ఛలో విశాఖపట్నం జయప్రదం చేయండి
ఎచ్చెర్ల: జనవరి 4వ తేదీన నిర్వహించనున్న ఛలో విశాఖపట్నం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఎచ్చెర్లలో అఖిల భారత మహాసభల ప్రచారం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రదర్శన, అనంతరం ఆర్కే బీచ్ వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకు, కార్మిక వర్గ హక్కులను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటాయన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్వహించడానికి సీఐటీయూ అగ్రభాగాన నిలిచిందన్నారు. కార్మక వర్గం సాధించుకున్న కార్మిక హక్కులను కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శారద, పుష్ప, లలిత, అమృత, కనకం తదితరులు పాల్గొన్నారు.


