
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ తరగతి గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. విద్యార్థి ఆత్మహత్యపై తాజాగా ఇంటర్ బోర్డ్ అధికారులు.. శ్రీ చైతన్య కాలేజీ మేనేజ్మెంట్కు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇంటర్ బోర్డు విచారణ చేపట్టింది.
ఇక, విద్యార్థి సాత్విక్ మృతి నేపథ్యంలో డీఈవో ఆధ్వర్యంలో బోర్డు అధికారులు కాలేజీని విజిట్ చేశారు. ఈ ఘటనపై అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. కాగా, కాలేజీ మేనేజ్మెంట్ ఇచ్చే వివరణపై ఫైనల్ రిపోర్టు సిద్ధం చేసి అధికారులు.. కమిషనర్కు నివేదిక అందజేయనున్నారు. మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాలేజీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు, అధికారులు.. విద్యార్థులు, పేరెంట్స్, మిగిలిన లెక్చరర్ల నుంచి కూడా సమాచారం తీసుకుని నివేదిక తయారు చేయనున్నారు. ఇదిలా ఉండగా, నివేదిక అందిన వెంటనే కాలేజీ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని నవీన్ మిట్టల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment