జిల్లాలో పోలీసు కార్డన్ సెర్చ్
●భారీగా వాహనాల స్వాధీనం
●రౌడీ షీటర్లకు వార్నింగ్
తెనాలిరూరల్: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆదివారం తెనాలిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక చినరావూరుతోటలో ఇంటింటికి తిరిగి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎటువంటి ధ్రువపత్రాలు లేని 43 బైక్లు, ఆరు ఆటోలను సీజ్ చేశారు. అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ జనార్ధనరావు మాట్లాడుతూ గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ‘సంకల్పం’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో గంజాయి వినియోగం, రౌడీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో తెనాలి వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ సీఐలు వి.మల్లికార్జునరావు, రాములు నాయక్, సాంబశివరావు పాల్గొన్నారు.
మేడికొండూరులో..
మేడికొండూరు: స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలోని పేరేచర్ల ఎల్ఎన్ఎస్ కాలనీలో తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఫిరంగిపురం, తాడికొండ, తుళ్లూరు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సీఐలు, మేడికొండూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి ప్రతి ఇంటిని, అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం కాలనీలోని రౌడీషీటర్లు, పాత నేరస్తులను పిలిపించి డీఎస్పీ మురళీకృష్ణ ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, గంజాయి జోలికి వెళ్లినా కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. పోలీస్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో సీఐలు కె.వాసు, శ్రీనివాసరావు, ఎస్ఐ సుబ్బారావు, పలు మండలాల పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పోలీసు కార్డన్ సెర్చ్


