జాతీయ స్థాయికి ఎంపిక
మొయినాబాద్ రూరల్: జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు కాశీంబౌలి గ్రామంనుంచి ఎం.జశ్వంత్రెడ్డి ఎంపికవ్వడం అభినందనీయమని సర్పంచ్ రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో నిర్వహించనున్న సీనియర్ నేషనల్ వాలీబాల్ చాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ జట్టుకు ఆడటం సంతోషకరమన్నారు. జాతీయస్థాయిలో గెలుపొంది రాష్ట్రానికి, గ్రామానికి కీర్తి తీసుకరావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
● అర తులం బంగారం, ఐదు తులాల వెండి, రూ.20వేల నగదు అపహరణ
● కేసు నమోదు
శంకర్పల్లి: తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన ఆదివారం శంకర్పల్లి పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని వివేకానంద నగర్లో నివాసం ఉండే రవి(35) ప్రైవేటు ఉద్యోగి. ఈ నెల 2న రవి ఇంటికి తాళం వేసి, కుటుంబంతో కలిసి తన బంధువు గ్రామమైన స్టేషన్ గొల్లగూడకి వెళ్లాడు. తిరిగి ఆదివారం ఇంటికొచ్చి చూసేసరికి తాళం పగులగొట్టకుండా దుండగులు ఇంటి పైకప్పు నుంచి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా తాళం పగులగొట్టి అర తుల బంగారం, 5తులాల వెండి, రూ. 20వేల నగదు అపహరించినట్లు గుర్తించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


