breaking news
Palnadu
-
గంజాయి తాగి, విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్
● 1.3 కిలోల గంజాయి స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు తెనాలిరూరల్: గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసి, వీరి నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను డీఎస్పీ బి.జనార్ధనరావు వెల్లడించారు. నందివెలుగు జంక్షన్ వద్ద బ్రిడ్జి కింద గంజాయి విక్రయాలు, తాగుతున్నట్లు అందిన సమాచారంతో సోమవారం సాయంత్రం తెనాలి రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. తెనాలి రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, డెప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్, వీఆర్వోలు గుంపెన నాగరాజు, కొత్త జార్జి థామస్ సమక్షంలో దాడులు చేశారు. అబ్దుల్ కరీమ్(కొల్లిపర), అమిరె ఆనంద్ కిషోర్ అలియాస్ చోటు(కొల్లిపర), షేక్ సాధిక్(తెనాలి), కోలా రత్నరాజు(తెనాలి), దేవరకొండ మను శివశంకర్ అలియాస్ బబ్లూ(తెనాలి), బత్తెన అజయ్కుమార్(తెనాలి), రెడ్డి సాయికుమార్(తెనాలి) గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా గంజాయిని గుంటూరుకు చెందిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వీరి సమాచారంతో మంగళవారం ఉదయం గుంటూరు చుట్టుగుంట ప్రాంతంలో దాడి చేసి ప్రధాన సప్లయర్లుగా పేర్కొన్న ఆరేటి నవీన్న్, షేక్ షఫీలను అరెస్టు చేశారు. తెనాలి ప్రాంతానికి గంజాయి సరఫరా చేస్తున్న ముఠా లింక్ను ఛేదించారు. అరెస్టయిన వారిలో పలువురిపై గతంలోనూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కొందరిపై దొంగతనాలు, ఎన్న్డీపీఎస్ కేసులు ఉండగా, షేక్ షఫీపై ఎన్న్డీపీఎస్, ఆయుధాల చట్టం, హత్య, దాడి తదితర కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచగా రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె. ఆనంద్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్తో పాటు సిబ్బందిని డీఎస్పీ జనార్ధనరావు అభినందించారు. సమావేశంలో తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ ఉన్నారు. -
రేషన్ మాఫియాలో అంతర్గత పోరు
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం అంతర్గత పోరుకు దారి తీసింది. పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మరో రేషన్ మాఫియా అడ్డుకొని దాడికి పాల్పడింది. వారి నుంచి డ్రైవర్ తప్పించుకునే క్రమంలో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టటం కలకలంరేపింది. సంఘటనలో గాయపడ్డ వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అక్రమ రేషన్ మాఫియా వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాలు ప్రకారం.. ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు సోమవారం నరసరావుపేటలో రేషన్ బియ్యం కొనుగోలు చేసి వాహనంలో అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న పట్టణానికి చెందిన రేషన్ మాఫియా సభ్యులు నాలుగు మోటార్ సైకిళ్ల పై కోట సెంటర్ వద్దకు చేరుకొని వాహనాన్ని వెంబడించారు. ఒక చోట వాహనాన్ని అడ్డగించి డ్రైవర్పై దాడికి యత్నించినట్లు తెలిసింది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ ఇరువురు ద్విచక్ర వాహనదారులను ఢీకొట్టాడు. అనంతరం వాహనం వేగంగా నడుపుకుంటు అక్రమ రేషన్ బియ్యంతో డ్రైవర్ పారిపోయాడు. ఈ ఘటన మొత్తం స్థానిక సీసీ కెమెరాలలో నిక్షిప్తమైంది. అక్రమ రేషన్ వాహనాన్ని అడ్డుకోవటంతో మొదలైన వ్యవహారం పల్నాడు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, తరలింపుల వెనుక ఉన్న వర్గాల మధ్య అంతర్గత పోరును బయటపెట్టింది. పేదలకు అందాల్సిన బియ్యం ప్రతినెలా యథేచ్చగా అక్రమంగా తరలి వెళ్తుతుందనటానికి ఈ సంఘటన అద్దం పడుతుంది. అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి విచారణ చేపట్టితే రేషన్ మాఫియా అక్రమాలు బయటపడతాయి. ఈ వ్యవహారం బహిర్గతం కావటంతో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతొంది. కాగా రేషన్ అక్రమ రవాణాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
పరిశ్రమల ఏర్పాటుకు సౌకర్యాలు కల్పిస్తాం
నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అవసరమైన సౌకర్యాలను కల్పించి ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వన్ ఫ్యామిలీ–వన్ ఎంట్రప్రెన్యూర్ స్లోగన్తో ఎంఎస్ఎంఈ గ్రోత్ వర్క్షాప్ మంగళవారం కాసు సెంట్రల్లో నిర్వహించారు. తొలుత శివశంకరరావు, మరో ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాతో కలిసి జ్యోతి ప్రజ్వలనలో పాల్గొన్నారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ఉత్పత్తి, మార్కెటింగ్, రుణ సౌకర్యాలు, డిజిటల్ ఆధారిత సేవల వినియోగం వంటి అంశాల మధ్య సమన్వయం సాధించేందుకు, సులభతరంగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అన్నింటిని ఒకే వేదిక మీదకు తీసుకు వస్తున్నట్లుగా చెప్పారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన పరిశ్రమలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను పల్నాడు జిల్లా యంత్రాంగం అందిస్తుందని తెలియజేశారు. నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన వివిధ అంశాలపై పరిజ్ఞానం అందించేందుకు ప్రత్యేక సెమినార్లు, హెల్ప్ డెస్క్, స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాటిని ముఖ్యఅతిధులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి పలు సూచనలు చేశారు. జిల్లా పరిశ్రమల అధికారి వెంకట సురేష్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ డాక్టర్ గుడిపూడి చిన్నరాజు, సీఈఓ విశ్వ మనోహర్ పాల్గొన్నారు. ఏపీఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు -
చెరువు భూముల్లో కబ్జాపర్వం
నరసరావుపేట: నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలకు అంతేలేకుండా పోయింది. అధికారాన్ని అడ్డంపెట్టుకొని వారం క్రితం నలుగురు కార్యకర్తలు సత్తెనపల్లి రోడ్డులోని సుమారు 37 ఎకరాల విస్తీర్ణంలోని కత్తవ చెరువులో కొంతభాగం ఆక్రమణలకు పాల్పడ్డారు. ఒకటవ వార్డులోని చెరువుకు ఉత్తరం వైపున సుమారు 12 సెంట్ల స్థలంలో మట్టిపోసి చదును చేశాక రేకుల షెడ్లు వేశారు. అధికారులు అటు వాటివైపు చూడకుండా ఆ షెడ్ల ముందు విద్యాశాఖా మంత్రి నారాలోకేష్ ఫొటోలతో ఉన్న టీడీపీ జెండాలు పాతారు. సాయినగర్కు చెందిన శ్రీనివాస్, ఓ రేషన్డీలర్తో పాటు మరో ఇద్దరు టీడీపీ వర్గీయులు ఈ ఆక్రమణలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన వారికి సమీపంలోని రేషన్ డీలర్ వృద్ధాశ్రమానికి స్థలం ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు. నిధులు మంజూరు రెండు నెలల క్రితం కత్తవ చెరువును సుందరీకరణ చేసేందుకు అమృత్ పథకం కింద ఏపీ అర్బన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ (ఏపీయూజీబీసీ) సంస్థ రూ.5.50 కోట్లతో పనులు మొదలు పెట్టారు. ప్రొక్లయినర్తో చెరువులోని పిచ్చిమొక్కలు తలగించారు. సుమారు వందేళ్ల క్రితం ఈ చెరువు ఆవిష్కృతమైంది. పట్టణంలోని కత్తవ కాలువ గుండా వచ్చే నీరు అందులో చేరేది. దానికింద ఆయకట్టు కూడా ఉంది. చాలామంది రైతులు తమ పొలాల్లో పశువుల గడ్డిని పెంచుతున్నారు. కొన్నేళ్లుగా చెరువు కట్టలు అదృశ్యమై ఆక్రమణలకు నిలయంగా మారింది. సత్తెనపల్లిరోడ్డులో ఆ వైపున ఉన్న చెరువు కట్టను తొలచి లోపలికి ఆక్రమించుకుంటూ అనేక షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మాణాలు చేశారు. జిల్లా కేంద్రమైన తర్వాత పట్టణంలో ఏ మూల చూసినా సెంటు స్థలం రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు పలుకుతోంది. దీంతో అక్రమార్కుల దృష్టి ఈ చెరువుపై పడింది. అధికార బలాన్ని ఉపయోగించి అప్పనంగా ఆక్రమించుకొని కొన్నిరోజుల పాటు తమ కిందే ఉంచుకొని వాటిని ఎంతోకొంతకు అమ్ముకుంటూ లాభ పడు తున్నారు. -
వైద్య కళాశాలలో అత్యాధునిక ఎక్స్రే యూనిట్ ప్రారంభం
పిడుగురాళ్ల రూరల్: పల్నాడు ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ వైద్య రంగం ద్వారా చేరువ చేయడమే తమ ప్రధాన ధ్యేయమని పిడుగురాళ్ల మెడికల్ కళాశాల ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌరి, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ బాబు, అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కామేపల్లి గ్రామంలోనే మెడికల్ వైద్య, కళాశాలలో అత్యాధునిక ఎక్స్–రే యూనిట్ను మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అత్యాధునిక ఎక్స్–రే యూనిట్ అందుబాటులోకి రావడం వల్ల ఎముకల పగుళ్లు, ఛాతీ ఇన్ఫెక్షన్లు, ఇతర ప్రాథమిక ఆరోగ్య సమస్యలను తక్షణమే, ఖచ్ఛితంగా నిర్ధారించడం వీలవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం తప్పుతుందన్నారు. రేడియాలజీ ఇన్చార్జి డాక్టర్ సౌజన్య, ఆర్థోపెడిక్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జోత్స్న, వైద్య సిబ్బంది, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు -
గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రత ముఖ్యం
నరసరావుపేట: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తితో పూజిద్దాం.. భద్రతతో పండుగ జరుపుకొందామని ప్రతి ఒక్కరూ భావించాలని పిలుపునిచ్చారు. మండపాల్లో విద్యుత్ అలంకరణలు, తాత్కాలిక విద్యుత్ వినియోగం విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. గణేష్ మండపాలను విద్యుత్ స్తంభాలు, తీగలకు తగినంత దూరంలో ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల పైనుంచి విద్యుత్ తీగలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ అలంకరణలకు నాణ్యమైన వైర్లు, స్విచ్లు, ప్లగ్లు మాత్రమే వినియోగించాలని తెలిపారు. మండపాలకు అనధికారికంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోవద్దని స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసే సమయంలో భక్తులు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని తెలిపారు. అత్యవసర వాహనాలు, సేవలకు ఆటంకం కలుగకుండా మండపాల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ వరకు గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా అందించనున్నట్లు తెలిపారు. 500 వాట్లకు రూ.వెయ్యి, వెయ్యి వాట్లకు రూ.2,250 చొప్పున రుసుం ఉంటుందని ఆయన వెల్లడించారు. మండపాల నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టవిరుద్ధంగా విద్యుత్ను వినియోగించరాదని సీఎండీ హెచ్చరించారు. అనధికారిక కనెక్షన్లు తీసుకోవడం లేదా అక్రమంగా విద్యుత్ వినియోగించడం నేరమని తెలిపారు. అలాంటివి గుర్తిస్తే నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
పట్టా రైతులకు బ్యాంకు రుణాలు అందించండి
డీఎల్ఆర్సీ సమావేశంలో కలెక్టర్ నరసరావుపేట: కౌలు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా రైతులకు సత్వరమే బ్యాంకు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం డీసీసీ, డీఎల్ఆర్సీ జూన్ క్వార్టర్ సమావేశం నిర్వహించారు. దీనికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రధాన మంత్రి సురక్షిత భీమా యోజన (పీఎంఎస్బీవై) గురించి జిల్లాలోని ప్రజలకు అవగాహన కోసం బ్రాంచ్లలో పోస్టర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వివిధ సబ్సిడీ పథకాలపై కనీసం నెలకు రెండు రుణ మేళాలు నిర్వహించాలన్నారు. ఎక్కువ మంది లబ్ధిదారులకు రుణాలు అందించే విధంగా చూడాలని బ్యాంకర్లను కోరారు. ఈ ఏడాది జూన్ వరకు జరిగిన ప్రాధాన్యత, ఇతర రంగాల రుణ వితరణపై సమీక్షించారు. సాగు రంగానికి రూ.17,761 కోట్ల వార్షిక లక్ష్యానికిగాను జూన్ క్వార్టర్ నాటికి రూ.5,927.84 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ.3,112 కోట్లకు గాను రూ.1,445 కోట్లు, ప్రాధాన్యత రంగానికి రూ.21,490 కోట్లకు రూ.7,445 కోట్లు, ఏసీపీకి రూ.25,879 కోట్లకు రూ.9,086 కోట్లు లక్ష్యం సాధించినట్లు పేర్కొన్నారు. ఎల్డీఎం కేఎస్ రామ్ప్రసాద్, కన్వీనర్ డి.లక్ష్మీనారాయణ, యూబీఐ రీజినల్ హెడ్, నాబార్డు డీడీఎం శరత్, ఆర్బీఐ ఎల్డీఓ రామకృష్ణ, బ్యాంక్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యపు చీకట్లు
నరసరావుపేట టౌన్: పగలంతా వాహనాల రద్దీ.. రాత్రయితే విద్యుత్ దీపాలు వెలగక అలుముకునే చీకటి.. ఇదీ పల్నాడు జిల్లాలోని అన్ని పట్టణాల్లో పరిస్థితి. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గురజాల వంటి పురపాలక సంఘాల్లోని ప్రధాన రహదారులు, కీలక కూడళ్లలో సరిపడా వెలుతురు లేక వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా పట్టణాలకు ఆనుకొని జాతీయ రహదారులు ఉండటంతో రాత్రుళ్లు తిరిగే వాహనాల సంఖ్య ఎక్కువైంది. జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణ నడిబొడ్డున ఉన్న మల్లమ్మ సెంటర్ రాత్రివేళల్లో చిమ్మచీకటిని తలపిస్తోంది. ట్రాఫిక్ సిగ్నళ్లు, డివైడర్లు ఎక్కడున్నాయో వాహనదారులకు సరిగ్గా కనిపించక తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగిలిన పట్టణాల్లో ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాత్రి వేళ కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక అంధకారం నెలకొంటోంది. వాహనదారులకు రహదారి సరిగ్గా కనిపించక తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీధి దీపాల్లో తగ్గిన కాంతి.. పురపాలక సంఘాల్లో ఎప్పుడో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో కాంతి ఇవ్వటం లేదు. కాలం గడిచేకొద్దీ వాటి వెలుతురు సామర్థ్యం తగ్గటంతో రహదారులపై ప్రకాశవంతమైన కాంతి కనిపించటం లేదు. దీంతో చాలా చోట్ల విద్యుత్ దీపాలు ఉన్నప్పటికీ వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోతోందని వాహనదారులు చెబుతున్నారు. వీధిదీపాలను మార్చి కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ మరమ్మతులతో సరిపెడుతున్నారు. అవసరమైన పలు ప్రాంతాల్లో అదనపు వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు తగిన చర్యలు తీసుకోవటం లేదు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. చీకటిని ఆసరాగా చేసుకొని దొంగతనాలు చోటుచేసుకునే అవకాశాలూ లేకపోలేదు. అవసరమైన ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేసి రాత్రంతా పూర్తిస్థాయిలో వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. హైదరాబాద్, గుంటూరు, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల వైపు నుంచి నరసరావుపేటకు రాకపోకలు సాగించే వాహనాలు నరసరావుపేటలోని మల్లమ్మ సెంటర్ మీదుగానే వెళ్లాలి. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ కూడలి పట్టణానికి ప్రధాన ప్రవేశ మార్గంగా ఉంది. ఇంతటి ముఖ్య ప్రాంతంలో రాత్రిళ్లు సరైన వెలుతురు లేకపోవడం పట్ల వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్లమ్మ సెంటర్ మధ్యలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నళ్లను ఇప్పటికే పలుమార్లు భారీ వాహనాలు ఢీకొన్న ఘటనలు ఉన్నాయి. రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్లను సైతం వాహనాలు ఢీకొంటున్నాయి. వీటన్నింటికీ అక్కడ సరైన వెలుతురు లేకపోవటమే కారణం. -
విజ్ఞాన్కు హెచ్సీఎల్టెక్ ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’ గుర్తింపు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సీఎల్టెక్ ప్రతిష్టాత్మకమైన ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’ గుర్తింపు అందజేసింది. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మంగళవారం వైస్ చాన్సలర్ కృష్ణకిషోర్కు హెచ్సీఎల్టెక్ క్యాంపస్ రిక్రూట్మెంట్ విభాగ ప్రతినిధి రాజమురుగన్ అథిముత్తు నాడర్ ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’కు సంబంధించిన ప్రశంసాపత్రాన్ని అందజేశారు. హెచ్సీఎల్టెక్ సంస్థ తన ప్రశంసాపత్రంలో సాంకేతిక ప్రతిభావంతుల భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఇరువర్గాల ఉమ్మడి నిబద్ధతను ప్రత్యేకంగా అభినందించింది. ‘ప్రైమస్ క్యాంపస్ పార్ట్నర్’గా విజ్ఞాన్ యూనివర్సిటీతో కలిసి విద్యా రంగం– పరిశ్రమ మధ్య బలమైన వారధిని నిర్మిస్తున్నామని, విద్యార్థులు తమ నైపుణ్యాలను చాటుకుని వృత్తిపరమైన కెరీర్లో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు ఈ భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, డీన్లు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఇరువురికి తీవ్ర గాయాలు సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఇరువురికి తీవ్ర గాయాలైన ఘటన పట్టణంలోని అచ్చంపేటరోడ్లో పట్టణ శివారులో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన ఆదిమూలపు దివ్య, భర్త రాంబాబు ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో పట్టణంలోని అంబేడ్కర్నగర్కు చెందిన షేక్ సిద్ధిక్ స్కూటీపై పాకాలపాడు వైపు వెళుతుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆదిమూలపు దివ్య(35) తలకు బలమైన గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. భర్త ఆదిమూలపు రాంబాబుకు తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అలాగే షేక్ సిద్ధిక్ తలకు, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో ఇరువురు క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సిద్ధిక్కు 15 కుట్లు పడగా పరిస్థితి విషమంగా మారింది.పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. నగరంపాలెం: ఆర్టీసీలోకి ప్రవేశపెట్టే విద్యుత్ బస్లను ఆర్టీసీ ద్వారానే నడపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యుత్ బస్ల డిపోల ఏర్పాటు పేరుతో మూసివేసిన అలిపిరి, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు– 2, గుంటూరు– 2, విద్యాధరపురం డిపోలను పునఃప్రారంభించాలని కోరారు. పెరుగుతున్న మహిళల ఉచిత ప్రయాణికుల దృష్ట్యా బస్లు, సిబ్బందిని పెంపొందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బస్ల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. మూతపడిన డిపోలను వెంటనే పునః ప్రారంభించాలని అన్నారు. శిబిరంలో ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.హనుమంతరావు, ముత్యాలరావు, చింతల శ్రీనివాసరావు, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకులు కె.గంగాధర్రావు, జె.నాంచారయ్య, కె.పాములు మద్దతు ప్రకటించగా, ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎంవీఎస్.రామకృష్ణ, కార్యకర్తలు వి.మధుసూదన్రావు, సిహెచ్.శ్రీను, టి.శ్రీను, రవిచంద్, జయశ్రీ, బి.రామాంజనేయులు, ఎల్.వి.ఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: పన్నులు చెల్లించకుండా రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడి, నిర్బంధంలో ఉన్న వాహనాలు ఈనెల 26 వేలం నిర్వహించనున్నట్లు గుంటూరు ఉపరవాణా కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఉప రవాణా కమిషనరు కార్యాలయ ఆవరణలోని 33, తెనాలి కార్యాలయంలోని 33 వాహనాలు (హెచ్జీవీలు, ఎంజీవీలు, ఎల్జీవీలు, మోటార్ సైకిల్స్, మోటార్కార్, మ్యాక్సిక్యాబ్లు) ఈ వేలంలో విక్రయిస్తామని తెలిపారు. సంబంధిత వాహనాల యజమానులు, ఫైనాన్షియర్లు చెల్లించాల్సిన పన్నులు, అపరాధ రుసుం ఈనెల 25లోగా చెల్లించాలని అన్నారు. లేనిచో ఈనెల 26 మధ్యాహ్నం రెండు గంటలకు గుంటూరు డీటీఓ కార్యాలయంలో వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
21న బ్యాంకు అధికారులకు అర్జీలు అందజేత
లక్ష్మీపురం: కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 21న బ్యాంకు అధికారులకు అర్జీలు అందజేయనున్నట్లు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల రామకృష్ణ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో వేలాది ఎకరాల దేవాలయ భూములను పేద రైతులు సాగు చేస్తున్నారని, వారికి దేవదాయ శాఖ అధికారులు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు ఇవ్వాలని కోరారు. పంట వచ్చిన తరువాత కౌలు చెల్లంచేందుకు అనుమతినివ్వాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులందరికీ వర్తింప చేయాలని, పంట నష్టపరిహారాలు కౌలు రైతులకు కూడా ఇవ్వాలన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పొడిగింపునకు, నల్లమడ ఆధునికీకరణకు ఒకే సారి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు నీలాంబరం, ఏడుకొండలు, మొగిలయ్య, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల రామకృష్ణ -
చెరువును పరిశీలించిన ఇరిగేషన్ ఎస్ఈ
సత్తెనపల్లి: పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే లక్కరాజుగార్లపాడు రోడ్లోని చెరువును ఇరిగేషన్ ఎస్ఈ టీ రమేష్ మంగళవారం పరిశీలించారు. కాలువల నుంచి విడుదలైన నీటిని పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని చెరువు నింపుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువును ఆయన పరిశీలించి ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయనతోపాటు ఇరిగేషన్ ఈఈ మురళీధర్, ఏఈ సుందర్రావు, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ బి.మధుసూదనరావు, ఏఈ సాగర్మరియరాజు, సిబ్బంది ఉన్నారు. గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాంఫాం సార్వత్రిక, దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.మణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న రెండు నెలలపాటు తేనెటీగల పెంపకం, చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ ఆధారిత, ఉత్పత్తుల తయారీ వంటి కోర్సులు నిర్వహిస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.1,500 చొప్పున ఫీజు చెల్లించి కోర్సుకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ సదుపాయం కంప్యూటర్, ఆండ్రాయిడ్ సెల్ఫోన్, ఐపాడ్ కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీగా నిర్ణయించారన్నారు. ఆసక్తి కలిగినవారు మరిన్ని వివరాలకు ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ వెబ్సైట్ను గానీ, 70366 89346, 91822 45693 ఫోన్ నంబర్లనుగానీ ఉదయం 9–సాయంత్రం 7 గంటల వరకు సంప్రదించాలన్నారు. గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జీజీహెచ్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఆగస్టు 21 వ తేదీ నుంచి పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం జీజీహెచ్లో నల్లమాస్క్లు ధరించి నిరసన తెలియజేశారు. తమ ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు నూరు శాతం గ్రాస్ జీతం చెల్లించాలన్నారు. బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు స్టాఫ్నర్సులు రమాదేవి, సుజిత, హైమావతి, శైలజ, భార్గవి, అంజలి, ల్యాబ్ టెక్నీషియన్లు ఖాసీం, రమేష్, వాణి, ఆదిలక్ష్మి, శైలజ, ఫార్మాసిస్టులు శ్రీలక్ష్మి, సుజాత, అశ్విని తదితరులు పాల్గొన్నారు. గుంటూరు లీగల్: అక్షరాలు జీవితాన్ని మార్చగలవని, చదువుకున్న సమాజం దేశ భవిష్యత్తును మార్చగలదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మంగళవారం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జియాఉద్దీన్ మాట్లాడుతూ అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, లెక్కలు చేయడం కాదన్నారు. హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను అర్థం చేసుకోవడం అన్నారు. మహిళ చదువుకుంటే కుటుంబం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఒకరినైనా అక్షరాస్యులుగా మార్చేందుకు మనవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ ఎం.వెంకట రమణప్ప, జిల్లా బాలల పరిరక్షణ సంస్థ అధికారి సీహెచ్ విజయ్కుమార్, డీపీఓ పి.వి.నాగసాయికుమార్, సోషల్ వెల్ఫేర్ శాఖ సూపరింటెండెంట్ కె.మధుసూదన్, ట్రైబల్ వెల్ఫేర్ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఎ.పద్మావతి, ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
నరసరావుపేట: జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. మంగళవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో చిలకలూరిపేట పురుషోత్తంపట్నం జంక్షన్ వద్ద గత నెలలో జరిగిన ఆటో ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతిచెందడం, ఆరుగురు గాయపడిన సంఘటనపై ట్రాన్స్పోర్టు, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, పోలీస్ , చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రహదారి ప్రమాదాల పరిస్థితి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, హాట్స్పాట్, బ్లాక్ స్పాట్ల వద్ద తీసుకుంటున్న చర్యలు, రహదారి భద్రత ప్రమాణాలపై సమీక్షించారు. చిలకలూరిపేట హైవేపై ఐదు హాట్ స్పాట్లు, నాలుగు బ్లాక్ హోల్స్ను గుర్తించినట్లు కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. పురుషోత్తం పట్నం జంక్షన్, ఎన్ఆర్టీ జంక్షన్ల వద్ద రోడ్లపై ఆక్రమణలు ఉన్నాయని, వాటిని తొలగించాలని, ట్రాఫిక్ డివైడర్ల మధ్యలో అడ్వర్టైజ్మెంట్ బోర్డులు కూడా తొలగించాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చి వాటిని తొలగించాల్సిందిగా చిలకలూరిపేట ఆర్డీవోని కలెక్టర్ ఆదేశించారు. పురుషోత్తంపట్నం, ఎన్ఆర్టీ, విజయ బ్యాంక్, ఏఎంజీ సెంటర్లు, బస్స్టాండుల వద్ద లైట్లు, సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పురుషోత్తంపట్నం యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. జిల్లా ఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్, అదనపు ఎస్పీ -
రిజిస్ట్రేషన్ రద్దుతో కథ కంచికేనా?
యడ్లపాడు: పట్టణ నడిబొడ్డున రూ.కోట్ల విలువైన మున్సిపల్ రిజర్వు స్థలానికి సంబంధించి సాగిన రిజిస్ట్రేషన్ వ్యవహారం చివరకు రద్దుతో ముగిసింది. అయితే రిజిస్ట్రేషన్లు రద్దయినంత మాత్రాన అసలు ప్రశ్నలు మాత్రం సమసిపోలేదు. ప్రభుత్వ స్థలానికి ప్రైవేటు సంస్థ పేరుతో పన్ను రశీదు ఎలా జారీ అయింది? సర్వే నంబర్ మార్పుతో ఎండార్స్మెంట్ ఎవరి ఆదేశాలతో వచ్చింది? ఆ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లకు మార్గం ఎవరు సుగమం చేశారు? అనేది అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్తో వెలుగులోకి... స్థానిక ఫైర్స్టేషన్ రోడ్డులోని హెచ్.హెచ్. డైక్మెన్ నగర్లో ఉన్న 27 సెంట్ల మున్సిపల్ రిజర్వు స్థలంలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. ఆ స్థలంలో ఎన్నో ఏళ్లుగా ఏఎంజీ డేకేర్ సెంటర్ ఏర్పాటుతో అనేక సేవలు అందించింది. ఆ సేవలు నిలిచిపోయాక సదరు స్థలాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న ఏడుగురి పేర్లతో దాన దస్తావేజుల ద్వారా రిజిస్టర్ చేసినట్లు రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో అధికారపార్టీ నేతలు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఈ నెల 7వ తేదీన ‘‘ప్రజా ఆస్తి.. ‘పచ్చ’నేతల పరం’’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. పట్టణంలోని కీలక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల పేర్లకు బదలాయింపునకు దస్తావేజులు సిద్ధం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. వివాదం ముదరడంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు సోమవారం రాత్రి చిలకలూరిపేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని దాన దస్తావేజులను రద్దు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్థలం మున్సిపాలిటీదే...! ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబును వివరణ కోరగా.. సర్వే నంబర్ 88/1లో ఉన్న స్థలం వివాదంలోకి రాగానే సదరు స్థలం తమ శాఖదేనని అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామన్నారు. రిజిస్టర్ చేసుకున్న వారు వాటిని స్వచ్ఛందంగా సోమవారం రద్దు చేసుకున్నారని తెలిపారు. ఇక స్థలంపై ఎలాంటి వివాదం లేదని, పూర్తిగా తమ స్వాధీనంలో ఉందని వెల్లడించారు. -
పర్యాటకాభివృద్ధికి చర్యలు
విజయపురి సౌత్: మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని తీసుకురానుంది. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నెలవైన ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించేందుకు నిత్యం పర్యాటకులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో సరికొత్త థ్రిల్, వినోదం, అడ్వెంచర్ అనుభూతిని అందించేందుకు జిప్లైన్, జిప్ సైక్లింగ్ కార్యకలాపాలను ఏపీటీడీసీ టూరిజం యూనిట్ ఎత్తిపోతల జలపాతం వద్ద ఏర్పాటు చేసింది. రైన్బో ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో పర్యాటకశాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ అడ్వెంచర్ కార్యకలాపాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఎత్తిపోతలను మరింత ఆకర్షణీయమైన అడ్వెంచర్, ఫ్యామిలీ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ధి చేయడంలో కీలకంగా మారనున్నాయి. దీంతో ప్రకృతి ప్రేమికులకు మరింత ఆనందంగా గడిపే అవకాశం లభించనుంది. ఈ మేరకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రగతికి ఊతం ఎత్తిపోతలలో ఏకముఖి దత్తాత్రేయ స్వామి ఆలయం, శ్రీరంగనాథ స్వామి దేవాలయాలు ఆధ్యాత్మికతతో వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటికే ఎత్తిపోతల జలపాతం ప్రకృతి ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. ప్రారంభం కానున్న అడ్వెంచర్ కార్యకలాపాలతో పర్యాటకులు మరింత ఎక్కువ సమయం గడిపే అవకాశం ఏర్పడనుంది. భద్రతకు ప్రాధాన్యం ఎత్తిపోతల జలపాతానికి వచ్చే ప్రతి పర్యాటకుడికి ఒక ప్రత్యేకమైన, సురక్షితమైన, మరుపురాని అనుభూతిని అందించాలన్నదే లక్ష్యమని రైన్బో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు పరికరాలు, నిర్మాణాలు, భద్రతా వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలతో కలిసి రూ.1.71 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనుందన్నారు. హోటళ్లు, రవాణా, చిన్న వ్యాపారాలు, పర్యాటక ఆధారిత కార్యకలాపాలకు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. -
నిత్యావసర ధరల పెరుగుదలను అరికట్టాలి
పల్నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ఐద్వా జిల్లా కమిటీ నిరసన నరసరావుపేట: నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పల్నాడు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి గుంటుపల్లి రజిని మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం దుర్భరంగా మారుతుందన్నారు. కందిపప్పు, పంచదార, బియ్యం, ఉల్లిపాయలు, వంట నూనెల ధరలు పెరగడంతో కుటుంబాలపై ఆర్థిక భారం అధికమైందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో ప్రజలకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని, కుటుంబ పోషణతో పాటు డ్వాక్రా రుణాలు, ఇతర అప్పులు తీర్చలేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు గుంటూరు మల్లేశ్వరి మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్పై పన్నుల భారాన్ని తగ్గించాలని, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు అందించి పాత రుణాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షురాలు ఎస్.దుర్గాబాయి, జిల్లా కమిటీ సభ్యురాలు షేక్ ఆయేషా, పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
రాజుపాలెం: పంట వైవిధ్యంతో ప్రకృతి వ్యవసాయం చేస్తే రైతుకు ఆరోగ్యం, ఆదాయంతోపాటు ఆనందం లభిస్తుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి అన్నారు. మండలంలోని రాజుపాలెం, బ్రాహ్మణపల్లి గ్రామాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు గల్లా ప్రసాద్, గుర్రాల మల్లికార్జున్ల పొలాలను ఆమె సోమవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మూడేళ్లుగా ఖరీఫ్కు ముందు పీఎండీఎస్ విధానంలో వివిధ రకాల విత్తనాలను సాగుచేస్తున్నట్లు తెలిపారు. రబీ అనంతరం డ్రైసోయింగ్ చేయడం వలన నేలలో సూక్మజీవుల చైతన్యం పెరిగి భూసారం పెరుగుతుందన్నారు. గల్లా ప్రసాద్ ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని, పొలంలోనే అన్ని వసతులతో కూడిన నివాసం ఏర్పాటు చేసుకుని కుటుంబసభ్యులంతా కలసి ప్రకృతి వ్యవసాయం చేయడం ఆనందదాయకం అన్నారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా క్షేత్రంలోని పంటలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు. పండ్ల మొక్కలు, ఆకు కూరలు, కూరగాయలు, పూలు, సీజనల్ పంటలను కలిపి సాగు చేయడం వలన రైతులకు పంటల ద్వారా నిరంతరం ఆదాయం లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని ఆదరించి రైతులను ప్రోత్సహించాలని కోరారు. -
పీజీఆర్ఎస్ అర్జీలు సత్వరం పరిష్కరించాలి
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్ అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ రోహిహిత్ కుమార్ చౌదరి అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. పీజీఆర్ఎస్లో రోహిత్ కుమార్ చౌదరి పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదరింపులు, ఆక్రమణలు వంటి అంశాలకు సంబంధించిన 82 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. క్షేత స్థాయిలో విచారణ వేగవంతం చేసి చట్ట ప్రకారం న్యాయం చేయాలని ఆదేశించారు. నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్కుమార్ గుంటూరులో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా బెట్టింగ్, జూదాలకు అలవాటుపడి డబ్బును దుర్వినియోగం చేశాడు. ఆర్థిక నష్టాలు భరించాలని బెదిరిస్తున్నాడు. 2025లో రూ.30 లక్షలు ఇచ్చానని, మిగిలిన ఆస్తి కోసం కుమారుడు, కొడలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. –చీమకుర్తి సుబ్రహ్మణ్యం, పిడుగురాళ -
ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్
నరసరావుపేట టౌన్: పార్క్ చేసిన ద్విచక్రవాహనాలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.14 లక్షల విలువైన 22 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. సోమవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. గత కొన్ని నెలలుగా నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో ద్విచక్రవాహన చోరీలు అధికమయ్యాయన్నారు. దీంతో దొంగతనాల నివారణ కోసం వన్టౌన్ సీఐ ఫిరోజ్, ఎస్ఐ వంశీకృష్ణాలు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఆదివారం సాయంత్రం మొదటి రైల్వే గేటు వద్ద తనిఖీలు చేస్తుండగా నూజెండ్ల మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన యన్నాబత్తుని మణికంఠ ద్విచక్రవాహనంపై అనుమానస్పదంగా సంచరిస్తున్నాడన్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ద్విచక్రవాహన చోరీల వ్యవహారం వెలుగు చూసిందన్నారు. అత్యంత చాకచక్యంగా పది రోజలు వ్యవధిలోనే దొంగతనాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. పలు ప్రాంతాల్లో 22 ద్విచక్రవాహనాలు చోరీ చేసినట్లు నేరాన్ని అంగీకరించటంతో దొంగలించబడ్డ వాహనాలను నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు స్వాధీనం చేసుకున్నామన్నారు. వన్టౌన్లో 12, టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు మొత్తం 13 బైక్ చోరీ కేసుల్లో మణికంఠ నిందితుడిగా ఉన్నాడన్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో నేరాలు చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. నిందితుడు రిమాండ్కు వెళ్లిన తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారిస్తామన్నారు. నిందితుడిని పట్టుకోవటంలో ప్రతిభ కనపరిచిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిను అభినందించారు. వారికి రివార్డు ప్రకటించేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. 16 వాహనాలు స్వాధీనం బొల్లాపల్లి : ద్విచక్ర వాహనాల అపహరణకు పాల్పడుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించి, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వినుకొండ రూరల్ సీఐ బి బ్రహ్మయ్య తెలిపారు. బండ్లమోటు పోలీస్స్టేషన్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. మండలంలోని పేరూరుపాడు పంచాయతీ కేశవానిపేట తండాకు చెందిన వడితే సర్తార్ నాయక్, కదలికలపై అనుమానంతో నిఘా ఉంచామని, నిందితుడిని సోమవారం సరికొండపాలెం తండా వద్ద అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. ఈ క్రమంలో పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల పరిధిలో వరుసగా మోటార్ బైకులు చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. సుమారు రూ.11 లక్షల విలువచేసే, 16 ద్విచక్ర వాహనాలను నిందితుని వద్ద స్వాధీనపరచుకుని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. నిందితుడిపై బండ్లమోటు స్టేషన్లో 11 కేసులు, దొనకొండ, తిరుమల 2వ పట్టణ, మాచర్ల పట్టణం, శావల్యాపురం పోలీస్స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదైందని వివరించారు. నిందితుడిపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకోని వాహనాలు స్వాధీనపరచుకోవడంలో ప్రతిభ కనబరచిన బండ్లమోటు ఎస్ఐ సయ్యద్ షమీర్ బాషా, హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజు, రమేష్, కానిస్టేబుల్లు ఇమ్రాన్ ఖాన్, కృష్ణమోహన్, సుమన్, గంగిరెడ్డి, లక్ష్మయ్యలను ఉన్నతాధికారులు అభినందించారు. -
విజయమే అందరి లక్ష్యం
‘స్థానిక’ ఎన్నికలపై వైఎస్సార్ సీపీ సన్నాహాక సమావేశం నరసరావుపేట: రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం కృషి చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్యనాయకులు పిలుపునిచ్చారు. నరసరావుపేటలోని ఓ కల్యాణమండపంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు, జిల్లా, నియోజకవర్గాలకు చెందిన పలు విభాగాల నాయకులకు పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం పార్టీ నాయకుడు రేపాల శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నేతలు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టిన రాజకీయ భిక్షతో ఎంపీగా గెలిచి, అనంతరం టీడీపీలో చేరి ఎంపీ అయిన వ్యక్తి తన పాత పరిచయాలతో ఫోన్లు చేసినా పట్టించుకోవద్దని కోరారు. నాయకులు, కార్యకర్తలు లైను దాటకుండా పార్టీ అఖండ విజయం కోసం కృషి చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడారు. పార్టీ వలంటరీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జున యాదవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సినిమాలో ఇంటర్వెల్ ఫైట్గా భావించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అక్రమ కేసులో పీఆర్కే జైలులో ఉండగా చూసేందుకు వెళ్లిన తనను అరెస్టుచేసి జైలు పాలు చేశారన్నారు. అక్రమ కేసులతో ఇబ్బందులు పడిన పీఆర్కే, విడుదల రజిని, ఇతర నేతలకు పార్టీ అండగా నిలిచిందన్నారు. బీసీ మహిళ రజనిని పల్నాడు నాగమ్మగా భావించిన వెన్నుపోటు పార్టీ నాయకులు భయపడుతున్నారన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని వెన్నుపోటు ప్రభుత్వం ప్రకటించిందని, ఇదో పెద్ద మోసం, దొంగ వాగ్దానం అన్నారు. గత ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో 80 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని, ఇప్పుడు ప్రతి ఒక్కరిని రూ.లక్ష కట్టమని అడుగుతున్నారని, అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని చంద్రబాబు మాటలకు ఇదే అర్ధం అన్నారు. పేకాట క్లబ్పై తాను ఫిర్యాదుచేస్తే పట్టించుకోని పోలీసులు, అధికారులు ఆ క్లబ్పై మరో క్లబ్ నిర్వాహకులు దాడిచేసి ధ్వంసం చేస్తే మూడురోజుల్లో పట్టుకున్నారని, ప్రభుత్వ తీరు ఈవిధంగా ఉందన్నారు. గురజాల, వినుకొండ నియోజకవర్గాల పరిశీలకులు పడాల శివారెడ్డి, బాసు లింగారెడ్డి మాట్లాడారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడితో పాటు జిల్లా పదవులు పొందిన వారందరికీ పార్టీ అందజేసిన గుర్తింపుకార్డులను నాయకులు అందజేశారు. పలు నియోజకవర్గాల పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, చిట్టా విజయభాస్కరరెడ్డి, యెనుముల మురళీధర్రెడ్డి, దొంతిరెడ్డి అంజిరెడ్డి, పార్టీ నాయకులు గుబ్బా చంద్రశేఖర్, టీజీవీ కృష్ణారెడ్డి, చింతా విజయభాస్కరరెడ్డి, జాలయ్య, ఈదా శ్రీనివాసరెడ్డి, జిల్లా, నియోజకవర్గాలకు చెందిన పలు విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో గ్రీన్ వాక్
గుంటూరు మెడికల్: స్వచ్ఛ వాయువు దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు నగరంలో గ్రీన్ వాక్ నిర్వహించారు. స్థానిక బృందావన్గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుజ్జనగుండ్ల వరకు గ్రీన్వాక్ నిర్వహించారు. రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, పరిశ్రమల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు గ్రీన్వాక్లో పాల్గొన్నారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ, వాయువు కాలుష్య నియంత్రణకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రీన్వాక్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మానవ హారం నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలిపిన వేసిన సమయంలో ఇంజన్లను ఆన్లైన్లో ఉంచకుండా ఆఫ్ చేసి ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజినీర్ నజీనా బేగం అన్నారు. వాహనాల ఇంజిన్లు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆఫ్ చయడం వల్ల వాయువు కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలన్నారు. కాలుష్య నియంత్రణ ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు, వాహనదారులు, పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమష్టి కృషితోనే స్వచ్ఛమైన గాలి లక్ష్యాన్ని సాధించగలమన్నారు. విజయపురిసౌత్/నరసరావుపేట: జలవనరుల శాఖ ఫుల్ అడిషనల్ ఎస్ఈగా టి.రమేష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎస్ఈగా పనిచేసిన వెంకటరత్నం గుంటూరుకు బదిలీ కావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈఈ గా విధులు నిర్వర్తిస్తున్న టి రమేష్ అడిషనల్ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జలవనరుల శాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. అడిషనల్ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన టి రమేష్ను ఇరిగేషన్ ఈఈ లు, డీఈలు, జేఈలు, ఉద్యోగులు అభినందించారు. మ్యూజికల్ నైట్కు హాజరుకానున్న దర్శకుడు బోయపాటి ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం 5కె రన్, వాక్ నిర్వహించనున్నారు. అందుకుగాను వర్సిటీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు కలిపి సుమారు 6 వేల మంది ఉత్సాహంగా పాల్గొననున్నారు. క్రీడా మైదానంలో సాయంత్రం 4 గంటలకు నుంచి ప్రారంభమయ్యే 5కే రన్–వాక్ క్యాంటీన, రవీంద్రనాథ్ ఠాగూర్ పరిపాలనా కార్యాలయం, అబ్దుల్ కలాం విగ్రహం, బాలికల హాస్టల్ గేట్ మీదుగా సాగుతుంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకూ జరిగే మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు హాజరు కానున్నారు. అలానే పాడుతా తీయగా ఫైనలిస్ట్ సూర్య కార్తీక్, శ్రీలత బృందం సంగీత విభావరి అందించనున్నారు. పాటలు, నృత్యాలతో పాటు వర్సిటీ విద్యార్థుల కళా ప్రదర్శనలు అలరించనున్నాయి. ప్రత్తిపాడు: ప్రమాదవశాత్తూ కారు అగ్నికి ఆహుతైన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ప్రత్తిపాడుకు చెందిన చేరెడ్డి శ్రీనివాసరరావు తన కుమార్తెను హైదరాబాద్కు చెందిన పుసులూరి దిలీప్కు ఇచ్చి వివాహం చేశాడు. వారిద్దరూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. పిల్లలకు పాఠశాల సెలవులు కావడంతో కుమార్తె ప్రత్తిపాడుకు వచ్చి తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అల్లుడు తన టయోటా కారును ఇంటి వద్ద నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతై పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన కారును ఎస్ఐ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఇంట్లో పట్టపగలు చోరీ
సత్తెనపల్లి: పట్టపగలే చోరీ జరిగిన సంఘటన సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామంలోని ఎస్సీ కాలనీలో సోమవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఫణిదం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి కూచిపూడి రామారావు, మరియమ్మల గృహంలో సుమారు ఉదయం 11:30 గంటల సమయంలో ఎవరు లేకపోవటంతో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మరియమ్మ డ్వాక్రా నగదు చెల్లించేందుకు వెళ్లడంతో ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మూడు సవర్ల బంగారు తాడు, మూడు సవర్ల రెండు బంగారు గాజులు, అరసవర రెండు చెవుల పోగులు, రూ.లక్ష నగదు అపహరించుకుపోయారు. డ్వాక్రా నగదు చెల్లించి ఇంటికి వచ్చిన మరియమ్మ ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లు గుర్తించి తన కుమారుడు కూచిపూడి సైమన్కు తెలిపింది. దీంతో సైమన్ సత్తెనపల్లి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నాదెండ్ల: పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై కత్తితో దాడిచేసిన మరో యువకుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన కాకుమాను వేణుగోపాల్ చిలకలూరిపేట పండరీపురంలో నివాసం ఉంటూ అడ్డరోడ్డు సెంటర్లో కార్ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన పట్టపురాజు సాయి కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల వేణుగోపాల్ కుటుంబంపై సాయి అసభ్యంగా మాట్లాడాడు. ఈ విషయమై ఆదివారం సాయంత్రం గణపవరం జాతీయరహదారి టీమాక్స్ వద్ద ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సాయి తాను ముందుగా తెచ్చుకున్న కత్తితో వేణుగోపాల్పై దాడి చేశాడు. స్ధానికులు సాయిని పోలీసులకు అప్పగించారు. గాయాలపాలైన వేణుగోపాల్ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రాజుపాలెం: పాలిమర్ గోతాల లోడుతో అతివేగంతో వెళుతున్న లారీ నెమలిపురి గ్రామంలో మలుపు వద్ద బోల్తాపడిన సంఘటన మండలంలోని అద్దంకి–నార్కెట్పల్లి రహదారిపై నెమలిపురిలోని పోలేరమ్మ గుడి మలుపు వద్ద సోమవారం రాత్రి జరిగింది. గుజరాత్ నుంచి చైన్నె అతివేగంగా వెళుతున్న లారీ మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ సాయికృష్ణ, క్లీనర్ ఈశ్వర్ ఇద్దరు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో ప్రొక్లెయిన్తో ఇరువురిని బయటకు తీసి 108 సహాయంతో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ డ్రైవర్ సాయికృష్ణ(35) మృతిచెందాడు. ఇరువురు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారని ఎస్ఐ తెలిపారు. రాజుపాలెం: అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టు షాపులో ఇరువురు యువకులు ఘర్షణ పడగా ఒక యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని అనుపాలెం బస్టాండ్ సెంటర్లో నిర్వహిస్తున్న బెల్టు షాపులో సోమవారం జరిగింది. టీడీపీ కార్యకర్త ఆలా రామయ్య కొంత కాలం నుంచి బెల్టు షాపును అక్రమంగా నడుపుతున్నాడు. షాపులోనే సిటింగ్ ఏర్పాటు చేశాడు. నిత్యం మందుబాబులు షాపులో తాగుతుంటారు. అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రోజులాగనే అనుపాలేనికి చెందిన కుంటా సైదారావు, అంచులవారిపాలెంకు చెందిన అంచుల గోపిలు బెల్టు షాపులో మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో ఇరువురి మద్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఉన్నపళంగా అంచుల గోపి కుంటా సైదారావును బీరు సీసాతో మెడమీద పొడవడంతో సృహతప్పి పడిపోయాడు. బంధువులు హుటాహుటీన 108 సహాయంతో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బస్టాండ్ సెంటర్లో బెల్టు షాపు నిర్వహించవద్దని గ్రామస్తులు ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. -
చిరకాల స్వప్నం సాకారం
పిడుగురాళ్ల రూరల్: పల్నాడు చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కతమైంది. దశాబ్దాలుగా వైద్య విద్యకు అందనంత దూరంగా ఉన్న ఈ ప్రాంతవాసుల చిరకాల స్వప్నం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, గురజాల నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిల కృషితో నేడు వాస్తవరూపం దాల్చింది. పిడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాల పర్వం అధికారికంగా ప్రారంభమైంది. వైఎస్ జగన్ కృషితోనే సాకారం వైద్య సేవల కోసం, వైద్య విద్య కోసం పల్నాడు ప్రజలు గుంటూరు, విజయవాడ, బెంగళూరు, చైన్నె, విశాఖపట్నం, హైదరాబాదు వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పల్నాడు ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పిడుగురాళ్ల మండలం, కామేపల్లి గ్రామంలో అత్యాధునిక వసతులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఈ ప్రాజెక్ట్ సాధనలో అప్పటి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. కామేపల్లిలో కాలేజీ ఏర్పాటు కోసం భూసేకరణ నుంచి ప్రభుత్వ అనుమతులు, నిధుల మంజూరు వరకు ప్రతి అడుగులోనూ ఆయన పట్టుదలగా శ్రమించారు. స్థానికంగా భవన నిర్మాణాలు వేగవంతం కావడంలోనూ, ఈ ప్రాజెక్ట్ను పల్నాడు గడ్డపై సాకారం చేయడంలోనూ ఆయన చూపిన నాయకత్వ పటిమ మరువలేనిది. ముగిసిన కౌన్సెలింగ్ జాతీయ వైద్య కమిషన్ అనుమతులతో కౌన్సెలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. కౌన్సెలింగ్ ద్వారా తొలి విడతలో భాగంగా 22 మంది విద్యార్థులు పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాలు పొందారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయి. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి అడ్మిషన్ పొందడం ద్వారా వినుకొండ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఎస్.సన్నీ సరికొత్త చరిత్ర సృష్టించారు. వెనుకబడిన ప్రాంతంగా పేరున్న పల్నాడు గడ్డపైనే స్థానికంగా వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కడంతో విద్యార్థిని కుటుంబంలోనూ, పల్నాడు ప్రాంతంలోను హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం
నరసరావుపేట రూరల్: రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్లో టెన్నిస్ డబుల్స్ విభాగంలో జిల్లా హోంగార్డ్ ఆర్ఐ(అడ్మిన్) ఎస్.కృష్ణ కాంస్య పతకం సాధించారు. ఈనెల 1నుంచి 4వ తేదీ వరకు అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో కృష్ణ ప్రతిభ కనభర్చి ద్వితీయస్ధానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పతకం సాధించిన ఆర్ఐ కృష్ణను అదనపు ఎస్పీ రోహిత్కుమార్ చౌదరి అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనభర్చి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరుకు తీసుకువచ్చారని ప్రశంసించారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. నరసరావుపేట: చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలో ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన వ్యక్తి ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి ఏడుగురి పేరుపై ఉన్న ప్రభుత్వం భూమిని ఆక్రమించి రూ.10కోట్లకు విక్రయించారని పల్నాడు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు, జనతా వారధి జిల్లా కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు, నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓ కె.అద్దెయ్యకు వినతిపత్రం సమర్పించారు. తహసీల్దార్ ద్వారా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని, మున్సిపల్ కార్యాలయం ద్వారా ఇంటి పన్ను వేయించి చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ని మేనేజ్ చేసి సర్వే నెంబరు 138/1 ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించారన్నారు. కొన్నవారు మరల అమ్మకానికి చూపగా అది ప్రభుత్వ భూమి అంటూ అందులో ఉన్న భవనాలు పడేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు అందరిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వృద్ధురాలికి ప్రజాసంఘాల నాయకుల పరామర్శ చీరాల: వృద్ధురాలిపై టూటౌన్ సీఐ శశికుమార్ దురుసుగా ప్రవర్తించి అసభ్యపదజాలంతో దూషించిన ఘటనపై ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు, ఎమ్మార్పీఎస్, ప్రజాసంఘాల నాయకులు స్పందించారు. సోమవారం ఆమె ఇంటికి వెళ్లి ఘటనకు సంబంధించి వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు.వారు మాట్లాడుతూ.. వృద్ధురాలిని అసభ్యంగా దూషించిన సీఐపై చర్యలు తీసుకోకుంటే ప్రజాసంఘాలతో కలిసి దశలవారీగా ఉద్యమిస్తామన్నారు. ఈ ఘటనతో వృద్ధురాలు తీవ్ర భయాందోళనకు గురైందని, పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం అత్యంత ఆందోళనకరమన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే సంయమనం పాటించకుండా దూషణలకు దిగడం సరికాదన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు చట్టాలకు అతీతులు కారని, టూటౌన్ సీఐపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.మోహన్కుమార్ ధర్మా, బలహీనవర్గాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శవనం శామ్యూల్, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ నాయకులు బి.లక్ష్మీనరసయ్య, డి.వందనం, వైహెచ్పిఎస్ నాయకులు మొగిలి ప్రతాప్, కె.ఉమాదేవి, మొగిలి శబరి, బ్రహ్మయ్య, పి.పోలయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు. -
అర్జీలను సత్వరం పరిష్కరించండి
పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట: జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో వచ్చే అర్జీదారులతో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అధ్యక్షత వహించి 115 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా 24 అర్జీలు స్వీకరించగా వాటిలో గురజాల డివిజన్కు చెందిన నాలుగు అర్జీలు, సత్తెనపల్లి –10, నరసరావుపేట డివిజన్కు చెందినవి 10 ఉన్నాయి. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ నిర్వహించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తమ సమస్యల పరిష్కారంపై ఫీడ్బ్యాక్ అందించేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అర్జీ పెట్టిన వెంటనే ట్రై సైకిల్.. స్థానిక లింగంగుంట్లకు చెందిన దివ్యాంగుడు రమేష్ తనకు ట్రై సైకిల్ మంజూరు చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్లో అర్జీ సమర్పించారు. రమేష్ నుంచి కలెక్టర్ స్వయంగా అర్జీని స్వీకరించి, వెంటనే సంబంధిత శాఖ అధికారుల ద్వారా ట్రై సైకిల్ను రమేష్కు అందజేశారు. జేసీ సంజనా సింహ, డీఆర్ఓ అద్దెయ్య, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మహిళ కడుపులో 13 పెన్నులు, 5 స్పూన్లు, కొవ్వొత్తి
నరసరావుపేట రూరల్: మతిస్థిమితం లేని మహిళకు అరుదైన శస్త్రచికిత్స ద్వారా 13 పెన్నులు, 5 స్పూన్లు, కొవ్వొత్తి వెలికితీసిన ఘటన పల్నాడుజిల్లా నరసరావుపేటలో చోటుచేసుకుంది. లాప్రోస్కోపి ద్వారా శస్త్ర చికిత్స నిర్వహించి మహిళ కడుపులో ఉన్న వాటిని వెలికితీసినట్లు మాతాశ్రీ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పి.రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం మండలంలోని పెట్లూరివారిపాలెంకు చెందిన కుటుంబం కొంతకాలంగా పట్టణంలో నివసిస్తుంది. వీరి కుమార్తెకు మతిస్థిమితం లేకపోవడంతో ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. రెండు రోజులుగా ఎడమవైపు కడుపునొప్పితో బాధపడుతుండడంతో పలు పరీక్షలు నిర్వహించి కడుపులో పెన్నులు, స్పూన్లు, కొవ్వొత్తి ఉన్నట్టు గుర్తించారు. మతిస్థిమితం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ముప్పాళ్ళ: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా ఇద్దరు గాయపడిన సంఘటన శనివారం రాత్రి జరిగింది. సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బొల్లవరం గ్రామానికి చెందిన బద్దిగం వెంకటరెడ్డి, వి.శ్రీనివాసరెడ్డిలు సత్తెనపల్లిలో జరిగే వివాహానికి ద్విచక్రవాహనం పై బయలుదేరారు. మార్గమధ్యలో ఇరుకుపాలెం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ వద్ద నరసరావుపేట వైపు నుంచి వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని వెనుక ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనం పై ఉన్న వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు ఎగిరి రోడ్డు మార్జిన్లో పడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయింది. ఘటనపై బాధితులు ముప్పాళ్ళ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రైల్లో నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు సత్తెనపల్లి: రైల్లో నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన సత్తెనపల్లి మండలం గుడిపూడి–లక్ష్మీపురం గ్రామాల మధ్య ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.ఒడిశా రాష్ట్రం కలహందిజిల్లా తండిమండలం బలిజీ వాహన్ గ్రామానికి చెందిన బలిజివార్ శివ అనే యువకుడు హైదరాబాద్–భువనేశ్వర్ రైల్లో నుంచి జారిపడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న 108 బృందం ఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. ఘటనా స్థలం వద్దకు 108 వాహనం చేరే పరిస్థితి లేకపోవడంతో క్షతగాత్రుడు శివను సుమారు మూడు కిలోమీటర్లు పంట పొలాల గుండా మోసుకుంటూ 108 వాహనం వద్దకు చేర్చారు. అనంతరం క్షతగాత్రుడు శివను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. గంజాయి మత్తులో యువకుల వీరంగం నడిరోడ్డుపై గొడవేందని ప్రశ్నించిన వారిపై దాడి శావల్యాపురం: గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించిన సంఘటన మండల కేంద్రం శావల్యాపురలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణానికి చెందిన కొందరు యువకులు నడిరోడ్డుపై బీరు సీసాలతో హాల్చల్ చేస్తూ మత్తులో బైకుపై వస్తున్నారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన ఒక యువకుడుకి బైకు తగిలించారు. ఇదేమని ప్రశ్నించిన యువకుడుపై దాడికి పాల్పడ్డారు. ప్రశ్నించిన గ్రామస్తులపై మత్తులో ఉన్న యువకులు దౌర్జనంగా మాట్లాడుతూ ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో దూషణకు దిగారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గంజాయి మత్తులో ఉన్న యువకులను పోలీసు స్టేషనుకు తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించటంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పిల్చుకున్నారు. ఈవిషయం గురించి స్టేషను రైటరు సలీమ్బాషను వివరణ కోరగా.. గంజాయి మత్తులో శాంతి భద్రతలు విఘూతం కల్గించిన యువకులపై చట్టపరంగా కేసు నమోదు చేస్తామన్నారు. యువకుడిపై కత్తితో దాడి నాదెండ్ల: పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన కాకుమాను వేణుగోపాల్ చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్లో కార్ ట్రావెల్స్ నిర్వహిస్తుంటాడు. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పట్టపురాజు సాయికి, వేణుగోపాల్కు కొంతకాలంగా పాతకక్షలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వేణుగోపాల్ భార్య సుకన్యను సాయి ఫోన్లో అసభ్యంగా మాట్లాడిన విషయాన్ని ప్రశ్నించగా ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో జాతీయ రహదారి సమీపంలోని టీ దుకాణం వద్దకు వేణు దంపతులు వచ్చారు. కక్షపెంచుకున్న సాయి తన వద్ద ఉన్న కత్తితో గోపాల్పై దాడి చేశాడు. దీంతో గాయాలైన గోపాల్ను పోలీసులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన సాయి నాదెండ్ల పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్లు ఎస్ఐ ఆర్.వెంకటేశ్వరరావు తెలిపారు. -
వినూత్న బోధనకు జాతీయ గుర్తింపు
యడ్లపాడు: విద్యార్థుల వికాసమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తున్న కొండవీడు జెడ్పీహైస్కూల్ ప్రాంగణంలోని పీఎంశ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు డాక్టర్ జున్నుసాహెబ్కు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. విద్యారంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత్ గురు రత్న అవార్డు–2026ను ఆదివారం అందుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంగా కాకుండా సేవగా భావించే జున్నుమాస్టారు.. సంప్రదాయ బోధనకు భిన్నంగా కృత్యాధార, అనుభవపూర్వక పద్ధతులను అనుసరిస్తున్నారు. విద్యార్థుల్లో అభ్యసన ఆసక్తిని పెంచుతూ, స్వేచ్ఛాయుత వాతావరణంలో నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. కాలిగ్రఫీలో డిప్లొమా చేసిన ఆయన సెలవు రోజుల్లో ఇతర ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ప్రత్యేక క్లాసుల్ని ఏర్పాటు చేసి ఉచిత హ్యాండ్రైటింగ్ శిక్షణ అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ అవార్డును ప్రదానం చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్ 6న హైదరాబాద్ రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ హాల్లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్, శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పట్నం కమల మనోహర్ చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేసి ఆయనను ఘనంగా సత్కరించారు. భారత్ గురురత్న అవార్డు–2026 అందుకున్న డాక్టర్ జున్నుసాహెబ్ -
ఐదు రాష్ట్రాలస్థాయి కరాటే పోటీలు ప్రారంభం
దాచేపల్లి: దాచేపల్లిలోని తిరుమల కల్యాణ మండపంలో ఐదు రాష్ట్రాలస్థాయి కరాటే పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. చోటోఖాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య ప్రారంభించారు. ఈ పోటీల్లో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 500మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–12, అండర్––14, అండర్–18 విభాగాల్లో కరాటే పోటీలు నిర్వహించినట్లు నిర్వహకులు కొప్పుల నరసింహరావు, కొప్పుల పార్వతి తెలిపారు. గ్రాండ్ చాంపియన్ షిప్ తెలంగాణ, రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడవస్థానంలో కర్నాటక రాష్ట్రాలు నిలిచినట్లు వారు వెల్లడించారు. విజేతలైన క్రీడాకారులకు షీల్డ్స్, సర్టిఫికెట్లను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. -
ప్రజా ఆస్తి.. పచ్చ నేతల పరం
● ఏకంగా 27 సెంట్ల మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్ ● ఆక్రమిత భూమి విలువల దాదాపు రూ.పది కోట్లపైనే ● ఏఎంజీకి అప్పగించిన స్థలం ఏడుగురి పేరిట రిజిస్ట్రేషన్ యడ్లపాడు: చిలకలూరిపేట పురపాలక సంఘానికి ఆనుకుని ఉన్న పరిధిలోని ప్రజాప్రయోజనాల కోసం నిర్దేశించిన రిజర్వ్డ్ స్థలం అది. కార్మికుల కుటుంబాల పిల్లల విద్య, మధ్యాహ్న భోజనం కోసం ఏఎంజీ స్వచ్ఛంద సంస్థకు అధికారులు అప్పగించారు. కొంతకాలం డే–కేర్ సెంటర్గా కొనసాగిన రూ. పది కోట్ల విలువైన ఆ భూమి ఇప్పుడు యాజమాన్య హక్కుల వివాదంలో చిక్కుకుంది. మున్సిపల్ ఆస్తిగా అధికారులు చెబుతున్న ఈ స్థలం ఏడుగురు వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ అయినట్లు పత్రాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతలదే ఇందులో కీలక పాత్రగా ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఏంఎజీకి అప్పగించిన ఈ భూమిలోని భవనాన్ని తొలగించి స్థలాన్ని చదును చేయడంతో విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సెప్టెంబర్ 4న అధికారికంగా అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టి, స్థలం రక్షణ గేటుకు తాళంతో పాటు మున్సిపల్ అధికారులు సీల్ వేశారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతోనే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ స్థలాన్ని తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉన్నప్పటికీ.. మున్సిపల్ ఆస్తిగా అధికారులు స్పష్టం చేస్తున్న భూమికి ప్రైవేటు హక్కులు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు రాజకీయ కోణం కూడా తోడవుతోంది. అయితే ఈ స్థలం వాస్తవంగా ఎవరిది? మున్సిపల్ ఆస్తి అయితే ప్రైవేటు వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? ఒకవేళ స్వచ్ఛంద సంస్థకు గుత్తాధిపత్యం ఉంటే మున్సిపల్ అధికారులు సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువైన ఈ ఆస్తి వివాదంలో చిక్కుకోవడంపై బాధ్యులెవరనే విషయంపైనే ఇప్పుడు ప్రజల్లో హాట్టాపిక్గా మారింది. ఏఎంజీకి స్థలం అప్పగింత ఇలా... హెచ్హెచ్ డైక్మెన్ నగర్ నివాసితుల కమ్యూనిటీ అవసరాల కోసం ఉద్దేశించిన ఈ రిజర్వ్డ్ స్థలాన్ని 1998లో పురపాలకశాఖ ఏఎంజీ సంస్థకు అప్పగించింది. పారిశుధ్య కార్మికుల పిల్లలకు విద్య, మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్కడ డే–కేర్ సెంటర్ నిర్వహించారు. ఏఎంజీ ప్రధాన దాత జర్మనీకి చెందిన డాక్టర్ హెచ్హెచ్ డైక్మెన్ మరణం తర్వాత ఆ కేంద్రం కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మున్సిపాలిటీ ఆ స్థలాన్ని ఏ ప్రాతిపదికన ఏఎంజీకి అప్పగించింది? లీజా.. వినియోగానికి అనుమతా.. లేక ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారమా? అనే వివరాలను నిర్ధారించే పాత రికార్డులేవీ దొరకలేదని, వాటి కోసం వెతుకుతున్నట్లు అధికారులు చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. డోర్ నంబర్ 80/1, సర్వే నంబర్ 138/1గా పేర్కొంటూ ఈ ఏడాది ఆగస్టు 11న స్థలం ఏడుగురి పేర్లతో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. మున్సిపల్ పన్ను అసెస్మెంట్ నంబర్ 1020025573 కూడా పత్రాల్లో ఉన్నట్లు సమాచారం. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థకు అందించిన సేవలకు ప్రతిఫలంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్కుమార్ కంటి మహంతి తరఫున వారికి స్థలాన్ని కానుకగా ఇచ్చినట్లు దస్తావేజుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాక, రిజిస్ట్రేషన్ సమయంలో అక్కడ డే–కేర్ భవనం ఉన్నప్పటికీ ఖాళీ స్థలంగా చూపించినట్లు సమాచారం. మున్సిపల్ ఆస్తిగా అధికారులు చెబుతున్న భూమి విషయంలోనే యాజమాన్య హక్కులపై ఇంతటి వివాదం తలెత్తడం ఇప్పుడు అధికారుల పాత్రపైనా అనుమానాలకు తావిస్తోంది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబును దీనిపై ‘సాక్షి’ వివరణ కోరగా.. వివాదాస్పద స్థలం సర్వే నంబర్ 88లోని 27 సెంట్లు మున్సిపల్ ఆస్తిగా స్పష్టం చేశారు. పన్ను అసెస్మెంట్ ఇటీవలే ఇచ్చారన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. గతం నుంచే అసెస్మెంట్ నంబర్ ఉందన్నారు. సదరు స్థలం ఏఎంజీకి ఏ ప్రాతిపదికన అప్పట్లో ఇచ్చారనే విషయంపై రికార్డులు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. తమ స్థలంలోని భవనం తొలగించారని తెలిసి స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారు ఎలా రిజిస్ట్రేషన్లు చేసుకున్నా అది పక్కా మున్సిపల్ ఆస్తి అని, ఆ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో చెల్లదని పేర్కొన్నారు. వారికి ఆ ఆస్తిపై ఎలాంటి హక్కూ లభించదని తేల్చి చెప్పారు. -
నేడు వైఎస్సార్ సీపీ జిల్లా సమావేశం
నరసరావుపేట రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి సమావేశం సోమవారం సాయంత్రం 3గంటలకు పట్టణంలోని ఏ–1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. 9,11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం చిలకలూరిపేటటౌన్: నియోజకవర్గంలోని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ (ఎల్ఈఎస్టీ–2027) ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతిలో, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా సమీప మీ సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. యడ్లపాడు: చారిత్రక ప్రాశస్త్యం కలిగిన కొండవీడు కోటకు ఆదివారం సందర్శకులు అధికసంఖ్యలో వచ్చారు. కొత్తపాలెం గ్రామం నుంచి ఘాట్రోడ్డు, కొండపైన పురాతన కట్టడాల వద్ద గుంపులు గుంపులుగా వచ్చి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. పలు జిల్లాల నుంచి వచ్చిన 35 మంది వెటర్నరీ వైద్యులు కొండవీడును సందర్శించారు. వారంతా సాహస క్రీడలపై ఆసక్తి చూపారు. పల్నాడు జిల్లా అటవీశాఖ, ఔట్రీచ్ ట్రెక్కింగ్ అకాడమీ ఆధ్వర్యంలో కొండలపై ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ యువతతో పాటు వెటర్నరీ వైద్యులు పాల్గొన్నారు. ట్రెక్కింగ్లో భాగంగా కొండవీడు కోట చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకుంటూ, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఉత్సాహంగా సాగిన ట్రెక్కింగ్ను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. వారితో పాటు కొండవీడు అభివృద్ధి కమిటీ కన్వీనర్ కె.శివారెడ్డి, అటవీశాఖ అధికారులు ఉన్నారు. బావిలో గుర్తు తెలియని మృతదేహం పిడుగురాళ్ల: పొలం బావిలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన సంఘటన మండలంలోని కామేపల్లి శివారు పొలాల్లో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ ఎస్ఐ ఎం.మోహన్ తెలిపిన వివరాల మేరకు.. కామేపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో పల్లా నాగయ్య నేలబావిలో సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతదేహం లభించిందన్న స్థానికులు సమాచారం మేరకు.. బావిలోని మృతదేహాన్ని వెలికి తీయటం జరిగిందన్నారు. మృతుడు ఆకుపచ్చ రంగు లుంగీ, తెలుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ వైద్యశాల మార్చురీలో ఉంచామని, మృతుడి సంబంధీకులు పట్టణ సీఐ వెంకట్రావు 9440796236, ఎస్ఐ మోహన్ 7207271178 నెంబర్లలో సంప్రదించాలని ఎస్ఐ మోహన్ తెలిపారు. తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై భార్యను ఎక్కించుకొని వెళుతున్న సొంగా కృష్ణ (40)ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడి నలిగి ప్రాణాలొదిలాడు. భార్య పక్కకు పడటంతో ప్రమాదం తప్పింది, కళ్లేదుటే భర్త లారీ చక్రాల కింద నలిగి మృతి చెందడంతో భార్య రోదన మిన్నంటింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వాహనాలు అడ్డుగా పెట్టి లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుభవం లేని డ్రైవర్లు, యువకులను పెట్టి పరిమితికి మించిన లోడుతో రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఇకనైనా సంబంధిత పోలీసు, రవాణా శాఖాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో కిరాణా వ్యాపారి మృతి
రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడు సమీపంలో శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వే పై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంచనపల్లి గురుమూర్తి(50) మృతి చెందాడు. 30 ఏళ్లుగా కిరాణా వ్యాపారం చేస్తున్న గురుమూర్తి తన ద్విచక్రవాహనంపై సరుకుల కొనుగోళ్ల నిమిత్తం నరసరావుపేటకు బయలుదేరాడు. ఈ క్రమంలో సంతగుడిపాడు నుంచి హైవేపై కొంత దూరం ప్రయాణించి పాలపాడు రోడ్డు మలుపు తిరుగుతుండగా స్కార్పియో కారు వెనుకగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన గురుమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. రొంపిచర్ల ఎస్ఐ లోకేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన స్కార్పియో వాహనాన్ని అక్కడే వదిలివేసి డ్రైవర్, కారులో ఉన్నవారు పరారీ అయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. -
‘ఉత్త మా’ పురస్కారాలు
● అవార్డు పొందిన ముగ్గురు అధ్యాపకులూ సీఎం సామాజిక వర్గమే ● రాష్ట్ర స్థాయి ఎంపిక తీరు చూసి విస్తుపోతున్న విద్యావేత్తలు ● ఇతర సామాజిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : అధ్యాపకుల విద్యాపరమైన రికార్డుతోపాటు విద్య, పరిశోధన అంశాలనూ లెక్కలోనికి తీసుకోలేదు. వారు వ్యక్తిగతంగా కనబరిచిన ప్రతిభ, అందుకున్న పురస్కారాలు పట్టించుకున్న పాపాన పోలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారు సమర్పించిన పరిశోధనా పత్రాలు, వాటి ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించలేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికై న వారి జాబితా చూస్తే ఇవేమీ కనిపించవు. దీంతో విద్యావేత్తలు విస్తుపోతున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిపాలన, వ్యవస్థాపరమైన అన్ని పదవులు, నియామకాలన్నింటిలోనూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సామాజిక వర్గానికే అగ్రతాంబూలం అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిలో భాగస్వాములమైనప్పటికీ తమకు కనీస ప్రాధాన్యత కూడా ఉండటం లేదని కొన్ని సామాజిక వర్గాలు గతంలో అసంతృప్తి కూడా వ్యక్తం చేశాయి. కానీ అవేమీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ, ఏఎన్యూ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. ఆదర్శంగా నిలవాల్సిన అవార్డుల ప్రక్రియను కూడా ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయడం, ముగ్గురూ సైన్స్ కళాశాలకు చెందిన వారే కావడం టీడీపీ ప్రభుత్వ విపరీత ధోరణికి అద్దం పడుతోందని విద్యావంతులు మండిపడుతున్నారు. ఆరోపణలున్నా పట్టింపేదీ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనివర్సిటీలో కీలకమైన పరీక్షల నిర్వహణ పదవిని ‘ఉత్తమ’ అవార్డుకు ఎంపికై న ఓ అధ్యాపకుడు నిర్వర్తించేవారు. ఆయన హయాంలో యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది పరీక్ష ప్రారంభానికి ముందే బీఈడీ ప్రశ్నపత్రం లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీకేజీ ఘటనపై అప్పట్లో పెదకాకాని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఓ బీఈడీ కళాశాల క్లర్క్ను, కొందరు ఒడిశా విద్యార్థులను నామమాత్రంగా బాధ్యులను చేసి చేతులు దులుపుకొన్నారు. పేపర్ లీకేజీ వంటి ఘటనలు చోటుచేసుకుంటే గతంలో ఆ పదవిలో ఉన్న వారిని యూనివర్సిటీ తొలగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ అధికారికి మరింత అగ్రపీఠం వేసినట్లు వ్యవహరించారు. ఆ తరువాత కూడా పీజీ ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు తప్పుగా రావడం, చేతిరాతతో ఉన్న ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీసి విద్యార్థులకు ఇవ్వడం వంటి అనేక ఘటనలు ఈ అధికారి హయాంలో చోటుచేసుకున్నాయి. ఇక బోధన, పరిశోధన అంశాల్లో ఈ అధ్యాపకుడు కనబరిచిన ప్రత్యేక ప్రతిభ ఏంటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. బీఈడీ పేపర్ లీక్ జరిగిన సమయంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయం చాలా సీరియస్ అయ్యిందని, ఏఎన్యూ ఉన్నతాధికారులను నివేదిక కూడా అడిగిందని అప్పట్లో ప్రచారం చేశారు. కానీ ఆ ఘటన చోటుచేసుకున్న విభాగానికి చెందిన అధికారికి ఇప్పుడు అదే శాఖ నుంచి ఉత్తమ అవార్డును ప్రదానం చేయడం.. లోకేశ్, చంద్రబాబులకు ఉన్న సామాజిక ప్రేమను చాటి చెబుతోందని పలువురు పేర్కొంటున్నారు. -
ఉమ్మడి జెడ్పీ
మూడుగా మారిన పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు ● 25 నుంచి మొదలుకానున్న కార్యకలాపాలు ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో జెడ్పీ ● ఇప్పుడు 17 మండలాలకు గుంటూరు పరిమితం ● పల్నాడులో 28, బాపట్ల పరిధిలో 20 మండలాలు గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలు ఉండేవి. కొత్తగా పల్నాడు, బాపట్ల జెడ్పీలు ఏర్పడనుండగా.. మిగిలిన గుంటూరు జిల్లాకు ప్రస్తుతమున్న జెడ్పీ పరిమితం కానుంది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం సెప్టెంబర్ 24న ముగియనుంది. మరుసటి రోజు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లా పరిషత్ల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆయా జిల్లాల్లోని జెడ్పీలకు అవసరమైన ఉద్యోగుల విభజనపైనా కసరత్తు సాగుతోంది. కొత్త జిల్లాల జెడ్పీలకు సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో జెడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో కొనసాగిన జిల్లా ప్రజా పరిషత్ రాష్ట్రంలోని పెద్ద జిల్లాల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం మూడు జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో గుంటూరు జిల్లా 17 మండలాలకు పరిమితం కానుంది. అదే విధంగా పల్నాడులో 28, బాపట్లలో కొత్తగా కలిసిన వాటితో కలిపి 20 మండలాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే పల్నాడు జిల్లాలోనే అధికంగా మండలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 57 మండలాల నుంచి 57 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొత్త జిల్లాల ప్రాతిపదికగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆయా జిల్లాల పరిధిలోని మండలాల వారీగా కొత్తగా జెడ్పీటీసీలను, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలంటే పాలకవర్గాలు తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతమున్న పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న దృష్ట్యా, త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. 1959లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయత్ సమితి, జిల్లా ప్రజా పరిషత్ చట్టం ప్రకారం జిల్లా ప్రజా పరిషత్ ఏర్పడింది. అంతకు ముందు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా బోర్డు వ్యవస్థలో 1921 నుంచి 1959 వరకు పలువురు ప్రముఖులు అధ్యక్షులుగా కొనసాగారు. 1921 నుంచి 1927 వరకు మొదటి జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పీజీఎన్ యతిరాజుల నాయుడు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ విధంగా 1921 నుంచి 1959 వరకు తొమ్మిది మంది జిల్లా బోర్డు అధ్యక్షులుగా పదవిలో కొనసాగారు. మూడు సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించారు. 1959లో అమల్లోకి వచ్చిన చట్టం ఆధారంగా డిసెంబర్ ఒకటో తేదీన మేడూరి నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రస్తుత చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వరకు గత 66 ఏళ్ల కాలంలో 36 మంది చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో నాలుగు సార్లు ఇన్చార్జ్ చైర్మన్లు, 18 సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా కొనసాగారు. జెడ్పీకి 16 మంది చైర్మన్లు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు. చైర్మన్లుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వారిలో కాసు వెంగళరెడ్డి, రాయపాటి శ్రీనివాస్, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు తదితర ప్రముఖులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన మోహన్ కందా గుంటూరు జిల్లా కలెక్టర్గా పని చేసిన కాలంలో జెడ్పీ ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతమున్న జెడ్పీ పరిపాలన భవనాన్ని 1964 జూలై 15న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో చేబ్రోలు, దుగ్గిరాల, గుంటూరు, కాకుమాను, కొల్లిపర, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, పెదనందిపాడు, ఫిరంగిపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడేపల్లి, తాడికొండ, తెనాలి, తుళ్లూరు, వట్టిచెరుకూరు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో అమృతలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చెరుకుపల్లి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, కారంచేడు, కర్లపాలెం, కొల్లూరు, మార్టూరు, నగరం, నిజాంపట్నం, పర్చూరు, పిట్టలవానిపాలెం, రేపల్లె, చుండూరు, వేమూరు, వేటపాలెం, యద్దనపూడి మండలాలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, బొల్లాపల్లి, చిలకలూరిపేట, దాచేపల్లి, దుర్గి, యడ్లపాడు, గురజాల, ఈపూరు, కారంపూడి, క్రోసూరు, మాచవరం, మాచర్ల, ముప్పాళ్ల, నాదెండ్ల, నరసరావుపేట, నకరికల్లు, నూజెండ్ల, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, రెంటచింతల, రొంపిచర్ల, సత్తెనపల్లి, శావల్యాపురం, వెల్దుర్తి, వినుకొండ ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ స్వరూపం మారింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వారీగా జెడ్పీలు ఏర్పడనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లాల వారీగా పరిషత్లను ఏర్పాటు చేస్తూ జీవో 114 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. దశాబ్దాల తరబడి ఉమ్మడి గుంటూరుగా కొనసాగుతున్న జెడ్పీ ఇక నుంచి మూడు జిల్లాల వారీగా విడిపోనుంది. -
కుంకుమ ప్రభ ఊరేగింపులో అపశ్రుతి
బొల్లాపల్లి: బొల్లాపల్లి మండలం గరికపాడు గ్రామంలో కుంకుమ ప్రభ ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. వర్షాలు కురవాలని గంగమ్మ తల్లికి కుంకుమ ప్రభ ఏర్పాటు చేయగా, ఆ గ్రామానికి చెందిన అరవా ముక్కంటికి చెందిన ఎడ్ల జతను కుంకుమ ప్రభకు కట్టి గ్రామంలో శనివారం రాత్రి 11 గంటలకు ఊరేగింపు ప్రారంభించి, ఊరేగిస్తుండగా తెల్లవారితే ఆదివారం 2.30 గంటల సమయంలో 11కే వీ విద్యుత్ లైన్ కు చెందిన కరెంట్ తీగలు ప్రభకు తగలడంతో షాక్కు గురై ఎడ్ల జత అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయని, వీటి ఖరీదు రూ. 3 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విద్యుత్ ప్రమాదంలో ప్రభకు సమీపంలో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని, మరికొందరు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ షాక్తో ఎడ్ల జత మృతి -
సాఫ్ట్బాల్ జూనియర్ బాలబాలికల జట్లు ఎంపిక
పెదకాకాని: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న పది క్వింటాళ్ల రేషన్ బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదకాకాని ఏకలవ్య నగర్లోని రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు శనివారం రాత్రి తనిఖీలు చేసిన పోలీసులు సుమారు పది క్వింటాళ్ల బరువు కలిగిన 23 రేషన్ బియ్యం బస్తాలను సీజ్ చేశారు. స్థానికంగా నివసించే మేడా కుమారి ఇళ్ల వెంట తిరిగి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితురాలిని పోలీసు స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో పోలీసులు నాగేశ్వరరావు, మల్లేశ్వరరావు, ఇర్ఫాన్లు పాల్గొన్నారు. 15లోపు పేరు నమోదుకు అవకాశం మధురానగర్(విజయవాడ సెంట్రల్): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీ నిర్వహించనున్న శతాధిక వృద్ధుల సన్మానోత్సవానికి అర్హులు ఈ నెల 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్రాజ్ సోలంకి కోరారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మీడిమా సమావేశంలో వారు మాట్లాడారు. తాము ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను గుర్తించి సత్కారం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు 93475 72766, 98481 11138 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా వారు కోరారు. ఎంపిక చేసిన శతాధిక వృద్ధులను ట్రస్ట్ ఖర్చులతో విజయవాడ తీసుకువచ్చి సత్కారం చేస్తామన్నారు. తిరిగి వారి ఇంటి వద్ద దింపివేయనున్నట్లు తెలిపారు. -
చీకటి గోపిది ముమ్మాటికి పోలీసుల హత్యే
లక్ష్మీపురం: చీకటి గోపిది ముమ్మాటికి పోలీసుల హత్యేనని, బాధ్యులపై చర్య తీసుకోవాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో బహుజన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులతో కలిసి పోలీసులపై చర్య తీసుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్కుమార్ మాట్లాడుతూ పోలీసుల చర్యల వలనే గోపి మృతి చెందాడనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు. పోలీసులపై ఆరోపణలు ఉన్న ఘటనలో అదే పోలీసు శాఖకు చెందిన అధికారులు విచారణ చేయడం వల్ల విచారణ నిష్పక్షపాతంపై అనుమానాలు ఏర్పడే అవకాశం ఉందని అందువల్ల ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. చీకటి గోపి ఘటన ఒక్కటే కాదు రాష్ట్రంలో గత కొంతకాలంగా పోలీసుల కస్టడీ, విచారణ లేదా పోలీసుల చర్యల అనంతరం వ్యక్తులు మృతి చెందిన ఘటనలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ ఇది ఒక్క గోపి కుటుంబం సమస్య కాదని, చీకటి గోపి మరణాన్ని ఒక కుటుంబానికి జరిగిన విషాదంగా మాత్రమే చూడకూడదన్నారు. పోలీసు స్టేషన్కు విచారణ కోసం పిలిపించిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో హింస, అక్రమ నిర్బంధం, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎలాంటి అవకాశం ఉండకూడదన్నారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అని ప్రభుత్వం చెబుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశాలపై రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న దళిత, గిరిజన, బహుజన, ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేస్తూ పోలీసుల దుర్మార్గంపై, సీఐడీ ఎస్పీ చెప్పే అబద్ధాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను ప్రత్యేకంగా కలిసి సమస్య తీవ్రతను వివరించాలని, డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమస్య పరిష్కారం కాకపోతే చలో గుంటూరు నిర్వహించాలని నిర్ణయించినట్లు నేతలు ప్రకటించారు. -
వినాయక మండపాలకు ఆన్లైన్లో అనుమతులు
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, ఇతర శాఖల అనుమతుల కోసం ganeshutsav.net వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లాలోని పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓ (సీఐ)లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి గణేష్ మండపాన్ని నేరుగా పరిశీలించాలని సూచించారు. ప్రజా, అత్యవసర వాహనాల రాకపోకలు, విద్యుత్, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు పరిశీలించాక అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్ కనెక్షన్లు, జనరేటర్లు, విద్యుద్దీపాల ఏర్పాట్లల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ సేఫ్టీ పరికరాలు, అగ్నిమాపక సిలిండర్లు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చూడాలన్నారు. ప్రధాన రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్ ఏరియాల్లో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. నిఘా పెంచాలి నిమజ్జన ఊరేగింపు తేదీలు, మార్గాలను ముందుగా సమీక్షించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు, పోలీస్ నిఘా పెంచాలని సూచించారు. ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని.. వివాదాస్పద వ్యాఖ్యలు, నినాదాలు, రెచ్చగొట్టే చర్యలు వద్దని నిర్వాహకులకు సూచించారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దని తెలిపారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం స్పష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● లారీని ఢీకొన్న కారు ● మంటలు చెలరేగి కారు దగ్ధం ● ప్రయాణికులు సురక్షితంపిడుగురాళ్ల: ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ ఎం.మోహన్ తెలిపిన వివరాల మేరకు.. నరసరావుపేట వైపు నుంచి కారంపూడి వైపునకు ఓ లారీ వెళుతోంది. ఇంతలో కారంపూడి వైపు నుంచి గుత్తికొండ వైపు వస్తున్న కారు వేగంగా ఢీకొంది. గుత్తికొండ గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న నలుగురు వ్యక్తులను క్షేమంగా కాపాడారు. అదృష్టశాత్తు వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆమ్యామ్యాల తడాఖా
అమాత్యుని ఇలాకా.. జిల్లా ఇన్చార్జి మంత్రి అంటే.. ఆ జిల్లాలోని పరిపాలన మొత్తానికి ఆయనే కీలకం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలపైనా పర్యవేక్షణ ఆయనదే. కానీ గొట్టిపాటి రవికుమార్ ఇన్చార్జి మంత్రిగా ఉన్న పల్నాడు జిల్లాలో సాక్షాత్తూ ఆయన శాఖలోనే పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలుతున్నా చోద్యం చూస్తున్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతున్నామంటూ ఉపన్యాసాలకే ఆయన పరిమితం అయ్యారు. మరోవైపు ఆయన శాఖకు చెందిన అధికారులు ప్రతి పనికో రేటు కట్టి వినియోగదారుల నుంచి దొరికినకాడికి దోచుకుంటున్నారు. నరసరావుపేట టౌన్: జిల్లా కేంద్రం నరసరావుపేటలో విద్యుత్ శాఖ అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలు అందించాల్సిన శాఖలో ప్రతి పనికీ ‘రేటు’ నిర్ణయించారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కావాలన్నా.. కొత్త విద్యుత్ కనెక్షన్ పొందాలన్నా.. లోడ్ పెంచుకోవాలన్నా.. లైన్ మార్పులు, ఇతర సాంకేతిక అనుమతులు పొందాలన్నా మామూళ్లు లేకుండా పని జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు ముడుపుల వ్యవహారం సాగుతోందని ఆరోపిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం నిద్రావస్థలో ఉండటం అవినీతిపరులకు వరంగా మారింది. అవినీతి అధికారికి అందలం.. విద్యుత్ శాఖకు చెడ్డపేరు తెస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వంపైనా ఉందని ప్రజలు అంటున్నారు. గతంలో నరసరావుపేట విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేసిన అధికారిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కెపాసిటీని బట్టి వసూలు చేశాడు. ఆయనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిపోయి పదోన్నతి కల్పించి మరో నియోజకవర్గానికి బదిలీ చేయటం ఉద్యోగ వర్గాలతో పాటు వినియోగదారులకు విస్మయానికి గురిచేసింది. ఇప్పటివరకు అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి సమగ్ర విచారణ జరిగిందే లేదు. ప్రభుత్వ పెద్దల పర్యవేక్షణపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరోపణలపై మంత్రి నేరుగా దృష్టి సారించి, నరసరావుపేట విద్యుత్ శాఖలో పారదర్శక విచారణకు ఆదేశిస్తారా లేక ఈ ‘అవినీతి చీకట్లు’ ఇలాగే కొనసాగుతాయా అనేది వేచి చూడాలి.విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కీలక బాధ్యతల్లో ఉన్న మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కేంద్రం నరసరావుపేటలో విద్యుత్ శాఖ అధికారులపై ఇంత తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అని వినియోగదారులు చర్చించుకుంటున్నారు. ఇకనైనా దృష్టి సారించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. -
ఇదేం... విభజన?
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన వ్యవహారం అధికార పార్టీ ప్రయోజనాల కోసమే తెరపైకి తెచ్చిన బహిరంగ కుట్రలా కనిపిస్తోందనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. నగరంలో ఇప్పటివరకు ఉన్న 57 డివిజన్లను ఏకంగా 76కు పెంచుతూ విడుదల చేసిన ప్రాథమిక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అగ్గి రాజేస్తోంది. క్షేత్రస్థాయి భౌగోళిక సరిహద్దులు, సహజ నిర్మాణం, పరిపాలనా సౌలభ్యం, కనీస శాసీ్త్రయ ప్రమాణాలను గాలికొదిలేసి.. కేవలం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పినట్లే అధికారులు జీ హుజూర్ అంటూ సరిహద్దులను గీసేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్న డివిజన్లను లక్ష్యంగా చేసుకుని విభజన కత్తి దూశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ సీపీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రాంతాలను ఒక క్రమపద్ధతి లేకుండా రెండు మూడు డివిజన్లలోకి అడ్డగోలుగా ముక్కలు చేసి పంపించారు. అంతేకాకుండా, పలుచోట్ల సహజ హద్దులైన ప్రధాన రహదారులను కాకుండా నాలుగు అడుగుల సందులను బౌండరీలుగా చూపించడం వెనుక స్పష్టమైన రాజకీయ దురుద్దేశం కనిపిస్తోంది. అనేక డివిజన్లను ఇష్టారాజ్యంగా చీల్చి పక్క డివిజన్లో కలిపినప్పటికీ, కొన్ని డివిజన్లలో జనాభా భారీగా పెరగడం, మరికొన్నింటిలో తీవ్రంగా తగ్గిపోవడం వంటి అంతుచిక్కని లెక్కలు అధికారుల పనితీరును బట్టబయలు చేస్తున్నాయి. ఉదాహరణకు నల్లపాడు, అంకిరెడ్డిపాలెం లాంటి విలీన ప్రాంతాలను అసంబద్ధంగా కలపడం వల్ల స్థానిక ప్రాతినిధ్యం ప్రశ్నార్థకంగా మారింది. జన సైనికుల్లోనూ అసంతృప్తి సెగలు ఈ అశాసీ్త్రయ విభజన కేవలం ప్రతిపక్ష వైఎస్సార్ సీపీలోనే కాకుండా, క్షేత్రస్థాయిలో కూటమి భాగస్వామి అయిన జనసేన కేడర్లోనూ అసంతృప్తి రగిలిస్తోంది. తమకు పట్టున్న డివిజన్లు, జనసైనికుల ప్రాబల్యం ఉన్న కాలనీలను కూడా అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా చీల్చి బలహీన పరిచారంటూ జనసేన స్థానిక శ్రేణులు బహిరంగంగా చెబుతున్నాయి. స్వప్రయోజనాల కోసమే అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ మ్యాపింగ్ చేయించారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కమిషనర్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 11 వరకు అభ్యంతరాల స్వీకరణ ప్రస్తుతం డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు.. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 11వ తేదీ వరకు గడువు విధించారు. వచ్చిన అభ్యంతరాలను 12వ తేదీన సీడీఎంఏకు పంపడం, 13న సీడీఎంఏ తుది జాబితా ఖరారు చేసి, 14న ఫైనల్ జాబితాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అన్యాయంగా మార్చిన సరిహద్దులను సవరించాలంటూ నగరవ్యాప్తంగా నిరసన స్వరాలు మిన్నంటుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి
మృతులు వదిన, మరదలు కావడంతో శోకసంద్రంలో కుటుంబంపెదకూరపాడు: అమరావతి మండలం దిడుగు గ్రామానికి చెందిన వదిన, మరదలు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. పాలు తాగే పసిబిడ్డలను వదిలి పొట్టకూటి కోసం ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లిన తల్లులు మృత్యువాత పడటం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. వివరాలు... దిడుగు గ్రామానికి చెందిన బాపట్ల వెంకటేశ్వరమ్మ (28), బాపట్ల లక్ష్మీ తిరుపతమ్మ (25) గ్రామంలో ఉపాధి పనులు లేక విజయవాడకు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ సహకారంతో ఫంక్షన్లలో వంట పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో గత రెండు రోజులుగా ఫంక్షన్ పనులు ముగించుకొని ఒంగోలులోని వివాహ వేదికకు వెళ్తున్నారు. ఆ క్రమంలో ఒంగోలు సంఘమిత్ర ఫ్లయ్ఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాపట్ల వెంకటేశ్వరమ్మ భర్త ప్రభుదాస్ గత ఏడాది హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారికి కుమార్తెలు పాలి వేణు (8), సింధు (3), కుమారులు పోలయ్య (7), ప్రభుదాస్ (1) ఉన్నారు. లక్ష్మీ తిరుపతమ్మ భర్త రామాంజనేయులు గ్రామంలోని కూలి పనులు చేస్తుంటాడు. వీరికి కుమార్తెలు పావని (8), సుశీల (1), మూడేళ్ల కుమారుడు ఉన్నారు. పాలు తాగే పసిబిడ్డలను వదిలి పొట్టకూటి కోసం వెళ్లిన తల్లులు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ చిన్నారుల వేదన వర్ణనాతీతంగా మారింది.ప్రభుదాస్కు లక్ష్మీ తిరుపతమ్మ సొంత చెల్లెలు కావడంతో ఇరు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనతో దిడుగు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. లక్ష్మీతిరుపతమ్మ, వెంకటేశ్వరమ్మ (ఫైల్) -
గుంటూరు జిల్లాకు హెడ్ కానిస్టేబుళ్లు బదిలీ
నగరంపాలెం: ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వర్తించి, పోలీస్శాఖకు మంచి పేరు తేవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు బదిలీ అయిన తొమ్మిది మంది హెడ్ కానిస్టేబుళ్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిజాయతీ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని అన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం టెన్నిస్ కోర్టులో అండర్–10, అండర్–14, మిక్స్డ్ టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తామని ఫౌండేషన్ కార్యదర్శి జీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం ఏడు గంటలకు స్టేడియం టెన్నిస్ కోర్టులో రిపోర్ట్ చేయాలని కోరారు. వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు కూడా తీసుకురావాలన్నారు. మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల గ్రామంలోని ఒక రేషన్ దుకాణం నుంచి బియ్యం అక్రమ తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నారు. డీలర్ దుకాణం మూసివేసి వెళ్లిపోగా, లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు.. వారి కోసం ఎదురు చూస్తుండగా బియ్యం అక్రమ వ్యాపారి తన అనుచరులతో వచ్చి దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అనంతరం మినీ లారీని వేగంగా డ్రైవ్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. గ్రామస్తులు పక్కకు తప్పుకోవడంతో లారీ తీసుకెళ్లిపోయాడు. ఇప్పటికే పలుమార్లు రేషన్ బియ్యం తరలించారని గ్రామస్తులు చెబుతున్నారు. రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయంలో నీటిమట్టం శనివారం 535.70 అడుగులకు చేరింది. ఇది 179.4878 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 6,553, ఎడమ కాలువకు 8,022, ఎస్ఎల్బీసీకి 2,000, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 16,875 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కు 16,875 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నెహ్రూనగర్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ వినాయక చవితిని కాలుష్య రహితంగా జరుపుకొందామని జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా 11వ తేదీన నగరంలోని సుమారు 25 వేల మంది విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శనివారం జీఎంసీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ‘ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి’ నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. -
విద్యార్థులకు ఉపాధ్యాయులే స్ఫూర్తి
నరసరావుపేట ఈస్ట్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు మార్గదర్శకులు ఉపాధ్యాయులేనని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకాష్నగర్లోని టౌన్హాల్లో శనివారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ కృతికా శుక్లా, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖాధికారులు పాల్గొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 70 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్కు తల్లిదండ్రుల త్యాగంతో పాటు ఉపాధ్యాయుల మార్గదర్శకం కీలకమని తెలిపారు. విద్యార్థుల్లో జ్ఞాన వికాసంతోపాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, మానవీయత వంటి సద్గుణాలు పెంపొందిస్తూ వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అభిప్రాయపడ్డారు. ప్రతిభ గల ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణతను 95 శాతం వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీఈ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ప్రతిభ గల విద్యార్థులను నగదు బహుమతితో ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర శిల్పారామం, సాంస్కృతిక విభాగం సంస్థ చైర్మన్ చేరెడ్డి మంజులారెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ పి.శ్యామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
చేపల వేటలో ‘తూటాల’ మోత
కృష్ణా నదిలో దుండగులు యథేచ్ఛగా తూటాలు పేలుస్తున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా ఇలా పేలుస్తూ భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారు. చేపల కోసం భారీ స్థాయిలో మందుగుండుతో చేసిన ఈ తూటాలను వేస్తూ వాటి మృతికి కారణమవుతున్నారు. విచ్చలవిడిగా విసరడం వల్ల చేపలు మృతి చెంది నీటిపై తేలియాడుతున్నాయి. వాటినే ప్రజలకు విక్రయిస్తున్నారు. నదిలో నీరు కూడా కలుషితం అవుతోంది. ప్రజారోగ్యం పణంగా పెడుతున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. దాచేపల్లి: ఆంధ్ర–తెలంగాణ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న కృష్ణా నదిలో మందుగుండు సామగ్రితో చిన్న పరిమాణంలో నాటు బాంబుల తరహాలో చేసిన తూటాల పేలుళ్లు ఎక్కువ అవుతున్నాయి. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల గ్రామాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న నదిలో కొంతమంది చేపల కోసం తూటాలను విసురుతున్నారు. అక్రమ మార్గంలో మందుగుండు సామగ్రిని తీసుకువచ్చి తూటాలను తయారు చేస్తున్నారు. దీంతో చేపలు చనిపోయి నీటిపై తేలుతున్నాయి. బలమైన తూటాల వలన అడుగున ఉన్న చేపలు సైతం నీళ్లపైకి వస్తున్నాయి. దాచేపల్లి మండలం పొందుగుల, తెలంగాణలోని వాడపల్లి, ఇర్కిగూడెం ప్రాంతాల్లో ఈ పేలుళ్ల తీవ్రత ఎక్కువగా వినిపిస్తున్నట్లుగా సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. తూటా వేసిన చోట క్షణాల్లోనే చేపలు మృతి చెంది గుట్టలుగుట్టలుగా పైకి తేలుతున్నాయి. చాలావరకు గాయపడినవే మృతిచెందుతున్నాయి. వాటినే ఐస్ బాక్సుల్లో ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. అక్రమ మార్గంలో మందుగుండు సామగ్రి కృష్ణా నదిలో వలలు వేయడం ద్వారా కొంతమంది మత్స్యకారులు చేపలు పడుతున్నారు. మరికొంతమంది తూటాలను వేస్తున్నారు. వీటిని తయారు చేసేందుకు అవసరమైన మందుగుండు సామగ్రి అక్రమ మార్గంలో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. పిడుగురాళ్ల, దాచేపల్లి, దామరచర్లలో కొంతమంది నుంచి దుండగులు ఈ సామగ్రిని తీసుకొచ్చి తూటాలను తయారు చేసి నదిలో విసురుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. గతంలో దాచేపల్లిలో అక్రమంగా మందుగుండు సామగ్రిని నిల్వ చేసిన ఇంట్లో పేలుడు సంభవించి ఏకంగా 15 మంది మృత్యువాత పడ్డారు. ఇకనైనా అధికారులు అక్రమంగా మందుగుండు సామగ్రిని సరఫరా చేసే వ్యక్తులపై నిఘా పెట్టాల్సి ఉంది. లేదంటే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుంది. తాగునీరు కలుషితం కృష్ణా నదిలో తూటాల పేలుళ్ల ధాటికి నీరు కలుషితమవుతోంది. కృష్ణా నది నుంచి దాచేపల్లి మండలంతోపాటు తెలంగాణలోని పలు గ్రామాలకు రక్షిత తాగునీటి పథకాల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. రోజూ లక్షల లీటర్ల నీటిని కృష్ణా నది నుంచి ఈ పథకాలకు తరలిస్తున్నారు. ఈ నీటినే ఫిల్టర్ చేసి ప్రజలకు అందిస్తున్నారు. తూటాల పేలుళ్ల ప్రభావంతో తాగునీరు కలుషితం అవుతోందని నదీ పరివాహక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందుగుండు సామగ్రి ఎక్కువగా వినియోగించడం వలన నీరు రంగు మారడంతోపాటు దుర్వాసన కూడా వస్తున్నట్లుగా చెబుతున్నారు. అధికారులు నదిలోని మత్స్య సంపదను కాపాడేందుకు, తాగునీరు కలుషితం కాకుండా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
నేడు పోలింగ్ కేంద్రాల వద్ద స్పెషల్ క్యాంపెయిన్
సత్తెనపల్లి: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఆదివారం స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లోని ప్రత్యేక శిబిరాల్లో బూత్స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారు. ఓటర్ల నుంచి క్లైయిమ్లు, అభ్యంతరాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఇటీవల ప్రచురించిన ముసాయిదా జాబితాలను సైతం అందుబాటులో ఉంచుతారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు ఉందో, లేదో పరిశీలించుకోవచ్చు.వివరాల్లో ఏవైనా తప్పులు, అభ్యంత రాలు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేగాక ఓటర్లు తమ సెల్ఫోన్ నుంచి 1950 నెంబర్కు మెసేజ్ పంపటం ద్వారా కూడా తమ ఓటు నమోదు స్థితిని తెలుసుకోవచ్చు. మెసేజ్లో ఈసీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఈపీఎల్సీ నంబర్ నమోదు చేసి 1950 కు పంపితే ఓటరు వివరాలు, సర్ నమోదు స్థితికి సంబంధించిన సమాచారం తెలుస్తోంది. అంతేగాక కొత్తగా ఓటు నమోదు చేసుకున్నవారు, చిరునామా, పేరు, ఫోటో లేదా ఇతర వివరాల్లో మార్పులకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ విధానంలో తమ వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. -
వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
నరసరావుపేట ఈస్ట్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని బరంపేటలోని శ్రీ రాధా గోవింద చంద్రమందిరం (ఇస్కాన్) హరే కృష్ణ నామస్మరణతో మారుమోగింది. ఆలయాన్ని పూలమాలలతో అలంకరించి, రంగవల్లులు తీర్చిదిద్దారు. తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రీ రాధా గోవిందులకు శుభమంగళ హారతి సమర్పించారు. అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలతో ఉదయం 8.30 గంటలకు శుభదర్శన హారతితో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీమద్భాగవత ప్రవచనం, మహా హరినామ సంకీర్తనలతో ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తల్లిదండ్రులు తమ చిన్నారులకు రాధాకృష్ణుల అలంకరణ చేసి ఆలయానికి తీసుకువచ్చారు. సాయంత్రం ఆలయ ఆవరణలో నిర్వహించిన ఉట్లోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారులు ఉట్టి కొట్టేందుకు ఉత్సాహం చూపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రాత్రి ఉత్సవమూర్తులకు 56 రకాల ద్రవ్యాలతో మహాశంఖాభిషేకం, 108 రకాల భక్ష్యాలతో మహారాజభోగ నివేదన నిర్వహించారు. అనంతరం భక్తులకు ఏకాదశి ప్రసాద వితరణ గావించారు. -
నృసింహుని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సామూహిక వరలక్ష్మీ వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళగిరి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వ్రతంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా భక్తులు సాంప్రదాయబద్ధంగా పూజా సామాగ్రితో హాజరై అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వరలక్ష్మీదేవికి ప్రత్యేక అలంకరణ చేశారు. పుష్పాలు, పసుపు, కుంకుమ తదితర సామాగ్రితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ మంగళగిరి టౌన్: నేటి యువతరం క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని ఐజీపీ, ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో నిర్వహించిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. రవికృష్ణ మాట్లాడుతూ వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబర్చి ఎనిమిది పతకాలు సాధించానని తెలిపారు. టేబుల్ టెన్నిస్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, షటిల్ బ్యాడ్మింటన్, స్విమ్మింగ్లో పతకాలు సాధించి ఆల్రౌండర్గా నిలిచినట్లు పేర్కొన్నారు. ఈగల్ టీం టేబుల్ టెన్నిస్లో 40 ఫ్లస్ సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్లో రజత పతకాలు, 50 ఫ్లస్ సింగిల్స్, 50 ఫ్లస్ మెన్స్ డబుల్స్లో కాంస్య పతకాలు సాధించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో రజత పతకం, షటిల్ బ్యాడ్మింటన్లో 50 ఫ్లస్ మెన్స్ డబుల్స్లో స్వర్ణం, మిక్స్డ్ డబుల్స్లో రజతం, స్విమ్మింగ్లో 25 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లో స్వర్ణ పతకం సాధించారని వెల్లడించారు. ఈగల్ విభాగం మొత్తంగా 40 పతకాలు సాధించడం విశేషమని పేర్కొన్నారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన, క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైళ్లు రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా మచిలీపట్నం – తిరుచానూరు మధ్య వారానికి రెండు రోజులు నడిచేలా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. మచిలీపట్నం – తిరుచానూరు (07440) ప్రత్యేక రైలు ఈ నెల 11, 12, 18, 19 తేదీలలో సాయంత్రం 4.55 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారు జామున 2 గంటలకు తిరుచానూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07439) ఈ నెల 12, 13, 19, 20 తేదీలలో తెల్లవారు జామున 3.30 గంటలకు తిరుచానూరులో బయలుదేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. -
రద్దీ వేళ... భద్రత డొల్ల
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంగా మారింది. వరుసగా చోటుచేసుకుంటున్న చోరీలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బస్సు ఎక్కే సమయంలో, దిగే సమయంలో, టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మహిళల రద్దీ పెరగడంతో దొంగలకు మరింత అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని నెలలుగా బస్టాండ్లో దొంగలు సెల్ఫోన్లు, నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్తున్నారు. బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్ల కోసం నిలబడినప్పుడు చేతివాటం ప్రదర్శించి అందినకాడికి కాజేస్తున్నారు.నరసరావుపేట టౌన్: సీ్త్రశక్తి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో బస్టాండ్ ప్రాంగణంతో పాటు బస్సుల్లోనూ కిక్కిరిసిన పరిస్థితి నెలకొంటోంది. దీనికి అనుగుణంగా భద్రత, నిఘా వ్యవస్థ, మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల బ్యాగులు, పర్సులు, సెల్ఫోన్లు, నగదుపై చోరులు కన్నేసి, పథకం ప్రకారం కొల్లగొడుతున్నారు. గత ఆదివారం నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికురాలి బ్యాగులో ఉన్న 12 సవర్ల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. రద్దీని దొంగలు ఎంతగా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారో ఈ ఘటన అద్దం పడుతోంది. కెమెరాలు ఉన్నా ప్రయోజనం శూన్యం బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిలో కొన్ని పనిచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. చోరీ జరిగిన సమయంలో నిందితులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీ కీలకం. అయితే కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సైతం కష్టతరంగా మారింది. కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించడంతో పాటు కీలక ప్రాంతాల్లో అదనపు కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బుకింగ్ కౌంటర్లు, బస్సులు ఎక్కే ప్రదేశాలు, ప్లాట్ఫారాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను పూర్తిస్థాయిలో నిఘా పరిధిలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. కీలక కేంద్రం నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ పల్నాడు జిల్లా కేంద్రమే కాకుండా, రాయలసీమ ప్రాంతాలతో పాటు హైదరాబాద్, విజయవాడ, శ్రీశైలం తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు కీలక కేంద్రంగా ఉంది. రోజూ వేలాది మంది ప్రయాణాల కోసం బస్టాండ్ను ఆశ్రయిస్తుంటారు. ఇంతటి రద్దీ ఉన్న బస్టాండ్లో ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. సమన్వయ లోపం చోరీలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పర్యవేక్షించడం, రద్దీ సమయాల్లో పోలీసు లేదా సెక్యూరిటీ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని నిరంతరం పరిశీలించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చోరీలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేసుల నమోదు, దర్యాప్తు, నిందితుల గుర్తింపు కోసం ఆర్టీసీ, పోలీసు శాఖలు సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. చోరీలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే వాటిని అరికట్టేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. సీసీ కెమెరాలను తక్షణమే బాగుచేసి, రద్దీ ప్రాంతాల్లో నిఘాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా తగిన సిబ్బందితో ఇక్కడ నిఘా పెట్టి నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా పోలీసు ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సులు సరిపడా లేక అవస్థలు పడుతున్న తమకు ఈ చోరులతో ఆందోళన తప్పడం లేదని వాపోతున్నారు. -
ఆర్టీసీ బస్సులో సెల్ఫోన్ చోరీ
ఇటీవల అద్దంకి వెళ్లేందుకు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కుతుండగా నా సెల్ఫోన్ కాజేశారు. అదే రోజు మరో ఇద్దరు ప్రయాణికుల సెల్ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి. బస్సు ఎక్కే సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని జేబు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.1.40 లక్షల విలువైన ఫోన్ పోగొట్టుకుని, రికవరీ కోసం పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా. బస్టాండ్లో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. – సీహెచ్ నరసింహారావు, ప్రయాణికుడు -
పేద రోగుల మృత్యుఘోష
సాక్షి ప్రతినిధి, గుంటూరు : వెంటిలేటర్పై ఉన్న పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి.. బతికున్న పసికందు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారిస్తే శ్మశానం వద్ద కదలాడినట్లు గమనించి కుటుంబ సభ్యులు వెనక్కు తెచ్చారు. డబ్బు కోసం బిడ్డల్ని మార్చారంటూ ఆరోపణలు.. బాలింత చనిపోతే పది గంటల వరకూ చూడనేలేదు.. స్కానింగ్ కోసం వెళ్లిన గర్భిణి అక్కడ వైద్యులు లేక గంటలకొద్దీ నిరీక్షించి స్కానింగ్ కేంద్రం వద్దే కిందపడిపోయి అక్కడే ప్రసవించిన హృదయ విదారకమైన ఘటన.. ఆ నెత్తుటి మరకలను గర్భిణి తల్లితోనే తుడిపించిన దారుణం.. బతికుండగానే స్ట్రెచర్ సహా ఓ వృద్ధుడిని బయటకు గెంటేసిన వైనం.. సూదిమందు డ్యూటీ తమది కాదంటే తమది కాదంటూ వైద్యులు, స్టాఫ్ నర్సులు ఓ రోజంతా రోగికి ఇంజెక్షన్ ఇవ్వని ఘటన.. ఇవన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జీజీహెచ్లో జరిగిన ఘటనలు. మళ్లీ చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ నిర్లక్ష్యం మరింత పెరిగింది. అత్యవసర వేళ వెటకారం తాజాగా ఈ నెల ఒకటో తేదీన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి(30) తీవ్ర అస్వస్థతతో అత్యవసర విభాగంలో చేరాడు. ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నాడంటూ బంధువులు ఎంత వేడుకున్నా అక్కడి వైద్య సిబ్బంది చలించలేదు. పైగా ‘ఎవరి ఆక్సిజన్ మాస్క్ అయినా పీక్కుని వచ్చి మాకు ఇవ్వండి.. పెడతామంటూ’ వెటకారంగా మాట్లాడారు. కొద్ది సేపటికే ఊపిరి అందక గోపి మృతి చెందాడు. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఇలాంటి దారుణ ఘటనలు నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో కోకొల్లలు. ఎంతో కీలక ఆసుపత్రి జీజీహెచ్కు గుంటూరుతో పాటు చుట్టుపక్కలనున్న ఆరు జిల్లాల ప్రజలు వైద్యం కోసం వస్తారు. రోజుకు దాదాపు 3,500 నుంచి 4 వేల మంది వరకు అవుట్ పేషెంట్లు వచ్చి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకుని వెళ్తుంటారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లోకి రోగులు, వారి వెంట సహాయకులు కలిపి మొత్తం రోజుకు 10 వేల మంది వస్తుంటారు. ఇటీవల ఆస్పత్రి వైద్యులు, వారు అందజేస్తున్న వైద్య సేవలపై ఉన్నతాధికారులకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. సాక్షాత్తు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ వారంలో రెండు రోజులు సెలవులు పెట్టి మరీ హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు పరుగులు పెడుతున్నారు. సీఎస్ఆర్ఎం వెంకటేశ్వరరావు సైతం రాత్రివేళ అందుబాటులో ఉండకుండా వెళ్లిపోతున్నారు. కీలక పోస్టుల్లో ఉన్న ఇద్దరు అధికారులు సక్రమంగా అందుబాటులో ఉండకపోవడంతో మిగతా వారు కూడా దీన్ని ఆసరాగా తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గాల్లో కలుస్తున్న ప్రాణాలు జీజీహెచ్లో గత తొమ్మిది నెలలుగా నమోదవుతున్న మరణాల రేటును పరిశీలిస్తే.. గుండెలు పగిలే నిజాలు వెలుగులోకొచ్చాయి. జీజీహెచ్లో 2024లో 7,846 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. 2025లో 6,529 మంది చనిపోయారు. 2026లో సైతం వారానికి వంద మంది చొప్పున మృత్యువాత పడుతున్న దయనీయ పరిస్థితి. ఇంకా ఇక్కడ సరైన వైద్యం అందక వేరే ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలో జరిగిన మరణాలు చాలానే ఉన్నాయి. తీరు మార్చుకోని అఽధికారులు ఆస్పత్రిలో అత్యవసర వైద్యచికిత్సల తీరును నిత్యం పర్యవేక్షించాల్సిన సీఎస్ఆర్ఎంఓ, సూపరింటెండెంట్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాన్ని వైఎస్సార్ సీపీ హయాంలో నూతనంగా ప్రారంభించారు. అయితే ఎమెర్జెన్సీ వైద్యులు సరిగా డ్యూటీలు చేయకుండా సొంత ప్రాక్టీసు చేసుకుంటూ ఈ విభాగాన్ని గాలికొదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అత్యవసర వార్డుల్లోనే మరణాల సంఖ్య అధికంగా నమోదవుతోంది. ఇంత జరుగుతున్నా వైద్యులు మాత్రం తీరు మార్చుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్ పోస్టును సీనియర్లకు ఇవ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో తమకు ఇష్టమొచ్చిన వారికి ఇవ్వడంతో సీనియర్ వైద్యులెవరూ వారి మాట లెక్కచేయని పరిస్థితి. ఇన్చార్జులు కావడంతో వారు సైతం వైద్యులు, సిబ్బందిపై సీరియస్గా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో జీజీహెచ్లో మరణాల సంఖ్య తగ్గడం లేదు. అధికారికంగా 1,250 ... అనధికారికంగా మరో వెయ్యికిపైగా పడకలతో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిస్థితి ఊరు గొప్ప పేరు దిబ్బలా తయారైంది. అత్యవసర వైద్యసేవలు పొందాలంటే రోగులకు కష్టంగా ఉంది. ఫలితంగా, ఈ ఆసుపత్రిలో మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రైవేటు క్లినిక్లకు కేటాయిస్తున్న సమయం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులకు ఇవ్వడం లేదు. ప్రధానంగా క్యాజువాల్టీ, ట్రామాకేర్, ఐసీయూ, ఇతర ఎమెర్జెన్సీ వార్డులు, గైనిక్, పిల్లల వార్డుల్లో రోగులకు సకాలంలో వైద్యసేవలందక మరణాలు పెరుగుతున్నాయి. కొందరు వైద్యాధికారుల తప్పిదాల కారణంగా ఆస్పత్రి మొత్తానికి చెడ్డపేరు వస్తోంది. -
సర్పై 10 వరకు అభ్యంతరాల స్వీకరణ
నరసరావుపేట రూరల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)కు సంబంధించిన ఫిర్యాదులు, అభ్యంతరాలను ఈనెల 10వ తేదీ వరకు స్వీకరించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతికా శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఇప్పటికే సర్ ముసాదాను అగస్ట్ 31వ తేదీన విడుదల చేసినట్లు తెలిపారు. ముసాదా ఓటరు జాబితా అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యంతరాలను స్వీకరించేందుకు ఈనెల 5, 6 (శని, ఆదివారం) తేదీలను ప్రత్యేక ప్రచార దినాలుగా ప్రకటించి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత పోలింగ్ కేంద్రాలలో బిఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. రాజకీయపార్టీల ప్రతినిధులు తమ బూత్ లెవల్ ఏజెంట్లను హాజరయ్యేలా చూసుకోవాలని సూచించారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అవసరమైన పత్రాలు బీఎల్ఓల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువ ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నరసరావుపేట ఈస్ట్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని బరంపేటలోని ఇస్కాన్ ఆలయాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు. శ్రీరాధా గోవిందులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. -
జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు పల్నాడు క్రీడాకారులు
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు పల్నాడు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికై నట్టు పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈనెల ఏడో తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్న 52వ జూనియర్ నేషనల్ అక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలలో వాటర్ పోలో విభాగంలో పల్నాడు జిల్లాకు చెందిన ఆర్.లోహిత్, కె.రుద్రప్రతాప్ సైదులురెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఏపీ స్విమ్మింగ్ కోచ్ జి.సురేష్ పర్యవేక్షణలో శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో శిక్షణ పొందారని తెలిపారు. జాతీయస్థాయి పోటీలో క్రీడాకారులు లోహిత్, రుద్రప్రతాప్లు ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. -
పారదర్శకంగా సర్ ప్రక్రియ
నరసరావుపేట ఈస్ట్: జిల్లాలో ఓటర్లు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిబంధన ప్రకారం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్యాదవ్ సర్ ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అధికారులతో కలసి కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ కృతికా శుక్లా జిల్లాలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ వివరాలను రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్కు వివరించారు. కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి కె.అద్దెయ్య, ఆర్డీఓ బాలకృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జనగణన హ్యాండ్బుక్కు పక్కా సమాచారం ఇవ్వాలి.. నరసరావుపేట ఈస్ట్: జిల్లా జనగణన హ్యాండ్ బుక్ ప్రాంతీయ ప్రణాళిక, సామాజిక, ఆర్థిక విధానాల అమలుకు అత్యంత కీలక పత్రమని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్లో గురువారం పల్నాడు జిల్లా జనగణన హ్యాండ్బుక్ తయారీ, సంకలనంపై జిల్లా ఉన్నతస్థాయి సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ.. జిల్లాలోని తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలోని సమాచారాన్ని వ్యక్తిగతంగా ధ్రువీకరించి నిర్దేశించిన గడువులోపు అందచేయాలని ఆదేశించారు. సీఈఓకు వివరించిన కలెక్టర్ కృతికా శుక్లా -
వైఎస్సార్ సీపీలో జోష్
శుక్రవారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026కృష్ణం వందే జగద్గురుం సాక్షి, నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గత కొన్ని రోజులుగా పల్నాడు జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు అధికారపార్టీని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయింది. ఇంకో రెండున్నర సంవత్సరాలు అధికారం చెలాయిస్తామన్న ధీమా కన్నా భవిష్యత్పైనే వారికి భయం పట్టుకున్నట్లుంది. దానికి ప్రధాన కారణం గత వారంలో రోజులుగా వైఎస్సార్ సీపీలోకి తెలుగుదేశం పార్టీలో నుంచి వస్తున్న వలసలు. అధికారపార్టీని వదలి, వారు పెడుతున్న భయాలు, ప్రలోభాలకు గురికాకుండా వైఎస్సార్ సీపీ కండువాలు కప్పుకుంటున్నారు. మాచర్ల, గురజాల, సత్తెనపల్లి వంటి నియోజకవర్గాల్లో నిత్యం ఏదో ఒక చోట ప్రజాప్రతినిధులు, బలమైన సామాజికవర్గం అండ ఉన్న నేతలు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని ముందుకు వస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవహిస్తుండగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇదే ఊపు కొనసాగి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల లోపు మరింత మంది నేతలు అఽధికారపార్టీను వీడేందుకు సిద్ధపడుతున్నారని సమాచారం. వైఎస్సార్సీపీలోకి క్యూ కడుతున్న నేతలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత... స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్సార్ సీపీలోకి వస్తున్న వలసలు పార్టీలో కొత్త జోష్ను నింపుతున్నాయి. ఈ ఉత్సాహంతో ఉన్న వైఎస్సార్ సీపీ నేతలు గత ప్రభుత్వంలో చేసిన మంచిని చెప్పుకొంటూనే, కూటమి ప్రభుత్వంలో రెండేళ్లుగా పడుతున్న ఇబ్బందులను వివరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అఽధికార టీడీపీ నేతల్లో ఆంతర్మథనం మొదలైంది. ఎందుకు వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారన్న చర్చ గట్టిగా నడుస్తోంది. ఓ వైపు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతుంటే ఇలా నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతుంటే ఎలా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఇవ్వగలమన్న భయం వారిలో నెలకొంది. ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి వెళ్లడానికి అధికారపార్టీ నేతలు అలోచిస్తున్నారు. జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ సైతం జిల్లాలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సక్రమంగా జరగడం లేదని కార్యకర్తల సమావేశంలో పెదవి విరిచినట్లు సమాచారం.పీఆర్కేను కలసి వైఎస్సార్సీపీ తోనే ఉంటామంటున్న మాచర్ల మాజీ కౌన్సిలర్, టీడీపీ నేత జగన్నాథం శివయ్య, అనుచరులు గురజాలలో గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తుత టీడీపీ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని బేరీజువేసుకొని చాలా మంది టీడీపీ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డు కౌన్సిలర్ ముశ్యం సీతారామయ్య కుమారుడు, టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ముశ్యం శ్రీనివాసరావు సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. మాజీ ఎమ్యెల్యే కాసు మహేష్రెడ్డి చేతులు మీదుగా కండువా కప్పుకొన్నారు. గురజాల నియోజకవర్గంలో మరింత మంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ నేతలే చెప్పుకొస్తున్నారు. ఊహించని దెబ్బతో ఖంగుతున్న గురజాల ఎమ్యెల్యే యరపతినేని శ్రీనివాసరావు గత రెండేళ్లుగా టీడీపీలో ఉంటున్న గురజాల నగరపంచాయతీ చైర్మన్ బడే జానీ మెడలో కొత్తగా పచ్చ కండువా కప్పి అభాసుపాలయ్యారు. -
పేకాటకు ప్రోత్సాహం.. దాడులతో బీభత్సం
సాక్షి,టాస్క్ఫోర్స్: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్నాడు ప్రాంతం జూదానికి అడ్డాగా మారింది. పల్నాడు ప్రాంతాన్ని అడ్డాగా చేసుకొని పేకాట క్లబ్లు నిర్వహించడంలో సత్తెనపల్లి పేకాట క్లబ్కు మంత్రి లోకేష్, చిలకలూరిపేట పేకాట క్లబ్కు సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అండదండలు ఉండడంతోనే ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ బడా నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తమదేపై చెయ్యిగా నడవాలన్నట్లు ఆ రెండు పేకాట క్లబ్ల నిర్వాహకుల మధ్య ఆధిపత్య పోరుతో ప్రత్యక్ష దాడులకు తెగబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పేకాట క్లబ్పై గుర్తు తెలియని దుండగులు గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు దాడి చేశారు. నాలుగు కార్లలో 20 మంది దుండగులు పేకాట క్లబ్ వద్దకు చేరుకుని, అక్కడ పనిచేస్తున్న వాచ్మన్ చింతపల్లి రాజు, స్క్రోరల్ (పేక ముక్కలు పంచే వ్యక్తి)రెడ్డి ఆదినారాయణలపై దాడి చేశారు. వారి ఇరువురి వద్ద ఉన్న రూ.2,400 నగదు, రెండు సెల్ఫోన్లు తీసుకున్నారు. లోపలికి వెళ్లి నాలుగు క్యాష్ కౌంటర్లను పగల గొట్టారు. కౌంటర్లలో నగదు లేకపోవడంతో కుర్చీలు, టేబుళ్లు, అద్దాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలేవీ రికార్డు కాకుండా డీవీఆర్ బాక్స్ను అపహరించుకుపోయారు. తిరిగి కారులో ఎక్కి నరసరావుపేట వైపు వెళ్లారనేది ప్రచారం. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి టౌన్ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు, పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పేకాట క్లబ్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న వాచ్మన్ రాజు, స్క్రోరల్ ఆదినారాయణతో మాట్లాడగా కారులో వచ్చారని ముందుగా నలుగురు దిగి తమను పట్టుకున్నారని, మిగిలిన వారు దాడి చేసి లోపలికి ప్రవేశించారని చెప్పారు. క్లబ్ ప్రెసిడెంట్ మేకల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటాల పంపకాల్లో విభేదాలే కారణం? సత్తెనపల్లి పేకాట క్లబ్ నిర్వహణలో వచ్చే లాభాల్లో నుంచి 50, 30, 20, 10 శాతం పర్సంటేజీల వంతున పంచుకునేందుకు ‘పెద్ద’మనుషుల ఒప్పందాలు కూడా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రకారం వాటాల పంపిణీలో కొద్ది రోజులుగా జాప్యం చోటుచేసుకోవడంతో భాగస్వాములు ఎవరైనా దాడి చేయించి ఉంటారా? లేక వాటాలు మరికొన్ని రోజులపాటు ఆలస్యం చేసేందుకు నిర్వాహకులే దాడి చేయించారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రంగంలోకి పోలీసు బృందాలు సత్తెనపల్లిలో పేకాట క్లబ్పై దాడి జరగడాన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశాల మేరకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సత్తెనపల్లి పేకాట క్లబ్ ప్రాంతం నుంచి నరసరావుపేట వైపుగా రోడ్డుపైన ఉండే సీసీ కెమెరాలను పర్యవేక్షణ చేసుకుంటూ విచారణ చేపడుతున్నారు. సత్తెనపల్లి పేకాట క్లబ్పై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు కార్లలో నరసరావుపేట వైపు నుంచి చిలకలూరిపేట, ప్రకాశం జిల్లా మార్టూరు వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. వాచ్మన్ చింతపల్లి రాజు, స్క్రోరల్ రెడ్డి ఆదినారాయణల సెల్ఫోన్లు కూడా దుండగులు తీసుకొని వెళ్లడంతో ఆ ఫోన్లను ట్రాక్చేస్తూ పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. వీరిలో ఒకరిద్దరు పట్టుబడినట్లు సమాచారం. సత్తెనపల్లిలో పేకాట క్లబ్ ప్రారంభించిన నాటి నుంచి మూడు పువ్వులు .. ఆరు కాయలుగా సాగుతోంది. పేకాటరాయుళ్లను తీసుకువచ్చే బాధ్యత, పేకాట క్లబ్ నిర్వహణ, అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వచ్చిన ఆటగాళ్ల భద్రత ఏర్పాట్లు వంటి విధులను కూడా నిర్వాహకులు పంచుకొని క్లబ్ను నిర్వహిస్తున్నారు. దీంతో పల్నాడు జిల్లా వాసులే కాక గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలతోపాటు హైదరాబాదు, నల్గొండ, తెలంగాణ వాసులు కూడా ఎక్కువగా వస్తున్నారు. రూ. వేల నుంచి రూ.లక్ష వరకు ఒక్కో విభాగంలో పదికి పైగా టేబుళ్లు ఏర్పాటు చేయడంతో జోరుగా పేకాట క్లబ్ నడుస్తోంది. సత్తెనపల్లి క్లబ్ నడవడం వల్లన చిలకలూరిపేట పేకాట క్లబ్కు వెళ్లే ఆటగాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సత్తెనపల్లిలోని పేకాట క్లబ్ను మూసి వేయించేందుకు చిలకలూరిపేట పేకాట క్లబ్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
బెయిల్పై సింగారెడ్డి విడుదల
మాజీ మంత్రి విడదల రజిని పరామర్శ నాదెండ్ల: అక్రమ కేసుల్లో అరైస్టె జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్యార్డు మాజీ వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి గురువారం బెయిల్పై విడుదలయ్యారు. అనంతరం మాజీ మంత్రి విడదల రజిని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ ముప్పై ఏళ్ల తన రాజకీయ జీవితంలో కక్షసాధింపు రాజకీయాలు తానెప్పుడూ చూడలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒకసారి అరెస్టు చేశారని, ప్రస్తుత టీడీపీ పాలనలో నాతో పాటూ మాజీ సర్పంచ్, నా భార్య లక్ష్మిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని, వైఎస్సార్ సీపీ కోసం తానెప్పుడూ పనిచేస్తానని స్పష్టం చేశారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాజకీయ వేధింపులతో నాయకులు, కార్యకర్తల ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. కష్టకాలంలో పార్టీ శ్రేణులకు అండగా నిలవటం తన బాధ్యత అని, చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యంగా సాగాలన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఉడతా వెంకటేశ్వరరావు, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు దరియావలి, నాదెండ్ల మండల ఉపాధ్యక్షుడు అల్లడి రవికుమార్, ఎస్సీ సెల్ నాయకులు శేషయ్య, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, బూత్ కమిటీ అధ్యక్షుడు శేషిరెడ్డి ఉన్నారు. -
15 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీలో అడ్మిషన్లు
11మందికి తీవ్ర గాయాలు అచ్చంపేట: పిచ్చికుక్క స్వైర విహారం చేసి 11 మందిని తీవ్రంగా గాయపరచిన ఘటన అచ్చంపేట మండలం మాదిపాడులో గురువారం చోటుచేసుకుంది. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో షేక్ సైదా, ఫాస్టర్ విద్యాశేఖర్, యాంపొంగు శ్రావణి, మరికొంతమంది పడవ ప్రయాణికులు ఉన్నారు. అందరికి డాగ్బైట్ ఇంజక్షన్లు చేశారు. గాయపడినవారిలో ఒక చిన్నారి కూడా ఉన్నాడు. ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం లేదని, అందరికి ఇంజక్షన్లు చేశామని వైద్యాధికారి రాములునాయక్ తెలిపారు. సత్తెనపల్లి: భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు మూడు సంవత్సరాల కారాగార శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి విజయ్కుమార్రెడ్డి గురువారం తీర్పు వెలువరించారు. అమరావతికి చెందిన ఒంటిపులి దావీదు, నాగలక్ష్మి భార్యా,భర్తలు. 17 సంవత్సరాల కిందట వీరికి వివాహమైంది. కొంతకాలంగా చెడు అలవాట్లకు బానిసైన భర్త భార్యను మానసికంగా, శారీరకంగా హింసిస్తుండడంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వాత సరిగ్గా చూసుకుంటానని నమ్మబలికి 2019 అక్టోబర్ 21న దావీదు తన భార్యను అమరావతి తీసుకొని వచ్చాడు. ఇంటికి రాగానే నిన్ను చంపడానికే ఇంటికి పిలిచానని, కూరగాయల కత్తితో ఆమె పీక కోసి కొన్నిచోట్ల గాయపరిచి పడవేసి వెళ్లిపోయాడు. చుట్టుపక్కల వారి సహాయంతో 108 అంబులెన్స్లో అమరావతి సీహెచ్సీలో చేరి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్ తరలించారు. వైద్యశాలలో బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు భర్త దావీదుపై అప్పటి అమరావతి ఎస్ఐ డి రవీంద్రబాబు కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొల్లా వెంకటేశ్వరరావు కేసుకు సంబంధించిన న్యాయ పరమైన విషయాలను వివరిస్తూ కేసు నిరూపణ అవడంలో కీలకపాత్ర పోషించాడు. న్యాయమూర్తి విజయ్కుమార్రెడ్డి పై విధంగా తీర్పు వెలువరించారు. -
ఏ తల్లి కన్న బిడ్డో..
నరసరావుపేట టౌన్: ఆర్థిక భారమో లేకా మరో ఇతర కారణమో తెలియదు గానీ నవమాసాలు మోసి కన్న బిడ్డను ఆ తల్లి నిర్మాన్యుష్య ప్రదేశంలో వదిలి వెళ్లింది. శిశువు చీకట్లో ఏడుస్తుండగా ఆరోధనలు విన్న ఆసుపత్రి సిబ్బంది అక్కడకు చేరుకొని కాపాడిన ఉదంతమిది. నరసరావుపేట పట్టణంలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. లింగంగుంట్ల పరిధిలోని శ్రీ కేర్ ఆసుపత్రి వెనుక ఖాళీ ప్రదేశంలో మంగళవారం అర్థరాత్రి పసికందు ఏడుపు వినిపించింది. ఆసుపత్రి మేనేజర్ కృష్ణచైతన్యారెడ్డి అక్కడకు వెళ్లి పరిశీలించాడు. అక్కడ రెండు రోజుల కిందట పుట్టినట్లు కనిపిస్తున్న ఆడశిశువును గుర్తించి వెంటనే వైద్యశాలకు తరలించారు. శిశువును వైద్యల పర్యవేక్షణలో ఉంచి అవసరమైన వైద్యం అందిస్తున్నారు. ఈ సమాచారాన్ని గురువారం నరసరావుపేట రూరల్ పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. డీఎస్పీ హనుమంతరావు, ఎస్ఐ కిశోర్ వైద్యశాలకు చేరుకుని పసికందును పరిశీలించారు. శిశువు ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శిశువును అక్కడ ఎవరు వదిలి వెళ్లారు.. తల్లిదండ్రులు ఎవరు.. ఏ పరిస్థితుల్లో పసికందును నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వెళ్లారనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో ఉన్న సీసీ కెమారాల పుటేజ్లను పరిశీలించి ఆధారాలు సేకరించారు. శిశువుకు సంబంధించి తల్లిదండ్రులు లేదా కుంటుంబ సభ్యుల గురించి సమాచారం తెలిసిన రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. -
ఫీజు కట్టివస్తానంటూ కానరాని లోకాలకు..
చిలకలూరిపేటటౌన్: ఇంటి నుంచి కళాశాలలో ఫీజు చెల్లించి వస్తానంటూ వెళ్లిన విద్యార్థి చెరువులో మృతదేహమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లెమల్లి గ్రామానికి చెందిన గనిపినేని వెంకటేశ్వర్లు, నాగరాజా దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు అభిలాష్ (21) గుంటూరులోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు చిలకలూరిపేట టిడ్కో గృహాల్లో స్నేహితులతో కలిసి అద్దెకు ఉంటూ చదువుకునేవాడు. ఏప్రిల్ తర్వాత స్వగ్రామానికి వెళ్లిపోయాడు. సప్లిమెంటరీ ఫీజు చెల్లించి వస్తానంటూ ఈనెల ఒకటో తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఏమైందో ఏమో తెలీదు గాని చిలకలూరిపేట పట్టణం పరిధిలోని టిడ్కో గృహాల సమీపంలోని తాగునీరు సరఫరా చేసే కొత్త చెరువు గట్టుపై బుధవారం అభిలాష్ దుస్తులు, బ్యాగు, ఐడీకార్డు, చెప్పులు ఉండటాన్ని పురపాలక సిబ్బంది గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రూరల్ ఎస్ఐ జి అనిల్కుమార్ అక్కడకు వచ్చి గజ ఈతగాళ్లతో చెరువులోనూ, ఫిల్టర్ బావిలోనూ గాలింపు ప్రారంభించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం అభిలాష్ మృతదేహం చెరువులో తేలి కన్పించడంతో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మొదటి నుంచి కళాశాల పట్ల ఇష్టం లేదని, తనకు ఇష్టంలేని కారణంగానే ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యుల ద్వారా ప్రాథమిక సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. -
ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ఏకై క మార్గం ప్రకృతి వ్యవసాయం
జర్మనీ శాస్త్రవేత్త వాల్టర్ నార్నెపాడు(ముప్పాళ్ళ): ఎల్నినో ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయ విధానాలే ఏకై క మార్గమని జర్మనీకి చెందిన శాస్త్రవేత్త వాల్టర్ అన్నారు. మండలంలోని నార్నెపాడు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను హిమాచల్ప్రదేశ్కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త సడానా, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కే.అమలకుమారిలతో కలిసి గురువారం సందర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఏటీఎమ్ మోడల్ విధానాన్ని అవలంభిస్తే ఏడాది పొడవునా వివిధ పంటల ద్వారా ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్త వాల్టర్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తున్న పంటలపై ఎల్నినో ప్రభావం పెద్దగా కనిపించకపోవడం పట్ల శాస్త్రవేత్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఆర్ఎఫ్ ధనలక్ష్మి, జిల్లా సిబ్బంది సైదయ్య, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ కే.పూజ, ప్రకృతి వ్యవసాయ రైతులు, మహిళలు పాల్గొన్నారు. -
గణిత బోధకుడికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
యడ్లపాడు: విద్యారంగంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇప్పటికే మండల, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందుకున్న జగ్గాపురం జెడ్పీ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు ఎస్ ఆదినారాయణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన విద్యార్థులకు గణితాన్ని సులభతరం చేస్తూ.. వినూత్న బోధనా పద్ధతులతో వారి ప్రతిభను వెలికితీస్తూ.. విద్యారంగంలో విశిష్ట సేవలందించారు. బోధనలో వినూత్నం, లోకాస్ట్తో టీఎల్ఎం, ఐఎల్ఎం మెటీరియల్తో గణితాన్ని ఆసక్తికరంగా, గణిత, విజ్ఞాన ప్రదర్శనలతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడం ఆయన ప్రత్యేకత. దూరదర్శన్సప్తగిరి ఛానల్లో 1నుండి 10వ తరగతి వరకు గణిత బోధకుడిగా సేవలందించారు. ఆదినారాయణ మార్గదర్శకత్వంలో విద్యార్థులు రాష్ట్రస్థాయి గణిత క్విజ్తో పాటు క్రీడలు, చిత్రలేఖనం, నాటక పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయాలు సాధించారు. 2012 నుంచి 2025 వరకు పాఠ్యపుస్తకాలు, మాడ్యూళ్ల రచయితగా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ వైదిక గణిత రిసోర్స్ పర్సనన్గా కొనసాగుతున్నారు. వేదిక్ మ్యాథమెటిక్స్ విషయ నిపుణుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గణిత పాఠ్యపుస్తక రచయితగా విద్యారంగంలో తనదైన గుర్తింపు పొందారు. మానవతా సంస్థ ద్వారా 204 మంది విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్కు ఎంపిక కావడం ఆయన విద్యా ప్రోత్సాహానికి నిదర్శనంగా నిలిచింది. గణితంలో ప్రతి ఏడాది పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణతతో పాటు నూటికి నూరు మార్కులు సాధించారు. విద్యార్థులను వివిధ ప్రతిభా పరీక్షల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ.. వారు అనేక పతకాలు, నగదు బహుమతులు సాధించేలా మార్గనిర్దేశం చేశారు. ఉపాధ్యాయ బాధ్యతలే కాకుండా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఆదినారాయణ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఈ అవార్డు దక్కిందని తెలిపారు. ఈనెల 5న విజయవాడలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి ఆయన పురస్కారాన్ని అందుకోనున్నారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సుజాత
గిరిజనుల విద్యాభివృద్ధిలో సుజాత సేవలకు గుర్తింపు మాచర్ల రూరల్: గిరిజన చిన్నారుల చేత బలపం పట్టించి అక్షరాలు దిద్దించి, వారి ఉన్నతి కోసం నిరంతరం శ్రమిస్తూ గిరిజన విద్యార్థుల్లో సంకోచాన్ని తొలగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటంలో ఆ ఉపాధ్యాయురాలు సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేసింది. మాచర్ల మండలం ఎత్తిపోతల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంటుగా పనిచేస్తున్న మారుబోయిన సుజాతకు అరుదైన గౌరవం దక్కింది. 2012 డీఎస్సీ ద్వారా ఎస్ఎగా భౌతిక శాస్త్రం ఉపాధ్యాయురాలుగా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు, మురికిమళ్ల తండాలో విధుల్లో చేరారు. ఉపాధ్యాయురాలుగా నూరుశాతం ఉత్తీర్ణత సాధిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో చొరవచూపి తల్లిదండ్రుల విశ్వాసాన్ని సంపాదించారు. అక్టోబర్లో అంతర్జిల్లా బదిలీ ద్వారా పల్నాడుకు వచ్చి శిరిగిరిపాడు పాఠశాలలో పనిచేశారు. అక్కడ విద్యార్థులకు సైన్స్లో టాలెంట్ టెస్టులు, ప్రయోగశాలలు ఏర్పాటు చేసి కలెక్టర్ ద్వారా మెరిట్ సర్టిఫికెట్లను అందుకున్నారు. ముఖ్యంగా బడి మానేసిన విద్యార్థులను బడికి తీసుకురావటంతో పాటు, ఆరోగ్య సమస్యలతో పాటు బాధపడుతున్న వారికి సొంత ఖర్చులతో వైద్యం అందించి చిన్నారుల మనసు గెలుచుకున్నారు. వెల్దుర్తి మండల సైన్స్ అధికారిగా జిల్లా స్థాయిలో సైన్స్ కార్యక్రమం నిర్వహించి అవార్డు అందుకున్నారు. సైన్స్ పట్ల విద్యార్ధుల్లోని భయాన్ని పోగొట్టి వారికి సులభమైన రీతిలో ప్రయోగాల ద్వారా విద్యనందించటంలో ఆమె ప్రతిభను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. -
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా యశోదర
వినుకొండ: వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ వింజనంపాటి యశోదర ప్రతిష్టాత్మక రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యా రంగంలో ఆమె అందిస్తున్న విశేష సేవలు, సాధించిన ఘనతలకు గాను ఈ గౌరవం దక్కింది. డాక్టర్ యశోదర 1995 జూన్లో బాపట్ల ఎస్.ఎమ్. గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్లో హిందీ గ్రేడ్–2 ఉపాధ్యాయురాలిగా తమ ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2000 మే నెలలో సంగం జాగర్లమూడి జెడ్పీ ఉన్నత పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. 2025 జూన్లో వినుకొండ బాలుర ఉన్నత పాఠశాల హెచ్.ఎమ్గా బాధ్యతలు స్వీకరించిన ఆమె, ప్రస్తుతం రొంపిచర్ల మండలం ఎఫ్ఏసీ ఎంఈఓగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పరిశోధనలు, పుస్తక రచనల్లో ప్రతిభ 2017లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా ‘రామదర్శ మిశ్ర కే కథా సాహిత్య మే నారి‘ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి పీహెచ్డీ సాధించారు. 2021లో 7వ తరగతి హిందీ పాఠ్యపుస్తక రచయితగా వ్యవహరించారు. నేషనల్ బుక్స్ ట్రస్ట్ తరఫున హిందీ నుండి తెలుగులోకి ‘బిస్మిల్లా ఖాన్’, ‘ఏకతా కాసిని’, ‘కరోనా వైరస్ – సింబా’ అనే మూడు ప్రతిష్టాత్మక పుస్తకాలను అనువదించారు. నాలుగు సంవత్సరాలుగా యూటీఎఫ్ తరఫున పదవ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్లు తయారు చేయడంతో పాటు, అనేక జాతీయ రీసెర్చ్ జర్నల్స్లో వ్యాసాలు ప్రచురించారు. పాఠశాల పురోగతిలో కీలక పాత్ర హెచ్.ఎమ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 15శాతం పెరిగింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 14 మందికి పైగా విద్యార్థులు 500 కి పైగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని సమున్నతంగా నిలిపారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై న డాక్టర్ యశోదరను వినుకొండ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు అభినందించారు. మరొకరు అరెస్ట్ -
వెళుతున్న బైక్పై నుంచి దూకిన యువకుడు మృతి
గుంటూరు రూరల్: ద్విచక్రవాహనంపై వెళుతూ ద్విచక్రవాహనంపైనుంచి దూకే క్రమంలో యువకుడు మృతి చెందిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చల్లా నాగవర్థన్రెడ్డి (25), అదే గ్రామానికి చెందిన మస్తాన్లు ఇద్దరు నల్లపాడులోని ఒక బార్లో మద్యం సేవించారు. అనంతరం గుంటూరువైపు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో వాహనం నడుపుతున్న మస్తాన్ వాహనాన్ని అతి వేగంగా నడిపిస్తుండగా వెనుక కూర్చున్న నాగవర్థన్రెడ్డి భయపడి ద్విచక్రవాహనంపై నుంచి ఒక్కసారిగా కిందకు దూకాడు. వేగంగా వెళుతున్న ద్విచక్రవాహనంపై నుంచి దూకటంతో స్పీడుకు తట్టుకోలేక రోడ్డుపక్కనే ఉన్న చెట్టుకు ఢీకొన్నాడు, అక్కడినుంచి పక్కనే ఉన్న పంచర్షాపులోని గాలిసిలెండర్కు ఢీకొన్నాడు. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మస్తాన్ అదేవిధంగా స్పీడుగా వెళుతూ రోడ్డుపక్కన నిలిపిఉన్న లారీని ఢీకొన్నాడు. ప్రమాదంలో మస్తాన్కు గాయాలయ్యాయి. సంఘటనలో స్థానికులు మస్తాన్ను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించగా, నాగవర్థన్రెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి మృతుని బంధువులకు సమాచారం అందించి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగుల నిరసన
నరసరావుపేట ఈస్ట్: కాంట్రాక్ట్ పారా మెడికల్ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లాల ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్ఎస్) కార్యాలయం ఎదుట ఉద్యోగులు ‘టీమ్ పల్నాడు– ఏపీ పారా మెడికల్ జేఏసీ’ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మానవహారంగా ఏర్పడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని, వంద శాతం గ్రాస్ జీతాలు చెల్లించాలని, హెల్త్ కార్డులు, పరస్పర బదిలీలు కల్పించాలన్నారు. అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీసెట్–2026 నోటిఫికేషన్లో పొందుపర్చిన విధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుందని ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.కల్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను ఈనెల 8వ తేదీలోగా ఆన్లైన్లో పూర్తి చేయాలని సూచించారు. ఏపీ పీజీసెట్లో ఉత్తీర్ణులై, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీలో ఎమ్మెస్సీ జువాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఏపీ పీజీసెట్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. తెనాలి: దుబాయ్లో జరగనున్న సీపీఎల్ టీ20 క్రికెట్ లీగ్ పోటీలకు తెనాలికి చెందిన పల్నాటి నాగరాజు ఎంపికయ్యారు. చాంపియన్ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ పిల్ల శరత్ ఈ మేరకు సమాచారం పంపారు. గత ఆగస్టు నెలలో తునిలో సీపీఎల్ టీ20 క్రికెట్ లీగ్ నిర్వహించారు. తొలి సీజనులో ప్రతిభ చాటిన 24 మందిని దుబాయ్లో జరిగే టీ 20, వన్డే మ్యాచ్లకు ఎంపిక చేశామని తెలిపారు. ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రత్తిపాడు: మహిళల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఐద్వా ఏపీ రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఇండక్షన్ కార్యక్రమాలు 15వ రోజుకు చేరాయి. బుధవారం మధ్యాహ్నం రమాదేవి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. హక్కులపై అవగాహన పెంపొందించుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. చుండి రంగనాయకులు కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ టి.వెంకట నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. నగరంపాలెం: ప్రజలు, ప్రభుత్వ అధికారులకు కొంత మంది వ్యక్తులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల పేర్లు, హోదాలను ఫోన్ కాల్ ద్వారా తెలియజేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసిందని ఉమ్మడి గుంటూరు జిల్లా ఏసీబీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అటువంటి నకిలీ ఫోన్ కాల్స్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు. వ్యక్తిగత/ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు, పీన్లు, ఇతరత్రా రహస్య సమాచారాన్ని తెలియజేయవద్దని తెలిపారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా మెసేజ్లు వస్తే స్థానిక పోలీస్స్టేషన్లోగానీ ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064, ఏఎస్పీ 94913 05638, డీఎస్పీ 92465 37807 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
రాజన్నా.. మరువలేమన్నా...
నిత్యం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజల జీవితాలను మార్చిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. తొలుత వైద్యుడిగా పేదల బాధలను చూశారు... తర్వాత నాయకుడిగా ప్రజల సమస్యలను విన్నారు... అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి పరిష్కారం చూపించాలనే తపనతో పాలించారు. బుధవారం ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగారని కొనియాడారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజన్నా.. నిను మరువలేమన్నా.. అంటూ మహానేతను మరోసారి గుర్తుచేసుకున్నారు. – సాక్షి నెట్వర్క్ వినుకొండ రూరల్ మండలంలోని విఠంరాజుపల్లిలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నాయకులు -
చేనేత సహకార సంఘాలపై సర్కారు నిర్లక్ష్యం
మంగళగిరి టౌన్: చేనేత సహకార సంఘాల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరితో సహకార రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని, మనుగడ సాగించడమే కష్టంగా మారిందని ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికులు, నాయకులను సమాయత్తం చేసి తీవ్రస్థాయి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీ మార్కండేయ కళ్యాణ మండపంలో బుధవారం చేనేత సహకార సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘాల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికల ఊసేది? ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 2013 నుంచి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజాస్వామ్య పాలనకు దూరమయ్యాయని అన్నారు. రాజకీయ పదవులకు కాలపరిమితి పూర్తయిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తున్న విధంగానే సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎనిమిదేళ్లుగా చేనేత రంగానికి సంబంధించిన ట్రిఫ్ట్ ఫండ్, యార్న్ సబ్సిడీ, మార్కెట్ ఇన్సెంటివ్, పావలా వడ్డీ, రిబేట్ తదితర ఐదు సంక్షేమ పథకాల కింద సుమారు రూ.203 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆ నిధులను విడుదల చేసి చేనేత కార్మికులు, సహకార సంఘాలను ఆదుకోవాలని కోరారు. కేడీసీసీ బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన చేనేత సహకార సంఘాలకు సంబంధించిన రూ.46.19 కోట్ల రుణమాఫీ ఫైలు గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్లో ఉందని, ప్రభుత్వం తక్షణమే ఫైలుకు ఆమోదముద్ర వేసి రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 1985 హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ ప్రకారం చేనేత రంగానికి రిజర్వు చేసిన వస్తువుల తయారీ, విక్రయాలపై నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో చేనేత దుస్తులపై జీఎస్టీ రీఇంబర్స్మెంట్ చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. బకాయిలు విడుదల చేయండి ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఆప్కో నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి చెల్లించాల్సిన రూ.97 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి ఆప్కోను ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ఉన్న చేనేత సహకార సంఘాల్లో ఇప్పటికే సుమారు 300 సంఘాలు మూతపడ్డాయని, మిగిలిన సంఘాలు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని నాయకులు తెలిపారు. చేనేత సహకార సంఘాలకు, ఆప్కోకు తక్షణమే ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కోకన్వీనర్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, బండారు ఆనంద ప్రసాద్, పిల్లలమర్రి బాలకృష్ణ, సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, దామర్ల మోహన్, దొంతంశెట్టి సత్యప్రకాష్, గొట్టుముక్కల బాలాజీ, ఏ. నారాయణ, డోగిపర్తి రామారావు, పచ్చల థామస్, బండారు మస్తాన్, ఉట్ల సాంబశివరావు, వాసు, విజయ్కుమార్, కట్టా హేమసుందర్రావు, జ్ఞాన శంకరరావు, చింత వీరభద్రేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలి
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ అభివృద్ధిలో పూర్వ విద్యార్థులు భాగస్వాములు కావాలని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవాలలో భాగంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం వర్సిటీ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. దేశ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వర్సిటీ ప్రాంగణం సందడిగా మారింది. పాత మిత్రులను కలుసుకుని, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య, పరిశోధన, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమానికి పూర్వ విద్యార్థులు సహకారం అందించాలన్నారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ టి. జనార్దన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం విద్యార్థులకు కేవలం డిగ్రీలు మాత్రమే కాకుండా జీవితానికి అవసరమైన ఎన్నో విలువలను అందించిందన్నారు. రాష్ట్ర సీఐడీ డీజీపీ డాక్టర్ ఎస్. రవిశంకర్ అయ్యనార్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ కె. రత్న షీలామణి, కార్యదర్శి ప్రొఫెసర్ బి. తిరుపతిరావు, మాజీ డీజీపీ బండి మరియాకుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎం. ప్రేమ్కుమార్, వర్సిటీ రెక్టర్ ప్రొఫెసర్ ఆర్. శివరామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. సింహాచలం తదితరులు ప్రసంగించారు. -
ఇరు వర్గాల ఘర్షణ.. ఎనిమిది మందికి గాయాలు
ఈపూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా ఎనిమిది మందికి గాయాలైన ఘటన మండలంలోని అగ్నిగుండాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన ఓ కుటుంబం రొంపిచర్ల మండలంలోని ఆరేపల్లి గ్రామానికి శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్తూ ఈపూరు మండలం బొగ్గరం గ్రామ ఎస్సీ కాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అక్కడ ఉన్న మహిళలతో ఘర్షణ పడ్డారు. అనంతరం అగ్నిగుండాల గ్రామంలోని బంధువుల ఇంటికి చేరారు. గొడవ సమాచారం తెలుసుకున్న బొగ్గరం ఎస్సీ కాలనీ వాసులు అగ్నిగుండాల చేరుకొని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు, రాళ్లు, కరల్రతో దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో బొగ్గరానికి చెందిన పావులూరి రాంబాబు, పావులూరి ప్రవీణ్ కుమార్, కొలనీడి రవిశంకర్, కోలనీడి నాగరాజు, గడ్డం వెంకటరమణ, పావులూరి అంకమ్మ, కోలనీడి చెన్నమ్మకు గాయాలవ్వగా ఈపూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పావులూరి రాంబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట తరలించారు. వెల్లటూరుకు చెందిన ఏడుకొండలు తలకు తీవ్ర గాయాలు కాగా వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అమరేశ్వరునికి పవిత్రాల సమర్పణ
అమరావతి: పంచారామాలలో ప్రథమారామ క్షేత్రమైన అమరావతి శ్రీ బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వరస్వామివారి దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవాలలో రెండవ రోజు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం ఉదయం ఆలయ అర్చకులు, వేదపండితులు మండప పూజ, దీక్షా హోమం, రుద్ర హోమం, పవిత్రధారణ, చండీ హోమం, దీక్షా హోమం, హారతి, మంత్రపుష్పములు సమర్పించారు. అనంతరం అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీదేవికి, 18 ఉపాలయములలో పట్టు పవిత్రాలు సమర్పించి రుద్ర, చండీ, విశేష హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ విజయవాడకు చెందిన యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అమరేశ్వరునికి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. గురువారం ఉదయం పవిత్రోత్సవాలలో ముగింపు సందర్భంగా 11 గంటలకు మహాపూర్ణాహుతి నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ శ్రీ స్వామివారి పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. -
తాళ్లచెరువులో వైఎస్సార్కు ఘన నివాళి
అచ్చంపేట: మండలంలోని తాళ్లచెరువులో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి బుధవారం నిర్వహించారు. మాజీ సర్పంచి కిక్కురు అర్లారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తుమ్మా పాపిరెడ్డి, తుమ్మా జోసఫ్రెడ్డి, దొండేటి చిన్నపరెడ్డి, తుమ్మా శౌర్రెడ్డి, గోపు రాయపరెడ్డి, తుమ్మా సుధాకర్ రెడ్డి, గంజి రాయపురెడ్డి, ఎంపీటీసీ గోపు అంతోనిరెడ్డి తదితరుల ఆద్వర్యంలో నిరుపేదలకు అన్నదాన చేశారు. వెయ్యి మందికి పైగా అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫ్లయింగ్ టెన్నిస్ జట్ల సత్తా చిలకలూరిపేట టౌన్: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో అమెచ్యూర్ ఫ్లయింగ్ టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ సౌత్ జోన్ చాంపియన్్ షిప్ పోటీల్లో ఏపీ బాలబాలికల జట్లు సత్తా చాటాయి. వివిధ విభాగాల్లో పోటీపడి మూడు స్థానాలను కై వసం చేసుకుని రాష్ట్రానికి గుర్తింపు తీసుకొచ్చాయి. సబ్జూనియర్ బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానం సాధించగా, జూనియర్ బాలుర విభాగంలో ద్వితీయ స్థానం, జూనియర్ బాలికల విభాగంలో ద్వితీయ స్థానం సాధించింది. విజేతలను అభినందిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. దక్షిణ భారత స్థాయిలో రాష్ట్ర క్రీడాకారులు ప్రతిభ చాటడంపై అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో మరింతగా రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి శిక్షణ, క్రమశిక్షణతో పాటు పీఈటీలు, కళాశాల యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహం దోహదపడిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అమెచ్యూర్ ఫ్లయింగ్ టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొల్లా సతీష్ కుమార్, కార్యదర్శి బొంత కృపారావు, ఉపాధ్యక్షుడు ఈ శ్రీకాంత్, కోశాధికారి గురునాథ్, డీఆర్ఎంఎస్ కళాశాల పీడీ పి.ప్రవీణ్, పీఈటీ నవీన్, కావ్య పాల్గొన్నారు. కొనసాగుతున్న సీనియర్ వైద్యుల నిరసన గుంటూరు మెడికల్: గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో ఆగస్టు 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గుంటూరు మెడికల్ కాలేజ్, ప్రొఫెసర్లు బుధవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు మెడికల్ కాలేజీ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ దేవ కుమార్ మాట్లాడుతూ 2016 నుంచి రావాల్సిన జీతం బకాయిలు చెల్లించాలని, 2026 జనవరి నుంచి ఇవ్వాల్సిన 8వ యూజీసీ వేతనాల సవరణ, ఇతర డిగ్రీ కాలేజ్ బోధకులకు ఇచ్చినట్లే, యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రాజా కుమార్, డాక్టర్ గాజుల రామకృష్ణ, డాక్టర్ స్వరూప్ కాంత్, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ కమల రాజేశ్వరి, సునీత పాల్గొన్నారు. -
మంచినీటి చెరువులు నూరుశాతం నింపాలి
శావల్యాపురం: సాగర్ జలాలతో మంచినీటి చెరువులను నూరుశాతం నింపాలని జిల్లా ఎన్ఎస్పీ ఈఈ తమ్మిశెట్టి చంద్రశేఖర్ కోరారు. బుధవారం మండలంలోని పోట్లూరు, శానంపూడి గ్రామాల్లోని తాగునీటి చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఈఈ మాట్లాడుతూ జిల్లాలో రక్షిత తాగునీటి చెరువులు 132 ఉన్నాయని, ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ జలాలు విడుదల చేసినట్లు తెలిపారు. చెరువులు, నీటి కుంటలు పూర్తిస్థాయిలో నిండేలా పంచాయతీ, ఆర్డబ్యూఎస్, ఎన్నెస్పీ అధికారులు సమన్వయంతో నింపటానికి శక్తివంచన లేకుండా చేయాలన్నారు. పోట్లూరు గ్రామంలో ఉన్న మంచినీటి చెరువుకి ఫిల్టర్బెడ్స్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సౌజన్యంతో రూ.17 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మంచినీటి చెరువులో చేపల పెంపకంపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. శానంపూడిలో జలజీవన్ మిషన్ నిధులు రూ.50 లక్షలతో జరుగుతున్న పైపు నిర్మాణ పనులు తుది దశకు చేరాయని త్వరలో మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు డీఈ ఆర్.కుమార్రాజా, ఏఈ రత్నబాబు ఉన్నారు. ఎన్ఎస్పీ ఈఈ చంద్రశేఖర్ -
లోకేష్ పర్యటన.. ప్రజలకు నరకయాతన
నరసరావుపేట టౌన్: మంత్రి నారా లోకేష్ పర్యటన నరసరావుపేట ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కాకాని గ్రామం వద్ద ఉన్న జేఎన్టీయూ కళాశాల హాస్టల్ భవన ప్రారంభోత్సవానికి బుధవారం మంత్రి హాజరయ్యారు. ఆయన పర్యటన నేపథ్యంలో పోలీసులు పట్టణంలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ప్రయాణికులతో పాటు రోజు వారీ పనులకు వెళ్లే ప్రజానీకం నరకయాతన అనుభవించారు. చిలకలూరిపేట రోడ్డు నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా లోకేష్ ర్యాలీగా రావటంతో మల్లమ్మ సెంటర్లో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పట్టణంలోకి ప్రవేశించేందుకు ఉన్న నాలుగువైపుల మార్గాలకు బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీస్ శాఖ రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా గుంటూరు, సత్తెనపల్లి మార్గాలకు వెళ్లే బస్సుల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా ఉన్న మార్గాల్లోనూ ట్రాఫిక్ స్తంభించి పోవటంతో వాహనాలు గంటల తరబడి ముందుకు కదలలేదు. దీంతో రోడ్లపైనే ప్రయాణికులు ఉండిపోయారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, అత్యవసర పనులపై ఆసుపత్రులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ అంక్షలు అమలు చేసే సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్దం చేయాల్సిన అధికారులు ఆదిశగా ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వినిపించాయి. మంత్రి మెప్పు కోసం ఆరాటం.. మంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా వ్యవహరించలేదు. మంత్రి కాన్వాయ్ సాఫీగా వెళ్లేందుకు ప్రధాన రహదారులను గంటలతరబడి నిలిపివేశారు. ప్రజాప్రతినిధుల రాకపోకల కోసం రవాణా వ్యవస్థను పూర్తిగా స్థభింపచేయటం సరైన పద్దతి కాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయకపోవటంతో సమస్య తలెత్తింది. ట్రాఫిక్ ఆంక్షల సమయంలో అంబులెన్స్లు, అత్యవసర వైద్యసేవలకు వెళ్లే వారి పరిస్థితి ఏంటన్నా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కీలకమైన ఓవర్బ్రిడ్జి మార్గాన్ని పూర్తిగా నిలిపివేయటంతో సత్తెనపల్లి, గుంటూరు వెళ్లే వారు రెండు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఒకవైపు ఓవర్బ్రిడ్జి మూసివేత.. మరోవైపు మంత్రి ర్యాలీ.. ఇంకో వైపు ప్రత్యామ్నయ మార్గంలో వాహనాల రద్దీతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. -
వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్ సంస్థపై
సమగ్ర దర్యాప్తు చేయాలి తాడేపల్లి రూరల్: వెల్ఫేర్ బిల్డింగ్ అండ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేతిలో తాము మోసపోయామని ఆరోపిస్తూ, సదరు సంస్థపై సమగ్ర దర్యాప్తు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితులు బుధవారం తాడేపల్లి ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల తరఫున నెల్లూరు నుంచి వచ్చిన ఏజెంట్లు మాట్లాడుతూ విశాఖపట్నానికి చెందిన మళ్లా విజయ్ ప్రసాద్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న సంస్థలో తాము కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టామని తెలిపారు. మెచ్యూరిటీ గడువు పూర్తయినప్పటికీ చాలామందికి ఒప్పందాల ప్రకారం రావాల్సిన మొత్తాలు, ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ కార్యకలాపాలు, మెచ్యూరిటీ బకాయిలకు సంబంధించి గతంలో వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదయినట్లు, సంస్థ వ్యవహారాలు కేంద్ర దర్యాప్తు సంస్థల పరిశీలనకు వెళ్లినట్లు తమకు తెలిసిందన్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత కూడా సంవత్సరాలు గడుస్తున్నా బాధితుల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సంస్థ వ్యవహారాలపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని కోరారు. సంస్థకు సంబంధించిన ఆస్తుల పూర్తి వివరాలను గుర్తించి, వాటి విక్రయం ద్వారా వచ్చే మొత్తాలను బాధితుల బకాయిల చెల్లింపులకే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మధుసూదనరావు, సుభాషిణి, బిల్లా లక్ష్మి దేవి, నాగేంద్ర కుమార్, ప్రసాద్, పద్మమ్మ, షరీఫ్, శ్రీనివాసులు, సుభాషిణి, లక్ష్మీదేవి, ఎస్.శ్రీనివాసులు, బ్రహ్మయ్య, చెన్నకేశవులు పాల్గొన్నారు. ముగిసిన మహిళల క్రికెట్ టోర్నీ పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలాజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎస్కే ప్రసాద్ గ్రౌండ్స్లో మూడు రోజుల పాటు నిర్వహించిన మహిళల క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. ఈ టోర్నమెంట్లో ఆతిథ్య వీవీఐటీయూ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచి ట్రోఫీని కై వసం చేసుకుంది. మొత్తం 8 కళాశాలల జట్లు పాల్గొన్న ఈ పోటీలు క్రీడాభిమానులను అలరించాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో వీవీఐటీ వర్సిటీ జట్టు, విష్ణు వర్సిటీ జట్లు తలపడ్డాయి. చివరి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో వీవీఐటీయూ జట్టు విజయం సాధించగా, విష్ణు విశ్వవిద్యాలయం జట్టు రన్నరప్గా నిలిచింది. పోటీల ముగింపు కార్యక్రమంలో చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతగా నిలిచిన వీవీఐటీయూ జట్టుకు, రన్నరప్గా నిలిచిన విష్ణు విశ్వవిద్యాలయం జట్టుకు ట్రోఫీలు, మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకాడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, ఫిజికల్ డైరెక్టర్స్ ఎన్.అరుణ్ కుమార్, ప్రకాష్ పాల్గొన్నారు. -
గుండెపోటుతో వ్యక్తి మృతి
కుమార్తెను చూసేందుకు బైకుపై వెళుతుండగా దుర్ఘటనరాజుపాలెం: మృత్యువు ఏ రూపంలో వస్తుందో అంతుపట్టనే పట్టడు. కుమార్తె ప్రసవం కోసం వైద్యశాలలో ఉండడంతో ఆమెను చూసేందుకు బైకుపై వెళుతున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బైకు దిగేలోపే మృతి చెందిన విషాద ఘటన మండలంలోని కొండమోడు సమీపంలోని వీరమ్మ కాలనీ మలుపు వద్ద అద్దంకి–నార్కెట్పల్లి రహదారిపై బుధవారం జరిగింది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి చెందిన దోమనబోయిన సైదులు (45) తన చిన్న కూతురు నాగమణిని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవం కోసం చేర్పించారు. కుమార్తెను చూసేందుకు పిడుగురాళ్ల నుంచి నరసరావుపేటకు బైకుపై వెళుతున్నాడు. కొండమోడు సమీపంలో గుండెపోటు రావడంతో బైకును పక్కకు తీసి ఆపేలోపే వాహనంతోపాటు కిందపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికృష్ణ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. -
చెట్లు లేకుంటే.. భూమి మరో మార్స్
ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కె.నాగేంద్రబాబు చిలకలూరిపేట(యడ్లపాడు): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ జన్మదినం సందర్భంగా బుధవారం పట్టణంలోని ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేసి వాటిని నాటి సంరక్షించాలని సూచించారు. చిలకలూరిపేటలో రూ.3 కోట్లతో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ కృష్ణప్రియ పాల్గొన్నారు. గుర్తు తెలియని వృద్ధుడు మృతి సత్తెనపల్లి: పట్టణంలోని గుంటూరు బస్స్టాప్ సెంటర్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెంది ఉండడాన్ని పట్టణ పోలీసులు గుర్తించారు. మృతుని వయసు సుమారు 70 ఏళ్ల వరకు ఉంటుందని, తెల్లచొక్కా ధరించి ఉన్నాడన్నారు. మృతుని ఆచూకీ తెలిసినవారు సత్తెనపల్లి టౌన్ పోలీస్స్టేషన్ లేదా సీఐ 9440796230 నంబర్కు సమాచారం తెలియ చేయాలని పట్టణ ఎస్ఐ పీ.పవన్కుమార్ బుధవారం తెలిపారు. చీకటి గోపి మృతిపై కేసు నమోదు తాడికొండ: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపిని కేసు విచారణలో భాగంగా తాడికొండ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కొట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీస్స్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. కేసు విచారణాధికారిగా మేడికొండూరు సీఐ మధుసూధనరావును నియమించడంతో ఆయన పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన తాడికొండ పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతుడి ఒంటిపై ఉన్న గాయాలకు కారణాలు ఏంటి అనే విషయాలు గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్లోని సీసీ టీవీ పుటేజీలను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా తెనాలిలో అవినీతి ఆరోపణలు ఎదుక్కొని వీఆర్లో ఉంటూ తాడికొండకు పోస్టింగ్పై వచ్చిన ఓ కానిస్టేబుల్తో పాటు తాడికొండలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న మరో కానిస్టేబుల్ కేసు విచారణలో భాగంగా మృతుడిని కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం పూర్తి నివేదిక అంది విచారణ జరిగితే కానీ విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. పోస్టుమార్టం ప్రక్రియ వీడియో రికార్డింగ్ గుంటూరు మెడికల్: చోరీ కేసులో విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్కు వెళ్లిన తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి గుంటూరు జీజీహెచ్లో మంగళవారం మృతిచెందడంతో కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్లో ఆందోళన చేసిన విషయం విధితమే. పోలీసుల లాఠీ చార్జి వల్లే గోపి చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించడంతో బుధవారం గోపి పోస్టుమార్టం ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పూర్తి చేశారు. -
గ్రూపు రాజకీయాలతో పార్టీకి ఇబ్బంది
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలున్నాయి.. వాటి వల్ల పార్టీకి ఇబ్బందులొస్తాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గ్రూపు రాజకీయాలను పరిష్కరించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతామన్నారు. జిల్లాలో కొందరు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. పార్టీ ఆదేశాలను తప్పకుండా పాటించాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నరసరావుపేట ఎస్ఆర్కేటీ జంక్షన్లో ఉన్న పార్టీ కార్యకర్తలు మల్లమ్మ సెంటర్ వరకు కూడా రాకపోవడం, ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వచ్చే సరికి ఎవరూ లేకపోవడంపై స్థానిక టీడీపీ నేతలతో లోకేష్ ఆరా తీసినట్టు సమాచారం. మరోవైపు జేఎన్టీయూ కళాశాలను యూనివర్సిటీగా ఉన్నతీకరించాలని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన డిమాండ్పై హామీ ఇవ్వకపోవడంతో పెదవి విరిచారు. కళాశాల అధ్యాపకుల కొరత, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులలో వేగం పెంచడంపై స్పందించకపోవడంపై కళాశాల విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
చెకుముకి సైన్స్ ప్రతిభ పరీక్షకు విశేష స్పందన
చిలకలూరిపేట(యడ్లపాడు): విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు విజ్ఞానంపై ఆసక్తిని కలిగించే లక్ష్యంతో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని శ్రీశారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రతిభ పరీక్ష నిర్వహించారు. 8, 9, 10 తరగతులకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు కల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 240 పాఠశాలల్లో చెకుముకి సైనన్స్ సంబరాలు నిర్వహించామని తెలిపారు. మొత్తం 15 వేల మంది విద్యార్థులు ప్రతిభ పరీక్షలు రాశారని పేర్కొన్నారు. చిలకలూరిపేట డివిజన్న్ విజేతలకు ఈ నెల 11న స్థానిక సాధినేని చౌదరయ్య హెలోస్ పాఠశాలలో బహుమతులు అందించనున్నారు. కార్యక్రమంలో సైన్న్స్ ఉపాధ్యాయుడు వై.శ్రీనివాసరావు, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు డాక్టర్ పీవీ సుబ్బారావు, కేబీ వెంకటేశ్వరరావు, పాఠశాల హెచ్ఎం జ్యోతి పాల్గొన్నారు. -
డీలర్లకు క్యూఆర్ కోడ్ తంటాలు
సత్తెనపల్లి: దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరు పేదలకు చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం అక్రమాల కట్టడానికి ప్రభుత్వం ఇటీవల క్యూఆర్ కోడ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌక దుకాణాల డీలర్లు తీసుకెళ్లే బియ్యానికి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఆపై దుకాణాల వద్దకు సరఫరా అయ్యే బియ్యానికి ఇలా స్కాన్ చేసిన తర్వాతే బియ్యాన్ని డీలర్లకు ఇవ్వాలి. ఈ విధానంతో అటు స్టాక్ పాయింట్లలో గానీ, ఇటు చౌక దుకాణాల్లో గానీ బియ్యం సక్రమంగా కచ్చితమైన తూకం ఉండాలన్నదే లక్ష్యం. ఈ విధానాన్ని ఈ నెల నుంచి జిల్లా వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అమలు చేస్తోంది. అయితే ఈ కొత్త విధానం తమకు ఇబ్బందికరంగా మారిందని చౌక దుకాణాల డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. అక్రమాలకు చెక్ పడేనా? రేషన్ బియ్యం సరఫరాలో నిత్యం పలు అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం బస్తాలను పందికొక్కులు కొరికాయని, కొంత బియ్యం నేలపాలైందని చెప్పేవారు. ఇదే బియ్యాన్ని చౌక దుకాణాలకు పంపిణీ చేశాక అక్కడ జరిగిన నష్టాన్ని డీలర్లు తూకాల్లో కాస్త చూసుకొనే సరిచేసుకునేవారు. ఇకపై ఎక్కడా అక్రమాలకు తావివ్వకుండా ఉండేందుకు క్యూఆర్ కోడ్ స్కానింగ్తో చెక్ పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి స్టాక్ పాయింట్ (గోడౌన్)లో నుంచి క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చౌక దుకాణాలకు చేరిన బియ్యం కచ్చితంగా సరైన తూకం ఉంటుంది. దీంతో చౌక దుకాణాల డీలర్లు ఏమీ మాట్లాడేందుకు వీలు కాదు. డీలర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆపై తమ పెడ్డీ ప్రొక్యూర్మెంట్ సిస్టం (పీపీఎస్) యాప్ ద్వారా సబ్మిట్ చేసి ఈ–పాస్ ద్వారా ఆర్వో జనరేట్ చేసి ట్రాక్ షీట్ను చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇదంతా కష్టతరమని చౌక దుకాణాల డీలర్లు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. తప్పని తలనొప్పులు.. ఈ కొత్త విధానంపై అవగాహన లేని చౌక దుకాణాల డీలర్లకు తలనొప్పులు తప్పడం లేదు. ఎందుకంటే కొందరు డీలర్లకు స్మార్ట్ ఫోన్లు లేవు. వీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే కొత్త లింక్ను సెండ్ చేస్తున్నారు. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో దిక్కుతోచడం లేదు. దీంతోపాటు బియ్యం బస్తాలను షాపుల వద్దకు దించే హమాలీలు ప్రతి బస్తా స్కానింగ్ చేసేందుకు గంటల సమయం పడుతోంది. బియ్యం బస్తాలపై ఉన్న క్యూఆర్ కోడ్లు చిరిగిపోయి ఉంటే మరింత ఇబ్బందిగా మారుతోంది. మొత్తం మీద సాంకేతిక సమస్యలు డీలర్లకు తలనొప్పులు తెప్పిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,289 చౌక దుకాణాలు ఉన్నాయి. ప్రతి బస్తా (50 కిలోలు) క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గానీ పంపిణీ సాధ్యం కాదు. ప్రతి నెలా 15వ తేదీలోపు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. కొత్త విధానంతో ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుందనే మాట డీలర్ల నోట వినిపిస్తోంది. దీనిపై పౌరసరఫరాల శాఖ తొలుత డీలర్లకు శిక్షణ ఇచ్చి ఆపై అమలు చేస్తే మేలనే మాట వినిపిస్తోంది. పల్నాడు జిల్లాలో గణాంకాలు... చౌక దుకాణాలు : 1,289 రైస్ కార్డులు : 6,46,649 రైస్ కార్డుల్లోని సభ్యులు : 18,57,207 మంది ఎంఎల్ఎస్ పాయింట్లు : 10 ప్రతి నెలా సరఫరా చేసే బియ్యం : 8,600 మెట్రిక్ టన్నులు -
నేడు వైఎస్సార్ విగ్రహావిష్కరణ
అచ్చంపేట: మండలంలోని మాదిపాడు పంచాయతీ పరిధిలోని కంచుబోడు గిరిజన తండాలో (పులిచింతల ప్రాజెక్టుకు 6 కిలోమీటర్ల దూరం) దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకరరావు బుధవారం ఆవిష్కరించనున్నారు. వైఎస్సార్ విగ్రహ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని వైఎస్సార్ అభిమానులు బాణావతు జీవ్లానాయక్, బాణావతు చిన్నానాయక్లు ఉచితంగా కేటాయించారు. వైఎస్సార్ విగ్రహాన్ని కొరివి చిన్న సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య మంగమ్మ, కుమారులు నాగ గోపాలకృష్ణ, వెంకట నరేష్, సైదాబాబులు ఇచ్చారు. విస్సార్ విగ్రహానికి రంగులు వేసి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. బుధవారం వైఎస్సార్ వర్థంతి సందర్భంగా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎన్నికల హామీని అమలు చేయాలి
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో లోకేష్ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు దాటుతున్నా కాలయాపన చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తూ వెట్టి చాకిరీ చేస్తున్నాం. రెగ్యులర్ చేసేవరకు గ్రాస్ శాలరీ నూరు శాతం చెల్లించాలి. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అన్ని సదుపాయాలు కల్పించాలని ఆందోళన చేపడుతున్నాం. –బి.నాగరాజ కుమారి, కాంట్రాక్ట్ మెడికల్ జిల్లా జేఏసీ అధ్యక్షురాలు, పల్నాడు -
కొత్త సీసాలో పాతనీరు..
సాక్షి టాస్క్ఫోర్స్: కొత్త సీసాలో పాత నీరు అనే చందంగా మారింది టీడీపీ పరిస్థితి. రెండున్నరేళ్లుగా టీడీపీలో కొనసాగుతూ..ఎమ్మెల్యేతో పాటుగా టీడీపీ సభలు, సమావేశాల్లో పాల్గొంటున్న ప్రజాప్రతినిధులకు టీడీపీ కండువాలు కప్పి అభాసుపాలైంది. వైఎస్సార్ సీపీ తరపున నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వ్యక్తులు టీడీపీ అధికారంలోకి రాగానే పదవుల కోసం ప్రజాతీర్పును పక్కనపెట్టి ఆ పార్టీ పంచనా చేరారు. రెండున్నరేళ్లుగా టీడీపీలోనే కొనసాగుతూ ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా వారేదో వైఎస్సార్ సీపీ నుంచి వెళ్లినట్లుగా కటింగ్లు ఇచ్చి గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజానీతో పాటుగా మరికొంత మందికి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ కండువాలను కప్పారు. ఈ విషయం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ వైఫల్యాలతో వైఎస్సార్సీపీలో చేరికలు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవటంతో ఆ పార్టీ నేతలతోపాటుగా ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. దీంతో టీడీపీ చేస్తున్న మోసపూరితమైన పాలనా చూసి తట్టుకోలేక..ఆ పార్టీలో ఇమడలేక వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తాజాగా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని 20వ వార్డు కౌన్సిలర్ ముశ్యం సీతారామయ్య కుమారుడు, టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ముశ్యం శ్రీనివాసరావు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. బీసీలలో బలమైన నాయకుడిగా పేరొందిన శ్రీనివాసరావు టీడీపీ చేస్తున్న మోసాలను చూసి ఉండలేక, టీడీపీ సిద్ధాంతాలు నచ్చక వైఎస్సార్ సీపీలో చేరాడు. గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా మరికొంతమంది టీడీపీ ముఖ్యనేతలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు ఆ పార్టీ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డితో టచ్లో ఉన్నాట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నుంచి భారీ చేరికలు ఉంటాయని వైఎస్సార్ సీపీ నేతలు భావిస్తున్నారు. నవ్విపోదురు గాక గురజాల నియోజకవర్గంలోని గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజానీతో పాటుగా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ కండువాలు కప్పిన వారంతా వైఎస్సార్ సీపీ ఇచ్చిన బీఫాం ద్వారానే పోటీ చేసి గెలిచారు. 2024లో వైఎస్సార్ సీపీ ఓటమి తరువాత బడేజానీ పార్టీకి దూరంగా ఉంటూ టీడీపీ నాయకులతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురజాలలో పాల్గోనే ప్రతి కార్యక్రమంలో బడే జానీ పాల్గొన్నారు. రెండున్నరేళ్లపాటు అధికారంలో ఉన్న టీడీపీలోనే కొనసాగుతున్న నగర పంచాయతీ చైర్మన్ బడేజానీతోపాటుగా మరికొంతమంది కౌన్సిలర్లకు ఎమ్మెల్యే యరపతినేని టీడీపీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా మంగళవారం ప్రకటించారు. ఈ విషయం నియోజకవర్గంలో వైరల్గా మారటంతో సామాజిక మాధ్యమాల్లో టీడీపీ తీరు, ఎమ్మెల్యే యరపతినేని, నగర పంచాయతీ చైర్మన్ బడేజానీ వ్యవహారంపై వ్యంగ్యంగా వైరల్ చేస్తున్నారు. బడేజానీ టీడీపీ సభల్లో, సమావేశాల్లో పాల్గొని మాట్లాడుతున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు చేసి వైరల్ చేస్తున్నారు. టీడీపీలోనే కొనసాగుతున్న బడేజానీతో పాటుగా ఇతర కౌన్సిలర్లకు మళ్లీ టీడీపీ కండువాలు వేయటం ఏమిటని నవ్వుకుంటున్నారు. -
ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
డీపీటీఓ కార్యాలయం ఎదుట ధర్నా నరసరావుపేట: ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కోరారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం గ్యారేజ్ దగ్గర నుంచి డీపీటీఓ కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం డీపీటీఓ టి.అజితకుమారికి వినతిపత్రం అందజేశారు. డిపో అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకరరావు, సింగ్ మాట్లాడుతూ ఏళ్లు, నెలలు గడుస్తున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవట్లేదన్నారు. దీని వలన ఆయా ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాయన్నారు. లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాట్యుటీ తీసుకోకుండానే అనేక మంది రిటైర్డు ఉద్యోగులు మృతిచెందారన్నారు. ఉద్యోగం లేక రావాల్సిన సెటిల్మెంట్ తాలూకా మొత్తాలు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందువలన వెంటనే గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించాలని, రిటైర్డు ఉద్యోగి, ఆయన భార్యకు లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలని, హయ్యర్ పెన్షన్ కోసం ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించి పీఎఫ్ కార్యాలయంకు జమచేసిన సొమ్మును తిరిగి చెల్లించాలని, హైదరాబాదు బర్కత్పురాలో ఉన్న పీఎఫ్ కార్యాలయం నుంచి ఉద్యోగుల ఖాతాలను ఏపీకి తరలించాలని కోరారు. వై.మస్తాన్రావు, ఎం.ఆర్.కే.రెడ్డి, టి.సుబ్బారావు, ఎస్ఎం ఆలీ, వీరారెడ్డి తదితర రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఎల్నినోతో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి
నరసరావుపేట: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో ఖరీఫ్ 2026 పంటల పరిస్థితి, ఎల్నినో ప్రభావం, చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సాగర్ కుడి కాలువ ద్వారా వరి సాగుకు అవసరమైన నీటిని విడుదల చేసే అవకాశం లేని పరిస్థితి ఉన్నందున నీటి వినియోగం అధికంగా ఉండే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఇప్పటివరకు సాగు కాకుండా మిగిలిపోయిన 89,834 హెక్టార్ల పంట భూములలో సాగుకి అవసరమైన వర్షపాతం నమోదు అయినట్లైతే సెప్టెంబర్ నెలాఖరు వరకు సాగుకి అనువైన కంది, మినుము, కూరగాయలు, గడ్డి జొన్న, సుబాబుల్ తదితర పంటల సాగు చేసేవిధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. శనగసాగు రబీ సీజన్లో అక్టోబర్ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ పంట నమోదు, సాగు చేసిన పంటల ఆరోగ్య పరిస్టితిని రైతు సేవా సిబ్బందిని ద్వారా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో రైతుల నమోదు లక్ష్యం 3,12,583 మంది కాగా, ఇప్పటివరకు 2,56,082 మంది నమోదయ్యారని తెలిపారు. రైతు యాప్ డౌన్న్లోడ్ లక్ష్యం 2,40,530 మంది కాగా, ఇప్పటివరకు 1,25,735 మంది రైతులు యాప్ను డౌన్న్లోడ్ చేసుకున్నారని తెలిపారు. మిగిలిన రైతులు కూడా నమోదు చేసుకుని రైతు యాప్ను డౌన్న్లోడ్ చేసుకునేలా రైతు సేవా కేంద్రాల సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కౌలు రైతులకు రూ.101.50 కోట్ల రుణాల మంజూరు లక్ష్యానికిగాను, గత నెల 12 నాటికి రూ.6.60 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. బ్యాంకు వారీగా రుణ మంజూరు చేసిన వివరాలను సేకరించాలని ఆదేశించారు. ‘‘రైతన్న మీ కోసం’’ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో రైతులకు కరపత్రాల ద్వారా వర్షపాతం లోటు, నీటి లభ్యత, పంటల ఎంపిక, పంటల మార్పిడి, తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేయడం, భూగర్భ జలాల సంరక్షణ కోసం చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో నీటి గుంటల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ సిద్ద లింగమూర్తిని ఆదేశించారు. పశువుల మేతకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చెరువుల కింద, నీటి వసతి ఉన్న దగ్గర రైతులను గుర్తించి గడ్డి విత్తనాలు సాగు చేసేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. తొలుత జిల్లా వ్యవసాయ అధికారి ఐ.జగ్గారావు ఇప్పటివరకు జిల్లాలో పరిస్థితిని కలెక్టర్కు వివరించారు. ఖరీఫ్ 2026లో 1,57,932 హెక్టార్ల సాధారణ పంట విస్తీర్ణానికి గాను ఇప్పటివరకు 69,958 హెక్టార్లలో పంటలు సాగు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఈ కాలానికి సాధారణ వర్షపాతం 351.6మి.మీ కాగా, ఇప్పటివరకు 178.2 మి.మీ. మాత్రమే నమోదైందని, 49.3 శాతం లోటు వర్షపాతం ఉన్నట్లు వివరించారు. ఇప్పటివరకు ఖరీఫ్లో వరి 6118 హెక్టార్లు, పత్తి 58,604 హెక్టార్లు, మినుము 107 హెక్టార్లు, కంది 6,180 హెక్టార్లు, మొక్కజొన్న 510 హెక్టార్లలో సాగు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ముందస్తుగా పత్తి పంట సాగుచేసిన మండలాల్లో పంట దిగుబడి ఆశాజనకముగా వుందని, మార్కెట్లో క్వింటాల్ రు.8500–8800 వరకు రైతులు అమ్ముకుంటున్నారని కలెక్టర్కు తెలియచేశారు. వ్యవసాయ శాఖ, డీఆర్డీఏ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, డ్వామా, సాగునీటి శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ -
నల్లబ్యాడ్జీలతో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన
నరసరావుపేట: డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.నాగమల్లేశ్వరరావు, జి.తిరుపతిరావు పేర్కొన్నారు. చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా స్థానిక కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఉద్యోగులు 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని, తక్షణమే ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎంపీడీఓ, ఎన్ఆర్ఇజీఎస్, వీఆర్ఓలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం చర్చించి పరిష్కారం చూపించాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమన సమస్యలు పరిష్కరించాలని కోరారు. సత్వరమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ -
పదిరోజులు గైర్హాజరైతే ఇంటికే..
డీసీహెచ్ఎస్ రంగారావు ఈపూరు: విధులకు వరుసగా పది రోజులు గైర్హాజరైతే ఇంటికి వెళ్లాల్సి వస్తుందని ఉమ్మడి గుంటూరు జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్) రంగారావు హెచ్చరించారు. ఈపూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలోని వార్డులు, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, రికార్డులను పరిశీలించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఈపూరులో నిలిచిపోయిన ఆస్పత్రి భవన నిర్మాణ పనులను చూసి ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు చేపటతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న 500 మంది పీజీ చదువుల కోసం వెళ్లారని తెలిపారు. వినుకొండ, ఈపూరు పీహెచ్సీలో గైనకాలజిస్ట్, సివిల్ సర్జన్ వైద్యులను సర్దుబాటు చేస్తున్నామని అక్టోబర్ నాటికి పూర్తిస్థాయిలో వైద్యులను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. వినుకొండ, సత్తెనపల్లి, బాపట్లలకు డయాలసిస్ కేంద్రాలు మంజూరయ్యాయని, సత్తెనపల్లి, మాచర్లలో రక్తనిధి కేంద్రాలు ఏర్పాటుకు నిధులు విడుదలయ్యాయని చెప్పారు. వినుకొండలో 100 పడకల ఏరియా ఆసుపత్రి, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. నరసరావుపేటలో రూ.10 కోట్లతో 160 రకాల పరీక్షలు చేసే ఆధునిక ల్యాబ్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. గుండెపోటుకు గురైన వారికి టెనెక్ట్ ప్లస్ ఇంజక్షన్ అందించి ఇప్పటి వరకూ 625 మందిని ప్రాణాపాయం నుండి కాపాడినట్లు వెల్లడించారు. తనిఖీలో సూపరింటెంటెండ్ రేణుక, వైద్యులు వై.లక్ష్మి, అబ్దుల్ రజాక్ సిబ్బంది పాల్గొన్నారు. పురుగుమందు తాగి సోదరులు ఆత్మహత్య 88త్యాళ్లూరు(క్రోసూరు): తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన సోదరులు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ పి.రవిబాబు మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. 88 త్యాళ్లూరు గ్రామానికి చెందిన లంకోటి ఆదిలక్ష్మి, రత్తయ్యల కుమారులు కోటేశ్వరరావు(25), సీతారామయ్యలు(24) కూలీ పనులకు వెళ్లే వారు. మద్యం సేవించి రాత్రి ఇంటికి రావటంతో తల్లి మందలించింది. మనస్థాపానికి గురైన సోదరులు ఇంట్లో ఉన్న పురుగుమందు కూల్డ్రింక్లో కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించారు. దీనిని గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కోటేశ్వరరావు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో మృతి చెందగా, సీతారామయ్యను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ వేకువజామున మృతి చెందాడు. మృతుడు కోటేశ్వరరావుకు భార్య, ఇద్దరు సంతానం కలరు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు తెలిపారు. 5న సత్తెనపల్లిలో జాబ్మేళాసత్తెనపల్లి: స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ (ఏపీ ఎస్ఎస్డీసీ), సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 5న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివద్ధి అధికారి ఈ.తమ్మాజీరావు, సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.పద్మ మంగళవారం తెలిపారు. జాబ్మేళాకు టెక్ మహేంద్ర, ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, టాటా ఎలక్ట్రానిక్స్, ఫోక్స్కాన్, ఎస్బీఐ కార్డ్స్ వంటి 11 రకాల కంపెనీలు హాజరవుతు న్నాయన్నారు. విద్యార్హతను బట్టి జీతం సుమారు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండవచ్చునన్నారు. జాబ్మేళాకు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లమా, ఫార్మసీ, పీజీ విభాగాల వరకు చదువుకున్న 18– 35 సంవత్సరాల వయసుగల నిరుద్యోగ యువత బయోడేటా, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ జిరాక్స్, ఆధార్ నకలు, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చునన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. వివరాలకు రామకష్ణారెడ్డి– 80743 93466, అంజిరెడ్డి 77798 58789 నంబర్లలో సంప్ర దించాలన్నారు. ఔత్సాహికులు ముందుగా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోగలరన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ పరిసర ప్రాంత యువతీ, యువకులు అందరూ ఈ జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
క్రెడిట్ చోరీనే అంతా
పల్నాడుబుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026● వైఎస్సార్ సీపీ హయాంలో కాకాని జేఎన్టీయూఎన్కు మహర్దశ ● రూ.135కోట్లతో అభివృద్ధి పనులు ● రూ.60కోట్లతో విద్యార్థుల వసతి గృహ నిర్మాణాలు ● అంచనాలు పెరగడంతో గత రెండున్నర ఏళ్లుగా నిలిచిన నిర్మాణాలు ● గత ప్రభుత్వ హయాంలోనే 80శాతం పనులు పూర్తి ● ప్రస్తుతం సవరించిన అంచనాలతో రూ.10కోట్లతో పనులు ● అవి కూడా పూర్తికాకుండానే నేడు ప్రారంభించనున్న మంత్రి లోకేష్ 7చేసిందిగోరంత.. నరసరావుపేట రూరల్: విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాకానిలోని జేఎన్టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కళాశాలకు భూమి కేటాయించినా కనీసం ప్రహరీ నిర్మాణం కూడా నాటి టీడీపీ ప్రభుత్వ పూర్తిచేయలేకపోయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత జేఎన్టీయూఎన్ కళాశాల నిర్మాణాలకు అడుగులు పడ్డాయి. కరోనా సమయంలో కూడా ఇక్కడ పనులు ఆగలేదు. దాదాపు రూ.135కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల భవనాల నిర్మాణాలను పూర్తిచేసారు. రెండున్నరేళ్ల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జేఎన్టీయూఎన్ కళాశాల నిర్మాణాలు నిలిచిపోయాయి. యువతీ, యువకుల వసతి గృహాలకు అవసరమైన రూ.10కోట్లు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. రెండు సంవత్సరాల తరువాత ఇప్పుడు నిధులు మంజూరు చేసి పనులు పూర్తికాకుండానే వసతి గృహ భవనాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బుధవారం వసతి గృహ భవనాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. రూ.70కోట్లతో వసతి గృహాలు తామే పూర్తిచేసినట్టు కూటమి నేతలు ప్రచారం చేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. రెండున్నరేళ్లుగా తీవ్ర ఇక్కట్లు కూటమి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల పాటు వసతి గృహాలను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జేఎన్టీయూ వంటి ప్రతిష్టాత్మకమైన కళాశాలలో చదివేందుకు మెరిట్ విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఈ కళాశాలలో కనీసం వసతి గృహాలు లేకపోవడం వారికి ఇబ్బందిగా మారింది. నరసరావుపేటలోని పీజీ హాస్టళ్లలో ఉంటూ ప్రతి రోజు కళాశాలకు వెళ్లిరావడం ఆర్థికంగా భారం అయింది. దీంతో పాటు బస్సులు అందుబాటులో లేకపోవడం ఆటోలపై ఆధారపడటంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. అసంపూర్తి నిర్మాణాలతోనే ప్రారంభోత్సవం! మంత్రి నారా లోకేష్ బుధవారం కళాశాలలోని వసతి గృహలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసారు. విద్యార్థినీ, విద్యార్థులకు విడివిడిగా నాలుగు బ్లాక్ల్లో భవనాలు నిర్మిస్తున్నారు. ఇందులో యువతుల కోసం ఏర్పాటుచేసి గౌతమి, కృష్ణవేణి, నాగార్జున బ్లాక్లను మాత్రమే లోకేష్ ప్రారంభిస్తారు. నాల్గో బ్లాక్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రూ.10కోట్లతో చేపట్టిన పనులను పూర్తిచేయకుండానే హడావుడిగా ప్రారంభోత్సవాలు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాల్గో బ్లాక్లో ఇంకా రూ.3కోట్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు ముందుకు కదటడం లేదు. ఇండోర్ స్టేడియంతో పాటు పలు క్రీడలకు సంబంధించిన ప్రాంగణాలను ఇందులో అభివృద్ధి చేయాల్సి ఉంది. యూనివర్సిటీగా మార్చాలని డిమాండ్ వెనకబడిన పల్నాడు ప్రాంతంలో ఉన్న జేఎన్టీయూఎన్ కళాశాలను యూనివర్సిటీ చేయాలనే ప్రతిపాదన ఉంది. వర్సిటీకి అవసరమైన భూమి కళాశాలలో అందుబాటులో ఉంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల పరిధిలోనే ఇంజినీరింగ్ కళాశాలలు అధికంగా ఉన్నాయి. వర్సిటీలో పనుల కోసం కాకినాడ వెళ్లాల్సి రావడం విద్యార్థులకు భారంగా మారింది. ఇప్పటికే జేఎన్టీయూఎన్ కళాశాలను అటానమస్ చేసిన నేపథ్యంలో వర్సిటీగా ప్రకటించాలని కోరుతున్నారు. జేఎన్టీయూఎన్ కళాశాల నిర్మాణంలో ఎటువంటి పాత్ర లేని టీడీపీ నాయకులు ఇప్పుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు రూ.150కోట్ల మేర కళాశాలలో అభివృద్ధి పనులు నిర్వహించగా అందులో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పనులు రూ.10కోట్లు మేరకే. ఇందులో కూడా రూ.3కోట్ల మేర పనులు నిర్వహించాల్సి ఉంది. అయినా తమ ఆధ్వర్యంలోనే జేఎన్టీయూఎన్ కళాశాల నిర్మాణాలు జరిగాయంటూ టీడీపీ నాయకులు, కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాకానిలోని జేఎన్టీయూఎన్ కళాశాల నిర్మాణాలను 2016లో ప్రారంభించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం భవనాల నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించింది. కళాశాలకు కాకాని వద్ద కేటాయించిన భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.2.5కోట్లు కేటాయించినా ఐదేళ్లలో పూర్తిచేయలేకపోయారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భవనాల నిర్మాణాలను వేగవంతం చేశారు. అకడమిక్ బ్లాక్కు రూ.31కోట్లు, సీసీ రోడ్లుకు రూ.17కోట్లు, విద్యార్థినీ, విద్యార్థుల వసతి గృహాలకు రూ.60కోట్లు, గెస్ట్హౌస్కు రూ.6.5కోట్లు, కళాశాలలో మౌలిక సదుపాయాలకు రూ.11కోట్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్కు రూ.16కోట్లు కేటాయించారు. మొత్తం రూ.135కోట్లతో పనులు ప్రతిపాదించారు. ఇందులో వసతిగృహాల నిర్మాణాలకు అంచనాలు పెరగడంతో ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పెరిగిన అంచనాలను అమోదించడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది. నాలుగు నెలల క్రితం రూ.10కోట్లు నిధులను యూనివర్సిటి అధికారులు మంజూరు చేశారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ నీటిమట్టం మంగళవారం 536.00 అడుగులకు చేరింది. కుడికాలువకు 6,553, ఎడమకాలువకు 7,029 క్యూసెక్కులు విడుదలవుతోంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 27.9907 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7500, గరిష్ట ధర రూ.11600, మోడల్ ధర రూ.92000 వరకు పలికింది. క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబు, లోకేష్ల తర్వాతే ఎవరైనా.. ఇప్పటికే అనేక సంఘటనల్లో ఇది రుజువు కాగా.. తాజాగా జేఎన్టీయూఎన్ హాస్టళ్ల భవనాల ప్రారంభోత్సవంలోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తుండడం చూపరులను విస్మయానికి గురి చేస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుపుకొని, 80 శాతానికి పైగా పూర్తయిన భవనాలను గత రెండున్నరేళ్లుగా టీడీపీ నేతలు పట్టించుకోకపోగా.. ఇప్పుడు హడావుడిగా అరాకొరగా పనులు నిర్వహించి, అసంపూర్తి భవనాలనే ప్రారంభోత్సవం చేయనుండడంపై అందరూ అవాక్కవుతున్నారు. -
వైఎస్సార్ సీపీ నేతకు పోలీసుల నోటీసులు
సత్తెనపల్లి: అక్రమ కేసులో వైఎస్సార్ సీపీ నాయకుడికి మంగళవారం పట్టణ పోలీసులు నోటీసులు అందించారు. రాజుపాలెం మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహబూబ్ కమల్పాషా గత నెల 10న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్ మోహన్రెడ్డి పిలుపు మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డి ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో నిర్వహించిన దగా డీఎస్సీ ర్యాలీలో పాల్గొన్నందుకు 20 రోజుల తర్వాత పట్టణ పోలీసులు వెతికి మరీ అక్రమ కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా ఆయన పోలీసుల నుంచి నోటీస్ అందుకున్నారు. ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, పార్టీ మైనార్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ జానీ, పార్టీ నాయకుడు జేఎస్కే జానీ ఉన్నారు. -
గ్రంథాలయంలో తనిఖీలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లిలోని శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భీమనేని వందనాదేవి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రంథాలయం పనితీరు, అందుబాటులో ఉన్న పుస్తకాలు, సౌకర్యాలపై పాఠకులతో ఆరా తీశారు. పాఠకులకు అవసరమైన పుస్తకాలను రీడర్స్ ఆన్ డిమాండ్ రిజిస్టర్లో నమోదు చేయాలని గ్రంథాలయ అధికారి షేక్ నాగుర్ బాషాకు సూచించారు. గ్రంథాలయానికి ఎక్కువ మంది పాఠకులు వచ్చేటట్లు, ఎక్కువ మంది సభ్యత్వం తీసుకునేటట్లు, చదువరులను ప్రోత్సహించాలని నాగుర్ బాషాకు ఆదేశించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ స్వర్ణోత్సవాల సందర్భంగా 1976 నుంచి 2026 వరకు విశ్వవిద్యాలయం సాగించిన 50 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఫొటో ఎగ్జిబిషన్న్ను వర్సిటీ డైక్మన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఏఎన్యూలో మంగళవారం ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు, రెక్టార్ ప్రొఫెసర్ ఆర్ శివరాంప్రసాద్, ప్రొఫెసర్ జి సింహాచలం తదితరులు ప్రారంభించారు. వర్సిటీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ సాధించిన ప్రగతి, విద్యా, పరిశోధన, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో నమోదైన విజయాలు, ప్రముఖుల సందర్శనలు, ముఖ్యమైన కార్యక్రమాలు, విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించిన కీలక ఘట్టాలను అరుదైన ఛాయాచిత్రాల రూపంలో ప్రదర్శనలో పొందుపరిచారు. పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, ప్రస్తుత విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ తేజోమూర్తి, ఫొటోగ్రాఫర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మూడు రోజులపాటు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా మంగళవారం ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి ఆలయ అవరణను శుద్ధిచేసి భక్తులకు ఎనిమిది గంటలకు స్వామివారి అభిషేకం అనంతరం దర్శనాన్ని కల్పించారు. అనంతరం అర్చకులు ప్రధాన, ఉపాలయాల మూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేదపండితులు నవగ్రహామండ పారాధనతో దేవతలను అవాహన చేసి అగ్నిమదనంతో దీక్షాహోమాలు నిర్వహించారు. గురువారం పవిత్రోత్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవన ములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయఅర్చకులు తెలిపారు. మంగళగిరి రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని హరేకృష్ణ గోకుల క్షేత్రం ఉపాధ్యక్షుడు విలాస దాస తెలిపారు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని అక్షయపాత్ర ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామంలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో ఈనెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రోజంతా ప్రత్యేక దర్శనం, సంకల్ప అర్చన, మహాఅ భిషేకం, హరినామ సంకీర్తనం, భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఉట్టి ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి ప్రత్యేక అభిషేకం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. -
‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా.. రా కూల్డ్రింక్ తాగుదాం!’
పల్నాడు: ‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి స్నేహితుడురా... నీకు కూల్డ్రింక్ ఇప్పిస్తా..రా’ అంటూ బాలుడికి మాయమాటలు చెప్పి సైకిల్తో ఉడాయించిన ఘటన గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకునూరి నాగేశ్వరరావు కుమారుడు పవన్కుమార్ స్థానిక జెడ్పీహైస్కూలులో ఐదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులతో ఆడుకునేందుకు సైకిల్పై ఇంటి నుంచి బయలుదేరాడు. సినిమాహాల్ రోడ్డులో వెళ్తుండగా ఓ యువకుడి ఎదురై పవన్కుమార్ను ఆపాడు. మీ నాన్న నాకు తెలుసు.. బజారుకు వెళ్దాం రా అంటూ మాటలు కలిపాడు. పవన్కుమార్ను సైకిల్పై వెనుక కూర్చొబెట్టుకుని మెయిన్రోడ్డులోని ఓ బడ్డీ దుకాణం వద్దకు తీసుకెళ్లాడు.పవన్కుమార్కు కూల్డ్రింక్ ఇప్పించి, గ్లాసులు తీసుకొనివస్తా ఇక్కడే ఉండమని చెప్పి సైకిల్ తీసుకొని వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగిరాకపోయేసరికి బాలుడు పవన్కుమార్ ఇంటికి వెళ్లి విషయాన్ని తండ్రికి వివరించాడు. అగంతక వ్యక్తి కోసం గ్రామంలో వెతికినా ఫలితం లేకపోవటంతో ఓ ఇంటి సీసీ కెమేరాల ఫుటేజీని పరిశీలించారు. బాలుడిని సైకిల్పై ఎక్కించుకుని వెళ్తున్న సంఘటన సీసీ కెమెరాలో రికార్డు అవటంతో బాలుడి తండ్రి నాగేశ్వరరావు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.చదవండి: పల్నాడులో కలవరపెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు! -
పల్నాడులో కలవరపెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీలు!
సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలకు గత నెల పురిటి నొప్పులతో మూడో ప్రసవానికి ఓ గర్భిణి వచ్చింది. తీవ్ర ఎనీమియాతో బాధపడుతుండటంతో ప్రసవ సమయంలో ఇబ్బందులు తప్పలేదు. గుంటూరు జీజీహెచ్కు తరలించారు. బిడ్డకు జన్మనిచ్చి ఆమె మరణించింది. వైద్యులు ఆరా తీయగా, ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమేనని, 14వ ఏటే తొలి బిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారు. బాల్యవివాహం, టీనేజ్ ప్రెగ్నెన్సీతో పుట్టిన ఇద్దరు చిన్నారులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మూడో కాన్పులో తల్లి మరణించడంతో ముగ్గురు బిడ్డలు అనాథలయ్యారు. ఇటు ప్రభుత్వం, అటు అధికారులు టీనేజ్ ప్రెగ్నెన్సీని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో కౌమార బాలికల్లో గర్భధారణ (టీనేజ్ ప్రెగ్నెన్సీ) ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక, సామాజిక అసమానతలు అధికంగా ఉన్న వెనుకబడిన జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీ అధికంగా ఉండటం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. బాలికల వయసు 13 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న సమయంలో గర్భం దాల్చడం వల్ల వారి ఆశలన్నీ నీరుగారుతున్నాయి. అక్కడితో వారి జీవితం బాధ్యతల్లో బందీ అవుతోంది. మరోవైపు శారీరక, మానసిక ఆరోగ్యపరంగా వారిలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.దీంతో ఈ ప్రభావం ఆ కుటుంబం, సమాజంపై తీవ్రంగా పడుతోంది. బాల్యవివాహాలు, తెలిసీ తెలియని వయసులో క్షణికావేశం, అత్యాచారాలు వంటి ఘటనలు చిన్న వయసులో గర్భం దాల్చడానికి కారణమవుతున్నాయి. దీంతో తల్లీబిడ్డలను ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పాటు మాతాశిశు మరణాల ప్రమాదమూ పెరుగుతోంది. బాలికలు గర్భం దాలి్చన సమయంలో హైపర్టెన్షన్, ఎనీమియా వంటి సమస్యలు తలెత్తి, అధిక శాతం సిజేరియన్ కాన్పులకు దారి తీస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే ప్రోత్సాహకాలు అందాలంటే గర్భిణులకు తప్పనిసరిగా 19 ఏళ్లు నిండి ఉండాలి. అయితే చిన్నారి బాలింతలకు ఈ పథకాలు దూరం కావడంతో సరైన పోషకాలు, ఆర్థిక సహకారం, వైద్యసేవలు అందడం లేదు. 7.71 శాతం మంది వారే... పల్నాడు జిల్లాలో అత్యధికంగా మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో టీనేజ్ ప్రెగ్నెన్సీలు అధికంగా నమోదవుతున్నాయి. ఆగస్టు నెలకు సంబంధించి ఐసీడీఎస్ లెక్కల ప్రకారం తొమ్మిది ప్రాజెక్టుల కింద మొత్తం 8,900 మంది గర్భిణులు నమోదయ్యారు. ఇందులో ఏకంగా 686 మంది బాలికలు గర్భవతులయ్యారని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో మాచర్లలో 1,393 మందికి 116 మంది, ఈపూరు ప్రాజెక్టు పరిధిలో 532 మంది గర్భిణుల్లో 79 మంది, గురజాలలో 643 మందిలో 71 మంది, పిడుగురాళ్లలో 846 మందిలో 70 మంది టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ 7.71 శాతంగా నమోదవ్వడం ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తోంది. అనధికారికంగా ఇంకా ఎక్కువే టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఉండే అవకాశముందని, చట్టవ్యతిరేకం కావడంతో కుటుంబ సభ్యులు బయటకు రాకుండా చూస్తున్నారని సమాచారం.తల్లిదండ్రుల్లో మార్పు రావాలి టీనేజ్ ప్రెగ్నెన్సీ తగ్గాలంటే మొదట తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. అందుకే మొదట వారికి బాల్యవివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీలపై అవగాహన కల్పిస్తున్నాం. మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు లాంటి నియోజకవర్గాల్లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు నమోదవుతున్నాయి. చైల్డ్ ప్రొటెక్షన్ టీం, అంగన్వాడీ సిబ్బందితో కలిసి పంచాయతీ స్థాయిలో కమిటీలు వేసి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహిస్తున్నాం. యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాం. ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో విద్యారి్థనులను చైతన్య పరిచేలా పలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. – నాగమల్లేశ్వరి, పీడీ, ఐసీడీఎస్, పల్నాడు జిల్లా -
నా స్థలం ఆక్రమించి రోడ్లు వేశారు
నాకు గ్రామంలో రెండు చోట్ల స్థలాలు ఉన్నాయి. అందులో సెంటున్నర ఉన్న స్థలానికి ముందు, వెనుక రోడ్లు వేయడంతో నా స్థలం సెంటు లోపల మిగిలింది. కనీసం ఉండేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. సమస్య పరిష్కరించాలని 2022 నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకొంటూ సమస్య పరిష్కరించకుండా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి అనేకమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. – ఎస్. ఆంజనేయరాజు, బొగ్గరం, ఈపూరు మండలం -
యానిమేటర్పై చర్యలు తీసుకోవాలి
వెలుగు కార్యాలయం ముందు డ్వాక్రా సభ్యులు ధర్నాఅచ్చంపేట: తాము బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రతి నెలా తమ వద్ద నగదు వసూలు చేసి, బ్యాంకులో చెల్లించకుండా సొంతానికి వాడుకున్న యానిమేటర్ షేక్ సల్మాపై చర్యలు తీసుకోవాలని పలువురు డ్వాక్రా గ్రూపు సభ్యులు సోమవారం స్థానిక వెలుగు కార్యాలయం ముందు ధర్నా చేశారు. రుణాలకు సంబంధించి తాము చెల్లించిన నగదును వెంటనే బ్యాంకులో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా కొనసాగించారు. సల్మాపై చర్యలు తీసుకోవాలని, వెలుగు అధికారులు తమ గోడు విని వెంటనే స్పందించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. మధ్యాహ్న భోజనం కూడా కార్యాలయం ముందే చేశారు. నష్టపోయిన జానీ, శివసాయి, తిరుమల, ప్రియాంక, మక్కా మసీద్, అజ్మీత్ డ్వాక్రా గ్రూపు సభ్యులకు మద్దతుగా కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కమిటీ సభ్యుడు హనుమంతరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కత్తుల గోపీకృష్ణారెడ్డి మద్దతు తెలిపారు. న్యాయం దక్కలేదనే... ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ దీనిపై తాము జూలై 8న అచ్చంపేట వెలుగు కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. అక్కడ తమకు న్యాయం జరగకపోవడంతో గత నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వెలుగు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. ఎక్కడా తమకు న్యాయం జరగకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో తాము ధర్నాకు దిగాల్సి వచ్చిందని వాపోయారు. సుమారు రూ.35 లక్షలకు పైగా సల్మా మోసం చేసినట్లు ఆరోపించారు. తక్షణమే విచారణ జరిపి, తాము చెల్లించిన సొమ్మును యానిమేటర్ వద్ద రికవరీ చేసి బ్యాంకులో జమ చేయాలని, అప్పటి వరకు తాము ధర్నా విరమించేది లేదని తెలిపారు. వెలుగు కార్యాలయం ప్రధాన తలుపులను మూసేసి, ఎవ్వరినీ కార్యాలయంలోకి వెళ్లనీయకుండా దారికి అడ్డంగా కూర్చున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో వెలుగు ఏపీఎం వెంకటరెడ్డి పోలీసులతో వచ్చి జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. మూడు రోజుల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టి, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కార్యక్రమంలో డ్వాక్రా సభ్యులు ఎల్లమంద, మల్లేశ్వరి, తిరుపతమ్మ, కుంభా పార్వతి, గౌరి, పార్వతి, పుల్లమ్మ, కోటేశ్వరి, అచ్చమ్మ, ఏపూరి మల్లేశ్వరి, కోటేశ్వరి, దుర్గ తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూఎన్ వసతి గృహాలను పరిశీలించిన కలెక్టర్
నరసరావుపేట రూరల్: కాకానిలోని జేఎన్టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్ను సోమవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సందర్శించారు. కళాశాలలో రూ.70 కోట్లతో నిర్మించిన వసతి గృహాల భవనాలను ఈ నెల 2వ తేదీన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వసతి గృహ భవనాలను కలెక్టర్ పరిశీలించారు. మంత్రి లోకేష్ పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గృహంలో గదులను పరిశీలించి చేపట్టాల్సి పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో బాలకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్తో పవర్గ్రిడ్ అధికారుల సమావేశం.. నరసరావుపేట: జిల్లాలో ట్రాన్స్ మిషన్ లైన్లు, సబ్స్టేషన్ కోసం భూమి పరిహారంపై పవర్గ్రిడ్ సీనియర్ అధికారులు కె.సుధాకరరావు, ఆర్.రాములు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాతో క్యాంపు కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. 765 కేవీ, 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణానికి రైతులకు ఇవ్వబోయే భూమి, రోడ్డు కారిడార్ పరిహారం, టవర్ బేస్ పరిహారంపై చర్చించారు. పిడుగురాళ్ల మండలంలో 765 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం కోసం భూమి సేకరణకు సంబంధించి కలెక్టర్కు అధికారిక అభ్యర్థన పత్రాన్ని సమర్పించారు. రెవెన్యూ, పవర్గ్రిడ్ అధికారులు పాల్గొన్నారు. -
కూల్డ్రింక్ చేతిలో పెట్టి.. సైకిల్ కాజేసి..
నాదెండ్ల: ‘ఒరేయ్ మీ నాన్న నాకు మంచి స్నేహితుడురా... నీకు కూల్డ్రింక్ ఇప్పిస్తా..రా’ అంటూ బాలుడికి మాయమాటలు చెప్పి సైకిల్తో ఉడాయించిన ఘటన గణపవరం గ్రామంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆకునూరి నాగేశ్వరరావు కుమారుడు పవన్కుమార్ స్థానిక జెడ్పీ హైస్కూలులో ఐదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులతో ఆడుకునేందుకు సైకిల్పై ఇంటి నుంచి బయలుదేరాడు. సినిమాహాల్ రోడ్డులో వెళ్తుండగా ఓ యువకుడి ఎదురై పవన్కుమార్ను ఆపాడు. మీ నాన్న నాకు తెలుసు.. బజారుకు వెళ్దాం రా అంటూ మాటలు కలిపాడు. పవన్కుమార్ను సైకిల్పై వెనుక కూర్చొబెట్టుకుని మెయిన్రోడ్డులోని ఓ బడ్డీ దుకాణం వద్దకు తీసుకెళ్లాడు. పవన్కుమార్కు కూల్డ్రింక్ ఇప్పించి, గ్లాసులు తీసుకొనివస్తా ఇక్కడే ఉండమని చెప్పి సైకిల్ తీసుకొని వెళ్లాడు. ఎంతసేపటికి తిరిగిరాకపోయేసరికి బాలుడు పవన్కుమార్ ఇంటికి వెళ్లి విషయాన్ని తండ్రికి వివరించాడు. అగంతక వ్యక్తి కోసం గ్రామంలో వెతికినా ఫలితం లేకపోవటంతో ఓ ఇంటి సీసీ కెమేరాల ఫుటేజీని పరిశీలించారు. బాలుడిని సైకిల్పై ఎక్కించుకుని వెళ్తున్న సంఘటన సీసీ కెమెరాలో రికార్డు అవటంతో బాలుడి తండ్రి నాగేశ్వరరావు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడిని మోసగించిన ఆగంతకుడు -
వేరే వ్యక్తి పేరిట మా భూమి నమోదు
మాకు వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం లక్ష్మీపురం గ్రామంలో 2 ఎకరాల పొలం ఉంది. మార్కాపురం నియోజకవర్గం పెద్దారవీడు మండలం తోకపల్లిలో నివాసం ఉంటాం. ఆ భూమిని మాకు తెలియకుండా ఇంటి సమీపంలో నివాసం ఉండే వ్యక్తి తన పేరుపై ఆన్లైన్లో నమోదు చేయించుకున్నాడు. దానిని రద్దు చేసి మా పేరుపై మార్చి న్యాయం చేయాలి. – నరాల శ్రీదేవి, శ్రీనివాసరావు, తోకపల్లి, పెద్దారవీడు మండలం ● -
ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై చర్చించాలి
నరసరావుపేట: ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే చర్చించి పరిష్కారానికి కృషి చేయాలని ఏపీ జేఏసీ సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సీపీఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే అమలు చేయాలని, పీఆర్సీ కమిషన్ను వెంటనే ప్రకటించాలని, ఐదు డీఏలు అందజేసి ఐఆర్ను వెంటనే ప్రకటించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకుడు ఎస్. నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో తమ డిమాండ్లకు మద్దతు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు. మిగిలిన వాటిని అమలు చేయకుండా ఉండటం భావ్యం కాదని అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బాకీ ఉందని పేర్కొన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాడుతామని హెచ్చరించారు. నేటి నుంచి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడాన్ని రాజకీయ కోణంలో చూడటం, ఉద్యమాన్ని వక్రీకరించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులపై విమర్శల వల్ల సమస్యలు పరిష్కారం కావని గుర్తుచేశారు. ఏపీ అమరావతి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లుపై పాలకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
గోల్ షాట్బాల్ విజేతలకు సత్కారం
తెనాలి: భూటాన్లో జరిగిన ఇంటర్నేషనల్ గోల్ షాట్బాల్ సబ్–జూనియర్స్ బాయ్స్–గర్ల్స్ చాంపియన్షిప్లో భారత జట్లు రెండూ విజయం సాధించాయి. ఆగస్టు 24 నుంచి 27 వరకు నిర్వహించిన ఈ పోటీల్లో ఫైనల్స్లో రెండు విభాగాల్లోనూ భూటాన్ జట్లతో తలపడిన భారత జట్లు విన్నర్స్గా నిలిచాయి. స్థానిక సుల్తానాబాద్లోని సెయింట్ ఆన్స్ స్కూల్కు చెందిన నలుగురు బాలికలు, ముగ్గురు బాలురు చొప్పున రెండు జట్లలోనూ ఏడుగురు క్రీడాకారులు దేశం తరఫున ఆడారు. రెండు జట్లు విన్నర్స్గా నిలిచినందున ఆయా జట్లలో ఆడిన చిల్కా రుత్విక్ కిరణ్, పెదపల్లి సుహాస్, చుండూరు హర్షద్ గౌతమ్ దేవరకొండ అమూల్య, చుండూరు జెస్విత, దాసరి జెన్సినా జాయల్, చిలకా ప్రజ్ఞను సోమవారం సెయింట్ ఆన్స్ స్కూల్ యాజమాన్యం సత్కరించింది. అంతర్జాతీయ పోటీల్లో ఇంటర్నేషనల్ కోచ్గా స్కూల్ పీఈటీ ఎన్.వినోద్ కుమార్ మార్గనిర్దేశం చేశారు. విద్యార్థుల విజయానికి నిరంతరం ప్రోత్సాహం, సహకారం అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వీరి విజయం మరెందరో విద్యార్థులకు స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిస్టర్ సౌమ్య, కరస్పాండెంట్ సిస్టర్ లీసా జార్జ్, పీఈటీలు వినోద్కుమార్, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.9,69,418 వచ్చినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి తెలిపారు. సోమవారం అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు బాపట్ల దేవదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో నిర్వహించారు. లెక్కింపులో ట్రస్ట్ బోర్డు సభ్యులు, భక్తులు, పలు భజన సమాజం సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి మాట్లాడుతూ 99 రోజుల తరువాత అమ్మవారి హుండీ లెక్కించినట్లు తెలిపారు. గతంలో కంటే ఈసారి రూ.2,03,834 అదనంగా వచ్చినట్లు తెలిపారు. అమరావతి: అమరేశ్వర ఆలయంలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ సోమవారం పేర్కొన్నారు. యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మి దంపతుల నేతృత్వంలో జరిగే ఉత్సవాలలో మొదటి రోజైన మంగళవారం వేద పండితులచే ఉదకశాంతి, ఆలయ శుద్ధి, ప్రధాన ఉపాలయాల మూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రెండో రోజు బుధవారం మండప పూజలు, దీక్షా హోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం మూడో రోజు గురువారం ప్రాయశ్చిత్తహోమం, పూర్ణాహుతి, మహదాశీర్వచనం ఉంటాయన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 536.80 అడుగులకు చేరింది. కుడి కాలువకు 6,660, ఎడమ కాలువకు 7,029, ఎస్ఎల్బీసీకి 2 వేల క్యూసెక్కులు విడుదలవుతోంది. మొత్తం ఔట్ఫ్లోగా 15,689 క్యూసెక్కులు వెళుతోంది. శ్రీశైలం నుంచి సాగర్కు 1,259 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
వెట్టిచాకిరి నుంచి బాలుడికి విముక్తి
చీరాల రూరల్: వెట్టిచాకిరీతో ఇబ్బందులు పడుతున్న ఓ బాలుడు ఆర్డీవో చొరవతో కార్మికశాఖ, షాడోస్ సంస్థ సహకారంతో విముక్తి పొందాడు. వివరాల్లోకి వెళ్తే.. వేటపాలెంలో ఓ బాలుడు గొర్రెల కాపరిగా గత కొన్నేళ్లుగా అనేక ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్నాడని షాడోస్ సంస్థ నిర్వహకులు రాజా సాల్మన్ తెలిపారు. అయితే అతడు పడుతున్న కష్టాలను చూసిన సాల్మన్ అతడి కుటుంబ సభ్యులతో కలసి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశాడు. స్పందించిన జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఆర్డీవోను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. సోమవారం వేటపాలెంలో బాధిత బాలుడు పనిచేస్తున్న ప్రదేశానికి చీరాల కార్మికశాఖ అధికారి సుజాత, సాల్మన్, వేటపాలెం ఎస్సై జనార్దన్లు ఆర్డీవో నరసింహారావును తీసుకెళ్లారు. అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను పరిశీలించిన ఆర్డీవో విచారం వ్యక్తం చేశారు. తాను ప్రతిరోజు ఈ పనులు చేయలేకపోతున్నానని కాళ్ల వాపులు వచ్చాయని, అనారోగ్యానికి గురయ్యానని ఆ యువకుడు కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. చలించిన ఆర్డీవో బాలుడు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా గుర్తించి తక్షణమే అతడిని అక్కడ నుంచి విముక్తి చేస్తున్నట్లు విడుదల ధ్రువపత్రాన్ని అందజేశారు. ఇకపై జాగ్రత్తగా ఉండాలని ఆర్డీవో బాలునికి సూచించారు. బాలునికి ప్రభుత్వం నుంచి అందివచ్చే వివిధ పథకాలను గురించి వివరించారు. బాలునికి తక్షణమే ప్రభుత్వ పధకాలను అందజేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలునికి విముక్తి కల్పించడంలో ప్రత్యేక చొరవ చూపిన షాడోస్ నిర్వహకులు రాజా సాల్మన్ను ఆర్డీవో అభినందించారు. బాలుడికి విడుదల ధ్రువపత్రం అందజేసిన ఆర్డీఓ నరసింహారావు -
ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందికి సత్కారం
నరసరావుపేట రూరల్: ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బంది సత్కారం కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ రోహిత్కుమార్ చౌదరి కార్యక్రమంలో పాల్గొని సిబ్బందిని ఘనంగా సత్కరించారు. జిల్లా అదనపు ఎస్పీ వి.సత్తిరాజు, పీసీఆర్ ఎస్ఐ కె.నరసదాసు, ఎస్బీ ఏఎస్ఐ ఎండీ జిలాని, ఏఎస్ఏలు పి.మధుసుధనరావు, ఎస్.వీరాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్స్ జి.రమాదేవి, ఎస్కె కరీముల్లా, కానిస్టేబుల్ ఆర్.సాంబశివరావు, ఎస్.పోతురాజులు ఉద్యోగ విరమణ పొందిన వారిలో ఉన్నారు. ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సుదీర్ఘకాలం పని చేసి ఉద్యోగ విరమణ పొందిన సిబ్బంది సేవలు శ్లాఘనీయమన్నారు. కార్యక్రమంలో హోంగార్డ్ ఆర్ఐ ఎస్.కృష్ణ, వెల్పేర్ ఆర్ఐ ఎల్.గోపినాథ్, పోలీసు వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.మాణిక్యాల రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల మార్పు రద్దు చేయండి
నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గత 40 ఏళ్ల నుంచి ఉన్న పోలింగ్ కేంద్రాలను మార్చి వెన్నుపోటు పార్టీ నాయకులు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ నరసరావుపేట, వినుకొండ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తమ నియోజకవర్గాల్లో కూటమి పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు చేసిన పోలింగ్ కేంద్రాల మార్పులపై సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కలిశారు. ఎస్సీ, ఎస్టీలకు దూరంగా, ఓసీ ఓటర్లు ఉన్న ప్రదేశాల్లోకి మార్చిన పోలింగ్ కేంద్రాలను మళ్లీ యథావిధిగా పునరుద్ధరించాలని వినతిపత్రం సమర్పించారు. అఖిల పక్ష సమావేశం పెట్టకుండా ఏకపక్షంగా ఎందుకు పోలింగ్ కేంద్రాలను మార్చారని అక్కడే ఉన్న డీపీఓ నాగేశ్వరనాయక్ను ప్రశ్నించారు. తక్షణమే మార్పులు చేయకపోతే తాము హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. అంతా అడ్డగోలుగానే... ఈ సందర్భంగా జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేట మండలంలోని పెట్లూరివారిపాలెం గ్రామంలో ఎస్సీలు నివాసం ఉండే ప్రాంతం నుంచి ఓసీలు ఉండే ప్రాంతానికి పోలింగ్ కేంద్రం మార్చారన్నారు. ఈ నెల 23వ తేదీన రొంపిచర్ల మండలంలో పోలింగ్ కేంద్రాలకు సంబంధించి డ్రాఫ్ట్ లిస్టును ఎంపీడీఓ సంతకంతో పబ్లిష్ చేశారని తెలిపారు. ఈ నెల 28న ఐదు రోజుల్లోపు ఈ డ్రాఫ్ట్ లిస్టును టీడీపీకి అనుకూలంగా మార్చారన్నారు. మొదటి డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని, కానీ అటువంటిదేమీ లేకుండా మార్పులు చేశారన్నారు. ఇష్టానుసారంగా ఇలా వ్యవహరించడం తగదని ఆయన హితవు పలికారు. ● రొంపిచర్ల గ్రామానికి సంబంధించి మార్చిన పడమటిపాలెం పోలింగ్ కేంద్రంలో గతంలో బాంబు బ్లాస్టింగ్ జరిగి కేసులు నమోదైన ఘటనలు ఉన్న దృష్ట్యా ఆ పోలింగ్ కేంద్రంలోకి మార్చకూడదని హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఉందన్నారు. అయినా టీడీపీ నాయకుల సూచనలతో పోలింగ్ కేంద్రాన్ని మార్చారన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నిజంగా టీడీపీ నాయకులకు గెలిచే సత్తా ఉంటే 40 ఏళ్ల నుంచి ఓటింగ్ జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మొన్న డీపీఓను కలిశామని, ఇప్పుడు కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లామని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెరగాలి
డీఎంహెచ్ఓ డాక్టర్ రత్నమన్మోహన్ పిడుగురాళ్ల రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, ప్రభుత్వ ఆసుపత్రులలోనే కాన్పుల సంఖ్యను పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ రత్నమన్మోహన్ స్పష్టం చేశారు. పిడుగురాళ్ల మండలం కరాలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించి, వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలోని రికార్డులు, మందుల నిల్వలు, ఓపీ సేవలను డీఎంహెచ్ఓ పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రతి గర్భిణీకి సక్రమంగా వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇంటి ప్రసవాలను పూర్తిగా నివారించి, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. స్థానిక వైద్యులు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ రమాదేవి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటం వినుకొండ: రాష్ట్ర విద్యార్థి యువసేన ఉమ్మడి గుంటూరు జిల్లా మహాసభ వినుకొండలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంపెంగుల రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అనుమతులు లేకుండా, డమ్మీ భవనాలు చూపిస్తూ అక్రమంగా నడుస్తున్న కళాశాలలపై త్వరలోనే ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులను భయపెట్టి అక్రమ ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించడంలో విజయం సాధించామని పేర్కొన్న ఆయన.. రాబోయే రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్, సంక్షేమ హాస్టళ్ల సమస్యలు మరియు జీవో నెంబర్ 77 రద్దు కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎం.యేసుబాబు, ఆర్.రాజు, వి.కోటేశ్వరరావు, కె.ఆంజనేయులు తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. తొలగించిన షిప్ట్ ఆపరేటర్లను విధుల్లోకి తీసుకోవాలి పీజీఆర్ఎస్లో అధికారులను కోరిన ఏఐటీయూసీ నాయకులు నరసరావుపేట: వినుకొండ నియోజకవర్గంలో విద్యుత్ ఉపకేంద్రాలలో పనిచేస్తున్న 19 మంది షిఫ్ట్ ఆపరేటర్లను ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అన్యాయంగా అకారణంగా తొలగించారని, వారందరిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) నాయకులు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లా కార్యదర్శి పిశ్రీనివాసరావు ఆధ్వర్యంలో డీఆర్ఓ అద్దెయ్యకు వినతిపత్రం సమర్పించారు. సమస్యను పరిష్కరించాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ షేక్ సుభానీని డీఆర్ఓ ఆదేశించారు. తొలగించిన కార్మికులు పాల్గొన్నారు. బైక్ ఢీకొని వ్యక్తి మృతి అమరావతి: మండల పరిధిలోని మునగోడు శివారు గ్రామమైన తురగావారి పాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణించిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామానికి చెందిన తాల్లూరి సూర్యప్రకాష్ అమరావతి నుంచి పెదపాలెంకు తన ద్విచక్ర వాహానంపై వెళుతూ మార్గంమధ్యలో తురగావారిపాలెం వద్ద గేదెలు తోలుకుని వెళుతున్న బయ్యవరం గ్రామానికి చెందిన శిరసాని శ్రీనివాసరావు(56)ను ఢీకొట్టాడు. ఈసంఘటనలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడి వైద్యలు పరీక్షలు చేసి శ్రీనివాసరావు మృతి చెందాడని నిర్ధారించారు. ఈ సంఘటన పై అమరావతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్జీలు సత్వరం పరిష్కరించండి
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్ ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, మోసాలు, కాక్రమణలు, బెదిరింపులు వంటి పలు అంశాలపై 92 ఫిర్యాదులు అందాయి. మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి చట్ట ప్రకారం న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. -
చలపతి యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ బీవీ చౌదరి బాధ్యతల స్వీకారం
తాడికొండ: చలపతి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా ప్రొఫెసర్ బీవీ చౌదరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ వైవీ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రొఫెసర్ బీవీ చౌదరికి విద్య, పరిశోధన, పరిపాలనా రంగాల్లో 30 ఏళ్లకుపైగా అనుభవం ఉందని, ఆయన ఐఐటీ న్యూఢిల్లీ నుంచి ఎంటెక్, పీహెచ్డీ పట్టాలను పొందారన్నారు. వెస్ట్ ఇండీస్లో సుమారు 25 సంవత్సరాల పాటు డీన్ ప్రొఫెసర్గా సేవలందించారని, నెదర్లాండ్స్, అమెరికా తదితర దేశాలను సందర్శించారని, పరిశోధనా రంగంలో విశేష కృషి చేసి 175 పరిశోధనా పత్రాలను ప్రచురించడంతోపాటు 15 మంది పీహెచ్డీ విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారన్నారు. ఎస్టీసీ సభ్యుడిగా కూడా సేవలందించారని తెలిపారు. ప్రొఫెసర్ బీవీ చౌదరి మాట్లాడుతూ చలపతి యూనివర్సిటీని విద్యా, పరిశోధన, ఆవిష్కరణ రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. నాణ్యమైన విద్య, మెరుగైన పరిశోధనా అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ వై సుజిత్ కుమార్ వీసీకి అభినందనలు తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నాదెండ్ల రామారావు, డైరెక్టర్ డి వినయ్కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ కె నాగ శ్రీనివాసరావు, డీన్ డాక్టర్ కె కిరణ్కుమార్లు వైస్ ఛాన్స్లర్ను అభినందించారు. -
‘బడి కోసం’ పై విస్తృత ప్రచారం చేయాలి
జిల్లా విద్యాశాఖాధికారి రామారావు నరసరావుపేట రూరల్: బడి కోసం కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంపై 28 మండలాల సిబ్బంది, సీఆర్పీలకు శిక్షణ, సమీక్ష సమావేశం సోమవారం కేసానుపల్లిలోని ఎంఏఎం కళాశాలలో నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజలు, పూర్వ విద్యార్థులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తల సహకారాన్ని సమీకరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఇందుకోసం డోనర్ పోర్టల్ లక్ష్యాలు, దాతల భాగస్వామ్యం, నమోదు ప్రక్రియను వివరించారు. దాతలు నగదు, వస్తు రూపంలో అందించే సహాయాన్ని నమోదు చేయాలని తెలిపారు. తద్వారా దాతల సహకారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని వివరించారు. అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్టినేటర్ పి.శ్యాంప్రసాద్, సమగ్ర శిక్ష ఇంజినీరింగ్ అధికారులు శ్రీనివాసరెడ్డి, నాయక్, సెక్టోరల్ అధికారులు పద్మారావు, పూర్ణచంద్రరావు, సెల్వరాజ్, శంకర్రాజు పాల్గొన్నారు. -
న్యాయవాద వృత్తి ఉన్నతమైనది
నరసరావుపేట టౌన్: అన్ని వృత్తుల్లోకి ఉన్నతమైనది న్యాయవాద వృత్తి అని స్థానిక 13వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయాధికారి ఎస్.రమేష్ సోమవారం అన్నారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా న్యాయవాద సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. నరసరావుపేటలో విధులు నిర్వహించడం సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రతిభ, నైపుణ్యం కలిగిన న్యాయవాదులకు నెలవు నరసరావుపేట అన్నారు. యువ న్యాయవాదులు క్రమశిక్షణతో శ్రమించి ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. అనంతరం దివంగత న్యాయవాదులు రావిళ్ల లక్ష్మీనారాయణ, గుండాల సురేష్ బాబు, చిట్టి మాల సురేష్ల చిత్రపటాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక న్యాయాధికారులు కిరణ్ కుమార్, జోష్ణశ్రీ, న్యాయవాద సంఘ అధ్యక్షుడు జీవీ సుబ్బారావు, పలువురు సీనియర్, జూనియర్, మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
నరసరావుపేట టౌన్: గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్ సీఐ ప్రభాకర్ సోమవారం తెలిపారు. పల్నాడు బస్టాండ్ అన్నా క్యాంటీన్ పక్కన సుమారు 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది పడిఉన్నాడన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించామన్నారు. మృతుడి అనవాళ్లు తెలిసినవారు టూటౌన్ పోలీసుస్టేషన్లో సంప్రదించాలన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించిన నాయకులు నరసరావుపేట: గత ఎన్నికల సందర్భంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని వెంటనే అమలుచేసి నిలబెట్టుకోవాలని రజక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ రజక ఎస్సీ సాధన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి పీజీఆర్ఎస్లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సాధన సమితి కోర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 1986లో ఎన్టీ రామారావు రాష్ట్ర క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేశారన్నారు. 2009లో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రజకులు ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తుండగా అక్కడికి వచ్చి ఇప్పుడు బిల్లు పెడితే తాను ప్రతిపక్ష నాయకుడిగా బలపరుస్తానని చెప్పారన్నారు. ఆ తర్వాత 2014 పాదయాత్రలో చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే హామీ నెరవేరుస్తానని ఇచ్చారన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో గవర్నర్ ప్రసంగంలో అంశాన్ని దానికి కట్టుబడి ఉన్నానని ప్రకటించారన్నారు. 2024 మంగళగిరిలో బీసీ డిక్లరేషన్లో రజకుల చిరకాల కోరిక తాను అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా పూర్తిచేస్తానని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా మాట నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వెంటనే రజకులను ఎస్సీ జాబితాలు చేర్చే దానికి కట్టుబడి ఉండాలని, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. కోర్ కమిటీ సభ్యులు బాదుగున్నల శ్రీను, అక్కెనపల్లి బాలయ్య, కోయ రామారావు, మక్కెన శ్రీను, భీమవరపు కోటేశ్వరరావు పాల్గొన్నారు. పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం పలు కేంద్ర పథకాల అమలు తీరుపై సమీక్ష నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం (డీఈఐపీసీ) జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన సోమవారం నిర్వహించగా జిల్లా పరిశ్రమల అధికారి ఎస్.వి.సురేష్ కన్వీనర్గా వ్యవహరించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కన్వీనర్ కలెక్టర్కు సమర్పించగా, వాటి అమలు పురోగతిని సమీక్షించారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న కేంద్ర పథకాల అమలు, వాటి కింద నిర్వహించిన సమావేశాలు కార్యక్రమాల పురోగతి, సింగిల్ డెస్క్ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన పారిశ్రామిక అనుమతుల దరఖాస్తుల స్థితిగతులు, వాటి పరిష్కారం నిర్ణీత గడువుల్లో అనుమతుల జారీపై చర్చించారు. పలు శాఖల జిల్లా అధికారులు, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. ఎయిడ్స్పై ప్రచారం వాహనం ప్రారంభం ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశానుసారం ఇంటెన్సిఫైడ్ ఐఈసీ కాంపెయిన్–2026లొ భాగంగా జిల్లాలో హెచ్ఐవి,ఎయిడ్స్పై అవగాహన కోసం ఎల్ఈడీ వాహనం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ డాక్టర్ కృతికా శుక్ల తెలిపారు. వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ వాహనం జిల్లాలో 15 రోజుల పాటు వివిధ గ్రామాల్లో బాగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు హెచ్ఐవిపై అవగాహన కొరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రత్న మన్మోహన్, జిల్లా లెప్రసి, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఓపీ సేవలకు అరగంట విరామం
ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలుగుంటూరు మెడికల్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో ఓపీ వైద్య సేవలకు అరగంటసేపు విరామం ఇచ్చి నిరసన తెలియజేస్తామని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాబ్జి శ్యామ్కుమార్, జనరల్ సెక్రటరీ డాక్టర్ స్వరూప్కాంత్లు తెలిపారు. తమ నిరసనలో భాగంగా సోమవారం గుంటూరు వైద్య కళాశాలలో ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు నల్లబ్యాడ్జీలు ధరించారు. ఫ్లెక్సీలు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విడతల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సోమవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ను కలిసి సమ్మె నోటీసు అందజేశామన్నారు. అందులో భాగంగా మంగళవారం నుంచి వారం పాటు రోజూ అరగంటసేపు ఓపీ వైద్య సేవలకు విరామం ప్రకటిస్తామన్నారు. జిల్లా సంఘం నేతలు డాక్టర్ అజయ్, డాక్టర్ రాజా, డాక్టర్ శివగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ బేస్ బాల్ జట్ల ఎంపిక
రొంపిచర్ల: పల్నాడు జిల్లా పురుషుల, మహిళల సీనియర్ బేస్ బాల్ ఎంపిక ఆదివారం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి వి.వేమారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీల్లో జిల్లా నుంచి 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన 20 మంది చొప్పున పురుషులు, మహిళా క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశామని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా బేస్ బాల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వై.సైదయ్య మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారుల్లో మహిళలకు సెప్టెంబర్ ఒకటి నుంచి రొంపిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పురుషులకు మాచర్ల సెయింట్ ఆన్స్ స్కూల్లో శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ శిక్షణలో ప్రతిభ కనబర్చిన 16 మంది క్రీడాకారులను మెయిన్ టీంగా సెలెక్ట్ చేసి వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో పుట్టపర్తిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నటు చెప్పారు. కార్యక్రమంలో పీడీ వై.వి.చిరంజీవిరావు, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు పిడెం హుస్సేన్, పంబా వెంకట్ పాల్గొన్నారు. -
మాజీ మంత్రి అంబటిని పరామర్శించిన పిన్నెల్లి
మాచర్ల: ఇటీవల అస్వస్థతకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబును హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అంబటి త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఉత్సాహంగా కూడో జిల్లా స్థాయి పోటీలుగుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా కూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టోర్నమెంట్ స్థానిక బీఆర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆర్.సిద్ధార్థ వర్మ మాట్లాడుతూ టోర్నమెంట్లో పతకాలు సాధించిన క్రీడాకారులను విశాఖపట్నంలో సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కోచ్ బ్లాక్ బెల్ట్ 7వ డాన్ డి.ప్రభాకర్ పాల్గొన్నారు. కరాటేతో క్రమశిక్షణ, ఆత్మరక్షణ మంగళగిరి టౌన్: కరాటేతో క్రమశిక్షణతోపాటు ఆత్మరక్షణ కూడా అలవాటు అవుతుందని ఎయిమ్స్(అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)కు చెందిన డాక్టర్ శుభోదీప్ మిత్ర తెలిపారు. మంగళగిరి పట్టణంలోని స్వేచ్ఛ బుద్ధ విహార్లో ఆదివారం జపాన్ కరాటే అసోసియేషన్(జేకేఏ) క్యూ లెవల్ బెల్డ్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు నిర్వహించారు. శుభోదీప్ మిత్ర మాట్లాడుతూ కరాటే నేర్చుకుంటే విద్యార్థులకు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం పెరుగుతాయని పేర్కొన్నారు జేకేఏ ఏపీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ రవిబాబు, జోనల్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ సాగరిక పాల్గొన్నారు. అమ్మవారి నగల కోసం చెత్తలో వెతుకులాట పెదకాకాని: శివాలయంలో మాయమైన భ్రమరాంబ వారి ఆభరణాల కోసం డంపింగ్ యార్డులో వెతకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆగస్టు 14వ తేదీన పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూలతోపాటు బంగారు ఆభరణాలు అలంకరించారు. 18న అమ్మవారి మంగళసూత్రం, నాన్తాడు కనిపించడం లేదని ఆలయ అర్చకులు అధికారుల దృష్టికి తెచ్చారు. అర్చకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఐదుగుర్ని సస్పెండ్ కూడా చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 17 రోజులు గడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పోలీసులు, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆభరణాల కోసం సంబంధిత చెత్త వేసే ప్రదేశంలో వెతికారు. ఘర్షణలో వ్యక్తికి గాయాలు అచ్చంపేట: క్రికెట్ పోటీలలో రెండు టీమ్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో యువకుడికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన అచ్చంపేట, క్రోసురు సరిహద్దులోని మార్కెట్యార్డు వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రంథసిరి గ్రామానికి చెందిన సతీష్, నరేష్ చెరో టీమ్లో సభ్యులుగా ఉన్నారు. పోటీ కొనసాగుతున్న సమయంలో రెండు టీముల మధ్య వాగ్వాదం చోటుచేసు కుంది. సతీష్ని నరేష్ బీరు సీసాతో పొడవడంతో స్వల్ప గాయమైంది. వెంటనే బాధితుడిని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ఖో–ఖో బాలబాలికల జట్ల ఎంపిక
నకరికల్లు: ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ బాలబాలికల ఖో–ఖో జట్ల ఎంపిక పూర్తయింది. జిల్లా ఖో–ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నకరికల్లులోని వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా జట్ల ఎంపిక ఆదివారం నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి 160 మంది క్రీడాకారులు, 90 మంది క్రీడాకారిణులు పోటీలకు హాజరయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎంపిక పోటీల ద్వారా స్టాండ్బై క్రీడాకారులతో కలిపి 22 మందితో బాలికల జట్టు, 19 మందితో బాలుర జట్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సెక్రెటరీ చింతా పుల్లయ్య మాట్లాడుతూ ఎంపికై న జట్లలో బాలుర జట్టుకు గుంటూరులోని టీజేపీఎస్ కళాశాలలో, బాలికల జట్టుకు నకరికల్లులోని ఎస్వీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 12 వరకు శిక్షణ జరుగుతుందని అన్నారు. అనంతరం సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో నిర్వహించే రాష్ట్రస్థాయి జూనియర్ ఖో–ఖో పోటీల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున పాల్గొంటారని అన్నారు. గుంటూరు జిల్లా ఖో–ఖో అసోసియేషన్ సీఈఓ దాసరి కోటేశ్వరరావు, అధ్యక్షుడు వీరభద్రారెడ్డి, కార్యదర్శి చింతా పుల్లయ్య, మాజీ కార్యదర్శి రావి కిషోర్ ఎంపికను పర్యవేక్షించారు. ఎంపికకు న్యాయ నిర్ణేతలుగా ఫిజికల్ డైరెక్టర్ జి.ఝాన్సీరాణి, క్రీడా ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు కళ్యాణి, మద్దం వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, వీరయ్య, చినబాబు, పెద్దబాబు, చిన రత్తయ్య, నర్శింహారావు, స్వర్ణ రాజు, శ్రీను పాల్గొన్నారు. జూనియర్ బాలికల జట్టు క్రీడాకారులు వీరే... రంగా మహాలక్ష్మి, సీహెచ్.త్రివేణి, బి.లాస్య, షేక్.ఫర్హాన, ఎస్.హేమ శివ వర్షిణి, పి.షాహినా, ఎన్.లావణ్య, వై.హర్షిత, బి.నందిని, ఏ.అనూష, టి.లిఖిత, బి.సౌజన్య, సీహెచ్.విజయ, జె.నాగవేణి, కె.బుజ్జిలతో పాటు స్టాండ్బైలో మరో ఏడుగురిని ఎంపిక చేశారు. జూనియర్ ఖో–ఖో బాలుర జట్టులో క్రీడాకారులు వీరే షేక్.నబీరసూల్, ఏ.శ్రీనివాస్, ఎం.శ్రీకాంత్, యు.మనోహర్, కె.వి.గోపిచంద్, షేక్.ఆసిఫ్, ఏ.హనుమప్రసాద్, ఎన్.సాయిచరణ్, ఏ.కోమలేష్, డి.ఏడుకొండలు, వి.నందకిశోర్, పి.శివకార్తీక్, ఎస్.రామ్చరణ్, డి.శివగణేష్, ఎం.రవికరణ్లతో పాటు మరో నలుగురిని స్టాండ్బైగా ఎంపిక చేశారు. -
భవిత భళా..!
తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధిస్తున్న పాఠంలో సందేహాలను నివృత్తి చేసుకోవడం సాధారణంగా విద్యార్థుల్లో కనిపించే లక్షణం. అదే తరహాలో చెట్టు నుంచి ఆపిల్ కింద పడితే అది ఎందుకు కింద పడిందని తనలో తాను ప్రశ్నించుకోవడం ద్వారా భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుగొన్న న్యూటన్ గొప్ప భౌతిక శాస్త్రవేత్తగా ఎదిగారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు, ఆవిష్కరణలతో ప్రపంచం గర్వించే శాస్త్రవేత్తగా నిలిచారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సీవీ రామన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఎంతో మంది ఈ జాబితాలో ఉన్నారు. ఇదంతా గతంగా మారుతోంది. సమాజంలో ప్రస్తుతం శాస్త్రవేత్తలు కనుమరుగు అవుతున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులు తప్ప ఇక ఏవీ లేవనే ధోరణి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భావి శాస్త్రవేత్తలను సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బాల మేధ..ఆసక్తి ఉండాలే కానీ వేల మంది శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాలు, ప్రోత్సాహకాలు మన దేశంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 22 ఐఐటీల్లో 10,250 సీట్లు భావి శాస్త్రవేత్తలకు ఉన్నాయి. 31 ఎన్ఐటీల్లో 18,750 సీట్లు ఉన్నాయి. ఇస్రో, నాసాల ద్వారా ఏటా వెయ్యి మందికి 15 రోజులపాటు ఉచిత శిక్షణ ఇస్తున్నాయి. దేశంలో పరిశోధనా రంగంలోనూ అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రోబోటిక్ సైన్స్కు విశేష ఆదరణ ఉంది. మరోవైపు శాస్త్రవేత్తల కొరత తీవ్రంగా ఉంది. అది ఎంతగా అంటే దేశ జనాభాలో కేవలం నాలుగు శాతమే శాస్త్రవేత్తలు ఉన్నారు. నేటి విద్యార్థులు బంగారు భవిష్యత్తు సాధించడంతోపాటు దేశానికి మేలు చేయడానికి ఈ చక్కని అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించి నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. శాసీ్త్రయ దృక్పథాన్ని పెంచి భవిష్యత్ శాస్త్రవేత్తలను తయారు చేసే లక్ష్యంగా విభిన్న కార్యక్రమాలను అమలు పరుస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, వివిధ సమస్యలకు తమ మేధస్సుతో పరిష్కారం చూపగలిగే చిట్టిబుర్రల కోసం అన్వేషిస్తోంది. అలాంటి బాల మేధావులకు నేషనల్ సైన్స్ కాంగ్రెస్ చక్కటి వేదికగా మారుతోంది. దీని ద్వారా ఏటా అందించే నినాదంపై విద్యార్థులు తమ మేధస్సుతో చూపే పరిష్కార మార్గాన్ని నివేదిక రూపంలో తయారు చేసుకుని జిల్లాస్థాయిలో జరిగే సెమినార్లో దానిని న్యాయనిర్ణేతల ఎదుట చెప్పాలి. ఇందుకు గాను నేషనల్ సైన్స్ కాంగ్రెస్కు రిజిస్ట్రేషన్ గడువు సోమవారం ముగియనుంది. యువికా యువ శాస్త్రవేత్త యువికా పేరుతో యువ శాస్త్రవేత్తలను తీర్చిదిద్దేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 9వ తరగతి స్థాయిలో విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనపై ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా వివిధ ఇస్రో కేంద్రాల్లో రెండు వారాల రెసిడెన్షియల్ శిక్షణ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మోడల్ రాకెట్రీని నిర్మించడం, రోబోటిక్ కోడింగ్, డ్రోన్ ప్రదర్శనలు, అంతరిక్ష శాస్త్రవేత్తలతో నేరుగా సంభాషించడం ద్వారా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు. యువికా యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు ప్రయాణ, భోజన, వసతి ఖర్చులకు నిధులు కేటాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సైట్లో యువికా యంగ్ సైంటిస్ట్కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆవిష్కరణల కేంద్రంగా ఇన్స్పైర్ మానక్ కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం ఆధ్వర్యంలో ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలలో ఇన్స్పైర్ మానక్ వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏటా వేలాది చిట్టిబుర్రల్లో నూతన ఆలోచనలను రేకెత్తించి, భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న భారీ కార్యక్రమంగా దీనిని చెప్పుకోవచ్చు. పాఠశాల స్థాయిలో ఇలాంటి ఆలోచనలకు బీజం వేసే బాధ్యతను ప్రధానోపాధ్యాయులతోపాటు సైన్స్ ఉపాధ్యాయులకు అప్పగించింది. తాజాగా 2026–27 విద్యాసంవత్సరానికి ఇన్స్పైర్ మానక్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించిన కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ) ఆన్లైన్లో ప్రాజెక్టు నివేదికలను ఆహ్వానిస్తోంది. విద్యా, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతిక, పర్యావరణ, అంతరిక్ష, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల వారీగా నూతన ఆవిష్కరణలకు దోహదం చేసే సమగ్ర నివేదికను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంది. ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్, సాంఘిక, సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేటు ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఆరు నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. తాము ఎంచుకున్న ప్రాజెక్టు పేరు, దాని వలన సమాజానికి జరిగే మేలు వంటి అంశాలతో ప్రాజెక్టు నివేదికను గైడ్ టీచర్ సహాయంతో సిద్ధం చేసుకుని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ప్రాజెక్టు తయారీకి రూ.10 వేల చొప్పున నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఓ ఎగ్జిబిషన్లో తాము తయారు చేసిన ప్రాజెక్టులతో విద్యార్థులు (ఫైల్) బడుల్లోనే ల్యాబ్లు ఏర్పాటు చేసి ప్రయోగాలు నిర్వహించడం లక్ష్యంగా అటల్ టింకరింగ్ లాబొరేటరీస్ (ఏటీఎల్)ను అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా అమలు చేస్తున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ల ఏర్పాటుకు పాఠశాలలకు గ్రాంట్లను అందిస్తుంది. విద్యార్థులు భావనాత్మక సిద్ధాంతాలను ఆచరణాత్మక ఆవిష్కరణలుగా మార్చడానికి త్రీడీ ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మైక్రో కంట్రోలర్లు, అధునాతన శాసీ్త్రయ కిట్ల గురించి తెలుసుకుంటారు. విద్యార్థినుల్లో శాసీ్త్రయ ఆలోచనలు రేకెత్తించి, ప్రతిభావంతులైన బాలికలను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కార్యక్రమమైన విజ్ఞాన్ జ్యోతి. ఈ పథకం ద్వారా 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతిభావంతులైన బాలికలు అర్హులు. శాసీ్త్రయ కౌన్సెలింగ్, నిపుణుల ఉపన్యాసాలు, మహిళా శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష సంభాషణ, బాలికల్లో పరిశోధనాసక్తిని ప్రోత్సహించడం, సైన్స్ ల్యాబ్లు, రక్షణ అకాడమీలు, టెక్నాలజీ హబ్లకు పూర్తి నిధులతో కూడిన సందర్శనలు ఇందులో ఉన్నాయి. -
గణపవరం పీహెచ్సీకి ఎన్క్యూఏఎస్ సర్టిఫికెట్
నాదెండ్ల: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించినందుకు గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్డాండర్డ్స్(ఎన్క్యూఏఎస్) సర్టిఫికెట్ దక్కింది. జూలై 28,30 తేదీల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తరఫున ఇరువురు సభ్యులు గణపవరం పీహెచ్సీని పరిశీలించారు. వివిధ అంశాల్లో మదింపు నిర్వహించారు. ఔట్పేషెంట్, ఇన్పేషెంట్ విభాగాలు, లేబర్ రూమ్, లేబొరేటరీ పరిశీలించారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితర అంశాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల నాణ్యత, మందుల లభ్యత, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత, పరిపాలనా విధానాలు అధ్యయనం చేశారు. ఈ రిపోర్టు ఆధారంగా తాజాగా విడుదలైన జాబితాలో గణపవరం పీహెచ్సీ 90.24 శాతం స్కోరుతో ఎన్క్యూఏఎస్ సర్టిఫికెట్ మంజూరైంది. ఆసుపత్రికి ఏడాదికి రూ.3 లక్షల చొప్పున మూడేళ్ల పాటూ నిధులు అదనంగా అందనున్నాయి. ఈ నిధులను రోగుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు, నాణ్యత మెరుగుదలకు వెచ్చించనున్నారు. వైద్యులు, సిబ్బంది నాణ్యమైన సేవలందించటం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిరంతర మార్గదర్శకత్వంతో ఈ ఘనత సాధించినట్లు స్ధానిక వైద్యాధికారులు కవితాఅనసూయ, ప్రసాద్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. -
ప్రశాంతంగా నీట్ పీజీ
నరసరావుపేట ఈస్ట్: వైద్య ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పీజీ–2026 పరీక్షలో భాగంగా ఆదివారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఐదు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఆయా కేంద్రాల్లో 984 మందికిగాను 956 మంది హాజరు అయినట్లు అధికారులు తెలిపారు. సాయి తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో 195 మందికి 192, నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల (బ్లాక్–4)లో 204 మందికి 196, నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో 250 మందికి 245, ఎంఏఎం ఇంజినీరింగ్ కళాశాలలో 80 మందికి 74 మంది, ఏఎం రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 255 మందికి గాను 249 మంది హాజరయ్యారు. ఆయా కేంద్రాల వద్ద అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచే దూరప్రాంతాల నుంచి అభ్యర్థులు కేంద్రాల వద్దకు చేరుకున్నారు. -
సేవాతత్పరత గొప్పవరం
గుంటూరు రూరల్: అందరివారిగా పిలవబడడం.. ఇతరులకు సహాయం చేసే మంచి గుణం.. కొందరికే ఉంటుందని.. ఆ దిశగా అందరూ కృషి చేయాలని వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఆదివారం నగర శివారుల్లోని రెడ్డిపాలెంలోగల తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అనవేమా ట్రస్ట్ కార్యదర్శిగా నియమితులైన మున్నంగి సంజీవ రెడ్డిని మోదుగుల ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవతా విలువలతో కూడిన సేవా దృక్పథంతో ఉడుముల సాంబిరెడ్డి అనవేమా ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి విద్యార్ధుల కోసం అవిరళ కృషి చేశారని, ఆ సంస్థ విలువలు కాపాడతారని, అభివృద్ధికి సంజీవరెడ్డి బాటలు వేస్తారని ఆశిస్తున్నామన్నారు. ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ దుగ్గెంపూడి వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ అనవేమా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పేద మధ్యతరగతి విద్యార్థినుల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్ ట్రస్ట్ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి, కొల్లిపర సంజీవరెడ్డి, కుర్రి పుల్లారెడ్డి, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటి డ్రమ్ములో పడి బాలుడు మృతి పొన్నూరు: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పాస్టిక్ డ్రమ్ములోని నీటిలో పడి ఊపిరి ఆడక బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని చింతలపూడి గ్రామంలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ నివాసి, ఉద్యోగరీత్యా ప్రస్తుతం సౌదీలో ఉంటున్న యూసుఫ్ కుమారుడైన హుస్సేన్(4) తోటి స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో డ్రమ్ములో పడి ఊపిరాడక మరణించినట్లు తెలిపారు. గ్రామంలో ఉత్సవం జరుగుతున్న నేపధ్యంలో చూసేందుకు ఇంటి బయట నిలబడిన తల్లి లోపలికి వచ్చి డ్రమ్ములో మృతి చెందిన బాలుడిని చూసి కన్నీరుమున్నీరయింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ నాజర్ చిన్నారి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పొన్నూరు: స్థానిక షరాఫ్ బజార్లోని ఓ చిరు వ్యాపారి ఇంట్లో చోరీ జరిగి బంగారం, వెండి వస్తువులు అపహరణకు గురైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కొల్లిపర సుబ్బారావు తన నివాసంలోనిపై గదిలో రాత్రి నిద్రించారు. ఈ నేపధ్యంలో కింద ఇంటి గడియ పగలగొట్టి దొంగలు లోపలికి చొరబడి, బీరువా పగలగొట్టి సుమారు 6 సవర్ల బంగారు వస్తువులు, 700 గ్రాముల వెండి దొంగిలించినట్లు తెలిపారు. తెల్లవారుజామున కింద ఇంటిలోకి వచ్చిన యజమాని చోరీ జరిగినట్లు గుర్తించారు. తన కూతురి వివాహం కోసం బ్యాంకు నుంచి తీసుకువచ్చిన బంగారం, వెండి చోరీకి గురికావడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. క్లూస్టీం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
నరసరావుపేట టౌన్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు నరసరావుపేట రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజమోహన్రావు ఆదివారం తెలిపారు. సాతులూరు నుంచి నరసరావుపేటకు వచ్చే రైలు మార్గంలో గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మరణించినట్లు తెలిపారు. మృతుడికి సుమారు 25 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. మృతుడు తెలుపు రంగు టీ షర్ట్ మరియు లైట్ బ్లూ కలర్ నిక్కర్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతదేహాన్ని నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ మార్చిరీ రూంలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు నరసరావుపేట రైల్వే పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. గుర్తు తెలియని వృద్ధుడు మృతి గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లింగాయపాలెం టయోటా షోరూమ్ సమీపంలోగల ప్లాట్లలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని సమాచారం మేరకు ఆదివారం నల్లపాడు పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. మృతుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆధారాలను బట్టి ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. పొలాల్లో పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సుమారు 60 నుంచి 70 సంవత్సరాల వయసు ఉండొచ్చని భావిస్తున్నారు. తెలుపు రంగు డిజైన్ చొక్కా, నీలం రంగు గడుల (చెక్స్) లుంగీ ధరించి ఉన్నాడు. నోటి వెంట నురగ రావడంతో పురుగుల మందు తాగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఘటనపై నల్లపాడు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా సంబంధీకులు ఎవరైనా ఉంటే నల్లపాడు పోలీసులను సంప్రదించాలని కోరారు. పట్నంబజారు: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన పదేళ్ల బాలిక అనుమానాస్పద మృతి కేసులో బాలిక మృతదేహానికి పోలీసులు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. శనివారం పాతగుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలోని అల్లీనగర్ ప్రాంతంలో పదేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం విధితమే. ఈ క్రమంలో చిన్నారి తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పూరిస్థాయిలో పంచనామా, వాంగ్మూలాలు తీసుకున్నారు. ఆ చిన్నారి తల్లి పలు ప్రాంతాల్లో నివాసం ఉన్న నేపధ్యంలో ఆయా ప్రాంతాలన్నింటి వద్ద నివాసాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాలిక మృతిపై వస్తున్న అనుమానాల నేపధ్యంలో వైద్య నిపుణుల చేత పరీక్షలు చేయించినట్లు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పినట్లు తెలిపారు. చిన్నారిపై ఏదైనా లైంగికదాడి జరిగిందా..? లేకుంటే ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయా..? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందన్నారు. -
సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
మంగళగిరి టౌన్: మంగళగిరిలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్లో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించి, నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళగిరి పట్టణంలోని వివిధ సంఘాల నాయకులు హాస్టల్ను ఆదివారం సందర్శించారు. పలువురు నాయకులు విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, హాస్టల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో ప్రస్తుతం 16 మంది విద్యార్థులు ఉన్నారని, సొంత భవనం ఉన్నప్పటికీ కనీస వసతులు పూర్తిస్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూమ్లు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్ఓ ప్లాంట్ లేకపోవడంతో మున్సిపల్ కుళాయి నీటినే తాగాల్సి వస్తోందని, ఒక్కోసారి నీరు ఎర్రగా వస్తోందని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. దోమలు విపరీతంగా ఉన్నాయని దోమల నివారణ కోసం రెండు నెలల క్రితం మిషన్లు అందించినప్పటికీ ఇప్పటివరకు వాటిని ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. విద్యార్థులకు అందాల్సిన కాస్మోటిక్ చార్జీలు చెల్లించలేదని, క్రీడా సామగ్రి కూడా అందుబాటులో లేదని విమర్శించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంగళగిరిలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ను స్వయంగా సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి లోకనాధం, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, జిల్లా అధ్యక్షుడు ఏనుగుల కమలాకర్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు ఎ.అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ప్రభుత్వానికి ఓటమి భయం
వినుకొండ: ప్రజలకు వెన్నుపోటు పొడిచిన టీడీపీ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలంటే భయం పట్టుకుందని, గెలిచేందుకు కుట్రలకు తెరలేపిందని వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. ఆదివారం వినుకొండలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవ్వడంతో అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లోని పోలింగ్ బూత్లను పచ్చ నాయకుల ఇళ్ల మధ్యకు మార్చడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. నీలగంగవరం, నడిగడ్డ, నరగాయపాలెం, పెరుమాళ్లపల్లి, తిమ్మాయపాలెం గ్రామాలతో పాటు, శావల్యాపురం మండలంలోని భాస్కర్నగర్, గుంటుపాలెం, కోట్లూరు, మతుకుమల్లి గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా బూత్లను మార్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వినుకొండ పట్టణంలో ఏకంగా 15 బూత్లను పెంచిన అధికారులు, వాటి వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఓటర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం ‘సర్’ కార్యక్రమం దారుణంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఓటర్ల అత్యంత వ్యక్తిగత సమాచారం ఉన్న ఫారాలు బహిర్గతంపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అభివృద్ధి పేరుతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, గత వైఎస్సార్సీపీ హయాంలో కట్టిన భవనాలకు శిలాఫలకాలు మారుస్తూ ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మారిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుకు జీడీసీసీ బ్యాంక్ పదవి ఇవ్వడాన్ని తప్పుబట్టారు. వినుకొండలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పగడాల వెంకటరామిరెడ్డి, ఎం.ఎన్. ప్రసాద్, కొత్తమాసు శివ, కొత్త కృష్ణారెడ్డి, మేడం జయరామిరెడ్డి, గుంజి వాసు, రోడ్డ పుల్లారెడ్డి, జెక్కిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, నూజెండ్ల ఎంపీపీ ముప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ పోరుకు వైఎస్సార్ సీపీ సిద్ధం
నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ సిద్ధమేనని, ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా మున్సిపాలిటీతో పాటు పంచాయతీలను సైతం కై వసం చేసుకుంటామని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గుడ్మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని ప్రకాష్నగర్ 14వ వార్డు కంభంపాలెం, శారదాంబ థియేటర్ వెనుకవైపు, కన్యల హాస్పిటల్ రోడ్లలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్ల నిర్వహణ, పారిశుద్ధ్య పరిస్థితిని పరిశీలించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీలో సుమారు 250 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నా పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పర్యటించినా ఇక్కడి దుర్భర పరిస్థితి కనపడకపోవడం శోచనీయమని అన్నారు. ఈ వార్డులో ప్రభుత్వ పాఠశాలను రూ.25 లక్షలతో నాడు–నేడు కింద బాగు చేయించామన్నారు. టీడీపీ సర్కారు వచ్చాక నియోజకవర్గంలో విద్యుత్ బిల్లులు, పన్నుల సాకుతో సుమారు 6 వేల మందికి తల్లికి వందనం పథకం ఎగ్గొట్టిందన్నారు. ఈ ప్రభుత్వంలో పేద, మధ్యతరగతి వారు పూటకు రూ.100 ఖర్చు చేసినా కడుపు నిండా తినే పరిస్థితి లేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పార్టీ తెలుగుదేశం అన్నారు. వెంటనే కరువు మండలాలు ప్రకటించాలి ఒక వైపు కరువు వచ్చి నాగార్జునసాగర్ కుడికాలువ కింద నాలుగు లక్షల ఎకరాలు సాగుకు నోచుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఆయా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, తక్షణమే అక్కడి రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, నరసరావుపేట, రొంపిచర్ల మండల కన్వీనర్లు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ వర్కింగ్ అధ్యక్షుడు నిడమానూరి సురేంద్ర, పలు విభాగాల నాయకులు కందుల ఎజ్రా, షేక్ రెహమాన్, కొత్తూరి కిషోర్బాబు, షేక్ ఖాదర్ బాషా, సయ్యద్ ఖాదర్ బాషా, బూదాల కల్యాణ్, బండి వెంకటేశ్వరరెడ్డి, పాతర్ల చిన్న, కోటబాబు, మనీంద్రరెడ్డి, నాగ సుబ్రహ్మణ్యం నాయీ, నెలటూరి సురేష్బాబు, మిట్టపల్లి చంద్రశేఖర్, అత్తలూరి కృష్ణ, అన్నా చంద్రమోహన్, తిప్పరయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసిన నాణ్యతలేని బ్యాగులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధి, పనితీరుకు అద్దం పడుతున్నాయని డాక్టర్ గోపిరెడ్డి పేర్కొన్నారు. 14వ వార్డులో చిరిగిపోయిన స్కూల్ బ్యాగులను రైల్వే ట్రాక్ పక్కన పడేసి ఉండటాన్ని ఆయన గమనించారు. ఈ బ్యాగులను చూపిస్తూ ఆయన.. మంత్రి తీరుపై మండిపడ్డారు. -
చిన్నపరెడ్డి సేవలు మరువలేనివి
పెదకాకాని: ఆడిట్ విభాగానికి బూసిరెడ్డి చిన్నపరెడ్డి తన పనితీరుతో నూతన జవసత్వాలు తెచ్చారని రాష్ట్ర ఆడిట్ డైరెక్టర్ డాక్టర్ ఈదర కల్యాణి ప్రశంసించారు. ఆడిట్ సిబ్బందిని ఆయన విజ్ఞానాధారిత సమూహంగా మలిచారని కొనియాడారు. విజయవాడ నగరపాలక సంస్థలో జాయింట్ డైరెక్టర్ (అమృత్)గా పనిచేస్తున్న చిన్నపరెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆడిట్ విభాగంలో దాదాపు మూడు దశాబ్దాలుగా చిన్నపరెడ్డి అందించిన సేవలకు గుర్తుగా ఆదివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఉద్యోగ విరమణ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన కల్యాణి మాట్లాడుతూ యువతరంతో పోటీపడుతూ సాంకేతికతను అందిపుచ్చుకున్న చిన్నపరెడ్డి తాను కొవ్వొత్తిలా కరుగుతూ డిపార్ట్మెంట్కు వెలుగులు పంచారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆడిట్ శాఖలో నెలకొన్న పలు దీర్ఘకాలిక సమస్యలను చిన్నపరెడ్డి ఎంతో ఓర్పు, నేర్పుతో పరిష్కరించారని, సిబ్బందిపై ప్రేమాభిమానాలు ప్రదర్శించారని తెలంగాణ ఆడిట్ శాఖ మాజీ డైరెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు అన్నారు. చిన్నపరెడ్డి వ్యక్తిగతంగానూ పరిపూర్ణుడని, జీవితంలోనూ ఉన్నత శిఖరాలు అధిరోహించారని తెలంగాణ ఆడిట్ విభాగ మాజీ ప్రాంతీయ ఉప సంచాలకుడు చకిలం వేణుగోపాల్ చెప్పారు. వర్క్స్ ఆడిట్ అంశంలో చిన్నపరెడ్డి విశేష కృషి చేశారని ఆడిట్ విభాగం మాజీ అదనపు సంచాలకుడు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బూసిరెడ్డి చిన్నపరెడ్డి మాట్లాడుతూ తోటి సిబ్బంది అందించిన సహాయ సహకారాల వల్లనే తాను ఉద్యోగ జీవితంలో విజయాలు సాధించడం సాధ్యపడిందన్నారు. ఈ స్థాయిలో ఉద్యోగ విరమణ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ మాజీ డైరెక్టర్ పార్థసారథి, ప్రాంతీయ ఉప సంచాలకులు కె నాగశ్రీనివాస్, సీతారామారావు, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆర్థిక అధికారి కేవీ సుబ్బారావు, ఐఏఎస్ అధికారి నీలకంఠారెడ్డి, గుంటూరు నగరపాలక సంస్థ మాజీ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ నాగేంద్రకుమార్, జిల్లాల ఆడిట్ అధికారులు ఎస్.శ్రీకాంత్, పద్మజ, తిరుపతయ్య, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ఆడిట్ డైరెక్టర్ డాక్టర్ ఈదర కల్యాణి -
హైవేపై కంకర టిప్పర్ బోల్తా
నరసరావుపేట రూరల్: కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ గుంటూరు– కర్నూలు హైవేపై బోల్తా కొట్టిన ఘటన మండలంలోని ఉప్పలపాడు సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. కంకరలోడ్తో ఉప్పలపాడు వైపు నుంచి నరసరావుపేట పట్టణానికి వస్తున్న లారీ వేగాన్ని నిరోధించే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపైనే పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. డ్రైవర్ను స్థానికులు క్షేమంగా బయటకు తీసారు. రోడ్డుకు అడ్డుగా టిప్పర్ పడటంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. కంకరను జేసీబీతో బయటకు తీసిన అనంతరం టిప్పర్ను నిలబెట్టి అక్కడ నుంచి తరలించారు. -
బీసీల ఇళ్లకూ ‘సౌర పథకం’
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి తెనాలిటౌన్: బీసీల ఇళ్లకు కూడా ఉచిత సోలార్ రూఫ్టాప్ల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి వెల్లడించారు. తెనాలిలోని విద్యుత్ ఆపరేషన్ డివిజన్ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. అక్కడ కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించే ఎస్సీలకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ రూఫ్టాప్లను ఏర్పాటు చేస్తున్నట్టు గుర్తుచేశారు. ఇందులో భాగంగా తెనాలి డివిజన్కు 9 వేల యూనిట్లు మంజూరు కాగా, మెటీరియల్ కొరత కారణంగా 1,500 మాత్రమే పూర్తి చేయగలిగినట్టు తెలిపారు. బీసీలకు కూడా పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.60 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేలను సబ్సిడీగా సమకూరుస్తుందని చెప్పారు. మూడు నెలల్లోనే సాగు కనెక్షన్లు వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్టు వివరించారు. తెనాలి డివిజన్ పరిధిలో శేకూరు, పట్టణ కొత్తపేటలో రెండు నూతన విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరైనట్లు తెలిపారు. వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు ఇచ్చిన మూడు నెలల్లోనే మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున వేసవి కాలం మాదిరిగానే విద్యుత్ వినియోగం ఉందని అన్నారు. ఓవర్లోడ్ ప్రాంతాలను గుర్తించి ట్రాన్స్ఫార్మర్లను మార్చుతున్నట్లు తెలిపారు. సంవత్సరం క్రితం వ్యవసాయ కనెక్షన్లు 150 పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 285 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు తెలిపారు. రైతులకు పగలు 9 గంటల కరెంటు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చిందని వెల్లడించారు. సమావేశంలో టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణయాదవ్, గుంటూరు జిల్లా ఎస్ఈ చల్లా రమేష్, తెనాలి డివిజన్ ఈఈ అక్కల సత్యనారాయణ, డీఈఈ బోరుగడ్డ అశోక్కుమార్, టి.విశ్వనాథం, ఏఈలు బి.సుధీర్, దుర్గారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి
సత్తెనపల్లి: విద్యారంగ పరిరక్షణకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఉద్యమించాలని సీఐటీయూ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన ఎస్ఎఫ్ఐ సత్తెనపల్లి నియోజకవర్గ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా ఎస్ఎఫ్ఐ నాయకులు రియాజ్, డి. అమూల్య, వెంకీలు వ్యవహరించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగ ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు పాలకులు చదువును దూరం చేస్తున్నారన్నారు. క్రీడలకు ప్రైవేట్ విద్యాసంస్థలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కో కన్వీనర్ డి. అమూల్య గత కార్యకలాపాల నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు. ప్రతినిధులు చర్చలు జరిపి ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యచరణ ప్రణాళికను రూపొందించారు. పలు తీర్మానాలను భువనేశ్వరి, నవీన్లు ప్రవేశపెట్టగా, అమతవర్షిణి బలపరిచారు. మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 22 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా షేక్ రియాజ్, జె. సాయికుమార్, ఉపాధ్యక్షులుగా భువనేశ్వరి, అమృతవర్షిణి, సహాయ కార్యదర్శులుగా జానీ శంకర్, ఆగస్టిన్, వెంకీ, కమిటీ సభ్యులుగా నవీన్, దిలీప్, వెంకటేష్, సుధాకర్, లక్ష్మయ్య, ప్రశాంత్, లిఖిత, శ్రీవిద్య, ఆంజనేయులు, భార్గవి, దావీదు, నవీన్, బాషా, దిలీప్, అల్తాఫ్, సంజయ్ మనోహర్లను ఎన్నుకున్నారు. పరిశీలకులుగా ఎస్ఎఫ్ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ సాయి హాజరయ్యారు. కౌలు రైతు సంఘం సత్తెనపల్లి మండల కార్యదర్శి పి. మహేష్, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు నీరుకొండ కృష్ణ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు గద్దె ఉమాశ్రీలు సందేశం ఇచ్చారు. ముందుగా ఎస్ఎఫ్ఐ జెండాను షేక్ రియాజ్ ఆవిష్కరించారు. నాయకులు అభిలాష్, ఆసిఫ్, సీఐటీయూ సత్తెనపల్లి పట్టణ కన్వీనర్ జె. రాజకుమార్ నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘వేగ’ గణితం.. విద్యార్థులకు వరం
గుంటూరు ఎడ్యుకేషన్: వేద గణిత విజ్ఞాన శాస్త్రం శాసీ్త్రయ నామం వేదిక్ మ్యాథ్స్. కఠినమైన లెక్కలను సులువుగా పరిష్కరించగలిగే ప్రాచీన విధానం. పాఠశాల స్థాయి నుంచి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇది ఒక అస్త్రం. తల్లిదండ్రులు శిక్షణ సంస్థల కోసం అన్వేషిస్తున్నారు. పదో తరగతి తరువాత ఇంటర్తోపాటే విభిన్నమైన పోటీ పరీక్షలకు ఏకకాలంలో సన్నద్ధం కావాల్సిన పరిస్థితి నేడు నెలకొంది. గణితం ఆధారంగా ప్రతిభ చూపాల్సిన విద్యార్థులకు వేద గణితశాస్త్రం ఆయుధంగా మారింది. పూరి పీఠాధిపతి జగద్గురు భారతీకృష్ణ తీర్థస్వామి 1957లో రాసిన వేదిక్ మ్యాథ్స్ పుస్తకం ద్వారా వేద గణితశాస్త్రాన్ని వెలుగులోకి తెచ్చారు. వేదాల్లోని పలు సూత్రాలు, సిద్ధాంతాల ఆధారంగా ఆయన రూపొందించిన గణిత పద్ధతులు ఇందులో ఉన్నాయి. పుస్తకంపై ముద్రణా హక్కులు పొందిన ఢిల్లీకి చెందిన మోతీలాల్ బనారసీ దాస్ పబ్లిషర్స్ ఈ పుస్తకం ప్రచురించింది. ప్రస్తుతం మార్కెట్లోని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో ఒరిజినల్ ఎడిషన్ దొరుకుతోంది. వేదాల నుంచి ... వేద గణితం అంటే వేదాల నుంచి ఆవిర్భవించిన విజ్ఞానం. ఇందులో 16 సూత్రాలు, 13 ఉప సూత్రాలు ఉన్నాయి. వీటి ద్వారా గుణాకారాలు, భాగాహారాలు, కారణాంక విభజన, దశాంశ భిన్నాలు, పాక్షిక భిన్నాలు, ఆవర్తన దశాంశాలు, వర్గాలు, ఘనాలు, ఘనమూలాలు, బీజగణిత సమస్యలకు సులువుగా సమాధానం చెప్పవచ్చు. సింగిల్ లైన్ జవాబుగా మౌఖికంగా చేసే పద్ధతులు, కాలిక్యులస్, త్రికోణమితి వంటి పరిశోధనాంశాలు ఉన్నాయి. ఎంతో ప్రయోజనం వేద గణితశాస్త్రాన్ని సాధన చేయడం ద్వారా మేధస్సు వృద్ధి చెందుతుంది. క్లిష్టమైన లెక్కలను సులువుగా పరిష్కరించగలిగే నైపుణ్యం అలవడుతుంది. పోటీ పరీక్షలు, ఉద్యోగ అర్హత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగకరం. గణితంలో అవధానాలు చేయాలనుకునే వారికి వేద గణితం తప్పనిసరి. వేదిక్ మ్యాథ్స్ను పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని గణితశాస్త్ర మేధావులు కోరుతున్నారు. విదేశాల్లో ఒక సబ్జెక్టు మనదేశంలో పుట్టిన వేద గణితశాస్త్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. లండన్, హాలెండ్ దేశాల్లో ఇది తప్పనిసరి సబ్జెక్టు. విద్యార్థుల ఆసక్తి మేరకు స్వల్పకాలిక వ్యవధిలో శిక్షణ కల్పిస్తుండగా, పూర్తిస్థాయిలో సబ్జెక్టుగా బోధించాలని గణిత మేధావులు కోరుతున్నారు. వేద గణితం అనగానే ఒక మతానికి సంబంధించిన విషయం అనుకుంటారు. అది తప్పు. భారతీకృష్ణ తీర్థస్వామి తన పుస్తకానికి పెట్టుకున్న పేరే తప్ప, ఇందులో ఉన్నదంతా గణిత విజ్ఞానమే. -
సౌత్ జోన్ బరిలో ఏపీ ఫ్లయింగ్ టెన్నిస్ జట్టు
చిలకలూరిపేటటౌన్: ఫ్లయింగ్ టెన్నిస్ సౌత్ జోన్న్ చాంపియన్న్షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రజట్టు సిద్ధమైంది. జులైలో ఆంధ్రప్రదేశ్ ఫ్లయింగ్ టెన్నిస్ అసోసియేషనన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సౌత్ జోన్న్ చాంపియనన్ షిప్ కోసం రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ బాలబాలికల విభాగాల్లో మొత్తం 24 మంది క్రీడాకారులు ఏపీ తరఫున పోటీల్లో పాల్గొననున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న సౌత్ జోన్న్ చాంపియనన్ షిప్లో వీరు తమ ప్రతిభను చాటనున్నారు. బాలుర జట్టుకు యు నవీన్న్కోచ్గా, బాలికల జట్టుకు కె కావ్య, సాగర్రాణి కోచ్లుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర జట్టుకు ఎంపికై న వివరాలను ఫ్లయింగ్ టెన్నిస్ అసోసియేషన్న్ అధ్యక్షుడు డాక్టర్ కొల్లా సతీష్కుమార్, కార్యదర్శి బొంత కృపారావు, వైస్ ప్రెసిడెంట్ ఇ శ్రీకాంత్, మోడ్రన్సంస్థల అధినేత చేబ్రోలు మహేష్ వెల్లడించారు. సౌత్ జోనన్ చాంపియన్న్షిప్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని అసోసియేషనన్ ప్రతినిధులు ఆకాంక్షించారు. పోటీల్లో రాణించి ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు వారు సూచించారు. -
రాష్ట్రస్థాయి పోటీలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రస్థాయి అమరావతి చాంపియన్షిప్– 2026 పోటీల్లో పల్నాడు జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పల్నాడు జిల్లా నుంచి 364 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. వివిధ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు మూడు బంగారు, ఏడు రజిత పతకాలు సాధించారు. పతకాలు సాధించిన వారిలో అండర్–17 బాలుర కబడ్డీ జట్టు, ఆర్చరీ రికర్వ్ విభాగంలో ఎం.మారుతి అరుష్రెడ్డి, అథ్లెటిక్స్ షాట్పుట్లో అహ్మద్ ఆసియా బంగారు పతకాలు సాధించారు. అలాగే అథ్లెటిక్స్లో కుంచాల చంద్రశేఖర్ (లాంగ్జంప్) రూపలిత పాత్ర (జావెలిన్ త్రో), అండర్–23 పురుషుల విభాగంలో 4‘‘100 మీటర్లు రిలే జట్టు, బాక్సింగ్ సిహెచ్ నవ్యశ్రీ, వెయిట్లిఫ్టింగ్ షేక్.జహీర్. బాలికలు అండర్– 17 విభాగంలో బాస్కెట్బాల్, బాలుర అండర్– 17 విభాగంలో వాలీబాల్ జుట్టు రజిత పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను, కోచ్లను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి అభినందించారు. అమరావతి చాంప్ పోటీలో 10 పతకాలు -
ఓటమి భయంతోనే పోలింగ్ బూత్ల మార్పు
నరసరావుపేట రూరల్: ఓటమి భయంతోనే పోలింగ్ కేంద్రాల మార్పు, ఓటర్ జాబితాల జంబ్లింగ్కు కూటమి నాయకులు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రొంపిచర్ల మండలంలోని నాలుగు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల మార్పును అడ్డుకోవాలని శనివారం జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయం అధికారపార్టీకి పట్టుకుందన్నారు. రొంపిచర్ల మండలం సంతగుడిపాడు, రొంపిచర్ల, వీరవట్నం, ఎడ్వర్డ్పేట గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల మార్పు దీనికి నిదర్శనం అన్నారు. ఈనెల 23వ తేదీన ఎంపీడీవో, గ్రామ సచివాలయాల్లో పోలింగ్ బూత్ల వివరాలను పబ్లీష్ చేయడం జరిగిందని తెలిపారు. ఐదు రోజుల వ్యవధిలో ఈనెల 28వ తేదీన నాలుగు గ్రామాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోకి పోలింగ్ కేంద్రాలను మార్చారని తెలిపారు. దీనిపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని, రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయలేదని, ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించలేదన్నారు. ప్రజలకు మేలు చేయలేని కూటమి నాయకులు దొడ్డిదారిన స్ధానిక ఎన్నికల్లో గెలుపొందాలని కుతంత్రాలు చేస్తున్నారని విమర్శించారు. రొంపిచర్లలో నాలుగు వార్డుల బూత్లను పడమటిపాలెంకు మార్చినట్టు తెలిపారు. గతంలో ఈ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణలు జరగడంతో బూత్ను మార్చారని వివరించారు. ఈ పోలింగ్ బూత్ల పరిధిలో 850 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఇటువంటి విషయాలు పరిగణలోకి తీసుకోకుండా అధికారులు నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. సంతగుడిపాడుకు చెందిన ఏడు వార్డులను మండల పరిషత్ పాఠశాల నుంచి టీడీపీకి అనుకూలంగా ఉండే జెడ్పీ హైస్కూల్కు మార్చారని తెలిపారు. ఏడు వార్డుల పరిధిలో అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ఉన్నారని, ఓటు హక్కు వినియోగించుకునేందుకు కిలోమీటరు వరకు నడిచి వెళ్లాల్సి వస్తుందన్నారు. వీరవట్నంకు చెందిన ఏడు వార్డులను ఇదే విధంగా ఓసీలు నివసించే ప్రాంతంలోకి మార్చారని తెలిపారు. ఫ్యాక్షన్ గ్రామమైన ఎడ్వర్డ్పేటలో నాలుగు వార్డులను టీడీపీ వర్గీయులు నివసించే ప్రాంతంలోకి మార్చారని తెలిపారు. కొనకంచివారిపాలెంలో ఓటర్ లిస్ట్ జంబ్లింగ్ చేశారని వివరించారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కల్పించాలని తెలిపారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కురుగంట శ్రీనివాసరెడ్డి, పచ్చవ రవీంద్ర, కోడూరి వెంకటేశ్వరరెడ్డి, కల్లం శివారెడ్డి, చపారపు సంజీవరెడ్డి పాల్గొన్నారు. డీపీవోను కలిసి ఫిర్యాదు చేసిన డాక్టర్ గోపిరెడ్డి -
వాహనాన్ని ఢీకొన్న పెళ్లి బృందం బస్సు
ఎనిమిది మందికి తీవ్రగాయాలు రెంటచింతల: మండలంలోని పాలువాయి జంక్షన్ సమీపంలో నున్న వై జంక్షన్ వద్ద శుక్రవారం అర్దరాత్రి ఓ వాహనాన్ని పెళ్లి బృందం బస్సు బలంగా ఢీ కొట్టింది. తెలంగాణానికి చెందిన పెళ్లి బృందం బస్సు గుంటూరు నుంచి తిరిగి కల్వకుర్తికి వెళ్తుండగా రాత్రి 11.30 గంటల సమయంలో వై జంక్షన్ వద్ద ఎటు వెళ్లాల్లో తెలియని పరిస్థితిలో ఎదురుగా నాగార్జునసాగర్ నుంచి దాచేపల్లి వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. నాగార్జునసాగర్లో ఓ పాఠశాలలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి గోపిశెట్టి శ్రీనివాసరావు, మేకల వెంకయ్య (వినుకొండ), కేతావత్ నాగరాజు నాయక్ (పాలువాయి), మక్కెన నరేంద్రబాబు(నరసరావుపేట), మురికపూడి రాకేష్ (పౌడిమర్రు), చింతకాయల వెంకయ్య(పెదగార్లపాడు), కత్తుల దుర్గ(దేచవరం), బాణావత్ సైదానాయక్ (భట్రుపాలెం)లు వాహనంలో దాచేపల్లి వస్తున్నారు. ప్రమాదంలో వాహనం బోల్తాపడటంతో వాహనంలో ఉన్న ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్స్ వాహనంలో గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిలో ఏడుగురిని శనివారం నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేశారు. మరో వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. బస్సులోని వారికి ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పెళ్లి బస్సును స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అప్పుల ఒత్తిడి.. ఉద్యోగి బలవన్మరణం
చిలకలూరిపేటటౌన్:అప్పుల ఒత్తిడితో అపార్టుమెంట్ లో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పట్టణంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల ఏడుకొండలు(32) కుటుంబంతో ఉపాధి నిమిత్తం నాలుగేళ్ల కిందట చిలకలూరిపేట వచ్చారు. ఆర్టీసీ బస్స్టాండ్ వెనుక ఎన్వీ నారాయణపురంలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. నాటి నుంచి గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్న ఏడుకొండలకు సుమారు రూ.20 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. తీవ్ర మనస్తాపానికి గురవుతున్న ఆయన రెండు నెలలుగా విధులకు వెళ్లడం లేదు. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఏడుకొండలుకు భార్య సాగరికతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. -
తొలి దశలోనే ‘పేట’ పుర ఎన్నికలు?
నరసరావుపేట: సుమారు వందేళ్లకుపైగా చరిత్ర కలిగి, 1.40 లక్షల జనాభా ఉన్న నరసరావుపేట పురపాలక సంఘానికి మొదటి దశలోనే ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, సీడీఎంఏ, రాష్ట్ర సచివాలయ ప్రధాన కార్యదర్శి శనివారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు అధికారులను సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కొన్నిరోజులుగా ఎన్నికలకు అవరోధంగా మారిన కోర్టు కేసుల పరిష్కారానికి అధికారులు, టీడీపీ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మొత్తం తొమ్మిది కేసుల్లో ఆరింటిని పిటిషనర్లు ఉపసంహరించుకునేలా చేశారు. వచ్చే నెల ఒకటి, రెండు తేదీల్లో కోర్టులో విచారణకు వచ్చే మిగిలిన కేసులను కూడా విత్డ్రా చేయించేందుకు పిటిషనర్లతో మంతనాలు జరిపారని, వారిని ఒప్పించినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. వార్డుల సంఖ్య ఎంతంటే.. కోర్టు కేసుల అడ్డంకి తొలగితే వెంటనే జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ ద్వారా 34 వార్డులు లేదా 38 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారని తెలియవచ్చింది. ప్రత్యేక గ్రేడు మునిసిపాలిటీగా ఉన్న నరసరావుపేటను 48 వార్డులుగా విభజించాల్సిన అవసరం ఉంది. తొలుత ఎన్నికలు 34 వార్డులకు నిర్వహిస్తే 105 పోలింగ్ బూత్లలోను, 38 వార్డులు అయితే 115 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు ముగిసి కౌన్సిల్ ఏర్పడిన అనంతరం మిగతా వార్డులకు కౌన్సిల్లో తీర్మానం చేసిన అనంతరం ఆ వార్డులకు మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలియవచ్చింది. 2021లో ఎన్నికలకు కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. ఎలాగైనా ఈసారి పురపాలకసంఘానికి ఎన్నికలు నిర్వహించాలని జిల్లా టీడీపీ పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎన్నికలు నిర్వహించి కూటమి కౌన్సిల్ ఏర్పడితే తనతో సఖ్యతగా ఉండని స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధికి ప్రాధాన్యత తగ్గించి చెక్ చెప్పాలనే ఉద్దేశంతో ఎంపీ ఉన్నారని ప్రచారంలో ఉంది. ఎన్నికలకు రానున్న వారం రోజులు కీలకంగా మారనున్నాయి. అయితే సర్ కార్యక్రమం పూర్తికాకుండా ఎన్నికలు నిర్వహించవద్దంటు కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ పిటిషన్పై హైకోర్టు నిర్ణయం వెలువడనిదే ఎన్నికలు జరిగే అవకాశం లేదు. -
ఇళ్ల నిర్మాణాలు పరిశీలన
మాచర్ల: పట్టణంలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద నిర్మితమవుతున్న ఇళ్ల పనులను రాష్ట్ర స్పెషల్ సెక్రెటరీ, హౌసింగ్ ఎండీ కొర్లపాటి హెప్సీబారాణి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. మాచర్ల వచ్చిన ఆమె ఆయా ప్రాంతాలలో నిర్మాణ దశలోని ఇళ వద్దకు వెళ్లారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. వారితోపాటు అధికారులకూ పలు సూచనలు చేశారు. పనులు వేగవంతం చేయాలన్నారు. ఆమె వెంట సీఈ టి.వేణుగోపాల్, పల్నాడు స్పెషలాఫీసర్ శంకరరావు, జిల్లా హౌసింగ్ పీడీ పి.ప్రసాద్, హౌసింగ్ మాచర్ల డీఈ బాలాజీ నాయక్, పల్నాడు జిల్లా డీఈలు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరావు, ఏఈలు తదితరులు ఉన్నారు. పిడుగురాళ్ల రూరల్: జాతీయ వైద్య పరిశోధన మండలికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ – చైన్నె ఆధ్వర్యంలో ‘ట్రామా – బర్న్ ఇన్జ్యురి– ఆపరేషనల్ రీసెర్చ్ ప్రోగ్రామ్’కు పిడుగురాళ్ల మెడికల్ వైద్య కళాశాల చెందిన డాక్టర్ కోమేరా శివ రామ ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన జనరల్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈ అధ్యయనానికి జాతీయ స్థాయిలో ఎంపికై న ఎనిమిది మందిలో ఆయన ఒకరు. రోడ్డు ప్రమాద బాధితులపై తాము పరిశోధన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ను ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, సిబ్బంది అభినందించారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 537.60 అడుగులకు చేరింది. ఇది 183.3636 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 6,660, ఎడమ కాలువకు 7,029, ఎస్ఎల్బీసీకి 2 వేల క్యూసెక్కులు విడుదలఅవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 15,689 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 15,689 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని విద్యాహక్కు చట్టంలో ఉన్న నిబంధనల సవరణ కోసం పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 3వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం పోస్టర్లను శనివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, విద్యాహక్కు చట్టంలోని సవరణ చేయాలని డిమాండ్ చేశారు. టెట్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ బైక్ ర్యాలీలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో చలో విజయవాడ కార్యక్రమానికి తరలి రానున్నారని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 60 వేల మంది ఉపాధ్యాయుల ఆవేదనను విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి లోకేష్ అర్థం చేసుకోవాలని, టెట్లో సవరణకు ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్ రావు, ఎం. కళాధర్, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, ఆది నారాయణ, రంగారావు, ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, గఫార్ తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు
ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సర్పంచ్ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2న ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దాదాపు 4 నెలల నుంచి వీరే కొనసాగుతుండటంతో ప్రజలు అనేక అంశాలలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమైంది. అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. బాపట్ల: బాపట్లలోని ఈవీఎం గోదాములను బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ శనివారం పరిశీలించారు. ఆయన వెంట బాపట్ల ఆర్డీఓ, తహసీల్దార్ ఉన్నారు.సత్తెనపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయవర్గాల్లో చర్చ జోరందుకుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సంకేతాలు వెలువడటంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికలు ఎప్పుడు? రిజర్వేషన్ ఏ కేటగిరీకి వస్తుంది? ఎవరు పోటీ చేస్తారు? అనే చర్చలే వినిపిస్తున్నాయి. మరోవైపు వచ్చే నెలాఖరుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగియనుంది. రిజర్వేషన్ కేటగిరీపై ఉత్కంఠ... పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కేటగిరీ ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠగా మారింది. గతంలో రిజర్వు అయిన పంచాయతీలు ఈ సారి ఎలా ఉంటాయోనని లెక్కలు వేసుకుంటున్న నేపథ్యంలో సమీకరణాలు మారుతున్నాయి. ఏ పంచాయతీ ఏ కేటగిరీకి వస్తుందన్న స్పష్టత అధికారికంగా వెలువడక ముందే పలువురు తమకు అవకాశాలపై అంచనాలు వేసుకుంటున్నారు. సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలపైనా దృష్టిపెడుతున్నారు. నోటిఫికేషన్ కోసం ఎదురుచూపు ప్రస్తుతం అధికారిక ఎన్నికల షెడ్యూల్ కోసం పల్లె ప్రజలు, రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాతే అసలు సమీకరణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన వర్గాలు ఎన్నికలపై ఉత్సాహంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రామ స్థాయిలో తమ బలాన్ని పెంచుకునేందుకు నాయకులు అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు అధికార కూటమి శిబిరంలో అంతర్గత విభేదాలు వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్, రిజర్వేషన్ల ప్రకటన అనంతరం రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. -
అర్జీలకు సత్వర పరిష్కారం చూపండి
నరసరావుపేట: ఎస్సీ కమిషన్కు అందజేసిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని, వాటి పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం తగదని సంబంధిత శాఖల అధికారులను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన కమిషన్ చైర్మన్ జవహర్, కమిషన్ సభ్యులు మేకల బిక్షంలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్ఓ కె.అద్దెయ్య మొక్కలను అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎస్సీ కమిషన్ తరపున అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరుకు చెందిన దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ముద్రించిన షెడ్యూల్ కులాలు, తెగల (అత్యాచార నిరోధక) చట్టం 1989 అనుసరించి సహాయ పునరావాస పరిహారానికి ధన సహాయం – నిబంధనలు అనే బుక్లెట్ను ఆవిష్కరించారు. దళిత సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అందించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను చైర్మన్ ఆదేశించారు. -
ఏమీ కొనలేం.. తినలేం..!
టీడీపీ పాలనలో వంటింట్లో ‘ధరల’ మంటలు సత్తెనపల్లి: జిల్లాలో నిత్యవసరాలు ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. రోజువారీగా వినియోగించే సరుకుల ధరలు భారీగా పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రానున్న వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలకు అయ్యే ఖర్చు తలుచుకొని బెంబేలెత్తిపోతున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలోనే అన్ని ధరలు భారీగా పెరగడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. ఉదయమే కాఫీ, టీ లేనిదే అడుగు బయటపెట్టని వారికి పంచదార ధర చుక్కలు చూపుతోంది. రిటైల్ మార్కెట్లో జూలై నెలాఖరు నాటికి కిలో ధర రూ. 45 ఉండగా .. ప్రస్తుతం రూ. 75కు పెరిగింది. ఈ నెల ప్రారంభం నుంచి పంచదార ధరలు మరింత పెరుగుతున్నాయి. 23 రోజుల్లోనే కిలోకు రూ. 30 పెరగడం షాక్కు గురిచేస్తోంది. ఒక కుటుంబం సగటున నెలకు 5 కిలోల పంచదార వినియోగిస్తే సుమారు రూ. 150 అదనపు భారం కానుంది. ఇదే బాటలో బెల్లం కూడా పయనిస్తోంది. ఇప్పటివరకు రూ. 70 ఉన్న కిలో ప్రస్తుతం రూ. 90కి ఎగబాకింది. పండుగలకు మరింత పెరుగుతుందని వ్యాపారులే చెబుతున్నారు. రానున్న రెండు నెలలు పండుగలతోపాటు పెళ్లిళ్లు అధికంగా ఉన్నాయి. ప్రతి శుభకార్యంలోనూ తీపి తప్పనిసరి. ఈ క్రమంలో చక్కెర,బెల్లం ధర పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. బెల్లం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని, అందుకే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లో మునుపెన్నడూ లేని విధంగా పంచదార, బెల్లం, ఉల్లిపాయలు, వంట నూనె, పువ్వులు, పండ్లు, కూరగాయలు.. ఇలా అన్ని రకాల ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. సంపాదనలో ఎక్కువ మొత్తం ఆహార అవసరాలకే ఖర్చు పెట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. అన్ని రకాల ధరలు పెరగడం పేద, మధ్యతరగతికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. చంద్రబాబు పాలనలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఆహార వస్తువుల ధరలతో సామాన్య ప్రజల జీవనం దిన దిన గండంగా మారింది. నెల రోజుల నుంచి ధరలు పెరుగుతున్నా .. కనీసం నియంత్రించే చర్యలు తీసుకోవడం లేదు. గత ప్రభుత్వంలో నిత్యవసరాల ధర కాస్త పెరిగిన వెంటనే చంద్రబాబు ఆధ్వర్యంలో రోడ్డెక్కి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసిన టీడీపీ నేతలు నేడు అధికారంలోకి రాగానే నోరు మెదపడం లేదు. నిత్యం వాడే బియ్యం ధరలు పెరగడంతో సామాన్యుడిపై భారం అధికమైంది. బియ్యం క్వింటా ధర ఒక్క నెలలోనే రూ.2 వేలు పెరిగింది. గత నెలలో 25 కిలోల బియ్యం బస్తా రూ. 1,300 ఉండగా .. ప్రస్తుతం రూ. 1,800కి చేరింది. ప్రస్తుతం క్వింటా బియ్యం రకాన్ని బట్టి రూ. 6 వేల నుంచి రూ. 7 వేల వరకూ విక్రయిస్తున్నారు. సామాన్యులు ఏం తినాలి అంటూ నిట్టూరుస్తున్నారు. రైతులు వరి కోతలు పూర్తి చేసిన రోజే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఏ రైతు వద్ద కూడా ధాన్యం లేవు. వ్యాపారుల చేతుల్లోకి వెళ్లగానే వారు బియ్యం ధరలను పెంచేసి లబ్ధి పొందుతున్నారు. ధరల నియంత్రణకు జిల్లాలో ఏర్పాటు చేసిన 34 సబ్సిడీ బియ్యం కౌంటర్లు అలంకారప్రాయంగా మారాయి. ఇక కిలో ఉల్లిపాయలు రూ.60, ఎండుమిరప రూ.340, ధనియాలు రూ.220, వేరుసెనగ నూనె కిలో గానుగ అయితే రూ. 300 పైనే పలుకుతోంది. ప్రతి శుభకార్యానికి ఉపయోగించే కొబ్బరికాయ ఒక్కొక్కటి రూ. 40 నుంచి రూ. 50 ఉంది. చేదెక్కిన పంచదార, బెల్లం భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు బియ్యానికి అమాంతంగా రెక్కలు సలసలా కాగుతున్న వంటనూనెలు ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్దయ పేద, మధ్యతరగతి ప్రజల ఆవేదన -
తీవ్రంగా దెబ్బతిన్న పత్తి పంట
తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను బాగా కలవరానికి గురి చేస్తున్నాయి. ఐదెకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నా. పంట వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వర్షం కురవకపోవటంతో పంట బాగా దెబ్బతింది. పత్తి చెట్టుకు కాసిన పూత, పిందె, ఆకులు రాలిపోతున్నాయి. ఎకరానికి రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టా. ఇప్పుడు ఎకరానికి రెండు క్వింటాళ్ల పత్తి దిగుబడి అయ్యే పరిస్థితులు లేవు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కడితే పంటల బీమా వర్తింపజేశారు. ఇప్పుడు పంటల బీమా చేయాలంటే రూ.2 వేలు కట్టాలని చెబుతున్నారు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు టీడీపీ ప్రభుత్వం తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – బొమ్మిరెడ్డి నరసింహారావు, రైతు, దాచేపల్లి -
పల్నాడు రైతాంగానికి తీవ్ర అన్యాయం
వినుకొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పల్నాడు జిల్లా రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, సాగు, తాగునీరు లేక రైతులు అల్లాడిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు నాయుడు రావిపాడు వద్ద గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడి కాలువకు అనుసంధానం చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. దాదాపు రూ.6 వేల కోట్లతో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే పల్నాడులో సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, రైతులు మూడు పంటలు పండించుకునే అవకాశం ఉండేదని తెలిపారు. వరికపూడిశెలపై మౌనమెందుకో..! కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని చెప్పుకొనే నరసరావుపేట ఎంపీ పల్నాడు జిల్లాకు ఏం సాధించారో సమాధానం చెప్పాలని బొల్లా డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను నరసరావుపేటకు తీసుకొచ్చిన సమయంలో కూడా పల్నాడు రైతుల ప్రధాన సమస్య అయిన సాగునీటి ప్రాజెక్టులపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. వరికపూడిశెల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చాయని గతంలో గొప్పగా చెప్పిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు పూర్తయితే మాచర్ల, గురజాల, బొల్లాపల్లి, వినుకొండ ప్రాంతాలకు తాగు, సాగునీటి సమస్యలు తీరతాయని, అలాంటి కీలక ప్రాజెక్టును పక్కన పెట్టి ఇప్పుడు ‘పోలవరం–బనకచర్ల’ అంటూ కొత్త నినాదం తెరపైకి తీసుకురావడం ప్రజలను మభ్యపెట్టడమేనని ధ్వజమెత్తారు. రైతులపై వేధింపులు ఆపాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఈ–క్రాప్ ద్వారా రైతులకు పంటల బీమా అందించి అండగా నిలిచామని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం బీమా పరిహారం అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వినుకొండ నియోజకవర్గంలో పంటలు పండక రైతులు ఇబ్బందుల్లో ఉంటే, సొసైటీ రుణాల పేరుతో వారి ఇళ్లకు వెళ్లి ఫొటోలు తీసి గ్రూపుల్లో పెడుతూ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలు, రాజకీయ కక్షసాధింపులు పక్కనపెట్టి సత్వరమే వరికపూడిశెల పనులను పూర్తి చేసి పల్నాడు రైతాంగాన్ని ఆదుకోవాలని బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. కక్షసాధింపులకే పరిమితం మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి చీఫ్ విప్గా ఉన్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, రెండు సార్లు ఎంపీఐన లావు శ్రీకృష్ణదేవరాయలు ఈప్రాంత రైతులకు మేలు చేసే ఒక్క పనీ చేయలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే జీవీ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం, వైఎస్సార్ సీపీ హయాంలో మంజూరైన నిధులతో మంజూరైన పనులను ప్రారంభించడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అమరావతి నిర్మాణంలో ఖర్చు చేసే నిధులు రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తే ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని గుర్తు చేశారు. కోర్టుల్లో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నామని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు అసలు పనులు అడ్డుకోవడానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలియజేయాలని సవాలు విసిరారు. ఇప్పటికై నా అసత్య ప్రచారాలు మానుకొని పల్నాడు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాదు, పట్టణ అధ్యక్షుడు అధ్యక్షులు కొత్త మాస శివ, రూరల్ మండలం అధ్యక్షుడు దండు చెన్నయ్య, పట్టణ బీసీ నాయకుడు గుంజి వాసులతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు -
వర్షం లేక మిర్చి సాగు చేయలేదు
ప్రతి ఏడాది ఈ సమయానికి మిర్చి పంట సాగు చేస్తాం. కానీ ఈసారి ఇప్పటి వరకు మొక్కలు వేయలేదు. నర్సరీల్లో పెంచుతున్నారు. వర్షం కురవకపోతే పంట సాగు చేసే పరిస్థితి ఉండదు. పత్తి పంట ఇప్పటికే చాలా వరకు నష్టపోయారు. మిర్చి పరిస్థితి కూడా దారుణంగా ఉండటంతో రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. మేజర్ కాలువల ద్వారా సాగునీరు విడుదల చేస్తే కాస్త వరకై నా రైతులు కోలుకుంటారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కరువుతో అల్లాడిపోతున్నారు. – కందుల జాను, రైతు, సారంగపల్లి అగ్రహారం -
‘ఏడు’పొక్కటే మిగిలింది
చిలకలూరిపేట(యడ్లపాడు): చిలకలూరి పేట మండలం వేలూరు గ్రామాన్ని శుక్రవారం విషాదం చుట్టుముట్టింది. ఎస్సీ కాలనీలోని నాలుగు వీధుల్లో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే. ఒక ఇంట్లో తల్లిదండ్రుల కోసం బిడ్డలు విలపిస్తుంటే.. మరోచోట అక్కచెల్లెళ్ల కోసం తమ్ముళ్ల రోదనలు. ఇంకో ఇంట్లో భార్యను కోల్పోయిన భర్త.. అత్తను కోల్పోయిన కోడలు..అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు ఇకరారని తెలిసి మనవళ్లు, మనవరాళ్లు గుండెలవిసేలా రోదించారు. తమ వారిని శాశ్వతంగా కోల్పోయిన ఆ కుటుంబాల వేదన చూపరులను కదిలించింది. ఈనెల 26న బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం కొండమంజులూరులో సమీప బంధువుల ఇంట్లో ఓ వేడుకకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారిపై మార్టూరు వైపు నుంచి వస్తున్న ఆటో..కళామందిర్ సెంటర్ వైపు మళ్లుతుండగా విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఆటోలో 15 మంది ఉన్నారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలంలోనే నలుగురు మృతి చెందారు. చిలకలూరిపేట ఆస్పత్రిలో ఒకరు..గుంటూరు జీజీహెచ్లో ఇద్దరు కన్నుమూశారు. ఒకే గ్రామం నుంచి ఒక్కసారిగా ఏడుగురిని మృత్యువు కబళించింది. 20 గంటల నిరీక్షణ.. ప్రమాదం జరిగిన మరుసటి రోజు గుంటూరులో పోస్టుమార్టం పూర్తయిన ఇద్దరి మృతదేహాలను చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ అప్పటికే ఐదు పోస్టుమార్టం చేసిన మృతదేహాలు ఉన్నాయి. పంచనామా పూర్తయినా.. అంతిమ ప్రయాణానికి మాత్రం ఆలస్యమైంది. 20 గంటలకు పైగా మృతదేహాలు ప్రభుత్వ ఆస్పత్రి శవాగారంలోనే ఉండిపోయాయి. న్యాయం కోసం ఆందోళన.. ఆస్పత్రి వద్ద కొందరు బాధిత కొందరు బాధిత కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తుండగా, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎన్ఆర్టీ సెంటర్లో ధర్నా చేపట్టారు. మృతదేహాలను ఖననం చేసేందుకు ఆందోళనకు తాత్కాలిక విరామం ఇచ్చారు. అందరూ కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. ఒక్కో మృతదేహాన్ని ఒక్కో ఆటోలోకి ఎక్కించారు. వేడుకకు వెళ్లిన వారిని..విగతజీవులుగా వేలూరుకు తీసుకొచ్చారు. భౌతిక కాయాలను చూసేందుకు వచ్చిన నాయకులు, బంధువులతో వీధులు కిటకిటలాడాయి. చివరిచూపు కోసం బారులు మృతదేహాలు ఇళ్లకు చేరగానే రోదనలు మిన్నంటాయి. నాలుగు వీధుల్లోని ఏడు ఇళ్ల ముందు చివరి చూపు కోసం జనం బారులు తీరారు. ఒకేసారి ఏడు కుటుంబాల్లో విషాదం నిండడంతో.. ఎవరిని ఓదార్చాలో బంధుమిత్రులకే అర్థం కాలేదు. మృతదేహాలున్న ప్రతి ఇంటికీ దైవ సేవకులు చేరుకుని, మృతుల ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని కన్నీటితో వేడుకున్నారు. ఒకే రోజు ఏడుగురి ఖననం విషాదం మధ్య అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు జరిగాయి. గ్రామంలోని ఎస్సీ శ్మశానవాటికలో ఏడు సమాధులు సిద్ధమయ్యాయి. ఒకరి కోసం కాదు..ఇద్దరి కోసం కాదు..ఒకేసారి ఏడుగురి కోసం. నిన్నటి వరకు ఒకరినొకరు పలకరించిన ఆ వీధుల్లో.. నేడు చివరి చూపు కోసం జనం వరుసలో నిలబడ్డారు. వేలూరు విషాదం ఏడు కుటుంబాలకే పరిమితం కాలేదు. గ్రామానికే శోకసంద్రంగా మారింది. -
భూముల రీ సర్వే వేగవంతం చేయాలి
నరసరావుపేట: భూముల రీ సర్వే పనులను నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తిచేయాలని తహసీల్దార్లను జాయింట్ కలెక్టర్ సంజనా సింహ ఆదేశించారు. రీసర్వే పురోగతిపై జేసీ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆర్డీఓలు, సర్వే అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ మండలాల్లో చేపడుతున్న ఫీల్డ్ స్థాయి పనులు, పెండింగ్లో ఉన్న అంశాలు, లక్ష్యాల సాధనపై చర్చించారు. జేసీ మాట్లాడుతూ పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను సాధించేలా చూడాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చే సర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహ -
పంటలకు సాగునీరు అందక తీవ్ర ఆందోళనలో అన్నదాతలు
దాచేపల్లి: టీడీపీ పాలనాలో అన్నదాతల బతుకులు కకావికలం అవుతున్నాయి. పంటలకు సాగునీరు అందకపోవటంతో ఎండిపోతోంది. ఇప్పటికే పత్తి దాదాపుగా ఎండిపోయే పరిస్థితుల్లో ఉంది. మిరప మొక్కలు కూడా ఎండిపోయే దశకు చేరుకున్నాయి. గురజాల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మేజర్ కాలువల్లో చుక్క సాగునీరు కూడా పారకపోవటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగు చేస్తున్న పంటలను చూసి ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం పత్తి దిగుబడులతో కళకళలాడాల్సిన అన్నదాతల లోగిళ్లు వెలవెలబోతున్నాయి. వ్యవసాయ పనులలో నిమగ్నమై ఉండాల్సిన కూలీలు పనులు లేక పస్తులుంటున్నారు. ఎటు చూసినా కరువు పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతన్నారు. పత్తి చేలకు నీరందక... నియోజకవర్గ వ్యాప్తంగా వేల ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు. మే నెల ముగింపు నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం పత్తి పంట నుంచి దిగుబడి వచ్చే సమయం ఇది. సాగునీరు ఇప్పటి వరకు అందకపోవటంతో చెట్టుకు కాసిన పూత, పిందెలు, ఆకులు రాలిపోతున్నాయి. కాయ నుంచి వచ్చిన పత్తి కూడా రంగుమారి రాలిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి పంటకు తప్పనిసరిగా నీటి తడి వేయాల్సి ఉంది. నియోజకవర్గ పరిధిలోని తంగెడ, రామాపురం, ఆకురాజుపల్లి మేజర్ కాలువ నుంచి చుక్కనీరు పంటలకు అందని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కాలువల ద్వారా సాగునీరు విడుదల చేసే పరిస్థితులు లేవని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టారు. వ్యవసాయ బోర్ల కింద సాగు చేస్తున్న పత్తి పంటకు నీటి తడి వేయాలన్నా భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో బోర్ల ద్వారా నీరు అందని పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి కరువు పరిస్థితులను చూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరప పరిస్థితి అధ్వానం మిర్చి పంట పరిస్థితి కూడా దాదాపుగా ఇదేవిధంగా ఉంది. వర్షాలు కురవకపోవటంతో సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. వర్షం పడుతుందని ఆశతో కొంతమంది రైతులు మిరప సాగు చేశారు. సాగునీరు అందకపోవటంతో అవి కూడా ఎండిపోతున్నాయి. వర్షం కురిస్తే మిరప మొక్కలు నాటుదామని రైతులు నర్సీరీల్లో మొక్కలు పెంచుతున్నారు. వరుణుడి జాడ లేకపోవడంతో రైతులు మిరప మొక్కలు వేయకపోవటంతో నర్సీరీల్లో లక్షల్లో మొక్కలు నిల్వ ఉన్నాయి. రోజులు గడిచేకొద్దీ నర్సీరీల్లో మొక్కలు పెంచటం భారంగా ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. తీవ్ర వర్షభావ పరిస్థితులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు ఎండిపోతున్న పత్తి పెట్టుబడి పెట్టిన రైతులకు ఆర్థికనష్టం మిర్చి పంట పరిస్థితి కూడా దాదాపు ఇదే.. నర్సరీల్లో నిరుపయోగంగా లక్షల మొక్కలు టీడీపీ సర్కారు తీరుపై కర్షకుల ఆగ్రహం -
మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య చిలకలూరిపేట: ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం మాటలకు అందని మహావిషాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వేలూరులో అశ్రునయనాల మధ్య జరిగిన అంతిమ సంస్కారాలకు హాజరై మృతులకు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ తరఫున తక్షణ ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాలు నిరుపేదలని, ప్రభుత్వం వెంటనే భారీ ఎక్స్గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావులతో ఫోన్లో ఈశ్వరయ్య కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందా కృష్ణమాదిగ సైతం వేలూరులో మృతుల కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతి వరప్రసాద్, ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బుదాల శ్రీనివాసరావు, ఉలవలపూడి రాము, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని, గ్రామ కార్యదర్శి ఎలికా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వేలూరు గ్రామానికి చెందిన దళిత మహిళా వ్యవసాయ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రవిబాబు డిమాండ్ చేశారు. స్థానిక కోటప్పకొండరోడ్డులోని విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం ఢీకొన్న ఘటనలో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు మృతి చెందడం తీవ్ర విషాదకరమన్నారు. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నష్టపరిహారం ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్, ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ 10 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
నిరవధిక ఆందోళనకు తాత్కాలిక విరామం
చిలకలూరిపేట(యడ్లపాడు): రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఎమ్మా ర్పీఎస్ చేపట్టిన నిరవధిక ఆందోళనకు శుక్రవారం తాత్కాలిక విరామం లభించింది. అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈనెల 26న అర్ధరాత్రి చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో యడ్లపాడు మండలం వేలూరుకు చెందిన ఏడుగురు మృతి చెందిన విషయం విధితమే. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ గురువారం పట్టణ ఏరియా ఆస్పత్రి ఎదుట ప్రారంభమైన ఆందోళన.. ఎన్ఆర్టీ సెంటర్ హైవే కూడలికి చేరింది. బాధితులతో కలిసి నాయకులు అక్కడే బైఠాయించారు. సుమారు 20 గంటల పాటు చీకట్లో హైవేపైనే ఎమ్మార్పీఎస్ నాయకులు, బాధిత కుటుంబాలు ఆహారం సైతం తీసుకోకుండా నిరసన కొనసాగించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా.. వేగంగా పోస్టుమార్టం నిర్వహించినా ఏడు మృతదేహాలు శవాగారంలోనే ఉన్నాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం, రెండెకరాల భూమి, ఇంటి స్థలం, పిల్లల విద్యకు చేయూత, గాయపడిన వారికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు మృతదేహాలను ఖననం చేయమంటూ.. నిరసన వీడమంటూ పట్టుబట్టారు. ఏడుసార్లు చర్చలు.. ఫలితం శూన్యం ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. సీఐలు, ఆర్డీఓ, డీఎస్పీ తదితరులు నాయకులతో ఏడుసార్లు చర్చించారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా యంత్రాంగంతో మాట్లాడామని, కొంత పరిహారం ఇప్పించే బాధ్యత తమదని హామీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయినా చర్చలు ఫలించలేదు. తెల్లవారుజామున నిరసనకారులను ముందస్తుగా అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారని నాయకులు ఆరోపించారు. అరెస్టులు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. హామీలు అమలు కాకుంటే మళ్లీ పోరు బాధితుల అంత్యక్రియల కోసం శుక్రవారం మధ్యాహ్నం ఆందోళనకు తాత్కాలిక విరామం ప్రకటించామని, తమ డిమాండ్లపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సానుకూలంగా స్పందిస్తున్నారని ఎమ్మార్పీస్ నాయకులు తెలిపారు. అయితే బాధిత కుటుంబాలకు వెంటనే న్యాయం చేయకుంటే తిరిగి నిరవధిక ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్, జాతీయ మహిళా అధ్యక్షురాలు తబిత, మహిళా ప్రతినిధి కరుణ తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా గిరిజన ప్రజలను ఆర్థికంగా, సామాజికంగా, అన్ని విధాల ఆదుకుంటామని చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీను నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. భూక్యా సూర్య నాయక్, కోయ శ్రీను, రాంబాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ నియంత్రణకు చర్యలు
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్ ఈపూరు: ఊడిజర్ల ఎస్సీ కాలనీలో డెంగీ జ్వరాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పల్నాడు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ చుక్కా రత్న మన్మోహన్ అన్నారు. ‘ఊడిజెర్లలో డెంగీ విజృంభణ’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు డీఎంహెచ్ఓ స్పందించారు. శుక్రవారం ఊడిజర్ల ఎస్సీ కాలనీలో పర్యటించి, వీధులు పరిశీలించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పంచాయతీ అధికారితో ఫోన్లో మాట్లాడి కాలనీలో మురుగు కాలువల పరిస్థితిని వివరించారు. ఇళ్ల ముందు నీటి నిల్వలు ఉండటాన్ని గుర్తించి కాలనీవాసులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వైద్య శిబిరాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం డాక్టర్ రత్న మన్మోహన్ విలేకరులతో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కాలనీలో తరచూ డెంగీ కేసులు నమోదవుతున్నాయని మురుగుకాలువల అపరిశుభ్ర వాతావరణంతోనే దోమలు వ్యాపించి జ్వరాల బారిన పడుతున్నారన్నారు. వెంటనే కాలనీలో నీటి నిల్వలు, మురుగు తొలగింపు పనులు చేపట్టామన్నారు. బ్లీచింగ్ చల్లడం, ఫాగింగ్ పనులు చేపట్టి రెండు రోజుల్లో కాలనీలో సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయనతోపాటు మలేరియా అధికారి, కొచ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి, వైద్య సిబ్బంది ఉన్నారు. -
బాలచాముండేశ్వరికి శ్రావణ లక్ష్మి అలంకారం
చందోలు(కర్లపాలెం): శ్రావణమాసం మూడవ శుక్రవారం చందోలు గ్రామంలోని బగళాముఖి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. దేవస్థానం ఆధ్వర్యంలో తొలిసారిగా అమ్మవారికి నిర్వహించిన సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమాలలో మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారు శ్రీ మహాల క్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమార్చన పూజలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం తరఫున అమ్మవారి చిత్రపటం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పూలు, పండ్లు, పూజా ద్రవ్యాలు ఉచితంగా అందజేసినట్లు ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు చక్రధర్రెడ్డి, సభ్యుడు వరప్రసాద్ తెలిపారు. అమ్మవారి పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో నరసింహమూర్తి, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. చీరాల: పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో జరుగుతున్న డిగ్రీ రెండో సెమిస్టర్ పేపర్ వాల్యూయేషన్ను శుక్రవారం అధ్యాపకులు నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల అధ్యాపకులు మాట్లాడుతూ 2025–26లో ఆంధ్రకేసరి యూనివర్సిటీ 1,3,4,5 సెమిస్టర్ యూజీ పేపర్ల వాల్యూయేషన్ను పూర్తి చేశామన్నారు. పరీక్ష ఫలితాలు వచ్చినా వాల్యూయేషన్ పారితోషకం ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఈ ఏడాది మే నెలలో 47 డిగ్రీల మేర ఎండలు ఉన్నా పేపర్ వాల్యూయేషన్ను పూర్తి చేశామని పేర్కొన్నారు. రావల్సిన పారితోషకం చెల్లించని కారణంగా శుక్రవారం రెండో సెమిస్టర్ పేపర్ మూల్యాంకనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పారితోషకాన్ని త్వరగా విడుదల చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రిన్సిపాల్, యూజీ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్కు వినతిపత్రం అందించారు. నాదెండ్ల: జూనియర్ డివిజన్ సివిల్ జడ్జిల ఎంపికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర న్యాయశాఖ ప్రకటించిన మేరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన 41 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. ఈ జాబితాలో గణపవరం గ్రామానికి చెందిన కాట్రు అప్పయ్య, వెంకటసుబ్బమ్మల మనుమరాలైన నల్లూరి గౌతమి 200 మార్కులకు గాను 189.67 మార్కులతో మూడో ర్యాంకులో నిలిచారు. గతేడాది అక్టోబర్లో రాత పరీక్ష జరగ్గా, ఈ ఏడాది మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. త్వరలో ప్రభుత్వం వీరికి జూనియర్ సివిల్ జడ్జిగా పోస్టింగ్లు ఖరారు చేయనుంది. గౌతమి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, ఉదయలక్ష్మి ఉపాధ్యాయులు. వృత్తిరీత్యా ఒంగోలులో నివాసం ఉంటుండగా, గౌతమి విశాఖపట్నంలోని దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. -
గాలిలో ప్రాణాలు.. కన్నీటిలో కుటుంబాలు
● రోడ్డు ప్రమాదాలకు బలవుతున్న సామాన్యులు ● జిల్లాలో ఈ ఏడాది 677 ప్రమాదాల్లో 232 మంది మృతి ● మృత్యు నిలయాలుగా మారిన జాతీయ రహదారి జంక్షన్లు చిలకలూరిపేట టౌన్/ యడ్లపాడు: రోడ్డుపై వాహనం దూసుకెళ్లే వేళ చోటుచేసుకుంటున్న ప్రమాదాలతో కుటుంబాలే ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ప్రమాదాలలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్పత్రిలో క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. కానీ ఆ తర్వాత మొదలయ్యే కుటుంబాల వేదన మాత్రం బయటకు కనిపించదు. సంపాదించే మనిషి లేకపోవడం.. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన.. అప్పుల భారం.. ఆసరా కోల్పోయిన వృద్ధుల కన్నీళ్లు.. ఇవన్నీ ఒక రోడ్డు ప్రమాదం వదిలి వెళ్లే గాయాలే. జిల్లాలో ఇవీ నిదర్శనాలు... యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వంతెనపై ఇటీవల రెండు భారీ వాహనాలు ఢీకొని మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవ దహనమైన ఘటన ఇంకా స్థానికుల మదిలో నుంచి చెరిగిపోలేదు. చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి ఆటోను బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన దృశ్యం ఈ విషాదాన్ని కళ్లకు కట్టింది. ఒకే ప్రాంతానికి చెందిన కుటుంబాల్లో ఒక్కసారిగా అలుముకున్న విషాదం.. రహదారి భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనకు కారణమైంది. పల్నాడు జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 677 ప్రమాదాలు చోటుచేసుకోగా, 232 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ప్రతి మరణం తర్వాత ఒక కుటుంబం విషాదంలో ఉందన్న విషయాన్ని మరిచిపోకూడదు. అందరికీ కష్టాలే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో కుటుంబాన్ని నడిపించే వయసులో ఉన్నవారే, చేతికి అందివచ్చే యువతే అధికంగా ఉంటున్నారు. నిన్నటి వరకు ఇంటి ఖర్చులు చూసిన వ్యక్తి.. ఈరోజు ఫొటోలో మాత్రమే మిగిలిపోతే ఆ కుటుంబం ఒక్కసారిగా దిక్కులేనిదవుతుంది. నెలవారీ ఆదాయం ఆగిపోతుంది. పిల్లల చదువులకు డబ్బు ఉండదు. అప్పులు పెరుగుతాయి. బతుకుబండిని లాగేందుకు కుటుంబ సభ్యులు కొత్త పోరాటం మొదలుపెట్టాల్సి వస్తుంది. కొన్ని ఇళ్లలో తండ్రి మరణిస్తే పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోతాయి. తల్లి ఒక్కరే కుటుంబ బాధ్యత మోయాల్సి వస్తుంది. మరికొన్ని ఇళ్లలో జీవితాంతం తమకు అండగా ఉంటాడనుకున్న కుమారుడిని కోల్పోయిన వృద్ధ తల్లిదండ్రులు మిగిలిపోతారు. బిడ్డను కోల్పోయిన బాధకు తోడు.. వృద్ధాప్యంలో తమ భవిష్యత్తు ఏమిటన్న భయం వారిని వెంటాడుతుంది. బతికిన వారికి మరో పోరాటం.. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారందరి పరిస్థితి మరో కన్నీటి గాథ. తీవ్ర గాయాలతో మంచానికే పరిమితమయ్యే వారు ఎందరో. చేతులు, కాళ్లు పనిచేయకపోవడం, వెన్నుపూస దెబ్బతినడం, పక్షవాతం వంటి సమస్యలు జీవితాన్ని తలకిందులు చేస్తాయి. వైద్యం కోసం పొలాలు అమ్ముకోవడం.. ఇళ్లు తాకట్టు పెట్టడం.. బంగారం విక్రయించడం.. అప్పులు చేయడం సాధారణంగా మారిపోయింది. ప్రాణం నిలిచినా కుటుంబం అప్పుల పాలైతే.. ఆ ప్రభావం సంవత్సరాల తరబడి వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా... చిలకలూరిపేట పరిధిలోని ఎన్హెచ్–16, 167/ఏ హైవేలపై పలు ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. పసుమర్రు హైవే జంక్షన్, బొప్పూడి ఆంజనేయస్వామి ఆలయం, అడ్డరోడ్డు సెంటర్, విజయబ్యాంకు ప్రాంతం, ఎన్ఆర్టీ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, తిమ్మాపురం జంక్షన్, యడ్లపాడు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ రోడ్డు, బోయపాలెం హైవే వంతెన ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారీ కొంతకాలం హడావుడి కనిపించడం.. ఆ తర్వాత మళ్లీ అదే పరిస్థితులు కొనసాగడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం ప్రకటించడం కంటే.. ప్రమాదం జరగకుండా ముందే అడ్డుకోవడమే ప్రభుత్వ యంత్రాంగం ప్రాధాన్యత కావాలి. ప్రమాదకర ప్రాంతాలను శాసీ్త్రయంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలి. అలాగే రహదారిపై ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్టీరింగ్ వెనుక కూర్చున్న వ్యక్తి ఒక్కడే కాదు.. అతని కోసం ఒక కుటుంబం ఎదురుచూస్తోంది. ఒక్క నిమిషం ఆలస్యమైతే పెద్ద నష్టం లేదు. కానీ ఒక్క క్షణం నిర్లక్ష్యం చేస్తే.. తిరిగి రాని ప్రాణం పోతుంది. ఆ ప్రాణంతో పాటు ఒక కుటుంబం నవ్వు కూడా ఆగిపోతుంది. అందుకే రహదారిపై వేగం కంటే ప్రాణానికి విలువ ఇవ్వాలి. నిబంధనలను భయంతో కాదు.. ఇంటివద్ద ఎదురుచూస్తున్న వారి కోసం పాటించాలి. ఈ దిశగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
నిబంధనలన్నీ ఇసుకలో పాతర
● ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా యథేచ్ఛగా తవ్వకాలు ● పెద్ద లారీలలో బహిరంగంగానే రవాణా ● కనీసం కన్నెత్తి కూడా చూడని స్థానిక అధికారులు చింతపల్లి వద్ద శుక్రవారం ఉదయం కృష్ణానదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాక్షి, నరసరావుపేట: ఉచిత ఇసుక ముసుగులో కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు ఇసుకాసురులు తిలోదకాలు వదిలారు. పలు శాఖల అధికారులకు ముడుపులు చెల్లించి దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. రోజుకు 50 నుంచి 100 లారీల వరకు తరలిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రకృతి వనరుల పరిరక్షణ కాగితాలకే పరిమితమైంది. ఈ ప్రాంతాల్లో తవ్వకాలు... పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం పరిధి చింతపల్లి, కొత్తపల్లి సరిహద్దుల్లో కృష్ణానదిలో రాత్రింబవళ్లు తేడా లేకుండా ఇసుకాసురులు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఆరు పొక్లెయినర్లతో నది లోతుల్లో నుంచి తవ్వకాలు చేపట్టారు. నేరుగా పెద్ద ట్విన్ టైర్ లారీలకు ఎత్తుతున్నారు. ప్రస్తుతం పర్యావరణ నిబంధనల మేరకు మాన్సూన్ హాలిడే అమలులో ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాకాలం దృష్ట్యా జూన్ 1 నుంచి అక్టోబరు 15 వరకు నదిలో ఎలాంటి తవ్వకాలు నిర్వహించకూడదు. ముందుగా నది ఒడ్డున డంప్ చేసుకున్న ఇసుకను మాత్రమే అవసరాలకు తరలించుకోవాల్సి ఉంటుంది. కానీ అక్రమార్కులు నదిలో తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు ఎవరికీ అనుమానాలు రాకుండా జూన్ 1 నాటికి డంప్ చేసుకున్న కుప్ప నుంచి మాత్రమే ఇసుక రవాణా చేసుకుంటున్నట్లు చూపిస్తున్నారు. నేరుగా తరలింపు... రోజూ నది గర్భంలో పెద్ద పొక్లెయినర్లతో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. నేరుగా భారీ లారీలకు ఓవర్లోడ్ చేస్తున్నారు. ఇసుకను అచ్చంపేట, క్రోసూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల నుంచి నేరుగా హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రతి రోజు 50 నుంచి 100 లారీల వరకు ఇసుక తరలి వెళుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. అక్రమార్కులు ఒక్కొక్క లారీకి ఇసుకను ఓవర్లోడ్ చేసినందుకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసి తమ జేబులు నింపుకొంటున్నారు. ట్రాక్టర్లను అసలు నదిలోకి అనుమతించడం లేదు. వీరికి బడా ప్రజాప్రతినిధుల అండదండలున్నట్లు విశ్వసనీయ సమాచారం. మైనింగ్, విజిలెన్స్ అధికారులకు తెలిసినా మామూళ్లతో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇసుక లోడ్తో వెళుతున్న లారీజూన్ 1 నుంచి అక్టోబరు 15 వరకు మాన్సూన్ హాలిడే అమలులో ఉంది. దీని ప్రకారం కృష్ణానదిలో యంత్రాలతో గానీ, మాన్యువల్గా గానీ ఎలాంటి తవ్వకాలు నిర్వహించకూడదు. నదికి సమీపంలోనే అంతకు ముందు డంప్ చేసుకున్న ఇసుకను ట్రాక్టర్లు, లారీలలో రవాణా చేసుకునే అవకాశం ఉంది. నిబంధనల మేరకు మాత్రమే లోడ్ చేసుకోవాలి. ప్రస్తుతం కృష్ణానదిలో ఎలాంటి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం లేదు. ఎవరైనా ఇలా చేస్తే మా సిబ్బందిని పంపి పనులు నిలిపివేయిస్తాం. సంబంధితులపై తగిన చర్యలు తీసుకుంటాం. – నాగయ్య, మైనింగ్ ఏడీ, నరసరావుపేట. -
చిలకలూరిపేటలో కొనసాగుతున్న హైటెన్షన్
సాక్షి, పల్నాడు: చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన శుక్రవారం ఉదయం కూడా కొనసాగుతోంది. మృతుల కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాల నాయకులు, వేలూరు గ్రామస్తులు నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో ఎన్ఆర్టీ సెంటర్లోని చెన్నై–కోల్కతా జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన విరమించే ప్రసక్తే లేదని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంతో పాటు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.చిలకలూరిపేటలో నిన్న సాయంత్రం 4.30 గంటల నుంచి ఆందోళన కొనసాగుతుండగా.. జాతీయ రహదారిపై సుమారు 12 గంటలుగా బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్నామని.. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.ఎమ్మెల్యే రావాల్సిందే..తమ వద్దకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే తమ వద్దకు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించడంలో వెంటనే చొరవ చూపాలని దళిత సంఘాలు కోరుతున్నాయి.సంబంధిత వార్త: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి దుర్మరణంఅధికారులతో చర్చలుఅంతకు ముందు.. ఆందోళన నేపథ్యంలో రాత్రి 11 గంటల సమయంలో డీఎస్పీ, ఆర్డీఓ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని అధికారులు కోరినప్పటికీ.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తమ వద్దకు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సెంటర్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.ఎంపీ మాటతో భగ్గుమన్న దళిత సంఘాలుచిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు నిరసన సెగ తగిలింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మృతుని బంధువులతో.. వినతిపత్రం ఇవ్వండి అంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. దీంతో ఎంపీ తీరు పట్ల మృతుల కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు చనిపోతే న్యాయం చేయడానికి వినతిపత్రం ఇవ్వాలా? అంటూ ఎంపీని వారు ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని ఎంపీ ముందు నినాదాలు చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.ఇదీ చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. -
ప్రాణాలు పోతే వినతిపత్రం కావాలా?
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దళితులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బాధిత కుటుంబాలు, దళిత సంఘాల ఆగ్రహం తీవ్రస్థాయికి చేరింది. ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడినా ప్రభుత్వం నుంచి తగిన భరోసా, పరిహారం ప్రకటించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు గురువారం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చిన నరసరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. బాధితుల సమస్యలను విన్న ఎంపీ.. వినతిపత్రం ఇవ్వాలని, దానిని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో బాధితులు భగ్గుమన్నారు. ఇంతటి విషాదంలో ఉన్న తమకు ప్రభుత్వం నేరుగా అండగా నిలవాల్సింది పోయి వినతిపత్రం ఇవ్వాలని చెప్పడం ఏమిటంటూ వారు మండిపడ్డారు. పైగా.. ఇప్పటివరకు ఎలాంటి భరోసా కల్పించకపోవడంపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి..ప్రమాదంలో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 లక్షల చొప్పున పరిహారం అందించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరాయి. అలాగే, డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేదిలేదంటూ బాధితులు సా.4.30కు చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి వద్ద రోడ్డుపై ధర్నా చేపట్టారు. దీంతో చీరాల–చిలకలూరిపేట మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడి నుంచి ఆందోళనకారులు ర్యాలీగా బయల్దేరి జాతీయ రహదారి–16పై బైఠాయించారు. సా.7.30 గంటల నుంచి మూడు గంటలకు పైగా ధర్నా పెద్దఎత్తున కొనసాగింది. తాము ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. ధర్నాతో హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో వాటిని మళ్లించారు. -
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసానివ్వాలి
చిలకలూరిపేటటౌన్: ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి తగిన సహాయం అందించాలని మాజీ మంత్రి విడదల రజిని కోరారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రమాద మృతుల భౌతికకాయాలను ఆమె సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వేలూరు గ్రామానికి చెందిన ఏడుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రజిని మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంపై వేగంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన వారిలో పల్నాడు జిల్లా ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, షేక్ జాన్సైదా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన నాయకులు మండలనేని చరణ్తేజ్, తోటా రాజా రమేష్, నిడ్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, సీపీఐ నాయకులు తాళ్లూరి బాబూరావు, షేక్ సుభాని, చెరుకుపల్లి నిర్మల తదితరులు ఉన్నారు.


