
పోలీసులకు పన్నీర్ సెల్వం లేఖ
చెన్నై: తమినాడు పోలీసులకు తాజా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శుక్రవారం లేఖ రాశారు. ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న 'అమ్మ' మద్దతుదారులను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆయన కోరారు.
శశికళ మద్దతుదారులతో ఏర్పాటైన పళనిస్వామి సర్కారు ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, దీనిపై ధర్మయుద్ధం చేస్తానని పన్నీర్ సెల్వం గురువారం రాత్రి జయలలిత సమాధి వద్ద శపథం చేశారు. అసెంబ్లీలో ప్రజాభీష్టానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు ఓటు వేసేలా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలకు ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఆయన మద్దతుదారులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు.
కాగా, పన్నీర్ సెల్వం ఇంటిపై గురువారం రాత్రి మంత్రి సీవీ షణ్ముగం అనుచరులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో పన్నీర్ వర్గానికి చెందిన ఓ కార్యకర్త, సెక్యూరిటీ గార్డు గాయపడ్డారు.