తత్కాల్‌ టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌.. రైలు ప్రయాణికులకు శుభవార్త!   | Paytm 100% Refund On Tatkal Train Ticket Cancellation - Sakshi
Sakshi News home page

తత్కాల్‌ టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌.. రైలు ప్రయాణికులకు శుభవార్త!  

Published Thu, Oct 5 2023 9:03 AM

paytm 100pc Refund on tatkal train ticket Cancellation - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ చెల్లింపులు సేవల సంస్థ పేటీఎం.. తన ప్లాట్‌ఫామ్‌ ‘పేటీఎం యాప్‌’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ను పొందొచ్చని తెలిపింది. న్యూమనీ సేవింగ్‌ పేరుతో ప్రవేశపెట్టిన ఈ సదుపాయం యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందని పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ తెలిపింది.

తత్కాల్‌ సహా సహా అన్ని రకాల రైలు టికెట్ల రద్దుపై అప్పటికప్పుడే సోర్స్‌ అకౌంట్‌ (చెల్లింపులు చేసిన బ్యాంక్‌ ఖాతా లేదా కార్డ్‌)కు రిఫండ్‌ పొందొచ్చని ప్రకటించింది. రిఫండ్‌ కోసం రోజులకొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. రైలు ప్రారంభానికి ఆరు గంటల ముందు లేదంటే చార్ట్‌ రూపొందించడానికి (వీటిలో ఏది ముందు అయితే అదే వర్తిస్తుంది) ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని వివరించింది.

‘‘మొబైల్‌ చెల్లింపులు, క్యూఆర్‌ టెక్నాలజీలో ప్రముఖ సంస్థగా ఉన్న పేటీఎం, ట్రావెల్‌ బుకింగ్‌లకు సంబంధించి మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఉన్న ఫళంగా రైలు టికెట్లు రద్దు చేసుకునే వారికి ఈ కొత్త సుదపాయం ఉపశమనాన్ని ఇస్తుంది’’అని పేటీఎం అధికార ప్రతినిధి తెలిపారు. రైలు టికెట్లు బుకింగ్‌కు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే గేట్‌వే ఫీజు వసూలు చేయడం లేదని పేటీఎం తెలిపింది.

 
Advertisement
 
Advertisement