ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

ఏపీలో మద్యం షాపులను తగ్గిస్తూ ఉత్తర్వులు

Published Sat, May 9 2020 3:15 PM

Andhra Pradesh Government reduces liquor shops by 13 per cent - Sakshi

సాక్షి, విజయవాడ: మద్య నియంత్రణ, నిషేధంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. దశలవారీగా మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 33 శాతం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 4380 మద్యం షాపులను 2934కి తగ్గించింది. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం దుకాణాలను తగ్గించిన విషయం తెలిసిందే.

తాజాగా మరో 13 శాతం మద్యం షాపులను తొలగించాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నాటికి షాపులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 43వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు, 40 శాతం బార్లును గతంలోనే తగ్గించింది. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ప్రభుత్వం ఇప్పటికే 20శాతం తగ్గించింది. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్‌షాపుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపింది. 

రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం, ముందుగా బెల్ట్‌షాపులు ఎత్తివేస్తానంటూ పాదయాత్రలో హామీనిచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మద్యం దుకాణాలను ఏటా కొంతమేర తగ్గించేలా కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చారు. ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో నూటికి నూరుశాతం మద్యం దుకాణాలు ఎత్తివేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 

Advertisement
Advertisement