బుడతల యోగా విన్యాసాలు
బొమ్మనహళ్లి: బెంగళూరు రవీంద్ర కళాక్షేత్రలో నాట్య సంభ్రమ– 2026 కృష్ణార్పణం వేడుకలు రమణీయంగా జరిగాయి. ఈ సందర్భంగా కృష్ణుని జన్మ వృత్తాంతాన్ని బాలలు భరతనాట్యం ద్వారా కళ్లకు గట్టారు. అలాగే బాలికల యోగా విన్యాసాలు అబ్బురపరిచాయి.
స్థల వివాదంలో యశ్ తల్లి పుష్ప
యశవంతపుర: ప్రముఖ నటుడు యశ్ తల్లి పుష్ప మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వివరాలు.. హాసన్ పట్టణంలోని విద్యానగరలో పుష్పాకు ఇల్లు ఉంది. ఆమె నిర్మించిన కాంపౌండ్ను మూల యజమాని కూల్చివేశాడు. లక్ష్మమ్మ స్థలంలో పుష్ప కొంత జాగాని ఆక్రమించి ప్రహరీని కట్టారని దేవరాజు ఆరోపించాడు. లక్ష్మమ్మ స్థలాన్ని తాను జీపీఏ చేసుకున్నట్లు అతడు తెలిపాడు. కబ్జా గురించి హాసన్ జెఎంఎఫ్ కోర్టులో కేసు వేయగా తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, ఆ మేరకు కూల్చివేసినట్లు చెప్పాడు.
ఆ జాగా నాదే: పుష్ప
ఈ గొడవపై పుష్ప స్పందిస్తూ ‘నేను అక్రమంగా నిర్మించలేదు. ఆ జాగా నాదే. అయితే మేము ఊరిలో లేని సమయంలో దౌర్జన్యంగా కాంపౌండ్ను తొలగించారు’ అని చెప్పారు. దేవరాజుతో స్థానిక పిడిఓ కుమ్మకై అవినీతికి పాల్పడినట్లు పుష్ప అన్నారు. తన జాగాకు పన్నులు కూడా చెల్లించానన్నారు.
షాపులో భారీ సర్పం
శివమొగ్గ: శివమొగ్గలోని ఇలియాజ్ నగరలో వాహన విడిభాగాలను షాపులో ఒక భారీ బురద పాము కనిపించింది. దానిని చూసిన షాపు యజమాని భయంతో కేకలు వేస్తూ పరిగెత్తాడు. 100 అడుగుల రహదారిలోని ఫరూఖ్ దుకాణంలో ఆ పాము కనిపించింది. స్నేక్ కిరణ్కు సమాచారం ఇచ్చాడు. కిరణ్ కొంతసేపు గాలించి టైర్లలో దాక్కున్న సర్పాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. ఇది ఎనిమిదిన్నర అడుగుల పొడవు ఉంటుంది. ఇది బురద పాము అని, విషపూరితం కాదని చెప్పాడు. ‘పర్యావరణంలో జీవవైవిధ్యంలో పాములు అరుదైన జీవులు. అవి కనిపించినప్పుడు వాటిని చంపవద్దు, లేదా హింసించవద్దు. శివమొగ్గ నగరం చుట్టూ పాములు కనిపిస్తాయి. నాకు సమాచారం ఇస్తే, వాటిని రక్షిస్తాను’ అని తెలిపాడు.
బుడతల యోగా విన్యాసాలు


