
వాజపేయి జన్మదినం ‘సుపరిపాలన దినం’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినమైన డిసెంబర్ 25ను జాతీయ సుపరిపాలన దినంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారమిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఈమేరకు ఎంపీలకు చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఆ రోజు సుపరిపాలనకు మార్గదర్శకంగా నిలవాలని మోదీ పిలుపునిచ్చారని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ప్రతాప్ రూఢీ విలేకరులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, అధికారులు కూడా పాలుపంచుకుంటారన్నారు. అలాగే బీజేపీ ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లో ‘స్వచ్ఛ భారత్’ కోసం గంట సమయాన్ని కేటాయించాలని మోదీ సూచించారని చెప్పారు. ప్రధాని విదేశీ పర్యటనలకు సంబంధించిన సమాచారంతో ఒక బుక్లెట్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.