దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..
● ఆటోను ఢీకొన్న కారు ● ఇద్దరి మృతి
● 10 మందికి గాయాలు
రామసముద్రం : దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తున్న భక్తుల ఆటోను ఎదురుగా వస్తున్న ఇన్నోవ క్వాలిస్ వాహనం అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 10 మంది గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి పుంగనూరు పట్టణ సమీపంలోని రాయలపేట రోడ్డు బైపాస్ రోడ్డు మలుపు వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం, చెంబకూరు పంచాయతీ దిన్నిమీద హరిజనవాడకు చెందిన గాయిత్రి(27), రూపశ్రీ(13), రెడ్డెమ్మ(48), మనోజ్ (30), ఆటోడ్రైవర్ రెడ్డెప్ప(38),రాజమ్మ(58), లావణ్య(4), శరణ్య(2),నారాయణమ్మ(40) , కదిరప్ప(45), లక్ష్మీపతి(38), నారాయణప్ప(52)లు కలసి ఆటోలో స్వగ్రామం నుంచి బయలుదేరి పెద్దపంజాణి మండలం , వీరప్పల్లెలోని నల్లవీరగంగమ్మ గుడికి వెళ్లారు. అక్కడ అమ్మవారికి పూజలు చేసుకుని కుటుంబ సభ్యులతో కలసి సాయంత్రం స్వగ్రామానికి ఆటోలో తిరిగి బయలుదేరారు. మార్గ మధ్యంలో కొత్తపల్లె వద్ద గల జేన్యూటౌన్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఇన్నోవ వాహనం డ్రైవర్ ఇమ్రాన్ అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆటోడ్రైవర్ రెడ్డెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన 11 మందికి తీవ్ర గాయాలుకాగా గమనించిన స్థానికులు వెంటనే 108 కు సమాచారం అందించి, బాధితులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. గాయపడిన వారిలో నారాయణమ్మ, నారాయణప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పరిస్థితి విషమించి నారాయణప్ప మృతి చెందాడు. ఈ మేరకు సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


