ప్రణాళిక లేకుండానే శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చారు
ఇప్పటికై నా కళ్లు తెరిచి జేఏసీతో, అఖిలపక్షంతో సమావేశం నిర్వహించాలి లేకపోతే ప్రజాఉద్యమం చేపట్టి తగిన బుద్ధి చెబుతాం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో అంబటి రాంబాబు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జిని సరైన ప్రణాళిక లేకుండానే కూల్చేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నగరాన్ని సర్వనాశనం చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. ముందుగా బ్రిడ్జి పనులకు సంబంధించి చిత్రాలను ప్రదర్శించారు. శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేసే ముందు జేఏసీ, పెద్దలు, బాధితులతో సమావేశం నిర్వహించినప్పుడు ఆర్యూబీ నిర్మించాలని కోరితే ప్రొవి జన్ లేదని చెప్పి..హడావుడిగా చాలీచాలని నిధులతో బ్రిడ్జిని కూల్చివేశారని అన్నారు. సేతు బంధు పథకం కింద ఎక్కడో పొలాల్లో, గ్రామాల్లో రూ.98 కోట్లతో నిర్మించే బ్రిడ్జిని కోర్ సిటీ అయిన గుంటూరుకు తీసుకువచ్చి నగరాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఓవర్ బ్రిడ్జికి సంబందించి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, రైల్వే అధికారుల అనుమతులు తీసుకోకుండా బ్రిడ్జిని పడేశారన్నారు. బాధితులు కోర్టుకు వెళితే ఇప్పుడు భూ సమీకరణ చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యూబీకి ప్రొవిజన్ లేదని చెప్పిన పెమ్మసాని జేఏసీ, బాధితులు, ప్రజల సలహా మేరకు ఆర్యూబీ ప్రొవిజనన్్ పెడుతున్నామని చెప్పడం విడ్డూరమన్నారు. ఇప్పుడు నగర వాసులు ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారన్నారు. తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలను డమ్మీలను చేశారన్నారు. మరో సారి జేఏసీ, అఖిలపక్షం, బాధితులతో సమావేశం పెట్టి పరిష్కార మార్గాలు చూపకుంటే ప్రజాఉద్య మం చేపట్టి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి –మోదుగుల
బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందో ప్రజలకు తెలిసేలా శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ గుంటూరు, విజయవాడ పార్లమెంటరీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి డిమాండ్ చేశారు. ట్రాక్ మీద ఉన్న బ్రిడ్జి పడేయడానికి నాలుగు నెలలు పడుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాలు ఎలా కలుపుతారని ప్రశ్నించారు. గతంలో విలీనం అయిన 10 గ్రామాల్లో తాగాడానికి నీళ్లే లేవన్నారు. 2028 నాటికి కూడా బ్రిడ్జి నిర్మాణ పూర్తికాదన్నారు.
భూ సేకరణకు..కార్పొరేషన్కు
సంబంధం ఏమిటి?
– డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు
బ్రిడ్జి నిర్మాణంలో పెమ్మసాని ఒంటెత్తు పోకడతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మండిపడ్డారు. భూసేకరణకు కార్పొరేషన్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. భూ సేకరణకు రూ.30 కోట్లు నగరపాలక సంస్థ సాధారాణ నిధుల నుంచి ఖర్చు చేసేందుకు టేబుల్ ఏజెండా పెట్టారని, దీనిపై చర్చ పెట్టకుండానే ఆమోదించారన్నారు. ఆర్ అండ్ బీ డీపీఆర్ ఎవరికి తెలియదని..ఆఖరికి కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు కూడా తెలియదని..దీనికి కర్త..కర్మ, క్రియ పెమ్మసానేనని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, కార్పొరేటర్లు బూసి రాజలత, అచ్చాల వెంకట రెడ్డిలు మాట్లాడారు.


