నేటి నుంచి ఖాదీ ఎగ్జిబిషన్
పటమట(విజయవాడతూర్పు): ఖాదీ పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యంతో పాటు, గ్రామీణ కళాకారుల జీవనోపాధిని ప్రోత్సహించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా ఖాదీ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ ఎస్.గ్రీప్ తెలిపారు. పటమట రామినేని వారి వీధిలోని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన ఖాదీ మహోత్సవం నిర్వహణపై మీడియా ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేబీఐసీ), భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో పీఎంఈజీపీ ఖాదీ మార్కెటింగ్ రాష్ట్రస్థాయి సంయుక్త మార్కెటింగ్ ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ ఎగ్జిబిషన్ను ఈనెల 3వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక పంట కాలువ రోడ్డులోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ప్రారంభిస్తారన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో 100 కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ సహాయ సంచాలకుడు ఆర్.ఎల్.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.


