-
టికెట్ రద్దయితే.. రైల్వేకు పండగే!
సాక్షి, విశాఖపట్నం: దూర ప్రయాణాలకు వెళ్లాలంటే అందరికీ గుర్తొచ్చేది రైలే. మూడు నెలల ముందే టికెట్ తీసుకుంటే గానీ బెర్త్ దొరకని పరిస్థితి. ఒక్కోసారి టికెట్ కన్ఫర్మ్ కాదు. చివరి నిమిషంలోనైనా బెర్త్ దొరకదా.. కనీసం ఆర్ఏసీ అయినా అవ్వదా అనే ఆశతో ప్రయాణి కులు ఉంటారు. చివరి వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే క్యాన్సిల్ చేస్తుంటాం. కొన్నిసార్లు.. అత్యవసరంగా టికెట్ రద్దు చేసుకుంటుంటాం. రద్దు చేసుకున్న ప్పుడు కొంతమేర డబ్బులకు కోత విధించి.. రైల్వే శాఖ రీఫండ్ చేస్తుంటుంది. క్యాన్సిలేషన్ రుసుం కింద కోత విధించిన సొమ్ము రైల్వే ఖాతాలోకి జమ అవుతుంది. ఏటా సగటున రూ.2 వేల కోట్లు: వెయిటింగ్ లిస్ట్లో రూ.240 టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే.. కేవలం రూ.180 మాత్రమే రీఫండ్ వస్తుంది. అంటే.. రైల్వే సేవలేవీ వినియోగించుకోకుండానే ఆ శాఖకు సర్వీస్ చార్జ్ని ప్రయాణికులు చెల్లిస్తున్నట్టే. ఇలా టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ. 2022–23 సంవత్సరంలో టికెట్ క్యాన్సిలేషన్, క్లర్కేజ్ చార్జీల ద్వారా రూ.2,109.74 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే బోర్డు వెల్లడించింది. అదేవిధంగా 2023 ఏప్రిల్ 2023 డిసెంబర్ వరకూ రూ.1,762.62 కోట్లు జమ అయింది. అంటే గతేడాదితో పోలిస్తే.. 2023–24లోనూ పూర్తి లెక్కలు తేలాక రూ.2,200 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన టికెట్ క్యాన్సిలేషన్స్ ద్వారా రైల్వే శాఖకు ఏటా సగటున రూ.2 వేల కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. రూ.60 నుంచి రూ.240 వరకూ కట్ ప్రయాణ తరగతి ఆధారంగా టికెట్ రద్దు రుసుంలు మారుతూ ఉంటాయి. రెండో తరగతి టికెట్ క్యాన్సిలేషన్కు రూ.60 నుంచి మొదలై.. ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్కు రూ.240 వరకు చార్జీలు ఉంటాయి. సెకండ్ ఏసీకి అయితే రూ.200, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్ అయితే రూ.180 వసూలు చేస్తారు. స్లీపర్ క్లాస్కు రూ.120 వరకూ రుసుం కింద రైల్వే శాఖ కట్ చేసుకుంటుంది. ట్రైన్ బయలుదేరడానికి నాలుగు గంటలలోపు టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జి 50 శాతం ఉంటుంది. ఒక వేళ ట్రైన్ బయలుదేరడానికి 72 గంటలలోపు, అంటే మూడు రోజుల ముందే టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జీలు ఉండవు. వారికి పూర్తి రీఫండ్ లభిస్తుంది. -
పీఏసీఎల్ బాధితులకు శుభవార్త.. ప్రారంభమైన రిఫండ్
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ పథకాల ద్వారా నిధులు సమీకరించిన పీఏసీఎల్ ( PACL )లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన బాధితులకు చెల్లింపులు చేపట్టినట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. రూ. 19,000 వరకూ క్లెయిముల చెల్లింపుల కోసం దాదాపు రూ. 1,022 కోట్లు వెచ్చించినట్లు తెలియజేసింది. ఇందుకు అర్హమైన 20,84,635 దరఖాస్తుల(ఇన్వెస్టర్లు)కు చెల్లింపులను పూర్తి చేసినట్లు వెల్లడించింది. గతంలో వ్యవసాయం, రియల్టీ బిజినెస్ల పేరుతో పీఏసీఎల్ అక్రమ పథకాల ద్వారా రూ. 60,000 కోట్లకుపైగా సమీకరించినట్లు సెబీ తెలియజేసింది. రిటైర్డ్ జస్టిస్ ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ దశలవారీగా రిఫండ్స్ను ప్రారంభించినట్లు వివరించింది. పెట్టుబడులు చేపట్టిన ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించడంలో విఫలంకావడంతో 2015 డిసెంబర్లో పీఏసీఎల్తోపాటు.. 9మంది ప్రమోటర్లు, డైరెక్టర్లకు చెందిన అన్ని ఆస్తులనూ అటాచ్ చేయవలసిందిగా సెబీ ఆదేశించింది. నిజానికి 2014 ఆగస్ట్ 22న ఇన్వెస్టర్లకు సొమ్మును రీఫండ్ చేయవలసిందిగా పీఏసీఎల్సహా సంస్థ ప్రమోటర్లు, డైరెక్టర్లను సెబీ ఆదేశించింది. ఇందుకు మూడు నెలల గడువును సైతం ప్రకటించింది. -
వచ్చేవారంలోగా రిఫండ్స్ జరగాలి
న్యూఢిల్లీ: కోవిడ్ లాక్డౌన్ సమయంలో బుక్ చేసుకున్న విమాన టిక్కెట్లు, సర్వీసుల రద్దుకు సంబంధించిన రిఫండ్లను వచ్చే వారంలోగా (నవంబర్ 3 వారం లోపు) రిఫండ్ చేయాలని ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 25 నుండి వివిధ దశాల్లో దేశంలో లాక్డౌన్ అమలయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పలు విమాన సేవలను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే అప్పటి ముందస్తు బుకింగ్ల విషయంలో కొందరికి రిఫండ్స్ జరగలేదు. కొన్ని సాంకేతిక, ఆర్థిక అంశాలు దీనికి కారణంగా ఉన్నాయి. ఈ అంశంపై ఆన్లైన్ ట్రావెల్ అగ్రిగేటర్లతో వినియోగ వ్యవహారాల మంత్రిత్వశాఖ కీలక సమావేశం జరిగింది. వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో నవంబర్ మూడవవారంలోపు రిఫండ్స్ జరగాలని అగ్రిగేటర్లకు స్పష్టం చేసినట్లు ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. ప్రకటన ప్రకారం వినియోగదారుల ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు అంబుడ్స్మన్ను ఏర్పాటు చేయడం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ–వినియోగదారుల వ్యవహారాల శాఖ సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేసే విషయంలో విధివిధానాలు ఖరారుకు చేయాలని సమావేశం భావించింది. వినియోగదారుల ఫిర్యాదుల సమర్థవంతమైన పరిష్కారం కోసం ఎయిర్ సేవా పోర్టల్తో జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ను ఏకీకృతం చేయడం చర్చల్లో చోటుచేసుకున్న మరొక ప్రతిపాదన. -
తత్కాల్ టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్.. రైలు ప్రయాణికులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు సేవల సంస్థ పేటీఎం.. తన ప్లాట్ఫామ్ ‘పేటీఎం యాప్’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్ను పొందొచ్చని తెలిపింది. న్యూమనీ సేవింగ్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ సదుపాయం యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందని పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. తత్కాల్ సహా సహా అన్ని రకాల రైలు టికెట్ల రద్దుపై అప్పటికప్పుడే సోర్స్ అకౌంట్ (చెల్లింపులు చేసిన బ్యాంక్ ఖాతా లేదా కార్డ్)కు రిఫండ్ పొందొచ్చని ప్రకటించింది. రిఫండ్ కోసం రోజులకొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. రైలు ప్రారంభానికి ఆరు గంటల ముందు లేదంటే చార్ట్ రూపొందించడానికి (వీటిలో ఏది ముందు అయితే అదే వర్తిస్తుంది) ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. ‘‘మొబైల్ చెల్లింపులు, క్యూఆర్ టెక్నాలజీలో ప్రముఖ సంస్థగా ఉన్న పేటీఎం, ట్రావెల్ బుకింగ్లకు సంబంధించి మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఉన్న ఫళంగా రైలు టికెట్లు రద్దు చేసుకునే వారికి ఈ కొత్త సుదపాయం ఉపశమనాన్ని ఇస్తుంది’’అని పేటీఎం అధికార ప్రతినిధి తెలిపారు. రైలు టికెట్లు బుకింగ్కు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే గేట్వే ఫీజు వసూలు చేయడం లేదని పేటీఎం తెలిపింది. -
కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్షిప్ - రూ.61 లక్షలు రీఫండ్!
కారు కొనుగోలు చేయడం అనేది చాలామంది కల. ఈ కలను నిజం చేసుకోవడానికి కొంతమంది ఎన్నోన్నో కష్టాలు పడి చివరకు అనుకున్నది సాధిస్తారు. అయితే కొన్ని సార్లు డీలర్షిప్ యాజమాన్యం చేసే మోసాల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలు. మళ్ళీ ఇలాంటి సంఘటనే తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఇందర్జిత్ కౌర్ అనే కస్టమర్ జీప్ కంపెనీకి చెందిన 'గ్రాండ్ చెరోకీ' కారుని 2018లో రూ. 61.61 లక్షలకు కొనుగోలు చేసాడు. నిజానికి ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర దేశీయ మార్కెట్లో రూ. 80 లక్షల కంటే ఎక్కువ. అయితే ఇది 2016లో తయారైందన్న కారణంతో స్థానిక KAS కార్స్ డీలర్షిప్ రూ. 17 లక్షలు తగ్గించింది. కారు కొనుగోలు చేసిన తరువాత నుంచి అందులో సమస్యలు మొదలయ్యాయి. రోడ్డు మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తాయి. దీంతో కస్టమర్ డీలర్షిప్ను ఆశ్రయించాడు. వెళ్లిన ప్రతి సారి అప్పటికి ఏదో ఒక రిపేర్ చేసి బాగు చేసివారు. కానీ మళ్ళీ మళ్ళీ సమస్యలే తలెత్తుండటంతో కోర్టుని ఆశ్రయించాడు. ఇదీ చదవండి: నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు! కోర్టు విచారం చేపట్టి కస్టమర్ ఇబ్బందికి కారణమైన డీలర్షిప్కి కేవలం 45 రోజుల గడువులో రూ. 61.61 లక్షలు అతని చెల్లించాలని ఆదేశించింది. ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా చాలా కంపెనీలు కస్టమర్లకు లోపభూయిష్టమైన కార్లను విక్రయించడం వల్ల భారీ జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. -
రిఫండ్ త్వరగా పొందాలంటే? వెరిఫై చేశారా..
డిపార్ట్మెంటు వారు జ్ఞాపకం చేస్తున్నారా లేదా భయపెడుతున్నారా? కాదు కాదు ఎందరో మరిచిపోయేవారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ ఒక సందేశం.. రిమైండర్ పంపుతున్నారు. దాని సారాంశం ఏమిటంటే రిటర్ను దాఖలు చేసి ఊరుకోవద్దు. మరచిపోవద్దు. ఈ–ఫైలింగ్ ప్రాసెస్ని పూర్తి చేయండి. మీరు ఐటీఆర్ని 30 రోజుల్లోపల వెరిఫై చేయండి. గతంలో ఈ గడువు 120 రోజులు ఉండేది. అంటే నాలుగు నెలలు. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువుని 30 రోజులకు కుదించారు. గడువు తేదీలోగా వెరిఫై చేయకపోతే మీరు సకాలంలో రిటర్ను వేసినట్లు కాదు. మీరు దాఖలు చేసిన రిటర్ను ఇన్వాలిడ్ అయిపోతుంది. రద్దయిపోతుంది. వేసినట్లు కాదు. ఆలస్యమయింది కాబట్టి లేటు ఫీజు పడుతుంది. ఇది రూ. 5,00,000లోపు ఆదాయం ఉంటే రూ. 1,000 & రూ. 5,00,000 దాటితే రూ. 5,000 ఉంటుంది. ఈ–వెరిఫై చేయడం చాలా సులభం. త్వరగా కూడా పూర్తవుతుంది. ఈ–వెరిఫై వద్దనుకుంటే ఫారం– Vని 30 రోజుల్లోపల అందేలా స్పీడ్పోస్ట్లో పంపండి. పోర్టల్ ద్వారా చేయండి. ఆధార్ కార్డు ద్వారా ఓటీపీ వస్తుంది. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. బ్యాంకు అకౌంట్ ద్వారా లేదా డీమ్యాట్ అకౌంటు, బ్యాంకు ఏటీఎం ద్వారానైనా చేయొచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ద్వారా చేస్తే కొంచెం ఖర్చవుతుంది. ఈ–ఫైలింగ్కి సంబంధించిన ప్రశ్నల్లో, తరచుగా మీకు సందేహాలొచ్చే వివిధ అంశాలు, పరిస్థితులు అన్నింటినీ పొందుపర్చారు. లేటయితే కూడా వెరిఫై చేయొచ్చు. కానీ, తగిన కారణం ఉండాలి. ఒప్పుకుంటే లేటుగా వేయవచ్చు. మీ తరఫున మీ ఆథరైజ్డ్ వ్యక్తి వేయొచ్చు. మొబైల్ నంబర్ను వెంటనే ఆధార్తో అప్డేట్ చేయడం తప్పనిసరి. మరిచిపోకండి. మీరు స్పీడ్పోస్ట్లో పంపించిన డాక్యుమెంట్ల వివరాలు భద్రపర్చుకోండి. రుజువులు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు అందలేదని డిపార్టుమెంటు వారు అంటే ఇవి రుజువులుగా పనికొస్తాయి. రిఫండ్ క్లెయిమ్ చేసిన వారయితే, వెరిఫై చేసిన తర్వాతే రిఫండును ఆశించాలి. జులై మొదటి వారంలో కొంత మందికి 48 గంటల్లో రిఫండు వచ్చింది. ఇప్పుడు రెండు వారాలు దాటిన తర్వాత రిఫండు ఇస్తున్నారు. గతంలో నెలరోజులు దాటేది. ఇప్పుడు ఇంకా త్వరితగతిన ఇద్దామని గట్టి ప్రయత్నం చేస్తూ, సమాయత్తం అవుతున్నారు.. డిపార్ట్మెంట్ వారు. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్కు పంపించగలరు. -
సహారా డబ్బులు వెనక్కి ఇస్తున్నారు..వెంటనే ఇలా క్లయిమ్ చేసుకోండి
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ నాలుగు కోపరేటివ్ల పరిధిలో నాలుగు కోట్ల డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడం మొదలైంది. మొదటి విడత కింద ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 112 మంది చిన్న ఇన్వెస్టర్లకు చెల్లింపులను కేంద్ర హోంశాఖ, సహకార శాఖల మంత్రి అమిత్షా శుక్రవారం ప్రారంభించారు. సీఆర్సీఎస్ సహారా రిఫండ్ పోర్టల్పై ఇప్పటి వరకు 18 లక్షల మంది డిపాజిటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టు షా చెప్పారు. సహారా డిపాజిటర్ల చెల్లింపులకు వీలుగా సీఆర్సీఎస్–సహారా పోర్టల్ను కేంద్ర సహకార శాఖ జూలై 18న ప్రారంభించడం గమనార్హం. నమోదు చేసుకున్న ఇన్వెస్టర్లు అందరికీ తొలి విడతలో రూ.10వేల చొప్పున చెల్లించనున్నారు. ఆడిట్ పూర్తయిన తర్వాత రెండో విడత నిధులను బదిలీ చేస్తామని అమిత్షా తెలిపారు. ‘‘రానున్న రోజుల్లో డిపాజిటర్లు అందరూ తమ నిధులను పొందుతారని మీకు భరోసా ఇస్తున్నా’’అని ప్రకటించారు. సహార వంటి ఘటనలు జరిగినప్పుడల్లా సహకార సంస్థల పట్ల నమ్మకం కుదేలవుతున్నట్టు పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల డబ్బులు సురక్షితంగా ఉన్నాయని, వాటిని తిరిగి వారికి అందిస్తామని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సహారా డిపాజిటర్లు గత 12–15 ఏళ్ల నుంచి తమ డబ్బులు పొందలేకపోయారని, ఇందుకు సహారా యాజమాన్యం విఫలం కావడం, కోర్టుల్లో వ్యాజ్యాలతో జాప్యం జరిగినట్టు చెప్పారు. సెబీ–సహారా ఫండ్ నుంచి రూ.5,000 కోట్లను సహకార శాఖ పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు అమిత్షా వివరించారు. సీబీఐ, ఆదాయపన్ను శాఖ తదితర కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఒకేతాటిపైకి తీసుకొచ్చి.. నిధులపై ముందుగా చిన్న ఇన్వెస్టర్లకు తొలుత హక్కు ఉండాలంటూ సుప్రీంకోర్టును కోరినట్టు గుర్తు చేశారు. సహారా గ్రూపు నాలుగు కోపరేటివ్ల పరిధిలోని 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు వచ్చే తొమ్మిది నెలల్లో వారి డబ్బులు తిరిగి పొందేలా చర్యలు తీసుకుంటామని ఈ ఏడాది మార్చి 29న కేంద్రం ప్రకటించడం గమనార్హం. ఇక సహారా డబ్బుల్ని ఎలా క్లయిమ్ చేసుకోవాలంటే? ♦ ముందుగా mocrefund.crcs.gov.in. పోర్టల్కి వెళ్లాలి ♦ ఆధార్ కార్డ్ నెంబర్ సాయంతో డిపాజిటర్ లాగిన్ అవ్వాలి ♦ అనంతరం మీ వద్ద ఉన్న సహారా బాండ్ పేపర్లని, ఇతర పత్రాలని అప్లోడ్ చేయాలి. ♦ అప్లోడ్ చేసిన పత్రాలని 30 రోజుల్లోగా ధృవీకరిస్తారు. ♦ అనంతరం 15 రోజుల్లో అధికారులు దీనిపై చర్యలు తీసుకుంటారు ♦ తర్వాత ఎస్ఎంఎస్ ద్వారా వెరిఫికేషన్ పూర్తయినట్లు ఇన్వెస్టర్లకు సమాచారం అందిస్తారు. ♦ ఎస్ఎంఎస్ వచ్చిందంటే మీ ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదం పొందినదని అర్థం. ♦ తర్వాత పెట్టుబడి మొత్తం ఖాతాకు బదిలీ అవుతుంది. ♦ క్లెయిమ్ని ధృవీకరించిన తేదీ నుంచి 45 రోజుల తర్వాత మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. -
రూ. 13,000 టికెట్టుకి రూ. 20 రీఫండ్ - ఐఏఎస్ ఆఫీసర్ షాక్!
ఆధునిక కాలంలో విమాన ప్రయాణాలు సర్వ సాధారణం అయిపోతున్నాయి. కావున చాలామంది ఫ్లైట్ జర్నీ చేసేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే కొంత అమౌంట్ (రీఫండ్) తిరిగి వస్తుంది. అయితే ఇటీవల ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ఒక ఐఏఎస్ అధికారికి చేదు అనుభవం ఎదురైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, రాహుల్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి తన ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆ టికెట్ ధర రూ. 13,820 కాగా, క్యాన్సిల్ చేసుకున్న తరువాత అతనికి రీఫండ్ అయిన మొత్తం కేవలం రూ. 20 మాత్రమే. దీనిని అతని ట్విటర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది. నిజానికి అతని టికెట్ ధర నుంచి ఎయిర్లైన్ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 11,800, జీఐ క్యాన్సిలేషన్ ఫీజు కింద రూ. 1200, జీఐ కన్వీనియన్స్ ఫీజు కింద రూ. 800 కట్ చేసి చివరకు రూ. 20 రీఫండ్ చేసారు. ఇది చూడగానే ఐఏఎస్ అధికారి కూడా హవాక్కయిపోయాడు. తిరిగి డబ్బు వెనక్కి రావాలంటే ఏదైనా సలహా ఇవ్వండి అంటూ ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీనిపైన నెటిజన్లు వారికి నచ్చిన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: ఏఐతో కొత్త రకం మోసం - తెలిసిన ముఖమే అనుకున్నారో..) Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq — Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023 -
క్షమాపణలు చెప్పిన ఎయిరిండియా
ఢిల్లీ: సాంకేతిక సమస్యతో రష్యాకు విమానం దారి మళ్లింపు, అక్కడ మారుమూల ప్రాంతంలో అరకోర సౌకర్యాల నడుమ పడిగాపులు పడిన వ్యవహారంపై ఎయిరిండియా స్పందించింది. ప్రయాణికులందరికీ క్షమాపణలు తెలియజేస్తూ.. వాళ్ల టికెట్ డబ్బులను తిరిగి ఇవ్వడంతో పాటు బోనస్గా ట్రావెల్ వౌచర్లను ఇస్తామని ప్రకటించింది. మంగళవారం న్యూఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న క్రమంలో ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 777 ఎయిర్క్రాఫ్ట్లోని ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 216 మంది ప్యాసింజర్లు, 16 మంది సిబ్బందితో కూడిన విమానాన్ని రష్యా మగడాన్ ఎయిర్పోర్ట్కు తరలించారు. మాస్కో నుంచి 10వేల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. మారుమూల పట్టణం కావడంతో అరకోర సౌకర్యాలతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దాదాపు 36 గంటల తర్వాత.. ప్రత్యామ్నాయ విమానం అక్కడికి చేరుకుని ఈ ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోకు ప్రయాణికులను చేర్చింది. ఈ పరిణామంపై క్షమాపణలు చెబుతూ ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ & గ్రౌండ్ హ్యాండిలింగ్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి, అంతరాయానికి క్షమాపణలు చెబుతున్నామని, టికెట్ ఎమౌంట్ను రిఫండ్ చేయడంతో పాటు ట్రావెల్ వౌచర్లను స్వీకరించాలంటూ మనస్ఫూర్తిగా క్షమాపలంటూ ప్రకటనలో పేర్కొన్నారాయన. ఇక ఈ పరిణామంపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
ఐటీ నుంచి రూ.41 వేల రీఫండ్!
ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. మార్చి 31 సమీపిస్తుండటంతో పన్ను చెల్లింపుదారులు హడావుడి పడుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ. 41,104 రీఫండ్ చేస్తున్నట్లు కొందరికి ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ రీఫండ్ పొందడానికి వ్యక్తిగత వివరాలను సమర్పించాలని ఆ మెయిల్ ద్వారా కోరారు. ఇదీ చదవండి: Hindenburg Research: త్వరలో హిండెన్బర్గ్ మరో బాంబ్.. ఈసారి ఎవరి వంతో..! ‘ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా ఖాతా-ఆడిట్ను పూర్తి చేసింది. మీకు రూ. 41,101.22 రీఫండ్కు అర్హత ఉంది.. కానీ మీ వివరాలు కొన్ని తప్పుగా ఉన్నాయి. పరిశీలించి సరిచేసుకోండి’ అంటూ ఓ లింక్ ట్యాబ్ను అందులో ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్, బెంగళూరు నుంచి ఆ ఈమెయిల్ను పంపుతున్నట్లు పేర్కొన్నారు. అది పూర్తిగా ఫేక్.. ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చిన ఆ ఈమెయిల్ పూర్తిగా ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( పీఐబీ) నిర్ధారించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నేతృత్వంలోని ఆదాయపు పన్ను శాఖ నుంచి అటువంటి ఈమెయిల్లను పంపలేదని తేల్చింది. An E-mail claims that the recipient is entitled to a refund of ₹41, 104, and is seeking his/her personal details in the name of @IncomeTaxIndia#PIBFactCheck ✔️This claim is fake ✔️Report such suspicious emails at 'webmanager@incometax.gov.in' pic.twitter.com/bWgJT7iNbo — PIB Fact Check (@PIBFactCheck) March 20, 2023 ఆదాయపు పన్నుకు సంబంధించిన ఇలాంటి అనుమానాస్పద ఈమెయిల్స్ వచ్చినప్పుడు webmanager@incometax.gov.in లో తెలియజేయవచ్చు. ఐటీ శాఖ ఇలా ఈమెయిల్ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగదు. అలాగే క్రెడిట్ కార్డ్లు, బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక ఖాతాల కోసం పిన్ నంబర్లు, పాస్వర్డ్లు వంటివి కోరుతూ మెయిల్ పంపదు. ఇలాంటి ఈమెయిల్ వచ్చినప్పుడు ఏమి చేయాలి? వాటికి స్పందించవద్దు. అటాచ్మెంట్లు మీ కంప్యూటర్కు హాని కలిగించే హానికరమైన కోడ్ని కలిగి ఉండవచ్చు కాబట్టి వాటిని తెరవవద్దు. ఎలాంటి లింక్లపైనా క్లిక్ చేయవద్దు. ఒక వేళ మీరు లింక్లపై అనుకోకుండా క్లిక్ చేసినట్లయితే బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్కు సంబంధించిన వివరాలను షేర్ చేయవద్దు. ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్ -
అన్రిజిస్టర్డ్ వ్యక్తులకూ ఇక జీఎస్టీ రిఫండ్స్!
న్యూఢిల్లీ: రద్దయిన కాంట్రాక్టులు లేదా బీమా పాలసీలకు సంబంధించి నమోదుకాని (అన్రిజిస్టర్డ్) వ్యక్తులు కూడా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వాపసులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)తో జీఎస్టీ పోర్టల్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ను పొందాల్సి ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఒక ప్రకటనలో సూచించింది. బ్యాంక్ అకౌంట్ నెంబర్తోపాటు, రిఫండ్కు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్ రద్దయిన సందర్భంలో తాము అప్పటికే భరించిన పన్ను మొత్తాన్ని వాపసు కోసం క్లెయిమ్ చేయడానికి ఒక సదుపాయాన్ని (ఫెసిలిటీ) కల్పించాలని రిజిస్టర్ కాని కొనుగోలుదారులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెలువరిస్తున్నట్లు తెలిపింది. రెండేళ్ల కాల వ్యవధి... తాజా నిర్ణయంతో ఫ్లాట్, భవనం నిర్మాణం లేదా దీర్ఘకాలిక బీమా పాలసీ రద్దుకు సంబంధించి అప్పటికే చెల్లించిన జీఎస్టీని ఇకపై అన్ రిజిస్టర్డ్ వ్యక్తులూ తిరిగి పొందే (రిఫండ్) వెసలుబాటు కలిగింది. నమోదవ్వని పన్ను చెల్లింపుదారు సంబంధిత తేదీ నుండి రెండు సంవత్సరాలలోపు వాపసుల కోసం ఫైల్ చేయవచ్చని సీబీఐసీ వివరించింది. వస్తువులు, సేవలను స్వీకరించిన తేదీ లేదా ఒప్పందం రద్దయిన తేదీ నుంచి ఇది ఈ రెండేళ్ల కాల వ్యవధి వర్తిస్తుందని వివరించింది. డిసెంబర్ 17న జరిగిన జీఎస్టీ అత్యున్నత స్థాయి 48వ సమావేశం నిర్ణయాలకు అనుగుణంగా తాజాగా సీబీఐసీ ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ‘‘రిజిస్టర్ చేయని కొనుగోలుదారులు సరఫరా జరగని చోట జీఎస్టీ వాపసు పొందడానికి తాజా నిర్ణయం అనుమతిస్తుంది. వారిపై ఇప్పటి వరకూ ఉన్న అనవసరమైన వ్యయ భారాన్ని నివారించడంలో సహాయపడుతుంది’’ అని అని భారత్లో కేపీఎంసీ ప్రతినిధి (పరోక్ష పన్ను) అభిషేక్ జైన్ వ్యాఖ్యానించారు. -
ఒక్క డాలర్ కోసం జైలు పాలయ్యాడు.. అదీ భార్య వల్ల!
వాషింగ్టన్: భార్య చెప్పిన విషయం విని కోపంతో ఊగిపోయిన ఓ భర్త ఒక్క డాలర్ కోసం దొంగతనం చేశాడు. తీరా అరెస్టై జైలుకెళ్లాడు. ఈ సంఘటన అమెరికాలోని ఒక్లాహోమా నగరంలో జరిగింది. స్టార్బక్స్ అనే కాఫీ స్టోర్ తన భార్యకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వలేదనే కోపంతో స్టోర్లో చోరీకి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. చోరీ చేసిన వస్తువు విలువ 1.32 డాలర్లు మాత్రమే. ఆ స్టోరీ ఏంటో మనమూ తెలుసుకుందాం.. రిచర్డ్ ఎంగెల్(61) అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత ఆదివారం సాయంత్రం ఎడ్మోండ్లోని ఈస్ట్ మెమోరియల్ రోడ్లో ఉన్న స్టార్బక్స్ కాఫీ స్టోర్కు వెళ్లాడు. ఆ మరుసటి రోజు ఆయన భార్య తిరిగి కాఫీ షాప్కి వెళ్లి తనకు రీఫండ్ చేయాల్సిన 1.25 డాలర్లు తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే, కాఫీ కొనుగోలు చేసినట్లు రిసిప్ట్ లాంటి ఆధారం లేకుండా రీఫండ్ ఇవ్వడం కుదరదని స్టోర్ సిబ్బంది తెలిపారు. దీంతో ఇంటికి వెళ్లి తన భర్తను తీసుకొచ్చింది ఆమె. ఈ క్రమంలో క్యాషియర్తో గొడవ పడ్డాడు ఎంగెల్. తన భార్యకు రావాల్సిన రీఫండ్ను ఇవ్వాల్సిందేనని వాధించాడు. క్యాషియర్ అందుకు ఒప్పుకోకపోవడంతో కౌంటర్పై ఉన్న టిప్ జార్ను పట్టుకుని అక్కడి నుంచి పరుగులు పెట్టాడు ఎంగెల్. అయితే, ఆ టిప్ జార్లో కేవలం 1.32 డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఎంగెల్ను అనుసరించిన స్టోర్ సిబ్బంది అతడి కారును ఫోటోలు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా ఎంగెల్ ఇంటికి వెళ్లి చోరీ, దాడి వంటి నేరాల కింద అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదీ చదవండి: దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకున్నా..! -
పొరపాటున అడిషనల్ బోనస్: ఉద్యోగుల కుటుంబాల్లో చిచ్చు
న్యూఢిల్లీ: జపాన్ కార్ మేకర్ హోండా తప్పులో కాలేసింది. ఓహియో-ఆధారిత మేరీస్విల్లే ఫ్యాక్టరీలోని ఉద్యోగులకు చెల్లించాల్సిన బోనస్లో అనుకోకుండా అదనపు మొత్తంలో చెల్లించింది. ఆలస్యంగా పొరపాటు గ్రహించిన సంస్థ అదనంగా చెల్లించిన సొమ్మను ఇచ్చేయాలంటూ తన ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తాజా పరిణామంతో అవాక్కయిన ఉద్యోగులు చేతికొచ్చిన సొమ్ములు ఎలా ఇవ్వాలో తెలియక తికమకలో పడిపోయారు. మరోవైపు ఉద్యోగులు డబ్బులువాపస్ ఇస్తారా లేదా, లేదంటే భవిష్యత్తు బోనస్లో కట్ చేసుకోవాలో తేల్చుకోలేక హోండా అధికారులు తలలు పట్టుకున్నారు. (SpiceJet Salary Hikes: సంచలనం,పైలట్లకు 20 శాతం జీతం పెంపు!) సెప్టెంబరు 22 వరకు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని భవిష్యత్ చెల్లింపుల నుండి తీసుకోవాలా, భవిష్యత్ బోనస్లో మినహాయించుకోవాలా లేదా ముందుగా చెల్లిస్తారా మీరే తేల్చుకోమని ఉద్యోగులను కోరింది. ఈ విషయాన్ని హోండా ప్రతినిధి కూడా ధృవీకరించింది. అయితే సున్నితమైన ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఉద్యోగులు డబ్బును తిరిగి చెల్లించకపోతే హోండా చట్టపరమైన మార్గంలో వెళ్లవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో ఆగ్రహాలు దీనిపై ఉద్యోగుల కుటుంబాల్లో అగ్రహాలువ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని అందరూ మేనేజ్ చేయలేరంటూ ఒక హోండా ఉద్యోగి భార్య వాపోయారు. తన భర్తకు వచ్చిన బోనస్లో 8 శాతం తిరిగి ఇవ్వాలంటే.. వందల డాలర్లు ఆమెపేర్కొన్నారు. అది మాకు కారు చెల్లింపు. అది మా తనఖాలో సగం, రెండు, మూడు వారాల విలువైన కిరాణా.. ఈ డబ్బు చాలా విలువైంది..చెల్లించాలంటే కష్టం మరొకరు వ్యాఖ్యానించారు. -
35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం
కోటా: రాజస్తాన్కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఆ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికీ లబ్ధి చేకూర్చాడు. 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్లో స్వామి టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. క్యాన్సలేషన్లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జిని కూడా టికెట్ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది. అదేమంటే జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్న బదులు వచ్చింది. జూలై 1కి ముందే రద్దు చేసుకున్న టికెట్పై సర్వీస్ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్ను టాగ్ చేశాడు. ఎట్టకేలకు సర్వీస్ చార్జీ మొత్తాన్ని వెనక్కిస్తామంటూ రైల్వే శాఖ 2019లో దిగొచ్చింది. కానీ రౌండాఫ్ పేరుతో 33 రూపాయలే రీఫండ్ చేసింది. దాంతో మిగతా 2 రూపాయల కోసం కూడా పట్టుబట్టిన స్వామి, మూడేళ్ల పోరాటంతో వాటినీ సాధించాడు! 2017 జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికీ రూ.35 సర్వీస్ చార్జి రిఫండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. -
‘కరోనా’ కక్కుర్తిని కక్కించారు!
కోవిడ్ సందర్భంగా ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. నగర వైద్య చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఆస్పుత్రుల మీద వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ వినతి మేరకు సిటీ ఆసుపత్రులు రోగుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను వెనక్కి ఇచ్చేశాయి. నగరానికి చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్తకు అందించిన సమాచారంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్స ఛార్జీలపై 2020 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత రేట్లను జారీ చేసింది చికిత్స పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రులు/లేబొరేటరీలు వసూలు చేసే బిల్లులపై పరిమితిని విధించింది. అయితే వాటిని ప్రైవేటు ఆసుపత్రులు ఉల్లంఘించాయి. దారి చూపిన హెల్ప్లైన్ రొటీన్ వార్డు అండ్ ఐసోలేషన్లో చేరేందుకు రోజుకు రూ.4వేలు, వెంటిలేటర్ లేకుండా ఐసియూ ఐసోలేషన్కు రోజుకు రూ.7,500, వెంటిలేటర్తో ఐసియూ ఐసోలేషన్కు రోజుకు రూ.9 వేలుగా నిర్ణయించింది. అయితే ఆసుపత్రులు మాత్రం రకరకాల పేర్లు పెట్టి అధిక ఛార్జీలు వేసి బిల్లులు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని రోగుల నుంచి పెద్ద యెత్తున ఆరోపణలొచ్చాయి. గత సంవత్సరం, కోవిడ్–19 రోగులను పదే పదే ఉల్లంఘించినందుకు కనీసం 30 ఆసుపత్రులను కోవిడ్ చికిత్సల నుంచి నిషేధించింది. అంతేకాకుండా ఒక హెల్ప్లైను ఏర్పాటు చేసి, ఆసుపత్రులు ఎక్కువ వసూలు చేస్తున్నాయని భావిస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. వెల్లువెత్తిన ఫిర్యాదులు.. కరోనా చికిత్స కోసం ఆసుపత్రులు వివిధ అదనపు బిల్లులను వసూలు చేస్తున్నాయని రోగులు, బంధువుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత నెల ఆఖరు వరకు ప్రభుత్వం నిర్ణయించిన చికిత్స ఛార్జీలను ధిక్కరించినందుకు 268 ప్రైవేట్ ఆసుపత్రులపై 843 ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో 87 ఫిర్యాదులకు రీఫండ్లు అందించాల్సి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి వసూలు చేసిన బిల్లులను వాపసు చేసే విషయంపై ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చలు జరిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీని ద్వారా నగరంలోని 87 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి రూ. 1.61 కోట్లకు పైగా సొమ్మును రోగులకు వెనక్కి ఇచ్చారు. అత్యధిక రిఫండ్ ఓమ్ని ఆసుపత్రిదే... కూకట్పల్లిలోని ఓమ్ని ఆసుపత్రి అత్యధికంగా రూ.27,41,948 రీఫండ్ చెల్లించింది. ఉప్పల్లోని టీఎక్స్ హాస్పిటల్ రూ.10,85,000, కొండాపూర్లోని మెడికవర్ హాస్పిటల్ రూ.10,82,205 రీఫండ్ చేశాయి. బంజారాహిల్స్లోని సెంచురీ హాస్పిటల్స్ (రూ.10 లక్షలు), ఎల్బీ నగర్లోని అంకురా హాస్పిటల్ (రూ.6.1 లక్షలు), ఎల్బి నగర్లోని దియా హాస్పిటల్ (రూ. 6 లక్షలు), హైదరాబాద్ నర్సింగ్ హోమ్ (రూ.5 లక్షలు), సెక్రటేరియట్లోని మెడికవర్ హాస్పిటల్ (రూ.5.7 లక్షలు), కూకట్పల్లిలోని ప్రతిమ హాస్పిటల్ (రూ.8.2 లక్షలు) గచ్చిబౌలిలోని సన్షైన్ హాస్పిటల్ (రూ.5 లక్షలు) రోగులకు రీఫండ్ చేసిన ఆసుపత్రుల్లో ఉన్నాయి. (చదవండి: ‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!) -
రూ.1.83 లక్షల కోట్ల పన్ను రిఫండ్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 7 వరకు 2.14 కోట్ల పన్ను చెల్లింపుదారులకు రూ.1.86 లక్షల కోట్ల పన్ను రిఫండ్లు (తిరిగి చెల్లింపులు) పూర్తి చేసినట్టు ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) తెలిపింది. ఇందులో రూ.67,442 కోట్లు వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించి రిఫండ్లు కాగా, మిగిలిన మొత్తం కార్పొరేట్ పన్ను రిఫండ్గా పేర్కొంది. ఆదాయపన్ను శాఖకు సంబంధించి విధాన నిర్ణయాలను సీబీడీటీయే చూస్తుంటుంది. -
కెయిర్న్తో ‘రెట్రాస్పెక్టివ్’ వివాద పరిష్కారం
న్యూఢిల్లీ: రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారానికి సంబంధించి కేంద్రం బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీకి రూ.7,900 కోట్లు రిఫండ్చేసింది. కెయిర్న్ (ప్రస్తుతం క్యాప్రికార్న్ ఎనర్జీగా పేరు మారింది) ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ‘‘పన్ను రిఫండ్గా 1.06 బిలియన్ డాలర్లను స్వీకరించడం జరిగింది’’ అని పేర్కొంది. దీనితో భారత్తో పెట్టుబడులకు సంబంధించి గడిచిన ఏడేళ్ల నుంచి తీవ్ర వివాదాస్పంగా ఉన్న రెట్రాస్పెక్టివ్ వివాదంలో కీలక సానుకూల పరిణామం చోటుచేసుకున్నట్లయ్యింది. వివారాలు ఇవీ... 50యేళ్ల క్రితం జరిగిన వ్యాపార ఒప్పందాలపై కూడా పన్నులు విధించేందుకు వీలు కల్పిస్తూ 2012లో చేసిన రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టం అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. పలు అంతర్జాతీయ న్యాయస్థానాల్లో దీనిపై పలు సంస్థలు దావాలు దాఖలు చేసి, వాటికి అనుగుణంగా తీర్పులను పొందాయి. కెయిర్న్ విషయానికి వస్తే, 2006–07లో భారత విభాగాన్ని లిస్టింగ్ చేసే ముందు వ్యాపార పునర్వ్యవస్థీకరణ ద్వారా కెయిర్న్ గణనీయంగా క్యాపిటల్ గెయిన్స్ పొందిందన్నది ఆదాయ పన్ను శాఖ ఆరోపణ. లావాదేవీలు జరిగి చాలాకాలం గడిచినప్పటికీ వాటికి కూడా పన్నులను వర్తింపచేసే విధంగా (రెట్రాస్పెక్టివ్) 2012లో ప్రవేశపెట్టిన చట్టాన్ని ప్రయోగించి రూ. 10,247 కోట్ల మేర పన్నులు కట్టాలంటూ కెయిర్న్కు నోటీసులు పంపించింది. వాటిని రాబట్టుకునేందుకు కెయిర్న్ షేర్లు మొదలైన వాటిని జప్తు చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ. 7,900 కోట్లు. దీనిపై కెయిర్న్.. ఆర్పిట్రేషన్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించగా కంపెనీకి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. కానీ, భారత ప్రభుత్వం వాటిని తిరస్కరించడంతో .. తనకు రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకునేందుకు విదేశాల్లో భారత ప్రభుత్వానికి ఉన్న ఆస్తులపై కెయిర్న్ దృష్టి సారించింది. వాటిని జప్తు చేసి, తనకు పరిహారం ఇప్పించాలంటూ వివిధ దేశాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించింది. కొన్ని చోట్ల కంపెనీకి అనుకూల ఆదేశాలు కూడా వచ్చాయి. వరుసలో మరో 16 కంపెనీలు! అంతర్జాతీయంగా వివాదాస్పదం కావడంతో కేంద్రం గత ఏడాది రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటే సామరస్యంగా ఈ వివాదాల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఈ దిశలో వివాదాస్పద చట్ట నిబంధనల కింద వసూలు చేసిన మొత్తాలను తిరిగి రిఫండ్ చేస్తామని ప్రకటించింది. దాదాపు రూ.1.10 లక్షల కోట్ల పన్ను డిమాండ్లు అందుకున్న దాదాపు 17 కంపెనీల్లో 14 కంపెనీలు వీటి పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో బ్రిటన్ ఇంధన దిగ్గజం కెయిర్న్ ఎనర్జీ ఒకటి. కేంద్రంతో కుదుర్చుకున్న సెటిల్మెట్ ఒప్పందం ప్రకారం.. అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్ తదితర దేశాల న్యాయస్థానాల్లో భారత్పై వేసిన దావాలన్నింటిని కెయిర్న్ ఉపసంహరించుకుంది. ఇందుకు సంబంధించి కేసులను ఉపసంహరించుకున్న వివరాలతో కేంద్రానికి ఫారం 3ని సమర్పించింది. ఆ తర్వాత ట్యాక్స్ల రిఫండ్ కోసం ప్రభుత్వం ఫారం 4 జారీ చేసింది. దీంతో రూ. 7,900 కోట్ల పన్ను మొత్తాన్ని ప్రభుత్వం నుంచి రిఫండ్ పొందేందుకు కెయిర్న్కు మార్గం సుగమం అయ్యింది. కెయిర్న్తోపాటు కేంద్రంతో దాదాపు రూ.20,495 కోట్ల విలువైన రెట్రాస్పెక్టివ్ పన్ను వివాద పరిష్కారం దిశగా బిలియనీర్ అనిల్ అగర్వాల్ మైనింగ్ గ్రూప్ వేదాంతా ముందడుగులు వేస్తోంది. -
యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ‘ఆ డబ్బు వాపస్ చేయండి’
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2019 డిసెంబర్లో ఈ ఆందోళనల్లో పాల్గొన్నవారి నుంచి వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇచ్చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం చేకూర్చారన్న ఆరోపణలతో ఆందోళనకారుల నుంచి జరిమానాల రూపంలో రూ.కోట్లలో సొమ్ము వసూలు చేశారని, ఆ డబ్బు రీఫండ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. ఆందోళనకారుల ఆస్తులను అటాచ్ చేశారని, వాటిని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులకు జారీ చేసిన 274 రికవరీ నోటీసులను వెనక్కి తీసుకున్నామని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీఏఏ వ్యతిరేక కార్యక్రమాల్లో పొల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై 2020 ఆగస్టు 31న నోటిఫై చేసిన ‘ఉత్తరప్రదేశ్ రివకరీ ఆఫ్ డ్యామేజెస్ టు పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్’ కింద రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు ప్రారంభించవచ్చని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. యూపీ ప్రభుత్వం జారీ చేసిన రికవరీ నోటీసులను కొట్టివేయాలని కోరుతూ పర్వేజ్ అరీఫ్ టిటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరేళ్ల క్రితం మరణించిన వృద్ధుల పేరిట కూడా ఇలాంటి నోటీసులు ఇచ్చారని ఆక్షేపించారు. ఈ పిటిషన్పై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నోటీసులపై వివరణ ఇవ్వాలని ఈ నెల 11న యూపీ సర్కారును ఆదేశించింది. -
ఐస్క్రీమ్ చల్లగా ఉందేంటి, నా డబ్బులు తిరిగి ఇచ్చేయండి.. కస్టమర్ ఫిర్యాదు
గతంలో పుడ్ తినాలంటే హోటల్కి వెళ్లి తినేవాళ్లం. కానీ స్విగ్గి, జొమాటో లాంటి ఆన్లైన్ యాప్లు వాడకంలోకి వచ్చాక కూర్చున్న చోటు నుంచే నచ్చిన పుడ్ని తెప్పించుకు తింటున్నాం. కస్టమర్ల సౌకర్యం కోసం ఆన్లైన్ పుడ్ డెలివరీ యాప్లు కొన్ని రూల్స్ని పాటిస్తుంటాయి. అయితే కొందరు కస్టమర్లు మాత్రం వీటిని అలుసుగా తీసుకుని డబ్బులు ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఇటువంటి ఘటనలే యూకేలోని ఓ హోటల్లో చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే.. యూకేలోని ఓల్డ్హామ్లో హాసన్ హాబిబ్ అనే వ్యక్తికి జస్ట్ ఈట్ అనే రెస్టారెంట్ ఉంది. అన్ని హోటల్లో లానే అందులో టేక్ అవే సౌకర్యం ఉంది. ఆ ప్రాంతంలో పుడ్ సరిగా లేకుంటే మనీ రీఫండ్ లాంటి స్వీమ్లు కొన్ని కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కొందరు దాన్నే అదునుగా తీసుకుని ఫుడ్ ఆర్డర్ చేస్తూ డెలివరీ అయ్యాక ఏదో ఒక సాకులు చెప్పి.. డబ్బులు రిఫండ్ చేయాలంటూ రెస్టారెంట్పై ఫిర్యాదులు చేస్తున్నారట. ఇటీవల ఓ కస్టమర్.. ఐస్క్రీమ్ ఆర్డర్ చేసి డెలివరీ కాగానే ఐస్క్రీమ్ చల్లగా ఉంది నాకేమి నచ్చలేదు మనీ రిఫండ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టాడట. ఇదొక్కటే కాదు ఇలాంటి సిల్లీ కారణాలతో మనీ రిఫండ్ చేయాలని ఫిర్యాదులు రోజు వస్తూనే ఉండడంతో ఆ రెస్టారెంట్ ఓనర్ ఆన్లైన్ ఆర్డర్స్, టేక్ అవేని ఆపేశాడట. చివరకి ఆ రెస్టారెంట్ యజమాని తన కస్టమర్లు ఎవరైనా ఫుడ్పై ఫిర్యాదు చేయాలనుకుంటే.. దానికి కొంత చార్జ్ వసూలు చేయడం మొదలు పెట్టాడు. కనీసం 30 రోజుల గడువు తీసుకొని ఆలోపు కస్టమర్ల ఫిర్యాదులో పేర్కొన్న విధంగా సమస్య ఉంటే.. రిఫండ్ ఇవ్వడం ప్రారంభించారు. చదవండి: వర్క్ ఫ్రం హోం చేసినా బీమా చెల్లించాల్సిందే! -
ఖాతాదారులకు రూ. 164 కోట్లు బాకీ పడ్డ ఎస్బీఐ...!
SBI Yet To Refund Rs 164 Cr Undue Fee Charged From Jan Dhan Holders: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఖాతాదారులకు భారీ మొత్తంలో బాకీ పడినట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి జన్ధన్ యోజన ఖాతాదారుల నుంచి వసూలు చేసిన రూ. 164 కోట్లను ఎస్బీఐ ఇంకా రిఫండ్ చేయలేదు. ఏప్రిల్ 2017 నుంచి డిసెంబర్ 2019 మధ్య కాలంలో జన్ధన్ ఖాతాల డిజిటల్ చెల్లింపుల కోసం ఛార్జీలను ఎస్బీఐ వసూలు చేసింది. ఈ విషయంపై ఐఐటీ ముంబై సమగ్ర నివేదికను రూపొందించింది. చదవండి: ఓలాకు తప్పని పాట్లు..! వారికి మాత్రం తీవ్ర నిరాశే..! ఈ నివేదిక ప్రకారం... సదరు అమౌంట్ను తిరిగి ఆయా ఖాతాదారులకు చెల్లించాలని ప్రభుత్వం ఎస్బీఐకు సూచనలు చేసింది. దీంతో జన్ధన్ ఖాతాదారులకు సుమారు రూ. 90 కోట్లను మాత్రమే తిరిగి ఇవ్వగా...ఇంకా రూ.164 కోట్లను ఎస్బీఐ చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ 2017 నుంచి సెప్టెంబర్ 2020 జన్ ధన్ పథకం కింద తెరిచిన ఖాతాలనుంచి ఒక్కో లావాదేవీకి రూ.17.70 చొప్పున బ్యాంకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎస్బీఐను వివరణ కోరగా...ఇంకా స్పందించకపోవడం గమనర్హం. సదరు అమౌంట్ వెంటనే రీఫండ్చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ ఉత్తర్వులను జారీ చేసింది. చదవండి: మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుబడుల వర్షం! -
‘ఫిట్జీ’ ఆ విద్యార్థికి రూ.4 లక్షలు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: బోధన నచ్చలేదని చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వాలని విద్యార్థి చేసిన వినతిని ఫిట్జీ పినాకిల్ సంస్థ తిరస్కరించడంతో వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోచింగ్ మానేసిన విద్యార్థికి ఫీజు తిరిగి ఇచ్చేయాలని సంబంధిత సంస్థకు హైదరాబాద్ జిల్లా రెండో వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్సు మొత్తం ఫీజు మొదటే తీసుకోవడాన్ని కమిషన్ తప్పుపట్టింది. ఫిట్జీలో కోర్సులో చేరి తర్వాత మానేసిన విద్యార్థి తన ఫీజు తిరిగి ఇవ్వాలని కోరగా నిరాకరించింది. దీనిపై ఆ విద్యార్థి వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ ఫిట్జీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వాదోపవాదనలు విని పైతీర్పు ఇచ్చింది. అయితే విచారణలో ‘చేరే సమయంలో విద్యార్థికి తిరిగి ఫీజు చెల్లించబోమని విషయాన్ని ముందే చెప్పాం’ అని ఫిట్జీ వాదించింది. ఈ ఒప్పందంపై ఆ విద్యార్థి సంతకం చేశారని కూడా గుర్తు చేయగా ఆ వాదనను కమిషన్ తోసిపుచ్చింది. ఫీజు వివాదం వినియోగదారుల కమిషన్ పరిధిలోకి రాదని ఫిట్జీ విద్యా సంస్థ పేర్కొనగా కమిషన్ తిరస్కరించింది. విద్యా సంస్థ ముసుగులో కోచింగ్ కేంద్రం నిర్వహిస్తున్నారని కమిషన్ పేర్కొంది. విద్యార్థికి రూ.4.35 లక్షల ఫీజు, రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఫిట్జీకి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇది 45 రోజుల్లో చెల్లించకపోతే 9 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారుల కమిషన్ హెచ్చరించింది. -
వాహన రుణగ్రహీతలకు ‘జీపీఎస్’ కమీషన్ వెనక్కి
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద వాహనరుణాలు తీసుకుని, జీపీఎస్ పరికరాలను సైతం కొనుగోలు చేసిన కస్టమర్లకు ‘కమీషన్ల’ను త్వరలో తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. 2013–14 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరం మధ్య వాహన రుణాలు తీసుకున్న కస్టమర్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు జీపీఎస్ పరికరాలను కూడా కొనుగోలు చేయించింది. ఆయా పరికరాల విక్రయం రూపంలో కమీషన్లను సంపాదించుకుంది. వాహన రుణాల్లో అవకతవకలు జరిగినట్టు గతేడాది బ్యాంకు చీఫ్గా ఉన్న ఆదిత్యపురి సైతం అంగీకరించారు. దీనిపై ఆర్బీఐ రూ.10 కోట్ల జరిమానా కూడా విధించింది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 2013–14 నుంచి 2019–20 మధ్య వాహన రుణాలు తీసుకుని, జీపీఎస్ పరికరాలనూ కొనుగోలు చేసిన వారికి కమీషన్లను తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. బ్యాంకు వద్ద నమోదై ఉన్న కస్టమర్ల ఖాతాలకు వచ్చే 30 రోజుల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్టు తెలిపింది. దీనిపై కస్టమర్లు బ్యాంకు శాఖలను సంప్రదించొచ్చని సూచించింది. వాహన రుణ దరఖాస్తును ఆమోదించే సమయంలో కస్టమర్తో రూ.18,000 విలువ చేసే జీపీఎస్ పరికరాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు కొనుగోలు చేయించిందన్నది ఆరోపణ. నిబంధనల ప్రకారం బ్యాంకు లు ఇతర ఉత్పత్తులను విక్రయించరాదు. సేవల ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం అదే పనిగా డిజిటల్ సేవల్లో అంతరాయాలు ఏర్పడుతుండడంతో.. నూతన క్రెడిట్ కార్డులు మంజూరు చేయకుండా ఆర్బీఐ విధించిన నిషేధం నుంచి బయటపడేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి రమేష్ లక్ష్మీనారాయణ తెలిపారు. నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సేవల్లో అంతరాయాలు ప్రస్తుత పాత వ్యవస్థ కారణంగానే చోటుచేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. వీటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తరచూ సాంకేతిక అవాంతరాలు ఏర్పడుతుండడంతో కొత్తగా క్రెడిట్ కార్డులు, నూతన డిజిటల్ సేవలు ప్రారంభించకుండా 2020 డిసెంబర్లో ఆర్బీఐ నిషేధం విధించడం గమనార్హం. -
ట్యాక్స్ రిఫండ్ ఇంకా రాలేదా..?
ఒక అసెస్సీ తన నికర ఆదాయం మీద చెల్లించాల్సిన పన్ను కన్నా ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే అలా ఎక్కువగా చెల్లించిన మొత్తాన్ని రిఫండుగా వెనక్కి ఇస్తారు. అంతే కాదు. రిఫండుతో పాటు వడ్డీ కూడా ఇస్తారు. అసెస్సీలే కాదు.. అసెస్సీ పరిశీలకులు, సంరక్షకులు, ప్రతినిధి కూడా రిఫండును క్లెయిమ్ చేయొచ్చు. సాధారణంగా దాఖలు చేసిన రిటర్నుని అధికారులు అసెస్.. అంటే మదింపు చేస్తారు. అలా పూర్తి చేసిన తర్వాత రిఫండు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే రిఫండ్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో అప్పీలులో పన్ను భారం తగ్గవచ్చు. అప్పుడు కూడా రిఫండు ఇస్తారు. ఇలా సకాలంలో ఇవ్వకపోయిన పక్షంలో రిఫండుతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తారు. టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ .. ఈ మూడింటిని కలిపితే మీరు చెల్లించిన మొత్తం పన్ను అవుతుంది. మదింపు చేసిన తర్వాత చెల్లించాల్సిన పన్ను భారం కన్నా మీరు కట్టిన పన్ను మొత్తం ఎక్కువగా ఉంటే రిఫండు ఇస్తారు. బేసిక్ లిమిట్ కంటే స్థూల నికర ఆదాయం తక్కువ ఉంటే ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయనవసరం లేదు. కానీ చెల్లించిన పన్ను మొత్తం ఉంటే రిఫండు కోసం రిటర్ను దాఖలు చేయాలి. రిఫండు అనేది ఆటోమేటిక్గా రాదు. రిటర్ను దాఖలు చేయాలి. అన్ని రకాలుగా మీ క్లెయిమ్ కరెక్టుగా ఉంటే రిఫండు త్వరగానే వచ్చేస్తుంది. 2021 మార్చి 31 నాటికి 2,38,000 మందికి రూ. 2.62 లక్షల కోట్ల రిఫండులు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి మే 10 మధ్య కాలంలో 13 లక్షల మందికి రూ. 17,061 కోట్లు రీఫండులు జారీ చేశారు. అయితే, ఈ కింది పరిస్థితుల్లో రిఫండు రాకపోవచ్చు. మదింపు ఇంకా జరగకపోతే రిటర్ను వెరిఫై కాకపోతే .. అంటే 120 రోజుల్లోపల పంపాల్సిన ఫారం V పంపకపోతే మీ బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఇవ్వకపోయినా లేక వివరాలు సరిపోలకపోయినా మీరు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో లాగిన్ అయి మీ ఆదాయపు పన్ను స్టేటస్ చెక్ చేసుకోవాలి. రిటర్ను వేసేటప్పుడు వాడుకలో ఉన్న మీ వ్యక్తిగత మెయిల్ వివరాలే ఇవ్వండి. అంతా ఆన్లైన్ యుగం. గతంలో లాగా పోస్ట్మ్యాన్ తలుపు తట్టి తాఖీదు ఇవ్వరు. ఒకవేళ నోటీసులేమైనా వస్తే ఆన్లైన్ మాధ్యమంలో సకాలంలో జవాబు పంపించండి. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ గుర్తు పెట్టుకోండి. ఎవరితోనూ షేర్ చేయొద్దు. ఒక సంవత్సరకాలంగా రిఫండు రావాల్సి ఉండి.. ఇతరత్రా మరో సంవత్సరానికి చెల్లించాల్సిన పన్ను భారం ఉంటే దానికి అడ్జస్టు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో నోటీసులు ఇస్తారు. సక్రమంగా, సకాలంలో స్పందించండి. ఆదాయపు పన్ను శాఖ రిఫండు విషయంలో మెరుగైన సరీ్వసులు అందిస్తోంది. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూరి కె.వి.ఎన్ లావణ్య -
ప్రయాణికులకు రీఫండ్ వోచర్లు..?
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ప్రయాణాలకు ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్స్ ఎలా జరగాలన్న అంశంపై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్ చేసుకుంది. బదలాయింపులకు వీలయిన రిఫండ్ వోచర్లు జారీ ద్వారా సమస్యకు సానుకూల పరిష్కారం చూపవచ్చన్న కేంద్రం ప్రతిపాదనను పరిశీలిస్తామని న్యాయమూర్తులు అశోక్ భూషన్, ఆర్ సుభాషన్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రతిపాదనలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... లాక్డౌన్ సమయంలో రద్దయిన సర్వీసులకు సంబంధించి ప్రయాణి కులకు డబ్బు వాపసు చేస్తే, ఇప్పటికే తీవ్ర కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలపై ఆర్థికంగా మరింత ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ‘బదలాయింపునకు వీలయిన రిఫండ్ వోచర్లను’ ప్రయాణి కులకు జారీ చేస్తే అటు ప్రయాణికులు, ఇటు విమానయాన సంస్థల ప్రయోజనాలకు విఘాతం కలుగదు. వోచర్స్ను ప్రయాణికులు టికెట్లు బుక్ చేసిన తమ ఏజెంట్లకు సమర్పించి, డబ్బు వాపసు తీసుకోవచ్చు. లేదా తదుపరి తమ ప్రయాణాల టికెట్ బుకింగ్లకు వినియోగించుకోవచ్చు. డబ్బు వాపసు ఇచ్చిన పక్షంలో ఆయా వోచర్లను వేరొకరి ప్రయాణాలకు వినియోగించే సౌలభ్యతను ఏజెంట్లకు కల్పించడం జరుగుతుంది. ఎన్జీఓలు, ప్యాసింజర్ల అసోసియేషన్స్సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు రెండు వర్గాల వాదనలు విన్న సంగతి తెలిసిందే. కేంద్రం, డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తరఫున తుషార్ మెహతా చేసిన ‘బదలాయింపులకు వీలయిన రిఫండ్స్ వోచర్ల’ ప్రతిపాదనకు ట్రావెల్ ఏజెంట్ల సంస్థ తరఫున వాదలను వినిపించిన సీనియర్ అడ్వకేట్ పల్లవ్ సిసోడియా సానుకూల స్పందన వ్యక్తం చేయడం శుక్రవారంనాటి మరో కీలకాంశం. ఇండిగో ఎయిర్లైన్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ కూడా సంబంధిత ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. విదేశీ విమాన సర్వీసులకు వర్తించదు! కాగా వాదనల సమయంలో ‘ప్రవాసీ లీగల్ సెల్’ ఎన్జీఏ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్గే విదేశాల నుంచి టికెట్ బుక్ చేసుకున్న వారికి రిఫండ్ పరిస్థితిని ప్రస్తావించారు. దీనికి అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, విదేశీ విమాన సర్వీసుల అంశంలోకి వెళ్లలేమని పేర్కొంది. సంబంధిత టికెట్లకు రిఫండ్ను భారత్ ప్రభుత్వం ఆదేశించలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. -
యూపీఐ చార్జీలను రిఫండ్ చేయండి
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 1 నుంచి రూపే కార్డులు, భీమ్–యూపీఐ విధానాల్లో చేసిన చెల్లింపులపై విధించిన చార్జీలను కస్టమర్లకు వాపసు చేయాలని బ్యాంకులకు ఆదాయ పన్ను శాఖ సూచించింది. భవిష్యత్లోనూ ఈ రెండు విధానాల్లో జరిపే లావాదేవీలపై ఎలాంటి చార్జీలు విధించవద్దని పేర్కొంది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. 2020 జనవరి 1 తర్వాత నుంచి నిర్దేశిత ఎలక్ట్రానిక్ చెల్లింపులపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) సహా ఇతరత్రా ఎలాంటి చార్జీలు వర్తించబోవని గతేడాది డిసెంబర్లోనే స్పష్టం చేసిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీనిపై ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ యూపీఐ లావాదేవీలపై కొన్ని బ్యాంకులు చార్జీలు విధిస్తున్న సంగతి తమ దృష్టికి వచ్చిందని సీబీడీటీ తెలిపింది. ఇది నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. మరోవైపు, ఈ రిఫండ్ల వ్యవహారం బ్యాంకులపై అదనపు భారం మోపుతుందని నాంగియా ఆండర్సెన్ పార్ట్నర్ సందీప్ ఝున్ఝున్వాలా పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో 2019 ఆర్థిక చట్టంలో కేంద్రం ప్రత్యేక నిబంధన చేర్చింది. దీని ప్రకారం రూ. 50 కోట్ల టర్నోవరు దాటిన వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ విధానంలో చెల్లింపులు జరిపేందుకు కస్టమర్లకు వెసులుబాటునివ్వాలి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement