Sakshi News home page

కోవిడ్‌ అంతమయ్యే అవకాశముంది.. అయినా సరే నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్‌ డోసు తీసుకోవాల్సిందే

Published Tue, Apr 11 2023 12:15 PM

Covid Nearing Endemic No Need to Panic Says Top Epidemiologist - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ఈసీఎంఆర్‌ మాజీ సైంటిస్ట్‌ డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ కీలక  విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ ముగింపు దశకు చేరుకుందని, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని చెప్పారు. అయితే వైరస్‌ను నిర్లక్ష‍్యం చేయకుండా జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

కరోనా వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెంది(మ్యుటేషన్లు) బలహీన పడుతోందని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. ఇప్పుడు వైరస్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఇంకా కొన్ని మ్యూటేషన్ల అనంతరం కరోనా పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌పై
ఈ ఏడాది జనవరిలో తొలిసారి వెలుగుచూసిన ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ కూడా అంత ప్రమాదకరం కాదని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. గత మూడు నెలల్లో దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. 'XBB.1.16 అనేది రీకాంబినెంట్ వైరస్. ఇది మానవ శరీరంలో అనుకోకుండా తయారవుతుంది. రెండు వేర్వేరు వేరియంట్లు మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, పునరుత్పత్తి సమయంలో జన్యు పదార్ధం మిక్స్అప్ అయినప్పుడు అవి తయారవుతాయి.' అని ఆయన వివరించారు.

బూస్టర్ డోసులు, మాస్కులు
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున ఇంకా బూస్టర్ డోసు టీకా తీసుకోని వారు, ఆలస్యం చేసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అలాగే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు.

పిల్లలు అనారోగ్యానికి గురైతే వాళ్లను స్కూళ్లకు అసలు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఒకవేళ వారికి సోకింది కరోనా అయితే అది ఇతర విద్యార్థులకు, టీచర్లకు, సిబ్బంది సోకి మరింత  మందికి వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు.
చదవండి: మాక్‌డ్రిల్‌తో అప్రమత్తమైన భారత్‌.. కొత్తగా 5,676 కేసులు, 15 మరణాలు

Advertisement
Advertisement