-
చేరికల చిచ్చు.. ఒక్క రోజుకే కాంగ్రెస్కు డీఎస్ రాజీనామా.. అసలేమైంది?
సాక్షి, హైదరాబాద్: మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కుటుంబంలో చేరికల చిచ్చు చెలరేగింది. నిన్న (ఆదివారం)డీఎస్, ఆయన కుమారుడు సంజయ్ తిరిగి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. అయితే సొంతగూటికి చేరిన ఒక్కరోజుకే(సోమవారం) ఆ పార్టీకి రాజీనామా చేస్తునట్లు డీఎస్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. డీఎస్ లేఖ రాస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. రాజీనామా లేఖను ఆయన సతీమణి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. డీఎస్ ఆరోగ్యం సహకరించట్లేదని, కాంగ్రెస్ వాళ్లు తమ ఇంటి వైపుకు రావొద్దని డీఎస్ భార్య విజ్ఞప్తి చేశారు. కాగా తొలుత కాంగ్రెస్ నేత అయిన డీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్గా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీలో చేరి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. కొంతకాలంగా బీఆర్ఎస్కు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తన కొడుకు సంజయ్తో కలిసి గాంధీభవన్కు వచ్చిన డీఎస్.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే మరుసటి రోజే కాంగ్రెస్కు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కాగా డీఎస్ మరో కొడుకు అర్వింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా ‘కొడుకు సంజయ్ కాంగ్రెస్లో చేరిన సందర్భంగా ఆశీస్సులు ఇవ్వడానే గాంధీభవన్కు వచ్చాను. కానీ తాను కూడా మళ్లీ పార్టీలో చేరినట్టుగా మీడియాలో ప్రచారం చేశారు. నేను ఎపన్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ.. ప్రస్తుతం నా వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్కు ముడిపెట్టడం భావ్యం కాదు. నన్ను వివాదాల్లోకి లాగవద్దని విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని మీరు భావిస్తే ఈ లేఖను రాజీనామాగా భావించి ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. -
తండ్రి కాంగ్రెస్ లో.. తనయుడు బీజేపీలో..!!
-
ఓ కుటుంబ కథా చిత్రం..
-
ఒకే వేదికపై తండ్రీకొడుకులు
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా అభివృద్ధికి పాటుపడతారని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో నిర్వహించిన అన్నదాతల ఆశీర్వాద సభలో డీఎస్, అరవింద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాపు సంఘం ప్రతినిధులు అరవింద్కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్కు అభినందనలు తెలిపారు. మున్నూరు కాపులను రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని ఆయన మండిపడ్డారు. అరవింద్ మాట్లాడుతూ.. ఒక రైతు బిడ్డను ఎంపీగా గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతే రాజు అంటూనే.. అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. రైతులతో పెట్టుకోవడం వల్ల.. రాజు బిడ్డను ఇంటికి సాగనంపారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలనే కాకుండా, పేదల వ్యతిరేక పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే .. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పట్టడం ఖాయమని అన్నారు. అయితే చాలా రోజుల తర్వాత తండ్రీకొడుకులు ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు తనపై కక్షగట్టారని ఆరోపించిన డీఎస్ ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత డీఎస్ తిరిగి కాంగ్రెస్లో చేరాతరనే వార్తలు వచ్చినప్పటికీ.. అవి నిజం కాలేదు. మరోవైపు డీఎస్ తనయుడు అరవింద్ మాత్రం తండ్రి టీఆర్ఎస్లో యాక్టివ్గా ఉన్న సమయంలోనే బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో నిలిచిన అరవింద్ కేసీఆర్ కూతురు కవితను ఓడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ.. ఆ ప్రయత్నాల్లో భాగంగా డీఎస్ను కూడా పార్టీలో చేర్చుకుంటుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. -
తండ్రి రాజ్యసభకు.. కొడుకు లోక్సభకు..
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో అరుదైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. తండ్రీ కొడుకులిద్దరు పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కొనసాగుతుండగా, ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు అర్వింద్ ధర్మపురి కూడా ఎంపీగా విజయం సాధించారు. కాగా డి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, అర్వింద్ బీజేపీ సభ్యులుగా కొనసాగనున్నారు. -
భూపతిరెడ్డికి అంత సీన్ లేదు
నిజామాబాద్ : టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి అంత సీన్ లేదని నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ..తనకు ప్రజా మద్ధతు మెండుగా ఉందని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్, భూపతిరెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారని, అందులో భాగంగానే కుట్రలకు తెరలేపారని అన్నారు. భూపతిరెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని చెప్పారు. వీరి వ్యవహారాన్ని మొదట్లో కేసీఆర్ దృష్టికి ఎప్పుడూ తీసుకెళ్లలేదని, ఇద్దరూ కలిసి కుమ్మక్కై ఇప్పుడు తనను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డీఎస్ ఢిల్లీలో కూర్చుని పార్టీని బెదిరిస్తుంటారని ఎద్దేవా చేశారు. భూపతిరెడ్డి చేసే ఆరోపణలు నిరాధారమని, నిజామాబాద్ రూరల్ ఎన్నికల్లో తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
రాజీనామా చేయను.. మీరే సస్పెండ్ చేయండి
సాక్షి, నిజామాబాద్: తాను టీఆర్ఎస్కు రాజీనామా చేయనని, కావాలంటే సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ అధిష్టానాన్ని రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిజామాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘నేను రాజీనామా చేసి పార్టీని వదిలి వెళ్తే మీరు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లు అవుతుంది. నన్ను సస్పెండ్ చేయడం చేతకాకపోతే తీర్మానాన్ని వెనక్కు తీసుకోవాలని సూచించారు. తనను రాజకీయంగా దెబ్బ తీశారని, నా కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారు. లేనిపోనివన్నీ కల్పించి జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి నా కుమారుడు సంజయ్పై కేసు పెట్టించార’ని ఆరోపించారు. హైకోర్టు 41ఏ నోటీసు ఇచ్చినా ఆ ఆర్డర్లు పట్టించుకోకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. ఇందులో ప్రభుత్వం ఎంత ఆసక్తి తీసుకుందో అందరికీ అర్ధమవుతోందని, తనపై నిరాధార ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశానో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఎక్కడ పార్టీని బలహీన పరిచానో నిరూపించాలని కోరారు. తాను బీజేపీకి ఎలా ఉపయోగపడ్డానో, బీజేపీకి తన సహచరులను ఎవరిని పంపానో చూపించాలని పేర్కొన్నారు. తాను టీఆర్ఎస్లో ఉండటం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు, ఎంపీ కవితకు ఇష్టం లేకపోతే దయచేసి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ఎదిగిన కుమారులు స్వతంత్రంగా జీవిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. నా ఇంట్లోనే కాదు అందరి ఇళ్లల్లోనూ జరిగేది కూడా అదే. నా రెండో కుమారుడు అరవింద్ బీజేపీలో చేరడం అతని స్వీయ నిర్ణయం. నా ప్రమేయం లేదు అయినా నేను ఏమీ చేయలేని పరిస్థితి. కేసీఆర్కి ముందే రెండుసార్లు చెప్పాను. నా కుమారుడు అరవింద్ మోడీ అభిమాని అని. గతంలోనే కాలినడకన వెళ్లి బీజేపీలో చేరే ప్రయత్నం చేశాడు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణతో మెలిగాను. పార్టీని మోసం చేయడం నాకు తెలియదు. తెలంగాణ పట్ల నాకు ఉన్న ప్రేమ నిబద్దతను ఎవరూ ప్రశ్నించలేరు. అలాంటి నాపై లేనిపోని అభాండాలు మోపి నన్నో పార్టీ వ్యతిరేకిగా ముద్ర వేశారు. మనసులో ఏదో పెట్టుకొని నిరాధారమైన, నిజాయితీ లేని ఆరోపణలు చేస్తూ నన్ను రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తున్నా’ ని వ్యాఖ్యానించారు. నాపై చర్యల విషయంలో టీఆర్ఎస్కు డెడ్లైన్ ఇవ్వను కానీ సమయం, సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని.. ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నానని తెలిపారు. సస్పెండ్ చేయాలి లేదా తీర్మానం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సంజయ్ కేసు.. హైకోర్టులో డీఎస్ పిటిషన్
హైదరాబాద్: నర్సింగ్ విద్యార్థినిలపై లైంగిక వేధింపుల కేసులో తన కుమారుడు సంజయ్ని అరెస్ట్ చేసి పోలీసు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడిని ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు పోలీసు మాన్యువల్ తయారు చేయలేదని పేర్కొన్నారు. నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్పై పెట్టిన కేసులు చెల్లవని హైకోర్టులో డీఎస్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. -
డీఎస్ తనయుడి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
అజ్ఞాతంలోకి సంజయ్.. పోలీసుల గాలింపు
సాక్షి, నిజామాబాద్: సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ తనయుడు సంజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో అతన్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. విద్యార్థినుల ఫిర్యాదుతో ధర్మపురి సంజయ్పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసు నమోదుకాగా, అరెస్ట్ చేయడానికి శుక్రవారం సాయంత్రం పోలీసులు సంజయ్ ఇంటికి వెళ్లారు. అయితే సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. (శాంకరి కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాం) సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ 11 మంది నర్సింగ్ విద్యార్థినులు గురువారం తెలంగాణ హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాయిని సూచన మేరకు ఈ ఉదయం నిజామాబాద్ సీపీని కలిసి విద్యార్థులు మరోసారి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో సంజయ్పై నిర్భయ యాక్ట్ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. సంజయ్ను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే తాను ఎవరినీ వేధించలేదంటూ సంజయ్ ఆ ఆరోపణలను ఖండించిన విషయం విదితమే. విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు కూడా. 'అది టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం' -
'లైంగిక ఆరోపణలు.. టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం'
సాక్షి, నిజామాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మరో కుమారుడు బీజేపీనేత ధర్మపురి అరవింద్ స్పందించారు. సంజయ్ మీద వచ్చిన ఆరోపణలు టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని అరవింద్ అన్నారు. సంజయ్పై వస్తున్న ఆరోపణలు తనకు వ్యక్తిగతంగా డ్యామేజీ జరుగుతుందని అనుకోవడం లేదన్నారు. తాము విడిపోయి 20 ఏళ్లు దాటిపోయిందని అరవింద్ తెలిపారు. 'రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు 10 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకంగా మారిపోయింది. మంత్రి ఎక్కడ ఉన్నారో ఎందుకు నిజామాబాద్ వైపు రారో తెలియదు. షుగర్ ఫ్యాక్టరీ కోసం రైతులు ఎదురుచూస్తుంటే రైతు ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు ఎంపీ కవిత ఐటీ హబ్ తెర మీదకు తెస్తారు. టీఆర్ఎస్ వాళ్లు యువత చెవుల్లో ఐటీ హబ్ పేరుతో గులాబీ పువ్వులు పెడుతున్నారు. విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ యూనివర్సిటీని ఎందుకు అభివృద్ధి చేయరు. ఎంతమంది విద్యార్థులను ఎంపీ కవిత అమెరికా పంపారు' అని ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. సంబంధిత వార్తలు : ఎవరితో సహజీవనం చేయడం లేదు : డీఎస్ కుమారుడు డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు! -
ఎవరితోనూ సహజీవనం చేయడం లేదు
సాక్షి, నిజామాబాద్ : తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్ స్పందించారు. 'నాపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవు. శాంకరి నర్సింగ్ కాలేజీ వేరే వాళ్లకు ఇచ్చాము. అక్కడికి నేను వెళ్ళలేదు. అడ్మిషన్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కాలేజీలో ఎవరు చదువుతున్నారో కూడా తెలియదు. నాకు భార్య పిల్లలు ఉన్నారు. ఎవరితో సహజీవనం చేయడం లేదు. ఎవరో విద్యార్థినులతో అలా చెప్పించారు. రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇవన్నీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎవరో తెలియదు కానీ మా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఇలాంటివి జరుగుతున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు' అని ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. కాగా, డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు. -
విద్యార్థినులపై డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు!
-
విద్యార్థినులపై డీఎస్ తనయుడి లైంగిక వేధింపులు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కుమారుడు సంజయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమంటున్నాయి. తక్షణమే సంజయ్ను అరెస్ట్ చేయాలనీ, శాంకరి నర్సింగ్ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని హోంమంత్రి నాయిని డీజీపీని ఆదేశించారు. -
టీఆర్ఎస్లో డీఎస్ ఒంటరి!
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు తీసుకున్న ఓ నిర్ణయం సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) క్రియాశీల రాజకీయాలపై పడిందా..? సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న డీఎస్ను అధికార టీఆర్ఎస్లో ప్రాధాన్యం తగ్గిపోవడం వెనుక ఈ అంశమే దాగుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్లో చేరిన ఆయనకు రాజ్యసభ స్థానం కూడా దక్కింది. కానీ నిజామాబాద్ రాజకీయాల కారణంగా కొద్దిరోజుల్లోనే ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గడం మొదలైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. డీఎస్ తనయుడు అరవింద్ బీజేపీలో చేరడం, అదీ నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీ తీసుకుని కాషాయ కండువా కప్పుకోవడంతో విషయం పెద్దదైందని చెబుతున్నారు. తన రాజకీయం, తన తనయుడి రాజకీయం వేర్వేరని.. తనకేం సంబంధం లేదని డీఎస్ తెలంగాణ భవన్ వేదికగా వివరణ ఇచ్చుకున్నా.. టీఆర్ఎస్ అధినాయకత్వాన్ని సంతృప్తిపర్చ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికంగానూ పట్టని వైనం.. ప్రస్తుతం టీఆర్ఎస్లో డీఎస్ ఒంటరి అయ్యారనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ కేంద్రంగా టీఆర్ఎస్లో ఆయన ఉనికే ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. కాంగ్రెస్ను వీడి డీఎస్తో పాటు టీఆర్ఎస్లోకి వచ్చిన కొందరు కార్పొరేటర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు గుర్తింపు లేకుండా పోయిందని చెబుతున్నారు. స్థానిక అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు వారిని పట్టించుకోవడం లేదని, పార్టీ పరంగా పదవులూ ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. మరోవైపు డీఎస్కు అధికారుల నుంచి సహకారం లభించడం లేదని, ఏ పనీ కావడం లేదని చెబుతున్నారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి ఉపాధిహామీ పథకానికి మ్యాచింగ్ గ్రాంటు ఇచ్చి ప్రతిపాదించిన పనులకు మండల పరిషత్లు సైతం ఆమోద తీర్మానాలు చేయడం లేదని సమాచారం. ఇక రాష్ట్ర స్థాయిలోనూ డీఎస్కు గుర్తింపు లేకుండా పోయిందని అంటున్నారు. డీఎస్తో సమ ఉజ్జీ అయిన మరో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు(కేకే)కు టీఆర్ఎస్లో మంచి ప్రాధాన్యమే లభిస్తోంది. పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్న ఆయన సంస్థాగతంగా మరోమారు సెక్రెటరీ జన రల్గా నియమితులు కావడం గమనార్హం. ఎటువైపు చూపు? రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్ తన రాజకీయ భవిష్యత్పై కీలక నిర్ణయం తీసుకునేందుకు ఇటీవల సమాలోచనలు జరిపారన్న ప్రచారం జరిగింది. ఆయన తిరిగి కాంగ్రెస్కు వెళతారని కొన్ని వర్గాలు పేర్కొనగా.. డీఎస్ ఆ వార్తలను ఖండించారు. తాజాగా తన తనయుడి మాదిరిగా డీఎస్ సైతం బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అరవింద్ బీజేపీలో చేరక ముందే డీఎస్ చేరికపై మంతనాలు జరిగాయన్న వార్తలు వెలువడ్డాయి. దీనిపై అధికార టీఆర్ఎస్ నుంచి బలమైన ఒత్తిడి రావడంతో పార్టీ మారకుండా నిలిచిపోయారని తెలుస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఆరేడు నెలల ముందైనా డీఎస్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని అంటున్నారు. -
డీఎస్ కుమారుడి 'ప్రకటన' కలకలం..
జనమంతా మోదీ వెంట నిలవాలంటూ జాతీయస్థాయి పత్రికకు భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం డీఎస్ పార్టీ మారతారని కొన్నాళ్లుగా ప్రచారం ఆ దిశగానే ఈ ప్రకటన అంటూ చర్చలు కుమారుడి ప్రకటనతో సంబంధం లేదన్న డీఎస్ సాక్షి, నిజామాబాద్: రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ ముఖ్యనేత డి.శ్రీనివాస్ పార్టీ మారతారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ మంగళవారం ఓ జాతీయస్థాయి పత్రికకు ఇచ్చిన భారీ ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న అరవింద్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ‘‘జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి..’’ అని పేర్కొంటూ ప్రకటన ఇచ్చారు. ఇది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే డీఎస్ ప్రధాన అనుచరుడిగా పేరున్న సంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ కొన్ని నెలల కిందట బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అరవింద్ తాజా ప్రకటన నేపథ్యంలోడీఎస్ కూడా పార్టీ మారతారనే వాదనకు బలం చేకూరుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా తాను పార్టీ మారతానని జరుగుతున్న ప్రచారాన్ని డీఎస్ ఖండించారు. అంటీముట్టనట్లుగా.. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డీఎస్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డిగా నియమితులయ్యారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగా కేసీఆర్ అవకాశం కల్పించారు. ఎంపీ పదవిలో ఉన్నా డీఎస్.. కొంతకాలంగా టీఆర్ఎస్లో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. ఆయన మొదటి కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కూడా టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఐదు నెలల క్రితం టీఆర్ఎస్ నిర్వహించిన సభ్యత్వ నమోదులో సంజయ్ తన పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్తో అంటీముట్టనట్లు ఉంటున్న డీఎస్, ఆయన కుటుంబీకులతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత కొంతకాలంగా టచ్లో ఉంటోంది. అరవింద్ కూడా ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను కలిసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అరవింద్ను సంప్రదించగా.. తాను ఇచ్చిన ప్రకటనతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తాను ఇప్పట్లో బీజేపీలో చేరడం లేదని, అలాంటిదేమైనా ఉంటే చెబుతామని అన్నారు. పార్టీ వీడను: డి.శ్రీనివాస్ ‘‘నా కుమారుడు అరవింద్ ఇచ్చిన ప్రకటనకు నాకూ ఎలాంటి సంబంధం లేదు.. ఆ ప్రకటన అంత ప్రాధాన్య అంశమేమీ కాదు. నేను టీఆర్ఎస్ను వీడేది లేదు. కేసీఆర్ వెంటే ఉంటాను. అరవింద్ చిన్న పిల్లవాడేమీ కాదు. ఆ ప్రకటన గురించి ఆయన్నే అడగాలి. అరవింద్ కూడా బీజేపీలో చేరుతాడని అనుకోవడం లేద’ ని డీఎస్ ‘సాక్షి’తో చెప్పారు. -
కాంగ్రెస్ని ముంచింది ‘డిగ్గీరాజా’నే
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీని నిండా ముంచిన ఘనత దిగ్విజయ్ సింగ్కే దక్కుతుందని తెరాస సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ స్పష్టం చేశారు. కేసీఆర్తో పొత్తును డిగ్గీ రాజా వ్యతిరేకించడమే తెలంగాణలో కాంగ్రెస్కు తీవ్ర నష్టం కలిగించిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో అయినా సరే ప్రజల సంతోషమే కీలక విషయమైన విషయమని, వారు సంతోషంగా ఉన్నారా లేదా అనేది వచ్చే ఎన్నికల్లోనే తేలుతుందని పాలకుల విజన్ అనేది మాటల్లో కాకుండా చేతల్లో ఉంటుందని ఆ విషయంలో కేసీఆర్ అద్వితీయుడని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు అప్పుడు ఉండి చేసిందేమిటి, ఇప్పుడు చేయబోయేది ఏమిటి అని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో రాజీ ప్రసక్తే లేదని ఈరోజుకీ ఈ విషయంలో రెండు రాష్ట్రాల్లో గొడవ రేగుతూనే ఉందంటూ డి. శ్రీనివాస్ చెబుతున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... కాంగ్రెస్ పార్టీలో అన్నీ అనుభవించిన తర్వాతే పక్కకు పోయారని మీపై ఒక విమర్శ? పార్టీకి సేవ చేసే పదవులు అనుభవించాను. కానీ మాట మాత్రంగా కూడా కనీసం చెప్పకుండా నా జిల్లాలో నేను తీసుకొచ్చి ఎదిగించిన అమ్మాయికి నా సీటు ఇస్తామని చెప్పడంతో చాలా గాయపడ్డాను. దీనిపై సోనియాగాంధీకే ఉత్తరం రాశాను. సమాధానం రాలేదు. ఎప్పటికైనా ఆమె పిలిపించి మాట్లాడుతుందని ఆశించాను. అది కూడా లేదు. దశాబ్దాలు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడిన నాకు కనీస సమాచారం చెప్పకుండా పక్కన బెట్టడం, తర్వాతయినా సీటు ఇస్తారన్న గ్యారంటీ లేకపోవడంతో చివరకు నిర్ణయం తీసుకుని పార్టీని వదిలిపెట్టాను. ఎక్కడ తేడా వచ్చిందంటారు? దిగ్విజయ్ సింగే ప్రధాన కారణం. 2007 నుంచి దిగ్విజయ్ సింగ్ ఈ రాష్ట్రంలో చేసిన వ్యవహారాలపై రాష్ట్ర విద్యామంత్రి స్థాయిలో సోనియాగాంధీకి ఉత్తరం రాశాను. వైఎస్ అప్పటికి బతికే ఉన్నారు. అయితే నేను రాసిన ఆ ఉత్తరం దిగ్విజయ్ చేతికి వెళ్లింది. అప్పటి నుంచి నాపై వ్యతిరేకత పెంచుకున్నారు. 2014కు ముందు మళ్లీ ఇన్చార్జ్గా వచ్చాక దిగ్విజయ్ నన్ను డామేజ్ చేయాలని చూసి, పార్టీనే నాశనం చేశాడు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు కలిసిపోతాయని చెప్పారు. అదీ జరగలేదు కదా? దాన్ని చెడగొట్టింది కూడా ఈ మహానుభావుడే. దిగ్విజయ్ సింగే చెడగొట్టాడు. కాంగ్రెస్, తెరాస పొత్తు అంటేనే ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కేసీఆర్ను కలుపుకోని పోవాల్సిందే అని నేను సోనియాతో రెండు మూడుసార్లు గట్టిగా చెప్పాను. ఎందుకు జరగలేదంటే కాంగ్రెస్ పార్టీలో కోటరీ ప్రభావం ఎక్కువ. తెలంగాణ సాధించిన క్రెడిట్ మీరు ఎవరికి ఇస్తారు? తెలంగాణ అనే కాదు ఏ ఉద్యమమైనా తీసుకోండి. ఫైటర్ విల్ గెట్ ది క్రెడిట్. నాట్ ది గివర్.. పోరాడిన వాడికే పేరు వస్తుంది కానీ ఇచ్చినవాడికి రాదు. ఆ కోణంలో సోనియా గాంధీ తప్ప మరెవరున్నా తెలం గాణను ఇచ్చి ఉండేవారు కాదు. ఆమె కన్విన్స్ అయ్యారు. తెలంగాణ ఇస్తే ఫలితాలు ఎలా ఉంటాయని ఆమె పది మందిలో చర్చించేవారు. మొత్తంమీద తెలంగాణను ఇవ్వాలని ఆమె నిర్ణయించుకుంది. తెలంగాణలో కేసీఆర్ పాలన ఎలా ఉందని మీ అభిప్రాయం? తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నదీ, మీడియాలో మీరు రాస్తున్నది తేడాగానే ఉండవచ్చు. కానీ బంగారు తెలంగాణ అనే అజెండానే ధ్యేయంగా కేసీఆర్ ముందుకెళుతున్నారు. సాగునీరు, తాగునీరు ఇవి రెండూ ఆయన చేపట్టిన మేజర్ ప్రాజెక్టులు. మరో మూడు, నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయగలిగితే ప్రభుత్వానికి బొలెడు డబ్బులు వస్తాయి. మరోవైపు.. డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా కడుతున్నారు. కానీ ప్రజలు ఆశిస్తున్న వేగంలో జరగటం లేదు. అనుకున్న బడ్జెట్లో పూర్తి చేయాలి. ఇదే సమస్య. మరో విషయం.. ఏకకాలంలో కేసీఆర్ చాలా పెద్దభారం తలకెత్తుకున్నారు. వాటన్నింటినీ సాధిస్తారనే విశ్వాసం నాకుంది. ఎందుకంటే నిబద్ధత ఉంది. రివ్యూ చేయగలరు, ఆలోచనలు ఉన్నాయి. ఆచరణాత్మకంగా ఆయన చాలా సింపుల్ మనిషి. ఒకమాటలో చెప్పాలంటే ఎన్సైక్లోపీడియా. ఆయనకు తెలియని సబ్జెక్టు లేదు. రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే తెలంగాణ సాధ్యమయ్యేది కాదనడంపై మీ అభిప్రాయం? అదేమీకాదు. 2004లో తెరాసతో పొత్తు పెట్టుకున్నప్పుడే సూత్రబద్ధంగా ప్రత్యేక తెలంగాణను అంగీకరిస్తానని వైఎస్ చెప్పారు. దాని సాధ్యాసాధ్యాల గురించి కూడా చాలా కండిషన్లు పెట్టారనుకోండి. కాని ప్రాథమికంగా తెలంగాణ ఇవ్వాల్సిందే అనే ఆలోచనకయితే వచ్చారాయన. పొత్తు కుదిరాక, ఎన్నికల మ్యానిఫెస్టోలోనే వర్కింగ్ కమిటీ తీర్మానాన్నే పెట్టాం. తెలంగాణను ఇచ్చే ప్రక్రియకు కాస్త టైమ్ పట్టవచ్చు కానీ కాంగ్రెస్ కానీ, ప్రత్యేకించి సోనియా కానీ తెలంగాణ ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తన కొంప తానే ముంచుకుంది కదా? దానికి చాలా కారణాలున్నాయి. అది కూడా హైకమాండ్ చేసిన పొరపాటే. కేసీఆర్ను కలుపుకుని పోటీ చేసి ఉంటే 95 సీట్లు వచ్చేవి. అలాంటప్పుడు కేసీఆర్ను సీఎంని చేస్తే తప్పేముంది. సోనియా గాంధీతో నేరుగా ఈ విషయాన్నే చర్చించాను. కేసీఆర్ లీడర్షిప్ అడుగుతున్నారట కదా అని సోనియా అడిగారు. మీ మనసులో ప్రత్యేకించి పలానా వారికి ఇవ్వాలని ఫిక్స్ కాలేదు కదా. కేసీఆర్ మీతో బాగానే ఉంటాడు. తాను కాంగ్రెస్ సీఎంగానే ఉంటారు. తప్పేముంది అని చెప్పాను. దానికి సోనియా స్పందించలేదు. కానీ ఆమెతో అంత లోతుగా చర్చించేవాడిని. వైఎస్సార్ చనిపోయాక చాలామంది ఎమ్మెల్యేలు జగన్కే సీఎం పదవి ఇమ్మని చెప్పినా తీర్మానం లేకుండానే రోశయ్యకు ఇచ్చారే? అలా కాదు. వైఎస్ అంత్యక్రియలు పూర్తి కాకముందే పాలనకోసం తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాల్సి ఉంది. ఆ రకంగా అన్ని పదవులు చేపట్టిన, సీనియర్ వ్యక్తి, అర్హత కూడా కలిగిన రోశయ్యను ఎంచుకున్నారు. అయితే ఆయన మధ్యంతర సీఎం అని చెప్పారు. అయితే ఆయను కొనసాగించాలా లేక మార్చాలా అనే విషయంపై నిర్ణయించుకోవడానికి అధిష్టానానికి ఒకటన్నర సంవత్సరం పట్టిది. కేసీఆర్, బాబు పాలనపై మీ వ్యాఖ్య? న్యాయంగా మాట్లాడితే నిజంగా తెలంగాణను కోరుకునే వాళ్లు ఇవ్వాళ రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్తో కలిసి కూర్చుని ఏం చేస్తే బాగుంటుందో పరస్పరం చర్చించుకోవాలి. నేను ఇంకా ప్రతిపక్షంలోనే ఉండి ఉంటే తప్పకుండా ఏది చేస్తే మంచో, కాదో కేసీఆర్తోనే చర్చించేవాడిని. తెలంగాణ సెంటిమెంటును అంత బలంగా ప్రతిష్టించిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి అడ్డుగోడ వద్దు. ఈ మూడేళ్లలో అగ్ర ప్రాధాన్యతలు ఎంచుకుని ఒక విజన్తో పనిచేస్తున్నారు కేసీఆర్. ఇక బాబు. తన రాష్ట్ర అభివృద్ధికోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఏపీలో జనం సంతోషంగా ఉన్నారా లేదా అనేది ఇప్పుడు కాదు. వచ్చే ఎన్నికల్లో తేలుతుంది. ఓటుకు నోటు కేసులో బాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని కేసీఆర్ అన్నారు. మరి బాబును ఇప్పుడు ఎవరు రక్షించారు? ఈ కేసు విషయంలో రాజీపడ్డారన్నమాట అవాస్తవం. ఈరోజుకీ ఈ విషయంలో రెండు రాష్ట్రాల్లోనూ తిట్టుకుంటూనే ఉన్నారు కదా. పైగా ఓట్లను డబ్బుతో కొనాలనుకున్న వ్యక్తి ఇప్పుడు దెబ్బతినిపోయాడు కూడా. కేసు నడుస్తోంది. ఫలితాలకోసం చూడాలి. (డి. శ్రీనివాస్తో ఇంటర్వూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/wfvLFn https://goo.gl/RFxflM -
కేసీఆర్కు సిపాయిగా ఉంటా : డీఎస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాజ్యసభ సభ్యునిగా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ను జీవితంలో మరచిపోలేనని, ఆయనకు రుణపడి ఉంటానని సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. ఈ సహకారానికి జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషిగా సిపాయిగా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు ఫౌండేషన్లకు పరిమితమయ్యాయని, అదే రెండేళ్ల సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం లో అనేకచోట్ల ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయని డీఎస్ పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్లో జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన భగీరథ పథకాలతోపా టు, ప్రాజెక్టుల నిర్మాణాలను చకచకా చేపడుతుందన్నారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడమే ఏకైక లక్ష్యంతో సీఎం చక్కటి విజన్తో ముందుకు సాగుతున్నారన్నారు. సీమాంధ్ర నాయకులతోపాటు తెలంగాణలోని కొందరు కాంగ్రెస్ నాయకులే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై మెతక వైఖరి అవలంభించారని, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి తామిద్దరం తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పడంతో ఆమె అనుకూలంగా వ్యవహరించారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణమే తమ కర్తవ్యమన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, వి.జి.గౌడ్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, నగర మేయర్ ఆకుల సుజాత పాల్గొన్నారు. ఘనస్వాగతం: రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన డీఎస్కు జిల్లాలోని ఇందల్వాయి టోల్గేట్ వద్గ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ‘కేసీఆర్కు షుక్రియా ర్యాలీ’ పేరుతో నిజామాబాద్ చేరుకున్నారు. -
కేసీఆర్తోనే బంగారు తెలంగాణ
♦ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం అనంతరం ♦ తొలిసారి జిల్లాకు.. డీఎస్కు ఘన స్వాగతం ♦ వందలాది వాహనాలతో భారీ ర్యాలీ చంద్రశేఖర్కాలనీ : బంగారు తెలంగాణ నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. చక్కటి ఆలోచనలతో ప్రణాళికబద్ధమైన విజన్తో తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్న సీఎం అడుగు జాడల్లో అందరం కలిసికట్టుగా నడిచి జిల్లాను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం తొలిసారి జిల్లాకు వచ్చిన డీఎస్కు టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ‘కేసీఆర్కు షుక్రీయా ర్యాలీ’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం, జిల్లా కేంద్రంలో సన్మాన సభను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ నుంచి ఉదయం 8.40 గంటలకు బయల్దేరిన డీఎస్కు మార్గమధ్యలో మేడ్చల్, తూప్రాన్, రామాయంపేట్, కామారెడ్డి, డిచ్పల్లిలలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని ఇందల్వాయి గేట్ వద్దకు చేరుకున్న డీఎస్కు జిల్లా నాయకులు, అనుచరులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం అక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్ యువసేన కార్యకర్తలు వందలాది బైకులు, కార్లతో మాధవనగర్లోని శ్రీ సాయిబాబా దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డీఎస్కు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సోమయ్య నేతృత్వంలో ఆలయ అర్చకులు పూర్ణాకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన డీఎస్ అనంతరం.. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అక్కడి నుంచి మొదలైన భారీ ర్యాలీ బోర్గాం(పి), ఆర్యనగర్, వినాయక్నగర్, పులాంగ్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, బడాబజార్, ఆజాంరోడ్డు, నెహ్రూ పార్కు చౌరస్తా, గాంధీగంజ్ చౌరస్తా మీదుగా రాజీవ్గాంధీ ఆడిటోరియానికి చేరుకుంది. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో డీఎస్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీపరంగా తలనొప్పి వ్యవహారాలు ఉండవద్దని, ఐక్యంగా ముందుకు సాగుదామని సూచించారు. విభేదాలు, రాగ ద్వేషాలు పక్కనబెట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరం కలసి కట్టుగా జిల్లాను రాష్ట్రంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వంపై అపారమైన విశ్వాసం ఉండటంతోనే ఆయనకు ప్రభుత్వాన్ని అప్పగించారని తెలిపారు. గొప్ప చరిత్ర గల కాంగ్రెస్లో హేమాహేమీలు, అనేక సేవలు చేసిన వారూ ఎన్నెన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి వదిలివేశారన్నారు. అలాంటి వారు ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు నిర్మిస్తే డిజైన్ల మార్పు పేరోత రాద్దాంతం చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. చకచక ప్రాజెక్టుల నిర్మాణం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన భగీరథ పథకాలతో ప్రాజెక్టుల నిర్మాణాలను చకచక చేపడుతోందని డీఎస్ పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి అహర్నిషలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉందామన్నారు. మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. సీనియర్ నాయకుడు, జిల్లాకు పెద్దదిక్కుగా ఉన్న డీఎస్ను సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా చేశారన్నారు. విభేదాలు, కలహాలకు తావివ్వకుండా విశ్వాసంతో, అంకితభావంతో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేద్దామన్నారు. రెండు సార్లు పీసీసీగా పని చేసిన డీఎస్ సమర్థుడైన, ఆలోచనపరడైన నాయకుడని, హుందాతనం, సహృదయం గల వ్యక్తి అని పొగడ్తలతో ముంచెత్తారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎమ్మెల్సీలు డాక్టర్ భూపతిరెడ్డి, వీజీ గౌడ్, జెడ్పీ చెర్మైన్ దఫేదార్ రాజు, మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి, ఐడీసీఎస్ మాజీ చెర్మైన్ మునిపల్లి సాయరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నేతలు రాంకిషన్రావు, ఆదెప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతా తానై వ్యవహరించిన సంజయ్.. ‘కేసీఆర్కు షుక్రీయా ర్యాలీ’ పేరుతో నిర్వహించిన స్వాగత ఏర్పాట్లను డీఎస్ తనయుడు సంజయ్ అంతా తానై నడిపించారు. మూడ్రోజుల నుంచి ఆయన నేతలు, కార్యకర్తలను సమన్వయం చేశారు. -
'కేసీఆర్ తప్ప ఎవరు సీఎం అయినా...'
నిజమాబాద్: ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి సాధించలేనిది సీఎం కేసీఆర్ రెండేళ్లలో సాధించారని సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) అన్నారు. కేసీఆర్ తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ పని అయిపోయేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా శుక్రవారం సొంత జిల్లాకు వచ్చిన ఆయనకు నిజామాబాద్ లోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తోందని చెప్పారు. 2019లోనూ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, హరితహారం కార్యక్రమంలో భాగంగా డీఎస్ పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. -
ఇందూరుకు నేడు ఎంపీ శీనన్న
♦ రాజ్యసభ సభ్యుడిగా మొదటి సారి జిల్లాకు.. ♦ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద స్వాగత ఏర్పాట్లు ♦ కృతజ్ఞతగా ‘కేసీఆర్ అన్నకు షుక్రియా’కు ర్యాలీ ♦ ఘనస్వాగతం పలకనున్న టీఆర్ఎస్ శ్రేణులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) నేడు జిల్లాకు రానున్నారు. ఇటీవలే రాజ్యసభ్య సభ్యుడిగా ఎన్నికైన ఆయన తొలిసారిగా జిల్లాకు శుక్రవారం వస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం కారులో బయలుదేరనున్న డీఎస్ మధ్యాహ్నం వరకు జిల్లాకు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఆయనకు ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇందూరు నుంచి అంచెలంచెలుగా పెద్దల సభకు ఎదిగిన ధర్మపురి శ్రీనివాస్ ఎంపీగా మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు, అనుచరులు భారీ ఏర్పా ట్లు చేశారు. డీఎస్ తనయుడు, మాజీ నగర మేయర్ ధర్మపురి సంజయ్(జూనియర్ డీఎస్) ఆధ్వర్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు మాజీ డీసీఎంఎస్ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మునిపల్లి సాయరెడ్డి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో కలిసి గ్రామాలు తిరిగారు. మధ్యాహ్నం 12.30 గంటలకు .. హైదరాబాద్ నుంచి 12.30 గంటలకు జిల్లాకు చేరనున్న రాజ్యసభ సభ్యులు డీఎస్కు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుచరులు, అభిమానులు ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఘన స్వాగతం పలుకుతారు. ఈ మేరకు డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ పర్యవేక్షణలో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. డీఎస్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశాక మొదటిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా ఈ ర్యాలీలో వేలాదిగా శీనన్న అభిమానులు, పార్టీనాయకులు, కార్యకర్తలు, నగర, రూరల్ నియోజకర్గ పార్టీ నాయకులుతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులు, శ్రేయోభిలాషులు పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అక్కడి నుంచి కార్లతో కాన్వాయ్గా మాధవనగర్లోని శ్రీ సాయిబాబా దేవాలయం వరకు చేరుకుంటారు. మాధవనగర్ సాయిబాబా ఆలయంలో డీఎస్కు ఆయన అనుచరు లు ఘన స్వాగతం పలికి ‘బాబా’ వద్ద ప్రత్యేక పూజలు చేసి అనంతరం శాలువ కప్పి సన్మానిస్తారు. ఆ తర్వాత డీఎస్కు ఎంపీగా కల్పిం చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు పార్టీ వర్గాలు ‘కేసీఆర్ అన్నకు షుక్రియా ర్యాలీ’ని చేపట్టనున్నారు. రాజీవ్గాంధీ ఆడిటోరియంలో సమావేశం మాధవనగర్ నుంచి పెద్ద ఎత్తున పార్టీశ్రేణులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో డీఎస్ ర్యా లీని ప్రారంభించి అక్కడి నుంచి బోర్గాం(పి), ఆర్యనగర్, వినాయక్నగర్, పులాంగ్ చౌరస్తా, వర్ని రోడ్డు, రాజరాజేంద్ర చౌరస్తా, బడాబజా ర్, ఆజాంరోడ్డు, నెహ్రూపార్క్ చౌరస్తా, గాంధీచౌక్, బస్టాండ్, స్టేషన్రోడ్డు మీదుగా రాజీవ్గాంధీ ఆడిటోరియం వరకు కొనసాగించేం దుకు రూట్మ్యాప్ను తయారు చేశారు. అనంతరం రాజీవ్గాంధీ ఆడిటోరియంలో డీఎస్కు అభినందనసభ ఏర్పాటు చేశారు. రాజ్యసభ స భ్యునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రానికి వస్తున్న డీఎస్కు టీఆర్ఎస్ నాయకు లు, ఆయన అనుచరవర్గీయులు నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా హరి తహారం కార్యక్రమం ప్రారంభిస్తుండగా.. అం దులో భాగంగా శుక్రవారం రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ జిల్లాలోని ఆయా ప్రాంతా ల్లో హరితహారంలో పాల్గొని మొక్కలు నాటనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఇందల్వాయి టోల్గేట్ వద్ద, మధ్యాహ్నం 1.30 గంటలకు మాధవనగర్ సా యిబాబా మందిరం వద్ద, మధ్యాహ్నం 3 గంట లకు రాజీవ్గాంధీ ఆడిటోరియంలో మొక్కలు నాటుతారు. -
నేడు డీఎస్ ప్రమాణ స్వీకారం
♦ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవ ఎన్నిక ♦ ఎంపీ కవిత ప్రత్యేక చొరవతో.. ♦ ఢిల్లీకి తరలివెళ్లిన అనుచరులు, అభిమానులు ♦ వచ్చే నెల 7న జిల్లాకు రాక సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాజ్యసభ సభ్యుడిగా ధర్మపురి శ్రీనివాస్ మం గళవారం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీఆర్ఎస్ అధికార పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ డి.శ్రీనివాస్ను రాజ్యసభకు ఎంపిక చేసిన విషయం విధితమే. గత నెల 24 రాజ్యసభకు నోటిఫికేషన్ వెలువడగా.. 26న డీఎస్ను టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించింది. ఈ వ్యవహరంలో నిజామాబాద్ ఎంపీ కవిత కీలకంగా వ్యవహరించారు. అనంతరం డీఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆయన అనుచరులు, పలువురు కార్పొరేటర్లు భారీ సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు. రైళ్లల్లో ఒక రోజు ముందుగానే వెళ్లారు. సీనియర్ నేతగా అనుభవం రాజ్యసభ సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ధర్మపురి శ్రీనివాస్కు 32 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. సుధీర్ఘ అనుభవజ్ఞుడిగా అనేక పదవులు చేపట్టిన నాయకుడిగా డీఎస్ పేర్కొందారు. ప్రస్తుతం ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా మొదటిసారిగా కాలుమోపనున్నారు. ఢిల్లీ పెద్దల సభలో ఓ సీనియర్ నేతగా డీఎస్కు అవకాశం కల్పిస్తే.. బీసీ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందన్న ఎంపీ కవిత సూచన మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేసిన డీఎస్, అప్పటి నుంచే కేసీఆర్తో సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. ఈ అంశాలు కూడా డీఎస్కు కలిసొచ్చినట్లు చెప్తున్నారు. అంతేగాకుండా టీఆర్ఎస్ డీఎస్ చేరిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం మొదట ప్రభుత్వ సలహాదారుగా కేబినేట్ హోదా కల్పించిన కేసీఆర్ అనంతకం ఎంపీగా అవకాశం కల్పించారు. దీంతో సీనియర్ రాజకీయ వేత్త, బీసీ వర్గాల నేతగా డీఎస్కు తగిన ప్రాధాన్యం కల్పించారన్న చర్చ సాగుతోంది. వచ్చే నెల 7న డీఎస్ రాక రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన డీఎస్ ప్రమాణ స్వీకారం అనంతరం వచ్చే నెల 7న మొదటిసారిగా జిల్లాకు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అనుచరులు సన్నాహాలు ప్రారంభించా రు. ఇందుకు సంబంధించి అనుచరులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రారంభం నుంచి నగరంలోని డీఎస్ ఇంటి వరకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రత్యేక సలహాదారు పదవికి డీఎస్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు (అంతర్రాష్ట్ర సంబంధాలు) పదవికి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు అందజేయగా ప్రభుత్వం దాన్ని వెంటనే ఆమోదిస్తూ ఉత్తర్వులు (జీఓ ఆర్టీ నం.1206) జారీ చేసింది. రాష్ర్ట్రంలో రెండు రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులుగా కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావుతోపాటు తన పేరును పార్టీ నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నామినేటెడ్ పదవిని వదులుకోవాలని డీఎస్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 31న ఆయన రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతేడాది ఆగస్టు 21న ప్రభుత్వం అంతర్రాష్ట్ర సంబంధాల వ్యవహారాల కోసం డీఎస్ను ప్రత్యేక సలహాదారుగా ఏడాది పదవీకాలానికి నియమించింది. -
టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం: డీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్తోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ ప్రత్యేక సలహా దారు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం డీఎస్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ప్రత్యేక ప్రణాళికలతో సీఎం కేసీఆర్ ముందుకు వెళుతున్నారని వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల హామీలు శ్రుతిమించుతున్నాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధికి జీహెచ్ఎంసీ ఎన్నికలు అవకాశం కల్పిస్తున్నాయని.. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రభుత్వ పథకాలు సరిగా అమలవుతాయని వివరించారు. గ్రేటర్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్షోలకు వస్తున్న జనమే దీనికి నిదర్శనమన్నారు. -
డీఎస్కు కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు
- కుటుంబ సమేతంగా డీఎస్ ఇంటికి వెళ్లిన సీఎం సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)కు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం 67వ పుట్టిన రోజు జరుపుకొన్న డీఎస్ ఇంటికి సీఎం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి వె ళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా డీఎస్తో పుట్టిన రోజు కేక్ కట్ చేయించారు. సీఎం వెంట రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు. సీఎం కుటుంబ సభ్యులంతా డీఎస్ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరునేతలు కొద్ది సేపు వివిధ అంశాలపై చర్చించినట్లు డీఎస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement