-
ఒక్క ఫోన్ చాలు 'సమస్యలన్నీ పరిష్కారం'..
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా అన్ని రకాలుగా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉందని గుర్తు చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదిరిన ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ త్వరితగతిన అమల్లోకి తెస్తున్నామని, ఇందుకోసం కృషి చేస్తున్న అధికారులకు అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలను విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,100 కోట్ల విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. విశాఖ ఒప్పందాలు వేగంగా సాకారం.. పారిశ్రామిక రంగంపై ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, పుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. జిల్లా స్ధాయిలో కలెక్టర్లు కూడా దీనిపై దృష్టి సారించి పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 386 ఎంవోయూలు చేసుకున్నాం. వీటి ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు ఆరు లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ సాకారమయ్యేలా నిరంతరం సమీక్షిస్తూ పురోగతి కోసం చర్యలు తీసుకున్నాం. ఇందులో 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. మరో 94 ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం. నెలకు కనీసం రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించడం ద్వారా వీటన్నింటినీ వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నాం. కలెక్టర్లు కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తూ దీన్ని మరింత వేగవంతం చేయాలి. ఎంఎస్ఎఈలతో 12.62 లక్షల మందికి ఉపాధి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం. వీటి ద్వారా దాదాపు రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేలమందికి ఉద్యోగాలు కూడా ఇవ్వగలిగాం. ఎంఎస్ఎంఈ రంగంలో ఎప్పుడూ చూడని విధంగా అడుగులు వేశాం. కోవిడ్ సమయంలో ఎక్కడా, ఎవరూ కుప్పకూలిపోకుండా వారికి చేయూతనిచ్చాం. గత నాలుగున్నరేళ్లలో దాదాపు 1.88 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చాయి. వీటి ద్వారా 12.62 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అందరం కలసికట్టుగా బాధ్యత తీసుకున్నాం కాబట్టే ఇది సాకారమైంది. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మనం కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే మెస్సేజ్ను ఎంత సానుకూలంగా తీసుకెళ్లగలిగితే అంత ఉత్సాహంగా ముందుకొస్తారు. ఇది కచ్చితంగా నా దగ్గర నుంచి మొదలుకుని మీ వరకు ఇదే రకమైన తత్వాన్ని అలవరచుకోవాలి. రూ.1,100 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం పరిశ్రమలు–వాణిజ్యశాఖ, పుడ్ ప్రాసెసింగ్ రంగాలలో ఇవాళ తొమ్మిది ప్రాజెక్టులు చేపడుతున్నాం. దాదాపు రూ.1,100 కోట్ల పెట్టుబడితో 21,744 మందికి ఉద్యోగాలు లభించేలా మంచి అడుగు పడుతోంది. మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, మిగిలిన ఆరు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం నేను పత్తికొండ వెళ్లినప్పుడు టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయమని చెప్పా. కొద్ది కాలంలోనే అది అధికారుల కృషితో కార్యరూపం దాల్చి శంకుస్ధాపన దశకు వచ్చింది. రూ.12 కోట్ల పెట్టుబడితో టమోటా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు పత్తికొండలో శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ అంతే వేగంగా అడుగులు ముందుకేయాలి. ఇవాళ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకొంటున్న తొమ్మిది యూనిట్లకు శుభాభినందనలు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు, కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, వ్యవసాయం, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్కుమార్, హ్యాండ్లూమ్స్, టెక్టŠస్టైల్స్ కమిషనర్ ఎంఎం నాయక్, పరిశ్రమలశాఖ కమిషనర్ సీహెచ్ రాజేశ్వరరెడ్డి, ఉన్నతాధికారులు, పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్లో శంకుస్థాపనలు, ప్రారంభించిన యూనిట్లు 1.ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ముత్తుకూరు మండలం దొరువులపాలెంలో రూ.250 కోట్లతో గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ సంస్ధ ఆధ్వర్యంలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ ప్రారంభం. దీని ద్వారా 1,150 మందికి ఉద్యోగాలు. ఏటా 4.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి దీని సామర్ధ్యం. 2. రూ.144 కోట్లతో శ్రీవేంకటేశ్వర బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ పనులకు శంకుస్థాపన. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం కొమ్మూరు గ్రామం వద్ద ఏర్పాటయ్యే ఈ మొక్కజొన్న ఆధారిత పరిశ్రమ ద్వారా 310 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 90 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. దీని ద్వారా వేలమంది రైతులకు ప్రయోజనం. 3. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద రూ.13 కోట్లతో బ్లూఫిన్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీకి శంకుస్థాపన. దీనిద్వారా 45 మందికి ఉద్యోగావకాశాలు. 3,600 మెట్రిక్ టన్నుల గోధుమలు, 480 టన్నుల మిల్లెట్స్, 720 మెట్రిక్ టన్నుల పొటాటో ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ఏర్పాటుతో స్థానిక రైతులకు లబ్ధి. 4. కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద టామాటో ప్రాసెసింగ్ యూనిట్ పనులకు శంకుస్థాపన. రూ.12 కోట్ల పెట్టుబడితో ఏటా 3,600 మెట్రిక్ టన్నుల టమాటా ఉత్పత్తుల తయారీ. ఈ ప్రాజెక్టును పత్తికొండ వెజిటబుల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్కు అప్పగించనున్న ప్రభుత్వం. వారి ద్వారా లీజు ప్రాతిపదికన మంచి సమర్థత కలిగిన కంపెనీకి అప్పగించేలా సహకారం. పత్తికొండలో రైతులకు భారీ ప్రయోజనం. టమాటా ధరల స్థిరీకరణకు దోహదం చేయనున్న పరిశ్రమ. 5. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం రేగ పంచాయతీ పెద్దిరెడ్లపాలెం వద్ద నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్కు ప్రారంభోత్సవం. ప్లాంట్ను నెలకొల్పిన ఏపీఎఫ్పీఎస్. ఎల్.కోట జైకిసాన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్కు ప్లాంట్ను అప్పగించిన ప్రభుత్వం. నువ్వుల నూనె, చిక్కీ ఉత్పత్తుల తయారీ. రూ.2.5 కోట్ల పెట్టుబడితో 20 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 600 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కలిగిన ఈ యూనిట్తో స్థానిక రైతులకు ప్రయోజనం. పరిశ్రమల శాఖలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా 1. కర్నూలు జిల్లా ఓర్వకల్లు నోడ్ గొట్టిపాడు వద్ద సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా (ఏపీఐ) యూనిట్కు శంకుస్థాపన. రూ.280 కోట్ల పెట్టుబడితో 850 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 72 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. 2. కర్నూలు జిల్లా ఓర్వకల్ నోడ్ గొట్టిపాడు వద్ద న్యూట్రాస్యూటికల్స్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్న ఆర్పీఎస్ ఇండస్ట్రీస్. పనులకు వర్చువల్గా సీఎం శంకుస్థాపన. రూ.90 కోట్ల పెట్టుబడితో 285 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 4,170 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. 3. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 18 జిల్లాల్లో 21 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు, ఫ్యాక్టరీ కాంప్లెక్స్లకు సీఎం ప్రారంభోత్సవాలు, మరికొన్ని చోట్ల పనులకు శంకుస్ధాపనలు. కాంప్లెక్స్ ద్వారా రూ.1,785 కోట్ల పెట్టుడులకు అవకాశం. తద్వారా 18,034 మందికి ఉద్యోగాలు. 4. కాకినాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రింటింగ్ క్లస్టర్లో కామన్ ఫెసిలిటీ సెంటర్లను ప్రారంభించిన సీఎం జగన్. ఈ సెంటర్లలో 1,000 మందికి ఉద్యోగాలు. -
పారిశ్రామికోత్సాహం
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకుంది. ఆర్భాటానికి తావు లేకుండా వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కొత్త పరిశ్రమలు వెలుస్తున్నాయి. అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుండటం, శర వేగంగా అనుమతులు మంజూరవుతుండటంతో పారిశ్రామిక వేత్తలు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఒక్క ఎంఎస్ఎంఈల విషయాన్నే తీసుకుంటే రాష్ట్రంలో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి వాటి సంఖ్య 1,93,530 మాత్రమే ఉండగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడమే ఇందుకు నిదర్శనం. ఈ లెక్కన కొత్తగా అర కోటి మందికి ఉపాధి లభించడం గమనార్హం. సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలతో పాటు ఇతర ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను సిద్ధం చేశారు. వీటి ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఏర్పాటు చేసిన సిమెంట్ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ నవోదయం, రీస్టార్ట్ వంటి ప్యాకేజీలకు తోడు ఎంఎస్ఎంఈలకు అన్ని రకాలుగా చేయూత అందిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు భారీ ఎత్తున ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఎప్పటికప్పుడు ప్రోత్సహకాలు అందజేస్తోంది. వచ్చే ఫిబ్రవరి నెలలో కూడా ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడం గమనార్హం. వచ్చే నాలుగేళ్లల్లో కొత్తగా 6 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా క్లస్టర్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. వీటితోపాటు రైతులకు అదనపు ఆదాయం ఇచ్చేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా సుమారు రూ.402 కోట్లతో అయిదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి ముఖ్యమంత్రి భూమి పూజ, ప్రారం¿ోత్సవాలు చేయనున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో రూ.230 కోట్లతో ఏర్పాటు చేసిన గోకుల్ ఆగ్రో రిసోర్సెస్, విజయనగరంలో రూ.2.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఎల్ కోటా సీసేమి యూనిట్ను ప్రారంభిస్తారు. ఏలూరులో రూ.144 కోట్లతో మొక్క జొన్న నుంచి గంజి పౌడర్ను తయారు చేసే వెంకటేశ్వరా బయోటెక్, విజయనగరంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఆలూ చిప్స్, పాస్తా, న్యూడిల్స్ తయారు చేసే బ్లూఫిన్ ఎంటర్ప్రైజెస్, కర్నూలులో రూ.11 కోట్లతో ఏర్పాటు చేసే టమాట ప్యూరీ యూనిట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఇంధన శాఖకు సంబంధించి సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్పీసీఎల్ ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టు, ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను సైతం ప్రారంభించనున్నారు. వాస్తవ రూపంలోకి జీఐఎస్ ఒప్పందాలు విశాఖ వేదికగా మార్చి నెలలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు (జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జీఐఎస్ సమావేశంలో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదరగా, అందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఇందులో 24 యూనిట్ల ద్వారా రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. గ్రీన్ల్యామ్, డీపీ చాక్లెట్స్, ఆర్ఎస్బీ ట్రాన్స్మిషన్స్, గోద్రేజ్ ఆగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరేజ్, సూక్ష్మ గామా ఎల్ఎల్పీ వంటి ప్రముఖ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇవేకాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లు భూ కేటాయింపులు పూర్తి చేసుకొని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. మరో 194 యూనిట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. చేయిపట్టి నడిపిస్తున్నాం.. జీఐఎస్లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పరిశ్రమలను చేయిపట్టి నడిపిస్తున్నాం. అనుమతులన్నీ వేగంగా ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అధ్యక్షతన 17 మంది అధికారులతో కమిటీ వేసి.. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే పలు ఒప్పందాలు అమల్లోకి రాగా, మిగిలినవి కూడా అమల్లోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్ యువరాజ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆహార పరిశ్రమల రంగానికి మరింత ఊతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఆహార శుద్ధి పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.775 కోట్లతో 9 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించగా, 1,130 మందికి ఉపాధి కల్పించారు. 1,510 మందికి ఉపాధి కల్పించేలా రూ.2,226 కోట్లతో మరో 9 యూనిట్లకు శంకుస్థాపన చేశారు. తాజాగా రూ.232.5 కోట్లతో ఏర్పాటు చేసిన మరో రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. రూ.169 కోట్లతో మూడు యూనిట్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. తద్వారా 1,625 మందికి ఉపాధి, 3,654 మంది రైతులకు లబ్ధి కలగనుంది. – చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ -
రూ.3,008 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే దాదాపు రూ.3,008 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో పరిశ్రమల రంగానికి చెందిన ఏడు యూనిట్లు రూ.2,294 కోట్ల పెట్టుబడితో పాటు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుండగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆరు యూనిట్ల ద్వారా రూ.714 కోట్ల పెట్టుబడితో 3,155 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 91,000 మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. పులివెందులలో ఏర్పాటైన అరటి ప్రాసెసింగ్ యూనిట్తోపాటు తిరుపతి జిల్లాలో నెలకొల్పిన డీపీ చాక్లెట్స్కు చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్, గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ కంపెనీ యూనిట్లను ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖ ఒప్పందాలపై ప్రత్యేక కమిటీ ఈరోజు 13 యూనిట్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇందులో ఒక ఎంవోయూ కూడా ఉంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న 386 ఎంవోయూలతో దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా కార్యాచరణలోకి తేవాలన్న లక్ష్యంతో సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి ప్రతి నెలా సమీక్షిస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందించేలా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ, ఎవరికి ఏ అవసరం ఉన్నా దాన్ని ప్రభుత్వం తన అవసరంగానే భావించి పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఎంవోయూలను కార్యరూపంలోకి తెస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ 3 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక ఎంవోయూపై కూడా సంతకాలు చేశాం. దాదాపు రూ.3,008 కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే బృహత్తర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్ను వర్చువల్గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిగతావి ఆర్నెల్ల నుంచి ఏడాదిన్నరలోపే సిద్ధం ఈ పరిశ్రమల వల్ల 14 జిల్లాల్లో సుమారు 7 వేల మందికి పైగా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం కూడా చేశాం. దీనివల్ల మన పిల్లలందరికీ మంచి జరుగుతుంది. అక్కడే వీరికి ఉద్యోగాలు రావడం వల్ల స్థానికులందరూ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు పలికి స్వాగతించేలా మనం ఈ చట్టం చేశాం. వీటివల్ల యువతకు ఆరు నెలల నుంచి గరిష్టంగా 18 నెలలలోగా ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు రానున్నాయి. అప్పటిలోగా పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయి. ఇందులో 3 యూనిట్లను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మిగిలినవి ఆరు నెలల నుంచి ఏడాదిన్నరలోపే పూర్తవుతాయి. ఇవాళ ఎంవోయూ చేసుకున్న ప్లాంట్ కూడా ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రానుంది. కార్యక్రమంలో ఆయా రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో పాటు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. ఈ సందర్భంగా మీ అందరికీ (పారిశ్రామికవేత్తలు) మద్దతు ఇచ్చే విధంగా నాలుగు మాటలు చెబుతా. పారిశ్రామిక వేత్తల పట్ల మేం అత్యంత సానుకూలంగా ఉన్నాం. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా మేం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఈ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తుంది. కలెక్టర్లు, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమలశాఖ మంత్రి, సీఎస్ సహా అందరూ మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించేలా మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా కృషి చేసిన కలెక్టర్ నుంచి సీఎస్ వరకూ అందరికీ అభినందనలు. శ్రీకాకుళం జిల్లా నరువలో ‘నాగార్జున ఆగ్రో కెమికల్స్’ యూనిట్కు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్ పరిశ్రమల రంగంలో ప్రాజెక్టులివీ.. 1. గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో 66.49 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్లామ్ సౌత్ లిమిటెడ్ను వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్. ఈ యూనిట్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడి, దాదాపు 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు. 2. ఎకో స్టీల్ ఇండియా లిమిటెడ్ అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం జాజరకళ్లు గ్రామంలో రూ.544 కోట్లతో ఏర్పాటు కానున్న బయో ఇథనాల్ తయారీ యూనిట్కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు. 3. ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన. ఈ పరిశ్రమ వల్ల 600 మందికి ఉపాధి. 4. శర్వాణి బయో ఫ్యూయల్ బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం బుద్దవానిపాలెంలో ఏర్పాటు కానున్న శర్వాణి బయో ప్యూయల్ లిమిటెడ్ యూనిట్ శంకుస్థాపన. రూ.225 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు. 5. నాగార్జున ఆగ్రో కెమికల్స్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 57 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఏసీఎల్) యూనిట్. దీనిద్వారా బయో పెస్టిసైడ్స్, సింధటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఫ్లోరైన్ ఆధారిత కెమికల్స్ ఉత్పత్తి. రూ.200 కోట్లతో 200 మందికి ఉపాధి. 6. రవళి స్పినర్స్ తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో రూ.150 కోట్లతో ఏర్పాటు కానున్న రవళి స్పిన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎస్పీఎల్) యూనిట్. దీని ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి. 7.యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లెలో రూ.125 కోట్లతో ఏర్పాటు కానున్న యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిడెట్ యూనిట్. దీని ద్వారా 750 మంది స్ధానికులకు ఉపాధి. ఫుడ్ ప్రాసెసింగ్లో ఇవీ ప్రాజెక్టులు.. 1.డీపీ చాక్లెట్స్ తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కంచర్లపాలెంలో డీపీ చాక్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్ ప్రారంభం. రూ.325 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగావకాశాలు. ఏటా 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ఈ యూనిట్ ద్వారా దాదాపు 18వేల మంది రైతులకు లబ్ధి. 2. పులివెందుల అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లిలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్లో ఉత్పత్తి ప్రారంభం. రూ.4 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ క్లస్టర్ ద్వారా బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్ప్డ్ బనానా, కప్స్, ప్లేట్ల తయారీ. 700 మంది రైతులకు ఈ క్లస్టర్తో ప్రయోజనం చేకూరుతుంది. 3. ఓరిల్ ఫుడ్స్ విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఓరిల్ పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఇన్స్టెంట్ వెజిటబుల్ చట్నీస్ తయారీ యూనిట్కు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్. రూ.50 కోట్ల పెట్టుబడితో 175 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. ఏటా 7,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 1,000 మంది రైతులకు ప్రయోజనం. 4. నేటివ్ అరకు కాఫీ అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడిలో అరకు కాఫీ తయారీ యూనిట్కు వర్చువల్గా సీఎం జగన్ శంకుస్ధాపన. రూ.20 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 1,000 మంది గిరిజన రైతులకు ప్రయోజనం కలగనుంది. 5. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా 13 చోట్ల రూ.65 కోట్ల వ్యయంతో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వర్చువల్గా సీఎం జగన్ శంకుస్థాపన. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్మలమడుగు (రెండు చోట్ల), ఆదోని, నంద్యాల, కదిరిలలో ఈ యూనిట్ల ఏర్పాటు. 6. అయ్యవరంలో ‘3 ఎఫ్ ఆయిల్స్’ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న 3 ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గోయెంకా, ఏపీఎఫ్పీఎస్ సీఈవో శ్రీధర్రెడ్డి. రూ.250 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గంటకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మేలు జరగనుంది. -
‘పవర్’ ఫుల్
► రూ.10,350 కోట్ల పెట్టుబడి, 2,300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్కో కంపెనీ నిర్మించే సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన. దీనిద్వారా 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► 1,014 మెగావాట్లతో ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ నిర్మించే ప్రాజెక్టుకు శంకుస్ధాపన. ఇందులో 700 మెగావాట్లు సోలార్ పవర్ కాగా 314 మెగావాట్లు విండ్ పవర్ ఉత్పత్తి. రూ.4,500 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► ఎకోరన్ ఎనర్జీ 2 వేల మెగావాట్ల (1,000 మె.వా. సోలార్, 1,000 మె.వా. విండ్ పవర్) సామర్ధ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టుకు శంకుస్ధాపన. దాదాపు రూ.11 వేల కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు.. ఎన్హెచ్పీసీతో ఒప్పందం ► 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు సంబంధించి ఎన్హెచ్పీసీతో ఒప్పందం. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో యాగంటి, కమలపాడులో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుల వల్ల 2 వేల మందికి ఉద్యోగాల కల్పన. ► వీటితో పాటు ఎన్హెచ్పీసీతో మరో మూడు ప్రాజెక్టుల ఫీజిబిలిటీపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం. మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులపై కలసి పని చేసేలా అడుగులు. రాష్ట్రానికి.. రైతులకు.. యువతకు మేలు ఈ ప్రాజెక్టుల ఏర్పాటుతో మనకు జరిగే మేలును ఒక్కసారి పరిశీలిస్తే.. రాబోయే రోజుల్లో మన యువతకు స్ధానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా అందుబాటులోకి వస్తున్న ప్రతి మెగావాట్కు మరో వందేళ్ల పాటు అంటే ఈ ప్రాజెక్టు లైఫ్ ఉన్నంత కాలం మెగావాట్కు రూ.లక్ష చొప్పున రాయల్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో పాటు ఈ ప్రాజెక్టుల వల్ల జీఎస్టీ ఆదాయం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులకు తమ భూములిస్తూ సహకరిస్తున్న రైతన్నలకు కూడా ఈ కంపెనీల నుంచి లీజు రూపంలో ఏటా ఎకరాకు రూ.30 వేలు చొప్పున ఆదాయం వస్తుంది. ఇందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది. అంటే రైతులు ఎవరైనా భూములివ్వాలనుకుంటే ప్రతి రైతుకు, ప్రతి ఎకరానికి, ఏడాదికి రూ.30 వేలు లీజు రూపంలో ఇస్తారు. ప్రతి రెండేళ్లకు 5 శాతం లీజు రుసుము కూడా పెరుగుతుంది. దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడిన దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ రైతన్నలకు ఈ ప్రాజెక్టులతో మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన రంగానికి భద్రత చేకూరేలా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుడుతూ చరిత్రాత్మక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒప్పందాలను శరవేగంగా కార్యాచరణలోకి తెస్తూ నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం వర్చువల్ విధానంలో భూమి పూజ నిర్వహించారు. మరో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్పీ) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్హెచ్పీసీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఈమేరకు సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏపీ జెన్కో ఎండీ చక్రధరబాబు, ఎన్హెచ్పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో అపార పెట్టుబడుల అవకాశాలపై సీఎం జగన్ శ్వేతపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు. భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీదే ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ మనతో పాటు ఉన్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారత్, గ్రీన్కో, ఆర్సెలర్ మిట్టల్, ఎకోరన్ గ్రూపు యాజమాన్యాలకు, కంపెనీల ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు ఇక్కడకు వచ్చిన ఎన్హెచ్పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ గోయల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్కు ధన్యవాదాలు. ఇవాళ మూడు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. నాలుగో కార్యక్రమం కింద ఎన్హెచ్పీసీతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నాం. మొదటి ప్రాజెక్టు గ్రీన్కో.. 2,300 మెగావాట్ల సౌర విద్యుత్తుకు సంబంధించి రూ.10,350 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగిస్తున్న ప్రాజెక్టు ఇది. ఇక పంప్డ్ స్టోరేజ్ అన్నది ఆర్టిఫీషియల్ బ్యాటరీ లాంటిది. పీక్ అవర్స్లో పవర్ జనరేట్ చేస్తాం. నాన్ పీక్ అవర్స్లో మళ్లీ నీళ్లని వెనక్కి పంప్ చేసి ఆ తరువాత, పీక్ అవర్స్లో పవర్ని జనరేట్ చేసేందుకు ఆర్టిఫీషియల్ బ్యాటరీ మాదిరిగా ఏర్పాట్లు ఉంటాయి. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు భవిష్యత్తులో పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తయ్యేలా దోహదం చేస్తాయి. దీనివల్ల బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. పర్యావరణానికి మంచి జరగాలంటే రాబోయే రోజుల్లో పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సోలార్ ప్రాజెక్టులు, విండ్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతో మనం అనుసంధానమవుతున్న తీరు గ్రీన్ ఎనర్జీలో పెను మార్పులకు దారి తీస్తాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. అదే సమయంలో విద్యుదుత్పత్తికి తోడ్పాటునివ్వడం ద్వారా గ్రీన్ ఎనర్జీలో ఒక విప్లవాత్మక మార్పు వస్తుంది. మరో 30 ఏళ్లు ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా.. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 8,998 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేస్తున్నాం. రైతులకు దీర్ఘకాలం పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు 16 వేల మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 7,200 మెగావాట్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో యూనిట్ రూ.2.49కే అందేలా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా మరో 25 నుంచి 30 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా, ఒత్తిడి లేకుండా రైతులకు ఉచితంగా విద్యుత్ అందించే వెసులుబాటు లభిస్తుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో రూ.2.49కే మరో 25 – 30 ఏళ్ల పాటు ఉచిత కరెంటుకు ఢోకా లేకుండా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది గొప్ప అడుగు. 41 వేల మెగావాట్లు.. 37 ప్రాంతాలు ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మరోవైపు పంప్డ్ స్టోరేజీని ప్రోత్సహించడంలో భాగంగా దాదాపు 41 వేల మెగావాట్లకు సంబంధించి 37 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. ఇందులో 33,240 మెగావాట్లకు సంబంధించి 29 చోట్ల ప్రాజెక్టు ఫీజిబులిటీ పరిశీలన జరుగుతోంది. 20,900 మెగావాట్ల కెపాసిటీకి సంబంధించిన ప్రాజెక్టుల డీపీఆర్లు కూడా పూర్తయ్యాయి. వీటిలో 16,180 మెగావాట్ల కెపాసిటీతో ఉత్పత్తి చేసేందుకు వివిధ కంపెనీలకు అలాట్మెంట్లు కూడా పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే ఇవాళ ఎన్హెచ్పీసీతో ఒప్పందం చేసుకుంటున్నాం. దీనిలో యాగంటిలో 1,000 మెగావాట్ల ప్రాజెక్టు, కమలపాడులో మరో 950 మెగావాట్లు కలిపి మొత్తంగా దాదాపు 2 వేల మెగావాట్ల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్పీసీతో కలిసి నిర్మించనుంది. దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు ఫీజిబులిటీ స్డడీస్ పూర్తయ్యాయి. ఎన్హెచ్పీసీ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం వాటాతో ప్రాజెక్టును అభివృద్ధిలా ఇవాళ ఎంవోఓయూ కుదుర్చుకున్నాం. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్, డిప్యూటీ హెడ్ మిషన్ యూకే గవర్నమెంట్ వరుణ్ మాలి, యూకే గవర్నమెంట్ సీనియర్ అడ్వైజర్ నిషాంత్కుమార్ సింగ్, ఎన్హెచ్పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్, గ్రీన్కో వైస్ ప్రెసిడెంట్ ఎన్.శేషగిరిరావు, ఏఎం గ్రీన్ ఎనర్జీ బిజినెస్ హెడ్ సమీర్ మాథుర్, ఎకోరన్ గ్రీన్ ఎనర్జీ సీఎండీ వై.లక్ష్మీ ప్రసాద్, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మరో మూడు చోట్ల కూడా...! ఎన్హెచ్పీసీతో కలసి ఇంకా వేగంగా అడుగులు ముందుకువేసే కార్యక్రమంలో భాగంగా మరో 2,750 మెగావాట్లకు సంబంధించి 3 ప్రాంతాలలో ఫీజుబులిటీ స్డడీస్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ ప్రాజెక్టులను కూడా ఎన్హెచ్పీసీతో కలిసి సంయుక్తంగా చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సామర్ధ్యాన్ని పెంచుకుంటూనే మిగిలిన ప్రైవేట్ డెవలపర్స్కి కూడా అందుబాటులోకి తెచ్చి తద్వారా రాష్ట్రంతో పాటు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. వీటన్నింటితో రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవనుంది. ప్రపంచాన్ని శాసించే ఎనర్జీ దేవుడు గొప్పవాడు.. అందుకే మానవాళికి ఇంత చక్కటి వనరులను సృష్టించాడు. ఎండ బాగున్నప్పుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సోలార్ పవర్ని ఉత్ప త్తి చేస్తే సాయంత్రం 6 నుంచి ఉదయం వర కు విండ్ పవర్ ఉత్పత్తి అవుతుంది. పీక్ అ వర్స్లో నీళ్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను వాడుకోవచ్చు. ïపీక్ అవర్స్లో అవి ఆర్టిఫీషియల్ బ్యాటరీలా పనిచేస్తాయి. దీంతో ïపీక్ అవర్స్లో విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. ఫలితంగా శిలాజ ఇంధనాల నుంచి బయటపడి పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ లభిస్తుంది. ఇది ప్రపంచాన్ని శాసించ బోయే ఎన ర్జీగా నిలుస్తుంది. అందులో ఏపీ తొలిస్థానంలో నిలిచేలా అడుగులు పడుతున్నాయి. -
పర్యాటకానికి మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను చేపట్టింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని ప్రాంతాల్లో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం వెళుతోంది. ఇందులో భాగంగా రూ.3,016 కోట్ల విలువైన 13 పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా వాస్తవరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ 13 ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని రెండునెలల్లో మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 13 ప్రాజెక్టుల్లో 11 స్టార్ హోటళ్ల నిర్మాణానివి కాగా రెండు పర్యాటక ప్రాంతాల్లో రోప్వే నిర్మాణానికి సంబంధించినవి. ఈ 13 ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 17,032 మందికి ఉపాధి లభించనుంది. అంతర్జాతీయ సంస్థలైన ఒబరాయ్, నోవోటెల్, హయత్, హిల్టన్, మారియట్, మై ఫెయిర్, లెమన్ ట్రీ.. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఒబరాయ్ గ్రూపు కడప గండికోట వద్ద భారీ ఫైవ్స్టార్ హోటల్ నిర్మాణంతోపాటు తిరుపతి విశాఖల్లో కూడా హోటళ్లు నిర్మించనుంది. అలాగే దేవభూమి రోప్వేస్ సంస్థ కృష్ణా, నంద్యాల జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టనుంది. రాష్ట్ర పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని, అందులో తొలుత 13 ప్రాజెక్టులపై దృష్టిసారించామని ఏపీ టూరిజం అథారిటీ ఎండీ కె.కన్నబాబు చెప్పారు. ఈ 13 ప్రాజెక్టులకు డీపీఆర్లు పూర్తయ్యాయని, ఒకసారి ఎస్ఐపీబీ, మంత్రివర్గ ఆమోదం లభించిన వెంటనే సీఎం చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక భారీ ప్రాజెక్టులను చేపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖ, గండికోట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో ఎటు పోయింది: మీసా భారతి
ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక
గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
సోనియా గాంధీ ప్రయత్నం ఫలించడం లేదు: అమిత్ షా కీలక వ్యాఖ్యలు
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు.. 22,500 దిగువకు నిఫ్టీ
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"
పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "
కూటమి అంటేనే ఎలపరమబ్బా....
తప్పక చదవండి
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
- శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
Advertisement