అమెరికా నుంచి సెక్యూరిటీని తెచ్చుకోనీ: డీకే
శివాజీనగర: జనార్దనరెడ్డి ఇరాన్ లేదా అమెరికా నుంచైనా భద్రత తెప్పించుకోమను.. అని డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ అన్నారు. జనార్దనరెడ్డి జడ్ ప్లస్ భద్రత కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయడం గురించి డీకే ఆదివారం బెంగళూరులో మీడియాతో స్పందించారు. ఎక్కడి నుంచైనా రక్షణను తెచ్చుకోనీ, మాకు అభ్యంతరం లేదు. వందలమంది బీజేపీ కార్యకర్తలనే భద్రతగా నియమించుకున్నా వద్దనం అని అన్నారు. బళ్లారి గొడవలో వచ్చిన తూటా సతీష్రెడ్డి గన్మెన్ తుపాకీదని రిపోర్టు వచ్చిందనగా, ఆ సంగతి నాకు తెలియదన్నారు. ఎవరైనా భక్తితో విగ్రహాన్ని నెలకొల్పితే అసూయ ఎందుకు పడాలి, వాల్మీకి ఒక సముదాయానికి చెందినవారా, ఆయన అందరి ఆస్తి అని పేర్కొన్నారు. కేసును సీఐడికి ఇవ్వడం గురించి హోమ్ మంత్రి, సీఎం సిద్దరామయ్య నిర్ణయం తీసుకుంటారన్నారు. కేపీసీసీ సత్యశోధనా కమిటీ అధ్యక్షుడు హెచ్.ఎం.రేవణ్ణ బళ్లారిలో విచారించారు, మంచి సమాచారం సేకరించుకొని వచ్చారు, త్వరలో నివేదికను ఇస్తారని తెలిపారు.


