-
Sagubadi: విపత్తులకు తట్టుకునే ప్రకృతి సేద్యం.. గొప్పేంటి?
2023 డిసెంబర్ 4,5 తేదీల్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో పంటలను, ముఖ్యంగా వరి పంటను, నేలమట్టం చేసింది. అయితే, ఆ తీవ్రమైన గాలులు, వర్షాన్ని తట్టుకొని నిలబడే ఉన్నాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి పొలాలు. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి చేలు నేలకు వాలిపోయి, నీట మునిగి ఉంటే.. వీటి పక్కన పొలాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ వరి పంట మాత్రం చెక్కుచెదరకుండా దర్జాగా నిలబడి ఉండటం గురించి అప్పట్లోనే వార్తా కథనాలు చదివిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మిచాంగ్ తుపానే కాదు అంతకుముందు కూడా అనేక విపత్కర పరిస్థితుల్లోనూ ఇది స్పష్టంగా కళ్లకు కట్టిన వాస్తవం. అయితే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైన ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు డాక్టర్ ఫిల్ లీ ఈ నెల మొదటి వారంలో ఏపీలో పర్యటించారు. అనంతపురం తదితర జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు తుపానును, కరువును దీటుగా తట్టుకొని నిలబడుతూ సుభిక్షంగా, ఉత్పాదకంగా నిలవటానికి వెనుక గల శాస్త్రీయ కారణాలను డా. ఫిల్ లీ అన్వేషించారు. అనేక కోస్తా జిల్లాల్లో మిచాంగ్ తుపానుకు నేలకొరిగిన రసాయనిక వరి పొలాల్లో గడ్డికి, పక్కనే పడిపోకుండా నిలబడిన వరి పొలాల్లో గడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటో తన వెంట తెచ్చిన అధునాతన మైక్రోస్కోప్ ద్వారా పరిశోధించారాయన. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వరి మొక్క కాండంలో కణ నిర్మాణం రసాయనిక వ్యవసాయంలో కన్నా బలంగా, ఈనెలు తేలి ఉండటాన్ని ఆయన గుర్తించారు. రసాయనాలతో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు నేలకొరిగింది (ఎడమ ఫైల్), ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు తట్టుకుంది (కుడి ఫైల్) "మిచాంగ్ తుపాను నాటి రసాయనిక, ప్రకృతి సేద్య వరి పంటలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డా. ఫిల్ లీ అధ్యయనం" "ప్రకృతి సేద్యంతో ఒనగూడుతున్న అద్భుత ఫలితాలను కళ్లకు కట్టిన అధ్యయన ఫలితాలు" "ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత పెరుగుతుంది. అందువల్లనే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఈ పంటలకు వస్తోందనడానికి ఇప్పుడు విస్పష్టమైన రుజువులు దొరికాయి". – డాక్టర్ ఫిల్ లీ, ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు, ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ప్రకృతి సేద్య బలానికి నిదర్శనం’ అన్నారు డా. ఫిల్ లీ. అదేవిధంగా, ఏప్రిల్ మొదటి వారంలో అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన రసాయనిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగవుతున్న పంటలను పరిశీలించారు. ఆయా పొలాల్లో మట్టి నమూనాలను కూడా సేకరించి అధ్యయనం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి కాండం (మైక్రోస్కోప్ ఎడమ చిత్రం), రసాయనాలతో పండించిన వరి కాండం (కుడి చిత్రం) బంతి పూలను ఏకపంటగా సాగు చేస్తున్న రసాయనిక పొలంలోని మట్టిలో జీవం తక్కువగా ఉందని గుర్తించారు. ఆ పొలం పక్కనే బంతితో పాటు 12 పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలంలోని మట్టి నమూనాలను పరిశోధించగా.. మట్టి కణాల నిర్మాణం, ఆ మట్టిలో వైవిధ్యపూరితమైన సూక్ష్మజీవరాశి ఎంతో సుసంపన్నంగా ఉన్నట్లు గుర్తించానని డా. ఫిల్ లీ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో పెరుగుతున్న జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత వల్లనే పంటలకు వైపరీత్యాలను తట్టుకునే శక్తి వస్తోందనడానికి విస్పష్టమైన రుజువులు దొరికాయని ఆయన తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వీడియోలు ‘ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్’ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలో 20,21 తేదీల్లో ఆర్గానిక్ మేళా.. తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలోని మహతి ఆడిటోరియంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఉ. 10.30 గం. నుంచి రాత్రి 8 గం. వరకు స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ 2 ఫార్మర్’ ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తులు ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. రైతులు నేరుగా తమ ఆర్గానిక్ పంట ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకోగలిగే ఏర్పాటు చేయటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని కనెక్ట్ 2 ఫార్మర్ వ్యవస్థాపకులు శిల్ప తెలిపారు. 20న కషాయాల తయారీపై గంగిరెడ్డి, దేశవాళీ పండ్లు / పూల మొక్కల గ్రాఫ్టింగ్పై జె.ఎస్. రెడ్డి శిక్షణ ఇస్తారు. కంపోస్టింగ్పై డా.సింధు అవగాహన కల్పిస్తారు. 21న 5 దొంతర్ల పండ్లు, కూరగాయల సాగుపై, ఇంకుడుగుంతల నిర్మాణంపై విజయరామ్ ప్రసంగిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రకృతివనం ప్రసాద్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 63036 06326. ఇవి చదవండి: Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు! -
Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు!
భూతల్లి కన్న తల్లితో సమానమని భావించే ఈ రైతు దంపతులు తమ సొంత భూమిలో మనసుపెట్టి ఇష్టంగా వ్యవసాయం చేస్తూ ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నారు. దీంతో వీరి పొలాలు ప్రదర్శన క్షేత్రాలుగా మారిపోయాయి. పశువులు, గొర్రెలు, కోళ్ల ఎరువులు, జీవామృతంతో పంటలు పండిస్తున్నారు. మంచి దిగుబడులతో పాటు చక్కని ఆదాయం పొందుతున్నారు. మిట్టపెల్లి రాజేష్ రెడ్డి, భారతి ఆదర్శ రైతు దంపతులు. చదివించి పదో తరగతే అయినా తమ 12 ఎకరాల భూమిలో మనసుపెట్టి సేంద్రియ వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇంటికి అవసరమైన అన్నింటినీ సేంద్రియంగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వీరిది జగిత్యాల జిల్లాలో మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామం. 3 కి.మీ.ల పైపులైను.. ఆ రైతు దంపతులకు వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు పంచప్రాణాలు! వీరికి పన్నెండు ఎకరాల భూమి ఉంది. బావులే ఆధారం. 3 కి.మీ. దూరంలో వున్న ఎస్సారెస్పీ వరద కాల్వ నుంచి పైపులైన్లు వేసుకొని డ్రిప్తో సాగు చేస్తున్నారు. 20 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నప్పటికీ దిగుబడులు అంతంతే కాని, ఖర్చులు మాత్రం పెరిగాయి. ఇష్టారీతిన రసాయన ఎరువులు వేయడంతో ప్రతి పంటలో పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువై, వాటికి రసాయన మందులు పిచికారీ చేసేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కుటుంబ అదాయం పిల్లల చదువుకు కూడా సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో పాలేకర్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయవచ్చని తెలసుకొని సాగు పద్ధతిని మార్చుకున్నారు. ఈ దంపతులు ప్రతి ఏడాదీ మూడు పంటలు పండిస్తున్నారు. మేలో తప్ప మిగతా 11 నెలలూ వీరి పొలాల్లో పంటలతో ఉంటాయి. వర్షాలతో సంబంధం లేకుండా, వ్యవసాయ భావుల్లో ఉన్న కొద్దిపాటి నీటితోనే, జూన్ రెండో వారంలోనే విత్తనాలు వేస్తుంటారు. వానాకాలం సీజన్లో ఆరు ఎకరాల్లో సన్న రకం వరి, రెండెకరాల్లో పసుపు, మూడెకరాల్లో మొక్కజొన్న, ఒక ఎకరంలో మిర్చి పంట సాగు చేశారు. యాసంగి సీజన్లో ఆరెకరాల్లో లావు రకం వరి, ఎకరంలో జొన్న, 3 ఎకరాల్లో మొక్కజొన్న, రెండెకరాల్లో నువ్వు సాగు చేస్తున్నారు. ఖర్చు తగ్గించే సాగు పద్ధతులతో మేలు! మా భూమిలో రకరకాల పంటలు పండించి, ఆ పంటల్లో అధిక దిగుబడులు తీసినప్పుడు మాకు కష్టం గుర్తుకురాదు. ప్రధానంగా భూతల్లిని కాపాడేందుకు రసాయనాలను పూర్తిగా తగ్గించి, పశువులు, కోళ్లు, గొర్రెల ఎరువు వాడుతున్నాం. వ్యవసాయంతో చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటే, మేం మాత్రం ఇష్టంగా చేస్తున్నాం.. సంతృప్తిని, ఆదాయాన్ని పొందుతున్నాం. ప్రతి రైతు ఖర్చు తగ్గించే పద్ధతులపై దృష్టి పెట్టాలి. మేం అలాగే చేస్తున్నాం. మా పద్ధతిలోకి రావాలని తోటి రైతులను ప్రోత్సహిస్తున్నాం. – మిట్టపెల్లి భారతి, రాజేష్ రెడ్డి (9618809924, 9618111367) వెద వరి.. 30 క్వింటాళ్ల దిగుబడి వరి సాగు చేయబోయే పొలంలో జూన్లో మొక్కజొన్న సాగు చేసి, కంకులు కోసిన తర్వాత మొక్కజొన్న మొక్కలను రోటోవేటర్తో పొలంలో కలియ దున్నేస్తారు. ఆ తర్వాత, వరి నారు పోసి, నాటు వేసే బదులు, నేరుగా వెదజల్లి ఎకరానికి 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. అలాగే, పసుపు, మొక్కజొన్న సాగు చేసే భూమిలో రెండు లారీల గొర్రెల ఎరువు, ఒక లారీ మాగిన కోళ్ల ఎరువు వేసి భూసారం పెంచుకుంటూ ఉంటారు. పంటకాలంలో ప్రతి పంటకు జీవామృతాన్ని మూడు సార్లు ఇస్తున్నారు. నాలుగు ఆవులు, మూడు గేదేలను పెంచుతున్నారు. సగటున ఎకరానికి సజ్జలు 12–15, పసుపు 30, మొక్కజొన్నలు 40–45, నువ్వులు 4–6 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. భారతి, రాజేష్ రెడ్డి దంపతులు తెల్లవారుఝామున 3 గంటలకే వీరి దిన చర్య ప్రారంభం అవుతుంది. ఆవులు, గేదేల నుంచి పాలు పిండి 30 మందికి పాలు పోస్తారు. ఇంట్లో వంట పనులు పూర్తి చేసుకొని ఇద్దరూ తెల్లారేసరికే పొలంలో అడుగుపెడతారు. సా. ఆరు గంటలైతే కానీ ఇంటికి రారు. ఏ ఫంక్షన్కు వెళ్లినా సాయంత్రం ఇంటికి రావాల్సిందే! విలువ జోడించే అమ్ముతారు భారతి, రాజేష్ రెడ్డి దంపతులు తాము పండించిన పంటలను విలువ జోడించి అమ్ముతూ మంచి ఆదాయం పొందుతున్నారు. సన్న వరి ధాన్యాన్ని మర ఆడించి బియ్యం క్వింటాకు రూ. 6,500కు విక్రయిస్తున్నారు. మిరపకాయలను ఎండబెట్టి కారం పొడిని కిలో రూ. 280కి వినియోగదారులకు అమ్ముతున్నారు. సజ్జలను బై బ్యాక్ పద్ధతిలో కంపెనీలకు క్వింటా రూ.7 వేలకు, పసుపును క్వింటా రూ.11 వేలకు, మొక్కజొన్నను క్వింటా రూ.2,100కు నువ్వులను క్వింటా రూ.14 వేల చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. తమ పిల్లలిద్దరినీ హైద్రాబాద్లో ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఫార్మ్ అండ్ రూరల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్లో పూర్వ ఉపకులపతి దివంగత జె. రఘోత్తమరెడ్డి స్మాకరకోపన్యాస సభలో భారతి ఉత్తమ సేంద్రియ రైతు పురస్కారాన్ని అందుకోవటం విశేషం. – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
నారి వారియర్
మంజు వారియర్....పేరులోనే కాదు ఆమె వేసే ప్రతి అడుగులో సాహసం ఉంటుంది. కళకు సామాజిక స్పృహ జోడించి ముందుకు వెళుతోంది. యాక్టర్, రైటర్, డ్యాన్సర్, బ్రాండ్ అంబాసిడర్, ప్రొడ్యూసర్, సోషల్ యాక్టివిస్ట్గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది... కేరళలోని తిరువనంతపురం కల్పాక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని మహిళా సభ్యులు సొంతంగా కూరగాయలు పండించడం ప్రారంభించారు. అందరూ ఆశ్చర్యపోయేలా పెద్ద వెజిటెబుల్ గార్డెన్ను సృష్టించారు. ‘కల్పాక క్వీన్స్’గా పేరు గాంచారు. వెజిటెబుల్ గార్డెన్ సృష్టించడానికి కల్పాక క్వీన్స్కు ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ అనే సినిమా స్ఫూర్తి ఇచ్చింది. సమాజాన్ని సినిమా ప్రభావితం చేస్తుందా? సినిమాను సమాజం ప్రభావితం చేస్తుందా?... అనే చర్చ మాట ఎలా ఉన్నా సమాజంపై సినిమా చూపే ప్రభావం తక్కువేమీ కాదు. మంచి లక్ష్యానికి మంచి సినిమా వెన్నుదన్నుగా నిలుస్తుంది. మంజు వారియర్ రీఎంట్రీ మూవీ ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ ఈ కోవకు చెందిన సినిమానే. మంజు వారియర్ ఈ సినిమాలో నిరూపమ రాజీవ్ అనే పాత్ర పోషించింది. నిరూపమ రాజీవ్ అనే వివాహిత టెర్రస్ ఫార్మింగ్కు సంబంధించిన ప్రయాణం సినిమా మూల కథ. ‘స్త్రీలు తమలో ఉన్న శక్తి సామర్థ్యాలపై దృష్టి సారించి వెలికి తీస్తే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి’ అంటుంది వారియర్. ‘హౌ వోల్డ్ ఆర్ యూ’ సినిమా విడుదలైన తరువాత మంజు వారియర్ ఎక్కడికి వెళ్లినా మహిళలు దగ్గరికి వచ్చి ‘మీ సినిమా స్ఫూర్తితో టెర్రస్ ఫార్మింగ్ మొదలు పెట్టాం’ అని చెప్పేవాళ్లు. ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ‘కుటుంబశ్రీ’కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంతో మంది మహిళలను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు నడిపిస్తోంది మంజు వారియర్. పదిహేడు సంవత్సరాల వయసులో ‘సాక్ష్యం’ సినిమాతో మలయాళ చిత్రసీమలోకి అడుగు పెట్టిన వారియర్ ‘తూవల్’ ‘కొట్టరం’ ‘సల్లాపం’...మొదలైన సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. చిత్రసీమలోకి రావడానికి ముందు దూరదర్శన్ సీరియల్స్లో నటించింది. జెండర్–ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘జెండర్ పార్క్’ ప్లాట్ఫామ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వారియర్ క్యాన్సర్ పేషెంట్ల కోసం హెయిర్ డొనేషన్ డ్రైవ్లను నిర్వహిస్తుంటుంది. ‘చతర్ముఖం’ అనే మలయాళం సినిమాతో నిర్మాతగా తొలి అడుగు వేసింది మంజు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘సినిమా నిర్మాణంలో రిస్క్లు, బాధ్యతలు ఉంటాయి. నా చుట్టుపక్కల వాళ్ల సహకారంతో నిర్మాతగా ఎలాంటి సవాళ్లు, ఒత్తిడి ఎదుర్కోలేదు. ‘కాయట్టం’ సినిమాకు సహనిర్మాతగా ఉన్నప్పుడు చిత్ర నిర్మాణం గురించి సీరియస్గా ఆలోచించడం మొదలు పెట్టాను. నా జీవితంలో ఏది ప్లాన్ చేసుకోలేదు. ఆ సమయానికి ఏది ఆసక్తిగా ఉంటే అది చేస్తూ పోయాను. సినిమా నిర్మాణాన్ని నా జీవితంలో కొత్త ప్రయోగంగా భావిస్తాను’ అంటుంది మంజు వారియర్. క్లాసికల్ డ్యాన్సర్గా మంజు వారియర్ తెచ్చుకున్న పేరు తక్కువేమీ కాదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుంచి వారియర్ నాట్యప్రతిభ గురించి ప్రముఖ నాట్యకారుడు ఎన్వీ క్రిష్ణన్కు తెలుసు. ‘మంజు గిఫ్టెడ్ డ్యాన్సర్. మన దేశంలోని అద్భుతమైన భరతనాట్య కళాకారులలో ఆమె ఒకరు’ అంటాడు క్రిష్ణన్. భరతనాట్యంలో పేరు తెచ్చుకున్న మంజు వారియర్ తన కూతురు మీనాక్షి డ్యాన్స్ టీచర్ గీతా పద్మకుమారన్ నుంచి కూచిపూడి నాట్యం నేర్చుకుంది. ‘వారియర్కు కూచిపూడి నేర్పడం ఒక అద్భుత అనుభవం. తక్కువ సమయంలోనే డ్యాన్స్ నేర్చుకుంది. అద్భుతమై ఎక్స్ప్రెషన్స్ ఆమె సొంతం’ అంటుంది గీత. ‘సల్లాపం’ అనే పుస్తకంతో రైటర్గా కూడా తన ప్రతిభ చాటుకుంది వారియర్. ‘సల్లాపం’ తన జ్ఞాపకాల సమాహారం. వీణ వాయించడం నేర్చుకున్న వారియర్ ఎన్నో వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. మంజు వారియర్ బహుముఖ ప్రతిభకు మరోసారి ఫిదా అయ్యారు అభిమానులు. సంతోషమే నా బలం ప్రాజెక్ట్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా... ఫలితంతో సంబంధం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. సంతోషమే నా బలం. నా జీవితంలో ఎప్పుడూ ఏది ప్లాన్ చేసుకోలేదు. అయితే మంచి విషయాలు నా దారిలో ముందుకు వచ్చి కనిపిస్తాయి. వాటితో కలిసి ప్రయాణిస్తాను. సాహిత్య కార్యక్రమాల్లో మాట్లాడడానికి ముందు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చెప్పబోతున్నానో, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో... ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాను. – మంజు వారియర్ -
విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన
దేశంలోనే దిగ్గజ ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం.. దాదాపు 17 ఏళ్లు పనిచేసిన అనుభవం.. ఉద్యోగానికి రాజీనామా.. ఏదైనా ఐటీ కంపెనీ స్థాపిస్తాడేమోనని అనుకుంటాం. కానీ వ్యవసాయం ప్రారంభించాడు. ఏటా ఏకంగా రూ.205 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఏ పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాడు? అంత సంపాదన ఎలా సాధ్యమైందో ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన శశికుమార్ 17 ఏళ్లపాటు ఐటీరంగంలో సేవలందించారు. అందులో 13 ఏళ్లు దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ విప్రోలో విధులు నిర్వర్తించారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయానికి మాత్రం ప్రత్యామ్నాయం లేదని గ్రహించారు. రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, సేంద్రియ ఆహారం అందించాలని భావించారు. దాంతో ఆర్గానిక్ పద్ధతులతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తను చేస్తున్న ఉద్యోగం మానేశారు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పడంతో వారూ తనకు సహాయం అందించారు. దాంతో 2010లో 9 మంది మిత్రులు కలిసి అక్షయకల్ప ఆర్గానిక్ని ప్రారంభించారు. శశికుమార్ మొదట్లో కేవలం ముగ్గురు రైతులతో పాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే అక్షయకల్ప ఆర్గానిక్ నిర్వాహకులు పాలతో ఆగకుండా.. సేంద్రియ కూరగాయలు, పండ్లను పండించడం ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని ప్రజలకు ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరిస్తూ వారికి చేరువవుతున్నారు. ఆర్గానిక్ పద్ధతులతో పండిస్తున్న రైతుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. రైతుల ఆదాయాలను పెంచుతున్నారు. ప్రస్తుతం అక్షయకల్ప ఆర్గానిక్ ద్వారా పాలఉత్పత్తిలో భాగంగా 700 మంది రైతులు సహకారం అందిస్తున్నారు. దాదాపు 60,000 లీటర్ల సేంద్రియ పాలను ఉత్పత్తి చేస్తున్నట్లు శశికుమార్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో మార్కెటింగ్ సేవలందించేందుకు 500 మందికి పైగా శిక్షణ ఇస్తున్నారు. సేంద్రియ పాలపై మొదట్లో వినియోగదారులకు అవగాహన కల్పించడం పెద్ద సవాలుగా మారిందని శశికుమార్ తెలిపారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తన స్నేహితులు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఇటీవల రూ.10 కోట్లతో కొత్త డెయిరీ ప్లాంట్ ప్రారంభించామన్నారు. దాని ద్వారా రోజుకు లక్ష లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: 11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత సేంద్రియ కూరగాయలు, పండ్ల వ్యాపారం గతంలో కంటే మెరుగవుతుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో అక్షయకల్ప ఆర్గానిక్ స్టార్టప్ రూ.205 కోట్లు ఆర్జించింది. 2023-24లో ఆదాయం మరో 25 శాతం పెరుగుతుందని శశి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ 5 వేల గ్రామాలు, 5 వేల మంది రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. -
ఆర్గానిక్ పాలకు అధిక డిమాండ్ ఉంది
-
తేనెటీగలు సంచార జాతికి చెందినవి
-
సంపద కేంద్రంలో ప్రకృతి వనం
కంకిపాడు(పెనమలూరు): అది చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రం. నిన్నటి వరకూ ప్రజలకు అంత వరకే తెలుసు. ప్రస్తుతం ప్రకృతి విధానంలో కూరగాయల మొక్కల సాగు జరుగుతోంది. ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా సంపద కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు కంకిపాడు పంచాయతీ పాలకవర్గం పాటుపడుతూ స్థానిక సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది. మండల కేంద్రమైన కంకిపాడులో గత పాలకపక్షం హయాంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించారు. ఈ పాలకపక్షం అధికారం చేపట్టాక సంపద వృద్ధి, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించింది. ప్రస్తుతం వర్మికంపోస్టు, పొడి చెత్త విక్రయాలు సాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం సంపద కేంద్రంలో ఉన్న ఖాళీ స్థలంలోనూ సంపద సృస్టించేందుకు పంచాయతీ పాలకవర్గం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఐదు నెలల క్రితం సంపద కేంద్రం ప్రాంగణంలో వృథాగా ఉన్న స్థలాన్ని బాగుచేయించారు. ఆ ప్రాంతంలో వర్మీకంపోస్టు, మట్టి కలిపి మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేశారు. వంగ, బెండ, గోరు చిక్కుడు, టమాటా, మిర్చి మొక్కలు నాటారు. తీగజాతికి చెందిన సొర, బీర, కాకర, పొట్లను కూడా సాగుచేస్తున్నారు. వీటికి పందిరి అవసరం లేకుండా ప్రాంగణంలో కొంచెం ఎత్తు మాత్రమే ఉన్న చెట్లకు పాదులను పాకిస్తున్నారు. తోటకూర, పాలకూర, గోంగూర నారుపోసి సంరక్షించారు. అరటి, జామ, దానిమ్మ, పనస, మామిడి, ఉసిరి వంటి పండ్ల జాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలు తెగుళ్లు, పురు గుల బారిన పడకుండా నిత్యం పంచాయతీ సిబ్బంది సంరక్షిస్తున్నారు. మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేందుకు, మంచి ఫలసాయం లభించేందుకు ఎప్పటికప్పుడు వర్మికంపోస్టు, సేంద్రీయ ఎరువును మొక్కలకు అందిస్తున్నారు. ఆదాయం పెంపు దిశగా.. ఇప్పటికే చెత్త నుంచి సంపద కేంద్రం నుంచి వర్మీ కంపోస్టు, పొడి చెత్త విక్రయాలు జరుగుతు న్నాయి. వీటి తోపాటుగా అన్ని సీజన్లలో ప్రకృతి విధానంలో కూరగాయ మొక్కలను పెంచి వాటి ఉత్పత్తులను విక్రయించటం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు పంచాయతీ చర్యలు తీసుకుంది. వర్మీకంపోస్టు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు ఆర్గానిక్ కూరగాయలకు ఆసక్తి చూపుతారు. అదే ఉద్దేశంతో ప్రకృతి విధానాన్ని సంపద కేంద్రంలో అమలు చేస్తోంది. ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తులను మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆరోగ్యంపై అవగాహన, శ్రద్ధ పెరిగాయి. ఆర్గానిక్ పద్ధతిలో పెరిగిన కూరగాయలను భుజించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే కారణంతో ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేసిన కూరగాయలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావా లని నిర్ణయించుకున్నాం. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వృథాగా ఉన్న ఖాళీ స్థలాన్ని మొక్కల పెంపకానికి వినియోగి స్తున్నాం. కేంద్రం ప్రాంగణం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు పెంచి విక్రయించటం ద్వారా పంచాయతీకి కూడా ఆదాయం సమకూరుతుంది. – రాచూరి చిరంజీవి, ఉప సర్పంచ్, కంకిపాడు -
హైబ్రీడ్ రకాల సాగుకే మొగ్గుచూపుతున్న అన్నదాతలు
-
పుష్ప శ్రీవాణి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వ్యవసాయం
-
ఆర్గానిక్ పంటలకు మార్కెట్లో మంచి ధర దక్కుతుంది
-
లే‘టేస్ట్’ ట్రెండ్..!
మండపేట: నాటుకోడి... కౌజుపిట్ట... కొర్రమీను... ఇదీ ఇప్పుడు ట్రెండ్.. అటు రెస్టారెంట్లలో అందరి దృష్టి వీటిపైనే ఉంటోంది. ఇటు పెంపకంలోనూ వీటిపైనే యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. కొందరు ఉద్యోగం చేస్తూనే తమకున్న ఆసక్తి మేరకు కొద్దిపాటి స్థలంలో గేదెలు, ఆవులు, నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలు వంటివి ఒకేచోట పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇదే తరహాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం పాలతోడు గ్రామానికి చెందిన పిల్లా విజయ్కుమార్ కేవలం ఆరు సెంట్ల స్థలంలో నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలను ఆర్గానిక్ పద్ధతిలో పెంచుతున్నాడు. నెలకు రూ.40వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. డిప్లొమా సివిల్ ఇంజినీరింగ్ చదివిన విజయ్కుమార్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో సివిల్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచి పశుపోషణ, కోళ్ల పెంపకంపై ఆసక్తి కలిగిన అతను తన సొంతూరులో ఆరు సెంట్ల స్థలంలో నాలుగేళ్ల కిందట మూడు గేదెలు, రెండు ఆవులతో డెయిరీఫాం, నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాడు. డెయిరీఫాం బాగానే ఉన్నా కార్మికుల సమస్యతో దానిని మధ్యలోనే ఆపేశాడు. అనంతరం కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టాడు. భీమవరం నుంచి మేలుజాతి కోడిపుంజులు, పెట్టలను తీసుకువచ్చి గుడ్లు ఉత్పత్తి చేయించి ఆర్గానిక్ తరహాలో పెంచడం ప్రారంభించాడు. ఆ తర్వాత హోటళ్లలో కౌజుపిట్టలకు మంచి గిరాకీ ఉందని గుర్తించి... రెండేళ్లుగా వాటిని కూడా పెంచుతున్నాడు. అంతటితో ఆగకుండా గతంలో ఏర్పాటుచేసిన డెయిరీ ఫాంలో పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టెలలో ఏడాది నుంచి కొర్రమీను చేపల పెంపకం ప్రారంభించాడు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూనే వారానికి ఒకసారి ఒకసారి వచ్చి అన్నీ చూసుకుని వెళతాడు. ఆయనకు కుటుంబ సభ్యులు సాయం చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోల ఆధారంగా ఎప్పటికప్పుడు మెళకువలు తెలుసుకుంటూ కోళ్లు, చేపలు, కౌజుపిట్టల పోషణ చేస్తున్నాడు. యూట్యూబ్లో చూసి గుడ్లను పొదిగించేందుకు ఇన్వర్టర్పై పని చేసే ఇంక్యుబేటర్ను సొంతంగా ప్లేవుడ్తో తయారు చేసుకున్నాడు. దానిలోనే కోడిగుడ్లు, కౌజుపిట్ట గుడ్లు పొదిగిస్తున్నారు. ఆదాయం బాగుంది నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీనుల పెంపకం లాభసాటిగా ఉంది. వీటిని పూర్తి ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచుతాం. గుడ్ల ఉత్పత్తికి వినియోగించే కోడి పుంజు రూ.75 వేలు కాగా, పెట్ట రూ.25 వేలు చొప్పున భీమవరంలో కొనుగోలు చేశా. ప్రస్తుతం వందకు పైగా కోళ్లు, 2,500 నుంచి 3,000 వరకు కౌజుపిట్టలు, 1,000 నుంచి 1,200 వరకు కొర్రమీను చేపలు పెంచుతున్నాం. మేత, ఇతర ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోంది. – పిల్లా విజయ్కుమార్, పాలతోడు, మండపేట మండలం -
బ్లాక్ రైస్, రెడ్ రైస్ సాగుతో అధిక దిగుబడిని పొందిన రైతు
-
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయంపై విదేశీయుల ఆసక్తి
-
సేంద్రియ వ్యవసాయంతో రైతుకు కలుగుతున్న లాభాలు
-
ఆరోగ్యకర జీవనానికి ఔషధ మొక్కలు
-
మల్లేశ్వరమ్మ సహకార వెలుగులు
చిన్న, సన్నకారు మహిళా రైతులు సంఘటితమైతే ఆర్థికాభివృద్ధితో పాటు మంచి ఆహారం కూడా మారుమూల గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందనటానికి శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం ఓ తాజా ఉదాహరణ. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలం ముసలిరెడ్డిగారిపల్లి కేంద్రంగా 2014లో ఈ సొసైటీ ఏర్పాటైంది. సుస్థిర వ్యవసాయ కేంద్రం ఈ సొసైటీకి ఆది నుంచి అండగా నిలుస్తోంది. మల్లేపల్లి తదితర పరిసర గ్రామాలకు చెందిన 301 మంది సన్న, చిన్నకారు మహిళా రైతు కుటుంబాలలో ఆర్థిక, ఆహార భద్రతా వెలుగులు నింపుతున్న ఈ సొసైటీకి సీనియర్ ఎన్పిఓపి సర్టిఫైడ్ సేంద్రియ రైతు వడ్డెమాని మల్లేశ్వరమ్మ అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. చదువు లేకపోయినా.. కఠోర శ్రమ, పట్టుదలతో సొసైటీ వార్షిక వ్యాపారాన్ని రూ.65 లక్షలకు పెంచగలిగిరామె. ఆమె కృషిని ‘నాబార్డు’ మెచ్చింది. నాబార్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ బాబు.ఎ., మార్కెటింగ్, సహకార శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి చేతుల మీదుగా ఇటీవల విజయవాడలో ఉత్తమ మహిళా రైతు పుస్కారాన్ని మల్లేశ్వరమ్మ అందుకోవటం విశేషం. సేంద్రియ సేద్యం ఇలా.. మల్లేశ్వరమ్మ, చంద్రశేఖరరెడ్డి దంపతులు ముసలిరెడ్డిగారిపల్లి పరిసరాల్లోని 4 చోట్ల ఉన్న 9 ఎకరాల వారసత్వ భూముల్లో సేంద్రియ సేద్యం చేస్తున్నారు. 2 ఎకరాల్లో మూడేళ్ల క్రితం బత్తాయి మొక్కలు నాటారు. అందులో అంతరపంటగా సాగు చేస్తున్న పత్తి ప్రస్తుతం కోతకు వచ్చింది. గతంలో వేరుశనగ తదితర ఆహార పంటలనే వేసే వారమని, అడవి పందుల బాధ పడలేక పత్తి వేశామని ఆమె తెలిపారు. ఆగస్టు ఆఖరుకు పత్తి తీత పూర్తవుతుంది. సగటున చెట్టుకు 35 కాయలు వచ్చాయి. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ రెండెకరాల్లో పత్తికి ముందు పెసర, మినుము సాగు చేశారు. మరో రెండెకరాల్లో పూర్తిగా పత్తి సాగు చేస్తున్నారు. 4 ఎకరాలను బొప్పాయి నాటడానికి సిద్ధం చేశారు. ఊరికి ఆనుకొని ఉన్న ఎకరంలో 32 రకాల కూరగాయలను ఇటీవలే విత్తామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సిఎస్ఎ క్షేత్ర సిబ్బంది తోడ్పాటుతో ఏ పంటైనా సేంద్రియంగానే సాగు చేస్తుండటం విశేషం. మూడేళ్లకోసారి దిబ్బ ఎరువు వేస్తారు. ప్రతి ఏటా టైప్ 2 ఘనజీవామృతం, వేపపిండి, కానుగ పిండి ఎరువుగా వేస్తున్నారు. అవసరాన్ని బట్టి ద్రవ జీవామృతం, దశపర్ణి కషాయం, వేపనూనె పిచికారీ చేస్తున్నారు. గుంటక, సైకిల్ వీడర్తో కలుపు సమస్యను కొంత మేరకు అధిగమిస్తున్నారు. ఈ 9 ఎకరాలు మెయిన్ కేసీ కెనాల్కు దగ్గర్లో ఉండటంతో భూగర్భ జలానికి కొదువ లేవు. ఒకే బోరుతో నీటిని తోడుతూ భూగర్భ పైపు లైను ద్వారా నాలుగు పొలాల్లోని పంటలకు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. పెసర, మినుము, ధనియాలు, వాము, ఆవాలు, పత్తి, కంది, వేరుశనగ, గోధుమ తదితర పంటలు సీజన్కు అనుగుణంగా సాగు చేస్తున్నారు. సేంద్రియంగానే సంతృప్తికరమైన దిగుబడులు తీస్తున్నామని మల్లేశ్వరమ్మ వివరించారు. 48 మందికి సేంద్రియ సర్టిఫికేషన్ శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘంలో దాదాపు 11 గ్రామాలకు చెందిన 301 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 48 మంది సేంద్రియ సేద్యం చేస్తున్నారు. మల్లేశ్వరమ్మ సహా పది మంది ఎన్పిఓపి థర్డ్పార్టీ సేంద్రియ సర్టిఫికేషన్ పొందారు. విదేశాలకూ ఎగుమతి చేయొచ్చు. మరో 40 మంది పీజీఎస్ సర్టిఫికేషన్ పొందారు. రైతులకు విత్తనాలు తదితర ఉత్పాదకాలను తెప్పించి తక్కువ ధరకు సొసైటీ అందిస్తుంది. దీనితో పాటు కొర్రలు, అండుకొర్రలు, వేరుశనగలు, తెల్లజొన్న, గోధుమలు, ధనియాలు, కందులు, పెసలను సుమారు 15 క్వింటాళ్ల వరకు సభ్య రైతుల నుంచి కొనుగోలు చేసి సొసైటీ నిల్వ చేసి, ఏడాది పొడవునా శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి రుణం తీసుకోకుండా సొసైటీ సొంత డబ్బుతోనే పరిమితంగా కొంటున్నామన్నారు. మల్లేశ్వరమ్మ తన సొంత ఇంటిలోనే కొన్ని గదులను కేటాయించి సొసైటీ ముడి ధాన్యాలను నిల్వ చేశారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను మరపట్టే యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. డిమాండ్ మేరకు ధాన్యాలను శుద్ధి చేయించి సరసమైన ధరకు విక్రయిస్తున్నారు. కందులను సంప్రదాయ పద్ధతుల్లో పప్పుగా తయారు చేస్తున్నారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా పురుగు సమస్య ఉండదని తెలిపారు. ఇరుగు పొరుగు గ్రామాల వాళ్లు కూడా వచ్చి కొనుక్కెళ్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఉన్న కొందరికి కూడా పంపుతున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సోలార్ డ్రయ్యర్లతో ఒరుగులు, పొడులు టొమాటోలు, నిమ్మకాయల వంటి పంటలకు మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి, సోలార్ డ్రయ్యర్ల ద్వారా ఒరుగులు తయారు చేసి విక్రయించడం ఈ సొసైటీ చేస్తున్న మరో మంచి పని. రహేజా సోలార్ స్టార్టప్ సంస్థ 3 టన్నుల సామర్థ్యం గల 6 సోలార్ డ్రయ్యర్లను ఈ సొసైటీకి సిఎస్ఎ ద్వారా 80% సబ్సిడీపై 5 నెలల క్రితం అందించింది. గతంలో టొమాటో ఒరుగులు తయారు చేసి కిలో రూ. 340కి అమ్మినట్లు మల్లేశ్వరమ్మ తెలిపారు. 20 కిలోల టొమాటోలను ఎండబెడితే కిలో ఒరుగులు వస్తాయి. రెండోరకం టొమాటోలు కిలో రూ. 8 చొప్పున కొని ఎండబెట్టి రహేజా సంస్థకే అమ్మామని తెలిపారు. ఇప్పుడు నిమ్మకాయల ఒరుగులు చేస్తున్నారు. 11 కిలోలకు 1 కిలో ఒరుగులు వస్తున్నాయి. ధర రూ.340కి అమ్ముతున్నారు. కరివేపాకు, మునగాకులను సైతం ఈ డ్రయ్యర్లలో ఎండబెట్టి పొడులను ఆర్డర్లపై సరఫరా చేస్తున్నామని ఆమె వివరించారు. సొసైటీ పనులు చేసే మహిళా సభ్యులకు వేతనానికి అదనంగా రోజుకు రూ. 5లను వారి పేరున భవిష్యనిధిగా జమ చేస్తున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. ఈ మహిళా రైతుల సహకార సంఘం సేవలు మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలని ఆశిద్దాం. మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి ఉంది పజలకు ఆదాయం ఉంది, డబ్బుంది. కానీ, మంచి ఫుడ్డు లేదు. ఈ ఆలోచనతోనే సేంద్రియ ఆహారాన్ని పండించి అందించాలన్న ఆలోచన వచ్చింది. రసాయనాల్లేకుండా పండించిన రాగి సంగటి, కొర్రన్నం, సింగిల్ పాలిష్ బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు ఇంటిల్లపాదీ తింటున్నాం. దీని వల్ల మా ఆరోగ్యం ఎంతో బాగుంది. మా ఊళ్లో వాళ్లు 60% మా దగ్గర కొంటారు. బెంగళూరు, హైదరాబాద్లలో 18 కుటుంబాలకు కూడా పార్శిల్ ద్వారా పంపుతున్నాం. మా కుటుంబానికి, ప్రజలకు కూడా మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి చాలా ఉంది. ఈ కీర్తి చాలు. – వడ్డెమాని మల్లేశ్వరమ్మ (62815 06734), అధ్యక్షులు, శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం, ముసలిరెడ్డిగారిపల్లి, వేంపల్లె మం., వైఎస్సార్ కడప జిల్లా. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
సేంద్రియ వ్యవసాయంతో రైతులకు కాసుల వర్షం
-
సేంద్రియ పంటలతో ఆరోగ్యంతో పాటు ఆదాయ మార్గం
-
ఏడాదికి మూడు పంటలు పండిస్తూ మంచి లాభాలు
-
సెమీ ఆర్గానిక్ పద్ధతిలో బంగినపల్లి మామిడి ... లక్షల్లో ఆదాయం
-
అధిక ఎరువులు వాడితే అనర్థమే
నవాబుపేట: రసాయన ఎరువులు అధికంగా వాడితే అనర్థమే అని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా దిగుబడి తగ్గి, పెట్టుబడులు పెరుగుతాయని అంటున్నారు. సాధారణంగా నేల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులు వాడాలి. కానీ రైతులంతా ఒకే రకమైన ఎరువులను వినియోగిస్తున్నారు. వరి సాగులో ఎకరాకు 50కేజీల డీఏపీ, 100 కేజీల యూరియా వాడాలి. కానీ రైతులు ఎకరాకు రెండు బస్తాలకు తగ్గకుండా డీఏపీ వేస్తున్నారు. పైరు నాటే సమయంలో బస్తాకు అదనంగా 25 కేజీల పొటాష్ను కలిపి వేయాల్సి ఉన్నా రైతులు వేయడం లేదు. వరికి యూరియాను నాలుగు సార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల చొప్పున వాడాలి. పొట్టదశలో యూరియాకు 25 కేజీల పొటాష్ను కలిపి వాడాలి. అయితే రైతులు చాలా వరకు నాటిన 20 రోజులకు 50 కేజీలు, మధ్యలో 50 కేజీలు వాడుతున్నారు. ఇక పత్తి పంట విషయానికి వస్తే విత్తేకంటే ముందే ఎకరాకు మూడు నాలుగు అంగుళాల లోతున పడేలా 50 కేజీల డీఏపీ వాడాలి. అయితే వర్షాధారంగా సాగు చేసే పంటల్లో విత్తనాలు మొలుస్తాయో లేదోనని పత్తి విత్తేటప్పుడు ఎరువులు వేయడం లేదు. కనీసం 25సెం.మీ. లోతులో భూమిలో పదును ఉండేలా వర్షం పడినప్పుడు ఎరువుతో పాటు పత్తి గింజలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. పత్తితో పాటు అన్ని ఖరీఫ్ పంటలకు 50 కేజీల వరకు మాత్రమే డీఏపీ వాడాలి. అయితే రైతులు పైరు ఎదుగుదల దశలో రెండు మూడు బస్తాలు వరకు డీఏపీని పై పాటుగా చల్లుతున్నారు. దీని వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పోషకాలు ఉన్న కాంప్లెక్స్ ఎరువులు రెండు బస్తాలు వాడితే సరిపోతుంది. అధిక భాస్వరంతో నష్టం అధిక మోతాదులో భాస్వరం వాడడం వల్ల దిగుబడులపై క్రమంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలి రెండేళ్ల పాటు దిగుబడులు బాగా వచ్చినా ఆ తర్వాత ఎరువులు వాడినా దిగుబడులు రానంతగా నేల దెబ్బతింటుంది. భాస్వరం భూమి లోపలి పొరల్లో నిల్వ ఉండి నేల గట్టిగా మారి పంటలకు నష్టం కలిగిస్తుంది. సమతూల్యత ఏది? ప్రతి మొక్కకూ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం. రైతులు అవగాహన లోపంతో కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల్లో ఉండని పోషకాలను అదనంగా చేర్చి వాడాల్సిన విషయం రైతులకు తెలియదు. ఉదాహరణకు 28 – 28 – 0, డీఏపీలోను పొటాష్ ఉండదు. ఈ ఎరువులు వినియోగించినప్పుడు పైరు ఎదుగుదల దశలో పైపాటుగా యూరియాను వాడాలి. దుక్కిలో కాంప్లెక్స్ ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నా పైపాటుగా కూడా వాడుతుండడంతో ఎరువుల్లో పోషకాలు సరిగ్గా మొక్కకు చేరక వృథా అవుతున్నాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని రైతులు గుర్తించకపోవడంతో పంటల్లో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. సేంద్రియ ఎరువులు తప్పని సరి రైతులు రసాయన, సేంద్రియ ఎరువులు సగం మోతాదులో వాడాల్సి ఉంది. కేవలం రసాయన ఎరువులే వాడటం వల్ల భూ సారం తగ్గిపోయి నిస్సారంగా మారుతుంది. మొదట్లో బాగానే దిగుబడులు వచ్చినా క్రమంగా భూ సారం తగ్గి దిగుబడులు రావు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల బరువు నేలలు గుళ్ల బారి వేర్లు చక్కగా పెరగటానికి సహాయపడుతుంది. అవగాహన కల్పిస్తున్నాం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మోతాదుకు మించి ఎరువులు వాడడం వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తున్నాం. ఏ పంటకు ఏ సమయంలో ఎంత ఎరువు వాడాలి అనేది తెలిస్తే పంట దిగుబడిలో ప్రయోజనం కనిపిస్తుంది. ఆ దిశగా రైతులకు సూచనలు ఇస్తున్నాం. అంతేకాకుండా భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నాం. – ప్రసన్నలక్ష్మి, ఏఓ -
జీరో బడ్జెట్ ఆర్గానిక్ వ్యవసాయం ... లక్షల్లో ఆదాయం
-
తూములూరు రుచులు ఊరు
మొదట అక్కడ సేంద్రియ వ్యవసాయం మొదలైంది. తర్వాత స్త్రీలు సేంద్రియ తినుబండారాలు మొదలుపెట్టారు. రేకుల షెడ్డే వారి వంటశాల. అరవై పైబడిన బసవ పూర్ణమ్మ వారి మేస్త్రి. రాగి లడ్డు, జొన్నలడ్డు, నల్ల అరిసెలు, నువ్వుండలు... ఆ కారం... ఈ పచ్చడి... ఎక్కడా రసాయనాల ప్రస్తావన ఉండదు. ఆముదం, కాటుక, కుంకుమ కూడా తయారు చేస్తున్నారు. వీరికి ఆర్డర్లు భారీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న ఊరు స్త్రీల వల్ల కరకరలాడుతోంది. కళకళలాడుతోంది. 2018లో మొదలైంది ఈ కథ. ‘అమ్మా... మేము పండిస్తున్న సేంద్రియ పంటలకు మంచి డిమాండ్ వస్తోంది. కాని ఇవే సేంద్రియ పదార్థాలతో చిరుతిండ్లు చేయించి అమ్మమని అందరూ అడుగుతున్నారు. నువ్వు తయారు చేస్తావా?’ అని అడిగాడు అవుతు వెంకటేశ్వర రెడ్డి తన తల్లి బసవ పూర్ణమ్మతో. ఆమెకు పల్లెటూరి పిండి వంటలు చేయడం వచ్చు. పండగలకు పబ్బాలకు పల్లెల్లో ఎవరు మాత్రం చేయరు? ‘అదెంత పనిరా చేస్తాను’ అంది. అలా గుంటూరు జిల్లాలోని కొల్లిపరకు ఆనుకుని ఉండే తూములూరు అనే ఊళ్లో సేంద్రియ చిరుతిళ్ల తయారీ మొదలైంది. బసవ పూర్ణమ్మ ఇంటిలో వేపచెట్టు కింద ఉండే పశువుల కొట్టాం కాస్తా వంటల షెడ్డుగా మారింది. ఊళ్లో వంటలు చేయడం ఆసక్తి ఉన్న స్త్రీలకు ఇదొక ఉపాధిగా ఉంటుందని వారిని తోడుకమ్మని ఆహ్వానించింది బసవ పూర్ణమ్మ. అలా ‘విలేజ్ మాల్’ అనే బ్రాండ్తో ‘కొల్లిపర మండల వ్యవసాయదారుల సంఘం’ అనే లేబుల్ కింద తూములూరు చిరుతిండ్ల తయారీ మొదలైంది. రసాయనాలు లేని తిండి ‘మా అబ్బాయీ, ఇంకొంత మంది రైతులు 2015 నుంచి కొల్లిపర చుట్టుపక్కల ఊళ్లలో సేంద్రియ పద్ధతిలో వరి, పసుపు,అరటి, నిమ్మ పండించడం మొదలుపెట్టారు. వీళ్లకు ‘గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం’ అనే సంఘం ఉంది. రైతులంతా కలిసి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటూ పంటను మంచి రేటుకు అమ్ముతున్నారు. ఆ సమయంలోనే మార్కెట్లో కల్తీ నూనెలతో, పిండ్లతో తయారై వస్తున్న పిండి వంటలు తినలేక సేంద్రియ పిండివంటల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మా అబ్బాయి ప్రోత్సాహంతో రంగంలోకి దిగాను. మొదట వేరుశనగ ఉండలు చేశాం. నిడదవోలు, మాండ్య లాంటి చోట్ల నుంచి సేంద్రియ బెల్లం తెప్పించి చేశాం. రుచి భలే ఉండటంతో డిమాండ్ వచ్చింది. అలా ఒక్కోటి పెంచుకుంటూ వెళ్లాం. ఇవాళ 30 రకాల చిరుతిళ్లు తయారు చేస్తున్నాం’ అని చెప్పింది బసవపూర్ణమ్మ. రాగిలడ్డు, జొన్న లడ్డు, నల్లబియ్యం అరిసెలు, నువ్వుండలు, పప్పుండలు, జంతికలు, కొబ్బరి లడ్డు, చెక్కలు ఇవి కాకుండా కరివేపాకు కారం, మునగాకు కారం వీరు తయారు చేస్తున్నారు. ఇక మామిడి, గోంగూర పచ్చడి గుంటూరు జిల్లా ప్రత్యేకం. అవీ చేస్తున్నారు. ‘సేంద్రియ నూనె పేరుతో అమ్ముతున్న నూనెలు కూడా కరెక్ట్గా లేవు. చాలా నూనెలు ట్రై చేసి రాజస్థాన్లో ఒక చోట నుంచి మంచి సేంద్రియ నూనె తెప్పించి ఈ పిండివంటలకు వాడుతున్నాం’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. ఆమె అజమాయిషీలో సాగే వంటశాలకు వెళితే చెట్టు కింద కట్టెలపొయ్యి మీద ఆముదం గింజలు కుతకుత ఉడికిస్తుంటారు కొందరు. వరండాలో జీడిపాకం ఆరబెట్టి, ఉండలు చుడుతుంటారు కొందరు. చిరుధాన్యాలతో లడ్డూలు, నల్లబియ్యంతో అరిసెలు చేస్తారు మరికొందరు. అంతా కళకళగా ఉంటుంది. ఆముదం, కుంకుమ ‘మార్కెట్లో సిసలైన ఆముదం దొరకడం లేదు. మా చిన్నప్పుడు ఎవరి ఆముదం వారే తయారు చేసుకునేవాళ్లం. అందుకనే ఆముదం కూడా తయారు చేస్తున్నా. లీటరు 800 పెట్టినా ఎగరేసుకుని పోతున్నారు. పసుపు నుంచి కుంకుమ తయారు చేసే పద్ధతి ఉంది. అలా స్వచ్ఛమైన కుంకుమ తయారు చేస్తున్నా. ఆముదం గింజల నుంచే కాటుక తయారు చేయవచ్చు. అదీ చేస్తున్నా. మా చిరుతిండ్ల కంటే వీటిని ఎక్కువమంది మెచ్చుకుని కొనుక్కుంటున్నారు’ అని తెలిపింది బసవపూర్ణమ్మ. ఈ మొత్తం పనిలో పదిహేను మంది ప్రత్యక్షంగా మరో పదిహేనుమంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కోటి టర్నోవర్కు... వచ్చే మార్చికంతా కోటి టర్నోవర్కు ఈ పిండి వంటల పరిశ్రమ చేరుకోవచ్చని అంచనా. తూములూరు పిండి వంటలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా కేంద్రాల్లో అమ్ముడుపోతున్నాయి. కొందరు సరుకు తీసుకుని తమ బ్రాండ్ వేసుకుని అమ్ముకుంటున్నారు. సరుకు రవాణ మొత్తం ఆర్.టి.సి. కార్గొ మీద ఆధారపడటం విశేషం. గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల సంఘం నగరాల్లో నిర్వహించే ప్రదర్శనల్లో తూములూరు పిండివంటల స్టాల్ కచ్చితంగా ఉంటోంది. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నిర్వహించే సమావేశాలకూ ఈ పిండివంటలనే ఆర్డరు చేస్తున్నారు. ‘ఈ రోజుల్లో ఆడవాళ్లకు పిండివంటలు చేసుకోవటం కష్టమవుతోంది. దీనికితోడు రసాయన అవశేషాలు లేని ఆహారపదార్థాలు దొరకటం దుర్లభంగా తయారైంది. అందుకే మాకు డిమాండ్ వస్తోంది. మరింతమంది రైతులను కలుపుకుని సేంద్రియ పంటలతో పిండివంటలను పరిశ్రమ స్థాయికి చేర్చాలనే ఆలోచన సంఘ సభ్యుల్లో ఉంది. అప్పుడు మా వంటశాలను విస్తరించాల్సి వస్తుంది’ అని తెలిపింది బసవ పూర్ణమ్మ. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
ఆర్గానిక్ మహోత్సవ్ అదిరింది
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్గానిక్ మహోత్సవ్లో రూ.140 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు నగరంలోని గాదిరాజు ప్యాలెస్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ సంయుక్తంగా ఈ భారీ మేళాను నిర్వహించాయి. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్రంలో తొలిసారిగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ మేళాలో సేంద్రియ విధానంలో పండించిన వరి, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, బెల్లం, మామిడి పండ్లు, తేనె తదితర సేంద్రియ సహజ ఉత్పత్తులను 123 స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. ప్రత్యేకంగా ఒక ఆర్గానిక్ ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. సందర్శకులు వివిధ సేంద్రియ వంటకాలను ఆరగించి సంతృప్తి చెందారు. బహుళజాతి సంస్థల ప్రతినిధులు రాక దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు సింగపూర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, బహుళజాతి సంస్థల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు ప్రతినిధులు, చిరుధాన్యాల ఉత్పత్తి, సాగుదారులు, కొనుగోలుదారులు భారీగా హాజరయ్యారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై సెమినార్లు, వర్క్షాపులు నిర్వహించారు. ఈ మేళాకు మూడు రోజుల్లో 22 వేల మందికి పైగా సందర్శకులు వచ్చారు. 12కు పైగా సంస్థలు రైతుల తరఫున రైతు సాధికార సంస్థతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. వీటిలో బెంగళూరుకు చెందిన ఫలద ఆగ్రో ప్యూర్ అండ్ ష్యూర్ సంస్థ రూ.90 కోట్లు, సాగ్లిష్ హార్వెస్ట్ రూ.10 కోట్లు, సింగపూర్కు చెందిన జీఎన్ ఆర్గానిక్ రూ.10 కోట్లతో పాటు ఈ–మిల్లెట్స్, స్వచ్ఛ మిల్లెట్స్, బిగ్ బాస్కెట్, గాట్ కాటన్ తదితర సంస్థలు వెరసి రూ.140 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రకృతి వ్యవసాయ రైతులతో ప్రతినెలా ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకొచ్చాయి. జీవనశైలి వ్యాధులకు దూరంగా ఉండాలంటే జీవన విధానం మార్చాలనే ఇతివృత్తంతో సేంద్రియ పంటలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆర్గానిక్ మహోత్సవ్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆర్గానిక్ మేళాకు హాజరైన ఆయా సంస్థల ప్రతినిధులకు నిర్వాహకులు సరి్టఫికెట్లు అందజేశారని రైతు సాధికార సంస్థ సీనియర్ థిమాటిక్ లీడ్ ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రకృతి సాగే పరిష్కారం!
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలను ఆరోగ్యంగా ఉంచాలి. 98% ప్రాణవాయువును మొక్కలే ఇస్తున్నాయి. 80% ఆహారం పంటల ద్వారానే వస్తోంది. భూతాపోన్నతి కారణంగా విజృంభిస్తున్న పురుగులు, తెగుళ్ల వల్ల దిగుబడి 40% మేరకు దెబ్బతింటున్నది. ఈ నష్టం విలువ ఏడాదికి 22,000 కోట్ల డాలర్లని ఎఫ్.ఎ.ఓ. లెక్కగట్టింది. మన దేశంలో కత్తెర పురుగు, నల్ల తామర పురుగు, రుగోస్ తెల్లదోమ.. వంటివి ఇందుకు ఉదాహరణలు. అయితే, పొలాలు, పర్యావరణ వ్యవస్థలకున్న ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యంపై ఈ నష్టం తీవ్రత ఆధారపడి ఉంటుందని ఎఫ్.ఎ.ఓ. స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. సాగు పద్ధతి మార్చుకుంటే వీటి తీవ్రత తగ్గినట్లు ఏపీ రైతు సాధికార సంస్థ అధ్యయనంలో తేలింది. రసాయనిక వ్యవసాయంలో పురుగుల తీవ్రత, దిగుబడి నష్టం 50 శాతం పైగా ఉంటే.. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో 10% మాత్రమే. ప్రధాన పంట సాగుకు ముందు 30 రకాల పచ్చిరొట్ట (నవధాన్య) పంటలు సాగు చేసే రైతుల జీవవైవిధ్య క్షేత్రాల్లో ఒక్కో ఏడాది గడిచేకొద్దీ చీడపీడల బెడద అంతకంతకూ తగ్గుతోందని కూడా ఈ అధ్యయనం చెబుతోంది. ఈ నెల 12న ‘అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం. మన దేశంలో ఇటీవల సంవత్సరాల్లో పంటలకు పెను నష్టం కలుగజేస్తున్న కత్తెర పురుగు, నల్ల తామర పురుగు, రుగోస్ తెల్లదోమ.. వంటి పురుగులే ఇందుకు ఉదాహరణలు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు ఈ పురుగులు తీవ్ర నష్టం కలిగిస్తుండగా, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించే రైతుల పొలాల్లో ఈ పురుగుల తీవ్రత, నష్టం చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయాన్ని అమలుచేస్తున్న రైతు సాధికార సంస్థ అధ్యయన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 30 రకాల పచ్చిరొట్ట పంటలు వేసిన తర్వాత ఆహార/వాణిజ్య పంటలు సాగు చేయటంయటం వల్ల వాతావరణ మార్పులను, చీడపీడలను తట్టుకొని నిలబడి మంచి దిగుబడులను ఇచ్చే శక్తి ప్రకృతి సేద్య క్షేత్రాలకు పెరుగుతున్నట్లు అర్థం అవుతున్నది. రైతులు వచ్చే ఖరీఫ్లో సాగు చేసే ప్రధాన పంటకు చీడపీడల బెడద తక్కువగా ఉండాలన్నా, భూసారం పెరగాలన్నా.. ఇప్పుడే పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలి. ఏ జనుమో, జీలుగో వేస్తే చాలదు.. ముప్పై పంటల విత్తనాలను చల్లేయాలి అంటున్నది ఏపీ రైతు సాధికార సంస్థ. మిత్ర పురుగులే రైతుల సైన్యం ప్రకృతి సేద్యం దిగుబడి సాధించటంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు కూడా నెరవేరుతున్నాయి. జీవవైవిధ్యం. ఒకే పంట వేయటం కాదు. అనేక పంటలు కలిపి సాగు చేయటం అనేది ప్రకృతి సేద్యంలో ఓ ముఖ్యమైన మూలసూత్రం. బహుళ పంటలు ఉన్న పొలంలో పురుగులు గానీ, తెగుళ్లుగానీ అదుపులో ఉంటాయి. రకరకాల పంటలున్న చేనులో అనేక రకాల మిత్ర పురుగులు మనుగడ సాధ్యపడుతుంది. రసాయనిక పురుగుమందులు వాడే పొలాల్లో శత్రు పురుగులతో పాటు ఈ మిత్ర పురుగులు కూడా నాశనమవుతాయి. కాబట్టి, చీడపీడలు ఉధృతం అవుతున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో మిత్ర పురుగులే రైతుల సైన్యం. ప్రకృతి సేద్యం చేయటంతోపాటు.. ఏడాది పొడవునా ఇటువంటి బహుళ పంటలతో భూమిని కప్పి ఉంచితే (365 డేస్ గ్రీన్ కవర్) ఇంకా మంచిది. ఈ పద్ధతులు పాటించే ప్రకృతి సేద్య క్షేత్రాల్లో చీడపీడల సమస్య చాలా తక్కువగా కనిపిస్తోందని ఏపీ రైతు సాధికార సంస్థ తెలిపింది. ముఖ్యంగా, కత్తెర పురుగు, నల్లతామర వంటి పురుగుల విషయంలో ఇది ప్రస్ఫుటంగా నమోదైంది. 90% తగ్గిన కత్తెర పురుగు విజయనగరం, ప.గో., గుంటూరు జిల్లాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్న 49 ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, మరో 49 రసాయనిక వ్యవసాయ క్షేత్రాల్లో కత్తెర పురుగు తీవ్రతపై ఏపీ రైతు సాధికార సంస్థ అధ్యయనం చేసింది. కత్తెర పురుగు తీవ్రత పురుగుమందులు చల్లిన పొలాల్లో 5% మాత్రమే తగ్గితే, ప్రకృతి సేద్య పొలాల్లో 90% తగ్గిందని ఈ అధ్యయనంలో తేలింది. నల్ల తామర: ఇక్కడ 9.87% అక్కడ 57% లక్షల ఎకరాల్లో మిరప పంటకు గతంలో నష్టం కలిగింది. రసాయనిక పురుగుమందులు ఎన్ని వాడినా నల్లతామర తగ్గలేదు. కానీ ప్రకృతి వ్యవసాయంలో నియంత్రణలోకి వచ్చింది. ఏపీ రైతుసాధికార సంస్థ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని 70 ప్రకృతి వ్యవసాయ మిరప తోటల్లో, 73 రసాయనిక మిరప తోటల్లో అధ్యయనం చేసింది. నల్లతామర కలిగించిన నష్టం ప్రకృతి సేద్య మిరప పొలాల్లో 9.87% కాగా, రసాయనిక మిరప పొలాల్లో 57.53% వరకు ఉందని గుర్తించారు. ప్రకృతిసేద్యం చేస్తున్న మిరప పొలాల్లో అక్షింతల పురుగులు, క్రైసోపెర్ల అనే రెక్కల పురుగులు వంటి మిత్ర పురుగులు విస్తారంగా నల్లతామర పురుగుల్ని తింటూ నియంత్రించినట్లు కనుగొన్నారు. రసాయనిక పురుగుమందులు చల్లే మిరప పొలాల్లో ఇవి కనిపించలేదు. పంటలకొద్దీ మిత్రపురుగులు పీఎండీఎస్లో నవధాన్య పంటలుగా ఎన్ని ఎక్కువ పంటలు సాగు చేస్తే ఆ తర్వాత సీజన్లో మిత్రపురుగుల సంఖ్య ఎక్కువగా ఉండి చీడపీడల బెడద తగ్గినట్లు రైతు సాధికార సంస్థ గుర్తించింది. వేర్వేరు జిల్లాల్లో కొన్ని పొలాల్లో 27 రకాలు, మరికొన్ని పొలాల్లో 19 రకాలు, ఇంకొన్ని పొలాల్లో 9 రకాల నవధాన్య పంటలను సాగు చేయించారు. 9,19 రకాలు సాగు చేసిన పొలాల్లో కన్నా 27 రకాలు సాగు చేసిన పొలాల్లో మిత్ర పురుగుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఎన్ని ఎక్కువ పంటలు సాగు చేస్తే అన్ని ఎక్కువ మిత్రపురుగులుంటాయి. పీఎండీఎస్తో తగ్గుతున్న చీడపీడల తీవ్రత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా వానకు ముందే 30 రకాల ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు తదితర పంటల విత్తనాలను (ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్– పీఎండీఎస్) వానకు ముందే విత్తితే.. భూమి సారవంతం అవుతుంది. భూమి తేమగా ఉంటే నేరుగా విత్తనాలు వేస్తున్నారు. తేమ లేకపోతే విత్తనాలకు మట్టి, ఘనజీవామృతం తదితరాలను పట్టించి ‘విత్తన గుళికలు’ (సీడ్ పెల్లెట్స్) తయారు చేసి వేసవిలోనే వానకు ముందే విత్తుతున్నారు. ఇది ఏపీలో ముఖ్యంగా అనంతపురం జిల్లా కేంద్రంగా ప్రకృతి వ్యవసాయదారులు అనుసరిస్తున్న వినూత్న ఆవిష్కరణ. ఈ ఏడాది ఇతర జిల్లాల్లో కూడా ఈ పద్ధతిని రైతులకు ఆర్బీకేల ద్వారా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు పరిచయం చేస్తున్నారు. వరుసగా రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు వేసవిలో 30 రకాల పీఎండీఎస్ పంటలు పండించిన పొలాల్లో ఆ తర్వాత సీజన్లో సాగు చేసిన 123 క్షేత్రాల్లో చీడపీడల బెడదపై అధ్యయనం చేశారు. మూడేళ్లుగా వేసవిలో పీఎండీఎస్ పంటలు సాగు చేసిన పొలాల్లో అన్ని రకాల చీడపీడల బెడద రసాయనిక పొలాలతో పోల్చినప్పుడు 66 శాతం తగ్గిపోయినట్లు గుర్తించటం విశేషం. రైతు దేవుళ్ల చేతుల్లోనే భవిత! 50–60 ఏళ్ల విషపూరిత వ్యవసాయం వల్ల మన భూములు, వాతావరణం, గాలి, నీరు నాశనమయ్యాయి. క్లైమెట్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరో ప్రళయం రాబోతోంది. పోషకార/ఆహార భద్రతకూ ముప్పు రానుంది. దీని నుంచి రక్షించగల శక్తి ఒక్క రైతు చేతులోనే ఉంది. రసాయనిక వ్యవసాయం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు యావత్తు భూగోళాన్ని చల్లబరిచే శక్తి కూడా ప్రకృతి/పునరజ్జీవ వ్యవసాయానికి ఉంది. రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేయటంతో పాటు.. 30 రకాల నవధాన్య (పీఎండీఎస్) పంటల సాగును వేసవిలో, పంట సీజన్లకు మధ్యలో ప్రతి పొలంలోనూ సాగు చేయాలి. ఇన్ని పంటలు ఎందుకంటే ప్రతి పంట మొక్క వేర్ల దగ్గర వేర్వేరు రకాల మేలు చేసే సూక్ష్మజీవరాశి పెరుగుతోంది. ఎన్ని ఎక్కువ పంటలు వేస్తే అన్ని ఎక్కువ రకాల సూక్ష్మజీవరాశి తిరిగి భూమిలోకి చేరుతున్నది. మట్టిలో సూక్ష్మజీవుల వైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటే మన భూమి అంత సారవంతమవుతోంది. అంత శక్తివంతమవుతోంది. అంతగా చీడపీడల బెడద తగ్గుతుంది. కరువును, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడి 20–30% అధిక దిగుబడులు వస్తున్నాయి. ప్రతి పొలంలో పీఎండీఎస్ పంటలు సాగు చేయాలి. వాన నీరు పూర్తిగా పొలాల్లో ఎక్కడికక్కడే పూర్తిగా ఇంకుతుంది. ఇది అనంతపురం రైతు దేవుళ్ల అద్భుత ఆవిష్కరణ. ఈ ఏడాది ఏపీలో ఇతర జిల్లాల్లో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. 10 వేల మంది రైతులను మాస్టర్ ట్రైనర్లుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. అనేక ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి. – టి. విజయకుమార్, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ చిరుధాన్యాల శుద్ధి, విలువ జోడింపు, మార్కెటింగ్పై ఈ నెల 18–19 తేదీల్లో పులివెందులలోని ఫుడ్సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఆవరణలో ఔత్సాహికులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఐఐపిఎం) శిక్షణ ఇవ్వనుందని లైవ్లిహుడ్ ఇంక్యుబేషన్ సెంటర్ కోర్సు డైరెక్టర్ డా. నబీరసూల్ తెలిపారు. ఎఫ్.పి.ఓలు, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, చిరుధాన్యాల వ్యాపారులు, గ్రామీణ యువతకు ఇది ఉపయోగకరం. భోజన వసతి సదుపాయాలు ఉన్నాయి. ఫీజు రూ. 5 వేలు. వివరాలకు.. డా. నబీరసూల్ – 630297 72210 -పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Advertisement