ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ | Sakshi
Sakshi News home page

ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ

Published Sun, Mar 1 2020 8:48 AM

Pension Home Delivery In AP Completed 11 Percent By 7 Am Says Gopala Krishna Dwivedi - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 58.99లక్షల పింఛన్‌ లబ్ధిదారులకు ఈ తెల్లవారుజామునుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. అదివారం సెలవు రోజు అయినప్పటికీ పింఛన్‌దారులకు వారి ఇంటి వద్దే డబ్బులు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంచుతున్నారు. ఉదయం 7 గంటల కంతా 11శాతంపైగా మందికి పింఛన్‌ పంపిణీ పూర్తిచేసినట్లు పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేది ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. ఈ మధ్యాహ్నంకంతా వందశాతం పింఛన్ల పంపిణీ పూర్తిచేయనున్నట్లు తెలిపారు. కాగా, వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే.

 పింఛన్లు పంపిణీ చేసేందుకు వలంటీరు తమ పరిధిలో ఉండే ఫించనుదారులందరినీ ఒక చోటుకు పిలిపించడం చేయరాదని స్పష్టంగా ఆదేశాలు జారీ అయ్యాయి. బయోమెట్రిక్‌ విధానం ద్వారా లబ్ధిదారుల వేలి ముద్రలు తీసుకున్న తర్వాత నగదు పంపిణీ చేస్తున్నారు. ఈ ప్రక్రియతో సంబంధం లేని ప్రైవేట్‌ వ్యక్తులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లొద్దని వలంటీర్లకు సూచనలు జారీఅయ్యాయి.  



శరవేగంగా ఇంటి వద్దకే పింఛన్‌ పంపిణీ
లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్‌ పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఉదయం 6 గంటలనుంచే గడపగడపకు పింఛన్‌ పంపిణీ మొదలైంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు 26,20,673 మందికి.. 9 గంటలకు 31లక్షల మందికి పింఛన్‌ పంపిణీ పూర్తయింది. ఈ మధ్యాహ్నంకంతా దాదాపు 60 లక్షల మందికి రూ. 1,384 కోట్ల పింఛన్‌ పంపిణీ కానుంది.

రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో పింఛన్‌ పంపిణీ పూర్తయింది.  గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో పింఛన్ల పంపిణీ జరిగింది. గత నెల కంటే ఈ నెల అదనంగా 4.30 లక్షల పింఛన్లు మంజూరు అయ్యాయి. గత నెలలో పింఛన్లు అందని లబ్ధిదారులకు 2 నెలల పింఛన్‌ కలిపి అందజేశారు. దాదాపు 3.30 లక్షల మందికి 2 నెలల పింఛన్ అందజేశారు. తొలి రోజే పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉదయం నుంచే శరవేగంగా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ మొదలైంది. మ.12 గంటల వరకు 43.9 లక్షలకుపైగా పింఛన్లు పంపిణీ అయ్యాయి. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్‌ చొప్పున డిజిటల్‌ మ్యాపింగ్‌ ద్వారా ఐరిస్‌, వేలిముద్రలతో లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.

Advertisement
Advertisement