-
ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్న్యూస్.. వడ్డీ రేట్లు పెరిగాయ్!
భద్రతతో కూడిన స్థిరమైన రాబడికి ఉత్తమమైన పెట్టుబడి మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. అందుకే వీటిపై ఎక్కువ మంది దృష్టి సారిస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఎప్పటికప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్దిష్ట కాల వ్యవధి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 80 బేసిస్ పాయింట్లు పెంచింది. 300 రోజుల టెన్యూర్పై ఎఫ్డీ రేటు సాధారణ ప్రజలకు గతంలో 6.25 శాతం ఉండగా 7.05 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం నుంచి 7.55 శాతానికి, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం నుంచి 7.85 శాతానికి సవరించింది. రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల లోపు 300 రోజుల టెన్యూర్ పీఎన్బీ ఉత్తమ్ (ముందస్తు ఉపసంహరణకు వీలులేని) ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లోనూ వడ్డీ రేట్లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సవరించింది. సాధారణ ప్రజలకు 6.30 శాతం నుంచి 7.10 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం నంచి 7.60 శాతానికి పెంచింది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు కూడా 7.10 శాతం నుంచి 7.90 శాతానికి పెంచింది. కొత్త ఎఫ్డీ రేట్లు జనవరి 8 నుంచి వర్తిస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన వెబ్సైట్లో తెలిపింది. ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని ప్రకటించిన తర్వాత ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అనేక బ్యాంకులు తమ ఎఫ్డీ రేట్లను సవరించాయి. -
రెండు ప్రముఖ బ్యాంకులకు ఆర్బీఐ ఝలక్!
రెండు ప్రముఖ బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఝలక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ప్రభుత్వ ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్తో పాటు మరో రెండు ఫైనాన్స్ సంస్థలకు భారీగా జరిమానాలు విధించింది. వడ్డీ రేట్లు, బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ నిబంధనలు పాటించడంలో విఫలమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.72 లక్షలు, కేవైసీ నిబంధనలు ఉల్లంఘించిన ఫెడరల్ బ్యాంక్కు రూ.30 లక్షల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. ఇక కేవైసీ నిబంధనలను పాటించనందుకు మెర్సిడెస్-బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో డైమ్లర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్)కు రూ. 10 లక్షల పెనాల్టీని ఆర్బీఐ విధించింది. అలాగే ఎన్బీఎఫ్సీ నిబంధనలను ఉల్లంఘించిన కొసమట్టం ఫైనాన్స్ లిమిటెడ్పై రూ. 13.38 లక్షల నగదు పెనాల్టీ విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. -
వాటా విక్రయం! ఎస్బీఐ, ఎల్ఐసీ, పీఎన్బీ, బీవోబీ రెడీ..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు స్టేట్బ్యాంక్(ఎస్బీఐ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ).. యూటీఐ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్)లో వాటాలను విక్రయించే యోచనలో ఉన్నాయి. పురాతన ఎంఎఫ్ యూటీఐ స్పాన్సర్స్ అయిన ఈ సంస్థలు వాటా విక్రయం కోసం మర్చంట్ బ్యాంకర్లను సంప్రదిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. యూటీఐ ఎంఎఫ్ను ఎస్బీఐ, పీఎన్బీ, ఎల్ఐసీ, బీవోబీ ఉమ్మడిగా ప్రమోట్ చేశాయి. ఈక్విటీలో మొత్తం 45.21 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అనుబంధ సంస్థ ద్వారా మరో ప్రమోటర్ టీ రోవ్ ప్రైస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్(యూకే) సైతం 23 శాతం వాటాను పొందింది. 2020లో పబ్లిక్ ఇష్యూ ద్వారా ఈ సంస్థలన్నీ యూటీఐ ఎంఎఫ్లో దాదాపు 3.9 కోట్ల షేర్లను విక్రయించాయి. వెరసి ఐపీవో నిధులను ప్రమోటర్ సంస్థలే అందుకున్నాయి. 2019 డిసెంబర్లో సెబీ ఆదేశాలమేరకు వాటాను తగ్గించుకునే బాటలో ఐపీవోను చేపట్టాయి. కాగా.. ప్రభుత్వ సంస్థలు(పీఎస్ఈలు) అనుబంధ సంస్థలలో వాటాలను విక్రయించాలనుకుంటే ప్రతిపాదనలను ఆయా శాఖలకు పంపించవచ్చని గతేడాది దీపమ్ స్పష్టం చేసింది. తద్వారా ఇందుకు అనుమతించింది. ఈ బాటలో తాజాగా సంబంధిత మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. వీటి ప్రకారం వాటాల విక్రయ ప్రతిపాదనలు అందాక ఆయా మంత్రిత్వ పాలనా శాఖలు తొలుత పరిశీలించి దీపమ్కు బదిలీ చేస్తాయి. ఆపై దీపమ్ వీటికి ముందస్తు అనుమతిని మంజూరు చేస్తుంది. 1964లో.. పార్లమెంటు యూటీఐ ఎంఎఫ్ 1964లో ఏర్పాటైంది. యూఎస్ 64 పథకం మూతపడ్డాక 2002లో పార్లమెంట్ యూటీఐ చట్టాన్ని ఆమోదించింది. దీంతో యూటీఐను సూటీ(ఎస్యూయూటీఐ), యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ పేరుతో రెండు సంస్థలుగా విభజించారు. యాక్సిస్ బ్యాంక్కు సూటీలో 11.8 శాతం వాటా ఉంది. ఇక యూటీఐ ఎంఎఫ్లో నాలుగు ప్రభుత్వ సంస్థల నుంచి టీ రోవ్ ప్రైస్ 2009లో 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందుకు 14 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఒక్కో సంస్థ విడిగా 6.5 శాతం వాటా చొప్పున విక్రయించాయి. -
ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్!
సాక్షి,ముంబై: బ్యాంకింగ్ దిగ్గజాలు కస్టమర్లకు భారీ షాకిచ్చాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ,పబ్లిక్ లెండర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రెండూ తమ మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లకు (ఎంసీఎల్ఆర్) రేట్లు పెంచాయి. సవరించిన రేట్లు జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చాయి. ఐసీఐసీఐ అనూహ్యం కొన్నింటికి వడ్డీరేటును తగ్గించి, మరికొన్నింటిపై వడ్డీరేటును పెంచడం గమనార్హం. ఒక నెల ఎంసీఎల్ఆర్ను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ వడ్డీరేటు 8.50 శాతం 8.35శాతానికి దిగి వచ్చింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 8.55 శాతం నుంచి 8.40 శాతానికి తగ్గించింది. అయితే ఆరు నెలలు, ఏడాది కాలవ్యవధి రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 8.75 శాతంనుంచి 8.85 శాతానికి పెంచడం విశేషం. (సూపర్ ఆఫర్: ఐపోన్ 13పై రూ. ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇదే బాటలో నడిచింది. అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం ఓవర్నైట్ బెంచ్మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ 8శాతంనుంచి 8.10శాతానికి పెంచింది. ఒకటి, మూడు, ఆరు నెలల రేట్లును కూడా పెంచి వరుసగా 8.20, 8.30, 8.50 శాతంగా ఉంచింది. అలాగే ఏడాది రుణాలపై వడ్డీరేటు 8.60శాతంగానూ, మూడేళ్ల రుణాలపై వడ్డీరేటు 8.80శాతంనుంచి 8.90 శాతానికి పెంచింది. ఇదీ చదవండి: అంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? మరిన్ని ఇంట్రస్టింగ్ అప్డేట్స్, బిజినెస్ వార్తలకోసం చదవండి సాక్షిబిజినెస్ -
ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? కొత్త రూల్స్ చూసారా..!
కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైపోయింది. ఈ తరుణంలో ఎన్నెన్నో కొత్త రూల్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డులలో చాలా మార్పులు తీసుకువచ్చాయి. ఇందులో ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉన్నాయి. ఈ బ్యాంకులు చేసిన మార్పులను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్యూర్-ప్లే క్రెడిట్ కార్డ్ జారీచేసే ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్బీఐ కార్డ్) తమ AURUM కార్డ్లలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. దీని ప్రకారం ఆరమ్ కార్డు కలిగిన వారు RBL Luxeకి బదులుగా టాటా క్లిక్ లగ్జరీ నుంచి రూ. 5000 వోచర్ పొందుతున్నారు. గతంలో రూ.5 లక్షలు క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన వారికి ఆర్బీఎల్ లగ్జరీ నుంచి ఈ వోచర్ వచ్చేది. ఈజీ డైనర్ ప్రైమ్, లెన్స్ కార్ట్ గోల్డ్ మెంబర్ షిప్ ప్రయోజనాలను తొలగించింది. అయితే ఈ కార్డు మీద ప్రైమ్ అండ్ లెన్స్కార్ట్ గోల్డ్ మెంబర్షిప్ బెనిఫిట్ ఇకపై అందుబాటులో ఉండే అవకాశం ఉండదు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) 2023 మే 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) కూడా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం ఏటీఎమ్ నుంచి అమౌంట్ డ్రా చేసుకోవడం వంటి లావాదేవీలపైన రూ. 10 + జీఎస్టీ విధిస్తోంది. అంతే కాకుండా డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు వంటి వాటికి కూడా కొంత రుసుము అమలు చేసే ప్రక్రియలో బ్యాంకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కోటక్ మహీంద్రా బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకు విషయానికి వస్తే, ఇది 2023 మే 23 నుంచి డెబిట్ కార్డు చార్జీలను రూ. 259తో పాటు GST పెంచనున్నట్లు తమ కస్టమర్లకు ఒక మెయిల్ ద్వారా తెలిపింది. గతంలో ఈ చార్జీలు రూ. 199 ప్లస్ జీఎస్టీతో ఉండేది. కావున ఈ బ్యాంకు కూడా త్వరలోనే కొత్త రూల్స్ ద్వారా కస్టమర్ల మీద పెను భారాన్ని మోపే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే..
ఏప్రిల్ నెల దాదాపు ముగుస్తోంది. మే నెల ప్రారంభం కాబోతోంది. జీఎస్టీ, మ్యూచువల్ ఫండ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ చార్జీలు, గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించిన కీలక మార్పులు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఇదీ చదవండి: Bank Holidays in May 2023: మే నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్! సెలవులు ఏయే రోజుల్లో అంటే.. ఈ మార్పులు మీ ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్న కీలక మార్పులు, కొత్త నిబంధనలు ఏంటో ఒకసారి చూద్దాం.. జీఎస్టీ కొత్త రూల్ జీఎస్టీ ఇన్వాయిస్ల అప్లోడ్కు సంబంధించి మే 1 నుంచి కొత్త రూల్ అమలవుతుంది. ఈ రూల్ ప్రకారం.. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలు తమ లావాదేవీల రసీదులను ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ (IRP)లో ఏడు రోజుల వ్యవధిలో అప్లోడ్ చేయాలి. ప్రస్తుతం ఇన్వాయిస్ అప్లోడ్కు ఎలాంటి కాల పరిమితి లేదు. మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ చేసిన ఈ-వాలెట్ల నుంచి మాత్రమే నగదును అంగీకరించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలను ఆదేశించింది. అంటే మీ ఈ-వాలెట్ కేవైసీ కాకపోతే మీరు దాని ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టలేరు. ఈ నిబంధన కూడా మే 1 నుంచి అమల్లోకి రానుంది. గ్యాస్ సిలిండర్ ధర కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ఎల్పీజీ, సీఎన్జీ, పీఎన్జీ రేట్లను సవరిస్తుంది. గత నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలను రూ.91.50 మేర తగ్గించింది. ప్రస్తుతం ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2028 ఉంది. ప్రభుత్వం మే 1న ధరలను మార్చవచ్చు. పీఎన్బీ ఏటీఎం చార్జీలు ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం లావాదేవీలకు సంబంధించి కొత్త చార్జీలు కూడా మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఖాతాల్లో బ్యాలెన్స్ లేని కారణంగా ఏటీఎంలలో లావాదేవీలు విఫలమైతే రూ.10తో పాటు అదనంగా జీఎస్టీని కూడా బ్యాంక్ విధిస్తుంది. ఇదీ చదవండి: New GST Rule: జీఎస్టీ కొత్త రూల్.. మే 1 నుంచి అలా కుదరదు! -
ఇంటర్పోల్ నిర్ణయం: చోక్సీకి విముక్తి లభించినట్టేనా?
సాక్షి,ముంబై: పీఎన్బీలో రూ. 13,000 కోట్ల మోసానికి పాల్పడి భారతదేశంనుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించడం సంచలనం సృష్టించింది. ఇంటర్పోల్ రెడ్ నోటీసు నుంచి మెహుల్ చోక్సీని ఎందుకు తొలగించారనేది చర్చనీయాంశంగా మారింది. చోక్సీ లాయర్ ఏమన్నారంటే? తన క్లయింట్ (మెహుల్ చోక్సీ) వ్యతిరేకంగా జారీ అయిన ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు విత్ డ్రా చేసిందని, ఇది సంతోషించ దగ్గ పరిణామమని చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ ప్రకటించారు. లీగల్ టీమ్ ఇంటర్పోల్తో విచారణ జరుపుతోంది. తాజా నిర్ణయంతో ఇపుడు అతను భారతదేశం మినహా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగొచ్చని, ఇది ఇండియాలో అతనిపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ వ్యాజ్యాన్ని ప్రభావితం చేయదని కూడా ప్రకటించారు. (పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం) The legal team is taking up the matter with Interpol. Interpool has removed RCN on my client (Mehul Choksi) and now he is free to travel anywhere except India. This is not going to affect his criminal litigation pending in India. This RCN was an effort that he can be caught and… https://t.co/hN9zGXOnYP pic.twitter.com/BY5m4oRQV5 — ANI (@ANI) March 21, 2023 ఇంటర్పోల్ నిర్ణయం ప్రభావితం చేయదు మరోవైపు మెహుల్ చోక్సీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సిఎన్) రద్దు కేసును ప్రభావితం చేయదని కేంద్రం ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.ఈ కేసు ఇప్పటికే అధునాతన దశలో ఉందని చోక్సీ అరెస్టు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదించింది. అసలు ఏం జరిగింది? సంచలన పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితుడిగా విదేశాలకు చెక్కేసిన మెహుల్చోక్సీని ఇంటర్పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుంచి ఉపసంహరించుకుందనేది ఇపుడు హాట్ టాపిక్. తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని వాదించి చోక్సీ, సీబీఐ చార్జ్షీటు, రెడ్ కార్నర్ నోటీసులపై సీబీఐ అభ్యర్థనను సవాల్ చేస్తూ లియోన్ హెడ్క్వార్టర్స్ ఏజెన్సీకి అప్పీల్ చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఇంటర్పోల్ ఐదుగురు సభ్యుల కమిటీ ఈ కేసును పరిశీలించింది. ముఖ్యంగా డొమినికాలో చోక్సీని కిడ్నాప్ చేసినట్లు వార్తలు వెలువడిన తర్వాత భారతదేశంలో న్యాయమైన విచారణ జరగక పోవచ్చని కమిటీ తెలిపింది. ఈ కేసు రాజకీయ కుట్ర ఫలితమని పేర్కొంది. హిందూస్తాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, ఇంటర్పోల్ ఇలా ప్రకటించింది. చోక్సీని ఆంటిగ్వా నుండి డొమినికాకు కిడ్నాప్ చేయడంలో అంతిమ ఉద్దేశ్యం ఇండియాకు రప్పించడమేనని వ్యాఖ్యానించింది. అలాగే చోక్సిని ఇండియాకు తరలిస్తే.. ఈ కేసులో న్యాయమైన విచారణ లేదా అనారోగ్యంతో ఉన్న చోక్సి సరియైన చికిత్స పొందే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొంది. -
పీఎన్బీ స్కాం: చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు ఎత్తివేత కలకలం
సాక్షి,ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ. 13వేల కోట్ల రుణం మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పరారీలో ఉన్న మెహుల్ చోక్సీకి సంబంధించికీలక పరిణామంకలకలం రేపింది. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు లిస్ట్నుంచి చోక్సీ పేరును తొలగించింది. దీంతో అతనిని స్వదేశానికి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న భారత దర్యాప్తు సంస్థలకు, ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బేనని విమర్శలు వెల్లువెత్తాయి. 2018 డిసెంబర్లో జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్పోల్ ఇపుడు ఉపసంహరించుకోవడం గమనార్హం. అంటే మెహుల్ చోక్సీ విదేశీ గడ్డపై దొరికితే అరెస్ట్ చేసే అధికారాన్ని భారత ప్రభుత్వం కోల్పోయినట్టే. అయితే తాజా పరిణామంపై సీబీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. పీఎన్బీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహుల్ చోక్సీ దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్నమెహుల్ చోక్సీ పేరు ఇంటర్పోల్ డేటాబేస్ ఆఫ్ రెడ్ నోటీసుల నుండి తొలగించారు. లియోన్-హెడ్క్వార్టర్డ్ ఏజెన్సీకి చోక్సి అప్పీల్ మేరకే చోక్సీ పేరును రెడ్ లిస్ట్లో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఇంటర్పోల్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ పరిణామంపై కాంగ్రెస్ కేంద్రంపై విమర్శలు గుప్పించింది. అయిదేళ్లనుంచి పరారీలో ఉన్న చోక్సీని ఇండియాకు ఎపుడు రప్పిస్తారంటూ కాంగ్రెస్ ట్విటర్ ద్వారా మోదీ సర్కార్ను ప్రశ్నించింది. PM मोदी का चहेता मेहुल 'भाई' चोकसी अब वांटेड नहीं रहा। भगोड़े मेहुल चोकसी के खिलाफ इंटरपोल ने रेड कॉर्नर नोटिस हटा लिया है। PM मोदी जवाब दें कि आपके 'मेहुल भाई' को देश वापस कब लाया जाएगा। 5 साल से फरार है, अब और कितना वक्त चाहिए? — Congress (@INCIndia) March 20, 2023 రెడ్ నోటీసు (లేదా రెడ్ కార్నర్ నోటీసు) 2018లో డిసెంబరు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. నాలుగేళ్ల తరువాత మెహుల్ చోక్సీని రెడ్ కార్నర్ నోటీసును ఇంటర్పోల్ తొలగించింది. తాజా నివేదికల ప్రకారం ఆ నోటీసు ఇప్పుడు ఇంటర్పోల్ వెబ్సైట్లో అందుబాటులో లేదు. మంగళవారం ఉదయం 8 గంటల నాటికి, మొత్తం రెడ్ నోటీసుల సంఖ్య 7023కి చేరింది. ఇంటర్పోల్లో 195 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇంటర్పోల్ రెడ్ నోటీసు అనేది అప్పగించడం, లొంగిపోవడం లేదా ఇలాంటి చట్టపరమైన చర్యలు పెండింగ్లో ఉన్న వ్యక్తిని గుర్తించి, తాత్కాలికంగా అరెస్టు చేయమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టాన్ని అమలు చేసేవారికి చేసే అభ్యర్థన. రెడ్ నోటీసు అరెస్ట్ వారెంట్తో సమానం కాదు. అయితే సంబంధిత వ్యక్తిని అరెస్టు చేయాలా వద్దా అనేదానిపై సభ్యదేశాలు తమ స్వంత చట్టాలను వర్తింపజేయాలి. అనేక సందర్భాల్లో నిందితుడిని కోరుకున్న దేశానికి అప్పగిస్తారు. కాగా పీఎన్బీ స్కాం ప్రధాన నిందితుడు డైమండ్ వ్యాపారి నీరవ్మోదీకి దగ్గరి బంధువు మెహుల్ చోక్సీ. దేశంలో అతిపెద్ద స్కాం వెలుగులోకి రావడంతో ఆంటిగ్వా , బార్బుడా పారిపోయి, అక్కడి పౌరసత్వం పొందాడు. ఈడీ, సీబీఐ దర్యాప్తు, ఫుజిటివ్ నేరస్తుడుగా కేంద్రం ప్రకటించింది. సీబీఐ అభ్యర్థన మేరకు పది నెలల తర్వాత ఇంటర్పోల్ అతడి రెడ్ నోటీసు జారీ చేసింది. అయితే సీబీఐ ఛార్జిషీట్పై చోక్సీ అభ్యంతరాలు లేవనెత్తడంతోపాటు,పలు సందర్భాల్లో భారతీయ జైళ్లు, ఆరోగ్య సమస్యలను కూడా ప్రస్తావించడం గమనార్హం. ఈ కీలక పరిణామాల మధ్య మే 2021లో చోక్సీ ఆంటిగ్వా నుండి అదృశ్యమైనాడు. ఆ తరువాత దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడన్న ఆరోపణలపై డొమినికాలో అరెస్ట్ కావడంతో 51 రోజులు డొమినికా జైలులో గడిపాడు. అనంతరం అక్రమంగా ప్రవేశించిన చోక్సీపై ఉన్న అన్ని అభియోగాలను కూడా డొమినికా కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్! ఈ బ్యాంకులో కొత్త రూల్..
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెక్కు చెల్లింపుల విషయంలో కొత్త రూల్ తీసుకొస్తోంది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్)ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రూల్ మోసపూరిత చెక్కుల చెల్లింపు నుంచి కస్టమర్లను కాపాడుతుంది. ఇంతకుముందు రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకు పీపీఎస్లో చెక్కు వివరాలను సమర్పించాల్సి ఉండేది. రూ. 5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తానికి చెక్కులను జారీ చేసేటప్పుడు బ్యాంక్ అకౌంట్ నంబర్, చెక్కు నంబర్, చెక్కు ఆల్ఫా కోడ్, జారీ చేసిన తేదీ, చెక్కు మొత్తం, లబ్ధిదారు పేరుతో సహా అవసరమైన వివరాలను కస్టమర్లు పీపీఎస్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మోసాలు జరిగే అవకాశం తగ్గుతుందని బ్యాంకు పేర్కొంటోంది. చదవండి: అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి కస్టమర్లు ఈ పీపీఎస్ సౌకర్యాన్ని బ్యాంకు బ్రాంచ్, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్ బ్యాంకింగ్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. చెక్కు ప్రెజెంటేషన్ లేదా క్లియరింగ్ తేదీకి ఒక రోజు ముందుగా చెక్కు వివరాలను పీపీఎస్లో సమర్పించాల్సి ఉంటుంది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ క్లియరింగ్లో సమర్పించే రూ. 50 వేలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు పీపీఎస్ను ప్రవేశపెట్టింది. రూ. 5 లక్షల లోపు చెక్కులకు ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారు ఇష్టం. అయితే రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం మాత్రం దీన్ని తప్పనిసరి చేయవచ్చని ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. -
బ్యాంకులకు దండిగా వడ్డీ ఆదాయం
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో బ్యాంకుల వడ్డీ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. 25.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైంది. ఇచ్చిన రుణాలపై అధిక మార్జిన్, అధికంగా రుణాల వితరణ దీనికి కలిసొచ్చింది. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 0.17 శాతం పెరిగి 3.28 శాతానికి చేరింది. ప్రస్తుత రుణాలపై రేట్లను పెంచడంతోపాటు, కొత్తగా ఇచ్చే రుణాలపైనా రేట్లు పెంచడం, డిపాజిట్ రేట్లను పెద్దగా మార్చకుండా అదే స్థాయిలో కొనసాగించడం వడ్డీ ఆదాయం వృద్ధికి సానుకూలించినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. బ్యాంకుల ఆదాయంపై ఈ సంస్థ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది. నిమ్ వృద్ధిలో ప్రైవేటు బ్యాంకుల పాత్ర ఎక్కువగా ఉంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాల వల్ల ప్రైవేటు బ్యాంకుల నిమ్ 0.15 శాతం పెరిగి 4.03 శాతానికి చేరుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల నిమ్ 0.17 శాతం వృద్ధితో 2.85 శాతంగా ఉంది. బ్యాంకులు సమీకరించిన డిపాజిట్లు/నిధులపై చెల్లించే రేటుకు, ఈ నిధులను రుణాలుగా ఇచ్చి వసూలు చేసే వడ్డీ రేటుకు మధ్య వ్యత్యాసమే నికర వడ్డీ మార్జిన్. పెద్ద బ్యాంకులు డిపాజిట్లపై అధిక రాబడులను ఆఫర్ చేయడం ఆరంభించాయని, రుణాలకు రెండంకెల స్థాయిలో డిమాండ్ ఉండగా, అదే స్థాయిలో డిపాజిట్లు రావడం లేదని క్రిసిల్ నివేదిక తెలిపింది. కనుక నిమ్ ఈ స్థాయిలో స్థిరపడొచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి 2.5 శాతం మేర పెరో రేటును పెంచడం తెలిసిందే. రుణాల్లో చక్కని వృద్ధి డిసెంబర్ క్వార్టర్లో బ్యాంకులు రుణాల్లో 18.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రుణ వితరణలో ప్రభుత్వరంగ బ్యాంకులది పైచేయిగా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు 18.9 శాతం అధికంగా రుణాలను మంజూరు చేయగా, ప్రైవేటు రంగ బ్యాంకుల రుణ వితరణలో 17.9 శాతం వృద్ధిని చూపించాయి. నికర వడ్డీ మార్జిన్లో మాత్రం ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకుల పనితీరు మెరుగ్గా ఉంది. వడ్డీ వ్యయాలు ప్రైవేటు రంగ బ్యాంకులకు 27.3 శాతానికి పెరిగితే, ప్రభుత్వరంగ బ్యాంకులకు 22.6 శాతానికి చేరాయి. సగటు రుణ రేటు 1.2 శాతం పెరిగి 8.9 శాతంగా ఉంది. డిపాజిట్ల కోసం బ్యాంకుల మధ్య పోటీ ఉండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో రానున్న రోజుల్లో డిపాజిట్ రేట్లు పెరుగుతాయని అంచనా వేసింది. 12 ప్రభుత్వరంగ, 18 ప్రైవేటు రంగ బ్యాంకుల గణాంకాల ఆధారంగా కేర్ రేటింగ్స్ ఈ వివరాలను రూపొందించింది. -
పీఎన్బీ కస్టమర్లకు అలర్ట్.. ఇది తప్పనిసరి, లేదంటే మీ బ్యాంక్ ఖాతాపై ఆంక్షలు తప్పవ్!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన కస్టమర్లకు కీలక విషయాన్ని వెల్లడించింది. తమ బ్యాంక్లో అకౌంట్ కలిగిన కస్టమర్లు డిసెంబర్ 12 కేవైసీ (KYC) వివరాలను అప్డేట్ చేసుకోవాలని లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచనలు చేసింది. కేవైసీ పెండింగ్లో ఉన్న తమ ఖాతాదారులకు పీఎన్బీ ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. అలాగే రిజిస్టర్డ్ అడ్రస్కు రెండు నోటీసులు పంపించింది. అయితే ఇది అందరికీ వర్తించదు. ఎవరి కేవైసీ అప్డేట్ ఇంకా పెండింగ్లో ఉందో వారికి మాత్రమేనని తెలిపింది. ఈ మేరకు పీఎన్బీ అధికారికి ట్వీటర్లో ట్వీట్ చేసింది. ట్వీట్లో ఏముంది ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. కస్టమర్లు కేవైసీ అప్డేషన్ తప్పనిసరి. 30.09.2022 నాటికి ఏ కస్టమర్ల ఖాతాకు సంబంధించి కేవైసీ పెండింగ్లో ఉందో వారికి మొబైల్ ఎస్ఎంఎస్, నోటీసుల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాం. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న కస్టమర్లు వెంటనే వారి బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి 12.12.2022 లోపు ఈ అప్డేట్ ప్రక్రియని పూర్తి చేయాలి. ఇది పూర్తి చేయని కస్టమర్ల ఖాతాలపై ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. KYCని ఎలా అప్డేట్ చేయాలి పీఎన్బీ కస్టమర్లు గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్, ఇటీవలి ఫోటోలు, పాన్ కార్డ్, ఇన్కం ప్రూఫ్, మొబైల్ నంబర్లు వంటి వివరాలను బ్యాంకుకు మెయిల్ చేయవచ్చు (తమ బ్యాంక్ అకౌంట్లో రిజస్టర్ చేసుకున్న ఈమెయిల్ ద్వారా), లేదా వ్యక్తిగతంగా ఈ సమాచారాన్ని బ్యాంకుకు వెళ్లి అందివ్వాల్సి ఉంటుంది. పీఎన్బీ ఖాతాదారులు కేవైసీ పెండింగ్లో ఉందో లేదా అనే సమాచారం కోసం 1800 180 2222/ 1800 103 2222 (టోల్-ఫ్రీ)/ 0120-2490000 (టోల్ చేసిన నంబర్)లో కస్టమర్ కేర్ సేవతో కనెక్ట్ కావచ్చు. Points to be noted 👇🏻 Remember: KYC updation is mandatory as per RBI guidelines. Beware: Bank does not call & request personal information of customers for KYC updation.#KYC #Banking #SmartBanking #FoolTheFraudster pic.twitter.com/f6WohISarL — Punjab National Bank (@pnbindia) November 20, 2022 చదవండి: మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ.. కేంద్రం ఏం చెప్పిందంటే? -
పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) వృద్ధుల కోసం అధిక వడ్డీ రేటుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన ఎవరైనా కానీ 600 రోజుల కాలానికి డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపై 7.85 శాతం వార్షిక రేటును ఆఫర్ చేస్తోంది. అక్టోబర్ 19 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. ఇక వృద్ధులు కాకుండా ఇతరులకు 600 రోజుల డిపాజిట్పై (ఎప్పుడైనా ఉపసంహరించుకోతగిన) 7 శాతం వడ్డీ రేటు, కాలవ్యవధి వరకు ఉపసంహరణకు వీల్లేని 600 రోజుల డిపాజిట్పై 7.05 శాతం వడ్డీని ఇస్తున్నట్టు పీఎన్బీ తెలిపింది. -
భారీ పెంపు: పీఎన్బీ ఖాతాదారులకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఫిక్స్డ్ డిపాజిట్లపై (ఎఫ్డీలు) వడ్డీ రేట్లను పెంచింది. పీఎన్బీ రూ.2 కోట్ల వరకు ఎఫ్డీలపై రేట్లను సవరించింది. వారం వ్యవధిలో రేట్లను సవరించడం రెండో సారి. ఈ రేట్లు ఈ నెల 26 నుంచి అమల్లోకి వచ్చాయి. గరిష్టంగా 0.75 శాతం వరకు రేట్లను పెంచింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు సైతం ఎఫ్డీలపై రేట్లను పెంచడం ఒక నెలలో ఇది రెండో పర్యాయం. వివిధ కాల పరిమితులపై రూ.2 కోట్ల వరకు చేసే ఎఫ్డీలపై 0.50 శాతం వరకు పెంచింది. రికరింగ్ డిపాజిట్ల రేట్లను కూడా పెంచింది. సవరించిన రేట్లు అక్టోబర్ 26 నుంచే అమల్లోకి వచ్చాయి. -
ఆ ఖాతాదారులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శుభవార్త!
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) డిపాజిట్ మెచ్యూరిటీలపై సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లను సురక్షితమైన, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలుగా చూసే వారికి ఇది అద్భుతమైన వార్త. ముఖ్యంగా సీనియర్,సూపర్ సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు మేర అదనంగా ఇవ్వనుంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 13, 2022 నుండి అమలులోకి వచ్చాయని బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీ సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ. 2 కోట్ల లోపు దేశీయ డిపాజిట్లపై ఈ పెంపు వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్ల కోసం FDలపై వడ్డీ రేట్లు నిర్దిష్ట కాలవ్యవధిని సెట్ చేసినప్పటికీ, సూపర్ సీనియర్ సిటిజన్లకు మాత్రం అన్నిరకాల డిపాజిట్లపై ఒకే రేటు అందిస్తుంది. బ్యాంకు అధికారిక వెబ్సైట్ ప్రకారం రూ. 2 కోట్ల వరకు రేటు 30 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) గా ఉంది. 60-80 ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాల పరిధి డిపాజాట్లపై 50 బీపీఎస్ అదనపు వడ్డీని పొందుతారు. 5 కంటే ఎక్కువ కాలానికి 80బీపీఎస్ పాయింట్ల ఎక్కువ పొందుతారు.మొత్తంగా సీనియర్ సిటిజన్లకు 6.60 శాతం, సూపర్ సీనియర్లకు 6.90 శాతం వడ్డీ రేటు పొందుతారు. రిటైర్డ్ సిబ్బంది, రిటైర్డ్ సూపర్ సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 180 బీపీఎస్ పాయింట్లు వడ్డీ రేటు వర్తిస్తుంది. అలాగే పీఎన్బీ ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కింద ఉద్యోగులతో పాటు సీనియర్ సిటిజన్లు అయిన రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించే అత్యధిక వడ్డీ రేటు 100 బీపీఎస్ పాయింట్లుగా ఉంటుందని బ్యాంక్ తెలిపింది. -
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ అయ్యారు. పీఎన్బీ నుంచి రూ.52 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారనే అభియోగాల నేపథ్యంలోనే ఆమెను సీబీఐ అధికారులు హైదరాబాద్లోని నివాసం నుంచి మంగళవారమే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపై హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించారు అధికారులు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో సీబీఐ ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకోవడం విశేషం. బెంగళూరు అధికారులు కేవలం విచారణ కోసం తీసుకెళ్లారా? లేదంటే ఇతర కారణాలు ఉన్నాయా? అనే దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఇదీ చదవండి: ఏపీలో ఆరు పార్టీల తొలగింపు! -
బంపర్ ఆఫర్: మొబైల్ ఫోన్ అలవెన్స్ ఏడాదికి రూ.2 లక్షలు
ముంబై: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఉన్నతస్థాయిలోని (మేనేజ్మెంట్) ఉద్యోగులు ఒక్కొక్కరికి మొబైల్ ఫోన్లు కొనుగోలుకు వీలుగా ఏడాదికి రూ.2 లక్షలను అలవెన్స్గా ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగుల సంక్షేమ ప్రయోజనాలను ఈ మేరకు సవరించింది. దీని ప్రకారం ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ మొబైల్ ఫోన్ అలవెన్స్కు అర్హులు. సవరించిన నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు బ్యాంక్ ప్రకటించింది. పీఎన్బీలో ఎండీ, సీఈవోకి సహాయం అందించేందుకు ప్రస్తుతం నలుగు రు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. ఇక చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) స్థాయి అధికారికి గతంలో మాదిరే మొబైల్ ఫోన్ అలవెన్స్ కొనసాగనుంది. సీజీఎం రూ.50,000, జీఎం రూ.40,000ను ఫోన్ అలవెన్స్ పొందొచ్చు. -
ఎయిర్ఫోర్స్తో ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ ఒప్పందాలు
ముంబై: ప్రభుత్వరంగ ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్ఫోర్స్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్ఫోర్స్తో ‘డిఫెన్స్ వేతన ప్యాకేజీ’ ఒప్పందం చేసుకున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం కింద ఎయిర్ఫోర్స్ ఉద్యోగులు, పదవీ విరమణ తీసుకున్న వారికి ఎస్బీఐ పలు ప్రయోజనాలు, ఫీచర్లతో ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. వ్యక్తిగత ప్రమాద బీమా, వాయు ప్రమాదం, విధుల్లో మరణిస్తే అదనపు పరిహారంతో బీమా రక్షణను అందించనున్నట్టు తెలిపింది. శాశ్వత/పాక్షిక అంగవైకల్య కవరేజీ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ‘‘మన జాతి, పౌరుల రక్షణ కోసం వైమానిక దళ ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్నాం. డిఫెన్స్ శాలరీ స్కీమ్ కింద వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారాలు అందించడాన్ని కొనసాగిస్తాం’’అని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా ప్రకటించారు. ఈ ప్రయోజనాలు డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ పరిధిలో ఉన్న ఖాతాదారులకు ఆటోమేటిగ్గా లభిస్తాయని ఎస్బీఐ తెలిపింది. -
వినియోగదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకు షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును 15 బేసిస్ పాయింట్లు లేదా 0.15 శాతం పెంచింది. అన్ని రకాల టెన్యూర్స్పై ఈపెంపు వర్తిస్తుందని బుధవారం ప్రకటించింది. దీంతో రుణాల ఈఎంఐలపై భారం పడనుంది. సవరించిన కొత్త రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్బీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఏడాదికాల రుణాలపై ఎంసీఎల్ ఆర్ 7.25 - 7.40 శాతానికి పెరిగింది. అలాగే ఓవర్నైట్, ఒక నెల, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 6.7, 6.80, 6.90 శాతానికి చేరుకోగా, ఆరు నెలల వడ్డీరేటు 7.10 శాతానికి పెరిగింది. గత నెల మేలో ఆర్బీఐ రేటును పెంచిన తర్వాత ఈ మార్పు చోటు చేసుకొంది. -
పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకుల్లో కీలక పరిణామం.. !
న్యూఢిల్లీ: పీఎస్యూ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ), ప్రయివేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంకులలో ప్రభుత్వం ఇద్దరు డైరెక్టర్లను నామినేట్ చేయనుంది. పంకజ్ శర్మను 2022 ఏప్రిల్ 11 నుంచి డైరెక్టర్గా ప్రభుత్వం నియమించినట్లు పీఎన్బీ పేర్కొంది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేటంతవరకూ బాధ్యతల్లో కొనసాగుతారని తెలియజేసింది. పంకజ్ జైన్ స్థానే శర్మ పదవిని చేపట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం పంకజ్ శర్మ ఆర్థిక శాఖకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం ఈ నెల 11న విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మనోజ్ సహాయ్, సుశీల్ కుమార్ సింగ్లను డైరెక్టర్లుగా నియమించినట్లు ఐడీబీఐ బ్యాంక్ వెల్లడించింది. మీరా శ్వాంప్, అన్షుమన్ శర్మ స్థానే వీరి నియామకం వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేవరకు వీరు బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొంది. ప్రత్యేక నియామకం ప్రస్తుతం ప్రయివేట్ రంగ సంస్థగా ఉన్న ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటా ఉంది. దీంతో కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 161(3) ప్రకారం ప్రభుత్వ నామినీ డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించినట్లు బ్యాంక్ వివరించింది. కాగా.. ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా ఎంజీ జయశ్రీని డైరెక్టర్గా నామినేట్ చేసినట్లు పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ పేర్కొంది. ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా జయశ్రీ విధులు నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. ప్రభుత్వ నామినీ డైరెక్టర్ల నియామక వార్తల నేపథ్యంలో పీఎన్బీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 36.75 వద్ద, ఐడీబీఐ బ్యాంక్ 3 శాతం నష్టంతో రూ. 46 వద్ద ముగిశాయి. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 1.5 శాతం నీరసించి రూ. 17 వద్ద స్థిరపడింది. -
ఖాతాదారులకు గట్టిషాకిచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్..!
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులకు గట్టి షాక్ను ఇచ్చింది. ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 4, 2022 నుంచి అమలులోకి రానుంది. ఖాతాదారులకు నిరాశపరుస్తూ వడ్డీరేట్లను పీఎన్బీ తగ్గించింది. 10 లక్షల లోపు బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను ఏడాదికి గాను 2.70 శాతానికి తగ్గించినట్లు పీఎన్బీ ప్రకటించింది. అంతేకాకుండా రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల మధ్య బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును ఏడాదికి 2.75 శాతానికి తగ్గిస్తూ పీఎన్బీ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు డొమెస్టిక్, ఎన్ఆర్ఐ ఖాతాదారులకు వర్తించనుంది. పీఎన్బీ తీసుకున్న నిర్ణయంతో లక్షల మంది డిపాజిటర్లను ప్రభావితం చేయనుంది. వీరిలో చాలా మందికి రూ.10 లక్షల కంటే తక్కువ ఖాతా నిల్వలు ఉన్నాయి. రెండు నెలల సమయంలో రెండోసారి డిపాజిట్దారుల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును పీఎన్బీ మరింత తగ్గించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొదుపు ఖాతాపై రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల వారీ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరిగే నేపథ్యంలో పీఎన్బీ వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో భాగంగా స్వల్పకాలిక డిపాజిట్లపై 0.5 శాతం నుంచి 0.75 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది. మధ్యస్థ, దీర్ఘకాలిక డిపాజిట్లపై సంవత్సరానికి 2.25 శాతం, 2.5 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. చదవండి: స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నది తెలుగువారే.. -
కస్టమర్ల ధ్రువీకరణ తర్వాతే చెక్కులకు ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) రూ.10 లక్షలు అంతకుమించిన చెక్కుల ఆమోదానికి కస్టమర్ల ధ్రువీకరణను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పేసిస్టమ్ (పీపీఎస్)ను అమలు చేయనుంది. రూ.10 లక్షలకు మించిన చెక్కు క్లియరెన్స్ కోసం వచ్చినప్పుడు కస్టమర్ ధ్రువీకరణను తీసుకోనుంది. తద్వారా చెక్కుల రూపంలో భారీ మోసాలకు చెక్ పెట్టొచ్చన్నది పీఎన్బీ అభిప్రాయంగా ఉంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ విధానంలో రూ.50,000, అంతకుమించిన చెక్కులకు పీపీఎస్ను పీఎన్బీ అమలు చేస్తోంది. ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారుల ఇష్టానికి వదిలేయాలని, రూ.5లక్షలకు మించిన చెక్కులకు బ్యాంకులు తప్పనిసరి చేయవచ్చని గతంలో ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
పీఎన్బీ ఖాతాదారులకు అలర్ట్.. మరో కొత్త రూల్..!
చెక్కు మోసాల నుంచి బ్యాంకు ఖాతాదారులను రక్షించడం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకు ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పే సిస్టమ్(పీపీఎస్)ను తప్పనిసరి చేస్తామని నేడు తెలిపింది. ₹10 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన చెక్కుల కోసం వచ్చే నెల నుంచి పీపీఎస్ తప్పనిసరి చేయనున్నట్లు రుణదాత తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. 1 జనవరి 2021 నుంచి సీటీఎస్ క్లియరింగ్ సమయంలో ₹50,000, అంతకంటే విలువ కలిగిన చెక్కుల కోసం పీపీఎస్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన పాజిటివ్ పే సిస్టమ్(పీపీఎస్) కింద పెద్ద మొత్తం గల చెక్కును క్రాస్ చెక్ చేసే సమయంలో కొన్ని వివరాలను తప్పక తిరిగి ధృవీకరించాల్సి ఉంటుంది. పీఎన్బీ కస్టమర్లు అకౌంట్ నెంబరు, చెక్ నెంబరు, చెక్ ఆల్ఫా కోడ్, జారీ తేదీ, మొత్తం, లబ్ధిదారుపేరు వంటి వివరాలను తెలపాల్సి ఉంటుంది. చెక్ క్లియరింగ్ కోసం కనీసం 24 పనిగంటల ముందు చెక్ వివరాలను బ్యాంకుతో పంచుకోవాలి. కస్టమర్లు తన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎమ్ఎస్ బ్యాంకింగ్ లేదా తమ హోమ్ బ్రాంచీకి వెళ్ళి వివరాలను పంచుకోవచ్చు. ₹5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన చెక్కులను క్లియర్ చేయడం కోసం పాజిటివ్ పే సిస్టమ్ వేసులుబాటును ఆర్బీఐ బ్యాంకులకు కల్పించింది. (చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే శుభవార్త.. సింగిల్ ఛార్జ్ @ 300కిమీ!) -
అప్పులు చేసి పారిపోయిన మెహుల్ చోక్సీ.. హైదరాబాద్ ఆస్తుల అమ్మకం
బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన ఆస్తులను హైదరాబాద్కి చెందిన ఓ సంస్థ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికారిక వ్యవహరాలు ఇటీవలే కొలిక్కి వచ్చాయి. హైదరాబాద్లో పెట్టుబడులు ఒకప్పుడు దేశంలో ప్రముఖ వజ్రాల వ్యాపారిగా మెహుల్ చోక్సీ వెలుగొందారు. రోజుకో దేశంలో తిరుగుతూ కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. ఈ క్రమంలో బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణం పొందారు. వీటితో దేశవ్యాప్తంగా తన వ్యాపారాలను విస్తరించారు. ఈ క్రమంలో హైదరాబాద్కి చెందిన ఏపీ జెమ్స్, జ్యూయల్లరీ వ్యాపారాన్ని మెహుల్ చోక్సీ సొంతం చేసుకున్నారు. విదేశాలకు పరారీ బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లించలేదు. ఈ విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఒత్తిడి చేయడంతో అప్పు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు మెహుల్ చోక్సీ. ఈ క్రమంలో ఆయన దివాళా తీసినట్టుగా ప్రకటించారు. దీంతో ఇండియాలో ఆయన ఆస్తులను బ్యాంకుల అప్పులు తీర్చే ప్రక్రియ కొనసాగుతుంది. అమ్మకానికి ఆమోదం ఏపీ జెమ్స్ అండ్ జ్యూయల్లరీ కంపెనీ 2001లో హైదరాబాద్లో ఏర్పాటైంది. ఆ తర్వాత క్రమంలో కంపెనీని మెహుల్ చోక్సీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో కార్పోరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (సీఐఆర్పీ) 2019లో మొదలైంది. ఈ క్రమంలో ఏపీ జెమ్స్ని అమ్మకానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. విలువ ఎంతంటే హైదరాబాద్కి చెందిన రియాల్టీ డెవలపర్స్ సంస్థ రూ. 107 కోట్ల రూపాయలకు ఏపీ జెమ్స్ అండ్ జ్యూయల్లర్స్ని కొనేందుకు ముందుకు వచ్చింది. అమ్మకం ద్వారా సమకూరిన మొత్తాన్ని అప్పుల కింద బ్యాంకులకు జమ చేస్తారు. కాగా ఏపీ జెమ్స్ అండ్ జ్యూయలర్స్ సంస్థకి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో రెండెకరాల స్థలంతో పాటు ఐదు అతంస్థుల భవనం ఉంది. 2018 నుంచి ఈ ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. చదవండి: విజయ్ మాల్యా కోర్టు ధిక్కరణ కేసు.. ఆ రోజే తుది తీర్పు -
ఆర్థిక సంక్షోభంలో బ్యాంకు.. రంగంలోకి దిగిన ఆర్బీఐ
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ను యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (యూఎస్ఎఫ్బీ) టేకోవర్ చేసేందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ముసాయిదా స్కీమును రూపొందించింది. దీని ప్రకారం పీఎంసీ బ్యాంక్కు చెందిన డిపాజిట్లతో పాటు ఆస్తులు, అప్పులను యూఎస్ఎఫ్బీ తీసుకోనుంది. ఒకవేళ కొత్త బ్యాంకులో కొనసాగరాదని భావిస్తే రిటైల్ డిపాజిటర్లు దశలవారీగా నగదును వెనక్కి తీసుకోవచ్చు. ఇక పీఎంసీ బ్యాంక్ ఉద్యోగులు అవే వేతనాలు, అవే సర్వీసు నిబంధనల కింద నిర్దిష్ట తేదీ నుంచి మూడేళ్ల పాటు సర్వీసులో కొనసాగుతారు. ఈ స్కీముతో డిపాజిటర్ల సొమ్ముకు మరింత భద్రత చేకూరగలదని ఆర్బీఐ తెలిపింది. దీనిపై డిసెంబర్ 10 దాకా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను ఆర్బీఐకు పంపవచ్చు. ఆ తర్వాత ఆర్బీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో 2019 సెప్టెంబర్లో పీఎంసీ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ రద్దు చేసి, విత్డ్రాయల్స్పై పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, రెజిలియెంట్ ఇన్నొవేషన్ కలిసి ఏర్పాటు చేసిన యూఎస్ఎఫ్బీ ఈ ఏడాది అక్టోబర్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ పొందింది. నవంబర్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. చదవండి:మీ పేర్లలో ‘బ్యాంక్’ను తగిలించొద్దు -
వామ్మో! ఎస్బీఐ ఛార్జీల రూపంలో ఇంత వసూలు చేసిందా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ)తో సహా పలు బ్యాంకులు జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్(బిఎస్బిడిఎ) ఖాతాదారులకు అందించే కొన్ని సేవలపై అధిక ఛార్జీలు విధిస్తున్నట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. బీఎస్బిడిఎ ఖాతాదారులు నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీ నుంచి రూ.17.70 వసూలు చేయాలని ఎస్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని"సహేతుకమైనది"గా పరిగణించ లేమని అధ్యయనం పేర్కొంది. సేవా ఛార్జీలు విధించడం వల్ల 2015-20 మధ్య కాలంలో ఎస్బిఐ దాదాపు 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్(బీఎస్బిడిఎ) హోల్డర్ల నుంచి రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలో పేర్కొంది. అలాగే, ఎస్బీఐ తర్వాత ఇండియాలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇదే సమయంలో 3.9 కోట్ల బీఎస్బిడిఎ ఖాతాల నుంచి రూ.9.9 కోట్లు వసూలు చేసింది. "కొన్ని బ్యాంకులు బీఎస్బిడిఎలపై గల ఆర్బిఐ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఎస్బీఐ గరిష్ట సంఖ్యలో బీఎస్బిడిఎలను నిర్వహిస్తుంది. ప్రతి డెబిట్ లావాదేవీపై(డిజిటల్ మార్గాల ద్వారా కూడా) నెలకు నాలుగు దాటిన ప్రతిసారి 17.70 రూపాయలు వసూలు చేస్తుంది. 2018-19 కాలంలో రూ.72 కోట్ల వసూలు చేస్తే 2019-20 రూ.158 కోట్లు వసులు చేసినట్లు” ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది. 2013 సెప్టెంబర్ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బీఎస్బీడిఎపై ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ఎస్బీఐ, 2013 నాటి నుంచి ఆర్బిఐ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ నెలకు నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీపై బీఎస్బీడిఎ హోల్డర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తుంది. నెఫ్ట్, ఐఎంపిఎస్ వంటి డిజిటల్ లావాదేవీలపై కూడా ఛార్జీలు రూ.17.70 వసూలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. "ఒక వైపు ప్రభుత్వం దేశంలో డిజిటల్ చెల్లింపు మార్గాలను గట్టిగా ప్రోత్సహిస్తుంటే. మరోవైపు, ఎస్బీఐ ఖాతాదారులను నిరుత్సాహపరుస్తుంది" అని ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది. చదవండి: రెమిడెసివర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement