ప్రజల మనోవేదన చూసైనా ప్రభుత్వం స్పందించాలి
● అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటినే
యథాతథంగా కొనసాగించాలి
● హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు వెల్లడించిన
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర మనోవేదనను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజల ఆవేదననుఅర్థం చేసుకుని వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం రెండు రోజులుగా సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి, 30 పేజీల డ్రాప్టును తయారు చేసి , రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలనే ఉద్దేశ్యంతో హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. ఈ అంశంపై బుధవారం లోపు కోర్టులో వాదనలు జరిగే అవకాశముందని ఆయన తెలిపారు. రాయచోటి ప్రాంతానికి ప్రభుత్వం చేసిన అన్యాయంపై న్యాయస్థానాలు న్యాయం చేస్తాయనే పూర్తి నమ్మకం తమకు ఉందన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు విషయంలో రాయచోటి ప్రాంత ప్రజల అభిప్రాయాలను ఎక్కడా సేకరించలేదని , నోటిఫికేషన్లో కూడా వారి ప్రస్తావన లేకపోవడం గమనార్హమన్నారు. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో విధి విధానాలను పూర్తిగా విస్మరించడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాయచోటి ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం హడావుడిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నందున , న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజల తరఫున చివరి వరకు పోరాడుతామని గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.


