-
నామినేషన్ల జోరు
● అన్నమయ్యలో 34 నామినేషన్లు ● పార్లమెంట్కు 9, అసెంబ్లీలకు 25 నామినేషన్లు రాయచోటి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాల్గవరోజైన సోమవారం జిల్లాలో నామినేషన్లు జోరందుకున్నాయి. జిల్లాలో మొత్తం 34 నామినేషన్లు దాఖలు కాగా అందులో లోక్సభ స్థానానికి 9, అసెంబ్లీలకు 25 నామినేషన్లు అందాయి. వివరాలిలా ఉన్నాయి. రాజంపేట–24 పార్లమెంట్ స్థానానికి...1. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పి.వి. మిథున్రెడ్డి, ఆయన సతీమణి పి.లక్ష్మీదివ్యారెడ్డిలు వేర్వేరుగా ఒక్కొక్క సెట్టు వంతున నామినేషన్ పత్రాలను అందజేశారు. 2. కె.ఓబయ్యనాయుడు –ఇండిపెండెంట్ 3. షేక్ నజీర్అహమ్మద్ –ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4. డి.రాజానాయుడు– ఇండిపెండెంట్ 5. మర్రిపాటి శ్రీనివాసులు– ఇండిపెండెంట్ 6. ఎస్.నాగేశ్వరరాజు– ఇండిపెండెంట్ 7. బి.రమణయ్య –జైభారత్ నేషనల్ పార్టీ అసెంబ్లీకి 25 నామినేషన్లు రాజంపేట అసెంబ్లీ స్థానానికి... 1. పోలా విజయభాస్కర్– ఇండిపెండెంట్ 2.పోలా విజయభాస్కర్–ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3. దుగ్గనపల్లి సురేంద్రరెడ్డి –జైభీమ్ రావు భారత్ పార్టీ కోడూరు(ఎస్సీ) 1. నగిరిపాటి విజయ్కుమార్– సమాజ్వాది పార్టీ 2. ఓబిలి సుబ్రహ్మణం –ఇండిపెండెంట్ రాయచోటి అసెంబ్లీ స్థానానికి...1. గడికోట శ్రీకాంత్రెడ్డి –వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెండు సెట్లు 2. షేక్ అల్లాబకష్ –ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3. షేక్. షపబుల్బాషా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 4. మండిపల్లి రాంప్రసాద్రెడ్డి –టీడీపీ 5. పి. వెంకటరమణ –ఇండిపెండెంట్ రెండు సెట్లు తంబళ్లపల్లి: 1. పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి– వైఎస్సార్సీపీ 2. చంద్రశేఖర్రెడ్డి –ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3. ఎంఎస్ భానుచంద్రారెడ్డి –ఇండిపెండెంట్ 4. గుండాల కృష్ణప్ప– ఇండిపెండెంట్ పీలేరు: బాలిరెడ్డి సోమశేఖర్రెడ్డి –ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు సెట్లు మదనపల్లి: 1. ఎస్.నిస్సార్అహమ్మద్– వైఎస్సార్సీపీ 2. నర్రావుల మణిశంకర్ –జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక 3. వి.ఉమాదేవి –ఇండిపెండెంట్ 4. బి.నరసింహనాయక్– ఇండిపెండెంట్ 5. పవన్కుమార్రెడ్డి –ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ -
చంద్రబాబు పాలన అవినీతిమయం
కలికిరి/గుర్రంకొండ/పీలేరు/కలకడ/కేవీపల్లె/ వాల్మీకిపురం: ప్రజలు చంద్రబాబుకు అధికారం ఇచ్చిన ప్రతిసారీ ఆయన పాలన అవినీతిమయంగా మారిందని, గత ఐదేళ్ల పాలన కేవలం అమరావతి చుట్టూ తిరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో దోచుకున్నారని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. సోమవారం అన్నమయ్య జిల్లాలోని కలికిరి, గుర్రంకొండ, వాల్మీకిపురం, పీలేరు, కలకడ, కేవీపల్లె పట్టణాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన సభలు, సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. కలికిరి పట్టణ పరిధిలోని క్రాస్రోడ్డు హేమాచారి కల్యాణ మండపంలో జరిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యత కల్పించి, వైద్య రంగంలో 53వేల ఉద్యోగాల నియామకం చేపట్టారన్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాలలో భాగంగా 17 నూతన మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. కిషోర్ను ఎర్రచందనం దొంగ అనలేదా..! పీలేరు నియోజకర్గ టీడీపీ అభ్యర్థి కిషోర్కుమార్ రెడ్డిని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎర్రచందనం దొంగ అని తిట్టిన విషయం ప్రజలు ఇంకా మరువలేదన్నారు. అలా తిట్టిన పార్టీ చెంతన చేరడం నల్లారి కుటుంబానికే చెల్లిందన్నారు. మరొకరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా చీఫ్విప్, సీఎం పదవులు అనుభవించి, పార్టీని గల్లంతు చేసి సమైక్యాంధ్ర పేరిట పార్టీ పెట్టి చెప్పులు మెడలో వేసుకుని తిరిగారన్నారు. పదేళ్ల తరువాత బీజేపీలో చేరి ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నాడో ఆయన వి/్ఞతకే వదిలేయాలన్నారు. పెద్దిరెడ్డిని తిడితే గుర్తింపు రాదని, ప్రజలకు మంచి చేస్తే గుర్తింపు వస్తుందని తెలుసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పీవీ మిథున్రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిల గెలుపునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కోరారు. ఎంపీ అభ్యర్థి పీవీ మిథున్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి రావాలన్నారు. కూటమితో ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లు రద్దు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ముస్లింల 4శాతం రిజర్వేషన్లు రద్దుచేయడం ఖాయమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనార్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ తెలిపారు. పక్క రాష్ట్రం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తూనే రిజర్వేషన్లు తొలగించనున్నట్లు బీజేపీ నేతలు అంటున్నారని, ఇక్కడా అదే జరుగుతుందని హెచ్చరించారు. మతతత్వ పార్టీలను తరిమికొడదాం ఈ సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ పార్టీలను తరిమికొడదామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పీలేరులోని ఎంఎన్ఆర్ కల్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలు వందశాతం అమలు చేశాకే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని చెప్పారు. గతంలో చంద్రబాబు 600 హామీలు ఇవ్వడంతోపాటు, నూరు పేజీల మేనిఫెస్టో విడుదల చేసి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సుమారు 50 కుటుంబాల ముస్లిం మైనారిటీలు మంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకూ మేలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ మేలు జరిగిందని, సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ సీఎంగా జగన్మోహన్రెడ్డిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమ వారం వాల్మీకిపురంలోని కువైట్ శంకరాచారి లేఅవుట్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నివాసముండే అన్నదమ్ములైన నల్లారి కిరణ్కుమార్రెడ్డి, కిషోర్కుమార్రెడ్డిలకు ఓట్లు అడితే హక్కు లేదన్నారు. ఇలాంటి వ్య క్తులకు ఓట్లు వేస్తే మళ్లీ తెలంగాణకు వెళ్లి కూర్చుంటారే తప్ప ప్రజా సేవ చేయరని దుయ్యబట్టారు. ● ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యండలపల్లి శ్రీనివాసులురెడ్డి, ఏపీ ఎండీసీ డైరెక్టర్ హరీష్రెడ్డి, నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, నూర్జహాన్, పద్మజ, ఆఘామొహిద్దీన్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్, పెద్దిరెడ్డి సుధీర్రెడ్డి, జి.వి. రాకేష్రెడ్డి, ఎంపీపీ కంభం సతీష్రెడ్డి, జెడ్పీటీసీ రత్నశేఖర్రెడ్డి, పరిశీలకుడు సహదేవరెడ్డి, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ రవికుమార్రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు హారిక తదితరులు పాల్గొన్నారు. జగన్ వస్తేనే సంక్షేమ పథకాల కొనసాగింపు రాష్ట్రంలో మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగుతాయని రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖానమ్ అన్నారు. సోమవారం గుర్రంకొండలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. మైనార్టీల సంక్షేమం కోసం జగనన్న ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మతతత్వ బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి రానున్న ఎన్నికల్లో అందరూ బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనిఅమలు చేయకపోవడం ఆయన నైజం రాష్ట్రంలో కాంగ్రెస్ గల్లంతుకు కిరణే కారణం మాజీ సీఎంలు చంద్రబాబు, కిరణ్లపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ -
No Headline
ఒంటిమిట్ట: లోక కళ్యాణార్థం జగమేలే వైకుంఠరాముని జగత్ కళ్యాణం ఆంధ్రభద్రాద్రి ఏకశిలానగరి ఒంటిమిట్టలోని జగదభిరాముడి దివ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. కోదండ రామయ్య సీతమ్మవారిని పరిణయమాడిన వేళ శిల్పకళాశోభితమైన కళ్యాణ మండపం వైకుంఠాన్ని తలపించింది. ఒంటిమిట్ట కోదండ రాముడి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం తరపున సతీసమేతంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలోని మూల మూర్తులకు రాష్ట్ర స్పెషల్ సీఎస్ కరికలవల్లన్ కల్యాణ వేదిక వద్ద ఉన్న కల్యాణ దంపతులైన సీతారాములకు ముత్యాలతలంబ్రాలు, పట్టువస్త్రాలు సంప్రదాయం ప్రకారం స్వామి వారికి సమర్పించారు. సంప్రదాయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు సీతారామచ్రందులకు నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ఉత్సవ వరులను పల్లకీపై కొలువు తీర్చి ప్రధాన ఆలయం నుంచి మంగళవాయిద్యాల మధ్య భక్తుల జయజయ ధ్వనాలతో శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపం వద్దకు తీసుకు వచ్చారు. వేదిక పైన రంజిత సింహాసనంపై కళ్యాణ మూర్తులను ఆశీనులు చేశారు. అనంతరం పూజా సామగ్రిని సంప్రోక్షణ జరిపి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా విశ్వక్షేన పూజ నిర్వహించారు. ‘కర్మణ్యేపుణ్యాహవచనం’ అనే మంత్రంతో మండప శుద్ధి జరిపి కళ్యాణ తంతుకు శ్రీకారం చుట్టారు. ముంజానకీ ప్రథమం అనే మంత్రం జపిస్తూ వేద పండితులు స్వామి వారికి ఎదురుగా సీతమ్మను కూర్చో పెట్టి కన్యావరణ జరిపించారు. మోక్ష బంధనం, ప్రతిసర బంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోప వీత ధారణం చేశారు. అనంతరం ఆశీర్వచనం, పాద ప్రక్షాళనం, పుష్పోదకస్నానం నిర్వహించి, వర పూజ చేశారు. బంగారు ఆభరణాలను సీతమ్మకు అలంకరించి సకలోపచారాలు చేశారు. మధుపర్కపాసన అనంతరం పెరుగు, తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించగా నును సిగ్గుల మొలకై న సీతమ్మ నోసటన కళ్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్క పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్పెషల్ సీఎస్ కరికాలవలవన్ సమర్పించిన ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ధరించి పెళ్లికూతురిగా ముస్తాబైంది. అమెకు ఏ మాత్రం తీసిపోని విధంగా శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రమూర్తి అదే రీతిలో సర్వాభరణ భూషితుడై సీతమ్మ ఎదుట కూర్చున్నాడు. తరువాత లోక క్షేమం కోసం మహా సంకల్పం పఠించి కణ్యాదానం, గోదానం చేశారు. సీతమ్మకు రామయ్యకు చెరో 8 శ్లోకాలతో మంగళకాష్టం చదివారు. మంగళవాయిద్యాలు, వేద పండితుల చతుర్వేద పఠనం భక్తుల రామనామ ధ్వనుల మధ్య హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం గౌరిదేవి, సరస్వతి దేవి, మహాలక్ష్మీ అమ్మవార్లను ఆహ్వానించి సకల మంగళాలకు ఆలవాలమైన మంగళసూత్రానికి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర వేదపండితులు మంగళసూత్రాన్ని భక్తులకు చూపించి సాక్షాత్తూ లక్ష్మీనారాయణుడైన శ్రీరామ చంద్రమూర్తి చేత, శ్రీ మహాలక్ష్మీ స్వరూపినీ సీతాదేవికి శాస్త్రోక్తంగా మంగళసూత్రాధారణ నిర్వహించారు. ప్రభుత్వం తెచ్చిన ముత్యాల తలంబ్రాలు కళ్యాణమూర్తుల శిరస్సుపై వేసి కనుల పండువగా కళ్యాణం జరిపారు. అనంతరం నివేదన ఇచ్చి బ్రహ్మముడి వేశాక మహాదాశీర్వచనం నిర్వహించి హారతి ఇవ్వడంతో కళ్యాణ క్రతువు ముగిసింది. ● స్వామి వారి కల్యాణాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్తోపాటు టీటీడీ యంత్రాంగం, జిల్లా ఉన్నతాధికారులు, ప్రముఖులు, లక్షలాది మంది భక్త జనం వీక్షించారు. భక్తుల రామనామ సంకీర్తనలు.. పండితుల చతుర్వేద పఠనం..మంగళవాయిద్యాల నడుమ.. సోమవారం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు హస్త నక్షత్రయుక్త శుభలగ్నంలో దశరథ మహారాజు తనయుడు శ్రీ రామచంద్రమూర్తి , జనకుని గారాల పట్టి.. నునుసిగ్గుల మొలక సీతమ్మను పరిణయమాడాడు. కమనీయం..రమణీయమైన ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో తడిసిముద్దయ్యారు. కమనీయం..దాశరథి కల్యాణం ఏకశిలానగరిలో పండు వెన్నెలలో రాములోరి కల్యాణం కనులారా వీక్షించిన చంద్రుడు పోటెత్తిన భక్తజనం మార్మోగిన రామనామం -
●గజేంద్రుడిపై జగదభిరాముడు
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తర్వాత స్వామివారు గజవాహనంపై విహరించారు.అంతకు ముందు ఉదయం 7 నుంచి 9గంటల వరకు శివధనుర్భంగాలంకారంలో రాములోరు భక్తులకు దర్శనం ఇచ్చారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఆలయంలో స్నపన తిరుమంజనం జరిగింది.బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు రథారోహణం, 10:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రథోత్సవం నిర్వహిస్తారు. -
పది ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయి
రాయచోటి: పదో తరగతి ఫలితాల్లో అన్నమయ్య జిల్లాలో బాలికలు పై చేయి సాధించారు. మొత్తం 22,240 మంది విద్యార్థులకు గాను 19,276 మంది ఉత్తీర్ణత సాధించారు. 86.67 శాతంతో 17వ స్థానాన్ని దక్కించుకుంది. సోమవారం రాష్ట్ర ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ దేవానందరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లోనూ బాలుర (83.65 శాతం) కంటే బాలికలు (89.71) శాతం అంటే 6 శాతం మంది ఎక్కువగా ఉత్తీర్ణులై అమ్మాయిలు శభాష్ అనిపించుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పాఠశాలల చివరి పని దినానికి ముందు రోజున పదో తరగతి ఫలితాలను విడుదల చేయడం విశేషం. జిల్లాలో 491 పాఠశాలలకు సంబంధించి 22,443 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. కాని 22,240 మంది మాత్రమే హాజరు కాగా వారిలో 19,276 మంది పాసయ్యారు. 304 ప్రభుత్వ పాఠశాలల నుంచి 15,517 మంది విద్యార్థులకు గాను 15,314 మంది పరీక్షలు రాశారు. వీరిలో 12,566 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 187 ప్రైవేటు పాఠశాలల నుంచి 6947 మంది విద్యార్థులకు గాను 6926 మంది హాజరు కాగా 6710 మంది పాసయ్యారు. మొత్తం మీద జిల్లాలో 19276 మంది ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలల వారీగా సాధించిన శాతం.. జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలలు 80 శాతం, మోడల్ స్కూల్స్ 91 శాతం, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 98 శాతం, బి.సి. వెల్ఫేర్ స్కూల్స్ 99.5 శాతం, ప్రభుత్వ పాఠశాలలు 68.66 శాతం, కె.జి.బి.వి పాఠశాలలు 85.5 శాతం, మునిసిపల్ పాఠశాలలు 83 శాతం, ప్రైవేటు పాఠశాలలు 96.9 శాతం, సోషియల్ వెల్ఫేర్ పాఠశాలలు 92.6 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 84 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ శివప్రకాశ్రెడ్డి తెలిపారు. టెన్త్లో 86.67 శాతం ఉత్తీర్ణత రాష్ట్రంలో అన్నమయ్యకు 17వ స్థానం -
జిల్లా ఆస్పత్రిలో అనాధ వృద్ధురాలి మృతి
మదనపల్లె : స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న అనాధ వృద్ధురాలు తాయమ్మ(70) సోమవారం మృతి చెందింది. నెల రోజులుగా పట్టణంలో భిక్షాటన చేస్తూ మతిస్థిమితం లేక దేవతానగర్ వద్ద పడి ఉండగా, స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే రెండు రోజులకే ఆసుపత్రి నుంచి వెళ్లిపోయింది. యాచించుకుంటూ తిరిగి నడవలేని స్థితిలో ఆస్పత్రి ఆవరణలో చెట్టు కింద ఉండగా స్థానికులు కొందరు మానవత్వంతో ఆమెకు సపర్యలు చేశారు. ఈనెల 10వ తేదీన ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదురుగా అనాధగా పడి ఉన్న తాయమ్మను క్యాజువాలిటీ వద్దకు వచ్చినమెడికల్ కాలేజీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎమ్మెస్ రాజు గమనించి జిల్లా ఆసుపత్రి ఐసీయూ విభాగంలో చేర్పించారు. ఆ సమయంలో వివరాలు అడగగా తన పేరు తాయమ్మ అని కర్ణాటక రాష్ట్రం కే జి ఎఫ్ కు చెందిన రామస్వామి భార్యగా పేర్కొంది. బంధువులు ఎవరూ లేకపోవడంతో, ఆమెకు ఐసీయూ విభాగంలో చికిత్సలు అందించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. అప్పటినుంచి ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతూ సోమవారం పరిస్థితి విషమించి అనారోగ్యంతో ఆమె మృతి చెందింది. ఆమె బంధువులు ఎవరైనా ఉంటే టూ టౌన్ పోలీసులను సంప్రదించాల్సిందిగా సీఐ యువరాజు కోరారు. -
బాల్య వివాహం చేశారని తండ్రి ఫిర్యాదు
పెద్దతిప్పసముద్రం : మద్యం మత్తులో ఉన్న తనకు తెలియపరచకుండా తన కుమార్తెకు బాల్య వివాహం చేశారని కన్న తండ్రి జల్లా గంగిరెడ్డి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత తండ్రి కథనం మేరకు వివరాలిలా...మండలంలోని కందుకూరు పంచాయతీ నిలువురాతిపల్లికి చెందిన జల్లా గంగిరెడ్డి, భాగ్యమ్మ దంపతులు. వీరి కుమార్తె (14) కందుకూరు జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఈ దంపతులు తమ కుమార్తెను ఇదే మండలంలోని అంకిరెడ్డిపల్లి పంచాయతీ తోకలవారిపల్లికి చెందిన బాలిక అమ్మమ్మ అయిన రమణమ్మ ఇంట్లో వదలి బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అమ్మమ్మ అయిన రమణమ్మతో పాటు ఆమె కుమార్తె సుజాతలు కర్నాటక రాష్ట్రం చేలూరు సమీపంలోని నల్లగుట్లపల్లికి చెందిన ఆదినారాయణ అనే యువకుడితో పరిచయం చేసుకున్నారు. అంతేగాక కన్నవాళ్లకు తెలియపరచకుండా తమ బిడ్డ వివాహం గురించి మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉన్న తమను త్వరగా రావాలని కబురు పెట్టగా ఆదివారం రాత్రి తోకలవారిపల్లికి వచ్చామన్నారు. మద్యానికి బానిసైన తనను పూటుగా మద్యం తాపించారని, తాను మత్తులో ఉండగా తనతో పాటు తన భార్య భాగ్యమ్మను బలవంతంగా నల్లగుట్టపల్లికి కారులో తరలించారన్నారు. అక్కడ ఓ ఆలయంలో జరుగుతున్న తమ బిడ్డ పెళ్లి తతంగాన్ని చూసి తన భార్య కూడా ప్రశ్నించడంతో బలవంతంగా తాళి కట్టి వివాహం జరిపించేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కన్నవాళ్ల అనుమతి లేకుండా మైనర్ అయిన తమ బిడ్డకు పెళ్లి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గంగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేసాడు. -
పది ఫలితాల్లో ప్రతిభ
పదో తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభకనబరిచారు. ఉపాధ్యాయులు ఉత్తమ బోధన అందజేయడంతో పాటు విద్యార్థులను పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం చేశారు. దీంతోపాటు తల్లిదండ్రుల ప్రత్యేక పర్యవేక్షణతో పట్టుదలతో చదివిన పిల్లలు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మెరుగైన మార్కులతో సత్తా చాటారు. ప్రతిభచూపిన విద్యార్థులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు. రాయచోటి : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అన్నమయ్య జిల్లాలో 23 మంది విద్యార్థులు 580 మార్కులకు పైబడి సాధించి జిల్లా పేరు నిలబెట్టారు. ఈ మార్కుల సాధనలోనూ అమ్మాయిలు ఎక్కువ మంది ఉండడం విశేషం. జిల్లాలోని కలకడ ఎ.పి. రెసిడెన్షియల్కు చెందిన పందికుంట లిఖిత 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ● బి.కొత్తకోట బాలికల హైస్కూల్లో ఎస్.థమన్నా 594 మార్కులు, మదనపల్లె ఎ.పి.డబ్ల్యూ బాలికల రెసిడెన్షియల్లో ఎం.దోనిక 594, గ్యారంపల్లి ఎ.పి.ఆర్.ఎస్ బాలురలో ఎస్.రూపేస్ 594, మదనపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి ఎం.చరిషారెడ్డి 592, పీలేరు ఎం.జె.పి.ఎ.పి.బి.సి.డబ్ల్యూ.ఆర్ బాలికల పాఠశాలలో జె.భార్గవి 592, సదుం మండలం చిన్నతిప్ప హైస్కూల్లో జి.గౌతమి 590 మార్కులు సాధించారు. ● పీలేరు మండలం కొత్తపల్లె బాలికల హైస్కూల్లో ఎం.షీమాఖానమ్ 588, వాయల్పాడు మండలం చెర్లోపల్లి హైస్కూల్లో ఎం.ఎస్.చేతన్కుమార్ నాయుడు 585, దేవపట్ల హైస్కూల్లో పి.మాధవి 585 మార్కులు సాధించారు. ● రాజంపేట బాలికల హైస్కూల్లో షేక్ జైబా 584, పీలేరు మెయిన్ జెడ్పీ హైస్కూల్లో ఎ.కురైన్ సుహ 584, కురబలకోట జెడ్పీ పాఠశాలలో కె.తబసమ్ 583, ముదివీడు ఎ.పి.మోడల్ స్కూల్లో ఎన్.రామచరణ్రెడ్డి 582, బురకాయలకోట జెడ్పీ హైస్కూల్లో ఎన్.హేమంత్కుమార్రెడ్డి 582 మార్కులు సాధించారు. ● రాజంపేట బాలికల హైస్కూల్లో ఆర్.ప్రణతి 582, పుల్లంపేట ఎ.పి మోడల్ స్కూల్లో ఎం.మౌనిక 582, ముదివీడు ఎ.పి.మోడల్ స్కూల్లో జి.లోక రక్షిత రెడ్డి 582, మదనపల్లి సమీపంలోని నీరుగట్టుపల్లి ఎం.పి.ఎల్ హెచ్.ఎస్లో బి.దీక్షిత 582, బి.హేమమాలిని 582, గ్యారంపల్లె ఎ.పి.ఆర్.ఎస్ బాలుర పాఠశాలలో ఎస్.వేణు 582, నడిమిచర్ల జెడ్పీ హైస్కూల్లో ఓ.లక్ష్మీ కృతిక 582, పీలేరు బాలికల ఎం.జె.పి.ఎ.పి.బి.సి.ఆర్ స్కూల్లో కె.రాఘప్రియ 582 వంతున మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి శివ ప్రకాష్రెడ్డి, ఆయా మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు అభినందించారు. రామాపురంలో.. రామాపురం : మండల కేంద్రంలోని ఏపీ మోడల్స్కూల్కు చెందిన వి. భవాని శంకర్ పదవ తరగతిలో 574 మార్కులు సాధించాడు. మండలంలో 349 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 261 మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ● పెనగలూరు (ఓబులవారిపల్లె) : పెనగలూరు మండలం నల్లపరెడ్డిపల్లి హైస్కూల్కు చెందిన ప్రణయ్ కుమార్ 563, రూపా 562 మార్కులు సాధించారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నీలకంఠరాజు తెలిపారు. అలాగే మోడల్ స్కూల్లో 96 మంది విద్యార్థులకు గాను 88 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 92శాతం సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సహజ బ్లెస్సీ తెలిపారు. అందులో 7 మంది విద్యార్థులు 500 మార్కులు సాధించగా, ఫస్ట్ డివిజన్లో 74 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. టెన్త్లో 23 మంది విద్యార్థులకు 580కి పైగా మార్కులు -
వైఎస్ఆర్ జిల్లాలో నామినేషన్ల జోరు
కడప సెవెన్రోడ్స్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాల్గవరోజైన సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో కడప లోక్సభ స్థానానికి ఆరు నామినేషన్లు రాగా, ఏడు అసెంబ్లీ స్థానాలకు 38 నామినేషన్లు దాఖలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. కడప లోక్సభ: కడప లోక్భ స్థానానికి కుంచెం వెంకట సుబ్బారెడ్డి రాయలసీమ రాష్ట్ర సమితి అభ్యర్థిగా ఒకటి, ఇండిపెండెంట్గా ఒక నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల తరఫున మూడు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరఫున వేణుగోపాల్ ఒకటి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఖాజా హుసేన్ ఒకటి, ఇండిపెంట్ అభ్యర్థిగా వెంకట సుబ్బారెడ్డి రెండు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీలకు... బద్వేలు: కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్డీ విజయజ్యోతి ఒక సెట్, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా దాసరి సుధ ఒక సెట్, సమాజ్ వాది పార్టీ అభ్యర్థిగా వెంకట సుబ్బరాయుడు ఒకటి, బీజేపీ అభ్యర్థిగా రోశన్న ఒకటి, బీజేపీ అభ్యర్థిగా అరుణరాజి ఒకటి, ఇండిపెండెంట్గా మల్లికార్జున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కడప: రీఫార్మ్స్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా సుబ్రమణ్యం ఒకటి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యర్థిగా అలీషేర్ ఒకటి, నేషనల్ మహా సభ అభ్యర్థిగా పట్టుపోగుల పవన్కుమార్ ఒకటి, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా అవ్వారు మల్లికార్జున నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఒకటి, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా దాసరి రవిశంకర్ ఒకటి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా గవిరెడ్డి రామేశ్వర్రెడ్డి ఒకటి, బహుజన సమాజ్ పార్టీ తరఫున బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి ఒక నామినేషన్ దాఖలు చేశారు. కమలాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి.రవీంద్రనాథ్రెడ్డి రెండు సెట్లు, ఇండిపెండెంట్గా నర్రెడ్డి కిశోర్రెడ్డి ఒకటి, సీపీఐ తరఫున గాలి చంద్ర ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాముల బ్రహ్మానందరెడ్డి ఒకటి దాఖలు చేశారు. జమ్మలమడుగు: ఇండిపెండెంట్గా రామేశ్వర్రెడ్డి ఒకటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మూలె సుధీర్రెడ్డి రెండు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క్రాంతి ప్రియ ఒకటి, ఇండిపెండెంట్గా ప్రమోద్కుమార్రెడ్డి ఒకటి, ఇండిపెండెంట్గా రామాంజనమ్మ ఒకటి, ఇండిపెండెంట్గా వెంకట సుబ్బారెడ్డి ఒక నామినేషన్ దాఖలు చేశారు. ప్రొద్దుటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమల్లు శివస్రాద్రెడ్డి ఒకటి, బీఎస్పీ అభ్యర్థిగా సుబ్బరాయుడు ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ ఒకటి, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ అభ్యర్థిగా సురేష్బాబు ఒక నామినేషన్ దాఖలు చేశారు. మైదుకూరు: తెలుగుదేశం పార్టీ తరఫున పుట్టా సుధాకర్ ఒకటి, పుట్టా రవికుమార్ యాదవ్ ఒకటి, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామిరెడ్డి ఒకటి, బీఎస్పీ తరఫున డీఎస్ జయరాం ఒకటి, ఇండిపెండెంట్గా ఆవుల వెంకట రమణ ఒకటి, బీఎస్పీ అభ్యర్థిగా డీఎస్ కల్యాణ్ ఒకటి, కాంగ్రెస్ అభ్యర్థిగా గుండ్లకుంట శ్రీరాములు ఒకటి, జయభారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా లెక్కల శ్రీనివాసులురెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 44 నామినేషన్లు దాఖలు -
ఘనంగా ప్రారంభమైన ఉరుసు
కమలాపురం : పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా ఉరుసు మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. దర్గా పీఠాధిపతి (ముతవల్లి), సజ్జాద్–ఏ–నషీన్ మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో, అశేష భక్త జన సందోహం నడుమ ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. గంధం ఇంటి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన చాందినిలో నషాన్ జెండాను ఊరేగింపుగా తీసుకు వచ్చారు. జెండా ఊరేగింపు తాళిం, మార్కెట్, చౌక్ సెంటర్ మీదుగా దర్గాకు చేరుకుంది. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెచ్చిన బాణా సంచా పెద్ద ఎత్తున పేల్చుతూ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు అనంతరం నషాన్ జెండాను దర్గా ఆవరణంలో ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ ఉరుసు ఉత్సవాల ప్రారంభానికి సూచిక. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అశేష భక్త జనుల సమక్షంలో హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, దస్తగిరిషా ఖాద్రి, మౌలానా మౌల్వి మొహిద్ధీన్ షా ఖాద్రి, హాజీ హజరత్ జహీరుద్ధీన్ షా ఖాద్రిల మజార్లపై పూల చాదర్లు సమర్పించారు. ప్రత్యేక ఫాతెహ చేశారు. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా ఖాద్రి, గౌస్ పాక్, జియా, ఇస్మాయిల్, సర్ఫరాజ్, గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి టి. హుసేన్ మియా కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. నేడు గంధం : మంగళవారం రాత్రి గంధం మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి ప్రముఖ ఖవ్వాల్ల మధ్య గొప్ప ఖవ్వాలీ పోటీ నిర్వహించనున్నారు. గంధోత్సవాన్ని తిలకించడం శుభదాయకం: ఉరుసు మహోత్సవాల్లో భాగంగా గంధోత్సవాన్ని తిలకించడం శుభదాయకం అని పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉరుసు ఉత్సవాల్లో గంధోత్సవం అతి ముఖ్యమైన ఘట్టం అని, ఈ ఘట్టాన్ని భక్తులందరూ తప్పక వీక్షించాలన్నారు. -
యువకుడి ఆత్మహత్య
నందలూరు (రాజంపేట) : నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ అరవపల్లి ఆర్ఎస్ రోడ్డులోని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురు వీధిలో నివాసం ఉండే సయ్యద్ అల్తాప్ (22) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఎస్ఐ మహ్మద్ అబ్దుల్ జహీర్ సోమవారం మాట్లాడుతూ తండ్రి బాష సాహెబ్ మరణించడంతో తల్లీ, కొడుకు ఇద్దరూ ఓ ఇంట్లో ఉంటున్నారు. కాగా సయ్యద్ అల్తాప్ తరచూ తల్లితో గొడవపడుతుండడంతో ఆమె కుమారుడిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన అల్తాప్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మదనపల్లె మండలం తట్టివారిపల్లె మదనపల్లె బైపాస్ రోడ్డు వెంగమాంబ సర్కిల్ వద్ద నివాసం ఉన్న రజక కార్మికుడు శివయ్య(63) లాండ్రీషాపు నిర్వహిస్తున్నా డు. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్ర మంలో సోమవారం సాయంత్రం ఇంట్లోనే చీర తో ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నంకు పాల్ప డ్డా డు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ● మదనపల్లె మండలం మాలేపాడు పంచాయతీ దొనబైలు గ్రామానికి చెందిన విజయకుమార్ భార్య చంద్రకళ (20) కుటుంబ సమస్యల కారణంగా నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడింది. కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య కాశినాయన : మండలంలోని వరికుంట్ల గ్రామానికి చెందిన వివాహిత జాగిరిమున్ని (36) తన ఇంట్లో ఉరి వేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. వారి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మున్నికి గత 18 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన పీరావలితో వివాహమైంది. భర్త కువైట్లో పనిచేసేవాడు. మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. భార్యభర్తలు అన్యోన్యంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. అయితే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆమె ఉరి వేసుకుని మృతిచెందింది. కాశినాయన ఏఎస్ఐ రమణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ళ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కరెంటు షాక్తో విద్యార్థినికి గాయాలు మదనపల్లె : కరెంటు షాక్తో విద్యార్థినికి గాయాలైన సంఘటన సోమవారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. కలిచెర్ల పంచాయతీ నత్తి ఒబన్నగారిపల్లెకు చెందిన శుక్లానాయక్, రోజా దంపతుల కుమార్తె బుక్కె రెడ్డిలక్ష్మి(8) స్థానికంగా మూడవ తరగతి చదువుతోంది. ఇంటి వద్ద ఆడుకుంటూ ఇంటి మెట్లపైకి ఎక్కుతుండగా పక్కనే ఉన్న 11 కెవి విద్యుత్వైర్లు తాకి కరెంటు షాక్తో తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
కౌన్సిలర్ అనుమానాస్పద మృతి
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు మున్సిపాలిటీ వైఎస్సార్సీపీకి చెందిన 4వ వార్డ్ కౌన్సిలర్ జ్ఞాన ప్రసూన (32) సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు పట్టణానికి చెందిన వంగల నాగేంద్ర కుమార్తె అయిన జ్ఞాన ప్రసూన వివాహం అయినప్పటి నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉంటోంది. అప్పుడప్పుడు జమ్మలమడుగుకు వస్తూ ఉండేది. కాగా సోమవారం రాత్రి కోయంబత్తూర్లోని ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. -
నూతన నియామకం
రాయచోటి టౌన్ : అన్నమయ్యజిల్లా వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరిని రాష్ట్ర స్థాయి సెక్రటరీలుగా నియమించారు. రాష్ట్ర పార్టీ సెక్రటరీగా తురుక శ్రీనివాసుల రెడ్డిని, రాష్ట్ర వింగ్ కమిటీ సెక్రటరీగా జి. రాజశేఖర్రెడ్డిలను నియమించారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆమోద పత్రం తమకు అందినట్లు సోమవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా వారు పేర్కొన్నారు. ఈసందర్భంగా వీరు తమకు ఈ అవకాశం కల్పించినందుకు కృత/్ఞతలు తెలిపారు. తమ వంతు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. వలంటీర్పై హత్యాయత్నం ఒంటిమిట్ట : ఒంటిమిట్ట మండల పరిధిలోని ఇబ్రహీంపేటలో సోమవారం వలంటీర్ టి.సుధాకర్ యాదవ్పై సోమవారం సాయంత్రం హత్యాయత్నం జరిగింది. టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వడంలేదనే అక్కసుతో సుధాకర్పై అదే గ్రామానికి చెందిన పిడుగు సురేష్ కుమార్రెడ్డి, మొర్రంరెడ్డి విజయసింహారెడ్డి కత్తి, రాడ్డుతో దాడి చేశారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన గ్రామస్తులను కూడా కత్తితో పొడుస్తామని బెదిరింపులకు దిగారు. ఈ దృశ్యం సమీపంలోని కోదండరాముడి బ్రహ్మోత్సవాల బందోబస్తుకు వచ్చిన ఓ పోలీసు అధికారి కంటపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారి దాడికి దిగిన వారిద్దరిని ఒంటిమిట్ట పోలీస్స్టేషన్కు తరలించారు. వారిద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. గాయపడిన వలంటీర్ను చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిక
కలికిరి : కలికిరి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున టీడీపీ యువత వైఎస్సార్సీపీలో చేరారు. మండలంలోని మర్రికుంటపల్లి గ్రామం కొత్తగజ్జలవారిపల్లికి చెందిన టీడీపీ యువత మహమ్మద్ రఫీ, రఫీఖాన్, మహ్మద్ ఉస్మాన్, అజీముల్లా, ఫకృద్దీన్, బడేబాబు, సైఫుల్లా, ఖాజా, ఖాదర్బాషా, సయ్యద్ అహ్మద్, అల్తాఫ్, న్యామతుల్లా, షారు, జాకీర్, మునీర్ ఖాన్, అహ్మద్బాషా, రియాజ్, అమీర్ఖాన్, బాబ్జాన్, ఇర్ఫాన్, యాసిన్, నాగూర్, బాలాజీ, మొహ్మద్సమీర్, మహ్మద్బాబు తదితరులతో పాటు 70 కుటుంబాలు చేరాయి. అలాగే కలికిరి పట్టణానికి చెందిన రఫీ తదితరులు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు హరీష్ రెడ్డి, సతీష్రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం క్రాస్ రోడ్డు మదనపల్లి రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా వైఎస్సార్సీపీ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. -
ఆసక్తికరం..రథం కథ
కడప కల్చరల్ : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాల్లో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఆలయం ఎదురుగా ఈశాన్యంలో ఎత్తయిన గదిలో రామయ్య రథాన్ని గమనించే ఉంటారు. మిగతా రోజుల్లో ఆ గదికే పరిమితమైనా బ్రహ్మోత్సవాల సమయంలో దాదాపు నెల రోజుల ముందునుంచి దానికి అవసరమైన మరమ్మతులు చేసి ఉత్సవాలకు అనువుగా తీర్చిదిద్దుతారు. కొత్త రంగులద్ది కళకళలాడేలా చేస్తారు. ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. ఆ వివరాలు ఆలయం గోడపై శాసనం రూపంలో కనిపిస్తాయి. ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించే రోజుల్లో బ్రహ్మోత్సవాల కోసం ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించారు. శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది. తొలి బ్రహ్మోత్సవాల్లో వారు తాము కూడా ఊరేగింపు సమయంలో రథంపై ఉంటామని డిమాండ్ చేశారు. స్థానికంగా ఎక్కువ ప్రాబల్యంగల ఓ వర్గం వారు దీన్ని వ్యతిరేకించారు. అర్చకులు, ఆలయ పెద్దలు మినహా ఇతరులెవరూ రథంపై ఉండకూడదని అడ్డుచెప్పారు. రథ శిల్పులు కూడా పట్టువీడలేదు. తాము రథంపై కూర్చొవాల్సిందేనని పట్టుబట్టారు. ఇరు వర్గాల మధ్య రేగిన వివాదంతో రథోత్సవం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో తిరుపతిలో ఉన్న మట్లి అనంతరాజుకు విషయం తెలిసి వెంటనే ఒంటిమిట్టకు వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ధర్మాధికారులను ఆదేశించారు. వారు ఒంటిమిట్టకు వచ్చి విషయాల గురించి తెలుసుకున్నారు. రథాన్ని నిర్మించిన రథ శిల్పులు ఉత్సవాల సమయంలో రథంపై కూర్చొనే సంప్రదాయం ఉన్నట్లు పండితుల ద్వారా తెలుసుకున్నారు. ఆ విషయాన్ని తమ ప్రభువు మట్లి అనంతరాజుకు తెలిపారు. అప్పటి నుంచి ఆయన ఆజ్ఞ మేరకు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది. ఆలయంలో తూర్పు ఎదుర్కొలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కై ఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది. -
నాణ్యత పాటించకపోతే కఠిన చర్యలు
రాయచోటి అర్బన్ : హోటళ్లు, తిండి పదార్థాల తయారీదారులు ప్రజలకు శుచి,శుభ్రతతో కూడిన ఆహారాన్ని అందివ్వాలని మున్సిపల్ కమిషనర్ వాసుబాబు, జిల్లా ఫుడ్సేప్టీ అధికారి శమీమ్బాష అన్నారు. శుక్రవారం సాయంత్రం వారు మున్సిపల్, ఫుడ్సేప్టీ అధికారులతో కలసి పట్టణంలోని పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిండిపదార్థాల తయారీలో తప్పక నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరిలు, జ్యూస్సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు తదితరాలపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. తమ తనిఖీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వారు హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఐ మల్లిఖార్జున, ఫుడ్సేఫ్టి సిబ్బంది సీతారామయ్య పాల్గొన్నారు. -
టీడీపీ నిబంధనల ఉల్లంఘన
మదనపల్లె : మదనపల్లె టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే షాజహాన్బాషా నామినేషన్ దాఖలు ప్రక్రియలో ఆ పార్టీ శ్రేణులు నిబంధనలు ఉల్లంఘించాయి. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలను, నాయకులను మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో బెంగళూరు బస్టాండ్లోని పార్టీ కార్యాలయం దగ్గర నుంచి బయలుదేరిన ర్యాలీకి ఆశించిన స్థాయిలో జనాలు లేకపోవడంతో... డీజే వాహనాల మితిమీరిన శబ్దాల హోరులో డ్యాన్సులు, కేకలు వేసుకుంటూ కాలయాపన చేశారు. ఎన్నికల కోడ్కు వ్యతిరేకమైనప్పటికీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున టపాకాయలను పేలుస్తూ, బెంగళూరు బస్టాండు ప్రాంతమంతా పొగ కమ్ముకుపోయేలా చేశారు. తర్వాత 2.10 నిమిషాలకు బ యలుదేరిన షాజహాన్బాషాకు, నామినేషన్ గడువు ముగిసిపోతోందని నాయకులు చెప్పడంతో...గుట్టుచప్పుడు చేయకుండా.. హోండా యాక్టివా టూవీలర్లో ఎక్కి సబ్ కలెక్టరేట్కు చేరుకున్నారు. విషయం తెలియని కార్యకర్తలు, నాయకులు షాజహాన్బాషా వస్తారని, డీజే పాటలకు డ్యాన్సులు చేసుకుంటూ ముందుకు సాగారు. ఇంతలో 108 వాహనం చిత్తూరు బస్టాండ్ నుంచి అవెన్యూరోడ్డు మీదుగా జిల్లా ఆస్పత్రికి వెళ్లేందుకు అటువైపుగా వచ్చింది. టీడీపీ కార్యకర్తలు, నాయకులు వాహనానికి దారివ్వకపోగా, ఏకంగా వాహనాన్నే దారి మరల్చుకుని వెళ్లాల్సిందిగా డ్రైవర్కు సూచించి, బండికి రివర్స్ చెప్పారు. తర్వాత టౌన్బ్యాంక్ సర్కిల్ మీదుగా చిత్తూరు బస్టాండ్కు చేరుకుని సబ్ కలెక్టరేట్కు 200 మీటర్ల దూరంలో డీజే వాహనాలను నిలుపుకుని, పాటలకు డ్యాన్సులు వేసుకుంటూ షాజహాన్బాషా కోసం వేచిచూశారు. నామినేషన్ వేసి, మధ్యాహ్నం.3.10 గంటలకు వెలుపలికి వచ్చిన షాజహాన్బాషా, చిత్తూరుబస్టాండులో వాల్మీకి విగ్రహానికి ఆనుకుని, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సరిగ్గా ఆ సమయంలో అటువైపుగా ఓ ఫైర్ ఇంజన్ సైరన్ వేసుకుంటూ వచ్చింది. తెలుగు తమ్ముళ్లు దానికి దారికి ఇవ్వకపోగా, నాయకుడి స్పీచ్ వింటూ తన్మయత్వంలో మునిగిపోయారు. తర్వాత ఎవరో వచ్చి ఫైర్ ఇంజన్ వచ్చిందని చెప్పగానే, స్పీచ్ నిలిపిన షాజహాన్బాషా, ప్రచారరథం పైకి ఎక్కి ప్రసంగించారు. షాజహాన్బాషా నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకుల నుంచి మద్దతు కరువైంది. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, రాటకొండ బాబురెడ్డి, శ్రీరామ్ చినబాబు, జనసేన రామదాస్ చౌదరి తదితరులు ఎవ్వరూ హాజరుకాలేదు. సీ విజిల్ యాప్కు ఫిర్యాదు.. షాజహాన్బాషా నామినేషన్ సందర్భంగా అనుమతి లేని డీజే వాహనాలను వినియోగిస్తూ, కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నాడని సీవిజిల్ యాప్కు ఫిర్యాదుచేస్తే... అధికారులు చర్యలు తీసుకోకపోగా, సమస్య పరిష్కరించేసినట్లు ఫిర్యాదుదారుడికి మెసే జ్ పంపారు. అయితే ఫిర్యాదు పరిష్కారానికి తీసుకున్న చర్యలపై కనపరచకపోవడం గమనార్హం. అనుమతి లేని డీజే వాహనాలు, టపాకాయల పేలుళ్లు 108 వాహనం, ఫైర్ ఇంజన్కు దారి ఇవ్వని తమ్ముళ్లు నామినేషన్కు హాజరుకాని టీడీపీ సీనియర్ నాయకులు సీ విజిల్కు ఫిర్యాదుచేసినా అధికారుల చర్యలు శూన్యం -
వైఎస్సార్సీపీ వెంటే మైనార్టీలు
రాయచోటి : రాష్ట్రంలోని మైనార్టీలంతా వైఎస్సార్సీపీ వెంటే నడుస్తారని ఆ పార్టీ రాయలసీమ జోన్ మైనార్టీ ఇన్చార్జి ఎస్.ఫక్రుద్దీన్ షరీఫ్, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ముజీబ్, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా అన్నారు. శుక్రవారం రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి పీవీ మిథున్ రెడ్డి తరపున అన్నమయ్య జిల్లా రాయచోటి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను వారు అందజేశారు. ఈ సందర్భంగా రాయచోటిలో వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు మైనార్టీలపై చూపుతున్న అభిమానాన్ని మరువలేమన్నారు. నామినేషన్ దాఖలుకు ముందుగా మైనార్టీ నాయకులు ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి రియాసత్ అలీఖాన్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, సయ్యద్, అన్నమయ్య జిల్లా ప్రచార కార్యదర్శి అయూబ్ బాషా, పీలేరు మాజీ సర్పంచ్ హబీబ్, మదనపల్లి మైనార్టీ నాయకులు ఎం. అహ్మద్, కరీమ్ భాయ్, హెచ్ఎం అఫ్రోజ్ ఖాన్, డి.ఫక్రుల్లా ఖాన్, పీలేరు అమీన్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మృతుడి సమాచారం అందించండి ఓబులవారిపల్లె : ఓబులవారిపల్లె మండల కేంద్రంలో ఇటీవల గూడ్స్ రైలు కిందపడి మృతి చెందిన పులి (55) అనే వ్యక్తి గురించి సమాచారం తెలిసి ఉంటే తెలియజేయాలని రేణిగుంట జీఆర్పీఎఫ్ ఎస్ఐ శివ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పులి అనే వ్యక్తి ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరాలుగా మండల కేంద్రంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించినా , పూర్తి పేరు కానీ, ఊరుకానీ స్థానికులకు ఎవరికీ తెలియదన్నారు. దీంతో మృతుని బంధువులు కానీ, తెలిసిన వారు ఎవరూ రాలేదని, ఎవరైనా తెలిసి ఉంటే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ శివ తెలిపారు. చెక్పోస్టు తనిఖీ చేసిన ఎన్నికల పరిశీలకుడు సంబేపల్లె : మండలంలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై గుట్టపల్లిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును అన్నమయ్య జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఎస్జీ మూన్ శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎలాంటి అక్రమ రవాణాకు తావులేకుండా ఉండేందుకు చెక్పోస్టులలో గట్టి తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వాహన రికార్డుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ఆర్డీఓ రంగస్వామి, పలువురు అధికారులు పాల్గొన్నారు. తమ్ముడిని నాటు తుపాకీతో కాల్చిన అన్న అరెస్ట్ గుర్రంకొండ : ఆస్తి పంపకం వివాదంలో తమ్ముడ్ని నాటు తుపాకీతో కాల్చిన అన్న జయప్ప (56)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక నాటు తుపాకీతో పాటు మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని టి.పసలవాండ్లపల్లె పంచాయతీ ఎగువహరిజనవాడ గ్రామానికి చెందిన బాలపోగు జయప్ప, బాలపోగు విశ్వనాథ్లు అన్నదమ్ములు. వీరికి గ్రామానికి సమీపంలోనే తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పొలం ఉంది. ఈ ఆస్తి పంపకం విషయంతో గొడవ పడిన నేపథ్యంలో ఈనెల 16న కోపంతో తమ్ముడిని అన్న నాటు తుపాకీతో కాల్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడు జయప్పను శుక్రవారం మండలంలోని ఉదారివాండ్లపల్లె క్రాస్ వద్ద అరెస్ట్ చేసినట్లు వాల్మీకిపురం సీఐ పులిశేఖర్, గుర్రంకొండ ఎస్ఐ నాగార్జునరెడ్డిలు తెలిపారు. -
●త్రిముఖ పోటీ ఉంటే...
కడప అసెంబ్లీ పరిధిలో ప్రధాన భూమిక ముస్లిం మైనార్టీ ఓటర్లదేనని చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా 90వేల ఓట్లు ఆ సామాజిక వర్గానికి చెందన వారివి ఉన్నట్లు సమచారం. ఆ ఓట్లు ఏకపక్షంగా పడకుండా చీలికలు తీసుకరాగలిగితే సక్సెస్ అవుతామనే దిశగా టీడీపీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా కులాల కుంపట్లు ఎప్పుడు లేని విధంగా ఈమారు బాహాటంగా తెరపైకి వచ్చాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే కడప గడపలో పలువురు రెచ్చగొడుతూ లబ్ధి పొందాలనే దిశగా అడుగులు వేశారు. ఇప్పటికే ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన ఎస్బి అంజాద్బాషా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మరోమారు పోటీ చేయనున్నారు. టీడీపీ అభ్యర్థిగా శ్రీనివాసులరెడ్డి సతీమణీ మాధవీరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా అఫ్జల్ఖాన్ను పోటీ చేయిస్తే తద్వారా లబ్ధి పొందొచ్చని శ్రీనివాసులరెడ్డి ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. -
లిఫ్ట్ రోప్ తెగి ఏడుగురికి తీవ్ర గాయాలు
– ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రమాదం రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో లిప్ట్ రోప్ తెగి శుక్రవారం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కదిరివాండ్లపల్లె చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ పేషెంట్ను చూసేందుకు బంధువులు, మిత్రులు వచ్చారు. సుమారు పది మంది వరకు ఆస్పత్రి లిఫ్ట్ను ఎక్కారు. సగం దూరం వెళ్లగానే ఒకసారిగా రోప్ తెగిపోవడంతో లిప్ట్ బాక్స్ ఒకసారిగా కిందకు వచ్చి పడింది. అందులో ఉన్న వారిలో ఏడుగురికి కాళ్లు చేతులు విరిగాయి. ఈ భవనం రాయచోటి తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడి బంధువుకు చెందినది. కొత్తగా నిర్మించిన ఈ ఆస్పత్రి భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం వలన ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ప్రమాదం విషయం బయటి కి పొక్కనీయకుండా ఆస్పత్రి యాజమాన్య, టీడీ పీ నాయకులు కొందరు చాలా జాగ్రత్త వహించా రు. అదే ఆస్పత్రిలో క్షతగాత్రులకు తగు చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. నష్టపరిహారం చెల్లించడంతో పాటు వైద్య ఖర్చులు కూడా భరిస్తారని నచ్చచెప్పారు. దీనిపై పోలీసులను వివరణ అడుగగా తమ వద్ద కు ఫిర్యాదు చేయడానికి ఎవరూ రాలేదన్నారు. -
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
ఓబులవారిపల్లె : మండలంలోని గాదెల వెంకటాపురం దళితవాడలో భర్త వేధింపులు తాళలేక పి. ఓబులమ్మ (38) అనే మహిళ శుక్రవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. పెనగలూరు మండలం సాతుపల్లి గ్రామానికి చెందిన ఓబులమ్మకు గాదెల వెంకటాపురం దళితవాడకు చెందిన పోలమనేని చంద్రకు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఏడాది నుండి భార్యభర్తల మధ్య గొడవలు ఉండటంతో ఓబులమ్మ తన తల్లిదండ్రుల గ్రామమైన సాతుపల్లెలో ఉంటోంది. ఈ క్రమంలో విడాకులు కావాలని చంద్ర భార్యకు నోటీసులు పంపించాడు. అయితే భర్త, పిల్లలు కావాలని గురువారం సాయంత్రం గాదెల వెంకటాపురం దళితవాడకు వచ్చింది. రాత్రి భార్యా భర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి ఉరివేసుకొని ఓబులమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. తన చెల్లెలు మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని మృతురాలి సోదరుడు ఓబులేశు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి ఆత్మహత్యాయత్నం మదనపల్లె : కుటుంబసమస్యల కారణంగా ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో జరిగింది. నిమ్మనపల్లె పంచాయతీ నాగులయ్యగారిపల్లెకు చెందిన ఓ యువతి(17) కుటుంబసమస్యలతో పశువులకు వాడే పిడుదుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని 108లో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పీడీ గోపినాథ్పై ఉన్నతాధికారుల విచారణ
మదనపల్లె సిటీ : స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పీడీ గోపినాథ్పై ఉన్నతాధికారులు విచారణ చేశారు. గత ఏడాది నవంబర్ నెలలో పీడీ గోపినాథ్పై పదో తరగతి విద్యార్థిని తనను లైంగికంగా వేధిస్తున్నాడని హెచ్ఎంకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పట్లో డీఈఓగా ఉన్న పురుషోత్తం విచారణ చేశారు. ఈ సంఘటనలో పీడీ గోపినాథ్ను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు చేశారు. ఈ విషయంపై అప్పట్లో పోలీసుస్టేషన్లో కూడా కేసు నమోదైంది. జరిగిన సంఘటనపై విద్యాశాఖ ఏడీ ప్రసాద్బాబు, జీసీడీఓ రాధమ్మ శుక్రవారం పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులను వేర్వేరుగా విచారణ చేశారు. జరిగిన సంఘటనపై రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని ప్రశ్నపత్రం ద్వారా విద్యార్థులకు అందజేశారు. వీరి నుంచి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టారు. బాధిత విద్యార్థినితో పాటు తల్లిని కూడా విచారించారు. విచారణ ని వేదికను విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపనున్న ట్లు విచారణ అధికారులు ప్రసాద్బాబు, రాధమ్మ తెలిపారు. విచారణ గోప్యం: పీడీ గోపినాథ్పై విచారణ పాఠశాల హెచ్ఎం సుబ్బారెడ్డి గోప్యంగా ఉంచారు. గతంలో విచారణ సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకే విధంగా సమాధానం చెప్పారు. దీంతో అనుమానంతో విచారణ అధికారులు మరోసారి విచారణ చేశారు. -
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక
రామసముద్రం : రామసముద్రం పంచాయతీ కేంద్రమైన ఎగువ హరిజనవాడలో శుక్రవారం టీడీపీకి చెందిన యువకులు వైఎస్సార్సీపీలోకి చేరారు. మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహమ్మద్ అధ్యక్షతన 30 మందికి పైగా యువకులు మాజీ కన్వీనర్ భాస్కర్గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన యువకులకు నిస్సార్ అహమ్మద్ కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. మరోసారి వైఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుసుమకుమారి, జెడ్పిటిసి రామచంద్రారెడ్డి, నాయకులు ప్రకాష్, దర్శన్, సుదర్శన్, బాబు, ప్రభాకర్, తపాల మస్తాన్, షంషీర్, కృష్ణప్ప, మస్తాన్, ఉదయ్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. 80 మంది వైఎస్ఆర్సీపీలో చేరిక పుల్లంపేట : పుల్లంపేట మండలం, కొమ్మనవారిపల్లి పంచాయతీలోని అగ్రహారానికి చెందిన 80 మంది టీడీపీ నాయకులు శుక్రవారం రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు నచ్చి వైఎస్సార్ సీపీలో చేరడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వంలో తమ గ్రామానికి రోడ్డు వచ్చినందుకు జగనన్నకు రుణపడి ఉంటామని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిక కలకడ : మండలంలోని కదిరాయచెర్వు పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ గోగుల శ్రీనివాసయాదవ్ తన అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరారు. శుక్రవారం మండల ప్రత్యేక ఆహ్వానితులు జీవీ కిషోర్ ఆధ్వర్యంలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వారికి వైఎస్సార్సీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ శేఖర్యాదవ్, పీలేరు నియోజకవర్గ సోషియల్ మీడయా కోకన్వీనర్ చిరంజీవి యాదవ్, సచివాలయ కన్వీనర్ పుల్లయ్యగౌడ్, రమణయాదవ్, పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అశ్వవాహనంపై ప్రతాప రాముడి పార్వేట
వాల్మీకిపురం: వాల్మీకి క్షేత్రంలోని పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు శుక్రవారం రాత్రి 8గంటలకు స్వామివారు అశ్వవాహనంపై పార్వేటకు బయల్దేరారు. ఉదయం సుప్రభాతసేవ, మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, తిరుచ్చిలో స్వామివారి అలంకరణ, 8నుంచి 9గంటల వరకు తిరుచ్చి ఉత్సవం, స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సాయంత్రం ఊంజల్ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం వాహన మండపంలో స్వామివారిని విల్లంబులు ధరింపజేసి పార్వేటకు సిద్ధం చేశారు. అశ్వవాహనంపై విల్లంబులతో భక్తులకు ప్రతాప రాముడిగా దర్శనమిచ్చారు. పార్వేట మండపంలో ఆలయ అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు రాములవారి పార్వేట ఉత్సవం గురించి కథారూపంలో భక్తులకు తెలియజేశారు. వేట అనంతరం స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, సిబ్బంది నాగరాజ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు
రామసముద్రం : రామసముద్రంలో తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆర్.నడింపల్లె పంచాయతీ బల్లసముద్రం గ్రామానికి చెందిన వానీష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. తమ గ్రామంలో వాలీశ్వర ఆలయంపై గత కొంతకాలంగా ఘర్షణ నెలకింది. ఈ క్రమంలో దేవాదాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఈఓ వాలీశ్వర ఆలయంలో తాళాలు వేసి భద్రపరిచారన్నారు. ఈ నేపధ్యంలో తమ గ్రామానికి చెందిన జి.మనోహర్బాబు, మల్లికార్జున , గంగన్న, వెంకటరెడ్డి , శ్రీనివాసులు అనే వ్యక్తులు తాళాలు పగులగొట్టి పూజలు చేశారు. ఈ విషయంపై ఈఓ వారిని విచారిస్తుండగా గ్రామస్తులైన నారాయణ, వాలిరెడ్డి, కృష్ణప్ప, మల్లెప్ప, అర్చకులు లోకనాథ్దీక్షిత్ తో పాటు తనను కూడా పిలిపించారన్నారు. అయితే వారు అర్చకులను దుర్భాషలాడుతూ కొట్టేందుకు వెళ్లగా తాను అడ్డుకున్నందుకు తనపై, అర్చకుడు లోకనాథ్దీక్షిత్పై మనోహర్బాబు , మల్లికార్జున, శ్రీనివాసులు, వెంకటరెడ్డి, గంగన్నలు బలమైన కర్రలతో తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. అడ్డుకోబోయిన తమ పెద్దమ్మ గంగులమ్మ చేయిని విరగొట్టారన్నారు. తనను గ్రామస్తులు చికిత్స నిమిత్తం పుంగనూరు ఆసుపత్రికి తరలించారన్నారు. వారితో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఇరువర్గాలపై ఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement