-
తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఇవిగో చిట్కాలు!
మారుతున్న కాలంలో చాలా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వచ్చేస్తోంది. దీంతో చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. మరికొంతమంది మార్కెట్లో దొరికే అనేక రకాల రసాయనాలతో కూడిన హెయిర్ డైలను ఎడా పెడా వాడేస్తున్నారు. ఈ అనారోగ్యకరమైన కెమికల్స్తో కొత్త సమస్యలొస్తున్నాయి. అయితే మరికొంతమంది మాత్రం ఓపిగ్గా సహజమైన హెన్నా, ఇతర చిట్కాలను వాడుతున్నారు. మరి అలాంటి చిట్కా మీకోసం.. జామ ఆకులు: సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన చుట్టూదొరికేవాటితోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో జామ ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జామ ఆకులను శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్నుంచి తీసిన రసంలో 2 స్పూన్ల బాదం ఆయిల్ కలిపి జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నల్ల నువ్వులు నల్ల నువ్వులు జుట్టును నల్లగా మారుస్తాయి. కొన్ని నల్ల నువ్వులను వారానికి రెండుసార్లు తినడం వల్ల జుట్టు నెరిసే ప్రక్రియ నెమ్మదిస్తుంది లేదా రివర్స్ కూడా చేయవచ్చు. ఆమ్లా లేదా పెద్ద ఉసిరి ఆమ్లా జుట్టు పిగ్మెంటేషన్ను మెరుగుపరుస్తుంది. ఎండబెట్టిన ఉసిరికాయముక్కలు, కొబ్బరి నూనెలో కలిపి బాగా నల్లగా వచ్చే దాకా మరగించాలి. ఈ తైలాన్ని జుట్టు పట్టిస్తే కేశాలు నల్లగా మారతాయి. అంతేకాదు ఈ ఆయిల్ను మాడుకు మసాజ్ చేసినా, ఆమ్లా జ్యూస్ తాగినా జుట్టు రాలడం తగ్గుతుంది, నల్లని నిగనిగలాడే జుట్టు మీ సొంతం. కరివేపాకు: కరివేపాకు జుట్టు ప్రయోజనకారిగా ఉంటుంది. కరివేపాకులను పేస్ట్లా చేసి పెరుగుతో కలిపి వారానికి రెండుసార్లు జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అశ్వగంధ: ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, జుట్టు తెల్లగా అయిపోవడానికి తగ్గిస్తుంది.అశ్వగంధ వేరు పౌడర్తో పాటు బ్రాహ్మీ పొడిని పేస్ట్గా తయారు చేసి మాస్క్గా ఉపయోగించవచ్చు. ఈ మాస్క్ని నెత్తిమీద మసాజ్ చేసి తర్వాత కడిగేసుకుంటే లాభాలు వస్తాయి. అశ్వగంధ టీ తీసుకోవడం వల్ల జుట్టు నెరసిపోవడం కూడా తగ్గుతుంది. భృంగరాజ్: దీన్నే గుంట గలకర అని కూడా అంటారు. బృంగరాజ్ ఆకులను ఏదైనా నూనెలో రాత్రంతా నానబెట్టి, ఈ నూనెను జుట్టుకు రాసుకోవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యానికి కూడా చాలామంచిది. మందార పువ్వు: మందారలో విటమిన్ సి ఎ , ఐరన్ లభిస్తాయి. జుట్టుకు ఏదైనా నూనెతో కలిపి దాని ఎండబెట్టిన, లేదా పచ్చి పువ్వులను వేసి బాగా మరిగించి, చల్లారిన తరవుఆత దాన్ని జుట్టుకు పట్టించుకొని, తరువాత వాష్ చేసుకుంటే తెల్ల జుట్టు నివారణతో పాటు, మంచి మెరుపు కూడా వస్తుంది. తెల్ల జుట్టును తగ్గించడంలో ఉల్లిపాయ కూడా బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన జుట్టు కోసం సలాడ్లు, చేపలు, మాంసం, పండ్లు , ఆకు కూరలు ఎక్కువగా తినాలి. -
'సైంటిస్ట్గానే కాదు... భార్యగానూ గెలిచింది'!
ఆమె అంటువ్యాధులకు సంబంధించిన వైద్యురాలు, పరిశోధకురాలు. ఆమె భర్త అనుకోకుండా యాంటీబయాటిక్స్కి లొంగని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు గురయ్యాడు. తన కళ్లముందే భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రతి క్షణం ఓ యుగంలా భయం ముంచుకొస్తోంది. అంత పెద్ద పరిశోధకురాలు అయినా ఓ సాధారణ మహిళలా భర్త ప్రాణాల ఎలా రక్షించాలో తెలియక తల్లడిల్లిపోయింది. ఇంతవరకు అలాంటి యాంటీబయోటిక్ బ్యాక్టీరియల్ కోసం ఎలాంటి చికిత్స లేదని తెలిసి హుతాశురాలైంది. ఎలాంటి యాంటి బయాటిక్లు వాడిన ఫలితం ఉండదని తెలిసిన క్షణంలో ఆమె మెదడు తట్టిన మెరుపులాంటి ఆలోచనతో.. కలియుగ సావిత్రలా మారి తన భర్త ప్రాణాలను కాపాడుకుంది. అందరిచేత శభాష్ అనిపించుకుంది. దాని గురించి ఓ పుస్తకం సైతం ప్రచురించింది కూడా. ఇంతకీ ఆమె ఏం చేసింది. ఎలా భర్త ప్రాణాలు కాపాడుకుంది అంటే.. యూఎస్కి చెందిన స్టెఫానీ స్ట్రాత్డీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎపిడెమియాలజిస్ట్. ఆమె భర్త టామ్ ప్యాటర్సన్ సూపర్ బగ్(యాంటీబయాటిక్స్కి లొంగని బ్యాక్టీరియా) ఇన్ఫెక్షన్ బారినపడ్డాడు. సరిగ్గా 2015లో టామ్ నదిపై సర్ఫింగ్ చేస్తూ.. అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పితో పడిపోయాడు. తక్షణమే స్ట్రాత్ డీ ఈజిప్ట్లోని ఒక క్లినిక్కి తరలించగా, అక్కడ అతడి ఆరోగ్య మరింతగా దిగజారడం ప్రారంభమయ్యింది. దీంతో ఆమె అతడిని జర్మనీలోని ఓ ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్యుల యాంటీబయోటిక్స్కి లొంగని "బాక్టీరియం అసినెటోబాక్టర్ బౌమన్ని"తో బాధపడుతున్నట్లు తెలిపారు. అది అతడి కడుపులో ద్రాక్షపండు సైజులో ఓ గడ్డలా ఉందని చెప్పారు. అది ఎలాంటి యాంటీ బయోటిక్లకు లొంగదని చెప్పారు. నిజానికి ఈ బ్యాక్టీరియాని మధ్యప్రాచ్యంలోనే గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇరాక్ యుద్ధంలో చాలామంది అమెరికన్ దళాల గాయపడ్డారు. అయితే వారంతా ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్లాక ఈ బ్యాక్టీరియా బారిన పడే చనిపోయినట్లు నిర్థారించారు. అప్పుడే ఈ బ్యాక్టీరియాకు ఇరాకీ బాక్టీరియాగా నామకరణం చేశారు. దీనికి ఆధునిక వైద్యంలో సరైన చికత్స లేదు. ఇప్పటికీ ఈ బ్యాక్టీరియాని అంతం చేసేలా పరిశోధనలు జరుగుతున్న దశలోనే ఉన్నాయి. ఇంకా క్లినికల్ ట్రయల్స్ కూడా జరగలేదు. దీంతో స్ట్రాత్ డీ డీలా పడిపోయింది. కళ్ల ముందు మృత్యు ఒడిలోకి జారిపోతున్న భర్త, ఏం చేయాలేని స్థితిలో తాను ఏంటీ స్థితి అని పరివిధాలుగా ఆలోచించింది. ఈ క్రమంలో ఎందరో పరిశోధకులను సంప్రదించింది. దీనికి సంబంధించిన సమాచారాన్నంత క్షుణ్ణంగా పరిశీలించింది. దేనికి లొంగని ఈ యాంటీ బ్యాక్టీరియాలను తినేసే ఫేజ్ వైరస్లే(పరాన్నజీవులు) శరణ్యమని అర్థమయ్యింది. ఇవి ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే బ్యాక్టీరియాలని కూడా చెప్పొచ్చు. ఇవి మురికి నీటిలోను, చెరువులు, పడవల్లో, సముద్రాల్లో ఉంటాయని గుర్తించింది. అయితే వాటిలో ఏది తన భర్తకు వచ్చిన బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ను తినేయగలదో అంచనావేసి, ఆ ఫేజ్ వైరస్ని శుద్ధి చేసి రక్తంలోకి ఇంజెక్ట్ చేయాలి. అయితే ఇంతవరకు ఈ ఫేజ్ థెరఫీని ఏ పేషెంట్కి ఇవ్వలేదు. ఎందుకంటే దీనిపై పూర్తి స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ జరగలేదు. తన భర్త ప్రాణాలు దక్కించుకోవాలంటే ఈ సాహసం చేయకు తప్పదు స్ట్రాత్ డీకి. అందుకోసం ముందుగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తప్పనిసరి. దీంతో పాటు ఈ ట్రీట్మెంట్ చేసేందుకు పరిశోధకులు కూడా స్వచ్ఛందంగా ముందుకురారు ఎందుకంటే? ఈ టీట్మెంట్ పేషెంట్ ప్రాణాలతో చెలాగాటమనే చెప్పాలి. చివరకు టెక్సాస్ యూనివర్శిటీ బయోకెమిస్ట్ రైలాండ్ యంగ్ అనే పరిశోధకుడు మాత్రమే ముందుకొచ్చారు. ఆయన గత 45 ఏళ్లుగా ఈ ఫేజ్లపైనే ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ టెక్సాస్ యూనివర్సిటీ ల్యాబ్ స్ట్రాత్ డీ భర్త టామ్కి సరిపడా ఫేజ్ కోసం ఆహర్నిశలు యత్నించి టామ్ శరీరంలోని బ్యాక్టీరియాతో క్రియాశీలకంగా పనిచేసే ఫేజ్ వైరస్ని కనుగొన్నారు. ముందుగా అతడి పొత్తికడుపులో చీముతో నిండిన గడ్డలోని ఈ ఫేస్ని ఇంజెక్ట్ చేశారు. ఏం జరగుతుందో తెలియని ఉత్కంఠతో ప్రతి రెండు గంటలకు చికిత్సు కొనసాగిస్తూ పరిశోధక బృందమంతా అతడిని పర్యవేక్షించారు. ఆ తర్వాత శరీరంలోని మిగిలిన భాగాలను వ్యాపించిన బ్యాక్టీరియాను నివారించటం కోసం ఆ ఫేజ్లను టామ్ రక్తంలోకి ఇంజెక్ట్ చేశారు. నెమ్మదిగా టామ్ కోలుకోవడం కనిపించింది. దీంతో పరిశోధకులు హర్షం వ్యక్తం చేస్తూ..ఇలా యూఎస్లో సిస్టమిక్ సూపర్బగ్ ఇన్ఫెక్షన్కు చికిత్స చేయడానికి ఇంట్రావీనస్ ఫేజ్ థెరపీని పొందిన తొలి వ్యక్తి టామ్ అని చెప్పారు. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా కోమాలోకి వెళ్లిన టామ్ కాస్త బయటకు రావడమే కాకుండా తన కూతురిని గుర్తుపట్టి ఆమె చేతిని ముద్దాడాడు. దీని నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డాకు దీర్ఘాకాలిక వ్యాధులైన డయాబెటిస్ వంటి రోగాల బారిన పడ్డాడు. ఆహార సంబంధ జీర్ణశయ సమస్యలను కూడా ఫేస్ చేశాడు. అలాగే కోవిడ్ మహమ్మారి సమయంలో కరోనా బారిన పడి శ్వాస సంబంధ సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. అయితే వాటన్నింటిని విజయవంతంగా జయించి కోలుకున్నాడు. ఇప్పుడూ తన భార్య స్ట్రాత్ డీతో కలిసి ప్రపంచాన్ని చుట్టి వచ్చే పర్యటనలు కూడా చేస్తున్నాడు. ఒకరకంగా టామ్కి ఇచ్చిన ఫేజ్ థెరఫీ కొత్త శాస్త్రీయ ఆలోచనకు నాందిపలికింది. ఇక స్ట్రాత్ డీ తన భర్త ప్రాణాల కోసం సాగించిన అలుపెరగని పోరాటాన్ని “ది పర్ఫెక్ట్ ప్రిడేటర్: ఎ సైంటిస్ట్ రేస్ టు సేవ్ హర్ హస్బెండ్ ఫ్రమ్ ఎ డెడ్లీ సూపర్బగ్” అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించి మరీ ఈ బ్యాక్టీరియా పట్ల అవగాహన కల్పిస్తోంది. తనలా ధైర్యంగా ఉండి తమవాళ్లను ఎలా కాపాడుకోవాలో ఈ పుస్తకం ద్వారా ప్రచారం చేస్తోంది కూడా. కాగా, అయితే యాంటీబయటిక్లను ఈ ఫేజ్లు భర్తీ చేయవు కానీ యాంటీబయోటిక్లకు లొంగని బ్యాక్టీరియాలకు(సూపర్ బగ్లు) ఈ ఫేజ్లు మంచి ప్రత్యామ్నాయమైనవి, సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నారు పరిశోధకులు. నటుడు కృష్ణంరాజు సైతం.. అంతేగాదు 2050 నాటికి ప్రతి మూడు సెకన్లకు ఒకరు చొప్పున ఏడాదికి 10 మిలియన్ల మంది దాక ప్రజలు ఈ సూపర్బగ్ ఇన్ఫెక్షన్తో మరణిస్తారని యూస్ లైఫ్ సైన్స్ అంచనా వేసింది. అంతేగాదు దివంగత సినీనటుడు కృష్ణంరాజు మృతికి కారణం పేర్కొంటూ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన నివేదికలో కూడా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ప్రస్తావన ఉండటం గమనార్హం. ఇది ఎక్కువగా సుదీర్ఘ కాలం ఆస్పత్రుల్లో ఉండి చికిత్స పొందిన వారికే వస్తున్నట్లు వెల్లడించారు వైద్యులు. దీన్ని నెగిటివ్ బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. భారత్లో కూడా దీని తాలుకా కేసులు పెరుగుతుండటంతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. (చదవండి: 41 ఏళ్ల క్రితం చనిపోతే..ఇప్పుడామె ఎవరనేది గుర్తించి కూతురికి అందజేస్తే..!) -
మనిషికి చిరాయువు ఇక సాధ్యమే?
సాధారణంగా ఎవరైనా ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షు కోరుకుంటారు. ఇందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. శాస్త్రవేత్తలు, వైద్య పరిశోధకులు కూడా మనిషి జీవిత కాలం పొడిగించేందుకు పలు పరిశోధనలు సాగిస్తుంటారు. ఈ నేపధ్యంలో అనేక సిద్ధాంతాలు, ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. అయితే అవేవీ ఆశించినంత ఫలితాన్ని అందించలేదు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తల నూతన పరిశోధనలు మనిషి దీర్ఘాయువుకు గట్టి హామీని ఇచ్చేలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు యాంటీ ఏజింగ్ డ్రగ్ కోసం పలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు మనిషి దీర్ఘాయువుకు దోహదపడేలా పలు పరిష్కార మార్గాలను కనుగొంటున్నారు. వృద్ధాప్య కణాలను తొలగించి, అదే సమయంలో వాటి స్థానంలో కొత్త కణాలను సృష్టించడం ద్వారా దీర్ఘాయువు పొందవచ్చని చాలామంది భావిస్తుంటారు. తాజాగా బక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ అనే నెమటోడ్లు (నీటిలో నివసించే సూక్ష్మజీవులు)లను ఎలుకలలో ప్రవేశపెట్టి వాటి జీవితకాలాన్ని పొడిగించడంలో విజయం సాధించారు. ఈ ప్రయోగాలు మనిషికి దీర్ఘాయువును అందించేందుకు చేస్తున్న పరిశోధనలకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ నెమటోడ్లు పుష్కలంగా మైక్రోఫాగీలను కలిగివుంటాయి. మైక్రోఫాగీ అనేది ఒకరరమైన తెల్లరక్త కణం. ఇది మనిషి రోగ నిరోధకశక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మృత కణాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. మైక్రోఫాగీ అనేది యాంటీఆక్సిడెంట్ కావడానికి తోడు న్యూరోప్రొటెక్టివ్ ప్రయోజనాలను అందిస్తుంది. కెనోరబ్డిటిస్ ఎలిగాన్స్ నెమటోడ్లు అందించే ప్రయోజనాలను కొమారిన్లో కూడా ఉన్నాయని కనుగొన్నారు. ఇవి మొక్కలలో కనిపిస్తాయి. ముఖ్యంగా దాల్చినచెక్కలో అధికంగా ఉంటాయి. దాల్చిన చెక్క అనేది సెల్యులార్ ఆటోఫాగి, లైసోసోమల్ ఫంక్షన్లను నిర్దేశించడంలో కీలకంగా ఉండే ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ కార్యాచరణను ప్రోత్సహిస్తున్నదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొమారిన్ అనేది శరీరంలో కణాంతర రీసైక్లింగ్ వ్యవస్థను చక్కగా నిర్వహిస్తుంది. దీని కారణంగా వయస్సు పెరిగే ప్రక్రియ మందగించడం ప్రారంభమవుతుంది. శాస్త్రవేత్త, పరిశోధకులు శంకర్ చింతా.. న్యూరోనల్ కణాలపై సహజ సమ్మేళనాల ప్రభావం గురించి అధ్యయనం సాగిస్తున్నారు. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నాయని ఈ అధ్యయనానికి సారధ్యం వహిస్తున్న శాస్త్రవేత్త జూలీ ఆండర్సన్ చెప్పారు. మైక్రోఫాగీ ప్రేరేపిత సమ్మేళనాలు యాంటీ ఏజింగ్ థెరపీకి కీలకంగా ఉపయుక్తమవుతాయి. ఇవి ఎలుకల కండరాల కణాలలో మైటోకాన్డ్రియల్ పనిచేయకపోవడాన్ని కూడా నిరోధించాయని పరిశోధనల్లో తేలింది. మైటోకాండ్రియా అనేది ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. లోపభూయిష్టమైన మైటోకాన్డ్రియల్ ఫంక్షన్ పార్కిన్సన్స్, అల్జీమర్స్ , అనేక హృదయ సంబంధ వ్యాధులు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, జీవక్రియ వ్యాధులు, వయసు సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. మైటోకాన్డ్రియల్ కార్యకలాపాలు సవ్యంగా సాగాలంటే మైక్రోఫాగీ ప్రేరేపిత సమ్మేళనాలు అవసరం అవుతాయి. సమర్థవంతమైన మైటోఫాగి.. జీవుల జీవితకాలం పొడిగించిందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిపై జరుగుతున్న పరిశోధనలు మనిషికి చిరాయువును ప్రసాదించే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇది కూడా చదవండి: రికార్డు ధరకు నెపోలియన్ టోపీ -
పట్టణాలకు పచ్చదనం అందాలు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆహ్లాదం, వినోదం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న నగర వనాలు త్వరలో మరో 100 అందుబాటులోకి రానున్నాయి. భూమి లభ్యతను బట్టి ప్రతి జిల్లాలో కనీసం 2 నుంచి 4 నగర వనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించేందుకు, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో నగర వనాలను తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి, పేరేచర్ల, దివాన్చెరువు (రాజమహేంద్రవరం),కడప, అనంతపురం, నెల్లూరు, తిరుపతిలో ఒక్కోటి చొప్పున, కర్నూలు, చిత్తూరులో 2 చొప్పున నగర వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 30కి పైగా నగర వనాలను డిసెంబర్లోపు, మిగిలిన వాటిని మార్చి నెలాఖరులోపు సిద్ధం చేయడానికి అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రతి జిల్లాలో 2, 3 ఏర్పాటుకు సన్నాహాలు కొన్ని పట్టణాల్లో భూమి దొరక్కపోవడంతో నగర వనాల ప్రణాళిక ఆలస్యమైంది. భూమి అందుబాటులో ఉన్న చోట 2, 3 నగర వనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు వద్ద అటవీ ప్రాంతం ఎక్కువ ఉండటంతో అక్కడ 2 నగర వనాలను తీర్చిదిద్దారు. అనంతపురం టౌన్ దగ్గర్లో ఎక్కడా అటవీ భూమి లేదు. దీంతో అక్కడ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో భూమి కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి చోట్ల కొద్దిగా ఆలస్యమైనా మిగిలిన ప్రాంతాల్లో త్వరితగతిన నగర వనాలు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల భూమి లేకపోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉండే పెద్ద సంస్థలు, పెద్ద కాలేజీలు, క్యాంపస్లలో ఎక్కువ భూమి ఉంటే అలాంటిచోట్ల నగర వనాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేషన్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా ప్రాంతాల్లోని కార్పొరేట్ సంస్థలు, కంపెనీలను సంప్రదిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆయా ప్రాంతాల ప్రజలను వీటి ఏర్పాటులో భాగస్వాముల్ని చేస్తున్నారు. వాకర్స్ క్లబ్లు, స్థానిక ప్రముఖులను కూడా కలిసి వీటి గురించి వివరించి నిధులు సమకూర్చి, వారి ద్వారానే వాటిని నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా.. పచ్చదనంతో కూడిన స్వచ్చమైన పరిసరాలు నగర వనాల్లో ఉండేలా చూస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అక్కడకు వచ్చి ఆహ్లాదంగా గడిపేందుకు నగర వనాలను తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు పలు రకాల క్రీడా సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, యోగా, వెల్నెస్ సెంటర్, అరుదైన చెట్ల పెంపకం వంటివన్నీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఎకో టూరిజం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకృతి అందాల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు ప్రకృతి అందాలను వీక్షించేందుకు ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. వారి నివాసాలకు సమీపంలోనే ప్రకృతి సహజసిద్ధ ప్రాంతాలున్నాయి. వాటిని నగర వనాలుగా తీర్చిదిద్దుతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 నగర వనాలున్నాయి. మరో 100 వనాలను ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్ మధుసూదన్రెడ్డి, రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ -
స్వభావం
‘‘బట్టతలకి స్వభావానికి మందు లేదు.’’ అన్న మాట అందరికీ తెలిసినదే. స్వభావం అంటే ఏమిటి? ‘స్వ’ అంటే తన యొక్క ‘భావం’ అంటే సహజ లక్షణం, లేదా సహజ గుణం. ‘సహ’ అంటే కలిసి ‘జ’ అంటే పుట్టినది. అంటే, ఒక వ్యక్తితో పాటు పుట్టేది అని అర్థం. ఒక గురువుగారు శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక ఏరు దాటవలసి వచ్చింది. ప్రవాహం మధ్యలో ఒక తేలు నీటిలో కొట్టుకుపోతూ కనిపించింది. ఒక ఆకు మీద దానిని ఎక్కించారు. పట్టుకోగానే అది కుట్టింది. బాధగా వేలిని రుద్దుకున్నారు. కొద్దిసేపటికి అది మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. తిరిగి అదే పని చేశారు. అది కూడా తన పని తాను చేసింది. చేతిని గట్టిగా విదిలించారు. మూడోసారి మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. ఈలోపు గట్టు వచ్చింది. తేలుని పట్టుకుని నేల మీద వదిలారు. మళ్ళీ ముద్దు పెట్టుకుంది. ఒక శిష్యుడికి సందేహం కలిగింది. గురువుగారు మేధావి కదా! ఇంత తెలివితక్కువగా ఎందుకు ప్రవర్తించారు? అని. ‘‘రెండుమార్లు కుట్టినా మూడోమారు కూడా ఎందుకు కాపాడారు?’’ అని అడిగాడు. ‘‘కుట్టటం దాని స్వభావం. దానిని తేలు మార్చుకోలేదు. కాపాడటం అనే నా స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి?’’ అని సమాధానం చెప్పారు. స్వభావం అంటే తన యొక్క, ‘భావం’ తత్త్వం. తనతనం. అది పుట్టుకతో వస్తుంది. ‘‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే’’ అనే సామెత తెలుసు కదా! అంటే మారదు అని అర్థం. దీనిని వంకగా పెట్టుకుని తమలో ఉన్న చెడు స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయరు చాలా మంది. ఇదే మనిషి పురోభివృద్ధిని నిర్ణయించే ప్రధాన అంశం. సుమారుగా అందరికీ చాలా విషయాలు తెలుసు. ఏది మంచి ఏది చెడు అన్నదీ తెలుసు. తెలిసిన దానిని ఎంత వరకు ఆచరణలో పెట్టారు? అన్న దాని వల్ల పురోభివృద్ధిలో వ్యత్యాసం వస్తుంది. దానికి కారణం స్వభావం. స్వభావం సరిదిద్దుకో వలసినది అయితే చాలా ప్రయత్నం చేయ వలసి ఉంటుంది. ముందుగా మార్చుకోవాలి అనే సంకల్పం ఉండాలి. క్రమంగా, నిలకడగా ప్రయత్నం చేయాలి. మూతిని కట్టేసినా మాట్లాడకుండా ఉండలేని వారి చేత పాఠాలని చదివించిన ఉపాధ్యాయులని చూశాం. పెరిగాక వారిని యాంకర్లుగా చేస్తే సరి. పాఠం చదవటం వల్ల ఉచ్ఛారణ స్పష్టంగా ఉంటుంది. ఆగకుండా మాట్లాడి మంచి పేరు తెచ్చుకుంటారు. స్వభావాన్ని అనుకూలంగా ఉపయోగించుకునే మార్గం ఇది. అదేవిధంగా అబద్ధాలు ఆడే పిల్లవాడు ఉంటే, వాడి చేత కథలు రాయిస్తే వాడి సృజనాత్మకత అంతా అక్కడ చూపించటం జరుగుతుంది. నోరు విప్పని వారు ఉంటారు కొందరు. వారు రహస్యసమాచార శాఖలలో రాణిస్తారు. వ్యక్తి స్వభావాన్ని అనుసరించి తగినమార్గంలో పెడితే ఉన్నతస్థితికి చేరుకుంటారు. ఏదీ పనికి రానిది అని చెప్పటానికి వీలు లేదు. ‘స్వభావో దురతిక్రమః’’ మారదు కనుక మలచుకోవచ్చు. మంచి పనులు చేయటం ద్వారా మంచి స్వభావాన్ని పెంపొందించుకోవచ్చు. కనీసం మంచికి, మందికి ఉపయోగ పడవచ్చు. ఉదాహరణకి దేనిని చూసినా సొంతం చేసుకోవాలనే గుణం ఉంది అనుకుందాం. తప్పు అని తెలిసినా మనసు అదుపులో ఉండదు. అటువంటి వారిలో దొంగతనం అనే రోగం పోగొట్టటం ఎట్లా? వారి చేత ఇతరులకి ఇప్పిస్తూ ఉండాలి. అది తనదే కానక్కర లేదు. తీసుకున్న వారి ముఖంలో కనపడే ఆనందం చూసి ‘సెరిటోనిన్’ అనే హార్మోను విడుదల అయి వారికి ఆనందం కలిగిస్తుంది. అప్పుడు ఇతరుల వస్తువులని తీసుకోవాలనే స్వభావం క్రమక్రమంగా దూరమవుతుంది. కనీసం ఆలోచన ఆచరణ రూపం ధరించదు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
సూపర్ రేర్ చిరుత టోబీ పఫర్ ఫిష్: మురిసిపోతున్న ప్రకృతి ప్రేమికులు
ప్రకృతి అంటేనే మనిషికి అందని రహస్యాల పుట్ట. అప్పుడప్పుడు అద్భుతమైనవి వెలుగులోకి వచ్చి మనల్ని ఆశ్చర్యంలో ముంచుత్తుతాయి. అయితే కొన్ని అరుదైన జీవులు కూడా అంతరించిపోతున్న తరుణంలో, మారుతున్న కాలంతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైన జీవులు వెలుగులోకి రావడం విశేషం. ఆస్ట్రేలియా తీరంలో అత్యంత అరుదైన లెపార్డ్ టోబీ పఫర్ ఫిష్ దర్శనమిచ్చింది. దీంతో ప్రకృతి ప్రేమికులు సంబర పడుతున్నారు. Super Rare Leopard Toby Puffer Fish సముద్రపు లోతుల్లో సంచరిస్తున్న కోరల్ సీ మెరైన్ పార్క్లో ఈత కొడుతున్న డీప్ సీ డైవర్ దృష్టిలోచిరుతపులిని పోలిన మచ్చలున్న చిన్న తెల్ల చేప పడింది. దీన్నే లెపార్డ్ పఫర్ ఫిష్ లేదా కాంతిగాస్టర్ లెపార్డ్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా తీరంలోని గ్రేట్ బారియర్ రీఫ్లో ఈత కొడుతుండగా, ఒక డైవర్ 'అత్యంత అరుదైన' సముద్ర జీవిని చూసి ఆశ్చర్యపోయాడు టోబీ పఫర్ అందమైన ఫోటోను గ్రేట్ బారియర్ రీఫ్ మెరైన్ పార్క్ అథారిటీకి అనుబంధ సంస్థ మాస్టర్ రీఫ్ గైడ్స్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసింది. ఇలాంటి చేపను ఎప్పుడూ చూడలేదని సంస్థ తెలిపింది. ఇవి సాధారణంగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, గ్వామ్, మైక్రోనేషియా జలాల్లో కనిపిస్తుందని, అయితే ఈ తెల్లని చేప ఆస్ట్రేలియాలో కనిపించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ప్రతిరోజూ మనల్ని ఆశ్చర్యపరిచే శక్తి సముద్రానికి ఉంది.ఇంకా కనుగొనలేని అద్భుతమైన జంతువులు సముంద్రం నిండి ఉంది. తన జీవితంలో చిన్న తెల్ల చేపను చూడటం చాలా అదృష్టం అని డైవర్ కేథరీన్ లోగాన్ పేర్కొన్నాడు. చిరుత టోబీ పఫర్ అంటే ? రాక్ ఎన్ క్రిటర్స్ ప్రకారం, ఇది అక్వేరియంలో ఎక్కువగా వాడతారు. దీని ముందు భాగంలో రెండు చారలు ఉంటాయి. ముత్యం లాంటి తెల్లటి శరీరంపై చిరుత పులికి ఉండే మచ్చల్ని పోలిన మచ్చలు ఉంటాయి. అలాగే దీన్నిపట్టుకున్నప్పుడు కొద్దిగా "పఫ్"(ఉబ్బుతాయి) అవుతాయి. దాదాపు 3 అంగుళాల పొడవు ఉంటాయి. View this post on Instagram A post shared by Master Reef Guides - Great Barrier Reef 🪸 (@masterreefguides) -
అనారోగ్యం అంటే ఏంటీ..? ప్రకృతి వైద్యం ఏం చెబుతోంది?
ప్రతి రోజూ తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించ లేనివారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులు త్యాగం చేయక తప్పదు. మారుతున్న జీవన శైలి అనేక రుగ్మతలకు దారి తీస్తోంది. బీపీ, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ సమస్యలు వంటివాటి బారిన పడుతున్నారు. మితాహారం, కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం. అసంక్ర మిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది, దీనిని నివారించడానికి ఏమాత్రం ఖర్చు కాకుండా మన ఆరోగ్యాన్ని ‘ప్రకృతి వైద్యం’ ద్వారా నయం చేసుకోవచ్చు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అత్యాశే అవుతుంది. కష్టతరమైన పనులు చేసేవారు, రైతులు, కూలీలు, హెవీ మోటార్ డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, హమాలీలు, శరీర కష్టం చేసే వారు ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటే వ్యాయామం చేసే అవసరం తగ్గుతుంది. రోజువారీ పనులనునడక, సైకిల్ ద్వారా చేసుకుంటే సహజంగానే వ్యాయామం లభిస్తుంది. ఏ వ్యాయామం అయినా క్రమం తప్పకుండా చేయాలి. వ్యాయామం ఏదైనా ఒక్కటే నియమం, ‘శక్తికి మించి వ్యాయామం చేయకూడదు’. మిట్ట మధ్యాహ్నం ఎండలో వ్యాయామం చేయకుంటే మంచిది. నిత్య జీవితంలో రోజూ చేసే పనులు శారీరక శ్రమకు లింక్ చేయడం మంచిది. ఒబేసిటీ, బీపీ, మధుమేహ నియంత్రణకు వ్యాయామం చాలా అవసరం. అలాగే మనం ఇంట్లో కూర్చుని యోగ పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. యోగాసనాలు శరీరానికి, మెదడుకీ ఎంతగానో మేలు చేస్తాయి. ప్రకృతివైద్య సిద్ధాంతంలో, అనారోగ్యం అనేది ఆరోగ్యానికి భంగం కలిగించే ప్రక్రియగా, సహజ వ్యవస్థల సందర్భంలో ఆ తర్వాత కోలుకునే ప్రక్రియగా పరిగణించబడుతుంది. పేలవమైన పోషణ, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అనేకమైన విషయాలు ఆరోగ్యానికి ఎక్కువగా భంగం కలిగిస్తాయి. వీటిని గుర్తించడం, తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం ప్రకృతి వైద్యుల లక్ష్యం. – డా‘‘ ఎం. అఖిల మిత్ర, గౌతమ బుద్ధ అభివృద్ధి సమాఖ్య -
సహజ జీవన గమనం! అదే అత్యంత శుభదాయకం
మనిషి ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలి. ఏవిధంగా ప్రవర్తించాలి అని తెలిపే జైన్ కథలు మానావళి ఓ గోప్ప వరం. అవి మనిషి బుద్ధిని వికసింప చేసి ఆలోచింప చేసేవిగా ఉంటాయి. ధర్మా ధర్మాలని చాలా చక్కగా విపులీకరించి ఎంతటి చిన్నపిల్లవాడికైన సులభంగా అర్థమవుతాయి. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో ఈ కథలు మనస్సు ప్రశాంతతకు ఓ చక్కటి ఔషధంలా ఆహ్లాదాన్ని ఇస్తాయి ఈ జైన్ కథలు. ఈ రోజు చెప్పే జైన్ కథ దేని గురించి తెలుసా..! అసలైన మహత్యం అంటే.. జెన్ గురువు ‘బన్కెయి’ ఓ నాడు బౌద్ధ విహారంలో ప్రవచనం చేస్తుండగా వేరే బౌద్ధ శాఖకు చెందిన ఒకాయన అక్కడకు వచ్చి సభలో పెద్దగా మాట్లాడుతూ అలజడి సృష్టించాడు. బన్కెయికి వచ్చిన మంచిపేరంటే అతడికి అసూయ. బన్కెయి మాట్లాడటం ఆపి గొడవకు కారణం ఏమిటని అడిగాడు. వచ్చిన ఆ ఆగంతకుడు అన్నాడు: ‘మా శాఖను స్థాపించిన గురువు ఎటువంటి గొప్ప మాహాత్మ్యాలు చెయ్యగలడంటే, నదికి ఇవతల గట్టు మీద కుంచె పుచ్చుకొని ఉండి, అవతల గట్టుమీద ఎవరైనా అట్ట పుచ్చుకొని ఉంటే, దానిమీద ఆ కుంచెతో బొమ్మ గీయగలడు. నీవు అలాంటి మహత్తు చెయ్య గలవా?’ బన్కెయి సమాధానం చెప్పాడు: ‘అలాంటి తంత్రం మీ గురువు చెయ్యగలడేమో కాని, అది జెన్ పద్ధతి కాదు. నేను చేసే మహత్తు ఏమిటంటే, నాకు ఆకలైనప్పుడు తింటాను. దాహమైనప్పుడు తాగుతాను.’ అదే అత్యంత శుభదాయకం ఓ ధనవంతుడు, జెన్ గురువు ‘సెన్గయి’ని అడిగాడు, తన వంశాభివృద్ధికి శుభదాయకమైన వాక్యం ఒకటి వ్రాసివ్వమనీ, దాన్ని తరతరాలుగా దాచి ఉంచుకొంటామనీ! సెన్గయి పెద్ద కాగితం ఒక దాన్ని తెప్పించుకొని, దాని మీద ఇలా రాశాడు: ‘తండ్రి చనిపోతాడు, కొడుకు చనిపోతాడు, మన వడు చనిపోతాడు. ’ధనవంతుడికి కోపం వచ్చింది. ‘నేను నిన్ను నా కుటుంబం ఆనందంగా ఉండటానికి ఏదైనా రాసివ్వమని అడిగాను. నీవేంటి ఇలా నన్ను ఎగతాళి పట్టిస్తున్నావు?’ ‘ఇందులో ఎగతాళి ఏం లేదు’ వివరించాడు సెన్గయి. ‘నీవు చనిపోకముందే నీ కొడుకు చనిపోయినాడనుకో. అది నిన్ను ఎంతగానో బాధిస్తుంది. నీకంటే, నీ కొడుకు కంటే ముందే, నీ మనవడు చనిపోయినాడనుకో, మీ ఇద్దరి గుండె పగిలిపోతుంది. అలా కాకుండా, నీ కుటుంబం తరతరాలుగా నేను పేర్కొన్న వరుసలో గతించినారనుకో, అది సహజమైన జీవన గమనం అవుతుంది. దీన్ని నేను శుభదాయకం అంటాను.’ – దీవి సుబ్బారావు -
సహజ ప్రసవాలకు ‘సీ–సేఫ్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలను తగ్గించి.. సహజ ప్రసవాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇదే క్రమంలో ‘సీ–సేఫ్’ అనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. అయితే, రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 45 శాతం సిజేరియన్లు ఉంటున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతానికిపైగా, ప్రభుత్వాస్పత్రుల్లో 32 శాతం మేర ఈ తరహా కాన్పులు ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో కోత కాన్పుల నియంత్రణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. కాగా, సీ–సేఫ్ను త్వరలో ప్రారంభించనున్నారు. నర్సులకు మిడ్వైఫరీ శిక్షణ పూర్తి సహజ ప్రసవాలను పెంపొందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు ‘నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ (ఎన్పీఎం)’ కోర్సును గత ఏడాది ప్రారంభించారు. బ్యాచ్కు 30 మంది చొప్పున రెండు బ్యాచ్లుగా గుంటూరు, తిరుపతిలలో 18 నెలల శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్య సహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాత శిశువుకు అందించాల్సిన సేవలు, హైరిస్క్ లో ఉన్న గర్భిణులను ఏ విధంగా గుర్తించాలి వంటి పలు రకాల అంశాలపై నర్సులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డ్లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సరి్టఫికెట్లు జారీ చేస్తున్నారు. త్వరలో వీరిని రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు. అనవసర కోతల నియంత్రణ యూకేకు చెందిన బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం, యునిసెఫ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర వైద్య శాఖ సీ–సేఫ్ను నిర్వహించనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అనవసర కోత కాన్పులను సాధ్యమైనంత వరకూ నియంత్రించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో సిజేరియన్లను ఎలాంటి పరిస్థితుల్లో నిర్వహించాలి అనే దానిపై ప్రోటోకాల్స్ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మన ఆస్పత్రుల్లో అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలను అంతగా వినియోగించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఎంపిక చేసిన ఆరు ఆస్పత్రుల్లో గైనిక్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వ్యాక్యూమ్, ఇతర పరికరాలను ఉపయోగించి సాధారణ ప్రసవాల్ని చేసేలా అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలో నైపుణ్యాలు పెంచనున్నారు. సిజేరియన్ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో సురక్షితంగా సర్జరీల నిర్వహణపై మరింత అవగాహన పెంచనున్నారు. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, అనకాపల్లి, ఆదోని ఆస్పత్రులను సీ–సేఫ్ కోసం ఎంపిక చేసినట్టు యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ప్రోటోకాల్స్ రూపకల్పన త్వరలో పూర్తి అవుతుందన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా గతంతో పోలిస్తే మరణాలు తగ్గాయి. అదే విధంగా అనవసర సిజేరియన్ కాన్పుల నియంత్రణపై దృష్టి సారించాం. ఈ క్రమంలోనే సీ–సేఫ్కు ప్రణాళిక రచించాం. మరొక వైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
స్టన్నింగ్ లుక్తో మెరిసిపోతున్న రకుల్ ధరించిన చీర ధర ఎంతంటే..
దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆమె ఈ మధ్య హిందీ ఇండస్ట్రీ వైపే ఫోకస్ చేసింది. రకుల్ ప్రీత్ చాలా కూల్గా హిందీ సినిమాల్లో తనకు నచ్చిన పాత్రల్లో నటిస్తోంది. మరో వైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్గా ఉంటోంది. ఇక ఆమె ఫిట్నెస్కి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో.. తన అందాన్ని హైలైట్ చేసే ఫ్యాషన్కీ అంతే ప్రాధాన్యం ఇస్తుంది రకుల్ ప్రీత్ సింగ్! తన ఫ్యాషన్ ప్రాధాన్యంలో ఆమె లిస్ట్ చేసుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్లో కొన్ని ఇక్కడ.. జ్యూలరీ బ్రాండ్: మియార ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మియార..1960 నుంచీ వారసత్వంగా వస్తున్న వ్యాపారాన్ని.. నేడు ఇద్దరు సోరీమణులు కలసి అంతర్జాతీయ బ్రాండ్గా నిలబెట్టారు ‘మియార’గా! విలువైన రత్నాలు, వజ్రాలతో తయారయ్యే ఈ డిజైన్స్కి మంచి గిరాకీ ఉంది. పలువురు సెలబ్రిటీల ఫేవరెట్ ఈ బ్రాండ్ అనీ పేరుంది. డిజైన్ను బట్టే ధర. ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. అభినవ్ మిశ్రా.. పేరుకు ఇది దేశీ బ్రాండ్ కానీ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించింది. ఖరీదైనది కూడా! దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కనీసం ఒక్కసారైనా ఈ డిజైనర్ వేర్ను ధరించి ఉంటారు. ప్రతి కస్టమర్కి నచ్చేలా.. నప్పేలా ట్రెడిషనల్, ట్రెండీ, ఫ్యాషనబుల్ డిజైన్స్ను అందించడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. దేశంలోని ప్రముఖ నగరాలతోపాటు అమెరికా, లండన్లోనూ స్టోర్స్ ఉన్నాయి. ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. రకుల్ ధరించిన అభినవ్ మిశ్రా..చీర బ్రాండ్ ధర రూ. 70,000. ఇక రకుల్ ఫ్యాషన్ పరంగా ..నా దృష్టిలో ఫ్యాషన్ అనేది ఒక సహజ పక్రియ. మనం ధరించే దుస్తులు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. అందుకే నేను ఎప్పుడూ నా కంఫర్ట్కే ఇంపార్టెన్స్ ఇస్తాను! అని అంటోంది. -దీపిక కొండె (చదవండి: ఈ ఫోటో కనిపిస్తున్నది రాయి మాత్రం కాదు! అది ఏంటంటే..) -
ల్యాబ్ డైమండ్లతో ఉపాధికి ఊతం
జైపూర్: ల్యాబ్లలో తయారు చేసే వజ్రాలు (ఎల్జీడీ) కృత్రిమమైనవి కావని, వాటికి కూడా ప్రస్తు తం సహజ వజ్రాలుగా ఆమోదయోగ్యత పెరుగుతోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ఇలాంటి సానుకూల పరిణామాలు పరిశ్రమ వృద్ధికి దోహదపడగలవని, దీనితో ఉపాధి కల్పనకు కూడా ఊతం లభించగలదని ఆయన చెప్పారు. ఎల్జీడీల తయారీలో సౌర, పవన విద్యుత్ వంటి వనరులను వినియోగించడం వల్ల ఇది పర్యావరణానికి కూడా అనుకూలమైనదని మంత్రి తెలిపారు. జూన్ 22న అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 7.5 క్యారట్ల ఎల్జీడీని అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్కు బహూకరించడం ల్యాబ్ డైమండ్లకు పెరుగుతున్న ఆమోదయోగ్యతకు నిదర్శనం. ఎల్జీడీల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభు త్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎల్జీ డీ సీడ్స్పై 5% కస్టమ్స్ సుంకాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, దేశీ యంగా ఎల్జీడీ యంత్రాలు, సీడ్స్, తయారీ విధానాన్ని రూపొందించడంపై పరిశోధనలు చేసేందుకు ఐఐటీ–మద్రాస్కు రీసెర్చ్ గ్రాంట్ ప్రకటించింది. 2025 నాటికి ఎల్జీడీ ఆభరణాల మార్కెట్ 5 బిలియన్ డాలర్లకు, 2035 నాటికి 15 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. 2021 –22లో కట్, పాలిష్డ్ ఎల్జీడీల ఎగుమతులు 1.35 బిలియన్ డాలర్లుగా ఉండగా, గతేడాది ఏప్రిల్–డిసెంబర్ వ్యవధిలో 1.4 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదైంది. -
సెలూన్కి వెళ్లే పని లేకుండా..మీ హెయిర్ని స్ట్రయిట్ చేసుకోండిలా..!
కర్లీ హెయిర్ అందమే వేరు. ఒక్కోసారి అది పొల్యూషన్ వల్లో మరే ఇతర కారణాల వల్లనో నిర్వీర్యంగా అయిపోతుంది. దువ్వినా దువ్వనట్లుగా చిందరవందరగా ఉంటుంది జుట్టు. వెంట్రుకలు రఫ్గా మారిపోయి చిక్కులు పడిపోతూ చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అదీగాక కొందరికి స్ట్రయిట్గా కుచ్చుకుచ్చులుగా జాలు వారుతున్న జుట్టునే ఇష్టపడుతుంటారు. అందరూ సెలూన్కి వెళ్లి డబ్బులు పెట్టి మరి చేయించుకోవడం కుదరదు. ఒకవేళ చేయించినా మెయింటేన్ చేయించడం ఇబ్బంది. మళ్లీ మళ్లీ సెలూన్కి వెళ్తూ వారి చెప్పిన సెషన్లలో చేయించుకోవాల్సి కూడా ఉంటుంది. వాటన్నింటికి చెక్ పెట్టి జస్ట్ ఇంట్లో మనకు అందుబాటులో ఉండే వాటితోనే ప్యాక్లు వేసుకుంటే ఈజీగా జుట్టు స్ట్రయిట్ అవ్వడమే గాక జుట్టుకి మంచి గ్రోత్ ఉండి కనీసం జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. నేచురల్గా చేసుకునే హోం ప్యాక్లు ఏంటంటే.. మనం ఇంట్లో ఉపయోగించే పాలే తీసుకోండి. జస్ల్ ఒక కప్పు పాలు ఓ గుడ్డు తీసుకోండి. మీ జుట్లు బాగా పొడవైతే ఇంకో కప్పు పాగు, మరో గుడ్డు తీసుకోండి. ఇక ఈ రెండిటిని బాగా మిక్స్ అయ్యేలా కలిపిం బ్రెష్తో జుట్టుకి ప్యాక్ వేసుకోండి. ఓ అరంగంట తర్వాతా మీకు నచ్చిన షాంపుతో కడిగేయండి. మీరే ఆశ్చర్యపోతారు ఎంత సిల్కిగా జాలు వారుతుంటుందో మీ జుట్టు. కలబంద గుజ్జు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుందని తెలిసిన విషయమే మీరు అరకప్పు కలబందను, అరకప్పు కొబ్బరి నూనెతో మిక్స్ చేసి గంటపాటు అలానే ఉంచి షాంపుతో కడిగేయండి. చిట్లిన జుట్టు సమస్య తగ్గడమే గాక స్ట్రయిట్ అవుతుంది. మరొకటి యాపిల్ సైడర్ వెనిగర్ సహజమైన క్లెన్సర్ అని పిలుస్తారు. జుట్టుకి అప్లై చేస్తే అది మురికిని పోగొట్టడమే కాకుండా జుట్టుని మృదువుగా చేస్తుంది. మూడు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ను రెండు కప్పుల నీటిలో కలపండి. ముందుగా మీ జుట్టుని షాంపుతో కడిగేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అప్లే చేసి రెండు మూడు నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగేసుకుండి. ఇలా తరుచుగా చేస్తే త్వరితగతిన మీ జుట్టు స్ట్రెయిట్ అవుతుంది. మొక్కజొన్న పిండి, కొబ్బరి పాల మిశ్రమాన్ని జుట్టుకి ప్యాక్లా వేసిన స్ట్రయిట్గా అవుతుంది. ఇవన్నీ వద్దు అంటే ఈ ప్యాక్ని ట్రై చేయండి ఇది జుట్టు ఆరోగ్యంగా ఉంచడమే గాక చక్కగా స్ట్రయిట్ అవ్వుతుంది. అప్పటికప్పుడూ పార్టీల సమయంలో మీ జుట్టు స్ట్రయిట్ అవ్వడానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ముందుగా ఈ ప్యాక్కి కావాల్సినవి: బియ్యం ఒక కప్పు కొబ్బరి ముక్కలు పావు కప్పు నీరు కప్పు నానబెట్టిన మెంతులు 3 చెంచాలు అలోవేరా జెల్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఓ చెంచా తయారీ విధానం: ముందుగా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి నానబెట్టండి. ఆ తర్వాత ఆ బియ్యాన్ని కడగకుండా అలానే ఉడికించండి. ఆ తర్వాత మిక్సి జార్లోకో ఉడికించిన బియ్యం, కొబ్బరిముక్కలు, అలోవేరా జెల్ వేసి మిక్సీ పట్టుకోండి. మెత్తటి పేస్ట్లా ఉండాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి.. ఓ గంట పాటు ఉంచుకోండి. ఆ తర్వాత జుట్టుని మైల్డ్ షాంపుతో కడిగేయండి. ఆరిన తర్వాత చూస్తే జుట్టు స్ట్రైయిట్గా కుచ్చులా ఉంటుంది. ఇలా రెగ్యూలర్గా చేస్తే మాత్రం జుట్టు స్ట్రెయిట్ అయ్యి, ధృఢంగా ఉంటుంది. (చదవండి: ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!) -
గెలుపు.. గమనం.. మలుపు
గెలవాలి అని మనం దృఢంగా నిర్ణయించుకోవాలి; మనం మనస్పూర్తిగా గెలుపును కోరుకోవాలి; మనం గెలిచేందుకు త్రికరణ శుద్ధిగా పూనుకోవాలి; మనం గెలవాలి. మనకు మనుగడ ఉంది అని అంటే అది గెలుస్తూ ఉండేందుకే అని తెలుసుకోవాలి. ఎన్ని అవరోధాలు ఉన్నా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ఎంత వ్యతిరేకత పైనపడినా మనం గెలవాలి అని నిలవాలి; మనం గెలుస్తూ మెరుస్తూ ఉండాలి. ‘యమే వైష వృణుతే తేన లభ్యస్తైష ఆత్మా వివృణుతే తనూమ్ స్వామ్’ అని కఠోపనిషత్ చెబుతోంది. అంటే అతడి చేత ఏదైతే కోరుకోబడి అడగబడిందో దానివల్ల అతడు పొందబడతాడు; అతడికి ఆ ఆత్మ తన సహజ ప్రకృతిని తెరుస్తుంది అని అర్థం. ఈ సత్యాన్నే తెలియజేస్తూ ‘అడుగుడీ మీకియ్యబడును; వెదకుడీ మీకు దొరకును; తట్టుడీ మీకు తియ్యబడును’ అని చెప్పింది మత్తయి సువార్త. మనం గెలుపును కోరుకుని ప్రయత్నిస్తే మనకు గెలుపు తన తలుపును తెరుస్తుంది. మనం గెలుపును పొందాలనుకుని ఉద్యుక్తులం ఐతే మనం గెలుపు చేత పొందబడతాం. మనం ఉన్న ఈ ప్రపంచం ఒక పద్మవ్యూహం. కానీ మనలో ఎవరూ అభిమన్యుడు కారాదు. ప్రతివ్యక్తీ అర్జునుడే అవాలి; అర్జునుడి తీరే మనకు ఆదర్శం కావాలి; మనకు మార్గదర్శకం కావాలి. తాను ఏ స్థితిలో ఉన్నా, శాపవశాత్తు తన స్థితే మారి తాను పేడిగా మారిపోయినా అర్జునుడు గెలుపునే కోరుకుని, గెలిచేందుకు పూనుకుని గెలుపు తలుపును తట్టాడు. గెలుపు తలుపు తెరుచుకోబడి ఆ గెలుపుచేత పొందబడ్డాడు; అర్జునుడు విజయుడుగా పేరుపొందాడు. గెలుపు అనేది లక్ష్యమా? కాదు, కాదు. గెలుపు లక్ష్యంగా కాదు మనకు లక్షణంగా ఉండాలి. మనుగడ ఉన్నంతవరకూ మనం గెలుపు కోసమే, గెలుపుతోనే రోజుల్ని గడుపుతూ ఉండాలి. రోజు అనేది రావడమే ఒక గెలుపు. అదిగో ఆ రోజు రావడమే మనకు ప్రేరణ. రోజులాగా మనుగడ ఆసాంతమూ మనకు గెలుపు అనేది వస్తూనే ఉండాలి. రోజు ఒకసారి మాత్రమే వచ్చేదే ఐతే కాల గమనమూ, ప్రపంచ గమనమూ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. అలా జరిగితే కాలానికి, ప్రపంచానికి గమనమే ఉండదు కదా? రోజు అనేది వస్తూ ఉండడమే గమనం జరుగుతోంది అన్నదానికి ఋజువు. మనకు గెలుపు వస్తూ ఉండడమే మనుగడ గమనాన్ని నిర్ధారణ చేస్తుంది. పొందే ప్రతి గెలుపు మనిషికి ఒక మలుపు. మలుపులు తిరుగుతూ పయనం సాగాలి. గెలుపులతో సాగడమే మనుగడకు సార్థకత. మనుగడ అన్నది ఒక సాగే తీగ అయితే ఆ తీగకు గెలుపుల పూలు పూస్తూ ఉండాలి. మనుగడ గెలుపుల పూలు పూచే ఒక వల్లరి కావాలి లేదా మనుగడ గెలుపుల పుష్పగుచ్ఛం కావాలి. గెలుపుల పూల పరిమళానికి ఆకృతిగా మనిషి మంచి మాటకెక్కాలి. ‘గెలుపును పొందాలని తలపోద్దాం; గెలుపును పొందుదాం. గెలుస్తూ ఉన్నవాళ్లమై తల ఎత్తుకుని మనుగడ చేద్దాం; మన తలలకు విలువను పొదువుకుందాం. గెలుపు మనకు అభిరుచి కావాలి; గెలుపును మనం చవి చూస్తూ ఉండాలి; మనం మనుగడకు చవిని చేకూర్చుకోవాలి‘. 100% – నేను గెలిచాను. 90% – నేను గెలుస్తాను. 80% – నేను గెలవగలను. 70% – నేను గెలవగలను అని అనుకుంటున్నాను. 60% – నేను గెలవగలనేమో. 50% – నేను గెలవచ్చేమో అని అనుకుంటున్నాను. 40% – ఏది గెలుపు? 30% – నాకు గెలవాలని ఉంది. 20% – ఎలా గెలవాలో నాకు తెలియదు. 10% – నేను గెలవలేను. 0% – నేను గెలవను. ఇది గెలుపునకు నిచ్చెన. మనిషి ఈ నిచ్చెనను ఎక్కాలి; తప్పకుండా ఈ నిచ్చెనను ఎక్కి తనను తాను మనిషిని అని నిరూపించుకోవాలి. – రోచిష్మాన్ -
సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే .!
సాధారణంగా వేసవి వచ్చేదంటే అమ్మో!.. ఉక్కపోతా అంటూ అరిచేస్తాం. ఏసీలు, కూలర్లు పెట్టేసి.. వేలల్లో కరెంట్ బిల్లులు కట్టేసి హమ్మయ్యా అనుకుంటాం. జేబు చిల్లు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం గానీ సహజసిద్ధంగా ఇంటిని ఎలా కూల్గా ఉంచుకోవచ్చో ఆలోచించం. ఎందకంటే ఎలాగో విద్యుత్ సౌకర్యం, డబ్బులు కట్టే సామర్థ్యం రెండు ఉన్నాయి. ఇక మరో ఆలోచన కాదు గదా!.. ఆ పదం వరకు కూడా వెళ్లం. కానీ ఈ ఎడారి దేశంలోని ఓ నగరం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవడమేగాక దాని వినూత్న ఆలోచన విధానంతో అందనంత ఎత్తులో ఉంది ఆ నగరం. వివరాల్లోకెళ్తే..ఇరాన్లో ఎడారి నగరమైన యాజ్డ్లో వేడి అలా ఇలా ఉండదు. తట్టుకోవడం చాల కష్టం, కనీస అవసరాలు ఉండవు. పైగా కావల్సినంత విద్యుత్ కూడా ఉండే అవకాశమే లేదు కూడా. అలాంటి ఆ ప్రాంతం అందుబాటులో ఉన్న వనరులతోటే అద్భుతాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా 2017లో యునెస్కోలో వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఇంతకీ ఆ నగరంలో అంత గొప్పగా ఏముందంటే..ఆ నగరంలో ఇళ్లన్ని ఎత్తులో ఉండి పైన చిమ్నీ లాంటి టవర్లు ఉంటాయి. వేడి గాలిని ఇంట్లోకి రాకుండా నిరోధించి, చల్లగా ఉండేలా చేస్తుంటాయి ఆ టవర్లు. ఒకరకంగా చెప్పాలంటే వాటిని 'సహజసిద్ధమైన ఏసీ'లని చెప్పొచ్చు. నివాసాలను చల్లబర్చడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. వీటిని విండ్ క్యాచర్లు అంటారు. ఇది మధ్యప్రాచ్యంలోని పర్షియన్ సామ్రాజ్య కాలం నాటి నిర్మాణంగా భావిస్తారు నిపుణులు. నిజానికి వేసవిలో అక్కడ సుమారు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీంతో శతాబ్దాలకు ముందే అప్పటి వాళ్లే ఇళ్లను కూల్గా ఉంచడానికి వీలుగా ఇలాంటి నిర్మాణంలో ఇళ్లను నిర్మించారు. ప్రజలు దాన్ని ఇప్పటకీ కొనసాగిస్తుండటం విశేషం. విద్యుత్ గురించి తెలియక మునుపే మా పూర్వికులు ఇలాంటి ఇళ్లను కనుగొన్నారు, దాన్నే మేము కొనసాగించడమే కాకుండా ఆ వారసత్వాన్ని కాపాడుకుంటున్నాం అని గర్వంగా ఇరాన్ పర్యాటక మంత్రిత్వ శాఖ డిప్యూటీ అబ్డోల్మాజిద్ షాకేరి చెబుతున్నారు. ఇక్కడ ఇళ్లపై ఉండే 'విండ్ క్యాచర్'(చల్లటి గాలిని ఇచ్చేవి) టవర్లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి. తమ పూర్వీకులు చెదపురుగుల గూడుని బేస్ చేసుకుని ఇలా ఇళ్లను నిర్మించినట్లు ఇరాన్ వాసులు చెబుతున్నారు. ఈ ఇళ్లు ఆధునిక సిమెంట్ భవనాలకు అత్యంత విరుద్ధం. ఇవి బంకమట్టి ఇటుకతో నిర్మించే శతాబ్దాల నాటి సంప్రదాయ రీతి కట్టడాల నిర్మాణం. ఇక్కడ ఇంకో అద్భుతమైన నిర్మాణం ఉంది. అది భూగర్భ జల వ్యవస్ధ. దీన్ని ఖానాట్స్ అని పిలుస్తారు. భూగర్భ బావులు, లేదా చిన్న కాలువలు అని చెప్పొచ్చు. అక్కడ ఇళ్లు వేడి ఎక్కకుండా ఉండటానికి ఇవి కూడా ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇరాన్లో ప్రస్తుతం 33వేల ఖానాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇరాన్ అధికారులు ఈ ఖానాట్స్లను ఎండిపోకుండా పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా దేశాలు ఇలాంటి ప్రకృతిసిద్ధంగా లభించే గాలిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే మంచి గాలి పీల్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే గాక వాతావరణంలో కార్బన్ స్థాయిలు తగ్గించినవాళ్లము అవుతాం కదా ఆలోచించండి!. (చదవండి: టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్డ్రింక్స్లా తాగేస్తున్నామా..!) -
Photo Feature: ప్రకృతి గీసిన చిత్రం
ప్రకృతి.. మనల్ని ఎన్ని రకాల సొబగులతో మురిపిస్తుందో కదా! కొండలు.. గుట్టలు.. లోయలు.. సముద్రం.. నదులు.. చెట్లు.. కొమ్మలు.. ఆకులు.. పూలు.. అసలు అందలేనిదేది? ఆకట్టుకోనిదేది? కవుల వర్ణనలో కనిపించే అందాలకు నెలవు మన విశాఖ. చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా.. అయితే డేంజర్లో పడ్డట్టే! ఇది పర్యాటకుల స్వర్గధామం. ఆహ్లాదపరిచే పర్యావరణం.. పచ్చని అందాలతో అలరారే జీవ వైవిధ్యం.. సహజ అందాల సాగరతీరం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అందాలు.. మరెన్నో అనుభూతులు.. అలాంటి దృశ్యమే ఇది. ఆకుపచ్చగా గడ్డి.. మబ్బులు కమ్మిన ఆకాశం.. అల్లంతదూరంలో సముద్రం.. నిర్మాణంలో ఉన్న పడవ.. ఆహా ఏం అందం.! ప్రకృతి గీసిన ఈ చిత్రం.. కోస్టల్ బ్యాటరీ వద్ద ఆదివారం సాయం సంధ్య వేళలో ఆవిష్కృతమైంది. -ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
నేచురల్ డై హ్యాండ్మేడ్ ఎగ్జిబిషన్, వర్క్షాప్
సాక్షి, తెలంగాణ: ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్ ఆధ్వర్యంలో జూన్ 17-19 వరకు మూడు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. హైదరాబాద్కు ప్రత్యేకమైన సహజ రంగులతో, చేతితో తయారు చేసిన వస్తువులు కొలువు దీర నున్నాయి.బంజారాహిల్స్లోని తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్లో తొలిసారిగా ‘నేచురల్ డై హ్యాండ్మేడ్ ఎగ్జిబిషన్’ పేరుతో దీన్ని నిర్వహించ నున్నారు. ముఖ్యంగాకరోనా, లాక్డౌన్ సంక్షోభంతో అనేక ఇబ్బందులు పడుతున్న హస్తకళా కారులు, ఉత్పత్తులకు చేయూతనివ్వడంతోపాటు, స్వదేశీ బ్రాండ్ ఉత్పత్తిని ఏకతాటి పైకి తీసుకురావాలనేది తమ ధ్యేయమని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనలో బెంగాల్ మస్లిన్, జమ్దానీ, కౌడి ఆర్ట్, కాలా కాటన్, లంబాడీ ఎంబ్రాయిడరీ ఆర్ట్ ఇతర సహజ రంగుల వస్త్రాలుంటాయి. పురుషులు, మహిళలు, పిల్లలకు వివిధ రకాల వస్త్రాలతోపాటు ప్రధానంగా చేతితో తయారు చేసిన వస్తువులుంటాయని పేర్కొన్నారు.ఇలాంటి దుస్తులను ధరించడం మనకు గర్వకారణం మాత్రమే కాదు ప్రేమకు సంబంధించిన విషయం. అలాగే కాలుష్య నివారణలో, మానవ, ఇతర వనరుల దోపిడీని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్ భాగస్వాములైన చేనేత కార్మికులు, కళాకారుల, నేత సంఘాలు, గ్రూప్స్ ఇందులో పాల్గొంటాయి. మిషన్ సమృద్ధిపథకంలో భాగంగా ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్, ‘S.A.L.T (సస్టైన్. యాక్ట్. లైవ్. ట్రాన్స్ఫార్మ్) స్టోరీస్లో మూడవ ఎడిన్లో దేశవ్యాప్తంగా ఉత్పత్తైన అద్భుత దుస్తులను, కళాఖండాలను వెలుగులోకి తేనున్నారు. జూన్ 17 ఉదయం 11 గంటలకు హైదరాబాద్కు చెందిన మాజీ మిసెస్ ఇండియా, శిల్పా రెడ్డి డాక్టర్ రామాంజనేయులు (సీఎస్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), మీనా అప్నేందర్ (క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ),దుర్గా వెంకటస్వామి (స్థాపకుడు, బ్లూ లోటస్)తో కలిసి ఈఎగ్జిబిషన్ను ప్రారంభించనున్నారు. అలాగే నాగేంద్ర సతీష్, ప్రొఫెసర్ శారదా దేవి, డాక్టర్ షర్మిలా నాగరాజు, అనంతూలాంటి నిపుణులు ఈ దుస్తుల ఉత్పత్తి విధానం, ప్రయోజనాలు, కళాకారులు కష్టాలు జీవనోపాధి అవకాశాలపై ప్రసంగిస్తారు. ఈ ప్రదర్శనతోపాటు,జూన్ 17న హ్యాండ్ స్పిన్నింగ్ వర్క్షాప్, జూన్ 18న నేచురల్ డైయింగ్ వర్క్షాప్ ఉన్నాయి. వర్క్షాప్లో పాల్గొనేందుకు ముందుగా నమోదు చేసుకోవడం అవసరం. రిజిస్ట్రేషన్, ఇతర సందేహాల నివృత్తి కోసం 7305127412ను సంప్రదించవచ్చు. -
మామిడి పండు తింటున్నారా?.. కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
కర్నూలు(అగ్రికల్చర్): పళ్లలో మామిడి రారాజు. ఇప్పుడిప్పుడే మార్కెట్లో దర్శనమిస్తూ నోరూరిస్తున్నాయి. పసుపు పచ్చ రంగులో ఆకర్షించే అలాంటి మామిడిని చూసి మోసపోవద్దంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. కాల్షియం కార్బైడ్తో మాగబెట్టిన పండ్లు అయితేనే అంతలా ఊరిస్తాయని, వాటిని తింటే ఆరోగ్యానికి హానికరమంటూ హెచ్చరిస్తున్నారు. సహజసిద్ధంగా లేదా ఎథ్రిల్ లిక్విడ్తోనైనా మాగబెట్టిన పండ్లను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కృత్రిమంగా మాగబెట్టిన పండ్లకు సహజసిద్ధంగా మాగిన పండ్లను ఎలా గుర్తు పట్టాలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.. చదవండి: ఈ మిల్క్షేక్ను రాత్రి పడుకునే ముందు తాగితే! కాల్షియం కార్బైడ్తో మాగబెట్టిన పండు.. కాల్షియం కార్బైడ్తో మాగబెట్టిన పండు మొత్తం లేత పసుపు రంగులో ఒకే విధమైన కాంతితో నిగనిగలాడుతూ ఉంటుంది. పైకి మాగినట్లు కనిపించినా లోపల అపరిపక్వంగా ఉండి రుచి పుల్లగా ఉంటుంది. పండును ముక్కుకు దగ్గరగా ఉంచినప్పుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. చక్కెర శాతం తక్కువగా ఉండి, తీపి, రుచి అంతంత మాత్రమే ఉంటాయి. పండు తొక్క ముడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి. పండు త్వరగా పాడైపోతుంది. సహజసిద్ధంగా మాగిన పండు.. సహజంగా మాగిన పండు కొంత పసుపు, మరికొంత ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి లోపలి భాగం అంతా పరిపక్వంగా ఉంటుంది. పండు కొంత దూరంలో ఉన్నప్పటికీ కమ్మని మామిడి పండు వాసన వస్తుంది. చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. తీయగా, రుచిగా ఉంటుంది. సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు.. కాల్షియం కార్బైడ్తో కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను తింటే కాన్సర్, అల్సర్, కాలేయం(లివర్), మూత్ర పిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలీన్ వాయువు నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపి తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపిక శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయ పద్ధతులు.. మాగని కాయలను, కొన్ని మాగిన పండ్లను గాలి చొరబడని డబ్బాలలో ఉంచాలి. లేదా పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల సహజ సిద్ధంగా మాగుతాయి. లేదా తప్పని పరిస్థితుల్లో మామిడి కాయలు మాగబెట్టాల్సి వస్తే ఇథిలిన్ వాయువు(గ్యాస్) 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి. 100 పీపీఎం ఎథిలిన్ వాయువు 24 గంటలు తగిలేలా ఉంచితే 5 రోజుల్లో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి. ఈపద్ధతిని రైపనింగ్ చాంబర్లో వినియోగిస్తున్నారు. ఎథ్రిల్ లిక్విడ్లో 5 నిముషాలు పాటు ముంచి మూడు, నాలుగు రోజులు నిల్వ చేస్తే సహజత్వానికి దగ్గర మాగుతాయి. ముంచడం సాధ్యం కానిపక్షంలో ఎథ్రిల్ లిక్విడ్ను కాయలకు స్ప్రే చేయవచ్చు. తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు.. పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీళ్లతో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తినాలి. లేదా ఫ్రిజ్లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది. కాల్షియం కార్బైడ్తో మాగించొద్దు ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కాల్షియం కార్బైడ్తో మామిడి పండ్లను మాగించరాదు. కార్బైడ్ వాడిన పండ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎలా మాగించాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా కార్బైడ్తో మాగబెట్టిన వారికి, అమ్మేవారికి ఏడాది జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. – రఘునాథరెడ్డి, ఏడీ ఉద్యానశాఖ కర్నూలు -
ఇలా చేస్తే.. ముఖంపై ఎలాంటి మచ్చలైనా మటుమాయం
ఎత్తుకు తగిన బరువుతో ఆకర్షణీయమైన పర్సనాలిటీతో నలుగురిన్నీ ఆకట్టుకుంటూ ఉండాలని అందరమూ కోరుకుంటాం. కానీ అన్నీ బావున్నా.. తీరా ముఖం దగ్గరికొచ్చేసరికి మచ్చలు కొంతమందిని వేధిస్తూ ఉంటాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే ఈ నల్లటి మచ్చలనే మంగు మచ్చలంటారు. ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుంచి ముక్కు వరకూ వ్యాపిస్తాయి. ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు వెనుకభాగంలో కూడా ఏర్పడే అవకాశం ఉంది. శరీరతత్వాన్ని బట్టి ముఖంపై మొటిమలు, పులిపిర్లు, పెద్ద పరిమాణంలో ఉండే పుట్టుమచ్చలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు మొదలైనవి ఏర్పడుతుంటాయి. వీటిలో కొన్ని వంశ పారంపర్యంగా వస్తే, మరికొన్ని హార్మోన్లలో సమతుల్యత లోపించడం వల్ల కూడా రావచ్చు. వంశ పారంపర్యంగా వచ్చే మచ్చలను నివారించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ముఖంపై మంగు మచ్చలు లేదా, నల్లటి మచ్చలు వ్యాధి కాదు కానీ, వీటితో ఆత్మన్యూనతతో పదిమందిలోకీ వెళ్లడానికి ఇబ్బంది పడతారు. అసలు ఇలాంటి మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వాటిని నివారించ వచ్చు. తొలిదశలోనే ఉన్న వాటిని చిన్న చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చు. చిన్న చిన్న చిట్కాలతో ముఖంపై మంగు మచ్చలు మాయం. తాజా వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే క్రమేణా పలచబడి కొంతకాలానికి చర్మం రంగులో కలిసిపోతాయి. పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి పాలల్లో కలిపి రాస్తుంటే మంగు మచ్చలు, చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి. జాజికాయను పాలలో అరగదీసి రాయడం వల్ల గుణం కనిపిస్తుంది. పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది. పావు టీ స్పూన్నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. టొమాటోను రెండు ముక్కలుగా తరిగి, వాటితో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే నల్ల మచ్చలు తగ్గడంతోపాటు ముఖవర్చస్సు పెరుగుతుంది. అలోవెరా పేస్టును మచ్చలపై పూయాలి. ఆ మచ్చతడి ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి. టీ స్పూన్టొమాటో రసం, టీ స్పూన్గంధం పొడి, రెండు టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజ్వాటర్, కీరా రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెల రోజులు గడిచేసరికి మంచి మార్పు వస్తుంది. బంగాళదుంప చెక్కు తీసి, సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి, రసం తీయాలి. దానిలో దూది ఉండలని ముంచి, వాటితో మచ్చలపై అద్దాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటం. ఆత్మన్యూనతతో ఉంటే మరింత కృంగిపోతాం. పదే పదే అందవిహీనంగా ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసుకుంటే డిప్రెషన్కు లోనవుతాం. సో అలాంటివన్నీ పక్కన పెట్టి, సహజ పద్ధతుల్లో పరిష్కారానికి ప్రయత్నించడం, లేదంటే నిపుణులైన డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ఆత్మవిశ్వాసంతో ఉండి చక్కగా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటే ఏ మచ్చలూ మన అందాన్ని మసక బార్చలేవు. -
‘షేన్ వార్న్ది సహజ మరణమే’
మెల్బోర్న్: స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి విషయంలో అనుమానించాల్సిన అంశమేమీ లేదని తేలింది. అతనిది సహజ మరణమేనని, గుండె పోటు కారణంగానే చనిపోయినట్లు థాయ్లాండ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వార్న్ మృతదేహానికి పోస్ట్మార్టమ్ నిర్వహించిన వైద్యుడు థాయ్ పోలీసులకు నివేదిక ఇవ్వగా, దానిని వారు ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి అందజేశారు. ‘వార్న్ మృతికి సంబంధించి సందేహించాల్సిన అంశాలేమీ కనపడలేదు. ఇది హత్య కాదు. అతను సహజంగానే చనిపోయినట్లు పోస్ట్మార్టమ్ చేసిన డాక్టర్ వెల్లడించారు. అంతకుముందే తనకు ఛాతీలో కొంత నొప్పి వస్తోందని, థాయ్లాండ్ నుంచి తిరిగి రాగానే వైద్యులను కలుస్తానని వార్న్ తన తండ్రితో కూడా చెప్పాడు’ అని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సురచటే హక్పర్న్ స్పష్టం చేశారు. మరోవైపు సెలవుల కోసం థాయ్లాండ్ వెళ్లడానికి ముందే వార్న్ ఛాతీ నొప్పితో బాధపడినట్లు, అతని డైట్లో మార్పు కూడా అందుకు కారణం కావచ్చని వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కైన్ వెల్లడించాడు. ‘బరువు తగ్గే క్రమంలో వార్న్ కఠోర ఆహార నియమాలను అలవాటు చేసుకున్నాడు. థాయ్ వెళ్లే ముందు రెండు వారాలుగా అతను కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ వచ్చాడు. అతను తన జీవితంలో చాలా ఎక్కువగా ధూమపానం చేసేవాడు. బహుశా అది కూడా గుండెపోటుకు కారణం కావచ్చేమో’ అని అతను వివరించాడు. అధికారిక లాంఛనాలతో... వార్న్ అంత్యక్రియలను ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. వార్న్ కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలకు నెలవైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సుమారు లక్ష మంది అభిమానుల మధ్య ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఎంసీజీ బయట వార్న్ విగ్రహం ఉండగా, మైదానంలో ఒక స్టాండ్కు కూడా అతని పేరు పెట్టనున్నారు. ఇంకా తేదీ ధ్రువీకరించకపోయినా... వచ్చే రెండు వారాల్లోగా అంత్యక్రియలు నిర్వహించవచ్చు. దేశ ప్రధాని స్కాట్ మోరిసన్, విక్టోరియా ముఖ్యమంత్రి డానియెల్ ఆండ్రూస్ అంత్యక్రియలకు హాజరవుతారు. ‘ఇది ఎప్పటికీ ముగిసిపోని పీడకలలాంటిది. వార్న్ లేని జీవితాన్ని ఊహించలేకపోతున్నాం. అతను అందించిన జ్ఞాపకాలతో బతికేస్తాం’ అని అతని తల్లిదండ్రులు కీత్, బ్రిగిట్ ఆవేదనగా చెప్పగా... ‘నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటావు. నువ్వో గొప్ప తండ్రివి, స్నేహితుడివి’ అంటూ అతని కుమారుడు జాక్సన్ తన బాధను వ్యక్తం చేశాడు. థాయ్లాండ్ నుంచి వార్న్ మృతదేహం ఇంకా అతని ఇంటికి చేరలేదు. -
మంచిమాట.. ముందు నిన్ను నీవు సరిదిద్దుకో!
ఆనందం అంటే బయటికి నిరూపించలేనిది. అది ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అనుభవించే స్థితి. ఒక్కో పదార్థం తినడం వల్ల ఒక్కో రుచికి సంబంధించిన అనుభూతి కలుగుతుంది. అలా ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది..? ఆ అనుభూతిని ఎలా పొందాలి..? ఆనందానికి అర్థం పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? అది తెలుసుకుంటే ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా అన్నిటికీ అతీతంగా జీవిస్తాడు. నీ గురించి నువ్వు ఆలోచిస్తే, నీవు ఎవరో తెలుసుకుంటే చాలు. నిజానికి నీవు ఎవరు అంటే ఆ భగవంతుడివే. ఆ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది. నీ గురించి నీవు తెలుసుకోవడం మొదలుపెట్టగానే అంతరంగం శుద్ధి కావడం మొదలవుతుంది. వేరే వారి గురించి ఆలోచిస్తే నీ అంతరంగం కలుషితమవుతుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటే వారి సమాచారం, వారి భావాలు నీ మనసు లోకి ప్రవేశించి నీ మీద స్వారీ చేస్తాయి. నీవు ఎవరి గురించి అయితే అతిగా ఆలోచిస్తే నీ జీవితం వారికి సమర్పించినట్లు, మీ వ్యక్తిత్వం సహజత్వాన్ని కోల్పోయి అతనికి నీవు బానిసగా ఉన్నట్లే. ఇతరుల పట్ల ఆలోచిస్తున్నాను అంటే మనం వారిపై రాగద్వేషాలు పెంచుకున్నట్లే. ప్రస్తుతం మనుషులు తన జీవితం తను జీవించటం మర్చిపోయి ఇతరుల గురించి అనవసరంగా ఆలోచించుకుంటూ లేని సమస్యలను కొని తెచ్చుకుంటున్నాడు ఈనాటి మానవుడు. ఒకసారి మనసు కలుషితమై పరిపరివిధాల అనవసరమైన విషయాల గురించి మనసులో ఆలోచన చేసి దాని ద్వారా శరీరంలో ప్రాణ శక్తి తగ్గి అనేక రకాల రసాయనిక చర్యలు జరిగి తద్వారా అవయవాలు పని చేయక అనేక రకాల జబ్బులు కలిగి శరీరం తన శక్తిని కోల్పోయి దీర్ఘకాలిక రోగాల పాలవుతున్నారు. మానవునికి ఈ శరీరం ఉంటేనే ఏ కార్యమైనా చేయగలిగేది. నీవు జీవించేది నీ కోసమా..? లేక ఇతరుల కోసమా..? ఆలోచించుకోవాలి. ఇతరుల కోసం జీవిస్తున్నాను అని నీవు అనుకుంటే నీవు మాయలో ఉన్నట్టే... బానిసత్వంలో బతుకుతున్నట్టే. సమాజాన్ని ఉద్ధరించే ముందు నిన్ను నీ కుటుంబాన్ని ఉద్ధరించాలి. నీ కుటుంబాన్ని కాకుండా సమాజాన్ని ఉద్ధరించే ఆలోచన చాలా ప్రమాదకరం. ఇంతవరకు ఎవరు అది సాధించలేదు. సేవ చేయాలి కానీ నీవే తర్వాత సేవ చేయించుకునే పరిస్థితి ఏర్పడకూడదు. నిజానికి సేవ అంటే దాని నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు, అలా ఆశించి సేవ చేస్తే కర్మ రెట్టింపు అవుతుంది. సమాజం చెడిపోయింది. దానిని మంచి వైపు నడిపించాలని తపనతో తమ కుటుంబాన్ని మంచి వైపు నడిపించడం మరచిపోతున్నారు. సమాజాన్ని ఉద్ధరించడం తప్పనిసరి అవసరమే కానీ దానికి ఓ పద్ధతి ఉంది. ముందు తనని తను ఉద్ధరించుకోకుండా, తన బాధ్యతలు, బంధాలను, దాటకుండా సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం సరికాదు. అందుకు సమాజం కూడా సహకరించదు. నీ కోసం నీవు జీవించడమే నిన్ను నమ్ముకున్న వాళ్లకు నీవు ఇచ్చే అత్యున్నత జీవితం. నిన్ను నీవు ఉద్ధ్దరించి ఉన్నప్పుడే సమాజాన్ని సరి చేసే అర్హత వస్తుంది. కాబట్టి మొదలు నిన్ను నీవు సరి చేసుకో. ఆ తర్వాతనే సమాజం గురించి ఆలోచన చేయి. ఈ ప్రపంచంలో ఎవరి జీవితం వారిది. ఎవరి కర్మలు వారివి. కాబట్టి ప్రతి ఒక్కరు స్వీయనియంత్రణలో ఉండాలి. నీకు ప్రపంచాన్ని మార్చే అర్హత వచ్చినప్పుడు ప్రపంచం నిన్ను వదలదు. నీకు ఆ అర్హత లేకుంటే సమాజం నిన్ను స్వీకరించదు. మేధావులు మాకు అంతా తెలుసు అనుకుంటారు కానీ అదే వారి బలహీనత. తమ ద్వారా సమాజం మారుతుంది అనుకుంటారు. భౌతిక పరమైన అభివృద్ధి ద్వారానే మనిషి ఆనందంగా జీవిస్తున్నా అనుకుంటున్నాడు. అందుకే భౌతికమైన అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. అందరూ తెలుసుకోవాల్సిన నగ్నసత్యం మనిషి జీవితకాలం పరితపించేది ఆనందం కోసమే. కానీ ఆ ఆనందం పొందాలనే తపనలో భౌతిక, శారీరక సుఖాలే ఆనందం అనే భ్రమలో నిజమైన ఆనందాన్ని పొందలేక అసంతృప్తి పడుతున్నాడు. దీనికి మూల కారణం తన గురించి తను ఆలోచించుకోలేకపోవడం. నీ గురించి నీవు తెలుసుకుంటూ నీ జీవితం గురించి ఆలోచించుకోవడమే దీనికి పరిష్కారం. మనిషి ఆనందంగా ఉండలేక పోవడానికి కొంత పూర్వ జన్మ, ఇంకొంత ఈ జన్మలో చేసిన కర్మలు కారణం. ఈ కర్మలను క్రమేణా నివృత్తి చేసుకుంటూ వాటి తీవ్రతను తగ్గించుకొని అనవసరమైన వాటికి విలువ ఇవ్వకుండా అవసరమైన విషయాలకు మాత్రమే విలువ ఇస్తూ ఫలితం పొందితే ఆనందం సిద్ధిస్తుంది. ఆనందం అంటే ఎవరికి వారు స్వయంగా అనుభవించే స్థితి. ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా అన్నిటికీ అతీతంగా జీవిస్తాడు. ► భౌతిక సంపద పెరగడం అంటే మానసిక సంపద తరగడమే. ► సంపద పెరిగితే సంతృప్తి రావాలి ► సంతృప్తిని మించిన సంపద లేదు. ► ఆనందం లేనప్పుడు జీవితానికి అర్థం లేదు, ► మనం ఎందుకు జీవిస్తున్నాం ఎలా జీవిస్తున్నామో తెలుసుకోవాలి. ► ఆనందంగా జీవించే వ్యక్తికి అన్నిటిపై సమదృష్టి ఉంటుంది. ఇలా జీవించే వ్యక్తి మాత్రమే ప్రకృతి సహజంగా జీవిస్తాడు. – భువనగిరి కిషన్ యోగి -
ప్రకృతి నుంచి లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు
ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని కాపాడిన మందు పెన్సిలిన్.. దాని తయారీకి మూలం ఓ ఫంగస్.. ఇప్పుడు కరోనా టెస్టుల కోసం వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్ విధానంలో వాడేది ఓ బ్యాక్టీరియా.. ఇవే కాదు.. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినదీ ప్రకృతే. అత్యంత ముఖ్యమైన ఔషధాల తయారీకి స్ఫూర్తినిచ్చినదీ ప్రకృతే.. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మందులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా.. జంతువులు, మొక్కల నుంచి.. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్లగానీ, మన జీవనశైలి వల్లగానీ ఎన్నో రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటికి ఉపశమనం కోసం ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలతో మందులు తయారు చేస్తుంటారు. ఒక్కోసారి కొన్నిరకాల జంతువులు, చెట్లలోని రసాయనాల సమ్మేళనాలు నేరుగా రోగాలు, ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగానో, అనుకోకుండానో అలాంటి వాటిని గుర్తించి.. మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. మధుమేహానికి మందు ఇచ్చి.. గిలా మాన్స్టర్.. నలుపు, నారింజ రంగుల్లో ఉండే ఒక రకమైన పెద్దసైజు బల్లి. అమెరికా, మెక్సికో దేశాల్లో ఉండే ఈ బల్లి లాలాజలంలో ఎక్సెండిన్–4 అనే హార్మోన్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహం చికిత్సలో వాడుతున్న ఎక్సెనటైడ్ ఔషధానికి మూలం ఆ హార్మోనే. టైప్–2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి, పేషెంట్లు బరువు తగ్గడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుందని నార్త్ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు 2007లో గుర్తించారు. దానిని ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కరోనాను గుర్తిస్తున్నది ఇదే.. థర్మస్ అక్వాటికస్ బ్యాక్టీరియా.. 1969లో అమెరికాలోని ప్రఖ్యాత ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్లో దీనిని గుర్తించారు. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ప్రొటీన్ల పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్ టెస్టులో ఉపయోగించినప్పుడు.. సంబంధిత వైరస్ల ప్రొటీన్లను గుర్తించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ►ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) లెక్కల ప్రకారం.. ఇండియా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, టర్కీ ఈ ఐదు దేశాల్లోనే ఏడాది మే చివరినాటికి ఏకంగా 100 కోట్ల కరోనా టెస్టులు చేశారు. ఫంగస్పై పోరు నుంచి.. కేన్సర్ చికిత్సకు.. పాక్లిటాక్సెల్.. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన ఔషధం. పసిఫిక్ యూ అనే చెట్టు బెరడులో లభించే ఈ రసాయన మిశ్రమాన్ని 1971లోనే గుర్తించారు. అది కేన్సర్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని 2015లో జరిగిన పరిశోధనల్లో తేల్చారు. దాదాపు అన్నిరకాల కేన్సర్లకు చేసే కెమోథెరపీ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన అత్యవసర మందుల జాబితాలో ఈ పాక్లిటాక్సెల్ ఔషధం కూడా ఉండటం గమనార్హం. నిజానికి పసిఫిక్ యూ చెట్లు ఈ రసాయన సమ్మేళనాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తాయో తెలుసా.. తమపై ఫంగస్లు పెరిగి తెగుళ్లు కలిగించకుండా ఉండటం కోసమే. వాటి ఇమ్యూనిటీ మనకు ఔషధంగా మారింది. సూక్ష్మజీవులను నాశనం చేసే కప్ప మాగేనిన్.. ఆఫ్రికన్ క్లాడ్ రకం కప్ప చర్మంలో ఉండే ఓ ప్రత్యేకమైన ప్రొటీన్. చాలా రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్లు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. కొన్నేళ్ల కింద ఆ కప్పలపై పరిశోధనలు చేస్తున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వాటి శరీరంపై గాయాలైనా ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకడం లేదని గుర్తించారు. దానికి కారణం ఏమిటని పరిశోధించి ‘మాగేనిన్’ ప్రొటీన్ను గుర్తించారు. ఇది సూక్ష్మజీవుల పైపొరను ధ్వంసం చేస్తోందని తేల్చారు. అయితే ఈ ప్రొటీన్ను మానవ వినియోగానికి అనుగుణంగా మార్చడం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మరెన్నో మందులు.. ►జ్వరం, నొప్పులతోపాటు మరెన్నో అనారోగ్య లక్షణాలకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ అనే మందు విల్లో చెట్ల బెరడు, ఆకుల్లో ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలు దానిని వాడుతూ వచ్చారు. 1850వ దశకంలో ఆస్పిరిన్ను కృత్రిమంగా తయారుచేశారు. ►మలేరియాకు మందుగా వినియోగించే క్వినైన్ అనే ఔషధం సింకోనా చెట్ల బెరడు నుంచి వస్తుంది. వందల ఏళ్లుగా దాన్ని వినియోగిస్తున్నారు. 1940వ దశకంలో శాస్త్రవేత్తలు క్వినైన్ను కృత్రిమంగా తయారు చేశారు. ►రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్’ను పలు రకాల ఫంగస్ల నుంచి విడుదలయ్యే రసాయనాల నుంచి అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల విలువ! మనం పండించే, పెంచే చెట్లు, జంతువులు వంటివి కాకుండా.. సహజ ప్రకృతి నుంచి మనం ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వాడేసుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంచనాల ప్రకారం.. భూమ్మీద ఉన్న ప్రకృతిని రూపాయల్లో లెక్కిస్తే.. 92.5 కోట్ల కోట్లు (125 ట్రిలియన్ డాలర్లు) విలువ ఉంటుంది. ప్రకృతిని సంరక్షించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఏటా రూ.35.4 లక్షల కోట్లు (479 బిలియన్ డాలర్లు) నష్టపోతున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెచ్చరించింది. -
మనదేశంలో ప్రకృతి అద్భుతాలు
వెబ్డెస్క్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న ప్రతీ ఏడు జరుపుతుంటారు. పర్యావరణం అనగానే గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌజ్ గ్యాస్,, కాలుష్యం పెరుగుదల ఇలా సాగిపోతుంది వరస. పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కలు నాటడం, చెట్లు పెంచడం ఎంతో అనివార్యం కూడా. మాటల్లో చెప్పినట్టు చేతల్లో ఫలితాలు సాధించాల్సిందే. అయితే పర్యావరణం అంటే చెట్లు, చేమలే కాదు కొండలు, లోయలు, సేలయేర్లు, మంచు, ఏడారి ఇలా ప్రతీది పర్యావరణంలో భాగమే. ప్రతీది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయి. ఇందులో కొన్ని వింతలకు, విశేషాలకు నెలవై ఉంటాయి. మన దేశంలో పర్యావరణంలో భాగమైన ప్రకృతి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్నింటినీ ఓసారి చూద్దాం. లూనార్ క్రాటర్ లేక్ ప్రకృతి అద్భుతాల్లో ఒకటి మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్న లూనార్ క్రాటర్ లేక్. యాభై రెండు వేల సంవత్సరాల క్రితం గ్రహశకలాలు భూమిని బలంగా ఢీ కొట్టడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి వెడల్పు దాదాపు 1.8 కిలోమీటర్ల వెడల్పు, లోతు 137 మీటర్లు ఉంటుంది. గ్రహశకలాలు ఢీ కొట్టడం వల్ల ఏర్పడిన గొయ్యిలలో ఇదే ప్రపంచంలోనూ మూడో అతి పెద్దది. ఈ గొయ్యి నిండా ఆమ్ల లక్షణాలు ఉన్న నీరు చేరుకోవడంతో దీన్ని లూనార్ క్రాటర్ లేక్గా పిలుస్తున్నారు. గ్రావిటీ హిల్ వేసవి వచ్చిందంటే చాలు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న బైకర్లు, అడ్వెంచరిస్టుల్లో చాలా మంది లద్ధాఖ్కు చేరుకుంటారు. లద్ధాఖ్ - కార్గిల్ హైవేలో ఉన్న మరో ప్రకృతి వింత గ్రావిటీ హిల్. లేహ్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఈ వింతైన ప్రదేశం ఉంది. ఇక్కడ ఇంజన్ ఆఫ్ చేసినా సరే ఎత్తుగా ఉన్న వైపుకు వాహనాలు నడుస్తూనే ఉంటాయి. దీనికి ఆప్టికల్ ఇల్యూషన్ అని పేరు పెట్టినా .. భూమ్యాకర్షణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరిగే ఈ వింతకు గల అసలైన కారణం ఇప్పటి వరకు తేలలేదు. లోక్తాల్ సరస్సు ప్రపంచం మొత్తం మీద నీటిపై తేలియాడే సరస్సు మణిపూర్లో ఉంది. దీన్ని లోక్తాల్ అంటారు. నీరు, భూమి కలిసిపోయి ఉండే సరస్సు కనుల విందుగా ఉంటుంది. నీళ్లపై నేల తేలియాడుతుందా అనేట్టుగా ఈ సరస్సు కనిపిస్తుంది. జీవ వైవిధ్యానికి ఇది నెలవు. ఇక్కడ వందల రకాల పక్షులు, మొక్కలు, ఇతర జీవరాశులు నివసిస్తున్నాయి. సూది బెజ్జం మనదగ్గర రామప్ప శిల్పి సూది బెజ్జం పట్టెంత నైపుణ్యంతో వందలాది శిల్పాలను చెక్కాడు. కానీ ప్రకృతి కొండల్ని వింతైన ఆకారాలుగా మాలిచిన చోటు మహారాష్ట్రలోని గోలేవాడి ప్రాంతంలో ఉంది. ఎత్తైన కొండ మీదున్న రాళ్లలో ఒకటి సూది బెజ్జంలా కనిపిస్తుంది. మరోవైపు ఇదే ఆకారం ఏనుగు తొండంలా కూడా కనిపిస్తుంది. నీడిల్పాయింట్ లేదా ఎలిఫెంట్ పాయింట్గా చెప్పుకునే ఈ ప్రదేశం చక్కని టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వేర్ల వంతెనలు ప్రపంచలోనే అత్యధిక వర్షపాతం మేఘాలయలోని చిరపుంజిలో నమోదవుతుంది. నిత్యం ఇక్కడ కురిసే వర్షాలతో ఈ కొండ ప్రాంతంలో వరద నీరు ఎప్పుడు ఉరుకులు పరుగులు పెడుతుంది. దీంతో ఇక్కడ వంతెనల నిర్మాణం అంత సులువు కాదు. అందుకే 500 ఏళ్ల క్రితమే ఇక్కడి ప్రజలు వేర్లతో వంతెనలు కట్టే పద్దనికి కనుక్కొని అమలు చేస్తున్నారు. రబ్బరు చెట్ల వేర్లతో ఏర్పాటు చేసిన ఈ బ్రడ్జిలు చూడలను చూడటం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఉప్పు ఎడారి మగధీర సినిమాలో రామ్చరణ్ తెల్లటి ఉప్పు ఎడారిలో గుర్రం స్వారీ చేసే దృశ్యాలు రోమాంచితంగా ఉంటాయి. ఆ ఏడాది ఎక్కడో విదేశాల్లో లేదు. మన గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్లో ఉంది. ఇసుక ఎడారి, మంచు ఎడారి తరహాలో ఇది ఉప్పు ఎడారి. 2,897 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఈ ఉప్పు ఎడాది విస్తరించి ఉంది. పౌర్ణమి రోజుల్లో ఇసుక కూడా ఉప్పులానే కనిపిస్తుంది. లావా స్థంభాలు సాధారణంగా సముద్ర తీరంలో ఉన్న కొండలు, రాళ్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎగుడుదిగుడుగా, మొన తేలిన రాళ్లతో కూడి ఉంటాయి. కానీ కర్నాటక తీరంలో సెయింట్మేరిస్ ద్వీపంలో ఉన్న లావా స్థంభాలు ఇందుకు విరుద్ధం. అరేబియా సముద్ర తీరంలో పోత పోసిన షట్భుజి స్థంభాలాలు విరివిగా కనిపిస్తాయి. లక్షల సంవత్సరాల క్రితం బద్దలైన అగ్నిపర్వతం లావా నుంచి ఈ శిలలు ఏర్పడి ఉంటాయని అంచనా. కర్నాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న మాల్పే నుంచి బోటు ద్వారా ఈ దీవికి చేరుకోవచ్చు. ప్రకృతి హృదయ స్పందన కేరళ రాష్ట్రంలోని చంబ్రా కొండలపైనా సహజ సిద్ధంగా ఏర్పడిన చిన్న కొలను ఉంది. పై నుంచి చూస్తే ఈ కొలను ప్రేమకు చిహ్నమైన హృదయం ఆకారంలో కనిపిస్తుంది. -
'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' ఫేం రూప కొడువాయర్ నేచురల్ ఫోటోలు
-
కరోనా వైరస్ కృత్రిమంగా తయారి కాదు!
లాస్ ఏంజెలెస్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 వ్యాధి కారక కరోనా వైరస్ పరిశోధనశాలలో కృత్రిమంగా తయారైంది కాదని, పరిణామ క్రమంలో భాగంగా ప్రకృతిలో సహజసిద్ధంగా పరిణమించిన సూక్ష్మజీవేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గబ్బిలాల్లో ఉండిపోయి.. ఒకానొక సందర్భంలో మనుషులకు చేరిందని... తద్వారా లక్షల మందికి విస్తరించింనట్లు తాము అంచనా వేస్తున్నామని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేచర్ మెడిసిన్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ఇదే విషయాన్ని చెబుతోంది. (కరోనా: ఒక్కరోజే 475 మంది మృతి) కరోనా వైరస్తోపాటు సార్స్ తదితర వైరస్ల జన్యుక్రమాలను విశ్లేషించడం ద్వారా తామీ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. కరోనా వైరస్ జన్యుక్రమంలో కృత్రిమంగా చేర్చిన భాగాలేవీ లేవని తద్వారా ఇది సహజసిద్ధంగా పరిణమించిన సూక్ష్మజీవి అనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త క్రిస్టియాణ్ అండర్సన్ తెలిపారు. కరోనా వైరస్ మూలభాగం ఇతర వైరస్ల కంటే భిన్నంగా ఉందని... పైగా గబ్బిలాలు, పాంగోలిన్కు సంబంధించిన వైరస్లను పోలి ఉందని క్రిస్టియన్ వివరించారు. కోవిడ్–19 వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇది మానవ నిర్మితమైందన్న వదంతులు చాలా వ్యాపించాయని, వాటన్నింటికీ తమ పరిశోధన స్పష్టమైన సమాధానం చెబుతోందని అన్నారు. (కేసులు 2లక్షలు మరణాలు 8వేలు) -
తృప్తిని మించిన ధనం... భక్తిని మించిన మోక్షం లేవు!
కె.వి.రెడ్డి దర్శకత్వంలో సహజకవి జీవితంపై రూపొందించిన చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘నారాయణ...రామకృష్ణ,,,,గోవింద నారాయణ’ అంటూ భక్తిపరవశంతో భజన జరుగుతుంది. ఈ సందడిలోనే ఒకడు దేవుడి దీపంతో చుట్ట వెలిగించుకున్నాడు.‘‘ఎవడ్రా నువ్వు దేవుడి గుడిలో దీపానికి చుట్ట ముట్టిస్తావా!’’ అని నిప్పులు చెరుగుతూ వాడికి రెండు అంటించాడు మల్లన్న.ఈ దెబ్బకు చుట్ట ఎగిరివెళ్లి జనాల మధ్య పడింది.‘‘ఏ...నీ అబ్బ గంటా ఇది... పోరా’’ అని మండిపడ్డాడు చుట్టవాడు.ఈ గొడవ విని ‘‘మల్లన్నా...’’ అని కొడుకును పిలిచారు కవిగారు.‘‘నాన్నా...వీడి విషయంలో జోక్యం చేసుకోకు. వీడికి శాస్తి జరగాలి. ఈ పశువును ఇలా సాగనిస్తే....మనం ఒక్క క్షణం కూడా ఈ ఊళ్లో కాపురం చేయలేము’’ ఆవేశంగా అన్నాడు మల్లన్న.‘‘నీకెందుకు నాయనా ఇంతకోపం! మానవుల పాపపుణ్యాలను పాలించడానికి దేవుడున్నడుగా. నువ్వు ఊర్కో’’ అని కొడుకును శాంతింపజేయడానికి ప్రయత్నించారుకవిగారు.‘‘తమరు అలా సెలవీయకండీ...వీడి దుర్మార్గం రోజురోజుకూ మితిమీరి పోతోంది’’ అని చుట్టోడిపై ఫిర్యాదుల చిట్టా విప్పాడు ఒక భక్తుడు.‘‘దేవుడికి నీవు నేను ఎంతో. వీడూ అంతే...’’ అన్నారు శాంతస్వరంతో కవిగారు. ఆ రాత్రి కుక్కలు మొరిగేవేళ...‘‘అమ్మా...అన్నపూర్ణ...మాదాకవళం తల్లీ’’ అని అరుస్తున్నాడు ఒక యాచకుడు.‘‘సరిగ్గా సమయానికి వచ్చావు. పోయిరా’’ అంది కవిగారి భార్య.అతడు పోలేదు.‘‘గంజినీళ్లకు కూడా దిక్కులేదమ్మా. ప్రాణం పోయేలా ఉంది’’ దీనంగా అన్నాడు యాచకుడు.ఇది విని బయటికి వచ్చి యాచకుడిని ఇంట్లోకి తీసుకెళ్లి, పక్కనకూర్చొని మరీ భోజనం వడ్డించారు కవిగారు.ఆ యాచకుడి కళ్లలో అంతులేని కృతజ్ఞత.యాచకుడిని ఇంటిగుమ్మం వరకు సాగనంపి వచ్చి భార్యతో అన్నారు కవిగారు:‘‘పాపం ఎంతో ఆకలితో వచ్చాడు. నీ భోజనంతో పూర్తిగా సంతోషించి ఉంటాడు’’‘‘సంతోషించే కాదుదీవించి కూడా వెళ్లాడు. పస్తు ఉంటే బాధపడేది మనమేగానీ వాడికేం!’’ వ్యంగ్యంగా అంది ఆ ఇంటి ఇల్లాలు.‘‘పిచ్చిదానా! ఇళ్లు వాకిలీ ఉన్నంత వరకు ఏదో కలోగంజీ ఇచ్చాడు మనకు దేవుడు.ఆకలిగొన్నవానికి పెట్టిన ఒక కబళం, ఆపన్నుల కోసం విడిచిన ఒక కన్నీటిబొట్టు నూరు సత్రయాగాలు, వెయ్యి కుంభాభిషేకాలతో సమానం’’ అంటూ దానం విలువను చెప్పే ప్రయత్నం చేశారు కవిగారు.కాని ఆయన మాటలు ఆమెకు రుచించలేదు.‘‘మరీ బాగుంది మీ వేదాంతం. ఇక మన సంగతి ఆ దేవుడే విచారించాలి’’ నిర్వేదంగా అన్నది ఆమె.‘‘తప్పకుండా! తన భక్తుల బరువుబాధలు ఆ పరంధామునికి బాగా తెలుసు. అవన్నీ ఆయనే తీరుస్తాడు’’ అనడంతో పాటు...‘‘వెర్రిదానా ఆశకు అంతుండాలి. రత్నాలవంటి పిల్లలు, ఈ రైతుజీవితం...తృప్తిని మించిన ధనం, భక్తిని మించి మోక్షసాధనం లేదు తెలుసా’’ అని ఇల్లాలికి హితబోధ చేశారు కవిగారు. ఎవరో చుట్టాలు వస్తున్నట్లు కలకలం మొదలైంది.ఎవరో కాదు...కవిగారి బావగారు....పల్లకిలో నుంచి దిగారు. సేవకులు హడావిడి పడుతున్నారు.‘‘ఏం బావగారూ, ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. మా శారద కూడా అలాగే ఉంది. ఆభరణాలతో సహజంగా ఉండే సౌందర్యం చెడుతుందనా! ఏమ్మా?’’ అన్నారు ఖరీదైన బావగారు వ్యంగ్యస్వరంతో.‘‘అన్నయ్యా...ప్రశ్నలు తరువాత....భోజనం వేళ అయింది...’’ అనితొందర చేయబోయింది నర్సమాంబ.అన్నయ్యగారి మాటల్లో మళ్లీ వ్యంగ్యం...‘‘లక్షణం చూస్తే...ఇంట్లో అది కూడా ఉంటుందా!’’‘‘దైవకృప వల్ల ఇప్పటి వరకు అలాంటి ఇబ్బంది లేదు బావగారు. వచ్చిన వాళ్లకు ఏదో విధంగా పెడుతూనే ఉన్నాం’’ అన్నారు కవిగారు.నర్సమాంబ అన్నగారు తెచ్చిన నగలు వేసుకొని ధగధగలాడుతుంది ఆమె కూతురు శారద.‘‘ఇప్పుడెంత అందంగా ఉందో చూడండి. ఇలా సర్వాలంకారాలతో రాచకన్యలా ఉండకుండా పల్లెటూరి గబ్బిలాయిలా దిశ మెడలు, దిశ కాళ్లు...మీరూ’’ అని చురక అంటిస్తూ మేనల్లుడి వైపు తిరిగి...‘‘మల్లన్నా, నువ్వు ఇంకా అలాగే ఉన్నావేం. ఆ బట్టలు కట్టుకోరాదూ’’ అన్నారు కవిగారి బావగారు.‘‘ఆ చీనిచీనాంబరాలు వాడికెందుకు బావగారూ...రైతుకు పీతాంబరాలు చాలా దూరం. అంతేకాదు...సాటి రైతులకు కూడా దూరం అవుతాం. కోట్లాదిమంది భారతీయులు కొల్లాయితో సరిపెట్టుకుంటున్నారు. మాకు మాత్రం ఈ జరీపంచెలు ఎందుకు?’’ అన్నారు కవిగారు. ‘‘అవసరం వేరు. అలంకరణ వేరు బావగారు. ప్రజలు కూటికి గుడ్డకు లేక దరిద్రం వెళ్లబుచ్చుతున్నారంటే...తృప్తి కలిగి కాదు. విధి లేక చేతకాక. అంతే! కావాలని ఎవడూ దరిద్రుడు కాదు. కానీ అది తీరే దారి లేక దరిద్రం అనుభవిస్తున్నారు’’ అన్నారు ఆయన.‘‘సరిగపంచెలు కట్టినంత మాత్రానా ధనవంతులవుతారా బావగారు! భక్త ధనం కలవారే ధనవంతులు. వారే వాంఛారహితులు. సుఖసంపన్నులు’’ అన్నారు కవిగారు.‘మీరేదో కవిత్వగానం చేస్తున్నారుగానీ మామూలు రైతువలే మాట్లాడటం లేదు బావ. యదార్థజీవితంతో సంబంధం లేని ఈ భావోన్మోదం ఒక్క కవులకు మాత్రమే ఉంటుంది. ఈ మహత్తరభావాలను చేర్చి ఒక మహత్తర కావ్యం రాయరాదు. అదైనా కొంచెం ఉపయోగపడుతుంది’’ అన్నారు ఆయన.ఆయన ప్రతిమాటలో బావను మార్చే ప్రయత్నమేదో కనిపిస్తూ ఉంది..‘‘మామయ్య...మామయ్యా...నాన్న నిజంగా పెద్ద పుస్తకం రాస్తున్నారు. నాకు అందులో చాలా పద్యాలు వచ్చు..’’ అంది కవిగారి అమ్మాయి.‘‘నిజంగానే రాస్తున్నావా బావ?’’ అడిగారు ఆయన.‘‘లేదు బావ...అది భగవతాజ్ఞ. భగవంతుని రచన’’ అన్నారు కవిగారు∙∙ ‘‘నీవు భోగినిదండకం రచనలో చూపిన కవితావిలాసం ఇంకను సింగభూపాలుడు మరవలేదు బావ’’ అంటూ పేదకవిగారిని మహారాజుకుచేరువ చేయ ప్రయత్నం చేశారు బావగారు.‘‘అపచారం’’ అన్నారు కవిగారు.అంతేకాదు...దరిద్రానికి తనదైన నిర్వచనం ఇచ్చారు...‘‘అత్యాశపరుడే దరిద్రుడు. తృప్తి కలిగినవాడికి కలిమిలేమి లేవు’’ ఈ మాటలు విని బావగారికి కోపం వచ్చినట్లుంది. ఆయన ఇలా అన్నారు:‘‘సంసారంలో ఉన్నంత వరకు సంసారి వలెనే మాట్లాడవలెనుగానీ సర్వసంగపరిత్యాగిలా మాట్లాడవద్దు. ఆశ్రయం లేని చోట కవిత, వనిత, లత శోభించవని పెద్దలు అన్నారు’’
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement