కంటి సమస్యలు తొలిదశలోనే గుర్తించాలి
చేవెళ్ల: విద్యార్థుల్లో కంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.లలితా దేవి అన్నారు. పట్టణంలోని మోడల్ కాలనీలో కొనసాగుతున్న మియాపూర్కు చెందిన మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాలలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల్లో చూపు లోపాలను త్వరగా గుర్తించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే కంటి సమస్యలను నివారించవచ్చని తెలిపారు. తద్వారా విద్యాప్రగతికి దోహదం చేస్తుందన్నారు. డివిజన్ జిల్లా ఉపవైద్యాధికారి, కంటి వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్, ఆలూరు వైద్యాధికారి డాక్టర్ పద్మావతి, ఆప్థాల్మిక్ అధికారి పద్మ వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
షాబాద్: ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితాదేవి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. సిబ్బంది హాజరుపట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో షాబాద్ ఆస్పత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వివిధ రుగ్మతలతో ఆస్పత్రికి వచ్చే బాధితులు నిరుత్సాహంతో వెనక్కి వెళ్లకుండా వైద్యం చేసి పంపించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆమె వెంట సీహెచ్ఓ సంతోష, డాక్టర్ తబ్బుసమ్, సిబ్బంది ఉన్నారు.


