-
ముత్తు నందిని ప్యాలెస్ ఇష్టాల ఇల్లు
రాజ్ చందర్ పద్మనాభన్, నాగ జయలక్ష్మి దంపతులు తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారిలో నివసించేవారు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో వీరు అనుసరించిన విధానం ఇప్పుడు దేశమంతటినీ ఆకర్షిస్తోంది. పర్యావరణ ప్రేమికులనైతే మరీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. రెండేళ్ల కిందట గృహప్రవేశం చేసుకున్న కొత్త ఇల్లది. అయితే ఆ ఇంట్లో అడుగుపెడితే కాలం గిర్రున సినిమా రీల్లాగ వందేళ్ల వెనక్కి తిరిగిపోయిందా అనిపిస్తుంది. ఇంటిని చూడడానికి వచ్చిన వాళ్లను అతిథి మర్యాదలతో ముంచెత్తుతారు ఈ దంపతులు. సేంద్రియ పద్ధతిలో పండించిన దినుసులు, కాయగూరలతో సంప్రదాయ తమిళ, చెట్టినాడు వంటలను వడ్డిస్తారు. ఎర్రమట్టి, సున్నపు రాయితో నిర్మించిన ఇంట్లో భూగర్భ జలాలను పరిరక్షించే ఏర్పాటు ఉంది. బంకమట్టి నిర్మాణం కావడంతో ఎండాకాలం చల్లగా ఉంటుంది. నేచర్ ఫ్రెండ్లీ ట్రావెల్ను ఇష్టపడే వాళ్లు ఇక్కడ బస చేస్తుంటారు. బస చేయకపోయినా చూసి పోవడానికి వచ్చేవాళ్లు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ కాలంలో ఇంటిని ఇలా ఎందుకు కట్టుకున్నారనే ప్రశ్న దాదాపుగా ప్రతి ఒక్కరి నుంచి ఎదురవుతుంటుంది. జయలక్ష్మి ప్రతి ఒక్కరికీ పూసగుచ్చినట్లు వివరిస్తుంటుంది. బాల్యంలోకి వెళ్లారాయన! ‘‘రాజ్చందర్ వృత్తిరీత్యా జియో డాటా అనలిస్ట్. ఆయనకు ఇష్టమైన రోజులంటే చిన్నప్పుడు వాళ్ల అమ్మమ్మ గారింట్లో గడిపిన బాల్యమే. పైగా రాజ్ అభిరుచి, విధి నిర్వహణ కూడా పర్యావరణవేత్తలతో కలిసి పని చేయడమే. ఈ రెండు ఇష్టాలను కలుపుతూ చక్కటి ఇల్లు కట్టుకోవాలని ఎప్పుడూ చెప్పేవారు. నాక్కూడా మా సంప్రదాయ నిర్మాణంలో ఉండే సౌందర్యం చాలా ఇష్టం. ఇద్దరి అభిరుచులూ కలవడంతో ఇంటిని ఇలా కట్టుకున్నాం. మా ఇద్దరి ఇష్టాల మేరకు ఎలా కట్టుకోవాలో ఒక ఐడియా వచ్చేసింది. ఎక్కడ కట్టాలనే విషయంలో ఒక అభిప్రాయానికి రావడం కొంచెం కష్టమే అయింది. లొకేషన్ సెర్చింగ్ మొదలు పెట్టాం. సంజీవని శకలం కన్యాకుమారికి సమీపంలో పోథయాడి గ్రామాన్ని చూసినప్పుడు కొండలు, పచ్చటి చెట్లతో ప్రదేశం బాగుందనిపించింది. ఆశ్చర్యంగా మరో విషయం తెలిసింది. అదేంటంటే... రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు వైద్యం కోసం హనుమంతుడు ఏకంగా సంజీవని మొక్క ఉన్న పర్వతం అంతటినీ ఎత్తుకొచ్చాడని విన్నాం. వైద్యం చేసిన తర్వాత ఆ పర్వతాన్ని తిరిగి తీసుకెళ్లే క్రమంలో పర్వతంలోని ఒక శకలం విరిగి కింద పడి పోయిందని, ఆ శకలమే ఈ కొండ అని చె΄్పారు స్థానికులు. వాళ్ల విశ్వాసాన్ని పక్కన పెడితే ఆ కొండమీద చుట్టు పక్కల ఉన్న మొక్కలన్నీ ఔషధ మొక్కలే. ప్రకృతితో మమేకమై నివసించడానికి మాకు ఇంతకంటే సౌకర్యవంతమైన ప్రదేశం మరోటి ఉండదేమో అనిపించింది. అంతే... 2021లో నిర్మాణం మొదలు పెట్టాం. ఒక ఏడాదిలో తమిళ, వేనాడు, చెట్టినాడు సంస్కృతుల సమ్మేళనమైన మా ఇంటి నిర్మాణం పూర్తయింది. సంప్రదాయ కళాకృతుల సేకరణ నా హాబీ. ఇంటిని తమిళ సంప్రదాయ సంస్కృతికి ప్రతీకగా మలిచాను. ఇంటి ముఖద్వారం నుంచి నేల, గోడ, మెట్లు, పై కప్పు, అలంకరణ వస్తువులు ప్రతి ఒక్కటీ తమ వైభవాన్ని తామే చెప్పుకుంటాయి. పర్యావరణ హితమైన సున్నపు పోడి ఇటుకలు, ఎర్ర మట్టి, ఆవుపేడ, ధాన్యం పోట్టు, కోడిగుడ్లు, బెల్లంతోపాటు అత్తంగుడి నది తీరాన దొరికే ఇసుకతో తయారు చేసే అత్తంగుడి టైల్స్ను వాడాం. పై కప్పుకి కాంక్రీట్ వాడకాన్ని తగ్గించి ఫిల్లర్ స్లాబ్ టెక్నిక్ ఉపయోగించాం. వర్షపు నీటిని నిల్వ చేయడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్, కరెంటుకోసం సోలార్ ప్యానెల్స్ పెట్టాం. ఈ మట్టి సౌధంలో 5బెడ్ రూమ్లు, మూడు బాల్కనీలు, మూడు లివింగ్ స్పేస్లు ఉన్నాయి. ఇప్పటివరకు రెండు వందల మందికి పైగా పర్యాటకులు ఈ హోమ్ స్టేలో బస చేశారు. ఆహారం కూడా తమిళనాటప్రాంంతాల వారీగా విలసిల్లిన విభిన్నమైన రుచులుంటాయి. ఇంటి ఆవరణలో అన్ని రకాల కూరగాయలనూ పండిస్తాం. వంటగదిలో వచ్చే వ్యర్థాలనే ఎరువుగా వేస్తాం’’ అని తమ పర్యావరణ హిత భవనం ముత్తు నందిని ప్యాలెస్ గురించి వివరించింది జయలక్ష్మి. -
ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్
సరోజ్ బెన్, జరీనా, ముంతాజ్లాంటి సామాన్య మహిళలు తమలాంటి సామాన్యుల కోసం వాయు కాలుష్యంపై దిల్లీ గల్లీలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోర్టబుల్ ఏక్యూఐ(ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) మానిటర్లతో ‘వాయు కాలుష్య నివారణకు మన వంతుగా చేయాల్సింది’ అనే అంశంపై ప్రచారం చేస్తున్నారు... దిల్లీలోని నందనగిరి ప్రాంతం. చేతిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మానిటర్తో 39 సంవత్సరాల సరోజ్ బెన్ ఇద్దరు ముగ్గురు మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ‘విషయం ఏమిటీ?’ అని అడుగుతూ మరో ఇద్దరు మహిళలు, ఆ తరువాత మరో ముగ్గురు మహిళలు వచ్చారు. అడిగిన వారికల్లా ఓపిగ్గా చెబుతోంది సరోజ్. ‘మీ ఏరియాలో వాయుకాలుష్యం ప్రమాదకరమైన స్థాయిలో ఉంది...’ అంటూ ప్రారంభించి ఆ సమస్య తలెత్తడానికి కారణాలు, దీని ప్రభావం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, నివారణ చర్యలు... మొదలైన వాటి గురించి చెబుతూ పోయింది. ‘మీరు గవర్నమెంట్ ఆఫీసరా?’ అని ఎవరో అడిగారు. ‘కాదమ్మా, నేనూ నీలాగే గృహిణిని. పెరుగుతున్న వాయుకాలుష్యం గురించి బాధపడి, కాలుష్య నివారణకు నా వంతుగా ఏదైనా చేయాలని ఇలా వీధులు తిరుగుతున్నాను’ అని చెప్పింది సరోజ్. సరోజ్ బెన్ మాత్రమే కాదు గ్రాస్రూట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ‘మహిళా హౌజింగ్ ట్రస్ట్’ కమ్యూనిటీ మూమెంట్ ‘హెల్ప్ దిల్లీ బ్రీత్’ ప్రభావంతో ఎంతోమంది సామాన్య మహిళలు వాయు కాలుష్యంపై అవగాహన చేసుకున్నారు. తమలాంటి వారికి అవగాహన కలిగించడానికి వాడ వాడా తిరుగుతున్నారు. కాలుష్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, సాధారణ పౌరుల్లో వాయు కాలుష్యంపై అవగాహన కలిగించడానికి మహిళా హౌజింగ్ ట్రస్ట్, హెల్ప్ దిల్లీ బ్రీత్ సంస్థలు సామాన్య మహిళలకు శిక్షణ ఇస్తున్నాయి. పోర్టబుల్ ఏక్యూఐ మానిటర్లతో దిల్లీలోని గల్లీలు తిరుగుతూ వాయుకాలుష్య నివారణపై ప్రచారం నిర్వహిస్తున్న ఈ మహిళలు ‘ఏక్యూఐ ఉమెన్ అంబాసిడర్’లుగా గుర్తింపు పొందారు. ఏక్యూఐ అంబాసిడర్లు హెల్ప్ దిల్లీ బ్రీత్, మహిళా హౌజింగ్ ట్రస్ట్ నిర్వహించే సమావేశాలకు హాజరు కావడమే కాదు ప్రచార వ్యూహాల గురించి కూడా ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. ‘కమ్యూనిటీ యాక్షన్ గ్రూప్’గా ఏర్పడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు. ‘వాయు కాలుష్యం గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఒక గృహిణితో అన్నప్పుడు నా ముఖం మీద తలుపు వేసినంత పనిచేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఈసారి అలా కాదు ఇలా చేయాలనుకున్నాను. దిల్లీలోని నెహ్రూ నగర్కు వెళ్లినప్పుడు నా బ్యాగులో ఉన్న కొన్ని పోస్టర్లను ఆమెకు చూపాను. అవి చూసి అయ్యో ఏమిటి ఇది అన్నట్లుగా అడిగింది. అలా మెల్లగా టాపిక్ను మొదలుపెట్టాను. ఆమె చాలా శ్రద్ధగా విన్నది. పరిస్థితులను బట్టి ఏ రూట్లో వెళ్లాలో అప్పటికప్పుడు నిర్ణయించుకుంటే సమస్య ఉండదు’ అంటుంది సీమ అనే ఏక్యూఐ అంబాసిడర్. ‘ఉపన్యాసం ఇచ్చినట్లు కాకుండా మన ఇంటి పరిసరాల్లో ప్రమాదం పొంచి ఉంటే ఎలా చెబుతామో అలా వాయు కాలుష్యం గురించి చెబుతాను. ఉదాహరణలతో అర్థమయ్యేలా చెబుతాను. పెద్దవాళ్లకే సాధ్యం కాని పెద్ద సమస్య ఇది. మన వల్ల ఏమవుతుంది... అని కొందరు అంటారు. మీలా అందరూ అనుకోవడం వల్లే అది పెద్ద సమస్యగా మారింది అని నేను అంటాను. మొదటగా మీరు చేయాల్సింది మీ పెరట్లో ఒక మొక్క నాటడం అని సలహా ఇస్తాను. నేను చెప్పింది వారికి నచ్చినట్లు వారి హావభావాలను బట్టి గ్రహిస్తాను’ అంటుంది ఏక్యూఐ అంబాసిడర్ ముంతాజ్. ఏక్యూఐ అంబాసిడర్ల కృషి వృథా పోవడం లేదు. ఇప్పుడు ఎంతో మంది కాలుష్యాన్ని నియంత్రించే చర్యల గురించి నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నారు. వారు పెద్ద చదువులు చదుకున్నవారేమీ కాదు. సామాన్య మహిళలు. ఏక్యూఐ అంబాసిడర్ల విజయానికి ఇది ఒక ఉదాహరణ. మార్పు మొదలైంది... జరీనా ప్రతిరోజూ ఏక్యూఐ మానిటర్తో ఉదయం, సాయంత్రం వివిధ ప్రాంతాలలో పొల్యూషన్ లెవెల్స్ను చెక్ చేస్తుంది. ‘కొన్నిసార్లు కాలుష్యం తక్కువగా, మరికొన్నిసార్లు ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు ఏక్యూఐ మానిటర్పై ఎరుపు రంగు కనిపిస్తుంది. కొత్త సంఖ్యలు కనిపిస్తాయి. ఒకప్పుడు వాయుకాలుష్యం గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. అయితే ఇప్పుడు చాలామందిలో మార్పు రావడాన్ని గమనించాను’ అంటుంది జరీనా.ఏక్యూఐ అంబాసిడర్ అయిన జరీనా వాయునాణ్యత, వెంటిలేషన్, బొగ్గు పొయ్యిలకు దూరంగా ఉండడం... మొదలైన అంశాలపై దిల్లీ గల్లీలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇలా కూడా... వాడ వాడలా తిరుగుతూ వాయుకాలుష్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడమే కాదు లేబర్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు, పీఎం సురక్షిత్ మాతృత్వ అభియాన్, సుమన్ యోజనలాంటి ప్రభుత్వ సామాజిక, సంక్షేమ పథకాల గురించి భనన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు తెలియజేస్తున్నారు ఏక్యూఐ అంబాసిడర్లు. స్కీమ్కు సంబంధించిన పత్రాలు నింపడం నుంచి ఐడీ కార్డ్లు వారికి అందేలా చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయం అందిస్తున్నారు. -
Interim Budget 2024: బయో–ఫౌండ్రీకి స్కీము
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల చర్యల్లో భాగంగా త్వరలో బయో–తయారీ, బయో–ఫౌండ్రీ కోసం కొత్తగా స్కీమును ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బయో–ఫార్మా, బయో–ప్లాస్టిక్స్, బయోడిగ్రేడబుల్ పాలిమర్స్ మొదలైన వాటికి ఇది ఊతమివ్వనుంది. ప్రపంచ ఎకానమీని మార్చేయగలిగే సత్తా ఈ స్కీముకు ఉంటుందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ను సాకారం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. 2014లో కేవలం 10 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ బయో ఆర్థిక వ్యవస్థ గడిచిన ఎనిమిది, తొమ్మిదేళ్లలో 140 బిలియన్ డాలర్లకు చేరిందని సింగ్ చెప్పారు. -
Year End 2023: అన్నీ మంచి శకునములే!
ఓజోన్ పొరకు గండి పూడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరుగుతోంది. పర్యావరణపరంగా వరుస దుర్వార్తల పరంపర నడుమ ఇలాంటి పలు సానుకూల పరిణామాలకు కూడా 2023 వేదికవడం విశేషం! బ్రెజిల్లో అమెజాన్ అడవుల క్షీణత బాగా తగ్గుముఖం పట్టడం మొదలు ఇటీవలి కాప్28 సదస్సులో కీలక పర్యావరణ తీర్మానం దాకా ముఖ్యమైన ఇలాంటి ఓ ఐదు పరిణామాలను గమనిస్తే... సంప్రదాయేతర ఇంధనోత్పత్తి పైపైకి... శిలాజ ఇంధనాలకు వీలైనంత త్వరగా స్వస్తి పలికితేనే గ్లోబల్ వారి్మంగ్ భూతాన్ని రూపుమాపడం సాధ్యమని పర్యావరణవేత్తలంతా ఎప్పటినుంచో చెబుతున్నదే. సౌర విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం ఇందుకున్న మార్గాల్లో ముఖ్యమైనది. ఈ విషయంలో 2023లో ప్రపంచ దేశాలు చెప్పుకోదగ్గ ప్రగతినే సాధించాయి. అంతర్జాతీయంగా సంప్రదాయేతర ఇంధనోత్పత్తి ఈ ఒక్క ఏడాదే ఏకంగా 30 శాతం, అంటే 107 గిగాబైట్లకు పైగా పెరిగిందట! అంతర్జాతీయ ఇంధన సంస్థ ఈ మేరకు వెల్లడించింది. వాతావరణ కాలుష్య కారక దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్న చైనాయే ఈ విషయంలోనూ అందరికంటే ముందుంది! చైనా సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గత జూన్ నాటికే మిగతా ప్రపంచ దేశాలన్నింటి ఉమ్మడి సామర్థ్యాన్ని కూడా మించిపోయిందని ఒక నివేదిక తేల్చడం విశేషం. అదే సమయంలో చైనాలో బొగ్గు ఉత్పత్తి కూడా కొద్ది నెలలుగా తారస్థాయికి చేరినా, త్వరలోనే అది బాగా దిగొస్తుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తుండటం మరో సానుకూల పరిణామం. హాలోవీన్ వేడుక సందర్భంగా పోర్చుగల్ అక్టోబర్ 31 నుంచి వరుసగా ఆరు రోజుల పాటు కేవలం సంప్రదాయేతర ఇంధన వనరులను మాత్రమే వినియోగించి ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఓజోన్ క్రమంగా కోలుకుంటోంది... అతినీల లోహిత కిరణాల వంటివాటి బారి నుంచి భూమిని కాపాడే కీలకమైన ఓజోన్ పొర కోలుకునే ప్రక్రియ 2023లో మరింతగా వేగం పుంజుకుంది. విచ్చలవిడి క్లోరోఫ్లోరో కార్బన్ల విడుదల తదితరాల కారణంగా ఓజోన్కు రంధ్రం పడిందని, అది నానాటికీ పెరుగుతోందని 1980ల నుంచీ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు అంతర్జాతీయంగా జరిగిన ప్రయత్నాలు ఫలితాలిస్తున్నట్టు వారు తాజాగా చెబుతున్నారు. ఇందుకోసం చేసుకున్న మాంట్రియల్ ఒప్పందం ప్రకారం క్లోరో ఫ్లోరో కార్బన్లకు పూర్తిగా స్వస్తి చెప్పాలన్న లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కృషి ఇలాగే కొనసాగితే 2040 కల్లా ఓజోన్ పొర 1980లకు ముందునాటి స్థితికి మెరుగు పడటం ఖాయం’’ అని ఐరాస తాజా నివేదికలో హర్షం వెలిబుచి్చంది. అయితే అంటార్కిటికా మీద మాత్రం ఓజోన్కు పడ్డ రంధ్రం గతంతో పోలిస్తే మరింతగా విస్తరించిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెజాన్కు ఉద్దీపన అమెజాన్ అడవులను ప్రపంచం పాలిట ఊపిరితిత్తులుగా, ఆకుపచ్చని వలగా అభివరి్ణస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద వర్షాధారిత అడవులివి. బ్రెజిల్లో కొన్నేళ్లుగా అడ్డూ అదుపూ లేకుండా సాగుతూ వస్తున్న వాటి విచ్చలవిడి నరికివేతకు 2023లో భారీ బ్రేక్ పడింది. బ్రెజిల్ గురించే చెప్పుకోవడం ఎందుకంటే 60 శాతానికి పైగా అమెజాన్ అడవులకు ఆ దేశమే ఆలవాలం! గత జూలై నాటికే అక్కడ అడవుల నరికివేత ఏకంగా 22.3 శాతం దాకా తగ్గుముఖం పట్టిందట. గత ఆర్నెల్లలో ఇది మరింతగా తగ్గిందని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. 2030 నాటికి బ్రెజిల్లో అడవుల నరికివేతను పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని ప్రకటించిన నూతన అధ్యక్షుడు లులా డసిల్వా ఆ దిశగా గట్టి చర్యలే తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోష్ పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచమంతటా దుమ్ము రేపుతున్నాయి. 2023లో వాటి అమ్మకాల్లో అంతర్జాతీయంగా విపరీతమైన పెరుగుదల నమోదైంది. అగ్ర రాజ్యం అమెరికాలోనైతే ఈవీల అమ్మకాలు ఆల్టైం రికార్డులు సృష్టించాయి! 2023లో అక్కడ 10 లక్షలకు పైగా పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడైనట్టు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. చైనాలో కూడా 2023లో మొత్తం వాహనాల అమ్మకాల్లో 19 శాతం వాటా ఈవీలదేనట! పలు యూరప్ దేశాల ప్రజలు కూడా వాటిని ఇబ్బడిముబ్బడిగా కొనేస్తున్నారు. అక్కడ 2022తో పోలిస్తే ఈవీల అమ్మకాల్లో 55 శాతానికి పైగా వృద్ధి నమోదైంది! మొత్తమ్మీద 2023లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం వాహన కొనుగోళ్లలో 15 శాతానికి ఈవీలేనని తేలింది. ప్రపంచ కాలుష్యంలో ఆరో వంతు వాటా రోడ్డు రవాణా వాహనాలదే. ఈ నేపథ్యంలో ఈవీలు ఎంతగా పెరిగితే ఈ కాలుష్యం అంతగా దిగొస్తుంది. శిలాజ ఇంధనాలపై తీర్మానం బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలని ఇటీవల దుబాయ్లో జరిగిన కాప్28 అంతర్జాతీయ పర్యావరణ సదస్సు తీర్మానించడం విశేషం. పర్యావరణ పరిరక్షణకు కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ తీర్మానాన్ని కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఏకంగా 100కు పైగా దేశాలు దీనికి సంపూర్ణంగా మద్దతు పలకగా, ఈ దిశగా శక్తివంచన లేకుండా ప్రయతి్నంచాలని మరో 50 పై చిలుకు దేశాలు ఈ సదస్సు వేదికగా అభిప్రాయపడ్డాయి. గతంలోనూ పలు కాప్ సదస్సుల్లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగినా అవి చర్చల స్థాయిని దాటి తీర్మానం దాకా రాకుండానే వీగిపోయాయి. అందుకే ఇది చరిత్రాత్మక తీర్మానమని కాప్28 సదస్సుకు అధ్యక్షత వహించిన సుల్తాన్ అల్ జబర్ అభివరి్ణంచారు. ఇది దేశాల ఆర్థిక వ్యవస్థలనే పునరి్నర్వచిస్తుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. దీనికి దేశాలు ఏ మేరకు కట్టుబడి ఉంటాయన్న దానిపై భూగోళం భవిష్యత్తు చాలావరకు ఆధారపడి ఉంటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉత్తరాఖండ్ టన్నెల్ నేర్పిన పాఠం! 'పేదల జీవితాలతో ఆడుకోవద్దు'!
దీపావళి రోజున ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో సొరంగంలో 41 మంది చిక్కుకుపోయిన ఘటన యావత్త్ దేశాన్ని కలవరిపరిచింది. వారంతా బయటకు రావాలని కులమతాలకు అతీతంగా అందరూ ప్రార్థించారు. ఆ ప్రార్థనలు ఫలించాయో లేక ఆ కూలీలను రక్షించేందుకు అహర్నిశలు కష్టపడుతున్న రెస్క్యూ బృందాల కృషికి అబ్బురపడి ప్రకృతి అవకాశం ఇచ్చిందో గానీ వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు కూడా ప్రకటించడం అందర్నీ సంతోషంలో ముచ్చెత్తింది. దాదాపు 17 రోజుల నరాల తెగే ఉత్కంఠకు తెరపడి జయించాం అనే ఆనందాన్ని ఇచ్చింది. సరే గానీ ఈ ఉత్తర కాశీ టన్నెల్ ఘటన మన భారత ప్రభుత్వానికి, పరిశ్రమలకు ఓ గొప్ప పాఠాన్ని నేర్పాయి. అభివృద్ధి అనే పేరుతో ఏం జరుగుతుందో ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపింది. అలాగే పర్యావరణం కూడా ఎలా మసులుకోవాలో మానవుడిని పరోక్షంగా హెచ్చరించింది. ఆ ఉత్తర కాశీ ఘటన నేర్పిన గుణపాఠం ఏంటంటే.. నిజానికి ఆ ఉత్తరకాశీ సిల్క్యారా సోరంగం నరేంద్ర మోదీ ప్రభుత్వం చార్థామ్ ప్రాజెక్ట్లో భాగంగా చేపట్టిన నిర్మాణం. ఇది హిందూ ప్రముఖ క్షేత్రాలను కలుపుతుంది. ఇది పూర్తి అయితే యమునోత్రికి వెళ్లే యాత్ర మార్గం 20 కిలోమీటర్లు తగ్గుతుంది. భక్తుల చార్ధామ్ యాత్ర సులభతరం చేసేందుకు నిర్మించిన భూగర్భ మార్గం అని చెప్పాలి. కానీ ఇలా అభివృద్ధి పేరుతో చేపట్టే ప్రాజెక్టుల్లో పేద ప్రజల జీవితాలు ఎలా అగాధంలో పడతాయనేది అనేది అందరికీ తెలిసేలా చేసింది ఈ ఘటన. ఇప్పటి వరకు మనం నిర్మించిన చాలా ప్రాజెక్టులో చాలామంది కార్మికులు ప్రాణాలు కూడా ఇలానే పోయాయా అనే ఆలోచన కూడా వచ్చింది. ఆ ఘటనలు జరిగిన మీడియా మాధ్యమాలు, వార్త పత్రికల పుణ్యమాని ఒకటి రెండు రోజులే హాటాపిక్గా ఆ విషయంగా ఉంటుంది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. అబ్బా! భారత్ ఎంతో ముందకు పోతుంది. ఎన్నో ఫైఓవర్లు, భూగర్భ రైలు మార్గాలు ఏర్పాటు చేసేశాం, టెక్నాలజీని అందుకుంటున్నాం అని స్టేమెంట్లు నాయకులు ఇచ్చేస్తుంటే..అదే నిజం అని గర్వంగా ఫీలైపోతాం. నిజానికి ఆయా పెద్ద పెద్ద రహాదారుల లేదా రైల్వే నిర్మాణాలకు వెనక ఉన్న కార్మికుల శ్రమ ఎవ్వరికి తెలియదు. ఆ నిర్మాణం జరుగుతున్న సమయంలో పేదల జీవితాలు ఎలా చిధ్రమయ్యాయి అన్నది కూడా పట్టదు. నాయకులు, అధికారులు ఇలాంటి పెద్ద నిర్మాణాలు, ప్రాజెక్టులు కట్టేటప్పుడూ ఇవన్నీ కామన్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇలాంటి ఉత్తరకాశీ లాంటి కొన్ని ఘటనలు తెరమీదకు రాకుండానే కనుమరుగయ్యాయి. అందువల్లే సాధారణ ప్రజలకు కూడా ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయన్న విషయం కూడా తెలియదు. ఈ టన్నెల్ కూలిన ఘటన ప్రభుత్వాలకు, పరిశ్రమలకు పేదల జీవితాలతో చెలగాటం ఆడొద్దని నొక్కి చెప్పింది. కూలే అవకాశం ఉందని ముందే తెలుసా..! ఈ టన్నెల్ నిర్మాణాన్ని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ చేపట్టింది. ఇదే కంపెనీ కాంట్రాక్టర్లు గతంలో మహారాష్ట్ర థానే జిల్లాలో నాగ్పూర్-ముంబై సమృద్ధి ఎక్స్ప్రెస్వేని నిర్మించిన ఘటన ఇప్పుడు తెరమీదకు వచ్చింది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగి 20 మంది కార్మికులు, ఇంజనీర్లు మరణించారు. దీంతో ఆయ కంపెనీ కాట్రాక్టర్లపై ఎఫైర్ కూడా నమోదైంది. మరీ మళ్లీ అదే కంపెనీకి ఈ ఉత్తరకాశీ టన్నెల్ ప్రాజెక్ట్ అప్పగించడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక జర్మన్-ఆస్ట్రియన్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ బెర్నార్డ్ గ్రుప్పీ మన భారత కంపెనీ నవయగ ఇంజనీరింగ్ లిమిటెడ్కి టన్నెల్ నిర్మాణ ప్రారంభానికి ముందు నుంచి కూడా టెండర్ డాక్యుమెంట్లో ఊహించిన దానికంటే భౌగోళిక పరిస్థితులు చాల సవాళ్లుగా ఉన్నాయని హెచ్చరించింది. అందువల్ల ఎలాంటి ప్రమాదాల సంభవిస్తే బయటపడేలా ఎస్కేప్ పాసేజ్ని నిర్మించమని 2018లోనే ఆదేశించింది. మరీ ఇక్కడ సొరంగం కూలిపోయేంత వరకు కూడా దాన్ని ఎందుకు నిర్మిచలేదనేది స్పష్టం కావాల్సి ఉంది. ప్రస్తుతం బయట పడ్డ ఆ కూలీలంతా ఈ ఎస్కేప్ పాసేజ్ నుంచే సురక్షితంగా బటయకొచ్చిన సంగతి తెలిసిందే. డెవలప్మెంట్ పర్యావరణాన్ని ప్రమదంలో పడేస్తుందా? ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలకు నిలయం హిమాలయ పర్వతాలు. దాదాపు 45 మిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడినవి. నిజానికి ఈ ప్రాంతం ఎక్కువుగా భూకంపాలకు గురయ్యే ప్రాంతం కూడా. పైగా ఇక్కడ శిలలు అవక్షేపణ శిలలుగా ఉంటాయి. పైగా ఇక్కడ పర్యావరణం అస్థిరంగ ఉంటుంది. నిర్మాణ పద్ధతులకు అస్సలు అనూకులమైనది కూడా కాదు. అలాంటి ప్రదేశంలో అభివృద్ధి పేరుతో మనం చేస్తున్న పనులు ముఖ్యంగా పర్యావరణానికి ఇబ్బంది కలిగించేవే. ఈ విషయమై ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు ఎస్కె పట్నాయక్ ఎన్నోసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. మన జీవన శైలి సౌలభ్యానికి అవసరమైన మార్పలు ఎంత అవసమో పర్యావరణాన్ని విఘాత కలగించకుండా చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది కూడా అంతే ముఖ్యం. లేదంటే ప్రకృతి ప్రకోపానికి బలవ్వక తప్పదు. కానీ ఇలాంటి విపత్తులో బలయ్యేది కూడా పేద కార్మికులే అనే విషయం గుర్తించుకోవాలి అధికారులు. (చదవండి: ఎక్కువ రోజులు సొరంగంలో ఉంటే కార్మికుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది! వైద్యుల ఆందోళన) -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని సీఎస్ శాంతి కుమారి పిలుపునిచ్చారు. సచివాలయంలో వీటి వాడకాన్ని నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శులు మొదలు ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో వీటి నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై జరిగిన వర్క్ షాప్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీవ్ శర్మ తోపాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా..సామాజిక భాద్యతతోనే సాధ్యం శాంతి కుమారి మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్ లో కేవలం 9 శాతం మాత్రమే రీ–సైక్లింగ్ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకొందాం’అనే నినాదంతో రూపొందించిన పోస్టర్ను ఈ సందర్భంగా శాంతి కుమారి, రాజీవ్ శర్మ ఆవిష్కరించారు. -
ఇంట్లో అక్వేరియం ఉంటే డాక్టర్ ఉన్నట్టే
అక్వేరియం వద్ద కాసేపు గడిపితే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గుతాయని ఎన్విరాన్మెంట్ అండ్ బిహేవియర్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం పేర్కొంది.ప్లిమౌత్ యూనివర్సిటీ, నేషనల్ మెరైన్ అక్వేరియం ఆధ్వర్యంలో పరిశోధకుల బృందం జరిపిన అధ్యయనాన్ని ఈ జర్నల్ ప్రచురించింది. తీవ్ర ఒత్తిడిలో జీవనం సాగించే పట్టణ జనాభాలో ఒత్తిడిని తగ్గించే కారకాలపై ఈ బృందం పరిశోధనలు జరిపింది. రోజులో 10 నిమిషాల సేపు ఒక అక్వేరియం ముందు కూర్చుని అందులో కదిలే చేపలను గమనిస్తే హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్ బాగా నియంత్రణలోకి వస్తాయని ఆ బృందం గుర్తించింది. – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్ డెస్క్ ఓ గాజు పెట్టె.. దాని నిండా నీళ్లు.. అడుగున రంగు రాళ్లు.. రెండు మూడు లైవ్ ఫ్లాంట్స్.. దానిలో నాలుగైదు చేపలు.. ఇదే కదా అక్వేరియం అంటే. చెప్పడానికైతే అంతే. కానీ తరచి చూస్తే దానిలో ఓ సైన్స్ ఉంది. ఆ పెట్టెలోపల ఓ పర్యావరణం ఉంది. ఆ నీళ్లలో ఒక జీవన చక్రం ఉంది. అందులోని చేపలకు తమదైన ఓ ప్రపంచమూ ఉంది. అంతేకాదు.. అది ఓ ప్రశాంత నిలయం. దాంతో మన ఇంటిలోనూ ఒక ప్రశాంతత. అక్వేరియంలోకి అలా చూస్తూ కాసేపు గడిపితే... ఎంత ఉత్సాహంగా ఉంటుందో అనుభవించి చూడాల్సిందే. ఒంటికి రంగులద్దుకున్న ఆ చేపలు.. వయ్యారంగా అలా కదులుతూ ఉంటే.. ఆ నీటిని సుతారంగా అలా చిలుకుతూ ఉంటే.. చూడముచ్చటగా ఉంటుంది. ఇంటికి అందం.. మనసుకు ఆహ్లాదం అక్వేరియం అనేది మన ఇంటికి అదనపు అందాన్నిస్తుంది. ఇంట్లో ఓ సరికొత్త శోభను తీసుకొస్తుంది.రంగు రంగుల చేపలతో అక్వేరియం ఉన్న ఇల్లు కళకళలాడుతూ కాంతివంతంగా ఉంటుంది. చాలా మంది అక్వేరియంను అందం కోసం ఇంట్లో పెట్టుకుంటారు. కానీ అక్వేరియంతో ఆరోగ్యం కూడా సమకూరుతుందంటే ఆశ్చర్యమే మరి. నీటిలో ఈదుతున్న చేపలను చూస్తూ రోజూ కొంత సమయం గడపడం అన్నది ఆరోగ్యంపై అమితమైన ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మనసు, శరీరం రిలాక్స్ అవుతాయని, బీపీ, హార్ట్రేట్లు నియంత్రణలో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అల్జీమర్స్ దరిచేరదని, ఆ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపశమనం లభిస్తుందని వారు పేర్కొంటున్నారు. అక్వేరియం వద్ద గడిపే పిల్లలు ఎంతో నేర్చుకుంటారు.. చేపలకు ఫుడ్ వేయడం, నీళ్లు మార్చడం వంటి వాటితో క్రమశిక్షణ అలవడుతుంది. మనసికంగా పరిణతి సాధిస్తారు. అందరికీ అందుబాటు ధరల్లో.. అక్వేరియాలు అందరికీ అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. వాటిలో వేసే చేపలు, వాటి రకాలను బట్టి వాటి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. గతంలో ఈ అక్వేరియాల కోసం హైదరాబాద్, విశాఖ, విజయవాడ వంటి పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇటీవల కాలంలో వాటి వినియోగం పెరగడంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ముఖ్య పట్టణాల్లోనూ అందుబాటులోకొచ్చాయి. అనేక రకాలు..: అక్వేరియంలో పెంచే చేపల్లో రెగ్యులర్ గోల్డ్తో పాటు ఒరాండా, షుబుకిన్ గోల్డ్, బెట్టాస్, ఏంజిల్ ఫిష్, గౌరామీ, కోయీ కార్ప్స్, టైగర్ షార్క్, మోలీస్, గప్పీస్, ప్లాటీస్, ప్యారట్, టైగర్ ఆస్కార్స్ ఇలా పలు రకాలున్నాయి. రెగ్యులర్గా నిర్దేశిత పరిమాణంలో మాత్రమే వాటికి ఆహారాన్నివ్వాలి. ఆహారం తక్కువైనా, ఎక్కువైనా చేపలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. బెట్టా వంటి ఫైటర్ ఫిష్లు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాయి. అలాంటి చేపల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఫ్లవర్ హార్న్, అరవానా వంటివి కాస్త ధర ఎక్కువ. ఇవి కూడా ఒంటరిగానే ఉంటాయి. వాస్తుపరంగానూ ఇంటికి అక్వేరియం చాలా మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈశాన్యంలో ఉంటే ఆ ఇంటికి అన్ని రకాలుగా కలిసొస్తుందని విశ్వసిస్తారు. మనపై ఏదైనా నెగెటివ్ ప్రభావం పడినప్పుడు.. దానిని అక్వేరియంలోని చేపలు గ్రహించి మనల్ని రక్షిస్తాయని కూడా చాలామంది నమ్ముతారు. అక్వేరియం ఆరోగ్యదాయిని.. అక్వేరియంలోని చేపలను కొద్దిసేపు నిశితంగా పరిశీలించడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, రక్తపోటు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎలక్ట్రో కన్వెన్షనల్ థెరపీ అవసరమైన వారు నీటి ట్యాంక్లోని చేపలను రోజూ చూడటం వల్ల వారిలో ఆందోళన 12 శాతం తగ్గిందని ఓ అ«ధ్యయనంలో తేలింది. ఇంట్లో అక్వేరియం ఉంటే డిమెన్షియా ఉన్న వారిపై సానుకూల ప్రభావం చూపుతుందని తాజాగా చేసిన పరిశోధన తేల్చి చెప్పింది. అక్వేరియంలో ఉండే రంగు, రంగుల చేపలు, అవి ఈదటం, నీటి బుడగల శబ్దాలు ఆటిజం ఉన్న పిల్లల్లో అటెన్షన్ను పెంచడమేగాక వారికి రిలాక్స్నిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. – సీతామహాలక్ష్మి జెట్టి, సైకాలజిస్ట్, గుంటూరు ఒత్తిడిని అధిగమించాను.. బాధ్యతలతో పని ఒత్తిడి ఉండేది. పిల్లలకోసంఇంట్లో ఈ మధ్యే ఓ అక్వేరియం ఏర్పాటు చేసుకున్నాం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే రోజూ కాసేపు చేపలతో ఆడుకోవడం, వాటికి ఆహారం వేయడం, వారానికోసారి అక్వేరియంలో నీరు మార్చడం వంటివి చేస్తున్నాం. చాలా రిలాక్స్డ్గా ఉంటోంది. ఒత్తిడి చాలా వరకు తగ్గింది. – సీహెచ్వీబీ హరిణి, టీచర్, కొల్లూరు, బాపట్ల జిల్లా మెయింటెనెన్స్ సులభమే.. అక్వేరియం అనగానే మెయింటెనెన్స్ చాలా కష్టం కదా అని అనుకుంటుంటారు. ఇపుడు అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. క్లీనింగ్ సులభంగా చేసుకోవచ్చు. సులభమైన టిప్స్ కూడా ఉన్నాయి. బ్రీడర్ ఫిష్ఫామ్లలో చేపలు చాలా తక్కువ ధరలలో దొరుకుతు న్నాయి. అక్వేరియం, యాక్సెస్సరీస్ ధరలు కూడా ఇపుడు అందుబాటులోనే ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినా వినియోగదారులకు చేరుస్తున్నారు. – పి.సాయి ఈశ్వర్, ఫార్చ్యూన్ ఆక్వాహబ్ (బ్రీడర్ ఫిష్ ఫామ్) నిర్వాహకుడు, వణుకూరు,కృష్ణా జిల్లా -
Joyeeta Gupta: డైనమిక్ ప్రొఫెసర్కు డచ్ నోబెల్
ఆర్థికశాస్త్రం చదువుకున్నవారి ఆసక్తి గణాంకాలకే పరిమితమని, న్యాయశాస్త్రం చదువుకున్న వారి ఆసక్తి ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలపైనే ఉంటుందనేది ఒక సాధారణ భావన. ‘విభిన్న విద్యానేపథ్యం ఉన్న మేధావి’గా గుర్తింపు పొందిన జ్యోయితా గుప్తా ఆర్థికశాస్త్రం నుంచి న్యాయశాస్త్రం వరకు ఎన్నో శాస్త్రాలు చదివింది. అయితే ఆమె ప్రయాణంలో ఆ శాస్త్రాలేవీ వేటికవే అన్నట్లుగా ఉండిపోలేదు. వాతావరణ మార్పులపై తాను చేసిన శాస్త్రీయ పరిశోధనకు మరింత విస్తృతిని ఇచ్చాయి. నెదర్లాండ్స్లోని యూనివర్శిటీ ఆఫ్ ఆమ్స్టార్డమ్లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా డచ్ రిసెర్చి కౌన్సిల్ నుంచి ‘డచ్ నోబెల్’గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన స్పినోజా ప్రైజ్ను ది హేగ్లో అందుకుంది... దిల్లీలో పుట్టి పెరిగింది జ్యోయితా గుప్తా. లోరెటో కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. దిల్లీ యూనివర్శిటీలో ఎకనామిక్స్, గుజరాత్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం, హార్వర్డ్ లా స్కూల్లో ఇంటర్నేషనల్ లా చదివింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు’ అనే అంశంపై ఆమ్స్టార్ డామ్లోని వ్రిజే యూనివర్శిటీలో డాక్టరేట్ చేసింది. 2013లో ఈ యూనివర్శిటీలో ఫ్యాకల్టీగా చేరింది. వాతావరణ మార్పుల వల్ల సమాజంపై కలుగుతున్న ప్రభావం, ఉత్పన్నమవుతున్న సామాజిక అశాంతి... మొదలైన అంశాలపై లోతైన పరిశోధనలు చేసింది. 2016లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఔట్లుక్ (జీఈవో)కు కో– చైర్పర్సన్గా నియమితురాలైంది. యూనివర్శిటీ ఆఫ్ ఆమ్స్టర్డమ్లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న జ్యోయితా గుప్తా ‘ఆమ్స్టర్డామ్ గ్లోబల్ చేంజ్ ఇన్స్టిట్యూట్’ సభ్యులలో ఒకరు. పరిశోధనలకే పరిమితం కాకుండా పర్యావరణ సంబంధిత అంశాలపై విలువైన పుస్తకాలు రాసింది జ్యోయిత. ‘ది హిస్టరీ ఆఫ్ గ్లోబల్ క్లైమెట్ గవర్నెన్స్’ ‘ది క్లైమెట్ ఛేంజ్ కన్వెన్షన్ అండ్ డెవలపింగ్ కంట్రీస్’ ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హజడస్ వేస్ట్’ ‘అవర్ సిమరింగ్ ప్లానెట్’ ‘ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డెలిగేషన్: ఏ సర్వె్యవల్ గైడ్ ఫర్ డెవలపింగ్ కంట్రీ క్లైమెట్ నెగోషియేటర్స్’ ‘మెయిన్ స్ట్రీమింగ్ క్లైమేట్ చేంజ్ ఇన్ డెవలప్మెంట్ కో ఆపరేషన్’... మొదలైన పుస్తకాలు రాసింది. అమెరికా పరిశ్రమల చెత్త ఏ దేశాలకు చేరుతుంది? ఎంత విషతుల్యం అవుతుందో 1990లోనే ‘టాక్సిక్ టెర్రరిజమ్: డంపింగ్ హాజడస్ వేస్ట్’ పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించింది. పాశ్చాత్య దేశాల పరిశ్రమలు ఉత్పత్తి చేసే విషపూరిత వ్యర్థాలు మరోవైపు విదేశీ మారకద్రవ్యం కోసం పరితపిస్తూ పర్యావరణాన్ని పట్టించుకోని దేశాల గురించి లోతైన విశ్లేషణ చేసింది జ్యోయిత. సాధారణంగానైతే పర్యావరణ అంశాలకు సంబంధించిన చర్చ, విశ్లేషణ ఒక పరిధిని దాటి బయటికి రాదు. అయితే జ్యోయిత విశ్లేషణ మాత్రం ఎన్నో కోణాలను ఆవిష్కరించింది. వాతావరణంలోని మార్పులు ప్రభుత్వ పాలనపై చూపే ప్రభావం, ధనిక, పేద సమాజాల మధ్య తలెత్తే వైరుధ్యాల గురించి చెప్పడం ఇందుకు ఒక ఉదాహరణ. ‘ప్రపంచవ్యాప్తంగా తగినన్ని ఆర్థిక వనరులు ఉన్నాయి. అందరి జీవితాలను బాగు చేయడానికి ఆ వనరులను ఎలా ఉపయోగించాలనేదే సమస్య. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, నిరుపేదల మధ్య అసమానతలు ఉన్నాయి. భారత్లాంటి దేశాల్లో కూడా ఇదొక పెద్ద సవాలు’ అంటుంది జ్యోయిత. ఆమె విశ్లేషణలో విమర్శ మాత్రమే కనిపించదు. సందర్భాన్ని బట్టి పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. ‘విస్తృతమైన, విలువైన పరిశోధన’ అంటూ స్పినోజా ప్రైజ్ జ్యూరీ గుప్తాను కొనియాడింది. కొత్త తరం పరిశోధకులకు ఆమె మార్గదర్శకత్వం విలువైనదిగా ప్రశంసించింది. తనకు లభించిన బహుమతి మొత్తాన్ని (1.5 మిలియన్ యూరోలు) శాస్త్రపరిశోధన కార్యక్రమాలపై ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది జ్యోయితా గుప్తా. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, పర్యావరణ సంరక్షణకు చట్టాలతో కూడిన ప్రపంచ రాజ్యాంగం కోసం జ్యోయితా గుప్తా గట్టి కృషి చేస్తోంది. -
మన దేశంలోనే ఆ కంపెనీలు ఉన్నాయని తెలిసి షాక్ అయ్యాను: దియా మీర్జా
లైట్స్, కెమెరా, యాక్షన్ అనేవి సుప్రసిద్ధ నటి దియా మీర్జాకు సుపరిచిత పదాలు. అయితే ఆమెకు సంబంధించి ఈ పదాలు సినీ స్టూడియోలకే పరిమితం కాలేదు. తన కంటి కెమెరాతో ప్రకృతిని చూస్తుంది. పర్యావరణ నష్టానికి సంబంధించిన విధ్వంస చిత్రాలపై నలుగురి దృష్టి పడేలా ‘లైట్స్’ ఫోకస్ చేస్తోంది. తన వంతు కార్యాచరణగా క్లైమేట్ యాక్షన్ అంటూ నినదిస్తోంది... నటిగా సుపరిచితురాలైన దియా మీర్జా గ్లామర్ ఫీల్డ్ నుంచి పర్యావరణ స్పృహకు సంబంధించిన ప్రచారం వైపు అడుగులు వేసింది. ‘క్లైమేట్ యాక్టివిస్ట్’గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. యూఎన్ ఎన్విరాన్మెంట్ గుడ్విల్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పర్యావరణ ఉద్యమకారులతో కలిసి పనిచేస్తోంది.పర్యావరణానికి సంబంధించిన చర్చలు జరిగే ఇంట్లో పెరిగిన దియాకు సహజంగానే పర్యావరణ విషయాలపై ఆసక్తి మొదలైంది. దీనికితోడు స్కూల్లో టీచర్ ద్వారా విన్న పర్యావరణ పాఠాలు కూడా ఆమె మనసుపై బలమైన ప్రభావాన్ని వేసాయి. ఇక కాలేజీరోజుల్లో పర్యావరణ సంబంధిత చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ‘ప్రకృతిపై ప్రేమ అనే విలువైన బహుమతిని తల్లిదండ్రులు నాకు ఇచ్చారు’ అంటున్న దియ చిన్నప్పుడు చెట్లు, కొండలు ఎక్కేది. పక్షుల గానాన్ని ఎంజాయ్ చేసేది. మర్రిచెట్టు ఊడలతో ఉయ్యాల ఊగేది. ఉడతలతో గంతులు వేసేది. ఇల్లు దాటి చెట్ల మధ్యకు వెళ్లినప్పుడల్లా తనకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లుగా ఉండేది.బాలీవుడ్లోకి అడుగుపెట్టాక దియాకు పర్యావరణ సంబంధిత అంశాలపై ఎన్నో సామాజిక సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఆ సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పడింది. ఆ అవగాహనతోనే పర్యావరణ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించుకుంది. ‘ప్రజలకు మేలు చేసేదే పర్యావరణానికి మేలు చేస్తుంది’ అనే నినాదంతో పర్యావరణ ఉద్యమాలలో భాగం అయింది. ‘వాతావరణంలో మార్పు అనేది భవిష్యత్కు సంబంధించిన విషయం మాత్రమే కాదు వర్తమానాన్ని కలవరపెడుతున్న విషయం. ప్రకృతిమాత చేస్తున్న మేలును గుర్తుంచుకోలేకపోతున్నాం. పర్యావరణ సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థలు, శాస్త్రవేత్తలకే పరిమితమైనది కాదు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు శాస్త్రీయ విషయాలపై అవగాహన పెంచుకోవాలి’ అంటుంది దియ.వాయు కాలుష్యానికి సంబంధించిన అధ్యయనం దియాను ఆందోళనకు గురి చేసింది. ‘వాయు కాలుష్యం అనగానే దిల్లీ గురించే ఎక్కువగా మాట్లాడతాం. అయితే లక్నో నుంచి ముంబై వరకు ఎన్నో పట్టణాలలో వాయు కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది’ అంటున్న దియా తన ఎజెండాలో ‘స్వచ్ఛమైన గాలి’కి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఆమెను కలవరపెట్టిన మరో సమస్య ప్లాస్టిక్. షూటింగ్ నిమిత్తం మహా పట్టణాల నుంచి మారుమూల పల్లెటూళ్లకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కనిపించని చోటు అంటూ ఉండేది కాదు.‘ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన కంపెనీలు మన దేశంలోనే ఉన్నాయనే విషయాన్ని తెలుసుకున్నాను. బ్యాంబు బ్రష్లు, ఇయర్ బడ్స్ వాడుతున్నాను. నా దగ్గర ఆకర్షణీయమైన బ్యాంబు పోర్టబుల్ స్పీకర్ ఉంది’ అంటున్న దియా తాను వాడుతున్న ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను స్నేహితులకు కూడా పరిచయం చేస్తుంది. పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పర్యావరణ స్పృహతో కూడిన జీవనవిధానాన్ని ప్రచారం చేయడానికి ఎకో–ఫ్రెండ్లీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతుంది దియా మీర్జా. తాను పెట్టుబడులు పెట్టిన అయిదు కంపెనీలు మన దేశానికి చెందినవి. మహిళల నాయకత్వంలో నడుస్తున్నవి.‘నేను కష్టపడి సంపాదించిన డబ్బు, పొదుపు మొత్తాలను పర్యావరణ హిత కంపెనీలలో పెట్టుబడి పెట్టడం గర్వంగా ఉంది’ అంటుంది దియా. దియా మీర్జాకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ప్రజల్లో మార్పును తీసుకువచ్చే చిత్రాలను వినోదం మేళవించి తీయాలనుకుంటోంది. అవును...ఈరోజే మంచిరోజు అత్యుత్తమ రోజు అంటే ఈ రోజే... అనే సామెత ఉంది. మంచి పని చేయడానికి మరోరోజుతో పనిలేదు. మన భూమిని కాపాడుకోడానికి ప్రతిరోజూ విలువైన రోజే. పిల్లలను పార్క్లు, వనాల దగ్గరకు తీసుకువెళ్లడం ద్వారా వారికి ప్రకృతి పట్ల ఆసక్తి కలిగించవచ్చు. పచ్చటి గడ్డిలో పాదరక్షలు లేకుండా నడిపించడం, అప్పుడే మొదలైన వానలో కొంచెంసేపైనా గంతులేసేలా చేయడం...ఇలా చిన్న చిన్న పనుల ద్వారానే వారిని ప్రకృతి నేస్తాలుగా తీర్చిదిద్దవచ్చు. పిల్లలకు వినోదం అంటే సినిమాలు మాత్రమే కాదు. ప్రకృతితో సాన్నిహిత్యానికి మించి పిల్లలకు వినోదం ఏముంటుంది! – దియా మీర్జా, నటి, క్లైమేట్ యాక్టివిస్ట్ -
గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రల్లో తింటున్నారా?దీనిలోని బిస్ఫినాల్ వల్ల..
నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి.గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు ప్లాస్టిక్ను నిర్మూలించాలని చెబుతున్నా మరింత ఎక్కువగా వాడుతున్నాం. ఇప్పటికే ప్లాస్టిక్ ఉత్పత్తి సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో సమస్య సంక్షోభంగా మారే అవకాశం తొందర్లోనే ఉంది. ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాలివే పర్యావరణ_కాలుష్యం: ►సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు పర్యావరణ కాలుష్యానికి ప్రధాన మూలం. ఎందుకంటే అవి భూమిలో ఇంకిపోవడానికి చాలా సమయం పడుతుంది.ప్లాస్టిక్ కవర్లు వన్యప్రాణులకు హాని కలిగిస్తాయి. జంతువులు వాటిని ఆహరంగా భావించి తినేస్తున్నాయి. ఇది ఎక్కువైతే, మరణానికి కూడా దారితీయొచ్చు. ► ప్లాస్టిక్ కవర్లు అనేక రసాయనాలు కలిగి ఉంటుంది. వీటిని నీటిలో వదలడం వల్ల అవి కూడా కలుషితం అయ్యి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ► కొన్ని ప్లాస్టిక్ కవర్లలో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే బిస్ఫినాల్ A (BPA), థాలేట్స్ ,ఫ్లేమ్ రిటార్డెంట్స్ వంటి రసాయనాలు ఉండవచ్చు. ఈ రసాయనాలు ప్లాస్టిక్ నుండి బయటకు వెళ్లి ఆహారం లేదా పానీయాలలోకి వెళ్లి, హార్మోన్ల అసమతుల్యత, పునరుత్పత్తి సమస్యలు మరియు క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ► ప్లాస్టిక్ కవర్ల ఉత్పత్తి, పారవేయడం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తుంది. ఇది వాతావరణ మార్పు, ఇతర పర్యావరణ సమస్యలకు దోహదం చేస్తుంది. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారం తింటున్నారా? మీరు రోజూ ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం తీసుకుంటున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే. వేడి పదార్థాలను ప్లాస్టిక్ లేదా డిస్పోజబుల్ ప్లేట్లలో ఉంచడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని పరాశోధకులు ప్లాస్టిక్ (Plastic) తయారు చేసేందుకు బిఎస్ ఫినాల్ను ఉపయోగిస్తారు. ప్రధానంగా పాలికార్బోనేట్ లేదా రీసైకిల్ కోడ్7గా పిలువబడే ఇది ప్లాస్టిక్లో కలుస్తుంది. ఇది విషపూరితమైనది. దీని వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ పొంచివుండే ప్రమాదం ఉంది. బీపీఏ అనేది మానవ శరీరంలోని ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను అసమతుల్యత చేసే రసాయనమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల మానసిక ఒత్తిడి మొదలైన వాటికి దారి తీస్తుంది. అలాగే అలెర్జీలు, గుండెకు సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్ తీవ్రతను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గుతుంది ఎక్కువగా ప్లాస్టిక్ పాత్రల్లో తినడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ పాత్రలలో ఆహారం తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మైక్రోవేవ్లో ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయడం కూడా హానికరమంటున్నారు. మీరు మైక్రోవేవ్ ఉపయోగించాల్సి వస్తే ప్లాస్టిక్కు బదులుగా మీరు పేపర్ టవల్, గ్లాస్ ప్లేట్ లేదా సిరామిక్ వస్తువులను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు ప్లాస్టిక్ను నిషేధించాలని పదేపదే చెబుతున్నా, ఇంకా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ప్లాస్టిక్ కవర్స్ని నిషేధించే విధంగా చర్యలు చేపట్టినా, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్లాస్టిక్ భూమిలో కరగడానికి కొన్ని వందల ఏళ్లు సమయం పట్టడం, అందులో ప్లాస్టిక్ తయారీలో కలిసే పదార్థం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఎంతో మంది నిపుణులు చెబుతున్నా.. ఇంకా ప్లాస్టిక్ రూపుమాపడం లేదు. ప్లాస్టిక్ కవర్ల హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి, సింగిల్-యూజ్ ప్లాస్టిక్ల వినియోగాన్ని తగ్గించడం, కంటైనర్లు, పత్తి లేదా బీస్వాక్స్ వంటి సహజ పదార్థాలతో తయారు చేయబడిన ర్యాప్ల వంటి మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్లాస్టిక్ కవర్లను రీసైక్లింగ్ చేయడం సరైన పరిష్కారం కాదు. దానికంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే సమస్యను పరిష్కరించడానికి ఉత్తతమైన మార్గం. -నవీన్ నడిమింటి ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు -
‘ప్లాస్టిక్ అడవి’లో ఏనుగులు
ఎటు చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారం మధ్య ఏనుగుల గుంపు కనిపిస్తోందా? అంతటి కలుషిత, ప్రమాదకర పదార్థాల మధ్య ఆ ఏనుగులు ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి. అభివృద్ధితోపాటు వస్తున్న కాలుష్య ప్రమాదానికి ఇదో సంకేతమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి అడవుల సమీపంలో డంపింగ్ చేస్తుండటం కేవలం పర్యావరణానికి మాత్రమేకాదు వన్య ప్రాణులకు ఎంతో చేటు చేస్తున్న దారుణ పరిస్థితిని ఇది కళ్లకు కడుతోంది. శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్లో లలిత్ ఏకనాయకే అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. నేచర్ ఇన్ఫోకస్ సంస్థ ఇచ్చే ఫొటోగ్రఫీ అవార్డుల్లో ‘కన్సర్వేషన్ ఫోకస్’ విభాగంలో ఇది ఉత్తమ చిత్రంగా నిలిచింది. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
మొలకెత్తే పెన్ను.. పర్యావరణానికి దన్ను
గుంటూరు (ఎడ్యుకేషన్): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగంపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే పెన్నులను సైతం పర్యావరణ అనుకూల విధానంలో ఉపయోగిస్తోంది. యూజ్ అండ్ త్రో (వాడిపారేసే) ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల సంఖ్యలో పెన్నులను వాడి పారేస్తుండటంతో పర్యావరణానికి హాని కలిగించని పెన్నుల తయారీ, వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా పర్యావరణ అనుకూల పెన్నుల వినియోగాన్ని అమల్లోకి తెచ్చింది. కాగితం పొరలతో.. కాగితం పొరలతో తయారు చేసిన పెన్నులకు మందపాటి అట్టతో రూపొందించిన క్యాప్ ఉంచిన పెన్నులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేస్తున్నారు. ప్యాడ్తో పాటు పేపర్ పెన్నులను ఇస్తూ.. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. ప్రత్యేకంగా పేపర్ పెన్నుల ఉత్పత్తిదారులకు ఆర్డర్ ఇచ్చి పెన్నులు తయారు చేయిస్తున్నారు. వీటిని వాడిన తరువాత పడేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి. మరో విశేషం ఏమిటంటే.. ఆ పెన్నుల వెనుక భాగంలో అమర్చిన చిన్న గొట్టంలో నవ ధాన్యాలు, వివిధ దినుసులు, పూల మొక్కల విత్తనాలను అమర్చారు. బీన్స్, సన్ఫ్లవర్, మెంతులు తదితర విత్తనాలను కూడా అమర్చుతున్నారు. పెన్నును వాడి పారేసిన తరువాత ఇంటి పెరట్లోనో, రోడ్డు పక్కన మట్టిలోనో పారవేస్తే పెన్ను భూమిలో కరిగిపోయి.. అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ప్రస్తుతం బల్క్ ఆర్డర్లపై తయారు చేస్తున్న ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నును కేవలం రూ.20కే కొనుగోలు చేయవచ్చు. గురువారం గుంటూరు నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు ఎకో ఫ్రెండ్లీ పెన్నులను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు. -
‘ప్రగతి’ బాటలో పొదుపు మహిళ
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళా స్వయంశక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటు సత్ఫలితాలనిస్తోంది. వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం అందించిన నిధులతో అక్క చెల్లెమ్మలు స్వయం ఉపాధి మార్గాలపై దృష్టి పెట్టారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అండగా నిలిచి ‘పొదుపు’ మహిళలకు దిశానిర్దేశం చేస్తోంది. మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన నిధులను సమకూర్చి విజయం దిశగా ప్రోత్సహిస్తున్నారు గత నాలుగున్నరేళ్లల్లో వివిధ పథకాల ద్వారా 25 లక్షల మంది పట్టణ ప్రాంత పొదుపు సంఘాల్లోని మహిళలతో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లను నెలకొల్పి అద్భుత ఫలితాలను సాధించారు. దీంతోపాటు మహిళలు తయారు చేసే చేతి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించేందుకు ఈ–కామర్స్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు పొదుపు మహిళలతో పరిశ్రమలు నెలకొల్పేందుకు ‘మెప్మా’ ముందడుగు వేసింది. పర్యావరణహితంగా సరికొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ మహిళలతో ‘ప్రగతి యూనిట్లు’ ఏర్పాటు దిశగా కార్యాచరణ చేపట్టారు. ఏ పరిశ్రమ స్థాపించాలి? మూలధనం, శిక్షణ లాంటి అంశాలపై చర్చించేందుకు మెప్మా ఎండీ తాజాగా సంఘాల లీడర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 25 లక్షల మంది సభ్యులుగా ఉన్న పట్టణ సమాఖ్యలకు చెందిన టీఎల్ఎఫ్ రిసోర్స్ పర్సన్లు, సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు (ఆఫీస్ బేరర్స్) దాదాపు 700 మంది పాల్గొన్న ఈ సదస్సులో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోని మహిళా సంఘాలు తీర్మానాలు చేసిన ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లోని పట్టణ మహిళా సంఘాలు సంఘటితంగా సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా ఎండీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. 9 పట్టణాల్లోని జగనన్న మహిళా మార్టుల ద్వారా ఆగస్టు వరకు రూ.25 కోట్ల వ్యాపారం చేసినట్లు లబ్ధిదారులు వివరించారు. 110 యూఎల్బీల్లో ప్రతినెలా ఒకరోజు ఏర్పాటు చేసే అర్బన్ మార్కెట్ ద్వారా ఒక్కోచోట సగటున రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వ్యాపారం చేస్తున్నట్టు తెలిపారు. వీటితోపాటు ఆస్పత్రులు, మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 140 మెప్మా ఆహా క్యాంటీన్ల ద్వారా సంఘాల సభ్యులు ఆదాయం పొందుతున్న తీరును, వాటికున్న డిమాండ్ను సదస్సులో పంచుకున్నారు. వ్యాపారం చేసుకుంటున్నాం గతంలో బ్యాంకు రుణం వస్తే డబ్బులు పంచుకుని ఇంట్లో ఖర్చు చేసేవాళ్లం. ఇప్పుడు బ్యాంకు రుణాలు ఇప్పించడంతోపాటు వ్యాపారం దిశగా ‘మెప్మా’ ప్రోత్సహిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగున్నరేళ్లుగా అన్ని పథకాలు అందుతున్నాయి. బ్యాంకులు మాకు పిలిచి మరీ రుణాలు ఇస్తు న్నాయి. ఈ డబ్బులతో సంఘాల్లోని సభ్యులు తమకు నైపుణ్యం ఉన్న అంశంలో వ్యాపారం చేస్తున్నారు. స్థిరమైన ఆదాయం వస్తోంది. వ్యాపార ఆలోచన ఉంటే మెప్మా శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తోంది. – పి.కృష్ణకుమారి, నరసరావుపేట మహిళలకు అండగా సీఎం మహిళా సాధికారత అంటే ఇన్నాళ్లూ మాకు తెలియదు. ఇంటికే పరిమితమైన మమ్మల్ని సీఎం జగన్ ప్రగతి వైపు అడుగులు వేయించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆర్థికంగా ఎదుగుతున్నాం. తిరుపతిలో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేసుకున్నాం. పెద్దపెద్ద మార్ట్లతో పోటీ పడి వ్యాపారంలో లాభాలు పొందుతున్నాం. నవరత్నాల పథకాలను ప్రధానంగా మహిళల కోసమే అమలు చేస్తున్నారు. – ప్రతిమారెడ్డి, తిరుపతి ఆహా క్యాంటీన్తో ఉపాధి గతంలోనూ పట్టణ మహిళా పొదుపు సంఘాలు ఉన్నా పావలా వడ్డీ రుణాలు తప్ప మిగతావి పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక రుణాలు మంజూరు చేయడంతో పాటు అవగాహన ఉన్న రంగంలో వ్యాపారం దిశగా ప్రోత్సహించి ఆదాయ మార్గాన్ని కూడా చూపించింది. మెప్మా ప్రోత్సాహంతో ఆహా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కపూటకు అన్ని ఖర్చులు పోను రూ.1,000 లాభం వస్తోంది. – శ్యామల, అమలాపురం గత ప్రభుత్వంలో మోసపోయాం ఎన్నో ఏళ్లుగా పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్నా ఏనాడు ఆర్థికంగా బాగున్నది లేదు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పడంతో సభ్యులు ఎంతో ఆశతో రుణాలు చెల్లించడం ఆపేశారు. దాంతో బ్యాంకు మా సంఘాన్ని డిఫాల్టర్గా ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని చెల్లిస్తూ వ్యాపారం దిశగా ప్రోత్సహించింది. ఇప్పుడు బ్యాంకులు పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. – షేక్ ఫాతిమా, నరసరావుపేట ప్రతి రూపాయీ మాకే.. గత ప్రభుత్వంలో పట్టణ మహిళా పొదుపు సంఘాల పేరుతో చాలా వరకు బోగస్ సంఘాలు ఉండేవి. మాకు రావాల్సిన నిధులు వారికే పోయేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి సంఘాన్ని, ప్రతి సభ్యురాలి వివరాలను ఆన్లైన్ చేశారు. దీంతో బోగస్ సంఘాలు పోయాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి ఇప్పుడు నేరుగా సంఘాలకే అందుతోంది. శిక్షణనిచ్చి మున్సిపల్ స్థలాల్లో వ్యాపారాలు పెట్టిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు. – మీనాక్షి, విజయవాడ మహిళా సాధికారతే లక్ష్యం మెప్మాలోని సభ్యులు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్ల నిర్వహణతో మహిళలు విజయం సాధించారు. అనుకున్న దానికంటే మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. గతంలో మహిళా పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు ఎంతో ఆలోచించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. మహిళల్లో అద్భుతమైన వ్యాపార దక్షత ఉంది. వారు తయారు చేసే చేతి వస్తువులు, ఆహార పదార్థాలను ఈ–కామర్స్ సైట్ల ద్వారా విక్రయించేలా ప్రణాళిక రూపొందించాం. మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. వారిని మరో మెట్టు ఎక్కించేందుకు మెప్మా ద్వారా తయారీ యూనిట్లు కూడా నెలకొల్పే ఏర్పాట్లు చేస్తున్నాం. ఉచితంగా శిక్షణనిచ్చి ఆర్థిక సాయం చేసి వ్యాపార యూనిట్లు పెట్టిస్తాం. పట్టణ ప్రగతి యూనిట్లు నెలకొల్పే దిశగా సాయం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్ -
అమెరికా భూమికి పగుళ్లు!
అగ్రరాజ్యం అమెరికాకు పెను ప్రమాదం ముంచుకొస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ నేలపై పుట్టుకొస్తున్న మైళ్ల కొద్దీ పొడవైన భారీ పగుళ్లు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. పొంచి ఉన్న పెను ఉత్పాతాలకు ఇది బహుశా ముందస్తు సంకేతం మాత్రమే కావొచ్చన్న సైంటిస్టుల హెచ్చరికలు మరింత భయం పుట్టిస్తున్నాయి. పర్యావరణంతో ఇష్టారాజ్యంగా చెలగాటం ఆడితే ఎలా ఉంటుందో ఆ దేశానికిప్పుడు బాగా తెలిసొస్తోంది! అమెరికా అతి పెద్ద పర్యావరణ విపత్తును ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ నేల నిట్టనిలువుగా చీలుతోంది. అది కూడా చిన్నాచితకా సైజులో కాదు! మైళ్ల పొడవునా, మీటర్ల వెడల్పులో పగుళ్లిస్తోంది. ఫిషర్స్గా పేర్కొనే ఈ చీలికలు దశాబ్దాలుగా భూగర్భ జలాలను విపరీతంగా తోడేస్తున్న తాలూకు దుష్పరిణామమేనని పర్యావరణవేత్తలు మాత్రమే గాక భూ¿ౌతిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారిస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమంటూ ఇప్పుడు తీరిగ్గా నెత్తీ నోరూ బాదుకుంటున్నారు! పగుళ్లు ఎక్కడెక్కడ? ► అరిజోనా, ఉతా, కాలిఫోరి్నయా రాష్ట్రాల్లో ఇవి మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ► ముఖ్యంగా అరిజోనాలో 2002 నుంచే ఈ తరహా పగుళ్లు వస్తున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న పగుళ్లు పరిమాణంలో గానీ, సంఖ్యలో గానీ ముందెన్నడూ చూడనివి కావడమే కలవరపరుస్తున్న అంశం. జాతీయ సంక్షోభమే: న్యూయార్క్ టైమ్స్ ఈ పగుళ్లు ఇప్పుడు జాతీయ సంక్షోభం స్థాయికి చేరాయని న్యూయార్క్ టైమ్స్ మీడియా గ్రూప్ పరిశోధక బృందం తేల్చడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సర్వే ఏం చెప్పిందంటే... ► అమెరికాలో 90 శాతానికి పైగా జల వనరులకు ప్రధాన ఆధారమైన జల ధారలు శరవేగంగా ఎండిపోతున్నాయి. ► ఎంతగా అంటే, అవి కోలుకోవడం, బతికి బట్ట కట్టడం ఇక దాదాపుగా అసాధ్యమే! ► సర్వే బృందం పరిశీలించిన సగానికి సగం చోట్ల భూగర్భ జల ధారలు గత 40 ఏళ్లలో చెప్పలేనంతగా చిక్కిపోయాయి. ► 40 శాతం ధారలైతే కేవలం గత పదేళ్లలో ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. ► వాయవ్య అమెరికావ్యాప్తంగా అతి ప్రధాన మంచినీటి వనరుగా ఉంటూ వస్తున్న కొలరాడో నది కేవలం గత 20 ఏళ్లలో ఏకంగా 20 శాతానికి పైగా కుంచించుకుపోయింది. ► గ్లోబల్ వారి్మంగ్ తదితర పర్యావరణ సమస్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భూగర్భ జలమే ముఖ్య ఆధారం మనిషుల నీటి అవసరాలను తీర్చడంలో భూగర్భ జలం కీలకంగా మారింది. ఎంతగా అంటే... ► ప్రపంచ తాగునీటి అవసరాలూ సగం భూగర్భ జలంతోనే తీరుతున్నాయి. ► ఇక 40% సాగునీటి అవసరాలకు ఇదే ఆధారం. ► అయితే, అసలు సమస్య భూగర్భ జలాలను తోడేయడం కాదు. వెనుకా ముందూ చూసుకోకుండా విచ్చలవిడిగా తోడేయడమే అసలు సమస్య. అంత వేగంగా భూమిలోకి నీరు తిరిగి చేరడం లేదు. ఏం జరుగుతోంది? ► భూగర్భం నుంచి నీటిని విచ్చలవిడిగా తోడేయడం నేల కుంగిపోవడానికి దారితీస్తోంది. ► అదే చివరికిలా పగుళ్లుగా బయట పడుతోంది. ► ఫిషర్లుగా పిలిచే ఈ పగుళ్లు సాధారణంగా పర్వతాల మధ్య ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ► వీటితో ఇళ్లకు, రోడ్లకు, కాల్వలకు, డ్యాములకు తదితరాలకు నష్టం అంతా ఇంతా కాదు. ► చాలాసార్లు ఈ భారీ పగుళ్ల వల్ల ఊహించలేనంతగా ప్రాణ నష్టం కూడా సంభవించవచ్చు. పశు సంపదకు కూడా నష్టం కలగవచ్చు. ఇవి ప్రాకృతికంగా జరుగుతున్న పరిణామాలు కావు. నూటికి నూరు శాతం మనుషుల తప్పిదాలే ఇందుకు కారణం’’ – జోసెఫ్ కుక్, పరిశోధకుడు, అరిజోనా జియాలాజికల్ సర్వే – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘వైఎస్సార్ పర్యావరణ’ భవనాలు సిద్ధం
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అన్ని వసతులతో సొంత కార్యాలయాలను నిర్మించింది. ‘డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనాలు’ పేరిట రూ.54.43 కోట్లతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మించిన భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.22.57 కోట్లతో విజయవాడ ఏపీఐఐసీ కాలనీలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు. కర్నూలులో రూ.15.93 కోట్లతో జోనల్ కార్యాలయం, తిరుపతిలో మరో రూ.15.93 కోట్లతో రీజనల్ కార్యాలయం నిర్మించారు. ఐదు అంతస్తుల్లో అత్యాధునిక రీతిలో ఈ భవనాల నిర్మాణం పూర్తిచేశారు. ఈ భవనాల్లో విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు సోలార్ సిస్టం, రక్షణ కోసం అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని అంతస్తుల్లోనూ సెంట్రల్ ఏసీ, ఇతర అన్ని సదుపాయాలను కల్పించారు. త్వరలోనే ఈ భవనాలను ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పర్యావరణ హామీలపై దృష్టి
వాషింగ్టన్: వర్ధమాన దేశాలకు చేసిన వాగ్దానాలను, పర్యావరణం సహా కీలక అంశాలపై హామీలను నెరవేర్చడం తదితరాలు జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రాథమ్యాలు కానున్నాయి. ఆయన భారత పర్యటనకు సంబంధించి బుధవారం చేసిన ప్రకటనలో వైట్హౌస్ ఈ మేరకు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జీ20 సదస్సు గొప్పగా విజయవంతం అవుతుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ ఆశాభావం వెలిబుచ్చారు. బైడెన్ గురువారం భారత్ రానున్నారు. శుక్రవారం ఆయన మోదీతో భేటీ అవుతారు. శని, ఆదివారాల్లో జీ20 భేటీలో పాల్గొంటారు. -
సిటిజన్ ఫీడ్ బ్యాక్లో సిద్దిపేట టాప్
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్–2023లో భాగంగా పట్టణంలో చెత్త సేకరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా? అని ఇలా పది రకాల ప్రశ్నలతో స్వచ్ఛత యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల ఫీడ్ బ్యాక్లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2023 పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. దేశంలోని 4,355 పట్టణా లు ఇందులో మెరుగైన ర్యాంకింగ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గతేడాది స్వ చ్ఛ సర్వేక్షణ్–2022లో తెలంగాణలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లు 16 అవార్డులు సాధించాయి. ఫీడ్ బ్యాక్లో టాప్లో సిద్దిపేట: సిటిజన్ ఫీడ్ బ్యాక్ స్వీకరణ ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దేశ వ్యాప్తంగా 4,355 పట్టణాలుండగా లక్షకు పైగా జనా భా ఉన్నవి 427, లక్షలోపు 3,928 పట్టణాలున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన 427 పట్టణాల ఫీడ్ బ్యా క్లో తొలి స్థానంలో సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట మున్పిపాలిటీలో 1,16,583 జనాభా ఉండగా 76, 283 మంది.. అంటే ఉన్న జనాభాలో 65.43 శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 32.61 శాతం మంది ఫీడ్ బ్యాక్తో 4వ స్థానంలో మహబూబ్నగర్, 8.88 శాతంతో 24వ స్థానంలో వరంగల్ ఉంది. ఫీడ్ బ్యాక్కు 600 మార్కులు: స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం 9,500 మార్కులు కేటాయించనున్నా రు. అందులో సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్కు 4,830, సర్టిఫికేషన్కు 2,500, సిటిజన్ వాయిస్కు 2,170 కేటాయించగా, సిటిజన్ ఫీడ్ బ్యాక్కు 600 మార్కులను కేటాయించనున్నారు. జిల్లాలోని ము న్సిపాలిటీలు ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్–2023కు ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. వాటి ప్రకారం పట్టణం ఉందా? లేదా? అని ఫిజికల్గా వెరిఫికేషన్ చేయనున్నారు. -
పర్యావరణ సంరక్షణ.. అందరికీ అర్థమయ్యేలా ఇమోజీ, కార్టూన్లతో
‘కళ కళ కోసమే కాదు... పర్యావరణ సంరక్షణ కోసం కూడా’ అంటోంది యువతరం. సంక్లిష్టమైన పర్యావరణ అంశాలను సులభంగా అర్థం చేయించడానికి, పర్యావరణ స్పృహను రేకెత్తించడానికి గ్రాఫిటీ వర్క్, ఇల్లస్ట్రేషన్, ఇమోజీ, కార్టూన్లను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటుంది. ఆర్ట్, హ్యూమర్లను కలిపి తన ఇలస్ట్రేషన్లతో పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలను ప్రచారం చేస్తున్నాడు రోహన్ చక్రవర్తి. కామిక్స్, కార్టూన్లు, ఇలస్ట్రేషన్ సిరీస్లతో ‘గ్రీన్ హ్యూమర్’ సృష్టించాడు. రెండు జాతీయ పత్రికల్లో వచ్చిన ఈ సిరీస్ను పుస్తకంగా ప్రచురించాడు. తన కృషికి ఎన్నో అవార్ట్లు వచ్చాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రోహన్ చక్రవర్తి కార్టూన్లను పర్యావరణ పరిరక్షణ ప్రచారానికి వినియోగించుకుంటున్నాయి. మహారాష్ట్రలోని నాగ్పుర్కు చెందిన రోహన్ పదహారు సంవత్సరాల వయసు నుంచే కార్టూన్లు వేయడం మొదలుపెట్టాడు.‘పర్యావరణ సంక్షోభ తీవ్రతను కామిక్స్తో బలంగా చెప్పవచ్చు. శాస్త్రీయ విషయాలపై ఆసక్తి ఉన్న వారినే కాదు, వాటిపై అవగాహన లేని వారిని కూడా ఆకట్టుకొని మనం చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సులభంగా చెప్పవచ్చు’ అంటున్నాడు రోహన్ చక్రవర్తి. కార్టూనిస్ట్, గ్రాఫిక్ స్టోరీ టెల్లర్ పూర్వ గోయెల్ తన కళను పర్యావరణ సంబంధిత అంశాల ప్రచారానికి ఉద్యమస్థాయిలో ఉపయోగిస్తోంది. పర్యావరణ నిపుణులు, పరిశోధకులు, పర్యావరణ ఉద్యమ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ‘అన్ని వయసుల వారిని ఆకట్టుకొని, అర్థం చేయించే శక్తి కార్టూన్లకు ఉంది’ అంటోంది 26 సంవత్సరాల పూర్వ గోయెల్.పశ్చిమ కనుమల జీవవైవిధ్యానికి వాటిల్లుతున్న ముప్పు నుంచి అరుణాచల్ప్రదేశ్లోని దిబంగ్ లోయలోని మిష్మి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల వరకు పూర్వ గోయెల్ తన కళ ద్వారా ఆవిష్కరించింది. అభివృద్ధిగా కనిపించే దానిలోని అసమానతను ఎత్తి చూపింది. డెహ్రడూన్కు చెందిన పూర్వ గోయెల్ నదులు, అడవులు ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యను దగ్గరి నుంచి చూసింది. బెల్జియంలో గ్రాఫిక్ స్టోరీ టెల్లింగ్లో మాస్టర్స్ చేసింది. ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్యం అంశంపై కెనడాలో నిర్వహించిన సదస్సుకు హాజరైంది.‘ఆ సదస్సులో వక్తలు పర్యావరణ విధానాల గురించి సంక్లిష్టంగా మాట్లాడారు. సామాన్యులు ఆ ప్రసంగ సారాన్ని అర్థం చేసుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమయ్యేలా పర్యావరణ విషయాలను చె΄్పాలనుకున్నాను. దీనికి నా కుంచె ఎంతో ఉపయోగపడింది. నన్ను నేను కమ్యూనికేటర్గా భావించుకుంటాను’ అంటుంది పూర్వ గోయెల్. ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా కామిక్ బుక్ తయారుచేసింది గోయెల్. ఈ కామిక్ బుక్కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘మేము ఎన్నో రిపోర్ట్లు విడుదల చేశాం. కాని ఒక్క రిపోర్ట్ చదవడానికి కూడా మా ఎకౌంటెంట్ ఆసక్తి చూపించలేదు. కామిక్స్ రూపంలో ఉన్న రిపోర్ట్ ఆమెకు బాగా నచ్చింది. కామిక్స్ ద్వారా తెలుసుకున్న విషయాలను ఇతరులకు చెప్పడం మొదలు పెట్టింది’ అని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినప్పుడు ఉత్సాహం రూపంలో గోయెల్కు ఎంతో శక్తి వచ్చి చేరింది. ‘గ్రాఫిక్ డిజైన్లో భాగంగా బ్రాండ్ డిజైన్ నుంచి పబ్లికేషన్ డిజైన్ వరకు ఎన్నో చేయవచ్చు. కాని నాకు కామిక్ స్ట్రిప్స్ అంటేనే ఇష్టం. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ను సంక్షిప్తంగానే కాదు అర్థమయ్యేలా చెప్పవచ్చు. ఒకటి లేదా రెండు వాక్యాలు, ఇమేజ్లతో పెద్ద స్టోరీని కూడా చెప్పవచ్చు’ అంటున్న అశ్విని మేనన్ గ్రాఫిక్ డిజైన్ను పర్యావరణ అంశాల ప్రచారానికి బలమైన మాధ్యమంగా చేసుకుంది.బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)లో చదువుకున్న అశ్విని కళకు సామాజిక ప్రభావం కలిగించే శక్తి ఉందని గ్రహించింది. తన కళను సమాజ హితానికి ఉపయోగించాలనుకుంది. రిచీ లైనల్ ప్రారంభించిన డాటా స్టోరీ టెల్లింగ్ సంస్థ ‘బెజలెల్ డాటా’ అసాధారణ ఉష్ణోగ్రతలకు సంబంధించిన సంక్లిష్టమైన సమాచారం అందరికీ సులభంగా, వేగంగా అర్థమయ్యేలా యానిమేటెట్ ఇమోజీలను క్రియేట్ చేస్తోంది.‘సంప్రదాయ రిపోర్ట్ స్ట్రక్చర్స్ ప్రకారం వెళితే అందరికీ చేరువ కాకపోవచ్చు. రిపోర్ట్ సారాంశాన్ని సులభంగా అర్థం చేసుకునేలా డాటా కామిక్స్ ఉపయోగపడతాయి. పెద్ద వ్యాసం చదువుతున్నట్లుగా కాకుండా ఇతరులతో సంభాషించినట్లు ఉంటుంది’ అంటున్న రిచీ లైనల్ ఎన్నో స్టోరీ టెల్లింగ్ వర్క్షాప్లు నిర్వహించాడు క్లైమెట్ డాటాపై అజిమ్ ప్రేమ్జీ యూనివర్శిటీతో కలిసి పనిచేశాడు. సంక్లిష్టమైన విషయాలను సంక్షిప్తంగా, సులభంగా అర్థమయ్యేలా చేయడానికి రిచీ లైనల్ అనుసరిస్తున్న మార్గంపై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. మెరైన్ బ్లాగిస్ట్, నేచర్ ఫొటోగ్రాఫర్ గౌరవ్ పాటిల్ రాతలతోనే కాదు ఇలస్ట్రేషన్స్, ఫొటోలతో పర్యావరణ సంబంధిత అంశాలను ప్రచారం చేస్తున్నాడు. సముద్ర కాలుష్యం నుంచి కాంక్రీట్ జంగిల్స్ వరకు ఎన్నో అంశాల గురించి తన ఇల్లస్ట్రేషన్ల ద్వారా చెబుతున్నాడు.బెంగళూరుకు చెందిన అక్షయ జకారియ వైల్డ్లైఫ్ డాక్యుమెంటరీలు చూస్తూ పెరిగింది. పర్యావరణంపై ఆసక్తి పెంచుకోవడానికి అది కారణం అయింది. పర్యావరణ సంరక్షణపై అవగాహనకు ఇలస్ట్రేషన్, డిజైన్లను ఉపయోగిస్తోంది. రోహన్ చక్రవర్తి నుంచి అక్షయ వరకు పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే అందరినీ ప్రకృతి ప్రపంచంలోకి తీసుకువచ్చింది అనురక్తి మాత్రమే కాదు అంతకంటే ఎక్కువైన అంకితభావం కూడా. -
చిన్నారులకు ఆత్మీయ నేస్తం
పిల్లల కోసం పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తుల తయారీలోగ్రామీణ మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. న్యూ ఏజ్ పేరెంట్స్ను ఆకట్టుకునేలా చేస్తున్న ఈ ప్రయత్నానికి మంచి స్పందన వస్తోందని, పిల్లలకు ఈ బొమ్మలు ఆత్మీయ నేస్తాలు అవుతున్నాయని ఆనందంగా వివరిస్తోంది స్వాతి. ‘‘పిల్లల మనసులు తెల్లని కాగితాల్లాంటివి. వాటిపై మనం ఏది రాస్తే అదే వారి భవిష్యత్తు. పదేళ్లుగా వందలాది మంది చంటి పిల్లలతో ఆడిపాడి, వారికి నచ్చినట్టు చెప్పే పద్ధతులను నేనూ నేర్చుకుంటూ వచ్చాను. డిగ్రీ చేసిన నాకు స్వతహాగా పిల్లలతో గడపడంలో ఉండే ఇష్టం నన్ను టీచింగ్ వైపు ప్రయాణించేలా చేస్తోంది. ప్లే స్కూల్ పిల్లలతో ఆడుకోవడం, వారితో రకరకాల యాక్టివిటీస్ చేయించడం ఎప్పుడూ సరదాయే నాకు. నాకు ఒక బాబు. వాడి వల్లనే ఈ ఇష్టం మరింత ఎక్కువైందనుకుంటాను. బాబుతోపాటు నేనూ ఓ స్కూల్లో జాయిన్ అయి, నా ఆసక్తులను పెంచుకున్నాను. ఆలోచనకు మార్గం పదేళ్లుగా చంటి పిల్లల నుంచి పదేళ్ల వయసు చిన్నారుల వరకు వారి ఆటపాటల్లో నేనూ నిమగ్నమై ఉన్నాను కనుక వారి ముందుకు ఎలాంటి వస్తువులు వచ్చి చేరుతున్నాయనే విషయాన్ని గమనిస్తూ వచ్చాను. కానీ, నేను అనుకున్న విధంగా అన్నింటినీ ఒక దగ్గరకు చేర్చడం ఎలాగో తెలియలేదు. కరోనా సమయంలో వచ్చిన ఆలోచన నాకు నేనుగా నిలబడేలా చేసింది. ఒకప్రా జెక్ట్ వర్క్లాగా పిల్లల మానసిక వికాసానికి ఏమేం వస్తువులు అవసరం అవుతాయో అన్నీ రాసుకున్నాను. నేను ఏయే పద్ధతుల్లో పిల్లలకు నేర్పిస్తున్నానో, దాన్నే నాకు నేనేప్రా జెక్ట్ వర్క్గా చేసుకున్నాను. ఏ వస్తువులు ఏ ప్రాంతానికి ప్రత్యేకమైనవి, నాకు నచ్చినట్టుగా ఏయే వస్తువులను తయారు చేయించాలి అనేది డిజైన్ చేసుకున్నాను కాబట్టి అనుకున్న విధంగా పనులు మొదలుపెట్టాను. కిండోరా టాయ్స్ పేరుతో రెండేళ్ల క్రితం ఈప్రా జెక్ట్నుప్రా రంభించాను. అన్నింటా ఎకో స్టైల్ పిల్లలకు దంతాలు వచ్చే దశలో గట్టి వస్తువులను నోటిలో పెట్టేసుకుంటారు. వాటిలోప్లాస్టిక్వీ వచ్చి చేరుతుంటాయి. అందుకని సాఫ్ట్ ఉడ్తో బొమ్మలను తయారు చేయించాను. వీటికోసం మన తెలుగు రాష్ట్రాల్లోని కొండపల్లి, నిర్మల్ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లోని టాయ్ మేకింగ్ వారిని కలిసి నాకు కావల్సిన విధంగా తయారు చేయించాను. ఇంద్రధనుస్సు రంగులను పరిచయం చేయడానికి సాఫ్ట్ ఉడ్ మెటీరియల్, కలర్, బిల్డింగ్ బాక్స్లే కాదు... ఐదేళ్ల నుంచి చిన్న చిన్న అల్లికలు, కుట్టు పని నేర్చుకోవడానికి కావల్సిన మెటీరియల్, క్రోచెట్ అల్లికలు వంటివి కూడా ఉండేలా శ్రద్ధ తీసుకున్నాను. సాఫ్ట్ టాయ్స్తోపాఠం మన దేశ సంస్కృతిని పిల్లలకు తెలియజేయాలంటే మన కట్టూ బొట్టునూ పరిచయం చేయాలి. అందుకు ప్రతి రాష్ట్రం ప్రత్యకత ఏమిటో డెకొరేటివ్ బొమ్మల ద్వారా చూపవచ్చు. ఇవి కూడా ఆర్గానిక్ మెటీరియల్స్ తో తయారు చేసినవే. డెకరేటివ్ సాఫ్ట్ టాయ్స్ స్వయంగా నేను చేసినవే. ఆర్గానిక్ కాటన్ మెటీరియల్తో చేయించిన సాఫ్ట్ టాయ్స్లో జంతువులు, పండ్లు, పువ్వుల బొమ్మలు కూడా ఉంటాయి. వీటివల్ల చిన్న పిల్లలకు ఎలాంటి హానీ కలగదు. రంగురంగులుగా కనిపించే ఈ బొమ్మల ద్వారా చెప్పేపాఠాలను పిల్లలు ఆసక్తిగా వింటారు. వీటితోపాటు పిల్లలను అలరించే పుస్తకాలు కూడా అందుబాటులో ఉండేలా చూసుకున్నాను. ఒక విధంగా చె΄్పాలంటే ఈ కాలపు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి మానసిక వికాసపు బొమ్మలు కావాలనుకుంటారో అవన్నీ నా దగ్గర ఉండేలాప్లాన్ చేసుకున్నాను. నా ఆసక్తే పెట్టుబడి.. ఉద్యోగం చేయగా వచ్చిన డబ్బుల నుంచి చేసుకున్న పొదుపు మొత్తాలను ఇందుకోసం ఉపయోగించాను. ముందు చిన్నగా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆన్లైన్ వేదికగా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. నాతోపాటు ఈ పనిలో గ్రామీణ మహిళలు భాగస్వామ్యం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోంది. ప్లే స్కూళ్లు, ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా వచ్చే ఆర్డర్లను బట్టి సాఫ్ట్ టాయ్స్ తయారీలో కనీసంపాతికమంది మహిళలుపాల్గొంటున్నారు. ముందుగా వర్క్షాప్ నిర్వహించి, టాయ్స్ మేకింగ్ నేర్పించి వర్క్ చేయిస్తుంటాను. పూర్తి ఎకో థీమ్ బేస్డ్ కావడంతో ఈ కాలం అమ్మలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. నేననుకున్న థీమ్ ఎంతో కొంతమందికి రీచ్ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని వివరించింది స్వాతి.– నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్.. ఇప్పటికే 4లక్షల మొక్కలు
నిజాయితీగా, విరామం లేకుండా కృషి చేస్తే విజయం తప్పక సాధిస్తామని నమ్మే ట్రీ టీచర్... అతిపెద్ద థార్ ఎడారిని సస్యశ్యామలం చేసేందుకు నిర్విరామంగా కృషిచేస్తున్నాడు. ఇసుకమేటలను పచ్చని అడవులుగా మార్చేందుకు తను తాపత్రయపడుతూ.. అందరిలో అవగాహన కల్పిస్తున్నాడు. ‘‘ప్రకృతిని తన కుటుంబంలో ఒకరిగా చూసుకుంటూ భూమాతను కాపాడుకుందాం రండి’’ అంటూ పచ్చదనం పాఠాలు చెబుతున్నాడు ట్రీ టీచర్ భేరారం భాఖర్. రాజస్థాన్లోని బార్మర్ జిల్లా కుగ్రామం ఇంద్రోయ్కుచెందిన భేరారం భాఖర్ స్కూల్లో చదివే రోజుల్లో .. విద్యార్థులందర్నీ టూర్కు తీసుకెళ్లారు. ఈ టూర్లో యాభై మొక్కలను నాటడం ఒక టాస్క్గా అప్పగించారు పిల్లలకు. తన స్నేహితులతో కలిసి భేరారం కూడా మొక్కలను ఎంతో శ్రద్ధ్దగా నాటాడు. అలా మొక్కలు నాటడం తనకి బాగా నచ్చింది. టూర్ నుంచి ఇంటికొచ్చిన తరువాత మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం వల్ల ప్రకృతి బావుంటుంది అని తెలిసి భాఖర్కు చాలా సంతోషంగా అనిపించింది. మిగతా పిల్లలంతా మొక్కలు నాటడాన్ని ఒక టాస్క్గా తీసుకుని మర్చిపోతే భేరారం మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు.‘‘ప్రకృతిని ఎంత ప్రేమగా చూసుకుంటే అది మనల్ని అంతగా ఆదరిస్తుంది. పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత’’అని నిర్ణయించుకుని అప్పటి నుంచి మొక్కలు నాటడం మొదలు పెట్టాడు. ట్రీ టీచర్గా... మొక్కలు నాటుతూ చదువుకుంటూ పెరిగిన భాఖర్కు ప్రభుత్వ స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. దీంతో తనకొచ్చిన తొలిజీతాన్ని మొక్కల నాటడానికే కేటాయించాడు.‘మొక్కనాటండి, జీవితాన్ని కాపాడుకోండి’ అనే నినాదంతో తన తోటి టీచర్లను సైతం మొక్కలు నాటడానికి ప్రేరేపించాడు. ఇతర టీచర్ల సాయంతో బర్మార్ జిల్లా సరిహద్దుల నుంచి జైసల్మేర్, జోధర్, ఇంకా ఇతర జిల్లాల్లో సైతం మొక్కలు నాటుతున్నాడు. ఒకపక్క తన విద్యార్థులకు పాఠాలు చెబుతూనే, మొక్కల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రకృతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొక్కలను ఉచితంగా సరఫరా చేస్తూ మొక్కలు నాటిస్తున్నాడు. తన స్కూలు విద్యార్థులకేగాక, ఇతర స్కూళ్లకు కూడా తన మోటర్ సైకిల్ మీద తిరుగుతూ మొక్కలు నరకవద్దని చెబుతూ ట్రీ టీచర్గా మారాడు భేరారం. అడవి కూడా కుటుంబమే... బర్మార్లో పుట్టిపెరిగిన భాఖర్కు అక్కడి వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. సరిగా వర్షాలు కురవకపోవడం, నీళ్లు లేక పంటలు పండకపోవడం, రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా చూసి ఎడారిలో ఎలాగైనా పచ్చదనం తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే... ‘ఫ్యామిలీ ఫారెస్ట్రీ’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మొక్కను మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అనుకుంటే దానిని కచ్చితంగా కాపాడుకుంటాము. అప్పుడు మొక్కలు పచ్చగా పెరిగి ప్రకృతితో పాటు మనమూ బావుంటాము అని పిల్లలు, పెద్దల్లో అవగాహన కల్పిస్తున్నాడు. భేరారం మాటలతో స్ఫూర్తి పొందిన యువతీ యువకులు వారి చుట్టుపక్కల ఖాళీస్థలాల్లో మొక్కలు నాటుతున్నారు. నాలుగు లక్షలకుపైగా... అలుపెరగకుండా మొక్కలు నాటుకుంటూపోతున్న భేరారం ఇప్పటిదాకా నాలుగు లక్షలకుపైగా మొక్కలు నాటాడు. వీటిలో పుష్పించే మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలతో సహా మొత్తం లక్షన్నర ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడి మట్టిలో చక్కగా పెరిగే మునగ మొక్కలు ఎక్కువగా ఉండడం విశేషం. రాజస్థాన్లోని ఎనిమిది జిల్లాల్లో పన్నెండు లక్షల విత్తనాలను నాటాడు. 28వేల కిలోమీటర్లు బైక్ మీద తిరుగుతూ లక్షా ఇరవైఐదు వేలమందికి మొక్కల నాటడంతో పాటు, వాటి ప్రాముఖ్యం గురించి అవగాహన కల్పించాడు. మొక్కలే కాకుండా 25వేల పక్షులకు వసతి కల్పించి వాటిని ఆదుకుంటున్నాడు. గాయపడిన వన్య్రప్రాణులను సైతం చేరదీస్తూ పర్యావరణాన్ని పచ్చగా ఉంచేందుకు కృషిచేస్తున్నాడు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైనట్టుగా.. భేరారం కృషితో ఎడారి ప్రాంతం కూడా పచ్చదనంతో కళకళలాడాలని కోరుకుందాం. -
మిగిలిపోయిన కూరగాయలతో ప్యాకింగ్ పేపర్స్, ఆదర్శంగా నిలుస్తున్న మాన్య
పర్యావరణ పరిరక్షణ గురించి మాటలు కాదు, చేతల్లో చూపించండి అని గ్రేటాథన్ బర్గ్ గళం విప్పింది. ఈ మాటను తూ.చ. తప్పకుండా ఆచరిస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది మాన్యా. అందుకే మాన్యను ‘అంతర్జాతీయ యూత్ ఇకో– హీరో’ అవార్డు వరించింది. పర్యావరణ సమస్యలను పరిష్కరించే ఎనిమిది నుంచి పదహారేళ్ళలోపు వయసు వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా పదిహేడు మంది యువతీ యువకులను ఈ అవార్డుకు ఎంపిక చేయగా మన దేశం నుంచి మాన్యహర్షను ఏరికోరి ఈ అవార్డు వరించింది. మాన్య చేపట్టిన ‘సన్షైన్ ప్రాజెక్టుకు గానూ ఇంతటి గుర్తింపు లభించింది. 27 దేశాలు, 32 అమెరికా రాష్ట్రాల్లో... ఇరవై ఏళ్లుగా పర్యావరణం గురించి కృషిచేస్తోన్న... 339 మందిని గుర్తించి వారిలో పదిహేడు మందికి ఇకో హీరో అవార్డులు ఇచ్చారు. బెంగళూరుకు చెందిన పదిహేడేళ్ళ మాన్య గోల్డెన్ బీ ఆఫ్ విబ్జిఆర్ హైస్కూల్లో చదువుతోంది. చిన్నప్పటి నుంచి మొక్కలంటే ఇష్టం. మాన్యకు నాలుగేళ్లు ఉన్నప్పుడు నానమ్మ రుద్రమ్మ మాన్యతో మొక్కను నాటిస్తూ... ‘‘ప్రకృతినీ, పర్యావరణాన్నీ ప్రేమగా చూసుకోవాలి. మనతో పాటు మొక్కలు, జంతువులను బతకనిస్తే మనం బావుంటాము’’ అని ఆమె మాన్యకు చెప్పింది. అప్పటినుంచి మాన్యకు పర్యావరణంపై మక్కువ ఏర్పడింది. చిన్నప్పటి నుంచి పర్యావరణ కార్యక్రమాల్లో పాల్గొనేది. లాక్డౌన్ సమయంలో... కరోనా వైరస్ చెడు చేసినప్పటికీ సరికొత్త పనులు చేయడానికి కొంతమందికి వెసులుబాటు కల్పించింది. ఈ వెసులు బాటును వాడుకున్న మాన్య.. పిల్లల కోసం ‘సన్షైన్’ అనే మ్యాగజైన్ను ప్రారంభించింది. ప్రింట్, డిజిటల్ కాపీల ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తోంది. ఈ మ్యాగజైన్ను బెంగళూరులోని మాంటిస్సోరి, ఇతర స్కూళ్లల్లోని పిల్లలకు ఉచితంగా అందిస్తోంది. వివిధ కార్యక్రమాలను పరిచయం చేస్తూ పర్యావరణ ప్రాధాన్యత గురించి వివరిస్తోంది. ‘ఈచ్ వన్ ప్లాంట్ వన్ క్యాంపెయిన్’, ‘పేపర్ మేకింగ్ వర్క్షాప్’, ‘పిల్లలు నీటిని ఎలా కాపాడగలరు?’, ‘న్యూఇండియా సస్టెయినబుల్ క్యాంపెయిన్’,ప్లాస్టిక్ ఫ్రీ జూలై రైటింగ్ కాంపిటీషన్’, ఎర్త్డే రోజు పెయింటింగ్ పోటీల వంటివాటిని మ్యాగజైన్ ద్వారా నిర్వహిస్తూ పర్యావరణంపై చక్కని అవగాహన కల్పిస్తోంది. తన యూట్యూబ్ ఛానెల్లో కూడా పర్యావరణ కార్యక్రమ వీడియోలు షేర్ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. పీల్స్తో పేపర్స్.. అనేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు వంటింట్లో మిగిలిపోయే కూరగాయ తడి వ్యర్థాలను ప్యాకింగ్ పేపర్స్గా మారుస్తోంది. కూరగాయ తొక్కలను ఉపయోగించి, పెన్సిల్స్, పేపర్లు రూపొందిస్తోంది. ఇప్పటిదాకా రెండు వందలకు పైగా వెజిటేబుల్ పీల్ పేపర్లను తయారు చేసింది. ఇందుకోసం వంటింట్లో మిగిలిపోయిన వ్యర్థాలు, పండుగల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సేకరించి, వాటిని గ్రైండ్ చేసి పేపర్గా మార్చడం విశేషం. పాత జీన్స్ ప్యాంట్లను డెనిమ్ పేపర్లుగా తీర్చిదిద్దుతోంది. మాన్యా స్వయంగా తయారు చేయడమే గాక, వర్క్షాపుల ద్వారా పేపర్ల తయారీ గురించి పిల్లలకు నేర్పిస్తోంది. అనేక అవార్డులు.. నాలుగున్నరవేలకు పైగా మొక్కలను నాటి, ఏడువేల మొక్కలు పంపిణీ చేసింది. ఐదువేల విత్తనాలను నాటింది. ఎనిమిదివేలకు పైగా ఆర్గానిక్, కాటన్ సంచులను పంచింది. సిటీ, హైవే రోడ్లు, నీటి కుంటలను శుద్ధిచేసే కార్యక్రమాలను చేపట్టింది. వీటన్నింటికి గుర్తింపుగా మాన్యకు అనేక అవార్డులు వచ్చాయి. వెజిటేబుల్ పేపర్కు గ్రీన్ ఇన్నోవేటర్, జల వనరుల మంత్రిత్వ శాఖ 2020 సంవత్సరానికి గాను ‘వాటర్ హీరో’, ఎర్త్డాట్ ఓ ఆర్జీ ఇండియా నెట్వర్క్ నుంచి రైజింగ్ స్టార్, హ్యూమానిటేరియన్ ఎక్స్లెన్స్ అవార్డులు వచ్చాయి. పృథ్వి మేళా, అక్షయ్కల్ప్ రీసైక్లింగ్ మేళా, లయన్స్ క్లబ్, బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్, బైజూస్ పేపర్ బ్యాగ్ డే వంటి కార్యక్రమాల్లో పర్యావరణంపై ప్రసంగించింది. ఇవన్నీగాక మాన్య ప్రకృతిమీద ఏడు పుస్తకాలు రాసింది. 2019 ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ యంగెస్ట్ పోయెట్, ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలుచుకుంది. ‘‘ఈ అవార్డు నా కృషిని గుర్తించి మరింత స్ఫూర్తిని ఇచ్చింది. భవిష్యత్లో నా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తాను’’ అని చెబుతూ ఎంతోమందిని ఆలోచించేలా చేస్తోంది మాన్య. -
ఐఐటీ విద్యార్థులు.. పచ్చని కూరగాయలు పండిస్తున్నారు
బంజరు భూములలో కూడా బంగారాన్ని పండించవచ్చని నిరూపిస్తున్నారు ఐఐటీ–బాంబే గ్రాడ్యుయేట్స్ అభయ్ సింగ్, అమిత్ కుమార్లు. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయన రహిత కూరగాయలను పచ్చగా పండిస్తున్నారు. ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్తో ఈ మిత్రద్వయం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది... అభయ్ సింగ్, అమిత్ కుమార్లు ఐఐటీ–బాంబేలో బెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది స్నేహితులలాగా సినిమాలు, క్రికెట్ గురించి కంటే పర్యావరణం, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుకునేవారు. ‘కాలేజి రోజుల నుంచి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించడం మా అలవాటు. రకరకాల ప్రాజెక్ట్ల గురించి మాట్లాడుకునే వాళ్లం. క్లాస్ పూర్తయిన తరువాత ఎన్నో విషయాలపై మేధోమథనం చేసేవాళ్లం చదువుకున్నామా? ఉద్యోగాలు చేశామా? అని కాకుండా సమాజం కోసం మా వంతుగా ఏదైనా చేయాలనుకునే వాళ్లం. మన దేశంలో ఎంతో మంది వ్యవసాయరంగంలో పనిచేçస్తున్నారు. వారి కోసం ఏదైనా చేయాలనుకునేవాళ్లం. ఏదైనా సాధించాలనే తపన పుట్టినప్పుడు ఆత్మవిశ్వాసం మొదలవుతుంది. అది అనేక రకాలుగా శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. మా విషయంలోనూ ఇదే జరిగింది’ అంటాడు అమిత్. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమిత్, అభయ్లు ఆ రంగానికి సంబంధించిన రకరకాల ప్రయోగాలు చేస్తూ స్థిరమైన, అనుకూలమైన, అందుబాటులో ఉండే సాంకేతికతను రైతులకు దగ్గర చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ‘జనాభా పెరుగుదల దృష్ట్యా మన దేశంలో ఆహార కొరత ఏర్పడనుంది. ఆహారంలో పోషక విలువలు కోల్పోనున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా, ఆరోగ్యానికి మేలు చేసేలా, వేగంగా ఉత్పత్తి చేసేలా కొత్త ఆవిష్కరణలు చేయాలనుకున్నాం’ అంటాడు అభయ్. తాము చర్చించుకున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇకీ ఫుడ్స్’ అనే అంకురాన్ని ప్రారంభించారు. ‘ఇకీ ఫుడ్స్’ మొదలు పెట్టినప్పుడు మొదటి మూడు సంవత్సరాలు పరిశోధన, అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టారు. వీరు సృష్టించిన సాంకేతికత ఎనభై శాతం నీటి వృథాను ఆరికడుతుంది. సంప్రదాయ పద్ధతుల్లో కంటే 75 శాతం వేగవంతమైన వృద్ధిరేటు ఉంటుంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయనరహిత కూరగాయలను పండిస్తున్నారు. గత సంవత్సరం తమ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ రైట్స్ పొందారు. ‘ఎన్నో రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నా అవసరాలకు తగిన పద్ధతులు కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేగవంతమైన ఉత్పత్తి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చాం. మట్టి నుంచి మొక్క మొలకెత్తడానికి నీరు. ఆక్సిజన్, పోషకాలు, సపోర్ట్ అవసరం అవుతాయి. ఈ నాలుగు ఆధారాలతో మట్టితో పని లేకుండా మొక్కలను సృష్టించాలనుకున్నాం. డెబ్బైశాతం తేమ ఉన్న గదిలో అవసరమైన పోషక మూలాలను స్ప్రే చేసి ప్రయోగాలు మొదలు పెట్టాం’ అంటాడు అమిత్. సంపన్న దేశాల వ్యవసాయ క్షేత్రాల హైడ్రోపోనిక్స్ సిస్టమ్లో ఉపయోగించే కూలర్లు, చిల్లర్లు, బ్లోయర్లు, ప్లాస్టిక్ ఎన్క్లోజర్లకు ఈ మిత్రద్వయం దూరంగా ఉండాలనుకుంటోంది. సౌరశక్తిలోని అద్భుతాన్ని ఉపయోగించుకొని సంప్రదాయ పద్ధతుల్లో కంటే ఎక్కువ దిగుబడి సాధించాలనుకుంటోంది. రాజస్థాన్లోని కోట కేంద్రంగా పని చేస్తున్న ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్ ‘కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్’ను తన నినాదంగా, విధానంగా ఎంచుకుంది. రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో ‘ఇకీ ఫుడ్స్’ క్షేత్రాలకు శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నారు అమిత్, అభయ్లు. ఇకిగై అంటే... ఇకిగై అనేది జపనీస్ కాన్సెప్ట్. ఆరోగ్యవంతమైన. శక్తివంతమైన జీవన విధానాన్ని ప్రతిఫలించే మాట. జపనీస్ పదాలు ఇకీ (జీవితం), కై (ఫలితం, ఫలం) నుంచి పుట్టింది. స్ఫూర్తిదాయకమైన ‘ఇకిగై’ కాన్సెప్ట్ నుంచి తమ స్టార్టప్కు ‘ఇకీ ఫుడ్స్’ అని నామకరణం చేశారు అమిత్, అభయ్లు. కొత్త ఆలోచనలు వృథా పోవు. కాస్త ఆలస్యమైనా మంచి ఫలితం దక్కుతుంది. – అమిత్ కుమార్, ఇకీ–ఫుడ్స్, కో–ఫౌండర్ -
మహీంద్రా నుంచి చిన్న ట్రాక్టర్లు: ఏఆర్ రెహమాన్ గీతం అదుర్స్
కేప్టౌన్ (దక్షిణాఫ్రికా): ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) కొత్తగా మరిన్ని వాహనాలను ఆవిష్కరించింది. చిన్న ట్రాక్టర్లు, కార్లు వీటిలో ఉన్నాయి. చిన్న కమతాల రైతులు, వ్యక్తిగత ఫామ్హౌస్లున్న వారు మొదలైన వర్గాలకు ఉపయోగపడేలా తేలికపాటి, చిన్న ట్రాక్టర్లను ఫ్యూచర్స్కేప్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రవేశపెట్టింది. మహీంద్రా ఓజా పేరిట ఆవిష్కరించిన ఈ ట్రాక్టర్ల శ్రేణిలో ఏడు మోడల్స్ ఉంటాయి. వీటి ధర రూ. 5,64,500 నుంచి రూ. 7,35,000 వరకు (పుణె– ఎక్స్ షోరూమ్) ఉంటుంది. తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంటులో తయారు చేసే ఈ ట్రాక్టర్లను దేశీయంగా విక్రయించడంతో పాటు ఉత్తర అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, యూరప్ తదితర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు సంస్థ ఈడీ (ఆటో, ఫార్మ్ విభాగాలు) రాజేశ్ జెజూరికర్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో ట్రాక్టర్ల ఎగుమతులను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 18,000 పైచిలుకు ట్రాక్టర్లను ఎగుమతి చేసింది. ఓజా ప్లాట్ఫాంపై రూ. 1,200 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు జెజూరికర్ వివరించారు. మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చర్ మెషినరీ కలిసి దీన్ని తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. (2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్) థార్.ఈ, గ్లోబల్ పికప్ ఆవిష్కరణ.. ఫ్యూచర్స్కేప్ కార్యక్రమంలో భాగంగా ఎంఅండ్ఎం ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘థార్.ఈ’ని కూడా ఆవిష్కరించింది. వినూత్నమైన డిజైన్, ఇంటీరియర్స్తో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించినట్లు సంస్థ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ వీజే నక్రా తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్ల కోసం గ్లోబల్ పికప్ వాహనాన్ని సైతం సంస్థ ఆవిష్కరించింది. రోజువారీ ప్రయాణ అవసరాలతో పాటు సాహస ట్రిప్లకు కూడా అనువుగా ఇది ఉంటుందని నక్రా వివరించారు. అటు, విద్యుత్ వాహనాల శ్రేణి కోసం నెలకొల్పిన మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ (ఎంఈఏఎల్)కి కొత్త లోగోను కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన ‘లే ఛలాంగ్’ ప్రచార గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపర్చారు. (టెకీలకు గుడ్ న్యూస్: ఇన్ఫోసిస్ మెగా డీల్) -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మంత్రి తలసాని
సనత్నగర్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంతి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను ఆదివారం ఆయన తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, వర్షాకాలంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వాటి బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో మురుగునీరు, పిచి్చమొక్కలు, వ్యర్థాలు ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. దోమల నివారణకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి రోజూ ఫాగింగ్ చేస్తారన్నారు. కార్యక్రమంలో డీసీ శంకర్, ఎంటమాలజీ ఎస్ఈ దుర్గాప్రసాద్, ఏఈ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం అండ: మంత్రి యాదవుల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా యాదవ సంఘం నూతన కమిటీ సభ్యులు.. అధ్యక్షుడు మేకల యాదయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంత్రిని ఆయన నివాసంలో ఆదివారం కలిసి శాలువాతో సత్కరించారు. మంత్రిని కలిసిన వారిలో గౌరవ అధ్యక్షుడు అల్లి వేణుయాదవ్, ప్రధాన కార్యదర్శి కొమ్మనబోయిన సైదులు యాదవ్, ఉపాధ్యక్షుడు కదారి గోపి, సాంస్కృతిక విభాగం మహిళా అధ్యక్షురాలు మంజులత యాదవ్, యూత్ అధ్యక్షుడు దొంగరి శివకుమార్, సల్లా సైదులు, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోసాల గోపాల కృష్ణ ఉన్నారు. కాగా, మంజుల యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన గురుకులం, ఇతర పాటల పోస్టర్లను మంతి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. -
మన పులులు 21
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 21 పెద్ద పులులు ఉన్నట్టు ’స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022’నివేదిక వెల్లడించింది. ఈ మేరకు శనివారం కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అధికారిక నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో పులులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోనే ఉన్నాయని, కవ్వాల్ టైగర్ రిజర్వ్లో ఒక్క పులి కూడా శాశ్వత ఆవాసం ఏర్పరచుకోలేదని పేర్కొంది. కాగా ఈ నివేదిక చూస్తుంటే కేవలం రెండు టైగర్ రిజర్వ్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న పులుల సంఖ్యనే గుర్తించినట్టు కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ నివేదికలో రెండున్నరేళ్ల వయసుకు పైబడిన పులుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోందన్నారు. మొత్తంగా సవివరమైన వివరాలతో విడుదల చేసే ‘అబ్స్ట్రాక్ట్ నివేదిక’లో స్పష్టత వస్తుందనీ అది వచ్చేందుకు కొంత సమయం పట్టొచ్చునని పేర్కొంటున్నారు. తాజా నివేదికపై అధికారుల్లో చర్చ 2018లో ఉన్న 26 పులుల సంఖ్య (కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో 19, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో 7) నుంచి ఇప్పుడు గణనీయంగా పులుల సంఖ్య పెరిగి ఉంటుందని అధికారులు భావిస్తూ వచ్చారు. అయితే నివేదిక అందుకు భిన్నంగా రావడంపై రాష్ట్ర అటవీశాఖ అధికార వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని రెండు పులుల అభయారణ్యాల్లోనే కాకుండా టైగర్ కారిడార్లు, బఫర్ జోన్లు ఇతర ప్రాంతాలు కలిపితే 28 దాకా పెద్ద పులులు, దాదాపు పది దాకా పులి పిల్లలు ఉండొచ్చునని అటవీ అధికారులు చెబుతున్నారు. కిన్నెరసాని, పాకాల, ఏటూరునాగారం వంటి కొత్త ప్రాంతాల్లో పులి పాదముద్రలు రికార్డ్ అయ్యాయని, టైగర్ కారిడార్ ఏరియాలోని సిర్పూర్ కాగజ్నగర్, ఇతర ప్రాంతాల్లోనూ వీటి జాడలున్నాయని తెలిపారు. అక్కడ పులుల సంఖ్యలో వృద్ధికి సంబంధించి తాము క్షేత్రస్థాయిలో కెమెరా ట్రాపులు, ఫొటోలు, ఇతర సాంకేతిక ఆధారాలతో ఈ అంచనాకు వచి్చనట్టుగా ఒక సీనియర్ అధికారి ‘సాక్షి’కి వెల్లడించారు. ప్రాజెక్ట్ టైగర్ ద్వారా సత్ఫలితాలు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ ములుగులో ఘనంగా రాష్ట్ర స్థాయి పులుల దినోత్సవం ములుగు (గజ్వేల్): దేశవ్యాప్తంగా పులుల సంఖ్య పెంపుదల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్)ఆర్.ఎం. డోబ్రియాల్ తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం (ఎఫ్సీఆర్ఐ)లో ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో పులుల సంఖ్య 3,167కు పెరిందని తెలిపారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంరక్షణ చర్యలతో ఇక్కడ కూడా పులుల సంఖ్య పెరిగిందన్నారు. పులులను మనం కాపాడితే అడవిని, తద్వారా మానవాళిని కాపాడుతాయన్నారు. రానున్న రోజులలో పులుల ఆవాసాలను మరింతగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ములుగు ఎఫ్సీఆర్ఐ డీన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
తప్పక చదవండి
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement