Kodali Nani Serious Comments On Chandrababu Naidu Over YSRCP 4 MLAs, Details Inside - Sakshi
Sakshi News home page

నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే: కొడాలి నాని

Mar 29 2023 4:57 PM | Updated on Mar 29 2023 6:27 PM

Kodali Nani Commnts On Chandrababu - Sakshi

పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

సాక్షి, అమరావతి: పేద ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘ఎన్టీఆర్‌ను అన్ని వర్గాల ప్రజలు ఆదరించారు. ఎన్టీఆర్‌ చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరును ప్రజలంతా స్మరిస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని చంద్రబాబు లాక్కున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు’  అని దుయ్యబట్టారు.

‘‘ఎన్టీఆర్‌పై చెప్పులతో ఎందుకు దాడి చేయించారో చెప్పాలి. ఎన్టీఆర్‌ పెట్టిన సంక్షేమ పథకాలను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు డబ్బులకు అమ్ముకున్న నీచుడు చంద్రబాబు. ఎన్టీఆర్‌ తర్వాత రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తి వైఎస్సార్‌. పార్టీ కోసం 30 ఏళ్లు పనిచేసి అధికారంలోకి తెచ్చిన గొప్ప నాయకుడు వైఎస్సార్‌. ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌, పేదలకు ఇళ్లు వంటి ఎన్నో గొప్పపథకాలు వైఎస్సార్‌ తెచ్చారు. ఎన్టీఆర్‌+ వైఎస్సార్‌ కలిపితే వైఎస్‌ జగన్‌’’ అని కొడాలి నాని అన్నారు.

‘‘చంద్రబాబు అంటే వెన్నుపోటు గుర్తొస్తుంది. ఎన్టీఆర్‌ సిద్ధాంతాలు ఇప్పుడు టీడీపీలో లేవు. పేదల కోసం పెట్టిన పార్టీని పెత్తందార్లకు చంద్రబాబు తాకట్టు పెట్టారు. టీడీపీని వ్యాపార సంస్థగా చంద్రబాబు మార్చారు. వైఎస్‌ జగన్‌ నీతిగా రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలు. 2014లో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారు. 2019లో చంద్రబాబుకు 23 సీట్లే వచ్చాయి. ఇప్పుడు నలుగురిని లాక్కున్నారు.. వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లే వస్తాయి’’ అని కొడాలి నాని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement