Palnadu
-
సామాన్యుడిపై ధరువు
రకం పాత ధర కొత్త ధర కందిపప్పు 100 130 పెసరపప్పు 100 120 మినపగుళ్లు 105 120 శనగపప్పు 80 100 వేరుశనగలు 120 170 రకం పాత ధర కొత్తధర పామాయిల్ 110 130 రిఫైండ్ ఆయిల్ 155 185 డబ్బా ధర పామాయిల్ 2,000 2,300 రిఫైండ్ ఆయిల్ 2,500 2,900 సత్తెనపల్లి: పశ్చిమాసియాలో నెల రోజులుగా జరుగుతున్న యుద్ధం పేద, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడ యుద్ధమేఘాలు మన వంటింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఇక్కడ అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు నిత్యావసర ధరలు పెరగడం.. మరోవైపు గ్యాస్ కొరతతో జిల్లా ప్రజలు అవస్ధలు పడుతున్నారు. వంట నూనె నుంచి పప్పు దినుసుల వరకూ అన్నింటిపై ఆ ప్రభావం పడింది. వంట నూనె రేట్లు పెరగడంతో రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు పాఠశాలలు, హాస్టళ్లలో భోజన వంటకు గ్యాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఒక్కసారిగా పెరిగిన ధరలను చూసి షాక్కు గురవుతున్నారు. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే, మన దగ్గర ధరలు పెరగడమేమిటనే ప్రశ్నిస్తున్నారు. పెరిగిన రేట్లతో జేబులుకు చిల్లులు పడుతున్నాయని వాపోతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ఇటు ప్రభుత్వ పన్నుల పోటు, పెరుగుతున్న నిత్యావసర ధరలు, మధ్యలో వ్యాపారుల మాయాజాలం.. వెరసి సామాన్యుడి జేబు ఖాళీ అవుతోంది. కేవలం వారం వ్యవధిలోనే రేట్లు పెరగడం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ధరల పెరుగుదల గృహిణుల బడ్జెట్ను తలకిందులు చేస్తుంది. గ్యాస్ రేట్లు పెరగడంతో కొరత ఏర్పడడంతో వాటికి ప్రత్యామ్నాయమైన కట్టెలు రేట్లు కూడా గ్రామాల్లో పెరిగాయి. ధరల మంటకు కారణాలు ఇవే.. గల్ఫ్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఆయా దేశాల నుంచి దిగుమతి అయ్యే నిత్యావసర వస్తువులు, వంటనూనె, గ్యాస్ సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. దీంతో దిగుమతులు తగ్గి మార్కెట్లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం ట్యాక్స్ ధరలు భగ్గుమనడానికి మరో కారణమైంది. పండుగల సీజన్ కావడంతో మార్కెట్లో వంట నూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కృత్రిమ కొరతతో నిలువు దోపిడీ.. అంతర్జాతీయ కారణాలను సాకుగా చూపి కొందరు వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరగడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు పాత స్టాక్ను గోదాముల్లో బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన పాత స్టాక్ను సైతం పెరిగిన ధరలకే విక్రయిస్తూ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇదే అదునుగా రిటైల్ వ్యాపారులు కిరాణా వస్తువుల ధరలను కూడా పెంచారు. జిల్లాపై మరింత భారం... జిల్లాలో రోజుకు గృహ, వాణిజ్య అవసరాల నిమిత్తం పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ 10 వేల లీటర్ల వరకు వినియోగం జరుగుతున్నట్లు అంచనా. వీటిలో 50 శాతం పామాయిల్, 40 శాతం సన్ఫ్లవర్ ఆయిల్, 10 శాతం ఇతర నూనెలు వాడుతున్నారు. అయితే పామ్ ఆయిల్ లీటరుకు రూ. 20, సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్కు రూ. 30 వరకు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో వాటిని కట్టడి చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు అటుగా కనీస చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపారులతో అధికారులు అంటకాగుతున్నారా? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ధరల నియంత్రణకు, సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం రూ. 860+ రూ. 60 (పెరిగిన రేట్) ప్రస్తుతం (రూ.1816+రూ.114)= రూ.1,930 బ్లాక్లో కమర్షియల్ లేవంటున్నారు. ఉంటే రూ. 3,200 వరకూ విక్రయిస్తున్నారు. -
డిప్యూటీ స్పీకర్ వైఖరి ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు
నరసరావుపేట: ఉప సభాపతి పదవిలో కూర్చుని ఒక వర్గం కొమ్ముకాస్తూ దళితులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్న రఘురామ కృష్ణంరాజు వైఖరి ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ పేర్కొన్నారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షుడు విస్తాల జయరావు ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జాన్పాల్ మాట్లాడుతూ అసెంబ్లీలో అందరినీ సమానంగా చూడాల్సిన ఉప సభాపతి, వీధుల్లోకి వచ్చి కుల విద్వేషాలు రెచ్చగొట్టడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. రఘురామకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు. ఆకివీడులో ప్రశాంతంగా ఉన్న దళితులపై దాడులు చేయించడమే కాకుండా తిరిగి బాధితులైన 57 మంది దళితులపైనే నాన్–బెయిలబుల్ కేసులు పెట్టించడం రఘురామ అరాచక పాలనకు పరాకాష్ట అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక రఘురామ ’రాజరిక’ పాలనా అని ప్రశ్నించారు. ఆకివీడు దళితులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలి, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దళిత శక్తిని ఏకంచేసి అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి తెలిసేలా మా పోరాటం ఉంటుందని హెచ్చరించారు. నరసరావుపేట నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు సేవా సామేలు, మండల అధ్యక్షుడు ముచ్చు బ్రహ్మ పాల్గొన్నారు. ఆకివీడు దళితులపై అక్రమ కేసులు రద్దు చేయాలి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ -
జెడ్పీ పీఎఫ్ సిబ్బందిపై చర్యలు తీసుకోండి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులకు సంబంధించిన పీఎఫ్ లోన్ ప్రతిపాదనల ఫైళ్లను నెలల తరబడి పెండింగ్లో ఉంచుతున్న జెడ్పీ పీఎఫ్ విభాగంలోని సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు గుడిపాటి దాస్, మహమ్మద్ ఖాలీద్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం జెడ్పీ డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణను జెడ్పీ కార్యాలయంలో కలసిన ఏపీటీఎఫ్ బృందం ఆయనకు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.దాస్ మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తూ గతేడాది 2025 డిసెంబర్, 2026 జనవరి మధ్య ఉద్యోగ విరమణ పొందిన అన్ని కేడర్లకు చెందిన హెచ్ఎంలతో పాటు ఉపాధ్యాయుల ఫైనల్ క్లోజర్స్ జెడ్పీ పీఎఫ్ విభాగంలో సబ్మిట్ చేసి, నాలుగు నెలలు గడిచినా, ప్రాసెస్ చేయకుండా అకారణంగా పెండింగ్లో ఉంచారని ఆధారాలతో డిప్యూటీ సీఈఓకు వివరించారు. గత మార్చి వరకు ప్రాసెస్ చేసిన రుణ, ఇతర అన్ని ఫైల్స్ క్లియర్ చేసిన ప్రభుత్వం ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల్లో నగదు జమ చేసిందని, పీఎఫ్ సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా కొందరికి డబ్బులు పడలేదని తెలిపారు. ఉపాధ్యాయుల క్లోజర్స్, రుణ ఫైల్స్ క్లియర్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరో ఆర్నెల్ల వరకు పీఎఫ్ నగదు రాదని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. – ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ రూ.5 లక్షల లోపు పీఎఫ్ లోన్స్పై అసిస్టెంట్ సివిల్ సర్జన్, రూ.5 లక్షలు దాటితే సివిల్ సర్జన్ సంతకాలు ఉండాలనే నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. 15 రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు స్పష్టం చేశారు. డిప్యూటీ సీఈవోను కలసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.నాగశివన్నారాయణ, జిల్లా కార్యదర్శి పచ్చల శివరామకృష్ణ, జిల్లా కౌన్సిలర్లు బి.కృష్ణారావు, వి.కిషోర్ షా, చెన్నుపాటి పెదలక్ష్మయ్య ఉన్నారు. గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సిఎం సాయి కాంత్ వర్మను గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీజిఓ సంఘ అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి ఏ శ్యామ్ సుందర్ శ్రీనివాస్, ఏపీ ఎన్జీజివో సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికార యంత్రాంగం, ఉద్యోగులు, ప్రజల సమన్వయంతో గుంటూరు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. స్పందించిన కలెక్టర్ జిల్లా అభివృద్ధి కోసం అందరి సహకారం ఎంతో అవసరమన్నారు. అధికార యంత్రాంగం, ఉద్యోగుల సమన్వయంతో పారదర్శక పరిపాలన అందించడానికి వృషి చేస్తానని తెలిపారు. అలాగే ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతమైన పురోగతికి ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్. శ్రీధర్ రెడ్డి, సిహెచ్ అనిల్, బి. వృష్ణ కిషోర్, డి. శ్రీనివాస్, కే. నరసింహారావు, కే.విజయ్, గుంటూరు సిటీ కార్యదర్శి సిహెచ్ కళ్యాణ్ కుమార్, సిటీ ట్రెజరర్ జీవి కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
చిలకలూరిపేట: ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర రాజకీయ,సాంస్క్రతిక, విద్య,వైద్య రాజకీయ శిక్షణ తరగతులు మే నెలలో ఐదు రోజుల పాటు కోటప్పకొండలో నిర్వహించనున్నారు. శిక్షణా తరగతుల నిర్వహణ కోసం పార్టీ నేతలతో కలసి కోటప్పకొండ ను సందర్శించి అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో కలసి బుధవారం చిలకలూరిపేట పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్దిలో సైతం ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో విధ్వంసకర పాలన జరుగుతుందని ధ్వజమెత్తారు. ప్రశ్నించినవారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధిలో ఆమడ దూరం కూడా పోలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ పొంగిపొర్లుతుంటే పల్నాడులో అనేక ప్రాంతాలు గుక్కెడు నీటికి అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ రూ. 500 కోట్లు ఖర్చు చేస్తే, లక్ష ఎకరాలకు సాగునీరు అందే వరికపుడిశెలకు దిక్కులేదుగాని, రూ.81 వేల కోట్లతో ఎక్కడో పోలవరం దగ్గర నుంచి కర్నూలు జిల్లా పెనకచర్లకు నీళ్లు తీసుకెళ్తామని గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 151 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకో వచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలని, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అలా కాకుండా రాజధాని పేరుతో ఒకే ప్రాంతంలో నిధులు కేంద్రీకృతం చేస్తే ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్, సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్, యుగంధర్ పాల్గొన్నారు. రాజధాని పేరుతో ఒకే చోట అభివృద్ధి కేంద్రీకరణ తగదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య -
అటవీ శాఖ అనుమతుల కోసం సర్వే పూర్తి చేయండి
నరసరావుపేట: జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో సంబంధిత శాఖలు డీజీపీఎస్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లో అటవీ శాఖ అనుమతులపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అటవీ ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా పైపులైన్ల వంటి కార్యక్రమాలకు అధికారులకు సహకరించాలని జిల్లా అటవీ అధికారిని ఆదేశించారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు బోటింగ్ పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి కొండవీడు కోటపై నైట్ క్యాంపింగ్ సేవలు ప్రారంభించాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహ, జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం ప్రారంభం రొంపిచర్ల: మండలంలోని బుచ్చిబాపన్నపాలెం గ్రామంలో ఆధునికీకరించిన అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు బుధవారం ప్రారంభించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. పశువైద్య శిబిరాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బాలికల ఆరోగ్య భద్రతకు నిర్వహిస్తున్న హెచ్పీఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ నెల 9వ తేదీన గ్రామంలో ఆరోగ్య దర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గ్రామంలోని పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఆర్డీవో బాలకృష్ణ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమాదేవి, జిల్లా విద్యాధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అన్నమ్మ సేవలు మరువరానివి
నాదెండ్ల: తన తల్లి అన్నమ్మ అనాధలు, పేదలను ఆదుకుంటూ వారికి తల్లిగా నిలిచి ఆదర్శవంతంగా జీవించారని సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు చెప్పారు. తన స్వగ్రామమైన తూబాడులో తన తల్లి అన్నమ్మ రెండో వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి అన్నమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నరసరావుపేటకు చెందిన వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఎ.రామలింగారెడ్డి, కె.శ్రీనివాసరెడ్డి, కె.ప్రదీప్కుమార్రెడ్డి, కె.జగన్మోహన్రెడ్డి, పి.శ్రీనివాసరెడ్డి, ఒ.శేషిరెడ్డి, పి.వేణుగోపాల్రెడ్డి, ఎస్డీ అబ్బాస్, హిమనిరెడ్డి, చంద్రకిరణ్రెడ్డి, జయబారత్రెడ్డి, చెంచిరెడ్డి, వై.నవీన్, వై.గాయత్రీ, ఎం.వసంత, చెన్నారెడ్డి, డి.వసంత హాజరయ్యారు. సుమారు 400 మందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సైతం పలువురు రోగులను పరీక్షించి వైద్యసేవలందించారు. సుమారు 60 మందిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి రిఫర్ చేశారు. అనంతరం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్రామ్, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి, కాసు బ్రహ్మానంరెడ్డి, కాసు వెంగళరెడ్డి, తలతోటి ఛార్లెస్ విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. తూబాడులో అన్నమ్మ రెండో వర్ధంతి నివాళులర్పించిన ప్రముఖులు మెగా వైద్య శిబిరంలో 400 మందికి ఉచిత వైద్య సేవలు -
శ్రీవారికి ప్రత్యేక పూజలు సత్తెనపల్లి: స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని అలివేలు మంగ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో 51వ మాస పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. ధరలను నియంత్రించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలో కొనుగోలు చేసే చోట అరకిలోతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి నెలకొందని, ఇలా ఎన్ని రోజులు కాలం వెళ్లదీయాలని వారు ప్రశ్నిస్తున్నారు. ధరలను అదుపు చేయాల్సిన సర్కారు గుడ్లప్పగించి చూస్తోందని మండి పడుతున్నారు. పాలకుల తీరుతో కట్టడి చేయాల్సిన అధికారులూ చోద్యం చూస్తున్నారు. కొందరు వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తూ నిలువునా దోచేస్తున్నారు. పల్నాడుఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 34.5448 టీఎంసీలు. 7 -
రైల్వే వీక్ పురస్కారాల ప్రదానం
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్లో 70వ రైల్వే వీక్ అవార్డులు 14 మందికి రావడం అభినందనీయం అని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ కార్యాలయంలో బుధవారం 70వ రైల్వే వీక్ అవార్డులను డీఆర్ఎం ప్రదానం చేశారు. ముందుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలలో అవార్డులు అందుకున్న వారి కృషి, నిబద్ధతను ప్రశంసించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, సంబంధిత డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏఎన్యూ అడ్మిషన్ల బ్రోచర్ విడుదల ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీజీ, ఇంజినీరింగ్ ప్రవేశాల అడ్మిషన్స్ బ్రోచర్ను వీసీ ఆచార్య కె. గంగాధరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య పి. బ్రహ్మాజీరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో కోర్సులను విద్యార్థుల భవిష్యత్తు ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని పేర్కొన్నారు. సైన్స్ విభాగంలో 25, ఆర్ట్స్ విభాగంలో 33 పీజీ కోర్సులతోపాటు ఫిజికల్ ఎడ్యుకేషనను ఎంపీడీ, ఎంఎస్సీ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ వంటి ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అదనంగా యూజీ స్థాయిలో ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సులు, పలు డిప్లమా ప్రోగ్రాములు కూడా అందిస్తున్నామన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి ఆధునిక కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. -
ఆర్థిక వనరులపై దాడులతోనే ఎమ్మెల్యే ఆందోళన
నరసరావుపేట: తనకు ఆర్థిక వనరులు కల్పిస్తున్న గంజాయి, పేకాటలపై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా ఎస్పీపై కోపంతో పది గంటలపాటు బైఠాయించిన టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుపై వెంటనే కేసు నమోదుచేసి అరెస్టుచేసి జైలుకు పంపించాలని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగ అమలు కర్తలైన సాక్షాత్తూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆయన విధుల్ని అడ్డుకొని బైఠాయించి హల్చల్ చేసిన ఎమ్మెల్యేపై ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక చిన్న కానిస్టేబుల్ విధులు అడ్డుకుంటే వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై కనీసం నాలుగు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారన్నారు. అటువంటిది అధికార పార్టీ ఎమ్మెల్యే ఎస్పీ విధులకు ఆటంకం కలిగించినా చర్యలు లేకపోవచం శోచనీయం అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు రెడ్బుక్ రాజ్యాంగం, అధికార పార్టీకి మరో రాజ్యాంగం అమలవుతోందన్నారు. బైఠాయించిన ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు ఐజీ స్థాయి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ పెద్దలు వచ్చినా కలవకుండా బాత్రూంలో దాక్కోవటం చిన్నపిల్లల చేష్టలను తెలియజేస్తుందన్నారు. ఇతని వ్యవహార శైలి, ప్రవర్తనలో తేడాగా కనిపిస్తుందన్నారు. బాత్రూమ్ డోర్, ఆఫీస్ డోర్ పగలగొట్టాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. అలాగే ఎమ్మెల్యే ఆర్డీఓ కార్యాలయానికి గేదెలు కాసుకునే యువకుడిని తీసుకువెళ్లి సాయంత్రం నాలుగు గంటల లోపు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. అతని క్వాలిఫికేషన్, అర్హత ఏమిటో తెలియకుండా ఎలా ఉద్యోగం ఇస్తామని, రూల్స్ ప్రకారం కలెక్టర్కు పంపిస్తానని ఆర్డీఓ చెప్పినా మొండిపట్టు పట్టడం జరిగిందన్నారు. ఇతని ప్రవర్తన దారుణంగా ఉంటుందని, తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అసలు కారణం వేరే... ఎస్పీ కార్యాలయంలో ఒక లీగల్ అడ్వైజర్ పోస్ట్ కోసం ఈ గొడవ అంతా చేసినట్టు చెబుతున్నాడని, అయితే వాస్తవానికి ఎస్పీ పల్నాడు జిల్లా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎక్కడ పేకాట, గంజాయి అమ్మకాలు జరగనివ్వకుండా అడ్డుకోవటం చేస్తున్నాడనే కోపంతోనే ఎమ్మెల్యే ఈ రకంగా ప్రవర్తించారన్నారు. కార్యాలయంలో ధర్నా చేసి ఎస్పీని బ్లాక్ మెయిల్ చేయడం, బాత్రూం డోర్లు వేసుకొని తీవ్రమైన సమస్యలు సృష్టించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఇది చిన్న కేసు కాదని భారత రాజ్యాంగ అమలుకర్తలైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఈ రకమైన అవమానం జరగటం ఘోరమైన విషయమని అన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ సంఘాల పెద్దలు బయటికి రావాలని, ఈ ప్రభుత్వాన్ని చూసి ఎవరూ భయపడవద్దని, ఈ సంఘటనపై ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్పేవన్నీ సూక్తులు–చేసేవన్నీ దౌర్భాగ్యపు పనులని అన్నారు. టీడీపీ ఎంపీ పుట్ట సుధాకర్ యాదవ్ డ్రగ్స్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే అతని మీద ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకు పంపించిన ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారు. అదేవిధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను మోసగించినట్లు ఓ మహిళ మొత్తుకుంటున్నా ఇప్పటివరకు అతనిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. అతను యథావిధిగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడని అన్నారు. తమ పార్టీ నాయకులు ప్రెస్మీట్లోను, రోడ్డుపై ఏదైనా మాట్లాడితే వారిపై ఒకటికి నాలుగు కేసులు పెడుతూ ద్వంద్వ నీతిని అవలంబిస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొని రాజ్యాంగాన్ని కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
నరసరావుపేట: ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 28న రాష్ట్ర సచివాలయం ముట్టడికి పిలుపునిస్తామని యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. స్థానిక స్టేషన్రోడ్డు గాంధీ పార్క్ వద్ద ధర్నా చౌక్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ‘‘రణభేరి 3.0’’ సందర్భంగా నిరాహార దీక్ష చేపట్టారు. శిబిరాన్ని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. 12వ పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, బకాయిల చెల్లింపు, మెమో–57 అమలు, హెల్త్ స్కీమ్ వంటి కీలక అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. పీఆర్సీ అమలులో తీవ్ర ఆలస్యం జరుగుతోందని, ఇప్పటికే 30 నెలలకు పైగా ప్రయోజనాలు కోల్పోయామని తెలిపారు. డీఏలు సకాలంలో ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యా రంగంపై తగిన నిధులు ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులతో ప్రజలను దోపిడీ చేస్తున్నాయని అన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టత లేకపోవడం, తాత్కాలిక ఉద్యోగాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబర్ పి.ప్రేమ్కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పీఆర్సీ ఏర్పాటు, పెండింగ్ డీఏలు, బకాయిల చెల్లింపు, మెమో నెంబర్ 57 వర్తింపు, సీపీఎస్ రద్దు తదితర ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటం చేస్తామన్నారు. 29శాతం ఐ.ఆర్ ప్రకటించి పెండింగ్ డీఏలు విడుదల చేయాలన్నారు. కరోనా సమయంలో మరణించిన 953 పంచాయతీ రాజ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని అన్నారు. పల్నాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు కె.శ్రీనివాసరెడ్డి, మద్దుకూరి మోహనరావు, జిల్లా సహాధ్యక్షులు ఎ.భాగేశ్వరిదేవి, జెవిడి వాల్యా నాయక్, గౌరవ అధ్యక్షులు షేక్ ఖాసీం పీరా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్.సుందరరావు, షేక్ అయేషా సుల్తానా ఆయా మండల అధ్యక్ష, కార్యదర్శులు, 250 మందికిపైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఆంజనేయనాయక్, ఏపీ ఎన్జీఓ–ఏపీ జేఏసీ పల్నాడు అధ్యక్షులు ఎం.రామకృష్ణ, ఆనంద్, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఆదయ్య, ఏపీటీఎఫ్ 1938 పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షులు పమ్మి వెంకటరెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రేమ్కుమార్ నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపపజేశారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి, డీఈఓకు వినతిపత్రం అందజేశారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, గౌరవ అధ్యక్షులు -
ఎస్సీ, ఎస్టీలపై కక్షసాధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వం
నాదెండ్ల: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఉంటూ వారి మనోభావాలను దారుణంగా దెబ్బతిస్తోందని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. తూబాడులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమెతో పాటూ సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూబాడుకు చెందిన టీజే సుధాకర్బాబు మాతృమూర్తి అన్నమ్మ రెండో వర్ధంతి సందర్భంగా పేదలు, గ్రామస్తులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అయితే వైద్యశిబిరం జరగకుండా అడ్డుకునేందుకు స్ధానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పోలీసులను పంపటం దుర్మార్గమన్నారు. మైక్ అనుమతి ఉందా... అంటూ సుధాకర్బాబుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అయితే పోలీసుల తీరును స్థానికులు నిరసించటంతో వారు వెనుదిరిగారని వివరించారు. 1970లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గ్రామంలో ఎన్నో పేద కుటుంబాలకు ఐదు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఆ కాలనీలో కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో 2010లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి, కాసు వెంగళరెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. కాలానుగుణంగా విగ్రహాలు లోతట్టుగా ఉండటంతో తిరిగి పునర్నిర్మించేందుకు మూడు విగ్రహాలను మరో ప్రదేశంలో భద్రపరచటం జరిగిందన్నారు. బుధవారం ముగ్గురు నేతల విగ్రహాలతో పాటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జగ్జీవన్రామ్, తలతోటి ఛార్లెస్ విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ చేస్తుండగా అక్కడా అధికారులు, పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ తూబాడు మహానుభావులకు పుట్టినిల్లన్నారు. తాను ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తాను ప్రజలకు సేవల చేశానే తప్ప ఎలాంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడలేదన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి రజినీని గ్రామాల్లో రానీయకుండా, ఆమె ఫ్లెక్సీలు పెట్టనీయకుండా పోలీసులను అడ్డుపెట్టి రాజకీయాలు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు ఎంతో తేడా ఉందని, అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్సార్సీపీ పాలనకు పోటీయే లేదన్న విషయం ప్రజలు ఇప్పటికే గుర్తించారన్నారు. కార్యక్రమంలో సర్పంచి గోళ్లమూడి కాశయ్య, గ్రామ నాయకులు గంగిరెడ్డి అప్పిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దూరి కోటిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరావు, అధికార ప్రతినిధి ఉడతా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మాజీ మంత్రి విడదల రజిని టీజేఆర్ మాతృమూర్తి వర్ధంతిని అడ్డుకునేయత్నం దుర్మార్గం -
పీఆర్కేను పరామర్శించిన ఎమ్మెల్సీ ఏసురత్నం
మాచర్ల: అక్రమ కేసులో 99 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపి బెయిల్ పై విడుదలైన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం మాచర్లల్లోని పీఆర్కేను ఆయన స్వగృహంలో కలిసి సత్కరించారు. ఆయన వెంట కొమ్మినేని వెంకటేశ్వర్లు, పలువురు నాయకులున్నారు. కాకుమాను నాగలక్ష్మి, భువనగిరి సంధ్య గురజాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి మద్దతుగా ఉంటున్నామనే కుట్రతోనే తన కుటుంబ సభ్యులను చంపివేశారని కాకుమాను నాగలక్ష్మి, భువనగిరి సంధ్యలు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గురజాల మండలానికి చెందిన కాకుమాను భవనారుషి, అతని సోదరుడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి, అడిగొప్పల కాలువలో పడేసిన విషయం విధితమే.. దీనిపై బుధవారం మృతుల కుటుంబ సభ్యులు చర్లగుడిపాడులో మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబ సభ్యులను భయపెట్టి వైఎస్సార్ సీపీకి మద్దతు ఇవ్వకుండా చూడాలనే ఆలోచనతోనే కాకుమాను భవనారుషిని, భువన గిరి శ్రీనులను చంపేసి అడిగొప్పల కాలువలో పడవేశారన్నారు. అతికిరాతకంగా క్రూరంగా చంపి కాలులో పడవేస్తే కనీసం మృతదేహాలు వేతకడానికి ఒక్కరూ కూడా సహాయం లేదన్నారు. తాము వైఎస్సార్ సీపీ కార్యకర్తలం కావడంవల్ల, అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినవారం కావడం వల్లే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని తమకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని వేడుకొన్నారు. తమ కుటుంబాలకు న్యాయం చేసేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిరూరల్(మంగళగిరి): రడగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్పై అనర్హత వేటు వేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాజకీయాల నుంచి బహిష్కరించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కార్యదర్శి కనినిక బోస్ ఘోష్ డిమాండ్ చేశారు. తాడేపల్లి రూరల్ మండలం కొలనుకొండలోని ఐద్వా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఇటీవల డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేష్కు స్టేషన్ బెయిల్ ఇచ్చి రాజకీయ నాయకులకు ఒక న్యాయం... సామాన్యులకు మరో న్యాయం అన్నట్లుగా పోలీసులు వ్యవహరించారని బోస్ ఘోష్ విమర్శించారు. దేశంలో గంజాయి మాఫియాను అరికట్టేందు కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చే పట్టాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి, సీనియర్ నాయకురాళ్లు ఎస్.పుణ్యవతి, వై.సత్యవతి, డి.రమాదేవి, దొంతిరెడ్డి శ్రీనివాస్ కుమారి పాల్గొన్నారు. -
టీడీపీకి పరాభవం.. రెబల్ అభ్యర్థి విజయం
సత్తెనపల్లి: బార్ బరిలో రెబల్ అబ్యర్థిగా పోటీ చేసిన న్యాయవాది గంగూరి అజయ్కుమార్ 60 ఓట్ల భారీ మెజార్టీతో విజయదుందుభి మోగించాడు. రాజకీయాలకు అతీతంగా న్యాయవాదులు ఎన్నుకోవాల్సిన బార్ అసోసియేషన్ 2026–27 ఎన్నికలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాత్రం సాధారణ ఎన్నికలను తలపించాయి. మునుపెన్నడూ లేని విధంగా అధికార పార్టీ ఎట్టకేలకు అధ్యక్ష పదవిని కై వసం చేసుకోవాలని టీడీపీ లీగల్ సెల్ ద్వారా ఒంటెత్తు పోకడ పోవడంతో అధికార పార్టీ నుంచి మరో బలమైన వ్యక్తి రెబల్గా ఎన్నికల్లో పోటీకి దిగాడు. ఇది మింగుడు పడని అధికార పార్టీ నాయకులు సర్వశక్తులు ఒడ్డి గెలుపొందాలని భావించినప్పటికీ వారి ఎత్తుగడ కాస్తా తిరగబడింది. అధికార కూటమికి ఘోరపరాభవం తప్పలేదు. సత్తెనపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన అజయ్కుమార్ ఫలించని అధికార పార్టీ, టీడీపీ లీగల్ సెల్ వ్యూహాలు ఉపాధ్యక్షుడిగా సురేష్బాబు, జాయింట్ సెక్రటరీగా మార్క్ గెలుపు ప్రశాంతంగా ముగిసిన సత్తెనపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికలు -
ప్రపంచ పర్యాటక కేంద్రానికి పవర్కట్
తీవ్ర ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు, స్థానికులువిజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్లో అంతర్భాగమైన విజయపురిసౌత్ క్యాంపు కాలనీ 2వేల గృహాలు, 10వేల జనాభాతో పాటు నిత్యం దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులతో కళకళలాడుతోంది. ఇటువంటి పర్యాటక ప్రాంతంలో గత మూడు రోజులుగా ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు పవర్కట్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విజయపురిసౌత్ క్యాంపు కాలనీ వాసులు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవటంతో జలవనరుల శాఖ ఏపీఎస్పీడీసీఎల్కు సుమారు రూ.35 కోట్ల బకాయి పడింది. దీంతో మాచర్ల విద్యుత్ శాఖ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పవర్కట్ చేస్తున్నారు. -
న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం పెరిగింది
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): బీజేపీ పాలనలో న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ పేర్కొన్నారు. గుంటూరులో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తొందరపాటుతో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించారని తెలిపారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దళితుల్ని ముఖ్యమంత్రిని చేయాలని సీపీఎం అగ్రనాయకులు హరికిషన్ సింగ్ సూర్జిత్ కాంగ్రెస్ హై కమాండ్కు గట్టిగా సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అంశం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరుగుతోందన్నారు. రాజ్యాంగ సవరణ చేసి, రిజర్వేషన్లు కల్పిస్తారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ రాజకీయ ప్రేరేపిత జడ్జిమెంట్ అని పేర్కొన్నారు. దళితులను బలహీనం చేయాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అందులో భాగంగానే ఏబీసీడీ వర్గీకరణ తీర్పు అని పేర్కొన్నారు. ఇప్పుడు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు వంటి తీర్పులు వచ్చాయన్నారు. 2029లో ఎస్సీలు దేశ, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నారన్నారు. విలేకరులు సమావేశంలో ఎస్సీ నాయకుడు అన్నవరపు కిషోర్ పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రెంటచింతల: మండలంలోని పాలువాయిగేటు గ్రామ సమీపంలో ఉన్న టోల్ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడకక్కడే మృతిచెందాడు. పాతపాలువాయికి చెందిన ఇండ్లచెరువు పుల్లారావు(28) జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మాచర్ల నుంచి రెంటచింతల వైపు వెళ్తున్న వాహనం పుల్లారావును ఢీ కొట్టి ఉంటుందని ఆ ప్రాంతంలో వాహనానికి సంబంధించిన అద్దాలు ఉండటంవలన అనుమానిస్తున్నారు. పుల్లారావు భార్య కోటేశ్వరితో కొంతకాలంగా మనస్పర్థలు ఉన్న నేపథ్యంలో ఆమె కొత్తపల్లి గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఘటన వివరాలు తెలుసుకున్న ఎస్ఐ సీహెచ్ నాగార్జున ప్రమాద స్థలానికి చేరుకుని విచారించారు. భార్య కోటేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గుంటూరు లీగల్: పెదకాకాని పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన హుండీలోని కానుకలు లెక్కింపు సమయంలో కొంత సొమ్ము చోరీకి గురైంది. మల్లేశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామ రఘునందనరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఆరవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ గౌస్ నిందితురాలైన తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీరావమ్మకు మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించారు. ఈ కేసుకు సకాలంలో సాక్ష్యాధారాలను అందించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై.వినోద్కుమార్ కోర్ట్ కానిస్టేబుల్ కే.ప్రేమ్కుమార్కు సంబంధిత అధికారులు అభినందనలు తెలిపారు. కేసు లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి మురళీకష్ణ వాదనలు వినిపించారు. -
వీఆర్ఏల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం
వీఆర్ఏల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బదంగి సాహెబ్ గురజాల: వీఆర్ఏల డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బదంగి సాహెబ్ డిమాండ్ చేశారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద మంగళవారం వీఆర్ఏలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పే స్కేల్ జీతాలు అమలు చేయాలని, వన్టైమ్ సెటిల్మెంట్ ద్వారా వీఆర్వో, రికార్డు అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచ్మెన్ పోస్టులకు భర్తీ చేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జీతాలు పెరుగుతాయని, ప్రమోషన్లు వస్తాయని ఆశించామని.. కానీ నేడు ఆ పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో వీఆర్ఏల సమస్యలు గురించి చర్చించిన దాఖలాలు కనిపించలేదన్నారు. రీ సర్వే పేరుతో మమ్ములను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పలు డిమాండ్లను సత్వరమే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం పరిపాలనాధికారిణికి వినతిపత్రం అందించారు. ఇమాం వలి, ఏడుకొండలు, దేవ సహాయం, రవి, మునాఫ్, పాపారావు, వెంకటేష్, మస్తాన్వలి, ముస్తఫా, రామకృష్ణ, అశోక్, రాజారావు, గురవయ్య, సైదా తదితరులున్నారు. -
ఉద్యోగాన్ని ఒత్తిడి లేకుండా నిర్వహించాలి
జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీంబాషా చేబ్రోలు: ఉద్యోగాన్ని ఒత్తిడి లేకుండా ఆహ్లాదకరంగా నిర్వర్తించాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీం బాషా అన్నారు. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో మంగళవారం మండల విద్యాశాఖాధికారి రాయల సుబ్బారావు ఉద్యోగ విరమణ సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. మండలంలోని ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తదితరులు ఎంఈవో దంపతులను సన్మానించారు. డీఈఓ మాట్లాడుతూ 37సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో రాయల సుబ్బారావు సమర్ధవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొందారని కొనియాడారు. భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందన కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
డీఏవీ పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన
దాచేపల్లి: మండలంలోని తంగెడ భవ్య సిమెంట్కు చెందిన దయానంద్ ఆంగ్లో వేదిక్(డీఏవీ) పాఠశాల వద్ద మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం యజమాన్యం ఏర్పాటు చేయటంతో 300 మందికిపైగా తల్లిదండ్రులు వచ్చారు. డీఏవీ పాఠశాలను ఇప్పటి నుంచి చెట్టినాడ్ విద్యా మందిర్గా మార్పు చేస్తున్నామని, ఇప్పటి వరకు విద్యార్థులకు చెప్పిన సీబీఎస్ఈ సిలబస్ బదులుగా స్టేట్ సిలబస్ చెబుతామని ఈ సమావేశంలో యజమాన్య ప్రతినిధులు ప్రకటించారు. దీంతో సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్ ఏర్పాటు చేసిన నాటి నుంచే ఇక్కడ సీబీఎస్ఈ సిలబస్ని విద్యార్థులు చదువుకుంటున్నారని, ఇప్పుడు ఆ సిలబస్ తొలగించి స్టేట్ సిలబస్ చెబితే విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు. విద్యార్థుల భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని సీబీఎస్ఈ సిలబస్ బోధించాలని, యజమాన్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయవద్దని తల్లిదండ్రులు కోరారు. దీంతో తల్లిదండ్రులకు యజమాన్య ప్రతినిధులు సర్ది చెప్పే యత్నాలు చేశారు. యాజమాన్య ప్రతినిధులతో వాగ్వివాదం జరుగుతుండగానే యజమాన్య ప్రతినిధులు అక్కడ నుంచి వెళ్లినట్లు విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పారు. -
వర్సిటీ బడ్జెట్కు ఆమోదముద్ర
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 90వ అకడమిక్ సెనేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్సిటీలోని డైక్మెన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో సోమవారం సాయంత్రం జరిగిన పాలకమండలి, ఫైనానన్స్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. నూతనంగా ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్సుకు, బీటెక్లో స్పేస్ టెక్నాలజీ కోర్సులను 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సెనేట్ ఆమోదం తెలిపింది. ఏఎన్యూ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ విజయోత్సవాలను నిర్వహించాలని పలువురు మాజీ వీసీలు సూచించారు. 50 ఏళ్లకు గుర్తుగా ఒక ప్రత్యేక నిర్మాణం చేపట్టాలని చర్చించారు. లైబ్రేరియన్ ఆచార్య వెంకట్రావ్ మాట్లాడుతూ అధ్యాపకులు తన పరిశోధన పత్రాలను వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్లో నమోదు చేసుకుంటే పబ్లిక్కు అయ్యే ఖర్చులను ఆ సంస్థ భరిస్తుందన్నారు. సమావేశానికి హాజరైన మాజీ వీసీ ఆచార్య హరగోపాల్రెడ్డి పెన్షనర్లకు బకాయిలు విడుదల చేయాలన్నారు. మాజీ వీసీ ఆచార్య వియన్నరావు మాట్లాడుతూ ఏఎన్యూ రీసెర్చ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందేందుకు అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విశ్రాంత వీసీ బాలమోహన్దాస్ మాట్లాడుతూ ఏఎన్యూ 50 ఏళ్ల సందర్భంగా ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కోరాలని సూచించగా మాజీ వీసీ ఆచార్య రాఘవులు ఐకానిక్ భవనం నిర్మాణం చేపట్టాలని కోరారు. మాజీ వీసీ ఆచార్య ఎల్.వేణుగోపాల్రెడ్డి మాజీ ప్రొఫెసర్ సేవలను వర్సిటీ వాడుకోవాలన్నారు. మాజీ వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 50 ఏళ్ల వేడుకకు నోబెల్ విన్నర్లను తీసుకురావాలన్నారు. అనంతరం బడ్జెట్కు ఆమోదముద్ర వేశారు. ఇన్చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు వర్సిటీ నివేదికను వివరించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, పాలకమండలి సభ్యులు వెంకటేశ్వరరావు, షాహేదా అక్తర్, సుమంత్ కుమార్, జగదీష్ నాయక్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్ ఆచార్య రత్నషీలామణి, డీన్లు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, సెనేట్ సభ్యులు పాల్గొన్నారు. తనిఖీ బృందం నివేదిక ఆధారంగా కఠిన చర్యలు.. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన ఆరోపణలపై వర్సిటీ ఉన్నతాధికారులు నియమించిన ప్రత్యేక తనిఖీ బృందం కమిటీ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని దూరవిద్య పరీక్షల విభాగం కో–ఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ తనిఖీ బృందం (స్క్వాడ్) సమర్పించిన నివేదికలో పొందుపరిచిన అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళాశాలలకు చెందిన విద్యార్థుల పరీక్ష ఫలితాలను తాత్కాలికంగా విత్హెల్డ్ లో ఉంచుతున్నామన్నారు. ఇంపర్సనేషన్ (ఇతరుల స్థానంలో పరీక్ష రాయడం), మాల్ప్రాక్టీస్ వంటి అక్రమాలకు పాల్పడిన విద్యార్థులపై వర్సిటీ నిబంధనలకు అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తనిఖీ బృందం నివేదికలో సూచించిన తీవ్ర ఆరోపణలు ఉన్న పలు పరీక్ష కేంద్రాలను భవిష్యత్తులో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వబోమని, అవసరమైతే వాటి అనుబంధాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికే సమర్పించిన నివేదికలో కొన్ని అంశాలు అసంపూర్తిగా ఉన్నందున, సంబంధిత కమిటీ నుంచి పూర్తి వివరాలను మరోసారి సేకరించడం జరుగుతుందన్నారు. అనంతరం మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు దూరవిద్యాకేంద్రం పరీక్షా విభాగం కో–ఆర్డినేటర్ ఆచార్య రామచంద్రన్ తెలిపారు. -
సర్పంచ్ల పవర్కు చెక్
మాట వినే వారికే అందలం! ● సర్పంచ్ల చెక్ పవర్ రద్దు ● చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం ● పంచాయతీలలో చెల్లింపులకు ఆంక్షలు ● అత్యవసర చెల్లింపులకు డీడీఓ అనుమతి తప్పనిసరి ● మూడొంతులకు పైగా వైఎస్సార్ సీపీ సర్పంచ్లే ● ప్రభుత్వ ఉత్తర్వులతో మండిపడుతున్న సర్పంచ్లు ● పల్నాడు జిల్లాలో 529 గ్రామ పంచాయతీలు బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026గ్రామ ప్రథమ పౌరులను అవమానించడమే... సత్తెనపల్లి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయం -
ఆలయ ఆస్తుల కబ్జాకు యత్నం
యడ్లపాడు: భక్తితో కొలిచే దేవుడి సొత్తుపైనే ఓ వ్యక్తి కన్నేశాడు. పదేళ్లుగా నమ్మిన భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ, ఆలయానికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ను తన భార్య పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఉదంతం యడ్లపాడులో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఆస్తుల విషయంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులకు, కొనుగోలుదారులమని చెప్పుకుంటున్న వ్యక్తులకు మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం బహిర్గతమైంది. ఆర్యవైశ్య సంఘం, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అసలేం జరిగింది.. స్థానిక మెయిన్ సెంటర్లోని శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన సుమారు 4.05 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఆరు షాపుల కాంప్లెక్స్ను ఆర్యవైశ్య సంఘం పర్యవేక్షిస్తోంది. ఈ ఆలయానికి ఉప కోశాధికారిగా ఉన్న మద్దుల రమణారావు, పదేళ్లుగా ఆలయ వెండి, బంగారు ఆభరణాలతోపాటు అద్దె వసూళ్ల బాధ్యతలను చూస్తున్నాడు. అయితే ఇదే అదునుగా భావించిన రమణారావు, ఆ కాంప్లెక్స్ను తన పూర్వీకుల ఆస్తిగా రికార్డులు సృష్టించి, 2025లో తన భార్య శిరీష పేరిట గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు. ఈ మోసం కాస్తా బ్యాంకు అధికారులు తనిఖీకి రావడంతో వెలుగులోకి వచ్చింది. ఆలయ సొమ్మును తాకట్టు పెట్టి రుణం పొందేందుకు అతను ప్రయత్నించినట్లు గుర్తించిన ఆర్యవైశ్య సంఘం గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోర్జరీ, ఆభరణాల దుర్వినియోగంపై కేసులు నమోదయ్యాయి. కోర్టులో విచారణలో ఉండగానే.. ఈ వ్యవహారం కోర్టులో విచారణలో ఉండగానే, రమణారావు ఆ కాంప్లెక్స్ను మంగళగిరికి చెందిన కట్టెపోగు వెంకయ్య, నరిశెట్టి నారయ్యలకు విక్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం వెంకయ్య తన అనుచరుడితో కలిసి షాపుల వద్దకు వచ్చి, అద్దెలు తమకే చెల్లించాలని డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. గ్రామస్తులు, సంఘ సభ్యులు వారిని నిలదీయగా, మంగళగిరి నుంచి వచ్చిన వ్యక్తులు దుర్భాషలాడుతూ దాడికి దిగారు. సమాచారం అందుకున్న యడ్లపాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్న్కు తరలించి వివరాలను తెలుసుకుంటున్నారు. దేవుడి ఆస్తుల విషయంలో ఇంతటి మోసానికి పాల్పడటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెలుగు చూడాల్సి ఉంది. యడ్లపాడులో ఉద్రిక్తత -
జీజీహెచ్లో జూనియర్ అసిస్టెంట్పై చర్యలు
గుంటూరు మెడికల్ : గుంటూరు జీజీహెచ్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉదయభాస్కర్ను సీటు నుంచి తొలగిస్తూ ఆఫీస్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డి.ఉయభాస్కర్ కిడ్ని ప్లాంటేషన్ ఆపరేషన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు మంజూరు చేసేందుకు రూ. లక్షకుపైగా అడిగినట్లు జిల్లా కలెక్టర్కు బాధితులు లిఖితపూర్వకంగా గత నెలలో ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవ పట్నం గ్రామానికి చెందిన కె.సూర్యనారాయణ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అనుమతి కోసం జీజీహెచ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. సదరు సీటు బాధ్యతలు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఉదయభాస్కర్ త్వరితగతిన అనుమతులు మంజూరు చేయకుండా నాలుగు నెలలకుపైగా కాలయాపన చేశాడని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి అధికారులు నాలుగు రోజుల క్రితం రహస్య విచారణ చేసి ఉదయభాస్కర్పై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు, కనీసం సీటు మార్పు కూడా చేయలేదు. దీనిపై మార్చి 29న ‘సాక్షి’ దినపత్రికలో ‘లంచం ఇస్తేనే ఆపరేషన్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. అధికారులు స్పందించి మంగళవారం సీటు మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎన్.శ్రీకాంత్ను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ బోర్డు నిర్వహించాలని ఆదేశించారు. -
ఐజీని కలిసిన విశ్రాంత ఉద్యోగులు
నగరంపాలెం:గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్లోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మంగళవారం ఏపీ విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. సంఘం రాష్ట్ర కోశాధికారి డాక్టర్ కేవీ.నారాయణ (విశ్రాంత డీఎస్పీ), శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా యూనిట్ కోశాధికారి ఎల్.ప్రభాకరరావు (విశ్రాంత డీఎస్పీ) సంబంధించి సమస్యలపై వినతిపత్రాలు అందించినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ తెలిపారు. విశ్రాంత డీఎస్పీల సమస్యలపై గుంటూరు రేంజ్ ఐజీ సానుకూలంగా స్పందించారని అన్నారు. అనంతరం ఐజీని సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి డాక్టర్ కె.వి.నారాయణ, కార్యవర్గ సభ్యుడు బి.వి.సుబ్బారెడ్డి (విశ్రాంత డీఎస్పీ), సభ్యుడు వై.టి.నాయుడు (విశ్రాంత ఎస్పీ) పాల్గొన్నారు. నగరంపాలెం: గృహ ఎల్పీజీ సిలిండర్లను వినియోగించే వ్యాపార దుకాణాలు, హోటళ్లల్లో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండల పరిధిలోని గొల్లపాలెం రోడ్డులో ఉన్న బాలాజీ మెస్లో ఆరు సిలిండర్లు, మసీద్ సెంటర్లోని మస్తాన్ బాబా ముబారక్ హోటల్లో ఎనిమిది గృహ ఎల్పీజీ సిలిండర్లను గుర్తించారు. అక్రమంగా వినియోగిస్తున్న 14 సిలిండర్లను స్థానిక డిప్యూటీ తహసీల్దార్కు అప్పగించారు. ఆయా హోటళ్ల యాజమానులపై రెండు 6–ఎ కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్న్స్, పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని మోటార్ సెక్షన్, బెల్ఆఫ్ఆర్మీ సెక్షన్, డాగ్ కెన్నెల్స్, యూనిట్ హాస్పిటల్, పోలీస్ క్యాంటిన్, కమ్యూనికేషన్, టైలరింగ్ సెక్షన్ విభాగాలను మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తనిఖీలు చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి విభాగంలో శుభ్రత, నిర్వహణ ప్రమాణాలు మెరుగుపరచాలని అన్నారు. ఆయుధాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని ఆదేశించారు. ఎస్కార్ట్ డ్యూటీలు, గార్డ్ డ్యూటీలు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. పోలీస్ డాగ్స్క్వాడ్ సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్) డిఎస్పీ సంకురయ్య, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్, శివరామకృష్ణ పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారికి భక్తులు హుండీల ద్వారా రూ.76.38 లక్షల నగదును కానుకలు, మొక్కుబడిగా సమర్పించారు. కానుకలను సోమవారం అమ్మవారి మండపంలో లెక్కించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈఓతో గ్రూపు ఆలయాల ఈఓలు సీహెచ్ జయప్రకాష్బాబు, బీవీ సుబ్బారావు, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు పర్యవేక్షించారు. -
రోడ్డు ప్రమాదంలో అత్తాకోడలు మృతి
● ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ ● మృతులు ఫిరంగిపురం మండలం మునగపాడు వాసులు ● నరసరావుపేట సమీపంలో ఘటన నరసరావుపేట రూరల్: రోడ్డు ప్రమాదంలో అత్తా, కోడలు మృతిచెందిన ఘటన మంగళవారం గుంటూరు రోడ్డులో చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు. ఫిరంగిపురం మండలం మునగపాడుకు చెందిన చాట్ల మస్తాన్రావు, అతని తల్లి పార్వతమ్మ(50), భార్య నందిని(30)లు బ్యాంక్లో పని కోసం ద్విచక్రవాహనంపై నరసరావుపేటకు వచ్చారు. బ్యాంక్లో పని పూర్తిచేసుకుని తిరిగి స్వగ్రామం వెళ్లే క్రమంలో గుంటూరు రోడ్డు పాత ఆర్టీవో కార్యాలయం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని మొక్కజొన్న లోడుతో వినుకొండ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న పార్వతమ్మ, నందినిలు లారీ వెనుక చక్రాలు కింద పడిపోయారు. పార్వతమ్మ మీద నుంచి లారీ వెళ్లడంతో ఆమె మృతదేహం ఛిద్రమైంది. నందిని తీవ్రంగా గాయపడింది. ఆమెను పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. ఈ ఘటనలో మస్తాన్రావు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
నాగార్జునకొండను సందర్శించిన జిల్లా కలెక్టర్
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ను మంగళవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించి అభివృద్ధి పనులను సమీక్షించారు. ముందుగా కలెక్టర్ లాంచీలో నాగార్జునకొండకు చేరుకొని కొండలోని మ్యూజియం, బుద్ధుని పుట్టుకకు సంబంధించిన శిలా ఫలకాలు, రాతి పనిముట్లు, సింహళ విహార్లోని మహాస్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం తిలకించారు. నాగార్జునకొండ క్యూరేటర్ కమల్హాసన్ బుద్ధుని జీవిత చరిత్ర, చారిత్రక బౌద్ధ శిల్పాల గురించి కలెక్టర్కు వివరించారు. ఆమె పర్యాటక అవకాశాలను మరింత విస్తరించటానికి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించాలన్నారు. విజయపురిసౌత్లోని హరిత రిసార్ట్స్ గదులను ఆధునీకరించాలన్నారు. కృష్ణా జలాశయంలో చిన్న బోట్లు ఏర్పాటు చేయటంతోపాటు వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేయాలన్నారు. స్వదేశీ దర్శన్ చాలెంజ్ బేస్డ్ డెక్షినేషన్ డెవలెప్మెంట్ కింద జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ, టూరిజం డీవీఎం కృష్ణచైతన్య, ఏపీటీడీసీ డీఈ కుమార్, మాచర్ల తహసీల్దార్ కిరణ్కుమార్, లాంచ్ యూనిట్ ఇన్చార్జి మస్తాన్ ఉన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 534.30 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి జలాశయానికి 5,184 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
అవినీతికి ‘రాజముద్ర’
నరసరావుపేట టౌన్: నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంప్ల విక్రయాల పేరుతో జరుగుతున్న అవినీతి తారస్థాయికి చేరింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు కార్యాలయంలో స్టాంప్లను విక్రయిస్తూ సిబ్బంది బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్నారు. దీంతోపాటు డాక్యుమెంట్ రైటర్లతో సిబ్బంది కుమ్మకై ్క వ్యవహరించటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లుతుంది. స్టాంపుల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతుండటం ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది. మొదటి నుంచి రిజిస్ట్రార్ కార్యాలయంలో విక్రయించే నాన్ జ్యూడిషియల్, ఫ్రాంక్లీన్ స్టాంపులు, స్పెషల్ అడిసివ్ స్టాంపుల విక్రయాల్లో అవినీతి జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. అయితే అధికారులు స్పందించకపోవటంతో సిబ్బంది చేతివాటం రోజురోజుకు పెచ్చుమీరింది. ఒప్పంద పత్రాలు, నోటరీ, అగ్రిమెంట్లు, అఫిడవిట్లు, రిజిస్ట్రేషన్, బ్యాంక్ బాండ్స్ తదితర వాటికి స్టాంపుల వినియోగం తప్పనిసరి. స్టాంపులకు ఉన్న డిమాండ్ను ఆసరా చేసుకొని సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు. ● ముఖ్యంగా కార్యాలయంలో స్టాంపులు విక్రయించే సిబ్బంది అందుబాటులో ఉండక పోవటం అక్కడ సర్వసాధారణంగా మారింది. ఒక వేళ సిబ్బంది ఉన్నా స్టాంపులు అందుబాటులో లేవని కార్యాలయం ఎదుట ఉన్న డాక్యుమెంట్ రైటర్ల వద్ద కొనుగోలు చేయాలని పంపిస్తున్నారు. అక్కడ రూ.100 స్టాంపుకు రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా విక్రయిస్తున్నారు. కార్యాలయ పనివేళలు ముగిసిన తర్వాత వెళితే రెట్టింపు ధర వసూలు చేస్తున్నారు. దీంతో వినియోగదారులు అధిక ధరకు స్టాంపులు కొని నష్టపోతున్నారు. కళ్లెదుట అవినీతి జరుగుతున్నా.. రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ –1, జాయింట్ –2 రిజిస్ట్రార్లు ఇద్దరూ విధులు నిర్వహించే ఎదుటే స్టాంపులు విక్రయించే కేంద్రం ఉంది. అక్కడ బహిరంగంగా స్టాంపునకు రూ.20 అదనంగా విక్రయిస్తున్నారు. అక్కడ విధులు నిర్వహించే సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించటం లేదు. స్టాంపులు, ఫ్రాంక్లీన్ ముద్రలకు వచ్చిన వినియోగదారులు గంటలకొద్దీ వేచి ఉంటున్నారు. చివరికి సిబ్బంది అందుబాటులో ఉండకపోవటంతో అసహనంగా బయట డాక్యుమెంట్ రైటర్ల వద్ద స్టాంపులు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. స్టాంపుల విక్రయ సిబ్బంది చర్యల వల్ల ప్రభుత్వ ఆదాయానికి సైతం గండిపడుతున్నా అధికారులు స్పందించకపోవటం గమనార్హం. ఫిర్యాదు చేసినా ప్రయోజనం సున్నా.. రిజిస్ట్రార్ కార్యాలయంలో స్టాంపుల విక్రయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కొందరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఇటీవల ఫిర్యాదు చేశారు. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నా విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం విచారణ చేపట్టకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ అవినీతి ఇలానే కొనసాగితే ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు ప్రజలపై అదనపు భారం పడుతుంది. కొందరు దస్తావేజు లేఖర్లతో కార్యాలయ సిబ్బంది అంతర్గత ఒప్పందం చేసుకొని స్టాంపుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. స్టాంపులు విక్రయించే కేంద్రంలో సిబ్బంది ఉద్దేశపూర్వకంగా స్టాంపులు అందుబాటులో లేకుండా చేసి, బయట అధిక ధరలకు కొనుగోలు చేయించేలా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. దీనిలో భాగంగానే స్టాంపుల కోసం వచ్చిన వారిని కార్యాలయ సిబ్బందే బయట అధిక ధరకు స్టాంపులు కొనుగోలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. విక్రయాల ద్వారా వచ్చిన అధిక సొమ్మును సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు పంచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
పేదల సొంతింటి కల సాకారం
కలెక్టర్ కృత్తికా శుక్లా పిడుగురాళ్ల: పేదల సొంతింటి కల సాకారం అయిందని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా అన్నారు. సోమవారం పట్టణంలోని టిడ్కో గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లు పొందిన ప్రతి ఒక్కరూ వెంటనే కొత్త ఇంటిలోకి మారిపోవాలని అన్నారు. లబ్ధిదారులు ఈ నూతన గృహాలలో ఉండకపోతే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇక్కడే ఉంటే అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కాలనీలో ప్రత్యేకంగా ఒక రేషన్ డిపో, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమస్యలు ఏమైనా ఉంటే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రూ. 83 కోట్లతో ఈ నిర్మాణాలు చేపట్టామని మిగిలిన రూ.14 కోట్లతో మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ 2014 టీడీపీ ప్రభుత్వంలో కేంద్ర సహకారంతో పిడుగురాళ్లలో ఆరు వేల ఇళ్లకు అనుమతులు తీసుకొచ్చి నిర్మాణాలు చేపట్టామని, ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా పట్టణంలో 1273 ఇళ్లను పూర్తి చేసామని మొదటి విడతలో భాగంగా 94 మంది లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్ 15 నాటికి ఓపీ ప్రారంభం పిడుగురాళ్ల రూరల్: మండలంలోని కామేపల్లి గ్రామంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా సోమవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలోని హాస్పటల్ను ఏప్రిల్ 15లోగా పూర్తిచేసి ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. అవసరమైన అన్ని నియామకాలను పూర్తి చేస్తున్నామన్నారు. మే 15 కల్లా మెడికల్ కళాశాలను పూర్తి చేసి వంద ఎంబీబీఎస్ సీట్లతో విద్యా సంవత్సరం ప్రారంభిస్తామన్నారు. పల్నాడుకు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఒక వరం అన్నారు. ఇకపై వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్ని వైద్య సదుపాయాలు పల్నాడు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. రెండు మూడు నెలల్లో పూర్తిస్థాయి సేవలు అందిస్తామన్నారు. సమావేశంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు. -
బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన న్యాయమూర్తి
సత్తెనపల్లి: పట్టణంలోని రఘురామ్నగర్లో గల ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సత్తెనపల్లి ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్ )థౌషిద్ హుస్సేన్ సోమవారం సందర్శించారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్ ) వి.విజయ్కుమార్రెడ్డి సూచనల మేరకు వసతి గృహం విద్యార్ధినిలకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ముందుగా న్యాయమూర్తి థౌషిద్ హుస్సేన్ వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు. విద్యార్ధినిలకు అందిస్తున్న ఆహారం, అవసరమైన సరకులు నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినిలకు అందాల్సిన సౌకర్యాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో న్యాయవాదులు దివ్వెల శ్రీనివాసరావు, గంటా వెంకటశివ, బుర్రి సైదయ్య, పారా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని, వసతి గృహ అధికారిణి ఎం.ఇందిరాగాంధీ, కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో నాయకులు తెనాలి రూరల్: పాస్టర్ల సంక్షేమానికి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేస్తుందని అసోసియేషన్ నాయకులు తెలిపారు. అసోసియేషన్ మార్చి నెల సమావేశాన్ని పట్టణంలోని కల్వరి కృప చర్చిలో సోమవారం నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ డాక్టర్ పినపాటి జాన్పాల్, గౌరవాధ్యక్షుడు డాక్టర్ కత్తెర సురేష్కుమార్ మాట్లాడుతూ పాస్టర్లు నిబద్దతతో సేవ చేయాలని, ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. అసోసియేషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే పాస్టర్లకు అసోసియేషన్ అండగా ఉంటుందన్నారు. అసోసియేషన్ ద్వారా అందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నామని, అవసరతలో ఉన్న దైవ సేవకులకు ఆర్థిక చేయూత సైతం అందజేసే విధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న సూక్తి ప్రకారం అసోసియేషన్ లోని ప్రతి సభ్యుడికి సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామన్నారు. పాస్టర్లకు దేవుని సువార్త అందించటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. దేవునిపై నమ్మకం ఉంచి దేవుని సేవ చేసే వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయన్నారు. అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి రెవరెండ్ మల్లవరపు విజయ్ కుమార్, జె.ప్రభుదాస్, చిలక జాన్ వరప్రసాదరావు, అన్నం ఆదాం, విలియం కేరి, గడ్డం జాన్బాబు, ఎం.షడ్రక్, పొదిల ఏసోబు, శ్రీకాంత్, రజనీకాంత్, ఎం.షాలేమ్రాజు, తూమాటి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు సోమవారం రావణ వాహన సేవ జరిగింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆదివారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో రెండో రోజైన సోమవారం ఉదయం మూలమంత్ర హవనం, సాయంత్రం ఔపాసన, బలిహరణ, హారతి, మంత్రహవనం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రాంగణంలోని మహా మండపం నుంచి నగరోత్సవ సేవ ప్రారంభమైంది. రావణ వాహనంపై కొలువై ఉన్న శ్రీగంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ ఊరేగింపును ప్రారంభించారు. మహామండపం నుంచి ప్రారంభమైన రావణ వాహన సేవ రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్, మెయిన్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆదిదంపతులకు భక్తులు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఆదిదంపతులకు పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించి పూజలు జరిపించుకున్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ, చిన్నారుల కోలాట విన్యాసాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య నగరోత్సవం కనులపండువగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎప్పుడిస్తారు బాబూ?
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం..వారికి అన్ని విధాలా అండగా ఉంటున్నాం .. అంటూ చంద్రబాబు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంట నష్టం జరిగి ఆరు నెలలు గడుస్తున్నా వారికి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. నేను వ్యవసాయం చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నా. గత ప్రభుత్వంలో రైతు భరోసా ప్రతి ఏటా వచ్చేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ ఒక్కసారి కూడా రాలేదు. నాకు 52 సెంట్లు సొంత పొలం ఉంది. అలాంటప్పుడు నాకు అన్నదాత సుఖీభవ ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నిస్తే..నీ పేరుతో 10 సెంట్లు మాత్రమే పొలం ఉన్నట్లు చూపుతుందని సమాధానం ఇచ్చారు. నాకు 52 సెంట్లు ఉన్నట్లు ఆన్లైన్లో అడంగల్, వన్బీ కాపీలు తీసుకొని ఇచ్చా. అయినా ఇంత వరకు అతీగతీలేదు. – కాశిమాల ఓబయ్య, రైతు, గర్నెపూడి, సత్తెనపల్లి మండలంసత్తెనపల్లి: కొద్ది రోజులు గడిస్తే ఖరీఫ్ పంట చేతికి అందుతుంది .. సరిగ్గా అదే తరుణంలో .. గతేడాది అక్టోబర్ నెలాఖరులో మోంథా తుపాన్ విరుచుకుపడింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మోంథా తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని ప్రకటించి నేటికీ పరిహారం అందజేయక పోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాయం అందజేస్తే కనీసం రబీ సాగు ఖర్చులకు దోహదపడతాయని రైతులు ఆశగా ఎదురు చూశారు. రబీ ముగుస్తున్నా ఇంత వరకు పరిహారం అందలేదు. గత ఆరు నెలల కిందట మోంథా తుపాను దాటికి జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, మినప, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 1730.25 హెక్టార్లలో దెబ్బతిన్న పంట జిల్లా వ్యాప్తంగా 1730.25 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు సర్వే చేసి అధికారులు లెక్కలు కట్టారు. అప్పట్లో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టం జరిగితే పరిహారం అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేసి పంటల నష్టాన్ని గుర్తించారు. జిల్లాలో 3,377 మంది రైతులు పంట నష్ట పరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) అందుకునేందుకు అర్హులుగా గుర్తించి నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఆరు నెలలు గడుస్తున్నా నేటి వరకు నష్టపరిహారం అందజేయక పోవడంతో బాధిత రైతులు మౌనంగా రోదిస్తూ భారంగా ఎదురుచూస్తున్నారు. రైతు కంట కన్నీరు ఏటా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతున్నారు. అకాల వర్షాలు, తుపానుల కారణంగా చేతికొచ్చిన పంట ఉత్పత్తులు దెబ్బతింటున్నాయి. దెబ్బతినగా మిగిలిన కొద్ది పంటలను విక్రయించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిహారం అందజేస్తే కొద్దిగా అయినా నష్టం భర్తీ అవుతుందనే భావనలో అన్నదాతలు ఉన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా చర్యలేవి తీసుకోకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన సమయంలో కూడా ప్రభుత్వం ఆదుకోకపోతే ఎలా పంటలు సాగు చేపట్టాలని వారు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న రూ.20 వేల సాయాన్ని తొలి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాది కూడా కౌలు రైతులకు అందజేయలేదు. అర్హులైన కొంత మంది రైతులకు ఇంకా ఇంతవరకు ఖాతాలకు నగదు జమ కాలేదు. ఎందుకు అన్నదాత సుఖీభవ పథకం తమ ఖాతాకు జమ కాలేదని అడిగితే చెప్పేవారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగు సమయంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలోనూ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నష్టం తప్ప మేలు జరగలేదనే విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మోంథా తుపానుతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో మొంథా తుపాన్ నష్టం(హెక్లార్లలో) పంట విస్తీర్ణం పత్తి 1,564.80 వరి 114.75 మొక్కజొన్న 28.99 కంది 05.42 మినప 16.29 మొత్తం 1,730.25 -
సాతులూరులో విషాదం
గోపీ కుటుంబానికి అంతిమ సంస్కారాలు నాదెండ్ల: తమ కుమార్తె పుట్టుకతోనే జన్యు లోప సమస్యతో బాధపడుతుండటంతో మనోవేదనకు గురై చిన్నారితో సహా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సాతులూరులో విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన డాక్టర్ కుంభా గోపీ భోపాల్ ఎయిమ్స్లో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన శంకరకుమారితో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమార్తె మౌనిక ఉంది. కుమార్తె పుట్టుకతోనే డౌన్ సిండ్రోమ్తో బాధపడుతుండటంతో దంపతులు వేదన పడేవారు. ఈ క్రమంలో కుమార్తెతో కలిసి నరసరావుపేటకు చేరుకున్న దంపతులు స్థానికంగా ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఆదివారం ఉదయం డాక్టర్ గోపీ తన భార్య శంకరకుమారి, కుమార్తె మౌనికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి తాను కూడా తీసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. భార్య, కుమార్తె అప్పటికే మృతి చెందగా, గోపీ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. దీంతో మృతదేహాలను స్వగ్రామమైన సాతులూరుకు తరలించారు. గోపీ కుటుంబాన్ని చివరిసారి చూసేందుకు గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. -
తండ్రి మరణాన్ని దిగమింగుకుని
పదవ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థిని కుందురువారిపాలెం(ముప్పాళ్ల): తండ్రి మరణాన్ని సైతం బిగపట్టుకొని పదవ తరగతి పరీక్షకు హాజరైంది కుందురువారిపాలెం గ్రామానికి చెందిన విద్యార్థిని మేడ భావనలక్ష్మి. గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన మల్లికార్జునరావు (38), పద్మలకు ఇద్దరు సంతానం. వీరిలో పెద్దదైన భావనలక్ష్మి చదువులో చురుగ్గా ఉండటంతో నరసరావుపేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో పదవ తరగతి చదివించుకుంటున్నారు. సోమవారం జరిగే సోషల్ స్టడీస్ పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఆదివారం రాత్రి భావనలక్ష్మి తండ్రి మల్లికార్జునరావు గుండెపోటుతో మృతి చెందాడు. కళ్లెదుటే తండ్రి మృతి తట్టుకోలేక, మరో వైపు పరీక్షకు సన్నద్ధమవ్వాల్సి ఉండటంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటూ ధైర్యం కోల్పోకుండా సోషల్ పరీక్షకు హాజరైంది. తన అన్న సాయంతో నరసరావుపేటలోని పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష సజావుగా రాసింది. తండ్రి మరణంతో వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్షకు హాజరైన విద్యార్థిని అభినందించారు. -
టీచర్పై సస్పెన్షన్ ఎత్తివేత
‘సాక్షి’ కథనంతో దిగివచ్చిన విద్యాశాఖ అధికారులు గుంటూరు ఎడ్యుకేషన్: అకారణంగా ఉపాధ్యాయురాలిపై విధించిన సస్పెన్షన్ను గుంటూరు జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీంబాషా వెనక్కి తీసుకున్నారు. ఉపాధ్యాయురాలికి జరిగిన అన్యాయంపై ‘సాక్షి’లో వచ్చిన కథనం విద్యాశాఖలో కలకలం సృష్టించిన నేపథ్యంలో ఎట్టకేలకు క్షేత్ర స్థాయిలో విచారణ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఎత్తివేశారు. గుంటూరు బీఆర్ స్టేడియం ఎదుట ఉన్న మహాకవి తిక్కన – శ్రీ పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 23న మధ్యాహ్న భోజనం తనిఖీ చేసేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే ఎం.డి.నసీర్ అహ్మద్ పథకంలో తలెత్తిన లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంఘటనతో సంబంధంలేని ఉపాధ్యాయురాలు సి.హెచ్.అరుణరాణిని మరుసటి రోజే డీఈఓ సస్పెండ్ చేశారు. విచారణ లేకుండా సస్పెండ్ చేసిన విషయమై ‘సాక్షి’లో కథనం ప్రచురించడంతో దిగి వచ్చిన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ ఎత్తివేసి ఆమెను అదే పాఠశాలలో కొనసాగిస్తూ సోమవారం డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. -
పల్లెల్లో ముగియనున్న ‘ప్రజా’ పాలన
యడ్లపాడు : రాష్ట్రంలోని స్థానిక సంస్థల ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల బాటలోనే ఇప్పుడు గ్రామ పంచాయతీలు కూడా ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ రెండో తేదీతో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం, యంత్రాంగం సిద్ధంగా లేకపోవడంతో పాలనా పగ్గాలను అధికారులకు అప్పగించే ప్రక్రియ దాదాపుగా వేగవంతమైంది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. మేజర్ పంచాయతీలకు మండలస్థాయి అధికారులను, ఇతర గ్రామాలకు ఆ స్థాయికి తగ్గని అధికారులను ప్రత్యేక పాలకులుగా నియమించేందుకు కసరత్తు పూర్తయినట్లు సమాచారం. గత ఎన్నికల నేపథ్యం.. విభజన తర్వాత మారుతున్న సమీకరణాలు గత ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలిస్తే.. 2021 ఫిబ్రవరిలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 973 గ్రామ పంచాయతీలకు నాలుగు దశల్లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఫలితాలు వెల్లడైన వెంటనే సర్పంచులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, సాంకేతిక కారణాలతో వారి పదవీకాలం ఏప్రిల్ 2 నుంచి లెక్కించబడింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 1 అర్ధరాత్రి వరకు మాత్రమే వారికి అధికారికంగా హోదా దక్కనుంది. అయితే ఉమ్మడి జిల్లాలోని 56 గ్రామాల్లో గతంలోనే ఎన్నికలు జరగలేదు. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలు మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం కావడం, మరికొన్ని గ్రామాలు నగర పంచాయతీలుగా మారడం, ఇంకొన్ని చోట్ల కోర్టు కేసులు అడ్డంకిగా మారడం వల్ల సుదీర్ఘ కాలంగా అక్కడ ప్రజాప్రతినిధుల పాలన కరువైంది. జిల్లాల పునర్విభజన తర్వాత ఈ గందరగోళం మరింత పెరిగిందని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలుతోంది. అప్పుల ఊబిలో సర్పంచులు.. మరోవైపు గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ముగిసిపోతున్న తరుణంలో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత కొన్నేళ్లుగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్లో ఉండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. అధికారిక హోదా ఉన్నప్పుడే నిధులు రాబట్టుకోలేకపోయిన తాము, పదవి నుంచి దిగిపోయాక కార్యాలయాల చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం ఉంటుందా అన్న సందేహం వారిలో వ్యక్తమవుతోంది. సొంత నిధులు వెచ్చించి పనులు చేసిన వారు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయామని వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో అందుతున్న ప్రతికూల నివేదికల నేపథ్యంలో, ప్రజా ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందనే భయంతోనే ప్రభుత్వం నిధుల విడుదలపై కూడా స్పష్టత ఇవ్వడం లేదని తెలుస్తోంది. అధికారుల చేతుల్లోకి పల్లె అధికారం జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల విషయంలోనూ ఇదే తరహా అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు దృష్ట్యా పునర్విభజన ప్రక్రియ పూర్తి కావాలని, కుల గణన నిర్వహించాల్సి ఉందని ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఎన్నికల వాయిదాకే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. వివిధ సంక్షేమ పథకాల అమలులో తలెత్తుతున్న ఇబ్బందులు, సామాన్య ప్రజల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో, ప్రస్తుతానికి ఎన్నికల బరిలోకి దిగడం రాజకీయంగా నష్టదాయకమని టీడీపీ పెద్దలు అంచనా వేస్తున్నారు. మొత్తంమీద గ్రామీణ స్థాయిలో స్వపరిపాలనకు తాత్కాలికంగా విరామం లభించి, ప్రత్యేక అధికారుల చేతుల్లోకి అధికారం బదిలీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. -
జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలు
చిలకలూరిపేటటౌన్: చిలకలూరిపేట మండల పరిధిలోని పసుమర్రు వద్ద జాతీయ రహదారి ప్రమాదాల అడ్డాగా మారుతోంది. సోమవారం కొద్దిపాటి కాలవ్యవధిలోనే ఇక్కడ రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో కాలేజీ బస్సు ప్రమాదంలో విద్యార్థులు క్షేమంగా బయటపడగా, మరో ప్రమాదంలో టీవీఎస్ ఎక్స్ఎల్పై వెళ్తున్న వృద్ధుడు తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతున్నాడు. ఒకే ప్రాంతంలో వెంటవెంటనే రెండు ప్రమాదాలు జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ● నరసరావుపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు ఇంకొల్లు నుంచి నరసరావుపేట వైపు 8 మంది విద్యార్థులతో వెళ్తుండగా, నూతన జాతీయ రహదారిపై పసుమర్రు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా వాహనం నియంత్రణ కోల్పోయి కళాశాల బస్సును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి ఇన్నోవా ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్సు కూడా కొంతమేర దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులోని విద్యార్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. బస్సు ఇంజిన్ ఆగిపోవడంతో, విద్యార్థులందరూ ఎటువంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కాలేజీ యాజమాన్యం స్పందించి, మరో బస్సును పంపి విద్యార్థులను సురక్షితంగా కళాశాలకు తరలించింది. విద్యార్థులు ఎవరూ గాయపడలేదని కళాశాల వర్గాలు అధికారికంగా ధ్రువీకరించడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ● మొదటి ప్రమాదం జరిగిన స్థలానికి కొంత దూరంలోనే మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాపాబత్తిన కోటయ్య అనే వృద్ధుడు తన కుమారులను కలవడానికి చిలకలూరిపేటలోని తూర్పుమాలపల్లికి వచ్చాడు. సోమవారం ఉదయం తన స్వగ్రామమైన బాపట్ల జిల్లా పర్చూరు మండలం గర్నెపూడికి తిరిగి వెళ్లడానికి తన టీవీఎస్ ఎక్స్ఎల్పై బయలుదేరాడు. కోటయ్య పసుమర్రు వద్ద హైవే దాటి గర్నెపూడి వైపు వెళ్తుండగా, అప్పటికే వేగంగా దూసుకొచ్చిన బొలోరో కారు అతన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన కోటయ్యకు తల, కాలికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిలకలూరిపేట 108 సిబ్బంది ఈఎంటీ శోభన్బాబు, పైలెట్ పవన్కల్యాణ్ ఘటనా స్థలానికి చేరుకుని, కోటయ్యకు ప్రాథమిక చికిత్స అందించి, పట్టణ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించడం జరిగింది. ప్రస్తుతం కోటయ్య ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈరెండు ప్రమాదాలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మరోసారి డ్రామా
బాపట్ల: అమరావతే రాజధాని అంటూ మూడోసారి తీర్మానం చేయటం చూస్తుంటే చంద్రబాబు ప్రజలను ఏవిధంగానైనా మోసం చేయగలరని మరోసారి నిరూపితమైందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోన రఘుపతి మాట్లాడారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశంతో హడావిడిగా శాసనసభ ఏర్పాటుచేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అగౌరపరిచే విధంగా మాట్లాడించటం బాధాకరమన్నారు. శాసనమండలిలో తగినంత బలం లేకపోవటంతో శాసనసభలో తీర్మానం చేసి మమ అనిపించారని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేసిన చంద్రబాబు అన్నింటిని తాత్కాలికం పేరుతో అసెంబ్లీ, పరిపాలనభవనం, హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటో అర్ధం కావటంలేదన్నారు. తాజాగా మరో తీర్మానం చేసి మరికొంత భూమిని కాజేసేందుకు చంద్రబాబు టీమ్ సిద్ధంగా ఉందని కోన ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటం చేతకాని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టించేందుకు కుటిల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బాపట్ల అభివృద్ధిపై ఎమ్మెల్యే వేగేశన పెద్దవి విప్పాలి వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు బాపట్ల కేంద్రంగా జిల్లాను సాధించుకున్నామని కోన రఘుపతి గుర్తు చేశారు. ప్రస్తుతం బాపట్లలో జరుగుతున్న అభివృద్ధిపై ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పెద్దవి విప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రూ.530 కోట్లతో మెడికల్ కళాశాలను సాధించుకున్నామని, ఇప్పుడు నిలిచిపోయిన ఆ పనులను ఏవిధంగా చేపడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. సూర్యలంక ప్రాంతాభివృద్ధికి వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్రమంత్రి కిషన్రెడ్డికి రూ.100కోట్లతో ప్రతిపాదనలు పంపటం జరిగిందన్నారు. ఆ ప్రతిపాదనలపై ఇప్పుడు నిధులు విడుదల కాగా వాటిని ఏవిధంగా ఖర్చుపెడుతున్నారో బహిరంగంగా తెలియజేయాలని అన్నారు. సమావేశంలో బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు జి.సురేంద్ర, రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, నాయకులు వడ్డిముక్కల డేవిడ్, గంగిశెట్టి రత్తయ్య, నక్కా వీరారెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పిట్టు శ్రీనివాసరెడ్డి, చీరాల వెంకటేశ్వరెడ్డి, గవిని కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. -
కారు ఢీకొని దుర్గగుడి అర్చకుడి దుర్మరణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కారు డ్రైవర్ నిర్లక్ష్యం దుర్గగుడి అర్చకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరానికి చెందిన పాణిగ్రాహి జగన్మోహన శర్మ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. గత గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలుదేరిన జగన్మోహనశర్మను తాడేపల్లి పీహెచ్సీ సెంటర్కు వచ్చే సరికి కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో జగన్మోహనశర్మ రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. ప్రమాదస్థలం నుంచి హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. మరి కొద్ది రోజుల్లో ఉద్యోగ విరమణ చేయాల్సిన జగన్మోహన శర్మ మరణం కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రమాదంపై జగన్మోహన శర్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ప్రమాదానికి కారణమైన కారు యజమానిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన శర్మ భౌతికకాయాన్ని దుర్గగుడి దేవస్థానానికి చెందిన పలువురు అధికారులు, అర్చకులు, సిబ్బంది సందర్శంచి నివాళులర్పించారు. పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి ఆలయం వద్ద ఏడాది పాటు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన బహిరంగ వేలం, ఇ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ఆలయానికి రూ.92.90 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ బి.మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆలయం వద్ద కొబ్బరికాయలు విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.50,05,000(పచ్చల శివప్రసాద్), మట్టికుండలు నిర్వహణ లైసెన్స్ హక్కునకు రూ.10,50,000(పచ్చల శివప్రసాద్), మునేరు అవతల 7 షెడ్లు, 4 ఏసీ గదులు, ఒక కల్యాణ మండపం నిర్వహణకు రూ.9,50,000(కొత్తపల్లి సతీష్కుమార్), ఆలయం వద్ద సంచారంగా ఐస్క్రీమ్ విక్రయించుకునే లైసెన్స్ హక్కునకు రూ.5,10,000(ముండ్లపాటి నాగరాజు), భక్తుల సామాన్లు, పాదరక్షలు భద్రపరచు లైసెన్ప్ హక్కునకు రూ.3,15,000 (గడిపూడి గోపి), సులభ కాంప్లెక్స్ నిర్వహణకు రూ.11,80,000(నూతలపాటి సురేష్), పువ్వులు, పాలు, బియ్యం పోగుచేసుకునే హక్కునకు రూ.2,80,000(దండా పుష్పలత), హెచ్చు పాటదారులుగా నిలిచి లైసెన్స్ హక్కును పొందారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మ లేదన్న చేదు నిజాన్ని దాచి..
యడ్లపాడు: ఒకవైపు భవిష్యత్తును నిర్ణయించే పదో తరగతి పరీక్ష.. మరోవైపు ప్రాణ సమానమైన అమ్మ భౌతికకాయం. కన్నతల్లి మరణ వార్తను గుండెల్లోనే దాచుకున్న ఆ కుటుంబం చిన్నారికి చెప్పలేదు. పరీక్ష ముగిశాక తల్లి ఇక లేరన్న నిజం చిన్నారి దృష్టికి తీసుకెళ్లారు. యడ్లపాడు హైస్కూల్ రోడ్డులోని కొత్తూరుకు చెందిన మొగిలి వెంకటేశ్వర్లు, సునీత దంపతులు కొంతకాలంగా నరసరావుపేటలో నివాసం ఉంటున్నారు. అక్కడ వస్త్ర వ్యాపార దుకాణం నడుపుతూ తమ ఇద్దరు కుమారులను ప్రయోజకులను చేయాలని కలలు కన్నారు. అందులో భాగంగానే చిన్న కుమారుడు జగదీష్ ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. ఆదివారం స్వగ్రామం యడ్లపాడు వచ్చి వెళ్తుండగా కోండ్రుపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం వారి జీవితాల్లో చీకటి నింపింది. తీవ్రంగా గాయపడిన సునీత గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. అమ్మ ఇక లేదన్న చేదు నిజాన్ని వింటే జగదీష్ పరీక్ష రాయలేడని భావించిన తండ్రి, బంధువులు ఆ నిజాన్ని దాచారు. గుండె నిండా దుఃఖం ఉన్నా, ముఖంపై చిరునవ్వు నటిస్తూ సోమవారం జగదీష్ను నరసరావుపేట సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ పరీక్ష కేంద్రానికి పంపారు. పరీక్ష ముగిసి బయటకు రాగానే.. బంధువులు అసలు విషయం చెప్పారు. అమ్మ ఇక లేదని విన్న ఆ బాలుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. వెంటనే అతడిని యడ్లపాడుకు తీసుకువచ్చారు. పరీక్ష రాసి వచ్చిన చేతులతోనే అమ్మ పాదాలకు నమస్కరించాడు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. అంత్యక్రియల అనంతరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ద్విచక్ర వాహనాలు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
పెదకూరపాడు: అతివేగం ఇద్దరు మైనర్ల ప్రాణాల మీదకు తెచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకూరపాడుకు చెందిన ఇస్మాయిల్, సుభానీలు ద్విచక్ర వాహనంపై సినిమా హాల్వైపు వెళుతున్నారు.. ఈక్రమంలో వ్యక్తిగత పనులపై పెదకూరపాడు బస్టాండ్ వైపు వెళుతున్న షేక్ బాజీ వాహనం గ్రామంలోని కట్టెల అడితి వద్ద ఇరుకు బ్రిడ్జిపై ఒకరికొకరు ఢీకొనగా ఇస్మాయిల్, సుభానిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి గుంటూరు జీజీహెచ్కి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావటంతో ఇరువురు పరిస్థితి విషమంగా ఉంది. బాజీకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతివేగంగా రావడంతో రెండు ద్విచక్ర వాహనాలు టైర్లు పేలి దగ్ధమయ్యాయి. రెండు గంటల ఆలస్యం.. నెడితే గానీ కదలని వైనం.. ఇదిలా ఉండగా.. క్షతగాత్రుల కుటుంబ సభ్యులు 108 వాహనానికి ఫోన్ చేయడంతో ఘటనాస్థలానికి రెండు గంటల ఆలస్యంగా వాహనం వచ్చింది. ఈ క్రమంలో హుటాహుటిన కుటుంబ సభ్యులు క్షతగాత్రులను వాహనంలోకి ఎక్కించారు. వాహనం ఎక్కించిన వెంటనే సెల్ఫ్ డౌన్ అయి వాహనం ఎంతసేపటికి కదలికి పోవడంతో గాయపడిన క్షతగాత్రుల బంధువులు వాహనాన్ని రెండు మూడు పర్యాయాలు నెట్టినా స్టార్ట్ కాలేదు. చివరికి ఎక్కువ మంది వచ్చి వాహనాన్ని నెట్టడంతో స్టార్ట్ అయింది. ఇది మరో రెండు గంటల పాటు జరగటంతో క్షత గాత్రుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే వాహనం ఇదే రోజు మూడు పర్యాయాలు మరమ్మతులకు గురైనట్లు పైలెట్ తెలిపారు. అదిచేశాం.. ఇది చేశాం.. అంటూ గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఆపద్భాందవి అయిన 108 వాహనాలకు మరమ్మతులు సైతం చేయించలేకపోతోందని స్థానికులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. -
కుట్రలు ఎంతోకాలం కొనసాగవు
మాచర్ల: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలను టార్గెట్ చేస్తూ అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. మాజీ మంత్రి విడదల రజని, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావులు పేర్కొన్నారు. అక్రమ కేసులతో జైలుకెళ్లి బెయిల్పై ఇటీవల బయటకు వచ్చిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం మాచర్లలోని ఆయన కార్యాలయంలో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీపీ నేతలు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతూ అక్రమంగా ప్రజాదరణ కలిగిన నాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపటమే లక్ష్యంగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా పీఆర్కే, పీవీఆర్లకు వారికి ఎటువంటి సంబంధం లేని హత్య కేసులో ఇరికించారన్నారు. అంతటితో ఊరుకోకుండా జైలుకు పంపి శునకానందం పొందారన్నారు. తిరిగి వారు జైలు నుంచి విడుదలైతే వారికి లభించిన ఆదరణను భరించలేని స్థితిలో టీడీపీ నాయకులు లేనిపోని అవాకులు, చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ కుట్రలు ఎంతోకాలం కొనసాగవని, న్యాయం తప్పక గెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట, పెదకూరపాడు నియోజక వర్గాల నుంచి భారీ స్థాయిలో మాజీ ప్రజా ప్రతినిధులు, అభిమానులు పీఆర్కే కార్యాలయానికి చేరుకొని ఆయనకు జే జేలు పలుకుతూ ఆయనను సత్కరించారు. అక్రమ కేసులతో జైళ్లకు పంపి శునకానందం పొందుతున్న కూటమి నేతలు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి విడదల రజని, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు -
బుగ్గవాగులో మూడు మృతదేహాలు లభ్యం
రెంటచింతల: మండలంలోని మంచికల్లు గ్రామ సమీపంలోని బుగ్గవాగు రిజర్వాయర్లో సోమవారం ఒకేసారి మూడు మృతదేహాలు లభ్యంకావడంతో పల్నాడు ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముందు రెండు గుర్తుతెలియని మృతదేహాలు (గుర్తించలేని పరిస్థితి) కన్పించడంతో గురజాల ప్రభుత్వ వైద్యాధికారి సాయికరణ బుగ్గవాగు రిజర్వాయర్ వద్దే శవపంచనామ నిర్వహించి వస్తుండగా రాళ్లగుట్టపై మరో మృతదేహం పోలీసులకు కన్పించింది. మూడవ మృతదేహానికి మంగళవారం పంచనామా నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. రెండు మృతదేహాలు 40 సంవత్సరాల వయస్సు కలిగిన యువకులు, మరో మృతదేహం మహిళదిగా వైద్యులు భావిస్తున్నారు. పల్నాడు జిల్లాలోని ఏ పోలీసుస్టేషన్లో అయినా కొద్దిరోజులుగా ఎవరైన వ్యక్తులు అదృశ్యమైనట్లు ఫిర్యాదులు వచ్చాయా అని పోలీసులు విచారిస్తున్నారు. బుగ్గవాగు రిజర్వాయర్లో కన్పించిన ఈ మూడు మృత దేహాలు ఎవరివి...ఏ ప్రాంతానికి చెందిన వారివి ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నాయి అని విషయంపై విచారణ చేస్తున్నారు. మంచికల్లు వీఆర్వో పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగార్జున తెలిపారు. -
అర్జీలపై ప్రత్యేక దృష్టి
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పనిచేయాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చినవారి నుంచి 103 అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్ఓ నారదముని, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, డీపీఓ నాగేశ్వరనాయక్ పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో 103 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ -
ఆర్థిక బకాయిలు చెల్లించాలి
నరసరావుపేట: పీఆర్సీని అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించాలనే తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి గాంధీపార్కు వద్ద తలపెట్టిన ఒకరోజు నిరాహారదీక్షకు ఉపాధ్యాయులు హాజరై జయప్రదం చేయాలని యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహాకు కలెక్టరేట్లో నిరాహారదీక్షపై వినతిపత్రం సమర్పించారు. 12వ పీఆర్సీని అమలు చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతున్పా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. జిల్లా కార్యదర్శులు రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుందర రావు, ప్రాంతీయ శాఖల బాధ్యులు కోటేశ్వరరావు పాల్గొన్నారు. నరసరావుపేట టౌన్: మూడు చోరీ కేసుల్లో నేరం రుజువు కావడంతో నిందితులకు ఒక్కొక్కరికి నెల రోజుల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జి న్యాయాధికారి ఏ. సలోమి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నకరికల్లు, నర్సింగపాడు, చేజర్ల గ్రామాలలో ట్రాన్స్ఫార్మర్ కాపర్ వైర్లను అపహరించుకు వెళ్లినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నకరికల్లు పోలీసులు గత ఏడాది కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితులైన నరసరావుపేటలోని శివ సంజీవయ్య కాలనీకు చెందిన తిరువీధుల శ్రీకాంత్, పుల్లలచెరువు మండలం అక్కపాలెం తందాకు చెందిన మేఘావత్ శ్రీను నాయక్, వినుకొండ మండలం పార్వతీపురం గ్రామానికి చెందిన ధూపాటి చిన్న బాల లింగయ్య, నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామానికి చెందిన పాడిపర్తి నాగిరెడ్డి లను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. -
ఆస్తి వివాదాలపై అధిక ఫిర్యాదులు
నరసరావుపేట రూరల్: భూ, ఆస్తి వివాదాలు, ఆర్థిక అంశాలపై పీజీఆర్ఎస్లో అధిక ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కన్న కొడుకు నుంచి ప్రాణ హాని ఉంది తన కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని నరసరావుపేట మండలం ఇక్కుర్రు గ్రామానికి చెందిన తమ్మిశెట్టి బాలరాజు జిల్లా ఎస్పీని కోరారు. గతంలో తాను ప్రైవేటు బస్సు డ్రైవర్గా పనిచేసినట్టు తెలిపాడు. వృద్ధాప్యంలో ఉన్న తాను నివాస స్థలం, బంగారం, నగదును తన ఏకై క కుమారుడు రామాంజనేయులుకు అప్పగించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రాత్రి సమయాల్లో వచ్చి తనను చంపేందుకు ప్రయ త్నిస్తున్నాడని తెలిపాడు.రక్షణ కల్పించడంతో పాటు జీవనం వారి నుంచి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఉద్యోగం పేరుతో టోకరా జీఎస్టీ ఆఫీసులో ఉద్యోగం పేరుతో మహిళా తన వద్ద రూ.6.50లక్షలు తీసుకుని మోసం చేసినట్టు రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన బందనాథం ఆశోక్కుమార్ ఫిర్యాదు చేశాడు. నరసరావుపేటలో నివసిస్తూ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్న తనకు పెట్లూరివారిపాలెంకు చెందిన మొద్దుమాల నిర్మల పరిచయమైనట్టు తెలిపాడు. జీఎస్టీ ఆఫీసులో ఉద్యోగం ఉందని ఇందుకు రూ.7లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినట్టు వివరించాడు. తాను అంత ఇవ్వలేనని చెప్పగా రూ.6.5లక్షలకు అంగీకరించినట్టు తెలిపాడు. నగదును అప్పుగా తీసుకుని మూడు సంవత్సరాల క్రితం ఆమెకి ఇచ్చామని, ఇప్పటి వరకు ఉద్యోగం కల్పించలేదని ఫిర్యాదులో తెలిపాడు. దీనిపై నిర్మలను ప్రశ్నించడంతో ఎస్సి, ఎస్టి కేసు పెడతానని బెదిరించినట్టు తెలిపాడు. మోసానికి పాల్పడిన నిర్మలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరాడు. ఫైనాన్స్ సంస్ధ వేదింపుల నుంచి రక్షణ కల్పించండి... లోన్ చెల్లిస్తానని చెబుతున్నా తమ బంధువులకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతున్న ఫైనాన్స్ సంస్థ నుంచి రక్షణ కల్పించాలని పిడుగురాళ్లకు చెందిన గద్దల కుమార్ జిల్లా ఎస్పీని కోరాడు. హెచ్డీబి ఫైనాన్స్ సంస్థి నుంచి రూ.90వేలు రుణంగా తీసుకోగా ప్రతి నెల రూ.5300 చొప్పున 18 నెలలు చెల్లించినట్టు తెలిపాడు. మరో ఐదు నెలల ఈఎంఐ పెండింగ్లో ఉందని దీనిని చెల్లిస్తానని సంస్థి సిబ్బందికి తెలియజేసినా ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నారని వివరించాడు. జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ కృష్ణారావు -
పంచాయతీ కార్యదర్శి వేధిస్తోంది..!
పెదకూరపాడు: గత స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచిగా గెలుపొందిన తనను టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాటినుంచి గ్రామపంచాయతీ కార్యాలయానికి రావొద్దంటూ పంచాయతీ కార్యదర్శి అడ్డుకుంటోందని, చేసిన పనులకు బిల్లులు చేయకుండా వేధిస్తోందంటూ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం మూసాపురం గ్రామ వైఎస్సార్ సీపీ సర్పంచ్ వేముల తిరుపతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉప సర్పంచ్ బత్తుల విజయలక్ష్మీ, నాలుగో వార్డు సభ్యులు మేరుగా ఆదాం జ్యోతి, గ్రామస్తులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. గ్రామంలో రూ. 3.75 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు ఇవ్వకుండా మనోవేదనకు కార్యదర్శి గురిచేస్తుందన్నారు. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేస్తోందని వాపోయారు. గ్రామపంచాయతీ నిధులను గ్రామ అభివృద్ధి కొరకు టీడీపీ నేతలు పనులు చేస్తున్న ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా తాము తీర్మానాలు ఇచ్చామని గుర్తు చేశారు. అయితే మేము చేసిన పనులకు బిల్లులు అడుగుతుంటే టీడీపీ నేతల అనుమతి కావాలని తెలుపుతున్నారని వాపోయారు. గత రెండు సంవత్సరాల నుంచి పంచాయతీ కార్యాలయానికి రావద్దంటూ కార్యదర్శి హుకుం జారీ చేసిందన్నారు. అదేవిధంగా ప్రజల వద్ద నుంచి ఇంటి పన్నులు ఆన్లైన్లో నమోదు చేయకుండా గ్రామస్తులు వద్ద నుంచి నగదు స్వీకరించి రశీదులు ఇవ్వడం లేదన్నారు. కార్యదర్శి ఆగడాలపై గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు. ఎంపీడీఓకు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. తాము చేసిన పనులకు వెంటనే బిల్లులు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. వారి వెంట స్థానిక నాయకులు బత్తుల ఏడుకొండలు, సుబ్బారావు, వేముల బ్రహ్మేంద్ర, తమ్మిశెట్టి ప్రసాద్ తదితరులు ఉన్నారు. కార్యాలయానికి రావొద్దంటూ హుకుం జారీ చేస్తోంది.. చేసిన పనులకు బిల్లులు ఇవ్వటం లేదు ఇంటి పన్నులు వసూలు చేసి రసీదు ఇవ్వటం లేదు వైఎస్సార్ సీపీ ముసాపురం గ్రామ సర్పంచ్ ఆవేదన -
పోనుగోటివారిపాలెంలో ప్రబలిన అతిసార
ఈపూరు(శావల్యాపురం): ఈపూరు మండలం చిట్టాపురం గ్రామ పంచాయతీ శివారు పోనుగోటివారిపాలెం గ్రామంలో అతిసార ప్రబలింది. గ్రామంలోని ఆర్వో ప్లాంటు ద్వారా సరఫరా అయిన కలుషిత నీరు తాగడంతోనే అతిసార వ్యాప్తి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు. 20 మందికిపై అతిసార బారిన పడ్డారు. ఈ నెల 26న పులి సుజాత, వడ్లమూడి కోటయ్య, వడ్లమూడి అంజమ్మ, గుంటుపల్లి వెంకట కోటమ్మ, బోయపాటి మస్తానమ్మ, వడ్లమూడి మల్లమ్మ, యడవల్లి లింగమ్మ, గుంటుపల్లి వెంకట నరసమ్మ, గుంటుపల్లి రామారావు, వడ్లమూడి కోటేశ్వరరావు, గుంటుపల్లి అంజమ్మ, వడ్లమూడి హనుమంతరావు, వడ్లమూడి ధనలక్ష్మి, వడ్లమూడి అంజమ్మ వాంతులు, నీళ్ల విరోచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. అతిసార లక్షణాలు ఉన్న రోగులు మొదట నరసరావుపేట, ముప్పాళ్ళ వైద్యశాలల్లో చికిత్స తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఆరోగ్య సిబ్బంది, ముప్పాళ్ళ ఆరోగ్య కేంద్రం ద్వారా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం జిల్లా వైద్యా ఆరోగ్య అధికారి డాక్టరు బి.రవి గ్రామంలోని రామాలయం సమీపాన టెంటు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటు తాగునీరు కలుషితం కావటం వలన ఈ సమస్య వచ్చిదన్నారు. తక్షణమే ఆర్వో ప్లాంటు తాత్కాలికంగా మూత వేయించామని చెప్పారు. ఇందులో నుంచి సరఫరా అయిన నీటి నమూనాలను సేకరించి గుంటూరు జిల్లా రీజనల్ ల్యాబ్కు పంపిచారు. ఎండ తీవ్రత అధికంగా ఉందని అలాగే గ్రామంలో మిరప పంటలపై వినియోగించే రసాయనాల ప్రభావం లేకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవని ప్రజలు వదంతులు నమ్మరాదన్నారు. కాచి వడి చల్లార్చిన నీరు తాగాలని సూచించారు. తినిబోయే ముందు చేతులు సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలన్నారు. వాంతులు, విరోచనాలు అయిన వారిని తక్షణమే శిబిరం దగ్గర చికిత్స తీసుకోవాలని చెప్పారు. సర్పంచ్ వడ్లమూడి రాఘవయ్య, డెప్యూటీ డీఎంహెచ్వో మక్కెన పద్మావతి, ఆర్డబ్యూఎస్ చంద్రశేఖర్, ఆర్బీకేఎస్ అధికారి రాజేశ్వరి, ఎంపీహెచ్ఈవో సుబ్రమణ్యం ఉన్నారు. -
నాట్యాచార్యుడు ఎండీ గిరి మృతి
విచారంలో నృత్యకళాకారులు తెనాలి: పట్టణానికి చెందిన ప్రముఖ నాట్యాచార్యుడు, నాట్యగురువు ‘దేవపారిజాతం’ అవార్డు గ్ర హీత ఎండీ గిరి (80) మృతిచెందారు. వారం రోజుల కిందట అనారోగ్యానికి గురైన గిరి, స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. కళాకారులు, నృత్యకళాకారుల సందర్శనార్ధం ఆయన భౌతికకాయాన్ని బీసీ కాలనీలోని పట్టణ రంగస్థల కళాకారుల భవనంలో ఉంచారు. ప్రముఖ నృత్యకళాకారులు/నృత్యగురువులు భాస్కర్ల రంగనాయకి, జంధ్యాల వేదవల్లి, జంధ్యాల రామచంద్రమూర్తి, ఆలపాటి ప్రజ్ఞ తదితరులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు. ఎండీ గిరి పూర్తిపేరు దస్తగిరి. అనంతపురం జిల్లా బోగాలకట్ట స్వగ్రామం. 1986లో తెనాలి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. తాను స్థాపించిన శ్రీగిరిజా ఆర్ట్ అకాడమీ ద్వారా ఎందరికో నృత్యశిక్షణనిచ్చారు. దేశీయ నృత్యరీతులు, వాటి వైశిష్ట్యాన్ని వ్యాప్తి చేసేందుకు గత నాలుగు దశాబ్దాలుగా విశేష కృషిచేశారు. ఎన్నో నృత్యరూపకాలను రూపొందించి ప్రదర్శింపజేశారు. -
అంతర్జాతీయ కోచింగ్ కోర్సుకు శ్రీనివాసరావు ఎంపిక
యడ్లపాడు: మండలంలోని మైదవోలు గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు, కోచ్ నక్కా శ్రీనివాసరావు చైనాలో జరగనున్న ప్రతిష్టాత్మక ఎఫ్ఐవీబి లెవల్–3 అంతర్జాతీయ కోచింగ్ కోర్సుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తనపేరును అధికారికంగా సిఫార్సు చేసినట్లు ఆదివారం తెలిపారు. చైనా వేదికగా ఈ ఏడాది జూలై 17 నుండి 25 వరకు ఈ అత్యున్నత స్థాయి శిక్షణ తరగతులు జరగనున్నాయి. వాలీబాల్ కోచింగ్లో అత్యున్నత ప్రమాణంగా భావించే లెవల్–3 కోర్సుకు ఇంత చిన్న వయసులోనే ఎంపిక కావడం విశేషం. శ్రీనివాసరావు ఎంపిక పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు వయోపరిమితి పెంపు వర్తింపజేయాలి కారెంపూడి: ఏపీ మోడల్ స్కూల్స్లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు సైతం వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ అమరావతి జేఏసీ అధ్యక్షుడు వినుకొండ పేరయ్య తదితరులు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అన్ని రంగాల ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న వారి వయోపరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందని, అయితే ఏపీ మోడల్ స్కూల్స్లో పని చేస్తున్న ఉద్యోగులను మాత్రం మరచిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ మోడల్ స్కూల్స్లో పని చేస్తున్న వారికి కూడా వయోపరిమితి పెంపు వర్తింపచేయాలని కోరారు. నేడు సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ డే తాడికొండ: రాజధాని అమరావతి రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘గ్రీవెన్న్స్ డే‘ నిర్వహించనున్నట్లు సీఆర్డీయే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో వివిధ విభాగాల అధికారులు అర్జీలు స్వీకరిస్తారు కావున రాజధాని ప్రాంతవాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మిర్చి కమీషన్ దుకాణంలో నగదు చోరీ నగరంపాలెం: మిర్చి కమీషన్ దుకాణంలో నగదు చోరీపై బాధితుడు లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్గా రోడ్డులో శివరామచౌదరి మిర్చి కమీషన్ దుకాణం నిర్వహించేవారు. శుక్రవారం రాత్రి దుకాణం షట్టర్కి తాళం వేసి వెళ్లాడు. శనివారం ఉదయం దుకాణం వద్దకు వచ్చేసరికి షట్టర్ తాళాలు పగిలిపోయి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే లోనికెళ్లి బీరువా చూడగా, అందులో భద్రపరిచిన రూ.6 లక్షలు కనిపించలేదు. ఎవరైనా గుర్తుతెలియని అగంతకులు నగదు తస్కరించినట్లు గుర్తించి లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దుకాణం, పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అలాగే సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల పుటేజీ సేకరించారు. నేడు నాగార్జున యూనివర్సిటీ పాలకమండలి సమావేశం ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో పాలకమండలి సమావేశం సోమవారం జరగనుంది. ఈ సమావేశం ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదింప చేయనున్నారు. ఈ వార్షిక బడ్జెట్లో యూనివర్సిటీకి వచ్చే ఆదాయం, ఖర్చులు ప్రభుత్వం విడుదల చేసే బ్లాక్ గ్రాండ్ నిధులు, ఉద్యోగుల వేతనాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు వంటి ప్రధాన అంశాలకు బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి. సమావేశానికి ఇన్చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు అధ్యక్షత వహించనున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మంగళగిరి టౌన్: పార్టీలోనే ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ పిలుపునిచ్చారు. మంగళగిరి పట్టణ పరిధిలోని గౌతమ బుద్ధా రోడ్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభయాన్ 2026 శిక్షణా తరగతులు నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన శిక్షణ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. చివరిరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాధవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా కృషి చేయాలన్నారు. అంతోద్యయ ద్వారా సమాజంలోని చివరి వ్యక్తికి సేవలు చేరేలా సర్వ వ్యాప్తి, సర్వస్పర్శి లక్ష్యంతో పార్టీ విస్తరణ జరగాలని సూచించారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ సిద్ధాంతాలపై విశ్లేషాత్మకంగా వివరించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శివన్నారాయణ, జిల్లా కార్యదర్శి పంచుమర్తి ప్రసాద్, మంగళగిరి పట్టణ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడిగా షాహిద్ బాషా
ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడిగా షేక్ షాహిద్ బాషా(చిలకలూరిపేట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సత్తెనపల్లిలోని సుగాలి కాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం (ఏపీఎమ్ఎఫ్) జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ప్రధానకార్యదర్శిగా పి.వీరబ్రహ్మం(నాదెండ్ల), ట్రెజరర్గా పి సత్యనారాయణరాజు(పాకాలపాడు), గౌరవఅధ్యక్షుడిగా రామిశెట్టి గోవిందరాజులు (నరసరావుపేట), ఉపాధ్యక్షులుగా కె.జగన్నాధరావు (ముప్పాళ్ళ), జూపల్లి.గంగాధర్బాబు (మాచర్ల), ఎల్.రామాంజిరెడ్డి (వినుకొండ), ఏ.భాగేశ్వరిదేవి (మాదల), ఏం ఫణికుమార్ (నరసరావుపేట), కార్యదర్శులుగా ఈ పున్నమ్మ (అచ్చంపేట), జాన్కెనడి (మాచర్ల), కె.శ్రీనివాసరావు(చిలకలూరిపేట), ఎస్.ఆదినారాయణ(యడ్లపాడు), ఎం.శ్రీనివాసరెడ్డి(రొంపిచర్ల), సిహెచ్.నాగేశ్వరరావు(వినుకొండ), ఏ.వెంకటశ్రీవత్స (కారంపూడి), జెవికె ప్రసాద్(రెంటచింతల), కె.శివనాయక్ (ఈపూరు), పి రఘునాథబాబు (శావల్యపురం), బి.శివకోటేశ్వరరావు(దుర్గి), జి ప్రతాప్ (బొల్లాపల్లి), కె.రాంబాబు (క్రోసూరు)లు ఎన్నికయ్యారు. జిల్లా అడ్వైజరీ కమిటీ బాధ్యులుగా కె.వి.రమణ (పెదమక్కెన), ఏ శ్రీనివాసరెడ్డి (వెన్నాదేవి), పీవీ కోటేశ్వరరావు (సత్తెనపల్లి), బట్టు ఉదయ్భాస్కర్ (నరసరావుపేట), పీ.విజయ్కుమారి (దుర్గి), పి అంజనీకుమారి(నకరికల్లు), కె.వేణుగోపాలరావు(ముప్పాళ్ళ), ఎమ్.నరేంద్రకుమార్ (సత్తెనపల్లి) లు ఎన్నికయ్యారు. -
ప్రపంచ గమనాన్ని మార్చిన గణితం
సత్తెనపల్లి: ప్రపంచ గమనాన్ని గణితం మార్చిందని ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ ఫోరం రాష్ట్ర కమిటీ సభ్యుడు పెద్దింటి వెంకట కోటేశ్వరరావు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ గణిత వేదిక (ఏపీఎమ్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన పల్నాడు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. గణితం లేనిదే ప్రపంచ ప్రగతి లేదన్నారు. ప్రతి విద్యార్థి గణితంపై ఆసక్తి పెంచుకునేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. దైనందిన జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి గణితం పాత్ర ఎక్కువ అన్నారు. గణితం ఒక వేగం, గణితంతో స్నేహం ఒక అపూర్వ అనుభవమన్నారు. గణితం పై ఆసక్తిని పెంచుకునేందుకు మ్యాథ్స్ ఫోరం ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఏపీఎమ్ఎఫ్ ఆవిర్భావం నుంచి నేటి వరకు సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. ముందుగా సమావేశ పరిచయకర్తగా సత్యనారాయణరాజు వ్యవహరించారు. కందిమళ్ల వేణుగోపాల్ ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకన విధివిధానాలపై కీలక సూచనలు చేయగా, భాగేశ్వరి విద్యార్థుల పేపర్ ప్రజెంటేషన్ మెరుగుపరుచుకునే విధానాలను వివరించారు. తాత సాంబశివరావు గణిత బోధనా పరికరాల తయారీపై ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఏపీఎమ్ఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె.మల్లికార్జునరెడ్డి గణిత ఉపాధ్యాయుల నైపుణ్యాల పెంపకం, గణిత సబ్జెక్టు అభివృద్ధికి మ్యాథ్స్ ఫోరం చేస్తున్న కృషిని వివరించారు. మ్యాథ్స్ ఫోరం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పి దుర్గారావు పల్నాడు జిల్లా శాఖ కృషిని వివరించారు. సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రశాంత బాలు గణిత శాస్త్రవేత్తలపై రూపొందించిన ఆడియో విజువల్ ప్రదర్శించి అభినందించారు. ప్రశాంతబాలుకు ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందించారు. జాతీయ స్థాయి యోగా విజేతగా నిలిచిన ఉపాధ్యాయుడు ఎం రమేష్ దంపతులను, గణిత సేవలో విశేష కృషి చేసిన వీరబ్రహ్మం, వేణుగోపాల్, భాగేశ్వరిలను సన్మానించారు. ఏపీఎమ్ఎఫ్ మ్యాథ్స్ ఫోరం పల్నాడు జిల్లా కార్యవర్గాన్ని, జిల్లా అడ్వైయిజరీ కమిటీలను ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గణిత ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
ఆధునిక జీవనశైలి వల్లే సంతానలేమి సమస్యలు
గుంటూరు మెడికల్ ఆధునిక జీవనశైలి వల్ల నేడు దంపతుల్లో సంతానలేమి (ఇన్ఫెర్టిలిటి) సమస్యలు పెరిగిపోతున్నాయని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఆదివారం గుంటూరు ఐటీసీ హోటల్లో కిమ్స్ ఫెర్టిలిటి ఐవీఎఫ్ సెంటర్ ఆధ్వర్యంలో గుంటూరు ఆబ్స్ట్రిక్ట్ అండ్ గైనకాలాజికల్ సొసైటీ సహకారంతో ఇన్ఫెర్టిలిటి గురించి వైద్యులకు ఫెమ్కాన్ పేరుతో నిరంతర వైద్య విద్య కార్యక్రమం(సీఎంఈ) నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంతాన చికిత్సలు అందించే కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం సంతాన చికిత్సలకు ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఐవీఎఫ్ సెంటర్లో చట్టపరంగా చికిత్సలు అందించాలని చెప్పారు. పేదలకు సైతం ఆధునిక సంతాన చికిత్సలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మాత మరణాలు నివారించడంలో సీ్త్ర వైద్య నిపుణులు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక వైద్య సాంకేతికతలను సమర్థవంతంగా వినియోగించి సంతానోత్పత్తి సమస్యలకు పరిష్కారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మాత మరణాలను పూర్తిగా తగ్గించే దిశగా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యంపై సమగ్ర పర్యవేక్షణతోపాటు, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వరకు ఆధునిక వైద్య సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ సంతాన చికిత్సలు అందించే ఆస్పత్రుల వారు తప్పని సరిగా తమ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. పీజీ వైద్యులకు, నూతనంగా ప్రాక్టీస్లోకి వస్తున్న వైద్యులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. సీఎంఈ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కర్నాటకకు చెందిన డాక్టర్ ప్రత్యూష్కుమార్ నారాయణ్ సంతాన చికిత్సల్లో హార్మోన్స్ ఏవిధంగా స్పందిస్తాయనే విషయాలను, డాక్టర్ హితేష్బట్ సంతాన చికిత్సలు చేసే సమయంలో పాటించాల్సిన చట్టపరమైన అంశాలను, డాక్టర్ సచిన్ కులకర్ణి ఐవిఎఫ్ చికిత్సలు ఎవరికి చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేయాలనే విషయాల గురించి వివరించారు. సదస్సులో వైద్యులు, నిపుణులు పాల్గొని ఫెర్టిలిటీ, ఎంబ్రియాలజీ రంగాల్లో వచ్చిన అధునాతన పోకడలను వివరించారు. కార్యక్రమంలో కిమ్స్ ఫెర్టిలిటి ఐవిఎఫ్ సెంటర్ డైరక్టర్ డాక్టర్ బి.శ్వేత, సీఓఓ సుధర్జాదవ్, డాక్టర్ ఐ.ప్రత్యూష, డాక్టర్ శిరీషా, ఎంబ్రాలజిస్ట్ డాక్టర్ ఉదయ్, యూనిట్హెడ్ డాక్టర్ ఎస్. వి.హరికుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్, గుంటూరు ఆబ్స్ట్రిక్ట్స్ అండ్ గైనకాలాజికల్ సొసైటి ప్రెసిడెంట్ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, సెక్రటరీ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, జీజీహెచ్ గైనకాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ అరుణ, పలువురు గైనకాలజిస్ట్లు, ఐవీఎఫ్ స్పెషలిస్ట్లు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా -
మరో దోపిడికీ రంగం సిద్ధం చేస్తున్న చంద్రబాబు సర్కారు
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026రేపటి నుంచి శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు సత్తెనపల్లి: ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా .. కనీస వేతనం లేకపోయినా అప్పులు చేసి అన్నం, కూరలు తయారు చేస్తున్నారు. విద్యార్థుల కడుపు నింపి ఆకలి తీర్చుతున్నారు. అలాంటి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పొట్ట కొట్టేందుకు స్మార్ట్ కిచెన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సింది పోయి తమ అనుయాయులకు మేలు జరిపేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోగాత్మకంగా అమలు చేసిన వైఎస్సార్ కడప జిల్లాలో విజయవంతమైందంటూ 2025 డిసెంబర్లో హడావుడి చేశారు. మళ్లీ ఇప్పుడు తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 155 పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకు నివేదికలు పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తొలి విడతలో 13 పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా జిల్లా అధికారులు కూడా ఆగమేఘాల మీద సౌకర్యవంతంగా ఉన్న పాఠశాలలను గుర్తించి స్మార్ట్ కిచెన్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని మండల విద్యాశాఖాధికారులకు(ఎంఈఓ)ఆదేశాలు జారీ చేయగా వారు నివేదికలు పంపిస్తు న్నారు. పది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలు తప్ప విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న పాఠశాలలకు స్మార్ట్ కిచెన్ల ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా చేయనున్నారు. ఒకచోట భోజనం తయారు చేసి 1 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు అందించాలన్నది ప్రభుత్వ ఆలోచన. వంట కార్మికుల ఆందోళన... మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలను తొలగించి స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజనం నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న సమాచారంతో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో వంటలు నిర్వహిస్తున్న మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను ఆదుకుంటామంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు తమ పొట్ట గొట్టేందుకే ఈ పథకాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయ త్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న తమను రోడ్డును పడేస్తే ఎలా? అని ... ఇన్నేళ్లుగా కష్టపడి పనిచేసిన దానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రతిఫలం ఇదేనా ... అంటూ మధ్యాహ్న భోజన నిర్వాహకులు మండిపడుతున్నారు. ఎక్కడో దూరంలో ఉన్న విద్యార్థులకు ఒకచోట భోజనం వండి వాహనాల్లో తీసుకెళ్లి ఇవ్వడం అన్నది వ్యయప్రయాసలతో కూడుకున్నది. దీనివల్ల విద్యార్థులకు వేడి పదార్థా లు తినే భాగ్యం లేనట్టేనని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్న భోజనం వండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోతుంది. ఎవరిని సంతృప్తి పరచడానికి స్మార్ట్ కిచెన్లు తీసుకొస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి విద్యార్థు లకు వండి పెడుతున్న కార్మికుల కడుపులు కొట్టి సొంత పార్టీ నాయకుల బొజ్జలు నింపేందుకే స్మార్ట్ కిచెన్ల రూపకల్పన జరిగినట్టు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్మార్ట్ కిచెన్లకు స్వస్తిపలకాలని కోరుతున్నాయి. విద్యార్థుల కడుపు మాడ్చేసి .. మధ్యాహ్న భోజన కార్మికులను రోడ్డును పడేసి తమ అనుయాయుల జేబులు నింపేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పొట్ట గొట్టేందుకు స్మార్ట్ కిచెన్ల పేరుతో ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వకపోయినా అప్పో సప్పో చేసి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వండి పథకం కార్మికులు కడుపులు నింపుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పాత వారిని తొలగించి పచ్చ పార్టీ సానుభూతిపరులను నియమించుకోవాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారు. అవి ఫలించక ఇక ఇప్పుడు స్మార్ట్ కిచెన్ల పేరుతో అసలుకే ఎసరు పెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వేడి అన్నం స్థానంలో తమ పిల్లలు ఎప్పుడో తెల్లవారి వండిన భోజనాన్ని తినాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
అమరావతి నిర్మాణం..పరిపాలన అంతా గ్రాఫిక్సే!
వినుకొండ: చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణంతోపాటు పరిపాలన అంతా కూడా గ్రాఫిక్సే అని వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పల్నాడు జిల్లా వినుకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొల్లా మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు నేటికీ న్యాయం జరగలేదని, రాజధాని నిర్మాణం జరిగినట్టు ఔటర్ రింగ్ రోడ్డు కోసం మరో 20,000 ఎకరాలు కావాలని రైతులను వేధిస్తున్నారన్నారు. ఎక్కడైనా నగరం నిర్మాణం జరిగిన తర్వాత ఔటర్ రింగ్రోడ్డు నిర్మిస్తారని, అమరావతిలో అసలు ఏమీ లేకుండానే గ్రాఫిక్స్ రూపంలో చూపించి రైతుల వద్ద పొలాలను తీసుకోవడం దారుణం అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నానా అవస్థలు ఎదుర్కొంటుంటే పట్టించుకోకుండా రాజధాని అభివృద్ధి పేరుతో ఐదు గంటలపాటు నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కేవలం ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించేందుకే సరిపోయిందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ ఈరెండేళ్ల సమయంలోనే రాష్ట్రంలో విధ్వంస పాలన జరిగిందన్నారు. మొక్కజొన్న రైతులకు కూడా న్యాయం చేయలేకపోయారని అన్నారు. ఈ–క్రాప్, రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు, రైతులకు సేవలు చేసే ప్రతి ఒక్క వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. నేరాలు అదుపు చేయడంలో విఫలమైన పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులను బెదిరించడంలో కొత్త ట్రెండ్ తీసుకొచ్చారని, చదువుకునే విద్యార్థులపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగుతున్నారన్నారు. తిరునాళ్లలో కనీసం విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా వైఎస్సార్ సీపీ వారికి అనుమతులు ఇవ్వడం లేదని, సుపరిపాలన అంటే ఇదేనా అని దుయ్యబట్టారు. ఇప్పటికై నా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పంచాయతీ రాష్ట్ర విభాగం కార్యదర్శి వెంకటరామిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గంధం బాలిరెడ్డి, మండల కన్వీనర్లు దండు చెన్నయ్య నారాయణరెడ్డి, బోడేపూడి కొండలు, రెడ్డి బోయిన ప్రవీణ్ కుమార్, గుంజి వాసు తుమ్మ వెంకటరెడ్డి కొత్త కృష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు -
జాతీయ నాటికల పోటీలు
ఏప్రిల్ 3 నుంచి యడ్లపాడు: నిస్తేజమవుతున్న నాటక రంగానికి ఊపిరి పోస్తూ..భావితరాలకు సంస్కృతిని వారసత్వంగా అందించే వేదికలే నాటక పరిషత్లు అని డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు చెప్పారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్యర్యాన జరిగే 23వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీల పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. పరిషత్ అధ్యక్షులు సురేష్బాబు, కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన వేడుకల వివరాలను తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సాగే ఈ ప్రదర్శనల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరిషత్తుల్లో ఉత్తమ రచనలు, బహుమతులు సాధించిన పది మేటి నాటికలు తమ వేదికపై ప్రేక్షకులను అలరించనున్నాయని తెలిపారు. ఈ ఏడాది వేడుకల్లో భాగంగా సినీ, టీవీ నటులు, దర్శకులు ఉప్పులూరి సుబ్బరాయశర్మకు ప్రతిష్టాత్మక పుచ్చలపల్లి పురస్కారం అందజేయనుండగా, తెలుగు అకాడమీ చైర్మన్, పౌరాణిక నాటక రంగంలో విశేష గుర్తింపు పొందిన కళారత్న గుమ్మడి గోపాలకృష్ణను పుచ్చలపల్లి సుందరయ్య ● వేదిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సన్మానం ఉంటుందన్నారు. ప్రదర్శనల్లో పాల్గొనే ప్రతి మహిళా కళాకారిణిని ఆడపడుచుగా గౌరవిస్తూ సత్కరించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. పోటీల్లో తీర్పు విషయంలో పూర్తి పారదర్శకత కోసం ఉపాధ్యాయులు, వైద్యులు, న్యాయవాదులు వంటి విభిన్న రంగాలకు చెందిన 18 మందిని న్యాయనిర్ణేతలుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. మూడు రోజుల పాటు ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ప్రేక్షకులకు అల్పాహారం, వారికి కూపన్లు ఇచ్చి రోజుకు 40 మంది చొప్పున మూడు రోజులు 120 మందికి లక్కీడ్రా ద్వారా విలువైన బహుమతులు అందజేస్తామన్నారు. కళాకారులకు పారితోషికం, జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు వివరించారు. తెలుగు నాటక వైభవాన్ని చాటిచెప్పే ఈ మహా ప్రదర్శనలకు కళాభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ముత్తవరపు రామారావు, ఉపాధ్యక్షులు జరుగుల శంకరావు, వేదిక సంయుక్త కార్యదర్శి పోపూరి నాగేశ్వరరావు, ముత్తవరపు పద్మారావు, బొప్పన్న నరసింహరావు(బుజ్జి), షేక్ బాజి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల పోస్టర్ను ఆవిష్కరించిన డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు -
డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణ్ణంరాజు రాజీనామా చేయాలి
కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ డిమాండ్ లక్ష్మీపురం: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో దళితుల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ, తన అనుచరులతో దళిత యువతను రెచ్చగొట్టి అల్లకల్లోలం సృష్టించిన ఉండి ఎమ్మెల్యే, డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వైఖరిని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) గుంటూరు జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. ప్రభుత్వ తీరు అత్యంత అభ్యంతరకరంగా ఉందని అన్నారు. పెద్దపేటలో అసలు ఏం జరిగిందో, దళిత యువతపై ఏరకంగా దాడులు జరిగాయో తెలుసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రఘురామకృష్ణంరాజు చర్యలను సమర్థిస్తూ ప్రకటనలు చేయడం అత్యంత అన్యాయమని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంటే కనీసం విచారణ చేయకుండా ఏకపక్షంగా మాట్లాడటం రాష్ట్రానికి హానికరం అని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ, దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న రఘురామకృష్ణంరాజును పదవి నుండి తొలగించని పక్షంలో దళిత ప్రజాసంఘాలను ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. గోవాడ ప్రాశస్త్యాన్ని కాపాడుకుందాం తెనాలిటౌన్: వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానం గోవాడ తిరునాళ్ల ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ కమిటీ సభ్యులు ఆరోపించారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్లో ఆదివారం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కమిటీ కన్వీనర్ దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ తెనాలి దగ్గరలోని గోవాడ శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు రెండు తెలుగురాష్ట్రాల నుంచి ఈ తిరునాళ్ళకు లక్షల సంఖ్యలో వస్తారని చెప్పారు. ఆలయ సమీపంలోని గోవాడ నుంచి కావూరు డొంకలో ఉత్సవం కోసం నిర్దేశించిన స్థలంలో ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కుకు స్థలం కేటాయిస్తూ ఏపీఐఐసీ వారికి స్థలం అప్పగించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూవుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1943 నుంచి అనేకసార్లు ఈ స్థలాన్ని వేరేవారికి కేటాయించగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఉత్సవ విశిష్టతను తెలుసుకుని కేటాయింపులు రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే, తహసీల్దార్ ఈ స్థలం కేటాయింపునకు ప్రాధాన్యం కనబరుస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో తుమ్మల జగదీష్, మండవ మల్లీశ్వరి, కెవి సత్యనారాయణ, వేదాంతం ఫణీంద్ర, కె.వాసుదేవనాయుడు, కడియాల నంద కిషోర్, బసవపున్నయ్య, ఆర్.శివశంకరరావు, రాజేష్ పాల్గొన్నారు. -
వైద్యుడి కుటుంబం అఘాయిత్యం
నరసరావుపేట టౌన్/నాదెండ్ల: మూడేళ్ల కుమార్తెతో కలిసి ఓ వైద్యుడి కుటుంబం అఘాయిత్యానికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. భార్య శంకరకుమారి (30), కుమార్తె మౌనిక (3) ప్రాణాలు కోల్పోగా.. భర్త గోపి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి నరసరావుపేట వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన డాక్టర్ కుంభా గోపి భోపాల్ ఎయిమ్స్ వైద్యశాలలో మత్తు వైద్యుడుగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం అనంతపురం జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన శంకరకుమారి(30)ని ప్రేమ వివాహం చేసుకున్నారు. గోపి పనిచేస్తున్న ఆస్పత్రిలోనే భార్య శంకరకుమారి కూడా నర్సుగా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల పాప మౌనిక ఉంది. బాలిక మానసిక ఆరోగ్య సమస్యతో జన్మించింది. శనివారం రాత్రి డాక్టర్ గోపి నరసరావుపేట రైల్వేస్టేషన్ సమీపంలోని దినేష్ గ్రాండ్ లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు వెళ్లిన శంకరకుమారి ధర్మవరం నుంచి ఆదివారం ఉదయం కుమార్తె మౌనికతో భర్త బస చేసిన లాడ్జికి వచ్చింది. కాగా.. కుమార్తెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భార్యాభర్తలు కూడా ఆ ఇంజెక్షన్లు తీసుకున్నారు. అనంతరం చేతికి నీడిల్తో ఉన్న వీడియోలు, లొకేషన్ను బంధువుల ఫోన్కు పంపారు. అప్రమత్తమైన బంధువులు హుటాహుటిన లాడ్జికి చేరుకున్నారు. గదిలోకి వెళ్లి పరిశీలించగా ముగ్గురూ అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఆటోలో చిలకలూరిపేట రోడ్డులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మౌనిక మృతి చెందినట్టు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి తర్వాత శంకరకుమారి కూడా మృతి చెందింది. డాక్టర్ గోపి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బంగారం వ్యాపారిపై టీడీపీ నేత దాడి
వినుకొండ: కల్యాణ మండపం నిర్మాణానికి సంబంధించిన చందాల లెక్కలు అడగడంతో బంగారం వ్యాపారిపై టీడీపీ నాయకుడు దాడి చేశారు. పట్టణానికి చెందిన అన్నా రామకోటేశ్వరరావు అనే బంగారం వ్యాపారి ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం గంగవరంలో గ్రామస్తుల విరాళాలతో కల్యాణ మండం నిర్మించారు. పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ఎస్టేట్ వ్యాపారి పులిపాటి రామారావు సదరు మండపం కమిటీలో పెద్దగా ఉన్నారు. పదేళ్ల నుంచి చందాల వివరాలు లెక్కలు చూపించలేదని, ఇచ్చిన వారి పేర్లను కూడా ప్రకటించలేదని పులిపాటిని రామకోటేశ్వరరావు ప్రశ్నించారు. రెచ్చిపోయిన పులిపాటి రామారావు తన అనుచరలతో కలిసి రామకోటేశ్వరరావుపై దాడి చేశారు. బాధితుడు పోలీస్స్టేషన్లో పులిపాటితో పాటు మణికంఠ కోటేశ్వరరావు, అన్నా కోటేశ్వరరావులపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. వినుకొండ: పట్టణంలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న బర్మా నాయక్కు తీవ్ర గాయాలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల శుక్రవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా పాఠశాల సెలవు కావడంతో బర్మా నాయక్, ఐదుగురు 8 వ తరగతి విద్యార్థులు పీఈటీ అనుమతితో సమీపంలో ఉన్న కొండ మీద ఆలయానికి వెళ్లారు. మార్గ మధ్యలో బర్మా నాయక్ కొండపై నుంచి పడి దోర్లుకుంటూ వెళ్లి రాయికి తగిలాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలకు తరలించారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
ఉపాధ్యాయ పోస్టుల రద్దే లక్ష్యంగా రేషనలైజేషన్
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం విద్యాశాఖలో చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియను రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల రద్దే లక్ష్యంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడుతున్నదని పేర్కొన్నారు. ఎస్టీయూ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. రామిరెడ్డి మాట్లాడుతూ, పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టడంతో ఇప్పటికే ప్రతి మండలంలో పదుల సంఖ్యలో ఏకోపాధ్యాయ పాఠశాలలు దర్శనమిస్తున్నాయని తెలిపారు. గత ఏడాది రేషనలైజేషన్ కారణంగా వందల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కూడా గడవకుముందే మళ్లీ రేషనలైజేషన్కు ప్రభుత్వం సిద్ధపడటంతో పాఠశాలల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని స్పష్టం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండీ మాట్లాడుతూ, రేషనలైజేషన్ కారణంగా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారి విద్యా బోధనకు తీవ్ర ఆటంకంగా మారుతున్నదని తెలిపారు. ఉపాధ్యాయులలో అభద్రతా భావం ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి సమస్యలపై వినతి పత్రం అందచేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, చంటి పిల్లలు ఉన్న తల్లులను పదవ తరగతి స్పాట్ నుంచి మినహాయించాలని కోరారు. పది పరీక్షలు పూర్తయిన వెంటనే విధులు నిర్వహించిన వారికి వెంటనే చెల్లింపులు చేపట్టాని, పెండింగ్ బకాయిలను జమ చేయాలని కోరారు. ఆయా సమస్యలపై డీఈఓ పీవీజే రామారావు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు షేక్ కరిముల్లా, షేక్.మహబూబ్ సుభానీ, కె.యేసయ్య, పి.వి.భీష్మారావు తదితరులు పాల్గొన్నారు. -
సిలిండర్..!
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026సైబర్ వలలో కేటుగాళ్లతో జాగ్రత్త సత్తెనపల్లి:ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు దూకుడు ప్రదర్శించే ప్రమాదం ఉంది. పశ్చి మాసియాలో యుద్ధం ప్రభావంతో వంట గ్యాస్ కొరత ఏర్పడ డా న్ని తమ నేరానికి పెట్టుబడిగా పెట్టుకునే ఎత్తు లు వేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, అత్యవసర గ్యాస్ బుకింగ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ ఎస్ఎంఎస్లు పంపుతూ ప్రజలను బురిడీ కొట్టించి నగదు స్వాహా చేసే ప్రయత్నానికి శ్రీకారం చుడతారు. ఈ తరహా వాట్సాప్ పోస్టులు, ఎస్ఎంఎస్లపై ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 1930 కి ఫిర్యాదు చేయవచ్చు సాధారణంగా గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ వంటి ప్రక్రియలను ఆయా గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లు లేదా అధికారిక మొబైల్ యాప్ ల ద్వారానే చేయాలి. తెలియని వెబ్సైట్లు, యాప్ల ద్వారా వచ్చే లింకులు, సందేశాలను నమ్మి వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఇవ్వకూడదు. గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ వంటి వాట్సాప్ సందేశాలు, ఎస్ఎంఎస్లు వస్తే నేరుగా సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయడం ద్వారా ఆ నగదు రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ.ప్రసాద్ నరసరావుపేట: యుద్ధ పరిస్థితుల వల్ల జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత ఎక్కడా లేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవీ.ప్రసాదు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఆయిల్ నిల్వలు సరిపడినంత ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. వినియోగదారులు తమ వాహనాలకు అవసరాల మేరకే పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేయాలని, వేసవిలో ఫుల్ట్యాంకు చేయించటం వల్ల పేలిపోయే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఎక్కడైనా పెట్రోలు, డీజిల్ లేకపోయినా, ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్లో విక్రయిస్తున్నా సమాచారాన్ని కంట్రోల్ రూమ్కు తెలియచేయాలని కోరారు. గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్, గ్యాస్ బుకింగ్ పేరిట ఎరవేసే ప్రమాదం వాట్సాప్, ఎస్ఎంఎస్ లింకుల పరిశీలన అవసరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ చేయాలంటూ వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా వచ్చే లింకులను క్లిక్ చేయడం, వారు పంపే ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయడం అత్యంత ప్రమాదకరం. నేరగాళ్లు పంపించే యాప్ డౌన్లోడ్ చేస్తే మొబైల్ డేటా అంతా వారి ఆధీనంలోకి వెళ్లడం ద్వారా ఫోన్కు వచ్చే బ్యాంకు ఓటీపీలు, రహస్య సందేశాలు నేరు గా వారి చేతుల్లోకి వెళ్లి పోతాయి. ఖాతా లో డబ్బులు ఖాళీ అవుతాయి. వినియోగదారుల అవసరాలను నేరగాళ్లు ఆసరాగా చేసుకుని గ్యాస్ బుక్ చేసుకుంటే వెంటనే డెలివరీ చేస్తామని నకిలీ లింకులు, బుకింగ్ పోర్టల్ ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ముందస్తు చెల్లింపుల కోసం ఓటీపీ అడుగుతారు. ఎట్టి పరిస్థితిల్లో తెలి యని లింకులను ఓపెన్ చేసి మోసపోవద్దు. వారు పంపించే అనుమానాస్పద ఏపీకే లింకులనుఓపెన్ చేయకపోవడం శ్రేయస్కరం. -
దళిత మహిళ స్వాతికి న్యాయం చేయాలి
సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ కో–ఆప్షన్ మెంబర్, దళిత మహిళ కొణతం స్వాతిని కులం పేరుతో దూషించి సామాజిక మాధ్యమ వేదికగా బూతుపదజాలంతో పోస్ట్ చేసి అవమాన పరిచిన జనసేన మాజీ మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్కుమార్ను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలుకా జయపాల్ డిమాండ్ చేశారు. సుమన్కుమార్ను శిక్షించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో సత్తెనపల్లి తాలూకా సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన చేపట్టారు. అమరావతి బస్ పాయింట్ సెంటర్లో భైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడారు. -
వీఆర్కు వివాదాస్పద సీఐ భాస్కర్
సాక్షి టాస్క్ఫోర్స్ : ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి వేధించటంలో దిట్టగా పేరొందిన వివాదాస్పద సీఐ పొన్నూరి భాస్కర్ వీఆర్ బదిలీ అయ్యారు. పలు ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే దాచేపల్లి పోలీస్స్టేషన్లో విధుల నుంచి ఆయన తప్పుకొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాచేపల్లి సీఐగా భాస్కర్ బాధ్యతలు చేపట్టారు. పచ్చ చొక్కా తొడుక్కున్న ఖాకీలా వ్యవహరించటం తీవ్ర వివాదస్పదంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించటంలో సీఐ అత్యుత్సాహం చూపించారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఉప్పుతల హరికృష్ణపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా పోలీస్స్టేషన్లో నిర్బంధించారు. లాఠీతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. దీనిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా పోలీస్స్టేషన్కు చేరుకున్నాయి. సీఐతో మాట్లాడేందుకు ప్రయత్నించగా స్టేషన్ ప్రధాన గేట్కి బేడీలతో తాళాలు వేశారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ హత్య సమయంలో కూడా సీఐగా భాస్కర్ ఉన్నారు. టీడీపీ నేతలను తప్పించేందుకు సీఐ ప్రయత్నాలు చేశారు. రామాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు ఆకూరి రాజేశ్వరి భర్త వెంకటరెడ్డిపై టీడీపీ నాయకులు పట్టపగలే దాడులకు తెగబడిన సమయంలో సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రేషన్ మాఫియాకు అండగా ఉండటం, గ్రానైట్ అక్రమ వ్యాపారానికి సహకరించి జేబులు నింపుకొన్నారు. దాచేపల్లి, మాచవరంలలో అసాంఘిక కార్యాకలపాలకు రాచబాటలు వేశారు. టీడీపీ వారితో పేకాట ఆడించి నెల మామూళ్లు తీసుకున్నారు. పేకాట ఆడించే ఓ వ్యక్తితో స్టేషన్కి మరమ్మతులు చేయించినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. రంగురాళ్ల తవ్వకాలకు, ఇసుక అక్రమ వ్యాపారులకు సీఐ అండగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఐని వీఆర్కి పంపించటం వెనుక ఓ మహిళ వ్యవహారం కూడా ఉన్నట్లుగా సమాచారం. -
ప్రత్యేక పీజీఆర్ఎస్లో 24 అర్జీలు స్వీకరణ
నరసరావుపేట: కలెక్టరేట్లో శనివారం జాయింట్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగుల కోసం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 24 అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత శాఖలకు అందజేసి వెంటనే పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. దివ్వాంగుల వద్దకు జేసీ స్వయంగా వచ్చి అర్జీ స్వీకరించి వారి సమస్య విని డీఆర్డీఏ పీడీని పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు. సాహితీవేత్త నారాయణచార్యులకు ఘన నివాళి నరసరావుపేట రూరల్: ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిధులు పుట్టపర్తి నారాయణచార్యులు జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు నారాయణ చార్యుల చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి నారాయణచార్యులు విశేష సేవలు అందించారని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ రంగస్థలంపై నాట్య ప్రదర్శనలు ఇచ్చారని తెలిపారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రఖ్యాత నవల ఏకవీరను మళయాళంలోకి అనువదించారని, మరాఠి నుంచి ధర్మానంద కోశాంబి, వినాయక సావర్కర్ వంటి రచయితల రచనలను తెలుగులో అందుబాటులోకి తీసుకువచ్చరాని వివరించారు. దాదాపు 150 గ్రంథాలను వివిధ భాషలలో రాసినట్టు తెలిపారు. సాహిత్యానికి నారాయణచార్యులు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించినట్టు వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా కలెక్టర్ కృతికా శుక్లా బాధ్యతల స్వీకారం చిలకలూరిపేట: పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్ల నిర్వహణ, అమృత్ స్కీమ్ పనుల తీరు, పన్నుల వసూళ్లు, షాపుల అద్దెల వసూళ్లు, భవన నిర్మాణ అనుమతులు, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, టిడ్కో ఇళ్ల నిర్మాణం, గృహ నిర్మాణపథకాలు, జనన గణన, జనన మరణాల రికార్డుల పరిశీలనతో పాటు సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మున్సిపల్ సేవలు మరింత మెరుగ్గా అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు, మున్సిపల్ డీఈఈ షేక్ అబ్దుల్ రహీం, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ క్రోసూరు: ఏపి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్లలో ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్–2026 ప్రవేశపరీక్షకు క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు కళశాల ప్రిన్స్పాల్ బి.వీ.రమాదేవి శనివారం తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న జరుగుతుందని, అందుకుగాను ఏప్రిల్ 4 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు ఎంట్రన్స్ రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందచేయబడుతుందన్నారు. పాలిసెట్ ఎంట్రన్స్కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4 వ తేదీగా తెలిపారు. దరఖాస్తు చేసుకొనే వారు అధికారిక వెబ్సైట్ http://polycetap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. వివరాలకు 94903 43929, 96189 26798,72072 88540 లో సంప్రదించవచ్చునన్నారు. వరికోత మిషన్ తగిలి మహిళ మృతి మాచవరం: వరి కోత మిషన్ తగిలి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని వేమవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పెరుగు నాగేంద్ర (60) తెల్లవారు జామున ఇంటి పనులు చేసుకునేందుకు ఇంటి ముందుకు రాగా, మాచవరం వైపు నుంచి తెలంగాణ వైపు వెళుతున్న వరి కోత మిషన్ ముందు భాగం నాగేంద్రం తలభాగానికి తగిలింది. ఘటనలో నాగేంద్ర తలకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు . మృతురాలి కుమారుడు జానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్య యడ్లపాడు: చీరతో ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యడ్లపాడులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మృతురాలు షేక్ జిమ్మాబి(28)కి సుమారు ఎనిమిదేళ్ల కిందట ఫిరంగిపురానికి చెందిన షేక్ ఖాజావలితో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో నాలుగేళ్ల కిందట కుమారుడిని భర్త వద్ద వదిలివేసి పెదకాకానిలోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు గమనించిన తల్లిదండ్రులు ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. మనస్తాపానికి గురైన జిమ్మాబి యడ్లపాడు వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటుంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరెతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నాగార్జునకొండను సందర్శించిన శ్రీలంక మంత్రి విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను శనివారం శ్రీలంక దేశానికి బుద్ధ సేన రిలీజియస్, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్ సేన్వి 21 దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులు విదేశీ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. వీరు లాంచీలో నాగార్జునకొండకు చేరుకొని కొండలోని మ్యూజియంలో ఉన్న తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని పుట్టుకకు సంబంధించిన శిలా ఫలకాలు, రాతి పనిముట్లు, సింహళ విహార్, మహా స్థూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం తిలకించి బౌద్ధ గురు దలైలామా నాటిన బోధి వృక్షం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వీరికి నాగార్జునకొండ మ్యూజియం క్యూరేటర్ కమల్హాసన్ నాగార్జునకొండ చరిత్రను వివరించారు. -
వీఆర్ఏల ఆందోళన
● వీఆర్ఏల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి ● జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలకు వినతిపత్రం అందజేత నరసరావుపేట: పల్నాడు జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)కు పే స్కేలు జీతాలు అమలు చేయాలని, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచెమెన్ పోస్టులను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వీఆర్ఏల చేత భర్తీ చేయాలని, నామినీలుగా గుర్తించాలని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ వద్ద సమస్యల పరిష్కార నిమిత్తం ఆందోళన నిర్వహించారు. నినాదాలు చేస్తూ పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. ● బందగీసాహెబ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఎనిమిదేళ్ల నుంచి జీతాలు పెరగలేదని, ప్రక్క రాష్ట్రాలలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తున్నా మన రాష్ట్రంలో పే స్కేల్, జీతాలు పెంచకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. ● అక్రమ డ్యూటీల పేరుతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నా తమ సమస్యలు పరిష్కారం చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ● రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు ఏప్రిల్ 20 నుంచి సమ్మె బాట పడతారని ప్రకటించారు. ఇప్పటికై నా ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ● అనంతరం సమస్యల మీద జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహకు వినతి పత్రం అందజేశారు. ● అమరావతి, పిడుగురాళ్ల మండలాలలో వీఆర్ఏల చేత అదనపు డ్యూటీల విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లగా, కచ్చితంగా తహసీల్దారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తెలియజేశారు. ● అనంతరం స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓ బాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ● జిల్లా ముఖ్య నాయకులు రవి, మునాఫ్, రోశయ్య, కాసులు, వీఆర్ఏలు పాల్గొన్నారు. -
బీసీ మహిళపై టీడీపీ కక్షసాధింపు చర్యలు
సత్తెనపల్లి: ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చెందిన వారిపై టీడీపీ దాడులు పరాకాష్టకు చేరాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ వేముల శ్రీదేవి వైఎస్సార్ సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ఈక్రమంలో తనపై కక్ష సాధింపు చర్యలగా కూటమికి చెందిన సత్తెనపల్లి నాయకులు తన పేరుతో ఫేస్ బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యకర ఫొటోలు, వీడియోస్ క్రియేట్ చేశారని బాధితురాలు వాపోయింది. సత్తెనపల్లిలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. తనపై ఫేక్ అకౌంట్ క్రియేట్చేసిన వైనంపై గ్రీవెన్స్లో నాలుగు సార్లు ఫిర్యాదు చేశానని.. అయితే నిందితులు నిజం ఒప్పుకున్నా పోలీసులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తనను దూషించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇలా ఉంటే ఈనెల 25న రాత్రి సమయంలో తన ఇంటి మీదకి ఓ మహిళ, సుమారు 20 మంది పురుషులు వచ్చి ఒక్కసారిగా కళ్లలో కారం చల్లి, సభ్య సమాజం తలదించుకునే రీతిలో దుర్భాషలాడుతూ.. వైఎస్సార్ సీపీలోనే కండువా కప్పుకొని పార్టీలో తిరుగుతావా? వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పోస్టులు పెడతావా? అంటూ మాట్లాడటానికి వీలు లేని పదజాలంతో దూషించి దాడి చేశారని ఆవేదన వెలిబుచ్చింది. తన భర్త శ్రీనివాసరావు సెంట్రింగ్ పనిచేస్తూ పని నుంచి వస్తుంటే అతనిపై కూడా దాడి చేశారని, ఎందుకు ఇలా దాడులు చేస్తున్నారో అర్థం కాక సత్తెనపల్లి రూరల్ పోలీస్స్టేషన్కి వెళ్లి తమపై టీడీపీకి చెందిన వారు దాడి చేసేందుకు వచ్చారని ఫిర్యాదు చేస్తే పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించకపోగా .. నువ్వేదో వాళ్లపై పోస్ట్ పెట్టావంట, వాళ్లను తిట్టావంట అంటూ తననే తిరిగి ప్రశ్నించారని, బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకేమాత్రం సంబంధ లేదంటూ మొత్తుకుంటున్నా.. వినకుండా.. తనపై దాడి చేసిన వారికి మాత్రం రాచమర్యాదలు చేసి కూర్చోబెట్టారని, ఇది ఎంతవరకు సమంజసమో అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వెలిబుచ్చింది. మహిళలపై దాడి చేసే హక్కు ఏ రాజ్యాంగంలో ఉంది? ఏ చట్టంలో ఉందని ఆమె ఆవేదన వ్యక్తపరిచింది. తన భర్తకు రెండు నెలల బెడ్ రెస్ట్ అని చెబుతున్నారని, ఇలా చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. దాడి చేసిన వారికే పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆవేదన వ్యక్త పరిచింది. ఇప్పటికై నా జరిగిన ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. -
వాగు ఒడ్డున పురాతన ఆంజనేయస్వామి విగ్రహం
రొంపిచర్ల: స్థానిక చపా రపు సుబ్బారెడ్డి కాలనీ సమీపంలోని చప్టా వద్ద పురాతన కాలం నాటి ఆంజనేయస్వామి విగ్రహాన్ని శుక్రవారం స్థానికులకు కనుగొన్నారు. విగ్రహం ఆనవాళ్లతో పురాతనమైనదిగా భావిస్తున్నారు. మూ డు రోజుల కిందట రాత్రి సమయాల్లో జేసీబీ ఆ ప్రాంతంలో సంచరించటం స్థానికులు చూశారు. విగ్రహం ముఖ భాగం కనిపించకుండా ఉండటంతో స్థానికులు తొలుత దానిని రాయిగా భావించారు. శుక్రవారం గ్రామస్తులు కొందరు రాయిని దొర్లించగా విగ్రహం కనిపించింది. విగ్రహం ముక్కు, ఛాతీ, మొఖం, గధ ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లు గుర్తించారు. జేసీబీ బక్కెట్లో విగ్రహాన్ని ఉంచి ఇక్కడకు తీసుకొచ్చి పడవేసినట్లు భావిస్తున్నారు. ఆ సమయంలోనే విగ్రహం ధ్వంసం అయినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు ఆ విగ్రహాన్ని గుడిలోకి చేర్చి పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 48 మందిపై హత్యాయత్నం కేసు నాదెండ్ల: గణపవరం కొత్త మసీదు బజారులో మంగళవారం రాత్రి పాతకక్షల నేపథ్యంలో ఇరు ముస్లిం వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో 48 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఘర్షణలో షేక్ ఖాశింబీకి తీవ్రగాయాలై గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో పది మందికి గాయాలయ్యాయి. షేక్ ఖాశింపీరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు 18 మందిపై, అంబటి శివ ఫిర్యాదు మేరకు 30 మందిపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం రెండు వర్గాలకు చెందిన 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ట్రైనీ ఐపీఎస్ జె నిరంజన్, ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ, ఎస్సై ఆర్ వెంకటేశ్వరరావు నిందితులను స్టేషన్కు తరలించారు. శనివారం కోర్టుకు హాజరుపరచనున్నారు. -
అంధుల క్రికెట్ పోటీల్లో ఆంధ్ర జట్టు ఘన విజయం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అంధుల క్రికెట్ టోర్నమెంట్లోమధ్యప్రదేశ్పై ఆంధ్ర జట్టు 5–0 తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు రోజులుగా స్థానిక అరండల్పేటలోని పిచ్చుకులగుంట క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (సీఏబీఏపీ), డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అంధుల క్రికెట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అంధుల క్రికెట్ ఇన్క్లూజివ్ చాలెంజర్స్ ట్రోఫీ‘ టీ20 బైలాటరల్ సిరీస్ను ఆంధ్ర జట్టు ఏకపక్ష విజయాలతో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్స్లో జట్టు సమిష్టిగా ఆడి విజయం నమోదు చేసింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ పోటీతత్వం ముందు అంధత్వం ఓటమి పాలైందని పేర్కొన్నారు. యువ క్రీడాకారులకు ఈ విజయం ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. దృష్టి లోపం ఉన్నా, గుండె నిండా ధైర్యంతో మైదానంలో ప్రదర్శించిన పోరాట పటిమ అద్భుతమన్నారు. విజేతలతోపాటు రన్నర్స్కు ట్రోఫీలతోపాటు నగదు బహుమతులు అంజేశారు. అంతర్జాతీయ అంధుల మాజీ క్రికెటర్ అజయ్కుమార్ రెడ్డి, ఎస్బీఐ డీజీఎం కృష్ణకుమార్, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వెంకటరమణప్ప, ఏఐబీఓిసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జయకుమార్, వీసీవైఏ అధ్యక్షుడు ఎల్.రత్నరాజ్ పాల్గొన్నారు. -
జాతీయ ఆర్చరీ పోటీలు ప్రారంభం
పెదకాకాని: నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. పోటీలు ఏప్రిల్ 7వ తేదీ వరకు విశ్వవిద్యాలయం క్యాంపస్లో జరగనున్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2,300 మంది ఆర్చరీ క్రీడాకారులు, కోచ్లు రానున్నారు. అండర్ 10, అండర్ 13, అండర్ 15 విభాగాలుగా నిర్వహించనున్న పోటీలలో తొలి రోజున 723 మంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందమూరి తేజస్విని, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఎండీ ఎస్ భరణి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్షీశా, వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్సిటీ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ ఆర్చరీ వంటి క్రీడలు విద్యార్థులలో ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెప్పారు. అలాంటి పోటీలకు తమ విశ్వవిద్యాలయం వేదిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, ఇండియన్ ఆర్చరీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ, ఫిజికల్ డైరెక్టర్ ఎన్.అరుణ్కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
గోళ్ళపాడు(ముప్పాళ్ళ): మద్యం మత్తులో ముగ్గురు యువకులు ద్విచక్రవాహనం పై వస్తూ రహదారిపై ఆగిఉన్న లారీ డ్రైవర్ పై దాడిచేసి లారీ అద్దాలు పగలగొట్టిన సంఘటన నరసరావుపేట–సత్తెనపల్లి ప్రదాన రహదారిపై మండలంలోని గోళ్ళపాడు సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి పోలీసులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామం నుంచి మొక్కజొన్న పొత్తుల లోడ్తో పోరుమామిళ్ళ బయలుదేరిన ఏపీ07టీజే1454 నెంబర్ లారీ గోళ్లపాడు గ్రామంలోని లోలెవల్ చప్టా దాటాక లారీలోని మొక్కజొన్న పొత్తుల బస్తాలు పక్కకి వరిగిపోవటంతో రహదారి పక్కన ఆపి సరిచేసుకుంటున్నారు. అదే సమయంలో ద్విచక్రవాహనం పై ముగ్గురు యువకులు నరసరావుపేట వైపు నుంచి వస్తూ ఆగి ఉన్న లారీ డ్రైవర్ ఎస్.నాగయ్య, క్లీనర్ నందిపాటి ప్రవీణ్కుమార్లను లారీ రోడ్డు పై ఆపావేంట్రా...అని గొడవపడి బూతులు తిడుతూ చేతులు, కాళ్లతో కొట్టడం ప్రారంభించారు. భయపడిన డ్రైవర్, క్లీనర్లు పరిగెత్తేందుకు యత్నిస్తుండగా అడ్డగించి మళ్లీ దాడికి దిగారు. అంతటితో ఆగకుండా రాళ్ళతో లారీ అద్దాలు, హెడ్లైట్ పగలకొట్టారు. భయపడిన లారీ డ్రైవర్, క్లీనర్లు పొలాల గుండా ముప్పాళ్ళ పోలీస్స్టేషన్ కు వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. జరిగిన సంఘటనపై లారీ డ్రైవర్ ఎస్.నాగయ్య అందించిన ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.అనిల్కుమార్ తెలిపారు. అర్ధరాత్రి ఆగి ఉన్న లారీ అద్దాలు ధ్వంసం -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఇరువురికి గాయాలు వినుకొండ: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా ఇరువురికి గాయాలయ్యాయి. వినుకొండ – వెల్లటూరు మధ్యలో ఉన్న కురవ దగ్గరలోని పార్కు సమీపంలో గురువారం రాత్రి ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటేశ్వర్లు (27) మృతిచెందగా మరో ఇద్దరు హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. మృతుడు చింతపల్లి వెంకటేశ్వర్లుకి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నేడు కలెక్టరేట్లో ప్రత్యేక పీజీఆర్ఎస్ నరసరావుపేట: స్థానిక కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం శనివారం ఉదయం 10గంటలకు ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయా వర్గాల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): అతివేగంగా వెళ్తు న్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఒక యువకుడు దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన మేడికొండ అన్వేష్(27), జెట్టి అజయ్(17), మేడికొండ అఖిల్బాబు (15), పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన ఈదులమూడి రాజ్కుమార్(24) స్నేహితులు. అజయ్, అఖిల్బాబు ఐటీఐ చదువుతుండగా అన్వేష్ పెయింటర్గా పనిచేస్తుంటాడు. రాజ్కుమార్ గుండిమెడలోని సోదరి ఇంటిలో ఉంటూ పెయింటింగ్ పనులకు వెళ్తుంటాడు. వీరు నలుగురు శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సెల్ఫోన్ రిపేరు నిమిత్తం ఒకే ద్విచక్ర వాహనంపై గుండిమెడ నుంచి గవర్నర్పేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్కు బయలుదేరారు. ద్విచక్ర వాహనాన్ని రాజ్కుమార్ నడుపుతుండగా వెనుక అజయ్, తర్వాత అఖిల్, ఆ తర్వాత అన్వేష్ కూర్చున్నారు. మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో వారధి దాటి ట్రాఫిక్ సబ్ కంట్రోల్ సమీపానికి చేరుకోగానే అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో నలుగురు కింద పడిపోయి రోడ్డుకు గుద్దుకున్నారు. అన్వేష్ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ ముగ్గు రిని అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం, అన్వేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం తెనాలిటౌన్: తల్లి జన్మనిస్తే తనకు రంగస్థలం జీవితాన్నిచ్చిందని మా–ఏపీ వ్యవస్తాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా అన్నారు. స్థానిక చెంచుపేటలోని ఆలపాటినగర్లో గల మా–ఏపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించారు. పెదరావూరు ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్బాబు అధ్యక్షత వహించారు. మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్రాజా మాట్లాడుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవం నేపథ్యాన్ని వివరించారు. నాటి నటుడు శివాజి గణేశ్ నుంచి కోట శ్రీనివాసరావు వరకు రంగస్థలం నుంచి వెండితెరపై రాణించారని ఆయన వివరించారు. మేకప్ వేసుకునే ప్రతి నటీనటుడు మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం నిర్వహించాల్సిన నైతిక భాధ్యత ఉందన్నారు. రంగస్థల నటులు దేవిశెట్టి కృష్ణారావు, వసంత యామి ని, చందు సూర్యను ‘మా–ఎపీ’ సత్కరించింది. తమకు జరిగిన సత్కారానికి సన్మాన గ్రహీతలు ‘మా–ఏపీ’కి కృతజ్ఞతలు తెలిపారు. -
ఆటోను ఢీకొన్న టిప్పర్
గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకై ఏప్రిల్ 24న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీలోపు దరఖాస్తు చేయాలని సంస్థ గుంటూరుజిల్లా కన్వీనర్ ఎం.రజిని శుక్రవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. పాత గుంటూరు నందివెలుగురోడ్డులోని ఉర్దూ బాలుర గురుకుల పాఠశాలతోపాటు, సంగడిగుంటలోని బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి, 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకై విద్యార్థులు ఏపీఆర్ఈఐఎస్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. నందివెలుగురోడ్డులోని గురుకుల ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంపీసీ, సీఈసీ గ్రూపులలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. -
హ్యాండిల్ లాక్ విరగతీసి.. ఇంజిన్ వైర్లు కలిపి..
నరసరావుపేట టౌన్: పట్టపగలు జనసంచారం.. ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా.. ఇద్దరు అగంతకులు సినిమా స్టయిల్లో బైక్ చోరీకి పాల్పడ్డ ఘటన పట్టణంలో కలకలంరేపింది. నిమిషాల వ్యవధిలో హ్యాండిల్ లాక్ను విరగదీసి.. ఇంజన్వైర్లు కలిపి బైక్ స్టార్ట్ చేసుకొని దర్జాగా అక్కడ నుంచి జారుకున్నారు. వివరాల్లోకెళ్లితే... వెంగళరెడ్డి కాలనీకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి సయ్యద్ ఉస్మాన్ ప్రకాష్నగర్ ఓవర్ బ్రిడ్జి ఎంట్రన్స్ వద్దగల హోటల్ ఎదుట శుక్రవారం ద్విచక్రవాహనాన్ని నిలిపాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి చూడగా వాహనం కనిపించలేదు. ఈ మేరకు వన్టౌన్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని హోటల్ వద్ద ఉన్న సీసీ పుటేజ్ను పరిశీలించారు. అందులో ఇద్దరు అగంతకులు ద్విచక్రవాహనాన్ని చాకచక్యంగా దొంగలించుకొని వెళ్లినట్లు గుర్తించారు. మొదట ఓ యువకుడు బైక్ దగ్గర చుట్టూ చూసుకుంటూ నిలబడ్డాడు. అనుమానం రాకుండా ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటించాడు. కొద్దిసేపటికి మరో యువకుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ తర్వాత వాహన హ్యాండిల్ లాక్ను విరగతీశాడు. అనంతరం ఇంజన్కు సంబంధించిన వైర్లు కలిపి స్టార్ట్చేసి అపహరించుకొని దర్జాగా వెళ్లారు. ఈ దృశ్యం అంతా సీసీ పుటేజ్లో నిక్షిప్తమై ఉంది. వాటిని స్వాధీనం చేసుకొని నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టపగలు జనసంచారం ఉన్న ప్రాంతంలో యదేచ్ఛగా ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడటంతో వాహన యజమానులు ఆందోళన చెందుతున్నారు. -
పీవీఆర్కు వైఎస్సార్సీపీ శ్రేణుల ఘన స్వాగతం
మాచర్ల: చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో జైలుకు వెళ్లిన వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన నాయకుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి శుక్రవారం బెయిలుపై విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాచర్ల నియోజక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో వాహనాలలో వెళ్లి ఆయనకు ఘన స్వాగతం పలికారు. గుంటూరు నుంచి మాచర్ల వరకు ఆయన వెంట వందల మంది కార్లు, ద్విచక్ర వాహనాలతో వచ్చారు. పీవీఆర్కు జేజేలు పలుకుతూ వెంట సాగారు. మాచర్ల శివారులో బారికేడ్లు పెట్టి మరీ భారీ కాన్వాయ్ని పట్టణంలోకి రానివ్వబోమని అర్బన్ సీఐ వెంకటరమణ పేర్కొన్నారు. అనుమతించిన వాహనాలతోనే ర్యాలీగా ఆయన పట్టణానికి వచ్చారు. గుంటూరు నుంచి మార్గమధ్యలో పలు చోట్ల ఆయనకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎటుచూసినా కార్యకర్తల సందడి నెలకొంది. అందరికీ పీవీఆర్ అభివాదం చేస్తూ ముందుకుసాగారు. మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల, మాచర్ల రూరల్, దుర్గి, కారంపూడికి చెందిన వందల మంది ఆయనకు స్వాగతం పలికారు. ఎటుచూసినా టపాసులు పేలుస్తూ పీవీఆర్కు జేజేలు అంటూ ముందుకు సాగారు. పట్టణ శివారులో పోలీసులు ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఇంటికి చేరుకోగానే పీవీఆర్ను అర్చకులు ఆశీర్వదించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోదరుడు ఇంటికి రావటంతో పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాతృమూర్తి రాములమ్మ, కుటుంబ సభ్యులు ఆప్యాయంగా పలకరించారు. యోగ క్షేమా లు తెలుసుకున్నారు. పీవీఆర్ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షులు మేరాజోత్ హనుమంతునాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్లు బత్తుల ఏడుకొండలు, అబ్దుల్ జలీల్, మార్కెట్ యార్డు చైర్మన్ తాడి వెంకటేశ్వరరెడ్డి, పట్టణ అధ్యక్షులు పోలా శ్రీను, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ యరబోతుల శ్రీనివాసరావు, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ కామనబోయిన కోటయ్య, లెదర్ పార్కు రాష్ట్ర మాజీ డైరెక్టర్ బూదాల మరియమ్మ, జిల్లా కార్యదర్శి పోతురెడ్డి కోటిరెడ్డి, రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి నవులూరి చెన్నారెడ్డి, జిల్లా యువజన సంఘం నాయకులు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిలుకూరి చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మల్లుస్వామి, యువజన విభాగ అధ్యక్షుడు బూడిద శ్రీను, పల్నాడు జిల్లా వ్యవసాయ సలహా మాజీ చైర్మన్ కుర్రి సాయి మార్కొండా రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నవులూరి భాస్కర్రెడ్డి, పార్టీ మండలాల అధ్యక్షులు కొంగర సుబ్రహ్మణ్యం, ఉన్నం వెంకటేశ్వర్లు, కొండా శివలింగరాజు, గొట్టం బ్రహ్మారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కేతావత్ బాలునాయక్, వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు ఉన్నారు. -
అమరావతిలో వైభవంగా సీతారాముల కల్యాణం
అమరావతి: దక్షిణ కాశీ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన అమరావతిలోని కోదండ రామ ఆలయంలో వేంచేసియున్న సీతాసమేత కోదండ రామ స్వామికి శుక్రవారం శ్రీరామ నవమి సందర్భంగా వైభవంగా కల్యాణం నిర్వహించారు. స్వామి వారిని తొలుత దేవాలయంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఉంచి కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి పరాశరం రామకృష్ణమా చార్యులు ఆధ్వర్యంలో వైఖానస ఆగమానుసారం వేడుక జరిపించారు. సత్తెనపల్లి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ సెంటర్లో కనీస సౌకర్యాలు లేవంటూ అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష పేపర్లు దిద్దేందుకు కనీసం కూర్చునేలా కూడా బల్లలు సరిపడా లేవని, భోజనాలు చేయటానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినం కావడంతో కొందరు ముందస్తుగా బయటకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో బయట గేటుకు తాళాలు వేయడంతో అధ్యాపకులు గేట్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్ష కేంద్ర పర్యవేక్షకుడితో కొందరు అధ్యాపకులు వాగ్వివాదానికి దిగారు. గుంటూరు వెస్ట్: జిల్లా లోని 16 మండలాల్లో శనివారం వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించిందని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వడగాల్పులకు గురి కాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పనులు ఉంటే మినహా ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులకు బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని సూచించారు. చిన్నారులు, వయసు మీరినవారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు చూడాలని చెప్పారు. డీ హైడ్రేషన్కు గురికాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధింత అధికారులు ప్రజలకు తగు సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు. ప్రకృతి సాగును పరిశీలించిన నేపాల్ బృందం కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రైతు సాధికార సంస్థ (ఆర్వైఎస్ఎస్) సంయుక్తంగా వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న ‘ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం‘ (ఏపీసీఎన్ఎఫ్) పద్ధతులను నేపాల్ బృందం పరిశీలించింది. శుక్రవారం గుంటూరులోని రైతు సాధికార సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంస్థ సీఈఓ రామారావు సదరు బృందంతో సమావేశమయ్యారు. ఆర్వైఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్ కుమార్ వర్చువల్గా ప్రకృతి వ్యవసాయంలో అనుసరిస్తున్న విధానాలు, రైతులకు అందుతున్న ప్రోత్సాహం, పరస్పర సహకారం, భవిష్యత్తులో ఈ రంగంలో చేపట్టాల్సిన కార్యాచరణ వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ బృందం కొల్లిపర మండలం, అత్తట గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించింది. క్షేత్రస్థాయిలో సాగు పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించింది. రైతు సాధికార సంస్థకు చెందిన కృష్ణారావు, ఎన్ఆర్ఓ యూనిట్ ఆధ్వర్యంలో పర్యటన కొనసాగుతోంది. -
పల్నాడు
శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5884 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 536.30 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 18,516 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7500, గరిష్ట ధర రూ.9200, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది. నవమి వేళ.. కల్యాణ కళ శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కనుల పండువగా నిర్వహించారు. నగరం, పట్టణాలలోని ప్రధాన రహదారులు సహా వీధుల్లోని ఆలయాలలో శ్రీసీతారాముల కల్యాణం మహోత్సవాలు ఘనంగా జరిపించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కల్యాణ వేడుకను తన్మయంతో తిలకించి తరించారు. ఉత్సవం అనంతరం భక్తులకు పానకం, వడపప్పు, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయాల వద్ద భారీ ఎత్తున తాటాకు పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. – పెదకూరపాడు7 -
టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు: కాసు మహేష్రెడ్డి
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్సీపీ హయాంలో పల్నాడు జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైఎస్సార్సీపీ హయాంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయన్నారు.మెడికల్ కాలేజీని తెచ్చామని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. మెడికల్ కాలేజీపై ఎమ్మెల్యే యర్రపతినేని అవగాహన లేకుండా మాట్లాడారని కాసు మహేష్రెడ్డి చెప్పారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే వైఎస్సార్ మెడికల్ కాలేజీ పల్నాడు జిల్లాకు వచ్చిందని తెలిపారు. -
రాష్ట్ర సరిహద్దులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు
విజయపురిసౌత్: అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతం నాగార్జునసాగర్ వద్ద రవాణా శాఖ, పోలీస్, ఫైర్ అధికారుల ఆధ్వర్యంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులలో గురువారం తనిఖీలు నిర్వహించారు. మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. డ్రంకన్న్ డ్రైవ్, ఫిట్నెస్, ఇన్సురెన్స్, పర్మిట్ పత్రాలను పరిశీలించారు. నిబంధనలు పాటించని వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తావని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాష, ఎంవీఐ శేషారెడ్డి, విజయపురి సౌత్ ఎస్సై అశోక్ పాల్గొన్నారు. నరసరావుపేట టౌన్: చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నేషనల్ రీసెర్చ్ కమిటీ సభ్యుడిగా నరసరావుపేట కు చెందిన ప్రముఖ ఆడిటర్ చేకూరి సాంబశివరావు ఎంపికయ్యారు. ఈ మేరకు నియామాక పత్రాన్ని గురువారం రీసెర్చ్ కమిటీ చైర్మన్ విశాల్ దోషి చేతుల మీదుగా అందుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న 449వ కౌన్సిల్ సమావేశం నిర్వహించటం జరిగిందన్నారు. కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అధ్యక్షుడు రీసెర్చ్ కమిటీ 2026–27 పునఃవ్యవస్థీకరించారన్నారు. రీసెర్చ్ ద్వారా నూతన దృక్కోణాలు వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని సాంబశివరావు తెలిపారు. తన నియామాకానికి కృషి చేసిన చైర్మన్, ఇతర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చీరాల: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చీరాల మండలం వాడరేవులో చోటుచేసుకుంది. ఈపూరుపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చీరాల మండలం వాడరేవుకు చెందిన కె.పోతురాజు (45) అనారోగ్య కారణాలతో బాధపడుతున్నాడు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎ.చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బెట్టింగ్లతో ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఎటువంటి లాభం ఉండదని చెప్పారు. అంతేగాక అప్పుల ఊబిలోకి కూరుకుపోతారని పేర్కొన్నారు. బెట్టింగ్లతో సమయం వృధా చేసుకోవద్దని, యువత ఉన్నత స్థాయికి చేరేందుకు తమ సమయం ఉపయోగించాలని తెలిపారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే డయల్ 112 లేదా స్థానిక పోలీస్స్టేషన్లల్లో సమాచారం అందించాలని అన్నారు. ఈనెల 28 నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం దృష్ట్యా ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రధానంగా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. డబ్బులు పోగొట్టుకుని మానసిక ఒత్తిడికి గురై, నిరాశ, ఆత్మన్యూనత భావాలతో చివరికి ఆత్మహత్యా ప్రయత్నాలకు దారితీస్తాయని పేర్కొన్నారు. -
పకడ్బందీగా జనగణన నిర్వహించండి
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన ప్రక్రియ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రెండవ దశ ఫీల్డ్ ట్రైనర్లు శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి, శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మార్చి 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో జనగణన డేటా సేకరణపై అధికారులు పూర్తి అవగాహన పెంచుకోవాలని అన్నారు. ‘మన గణన–మన భవిష్యత్తు’ అనే నినాదంతో జరుగుతున్న ఈ మహా యజ్ఞం దేశ ప్రగతికి దిక్సూచి వంటిదని, సేకరించే ప్రతి అంకె అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు పునాది అని స్పష్టం చేశారు. గృహ నిర్మాణం, తాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్, ఇంటర్నెట్ వంటి 33 కీలక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందని, సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చట్టరీత్యా బాధ్యతని స్పష్టం చేశారు. మాస్టర్ ట్రైనర్లు అఖిల్, సుబ్రహ్మణ్యం, జిల్లా ఇన్చార్జి రామసుబ్బారావు ,జిల్లా ప్రణాళిక అధికారి పాల్గొన్నారు. తప్పులు లేకుండా రీ సర్వే చేయాలి మాదల(ముప్పాళ్ళ): రీ సర్వే ప్రక్రియను నిర్ణీత కాలంలో తప్పులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనాసింహ ఆదేశించారు. మండలంలోని మాదల గ్రామంలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. సర్వే నెంబర్ 614,615 ల జరుగుతున్న రీసర్వే ను పరిశీలించి సంబంధిత రైతులతో మాట్లాడారు. సత్తెనపల్లి డివిజనల్ సర్వే అధికారి విజయ్కుమార్, మండల తహసీల్దార్ కే.నగేష్, మండల సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలు క్లియర్ చేయాలి. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను విచారించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనాసింహ ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంను గురువారం సందర్శించి వెబ్ల్యాండ్ మ్యుటేషన్స్, కరెక్షన్స్, మీ సేవ, ఏపీసేవ పెండింగ్ అంశాలను, సుమోటో క్యాస్ట్ సర్టిఫికెట్లు పీజీఆర్ఎస్ అర్జీలపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ అందించే సేవలపై రికార్డుల నిర్వహణను పరిశీలించి పలు సూచనలు చేశారు. నిత్యావసర సరుకుల పంపిణీ తీరు తనిఖీ... మండల కేంద్రంలోని ముప్పాళ్ళలో 65 సంవత్సరాలు పై బడిన, వికలాంగులకు చౌకధరల దుకాణాల ద్వారా ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీని జిల్లా జాయింట్ కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ -
సీతారామచంద్రస్వామి ఆలయంలో 108 మంది దంపతులతో కళ్యాణం
నరసరావుపేట ఈస్ట్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణానికి పట్టణంలోని రామాలయాలు ముస్తాబయ్యాయి. వీటితో పాటు పట్టణంలోని పలు కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి శుక్రవారం రాములోరి కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టాభిరామస్వామి ఆలయం, సతైనపల్లిరోడ్డులోని సీతారామచంద్ర స్వామి ఆలయం, క్లాత్మార్కెట్ సెంటర్లోని సీతారామస్వామి ఆలయం, పాలపాడురోడ్డులోని చిన్నసింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం, బరంపేటలోని ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంతో పాటు వైష్ణవాలయాలలో సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. సతైనపల్లిరోడ్డులోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త వేముల శంకరనారాయణ, నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో 108 దంపతులచే సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం సీతారామ కళ్యాణ గానామృతం, సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అలాగే పట్టాభిరామస్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త నాగసరపు సుబ్బరాయగుప్త, అనూరాధ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం నిర్వహిం చనున్నారు. -
క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి
నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని 28 మండలాల్లో వినూత్నంగా 28 క్లస్టర్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా వివిధ రకాల ప్రాసెసింగ్ ప్లాంట్లను గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో డీఆర్డీఎ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో రైతులు పండించే పంటలకు అదనపు విలువ చేకూర్చడం ద్వారానే వారికి మెరుగైన ఆదాయం లభిస్తుందన్నారు. ప్రతి మండలంలో గుర్తించిన క్లస్టర్లకు సంబంధించిన డీపీఆర్లు వెంటనే బ్యాంకులకు సమర్పించాలన్నారు. పొదుపు మహిళల వ్యాపారాభివృద్ధికి ‘సంపన్నకారి’ నరసరావుపేట: స్వయం సహాయక సంఘ సభ్యులతో అనుసంధానమైన మహిళా వ్యాపారాభివృద్ధికి కోసం రూపొందించబడిన ప్రత్యేకమైన ‘సంపన్న కారి’ కార్యక్రమం ఒక వరం లాంటిదని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ చాల వ్యాపారాలు ఒక స్థాయి తర్వాత మరింత అభివృద్ధి చెందడానికి సరైన మార్గదర్శకం, వ్యాపార ప్రణాళికలు, మార్కెట్ అంశాలపై అవగాహన లేకపోవడం, పెట్టుబడికి వనరులు లేకపొతే ఆ వ్యాపారాన్ని విస్తరించడం కష్టంగా మారుతుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రూపొందించిన కార్యక్రమమే ‘ సంపన్న కారి ‘ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికై న వారికి కనీసం 18 నెలలు ఇంక్యుబేషన్ సహాయం అందించడంతో పాటూ లక్ష వరకు గ్రాంట్ లేదా రూ.4లక్షల వరకు సున్నా వడ్డీ సదుపాయం, వ్యాపార పరంగా శిక్షణ, మార్కెట్ అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో అర్హత కలిగిన సంఘ సభ్యులు ఏప్రిల్ 15వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
రామాలయాన్ని నిర్మించిన ముస్లిం భక్తుడు
మాచర్ల రూరల్: భద్రాద్రి శ్రీ సీతారామ దేవస్థాన నిర్మాణంలో భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించి తన స్వామి భక్తిని చాటుకుంటే.. మాచర్ల మండలం జమ్మలమడకలో ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి రామాలయాన్ని నిర్మించి రామభక్తిని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన షేక్ సైదా సాహెబ్ 1996 సంవత్సరంలో గ్రామ శివారులోని సుమారు ఎకరం స్థలంలో శ్రీసీతారామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన తన భక్తిని చాటుకున్నాడు. ముస్లిం వ్యక్తివి.. హిందూ దేవుళ్లకు చెందిన రామాలయాన్ని నిర్మించటమేటంటూ పెద్దలు వారించినా వినకుండా శ్రీరామునిపై తనకున్న భక్తిని విడవకుండా ఆలయాన్ని నిర్మించాడు. సైదా సాహెబ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావటం విశేషం. సుమారు 8సంవత్సరాల క్రితం అనారోగ్యంతో షేక్ సైదా సాహెబ్ ఆలయ ప్రాంగణంలోనే మృతిచెందాడు. సాహెబ్ భక్తి భావాన్ని ఆదర్శంగా తీసుకొని.. ఆయన్ను తలచుకుంటూ గ్రామస్తులంతా ప్రతి ఏడాది కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తుంటారు.రామాలయాన్ని నిర్మించి మతసామరస్యత చాటిన సైదా సాహెబ్ -
పీఆర్కేను కలిసిన ఎస్టీ విభాగం నేతలు
మాచర్ల: వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు రమావత్ రంగానాయక్, జిల్లా నాయకులు సభావత్ రవినాయక్, రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి దండు మధుబాబు, గిరిజన జిల్లా నాయకులు రమావత్ కృష్ణా నాయక్, బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మైదాన ప్రాంత గిరిజన విభాగం అధ్యక్షుడు గుండా సుధీర్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతు నాయక్, కాండ్లావత్ శ్రీను నాయక్లు ఆయన కార్యాలయంలో గురువారం కలిశారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులు పీఆర్కేను శాలువాతో సత్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజాభిమానం కలిగిన వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులను టార్గెట్ చేసి జైలుకు పంపిందని, అదే విధంగా పల్నాడు జిల్లాలో ప్రజాభిమాన నాయకుడు పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను కుట్రతో కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. నియోజక వర్గ గిరిజన నాయకులు రమావత్ మాద్యానాయక్, కేలా నాయక్, రమావత్ కృష్ణానాయక్, రవీంద్రా నాయక్, జాన్పాల్ నాయక్, శ్రీను నాయక్, బోజ్యానాయక్, సుధాకర్ నాయక్, పలువురున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జి.సురేందర్ను గిరిజన నాయకులు సత్కరించారు. -
ఏప్రిల్ చివరి వరకు సాగునీరివ్వాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసరావుపేట: పల్నాడు జిల్లాలో రబీ పంటలను కాపాడేందుకు ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు నిరంతరాయంగా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎన్ఎస్పీ సూపరింటెండెంట్ ఇంజినీరు కార్యాలయంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీర్ కొడాలి ఏడుకొండలుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గోపాలరావు మాట్లాడుతూ.. జిల్లాలో లక్షలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న తదితర పంటలను ప్రధానంగా చిన్న, సన్నకారు రైతులు అప్పులు చేసి సాగు చేశారని తెలిపారు. పంట చేతికి వచ్చే కీలక దశలో సాగునీరు అందించకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం, రైతులు అప్పులపాలవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం నష్టాల బాటలో ఉన్న వేళ, సాగునీటి విధానంలో పాలకుల అవగాహన రాహిత్యం రైతులను మరింత కష్టాల్లోకి నెట్టేస్తోందన్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారుతుందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ సాగునీరు ఇవ్వడంలో విఫలమవుతుందని ఆరోపించారు. కాలువల ఆధునీకరణ లోపం, సిబ్బంది కొరత కారణంగా సాగునీరు వృధా అవుతుందన్నారు. సరైన నిర్వహణతో చివరి భూములకు నీరు అందించవచ్చన్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలని, లేని పక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
బాలలతో బిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు
నరసరావుపేట టౌన్: బాలలతో బిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు తప్పవని కార్మిక శాఖ సహాయ కమిషనర్ షేక్ మహబూబ్ సుభాని హెచ్చరించారు. బడి ఈడు పిల్లలు నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యాచన చేయడంపై ‘మసి మొగ్గలు’ శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఈ మేరకు అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. కార్మిక, మహిళ శిశు సంక్షేమ శాఖలతో పాటు ఎన్జీవోలతో కలిసి అధికారుల బృందం సంయుక్తంగా పట్టణంలోని పలు దుకాణాలు, హోటళ్లు ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. చిన్నారులతో బిక్షాటన చేయిస్తున్న పలువురిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలానే బిక్షాటన కొనసాగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. పిల్లల చేత బలవంతంగా బిక్షాటన చేయిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారి సాంబశివారెడ్డి, డీసీపీవో శౌరీరాజు, సాంఘిక సంక్షేమ అధికారి సంతోష్, ఎన్జీవో ప్రతినిధులు రామాచంద్రరావు, ప్రేమ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
చిరుమామిళ్ళకు 30 పడకల ఆసుపత్రి
నాదెండ్ల: చిరుమామిళ్ళ అభివృద్ధిలో మరో మణిహారం చేరింది. గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి గురువారం అనుమతులు మంజూరయ్యాయి. గ్రామానికి చెందిన విద్యాదాత, గోల్కొండ గ్రూపు సంస్థల చైర్మన్ నడికట్టు రామిరెడ్డి 2.70 ఎకరాల భూమిని ఆసుపత్రి నిర్మాణానికి విరాళంగా అందించారు. ఇక్కడ ఆసుపత్రి నిర్మించేందుకు ప్రభుత్వం రూ.6 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారు చేసింది. ఆసుపత్రి పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అవసరమైన మొదటి అంతస్తుతోపాటు అనుబంధ బ్లాకుల నిర్మాణం కోసం రామిరెడ్డి వ్యక్తిగతంగా రూ.4.80 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం ఆసుపత్రికి నడికట్టు రామిరెడ్డి ప్రజావైద్యశాలగా నామకరణం చేసేందుకు అనుమతించింది. నిధులతో ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలు, ప్రసూతి, అత్యవసర వైద్య విభాగాలు ఏర్పాటు కానున్నాయి. 25 మంది వైద్యారోగ్య సిబ్బంది సేవలు అందించనున్నారు. -
కల్యాణ యోగం లేని రామయ్య!
వినుకొండ: శ్రీరామ నవమి పర్వదినం రోజున దేశవ్యాప్తంగా స్వామి వారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించటం ఆనవాయితీ. చోళ రాజుల కాలంలో నిర్మించిన వెయ్యేళ్లకుపైగా చరిత్ర కలిగిన వినుకొండ కోదండ రామాలయంలో మాత్రం శ్రీరామ నవమికి కల్యాణం నిర్వహించరు. 85 సంవత్సరాల క్రితం దేవాలయంలో కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో పీటల మీద కూర్చున్న దంపతులు మృతి చెందారు. అప్పటి నుంచి వేడుకలు నిలిచిపోయాయి. తరువాత ఏడాది కూడా స్వామివారి కల్యాణం నిర్వహించేందుకు ప్రయత్నించగా అశుభం జరిగింది. పీటల మీద కూర్చునేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో వేడుకలు పూర్తిగా నిలిపివేశారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న త్యాగరాజు ఉత్సవాల సందర్భంగా స్వామివారి కల్యాణం నిర్వహించేవారు. ఎంతో ప్రసిద్ధి త్రేతాయుగంలో సీతాన్వేషణలో ఉన్న శ్రీరామచంద్రమూర్తి, జటాయువు ద్వారా సీతమ్మ జాడ గురించి ఈ కొండ ప్రదేశంలోనే మొట్టమొదటి సమాచారం అందుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆ విధంగా ‘వినబడిన కొండ’ కాలక్రమంలో ‘వినుకొండ’గా ప్రసిద్ధి చెందింది. దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ రాజులు తమ విజయాలకు ప్రతీకగా ఈ పురాతన ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ స్వామి వారు దక్షిణాభిముఖంగా ఉండి భక్తులకు దర్శనమివ్వడం ఒక ప్రత్యేకత. విజయనగర పాలకుడు సదాశివ దేవరాయల కాలంలో రాయదళవాయి వారికి స్వామి వారు స్వప్నంలో సాక్షాత్కరించారు. స్వామివారి ఆదేశానుసారం గరుడ పక్షి వాలిన చోట నాలుగు స్తంభాల మండపం నిర్మించి, సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అపురూప శిల్పకళా సంపద ఈ ఆలయంలోని విగ్రహాలు అత్యంత కళాత్మకమైన ఏకశిలపై చెక్కబడ్డాయి. భూదేవి, విష్ణుమూర్తి అంశలతో కూడిన ఈ విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తాయి. అనంతరం చక్రపాణి రాయల వారు తన సొంత ధనంతో నిర్మించిన శిలా మండపం నేటికీ ఈ ఆలయ వైభవానికి అద్దం పడుతోంది. దీనిపై ఆలయ ప్రధాన అర్చకుడు నారాయణం రామ్మోహనాచార్యులు మాట్లాడుతూ... ‘‘తాతల కాలం నుంచి వారసత్వంగా రామాలయం పూజారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. గతంలో శ్రీరామనవమి సందర్భంగా కల్యాణం సమయంలో అశుభం జరుగటంతో రామనవమి రోజున ఆ వేడుక మాత్రం జరగటం లేదు. త్యాగరాజు ఉత్సవాలల్లో స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్నాం. వినుకొండ కోదండ రామాలయంలో 85 ఏళ్లుగా ఆగిన కల్యాణ వేడుక -
గుంటూరులో ఇండోర్ స్టేడియానికి శంకుస్థాపన
గుంటూరు వెస్ట్ (క్రీడలు): స్థానిక బీఆర్ స్టేడియం ప్రాంగణంలో రూ.14 కోట్లతో నిర్మించనున్న బహుళ ప్రయోజన ఇండోర్ స్టేడియానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ స్టేడియంలో తొమ్మిది బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్, టెన్నిస్ సహా ఆరు క్రీడా అంశాలలో వసతులు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. స్టేడియంలోని క్రికెట్ మైదానాన్ని ఏడాదిన్నర కాలంలో అభివృద్ధి చేస్తామన్నారు. రూ.170 కోట్లతో మొత్తం స్టేడియం డీపీఆర్లు తయారు చేశారని వివరించారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, తూర్పు శాసన సభ్యులు నసీర్ అహ్మద్లు మాట్లాడారు. కమిషనర్ మయూర్అశోక్, ఎమ్మెల్సీ ఆలపాటి, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ చైర్మన్ రవి నాయుడు, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణి, మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, డీఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు. సత్తెనపల్లి: రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ వి.విజయ్కుమార్ రెడ్డి సూచనల మేరకు పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో ఉన్న పరివర్తన మానసిక దివ్యాంగుల పాఠశాలను గురువారం సత్తెనపల్లి సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్,)జె. సుజన్కుమార్ సందర్శించారు. ముందుగా అక్కడ ఉన్న విద్యార్థుల వసతి గృహం, వంటశాలను పరిశీలించారు. ఆహార నాణ్యతను ప్రత్యేకంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు బి.ఎల్. కోటేశ్వరరావు, గంటా వెంకటశివ, పారా లీగల్ వలంటీర్ షేక్ సుభాని, పాఠశాల నిర్వాహకుడు కొరబండి కిషోర్బాబు ఉన్నారు. మంగళగిరి టౌన్: చినకాకానిలోని షైన్ ఆనంద శరణాలయానికి హైదరాబాద్ ఏఆర్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్ళం సుబ్బారెడ్డి రూ. 5.5 లక్షల విలువైన సోలార్ విద్యుత్ ప్యానళ్లను గురువారం అందజేశారు. సుబ్బారెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శరణాలయంపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్యానళ్లను ఆయన ప్రారంభించారు. బాలలకు అన్నదానం నిర్వహించారు. వైఎస్సార్సీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, వివిధ రంగాల ప్రముఖులు దొంతిరెడ్డి గాంధీ, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి, రుక్మాంగరెడ్డి, వెంకటరామిరెడ్డి, లంకా శ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్, నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
మసి మొగ్గలు
ఎప్పుడెప్పుడు రెడ్ సిగ్నల్ పడుతుందా అని ఎదురుచూసే పసి హృదయాలు ఆగిన వాహనాల వైపు కదులుతున్నాయి. తలకు తైల సంస్కారం జరిగి ఎంత కాలమైందో మాసిన బట్టల్లో వారి ముఖాలు మరింత బేలగా ఉన్నాయి. పుస్తకాలు అందుకోవాల్సిన చేతులు.. అయ్యా అంటూ బిచ్చమెత్తుకుంటున్నాయి.. అమ్మ గోరుముద్దలతో ఆకలి తీర్చుకోవాల్సిన పసిప్రాణాలు, ఎర్రటి ఎండలో నడివీధిలో ఆకలి పోరాటం చేస్తున్నాయి. నరసరావుపేట టౌన్: బంగారు భవిష్యత్తును దిద్దుకోవాల్సిన చిన్నారుల చేతులు.. చిల్లర కోసం వెతుకుతుంటే గుండెలు బరువెక్కుతున్నాయి. బాల్యాన్ని బజారుపాలు చేసిన వారిని శిక్షించాల్సిన వారి కళ్లకు నిర్లక్ష్యపు గంతలు కట్టుకున్నాయి. బడిబాట పట్టించాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించటంతో గుప్పెడు మెతుకుల కోసం ఆటపాటలకు సమాధి కట్టిన బాల్యం యాచిస్తూ రొడ్డున పడింది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణ నడిబొడ్డులో ఉన్న మల్లమ్మ సెంటర్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద బడిఈడు పిల్లలు ప్రతిరోజు యాచిస్తూ కనిపించటం ఆందోళన కలిగిస్తుంది. సిగ్నల్ పడిన సమయంలో నిలిచిన వాహనదారుల వద్దకు వెళ్లి యాచిస్తున్నారు. నిత్యం ఆ మార్గం గుండా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారు. అయినప్పటికీ చిన్నారులచే వారి తల్లిదండ్రులు యాచక వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇది చూసిన ప్రజానీకం విద్యాశాఖ, కార్మిక శాఖల అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడిఈడు పిల్లలు బహిరంగంగా మండుటెండలో యాచిస్తూ కనబడటం అధికారుల కళ్లకు కనిపించటం లేదా అని నిలదీస్తున్నారు. స్పెషల్ డ్రైవ్లు పేరిట దుకాణాల్లో, మెకానిక్ షెడ్లలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసే అధికారులు కళ్లెదుట బాలలు యాచిస్తూ ఉన్నా కనిపించక పోవటం శోచనీయం అని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పల్నాడు
నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7600, గరిష్ట ధర రూ.9300, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది. సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 536.70 అడుగులకు చేరింది. ఇది 181.5216 టీఎంసీలకు సమానం. ఒక్కరోజే రూ. 2.55 కోట్లు నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీని వినియోగించుకుని బుధవారం రూ. 2.55 కోట్లు పన్నులు ప్రజలు చెల్లించారని కమిషనర్ తెలిపారు.7 -
సాకారమవుతున్న వైద్యశాల, కళాశాల కల
పిడుగురాళ్ల రూరల్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో నిధులు మంజూరు చేసి వైద్యశాల, కళాశాలలు అతి త్వరలో పల్నాడు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పల్నాడు ప్రాంతానికి మణిహారంగా ఉండే మెడికల్ కళాశాల అందుబాటులోకి తీసుకొని రావాలని ఎంతో కృషి చేసి ప్రారంభించారు. దీనిలో భాగంగానే అధికారులు బుధవారం మెడికల్ కాలేజీని సందర్శించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తొలుత ఏపీ మెడికల్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మెడికల్ కాలేజీని సందర్శించారు. మెడికల్ కళాశాల, వైద్యశాలకు సంబంధించిన బ్లాక్లకు సంబంధించిన బ్లూ ప్రింట్ను పరిశీలించారు. అనంతరం వైద్యశాలలోని ప్రతి బ్లాక్ను సందర్శించారు. కాంట్రాక్టర్ల నుంచి వివరాలు సేకరించారు. ఏప్రిల్ 15వ తేదీకల్లా వైద్యశాల అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్లో సౌరభ్ గౌర్ మాట్లాడుతూ... రోగులకు వైద్యసేవలను ప్రారంభించేందుకు వీలుగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వైద్య సేవల తేదీలను ప్రకటిస్తామని తెలియజేశారు. విద్యా సంవత్సరం 2026–27 నుంచి ఎంబీబీఎస్ 100 సీట్ల మంజూరు కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేశామని తెలిపారు. దీనికి అనుగుణంగా ఎన్ఎంసీ నియమించే కమిటీ ఇన్స్పెక్షన్ కోసం వస్తుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మే నెల ఆఖరి నాటికి నిర్మాణాలు కాంట్రాక్టర్లతో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. కళాశాల నిర్మాణ పనులు మరింత చురుగ్గా జరగాలని ఆయన అన్నారు. విద్యను అభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలన్నారు. కళాశాల నిర్మాణానికి తగ్గటుగా పారామెడికల్, వైద్య సిబ్బంది నియామకాలను, డీఈఎంఈ, డీహెచ్వో అధికారులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ... అధికారులు సమన్వయంతో పని చేసి వైద్యశాల ఏప్రిల్ 15వ తేదీకల్లా పూర్తి చేయాలన్నారు. మున్సిపాలిటీ నుంచి మెడికల్ కాలేజీని మంచినీటి సౌకర్యం ఆలస్యం కాకుండా చూడాలని, అదేవిధంగా విద్యుత్శాఖ అధికారలు సరఫరాతోపాటు జనరేటర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు, రోగులు వచ్చేందుకు ఆర్టీసీ అధికారులతో రిక్వస్ట్ స్టాప్ను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా వైద్య సిబ్బంది రిక్రూట్మెంట్ వెంటనే పూర్తి చేసుకోవాలని ఆమె తెలిపారు. అనంతరం కామేపల్లి గ్రామంలోని ఆరోగ్య కేంద్రాన్ని, జానపాడు గ్రామంలోని ఉప ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రఘునందన్, డీహెచ్వో పద్మావతి, మెడికల్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, సీఈ నెహ్రూ, గుంటూరు వైద్యకళాశాల ప్రిన్సిపల్ సుందరాచార్య, పల్నాడు డీఎంహెచ్వో రవి, విద్యుత్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి
రొంపిచర్ల : మండలంలో రామిరెడ్డిపాలెం గ్రామంలో విద్యుత్ షాక్ గురై మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మహిళా రైతు, రొంపిచర్ల వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ మూలె కాశీ ఈశ్వరీ(40) విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. ఆమె తన గేదెలకు నీరు పెడుతుండగా, అక్కడ ఉన్న విద్యుత్ తీగలు తగలటంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్ళగా మృతి చెందినట్లుగా నిర్ధారించారు. కాగా మృతురాలికి భర్త, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎల్. లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడికొండూరు: మండల పరిధిలోని పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీ గుంతలో ఈతకు దిగి గల్లంతయిన విద్యార్థి మృతదేహం బుధవారం మేడికొండూరు పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి బయటకు తీశారు. పలకలూరు గ్రామానికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థి చంద్రశేఖర్(16) తన స్నేహితులతో కలిసి మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో క్వారీ గుంతలో ఈతకు దిగి కనిపించకుండా పోయాడు. సంఘటన జరిగిన సమయం నుంచి మేడికొండూరు సీఐ మధుసూదన్ రావు తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం తాడేపల్లి నుంచి గజ ఈతగాళ్ళను రప్పించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్వారీ గుంతలలో రాళ్ళల్లో లోతుగా ఉన్న చంద్రశేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మతుని తండ్రి బండారు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడికొండూరు సిఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు.. పేరేచర్ల కై లాసగిరి సమీపంలో ఉన్న క్వారీలో విద్యార్థి గల్లంతైన సంఘటన ప్రదేశానికి విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. తండ్రి రాంబాబు ఆటో డ్రైవర్ గా పని చేస్తూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివిస్తూ.. జీవనం సాగిస్తున్న ఈ తరుణంలో రెండవ కుమారుడు మృతి చెందటంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. తను ఆటోడ్రైవర్గా పనిచేసిన కుమారులు మాత్రం ఆ విధంగా ఉండకూడదని ఉన్నతంగా స్థిరపడేందుకు చదువే ఆధారంగా భార్యాభర్తలు కుమారుల కోసం కష్టపడుతూ ఉంటారని బంధువులు తెలియజేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
బుట్టాయగూడెం: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురు గాయపడిన ఘటన ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలోని శివాలయం సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరానికి చెందిన తాళ్లభోగి సురేష్, కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, మనవడితో పొగాకు పనుల నిమిత్తం వచ్చి కంసాలిపాలెంలో నివాసముంటున్నారు. మనవడు చిన్నా పానీపూరీ అడగడంతో సురేష్ కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, చిన్నాతో కలిసి ద్విచక్రవాహనంపై బుట్టాయగూడెం వస్తున్నారు. అదే సమయంలో స్థానిక అరుంధతీ కాలనీకి చెందిన ఉండ్రాజవరపు కాంతారావు, మరో యువకుడు ద్విచక్ర వాహనంపై బుట్టాయగూడెం నుంచి శివాలయం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రియాంక, చిన్నా, శ్రావణిలకు స్వల్ప గాయాలు కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే వైద్య సేవలు అందించారు. కాంతారావు, సురేష్ల పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్లో జంగారెడ్డిగూడెం తరలించారు. సీ్త్రనిధి ఏజీఎం నరసింహారావు నాదెండ్ల: డ్వాక్రా సంఘాల్లోని మొండి బకాయిలను వెంటనే రికవరీ చేయాలని సీ్త్రనిధి ఏజీఎం నరసింహారావు చెప్పారు. నాదెండ్ల రెండో సచివాలయంలోని వెలుగు కార్యాలయంలో బుధవారం సీసీలు, యానిమేటర్లు, డ్వాక్రా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి బ్యాంకు లింకేజీ బీపీఎం శ్రీనివాసరావు, డీపీఎం మల్లేశ్వరి, లీగల్ కోఆర్డినేటర్ సైదావలి హాజరయ్యారు. మండల పరిధిలో 1533 డ్వాక్రా సంఘాలున్నాయని, ఈ ఏడాది రూ.8 కోట్ల మేర రుణాల మంజూరు లక్ష్యంకాగా, ఇప్పటి వరకు రూ.6.5 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 48 గ్రూపుల్లో రూ.38 లక్షలకు పైగా మొండిబకాయిలు ఉన్నాయని, వీటిని త్వరగా రికవరీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం రమేష్, సీసీలు పద్మ, హేమలత, సుధ పాల్గొన్నారు. -
స్వామి భూమి.. కౌలు పెరగదేమి?
దేవుడు మాన్యాలకు కౌలు ఎకరాకు రూ.వెయ్యి మాత్రమే అమరావతి: అమరేశ్వరుని భూముల ద్వారా ఆదాయాన్ని పొందుతున్న రైతులు ఎకరాకు రూ.వెయ్యికి మించి కౌలు ఇవ్వడం లేదు. అలాగని కౌలు పెంచటానికి శాఖాపరంగా దేవదాయ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు శూన్యంగానే ఉన్నాయి. గ్రామంలో మిగిలిన పొలాలకు కనీసం రూ. ఆరు వేల నుంచి రూ. తొమ్మిది వేల వరకు కౌలు పలుకుతోంది. అమరేశ్వరుని భూములకు ఎకరాకు రూ. వెయ్యి కౌలు ఇస్తుంటే దేవాలయ అధికారులు ఆదే మహాప్రసాదంగా స్వీకరిస్తున్నారు. ఏడాదికి సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల కౌలు ఆదాయం రావాల్సి ఉంది. కానీ సుమారు రూ.నాలుగు లక్షలు మాత్రమే వస్తోంది. అలాగే ఈ భూమిలో సుమారు 20 ఎకరాల భూమి ఖమ్మం–విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఐదేళ్ల క్రితం తీసుకున్నా ఇప్పటివరకు పరిహారం రాలేదు. న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు సహకరించకపోతే ఓట్లు పోతాయనే భయంతో రాజకీయ నాయకులు, వారికి భయపడే అధికారులు వల్ల అమరేఽశ్వరుడు ప్రతి ఏడాది నష్టపోతున్నారు. రైతుల ఐకమత్యం అందరూ ఏకమై నామమాత్రంగా.. క్రీ.శ. 17వ శతాబ్దంలో అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు స్వామివారి నిత్య ధూప, దీప నైవేద్యాలకు ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామంలోని 410.34 ఎకరాల మాన్యాన్ని అందించారు. కాలక్రమేణా వాసిరెడ్డి వంశస్తుల అజమాయిషీలో మాన్యం కౌలు ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్వామి వారి సేవలకు వినియోగించారు. 19వ శతాబ్దంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తరువాత భూముల వేలం పాటలపై అధికారులు నిర్లక్ష్యం చూపారు. ఆ భూములకు రైతులు కొన్నాళ్లు కౌలు చెల్లించకుండా పండించుకున్నారు. కొందరు అధికారులు చేసిన ప్రయత్నాలతో ఎకరాకు రూ.200 నుంచి రూ.400 వరకే కౌలు చెల్లించారు. గ్రామాలలో బహిరంగ వేలం పాటల్లో ఎవరూ పాల్గొనకుండా ఎకరాకు రూ.400 నుంచి రూ. వెయ్యి కౌలు కడుతున్నారు. పరిహారం ఆలస్యం అమరేశ్వర దేవస్థానానికి చెందిన సుమారు 20 ఎకరాల భూమి ఖమ్మం–విజయవాడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూ సేకరణ చేశారు. భూములు దేవుడి పేరున ఉన్నా రైతుల ఆధీనంలో ఉండటంలో పరిహారం విషయంలో వివాదం తలెత్తింది ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ అధికారులు దేవుని భూములకు పరిహారం అమరేశ్వరునికే చెందటానికి న్యాయస్థానంలో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. 2021లో భూసేకరణ చేసిన గ్రామాలలో ప్రైవేటు వ్యక్తులు వెంటనే పరిహారం పొందినప్పటికీ అమరేశ్వరుని రావాల్సిన పరిహారం పొందటానికి తెలంగాణ హైకోర్టులో ఉన్న పరిహారం కేసు అంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేశారు. మొత్తం దాదాపు రూ.2.70 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు రావాల్సి ఉంది. మిగిలిన 390 ఎకరాల భూమికి బహిరంగ కౌలు వేలం పాటలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా కుగ్రామాలలో సైతం భూముల విలువ ప్రతి ఏడాది పెరుగుతుంటుంది. ప్రసిద్ధ శైవక్షేత్రమైన అమరావతి అమరేశ్వరునికి చెందిన ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరులో ఉన్న భూమి మాత్రం దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల విలువ పెంపు, కౌలు పెరిగే అవకాశం కనబడటం లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలు, దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల అమరావతి అమరేశ్వరస్వామి కౌలు ఆదాయానికి ఏటా భారీగా గండి పడుతూనే ఉంది. ఆలయ ఈవో రేఖ మాట్లాడుతూ ఇటీవల హైకోర్టు సంబంధిత 20 ఎకరాల భూమి అమరేశ్వరునికే చెందాలని నిర్ణయించిందన్నారు. ఇప్పటికే దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపామని తెలిపారు. మిగిలిన భూమికి కౌలు పెంపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇంటింటా గ్యాస్ తంటా!
చంద్రబాబు ప్రభుత్వం ఉచిత గ్యాస్ పథకంలో భాగంగా ఏడాదికి మూడు గ్యాస్ బండలు అందజేస్తామని తెలిపింది. కానీ ఉచితం మాట దేవుడెరుగు .. నేడు డబ్బులిస్తామన్నా గ్యాస్ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో గ్యాస్ కష్టాలు అన్ని వర్గాల ప్రజలను వెంటాడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందని అంతటా ముమ్మర ప్రచారం జరుగుతోంది. అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం కొరత లేదని చెబుతోంది. అధికారులు కూడా గ్యాస్ ఏజెన్సీలను పరిశీలిస్తున్నా సమస్యలు లేవని పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే కనిపిస్తాయని వినియోగదారులు చెబుతున్నారు. మూతపడుతున్న హోటళ్లు... సత్తెనపల్లి: యుద్ధ కారణంగా గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదు. రోజువారీ సరఫరాకు అంతరాయం కలగడంతో హోటల్స్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అధిక ధరలు చెల్లించి బ్లాక్లో సిలిండర్లు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో చిరు వ్యాపారులు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, పునుగు, బజ్జీ వ్యాపారాలు మూసి వేస్తున్నారు. మరికొందరు టిఫిన్స్, మీల్స్ ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. జిల్లాలో ఇండియన్, హెచ్పీ, భారత్, తదితర కంపెనీలకు చెందిన గ్యాస్ ఏజెన్సీలు 51 ఉన్నాయి.వీటి పరిధిలో సుమారు 7.35 లక్షల గృహ అవసరాల కనెక్షన్లు ఉన్నాయి. అమెరికా–ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో 14.20 కిలోల డొమెస్టిక్ సిలిండర్పై రూ. 60, కమర్షియల్కు సంబంధించిన 19 కిలోల సిలిండర్లపై రూ. 110 చొప్పున వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపిన విషయం విదితమే. బ్లాక్ మార్కెట్కు తరలింపు జిల్లాలో మొత్తం 7.35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఒక్కో కుటుంబం సగటున ఏడాదికి ఏడు సిలిండర్లు వినియోగిస్తుందని అంచనా. కాగా గ్రామీణ ప్రాంతాల్లో వంట వినియోగానికి కట్టెల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చిన్న కుటుంబాల్లో ఒక్కో సిలిండర్ మూడు నుంచి నాలుగు నెలలుపైగానే వస్తుంది. డెలివరీ బాయ్స్, ఏజెన్సీలు ఇలాంటి వారికి కొంత మొత్తం చెల్లించి వీటిని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ కష్టాలతో విద్యుత్తో పని చేసే ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్లకు డిమాండ్ పెరిగింది. గ్యాస్ అయిపోతే వంట కష్టమేనని వినియోగదారులు హోల్సేల్, రిటైల్ దుకాణాలకు క్యూ కడుతున్నారు. కొద్ది రోజులుగా రూ. రెండు వేల నుంచి రూ. మూడు వేల మధ్యలో లభించే ఆయా గృహాపకరణలకు డిమాండ్ పెరిగిందని హోమ్గూడ్స్ వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో గృహ, వాణిజ్య అవసరాల కోసం వంట గ్యాస్ కొరత లేకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. -
నృసింహుని హుండీ ఆదాయం లెక్కింపు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దిగువ, ఎగువ సన్నిధులతో పాటు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడులకు సంబంధించి హుండీ ఆదాయాలను బుధవారం ఆలయ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ మాట్లాడుతూ ఎగువ సన్నిధిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి రూ. 16,74,302, దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి రూ. 25,06,239, శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి రూ. 79,682, అన్నదానంకు రూ. 30,297 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని వైకుంఠపురం శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థాన సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి అనుపమ పర్యవేక్షించారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్ను బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్పాట్ వాల్యూయేషన్ జరుగుతున్న తీరు, తెన్నులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మూల్యాంకన విధుల్లో నిమగ్నమైన అధ్యాపకులకు ఇంటర్మీడియెట్బోర్డు నిర్దేశించిన వాల్యూయేషన్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని, వాల్యూయేషన్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని ఆయన సూచించారు. బుధవారం రెండో స్పెల్లో భాగంగా కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కామర్స్, సివిక్స్ సబ్జెక్టులకు ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు. మూల్యాంకన విధానంలో తీసుకువచ్చిన సంస్కరణలు, ప్రశ్నల కోడ్స్, ప్రశ్నపత్రం సరళి, మార్కుల వెయిటేజీ తదితర అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్ఐవో, స్పాట్ వాల్యూయేషన్ క్యాంపు అధికారి సునీత, సహాయ క్యాంపు అధికారులు, కోడింగ్ అధికారులు పాల్గొన్నారు. ముప్పాళ్ళ: మైనర్ బాలికపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక (13)ను యువకుడు(23) మాయమాటలు చెప్పి తరచూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా గమనించి తల్లిదండ్రులు ఇటీవల మందలించారు. బుధవారం బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లడాన్ని గమనించి మళ్లీ లైంగిక వేఽధింపులకు పాల్పడుతుండగా బాలిక సమీప బంధువులు యువకుడిని పట్టుకున్నారు. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు సమస్యల పరిష్కారం ముఖ్యం నరసరావుపేట రూరల్: నూతన సాంకేతిక పద్ధతులు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి తోడ్పాటును అందించేలా ఏరువాక కేంద్రం పనిచేయాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివన్నారాయణ తెలిపారు. మండలంలోని రావిపాడు ఏరువాక కేంద్రంలో జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ జి.శివన్నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖల సమన్వయం చేసుకుంటూ పంటలలో ఎదురయ్యే సమస్యలు, వాటి సమగ్ర నివారణ చర్యలు రూపొందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఏరువాక కేంద్రం కార్యక్రమాలను రైతు స్థాయిలో సమస్యలకు అనుగుణంగా నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు. -
మున్సిపల్ వేలంలో కుమ్మక్కు
నరసరావుపేట: పట్టణంలో కూరగాయల మార్కెట్, వీధుల్లో వ్యాపారులు, వాహనదారుల వద్ద నుంచి ప్రతిరోజూ పన్ను (అశీలు) సేకరించే కాంట్రాక్ట్ పనులను ఇది మీకు..అది నాకు అనే విధంగా టీడీపీ, జనసేన నాయకులు ఒకరినొకరు కుమ్మకై ్క చెరొకటి దక్కించుకున్నారు. ఈ వేలం పాటల్లో ఈ రెండు పార్టీలకు చెందిన వారు తప్పితే మరెవరూ పాల్గొనకపోవటం గమనార్హం. సుమారు 1.6 లక్షల మంది జనాభా నివాసం ఉండే 200 ఏళ్ల ప్రత్యేక గ్రేడ్ పురపాలక సంఘంలో 2026–27 ఏడాదికి సంబంధించి దినసరి కూరగాయల మార్కెట్ (హోల్సేల్ అండ్ రిటైల్), సండ్రి మార్కెట్, చేపలు, మాంసం మార్కెట్, కబేళా–1, కబేళా–2లకు వేలం పాటలు బుధవారం కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో నిర్వహించారు. ప్రతి ఏడాది కార్యాలయంలోనే బహిరంగ ప్రదేశంలో వేలం పాటలు నిర్వహించే ఆనవాయితీ ఉండగా ప్రస్తుతం కమిషనర్ చాంబర్లో తలుపులు వేసి నిర్వహించటం గమనార్హం. వేలంపాట జరుగుతుండగా రెండు పార్టీలకు చెందిన నాయకులు తమ మద్దతుదార్లతో కార్యాలయం బయట వేచి ఉన్నారు. దినసరి కూరగాయల మార్కెట్ను రామిశెట్టి అంజమ్మ్త రూ.23.60 లక్షలకు పాడుకోగా, రావెళ్ల సుబ్బమ్మ సండ్రీ మార్కెట్ పాటను రూ.22 లక్షలకు దక్కించుకున్నారు. ఫిజ్, మటన్ మార్కెట్ పాటను తాళ్లూరి దుర్గారాజు రూ.1.32 లక్షలకు పాడగా, కబేళా–1ను తాళ్లూరి దుర్గారాజు రూ.1లక్షకు పాడి దక్కించుకున్నారు. కబేళా–2ను వాయిదా వేశారు. పాటలను కమిషనర్ జి.రవికుమార్, ఆర్ఓ కె.శ్రీనివాసరావు, డీఇ మహమద్ రఫీక్, ఇతర అధికారులు నిర్వహించారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ఆర్డీఓగా బాలకృష్ణ బాధ్యతల స్వీకరణ
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా నియమితులైన బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన బదిలీల్లో భాగంగా ఆయన నందిగామ నుంచి నరసరావుపేటకు వచ్చారు. ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన కె.మధులతను రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు బదిలీ చేశారు. పలువురు ఉద్యోగులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. నరసరావుపేట డివిజన్ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని నూతన ఆర్డీఓ వెల్లడించారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక బృందావన్గార్డెన్న్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నయ్య కళావేదికపై పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మాగంటి మురళీమోహన్ ద్వితీయ నాటకోత్సవాలు, గుమ్మడి శ్రీమన్నారాయణ కళా సమితి, వైకే.నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ తొమ్మిదవ వార్షికోత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహాకులు కాట్రగడ్డ రామకృష్ణప్రసాద్, బొప్పన నరసింహారావు బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈనెల 28, 29, 30 తేదిల్లో నాటకోత్సవాలు కొనసాగుతాయని అన్నారు. 28న ఏపీ సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్మన్ తేజస్వినికి డాక్టర్ మురళీమోహన్ రంగస్థల పురస్కారం, మా ఇంట్లో మహాభారతం నాటిక ప్రదర్శిస్తారని తెలిపారు. 29న నువ్వో సగం, నేనో సగం నాటిక, 30న ఆర్యచాణక్య చారిత్రాత్మిక నాటకం ప్రదర్శించనున్నారని అన్నారు. -
భార్యాభర్తల మృతికి కారణమైన ఒకే స్కూటీ!
పల్నాడు జిల్లా: మండల కేంద్రమైన రెంటచింతల గ్రామ సమీపంలో నున్న మిట్టగుడిపాడు క్రాస్ బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని జెట్టిపాలెం గ్రామానికి చెందిన పల్లెర్ల జ్యోతి(35) గుంటూరులో చదువుతున్న తన కుమారుడు శ్రీనివాసరెడ్డిని రెంటచింతలలో గుంటూరు బస్సు ఎక్కించి అనంతరం స్థానిక బ్యాంక్లో తన ఖాతాకు సంబంధించిన పనిని ముగించుకుని జెట్టిపాలెంకు స్కూటీపై బయలు దేరింది. మిట్టగుడిపాడు క్రాస్ వద్ద బైపాస్ రోడ్డు దాటుతుండగా గురజాల నుంచి మాచర్ల వైపు అతివేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో స్కూటీ సుమారు 60 మీటర్లు దూరం ఎగిరి పడింది. ఈ ప్రమాదంతో తలకు, చేతులకు, కాళ్లకు తీవ్రగాయాలు కాగా పల్లెర్ల జ్యోతి అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో డ్రైవర్ ఎం.మల్లిఖార్జునరావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలానికి గురజాల ఇన్చార్జి డీఎస్పీ వెంకట రమణ, ఎస్ఐ సీహెచ్ నాగార్జున వెంటనే చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందో విచారించారు. మృతురాలి తల్లి చేర్రెడ్డి నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పంచనామ నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.భార్యాభర్తల మృతికి కారణమైన ఒకే స్కూటీ! మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పల్లెర్ల జ్యోతి నడిపిన స్కూటీ 5 సం. కిందట ఆమె భర్త పల్లెర్ల రామచంద్రారెడ్డి దివ్యాంగుడు కావడంతో మూడు చక్రాల స్కూటీ మీద పొలం వెళ్లి ఇంటికి వస్తున్న సమయంలో బోల్తాపడి తీవ్రంగా గాయపడ్డాడు. రామ చంద్రారెడ్డి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ స్కూటీకి ఉన్న మూడవ చక్రం తీసివేసి జ్యోతి ద్విచక్ర వాహనంగా వినియోగిస్తుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదంలో ఆమె మృతిచెందింది. వేర్వేరు ప్రమాదాలలో తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన రామచంద్రారెడ్డి, జ్యోతిల 14, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు అనాధలుగా మారారు. 2025 మార్చి 1 వ తేదిన జాతీయ అధికారులు, ట్రాన్స్పోర్టు అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ కూడలిని బ్లాక్స్పాట్గా గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంలో ఇక్కడే పలు రోడ్డు ప్రమాదాలు జరిగి కుటుంబాలు వీధులపాలైనట్లు స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానిక కోరుతున్నారు. -
షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలి
టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ జాని మౌలాలి నరసరావుపేట:పట్టణంలోని శ్రీరాంపురంలోని జామియా మసీదు పక్కన వక్ఫ్బోర్డు స్థలంలో మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్పై వక్ఫ్బోర్డు అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు టీడీపీ నేత రహమత్ ఆలీ సమాధానం చెప్పాలని మాజీ కౌన్సిలర్, టీడీపీ నాయకుడు, శ్రీరాంపురం జామియా మసీదు మేనేజ్మెంట్ కమిటీ సెక్రటరీ షేక్ జాని మౌలాలి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక వీడియా విడుదల చేశారు. రహమత్ ఆలీకి జామియా మసీదుతో ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇప్పటివరకు రూ.కోటి వసూలు చేసి 90 రసీదులు రాశారని, వాటిని తీసుకొని వస్తే వాటిపై చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. రహమత్ ఆలీకి షాపు లేకపోయినా 30వ నంబర్ షాపుకి విద్యుత్ మీటర్ కోసం దరఖాస్తు చేశాడని, షాపు లేకుండా ఏవిధంగా మీటర్ ఇచ్చారని ప్రశ్నించారు. చనిపోయిన వారి సంతకాలతో ఒక వినతిపత్రం రాసి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు ఇచ్చి అతడిని తప్పుదోవ పట్టించారన్నారు. డబ్బులు కట్టకపోతే పాతవారికి షాపులు లేవని ప్రకటనలు ఇవ్వటానికి వీరికేమి అధికారం లేదన్నారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్కు తమకు ఎటువంటి సంబంధం లేదని మున్సిపల్ అధికారులు ఆర్టీఐ చట్టం కింద తమకు సమాచారం ఇచ్చారన్నారు. గుంటూరురోడ్డులోని పెద్దమసీదు వద్దనున్న ఐదుగురి వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు, వరవకట్టలో ఒక మహిళ నుంచి రూ.7లక్షలు వసూలు చేశారన్నారు. దమ్ముంటే షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలి
చిలకలూరిపేట: పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ దశల వారీ పోరాటంలో భాగంగా యూటీఎఫ్ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం వద్ద రణభేరి పేరుతో ఒక రోజు నిరాహార దీక్ష మంగళవారం నిర్వహించారు. శిబిరాన్ని ఏపీ ఎన్జీవో సంఘం తాలూకా అధ్యక్షుడు బి. హనుమంతనాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 29శాతం ఐఆర్ను, డీఏలను ప్రకటించాలని కోరారు. హెల్త్ కార్డుల మెడికల్ బిల్ సమస్యలను పరిష్కరించాలన్నారు. 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తి అయిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని కోరారు. కోవిడ్ సమయంలో మరణించిన 953 మంది పంచాయతీరాజ్ ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్ష అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు టి. సుధాకరహరిప్రసాద్, వై. చిట్టిబాబు, డి. సుజాత, కె. అరుణ, షేక్ మొహమ్మద్ యాసిన్, ఐ. సునీత, వి. నాగేశ్వరరావు, టి. బాలరాజు, షేక్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి -
బడ్జెట్పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం
రాష్ట్ర కోఆర్డినేటర్ హేమలత నరసరావుపేట: సామాన్య ప్రజలు, దళిత, గిరిజన వర్గాలు బడ్జెట్ను తమకు సంబంధం లేని విషయంగా భావించడం ఆందోళనకరమని, వ్యక్తిగత సామాజిక అభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదల అన్నీ బడ్జెట్తోనే సంబంధం కలిగి ఉంటాయని దళిత గిరిజన బడ్జెట్ వాచ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం హేమలత పేర్కొన్నారు. మంగళవారం నాల్గవ తరగతి ఉద్యోగుల భవనంలో దళిత, గిరిజన బడ్జెట్ వాచ్ జిల్లా కన్వీనర్ మల్లెల చిన్నప్ప అధ్యక్షతన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్పై విశ్లేషణ నిర్వహించారు. హేమలత మాట్లాడుతూ బడ్జెట్ అనేది కేవలం మేధావులు, విద్యావేత్తలు చర్చించే అంశం కాకుండా ప్రతి మనిషి జీవితంతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన అంశమని అన్నారు. దళిత గిరిజన కోణంలో బడ్జెట్ అంటే ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాలు, రహదారులు, విద్యుత్, డ్రైనేజ్, పాఠశాలలు వంటి మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ఎంత కేటాయిస్తోంది, ఆ నిధులు ఎలా వినియోగం అవుతున్నాయనే విషయాలు ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో దళిత, గిరిజన వర్గాల అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. కేటాయింపులు పెరిగినట్లు చూపించినప్పటికీ, అనేక సందర్భాల్లో నిధుల వినియోగం సమర్థవంతంగా జరగడం లేదని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అడపా మోహన్, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాయక్, ఎస్ఎస్వీ సంస్థ ప్రతినిధి రవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో జేసీ, ఎమ్మెల్యే పర్యటన నరసరావుపేట: పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మంగళవారం పట్టణంలోని 5, 6, 7వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. అక్కడ నివసిస్తున్న సుమారు 360 ఇళ్ల ప్రజలకు పొజిషన్ పట్టాలు ఇచ్చే అంశంపై సర్వేయర్ తోట సుధాకర్, టీపీఓ సాంబయ్యలతో చర్చించారు. ఎస్ఆర్కేటీ కాలనీలో పర్యటించి 18వ లైన్ సమీపంలో నివసిస్తున్న నిరుపేదలకు పట్టాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పట్టాల సమస్యను పరిష్కరించి అర్హులైన వారందరికీ త్వరలోనే పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటామని జేసీ, ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తహసీల్దార్ వేణుగోపాలరావు, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రవి, రంగిశెట్టి రామకృష్ణ, తదితర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
తొమ్మిది మంది బైక్ రైడర్లపై కేసు నమోదు
నరసరావుపేట రూరల్: బైక్ రైడర్ల హల్చల్ అంటూ సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై రూరల్ పోలీసులు స్పందించారు. బైకులపై విన్యాసాలు చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్న తొమ్మిది మంది యువకులను మంగళవారం అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల ఆధారంగా పోలీసులు వీరిని గుర్తించారు. యువకులు పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందినవారు. వారి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించిన సీఐ ఎంవీ.సుబ్బారావు, ఎస్ఐలు కిషోర్, శ్రీకాంత్ కౌన్సెలింగ్ నిర్వహించారు. యువకులను బైక్ రేసింగ్లకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. మితిమీరిన వేగంతో చేసే విన్యాసాల కారణంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుందని తెలి పారు. దీనిపై రూరల్ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ బైక్ రేసింగ్లో కీలకంగా వ్యవహరించిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే విధంగా రవాణా శాఖ అధికారులకు సిఫార్సు చేసినట్లు వివరించారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు దరఖాస్తు చేసుకోండి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి నరసరావుపేటఈస్ట్: క్రీడలను ప్రోత్సహించి ఉత్తమ క్రీడాకారులగా తీర్చిదిద్దేందుకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న క్రీడా అసోసియేషన్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, సీనియర్ క్రీడాకారులు ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసు కోవాలని కోరారు. పల్నాడు జిల్లా పరిధిలో 50 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి శిబిరంలో 25 మంది బాలురు, 25 మంది బాలికలకు వివిధ క్రీడాంశాలలో శిక్షణ ఇస్తామన్నారు. శాప్ ఆదేశాల మేరకు 2026–27 సంవత్సరానికి మే 1 నుంచి 31వ తేదీ వరకు 8 నుంచి 14 సంవత్సరాల వయస్సు ఉన్న బాలబాలికలు శిబిరంలో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. శిక్షణ శిబిరం ఏర్పాటుకు బాస్కెట్బాల్ సీహెచ్.శ్రీనివాసరావు 8143475010, రెజ్లింగ్ కె.మనోహర్ 8309426350, అథ్లెటిక్స్ ఎం.సైదారావు 8019219224లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 8712622574 నెంబర్లో సంప్రదించాలని కోరారు. జిల్లా స్థాయి శాప్ లీగ్ అథ్లెటిక్స్ టీం ఎంపిక నరసరావుపేటఈస్ట్:సత్తెనపల్లి రోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్, చెస్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి జిల్లా జట్టు ఎంపిక చేశారు. ఆయా పోటీలలో 60 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. పోటీలలో 35 నుంచి 45 సంవత్సరాల వయస్సుగల మహిళలు, పురుషులు (మాస్టర్స్) పాల్గొన్నారు. పరుగుపందెం, లాంగ్జంప్, షాట్పుట్, డిస్కస్త్రో, హైజంప్, జావలిన్, రిలే పరుగు పందేలు నిర్వహించా రు. పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 30, 31తేదీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి మైనర్ నిందితుడిపై పోక్సో కేసు నాదెండ్ల: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై నాదెండ్ల పోలీసులు మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. ట్రైనీ ఐపీఎస్, ఇన్చార్జి ఎస్సై జె నిరంజన్ ధర్మేంద్ర సిన్హా తెలిపిన వివరాల మేరకు పదహారేళ్ల బాలికతో పదిహేడేళ్ల మైనర్బాలుడు పరిచయం పెంచుకున్నాడు. ఆ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఘనంగా ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వితీయ వార్షికోత్సవం చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని దివ్యశాంతి నిలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ ఫెలో షిప్ – పల్నాడు జిల్లా 2వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పాస్టర్స్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్– పల్నాడు జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా అధ్యక్షులు బిషప్ నందమూరి క్రిస్టర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. పాస్టర్స్, చర్చిలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. క్రైస్తవ సమాజానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చా రు. క్రైస్తవుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా పనిచేస్తామని అన్నారు. అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా, ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జుహాని హలోనేన్పాల్గొని దేవుని వాక్య సందేశం అందించారు. -
చట్టప్రకారం పోరాటం చేద్దాం..
మాచర్ల: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క వైఎస్సార్సీపీ నాయకుడు, కార్యకర్తల పై ఏదో విధంగా అక్రమ కేసులు పెడుతున్నారని, దీనిని దీటుగా ఎదుర్కొని పార్టీ క్యాడర్ను కాపాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, నాతో పాటు మీ అభిమాన యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్లు అండగా నిలబడతామని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువు, మల్లపాలెం తిరునాళ్లలో పీఆర్కే, యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్లకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఆర్కే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుందని, అయినా హామీలు అమలుపర్చకుండా రెడ్బుక్ రాజ్యాంగమంటూ అక్రమ కేసులు పెట్టి అందరినీ వేధిస్తున్నారన్నారు. ఇందుకు మూల్యం చెల్లించాల్సిన పరిస్ధితి వస్తుందన్నారు. రెండేళ్లు ఓపిక పట్టండి మేమంతా అండగా ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మేము కాపాడుకుంటాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. రాబోయే రోజుల్లో అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం, డిజిటల్ బుక్లో మీరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని ఎక్కించండి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా చూస్తాం. చట్టపరమైన పోరాటాన్ని చేసి ప్రతి ఒక్కరి హక్కు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామంలో వచ్చినప్పటి నుంచి వీడ్కోలు పలికే వరకు చంద్రశేఖర్, పీఆర్కేకు జేజేలు పలుకుతూ తిరునాళ్ళ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా వారు స్వామి వార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వీరి వెంట యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ నాయకులు, పుల్లలచెరువు మండలం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. -
ఆ విమర్శలకు బీజేపీతో సంబంధం లేదు...
నరసరావుపేట: అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ వర్గీయుల మధ్య ఆదిపత్య పోరు, పదవుల పోరాటం, అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయి. ఈ మూడు పార్టీల్లోని నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కంటే స్వప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ ఒకరిపై ఒకరు పోరాడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మూడు పార్టీల ప్రతినిధిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు గెలుపొందారు. ఎన్నికల సమయంలోనే టీడీపీ ఎంపీగా పోటీచేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట ఎమ్మెల్యేగా డాక్టర్ అరవిందబాబుకు టికెట్ ఇచ్చేందుకు తన విముఖుత వ్యక్తం చేశారనే ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల అనంతరం కూడా వారిద్దరి మధ్య పొరపొచ్చాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రజా సమస్యల పరిష్కారంలో రెండు పార్టీలు విఫలమయ్యాయి. రెండేళ్ల నుంచి నియోజకవర్గం నుంచి కొనసాగే నకరికల్లు–చీరాల ఓడరేవు బైపాస్ రోడ్డు నిర్మాణం పనులు మొదలు పెట్టించలేకపోయారు. పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా మారింది. పురపాలక సంఘంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏరులై పారుతుంది. ఈ ప్రభుత్వంలో అధికారుల లంచాలు తీసుకోవడం తప్పితే తమకు కూటమి ప్రభుత్వంలో ఒరిగిందేమిలేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ పూర్తిగా వెనుతిరిగి నడుస్తుంది. ఇక జేపీలో అంతర్గత కుమ్ములాట నడుస్తుంది. గత ఎన్నికల నాటికి నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన రంగిశెట్టి రామకృష్ణ, ప్రస్తుత అధ్యక్షులు ఏలూరి శశికుమార్ వర్గీయుల మధ్య నిప్పులేకుండానే పొగ వస్తుంది. ఇటీవల రామకృష్ణ కాపు కుల సంఘ సమావేశంలో తన కులస్తులపైనే కొన్ని విమర్శలు చేయటం, ఆ విమర్శలతో బీజేపీకి ఏమీ సంబంధం లేదని, అతని వ్యక్తిగతమంటూ బీజేపీ నాయకులు ప్రెస్మీట్ పెట్టి చెప్పటం గమనించాల్సిన అంశం. దీనిపై రామకృష్ణ వర్గీయులు జిల్లా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకొని వాట్స్ప్లలో వ్యతిరేక ప్రచారం చేయటంతో ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాట తేటతెల్లమౌతుంది. -
బాభౌయ్
● పిక్కలు పీకేస్తున్న వీధి కుక్కలు ● మున్సిపాలిటీ పరిధిలో ప్రజల బెంబేలు ● నామమాత్రపు చర్యలకే అధికారులు పరిమితం చిలకలూరిపేట టౌన్: మున్సిపాలిటీల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోంది. గుంపులు గుంపులుగా చేరి, రోడ్లపై స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పట్టణంలో ఏ వార్డులో చూసినా గ్రామ సింహాల గుంపులే దర్శనమిస్తున్నాయి. రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు బయటకు రావాలంటేనే వణుకుతున్నారు. బైక్లపై వెళ్లే వారి వెంటపడుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. కుక్కకాటు బారిన పడుతున్న బాధితుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. తాజాగా మంగళవారం సుగాలి కాలనీకి చెందిన ప్రవీణ్ ముఖంపై దాడి చేయగా, తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 138 మంది, మార్చిలో ఇప్పటి వరకు 95 మంది ఈ శునకాల బారిన పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమావేశాల్లో ఏకరువు పెట్టినా... ఈ సమస్యపై వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో పలుమార్లు ఏకరువు పెట్టారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో అధికారులు కుక్కలను పట్టించి, జంతు జనన నియంత్రణ శస్త్రచికిత్సలు, రేబీస్ వ్యాక్సిన్లు వేయించి, మళ్లీ అదే ప్రాంతాల్లో వదిలిపెట్టారు. ఇందుకోసం ఒక్కొక్క కుక్కకు రూ.1,500 వరకు ఖర్చు చేశారు. ఫలితం మాత్రం శూన్యంగా మారింది. సుప్రీంకోర్టు ఆగ్రహించినా... వీధి కుక్కల బెడద విషయంలో రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పాలకులు మాత్రం ఈ సమస్యను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారు. సమస్యను తాత్కాలికంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కుక్కల దాడిలో గాయపడిన ఓ మహిళ (ఫైల్), మంగళవారం గాయపడిన ప్రవీణ్ ప్రధానంగా కూరగాయల మార్కెట్, మటన్, చికెన్ మార్కెట్ల సమీపంలోనే కుక్కల బెడద మరింత ఎక్కువగా ఉంది. కవర్లలో ఆహార పదార్థాలు తీసుకువెళ్లే వారిపై కుక్కలు దాడి చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజలను కాపాడాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
నియోజకవర్గాల పునర్విభజనపై ప్రజల్లో చర్చలు.. నేతల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు ఉత్సాహంగా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూపురేఖలు పూర్తిగా మారేలా అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయని విశ్లేషకులు అభిప్
సాక్షి, నరసరావుపేట: దేశంలో లోక్సభతోపాటు శాసనసభ స్థానాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలోనే ఈ బిల్లును ఆమోదించేలా అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో నేతలు ‘కొత్త’ లెక్కలేసుకుంటున్నారు. జిల్లాలో కొత్తగా ఎన్ని సీట్లు పెరగనున్నాయి, ఏ మండలాలతో ఏర్పడితే రాజకీయంగా తమకు అనుకూలమనే ఆలోచనలో వారు ఉన్నారు. సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు తమ సొంత మండలం కొత్తగా ఏర్పడే వేరే నియోజకవర్గంలోకి వెళితే ఏం చేయాలన్న ఆలోచనలు మొదలుపెట్టారు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా పునర్విభజన ద్వారా ఏకంగా 50 శాతం స్థానాల సంఖ్య పెరుగుతాయన్న వార్తలతో ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టసభలకు వెళ్లాలనుకునే వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగడం, మహిళా రిజర్వేషన్ అమలులోకి రానుండటంతో కొత్తవారికి చట్టసభలకు వెళ్లే అవకాశాలు పెరగనున్నాయి. 2008లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో కొంతమేర మార్పుచేర్పులు జరగగా... తాజా పునర్విభజనతో సమూల మార్పులు రానున్నాయని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కేవలం అసెంబ్లీ స్థానాలు మాత్రమే మార్పు జరగగా... ఈసారి లోక్సభ స్థానాలలో సైతం పునర్విభజన జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఏడు చొప్పున, బాపట్ల జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. తాజా పునర్విభజన తరువాత ఉమ్మడి జిల్లాలో కొత్తగా 8 నుంచి 9 స్థానాలు పెరిగే అవకాశముంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 25గానీ, 26గానీ కానుంది. గతంలో అసెంబ్లీ స్థానాలుగా ఉండి రద్దు అయిన ఫిరంగిపురం, పెదకాకాని, దుగ్గిరాలలతోపాటు గుంటూరు రూరల్, నగరం, రొంపిచర్ల, పిడుగురాళ్ల, కారంపూడి, అమరావతి వంటి కొత్త అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ స్థానాలు కొత్తగా మరో 9 పెరగనున్న నేపథ్యంలో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మరోవైపు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు నియోజకవర్గాలు ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు కాగా... ఈ సంఖ్య పునర్విభజన తరువాత పెరగనుంది. ప్రస్తుతం గుంటూరు ఈస్ట్, వెస్ట్తోపాటు తెనాలి, నరసరావుపేట వంటి అర్బన్ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశముంది. 9 శాసనసభ, 2 లోక్సభ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే అవకాశం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుతో అతివలకు మరింత అందలం ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు మహిళలకు కేటాయింపు ఏ ప్రాంతం ఏ నియోజకవర్గంలోనో.. అభ్యర్థి ఎవరో.. అంటూ ప్రజల్లో చర్చ భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్న రాజకీయ నేతలు -
ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన భక్తులు మంగళవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. తెనాలి చెంచుపేటకు చెందిన మాదాల నాగరాజా కుమారి, భానుప్రసాద్లు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. పిడుగురాళ్ల: పట్టణంలోని నాగుల గుడిలో షష్టి సందర్భంగా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పల్లకి ఉత్సవం, కావడి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేపల్లె: పట్టణంలోని ఓల్డ్ టౌన్లో వేంచేసియున్న గ్రామదేవత బూరగలమ్మ వారికి పుష్కర మహా కుంభాభిషేక మహోత్సవాలు మంగళవారంతో రెండవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అమ్మవారికి వేకువ జాము నుంచే ఆలయ అర్చకులు నందివెలుగు భానుసుధాకర్ గురుకులు, బాలాజీ గురుకులు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పట్టు, రజత వస్త్రాలంకరణ చేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో నిత్య హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మ వారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
రూ.9 లక్షలు వెచ్చించాం
ఇటీవల పట్టణంలోని 670 శునకాలను పట్టించి ఒంగోలులోని స్నేహ యానిమల్ కేర్ ఏజెన్సీకి పంపించి కు.ని. శస్త్రచికిత్సలు చేయించాం. ఇందుకు రూ.9 లక్షలు వ్యయం కాగా, సదరు ఏజెన్సీకి రూ.8 లక్షలు చెల్లించాం. మరో రూ.లక్ష బకాయి ఉన్నాం. అయితే తాజాగా ప్రత్యేక వ్యక్తులకు వీటిపై శిక్షణ ఇప్పించి ఆపరేషన్లు చేయించాలనే నిర్ణయానికి వచ్చాం. అలాగే వీధి కుక్కల పోషణ జాగ్రత్తలపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోబోతున్నాం. – పి. శ్రీహరిబాబు, మున్సిపల్ కమిషనర్, చిలకలూరిపేట -
గ్యాస్ కోసం రోడ్డెక్కిన వినియోగదారులు
ఖాళీ సిలిండర్లతో అద్దంకి–నార్కట్పల్లి రాష్ట్ర రహదారిపై నిరనస నకరికల్లు: గ్యాస్ కోసం వినియోగదారులు రోడ్డెక్కారు. ఖాళీ సిలిండర్లతో స్థానిక అద్దంకి–నార్కట్పల్లి రాష్ట్ర రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసన చేస్తున్న వారితో మాట్లాడి సర్దిచెప్పి పంపారు. ఈ ఘటన స్థానిక రాష్ట్ర రహదారిపై వైజంక్షన్ వద్ద సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజన్సీలో మండలంలోని పలుగ్రామాలకు చెందిన వినియోగదారులు ఉన్నారు. కాగా గత వారంరోజులుగా గ్యాస్ బుకింగ్ చేసినవారికి ఓటీపీ రావడం లేదు. అలాగే సిలిండర్ల పంపిణీ జరగడం లేదు. దీంతో సమీప గ్రామాల నుంచి ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు స్థానిక గోడౌన్ వద్దకు చేరుకున్నారు. నోస్టాక్ బోర్డు ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ సమస్యను పరిష్కరించాలని, గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభించాలని స్థానిక రాష్ట్ర రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్ఐ కె.సతీష్ ఆందోళన వ్యక్తం చేస్తున్న వారితో మాట్లాడారు. దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న సమస్య కాబట్టి త్వరలో పరిష్కారమవుతుందని సర్దిచెప్పారు. ఆందోళన చేసి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించవద్దని హితవు పలికారు. దీంతో శాంతించిన వినియోగదారులు ఆందోళన విరమించారు. నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్, రెవెన్యూ క్లినిక్లో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 109 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా నరసరావుపేట డివిజన్కు చెందిన 22, సత్తెనపల్లి డివిజన్ ఆరు, గురజాల డివిజన్లకు చెందిన మూడు అర్జీలు స్వీకరించారు. అర్జీలను నాణ్యతగా, సకాలంలో పెండింగ్లేకుండా పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో గ్రీవెన్స్పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి నారదముని, డీఆర్డీఏ పీజీ ఝాన్సీరాణి, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.పీజీఆర్ఎస్లో 109 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ -
వీఆర్ఏల డిమాండ్ల పరిష్కారానికి దశలవారీ పోరాటం
సత్తెనపల్లి: వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి దశల వారీ పోరాటం తప్పదని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ అన్నారు. దీనిలో భాగంగా సోమవారం సత్తెనపల్లి ఇన్చార్జ్ ఆర్డీవో కె.శ్రీరాములును కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం బందగీసాహెబ్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. వీఆర్ఏలకు పే స్కేలు, జీతాలు అమలు చేయాలన్నారు. వీఆర్వో, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచ్మన్ పోస్టులను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్నారు. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలన్నారు. వీఆర్ఏలకు అక్రమ డ్యూటీలను రద్దు చేయాలన్నారు. ఈ నెల 26న జరగనున్న రిలే నిరాహార దీక్షకు జిల్లాలో ఉన్న అన్ని మండలాల వీఆర్ఏలు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. అన్ని మండలాల నాయకులు మీ మండలంలో ఉన్న వీఆర్ఏల అందరూ తప్పనిసరిగా పాల్గొనే విధంగా కృషి చేయాలన్నారు. ప్రమోషన్, నామిని వీఆర్ఏలు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నాలన్నారు. ఆర్డీవో శ్రీరాములు సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం సత్తెనపల్లి మండల అధ్యక్షుడు రవి, మండల ప్రధాన కార్యదర్శి మునాఫ్, ఉన్నారు. -
పిన్నెల్లిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాసు
గురజాల : అక్రమ కేసులో అరెస్టయి బెయిల్పై విడుదల అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పరామర్శించారు. మాచర్లలోని పిన్నెల్లి నివాసంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పిన్నెల్లిని పరామర్శించారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి , పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్రెడ్డి, మాచర్ల నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవి), గురజాల నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, కొప్పుల సాంబయ్య, పిడుగురాళ్ల టౌన్ అధ్యక్షుడు మాదాల కిరఃణ్ కుమార్, మండల అధ్యక్షుడు చింతా సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పీఆర్కేను కలిసిన గౌతమ్రెడ్డి మాచర్ల: టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆక్రమంగా హత్య కేసు బనాయించింది. ఈ కేసులో 99 రోజులపాటు జైలులో ఉండి బెయిల్పై విడుదలైన పీఆర్కే ను సోమవారం వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు పూనూరు గౌతమ్రెడ్డి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా అక్రమ కేసుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులు నిలబడవన్నారు. ఈ సందర్భంగా పీఆర్కేను ఘనంగా సత్కరించారు. ఈయన వెంట గురజాల నియోజకవర్గ పరిశీలకులు శివారెడ్డి, నాయకులు, తదితరులు ఉన్నారు. పీఆర్కేను కలిసిన డాక్టర్ గజ్జల..సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) అక్రమ కేసులో బెయిల్ పై విడుదలై వచ్చిన సందర్భంగా ఆయనను కలిసేందుకు వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి సోమవారం భారీ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మాచర్ల తరలి వెళ్లారు. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని సత్తెనపల్లి పట్టణం, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. -
వైకుంఠపురం ఆలయంలో హుండీ కానుకలు లెక్కింపు
తెనాలిటౌన్: వైకుంఠపురం లోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ కానుకలు సోమవారం లెక్కించారు. రూ.51 లక్షల నగదు, 61 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 745 గ్రాముల వెండి వచ్చింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ మాట్లాడుతూ 93 రోజులకు హుండీ కానుకలు లెక్కించగా ఈ ఆదాయం వచ్చినట్లు చెప్పారు. 75 మంది వలంటీర్లు, బ్యాంకు సిబ్బంది దేవస్థాన సిబ్బందితో లెక్కింపు చేపట్టినట్లు వివరించారు. పర్యవేక్షణాధికారిగా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సైదామాబి వ్యవహరించినట్లు తెలిపారు. శావల్యాపురం: పల్నాడు జిల్లా శావల్యాపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్యూబీ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజనల్ ఇంజనీరు (డీఈ) డి.శరత్ తెలిపారు. రైల్వే స్టేషను పరిధిలో జరుగుతున్న పనులను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఉన్నతాధికారుల అదేశాలకనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పది రోజుల వ్యవధిలోని పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. పనుల్లో భాగంగా రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఆయనతో పాటు రైల్వే అధికారులు, మతుకుమల్లి గ్రామ మాజీ సర్పంచ్ ముండ్రు హనుమంతరావు ఉన్నారు. తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో ఫెమ్ప్లేర్ 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం కార్నివాల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెమ్ప్లేర్–2026 చైర్ పర్సన్ డాక్టర్ కె. రూతురమ్య మాట్లాడుతూ అతిపెద్ద మహిళా వేడుక అని పేర్కొన్నారు. బాలికలే స్వయంగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ మహిళా సమ్మేళనాన్ని నిర్వహిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆయా కళాశాలల నుంచి విద్యార్థినులు హాజరు కానున్నారని తెలిపారు. మాచర్ల: చేతికందివచ్చిన పంటలను తొక్కిస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్న పైపులైను కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొత్తపల్లి, బైరవునిపాడు, పాలపల్లి గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎన్సీసీ కంపెనీ నిర్మించే నీటి పైపుల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భూమిలో పైపులైను ఏర్పాటు సమయంలో ముందుగా రైతులకు సమాచారం ఇవ్వకుండా మిర్చి పంటలను నాశనం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ముందుగా రైతులకు సమాచారం ఇచ్చి పంట పరిశీలించి వారి అనుమతితో పనులు చేపట్టాల్సి ఉండగా, కొత్తపల్లి గ్రామ శివారులో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏపుగా పెరిగిన మిర్చి పంటలను సైతం పీకి వేసి, పైపు పనులు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామానికి చెందిన రైతు ఓరుగంటి జయప్రకాష్రెడ్డి, మరికొందరు రైతులకు సమాచారం ఇవ్వకుండా మిర్చిపంటలను యంత్రాలతో పెద్ద పెద్ద గుంతలు తీసి, పైపులైనులు ఏర్పాటు చేయడంతో పంట అంతా నష్టపోయినట్లు వాపోయారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో మరింత నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి, మున్ముందు రైతులకు నష్టం జరుగకుండా చూడాలని కోరారు. -
అది డాబు క్యాలెండర్
విద్యార్థి, యువజన విభాగం నాయకులు నరసరావుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్లు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులు అందరికీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లుగా గ్లోబెల్ ప్రచారం చేస్తూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారని వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగ నాయకులు పేర్కొన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యువజన విభాగ జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్ మాట్లాడుతూ కేవలం 10,400 ఉద్యోగాలకు క్యాలెండర్ విడుదల చేయటం ద్వారా నిరుద్యోగుల సమస్యలు తీరవన్నారు. ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని, అసెంబ్లీ సమావేశాల్లో రెండేళ్లలో 6.20లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పారని, రెండేళ్లకు రూ.72వేలు చొప్పున, రూ.21,600 కోట్లు బాకీ పడ్డారని, వాటిని వెంటనే నిరుద్యోగులకు అందజేయాలని డిమాండ్ చేశారు. -
పీజీఆర్ఎస్ అర్జీలను వేగంగా పరిష్కరించాలి
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ సంతోష్ ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతోపాటు పలు మోసాలు, బెదిరింపులు, ఆక్రమణలకు సంబంధించిన 54 ఫిర్యాదులు కార్యక్రమంలో అందాయి. ఇందులో అధికంగా భార్యభర్తల వివాదాలపై 11, భూ వివాదాలపై 9, ఆర్థిక వివాదాలపై ఏడు ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి చట్టప్రకారం న్యాయం చేయాలని అధికారులను అదనపు ఎస్పీ ఆదేశించారు. -
బైక్ రైడర్ల హల్చల్
పల్నాడుమంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026నరసరావుపేటలో తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,800, గరిష్ట ధర రూ.9,400, మోడల్ ధర రూ.8,500 వరకు పలికింది.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 535.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 27,276 క్యూసెక్కు లు వచ్చి చేరుతోంది.సత్తెనపల్లి: వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి దశల వారీ పోరాటం తప్పదని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ అన్నారు. దీనిలో భాగంగా సోమవారం సత్తెనపల్లి ఇన్చార్జ్ ఆర్డీవో కె.శ్రీరాములును కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం బందగీసాహెబ్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుందన్నారు. వీఆర్ఏలకు పే స్కేలు, జీతాలు అమలు చేయాలన్నారు. వీఆర్వో, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచ్మన్ పోస్టులను వన్ టైం సెటిల్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్నారు. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలన్నారు. వీఆర్ఏలకు అక్రమ డ్యూటీలను రద్దు చేయాలన్నారు. ఈ నెల 26న జరగనున్న రిలే నిరాహార దీక్షకు జిల్లాలో ఉన్న అన్ని మండలాల వీఆర్ఏలు అందరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. అన్ని మండలాల నాయకులు మీ మండలంలో ఉన్న వీఆర్ఏల అందరూ తప్పనిసరిగా పాల్గొనే విధంగా కృషి చేయాలన్నారు. ప్రమోషన్, నామిని వీఆర్ఏలు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నాలన్నారు. ఆర్డీవో శ్రీరాములు సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం సత్తెనపల్లి మండల అధ్యక్షుడు రవి, మండల ప్రధాన కార్యదర్శి మునాఫ్, ఉన్నారు. సత్తెనపల్లి ఇన్చార్జి ఆర్డీవో శ్రీరాములకు వినతి పత్రం అందిస్తున్న బందగీసాహెబ్, నాయకులు7నరసరావుపేట రూరల్: ౖబెక్లపై ప్రమాదకర స్టంట్లు చేస్తూ రైడర్స్ నరసరావుపేట పట్టణంలో హల్చల్ చేస్తున్నారు. ప్రధాన రోడ్లులో అర్ధరాత్రి యువకుల చేస్తున్న విన్యాసాలతో వాహనదారులు భయబ్రాంతులకు గురవుతున్నారు. బైక్ స్టంట్స్ను యువత సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం అవి వైరల్ మారాయి. దీంతో పోలీసులు చర్యలు ప్రారంబించారు. బైక్ స్టంట్స్లో పాల్గొన్న యువతను గుర్తించే పనిలో ఉన్నారు. -
మిర్చి పంటను నష్టపరుస్తున్న కాంట్రాక్టర్లు
మిర్చి తోటలను పీకివేస్తున్నారంటూ రైతుల ఆందోళన మాచర్ల: చేతికందివచ్చిన పంటలను తొక్కిస్తూ తీవ్రంగా నష్టపరుస్తున్న పైపులైను కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కొత్తపల్లి, బైరవునిపాడు, పాలపల్లి గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎన్సీసీ కంపెనీ నిర్మించే నీటి పైపుల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భూమిలో పైపులైను ఏర్పాటు సమయంలో ముందుగా రైతులకు సమాచారం ఇవ్వకుండా మిర్చి పంటలను నాశనం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ముందుగా రైతులకు సమాచారం ఇచ్చి పంట పరిశీలించి వారి అనుమతితో పనులు చేపట్టాల్సి ఉండగా, కొత్తపల్లి గ్రామ శివారులో రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏపుగా పెరిగిన మిర్చి పంటలను సైతం పీకి వేసి, పైపు పనులు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రామానికి చెందిన రైతు ఓరుగంటి జయప్రకాష్రెడ్డి, మరికొందరు రైతులకు సమాచారం ఇవ్వకుండా మిర్చిపంటలను యంత్రాలతో పెద్ద పెద్ద గుంతలు తీసి, పైపులైనులు ఏర్పాటు చేయడంతో పంట అంతా నష్టపోయినట్లు వాపోయారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో మరింత నష్టపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి, మున్ముందు రైతులకు నష్టం జరుగకుండా చూడాలని కోరారు. -
వైకుంఠపురం ఆలయంలో హుండీ కానుకలు లెక్కింపు
తెనాలిటౌన్: వైకుంఠపురం లోని శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీ కానుకలు సోమవారం లెక్కించారు. రూ.51 లక్షల నగదు, 61 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారం, 745 గ్రాముల వెండి వచ్చింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ మాట్లాడుతూ 93 రోజులకు హుండీ కానుకలు లెక్కించగా ఈ ఆదాయం వచ్చినట్లు చెప్పారు. 75 మంది వలంటీర్లు, బ్యాంకు సిబ్బంది దేవస్థాన సిబ్బందితో లెక్కింపు చేపట్టినట్లు వివరించారు. పర్యవేక్షణాధికారిగా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సైదామాబి వ్యవహరించినట్లు తెలిపారు. శావల్యాపురం: పల్నాడు జిల్లా శావల్యాపురంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్యూబీ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు గుంటూరు రైల్వే డివిజనల్ ఇంజనీరు (డీఈ) డి.శరత్ తెలిపారు. రైల్వే స్టేషను పరిధిలో జరుగుతున్న పనులను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఉన్నతాధికారుల అదేశాలకనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పది రోజుల వ్యవధిలోని పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. పనుల్లో భాగంగా రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఆయనతో పాటు రైల్వే అధికారులు, మతుకుమల్లి గ్రామ మాజీ సర్పంచ్ ముండ్రు హనుమంతరావు ఉన్నారు. తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో ఫెమ్ప్లేర్ 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం కార్నివాల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెమ్ప్లేర్–2026 చైర్ పర్సన్ డాక్టర్ కె. రూతురమ్య మాట్లాడుతూ అతిపెద్ద మహిళా వేడుక అని పేర్కొన్నారు. బాలికలే స్వయంగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ మహిళా సమ్మేళనాన్ని నిర్వహిస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆయా కళాశాలల నుంచి విద్యార్థినులు హాజరు కానున్నారని తెలిపారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 34.6755 టీఎంసీలు. -
అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పనిచేయాలి
పీజీఆర్ఎస్లో 109 అర్జీలు స్వీకరించిన కలెక్టర్నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్, రెవెన్యూ క్లినిక్లో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి 109 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా నరసరావుపేట డివిజన్కు చెందిన 22, సత్తెనపల్లి డివిజన్ ఆరు, గురజాల డివిజన్లకు చెందిన మూడు అర్జీలు స్వీకరించారు. అర్జీలను నాణ్యతగా, సకాలంలో పెండింగ్లేకుండా పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో గ్రీవెన్స్పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి నారదముని, డీఆర్డీఏ పీజీ ఝాన్సీరాణి, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గ్యాస్ కోసం రోడ్డెక్కిన వినియోగదారులు
నకరికల్లు: గ్యాస్ కోసం వినియోగదారులు రోడ్డెక్కారు. ఖాళీ సిలిండర్లతో స్థానిక అద్దంకి–నార్కట్పల్లి రాష్ట్ర రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసన చేస్తున్న వారితో మాట్లాడి సర్దిచెప్పి పంపారు. ఈ ఘటన స్థానిక రాష్ట్ర రహదారిపై వైజంక్షన్ వద్ద సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజన్సీలో మండలంలోని పలుగ్రామాలకు చెందిన వినియోగదారులు ఉన్నారు. కాగా గత వారంరోజులుగా గ్యాస్ బుకింగ్ చేసినవారికి ఓటీపీ రావడం లేదు. అలాగే సిలిండర్ల పంపిణీ జరగడం లేదు. దీంతో సమీప గ్రామాల నుంచి ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు స్థానిక గోడౌన్ వద్దకు చేరుకున్నారు. నోస్టాక్ బోర్డు ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ సమస్యను పరిష్కరించాలని, గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభించాలని స్థానిక రాష్ట్ర రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్ఐ కె.సతీష్ ఆందోళన వ్యక్తం చేస్తున్న వారితో మాట్లాడారు. దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న సమస్య కాబట్టి త్వరలో పరిష్కారమవుతుందని సర్దిచెప్పారు. ఆందోళన చేసి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించవద్దని హితవు పలికారు. దీంతో శాంతించిన వినియోగదారులు ఆందోళన విరమించారు. ఖాళీ సిలిండర్లతో అద్దంకి– నార్కట్పల్లి రాష్ట్ర రహదారిపై నిరనస -
గరికపాటి వ్యాఖ్యలు దురదృష్టకరం
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతాహసంతి సత్తెనపల్లి: నిరుపేదల పిల్లలు పాఠశాలలో తినే మధ్యాహ్నభోజనంపై సాహితీవేత్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతాహసంతి అన్నారు. ఈ సందర్బంగా ఒక వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు గత ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద, ప్రస్తుత ప్రభుత్వంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో పౌష్టికాహరం అందించటం జరుగుతుందన్నారు. పసి పిల్లలు, పేద వారు తినే అన్నంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరమన్నారు. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, ఆలోచించాలని, పెద్దలు, సాహితీవేత్తలు మీరు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయన్నారు. రెంటచింతల: మతిస్థిమితంలేని మైనర్బాలికపై ఓ యువకుడు లైంగికదాడి యత్నానికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. మానసిక వికలాంగురాలైన బాలిక బహిర్భూమికి వెళ్లడాన్ని గమనించి సతీష్ అనే యువకుడు లైంగికదాడియత్నానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు గమనించి రావడంతో యువకుడు పరారయ్యాడని బాలిక తల్లి పోలీసులకు ఆదివారం ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. గురజాల డీఎస్పీ వెంకటరమణ స్థానిక పోలీసు స్టేషన్ను సందర్శించి ఘటన వివరాలను తెలుసుకున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్ :ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి దాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కోర్డు వద్ద ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో పెదనందిపాడు మండలం గోగులమూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిపాటి దాస్ను ఎన్నుకున్నారు. 11 ఏళ్లుగా సంఘ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కె.బసవ లింగారావు ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి స్థానాన్ని భర్తీ చేశారు. తెనాలిటౌన్: మా–ఏపీ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన వివిధ రంగాల్లోని ప్రముఖులు ఎనిమిది మందికి అష్టదిగ్గజాల పేరిట ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్రాజా వెల్లడించారు. తెనాలిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, 24 విభాగాల యూనియనన్్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక ఆలపాటి నగర్లోని రత్న ఫార్చూన్ కల్యాణ మండపంలో ఈ వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఈ వేడుకలకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరవుతారు. తమ సంస్థ అష్టదిగ్గజాలుగా ఎంపిక చేసిన ప్రముఖుల్లో రాష్ట్రంలో ప్రమాదాల నివారణలో 2025 సంవత్సరానికి ప్రథమ స్థానం పొందిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, కుష్టు, ఎయిడ్స్ పీడితులకు సాయం చేస్తున్న హార్వెస్ట్ ఆఫ్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ర్, అనాధ శవాల దహనసంస్కారి కుర్రా శ్రీను, ఉచిత వైద్య శిబిరాల శిఖరం డాక్టర్ డి.శారద, వృద్ధాశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి, కూచిపూడి కళాకారిణీ తేజస్వి ప్రఖ్య, షార్ట్ ఫిలిమ్స్ ఉత్తమ నటి సుజిత, యూట్యూబ్ ఉత్తమ కేరెక్టర్ నటి సాయిప్రకర్షలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాసయాదవ్, పెదరావూరు ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్బాబు పాల్గొన్నారు. -
పొదుపు సంఘం లీడర్ చేతివాటం
రూ.7 లక్షలు పక్కదారి నాదెండ్ల: కనపర్రు ఎస్సీ కాలనీలోని లక్ష్మీతిరుపతమ్మ మహిళా పొదుపు గ్రూపులో రూ.7 లక్షలు మాయమైన ఘటనపై గ్రూపు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామ ఎస్సీ కాలనీలో ఎన్నో ఏళ్ల క్రితం ఈ గ్రూపు ఏర్పడింది. ప్రస్తుతం గ్రూపు లీడర్గా ఉప్పలపాటి సుజాత వ్యవహరిస్తుండగా, పి.వెంకటలక్ష్మి, సీహెచ్ పార్వతి, సీహెచ్ కుమారి, ఎన్.సామ్రాజ్యం, సీహెచ్ పద్మ, సీహెచ్ భూలక్ష్మీ, డి.నాగేంద్రమ్మ, జి.రీనా, ఎం.అంజమ్మ గ్రూపు సభ్యులుగా ఉన్నారు. రీనా, అంజమ్మలు గ్రూపు నుంచి వైదొలగటంతో నూతనంగా మరో ఇరువురు సభ్యులను ఎన్నుకున్నారు. నరసరావుపేట ఏడీబీ ఎస్బీఐ నుంచి మూడేళ్ళ క్రితం రూ.15లక్షలు రుణం మంజూరు కావటంతో ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు పంచుకున్నారు. అప్పటి నుంచి గ్రూపు సభ్యులు నెలకు రూ.3 వేలు, రూ.100 పొదుపుతో కలిపి నెలకు ఒక్కొక్కరు రూ.3100లు చొప్పున లీడర్ సుజాతకు చెల్లిస్తూ వస్తున్నారు. మరో నాలుగు నెలల్లో రుణ చెల్లింపు పూర్తికావాల్సి ఉంది. తిరిగి మరలా రుణం పొందేందుకు గ్రూపు సభ్యులు తీర్మానం చేసుకునే సమయంలో లీడర్ చేతివాతం వెలుగులోకొచ్చింది. బ్యాంకులో ప్రతినెలా జమ చేయకుండా చేతివాటంతో రూ.8 లక్షలు మాత్రమే జమచేసి సుమారు రూ.7 లక్షలు దారి మళ్లించినట్లు గుర్తించారు. దీంతో సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తూ గ్రామ పెద్దలకు విషయం చెప్పారు. జిల్లాఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్ళనున్నట్లు సమాచారం. దీనిపై ఏపీఎం రమేష్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. సీసీ బండారు సుధను ఫోన్లో సంప్రదించగా గ్రూపు సభ్యులు చెల్లించాల్సిన బకాయిలు గ్రూపు లీడర్ సొంతానికి వాడుకున్న నగదుతో కలిపి సుమారు రూ.7 లక్షలుగా తేలిందని, అయితే గ్రూపు లీడర్ ఫిబ్రవరిలోనే బకాయిలు చెల్లిస్తానని చెప్పి నేటి వరకూ చెల్లించలేదని తెలిపారు. -
వెల్లువెత్తిన అభిమానం
మాచర్ల: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టణంలో ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలను ఆయన కలుసుకున్నారు. పలువురు ఆయనకు పూలబొకేలు అందించి సత్కరించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలు, అభిమానులతో ముచ్చటించారు. పట్టణంలోని తూర్పు బావి వద్ద, ముస్లిం షాదీఖానాలో జరిగిన వైఎస్సార్ సీపీ నాయకుడు పఠాన్ చిన్నబద్రు కుమార్తె పఠాన్ తస్లీమా, మాజీ కౌన్సిలర్ షేక్ కరిముల్లా కుమారుడు షేక్ ఆకీల్ల నిశ్చయతాంబూలం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులను ఆయన ఆశీర్వదించారు. అదే విధంగా పట్టణంలోని నరిశెట్టి కళ్యాణమండపంలో జరిగిన తిరుమల కొండ నాగరాజు కుమార్తె హేమలత ఓణీల బహూకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్ రెడ్డి, అబ్దుల్ జలీల్, వైఎస్సార్ సీపీ నాయకులు చల్లా కాశయ్య, పిల్లి కొండలు, కొమెర గిరి, డేగ శివ, చల్లా మోహన్, చల్లా వెంకటేశ్వర్లు, యర్ర వెంకటేశ్వర్లు, బత్తుల శ్రీను, దుర్గారావు తదితరులున్నారు. ప్రజాభిమానం ముందు కుట్ర కేసులు కొట్టుకుపోతాయి.. మాచర్ల: ప్రజాభిమాన ఉప్పెన ముందు చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కుట్ర కేసులు, రెడ్బుక్ కేసులు కొట్టుకుపోతాయని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మేరాజోత్ హనుమంతునాయక్ అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం మాచర్లలోని పార్టీ కార్యాలయంలో హనుమంతునాయక్ మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాభిమానం కలిగిన వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేస్తూ కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తుందన్నారు. గుండ్లపాడు జంట హత్య కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి ఎటువంటి సంబంధం లేకపోయినా, కావాలని అక్రమంగా వారిని కేసుల్లో ఇరికించి జైలు పాలు చేశారన్నారు. దీనిద్వారా వారు సాధించింది ఏమీలేదని, ఇంకా పీఆర్కే, పీవీఆర్లకు ప్రజాభిమానాన్ని మరింత పెంచారన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత పీఆర్కేకు వచ్చిన ఆదరణ చూసి కూటమి నాయకులకు కంటిమీద కునుకు ఉండడం లేదని పేర్కొన్నారు. -
దళిత మహిళను దూషించిన వారిపై చర్యలేవీ?!
● కొణతం స్వాతికి న్యాయం జరిగే వరకూ పోరాడుతాం ● కులం పేరుతో దూషించారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేస్తే ఈవ్ టీజింగ్ కేసు పెడతారా? ● డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసి రెండు వారాలైనా స్పందన లేకపోవడం విడ్డూరం ● న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం ● వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి సత్తెనపల్లి: దళిత మహిళ, మున్సిపల్ కో–ఆప్షన్ మెంబర్ను అవమానించటమే కాక కులం పేరుతో దూషించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజక వర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, మాజీ మున్సిపల్ కో–ఆప్షన్ మెంబర్ కొణతం స్వాతి గృహంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని కొణతం స్వాతి ప్రశ్నిస్తే ఆమైపె కేసు పెట్టి మొబైల్ కూడా పోలీసులు సీజ్ చేశారన్నారు. అయినప్పటికీ ఆమె భయపడకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చెప్పటానికి కూడా వీలులేని భాషలో కౌన్సిలర్ స్థానంలో ఉన్న రంగిశెట్టి సుమన్కుమార్ పోస్ట్ పెట్టడం దారుణమన్నారు. ఎస్సీ మహిళ పట్ల కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు దిగజారి ప్రవర్తించడం గర్హనీయమన్నారు. దీనిపై మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు సైతం క్షమాపణ చెప్పాలని కోరినప్పటికీ క్షమాపణ చెప్పకపోగా కులం పేరుతో దూషించి చేతనైంది చేసుకోమని మాట్లాడటం అధికార అహంకారానికి నిదర్శనమన్నారు. దీనిపై కొణతం స్వాతి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేస్తే పోలీసులు ఈవ్టీజింగ్ కింద కేసు నమోదు చేశారన్నారు. దీంతో స్వాతి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి సత్తెనపల్లి డీఎస్పీకి, అక్కడ నుంచి సత్తెనపల్లిటౌన్ సీఐకి మార్చారే తప్ప న్యాయం చేయలేదన్నారు. చివరికి ఆ చట్టం వర్తించదని చెప్పడం జరిగిందన్నారు. దీనిపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే రెండు వారాలు గడిచినా ఇంతవరకు స్పందన లేదన్నారు. ● సంబంధం లేని కేసుల్లో మాజీమంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలపై అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించారన్నారు. మహిళలను గౌరవించాల్సిందిపోయి అసభ్యకరంగా పోస్టులు పెట్టడమే కాక కులం పేరుతో దూషించినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. దళిత మహిళ కొణతం స్వాతికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, ఆమెకు న్యాయం జరిగే వరకూ దీనిపై పోరాడుతామన్నారు. లీగల్సెల్ను సంప్రదించి కోర్టు ద్వారా న్యాయపోరాటం కూడా చేయడం జరుగుతుందన్నారు. ● వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, సీనియర్ న్యాయవాది పక్కాల సూరిబాబు మాట్లాడుతూ ఎవరైనా పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే మొదట ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందన్నారు. విచారణలో వాస్తవం కాకపోతే కొట్టివేస్తారన్నారు. అలా చేయకుండా ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ రిపోర్టునే తలకిందులు చేయడం, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని మీపై ఫిర్యాదులు ఉన్నాయంటూ పోలీసులు కూర్చోబెట్టడం దురదృష్టకరమన్నారు. దళిత మహిళ బహిరంగంగా తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేస్తే సరైన విచారణ చేయకపోవడం సరైనది కాదన్నారు. దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. ● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలుకా జైపాల్ మాట్లాడుతూ కొణతం స్వాతికి న్యాయం జరిగే వరకూ ఎస్సీలంతా ఏకతాటిపైకి వచ్చి అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపడతామన్నారు. ఇప్పటికై నా రంగిశెట్టి సుమన్కుమార్ తక్షణమే కొణతం స్వాతికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే న్యాయపోరాటం తప్పదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు కోడిరెక్క దేవదాస్, కొణతం స్వాతిలు మాట్లాడారు. సమావేశంలో నాయకులు డాక్టర్ గీతా హాసంతి, చలంచర్ల సాంబశివరావు, రాయపాటి పురుషోత్తమరావు, లోక కళ్యాణి, కళ్ళం విజయభాస్కర్రెడ్డి, జొన్నలగడ్డ ఆనంద్, పెద్దింటి నాగేశ్వరరావు, సయ్యద్ గోరా, షేక్ జలీల్, యనమా సింగయ్య, కృపావరం, చావా రమేష్, సీతారాములు, జొన్నలగడ్డ సాగర్, జంగాల సంపత్, గుజ్జర్లపూడి సతీష్, బండి మల్లిఖార్జునరెడ్డి, జడా ప్రసాద్, కాటమల డేవిడ్, పొత్తూరు రామ కోటయ్య, అక్కేశ్వరరావు, రవితేజ, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
సంక్షోభంలో పాఠశాల విద్యారంగం
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం సంక్షోభంలో ఉందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు వద్ద ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో పాఠశాల విద్యారంగం సంక్షోభంలోకి నెట్టి వేయబడిందని అన్నారు. పాఠశాల విద్యలో అనేక ప్రయోగాలను చేస్తూ, పాఠశాలలను ప్రయోగ పరీక్ష కేంద్రాలుగా మార్చి వేశారని అన్నారు. కూటమి పాలనలో విద్యారంగంలో తెచ్చిన ఏ ఒక్క పథకం, కార్యక్రమం నాణ్యమైన విద్య అందించేదిగా లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా విద్యారంగంపై ప్రయోగాలు మానుకుని, విద్యార్థులకు ఉపయోగపడే శాసీ్త్రయమైన విద్యావిధానాన్ని మాతృభాషలో కొనసాగించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన ప్రాథమిక పాఠశాలల తరగతులు ఉపసంహరించుకోవాన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించి, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, సంఘ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు మాట్లాడుతూ విద్యాశాఖాధికారులు నిరంకుశంగా అమలు చేస్తున్న విద్యార్థి, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను పోరాటాల ద్వారానే ఎదుర్కోవాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకుడు షేక్ జిలానీ మాట్లాడుతూ 79 ఏళ్లుగా ఏపీటీఎఫ్ విద్యారంగ ప్రగతికి, ఉపాధ్యాయ సంక్షేమానికి నిరంతరం పనిచేస్తోందని, కార్యకర్తలు నిత్య చైతన్యంతో పనిచేయాలని సూచించారు. పేద ప్రజల బిడ్డలకు మంచి విద్యను అందించాలన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న గుడిపాటి దాస్ మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకుల సమష్టి కృషితో సంఘ నిర్మాణానికి, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యవర్గ సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర జీఓ కమిటీ కన్వీనర్ సయ్యద్ చాంద్ బాషా, జిల్లా శాఖ అధ్యక్షుడు గుడిపాటి దాస్, ప్రధానకార్యదర్శి మహమ్మద్ ఖాలీద్, ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, పుట్టా జనార్ధనరావు, పి.పార్వతి, జిల్లా కార్యదర్శులు గడ్డిపాటి శివరామకృష్ణ, చక్కా వెంకటేశ్వరావు, కె.శ్రీనివాసరావు, పి.శివరామకృష్ణ, రాష్ట్ర కౌన్సిలర్లు బి.సాయి లక్ష్మీ, కె.రమేష్ వివిధ మండల శాఖల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు -
పిడుగుపాటుకు యువకుడు మృతి
అమరావతి: పిడుగుపాటుకు గురై మండల పరిధిలోని ఎండ్రాయి గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎండ్రాయి గ్రామానికి చెందిన నల్లగోర్ల విజయకుమార్ గేదెలను తోలుకుని రోజులాగానే శనివారం కూడా పొలానికి వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలివాన తోపాటు పిడుగు పడటంతో విజయ్కుమార్(25) అక్కడిక్కడే మృతి చెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా విజయకుమార్ రాకపోవటంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎండ్రాయి పరిసర ప్రాంతాలలో గాలించారు. శనివారం రాత్రి పొలాల్లో విగతజీవిగా పడి ఉన్న విజయకుమార్ను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని అమరావతి సీహెచ్సీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబసభ్యులకు ఆదివారం అప్పగించారు. మృతుడికి ఏడాది కిందటే వివాహమైంది. భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గుంటూరు రూరల్: ట్రూకాలర్లో మహిళల పేర్లను చూసి ఆయా సెల్ నంబర్లకు వీడియో కాల్స్ చేసి అసభ్యకర వీడియోలు పంపుతున్న వ్యక్తిని నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అడవితక్కెళ్లపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావు, సీఐ వంశీధర్ వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం, మాచవరం గ్రామానికి చెందిన రామనాథం నాగేశ్వరరావు గతంలో పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. జల్సాలకు అలవాటు పడి ఆడవారిని బెదిరించి డబ్బులు గుంజాలని తన ఫోన్లో రియల్ నంబర్స్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఆ నంబర్లను ట్రూ కాలర్లో చెక్ చేసి వాటిలో ఆడవారి పేర్లతో రిజిస్టర్ అయిన నెంబర్లకు వాట్సప్ ద్వారా మెసేజ్లు పెట్టడం, వారికి వీడియో కాల్స్ చేయడం అసభ్య కరమైన ఫొటోలను వీడియోలను పంపుతున్నాడు. తద్వారా డబ్బులు సంపాదించాలని చూస్తుండేవాడు. పలకలూరు రోడ్డులోని ఒక మహిళకు అదే విధంగా అసభ్య పదజాలంతో వాట్సప్ ద్వారా బూతులు తిట్టి అసభ్యకరమైన ఫొటోలు పంపించాడు. ఆ మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆదివారం పలకలూరు రోడ్డు విజ్ఞాన్ కాలేజి దగ్గరలో నిందితుడిని పట్టుకొని అతడి వద్ద నుంచి వివో ఫోన్, ఆపిల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు, మహిళా భద్రతా దష్ట్యా శక్తి టీములు నిరంతరం అందుబాటులో ఉంటున్నట్లు డీఎస్పీ మధుసూదనరావు తెలిపారు. ఆపదలో ఉన్న వారు 112కు ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం పొందవచ్చని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా మాధ్యమాలను దుర్వినియోగం చేయరాదని సూచించారు. కేసులో ప్రతిభ కనబరిచిన నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్, ఎస్ఐ మహేష్కుమార్, సిబ్బందికి రివార్డు అందజేసి అభినందించారు. + రూ.11.80 లక్షల సొత్తు స్వాధీనం తెనాలిరూరల్: తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్డులోని ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనోవిజన్న్లో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని రూ.11.80 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. నిందితుల్లో ఒకరు ఇప్పటికే జువైనెల్ హోమ్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. మళ్లీ ఇప్పుడు మద్యం, గంజాయికి అలవాటుపడిన మరో బాలుడిని కలుపుకుని ఏకంగా ఎలక్ట్రానిక్ షోరూమ్లోనే చోరీ చేశాడు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వివరాలను వెల్లడించారు. బుర్రిపాలెం రోడ్డులోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనోవిజన్లో ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి అనంతరం జరిగిన చోరీ కేసులో ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని వారి నుండి రూ.11.80 లక్షల విలువైన సెల్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణ ముత్యంశెట్టిపాలెంకు చెందిన 17 ఏళ్ల బాలుడు, చినరావూరు ఆర్టీసీ ఓల్డ్ డిపోరోడ్డుకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఈ కేసులో నిందితులని తెలిపారు. ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి రెండో అంతస్తులో గల గ్లాస్ డోరు పగులగొట్టి లోపలకు ప్రవేశించి వివిధ కంపెనీల మొబైల్స్, వాచీలు, బడ్స్, చార్జర్, అడాప్టర్లను దొంగతనం చేశారు. దీనిపై షోరూమ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో ఆదివారం గాంధీచౌక్లో నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ బి.జనార్ధనరావు చెప్పారు. ముత్యంశెట్టిపాలెంకు చెందిన బాలుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో అక్కల వద్ద నివాసం ఉంటున్నాడు. క్యాటరింగ్ పనులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు బానిసైనట్టు తెలిపారు. ఆదాయం సరిపోక బైక్ దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నేరాలకుగాను అతడిపైన స్థానిక వన్న్ టౌన్, త్రీటౌన్, రూరల్ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. వీటిలో రెండు కేసుల్లో ఇప్పటికే శిక్ష పడగా, తొమ్మిది నెలలపాటు విజయవాడ హోమ్లో ఉండి నాలుగు నెలల కిందట విడుదలయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఇంటర్ సెకండియర్ చదువుతూ మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటుపడిన చినరావూరు బాలుడిని కలుపుకొని సోనోవిజన్ షోరూమ్లో చోరీ చేసినట్టు వివరించారు. షోరూమ్ ఉన్న కాంప్లెక్సులోనే ఉన్న హోటల్లో క్లీనర్గా చేసిన 17 ఏళ్ల బాలుడు, రెక్కీ నిర్వహించి 16 ఏళ్ల బాలుడితో కలిసి చోరీ పాల్పడినట్టు తెలియజేశారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన సీఐ రాములునాయక్, ఆయన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
పేద మనసు కోపింఛెన్
‘అధికారంలోకి రాగానే నూతన పింఛన్లు మంజూరు చేసి అర్హులందరికీ న్యాయం చేస్తాం .. పేదలకు అండగా ఉంటాం ..’ అంటూ ఎన్నికల ముందు కూటమి నాయకులు ఊదరగొట్టారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంపై వారు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు సర్కార్ కనీసం జాలి కూడా చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీ వచ్చిందంటే చాలు దరఖాస్తుకు అవకాశం వస్తుందేమోనని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నేటికీ సంబంధిత వెబ్సైట్ ప్రారంభం కాకపోవడంపై అర్హులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సులువుగా... వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే... భారీ సంఖ్యలో దరఖాస్తులు... -
ఘరానా దొంగ అరెస్ట్
గుంటూరు రూరల్: జల్సాల కోసం డబ్బులు సులువుగా సంపాదించుకునేందుకు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లాల దొంగను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం అడవితక్కెళ్ళపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదనరావు తెలిపిన వివరాల మేరకు... కృష్ణా జిల్లా, గన్నవరం గ్రామానికి చెందిన కత్తి రవికుమార్ గతంలో గుంటూరు, ప్రకాశం, ఏలూరు, కృష్ణా, కర్నూల్ జిల్లాలతోపాటు హైదరాబాద్లోనూ చోరీలు చేశాడు. పలు కేసుల్లో అరైస్టె 5 సార్లు జైలుకు కూడా వెళ్లొచ్చాడని తెలిపారు. గత సంవత్సరం డిసెంబరు నెలలో జైలు నుంచి వచ్చి మళ్లీ గుంటూరు అంకిరెడ్డిపాలెం గ్రామంలో ఒక ఇంటిలో రాత్రి పూట బంగారం చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం పలకలూరు రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 5 లక్షల విలువ చేసే బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం స్టేషన్ పరిధిలో చోరీలకు సంబంధించి రూ1.50 లక్షల విలువ చేసే బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన నల్లపాడు సీఐ వంశీధర్, ఎస్ఐ మహేష్కుమార్, సిబ్బందిని రివార్డు అందజేసి అభినందించారు. -
నేటి నుంచి పుష్కర కుంభాభిషేక మహోత్సవాలు
రేపల్లె: రేపల్లె పట్టణ గ్రామదేవత బూరగలమ్మ వారి పుష్కర కుంభా భిషేక మహోత్సవం నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం సోమవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు జరుగుతుందని ఆలయ అర్చకుడు నందివెలుగు భానుసుధాకర్ గురుకులు ఆదివారం తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకమారు ఈ మహాకుంభాభిషేక మహోత్సవాలు జరుగుతాయని, దీనిలో భాగంగా విశేష పూజలతోపాటు ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 25వ తేది ఉదయం 9.50 గంటలకు ఆలయ శిఖరానికి, అమ్మవారికి ఏకకాలంలో అభిషేకం జరుగుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. చేబ్రోలు: మానవాళి రక్షణకు ఏసుక్రీస్తు శిలువ శ్రమలు పొంది, శిలువపై రక్తం చిందించి మరణించి సర్వ మానవాళికి రక్షణ అందించారని చేబ్రోలు చీలిపాలెంలోని పునీత అంతోనివారి దేవాలయం ఫాదర్ మల్లవరపు బాలశౌరి తెలిపారు. చేబ్రోలులో ఆదివారం ఘనంగా శిలువ యాత్ర కార్యక్రమం చేపట్టారు. పాతరెడ్డి పాలెం, గొడవర్రు, కోవెలమూడి, లేమల్లె పాడు, కొత్తరెడ్డిపాలెం నుంచి వందలాది మంది విశ్వాసులు పాల్గొన్నారు. ప్రభువు శిలువ శ్రమలను కళ్లకు కట్టే విధంగా నాటక రూపంలో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. పొన్నూరు ఆశ్రమానికి చెందిన బ్రదర్ జాక్ (గోతాలస్వామి) సందేశాన్ని అందజేశారు. కార్యక్రమానికి వచ్చిన వేలాది మందికి అన్నదానం చేశారు. కమిటీ పెద్దలు, సంఘస్తులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో నాల్గో రోజైన ఆదివారం జగన్మాతకు మందార పుష్పాలు, ఎర్రకలువలు, చామంతులతో అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారి అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో అధికారులు, అర్చకులు ప్రధాన ఆలయంలోని మూల విరాట్ను దర్శించుకున్నారు. -
వంటింట్లో నూనె మంట
వంటింట్లో నూనె మంటసలసల కాగుతున్న నూనెల ధరలు మరో వైపు గ్యాస్ కొరతతో అల్లాడుతున్న ప్రజలు సత్తెనపల్లి: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం మన వంటింట్లో సెగలు పుట్టిస్తోంది. ఇప్పటికే గ్యాస్ కొరతతో జిల్లా ప్రజలు బాధపడుతుంటే .. దానికి తోడు వంటనూనెల ధరలు పెరగడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే లీటర్ వంట నూనె పై సగటున రూ. 6 నుంచి రూ.10 వరకు ధర పెరగడంతో బెంబేలెత్తిపోతున్నారు. వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా వంటనూనెల సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. దీంతో దిగుమతులు తగ్గి మార్కెట్లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం ట్యాక్స్ ధరలు భగ్గుమనడానికి మరో కారణమైంది. పండుగల సీజన్ కావడంతో మార్కెట్లో వంటనూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అంతర్జాతీయ కారణాలను సాకు చూపి స్థానిక వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరగడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు పాత స్టాక్ను గోదాముల్లో బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన పాత స్టాక్ను సైతం పెరిగిన కొత్త ధరలకే విక్రయిస్తూ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాలు, విజిలెన్న్స్ అధికారుల పర్యవేక్షణ కొరవడటం విమర్శలకు తావిస్తోంది. ఒకవైపు ధరలు పెంచుతున్న కంపెనీలు, మరోవైపు ప్యాకింగ్ విషయంలోనూ మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. సాధారణంగా వినియోగదారులు నూనె ప్యాకెట్ కొనేటప్పుడు ధరను గమనిస్తారే తప్ప, అందులో ఎంత పరిమాణం ఉందనేది నిశితంగా చూడరు. ఇదే అదునుగా పలు కంపెనీలు లీటర్ ప్యాకెట్లో ఉండాల్సిన 900 గ్రాములకు బదులుగా కేవలం 850 గ్రాములు లేదా 800 గ్రాముల నూనె మాత్రమే నింపి మార్కెట్లోకి వదులుతున్నాయి. అంటే పరోక్షంగా ప్రజలు తక్కువ నూనెకు ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారు. వ్యాపారులు సాగిస్తున్న ఈ దందాపై అధికారులు తక్షణమే స్పందించి బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేయాలని సామాన్యులు కోరుతు న్నారు. నూనె రకం గతంలో ప్రస్తుత ధర ధర (లీటర్) (లీటర్) పామాయిలు 90–115 120–160 సన్ఫ్లవర్ ఆయిల్ (బ్రాండెడ్ తదితర) 140–155 160–180 వేరుశనగ నూనె 130–150 170–190పల్నాడు జిల్లాలో రోజుకు గృహ, వాణిజ్య అవసరాలు నిమిత్తం పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె 10 వేల లీటర్లు వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 50 శాతం పామాయిలు, 40 శాతం సన్ ఫ్లవర్ ఆయిల్, 10 శాతం వేరుశనగ, ఇతర నూనెలు వాడుతున్నారు. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు గతంలో కంటే ఇటీవల రూ.6 నుంచి రూ.10 పెరిగింది. దీంతో వినియోగదారులపై భారం పడింది. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వంట నూనెలు సరఫరా చేస్తున్నారు. -
షాపులు కేటాయించాలి
పాత వ్యాపారులకే నరసరావుపేట: అంజుమన్ కాంప్లెక్స్లోని పాత వ్యాపారులు 72 మందికి షాపులు కేటాయించకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు దిగుతామని జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా శ్రీరాంపురంలో నిర్మాణంలో ఉన్న అంజుమన్ కాంప్లెక్స్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... పాత వ్యాపారులు కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసి ఈ అంజుమన్ షాపుల అక్రమ దందా వ్యవహారాల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 2018 డిసెంబర్లో అంజుమన్ స్థలంలో ఉన్న 72 మందికి చెందిన షాపులను నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో టీడీపీ నాయకులు అక్రమంగా కూల్చివేసి వీధిన పడవేశారన్నారు. 2019లో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంజుమన్ షాపులకు చెల్లించవలసిన మున్సిపల్ బకాయిలలో రూ.35 లక్షలు ప్రత్యేక జీవో ద్వారా క్యాబినెట్ సమావేశంలో మినహాయింపునకు ఆమోదం పొంది, అన్ని అనుమతులు తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. దాదాపు స్లాబ్ వరకు నిర్మాణాన్ని కొనసాగించామని, అప్పట్లో వక్ఫ్ బోర్డు ద్వారా అనుమతి పొంది ఒక్కొక్క షాపు వారి వద్ద నుంచి రూ.2 లక్షల తీసుకొని నిర్మాణం అనంతరం రూ.లక్ష తిరిగి ఇచ్చేలా వక్ఫ్ సీఇఓ అనుమతులతో ఈ నిర్మాణాలు ప్రారంభించామని తెలిపారు. నిర్మాణం స్లాబ్ దశలో ఉండగా 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు అహలె సున్నత్ జామియా మసీదు సంఘం పేరుతో ప్రస్తుత అంజుమన్ కమిటీ చైర్మన్ రహమతుల్లా ఒక బోగస్ సంస్థను ఏర్పాటు చేసి, ఈ అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్లో 26 షాపులు తనకు చెందినవని, తాను ముతవల్లిని అంటూ ఈ షాపులకు పూర్తి హక్కుదారుడిని తానేనని నమ్మబలుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే రూ.36 లక్షలు వసూలు 26 షాపులు అమ్మకం మొదలు పెట్టాడన్నారు. ఒక్కొక్క దానికి రూ.9 లక్షల చొప్పున నాలుగు షాపులను ఇప్పటికే విక్రయించారన్నారు. వక్ఫ్ బోర్డ్ అనుమతులు లేకుండా యథేచ్ఛగా విక్రయిస్తున్నాడని అన్నారు. పైన కూడా కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని చెప్పి కొంతమంది లాయర్ల దగ్గర కూడా ముందస్తుగా డబ్బులు వసూలు చేయడం చేశాడన్నారు. అనుమతులు లేని కట్టడాలపై కొంతమంది కోర్టుకు వెళితే స్టే ఇచ్చినప్పటికీ పనులు కొనసాగిస్తున్నారని అన్నారు. దీనిలో ఎమ్మెల్యే అరవింద బాబు పేరుతో రసీదులు ముద్రించి మదీనా రసూల్ అనే వ్యక్తి ఒక్కొక్క షాపునకు రూ.2.5 లక్షలు వసూలు చేస్తున్నాడన్నారు. ఈ 72 మందికి షాపులు కేటాయించడం లేదని చెబుతూ, కొత్త వారి వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. అంజుమన్ సంస్థ సొంత ఆస్తి కాదనే విషయం స్థానిక ఎమ్మెల్యే తెలుసుకోవాలని హెచ్చరించారు. వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులను అక్రమ సంస్థల పేరుతో ఎమ్మెల్యే రసీదులు ఎలా ముద్రిస్తాడని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షులు అచ్చి శివకోటి, సీనియర్ నాయకులు షేక్ ఖాజావలి మాస్టారు, నియోజకవర్గ మైనార్టీ విభాగ అధ్యక్షులు షేక్ శిలార్, మైనార్టీ విభాగ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులకు విద్యుత్ షాక్
తాడేపల్లి రూరల్: ఆడుకుంటున్న సమయంలో చేతిలో ఉన్న బెల్టు ఇంటికి అతి సమీపంలో వున్న 11 కేవీ విద్యుత్ వైర్లపై పడింది. దానిని తీసేందుకు ప్రయత్నించిన ఇద్దరికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి సెంటర్లో జామాయిల్ తోటలో నివాసముండే పుప్పాల శ్రీనివాస్, దుర్గ దంపతులకు కుమార్తె, కుమారుడు. ఇతను ఆటోను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శ్రీనివాస్ తమ్ముడు సురేష్ అలియాస్ బుజ్జి చిరు ఉద్యోగం చేస్తూ ఉండవల్లి సెంటర్లోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద మూడో అంతస్తులో అద్దెకు నివాసముంటున్నాడు. సురేష్కు కూడా ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ పిల్లలు ఆడుకునేందుకు సురేష్ ఇంటికి వచ్చారు. సురేష్ కొడుకు త్రివిక్రమ్ చేతిలోని బెల్టును విసిరివేశాడు. అది 11 కేవీ వైర్లపై పడింది. పక్కనే ఉన్న శ్రీనివాస్ కుమార్తె విష్ణుప్రియ బెల్టును తీసేందుకు ఇంటికి మాపు వేసే ఐరన్ పైపు కలిగి ఉన్న కర్రతో ప్రయత్నించింది. దీంతో విష్ణుప్రియకు, త్రివిక్రమ్కు విద్యుత్ షాక్ తగిలింది. పెద్దగా కేకలు వినిపించడంతో ఇంట్లో నిద్రిస్తున్న పెద్దలు బయటకు వచ్చి చూడగా పిల్లలు ఇద్దరూ మంటల్లో కాలిపోతున్నారు. పెద్దగా కేకలు వేసి ఇంట్లో ఉన్న దుస్తులతో మంటలను అదుపుచేశారు. ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దర్ని విజయవాడ ఆసుపత్రిలో చేర్పించారు. విద్యుత్వైర్లు ఇంటి ముందు నుంచి వెళుతున్నా యజమాని విద్యుత్ సరఫరా కాకుండా పైపులైన్లు వేయించలేదు. ప్రమాదం అని తెలిసినా అధికారులు ఆ బిల్డింగ్ యజమానికి సూచించలేదు. వారి నిర్లక్ష్యం కారణంగా చిన్నారులిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 8వ తరగతి చదువుతున్న విష్ణుప్రియకు జుట్టుతోపాటు రెండు చేతులు, ఛాతీ పూర్తిగా కాలిపోయింది. కుడిచేయి బొటన వ్రేలు, చూపుడు వేలు తీసివేయాలని వైద్యులు తెలియజేశారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. త్రివిక్రమ్కు రెండు చేతులు, కుడిచేయి ఛాతీ కింద భాగంలో పూర్తిగా విద్యుత్ ఘాతానికి గురై కాలిపోయాయి. -
నిద్రలోకి నిఘా.. బుకీలదే హవా
సాక్షి, నరసరావుపేట: దాదాపు 30 మందికిపైగా క్రికెట్ బుకీలు నరసరావుపేట పట్టణంలోనే ఉన్నారని సమాచారం. పల్నాడు జిల్లాతో పాటు మూడు, నాలుగు రాష్ట్రాలలో నరసరావుపేటకు చెందిన బుకీలు క్రికెట్ పందేలు నిర్వహిస్తుంటారు. ఇంత జరుగుతున్నా పల్నాడు పోలీసులు వారిపై గట్టిగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే కొందరు బుకీలపై రౌడీషీట్లు తెరిచారు. అయినా వారిలో మార్పు రాకపోగా మరింతగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీరి వలలో పడి బెట్టింగ్ ఆడుతున్న యువత అర్ధంతరంగా జీవితాలనే ముగిస్తున్నారు. అరెస్ట్ చేసినా పరార్ నరసరావుపేటకు చెందిన క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్ను ప్రకాశం జిల్లా దర్శి పోలీసులు గత వారం అరెస్ట్ చేశారు. గోల్డ్ శేఖర్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మూడు కమ్యూనికేటర్ బాక్సులు, రెండు ల్యాప్టాప్లు, 21 మొబైల్ ఫోన్లు, రూ.24 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నారు. గోల్డ్ శేఖర్ ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట ఇస్లాంపేటకు చెందిన మరో బుకీని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి లిస్ట్లో మరో పది మంది వరకు ఉన్నట్టు తెలియడంతో సదరు బుకీలు మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకొని గోవా, శ్రీలంకలకు పారిపోయినట్టు సమాచారం. ఓవైపు ప్రకాశం పోలీసులు నరసరావుపేటకు చెందిన క్రికెట్ బుకీల విషయంలో ఇంత చేస్తూంటే పల్నాడు జిల్లా పోలీసులు మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నరసరావుపేట అడ్డాగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నా ఎందుకు స్థానిక పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారని విమర్శలొస్తున్నాయి. బుకీలు ఇస్తున్న మామూళ్లతో కొందరు పోలీసులు బెట్టింగ్ దందాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. రానున్న ఐపీఎల్ సీజన్తో ... బెట్టింగ్ జడలు విప్పి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నా దీనిని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. నరసరావుపేటతో పాటు మారుమూల గ్రామాల్లో సైతం బెట్టింగ్ చాపకింద నీరులా విస్తరించింది. ఇటీవల జరిగిన వరల్డ్ టీ20 ప్రపంచకప్లో ప్రతి మ్యాచ్కు జిల్లా వ్యాప్తంగా రూ.కోట్ల చేతులు మారాయి. ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో ఈ బెట్టింగ్ జరుగుతోంది. అవగాహన సదస్సులు పెట్టి, ప్రెస్నోట్లు ఇచ్చి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి ఐపీఎల్ మొదలు కానున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం క్రికెట్ బెట్టింగ్ నిర్మూలనపై క్షేత్రస్థాయిలో మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నిండు ప్రాణాలు బలి » క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని గతేడాది ఏప్రిల్ 21న అచ్చంపేట మండలానికి చెందిన 19 ఏళ్ల యువకుడు ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారం రోజుల పాటు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించాడు. వృద్ధాప్యం వెంబడిస్తున్నా జీవనం కోసం తనకు అబ్బిన టైలర్ వృత్తిని చేసుకుంటున్న ఆ యువకుడి తండ్రికి బెట్టింగ్ భూతం రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. » బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన ఓ యువకుడు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద లాడ్జిలో గతేడాది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఆ యువకుడు తొలుత పని ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులకు అసలు విషయం బహిర్గతమైంది. క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు నష్టపోయానని, సమయం ఇస్తే డబ్బులు తిరిగి చెల్లిస్తానని ప్రాథేయపడుతూ కొంతమందికి అతడు సందేశాలు పంపినట్లు గుర్తించారు. ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి పాల్పడినట్టు తేలింది. ‡ఇలా ఎందరో బెట్టింగ్ భూతానికి బలైపోతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. -
వీనులవిందుగా వేంకటేశ్వర గానామృతం
తెనాలిటౌన్: స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్త స్థల ప్రాంగణంలో శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్టు ఆధ్వర్యంలో 39వ శనివారం శ్రీవేంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీవేంకటేశ్వరస్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి విశేష పూజలు చేశారు. శ్రీపంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనాబృందం ఆధ్వర్యంలో మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని భక్తిశ్రద్ధలతో గీతా లు ఆలపించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాజాం మున్సిపల్ కమిషనర్ ఆకురాతి రామచంద్రరావు దంపతులు, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత, ట్రస్ట్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు లక్కరాజు సాయికి ట్రస్టు నిర్వాహకులు స్వామి జ్ఞాపికను, వస్త్రాలను అందజేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు ఆర్వీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి గానామృతం కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రం భూదాన విరాళంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. భూదాన విరాళం అందజేసిన దాతలకు ట్రస్టు సభ్యులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణలు తదితరులు పాల్గొన్నారు. డీఎస్ఓ జమీర్బాషా బాపట్ల: ప్రభుత్వం నిర్ణయించి ధరకు మించి గ్యాస్ సిలిండర్లు ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆర్.జమీర్ బాషా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 27 గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి 5377 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలను సీఎస్ డీటీలు, తహసీల్దార్లు తనిఖీ చేస్తారని తెలిపారు. జిల్లా కలెక్టరేట్, డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులు ఉంటే 94932 47765కు తెలియజేయాలని సూచించారు. అసత్య ప్రచారాలు నమ్మి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పట్టణనాలలో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులు తర్వాత మాత్రమే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని బుక్ చేసిన తర్వాత ఏడు రోజులలోగా సిలిండర్ వస్తుందన్నారు. గృహ అవసరాలు, సంక్షేమ వసతి గృహాలు, ఇతర అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో నిలుపుదల ఉండదని స్పష్టం చేశారు. -
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించండి
బెల్లంకొండ: స్టేషన్ ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. శనివారం బెల్లంకొండ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు, ఫిర్యాదుల నిర్వహణ, కేసుల వివరాలను పరిశీలించారు. మండలవ్యాప్తంగా సీసీ కెమెరాల నిర్వహణను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీలైనంత తొందరగా పెండింగ్ కేసులను పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్ఐకు సూచించారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు, గంజాయి సరఫరా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటూ, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని ఎస్పీ తెలిపారు. గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, పల్లెనిద్ర, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు, పెదకూరపాడు రూరల్ సీఐ ప్రత్తిపాటి సురేష్, స్థానిక ఎస్ఐ పి.గోపి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు -
పచ్చదనం పెంపు అందరి బాధ్యత
చిలకలూరిపేట టౌన్: భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ పిలుపునిచ్చారు. శనివారం చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని నక్షత్ర వనాన్ని ఆయన తన సతీమణితో కలిసి సందర్శించారు. నక్షత్ర వనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. నక్షత్ర వనం వంటి ఆధ్యాత్మిక, పర్యావరణ మేళవింపు ఉన్న ప్రాంతాలు మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం అన్నారు. పచ్చని చెట్లతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని చెప్పారు. తన స్వగ్రామమైన బొప్పూడిపై ఉన్న మమకారంతోపాటు, పర్యావరణం పట్ల గ్రామస్థులు చూపుతున్న శ్రద్ధను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో చిలకలూరిపేట ప్రిన్సిపల్ జూనియర్ కోర్టు సివిల్ జడ్జి కె. నరేంద్రరెడ్డి, గ్రామ పెద్దలు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ -
పెదకాకాని శివాలయంలో హుండీల కానుకల లెక్కింపు
పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం హుండీలు తెరచి కానుకలు లెక్కించారు. దేవదాయశాఖ ఆదేశాల మేరకు ఈ హుండీల కానుకలు లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా తెనాలి వైకుంఠపురంలోని పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఏసీ వి.అనుపమ హాజరయ్యారు. ఆలయంలో ఉదయం 9 గంటలకు కల్యాణ మండపంలో లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 84 రోజులకుగాను కానుకల హుండీల ద్వారా రూ.48,76,103 ఆదాయం లభించినట్లు డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. అన్నప్రసాద వితరణ హాల్లోని హుండీ ద్వారా రూ.2,81,368 సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం, వెండి కూడా వచ్చిందన్నారు. విదేశీ నగదు అమెరికన్ డాలర్లు 127 సమకూరినట్లు డీసీ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, ఆలయ సిబ్బంది, పెదకాకాని ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాసరావు, సిబ్బంది, సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. సత్తెనపల్లి: పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణంలో గల వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం మత్స్య జయంతి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామిని మత్స్యావతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కోదండ రామస్వామి, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీ బాధ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చేబ్రోలు: ిహందూ ఉపాధ్యాయ సమితి ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం చంద్రమాసం ఆధారంగా రూపొందించిన శుభతిథి క్యాలెండర్ను శనివారం ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండల శివారు బ్రాహ్మణ కోడూరులో రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ను ఆవిష్కరించారు. దర్మ ప్రచారక్ మాట్లాడుతూ ఈ క్యాలెండర్ నూతన ఒరవడితో ఆకట్టుకుందన్నారు. తెలుగు నెలలు, తెలుగు వారాలు, తిథులతో కూడిన క్యాలెండర్ను హిందూ ఉపాధ్యాయ సమితి చేయటం అభినందనీయం అన్నారు. హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర కార్యదర్శి మట్టపూడి కిరణ్ కుమార్, ఎస్ఎస్ఎఫ్ పొన్నూరు ఖండ ఇంటూరి శివ రామకృష్ణ, రామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నూజండ్ల: గుర్తు తెలియని వ్యక్తులు సుబాబుల్ తోటను నరికివేసిన సంఘటన నూజండ్ల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సోమేపల్లి వెంకటరత్నంకు సుబాబుల్ తోట ఉంది. శనివారం ఉదయం తోటకు వెళ్లి చూడగా పెద్ద సంఖ్యలో చెట్లను విచ్చలవిడిగా నరికివేసినట్టు గుర్తించి ఐనవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కారణమైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కోరారు. -
మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు
మాచర్ల: జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తనపై చూపిన అభిమానానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పీఆర్కే కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ తాను జైలులో ఉన్నా తనకు, తన కుటుంబానికి మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అక్రమ కేసులో జైలులో ఉండి విడుదలై వచ్చిన సందర్భంగా రెండవ రోజు శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయా మండలాల నుంచి భారీస్ధాయిలో తరలివచ్చి పీఆర్కేను కలసి అభినందనలు తెలిపారు. పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగ ప్రధాన కార్యదర్శి కనుమెల శ్యామ్యూల్, జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమెల మాణిక్యం, జిల్లా ఉపాధ్యక్షుడు కాలే మాణిక్యరావులతో పాటు ఆయా మండలాలకు చెందిన వారు భారీ స్థాయిలో వాహనాలలో తరలివచ్చి పీఆర్కేను శాలువాలతో సత్కరించారు. అందరినీ పీఆర్కే ఆప్యాయంగా పలకరించారు. పలు వివరాలడిగి తెలుసుకున్నారు. పీఆర్కేను సత్కరించిన వారిలో ఎస్సీ విభాగానికి చెందిన నియోజక వర్గ నాయకులు దరివేముల కిరణ్కుమార్, మాచర్ల ఏసుదాసు, కె. పాపయ్య, రాయపాటి నాగేశ్వరరావు, కందుకూరి మధు, జి. నాగేశ్వరరావు, ఎ. శేఖర్, నందిగం ఇస్సాకు, కందుకూరి సాగర్, కిన్నెర కిరణ్ తదితరులు ఉన్నారు. మాచర్ల జెడ్పీటీసీ మండ్లి పెద్ద మల్లుస్వామి, నియోజకవర్గ యువజన సంఘం అధ్యక్షులు బూడిద శ్రీను, జిల్లా కార్యదర్శి దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర యువజన సంఘం నాయకులు నవులూరి చెన్నారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి పోతురెడ్డి కోటిరెడ్డి, నియోజకవర్గ నాయకులు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, ఆయా విభాగ నియోజకవర్గ అధ్యక్షులు, ప్రజలు, మహిళా నాయకులు భారీ స్థాయిలో తరలివచ్చారు. -
హక్కుల సాధనకు యూటీఎఫ్ రణభేరి
● 24న నిరాహార దీక్షకు నిర్ణయం ● జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా కమిటీ పిలుపు నరసరావుపేట: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం రణభేరి–3 పేరిట ఈ నెల 24వ తేదీన పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిర్వహించే ఒక్క రోజు నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దుకూరి మోహనరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం పల్నాడు జిల్లా కార్యాలయంలో రణభేరి–3 కరపత్రాలను నాయకులతో కలసి ఆవిష్కరించారు. తొలుత యూటీఎఫ్ పూర్వ నాయకులు అప్పారి వెంకటస్వామి 26 వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం, విద్యా వ్యవస్థ ప్రగతి కోసం 12 ఏళ్ల ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసిన నాయకులు అప్పారి అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో బలమైన ఉపాధ్యాయ ఉద్యమాలను నిర్మించాలని నేతలు పిలుపునిచ్చారు. మోహనరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ ఏర్పాటు, పెండింగ్ డీఏలు, బకాయిల చెల్లింపు, మెమో నెంబర్ 57 వర్తింపు, సీపీఎస్ రద్దు తదితర ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళలనలకు ఇచ్చిన పిలుపు మేరకు 24న జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఒక్క రోజు చేసే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని అన్నారు. జిల్లా కార్యదర్శి ఎం.రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్.సుందరరావు, టి.వెంకటేశ్వర్లు, ఆయా ప్రాంతీయ శాఖల బాధ్యులు డి.కోటేశ్వరరావు, జి.వెంకటేశ్వరరావు, ఎల్.పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
విశ్వశాంతి స్థాపనకు కవులు పునరంకితం కావాలి
ప్రపంచ కవితా దినోత్సవ సభలో రంగిశెట్టి రమేష్ తెనాలి: ప్రపంచ కవితా దినోత్సవం రోజైన శనివారం సాయంత్రం తెనాలి నాజరుపేటలోని కమలశ్రీ సాహితీ నిలయంలో శ్రీకృష్ణ దేవరాయ కళావేదిక, విశ్వ సాహితీ కళావేదిక సంయుక్త నిర్వహణలో ‘విశ్వశాంతి ఆవశ్యకత–కవుల పాత్ర’ అంశంపై కవిసమ్మేళనం నిర్వహించారు. తొలుత ప్రాచీన కవుల నుంచి నేటి ఆధునిక కవుల చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. సభకు శ్రీకృష్ణదేవరాయ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వ సాహితీ కళావేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు రంగిశెట్టి రమేష్ అధ్యక్షత వహించారు. నేటి వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య విశ్వశాంతి స్థాపనకు కవులందరు మరొక్కసారి పునరంకితం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యుద్ధం అనర్థాలపై సమాజాన్ని చైతన్యపరచి యుద్ధ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎలుగెత్తి చాటాలన్నారు. -
పల్నాడు
ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 20267మాచర్లలో నమాజ్ చేస్తున్న ముస్లింలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మ కాయలు కనిష్ట ధర రూ.7,200, గరిష్ట ధర రూ.9,200, మోడల్ ధర రూ.8,400 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం శనివారం 535.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 300 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. మాచర్లలోని ఈద్గాలో రంజాన్ ప్రార్థన నిర్వహిస్తున్న ముఫ్తీ షేక్ అబ్దుల్ రజాక్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : వాణిజ్య అవసరాలకు అక్రమంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న దుకాణాలు, హోటళ్లపై గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం విద్యానగర్లో వణుకూరి పవన్కుమార్ కార్ఖానాలో నాలుగు ఎల్పీజీ సిలిండర్లను గుర్తించారు. ఈ మేరకు సీజ్ చేసిన సిలిండర్లను స్థానిక వీఆర్ఓకి అప్పగించారు. ఈ మేరకు అతనిపై 6–ఎ కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. -
మోసం తెలియని నేత వైఎస్ జగన్
రొంపిచర్ల: మోసం చేయడం తెలియని నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఉగాది సందర్భంగా రొంపిచర్లలో గురువారం రాత్రి శ్రీ బాల త్రిపుర సమేత శంకరేశ్వరస్వామి తిరునాళ్లలో పాల్గొని ఆయన మాట్లాడారు. రెండు సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రజలకు ఏమి చేయకుండా నయవంచన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పడాల శివారెడ్డి, పడాల చక్రారెడ్డి, గెల్లి బ్రహ్మారెడ్డి, గెల్లి కోటిరెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కురుగుంట శ్రీనివాసరెడ్డి, పునుగోటి వెంకట్రావు, మోతుకూరి వెంకటేష్, నరసరావుపేట మండల పార్టీ అధ్యక్షుడు మోరబోయిన శ్రీనివాసరావు, పచ్చవ రవీంద్రబాబు, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
రంజాన్ ప్రార్థనలకు సర్వం సిద్ధం
పెదకాకాని: బాజీబాబా దర్గా రెండు రోజుల ఉరుసు మహోత్సవం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలతో ముగిసింది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్బోర్డు అధికారులు మహ్మద్ హుస్సేన్, దర్గా ఈఓ షేక్ ఖాజావలిలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా ఉరుసు మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో భాగంగా పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందినీ అలంకరణలో గంధం బిందెలతో గురువారం రాత్రి ప్రారంభమైంది. బాజీబాబా వారి గుర్రం శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకూ వెనిగండ్ల, పెదకాకాని గ్రామ పురవీధులలో గ్రామోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు బాజీబాబా వారి గుర్రానికి మిఠాయిలు, పండ్లు తినిపించారు. కొబ్బరికాయలు, పూలు, గంధం సమర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. బాబావారి గుర్రం దర్గాలోకి చేరుకోగాలనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భక్తులకు గంధం పంపిణీ చేశారు. గంధం పంపిణీ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో రద్దీ వాతావరణం నెలకొంది. భక్తులందరికీ గంధం పంపిణీ జరిగిందని వక్ఫ్బోర్డు ఈఓ షేక్ ఖాజావలి తెలిపారు. -
60 కిలోల రాగి తీగలు స్వాధీనం
తెనాలిరూరల్: ౖరెల్వేకు చెందిన వైర్లను దొంగిలించి వాటిని కాల్చి రాగి తీగలను అమ్మిన నిందితులను ఆర్పీఎఫ్ అధికారులు అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుంచి వైర్లు, రాగి తీగలను స్వాధీనపర్చుకున్నారు. తెనాలి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బి. హీరాసింగ్ వివరాలను శుక్రవారం వెల్లడించారు. తెనాలి రైల్వే స్టేషన్ టెలికాం స్టోరులో ఈ నెల 8వ తేదీన సుమారు రూ. 2.25 లక్షల విలువైన వైర్లు అపహరణకు గురయ్యాయి. నిందితు లు స్టోర్ రూమ్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన ఆర్పీఎఫ్ అధికారులు నిందితుల ఆచూకీ కోసం ప్రయ త్నించారు. నిందితులు కావలికి చెందిన దార్ల శ్రీను, దార్ల సింహాద్రి, దార్ల పుట్టయ్య, పర్తపు దుర్గయ్య, పర్తపు వల్లూరయ్య, నెల్లూరుకు చెందిన పర్తపు శ్రీనుగా గుర్తించారు. నిందితులు కొంత కాలంగా తెనాలి వీఎస్ఆర్ కళాశాల ఎదురు కఠెవరం కాల్వకట్టకు వెళ్లే దారిలో ఐసీడీఎస్ కా ర్యాలయం ఎదుట పాకలు వేసుకుని ఉంటున్నా రు. అదను చూసి రైల్వే వైర్లను దొంగలించారు. అపహరించిన వైరులో సగ భాగం కాల్చి రాగి తీగలను నందివెలుగులోని ఓ వ్యక్తికి విక్రయించారు. అతను విజయవాడలోని మరో వ్యక్తికి విక్రయించాడు. విజయవాడ వ్యక్తి విజయవాడ ఆటోనగర్లోని ఇంకో వ్యక్తికి విక్రయించాడు. చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. తెనాలి ఆర్పీఎఫ్ ఏఎస్ఐ శివరామకృష్ణయ్య, విజయవాడ ఆర్పీఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు ఉన్నారు. -
ఇంజినీరింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
ఈనెల 24 వరకు ఏపీ ఈఏపీ సెట్–2026 దరఖాస్తుల స్వీకరణ గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్హతతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2026 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 24వ తేదీవరకు పొడిగించారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్–2026 (గతంలో ఎంసెట్) నోటిఫికేషన్ ఆధారంగా సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులతో తాజాగా పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్–2026 ఆధారిత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 36 ఇంజనీరింగ్ కళాశాలల్లో 30,240 సీట్లు ఏపీ ఈఏపీసెట్ సైట్లో పూర్తి సమాచారం సైట్కు లాగిన్ అయ్యి ఏపీ ఈఏపీసెట్–2026పై క్లిక్ చేయాలి. ఏపీఈఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు పూరింపు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్స్టక్షన్స్ మాన్యువల్ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు. ఏపీ ఈఏపీ సెట్కు దరఖాస్తు ఇలా -
దీక్ష ముగిసె .. దువా ఫలించే
సత్తెనపల్లి: పవిత్ర రంజాన్ మాసం నేటితో ముగియనుంది. శుక్రవారం సాయంత్రం చంద్ర వంక దర్శనంతో ముస్లింలు ఈద్ నమాజ్కు సిద్ధమయ్యారు. శనివారం ఈద్–ఉల్–ఫితర్ పండగ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు (రోజా), ప్రత్యేక తరావీహ్ నమాజ్, సహర్, ఇఫ్తార్లు, ఖురాన్ పఠనం, దానధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముస్లింలు గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చుక్క నీరు తాగకుండా నిష్టతో దీక్షలు పాటించారు. చివరకు నెల వంక దర్శనం కావడంతో పండుగ చేసుకోనున్నారు. ఈదుల్ ఫితర్ నమాజ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఈద్గాలతోపాటు మసీదుల్లో సౌకర్యాలు కల్పించారు. పండుగ రోజు ముస్లింలు ఈద్గాలకు వెళ్లి ఈదుల్ ఫితర్ నమాజ్ చేయడం ఆనవాయితీ. నెల రోజులు తమ నమాజులు ఫలించాలని, సర్వ మానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ అల్లాహ్కు దువా చేస్తారు. 2.50 శాతం జకాత్ రంజాన్లో దానధర్మాలకు అధిక ప్రాధాన్యం ఉంది. మనిషి ఆరోగ్యం, తాను సంపాదించిన ధనం పై అల్లా నిర్దేశించిన బీమాయే జకాత్, ఫిత్రా దానాలు. 52.5 గ్రాముల వెండి, 75 గ్రాముల బంగారం, అంతకుమించి విలువైన ధన, ఆస్తులు కలిగితే జకాత్కు అర్హులు. వాటి వెల లెక్క కట్టి 2.5 శాతం పేదలకు జకాత్ రూపేణ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రంజాన్లో ఇస్తే 72 రెట్లు అధికంగా పుణ్యం లభిస్తుందనేది ముస్లింల విశ్వాసం. ఫిత్రా ఇవ్వాల్సిందే .. సాధారణ ముస్లిం రంజాన్ సందర్భంగా 2.6 కిలో గ్రాముల గోధుమలు, వరి (ప్రధాన ఆహార ధాన్యం), సమానమైన డబ్బు పేదలకు దానం చేయడమే ఫిత్రా. దీనిని ఆరోగ్య బీమాగా మత పెద్దలు చెబుతారు. పేదరికంతో పండగకు నోచుకోని నిరుపేద ముస్లింలకు ఫిత్రా దానం ఇవ్వాలి. సద్ఖా–ఎ–ఫిత్రాతో ఆరోగ్య బీమాను అల్లాహ్ కల్పిస్తారంటారు. సూత్రప్రాయంగా ఈ ఏడాది మత పెద్దలు రూ. 105 ఫిత్రా ఇవ్వాలని సూచించారు. దీని కంటే ఎక్కువ ఇవ్వవచ్చు. కానీ తగ్గించరాదు. పండుగకు కనీసం ఒకరోజు ముందే ఫిత్రా చెల్లిస్తే పేదలు సైతం పండగ చేసుకునే వీలుంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరున ఫిత్రా ఇవ్వాలి. అల్లా ఇంటి ఆతిథ్యం ఎతెకాఫ్ ఎతెకాఫ్ అల్లా ఇంటి (మసీదు) ఆతిథ్యం వంటిది. రంజాన్లో దీనికెంతో ప్రాధాన్యం ఉంది. ఊళ్లో0 ఒక వ్యక్తి కూడా ఎతెకాఫ్ ఉండకపోతే, ఆ ఊరిపై అల్లా కరుణ, కటాక్షాలు ఉండవని పవిత్ర ఖురాన్ బోధిస్తోంది. ఎతెకాఫ్ను రంజాన్ చివరి పది రోజుల్లో పాటించాలి. ప్రాపంచిక జీవితానికి దూరంగా, వీలుపడిన రోజులు (కనీసం 24 గంటలు) మసీదులో అల్లా ధ్యానంలో గడపడమే ఎతెకాఫ్. అన్నిటినీ త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే వానిపై అల్లాహ్ అత్యంత కరుణతో మొర ఆలకిస్తారని మౌల్వీలు అంటున్నారు. సామూహిక నమాజులకు ముందు మహా ప్రవక్త మొహమ్మద్ సంప్రదాయ ప్రకారం ఖర్జూరం సేవించి, నూతన వస్త్రాలు ధరించి, అత్తరు రాసుకొని నమాజు కోసం ఈద్గాకు చేరుకుంటారు. అక్కడ ఈద్ నమాజు చదివి, అనంతరం పరస్పరం ఈద్ ముబారక్ చెప్పుకొంటారు. అల్లాహ్ నామాన్ని స్మరిస్తూ ఇంటి నుంచి ఇద్గాకు వెళ్లి, నమాజ్ పూర్తయ్యాక వేరే మార్గంలో ఇంటికి చేరుతారు. రంజాన్లో సేమియా పాయసం ప్రత్యేకం. బంధుమిత్రులకు ఇరుగుపొరుగు వారికి సేమియా పాయసం ఇచ్చి తమ ఆత్మీయతను పంచుకుంటారు. చిన్నపిల్లలకు ఈద్ కానుకలు బహూకరిస్తారు. -
నిద్రలోకి నిఘా.. బుకీలదే హవా
నిండు ప్రాణాలు బలి సాక్షి, నరసరావుపేట: దాదాపు 30 మందికిపైగా క్రికెట్ బుకీలు నరసరావుపేట పట్టణంలోనే ఉన్నారని సమాచారం. పల్నాడు జిల్లాతో పాటు మూడు, నాలుగు రాష్ట్రాలలో నరసరావుపేటకు చెందిన బుకీలు క్రికెట్ పందేలు నిర్వహిస్తుంటారు. ఇంత జరుగుతున్నా పల్నాడు పోలీసులు వారిపై గట్టిగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే కొందరు బుకీలపై రౌడీషీట్లు తెరిచారు. అయినా వారిలో మార్పు రాకపోగా మరింతగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీరి వలలో పడి బెట్టింగ్ ఆడుతున్న యువత అర్ధంతరంగా జీవితాలనే ముగిస్తున్నారు. అరెస్ట్ చేసినా పరార్ నరసరావుపేటకు చెందిన క్రికెట్ బుకీ గోల్డ్ శేఖర్ను ప్రకాశం జిల్లా దర్శి పోలీసులు గత వారం అరెస్ట్ చేశారు. గోల్డ్ శేఖర్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో బెట్టింగ్లు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మూడు కమ్యూనికేటర్ బాక్సులు, రెండు ల్యాప్టాప్లు, 21 మొబైల్ ఫోన్లు, రూ.24 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ శేఖర్ ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట ఇస్లాంపేటకు చెందిన మరో బుకీని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి లిస్ట్లో మరో పది మంది వరకు ఉన్నట్టు తెలియడంతో సదరు బుకీలు మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్ చేసుకొని గోవా, శ్రీలంకలకు పారిపోయినట్టు సమాచారం. ఓవైపు ప్రకాశం పోలీసులు నరసరావుపేటకు చెందిన క్రికెట్ బుకీల విషయంలో ఇంత చేస్తూంటే పల్నాడు జిల్లా పోలీసులు మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నరసరావుపేట అడ్డాగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నా ఎందుకు స్థానిక పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారని విమర్శలొస్తున్నాయి. బుకీలు ఇస్తున్న మామూళ్లతో కొందరు పోలీసులు బెట్టింగ్ దందాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వాదనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. బెట్టింగ్ జడలు విప్పి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నా దీనిని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. నరసరావుపేటతో పాటు మారుమూల గ్రామాల్లో సైతం బెట్టింగ్ చాపకింద నీరులా విస్తరించింది. ఇటీవల జరిగిన వరల్డ్ టీ20 ప్రపంచకప్లో ప్రతి మ్యాచ్కు జిల్లా వ్యాప్తంగా రూ.కోట్ల చేతులు మారాయి. ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో ఈ బెట్టింగ్ జరుగుతోంది. అవగాహన సదస్సులు పెట్టి, ప్రెస్నోట్లు ఇచ్చి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ నెల 28వ తేదీ నుంచి ఐపీఎల్ మొదలు కానున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం క్రికెట్ బెట్టింగ్ నిర్మూలనపై క్షేత్రస్థాయిలో మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ముస్లింలతో మమేకమైన వైఎస్సార్సీపీ నేతలు
మాచర్ల: రంజాన్ నెల చివరి రోజున మాచర్ల పట్టణంలోని నూర్ మసీదు, మర్కస్ మసీదుల్లో శుక్రవారం రాత్రి ముస్లిం సోదరులకు పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడు పరిశీలకుడు యెనుముల మురళీధర్రెడ్డిలు రంజాన్ ముందుగా శుభాకాంక్షలు తెలిపి దువా చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడి ఆధ్వర్యంలో నాయకులంతా మసీదులో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముక్తీసాబ్ షేక్ గౌస్ దువా చేసిన అనంతరం ఉపవాసం విడిచిన ముస్లింలకు వారు ఖర్జూర పండ్లు, స్వీట్లు అందజేశారు. ముందుగా పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి మసీదు వరకు నడుచుకుంటూ వెళ్ళి ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ జలీల్, వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్, నియోజక వర్గ అధ్యక్షులు అబ్దుల్ సత్తార్, ఉప్పలపాటి జాని, పఠాన్ గౌస్, షేక్ రహమాన్, షేక్ అంగార్బాషా, షేక్ సులేమాన్, ఉప్పలపాటి జాని, షేక్ నాగూర్, కిజర్, సైద్మస్తాన్, షేక్ జాని, పఠాన్బద్రుద్దీన్, అబ్దుల్ రహీం, చికెన్ బాజి, మాయ సుభాని, మహ్మద్ రఫి, పట్టణ పార్టీ అధ్యక్షులు పోలా శ్రీను, మున్సిపల్ మాజీ చైర్మన్ బోయ రఘురామిరెడ్డి, కామనబోయిన కోటయ్య, కౌన్సిలర్ మందా సంతోష్, వేల్పుల గురవయ్య ్డ తదితరులున్నారు. -
భృతి భ్రమ.. కొలువు మమ!
సత్తెనపల్లి: చదువుకున్నారక ఉద్యోగాలు రాక వేలాది మంది నిరుద్యోగులుగా మిగిలి పోతున్నారు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకపోతే ప్రతి నెలా రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు .. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం మానేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్రలో ఉద్యోగ అవకాశాలపై పలుచోట్ల హామీలు ఇచ్చారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని గొప్పలు చెప్పారు. తీరా చూస్తే అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలు తొలగించడం తప్ప కొత్తగా ఇవ్వడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. ఇచ్చేది గోరంత .. ప్రచారం కొండంత అన్నట్టుగా ఉంది ప్రభుత్వ తీరు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు.ఒక ఏడాది గడిచిపోగా .. రెండో ఏడాది కేవలం 10 వేల పోస్టులతో అరకొరగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 5.23 లక్షల మందికిపైగా.. ఉగాదికి కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసింది. అసెంబ్లీ సాక్షిగా 90 వేలకుపైగా ఖాళీ పోస్టులు ఉన్నట్లు గతంలో ప్రకటించింది. తీరా చూస్తే అన్ని విభాగాల్లో ఉన్న వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కేవలం 10 వేల పోస్టులతో మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 20.42 లక్షలు. జిల్లా వ్యాప్తంగా 5.23 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికొకరు చొప్పున లెక్క వేసిన జిల్లాలో 5.23 లక్షల మందికిపైగానే నిరుద్యోగులు ఉన్నారు. రాష్ట్రమంతటికీ కలిపి కేవలం 10 వేల పోస్టులతో మాత్రమే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికల హామీ మేరకు ఉద్యోగం ఇవ్వకపోగా.. కనీసం రూ. 3 వేల భృతి వరకే తీసుకున్నా ప్రతి నెలా ప్రభుత్వం రూ. 156.90 కోట్లకు పైగా చెల్లించకపోవడంపై కూడా నిరుద్యోగులు నిరసన గళం వినిపిస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వలస బాట... చదువుకున్నా ఇక్కడ ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో అనేక మంది యువతీయువకులు తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ముంబై వంటి సుదూర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వలస పోవాల్సి వస్తోంది. గుంటూరులోని ఉమ్మడి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యాన కొన్నేళ్లుగా ప్రభుత్వ నియామకాలు జరగడమే లేదు. వాటిల్లో నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చాలామంది ప్రైవేట్ సంస్థల్లో చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. ఎన్నికల వేళ ‘బాబు ష్యూరిటీ – జాబ్ గ్యారెంటీ’ అంటూ ఊదరగొట్టిన కూటమి నేతలు.. అధికారం చేపట్టిన తర్వాత యువతను నట్టేట ముంచారు. టీడీపీ సర్కార్ కొలువుదీరి రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడంతోపాటు ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించారు. ఇప్పుడు పదివేల పోస్టులతో సరిపెడుతూ నిరుద్యోగులను సర్కార్ మోసం చేస్తోంది. ఈ క్రమంలో కనీసం నిరుద్యోగ భృతి అమలు చేస్తారని ఎదురు చూస్తున్న యువతకు కూడా మొండిచేయి చూపుతోంది. రాష్ట్రంలో లక్షలాది ఖాళీలు ఉన్నప్పటికీ, వాటిని పూర్తిగా భర్తీ చేయకుండా కేవలం కొద్ది పోస్టులతో పరిమితమవడం నిరుద్యోగులకు అన్యాయం చేయడమే. ఇంటికో ఉద్యోగం లేకపోతే నెల నెలా రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం. –కోట సాయికుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్, పల్నాడు జాబ్ కావాలంటే బాబు రావాలని, తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోగా .. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులను తొలగించారు. వలంటీర్లు, ఉపాధి హమీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న వారు, ఏపీ ఫైబర్ నెట్, ఏపీఎండీసీ కాంట్రాక్ట్ వర్కర్లు, యానిమేటర్లు, విద్యుత్ మీటర్ రీడర్లు, విద్యుత్ సబ్స్టేషన్లలో ఆపరేటర్లు, ఆశా కార్యకర్తలు, స్కూల్ ఆయాల వంటి వారు వీరిలో ఉన్నారు. వీరందరూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వలంటీర్లకు రూ. 5 వేలు కాకుండా, రూ. 10 వేలు ఇస్తామన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల హామీ గాల్లో కలసిపోయింది. వలంటీర్లను చివరకు రోడ్డుపైకి నెట్టేశారు. -
కార్మెల్ కొండ వద్ద విద్యార్థుల ప్రార్థనలు
ఫిరంగిపురం: మండల కేంద్రంలోని కార్మెల్ కొండపై ఉన్న కార్మెల్ మాత వద్ద సెయింట్ ఆన్స్ సెంటినరీ ఇంగ్లిషు మీడియం పదవ తరగతి విద్యార్థులు ప్రార్థనలు నిర్వహించినట్లు పాఠశాల హెచ్ఎం సిస్టర్ కె.నిర్మల తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా దైవానుగ్రహం అందేలా ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉపాథ్యాయులు కె.అనిల్, విద్యార్థులు పాల్గొన్నారు. పోలేరమ్మ తిరునాళ్ల వేడుకలు రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి దేవాలయ 37వ వార్షికోత్సవ తిరునాళ్ల వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజనరీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తిరునాళ్లకు వచ్చిన భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. గ్రామస్తులు విద్యుత్ ప్రభను నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రొంపిచర్ల పోలీసులు తిరునాళ్లలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. సాగర్ నీటి మట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 535.70 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 8,541, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 18,864 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 18,864 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


