రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు కేజీబీవీ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

Dec 29 2025 7:31 AM | Updated on Dec 29 2025 7:31 AM

రాష్ట

రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

ఖిల్లాఘనపురం: ఎస్‌జీఎఫ్‌ రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులు ఎంపికై నట్లు ప్రత్యేక అధికారి లలిత, పీఈటీ చిట్టి తెలిపారు. శనివారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో జరిగిన అండర్‌ 14 ఉమ్మడి జిల్లాస్థాయి 5 కిలోమీటర్ల సైక్లింగ్‌ పోటీలో శశిప్రియ, మీనాక్షి, అండర్‌ 17 విభాగంలో కె.పూజ, మేఘన చక్కటి ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. సోమవారం మల్కాజ్‌గిరిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆయా విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ఎంపికై న విద్యార్థులను ఎస్‌ఓ, పీఈటీతో పాటు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.

రామన్‌పాడులో

నిలకడగా నీటిమట్టం

మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ వరప్రసాద్‌ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వ నుంచి జలాశయానికి నీటి సరఫరా నిలిచిపోగా.. ఎన్టీఆర్‌ కాల్వకు 600 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 35 క్యూ సెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.

యువత సేవా కార్యక్రమాలు నిర్వహించాలి

ఖిల్లాఘనపురం: యువత ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నారాయణపేట జిల్లా మెడికల్‌ కళాశాల ఆర్‌ఎంఓ డా. శ్రీనివాసులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఖిల్లా సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా ఆయనతో పాటు సేవాసమితి వ్యవస్థాపకుడు, ఏఎస్‌ఐ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సేవాసమితి ఏర్పాటుచేసి వైద్య శిబిరాలతో ప్రజలకు ఉచితంగా సేవలు అందించడం సంతోషించదగిన విషయమన్నారు. ఇలాంటిి కార్యక్రమాల నిర్వహణతో సమాజంలో యువతపై సదాభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శిబిరంలో డా. కృష్ణమూర్తి, డా. రవిరాజు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 210 మందిని పరీక్షించగా.. కంటిచూపుతో బాధపడుతున్న 162 మందికి కంటి అద్దాలు తయారు చేయించి వచ్చే వారం అందిస్తామని సమితి వ్యవస్థాపకులు కొరిగెల గోపి, రాగిరి పెద్దరాజు వివరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆగారం ప్రకాష్‌, గోనెల నాగేష్‌, గోవిందు, లింగస్వామి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గోపాల్‌, బీజేపీ నాయకులు బెన్నూరు ఆశన్న, రామచంద్రయ్య, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పోషకాల ఆహారం

అందించాలి

వనపర్తిటౌన్‌: విద్యార్థులకు మధ్యాహ్న భోజన మెనూ పాటిస్తూ పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు అందించాలని కమ్యూనిటీ మొబిలైజింగ్‌ అధికారి ప్రతాప్‌రెడ్డి కోరారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వంటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి మండలం నుంచి ఒక బృందం పాల్గొని వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేశారు. వీటిని జిల్లాస్థాయి అధికారులు పరిశీలించి విజేతలను ప్రకటించారు. ప్రథమ బహుమతి ఏదుల మండల సిబ్బంది మంజుల, శైలజ.. ద్వితీయ బహుమతి గోపాల్‌పేట సిబ్బంది పద్మ, ఎల్లమ్మ.. తృతీయ బహుమతి పెద్దమందడి మండలం మోజర్ల సిబ్బంది అందుకున్నారు. కార్యక్రమంలో ఏఎంఓ మహానంది, జీసీడీఓ శుభలక్ష్మి, డీఎస్‌ఓ శ్రీనివాసులు, ఎంఈఓలు జయరాములు, మంజుల, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివాజీ, మౌనిక, ఏపీఓ శ్రీధర్‌రెడ్డి, వరప్రసాదరావు, శాంతన్న తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు కేజీబీవీ విద్యార్థులు 1
1/2

రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు కేజీబీవీ విద్యార్థులు 2
2/2

రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీలకు కేజీబీవీ విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement