Anderson Peters: అథ్లెట్పై అమానుష దాడి.. వీడియో వైరల్
Published
Sun, Aug 14 2022 1:20 PM
జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ అండర్సన్ పీటర్స్పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గ్రెనాడాలో ఓ బీచ్ పార్టీకి హాజరైన అండర్సన్ పీటర్స్పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అనంతరం పడవలో నుంచి నీళ్లల్లోకి తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే గొడవ ఎందుకు జరిగింది?దాడి ఎవరు చేశారు? ఏం జరిగిందనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా దాడిలో స్వల్పంగా గాయపడిన అండర్సన్ పీటర్స్, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు గ్రెనాడా పోలీసులు పేర్కొన్నారు.
కాగా అండర్సన్ పీటర్స్పై దాడిని ఒలింపిక్ కమిటీ ఖండించింది. ‘పీటర్స్పై దాడి అమానుష చర్య. నేషనల్ స్పోర్ట్స్ స్టార్, హీరో అయిన అండర్సన్పై దాడి చేసిన ఐదుగురిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. అతనిపై దాడి చేసిన వాళ్లు ఈ ప్రాంతానికి చెందిన వాళ్లు కాదని తెలిసింది.’ అంటూ పేర్కొంది. గ్రేనడా దేశానికి చెందిన అండర్సన్ పీటర్స్.. 2019, 2022 జావెలిన్ త్రో వరల్డ్ ఛాంపియన్షిప్స్ టైటిల్స్ గెలిచాడు. ఈ ఏడాది దోహా డైమండ్ లీగ్లో 93.07 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన అండర్సన్ పీటర్స్, ఆ తర్వాత స్టాక్హోమ్ డైమండ్ లీగ్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లోనూ స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాడు.