
హీరోయిన్ మీరా వాసుదేవన్ పెళ్లిపీటలెక్కింది.

ముచ్చటగా మూడోసారి తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది.

ఈ శుభవార్తను మీరా సోషల్ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించింది. ఏప్రిల్ 21న కోయంబత్తూరులో పెళ్లయిందని, రిజిస్టర్ ప్రక్రియ ఈరోజు పూర్తయిందంటూ శుక్రవారం నాడు వివాహ ఫోటోలు షేర్ చేసింది.

అలాగే తన భర్త గురించి వివరాలను సైతం పొందుపరిచింది.

విపిన్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందినవాడు.

ఈయన ఒక సినిమాటోగ్రాఫర్. అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నాడు.

విపిన్, నేను ఒక ప్రాజెక్టు కోసం 2019 మే నుంచి కలిసి పని చేస్తున్నాం. గతేడాదే కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చాం.

అలా ఈ ఏడాది ఒక్కటయ్యాం. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది అని రాసుకొచ్చింది.

ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

కాగా మీరా వసుదేవన్ 2001లో సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది.

రెండు మూడు ధారావాహికల్లో కనిపించిన ఆమె గోల్మాల్ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారింది.

అంజలి ఐ లవ్ యూ అనే చిత్రంలోనూ నటించింది. తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్గా యాక్ట్ చేసింది.

ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేస్తోంది.

తన వ్యక్తిగత విషయానికి వస్తే.. మీరా వాసుదేవన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ తనయుడు విశాల్ అగర్వాల్ను 2005లో వివాహం చేసుకుంది.

పెళ్లయిన ఐదేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు.

తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ బంధం కూడా ముక్కలైంది.

2016లో భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి సింగిల్ మదర్గా ఉంటున్న ఈమె కుడుంబవిలక్కు అనే సీరియల్ షూటింగ్లో ఆ ధారావాహిక కెమెరామన్ విపిన్తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను ఇప్పుడు పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు.