ఇలలో వైకుంఠ వైభవం
బనశంకరి: రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవ దేవస్థానాలు మంగళవారం గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేంకటేశ్వర స్వామి ఆలయాలను వివిధ పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణ చేపట్టడంతో ప్రత్యేక శోభ సంతరించుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే దేవస్థానాల్లో ఆలయ అర్చకులు వేంకటేశ్వరుడి మూలవిరాట్లకు ప్రత్యేక అలంకరణ చేపట్టి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామి దర్శనం కోసం బారులు తీరారు. బెంగళూరు వయ్యాలికావల్ టీటీడీ దేవస్థానంలో రాత్రి 1:30 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతించారు. మంగళవారం రాత్రి 12 గంటల వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల కోలాహలం
భక్తులు భారీ ఎత్తున స్వామి దర్శనానికి తరలిరావడంతో కోలాహలం నెలకొంది. రాజాజీనగరలోని వేంకటేశ్వర దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. 5వ బ్లాక్లోని కై లాస వైకుంఠ మహాక్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజాజీ నగర ఇస్కాన్ దేవస్థానంలో వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక భజనలు చేశారు. తెల్లవారు జామున శ్రీనివాస గోవింద, మహాభిషేకం, రాధాకృష్ణ పల్లకీ దర్శనం, వైకుంఠ ద్వారపూజ, కళ్యాణోత్సవం, వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టారు. కామాజీపాళ్య వృషభావతి లక్ష్మీవేంకటేశ్వర దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్ధరాత్రి నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మీలేఔట్ శ్రీనివాస దేవస్థానానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని వైకుంఠ ద్వారంలో ప్రవేశించారు.
ఇస్కాన్ ఆలయంలో వైకుంఠ ద్వారంలో ప్రవేశిస్తున్న భక్తులు
మార్మోగిన గోవింద నామస్మరణ
ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుక
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
చామరాజపేటె కోటె వేంకటరమణ స్వామి దేవస్థానం, మాగడి రోడ్డు ఎంజీ రైల్వే కాలనీ వినాయక వేంకటేశ్వరస్వామి దేవస్థానం, జేపీ నగర తిరుమలగిరి లక్ష్మీవేంకటేశ్వర స్వామి, పద్మనాభనగర దేవగిరి వరప్రసాద వేంకటేశ్వర దేవస్థానాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని వైకుంఠ ద్వారంలో ప్రవేశించి మొక్కులు చెల్లించుకున్నారు. నెలమంగలలో సుమారు 800 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీదేవి భూదేవి రంగనాథ దేవస్థానంలో ఉత్తర ద్వారం, వైకుంఠ ద్వారం గుండా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర దేవస్థానాలు భక్తులతో సందడిగా మారాయి. అర్ధరాత్రి నుంచి దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. వివిధ దేవస్థానాల వద్ద భక్తులకు తీర్థప్రసాదాలు, లడ్డూ వితరణ చేశారు.
ఇలలో వైకుంఠ వైభవం


