చైనాలో పందుల కొరత.. రష్యా విమానాలకు గిరాకీ | Sakshi
Sakshi News home page

చైనాలో పందుల కొరత.. రష్యా విమానాలకు గిరాకీ

Published Thu, Jun 11 2020 4:54 PM

Pigs Transportation gives josh in cargo Airlines Business - Sakshi

మాస్కో : కరోనా మహమ్మారితో విమానయాన రంగం కుదైలైంది. అయితే చైనాలో ఏర్పడిన పందుల కొరతతో రష్యాకు చెందిన విమానయాన సంస్థకు మంచి గీరాకీ వస్తోంది. ఓల్గా-డీఎన్‌ఈపీఆర్‌కు చెందిన వాణిజ్య విమానాల్లో ఈ ఏడాది ఫ్రాన్స్‌ నుంచి చైనాకు దాదాపు 3000 పందులు సరఫరా చేశారు. ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ బీభ‌త్సం సృష్టించడంతో చైనాలో పందుల కొరత విపరీతంగా పెరిగింది. దీంతో 10380 కిలోమీటర్ల దూరం నుంచి చెక్క డబ్బాల్లో ఉంచిన పందులను బోయింగ్‌ 747 కార్గో విమానాల్లో సరఫరా చేస్తున్నారు. (22 వేల మందిని తొలగించనున్న లుఫ్తాన్సా)

అమెరికా నుండి ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో చైనా మొత్తం 254,533 టన్నుల పంది మాంసాన్ని దిగుమతి చేసుకుంది. దీంతో యూరప్‌ను అధిగమించి చైనా అతిపెద్ద పంది మాంసం సరఫరాదారుగా అవతరించింది. ఇది ఇప్పటికే 2019 ఏడాది మొత్తానికి చైనా కొనుగోలు చేసిన 245,000 టన్నుల కంటే ఎక్కువ. ఇక పందుల సరఫరాకు వాడిన ఓల్గా-డీఎన్‌ఈపీఆర్‌ విమానయాన అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 32% పెరిగి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 630 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 

ఎన్నడూ లేనన్ని సవాళ్లను ప్రపంచ విమానయానరంగం ఎదుర్కొంటుంది. కానీ కార్గో క్యారియర్‌లకు ఇదొక సువర్ణ అవకాశం అని ఓల్గా-డీఎన్‌ఈపీఆర్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ ఇసైకిన్‌ అన్నారు. ‘ఇంతకుముందు, అన్ని ప్రయాణికుల విమానాల్లో సగానికి పైగా కంపార్ట్‌మెంట్లలో సమానులు తీసుకువెళ్లేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సరఫరా తగ్గడంతో, కార్గో విమానయాన సంస్థలకు డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. కొన్ని ఆదాయ మార్గాలు తగ్గిపోతున్నప్పటికీ మొత్తం అమ్మకాలు పెరిగాయి. అలాగే సరఫరా విషయంలో భౌగోళికంగా మా సంస్థ పరిధి విస్తరిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తి తరువాత, మేము చైనా వైద్య పరికరాలను ఆఫ్రికాకు పంపించడం ప్రారంభించాము. లాటిన్ అమెరికా నుండి కూడా మా సేవల కోసం విచారిస్తున్నారు. తదుపరి స్థానంలో భారత్‌ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను’ అని ఇసైకిన్‌ పేర్కొన్నారు.   

Advertisement
Advertisement