విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదు
ఇబ్రహీంపట్నం: విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్ విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థి రాము హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడాన్ని నిరసిస్తూ శనివారం గురునానక్ యూనివర్సిటీ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన రాము యూనివర్సిటీ యాజమాన్యం వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రులకు తీరని వ్యథను మిగులుస్తున్న, ఈ ఘటనపై గురునానక్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని, రాము ఆత్మహత్యపై పూర్తిస్థాయి విచారణ జరిపించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని సూచించారు. ఇటీవల కాలంలో గురునానక్ యూనివర్సిటీలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పోరెడ్డి నర్సింహ్మారెడ్డి, అర్జున్రెడ్డి, ముత్యాల భాస్కర్, నాయిని సత్యనారాయణ, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు జక్క రవీందర్రెడ్డితోపాటు టేకుల రాంరెడ్డి, నారాయణయాదవ్, రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ముత్యాల మహేందర్ పాల్గొన్నారు.
గురునానక్ విద్యాసంస్థలపై
చర్యలు తీసుకోవాలి
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
యూనివర్సిటీలో ఆత్మహత్యలపై
బీజేపీ మహాధర్నా


