-
సెల్ఫోన్ కోసం అక్కాచెల్లెళ్ల గొడవ
దుబ్బాక టౌన్: అక్కాచెల్లెళ్ల మధ్య సెల్ ఫోన్ చిచ్చు రాజేసింది. ఫోన్కోసం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా, చెల్లెలు క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మర్గల శంకర్, వసంత దంపతులకు ముగ్గురు కూతుర్లున్నారు. రెండో కుమార్తె నందిని డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. చిన్న కుమార్తె నవిత అలి యాస్ నవ్య (18) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. గురువారం ఉదయం ఇద్దరూ సెల్ఫోన్ విషయమై గొడవ పడ్డారు. ఇది గమనించిన తల్లి, వారిని మందలించి ఫోన్ ను బీరువాలో పెట్టి తాళం వేసి పని కోసం వెళ్లింది. దీంతో అప్పటికే ఆవేశంలో ఉన్న నవిత గడ్డిమందు తాగింది. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన నందిని, చెల్లి అపస్మరక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు చేరుకున్నా రు. వెంటనే నవితను దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం సిద్దిపేట హాస్పిటల్కు, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున నవ్య మృతిచెందింది. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మీ సెల్ఫోన్ పోగొట్టుకున్నారా? ఇలా చేస్తే ఎక్కడున్నా దొరికేస్తుంది
సాక్షి, భీమవరం: సెల్ఫోన్ పోగొట్టుకుంటే వర్రీ కాకండి. ఫోన్ కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీసులకు వాట్సాప్ మేసేజ్ ద్వారా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజుల్లోనే పైసా ఖర్చులేకుండా మీ చెంతకు చేరుతుంది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సెల్ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోగొట్టుకున్న సెల్ఫోన్ను ఎవరైనా, ఎంత దూరంలో వినియోగిస్తున్నా సులభంగా కనిపెడుతున్నారు. వాటిని రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,400 సెల్ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందగా సుమారు రూ.1.20 కోట్ల విలువైన 801 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కొందరే పోలీస్స్టేషన్లకు.. ప్రస్తుతం సెల్ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగింది. వీటి ఖరీదు అధికంగా ఉంది. సెల్ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఖరీదైన ఫోన్ పోయిందనే బాధతోపాటు ఫోన్లో నిక్షిప్తమైన ఫోన్ నంబర్లు, సమాచారం పొందడం కష్టంగా మారింది. దీంతో ఫోన్ పోగొట్టుకున్నవారు తన ఫోన్ ఎక్కడైనా పడిపోయిందా.. లేదా ఎవరైనా దొంగిలించారా అనే సందేహంతో సతమతమవుతుంటారు. దీనిపై కొందరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు మిన్నకుండి పోతున్నారు. దీంతో సెల్ఫోన్ దొరికిన వారు లేదా దొంగిలించిన వారు ఆ ఫోన్ తమదేనన్న ధీమాతో వినియోగించుకుంటున్నారు. వాట్సాప్కు మెసేజ్ చేస్తే.. సెల్ఫోన్ పొగొట్టుకున్నవారికి పోలీసు శాఖ మంచి అవకాశం కల్పించింది. పోగొట్టుకున్న ఫోన్ వివరాలను 9154966503 వాట్సాప్ నంబర్కు ‘హాయ్’ అనే మెసేజ్ చేస్తే చాట్బోట్ మెసేజింగ్ పద్ధతి ద్వారా ఒక లింక్ ఆటోమెటిక్గా వస్తుంది. ఆ లింక్ను ఓపెన్ చేసి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వివరాలతోపాటు ఫోన్ వివరాలను పొందుపరిస్తే సెల్ఫోన్ను గుర్తిస్తారు. దీనికిగాను జిల్లాలో ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక సెల్ఫోన్ ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో దిశా పోలీసు స్టేషన్కు సంబంధించిన ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐడీ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. బృంద సభ్యులు తమ రోజువారి విధి నిర్వహణతోపాటు ఫోన్ల రికవరీని కూడా చేస్తున్నారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లలో ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఫోన్లు కూడా ఉండటం విశేషం. నా ఫోన్ దొరికింది మోటారు సైకిల్పై భీమమరం నుంచి నిడదవోలు వెళ్తుండగా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించాడు. నిడదవోలు స్టేషన్లో కంప్లయింట్ చేశాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోన్ పోగా వెతికి పట్టుకుని జూన్లో అందజేశారు. పోయిన ఫోన్ దొరకడం ఆనందంగా ఉంది. – షేక్ బాషా, భీమవరం సెల్ఫోన్ ట్రాకింగ్ బృందం ద్వారా.. సెల్ఫోన్ దొరికితే పోలీసుస్టేషన్లలో అందజేయాలి. అక్రమంగా వినియోగించినా, ఆధారాలు లేకుండా కొనుగోలు చేసినా ఇబ్బందులు తప్పవు. జిల్లాలో సెల్ఫోన్ ట్రాకింగ్ బృందం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పటివరకు రూ.1,20,15,000 విలువైన 801 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఒకసారి ఫిర్యాదు చేసి మిన్నకుండి పోకూడదు. కొన్నిరోజుల తర్వాత మరలా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
కస్తూర్బాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
శాయం పేట: సెల్ఫోన్ దొంగతనం చేశారని తోటి విద్యార్థినులు అవమానించారని మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం సాయంత్రం జరిగింది. టీచర్లు వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గోవిందాపూర్ కేజీబీవీలో కల్పన, పూర్ణ పదో తరగతి చదువుతున్నారు. ఇందులో హనుమకొండకు చెందిన కల్పన, పూర్ణతో కలిసి మంగళవారం రాత్రి అటెండర్ సెల్ ఫోన్ తీసుకొని తల్లికి ఫోన్ చేసింది. తనకు ఆరోగ్యం బాగా లేదని, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. అదే సందర్భంగా తోటి విద్యార్థినులు గమనించి ‘దొంగ’‘దొంగ’.. అంటూ అవహేళన చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులు బుధవారం సాయంత్రం తమ వద్ద ఉన్న నెయిల్ పాలిష్ను తాగారు. గమనించిన టీచర్స్ వారిని వెంటనే పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారి ని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఆరోగ్యం మెరుగు పడటంతో గురువారం తల్లిదండ్రులు వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషలాఫీసర్ మాధవిని వివరణ కోరగా కల్పన, పూర్ణ తమ ఇళ్లకు వెళ్తామని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదని, ఆ బాధతోనే ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు. -
బైక్పై ఫోన్.. రింగ్ రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడ్డాడు..!
డ్రైవింగ్ చేస్తూ సెల్ఫోన్ మాట్లాడితే ప్రమాదాలు జరుగుతాయని అధికారులు హెచ్చరికలు చేస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కూడా ప్రమాదానికి సెల్ఫోనే కారణం.. కానీ ఇది పూర్తిగా విభిన్నం. ఏ వాహనం అతన్ని టచ్ చేయకుండానే బైక్పై నుంచి కిందపడ్డాడు. ఈ తీరు చూస్తే తప్పకుండా నవ్వు ఆపుకోలేరు. వీడియోలో చూపిన విధంగా.. ఫోన్ మాట్లాడుతూ ఓ వ్యక్తి బైక్ను నడుపుతున్నాడు. కూడలిలో సిగ్నల్ రావడంతో బైక్ను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఓ పక్క ఫోన్ను చెవి వద్ద పెట్టుకుని మరో పక్క బైక్ను అదుపు చేయలేక పోయాడు. రింగు రోడ్డుపై రౌండ్లు తిరుగుతూ కిందపడిపోయాడు. విచిత్రమేమంటే.. కిందపడిపోతున్నా.. అతను సెల్ఫోన్ విడవకపోవడం గమనార్హం. Important call ayy untadi 🏃♂️🏃♂️😂😂 pic.twitter.com/JHAJj5LQGj — Pakkinti Uncle (@Idly_Baba) July 18, 2023 ఈ వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాపం.. చాలా ముఖ్యమైన కాల్ అనుకుంటా.. కిందపడిపోతున్నా చెవి వద్ద ఫోన్ తీయకుండా మాట్లాడుతున్నాడంటూ కామెంట్లు పెట్టారు. ఇదీ చదవండి: Viral Video: అమ్మా! తల్లి ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో.. -
హైటెక్ కాపీయింగ్:సెల్ఫోన్తో గ్రూప్-4 పరీక్ష రాస్తూ పట్టుబడ్డ అభ్యర్థి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా శనివారం జరిగిన గ్రూప్-4 ఎగ్జామ్ సందర్భంగా ఓ అభ్యర్థి హైటెక్ కాపీయింగ్కు తెరలేపాడు. సెల్ఫోన్ను వెంట తెచ్చుకుని దాని సాయంతో ఎగ్జామ్ రాసేందుకు యత్నించి పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతినగర్లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన అరగంట అనంతరం ఒక అభ్యర్థి సెల్ ఫోన్తో హాజరైనట్లు గమనించిన ఇన్విజిలేటర్, అతని వద్ద గల సెల్ ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేశారని జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్ లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. -
అన్నీ మొబైల్లోనే.. ఆఖరికి కాపురాలు కూడా ఆన్లైన్లోనే!
మా ఊరు రాయికల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ( 1956-68) కే వీ రాజు గారుమా తెలుగు సారు. మంచి జోకులు వేస్తూ పాఠాలు చెప్పేవాడు కాబట్టి ఆయన క్లాస్ ఎప్పుడూ నిండుగా ఉండేది. 'పిచ్చి సన్నాసి' అన్నది ఆయనకు ఊతపదం. మీరు మా అందరినీ పిచ్చోళ్ళనే అంటున్నారు మాలో అసలు పిచ్చోడు ఎవడు సార్!అని అడిగాం ఒక రోజు. 'ఎవడైతే ఒంటరిగా కూర్చొని తనలో తాను నవ్వుకుంటూ, తనతో తాను మాట్లాడుకుంటాడో, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తాడో వాడేరా ఏక్ నెంబర్ పిచ్చోడు!' అన్నాడాయన. ఇది దాదాపు అరవై సంవత్సరాల నాటి విషయం. మా మాస్టారు చెప్పిన లక్షణాలనుబట్టి చూస్తే ఇప్పుడు అలాంటివాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి. రోడ్లమీద,బస్స్టాప్ ల దగ్గర,పార్కులు పబ్లిక్ స్థలాల్లో, కార్యాలయాల్లో ఇందుగలరందు లేరన్నట్లుగా ఎక్కడ చూసినా ఒంటరిగా పరిసరాలను, చేయాల్సిన పనులను కూడా మరిచిపోయి చెవి పుల్ల తగిలించుకొని, చూపుడు వెలుతో ప్రపంచాన్ని చుట్టేస్తూ తమలో తామే నవ్వుకుంటూ, తమతో తామే గంటలు గంటలు మాట్లాడుకుంటున్నట్లు కనబడే సెల్ ఫోన్ పిచ్చిగాళ్ళు విచ్చలవిడిగా కనబడుతున్నారు, ఎవరి పిచ్చి వారికానందం ! మొబైల్ వ్యసనంగా మారిన తర్వాత వచ్చిన దుష్పరిణామాలు 1. జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోయింది (గతంలో కనీసం 50 లాండ్లైన్ నెంబర్లు గుర్తుండేవి), ఇప్పుడు దేనికయినా కాంటాక్ట్స్లోకి వెళ్లి పేరు, ఫోటో చూసి నొక్కడమే. 2. మెదడుకు మేత అసలే లేదు ఇప్పుడు ఏదయినా మొబైలే. కాలిక్యులేటర్ మొబైల్లోనే, క్యాలెండర్ మొబైల్లోనే, పెయింట్, ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ AI సహకారంతోనే. అంటే నీ మెదడుకు పని చెప్పడమే లేదు. మేత వేయనప్పుడు.. మెదడు కూడా పని చేయడం మానేస్తుంది. 3. సృజనాత్మకత ప్రదర్శించే అవకాశమే లేదు మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలన్నది నాటి మాట. జీవితాల్లోకి మొబైల్ ఎంటరయ్యాక.. మరొకరిని చూసి ఫాలో కావడమే తప్ప మనలో జ్ఞానం వికసించేది చాలా తక్కువ. కోటిలో ఒకరు బాగుపడితే.. మిగతా అంతా దానికి బానిసలవుతున్నారు. 4. రుచిని గ్రహించే సమయం లేదు ఏం తింటున్నామన్నా స్పృహనే లేదు, తింటున్నంత సేపు చేతిలో మొబైల్, తల తీసుకెళ్లి స్క్రీన్లో పెట్టడమా. మన ముందున్న ప్లేట్లో ఏముంది, దాని రుచి ఏంటీ? అది ఎలా తినాలి? ఏం తెలియట్లేదు. నోట్లోకి నెట్టడం, కడుపులోకి కుక్కడం.. 5. సెల్కు జై, బంధుత్వాలకు బై బై గతంలో సెలవులు వస్తే.. ఊళ్లకు వెళ్లి బంధువులతో, మిత్రులతో గడిపేవాళ్లు. ఇప్పుడిది బాగా తగ్గింది. ఎవడి సెల్ వాడికి లోకం. సినిమాలు, క్రికెట్, చాటింగ్లు అన్నీ మొబైల్లోనే.. 6. సర్వం సెల్ మయం తినాలంటే మొబైల్లో ఆర్డర్, చదువుకోవాలంటే మొబైల్లో ఆన్లైన్ క్లాస్లు, ఆఫీస్ మీటింగ్లు మొబైల్లో వర్చువల్, ఇంకా రేపు స్పర్శ కూడా తెస్తారట. అప్పుడు కాపురాలు కూడా ఆన్లైన్లో ఉంటాయేమో. పోయేకాలం.. మొబైల్ రూపంలో దాపురిస్తే.. ఎవరేం చేయగలరు. కే వీ రాజు గారు పిచ్చి సన్నాసి అన్నది ప్రత్యేకంగా ఇప్పుడు ఒకరిని ఉద్దేశించే అవసరమే లేదు. వేముల ప్రభాకర్, హైదరాబాద్ -
సెల్ఫోన్ నిజామాబాద్లో పోయింది.. దుబాయ్లో దొరికింది!
మన జీవితంలో భాగంగా మారి పోయిన స్మార్ట్ ఫోన్ పోగొట్టుకుంటే మనం మొత్తం కోల్పోయినట్లే ఫీలవుతాం. అంతలా మనతో పాటే కలిసిపోయింది స్మార్ట్ ఫోన్. అటువంటి ఫోన్ను పోగొట్టుకుంటే మనశ్శాంతి కూడా ఉండదు.. ఫోన్ కనపడకపోయేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అవుతుంది. వందలాది కాంటాక్ట్ నంబర్లు, ముఖ్యమైన ఫొటోలు.. ముఖ్యమైన డేటా అంతా కూడా అందులోనే ఉండటంతో ప్రపంచమే ఆగిపోయినట్లు ఉంటుంది. అయితే ఇలా ఒక వ్యక్తి సెల్ఫోన్ను పోగొట్టుకున్నా తిరిగి దాన్ని సంపాదించుకుని ఊపిరి పీల్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో బాన్సువాడకు చెందిన వ్యక్తి తన సెల్ఫోన్ను పోగొట్టుకున్నాడు. ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు. ఫోన్ ఎక్కడిపోయిందో అనే విషయాన్ని గుర్తుకుతెచ్చుకున్నాడు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో పోయిందనే విషయాన్ని గ్రహించిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన నూతన టెక్నాలజీ ద్వారా ఆ ఫోన్ దుబాయ్లో ఉందని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్లో సెల్ఫోన్ పోతే అది దుబాయ్లో ఉందని కనుక్కోవడం వెనుక నూతన టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. అంతే ఆ సెల్ఫోన్ను దుబాయ్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఆ తర్వాత సదరు బాధితునికి డీఎస్సీ జైపాల్రెడ్డి.. ఆ సెల్ఫోన్ను అప్పగించారు. -
భయం.. తత్తరపాటు లేకుండా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్మెట్ హత్య కేసులో మృతుడు నవీన్ శరీర భాగాలు పోలీసులకు ఇంకా దొరకలేదు. హతుడి ఫోన్తో పాటు నిందితుడు హరిహరకృష్ణ సెల్ఫోన్లు సైతం ఇంకా స్వాదీనం చేసుకోలేదు. దీంతో తొలిరోజు కస్టడీలో నిందితుడు హరిని పోలీసులు ఆయా వివరాలను రాబట్టే కోణంలోనే విచారించారు. గత నెల ఫిబ్రవరి 17న ప్రేమించిన యువతి దూరమవుతుందనే అనుమానంతో మద్యం మత్తులో ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ను స్నేహితుడు హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్మెట్ శివారు ప్రాంతంలో గొంతు నులిమి హత్య చేసి.. అనంతరం మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు చేతి వేళ్లు, పెదాలు, గుండె, మర్మాంగాలను కోసి ముక్కలు చేశాడు. అనంతరం ఫిబ్రవరి 24న నిందితుడు హరి అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం నిందితుడిని ఈనెల 9వ వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు చర్లపల్లి జైలు నుంచి నిందితుడిని తరలించిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం విచారణ చేపట్టారు. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఎలాంటి భయం, తత్తరపాటు లేకుండా నిందితుడు సమాధానాలు ఇచ్ఛినట్లు తెలిసింది. హత్య కేసులో మరిన్ని ఆధారాలను రాబట్టేందుకు నిందితుడు హరిని హత్య జరిగిన ప్రాంతం అబ్దుల్లాపూర్మెట్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి సీన్–రీకన్స్ట్రక్షన్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్త సెల్ఫోన్తో ఠాణాకు.. హత్య తర్వాత హరి మరొక స్నేహితుడు హసన్ ఇంట్లో ఆ రోజు రాత్రి నిద్రించి మర్నాడు ఉదయం కోదాడ, విజయవాడ, విశాఖపట్నం మీదుగా తిరిగి.. సొంతూరైన వరంగల్కు చేరుకున్నాడు. తండ్రికి జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు లొంగిపోవాలని తండ్రి సూచించడంతో తిరిగి హైదరాబాద్కు వచ్ఛిన హరి.. ప్రేమికురాలిని కలిసి నవీన్ హత్య గురించి వివరించారు. ఆమె సూచన మేరకు ఫిబ్రవరి 24న అబ్దుల్లాపూర్మెట్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే అప్పటికే హరి వినియోగిస్తున్న సెల్ఫోన్ను ధ్వంసం చేసి.. కొత్త సెల్ఫోన్ తీసుకొని దాన్ని జేబులో పెట్టుకొని పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. ఈ సెల్ఫోన్నే పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో ఇది కొత్త ఫోన్ అని గుర్తించిన పోలీసులు.. హత్యకు ముందు సెల్ఫోన్ గురించి కస్టడీ విచారణలో పోలీసులు ఆరా తీయగా.. తాను వాడేది ఇదే ఫోన్ అని బుకాయించినట్లు తెలిసింది. -
మంత్రి ఎర్రబెల్లికి వింత అనుభూతి.. అసలేం జరిగిందంటే?
సాక్షి, వరంగల్: వెరైటీ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు వింత అనుభూతి ఎదురైంది. దేవుడి పెళ్లికి పోతే మొబైల్ ఫోన్ మాయమయ్యింది. కొద్దిసేపు అందరూ కంగారు పడ్డారు. కాసేపటికి భగవంతుడి మహిమతో దొరికిందని సంతోషపడ్డారు. జనగామ జిల్లా చిల్పూర్ గుట్ట శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ శ్రీధర్ రావుతో పాటు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేవుడి కల్యాణంలో పాల్గొని తిరిగి వెళ్తున్న క్రమంలో మంత్రి మొబైల్ ఫోన్ పోయింది. ఫోన్ కనిపించకపోయేసరికి అందరూ కంగారు పడ్డారు. ఎమ్మెల్యే రాజయ్య ఏకంగా మైక్ అందుకొని మంత్రి గారి ఫోన్ పోయింది.. ఎవరికైనా దొరికితే ఆలయ చైర్మన్ శ్రీధర్రావుకు అప్పగించాలని కోరారు. ఆ నోటా ఈనోట అందరూ మంత్రి గారు ఫోన్ పోయిందట... ఏమైందో ఏమో అంటూ గుసగుసలు పెట్టారు. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఆలయ అర్చకుడు రంగాచార్యులు మంత్రిగారి సెల్ ఫోన్ దొరికిందని సెలవిచ్చారు. మంత్రి సెల్ ఫోన్ను కారులోనే మరిచిపోయి వచ్చారట. అసలు విషయం తెలుసుకొని అందరూ నవ్వుకున్నారు. చదవండి: చేతిలో నుంచి జారి సల సల మరిగే నూనెలో పడ్డ ఫోన్.. తర్వాత ఏమైందంటే? -
జైల్లో ఆకస్మిక తనిఖీలు.. మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ..
పాట్నా: బిహార్ గోపాల్గంజ్ జిల్లా జైల్లో ఓ ఖైదీ మొబైల్ ఫోన్ మింగేశాడు. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో ఫోన్ విషయం బయటపడుతుందని భయపడి దాన్ని అమాంతం నోట్లో వేసుకున్నాడు. హమ్మయ్య ఇక ఎవరూ కనిపెట్టలేరని ఊపిరిపీల్చుకున్నాడు. శనివారం ఈ ఘటన జరిగింది. అయితే ఆదివారం ఇతనికి అసలు సమస్య మొదలైంది. భరించలేని కడుపునొప్పి వచ్చింది. దీంతో అధికారులకు అసలు విషయం చెప్పేశాడు. తన పొట్టలో మొబైల్ ఉందని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. దీంతో అధికారులు వెంటనే అతడ్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్-రే తీయగా అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు తేలింది. దాన్ని బయటకు తీసేందుకు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అనంతరం ఖైదీని పాట్నా మెడికల్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. మొబైల్ ఫోన్ మింగేసిన ఈ ఖైదీ పేరు ఖైసర్ అలీ. 2020 జనవరి 17న డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. మూడేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. అయితే ఖైదీ వద్దకు మొబైల్ ఫోన్ ఎలా చేరిందని ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి. జైలు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిహార్ జైళ్లలో ఖైదీల వల్ల మొబైల్ ఫోన్లు బయటపడటం సాధారణమైపోయింది. 2021 మార్చి నుంచి ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో 35 సెల్ఫోన్లు ఖైదీల వద్ద లభ్యమయ్యాయి. భారత్లోని జైళ్లలో మొబైల్ ఫోన్స్ వినియోగంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయినా కొందరు ఖైదీలు వీటిని ఉపయోగిస్తున్నారు. చదవండి: దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్ ద్వారా పెన్షన్ -
చోరీ నెపంతో తల్లి ఎదుటే విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్
సాక్షి, హనుమకొండ: సెల్ఫోన్ చోరీ చేశావంటూ ఓ విద్యార్థిపై నిందమోసి చితకబాదాడొక ప్రిన్సిపాల్. హనుమకొండ జిల్లా కమలాపూర్లోని మహాత్మా జ్యోతిభాపూలే బాలుర గురుకుల పాఠశాలలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై బాధిత విద్యార్థి, తల్లిదండ్రుల కథనమిది. కమలాపూర్ మండలం అంబాలకు చెందిన మాట్ల విష్ణు కమలాపూర్లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత ఏడాది దసరా సెలవులకు ముందు పాఠశాలలోని ఓ వంట మనిషి సెల్ఫోన్ చోరీకి గురైంది. అది ఎవరు దొంగిలించారో తెలియకపోయినా.. నేరాన్ని విద్యార్థులు యాకూబ్, విష్ణుపై ప్రిన్సిపాల్ పింగిలి వెంకటరమణారెడ్డి మోపారు. క్రిస్మస్ సెలవులకు ముందు ఇద్దరిని సుమారు పదిరోజుల పాటు సస్పెండ్ చేశారు. క్రిస్మస్ సెలవుల ఆనంతరం గురువారం విష్ణుతోపాటు మరో విద్యార్థి పాఠశాలకు రాగా.. పాఠశాలకు ఎందుకు వచ్చారంటూ ప్రిన్సిపాల్ మండిపడ్డారు. అదే పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్న విష్ణు తల్లి కవితను పిలిపించి.. ‘మీ అబ్బాయి సెల్ఫోన్ దొంగతనం చేశాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని, టీసీ తీసుకొని వెళ్లిపోండని’.. ఆదేశించారు. చదవండి: (భర్త నిర్వాకం.. రెండో వివాహం చేసుకొని.. మొదటి భార్యను..) తన కొడుకు అలాంటి వాడు కాదని, దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా వినిపించుకోని ప్రిన్సిపాల్.. ఆమె ఎదుటే విష్ణును గొడ్డును బాదినట్టు బాదారు. చోరీకి గురైన సెల్ఫోన్ డబ్బు ఇస్తామని తమతో ప్రిన్సిపాల్ ఒప్పంద పత్రం రాయించుకున్నారని, విష్ణును కొట్టిన విషయం బయటకు చెబితే స్వీపర్ పనినుంచి తీయించేస్తానని బెదిరించారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. తాను చేయని నేరానికి దెబ్బలు తినాల్సి వచ్చిందని మనస్తాపానికి గురైన విష్ణు చనిపోతాననడంతో ఆందోళన చెందిన కవిత ఇంటి వద్ద బిడ్డకు కాపలా కాస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ విద్యార్థి విష్ణును పాఠశాలకు పిలిపించుకుని ‘తనకు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని.. దొంగతనం చేసింది నువ్వు కాదని తెలిసిందని.. నిన్ను కొట్టినందుకు సారీ’.. అని క్షమాపణ చెప్పారు. విషయం తెలిసిన ఎన్ఎస్యూఐ, దళిత సంఘాల నేతలు శుక్రవారం విష్ణు తల్లిదండ్రులతో కలిసి పాఠశాలలో విచారణకు వచ్చిన జిల్లా కన్వీనర్ మనోహర్రెడ్డిని నిలదీశారు. ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేశారు. ఈ సంఘటనపై ఆర్సీవో ఆదేశాల మేరకు విచారణ జరిపానని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని మనోహర్రెడ్డి తెలిపారు. -
అంతా ఈజీ కాదు దొంగతనం! ఎంత కూల్గా దొంగను బంధించాడు!
దొంగలు కూడా ఇప్పుడూ సాధారణ వ్యక్తుల మాదిరి షాప్లకి వచ్చి తెలివిగా దొంగతనం చేసి తప్పించుకుంటున్నారు. సీసీఫుటేజ్లు ఉన్నా కూడా వారి చేతివాటం మందు అవన్నీ దిగదుడుపే అవుతున్నాయి. కానీ ఇక్కడొక షాపు ఓనర్ మాత్రం భలే స్మార్ట్గా దొంగను పట్టుకున్నాడు. దొంగ అని అరవకుండా చాలా కూల్గా పట్టించాడు. వివరాల్లోకెళ్తే...యూకేలోని ఫోన్ మార్కెట్కి ఒక దొంగ కస్టమర్లాగా వచ్చాడు. అక్కడ లక్షల ఖరీదు చేసే ఫోన్లను కొనేసేవాడి మాదిరి ఫోన్లను చెక్ చేస్తున్నాడు. ఐతే ఆ షాపు ఓనర్ చాలా తెలివిగా ఫోన్లను చూపిస్తూ..బయట తలుపులను లాక్ చేశాడు. దీన్ని గమనించిన మన దొంగ ఇక ఇదే అవకాశం అనుకుని ఒక రెండు ఫోన్లను పట్టుకుని పరారయ్యేందకు యత్నించాడు. ఐతే డోర్లు ఓపెన్ కాకపోవడంతో చచ్చినట్లు తిరిగొచ్చి షాపు అతనికి ఫోన్లు ఇచ్చి వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా వీక్షించి నవ్వుకోండి. Don’t be an idiot pic.twitter.com/ldoXuFW4QB — UOldGuy🇨🇦 (@UOldguy) December 12, 2022 (చదవండి: జస్ట్ మిస్! లేదంటే.. తల పుచ్చకాయలా పగిలిపోయేది) -
విద్యార్థి ప్రాణం తీసిన మొబైల్.. స్కూల్కు సెల్ఫోన్ తీసుకొచ్చాడని..
సికింద్రాబాద్: స్కూల్కు సెల్ఫోన్ను తీసుకొచ్చాడని విద్యార్థిని.. ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశాడు. మనస్తాపానికి గురైన విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజ్గిరి ఆర్కే పురంలోని గాంధీనగర్కు చెందిన కొండా దినేష్ రెడ్డి (15) ఏఓసీ సెంటర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం దినేష్ రెడ్డి పాఠశాలకు సెల్ఫోన్ తీసుకెళ్లాడు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ పద్మజ వెంటనే దినేష్ను మందలించారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్ తెచ్చినందుకు 12 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇదే విషయం విద్యార్థి తండ్రి రమణారెడ్డికి కూడా చెప్పి విద్యార్థిని అతడితోపాటు పంపారు. ఇంటికి వెళ్లిన దినేష్రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురై.. సోమవారం సాయంత్రం అమ్ముగూడ స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్లో ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్/సనత్నగర్: రాష్ట్రంలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాల పరంపర కొనసాగుతోంది. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు వరుసగా రియల్ ఎస్టేట్ సంస్థలపైనా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోనూ దాడులు జరుపు తూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం నుంచి రెండు వస్త్ర దుకాణాలతోపాటు సెల్ఫోన్ విక్రయ సంస్థలపైనా ఆదాయపు పన్ను శాఖ సోదాలు జరిపింది. ఐటీ అధికారులు డజ నుకు పైగా బృందాలుగా విడిపోయి ఏక కాలంలో సోదాలు చేశారు. ఈసారి కేంద్ర బలగాల బలగాల పహారాలో దాడులు నిర్వ హించడం గమనార్హం. అమీర్పేట, కూకట్ పల్లి, దిల్సుక్నగర్తోపాటు పలు ప్రాంతాల్లో ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ఇండియా షాపింగ్మాల్స్పైనా.. ఈ సంస్థలకు అనుబంధంగా ఉన్న లాట్ మొబైల్స్, బిగ్ సీ దుకాణాలపైనా దాడులు చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున డాక్యుమెంట్స్, కంప్యూటర్ హార్డ్డిస్క్లు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసు కున్నట్లు సమాచారం. ఉదయం నుంచి ఈ మాల్స్లోకి వినియోగదారులను రానీయకుండా సోదాలు నిర్వహించారు. హానర్లో పెట్టుబడులు పెట్టినందుకేనా... ఆర్ఎస్ బ్రదర్స్ ఈమధ్య పెద్దఎత్తున రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దాడులకు దిగినట్లు తెలిసింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో హానర్ రిచ్మండ్ పేరుతో చేపట్టిన భారీ ప్రాజెక్టులో ఈ వస్త్ర దుకా ణాలు, మొబైల్ విక్రయాల సంస్థల యజ మానులు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హానర్ గ్రూపు 28.4 ఎకరాల్లో 142 ప్లాట్లలో విల్లాల నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్సీకి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హానర్ గ్రూపు జూబ్లీహిల్స్, గచ్చి బౌలి, హైటెక్సిటీ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు చేపట్టింది. -
ఒకప్పటి స్టేటస్ సింబల్.. నేడు మ్యూజియంలో వస్తువుగా..
ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా): ట్రింగ్ ట్రింగ్... ట్రింగ్ ట్రింగ్.. అంటూ మార్మోగిన ల్యాండ్లైన్ ఫోన్ క్రమక్రమంగా అదృశ్యమవుతోంది. రెండు దశాబ్దాల క్రితం స్టేటస్ సింబల్గా పిలుచుకునే టెలిఫోన్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా డెడ్ కాగా.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం కాస్త తన ఉనికిని కాపాడుకునేందుకు ఊగిసలాడుతోంది. కాలగమనంలో అరచేతిలోకి సెల్ఫోన్ వచ్చి చేరడంతో ల్యాండ్లైన్కు ఆదరణ కరువైంది. ఒకప్పుడు ఇళ్లల్లో రాజసానికి సింబాలిక్గా నిలిచిన ‘ల్యాండ్లైన్ ఫోన్’.. సెల్ఫోన్ సునామీతో నేడు మ్యూజియంలో వస్తువుగా మారింది. చదవండి: హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి.. కాలం గడుస్తున్నకొద్దీ మనం రోజూ వాడే వస్తువులకు కూడా కాలం చెల్లుతుంది. సేవలు కూడా కనుమరుగైపోతాయి. శతాబ్దాలుగా పట్టణాలకే పరిమితమైన టెలిఫోన్ సౌకర్యం 1988లో మండలాలు, పెద్దపెద్ద గ్రామ పంచాయతీలకు వచ్చింది. ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే పోస్టాఫీసుకు వెళ్లి ట్రంక్ కాల్ బుక్ చేసుకుని గంటల తరబడి కూర్చొని మాట్లాడి వచ్చేవారు. 2000 సంవత్సరం వరకు ఓ వెలుగు వెలిగిన బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ సేవలు ఏటికేటికీ తగ్గుముఖం పడుతూ 2006 సంవత్సరం నుంచి తన ఉనికిని పూర్తిగా కోల్పోవడం మొదలు పెట్టింది. 2009లో మొబైల్ ఫోన్కు 3జీ సెక్టార్ రావడంతో ఎక్కడి నుంచైనా మాట్లాడుకునే సౌకర్యం ఉండటం, మెసేజ్లు పంపుకునే వీలు కలగడంతో దాదాపు అందరూ అటువైపు మొగ్గు చూపారు. అంతవరకు కాస్తో కూస్తో ఉన్న ల్యాండ్లైన్ కనెక్షన్లను 2015లో వచ్చిన జియో బాగా దెబ్బతీసింది. గ్రామగ్రామానా జియో టవర్లు ఏర్పాటు చేయడంతో పాటు సుమారు రెండు సంవత్సరాలు జియో 4జి సేవలు పూర్తి ఉచితంగా అందించడంతో ఆ సునామీలో ల్యాండ్లైన్ నిలువలేక పోయింది. 2000 సంవత్సరం వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 1.5 లక్షల బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 7,500 పడిపోయింది. అది ఒకప్పటి స్టేటస్ సింబల్ సుమారు మూడు దశాబ్దాల క్రితం ఏదైనా గ్రామంలో టెలిఫోన్ ఎక్సేంజి ఉందంటే అది పెద్ద వ్యాపార లావాదేవీలు ఉన్న గ్రామంగా గుర్తించేవారు. ఎవరింట్లోనైనా టెలిఫోన్ ఉందంటే వారిని భూస్వాములుగానో, రాజకీయ నాయకులుగానో,పెద్ద వ్యాపారవేత్తలుగానో చెప్పుకునేవారు. వారిని ఆ ఊరంతా సంపన్నులుగా భావించేవారు. ఆ ఊర్లో వాళ్లకు వారి బంధువులు ఏమైనా శుభవార్త అయినా.. అశుభ వార్త అయినా ఈ ఫోన్కు కాల్ చేసి చెబితే వారు పిలిపించి మాట్లాడించేవారు. అందుకే ఫోన్ ఇంట్లో ఉన్న వారితో ఇరుగు పొరుగు అంతా బాగా కలిసి ఉండేవారు. కొంత కాలానికి ల్యాండ్లైన్ ఫోన్ మధ్యతరగతి వారి ఇళ్లకూ చేరింది. తమ పిల్లలు, బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలంటే ఫోన్ తప్పసరి కావడంతో ల్యాండ్ఫోన్ పెట్టించుకునేవారు. అయితే కాలగమనంలో అతి తక్కువ ధరకు సెల్ఫోన్లు రావడంతో పాటు ఇంట్లో ఉన్న వారు ఫోన్ మాట్లాడేందుకు ఎవరికి వారు ప్రైవసీకి అలవాటు పడటంతో ల్యాండ్లైన్ ఫోన్లు ఆదరణ కోల్పోయాయి. ఉపాధికి కేరాఫ్గా ఎస్టీడీ బూత్లు ఓ 20 సంవత్సరాల క్రితం చదువుకుని ఉద్యోగం రాని నిరుద్యోగ యువత పట్టణాల్లో ఎస్టీడీ బూత్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేవారు. వీటిలో షిఫ్ట్ల పద్ధతిలో వేలాది మంది పనిచేసేవారు. కాలక్రమేణా ల్యాండ్లైన్ స్థానంలో కాయిన్బాక్స్లు రావడంతో పట్టణం నుంచి పల్లెల్లో వీధివీధినా ముఖ్యంగా దుకాణాల దగ్గర ఎక్కడ చూసినా రూపాయి కాయిన్ బాక్స్ ఉండేవి. అంతే స్పీడుగా స్మార్ట్ ఫోన్ సేవలు అందుబాటులోకి రావడంతో ఆ సేవలన్నీ కనిపించకుండా పోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణాల్లోనే.. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ఫోన్ల సంఖ్య భారీగా తగ్గింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2006 వరకు సుమారు 1.5 లక్షల కనెక్షన్లు ఉండగా ప్రస్తుతం 7,500కు తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ల్యాండ్లైన్ కనుమరుగు అవగా పట్టణాల్లో ప్రభుత్వ కార్యాలయాలైన విద్యుత్, పోలీస్, రెవెన్యూ, హాస్పిటల్, బ్యాంకులు, పెద్దపెద్ద వ్యాపార సంస్థల్లో మాత్రమే ల్యాండ్ఫోన్లు కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా కనుమరుగై పోవడంతో ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2015 నుంచి డౌన్ఫాల్ 2000 సంవత్సరం నుంచి బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడికి ల్యాండ్ఫోన్ ఉచితంగా ఇవ్వడం మానేసింది. డబ్బులిచ్చి ఫోన్ కొనుక్కోవాలి. ల్యాండ్ఫోన్ కనెక్షన్కు డిపాజిట్ కట్టి ఫోన్ కొనుగోలు చేసే సొమ్ముకు సెల్ ఫోన్ వస్తుండటంతో అందరూ అటువైపు మొగ్గుచూపారు. దీనికి తోడు 2015లో జియో 4జి రావడం.. ఒకటి, రెండేళ్లు ఉచితంగా అపరిమిత సేవలు అందించడంతో ప్రజలు మొత్తం సునామీలా అందులోకి డైవర్ట్ అయ్యారు. అప్పటి నుంచి బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ ఫోన్ కనెక్షన్లకు డౌన్ఫాల్ మొదలైంది. – రామాంజనేయరెడ్డి, ఎస్డీఓటీ, ఆళ్లగడ్డ అందరూ ప్రైవసీకి అలవాటు పడ్డారు ల్యాండ్ఫోన్ ఖర్చుతో పోల్చితే మొబైల్ ఖర్చు చాలా తక్కువగా ఉంటోంది. దీనికి తోడు ల్యాండ్ఫోన్ ఓ చోట ఉంటే అందరూ అక్కడికి వచ్చి అందరి ముందు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రైవసీకి అలవాటు పడ్డారు. మొబైల్ అయితే వారికి అనువుగా ఉన్నచోట కూర్చొని రహస్యంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే ల్యాండ్లైన్ ఫోన్లు ఎవరూ ఇష్ట పడ్డం లేదు. – రమణ, అహోబిలం -
మొబైల్ ఫోన్లు కొంప ముంచుతున్నాయి!
యుద్ధంలో బాంబులు వేసుకోవడం మామూలే. ఆ బాంబులు ఎక్కడ వేయాలో నిర్ణయించడానికి రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో సెల్ఫోన్ లను వాడుతున్నారంటే ఎవరికీ వింతగా తోచడం లేదు. అవి అధునాతనమయిన స్మార్ట్ ఫోన్లయినా; కేవలం కాల్స్, మెసేజ్లు మాత్రమే పంపగల సింపుల్ ఫోన్లయినా సైనికులందరికీ అందుబాటులో ఉండి సాయం చేస్తున్నాయి. ఇరుపక్షాల వారు ఎదుటివారి కదలికలను, స్థావరాలను గుర్తించడానికి ఈ ఫోన్లు సాయపడుతున్నాయి. మొబైల్ ఫోన్లు అన్నీ దగ్గరలోని కమ్యూనికేషన్ టవర్కు సంకేతాలు పంపుతుంటాయి. వాటి ఆధారంగానే కాల్స్, మెసేజెస్ వీలవుతాయి. ఈ మధ్యన ఈ సంకేతాల ఆధారంగా నేరస్థులను, ఇతరులను అనుసరించి ఆరా తీయడం మామూలయింది. మూడు టవర్ల నుంచి సంకేతాలను ‘ట్రయాంగులేషన్’ అనే పద్ధతిలో విశ్లేషిస్తే, వాటిని పంపిన ఫోన్ ఉన్న స్థలం తెలిసిపోతుంది. దీంతో రష్యా–ఉక్రెయిన్ సైన్యాలు దీన్ని అనువుగా వాడుకుని శత్రుపక్షం ఆచూకీ సులభంగా తెలుసుకుంటున్నాయి. ‘ఇదేదో, ఇదుగో నేను నీ లక్ష్యాన్ని’ అని వీపు మీద బొమ్మ గీసుకుని తిరుగుతున్నట్లయిందని అంటారు యూకేలోని సర్రె విశ్వవిద్యాలయం పరిశోధకులు అలన్ వుడ్వర్డ్. ఇక రష్యావారు ఒక అడుగు ముందుకు వేసి ‘లియత్–3’ అనే సిస్టమ్ను తయారు చేశారు. ఇందులో మొబైల్ ఫోన్ టవర్స్లాగ పనిచేసే డ్రోన్స్ ఉంటాయి. అవి ఆరు కిలో మీటర్ల పరిధిలోనున్న సుమారు రెండు వేలకు పైగా మొబైల్ ఫోన్ల ఆచూకీ తెలుసుకునే శక్తి గలవి. ఈ రకంగా అధికారులను అనుసరించి మట్టుబెట్టిన సందర్భాల గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో వివరంగా రాశారు. ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, టార్గెట్ అక్విజేషన్, రీకన్నాయిజాన్స్ అంటే కంప్యూటర్ వాడకం సాయంగా గమ్యాలను గుర్తించే ‘ఇస్తార్’ సిస్టమ్లు ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్నాయి. కనుక క్షణాల్లో గమ్యాలను తెలుసుకుని మిసైల్స్ ప్రయోగించే వీలు కలుగుతున్నది. (క్లిక్: యుద్ధ నివారణే పాలకుల కర్తవ్యం!) ఇక స్మార్ట్ ఫోన్లలో ‘జీపీఎస్’ అనే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. అది సులభంగా ఎదుటివారికి అందరి స్థావరాల ఉనికినీ అందజేస్తుంది. అన్నింటికీ మించి యుద్ధరంగంలోని సైనికులను భయానికి గురిచేసే, సందేశాలు కూడా మొబైల్ ఫోన్లలో వస్తున్నాయి అంటారు ‘కోపెన్ హేగెన్ యూనివర్సిటీ’ పరిశోధకులు గొలోవ్షెంకో. మీవాడు చనిపోయాడంటూ తప్పుడు సమాచారాన్ని అందించిన సందర్భాలను ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ బాధలు రెండు పక్షాల వారికీ తప్పడం లేదు. (క్లిక్: అందుకే రష్యాను సమర్థించక తప్పదు) బాల్టిక్ స్టేట్స్లోనూ, అఫ్గానిస్తాన్లో కూడా ఈ రకం పద్ధతులను వాడి సైనికులను మానసికంగా వ్యథకు గురిచేసిన సందర్భాలను గురించి గొలోన్షెంకో వంటి పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. రష్యా సైన్యం ఏప్రిల్ మొదటి తేదీన సుమారు 5 వేలమంది ఉక్రెయిన్, సైన్యాధికారులు, రక్షణ సిబ్బందికి మెసేజీలు పంపినట్టు సమాచారం. తాము కూడా ఇటువంటి సందేశాలు పంపుతున్నట్టు ఉక్రెయిన్ ఇంటీరియర్ అఫెయిర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫోన్ వాడుతున్న ప్రతి సైనికుడూ ఒక డేటా పాయింట్గా నిలచి, తమ గురించి సమాచారం వెదజల్లుతున్నట్లే లెక్క. అది సైనికులకు ప్రాణాపాయం కలిగిస్తున్నది. - డాక్టర్ కె.బి. గోపాలం రచయిత, అనువాదకులు -
Crime News: ప్రియురాలి ఉసురు తీసిన సెల్ఫోన్ గిఫ్ట్
ప్రేమలో ఉన్నప్పుడు పరస్పరం కానుకలు ఇచ్చుకోవడం సహజం. అలాగే ప్రేమలో బ్రేకప్లు కూడా సర్వసాధారణమే. కానీ, మరో యువతితో పెళ్లి ఫిక్స్ కావడంతో బ్రేకప్ చెప్పిన ఆ ప్రియుడి తీరును ఆమె తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో.. ప్రియురాలిపై కోపంతో దాష్టీకానికి పాల్పడ్డాడు. తాను కానుకగా ఇచ్చిన సెల్ఫోన్.. తిరిగి ఇవ్వడం లేదన్న కోపంతో ప్రియురాలిని ఏకంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. జార్ఖండ్లోని పాకుర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువకుడు, సదరు బాధిత యువతి రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో కూడా తెలుసు. అబ్బాయి ఇంట్లో అభ్యంతరాలు చెప్పకపోతే ఈ ఏడాదిలో వీళ్లద్దరికి వివాహం చేయాలని అనుకున్నారు కూడా. అయితే.. ఈ మధ్యే ఆ యువకుడికి మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. దీంతో ప్రియురాలికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అంతేకాదు తాను కొనిచ్చిన కాస్ట్లీ ఫోన్ను తిరిగి ఇచ్చేయాలంటూ ఆమెను అడుగుతూ వస్తున్నాడు. ఆమె అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఆదివారం ఉదయం స్థానిక మైదానంలో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ చూద్దామంటూ ఆమెను బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె గొంతు కోసి సెల్ఫోన్ తీసుకెళ్లాడు. రక్తపు మడుగులో ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సోమవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో ప్రియుడే ఆమెను బయటకు తీసుకెళ్లినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గట్టిగా నిలదీయడంతో నేరం ఒప్పుకున్నాడు నిందితుడు. -
మేకలు అమ్మి ఫోన్ కొనిస్తే! ఆ కొడుకేమో..
భర్త కాలం చేసింది చానారోజులే అయ్యింది. ఇద్దరు కొడుకులను బాగా చదివించేందుకు అహర్నిశలు కష్టపడేది ఆ తల్లి. కొడుకు సరస్వతి పుత్రుడు. అందుకే ఆన్లైన్ సదువుకు ఫోన్ కావాలని అడగ్గానే.. ఉన్న రెండు మేకలను అమ్మేసి కొడుకు చేతులో సొమ్ములు పెట్టింది ఆ తల్లి. కానీ, ఆ బిడ్డ.. ఆ తల్లి నమ్మకాన్ని మాత్రమే దెబ్బ తీయలేదు. కటకటాల పాలై జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నాడు కూడా. బిహార్ నవాడా జిల్లా థాల్పోస్ గ్రామం ఈ మధ్య వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం.. ఆ ఊరి నుంచి సైబర్ నేరాలనుగానూ పోలీసులు అరెస్ట్ చేయడం. జిల్లావ్యాప్తంగా ఒకే తరహాలో జరిగిన స్కామ్లో మొత్తం 33 మందిని అరెస్ట్చేస్తే.. అందులో 31 మంది థాల్పోస్ గ్రామం నుంచే కావడం ఆశ్చర్యం కలిగించేదే కదా!. అందునా నేరాలకు పాల్పడింది 14 నుంచి 40 ఏళ్లలోపు వాళ్లే కావడం గమనార్హం. అందులో ఒకడే 19 ఏళ్ల గుల్షన్. అరెస్ట్ అయిన చాలామంది ఈపాటికే బెయిల్ మీద బయటకు వచ్చారు. కొందరేమో ఆర్థిక స్థితి బాగోలేక జైల్లోనే ఉండిపోయారు. మరికొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలు అలాంటి పని చేశారంటే నమ్మలేకపోతున్నారు. గుల్షన్ తండ్రి చనిపోయాక అన్నితానై చూసుకుంది ఆ తల్లి. అలాగని గుల్షన్ సుద్దమొద్దు కాదు. 2019లో పదవ తరగతి ఫస్ట్ డివిజన్లో పాసయ్యాడు. ముఖ్యమంత్రి బాలక్ బాలికా ప్రోత్సాహన్ యోజన కింద 10 వేల రూపాయల స్కాలర్షిప్ కూడా అందుకున్నాడు. స్థానికంగా ట్యూషన్స్ చెబుతూ నెలకు మూడు వేల రూపాయలు సంపాదిస్తూ.. తల్లి, తమ్ముడి పోషణలో భాగం అయ్యాడు కూడా. అలాంటోడి జీవితాన్ని సెల్ఫోన్ దెబ్బ తీసింది. సులువుగా డబ్బు సంపాదించాలన్నా దుర్భుది.. అతని కుటుంబం పరువు తీయడంతో పాటు వ్యక్తిగతంగా ఆ కుర్రాడిని కటకటాల పాల్జేసింది. అతనికి బెయిల్ ఇప్పించే పరిస్థితిలోనూ లేదు 42 ఏళ్ల సర్విలా దేవి. అరెస్ట్ అయిన చాలామందివి పేద కుటుంబాలే. కాస్తో కూస్తో చదువుకున్నారు. అప్పో సొప్పో చేసి స్మార్ట్ఫోన్లు కొని సైబర్నేరాలకు పాల్పడ్డారంతా. ఓటీపీ నేరాల దగ్గరి నుంచి, నకిలీ ఫోన్ కాల్స్, బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే దాకా.. వాళ్లు పాల్పడి నేరాలంటూ లేవు. ఉన్నంత చదువు, ఆన్లైన్ మోసాలపై పెంచుకున్న జ్ఞానం వాళ్లతో నేరాలు చేయించింది. ఊరిలో ఎవరికీ అనుమానాలు రాకుండా.. పోలాల దగ్గర, బోరు బావిల దగ్గర, ఊళ్లో చెట్ల అరుగుల మీద కూర్చుని ఈ నేరాలకు పాల్పడ్డారని థాల్పోస్ ఎస్సై బెయిడ్నాథ్ ప్రసాద్ చెప్తున్నారు. బీహార్లో నమోదు అయ్యే సైబర్ నేరాలు తక్కువేం కాదు. ఒక్క నవాడా జిల్లా పరిధిలో 2019-20 మధ్య 18 కేసులకుగానూ 28 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2020-21లో ఆ సంఖ్య 14 కేసులకు 30 మందికి చేరింది. కానీ, 2022లో అదీ మార్చి వరకే 11 కేసుల్లో 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల వాళ్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారంతా. పేదరికం, కరోనాతో ఉద్యోగాలు కోల్పోవడం, వలస కూలీలకు పనులు లేకపోవడం, బడిలు బంద్ కావడంతో చాలామంది ఇటువంటి నేరాల వైపు మళ్లుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కేసులు నమోదు చేయకుండా.. కౌన్సెలింగ్ ద్వారా వీళ్లలో మార్పు తీసుకురావాలనే ఆలోచనలో ఉంది పోలీస్ శాఖ. -
ఉపాధ్యాయులకు షాక్.. క్లాస్ రూమ్స్లో ఫోన్ల వాడకంపై ఆంక్షలు
డెహ్రాడూన్: క్లాస్ రూమ్స్లో ఫోన్లు వాడే టీచర్లకు బిగ్ షాక్ తగిలింది. క్లాస్ రూమ్ల్లోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ వినయ్ శంకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా టీచర్ల వద్ద క్లాస్ రూమ్స్లో ఫోన్లు కలిగి ఉన్నట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రూల్ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తరగతి గదుల్లో కూడా ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లతో బిజీగా ఉండటం చాలా కాలంగా గమినిస్తున్నట్టు చెప్పారు. ఫోన్లలో బిజీగా గేమ్స్ ఆడటం, చాటింగ్లు చేయడం వంటివి గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రుల నుండి తమకు చాలా కాలంగా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అలాగే విద్యార్థులు, ఫిర్యాదులను ధృవీకరించడానికి అధికారులను పంపించినట్టు తెలిపారు. అయితే, ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్లను పాఠశాలలకు తీసుకెళ్లవచ్చు కానీ.. ఫోన్లను ప్రిన్సిపాల్ గదిలో భద్రపరచాలని స్పష్టం చేశారు. వారు మొబైల్ ఫోన్లు లేకుండా తరగతి గదిలోకి ప్రవేశించాలని ఆదేశాలు జారీ చేసినట్టు పాండే చెప్పారు. అయితే, టీచర్ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో మినహాయింపు ఇవ్వవచ్చని తెలియజేసారు. కాగా, ప్రిన్సిపాల్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఫోన్ తమ వద్ద పెట్టుకోవచ్చనని సూచించారు. ఈ క్రమంలోనే తమ ఆకస్మిక తనిఖీల్లో ఎవరైనా ఉపాధ్యాయులు ఫోన్ను వాడుతున్నట్టు గమినిస్తే.. కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రిన్సిపాల్ కూడా బాధ్యత వహించాలన్నారు. Following complaints from students, parents that teachers were engaged with their phones in classrooms, an order has been issued which makes it mandatory for teachers to deposit their phones to Principal. Strict action in case of violation:Vinay S Pandey, Haridwar DM, Uttarakhand pic.twitter.com/B4GVDVwKcU — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 23, 2022 -
AP Assembly: టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ రూలింగ్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం కొత్త రూల్ ప్రవేశపెట్టారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనకు సంబంధించి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఇకపై సెల్ఫోన్లు అసెంబ్లీలోకి తీసుకురావొద్దని ఆదేశాలిచ్చారు. లోపల జరిగే యాక్టివిటీ టీడీపీ రికార్డ్ చేస్తోందని స్పీకర్ అన్నారు. ఇకపై ఈ రూల్ అందరికీ వర్తిస్తుందని.. సభ్యులు సభా సంప్రదాయాలను పాటించాలని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. చదవండి: వేసవిలో 24/7 నాణ్యమైన విద్యుత్ ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ శాసన సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో ఒక రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సత్యప్రసాద్, చినరాజప్ప, రామ్మోహన్, అశోక్, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను సస్పెన్షన్ చేశారు. -
సెల్ఫోన్లు వాడొద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టు షాక్
చెన్నై: సెల్ఫోన్ ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది. అది లేనిదే పిల్లలకు ముద్ద దిగడం లేదు. పెద్దలకు పనులు జరగడం లేదు. ఈ తరుణంలో.. పని టైంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అదే పనిగా ఫోన్లో మునిగిపోవడాన్ని తమిళనాడు రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ వేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియన్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే రూపొందించాలని, రూల్స్ ఫాలో కానీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ సుబ్రమణియన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. Madras HC says government servants should not be allowed to use mobile phones for personal use during office hours. Madras HC Justice SM Subramaniam directed Tamil Nadu Government to frame regulations in this regard and take action against those who do not follow the rules. pic.twitter.com/b2CtEvWx9J — ANI (@ANI) March 15, 2022 -
ఫోన్ మాట్లాడడం తగ్గించమని తండ్రి మందలించడంతో యువకుడి ఆత్మహత్య
సాక్షి,బంట్వారం(వికారాబాద్): ఫోన్ మాట్లాడడం తగ్గించమని తండ్రి మందలిచడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడే. ఈ సంఘటన బుధవారం కోట్పల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ధారూరు సీఐ తిరుపతిరాజు తెలిపిన ప్రకారం.. కోట్పల్లి గ్రామానికి చెందిన చాకలి అఖిలేష్ (20) జహీరాబాద్ మహీంద్రా కంపెనీలో అప్రెంటీస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఫోన్ మాట్లాడే విషయంలో కుమారుడిని తండ్రి మందలించాడు. చదవండి: జేపీ నేతల పెట్రోల్ దాడి.. ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తల మృతి దీంతో మనస్తాపం చెందిన అఖిలేష్ మంగళవారం ఇంట్లో నుంచి బైక్ పై వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబీకులు బుధవారం కోట్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు అఖిలేష్ బైక్ను నాగసమందర్ సమీపంలో కోట్పల్లి ప్రాజెక్టు తూము కాల్వ దగ్గర గుర్తించారు. బోటింగ్ నిర్వాహకుల సాయంతో అఖిలేష్ మృతదేహన్ని చెరువులో నుంచి బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిరుపతిరాజు చెప్పారు. చదవండి: ఎంపీటీసీ కూతురుతో మూడేళ్లుగా ప్రేమ, రహస్య పెళ్లి.. ఇంట్లో తెలియడంతో -
ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. ఎంత పనిచేశావ్ తరుణ్..
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో సోమవారం జరిగింది. సదుం మండలం, చెరుకువారిపల్లెకు చెందిన క్రిష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో అతని భార్య సుజాత, కుమారుడు తరుణ్ రెండేళ్ల క్రితం మదనపల్లె ఈస్ట్పేటలో ఉంటున్నారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ముగ్గురు అరెస్టు తరుణ్ పట్టణంలో ఫుడ్ సరఫరా చేసే సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతను ఏడాదిగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె 2 నెలలుగా ఫోన్కు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో సుజాత తల్లడిల్లిపోయింది. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
APEPDCL ఎవరి ఇంటి మీటర్కు వారే రీడింగ్!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ శ్రీకారం చుడుతోంది. ఎవరి ఇంటి మీటర్కు వారే రీడింగ్ తీసి బిల్లులు పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేసింది. స్మార్ట్ ఫోన్తో కరెంటు బిల్లు కడుతున్నట్లుగానే అదే ఫోన్తో మీటర్ రీడింగ్ కూడా తీసేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లులు తీసే ప్రక్రియ స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా జరుగుతోంది. కరోనా నేపథ్యంలో మీటర్ రీడింగ్ తీసేందుకు సిబ్బంది ఇళ్లకు రావడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. అయినా, మరో మార్గం లేకపోవడంతో వారే రీడింగ్ తీస్తున్నారు. గత రెండు వేవ్లలో కరోనా బారిన పడి పలువురు స్పాట్ బిల్లింగ్ రీడర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు. మూడో వేవ్ వస్తున్న నేపధ్యంలో మళ్లీ ఇప్పుడు రీడింగ్పై ఆందోళన మొదలైంది. అంతేకాకుండా రీడింగ్ తీయడం కాస్త ఆలస్యమైతే స్లాబు మారి, బిల్లు ఎంత వస్తుందోననే భయం వినియోగదారుల్లో ఉంది. దీనికి పరిష్కారంగా ఎవరికి వారు మీటరు రీడింగ్ సకాలంలో తీసుకుని పంపితే ఈ–బిల్లు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అందుబాటులోకి తెచ్చింది. దీనిని మిగతా రెండు డిస్కంలు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్లు కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రీడింగ్ ఇలా.. ఈపీడీసీఎల్ అనుసరిస్తున్న విధానం ప్రకారం.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునామా, సెల్ ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ నమోదు చేయాలి. ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. 16 నంబర్ల విద్యుత్తు సర్వీస్ మీటరును నమోదు చేయాలి. ఆ వెంటనే సెల్ఫోన్కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీటరు ఐకాన్ రిజిస్ట్టర్ సర్వీస్ నంబర్పై క్లిక్ చేసి కెమెరా ఐకాన్ ద్వారా మీటర్ రీడింగ్ స్కాన్ చేయాలి. దానిని సబ్మిట్ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైల్కు సమాచారం వస్తుంది. ఈ యాప్లోనే బకాయిలు, బిల్లు కట్టే విధానం, వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందరి క్షేమం కోరి వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాం. విద్యుత్ అంతరాయాల షెడ్యూల్ను ముందే తెలుసుకునేలా రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (ఆర్టీఎఫ్ఎంఎస్)ను కూడా మా డిస్కం అభివృద్ధి చేసింది. వినియోగదారులు, సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి మీటర్కు రీడింగ్ వెసులుబాటు కల్పించాం. దీనివల్ల భద్రతతో పాటు స్లాబులు మారకుండా ఉంటాయి. –కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
ఆ ఇంట్లో ఎటుచూసినా సెల్ఫోనే!:కొట్టేసినవి కాదు.. కొన్నవే
ఎప్పుడు చూసినా చేతిలో ఫోన్. ఎదుటివాళ్లు మాట్లాడేది పట్టించుకోకుండా అందులోనే ముఖం పెట్టేయడం. స్మార్ట్ఫోన్ ధ్యాసలో తిండి, నిద్రకు దూరం.. ఇవన్నీ ఫోన్ పిచ్చి పరాకాష్టకు చేరిందని చెప్పడానికి నిదర్శనాలు. అయితే ఇక్కడో పిచ్చోడు ఫోన్కు అడిక్ట్ కాలేదు. కానీ, ఫోన్ల కలెక్షన్లతో తన ఇంటిని నింపేసుకుంటూ పోతున్నాడు. కప్బోర్డులు, బెడ్రూం, కిచెన్ డబ్బాల్లో.. ఆఖరికి కారును కూడా ఫోన్లతోనే నింపేశాడు. ఇదంతా ఎందుకని అడిగితే ఓ ప్రత్యేక కారణం ఉందని చెప్తూ పోయాడు. ‘నా పేరు జయేష్ కాలే. ముద్దు పేరు మిస్టర్ నోకియా. వయసు 35 సంవత్సరాలు. ఓ కంపెనీలో డిజైన్ హెడ్గా పని చేస్తున్నాడు. ఉండేది ముంబై(మహారాష్ట్ర) థానేలో ఓ అపార్ట్మెంట్లో. ప్రస్తుతం నా కలెక్షన్స్లో 3,500 హ్యాండ్సెట్స్ ఉన్నాయి. వీటి కోసం 20 లక్షల దాకా ఖర్చు చేశా. వర్కింగ్ కండిషన్ ఫోన్లతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కే ప్రయత్నం చాలా క్రితమే చేశా. కానీ, ఇప్పటికైతే నా పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో పేరెక్కింది. మీ వరకు ఇవి ఫోన్ కలెక్షన్లు. కానీ, నా వరకు ఇవి చంటిపాపలు. మీకు తెలిసి ఇంకేమైనా మోడల్స్ ఉంటే నా దృష్టికి తెండి’ అంటూ వాటిని లెక్కపెట్టుకుంటూ ఉండిపోయాడు జయేష్. ఆ ఘటన తర్వాత.. చదువుకునే రోజుల్లో జయేష్ ‘నొకియా 3310’ మోడల్ ఫోన్ వాడేవాడు. ఓరోజు రెండో అంతస్థు నుంచి అది కిందపడిపోయిందట. భయంతో కిందకు పరిగెత్తి చూస్తే.. ఫోన్ పార్ట్ పార్ట్లుగా పడి ఉందట. అయినా కూడా ఫోన్ కండిషన్లోనే పని చేసేసరికి అతను ఆశ్యర్యపోయాడట. ‘ఆ ఘటనతో నోకియాకు వీరాభిమానిగా మారిపోయా’ అంటాడతను. అందుకే అతని దగ్గర ఉన్న కలెక్షన్లలో చాలావరకు నోకియా హ్యాండ్సెట్లే ఉన్నాయి. ఐదు నుంచి ఆరేళ్ల కష్టపడి ప్రపంచంలోని చాలా దేశాల నుంచి హ్యాండ్సెట్లు తెప్పించుకున్నాడు. మాగ్జిమమ్ ఫీచర్ ఫోన్ తాలుకావే. చాలావరకు రేర్ పీసులు. వీటిలో ఎక్కువ వర్కింగ్ కడింషన్లో గనుక ఉండిఉంటే ఈపాటికే గిన్నిస్ బుక్లోకి ఎక్కేవాడే. కానీ, చాలావరకు పని చేయడం ఆగిపోయాయి. కొన్నింటికి యాక్సెసరీస్ దొరకట్లేదు. అందుకే లిమ్కా బుక్ రికార్డుతో సరిపెట్టుకున్నాడు. భార్య కోపం.. పిచ్చోడు అనుకున్నారట జయేష్ కాలేకి చాలా కాలం క్రితమే నోకియా మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ దక్కింది. ఫోన్ల కోసం ఇప్పటికే 20 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాడతను. ఇదంతా చూసి ఇంట్లోవాళ్లు తెగ తిట్టారు. భార్య చాలా రోజులు మాట్లాడడమే మానేసిందట. బంధువులు, స్నేహితులు అతనికి ‘ఫోన్ పిచ్చోడు’ అనే ముద్ర వేశారు. కానీ, జయేష్ వాటన్నింటిని నవ్వుతూ స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే అతని లక్క్ష్యం ‘గిన్నిస్ బుక్’లోకి ఎక్కడం కాబట్టి. అప్పటిదాకా వీలైనన్ని ఎక్కువ ఫోన్లను సేకరించి తీరతానని అంటున్నాడతను. పాత వీడియో చదవండి: భార్య చేసిన తప్పు! బిలియనీర్ కావాల్సినోడు...ఇప్పుడు..
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement