అమొ బస్ భద్రతకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
భువనేశ్వర్: రాజధానిలో ఇద్దరి ప్రాణాలను బలిగొన్న అమొ బస్ ప్రమాదం నేపథ్యంలో అమొ బస్ సేవల భద్రత, నిర్వహణ, నియంత్రణపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉషా పాఢి అధ్యక్షత వహించారు. రవాణా కమిషనర్ అమితాబ్ ఠాకూర్, సీఆర్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ బిశ్వాల్, భువనేశ్వర్ డీసీపీ జగ్మోహన్ మీనా, ట్రాఫిక్ డీసీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం తర్వాత మీడియాతో స్పందించిన ఉషా పాఢి మాట్లాడుతూ ఆమె అధ్యక్షతన 5 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ అమొ బస్ సేవలు క్రమం తప్పకుండా పర్యవేక్షించి నిర్వహణ క్రమశిక్షణలో మెరుగుదల, భద్రతను పెంచడంపై పరిశీలిస్తుంది. ఈ కమిటీలో రవాణా కమిషనర్, డీసీపీ, ట్రాఫిక్ డీసీపీ, సీఆర్యూటీ సీనియర్ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై అత్యవసర సమస్యలను సమీక్షిస్తుంది. అవసరమైతే సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడైనా సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. నిర్వహణ సామర్థ్యాన్ని, చిట్ట చివరి గమ్యం సురక్షిత అనుసంధానం మెరుగుపరచడానికి అమొ బస్ ఫ్లీట్కు అదనపు మినీ బస్సులను జోడించనున్నట్లు ఉషా పాఢి తెలిపారు. డ్రైవర్ నియామక ప్రక్రియను మరింత కఠినతరం చేస్తామని ఆమె తెలిపారు. కొత్తగా నియమించబడిన డ్రైవర్లకు ఇంటెన్సివ్ శిక్షణ ఇస్తారు. విధుల్లో చేరడానికి ముందు డ్రైవింగ్ నైపుణ్యాలు, రహదారి భద్రతా అవగాహన, వీధుల్లో డ్రైవింగ్, ప్రవర్తనా నిబంధనల అమలుపై తప్పనిసరిగా 5 రోజులకు ఒకసారి శిక్షణ కల్పిస్తారు. భద్రత, కార్యాచరణ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూసుకోవడానికి వచ్చే ఒక నెల పాటు సమగ్ర నిర్వహణను నిశితంగా పర్యవేక్షిస్తారు. ఈ విషాద సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు.


