Palnadu
-
త్వరలో పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభిస్తాం
రెంటచింతల: పిడుగురాళ్ల వైద్య కళాశాలను రానున్న విద్యాసంవత్సరంలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి సత్యకుమార్ వ వెల్లడించారు. గురువారం రాత్రి మండల కేంద్రమైన రెంటచింతలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో 3100 ఆరోగ్య ఉపకేంద్రాలను గత వైసీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధులు మళ్లించి అసంపూర్తిగా నిర్మించారన్నారు. కేంద్రం నిధులతో కూటమి ప్రభుత్వం మరో 1700 ఆరోగ్య ఉపకేంద్రాలను గ్రామాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు బిఎస్సీ నర్సింగ్ చదివిన విద్యార్థులను వినియోగించుకుంటామన్నారు. ఇప్పటికే కేంద్రప్రభుత్వం కూడా నిధులను కేటాయించడం జరిగిందన్నారు. మాచర్ల పట్టణంలో త్వరలోనే 100 పడకల వైద్యశాలను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆరోగ్య కేంద్రాలలో వైద్యుల కొరతను నివారించేందుకు పీపీపీ పద్ధతిలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ముందుగా పార్టీ యువ నాయకులు ఇగుటూరి రాజశేఖర్రెడ్డి దంపతులు మంత్రి సత్యకుమార్కు కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందచేసి దుశ్శాలవతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, పల్నాడు జిల్లా ఇన్చార్జి కె.శ్రీనివాస్, మాచర్ల నియోజక వర్గ ఇన్చార్జి గుమ్మడి నాసరయ్య, మండల అధ్యక్షులు బోయిన నాగిరెడ్డి, పార్టీ నాయకులు పాశం మట్టారెడ్డి, ఇగుటూరి రాజశేఖర్రెడ్డి, సూరపరెడ్డి పుల్లారెడ్డి, విజయ్ కుమార్,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ -
నిందితుడు అరెస్ట్
చోరీలకు పాల్పడుతున్న నరసరావుపేట రూరల్: తాళాలు వేసి ఉన్న గృహాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న నేరస్తుడిని అరెస్ట్చేసి అతని వద్ద నుంచి రూ.33.50లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరంకు చెందిన గోపిశెట్టి నాగమల్లేశ్వరరావు బెట్టింగ్తో పాటు చేడు వ్యసనాలకు బానిసై నేరాలకు అలవాటు పడ్డాడు. ఇతనిపై 2018 సంవత్సరంలో అద్దంకి పోలీస్ స్టేషన్లో హత్యకేసు నమోదైంది. దర్శి, గిద్దలూరు పోలీస్స్టేషన్లో హత్యకేసులు ఉన్నాయి. దీంతో పాటు పలు పోలీసు స్టేషన్ల్లో చోరీ కేసులూ ఉన్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గమనించి రాత్రి, పగలు తేడా లేకుండా చోరీలకు పాల్పడటంలో ఆరితేరాడు. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఉప్పలపాడు మెయిన్రోడ్డులోని ఇంటిలో చోరీకి పాల్పడి 350 గ్రాముల బంగారంతో పాటు వెండి దొంగిలించాడు. చోరీ చేసిన సొత్తును విక్రయించే ప్రయత్నంలో నరసరావుపేట మండలం రావిపాడు శివారులో పోలీసులు నాగమల్లేశ్వరరావును అదుపులోకి తీసుకొని విచారించారు. నరసరావుపేట మండలం ఉప్పలపాడుతో పాటు పెట్లూరివారిపాలెం, పమిడిపాడు, వన్టౌన పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్లాల్ హోటల్ వెనుక గృహంలో, చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెంలో చోరీకి పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. ఈ మేరకు నిందితుడి నుంచి 380 గ్రాముల బంగారం, 6 కిలోల వెండిని స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో దర్యాప్తులో ప్రతిభ చూపిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు, గురజాల డీఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. రికవరీపై అనుమానాలు..! చోరీ కేసులో పోలీసులు వెల్లడించిన బంగారం రికవరీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు పూర్తిస్థాయిలో బంగారాన్ని రికవరీ చేయలేదని తెలుస్తుంది. నిందితుడు నాగమల్లేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు నరసరావుపేటలో బంగారం వ్యాపారం చేస్తున్న అధికారపార్టీ నాయకుడు దొంగ బంగారాన్ని కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. బంగారం రికవరీ కోసం పోలీసులు ఒత్తిడి తీసుకురావడం, దీనిపై మీడియాలో కథనాలు రావడంతో వ్యాపారి అధికారపార్టీ ప్రజాప్రతినిధులను ఆశ్రయించాడు. ఒక ఎంపీతో పాటు ఎమ్మెల్యే వ్యాపారికి అండగా నిలవడంతో నామమాత్రంగా వ్యాపారి నుంచి పోలీసులు రికవరీ చేసినట్టు తెలుస్తుంది. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కూడా కేవలం ఉప్పలపాడులోనే 350 గ్రాములు బంగారం చోరీకి గురైనట్టు తెలిపారు. మిగిలిన నాలుగు కేసుల్లో ఎంత బంగారం నిందితుడు చోరీ చేసింది వెల్లడించక పోవడం అనుమానాలను తావిస్తుంది. రూ. 33.50లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు స్వాధీనం తాళాలు వేసిన గృహాలే లక్ష్యంగా చోరీలు నరసరావుపేట, చిలకలూరిపేటల్లో ఐదు చోట్ల దొంగతనాలు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు -
మాచర్ల నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు నియామకం
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షు లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇరువురిని మాచర్ల నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యా లయం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందీ. ఈ మేరకు పాముల సంపూర్ణమ్మను మహిళా విభాగ అధ్యక్షురాలిగాను, కందుకుర్తి మధును ఎస్సీ సెల్అధ్యక్షులుగా నియమితులయ్యారు.ఏపీఐఐసీ భూముల పరిశీలన మాచర్ల రూరల్: మండలంలోని రాయవరం గ్రామ సమీపంలోని ఏపీఐఐసీకి చెందిన భూములను తైవాన్ దేశానికి చెందిన ఏషియా కంపెనీ పారిశ్రామికవేత్తలు పరిశీలించారు. లెదర్ పార్కు ఏర్పాటు కోసం గురువారం వారు ఆయా భూముల గురించి తెలుసుకున్నారు. భవన నిర్మాణాలకు అనుకూలత, నీటి వసతి, విద్యుత్, భూగర్భ జలాలు, నేషనల్ హైవే, ఇతర రహదారి మార్గాలను వారు పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ బి. కిరణ్ కుమార్తో పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో రెవెన్యూ, ఇండస్ట్రియల్ అధికారులు పాల్గొన్నారు. నేడు సత్తెనపల్లిలో సీఐటీయూ మహాసభ సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సీఐటీయూ) 4వ రాష్ట్ర మహా సభ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో గల పుతుంబాక వెంకటపతి భవన్ నందు శుక్రవారం నిర్వహించడం జరుగుతుందని వీఆర్ఏల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బందగీ సాహెబ్ గురువారం తెలిపారు. వీఆర్ఏల 4వ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరవుతారన్నారు. ముఖ్యంగా ఈ 4వ రాష్ట్ర మహాసభలలో వీఆర్ఏల సమస్యల పట్ల చర్చ, భవిష్యత్తు కార్యాచరణ, నూతన కార్యవర్గం తదితర అంశాల మీద చర్చ జరుగుతుందన్నారు. ఈ మహా సభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకత్వం, డివిజన్ నాయకులు పాల్గొంటారన్నారు. అదుపు తప్పిన రెండు కార్లు కారంచేడు: దగ్గుబాడు నుంచి చీరాలకు తన కారులో ప్రయాణిస్తున్న వీరగంధం రామకృష్ణ అనే వ్యక్తి నాలుగురోడ్ల సెంటర్ దాటి మామిడి తోట సమీపంలోకిగా రాగనే గాడిలో టైర్లు పడటంతో కారు అదుపుతప్పి రోడ్డు మార్జిన్ ఉన్న పంట కాలువలో పడిపోయింది. బెలూన్లు ఓపెన్ కావడంతో ఆయన స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మధ్యాహ్నం పోతినవారిపాలేనికి చెందిన ఎనికపాటి మస్తాన్రావు చీరాలకు వెళ్తుండగా పోతినవారిపాలెం గ్రామం దాటిన ఒక కిలోమీటరు దూరంలోనే ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలో పడిపోయింది. దీంతో ఆయన కారులోను బెలూన్లు ఓపెన్ అయ్యాయి. ఆయన కూడా స్వల్ప గాయాలతో బయట పడ్డాడని గ్రామస్తులు చెబుతున్నారు. -
బర్లీపై బేఖాతర్ !
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రైతుల వద్ద ఉన్న బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని మే నెల 24న పర్చూరు ప్రాంతంలో పర్యటించిన మంత్రుల బృందం ఆదేశించినా టుబాకో కంపెనీలు ఐ డోంట్కేర్ అంటున్నాయి. పొగాకు కొనాలని 22 కంపెనీలను ఆదేశిస్తే ఒకటి రెండు కంపెనీలు మినహా మిగిలినవి మొక్కుబడిగా కూడా కొనడం లేదు. కొన్ని కేవలం 10 టన్నులు కొని చేతులు దులుపుకున్నాయి. ప్రభుత్వం ఆదేశించి రెండు వారాలు దాటుతున్నా గురువారం నాటికి కేవలం 24,571 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశాయి. ఒక్క జీపీఐ లిమిటెడ్ కంపెనీ 3,426 మెట్రిక్ టన్నులు, ప్రధాన కంపెనీగా ఉన్న ఐటీసీ కేవలం 758 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. యార్లగడ్డ ఆగ్రోస్ 771 టన్నులు, కార్టెల్ 1933, అలి ఎంటర్ ప్రైజెస్ 766, మహమ్మద్ ఎంటర్ ప్రైజెస్ 918, కళ్యాణీ టుబాకో 525, ఎస్బి ఇంపెక్స్ 460 టన్నుల చొప్పున కొనుగోలు చేయగా ఇక వేహా 12 టన్నులు, ప్రేవైల్ 46, ట్రేడ్ వెల్ 16, మహంకాళీ 10, ఎలైట్ ఆగ్రో 50 టన్నుల చొప్పున మాత్రమే కొనుగోలు చేసి మమ అనిపించాయి. వంద మెట్రిక్ టన్నుల లోపే... కొన్ని కంపెనీలు వంద మెట్రిక్ టన్నుల లోపే బ్లాక్బర్లీ కొనుగోలు చేశాయి. మొత్తంగా 22 కంపెనీలు కలిపి కేవలం 24, 571 మెట్రిక్ టన్నులు కొనగా ఒక్క జీపీఐ 3,500 టన్నులు కొంది. జీపీఐ నిత్యం రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేస్తోంది. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం రైతుల వద్ద 87.23 మెట్రిక్ టన్నుల పొగాకు దిగుబడి ఉండగా గురువారం నాటికి 24.57 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. పట్టించుకోని సర్కార్ జిల్లాలో రైతుల వద్ద ఉన్న బ్లాక్బర్లీ పొగాకు మొత్తం కొనుగోలు చేయిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత కొనుగోళ్లను ఏమాత్రం పర్యవేక్షించక చేతులెత్తేసింది. దీంతో కొనుగోళ్లు దాదాపు నిలిచిపోయాయి. మే 24న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కూడిన మంత్రుల కమిటీ పర్చూరు నియోజకవర్గంలో పర్యటించి రైతుల వద్ద పొగాకు కొనాలని కంపెనీలను ఆదేశించాయి. మొత్తం పొగాకు కొనిపిస్తామని మాటిచ్చారు. ప్రధానంగా ఐటీసీ లాంటి పెద్ద కంపెనీలు కేవలం 758 మెట్రిక్ టన్నులు కొని చేతులు దులుపుకోవడం విమర్శలకు దారితీసింది. పొగాకు కొనిపించే విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చూపించడం లేదనడానికి ఇదే నిదర్శనమని ప్రతిపక్ష వైఎస్సార్సీపీతోపాటు రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం కొన్నా 20 వేల మెట్రిక్ టన్నులకు మించి కొనుగోలు చేసే పరిస్థితి ఉండక పోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే పర్చూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు నియోజకవర్గంలోని పచ్చపార్టీ కార్యకర్తల పొగాకు మాత్రమే కొని చేతులు దులుపు కునే అవకాశముందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ ఆదేశాలు లెక్క చేయని టుబాకో కంపెనీలు రైతుల వద్ద బ్లాక్ బర్లీ కొనాలన్న ప్రభుత్వం జీపీఐ మినహా పొగాకు కొనని ఇతర కంపెనీలు మొక్కుబడి కొనుగోళ్లతో సరిపెట్టిన ఐటీసీ పేరుకు 22 కంపెనీలు ఉన్నా 25 వేల టన్నులు కూడా కొనని వైనం ఇంకా రైతుల వద్ద 62 వేల టన్నుల బ్లాక్ బర్లీ పొగాకు నిల్వలు -
అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు
దుగ్గిరాల: డ్రైవరు మద్యం మత్తులో ఉండగా అదుపు తప్పిన కారు కాలువలోకి దూసుకెళ్లిది. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో గురువారం మధ్యాహ్నం చిలువూరు నుంచి కె.ఆర్.కొండూరు గ్రామం వైపు కారు వేగంగా వెళుతోంది. ఈ క్రమంలో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిది. స్థానికులు చూసి కారులోని డ్రైవరును బయటకు తీశారు. అతడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. చిలువూరులో పక్కపక్కనే రెండు మద్యం దుకాణాలు ఉండటం వల్ల కొందరు నిత్యం మద్యం తాగి వేగంగా ద్విచక్రవాహనాలు, కార్లను నడుపుతున్నారని స్థానికులు చెప్పారు. పలువురు ప్రమాదానికి గురవుతున్నారని తెలిపారు. అధికారులకు అనేకసార్లు ఇక్కడ మద్యం దుకాణాలు తొలగించాలని కోరినా స్పందించలేదని పేర్కొన్నారు. -
‘కూటమి’ విష సంస్కృతి
● వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై వేఽధింపులు ● నూతన విద్యుత్ స్తంభాలు నిలిపివేత ● గ్రామంలో కూటమి నాయకులకే వత్తాసు పలుకుతున్న విద్యుత్ అధికారులు జె.పంగులూరు: నిన్నటి వరకు కలిసి మెలిసి ఒకే కుటుంబంలా జీవించే గ్రామాలు నేడు రాజకీయ రంగు పులుము కుంటున్నాయి. కులమతాలకు, రాజకీయాలుకు అతీతంగా ఉండే గ్రామాలు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో.. రెడ్ బుక్ రాజ్యాంగంలో చితికిపోతున్నాయి. కూటమి పెద్దలు వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై రాజకీయ కక్ష పెంచుకొని, వారిని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని చందలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని 8వ వార్డులో గొట్టిపాటి వారి బజారు ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆ వార్డు నుంచి కుంచాల రమాదేవి అనే మహిళ వార్డు మెంబరుగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరురాలిగా గెలిచింది. అయితే గొట్టిపాటి వారి బజారు నుంచి వార్డు మెంబరుగా నిలబడి గెలవడమే ఆ బజారు వారు చేసిన తప్పుగా మారింది. 2024 లో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వారిని అన్ని విధాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు. 40 ఏళ్ల నాటి కరెంటు స్తంభాలు గొట్టిపాటి వారి బజారుకి 1984లో మూడు స్తంభాలు వేసి కరెంటు లైన్ లాగారు. అయితే ప్రస్తుతం చందలూరు గ్రామంలో పాత స్తంభాల స్థానంలో కొత్తవి వేస్తున్నారు. అందరితో పాటు తమకూ వేస్తారులే అని అ బజారు వారు అనుకున్నారు. కానీ ఊరు మొత్తం కొత్త స్తంభాలు వేసి కరెంటు లైన్లు లాగిన సిబ్బంది.. ఆ బజారును మాత్రం అలానే వదిలేశారు. 40 సంవత్సరాల నాటి స్తంభాలు పూర్తిగా వంగి పోయి కరెంటు వైర్లు కిందికి జారాయి. ఎప్పడు విరిగిపోతాయో తెలియని దుస్థితి నెలకొంది. అధికారులు మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికే నిర్ణయించుకున్నట్లుంది. కలెక్టర్కు అర్జీ గొట్టిపాటి వారి బజారుకు చెందిన స్థానికులు ఏప్రిల్ 7న బాపట్ల కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్ వెంటనే 15 రోజుల్లో సమస్య పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే కొత్త స్తంభాలు వేస్తామని, అడ్డు వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి సంతకాలు చేయించుకొని.. ఆన్లైన్లో అర్జీ రద్దు చేశారు. చేసేది లేక తిరిగి గొట్టిపాటి బజరు వారు మే 19న కలెక్టర్కు మరో సారి అర్జీ ఇచ్చారు. కలెక్టర్ సమస్య పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉచిత సలహాలు ఇస్తున్న అధికారులు విద్యుత్ ఏఈ గొరంట్ల అనిల్ కుమార్కు ఫోన్ చేసి తీగలు వేల్లాడుతున్నాయని చెబితే.. కర్రలు అడ్డు పెట్టుకోమని తమకు ఉచిత సలహాలు ఇస్తున్నారని స్థానికులు వాపోయారు. స్తంభాలు ధ్వంసం అయ్యాయని తెలిపినా.. వాటి జోలికి వస్తే ఊరుకోమంటూ దురుసుగా మాట్లాడారని తెలిపారు. -
పర్యావరణ సమతుల్యతకు మొక్కలు నాటాలి
అదనపు సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎం. లావణ్య నరసరావుపేట టౌన్: పర్యావరణ సమతుల్యం కోసం మొక్కలు నాటాలని అదనపు సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎం. లావణ్య సూచించారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా గురువారం రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు స్థానిక న్యాయస్థానం ఆవరణలో పర్యావరణ పరిరక్షణపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని ప్రసంగించారు. మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలనీ, కాలుష్యాన్ని నివారించడం కోసం అందరమూ కృషి చేయాలన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి సంరక్షించడంతోపాటు ప్లాస్టిక్ బ్యాగ్ల వాడకాన్ని నివారించాలన్నారు. అనంతరం న్యాయస్థాన భవనాల ఆవరణలో న్యాయాధికారి లావణ్య మొక్కలు నాటారు. కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, కోర్ట్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ ఎం.వి. చరణ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ లోక్నాథ్, ఎస్ఐలు కిషోర్, అశోక్ సిబ్బంది పాల్గొన్నారు. -
కౌలు రైతులకు రుణాలు పెంచాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో కౌలు రైతులకు ఇవ్వాల్సిన రుణ లక్ష్యాలను ఆశించిన స్థాయిలో బ్యాంకర్లు పూర్తి చేయలేదని, దీన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో 2025 త్రైమాసికానికి సంబంధించి డీసీసీ, డీఎల్ఆర్సీ బ్యాంకర్ల సమవేశం జరిగింది. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులకు రూ. 180 కోట్ల రుణ లక్ష్యం కాగా, రూ. 60 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. దీన్ని మరింత పెంచి పెండింగ్ రుణాలు అందించాలన్నారు. విద్య, గృహ రుణాలు పెంచేందుకు బ్యాంకర్లు, విద్యా సంస్థలు, ఇంజినీరింగ్ కళాశాలలు, తదితర రద్దీ ప్రాంతాల్లో రుణ మేళా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించాలన్నారు. దీనిలో భాగంగా కనీసం రూ. 20 వేల మందికి రుణాలు ఇవ్వాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఎం విశ్వకర్మ, పీఎం ఈజీసీఎం, పీఎంఎఫ్ ఎంజీ, ముద్ర రుణ లక్ష్యాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. గత ఆర్థిక సంవత్సరం 2024–25 కు సంబంధించి వ్యవసాయ రంగానికి రూ.13,613 కోట్ల రుణ లక్ష్యం కాగా, రూ.16,266 కోట్లు అంటే 119 శాతం మంజూరు చేశారన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 9,495 కోట్లు రుణ లక్ష్యం కాగా, రూ. 10,679 కోట్లు అంటే 112 శాతం మంజూరు చేశారన్నారు. ప్రాధాన్యత రంగానికి సంబంధించి విద్యా రుణాలు రూ.114.5 కోట్లు లక్ష్యం కాగా, రూ.95.87 కోట్లు మంజూరు చేశారన్నారు. గృహ రుణాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని అసహనం వ్యక్తం చేశారు. దీనిలో రూ.664 కోట్లు లక్ష్యం నిర్ణయిస్తే, రూ.182 కోట్లు అంటే కేవలం 27.5 శాతం మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. మొత్తం వార్షిక రుణ లక్ష్యం రూ.34,730 కోట్లకు గాను, రూ.44,918 కోట్లు అంటే రూ.129 కోట్లు మంజూరు చేసి రుణ లక్ష్యాలను దాటినందుకు బ్యాంకర్లను అభినందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లాకు సంబంధించి నాబార్డు పీఎల్పీ 2025 –26 పుస్తకాన్ని ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, యూడీఐ రీజనల్ హెడ్ జవహర్, జిల్లా లీడ్బ్యాంకు మేనేజర్ మహిపాల్రెడ్డి, నాబార్డు డీడీఎం శరత్, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఆర్బీఐ ఎల్డీవో నవీన్లు ఆవిష్కరించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ -
పకడ్బందీగా మెగా డీఎస్సీ
● పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు, బందోబస్తు కల్పించండి ● సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్ నరసరావుపేట: జిల్లాలో నేటి నుంచి ఈ నెల 30 వరకు నిర్వహించే మెగా డీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష కేంద్రాల వద్ద మౌలికవసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. గురువారం కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రెండు షిఫ్ట్లలో సుమారుగా 18,415 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారన్నారు. మారుమూల ప్రాంతాలనుంచి అభ్యర్థులకు అనువుగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాలు తెలిసేలా ప్రధాన కూడళ్లలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులు అనుమతించడం జరుగుతుందని, పరీక్షకు ఒక గంట ముందుగా అభ్యర్థులు హాజరుకావాలని, నిముషం లేటు అయినా అనుమతించడం జరగదని అన్నారు. అభ్యర్థులు కలర్ ఫొటో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డీఆర్ఓ ఏకా మురళి, అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ఆర్డీఓ కె.మధులత, డీఈఓ ఎల్.చంద్రకళ, ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. 8న రెడ్ల సత్రం సిల్వర్ జూబ్లీ వేడుకలు నరసరావుపేట రూరల్: కోటప్పకొండలోని శ్రీ యోగి వేమారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్, రెడ్ల సత్రం ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈనెల 8వ తేదీ ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్టు సత్రం కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, గాదె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, యర్రం వెంకటేశ్వరరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీజీ కృష్ణారెడ్డి, సత్తెనపల్లి వైఎస్సార్ సీపీ కన్వీనర్ డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డిలు పాల్గొంటారని తెలిపారు. ఘనంగా రామాలయం వార్షిక వేడుకలు నకరికల్లు: శ్రీరాంపురంలోని శ్రీరాముల వారి ఆలయ వార్షిక వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. 21వ వార్షిక వేడుకలు పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 24 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 24 మందికి గురువారం గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుచిత్ర, డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్లు నాగూర్ షరీఫ్, గోపవరపు స్టాన్లీ రాజ్కుమార్, సీనియర్అసిస్టెంట్ బి.శ్యామ్ అనిల్, పాల్గొన్నారు. జూలై 26, 27 తేదీలలో టైప్రైటింగ్ పరీక్షలు రేపల్లె: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలలో టైప్రైటింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ టైప్రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీవీ మోహనరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 26, 27 తేదీలలో లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలను, అదనంగా ఇంగ్లిష్ జూనియర్ గ్రేడ్ పరీక్షలు 36 కేంద్రాలలో నిర్వహించనున్నట్టు తెలిపారు. జులై 12, 13 తేదీలలో తెలుగు, ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ అన్ని గ్రేడ్ల పరీక్షలు 7 కేంద్రాలలో నిర్వహిస్తారు. టైప్, షార్ట్ హ్యాండ్ పరీక్షలకు హాజరుకాదలచిన అభ్యర్థులు పూర్తి వివరాలకు స్థానికంగా ఉన్న టైప్ ఇనిస్టిట్యూట్లలో సంప్రదించాలన్నారు. -
ఆధునిక వ్యవసాయ విధానంతో అధిక దిగుబడులు
కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వర్లు పెదకూరపాడు: ఆధునిక వ్యవసాయ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్పారు. కృషి విజ్ఞాన్ కేంద్రం వారి ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప యాత్ర పెదకూరపాడులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులు అంటే డ్రోన్ల ప్రాముఖ్యత, అధునాతన యంత్రాలు గురించి వివరించారు. అవి ఎలా ఉపయోగపడతాయో తెలియ చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం లాంఫాం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.గంగాదేవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయం, అనుబంధ రంగాల పథకాల గురించి వివరించారు. ఈనామ్ పోర్టల్ వినియోగం, కిసాన్ సారధి టోల్ ప్రీనెంబరు గురించి వివరించారు. ఉద్యానశాఖలో అమలవుతున్న పండ్ల తోటలు, పూల తోటలకు ఇచ్చే సబ్సిడీల వివరాలను ఉద్యానవన శాఖాధికారి యు.శ్రీ నిత్య వివరించారు. పశు సంవర్థకశాఖ పథకాలను గురించి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ పి.శ్రీదేవి తెలియచేశారు. వ్యవసాయ శాఖలో అమలవుతున్న పీఎం కిసాన్ మట్టి నమూనాల సేకరణ, 50 శాతం రాయితీపై పచ్చిరొట్టె విత్తనాలు పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ మొదలైన పథకాల గురించి ఏవో ఐ శాంతి తెలియచేశారు. జీవ శిలీంద్రనాసిని అయిన ట్రైకోడెర్మావిరిడి ప్యాకెట్లను కృషి విజ్ఞాన కేంద్రం, లాంఫాం శాస్త్రవేత్తలు రైతులకు ఉచితంగా పంపిణి చేశారు. కార్యక్రమంలో రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు బి.జ్యోతి, పి.ధనలక్ష్మీ షేక్ హసన్ బాజీ పాల్గొన్నారు. -
ఆరోగ్యయోగం
యోగాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజల్లో యోగా గురించిన అవగాహన పెరిగిందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ యోగా స్ఫూర్తి వికసించింది. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ వేలమంది ఏకకాలంలో యోగా చేశారు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జిల్లా అధికారులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అర్ధగంట పాటు యోగాసనాల కోసం కేటాయించాలన్నారు. యోగా అంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానమని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు గిన్నిస్ బుక్ రికార్డు సాధించే ప్రయత్నానికి ప్రజలు అందరూ సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్పర్సన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, జిల్లా అధికారులు, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసుశాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. –నరసరావుపేట -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావుపేట: పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. మనతో మనం మమేకం అవడం యోగా అయితే, ప్రకృతితో మమేకం అవడం ‘హరిత యోగా’ అని పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గురువారం పరేడ్ గ్రౌండ్స్ రోడ్డులో వనమహోత్సవం నిర్వహించి మొక్కలు నాటారు. యోగాంధ్ర, వనమోత్సవం కార్యక్రమాలకు హాజరైన వారితో డీఎఫ్ఓ (సామాజిక అడవులు) అశోక్ వనమహోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞను చేయించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. డీఆర్ఓ ఏకా మురళి, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, ఆర్డీకె కె.మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నీటిశుద్ధి ప్లాంట్కు 20ఎకరాలు సేకరించండి నరసరావుపేట: నాగార్జునసాగర్ వద్ద నీటిశుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన 20 ఎకరాల భూమిని త్వరగా ఏర్పాటుచేసి రానున్న రెండేళ్లలో ప్లాంట్ పూర్తిచేసేందుకు సహకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ జాయింట్ సెక్రటరీ లాల్ చంద్రమా, టెక్నికల్ ఆఫీసర్ జగజిత్సింగ్ సోది జిల్లా కలెక్టర్ను కోరారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ పి.అరుణ్బాబు అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా నీటిశుద్ధి, పారిశుధ్య మిషన్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చేపడుతున్న జలజీవన్ మిషన్ వివరాలు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కలెక్టర్ వారికి వివరించారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ అనంతరాజ్, ద్వామా పీడీ సిద్ధలింగమూర్తి, డీఎఫ్ఓ అశోక్కుమార్, డీపీఓ నాగేశ్వర్ నాయక్, ఎన్ఎస్పీ ఈఈ కృష్ణమోహన్, ఏడీఏ రవికుమార్, డీఎల్డీఓ వెంకటరెడ్డి, భూగర్భజల అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
16 మందికి హెడ్ నర్సులుగా ఉద్యోగోన్నతి
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్ నర్సులుగా పని చేస్తున్న 16 మందికి గురువారం కౌన్సెలింగ్ నిర్వహించి హెడ్ నర్సులుగా ప్రమోషన్ ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్కు 17 మంది స్టాఫ్ నర్సులను ప్రమోషన్ కోసం పిలువగా, ఒకరు ప్రమోషన్ వద్దని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. ప్రమోషన్ ద్వారా గుంటూరు జీజీహెచ్లో ఎనిమిది మంది, ఒంగోలు జీజీహెచ్లో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు హెడ్ నర్సులుగా చేరారు. సుమారు ఆరు నెలలుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న నర్సింగ్ సిబ్బంది ఎట్టకేలకు కౌన్సెలింగ్ జరగడంతో నర్సింగ్ యూనియన్ నేతలతో కలిసి గురువారం మెడికల్ అండ్ హెల్త్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుచిత్రాదేవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆర్డీతోపాటు, డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ షేక్ నాగూర్ షరీఫ్, సీనియర్ అసిస్టెంట్ సుబ్బారావు పాల్గొన్నారు. ఆర్డీకి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా సెక్రటరీ వెల్లంపల్లి పద్మజ, వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సునీత, అరుణ తదితరులు పాల్గొన్నారు. -
బంగారం కోసమే వృద్ధురాలి హత్య
తెనాలి ముత్తెంశెట్టిపాలెం కేసును ఛేదించిన పోలీసులు తెనాలి రూరల్: తెనాలి ముత్తంశెట్టిపాలెంలో ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున వృద్ధురాలి హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. తెనాలి వన్ టౌన్ పోలీస్స్టేషన్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి. జనార్దనరావు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకార.. ముత్తెంశెట్టిపాలెంలో తాడిపత్రి మల్లీశ్వరి టిఫిన్ బండి నిర్వహిస్తూ ఒంటరిగా జీవిస్తోంది. కుమార్తె, కుమారుడికి వివాహాలయ్యాయి. వారు ఇదే ప్రాంతంలో వేర్వేరుగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటున్న మల్లీశ్వరి బంగారు ఆభరణాలను ధరించి ఉండడాన్ని ఆమె ఇంటి పక్కనే నివసిస్తున్న 24 ఏళ్ల నన్నెపాముల తారక జోషి గమనించాడు. ఇతడు గతంలో బాపట్ల జిల్లా నగరం మండలం ధూళిపూడి గ్రామంలో నివసించేవాడు. వివాహమై, చెడు వ్యసనాలతో అప్పులపాలైన అతను ఆ ఆభరణాలను దోచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు తన తమ్ముడు సతీష్కుమార్ సహాయం తీసుకున్నాడు. 3వ తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు మల్లీశ్వరి నీళ్ల కోసం పంపు వద్దకు రాగా ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఆ బంగారంలో కొంత తారక జోషి తనకు పరిచయమున్న సంగంజాగర్లమూడి గ్రామానికి చెందిన మహిళ గాజులవర్తి కీర్తికి ఇచ్చాడు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారిస్తున్న క్రమంలో చిక్కిన నిందితులు నేరానికి పాల్పడినట్టు గుర్తించారు. ఆ ఆభరణాలను ఆమె తాకట్టు పెట్టిందని, వాటిని స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసును 48 గంటల్లో ఛేదించిన వన్ టౌన్ సీఐ మల్లికార్జునరావు, సిబ్బందిని ఆయన అభినందించారు. -
నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచిపేరు తీసుకురండి
సత్తెనపల్లి: క్రీడాకారులు క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాబు హుస్సేన్ అన్నారు. స్థానిక సుగాలీకాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్నాడు జిల్లాస్థాయి సబ్ జూనియర్స్, జూనియర్స్ బాలబాలికల ఫుట్బాల్ సెలక్షన్ ట్రయల్స్ గురువారం జరిగాయి. ఈ సెలక్షన్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 70 మంది బాలురు, 50 మంది బాలికలు ఫుట్బాల్ క్రీడలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు విజయమే లక్ష్యంగా పెట్టుకొని రాణించాలన్నారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరామ్ రెడ్డి, అచ్చిరెడ్డి, మహబూబ్ సుభాని, నరసింహారావులు మాబు హుస్సేన్ను ఘనంగా సత్కరించారు. పల్నాడు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు సెలెక్ట్ అయిన ఫుట్బాల్ క్రీడాకారులు త్వరలో జరిగే స్టేట్ మీట్లో పాల్గొంటారన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా సబ్ జూనియర్స్, జూనియర్స్ బాల, బాలికల జట్లను ప్రకటించారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాబు హుస్సేన్ జిల్లాస్థాయి సబ్ జూనియర్స్, జూనియర్స్ బాల, బాలికల ఫుట్బాల్ జట్ల ఎంపిక -
ప్రాణాలకు తెగించి సేవలు
మన్ననలు పొందిన సేవలు ఇలా... గురజాల: ప్రతినెలా ఒకటో తేదీనే సూర్యోదయం ఇంకా కాకముందే ఇంటివద్దకు వచ్చి చిక్కటి చిరునవ్వుతో అవ్వా,తాతలను పలకరిస్తూ పెన్షన్ డబ్బులు వారి చేతిలో పెట్టేవారు.. ఫోన్ చేస్తే చాలు పలికి.. ఏ పని కావాలన్నా రోజుల వ్యవధిలోనే పూర్తి చేసేవారు. విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, రైతులకు కావల్సిన పట్టాదారు పాసుపుస్తకాలు, తదితర ఎన్నో రకాల సర్టిఫికెట్లు ఇంటికే వచ్చి అందజేసేవారు.. ప్రభుత్వ పథకాల, ఇతర సమాచారాన్ని ప్రజల చెంతకే చేర్చారు. వారే వలంటీర్లు. దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా, గడప వద్దకే పాలన తెచ్చేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకురాగా, దానికి అనుబంధంగా ప్రజలకు మరింత చేరువగా సేవలందించేందుకు వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పథకాలు, సర్టిఫికెట్లు తదితరాలు నేరుగా ప్రజలకు అందించే ఏర్పాట్లు చేశారు. అయితే నేటి కూటమి ప్రభుత్వం వలంటీర్లకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి.. వారిని నడిరోడ్డుపై వదిలేసింది. వలంటీర్లను పూర్తిగా తొలగించడమే కాకుండా వారికి ఇవ్వాల్సిన బకాయిలను సైతం నేటికీ ఇవ్వలేదు. నమ్మించి.. వంచించి పల్నాడు జిల్లాలో మొత్తం 527 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాల్టీలు ఉన్నాయి. వాటిలో గ్రామ, వార్డు వలంటీర్లు 10,276 మందిని చంద్రబాబునాయుడు నమ్మించి వంచించాడు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి హయాంలో బాగా పనిచేసిన వలంటీర్లుకు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రలుగా గుర్తించి వారికి అవార్డుల కింద కొంత నగదును అందించి ప్రోత్సహించారు. కరోనా సమయంలో మా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాం. గౌరవ వేతనం కింద రూ.5వేలు అందించారు. కానీ మేం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చాం. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే రూ.10వేలు వేతనం ఇస్తామని చెప్పారు. గెలిచిన వెంటనే వలంటీర్ వ్యవస్థనే రద్దు చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేసే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలి. – షేక్ సైదాబీ, గురజాల వలంటీర్ కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి వలంటీర్లు సేవలు అందించారు. కోవిడ్ సోకి సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టగా, వలంటీర్లు వారి ఇళ్లకు వెళ్లి నిత్యావసరాలు, మందులు ఇవ్వడమే కాకుండా వారికి ధైర్యం కూడా చెప్పి సేవలందించారు. నేటి కూటమి ప్రభుత్వం వారి సేవలను గుర్తించి, వేతనాలు పెంచకపోగా, ఉద్యోగాలు సైతం ఊడబెరికింది. వలంటీర్లను వంచించిన చంద్రబాబు వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ అధికారమెక్కాక వ్యవస్థకే మంగళం జిల్లాలో 10,276 మంది వలంటీర్లు రోడ్డున పడ్డ వలంటీర్ల కుటుంబాలు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాం ప్రతి నెల 1వ తేదీన తెల్లవారకముందే అవ్వాతాతల ఇళ్లకు వెళ్లి వారికి పింఛన్లు అందించేవారు. కొన్నిసార్లు లబ్ధిదారులు ఏదైనా అనుకోని కారణంతో దూర ప్రాంతంలో, వైద్యశాలలో ఉంటే అక్కడికి సైతం వెళ్లి పింఛన్ అందించేవారు. పిల్లల చదువులకు కావల్సిన సర్టిఫికెట్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చేవారు. అనేక సంక్షేమ పథకాలకు తమ పరిధిలోని అర్హులను ప్రత్యేకంగా గుర్తించి, లబ్ధి చేకూర్చారు. కరోనా కష్టకాలంలో బాధితుల ఇళ్లకు వెళ్లి నీరు, ఆహారం, మందులు అందించారు. వారి ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలు అందించారు. -
పర్యావరణ పరిరక్షణ దినోత్సవ ప్రతిజ్ఞ
లక్ష్మీపురం: పర్యావరణ పరిరక్షణను ప్రొత్సహించే లక్ష్యంతో గుంటూరు రైల్వే స్టేషన్లో వేడుకలు నిర్వహించామని డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లో గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఒకటో ప్లాట్ఫాంపై ప్రయాణికులకు అవగాహన కలిగించారు. ర్యాలీ చేపట్టి, నాటకం ప్రదర్శించారు. డివిజన్ అధికారులు, ప్రయాణికులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్ఎం మాట్లాడుతూ పర్యావరణ అనుకూల అలవాట్లను నేర్చుకోవాలన్నారు. అనంతరం నల్లపాడులోని మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం కె.సైమన్, సీనియర్ డీఈఎన్ జె.వి. అనూష, సీనియర్ డీఎంఈ ఎం.రవికిరణ్, సీనియన్ డీసీఎం డాక్టర్ సీహెచ్ ప్రదీప్, డీఎస్సీ మధుసూదన రావు, సీనియర్ డీఈఈ జి.సూర్యనారాయణ, పి.రవితేజ తదితరులు పాల్గొన్నారు. లాంఫాంలో వన మహోత్సవం గుంటూరు రూరల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధంపై గురువారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏడీఆర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, శాస్త్రవేత్తలు పరిశోధన స్థానంలో మొక్కలు నాటారు. ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్న తరుణంలో విత్తనం ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయా ప్రాంతాలకు అనువైన విత్తనాలను లైసెన్స్డ్ డీలర్ల వద్ద , లేదా వ్యవసాయ శాఖ, లేదా యూనివర్సిటీ వద్ద మాత్రమే పొందాలన్నారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు పరిశీలనలో ఉన్న కంది రకం ఎల్ఆర్జీ 494 ను అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గుండ్లపాడు జంట హత్య కేసులో ఆరుగురి అరెస్ట్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. ఈ కేసులో టీడీపీకి చెందిన తోట వెంకట్రామయ్య, జవిశెట్టి శ్రీనివాసరావు, తోట గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రంలను ఈ నెల 4న సాయంత్రం వెల్దుర్తిలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు.టీడీపీలో వర్గపోరు నేపథ్యంలో గత నెల 24న గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు (మొద్దయ్య), జవిశెట్టి కోటేశ్వరరావు హత్యకు గురైన విషయం విదితమే. వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపిన ఎస్పీ శ్రీనివాసరావు చనిపోయిన, చంపిన వ్యక్తులు టీడీపీకి చెందిన వారేనని మీడియాకు వీడియో రూపంలో వివరించారు. మృతుల సమీప బంధువు తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మిగిలిన ముగ్గురు నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నామని, త్వరలో అరెస్ట్ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసుజంట హత్యల కేసును వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై నెట్టాలన్న దురుద్దేశంతో పోలీసులు ఓ కట్టుకథ అల్లారు. హత్యలపై టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరు వల్లే హత్యలు జరిగాయని తెలిపాడు. జవిశెట్టి వెంకటేశ్వర్లును హతమారిస్తే టీడీపీలో తనకు ఎదురుండదని, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు. ఆ తరువాత ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో కట్టుకథ అల్లారు. హత్యలో పాల్గొన్న నిందితులు జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజు హత్యానంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా కారులో కత్తులే ఉంటే.. జవిశెట్టి సోదరులను బండరాళ్లతో మోది ఎందుకు చంపుతారని, వారిని హత్య చేసేందుకు కత్తులే వాడేవారు కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. ‘వచ్చేది మా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డి చెబితేనే మేం చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు’ అంటూ హత్యానంతరం నిందితులు కారులోంచి కతు్తలు చూపించి బెదిరిస్తూ వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరులు కుట్ర పన్ని ఉంటే ఇలా చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించేందుకే ప్రభుత్వం, పోలీసులు పన్నిన కుట్రగా అర్థమవుతోంది. నిందితులు బెదిరించారన్న కట్టుకథలు తప్ప ఈ హత్యలో పిన్నెల్లి సోదరుల పాత్రపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు. -
నసివిల్స్ ర్యాంకర్కు తెలంగాణ గవర్నర్ సత్కారం
తెనాలి: గత నెలలో వెలువడిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ర్యాంకు సాధించిన తెనాలికి చెందిన దోనేపూడి విజయ్బాబును బుధవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సత్కరించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్–2024 పరీక్షల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ర్యాంకర్లను తెలంగాణ రాజ్భవన్ దర్బార్ హాలులో ఆ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సత్కరించారు. అందులో భాగంగా విజయ్బాబు సత్కారం అందుకున్నారు. ఆయన గతంలోనే సివిల్స్లో ర్యాంక్ సాధించి, ఐఆర్ఎస్ అధికారిగా సేవలను అందిస్తున్నారు. మెరుగైన ర్యాంకు కోసం మళ్లీ 2024 పరీక్షలు రాశారు. ఆ పరీక్షలోని ర్యాంకర్లకు ఇంకా పోస్టింగులు ఇవ్వాల్సివుంది. ఐపీఎస్ వస్తుందని విజయ్బాబు, ఆయన తల్లిదండ్రులు ఆశిస్తున్నారు. . -
వైకుంఠపురం వెంకన్న కొండకు అపచారం
అమరావతి: పవిత్ర పుణ్యక్షేత్రమైన వైకుంఠపురంలో స్వయంభూగా వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి కొండకు అపచారం జరుగుతోంది. కూటమి నేతల అండదండలతో కొందరు అక్రమంగా గ్రావెల్ కోసం కొండను తవ్వేస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు. వివరాల్లోకెళితే.. రాజధాని అమరావతికి సమీపాన ఎంతో చారిత్రక నేపధ్యం కలిగిన వైకుంఠపురం కొండపై వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈకొండ పక్కనుంచే పవిత్ర కృష్ణానది ఉత్తర దిక్కుగా ప్రవహించి ఉత్తరవాహినిగా పేరుగాంచింది. ఈకొండ చుట్టూ అష్టదిగ్బంధనంలాగా ఎనిమిది ఆంజనేయస్వామి వారి విగ్రహాలు ప్రతిష్టించి ఉన్నాయని గ్రామస్తులు నమ్మకం. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన కొండను కూటమి నేతల అండదండలతో పలువురు ఉత్తరవాహిని సమీపంలో తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారు. రోజుకు వందలాది ట్రక్కులకు పైగా భారీ పొక్లెయిన్లతో మట్టి తవ్వి తరలిస్తున్నారు. దీనిపై స్థానిక రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈకొండను తాము ఎంతో పవిత్రంగా పూజిస్తామని అటువంటి కొండను తవ్వడం అపచారమంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు అక్రమ గ్రావెల్ తవ్వకాలపై దృష్టిసారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. కూటమి నేతల అండతో తవ్వి తరలింపు -
మెగా డీఎస్సీకి ఏర్పాట్లు పూర్తి
నరసరావుపేట ఈస్ట్: పల్నాడుజిల్లా పరిధిలో ఈనెల 6వతేదీ నుంచి ప్రారంభం కానున్న మెగా డీఎస్సీ– 2025 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ బుధవారం తెలిపారు. నరసరావుపేట పట్టణ పరిధిలోని నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల, నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (యలమంద), ఏ.ఎం.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (పెట్లూరివారిపాలెం), తిరుమల ఇంజినీరింగ్ కళాశాల (జొన్నలగడ్డ), ఎం.ఏ.ఎం ఇంజినీరింగ్ కళాశాల (కేసానుపల్లి) పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఆయా పరీక్షా కేంద్రాలలో ఈనెల 6వతేదీ నుంచి 30వతేదీ వరకు నిర్వహించనున్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు 11,107మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. అభ్యర్థులు పరీక్షా సమయానికి ఒక గంట ముందుగా వారికి కేటాయించిన పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులకు లోనికి అనుమతించరని స్పష్టం చేశారు. హెల్ప్డెస్క్ 9963192487 నంబరును ఏర్పాటు చేశామన్నారు. -
తాళం వేసిన ఇంట్లో నగలు, నగదు చోరీ
బెల్లంకొండ: తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు నగలు, నగదు చోరీ చేసిన ఘటన మండలంలోని నాగిరెడ్డి పాలెం గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై డి.ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎరబ్రద్దూరి చిన రమణారెడ్డి కుటుంబ సభ్యులతోపాటు గ్రామంలోని మరి కొంతమందితో కలిసి సోమవారం శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో రమణారెడ్డి ఇంట్లోకి దొంగలు కిటికీ గుండా చొరబడ్డారు. బీరువా పగలుకొట్టి 23.5 సవర్ల బంగారం, 15 వేల నగదు చోరీ చేశారు. మంగళవారం ఉదయం ఇరుగు పొరుగువారు ఇంటి పరిసర ప్రాంతాల్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉండడాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని రమణారెడ్డి బంధువులతో చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చి పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు పెదకూరపాడు సీఐ సురేష్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత అచ్చంపేట: ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన బాలుడిని సామాజికవేత్త షేక్ కమల్సైదా బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. అచ్చంపేట ఎస్సీ కాలనీకి చెందిన సందెపోగు వివేక్ గత 29న గుంటూరు వెళ్లి రైల్వేస్టేషన్లో రైలు ఎక్కి మహారాష్ట్రలోని జనగావ్ జిల్లా స్టేషన్ పోలీసులకు చిక్కినట్లుగా కమల్సైదా సమాచారం తెలుసుకున్నారు. మహారాష్ట్రలోని పోలీస్ వారితో మాట్లాడి వివేక్ పల్నాడు జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందినవాడిగా సమాచారం అందించారు. తిరిగి అచ్చంపేటకు రప్పించారు. గత వారం రోజులుగా కుమారుడి కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు అతడిని అప్పగించడంతో ఆనందపడ్డారు. కార్యక్రమంలో మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బీరువాల సైదా తదితరులున్నారు. -
బదిలీల కలవరం
కరోనా కలకలం... గుంటూరు మెడికల్: జిల్లాలో ఒక పక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోపక్క గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా సోకి ఇబ్బంది పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను కూడా ఈ పరిణామాలు కలవరపెడుతున్నాయి. గతంలో అనేక మంది వైద్య ఉద్యోగులు కరోనా బారిన పడి చికిత్స పొందారు. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు. మరోసారి కరోనా కేసులు రావడం ఉద్యోగుల్లో ఆందోళనకు దారి తీసింది. మరోపక్క వైద్య ఉద్యోగుల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. ఈ నెల 19వ తేదీలోపు ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీలు చేయనున్నారు. ఐదేళ్లు సర్వీసు పూర్తయితే స్థానచలనం ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వైద్యులు, వైద్య సిబ్బందికి తప్పనిసరిగా స్థానచలనం కలిగించనున్నారు. గతంలో దీర్ఘకాలం ఉన్న సిబ్బందిలో 20 శాతం మందిని మాత్రమే బదిలీ చేసేవారు. దీంతో అందరూ ఇబ్బంది పడేవారు కాదు. ఇప్పుడు ఐదేళ్ల సర్వీసు, కొన్ని కేడర్లలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరిని బదిలీ చేయాలని నిబంధన పెట్టారు. దీంతో బదిలీల కలవరం ప్రారంభమైంది. ప్రాక్టీస్ వదిలి వెళ్లలేక.. దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేయడం వల్ల గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, జిల్లాలోని పలు ఆసుపత్రుల వైద్యులు ఎక్కువ శాతం మంది సొంత క్లీనిక్లు పెట్టుకున్నారు. గుంటూరులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో వైద్యులు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తప్పనిసరి బదిలీ నిబంధనతో ప్రాక్టీస్ వదిలి వెళ్లేందుకు పలువురు సంశయిస్తున్నారు. వైద్య సిబ్బంది సైతం గుంటూరు చుట్టుపక్కల పిల్లలను చదివించుకుంటూ, గృహాలు నిర్మించుకుని ఇక్కడే స్థిరపడ్డారు. విద్య, వైద్య రంగంలో ఎప్పటి నుంచో గుంటూరు జిల్లాకు పేరుండటంతో అనేక మంది స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. బదిలీల పేరుతో ప్రభుత్వం వేరేచోటకు పంపించేందుకు సిద్ధమడంతో వారు ఆందోళన పడుతున్నారు. జూనియర్ అసిస్టెంట్ల ఆందోళన జీజీహెచ్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు పదోన్నతులు వదులుకొని సుమారు 20 –30 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ప్రమోషన్ తీసుకుంటే ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారన్న భయంతో ఇలా చేశారు. అందులోనూ గుంటూరు జీజీహెచ్లోనే జీవితాంతం పనిచేసేందుకు అన్ని బెన్ఫిట్స్ వదులుకుని పలువురు జూనియర్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా వారిని సైతం బదిలీ చేస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. దీంతో జీజీహెచ్ మినిస్టీరియల్ ఉద్యోగులంతా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రపతి అనుమతి లేకుండా గుంటూరు జీజీహెచ్ యూనిట్ సిబ్బందిని బదిలీ చేసే అధికారం ఎవరికీ లేదనే విషయాలను బయటపెట్టారు. సదరు విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం పంపించారు. దీంతో ఈ ఏడాదికి జూనియర్ అసిస్టెంట్లకు బదిలీలు లేనట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. యూనియన్లకు ఆంక్షలు గతంలో యూనియన్ పేరుతో ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఒకే ప్రాంతంలో ఉండేవారు. నేడు ఒకేచోట లేకుండా పలు మార్గదర్శకాలను సంఘ నాయకులకు ప్రభుత్వం విడుదల చేసింది. యూనియన్లో చేరిన సభ్యత్వాల రశీదులు, ఎన్నికల్లో పాల్గొన్నట్లు జాబితా, యూనియన్ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వివరాలు సమర్పించాలని పేర్కొంది. దీంతో నేతలకు సైతం స్థానచలనం తప్పడం లేదు. నగరంలో ఒక చోట నుంచి మరోచోటికి యూనియన్ నేతలు బదిలీ కోరుకునేలా కొంత మినహాయింపు ఇచ్చారు. వైద్య ఉద్యోగుల్లో ఆందోళన ఐదేళ్లు దాటితే స్థాన చలనం యూనియన్లకు ప్రాధాన్యత అంతంతే 20 రోజుల ప్రక్రియ వైద్య ఆరోగ్య శాఖలో బదిలీ ప్రక్రియ 20 రోజులపాటు జరుగనుంది. మే 31 నుంచి జూన్ 19వ తేదీ వరకు నిర్వహిస్తారు. జూన్ 17 – 19 వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. తర్వాత బదిలీ ఉత్తర్వులు అందజేస్తారు. ఒకేచోట రెండేళ్లకుపైగా పనిచేస్తున్న వారు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులకు, ఉద్యోగులైన భార్యభర్తలకు నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహిస్తారు. గురు, శుక్రవారాల్లో అభ్యర్థులు బదిలీ ఆప్షన్లు ఎంచుకునేందుకు గడువు ఇచ్చారు. గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయం, గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారులు కొద్దిరోజులుగా బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. -
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ఫిరంగిపురం: ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని నిర్మించనున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమానికి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లను బుధవారం రాత్రి నారాయణ పరిశీలించారు. ముఖ్యమంత్రి మొక్కలు నాటే ప్రాంతాన్ని పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవం సందర్భంగా ఐదు కోట్ల మొక్కలు నాటుతామన్నారు. రాజధాని ప్రాంతాన్ని అత్యున్నత నిర్మాణాలతోపాటు గ్రీన్ అండ్ బ్లూ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. పచ్చదనం కోసం ఒకే రకం మొక్కలు కాకుండా సింగపూర్, జపాన్తో సంప్రదించి అక్కడి మాదిరిగా ప్లాంటేషన్ ఉండేలా చూడమని చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ ఎండీ లక్ష్మీపార్థసారథి, ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ సుజాత, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. అత్యుత్తమ నగరంగా అమరావతి నిర్మాణం ఫిరంగిపురం(తాడికొండ): తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో గురువారం పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే వన మహోత్సవానికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పర్యటన ఏర్పాట్లను ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, రాష్ట్ర ఏపీఎంఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, ఆర్డీవో శ్రీనివాసరావులు పరిశీలించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎ.భార్గవ్ తేజ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు చేపట్టాల్సిన వివిధ పనులపై తగిన సూచనలు అందజేశారు. శానిటేషన్, పార్కింగ్, బ్యారికేడ్ పనులు సజావుగా చేపట్టాలని చెప్పారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. వారి వెంట ఫారెస్ట్ కన్జర్వేటర్ రాజు, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) రవికుమార్, డీఎస్పీ మురళీకృష్ణ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ఎండీ నజీమా బేగం, ఏపీఎంఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బసవేశ్వరరావు, తుళ్లూరు సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్లు సుజాత, వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు ఉన్నారు. -
యోగాతో మానసిక ఉల్లాసం
విజయపురి సౌత్త్: యోగాతో ఒత్తిడి దూరమై మానసిక ఉల్లాసం కలుగుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అనుపు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రసిద్ధ పర్యాటక కేంద్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి మురళి మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణానికి చెందిన మెట్టు గోవిందరెడ్డి దాదాపు 200 యోగా మ్యాట్స్ను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. బెలూన్లను గాలిలోకి వదిలారు. నాగార్జునకొండ క్యూరేటర్ కమల్ హాసన్, పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి, పర్యాటకశాఖ డివిజనల్ మేనేజర్ చైతన్య, ఆర్డీవో మురళీకృష్ణ, జిల్లా మెడికల్ ఆఫీసర్ డా.రవి, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణ మోహన్, ఈఈ రమేష్ ,ఆర్అండ్బీ ఎస్ఈ రాజా నాయక్, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి, ట్రాన్స్పోర్ట్ అధికారి సంజీవ్ కుమార్, డీఎఫ్ఓ ఫైర్ శ్రీధర్రావు, డీఎల్డీవో గబ్రు నాయక్, హౌసింగ్ ఈఈ రవీంద్ర, డీపీఓ నాగేశ్వర నాయక్ , జిల్లా పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ , జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు, డీసీఓ వెంకటరమణ, ఏపీఎంఐపీ ఆంజనేయులు, ఏపీటీడీసీ డిప్యూటీ మేనేజర్ శివారెడ్డి, గ్రౌండ్ వాటర్ అధికారి శ్రీనివాసరావు, మాచర్ల మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, మాచర్ల తహసీల్దార్ కిరణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు -
అడ్డుకున్న పోలీసులు
వైఎస్సార్సీపీ నేతలను మాచర్ల: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలో చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పూనూరి గౌతమ్రెడ్డి, పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి సతీమణి స్వాతి తదితరులు వందల మంది కార్యకర్తలతో పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరారు. అనుమతి లేదంటూ పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతలకు సమస్యలు తలెత్తుతాయని పోలీసులు తెలిపారు. వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. గురజాల డీఎస్పీ జదీష్ ఆధ్వర్యంలో పోలీసులు అనుమతి లేని విషయాన్ని చెప్పి వెళ్లిపోవాలంటూ బెదిరించారు. పార్టీ కార్యాలయంలో మాత్రమే కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. దీనిపై పిన్నెల్లి రమాదేవి పోలీసులతో మాట్లాడుతూ శాంతియుతంగా ర్యాలీ చేసుకునేందకు కూడా అనుమతి లేదా? అని నిలదీశారు. ప్రభుత్వం అమలు చేయని హామీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహసీల్దారు కార్యాలయం వరకు వెళతామని కోరారు. అయినప్పటికీ పోలీసులు అనుమతించలేదు. చేసేది లేక పార్టీ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శించి చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ జలీల్, కె.కోటయ్య, మాజీ ఎంపీపీ సంపూర్ణమ్మ, పట్టణ అధ్యక్షుడు కోలా శ్రీను, దుర్గి మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నం పెద్దబ్బాయి, కౌన్సిలర్లు మాచర్ల సుందరరావు, మురళి, మందా సంతోష్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మరియమ్మ, న్యాయవాది మాధవి, సర్పంచ్లు వి.చిన్న, జి.బ్రహ్మారెడ్డి, పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాసనాయుడు, డాక్టర్ కరీముల్లా, కె.మస్తాన్, నాగూర్, కొమ్ము చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, కె.ఏబు, మాచర్ల ఎంపీపీ పోతిరెడ్డి కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మూడు వాహనాలు ఢీ.. ఒకరు మృతి
రొంపిచర్ల: మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన రొంపిచర్ల సమీపంలోని శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సు కందుకూరుకు వెళ్తోంది. రొంపిచర్ల విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలోకి రాగానే బస్సు ఆగటంతో 8 మంది ప్రయాణికులు దిగారు. అదే సమయంలో వెనుకగా వస్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు రోడ్డు మార్జిన్కు దూసుకు రాగా, ఢీకొట్టిన లారీ రోడ్డుపైనే నిలబడింది. ఇంతలో అదే రూట్లో వస్తున్న ప్రయివేటు ట్రావెల్ బస్సు అదుపుతప్పి కంటైనర్ లారీని ఢీకొంది. కంటైనర్ లారీ ముందు భాగంలో నిల్చొని ఉన్న ప్రయాణికుడు బెల్లంకొండ మాధవరావు(40)పై నుంచి లారీ వెళ్లింది. మాధవరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అతనిది ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధిలోని గుడ్లూరి మండలం, మిట్టపాలెం గ్రామం అని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సులు, లారీకి నష్టం వాటిల్లింది. వెంటనే ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సహాయంతో పోలీసులు తొలగించారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ సీహెచ్ మణికృష్ణలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కానిస్టేబుల్కు జాతీయస్థాయిలో రజత పతకం
అభినందించిన ఎస్పీ తుషార్డూడీ బాపట్లటౌన్: పట్టుదలతో పోరాడినప్పుడే విజయాలు మన సొంతమవుతాయని జిల్లా ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. కర్లపాలెం పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించే వీరంకి నరేంద్ర 13వ జాతీయ స్థాయి పెన్ కాక్ సిలాట్ చాంపియన్ షిప్–2025లో రజత పతకం సాధించారు. కానిస్టేబుల్ను బుధవారం ఎస్పీ తుషార్డూడీ అభినందించారు. ఎస్పీ తుషార్డూడీ మాట్లాడుతూ 2025 మే 9 నుంచి 12వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో కేడీ సింగ్బాబు స్టేడియంలో జరిగిన 13వ జాతీయ స్థాయి పెన్కాక్ సిలాట్ చాంపియన్ షిప్–2025 లో వీరంకి నరేంద్ర సత్తా చాటి రజత పతకం గెలుపొందారన్నారు. క్రీడలలో సత్తా చాటి జిల్లా పోలీస్ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేస్తూ పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. గతంలో కూడా జాతీయ స్థాయిలో రెండు మెడల్స్ సాధించాడని, 2024లో జరిగిన సెకండ్ ఆల్ ఇండియా పెన్కాక్ సిలాట్ చాంపియన్ షిప్లో కాంస్య పతకం, 2018లో 3వ ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్లో కాంస్య పతకం సాధించాడన్నారు. రాబోయే రోజుల్లో మంచి తర్ఫీదు పొంది అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఎస్పీ ఆకాక్షించారు. జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది క్రీడల్లో పాల్గొనాలన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచినవారిని ప్రోత్సహిస్తామన్నారు. -
ప్రతి ఇల్లు యోగా కేంద్రం కావాలి
గుంటూరు వెస్ట్: ప్రతి ఇల్లు యోగా కేంద్రంగా మారితే ఆ ఇంట ఆరోగ్య, మానసిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. బుధవారం యోగాంధ్రాలో భాగంగా స్థానిక బృందావన్గార్డెన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనతోపాటు నగర మేయర్ కోవెలమూడి రవీంద్రనాథ్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డెప్యూటీ మేయర్ షేక్ షజిల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని రోజులుగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శారీరక, మానసిక ప్రయోజనాలు కలిగించే యోగాపై ప్రజలు విస్తృతంగా అవగాహన పెంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో యోగ ఒక భాగం కావాలన్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు యోగాసనాలు వేశారు. -
కూటమి మోసాల పాలనకు ఏడాది
అంతన్నారు.. ఇంతన్నారు.. అందరినీ నమ్మించారు.. గంపగుత్తగా ఓట్లేయించుకున్నారు.. చివరకు ముంచేశారు. వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు ‘ఎర్ర’ పుస్తకం ఎంచుకున్నారు.. గ్రామాల్లో రక్తపుటేరులు పారించారు.. ప్రశ్నించిన వారిని అక్రమ అరెస్టులు చేయించారు.. అడ్డొచ్చిన వారిని అడ్డగోలుగా మూయించారు.. కేసులంటూ వేధించారు.. ఊళ్లకు ఊళ్లనే ఖాళీ చేయించారు. టూకీగా జిల్లాలో కూటమి ఏడాది పాలన ఇది. అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు.. నేడు వాటి అమలుపై మాత్రం బీద పలుకులు.. జిల్లాకు వచ్చిన కూటమి ముఖ్యనేతలు హామీల వరద పారించారు.. అరచేతిలో స్వర్గం చూపించారు. ఏడాది గడిచినా ఒక్కటంటే ఒక్క పథకమూ అమలు చేయలేదు.. ఒక్క హామీ పట్టాలెక్కలేదు. ఈ సారైనా హామీలు అమలు చేస్తారని నమ్మి ఓట్లేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.జిల్లాను ఎరుపెక్కించారు కూటమి పార్టీలకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జిల్లాలో వైఎస్సార్ సీపీ నేతలు సానుభూతిపరుల ఇళ్లపై కూటమి గుండాలు దాడులు మొదలుపెట్టారు. వందలాది కుటుంబాలు పల్నాడు జిల్లా వదలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లి తలదాచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పోలీసులను అంబేడ్కర్ రాజ్యాంగం అమలుకు కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వినియోగిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొదలు సుమారు 390 మంది కార్యకర్తలు, పాతిక మంది సోషల్మీడియా యాక్టివిస్టులు, తొమ్మిది మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు దిగారు. వందలాది మందిని జైళ్లపాలు చేసి కక్షా రాజకీయాలు చేస్తున్నారు. పోలీసులు పోలిటికల్ బాస్లకు సెల్యూట్ కొడుతున్నారన్న అపవాదుంది. మరోవైపు కూటమి నేతలు ఏడాదిగా ఇసుక, మట్టి, గ్రానైట్, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో రూ.కోట్ల సంపాదించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను అక్రమించి వారి వశం చేసుకుంటున్నారు. సాక్షి, నరసరావుపేట: ఎన్నికల ముంగిట అధికారంలోకి వస్తే సూపర్–6 పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి పార్టీలు ఊరూవాడా తిరిగి ప్రచారం చేశాయి. ప్రతి సభలోనూ సూపర్ సిక్స్ పేరిట ఏయే పథకం ద్వారా ఎవరికి లబ్ధి కలుగుతుందో వివరించారు. జిల్లాలోని ప్రతి కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు పచ్చమీడియాలో ప్రత్యేక ఇంటర్వ్యూల పేరిట సూపర్–6లను వివరించారు. చంద్రబాబు పెదకూరపాడు, సత్తెనపల్లి, పిడుగురాళ్లలో పర్యటించి సంపద సృష్టించి అన్ని పథకాలను అమలుచేస్తామని భరోసానిచ్చాడు. ప్రజలు మరోసారి చంద్రబాబు అండ్ కో కపట మాటలను నమ్మి అధికారం అప్పగించారు. తీరా పీఠం ఎక్కి ఏడాదైనా చంద్రబాబు సూపర్–6 పథకాల అమలకు నోచుకోలేదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల ఆకలికేకలు పెడుతున్నారు. ప్రజల వద్ద ధన మార్పిడి పెద్ద మొత్తంలో జరగకపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయని వ్యాపార వర్గాలు లబోదిబోమంటున్నాయంటే సంక్షేమ పథకాలు అమలుచేయకపోవడంతో ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగము లేదు.. భృతీ రాదు ఇంటింటికి ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 50 రోజులు దాటినా నిరుద్యోగల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ఆలోగా ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి రూ.3 వేలను విడుదల చేయలేదు. ఈ పథకం ప్రకారం ఇంటికో నిరుద్యోగి అనుకున్న జిల్లాలో 6.51 లక్షల కుటుంబాలకు నెలకు రూ.195.48 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలకు ప్రభుత్వం సుమారు రూ.2,345.76 కోట్లు బకాయిపడినట్లయింది. మరోవైపు కూటమి ప్రభుత్వ ఆధికారంలోకి రాగానే ఉద్యోగాలు పొందవచ్చని భావించిన యువత పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. చంద్రబాబు మరోసారి యువతను మభ్యపెడుతున్నాడంటూ గగ్గోలు పెడుతున్నారు. నెలకు రూ.1500 హుళక్కే! కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్–6లో మరో కీలక హామీ 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య గల ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18,000 ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పడం. ఈ పథకం కోసం జిల్లాలోని మహిళలందరూ ఎదరుచూస్తుండగా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీని వల్ల జిల్లాలోని 7,80,538 మంది మహిళలకు నెల నెలా ప్రభుత్వం రూ. 117.08 కోట్లు బకాయిపడినట్టు అవుతోంది. ఏడాదికి ఒక్కో మహిళకు రూ.18 వేల చొప్పున ఈ పథకం ద్వారా సుమారు రూ.1,405 కోట్లు అందజేయాల్సి ఉంది. బస్సు.. తుస్సు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మహిళందరికి ఉచిత బస్సుప్రయాణం కల్పిస్తామని హామినిచ్చారు. దీని ప్రకారం పల్నాడు జిల్లాలో 5 ఏళ్ల మొదలు మొత్తం 10,92,752 మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణం అందజేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీని వల్ల ఉపాధి, ఉద్యోగాలు, వైద్యం, వివిధ పనులపై నిత్యం బస్సుల ప్రయాణించే మహిళలు ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఆర్టీసీ పరిధిలో 461 బస్సులు నిత్యం 2,995 ట్రిప్పులు చొప్పున రోజుకు 1,73,573 కిలోమీటర్లు తిరిగుతున్నాయి. ఇలా ఆర్టీసీ బస్సులలో రోజుకు సగటున 1,41,717 మంది ప్రయాణిస్తుండగా రూ.59.22 లక్షల ఆదాయం ఆర్టీసికి సమకూరుతోంది. ప్రస్తుత ఆదాయం ప్రకారం రూ.30 లక్షల మహిళల నుంచి రోజు ఆదాయం వస్తోంది అనుకున్నప్పటికి , ఉచిత ప్రయాణం అంటే మరో రూ.10 లక్షల అధికంగా తిరిగినా రోజుకు రూ.40 లక్షలు మహిళలు ఉచిత ప్రయాణం పేరిట ఆదాయం కానుంది. అంటే ఈ పథకం సరిగా అమలు చేస్తే పల్నాడు జిల్లాలోని మహిళలకు ఏడాదికి రూ.146 కోట్లు లబ్ది కానుంది. హామీలతో నమ్మించి ప్రజలను దగా ఊరూరా సూపర్సిక్స్ పేరుతో కరపత్రాలు ఒక్క పథకమూ ఇవ్వకుండా సామాన్యులను మోసం ఏడాదిగా అక్రమాలు, ఆక్రమణలు, మోసాలతో రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు వైఎస్సార్ సీపీ సానుభూతి పరులపై హత్యలు, దాడులు పొలిటికల్ బాస్లకు సెల్యూట్ కొడుతున్న పోలీసులు నేటితో ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడాది పూర్తి ప్రజలను మోసం చేస్తున్న కూటమికి వ్యతిరేకంగా నేడు వెన్నుపోటు దినం ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం అధికారంలో ఉండగా గత ఐదేళ్లు పేదలకు సంక్షేమ ఫలాలు అందించిన వైఎస్సార్ సీపీ ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన వారి సమస్యలపై పోరాటాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలను ఎదుర్కొంటూనే ఇచ్చిన హామీల అమలుకు పోరుబాట ప్రారంభించింది. రైతుకు అండగా, విద్యుత్ పోరు, యువత పోరు లాంటి కార్యక్రమాలతో జిల్లా కేంద్రంతో పాటు, ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో వైఎస్సార్ సీపీ నేతలు నిరసన ప్రదర్శనలు చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి ఏడాదైనా హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచించిన నేపథ్యంలో వెన్నుపోటు దినం పేరిట వైఎస్సార్ సీపీ అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చారు. -
క్యూఆర్ కోడ్తో జనాభా నిర్వహణపై ప్రజాభిప్రాయం
నరసరావుపేట: జనాభా నిర్వహణ విధానంపై ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈనెల ఒకటి నుంచి 20వ తేదీ వరకు క్యూఆర్ కోడ్ విధానం ద్వారా ప్రజాభిప్రాయం సేకరించేందుకు ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అర్ధగణాంకశాఖ అధికారి మాలతి పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం క్యూఆర్ కోడ్ పోస్టర్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని కుటుంబాల నుంచి జనాభా నిర్వాహణ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా సేకరించాలని ఆదేశించారు. దీనిలో జేసీ సూరజ్ గనోరే, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేడు నాగార్జున సాగర్లో సామూహిక యోగా నరసరావుపేట: జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం నాగార్జునసాగర్ వద్ద బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహించి యోగా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. మే 28న ఇప్పటికే కోటప్పకొండపై సామూహిక యోగా నిర్వహించామన్నారు. జూన్ 11న కొండవీడు కోట, జూన్ 18న అమరావతి ధ్యానబుద్ధ విగ్రహం వద్ద సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. చిట్ఫండ్ యజమానికి బెయిల్ మంజూరు గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి కోర్టు మంగళవారం చిట్ ఫండ్ యజమానికి బెయిల్ మంజూరు చేసింది. పాలడుగు పుల్లారావు సాయిసాధన చిట్ఫండ్ కంపెనీ నడుపుతూ రూ.కోట్లు స్కామ్ చేసి ప్రజలను మోసం చేశాడనే అభియోగంపై అరెస్టయ్యాడు. దీనిపై నరసరావుపేట–1 టౌన్ సిట్ సీఐడీ వారు కేసు నమోదు చేశారు. ఇరువురి హామీతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఆళ్ల నాగేశ్వరరావుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం తెనాలి: తెనాలికి చెందిన కవి, ఆర్టీసీ కండక్టర్ ఆళ్ల నాగేశ్వరరావు పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. విజయవాడకు చెందిన ‘తెలుగు కళారత్నాలు’ సాంస్కతిక సేవా సంస్థచే సోమవారం అర్ధరాత్రి వరకు ఏకధాటిగా 10 గంటలపాటు జరిగిన సకల కళాప్రదర్శనలో నాగేశ్వరరావు సాహిత్య ప్రదర్శనకు ఈ గౌరవం లభించింది. సంబంధిత ధ్రువీకరణ పత్రం, మెడల్ను ఏపీ సచివాలయం ఓఎస్డీ డాక్టర్ ప్రభాకర్, విశ్రాంత ఆదాయ పన్ను అధికారి డాక్టర్ పతంగి చెన్నయ్య, ప్రముఖ రచయిత్రి డాక్టర్ సరికొండ రమాదేవి సమక్షంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు యూవీ రత్నం అందజేశారు. -
6 నుంచి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్
నరసరావుపేట: ఈనెల ఆరవ తేదీ నుంచి 14 వరకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి డ్రెయిన్లను శుభ్రం చేయాలని, అలానే నాల్గవ తేదీ నుంచి ఐదు వరకు ట్యాంకులు శుభ్రపర్చటం, క్లోరినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వర్షాకాలం రానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ వెక్టార్, హైజీన్ యాప్లో వివరాలు త్వరితగతిన అప్లోడ్ చేయాలన్నారు. గార్బేజ్ సేకరణ ప్రతిరోజు చేపట్టాలన్నారు. మండల పరిషత్ అధికారులు తరచుగా సిబ్బందితో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యంలో అనుమానం ఉన్నవారు పరీక్షలు చేయించుకొని తగు జాగ్రతలు తీసుకోవాలన్నారు. యోగాంధ్రలో భాగంగా ఈ నెల 5వ తేదీన నాగార్జునసాగర్ వద్ద పదివేలమందితో కార్యక్రమం నిర్వహించానున్నామని, నాల్గవ తేదీన అనుపు వద్ద సుమారు వెయ్యిమందితో యోగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. జేసీ సూరజ్ గనోరే మాట్లాడుతో సిటిజన్ రిజిస్ట్రేషన్ వేగవంతం చేసి నిర్ణీత లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బీవీ రవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ప్రసూన, డీఎల్డీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. 23న రెడ్క్రాస్ సాధారణ సమావేశం నరసరావుపేట: జిల్లా రెడ్క్రాస్ సొసైటీ సాధారణ సమావేశం ఈనెల 23వ తేదీ సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్, జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశానికి రెడ్క్రాస్ ప్యాట్రన్, వైస్ ప్యాట్రన్, లైఫ్ మెంబర్స్, లైఫ్ అసోసియేట్ మెంబర్స్ తమ గుర్తింపు కార్డులతో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు -
మోసగించిన వారిపై చర్యలు తీసుకోండి
నాదెండ్ల: ఓ వివాహిత తనకు జరిగిన మోసం, అన్యాయంపై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన మంజుభార్గవి బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో తన నానమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంది. ఆ సమయంలో విశ్వభారతి జూనియర్ కాలేజ్ డైరెక్టర్, తమ దూరపు బంధువు అయిన సోడిశెట్టి రామానాయుడు తనను ప్రేమ పేరిట లోబరుచుకున్నాడని, గర్భిణిని చేశాడని పేర్కొంది. వివాహం చేసుకోమని అడిగితే ముఖం చాటేశాడని, అధికకట్నం తీసుకుని మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడని పేర్కొంది. ఈ విషయపై తాను 2022 ఫిబ్రవరి 8న నరసరావుపేటలోని దిశా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. దీంతో రామానాయుడు తల్లి వెంకటసుబ్బమ్మ, బంధువులైన దుర్గాప్రసాద్, విజయవాడలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మేకల నరేంద్ర తనతో మాట్లాడి రామానాయుడితో వివాహం జరిపిస్తామన్నారు. ● అయితే కొన్ని రోజుల తర్వాత రామానాయుడు సోదరుడు కామేశ్వరరావును వివాహం చేసుకోవాలంటూ వారితో పాటూ ఇతర బంధువులు తనను బలవంతం చేయటంతో అంగీకరించానన్నారు. కామేశ్వరరావుతో తనకు వివాహమైన మూడు రోజుల తర్వాత పదహారు రోజుల పండుగకు వస్తానని చెప్పి కామేశ్వరరావు వెళ్ళిపోయాడని పేర్కొంది. అయితే రామానాయుడు తనకు అసభ్యకరరీతిలో వాట్సాప్లో మెసేజీలు పెట్టేవాడని వాపోయింది. విషయాన్ని కామేశ్వరరావుకు ఫోన్లో చెప్పినా పట్టించుకోలేదని, నీకు తగిన శాస్తి జరిగిందంటూ తిట్టాడని వాపోయింది. 2023 ఏప్రిల్ 27న తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి అత్తారింటికి వెళ్లగా, తన అత్త చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయిందన్నారు. అప్పటి నుంచి తన తల్లితో అద్దంకిలోనే ఉంటున్నానని పేర్కొంది. ● అప్పట్లో తన ఫోన్ తీసుకుని ఏఆర్ కానిస్టేబుల్ నరేంద్ర, దుర్గాప్రసాద్లు తన ఫోన్ను హ్యాక్ చేసి 2023లో తనపై బంధువులకు చెడుగా ప్రచారం చేశారని వాపోయింది. వారు పలుమార్లు తనపై హత్యాయత్నం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తనను మోసగించిన రామానాయుడు, తన భర్త కామేశ్వరరావు, ఏఆర్ కానిస్టేబుల్ నరేంద్ర, దుర్గాప్రసాద్లపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, హోమంత్రి అనిత, మంత్రి నారా లోకేష్లకు ఫిర్యాదు అందించినట్లు తెలిపింది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ -
పాఠశాల ప్రాంగణంలో గుడి...!
నూజెండ్ల: భవిష్యత్ తరాలకు ఉపాయోగపడాల్సిన పాఠశాల గ్రామస్తుల పంతాలకు వేదికై ంది. దీంతో అక్కడ చదువుతున్న 35 మంది విద్యార్థుల చదువులు ప్రశ్నార్ధకమయ్యాయి. పాఠశాల ఆవరణలో గుడి నిర్మించాలని ఓ వర్గం నడుం బిగించగా విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుంది వేరే చోట ఏర్పాటు చేయాలని మరో వర్గం వారు నిలవరించటానికి ప్రయత్నిస్తున్నారు. మండలంలోని కొత్త కొత్త పాలెం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చేపడుతున్న గుడి నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇందు కోసం గత ప్రభుత్వ హయాంలో పాఠశాల ఆవరణలో చేపట్టిన నాడు నేడు మరుగుదొడ్లను సైతం కూల్చి వేశారు. రాత్రికి రాత్రి స్థలాన్ని చదును చేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేశారు. భక్తులకు అందుబాటులో గుడి నిర్మాణం చేపట్టడం ఆనందమే కానీ ప్రశాంత వాతావరణంలో చదువుకోవాల్సిన విద్యార్థులకు ఇబ్బంది కాదా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అనుకూలమైన మరో ప్రాంతంలో గుడి ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. అయితే గుడి కట్టాల్సిందే ఎవరు అడ్డు వస్తారో చూస్తామంటూ.. ఎంత వారించినా వినకుండా ఇటువంటి అనైతిక దుశ్చర్యకు కొంత మంది పాల్పడుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు స్పందించి బడి స్థలంలో నిర్మాణాలు అడ్డుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వివాదంపై ఎంఈఓ రవిచంద్రను వివరణ కోరగా కొంత మంది గ్రామస్తులు ఫిర్యాదు చేశారని సంఘటనా స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. పంతాలకు వేదికగా మారిన కొత్త కొత్తపాలెం ఎస్సీ కాలనీలోని పాఠశాల నాడు – నేడు మరుగుదొడ్లను సైతం కూల్చివేసిన వైనం -
బోధనావిధానంలో మార్పులకు శ్రీకారం
నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించే దిశగా పలు మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరం నుంచి తీసుకువస్తున్న మార్పులపై ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే విధానంలో భాగంగా జిల్లా రిసోర్స్ పర్సన్స్కు జిల్లాస్థాయి 3రోజుల శిక్షణ తరగతులు మంగళవారం మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో ప్రారంభించారు. ప్రారంభ సమావేశంలో పాల్గొన్న డీఈఓ చంద్రకళ మాట్లాడుతూ, ఈ విద్యాసంవత్సరం నుంచి చేపట్టిన మార్పులలో భాగంగా మూల్యాంకన పుస్తకాలు – నిర్వహణ, అకడమిక్ క్యాలెండర్, హ్యాండ్ బుక్, గ్రంథాలయాల నిర్వహణ, బ్రిడ్జి కోర్సులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించనున్నట్టు వివరించారు. జిల్లావ్యాప్తంగా 130 మంది రిసోర్స్ పర్సన్స్కు ఆయా అంశాలలపై మూడు రోజుల పాటు జరగనున్న శిక్షణా తరగతులలో అవగాహన కల్పించనున్నారు. ఎస్సీఈఆర్టీ పరిశీలకులు లక్ష్మీప్రసన్న, డీసీఈబీ చైర్మన్ ఐ.కృష్ణానాయక్, డైట్ అధ్యాపకులు బి.బాలకోటయ్య, ఎం.సాంబశివరావు, రాష్ట్ర రిసోర్స్ పర్సన్స్, సబ్జెక్ట్ నిపుణులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ -
‘ప్రైమరీ’ హెచ్ఎం పోస్టులను ఎస్జీటీలతో భర్తీ చేయాలి
చిలకలూరిపేట: ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో సంఘ సభ్యుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల పోస్టులన్నీ ఎస్జీటీలతోనే భర్తీ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ, సదరు పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కేటాయిస్తున్నారనే సమాచారం రావడం బాధాకరమన్నారు. అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించిన హెచ్ఎం పోస్టులను 100 శాతం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలని కోరారు. అలాకాకుండా స్కూల్ అసిస్టెంట్ల స్థాయిని తగ్గిస్తూ వారిని తాత్కాలిక ప్రాతిపదికన ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా నియమించటం సరికాదన్నారు. ఈ చర్యను ఉపాధ్యాయ లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట పట్టేలోగా దీనిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్కూల్ అసిస్టెంట్ల సేవలను ఉన్నత పాఠశాలల్లో మాత్రమే ఉపయోగించుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ నాయకులు వినుకొండ అక్కయ్య, మేకల కోటేశ్వరరావు, వి.జయప్రకాశ్, షేక్ మగ్బూల్ బాష, బొంతా రవి, షేక్ మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు -
రూ.51 కోట్లతో అభివృద్ధి పనులు
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో సుమారు రూ.51 కోట్లతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులను నిర్వహించడానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ చాంబర్లో జరిగింది. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, నగర పాలక సంస్థ అధికారులు ప్రతిపాదించిన 143 అంశాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై సభ్యులు, వివిధ విభాగాధిపతులతో చర్చించి, ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర శివారు, నగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలలో రోడ్లు, డ్రైయిన్లు, వీధి దీపాలు, తాగు నీటి పైపులైన్లు ఏర్పాటు వంటి పనులకు ఆమోదం తెలిపామన్నారు. నాజ్ సెంటర్, స్వామి థియేటర్ వద్ద, అడవితక్కెళ్ళపాడులలోని షాపింగ్ కాంప్లెక్స్లలో లీజు గడువు పూర్తయిన షాపులకు నిబంధనల ప్రకారం రెన్యూవల్ చేయడానికి ఆమోదించామన్నారు. గుంటూరు నగరంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉండటంతో వాటికి శస్త్రచికిత్సలు, యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ వేసేందుకు అదనంగా ముగ్గురు పశువుల డాక్టర్లు, ఆపరేషన్ థియేటర్ సహాయకులను నియమించాలని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు ఈరంటి వరప్రసాద్, షేక్ మీరావలి, కొమ్మినేని కోటేశ్వర రావు, నూకవరపు బాలాజీ, దాసరి లక్ష్మీదుర్గ, ముప్పవరపు భారతి, నగర పాలక సంస్థ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం పాల్గొన్నారు. ఆమోదం తెలిపిన స్టాండింగ్ కమిటీ -
బ్రెయిలీ ఉచిత పాఠ్యపుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట: జిల్లాలో ఒకటినుంచి పదోతరగతి వరకు చదివే అంధ విద్యార్థులు ఉచిత బ్రెయిలీ పాఠ్య పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రా, వయో వృద్ధుల సంక్షేమశాఖ జిల్లా అధికారి జి.సువార్త మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీఓ సంస్థల్లో చదివే అంధ విద్యార్థులు ఆయా సంస్థల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్స్ ద్వారా www.apdascac. ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. నిబంధనలను అనుసరించి ఉచితంగా వారికి బ్రెయిలీ పుస్తకాలు అందజేస్తామన్నారు. ఈ సదుపాయాన్ని బాలబాలికలు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహాసభను జయప్రదం చేయండి సంఘం జిల్లా అధ్యక్షుడు చినరామిరెడ్డి నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈనెల 5వ తేదీన విజయవాడలో తలపెట్టిన 3వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభను జయప్రదం చేయాలని సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చినరామిరెడ్డి కోరారు. సంఘం యూనిట్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, పార్ట్టైమ్ ఉద్యోగులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆహ్వానించామని, ఆయన సానుకూలంగా స్పందించటంతో పాటు సమావేశానికి హాజరయ్యే ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. యూనిట్ సమావేశంలో జిల్లా కార్యదర్శి చుక్క వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి షేక్ బాజీ, కోశాధికారి పీటర్ డామియన్ పాల్గొన్నారు. బాలికపై లైంగిక వేధింపులు.. కేసు నమోదు లక్ష్మీపురం: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏటీ అగ్రహారం పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళ ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు కలిగాక మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన షేక్ మస్తాన్ అనే వ్యక్తిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు. మొబైల్ షాపులో పని చేసుకుంటూ ఆమె జీవనం సాగిస్తున్నారు. మస్తాన్కు రెండో వివాహం చేయాలని ఆయన కుటుంబసభ్యులు సిద్ధం అయ్యారు. దీంతో ఆమె నిలదీయడంతో ఒంటరిగా వదిలేశాడు. ఇటీవల ఆమె కుమార్తె (8) నిద్రలో ఉలిక్కి పడటం, ఏడవడం వంటివి చేస్తుండటంతో ఏమైందని తల్లి ఆరా తీసింది. మస్తాన్ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. దీంతో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లైంగికదాడి, హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
విజయపురిసౌత్: ఆశా వర్కర్పై లైంగికదాడి చేసి, హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులకు మంగళవారం గుంటూరు కోర్టు జీవిత ఖైదు, జరిమానా విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మాచర్ల మండలం అనుపు చెంచుకాలనీకి చెందిన రమావత్ నీలావతి (46) కొప్పునూరు, నాగులవరం పంచాయతీ పరిధిలోని అనుపు చెంచుకాలనీ, బీకెవీ పాలెం చెంచుకాలనీలో ఆశావర్కర్గా పనిచేస్తుంది. నీలావతి భర్త లస్కర్కు రెండో భార్య. లస్కర్ మొదటి భార్య సాయితో గ్రామ శివారులోని పొలంలో నివాసం ఉంటుంటాడు. 2022 సెప్టెంబర్ నెల 16వ తేదీ సాయంత్రం 6గంటలకు లస్కర్ నీలావతితో మాట్లాడి పొలానికి వెళ్లాడు. 17వ తేదీ ఉదయం ఇంటికి రాగా నీలావతి ఇంట్లో కనిపించలేదు. దీంతో పక్క ఇంటిలో ఉంటున్న నీలావతి తండ్రి లాలుకు విషయం తెలియజేశాడు. దీంతో ఇద్దరు గ్రామంలో విచారించగా మండ్లి ముత్తయ్య రాత్రి 9గంటల ప్రాంతంలో నీలావతి మా ఇంటివైపు వచ్చి సెల్ఫోన్ పోయిందని చెప్పిందని, అదే సమయంలో బీకెవీ పాలెంకు చెందిన సావిటి చిన్న అంజి, శీలం అంజి, శీలం భైస్వామి కూలి డబ్బుల కోసం తన దగ్గరకు వచ్చినట్లు తెలిపాడు. ఆ ముగ్గురు బీకెవీ పాలెంలో వెంకన్న అనే వ్యక్తి పోయిన సెల్ఫోన్ ఎక్కడ ఉంతో కనిపెడతాడని చెప్పటంతో వారితో నీలావతి ఆ గ్రామానికి వెళ్లిందని చెప్పాడు. దీంతో భర్త లస్కర్, గ్రామస్తులు వెంకన్నను విచారించగా తన దగ్గరకు వచ్చిన మాట వాస్తవమేనని సెల్ఫోన్ స్విచ్ఆఫ్లో ఉందని తరువాత రోజు వస్తే చూస్తానని చెప్పటంతో నీలావతితో పాటు ఆ ముగ్గురు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్లారని చెప్పాడు. గతంలో నేర చరిత్ర ఉన్న సావిటి చిన అంజి, శీలం అంజిలను గ్రామస్తులు గట్టిగా అడగటంతో ముగ్గురం లైంగిదాడి చేశామని, నీలావతి గొడవ చేయటంతో శీలం అంజి రాయితో తల మీద కొట్టటంతో మృతి చెందిందని చెప్పారు. రోడ్డు పక్కన సమీపంలో రెండు బండరాళ్ళ మధ్య నీలావతి మృతదేహాన్ని ఉంచి తాటాకులు కప్పినట్లు చెప్పి సంఘటన స్థలాన్ని చూపించారు. విషయాన్ని భర్త లస్కర్, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించటంతో ముగ్గురు నిందితులైన చిన అంజి, శీలం అంజి, శీలం భైస్వామిలను అదుపులోకి తీసుకున్నన్నారు. సావిటి చిన అంజి, శీలం అంజిలు గతంలో 2020 జనవరి నెలలో వెల్థుర్తి మండలం గుడిపాడు చెరువు గ్రామానికి చెందిన మహిళను అనుపువద్ద లైంగికదాడి చేసి హతమార్చిన కేసులో నిందితులు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 2022లో ఆశావర్కర్పై లైంగిదాడి చేసి హతమార్చిన దుండగులుఅప్పటి పల్నాడు జిల్లా ఎస్పీ శివశంకర్ రెడ్డి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసులో నిందితులపై అప్పటి నాగార్జునసాగర్ ఎస్ఐ పి.అనిల్కుమార్రెడ్డి, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర కేసు నమోదు చేశారు. ప్రస్తుత పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు మానిటరింగ్ ద్వారా నరసరావుపేట మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ, కోర్టు హెడ్ కానిస్టేబుల్ టి.మాణిక్యాలరావు, అడిషనల్ పబ్లిక్ ప్రోసిక్యూటర్ పల్లపు కృష్ణ నిందితులకు శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించారు. ముగ్గురు నిందితులకు గుంటూరు 5వ అడిషనల్ కోర్టు జడ్జి కె.నీలిమ 376 డీ సెక్షన్ కింద 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.20వేల జరిమానా, అలాగే 376 ఏ సెక్షన్ కింద 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.20వేల జరిమానా, 302సెక్షన్కు గానూ జీవిత ఖైదు, 20వేల రూపాయల జరిమానా, 201 సెక్షన్ కింద 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
వృద్ధురాలు అనుమానాస్పద మృతి
తెనాలి రూరల్: తెనాలిలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. లైంగికదాడి తర్వాత హత్య చేసి, ఆభరణాలు చోరీ చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... పట్టణ ముత్తెంశెట్టిపాలెం తూర్పు కాల్వ కట్ట రోడ్డులో కబేళా వంతెన నుంచి వైకుఠపురం వెళ్లే మార్గంలో అయ్యప్పస్వామి గుడి పక్కనే తాడిపత్రి మల్లీశ్వరి (60) ఒంటరిగా నివసిస్తోంది. టిఫిన్ బండి, టీ స్టాల్, కూల్డ్రింక్ దుకాణం నిర్వహిస్తోంది. ప్రతి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు లేచి టిఫిన్ బండి పనులను ప్రారంభిస్తుంటుంది. అదే సమయంలో టీ కూడా విక్రయించడంతో ఉదయాన్నే అక్కడి వారు టీ తాగేందుకు వస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం వచ్చిన వారు మల్లీశ్వరి బయటకు రాలేదని, ఇంటి కిటికీ నుంచి చూశారు. ఇంకా మంచంపైనే ఉంది. పిలిచినా స్పందన లేకపోవడంతో ఇదే ప్రాంతంలో నివసించే ఆమె కుమార్తెకు సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి చూడగా మల్లీశ్వరి మృతి చెంది ఉన్నట్టు గుర్తించింది. మృతురాలి ఒంటిపై బంగారు ఆభరణాలు, బీరువాలోని నగలు చోరీకి గురైనట్టు తెలిసింది. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్ టౌన్ సీఐ వి. మల్లికార్జునరావు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించారు. మృతిపై అనేక అనుమానాలు.. మల్లీశ్వరి మృతిపై స్థానికుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి తలుపునకు బయట గడి పెట్టి ఉండడం, విగతజీవిగా పడి ఉన్నప్పుడు శరీరంపై దుస్తులు సరిగా లేకపోవడం, ఆభరణాలు మాయమవడంతో ఆమైపె లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అనంతరం ఆభరణాలు, నగదు దోచుకెళ్లి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. మల్లీశ్వరిది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని, దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని సీఐ తెలిపారు. లైంగికదాడి చేసి అనంతరం హతమార్చి ఉంటారని స్థానికుల అనుమానం -
క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరాని గాను 4, 5 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 19వతేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. క్రీడా శాఖ వెబ్సైట్ www. apsportsschool. ap. gov. in ద్వారా తరగతుల వారీగా సీట్లు వివరాలు, షెడ్యూలు, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో బాలురు 20, బాలికలు 20, 5వ తరగతిలో బాలురు 20, బాలికలు 20 సీట్లు ఉన్నాయని తెలిపారు. 4వ తరగతి ప్రవేశానికి అభ్యర్థులు 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలని, అలాగే 5వ తరగతి ప్రవేశానికి 9 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని తెలిపారు. జనన ధ్రువీకరణ పత్రం వాస్తవ పుట్టిన తేదీ నుంచి ఒక సంవత్సరం లోపు జారీ చేసి ఉండాలని స్పష్టం చేసారు. దరఖాస్తుదారుని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వైద్య పరీక్షల్లో సంతృప్తి చెందిన తరువాత మాత్రమే జిల్లాస్థాయి ఎంపిక పోటీలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. జిల్లాస్థాయిలో సాధించిన మెరిట్ ప్రాతిపదికన రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారనీ, రాష్ట్రస్థాయిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికను సీటు కేటాయిస్తారని తెలిపారు. జిల్లాస్థాయి శారీరక సామర్ధ్య పరీక్షలు ఈనెల 20 నుంచి 25వ తేదీ వరకు, రాష్ట్రస్థాయి పరీక్షలు జూలై 10, 11 తేదీలలో నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీఎస్ఓ నరసింహారెడ్డి -
సుద్ధపల్లిలో వ్యక్తి దారుణహత్య
వివాహేతర సంబంధమే కారణం చేబ్రోలు: వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన సోమవారం సుద్ధపల్లిలో చోటుచేసుకుంది. చేబ్రోలు మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన కొమ్మూరి గోపయ్య (35)ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హతమార్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చేబ్రోలు సీఐ వై.కోటేశ్వరరావు, ఎస్ఐ డి.వెంకటకృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి తల్లి కొమ్మూరి రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి.వెంకటకృష్ణ తెలిపారు. మహిళకు ఇద్దరు వ్యక్తులతో ఉన్న వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇరువురి మధ్య చోటు చేసుకున్న వివాదం కారణంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త అరెస్ట్
లక్ష్మీపురం: వ్యసనాలకు అలవాటు పడిన భర్తను వదిలి పుట్టింట్లో ఉంటూ పని చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్న మహిళను ఆమె భర్త కత్తి పొడిచి గాయాలపాలు చేశాడు. నిందితుడిని పట్టాభిపురం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కోబాల్డ్పేటకు చెందిన మెరిగల రాజేష్, కల్పనకు 2014లో వివాహం అయింది. రాజేష్ పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే కొంతకాలంగా రాజేష్ వ్యసనాలకు అలవాటు పడి మద్యం సేవిస్తూ భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక కల్పన ఏడాది క్రితం పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలను పోషించేందుకు చంద్రమౌళినగర్లోని సంస్థలో చిరు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే రాజేష్ మద్యం సేవించి పిల్లలు కావాలంటూ, కాపురానికి రావాలంటూ భార్య పని చేసే ప్రదేశానికి వెళ్లి వేధిస్తుంటాడు. ఈ నేపథ్యంలో గత నెల 25న రాత్రి ఆమె పనిచేసే ప్రదేశానికి వెళ్లి వాగ్వివాదానికి దిగిన రాజేష్ వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి తీవ్ర గాయాలపాలు చేశాడు. దీన్ని గమనించిన స్థానికులు కల్పనను హుటాహుటిన జీజీహెచ్కు తరలించారు. సమచారం తెలుసుకున్న పట్టాభిపురం పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలో విచారించి, బాధితురాలు కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాడు. నిందితుడు ఉడాయించడంతో అతనికోసం గాలింపు చేపట్టారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ తరంగిణిలకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి కోబాల్డ్పేట 7వ లైన్లో నిందితుడు ఉన్నట్లు తెలియడంతో మెరిగల రాజేష్ను అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించి సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ఆత్మరక్షణ కోసం ఆయుధం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రతి చిన్న సమస్యని పెద్దదిగా చూడడం, ఆందోళన చెందడం, క్రమశిక్షణ లోపించడం తదితర అంశాలను నేటిచిన్నారుల్లో తరచూ చూస్తుంటాం. తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లల చదువుకు అధిక ప్రాధాన్యతనిచ్చి పెద్ద కళాశాలల్లో సీట్లు సాధించాలనే తపన ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొందరు మాత్రం తమ పిల్లల్ని విద్యావంతులుగానూ ఆత్మ రక్షణ విద్యలోనూ మేటిగానూ చూడాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగా శిక్షణా శిబిరాల్లో చేర్పించి దీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఇలా శిక్షణ పొందిన కొందరు చిన్నారులు పోటీల్లోనూ రాణిస్తున్నారు. గుంటూరు విద్యానగర్లోని కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో సుమారు 100 మందికిపైగా మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతూ అద్భుతంగా రాణిస్తున్నారు. గత నెల 24 నుంచి 26 వరకు తమిళనాడులోని కోయంబత్తూర్లో జరిగిన 5వ అంతర్జాతీయ కర్రసాము పోటీల్లో 9 బంగారు, 5 రజతాలు 3 కాంస్య పతకాలు సాధించి ఔరా అనిపించారు. అకాడమీ కోచ్ కాశీనాథ్ రెడ్డి ప్రత్యేక శిక్షణలో రాటుదేలుతున్న వీరు కర్రసాముతోపాటు తైక్వాండాలోనూ విశేషంగా రాణిస్తున్నారు. కర్రసాము, తైక్వాండోల్లో రాణిస్తున్న చిన్నారులు అంతర్జాతీయ పోటీల్లో పతకాల పంట మారుతున్న తల్లిదండ్రుల ఆలోచన ధోరణి -
పోలీసుల తీరు హేయం
తెనాలిరూరల్: దళిత, మైనార్టీ యువకులపై జనావాసాలు మధ్య బహిరంగంగా, కర్కశంగా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.శాంతకుమార్ అన్నారు. తెనాలిలో సోమవారం ఆయన మాట్లాడారు. ముగ్గురు బాధితులను అమానుషంగా హింసించడంపై ప్రజా హక్కులు సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయన్నారు. పోలీసుల చర్యలను సమర్థిస్తూ బాధిత యువకులపై ఎలాంటి గాయాలు లేవని తప్పుడు దృవపత్రాలు సమర్పించిన డాక్టర్లతో పాటు సాక్షులుగా ఉన్న వీఆర్వోలను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తెనాలి బార్ అసోసియేషన్ బేతాళ ప్రభాకర్, దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది కొరివి వినయ్ కుమార్, తెనాలి జేఏసీ అధ్యక్షుడు బొనిగల ప్రదీప్, తెనాలి నియోజకవర్గం ఇన్చార్జి కారుమంచి సునీల్ సందీప్, న్యాయవాదులు గుంటి సురేష్ బాబు, గుమ్మడి రవిరాజు, కంచర్ల కోటేశ్వరరావు, కనపర్తి కుటుంబరావు, పెనుమాక మధు, దోమ రమేష్ రాంజి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ జిల్లాల 11వ సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్షిప్– 2025 పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. రన్నర్స్ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది. శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో నిర్వహించిన ఈ పోటీలలో పురుషుల వ్యక్తిగత చాంపియన్షిప్ను ఎం.శరత్ (ఎన్టీఆర్ జిల్లా) సాధించగా, మహిళల విభాగంలో సన్వి కొంగర, యు.ప్రేమాంమృత (ఎన్టీఆర్జిల్లా) సంయుక్తంగా వ్యక్తిగత చాంపియన్షిప్కు ఎంపికయ్యారు. ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కొంగర రవికాంత్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించిన పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. పోటీలలో భాగంగా ఎంపిక చేసిన రాష్ట్ర స్విమ్మింగ్ జట్టు క్రీడాకారులు త్వరలో ఒడిశాలోని భువనేశ్వర్లో జరగనున్న 78వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఓబుల్రెడ్డి, వెంకట్రామ్మోహన్, పల్నాడుజిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష్య, కార్యదర్శులు డాక్టర్ ఏ.ఏ.రామలింగారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్ ఛాంప్ ఎన్టీఆర్ జిల్లా రన్నర్స్గా కర్నూలు జిల్లా -
అర్జీలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించండి
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం తదితర 63 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు -
ఐదున జిల్లాలో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర
నరసరావుపేట: యోగాంధ్ర మాసోత్సవ వేడుకలలో భాగంగా జూన్ ఐదు గురువారం డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం వేదికగా పదివేల మందితో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు వెల్లడించారు. దీనికి పెద్ద ఎత్తున జిల్లా ప్రజలు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో యోగాంధ్ర మాసోత్సవంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం ప్రముఖ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ వద్ద ఒక వేయి మందితో సామూహిక యోగా నిర్వహిస్తామన్నారు. యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల వద్ద స్థానికులతో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యోగా చేసిన వ్యవసాయ శాఖ ఉద్యోగులు యోగాంధ్రలో భాగంగా సోమవారం పల్నాడు బస్టాండ్, పెద్దచెరువురోడ్డు వద్ద జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యోగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రవి మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలన్నారు. సుమారు 150 మంది దాకా వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టండి రానున్న వర్షా కాలంలో జిల్లాలో సీజనల్ వ్యాధు లు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. వారం రోజులపాటు గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ప్రతి శుక్రవారం మండల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు.జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
● జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ● పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 158 అర్జీలు స్వీకరణ నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ పాల్గొని జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 158 అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చే ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన వారిలో డీఆర్ఓ ఏకా మురళి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వేధిస్తున్నా పట్టించుకోవట్లేదు నేను కొన్నేళ్లుగా శ్రీనివాసనగర్–2 అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్నా. నాకు ఇద్దరు పిల్లలు. ఇదే నాకు జీవనాధారం. అదే సెంటర్లో టీచర్గా పనిచేస్తున్న మహిళ నన్ను ఆకారణంగా వేధిస్తుంది. పిల్లలను తీసుకురావొద్దని, తీసుకొస్తే రేషన్ మిగలదని అంటూ నాపై దాడిచేస్తుంది. ఈరోజు సోమవారం కూడా దాడిచేసింది. గతంలో నాపై దాడి చేసినందుకు రెండుసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమైపె చర్యలు తీసుకోవాలని మరోసారి అర్జీ అందజేస్తున్నా. సీడీపీఓ ఉమామహేశ్వరి ఆమెను పిలిపించి మాట్లాడతానని చెప్పింది. –సింధు నాగూభాయ్, అంగన్వాడీ ఆయా, నరసరావుపేట -
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ బాబు
సత్తెనపల్లి: అవినీతిలో కూరుకుపోయి అస్తవ్యస్తమైన పరిపాలన చేస్తున్నందుకు వ్యతిరేకంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచావు కాబట్టి వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకుడు పూనూరు గౌతంరెడ్డి అన్నారు. సత్తెనపల్లిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి అవ్వడానికి ఏకంగా మామకు ఎలా వెన్నుపోటు పొడించావో ప్రజలు గమనించారన్నారు. ఈ రోజు యావత్ ప్రజానికానికి వెన్నుపోటు పొడుస్తున్నావు కాబట్టి, జాగ్రత్త అంటూ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో తలపెట్టిన వెన్నుపోటు దినం విజయంతం చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు నోరు తెరవకుండా ఉండాలని, వందలాది మందిని హత్య చేయించాడని, వందలాది మందిపై హత్యా నేరాలు మోపాడన్నారు. వేలాది మందిపై కేసులు పెట్టడం పరాకాష్టకు చేరిందన్నారు. గ్రామాలు, ఇల్లు వదిలి వెళ్లే పరిస్థితి తెచ్చాడని, వాళ్లు చేసే అవినీతిని ఎవరూ ప్రశ్నించ కూడదనే పద్ధతిలో తీసుకొస్తున్నాడన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 4నాటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతుందని, కానీ ఏడాది కాలంలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటీ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు దినం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, నాయకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, పక్కాల సూరిబాబు, చల్లంచర్ల సాంబశివరావు, రాజారపు శివనాగేశ్వరరావు, రాయపాటి పురుషోత్తమరావు, భవనం రాఘవరెడ్డి, నక్కా శ్రీను, షేక్ మౌలాలి, మర్రి సుబ్బారెడ్డి, కళ్లం విజయభాస్కరరెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. గద్దెనెక్కడానికి చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు అవినీతిని ప్రశ్నించే వారిపై అక్రమ కేసుల బనాయింపు వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకుడు పూనూరు గౌతంరెడ్డి -
పల్నాడు
మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 512.20 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువ కు 5,292 క్యూసెక్కులు విడుదలవుతోంది.శివాలయానికి బారికేడ్లు విరాళం పెదకాకాని: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం ఇర్లపాడుకి చెందిన ఆరుమళ్ల వెంకటరావు, అనూష దంపతులు 25 బారికేడ్లను శివాలయానికి సోమవారం అందజేశారు.గుట్టలు తొలగించేది ఎప్పుడో! తెనాలిఅర్బన్: పట్టణంలోని తూర్పు కాల్వలో ఉన్న వ్యర్థాలను ఇరిగేషన్ అధికారులు పక్కన రోడ్డుపై వేశారు. ఇలా జరిగి 10 రోజులు దాటుతున్నా తొలగించలేదు. I -
అర్జీ ఇచ్చినా పట్టించుకోవట్లేదు
నాకు వారసత్వంగా లభించే పొలాన్ని వేరే వ్యక్తులు అక్రమంగా ఆన్లైన్లో నమోదు చేయించుకొని పాస్బుక్లు పొందారు. వాటిని రద్దుచేసి ఆ పొలాన్ని హక్కుదారైన నా అత్తపేరుపై పెట్టించా. పాస్బుక్లు మంజూరు చేశారు. ఆమె తదనంతరం ఆ పొలం హక్కుదారులం మేమే. ఆమె మృతి చెందింది. అయితే ఆ పొలాన్ని ఆన్లైన్లోకి ఎక్కించుకున్న వారు కోర్టుకు ఎక్కారు. ఎటువంటి హక్కులు లేని వ్యక్తులు పొలంలోకి మేము వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. వేసిన పంటను ధ్వంసం చేస్తున్నారు. దీనిపై 2024లో రెండుమార్లు అర్జీ అందజేశా. అధికారుల నుంచి సరైన స్పందనలేదు. మంగళగిరి వెళ్లి టీడీపీ కార్యాలయంలో అర్జీ అందజేశా. అక్కడి నుంచి ఫోన్చేసి రెవెన్యూ అధికారులకు చెప్పారు. అయినా ఇక్కడ అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదు. అందువలన మూడోసారి మళ్లీ అర్జీ అందజేస్తున్నా. –ఉన్నం నాగేశ్వరరావు, ధర్మవరం గ్రామం, దుర్గి మండలం -
తల్లికి వంచన
‘‘నీకు రూ.15 వేలు...నీకు రూ.15 వేలు... ముగ్గురుంటే రూ.45 వేలు’’ ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదా. సరిగ్గా ఏడాది కిందట(ఎన్నికల ముందు) చంద్రబాబు ఆ పార్టీ నాయకులు తల్లులకు ఇచ్చిన హామీ. తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటను మరిచారు. తల్లికి వందనం అంటూ వంచించారు. రెండో ఏడాది కూడా డబ్బులు ఇస్తారో లేదో తెలియదు. కూలినాలి చేసుకునే తల్లిదండ్రులు పిల్లలను బడులకు పంపేందుకు అవస్థలు పడుతున్నారు. కొంతమంది మధ్యలో చదువులకు స్వస్తి పలుకుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తీరుపై విద్యార్థుల తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● కూటమి ప్రభుత్వంలో దగా పడ్డ తల్లులు, విద్యార్థులు ● బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ● 2024–25 విద్యాసంవత్సరంలో ఒక్క రూపాయి ఇవ్వని కూటమి ప్రభుత్వం ● కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా త్వరలో అందజేస్తామని ప్రకటనలతో సరి ● జిల్లాలో తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్న 3,23,711 మంది విద్యార్థులు ● ప్రైవేట్ పాఠశాలల ఒత్తిడితో ఫీజులు కట్టడానికి ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు ● వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరుతో రూ.977.45 కోట్ల తల్లుల ఖాతాల్లో జమ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై తల్లుల ఆగ్రహం సాక్షి, నరసరావుపేట: టీడీపీ తన మేనిఫెస్టోలో తల్లికి వందనం పేరిట పాఠశాల, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున వారి తల్లుల ఖాతాలలో వేస్తామని తెలిపారు. బడికి వెళ్లే పిల్లాడు ఒకరుంటే రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు ... అంటూ కూటమి నేతలు ఊదరగొట్టారు. అయితే అఽధికారంలోకి వచ్చాక చంద్రబాబు తన సహజ నైజాన్ని బయటపెట్టారు. తొలి ఏడాది ఇవ్వాల్సిన తల్లికి వందనం నిధులు ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. రెండో ఏడాది విద్యా సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నది. ఇప్పటికీ డబ్బులెప్పుడిస్తారో చెప్పేవారు లేదు. కూటమి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని తల్లిదండ్రులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి చెప్పిన తేదీ ప్రకారం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో నేరుగా జమ అయ్యేవని గుర్తు చేసుకుంటున్నారు. అదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 3,23,711 మంది విద్యార్థుల ఎదురుచూపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 అందజేస్తామని హామీనిచ్చారు. ఈ పథకం ప్రకారం పల్నాడు జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరికి ఒక్కొక్కరికి రూ.15వేలు అందజేయాల్సి ఉంది. పల్నాడు జిల్లాలో 2024–25 విద్యాసంవత్సరం 3,23,711 మంది విద్యార్థులకుగాను ఏడాదికి రూ.485.56 కోట్లు అందజేయాల్సి ఉంది. ప్రస్తుతం 2025–26 విద్యాసంవత్సరం బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల ఖాతాలలో రెండేళ్ల నగదు జమ చేయాల్సి ఉంటుంది. అంటే సుమారు రూ.971.12 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఇంతవరకు తల్లికి వందనం నిధులు విడుదల చేయలేదు. దీంతో పిల్లలను బడులకు పంపుతున్న తల్లిదండ్రులు ఇబ్బందిపడుతున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా బడులు తెరచిన వెంటనే తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు జమ అయ్యేవి. ఇలా జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో రూ.977.45 కోట్లు తల్లుల వ్యక్తిగత ఖాతాలలో జమ చేసింది. ఇబ్బందిపడుతున్న ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న గత ప్రభుత్వంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ నెలలోనే అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థిని బడికి పంపుతున్న ప్రతి తల్లికి రూ.15 వేలను బ్యాంక్ ఖాతాలలో జమ చేసేవారు. దీంతో విద్యార్థులు బడులకు పంపడానికి ఆర్థికంగా వెసులుబాటు కలిగేది. ముఖ్యంగా ప్రైవేట్ బడులకు పంపేవారికి ఈ రూ.15 వేలు ఫీజులు కట్టడానికి ఉపయోగపడేది. విద్యార్థుల పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు వంటి వస్తువులు కొనడానికి ఈ డబ్బులు ఉపయోగించేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఒక విద్యాసంవత్సరం పూర్తయితే మరొకటి ప్రారంభమైనా ఇంత వరకు తల్లికి వందనం నిధులు విడుదల చేయలేదు. ఇంకా ఎటువంటి కార్యాచరణ, ప్రాథమిక సర్వేలు చేయలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థఽలు ఫీజులు అడుగుతున్నారని, ప్రభుత్వ త్వరగా నిధులు విడుదల చేస్తేనే కట్టగలమని చెబుతున్నారు. ఇప్పటికే పంటలు పండక, గిట్టుబాట ధరలు లభించక, మార్కెట్లో నగదు ప్రవాహం తగ్గడం వంటి కారణాలతో బడుగు, బలహీనవర్గాల కుటుంబాలకు ఈ విద్యాసంవత్సరం భారంగా మారింది. దీంతో వేలాది మంది విద్యార్థులు బడికి దూరమయ్యే ప్రమాదముందన్న ఆందోళన నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది బడి మానేసిన విద్యార్థులు అమ్మ ఒడి పథకం ద్వారా తిరిగి బడి బాట పట్టారు. అప్పులు చేసి చదివిస్తున్నాం.. నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి మోక్షిత్రెడ్డి (11) ఆరో తరగతిలో చేరనున్నాడు. చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నాడు. అమ్మాయి జాహ్నవి(8) నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నాలుగో తరగతి చదవనుంది. సొంత ఇల్లు లేదు. టీ స్టాల్ నిర్వహించుకుంటూ జీవనాధారం పొందుతున్నాను. గతంలో మూడేళ్లపాటు ఏటా అమ్మ ఒడి సాయం అందింది. పిల్లలను చదివించుకోవడానికి ఊరట నిచ్చింది. కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తామని చెప్పారు. నేటికీ ఇంతవరకు అందలేదు. ప్రభుత్వం సాయం అందిస్తే పిల్లల చదువుకు ఆసరాగా ఉంటుంది. అప్పులు చేసి చదివించుకోవాల్సి వస్తోంది. – ఉండేల రామకృష్ణారెడ్డి, చాగంటివారిపాలెం, ముప్పాళ్ల మండలం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య, ప్రభుత్వం చేసిన ఖర్చు ... సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య రూ.కోట్లలో 2019–20 1,61,031 241.55 2020–21 1,72,772 241.88 2021–22 1,92,598 250.37 2022–23 1,87,417 243.64 జిల్లాలో నియోజకవర్గాల వారీగా తల్లికి వందనం పథకం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సంఖ్య ... నియోజకవర్గం విద్యార్థుల సంఖ్య నరసరావుపేట 50,501 చిలకలూరిపేట 41,361 సత్తెనపల్లి 40,597 పెదకూరపాడు 39,685 గురజాల 51,551 మాచర్ల 50,613 వినుకొండ 49,403 మొత్తం 3,23,711 గతంలో నేరుగా బ్యాంక్ ఖాతాలలో జమ మా అమ్మాయి ఈ ఏడాది ఐదో తరగతికి వెళ్లనుంది. గతేడాది తల్లికి వందనం నగదు జమ కాలేదు. ఈ ఏడాది ఇస్తామంటున్నారు, కానీ దానిపై ఎటువంటి స్పష్టత రాలేదు. త్వరగా ఆ డబ్బులు పంపిణీ చేస్తే పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో నాకు అమ్మ ఒడి పథకం ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు జమ అయ్యేవి. –సంగు రాజ్యలక్ష్మి, రాజుపాలెం -
6న ఐటీఐ అభ్యర్థులకు కౌన్సెలింగ్
మాచర్ల: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2024–25 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు మాచర్లలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో కౌన్సెలింగ్ జరుగుతుందని జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ప్రసాద్బాబు సోమవారం తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి మార్కు లిస్టు, స్టడీ సర్టిఫికెట్ ఒరిజినల్స్తో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు మాచర్ల ఐటీఐ కాలేజీలో సంప్రదించాలన్నారు. నేడు లక్ష్మీ వినాయకస్వామి ఆలయ వార్షికోత్సవం పాత పాలువాయి(రెంటచింతల): పాత పాలువాయి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వినాయకస్వామి ఆలయ 31వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గార్లపాటి శివ ప్రసాద్ సోమవారం తెలిపారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, గణపతి పూజ, పలు రకాల అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానంను రంగు రంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఘనంగా త్రిశక్తి పీఠం నాలుగవ వార్షికోత్సవం పెదకూరపాడు: పెదకూరపాడులోని మహాలక్ష్మీ మహా సరస్వతి సమేత శ్రీ వాసవీ మాత దేవస్థానం నాలుగో వార్షికోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలయ శాశ్వత ధర్మకర్త పొట్టి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో యజ్ఞ హోమాధి కార్యక్రమాలు జరిగాయి. అమ్మవార్లను చందనంతో అలంకరించారు. సోమవారం రాత్రి భక్తులకు వేద ఆశీర్వచనాలు నుంచి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బావిలో జారిపడి విద్యార్థి మృతి నూజెండ్ల: పొలంలోని వ్యవసాయ బావిలో జారిపడి విధ్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని తంగారాల గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పమిడి ఏడుకొండలు, నాగరాజ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు పవన్కుమార్ (21) బీటెక్ రెండో సంవత్సరం గుంటూరులో చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన ఏడుకొండలు తండ్రికి సాయంగా పొలం వెళ్లాడు. దాహం తీర్చుకోవటానికి బావిలో దిగాడు. ఆ క్రమంలో జారిపడటంతో బావి లోతుగా ఉండటంతో మునిగిపోయి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. బావి సుమారు 25 అడుగుల లోతు ఉంటుందని, 6 ఇంజన్లు సాయంతో నీరు తోడటంతో మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న ఐనవోలు ఎస్సై ఎంవీ కృష్ణారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జేఈఈలో వీరవట్నం విద్యార్థికి 22వ ర్యాంకు రొంపిచర్ల: మండలంలోని వీరవట్నం గ్రామానికి చెందిన అడుసుమల్లి మోహన్ సాత్విక్ జేఈఈ –2025 అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆల్ ఇండియా 22వ ర్యాంకును కై వసం చేసుకున్నాడు. మోహన్ సాత్విక్ తండ్రి అడుసుమల్లి రవికుమార్ది వీరవట్నం గ్రామం. ఉద్యోగరీత్యా రాజస్థాన్లోని అలెన్కోటలో స్థిరపడ్డారు. 10వ తరగతి వరకు హైదరాబాద్లో చదివిన సాత్విక్ ఇంటర్మీడియట్ను రాజస్థాన్లోనే పూర్తి చేశాడు. రవికుమార్, మనీషా దంపతులకు సాత్విక్ మొదటి సంతానం. రెండో కుమారుడు రిత్విక్ 10వ తరగతి చదువుతున్నాడు. తమ గ్రామానికి చెందిన మోహన్ సాత్విక్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి 22వ ర్యాంకు సాధించటం పట్ల వీరవట్నం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పింఛన్ పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోండి
ఆరో వార్డు బాబాపేటకు చెందిన మండ్ల మరియమ్మకు పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేవు. అదే ప్రాంతానికి చెందిన షేక్ మస్తాన్బీ కుమారులు 35 ఏళ్ల ఇస్మాయిల్, 32 ఏళ్ల సుభానీ మరుగుజ్జులు. వారికి ప్రస్తుతం రూ.6వేల పింఛన్ అందుతుంది. తమకు రూ.10వేల పింఛన్ ఇవ్వాలని కోరేందుకు అర్జీలతో వచ్చారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కిందకు దిగి వారి వద్దకు వచ్చి అర్జీలను పరిశీలించి వెంటనే మెడికల్ బోర్డుకు సిఫార్సుచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో మధులత, డీఎంహెచ్ఓ డాక్టర్ రవిలను ఆదేశించారు. –కలెక్టర్ను కలిసిన దివ్వాంగురాలు, మరుగుజ్జులు -
ఫ్రీ బస్సు రోడ్డు ఎక్కేనా ?
కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాదిరిగా ప్రతి మహిళా ఉచితంగా ప్రయాణించేలా ఉచిత బస్సు (ఫ్రీ బస్సు) పథకం అమలు చేస్తానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఊదరగొట్టారు. మాయ మాటలు చెప్పి మహిళలతో ఓట్లు వేయించుకున్నారు. అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు దాని అతీగతీ లేదు. తొలుత దసరా అన్నారు.. తర్వాత దీపావళి.. ఆ తర్వాత సంక్రాంతి అన్నారు..చివరకు వచ్చే ఆగస్టు 15 నుంచి అమలు చేస్తానని మహానాడులో ప్రకటించారు. ఇదీ కష్టమేనని ఆర్టీసీ పరిస్థితులపై అవగాహన ఉన్న సంస్థ ఉద్యోగులు అంటున్నారు.నరసరావుపేట: పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేసి చూపితే, మన రాష్ట్ర పెద్దలు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదేమంటే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడటంతో అమలు చేయలేకపోతున్నామంటూ కుంటి సాకులు చెబుతున్నారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టించి, ప్రజలకు పథకాలు అమలుచేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సాకులు వెతుకుతుండటం శోచనీయమని మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా పథకాలు అమలు చేయాలంటే భయంగా ఉందంటూ చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళలు, ప్రజలు విస్తుపోతున్నారు. అసలు ఫ్రీ బస్సు అమలు చేస్తారా లేదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. పథకం అమలుపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు చర్చించిన దాఖలాలు లేవు.జిల్లా కేంద్రానికి నిత్యం రాకపోకలుమూడేళ్ల కిందట నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటైంది. దీంతో పలు ప్రాంతాల నుంచి మహిళా ఉద్యోగులు, ఉపాధి కోసం మహిళా కూలీలు జిల్లా కేంద్రానికి ప్రతిరోజూ రాకపోకలు చేస్తున్నారు. వందలాది మంది విద్యార్థినులు ఇంజినీరింగ్తో పాటు పలు ఉన్నత విద్యా విద్యా సంస్థలకు రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట డిపో ద్వారా ఆర్టీసీ 90 బస్సుల ద్వారా 106 సర్వీసులను నడుపుతోంది. అందులో 65 బస్సులు సంస్థవి కాగా, మరో 25 అద్దెవి. వీటిలో పల్లె వెలుగు 47 బస్సులు ఉన్నాయి. మిగిలినవి హైటెక్, అల్ట్రా, ఎక్స్ప్రెస్ బస్సులు. ప్రతిరోజూ ప్రయాణికుల ద్వారా రూ.13 లక్షల నుంచి రూ.14లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. జిల్లావ్యాప్తంగా సంస్థకు నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల ఉన్నాయి. ఫ్రీ బస్సు ఏ విధంగా అమలుచేస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. కేవలం జిల్లాకు లేదా నియోజకవర్గానికే పరిమితం చేస్తామని కూటమి నేతలు లీకులు వదులుతున్నారు.మహిళలకు ఎంతో ఉపయోగంతెలంగాణలో పథకం అమలు చేసినా ఇక్కడ ఏడాదిగా అమలు చేయకపోవడం దారుణం. చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చే మనస్తత్వం లేదు. పేదలంటే పడదు. వారికేమి చేయడు. ఫ్రీ బస్సు పథకం అమలుచేస్తే మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.–ఎస్.సుజాతాపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ సీపీ , నరసరావుపేటఇప్పటి వరకు ప్రణాళిక లేదుఉచిత బస్సు గురించి ఇప్పటి వరకు మాకెటువంటి సంకేతం అందలేదు. జిల్లాలో కూడా సర్వే చేయలేదు. ప్రభు త్వం ఆదేశిస్తే ఉన్న బస్సులతోనే పథకం అమలుచేసేందుకు ప్రయత్నాలు చేస్తాం.– ఎం.మధు,ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారిపల్నాడు జిల్లాలో ఐదేళ్ల మొత్తం 10,92,732మంది మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దీని వల్ల ఉపాధి, ఉద్యోగాలు, వైద్యం, వివిధ పనులపై నిత్యం బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఆర్టీసీ పరిధిలో 461బస్సులు నిత్యం 2995 ట్రిప్పులు చొప్పున రోజుకు 1.73,573 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. రోజుకు సగటున 1,41,717మంది మహిళలు ప్రయాణిస్తుండగా రూ.59.22లక్షల ఆదాయం సమకూరుతోంది. ఉచిత పథకం సరిగా అమలుచేస్తే జిల్లాలోని మహిళలకు ఏడాదికి రూ.146కోట్లు లబ్ధి చేకూరనుంది. -
ప్రజలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు
వినుకొండ : కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏడాది కాలంలో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్ సీపీ పీఏసీ మెంబరు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఈనెల 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వాల్పోస్టర్లను ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ ఏడాదిలోనే 99శాతం అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. వినుకొండలో ఉదయం 10గంటలకు వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించి ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. పింఛన్ల నిలిపివేత దుర్మార్గమైన చర్య శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామంలో 72 పింఛన్లు ఆపివేయడం దుర్మార్గమైన చర్య అని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. ఎక్కడా లేని విధంగా రాజకీయ కక్షతో, దురుద్దేశంతోనే పింఛన్లను తొలగించారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మళ్లీ రేషన్ కష్టాలు
గుంటూరు వెస్ట్: రేషన్ పంపిణీ తొలిరోజే విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎండీయూ వాహనాలను కాదని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ ప్రారంభించింది. దీని కోసం నాయకులతోపాటు కార్యకర్తలను రేషన్ దుకాణాలకు పంపి హడావుడి చేసింది. ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలాచోట్ల ఈ పోస్ మిషన్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్లా మాధవి స్థానిక ఏటీ అగ్రహారం రేషన్ దుకాణం నెంబర్ 0781174ను ప్రారంభించారు. కొద్ది సేపటికే అక్కడ ఈ పోస్ మిషన్ మొరాయించింది. జిల్లాలో మొత్తం 972 రేషన్ దుకాణాలున్నాయి. 5,99,511 మందికి సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. తొలి రోజు మాత్రం పెద్దగా స్పందన లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసేటప్పుడు పేదలకు ఎంతో సౌలభ్యంగా ఉండేది. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని కార్డుదారులు వాపోతున్నారు. తప్పని సమస్యలు చాలా దుకాణాల్లో సర్వర్ మొరాయించింది. కొన్ని చోట్ల నెమ్మదించింది. దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ పోస్ మిషన్లు, వేయింగ్ మిషన్లు వాడకపోవడంతో అవి చాలా వరకు పాడైపోయాయి. ఇంటి వద్దకే రేషన్ తీసుకోవడానికి అలవాటు పడ్డ ప్రజలు దుకాణాలకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. కొన్ని చోట్ల లైన్లు కనబడగా, మరికొన్ని చోట్ల ఎవ్వరూ రాలేదు. మిషన్లు పనిచేయకపోవడంతో ప్రజలు తిరిగి వెళ్లిపోయారు. కూటమి నేతలు తమ కార్యకర్తలను తీసుకుని రేషన్ దుకాణాల్లో హాల్చల్ చేయడం కనిపించింది. రేషన్ తీసుకోవాలని కొంత వరకు స్థానికంగానూ ప్రచారం చేశారు. ఎండీయూ వాహనాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం రేషన్ దుకాణదారులు చేసే అక్రమాలను ఎలా నివారిస్తోందో చెప్పకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొన్నారు. తొలిరోజు సరకుల పంపిణీలో తీవ్ర ఇబ్బందులు పలుచోట్ల ఈ– పోస్ మిషన్లు మొరాయింపు పనిచేయని ఎమ్మెల్యే మాధవి ప్రారంభించిన దుకాణం ఇంటివద్దకే సరకులు ఇచ్చే వ్యవస్థ నాశనం చేసిన కూటమి ప్రభుత్వం పాలకుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం -
మోసం చేయడం చంద్రబాబు నైజం
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి గురజాల: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడం చంద్రబాబునాయుడు నైజం అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి విమర్శించారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదని, ఇందుకు నిరసనగా జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో గెలుపొందిన రెండు నెలల్లోనే బ్రాహ్మణపల్లి సమీపంలో మెడికల్ కళాశాలను స్థాపించామని తెలిపారు. కేంద్రం నుంచి రూ.500 కోట్లు నిధులు తీసుకువచ్చి 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. గురజాల నియోజకవర్గాన్ని రూ.3500 కోట్లతో అభివృద్ధి చేశామని, కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏం అభివృద్ది చేశారో చెప్పాలని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా కూటమి నేతలు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించి జానపాడు రైల్వే బ్రిడ్జి పనులు చేపట్టేలా చూశామని చెప్పారు. మెడికల్ కళాశాల కూడా ప్రారంభించేలా చూస్తామన్నారు. అనంతరం వెన్నుపోటు దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్రెడ్డి, సీనియర్ నాయకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి, మాజీ కన్వీనర్ సిద్దాడపు గాంధీ, పట్టణ కన్వీనర్ కె. అన్నారావు, కర్రా చిన్న కోటేశ్వరరావు, వేముల చలమయ్య, కావూరి అంజిబాబు, మహంకాళి యశోద దుర్గ, చల్లా కాశీబాబు, జక్కా సత్యం, షేక్ నాసర్ౖ సెదా, బండ్ల వెంకయ్య పాల్గొన్నారు. -
కూటమి మోసాలను ఎండగట్టేందుకే ‘వెన్ను పోటు’ దినం
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: వెన్నుపోటుకు ఆద్యుడు..వెన్నుపోటుకే ఓ ప్రత్యేక దినం అవసరాన్ని తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి విడదల రజిని విమర్శించారు. చిలకలూరిపేటలో జూన్ 4వ తేదీన వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన జరగనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమ పోస్టర్ను పార్టీశ్రేణులతో కలిసి ఆదివారం ఆమె నివాసంలో ఆవిష్కరించారు. ప్రజల మద్దతుతో జరిగే ఈ నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2024 జూన్ 4న అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ‘సూపర్సిక్స్’ పాటు మరో 143 హామీలు ఇచ్చిందని, ఏడాది గడిచినా ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదని అన్నారు. సంక్షేమ పథకాల అమలు ద్వారా ప్రజల ఖాతాల్లో నేరుగా నగదు జమచేసి పారదర్శక పాలన అందించి దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అరాచక పాలన సాగిస్తూ..నిత్యం కల్లబొల్లి మాటలతో ప్రజలను చంద్రబాబు మభ్య పెడుతున్నారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడమే పార్టీ ఎజెండాగా పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు గల్లంతవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే గుణపాఠం చెబుతారని రజిని హెచ్చరించారు. జూన్ 4న జరగనున్న ‘వెన్నుపోటు దినం’ కేవలం నిరసన కార్యక్రమం కాదని, అది హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రజల గళం అని పేర్కొన్నారు. పట్టణంతోపాటు నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రజిని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా యూత్ అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, జిల్లా వైస్ప్రెసిడెంట్ మద్దూరి కోటిరెడ్డి, మాజీ ఎంపీపీ మద్దూల విజయబాలచంద్రారెడ్డి, రూరల్ ఎంపీపీ దేవినేని శంకర్రావు, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మాజీ డైరెక్టర్ షేక్ దరియావలి, సింగారెడ్డి కోటిరెడ్డి, కల్లి వెంకటరెడ్డి, మైలా రాజేష్, పందుల బుల్లెబ్బాయి, వడ్డేపల్లి నర్సింహరాజు, కుప్పాల ప్రభుదాసునాయుడు పాల్గొన్నారు. మాజీమంత్రి విడదల రజిని 4న చిలకలూరిపేటలో భారీ ర్యాలీ ప్రజలతో కలిసి అధికారులకు వినతిపత్రాల సమర్పణ పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ -
యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం
నరసరావుపేట: యోగాతో శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. యోగాంధ్రలో భాగంగా ఆదివారం నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్, పెద్ద చెరువు రోడ్డు వద్ద కార్యక్రమాలను పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ 30 నిమిషాల నుంచి గంట వరకు యోగాభ్యాసం చేయాలని సూచించారు. యోగాతో శారీరక రుగ్మతలు దూరమవుతాయని పేర్కొన్నారు. యోగా అనేది చాలా ప్రాచీనమైనదని, వందల ఏళ్ల నుంచి గుర్తింపు పొందిందని అన్నారు. జూన్ 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని, శిక్షణ అనంతరం యోగాను ప్రతిరోజూ సాధన చేయాలన్నారు. తద్వారా ఆయుష్షు పెరుగుతుందని, యోగ సాధనపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. వందల మంది పాల్గొని యోగాభ్యాసం చేశారు. జిల్లా పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్మార్త వేద పాఠశాలలో ప్రవేశాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న స్మార్త వేద పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి వేద పాఠశాల పునఃప్రారంభం కానుందని, విద్యాభ్యాసం కోసం విద్యార్థులు ప్రవేశ దరఖాస్తులను పొందవచ్చని పేర్కొన్నారు. సమాజ వికాసానికి తోడ్పడే వేద విద్య అభ్యున్నతికి, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు దేవస్థానం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. -
క్రీడాకారులను తీర్చిదిద్దడం గొప్ప విషయం
చినగంజాం: క్రీడాకారులను ప్రతిభావంతులుగా తీర్చి దిద్దడం గొప్ప విషయం అని హైదరాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్ను వేణుగోపాల్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజీ ఆవరణలో 40 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి కబడ్డీ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరానికి శిక్షకుడుగా అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు గిరిబాబు వ్యవహరించి ప్రతి రోజూ శిక్షణ అందించారని, అనేక మంది యువ క్రీడాకారులు ప్రేరణ పొందారన్నారు. ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 నుంచి జూన్ 1వ తేదీ వరకు గ్రామీణ యువతకు కబడ్డీపై శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిర్వహించామని.. శిబిరం విజయవంతంగా ముగిసిందన్నారు. కోచ్ గిరిబాబు మాట్లాడుతూ శిబిరంలో మొత్తం 150 మంది బాలలకు శిక్షణ ఇచ్చామని, శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డాక్టర్ నల్లూరి సుబ్బారావు రూ.లక్ష విరాళంగా అందజేశారని తెలిపారు. దీంతో క్రీడాకారులకు పౌష్టికాహారం, కబడ్డీ కిట్లు అందజేశామన్నారు. శిబిరంలో సీనియర్ క్రీడాకారులు బి.నాగాంజనేయులు, వెంకటేశ్, కె.సతీష్రెడ్డి, బి.శివారెడ్డి, డి.సుబ్బారెడ్డి, వి. వెంకటేశ్, జీటీ అంకిరెడ్డి, ఎం.భాను ప్రకాష్రెడ్డి తదిరులు పాల్గొనగా, వారి సలహాలు సూచనల మేరకు శిక్షణ పూర్తి చేసినట్లు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి, క్రీడాకారులకు భోజన వసతి కల్పించేందుకు అన్ను వేణుగోపాల్ రూ.40 వేలు ఆర్థిక సాయమందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మచిలీ పట్నం జిల్లా అదనపు పోలీస్ అధికారి సత్యం, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ దాత డాక్టర్ నల్లూరి సుబ్బారావు, అసోసియేషన్ చైర్మన్ చంద్రమోహనరెడ్డి, అసోసియేషన్ కార్యదర్శి వై.పూర్ణచంద్రరావు, డి.రమేష్, డాక్టర్ రవిప్రకాష్ రెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిరిగిరి రంగారావు పాల్గొన్నారు. -
‘గ్రీన్లైట్ ఏరియా’ కథా సంపుటి ఆవిష్కరణ
అద్దంకి రూరల్: వడలి రాధాకృష్ణ (చీరాల) రచించిన కథా సంపుటి ‘గ్రీన్ లైట్ ఏరియా’ ఆవిష్కరణ ఆదివారం రాత్రి స్థానిక కమఠేశ్వరస్వామి ఆలయంలో సృజన, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించి తొలి ప్రతిని చెన్నుపాటి రామాంజనేయులుకు అందజేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య అధ్యక్షత వహించారు. కథా రచయిత్రి పాలపర్తి జ్యోతిష్మతి మాట్లాడుతూ రాధాకృష్ణ కథలు ప్రత్యేకమైన శైలిలో సమాజంలోని సమస్యల పరిష్కారం దిశగా సాగుతాయని తెలిపారు. అనంతరం ఇటీవల ఉగాది పురస్కారం పొందిన వడవల్లి రాధాకృష్ణ, ఎన్టీఆర్ జాతీయ కీర్తి పురస్కారాన్ని అందుకున్న నాగనేని రామకృష్ణ, ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకున్న మన్నం త్రిమూర్తులు, పెద్దినేని సురేంద్రబాబు, రక్తదాన ప్రోత్సాహకులు చుండూరి మురళీ సుధాకర్లను సృజన, రోటరీ క్లబ్ సభ్యులు దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సృజన అధ్యక్షుడు గాడేపల్లి దివాకరదత్తు, వీరవల్లి రుద్రయ్య, కోట అంజమ్మ, కొల్లా భువనేశ్వరి, జ్యోతి చంద్రమౌళి, కృష్ణమోహన్, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, షేక్ మస్తాన్, రావూరి రంగయ్య, లెవీ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఆరోగ్యానికి సైక్లింగ్
నరసరావుపేట ఈస్ట్: ఆరోగ్యకర జీవనానికి సైక్లింగ్ ఉత్తమ వ్యాయామంగా దోహదపడుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆదివారం ఎర్త్ హీరో ఫౌండేషన్ భాగస్వామ్యంతో హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ స్వచ్ఛంద సేవా సంస్థ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. సతైనపల్లిరోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో సైకిల్ ర్యాలీని ప్రారంభించిన డీఎస్ఓ నరసింహారెడ్డి మాట్లాడుతూ కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రపంచ సైకిల్ దినోత్సవంతోపాటు సండేస్ ఆన్ సైకిల్ నిర్వహించాలని ఆదేశించినట్టు వివరించా రు. శరీరానికి వ్యాయామాన్ని అందించే సైక్లింగ్ను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూ చించారు. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.ఆనంద్ బెంజిమెన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పర్యావరణ రక్షణ, ఆరోగ్యవంతమైన జీవనశైలిని పౌరులకు పరిచయం చేసేందుకే సండేస్ ఆన్ సైకిల్ నిర్వహిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో స్టేడియం కోచ్లు చావా శ్రీనివాసరావు, మద్దాలి సైదారావు, ఖేలో ఇండియా పీఈటీ ఇజ్రాయిల్ ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. డీఎస్ఓ నరసింహారెడ్డి -
రాష్ట్రస్థాయి ఈత పోటీలు ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: ఈత అత్యుత్తమ వ్యాయామమని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో 11వ సీనియర్ అంతర్ జిల్లాల స్విమింగ్ ఛాంపియన్షిప్– 2025 పోటీలను నిర్వహించారు. పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు పలు ప్రణాళికలు రూపొందించిందని వివరించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 105 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ కె.రవికాంత్, అధ్యక్షుడు ఓబుల్రెడ్డి, కార్యదర్శి మోహనవెంకటరామ్, కోశాధికారి రమేష్, పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు ముగియ నుండటంతో, వివాహ ముహుర్తాల నేపథ్యంలో నూత న వధూవరులు, భక్తులు, యాత్రికులతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించగా, ఎటువంటి ఇబ్బంది కలుగకుండా దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దేవస్థాన కేశఖండనశాలలో తలనీలాలు సమర్పించారు. ఘాట్రోడ్డు, మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 టికెట్ల క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సర్వదర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటలు, రూ.100, రూ.300 టికెట్పై దర్శనానికి గంటన్నరకు పైగా సమయం పట్టింది. వీఐపీ దర్శనాలను బ్రేక్ ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం 1–30 గంట వరకు వీఐపీ దర్శనాలను దేవస్థాన అధికారులు నిలిపివేశారు. అమ్మవారికి మహానివేదన నిమిత్తం ఉ దయం 11–45 గంటల నుంచి 12–15 గంటల వరకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మహానివేదన అనంతరం రూ. 500టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ. 300 టి కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారువాకిలి దర్శ నం కల్పించారు. మధ్యాహ్నం 2గంటల వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. సాయ ంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీసేవలో పలువు రు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఏడు గంటలనుంచి భక్తుల తాకిడి కనిపించింది. మహానివేదన తర్వాత వీఐపీ దర్శనాలకు బ్రేక్ అంతరాలయ దర్శనం రద్దు -
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
దాచేపల్లి: అతివేగంగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఇందిరాకాలనీకి చెందిన కొమ్మా విజయ్కుమార్(58)తన ఇంటి నుంచి హైవే రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో పిడుగురాళ్ల వైపు నుంచి అతివేగంగా వస్తున్న వాహనం అతనిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జీ. పాపారావు సంఘటన స్థలాన్ని పరిశీలన చేశారు. ఢీకొట్టిన వాహనం కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య భార్య విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పాపారావు తెలిపారు. పొస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
కార్డుదారులకు సరుకులు సక్రమంగా అందించాలి
చీరాల టౌన్: కార్డుదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందించాలని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖరనాయుడు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా మండలంలోని ఈపురుపాలెం, తోటవారిపాలెం, పట్టణంలోని పలు వార్డుల్లోని రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు సరుకులు పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి డీలర్ విధిగా ప్రతి నెలా 15వ తేదీలోగా కార్డుదారులకు సరుకులు అందించాలని ఆదేశించారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరచి ఉంచాలని తెలిపారు. ప్రతి డీలర్ విధిగా స్టాక్ రికార్డులు, బోర్డుల్లో సరుకుల కేటాయింపులు, నిల్వలను తెలియజేయాలని చెప్పారు. సరుకుల పంపిణీలో వ్యత్యాసాలు, అధిక ధరలకు అమ్మకాలు, బియ్యాన్ని ఇవ్వకుండా డబ్బులకు కొనుగోలు చేయడం నేరమని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ, వీఆర్వోలు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
అండర్ పాస్లో ఇరుక్కుపోయిన లారీ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎన్టీఆర్ కరకట్ట నుంచి సీతానగరం వచ్చే మార్గంలో బకింగ్హామ్ కెనాల్ వద్ద ఉన్న రైల్వే అండర్పాస్లో మరో సారి భారీ వాహనం ఆదివారం ఇరుక్కుపోయింది. సీతానగరం నుంచి ఎన్టీఆర్ కరకట్ట వైపు వెళుతున్న లారీ రైల్వేబ్రిడ్జి సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన గడ్డర్ను దాటి ముందుకు వచ్చేసింది. బ్రిడ్జి కిందకు రాగానే లారీపై ఉన్న లోడ్ తగిలి ఇరుక్కుపోవడంలో డ్రైవర్ నిలిపివేశాడు. చివరకు టైర్లలో గాలి తీసి ముందుకు తీసుకువెళ్లారు. రైల్వే బ్రిడ్జి కింద తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో పెను ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రైల్వే అధికారులు స్పందించి రైల్వే బ్రిడ్జికి ప్రమాదం కలగకుండా సమాంతరంగా గడ్డర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ సంఘటనపై తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులతో మైదానాలు కళకళలాడాలి గుంటూరు వెస్ట్ (క్రీడలు): చిన్నారులతో క్రీడా మైదానాలు కళకళలాడాలని, ఆ విధంగా స్టేడియాన్ని తీర్చిదిద్దుతామని తూర్పు శాసన సభ్యుడు మొహమ్మద్ నసీర్ అహ్మద్ తెలిపారు. మూడు రోజల నుంచి స్థానిక బీఆర్ స్టేడియంలో జరుగుతున్న అండర్–16 బాలబాలికల ఓపెన్ టెన్నిస్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రూ.100 కోట్లతో స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పోటీల నిర్వాహకుడు, టెన్నిస్ కోచ్ షేక్ అహ్మద్ మాట్లాడుతూ అండర్–16 బాలుర విజేతగా కె.విన్సెంట్, రన్నర్గా జయ సాయి కుమార్ నిలిచాడన్నారు. బాలికల్లో గోలి జోషిత విజేత కాగా తనిక్షరెడ్డి రన్నర్గా నిలిచిందని చెప్పారు. విజేతలకు బహుమతులను నసీర్ అహ్మద్, టోర్నమెంట్ స్పాన్సర్ డాక్టర్ రామకృష్ణ, రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వరరావు అందజేశారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో అవినీతిపై విచారణ
వినుకొండ: అంగన్వాడీ ఈపూరు ప్రాజెక్టు అధికారి అరుణపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి శుక్రవారం విచారణ చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో అనధికార వసూలుపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ప్రతినెలా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు మామూళ్లు ఇవ్వాలని, ఈనెల 31వ తేదీ రానున్న నేపథ్యంలో అందరూ తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాలని సోషల్మీడియాలో ఓ కార్యకర్త పోస్టు పెట్టడంతో వివాదం నెలకొంది. బొల్లాపల్లి, ఈపూరు మండలాల అంగన్వాడీ కార్యకర్తలను వ్యక్తిగతంగా విచారణ చేసి వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నివేదికను జిల్లాకలెక్టరు కు నివేదించనున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను నిబంధనల ప్రకారం నడపాలని సూచించారు. ఎక్కడయినా సమస్యలు ఉంటే తమదృష్టికి తీసుకురావాలని కోరారు. ఈపూరులో విచారణ చేపట్టిన పీడీ జిల్లా కలెక్టరుకు నివేదించనున్న వైనం -
పొగాకు.. ఆరోగ్యానికి చేటు
● నేడు నో టుబాకో డే ● బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం ● పొగాకు వినియోగంతో అనేక నష్టాలు గుంటూరు మెడికల్: యవ్వనంలో సరదా కోసం మొదలుపెట్టే ధూమపానం చివరకు ప్రాణాలనే హరిస్తుంది. సిగరెట్, బీడీ, చుట్ట తాగే అలవాటు వ్యసనంలా మారి మనిషిని బానిసను చేసుకుంటుంది. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల మోజులో పడి యువత భవిష్యత్తును అంధకారం చేసుకుంటోంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో 40 శాతం మంది పొగతాగటం, పొగాకు ఉత్పత్తులు వాడటం ద్వారానే వ్యాధి బారిన పడి మరణిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ధూమపానంతో కలిగే అనర్థాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రపంచ వ్యాప్తంగా మే 31వ తేదీన నో టుబాకో డేను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా‘ సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. జిల్లాలో బాధితులు అధికమే... జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం 35 శాతం మంది యువత ధూమపానం చేస్తున్నారు. వివిధ రోగాలతో 30 – 39 ఏళ్ల వయస్సు వారిలో చనిపోతున్న ప్రతి ఐదుగిరిలో ఒకరు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్లేనని తేలింది. గుంటూరు జీజీహెచ్లో ప్రతి నెలా 1,200 మంది పురుషులు, 2 వేల మంది మహిళలు వివిధ రకాల క్యాన్సర్లతో చికిత్స పొందుతున్నారు. వీరిలో 40 శాతం మంది కేవలం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల క్యాన్సర్ బారిన పడ్డారు. జిల్లాలో క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందించేందుకు 15 ఆస్పత్రులు, క్లీనిక్లు ఉన్నాయి. వీటిల్లో రోజూ 400 మంది వరకు క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు. చట్టం ఏం చెబుతోందంటే.. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం రైల్వే స్టేషన్లు, సినిమా హాల్స్, బస్ స్టేషన్లు, జనసంచారం ఉండే మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ధూమపానం చేయకూడదు. ముఖ్యంగా పాఠశాలలు, గుడులకు సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మటం చట్టరీత్యా నేరం. 18 ఏళ్లలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు చట్టరీత్యా విక్రయించకూడదు. చట్టాన్ని అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తారు. ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్ ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో మాత్రమే ధూమపానం చేసేందుకు అనుమతించాలి. పొగాకు వినియోగంతో క్యాన్సర్ క్యాన్సర్ చికిత్స కోసం వచ్చే వారిలో 40 శాతం మంది పొగాకు, దాని ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్కు గురవుతున్నవారే. పొగతాగటం, పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, గుట్కా, పాన్పరాగ్ వంటి వాటిని వినియోగించటం వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తులు, జీర్ణాశయం, మూత్రాశయ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు నేడు ఆధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. చికిత్స తీసుకుని త్వరితగతిన వ్యాధి నుంచి కోలుకోవచ్చు. – డాక్టర్ ఎం.జి.నాగకిషోర్, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, గుంటూరు ధూమపానంతో గుండెజబ్బులు పొగతాగే వారిలో రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొగాకులో 400 రకాల విషపదార్థాలు ఉంటాయి. కార్బన్ మోనాకై ్సడ్ వల్ల గుండెపోటు, టార్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. నపుంసకత్వం, పక్షవాతం పొగరాయుళ్లను వదలవు. పొగతాగే వారికి చుట్టుపక్కల ఉన్నవారిపై కూడా పొగాకు ప్రభావం ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చే వారిలో 70 శాతం మంది ధూమపానం చేసేవారే. – డాక్టర్ బొర్రా విజయ్చైతన్య, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్, గుంటూరు జీజీహెచ్ జీజీహెచ్లో ఉచిత కౌన్సెలింగ్ గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల వైద్య విభాగంలో పొగాకు ఉత్పత్తుల అలవాటు మానేయాలనుకునే వారికి ఉచితంగా కౌన్సెలింగ్ చేసి, ఔషధాలు ఇస్తున్నారు. 2019 నుంచి డీ అడిక్షన్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. గత ఏడాది 1,263 మందికి చికిత్స అందించడం ద్వారా కొంత మంది స్మోకింగ్ అలవాటు మానేశారు. స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఛాతీ ముందు భాగంలో, భుజానికి, తొడకు.. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో వెంట్రుకలు లేని చోట నికోటిన్ ట్రాన్స్థర్మల్ ప్యాచ్ను అంటిస్తారు. ఈ ప్యాచ్ అంటించి కౌన్సెలింగ్ చేయడం ద్వారా ప్రతి నెలా పది మందికి పైగా పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానివేస్తున్నట్లు గుర్తించామని సెంటర్ ఇన్చార్జి డాక్టర్ వడ్డాది వెంకట కిరణ్ తెలిపారు. -
ప్రకృతి వనరులను కాపాడుకోవాలి
గుంటూరు వెస్ట్: ప్రకృతి పంచిన అరుదైన వనరులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన చిత్తడి నేలల పరిరక్షణ కమిటీ సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం జిల్లాలోని ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని కన్జర్వేటివ్ రిజర్వ్గానూ, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలోని మంచినీటి చెరువును చిత్తడి నేలగానూ మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు పంపామన్నారు. వీటిని గ్రామ సభల ద్వారానూ సంబంధిత శాఖాధికారుల ద్వారా ఆమోదం లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాల్సి ఉందని తెలిపారు. సమావేశంలో డీపీఓ సాయి కుమార్, పశుసంవర్ధక శాఖ జేడీఏ సత్యనారాయణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ నజీమా బేగం, అధికారులు పాల్గొన్నారు.జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్సగుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడినట్లు జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ చెప్పారు. శుక్రవారం జీజీహెచ్ జనరల్ సర్జరీ విభాగంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాదారం గ్రామానికి చెందిన పాలిపోగు ప్రసాద్ (62) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తీవ్రమైన కడుపునొప్పి, కామెర్లు, చలిజ్వరం రావడంతో ఒంగోలులో 25 రోజులు చికిత్స తర్వాత గుంటూరు జీజీహెచ్కు వచ్చాడు. హైడాటిడ్ సిస్ట్ వ్యాధి (కాలేయంలో నీటిబుడ్డ)తో బాధపడుతున్నట్లు నిర్ధారించామన్నారు. కుక్కల వల్ల, కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధి వస్తుందన్నారు. కొన్నిసార్లు మాంసం పూర్తిగా ఉడకకుండా తినడం వల్ల కూడా వస్తుందని చెప్పారు. ప్రసాద్ కాలేయం, ఇతర అవయవాలకు ఇబ్బంది ఉండటంతో సర్జరీ చేశామని, దీనికి నాలుగు గంటల సమయం పట్టిందన్నారు. సుమారు 40 రోజులపాటు వార్డులో చికిత్స అందించి డిశ్చార్జి చేశామన్నారు. సుమారు రూ.10 లక్షల ఖరీదైన ఆపరేషన్ను ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. ఆపరేషన్ ప్రక్రియలో వైద్యులు నాగ సంతోష్కుమార్, సాదిక్ బాషా, వేణుగోపాల్, మేఘన, అవిన్, హరి, పోలయ్య, శ్యాంసన్, శ్వేత, ప్రసాద్, హనుమంతరావు, నర్సింగ్ సిబ్బంది రాజ్యలక్ష్మి, స్రవంతి, అనిత, ఉష, నంద పాల్గొన్నట్లు వెల్లడించారు. వృద్ధుడి ప్రాణాలు కాపాడిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ అభినందించారు.పోలీసులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్తెనాలి రూరల్: లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిరాటంకంగా అమలు చేస్తూ దళిత, మైనార్టీ యువకులపై విచక్షణారహితంగా దాడి చేసిన సీఐలు, ఇతర పోలీసు సిబ్బందిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి అందే శ్యాం డిమాండ్ చేశారు. తెనాలి ఐతానగర్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం వారు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఐతానగర్ దళితులు క్రిమినల్, గంజాయి కేసుల్లో ఉన్నందున పోలీసులు బహిరంగంగా ట్రీట్మెంట్ ఇవ్వడం సరైందేనని అధికార పార్టీ పత్రికల ద్వారా, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయించారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్సీ కార్యాలయంలో కారు చోరీ చేసిన దొంగ అరెస్టు
వివరాలు వెల్లడించిన వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ లక్ష్మీపురం: ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో కారు చోరీ చేసి పరారైన ఘటనలో వ్యక్తిని అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నట్టు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ శుక్రవారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 28వ తేదీన కడప జిల్లా కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామానికి చెందిన పనకనపల్లి రాంప్రసాద్ రెడ్డి 2009–2014 వరకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్కు చెందిన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ కార్యాలయంలో డ్రైవర్గా పనిచేశాడు. అక్కడ నుంచి హైదరాబాద్లో ఓలా క్యాబ్, అలాగే మరి కొన్ని చోట్ల డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం సాగించాడు. ఆర్థిక పరిస్ధితులు అనుకూలంగా లేని కారణంగా మరలా తిరిగి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వద్ద పనిచేసేందుకు ఈనెల 28వ తేదీన గుంటూరు విద్యానగర్లోని రాజేంద్రప్రసాద్కు చెందిన ఎన్ఆర్ఐ అగ్రిటెక్ సంస్థకు చెందిన వైస్ చైర్మన్ సాంబశివరావు వద్దకు వచ్చి పని కావాలని అడిగాడు. ప్రస్తుతం పనిలేదని ఆయన చెప్పాడు. కొద్ది రోజుల తరువాత చూద్దాం అని చెప్పడంతో కడప నుంచి వచ్చానని, రెండు రోజుల ఇక్కడే ఉండి వెళ్తానని చెప్పాడు. గతంలో ఉన్న పరిచయాల వల్ల ఆఫీస్ వద్దనే ఉన్నాడు. అయితే అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ డ్రైవర్గా పని చేసే సంతవరపు నాగార్జున ఏపీ 07జెడ్ 2137 నంబర్ గల కారును కార్యాలయం వద్ద పార్కింగ్ ప్రదేశంలో పెట్టి తాళాలు కార్యాలయంలో పెట్టి వాచ్మెన్కు చెప్పి వెళ్లిపోయాడు. తరువాత రాత్రి ఒంటి గంట సమయంలో హైదరాబాద్ ఉన్న రాంప్రసాద్రెడ్డి కారును, వాచ్మన్ సెల్ఫోన్ను చోరీ చేసి పరారైయ్యాడు. దీంతో కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గుజ్జనగుండ్ల సెంటర్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో చోరీ చేసిను కారులో ఉన్న రాంప్రసాద్రెడ్డి కారును ఆపి పారిపోయే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు రాంప్రసాద్రెడ్డిని అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. స్టేషన్లో విచారించగా హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్న ప్రియురాలిని కలసి, కారు తిరిగి ఇచ్చేద్దామని వస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు అంగీకరించాడు. దీంతో చోరీ చేసిన రాంప్రసాద్రెడ్డిని అరెస్ట్ చేశారు. చాకచక్యంగా పట్టుకున్న పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, క్రైం సిబ్బంది ఆంజనేయులు, ప్రసాదరావు, శ్రీనివాసరావును జిల్లా ఎస్పీ అభినందించారు. -
చిన్నారుల సృజనకు పదను..
గురజాల: పల్నాడు విద్యార్థులు కొత్త ఆవిష్కరణకు ప్రాణం పోశారు. వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తరగతి గదుల్లో బట్టిచదువులు స్వస్తి చెప్పి సృజనకు పదను పెడుతున్నారు. అందుకు నిపుణుల సహకారం ఉంటే అద్భుతాలు సృష్టించేందుకు చిన్నారులు సిద్ధమయ్యారు. రహదారి ప్రమాదాలు, దొంగతనాల నివారణ దృష్టి పెట్టారు. సరికొత్త ప్రాజెక్టును ఆవిష్కరించారు.. గురజాలకు చెందిన మట్టపల్లి మన్హితా రియా,కూరపాటి ఆశ్వని కిర్తీ,మేకల సాయి చరణ్, మేకల అరవింద్, బండి ఆశ్మీత. రోబోటిక్ నిపుణులు ఎస్ఆర్ఎంయూ డైరెక్టర్ దాసరి నరేంద్ర కుమార్ సహకారంతో ముందుకు సాగారు. చిన్నారుల లక్ష్యం.. రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఒంటరి వారవుతున్న జీవితాలను చూసి చలించిపోయారు. దీంతో ఆ చిన్నారుల మనస్సులో ప్రమాదాలు నివారించాలనే ఆలోచన తట్టింది. సెన్సార్ టెక్నాలజీతో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. రూపొందించేందుకు నెల రోజుల వ్యవధి కాగా రూ.5వేలు ఖర్చు చేసినట్లు చిన్నారులు చెబుతున్నారు. పనిచేసే విధానం.. వాహనం స్టార్ట్ చేయడానికి ముందుగానే హెల్మెట్ ధరించాలి. వాహనదారుడు వాహనం ఎక్కాగానే హెల్మెట్ ధరించాడా లేదా అని గుర్తు చేస్తుంది. హెల్మెట్లో ఏర్పాటు చేసిన సెన్సార్ వ్యవస్థ బైక్కు అనుసంధానమై ఉంటుంది. హెల్మెట్ ధరించకపోతే వాహనం ముందుకు సాగదు. స్మార్ట్ హెల్మెట్లో మైక్రో కంట్రోలర్, బ్లూటూత్ మాడ్యూల్, ఫ్రెషర్ సెన్సార్, వంటి అత్యాధునిక పరికరాలను ఉపయోగించారు. హెల్మెట్లోని ప్రెషర్ సెన్సార్ హెల్మెట్ ధరించినప్పుడు సిగ్నల్ను బైక్కు వస్తుంది. ఈ సిగ్నల్ వచ్చిన తరువాతనే వాహనం స్టార్ట్ అవుతుంది. ఈ చిన్నారులు ప్రవేశపెట్టిన తీరు ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. యాంటీ ధెప్ట్ అలారం.. స్మార్ట్ హెల్మెట్, బైక్ ధెప్ట్ అలారం పరికరాలు వాహనం యజమానికి సెక్యూరిటీని పెంచే కొత్త మార్గాన్ని అందిస్తున్నాయి. ఈ హెల్మెట్, బైక్ ట్రాకింగ్ సిస్టమ్తో అనుసంధానమై ఉంటుంది. ఎవరైనా బైక్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తే వెంటనే అలారం మోగుతోంది. వాహనం ఎక్కడున్నా తమ బైక్ సురక్షితంగా ఉందా లేదా అని తెలియచేస్తుంది. వాహన చోదకుడికి అలసటగా ఉన్నా.. వాహనం అదుపు తప్పుతున్న వెంటనే సమాచారం ఇస్తుంది. కొంత భాగంలో హెల్మెట్ కూడా డేటా యాక్సెస్ ఇవ్వడం ద్వారా యజమానికి వెంటనే సమాచారం వస్తుంది. ప్రమాదాల నివారణకు వినూత్న ఆలోచన సెన్సార్ టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్ -
కూటమి ప్రభుత్వ మోసాలను గుర్తించిన ప్రజలు
మంగళగిరి: కూటమి ప్రభుత్వం అధికారం కోసం ఎన్నో హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ఆ విషయాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ అన్నారు. జూన్ 4వ తేదీన జరగనున్న వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆత్మకూరు జాతీయ రహదారి వెంట ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మహేష్ మాట్లాడుతూ మభ్య పెట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మడం లేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలనే కాక ఇవ్వని వాటిని కూడా కూడా నెరవేర్చారని, దీనిని ప్రజలు గుర్తించారని చెప్పారు. కూటమి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయం 15 ఎకరాలలో ఉందని, కొత్త ఇంటిని రూ.కోట్లతో నిర్మిస్తున్న చంద్రబాబు ఎన్ని ఎకరాలలో ఇల్ల్లు కడుతున్నారని ప్రశ్నించారు. చేతిలో మీడియా ఉందని దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే రోజులు పోయాయని హితవు పలికారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరకు వచ్చాయి హామీలను నెరవేర్చని కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే వెన్నుపోటు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలంతా వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొని తెలియజేయాలని కోరారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్ర ప్రజలంతా మోసపోయారన్నారు. మంగళగిరి, గుంటూరు తూర్పు, పొన్నూరు, తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి, నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపు -
కూటమి కోత
పేదల పింఛన్లకూ ఏడాది పాలనలో పింఛనుదారులకు అష్టకష్టాలు సాక్షి, నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో అర్హత కలిగిన వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని మేని ఫెస్టోలో పెట్టి ఎన్నికల ప్రచారంలో నేతలు వాగ్దానాలు చేశారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాదైనా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు సర్కార్ పింఛన్ ఇస్తుందని ఆశపడిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేదలను నిండా మోసం చేశారు. బాబు మోసాలపై గత అనుభవాలు తెలిసినా సూపర్–6 పథకాల పేరిట అరచేతిలో వైకుంఠం చూపడంతో ఓటేసిన ప్రజలకు మరోసారి వెన్నుపోటు తప్పలేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్కు అర్హత కల్పించి ఉంటే నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికిగాను ఒక్కొక్కరికి రూ.48 వేల వంతున ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అంది ఉండేది. కూటమి ప్రభుత్వం తీరుతో జిల్లాలో సుమారు 2 లక్షల మందికిపైగా అర్హులు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీన్ని అమలు చేయకపోవడంతో జిల్లాలో అర్హులైన వారు ఏడాదికి సుమారు రూ.960 కోట్ల మేరకు లబ్ధి పొందలేకపోయారు. ఏడాదిలో 11,893 పింఛన్ల కోత కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న వాటికి మంగళం పాడుతోంది. అనర్హుల ఏరివేత పేరిట టీడీపీకి అనుకూలంగా ఓటేయని వారందరినీ లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన సామాజిక పింఛనుదారులకు సైతం నోటీసులు పంపి, అర్హత నిరూపించుకోవాలని చెబుతోంది. లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని రీ వెరిఫికేషన్ పేరిట ఎంపీడీఓలతో నోటీసులు ఇప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా సామాజిక పింఛన్ల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. ఎవరో ఓ టీడీపీ నేత తమ పరిధిలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల లిస్ట్ అందజేస్తే వారందరికీ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. నోటీసు అందుకున్న ఒంటరి మహిళలు కూడా తహసీల్దార్ ద్వారా ధ్రువీకరణ పొంది ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొంటున్నారు. దివ్యాంగులైతే మరోసారి వైద్యుల నుంచి సర్టిఫికెట్ తీసుకొని సమర్పించాలని అడుగుతున్నారు. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా నోటీసులు ఇవ్వడం పట్ల ప్రజలు, ప్రజా సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గతేడాది జూన్ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జూన్కు సంబంధించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంపిక చేసిన 2,82,126 మంది లబ్ధిదారులకే జూలై నెలకు పింఛన్ మంజూరైంది. ప్రస్తుతం ఈ సంఖ్య 2,70,233కు చేరింది. గత ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్య 11,893 తగ్గింది. ప్రభుత్వ చర్యల వల్ల అర్హులైన తమకు పింఛన్లు అందలేదని బాధితులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్కటీ ఇవ్వకపోగా ఉన్న వాటిలోనూ కోత ఆశగా ఎదురుచూస్తున్న లక్షలమంది అర్హులు ఏడాది పాలనలో జిల్లా వ్యాప్తంగా 11,893 మందికి పింఛన్లు రద్దు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీ గాలికొదిలేసిన వైనం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏడాదికి రెండుసార్లు కొత్త పింఛన్లు మంజూరు మరోసారి చంద్రబాబు అబద్ధపు హామీలు నమ్మి మోసపోయిన పేదలు పల్నాడు జిల్లాలో గతేడాది జూలై నుంచి తగ్గుతూ వస్తున్న పింఛన్ల సంఖ్య వివరాలు నా భర్త వృద్ధాప్య పింఛన్ తీసుకునేవారు. అనారోగ్య కారణాల వల్ల మరణించారు. నాకు పింఛన్ ఇవ్వాలని ఎన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. కొత్త పింఛన్లు మంజూరు కాలేదని, ఎవరైనా మరణిస్తే ఇస్తామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. భర్త చనిపోయారని, ఆ స్థానంలోనైనా నాకు ఇవ్వమంటే పట్టించుకునేవారే లేరు. 65 ఏళ్ల వయసులో పింఛన్ వస్తే ఆసరాగా ఉంటుంది. ఇప్పటికే బతుకు భారమైంది. – పెరికల చెన్నమ్మ, మూసాపురం, పెదకూరపాడు మండలం ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదు. అర్హులైన వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. కొత్త పింఛన్ ఒక్కటి కూడా ఇవ్వకపోగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే అక్కసుతో అర్హులైన పేదల పింఛన్లను కూడా తొలగిస్తున్నారు. ఒక్క శావల్యాపురం మండల పరిధిలోనే ఇలా వందల సంఖ్యలో పింఛన్లు అన్యాయంగా తొలగించారు. – బోడేపూడి కొండలు, శావల్యాపురం, వినుకొండ నియోజకవర్గం -
బాలలకు విచ్చలవిడిగా మద్యం సరఫరా
నరసరావుపేట టౌన్: ఉజ్వలంగా వెలగాల్సిన విద్యార్థుల జీవితాలు కూటమి ప్రభుత్వ ధనదాహం, అధికారుల మామూళ్ల మత్తులో చిత్తవుతున్నాయి. వైన్ షాపు నిర్వాహకులు కక్కుర్తితో టీనేజ్ కూడా దాటని పిల్లలతో బహిరంగంగా మద్యం తాగిస్తున్నారు. పర్మిట్ రూములకు అనుమతులు లేకపోయినా.. ఏకంగా కుర్చీలు, బల్లలు వేసి పిల్లలకు మద్యం సరఫరా చేస్తూ వారి జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నారు. జీవితాలతో చెలగాటం.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానాన్ని ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి తీసుకెళ్లింది. వారికి టార్గెట్లు ఇచ్చి మరీ మద్యం అమ్మకాలకు తెరతీసింది. ఈ క్రమంలో వైన్స్ నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు మద్యం విక్రయాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అనుమతులు లేకుండానే పర్మిట్ రూములు ఏర్పాటు చేస్తున్నారు. వేళాపాళా లేకుండా మద్యం విక్రయిస్తున్నారు. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఆదాయమే పరమావధి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాలను సర్కారే నిర్వహించేది. ఆ క్రమంలో ప్రజలను మద్యానికి దూరం చేసేందుకు ప్రయత్నం చేసింది. తద్వారా యువత మద్యం జోలికి వెళ్లకుండా కట్టడి చేయగలిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చివరకు మైనర్లకు కూడా మద్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. నరసరావుపేట రావిపాడు రోడ్డులోని ఓ వైన్ షాపులో అనుమతులు లేకుండానే పర్మిట్ రూము ఏర్పాటు చేశారు. ఇక్కడ 18 ఏళ్లు కూడా నిండని బాలలు మద్యం తాగుతూ కనిపించారు. మైనర్లకు మద్యం విక్రయించరాదనే నిబంధనలను నిర్వాహకులు తుంగలో తొక్కారు. వీటిపై ఎకై ్సజ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు యథేచ్ఛగా పర్మిట్ రూముల ఏర్పాటు మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్న వైనం మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ అధికారులు కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు -
సేవల్లో ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’
తెనాలి: పవిత్రమైన వైద్యవృత్తిలో నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే వృత్తిజీవితంలో సంతృప్తినే కాదు... ఏకంగా రాష్ట్ర, జాతీయ అవార్డులు కూడా వరిస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా శుక్రవారం జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును స్వీకరించిన వలివేటి శుభావతి ఇందుకు చక్కని నిదర్శనం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ అవార్డును అందుకున్న ఏకై క మహిళ కూడా శుభావతినే. ఏఎన్ఎం విధుల్లో వైద్యవృత్తి ప్రాధాన్యతను గుర్తెరిగి, అంకితభావంతో నిర్వహిస్తూనే ఉన్నత కోర్సులు చేస్తూ, వరుస పదోన్నతులతో మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్ హోదాకు ఎదిగారు. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డునే దక్కించుకున్నారు. తెనాలి రూరల్ మండల గ్రామం సంగంజాగర్లమూడి శుభావతి స్వస్థలం. తల్లిదండ్రులు సీతారావమ్మ, సుబ్రహ్మణ్యం. తొలుత ఉమ్మడి గుంటూరు జిల్లా నాదెండ్ల పీహెచ్సీ పరిధిలోని చందవరం సబ్ సెంటర్లో ఏఎన్ఎంగా శుభావతి వృత్తిజీవితం ఆరంభమైంది. ఉద్యోగ బాధ్యతల్లో ఉంటూనే పీజీ కోర్సులు చేస్తూ వచ్చారు. 13 ఏళ్ల సర్వీసులో మూడు పీజీలు చేశారు. ఫలితంగా పదోన్నతిపై ఇదే జిల్లాలోని నకిరేకల్లో హెల్త్ ఎడ్యుకేటర్గా నియమితులయ్యారు. అక్కడ 12 ఏళ్లపాటు పనిచేశారు. కర్నూలులోని రీజినల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ (మేల్)కు మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ గత జనవరిలో ఉద్యోగ విరమణ చేశారు. పేద రోగులకు సేవలు వైద్యరంగంలో తన 39 ఏళ్ల సర్వీసులో శుభావతి పేద ప్రజలు, అవసరమైన వారికి తగిన సేవలను అందిస్తూ వచ్చారు. తన సమర్థత, నిబద్ధతను గుర్తించిన ఉన్నతాధికారులు అప్పగించిన అన్ని బాధ్యతలను ఆమె సక్రమంగా నిర్వర్తించారు. అనేక అవార్డులను అందుకున్నారు. నకిరేకల్లో ఉండగా, హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రాజెక్టుపై శుభావతిని నాటి జిల్లా కలెక్టర్ ప్రత్యేక శిక్షణకని ఢిల్లీ పంపారు. అదే ప్రాజెక్టుపై జిల్లాలోని ఆర్ఎంపీ/పీఎంపీలతో సహా ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని డిపార్టుమెంటు ఉద్యోగులకు శుభావతి అవగాహన కల్పించారు. ఆ కృషికి గుర్తింపుగానే అప్పటి రాష్ట్రమంత్రి కొణిజేటి రోశయ్య నుంచి అవార్డును అందుకున్నానని శుభావతి చెప్పారు. ఎక్కడ పనిచేసినా తోటి సిబ్బంది, ప్రజలు ఎంతో ప్రేమను చూపటం తనకు గుర్తుండి పోతుందని పేర్కొన్నారు. ‘ఎంతో కష్టపడి పనిచేశాను. అందరి మన్ననలు పొందాను. డబ్బు కోసం ఆశపడలేదు. స్వచ్ఛందంగా బాధ్యతలను నిర్వర్తించాను. జాతీయ అవార్డు లభించిందంటే వృత్తి జీవితం మొత్తానికి అందిన గౌరవంగా భావిస్తున్నాను’ అని శుభావతి చెప్పారు. రాష్ట్రపతి చేతులమీదుగా జాతీయస్థాయి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్న వలివేటి శుభావతి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పురస్కారం పొందిన ఏకై క మహిళఎన్నో అవార్డులు.. రివార్డులు ఆకాశవాణి, విజయవాడ కేంద్రం ఆహ్వానంపై బాల్య వివాహాలు, మాతాశిశు మరణాలు, బాలికా శిశు సంరక్షణ వంటి కార్యక్రమాలపై శుభావతి ప్రత్యేక ప్రసంగాలు చేశారు. గుంటూరు జిల్లాలో బాల్య వివాహాల నిరోధంపై రిసోర్స్ పర్సన్గానూ వ్యవహరించారు. దీనిపై పలు పాటలు రాసి, స్వయంగా గానం చేశారు. అప్పట్లో నెల్లూరు కలెక్టర్ల నుంచి అవార్డులను అందుకున్నారు. 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కలెక్టర్ సూచనపై ఓటరు అవగాహనపై పాట రాశారు. చైన్నెలో సినీ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్తో స్వరకల్పన చేయించారు. ఈ సందర్భంగా నాటి కలెక్టర్ రేఖారాణి ప్రశంసాపత్రం అందించారు. రక్తహీనతపై అవగాహన కోసం పాట రాశారు. శ్రీకాకుళంలో కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ చేసిన సేవలకుగాను అవార్డులు దక్కాయి. గత ప్రభుత్వ హయాంలో శానిటేషన్, న్యూట్రిషన్పై శుభావతి రాసిన పాట పేరు పొందింది. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లోనూ ఏఎన్ఎంల పుస్తకంలో తొలి పేజీలోనే ఆ పాటను ముద్రింపజేశారు. ఏపీ కల్చరల్ అవేర్నెస్ రాష్ట్రస్థాయి ఉత్తమ పౌరురాలి అవార్డు, శ్రీకాకుళంలో ఆంధ్రరత్న అవార్డు వంటివెన్నో తనకు అలంకారాలుగా మారాయి. భర్త ప్రైవేటు ఉద్యోగి, కుమారుడు హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో పని చేస్తున్నారు. రిటైరయ్యాక గుంటూరులోనే ఆమె స్థిరపడ్డారు. -
అక్రమాలకు పాల్పడితేక్రిమినల్ కేసులు
నరసరావుపేట టౌన్: చౌక దుకాణ డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పల్నాడు జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్. నారదముని శుక్రవారం హెచ్చరించారు. జూన్ 1వ తేదీ నుంచి చౌక దుకాణాల వద్ద కార్డుదారులకు నిత్యావసరాల సరకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8–మధ్యాహ్నం 12, సాయంత్రం 4 – రాత్రి 8 గంటల వరకు చౌక దుకాణాలు తెరిచి ఉంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పరమైన స్టాక్ బోర్డ్, కార్డుదారులకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరకుల వివరాలను డీలర్ అందుబాటులో ఉంచాలన్నారు. చౌక దుకాణ పరిధిలోని వృద్ధులు, దివ్యాంగులకు ఆయా డీలర్లు ఇంటి వద్దకే వెళ్లి సరకులు అందించాలని పేర్కొన్నారు. నియమ నిబంధనలు, నిర్దేశించిన సమయాలను తప్పక పాటించాలన్నారు. పంపిణీ సమయంలో సంబంధిత సీఎస్డీటీ ఆయా చౌక దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ను పరిశీలిస్తారన్నారు. అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.జవహర్ నవోదయ కోసం స్థల పరిశీలనబల్లికురవ: కేంద్ర ప్రభుత్వం అద్దంకి నియోజకవర్గానికి జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి రెవెన్యూ అధికారులు శుక్రవారం అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. విద్యాలయం ఏర్పాటుకు 25 ఎకరాల భూమి కావాల్సి ఉంది. బల్లికురవ తహసీల్దార్ రవినాయక్ వల్లాపల్లి గ్రామంలోని పేరంటాళ్ల తల్లి ఆలయం సమీపంలో, గుంటుపల్లి గ్రామంలోని సచివాలయం సమీపంలో భూములను పరిశీలించారు. జిల్లా అధికారులకు నివేదించనున్నట్లు తహసీల్దార్ వివరించారు.కోన నీరజకు టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డుబాపట్ల: సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా, దర్శకురాలుగా పనిచేస్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కుమార్తె కోన నీరజకి ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకమైన టైమ్స్ పవర్ ఉమెన్ అవార్డు దక్కింది. ఈ మేరకు గురువారం హైదరాబాదులో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ఆమె అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో వెలుగొందడంతో పాటు పుస్తక రచయితగా, దర్శకురాలుగా ఆమె శక్తివంతమైన మహిళగా రూపుదిద్దుకుంటున్నారని ది టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ కొనియాడింది. ఈ సందర్భంగా కోన రఘుపతి తన కుమార్తెకు శుభాకాంక్షలు తెలియజేశారు. నీరజ అవార్డు అందుకోవడం బాపట్ల ప్రాంతానికి ఎంతో గర్వకారణమన్నారు.యోగాతో సంపూర్ణ ఆరోగ్యంఏఎన్యూ: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. యోగాంధ్రలో భాగంగా శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు, సిబ్బంది, పరిశోధకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వర్సిటీ యోగా సెంటర్లో సాధన చేశారు. యోగా ఆవశ్యకతను వీసీ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, ప్రిన్సిపాల్స్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్, ఆచార్య పి.సిద్దయ్య, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య వి. వెంకటేశ్వర్లు, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య ఎన్వీ కృష్ణారావు, బాలుర వసతి గృహాల చీఫ్ వార్డెన్ ఆచార్య కె.మల్లికార్జున, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య దివ్యతేజోమూర్తి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.నేటి నుంచి రైల్వే గేటు మూసివేతఫిరంగిపురం: ఫిరంగిపురం – సత్తెనపల్లి మార్గంలోని అల్లంవారిపాలెం వద్ద ఉన్న రైల్వేగేటు ఎల్సీ 298కి శనివారం నుంచి అత్యవసర మరమ్మతులు నిర్వహించనున్నట్లు రైల్వే శాఖ నల్లపాడు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పి. ఉమామహేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం నుంచి జూన్ 3వ తేదీ వరకు గేటు మూసి వేస్తామన్నారు. ప్రత్యామ్నాయంగా ఆరోగ్యనగర్ వద్ద ఉన్న అండర్ పాస్ను వాహన దారులు వినియోగించుకోవాలన్నారు. -
ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు
శావల్యాపురం: ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ సిద్దా రామలింగామూర్తి అన్నారు. గురువారం మండలంలోని బొందిలిపాలెం, వేల్పూరు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు పనులు చేస్తున్న ప్రదేశాల్లో మాత్రమే మస్టర్ నమోదు చేయాలన్నారు. గోకులం షెడ్లు బిల్లులు ఈనెలాఖరులోగా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు ఎంపీడీవో పేరుమీనా సీతారామయ్య, ఏపీవో కె.రామారావు, ఫీల్డ్ అసిస్టెంట్లు చల్లగుండ్ల రాజా, మారుతీ తదితరులు ఉన్నారు. డ్వామా పీడీ సిద్దా రామలింగమూర్తి -
తప్పిపోయిన చిన్నారి
మంగళగిరి టౌన్ ః ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయిన ఓ చిన్నారిని కేవలం గంట వ్యవధిలోనే తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన మంగళగిరిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి అజయ్నగర్కు చెందిన తేజస్విని అనే పాప ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏడుస్తూ కనిపించింది. అదే సమయంలో విధుల్లో ఉన్న సీఐ వినోద్ కుమార్ కంటపడింది. వెంటనే చిన్నారి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అజయ్నగర్ అని, తండ్రి పేరు విజయ్ అని చెప్పడంతో ఆ చిన్నారిని తీసుకుని అజయ్నగర్లోని పాప నివాసానికి వెళ్లి తేజస్విని తండ్రికి అప్పగించారు. తప్పిపోయిన చిన్నారి సురక్షితంగా ఇంటికి రావడంతో సిఐ వినోద్కుమార్కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. గంట వ్యవధిలో తల్లిదండ్రులకు అప్పగింత -
బిల్లుల్లోనూ పచ్చపాతం
నెహ్రూనగర్: జనవరి 10వ తేదీన గుంటూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఆయన పర్యటించే ప్రాంతం ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి చేబ్రోలు హనుమయ్య కంపెనీ వరకు రోడ్లు అందంగా కనిపించేందుకు షో మొక్కలు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి రూ.35 లక్షలు వెచ్చించి తెప్పించారు. ఎన్ని తెప్పించారో.. ఎన్ని ఉన్నాయో నేటికీ నగరపాలక సంస్థ అధికారుల వద్ద లెక్క లేదు. అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మొక్కలు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. కొన్ని మొక్కలు ఎండిపోయాయి. దీనిపై సాక్షిలో ఏప్రిల్ 13వ తేదీన ‘ఎండిన మొక్కలు..తేలని లెక్కలు’ పేరిట కథనం ప్రచురితమైంది. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం వైరల్గా మారింది. దీంతో ఎక్కడ ఈ బిల్లు ఆపితే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో అని అప్పుడు ఏడీహెచ్గా పనిచేసిన శ్రీనివాస్ను సరెండర్ చేసి మరీ సదరు బిల్లు రూ.35 లక్షలు ప్రాసెస్ చేసినట్లు సమాచారం. ఖర్చుల బిల్లు వస్తే ఒట్టు 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్షన్ రోజు పోలింగ్, తర్వాత కౌంటింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, బ్యారికేడింగ్, డిపార్ట్మెంట్ సిబ్బందికి సంబంధించిన భోజనాలు, టీ, కాఫీలు, స్నాక్స్, ఇతర స్టేషనరీ వంటి పనులు కాంట్రాక్టర్లు సుమారు 1.50 కోట్ల వర్కులు ఇంజినీరింగ్ అధికారుల హాహీతో చేపట్టారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ బిల్లులను అధికారులు ప్రాసెస్ చేయకుండా పక్కన పెట్టారని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. వడ్డీలకు తీసుకొచ్చి... కొంతమంది కాంట్రాక్టర్లు బ్యాంకుల్లో స్థలాలు, ఇళ్లు తనాఖాలు పెట్టి పనులు చేశారు. ఆ వర్కులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి వడ్డీ పడుతోంది. మరికొంత మంది కాంట్రాక్టర్లు బయట వ్యక్తుల వద్ద నుంచి వడ్డీ కట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వలన తాము అప్పుల్లో కూరుకుపోతున్నామని బహిరంగంగానే వాపోతున్నారు. ఏదో విధంగా బిల్లు ప్రాసెస్ చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను వేడుకుంటున్నారు. సిఫార్సులు.. పర్సంటేజీలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత సర్కారు హయాంలో చేసిన వర్కుల బిల్లులు ప్రాసెస్ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చేసిన వర్కులకు మాత్రమే బిల్లులు ప్రాసెస్ అవుతున్నట్లు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఎవరైపా వడ్డీలు కట్టుకోలేక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎంతకొంత ముట్టజెప్పి సిఫార్సు చేయించుకుంటున్నారు. ఇక్కడ నగరపాలక సంస్థ అధికారులు కూడా పర్సంటేజీ ఇస్తేనే బిల్లు ప్రాసెస్ చేస్తామని చెబుతున్నారు. చేసేదేమీ లేక అధికారులు అడిగినంత ఇచ్చుకుని ప్రాసెస్ చేయించుకుంటున్నారు కాంట్రాక్టర్లు. బిల్లుల ప్రాసెసింగ్లో మున్సిపల్ అధికారుల తీరిది తమ అనుకునే వారికి మాత్రమే అత్యధిక ప్రాధాన్యత అవసరం లేదనుకున్న వారికై తే నెలల తరబడి పెండింగ్ ఇటీవల సీఎం పర్యటనకు రూ.35 లక్షల విలువైన మొక్కలు ఎక్కడున్నాయో.. ఏమైపోయాయో కూడా తెలియని దుస్థితి రూ.35 లక్షల బిల్లు ఆగమేఘాలపై ప్రాసెస్ పూర్తి ఇంకా పెండింగ్లోనే ఏడాది క్రితం ఎన్నికల ఖర్చు బిల్లులు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. తమ అనుకునే కాంట్రాక్టర్ల బిల్లు ప్రాసెస్ చేయడంలో చూపుతున్న ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. మిగతా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో మొండి చేయి చూపుతున్నారనేది జగమెరిగిన సత్యం. గత ప్రభుత్వంలో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లలో కొంత మందికి బిల్లులు చెల్లింపులు జరపకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులకు పర్సంటేజ్ రూపంలో ముడుపులు సమర్పించుకుంటే ఎప్పటి బిల్లు అయినా ప్రాసెస్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే చెల్లింపులు ఎవరైనా కాంట్రాక్టర్ అత్యవసరం అని అడిగితే సదరు బిల్లుల చెల్లింపులు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రాసెస్ చేస్తున్నాం. – నమ్రత్కుమార్, అకౌంటెంట్ -
ఉచిత మోడల్ లాసెట్ పోస్టర్ ఆవిష్కరణ
నగరంపాలెం: లాసెట్ అభ్యర్థులకు ఉచిత మోడల్ లాసెట్ ఎంతగానో ఉపయోగకరమని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రొసిక్యూషన్ ఎండీ.బర్కత్ అలీ అన్నారు. ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఉచిత మోడల్ లాసెట్ పోస్టర్ను గురువారం నగరంపాలెంలోని ఆయన కార్యాలయంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసెక్యూటర్స్ పల్లపు కృష్ణ, బి.కోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, స్పాట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి ఎ.శేషగిరిరావులు ఆవిష్కరించారు. శేషగిరిరావు మాట్లాడుతూ ఈ పరీక్షను జూన్ ఒకటిన గుంటూరు శ్యామలానగర్ ఒకటో వీధిలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహిస్తామని అన్నారు. ఉదయం పది గంటలకు పరీక్ష మొదలువుతుందని, మరిన్ని వివరాలకు 8297483785 నంబర్కు సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కొండవీటి శ్రీనివాసరావు, కె.వీరభాస్కర్, న్యాయవాదులు కె.నారాయణ చిన్న, జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. హత్య కేసులో రిమాండ్ బల్లికురవ: మండలంలోని కొమ్మినేనివారి పాలెంలో గత ఏడాది అక్టోబర్ 4న జరిగిన హత్య కేసులో నిందితుడు పి. నారాయణ రెడ్డికి అద్దంకి కోర్టు న్యాయమూర్తి బుధవారం 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై వై. నాగరాజు తెలిపారు. -
జీఎస్టీతో వేగంగా ఆర్థికాభివృద్ధి
లక్ష్మీపురం: వస్తు సేవల పన్నుతో దేశం వేగంగా ఆర్థికంగా ముందుకు వెళుతుందని, పన్ను వ్యవస్థ పూర్తిగా చక్కబడిందని సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ అన్నారు. గురువారం గుంటూరు కన్నవారితోటలోని జీఎస్టీ భవన్లో ప్రీ జీఎస్టీ డే వేడుక నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ జీఎస్టీతో పన్నులను అంగీకరించే సమాజం ఏర్పడిందన్నారు. పన్ను చట్టాల్లో పారదర్శకత పెరగటమే కాకుండా, పన్ను అధికారులకు, పన్ను చెల్లింపుదారుల మధ్య స్నేహభావం ఏర్పడిందన్నారు. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం, పన్ను చెల్లింపులు పెంచడం వంటి అంశాలలో జీఎస్టీ ప్రాధాన్యతను వివరించారు. జీఎస్టీ విజయవంతంగా అమలు కావడంలో పరిశ్రమ భాగస్వాముల సహకారాన్ని అభినందించారు. జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ ప్రయాణాన్ని గుర్తుచేసే ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఈ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరావు మాట్లాడుతూ జీఎస్టీ ప్రారంభంలో తెలియక చాలా మంది వ్యాపారులు తమ రిటన్స్లో తప్పుడు వివరాలు నమోదు చేశారని, ప్రస్తుతం జీఎస్టీ ఆడిట్లో అవన్నీ పట్టుబడుతున్నాయన్నారు. అవి కావాలని చేసిన తప్పులు కావన్నారు. నేషనల్ కనూ్స్య్మర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు చదలవాడ హరిబాబు మాట్లాడుతూ ప్రాణ రక్షణ కోసం వాడే మందులపై జీఎస్టీని తక్షణమే తీసివేయాలన్నారు. చేనేత మగ్గాలపై విధించే ఐదు శాతం పన్నును కూడా రద్దు చేయాలన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు యేల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీఎస్టీపై వ్యాపారుల ఇబ్బందులను ప్రతి మూడు నెలలకొకసారి సమీక్ష చేయాలన్నారు. ఇండియన్ టెక్స్టైల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ రేట్లలో రెండు స్లాబులే ఉండాలని సూచించారు. పలువురు పరిశ్రమ ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలిపారు. కమిషనర్ సుజిత్ మల్లిక్ను ట్రేడ్ వర్గాలు సన్మానించాయి. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవికుమార్, వి.వెంకటేశ్వరరావు, మనోజ్కుమార్, మరియదాసు, రాయలు, ఆనందరావు, చాంబర్ మాజీ అధ్యక్షుడు ఎ.ఆంజనేయులు పాల్గొన్నారు. సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ -
పవిత్ర పూజాక్షేత్రంగా ఓంకారాశ్రమం
తెనాలి: ఆంధ్యా ప్యారిస్ తెనాలిలోని బుర్రిపాలెంరోడ్డులో తొమ్మిది దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఓంకారాశ్రమం ఇప్పుడు పవిత్ర పూజాక్షేత్రంగా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. రూ.కోట్ల విలువైన ఆస్తులున్నా స్వార్థపరుల కారణంగా కునారిల్లుతూ వచ్చిన ఆశ్రమమిది. ఆశ్రమ స్థలాన్ని పవిత్ర సందర్శనీయ స్థలంగా చేయాలని గత ప్రభుత్వ హయాంలో దేవదాయశాఖ సంకల్పించింది. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఫలితంగానే ఇప్పుడు ఆశ్రమ స్థలంలో పరివార దేవతా, శిఖర, ధ్వజస్తంభ, శ్రీశరభ సాళ్వేశ్వరస్వామి, శ్రీపార్వతీ సమేత శ్రీఓంకారేశ్వరస్వామి వార్ల ఆలయం నిర్మించారు. ప్రతిష్టా మహోత్సవాలు గురువారం నుంచి ఆరంభించారు. తెనాలి బుర్రిపాలెంరోడ్డులోని ఓంకారాశ్రమం 1932లో ఏర్పాటైంది. కాకుమాను శ్రీరాములు అనే ఆధ్యాత్మిక చింతనాపరుడు ఆశ్రమాన్ని స్థాపించారు. సాధువులు ధ్యానం చేసుకునేందుకు, వారి పోషణ కోసమనే భావనతో ఏర్పాటైన ఆశ్రమానికి అప్పట్లో శ్రీవ్యాస ఆశ్రమ నిర్వాహకుడు మలయాళస్వామి శంకుస్థాపన చేశారు. ఆశ్రమం తరపున పేదలకు వైద్యం, విద్యార్థులకు విద్య కోసమని దాతలు 12.83 ఎకరాల మాగాణి భూమిని సమకూర్చారు. దాతల లక్ష్యం నిర్విఘ్నంగా నెరవేరింది. యజ్ఞయాగాది క్రతువులు వైభవంగా జరిగాయి. అప్పట్లో ఆశ్రమానికి స్వామీజీలు ట్రస్టీలుగా ఉండేవారు. 1947–1963 మధ్య ఆశ్రమానికి గల మాగాణి భూమిని విక్రయించారు. ఆ డబ్బుతో గంగానమ్మపేటలో ఉన్న శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలో రెండు ఇళ్లు, చెంచుపేటలోని గోడౌన్ కొనుగోలు చేశారు. ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మలయాళస్వామి మరణంతో ఆశ్రమ ట్రస్టీల వ్యవహారంలో వివాదాలు మొదలయ్యాయి. 1980 వరకు పరంపరగా సాగాయి. అనంతరం ట్రస్టీలు ఏర్పాటైనా 1996లో ఆశ్రమ నిర్వహణ దేవదాయ, ధర్మదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. అప్పట్నుంచి అభివృద్ధి శూన్యమైంది. పైగా 1983లో ఆశ్రమంలో గల ధ్యానమందిరాన్ని కూల్చారు. 1998లో ఆశ్రమ స్థలంలోని 80 సెంట్ల స్థలాన్ని ఓ ప్రైవేటు విద్యాసంస్థకు లీజుకిచ్చారు. కోర్టు వివాదంతో ప్రైవేటు విద్యాసంస్థకు లీజు ఆగిపోయింది. లాడ్జికి అద్దెకు ఇచ్చిన భవనం శ్రీవేణుగోపాలస్వామి గుడి వీధిలోని భవనాన్ని గతంలో కొంతకాలం లాడ్జికి అద్దెకిచ్చారు. కొన్ని నెలలు రిక్రియేషన్ క్లబ్ కూడా నడిచింది. దేవదాయశాఖ చర్యలతో ఏడాదికి రూ.5.23 లక్షల వరకు ఆదాయం సమకూరుతోంది. ఆశ్రమానికి 2022లో అవుతు శ్రీనివాసరెడ్డి ఈవోగా వచ్చారు. వేలం ఆదాయం పెరిగేలా చూశారు. అప్పట్నుంచి ఏడాదికి రూ.7 లక్షలకు పైగా ఆదాయం లభిస్తోంది. నిరుపయోగంగా ఉన్న ఆశ్రమ స్థలాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు చేసిన కృషి ఫలించింది. 1.40 ఎకరాల ఆశ్రమం స్థలం ముందుభాగంలో ఆలయం నిర్మాణానికి 2023 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. దేవదాయశాఖ రూ.26.66 లక్షలు, ఆశ్రమ నిధులు రూ.13.34 లక్షలు, దాతల సహకారంతో నిర్మాణం పూర్తయింది. రేపు ప్రతిష్టా మహోత్సవం ఈనెల 31వ తేదీన ఉదయం 8.19 గంటలకు ప్రతిష్టా మహోత్సవం జరగనుంది. గురువారం వేదస్వస్తి పూర్వకంగా యాగశాల ప్రవేశం చేసి, సంప్రదాయ పూజలను ఆరంభించారు. రెండురోజుల పూజల అనంతరం 31న యంత్రబింబ, ధ్వజ ప్రతిష్టలు, కళాన్యాసము, ప్రాణప్రతిష్ట జరుగుతాయి. ప్రతిష్టా కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, దేవదాయశాఖ డీసీ కె.బసవ శ్రీనివాసరావు పాల్గొంటారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆశ్రమంలో ఓంకారేశ్వరస్వామి ఆలయం ఆరంభమైన ప్రతిష్టా మహోత్సవాలు -
రైతులకు వరుస కష్టాలు
కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే అన్నదాతలకు చుక్కలు చూపించింది. విత్తనాలు అందక, సకాలంలో ఎరువులు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరి విత్తనాల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షంలోనే అన్నదాతలను క్యూలైన్లో నిలబెట్టి వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఎరువుల సరఫరా నామమాత్రంగా సాగింది. కృత్రిమ కొరత కారణంగా అధిక ధర చెల్లించాల్సి రావడం రైతులకు భారంగా మారింది.నరసరావుపేట రూరల్: నాణ్యమైన విత్తనాల నుంచి ఎరువులను రైతులకు సకాలంలో అందించే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. వీటిని నిర్వహిస్తే జగన్కు పేరు వస్తుందని ఆర్బీకేలను నిర్లక్ష్యం చేసిన కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేసింది. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలన కొనసాగింది. వ్యవసాయ రంగంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో ఆర్బీకేలు ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులతో పాటు విత్తనాలు అందజేశారు. ఐదేళ్ల పాటు జిల్లాలో ఎక్కడా ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ శాఖ పనిచేసింది.విత్తనాల కోసం రోడ్డెక్కిన రైతులుకూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఎన్నికల ముందు అలివి కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సరఫరాలో పూర్తిగా విఫలమయింది. గత ఏడాది ఖరీఫ్లో సకాలంలో వర్షాలు కురవడంతో నాగార్జునసాగర్ జలశాయం నీటితో పూర్తిగా నిండింది. అదునులో వర్షాలు రావడంతో రైతులు వరి సాగుపై దృష్టిసారించారు. వరి విత్తనాలు సరఫరాపై ప్రభుత్వం ముందస్తుగా సిద్ధంగా లేకపోవడంతో కొరత ఏర్పడింది. ప్రధానంగా జేజీఎల్–384 రకం విత్తనాలు కోసం రైతుల నుంచి డిమాండ్ అధికంగా వచ్చింది. ఈ రకం విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఒక దశలో ప్రభుత్వ అధికారులు రైతులను క్యూలలో నిలబెట్టి విత్తనాలు పంపిణీ చేయాల్సి వచ్చింది. భారీ వర్షంలో క్యూలలో నిలబడి రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితిని మొదటి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అన్నదాతలకు చూపించింది.ఎరువుల కొరతవర్షాలు రావడం భూమి పదునెక్కడంతో వరి, పత్తి, మిరప పంటలను రైతులు గత ఏడాది సకాలంలో ప్రారంభించారు. విత్తనాలు కోసం అగచాట్లు పడిన రైతులకు ఎరువులను కూడా ప్రభుత్వం సకాలంలో అందించలేకపోయింది. పంటలు సాగు దశలో ఉన్న అక్టోబర్ నెలలో ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు ఎరువులు కొనుగోలు చేశారు. యూరియా, డీఏపీ బస్తాకు రూ.100 చొప్పున అధిక రేటుకు వ్యాపారులు విక్రయించారు. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేసిన ఎరువులను టీడీపీ నాయకులు ఇళ్లలో ఉంచి తమ సొంత క్యాడర్కు సరఫరా చేసుకున్నారు. జిల్లాకు 3,42,735 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే గత ఏడాది అక్టోబర్ నెల వరకు జిల్లాకు కేవలం 1,32,119 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే కంపెనీలు సరఫరా చేసాయి.అన్నదాతలకు అండగా వైఎస్సార్సీపీఅన్నదాతల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ డిసెంబర్ 13న వైఎస్సార్సీపీ పోరుబాటను నిర్వహించింది. జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు పోరుబాటలో పాల్గొని రైతుల పడుతున్న ఇబ్బందులపై జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమయిందని వైఎస్సార్సీపీ నాయకులు నిలదీశారు. పత్తి, మిరప పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. -
అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ ఈ నెల 29 నుంచి జూన్ 5వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి గురువారం తెలిపారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచ్ ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ఈ బెంచ్ ద్వారా సివిల్ కేసులు (పార్టిషన్ సూట్స్, మనీ మేటర్స్, పర్మినెంట్ ఇంజక్షన్ సూట్స్, స్పెసిఫిక్ పెర్ఫార్మన్స్), రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం కొన్ని రాజీ పడదగ్గ ఎకై ్సజ్ కేసులు, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఎల్ఏఓపీ కేసులు, ప్రీ–లిటిగేషన్ కేసులు పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు, పోలీస్, స్టేక్ హోల్డర్లు ఎక్కువ కేసులు పరిష్కరించేలా సహకరించాలని సూచించారు. తిరుపతమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళం పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సుంకర శ్రీనివాసరావు, మాధురి దంపతులు రూ.50,116, సుంకర చెంచయ్య, బాయమ్మల స్మారకార్థం గోశాలలో గోవుల సంరక్షణకు రూ.50,116 ఏఈవో తిరుమలేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. దాతలను ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు ఎం.గోపిబాబు, తదితరులు పాల్గొన్నారు. 33 వాహనాలపై కేసులు నరసరావుపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ, పోలీసు, రవాణా శాఖ అధికారులు గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. పట్టణం నుంచి రావిపాడు, వినుకొండ, గుంటూరుకు వెళ్లే రోడ్లలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న 33 ఆటోరిక్షా వాహనాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేశారు. వాటిలో ఏడింటిని సీజ్ చేశారు. సుమారు రూ.2.20 లక్షల అపరాధ రుసుం విధించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ బి.శ్రీనివాసరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్.శివనాగేశ్వరరావు, ఎస్ఐ కిషోర్ తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీలు కొనసాగుతాయన్నారు. నిలిచిన వర్షపు నీరు మంగళగిరి టౌన్: మంగళగిరిలో గురువారం అకాల వర్షం కురిసింది. నగరంలోని వీధులు జలమయమయ్యాయి. దేవస్థానం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్చ్ వద్ద ర్యాంప్ వేయడంతో వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్డు కంటే ర్యాంప్ ఎత్తుగా ఉండడంతో వర్షపు నీరు కాలువలోకి వెళ్లకపోవడంతో అక్కడే ఆగింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీటితో పాటు మురుగునీరు కూడా సమీపంలోని దుకాణాల్లోకి చేరడంతో అవస్థలు తప్పలేదు. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సినిమా థియేటర్లలో తనిఖీ చీరాల: సినిమా థియేటర్లలో ఆర్డీఓ టి.చంద్రశేఖర్ నాయుడు గురువారం రాత్రి తహసీల్దార్ కె.గోపీకృష్ణతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులును పరిశీలించారు. ఆహార పదార్థాల రేట్లను తెలుసుకున్నారు. థియేటర్లకు అనుమతులు, ఫుడ్కు ఎక్కువ ధర వసూలు, నిర్ణీత పరిమాణంలో ఉన్నాయా?, టికెట్ల ధరలు, టాయిలెట్స్ నిర్వహణ తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు థియేటర్లలో పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. -
అధైర్య పడొద్దు .. అండగా ఉంటాం
సత్తెనపల్లి: ‘‘ మీరేమీ ఇబ్బంది పడవద్దు, భయపడ వద్దు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు అండగా ఉన్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం..’’ అంటూ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి విడుదల రజిని, నరసరావుపేట మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామంలో వారు గురువారం పర్యటించారు. ఏడాది క్రితం టీడీపీ, జనసేన నేతల దాడులు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ళ ఉపసర్పంచ్, వైఎస్సార్ సీపీ క్రీయాశీలక నాయకుడు కొర్లకుంట శివ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యాన్ని కలిగించారు. మృతుడు తండ్రి, పాకాలపాడు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కొర్లకుంట వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జూన్ 3న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ళ గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పారు. కొర్లకుంట శివనాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి, నివాళులర్పిస్తారన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని పేర్కొన్నారు.ఈ క్రమంలో రూట్ మ్యాప్ను పరిశీలించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణ్ రెడ్డి, డీఆర్యూసీసీ మెంబర్ చల్లంచర్ల సాంబశివరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగుర్ మీరాన్, సత్తెనపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, ఎంజే ఎం రామలింగారెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, ఇందూరి నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి(సత్తెనపల్లి టౌన్), వేపూరి శ్రీనివాసరావు (రాజుపాలెం), భవనం రాఘవరెడ్డి (నకరికల్లు), నక్కా శ్రీను(ముప్పాళ్ళ), వైఎస్సార్ సీపీ నాయకులు బండి కోటినాగిరెడ్డి, ఏకుల మత్తయ్య, పల్లె గాబ్రియేలు, కోట ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి, నేతల బృందం రెంటపాళ్ళ ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ జూన్ 3న రెంటపాళ్ళకు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో రూట్మ్యాప్ పరిశీలన -
తోడికోడళ్ల మృతితో తెనాలిలో విషాదం
తెనాలి రూరల్: అరుణాచలేశ్వరుని దర్శనం కోసం బయలుదేరిన తోడికోడళ్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తెనాలిలో విషాదం అలుముకుంది. ఎంతో ఆప్యాయంగా ఉండే తోడికోడళ్ల బంధం మరణంలోనూ వీడలేదు. పట్టణానికి చెందిన కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, కన్నెగంటి ఝాన్సీరాణిలు తోడికోడళ్లు. ఝాన్సీరాణి కుమారుడు నాగార్జున, ఆడపడుచు పార్వతితో కలిసి వీరు ముగ్గురు గురువారం అరుణాచలానికి కారులో పయనమయ్యారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఝాన్సీరాణి అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన నలుగురిని ఒంగోలు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సూర్యకుమారి, సరస్వతికుమారి కూడా ప్రాణాలు కోల్పోయారు. సూర్యకుమారి తన భర్త నరసింహారావుతో కలిసి ఇక్కడి కవిరాజపార్కు రోడ్డులో అక్షర గీత విద్యానికేతన్ను స్థాపించారు. సరస్వతికుమారి భర్త వెంకటేశ్వరరావు ఆర్మీలో పని చేసి రిటైరై తెనాలిలో రెడీమేడ్ దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. ఝాన్సీరాణి భర్త నాగేశ్వరరావు గాంధీచౌక్లో పారగాన్ వాచ్ కంపెనీ నిర్వహించేవారు. ముగ్గురు అన్నదమ్ములు గతంలోనే మృతి చెందారు. ఆప్యాయంగా ఉండే తోడి కోడళ్లు అరుణాచలం దర్శనం కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ ఆడపడుచు పార్వతిని వెంటబెట్టుకుని ఝాన్సీరాణి కుమారుడు నాగార్జునతో కలిసి తమకు తెలిసిన వారి కారు తీసుకుని బయలుదేరారు. రోడ్డుప్రమాదం రూపంలో వీరి కుటుంబాలను మృత్యువు కబళించింది. సూర్యకుమారికి ఇద్దరు కుమారులు ఉండగా. తెనాలి ప్రభుత్వ వైద్యశాల సమీపంలో తన కుటుంబంతో నివాసం ఉంటోంది. సరస్వతికుమారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కవిరాజపార్కు రోడ్డులో నివసిస్తున్నారు.ఝాన్సీరాణి పెద్దకుమారుడు గతంలో మృతి చెందగా, ప్రస్తుతం సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని సాయిబాబా ఆలయం వద్ద సాయి పథం అపార్ట్మెంట్లో చిన్న కుమారుడు నాగార్జున కుటుంబంతో కలసి నివసిస్తున్నారు. ముగ్గురు తోడి కోడళ్లు మృతి చెందారన్న వార్త తెలియడంతో తెనాలిలో విషాదఛాయలు అలముకున్నాయి. వీరి కుటుంబాలను పలువురు ప్రముఖులు పరామర్శించారు. బాపట్ల జిల్లాలో కారు ప్రమాదం ముగ్గురు మృత్యువాత -
బ్లాక్లో ఎరువులు కొనుగోలు
నేను 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. దుక్కుల్లో వేసేందుకు యూరియా, డీఏపీ అవసరం కాగా దుకాణాల్లో కొరత ఏర్పడింది. దీంతో బ్లాక్లో బస్తాకు రూ.100 అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఆర్ఎస్కేలకు నామమాత్రంగా ఎరువులు వస్తున్నాయి. అక్కడ అందరికీ అందలేదు. రాష్ట్ర సర్కారు రైతులను ఆదుకోవాలి. విత్తనాలు, ఎరువులను సకాలంలో అందించాలి. గిట్టుబాటు ధరలు కల్పించడం ద్వారా అన్నదాతలకు కాస్త ఊరట లభిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. – ఇగుటూరి కోటిరెడ్డి, రైతు, దొండపాడు, నరసరావుపేట మండలం -
బీచ్ కబడ్డీ పురుషుల రాష్ట్ర జట్టుకు శిక్షణ
చెరుకుపల్లి: జూన్ 5 నుంచి 8వ తేదీ వరకు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్లో నిర్వహించనున్న 12వ జాతీయ బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు శిక్షణ ఇస్తున్నట్టు ఏపీ కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సుబ్బరాజు తెలిపారు. జట్టుకు మండలంలోని పొన్నపల్లి గ్రామంలో శిక్షణ శిబిరాన్ని బుధవారం సుబ్బరాజు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 3వ తేదీ వరకు శిక్షణ కొనసాగనున్నట్లు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన కుంచల శ్రీనివాసరెడ్డి స్పాన్సర్గా వ్యవహరించనున్నట్టు చెప్పారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వై.శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించన్ను పోటీలకు పురుషుల జట్టుకు పర్యవేక్షకులుగా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు వైఎస్సార్ ప్రసాద్, రాధాకృష్ణమూర్తి వ్యవహరిస్తారని తెలిపారు. శిబిరానికి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరు అయ్యారని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం తుది జట్టును ఎంపిక చేయనున్న వివరించారు. -
నాటకరంగ అభివృద్ధికి పరిషత్ల కృషి ఎనలేనిది
నాదెండ్ల: తెలుగు నాటక రంగాభివృద్ధికి కళాపరిషత్లు చేస్తున్న కృషి అభినందనీయమని సినీ, సీరియల్ నటుడు, పుచ్చలపల్లి సుందరయ్య కళాపరిషత్ అధ్యక్షుడు ముత్తవరపు సురేష్బాబు చెప్పారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటిక పోటీలు గురువారం ఐదో రోజు కొనసాగాయి. సభాధ్యక్షుడిగా బండారుపల్లి సత్యనారాయణ వ్యవహరించగా, ముఖ్యఅతిథులుగా రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు, వరగాని కళాపరిషత్ అధ్యక్షుడు పోపూరి నాగేశ్వరరావు, లింగారావుపాలెం కొండవీడు కళాపరిషత్ అధ్యక్షుడు కట్టా శ్రీహరిరావు, కట్రపాడు ఉషోదయ కళానికేతన్ అధ్యక్షుడు చెరుకూరి సాంబశివరావు పాల్గొన్నారు. ముత్తవరపు మాట్లాడుతూ తెలుగు నాటక రంగాన్ని నిలబెట్టేందుకు జూన్ మాసంలో జాతీయస్థాయిలో సదస్సుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం కన్నాంబ అవార్డు గ్రహీత ఎస్.అమృతవర్షిణి, ముత్తవరపు సురేష్, అరుణకుమారి దంపతులను కళాపరిషత్ సభ్యులు, అతిథులు శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో పాండురంగారావు, నాగమల్లి, రామారావు, పెద్దబ్బాయి, పరిషత్ నిర్వాహకుడు నడింపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు... తాడేపల్లి అరవింద ఆర్ట్స్వారి ‘విడాకులు కావాలి’, తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్వారి ‘ఎవరు’ కట్రపాడు ఉషోదయ కళానికేతన్వారి ‘కిడ్నాప్’ నాటకాలు పేరక్షకులను అలరించాయి. సినీ, సీరియల్ నటుడు ముత్తవరపు సురేష్బాబు నేటితో ముగియనున్న జాతీయస్థాయి నాటికల పోటీలు -
ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య
ప్రత్తిపాడు: ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఐటీఐ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన మన్నవ జేమ్స్, ఏసుకుమారిలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మన్నవ స్టాలిన్ (17) గుంటూరు రూరల్ మండలంలోని అడవితక్కెళ్లపాడులోని ఎంజీఎస్ కళాశాలలో ఐటీఐ ఎలక్ట్రికల్ కోర్సు చదువుతున్నాడు. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు స్టాలిన్ను గారాబంగా పెంచుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ 27వ తేదీ రాత్రి ఏసుకుమారి పనిపై బయటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి స్టాలిన్ ఇంటి వరండాలోని సీలింగ్ ఫ్యాన్కు తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి స్టాలిన్ను కిందకు దింపి తండ్రికి సమాచారం అందించారు. అపస్మారక స్థితిలోనికి వెళ్లిన స్టాలిన్ను తీసుకుని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే స్టాలిన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. జేమ్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె. నాగేంద్ర తెలిపారు. విద్యార్థి మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. -
కేశవకుమార్ సాహిత్యంలో ధిక్కార స్వరం
కవితా సంపుటాల ఆవిష్కరణలో వక్తలు తెనాలి: గత మూడున్నర దశాబ్దాల తెలుగు కవిత్వంలో కేశవకుమార్ది ముఖ్యమైన గొంతుక అని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విప్లవాత్మక భావజాలం ద్వారా ప్రేరణ పొందిన కవి అని ప్రముఖ సాహితీ విమర్శకుడు, ప్రొఫెసర్ బి.తిరుపతిరావు ప్రశంసించారు. ఆయన కవిత్వం సామాజిక– రాజకీయ విమర్శ, తాత్విక అన్వేషణల శక్తిమంతమైన సమ్మేళనాన్ని సూచిస్తుందని అన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర ప్రొఫెసర్, తెనాలి సమీపంలోని మండల కేంద్రం అమృతలూరుకు చెందిన కేశవకుమార్ రచించిన కవితలతో తీసుకొచ్చిన రెండు కవితా సంపుటాలను బుధవారం సాయంత్రం హోటల్ గౌతమ్ గ్రాండ్ హోటల్లో ఆవిష్కరించారు. ‘భిన్నస్వరాలు’ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు జీఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. కేశవకుమార్ కవితా సంపుటి ‘ఆదిమ పౌరుడు’ను బి.తిరుపతిరావు, ‘ఎగిరే పళ్లెం నడిచే మంచం ఓ కూనిరాగం’ సంపుటిని ప్రముఖ కవి సీతారాం ఆవిష్కరించారు. తిరుపతిరావు మాట్లాడుతూ అమృతలూరులో పుట్టి, దళిత ఉద్యమాలు, దళితుల ఆర్థిక, సామాజిక, రాజకీయ ఎదుగుదలను చూస్తూ పెరిగిన క్రమంలో కేశవకుమార్ వాటిని సొంతం చేసుకున్నారని చెప్పారు. ఆయన భావాలన్నీ అంబేడ్కర్ ఆలోచనల చుట్టూ తిరుగుతుంటాయన్నారు. రాడికల్గా సమీక్షించటం, విమర్శించటం ఆయన రచనల్లో గోచరిస్తుందని చెప్పారు. విస్తృతంగా రాస్తున్న కవితలు, వ్యాసాల్లో వ్యంగ్యాన్ని జోడించి విమర్శనాత్మకంగా రాయటం కేశవకుమార్ శైలి అన్నారు. సమకాలీన విషయాలపై తక్షణం స్పందించి రాయటం ఆయన ప్రత్యేకతగా చెప్పారు. కవి సీతారాం మాట్లాడుతూ, సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల ప్రతిఘటన, నిరసన ఉద్యమాల్లో కేశవకుమార్ ముందుండి గొంతెత్తారని చెప్పారు. అంబేడ్కర్, పూలే భావధారలో తనను తాను రూపుదిద్దుకున్న కేశవకుమార్ రచనలు, తెలుగునాట దళితవాద సాహిత్యానికి ప్రోత్సాహాన్ని, ప్రేరణను ఇస్తాయని చెప్పారు. ప్రముఖ దళిత సీ్త్రవాద రచయిత్రి చల్లపల్లి స్వరూపరాణి తన ప్రసంగంలో విప్లవ సాహిత్యానికి కేంద్రబిందువుగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన కేశవకుమార్ కవితా సంపుటాల్లో దళిత, బహుజన సాహిత్యంలో వచ్చిన ధోరణులు ప్రతిబింబిస్తాయని చెప్పారు. కత్తి కళ్యాణ్ మాట్లాడుతూ కేశవకుమార్ కవిత్వంలో నిరసన, ధిక్కారం, వ్యంగ్యం ప్రదర్శిస్తూ సమాజానికి అనేక ప్రశ్నలు సంధించారని చెప్పారు. సభలో శిఖా–ఆకాష్, నూకతోటి రవికుమార్, ఎన్జే విద్యాసాగర్, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు, తంగిరాల సోని మాట్లాడారు. కేశవకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. భిన్నస్వరాలు బాధ్యులు జుగాష్విలి, ఉమ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్కు ఘననివాళి
నరసరావుపేట: తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు చల్లి ఘన నివాళులర్పించారు. అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఏఆర్ వెల్ఫేర్ ఆర్ఐ గోపినాథ్, ఎస్బీ సీఐ శరత్ బాబు, సీసీ ఆదిశేషు, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్ పాల్గొన్నారు. నివాళులర్పించిన జేసీ.. నరసరావుపేట: మహనీయుల జయంతి వేడుకలు నిర్వహించుకోవడం వారికి ఇచ్చే గొప్ప గౌరవమని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు నిర్వహించారు. జేసీ సూరజ్ గనోరే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. డీఆర్ఓ ఏకా మురళి, డిప్యూటి కలెక్టర్ కుమార్, ఆర్డీఓ కె.మధులత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సభ్యుల పేరుతో రూ.4 లక్షల రుణం పొందిన ఆర్పీ లబోదిబోమంటున్న సభ్యులు అద్దంకి రూరల్: గ్రూపు సభ్యులకు తెలియకుండా వారి పేరుతో ఆర్పీ.. ఓ బ్యాంకులో రూ. 4 లక్షల రుణం పొందిన సంఘటన ఫిబ్రవరి 2వ తేదీ జరగ్గా అసల్యంగా వెలుగులోకి వచ్చింది. మెప్మా అధికారి శ్రీలత తెలిపిన వివరాల మేరకు.. అద్దంకి మెప్మా కార్యాలయంలో వెంకటేశ్వర మహిళా సమాఖ్య గ్రూపులో ఆర్పీగా పనిచేస్తున్న మల్లాది గాయత్రి ఆదర్శ పొదుపు గ్రూపు సభ్యులకు తెలియకుండా సీసీఎల్ రుణం రూ. 4 లక్షల బ్యాంకు నుంచి తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రూపు సభ్యులు మెప్మా అధికారికి తెలిపారు. ఆమె అప్పటి నుంచి ఆఫీస్కు రాకపోవటంతో ఎందుకు రావటం లేదని మెప్మా అధికారి విచారించగా 4 నెలల నుంచి ఆచూకీ లేదని తెలిసింది. బ్యాంకు వద్దకు వెళ్లి గ్రూపులో వివరాలను సేకరించగా గత నాలుగు నెలల నుంచి రుణం కట్టటం లేదని సీసీఎల్ లోను రూ. 4 లక్షలు, గ్రూపులోను రూ. 3 లక్షలు మొత్తం రూ. 7 లక్షలు రుణం ఉన్నట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఆర్పీ గాయత్రిని ఆమె కూమారుడు ద్వారా ఆఫీస్కు పిలిపించి బుధవారం విచారించగా తాను తీసుకున్న రుణం రూ.4 లక్షల వడ్డీతో సహా చెల్లిస్తానని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన్నట్లు మెప్మా అధికారి తెలిపారు. -
జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్గా విజయలక్ష్మి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్గా కుమ్మమూరు విజయలక్ష్మి నియమితులయ్యారు. విజయలక్ష్మి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీకాం చేశారు. గుల్బర్గా యూనివర్సిటీలో 1991లో న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. 1992లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్ అయ్యారు. సోదరుడు కృష్ణకిషోర్ వద్ద న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. బుధవారం గుంటూరు జిల్లా కన్జ్యూమర్ ఫోరం చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఒకటిన జిల్లా క్రికెట్ జట్లు ఎంపిక గుంటూరు వెస్ట్ ( క్రీడలు ): జిల్లా క్రికెట్ సంఘం త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన స్థానిక అరండల్పేటలోని పిచ్చుకులగుంటలో జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తామని సభ్యులు యు.మహతి శంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–19 యువకులు జట్టుకు ఉదయం 8 గంటలకు, అండర్–19 యువతులకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్ 1,2006 తర్వాత జన్మించినవారై ఉండాలి. అండర్–15 బాలికలకు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. నవంబర్ 1, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలి. అండర్–23 ఉమెన్స్కు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తారు. వీరు నవంబర్ 1,2001 తర్వాత జన్మించినవారై ఉండాలి. పోటీలకు హాజరయ్యే క్రికెటర్లు వైట్ డ్రెస్తోపాటు సొంత కిట్ కలిగి ఉండాలి. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ను తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు మహతి శంకర్ను 98491 50249 నంబరులో సంప్రదించాలన్నారు. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష గుంటూరు లీగల్: అత్యాచార యత్నం కేసులో నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 86 సంవత్సరాల వృద్ధురాలిపై లైంగిక దాడికి యత్నించిన పాలపర్తి మంజు అనే 21 సంవత్సరాల యువకుడిపై పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ మేరకు తీర్పు వచ్చింది. నిందితుడికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 5 వేలు జరిమానా విధిస్తూ గుంటూరు ఐదో జిల్లా కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెలువరించారు. బాధితురాలి తరఫున ప్రాసిక్యూషన్ న్యాయవాదిగా పల్లపు కృష్ణ వాదనలు వినిపించారు. 11 నెలలుగా అందని జీతాలు ఏపీజీఏఈ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా గుంటూరు వెస్ట్: స్థానిక బీఆర్ స్టేడియంలో ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 11 నెలలుగా జీతాలు అందడం లేదని ఏపీజీఏఈ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్ బాషా తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ అంతంత మాత్రపు జీతాలతో నెట్టుకొచ్చే చిరుద్యోగులకు నెలవారీ జీతాలు అందకపోతే చాలా ఇబ్బందులు పడతారన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పులు చేస్తున్నారని తెలిపారు. తక్షణం ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసోసియేషన్ నాయకులు లక్ష్మీనారాయణ, వై.నాగేశ్వరరావు, కోటా సాహెబ్, పెదరత్తయ్య, జాన్ పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట పైరుతో ప్రయోజనాలు
తెనాలి టౌన్: ఖరీఫ్ సాగుకు ముందు పచ్చిరొట్ట పైరు సాగు చేసుకోవాలని వ్యవసాయశాఖ రాష్ట్ర సంచాలకులు ఎస్.ఢిల్లీరావు రైతులకు సూచించారు. రూరల్ మండలం ఎరుకలపూడి గ్రామంలో రైతు ముళ్ళపూడి రంగయ్య ప్రయోగాత్మకంగా చేపట్టిన పీఎండీఎస్ క్షేత్రాన్ని బుధవారం ఎస్.ఢిల్లీరావు పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సంస్థ 7, 8 సంవత్సరాలుగా పరిశోధించి 32 రకాల పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. వీటిని వేసుకోవడం వలన సేంద్రియ కర్బనం పెరుగుతుందని తెలిపారు. ఎరువుల మోతాదు తగ్గించుకోవచ్చని వివరించారు. జనుము, జీలుగ, పిల్లి పెసర విత్తనాలను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానం వలన కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందుల ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చని అన్నారు. భూమి గుల్లబారి ఆరోగ్యంగా ఉంటుందని, సూక్ష్మపోషకాలు త్వర గా లభ్యమవుతాయని అన్నారు. ప్రతి రైతును చైతన్యపరచి పచ్చిరొట్ట విత్తనాలు వేసుకోనేలా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె.రాజకుమారి, ఏడీఏ ఎన్.ఉషారాణి, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ రాష్ట్ర సంచాలకులు -
రైతులు రోడ్డెక్కితే రాష్ట్రం స్తంభిస్తుంది
చిలకలూరిపేట: బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్లమీదకు వస్తే రాష్ట్రం స్తంభించి పోతుందని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు చెప్పారు. బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఐటీసీ కంపెనీ ముందు నిర్వహిస్తున్న నిరసన దీక్ష బుధవారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాది రైతాంగ ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని రైతులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. బర్లీ పొగాకు కలపకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ సిగరెట్లు తయారు కావన్నారు. సువాసన కోసం బర్లీ పొగాకును విదేశాలు సిగరెట్లలో ఉపయోగిస్తాయని తెలిపారు. పొగాకు కంపెనీలు కుట్రపూరితంగా ఏకమై ధరలను పతనం చేసేందుకు బర్లీ పొగాకు కొనుగోళ్లను నిలిపివేశారని ఆరోపించారు. మంత్రి సమక్షంలో జరిపిన చర్చలకు విలువ లేదా? రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ససమస్యను తీసుకువెళితే చర్చలతో సరిపెడుతున్నారని, రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి అచ్చెనాయుడు సమక్షంలో జరిగిన చర్చలకు విలువలేకుండా పోయిందని వెల్లడించారు. పొగాకు కంపెనీలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంటే, ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా అచేతనంగా ఉండటం ఏ మాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల బాధలు వింటే భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది బర్లీ పొగాకు మంచి ధరలు లభించటంతో రైతులు బర్లీ పొగాకును ఎక్కువగా సాగు చేశారని వెల్లడించారు. ఈ విషయాన్ని గుర్తించిన పొగాకు కంపెనీలు రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకును కొనుగోలు చేయకుండా వ్యవహారాన్ని సాగదీసి తక్కువ ధరకు రైతుల వద్ద కొని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కోట్లు గడించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. గత ఏడాది బర్లీ పొగాకు క్వింటా రూ. 18వేల వరకు కొన్నారని, ఈ ఏడాది కనీసం క్వింటాకు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడెల్లా కొనుగోళ్లు చేస్తాం అనడం తప్పించి, అడుగు ముందుకు పడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలతోనే సమస్యలు పరిష్కరించేందుకు రైతులు సిద్దం కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు తాళ్లూరి బాబురావు, దాసరి వరహాలు, పేలూరి రామారావు, షేక్ సుభాని, ఇంటూరి భవాని వెంకటేష్, దోమల మరియదాసు, రెడ్డమ్మ నరిసిరెడ్డి, షేక్ నసీరుద్దీన్, మాడ శివ ప్రసన్నబాబు, జొన్నల రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం రాధాకృష్ణ, లోక్ సత్తా మాదాసు భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని నిరసన దీక్ష -
వైభవంగా పోలేరమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట
ఈపూరు(శావల్యాపురం)/వినుకొండ : ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామంలో గ్రామస్తులు రూ.25లక్షల వ్యయంతో నిర్మించిన పోతురాజు – పోలేరమ్మ తల్లి దేవాలయం విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి వేదపండితులు వేదమంత్రాలతో గణపతి పూజ, పుణ్యాహావాచనం, మండపారాధన, ప్రధాన హోమాలు, యంత్ర ప్రతిష్ట, మహాపూర్ణాహుతి, విగ్రహా ప్రతిష్ట, మహా కుంభాభిషేకం, విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నరసరావుపేట, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గోనుగుంట్ల లీలావతి, తదితరులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. భక్తులకు భారీ అన్నదానం నిర్వహించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 512.60 అడుగుల వద్ద ఉంది. ఇది 136.1274 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 5,598 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. -
యోగాతో ఆరోగ్యం.. ఉల్లాసం
నరసరావుపేట రూరల్: యోగా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమలో భాగంగా ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో బుధవారం యోగా శిక్షణా శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, జిల్లా రెవెన్యూ అధికారి మురళీతో పాటు పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు యోగా శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ సూరజ్ మాట్లాడుతూ యోగా వలన ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. దీంతో పాటు కొన్ని శారీరక రుగ్మతలు దూరం అవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరు యోగా సాధనను అలవర్చుకొని ఆయుష్షును పెంచుకోవాలని సూచించారు. పవిత్రమైన కోటప్పకొండపై యోగా శిక్షణను ఏర్పాటుచేసిన అధికారులను అభినందించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే కోటప్పకొండలో యోగాంధ్ర -
లోక్ అదాలత్లో ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి
గుంటూరు లీగల్: లోక్ అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్చక్రవర్తి పేర్కొన్నారు. బుధవారం కోర్టు ప్రాంగణంలో ఈ నెల 28 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరుగనున్న లోక్ అదాలత్పై కంపెనీ సభ్యులు, కౌన్సిలర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. అందరూ సహకరించాలని సూచించారు. సమావేశంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి వి.ఎ.ఎల్.సత్యవతి, గుంటూరు ఫ్యామిలీ కోర్టు జడ్జి జి. చక్రపాణి, నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్. శరత్ బాబు, ఐదో అదనపు జిల్లా జడ్జి కె. నీలిమ, మూడో అదనపు జిల్లా జడ్జి సి.హెచ్.వి.ఎన్. శ్రీనివాసరావు, పోక్సో కోర్ట్ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి షమీ పర్వీన్ సుల్తానా బేగం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్, బార్ అధ్యక్షుడు వై.సూర్య నారాయణ పాల్గొన్నారు. -
సుబ్రహ్మణ్యేశ్వరుడికి రజత కవచం
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి బుధవారం దాతలు రజత కవచం సమ ర్పించారు. మండల పరిధిలోని ధరణికోటకు చెందిన కామని వీరయ్య, సామ్రాజ్యం దంపతులు సుమారు రెండుకిలోల 395 గ్రాముల బరువుతో రూ.3లక్షల విలువైన రజత కవచానికి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించి ఈఓ రేఖకు అప్పగించారు. అనంతరం అర్చకులద్వారా సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కవచాన్ని అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు కుంకుమపూజలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు నేడు జెడ్పీ గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులకు కౌన్సెలింగ్ గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయ పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తూ గ్రేడ్–2 హెచ్ఎం ఉద్యోగోన్నతుల కోసం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు గురువారం ఉదయం 8 గంటలకు జెడ్పీ కార్యాలయ రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో హాజరు కావాలని సూచించారు. శివాలయంలో అవినీతిపై విచారణ మంగళగిరి : మంగళాద్రిలో వేంచేసిఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానం(శివాలయం)లో జరిగిన అవినీతిపై దేవదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. దేవస్థాన అభివృద్ధికి దాతలు అందించిన నగదును రికార్డులలో నమోదు చేయకపోవడంతో అభివృద్ధి పనులలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. అధికారులు బుధవారం ఆలయానికి చేరుకుని ఈవో కార్యాలయంలో పలు ఫైళ్ళును స్వాధీనం చేసుకున్నారు. పునఃప్రారంభమైన సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: వికలాంగుల ధృవ పత్రాలను పునః పరిశీలన జరిపే కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్ నిర్వహించారు. ఆర్థో, ఈఎన్టీ, సెక్రాటిక్ విభాగాలకు చెందిన వికలాంగులు వైద్యశాలకు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. గురు, శుక్రవారాలలో కూడా క్యాంప్ జరుగుతుందని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు. 31న అయ్యప్ప స్వామి దేవస్థాన వార్షికోత్సవం చిలకలూరిపేట: ఓగేరు వాగుకు దక్షిణాన ఉన్న అయ్యప్పస్వామి దేవస్థానం 16వ వార్షికోత్సవం ఈ నెల 31వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం దేవస్థాన వార్షికోత్సవ కరపత్రాలను కమిటీ సభ్యులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కమిటీ సభ్యులు తవ్వా నాగమల్లేశ్వరరావు, సత్యనారాయణ, భవిరిశెట్టి మణి పాల్గొన్నారు. -
తిరగబడ్డ గ్రామస్తులు
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025అచ్చంపేట: ‘‘ప్రభుత్వం ట్రాక్టర్లకు ఉచితంగా ఇసుక తోలుకునేందుకు అనుమతించింది.. వాటిని ఆపడానికి మీరెవ్వరు..? ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మీరు అతిక్రమిస్తారా.. అలాగైతే మీ లారీలనుకూడా మేం పోనివ్వమంటూ కోనూరు గ్రామస్తులు రహదారిపై రాళ్లు, టైర్లు అడ్డుగా బెట్టి టీడీపీ నేతలకు చెందిన లారీలను స్తంభింపజేశారు.’’ కోనూరు కృష్ణానదిలో నది లోపలవరకు రోడ్డు వేసి పెద్ద పెద్దయంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గతంలో ఇసుక ర్యాంప్ను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులు మాత్రమే ఆపగలిగిన అధికారులు అడ్డదార్లను పూర్తిగా నిలిపి వేయలేకపోయారు. మళ్లీ గత వారం రోజులుగా ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. మా దారి అడ్డదారి.. అయితే అడ్డదారుల్లో పెద్ద పెద్ద టిప్పర్లతో అడ్డదిడ్డంగా ఇసుకను తరలిస్తున్న టీడీపీ నేతలు స్థానికులు ట్రాక్టర్ల ద్వారా చేస్తున్న తరలింపును అడ్డుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకోవచ్చంటూ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు చెబుతుండగా స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరం చెబుతుండడం విడ్డూరం. గ్రామంలో సుమారు 20 నుంచి 30 ట్రాక్టర్ల ద్వారా గ్రామస్తులు ఇసుక రవాణా చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరిలోనూ ఎక్కువగా టీడీపీ వారే ఉండటం గమనార్హం. వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాలు కురిస్తే ఇసుక నిల్వ చేసుకునే అవకాశం లేనందున ఇసుకను డంపింగ్ చేసుకునేందుకు అనుమతులిచ్చారంటూ టీడీపీ నాయకులు గతంలో నదిలో అడ్డంగా వేసిన రోడ్లపైనుంచి యంత్రాల సహాయంతో నది ఒడ్డున ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. ఈ ముసుగులోనే కొన్ని లారీలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదేమంటే రాజధాని నిర్మాణానికి తరలిస్తున్నామని చెబుతున్నారు. అడ్డుతగిలితే కేసులంటూ హుకుం అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు గ్రామస్తులను దారికి అడ్డుతగితే కేసులు మోపుతామని, దారికి అడ్డుపడే హక్కులేదంటూ హెచ్చరించారు. నదికి అడ్డుగా రోడ్డు వేసే హక్కు ఉందా అంటూ గ్రామస్తులు ప్రశ్నించగా, ఇదంతా మాకు తెలియదని, ఎమ్మెల్యేతో మాట్లాడి అనుమతి తెచ్చుకోండి.. అప్పుడు మీ ట్రాక్టర్లకు అనుమతిస్తామని సీఐ హుకుం జారీ చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ట్రాక్టర్లకు అనుమతిచ్చినప్పుడు ఇంకా ఎమ్మెల్యే అనుమతులేంటి అంటూ గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులకు, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులకు కొంత వాగ్వివాదం జరిగింది. అయితే గ్రామస్తులు ఎంత ఆందోళనలకు దిగినా చివరకు ఏమీ సాధించలేకపోయారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రవాణా చేసుకునే హక్కును పొందలేకపోయారు. భారీ ఇసుక లోడ్ లారీలు మాత్రం నదిలో వేసిన అడ్డదారిలో యథేచ్ఛగా తరలి వెళుతూనే ఉన్నాయి. కోనూరులో దారికి అడ్డంగా గ్రామస్తులు రాళ్లు, టైర్లు పెట్టడంతో నిలిచిపోయిన ఇసుక లారీలున్యూస్రీల్ అచ్చంపేట మండలం కోనూరు ఇసుక ర్యాంపు మూసేసిన అధికారులు భారీ వాహనాలతో చాటుగా ఇసుక తరలించేస్తున్న పచ్చనేతలు ట్రాక్టర్ల ద్వారా తరలింపును అడ్డుకుంటున్న అక్రమార్కులు దీనికి ప్రతిగా ఇసుక లారీలను అడ్డుకున్న కోనూరు గ్రామస్తులు ట్రాక్టర్లను ఆపితే ఊరుకోమంటూ గ్రామస్తులు ఆందోళన టీడీపీ, వైఎస్సార్ సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ గ్రామంలో ఇప్పటికి వరకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరగ్గా, ఎప్పుడైతే లారీలతో రవాణా మొదలుపెట్టారో అప్పటి నుంచి నదిలోకి ట్రాక్టర్లను అనుమతించడం నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు తిరగబడ్డారు. లోడ్ చేసిన లారీలను పోనివ్వకుండా గ్రామనడిబొడ్డులో పెద్ద పెద్ద రాళ్లు, టైర్లు పెట్టి నిలిపి వేశారు. ట్రాక్టర్లను అనుమతించే వరకు లారీలను కూడా వెళ్లనివ్వమంటూ భీష్మించుకుని కూర్చుని ఆందోళన చేపట్టారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను స్టేషన్కు పిలిపించారు. కొంతమంది గ్రామస్తులు అచ్చంపేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. -
జీజీహెచ్లో కరోనా వైద్య సేవలు
గుంటూరు మెడికల్: కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి వెలుగులోకి వచ్చింది. పలువురు బాధితులు కరోనాతో బాధపడుతుండటంతో గుంటూరు జీజీహెచ్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా 15 పడకలతో వార్డు ఏర్పాటు చేశారు. ఇన్పేషెంట్ విభాగంలో బీ క్లాస్ రూములో కూడా బాధితుల కోసం సిద్ధం చేసి ఉంచారు. అత్యవసర విభాగం వల్ల నూతనంగా నిర్మించిన స్టెప్ డౌన్ ఐసీయూ గదిని కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. ఇప్పటికే కరోనా అనుమానంతో వచ్చిన ఐదుగురికి వైద్య పరీక్షలు చేశామని, రిపోర్టు నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. జీజీహెచ్లో కరోనా బాధితులకు ప్రత్యేకంగా ఓపీని ప్రారంభించామన్నారు. ఆక్సిజన్ కాన్సెట్రేటర్స్, సీక్యాప్ మిషన్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి కరోనా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వైద్య సేవలకు సిద్ధంగా ఉండండి రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందించేందుకు ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీఎంఈ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. సమావేశంలో డీఈఓ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఎక్కువ మంది చికిత్స పొందేలా చూడాలన్నారు. ఈ – హాస్పిటల్ వైద్య సేవలు పెంచాలన్నారు. సమావేశానికి హాజరు కాని జీజీహెచ్ వైద్యులకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతోపాటు పలు వైద్య విభాగాధిపతులు, ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ కింద పడి బాలిక దుర్మరణం
బెల్లంకొండ: ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి చెందిన ఘటన మండలంలోని న్యూ చిట్యాల సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో న్యూ చిట్యాలకు చెందిన అడావత్ సంధ్య భాయి (13) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ చిట్యాలకు చెందిన సంధ్య భాయి మంచినీళ్ల కోసం బంధువుల బైక్పై బెల్లంకొండలోని వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్తుంది. కాగా కొండ సమీపంలోకి రాగానే బెల్లంకొండ నుంచి మన్నెసుల్తాన్పాలెం వైపు వెళ్తున్న మరో బైక్ వీరిని ఢీకొంది. ఈ క్రమంలో సంధ్య భాయి బైక్ పై నుంచి రోడ్డు మీద పడిపోయింది. ఈ క్రమంలో వారి వెనకగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ సంధ్య భాయిని తొక్కుకుంటూ వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక అక్కడికక్కడే మృతి చెందిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
పిన్నెల్లి సోదరులపై కేసులు దుర్మార్గం
పిడుగురాళ్ల: పథకం ప్రకారమే గుండ్లపాడు హత్య కేసుల్లో సంబంధం లేకపోయినప్పటికీ పిన్నెల్లి సోదరులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రయ్య హత్యతో వైఎస్సార్ సీపీకి ఎలాంటి సంబంధం లేదని, ఈ హత్యలు టీడీపీ ఆధిపత్య పోరు వలనే జరిగిందని గుర్తు చేశారు. అయినా కేవలం పిన్నెల్లి సోదరులే టార్గెట్గా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ -
జేఎన్టీయూఎన్లో కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళన
నరసరావుపేట రూరల్: నరసరావుపేటలోని కాకాని జేఎన్టీయూఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనకు దిగారు. జేఎన్టీయూకే కాంట్రాక్ట్ అధ్యాపకుల రెన్యూవల్ విషయంలో అనుసరిస్తున్న విధానానికి నిరసనగా మంగళవారం కళాశాలలోని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు ఛాంబర్ను ముట్టడించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు రివ్యూల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించడంపై ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. అదే విధంగా బ్రేక్ పిరియడ్ను 15 రోజుల నుంచి ఐదు రోజులకు తగ్గించాలని కోరారు. నిబంధనలకు విరుద్దంగా రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీల్లో లేని విదంగా కాంట్రాక్ట్ అద్యాపకులను ఇబ్బందులకు గురిచేసే విధంగా జేఎన్టీయూకే అధికారులు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల అసోసియేషన్ అద్యక్షుడు పి.మణికంఠ మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ను కలిసి తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లగా వారి నుంచి సానుకూల స్పందన లభించందన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా కొంతమంది యూనివర్సిటీ అధికారుల చర్యలు ఉన్నాయని విమర్శించారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు హరికృష్ణ, ఆదినారాయణ నాయక్, మన్మదరెడ్డి, సాయి, రాధ, అనిత తదితరులు పాల్గొన్నారు. రివ్యూల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న వర్సిటీ అధికారులు ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తమకు ఇప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహించడంపై అధ్యాపకుల ఆగ్రహం ప్రిన్సిపాల్ చాంబర్ను ముట్టడించిన కాంట్రాక్ట్ అధ్యాపకులు -
పల్నాడు
పాలవాగు పూడిక తీత రాయపూడి(తాడికొండ): రానున్న వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాయపూడి గ్రామంలోని పాలవాగు పూడికతీత పనులు ప్రారంభించారు.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 512.60 అడుగు ల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడికాలువ కు 5,598 క్యూసెక్కులు విడుదలవుతోంది. ఈవీఎం గోడౌన్ పరిశీలన ఫిరంగిపురం: రేపూడి మార్కెట్ యార్డులోని ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ను మంగళవారం ఆర్డీవో కె.శ్రీనివాసరావు పరిశీలించా రు. తహసీల్దార్ జె.ప్రసాదరావు పాల్గొన్నారు. బుధవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 20257 -
నైపుణ్యాభివృద్ధి తరగతులు ప్రారంభం
తాడికొండ: మహిళలు, యువతకు నైపుణ్యాభివృద్ధి, సెన్సిటైజేషనుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాల ద్వారా సాధికారత సాధించవచ్చని ఏపీ సీఆర్డీఏ నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలిపారు. అమరావతి ప్రాంతంలో మహిళలకు సాధికారత కల్పించడం, యువతకు నైపుణ్యాలను అందించేందుకు తుళ్ళూరులో ఈ కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. నిర్మాణ స్థలాల వద్ద కార్మికుల రాకను దృష్టిలో ఉంచుకొని జెండర్ కమిటీల సభ్యులైన 368 స్వయం సహాయక బృంద మహిళలకు లింగ ఆధారిత హింసపై సెన్సిటైజేషన్ శిక్షణ ఇస్తున్నారు. వీరు సంబంధిత ఫిర్యాదులపై పని చేస్తారని అధికారులు తెలిపారు. ఏపీ సీఆర్డీఏ స్కిల్ హబ్ తుళ్ళూరులో పెయింటింగ్ కోర్సులో 22 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు 30 మంది, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్ కోర్సులో 29 మందికి శిక్షణ ప్రారంభమైందన్నారు. -
ముగిసిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు
● 19 నుంచి జరిగిన అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 39,693 మంది విద్యార్థులు హాజరు గుంటూరు ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 19న ప్రారంభమైన పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగాయి. ఈ నెల 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 22 కేంద్రాల పరిధిలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 41,384 మంది విద్యార్థుల్లో 39,693 మంది హాజరయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే... ● గుంటూరు జిల్లాలోని 15 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 25,731 మందిలో 24,607 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 21,590 మందికిగాను 20,765 మంది; అగ్రిల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షకు 4,141 మందికిగాను 3,842 మంది హాజరయ్యారు. ● పల్నాడు జిల్లాలోని 5 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసిన 11,142 మందికిగాను 10,746 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 9,214 మందికిగాను 8,944 మంది; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,928 మందికిగాను 1,802 మంది విద్యార్థులు హాజరయ్యారు. ● బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాలలో ఏర్పాటు చేసిన 2 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 4,511 మందికిగాను 4,340 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్కు 3,409 మందికిగాను 3,304; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,102 మందికిగాను 1,036 చొప్పున హాజరయ్యారు. -
● సమీక్షలో ఆదేశించిన జిల్లా కలెక్టర్ ● యోగా స్ట్రీట్లో యోగా చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బంది
యోగా ఔత్సాహిక రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయండి నరసరావుపేట: జిల్లాలో యోగాంధ్ర యాప్ ద్వారా యోగా ఔత్సాహిక రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం యోగాంధ్రపై జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎనిమిది లక్షల మందిని యోగా ఔత్సాహికులను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకూ లక్ష మంది నమోదు పూర్తయిందన్నారు. వీరితోపాటూ 4,800 వరకూ మాస్టర్ ట్రైనర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రేపు ఉదయం 8.00 గంటలలోగా గ్రామ స్థాయిలో యోగా పోటీలు నిర్వహించి విజేతల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గ్రామ స్థాయిలో విజేతలకు జూన్ రెండు నుంచి మండల స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు. యోగా స్ట్రీట్గా కలెక్టర్ క్యాంపు కార్యాలయ రోడ్డు యోగాంధ్ర మాసోత్సవ వేడుకలలో భాగంగా స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం రోడ్డుకు యోగా స్ట్రీట్ గా నామకరణం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు వెల్లడించారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకూ ప్రతి రోజూ ఉదయం వివిధ శాఖల ఆధ్వర్యంలో యోగా స్ట్రీట్ నందు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మంగళవారం ఉదయం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సామూహిక యోగా నిర్వహించడం జరిగిందన్నారు. -
ఉద్యోగోన్నతులకు ధ్రువపత్రాల పరిశీలన
గ్రేడ్–2 హెచ్ఎంగుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఉపాధ్యాయులు హాజరు గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్–3 పరిధిలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, తత్సమాన కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు గ్రేడ్–2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించేందుకు మంగళవారం గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో ఆరు, ప్రకాశం జిల్లాలో ఏడు, నెల్లూరు జిల్లాలో నాలుగు హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పిలిచారు. సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు తమ ధ్రువపత్రాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు సర్వీసు రిజిస్టర్, సామాజిక ధ్రువీకరణ పత్రం ఒరిజినల్, విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలించారు. ఉపాధ్యాయ బదిలీలతో ఏర్పడే ఖాళీల్లో సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించనున్నారు. అర్హత లేని వారికి ప్రాధాన్యం గ్రేడ్–2 హెచ్ఎం పోస్టుల్లో ఉద్యోగోన్నతులు కల్పించేందుకు రూపొందించిన సీనియార్టీ జాబితాలో అర్హత లేని వారికి ముందు వరుసలో స్థానం కల్పించినట్లు పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. మెరిట్, రోస్టర్ను పాటించకుండా యథేచ్ఛగా అర్హత లేని వారికి ప్రాధాన్యతను ఇచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. తద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని, ఆర్జేడీ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జెడ్పీ, మున్సిపల్ హెచ్ఎం పోస్టులకు... గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ, నగరపాలక సంస్థ, మున్సిపల్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని జిల్లా పరీక్షా భవన్లో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పర్యవేక్షణలో సీనియార్టీ జాబితాలో పొందుపర్చిన ఉపాధ్యాయులు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న హెచ్ఎం పోస్టుల్లో జెడ్పీ–59, మున్సిపల్–8, కార్పొరేషన్–9 చొప్పున ఉన్నాయి. ఆయా పోస్టుల వారీగా అర్హులైన ఉపాధ్యాయులను ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. బదిలీల ప్రక్రియ అనంతరం ఖాళీల ఆధారంగా సంబంధిత స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించనున్నారు. సీనియర్ హెచ్ఎంలు, ఉద్యోగులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో పాల్గొన్నారు. -
సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి
జిల్లా సహకార అధికారి వెంకటరమణ నరసరావుపేట: సహకార సంఘాల సమగ్రాభివృద్ధికి కమిటీ సభ్యులు, సీఈఓలు తమ వంతు పాత్ర పోషించాలని జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కమిటీ సభ్యులు, కార్యనిర్వాహక కార్యదర్శులకు సామర్ధ్య నిర్మాణం – సుపరిపాలనపై ఏపీ రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జీడీసీసీ బ్యాంకులో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ సహకార సంఘాల కమిటీ సభ్యులు, సీఈఓలు సహకార సంఘాలు అభివృద్ధిలో ముఖ్యపాత్ర వహిస్తున్నారని అన్నారు. విజయవాడ సహకార శిక్షణా కేంద్ర వైస్ ప్రిన్సిపాల్ వేదాంతరెడ్డి మాట్లాడుతూ సంఘ కార్యకలాపాల పర్యవేక్షణ, సరైన పాలనకు మార్గనిర్దేశం చేయడం కమిటీ సభ్యుల ముఖ్యవిధి అన్నారు. జిల్లాలో అన్ని సహకార సంఘాలను ఈ–పీఏసీఎస్గా మార్చి సభ్యులకు డిజిటల్ సేవలు అందిస్తున్నామని, దీనివల్ల సంఘాల్లో పారదర్శకత పెరుగుతుందని ఆయన చెప్పారు. కంప్యూటీకరణ మూలంగా సంఘాల ఆడిట్ సులభం అవుతుందని అన్నారు. శిక్షణలో సహకార సంఘాల పర్సన్ ఇన్ చార్జీలు, సంఘాల సీఇఓలు పాల్గొన్నారు. -
లక్ష టన్నుల సేకరణ తర్వాతనే బయటకు
నరసరావుపేట: జిల్లాలో ఉన్న ఇసుక రీచ్ల ద్వారా లక్ష టన్నుల సేకరణ అనంతరమే బయటకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎనిమిదో జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం సుమారు 60వేల టన్నుల ఇసుక మల్లాది, కోనూరు స్టాక్ యార్డులలో అందుబాటులో ఉందన్నారు. రీచ్ల నుంచి స్టాకు పాయింట్ల వరకు ఇసుక రవాణాకు టన్నుకు చెల్లించే పైకంపై సత్వరమే నిర్ధారణ చేయాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా మైన్స్ గనుల శాఖాధికారి నాగినిని ఆదేశించారు. చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల వద్ద స్టాక్ యార్డుల ఏర్పాటుకు స్థల సేకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలాన్నారు. తంగెడ, పొందుగల, విజయపురి సౌత్ వద్ద ఉన్న ఇసుక పాయింట్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద రాత్రిపూట వాచ్మెన్లను ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. అడిషనల్ ఎస్పీ జేవీ సంతోష్, సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి రమాకాంత్రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
దురాచారాల నిర్మూలనలో పరిషత్ల కృషి ఎనలేనిది
నాదెండ్ల: నేటి సమాజంలో సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు నాటికల ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు కళాపరిషత్లు చేస్తున్న కృషి అభినందనీయమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు చెప్పారు. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయస్థాయి నాటికల పోటీలు నాలుగోరోజు మంగళవారం కొనసాగాయి. సభాధ్యక్షులుగా హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వ్యవహరించారు. అతిథులుగా అనంతవరం ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షుడు గూదే పాండురంగారావు, సినీ హీరో సందేశ్ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా రాష్ట్రంలో వేల కళాపరిషత్ నాటికలు సమాజంలో నెలకొన్న దురాచారాలు, మూఢ నమ్మకాల నిర్మూలనకు విశేష కృషి చేస్తున్నాయన్నారు. అనంతరం దర్శకుడు, రచయిత సుంకర కోటేశ్వరరావు, నాటక రూపశిల్పి కె.థామస్లను కళాపరిషత్ సభ్యులు శాలువాలు, మెమొంటోలతో సత్కరించారు. కార్యక్రమాలను కళాపరిషత్ అధ్యక్షుడు నడింపల్లి వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు... హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి జ్యోతిరాజ్ రచనలో, వెంకట గోవాడ దర్శకత్వం వహించిన ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటిక ఆకట్టుకుంది. న్యూఢిల్లీ వారి అనశ్వరం నాటిక, చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ వారి ‘మా ఇంట్లో మహాభారతం’ నాటికలు ఆకట్టుకున్నాయి. నేటి ప్రదర్శనలు... తాడేపల్లి అరవింద ఆర్ట్స్ ‘విడాకులు కావాలి’, తెనాలి అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ ‘ఎవరు’, కాట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘కిడ్నాప్’ నాటికలు బుధవారం ప్రదర్శించనున్నారు.కొనసాగుతున్న జాతీయస్థాయి నాటికల పోటీలు -
కర్రసాములో గుంటూరు జిల్లా క్రీడాకారుల ప్రతిభ
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కర్రసాము అంతర్జాతీయ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచినట్లు కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకుడు కాశీనాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన పోటీల్లో వారు ప్రతిభ చూపారన్నారు. అంతర్జాతీయ కర్రసాము సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 9 బంగారు, 5 రజత, 3 కాంస్య పతకాలు సహా మొత్తం 17 పతకాలను చిన్నారులు సాధించారని పేర్కొన్నారు. సాయి సుబ్రహ్మణ్యం, విజయ్ శిక్షణలో చిన్నారులు ఈ విజయం సాధించారని తెలిపారు. -
మావోయిస్టుల మృతదేహాలను దహనం చేయటం చట్ట వ్యతిరేకం
వినుకొండ: ఈ నెల 21న చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన 27 మంది మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించకుండా దహనం చేయడం చట్టవ్యతిరేకమని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. మావోయిస్టుల మృతదేహాలను రక్తసంబంధీకులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా చట్టవిరుద్ధంగా వారిని దహనం చేశామని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు వైవీ, జి.రామకృష్ణ, చిన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సాధారణం కంటే అధిక వర్షపాతం మేలో సాధారణ వర్షపాతం 1237.3 మి.మీ కురిసింది 2703.8మి.మీ నరసరావుపేట: జిల్లాలో మే నెల మండు వేసవిలో ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని మించి వర్షం కురిసింది. జిల్లాలో ఈ నెల 1237.3 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సివుండగా మరో నాలుగురోజులు మిగిలి ఉండగానే 2703.8 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 28 మండలాల్లో ఈనెలలో కురిసిన వర్షపాత వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మాచర్లలో 102.4మి.మీటర్లు, వెల్దుర్తిలో 57.0, దుర్గిలో 78,2, రెంటచింతలలో 75,6, గురజాల 82,0, దాచేపలి 51.8, కారంపూడి89.8, పిడుగురాళ్ల 83,6, మాచవరం 46.4, బెల్లంకొండ 119.6, అచ్చంపేట 82.6, క్రోసూరు 68.0, అమరావతి 199.6, పెదకూరపాడు 105.6, సత్తెనపల్లి 146.2, రాజుపాలెం 110.4, నకరికల్లు 34.0, బొల్లాపల్లి 65.4, వినుకొండ 87.0, నూజెండ్ల 71.2, శావల్యాపురం 77.6, ఈపూరు 63.4, రొంపిచర్ల 50.2, నరసరావుపేట 135.4, ముప్పాళ్ల 118.4, నాదెండ్ల 132.6, చిలకలూరిపేట 200.4, యడ్లపాడు 169.4 మి.మీ వర్షం పడింది. ఒక్కో మండలానికి సరాసరిన 96.4 మి.మీటర్ల వర్షం కురిసింది. రెండు లారీలు ఢీ ఒకరికి గాయాలు మేదరమెట్ల: ముందు వెళ్తున్న లారీ రివర్స్లో వస్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీ కొన్న సంఘటన మంగళవారం తెల్లవారు జామున మేదరమెట్ల కొండ సమీపంలో జాతీయరహదారిపై చోటు చేసుకుంది. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీ మేదరమెట్ల కొండ సమీపానికి రాగానే ముందు వెళుతున్న లారీ రివర్స్లో వెనక్కు వస్తోంది. దీన్ని గమనించని కంటైనర్ డ్రైవర్ లారీ వెనుకభాగాన్ని బలంగా ఢీ కొన్నాడు. దీంతో కంటైనర్ డ్రైవర్ దీప్కుమార్కు గాయాలు కాగా 108 వాహనంలో ఒంగోలు జీజీహెచ్కు తరలిచారు. కంటైనర్ ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
రెడ్బుక్ రాజ్యాంగం మేరకే అక్రమ కేసులు
మాచర్ల: నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా పనిచేసి రెండు దశాబ్దాలుగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం అత్యంత దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పల్నాడు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల సుందరరావు, ఎస్సీ సెల్ కారంపూడి మండల అధ్యక్షుడు దరివేములు కిరణ్లు అన్నారు. మంగళవారం మాచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రెడ్బుక్ రాజ్యాంగం అమలుపైనే దృష్టి పెట్టిందన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ అత్యంత దారుణంగా వ్యవహరిస్తుందన్నారు. అక్రమ కేసులు నమోదు చేయడం హేయం గుల్లపాడు గ్రామంలో ఏ ఒక్క విషయానికి పీఆర్కే వెళ్లడం లేదన్నారు. ఆయన సోదరుడు నియోజకవర్గంలోనే లేడన్నారు. వీరివురి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా అక్రమ కేసులు పెట్టిస్తుందన్నారు. ఇప్పటికే పీఆర్కేపై 13 కేసులు అక్రమంగా నమోదు చేయించారన్నారు. ఆ గ్రామానికి, పార్టీకి సంబంధం లేని ఘటనను ఆధారంగా చేసుకుని 302 హత్య కేసు నమోదు చేయడం హేయమైన ఘటన అన్నారు. పీఆర్కేకు ఏడాదిలోనే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి సహించలేక, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును పీఆర్కే సోదరులపై నమోదు చేయించారన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు పీఆర్కేను ఏం చేయలేవన్నారు. పార్టీ జిల్లా ఎస్సీ విభాగం కార్యవర్గ సభ్యులు మామిడి శేఖర్, మాచర్ల నియోజకవర్గ నాయకులు ఎ.రమేష్, రాజేష్, కె.మధు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల అభ్యున్నతికి కృషి చేయాలి
తెనాలి టౌన్: విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను ఎనర్జీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అందె రాజేష్ కోరారు. మంగళవారం విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీఎండీ పుల్లారెడ్డి, టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ను యూనియన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. సర్వీసు కండీషన్లు, పదోన్నతులపై చర్చించినట్లు రాజేష్ తెలిపారు. అలవెన్స్ ఆర్డర్ కాపీ ఇవ్వాలని కోరారు. లీవ్ ఎన్క్యాష్మెంట్కు సంబంధించిన ఆర్డర్ను కూడా త్వరలో ఇస్తామని డైరెక్టర్ చెప్పినట్లు వివరించారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలీ, ఎగ్జిక్యూటివ్ మెంబరు బీటీ కృష్ణ తదితరులు ఉన్నారు. -
జంట హత్యలపై కట్టు కథలు
సాక్షి, టాస్క్ఫోర్స్: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో జరిగిన జంట హత్యలపై ప్రభుత్వం, పోలీసులు కట్టు కథ అల్లారు. కేసు ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే అందుకు బలం చేకూరుస్తున్నాయి. టీడీపీలో ఆధిపత్య పోరుతో జరిగిన హత్యలను ఎలాగైనా వైఎస్సార్ సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై నెట్టాలన్న దురుద్దేశంతో పెట్టిన అక్రమ కేసుగా స్పష్టమవుతోంది. హత్యలపై మృతుల అల్లుడు, టీడీపీ నేత తోట ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదులో హత్యకు గల కారణం గ్రామ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతోనే జరిగిందని తన తొలి మాటల్లోనే తెలిపాడు. మృతుడు జెవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్యను హతమారిస్తే టీడీపీలో నాకు ఎదురు ఉండదన్న కారణంతోనే నిందితుడు తోట వెంకట్రామయ్య హత్య చేశాడని స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎలాగైనా పిన్నెల్లి సోదరులను కేసులో ఇరికించాలన్న దుర్బుద్ధితో ఓ కట్టుకథకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హత్యలో పాల్గొన్న నిందితులు జెవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజులు హత్య చేసిన అనంతరం ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులును చూసి కారులోని కత్తులు తీసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నిజంగా కారులో కత్తులే ఉంటే బండరాళ్లతో ఎందుకు మోది చంపుతారు, కత్తులే వాడే వారు కదా అనే ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. పోలీసుల ఎఫ్ఐఆర్, ప్రభుత్వ వైద్యుల పంచనామాలో ఎక్కడా కత్తులు వాడినట్టు పేర్కొనలేదు. పోతూ పోతూ ‘‘ నా కొ..రా వచ్చేది మా వైఎస్సార్ ప్రభుత్వమే. మిమ్మల్ని బతకనివ్వం, మాతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామరెడ్డిలు చెబితేనే మేము చేస్తున్నాం. మాకు ఏమైనా ఆపద వస్తే వాళ్లు చూసుకుంటారు.’’ అంటూ కత్తులు చూపి బెదిరిస్తూ పోయారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. నిజంగా హత్యకు పిన్నెల్లి సోదరు లు కుట్ర పన్ని ఉంటే ఎవరైనా ఇలా చెబుతారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం పిన్నెల్లి సోదరులను కేసులో అక్రమంగా చేర్చడానికి ప్రభుత్వం, పోలీసుల కుట్రగా అర్థమవుతోంది. మరోవైపు హత్య జరిగిన వెంటనే ఫిర్యాదుదారుడైన తోట ఆంజనేయులు మీడియాతో మాట్లాడిన వీడియోలో మేము రావడం చూసి పారిపోయారని చెప్పాడు తప్ప నిలబడి బెదిరించారని ఎక్కడా చెప్పలేదు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి ఒత్తిడితో మరుసటి రోజు ఫిర్యాదు చేసే సమయానికి ఇలా మాట మార్చాడని అర్థమవుతోంది. నిందితులు పోతూపోతూ అన్నారని చెబుతున్న కట్టుకథలు తప్ప ఈ హత్యలో పిన్నెల్లి సోదరుల పాత్రపై ఎటువంటి ఆధారాలు దొరకలేదు. హత్య జరిగిన ప్రదేశంలో జేబీఆర్ అని పసుపు పచ్చ రంగులో స్టిక్కర్ ఉన్న టీడీపీ నేత తోట వెంక్రటామయ్య కారు దొరికింది. ఆధిపత్య పోరు కారణంగానే హత్యలు జరిగినట్లు ఎస్పీ ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షి హత్యలో పాల్గొన్న వారంతా టీడీపీ నేతలే అని స్పష్టం చేశాడు. ఇన్ని ప్రాథమిక ఆధారాలున్నా రాజకీయ కక్షతోనే పిన్నెలి సోదరులపై కేసు నమోదు చేసినట్టు అర్థమవుతోంది. ఎస్పీపై ఆగ్రహం పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావుపై పలు రకాలుగా ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు సమాచారం. ఇది టీడీపీ నేతల మధ్య జరిగిన హత్య అని ప్రాథమిక విచారణ తర్వాత ఎస్పీ తెలిపారు. దీంతో టీడీపీ అనుకూల మీడియాలో ఎస్పీపై వ్యతిరేక కథనాలు రాయించి బెదిరించే ధోరణిని ఎమ్మెల్యే జూలకంటి అవలంబించాడు. వైఎస్సార్ సీపీ నేతలపై తాను చెప్పినట్టు కేసులు నమోదు చేయకపోవడం వల్లే హత్యలు జరిగాయంటూ ఆరోపించారు. ఎస్పీపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానంటూ మీడియాలో లీక్లు ఇచ్చి బెదిరించి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు బనాయించినట్టు తెలుస్తోంది. ఇది టీడీపీ నేతల మధ్య జరిగిన హత్య అంటూ తేల్చిన పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఎవరి ఒత్తిడితో మాట మార్చారో చెప్పాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జూలకంటి అసమర్థతే కారణం మా వెంట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడంటూ హంతకుల బెదిరింపు మేము రావడం చూసి హంతకులు పారిపోయారంటూ చెప్పిన ప్రత్యక్ష సాక్షి మరుసటి రోజు మాట మార్చి తప్పుడు ఫిర్యాదు టీడీపీలో ఆధిపత్య పోరుతోనే జెవిశెట్టి సోదరుల హత్య అంటూ ఎఫ్ఐఆర్లో ప్రస్తావన జెవిశెట్టి వెంకటేశ్వర్లకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన ఎమ్మెల్యే జూలకంటి తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన వ్యక్తికి రెండు కాళ్లు విరగొట్టినా పట్టించుకోని ఎమ్మెల్యే దీంతో హత్య చేసేందుకు సిద్ధపడిన తోట వెంకట్రామయ్య ఇరువర్గాల మధ్య రాజీ చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారంటూ తెలుగు తమ్ముళ్ల ఆరోపణ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు పిన్నెల్లి సోదరులపై కుట్ర గుండ్లపాడు టీడీపీ నాయకుల హత్యకు కారణం స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అసమర్థతే కారణమని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. గత కొంత కాలంగా గుండ్లపాడు తెలుగుదేశం పార్టీలో తారస్థాయికి చేరిన వర్గపోరును జూలకంటి పరిష్కరించి ఉంటే దశాబ్దకాలంగా పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలు హత్యకు గురయ్యేవారు కాదంటున్నారు. మరీ ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గుండ్లపాడులో ఉన్న జెవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య వర్గానికి, తోట వెంకట్రామయ్య వర్గానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు నెలలుగా అది మరింత ముదిరి ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసుకొనే వరకు దారి తీసింది. అందులో భాగంగా గత నెల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదమే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇందులో తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీనుపై హత్యకు గురైన జెవిశెట్టి మొద్దయ్య వర్గీయులు దాడి చేసి రెండు కాళ్లు విరిగగొట్టారు. అయినా మొద్దయ్యను ఎమ్మెల్యే ఏమనకపోవడం, పోలీసులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నాడన్న బాధ తోట వెంకట్రామయ్య వర్గంలో బలంగా నాటుకుపోయింది. మరోవైపు తాను ఫోన్ చేస్తే ఎమ్మెల్యే లిఫ్ట్ చేయడం లేదని, మొద్దయ్య మాటకే విలువిస్తున్నాడని వెంకట్రామయ్య ఒకరిద్దరు టీడీపీ స్థానిక నేతల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. -
నేడూ పొగాకు రైతుల నిరసన
చిలకలూరిపేట: నల్లబర్లీ పొగాకును వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ చిలకలూరిపేటలోని ఐటీసీ కంపెనీ వద్ద పొగాకు రైతులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. ఈ మేరకు రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు తెలిపారు. క్వింటా ధర రూ.15వేలకు తక్కువ కాకుండా బర్లీ పొగాకును కంపెనీల చేత ప్రభుత్వం కొనిపించాలని కోరారు. దీక్షకు రైతులు, రైతు సంఘాల నాయకులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. నేడు కోటప్పకొండలో యోగాంధ్ర నరసరావుపేట: కోటప్పకొండ శైవక్షేత్రం వద్ద యోగాంధ్ర కార్యక్రమం బుధవారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి.అరుణ్బాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు. విజయకీలాద్రిపై సుదర్శన హోమం తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం సుదర్శన హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి వారి మంగళాశాసనాలతో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటల నుంచి సర్వ రక్షాకర సుదర్శన హోమాన్ని నిర్వహించామని తెలిపారు. అమావాస్య రోజున హోమం, పారాయణం, శాంతులు, దానాలు చేయడం ఎంతో ఉన్నత ఫలితాలను ఇస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు పట్నంబజారు(గుంటూరుఈస్ట్) : బక్రీదు పండుగను పురస్కరించుకుని గోవుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ కె.సీతారామిరెడ్డి హెచ్చరించారు. జూన్ 7న జరిగే బక్రీదు పండుగ సందర్భంగా గేదెలు, ఇతర పశువులను అధిక సంఖ్యలో వాహనాల్లో తరలించి వధకు పాల్పడితే వారిపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేయడంతోపాటు, వాహనాలు సీజ్ చేస్తామన్నారు. వాహనాల్లో పశువులను తరలించే వారు ఎంవీఐ యాక్ట్ 1989, రూల్ 253 ప్రకారం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలని, అనంతరం తరలించాలని సూచించారు. శని జయంతి పూజలు మంగళగిరి టౌన్: శ్రీశనైశ్చర స్వామి జయంతిని పురస్కరించుకుని మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో మంగళవారం శనిజయంతి పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి తైలాభిషేకం, అర్చనలు, జపాలు, పూజలు నిర్వహించి పురోహితులకు నువ్వులు దానాలు ఇచ్చారు. దేవస్థానంలోని మల్లేశ్వరునికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థాన కార్యనిర్వహణాధికారి జేవీ నారాయణ తగు ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. ఎంపీహెచ్ఏలకు బదిలీ గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలో వివిధ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ కేడర్కు చెందిన 172 మందికి డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించి మలేరియా, డెంగీ, చికున్ గున్యా ప్రబలి ఉన్న పలు ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేశారు. ఈ ప్రక్రియలో డీఎంహెచ్ఓతోపాటు, పరిపాలన అధికారి లక్ష్మీకుమారి, జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, భక్తవత్సలం, సీనియర్ అసిస్టెంట్లు కిరణ్, రహీం పాల్గొన్నారు. -
కొండవీడుకోటలో ఉద్రిక్తత
● సందర్శకులు, స్ట్రైకర్ల మధ్య వాగ్వాదం ● గ్రామస్తులు సందర్శకుల కారు అడ్డగించి దాడి ● విచారణ ప్రారంభించిన పోలీసులు యడ్లపాడు: పర్యాటక కొండవీడుకోట ప్రాంతంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుంటూరు మిర్చి యార్డు సమీపంలోని సాయినగర్కు చెందిన లక్ష్మీప్రియ, భర్త ముని కోటేశ్వరరావు, కుమార్తె, మేనల్లుడు సోమవారం సాయంత్రం సందర్శనకు రాగా, కొండవద్ద ఉన్న స్ట్రైకర్ల (ఔట్సోర్సింగ్)తో వాగ్వాదం జరిగింది. స్ట్రైకర్ల సమాచారంతో గ్రామస్తులు సందర్శకుల కారును ఆపి దాడిచేసి, కారు అద్దాన్ని ధ్వంసం చేశారంటూ ఘటన స్థలం నుంచి బాధితులు పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు. చిలకలూరిపేట రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణతో కలిసి పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు. కొత్తపాలెం ఘాట్రోడ్డుకు చేరుకొని అటవీశాఖ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందితోపాటు గ్రామస్తులను కలిశారు. ఘటన సమయంలో విధుల్లో ఉన్న స్ట్రైకర్లు, అటవీశాఖ అధికారులు, గ్రామ పెద్దలతో మాట్లాడి ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితుల్ని తెలుసుకున్నారు. సమగ్ర విచారణ అనంతరం కేసులు నమోదు సోమవారం రాత్రి జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ తర్వాత కేసు నమోదు చేయనున్నట్లు సీఐ సుబ్బానాయుడు చెప్పారు. కొండవీడుకోటకు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఘాట్రోడ్డుపై విధుల్లో ఉన్న స్ట్రైకర్లు యూనిఫారమ్, గుర్తింపు కార్డులు లేకుండా విధులు నిర్వహించడమే ప్రధానంగా సందర్శకుల్లో అపోహలు కలగడానికి దారితీసినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. స్ట్రైకర్లు సహనం పాటించకపోవడం, గ్రామస్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతోనే స్థానికులు కారును అడ్డగించి దాడికి పాల్పడినట్లు తెలిసిందని వివరించారు. సోమవారం రాత్రి యడ్లపాడు పోలీసులకు ఘటన సమాచారం అందగానే కానిస్టేబుల్ కొత్తపాలెం గ్రామానికి చేరుకునేలోపు వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సందర్శకుల కారు నంబర్ ఆధారంగా వారి ఫోన్ నెంబర్లను సేకరించి, వ్యక్తులతో మాట్లాడి వాస్తవాలను తెలుసుకుంటామన్నారు. మంగళవారం సాయంత్రం వరకు బాధితుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు. సమగ్ర సమాచారం వెలుగులోకి వచ్చిన అనంతరం ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ బి సుబ్బానాయుడు స్పష్టం చేశారు. ఇకపై చర్యలు తప్పవు కొండవీడు ప్రాంతానికి వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టిని సారిస్తామని సీఐ చెప్పారు. స్టైకర్లు స్థానికులమనే భావన వీడి విధి నిర్వహణను బాధ్యతగా నిర్వహించాలని, సందర్శకుల పట్ల బాధ్యతగా ప్రవర్తించకుంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. పోలీసుల మొబైల్ నంబర్లను కొండవీడుకోట సందర్శకులకు కనిపించేలా పలుచోట్ల రాయించాలని ఎస్ఐను ఆదేశించామన్నారు. స్ట్రైకర్లు వారంరోజుల్లోగా యూనిఫాం, ఐడీకార్డులను సమకూర్చుకోవాలని, అవసరమైతే అటవీశాఖ అధికారులతో చర్చించనున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటన తిరిగి పునరావృతం కాకుండా పైచర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రశ్నించినందుకే దాడి చేశారు : లక్ష్మీప్రియ కొండవీడు సందర్శనకు వెళ్లి స్ట్రైకర్లు, కొత్తపాలెం గ్రామస్తుల దాడిలో గాయపడిన బాధితురాలు దాసరి లక్ష్మీప్రియ మంగళవారం ఫోన్లో మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్లో పనిచేశా, ప్రస్తుతం గుంటూరు సాయినగర్లో ఉంటూ బాలికలకు ఆత్మసంరక్షణపై అవగాహన తరగతులు బోధిస్తున్నట్లు తెలిపారు. కొండపై ఉన్న క్రీడాపార్కులో ఫొటోలు తీసుకునే ప్రయత్నం చేశాం, కొందరు యువకులు వచ్చి అడ్డుకున్నారు, మీరెవరంటూ ప్రశ్నించాం...వారిలో ఒకరు రూ.32 లక్షలు ప్రభుత్వానికి చెల్లించి లీజుకు తీసుకున్నామన్నాడు. ఐడీ, యూనిఫాంగాని ఎందుకు లేవని ప్రశ్నించినందుకు రెచ్చిపోయారు. ఆ తర్వాత కొండ కింద ఘాట్రోడ్డు చెక్పోస్టు వద్ద ఈ విషయంపై ఫిర్యాదు ఇవ్వాలని వస్తే అటవీశాఖ, పోలీసు అధికారులు లేరని చెప్పారు. అంతా యువకులే ఉన్నారు, మా కారును వెంటాడుతూ బైకుల పైన ఉన్న యువకులు వచ్చారు. అక్కడ కూడా వాగ్వాదం జరిగింది. వారు మా పాపపై చేయి వేయడంతో దూషించిన మాట వాస్తవమే. అయితే ఊరు దాటి వెళ్లలేవంటూ కారులో వెళ్లే మమ్మల్ని గ్రామంలో చెత్తవాహనాలు, బైక్లు అడ్డుగా పెట్టి దాడి చేయించారని తెలిపారు. కారు అద్దాలు ధ్వంసం చేసి కిందకు లాక్కెళ్లి మా కుటుంబ సభ్యులందరి చేతుల్ని వెనక్కి విరిచి క్షమాపణలు చెప్పించారు. పవన్ అభిమానులమని చెబితే, మాకు అంతకంటే ఎక్కువ ఉంది ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకోమంటూ దాడిచేశారని వాపోయింది. ఆ సమయంలో ఇద్దరు పోలీసులు వచ్చారని, వారు చూసీచూడనట్లు వ్యవహరించారని తెలిపింది. యడ్లపాడు ఎస్ఐకి ఫోన్చేసినా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మా తప్పు ఉంటే మమ్మల్ని పోలీసులకు అప్పగించాలి గానీ దాడి చేయడం ఏమిటని ప్రశ్నించింది. రాష్ట్రంలో వీరమహిళలకు అన్యా యం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదా...అందుకే ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని మంగళవారం సచివాలయంలో ఫిర్యాదు చేసినట్లు లక్ష్మీప్రియ చెప్పారు. -
పరాకాష్టకు రెడ్ బుక్ పాలన: విడదల రజిని
సాక్షి, గుంటూరు: గుండ్లపాడు జంట హత్యలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరూ టీడీపీ నేతలే.. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. జూలకంటి అనుచరులు హత్యలు చేస్తే పిన్నెల్లిపై కేసులు పెడతారా’’ అంటూ విడదల రజిని నిలదీశారు. రాజకీయ కక్షతో అక్రమంగా పిన్నెల్లి బ్రదర్స్పై కేసు నమోదు చేశారని ఆమె ధ్వజమెత్తారు.‘‘రాష్ట్రంలో ఏడాది కాలం నుంచి అరాచకం రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇప్పుడు రెడ్ బుక్ పాలన పరాకాష్టకు చేరింది. నాలుగు రోజుల క్రితం మాచర్ల నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో మర్డర్ జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలుగుదేశం వారే చంపారని చెబుతున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ చంపిన వారు, చనిపోయిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే అని ప్రకటించారు...డబుల్ మర్డర్లకు ఉపయోగించిన కారు వెనక జూలకంటి బ్రహ్మారెడ్డి అనే స్టిక్కర్ కూడా ఉంది. చనిపోయిన వారు చంపిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ వారి అయినప్పుడు ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్కు ఏంటి సంబంధం?. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిపై అక్రమంగా కేసు బనాయించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ ను ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ మారుస్తున్నారు. వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పై పెట్టిన అక్రమ కేసును తొలగించాలి. లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని విడదల రజిని హెచ్చరించారు.కట్టుకథలతో కేసులో ఇరికించారు..మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతో ఇద్దరు మర్డర్ అయ్యారు. చంపింది తెలుగుదేశం నాయకులు.. చనిపోయింది తెలుగుదేశం నాయకులే అని పల్నాడు SP ప్రకటించాడు. కట్టుకథలతో అద్భుతంగా ఫిర్యాదు ఇచ్చారు. అక్రమంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడిని కేసులో ఇరికించారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
● జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ● పోలీసు పీజీఆర్ఎస్కు 75 ఫిర్యాదులు నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి ప్రజల నుంచి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం, చోరీలు తదితర సమస్యలకు సంబంధించిన 75 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుని సమస్యను శ్రద్ధగా విని, నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. పొలాన్ని ఆక్రమించారు కోనూరు ఇసుక రీచ్లో అక్రమంగా ఇసుక తోడుతుంటే నేను ఆర్డీఓ, కలెక్టర్లకు ఫిర్యాదు చేశాను. ఈ పనిచేశానని ఎమ్మెల్యే అనుచరులు నాపై కక్ష కట్టి, నా మూడెకరాల పొలాన్ని ట్రాక్టర్తో దున్నారు. కౌలు రైతులను బెదిరిస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయండి. –శాఖమూరి శ్రీనివాసరావు, కోనూరు, అచ్చంపేట -
అ‘పూర్వ’ సమ్మేళనం
● తెనాలి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ జూనియర్ కాలేజీ 1995–97 బ్యాచ్ ఇంటర్ పూర్వ విద్యార్థుల సమావేశం ● 28 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రులు గుంటూరు మెడికల్: తెనాలి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మెమోరియల్ జూనియర్ కాలేజ్లో 1995–97 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదివిన పూర్వ విద్యార్థులు సోమవారం మంగళగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో, ఇతర రాష్ట్రాల్లో వివిధ వృత్తుల్లో, హోదాల్లో స్థిరపడిన మిత్రులంతా 28 సంవత్సరాల అపూర్వ వేడుకలకు హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. పలువురు తమ కుటుంబ సభ్యులతో హాజరై కాలేజీ రోజుల్లో చేసిన చిలిపి పనులు గుర్తు చేసుకుని నాటి జ్ఞాపకాల్లో విహరించారు. సీఐలు రాంబాబు, రమేష్, ఎస్ఐ రాజారావు, కానిస్టేబుళ్లు సుబ్బారావు, ఆనంద్, బాబూరావు, కోటి, సుబ్బు, సీఆర్పీఎఫ్కు చెందిన అనిల్, పలువురు వైద్య సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. -
డల్లాస్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన, సంక్షేమం దక్కాయని అవర్ స్టేట్.. అవర్ లీడర్ సభ్యుడు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. యూఎస్ఏ పర్యటనలో ఉన్న కిరణ్కుమార్ రెడ్డి సోమవారం డల్లాస్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రజల్లో విశ్వసనీయత, ఆదరాభిమానాలు పొందారని అన్నారు. ప్రజా సంక్షేమంతో పాటు వారి కుటుంబాలు, పిల్లల అభివృద్ధిని తన ఆనందంగా భావించి, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ఆశించారని అన్నారు. యుఎస్ఏలోని అవర్ స్టేట్ – అవర్ లీడర్ సభ్యుడు శివ అన్నపురెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, సంక్షేమ కార్యక్రమాలను నిర్విరామంగా అమలు చేసేందుకు కోవిడ్ ప్రభావంతో రెండేళ్ల పాటు ఎన్నో ఆర్థికపరమైన సవాళ్ళను ఎదుర్కొన్నారని తెలిపారు. సంతమాగులూరు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు, అరెస్టుల పర్వం మినహా ప్రజా సంక్షేమం, ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఆలోచన లేకుండా పోయిందన్నారు. ఈసందర్భంగా అవర్ స్టేట్ – అవర్ లీడర్, ఇంటలెక్చువల్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.శాంతమూర్తి మాట్లాడుతూ గ్రూపునకు చెందిన 700కు పైగా సభ్యులు రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలు, దేశాల్లో వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపర్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రమణారెడ్డి, డాక్టర్ రామిరెడ్డి, ప్రసాద్ భీమవరపు, సాంబిరెడ్డి, పాల్ రెడ్డి, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సాతి’పై అవగాహన కార్యక్రమం
గుంటూరు లీగల్: హైకోర్ట్ ఆదేశాల మేరకు నాల్గో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్టేక్ హోల్డర్స్కు ‘సాతి’ (సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సిస్ త్రూ ట్రాకింగ్, హాలిస్టిక్ ఇంక్లూషన్) పై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొని సాతి డిస్ట్రిక్ట్ కమిటీ విధి, విధానాల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదే శాల మేరకు, ఆధార్ నమోదు, న్యాయ సహాయం, సంక్షేమ పథకాలతో అనుసంధానం ద్వారా అనాథ పిల్లలను గుర్తించి, వారికి సహాయం చేయడానికి సాతి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ ఒక్క బిడ్డ గుర్తింపు లేకుండా, వారి హక్కులు, అర్హతలకు దూరంగా ఉండకుండా చూసుకోవడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. వీధి బాలలు, అనాథలు, రక్షించబడిన పిల్లలు వంటి 18 సంవత్సరాల లోపు నిరాశ్రయులైన పిల్లలందరికీ చట్టపరమైన గుర్తింపును అందించడం, వారికి ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్యం, రక్షణ సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కమిటీలో సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్ పర్సన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి యూఐడీఏఐ ప్రతినిధి, ప్రతి తాలూకా తహసీల్దార్లు, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా ఆరోగ్య అధికారి, సివిల్ సర్జన్, జిల్లా శిశు అభివృద్ధిశాఖ అధికారి, జువైనెల్ యూనిట్ నుంచి పోలీస్ అధికారి, అనాధ శరణాలయాలు, బాలల సంరక్షణ సంస్థల ప్రతినిధులు ఐదుగురు, ప్యానల్ లాయర్లు నలుగురు, పారా లీగల్ వలంటీర్లు నలుగురు సభ్యులుగా ఉంటారన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
అచ్చంపేట: వుండలంలోని గింజుపల్లి వద్ద కృష్ణానదిలో ఈతకెళ్లిన వ్యక్తి ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. కాగా అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపల పడవల ద్వారా ఈతగాళ్ల సహాయంతో విస్తృత గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి 9.30 సమయంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నకరికల్లు మండలం చాగళ్లు గ్రామానికి చెందిన ఆలపర్తి సైదారావు(43) మాదిపాడు పంచాయతీ పరిధిలోని సత్తెమ్మతల్లి దేవాలయం వద్ద మొక్కుబడులు తీర్చుకుని సమీపంలోని గింజుపల్లి వద్ద కృష్ణానదిలో తన స్నేహితులతో కలసి ఈతకొట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. అచ్చంపేట సీఐ కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వ్యక్తి అనుమానాస్పద మృతి క్రోసూరు: మండలంలోని విప్పర్ల, ఊటుకూరు గ్రామాల ప్రధాన రహదారిపై ఒంటిపై తీవ్ర గాయాలపై వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెంది ఉండడం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు, క్రోసూరు ఎస్ఐ పి.రవిబాబులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు జరిపారు. మృతుడు క్రోసూరు మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన కుంభా సాంబశివరావు(35)గా గుర్తించారు. తన ద్విచక్రవాహనం పక్కన ఒంటిపై తీవ్ర గాయాలతో చొక్కా లేకుండా పడి ఉండటాన్ని గమనించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. క్లూస్టీం, డ్వాగ్ స్క్వాడ్ను తెప్పించారు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరుకు చెందిన వాడు. క్రోసూరు మండలంలోని అనంతవరం గ్రామానికి చెందిన అనంతమ్మను వివాహం చేసుకుని సుమారు 10 సంవత్సరాల నుంచి అనంతవరంలోనే ఉంటున్నట్లు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. -
అవగాహనతోనే నకిలీలకు అడ్డుకట్ట
కొరిటెపాడు(గుంటూరు): ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో రైతులు పొలం పనులకు సమాయత్తమవుతున్నారు. జూన్ నెల నుంచి ఖరీఫ్ సీజన్ విత్తనాలు చల్లే పనులు ప్రారంభం అవుతాయి. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అంటగట్టి అందినంత దోచుకునేందుకు అదునుగా ఎదురుచూస్తున్నారు. వీరి బారిన పడకుండా ఉండాలంటే రైతులు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వ్యాపారులు చేస్తున్న అక్రమాలను గుర్తించి ప్రశ్నించగలరని అధికారులు చెబుతున్నారు. అన్నింటా మోసం.. విత్తనాలు కొనుగోలు చేసి పొలంలో వేసుకున్న తర్వాత మొలకలు పూర్తిగా రాకపోవడం, తక్కువ శాతం మొలకలు రావడం జరిగితే నాశిరకం విత్తనాలు ఇచ్చి వ్యాపారి తమను మోసం చేశారని రైతులు అనుకుంటారు. ఒక్క విత్తనాలు అనుకుంటే పొరపాటే. విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందులు.. ఇలా ప్రతి వ్యాపారంలోనూ మోసాలు జరుగుతుంటాయి. పరిశీలన తప్పనిసరి.. ప్రభుత్వ అనుమతి పొంది వ్యాపారం చేస్తున్న డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. రశీదులు(బిల్లులు) ఇవ్వని దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేయకపోవడమే మంచిది. కొనుగోలు చేసిన విత్తనాల సంచుల(బ్యాగ్)కు సీల్ వేసి ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. సీల్ వేసి ఉన్న సంచులనే కొనుగోలు చేయాలి. సంచులపై కంపెనీ పేరు, తయారీ, గడువు తేదీలు, నికర బరువు, విత్తన రకం, తేమ శాతం.. తదితర అంశాలను సరిచూసుకోవాలి. పొలంలో విత్తనాలు వేసుకున్న తర్వాత సంచులను, రశీదులను, సంచులపై ఉన్న సమగ్ర వివరాలను తెలియజేసే పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో మోసం జరిగితే వినియోగదారుల చట్టం ప్రకారం పరిహారం పొందేందుకు ఇవే కీలకమవుతాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి కొనుగోలు సమయంలో రశీదు తప్పనిసరి నకిలీలను గుర్తిస్తే.. పొలంలో వేసిన విత్తనాలకు మొలకలు రాకపోతే నకిలీ విత్తనాలుగా భావిస్తారు. దిగుబడి పూర్తిగా రాకపోయినా నకిలీ విత్తనాలుగానే భావించవచ్చు. వెంటనే వ్యవసాయశాఖ ఏఓ, ఏడీఏ, డీఏఓ, పోలీసులకు అన్ని రకాల రశీదులతో రైతుకు జరిగిన నష్టాన్ని, విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారో తెలియజేస్తూ ఫిర్యాదు చేసి రశీదు ఉంచుకోవాలి. ధ్రువీకరించేందుకు శాస్త్రవేత్తలను అధికారులు తీసుకువస్తారు. పోలీసులు, వ్యవసాయాధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. –నున్నా వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు. -
ముస్లింల చైతన్యానికి రాజకీయ వేదిక
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల నిర్ణయం తెనాలి: ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (ఎంయూఎఫ్)ను బలోపేతం చేసుకుంటూ అనుబంధంగా రాజకీయ చైతన్య వేదికను ఏర్పాటు చేయాలని ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం తీర్మానించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంయూఎఫ్ ముఖ్యనేతల సమావేశం ఆదివారం స్థానిక చినరావూరులోని సీనియర్ నేత షేక్ ఖలీల్ అధ్యక్షతన జరిగింది. ప్రస్తుత రోజుల్లో ఎంయూఎఫ్ ఆవశ్యకత అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆ సంస్థ అధ్యక్షుడు ఎండీ కలీం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ గత 28 ఏళ్లుగా పార్లమెంట్ వ్యవస్థను విశ్వసిస్తూ, ప్రజాస్వామ్య లౌకికవాద విధానాలను అవలంభిస్తూ, ఎన్నో కార్యక్రమాలతో ముస్లింల న్యాయమైన హక్కులను సాధించేందుకు కృషిచేసినట్టు గుర్తుచేశారు. అధ్యక్షత వహించిన షేక్ ఖలీల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంయూఎఫ్ను గుంటూరు ఉమ్మడి జిల్లాలో బలోపేతం చేసేందుకు 17 నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు ముఖ్యనేతలంతా కృషిచేయాలని కోరారు. ముస్లింలను రాజకీయంగా చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నందున ముస్లిం యునైటెడ్ ఫ్రంట్కు అనుబంధంగా రాజకీయ చైతన్య వేదిక ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సమావేశంలో ప్రవేశపెట్టారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించటంతో తీర్మానం చేశారు. గుంటూరు జిల్లా ముఖ్య నాయకులు షేక్ కరీముల్లా (ప్రత్తిపాడు), ఎంఏ సాలార్ (వినుకొండ), షేక్ ఇబ్రహీం (పెదకూరపాడు), మెమన్ భాష, సయ్యద్ జాఫర్ (పొన్నూరు), సయ్యద్ జాకీర్ హుస్సేన్ (తాడికొండ ), సయ్యద్ ఆదమ్ సాహెబ్ (గుంటూరు వెస్ట్), సయ్యద్ గౌస్ బాషా, షేక్ వహీద్ (గుంటూరు ఈస్ట్)తోపాటు తెనాలి నియోజవర్గంలోని మండలాల నాయకులు పాల్గొన్నారు. -
పిన్నెల్లి సోదరులపై హత్య కేసు మోపడం దారుణం
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శివనాగేశ్వరరావు సత్తెనపల్లి: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులపై హత్యా కేసు మోపడం దారుణమని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇరువురు టీడీపీ కార్యకర్తలైన జెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య, ఆయన సోదరుడు కోటేశ్వరరావులను ఈ నెల 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం లోని బోదేలవీడు – మండాది గ్రామాల మధ్య జరిగిన హత్యలు టీడీపీలోని రెండు వర్గాల ఆదిపత్య పోరులో భాగంగా జరిగాయని, ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోకుండా రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై అక్రమంగా, అన్యాయంగా హత్యానేరం మోపడం దారుణమైన విషయమన్నారు. ఈ కేసుకు పిన్నెల్లి సోదరులకు ఏ విధమైన సంబంధం లేదని, తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాలకు గతం నుంచే ఆదిపత్య్హ పోరు ఉందని ఒక వర్గంపై మరొక వర్గం గతం నుంచే గొడవలు పడేవారని గ్రామస్తులు చెబుతున్నా పోలీసు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. హామీల అమలుపై దృష్టి మరల్చేందుకే.. రాష్ట్రంలోని 175 నియోకవర్గాలల్లోని వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టించడమే రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగమని విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో తల్లికి వందనం ఇస్తానని, రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తానని, మహిళలకు 3 గ్యాస్ సిలెండర్లు ఇస్తానని, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తానని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని, ప్రతి మహిళకు నెలకు రూ.1,500 నగదు ఇస్తామని, ఇంటింటికి సూపర్ సిక్స్ పేరు చెప్పి మాయమాటలతో అధికారంలోనికి వచ్చిన కూటమి నేడు ఆ హామీలు ఒక్కటైనా అమలు చేయకుండా, ప్రజల దృష్టి మరల్చేందుకే ఇటువంటి డ్రామాలు ఆడుతోందని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు చేసే అక్రమాలు, అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని వాటికి త్వరలోనే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. -
కీటక జనిత వ్యాధులపై అప్రమత్తత అవసరం
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు మెడికల్: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో సోమవారం మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్లతో కీటక జనిత వ్యాధుల నివారణపై సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎంహెచ్ఓ మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా మెజర్స్ అమలు చేయాలన్నారు. అడల్డ్ మస్కిటో మెజర్స్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగీ, మలేరియా వంటి దోమ కాటు వ్యాధులను గణనీయంగా తగ్గించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత వల్ల దోమలు దరిచేరవని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజునాయక్, ఏఎంఓ ప్రభాకర్రెడ్డి, ఘంటసాల శ్రీనివాసరావు, నరేంద్రబాబు, ప్రశాంత్, సబ్ యూనిట్ ఆఫీసర్లు శేషగిరిరాజు, శ్రీమన్నారాయణ, శిగణేష్ పాల్గొన్నారు. -
విద్యుత్ లైను పనులు అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోండి
బొల్లాపల్లి మండలం గండిగనుముల గ్రామంలో 50 సుగాలీ కుటుంబాల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విద్యుత్ లైన్ పనులు అడ్డుకుంటున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వారు ఇప్పటివరకు సింగిల్ ఫేస్తో లోఓల్టేజ్ కారణంగా ఇబ్బందిపడుతుండగా త్రీ ఫేస్ సౌకర్యం కలిగించేందుకు పనులు చేపట్టారు. లైను వేయకుండా స్థానిక రామావత్ రామునాయక్, విద్యుత్ లైన్మెన్ రామావత్ బాలాజీ నాయక్, పోస్టుమాస్టర్ తవ్వా నాయక్ అడ్డుకుంటున్నారన్నారు. అవసరమైతే ప్రాణాలైనా తీస్తామని వారు బెదిరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోండి. – ప్రజాసంఘాల నాయకులు -
విద్యాశాఖ బదిలీలలు
గుంటూరుఎడ్యుకేషన్: బదిలీలకు తెరలేచిందనే ఆనందం ఉపాధ్యాయుల్లో ఎక్కువ కాలం నిలిచేలా లేదు. ఎందుకంటే బదిలీకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో కోరుకున్న పాఠశాలకు వెళ్లడం గగనమవుతోంది. ఒకవైపు బదిలీలు చేపడుతున్నామంటూనే మరోవైపు గతంలో ఎన్నడూ లేని రీతిలో విధించిన నిబంధనలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నా రు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ముగియనుంది. ఇందుకు సంబంధించి జీఓ 22 ద్వారా విడుదల చేసిన మార్గదర్శకాలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు. పుట్టుకతో శారీరక వైకల్యానికి గురైన ఉపాధ్యాయులకు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ద్వారా వారు కోరుకున్న పాఠశాలకు వెళ్లే సదుపాయంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. శారీరక వైకల్యం 70 శాతం లోపు ఉంటే ప్రాధాన్యత క్రమంలో పాయింట్లు, 70 శాతానికి పైగా ఉంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీలో సంబంధిత ఉపాధ్యాయులు వారు పని చేస్తున్న పాఠశాలలకు బదిలీపై వెళ్లవచ్చు. గత 25 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ఈ విధానాన్ని మార్చివేసి ఎస్జీటీలకు 40 శాతం, స్కూల్ అసిస్టెంట్లకు 50 శాతం సీలింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కక్షపూరితంగానే..! శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బదిలీల ప్రక్రియలో భాగంగా ఒకే పాఠశాలలు ఐదు విద్యాసంవత్సరాలు పూర్తి చేసుకున్న గ్రేడ్–2 హెచ్ఎం, ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి. ● ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఒకరు లేక ఇద్దరు ఎస్జీటీలు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు లాంగ్ స్టాండింగ్ విధానంలో బదిలీపై వెళ్లేందుకు పీహెచ్ కేటగిరీ ఉపాధ్యాయులకు అవకాశం లేదు. ముగ్గురి కంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉంటేనే సదరు పాఠశాలలను కోరుకోవాలని లేకుంటే మరో పాఠశాలకు వెళ్లాలంటూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వం, సీలింగ్ పరిధికి మించిన పాఠశాలలను బ్లాక్ చేసింది. ● పుట్టుకతో అంధత్వం, వినికిడి లోపంతో పాటు నడవలేని స్థితిలో ఉన్న ఉపాధ్యాయులకు గతంలో తాము పని చేస్తున్న పాఠశాలల్లోనే బదిలీ కాకుండా ఉండటంతో పాటు కోరుకున్న చోటకు బదిలీపై వెళ్లే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం ఈ సదుపాయం లేకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీకి ప్రభుత్వం కొత్త భాష్యం చెబుతోంది. ● శారీరక వైకల్యంతోపాటు దీర్ఘకాలిక జబ్బులు, కేన్సర్, గుండె జబ్బులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు హైస్కూళ్లలో సింగిల్ సబ్జెక్టు టీచర్లుగా బదిలీపై వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. అంధ, వినికిడి లోపం, నడవలేని స్థితిలో ఉన్నవారికి సైతం కోరుకున్న పాఠశాలలకు వెళ్లే అవకాశం లేకుండా కఠిన నిబంధనలు విధించారు. ప్రతి మండలంలో 15 వరకు ఖాళీలు ఉండగా, వాటిలో కేవలం ఐదు స్థానాలు మాత్రమే కోరుకునే విధంగా ఉంచి, మిగిలిన వాటిని బ్లాక్ చేశారు. ● దూరప్రాంతాల్లో మగ్గుతూ వైద్య సదుపాయాల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లాలని ఆశపడుతున్న టీచర్లకు మొండిచెయ్యి చూపారు. భర్త చనిపోయిన మహిళా ఉపాధ్యాయులకు విడాకులు తీసుకున్న ఉపాధ్యాయినులకు సైతం నిరాశే ఎదురవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న ఉపాధ్యాయులకు సైతం అన్యాయానికి గురవుతున్నారని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆర్థికంగా భారం లేని బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘాలతో జరిపిన చర్చలకు, మార్గదర్శకాలకు పొంతన లేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. బదిలీలకు అవకాశం ఇచ్చి.. కఠిన నిబంధనలతో మోకాలొడ్డి.. శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారిపై కనీస మానవత్వం కరవు 25 ఏళ్లుగా అమలులో ఉన్న ప్రిఫరెన్షియల్ కేటగిరీపై ఆంక్షలు ఉపాధ్యాయ బదిలీలకు నేటితో ముగియనున్న గడువు ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాఖలైన దరఖాస్తులు 6,870 లాంగ్ స్టాండింగ్లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్లు 4,143 మంది ఉమ్మడి జిల్లాలో 6,870 దరఖాస్తులు ఉపాధ్యాయ బదిలీల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ముగియనుండగా, సోమవారం నాటికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 6,870 మంది ఉపాధ్యాయులకు బదిలీలకు దరఖాస్తు చేశారు. వీరిలో లాంగ్ స్టాండింగ్లో తప్పనిసరి బదిలీ కావాల్సిన హెచ్ఎంలు, టీచర్లు 4,143 మంది ఉన్నారు. మానవత్వం లేకుండా మార్గదర్శకాలు బదిలీల మార్గదర్శకాల్లో విద్యాశాఖాధికారులు ఇష్టారాజ్యంగా నిబంధనలు విధించారు. పీహెచ్ కేటగిరీ తోపాటు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చెందిన ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం చేస్తూ పాఠశాలల్లో ఖాళీలను బ్లాక్ చేశారు. శారీరక వైకల్యానికి గురైన ఉపాధ్యాయుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పీడబ్ల్యూడీ చట్టానికి వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. వైకల్యాన్ని అధిగమించి, ఎంతో కష్టపడి చదువుకుని ఉద్యోగం పొందిన వారిపై మానవత్వంతో వ్యవహరించాల్సినదిపోయి ఈ విధంగా కఠిన నిబంధనలు విధించడం దుర్మార్గం. – కె.బసవలింగారావు, జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్వైకల్యంతో పుట్టడం మా తప్పా ? నేను గుంటూరు రూరల్ ఓబులనాయుడుపాలెంలోని ఎంపీయూపీఎస్లో పని చేస్తున్నాను. 70 శాతానికి పైగా శారీరక వైకల్యానికి గురైన నేను బదిలీల్లో గుంటూరుకు సమీపంలోని పాఠశాలలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా చేశారు. ఉపాధ్యాయ బదిలీల చట్టంలో లేని విధంగా జీఓలో అనేక కఠిన నిబంధనలు విధించారు. శారీరక వైకల్యంతో జన్మించడం నా తప్పిదమా ? మానవత్వాన్ని చూపాల్సిన ప్రభుత్వం, అధికారులు ఈ విధంగా నిబంధలు విధించి పీహెచ్ కేటగిరీ ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం తగదు. – పి.నాగశివన్నారాయణ, ఎస్జీటీ, గుంటూరు -
పిన్నెల్లి సోదరులపై హత్య కేసు ఉపసంహరించాలి
నరసరావుపేట: మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో హత్యకు గురైన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కేసులో పిన్నెల్లి సోదరులపై బనాయించిన అక్రమ కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దీనిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. నరసరావుపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామంలో జెవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు కోటేశ్వరరావులను టీడీపీలోని ప్రత్యర్థులు జెవిశెట్టి శ్రీనివాసరావు, తోట వెంకటరామయ్యలు హత్య చేశారని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారన్నారు. ఆ గ్రామంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్యలు జరిగాయని ఎస్పీ ఒక వీడియోను మీడియాకు రిలీజ్ చేశారన్నారు. తోట చంద్రయ్య హత్యతో ఈ హత్యకు ఎటువంటి సంబంధంలేదని కూడా ఎస్పీ చెప్పడం జరిగిందన్నారు. ఈ నేరానికి సంబంధించిన ఐదుగురు నిందితులను కూడా అరెస్ట్ కూడా చేశారన్నారు. ఆ విధంగా జరిగిన హత్యలపై ఎస్పీ చెప్పిన తర్వాత కూడా నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులుగా, ప్రభుత్వ విప్గా పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైన, ఒక ఏడాది కాలంగా ఊళ్లోలేని, ఎక్కడున్నాడో కూడా తెలియని అతని తమ్ముడు వెంకటరామిరెడ్డిపై కేసు బనాయించడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. చనిపోయిన వారు, చంపిన వారు ఇద్దరు టీడీపీ వారేనని అందరూ చెప్పుకుంటున్నారన్నారు. ఇది కేవలం కక్ష సాధింపు ధోరణితోనే ఇటువంటి చర్యలు చేపడుతున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. గురజాల సబ్ డివిజన్లో రెండు నెలల నుంచి డీఎస్పీ లేడని, ఎందుకు పోస్టింగ్ వేయలేకపోతున్నారని ప్రశ్నించారు. గ్రామంలో పల్లెనిద్ర చేసిన ఎస్పీ, ఇన్చార్జి డీఎస్పీ అక్కడ సమస్యలు విని మీకు ఏమైనా సమస్యలు ఉంటే జెవిశెట్టి వెంకటేశ్వర్లుకు చెప్పమని కూడా చెప్పారన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదని ఉద్దేశంతో ఎస్పీ, డీఎస్పీ, ఇంతమంది పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా వెళ్లి చెప్పినప్పటికీ ఈ హత్యలు జరిగాయంటే దీనికి పోలీసుల బాధ్యతలేదా అని ప్రశ్నించారు. ఒక గ్రామంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంటే టీడీపీ నాయకుడు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారని ప్రశ్నించారు. ఈ హత్యను అరెస్టు చేసి న ఆ ఐదుగురు నిందితులే చేశారని ప్రత్యక్ష సాక్షి మృతుల బావమరిది స్వయంగా చెప్పాడని అన్నా రు. దీనిపై హైకోర్టు కూడా వెళ్తామని తెలియజేస్తూ, తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి -
విద్యుత్ బకాయిలు వసూలు చేయండి
నరసరావుపేట: వినియోగదారులకు మెరుగైన సేవలతోపాటు విద్యుత్ బకాయిలను వసూలు చేసి సంస్థ ప్రగతికి తోడ్పడాలని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పుల్లారెడ్డి కోరారు. నూతనంగా ఏర్పడిన జిల్లాల పర్యవేక్షణలో భాగంగా సోమవారం పల్నాడు సర్కిల్ని సందర్శించారు. జొన్నలగడ్డలోని సర్కిల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. పలు విషయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే విద్యుత్ జేఏసీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి కార్మికుల సమస్యలు తీర్చాలని, నూతనంగా ఏర్పడిన సర్కిల్లో శాశ్వత ఉద్యోగులను నియమించాలని కోరారు. పల్నాడు జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ పి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్.రాంబట్లు, ఆర్ బంగారయ్య, అధికారులు పాల్గొన్నారు.అధికారులతో సమీక్ష చేసిన సీపీడీసీఎల్ చైర్మన్, ఎండీ పుల్లారెడ్డి -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 171 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్, డీఆర్ఓ ఏకా మురళి, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగుడి సమస్య తెలుసుకున్న కలెక్టర్ బొల్లాపల్లికి చెందిన ఎం.సుధాకర్ అనే దివ్యాంగుడు పింఛన్ కోసం వీల్ఛైర్లో వచ్చాడు. కలెక్టర్ స్వయంగా అతని వద్దకు వెళ్లి సమస్య అడిగి తెలుసుకొని సెర్ఫ్ సీవోతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజల నుంచి 171 అర్జీలు స్వీకరించిన కలెక్టర్, అధికారులు -
పొగాకు రైతుకు అండగా వైఎస్సార్ సీపీ
అద్దంకి: పొగాకు రైతుకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం పొదిలి వస్తున్నారని చెప్పా రు. దీనికి సంబంధించి బాపట్ల జిల్లాలోని స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతులు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం నల్ల బర్లీ సాగు చేసిన రైతు పరిస్థితి జీవన్మరణ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు దిగుబడులు పడిపోవడం, మరో వైపు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు. అందుకే పొగాకు రైతుల తరఫున పోరాటం చేసేందుకు, వారికి ధైర్యం కల్పించేందుకు జగన్ పొదిలి రానున్నట్లు చెప్పారు. అయితే టీడీపీ నాయకులు, అక్కడ హడావుడి చేసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కానీ తమ నేత అనుకున్న కార్యక్రమం పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. చేతనైతే రైతులకు సాయం చేసే విధంగా ఉండాలే తప్ప వారికి మేలు జరిగే పనిని అడ్డుకోవాలనుకుంటే ప్రజలు బుద్ధి చెప్పి తీరు తారన్నారు. తమ పార్టీ తరఫున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ జాయింట్ సెక్రటరీ పులికం కోటిరెడ్డి, ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ కె.అంకారావు ఉన్నారు. -
తారస్థాయికి చేరిన కూటమి కుట్రలు
సాక్షి, నరసరావుపేట: ప్రజల కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు తారస్థాయికి చేరాయని మాజీ మంత్రి విడదల రజిని వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో సోమవారం ఆమె స్పందించారు. గుండ్లపాడులో జరిగిన డబుల్ మర్డర్ పూర్తిగా టీడీపీలో ఆధిపత్యపోరుతో జరిగిందని ప్రత్యక్షసాక్షులు, పోలీసులు చెబుతున్నా ప్రభుత్వం కావాలనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు నమోదు చేసిందన్నారు. హత్య జరిగిన ప్రదేశంలో చంపడానికి ఉపయోగించిన జేబీఆర్ పేరుతో టీడీపీ నేత కారు దొరికినా ఇంకా వైఎస్సార్సీపీపై నెపం వేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గతంలో తోట చంద్రయ్య హత్య విషయంలోనూ ఇలానే శవరాజకీయాలు చేశారని గుర్తుచేశారు. ఇప్పటికే పిన్నెల్లిపై అనేక అక్రమ కేసులతో వేధించారని మరోసారి ఆయనపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఇంత బరితెగించి గతంలో ఏన్నడూ అక్రమ కేసులు పెట్టిన దాఖలాలు లేవన్నారు. పోలీసులు సైతం ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి అక్రమ కేసులు నమోదు ఆ శాఖకు మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. ఈ విషమ సంస్కృతిని కూటమి ప్రభుత్వం విడనాడాలని లేకపోతే భవిష్యత్తులో వీటన్నింటికి సమాధానాలు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు అండగా నిలిచి వారిని కాపాడుకుంటామన్నారు. ఏమాత్రం సంబంధంలేని కేసుల్లో వైఎస్సార్సీపీ నేతలను ఇరికిస్తున్నారు గుండ్లపాడు హత్యలు పూర్తిగా టీడీపీ వర్గపోరుతోనే జరిగాయి కావాలనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు నమోదు మాజీ మంత్రి విడదల రజిని -
చంపిందేమో జూలకంటి అనుచరులు.. కేసేమో పిన్నెల్లిపై!
సాక్షి, టాస్క్ఫోర్స్: టీడీపీలోని ఆధిపత్య పోరుతోనే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జంట హత్యలు జరిగాయని సాక్షాత్తూ జిల్లా ఎస్పీ ప్రకటించినా.. ప్రత్యక్ష సాక్షి అయిన మృతుడి అల్లుడు వెల్లడించినా కూడా కూటమి సర్కార్ బరితెగించి నీచ రాజకీయాలు చేస్తోంది. కళ్లెదుటే వాస్తవాలు కనిపిస్తున్నా.. రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించింది. జూలకంటి ఫ్లెక్సీతో మొదలైన గొడవ.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తోట చంద్రయ్య హత్య అనంతరం గ్రామ టీడీపీ నాయకత్వం జవిశెట్టి వెంకటేశ్వర్లు చేతిలోకి వెళ్లింది. ఇది టీడీపీ నాయకుడు తోట వెంకట్రామయ్య వర్గానికి ఇబ్బందికరంగా మారింది. కొంతకాలంగా ఇరువర్గాలు విడివిడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి జన్మదినం సందర్భంగా తోట వెంకట్రామయ్య వర్గానికి చెందిన ఉప్పుతోళ్ల శ్రీను గత నెలలో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్న వీధిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. దీంతో వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన వర్గంతో కలిసి శ్రీనుపై దాడి చేసి రెండు కాళ్లు విరగ్గొట్టాడు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న తోట వెంకట్రామయ్య పక్కా కుట్రతో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావును కారుతో ఢీకొట్టి పాశవికంగా హత్య చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడైన తోట వెంకట్రామయ్యదే. ఆ కారు వెనుక జేబీఆర్ పేరుతో పసుపు రంగులో పెద్ద స్టిక్కర్ సైతం ఉంది. హత్యల అనంతరం ముందు టైర్ల సస్పెన్షన్ విరిగిపోవడంతో కారును అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. టీడీపీ నాయకుల మారణకాండ ఇది.. ఈ హత్యలు పూర్తిగా గ్రామ టీడీపీ నాయకులు చేసిన మారణకాండ అని.. దీనిని వైఎస్సార్సీపీపైకి నెట్టి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే జూలకంటి కుట్ర పన్నారంటూ మృతుల బంధువులు వాపోతున్నారు. అసలు ఈ హత్యలతో ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి సోదరుల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చడం ద్వారా అసలైన నిందితులను తప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలైన దోషులకు శిక్షలు పడకపోతే.. ప్రతీకార దాడులు కొనసాగే ప్రమాదముందని టీడీపీ కార్యకర్తలు సైతం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. హత్యకు ఉపయోగించిన కారు మన టీడీపీ వాళ్లదే అయితే.. వైఎస్సార్సీపీ పైకి నెట్టడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. హత్య చేసింది టీడీపీ వాళ్లేనంటూ నిర్ధారణ.. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్త, మృతుల అల్లుడు తోట ఆంజనేయులు మాట్లాడుతూ.. టీడీపీ నేత తోట వెంకట్రామయ్య వర్గమే ఈ ఘాతుకానికి పాల్పడిందని మీడియాతో పాటు పోలీసులకు సాక్ష్యం చెప్పాడు. ప్రాథమిక విచారణ అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఓ వీడియో విడుదల చేశారు. హత్యకు గురైన వారు, హత్యలు చేసిన వారు.. టీడీపీకి చెందిన వాళ్లేనని స్పష్టంగా ప్రకటించారు. దీనిని నిర్ధారిస్తూ ఎస్పీ కార్యాలయం కూడా పత్రికా ప్రకటన విడుదల చేసింది. పోలీసులపై జూలకంటి ఒత్తిడి.. అనంతరం హత్య జరిగిన ప్రదేశానికి శనివారం రాత్రి చేరుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి నీచ రాజకీయాలకు తెరలేపారు. ఈ హత్యల వెనుక పిన్నెల్లి సోదరుల కుట్ర ఉందని ఆరోపించారు. కేసు నమోదులో సైతం వారి పేర్లు ఉండాల్సిందేనంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు మాట మార్చి పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు నమోదు చేశారు. దీని వల్ల ఎస్పీ మాటలకే విలువ లేకుండా పోయిందంటూ పోలీస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
ఆ హత్యలతో నాకేం సంబంధం?
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన జంట హత్యలకు టీడీపీలోని ఆధిపత్య పోరే కారణమని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షితో పాటు జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారని పేర్కొన్నారు. అయినా కూడా కూటమి సర్కార్ రాజకీయ కక్షతో తనపై అక్రమ కేసు నమోదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండ్లపాడు జంట హత్యలపై వెల్దుర్తి పోలీసుస్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో తన పేరు చేర్చడంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం స్పందించారు. టీడీపీలోని ఆధిపత్య పోరుతోనే జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావును అదే పార్టీలోని ప్రత్యర్థి వర్గం పొట్టన పెట్టుకుందన్నారు. ఈ విషయాన్ని హత్య జరిగినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి, మృతుల అల్లుడు తోట ఆంజనేయులు మీడియాతో పాటు పోలీసులకు కూడా తెలియజేశారన్నారు. టీడీపీలోని వర్గపోరు వల్లే ఈ హత్యలు జరిగాయని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సైతం శనివారం ప్రకటించారని గుర్తు చేశారు. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో గొడవలు జరగ్గా. ఇరు వర్గాలు టీడీపీ వాళ్లేనని వదిలేయడంతో సమస్య పెద్దదైందన్నారు. ఆనాడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. హత్య జరిగిన ప్రదేశంలో జేబీఆర్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడి కారు దొరికినా.. ప్రత్యక్ష సాక్షులు సైతం హత్యలు చేసింది టీడీపీ వాళ్లేనని చెబుతున్నా.. తనపై ఎందుకు నిందలు వేస్తున్నారని పిన్నెల్లి ప్రశ్నించారు. జంట హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం మాచర్ల ప్రజలందరికీ తెలుసునన్నారు.అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి తనపై అక్రమ కేసు నమోదు చేయించారని మండిపడ్డారు. ఈ హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏ గుడిలోనైనా ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. ధైర్యం ఉంటే బ్రహ్మారెడ్డి తన పిల్లలపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల తరఫున పోరాడుతామని పిన్నెల్లి స్పష్టం చేశారు. -
జిల్లాస్థాయి ఫుట్బాల్ జట్ల ఎంపిక
చీరాల రూరల్: బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్ఆర్ అండ్ పీఎంఏ హైస్కూలు క్రీడా మైదానంలో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాలలో జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేశారు. ప్రతిభభ ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్లు బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. విజయకుమార్, కోఆర్డినేటర్ ఎన్. దేవదాసు, సమ్మర్ క్యాంప్ ఇన్చార్జి బి.ప్రేమయ్య, కోచ్ ప్రసన్నకుమార్ తెలిపారు. బాలురకు సంబంధించి అండర్–13, అండర్–15లలో 22 మంది చొప్పున ఎంపికై నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని చెప్పారు. సీనియర్ క్రీడాకారుడు ఎన్. నరేష్, రమ్మికుమార్, ఎన్.బాలశౌరి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ‘కారుమూరు’
వేమూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన కారుమూరు వెంకట రెడ్డిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు కేంద్ర పార్టీ కార్యాలయం ఆదివారం ప్రకటన జారీ చేసింది. చుండూరు మండలంలోని కారుమూరు పాలెం గ్రామానికి చెందిన కారుమూరు వెంకట రెడ్డి డిబేట్స్ విశ్లేషకులుగా, పార్టీలోనూ అనేక పదవులు చేపట్టారు. వైఎస్సార్ సీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. నియోజకవర్గంలో కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కారుమూరు వెంకట రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ప్రోత్సాహంతో తనకు పదవి లభించిందని తెలిపారు. ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి వేటపాలెం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని దేశాయిపేట పంచాయతీ పరిధి విఘ్నేశ్వర కాలనీ దగ్గర ఇసుక క్వారీలో ఆదివారం చోటు చేసుకుంది. కొత్తపేటలోని మూడు రోడ్లు దగ్గలో నివాసం ఉండే పిగిలి వాసు (38) తన ట్రాక్టర్తో ఇసుక క్వారీ వద్దకు వెళ్లాడు. ట్రాక్టర్ను క్వారీ వద్ద నిలిపి ఇసుక లోడ్ చేసుకునే సమయంలో కిందికి దిగాడు. ట్రాక్టర్ ఓ కుప్ప నుంచి ముందుకు దొర్లుకుంటూ పోతుండటంతో వాసు ట్రాక్టర్పైకి ఎక్కి దానిని ఆపేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవ శాత్తు జారి ట్రాక్టర్ టైరు కింద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వారు గమనించి చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి
మరో మహిళకు తీవ్ర గాయాలు మాచవరం: ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని పిల్లుట్లలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లుట్ల గ్రామానికి చెందిన కాండ్రకుంట ఐశ్వర్య (33), కామినేటి సుజాతలతో పాటు మరి కొంత మహిళలు పొలం పనుల నిమిత్తం రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో నర్రా బాలు పిడుగురాళ్ల వైపు నుంచి ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వస్తూ వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలిస్తుండగా కాండ్రకుంట ఐశ్వర్య (33) మృతి చెందింది. తీవ్ర గాయాలైన సుజాతను పిడుగురాళ్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం.రోశయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా నదిలో వ్యక్తి గల్లంతు పోలీసుల ముమ్మర గాలింపు అచ్చంపేట: కృష్ణా నదిలో వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలోని గింజుపల్లి వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా, నకరికల్లు మండలం, చాగళ్లు గ్రామానికి చెందిన ఆలపరి సైదారావు(43) మరికొంత మందితో ఆదివారం ఉదయం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని మాదిపాడు పంచాయతీ పరిధిలోని సత్తెమ్మ తల్లి దేవాలయానికి వచ్చారు. మధ్యాహ్నం వరకు అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుని, కానుకలు సమర్పించి అక్కడే భోజనాలు వండుకుని తిన్నారు. సుమారు మూడు గంటల సమయంలో సమీపంలోని గింజపల్లి వద్ద కృష్ణానదిలో సరదాగా ఈత కొట్టేందుకు మరో 10మందితో దిగాడు. సైదారావు నది లోతుల్లోకి వెళ్లిపోగా దగ్గరలో ఉన్నవారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలించ లేదు. విషయం తెలుసుకున్న అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్ల సహాయంతో చేపల పడవల ద్వారా ఆదివారం రాత్రి 7గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. మృతుడు కూలి పనే వృత్తిగా జీవిస్తుంటాడు. సైదారావుకు భార్య, బీటెక్ చదివే కుమారైలు ఇద్దరు ఉన్నారు. సంపులో పడి బాలుడి మృతి లక్ష్మీపురం: సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. గుంటూరు కొత్తకాలనీకి చెందిన ఒడిశా వాసుల కుమారుడు రాఘవకుమార్ (5) ఆడుకుంటూ ఓ సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. నీటి కోసం తవ్విన సంపుకు ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రమాదవశాత్తు అందులో జారి పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులుకు బాలుడు కనిపించకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలలో గాలింపు ప్రారంభించారు. తీరా సంపులో పరిశీలించగా రాఘవకుమార్ అందులో పడి ఉన్నాడు. దీంతో హుటాహుటిన ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదులు చేయబోమని, పోస్ట్మార్టం అవసరం లేదని చెప్పి బాలుడి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. -
ముగిసిన ప్రసన్నాంజనేయుడి జయంత్యుత్సవాలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి జయంతి, కల్యాణ ఉత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు స్వామికి విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు స్వామికి సుప్రభాత సేవలతో పూజలు ప్రారంభించారు. అనంతరం లక్ష మల్లె పూలతో విశేష పూజలను నిర్వహించారు. చివరి రోజు భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామికి పొంగళ్లు చేసి, నైవేద్యాలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. రాత్రి రాజుపాలెం గ్రామానికి చెందిన శ్రీ అంకమ్మ తల్లి కళా నాట్యమండలి వారి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. ఆదివారం ఆలయంలో హుండీని లెక్కించగా జనవరి నుంచి ఈ నెల 25 వరకూ హుండీ ద్వారా రూ. 3,28,366 ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు సహకరించిన అందరికీ ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తలిపారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. చివరి రోజు లక్ష మల్లెలతో స్వామికి అభిషేకం -
మదిని దోచిన సంగీత, నాట్య కళారూపాలు
చిలకలూరిపేట: కన్నుల పండువగా సంప్రదాయ నృత్యాలు, వీనుల విందుగా సుమధుర సంగీత కీర్తనలు, నాట్య కళాకారుల ఉత్సాహపూరిత ప్ర దర్శనల మధ్య కళా నిలయం 40వ జాతీయ స్థా యి నవరస శాసీ్త్రయ, జానపద, సంగీత నాట్య కళా రూపాల పోటీలు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. పోటీలకు వేదికై న పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో భరతనాట్యం, కూచిపూడి పోటీలు సూర్య, చంద్ర విభాగాల్లో రసవత్తరంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి ,చక్కటి హావభావాలతో నాట్యకళ ప్రదర్శించి, నటరాజ వారసులమని నిరూపించారు. కీర్తన, మూషిక వాహన, గణపతి కౌతం, వినాయక కౌతం, ముద్దుగారే యశోద, బాలగోపాల తరంగం, బ్రహ్మాంజలి, దశావతార శబ్దం,జనుత శబ్దం,కొండలలో నెలకొన్న, భామాకలాపం, నరసింహ వైభవం, హిమగిరి తనయ, అలవేల్ మంగ వంటి కీర్తనలకు లయబద్ధంగా నర్తించారు. రసజ్ఞులైన ప్రేక్షకులను రంజింపచేసి వారి ప్రశంసలను అందుకున్నారు. ఒకవైపు పోటీలు కొనసాగిస్తూనే మరోవైపు నాట్యకళ బోధించిన నాట్యాచార్యులకు సన్మానాలు నిర్వహించి వారి ఆశీస్సులు పొందారు. ముందుగా కళానిలయం నిర్వాహకుడు ప్రగడ రాజమోహనరావు సతీమణి శివసత్యనారాయణమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి పూజ నిర్వహించారు. నేటి కార్యక్రమాలు సూర్య, చంద్ర విభాగాల్లో జానపద నృత్య పోటీలతో పాటు శాసీ్త్రయ జంట నాట్యాలు, అశాసీ్త్రయం జంట నాట్యాలు, శాసీ్త్రయ బృంద నాట్యాలు, అశాసీ్త్రయ బృంద నాట్యాలు, శాసీ్త్రయ నృత్యనాటికల పోటీలు సోమవారం నిర్వహిస్తారు. వీటితో పాటు నాట్యాచార్యులకు సన్మానాలు ఉంటాయి. రెండో రోజు ఆకట్టుకున్న నాటికలు నాదెండ్ల: మండలంలోని సాతులూరులో నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ తృతీయ జాతీయ నాటికల పోటీలు ఆదివారం రెండో రోజు ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి కురిసిన వర్షంతో గుంటూరు ఆరాధన ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరగాల్సిన ‘మరీ అంతొద్దు’ నాటిక ప్రదర్శన నిలిచిపోయింది. ఆదివారం తొలిగా ప్రదర్శించారు. అనంతరం కొలకలూరి శ్రీసాయి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ‘జనరల్ బోగీలు’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. విశాఖపట్నం భద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘దొందూ దొందే’ నాటిక ప్రదర్శించారు. రచనా దర్శకత్వం డేవిడ్రాజు వహించారు. ఏలూరు హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘సారీ రాంగ్ నంబర్’ నాటికకు రచయితగా చింతల మల్లేశ్వరరావు, దర్శకుడిగా మహమ్మద్ ఖాజావలి వ్యవహరించారు. సామాజిక రుగ్మతలు, సందేశాలను నాటికలు ప్రస్ఫుటించాయి. జ్యోతి ప్రజ్వలన బండారుపల్లి మస్తాన్రావు, సభా పరిచయం నడింపల్లి వెంకటేశ్వరరావు చేయగా, సభాధ్యక్షత గరికపాటి వెంకట రామారావు వహించారు. నేటి ప్రదర్శనలు : బాపట్ల సహృదయ ద్రోణాదుల వారి ‘వర్క్ఫ్రం హోమ్’, సాతులూరు వజ్జా రామనాథం ఆర్ట్స్ ‘రారాజు సుయోధన’, వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ‘ఏకాకి’ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. రెండో రోజు కొనసాగిన కళానిలయం జాతీయ స్థాయి పోటీలు -
ఆది దంపతుల ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో ఆదివారం నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో కీలకమైన రూ.25 వేల వస్త్రాలంకరణ సేవలో ఆదివారం ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి, తొలి దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామున నాలుగు గంంటలకు ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్ వద్ద నిర్వహించిన ఖడ్గమాలార్చనలో 18 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష అభిషేకాల్లోనూ ఉభయదాతలను అనుమతించారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో చండీహోమం నిర్వహించారు. 51 మంది ఉభయదాతలు తమ నామగోత్రాలతో హోమం జరిపించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మూర్తి వద్ద లక్ష కుంకుమార్చన నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. ఇక ప్రతి ఆదివారం నిర్వహించే సూర్యోపాసన సేవలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. -
తిరునాళ్లలో మైక్ అనుమతికి నిరాకరణ
చెరుకుపల్లి: పొన్నపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కార్మూరమ్మ తిరునాళ్లకు మైక్ అనుమతి ఇవ్వకుండా స్థానిక పోలీసులు అడ్డుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని పొన్నపల్లి గ్రామంలో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. 95 శాతం మంది వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఉన్నారు. పది రోజులు క్రితం మైక్ అనుమతి కోసం గ్రామ పెద్దలు మీ–సేవ ద్వారా చలానా తీశారు. స్థానిక ఎస్ఐ అనిల్కుమార్ను నాలుగు రోజులుగా పొన్నపల్లి గ్రామస్తులు సంప్రదిస్తూనే ఉన్నారు. గ్రామంలో గొడవలు జరుగుతాయనే సమాచారం ఉందని, అందుకే మైక్ పర్మిషన్ ఇవ్వలేమని చెప్పడం గమనార్హం. దీంతో ఆదివారం వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు. రేపల్లె రూరల్ సీఐ సురేష్బాబును, ఎస్ఐ అనిల్ కుమార్ను దీనిపై సంప్రదించినా అనుమతికి ససేమిరా అన్నారు. వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, డాక్టర్ ఈవూరి గణేష్ తదితరులు గ్రామస్తులతో కలిసి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడుతూ.. గ్రామంలోని వారు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారని, కూటమి నేతల ఆదేశాల మేరకే స్థానిక పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని తెలిపారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి తిరునాళ్ల సంతోషంగా జరుపుకోవటానికి మైక్ అనుమతి ఇవ్వాలని కోరారు. సమాచారం తెలుసుకున్న రేపల్లె డీఎస్పీ అవల శ్రీనివాసరావు వచ్చి డాక్టర్ ఈవూరి గణేష్తో చర్చించారు. దీంతో మైక్ పర్మిషన్ వచ్చింది. దీనిపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వరుకూటి అశోక్బాబు, డాక్టర్ ఈవూరి గణేష్లు అమ్మవారిని కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ దుండి వెంకటరామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. వెఎస్సార్సీపీకి గ్రామస్తులు అనుకూలమని పక్షపాతం రేపల్లె రూరల్ పోలీసుల అత్యుత్సాహం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ఆగ్రహం ఎట్టకేలకు డీఎస్పీ ఆదేశాలతో మైక్ అనుమతి -
కళల తెనాలికి ఆభరణం కాటూరి శిల్పకళ
తెనాలి: వంశపారంపర్యంగా వస్తున్న శిల్పకళను కొనసాగిస్తూ ఆరు, ఏడు తరాల్లో ఆ కళకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొస్తున్న శిల్పకళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్షలు కళల తెనాలికి గర్వకారణమని పలువురు వక్తలు అభినందించారు. ప్రముఖ స్వచ్ఛంద సేవాసంస్థ మానవత తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ లైబ్రరీ హాలులో జరిగింది. సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్ అధ్యక్షత వహించారు. రాష్ట్రప్రభుత్వ ‘కళారత్న’ అవార్డు గ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షను ఈ వేదికపై సత్కరించారు. తెనాలిలో తొలిసారిగా శిల్పకళపై నిర్వహిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ, తండ్రీకొడుకుల శిల్పకళానైపుణ్యానికి నిదర్శనమని డాక్టర్ రామ్చంద్ అన్నారు. శిల్పకళలో తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన శిల్పకారులను సత్కరించడం మానవత విధిగా భావించినట్టు తెలిపారు. సత్కారగ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తండ్రీకొడుకులు ముగ్గురికీ ఒకే వేదికపై అభినందన గౌరవం మరచిపోలేనిదని చెప్పారు. తండ్రి కోటేశ్వరరావు నుంచి వచ్చిన శిల్పకళను గురువు అంచే రాధాకృష్ణమూర్తి శిక్షణలో మెరుగుపరచుకున్నట్టు చెప్పారు. బీఎఫ్ఏలో పీజీ చేసిన రవిచంద్ర ఇనుప వ్యర్థాలకు శిల్పకళా సోయగాలు కల్పిస్తుంటే, శ్రీహర్ష త్రీడీ, ఏఐ టెక్నాలజీని జోడిస్తూ కళాత్మక ఉట్టిపడేలా చేస్తుండటం తమ అదృష్టమన్నారు. సభకు ముందు ‘ఆపరేషన్ సిందూర’ స్ఫూర్తితో ఎన్ఎస్ఎస్ మున్సిపల్ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ నేతృత్వంలో ప్రదర్శించిన ‘తల్లికి వందనం’ సాంస్కృతిక కార్యక్రమం ప్రశంసలను అందుకుంది. ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్, కార్యదర్శి పి.వెంకట్, డీవీ సోమయ్యశాస్త్రి, కూరపాటి కల్యాణి, మొవ్వా సత్యనారాయణ పాల్గొన్నారు. సత్కార సభలో ప్రముఖుల అభినందన -
నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన
నరసరావుపేట: యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతి ఒక్కరికీ యోగా గొప్పతనాన్ని వివరించి వారితో ఆసనాలను వేయించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనీలు, టీఓటీలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో రోజు ఆదివారం కూడా శిక్షణ కొనసాగింది. ఆన్లైన్ ద్వారా జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. ఇందులో యోగా గురువులు, టీఓటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో నాలుగు పర్యాటక ప్రాంతాల్లో భారీస్థాయిలో యోగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఈనెల 28న కోటప్పకొండ, జూన్ 5న నాగార్జునసాగర్, 11న కొండవీడు కోట, 18న అమరావతి వద్ద ప్రదర్శనలు నిర్వహించనున్నారు. అంశాల ప్రాతిపదికగా ప్రతి జిల్లాకు ఒక థీమ్ను ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా జిల్లాలో వేలాది మంది ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వర్కర్లతో జూన్ ఐదున యోగా ప్రదర్శనను నిర్వహించడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పొందినవారితో బాటు, సామాన్య ప్రజలు సైతం ఈ యోగా స్ట్రీట్కి వచ్చి ఆసనాలను అభ్యాసం చెయ్యవచ్చు. పోలీసు శాఖ అధ్వర్యంలో సోమవారం ఉదయం నరసరావుపేటలోని కలెక్టర్ బంగ్లా రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై యోగా ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఐదున రాష్ట్ర స్థాయి కార్యక్రమం కొనసాగుతున్న శిక్షణ