IPL 2023: ఐపీఎల్‌కు దూరమైనా పంత్‌కు అరుదైన గౌరవం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక నిర్ణయం!

Rishabh Pants Jersey Number To Be Printed On Delhi Capitals - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌, టీమిండియా స్టార్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కానున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ వ్యవహరించనున్నాడు.

ఇక ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌కు దూరమైన రిషబ్‌ పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్ మేనేజ్‌మెంట్ అరుదైన గౌరవం ఇవ్వనుంది. ఈ ఏడాది సీజన్‌లో పంత్‌ జెర్సీ నెంబర్‌తో బరిలోకి దిగాలని ఢిల్లీ జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ కూడా దృవీకరించాడు.

"మేం పంత్‌ను చాలా మిస్‌ అవ్వబోతున్నాం. ప్రతీ మ్యాచ్‌కు డగౌట్‌లో అతడు నా పక్కన కూర్చోవాలని నేను భావిస్తున్నాను. ఒకవేళ అది కుదరకపోతే మాకు సాధ్యమయ్యే మార్గాల్లో అతన్ని జట్టులో భాగం చేయాలనుకుంటున్నాము. మేము అతడి జెర్సీ  నంబర్‌ను మా షర్టులపై లేదా క్యాప్‌లపై ఉంచాలి అనుకుంటున్నాం.

అతడు మా జట్టుతో లేకపోయినా, ఎప్పటికీ అతడే మా నాయకుడు అని తెలియజేయడం కోసమే ఇదంతా. మేము ఇంకా పంత్‌ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్నది నిర్ణయించలేదు. అయితే  సర్ఫరాజ్ ఖాన్‌ మాత్రం మా జట్టుతో చేరాడు. ఈ ఏడాది సీజన్‌కు ముందు మేము ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడాలి అనుకుంటున్నాము" అని పాంటింగ్‌ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు ముందు కేకేఆర్‌కు ఊహించని షాక్‌! ఇక అంతే సంగతి?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top