సింగారపు చెరువు కట్ట పరిశీలన
మొయినాబాద్రూరల్: మండల పరిధిలోని నదీమ్నగర్ రెవెన్యూ పరిధిలోని సింగారపు చెరువులో ఇళ్ల నిర్మాణానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చెరువు లోపల ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలను తొలగించి చదును చేశారు. కాగా చెరువు కట్టను తొలగించి రోడ్డును వేస్తుండడంతో రెండురోజుల క్రితం అధికారులకు సమాచారం అందడంతో పనులను నిలిపివేశారు. పనులు అలాగే కొనసాగితే చర్యలు తప్పవని అధికారులు వారిని హెచ్చరించారు. ఆదివారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు రోడ్డు వేసిన చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గౌతమ్కుమార్, ఇరిగేషన్ అధికారి భరత్కుమార్ మాట్లాడుతూ.. నదీమ్నగర్ సమీపంలో ఉన్న సింగారపు చెరువు కట్టను తొలగిస్తూ కొందరు రోడ్డు వేస్తున్నారనే సమాచారంతో పనులు నిలిపివేయించామని తెలిపారు. కట్టను యథావిధిగా చేసేందుకు కృషి చేస్తామని వివరించారు. చెరువు కట్ట జోలికి వస్తే చర్యలు తప్పవన్నారు.
చెరువు కట్ట తొలగించిన వ్యక్తిపై కేసు నమోదు
నద్దీమ్నగర్ గ్రామ సమీపంలోని సింగారపు చెరువు కట్టపై మట్టిని తొలగించారంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ భరత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. డిసెంబర్ 17వ తేదిన సింగారపు చెరువు పరిధిలో శిఖంపట్ట భూమి యజమాని అక్కడ నిర్వహిస్తున్న కార్యకలాపాలపై అధికారులకు సమాచారం అందింది. ఈ విషయంలో స్పందించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా భూమి యజమాని సమక్షంలో అక్కడ తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం శిఖంపట్టభూమి యజమాని చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతంలో వండు మట్టిపై పిచ్చిమొక్కలను తొలగించినట్లు గుర్తించారు. అదేవిధంగా ఎఫ్టీఎల్ ప్రాంతంలోని వండుమట్టిపైనా లూజ్ మట్టిని డోజర్తో తొలగించినట్లు గుర్తించిన అధికారులు ఎన్. సూర్యప్రకాశ్రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.


