షాద్నగర్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి
షాద్నగర్రూరల్: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాన్ని కలుపుతూ షాద్నగర్ను నూతన జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ఎమ్మె సంతోష్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని జిల్లా సాధన సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో కలిపి ఉంటుందని, పట్టణ ప్రాంతాలకు ప్రాధాన్యం పెరుగుతుండగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాయన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అవసరమైన సాగునీరు, రోడ్లు, విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలు సకాలంలో అందక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లా కేంద్రం ప్రజలకు దూరంలో ఉండటంలో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి గ్రామీణ ప్రాంతాలను విడదీసి ఫ్యూచర్ సిటీ పరిధిలోని ప్రాంతాలను కలుపుతూ నూతన షాద్నగర్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం వెంటనే మొగిలిగిద్ద, చించోడ్, చేగూరు గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేయడంతో పాటుగా షాద్నగర్ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా సాధన సమితి ప్రధాన కార్యదర్శి దర్గ వెంకటేశ్, పట్టణ అధ్యక్షుడు కాసోజు శివకుమార్, నాయకులు శరత్కృష్ణ, ఆదిత్య వర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ఎమ్మె సంతోష్


