-
మూడు రోజుల్లో 795 ఫ్లాట్లు అమ్మిన డీఎల్ఎఫ్.. ఎక్కడంటే..
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్ఎఫ్ మూడు రోజుల్లోనే గురుగ్రామ్లో రూ.5,590 కోట్ల విలువైన 795 లగ్జరీ ఫ్లాట్లు విక్రయించింది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం..డీఎల్ఎఫ్ గురుగ్రామ్లో 'డీఎల్ఎఫ్ ప్రివానా వెస్ట్' అనే కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా లగ్జరీ ఫ్లాట్లను నిర్మించారు.ఫ్లాట్ల అమ్మకాలు ప్రారంభించిన మూడు రోజుల్లోనే మొత్తం 795 ఫ్లాట్లు విక్రయించారు. వాటి విలువ రూ.5,590 కోట్లుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ను 116 ఎకరాల డీఎల్ఎఫ్ టౌన్షిప్లో భాగంగా 12.57 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ గతంలో ప్రివానా సౌత్లో నిర్మించిన 1,113 ఫ్లాట్లను మూడురోజుల్లో విక్రయించి రూ.7,200 కోట్లు సమకూర్చుకుంది.ఇదీ చదవండి: సిక్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల తొలగింపుడీఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి మాట్లాడుతూ..ఫ్లాట్ల విక్రయానికి సంబంధించి వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చినట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని ఎక్కువగా ఎన్ఆర్ఐలే కొనుగోలు చేసినట్లు తెలిపారు. -
హైదరాబాద్లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. కొవిడ్ భయాలు తొలగి క్రమంగా దాదాపు చాలా కంపెనీలు వర్క్ఫ్రంహోం కల్చర్కు స్వస్తి పలుకుతాన్నాయి. ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేయాలని కోరుతున్నాయి. దాంతో దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలాలు హాట్కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ జనవరి-మార్చి మధ్యకాలంలో ఆరు మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాల లీజులో 35 శాతం వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లియర్స్ ఇండియా తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్-6 నగరాలైన బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణెలో సమీప భవిష్యత్తులో 13.6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 10.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. హైదరాబాద్తోపాటు ముంబై, బెంగళూరు, దిల్లీ-ఎన్సీఆర్లలో ఆఫీస్ స్థలాల లీజు పెరగగా, చెన్నైలో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్లో అత్యధికంగా 2.9 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. వచ్చే త్రైమాసికానికిగాను ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు తమ లీజుకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపింది. నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు ముంబైలో ఆఫీస్ స్థలం డిమాండ్ 90 శాతం ఎగబాకి 1 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.9 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. బెంగళూరులో కార్యాలయాల స్థలం 25 శాతం పెరిగి 4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోనుంది. గతేడాది ఇది 3.2 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. దిల్లీ-ఎన్సీఆర్లో 2.5 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకునే అవకాశం ఉంది. క్రితం ఏడాది కంటే ఇది 14 శాతం అధికం. చెన్నైలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 6 శాతం తగ్గి 1.6 మిలియన్ చదరపు అడుగుల నుంచి 1.5 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. ఇదీ చదవండి: భారత్లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు -
హైదరాబాద్లో ఇళ్లు అ‘ధర’హో..
నగరంలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8 శాతం ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14 శాతానికి పెరిగింది. స్థిరాస్తి ధరలు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కోరుకున్న చోట కనీస సౌకర్యాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో రెండు పడక గదుల ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే కోటి రూపాయలు ఉండాల్సిందే. ప్రస్తుతం నగరంలో సగటు చదరపు అడుగు ధర సుమారు రూ.5 వేలు పలుకుతోంది. ఇది బేస్ ధర మాత్రమే. 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు పడకల గదికి రూ.70 లక్షల వరకు అవుతుంది. కారు పార్కింగ్, క్లబ్ హౌస్ సభ్యత్వం, గ్యాస్, ఈవీ ఛార్జింగ్ పాయింట్ల వంటి మౌలిక వసతుల కోసం మరో పది లక్షల వరకు తీసుకుంటున్నారు. 5 శాతం జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్డ్యూటీ, ట్రాన్స్ఫర్ ఛార్జీలు కలిపి మరో 10 లక్షల వరకు అవుతున్నాయి. ఇంటీరియర్ కోసం మరో రూ.పది లక్షల వరకు ఖర్చవుతోంది. రూ.కోటి పెడితే రెండు పడకల ఫ్లాట్ మాత్రమే వస్తోంది. మరింత విశాలంగా మూడు పడకల గది కావాలన్నా.. పై అంతస్తుల్లో ఉండాలంటే ఫ్లోర్ రైజ్ ఛార్జీలు, తూర్పు, ఉత్తరం వైపు ఫ్లాట్ కావాలన్నా... చెరువు వైపు, గార్డెన్ వైపు ఉన్న బాల్కనీ కావాలన్నా అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. వీటితో పాటూ మూడు పడకల ఫ్లాట్ కావాలంటే కోటిన్నర అవుతోంది. ఇదంతా ఐటీ కారిడార్ బయటనే. ఐటీ కారిడార్లో అయితే రెండు నుంచి రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగానే జనవరిలో కోటి అంతకంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. వెయ్యి నుంచి రెండువేల లోపు విస్తీర్ణం కలిగిన వాటి రిజిస్ట్రేషన్లు 71 శాతం జరిగాయి. కొందరు బిల్డర్లు సామాన్య, మధ్యతరగతి వర్గాల కోసం 500 నుంచి వెయ్యి చదరపు అడుగుల లోపల ఉండే రెండు పడకల గదుల ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. అఫర్డబుల్ హౌసింగ్ కింద వీటిని పరిగణిస్తారు. జీఎస్టీ 1 శాతమే ఉంటుంది. ఈ తరహా ఇళ్లు రూ.50 లక్షల ధరల్లో వస్తున్నాయి. కొనుగోలుదారుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో ఎక్కువ మంది ఈ విస్తీర్ణంలో కట్టడం లేదు. 2023 జనవరిలో వీటి రిజిస్ట్రేషన్లు 17 శాతం జరగ్గా.. ఈ ఏడాది జనవరిలో 14 శాతానికి పడిపోయాయి. ఇదీ చదవండి: అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్ -
హైదరాబాద్లో 3 పడకల ఇళ్లకే గిరాకీ.. ఏ ధరకు కొంటున్నారో తెలుసా..
మానవుల జీవనప్రమాణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అవసరాలకు తగ్గట్టు నివసించేందుకు ఇళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్నేళ్ల నుంచి రెండు పడక గదుల ఇల్లు ఉంటే చాలు అనుకునేవారు. దాంతో నిర్మాణ సంస్థలూ వాటినే పెద్ద మొత్తంలో నిర్మించేవి. ఇప్పుడు మాత్రం ధర అధికమైనా సరే మూడు పడక గదుల ఇల్లు, విశాలమైన వరండా లాంటివి ఉండే ఇళ్లనే కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ఇళ్ల కొనుగోలు తీరుపై 2023 జులై-డిసెంబరు మధ్య ఫిక్కీ-అనరాక్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇళ్ల కొనుగోలుదారుల్లో సగానికి పైగా 3 బీహెచ్కే (మూడు పడక గదులు, హాలు, వంటగది) ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీలలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. 2బీహెచ్కే ఇళ్ల కొనుగోలుకు 38% మంది మొగ్గు చూపించారు. ఏడాది క్రితం 3బీహెచ్కే ఇల్లు/ఫ్లాట్ కొనుగోలుకు 42% మందే ఆసక్తి చూపించడం గమనార్హం. ఇళ్ల ధరలు ఆకాశాన్నంటే ముంబయిలో మాత్రం 44% మంది కొనుగోలుదారులు ఇప్పటికీ 2బీహెచ్కే వైపే చూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో 1బీహెచ్కే ఇళ్లపై ఆసక్తి తగ్గినా, ముంబయి, పుణెలో వీటికి గిరాకీ ఉందని తెలిసింది. పెరిగిన సగటు విస్తీర్ణం పెద్ద ఇళ్లకు గిరాకీ పెరుగుతుండటంతో, వాటి నిర్మాణాలూ అధికంగానే ఉంటున్నాయని అనరాక్ గ్రూప్ ఛైర్మన్ అనుజ్ పురి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సగటు ఫ్లాటు విస్తీర్ణం 11% పెరిగిందన్నారు. 2022లో సగటు ఫ్లాటు విస్తీర్ణం 1,175 చదరపు అడుగులు ఉండగా, 2023లో 1,300 అడుగులకు చేరుకుందన్నారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. భారీగా అమ్మకాలు.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2022తో పోలిస్తే గత ఏడాది ఇళ్ల విక్రయాల్లో 31% వృద్ధి కనిపించింది. మొత్తం 4.77 లక్షల ఇళ్లు 2023లో అమ్ముడయ్యాయి. కొత్తగా 4.46 లక్షల ఇళ్లు/ఫ్లాట్ల నిర్మాణాన్ని డెవలపర్లు ప్రారంభించారు. ఇళ్ల కొనుగోలుదారులు ఎక్కువగా రూ.45-90 లక్షల ఇల్లు/ఫ్లాట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరికొందరు రూ.90లక్షల నుంచి రూ.1.5 కోట్ల విలువైన ఇళ్లను కొనాలనే ఆసక్తితో ఉన్నారని సర్వే వెల్లడించింది. -
వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే..
ఇంకా వేసవికాలం పూర్తిగా రానేలేదు. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం దాదాపు 12 నుంచి సాయంత్రం 4 వరకు విపరీతమైన వేడి ఉంటుంది. దాంతో బయట పనులకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. అలా అని ఇంట్లో ఉందామంటే కూడా వేడి తాళలేకపోతున్నారు. ఒకవేళ తప్పని పరిస్థితిలో బయటకు వెళ్లినా ఇంటికి వస్తే హాయిగా చల్లగా ఉండాలి.. రాత్రిపూట ఉక్కపోత లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలి.. ఏసీ వేసుకుంటే సరిపోతుంది కదా అంటారా? నిజమే కానీ అందరి ఇళ్లలో ఆ సౌకర్యం ఉండదు కదా.. దాన్ని భరించే స్థోమత చాలామందికి లేదు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో వేసవిలో ఇంటిని చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. అందుకు మార్కెట్లో రకరకాల పద్ధతులను పాటిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. చల్లదనాన్ని ఇచ్చే పెయింట్లు.. దాదాపు అన్ని ఇళ్లు నిర్మాణానికి కాంక్రీటే వినియోగిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సిమెంట్, ఇతర రేకుల ఇళ్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దాంతో ఆ ఇళ్ల లోపల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీనికి పరిష్కారంగా పైకప్పులపై తెల్లని పెయింట్ను వేసుకోవడం ద్వారా చాలావరకు ఉపశమనం కల్గుతుంది. ఇంటిపై పడిన కిరణాలు తెలుగు రంగు కారణంగా పరావర్తనం చెంది వాతావరణంలో కలిసిపోతాయి. ఇందుకోసం పైకప్పుపై సున్నం మొదలు మార్కెట్లో దొరికే కూల్ రూఫ్ పెయింట్స్ వరకు వినియోగించవచ్చు. దీనివల్ల భవనంపైన 20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గుతుంది. ఇంటి లోపల 2.1 నుంచి 4.3 డిగ్రీల వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ షీట్స్తో రక్షణ.. బస్తీల్లో బిల్డింగ్లతోపాటు చాలావరకు రేకుల ఇళ్లు ఉంటాయి. వాటిలోనే ఎక్కువ మంది జీవిస్తుంటారు. వీరు తక్కువ ఖర్చుతో పైకప్పుపై ప్లాస్టిక్ షీట్స్ను పరిస్తే చాలు. గాలులకు ఎగిరిపోకుండా చూసుకోవాలి. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని దేవరకొండ బస్తీలో కొన్ని ఇళ్లపై ప్లాస్టిక్ షీట్స్ను పరిచి వేడి తగ్గించడం ద్వారా బస్తీవాసుల్లో అవగాహన కల్పించారు. ఆరేడు డిగ్రీల వరకు లోపల వేడి తగ్గినట్లు గుర్తించారు. సోలార్ ప్లేట్లతో.. ఇంటిని చల్లగా ఉంచడంతోపాటు విద్యుత్తును ఉత్పత్తిచేస్తూ అవసరాలకు వాడుకునేలా సోలార్ ప్లేట్ను ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు కిలోవాట్లకు సబ్సిడీ పోను రూ.1.10 లక్షలు ఖర్చువుతుంది. నెలకు 360 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. ఇంటికి అవసరమైన విద్యుత్తును వాడుకుని మిగిలిన దాన్ని గ్రిడ్కు అనుసంధానం చేయవచ్చు. డిస్కం నుంచి యూనిట్కు రూ.5 లపైన తిరిగి పొందవచ్చు. ఇదీ చదవండి.. కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు! మొక్కలను పెంచడంతో.. ఇంటిపైన ఖాళీ స్థలంలో మొక్కలను పెంచవచ్చు. దాంతో వేసవిలో చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. రకరకాల పూలు, అలంకరణ మొక్కలు, కూరగాయలు పెంచుకోవచ్చు. అయితే అంతకంటే ముందు వాటర్ లీకేజీలు లేకుండా వాటర్ఫ్రూపింగ్ చేయించాలి. ఇంటి చుట్టూ మొక్కలు, నీడనిచ్చే చెట్లు ఉంటే చల్లగా ఉంటుంది. -
ఐటీ సిటీలో డబుల్ ట్యాక్స్.. ఇంటి అద్దెలు మరింత పెరుగుతాయా?
బృహత్ బెంగళూరు మహానగర పాలికె మార్గదర్శక విలువ ఆధారిత ఆస్తిపన్నును ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో బెంగళూరు నగరంలోని నివాస, కమర్షియల్ భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులపై అదనపు భారం పడబోతోంది. ఆస్తిపన్ను విలువలలో ఈ భారీ పెరుగుదల ఇప్పటికే అధిక అద్దెల భారం మోస్తున్నవారిపై మరింత భారాన్ని పెంచే అవకాశం ఉంది. కొత్త ఆస్తి పన్ను విధానం ప్రకారం.. యజమానులు తామె స్వయంగా నివాసం ఉంటున్న ఆస్తులపై చెల్లించే పన్నుతో పోలిస్తే అద్దెకు ఇచ్చిన ఆస్తులపై రెండింతలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతర వాణిజ్య భవనాల విషయానికి వస్తే పన్ను 3-5 రెట్లు పెరగనుంది. కొత్త ఆస్తి పన్ను విధానం ఇదీ.. ప్రస్తుత పన్ను విధానంలో పీజీలు, కన్వెన్షన్ హాళ్లు, లేదా మాల్స్ వంటి అద్దె ఆస్తులకు ఏడు సుంకాలు ఉన్నాయి. అయితే ఎయిర్ కండీషనర్ లేదా ఎస్కలేటర్లు ఉన్న భవనాలకు ప్రత్యేకంగా పన్నులేమీ విధించడం లేదు. గైడెన్స్ విలువను 33 శాతం పెంచినందున వ్యాపారులు, ఆస్తి యజమానులు వార్షిక బీబీఎంపీ పన్నులో కనీసం 40 శాతం పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అయితే బీబీఎంపీ కొత్త నోటిఫికేషన్లో ఆస్తి పన్ను పెంపును 20 శాతానికి పరిమితం చేసింది. బెంగళూరు నగరంలోని అద్దె ఇళ్లు, ఫ్లాట్లపై బీబీఎంపీ రెట్టింపు పన్నులు వేస్తోందని, అయినప్పటికీ తమకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని నగరంలో అద్దె నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "కొత్త పన్ను నియమంతో అద్దెదారులు అదనపు ఖర్చును భరించవలసి ఉంటుందని వాపోతున్నారు. అయితే ఆస్తి పన్ను 5 శాతానికి మించి పెరగదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు. -
ఔటర్ చుట్టూ టౌన్ షిప్ లు..మళ్లీ పరుగులు పెట్టనున్న రియలెస్టేట్
-
హైదరాబాద్లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా..
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. రోజు రోజుకు రెంట్లు పెంచేస్తుండడంతో అద్దెకట్టేవారికి ఆర్థికభారం పెరుగుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు Work from Home వర్క్ ఫ్రం హోం తొలగించి ఉద్యోగస్థులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. దాంతో అద్దె ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. అదే అదనుగా ఇంటి యజమానులు రెంట్ పెంచుతున్నారు. కొవిడ్ పూర్వం అద్దెలకు ప్రస్తుతం ఉన్న అద్దెలకు భారీ వ్యత్యాసం ఉంది. 2019తో పోలిస్తే ఇంటి రెంట్లు ఎంత పెరిగాయనేదానిపై ప్రముఖ రియల్టీ సంస్థ హౌసింగ్.కామ్ కీలక నివేదిక విడుదల చేసింది. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికలోని వివరాల ప్రకారం.. 2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు దాదాపు 25-30 శాతం మేర పెరిగాయి. అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీల రెంట్లు 15-20 శాతం మేర అధిమయ్యాయి. అద్దెలు పెరిగిన క్రమంలో రెంటల్ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు నివేదిక పేర్కొంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా న్యూయార్క్, లండన్, దుబాయ్, సింగపూర్ వంటి గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లతో పోలిస్తే దేశంలో చాలానే గ్యాప్ ఉన్నట్లు తెలిపింది. దేశంలోని టాప్ నగరాల్లో ప్రాపర్టీల ధరలు 2019 ధరలతో పోలిస్తే ప్రస్తుతం 15 నుంచి 20 శాతం మేర పెరిగినట్లు హౌసింగ్.కామ్ నివేదిక వెల్లడించింది. ప్రాపర్టీలు, అద్దె ఇళ్ల కోసం ఆన్లైన్లో సర్చ్ చేస్తున్న వారి సంఖ్య సైతం భారీగానే పెరిగినట్లు తెలిపింది. కొనుగోలు ఇండెక్స్తో పోలిస్తే ఐఆర్ఐఎస్ ఇండెక్స్ 23 పాయింట్లు అధికంగా ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: ఓవెన్ సైకిళ్లు వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి.. 'కరోనా మహమ్మారి తర్వాత హౌసింగ్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రాపర్టీల కొనుగోలు, అద్దెల డిమాండ్ అధికమైంది. దాదాపు దశాబ్ద కాలం పాటు స్తబ్దుగా కొనసాగిన హౌసింగ్ మార్కెట్ ధరల పెరుగుదల గత రెండేళ్లలో మాత్రం గణనీయంగా పెరిగింది. నగరాలను బట్టి ఈ ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు భారీగా పెరిగాయి.' అని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. -
కోట్ల రూపాయలు కావాలా..? స్థలం ఎక్కడ కొనాలంటే..
రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వారు మంచి రాబడులు అందుకుంటున్నారు. దశాబ్దకాలంలో సగటున ఏటా 10 శాతం చొప్పున ఇంటి విలువలు పెరిగాయి. 2013లో రూ.50 లక్షలు విలువ చేసే ఇల్లు కొంటే దాని ధర ఇప్పుడు రూ.కోటిపైనే పలుకుతోంది. బాగా వృద్ధి ఉన్న ప్రాంతాల్లో ఇంతకు రెండుమూడు రెట్లు పెరిగిన సందర్భాలున్నాయి. వచ్చే దశాబ్దంలోనూ రియల్ ఎస్టేట్లో వృద్ధి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ కొన్నాళ్ల పాటు స్తబ్ధుగా ఉండటం, ఆ తర్వాత ఒక్కసారిగా పెరగడం హైదరాబాద్లో పలుమార్లు జరిగింది. పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ అనంతరం ఎక్కువ మంది ఇలాంటి పరిస్థితిని గమనించే ఉంటారు. దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టిన వారు లాభపడ్డారు. మంచి రాబడులు అందుకున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ముగిసి, లోక్సభ ఎన్నికలు రాబోతుండడంతో మార్కెట్లో కొంత స్తబ్ధత కన్పిస్తోంది. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మార్కెట్ మళ్లీ పెరగడం ఖాయమని నిర్మాణదారులు అంటున్నారు. కాబట్టి ఇంటి కల నెరవేర్చుకునేవారు, పెట్టుబడి కోణంలో రెండో ఇల్లు కొనేవారికి ఇప్పుడు అనుకూల సమయం అంటున్నారు. అయితే ఎలాంటి ప్రదేశంలో ఇల్లు, స్థలం కొనాలో నిపుణులు కొన్ని అంశాలను సూచిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి సంస్థలు పెద్ద ఎత్తున వస్తున్న ప్రాంతాలకు చేరువగా ఉన్న ప్రాంతాలను పరిశీలించవచ్చు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలి. వంద అడుగుల రహదారులను చేపట్టగానే ఆ ప్రాంతంలో స్థిరాస్తుల ధరలు ఒక్కసారిగా పెరగడం గమనించే ఉంటారు. మూసీపై వంతెనలతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయిన ఉదాహరణలు కళ్లముందే ఉన్నాయి. కొత్తగా కొన్నిచోట్ల ప్రభుత్వం మూసీపై వంతెనలను కట్టబోతుంది. వీటిలో ఇప్పటివరకు లేని చోట ఎక్కడ కడుతున్నారో దృష్టి పెట్టాలి. మెట్రోరైలును సిటీలో పలు ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. ఎక్కడ తొలుత విస్తరిస్తున్నారో గమనించాలి. ఇలాంటి చోట్ల తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదల ఉంటుంది. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. ఇవేవి లేకున్నా కూడా సహజంగా వృద్ధి చెందే ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడ నిలకడగా ధరల వృద్ధి, అభివృద్ధి ఉంటుంది. మీరు శివార్లలో ఉంటున్నట్లయితే అక్కడి నుంచి పది కి.మీ. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై ఒక నజర్ వేయండి. స్థిరాస్తి సంస్థల ప్రకటనలు గమనించండి.. స్థలాలు, ఫ్లాట్లు, విల్లాల ప్రాజెక్టులు ఎటువైపు వస్తున్నాయో అవగాహన పెంచుకోండి. ప్రత్యక్షంగా చూసిన తర్వాత నిర్ణయానికి రండి. -
నివాసానికి ఒకటి.. అద్దెకు మరొకటి..!
ఉండటానికి సొంతిల్లు ఉన్నా స్థిరమైన అద్దె ఆదాయం కోసం మరో ఇల్లు కొనాలని చాలామంది ఆలోచిస్తున్నారు. గతంలో బెంగళూరు నగరంలో ఈ ధోరణి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లోనూ పెరిగింది. హైటెక్సిటీ వంటి కొన్ని ప్రాంతాల్లో కమర్షియల్ భవనాల స్థాయిలో గృహాలకు అద్దెలు వస్తుండటంతో రెండో ఇల్లు వైపు మొగ్గుచూపుతున్నారు. నగరంలో వివిధ కారణాలతో కొద్దినెలలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ నెమ్మదించింది. గృహ రుణ వడ్డీరేట్లు పెరగడం, మార్కెట్లో నగదు లభ్యత లేకపోవడం, ప్రవాస భారతీయుల పెట్టుబడులు తగ్గడం, ఎన్నికల సంవత్సరం, మార్కెట్లో సరఫరా పెరగడం వంటి కారణాలతో రియల్ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉంది. ఇలాంటి దశలోనూ అద్దె ఆవాసాలకు మాత్రం డిమాండ్ కొనసాగుతూనే ఉందని ఈ రంగంలోని సంస్థలు చెబుతున్నాయి. ఐటీ కారిడార్గా ఉన్న మాదాపూర్లో రెండు పడక గదుల ఇంటి అద్దె సగటు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. కమ్యూనిటీ, అక్కడి సౌకర్యాలను బట్టి రూ.2లక్షల వరకు కూడా అద్దెలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో సగటున రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య రెంట్లు ఉన్నాయి. స్థలానికి ప్రత్యామ్నాయంగా.. సొంతిల్లు ఉంటే భవిష్యత్తులో మంచి పెట్టుబడిగా భావించి గతంలో స్థలాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, విల్లాల సంస్కృతి మొదలయ్యాక వీటిలో అద్దెలు బాగా వస్తుండటంతో స్థలానికి ప్రత్యామ్నాయంగా రెండో ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆదాయ పన్ను ప్రయోజనాలు సైతం ఉండటంతో పన్ను భారం తగ్గించుకునేందుకు కొనేవారు ఉన్నారు. నెలనెలా ఆదాయం కోసం కూడా వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో చూస్తే అద్దెల రాబడి తక్కువలో తక్కువ 2.35 శాతం నుంచి గరిష్ఠంగా 4.03 శాతం వరకు ఉంటోంది. ఇల్లు కొనేందుకు పెట్టుబడి పెట్టిన మొత్తం, వార్షికంగా వచ్చిన అద్దెను పరిగణనలోకి తీసుకుని రాబడి లెక్కిస్తున్నారు. అంటే ఉదాహరణకు రూ.10 లక్షలతో ఇల్లు కొంటే వార్షికంగా 4 శాతం రూ.40 వేలు అద్దె వస్తుందని లెక్కకడుతున్నారు. దీనికి అదనంగా ఇంటి విలువ పెరగడం కలిసొచ్చే అంశం. ఇదీ చదవండి: చలిలో విద్యుత్ వాహనాలు.. ఇవి పాటించాల్సిందే.. ఎప్పటి నుంచో ఉన్నదే.. అద్దె రాబడి కోసం వ్యక్తిగత ఇళ్లల్లో ప్రత్యేకంగా పోర్షన్లు నిర్మించడం సిటీలో ఎప్పటినుంచో ఉన్నదే. ఇందుకోసం జీ+2, 3, 4 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఒక అంతస్తులో పూర్తిగా యజమానులు ఉంటూ.. మిగతా అంతస్తుల్లో ఒక పడక, రెండు పడక గదులను అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నారు. అద్దెల మీద వచ్చే సొమ్ముతోనే జీవనం సాగిస్తున్న వారు సిటీలో ఎందరో ఉన్నారు. అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లను అద్దె రాబడి కోసం ఇటీవల ఎక్కువ మంది కొంటున్నారు. -
2036 నాటికి 9.3 కోట్ల ఇళ్లకు గిరాకీ.. ఎక్కడో తెలుసా..
సొంతిళ్లు అనేది సామాన్యుడి కళ. ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఏ పని చేస్తున్నా ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతారు. అయితే పెరుగుతున్న జనాభా కారణంగా ఇళ్ల అవసరాలు హెచ్చవుతున్నాయి. అందుకు అనువుగా రియల్ ఎస్టేట్ సంస్థలు వాటి నిర్మాణాన్ని పెంచుతున్నాయి. మారుతున్న జీవనప్రమాణాల వల్ల అధికశాతం జనాభా ఇప్పటికే ఇళ్లు ఉన్నా అన్ని సౌకర్యాలు కలిగిన మరో ఇంటికి మారాలని చూస్తున్నారు. దాంతో ఇళ్ల నిర్మాణానికి మరింత డిమాండ్ పెరుగుతోంది. 2036 నాటికి 6.4 కోట్ల కొత్త ఇళ్ల అవసరం ఉంటుందని క్రెడాయ్-లియాసెస్ ఫోరాస్ నివేదిక అంచనా వేసింది. మంగళవారం వారణాసిలో జరిగిన న్యూ ఇండియా సదస్సులో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం..2018 నాటికే జనాభా అవసరాలకు తగిన ఇళ్ల నిర్మాణం జరగలేదు. అప్పటికే 2.9 కోట్ల ఇళ్ల కొరత ఉంది. 2036 నాటికి మొత్తం 9.3 కోట్ల గృహాలకు గిరాకీ ఉంటుందని అంచనా వేసింది. స్థిరాస్తి రంగంలో ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధి అధికంగా ఉండనుంది. 2023లో ఇళ్లకు అధిక గిరాకీ ఏర్పడిందని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా రెరా వద్ద 19,050కి పైగా ప్రాజెక్టులు నమోదయ్యాయని, ఇందులో 45 శాతానికి పైగా నివాస ప్రాజెక్టులున్నాయని వెల్లడించింది. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మాట్లాడారు. దేశంలో వేగంగా పెరుగుతున్న జనాభా వల్ల ఇళ్లకు గిరాకీ, సరఫరా వృద్ధి చెందుతోందన్నారు. అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పెద్ద గృహాలకు డిమాండ్ పెరిగినట్లు చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ఇదీ చదవండి: 2030 నాటికి రూ.8 లక్షలకోట్ల ఎగుమతులు..? క్రెడాయ్ ఛైర్మన్ మనోజ్ గౌర్ మాట్లాడుతూ.. గత ఏడాది స్థిరాస్తి రంగానికి సానుకూలంగా ఉందని చెప్పారు. 2024లోనూ ఈ రంగంలో వృద్ధి నమోదవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లియాసెస్ ఫోరాస్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరే క్రమంలో స్థిరాస్తి రంగం పాత్ర ఎంతో కీలకమని వివరించారు. -
ఖరీదైన భవనం కొనుగోలు చేసిన సీఈఓ.. ధర ఎంతంటే..?
భారత్కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా లండన్లో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ.1,446 కోట్లు వెచ్చించి ఆ భవనాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం ఖరారైనట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. భారత్లో విస్తృతంగా పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ను సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన విషయం తెలిసిందే. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. లండన్లోని హైడ్ పార్క్ ప్రాంతంలో ఉన్న అబెర్కాన్వే హౌస్ను పూనావాలా కొనుగోలు చేశారు. ఈ భవనం 1920 నాటిది. దీని విస్తీర్ణం 25 వేల చదరపు అడుగులు. పోలండ్కు చెందిన దివంగత వ్యాపారవేత్త జాన్ కుల్జిక్ కుమార్తె డొమినికా కుల్జిక్ నుంచి అదర్ పూనావాలా దీన్ని కొనుగోలు చేసినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన యూకే అనుబంధ సంస్థ సీరం లైఫ్ సైన్సెస్ ఈ భవనాన్ని సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. లండన్లో ఈ ఏడాది అత్యంత ఖరీదైన ఇంటి కొనుగోలుగా ఇది నిలవనున్నట్లు సమాచారం. లండన్లో ఇది రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా రికార్డుల్లో ఉండనుందని పలువురు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తెలిపారు. అయితే తాజా కొనుగోలుతో పూనావాలా కుటుంబం లండన్కు మకాం మార్చే అవకాశాలేమీ లేవని సీరం లైఫ్ సైన్సెస్కు చెందిన ఓ కీలక పదవిలోని వ్యక్తి తెలిపారు. ప్రస్తుతానికి కంపెనీ కార్యకలాపాలకు ఇది కేంద్రంగా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ వ్యాపార విస్తరణకు ఈ భవనాన్ని గెస్ట్హౌజ్గా వినియోగించుకోనున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: ‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’ లండన్లో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భవనంగా 2-8ఏ రట్లాండ్ గేట్ నిలిచింది. సౌదీ మాజీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులాఅజిజ్కు చెందిన ఎస్టేట్ దీన్ని 2020 జనవరిలో 210 మిలియన్ పౌండ్లు(రూ.2100 కోట్లు)కు కొనుగోలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, దీని వాస్తవ కొనుగోలుదారుడు చైనాకు చెందిన స్థిరాస్తి సంస్థ ఎవర్గ్రాండ్ వ్యవస్థాపకుడు ‘హుయ్ కా యాన్’గా గుర్తించినట్లు గత ఏడాది ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది పునావాలా కొనుగోలు చేసిన భవనం కాకుండా రెండో ఖరీదైన భవనం కొనుగోలుగా హనోవర్లాడ్జ్ (రూ.1180 కోట్లు) నిలిచింది. -
దానికదే పగుళ్లు పూడ్చుకునే కాంక్రీటు..!
భవన నిర్మాణంలో వాడే కాంక్రీటు దృఢంగా ఉంటుంది. అయితే వాతావరణంలోని తేమ లేదా ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గుల వల్ల కాంక్రీటు నిర్మాణాల్లోనూ పగుళ్లు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు దాని నిర్వహణకోసం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పగుళ్లతో కొన్నిసార్లు కాంక్రీటు మూలకాలు క్షీణించే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను నివారించటానికి డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు వినూత్నమైన కాంక్రీటును రూపొందించారు. ఇది తనకు తానే మరమ్మతు చేసుకుంటుంది. ఇందులోని బయోఫైబర్లు బ్యాక్టీరియా సాయంతో పగుళ్లను పూరిస్తాయి. కాంక్రీటు నిరంతరం వాతావరణ ప్రభావానికి గురవుతున్నప్పుడు పగుళ్లు ఏర్పడుతుంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత మరీ పెరిగితే పగుళ్లు మరింత పెద్దగా అవుతాయి. పైగా తేమ సైతం వివిధ ప్రక్రియలతో కాంక్రీటు క్షీణించేలా చేస్తుంది. కాబట్టి కాంక్రీటు నిర్మాణాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. తరచూ మరమ్మతులు అవసరమవుతాయి. దీనికి ఖర్చు అవుతుంది. అసౌకర్యమూ కలిగిస్తుంది. అందుకే కాంక్రీటు క్షీణించే వేగాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అందుకు అనుగునంగా డ్రెక్సెల్ యూనివర్సిటీ పరిశోధకులు బయోఫైబర్లు రూపొందించారు. ఈ పాలిమర్ ఫైబర్లు కేవలం కాంక్రీటుకు దన్నుగా నిలవటమే కాకుండా పగుళ్లు వాటికవే పూడిపోయేలా చేసి మన్నికగా ఉండే కాలాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ ఫైబర్లకు సన్నటి రంధ్రాలు కలిగిన హైడ్రోజెల్ పూత పూస్తారు. ఇందులో బ్యాక్టీరియా ఉంటుంది. ఇదీ చదవండి: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో..! ఇది నిద్రాణంగా ఉంటూ తీవ్ర వాతావరణ పరిస్థితులనూ తట్టుకొని జీవిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా పగుళ్లు ఏర్పడితే వాటిలోంచి నీరు వెళ్లి బయోఫైబర్లును తాకుతుంది. అప్పుడు హైడ్రోజెల్ విస్తరిస్తుంది. ఈ క్రమంలో బ్యాక్టీరియా నిద్రలేస్తుంది. కాంక్రీటు చుట్టూ ఉండే కార్బన్, క్యాల్షియంను తినటం ఆరంభిస్తుంది. అప్పుడు వీటి నుంచి క్యాల్షియం కార్బొనేట్ ఉత్పత్తి అవుతుంది. ఇది పగుళ్లను పూడుస్తుంది. నిర్మాణ పదార్థాలను మెరుగు పరచటానికి జరుగుతున్న ప్రయత్నాల నేపథ్యంలో బయోఫైబర్లతో కూడిన కాంక్రీటు ఆసక్తి కలిగిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. -
ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!
ఇంటి నిర్మాణంలో ఇంటీరియర్తోపాటు బయటకు కనిపించే వాటికిసైతం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇంటిని డిజైన్ చేయిస్తుంటారు. వంటగది ఎక్కడ రావాలి? పడక గదులు ఎన్ని ఉండాలి? మెట్లు ఏవైపు ఉండాలి? ఎలివేషన్ ఎలా ఉంటే బావుంటుందనే విషయాలకే ఎక్కువ పట్టింపు ఉంటుంది. ఇంటిలో స్థలాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఆధునిక భవన డిజైన్లలో కీలకం. అయితే చాలా మంది జీవితకాలంలో గణనీయ ప్రభావాన్ని చూపే ఇలాంటి అంతర్గత విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా భవనాల డిజైన్లో ఈ అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లాంటి నగరంలో కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా ఇంటి విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. అలాగని సమర్థంగా వినియోగిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఇంట్లో చాలా గదులు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. పెరిగిన ఇంటి విస్తీర్ణంతో దాని ధర కూడా పెరుగుతుంది. అందరూ అధిక ధరలను భరించలేరు. వీటిని గమనించిన ఆర్కిటెక్చర్లు ఇంటిలోపల స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునేలా డిజైన్ చేస్తున్నారు. ఉదాహరణకు 200 చదరపు అడుగుల స్థలాన్ని లివింగ్ రూంకు వదిలిపెడుతుంటారు. అందుకు బదులుగా కొంత అదనంగా మరో 100 చదరపు అడుగుల స్థలాన్ని కలిపి భోజన ప్రదేశంగా, వంటగది వంటి బహుళ అవసరాలకు వినియోగించవచ్చు. అవసరాల్లో రాజీ పడకుండా ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే ‘ఎఫెక్టివ్ మల్టిపుల్’ అధికంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సగటున కొన్ని సర్వేల ప్రకారం వంటగది, హాల్, కిచెన్.. వంటి గదుల ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని సమర్థంగా వినియోగిస్తే ఎఫెక్టివ్ మల్టిపుల్ బావుంటుంది. ఎఫెక్టివ్ మల్టిపుల్ విలువ 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్లోని స్థలాన్ని ప్రభావవంతంగా వాడుతున్నట్లు. ఇదీ చదవండి: రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత! ఇంట్లో పడక గదిలో కంటే లివింగ్ రూంలో ఎక్కువ సమయం గడిపేవారికి.. పడక గది విస్తీర్ణం తగ్గించుకుని లివింగ్ రూం విస్తీర్ణం పెంచుకోవాలి. ఇంటిని సమర్థంగా వాడుకోవానుకున్నా, విశాలంగా కనిపించాలన్నా సహజంగా వెలుతురు వచ్చేలా ఇంటిని డిజైన్ చేసుకోవాలి. ఇందుకోసం పెద్ద కిటికీలు క్రాస్ వెంటిలేషన్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. దాంతో కొంతమేర కరెంట్ బిల్లు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. -
రణ్వీర్ సింగ్ రీల్ లగ్జరీ బంగ్లా: రియల్ ఓనర్ ఎవరో తెలిస్తే షాకవుతారు
Rocky RandhawaParadise: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ,స్టార్ హీరోయిన్ అలియా భట్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ హిట్టాక్ సొంతం చేసుకుంది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ మూవీలో ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ లాంటి బి-టౌన్కు చెందిన ప్రముఖులు నటించిన సంగతి తెలిసిందే. అయితే చిత్రం విడుదలైనప్పటి నుంచి రణ్వీర్ సింగ్ పాత్ర నివసించిన లగ్జరీ బంగ్లా హాట్ టాపిక్గా నిలిచింది. ‘రాకీ రంధావా పారడైజ్’ గా సినిమాలో చూపించిన సుందరమైన 'రాకీ రాంధావా' భవనంలోని అద్బుతమైన షాట్లు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండానే ఈ భవనంలోని దృశ్యాలు మంత్రముగ్దులను చేశాయి. షెహజాదా మూవీ చిత్రీకరణ కూడా ఇక్కడే జరిగిందట. విలాసవంతమైన భవనం సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇదిఅందమైన భవనం లండన్లో ఉందని కొందరు , స్విట్జర్లాండ్లో ఉందని సినీ ప్రియులు ఊహాగానాలు చేశారు. కానీ ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే ఇది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది. ఇంతకీ ఈ భవనం ఎవరిది, ఇందులో విశేషాలేంటి తెలుసుకుందా రండి! గౌర్ మల్బరీ మాన్షన్స్ స్వర్గధామంగా చిత్రీకరించిన ‘రాకీ రంధావా’ అసలు పేరు ది గౌర్ మల్బరీ మాన్షన్స్ ఇదిగ్రేటర్ నోయిడా సెక్టార్-1లో ఉంది. దాదాపు 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అంతేకాదు ఈ ఐకానిక్, యునైటెడ్ స్టేట్స్ కాపిటల్ భవనాన్ని కూడా పోలి ఉంటుందని కూడా అంచనా. ఫర్నీచర్, కళాఖండాలు, అలంకార వస్తువులు, ఫ్లోరింగ్, షాన్డిలియర్లు, కిటికీలు, మిర్రర్.. ఒకటేమిటి సర్వం పచ్చదనానికి మారు పేరుగా ఉన్నాయి. గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,ఎండీ మనోజ్ గౌర్ బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త, గౌర్స్ గ్రూప్ ఛైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ సొంతంఈ గౌర్ మల్బరీ మాన్షన్స్ . రియల్ ఎస్టేట్ దిగ్గజం మనోజ్ క్రెడాయ్ నేషనల్ చైర్మన్ మరియు క్రెడాయ్ (NCR) అధ్యక్షుడు కూడా. గత 28 సంవత్సరాలుగా, గౌర్స్ గ్రూప్కు లీడ్ చేస్తున్న మనోజ్ అనేక ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తిచేశారు. డెలివరీ నుంచి నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్ల నాణ్యతతోపాటు అందుబాటులో ధరల్లో గృహాలను అందిస్తూ తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగం మాత్రమేకాదు మనోజ్ గౌర్ కూడా పర్యావరణ పద్ధతులను పాటించడంలోనూ దిట్ట. సోలార్ పవర్ ప్లాంట్లో రూ.80 కోట్లు పెట్టుబడులున్నాయి.. -
చిన్న ప్రాజెక్ట్లు.. పెద్ద లాభాలు!
ప్రతికూల పరిస్థితుల్లోనూ హాట్కేకుల్లా ఫ్లాట్లు అమ్ముడుపోవాలంటే.. పునాదుల్లోనే సగానికిపైగా అమ్మకాలు జరగాలంటే.. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏడాదిలో గృహ ప్రవేశం చేయాలంటే.. వీటన్నింటికీ ఒకే సమాధానం చిన్న ప్రాజెక్ట్లు. నిజం చెప్పాలంటే చిన్న ప్రాజెక్ట్లు విస్తీర్ణంలోనే చిన్నవి.. వసతుల్లో మాత్రం పెద్ద ప్రాజెక్ట్లకు ఏమాత్రం తీసిపోవు. పైపెచ్చు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండటం చిన్న ప్రాజెక్ట్లకు మరింత కలిసొచ్చే అంశం. సాక్షి, హైదరాబాద్: బడా ప్రాజెక్టులు నిర్మించాలంటే కోట్లలో పెట్టుబడి కావాలి. అమ్మకాలు బాగుంటే పర్వాలేదు.. కానీ, సీన్ రివర్స్ అయ్యిందో ప్రాజె క్ట్ను పూర్తి చేయడం కష్టం. దీంతో అటు కొనుగోలుదారులకు, ఇటు నిర్మాణ సంస్థలకూ తలనొప్పే. ప్రతికూల పరిస్థితుల్లో గొప్పకు పోయి పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలు తెచ్చి ప్రాజెక్ట్లు ప్రారంభించి అమ్మకాల్లేక బోర్డు తిప్పేసిన సంస్థలనేకం. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాట్కేకుల్లా ప్రాజెక్ట్ అమ్ముడుపోవాలంటే చిన్న ప్రాజెక్ట్లే మేలని సూచిస్తున్నారు నిపుణులు. చేతిలో ఉన్న కొద్దిపాటి పెట్టుబడితో ప్రాజెక్ట్ను ప్రారంభించి.. పునాదుల్లోనే సగానికి పైగా అమ్మకాలు చేసుకునే వీలుంటుంది కూడా. ఏడాదిలో గృహప్రవేశం.. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొద్దిపాటి స్థలంలోనే చిన్నపాటి నిర్మాణాలు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. అప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం కావటం, ఆధునిక వసతులూ కల్పిస్తుండటంతో కొనుగోలుదారులూ వీటిల్లో ఫ్లాట్లు కొనేందుకు ముందుకొస్తున్నారు. చిన్న ప్రాజెక్ట్ల మార్కెట్లో లాభాలు తక్కువగానే ఉంటాయి. అయినా నిర్మాణం చేపట్టడానికి సిద్ధం. ఎందుకంటే ఈ నిర్మాణాలు ఏడాది లేక 15 నెలల్లో పూర్తవుతాయి. దీంతో త్వరగానే కొనుగోలుదారుల సొంతింటి కల నెరవేరడంతో పాటు మార్కెట్లో తమ కంపెనీ బ్రాండింగ్ పెరుగుతుందనేది నిర్మాణ సంస్థల వ్యూహం. అయితే చిన్న ప్రాజెక్ట్లు నిర్మించాలంటే స్థలం అంత సులువుగా దొరకదు. పోటీ ఎక్కువగా ఉంటుంది. వసతులకు కొదవేంలేదు.. గతంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్ట్ల్లో వసతులు కల్పించకపోయినా గిరాకీకి ఢోకా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు వచ్చింది. ధర ఎక్కువైనా.. వసతుల విషయంలో రాజీపడటం లేదు. దీంతో చిన్న ప్రాజెక్ట్ల్లోనూ ఆరోగ్యం కోసం వాకింగ్, జాగింగ్ ట్రాక్స్, యోగా, జిమ్, మెడిటేషన్ హాల్, ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేపింగ్లతో పాటుగా స్విమ్మింగ్ పూల్, బేబీ, మదర్ కేర్ సెంటర్, లైబ్రరీ.. వంటి ఏర్పాట్లుంటున్నాయి. అంతేకాకుండా చిన్న ప్రాజెక్ట్లో కొన్ని ఫ్లాట్లే ఉంటాయి. ఫ్లాట్వాసులందరూ ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉంటారు. దీంతో ఉమ్మడి కుటుంబాల లోటు తీరుతుందనేది కొనుగోలుదారుల అభిప్రాయం. -
హైదరాబాద్లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్టీ రంగంపై 111 జీవో ఎత్తివేత ప్రభావం గట్టిగానే పడనుంది. చదరపు అడుగు (చ.అ.) రూ.6 వేల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రాజెక్ట్లలో కొనుగోళ్లకు కస్టమర్లు పునరాలోచనలో పడ్డారు. ఎక్కువ ధర పెట్టి అపార్ట్మెంట్లలో కొనుగోలు చేసే బదులు అదే ధరకు 111 జీవో పరిధిలోని గ్రామాలలో వ్యక్తిగత గృహాలు, విల్లాలు కొనుగోలు చేయవచ్చనే భావన కొనుగోలుదారులలో పెరిగిపోయింది. దీంతో పశ్చిమ హైదరాబాద్లోని హైరైజ్, లగ్జరీ ప్రాజెక్ట్లలో విక్రయాలు తగ్గిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమంలో 50 వేల యూనిట్లు.. హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో పశ్చిమ హైదరాబాద్ కీలకమైనది. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల కారణంగా ఈ ప్రాంతాలలో గృహ కొనుగోళ్లు, లాంచింగ్లు ఎక్కువగా ఉంటాయి. ఏటా హైదరాబాద్లోని రియల్టీ క్రయవిక్రయాలలో వెస్ట్ హైదరాబాద్ వాటా 60 శాతం ఉంటుంది. కూకట్పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయ దుర్గం, కోకాపేట, గోపన్పల్లి, నల్లగండ్ల వంటివి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలలో సుమారు 10 కోట్ల చ.అ.లలో నివాస సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిల్లో సుమారుగా 50 వేల యూనిట్లు ఉంటాయని అంచనా. 111 జీవో రద్దుతో ఆయా ప్రాజెక్ట్ల డెవలపర్లు డోలాయమానంలో పడ్డారు. ప్రీలాంచ్ నిర్మాణాలకు బ్రేక్.. కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ వంటి వెస్ట్ హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో డెవలపర్లు ప్రీలాంచ్లో విక్రయాలు చేశారు. ధర తక్కువకు వస్తుంది కదా అని కొనుగోలుదారులూ ఎగిరి గంతేసి బిల్డర్లతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాజెక్ట్లన్నీ నిర్మాణ దశలో ఉన్నాయి. గత 3–4 నెలలుగా మార్కెట్ ప్రతికూలంగా మారడంతో లగ్జరీ ప్రాజెక్ట్లలో కొనుగోళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. విక్రయాలు లేకపోవటం, నిధుల లేమి కారణంగా చాలా వరకు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నెమ్మదించాయి. తాజాగా 111 జీవో రద్దు ప్రకటించిన నాటి నుంచే పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రీలాంచ్లోని పలువురు కస్టమర్లు డెవలపర్తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయమని నిర్మాణ సంస్థల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డెవలపర్లను కోరుతున్నారని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ టీవీ నర్సింహా రెడ్డి తెలిపారు. స్పష్టత వచ్చేదాక స్తబ్ధుగానే.. జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చిన జీవో 111ను ప్రభుత్వం ఎత్తేసి 69 జీవో తీసుకొచ్చినా స్థానిక భూ యజమానులు మాత్రం వేచిచూసే ధోరణిలో ఉన్నారు. వెంటనే భూములు అమ్మడానికి ఆసక్తి చూపడంలేదు. నగరానికి అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతంలో మునుముందు భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం గ్రీన్ జోన్, బఫర్ జోన్లు చేస్తామని ప్రకటించింది. దీంతో ఏయే ప్రాంతాలు గ్రీన్ జోన్లో ఉంటాయి? ఏ ప్రాంతాలు బఫర్ జోన్లో ఉంటాయనే విషయంలో స్పష్టత లేదు. దీంతో ఇప్పుడు భూములు ఎందుకు అమ్ముకోవాలని రైతులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అవసరాల కోసం కొందరు రైతులు భూములు అమ్మకానికి పెట్టినా గతం కంటే ఎక్కువ ధరలే చెబుతున్నారు. జీవో 69 విధివిధానాలను మాత్రం ఖరారు చేయలేదు. భవన నిర్మాణ నిబంధనలు, జలాశయాల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, జోన్ల ఏర్పాటు, మాస్టర్ ప్లాన్ వంటి వాటిపై స్పష్టత వస్తే ఇక్కడి భూములకు మరింత గిరాకీ ఉంటుంది. ప్రభావిత ప్రాంతాలివే.. కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, గోపన్పల్లి, నానక్రాంగూడ, ఖానామెట్, నార్సింగి, కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ వంటి 111 జీవో పరిధిలోని 10 కి.మీ. క్యాచ్మెంట్ ఏరియాకు ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండున్నర దశాబ్ధాల కలను ప్రభుత్వం సాకారం చేసింది. 111 జీవోను ఎత్తివేస్తూ రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. దీంతో 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాలకు పైగా భూమి అందుబాటులోకి వస్తుంది. ఆహ్వానించదగ్గ పరిణామమే.. కానీ, ఆ ఫలాలు నిజంగా స్థానిక రైతులకు అందుతాయా అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. నిర్మాణ నిబంధనల సాకు చూపి ఇప్పటికే 60 శాతానికి పైగా భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో జీవో రద్దు ఫలాలు ఎవరికి దక్కుతాయనేది సుస్పష్టం. చదవండి👉 ఫ్లాష్బ్యాక్: ఆ నిర్ణయంతో..అతలాకుతలం -
చిట్ వద్దు, ఫైనాన్స్ వద్దు.. జాగా కొంటే.. అదే ముద్దు
సాక్షిప్రతినిధి, కాకినాడ: కోవిడ్ తదనంతర పరిణామాలతో ప్రజలు నగదు నిల్వలకు వెనుకంజ వేస్తున్నారు. నగదు నిల్వల కంటే చర, స్థిరాస్తులపై పెట్టుబడికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఏదో ఆరోగ్యం, విద్య వంటి అత్యవసరాలకు తప్పించి నగదు తమ వద్ద ఉంచుకోవాలనే ఆలోచనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సంపన్నుల నుంచి ఎగువ మధ్యతరగతి వర్గాల వరకు ఎవరిని కదిపినా ఇదే మాట చెబుతున్నారు. ఇంతవరకు కొంతమంది నాలుగు లక్షల రూపాయలు కూడబెడితే చాలు రూ.2 వడ్డీకి అప్పు ఇచ్చి నెలనెలా వచ్చే సొమ్ముతో కాలక్షేపం చేసేవారు. కోవిడ్ సమయంలో సంభవించిన మరణాలు, అనంతరం పెరుగుతున్న హఠాన్మరణాలతో వడ్డీ మాట దేవుడెరుగు.. కనీసం అసలు కూడా తిరిగి రావడం లేదని వారంతా గగ్గోలు పెడుతున్నారు. అభద్రతతో ఆందోళన దీనికితోడు మార్గదర్శి వంటి చిట్ఫండ్ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకులు, కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీలు ప్రజల నుంచి కోట్లు డిపాజిట్లు సేకరించి నిధులు తమ అవసరాలకు మళ్లిస్తున్నాయి. కొన్ని బోర్డు తిప్పేస్తున్నాయి. ఈ పరిణామాలతో డబ్బులు దాచుకున్న వారిలో కూడా అభద్రతాభావం వచ్చేసింది. ఈ పరిస్థితులను బేరీజు వేసుకుని నగదు నిల్వ పెంచుకోవడం కంటే భూములు, ఇళ్ల కొనుగోలు మేలు అని ఎక్కువ మంది భావిస్తున్నారు. స్థిరాస్తులు కూడబెట్టుకుంటే ఏ క్షణాన అవసరం వచ్చినా బ్యాంకుల్లో కుదవ పెట్టుకుని అప్పటికప్పుడు సొమ్ము తెచ్చుకోవచ్చుననే ఒక భరోసా ఇందుకు ప్రధాన కారణం. అప్పులు ఇచ్చి అసలు కోసం పోలీసు స్టేషన్లు, ప్రైవేటు సెటిల్మెంట్ల కోసం తిరగడం కంటే భూములు, ప్లాట్లు, ఇళ్లు కొనుక్కుని పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోవచ్చునని భావిస్తున్నారు. రెండు మూడేళ్లకే రేట్ల పెరుగుదల నాలుగు డబ్బులు వెనకేసుకునేవారి ఆలోచనలు మారడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భూములు, ప్లాట్లు క్రయ, విక్రయాలు పెరుగుతున్నాయి. ఏటా రిజిస్ట్రేషన్లు కూడా రెట్టింపవుతున్నాయి. బడా బాబులు భారీగా భూములు కొనుగోలు చేస్తుంటే, ఎగువ ..దిగువ మధ్య తరగతి వర్గాలు కుటుంబ పోషణ పోగా మిగుల్చుకున్న కొద్దిపాటి సొమ్ముతో 100, 150 గజాలు కొనుగోలు చేస్తున్నారు. గజం రూ.15వేలు పెట్టి కొనుగోలు చేసిన స్థలాల రేట్లు రెండు, మూడేళ్లకే పెరిగిపోతున్నాయి. దీంతో ఇది లాభార్జనగా ఉంటుందని మధ్యతరగతి వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. ఇలా కొనుగోలు చేసిన స్థలాలు భవిష్యత్తులో పిల్లల చదువులు, వివాహాలకు కలసి వస్తాయని వారు చెబుతున్నారు. సరళతరంగా బ్యాంకుల్లో వస్తున్న రుణాలు తీసుకుని మరీ స్థలాలు కొనుగోలు చేస్తున్న వారూ లేకపోలేదు. బడాబాబులు, కాంట్రాక్టర్లు, అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చిన వారు సైతం రికవరీ చేసి స్థలాలపై పెట్టుబడి పెడుతున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత.. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు అమలాపురం సహా రామచంద్రపురం, మండపేట, తుని, సామర్లకోట వంటి పట్టణాల పరిసర ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్ల క్రయ, విక్రయాలు ఇటీవల రెట్టింపయ్యాయి. హాట్కేక్లుగా అమ్ముడు పోయే ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్లకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగర పరిసర ప్రాంతాల్లో స్థలాలు, భూములు, ఇళ్లు కొనుగోలుకు నాడు జిల్లా నలుమూలల నుంచి ఎక్కువ ఆసక్తి కనబరిచేవారు. పునర్విభజన తరువాత కాకినాడతో పాటు అమలాపురం, రాజమహేంద్రవరం జిల్లా కేంద్రాలయ్యాయి. ఇప్పుడు వాటిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల భూములు రియల్ ఎస్టేట్లుగా ఎక్కువ రూపాంతరం చెందుతున్నాయి. అపార్టుమెంట్ సంస్కృతి పెరగడంతో స్థలాల విలువ రెట్టింపు అయింది. పెరుగుతున్న రియల్ ఎస్టేట్లు కోనసీమ కేంద్రం అమలాపురానికి ఆనుకుని ఎర్రవంతెన, కామనగరువు, ఈదరపల్లి, పేరూరు, భట్నవిల్లి, బండార్లంక, రాజమహేంద్రవరంలో గోదావరి గట్టు నుంచి తొర్రేడు, మధురపూడి విమానాశ్రయం రోడ్డు నుంచి గాడాల, లాలాచెరువు నుంచి దివాన్చెరువు, జాతీయ రహదారి నుంచి శ్రీరామపురం రోడ్డు, రాజవోలు, సంపత్నగర్ వరకు నివాసప్రాంతాలుగా విస్తరిస్తున్నాయి. కాకినాడకు ఆనుకుని మేడలైన్, చీడిగ, కొవ్వాడ, తూరంగి, పెనుగుదురు, సర్పవరం, గైగోలుపాడు, ఏపీఎస్పీ, అచ్చంపేట వాకలపూడి వరకు రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగింది. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. జిల్లాల విభజన జరుగుతుందనే ముందుచూపుతో గడచిన రెండేళ్లుగా జిల్లా కేంద్రాలకు ఆనుకుని ఐదారు కిలోమీటర్ల వరకు భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్లు కూడా పెరిగాయి. పట్టణానికి సమీపాన నాలుగైదు కిలోమీటర్ల వరకు ఖాళీగా ఉన్న పంట భూములు రియల్ ఎస్టేట్లుగా మారి నివాసప్రాంతాలు అవుతున్నాయి. గడచిన నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ల ఆదాయ గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రిజిస్ట్రేషన్, ఆదాయం వివరాలు సంవత్సరం దస్తావేజులు ఆదాయం 2018–19 1,48,213 541.74 కోట్లు 2019–20 1,91,191 592. 07 కోట్లు 2020–21 1,67,095 638.21 కోట్లు 2021–22 2,44,695 907.16 కోట్లు 2022–23 2,66,233 886.88 కోట్లు భవిష్యత్తుకు భరోసాగా భూములపై పెట్టుబడి భూములు, స్థలాలు, ఫ్లాట్లపై పెట్టుబడి పెట్టడమంటే అన్ని వర్గాల ప్రజలు భరోసాగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్లు పుంజుకున్నాయి. ఆదాయం కూడా బాగా పెరుగుతూ వస్తోంది. కోవిడ్ తరువాత పరిణామాలతో ప్రజల ఆలోచనా విధానం మారింది. భూములపై పెట్టుబడి పెడితే భవిష్యత్తులో వాటి విలువ పెరుగుదలే తప్ప తరుగుదల ఉండదనే నమ్మకం ఏర్పడింది. దీంతో స్థిరాస్థులపైనే ఎక్కువగా డబ్బు పెడుతున్నారు. – ఎ.నాగలక్ష్మి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, కాకినాడ. కొనుగోలు భద్రతనిస్తోంది భూమి కొనుగోలు కుటుంబానికి భద్రతనిస్తుంది. గతంలో బ్యాంకులో భద్రపరుచుకోవడం, లేకపోతే వడ్డీలకు ఇవ్వడం చేసేవారు. కొన్ని సొసైటీలు రాత్రికి రాత్రే ఎత్తివేయడం, వడ్డీకి తీసుకునేవారు తిరిగి ఇచ్చే విషయంలో ఏర్పడే సమస్యలతో విసుగెత్తిపోయారు. దీంతో రోజురోజుకూ పెరుగుతున్న భూమి రేట్లను దృష్టిలో పెట్టుకుని భూములు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. – జాడ అప్పలరాజు, దస్తావేజు లేఖరి, కాకినాడ విలువ పెరుగుతుందనే కొన్నాను రెక్కల కష్టం మీద కుటుంబం నెట్టుకొస్తున్నాను. కూడబెట్టిన కొద్దిపాటి సొమ్మును భూమిపై పెట్టడం మంచిదనుకున్నాను. మున్ముందు ఆ భూమి విలువ పెరుగుతుందని 100 గజాల స్థలాన్ని కొన్నాను. ఎక్కడైనా బ్యాంకులో వేద్దామన్నా నమ్మకం కుదరడం లేదు. ఇవన్నీ ఆలోచించే పెట్టిన సొమ్ముకు భరోసాతోపాటు, ధరలు కూడా పెరుగుతాయని జాగా కొనుక్కున్నాను. – డి.రమేష్, ఇంద్రపాలెం, కాకినాడ -
రియల్ ఎస్టేట్కు తగ్గని డిమాండ్.. హైదరాబాద్లో భారీగా పెరిగిన అమ్మకాలు
న్యూఢిల్లీ: భారత్లో జనవరి–మార్చిలో ఎనమిది ప్రధాన నగరాల్లో స్థిరాస్తి రంగం స్థిర డిమాండ్ను నమోదు చేసిందని రియల్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ‘2022 తొలి త్రైమాసికంతో పోలిస్తే 2023 జనవరి–మార్చిలో గృహాల విక్రయాలు 1 శాతం ఎగసి 79,126 యూనిట్లు నమోదయ్యాయి. గృహాల అమ్మకాలు హైదరాబాద్లో 19 శాతం పెరిగి 8,300 యూనిట్లు, చెన్నై 8 శాతం వృద్ధితో 3,650 యూనిట్లుగా ఉంది. (రిలయన్స్ డిజిటల్ డిస్కౌంట్ డేస్: ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు) కార్యాలయాల స్థూల లీజింగ్ 5 శాతం దూసుకెళ్లి 1.13 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. హైదరాబాద్లో ఆఫీస్ లీజింగ్ 46 శాతం క్షీణించి 8 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఎనమిది నగరాల్లో గృహాల ధరలు 1–7 శాతం అధికం అయ్యాయి. బెంగళూరులో 7 శాతం, ముంబై 6, హైదరాబాద్, చెన్నైలో 5 శాతం ధరలు పెరిగాయి. ఆఫీసుల అద్దె 2–9 శాతం హెచ్చింది. కోల్కతలో 9 శాతం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో 5 శాతం దూసుకెళ్లాయి. (అప్పుడు కొనలేకపోయారా..? ఇప్పుడు కొనండి..) బలమైన ఆర్థిక వాతావరణం కారణంగా 2023లో ఆఫీస్ మార్కెట్ సానుకూలంగా అడుగు పెట్టడానికి సహాయపడింది. 2023 మొదటి త్రైమాసికంలో అమ్మకాల స్థాయి నిలకడగా ఉన్నందున పెరుగుతున్న వడ్డీ రేట్లు, ధరల నేపథ్యంలో గృహాల మార్కెట్ స్థితిస్థాపకంగా ఉంది. కొన్ని నెలలుగా గృహ కొనుగోలుదార్ల కొనుగోలు సామర్థ్యం ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ సొంత ఇంటి ఆవశ్యకత డిమాండ్ను పెంచుతూనే ఉంది. మధ్య, ప్రీమియం గృహ విభాగాలు ఈ నగరాల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. ఈ ఏడాది కూడా పరిమాణం పెంచుతాయని ఆశించవచ్చు’ అని వివరించింది. (అంచనాలకు మించి పన్ను వసూళ్లు.. ఏకంగా రూ.16.61 లక్షల కోట్లు) -
హైదరాబాద్లో మరో డేటా సెంటర్, వందల కోట్లలో పెట్టుబడులు
సింగపూర్కు చెందిన ప్రముఖ డైవర్సిఫైడ్ రియల్ఎస్టేట్ సంస్థ క్యాప్టాల్యాండ్ (CapitaLand) వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టుంది. పెట్టుబడులకు స్వర్గధామమైన హైదరాబాద్లో రూ.1200కోట్లతో డేటా సెంటర్ను నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా క్యాప్టాల్యాండ్ తన భవిష్యత్ కార్యచరణ వివరించింది. . రానున్న 5 - 7 సంవత్సరాల్లో పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్ కింద రూ.5వేల కోట్లు, డేటా సెంటర్, ఆఫీస్ స్పేప్రాజెక్ట్ కింద మొత్తంగా రూ.6,200కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా క్యాప్టాల్యాండ్ యాజమాన్యం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. Very Happy to announce that @CapitaLand is investing in a Data Center in Hyderabad with a capacity of 36 MW and an investment ₹1200 Crores scheduled to be developed and deployed by the end of 2024 MoU signed today for the same#HappeningHyderabad pic.twitter.com/mEOohSWRQs — KTR (@KTRTRS) December 6, 2022 -
రియల్ ఎస్టేట్ కంపెనీల దివాలా, కంటిమీద కునుకు లేని చైనా
రుణాల ఎగవేతలో చైనా రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీలు పడుతున్నాయి. మొత్తం మీద పాతిక్కి పైగా కంపెనీలు తాము జారీ చేసిన బాండ్లకు చెల్లింపులు చేయకుండా చేతులెత్తేసినట్లు సమాచారం. మరి కొన్ని కంపెనీలు అనుకున్న షెడ్యూల్ సమయానికి ఇవ్వకుండా నాన్చి ఆలస్యంగా చెల్లింపులు చేశాయి. దీంతో వినియోగదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. షాంఘైకి చెందిన షిమో గ్రూప్ రియల్ కంపెనీ బిలియన్ డాలర్ల విలువ జేసే బాండ్లకు వడ్డీయే కాదు అసలు కూడా ఎగ్గొట్టింది. (చైనాలో ఇంత దారుణంగా ఉందా? అసలు ఏం జరుగుతోంది?) చైనాలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన షిమోయే ఇలా ఎగ్గొడితే ఇక చిన్నా చితకా రియల్ కంపెనీల సంగతేంటి? అని ఆర్ధిక రంగ నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కంపెనీకు 5.5 బిలియన్ డాలర్ల మేరకు విదేశీ అప్పులూ ఉన్నాయి. ఎవర్ గ్రాండే సంక్షోభం వెలుగులోకి వచ్చిన తర్వాత జింగ్ పింగ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఆంక్షలను కఠిన తరం చేయడంతో చాలా రియల్ కంపెనీలు దివాళా దిశగా పయనిస్తున్నాయి. జిన్ పింగ్ చైనా అధ్యక్షుడు అయ్యాక దేశంలో రియల్ ఎస్టేట్ రంగం వాయు వేగంతో పెరిగిపోయింది. ఏకంగా 600 శాతం మేరకు పెరిగిపోయింది. దీనికి కారణం మితిమీరిన ప్రమోషన్లే. ఆకర్షణీయమైన వెంచర్లను ప్లాన్ చేస్తూ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆశ్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో అప్పులు సమీకరిస్తోన్న రియల్ వ్యాపారులు తమ ఇళ్లు అమ్ముడు పోక తమకు రావల్సిన డబ్బులు చేతికి రాక పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేక నిర్దాక్షిణ్యంగా బోర్డులు తిప్పేస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ పెట్టుబడి దారులూ నష్టపోవలసి వస్తోంది. నిజానికి 1998 వరకు చైనాలో ఇళ్ల విక్రయాలపై కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. అప్పట్లో మూడింట ఒక వంతు మాత్రమే నగరాల్లో ఉండేవారు. ఆ తర్వాత నిబంధనలు సరళీకృతం చేయడంతో నగరీకరణ వేగం పుంజుకుంది. రియల్ ఎస్టేట్ రంగంలో చోటుచేసుకున్న సంక్షోభం చైనా పాలకులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎందుకంటే రియల్ వ్యాపారం ఢమాల్ మంటే అది చైనా ఆర్ధిక వ్యవస్థనే కుప్పకూల్చే ప్రమాదం ఉంటుంది. (ఇంకా ఉంది..పడిపోతున్న ప్రాపర్టీ మార్కెట్ను రక్షించే ప్రయత్నాల్లో "బిల్డ్, పాజ్.. డిమాలిష్..రిపీట్ " విధానాన్ని అవలంబించిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వరస కథనాలు ) -
Hyderabad: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్పై ఐటీ దాడులు
సాక్షి, హైదరాబాద్: వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏకకాలంలో 20 చోట్ల సోదాలు చేశారు. ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. వాసవి కన్స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ ప్రధాన కార్యాలయాల్లో 20 మంది ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహించారు. వేల కోట్లు పనులు చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కంపెనీ అక్రమ లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. వాసవీ గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి సమాచారం సేకరిస్తున్నారు. ఈ సోదాల్లో సంస్థకు అక్రమాలకు సంబంధించి పలు కీలక ఫైళ్లను, సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. చదవండి: (హాస్టళ్లపై పోలీసుల ఫోకస్.. ఈ పది నిబంధనలు పాటించాల్సిందే) -
గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు.. రియల్ ఎస్టేట్పై తగ్గిన ఆసక్తి!
న్యూఢిల్లీ: గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపుతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రంగంపై ఆసక్తి కొంత తగ్గింది. నైట్ ఫ్రాంక్ ఇండియా, నారెడ్కో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ సూచీ క్యూ2లో 62 పాయింట్లకు పరిమితమైంది. జనవరి–మార్చి త్రైమాసికంలో (క్యూ1) ఇది 68గా నమోదైంది. డెవలపర్లు, ఇన్వెస్టర్లు, ఆర్థిక సంస్థలపై సర్వే ప్రాతిపదికన ఈ సూచీలో స్కోరు ఉంటుంది. 50కి ఎగువన ఉంటే సెంటిమెంటు ఆశావహంగా ఉన్నట్లు, సరిగ్గా 50 ఉంటే యథాతథంగా లేదా తటస్థంగా ఉన్నట్లు, 50కి దిగువన ఉంటే నిరాశ ధోరణిలో ఉన్నట్లు పరిగణిస్తారు. ఈ ఏడాది మే, జూన్లో రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండు సార్లు కీలక పాలసీ రేట్లను పెంచడంతో గృహ రుణాల వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలతోనే క్యూ2లో సెంటిమెంట్ సూచీ స్కోరు తగ్గిందని వివరించాయి. వచ్చే ఆరు నెలల కాలాన్ని ప్రతిబింబించే భవిష్యత్ ధోరణి సెంటిమెంట్ సూచీ కూడా క్యూ1లోని చారిత్రక గరిష్ట స్థాయి 75 నుండి క్యూ2లో 62 పాయింట్లకు తగ్గింది. ద్రవ్యోల్బణం, డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణత వంటి అంశాలు ఇందుకు కారణం. అయినప్పటికీ ప్రస్తుత, భవిష్యత్ సూచీలు రెండూ 50కి ఎగువనే ఉన్న నేపథ్యంలో సెంటిమెంటు వచ్చే ఆరు నెలలు ఆశావహంగానే ఉండగలవని నైట్ ఫ్రాంక్–నారెడ్కో నివేదికలో పేర్కొన్నాయి. నివేదికలోని మరిన్ని వివరాలు.. ♦రియల్ ఎస్టేట్ రంగంలో సరఫరాకు కీలకంగా ఉండే డెవలపర్లు, ఇన్వెస్టర్లు తదితర వర్గాలు .. అమెరికాలో ఆర్థిక సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, యూరప్లో ఆర్థిక మందగమనం వంటి అంశాలపై మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. ♦రెసిడెన్షియల్ విభాగంలో పటిష్టమైన డిమాండ్ ఉన్నట్లు గత 8–10 త్రైమాసికాలుగా రుజువైంది. సరైన ధర, ప్రోత్సాహకాలు ఉంటే ఇది అమ్మకాల రూపంలోకి మారగలదు. ♦కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కమర్షియల్ ఆఫీస్ విభాగం వృద్ధి బాట పట్టింది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి, నియామకాల జోరు, ఉద్యోగులు తిరిగి కార్యాలయాలకు వస్తుండటం తదితర అంశాలతో గత 3–4 త్రైమాసికాలుగా ఈ విభాగం పుంజుకుంటోంది. -
కరోనాలోనూ 'రియల్' దూకుడు! రూ.65,000 కోట్లకు రియల్టీ!
కోల్కతా: రియల్ ఎస్టేట్ పరిశ్రమ 2024 నాటికి రూ.65,000 కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2025 నాటికి దేశ జీడీపీలో రియల్టీ పరిశ్రమ వాటా 13 శాతానికి చేరుతుందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 2019లో రూ.12,000 కోట్లుగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. కరోనాకు సంబంధించి ఆందోళనలు ఉన్నప్పటికీ.. 2022లో మార్కెట్ సానుకూలంగా ఉంటుందని, రియల్ ఎస్టేట్ రంగంలోని అన్ని విభాగాల్లోనూ డిమాండ్ పుంజుకుంటుందని అంచనా వేసింది. వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ను ప్రస్తావిస్తూ.. టెక్నాలజీ ఆధారిత ఎకోసిస్టమ్ ఉన్న కార్యాలయ వసతులకు డిమాండ్ ఉంటుందని తెలిపింది. డెవలపర్లు టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేస్తున్నారని, డిజిటల్ చానల్స్ ద్వారా వినియోగదారులను చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. భారత రిటైల్ పరిశ్రమ 2021–2030 మధ్య 9 శాతం చొప్పున వృద్ది చెంది 2026 నాటికి 1400 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్నది అంచనా. భారతీయులు ఆన్లైన్ రిటైల్ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని, 2024 నాటికి దేశ ఈ కామర్స్ పరిశ్రమ 111 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని క్రిసిల్ అంచనా వేసింది. వేర్ హౌసింగ్ (గోదాములు) రియల్ ఎస్టేట్ ఇక మీదటా వృద్ధిని చూస్తుందని, ఈ కామర్స్ విస్తరణ కలసి వస్తుందని.. ఈ విభాగంలో లావాదేవీలు 20 శాతం వృద్ధిని చూస్తాయని పేర్కొంది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశ ఫైనాన్షియల్ మార్కెట్లకు మద్దతుగా నిలుస్తుంటే, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యం చూపిస్తున్నట్టు క్రిసిల్ నివేదిక తెలియజేసింది. చదవండి👉హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే! -
ఎగబడి కొంటున్న జనం! హైదరాబాద్లో ఈ ధర ఇళ్లకు యమ డిమాండ్!
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు రాత్రికి రాత్రే పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలతో హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది. ఇలాంటి సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు సరైన నిర్ణయం కాదని, దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు గృహాలను కొనలేరని స్థిరాస్తి నిపుణులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయినా సరే ప్రభుత్వం ఏవీ పట్టించుకోకుండా ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటూ మార్కెట్ విలువలను కూడా పెంచేసింది. ఫలితంగా గత నెలలో నగరంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి. మధ్య తరగతి గృహాల మార్కెట్గా పేరొందిన హైదరాబాద్ రియల్టీపై రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు నిర్ణయం గట్టి దెబ్బే వేసింది. రూ.25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న అపార్ట్మెంట్లపై రిజిస్ట్రేషన్ చార్జీల పెరుగుదల ఎక్కువ ప్రభావం చూపించింది. గత నెలలో ఈ కేటగిరీ కేవలం 844 అపార్ట్మెంట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అదే గతేడాది ఫిబ్రవరిలో ఈ విభాగంలో 2,888 ఫ్లాట్లు అమ్ముడుపోవటం గమనార్హం. 2021 ఫిబ్రవరిలో నగరంలోని గృహ విక్రయాలలో రూ.25 లక్షలలోపు ధర ఉన్న అపార్ట్మెంట్ల వాటా 42% కాగా.. ఈ ఏడాది ఫిబ్ర వరి నాటికిది 16%కి పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో చూస్తే ఈ విభాగం విక్రయాల వాటా 32 శాతంగా ఉంది. క్షీణత రెండోసారి: 2022 ఫిబ్రవరిలో నగరంలో రూ.2,722 కోట్ల విలువ చేసే 5,146 యూనిట్లు విక్రయమయ్యాయి. ఇందులో 52 శాతం యూనిట్లు రూ.25–50 లక్షల మధ్య ధర ఉన్నవే. కాగా.. ఈ ఏడాది జనవరిలో రూ.2,695 కోట్ల విలువ చేసే 5,568 యూనిట్లు అమ్ముడుపోయాయి. గతేడాది ఫిబ్రవరిలో 6,877 యూనిట్లు విక్రయమయ్యాయి. అంటే ఏడాది కాలంతో పోలిస్తే అమ్మకాలు 25 శాతం తగ్గాయి. సేల్స్లో క్షీణత నమోదవటం 2022 ఆర్ధిక సంవత్సరంలో ఇది రెండోసారని నైట్ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్లో ఈ ధర ఇళ్లకు డిమాండ్: గతేడాది ఫిబ్రవరిలో జరిగిన అపార్ట్మెంట్ విక్రయాలలో హైదరాబాద్ వాటా 20 శాతం ఉండగా..ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 10 శాతానికి క్షీణించింది. మేడ్చల్–మల్కాజ్గిరి వాటా 39 శాతం నుంచి 42 శాతానికి, రంగారెడ్డి వాటా 37 శాతం నుంచి 43 శాతానికి, సంగారెడ్డి వాటా 4 శాతం నుంచి 5 శాతానికి పెరిగాయి. "రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాల విక్రయాలు గతేడాది ఫిబ్రవరిలో 34 శాతం ఉండగా.. ఇప్పుడవి 52 శాతానికి వృద్ధి చెందాయి. అలాగే రూ.75 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న గృహాలు 7 శాతం నుంచి 9 శాతానికి, రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న గృహ విక్రయాలు 7 శాతం నుంచి 9 శాతానికి" పెరిగాయి. 16 శాతం డౌన్: గతేడాది ఫిబ్రవరిలోని గృహ విక్రయాలలో 1,000 చ.అ.లోపు విస్తీర్ణం ఉండే మధ్యతరగతి అపార్ట్మెంట్ల వాటా 19% ఉండగా.. ఇప్పుడవి 16 శాతానికి పడిపోయాయి. గత నెలలోని అమ్మకాలలో 74 శాతం అపార్ట్మెంట్లు 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణాలున్నవే. 2021 ఫిబ్రవరిలో వీటి వాటా 70%గా ఉంది. అలాగే 2,000 చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణమైన గృహాలు కూడా 10% నుంచి 11%కి వృద్ధి చెందాయి. చదవండి: దుమ్ముదులిపేస్తున్న ఇళ్ల అమ్మకాలు, ఆ 7 నగరాల్లో రాకెట్ సేల్స్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement