-
టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి డర్టీ పాలిటిక్స్.. మహిళను నిర్బంధించి..
సాక్షి, గుంటూరు జిల్లా: టీడీపీ దుర్మార్గపు రాజకీయాలకు అంతులేకుండా పోతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నీచ రాజకీయం వెలుగులోకి వచ్చింది. గుంటూరు వెస్ట్ వైఎస్సార్సీపీ నుంచి మంత్రి విడదల రజిని పోటీ చేస్తుండగా, విడదల రజిని అనే పేరుగల మరొక మహిళ చేత నామినేషన్ వేయించడానికి గల్లా మాధవి ప్రయత్నించింది.మూడు రోజుల నుంచి గల్లా మాధవి ఉంటున్న అపార్ట్మెంట్లో విడదల రజిని అనే మహిళను నిర్బంధించారు. తన కుమార్తె విడుదల రజినిని కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మహిళను అపార్ట్మెంట్ నుంచి నగరంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని.. తండ్రికి అప్పగించారు.కాగా, గల్లా మాధవిపై ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ప్రచారం నిర్వహించినందుకు రెండు పోలీసు కేసులు నమోదయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా శనివారం నామినేషన్ వేసిన గళ్లా మాధవి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో పోలీసు కేసుల వివరాలతోపాటు పెద్ద ఎత్తున స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలు చూపారు. -
Ugadi 2024: ఆరు రుచులను కలపగా.. విరిసిన 'ఉగాది'
జీవితమనే చెట్టు గొప్ప గొప్ప లక్ష్యాల చిగుర్లు వేసింది ప్రయత్నాల పూత పూసింది విరివిగా కానీ చేదుగా; అభిమానం అడ్డొచ్చి పడింది పిందెలుగా అయితే గుత్తులు గుత్తులుగా, అంతలో.. చింత చిరాకుపడి, పులుపుని రేపడం మొదలుపెట్టింది ఊరుకోని పట్టుదల పచ్చపచ్చగా వ్యాపించి ఎదగడం మొదలుపెట్టింది; కటువుగా కారం చల్లినట్లు.. నిర్ణయాలు వాటి వాటి స్థానం తీసుకున్నాయి; ధైర్యం విషయ గుజ్జుని గ్రహించింది.. లోపాలకు వగరు మందేసింది.. పరిశ్రమ కఠోరంగా అన్నిటినీ కలిపంది.. విజయం తియ్యగా వరించింది కృతజ్ఞత ఎక్కువ మోతాదులో కాకుండా.. తగిన మోతాదులో ఉపయోగించాలని ఉప్పు ఉపదేశించింది.. మొత్తానికి కచ్ఛాపచ్ఛాగా పచ్చడవుతున్న జీవితం.. మాంఛి.. పసందైన షడ్రుచులతో నడుస్తున్నది! :::మాధవి మేళ్ళచెర్వు, గుంటూరు క్రోధి నామ సంవత్సర రాశిఫలాల కోసం క్లిక్ చేయండి -
డివైడర్ మధ్యలోని పూలు తెంపుకొని వస్తుండగా గర్భిణి విషాదం!
నిజామాబాద్: సంప్రదాయం ప్రకారం గోదావ రి నదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్తున్న ఐదు నెలల గర్భిణి.. మార్గమధ్యలో డివైడర్పై ఉన్న పూలను తెంపి, వాహనం వద్దకు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది. వివరాలిలా ఉన్నా యి. ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్కు చెందిన కొమిరె మాధవి(25) ఐదు నెలల గర్భిణి. ఐదు నెలల సమయంలో గంగమ్మ పూజలు చేయడం వారి కుటుంబంలో ఆనవాయితీ. శుక్రవారం ఉదయం మాధవి భర్త గంగసాగర్, కుటుంబ సభ్యులతో కలిసి నిర్మల్ జిల్లా సోన్ వద్ద గల గోదావరిలో స్నానాలు ఆచరించడానికి ఆటోలో బయలుదేరారు. మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద ఆటోను ఆపి జాతీయ రహదారి డివైడర్ మధ్యలోనున్న పూలను తెంపడానికి మాధవి వెళ్లింది. పూలను తెంపి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన వాహనం ఆమెను ఢీకొంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
ఓట్ల కోసం టీడీపీ చిల్లర రాజకీయం..!
-
ఎంపీ మాధవి కుమార్తెకు సీఎం నామకరణం
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): అరకు ఎంపీ మాధవి శివప్రపాద్ దంపతుల కుమార్తెకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నామకరణం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన మాధవి, భర్త శివప్రసాద్ అక్కడకు వచ్చిన సీఎం జగన్ను కలిశారు. వారి కోరిక మేరకు చిన్నారికి నామకరణం చేశారు. తాము కోరిన వెంటనే సీఎం నామకరణం చేయడం ఆనందంగా ఉందని, త్వరలో బారసాల నిర్వహించి సీఎం నామకరణం చేసిన పేరును ప్రకటిస్తామని ఎంపీ మాధవి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. -
టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల కల్చరల్/వేములవాడ: న్యాయవాద వృత్తి లో టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని, ని రంతర అధ్యయనంతోనే రాణించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ టి.మాధవీదేవి పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోర్టు సముదాయంలో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి (ఏజేసీజే) కోర్టు భవనాన్ని హైకోర్టు మ రో న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్రావుతో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో న్యాయవాదులకు దిశానిర్దేశనం చేశారు. ప్రస్తుతం హైకోర్టులో అమలులో ఉన్న వ ర్చువల్ విధానాన్ని రానున్న రోజుల్లో అన్ని కోర్టు లకూ విస్తరిస్తామన్నారు. జిల్లా కోర్టులోనూ ఈ ఫైలింగ్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. కోర్టు సముదాయం కోసం కేటాయించిన స్థలం విషయంలో బార్ కౌన్సిల్ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. జస్టిస్ జె.శ్రీనివాసరావు మాట్లాడు తూ కఠోరశ్రమ, నిజాయితీతో కొనసాగితే న్యాయ వృత్తిలో రాణించడం సులువేనన్నారు. సిరిసిల్ల, జగి త్యాల జిల్లాల న్యాయమూర్తులు ఎన్.ప్రేమలత, నీలిమ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్కుమార్ పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ మాధవిదేవి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. భద్రాచలంలో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ కాజా శరత్ శని వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భద్రాచలంలో ఇప్పటికే ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉన్నప్పటికీ.. సుమారు 3,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటికి సంబంధించి సత్వర తీర్పు వెలువరించేందుకే మరో కోర్టు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. భద్రాచలం బార్ అసోసియేషన్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను అందించిందని, బార్ అభివృద్ధికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండలో ఫ్యామిలీ కోర్టు ప్రారంభం రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కోర్టు సము దాయంలో ఫ్యామిలీ కోర్టును హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జి.రాధారాణి శనివారం ప్రారంభించారు. అదేవిధంగా జ్యుడీషియల్ ఎంప్లాయీస్ నూతన సంవత్సర కేలెండర్ను ఆవిష్కరించారు. హైకోర్టు జడ్జికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు స్వాగతం పలకగా.. పలువురు జడ్జిలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మొద టి అదనపు జిల్లా జడ్జి తిరుపతి, ఫ్యామిలీ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్, ఐదవ అదనపు జిల్లా జడ్జి జి.వేణు పాల్గొన్నారు. సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్తా: జస్టిస్ పుల్లా కార్తీక్ చివ్వెంల(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కోర్టులో నెలకొన్న సమస్యలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హైకోర్టు జడ్జి, సూర్యాపేట జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ పుల్లా కార్తీక్ అన్నారు. ఆయన శనివారం సూర్యాపేట జి ల్లాకోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా న్యా యవాదులు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ కార్తీక్ మాట్లాడారు. అంతకుముందు ఆయన పిల్ల లమర్రి శివాలయాన్ని, అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోండ్రాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
Madhavi Kattekola: జై జవాన్కు టిఫిన్ బాక్స్
సమాజానికి మంచి ఆహారాన్నివ్వాలనుకుంది. ఖాద్యమ్... పేరుతో తినదగిన ఆహారాన్నిస్తోంది. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లోనూ నిరూపించుకుంది. దేశ రక్షణ కోసం కొండల్లో గుట్టల్లో డ్యూటీ చేసే సైన్యానికి మంచి ఆహారాన్నిచ్చే బాధ్యత చేపట్టింది. ఈ సందర్భంగా కట్టెకోల మాధవి విజయగాథ. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారి ఆహారం ఎలా ఉండాలో నిర్దేశించడానికి డీఎఫ్ఆర్ఎల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం పని చేస్తూ ఉంటుంది. ఆ ప్రమాణాల మేరకు ఆహారం తయారు చేయడానికి అనుమతి సాధించారు ఓ తెలుగు మహిళ. ఈ అనుమతి సాధించడానికి ముందు ఆమె ఆహారం మీద అంతులేని పరిశోధన చేశారు. భూమిలో నాటే గింజ నుంచి పంట దిగుబడి, దినుసులను ప్రాసెస్ చేయడం, వండి చల్లార్చి డబ్బాల్లో ప్యాక్ చేయడం వరకు ప్రతిదీ ఒక చేతి మీదుగా నడిచినప్పుడే నిర్దేశించిన ప్రమాణాలను పాటించగలమని నమ్ముతారామె. సేంద్రియ పంట, వంటను ఈ నెల న్యూఢిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సులో ప్రదర్శించి మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు హైదరాబాద్లో నివసిస్తున్న కట్టెకోల మాధవి. రైతులు విచిత్రంగా చూశారు! మాది సూర్యాపేట. నాన్న ఉద్యోగ రీత్యా నా చదువు మొత్తం హైదరాబాద్లోనే. నిజానికి నా చదువుకి, నేనెంచుకున్న ఈ రంగానికి సంబంధమే లేదు. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసి కొంతకాలం టీచర్గా, ఆ తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేశాను. మా వారు మైక్రో బయాలజీ చేసి హిమాలయ సంస్థలో ఉద్యోగం చేశారు. నెలలో ఇరవై రోజులు క్యాంపుల ఉద్యోగం ఆయనది. జీవితం ఇది కాదనిపించేది. మన జ్ఞానాన్ని సరిగ్గా ఒకదారిలో పెడితే గొప్ప లక్ష్యాలను సాధించవచ్చనిపించింది. సొంతంగా ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి 2009లో వచ్చాం. నాలుగేళ్లపాటు సమాజం అవసరాలేమిటి, అందుబాటులో ఉన్న వనరులేమిటి అని అధ్యయనం చేశాం. సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారం తప్ప అన్నీ ఉన్నాయని తెలిసింది. మేము 2014లో గ్రామాలకు వెళ్లి రైతులతో కొర్రలు పండిస్తారా అని అడిగినప్పుడు మమ్మల్ని వెర్రివాళ్లను చూసినట్లు చూశారు. కుగ్రామాలకు వెళ్లి మహిళలకు మా ఉద్దేశాన్ని వివరించాం. విత్తనాల నుంచి పంటకు అవసరమైన ఇన్పుట్స్ అన్నీ మేమే ఇస్తాం, మీరు పండించిన పంటను మేమే కొంటాం... అని భరోసా ఇచ్చాం. దాంతోపాటు వారు పండించే కంది పంట మధ్య చాళ్లలో చిరుధాన్యాలను పండించమని సూచించాం. ఒక కందిపంట సమయంలో చిరుధాన్యాలు మూడు పంటలు వస్తాయి. తమకు నష్టం ఏమీ ఉండదనే నమ్మకంతోపాటు మామీద విశ్వాసం కలిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో మొత్తం 1350 మంది మహిళారైతులు మాతో కలిశారు. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2018లో కంపెనీ ఖాద్యమ్ని రిజిస్టర్ చేశాం. ఖాద్యమ్ అనే సంస్కృత పదానికి అర్థం తినదగినది అని. పంట నుంచి మా ప్రయోగాలు వంటకు విస్తరించాయి. వండి చల్లబరుస్తాం! ఇడ్లీ, సాంబార్, చట్నీ వంటి ఆహార పదార్థాలు యంత్రాల్లోనే తయారవుతాయి. ఉడికిన వెంటనే మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లడంతో వాటిలో ఉండే తేమ హరించుకుపోతుంది. ఇలా తయారైన ఆహారం ప్యాకెట్లలో తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంటుంది. వేడినీటిలో ముంచితే ఐదు నిమిషాల్లో ఇడ్లీ మెత్తగా మారుతుంది, సాంబార్, చట్నీలు కూడా అంతే. మేము కనుగొన్న విజయవంతమైన ఫార్ములా ఇది. పోహా నుంచి స్పగెట్టీ, పాస్తా వరకు ఒక ఇంట్లో అన్ని తరాల వారూ ఇష్టపడే రుచులన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. మొదట్లో రెడీ టూ కుక్ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాం. రోజూ వండి బాక్సు పట్టుకెళ్లడం కుదరని రోజుల్లో రెడీ టూ ఈట్ విధానాన్ని అనుసరించాం. ఆఫీస్కి టిఫిన్ బాక్స్ తేలిగ్గా తీసుకెళ్లడానికి, ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి మా ఉత్పత్తులు చాలా అనువుగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సైన్యం అవసరాలకు తగినట్లు ఆహారాన్ని తయారు చేయడం పెద్ద సవాల్ అనే చెప్పాలి. మైసూర్లో ఉన్న డీఎఫ్ఆర్ఎల్కి ఎన్నిసార్లు వెళ్లామో లెక్క పెట్టలేం. యాభైసార్లకు పైగా వెళ్లి ఉంటాం. విమాన టిక్కెట్ల ఖర్చే లక్షల్లో వచ్చింది. సైంటిస్టులు సూచించిన నియమావళి ప్రకారం తయారు చేయడం, శాంపుల్ తీసుకెళ్లి చూపించడం, వాళ్లు చెప్పిన సవరణలను రాసుకుని హైదరాబాద్ రావడం, మేడ్చల్ దగ్గర బండ మాదారంలో ఉన్న మా యూనిట్లో తయారు చేసి మళ్లీ పట్టుకెళ్లడం... ఇలా సాగింది. మా ప్రయోగాల గురించిన ప్రతి వివరాన్నీ నోట్స్ సమర్పించాం. జీవితంలో ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నాం, ఆ ప్రయాణంలో మేము లక్ష్యాన్ని చేరేలోపు ఉద్యోగంలో సంపాదించుకున్న డబ్బు రెండు కోట్లకు పైగా ఖర్చయిపోయింది. ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా దీక్షగా ముందుకెళ్లడమే ఈ రోజు విజేతగా నిలిపింది. ఏ– ఐడియా వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగానూ, మౌలిక వసతుల కల్పనలోనూ సహకరిస్తున్నాయి. మా ఉత్పత్తులు ఈ–కామర్స్ వేదికల మీద పన్నెండు దేశాలకు చేరుతున్నాయి. ఢిల్లీలో ఈ నెల మూడు నుంచి ఐదు వరకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సు జరిగింది. అందులో స్టాల్ పెట్టమని ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడమే ఈ ప్రయత్నంలో మేము గెలిచామని చెప్పడానికి ఉదాహరణ’’ అని వివరించారు ఖాద్యమ్ కో ఫౌండర్ మాధవి. డీఎఫ్ఆర్ఎల్... డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ. కర్నాటక రాష్ట్రం మైసూర్లో ఉన్న ఈ సంస్థ డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఒక విభాగం. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారికి నిల్వ ఉండే ఆహారాన్ని సరఫరా చేస్తుంది. పర్వత ప్రాంతాలు, లోయలు, గడ్డకట్టే మంచులో ఉండే ఆర్మీ క్యాంపుల్లో విధులు నిర్వర్తించేవారికి తాజా ఆహారాన్ని అందించడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో వారి ఆకలి తీర్చేది... ముందుగానే వండి, శీతలపరిచి డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారమే. అలా నిల్వ చేసే ఆహారాన్ని తయారు చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఆహారం నెలల కొద్దీ నిల్వ ఉండాలి, అందులో పోషకాలు లోపించకూడదు. – వాకా మంజులారెడ్డి ఫొటో : నోముల రాజేశ్ రెడ్డి -
అల్లూరి జిల్లా వెలగల పాలెంలో మాజీ ఎమ్మెల్యే గొట్టేటి దేముడు 8వ వర్ధంతి
-
భార్యాబిడ్డలను హత్యచేసి.. ఆత్మహత్య
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడపలో హెడ్ కానిస్టేబుల్ భార్యాపిల్లల్ని హత్యచేసి, ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ టి.వెంకటేశ్వర్ (51) (హెచ్సీ 1895) ఈ దురాగతానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి 11 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున మూడుగంటలలోపు 9ఎంఎం పిస్టల్తో భార్య, ఇద్దరు పిల్లలను కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. పులివెందులకు చెందిన వెంకటేశ్వర్ 1993లో కానిస్టేబుల్గా చేరాడు. అతడి భార్య మాధవి (47). వీరికి ఇద్దరు కుమార్తెలు లాస్య (21), అభిజ్ఞ (16). లాస్య డిగ్రీ, అభిజ్ఞ టెన్త్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్కు యారాసు రమాదేవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త చనిపోయిన ఆమెకు నాగలోకేశ్వర్రెడ్డి అనే కుమారుడున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో కలతలు రేగాయి. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్ బుధవారం రాత్రి విధులు ముగించుకుని 10.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. తన కస్టడీలోనే ఉండే పోలీసు అధికారులకు సంబంధించిన ఓ పిస్టల్ను ఎవరికి తెలియకుండా వెంట తెచ్చుకున్నాడు. రాత్రి భోజనం తర్వాత భార్య, ఇద్దరు కుమార్తెలు బెడ్రూంలో పడుకుని ఉండగా కాల్చి చంపేశాడు. తర్వాత అదే పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు వచ్చారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ కం అగ్రిమెంట్తో పాటు మరో డాక్యుమెంట్ను స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్నోట్లో తన భార్య, ఇద్దరు పిల్లలు చనిపోయారు కాబట్టి, తన మరణానంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన డెత్ బెనిఫిట్స్ మొత్తం తన రెండో భార్య యారాసు రమాదేవికి, ఆమె కుమారుడు యారాసు నాగలోకేశ్వర్రెడ్డికి చెందాలని రాశాడు. మరో డాక్యుమెంట్లో రమాదేవి నుంచి తాను అవసరాల నిమిత్తం రూ.20 లక్షలు అప్పు తీసుకున్నానని, ప్రతిఫలంగా తనకు పులివెందుల మండలం ఉలిమెల వద్ద అనువంశికంగా వచ్చిన స్థిరాస్తిని రాసి ఇస్తున్నట్లు ఉంది. భార్యాపిల్లలను చంపకముందు వారు పూర్తిగా నిద్రలోకి జారుకునేందుకు మత్తుమందు కలిపి ఇచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, కడప డీఎస్పీ ఎండీ షరీఫ్, సీఐలు ఎన్.వి.నాగరాజు, రామచంద్ర, సయ్యద్ హాసం, ఎస్బీ సీఐలు అశోక్రెడ్డి, యు.వెంకటకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం వారు ఆధారాలను సేకరించారు. మృతదేహాలను డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్బాషా, కడప మేయర్ కె.సురేష్బాబు, వైఎస్సార్సీపీ నాయకుడు అప్జల్ఖాన్, పులి సునీల్కుమార్, సిబ్బంది పరిశీలించారు. డీఎస్పీని అడిగి వివరాలను తెలుసుకున్నారు. మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. మార్చురీలో మృతదేహాలను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరి్థక సమస్యలు, వివాహేతర సంబంధం కారణంగా ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కర్నూలు డీఐజీ సెంథిల్కుమార్ కడప వచ్చి స్టేషన్లో పోలీసు అధికారులను, సిబ్బందిని విచారించారు. -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్
వెండితెరపై అలరించిన అలనాటి తారలేందరో ప్రస్తుతం కనుమరుగయ్యారు. అందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. 80,90లో తమ అందం, అభిమనయంతో ఆకట్టుకున్న ఎంతో స్టార్ హీరోయిన్స్ వెండితెరకు దూరమై పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందులో సీనియర్ నటి, ‘మాతృదేవోభవ’ ఫేం మాధవి ఒకరు. అందంలో జయసుధ, జయప్రద వంటి హీరోయిన్స్కి పోటినిచ్చిన ఆమె ప్రస్తుతం గుర్తు పట్టలేకుండా మారిపోయారంటూ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫొటోలు చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు. తన తెనె కళ్లలతో మాయ చేసిన ఆమె ఇంతలా మారిపోయారేంటంటూ సర్ప్రైజ్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన మెప్పించిన మాధవి దాదాపు 300 సినిమాల వరకు చేశారు. చిరంజీవి ‘ఇంట్లో రామయ్యా వీధిలో కృష్ణయ్య’ చిత్రంలో హీరోయిన్గా పరిచయమైన ఆమె ఆ తర్వాత కోతల రాయుడు, ప్రాణం ఖరీదు, కుక్కకాటుకు చెప్పు దెబ్బ, ఖైది వంటి సినిమాల్లో ఆమె చిరంజీవికి జోడికట్టారు. చెప్పాలంటే అప్పట్లో చిరు-మాధవి పెయిర్ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. ఇక మాధవి గ్లామర్, అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యం తన కళ్లంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. అందులో లేడి ఫ్యాన్స్ కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. 13 ఏళ్లకే సినీరంగ ప్రవేశం చేసిన ఆమె దాదాపు 17 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగారు. ఇక ఆమె కెరీర్లో ఎప్పటికి గుర్తుండిపోయే చిత్రం ‘మాతృదేవోభవ’. ఇందులో ముగ్గురు పిల్లల తల్లిగా ఆమె చేసిన పోరాటం, ఎమోషన్స్ ఇప్పటికి ప్రతి ఒక్కరి మదిలో నిలిచిపోయింది. ముఖ్యం ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టకున్నాయి. అలా నటిగా కెరీర్ పీక్లో ఉండగానే మాధవి సడెన్గా వెండితెరకు దూరమయ్యారు. అమెరికాకు చెందిన బిజినెస్ మెన్ రాల్ఫ్ శర్మని పెళ్లి చేసుకుని ఫారిన్లో సెటిలైపోయారు. ప్రస్తుతం వీరికి ముగ్గురు కూతుళ్లు. పిల్లలు ఎదగడంతో భర్తకు సాయంగా బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటున్న మాధవి తరచూ ఇన్స్టాగ్రామ్లో ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె లెటెస్ట్ ఫొటోలు చూసి నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Maadhavi (@actress.maadhavi) View this post on Instagram A post shared by Maadhavi (@actress.maadhavi) -
నమ్మిన వ్యక్తే దారుణంగా మోసం చేశాడు: ‘మిర్చి’ నటి ఆవేదన
ప్రముఖ సినీ, టీవీ నటి మాధవి ఓ వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయానంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది. నటి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో ఆమె గుర్తింపు పొందింది. మిర్చిలో మాట వినని కొడుకు కోసం ఆత్మహత్యాయత్నం చేసిన తల్లిగా కనిపించింది. దీంతో ప్రభాస్ ఆమెకు విలన్ కుటుంబం తరపున డబ్బు సాయం చేస్తాడు. అలా ఈ సినిమాలో ఎమోషన్స్ పండించి నటిగా మంచి గుర్తింపు పొందిన ఆమె పలు టీవీ సీరియల్స్లో విలనిజం పోషిస్తోంది. బుల్లితెరపై కుట్రలు చేస్తూ, మోసం చేసే పాత్రల్లో మాధవి ఆకట్టుకుంటోంది. చదవండి: ఏడాది తిరక్కుండానే యాంకర్ శ్యామల మరో కొత్త ఇంటి నిర్మాణం, ‘అంత డబ్బు ఎక్కడిది?’ అలాంటి ఆమె నిజ జీవితంలో ఓ వ్యక్తి నమ్మ భారీ మొత్తంలో డబ్బు పొగొట్టుకుందట. ఇటీవల లైవ్లో ఫ్యాన్స్తో ముచ్చటించిన ఆమె స్వయంగా ఈ విషయం వెల్లడించింది. తనకు తెలిసిన వ్యక్తే నమ్మించి మోసం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాకు బాగా తెలిసిన వ్యక్తి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టమన్నాడు. అతడిని నమ్మి రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఆ తర్వాత మాయ మాటలు చెబుతూ ఆ డబ్బు మొత్తం కాజేశాడు. స్టాక్ మార్కెట్పై నాకు పెద్దగా అవగాహన లేకపోడం వల్లే సులువుగా నన్ను మోసం చేయగలిగాడు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న కల్యాణ్ రామ్ అమిగోస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..! డబ్బు పోయిందనే బాధ కంటే.. తెలిసినే వ్యక్తే, నేను బాగా నమ్మిన వ్యక్తి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని, లేదంటే తనలా మోసపోతారంటూ నెటిజన్లకు సూచించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ గురించి తెలియకుండ అసలు డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దని ఆమె తెలిపింది. కాగా స్టార్ మాలో ప్రసారమయ్యే ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో మాధవి దేవయాని పాత్ర పోషించింది. ఇందులో హీరోకు పెద్దమ్మగా నటించింది. కపట ప్రేమ చూపిస్తూ.. సొంతవాళ్లపైనే కుట్రలు చేసే పెద్దమ్మగా మాధవి తన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. -
హెచ్ఎం చనువుతో.. టీచర్గా మారిన డ్రైవర్
సాక్షి, బంజారాహిల్స్: డ్రైవర్గా ఉండాల్సిన వ్యక్తి సదరు స్కూల్ హెచ్ఎం ఇచ్చిన చనువుతో ఏకంగా టీచర్గా మారాడు. ప్రతిరోజూ ఎల్కేజీ విద్యార్థులకు హాజరు తీసుకోవడంతో పాటు క్లాస్లు కూడా చెప్పేవాడు. ఇదే చనువుతో ఎల్కేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ రోడ్ నెం. 14 డీఏవీ పబ్లిక్ స్కూల్లో అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రజనీకుమార్, హెచ్ఎం మాధవిల కస్టడీ మంగళవారంతో ముగిసింది. వీరిని బుధవారం తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. నిందితుడు రజనీకుమార్ పాఠశాలలో అన్ని తానై వ్యవహరించడమే కాకుండా ఏకంగా క్లాస్ తీసుకునేవాడని విచారణలో తేలింది. ప్రతిరోజూ ఓ క్లాస్ తీసుకోవడమే కాకుండా చిన్నారుల హాజరును కూడా నమోదు చేసేవాడని గుర్తించారు. పాఠశాలలోని సీసీ కెమెరాల వ్యవస్థ మొత్తం ఆయన పర్యవేక్షణలోనే ఉండటంతో తన అక్రమాలు వెలుగు చూడకుండా కొన్ని సీసీ కెమెరాల వైర్లను కట్ చేసిన విషయాన్ని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కొందరు టీచర్లు నిందితుడిపై ఫిర్యాదు చేసినా హెచ్ఎం మాధవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం కూడా విచారణలో వెలుగు చూసింది. పాఠశాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే తల్లిదండ్రులు డబ్బులను నేరుగా నిందితుడి అకౌంట్లోకే పంపించేవారని పోలీసులు గుర్తించారు. డ్రైవర్గా ఉండాల్సిన నిందితుడు టీచర్ అవతారం ఎత్తడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. స్కూల్లో ఇష్టారాజ్యం నెలకొనడం, క్రమ శిక్షణ లేకపోవడం ఇవన్నీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవి నిర్వాకంతోనే జరిగినట్లుగా తేలింది. -
అలా గిన్నిస్ రికార్డు ‘అల్లు’కుపోయారు
‘మనందరికీ ప్రత్యేకమైన ప్రతిభ, నైపుణ్యం ఉంటాయి. ఆ దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఏ పనీ చిన్నదీ కాదు, పెద్దదీ కాదు. చిన్న సూది, దారంతో నా ప్రయాణం మొదలైంది. ఇదే ఇప్పుడు నా చుట్టుపక్కల వారి జీవితాలను మార్చింది. మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. మీ అభిరుచిని అనుసరించండి. మీకు లభించే ప్రతి అవకాశాన్ని పొందండి. అపజయాలకు భయపడ కండి. అవి విజయానికి సోపానాలుగా భావించండి’ అంటున్నారు మాధవి. సీతంపేట (విశాఖ ఉత్తర): కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మహిళలు కూడా అద్భుతాలు సృష్టించగలరని, రికార్డులు క్రియేట్ చెయ్యగలరని నిరూపించారు అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలో నివసిస్తున్న మాధవి సూరిభట్ల. మాధవి స్థాపించిన ‘మహిళా మనోవికాస్’ సంస్థ ద్వారా తన వద్ద ఆన్లైన్లో శిక్షణ పొందిన 200 మంది మహిళలతో కేవలం మూడు నెలల్లో ఊలుతో 4,686 క్రోచెట్ క్యాప్స్ చేతి అల్లికతో తయారు చేసి.. ‘లార్జెస్ట్ క్రోచెట్ హ్యాట్స్, క్యాప్స్’ ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు సాధించారు. ఒక గృహిణి సారధ్యంలో మరో 200 మంది మహిళల భాగస్వామ్యంతో రికార్డు సాధించి గిన్నిస్బుక్లో విశాఖ నగరానికి ఒక పేజీ సృష్టించారు. ఆమె సాధించిన గిన్నిస్ రికార్డుపై ఎంతోమంది మహిళలు, ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దీనికి ముందు మరో నాలుగు గిన్నిస్ రికార్డుల్లో మాధవి భాగస్వామ్యం కావడం విశేషం. అదే స్ఫూర్తితో తనెందుకు సొంతంగా గిన్నిస్ రికార్డు సాధించకూడదు అనే ఆలోచన విజయంవైపు నడిపించింది. రెండు పీజీలు చేసిన మాధవి వివాహం తర్వాత కొన్నాళ్లు హైదరా బాద్లో ఒక కంపెనీలో హెచ్ఆర్గా పనిచేశారు. భర్త వెంకట రామారావుకు ఆర్సీఎల్లో ఉద్యోగం కారణంగా పాతికేళ్ల క్రితం విశాఖలో స్థిరపడ్డారు. మాధవి దంపతులకు ముగ్గురు పిల్లలు. దీంతో కుటుంబ బాధ్యతలు చూసుకునేసరికే సమయం సరిపోయేది. అయినా తనలో ఉన్న ప్రతిభ తోటి మహిళలకు నేర్పాలన్న ఉద్దేశంతో మధు క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ పేరిట 2014లో మాధవి సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఎంతో మందికి ఊలుతో క్యాప్స్, స్వెట్టర్స్, శాలువాలు, స్కార్ఫ్, పోంచోస్, అలాగే చాక్లెట్స్, కేక్స్ తయారీ, న్యూస్ పేపర్తో అలంకరణ (పేపర్ క్విల్లింగ్) వస్తువులు ఇలా ఎన్నో అంశాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా పాండమిక్ సమయంలో మహిళా మనో వికాస్గా సంస్థ పేరును మార్చి ఆన్లైన్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఉదయం రెండు బ్యాచ్లు, సాయంత్రం రెండు బ్యాచ్లకు శిక్షణ ఇచ్చేవారు. ఈ విధంగా దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది మహిళలు ఊలుతో పలు రకాల అల్లికలు నేర్చుకున్నారు. ఆ విధంగా సుమారు 350 మంది వరకు మనో వికాస్లో సభ్యులుగా చేరారు. నాలుగు గిన్నిస్ రికార్డుల్లో భాగస్వామ్యం... గతంలో నాలుగు గిన్నిస్ రికార్డుల సాధనలో మాధవి భాగస్వా మ్యం అయ్యారు. చెన్నైకు చెందిన సంస్థ ద్వారా 2017లో లార్జెస్ట్ స్కార్ఫ్ తయారీ, 2018లో స్ల్కప్చర్స్ తయారీ, 2019లో క్రిస్మస్ డెకరేషన్, 2020లో హనుమాన్ చాలీసా లక్ష గలార్చనలో ఆన్లైన్లో పాల్గొని గిన్నిస్ రికార్డులో భాగస్వామ్యం అయ్యారు. అదే స్ఫూర్తితో తనెందుకు రికార్డు సాధించకూడదు. నా వల్ల మరో నలుగురికి పేరు తేవాలన్న ఆలోచన కలిగింది. అదే తడువుగా మహిళా మనోవికాస్ సభ్యుల వద్ద తన ఆలోచన బయటపెట్టారు. దేశ విదేశాలలో తన వద్ద శిక్షణ పొందిన 200 మంది మహిళలు మాధవి ఆలోచనకు జత కలిశారు. గిన్నిస్ బుక్ ప్రతినిధిని మెయిల్ ద్వారా సంప్రదించారు. గిన్నిస్ రికార్డు సాధించాలంటే మూడు నెలల్లో వెయ్యి క్రోచెట్ క్యాప్స్(చేతితో అల్లిన ఊలు క్యాప్లు) తయారు చెయ్యాలని గిన్నిస్ ప్రతినిధులు జులై 2022లో లక్ష్యం నిర్దేశించారు. మూడు నెలల్లో 200 మంది మహిళలు ఏకంగా 4,686 క్రోచెట్ క్యాప్స్ తయారు చేసి ప్రదర్శనకు సిద్ధం చేశారు. సెప్టెంబర్ 18న అక్కయ్యపాలెం మెయిన్రోడ్లో ఒక ఫంక్షన్ హాల్లో 4,686 క్యాప్స్తో ‘లార్జెస్ట్ క్రోచెట్ క్యాప్స్ ’ ప్రదర్శించారు. గిన్నిస్ బుక్ ప్రతినిధి స్వప్నిల్ డంగారికర్ పరిశీలించి రికార్డును ధ్రువీకరించి మాధవితో పాటు, భాగస్వా మ్యులైన 200 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. 13 ఏళ్ల నుంచి 70 ఏళ్ళు పైబడిన మహిళలు సైతం ఈ రికార్డు సాధనలో పాలు పంచుకున్నారు. ఒక్కొక్కరు 5 నుంచి 20 వరకు క్యాప్స్ తయారు చేశారు. (చదవండి: చంద్రబాబు పేకలో పవన్కల్యాణ్ జోకర్) -
స్ఫూర్తి..: జీవనాడిని విస్తరించింది.. రూ.60 లక్షల వ్యాపారం
పచ్చని ఆకులో భోజనం మన సంప్రదాయం అదే మన ఆరోగ్య రహస్యం. ఆ జీవనాడిని పట్టుకొని అదే వ్యాపారంగా మార్చుకున్నారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వాసి మాధవి విప్పులంచ. బాధించిన క్యాన్సర్ నుంచి కోలుకొని అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మరలి పచ్చని విస్తరాకు ప్లేట్లను రాష్ట్రంతోపాటు ఇతర దేశాలకూ సరఫరా చేస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన విప్పులంచ మాధవి బీఫార్మసీ చేసి, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేశారు. తిమ్మారెడ్డిపల్లిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ మోదుగ, అడ్డాకులతో ప్లేట్లు తయారు చేస్తూ, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, యేటా రూ.60 లక్షలు సంపాదిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రి టూరిజాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న మాధవిని ఆమె పర్యావరణ ప్రయాణం గురించి అడిగితే ఎన్నో విశేషాలను వివరించింది. ‘‘పుట్టి పెరిగింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనుగుర్తి గ్రామం. అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. నాన్న చింతల బలరాం కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. అమ్మ సరోజిని రిటైర్డ్ ఫార్మసిస్ట్. నేను డిగ్రీవరకు హైదరాబాద్లోనే చదువుకున్నాను. ఆ తర్వాత అమ్మ సలహా తో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ పూర్తి చేశాను. చదువుకునే సమయంలోనే పెళ్లైంది. ఇద్దరు కొడుకులు. నా చదువు పూర్తయిన తర్వాత నా భర్త వేణుగోపాల్తో కలిసి ఉద్యోగరీత్యా పూణె వెళ్లాను. అక్కడ పూణె హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా మూడేళ్ల పాటు పని చేశాను. ఆ తర్వాత బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేసి, 2007లో తిరిగి హైదరాబాద్కు వచ్చేశాం. స్కూల్తో మొదలు కొన్ని రోజుల్లోనే ప్రైమరీ పాఠశాలను ప్రారంభించాను. సాయంత్రం వేళల్లో యోగా శిక్షకురాలిగా పనిచేశాను. వ్యవసాయం అంటే ఉన్న ఆసక్తితో సేంద్రియ సేద్యం వైపు దృష్టి పెట్టాను. అంతా సాఫీగా సాగుతుందనుకున్న క్రమంలో కొద్దిరోజుల తేడాతో నాన్న, అక్క మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది. క్యాన్సర్ నుంచి కోలుకుని.. వారి మరణం బాధ నుంచి కోలుకోక ముందే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డాను. అయినా భయపడకుండా ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకున్నాను. ఆ సమయంలో యోగా శిక్షణ నన్ను మరింత బలంగా చేసింది. ఏడాదిన్నర కాలంలో క్యాన్సర్ను జయించాను. ఆ సమయంలోనే కూరగాయలు, పంటల సాగులో రసాయనాల వాడకం, కలుషితమైన వాతావరణమే నా వ్యాధికి కారణమని గ్రహించాను. నాలాగే చాలామంది ఇలాంటి సమస్యలకు లోనవుతుంటారని కూడా తెలుసుకున్నాను. అప్పుడే ప్రకృతి సేద్యం చేస్తూ ఉన్నంతలో మంచి ఆహార పంటల ఉత్పత్తులను సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో నా భర్త సహకారంతో 2017లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. అందులో 20 వేల వరకు మామిడి, జామ, అరటి, బత్తాయి, సపోట తోటలు పెట్టాం. ఇతర కూరగాయలు పంటలను çపండించడం మొదలుపెట్టాం. సేంద్రియ ఎరువు తయారీకి 15 ఆవులను పెంచుతున్నాం. వాటి మూత్రం, పేడతో జీవామృతం తయారుచేసి మొక్కలకు అందిస్తున్నాం. పచ్చని విస్తరాకులు పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్ను చూసినప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. నా చిన్నతనంలో ఆకులతో కుట్టిన విస్తరాకుల్లోనే భోజనం చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. మన సంస్కృతిలో భాగమైన విస్తరాకుల తయారీని ముందు చేత్తోనే చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దీనినే 2019లో ‘ఆర్గానిక్ లీఫ్ టేబుల్’ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించాను. ఈ విస్తరాకు ల విక్రయానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ సైతం ఏర్పాటు చేశాను. దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ నిత్యం పోస్టులు చేయడం ద్వారా కొనుగోలుదారులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. విదేశాలకూ ఎగుమతి జర్మనీ, హాంకాంగ్, అమెరికా దేశాలకు సైతం మా విస్తరాకులు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీకి కావాల్సిన అడ్డాకులను ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మోదుగ ఆకులు మన నేలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఆకుల సేకరణ కష్టంగా ఉంది. ఇబ్బందులను అధిగమిస్తూనే రోజూ 10 వేల వరకు విస్తరాకులను తయారు చేస్తున్నాం. దాదాపు 20 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాను. ప్రతి యేడు రూ.60 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మేం పండిస్తున్న సేంద్రియ కూరగాయలు, పండ్లతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుని వచ్చినవారికి మా స్థలంలో ఒక పిక్నిక్ స్పాట్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వచ్చినవాళ్లకు రెండు మూడు రోజులపాటు వసతి సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటూ, అగ్రి టూరిజం చేయాలనేదే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను’ అని వివరించారు మాధవి. పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్ను చూసి నప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: కె.సతీశ్కుమార్ -
ఎవరీ మాధవీ పురీ.. కీలక పదవి దక్కించుకున్న తొలి మహిళగా రికార్డ్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తొలిసారి ఒక మహిళ నాయకత్వం వహించనున్నారు. కేబినెట్ ఎంపికల కమిటీ.. మాజీ బ్యాంకర్ మాధవీ పురీ బుచ్ను సెబీ కొత్త చైర్పర్సన్గా ఎంపిక చేసింది. ప్రస్తుత చైర్మన్ అజయ్ త్యాగి ఐదేళ్ల పదవీకాలం సోమవారం(28న) ముగియనుంది. దీంతో నేటి(మార్చి1) నుంచి 57 ఏళ్ల మాధవి బాధ్యతలు స్వీకరించనున్నారు. తొలిగా మూడేళ్లపాటు సెబీ చీఫ్గా వ్యవహరించనున్నారు. వెరసి సెబీ నిర్వహణకు ప్రైవేట్ రంగం నుంచి ఎంపికైన తొలి వ్యక్తిగా నిలవనున్నారు. సెబీకి పూర్తికాలపు తొలి మహిళా సభ్యురాలిగా కూడా మాధవి సేవలందించడం గమనార్హం! 30 ఏళ్ల అనుభవం.. ఫైనాన్షియల్ మార్కెట్లలో మూడు దశాబ్దాల కెరీర్ను సొంతం చేసుకున్న మాధవీ పురీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కెరీర్ను ప్రారంభించారు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం 1989లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 12 ఏళ్ల సర్వీసులో మూడేళ్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలందించారు. ఆపై ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్కు ఎండీ, సీఈవోగా పదోన్నతి పొందారు. 2009 ఫిబ్రవరి నుంచి 2011 మే వరకూ బాధ్యతలు నిర్వహించారు. 2011లో పీఈ కంపెనీ గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ ఎల్ఎల్పీలో చేరేందుకు సింగపూర్ వెళ్లారు. తదుపరి బ్రిక్స్ దేశాలు షాంఘైలో ఏర్పాటు చేసిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కన్సల్టెంట్గా సేవలందించారు. ఇవికాకుండా అగోరా అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ కూడా. త్యాగి ఐదేళ్లు...: 1984 బ్యాచ్ హిమాచల్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ త్యాగి 2017 మార్చి 1న సెబీ చైర్మన్గా ఎంపికయ్యారు. తొలుత మూడేళ్లు బాధ్యతలు నిర్వహించాక తదుపరి ఆరు నెలలపాటు, ఆపై మరో 18 నెలలపాటు చైర్మన్ పదవీ నిర్వహణకు గడువును పొందారు. సెబీ చట్ట ప్రకారం చైర్మన్ పదవికి అభ్యర్థుల ఎంపికలో గరిష్టంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసువరకూ పనిచేసేందుకు వీలుంటుంది. పూర్తికాలపు సభ్యురాలిగా మాధవి ప్రస్తుత చైర్మన్ త్యాగితో కలసి 2017 ఏప్రిల్ 5 నుంచి 2021 అక్టోబర్ 4 వరకూ పలు కీలక విధులను నిర్వర్తించారు. మాధవీ పురీ కెరీర్... సెబీకి తొలి మహిళా సారథిగా బాధ్యతలు చేపట్టనున్న మాధవీ పురీ ఐసీఐసీఐ బ్యాంక్సహా ప్రైవేట్ రంగంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. 2008 నవంబర్ 26న ముంబైలోని ఓ హోటల్పై టెర్రిరిస్టుల దాడి జరిగినప్పుడు చిక్కుకుపోయిన కార్పొరేట్ లీడర్లలో ఒకరిగా ఉన్నారు. సెబీకి ఐదేళ్ల పూర్తికాలపు సభ్యురాలిగా ఆమె పదవీకాలం 2021 అక్టోబర్లో ముగిసింది. దీంతో అదే ఏడాది డిసెంబర్లో సెబీ సెకండరీ మార్కెట్ కమిటీ అధినేత్రిగా ఎంపికయ్యారు. సెకండరీ మార్కెట్ల రక్షణ, సామర్థ్యం, పారదర్శకత తదితర అంశాల మెరుగుపై సలహా కమిటీ ద్వారా సెబీకి సేవలందించారు. -
మిద్దె తోటల మాధవి.. ‘మ్యాడ్ గార్డెనర్’ పేరుతో
తోటపని ఆందోళనను దూరం చేస్తుంది.తోటపని ఒత్తిడుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.తోటపని ఏకాగ్రతకు దారి చూపుతుంది.తోటపని ఆరోగ్యాన్నిఇస్తుంది.తోటపని సంతృప్తినీ, సంతోషాన్నీ మూట గట్టి ఇస్తుంది. విశాఖపట్నం వాసి మాధవి గుత్తికొండ పదేళ్లుగా చేస్తున్న డాబాగార్డెన్ ఐదేళ్లుగా ‘మ్యాడ్ గార్డెనర్’ పేరుతో యూ ట్యూబ్ ద్వారా కూరగాయల పెంపకాన్నీ ప్రోత్సహిస్తోంది. లక్షలాది వ్యూవర్స్కి తనదైన వాణీ వినిపిస్తోంది. ఇంటికి అవసరమైన కూరగాయల సాగును సొంతంగా తామే ఎలా సాగు చేసుకోవచ్చో చిన్న చిన్న సూచనల ద్వారా వ్యూవర్స్ని ఆకట్టుకుంటోంది మాధవి గుత్తికొండ. సాగులో మెలకువలను చెబుతూ నెటిజనులను ప్రోత్సహిస్తున్న మాధవి తాను చేస్తున్న పని గురించి చెబుతూ... ‘‘తోటపని నాకు చిన్నప్పటి నుంచీ ఉన్న అభిరుచి. కుండీల్లో మొక్కలు పెంచేదాన్ని. ఇండోర్, ఔట్డోర్ డెకొరేటివ్ మొక్కల పెంపకాన్ని ఇష్టంగా చేసేదాన్ని. పెళ్లి, పిల్లల బాధ్యతల నడుమ రోజులు గడుస్తున్నప్పటికీ మొక్కల పెంపకం ఎప్పుడూ ఆపలేదు. పదేళ్ల కిందట సొంతంగా ఇల్లు కట్టుకున్నాం. ఇంటికి అవసరమైన రెండు మూడు రకాల కూరగాయల మొక్కలు సాగుచేసేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కాలేజీలకు వెళుతున్నారు. నాకు కాస్త తీరిక దొరికింది. దీంతో మేడ పైన కూడా మొక్కల పెంపకం ముఖ్యంగా కూరగాయల పెంపకం చేసేదాన్ని. ఒత్తిడి నుంచి విశ్రాంతి వైపు.. పిల్లలు మేడ పైన చదువుకునేటప్పుడు మొక్కల మధ్య ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందనీ నాతోపాటు వాళ్లూ మొక్కలకు నీళ్లు పోయడం, వాటి గురించి పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఐదేళ్ల క్రితం యూ ట్యూబ్ మా పిల్లలు, వారి స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు యూ ట్యూబ్లో గార్డెన్కి సంబంధించిన ఛానెల్స్ సెర్చ్ చేశాను. తెలుగులో ఏవీ కనిపించలేదు. దాంతో నేనే చానెల్ మొదలుపెట్టాను. ఫోన్తోనే షూట్.. ఏ సీజన్లో ఏ విత్తనాలు, మట్టి రకాలు, ఎరువు, నీళ్లు ఎంతలా పెట్టాలి.. ఇలా అన్ని సూచనలతో ఫోన్లోనే గార్డెనింగ్కు సంబంధించిన వన్నీ షూట్ చేస్తుంటాను. తీసిన వీడియోలను మొదట్లో పిల్లలే ఎడిట్ చేసేవారు. ఇప్పుడు నేనే స్వయంగా ఛానెల్ వర్క్ కూడా చేస్తున్నాను. కాలక్షేపం... పేరు, ఆనందం టైమ్ పాస్కు మొదలుపెట్టిన ఈ తోట పని ఇప్పుడు నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పిల్లలు కూడా కాస్త టైమ్ దొరికితే చాలు తోట పనిలోకి వచ్చేస్తున్నారు. మేం బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా కొత్తరకం విత్తనాలు, మొక్కలు కనిపించినా, వాటిని తీసుకురావడం మొదలైంది. బంగాళదుంప.. పసుపు నేను ప్రయత్నించని సాగు అంటూ లేదు. బీర, సొరకాయలు, పచ్చిమిరప నాలుగైదు రకాలు, టొమాటో నాలుగు రకాలు, మునగ.. బంగాళదుంపల సాగు కూడా చేశాను. వెల్లుల్లి ట్రై చేశాను. పసుపు కొమ్ములూ పండించాను. అరటిమొక్కలు పెంచుతున్నాం. వీటి పనిలో సాయంగా ఉండటానికి ఒక హెల్పర్ని పెట్టుకున్నాను. ఘనమైన రుచి.. ఆరోగ్యం.. ఖర్చు గురించి ఆలోచన లేదు. ఎందుకంటే, ఇంటికి అవసరమైన ఆర్గానిక్ కూరగాయలు కొనాలంటే మాటలు కాదు. అదే మనకు మనంగా పండించుకున్నాం కాబట్టి ఖర్చు కలిసిరావడంతోపాటు కూరగాయల రుచి కూడా బాగుంటుంది. ఇంటిల్లిపాది ఆరోగ్యం బాగుంటుంది. మా అవసరాలకు మించిన కూరగాయలను చుట్టుపక్కలవాళ్లకు, బంధువులకు కూడా పంపిస్తుంటాను. కాలానుగుణంగా మూడు నెలలకు ఒకసారి పంటసాగు పని ఉంటుంది. ఇప్పటికి నాలుగు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ముందు నుంచీ ఛానెల్ ఉంది కాబట్టి అప్పటి నుంచి ఫాలో అయినవారున్నారు. కొత్తగా జాయినైనవారున్నారు. మా ఛానెల్ ద్వారా మిద్దె తోట గురించి తెలిసినవారు, సూచనలు, సలహాలు తీసుకొని వాళ్లు కూడా కూరగాయలు పండిస్తున్నారు. వాటిని మాకు పంపించేవారు, లేదా ఆ వీడియోలు షేర్ చేసేవారు ఉంటారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంటుంది. కొంతమందైనా స్ఫూర్తిగా తీసుకొని కూరగాయల సాగు చేయడం సంతోషాన్ని ఇస్తుంటుంది. అనుభవంలోకి వస్తే తప్ప ఆ ఆనందం తెలియదు. ఇప్పుడు మా ఇంటిపైన కాసే కూరగాయలతో వంటలు కూడా చేసి, వాటిని పోస్ట్ చేస్తుంటాను. మంచి రెస్పాన్స్ రావడంతోపాటు ఇప్పుడు యూట్యూబ్ నుంచి అంతో ఇంతో ఆదాయమూ వస్తోంది’’ అని ఆనందంగా వివరించారు మిద్దె తోటల మాధవి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఘనంగా టీవీ యాంకర్ పెళ్లి
మలయాళ దర్శకుడు, నటుడు మధుపాల్ పెద్ద కూతురు, టీవీ యాంకర్ మాధవి పెళ్లి ఘనంగా జరిగింది. కేరళలోని వాజుత్తకోడ్కు చెందిన అరవింద్తో ఆమె ఏడడుగులు వేసింది. శాంతిగిరి ఆశ్రంలో ఈ వివాహ కార్యక్రమం జరగ్గా ఈ విషయాన్ని పెళ్లి కూతురి చెల్లి మీనాక్షి సోమవారం సోషల్ మీడియాలో వెల్లడించింది. "ప్రపంచంలోనే నువ్వు బెస్ట్ అక్కవి. నువ్వు పెళ్లి బంధంలో అడుగు పెట్టినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు వేరే ఇంట్లోకి అడుగు పెడుతున్నా మేమంతా నీ వెన్నంటే ఉంటాం. కానీ నిన్ను ఎంత మిస్ అవుతానో చెప్పడం నాకిష్టం లేదు. ఎందుకంటే అది తలుచుకుంటేనే కన్నీళ్లు జలధారలా కారడం ఖాయం. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ సిస్టర్, బెస్ట్ డాటర్.. ఇలా అన్నీ ఉన్న నువ్వు దొరకడం నా అదృష్టం. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను" అని ఎమోషనల్ అవుతూ వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. (చదవండి: నటిని పెళ్లాడబోతున్న దర్శకుడు) మరోవైపు సన్నిహితులు, స్నేహితుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయగా టీవీ సెలబ్రిటీలతో పాటు సినిమా వాళ్లు కూడా హాజరై వధూవరును మనసారా ఆశీర్వదించారు. వీరిలో నటులు జగదీష్, మనియన్ పిల్ల రాజు, శ్రీకుమార్, దర్శకులు కమల్, షాజి కైలాస్ తదితరులు ఉన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతుండగా అభిమానులు కొత్త జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా సినీ దర్శకుడు మధుపాల్ - రేఖల మొదటి సంతానమే మాధవి. టీవీ యాంకర్గా ఆకట్టుకున్న ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గానూ పని చేస్తున్నారు. (చదవండి: వైరల్: బుల్లితెర స్టార్లతో ప్రదీప్ డ్యాన్స్) View this post on Instagram A post shared by Meenakshi 💮 (@meenakshi_madhupal) -
నా భర్తను నాకు అప్పగించాలి : మాధవి
సాక్షి, హైదరాబాద్ : తన భర్తను అప్పగించాలని కరోనా బాధితుడు మధుసూదన్ భార్య మాధవి డిమాండ్ చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో మాధవి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డాక్టర్లు తన భర్తకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని చెప్పారని మాధవి తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మధుసూదన్ను ప్రాణాలతో అప్పగిస్తే సీఎం కేసీఆర్ను సన్మానిస్తానని తెలిపారు. మధుసూదన్కు ఎం జరిగినా అది ప్రభుత్వ హత్యే అవుతుందన్నారు. మరణాలు పెరగాలని ఎవరు కోరుకోరని.. మధుసూదన్ విషయంలో ప్రభుత్వం వాదనకు, గాంధీ ఆస్పత్రి రికార్డులకు పొంతన కుదరడం లేదని విమర్శించారు. (చదవండి : నా భర్త జాడ చెప్పండి!) కాగా, మధుసూదన్ కుటుంబంలో పలువురికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మాధవి కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే ఇంటికి వెళ్లిన మాధవికి తన భర్త కనిపించకపోవడంతో ఆమె షాక్కు గురయ్యారు. వైద్యులు తన భర్త బతికే ఉన్నాడని చెప్పారని అన్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం మధుసూధన్ చికిత్స పొందుతూ మరణించాడని స్పష్టం చేశాయి. కుటుంబ సభ్యుల సూచనల మేరకే ఈ విషయాన్ని మాధవికి చెప్పలేదని వెల్లడించాయి. మరోవైపు మాధవి మాత్రం తన భర్త జాడ చెప్పాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు ఆమె మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. -
షీ ఐ మాధవి
‘జరిగిందంతా నాతో చెప్పడం మీకు ఇబ్బందిగా ఉంటే మా లేడీ కానిస్టేబుల్తో షేర్ చేసుకోవచ్చు’ అని చెప్తాడు లైంగిక బాధితురాలితో ఒక ఎస్సై. కోర్టులో ... ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేలా డిఫెన్స్ లాయర్ ప్రశ్నలు అడుగుతూంటే.. ‘బాధితురాలు స్త్రీ.. కాస్త సున్నితంగా డీల్ చేయండి’ అంటూ అడ్డుపడుతుంది పబ్లిక్ ప్రాసిక్యూటర్. ‘సెక్షన్ 375’ సినిమాలోని దృశ్యాలవి. నిజంగా కూడా పోలీస్ శాఖ, జ్యుడీషియరీలోనూ ఇలా ఆలోచించే వాళ్లుంటే బాగుండు అనిపిస్తుంది. లేరు అనడానిక్కూడా లేదు.. ఉన్నారు. కొంత మంది. వాళ్లలో వాసంశెట్టి మాధవి ఒకరు. తెలంగాణ, కరీంనగర్ జిల్లా, హుజురాబాద్లో సీఐగా పనిచేస్తున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్కు, పేరంటాలు, పెళ్లిళ్లకూ అందునా చీరలు కట్టుకుని అటెండ్ అయ్యే వీలు చాలా తక్కువ. పట్టుచీరలు కట్టుకొని ఆ ఫంక్షన్స్కు అటెండ్ అయిన మహిళలను చూసి ‘అయ్యో.. నాలా యూనిఫామ్ వేసుకునే చాన్స్ వీళ్లకు లేదే’ అనుకుంటా.. నా యూనిఫామ్ పట్ల గౌరవం, నా పట్ల నాకు గర్వంగా అనిపిస్తుంది. అమ్మాయిలు భద్రంగా ఉండాలంటే మగపిల్లల ఆలోచనలు ఆరోగ్యంగా ఉండాలి. అమ్మను, తోబుట్టువులను గౌరవించడం మగపిల్లలకు నేర్పించాలి. దీని బాధ్యత పేరెంట్స్, టీచర్స్దే. పిల్లలకు చదువొక్కటే కాదు లోకజ్ఞానమూ కావాలి. పాఠ్యపుస్తకాలతోపాటు ఇతర పుస్తకాలు, పేపర్ రీడింగ్ పిల్లలకు అలవాటు చేయాలి. వార్తలను టీవీల్లో, సోషల్ మీడియాలో ఫాలో అవడం కాదు కచ్చితంగా పత్రికలనే చదివేలా చూడాలి. పేపర్ అనే ఎందుకంటున్నానంటే.. పేపర్కున్న విశ్వసనీయత ఒక కారణమైతే.. అది చదివినప్పుడు మనలో ఒక రియాక్షన్ ఉంటుంది. అది ఇంకో కారణం. నా 23 ఏళ్ల సర్వీస్లో ఎన్నడూ పశ్చాత్తాప పడ్డ సందర్భాలు లేవు. కేవలం పొట్టకూటి కోసమే ఈ ఉద్యోగంలో చేరా. డిగ్రీ అయిపోయాక బీఈడీ చేయాలనుకుంటున్నప్పుడు అప్పటికే ఎస్ఐ పోస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న మా అన్నయ్య.. ‘బీఈడీ అంటే ఇంకా రెండేళ్లు పడుతుంది. నా మాట విని ఎస్.ఐ. పోస్ట్’కి అప్లయ్ చెయ్’ అంటూ ఎంకరేజ్ చేశాడు. అలా అన్నయ్య, నేను ఇద్దరం ఒకే బ్యాచ్ లో ట్రైన్ అయ్యాం. ఉద్యోగంలో చేరినప్పటినుంచి నా పనికి న్యాయం చేసుకుంటూ పోతున్నా’ అని చెప్పారు మాధవి. ఆ మూడు కేసులు.. ‘ పదేళ్ల కిందట 26 ఏళ్ల యువతి మీద 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి చేశాడు. అప్పుడు నేను ఆ జ్యూరిస్ డిక్షన్లో లేను. పదేళ్ల తర్వాత అంటే ఇటీవలే ఆ కేస్ ట్రయల్స్కు వచ్చింది. ఇప్పుడది నా జ్యూరిస్ డిక్షన్. అయితే లైంగిక దాడి తర్వాత ఆ అమ్మాయి మానసికంగా, శారీరకంగా చాలా కుంగిపోయింది. జరిగిన సంఘటన అటుంచి, ఎవరినీ గుర్తుపట్టే స్థితిలో కూడా లేదు. ఆమెకు మానసిక చికిత్స అవసరమని, మానసికంగా కుదుట పడ్డాకే ట్రయల్స్ మొదలుపెట్టాలని కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాను. మూడు నెలల తర్వాత ఆమె కుదుట పడ్డాకే.. ట్రయల్స్కు వెళ్లాం. ఇక్కడ ఇంకో చిక్కు వచ్చిపడింది. నేను ఎదురుగా ఉంటేనే ధైర్యంగా మాట్లాడేది. నన్నూ అనుమతించమని కోరును అభ్యర్థించి మరీ ఆమెకు అండగా నిలబడ్డాను. ఈ ప్రయత్నాలతో ఆమె తన మీద దాష్టీకం చేసిన వ్యక్తిని గుర్తుపట్టి.. జరిగిందంతా కోర్టుకు వివరించింది. ఆ నేరస్తుడికి పదేళ్లు శిక్ష పడింది. వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలనూ డీల్ చేసాను. సామాన్యుల నుంచి సమాజంలో పేరున్నవాళ్ల దాకా, కొత్త పెళ్లిజంటల నుంచి 40 ఏళ్లు కాపురం చేసిన వాళ్లదాకా ఎందరికో కౌన్సెలింగ్స్ ఇచ్చాను. పోలీస్స్టేషన్కు రావడం ఇష్టంలేని వాళ్ల ఇళ్లకు సివిల్ డ్రెస్లో వెళ్లి మరీ కౌన్సెలింగ్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఆస్తి లాక్కొని తిండి పెట్టక అమ్మానాన్నలను కష్టపెడ్తున్న పిల్లలనూ పిలిచి మాట్లాడి పెద్దవాళ్లకు పరిష్కారం చూపించిన కేసులు ఎన్నో. ఇలాంటి పట్టణాల్లో అంతగా కనపడవు కాని పల్లెల్లో అన్నీ అవే. రోజుకు ఒక్కటైనా వస్తుంది అలాంటి కేసు. సవాళ్లు? నేనైతే పెద్దగా ఎదుర్కోలేదు. అలాగని డిస్క్రిమినేషన్కు ఈ ఫీల్డేమీ మినహాయింపు కాదు. పనికి జెండర్ ఉండదు, ఏ టాస్క్కైనా నేను సిద్ధమే అని నిరూపించుకోవడానికి, ఆ కాన్ఫిడెన్స్ను బిల్డప్ చేయడానికి ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికే తెలుసు. మహిళలమని మనకు మనమే రిజర్వేషన్స్పెట్టుకుంటే అవతలి వాళ్లు మనల్ని ఈక్వల్గా చూడరు అని నా ఉద్దేశం. మన పనితీరే మనకు గౌరవాన్ని, గుర్తింపునిస్తుంది. నేను జాయిన్ అయిన కొత్తలో మగవాళ్లు ఎవరైనా ‘మాధవి ..లేడీ ఇన్స్పెక్టర్ అని పిలిస్తే ‘ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్... అంతే.. మగ, ఆడ అని ఉండదు కదా అని వాదించి వారికి వారికి నచ్పజెప్పేదాన్ని. కుటుంబ సభ్యులతో మాధవి విమెన్ ఫ్రెండ్లీ పోలీస్... మొన్న తొమ్మిదేళ్ల పాప మీద లైంగిక దాడి జరిగింది. సివిల్ డ్రెస్లో వెళ్లి.. ఓపిగ్గా ఆ పాపతో మాట్లాడితే విషయమంతా చెప్పింది. బహుశా నాలో వాళ్ల అమ్మనో.. అత్తనో.. పిన్నినో చూసుకొని ఉంటుంది. అదే నా స్థానంలో మేల్ ఆఫీసర్ ఉండుంటే ఆ పాప భయంతో బిగుసుకుపోయేదేమో! న్యాయం జరిగినా, జరగకపోయినా బాధితులు మహిళలే. ఈ నిజాన్ని గ్రహించేది, అర్థం చేసుకునేదీ మహిళలే. ఇన్స్టంట్గా న్యాయం అందించే అవకాశమూ ఉంటుంది. అందుకే పోలీస్డిపార్ట్మెంట్లోకి ఎంత వీలైతే అంత ఎక్కువ మంది మహిళలు రావాలి. బీటెక్లు చదివి ఏ కాల్సెంటర్లోనో పదివేలకు ఉద్యోగం చేసేకంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తే.. గౌరవానికి గౌరవం, సాటి మహిళల తరపున ఉన్నామనే గర్వం రెండూ మిగులుతాయి. తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే.. మీ ఆడపిల్లలను పోలీస్ జాబ్స్కి ఎంకరేజ్ చేయండి. భయపడాల్సిందేమీ లేదు. మీ అమ్మాయి ధైర్యంగా ఉండడమే కాక పదిమంది అమ్మాయిలకూ ధైర్యాన్నివ్వగలదు. దిశ తర్వాత మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమాలు.. ప్రత్యేకంగా ఏమీ చేపట్టలేదు కాని డయల్ 100 మీద విస్తృత ప్రచారం మాత్రం చేశాం.. చేస్తున్నాం. మహిళల నుంచి వచ్చిన, వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందం, ఆశ్చర్యం రెండూ కలుగుతున్నాయి. తన కొడుకు స్కూల్కి వెళ్లకుండా మారాం చేస్తున్నాడు కాస్త వచ్చి పిల్లాడిని బుజ్జగించండి అని ఒక అమ్మ, తొమ్మిది నెలల నిండుతున్నా డెలివరీకి తల్లిగారింటికి పంపించట్లేదు.. కొంచెం మీరొచ్చి మా అత్తగారికి కౌన్సెలింగ్ ఇవ్వరా అంటూ ఓ గర్భిణీ కాల్ చేశారు. çసమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలన్న అవగాహనైతే వచ్చింది అది చాలు’’ అని సంతోషపడుతున్నారు మాధవి. కుటుంబ నేపథ్యం.. మేం ఆరుగురం అక్కచెల్లెళ్లం, మాకు ఇద్దరన్నదమ్ములు. మా నాన్నదీ పోలీస్ ఉద్యోగమే. నా పదేళ్లప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లమే ఇంటి బాధ్యతలను చూసుకునేవాళ్లం. మా అక్కచెల్లెళ్లం మా అత్తగారింటి వాళ్లకు చెప్పిన మాటొక్కటే..‘మా అమ్మ బతికుంటే ఒకటే అమ్మ ఉండేది.. కాని ఇప్పుడు మాకు మేం ఆరుగురం అమ్మలమే’ అని. అందుకే ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే గర్వపడండి. బాగా చదివించండి.. స్వశక్తి మీద నిలబడేలా పెంచండి. నా కుటుంబానికి వస్తే మా వారు మహేష్ బాబు కూడా ఇన్స్పెక్టరే. ఇద్దరు అబ్బాయిలు రుషి ఫణీంద్ర, మీరజ్ చంద్ర. నేను ఈ రోజు ఈ ఉద్యోగం హాయిగా చేసుకోగలుతున్నానంటే మా అత్తగారి సహకారం వల్లే. – సరస్వతి రమ ఫొటోలు .. అల్లె నరేందర్, సాక్షి, హుజురాబాద్ -
మాధవి పరిణయ సందడి
గొలుగొండ, కొయ్యూరు: అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి పెళ్లిపీటలెక్కారు. గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) తన చిన్ననాటి స్నేహితుడు కుసిరెడ్డి శివప్రసాద్తో మాధవి వివాహం వేడుక వైభవంగా జరగనుంది. దీంతో మాధవి స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలోనూ, ఇటు వరుడు శివప్రసాద్ స్వగ్రామం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గురువారం రోజుంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ జంటను ఆశీర్వదించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల రాకతో గ్రామాలు కళకళలాడాయి. పెళ్లిబాజాలు మోగే వరకు వధూవరుల్ని ఒక చోటకి తీసుకురాకపోవడం అక్కడి సంప్రదాయం కావడంతో.. ముహూర్తానికి గంట ముందు పెళ్లికుమారుడిని తీసుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుతో పాటు పార్టీ నేతలు ఎంపీ మాధవిని ఆశీర్వదించారు. -
ఎన్నికలే స్నేహాన్ని ప్రేమగా మార్చాయి..
ప్రేమించుకోవడానికి రెండు హృదయాలు ఒకటి కావాలి. వివాహం చేసుకోవాలంటే రెండు కుటుంబాలు కలవాలి. మొదట ఇద్దరూ ప్రేమించుకున్నారు. తరువాత వారి అభిప్రాయాన్ని పెద్దలకు చెప్పారు. ముందు కాదూ కూడదు అన్నా చివరకు వివాహానికి రెండు వైపుల వారు అంగీకరించారు. దీంతో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి , గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్ల మధ్య చిగురించిన ప్రేమ ఇప్పుడు వివాహంతో ఇద్దరిని ఒకటిగా చేస్తోంది. కొయ్యూరు (పాడేరు): స్నేహ బంధం..ప్రేమగా అంకురించింది. మిత్రత్వం చిగురించి అది ప్రేమగా మారింది. ఎంపీ మాధవి, కాబోయే భర్త శివప్రసాద్ దాదాపు 16 సంవత్సరాల పాటు స్నేహితులుగానే ఉన్నారు. ఎన్నికల సమయంలో మాధవికి సహాయం చేసేందుకు ఆమె వెనకే శివప్రసాద్ ఉన్నారు. అంత వరకు స్నేహితులుగా ఉన్న ఇద్దరు ప్రేమికులుగా మారారు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు వివరించారు. పెద్దలు రెండు వైపుల కాస్తా వ్యతిరేకించారు. తరువాత వివాహానికి అంగీకరించారు. ఇద్దరి తండ్రుల మధ్య పరిచయం మాధవి తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే దేముడు. శివప్రసాద్ తండ్రి నారాయణమూర్తి మధ్య పరిచయం ఉంది. దేముడు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు.అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న దేముడు, నారాయణమూర్తిల మధ్య మిత్రత్వం చాలాకాలం కొనసాగింది. ఇద్దరూ సహధ్యాయులు శివప్రసాద్ మాధవి క్లాస్మేట్లు. ఇద్దరు కలిసి చదువుకున్నారు. నవోదయలో చదివిన మాధవి పదిలో బయటకు వచ్చారు. తరువాత ఇద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యారు. ఉన్నత విద్యలోను కలిసి చదువుకోవటంతో స్నేహం చిగురించింది. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. ఎన్నికలే స్నేహాన్ని ప్రేమగా మార్చాయి ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలు ఇద్దరు స్నేహితులను ప్రేమికులుగా మార్చాయి. మాధవికి ఇద్దరు సోదరులున్నారు. అయితే ఎన్నికల సమయంలో కీలకంగా ఉండి సలహాలు ఇచ్చేవారు ఉండాలి. ప్రసాద్ ఎన్నికల సమయంలో అన్ని తానే వెనక నుంచి మద్దతు చెప్పారు. ఆ సమయంలో స్నేహితులు ఇద్దరు ప్రేమికులుగా మారారు. చివరకు ఎన్నికల త రువాత వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఈనెల 17న రాత్రి 3.15 నిమిషాలకు శరభన్నపాలెంలో వివాహం జరుగుతుంది. 18న శరభన్నపాలెంలోనే విందు ఏర్పాటు చేశారు. ఒకరినొకరంఅర్థం చేసుకున్నాం ఇద్దరికి 16 ఏళ్లుగా పరిచయం ఉంది. చిన్నతనం నుంచి స్నేహితులుగానే ఉండిపోయాం. కలిసి చదవడం మూలంగా ఒకరిని ఒకరం పూర్తిగా అర్థం చేసుకున్నాం. అన్ని తానై ఎన్నికల సమయంలో నన్ను నడిపించారు.అటువంటి వ్యక్తి భర్తగా రావడం నా సుకృతం. –మాధవి, ఎంపీ స్నేహమే ప్రేమగా మారింది మొదటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులం కలిసి చదువుకున్నాం. ఎన్నికల సమయంలో ఇద్దరం కలిసి ప్రచారం చేశాం. అవసరమైన సాయం చేశాను. ఆ సమయంలోనే ఇద్దరి నడుమ స్నేహం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది. ఆమె నా భార్యగా రావడం నా అదృష్టం.– కుసిరెడ్డి శివప్రసాద్ -
ఎంపీ మాధవి వివాహానికి సీఎంకు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: అరకు ఎంపీ గొడ్డేటి మాధవి తన వివాహానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. తనకు కాబోయే భర్త శివప్రసాద్తో కలిసి ఆమె తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న (శుక్రవారం) ముఖ్యమంత్రిని కలిశారు. ఈ నెల 17వ తేదీన జరిగే తమ పెళ్లికి రావాలంటూ సీఎం జగన్కు వివాహా ఆహ్వాన పత్రికను అందచేశారు. కాగా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్తో ఎంపీ మాధవి వివాహం జరగనుంది. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్స్లో ఏర్పాటు చేశారు. చదవండి: అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్ 17న అరకు ఎంపీ వివాహం -
అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్
సాక్షి, విశాఖపట్నం : అతి పిన్న వయసులో పార్లమెంట్లో అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడైన శివప్రసాద్ను పెద్దల అంగీకారంతో విహహం చేసుకోబోతున్నారు. మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో ఈ వివాహ వేడుక జరగనుంది. రిసెప్షన్ను ఈ నెల 22న రుషికొండలోని సాయిప్రియ బీచ్ రిసార్ట్స్లో ఏర్పాటు చేయనున్నారు. గొలుగొండ మండలం కెడిపేట గ్రామానికి చెందిన శివప్రసాద్ బి.టెక్, ఎంబీఏ పూర్తిచేశారు. ప్రస్తుతం కరస్పాండెట్గా ఓ కాలేజ్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ పెళ్లికి ముందు తమ స్నేహాన్ని, ప్రేమను తెలియజేసేలా ఓ ప్రీ వెడ్డింగ్ వీడియో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రేమ ముందు అందరూ సమానమే అని ఈ వీడియో రుజువు అయింది. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానం ప్రారంభించిన మాధవి... ఈ ఎన్నికల్లో ముప్ఫై ఏళ్లుగా రాజకీయ చక్రం తిప్పిన కిశోర్చంద్రదేవ్ని ఇంటికి సాగనంపారు. -
అరకు ఎంపీ ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్
-
విశాఖకు ఇది శుభోదయం
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు కూత పెట్టింది. పరుగు ప్రారంభించింది. అతి తక్కువ సమయం, తక్కువ చార్జీలు, మెరుగైన సౌకర్యాలు వంటి ప్రత్యేకతలు కలిగిన ఈ రైలు సర్వీసు దేశంలోనే రెండోది. గురువారం ఉదయం 11.30 గంటలకు రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప అంగాడి జెండా ఊపి ఈ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. అలాగే వాల్తేర్ డివిజన్ను యథాతథంగా కొనసాగించాలన్న డిమాండ్ పరిశీలనలో ఉందన్న మంత్రి వెల్లడించారు. సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ): ‘విశాఖవాసులకు ఇది శుభోదయం.. ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న సమయం . అతి తక్కువ ప్రయాణ సమయం, ఏసీ, డైనింగ్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ రైలు సర్వీసు దేశంలోనే రెండోది’ అన్నారు రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్ చెన్నబసప్ప. విశాఖ రైల్వేస్టేషన్లో గురువారం దీనిని ప్రత్యేక రైలుగా ఆయన ప్రారంభించారు. అతిథులు, డీఆర్ఎం, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ రైలుకు జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి ప్రత్యేక రైళ్లను బిజీ రూట్లలో మాత్రమే నడుపుతామని, విశాఖ ప్రజలకు దీని అవసరం ఉండటంతో ఉదయ్ను ఏపీకి కేటాయించామన్నారు. రైల్వేలో ఆ మూడింటికి ప్రాధాన్యం మోదీ ప్రభుత్వం రైల్వేలో మూడు అంశాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మొదటిది ప్రయాణికుల భద్రత, రెండోది పరిశుభ్రత, మూడోది సమయపాలన అని తెలిపారు. ఈ మూడింటిని రైల్వే కచ్చితంగా అమలు చేస్తోందన్నారు. ఉదయ్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రైల్వే సహాయ మంత్రి సురేష్ చెన్నబసప్ప, డీఆర్ఎం శ్రీవాస్తవ, ఎంపీలు జీవీఎల్, ఎంవీవీ తీరిన విశాఖ వాసుల చిరకాల కోరిక విశాఖవాసుల చిరకాల కోరిక విజయవాడకు విశాఖ నుండి డైరెక్ట్ రైలు నడపడం. నేడు ఉదయ్ ప్రారంభంతో ఈ కోరిక తీరిందని వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం చేతన్కుమార్ శ్రీ వాస్తవ అన్నారు. రైల్వేస్టేషన్లో ఉదయ్ ప్రారంభం సందర్భంగా డీఆర్ఎం మాట్లాడారు. ఉదయ్ సర్వీస్ ప్రారంభంతో విశాఖవాసులకు విజయవాడ ప్రయాణం చాలా అనుకూలంగా మా రిందన్నారు. నగరవాసులు విజయవాడలో తమ పనులు చూసుకుని తిరిగి రాత్రికి నగరానికి చేరుకునే విధంగా ఈ టైంటేబుల్ ఉం దని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీలు పి.వి.ఎన్.మాధవ్, పాకలపాటి రఘువర్మ, దువ్వారపు రామారావు, మాజీ ఎంపీ కె.హరిబాబు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు, రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుగుప్రయాణం ఫుల్ విశాఖ నుంచి గురువారం ప్రారంభమైన ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు తిరుగు ప్రయాణంలో విజయవాడ నుండి పూర్తి ఆక్యుపెన్సీతో వచ్చినట్లు తెలిసింది. విశాఖ నుంచి కూడా ప్రకటించిన అతి కొద్ది సమయంలోనే సీట్లు చాలావరకు నిండిపోయాయి. విజయవాడ నుంచి కూడా అన్ని కోచ్లు ఫుల్గా వచ్చాయి. డివిజన్ విషయంలో మాకు చేతనైనంత చేస్తాం విశాఖకు ప్రత్యేక జోన్ కేటాయింపు పెద్ద వరమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. డివిజన్ విషయంలో చేతనైనంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విశాఖ అందాలు అద్భుతం విశాఖ నగర సౌందర్యానికి ముగ్ధులైన ఆయన అనంతరం స్టేషన్ నిర్వహణ చూసి డీఆర్ఎం చేతన్కుమార్ను ప్రశంసించారు. విశాఖ రైల్వేస్టేషన్ ఎంతో అందంగా ఉందని, స్టేషన్ను ఇలా ఉంచడంలో డీఆర్ఎం, సిబ్బంది పనితీరు అభినందనీయమన్నారు. విశాఖలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే రెండో విస్టాడోమ్ కోచ్ను కూడా సమకూర్చనున్నట్లు తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?
తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు: కేటీఆర్
నాకు నచ్చిన భారతీయ వంటకాలు ఇవే.. సీఈఓ సుందర్ పిచాయ్
తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్డే విషెస్
తప్పక చదవండి
- ‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- ఉత్తర భారతానికి హీట్వేవ్ అలర్ట్
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- జామ పండ్లే కాదు, ఆకులతో కూడా అనేక లాభాలు
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement