-
పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..
-
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అన్నీ అపోహలే
సాక్షి, అమరావతి: ల్యాండ్టైట్లింగ్ చట్టంపై అవగాహన లేకుండా కొందరు దుర్మార్గ ప్రచారం చేస్తున్నారని ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం మండిపడింది. రెవెన్యూ, న్యాయపరమైన అంశాలు తెలియనివారు దీనిపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తింది. ప్రభుత్వం భూములు లాక్కుంటుందనేది శుద్ధ అబద్ధమని తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం ఇండియన్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో సీఎం సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజేయ కల్లం, భూచట్టాల నిపుణుడు సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అజేయ కల్లం మాట్లాడుతూ ఈ చట్టంపై హైకోర్టు స్టే ఇచ్చిందని, ఇక ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భూముల రీ సర్వే పూర్తయ్యాక టైట్లింగ్ మొదలవుతుందని, అప్పుడే డిక్లరేషన్ జరుగుతుందన్నారు. తీసుకువచ్చే మార్పులు చేర్పుల గురించి కోర్టుకు తెలిపాక, అందరితో సంప్రదించాక ఈ చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. టైట్లింగ్ యాక్ట్, రీ సర్వే, ఇ–స్టాంపింగ్ విధానాలు అద్భుతమైన సంస్కరణలని కొనియాడారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే వాటిని ఎలాగైనా అడ్డుకోవాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ల్యాండ్ టైటిల్స్ కోర్టులు ఇవ్వాలి తప్ప రెవెన్యూ శాఖకు ఏం పని అంటున్నారని, దీనిపై నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదన్నారు. ఆర్ఓఆర్ లేక ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేసే అధికారం కేవలం కార్వనిర్వాహక వ్యవస్థకే ఉంటుందన్నారు. కోర్టుల్లో కేవలం వివాదాల పరిష్కారానికి, వాటిపై అభిప్రాయాలు చెప్పడానికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. భూ రికార్డుల వ్యవస్థను భ్రష్టు పట్టించినవారే ఇప్పుడు వాటిని పరిష్కరించేందుకు తీసుకువస్తున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 1983 నుంచే భూ రికార్డుల వ్యవస్థ భ్రష్టు పట్టడం మొదలైందన్నారు. ప్రతి సంవత్సరం జమాబందీ, అజమాయిషీ సర్వేలు చేస్తూ కచ్చితమైన రికార్డుల వ్యవస్థగా ఉన్న కరణం వ్యవస్థను ప్రత్యామ్నాయం లేకుండా ఒక్కసారిగా రద్దు చేశారని విమర్శించారు. దీంతో పదేళ్లపాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులు తయారు చేసేవారు లేకుండాపోయారన్నారు. దీనివల్లే వివాదాలు పెరిగాయని, నకిలీలు, రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేసి మంచి వ్యవస్థను తీసుకువçస్తుంటే దానిపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.12కి పైగా రాష్ట్రాల్లో ఇ–స్టాంపింగ్ వ్యవస్థ తెల్గీ స్టాంపుల కుంభకోణం తర్వాత కేంద్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని అజేయ కల్లం గుర్తు చేశారు. ఇప్పుడున్న స్టాంప్ పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లతో ఆ సంస్థ ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తెచ్చిందన్నారు. మహారాష్ట్రలో 2015లో ఈ విధానాన్ని తొలిసారి అమలు చేశారని, అది విజయవంతమయ్యాక ఇప్పుడు 12కిపైగా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. 2016లో మన రాష్ట్రంలోనూ తాను రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్ను ఆహ్వానించి పైలెట్ ప్రాజెక్టు చేయమన్నానని గుర్తు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి ఇ–స్టాంపింగ్ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. దాని ట్రయల్స్ కోసం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 135 డాక్యుమెంట్లు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ మెమో ఇస్తే.. దానికి, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి లింకు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇ–స్టాంపులు జిరాక్స్ పేపర్లు కావన్నారు. అందులో నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లు ఉంటాయని తెలిపారు.నల్లచట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరం: భూచట్టాల నిపుణుడు సునీల్కుమార్భూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సునీల్కుమార్ మాట్లాడుతూ ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని నల్ల చట్టంగా ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ చట్టం ద్వారా భూములు లాగేసుకుంటారని, కోర్టులకు అధికారాలు ఉండవని, అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్ రిజిస్టర్ అధికారికి ఇస్తున్నారని, ఆయన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారనే ప్రచారాలు పూర్తిగా తప్పని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలు జరగకపోతే రాష్ట్రం మళ్లీ 50 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. ఉన్న భూములకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి హక్కులను కాపాడుతుందే తప్ప భూములను లాక్కునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఉన్న రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఒక రిజిస్టర్ తయారు చేస్తుందని, దాన్ని ప్రజలందరికీ అందుబాటులో పెడతారన్నారు. దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. రీ సర్వే ద్వారా తయారయ్యే రికార్డును టైటిల్ రిజిస్టరింగ్ చట్టం కింద ప్రకటిస్తారని, అది ఆన్లైన్లో అందరికీ అందబాటులో ఉంటుందని వివరించారు. కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనేది తప్పని, ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తున్న కేసులు అలాగే నడుస్తాయన్నారు. అలాగే భూములు అమ్మాలన్నా, దానం చేయాలన్నా టైటిల్ రిజిస్ట్రార్ అనుమతి కావాలనేది అపోహేనని తేల్చిచెప్పారు. కొత్త చట్టం తహశీల్దార్కి, సబ్ రిజిస్ట్రార్కి ఉన్న అధికారాలను ఒక చోటకు చేరుస్తుందన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ జరిగి రికార్డులోనూ మార్పు కూడా జరిగిపోతోందన్నారు. భూముల రీ సర్వే పూర్తయితే భూములకు సంబంధించి 80 రకాల సమస్యల్లో చాలావరకు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మే నెల పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ
సాక్షి, అమరావతి: మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) విధానంలో లబ్ధిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు. ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది. అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్ధిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పింఛన్ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
ఏపీ ఉద్యోగులతో ఒక మాట!
దేశంలోనే అన్ని రంగాల్ని మొట్టమొదటగా ప్రైవేటీకరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది – స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. దీంతో పేదలకు చదువు దూరమైంది. ఆంగ్లం అందకుండా పోయింది. దీనికి విరుగుడుగా జగన్ నేతృత్వంలో విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. దేశంలోని మొత్తం స్కూలు విద్యను ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చకుండా విద్యా సమానత్వాన్ని తేవడం సాధ్యమా? అందుకే గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అట్టడుగు గ్రామీణ శ్రమజీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తున్నదో అర్థం చేసుకోవడం ముఖ్యం.రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు ఎక్కువ ఎటు ఓటు వేశారనేది ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించినప్పుడు తెలుస్తుంది. ముఖ్యంగా అత్యధిక సంఖ్యలో ఉన్న టీచర్లు – స్కూలు, కాలేజీ, యూనివర్సిటీలలో పనిచేసేవారు ఎటువైపు ఉన్నారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, సహాయక సిబ్బంది ఎటు ఓటు వేస్తారనేది కూడా ముఖ్యం. వీరితోపాటు గణనీయ సంఖ్యలో ప్రభుత్వ పోలీసు రంగం ఉద్యోగులు కూడా ఎటు ఓటు వేస్తారనేది చాలా ముఖ్యం. ఇక రెవెన్యూ, మున్సిపాలిటీ, సఫాయి శాఖతో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న పర్మనెంటు ఉద్యోగులు ఎటు ఓటు వేస్తారు, ఎవరు గెలవాలనుకుంటారు అనేది చాలా ముఖ్యమైంది. ఇంతకీ ఈ ఉద్యోగుల ఓటు గురించి ఎన్నడూలేని విధంగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లోనే ఎందుకు చర్చించాలి? దానికొక ముఖ్య కారణమున్నది.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబులాగే ఒక రీజినల్ పార్టీ నడిపే ప్రభుత్వం. దేశంలోనే అన్ని రంగాల్ని మొట్టమొదటగా ప్రైవేటీ కరించడం మొదలుపెట్టిన ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడు. అన్నిటికంటే ప్రమాదకరమైంది–స్కూళ్ళు, జూనియర్ కాలేజీల విద్యా ప్రైవేటీకరణ. దాన్ని ఆయన విపరీతంగా ప్రైవేటీకరించి అక్కడినుండి పార్టీ ఫండ్ను జమ చేశాడు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో ఎంట్రెన్సులు, కోచింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఈ దశలోనే పుట్టగొడుగుల్లా స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, గైడ్ రైటింగ్ కంపెనీలు, అడ్వరై్టజ్ ర్యాంకులు మొదలయ్యాయి.వైద్య రంగంలో కూడా ప్రభుత్వ రంగాన్ని మండలాల వరకు అభివృద్ధి చెయ్యకుండా ప్రైవేట్ హాస్పిటల్స్, ఒక్కొక్క డాక్టరు తన సొంత హాస్పిటల్ కట్టి నడపడం మొదలయ్యాయి. గత ఐదేళ్ళ జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా రంగంలో ఇంగ్లిష్ మీడియం పెట్టి, స్కూళ్ళ అభివృద్ధి ప్రారంభించాక స్కూలు విద్యలో ప్రైవేట్ రంగం విద్య బాగా పడిపోయింది.స్కూలు టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థ వ్యతిరేక అభివృద్ధిని ఎలా చూడాలి? రాష్ట్రంలో మండలం, గ్రామ స్థాయిలో చిన్న, చిన్న ప్రభుత్వ హాస్పిటల్స్ పెరిగి, వాటిని టెలీ మెడిసిన్తో ముడేసిన వైద్యం... వైద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకమైందా, కాదా? గ్రామ సెక్రటేరియట్ల నిర్మాణం, చిన్న జీతాలతోనైనా 2,50,000 మంది వలంటీర్లను ప్రభుత్వ రంగంలో నియమిస్తే ప్రభుత్వ రంగం విస్తరించినట్టా, ప్రైవేట్ రంగం విస్తరించినట్టా?నిజంగానే బడ్జెట్ డబ్బులో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంత బీద, దిగువ మధ్యతరగతి రైతాంగానికి, కూలీలకు బదిలీ చేయబడ్డది కనుక ఉద్యోగుల జీతభత్యాల పెరుగుదల ఆగిందనుకుందాం. అయినా ప్రభుత్వ రంగ ఎదుగుదల, ప్రైవేట్ రంగ ఎదుగుదల కోణం నుండి చూసినప్పుడు ప్రభుత్వం 30 వేల ఎకరాల్లో అమరావతి కట్టడం కోసం కాంట్రాక్టర్లకు ఆ డబ్బు ఇస్తే ఏ రంగం పెరిగేది? అందుకు బదులు గ్రామీణ అభివృద్ధి ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల అభివృద్ధి జాతీయ వాదంలో కీలకమైంది.ఈ స్థితిలో ప్రభుత్వ రంగ ఉద్యో గులు, ముఖ్యంగా టీచర్లు ఏ ముఖ్యమంత్రిని కోరుకోవాలి? ప్రభుత్వ రంగాన్ని గణనీయంగా పెంచిన జగన్నా, ప్రైవేట్ రంగ అనుకూల బాబునా? మరీ ముఖ్యంగా మోదీల కూటమినా? పవన్ కల్యాణ్కి సినిమా రంగం తప్ప ఏ రంగం గురించి తెలియదు. ఆయన మోదీ, బాబు ఏది చెబితే అది చేస్తాడు.ఉద్యోగస్తులు నిరంతరం ప్రజా జీవన విధానం, వారి ఆర్థిక స్థితి గతులతో సంబంధం లేకుండా తమ జీతాల పెంపు, అనుకూల ట్రాన్స్ ఫర్, రిటైర్మెంట్ ఏజ్ పెంపు గురించి ఆలోచిస్తే క్రమంగా ప్రభుత్వ రంగాన్ని మూసేసి ప్రైవేట్ రంగ ఎదుగుదలకు ఓటెయ్యడమే. భవిష్యత్ తరాల బతుకుదెరువు గురించి, రాష్ట్ర, దేశ భవిష్యత్ గురించి మాకెందుకు అనుకుంటే ప్రైవేటీకరణను ప్రభుత్వ రంగ ఉద్యోగులే కోరుకోవడం కాదా? ఉద్యోగుల్లో, ముఖ్యంగా టీచర్లు కమ్యూనిస్టు పార్టీలతో ఉండి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంటారు.అదే టీచర్లు ఇప్పుడు ఏపీలో ప్రైవేట్ విద్యారంగాన్ని ప్రభుత్వ రంగంలోకి మారిస్తే, ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే, నాడు–నేడు పథకం ద్వారా స్కూళ్ల రూపురేఖలను మారిస్తే ఈ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలి కదా! కమ్యూ నిస్టు పార్టీలు ఈ నూతన ప్రభుత్వ రంగ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ జగన్ను ఓడించాలని చూస్తున్నాయి. ఇది విద్యా, వైద్య రంగంలో పెరుగుతున్న ప్రభుత్వ ఆస్తులను వ్యతిరేకించడం కాదా?కమ్యూనిస్టులు ఏపీలో ఒకవేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్ మీడియంను తీసేసి, ఆ బడులను మూసేసి, విద్యా దోపిడీదారులకు అప్పజెబుతారా? భారతదేశంలో అతి పెద్ద ప్రైవేట్ సెక్టార్, విద్యా రంగం. ప్రైవేట్ రంగంలో ఇంగ్లిష్ విద్య పేరుతో చంద్రబాబు మిత్రబృందం వేల కోట్లు దోచుకుంటుంటే జగన్ ప్రభుత్వం ఆ దోపిడీకి అడ్డుకట్ట వేసే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది.కమ్యూనిస్టులు సైతం ప్రభుత్వ రంగ అభివృద్ధిని వ్యతిరేకిస్తూ, మాతృభాష ప్రాంతీయ వాదానికి తలొగ్గి మళ్ళీ ప్రైవేట్ విద్యా వైద్యానికి ఊడిగం చేస్తే ప్రజలు వీరినెలా నమ్ముతారు? విద్యా, వైద్య రంగాల్లో ప్రైవేటీకరణ వ్యతిరేక మోడల్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. దాన్ని చంపెయ్యడానికి కమ్యూనిస్టులు నడుం కడితే ప్రజలు ఏమైపోవాలి?ఆరెస్సెస్/బీజేపీ నేతృత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వం కేంద్ర స్థాయి పరీక్షలు, సెంట్రల్ యూనివర్సిటీల ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే రాయనిస్తున్నది. అంటే క్రమంగా హిందీని దేశపు ఉత్పత్తి కులాల పిల్లల మీద రుద్ది, ధనవంతులకు మాత్రమే ప్రైవేట్ ఇంగ్లిష్ అంతర్జాతీయ జ్ఞాన సంపదను అందు బాటులో ఉంచ చూస్తున్నది.ఈ విద్యా విధానాన్ని ఎలా ఎదు ర్కోవాలి? దేశంలోని మొత్తం స్కూలు విద్యను ఎల్కేజీ నుండి 12వ తరగతి వరకు ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ రంగంలోకి మార్చ కుండా విద్యా సమానత్వాన్ని సాధించగలమా? దేశంలో విద్యా వ్యవస్థని, కనీసం స్కూలు విద్యా వ్యవస్థనైనా ప్రభుత్వ రంగంలోకి మార్చడానికి ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, మానవ సమానత్వం కోసం పనిచేసేవాళ్ళు సపోర్టు చెయ్యకపోతే ఎలా?అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులు బీద ప్రజల సంక్షేమం కోసం బడ్జెట్ డబ్బును ఖర్చు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తమ కుటుంబాల గురించే ఆలోచిస్తే ప్రభుత్వ రంగం కూలిపోక ఏమౌతుంది? ఈ సమస్య చాలా కీలకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ముందు ఉన్నది. దేశంలోనే అన్ని రంగాల్ని పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలోకి నెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు ప్రభుత్వ రంగ వ్యతిరేకికే ఓటు వేస్తే జరిగేదేంటి?గ్రామాలలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా టీచర్లు అట్టడుగు గ్రామీణ శ్రమ జీవుల జీవితాలను మార్చడానికి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూసి ఆ ప్రభుత్వాన్ని కొనసాగించాలా వద్దా అని నిర్ణ యించుకోవాలి. ఉత్పత్తి రంగంలో పనిచేసే ప్రజల జీవితాలను మెరుగుపర్చే ప్రభుత్వం ఉన్నప్పుడు తమ జీతభత్యాల పెంపుదలతో కొంత రాజీపడాల్సి వస్తే కూడా పడాలి. అది ఒక ఉద్యోగి రాష్ట్రానికి, దేశానికి చేసే మేలు. రాజకీయ నాయకులు దోచుకుంటున్నప్పుడు వారిపై పోరాటం తప్పు కాదు.ఉద్యోగులు హక్కులను, ఆత్మగౌర వాన్ని ఎప్పుడు కూడా తాకట్టు పెట్టకూడదు. అయితే, తమ హక్కుల పోరాటం, ఉత్పత్తి రంగంలో పనిచేసే మానవాళిని ఆకలితో మాడ్చ టానికో, బీద పిల్లలు ధనవంతుల పిల్లలతో పోటీపడి ఎదిగే జీవితాన్ని అడ్డుకోవడానికో చెయ్యడం మహానేరం. ఈ మాట 38 సంవత్సరాలు ప్రభుత్వ రంగంలో పనిచేసిన వ్యక్తిగా చెబుతున్నాను. ప్రతి ఉద్యోగి, ఓటరు, పౌరుడు దిక్కు లేని వారికి దిక్కుగా నిలబడాలి. అందుకే 2024 ఎన్నికల్లో వాళ్ళ ఓటు వాళ్ళ జీవిత లక్ష్యాన్ని సూచిస్తుంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
మహిళా సంక్షేమంలో మునుముందుకు
ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విలక్షణమైన పద్ధతిని రూపొందించింది. ముఖ్యంగా మహిళా సంక్షే మాన్ని అభివృద్ధి నమూనాలో ప్రధానాంశంగా తీసుకు వచ్చింది. మహిళలు, పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం సమష్టి ప్రయత్నాలు... రాష్ట్ర అభివృద్ధి పథాన్ని పునర్నిర్వచించడమే కాకుండా భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సమానత్వ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో మహిళా సంక్షేమంలో సాధించిన ప్రగతి, దాని విధానాల పరివర్తన ప్రభావం రానున్న సార్వత్రిక ఎన్నికలలో చైతన్యవంతులైన ఓటర్లలో ప్రతిబింబిస్తుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే దాదాపు 32 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు పంపిణీ చేయడం, వెనుకబడిన వర్గాలకు ఇళ్లు, భూమిపై హక్కులు కల్పించడం... ప్రభుత్వం చూపించిన అంకితభావా నికి నిదర్శనాలు. రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ , తాగు నీరుతో సహా కొత్త హౌసింగ్ కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం గణనీయమైన నిధులను కేటా యించి అక్కడి పౌరుల సంక్షేమం, అభివృద్ధికి పాటు పడడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిబద్ధతను మరింత నొక్కి చెబుతుంది. అలాగే ‘అమ్మ ఒడి’, ‘విద్యా దీవెన’, ‘వసతి దీవెనల’తో సహా ‘నవరత్నాలు’ అన్నీ... విద్య, ఆర్థిక సాధికారత అంశాలలో మహిళలకు సహాయం చేయడంలో కీలకంగా మారాయి. ఒక్క ‘జగనన్న అమ్మ ఒడి పథకం’ ద్వారానే 44 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూర్చగా, మొత్తం వ్యయం రూ. 26,067 కోట్లు. ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా 78 లక్షల మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులకు 25,570 కోట్లు జమయ్యాయి. ఇది స్వయం సహా యక సంఘాల ఆర్థిక స్థిరత్వాన్ని బలపరిచింది. ‘వైఎస్సార్ చేయూత’, ‘కాపు నేస్తం’ పథకాలు అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఆర్థిక ప్రగతికీ, స్వాతంత్య్రానికీ భరోసా ఇచ్చాయి. ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకం ద్వారా పాలిచ్చే తల్లులలకూ, శిశు వులకూ పౌష్టికాహారం అందింది. ఐదేళ్ల లోపు 17 ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాపన... ముఖ్యంగా అట్ట డుగు వర్గాలకు ఆరోగ్య సంరక్షణ, వైద్యవిద్య అవకా శాలను గణనీయంగా విస్తరించింది. మహిళా సాధికారత పట్ల ప్రభుత్వ నిబద్ధత రాజ కీయ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. 1,356 నామినేట్ చేసే పోస్టుల్లో 688 మంది మహిళలను నియమించడం ద్వారానే భర్తీ చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా, మేయర్లుగా, డిప్యూటీ మేయర్ లుగా, స్థానిక పాలనా సంస్థల్లో ఇతర కీలక పాత్రల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం గుర్తించదగిన విజయం. ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా గణనీయమైన నిధులను పంపిణీ చేసింది. ప్రయోజనాలు ఎటువంటి పక్షపాతం లేకుండా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూసింది. ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’, ‘వైఎస్సార్ షాదీ తోఫా’ పథకాలు వివాహ సంబంధిత ఖర్చుల కోసం మహిళలకు ఆర్థిక సహాయం అందించాయి. మొత్తం రూ. 427.27 కోట్లను 56,194 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. సంక్షేమ పథకాల అమలును కొనసాగించాలనీ, మరిన్ని ప్రముఖ పదవుల్లో మహిళలను నియమించాలనీ జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు మహిళా సంక్షేమంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించడం... భారత రాజ్యాంగ సూత్రాల పట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల పట్ల ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోంది. పరి పాలనా విధానాలు మహిళలకు సాధికారత కల్పించడమే కాకుండా సమగ్రతకు, సమానమైన అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే పాలనకు కొత్త ప్రమాణాన్ని కూడా ఏర్పాటు చేశాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి మహిళ గౌరవంగా, అవకాశంతో, శ్రేయస్సులతో కూడిన జీవితాన్ని గడపడానికి ఈ కార్యక్రమాలు అభివృద్ధి చెందడం, విస్తరించడం తప్పనిసరి. ఓరుగంటి దుర్గ వ్యాసకర్త నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ చైర్పర్సన్, ట్రైబల్ డెవలప్మెంట్ మిషన్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement