ఈ ఏడాది (2022) మే 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం (మొతేరా) వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన ఆ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 1,01,566 మంది హాజరయ్యారు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్కు ఈ స్థాయిలో ప్రేక్షకులు హాజరుకావడం అదే తొలిసారి. దీంతో ఐపీఎల్-2022 సీజన్ ఫైనల్ మ్యాచ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించింది.
A proud moment for everyone as India creates the Guinness World Record. This one is for all our fans for their unmatched passion and unwavering support. Congratulations to @GCAMotera and @IPLpic.twitter.com/PPhalj4yjI
ఈ విషయాన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఇవాళ (నవంబర్ 27) వెల్లడించింది. బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధి నుంచి అవార్డు ప్రతిని అందుకున్న దృష్యాన్ని షేర్ చేసింది. భారతీయులకు ఇదో గర్వించదగ్గ క్షణం. భారత్.. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఇది మా అభిమానులకు అంకితం.. మొతేరా, ఐపీఎల్కు అభినందనలు అంటూ బీసీసీఐ ట్విటర్లో రాసుకొచ్చింది.
ఇదిలా ఉంటే, నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. ఆడిన తొలి లీగ్లోనే అండర్ డాగ్గా బరిలోకి దిగిన హార్ధిక్ సేన ఛాంపియన్గా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగా, గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజేతగా ఆవిర్భవించింది. ఈ మ్యాచ్లో 3 వికెట్లు పడగొట్టి, 30 బంతుల్లో 34 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.