ధాన్యం లోడ్తో వెళ్తున్న వ్యాన్ బోల్తా
టెక్కలి రూరల్: స్థానిక ఒలేసాగరం సమీప ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైన ఆదివారం ధాన్యం లోడ్తో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. పలాస నుంచి కోటబొమ్మాళి వైపు ధాన్యం లోడ్తో వెళ్తున్న వ్యాన్ టెక్కలి సమీప ఒలేసాగరం వద్దకు వచ్చే సరికి వ్యాన్ అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్లోని ధాన్యం బస్తాలు మొత్తం చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయా యి. వ్యాన్లో ఉన్న వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
నేటి నుంచి శాఖాపరమైన పరీక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో సోమవారం నుంచి శనివారం వరకు ఏపీపీఎస్సీ శాఖాపరమైన (డిపార్డుమెంటల్) పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి తెలిపారు. ఆదివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమన్వయ కమిటీ నిర్వహించారు. చిలకపాలెంలోని శివాని ఇంజినీరింగ్ కళాశాల, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ కేంద్రాలను పరీక్ష కేంద్రాలుగా కేటాయించామన్నారు. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు గంటన్నర ముందే కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. సమయపాలన విషయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయని, ఉదయం 9:30 గంటలు, మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించబోమ ని ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ పీవీ నవ జ్యోతి స్పష్టం చేశారు. పరీక్షా హాల్లోకి సెల్ఫోన్లు, వాచీలు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు.
హోరాహోరీగా తైక్వాండో పోరు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ఆద్యంతం హోరాహోరీగా సాగుతున్నాయి. ఏపీ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కల్యాణ మండపం వేదికగా 39వ ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ కుర్గీ, 14వ ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ పూమ్ సే బాలబాలికల తైక్వాండో చాంపియన్షిప్–2025–26 పోటీలు జరుగుతున్నాయి. రెండు రోజుల పోటీల్లో భాగంగా శనివారం ప్లేయర్స్ వేయింగ్ (బరువు) పూర్తిచేసిన నిర్వాహకులు, రెండోరోజు ఆది వారం పోటీలను నిర్వహిస్తున్నారు. తొలుత బాలురుకు పోటీలను పూర్తిచేయగా, బాలికల పోటీలు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులకు పతకాలను అందజేస్తున్నారు. ఎప్పటికప్పుడు విజేతలుగా నిలిచిన ప్లేయర్స్కు మెడల్స్ను బహూకరిస్తున్నారు. తొలుత ఉదయం ఈ పోటీలను శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ముఖ్య అతిఽథిగా హాజరై ప్రారంభించారు. మార్షల్ ఆర్ట్స్ క్రీడలతో శారీరక దారుఢ్యంతోపాటు ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. అనంతరం శ్రీకాకుళం ఎమ్మె ల్యే గొండు శంకర్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు (వాసు) తదితరులు హాజరై వివిధ బరువుల కేటగిరి పోటీలను ప్రారంభించి, విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.
ధాన్యం లోడ్తో వెళ్తున్న వ్యాన్ బోల్తా


