breaking news
Funday
-
చిటికెలో సినిమా.. ఫోన్తోనే!
స్మార్ట్ ఫోన్ ఉందా? ఈ లెన్స్ తగిలించండి. మీ రూమ్ ఒక సెట్, మీరే డైరెక్టర్! ఆశ్చర్యపోతున్నారా! నిజం, ఈ చిన్న 1.33 ఎక్స్ అనామార్ఫిక్ లెన్స్ సాయంతో, మీ స్మార్ట్ఫోన్తోనే సినిమా తీయొచ్చు. పెద్ద కెమెరాలు, లైట్లు, సెటప్లు ఏవీ అవసరం లేదు. బెడ్రూమ్, హాల్, టెర్రస్... ఎక్కడైనా సినిమా లెవెల్ షాట్ తీయవచ్చు. ఇది రెండు రకాల లైటింగ్ ఎఫెక్ట్స్తో పనిచేస్తుంది. అందులో బ్లూ ఫ్లేర్ పెడితే ఇంట్లోనే స్పేస్ సినిమా ఫీల్, గోల్డ్ ఫ్లేర్ పెడితే శ్రావణ మాసం గుడిలో వచ్చే డివోషనల్ ఫీల్ కనిపిస్తుంది. ఒక్కసారి ఇది తీసిన వీడియో చూస్తూ ‘ఇది నిజంగా ఫోన్తో తీయగలరా?’ అని అశ్చర్యపోతారు. ఒక్కసారి వాడాక, మామూలు కెమెరా తెరవాలని కూడా అనిపించదు. ఇంకా ప్రత్యేకంగా డబ్బింగ్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోలో సౌండ్ కూడా అద్భుతంగా రికార్డ్ అవుతుంది. ధర రూ.13,999 మాత్రమే!జేబులో దీపావళి!చుట్టూ చీకటి ఉన్నా, మీ ఇల్లు దీపావళి నాటి ఆకాశంలా మెరవాలంటే, మీ దగ్గర ఈ ‘డిజి టెక్ పోర్టబుల్ ఎల్ఈడీ లైట్’ ఉండాల్సిందే! చేతిలో పట్టేంత చిన్నదే, కాని ఆన్ చేస్తే మాత్రం మీ ముఖం, చుట్టూ ఉన్న వాతావరణం అంతా బ్రైట్గా మెరిసిపోతుంది. ఈ లైట్ సుమారు మూడు వేల నుంచి ఆరువేల కెల్విన్ వరకు వెలుతురును అందిస్తుంది. లైట్ బ్రైట్నెస్, రంగులను అవసరానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. అలా చిత్రీకరణకు కావాల్సిన వాతావరణాన్ని సులభంగా సృష్టించవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే, నిర్విరామంగా సుమారు రెండు గంటలపాటు పని చేస్తుంది. ధర కేవలం రూ.1,299 మాత్రమే!స్టూడియో బాక్స్!చిన్న వస్తువులను ఫొటో తీయడం అంటే, ‘ఫ్యాన్ ఇండియా’ సినిమా తీసినంత ఈజీ కాదు. హోల్ లైట్, టేబుల్, షీట్, లో ఫ్యాన్ ... ఇలా చాలానే ప్లానింగ్ చేసి తీయాలి. అయితే, ఇప్పుడు ఈ హిఫిన్ ఫోల్డబుల్ లైట్ బాక్స్ ఉంటే చాలు, ఇంట్లోనే ఓ చిన్న సినిమాటిక్ ఫొటో స్టూడియో సెట్ రెడీ అవుతుంది. చూసేందుకు క్యూబ్లా ఉంటుంది. కాని, ఒక్కసారి తెరిస్తే, అంతా మాయలా మారిపోతుంది. ఫుల్ బ్రైట్ ఎల్ఈడీ లైట్లు మెరిసిపోతాయి. వాడటం కూడా చాలా సులభం– యూఎస్బీకి పెట్టండి, ఎంత చిన్నవస్తువునైనా మధ్యలో పెట్టండి, ఫోటో తీయండి... అంతే! పైగా ఈ బాక్స్ను మడిచి పెట్టుకోవచ్చు, ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లవచ్చు. ఇందులో పెట్టి ఫొటో తీస్తే తెలుపు, నలుపు రంగుల బ్యాక్డ్రాప్లతో ఫొటోలకు పూర్తిగా ప్రొఫెషనల్ టచ్ ఇస్తుంది. ధర రూ.499 మాత్రమే!తిరిగే ఎలక్ట్రిక్ స్టాండ్!వస్తువుల ఫొటో తీయాలంటే చేతితో తిప్పుతూ తిప్పుతూ మీ తల తిరగాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఈ తిరిగే ఎలక్ట్రిక్ స్టాండ్పై వస్తువును పెట్టి ఫొటో తీయండి. మెల్లగా 360 డిగ్రీలుగా తిరుగుతూ, ఏ కోణంలో చూసినా వస్తువును అందంగా చూపిస్తుంది. కావాల్సిన రీతిలో వస్తువు యాంగిల్, దిశ, వేగాన్ని సులభంగా నియంత్రించవచ్చు. ఇది బంగారు వస్తువులు, గడియారాలు, చిన్న కేకులు, ప్రదర్శన వస్తువుల ఫొటోగ్రఫీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. సుమారు ఎనిమిది కిలోల బరువు వరకు కోరుకున్న దిశలో తిప్పగలదు. దీనిని ఉపయోగించడం చాలా సులువు. ధర రూ. 1,699 మాత్రమే! -
ఇరుకు దారులకు చురుకైన కారు..!
ఇరుకు దారుల్లో ద్విచక్ర వాహనాలు ఎలాగోలా ప్రయాణించగలవు గాని, కార్లు ముందుకెళ్లడం అంత సులువు కాదు. ఈ సమస్యను అధిగమించాలనే ఆలోచనతోనే ఇటాలియన్ మెకానిక్ ఆండ్రియా మరాజీ ప్రపంచంలోనే అతి సన్నని కారును రూపొందించాడు. అలాగని అతడేమీ కొత్తగా కారును తయారు చేయలేదు. తన షెడ్డులో మూలపడిన 1993 మోడల్ ‘ఫియట్ పాండా’ కారు రూపురేఖలను తాను కోరుకున్న రీతిలో మార్పులు చేసి, ఇలా అతి సన్నని కారుగా మార్చేశాడు. దీనికోసం ఆండ్రియా ఏకంగా పన్నెండు నెలలు శ్రమించాడు. రోడ్ల మీద పరుగులు పెట్టేలా దీనిని తీర్చిదిద్దడానికి పూర్తిగా ఫియట్ కంపెనీకి చెందిన ఒరిజినల్ విడి భాగాలనే ఉపయోగించాడు. కారుకు ఉన్న పాత పెట్రోల్ ఇంజిన్ను తొలగించి, ఎలక్ట్రిక్ ఇంజిన్ను ఏర్పాటు చేసి, బ్యాటరీని అమర్చాడు. బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే, పాతిక కిలోమీటర్లు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారు ఎత్తు 140 సెం.మీ., పొడవు 340 సెం.మీ., వెడల్పు 50 సెం.మీ. మాత్రమే! ఈ కారులోనే చక్కర్లు కొడుతూ ఆండ్రియా యూట్యూబ్ సంచలనంగా మారాడు.(చదవండి: జైలు శిక్షనే శిక్షణగా మార్చుకున్న జీనియస్ ఖైదీ..!) -
బహుత్ అచ్చీ..'బాత్' హై..!
నగర జీవనం అత్యాధునికం, సంకేతికం అవుతోంది.. రోజు రోజుకూ అందుబాటులోకొస్తున్న టెక్నాలజీ పుణ్యమాని కొత్త కొత్త ట్రెండ్స్ నడుస్తున్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో చెప్పుకోదగిన విషయం ఏదైనా ఉందంటే అది బాత్రూమ్ ట్రెండ్స్.. సగటు మానవుని జీవితం మూడేళ్లపాటు బాత్రూమ్స్లోనే గడుపుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. అంతేకాదు.. ‘ఛేంజింగ్ ఫేస్ ఆఫ్ బాత్రూమ్స్’ పేరిట నగరంలో ఓ సెమినార్ కూడా నిర్వహించారట.. దీన్ని బట్టి స్నానాల గదికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.. దీన్ని దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక హంగులను అద్దుతున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్లోనూ కీలకపాత్ర పోషిస్తోందనడంలో సందేహం లేదు..ఇటీవల కాలంలో మొబైల్స్ పుణ్యమాని మానవులు, మరీ ముఖ్యంగా నగరవాసులు సగటున మూడేళ్ల పాటు సమయాన్ని బాత్రూమ్స్లోనే గడుపుతున్నారని ఓ అధ్యయంనలో తేలింది. అంతేకాదు ఏడాదికి 70 లక్షల మంది తమ మొబైల్స్ను పోగొట్టుకుంటున్నారని మరో అధ్యయనం తేలి్చంది. అదీ ఎక్కడో కాదు.. బాత్రూమ్స్లోనే.. మన జీవితంలో ఏడాదికి 2500 సార్లు రెస్ట్రూమ్స్ వినియోగిస్తామని మరో స్టరీ పేర్కొంటోంది..ఇక దేశంలో దంపతుల మధ్య గొడవలకుగల కారణాల్లో బాత్రూమ్దే ప్రధాన పాత్ర అని మరో స్టడీ చెబుతోంది.. ఇలా చూస్తే.. డ్రాయింగ్ రూమ్స్, జిమ్స్ వంటి వాటికన్నా బాత్రూమ్ కోసమే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారట. స్నానాలగది గురించి ఇంతకు మించిన ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి.. బాత్ చుట్టూ బాతాఖానీ.. ‘ఛేంజింగ్ ఫేస్ ఆఫ్ బాత్రూమ్స్’ పేరిట నగరంలో జరిగిన ఓ సెమినార్లో ఇలాంటి విషయాలెన్నో చర్చకు వచ్చాయి. ‘బాత్రూమ్లు మన జీవనశైలిలో అత్యంత ప్రధానమైన భాగంగా మారాయి. ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు, నిర్మించుకునేటప్పుడు సిటిజనులు బాత్రూమ్లకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. బిల్డర్స్ కూడా అత్యధికంగా వ్యయం చేసి వినూత్నంగా తీర్చిదిద్దిన, బాత్రూమ్స్తో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు’ అని చెప్పారు నగరంలోని ఓ భవన నిర్మాణ సంస్థకు చెందిన చైతన్య. వీటిని ఇప్పుడు డిజైనర్ బాత్ రూమ్ స్పేసెస్ అని వ్యవహరిస్తున్నారు అని అన్నారాయన. ఒత్తిడి చిత్తు.. రీచార్జ్ ఎత్తు.. ‘బాత్రూమ్స్ అంటే కొత్త ఐడియాలకు పుట్టినిల్లు’ అని చెప్పారు ఓ స్టార్టప్ కంపెనీ యజమాని సందీప్. అంతేకాదు ఇవి ఐ కెన్ డూ అనిపిస్తాయి. నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ అని వెన్ను తడతాయి. నెగెటివ్ ఆలోచనల్ని నురగతో పాటు కొట్టుకుపోయేలా చేస్తాయి. ఒత్తిడిని దూరం చేసి రిలాక్స్డ్ మైండ్ని అందిస్తాయని, మెదడులో డోపమైన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయని పరిశోధకులు అంటున్నారు. స్విమ్మింగ్, జాగింగ్ వంటివాటితో వచ్చే లాభాలతో సమానంగా బాత్రూమ్ పనిచేస్తుంది.గతంలో బాత్రూమ్స్ నిర్లక్ష్యానికి గురి అయిన ప్లేసులు. అయితే ప్రస్తుతం వీటికి బాగా ప్రాధాన్యం పెరిగింది. విశాలంగా అవసరమైన అన్ని సౌకర్యాలు, ఫిట్మెంట్స్ ఏర్పరచుకుంటున్నాయి. ఇందులో భాగంగా తడి, పొడి ప్రదేశాలుగా బాత్ రూమ్ని రెండు భాగాలుగా విభజిస్తారు. వెట్ ప్లేస్లో షవర్, టబ్లు ఉంటాయి. గ్లాస్తో విభజించి మరో భాగంలో శానిటరీ, వాష్ బేసిన్, మిర్రర్.. ఉంటాయి.హైలెట్ టైల్స్ : బాత్రూమ్లో ఒక ప్లేస్లో పెడితే బాత్రూమ్ మొత్తాన్ని హైలెట్ చేసే హైలైటర్స్లో వాల్ పేపర్స్/టైల్స్/మిర్రర్స్ ఉన్నాయి. ఇవి రూ.50 వేల నుంచి ధరల్లో అందుబాటులో ఉన్నాయి. బాత్రూమ్ ప్లేస్ని బట్టి ఖరీదు ఉంటుంది. కింద ఫ్లోరింగ్ చూస్తే అచ్చం వాటర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఓషన్ థీమ్లా లేదా మరే థీమ్ అయినా తీసుకోవచ్చు.ప్లాంట్స్ : బాత్రూమ్లో వాల్కి పక్కన, లేదా బాత్టబ్ పక్కన ప్లాంట్స్ని ఏర్పాటు చేస్తున్నారు. మంచి పరిమళాలు పంచే బోన్సాయ్ మొక్కలైన హైపర్ బోల్స్, సిల్క్ ఫ్లవర్, టైడ్ రిబ్బన్స్తో పాటు అలోవీరా, స్పైడర్ ప్లాంట్ వంటివి పాపులర్ అయ్యాయి. ఇవి రూ.10వేల నుంచి లభిస్తున్నాయి. బోన్సాయి అయితే రూ.25వేల నుంచి ప్రారంభమవుతాయి. గ్రీనరీ లుక్ కోసం విండో ప్లేస్లో ఐరన్ బదులు బ్యాంబూ పెడతారు. చిన్న చిన్న లైట్స్ దీనికి అమరుస్తారు.వానిటీ : టవల్స్, షేవింగ్ కిట్స్, అవసరమైతే బుక్స్ పెట్టుకోడానికి బాత్రూమ్లోనే వార్డ్రోబ్స్ పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు హోటల్స్కి పరిమితమైనవి.. ఇప్పుడు ఇళ్లలోకి కూడా వచ్చేశాయి.జెట్ మసాజెస్ : ఇవి అమర్చుకుంటే మన మీద పడే నీళ్లతోనే మనకు మసాజ్ అనుభూతి కలుగుతుంది. నీళ్ల వేగానికి శరీరం రిలాక్స్ అవుతుంది. షవర్ ప్యానెల్లో లేదా టబ్లో అయితే అడుగున లేదా ఇరుపక్కల అమరుస్తారు. వాటర్ ప్రెజర్ని మనం తగ్గించుకునే, పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. రూ.15వేల నుంచి వీటి ధర మొదలవుతుంది. అయితే నిర్మాణ సమయంలో ముందస్తు ప్లాన్స్ చేసుకుని గోడలో ఉండే పైప్లోనే ప్రెషర్ వాల్ ఉండేలా చూడాలి.ఇ–టబ్స్ : బాత్రూమ్ టబ్స్లో రేడియో, ఎఫ్ఎం, బ్లూటూత్, మొబైల్ కాలింగ్ కూడా ఉంటాయి. టబ్కి రైట్సైడ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. దీనిని ఆపరేట్ చేసుకోవచ్చు. నీళ్లలో తడిచినా ఆ టచ్స్క్రీన్కు ఏమీ కాదు. ఇది టబ్తో పాటు కలిపి వస్తుంది. దీన్ని తర్వాత ఫిట్ చేసుకోవడం కుదరదు. ఇవి రూ.2లక్షల నుంచి మొదలువుతాయి.స్ట్రిప్ లైట్స్ : సీలింగ్లో లైటింగ్ కోసం మిర్రర్ కానీ స్ట్రిప్ లైట్స్ కానీ ఎక్కువగా వినియోగిస్తారు. దీని వల్ల కొంచెం ఎక్కువ వెలుగు వస్తుంది. సీలింగ్ కోసం 3డీ వాల్పేపర్స్ కూడా వాడుతున్నారు. చూడడానికి టేకు చెక్కతో చేసినవిలా అనిపించే డబ్ల్యూపీవీసీ సీలింగ్ ప్యానెల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒకరకమైన ప్లాస్టిక్ తరహాలో ఉండే ఇవి రిమూవబుల్ కూడా.సిరి ఉంటే ఆవిరి : మరింత రిలాక్సేషన్ కోసం. స్టీమ్బాత్ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటున్నారు. స్టీమ్ ఉంటే ఫాల్స్ సీలింగ్ చేయించకూడదు. త్రీడీ వాల్ పేపర్స్, టైల్స్ మాత్రమే వాడతారు. వీటినే జకోజీ బాత్రూమ్స్గా పిలుస్తున్నారు. వీటి విలువ కనీసం రూ.5లక్షల నుంచి మొదలవుతుంది. స్టీమ్ బాత్, షవర్ ఏరియా, జెట్స్ మసాజ్ అన్నీ కలిపి షవర్ యూనిట్ అంటారని చెప్పారు నగరానికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ కాత్యాయని.. -
ఈ సండే స్పెషల్గా వెరైటీ స్వీట్స్ ట్రై చేయండిలా..!
ఇటలీ క్రిస్పిల్లే రైస్ రోల్స్కావలసినవి: బియ్యం– 250 గ్రాములు (కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి), చిక్కటి పాలు– 400 మి.లీ., నీళ్లు– 100 మి.లీ., ఉప్పు– చిటికెడు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టేబుల్ స్పూన్, పంచదార పొడి– 70 గ్రాములుపైనే, మైదాపిండి– 135 గ్రాములు, తాజా యీస్ట్– 15 గ్రాములు, (2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలలో కలిపి క్రీమ్లా చేసుకోవాలి), దాల్చిన చెక్క పొడి– కొద్దిగా, నారింజ తొక్కల తురుము– కొద్దిగా (నిమ్మ తొక్కలు కూడా తీసుకోవచ్చు) తేనె లేదా పంచదార పాకం– కొద్దిగా, నూనె– సరిపడాతయారీ: ముందుగా పాలు, నీళ్లు ఒక పాత్రలో వేసుకుని, చిన్న మంట మీద ఎసరు పెట్టినట్లుగా పెట్టుకోవాలి. పాలు పొంగుతున్న సమయంలో బియ్యం వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం పలుకుగా ఉంటే ఇంకొన్ని పాలు పోసుకుని ఉడికించుకోవాలి. అన్నం పూర్తి అయిన తర్వాత కాసేపు చల్లారనిచ్చి ఒక బౌల్లోకి తీసుకుని, వెనీలా ఎక్స్ట్రాక్ట్, 70 గ్రాముల పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి, యీస్ట్, మైదా పిండి, నారింజ తొక్క లేదా నిమ్మ తొక్క తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా మెత్తగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు చిత్రంలో చూపిన విధంగా రోల్స్ చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఒక బౌల్లో వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తేనె లేదా పంచదార పాకం వేసుకుని పైన పంచదార పొడి జల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. నారింజ ముక్కలతో వీటిని తింటే భలే రుచిగా ఉంటాయి.ఛెన్నా గొజ్జాకావలసినవి: చిక్కటి పాలు– ఒక లీటరు, నిమ్మరసం– 2 టేబుల్ స్పూన్లు (వెనిగర్ కూడా వాడుకోవచ్చు), కూలింగ్ వాటర్– సరిపడా, రవ్వ– ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి– ఒక టేబుల్ స్పూన్, ఏలకుల పొడి– అర టీస్పూన్, నెయ్యి– వేయించడానికి సరిపడా, పంచదార, నీళ్లు– ఒక కప్పు చొప్పునతయారీ: ముందుగా ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి, మధ్యస్థ మంటపై మరిగిస్తూ, పాలు పొంగకుండా చూసుకోవాలి. మరిగిన తర్వాత ఒక నిమిషం పాటు చల్లారనిచ్చి, ఇప్పుడు నిమ్మరసం లేదా వెనిగర్ను కొద్దికొద్దిగా పోస్తూ, పాలు విరిగే వరకు నెమ్మదిగా కలపాలి. పాలు పూర్తిగా విరిగిపోయాక, విరిగిన పనీర్ను ఒక బౌల్లోకి తీసుకుని చల్లటి నీటిలో వేసి దానిలో కాసేపు కడిగి, పలుచటి క్లాత్లోకి తీసుకోవాలి. నీరు మొత్తం పిండేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. నీరు పిండేటప్పుడు కొద్దిగా తేమ ఉండేలా చూసుకోవాలి.అనంతరం ఆ పనీర్ని సుమారు 5 లేదా 7 నిమిషాలు చేత్తో పిసికి మరింత మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో రవ్వ, మైదా పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. అది అప్పుడు చపాతీ పిండిలా మెత్తగా అవుతుంది. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని, చిన్న మంట మీద, నేతిలో దోరగా వేయించుకోవాలి. ఈలోపు మరో స్టవ్ మీద పంచదార, నీళ్లు పోసుకుని, ఏలకుల పొడి వేసుకుని, లేత పాకం రాగానే కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు అందులో నేతిలో వేగిన ముక్కలను వేయించి పాకంలో నానబెట్టాక సర్వ్ చేసుకోవచ్చు.చాక్లెట్ పీనట్ బార్స్ కావలసినవి: ఓట్స్ పౌడర్– ఒక కప్పుపైనే (ఓట్స్ని దోరగా వేయించి పౌడర్లా చేసుకోవాలి), బాదం పౌడర్– ఒక కప్పు, పీనట్ బటర్– 2 కప్పులు, మేపుల్ సిరప్– 80 ఎమ్ఎల్, డార్క్ చాక్లెట్ ముక్కలు– ఒక కప్పు తయారీ: ముందుగా ఓట్స్ పౌడర్లో బాదం పౌడర్, పీనట్ బటర్, మేపుల్ సిరప్ ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముద్ద కాగానే బేకింగ్ ట్రేలో నింపుకుని సమాంతరంగా ఒత్తుకోవాలి. ఈలోపు చాక్లెట్ ముక్కల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి కరిగించుకుని, ఆ సిరప్ను బేకింగ్ ట్రేలో ఉన్న పీనట్ మిశ్రమంపై, సమానంగా పోసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాల పాటు ఫ్రిజ్లో పెట్టుకుని నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: నీలిరంగులో కనిపించే పండ్లు, కూరగాయలు ఇవే..!) -
జ్యూట్ ఈజ్ క్యూట్!
వర్షాకాలం రైతులు పొలంలో విత్తనాలు వేస్తుంటారు. మొలకెత్తిన గింజ ధాన్యాలతో నారుమడులు కడుతుంటారు. సాగుకు ఉపయోగపడే పనులు ఏ విధంగా అవుతుంటాయో.. ఆ కళ మన ఇంటిలోనూ కనిపించాలంటే ధాన్యపు గింజలను నింపిన చిన్న చిన్న జనుప సంచులకు రంగులు వేసి, వాటిని వరుసలుగా పేర్చితే గది రూపరేఖలే మారిపోతాయి.సంచుల గుచ్ఛాలు పుష్ప గుచ్ఛాల గురించి మనకు తెలిసిందే! చిన్న చిన్న జ్యూట్ సంచులకు ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ కుట్టి, ఆర్టిఫిషియల్ గింజలను అలంకరణకు ఉపయోగించవచ్చు. ఈ హ్యాంగర్స్ను కిచెన్, బాల్కనీ ఏరియాల్లో అలంకరిస్తే అందంగా ఉంటుంది.ఆకర్షణీయంగా కనిపించేలా ...సంచులను లేసులు, ప్యాచ్ వర్క్, రిబ్బన్ వర్క్ ద్వారా అందంగా తయారు చేసుకోవచ్చు. వాటిలో ఉపయోగించే గింజ ధాన్యాలలో వడ్లు, మొక్కజొన్న, కందులు, పెసలు వంటి వేర్వేరు రంగుల్లో కనిపించే గింజలతో నింపవచ్చు.సంచుల కుండలుజనుపనారతో తయారుచేసిన చిన్న చిన్న ఉట్టెలను, వెదురుతో తయారుచేసిన బుట్టలనూ ఈ అలంకరణలో ఉపయోగించవచ్చు. వరి కంకులను, తాటాకుల డిజైన్లను, పక్షుల బొమ్మలనూ ఈ సంచుల అలంకరణలో వాడుకోవచ్చు. – ఎన్.ఆర్ (చదవండి: ప్లాస్టిక్ను తినేసే పుట్టగొడుగులు) -
Anushka Shetty: ఎక్కడికి వెళ్లినా ఆ దేవుడి విగ్రహం తనవెంటే!
అనుష్క శెట్టి.. తెలుగు ప్రేక్షకులకే కాదు, సౌత్ ఇండియన్ ఆడియన్స్కు కూడా ఫేవరెట్ హీరోయిన్. చాలాకాలం గ్యాప్ తర్వాత ‘ఘాటీ’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఆమె గురించి కొన్ని విశేషాలు..యోగా టీచర్ నుంచి..అనుష్క శెట్టి (Anushka Shetty) నవంబర్ 7న పుట్టింది. అదే రోజున మహానటుడు కమల్ హాసన్ పుట్టిన రోజు. అందుకే కొందరు ‘నటనకి పుట్టిన రోజు’ అని కామెంట్ చేస్తుంటారు. నటన మీద ఆసక్తి లేకపోయినా, అనుకోకుండా హీరోయిన్గా అవకాశం వచ్చింది. ముంబైలో భరత్ ఠాకూర్ వద్ద యోగా టీచర్గా పనిచేస్తుండగా, బాలీవుడ్ డైరెక్టర్ ఇ.నివాస్ ద్వారా తెలుగు దర్శక నిర్మాత పూరీ జగన్నాథ్ పరిచయమయ్యారు. అరుంధతితో స్టార్డమ్రామ్ చరణ్ మొదటి సినిమా ‘చిరుత’.. మొదట పూరీ జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్తో ‘సాగర్’ పేరుతో మెహర్ రమేష్ డైరెక్షన్లో తీద్దామనుకున్నారు. ఆ సినిమా కోసం అనుష్కను మొదట ఫొటోషూట్ చేశారు. కానీ అనుకున్నవేవీ జరగలేదు. ‘సూపర్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. ‘అరుంధతి’తో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ మొదలైన సినిమాలు ఆమె స్టార్డమ్ను పెంచాయి. అర్జున్రెడ్డిలో..కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన కుటుంబం అనుష్క శెట్టిది. అందుకే విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’లో హీరోయిన్ మంగళూరు ఏరియాకు చెందిన అమ్మాయి అని చూపించగానే, అనుష్క బాగా కనెక్ట్ అయి, ఆ విషయం హైలైట్ చేస్తూ ట్వీట్ కూడా చేసింది. క్రిష్ డైరెక్షన్లో గతంలో ‘వేదం’ సినిమా చేసిన అనుష్క శెట్టి ఇప్పుడు ‘ఘాటీ’ మూవీ చేస్తోంది.హారర్ సినిమాలంటే భయంమలయాళంలో ఫస్ట్ టైమ్ యాక్ట్ చేస్తోంది. ఆ సినిమా పేరు ‘ఘటన’. కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమా ఎంతటి సెన్సేషనల్ హిట్టో అందరికీ తెలిసిందే. ఆ సినిమా సీక్వెల్కి అనుష్కని హీరోయిన్గా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సెలెక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదెంత నిజమో చూడాలి. ‘అరుంధతి’, ‘పంచాక్షరి’, ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ లాంటి హారర్, క్రైమ్ థ్రిల్లర్స్లో యాక్ట్ చేసిన అనుష్కకి పర్సనల్గా హారర్ సినిమాలు చూడటం అంటే మాత్రం చాలా భయం!వెంటే ఉండాలిఅనుష్క షిర్డీ సాయిబాబా భక్తురాలు. తన మేకప్ రూమ్లో, కార్వాన్లో.. తను వెళ్ళిన ప్రతి చోటకి సాయిబాబా విగ్రహం చిన్నదైనా తీసుకుని వెళ్తుంది. కొంతకాలం వరకు అనుష్కకి, సూపర్ స్టార్ రజనీకాంత్కి ఒకే మేకప్ వుమన్ పని చేసేవారు. చదవండి: హీరోయిన్తో ప్రేమ... పెళ్లి వాయిదా వేసిన విశాల్ -
ఆయన ఇల్లే ఓ మ్యూజియం..!
మనింట్లో తాతయ్య భోజనం చేసిన కంచం, నానమ్మ ఉపయోగించిన వంట పాత్రలు వంటివి ఉంటే, వాటిని ప్రేమగా, మురిపెంగా చూసుకుంటూ ఎంతో అపురూపంగా దాచుకుంటాం. అలాంటిది, ఆయన దగ్గర దాదాపు కొన్ని వందల సంవత్సరాల నాటి పురాతన వస్తువులు ఉన్నాయి. వాటిని రకరకాల ప్రాంతాల నుంచి సేకరించి, తన ఇంటినే మ్యూజియంగా మార్చారు సిద్దిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సే. ఇత్తడి, రాగి వస్తువులను ఇంట్లోని షోకేసులలో చూడచక్కగా అమర్చారు.అప్పటి నుంచే మొదలుఫారూక్ హుస్సేన్కు చిన్నప్పటి నుంచి నిజాం కాలంలో వినియోగించిన వస్తువులు, పురాతన వస్తువులు అంటే ఎంతో ఇష్టం. దీంతో వాటిని సేకరించే పనిలో పడ్డారు. హైదరాబాద్కు చెందిన బషీరుద్దీన్ బాబూఖాన్, జాఫర్ జావేద్ ఇళ్లల్లో చూసిన తర్వాత వాటిపై మరింత మక్కువ పెంచుకున్నారు. పురాతన వస్తువులు ఎక్కడ విక్రయిస్తారో అన్వేషణ సాగించి మరీ, వాటిని సేకరిస్తూ వస్తున్నారు.లండన్ నుంచి కొనుగోలుఫారూక్ హుస్సేన్ కూతురు, అల్లుడు లండన్ లో నివాసం ఉంటున్నారు. వారి దగ్గరికి ఏడాదికి ఒకసారి వెళ్లి వస్తుంటారు. అలా వెళ్లినప్పుడు 2008లో ఒకరోజు లండన్లో సండే మార్కెట్కు వెళ్లారు. అక్కడ పలు పురాతన వస్తువులను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి లండన్ వెళ్లినప్పుడల్లా అక్కడ పురాతన వస్తువులను కొనుగోలు చేసి, తీసుకురావడం మొదలుపెట్టారు. లండన్ నుంచే కాకుండా, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు; మన దేశంలోని ప్రధాన నగరాలైన కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నైలతో పాటు ఇతర నగరాలకు వెళ్లినప్పుడు అక్కడ విక్రయిస్తే అక్కడి నుంచి సైతం కొనుగోలు చేశారు. పాన్దాన్, పావు, చాయ్కేడ్, టుటిక లోటా, వగల్దాన్ – ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తువులను తీసువచ్చారు.సేకరించిన వస్తువులతోవివిధ ప్రాంతాల నుంచి సేకరించిన అపురూపమైన వస్తువులన్నింటినీ తన సిద్దిపేట, హైదరాబాద్ ఇళ్లలోని ముందు గదుల్లో ప్రదర్శించేందుకు వీలుగా ప్రత్యేకంగా ర్యాక్లను తయారు చేయించారు. ఆయన ఇంటికి వచ్చేవారంతా వాటిని చూసి అబ్బురపడుతూ, వాటి గురించి అడిగి తెలుసుకుంటుంటారు. ఫారూక్ వారికి వాటి చరిత్రను, విశేషాలను ఓపికగా వివరిస్తుంటారు.ఇంకా వస్తున్నాయిలండన్లో సండే మార్కెట్లో నచ్చిన వస్తువులను కొనుగోలు చేసి తన కూతురు ఇంట్లో భద్రపరుస్తున్నారు. లండన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చే సమయంలో కొన్ని తీసుకుని వస్తున్నారు. విమానంలో 45 కిలోల బరువు మాత్రమే అనుమతించడంతో దానికి సరిపడే పరిమాణంలోనే తీసుకువస్తున్నారు. విమాన ప్రయాణాల్లో నిబంధనల కారణంగా అక్కడ కొనుగోలు చేసిన వాటిలో దాదాపు 100 కిలోల మేరకు వస్తువులు అక్కడే ఉండిపోయాయి. వీలు చిక్కినప్పుడు వాటిని ఇక్కడికి తీసుకువస్తానని ఫారూఖ్ చెబుతున్నారు.ముప్పయి దేశాల నాణేలుమన దేశంలో వాడుకలో లేకుండా పోయిన పాతకాలం అణా పైసల నాణేల నుంచి పావలాల వరకు ఎన్నో పాత నాణేలు కూడా ఫారూక్ సేకరణలో ఉన్నాయి. వీటితో పాటు నిజాం కాలంలో ఉపయోగించిన సిక్కా నాణేలు కూడా ఉన్నాయి. మనదేశంతో పాటు విదేశాలకు చెందిన నాణేలను సేకరించడాన్ని ఆయన హాబీగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు సుమారుగా ముప్పయికి పైగా దేశాలకు చెందిన నాణేలను దాదాపు ఐదువందలకు పైగా సేకరించారు.అల్లుడు సండే మార్కెట్కు తీసుకవెళ్లాడు....మా బిడ్డ ఇంటికి లండన్ వెళ్లాం. అక్కడ కాలక్షేపం కాకపోవడంతో మా అల్లుడు సండే మార్కెట్కు తీసుకవెళ్లాడు. ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకున్న పురాతన వస్తువులు అక్కడ కనిపించాయి. దీంతో చాలా వస్తువులను లక్షలు పెట్టి కొనుగోలు చేశాను. ఇంట్లో వాటి కోసం ప్రత్యేకంగా ర్యాక్లు చేయించాను. మా ఇంటికి వచ్చిన వారందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తారు. ‘ఇవన్నీ మీ తాతలు వినియోగించినవా?’ అని అడుగుతారు. చిన్నప్పటి నుంచి పురాతన వస్తువుల మీద ఇష్టం ఉండటంతో కొనుగోలు చేస్తున్నా అని చెబుతుంటారు ఫారూక్ హుస్సేన్. గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట(చదవండి: స్మార్ట్ స్టడీ స్ట్రాటజీస్..!) -
స్మార్ట్ స్టడీ స్ట్రాటజీస్..!
ప్రతి విద్యార్థి రోజూ గంటలు, గంటలు చదువుతున్నారు. అయినా పరీక్షల్లో గందరగోళ పడుతున్నారు. చదివినది గుర్తురాక, పరీక్షలు సరిగా రాయలేక ఆందోళనకు లోనవుతున్నారు. దాంతో పేరెంట్స్, టీచర్స్ మరిన్ని గంటలు చదవమని ఒత్తిడి పెడుతున్నారు. విద్యార్థులతో రెండు దశాబ్దాలకు పైబడి పనిచేస్తున్న సైకాలజిస్ట్గా, జీనియస్ మ్యాట్రిక్స్ డెవలపర్గా ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా. ఎన్ని గంటలు చదివామనే దానికన్నా, ఎంత బాగా చదివామనేది ముఖ్యం. మెదడు ఎలా నేర్చుకుంటుందో తెలుసుకుని చదివితే మార్కులు పరుగెత్తుకుంటూ వస్తాయి. లేదంటే మీరు పెట్టే శ్రమ, టైమ్, ఫీజులు అన్నీ వృథా అవుతాయి. అందుకే స్మార్ట్గా ఎలా చదవాలో తెలుసుకుందాం. లైఫ్ లాంగ్ లెర్నర్గా ఎదుగుదాం. మార్కులు, ర్యాంకుల కన్నా ఇదే నిజమైన విజయం. లెర్నింగ్ సైన్స్మనం కొత్తగా ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు నాడీకణాల మధ్య బంధాలు బలపడతాయి. ప్రతిసారి రివిజన్ చేసేటప్పుడు ఆ బంధాలు మైలినేషన్ అనే ప్రక్రియ ద్వారా వేగవంతం అవుతాయి. అప్పుడు గుర్తుంచుకోవడం సులువవుతుంది. స్పేస్డ్ రిపిటీషన్, రిట్రీవల్ ప్రాక్టీస్, ఇంటర్ లీవింగ్ వంటి టెక్నిక్స్ వల్ల చదివింది బాగా గుర్తుంటుందని కెంట్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధనల్లో వెల్లడైంది. యాక్టివ్ రీకాల్: ఒక సెక్షన్ చదివాక, పుస్తకం మూసేసి ‘ఇప్పుడు నేనేం నేర్చుకున్నాను, నా ప్రెజెంట్ నాలెడ్జ్తో అదెలా కలుస్తుంది, నేర్చుకున్నది ఏమిటి?’ అని మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇది జ్ఞాపకంలో నుంచి సమాచారాన్ని తిరిగి తెస్తుంది. దీని వల్ల జ్ఞాపకం బలపడుతుంది.స్పేస్డ్ రిపిటీషన్: ఎవరేం నేర్చుకున్నా 24 గంటల్లో దాదాపు 70 శాతం మర్చిపోతారు. దీర్ఘకాలం గుర్తుండాలంటే 24 గంటల్లోపు ఒకసారి రివిజన్ చేయాలి. ఆ తర్వాత వారం, నెల, మూడు నెలల వ్యవధిలో రివిజన్ చేయడం వల్ల నేర్చుకున్నది దీర్ఘకాలిక జ్ఞాపకాల్లోకి చేరి పూర్తిగా గుర్తుంటుంది. ఇంటర్ లీవింగ్: ఒకే సబ్జెక్ట్ గంటల తరబడి చదవకుండా, సంబంధిత సబ్జెక్ట్స్ను మార్చి మార్చి చదవడం మెదడులో ఫ్లెగ్జిబిలిటీని పెంచుతుంది.డ్యూయల్ కోడింగ్: పదాలతో పాటు విజువల్స్ కలిపి చదవడం. మైండ్ మ్యాప్స్, డయాగ్రమ్స్ వాడడం వల్ల మాటల జ్ఞాపకం, విజువల్ జ్ఞాపకం రెండూ కలసి జ్ఞాపకం పెరుగుతుంది. టీచ్ వాట్ యూ లెర్న్: మీరు నేర్చుకున్నది ఇతరులకు బోధించండి. లేదా మీకు మీరే చెప్పుకోండి. దీనివల్ల మెదడులో సమాచారం క్లియర్గా ఆర్గనైజ్ అవుతుంది. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినవి రోజూ గంటలకు గంటలు చదవమని పిల్లలను ఒత్తిడి చేయవద్దు. ప్రతిరోజూ కొద్దిపాటి విరామాలతో కొద్ది కొద్ది సేపు చదివేలా అలవాటు చేయండి.కేవలం మార్కులు, ర్యాంకులకే కాదు– ప్రయత్నం, స్ట్రాటజీ, క్రియేటివిటీని అభినందించండి. ఉదాహరణకు, ‘నువ్వు ఈ క్లిష్టమైన చాప్టర్ను సులువుగా విభజించడం నాకెంతో నచ్చింది’ అని చెప్పండి.చదవడానికి డిస్ట్రాక్షన్స్ లేని ప్రశాంత వాతావరణం సృష్టించండి. రోజుకు కనీసం7–9 గంటల నిద్ర అందేలా చూడండి.రోజూ వ్యాయామం చేయడం వల్ల మెదడులో కొత్త కనెక్షన్లను ఏర్పరచే బీఎన్డీఎఫ్ అనే ప్రొటీన్ విడుదలవుతుంది. మెదడుకు శక్తినిచ్చే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్నట్స్, ఫ్లాక్స్సీడ్స్, చేపలు, బెర్రీలు వంటివి అందించండి. విద్యార్థులు చేసే పొరపాట్లుపాసివ్ రీడింగ్: పాఠాలను హైలైట్ చేస్తూ పదేపదే చదివితే బాగా గుర్తుంటుందని అనుకుంటారు. కానీ దీనివల్ల బలమైన మెమరీ ట్రేసెస్ ఏర్పడవు. క్రామింగ్: చివరి రోజు వరకు వాయిదా వేసి ఒక్కరోజులో మొత్తం రివిజన్ చేయడం వర్కింగ్ మెమరీను ఒత్తిడికి గురి చేస్తుంది. ఈజీగా మరచిపోతారు.మల్టీ టాస్కింగ్: చదివేటప్పుడు టీవీ చూడటం, సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడం, ఒకేసారి రెండు మూడు సబ్జెక్టులు చదవడంలాంటి పనులు చేస్తే అధ్యయన సామర్థ్యం 40 శాతం వరకు తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.మూడు స్మార్ట్ స్టడీ స్ట్రాటజీస్పొమోడోరో టెక్నిక్: 25 నిమిషాలు ఫోకస్తో చదివి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. అలా నాలుగుసార్లు చదివాక 20–30 నిమిషాలు పెద్ద విరామం తీసుకోండి. సెల్ఫ్–టెస్టింగ్: చాప్టర్ హెడింగ్స్ను ప్రశ్నలుగా మార్చుకుని ముందుగా వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. తరువాత చదివాక తిరిగి పరీక్షించుకోండి.కాంటెక్స్ట్ /వేరియేషన్: ఎప్పుడూ ఒకే చోట కూర్చుని చదవకండి. చదివే ప్రదేశాలు మార్చడం వల్ల జ్ఞాపకానికి వివిధ క్యూస్ ఏర్పడి గుర్తుకు తెచ్చుకోవడం సులువవుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: జైలు శిక్షనే శిక్షణగా మార్చుకున్న జీనియస్ ఖైదీ..!) -
ప్లాస్టిక్ను తినేసే పుట్టగొడుగులు
ప్లాస్టిక్ తెచ్చిపెట్టే అనర్థాలు ప్రపంచానికి అనుభవపూర్వకంగా తెలుసు. అయినా, ప్రపంచంలో ప్లాస్టిక్ ఉత్పాదనా తగ్గడం లేదు; ప్లాస్టిక్ వినియోగమూ తగ్గడం లేదు. ప్లాస్టిక్ను నేలమీద పడేస్తే, అది ఎన్నేళ్లు గడిచినా మట్టిలో కలిసిపోదు. నదుల్లోను, సముద్రాల్లోను పడేస్తే, నీటిలో కరిగిపోదు. ప్లాస్టిక్ వల్ల ప్రపంచవ్యాప్తంగా నేల, నీరు కలుషితమవుతున్నాయి. ప్లాస్టిక్ సమస్యను అరికట్టాలంటే, ప్లాస్టిక్ ఉత్పాదన, వినియోగం తగ్గాలని ఇప్పటివరకు చాలామంది పర్యావరణవేత్తలు చెబుతూ వస్తున్నారు. అయితే, ప్లాస్టిక్ సమస్యకు ప్రకృతిలోనే పరిష్కారం ఉంది. కొన్నిరకాల పుట్టగొడుగులకు ప్లాస్టిక్ను తినేసే శక్తి ఉంది. ప్లాస్టిక్ పేరుకుపోయిన ప్రదేశాల్లో ఆ పుట్టగొడుగులను పెంచితే చాలు, ప్లాస్టిక్ సమస్య ఇట్టే పరిష్కారమవుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్ను తినేసే పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం.పెస్టలోటియాప్సిస్ మైక్రోస్పోరాఅమెజాన్ అడవుల్లో కనిపించే పుట్టగొడుగులు ఇవి. తొలిసారిగా వీటిని 1880లో శాస్త్రవేత్తలు గుర్తించారు. బాగా వానలు కురిసే దట్టమైన అడవుల్లో భారీ వృక్షాల కాండాలను, కొమ్మలను ఆశ్రయించుకుని, ఈ పుట్టగొడుగులు పెరుగుతాయి. ఇవి తినడానికి పనికిరావు. ఈ పుట్టగొడుగులు సునాయాసంగా ప్లాస్టిక్ను తినేస్తాయి. వీటికి గల ప్లాస్టిక్ను తినేసే లక్షణాన్ని శాస్త్రవేత్తలు 2010లో గుర్తించారు. ప్లాస్టిక్లో కీలకంగా ఉండే ‘పాలీయురెథీన్’ అనే పాలిమర్ అణువులను ఈ పుట్టగొడుగులు చాలా సులువుగా విచ్ఛిత్తి చేసేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల పర్యావరణానికి ప్లాస్టిక్ ముప్పు తప్పుతుంది. ఈ పుట్టగొడుగుల లక్షణాలు, ప్లాస్టిక్లోని పాలిమర్ అణువులను విచ్ఛిత్తి చేయడంలో వాటి శక్తిసామర్థ్యాలపై శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు జరుపుతున్నారు. ఆయిస్టర్ మష్రూమ్ఉష్ణమండల ప్రాంతాల్లోను, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లోను ఈ పుట్టగొడుగులు విరివిగా కనిపిస్తాయి. తేమ వాతావరణంలో ఇవి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. చెట్ల కాండాలను, కొమ్మలను అంటిపెట్టుకుని, విసనికర్ర ఆకారంలో పెరిగే ఈ పుట్టగొడుగులు ఆహారంగా కూడా పనికొస్తాయి. వీటిని ఆహారంగానే కాకుండా, కృత్రిమ తోలు తయారీ కోసం, ఫర్నిచర్ తయారీ కోసం, ఇటుకల తయారీ కోసం కూడా వినియోగిస్తుంటారు. ప్లాస్టిక్లోని పాలిమర్ కణాలను ఈ పుట్టగొడులు విచ్ఛితి చేయగలవనే విషయాన్ని యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తొలిసారిగా 2011లో గుర్తించారు. ఆక్సిజన్ ఉన్న పరిస్థితుల్లోనైనా, ఆక్సిజన్ లేని పరిస్థితుల్లోనైనా ఈ పుట్టగొడుగులు ప్లాస్టిక్లోని పాలిమర్ కణాలను సమర్థంగా విచ్ఛిత్తి చేయగలవని వారి పరిశోధనల్లో తేలింది. ఈ పుట్టగొడుల్లో ఉండే ‘ల్యాకేస్’ అనే ఎంజైమ్కు ప్లాస్టిక్లోని పాలిమర్ కణాలను విచ్ఛిత్తి చేయగల శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. వీటిపై వారు మరింతగా పరిశోధనలు సాగిస్తున్నారు.ఆస్పెర్గిలస్ ట్యూబిన్జెన్సిస్పుట్టగొడుగుల పరిమాణంలో పెరగదు గాని, ఇది కూడా ఒకరకం ఫంగస్. ఈ ఫంగస్ పెరిగిన చోట ముదురు గోధుమ రంగు లేదా ముదురు బూడిద రంగులో దట్టంగా పేరుకుని కనిపిస్తుంది. ఈ ఫంగస్ పరిమాణం ఒక్కొక్కటి 3 నుంచి 5 మైక్రాన్ల వ్యాసం వరకు ఉంటుంది. దీనిని శాస్త్రవేత్తలు తొలిసారిగా 1934లో గుర్తించారు. ఇది ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. అల్ట్రావయొలెట్ కిరణాలను తట్టుకుని మరీ ఈ ఫంగస్ బతకగలదు. తేమ వాతావరణంలో ఉష్ణోగ్రతలు 21 డిగ్రీల నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నట్లయితే, ఈ ఫంగస్ విపరీతంగా పెరుగుతుంది. ఈ ఫంగస్ను ఔషధ తయారీ పరిశ్రమల్లో చాలాకాలంగా వాడుతున్నారు. ఎమిలేజ్, ఫైటేజ్, యాసిడ్ ఫాస్ఫేటేజ్, జైలానేజ్ వంటి రకరకాల ఎంజైమ్ల తయారీ కోసం ఈ ఫంగస్ను వినియోగిస్తారు. చైనా, పాకిస్తాన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో 2017లో ఈ ఫంగస్కు ప్లాస్టిక్ వ్యర్థాలను నాశనం చేసే శక్తి ఉన్నట్లు వెల్లడైంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్లో ఒక చెత్తకుప్పపై పెరిగిన ఈ ఫంగస్ను శాస్త్రవేత్తలు గమనించారు. చెత్తలోని ప్లాస్టిక్ పదార్థాలను ఈ ఫంగస్ తినేస్తూ ఉండటాన్ని వారు గుర్తించారు. దీనిపై అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.ఆస్పెర్గిలస్ టెరోస్ఇది ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఫంగస్. శీతోష్ణ స్థితులకు అతీతంగా, కాస్తంత తేమ ఉన్న చోటల్లా ఈ ఫంగస్ పెరుగుతుంది. గుండ్రంగా ఉండే ఈ ఫంగస్ కణాలు ఒక్కొక్కటి దాదాపు 2 మైక్రాన్ల వ్యాసంలో ఉంటాయి. ఈ కణాలు గాలిలో తేలికగా కలిసిపోతాయి. తేమ ఉన్న ఉపరితలానికి చేరుకున్నప్పుడు వేగంగా పెరుగుతాయి. బాగా పెరిగినప్పుడు ఆహార పదార్థాల మీద, కట్టెల మీద దట్టంగా బూజు పేరుకున్నట్లుగా ఈ ఫంగస్ కనిపిస్తుంది. ఈ ఫంగస్ మనుషులకు, పశువులకు సోకినప్పుడు ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది. పంటలను ఆశించినప్పుడు పంటనష్టం కలిగిస్తుంది. ఈ ఫంగస్ తక్కువ సాంద్రత కలిగిన ప్లాస్టిక్ కణాలను నాశనం చేయగలదని 2023లో జరిపిన పరిశోధనల్లో ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిపై వారు మరింత విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నారు.ప్లాస్టిక్ విచ్ఛిత్తి కోసం ఈ రకాల ఫంగస్ను వాడుకునేటట్లయితే, ప్రపంచానికి ప్లాస్టిక్ కాలుష్యం నుంచి ముప్పు తప్పుతుందని పర్యావరణవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడే ప్రతిచోటా ఈ రకాల ఫంగస్ను పెంచేటట్లయితే, కాలుష్యాన్ని నివారించవచ్చునని చెబుతున్నారు.(చదవండి: జైలు శిక్షనే శిక్షణగా మార్చుకున్న జీనియస్ ఖైదీ..!) -
లెక్కలతో జీవితాన్నే తిరగరాసుకున్న ఖైదీ..!
జైలు గోడల మధ్య మగ్గిపోతున్న కాలంలోనే ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట నాయకులు అద్భుతమైన రచనలు చేసిన సంగతి చాలామందికి తెలుసు. అయితే, అమెరికాలో జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ స్వయంకృషితో గణిత సాధన చేస్తూ, ప్రపంచ గణిత మేధావుల దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. దృఢసంకల్పం ఉండాలే గాని, అనుకున్నది సాధించడానికి జైలుగోడలు ఆటంకం కాదని నిరూపిస్తున్నాడు.ఆ ఖైదీ పేరు క్రిస్టఫర్ హేవెన్స్. హత్య కేసులో అతడికి 2010లో పాతికేళ్ల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి జైలులో ఒంటరి గదిలో ఉంటూ లెక్కల లోకంలో లోతుగా మునిగిపోయాడు. జైలు గదిలో చిన్న పజిల్స్తో మొదలైన ప్రయాణం, పెద్ద గణిత సూత్రాల వరకు వెళ్లింది. అతడు ఉండే జైలు గదిలో కంప్యూటర్ లేదు, ఇంటర్నెట్ లేదు, చేతిలో పుస్తకం, మదిలో లక్ష్యాలు తప్ప. అలా లెక్కలు వేసి వేసి నోటుబుక్కులు, జైలు గోడలు నింపేశాడు. ఏకంగా ప్రపంచానికి కొత్త గణిత రహస్యాన్ని చూపించి, గణిత పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. క్రిస్టఫర్ ప్రయాణం అంతటితోనే ఆగలేదు. ‘నేను మాత్రమే కాదు, అందరూ గణితం నేర్చుకోవాల్సిందే!’అనే తపనతో, జైల్లో నుంచే ఖైదీల కోసం ‘ప్రిజన్ మ్యాథ్స్ ప్రాజెక్టు’ ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కింద అమెరికాలోని దాదాపు ముప్పై రాష్ట్రాల్లో వందలాది ఖైదీలు గణితంలో మునిగి తేలుతున్నారు. వారిని చూస్తే, నిజంగా జైలులో ఉన్నారా, లేక ఏదైనా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. మరో కొత్త ప్రయత్నంఇంతలోనే ఇంకో కొత్త ప్రయత్నం. ‘కంప్యూటర్ లేని ఖైదీలు గణితంలో సంక్లిష్టమైన లెక్కలు ఎలా చేయాలి?’ అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడే హేవెన్స్కి తట్టిన ఆలోచన. ‘ఈమెయిలు ద్వారా కోడింగ్’ ఈ పద్ధతిలో కోడ్ లేఖలా పంపిస్తారు, ఫలితాలు తిరిగి వస్తాయి. ఈ విధానంతో జైలులో ఉండే ఖైదీ ఇప్పుడు మేఘగణన చేస్తున్నాడు. ప్రస్తుతం క్రిస్టఫర్, జర్మనీకి చెందిన గణిత నిపుణుడితో కలిసి ‘జోప్’ అనే గణిత శ్రేణిపై పరిశోధన చేస్తున్నాడు. ఈ విషయమై హేవెన్స్ మాట్లాడుతూ, ‘న్యాయం అంటే శిక్ష కాదు, మార్పు. లెక్కలతో నా జీవితాన్ని తిరిగి రాసుకున్నా’ అని చెప్పాడు. (చదవండి: పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?) -
నీలిరంగులో కనిపించే పండ్లు, కూరగాయలు ఇవే..!
కొన్ని పండ్లు, కూరగాయలు సర్వసాధారణంగా ఒక నిర్దిష్టమైన రంగులో ఉంటాయి. అవి భిన్నమైన రంగులో కనిపిస్తే, అదొక విచిత్రంగా ఉంటుంది. అలవాటైన రంగుల్లో కాకుండా, నీలిరంగులో కనిపించే కొన్ని రకాల పండ్లు, కూరగాయల సంగతి తెలుసుకుందాం...టొమాటోలు పండిన తర్వాత ఎర్రని ఎరుపురంగులో ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అరుదుగా కొన్ని జాతుల టొమాటోలు ముదురు నీలి రంగులోను, ముదురు ఊదా రంగులోను ఉంటాయి. వీటిని ‘బ్లూ టొమాటో’ అని, ‘పర్పుల్ టొమాటో’ అని అంటారు. ఇవి ప్రకృతి సిద్ధంగా పండినవి కాదు. ఇంగ్లండ్లోని జాన్ ఇనెస్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి ద్వారా ఈ నీలి టొమాటో జాతులను సృష్టించారు. నేరేడు జాతికి చెందిన పండ్ల రంగుకు కారణమైన పిగ్మెంట్తో ముదురు నీలి, ముదురు ఊదా రంగులు వచ్చేలా టొమాటోలను రూపొందించారు. వీటిని ఇప్పుడు పలు యూరోపియన్ దేశాల్లో పండిస్తున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, ఈ జాతుల టొమాటో మొక్కలు చీడ పీడలను తట్టుకుని పుష్కలంగా దిగుబడిని ఇవ్వగలవని చెబుతున్నారు.బ్లూ క్యారట్స్మొక్కజొన్న దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా దొరుకుతుంది. సాధారణంగా మొక్కజొన్న గింజలు పసుపు రంగులో ఉంటాయి. అక్కడక్కడా లేత పసుపు, తెలుపు రంగు గింజలతో కూడా ఉంటాయి. అరుదుగా నీలి రంగు గింజలు ఉండే మొక్కజొన్నలు మెక్సికోలో పండుతాయి. మామూలు మొక్కజొన్న మాదిరిగానే నీలి మొక్కజొన్నను కూడా రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. సాధారణ మొక్కజొన్నల కంటే నీలి మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతారు.నీలి ముల్లంగిమన దేశంలో ఎక్కువగా ముల్లంగి తెలుపు రంగులోనే దొరుకుతుంది. కొన్ని దేశాల్లో ఎరుపు, పసుపు, గులాబి వంటి రంగుల్లో కూడా దొరుకుతుంది. అరుదుగా కొన్ని చోట్ల ముదురు నీలి, ముదురు ఊదా రంగుల్లో కూడా ముల్లంగి దొరుకుతుంది. నీలి, ఊదా రంగుల్లో ఉన్న ముల్లంగిని కోస్తే, లోపలి భాగంలో నీలి, ఊదా రంగులతో పాటు కొంత తెలుపుదనం కూడా ఉంటుంది. రుచికి ఈ రకం ముల్లంగి కొంచెం తీపిగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. వీటిని పచ్చిగా తినడంతో పాటు సలాడ్లు, ఇతర వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తారు.చిలకడ దుంపలు సాధారణంగా కాస్త ఎరుపురంగు తొక్కతోను, లేత గోధుమ రంగు తొక్కతోను ఉంటాయి. తొక్క రంగు ఎలా ఉన్నా, లోపలి భాగం తెలుపుగా లేదా లేత నారింజరంగులోను ఉంటుంది. ముదురు రంగు తొక్క కలిగి, లోపలి భాగం కూడా ముదురు ఊదా రంగు లేదా ముదురు నీలి రంగులో ఉండే ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకాన్ని జపాన్లో పండిస్తారు. దీనిని ‘ఒకినావన్ స్వీట్ పొటాటో’ అంటారు. సాధారణ చిలకడ దుంపల కంటే ఈ ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకానికి చెందిన చిలకడ దుంపల్లో పోషకాలు మరింత అధికంగా ఉంటాయని చెబుతారు.నీలి అరటిపండ్లుఅరటిపండ్లు ఎక్కువగా పసుపురంగులో ఉంటాయి. కొన్ని ఆకుపచ్చగాను, అరుదుగా ఇంకొన్ని ఎరుపు రంగులోను ఉంటాయి. జావాలో మాత్రం ప్రపంచంలోనే అత్యంత అరుదైన నీలిరంగు అరటిపండ్లు పండుతాయి. దీనిని ‘బ్లూ జావా బనానా’ అని, ‘హవాయిన్ బనానా’ అని అంటారు. అరటిచెట్లు శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పెరగవు. అయితే, ఈ నీలి అరటిపండ్ల జాతికి చెందిన చెట్లు మాత్రం చల్లని వాతావరణాన్ని కూడా తట్టుకుని పెరగగలవు. దీని రుచి వెనీలా ఐస్క్రీమ్లా ఉంటుంది. అందువల్ల దీనిని ‘వెనీలా బనానా’ అని, ‘ఐస్క్రీమ్ బనానా’ అని కూడా అంటారు. ఇప్పుడు వీటిని యూరోపియన్ దేశాల్లో కూడా పండిస్తున్నారు.బ్లూ స్వీట్ పొటాటోచిలకడ దుంపలు సాధారణంగా కాస్త ఎరుపురంగు తొక్కతోను, లేత గోధుమ రంగు తొక్కతోను ఉంటాయి. తొక్క రంగు ఎలా ఉన్నా, లోపలి భాగం తెలుపుగా లేదా లేత నారింజరంగులోను ఉంటుంది. ముదురు రంగు తొక్క కలిగి, లోపలి భాగం కూడా ముదురు ఊదా రంగు లేదా ముదురు నీలి రంగులో ఉండే ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకాన్ని జపాన్లో పండిస్తారు. దీనిని ‘ఒకినావన్ స్వీట్ పొటాటో’ అంటారు. సాధారణ చిలకడ దుంపల కంటే ఈ ‘బ్లూ స్వీట్ పొటాటో’ రకానికి చెందిన చిలకడ దుంపల్లో పోషకాలు మరింత అధికంగా ఉంటాయని చెబుతారు.బ్లూ పొటాటోబంగాళ దుంపలు పైకి గోధుమరంగులో ఉంటాయి. తొక్క తీశాక తెలుపురంగులో ఉంటాయి. అయితే, ముదురు నీలి రంగులోను, ముదురు ఊదా రంగులోను ఉండే బంగాళ దుంపలు కూడా ఉన్నాయి. తొక్క తీసి, తరిగిన తర్వాత కూడా ఈ దుంపలు ముదురు ఊదా లేదా నీలి రంగుల్లోనే ఉంటాయి. ‘అడిరోన్డాక్ బ్లూ’ జాతికి చెందిన బంగాళ దుంపలు ఈ ముదురు ఊదా లేదా నీలి రంగుల్లో ఉంటాయి. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటి నుంచి మరిన్ని నీలిరంగు బంగాళ దుంపల జాతులను కూడా ఇటీవలి కాలంలో అభివృద్ధి చేశారు. (చదవండి: పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?) -
రాలిన జుట్టే పెరిగేనులే..!
చక్కని తలకట్టుతోనే ముఖానికి అందం వస్తుంది. జుట్టు ఊడిపోతున్నా, నెత్తి పలచబడిపోతున్నా చాలామంది అసలు సహించలేరు. జుట్టు ఊడిపోయే సమస్యకు ‘ప్లాస్మా థెరపీ’తో మంచిఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ చికిత్సలో ఎవరికి ట్రీట్మెంట్ చేస్తున్నారో వారి రక్తమే సేకరించి, ఆ రక్తంలో ప్లేట్లెట్లు అధికంగా ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాలో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఉంటాయి. వాటిని సూక్ష్మంగా ఉండే సూదులతో, తలపైన జుట్టు రాలిన ప్రదేశంలో ఇంజెక్ట్ చేస్తారు. ఇలా ఇంజెక్ట్ చేయడం వల్ల దెబ్బతిన్న జుట్టు కుదుళ్లు పునరుత్తేజం పొంది, కొత్త జుట్టు ఏపుగా, ఒత్తుగా పెరుగుతుంది. ఈ ట్రీట్మెంట్కి సాధారణంగా 3 నుంచి 6 వారాల వ్యవధిలో, సుమారు 4 సెషన్లు అవసరమవుతాయి.చర్మ సంరక్షణ కోసం..ఆధునిక జీవనశైలిలో, చర్మ సంరక్షణకు సమయం దొరకడం చాలా కష్టంగా మారుతోంది. అలాంటప్పుడు చర్మాన్ని ఎల్లవేళలా కళకళలాడేలా ఉంచుకోవాలంటే చిత్రంలోని ఈ స్టైలిష్ గాడ్జెట్ని వెంట ఉంచుకోవాల్సిందే!ఈ ‘పోర్టబుల్ నానో ఫేషియల్ డివైస్’ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. రోజువారీ చర్మ సంరక్షణకు, ఇది కాంపాక్ట్గా ఉంటుంది. ఆఫీసులో ఉన్నా, ప్రయాణాల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఈ డివైస్ను ఉపయోగించి, చర్మానికి తక్షణ తాజాదనాన్ని పొందవచ్చు. ఈ ఫేషియల్ స్టీమర్ పైభాగంలో ప్రత్యేకమైన మిర్రర్ ఉంటుంది. దాని చుట్టూ ఎల్ఈడీ లైట్ కూడా ఉండటంతో చీకటి వేళల్లో కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. ఈ మిర్రర్ 180 డిగ్రీలు కదులుతూ ఉండటంతో, నచ్చిన తీరులో పట్టుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ మిర్రర్ ఇరువైపులా ఉండటంతో ఎటు తిప్పినా అందాన్ని చూసుకోవచ్చు.పైగా ఈ డివైస్ ఆన్లో ఉన్నప్పటికీ శబ్దం చేయదు. ఆటో షట్డౌన్ ఆప్షన్తో చాలా అనుకూలంగా పని చేస్తుంది. దీనిలో టెంపరేచర్ సెట్టింగ్స్ మార్చుకోవడం కూడా తేలికే! దీని ధర సుమారు రూ.2,500 ఉంటుంది. ఈ డివైస్ నుంచి వచ్చే ఆవిరితో చర్మాన్ని లోతుగా శుభ్రపరచుకోవచ్చు. దీనిలో 80 ఎమ్ఎల్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. దీనిని ఈజీగా డివైస్కి కింద భాగంలో సొరుగు మాదిరిగా అమర్చుకోవచ్చు. ఇది ఆగకుండా పదిహేను నిమిషాల పాటు ఆవిరి అందిస్తుంది. ఈ స్పెషల్ ఫేస్ స్టీమర్ వెంట ఉంటే అన్ని వేళలా తాజాగా మెరిసిపోవచ్చు. (చదవండి: ఒత్తిడి కంటిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే..! హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు) -
సంగీత సంబరం..!
శ్రావ్యమైన సంగీతానికి చెవి కోసుకునే స్వరాభిమానులకు సరైన వేదిక– జపాన్లో జరిగే ‘ఫుజీ రాక్ ఫెస్టివల్!’ ఈ వేడుక జపాన్లోని నిగాటా ప్రిఫెక్చర్లో ఉన్న నేబా స్కీ రిసార్ట్లో ప్రతి ఏటా జూలై నెల చివరి వారంలో మూడురోజుల పాటు జరుగుతుంది. ఈ నెల 25 నుంచి 27 వరకు ఈ సంగీత సంబరం జరగనుంది. ఈ వేడుక తొలిసారిగా 1997లో ప్రారంభమైంది. పచ్చని పర్వతాల నడుమ, స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో ప్రత్యేకంగా సాగుతుంది.ఈ వేడుకలో వివిధ దేశాలకు చెందిన వందలాది మంది కళాకారులు పాల్గొంటారు. రాక్, పాప్, ఎలక్ట్రానిక్, హిప్–హాప్, జానపద శైలులలో సంగీతం శ్రోతలకు వీనులవిందు చేస్తుంది. గ్రీన్ స్టేజ్, వైట్ స్టేజ్, రెడ్ మార్క్ వంటి అనేక వేదికలపై జరిగే ప్రదర్శనలు సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తాయి. సంగీత ప్రదర్శనలతో పాటు, స్థానిక కళా ప్రదర్శనలు, ఇతర వినోద కార్యక్రమాలు ప్రేక్షకులను మరింతగా ఉత్సాహపరుస్తాయి.ఫుజీ రాక్ ఫెస్టివల్ కేవలం సంగీతానికి మాత్రమే పరిమితం కాదు, ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యమిస్తుంది. ఈ వేడుకల నిర్వాహకులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ను ప్రోత్సహించడం వంటి అనేక పర్యావరణ అనుకూల కార్యక్రమాలను చేపడతారు. ‘ప్రకృతితో కలసి ఉందాం’ అనే నినాదంతోనే ఈ వేడుక ప్రపంచ ప్రసిద్ధి పొందింది. (చదవండి: రాజుగారి 'కలా'ఖండం..! మదిలో మెదిలి, రూపుదిద్దుకున్న కోట) -
పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?
నాకు ముప్పై ఐదు ఏళ్లు. మోకాలి నొప్పి చాలా ఎక్కువగా ఉంది. కొన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ వాడాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను. మునుపటి మందుల వలన ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఇప్పటికీ ఆ మందులు వాడొచ్చా?– అనిత, మెదక్.మీరు చెప్పిన మోకాలి నొప్పి సమస్య ఆస్టియో ఆర్థరైటిస్ కారణం కావచ్చు. ఇది జాయింట్ డీజెనరేషన్ లక్షణాలలో ఒకటి కావచ్చు. పెయిన్ కిల్లర్ మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కాని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో మాత్రం ఈ మందుల వాడకాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఐబుప్రొఫెన్ లాంటి మందులు తక్కువ కాలం ఉపశమనం ఇస్తాయి కాని, దీర్ఘకాలంగా వాడడం సురక్షితమేమీ కాదు. ముందుగా పూర్తి పరీక్షలు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. ఐబుప్రొఫెన్ వంటి మందులు ఎన్ ఎస్ఎఐడీ గ్రూపులోకి వస్తాయి. ఇవి నొప్పికి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. అయితే కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా వుంటాయి. మోకాలిలో నొప్పి లేదా గట్టిపడటం వంటి సందర్భాల్లో శరీరంలో ప్రోస్టాగ్లాండిన్లు అనే కెమికల్స్ విడుదల అవుతాయి. వీటిని తగ్గించడానికే ఈ మందులు పనిచేస్తాయి. ప్రెగ్నెన్సీలో వీటిని వాడితే పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని మందులు జీర్ణాశయంలో అల్సర్లు, శ్వాస సమస్యలు, బ్లడ్ క్లాట్లు వంటి ఇబ్బందులు కలిగించవచ్చు. హెర్బల్ మందులు కూడా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో ఏ ఔషధాన్నైనా డాక్టర్ను సంప్రదించి మాత్రమే వాడాలి.నాకు యాభై ఐదు ఏళ్లు. ఇటీవల వజైనాలో పొడిగా ఉంటోంది. ఇరిటేషన్, ఇచింగ్, డిశ్చార్జ్ వస్తోంది. కొన్ని క్రీములు వాడాను. అయినా తగ్గడం లేదు. పరిష్కారం చెప్పండి.– సుజాత, రాజోలు.వజైనాలో పొడిబారడం అంటే ఎక్కువగా హార్మోనుల మార్పుల వలన వచ్చే సమస్య. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పచ్చటి డిశ్చార్జ్ వస్తే, అది ఇన్ఫెక్షన్ కావొచ్చు. పొడిగా మారడం, ఇచింగ్ అనేవి వజైనల్ వాల్స్, యూరినరీ ట్రాక్ట్ సున్నితంగా మారినప్పుడు జరుగుతుంది. ఆరోగ్యకరమైన వజైనల్ మ్యూకస్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. దీనివల్ల వజైనాలో తేమ తగ్గిపోతుంది. ఇక ఎక్కువ మంది బాధపడే ఇచింగ్ సమస్యకు కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు, వజైనల్ బ్యాక్టీరియా లోపం కూడా కారణం కావచ్చు. మెనోపాజ్ తర్వాత ఓవరీల నుంచి ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒత్తిడి వల్ల కూడా తేమ తగ్గే అవకాశం ఉంటుంది. వజైనల్ గ్లాండ్లు ఈస్ట్రోజ పై ఆధారపడి మ్యూకస్ తయారుచేస్తాయి. అవి తగ్గిపోతే పొడి సమస్య ఎక్కువవుతుంది. యాంటీఫంగల్ ఆయింట్మెంట్లు, పౌడర్లు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కానీ మళ్లీ మళ్లీ వస్తుంటుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఈస్ట్రోజన్ క్రీములు, వజైనల్ లూబ్రికెంట్లు, వజైనల్ ఈస్ట్రోజన్ టాబ్లెట్లు, కొన్ని ప్రత్యేకమైన మందులు డాక్టర్ సూచనతోనే వాడాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారు ఈ చికిత్సలు తీసుకోకూడదు. కనుక తప్పకుండా గైనకాలజిస్టును సంప్రదించి, వారి సూచనల మేరకు తగిన చికిత్స తీసుకోవాలి.(చదవండి: పెద్ద పిల్లల్లో చొల్లు చేటే..! సీరియస్గా తీసుకోవాల్సిందే..) -
రాజుగారి 'కలా'ఖండం..!
ఒక రాజు కల ఏకంగా కళాఖండమైంది. కాని, ఆ కల తీరకుండానే రాజు కథ ముగిసింది. జర్మనీలోని బవేరియా పర్వత శ్రేణుల మధ్య న్యూష్వాన్ స్టీన్ కోట– నిర్మాణం, ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఎందరో మనసులను దోచేస్తుంది. ‘లూడ్విగ్ 2’ అనే రాజు 19వ శతాబ్దంలో ఎంతో ప్రత్యేక శ్రద్ధతో, ఇష్టంతో ఈ కోటను కట్టించుకున్నాడు. ‘లూడ్విగ్ 2’ – నాటి జర్మన్ సంగీత స్వరకర్తగా పేరున్న రిచర్డ్ వాగ్నర్ అభిమాని కావడంతో, వాగ్నర్ ప్రేరణతోనే ఈ కోటను కట్టించాడు. సింహాసనం దగ్గర నుంచి గానకచేరీ గది వరకు ప్రతి గదినీ అత్యంత కళాత్మకంగా రూపొందించారు. అయితే, ఈ కోట నిర్మాణం పూర్తికాకుండానే అనుమానాస్పద పరిస్థితుల్లో ‘లూడ్విగ్ 2’ మరణించాడు. ఆయనను మానసిక రోగిగా ప్రకటించి, రాజ్యాన్ని త్యజించమని బలవంతం చేసిన కొద్ది రోజులకే ఆయన, ఆయన వైద్యుడు సమీపంలోని స్టాంబెర్గర్ సరస్సులో శవాలుగా దొరికారు. ఇది ఆత్మహత్యగా ప్రచారం చేసినా, అంతశ్శత్రువులే రాజును హత్య చేశారని చాలామంది ఇప్పటికీ నమ్ముతారు. విధి ఆడిన వింత నాటకంలో ‘లూడ్విగ్ 2’ కల చెదిరింది. అతడి మదిలో మెదిలి, రూపుదిద్దుకున్న కోట మాత్రం ప్రపంచానికి ఒక కళాఖండంగా మిగిలింది.(చదవండి: ధోతికట్టు..అదిరేట్టు..! నాడు గౌరవం..ఇవాళ ట్రెండీ స్టైల్..) -
అందాల అనుపమా ఇష్టపడే ఫ్యాషన్ స్టైల్ వేరెలెవెల్..!
సింపుల్ స్టన్నింగ్ బ్యూటీకి నిర్వచనం, నటి అనుపమా పరమేశ్వరన్. ఆమె ధరించే ప్రతి ఔట్ఫిట్లోనూ ఒక ఫ్యాషన్ ఫ్లో ఉంటుంది. స్టయిలింగ్లో సౌకర్యం చూపిస్తూ మెరిసిపోవటమే ఆమె మ్యాజిక్! అందం అంటే ముఖం కాదు, మూడ్! హ్యాపీగా ఉంటే, ఎప్పుడూ అందంగానే కనిపిస్తాం. అందుకే, నా శరీరానికి నచ్చే, నప్పే దుస్తులనే ఎంచుకుంటాను. వన్ పీస్లు, కుర్తీ–జీన్స్ కాంబో, చిన్న స్లీవ్ల టాప్స్ నా ఫేవరెట్ ఔట్ఫిట్స్. చీరలు అంటే కూడా ఇష్టమే! వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్, హీట్ స్టయిలింగ్ తగ్గించడమే నా కేశ సౌందర్య రహస్యం అంటోంది అనుపమా పరమేశ్వరన్ . ఇక్క అనుపమా జ్యూలరీ బ్రాండ్: షాయా ఇయర్ రింగ్స్ ధర: రూ. 2,500, నెక్ పీస్ ధర: రూ. 7,800, డ్రెస్..రూ.98,800చెవితో మాట్లాడే చెయిన్!చెవికి పెట్టే ఈ చిన్న చెయిన్, మొత్తం మీ స్టయిల్నే చేంజ్ చేసేస్తుంది. ఒక్కసారి ఈ చెయిన్ చెవిలో కనిపిస్తే, ఆ తర్వాత అది చూసిన ప్రతి ఒక్కరి చెవిలోనూ అలాంటిదే దర్శనమిస్తుంది. అదే ఈ ‘చెయిన్డ్ ఇయర్ కఫ్’ మ్యాజిక్! పాత రోజుల్లో ఇది పంక్ స్టయిల్కి గుర్తుగా ఉండేది. కాని, ఇప్పుడు ఇది మోడ్రన్ ట్రెండ్ ఐకాన్. చెవిని నగల దుకాణంలా కాకుండా, మినిమలిస్టిక్గా చూపించాలంటే ఇదే బెస్ట్ చాయిస్. హెయిర్ స్టయిల్ విషయంలో హై పోనీ, స్లీక్ బ లేదా బ్రెయిడ్ బెస్ట్. ఎందుకంటే ఈ ఇయర్కఫ్ వేసుకున్నాక దాన్ని దాచడం, బ్యాడ్ టేస్ట్! చెవిని పూర్తిగా కనిపించేలా ఉంచాలి. వెస్ట్రన్ డ్రెస్సులు, ఫ్యూజన్ లెహంగాలు, కుర్తాలకు సూపర్ మ్యాచ్ అవుతుంది. చీరకైనా సరే, బ్లౌజ్ నెక్ డిజైన్లు ఆఫ్–షోల్డర్, స్వీట్హార్ట్, బోట్నెక్, సింగిల్ షోల్డర్ స్టయిల్స్తో ఉంటే గ్లామర్ డబుల్ అవుతుంది. ఫొటోషూట్స్, సంగీత్, కాక్టెయిల్ పార్టీలు, బ్రాంచ్ డేట్స్కు బెస్ట్. ఒక్కసారి ఈ చెయిన్డ్ ఇయర్కఫ్ వేసుకుంటే, అదే మీ ఫ్యాషన్ స్టేట్మెంట్ అవుతుంది!.(చదవండి: పార్లమెంటు క్యాంటీన్లో సరికొత్త హెల్త్ మెనూ! లిస్టు చూసేయండి!) -
వజ్రాలు వదిలేసింది!
ఆరేళ్లయింది అవుంగ్షీ ఢిల్లీని వదిలేసి. ఇప్పుడు ఆమె మణిపూర్లోని తన స్వగ్రామంలో తల్లిదండ్రులకు తోడుగా ఉంటోంది. అసలు వాళ్ల కోసమే ఆమె వజ్రంలాంటి తన ఉద్యోగాన్ని వదిలేసి వచ్చింది. వస్తూ వస్తూ సిమ్లా నుంచి ఆపిల్ మొక్కల్ని తెచ్చుకుంది. అవి రెండో ఏడాదే కిలోల కొద్దీ తియ్యటి ఆపిల్ పండ్లను ఇచ్చాయి. తొలి కాపును అమ్మానాన్నకు నైవేద్యంగా పెట్టింది. స్నేహితులు, బంధువులకు ప్రసాదంలా పంచింది. మిగతా పండ్లను అమ్మింది. మరికొన్ని చెట్టుకు సిద్ధంగా ఉన్నాయి. ‘‘ఆరేళ్ల క్రితం ల్యాబ్లో మేము వజ్రాలను తయారు చేసేవాళ్లం. ఆనాటి ఉద్యోగ సంతృప్తిని మించిన సంతృప్తి ఏటా చేతికొస్తున్న ఈ ఆపిల్ పంటను చూస్తే కలుగుతోంది’’ అంటోంది అవుంగ్షీ.తొలి పంట వచ్చినప్పుడు చూడాలి అవుంగ్షీ కళ్లలోని వజ్రాల మెరుపుల్ని! ‘పండంటి బిడ్డ’ అంటుంటాం కదా.. ఆమెకు అవి బిడ్డంటి పండ్లు. విరగ గాసిన ఆపిల్ పండ్లు! ఆమెను చూసి ఉఖ్రూల్లోని పాయ్ గ్రామం ఆపిల్ని పండించడానికి ఉత్సాహపడింది. అక్కడి భూమిలకది ఏ మాత్రం పరిచయం లేని పంట. అయితే ఎర్రగా, జ్యూసీగా, తియ్యగా ఉన్న ఆ ఆపిల్ పండ్లను చూసి స్థానికులు తాము కూడా ఆపిల్స్ను పండించడానికి ఆసక్తి కనబరిచారు. దాంతో పోయ్ ప్రాంతానికి ఆవుంగ్షీ ఆపిల్ పండ్ల సాగుకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. 2019 ఏప్రిల్లో ఆమె హిమాచల్ప్రదేశ్ నుంచి 55 ఆపిల్ మొక్కల్ని తెచ్చి నాటితే వాటిలో 52 బతికాయి. మొదటి ఏడంతా కాపు లేదు. రెండో ఏడాది జూన్ రెండో వారానికల్లా ఆకులు కనిపించనంతగా పండ్లొచ్చేశాయి! పోయ్ గ్రామం ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంటుంది. మరీ చల్లగా ఉండని అక్కడి పొడి వాతావరణానికి అనువైన భూమిలో పెరిగే ఆపిల్ మొక్కల్ని ఆవుంగ్షీ ఎంపిక చేసుకోవడం దగ్గర్నుంచి.. హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్లోని శిక్షణ కేంద్రంలో ఆపిల్ సాగులో మెలకువలు నేర్పించడం వరకు అన్నిటా ఆమె స్నేహితురాలు సోసో షైజానే ఆమెకు సహాయంగా ఉంది. షైజా.. నేషనల్ విమెన్ కమిషన్లో సభ్యురాలు. ‘‘ఊరెళ్లి ఏం చేస్తావు?!’’‘‘ఊరెళ్లిపోతున్నాను. అమ్మానాన్నకు ఇంటి దగ్గర తోడుగా ఉండాలి’’ అని అవుంగ్షీ చెప్పినప్పుడు.. షైజా మొదట ఆమెను అడిగిన మాట.. ‘‘ఉద్యోగం మానేసి, ఊరెళ్లి ఏం చేస్తావు?’’ అని. ‘‘ఏమీ అనుకోలేదు’’ అంది అవుంగ్షీ. ఏమీ అనుకోకుండా ఉద్యోగం మానేయడం అంటే అంతకన్నా పొరపాటు లేదు. పైగా అవుంగ్షీ ఆ సమయంలో ఢిల్లీలోని గోర్డెన్–మ్యాక్స్ అనే సింగపూర్ వజ్రాల కంపెనీలో డైమండ్ ల్యాబ్ మేనేజర్గా ఉంది! అయితే తల్లిదండ్రుల కోసం ఆ వజ్రంలాంటి ఉద్యోగాన్ని వదలేయాలని నిర్ణయించుకుంది. ‘‘సరే వదిలేయ్, అయితే మీ మణిపూర్లో ఆపిల్స్ పండించడం ఎలా ఉంటుందో ఆలోంచించు’’ అని షైజా సలహా ఇచ్చింది. అలా ఢిల్లీ–హిమాచల్ప్రదేశ్–మణిపూర్ల మీదుగా అవుంగ్షీ ఆపిల్ పంట ఆలోచన సాగింది. ఆనాటి ఆ ఆలోచన ఈనాటి వరకూ ఏటా విరగ్గాస్తూనే ఉంది.పంట రాగానే పంపకం!పెరుగుతున్న దిగుబడితో ఏటికేడాదీ మరిన్ని ఆపిల్ మొక్కల్ని తెచ్చి భారీ ఎత్తున ఆపిల్ తోటను పెంచుతోంది అవుంగ్షీ. ఆమె తండ్రి వరి రైతు. మొదట – కూతురు ఆపిల్స్ పండిస్తాను అనగానే ఆయనేమీ మాట్లాడలేదు. తల్లి మాత్రం కూతురి వైపు నిలబడింది. ఆమె మద్దతు ఇవ్వడానికి తగిన కారణమే ఉంది. అవుంగ్షీ పెంచుతున్న ఆపిల్ రకం ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలోనే కాపుకు వచ్చేస్తుంది. ఉఖ్రూల్ శీతోష్ణ స్థితుల్లో చక్కగా ఎదుగుతుంది. పైగా పూర్తి ఆర్గానిక్. మార్కెట్లో మంచి ధర ఉంది. కిలో ఆపిల్స్ రూ.250 వరకు ధర పలుకుతాయి. ఏటా పంట రాగానే స్నేహితులకు, పరిచయస్తులకు, బంధువులకు ఇచ్చినన్ని ఇచ్చి మిగతా వాటిని అమ్మేస్తుంది అవుంగ్షీ. ఇంకా కొన్ని అమ్మకానికి ఉంటాయి. వాటిని ఉచితంగా గ్రామస్థులకు పంచిపెడుతుంది. చెట్లపై ఇంకా డెబ్భై నుంచి ఎనభై కిలోల ఆపిల్స్ కోతకు వస్తూనే ఉంటాయి. ఈ లెక్కలన్నీ క్రమేణా అవుంగ్షీ తండ్రిలో నమ్మకం కలిగించి ఆయన ప్రోత్సాహం కూడా ఆమెకు లభించింది. ఇప్పుడు తన ఆపిల్ పండ్ల తోటను చూడ్డానికి వస్తున్న పోయ్, చుట్టు పక్కల గ్రామాల అమ్మాయిలు, గృహిణులు ఆపిల్ సాగుపై ఆసక్తి చూపడంతో వారిని కూడా అవుంగ్షీ ప్రోత్సహిస్తోంది. తను ఏ విధంగానైతే హిమాచల్ ప్రదేశ్ వెళ్లి శిక్షణ తీసుకుని వస్తూ వస్తూ కొన్ని ఆపిల్ మొక్కల్ని కొని తెచ్చుకుందో వాళ్లకూ అదే దారిని చూపిస్తోంది. ఈ ఆరేళ్లతో తనకు ఎదురైన కష్టనష్టాల గురించి కూడా ఆమె వారికి చెబుతోంది. ‘‘కష్టనష్టాలంటే ఏం లేదు. మొక్కల్ని పశువులు తినకుండా కాపాడుకోవాలి. పండ్లు వచ్చాక దొంగలు పడకుండా కాపు కాయాలి’’ అని తియ్యగా నవ్వుతుంది అవుంగ్షీ. ఏమైనా వజ్రాల ఉద్యోగాన్ని మించినదవుతుందా ఆపిల్ పండ్ల పెంపకం?! ‘‘కాకపోవచ్చు. అక్కడికి మించిన ఉద్యోగ సంతృప్తి.. ఈ పంట సాగులో ఉంది’’ అంటుంది ఈ యువ కృషీవలురాలు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఈ వారం కథ: రాణి
గాలికి ప్రాణం పోయినట్లు, చెట్లన్నీ ఉరేసుకున్నట్లు, చడీ చప్పుడు లేదు. ఒక్కటే ఉక్కబోత! ఏం చెప్పాలా? ఎలా చెప్పాలా? అని ఆలోచిస్తూ ఉక్కబోతలో నిద్రపట్టక మేడ మీదకి వచ్చేశాను.పెచ్చులూడిపోయిన గచ్చు ఎండకు సలసల కాగి అర్ధరాత్రి అయినా చల్లారలేదు. కాని, శరీరానికి ఇవేమీ పట్టినట్లు లేదు. చెమటకు తడిసి ముద్దయిపోయిన బనియన్ తీసి, జాజిమల్లి తీగ మీద వేస్తుంటే తీగ చాటున దాక్కున్న చంద్రుడు మేఘాలతో దోబూచులాడుతున్నట్లు, వచ్చీరానట్లున్న వెన్నెల చీకటితో సరసమాడుతున్నట్లు అనిపించింది.మా అమ్మకు ఆడపిల్లలు లేకపోయినా అన్ని రకాల పూలమొక్కలు పెంచేది. కొంచెం తీరుబడి దొరికితే చాలు మొక్కలన్నింటికీ నీళ్ళు పోసి ముస్తాబు చేసేది. కాని, రోజూ పూలు కోసుకోవడానికి వచ్చే పిల్లలు, ‘‘నేను ముందంటే నేను ముందని; ఈ పువ్వు నాదంటే ఆ పువ్వు నాదని, ఇల్లు పీకి పందిరేసేవారు. ఎప్పుడైనా కోపమొచ్చి, ‘‘ఎందుకమ్మా ఇవన్నీ!’’ అని అంటే,‘‘మీ నాన్నగారిని ఈ పువ్వుల్లో , పిల్లల నవ్వుల్లో చూసుకుంటున్నాను రా!’’ అనేది పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ. అప్పటి నుంచి మొక్కలకి నీళ్ళు పోయడం మొదలుపెట్టాను నేను కూడా!మా నాన్నగారికి ప్రకృతన్నా, ప్రశాంతతన్నా చాలా ఇష్టం. అప్పట్లో అందరూ వద్దన్నా, ఊరికి దూరంగా ఈ కొండ అంచున ఇల్లు కట్టారు. చాలాకాలం మా ఇరుగు పొరుగుగా ముళ్ళ కంచెలే ఉండేవి. కాని, తరువాత దగ్గరలో పరిశ్రమలు రావడం వలన కార్మికులు ఒక్కొక్కరుగా వచ్చి స్థిరపడ సాగారు. ఒకట్రెండు ఇళ్లు ఉండే గ్రామం నేడు నిండుకుండలా తొణికిసలాడుతోంది. అలా పెరిగిన జనాభా అవసరాల కోసం ఈ ఊర్లో అధికార్లు ఓ చిన్న పోస్టాఫీసు కూడా పెట్టారు. అలా మా నాన్నగారు చాలా కాలం తపాలా శాఖలో బ్రాంచ్ పోస్టుమాస్టర్గా పనిచేసి, ఒక రోజు ప్రమోషన్ తీసుకుని దేవుడి దగ్గరకి బదిలీమీద వెళ్ళిపోయారు, కనీసం మాటైనా చెప్పకుండా!నేను ఇలా అటు ఇటు తిరగడానికి కారణం లేకపోలేదు. ఆమె పేరు రాణి. మనుషుల మధ్యలో దేవతలా, రాజ్యాన్ని కోల్పోయి అజ్ఞాతంలో ఉన్న రాకుమారిలా ఉంటుంది.నేను ఎంసీఏ చేసి ‘క్యాట్’ పరీక్షకు సిద్ధమవుతున్న రోజులవి. విదేశాల్లో స్థిరపడాలని, మేఘాల్లో తిరగాలని ఆకాశానికి నిచ్చెన వేస్తున్న వయస్సు అది. నాన్న లేని నన్ను అమ్మ ఏ లోటు రాకుండా పెంచింది.మా వీధి బోసిపోయింది రెండు రోజుల నుంచి. ఎప్పుడూ గలగలమని నవ్వుతూ తుళ్ళుతూ మా ఇంటి పక్కన ఉండే రాణి రెండు రోజుల నుంచి బయట కనిపించలేదు. భోజనం చేస్తుంటే అమ్మ అంది ‘‘రాణి ఒక్క మార్కులో పరీక్ష తప్పిందంటరా! ఆ ఒక్క మార్కు వేస్తే వాడి సొమ్మేం పోయేదో’’ అంటూ ఆడగని సమాచారం ఇచ్చి, ‘‘ఓసారెళ్ళి చూసి రారా!’’ అని ముక్తాయింపు ఇచ్చింది.అమ్మ చెప్పిందని పక్కింటికెళితే, అమ్మ పాడిన పాటే పాడుతోంది రాణి. ‘‘ఒక్క మార్కులోనే పోయిందమ్మమ్మా! నేను చాలా బాగా రాశాను. నా మార్కులు ఎవరికో వేసేశారు’’ అని అమాయకంగా అంటుంటే, నిజంగానే ఒకరి మార్కులు ఇంకొకరికి వేసేస్తారేమో! అనిపించింది ఆ ఏడుపు చూసి. ఇంతలోనే మా అమ్మ వచ్చి, ‘‘మీరేమీ బాధపడకండి బామ్మగారు. ఒక్క మార్కులో పోయిందంటే మీ మనవరాలు తెలివైనదే అయ్యి ఉంటుంది. మా అబ్బాయి ట్యూషన్ చెబుతాడులే!’’ అని భరోసా ఇచ్చేసింది. ఆ భరోసా నా జీవిత కాలానికి సరిపడే పాఠాలు నేర్పింది. ఏ బాధ్యత లేని నాకు ఇప్పుడు రాణి ఒక బాధ్యతై కూర్చుంది. ఇప్పుడు ఈ అమ్మాయి పరీక్ష పాస్ కాకపోతే ‘‘నాకు లెక్కలు బాగా వచ్చు’’ అనే పేరు మొత్తం ఎగిరిపోతుంది. ఊళ్ళో తలెత్తుకుని తిరగలేను. మా అమ్మ ఇచ్చిన మాట కోసం, ముఖ్యంగా నా పరువు కోసం నెల రోజుల నుంచి రాణికి లెక్కలు చెబుతూనే ఉన్నాను.‘‘నా ఓపిక అయిపోయింది బాబూ! నా మనవరాలు పరీక్ష గట్టెక్కితే అంతే చాలు’’ అంటూ రాణి వాళ్ళ అమ్మమ్మ సుప్రభాతం మొదలుపెట్టేది ప్రతిరోజూ. నాకు వినీ వినీ విసుగొచ్చేసింది. రాణి ఈ పరీక్ష పాసైతే ఇక పైచదువులు వాళ్ళ మావయ్యే పట్నంలో చదివించుకుంటాడట! ఆవిడ సుప్రభాత సారాంశం ఇది. నా ప్రిపరేషన్ పక్కనపెట్టి, ఎన్నో మోడల్ పేపర్స్ తయారు చేసి, రాణితో చేయించేవాడిని. రాణికి కూడా ఓపిక ఎక్కువ. ఆలస్యమైనా ప్రతీ లెక్క చేసి చూపించే ఇంటికి వెళ్ళేది.‘‘సప్లిమెంటరీ ఫీజు కట్టేశాను సార్!’’ అంది ఒకరోజు. పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ నాలో టెన్షన్ పెరిగిపోయింది కాని, రాణి ఎప్పటిలా ప్రశాంత వదనంతో సుభిక్షంగా ఉన్న రాజ్యానికి రాణిలా కనిపించేది. రాణి ఆలోచనలు, మాటలు వింటే తత్త్వం చక్కగా బోధ పడుతుంది. జీవితం పట్ల అవగాహన, భవిష్యత్తు పట్ల ఆమె ఆలోచనలు ఆమెపై లోలోన గౌరవం పెంచేవి. ఈరోజు ఉదయం రాణి చాలా కొత్తగా కనబడింది. ఎప్పుడు చలాకీగా ఉండే రాణి ఈ రోజు సిగ్గుపడుతూ, ‘‘మీకో విషయం చెప్పాలని ఉంది సర్’’ అంది. మహారాణే వచ్చి వరం ఇస్తానంటే ఎవరూ కాదంటారు!‘‘సరే, చెప్పు అయితే’’ అన్నాను. ‘‘సాయంత్రం చెబుతాను సర్’’ అంది.ఎందుకో తెలియకుండానే నాలో రాణి పట్ల ఆరాధన భావం ఏర్పడింది. ఆమె నడవడికను చూస్తే ఆమెను ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో! నాలో ఆతృత అనే ఒక భావన ఇంతలా పనిచేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎక్కడికీ వెళ్లాలి అనిపించలేదు. రాణిలాంటి అమ్మాయి ఎక్కడో కాని ఉండదు. ఎప్పుడోగాని పుట్టదు. జీవితంపై స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంది. క్యాట్ ప్రిపరేషన్కి ఫుల్స్టాప్ పెట్టి జీవితంలో స్థిరపడాలని మొదటిసారి అనిపించింది. చదువే లోకంగా ఉన్న నాకు ఉద్యోగం సాధించడం ఎప్పుడూ కష్టమనిపించలేదు. మొదటిసారి అందంగా కనిపించాలనిపించింది.రాణి కోసం ఎదురు చూస్తున్నాను. రోజు ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. రాణి రాలేదు కాని, రాణి చెలికత్తె వచ్చింది. నాలుగు మడతలు పెట్టి ఉన్న ఒక కాగితాన్ని నా చేతిలో పెట్టి, అంతలోనే మాయమైపోయింది. చదవడానికి చేతులు వణుకుతున్నా ఊహించిందే ఉంటుందనే నమ్మకంతో చదవడం మొదలు పెట్టాను, మెట్ల పైన కూర్చుని. ఏం చెప్పబోతోందా అనే కుతూహలం నరనరాన్ని పట్టి ఊపేస్తోంది.‘‘సార్ నమస్కారం!ఒక్క రూపాయి ఆశించకుండా మీ సొంత సమయాన్ని నా కోసం వెచ్చించి, ఇచ్చిన మాట కోసం మీ లక్ష్యాన్ని కూడా పక్కనపెట్టి, నా భవిష్యత్తు కోసం ఇంతలా కష్టపడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు అపార గౌరవం కలుగుతోంది. మీరు నన్ను ఒక విషయంలో క్షమించాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మమ్మే నాకు సర్వస్వం. అమ్మమ్మను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అందరూ అనుకున్నట్లు నాకు లెక్కలు రాకో, చదువు మీద ఆసక్తి లేకనో నేను ఫెయిల్ కాలేదు. నేను పాస్ అయితే అమ్మమ్మ నన్ను మావయ్య దగ్గరికి పంపేస్తుంది. మా అమ్మా, నాన్న పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చనిపోయిన దగ్గర నుండి నేనే సర్వస్వం అనుకుని పెంచింది. నేను పట్నం పోతే చదువు, ఆపై పెళ్లి అంతే కదా సర్! ఆడపిల్ల బరువు ఎంతకాలం ఉంచుకుంటారు ఎవరైనా! నేను వెళ్ళిపోతే నేనే ప్రాణం అనుకుని బ్రతికే అమ్మమ్మ పరిస్థితి ఏమిటి సార్? ఏ తోడు లేకుండా ఒంటరిగా తన చివరి రోజులు గడపాల్సిందేనా? అందుకే కావాలనే ఫెయిల్ అయ్యాను.అమ్మమ్మ కన్నా నా భవిష్యత్తు, ర్యాంకు గొప్పగా అనిపించలేదు. మీరు చెప్పే పాఠాలు రానట్లు నటించినందుకు ఏమీ అనుకోకండి. మీరు చాలా మంచి ఉపాధ్యాయులు అవుతారు. ఎలాగైనా మీరే మా అమ్మమ్మను ఒప్పించి, మావయ్య దగ్గరికి పంపే ప్రయత్నాన్ని మాన్పించండి. మీరు ఒప్పిస్తే ఈసారి పాస్ అయ్యి, దగ్గర్లోని కాలేజీలో చేరుతాను. అమ్మమ్మతోనే ఉంటాను ప్లీజ్.ఇట్లురాణి ’’నా నడినెత్తికెక్కిన మత్తు ఒక్కసారిగా వదిలిపోయింది. జీవితాన్ని కాచి వడబోసిన దానిలా ఉత్తరం రాసింది. అక్షరాలు మనస్సుకు గుచ్చుకున్నాయి. నేను వేసుకున్న కొత్తబట్టలు చూసి నాకే సిగ్గేసింది. తను నిజంగా రాణే అయ్యుంటే తన రాజ్యంలో ప్రజలకు అసలు కష్టాలు తెలియనిచ్చేదా అనిపించింది, తన మాటలు వింటే. నా ఊహలకి తాళం వేసి వాళ్ళ అమ్మమ్మకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ మేడ మీద అటూ ఇటూ తిరుగుతున్నాను. నిద్రకొచ్చిన చంద్రుడు మేఘాల్లో జోగుతున్నాడు. నేనేదో రాణికి లెక్కలు నేర్పుతున్నాను అనుకున్నాను కాని, తనే నాకు జీవిత విలువలు నేర్పింది.నా స్వార్థం కోసం నా అందమైన భవిష్యత్తులో నేను తప్ప ఏ తోడులేని అమ్మ స్థానం ఏమిటో ఆలోచించలేదు. బంధాలకు రాణి ఇచ్చే విలువ, నలుగురి అభ్యున్నతి కోసం పాటుపడాలని అప్పుడప్పుడు చెప్పిన మాటలు నాకు ఇప్పుడు గీతోపదేశంలా చెవిలో గింగుర్లు తిరుగుతున్నాయి. రాణి తల్లిదండ్రులు ఉద్యమంలో చనిపోయారంటే మొదట్లో నమ్మబుద్ధి కాలేదు. కాని, ఇప్పుడు అర్థం అయ్యింది. అసలు ఈ అభ్యుదయ భావాలన్నీ ఆమెకు తల్లిదండ్రుల నుండే వచ్చాయని!అమ్మ నా కోసం ఇంకా మెలకువగానే ఉంది. ఆలోచనలలో పడి అమ్మ గురించి పట్టించుకోలేదు. అమ్మ చదువుకోపోయినా చదువు విలువ తెలిసిన వ్యక్తి. నాన్నగారు పోయిన తరువాత బ్రాంచ్ పోస్టు మాస్టర్ ఉద్యోగం ఇస్తానంటే, ‘‘ఛీ! నాకొద్దు’’ అన్నాను. నాన్న ఆ చిన్న జీతంతో అమ్మను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నన్ను బాగా చదివించారు. అంతకు మించి నా పేరడిగితే, నా పేరుకన్నా బ్రాంచ్ పోస్టుమాస్టర్గారి అబ్బాయిని అని గర్వంగా చెప్పుకునేలా బ్రతికారు. ఒక కొడుకుగా అంతకంటే అదృష్టం ఏముంటుంది? మా నాన్నగారు ఈ ఉద్యోగం చేయి, ఆ ఉద్యోగం చేయి అని ఎప్పుడూ చెప్పలేదు. నలుగురికీ సేవ చేయి అని మాత్రం చెప్పారు, తాను చేసి చూపించారు కూడా. అర్ధరాత్రయినా, అపరాత్రయినా, ఎవ్వరికీ ‘ఈరోజు కుదరదు, రేపు రండి’ అని చెప్పలేదు. ఆయన గొప్పతనం మనసులో మెదలగానే ఆయన బతికుంటే కాళ్ళకు దణ్ణం పెట్టాలనిపించింది.అమ్మ ఎప్పుడూ నేను పడుకున్న తరువాతే పడుకుంటుంది. నాకన్నా ముందే లేచి, అన్నీ సర్దిపెడుతుంది.వేగంగా మెట్లు దిగి అమ్మని అడిగా, ‘‘అమ్మా! నీకు ఏమిష్టం?’’ అని. నిద్ర కళ్ళతోనే చెప్పింది, ‘‘నువ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి కన్నా, అది చాలు నాకు ఇంకేం అక్కర్లేదు’’ అని.దుఃఖం పొంగుకొచ్చింది మనసులో. ఏ తల్లి అయినా కోరుకునేది అదే కదా! రాణి చేసింది కూడా అదే. వాళ్ళ అమ్మమ్మకి తోడుగా వుండటం కంటే పట్టణాల్లో చదువులు గొప్ప కాదనుకుంది.ఎప్పటికైనా రాణి రాణే కదా!నాన్న చూపిన బాటలో బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఉద్యోగానికి అప్లై చేయడానికి బయలదేరాను, అమ్మ కళ్ళల్లో సంతోషం చూస్తూ... -
ఎలుక... ఎంత పని చేసింది!
అది 2018 ఫిబ్రవరి ఒకటో తేదీ. హైదరాబాద్లోని ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతం... తెల్లవారుతూనే క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటి పైన మూడు నెలల చిన్నారి తల ఉందనే వార్త దావానలంలా వ్యాపించింది. ఆ ఇంటి ఎదురుగా నివసించే ఒక మెకానిక్ ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసుల విచారణ ఎదుర్కొన్నాడు. అసలు నిందితులు చిక్కే వరకు నానా ఇబ్బందులు పడ్డాడు. దీనికంతటికీ కారణం ఒక ఎలుక! చిలుకానగర్ మైసమ్మ దేవాలయం సమీపంలో నివసించే రాజశేఖర్ వృత్తిరీత్యా క్యాబ్ డ్రైవర్. ఎప్పటిలాగే 2018 ఫిబ్రవరి ఒకటో తేదీన తన క్యాబ్ తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. అతడి అత్త బాలలక్ష్మి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉతికిన దుస్తులను ఆరేసేందుకు డాబాపైకి వెళ్లింది. అక్కడ ఒక చిన్నారి తల కనిపించడంతో హడలిపోయి, కేకలు వేస్తూ కిందికి పరిగెత్తుకు వచ్చింది. పక్కింట్లో ఉండే నరహరికి ఈ కేకలు వినిపించాయి. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆమె వద్దకు వచ్చాడు. బాలలక్ష్మి విషయం చెప్పడంతో పైకి వెళ్లి తలను చూసి, దగ్గర వరకు వెళ్లి పరిశీలించి వచ్చాడు. ఆపై విషయాన్ని ఫోన్ ద్వారా రాజశేఖర్కు తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అంతకు ముందురోజు అమావాస్య కావడంతో ఇది నరబలిగా అనుమానిస్తూ ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈలోపు అక్కడకు చేరుకున్న రాజశేఖర్, అతడి భార్య శ్రీలత సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ఇంటి చుట్టుపక్కల వాళ్లే ఎవరో నరబలి ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి క్లూస్టీమ్స్తో పాటు డాగ్ స్క్వాడ్ను కూడా పోలీసులు రప్పించారు. పోలీసు జాగిలాలు రాజశేఖర్ డాబా పైనుంచి కిందికి వచ్చి ఎదురుగా ఉన్న నరహరి ఇంటి వద్దకు చేరాయి. అక్కడ నుంచి సమీపంలోని రోడ్డు మీదకు వచ్చి ఆగాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రాజశేఖర్, శ్రీలతలతో పాటు నరహరిని, మరికొందరినీ పోలీసులు ప్రశ్నించారు. ఒక్కో రోజు గడిచే కొద్దీ పోలీసులపై ఒత్తిడి పెరుగుతూ పోయింది. ఒక పక్క నిందితుల కోసం, మరోపక్క మొండెం కోసం గాలించడం మొదలెట్టారు. పోలీసులు అదే ఏడాది ఫిబ్రవరి 9న నరహరి ఇంట్లో గాలిస్తుండగా దుర్వానస వస్తున్నట్లు గమనించారు. నరబలి కోసం పూజలు చేసి, అక్కడే చిన్నారిని చంపి ఉండవచ్చని అనుమానించారు. మొండేన్ని కూడా అక్కడే దాచి ఉండటంతో కుళ్లి దుర్వాసన వస్తోందని భావించారు. అతడే ప్రధాన అనుమానితుడిగా మారడంతో మరోసారి వివిధ కోణాల్లో లోతుగా విచారించారు. ఇలా రెండు రోజులు గడిచాక ముందు మొండేన్ని లేదా కొన్ని ఆధారాలను వెలికి తీయాలని నిర్ణయించుకున్నారు. ఆ పని చేస్తే కేసు కొలిక్కి వచ్చినట్లే అనే భావనతో క్లూస్టీమ్తో కలిసి ఆ గదిలో అణువణువూ తనిఖీ చేశారు. చివరకు గదిలో సామాను కింద చనిపోయిన ఎలుక దొరకడంతో అదే దుర్వాసనకు కారణమని తేల్చారు. ఘటనాస్థలికి వచ్చిన జాగిలాలు అతడి ఇంట్లోకి ఎందుకు వెళ్లాయనేది ఆరా తీశారు. ఇంటి పైన ఉన్న చిన్నారి తలను చూసిన బాలలక్ష్మి అరుస్తూ కిందికి పరిగెత్తుకు వచ్చింది. అప్పటికే రాజశేఖర్ తన క్యాబ్ తీసుకుని వెళ్లిపోయాడు. అరుపులు విన్న ఎదురింట్లో ఉండే నరహరి డాబా పైకి వచ్చాడు. అక్కడున్న తలను చూసి, దగ్గర నుంచి పరిశీలించాడు. ఆపై అతడే ఫోన్ ద్వారా విషయాన్ని రాజశేఖర్కు సమాచారం ఇచ్చి తన ఇంటికి వెళ్లిపోయాడు. అలా అక్కడ అతడి వాసన ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసు జాగిలాలు వాసన చూస్తూ నరహరి ఇంట్లోకే వెళ్ళాయి. ఈ పూర్వాపరాలను మరోసారి సరిచూసుకున్న అధికారులు అతడికి క్లీన్ చిట్ ఇచ్చి వదిలిపెట్టారు. ఆధారాల కోసం పోలీసులు మరోసారి ఘటనాస్థలికి పరిశీలించారు. రాజశేఖర్ ఇంటి లోపలి భాగాన్ని ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి తనిఖీ చేసిన పోలీసులు కొన్ని రక్తపు మరకలు కనుగొన్నారు. తల భాగం దొరికిన డాబా పైన కూడా తనిఖీలు చేస్తున్నప్పుడు పోలీసుల దృష్టి ఓ చీపురుపై పడింది. ఇంటిలోకి ఎండ, వర్షం నీరు పడకుండా సన్షేడ్ మాదిరిగా ఏర్పాటు చేసిన రేకులపై అది కనిపించింది. దాన్ని తీసిన పోలీసులు వెదురు ఆకులతో చేసిందిగా గుర్తించారు. దగ్గరగా పరిశీలించగా ఆకుల మధ్య కుంకుమ కనిపించడంతో పూజలు చేసిన ఆనవాళ్లుగా భావించారు. వీటన్నింటినీ మించి ఆ చీపురును ఓ దారంతో పాటు ఎండు గరికతో కలిపి కట్టడంతో అనుమానం బలపడింది. నమూనాలనూ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి క్షుద్రపూజల విషయం నిర్థారించుకున్నారు. రాజశేఖర్, శ్రీలతల పాత్ర రూఢి కావడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తే, తన భార్య ఆరోగ్యం కోసం నరబలి ఇచ్చినట్లు అంగీకరించాడు.ఈ హత్య వెలుగులోకి వచ్చిన రోజే పోలీసు జాగిలాలు డాబా పైనుంచి వాసన చూసుకుంటూ నేరుగా రాజశేఖర్ ఇంట్లోకే వెళ్లాల్సి ఉంది. అయితే, 2018 జనవరి 31న చిన్నారిని కిడ్నాప్ చేసిన రాజశేఖర్ నేరుగా ప్రతాపసింగారం వెళ్లి అక్కడే చిన్నారిని హత్య చేసి మొండాన్ని మూసీలో పడేశాడు. అక్కడ నుంచి తలను ఇంటికి తీసుకువచ్చి నట్టింట్లో పెట్టి తన భార్య శ్రీలతతో కలిసి పూజలు చేశాడు. ఆపై తలను ఇంటి పైన పెట్టి, భార్యతో కలిసి ఇల్లంతా కడిగేశాడు. వాసనను బట్టి ముందుకు వెళ్లే పోలీసు జాగిలాలు నీళ్లతో కడిగిన ప్రాంతంలో వాసన గుర్తించలేవు. రాజశేఖర్ తన ఇంటిని ఫ్లోర్ క్లీనర్లతో పూర్తిగా కడిగేసిన కారణంగానే జాగిలాలు అతడి ఇంటి లోపలకు వెళ్లకుండా సమీపంలో తిరిగాయి. 2018 ఫిబ్రవరి 15న రాజశేఖర్, శ్రీలతల్ని పోలీసులు అరెస్టు చేశారు. ∙ -
ప్రహ్లాద అజగర సంవాదం
ప్రహ్లాదుడు ఒకసారి భూలోక సంచారం చేయాలనుకున్నాడు. సాధు సజ్జనులతో కలసి బయలుదేరాడు. భూలోకంలో సంచరిస్తూ, సహ్యాద్రి ప్రాంతానికి చేరుకున్నాడు. కావేరీ నదిలో స్నానసంధ్యాదులు పూర్తి చేసుకుని, ప్రహ్లాదుడు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, సాధు సజ్జన బృందంతో ముందుకు నడవ సాగాడు. తోవలో నేల మీద దుమ్ము, ధూళిలో పడుకుని ఉన్న ఒక మహర్షిని అల్లంత దూరం నుంచి చూశాడు. ఆ మహర్షిలో ఎలాంటి చలనం లేదు. ప్రహ్లాదుడిని అనుసరించి వస్తున్నవారు కూడా ఆయనను గమనించారు.‘ఎవరీ మహర్షి? ఎందుకిలా నేల మీద పడుకుని ఉన్నారు? దగ్గరలో ఆశ్రమమేదైనా ఉందా? ఇలా దుమ్ము, ధూళిలో నిశ్చలంగా పరుండి ఉండటం ఏమైనా వ్రత నియమమా?’ అని వారిలో వారు రకరకాలుగా తర్జనభర్జనలు పడ్డారు.మహర్షి సంగతేమిటో స్వయంగా తెలుసుకుందామని ప్రహ్లాదుడు ఆయనను సమీపించాడు. నెమ్మదిగా ఆయన పాదాల చెంత కూర్చున్నాడు. పాదాలకు శిరసును ఆన్చి నమస్కరించి, ఆ పాదాలను తన ఒడిలోకి తీసుకుని, నెమ్మదిగా ఒత్తుతూ, ‘మహానుభావా!’ అని సంకోచిస్తూనే పలకరించాడు.ఆ మహర్షి నెమ్మదిగా కళ్లు తెరిచి, ‘ఏమిటి?’ అన్నట్లు ప్రహ్లాదుని వంక చూశాడు.‘మహానుభావా! తమరు ఎందుకిలా నేల మీద పడి ఉన్నారు? శరీరమంతా దుమ్ము, ధూళితో నిండి ఉందంటే, మీరు చాలాకాలంగా ఇలాగే ఉన్నట్లు అర్థమవుతోంది. ఇది ఏమైనా వ్రత నియమమా? లోకంలో ప్రయత్నం లేకుంటే, మనిషికి ధనం లభించదు. ధనం లేకుంటే, సుఖభోగాలు లభించవు. మానవ సహజమైన సుఖాలను త్యజించి, మీరిలా నేల మీద పడుకుని ఉన్నా, మీలో తేజస్సు ప్రకాశిస్తూనే ఉంది. ఇదంతా వింతగా ఉంది. మీ వింత పద్ధతికి కారణం ఏమిటో చెప్పండి’ అని అడిగాడు ప్రహ్లాదుడు.‘నాయనా ప్రహ్లాదా! ఇదంతా తెలియకనే అడుగుతున్నావా? నీవు సాక్షాత్తు శ్రీహరినే మెప్పించిన భక్తాగ్రేసరుడివి. ప్రవృత్తి నివృత్తి ఫలాలను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగిన తత్త్వవేత్తలలో అగ్రగణ్యుడివి. అలాంటి నువ్వు నన్నిలా అడగటం ఆశ్చర్యంగా ఉంది. అయినా అడిగావు గనుక చెబుతాను, విను. దీనివల్ల నీకూ నాకూ ఆత్మశుద్ధి కలుగుతుంది’ అని ఆ మహర్షి తన కథను చెప్పనారంభించాడు.‘కర్మలు ఆచరిస్తూ; వాటి వల్ల కలిగే జన్మల ఫలితాలను చూస్తూ; ఈ సుడిగుండంలో తిరిగి తిరిగి విసిగి వేసారిపోయాను. ఇదివరకటి జన్మలో నేను కొండచిలువను. ఇప్పుడు మానవజన్మ ఎత్తాను. మానవజన్మ స్వర్గమోక్షాలకు ప్రవేశద్వారం. మానవజన్మలోనూ దుష్కర్మలను ఆచరిస్తే జంతుజన్మ లభిస్తుంది. పాప పుణ్యాలు రెండూ చేస్తే, మళ్లీ మానవజన్మ లభిస్తుంది. దుఃఖాలను తొలగించుకోవడానికి, సుఖాలను పొందడానికి మనుషులు ఏవేవో కర్మలు చేస్తూనే ఉంటారు. వాటి వల్ల లభించే అనుకూల, ప్రతికూల ఫలితాలను అనుభవిస్తూనే ఉంటారు. అసలు ఫలానుభవమే వద్దనుకున్నవాడు కర్మలను ఆచరించవలసిన పని ఏముంది? సుఖం ఆత్మస్వరూపం. భోగాలు అశాశ్వతాలు. ఈ జ్ఞానం కలిగిన తర్వాత నేను కర్మలను ఇంకా ఎందుకు ఆచరించాలి? అందువల్లనే నిశ్చేష్టుడినై, నిష్ప్రయత్నుడినై పూర్వజన్మ సంచితాలైన ప్రారబ్ధ కర్మల ఫలాలను అనుభవిస్తూ ఇక్కడ పరుండి ఉన్నాను.ప్రహ్లాదా! ధనం వల్ల సుఖం దొరుకుతుందని అన్నావు కదా! ధనం వల్ల దుఃఖమే తప్ప సుఖం లేదు. ధనాన్ని రాజ, చోర, శత్రు, మిత్ర, పుత్ర, కళత్రాదులు అపహరించుకుపోతారనే భయం మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది. ధనవంతులు నిశ్చింతగా నిద్రించలేరు. అందువల్ల ధనం మీద, ధనం వల్ల కలిగే భోగాల మీద మమకారాన్ని విడిచిపెట్టడం ఉత్తమం.ఈ సృష్టిలో నాకు తేనెటీగ, అజగరం గురువులు. తేనెటీగలు ఎంతో శ్రమించి, తాము కట్టుకున్న పట్టులో తేనెను కూడబెడతాయి. ఎవడో వచ్చి, పొగపెట్టి తేనెటీగలను చంపి, పారదోలి ఆ తేనెను దోచుకుపోతాడు. అలాగే మానవులు ధనం కూడబెడతారు. చివరకు దాని వల్లనే నశిస్తారు. అందువల్ల తేనెటీగల నుంచి నేను వైరాగ్యాన్ని నేర్చుకున్నాను. నా ఇంకో గురువు అజగరం– అంటే, కొండచిలువ. అది మహాసర్పం. అది అందుబాటులో ఉన్న ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. తర్వాత కదలదు, మెదలదు. తనకై తాను సొంత ప్రయత్నమంటూ చేయదు. తిండి దొరకకుంటే, ఎన్నాళ్లయినా పస్తులుంటూ ముడుచుకుని పడుకుంటుంది. అజగరాన్ని చూసి నేను సంతుష్టిని నేర్చుకున్నాను. నాకు సుఖం లేదు, దుఃఖం లేదు. ఎవరినీ ఏదీ అడగను. ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటాను. పట్టువస్త్రాలు ధరించినా, చిరిగిన గుడ్డపీలికలు ధరించినా నాకు తేడా ఉండదు. హంసతూలికా తల్పాలపై శయనించినా, ఇలా మట్టిలో శయనించినా నాకు ఒకేలా ఉంటుంది. సగుణమైనా, నిర్గుణమైనా నాకు ఒకటే! అధికమైనా అల్పమైనా ఒకటే! నాది సర్వసమదృష్టి. దీనివల్ల సుఖదుఃఖ భేదాన్ని చిత్తవృత్తిలో లయింపజేయగలిగాను. చిత్తవృత్తిని మనసులో, మనసును అహంలో, అహాన్ని మాయలో, మాయను ఆత్మానుభూతిలో లయింపజేశాను. స్వానుభవంలో ఆత్మస్థితిలో ఏకనిష్ఠలో ఉంటున్నాను.ప్రహ్లాదా! నువ్వు యోగ్యుడివి. ఇది చాలామందికి లోకవిరుద్ధంగా, శాస్త్ర విరుద్ధంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మికజ్ఞానివైన నువ్వు అర్థం చేసుకోగలవు. అందుకే ఇదంతా నీకు చెప్పాను’ అని అజగరవ్రతంలో ఉన్న మహర్షి ముగించాడు.ప్రహ్లాదుడు అమితానందంతో ఆయనను సేవించి, పూజించి ఆయన ఆశీస్సులు పొందాడు. అజగర మహర్షి నుంచి తెలుసుకున్న ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆత్మతృప్తి పొంది, ఆయన నుంచి వీడ్కోలు తీసుకుని, తన బృందంతో కలసి యాత్ర కొనసాగించేందుకు బయలుదేరాడు. ∙సాంఖ్యాయన -
చల్లని థ్రిల్లింత.. తియ్యని తుళ్లింత
నోట్లో వేసుకోగానే జివ్వుమనిపించే ఐస్క్రీమ్ జిహ్వకు ఒక చల్లని చలువ వేడుక ఆబాల గోపాలానికీ నోరూరించే ఐస్క్రీమ్ తరతరాలకు తియ్యని రుచుల కానుక ప్రపంచవ్యాప్తంగా ఐస్క్రీమ్ ఒక భావోద్వేగం తియ్యని చల్లని ఐస్క్రీమ్ ఒక మధురోత్సాహం! స్కూల్ విడిచిపెట్టగానే ముందు సందులోనూ..సెలవలొచ్చి ఇంట్లో ఉంటే, వీధి చివరి సందులోనూ..ప్రత్యేకమైన ఒక బెల్ మోగుతుంటుంది. అది వినగానే పిల్లలకు ఆకలి మొదలైపోతుంది! అది అట్టాంటి ఇట్టాంటి ఆకలి కాదు,కేవలం ఐస్క్రీమ్ ఆకలి! ఆరు నూరైనా ఐస్క్రీమ్ తింటేనే తీరుతుంది! ఇక ఆ బెల్ ఏ బండిదో చెప్పుకోనక్కర్లేదు కదూ! నిజానికి ఆ శబ్దం– పెద్దలను కూడా బాల్యానికి నెడుతుంది! సందర్భమేమీ లేకపోయినా, ఉన్నపళంగా కుటుంబంలో తియ్యని వేడుకను సృష్టించగలుగుతుంది! అదే ఐస్క్రీమ్కి ఉన్న క్రేజ్!‘పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి’ అంటారు పెద్దలు. అయితే నోరూరించే తియ్యదనం, నాలుకపై చిందులేసే చల్లదనం ఊహల్లో మెదలగానే, అన్ని జిహ్వలు కోరేది ఒక్కటే– ఐస్క్రీమ్! అది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఒక మధురానుభూతి!శీతల పానీయాల నుంచి హిమక్రీములకు సాగిన ఐస్క్రీమ్ చరిత్ర– ఐస్క్రీమ్ తిన్నంత తియ్యగా ఉంటుంది. నిజానికి ఐస్క్రీమ్, సరిగ్గా ఎప్పుడు మొదలైంది? ఎవరు కనిపెట్టారు? అనే ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోయినా, క్రీ.పూ. 4 వేల సంవత్సరాల కాలంలోనే మనిషి చల్లని రుచులను ఆస్వాదించడం మొదలుపెట్టాడట! ‘టర్కీ–సిరియా–ఇరాక్ దేశాల గుండా ప్రవహించే టైగ్రిస్, యూఫ్రటిస్ నదుల పరివాహక ప్రాంతమైన మెసపొటేమియాను ‘ప్రపంచ నాగరికతకు పుట్టినిల్లు’గా గుర్తిస్తారు! అందులో భాగమైన దక్షిణ ఇరాక్లోని యూఫ్రటిస్ నది సమీపంలో ఎల్లవేళలా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయి. అక్కడ జీవనం సాగించిన, క్రీ.పూ. ఐదో శతాబ్దం నాటికి పర్షియన్లు తమ నివాసాలను చల్లబరచుకోవడానికి, రాత్రి వేళల్లో సహజంగా ఏర్పడిన మంచును భూగర్భంలో నిల్వ చేసుకుని, వాడుకునేవారు. కాలక్రమేణా ‘యఖ్చాల్’ అనే హిమగృహాలను ఏర్పాటు చేసుకునేవారు. సాంకేతికాభివృద్ధి పెరిగి, రిఫ్రిజిరేటర్స్ వాడుకలోకి వచ్చాక ఐస్క్రీమ్ చరిత్ర చల్లని మలుపు తిరిగింది.క్రీ.పూ. ఐదో శతాబ్దంలో గ్రీకు రాజధాని ఏథెన్స్ ్సలో వైన్స్ ను చల్లబరచడానికి మంచును విక్రయించేవారట! మరోవైపు ఒకటో శతాబ్దానికి చెందిన రోమన్స్ చక్రవర్తి నీరో– తేనెతో కూడిన చల్లని పానీయాలను ఆస్వాదించేవాడు. చైనాలో టాంగ్ రాజవంశీకుల కాలంలో కర్పూరం కలిపిన గేదె పాలతో తియ్యటి పానీయాలు చేసుకుని, చల్లగా తాగేవారట! అలాగే పర్షియన్స్ వంటకమైన ‘ఫాలూదా’ శతాబ్దాల నాటిదని చరిత్ర చెబుతుంది. ఎందరో ఇష్టపడి ఆస్వాదించే చల్లచల్లని ‘షర్బత్’కి ఏళ్లనాటి అరబిక్ మూలాలున్నాయి. తర్వాత తర్వాత చల్లగా తాగే తీపి పదార్థాలను గడ్డ కట్టించి ఐస్క్రీమ్లా ఆస్వాదించడం మొదలైంది. ఈ క్రమంలోనే భారత్లో మొఘల్ చక్రవర్తులు ‘కుల్ఫీ’ని ఇష్టంగా తినేవారట. ఇది పాల మీగడను గడ్డకట్టించి, తయారు చేసే ఒక రకమైన ఐస్క్రీమ్!పాప్సికిల్ – ఓ అనుకోని రుచిపాప్సికిల్ (పుల్ల ఐస్) చరిత్ర చాలా ఆసక్తికరంగా, అనుకోని రీతిలో మొదలైంది. ఫ్రాంక్ ఎపర్సన్స్ అనే పదకొండేళ్ల కుర్రాడు, దీనిని 1905లో తొలిసారి కనుగొన్నాడు. శీతకాలంలో ఒక రాత్రి– ఫ్రాంక్ తన పెరట్లో సోడా పౌడర్, నీళ్లు కలిపిన గ్లాసును, ఆ నీళ్లను కలపడానికి వాడే ఒక పుల్లతో సహా ఆరుబయట అలాగే వదిలేశాడు. తెల్లవారేసరికి, గ్లాసులోని మిశ్రమం రంగులో గడ్డకట్టి, పుల్లతో సహా చేతిలోకొచ్చిందట. దానిని కాస్త రుచి చూస్తే అదిరిపోయిందట! దానికి ‘ఎప్సికిల్’ అని పేరుపెట్టాడు ఫ్రాంక్. ఆ రుచిని వెంటనే తన స్నేహితులకు, పక్కింటి పిల్లలకు పరిచయం చేశాడు. వాళ్లు కూడా ఇష్టంగా తిన్నారు.1922లో కాలిఫోర్నియా, ఆక్లండ్లో జరిగిన ఒక డ్యాన్స్ ్స పార్టీలో పాల్గొన్నవారందరికీ ‘ఫ్రాంక్ ఎపర్సన్స్ ’ తాను తయారు చేసిన పాప్సికిల్ రుచిని తొలిసారి పరిచయం చేశాడు. వారంతా ఆ రుచిని ఎంతో ఇష్టపడ్డారు. ఆ క్రేజ్తోనే ఆ మరుసటి ఏడాది దానిపై పేటెంట్ పొందాడు ఫ్రాంక్. ఆ రోజుల్లో, పాప్సికిల్ను ఎక్కువగా స్ట్రాబెర్రీ, నారింజ, చెర్రీ వంటి పండ్ల రుచులలో తయారు చేసుకునేవారు. కాలక్రమేణా ఈ పుల్ల ఐస్ చిన్ననాటి జ్ఞాపకాలకు, వేసవి వినోదానికి గుర్తుగా మారింది.హిమక్రీములు విశేషాలువాతావరణం వేడెక్కుతున్నప్పుడు, ఎక్కువగా ఐస్క్రీమ్ తినడం సహజమే! శతాబ్దాలుగా అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని పంచుతున్న ఈ తియ్యని, చల్లని పదార్థం కేవలం రుచికే కాదు, కొన్ని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలకూ బెస్టేనట. ఒకటి లేదా రెండు హెల్దీ ఐస్క్రీమ్ స్కూప్లను తింటే తప్పేమీ లేదట. ప్రమాదమేమీ కాదట!ఇంటర్నేషనల్ డైరీ ఫుడ్స్ అసోసియేషన్స్ ప్రకారం, సగటు అమెరికన్స్ సంవత్సరానికి 20 పౌండ్ల ఐస్ క్రీమ్ను తింటాడట. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు 13 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందట!పాల పదార్థాలతో చేసిన ఐస్క్రీమ్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఐస్క్రీమ్ కొనుగోలు చేసేటప్పుడు ‘ప్రోబయోటిక్ ఐస్క్రీమ్’ లేదా ‘లైవ్ అండ్ యాక్టివ్ కల్చర్స్’ వంటి లేబుల్ ఉందో లేదో చూసి కొనుగోలు చేయడం మంచిది.ఐస్క్రీమ్తో రికార్డ్స్!ఐస్క్రీమ్ అంటే ఇష్టపడని వారు అరుదుగా ఉంటారు. అయితే, కొందరు ఐస్క్రీమ్ను కేవలం తినడమే కాకుండా, దానితో ప్రపంచ రికార్డులను సైతం సృష్టించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదైన ఐస్క్రీమ్ అద్భుతాలను చూద్దాం!నిమిషంలో చప్పరించేవాడుఐస్ ఎక్కువగా తిన్నా, వేగంగా తిన్నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. తలలోంచి తీవ్రమైన నొప్పి వస్తుంది. అలాంటిది ఐజాక్ హార్డింగ్ డేవిస్ అనే వ్యక్తి 2017 జూలై 16న కేవలం ఒక నిమిషంలో 806 గ్రాముల ఐస్క్రీమ్ను లాగించేసి, వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.నోరూరించే అతిపెద్ద స్కూప్సాధారణంగా ఐస్క్రీమ్ లవర్స్కి పెద్ద స్కూప్ చూస్తే భలే సంబరంగా ఉంటుంది. అలాంటి వారి కోసం ‘కెంప్స్’ అనే సంస్థ, 2014 జూన్ 28న తన శత వార్షికోత్సవ వేడుకల్లో అతిపెద్ద స్కూప్ని ప్రదర్శించింది. ‘విస్కాన్సిన్స్ లోని సెడార్బర్గ్ స్ట్రాబెర్రీ ఫెస్టివల్’లో 5 అడుగుల 6 అంగుళాల పొడవు, 6 అడుగుల 2 అంగుళాల వెడల్పుతో భారీ స్ట్రాబెర్రీ ఐస్క్రీమ్ స్కూప్ను తయారుచేసి, రికార్డు సృష్టించింది.ఎత్తైన కోన్ ఐస్క్రీమ్ఎంతపెద్ద కోన్ ఐస్క్రీమ్ అయినా అరచేతి సైజుకి మించదు. అలాంటిది 10 అడుగుల 1.26 అంగుళాల ఎత్తైన కోన్ ఐస్క్రీమ్ని సృష్టించారు నార్వేకు చెందిన హెనిగ్ ఓల్సెన్, ట్రోండ్ ఎల్. వాయిన్ అనే ఇద్దరు స్నేహితులు 2015 జూలై 26న ఈ భారీ కోన్ ఐస్క్రీమ్ను సృష్టించి రికార్డ్ సాధించారు.ఒక కోన్స్ పై అత్యధిక స్కూప్లుఒక ఐస్క్రీమ్ కోన్స్ పై సాధ్యమైనన్ని ఎక్కువ స్కూప్లను పేర్చడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అయితే ఇటలీకి చెందిన దిమిత్రి పాన్చెరా సాధించిన రికార్డ్ను మాత్రం ఎవ్వరూ కొట్టలేరనిపిస్తుంది. ఎందుకంటే, గతంలో తాను సృష్టించిన రికార్డ్ని తానే బద్దలుకొట్టాడు. అతడు 2018, నవంబర్ 17న ఒకే కోనుపై 125 స్కూపులను నిలిపి రికార్డ్ సృష్టించాడు. అయితే గతంలో 121 స్కూపులను నిలిపి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించాడు.పొడవాటి తియ్యని వేడుక2011 జూలై 23న యూకేలోని పోర్ట్ స్టీవర్ట్లో ‘మోరెల్లి ఐస్క్రీమ్ షాప్’ ఒక ప్రత్యేకమైన రికార్డును సాధించింది. ఆ కంపెనీ వార్షికోత్సవం సందర్భంగా 2,728 మందిని ఒక చోటికి చేర్చి; ప్రతి ఒక్కరికీ ఐస్క్రీమ్ కప్స్ ఇచ్చి, ఒకరికి ఒకరు తినిపించుకోమని చెప్పింది. అలా 2,728 మందీ పొడవాటి మానవహారంలా నిలబడి, ఒకరికొకరు ఐస్క్రీమ్ తినిపించుకోవడంతో అది ప్రపంచ రికార్డ్గా నిలిచింది.ఐస్క్రీమ్ కోన్లా మారిన మనుషులుచైనాలో నెస్లే లిమిటెడ్ ఐస్క్రీమ్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక వినూత్న రికార్డ్ సృష్టించింది. 2019, డిసెంబర్ 18న రెండు వేరువేరు రంగుల దుస్తులు ధరించిన 478 మందికి జనం ఒక భారీ ఐస్క్రీమ్ కోన్స్ ను రూపొందించారు. ఇది గిన్నిస్ రికార్డ్ సృష్టించింది.ఐస్క్రీమ్ కాన్వాయ్ సాధారణంగా ఐస్క్రీమ్ బండి వేసే హారన్ కూడా మనసులో ప్రత్యేకమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంది. బాల్యంలోని రుచులన్నింటినీ గుర్తు చేస్తుంది. అందుకే యూకేలో 2018 అక్టోబర్ 16న ‘ది ఐస్క్రీమ్ వ్యాన్ డ్రీమ్ టీమ్’ అనే బృందం 84 ఐస్క్రీమ్ ట్రక్కులు, వ్యాన్లతో ఒకేసారి భారీ ఊరేగింపు చేసి, అద్భుతమైన ప్రపంచ రికార్డును సృష్టించింది.ఐస్క్రీమ్ శతాబ్దాల పాటు ఒక ప్రత్యేకమైన, ఖరీదైన విలాసవంతమైన ఆహారంగా ఉండేది. చౌకైన రిఫ్రిజిరేటర్లు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేంత వరకు ఐస్క్రీమ్ లగ్జరీ రుచే! సాంకేతికత అందుబాటులోకి వచ్చాకే ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల వారు ఐస్క్రీమ్ను రుచి చూడగలుగుతున్నారు.మరో అమెరికన్ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఐస్క్రీమ్ మీద ప్రేమతో జూలై నెలను ఐస్క్రీమ్ నెలగా ప్రకటించాడు. జూలై మూడో ఆదివారాన్ని ‘ఐస్క్రీమ్ డే’గా ప్రకటించాడు.ఐస్క్రీమ్ను అత్యధికంగా తినే దేశాలలో యునైటెడ్ స్టేట్స్ రెండో స్థానంలో ఉంది. తొలిస్థానం న్యూజీలండ్దట. అక్కడ సంవత్సరానికి సగటున ప్రతి వ్యక్తి సుమారు 20 నుంచి 22 కేజీల ఐస్క్రీమ్ను తింటున్నారట.ఐస్క్రీమ్లో కూడా శరీరానికి అవసరమైన ప్రొటీన్లతో పాటు విటమిన్స్ ఎ, డి, బి12 వంటివి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి.ఒత్తిడి, ఆందోళన, విచారం ఉన్నప్పుడు చాలామంది ఐస్క్రీమ్ వైపు మొగ్గు చూపుతారట. ఐస్క్రీమ్ డోపమైన్, సెరోటోనిన్స్ వంటి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. వీటిని ‘ఫీల్–గుడ్’ హార్మోన్లు అంటారు. అందుకే అప్పుడప్పుడు ఈ తియ్యని, చల్లని ట్రీట్ను ఆస్వాదించి, మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు.మూడు నుంచి నాలుగు కేజీల ఐస్క్రీమ్ ఉత్పత్తికి, సుమారు 10 నుంచి 12 లీటర్ల పాలు అవసరమవుతాయి.థామస్ జెఫర్సన్స్ – అమెరికా అధ్యక్షుడు కావడానికి కొన్నేళ్ల ముందు ఫ్రాన్స్్సలో అమెరికా రాయబారిగా పనిచేసేవాడు. అక్కడ ఆయన వెనీలా ఐస్క్రీమ్ తొలిసారి రుచి చూసి మైమరచిపోయాడు. ఆ వెంటనే ఆ రెసిపీ తయారీ విధానాన్ని నోట్ చేసుకుని మరీ, అమెరికా వంటకాల్లో భాగం చేసేశాడు. ఇక ఆ తర్వాత తన విందు భోజనాల్లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక కప్పు ఐస్క్రీమ్ ఉండేలా చూసుకునేవాడు.థామస్ జెఫర్సన్స్ అప్పటికే పరిచయం చేసిన ఆ ఐస్క్రీమ్ రుచి కోసం అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్స్ తపించిపోయేవాడట! ఆయన అధికారంలోకి రాగానే, వైట్హౌస్లో ఐస్క్రీమ్ తయారీ పరికరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించుకున్నాడు.ఐస్క్రీమ్పైన చాక్లెట్ సిరప్ వేస్తే చాలామందికి నచ్చుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఆ సిరప్.. ఐస్క్రీమ్ రుచిని మరింత పెంచుతుంది.ఐస్క్రీమ్ రుచిని పరీక్షించే నిపుణులు బంగారు చెంచాలను ఉపయోగిస్తారు. దీనికి కారణం, ఇతర లోహాలతో తయారు చేసిన చెంచాలు ఐస్క్రీమ్ రుచిని సూక్ష్మంగా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. ఐస్క్రీమ్ అసలు రుచిని ఏమాత్రం మిస్ కాకుండా ఉండటానికే బంగారు చెంచాలను ఉపయోగిస్తారు.బరాక్ ఒబామాఅమెరికా అధ్యక్షుడిగా మారడానికి ముందు, బరాక్ ఒబామా హవాయిలోని హోనోలులులో ఉన్న ఒక బాస్కిన్–రాబిన్స్ ్స ఐస్క్రీమ్ పార్లర్లో పనిచేశారు. ఈ ఉద్యోగం తనకు బాధ్యతలను నేర్పిందని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు.జూలియా రాబర్ట్స్ప్రముఖ హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ కూడా ఒకప్పుడు ఐస్క్రీమ్ స్కూప్ చేస్తూ పనిచేశారట. ‘మిస్టిక్ పిజ్జా’ చిత్రంలో ఆమె పాత్ర ప్రస్తావనతో పాటు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా!జూలియా లూయీ–డ్రైఫన్‘కమేడియన్స్ ్స ఇన్ కార్స్ గెట్టింగ్ కాఫీ’ అనే కార్యక్రమంలో ప్రముఖ నటి జూలియా లూయీ–డ్రైఫస్ తన ఐస్క్రీమ్ పార్లర్ అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె స్వెన్స్ సెన్స్ ్స అనే ఐస్క్రీమ్ పార్లర్లో పనిచేసినట్లు వెల్లడించారు. ఆమె ఎమ్మీ అవార్డు గ్రహీతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.బాబీ ఫ్లే – ప్రసిద్ధ అమెరికన్ షెఫ్, టీవీ పర్సనాలిటీ అయిన బాబీ ఫ్లే కూడా యువకుడిగా ఉన్నప్పుడు ఐస్క్రీమ్ స్కూపర్గా పనిచేశారు. హిమక్రీముల క్రేజు‘ఐస్క్రీమ్ రుచుల కోసం మనుషులే కాదు, యమలోకం నుంచి యముడైనా కదిలి రావాల్సిందే’ అన్నట్లు నటించారు ‘యమలీల’ చిత్రంలోని కైకాల సత్యనారాయణ. ఆ సినిమాలో ఆయన ‘హిమక్రీములున్నాయా నాయనా?’ అంటూ ఐస్క్రీముల కోసం తపించడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం 1994లో విడుదలైంది. ఈ ఒక్క సన్నివేశంతో ఆనాడు ఐస్క్రీమ్ పట్ల ప్రజల్లో ఉన్న క్రేజ్ను స్పష్టంగా తెలియజేస్తుంది. నిజానికి, హిమక్రీములంటే జనాల్లో నేటికీ అదే మోజుంది, అదే క్రేజుంది!ఐస్క్రీమ్ గురించి విన్నా, చూసినా, చదివినా వెంటనే తినాలనిపించే అనుభూతి కలగడం సహజం! చల్లని తియ్యని రుచులను కోరుకునే వారు ఇంట్లోనే ఐస్క్రీమ్ తయారు చేసుకోవచ్చు. పైగా ఇంట్లోనే సులభంగా ఐస్క్రీమ్స్ చేసుకునే మేకర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి! మరోవైపు బయట అమ్ముడయ్యే కొన్నిరకాల ఐస్క్రీములు చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు! ఇక ఇంట్లో ఐస్క్రీమ్ తయారు చేసుకునేటప్పుడు పంచదార, ఐస్క్రీమ్ ఎసెన్స్ వంటివి ఆరోగ్యానికి అనర్థం అనుకుంటే, వాటిని కలపకుండా కూడా ఐస్క్రీమ్ చేసుకోవచ్చు. తియ్యటి పండ్లతోనో, కమ్మటి కూరగాయలతోనో మెత్తటి గుజ్జు చేసుకుని, దానిలో తేనెనో, ఖర్జూరాలో, బెల్లం తురుమో జోడించి డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఇంటిల్లిపాది చల్లని వేడుక చేసుకోవచ్చు. పండ్లు, కూరగాయలు ఇష్టంగా తినని పిల్లలతో ఇలా కూడా తినిపించొచ్చు. అయినా తియ్యని, చల్లని ఐస్క్రీమ్ రుచిని కాదనేవారు ఎవరుంటారు?ఐస్క్రీమ్ పార్లర్లలో పనిచేసిన ప్రముఖులుఉన్నతమైన స్థానాలకు వెళ్లిన చాలామంది జీవితాల్లో ఆర్థిక కష్టాలు చాలానే ఉంటాయి. తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి చిన్నా చితకా పనులతో కాలం వెళ్లదీసిన ప్రముఖులు ఎందరో ఉంటారు. కొందరు ప్రముఖులు తమ కెరీర్ ప్రారంభంలో ఐస్క్రీమ్ పార్లర్లలో పనిచేశారు. వారిలో కొందరి ప్రముఖుల వివరాలు చూద్దాం. -
రాజాసాబ్ బ్యూటీ.. విజయ్ దేవరకొండ మూవీతో డెబ్యూ ఇవ్వాల్సిందట!
తన ప్రత్యేకమైన స్టయిల్, స్వతంత్ర భావనతో ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించే మాళవిక మోహనన్ త్వరలోనే టాలీవుడ్లో స్టార్గా వెలుగొందనుంది. ఆ విషయాలే మీకోసం.. రాజాసాబ్ బ్యూటీ..మాళవిక మోహనన్ (Malavika Mohanan) కొన్ని తమిళ, మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తాజాగా ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాలో నాయికగా నటించడంతో ఆమెకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చేసింది. మాళవిక తండ్రి కె.యు. మోహనన్ కూడా సినీరంగానికే చెందినవాడు. షారుఖ్ ఖాన్ ‘డాన్’, ‘తలాష్’, ‘ఫక్రే’ వంటి ఎన్నో సినిమాలకు కెమెరా బాధ్యతలు నిర్వహించారు.తండ్రితో లొకేషన్కి..మాళవిక.. కేరళలోని పయ్యనూర్ అనే గ్రామంలో జన్మించింది. అయితే చిన్నప్పటి నుంచి ముంబైలోనే పెరిగింది, చదువుకుంది కూడా అక్కడే. కేవలం చదువు పూర్తి చేయాలనే ఉద్దేశంతో మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి చేసింది కాని, అసలు ఆసక్తి సినిమాలవైపే! ఒకసారి తండ్రి మోహనన్ యాడ్ ఫిల్మ్ షూటింగ్ చేస్తుండగా, ఆమె లొకేషన్కు వెళ్లింది. ఆ యాడ్లో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. ఫ్యాషన్ డిజైనింగ్పై ఆసక్తిఆమె నటనపై చూపిన ఆసక్తిని గమనించిన మమ్ముట్టి, తన కుమారుడు దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశం ఇప్పించారు. అలా మాళవిక కెరీర్ మొదలైంది. ‘పట్టమ్ పొలే’ అనే మలయాళ చిత్రం ఆమె మొదటి సినిమా. ఆ సినిమా సమయంలో కాస్ట్యూమ్స్ డిజైనర్ అనారోగ్యం కారణంగా పని చేయలేకపోయారు. దాంతో మాళవిక తన దుస్తులను తానే డిజైన్ చేసుకుంది. అక్కడి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఆసక్తి పెరిగి, ‘ది స్కార్లెట్ విండో’ అనే పేరుతో తన బ్రాండ్ ప్రారంభించింది.ధైర్యం ఎక్కువే!మాళవిక చాలా ధైర్యంగా ఉండే అమ్మాయి. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు పెడుతుంటే, కొందరు నెటిజన్లు తప్పుడు కామెంట్లు పెట్టారు. మర్యాదగా, పద్ధతిగా ఉండాలని సూచనలు ఇచ్చారు. దానికి స్పందనగా పద్ధతిగా చీర వేసుకున్న ఓ ఫొటో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో కూడా షార్ట్, చిన్న చొక్కా ఉండడంతో మరింత సెన్సేషన్ అయింది. ‘ఒక ఆడపిల్ల ఏ బట్టలు వేసుకోవాలో, ఎలా ఉండాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎవరి పని వారు చూసుకుంటే బెటర్’ అని కౌంటరిచ్చింది.విజయ్ దేవరకొండతో మూవీభవిష్యత్తులో డైరెక్టర్ లేదా సినిమాటోగ్రాఫర్గా మారాలనేది ఆమె ఆశ. రింగులు అంటే మాళవికకి చాలా ఇష్టం. వందల సంఖ్యలో రింగులు కలెక్ట్ చేసింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే – తెలుగులో ఆమెకి వచ్చిన మొదటి అవకాశం ‘రాజా సాబ్’ సినిమా కాదు. మొదట విజయ్ దేవరకొండ సినిమా కోసం ఎంపికైంది. కొన్ని రోజులు షూటింగ్ జరిగాక ఆ సినిమా నిలిచిపోయింది. ఆ సినిమా పేరు ‘హీరో’.తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంసూపర్ స్టార్ రజనీకాంత్ అంటే మాళవికకి విపరీతమైన అభిమానం. ఆయనతో ‘పేట’ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఎంతో థ్రిల్ అయ్యిందట! అలాగే విజయ్తో ‘మాస్టర్’ సినిమాలో కూడా నటించింది. తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రత్యేకమని మాళవిక చెప్పింది. ‘ఒక్క సినిమాలో కనిపించినా చాలు – తెలుగు వారు ఎంతగానో ప్రేమిస్తారు. అలా అభిమానించే ప్రేక్షకులు మరే భాషలో ఉండరని నాకు అనిపిస్తుంది’ అని చెప్పింది. ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ప్రభాస్తో పని చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ – ‘షూటింగ్ మొదలైన వారం రోజుల్లోనే ప్రభాస్ ఇంటి నుంచి ఎంతో రుచికరమైన భోజనం వచ్చేది. దాదాపు ముప్పై నుంచి నలభై మంది తినగలిగేంత పెద్ద పరిమాణంలో వంటలు వచ్చేవి. భోజనం బాగా నచ్చినా, అంత తినలేకపోయా’ అని తెలిపింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ – మాళవిక చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకే బిల్డింగ్లో పెరిగారు. అందుకే తనకి అత్యంత సన్నిహితుడిగా విక్కీని భావిస్తానని చెబుతుంది. మలయాళ అమ్మాయి అయిన మాళవికకి మట్టి పాత్రలో వండే చేపల కూర అంటే విపరీతమైన ఇష్టం. డైటింగ్ను పక్కనపెట్టి, షూటింగ్ లేనప్పుడు తల్లి బీనా చేత వండించుకుని, ఆ చేపల కూర తింటూ ఆనందపడుతూ ఉంటుంది.చదవండి: ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా -
పూజారి – మేక!
వైశాలి రాజ్యంలోని కందవరం గ్రామంలో ఒక పూజారి ఉండేవాడు. అతని పేరు సుధాకరుడు. అతను ప్రతిరోజూ ఉదయాన్నే నది ఒడ్డుకు వెళ్లి స్నానమాచరించి, ఊరిలో ఉన్న గుడిలో పూజలు చేస్తూ ఉండేవాడు. ఆ ఊరిలోనే శరభయ్య అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను సమీపంలోని అడవిలో ఉండే పక్షులను, జంతువులను వేటాడి; వాటిని చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. పూజారి ప్రతిరోజూ నదీ స్నానం అనంతరం సమీప అడవిలో ఉన్న వివిధ రకాల పూలను సేకరించి పూజకు తీసుకువెళుతూ ఉండేవాడు. ఒకరోజు నదికి వెళుతుండగా, ఎక్కడి నుంచో ఒక మేక పూజారి దగ్గరకు వచ్చి, అతనిని అనుసరించ సాగింది. ఎన్నిసార్లు దాన్ని అదిలించినా, అది వెళ్లిపోకుండా అతనినే అనుసరించింది. చేసేదిలేక దానిని కూడా తనతో పాటు తీసుకు వెళ్ళాడు ఆ పూజరి. ఆ రోజు మొదలు ప్రతిరోజూ పూజారి దగ్గరే ఉంటూ, పూజారితో పాటు నదీ స్నానానికి వచ్చి, పూజారి స్నానం చేస్తుండగా ఆ పరిసరాల్లో ఉన్న ఆహారాన్ని తిని, తిరిగి పూజారితోపాటు గుడికి వెళ్ళేది. ఇలా కొంతకాలం గడిచింది.ఒకరోజు ఎప్పటి మాదిరిగానే పూజారిని అనుసరించి మేక నది వైపు బయలుదేరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత మేక వస్తున్న అలికిడి లేకపోవడంతో పూజారి వెనుతిరిగి చూశాడు. మేక కనిపించలేదు! కంగారుగా నాలుగు వైపులా వెతికాడు. చివరకు ఒక మూల చెట్టుకి కట్టేసి కనపడింది. వెంటనే వెళ్లి, దాని కట్లు విప్పదీశాడు. మేకని తీసుకుని వెళుతుండగా, ‘ఓ పూజారిగారు! ఆగండి... ఆగండి... ఏంటిది? దాన్ని తీసుకుపోతున్నారు? ఆ మేక నాది’ అన్నాడు శరభయ్య. ‘ఏంటి, ఈ మేక నీదా? ఇది ఎప్పటి నుంచో నాతో పాటు ఉంటోంది. ప్రతిరోజూ నా వెంబడి నది స్నానానికి వస్తోంది. ఈరోజు కూడా అలానే వస్తుంటే, దాన్ని పట్టి బంధించిందే కాకుండా, నీది అంటావా?’ అని పూజారి అన్నాడు.‘లేదు లేదు... అది నాది’ అని దగ్గరకు రాబోతున్న శరభయ్యను తప్పించుకుని మేకను భుజాన వేసుకుని, ఆగకుండా వెళ్ళిపోయాడు పూజారి.వెంటనే శరభయ్య రాజుగారి దగ్గరికి వెళ్లి పూజారి మీద ఫిర్యాదు చేశాడు. రాజుగారి భటులు పూజారి వద్దకు వచ్చి ‘నీ మీద అభియోగం వచ్చింది. నీ దగ్గర ఉన్న మేక నీది కాదని శరభయ్య ఫిర్యాదు చేశాడు. మేకతో సహా రావాలని రాజుగారి ఆజ్ఞ!’ అన్నారు.అలాగేనంటూ పూజారి మేకతో సహా రాజుగారి ఆస్థానానికి చేరుకున్నాడు. ‘ప్రణామాలు మహారాజా! పిలిపించారట’ అనగానే, మంత్రి కలగజేసుకొని ‘శరభయ్య తన మేకను తీసుకున్నావని నీ మీద అభియోగం మోపాడు. దీనికి నీ సమాధానం?’ అన్నాడు.‘మహారాజా! ఆ మేక నిజానికి నాది కూడా కాదు! ఒక రోజు నదీస్నానం చేసి, పూజ కోసం అడవిలో పూలు కోయడానికి వెళ్ళినప్పుడు నా దగ్గరికి వచ్చింది. నేను ఎంత ప్రయత్నించినా వెళ్లకుండా, అప్పటి నుంచి నా వద్దే ఉంటోంది. అంతేగాని, ఈ శరభయ్య చెప్పినట్లు అది అతనిది కూడా కాదు’ చెప్పాడు ఆ పూజారి. ‘నువ్వు చెప్పిన దానికి ఏమైనా సాక్ష్యం ఉందా?’ అడిగాడు మంత్రి. ‘లేదు మహారాజా!’ అన్నాడు పూజారి.‘మరైతే నీదే అని సాక్ష్యం లేనప్పుడు మరెలా?’ అన్నాడు మంత్రి. ‘ఒక పని చేయండి మహారాజా! ఈ మేక కళ్లకు గంతలు కట్టండి. ఒకవైపు నన్ను, మరొకవైపు శరభయ్యను ఉంచండి. తన యజమాని ఎవరో వాసన పసిగట్టి గుర్తించే గుణం పెంపుడు జంతువులకు ఉంటుంది అప్పుడు అది వారి వద్దకు వెళుతుంది’ అన్నాడు పూజారి. ‘నువ్వు చెప్పినది సబబుగానే ఉంది’ అని మంత్రి, ‘వెంటనే మేక కళ్ళకు నల్లని గుడ్డతో గంతలు కట్టండి’ అని భటులను ఆదేశించాడు.వారు మేక కళ్లకు గంతలు కట్టారు. మొదట శరభయ్య వద్దకు, ఆ తర్వాత పూజారి వద్దకు మేకను తీసుకువెళ్లారు. శరభయ్య వద్దకు తీసుకెళ్లినప్పుడు ఏ స్పందన లేని మేక, పూజారి వద్దకు తీసుకు వెళ్ళగానే తన ముక్కుతో వాసన పిలుస్తూ, నాలుకతో పూజారి కాలిని నాకసాగింది. తర్వాత దానిని ఒక భటుని వద్దకు కూడా తీసుకువెళ్లారు. అప్పుడు కూడా అది ఏమీ చేయకుండా, అలాగే నిలబడింది. ఏ రకమైన స్పందన చూపలేదు.వెంటనే మహారాజు ‘ఆ మేక పూజారిదే’ అని తీర్పునిచ్చాడు. ‘శరభయ్యను బంధించండి’ అని భటులను ఆదేశించాడు. అతడు చేసిన తప్పును మన్నించి, అతడిని విడిచిపెట్టండి మహారాజా!’ అని పూజారి వేడుకున్నాడు.‘చూశావా, శరభయ్యా! నువ్వు పూజారి మీద అభియోగం మోపినా, నీ మీద కోపం లేకుండా, నిన్ను కాపాడే ప్రయత్నం చేశాడు. ఇప్పటి నుంచైనా జంతువుల వేట మానుకుని, ఏదైనా పని చేసి బతుకు’ అని శరభయ్యను దండించకుండా వదిలేశాడు మహారాజు. పూజారిని అభినందిస్తూ, ఘనంగా సన్మానం చేశాడు. అప్పటి నుంచి శరభయ్య జంతువుల వేటను మాని, వ్యవసాయం చేస్తూ జీవించసాగాడు. -
ఈ ఉత్సవం.. ఉత్కంఠభరితం!
ప్రపంచ సాహస ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే వేడుకల్లో శాన్ ఫర్మిన్ ఫెస్టివల్ ముందు వరసలోనే ఉంటుంది. ఇది ప్రతి ఏడాది స్పెయిన్ లోని పాంప్లోనాలో జూలై 6 నుంచి 14 వరకు జరుగుతుంది. ఈ ఉత్సవంలో బుల్ రన్ (ఎన్సియెర్రో) ప్రధానంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ వేడుకలో ఎద్దులను వీధుల్లోకి వదిలి, వందలాది మంది ప్రజలు వాటి వెంట పరిగెడతారు.ఇది అత్యంత ఉత్కంఠభరితమైన పోటీ. ఉదయం 8 గంటలకు బలమైన ఎద్దులను వదులుతారు. వేలాది మంది ధైర్యవంతులు వాటి ముందు పరిగెడతారు. ఈ పరుగు అత్యంత ప్రమాదభరితమైనది. ప్రతి సంవత్సరం గాయాల పాలైనవారు చాలామంది ఉంటారు, కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా జరుగుతుంది. అయినప్పటికీ, ఈ అనుభూతిని పొందాలని చాలామంది కోరుకుంటారు.ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందు, ‘చుపింజో’ అనే ఒక రాకెట్ పేల్చడంతో పాంప్లోనా నగరం మొత్తం ఉత్సాహంతో నిండిపోతుంది. ఆ తర్వాత వారం రోజుల పాటు సంగీత కచేరీలు, సాంప్రదాయ నృత్యాలు, ఊరేగింపులు, బాణసంచా ప్రదర్శనలు, మతపరమైన ఊరేగింపులు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలో అంతా తెలుపు ఎరుపు రంగు దుస్తులనే ధరిస్తారు. దాంతో వీధులన్నీ ఎరుపు, తెలుపు రంగుల్లో మెరుస్తాయి. మరోవైపు ‘జిగాంటెస్ జెయింట్స్’ అని పిలవబడే పెద్దపెద్ద బొమ్మలు రాజులు, రాణులు, చారిత్రక వ్యక్తుల రూపంతో నెమ్మదిగా నడుస్తూ ఊరేగింపులో పాల్గొంటాయి. వీటిని చూడటానికి పిల్లలు, పెద్దలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. -
ట్రిపుల్ సెంచరీ మామిడి చెట్టు
చెట్టు ఒక్కటే కానీ, అందులోని ఒక్కో పండు ఒక్కోరకం సినిమాలా కనిపిస్తుంది. ఒకటి రొమా¯Œ ్స, మరొకటి యాక్షన్, ఇంకొకటి కామెడీ! మొత్తం 300 కథలు, 300 రుచులు, 300 క్యారెక్టర్లతో మల్టీప్లెక్స్ను తలపిస్తుంది ఈ మామిడి చెట్టు. ఆ మల్టీప్లెక్స్ క్రియేటర్, డైరెక్టర్, ఓనర్... ‘మామిడి మాస్టర్’ కలీముల్లా ఖాన్ !మలీహాబాద్లో అతన్ని అందరూ ‘మ్యాంగో మేన్’ అంటారు. వయసు 82. వయసులో వృద్ధుడే అయినా, మామిడి మీద ఆయన ప్రేమలో మాత్రం నిత్యయవ్వనం తొణికిసలాడుతూ ఉంటుంది. ఉదయాన్నే లేస్తాడు, ప్రార్థనలు చేస్తాడు, తోటపని చేస్తాడు. ఆ తర్వాత అలసిపోయి, నిద్రపోతాడు. ఆ నిద్రలో వచ్చే కలల్లో కూడా తన 120 ఏళ్ల మామిడి చెట్టుతోనే కాలక్షేపం చేస్తాడు. చెప్పుకోడానికి చెట్టు ఒకటే కాని, ఆ చెట్టుకే తాను వేసిన అంటు కొమ్మలకు మూడు వందల రకాల మామిళ్లు కాస్తున్నాయి. ఒక్క చెట్టులోనే ఇన్ని రకాలా? అని చూసినవారు నోరెళ్లబెడుతుంటారు. కరీముల్లాకు మాత్రం ఆ చెట్టు పండ్లు కన్నబిడ్డల్లాంటివి. అందుకే, వాటికి పేర్లు కూడా పెడతాడు. ఒక రకం మామిడికి ‘ఐశ్వర్యా’ అని పేరు పెట్టాడు – బాలీవుడ్ నటి గుర్తుందా? ఆమె పేరునే ఒక మామిడి రకానికి పెట్టాడు. (సింపుల్ చిట్కాలతో 15 కిలోలు తగ్గింది : నచ్చిన బట్టలు, క్రాప్ టాప్లు)ఎందుకంటే ఆ పండు చూసినా, తిన్నా, తీయదనం చూసినా, ప్రేమలో పడేలా ఉంటుందట! ఒక కిలోకు మించిన బరువు, చర్మం మీద ముదురు ఎరుపు రంగుతో ఉంటుంది. ఇంకొకటి ‘సచిన్ మామిడి’– అది తింటే స్టేడియంలో సెంచరీ కొట్టినట్టే! పొట్టిగా ఉన్నా చాలా రుచిగా ఉంటుంది. ‘మోదీ మామిడి’ కూడా ఉంది– ఇది బాగా బలంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన వాసనలతో ఉంటుందని. ఇంకో మామిడికి ‘అనార్కలి’ అని పేరు పెట్టాడు. ఇలా మొత్తం మామిడి రకాలకు పేర్లు పెట్టాడు. తాజాగా ‘రాజ్నాథ్ మామిడి’ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరుతో కొత్త రకం మామిడి పండింది. ఇతని కృషికి మెచ్చి ప్రభుత్వం 2008లో పద్మశ్రీ ఇచ్చింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా కలీముల్లా ఖాన్కు నాలుగు వందలకు పైగా అవార్డులు ఉద్యాన విభాగంలో వచ్చాయి. అసలు రహస్యం!ఇదంతా అతని గ్రాఫ్టింగ్ టెక్నిక్ వలనే సాధ్యం అయింది. అంటే, మామిడి చెట్టులో ఒక కొమ్మను చెక్కి, దానిలో మరో రకానికి చెందిన మామిడి కొమ్మను అంటుకట్టి, టేప్ పెడతాడు, అది చెట్టులో కలిసి ఎదిగేలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆ కొమ్మ కలిసిపోయిన తర్వాత, రెండేళ్లలో కొత్త మామిడి రకం జన్మిస్తుంది. ఇదంతా తన తాత తనకు నేర్పాడట! పద్దెనెమిదేళ్ల వయసులో కలీముల్లా అంటు కట్టి మొదటి మామిడి మొక్కను నాటాడు. అప్పటి నుంచి గత ఆరు దశాబ్దాలుగా వివిధ రకాల కొమ్మలను అంటు కడుతూ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. రసాయనాలు చల్లి పండ్లు పండించకుండా, చెట్టుతో మాట్లాడుతూ, ప్రేమగా పెంచుతున్నాడు. అందుకే ఆ చెట్టు కూడా వివిధ రకాల మామిళ్లతో తిరిగి, ప్రేమను అందిస్తోంది. ఇదీ చదవండి: Today Tip ఎంత బిజీ అయినా సరే, ఇలా బరువు తగ్గొచ్చు!ప్రస్తుతం ఆ చెట్టు తొమ్మిది మీటర్ల ఎత్తులో నిలబడి, చల్లని నీడను ఇస్తోంది. చెట్టు ఆకులు కూడా ఒక్కో చోట ఒక్కో రంగులో కనిపిస్తాయి. ఒకచోట ముదురాకుపచ్చ, ఇంకోచోట మెరిసే పసుపు ఆకులు, మరోచోట ముదురు ఊదా ఆకులు– ఇలా కేవలం ఆకులు మాత్రమే కాదు, ఈ చెట్టు పండ్లు వెదజల్లే పరిమళాలు కూడా వేర్వేరు. చివరగా కరీముల్లా మాటల్లో – ‘మనుషులు వస్తుంటారు, పోతుంటారు. కాని, ఈ మామిళ్లు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. వాటి వాసనలో, రుచిలో, పేర్లల్లో ఎన్నో కథలు దాగున్నాయి. అచ్చం మన వేలిముద్రల్లాగానే ఒక్కో మామిడి ఒక్కో రకం’. పనిలో పనిగా మీరు చెప్పండి – మీకిష్టమైన మామిడి ఏది? ‘ఐశ్వర్యా’ తినాలనిపిస్తుందా? లేక ‘సచిన్’ను రుచి చూస్తారా? -
లిటిల్ ఫైర్ఫైటర్!
ఉదయం లేవగానే చాలామంది పిల్లల్లో గేమ్ మోడ్ ఆన్ అవుతుంది. బకెట్లో వేడి నీళ్లు సిద్ధం అయ్యేలోపే ‘పబ్జీ’లో స్క్వాడ్ రెడీ చేసేసుకుంటారు. లంచ్బాక్స్ చేతికి వచ్చే సమయానికి ‘ఫోర్ట్నైట్’లో నాలుగు ఫైటింగ్ స్టంట్స్ చేసేసి ఉంటారు. ఇలా చాలామంది ఇళ్లల్లో స్క్రీన్ బ్రైట్నెస్తో గది మెరిసిపోతుంటే, వర్జీనియాలో ఉండే రోమిర్ అనే పన్నెండేళ్ల అబ్బాయి ఇంట్లో ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం మొదలయ్యాయి. గేమ్లో పొగలు వస్తే అలర్ట్ మోడ్కి వెళ్లిన ట్లు, అచ్చం అలాగే, రియల్ లైఫ్లోనూ ఆపదలో చిక్కుకున్నవారిని కాపాడే మోడ్ను రోమిర్ యాక్టివేట్ చేశాడు. చేతిలో గన్ లేకపోయినా, అసలైన ధైర్యం, మెదడులో మెగాబైట్ల బుద్ధి ఉపయోగించి, వెంటనే ఫైర్స్టేషన్ కు ఫోన్ చేశాడు. ‘ఎవరో వస్తారు, ఏదో చేస్తారు’ అని హీరో అనుకోడు కదా! అందుకే, సోఫాలో నిద్రపోతున్న ఇద్దరు పిల్లలను, ఒక్క చేతిలో ఒకరిని, ఇంకొక చేతిలో ఇంకొకరిని ఎత్తుకొని, జెట్ స్పీడ్తో డోర్ దాటి బయటకు తెచ్చి, సురక్షిత ప్రాంతంలో ఉంచాడు. తర్వాత మళ్లీ లోపలికి వెళ్లి, మోకాళ్ల నొప్పులతో నడవలేని నాన్నమ్మను నెమ్మదిగా బయటకు తీసుకొచ్చాడు. ఫోన్ చేసిన నాలుగు నిమిషాల్లో అసలైన ఫైర్ఫైటర్లు వచ్చారు. కాని, అప్పటికే రోమిర్ రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశాడు. అప్పుడు వాళ్లు చూసింది కాలిపోయిన ఇల్లు మాత్రమే కాదు, నల్లటి పొగలో మెరిసిపోతున్న చిన్న హీరోని కూడా. అప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ ఒకటే మాట చెప్పింది ‘నీ టాలెంట్ మా ఫైర్ఫోర్స్లో చాలా అవసరం. నీకు పద్దెనిమిదేళ్లు వచ్చిన వెంటనే ఫైర్ఫైటర్ జాబ్ నీదే!’ అని. ఇలా రోమిర్ ఆడిన అసలైన అడ్వెంచర్ గేమ్– అతని జీవితాన్ని సెట్ చేయడమే కాదు, దీంతో అతడి స్కోర్ బోర్డ్లో ‘రోమిర్ – ది రియల్ లైఫ్ ఫైర్ ఫైటర్!’ అనే టైటిల్ కూడా జతపడింది. -
....ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి
∙నా వయసు ఇరవైఐదు సంవత్సరాలు. నాకు తరచు మూత్రసంబంధ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కారణం ఏమిటి? పరిష్కార మార్గాలు చెప్పండి. – కీర్తి, అనంతపురం. మూత్రనాళ ఇన్ఫెక్షన్ అంటే మూత్ర వ్యవస్థలోకి బాక్టీరియా ప్రవేశించడం వల్ల కలిగే సమస్య. సాధారణంగా ఈ బాక్టీరియా బయట నుంచి యూరినరీ బ్లాడర్లోకి ప్రవేశిస్తే ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు మరింత తీవ్రమవుతూ మూత్రనాళం మొత్తం పైకి, కిడ్నీల వరకు చేరుతుంది. దీనివలన మూత్రం పోతున్నప్పుడు మంటగా అనిపించడం, తరచుగా మూత్రం రావడం, నొప్పి ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. తక్కువ నీరు తాగటం, బయట తినే ఆహారం, శరీర శుభ్రత సరిగ్గా పాటించకపోవడం వంటి వాటి వల్ల ఈ సమస్యలు పునరావృతం అవుతూనే ఉంటాయి.రోజుకు కనీసం మూడున్నర లీటర్ల నీరు తాగాలి. మసాలా, కారం ఎక్కువుండే ఆహార పదార్థాలు, చల్లని పానీయాలు, టీ, కాఫీ లాంటివి తగ్గించాలి. ఇవి మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతాయి. జననేంద్రియ భాగాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. సెంటు ఉన్న సబ్బులు, పరిమళభరిత పదార్థాలు వాడకూడదు. భర్తతో ఇంటర్కోర్స్ జరిగిన వెంటనే శుభ్రత పాటించాలి. మలవిసర్జన తర్వాత ముందువైపు నుంచి వెనుకవైపు వైపు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. వెనుక నుంచి ముందుకు శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల బాక్టీరియా బ్లాడర్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాటన్ అండర్వేర్ ధరించాలి. ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. స్నానం చేసిన తరువాత కూడా ఆ భాగాన్ని బాగా పొడిగా ఉంచుకోవాలి. కొంతమంది క్రమం తప్పకుండా వచ్చే ఇన్ఫెక్షన్లకు సహజమైన చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు, తాజా పండ్ల రసాలు, బార్లీ నీరు, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు రోజూ తీసుకోవచ్చు. ఇవి మూత్రనాళం శుభ్రంగా ఉండేలా చేస్తాయి. తరచు పొత్తి కడుపులో నొప్పిగా అనిపించటం, మూత్రంలో ముదురు రంగు, రక్తం కనిపించడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. జ్వరమొచ్చినా, నడుము నొప్పి ఉన్నా ఆలస్యం చేయకూడదు. మొదటి దశలోనే పరీక్షలు చేయించుకుని, చికిత్స తీసుకుంటే సమస్య తిరిగి రాదు. అవసరమైతే మూత్రపరీక్షలో బాక్టీరియా ఏ రకమైనదో చూసి, దానికి సరిపడే మందులు మాత్రమే వాడాలి. ఇతర వైద్యం అవసరం లేకుండా, ఒత్తిడి తగ్గించి, శరీర శుభ్రతను పాటించడం ద్వారా చాలా వరకు నియంత్రించ వచ్చు. రాగానే తలనొప్పి నాకు గత రెండేళ్లుగా ప్రతి నెలా పీరియడ్ రాగానే తీవ్రమైన తలనొప్పి వస్తోంది. ఇది మైగ్రేన్∙ అంటున్నారు. ఇది ఎందుకు వస్తోంది? దానికి ఏమైనా పరిష్కారం ఉందా?– శారద, తిరుపతి. మీకు వస్తున్న తలనొప్పి సాధ్యమైనంత వరకు హార్మోన్ల మార్పుల వల్ల కలిగే మైగ్రేన్ కావచ్చు. పీరియడ్ వచ్చే కొన్ని రోజుల ముందు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ శరీరంలో తగ్గిపోతుంది. దాని ప్రభావంతో తలనొప్పి ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇది నాలుగు రోజుల ముందే మొదలై, పీరియడ్ మొదటి రెండు రోజుల వరకూ ఎక్కువగా ఉంటుంది. దీనిని మెన్స్ట్రువల్ మైగ్రేన్ అంటారు. ఇది ఓ పద్ధతిలో వచ్చే తలనొప్పి కాబట్టి, మీరు ఒక డైరీ రాసుకోవాలి – ఎప్పుడు వస్తోంది, ఎంతసేపు ఉంటుంది, ఏమి తిన్నాక లేదా ఏ పరిస్థితుల్లో వస్తోంది అన్నదాన్ని గమనించాలి. ఆ వివరాలతో డాక్టర్ సరైన మందులు సూచిస్తారు. కొంతమంది మైగ్రేన్ రాకముందే కొన్ని రోజుల పాటు నాప్రోక్సెన్, ఐబుప్రొఫెన్ లాంటి నొప్పి నివారణ మాత్రలు వాడతారు. ఇవి శరీరంలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. గర్భధారణ ఉన్నవారు అయితే, కొన్ని మందులు వాడకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే గర్భసంచయానికి అనుకూలంగా ఉండే ప్రొజెస్టెరాన్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. పీరియడ్ సమయాల్లో మైగ్రేన్ ఎక్కువగా ఉంటే, ఆ రోజుల్లో తీసుకోవాల్సిన మందులు ప్రత్యేకంగా సూచిస్తారు. కొంతమందికి ఈస్ట్రోజన్ తక్కువ స్థాయిలో ఉండటం వల్లే ఇది వస్తుంది కాబట్టి, తగిన ఈస్ట్రోజన్ ప్యాచ్లు లేదా ఇతర మార్గాల్లో ఇచ్చే చికిత్సలు ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో ఏ మాత్రలు తీసుకోవాలో, ఏవి తీసుకోవద్దో వైద్యులే నిర్ణయిస్తారు. మైగ్రే తో పాటు వాంతులు, వికారం వంటి సమస్యలు ఉంటే, అటువంటి లక్షణాల కోసం ప్రత్యేక మందులు ఇస్తారు. తిండి మానేయకూడదు, ఆకలితో ఉండకూడదు. ప్రతిరోజూ ఒకే సమయంలో తినడం, నీరు ఎక్కువగా తాగడం, శరీరాన్ని విశ్రాంతిగా ఉంచడం అవసరం. ఒక నెలలో మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మైగ్రేన్ వస్తున్నట్లయితే, రోజూ తీసుకునే ప్రివెంటివ్ మందులు అవసరమవుతాయి. ఈ మందుల్ని మొదటి మూడు నెలల పాటు వాడిన తరువాత, దాని ప్రభావాన్ని డాక్టర్ అంచనా వేస్తారు. దాని ఆధారంగా మందులు వాడాలి. -
ఎంసెట్ను ఎత్తిచూపాడు!
జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘నీట్’ అమలులోకి వచ్చే వరకు రాష్ట్రంలో మెడికల్ సీట్లు ‘ఎంసెట్’ ర్యాంకుల ఆధారంగానే భర్తీ అయ్యేవి. కొన్నేళ్లు సాగిన ఈ పరీక్షల ప్రశ్నపత్రాల్లోనూ సిరీస్లు ఉండేవి. మాల్ ప్రాక్టీస్ను నిరోధించడానికి ఉద్దేశించిన ఈ విధానంలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. వీటిని విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు, అధికారులు, నిపుణులు గుర్తించలేకపోయారు. అయితే 2010 ఎంసెట్ సందర్భంలో పోలీసులకు చిక్కిన హైటెక్ మాస్ కాపీయింగ్ గ్యాంగ్లో కీలకంగా వ్యవహరించిన ఇంద్రసేన్ రెడ్డి విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించడంతో ‘ఎంసెట్’ పేపర్ల కూర్పులో మార్పులు జరిగాయి. ఆ ఏడాది హైదరాబాద్, కడపల్లో ఈ నిందితులు అరెస్టు అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తికి చెందిన గంగాధర్రెడ్డి, కడప వాసి గురివిరెడ్డి సూత్రధారులుగా ఏర్పడిన గ్యాంగ్ 2010 నాటి ఎంసెట్లో మెడిసిన్ అభ్యర్థుల హైటెక్ మాల్ ప్రాక్టీస్కు తెరలేపింది. హైదరాబాద్తో పాటు చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది. నెల్లూరుకు చెందిన ఇంద్రసేనారెడ్డి, కర్నూలు వాసి నాగూర్ బాషా, అనంతపురం వాసి లోకేశ్వర్రెడ్డి, సుబ్బారెడ్డిలతో ఆయా ప్రాంతాల్లో వ్యవహారాలు పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో వ్యవహారాల కోసం నెల్లూరుకు చెందిన ఎంబీబీఎస్ డాక్టర్ జన భాస్కర్, చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన హరిప్రసాద్రెడ్డిలను ఏర్పాటు చేశారు. ఈ ముఠా హైటెక్ పద్ధతిలో ఎంసెట్ పేపర్లు లీక్ చేసి, విద్యార్థులతో పరీక్షలు రాయించాలని పథకం వేసింది. దీని కోసం బ్లూటూత్, ఇయర్ఫోన్స్ సిద్ధం చేసుకుంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి, మాల్ప్రాక్టీస్ ద్వారా పరీక్షలు రాయించి పాస్ చేయించాలని కుట్ర పన్నింది. దీనికోసం కొన్ని మెడికల్ కాలేజీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. మెడిసిన్ విభాగం ఎంసెట్ పేపర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉండేవి. ప్రతి విభాగం నుంచి 40 ప్రశ్నలు ఉండటంతో ఈ ముఠా ఒక్కో విభాగానికి సంబంధించి కొందరు నిపుణులను రంగంలోకి దింపింది. పరీక్ష ప్రారంభానికి పది నిమిషాల ముందే ప్రశ్నపత్రాన్ని బయటకు తీసి, ఆ వెంటనే ఆయా అవి నిపుణులకు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నిపుణులు అన్ని సిరీస్లకు సంబంధించిన జవాబులను ఫోను ద్వారా ముఠాలో కీలక వ్యక్తులకు పది నిమిషాల్లో చెప్పేలా ఏర్పాట్లు చేసుకుంది. తమకు డబ్బు చెల్లించి, మాల్ప్రాక్టీస్ ద్వారా ఉత్తీర్ణులవ్వాలని ఆశించి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అందించడానికి ఈ ముఠా అత్యాధునిక ఇయర్ఫోన్లు, బ్లూటూత్స్ ఖరీదు చేసింది. చెవిలో ఇమిడిపోయే అతి చిన్న ఇయర్ఫోన్లకు తోడు బ్లూటూత్లను పెట్టుకోవడానికి బనియన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ఫుల్హ్యాండ్స్ బనీన్లలో కుడి, ఎడమ చేతుల్లో భుజానికి దగ్గరగా బ్లూటూత్ సరిపడా చిన్న జేబులు కుట్టించారు. వీటికి సంబంధించిన సెల్ఫోన్లను సైలెంట్ మోడ్లో విద్యార్థులు అండర్వేర్స్లో పెట్టుకునేలా ఏర్పాటు చేశారు. సదరు విద్యార్థి పరీక్షకు వెళ్లే ముందే బ్లూటూత్ ఆన్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పరీక్ష హాలులోకి ప్రవేశించిన విద్యార్థి మాట్లాడాల్సిన అవసరం లేకుండానే పని నడిచేలా ప్లాన్ చేశారు. సదరు విద్యార్థి పరీక్ష పేపర్ తీసుకునే సమయం అయిన వెంటనే ఈ ముఠాకు చెందిన వ్యక్తులు ఫోను ద్వారా విద్యార్థిని సంప్రదిస్తారు. ఆపై వరుస పెట్టి అన్ని సిరీస్లు ఏ...బీ...సీ...డీ... అంటూ చదువుతారు. బ్లూటూత్కు అనుసంధానమైన ఇయర్ఫోన్ ద్వారా ఇవి వినే విద్యార్థి తనకు వచ్చిన సిరీస్ చదివిన వెంటనే చిన్నగా దగ్గి సిగ్నల్ ఇస్తాడు. ఇక ఆ సిరీస్ ప్రశ్నలకు సంబంధించిన జవాబులను వరుసపెట్టి బ్లూటూత్ ద్వారా ముఠా సభ్యులు చెప్పి పరీక్ష రాయించాలని పథకం వేశారు. 2010 మే నెలలో హైదరాబాద్ సహా ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసిన అధికారులు ఈ హైటెక్ గ్యాంగ్ గుట్టురట్టు చేసి, నాటి పరీక్షలో మాల్ ప్రాక్టీస్ను అరికట్టారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులైన గురివిరెడ్డి, ఇంద్రసేన్లను కడప పోలీసులు అదే ఏడాది జూన్ 5న అరెస్టు చేశారు. అక్కడి కేసులో ఇంద్రసేన్కు కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ష్యూరిటీలు లేకపోడంతో విడుదల జాప్యమైంది. ఇది తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు పీటీ వారంట్పై ఇక్కడకు తీసుకువచ్చారు. కడప జిల్లాకు చెందిన ఇంద్రసేన్ అప్పట్లో నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివేవాడు. 2004–05ల్లో ఇంద్రసేన్, గురివిరెడ్డి ఇద్దరూ నెల్లూరులో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. ఆ సందర్భంలో వీరికి పరిచయమైంది. ఇంద్రసేన్ చదువుకుంటూనే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేవాడు. దీంతో అప్పుడప్పుడు గురివిరెడ్డి నుంచి ఆర్థిక సహాయం పొందేవాడు. షేర్లలో నష్టపోయిన గురివిరెడ్డి తన ఆర్థిక ఇబ్బందులను ఇంద్రసేన్తో చెప్పడంతో ఇద్దరూ కలిసి 2009 నుంచి ఎంసెట్ హైటెక్ మాల్ప్రాక్టీస్కు పథకం వేశారు. ఎగ్జామినేషన్ హాల్లో మాల్ప్రాక్టీస్ జరగకూడదన్న ఉద్దేశంతో నిర్వాహకులు క్వశ్చన్ పేపర్ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు సిరీస్లలో అందించేవారు. అయితే, క్లాస్రూమ్లో మాల్ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడే ఓ చిన్న లాజిక్ను ఇంద్రసేన్ గుర్తించాడు. ‘ఏ’ సిరీస్లో 1వ ప్రశ్న ‘బి’ సిరీస్లో 31, ‘సి’ సిరీస్లో 21, ‘డి’ సిరీస్లో 11గా... అలాగే ‘ఏ’ సిరీస్లో రెండోది ‘బి’లో 32, ‘సి’లో 22, ‘డి’లో 12గా వస్తుంటుందని గమనించాడు. ఎంసెట్ ర్యాంక్ కోసం ఏడుసార్లు ప్రయత్నించిన నేపథ్యంలోనే తనకు ఈ విషయం తెలిసిందని ఇంద్రసేన్ పోలీసుల ఎదుట బయటపెట్టాడు. అనేక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో పాటు కనీసం మూడుసార్లు ఎంసెట్ రాసిన ప్రతి అభ్యర్థికీ ఈ సంగతి తెలుస్తుందనని, దీన్ని అనేక మంది అనువుగా మార్చుకుంటున్నారని వెల్లడించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత నుంచి వివిధ సిరీస్ల ప్రశ్నపత్రాల్లో ప్రశ్నల సీక్వెన్స్ మార్చే విధానం అమలులోకి వచ్చింది.∙ -
శివాంజనేయ యుద్ధం
పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు రాముడు అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు. యాగాశ్వానికి పరిరక్షకులుగా భరత శత్రుఘ్న సుగ్రవ ఆంజనేయులను నియమించాడు.యాగాశ్వాన్ని పట్టుకున్న చాలామంది రాజులతో యుద్ధాలు జరిగాయి. హనుమంతుడి ప్రతాపం వల్ల యుద్ధాలలో ఎక్కువ ప్రయాస లేకుండానే రాజులు ఓటమిని అంగీకరించారు. చేసేది లేక యాగాశ్వాన్ని భరత శత్రుఘ్న సుగ్రీవ ఆంజనేయులకు అప్పగించారు. యాగాశ్వంతో పాటు అలా ముందుకు సాగుతుండగా, చక్రాంక నగరంలో రాజసుబాహుడు అనే రాజు యాగాశ్వాన్ని బంధించాడు. అతడితో కూడా యుద్ధం జరిగింది. అతడు హనుమంతుడి ఎదుటకు వచ్చి, బాణాలు ప్రయోగించాడు. చిర్రెత్తిన ఆంజనేయుడు పైకెగసి, కాలితో అతడి ఛాతీ మీద కొట్టాడు. ఆ దెబ్బకు రాజసుబాహుడు మూర్ఛిల్లాడు. మూర్ఛావస్థలలో అతడికి శ్రీరాముడు దర్శనమిచ్చాడు. బ్రహ్మాది దేవతలందరూ పూజిస్తున్న శ్రీరాముని రూపం అతడి మనోనేత్రానికి కనిపించింది. కొద్దిసేపటికి అతడు మూర్ఛ నుంచి తేరుకుని స్పృహలోకి వచ్చాడు. ‘హనుమంతుడి పాదస్పర్శ మహిమతో భగవంతుడైన శ్రీరాముడిని దర్శించుకోగలిగాను. నా అపరాధానికి మన్నించండి’ అంటూ యాగాశ్వాన్ని అప్పగించి, భరత శత్రుఘ్న సుగ్రీవ ఆంజనేయులను వినయంగా సాగనంపాడు.యాగాశ్వాన్ని తీసుకుని వారు ముందుకు సాగారు. దారిలో దేవపురం వచ్చింది. దేవపురం రాజు వీరమణి శివభక్తుడు. శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు అతడి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమంటే, ‘స్వామీ! నా రాజ్యంపై ఎవరైనా దాడికి వచ్చినట్లయితే, నన్ను రక్షించు’ అని కోరుకున్నాడు. శివుడు ‘తథాస్తు’ అన్నాడు. అప్పటి నుంచి వీరమణి తనను తాను అపరాజితుడినని అనుకోసాగాడు. తన రాజధాని నగరంలోకి ప్రవేశించిన యాగాశ్వాన్ని వీరమణి పట్టుకున్నాడు. దానిని తన అశ్వశాలలో బంధించాడు.‘ఇది రాముడి యాగాశ్వం. మర్యాదగా విడిచిపెట్టు, మేం ముందుకు సాగాలి’ అని భరత శత్రుఘ్నులు హెచ్చరించారు. వీరమణి పట్టించుకోలేదు. ‘నువ్వు మొండికేస్తే, యుద్ధంలో బుద్ధి చెప్పక తప్పదు’ తుది హెచ్చరికగా పలికాడు సుగ్రీవుడు.‘యుద్ధానికి నేను సిద్ధమే! నేను పట్టుకున్న అశ్వాన్ని మీరెలా తీసుకుపోతారో చూస్తాను’ అంటూ వీరమణి సేనలను సమాయత్తం చేసి, యుద్ధానికి సిద్ధమయ్యాడు.యుద్ధం హోరాహోరీగా జరిగింది.ఒకవైపు భరత శత్రుఘ్నులు శరపరంపరను కురిపిస్తుంటే, మరోవైపు సుగ్రీవుడు, హనుమంతుడు సేనా సమూహంలోకి చొరబడి విజృంభించారు. వారి నలుగురి ధాటికి వేలాదిగా ఉన్న వీరమణి సైన్యం కకావికలమైంది. వీరమణి పరమశివుడిని తలచుకున్నాడు. అతడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు స్వయంగా త్రిశూలం ధరించి, రణరంగంలోకి వచ్చి వీరవిహారం ప్రారంభించాడు.పరమశివుడి ధాటికి భరత శత్రుఘ్నులు, సుగ్రీవుడు మూర్ఛితులయ్యారు.హనుమంతుడు శివుడిని ఎదిరించి, యుద్ధం చేయడం ప్రారంభించాడు.కొంతసేపు యుద్ధం తర్వాత ‘మహాశివా! నేను రామబంటును. సేవాధర్మంగా రామకార్యం కోసం యుద్ధం చేస్తున్నాను. నువ్వెందుకు రామకార్యాన్ని అడ్డుకుంటూ యుద్ధం చేస్తున్నావు?’ అడిగాడు హనుమంతుడు.‘హనుమా! నువ్వు నీ స్వామి కోసం యుద్ధం చేస్తున్నావు. నేను నా భక్తుడి కోసం యుద్ధం చేస్తున్నాను’ చెప్పాడు శివుడు.ఇద్దరికీ నడుమ మరికొంత పోరు సాగింది. హనుమంతుడు తన గదతో శివుడి రథాన్ని కూల్చేశాడు. శివుడు నేల మీద పడ్డాడు. ‘హనుమా! నువ్వు మహావీరుడివి. యుద్ధంలో నా దెబ్బలను తట్టుకుంటూనే నా రథాన్ని కూల్చేశావు. నీ పరాక్రమానికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో!’ అని అడిగాడు.‘నేను ద్రోణపర్వతానికి వెళ్లి, సంజీవని మూలిక తీసుకొస్తాను. అంతవరకు యుద్ధంలో మూర్ఛిల్లిన భరత శత్రుఘ్న సుగ్రీవులకు, మిగిలిన సైనికులకు ఏ ఆపదా రాకుండా రక్షణగా ఉంటానని వరమివ్వు, అది చాలు’ అన్నాడు హనుమంతుడు.‘తథాస్తు’ అన్నాడు శివుడు.హనుమ రివ్వున ఎగిరి ఆకాశమార్గాన ద్రోణ పర్వతానికి వెళ్లాడు. పర్వతం మీద ఎంత వెదికినా సంజీవని మూలిక జాడ కనుక్కోలేకపోయాడు. చివరకు పర్వతాన్నే పెకలించుకుపోవాలని నిశ్చయించుకుని, పర్వతాన్ని పెకలించసాగాడు.ఆకాశమార్గాన బృహస్పతి సహా దేవతలతో సంచరిస్తున్న దేవేంద్రుడు ఈ దృశ్యాన్ని చూసి చకితుడయ్యాడు. హనుమంతుడి మీదకు వజ్రాయుధం ప్రయోగించడానికి సిద్ధపడ్డాడు.అయితే, బృహస్పతి అతడిని వారించాడు. ‘హనుమంతుడు రామభక్తుడు. అతడితో ఖ్యంగానే సమస్యను పరిష్కరించుకుందాం’ అని చెప్పి, ద్రోణాచలానికి దారితీశాడు. ఇంద్రాది దేవతలు అతణ్ణి అనుసరించారు.‘పర్వతాన్ని ఎందుకు పెళ్లగిస్తున్నావు?’ అని హనుమను అడిగాడు బృహస్పతి.‘ఇందులో సంజీవని మూలిక ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయాను. అందుకే పర్వతం మొత్తాన్ని తీసుకుపోవాలని అనుకుంటున్నాను’ బదులిచ్చాడు హనుమ.‘నీకు కావలసినది మూలికే కదా, నేను గుర్తించగలను. వెదికి ఇస్తాను’ అంటూ బృహస్పతి అతడికి సంజీవని మూలికను తెచ్చి ఇచ్చాడు.హనుమంతుడు సంతోషంగా మూలిక తీసుకుని, దేవపురం చేరుకున్నాడు. మూర్ఛితులైన భరత శత్రుఘ్న సుగ్రీవులు సహా సైనికులను మూలిక సాయంతో స్పృహలోకి రప్పించాడు. జరిగినదంతా చూసి, వీరమణి యాగాశ్వాన్ని మర్యాదగా అప్పగించాడు.∙సాంఖ్యాయన -
హోమ్ వర్క్ శిక్ష కారాదు
హోమ్ వర్క్ విషయంలో పిల్లలు మారాం చేస్తారు. తల్లిదండ్రులు కోప్పడతారు. చదువు ఘర్షణలా మారుతుంది. ఇది ప్రతిరోజూ, ప్రతి ఇంటిలోనూ జరిగే విషయం. చదువు పట్ల తల్లిదండ్రులకు ఉన్న అపోహే అందుకు కారణమంటే ఆశ్చర్యపోకండి. చదువు అంటే ‘గుర్తుపెట్టుకోవడం’ మాత్రమే అన్న నమ్మకం మన సమాజంలో చాలా బలంగా ఉంది. ఎక్కువసార్లు చదివినా, రాసినా మెదడులో నిలుస్తుందన్న అపోహలో ఉన్నాం. దాంతో హోమ్ వర్క్ను ఒక నిల్వ ప్రక్రియలాగా చూస్తున్నాం. పిల్లల మెదడు నిజంగా ఎలా నేర్చుకుంటుందో తెలుసుకోవడమే హోమ్ వర్క్ సమస్యకు అసలైన పరిష్కారం. దృక్పథం మారాలిచదువు అంటే ఒత్తిడి కాదు, ఉత్సాహం. హోమ్ వర్క్ అంటే పనిభారం కాదు, పునఃచింతన. ఇది జరగాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మానసిక దృక్పథమే మారాలి. హోమ్ వర్క్ను సరికొత్తగా చూడాలి. అది భావోద్వేగ అనుభూతి, ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి, సంబంధాల మధ్య ఒక వారధిలా ఉండాలి. పిల్లల మెదడును డౌన్లోడ్ చేయడం కాదు, డెవలప్ చేయాలి. పరీక్షల కోసం కాదు, జీవితానికి నేర్చుకోవాలి.⇒ మెదడు భావోద్వేగాల ద్వారా నేర్చుకుంటుంది, రిపిటీషన్ ద్వారా కాదని న్యూరో సై¯Œ ్స పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి నేర్చుకోవడాన్ని అడ్డుకుంటుంది. కాని, భావోద్వేగ సంబంధిత విషయాలు మెదడులో బలమైన న్యూరల్ కనెక్షన్లు ఏర్పరుస్తాయని డాక్టర్ జుడీ విల్లిస్ అనే న్యూరాలజిస్ట్ చెబుతున్నారు.⇒ జాన్ స్వెల్లర్ కాగ్నిటివ్ లోడ్ థియరీ ప్రకారం ప్రతి పిల్లవాడికి వర్కింగ్ మెమరీ పరిమితంగా ఉంటుంది. మన మెదడు ఒక్కసారిగా 4–7 అంశాలు మాత్రమే హ్యాండిల్ చేయగలదు. ఈ పరిస్థితిలో, పెద్ద పెద్ద హోమ్ వర్క్లు ఇచ్చినప్పుడు వాళ్లు నేర్చుకోకపోగా; అలసటకు, నిరాశకు లోనై హింసలా భావిస్తారు.⇒ ఒకేసారి గంటలకు గంటలు ఒత్తిడితో చేసే హోమ్ వర్క్ కన్నా, విరామం తీసుకుంటూ చదివినప్పుడు లేదా హోమ్ వర్క్ చేసినప్పుడు మెదడు ఎక్కువగా నేర్చుకుంటుందని డాక్టర్ రాబర్ట్ బిజోర్క్ చెబుతున్నారు. ⇒మంచి నిద్ర జ్ఞాపకశక్తిని పెంచుతుందని డాక్టర్ మాథ్యూ వాకర్ అనే నిద్ర శాస్త్రజ్ఞుడు చెబుతున్నారు. మంచి నిద్ర లేని పిల్లలు ఎంత రాసినా, ఎంత చదివినా లాంగ్ టర్మ్ మెమరీలో నిలవదు. కాబట్టి పిల్లలకు మంచి నిద్ర ఉండేలా జాగ్రత్త తీసుకోండి. సంప్రదాయ హోమ్ వర్క్లో లోపాలు⇒ప్రతి పిల్లవాడి శైలి వేరు. కొందరు వింటూ, మరికొందరు రాసుకుంటూ, ఇంకొందరు చూసి నేర్చుకుంటారు. ఎవరి శైలిలో వారిని చేయనివ్వాలి. ఒక్కటే హోమ్ వర్క్ మొత్తం క్లాస్కు ఇవ్వడమంటే అందరికీ ఒకే మందు ఇవ్వడం లాంటిది.⇒అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ ప్రకారం హోమ్ వర్క్ వల్ల ఉదాసీనత, నిద్రలేమి, ఫ్యామిలీ గొడవలుపెరిగాయి. ఇక మన దేశంలో హోమ్ వర్క్ మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. ⇒ ‘క్లాస్ వర్క్ పూర్తిచేయకపోతే ఊరుకోం. డబుల్ హోం వర్క్ చేయాలి’ అని టీచర్లు, పేరెంట్స్ బెదిరిస్తుంటారు. దీని వల్ల పిల్లల మనసులో ‘చదువు = శిక్ష’ అనే భావన బలపడుతుంది. ఇది వారికి చదువుపై కోపం, భయం పెంచుతుంది. హోమ్ వర్క్ ఎలా చేయించాలి?⇒ పేజీలకు పేజీలు రిపీట్ చేసే బదులు ఒక ప్రశ్న ఇవ్వండి. ‘ఇవ్వాళ నువ్వు ఏం అర్థం చేసుకున్నావు?’, ‘ఇది నీ స్నేహితుడికి ఎలా చెప్తావు?’ అని అడగండి. అది వారి ఊహాశక్తిని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ను పెంచుతుంది.⇒ డ్యూక్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం హోమ్ వర్క్ గరిష్ఠంగా ‘తరగతి నంబర్ 10 నిమిషాలు’ మాత్రమే ఉండాలి. 1వ క్లాస్ అంటే 10 నిమిషాలు, 5వ క్లాస్ అంటే 50 నిమిషాలు మించకూడదు. ⇒ హోమ్ వర్క్ను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, చర్చగా మార్చండి. ఒక సబ్జెక్టును చర్చించాలంటే పిల్లలు తమ మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ‘ప్రాటిజీ ఎఫెక్ట్’ అనే అభ్యాసాన్ని బలోపేతం చేస్తుంది – నేర్పేటప్పుడు నేర్చుకునే శక్తి పెరుగుతుంది.⇒హోమ్ వర్క్ ఎలా చేయాలనే విషయంలో పిల్లలకు స్వేచ్ఛనివ్వండి. ‘ఇది రాయాలని ఉందా? లేక చెప్పాలని ఉందా?’ అనే చాయిస్ ఇవ్వండి. ఈ ఎంపిక వల్ల మెదడులో డోపమైన్ విడుదల అవుతుంది. ఇది చదువు పట్ల ఆసక్తిని పెంచుతుంది. -
ఈ వారం కథ: రచయిత వీలునామా!
కొన్ని మరణాలు భరించలేని దుఃఖాన్ని మోస్తాయి. మరికొన్ని పూరించలేని లోటుని మిగులుస్తాయి.ఇంకొన్ని మరణాలు బతికిస్తాయి. బతుకునిస్తాయి. ‘‘నాపేరు యామిని.. సార్కి అసిస్టెంట్ని..’’ ఎదురుగా కూర్చొంటూ అందామె. ఆమె తెచ్చిన కాఫీ– టీపాయ్ మీద పొగలు కక్కుతోంది.‘‘ కాఫీ తీసుకోండి..’’ నవ్వుతూ అంది. మేకప్ మాత్రమే కాదు, శారీరక భాష కూడా ఆమె నడివయసు స్త్రీ అని చెప్పకనే చెబుతోంది. ఖరీదైన ఫర్నిచర్, అధునాతన డిజైనింగ్తో వెయిటింగ్ రూమ్ అదిరిపోతోంది.రచయితగా కళాధర్ సంపాదన బాగానే ఉన్నట్టుంది. చూపు సారించినంత మేర ఇల్లంతా రిచ్గా కనిపిస్తోంది.ఎదురుగా విశాలంగా ఉన్న షెల్ఫ్లో వందలాదిగా ఎన్నో పుస్తకాలు. సాహితీ టీవీ సినీ దిగ్గజాలతో దిగిన ఫొటోలు, అవార్డుల మెమెంటోలు, సన్మానపత్రాల ఫొటోషీల్డులు ఎన్నో వరుసగా కొలువుదీరి ఉన్నాయి. కాఫీ తాగడం పూర్తిచేసి కప్పు కింద పెట్టాను.‘‘సారీ సర్.. లేటయ్యింది’’ వస్తూనే కళాధర్ పలకరిస్తూ, ప్రేమగా నన్ను హత్తుకున్నాడు. కుశలప్రశ్నల వర్షం కురిపించేడు. తడిసి ముద్దవుతూనే అన్నిటికీ జవాబిచ్చాను.‘‘సినిమా ఫీల్డ్కు వచ్చి ఎన్నాళ్లైంది సర్ ?’’ అడిగాను కుతూహలంగా.‘‘ముప్ఫైయేళ్లు దాటింది. అంతకుముందు మా ఊళ్లో ఉండేటప్పుడు నేనూ, మీబావగారు కలిసి తిరిగేవాళ్ళం. కథలు రాసేవాళ్ళం. నాటకాలు వేసేవాళ్ళం. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. పొట్టకూటి కోసం’’...‘‘ఇక్కడెలా అవకాశాలు వచ్చేయి?’’‘‘మొదట్లో పత్రికలకు సీరియళ్లు, కథలూ రాసేవాణ్ణి. మెల్లగా సినిమావాళ్లతో పరిచయాలు చేసుకున్నాను. ఎన్నో సినిమాలకు కథలు అందించాను. కొంతమందికి ఘోస్ట్ రైటర్ గా పనిచేశాను.’’‘‘రచయితగా మీరు సాధించిందేంటి..?’’‘‘నాలుగు రాళ్లు వెనకేసుకోవడం... అంతకు మించి ఏం లేదు. నీతులూ సూక్తులూ చైతన్యాలూ మన వల్ల కాదు. బతుకు దెరువు కోసం నా రచనల్ని అమ్ముకుంటున్నాను. ఒకప్పుడు సినిమాలకు, ఇప్పుడు టీవీ సీరియళ్లకు...’’ కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడతను. ఎంతో ముచ్చటేసింది.‘‘ఆల్ ది బెస్ట్ సర్. ఇక నేనొచ్చిన పని మీకు తెలుసు కదా?’’‘‘తెలుసు సర్. శేఖరం రాత్రే ఫోన్ చేశాడు. నా మిత్రునికి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డ్ వచ్చిందంటే నాకు మాత్రం ఆనందం కాదా! తప్పకుండా వస్తాను. ఏర్పాట్లన్నీ దగ్గరుండి నేనే చూస్తాను. సరేనా..?’’ఇచ్చిన ఆహ్వాన పత్రికను తనఫైల్లో భద్రంగా దాచుకున్నాడతను. లంచ్ కానిచ్చి తిరుగు ప్రయాణానికి తయారయ్యాను. ఇద్దరూ స్టేషన్కు కార్లో దిగబెట్టారు. అతను నా పక్క బ్యాక్ సీట్లో కూర్చుంటే, కారు డ్రైవింగ్ చేసింది యామిని. స్టేషన్ చేరుకునే సరికి ప్లాట్ఫామ్పై ట్రైన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అనౌన్స్మెంట్ వినిపిస్తోంది.‘‘చివరగా ఒకే ఒక్క ప్రశ్న... అడగొచ్చా?’’ బెర్త్పై కూర్చొంటూ అడిగాను.‘‘అడగండి.. పర్వాలేదు’’‘‘మీరెందుకు పెళ్లి చేసుకోలేదు?’’‘‘సరైన అమ్మాయి దొరక్క...’’ బిగ్గరగా నవ్వేడతను. యామిని కిసుక్కున నవ్వింది.అతని విచిత్ర సమాధానానికి నేనేమీ ఫీలవ్వలేదు. పైగా అతని వ్యక్తిగత జీవితంపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఆరా తీయాలనిపించింది. ఇంటికొచ్చాక బావగారిని అడిగాను. అతను కూడా వెంటనే చెప్పడానికి ఇష్టపడలేదు. గట్టిగా పట్టుబడితేనే తప్ప.‘‘నాకు తెలిసినప్పటి నుంచి వాడిదో పెక్యూలియర్ మెంటాలిటీ. బాగా డబ్బు సంపాదించాలని, దర్జాగా బతకాలని కలలు కనేవాడు. ఇంటర్ నుంచి మా ఇద్దరికీ పరిచయం. సైకిల్పై కాలేజీకి వచ్చేవాడు. ఒంటరిగా ఏదో రాసుకుంటూనో, ఎక్కడో చదువుకుంటూనో కనిపించేవాడు. కాలేజీ మ్యాగజైన్లో మా ఇద్దరి కవితలు పడ్డాక మరింత సన్నిహితమయ్యాము. పుస్తకాల గురించి, సినిమాల గురించి చర్చించేవాళ్ళం. డిగ్రీ పూర్తయ్యాక ఇద్దరమూ కలిసి మా పేర్లలోని సగాలతో కలిపి ‘చంద్రకళ’ అనే పేరుతో కథలు రాసేవాళ్ళం. తొంబైల్లో జంటరచయితలుగా మాకో ప్రత్యేక గుర్తింపు కూడా ఉండేది. మా కుటుంబానికి కూడా బాగా దగ్గరయ్యాడు. అలాంటి వాడు ఉన్నట్టుండి అదృశ్యమైపోయాడు. ఎక్కడున్నాడో, ఏమైపోయాడో తెలీదు. వాడి సొంతవూరు వెళ్లి విచారిస్తే, కొన్ని చేదు నిజాలు తెలిశాయి. వాడి కన్నతల్లి చిన్నతనంలోనే చనిపోయిందని కొందరు, కాదు... లేచిపోయిందని మరికొందరు... సవతితల్లితో చాలా బాధలు పడ్డాడని మరికొందరు... చాలా బాధనిపించాయి.. ఐదేళ్ల తర్వాత వాడి నుంచి ఉత్తరం వచ్చింది హైదరాబాదులో క్షేమంగా వున్నానని, ఓ పత్రికాఫీసులో పనిచేస్తున్నానని... చదివి సంతోషమనిపించింది. ఆ తర్వాత శిక్షణ పూర్తయి నేను టీచర్ గా స్థిరపడ్డాను. నాపెళ్ళికీ, చెల్లి పెళ్ళికీ పిలిచాను. ఆనందంగా పాల్గొన్నాడు. ఇప్పుడు నువ్వడిగిన ప్రశ్ననే చాలాసార్లు వాడిని అడిగాను. పెళ్లి నా ఒంటికి పడదని నవ్వుతూ సమాధానం దాటవేసేవాడు. వాడిపై బోలెడు పుకార్లు... నేనవేవీ పట్టించుకోవడం మానేశాను. ఎవరెవరితోనో తిరిగి, ప్రస్తుతం ఎవరో ఒకామెతో సహజీవనం చేస్తున్నాడని విన్నాను. ఇన్ని అవలక్షణాలు ఉన్నా, మనిషిగా మాత్రం మంచివాడు. సవతితల్లి కూతురి పెళ్లిని తనే ఘనంగా చేశాడు. మా నాన్నగారి గుండె చికిత్సకు అయిన ఖర్చునంతా తనే పెట్టాడు. డబ్బు తిరిగి చెల్లించబోతే ఎంతమాత్రం ఒప్పుకోలేదు. సినీ రచయితగా వాడి రచనల్లోని విలువలూ, ఆలోచనా దృక్పథమూ నాకు నచ్చవు. అయినాసరే, అవెప్పుడూ మా స్నేహానికి అడ్డు రాలేదు’’ ముగించారు బావగారు. అతనేంటో మరింత అర్థమవడం ఆరంభమైంది.‘‘సభకు నమస్కారం... నా పేరు కళాధర్. నేనొక టీవీ, సినీ రచయితనని మీ అందరికీ తెలిసే ఉంటుంది. తన ‘అగ్నిశిఖ’ కథాసంపుటి ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకోబోతున్న నా మిత్రుడు చంద్రశేఖరానికి ముందుగా అభినందనలు. మేమిద్దరం ప్రాణస్నేహితులమని చెప్పడం కంటే శేఖరం స్నేహితుడినని చెప్పుకోవడమే నాకు గర్వకారణం. శేఖరం ఒకగొప్ప రచయిత. అంతకు మించి స్నేహశీలి. స్వతహాగా నేను బిడియస్తుణ్ణి. ఎవరితోనూ కలిసేవాడిని కాదు. ఒంటరి నా ఆలోచనలను సరిచేసి, కుటుంబ ఆప్యాయతలను, అనుబంధాలను అందించిన ఆత్మీయవ్యక్తి శేఖరం. రచయితగా రచనల్లోని మెలకువలు నేర్పిన మార్గదర్శి. ఈరోజు నేనిలా నిలబడ్డానికి కారణం వాడిచ్చిన ప్రోత్సాహమే! అందించిన స్నేహహస్తమే! రచన చేయడం గొప్ప కాదు, ఒక సామాజిక బాధ్యతతో, సైద్ధాంతిక నిబద్ధతతో ఒక కొత్త తరాన్ని తయారు చేసి నడిపించగలగడం మహత్కార్యం, సాహిత్యసేవ. దాన్ని శేఖరం మాత్రమే చేతల్లో చూపించాడు. నిజంగా వాడొక అగ్నిశిఖ. వాడి రచనల్ని తడిమి చూసేంత సత్తా ఏ విమర్శకుడికీ లేదు. వాడి రచనలు కళ్ళు చెమర్చే జీవితపు విలువలు, స్ఫూర్తినిచ్ఛే మానవీయ స్పందనలు. డబ్బు కోసమో, పేరు కోసమో, కాలక్షేపం కోసమో రాయడు. అందుకే వాడి రచనలంటే గౌరవం. వాడంటే భయం. ఇది మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. చివరగా శేఖరానికి ఇలాంటి అవార్డులెన్నో రావాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటూ, సెలవు తీసుకుంటున్నాను’’కళాధర్ ప్రసంగం ముగిసింది. ఆడిటోరియం కరతాళధ్వనులతో మార్మోగిపోయింది. బావగారిని గట్టిగా హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడతను.ఆ తర్వాత వక్తలెందరో ప్రసంగించారు. రాష్ట్ర మంత్రివర్యుల చేతుల మీదుగా బావగారికి ఘనసత్కారం జరిగింది. అభిమానులు, మిత్రులు పోటాపోటీగా శాలువాలు కప్పేరు. పనిలో పనిగా కళాధర్ని కూడా సన్మానించారు. అన్నట్టుగానే నిర్వహణ అంతా తన భుజాలపైనే వేసుకుని, కళాధర్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశాడు.ఆ రోజు నుంచి బావగారి కీర్తిప్రతిష్ఠలు అమాంతం పెరిగిపోయాయి. మిగిలిన ఎన్నో సంస్థల అవార్డులు, సత్కారాలు వరుసగా వరించాయి. సందర్శకుల తాకిడి ఎక్కువైపోయింది. పరిశోధక విద్యార్థులు, సాహిత్యాభిలాషులు. ఔత్సాహిక రచయితలు... ఎందరెందరో... ఎక్కడెక్కడి నుంచో... ఇంటికి వచ్చేవారు. విషయ సేకరణ చేయడమో, రచనా నైపుణ్యాల గురించి అడిగి తెలుసుకోవడమో చేసేవారు. చర్చలు, సమావేశాలు రోజురోజుకీ ముమ్మరమయ్యాయి. దూరాభార కార్యక్రమాలకు రాకపోకలు ఎక్కువయ్యాయి. వృద్ధాప్యంలో ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదనీ అక్కా... కుటుంబ సభ్యులు ఎన్నోసార్లు హెచ్చరించారు. అవి ఆయన చెవికెక్కలేదు.అలా ఒకరోజు ఎక్కడో సాహిత్య సమావేశం జరుగుతోంది. బావగారు ముఖ్యఅతిథి. ఉద్వేగంగా ప్రసంగిస్తూ.. సభావేదికపైనే గుండెనొప్పంటూ కుప్పకూలిపోయారు. నిర్వాహకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. రెండు రోజుల చికిత్స అనంతరం బావగారి ప్రాణం పోయింది.సాహిత్య లోకానికే కాదు, మా కుటుంబాలకు కూడా పెద్ద దిక్కు లేకుండా పోయింది. కళాధర్ వేదన గట్టుతెగిన వాగైంది. అందరి హృదయాలూ దుఃఖంతో బరువెక్కాయి. సంతాపసందేశాలూ, చానళ్లలో స్క్రోలింగ్ వార్తలూ హోరెత్తాయి. ఆప్తులందరి సమక్షంలో బావగారి భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి. దశదినకర్మలు పూర్తయ్యాయి. వేడుక ముగిసిన వేదికలా బావగారిల్లు మిగిలిపోయింది.కొన్నేళ్ళకు మరో చేదు వార్త కమ్ముకుంది. కళాధర్ కూడా కాలధర్మం చేశాడనే వార్త! నిద్దట్లోనే గుండె ఆగిపోయిందట! హృదయం బాధా తప్తమైంది. మరు నిమిషం హైదరాబాద్ రాత్రి బస్సెక్కెశాను. నేను వెళ్లేసరికి శవాన్ని ఉంచేందుకు ఫ్రీజర్ను సిద్ధం చేస్తున్నారు. సినీ టీవీ రంగాల ప్రముఖులెందరో విచార వదనాలతో ఒక్కరొక్కరూ వస్తున్నారు. కొయ్యబారిన దుఃఖంలా యామిని ఉంది. కళాధర్ వ్యక్తిగత లాయర్ అప్పుడొచ్చాడు వీలునామా పట్టుకొని... చదివి వినిపించాడు. అంతా నివ్వెరపోయారు.హిందూ మతాచారాల పట్ల తనకు నమ్మకం లేదని, మరణానంతరం తన పార్థివదేహాన్ని ఏదైనా మెడికల్ కాలేజీకి అప్పగించాలని.., తను ఉంటున్న ఇల్లు, బ్యాంక్ అకౌంట్లో నగదు మొత్తం యామినికి చెందుతుందని.. మిగిలిన యావదాస్తి సమంగా నగరంలోని అన్ని అనాథ శరణాలయాలకు చెందుతుందని దాని సారాంశం.కళాధర్ గొప్ప మనసును అక్కడ చేరిన గొంతులు వేనోళ్ళ పొగిడాయి. జోహారు నినాదాలు పెద్ద ఎత్తున చేశాయి. ఈ వార్త క్రమేపి వార్తా చానళ్ల వరకూ పాకింది.‘గొప్ప మానవతావాది.. సినీ రచయిత కళాధర్కు జోహార్’ అంటూ ఒక రోజంతా లైవ్ కవరేజీ ప్రసారం చేశారు. ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర మంత్రివర్యులు కూడా హాజరై నివాళులర్పించారు. భౌతిక దేహాన్ని అంతిమ దర్శనం చేసుకుని, యామిని దగ్గరికి వచ్చాను. నిస్తేజంగా చూసిందామె.‘‘బాధపడకండి... అంతా మంచే జరుగుతుంది...’’ అన్నాను.‘‘పర్వాలేదు సర్... విల్లు వివరాలన్నీ తెలుసు... ఆయన ఆకాంక్షలను గౌరవిస్తాను’’ అందామె క్లుప్తంగా...ప్రతిఏటా మిత్రులిద్దరి వర్ధంతులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతూనే ఉన్నాయి. సాహిత్య మార్గదర్శిగా అతని అనుచరులు చంద్రశేఖర్ని స్మరిస్తూ, అతని సాహిత్యాన్ని సమగ్రంగా చర్చించుకుంటూ ఎక్కడో ఒకచోట... అయితే తండ్రిలా తమని పోషిస్తూ, విద్యాబుద్ధులు చెప్పిస్తున్న కళాధర్ను దేవుడిలా కొలుస్తూ, ధ్యానమందిరాల్లో పూజలు చేస్తూ ఎందరో అభాగ్యులు అనాథ శరణాలయాల్లో మరో చోట...∙పాలకొల్లు రామలింగస్వామి -
రెక్కలున్నా.. లెక్క తేలక... పదేళ్లుగా ఉన్నచోటే!
2015 ఆగస్టు 7 రాత్రి 7 గం.లకు ‘మెక్డొనెల్ డగ్లస్ ఎం.డి. 83’ అనే బంగ్లాదేశ్ బోయింగ్ విమానం మన దేశంలో దిగింది. నిజానికి, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో టేకాఫ్ అయిన ఆ విమానం నేరుగా ఒమన్ రాజధాని మస్కట్ వెళ్లాలి. అయితే దారి మధ్యలో విమానంలోని ఒక ఇంజిన్ చెడిపోయింది. పైలట్ విమానాన్ని అత్యవసరంగా రాయ్పుర్ (ఛత్తీస్గఢ్)లోని స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్లో దింపేశాడు. విమానంలో ప్రయాణిస్తున్న 176 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తర్వాత వాళ్లంతా ప్రత్యేక విమానంలో మస్కట్ చేరుకున్నారు. అయితే రాయ్పుర్లో ఆ రోజు ల్యాండ్ అయిన ఆ ‘డగ్లస్ 83’ మాత్రం నేటికీ తిరిగి బంగ్లాదేశ్ చేరుకోలేదు! రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా పదేళ్లుగా ఇప్పటికీ అక్కడే అంగుళం అయినా కదలకుండా ఉండిపోయింది!పార్కింగ్కి రూ.4 కోట్ల బకాయిపదేళ్లుగా ఆ డగ్లస్ 83 విమానం నిలిపి ఉన్న స్థలం ‘ఎయిర్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (ఏఏఐ) కిందికి వస్తుంది. అక్కడ పార్క్ చేసినందుకు ‘బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్’ ఇప్పటికి రూ. 4 కోట్లకు పైగా బకాయి పడింది. ఇమ్మంటే ఇవ్వదు, విమానాన్ని తీసుకుపోమ్మంటే పోదు. చూసి, చూసి, ఐదేళ్లు ఓపిక పట్టిన ఏఏఐ 2021 జనవరి 18న అధికారికంగా లేఖ రాసింది. ఆ లేఖ కూడా పని చేయలేదు. విమానం లాగే ఎక్కడి విజ్ఞప్తులు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడిక బంగ్లాదేశ్లో ఉన్నది తాత్కాలిక ప్రభుత్వం కావటంతో ఏఏఐ కూడా చూసీ చూడనట్లు పోవలసి వస్తోంది. కొనేవాళ్ల కోసం ఎదురుచూపులు!రాయ్పుర్, స్వామి వివేకానంద విమానాశ్రయంలో ఉన్నవే 11 పార్కింగ్ బేస్లు. (మొదట ఎనిమిదే ఉండేవి). వాటిల్లో ఒక బేస్లో డగ్లస్ ఎం.డి.83 ఉండిపోయింది. దానిని డంప్ యార్డ్కు పంపటానికి లేదు, అలా పడి ఉంటుందిలే అని సర్దుకుపోయే వీలూ లేదు. రెండు మూడు మరమ్మత్తుల చేస్తే చాలు, పైకి ఎగిరే విమానమే అది. అయితే బంగ్లాదేశ్ ఆ పని కూడా చేయటం లేదు! ‘‘కొనేవాళ్ల కోసం ఎదురు చూస్తున్నాం. కాస్త టైమ్ ఇవ్వండి..’’ అని బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్ అంటోంది. విసిగి వేసారిన రాయ్పుర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎస్.డి. శర్మ, న్యాయపరంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతికేందుకు ఉన్న మార్గాల కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ వస్తే చాలుఅసలు డగ్లస్ 83 అత్యవసరంగా ల్యాండ్ అయిన మూడు వారాల తర్వాత గానీ బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ అధికారులు పర్యవేక్షణ కోసం రాయ్పుర్ రాలేదు! ఆ వచ్చిన వాళ్లు మాత్రం చెడిపోయిన ఇంజిన్ను తీసి, దాని స్థానంలో కొత్తది బిగించారు. అంతవరకు బాగానే ఉంది. అయితే అక్కడి నుంచి విమానాన్ని తీసుకెళ్లాలంటే బంగ్లాదేశ్ విమానయాన శాఖ నుంచి తప్పనిసరిగా.. ‘ఎగిరేందుకు ఫిట్గా ఉంది’ అన్న సర్టిఫికెట్ రావాలి. అది రావటం లేదు, ఇది ఎగరటం లేదు. మనవాళ్లు ఇప్పటికి లెటర్లు, ఈమెయిళ్లు, కలిపి దాదాపు 100 వరకు పంపారు. నెలనెలా గుర్తు చేస్తూనే ఉన్నారు. ‘‘ఇదిగో, ఫిట్నెస్ సర్టిఫికెట్ రాగానే విమానాన్ని తీసుకెళతాం’’ అని గత పదేళ్లుగా ఒకటే సమాధానం. రాయ్పుర్ ఎయిర్పోర్టుకూ ఇబ్బందులు ఉన్నాయి. అక్కడి నుండి రోజూ 30 విమానాలు టేకాఫ్ అవుతాయి. 30 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఉదయం 8–10 గం. మధ్య, సాయంత్రం 4–6 గం. మధ్య మొత్తం నాలుగు గంటల పాటు పదకొండు పార్కింగ్ బేస్లు విమానాలకు అవసరం అవుతాయి. డగ్లస్ 83 కారణంగా ఆ బేస్లో ఉంచవలసిన వాటిని వేరే బేస్కు తరలించాల్సి వస్తోంది. ... ఇక వాళ్ల కష్టాలు..!‘బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్’ నష్టాల్లో కూరుకుపోయి, 2016లోనే కార్యకలాపాలు ఆగిపోయాయి. ఆ సంస్థ నుండి ఇంతవరకు ఒక్క విమానం కూడా టేకాఫ్ అవలేదు. అక్కడి నుంచి ఎనిమిది విమానాలను తీసుకెళ్లి ఢాకా హజ్రత్ షాజాలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ‘కార్గో అప్రోచ్ ఏరియా’లో వదిలేశారు. అక్కడ అవి కార్గో ఫ్లయిట్స్ కదలికలకు అడ్డుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో – రాయ్పుర్ విమానాశ్రయానికి పార్కింగ్ చార్జీలు చెల్లించలేక, విమానాన్ని తీసుకెళ్లలేక, ‘‘మీరే ఎవరైనా కస్టమర్ను వెతికి పట్టుకుని, డగ్లస్ 83ని వచ్చింతకు అమ్మేసి, మీ బకాయిలను మినహాయించుకుని, మిగిలిన డబ్బును మాకు పంపండి’’ అని బంగ్లాదేశ్ యునైటెడ్ ఎయిర్వేస్.. మన ఎయిర్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ·అసలు ఆ రోజు ఏం జరిగిందంటే?‘మెక్డొనెల్ డగ్లస్ ఎం.డి. 83’ విమానం బంగ్లాదేశ్లో టేకాఫ్ అయింది. వారణాసి–రాయ్పుర్ గగనతల హద్దులోకి వచ్చేసరికి ఒక ఇంజిన్ పాడైపోయింది! లోపల 176 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసరంగా ల్యాండ్ అవకపోతే గాల్లోనే పేలిపోయే ప్రమాదం ఉందని ఫైలట్ షాబాజ్ ఇంతియాజ్ ఖాన్ గ్రహించారు. భూమికి 32 వేల అడుగుల ఎత్తున విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. విమానంలోని ఫ్లయిట్ ఇంజినీర్ ‘ప్రమాదంలో ఉన్నాం. ల్యాండింగ్కి అనుమతి ఇవ్వండి’ అని సంకేతం పంపారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ సంకేతం కోల్కతాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి చేరలేదు. కోల్కతా చెబితేనే రాయ్పుర్ చేస్తుంది. ఏమైతే అది అయిందని విమానాన్ని రాయ్పుర్లో దించేయాలని పైలట్ నిర్ణయించుకున్నారు. అయితే అత్యవసరంగానే అయినా ఒక విమానాన్ని ల్యాండ్ చేయించే అధికారం రాయ్పుర్ ఎయిర్ పోర్ట్కు లేదు. కోల్కతా నుంచి ఆదేశాలు రావాలి. అయితే దురదృష్టంతో పాటుగా అదృష్టమూ వారి వెంట ఉన్నట్లుంది. పైలట్ ఇచ్చిన సంకేతాన్ని ముంబై నుండి కోల్కతా వెళుతున్న ఇండిగో ఫ్లయిట్ పైలట్ పికప్ చేసుకుని ఆ సమాచారాన్ని కోల్కతా ఎయిర్పోర్ట్కు అందించారు. కోల్కతా ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే రాయ్పుర్ అధికారులకు సమాచారం ఇచ్చి ల్యాండింగ్కి అనుమతి ఇవ్వాలని కోరారు. రాయ్పుర్ ఎయిర్పోర్ట్లో ఎలా దిగాలో తెలిపే నేవిగేషన్ చార్టు లేకుండానే విమానం సురక్షితంగా దిగేందుకు ఇండిగో పైలట్ నిర్విరామంగా రేడియో కాంటాక్ట్లోఉండి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారు. విమానం భద్రంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులకు వేరే విమానం అందుబాటులో లేకపోవటంతో 27 గంటల పాటు వారు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. బంగ్లాదేశ్ నుండి ఆగస్టు 8 రాత్రి 10.27 గం.లకు ప్రత్యేక విమానం వచ్చి వారిని మస్కట్ తీసుకెళ్లింది. -
ఏఐ డాక్టర్లా? మజాకా?
డాక్టర్ ఏఐ– ఇదొక కొత్త స్టెతస్కోప్ ఇదొక రోబో సర్జన్ ఇదొక డయాగ్నస్టిక్ ల్యాబ్ ఇది రోగుల పాలిటి వరం వైద్యరంగం చేతిలోని శరంకృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి దూసుకొచ్చేస్తున్నట్లే, వైద్యరంగంలోకి కూడా శరవేగంగా దూసుకొస్తోంది. ఏఐ మాయాజాలం వైద్యరంగంలో పెనుమార్పులను తీసుకొస్తోంది. మన దేశంలోని ఆస్పత్రులు కూడా ఇటీవలి కాలంలో ఏఐని విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. వైద్యరంగంలో డాక్టర్ ఏఐ ఇప్పటికే తీసుకొచ్చి మార్పులను, భవిష్యత్తులో తీసుకురానున్న మార్పులను ఒకసారి తెలుసుకుందాం.‘కరోనా’కాలంలో ప్రపంచవ్యాప్తంగా వైద్య ఆరోగ్యరంగం అత్యంత సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడే పరిస్థితులు ఉంటే, చాలా చోట్ల ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బంది లేని పరిస్థితి. మహమ్మారి వ్యాధులు విజృంభించినప్పుడు మాత్రమే కాదు; సీజనల్ వ్యాధులు ఇబ్బడి ముబ్బడిగా వ్యాపించేటప్పుడు; అనుకోని విపత్తులు తలెత్తేటప్పుడు ఆస్పత్రుల్లో రోగుల తాకిడి విపరీతంగా పెరుగుతుంది. రోగుల తాకిడికి తగినంతగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండరు. ఇలాంటి విపత్కర పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోవడంలో ఏఐ బాగా సహాయపడగలదని నిపుణులు చెబుతున్నారు. వైద్యులపై పనిభారం తగ్గించడానికి, వారి పనిని మరింత సులభతరం చేయడానికి ఏఐ వరప్రసాదం లాంటిదని వారు అంటున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల మొదలుకొని, సంక్లిష్టమైన శస్త్రచికిత్సల వరకు వివిధ దేశాల్లోని ఆస్పత్రులు ఏఐని ఉపయోగించుకుంటున్నాయి. ప్రపంచంలోనే తొలి ఏఐ ఆస్పత్రిప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి ఏఐ ఆస్పత్రి ఇటీవల చైనాలో ప్రారంభమైంది. చింగ్హ్వా యూనివర్సిటీ ఈ పూర్తిస్థాయి ఏఐ ఆస్పత్రిని అభివృద్ధి చేసింది. ‘ఏజెంట్ హాస్పిటల్’ పేరిట ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో ఇతర సాధారణ ఆస్పత్రుల్లో మాదిరిగా మనుషులు ఉండరు. ఇదంతా ఒక మాయాలోకంలా ఉంటుంది. ఇందులో పనిచేసే సిబ్బంది అంతా పద్నాలుగు మంది ఏఐ డాక్టర్లు, నలుగురు ఏఐ నర్సులు మాత్రమే! ఈ ఏఐ ఆస్పత్రిలో పేషెంట్లను చేర్చుకునే వార్డులు కూడా కనిపించవు. ఈ ఆస్పత్రిలోని ఏఐ డాక్టర్లు, ఏఐ నర్సులు ‘వర్చువల్’గానే రోగులకు సేవలు అందిస్తూ ఉంటారు. రోజుకు దాదాపు మూడువేల మందికి ఈ ఏఐ డాక్టర్లు, ఏఐ నర్సులు రోగ నిర్ధారణ మొదలుకొని, రకరకాల చికిత్సలను అందిస్తూ ఉంటారు. ఈ ఏఐ డాక్టర్లు ఆషామాషీ చాట్బోట్లు కాదు, యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ (యూఎస్ఎంఎల్ఈ) పరీక్షల్లో 93.06 శాతం మార్కులు సాధించిన ఘనత సొంతం చేసుకున్న ఘనవైద్యులుగా గుర్తింపు పొందాయి. అంతేకాదు, కొన్ని రంగాల్లో అనుభవజ్ఞులైన మానవ వైద్యులను మించిన ఫలితాలను సాధించిన ఘనత కూడా ఈ ఏఐ వైద్యులు సాధించడం విశేషం.తొలి రిమోట్ ఏఐ సర్జరీచైనా శాస్త్రవేత్తలు ఏఐ డాక్టర్ల రూపకల్పనలోనే కాదు, ప్రపంచంలోనే తొలి రిమోట్ ఏఐ సర్జరీని ఇటీవల విజయవంతంగా నిర్వహించారు. ఫుడాన్ యూనివర్సిటీకి చెందిన ఐ అండ్ ఈఎన్టీ హాస్పిటల్ వైద్య శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఐదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా రిమోట్ ఏఐ సర్జరీని నిర్వహించారు. ఏఐ సాయంతో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సకు సాధారణంగా చేసే శస్త్రచికిత్స కంటే ముప్పయిశాతం తక్కువ సమయం పట్టింది. అంతేకాదు, రోగికి పెట్టే కోతలో మిల్లీమీటరులో పదోవంతు కూడా తేడా లేనంత కచ్చితత్వంతో ఈ శస్త్రచికిత్స జరగడం అద్భుతమనే చెప్పుకోవాలి. ఫుడాన్ వర్సిటీ ఈఎన్టీ విభాగం డైరెక్టర్ డాక్టర్ వు చున్పింగ్ ఆధ్వర్యంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్రచికిత్స ద్వారా రోగి గొంతులో ఏర్పడిన కణితిని ‘ట్రాన్స్ ఓరల్ సర్జికల్ రోబో సిస్టమ్’ ద్వారా ఏఐ సాయంతో తొలగించారు. షాంఘైలో ఉన్న వైద్యనిపుణుల సూచనలకు అనుగుణంగా, అక్కడకు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని చెంగ్డూ ఆస్పత్రిలోని ఏఐ సర్జికల్ రోబోలు ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశాయి. ‘బోర్న్ ’ గ్రూప్లోని సింఫనీ రోబోటిక్స్ కంపెనీ ఈ ఏఐ సర్జికల్ రోబోలను తయారు చేసింది. షాంఘైలోని వైద్య నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన రిమోట్ ఏఐ సర్జరీ వల్ల శస్త్రచికిత్స ఖర్చు ఇరవై శాతం మేరకు, సమయం ముప్పయి శాతం మేరకు తగ్గినట్లు ‘బోర్న్’ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈవో లి యావో తెలిపారు. ‘బోర్న్’ గ్రూప్ రూపొందించిన ఏఐ సర్జికల్ రోబోలకు కావలసిన 1760 విడిభాగాలను చైనాలోని 165 కంపెనీల నుంచి సమకూర్చుకున్నట్లు లి యావో చెప్పారు. ఏఐ సర్జికల్ రోబోలను అభివృద్ధి చేయడానికి, వాటి వినియోగాన్ని మరింతగా విస్తరించడానికి తమ సంస్థ అమెరికా, జపాన్, జర్మనీలకు చెందిన కంపెనీలు, వైద్య పరిశోధక సంస్థలకు సహకరిస్తోందని వెల్లడించారు.ఏఐ మాయాదర్పణంవైద్యరంగంలో వ్యాధుల నియంత్రణ, చికిత్స పద్ధతులు ఒక ఎత్తు అయితే, వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరో ఎత్తు. వ్యాధుల చికిత్సకు వ్యాధి నిర్ధారణే కీలకం. ఎంత ఆధునిక వ్యాధి నిర్ధారణ పద్ధతులైనా, కొన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షల ఫలితాలు రావడానికి ఒకటి రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు సమయం పడుతుంది. అయితే, ఏఐ రాకతో వ్యాధి నిర్ధారణ శరవేగం పుంజుకుంటోంది. వ్యాధి నిర్ధారణలో ఏఐ తీసుకొచ్చిన వేగానికి ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఈ మాయాదర్పణమే తాజా ఉదాహరణ. మామూలుగా అద్దం ముందు నిలుచున్నట్లుగానే ఈ మాయాదర్పణం ముందు నిలుచుంటే చాలు, ఉన్నపళాన మీ ఆరోగ్య వివరాలను క్షణాల్లో చెప్పేస్తుంది. ఈ మాయాదర్పణం డయాబెటిస్, బీపీ వంటి సర్వసాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు పార్కిన్సన్స్, డెమెన్షియా, గుండెజబ్బులు, శ్వాస సమస్యలు, నాడీ సమస్యలు, లివర్ సమస్యలు, క్యాన్సర్ వంటి జటిలమైన వ్యాధులను కూడా ఇట్టే గుర్తించగలదు. స్మార్ట్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లుగా దీని ముందు నిలబడి ముప్పయి సెకన్ల సెల్ఫీ వీడియో తీసుకుంటే చాలు, ఇది శరీరాన్ని ఆపాదమస్తకం త్రీడీ స్కానింగ్ చేసేస్తుంది. అంతేకాదు, క్షణాల్లోనే ఈ మాయాదర్పణం ముప్పయి రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి, వాటి వివరాలను అత్యంత కచ్చితత్వంతో చెబుతుంది. అమెరికన్ హెల్త్టెక్ స్టార్టప్ కంపెనీ ‘విదింగ్స్’ దీనిని ‘ఒమీనా’ పేరిట రూపొందించింది. ఈ ఏడాది లాస్వేగాస్లో జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)–2025లో ప్రదర్శించిన దీని పనితీరు నిపుణుల ప్రశంసలు పొందింది. ‘ఒమీనా’ మాయాదర్పణం కేవలం ఆరోగ్య వివరాలను తెరపై చూపించి, అంతటితోనే సరిపెట్టుకోదు. ఇది ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా కూడా పనిచేస్తుంది. తెరపై కనిపించే ఆరోగ్య వివరాలను చూసుకున్న తర్వాత వినియోగదారులు అడిగే సందేహాలన్నింటికీ సమాధానాలను ఓపికగా చెబుతుంది. గుర్తించిన ఆరోగ్య సమస్యలకు సంబంధించి, తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలపై సూచనలు కూడా చేస్తుంది. వ్యాధి నిర్ధారణ రంగంలో ‘ఒమీనా’ ఏఐ సంచలనానికి నాంది పలుకుతుందని నిపుణులు చెబుతున్నారు.మన ఆస్పత్రుల్లోనూ ఏఐమన దేశంలోని ప్రముఖ ఆస్పత్రులు కూడా ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. అంతర్జాతీయ సాంకేతిక సంస్థలైన గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటివి భారత్లోని ఆస్పత్రులకు ఏఐ సాంకేతికతను అందించడానికి ముందుకొస్తున్నాయి. అపోలో హాస్పిటల్స్, ఫోర్టిస్ హెల్త్కేర్, మణిపాల్ హాస్పిటల్స్, అరవింద్ ఐ హాస్పిటల్స్, ఏజే హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, టాటా మెమోరియల్ హాస్పిటల్, నారాయణ హెల్త్, క్లౌడ్నైన్ హాస్పిటల్స్, కావేరీ హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్స్ వంటివి ఇప్పటికే ఏఐ సాంకేతికతను రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళిక, శస్త్రచికిత్సలలో కచ్చితత్వం తదితర అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. పలు ఔషధ తయారీ సంస్థలు, పరిశోధక సంస్థలు ఔషధాల రూపకల్పన కోసం కూడా ఏఐని వినియోగించుకుంటున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులే కాకుండా, ప్రభుత్వ ఆస్పత్రులు కూడా ఏఐ సాంకేతికతను వినియోగించుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘భారత్నెట్’ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటికీ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో సుమారు రూ.8500 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ‘నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్’ కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని పౌరులందరికీ ఆరోగ్య గుర్తింపు కార్డులు జారీ చేయాలని సంకల్పించుకుంది. ఈ ఆరోగ్య గుర్తింపు కార్డులకు పౌరుల వ్యక్తిగత ఆరోగ్య సమాచారం అంతా అనుసంధానమై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ పథకం అమలులోకి వచ్చినట్లయితే, ఏఐ సాంకేతికత గ్రామీణ ఆస్పత్రులకు కూడా అందుబాటులోకి వస్తుంది.ఆరోగ్యరంగంలో విస్తరిస్తున్న ఏఐప్రపంచవ్యాప్తంగాను, మన దేశంలోను ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ గడచిన ఐదేళ్లుగా బాగా విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ విలువ 2022 నాటికి 11 బిలియన్ డాలర్లుగా (రూ.94,112 కోట్లు) నమోదైంది. ఇది 2025 నాటికి 35.71 బిలియన్ డాలర్లకు (రూ.3.04 లక్షల కోట్లు) చేరుకోగలదని మార్కెట్ వర్గాల అంచనా. భారత్లో 2022 నాటికి ఆరోగ్యరంగంలో ఏఐ మార్కెట్ విలువ 0.13 బిలియన్ డాలర్లు (రూ.1112 కోట్లు) ఉంటే, ఈ ఏడాది చివరి నాటికి ఈ విలువ 1.6 బిలయన్ డాలర్లకు (రూ.13,689 కోట్లు) చేరుకోగలదని ‘ఫోర్బ్స్’ పత్రిక అంచనా. భారత్ ఆరోగ్య రంగంలో ఏఐ మార్కెట్ 40.6 శాతం మేరకు వార్షిక వృద్ధి నమోదు చేసుకోగలదని కూడా ‘ఫోర్బ్స్’ పత్రిక తన అంచనాను ప్రకటించింది. భారత్ ఆరోగ్యరంగంలో ఏఐ విస్తరణ దిశగా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. టాటా గ్రూప్కు చెందిన ‘టాటా ఎల్క్సి’ ఏఐతో పనిచేసే మెడికల్ ఇమేజింగ్ పరికరాల తయారీ కోసం పనిచేస్తోంది. మన దేశానికి చెందిన డిజిటల్ హెల్త్కేర్ స్టార్టప్ సంస్థ ‘ప్రాక్టో’ తన టెలిమెడిసిన్ సేవల కోసం బహుభాషా సామర్థ్యం కలిగిన ఏఐ సాంకేతికతను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ ‘సిగ్టపుల్’ రక్త నమూనాలను దూరం నుంచే విశ్లేషించి, వ్యాధుల వివరాలను వెల్లడించగలిగే ‘డిజిటల్ పాథాలజీ ప్లాట్ఫామ్’ను ప్రారంభించింది. ఇది స్పెషలిస్టులు, హీమాటాలజిస్టుల అవసరం లేకుండానే ఏ ప్రాంతంలో ఉన్న రోగులకైనా రక్తపరీక్షల వివరాలను అందించగలదు.ఏఐ తెచ్చిన మార్పులుఆరోగ్యరంగంలో ఏఐ ఇప్పటికే చాలా మార్పులు తెచ్చింది. అయితే, ఈ మార్పుల ఫలితాలు ప్రపంచం అంతటా ఇంకా పూర్తిగా విస్తరించలేదు. మరో ఐదేళ్లలో ఆరోగ్యరంగంలో ఏఐ మరింతగా విస్తరించే సూచనలు ఉన్నాయి. ఆరోగ్య వైద్యసేవలలో ఏఐ ఇప్పటి వరకు తెచ్చిన కొన్ని మార్పులు ఇవి:ఏఐ వల్ల వ్యాధినిర్ధారణ సులభతరంగా మారింది. సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్రే వంటి వాటిని ఏఐ శరవేగంగా విశ్లేషించి రోగ నిర్ధారణ చేయగలుగుతోంది. ఈ పరీక్షలను విశ్లేషించడంలో మానవ తప్పిదాలకు కొంత ఆస్కారం ఉండేది. ఏఐ వినియోగంతో ఎలాంటి తప్పిదాలకు తావులేని పరిస్థితి ఏర్పడింది.ఏఐ సహాయంతో పలు దేశాల్లోని ఆస్పత్రులు విజయవంతంగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించగలుగుతున్నాయి. ఏఐ వినియోగం వల్ల శస్త్రచికిత్సల్లో కచ్చితత్వం పెరగడమే కాకుండా, శస్త్రచికిత్సకు పట్టే సమయం కూడా గణనీయంగా తగ్గుతుండటం విశేషం.చైనా ఇప్పటికే ఏఐ డాక్టర్లు సేవలందిçంచే స్థాయి పురోగతి సాధించింది. త్వరలోనే మిగిలిన దేశాలు కూడా ఏఐ డాక్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.మానసిక సమస్యలతో బాధపడేవారికి చికిత్సను అందించడంలోను, మానసిక సమస్యల లక్షణాలను ముందుగానే గుర్తించడంలోను ఏఐ సాంకేతికత ఉపయోగపడుతోంది.ఔషధ తయారీ సంస్థలు, ఔషధ పరిశోధనలు నిర్వహించే సంస్థలు ఔషధాల ఆవిష్కరణకు, కొత్త ఔషధాల రూపకల్పనకు కూడా ఏఐ సేవలను వినియోగించుకుంటున్నాయి.పలు దేశాల్లోని ఆస్పత్రులు ఏఐ సాంకేతికతను వ్యాధి నిర్ధారణకు విరివిగా వాడుకుంటున్నాయి. వివిధ వ్యాధి నిర్ధారణ పరీక్షల విశ్లేషణతో పాటు, ఎక్స్రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈసీజీ, టూడీ ఎకో తదితర నివేదికలను నిమిషాల్లోనే విశ్లేషించి, భవిష్యత్తులో రానున్న వ్యాధులను గుర్తించడానికి కూడా ఏఐ సాంకేతికత ఉపయోగపడుతోంది.చైనా ఇప్పటికే ఏఐ డాక్టర్లు సేవలందించే స్థాయి పురోగతి సాధించింది. త్వరలోనే మిగిలిన దేశాలు కూడా ఏఐ డాక్టర్లను రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి.ఏఐ డాక్టర్లా? మజాకా?‘ఏజెంట్ హాస్పిటల్’లోని ఏఐ డాక్టర్లన్నీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్లో శిక్షణ పొంది; వైద్య శాస్త్ర విషయాలను, వ్యాధి నిర్ధారణ పద్ధతులను ఆకళింపు చేసుకుని; రోగుల పరిస్థితికి తగినట్లుగా స్పందించడంలో మానవ వైద్యుల కంటే మిన్నగా రూపొందినవి. వైద్యరంగంలోని వివిధ అంశాలపై కూలంకషమైన పరిజ్ఞానం పొందడానికి సాధారణంగా ఏళ్లతరబడి కృషి అవసరమవుతుంది. ఈ ఏఐ డాక్టర్లు మాత్రం కొద్దివారాల్లోనే అంతటి పరిజ్ఞానాన్ని పొందడం విశేషం. సాధారణమైన జలుబు దగ్గు మొదలుకొని అత్యంత సంక్లిష్టమైన జన్యువ్యాధులకు, ఆటోఇమ్యూన్ వ్యాధులకు సైతం ఈ ఏఐ డాక్టర్లు సమర్థంగా చికిత్సలు అందిస్తుండటం విశేషం. నవజాత శిశువుల నుంచి వయోవృద్ధుల వరకు రకరకాల వయసుల్లోని రోగులకు తగిన రీతిలో ఊరటను అందిస్తూ, తగిన చికిత్సతో ఏఐ డాక్టర్లు రోగ నిదానం చేయడమే కాకుండా, రకరకాల మానసిక సమస్యలతో బాధపడే రోగులకు కౌన్సెలింగ్ ద్వారా సాంత్వన కలిగిస్తుండటం మరింత విశేషం. ఏఐ డాక్టర్లు ఔట్ పేషెంట్లకు వర్చువల్ రియాలిటీ ద్వారా సత్వర సేవలను అందిస్తున్నాయి. -
మాసిడోనియా జిలేబీ, మొఘలాయ్ పరోటా ట్రై చేయండిలా..!
కోల్కతా మొఘలాయ్ పరోటాకావలసినవి: మైదా పిండి– 2 కప్పులు, ఉప్పు– అర టీస్పూన్, నీళ్ళు– తగినన్ని, గుడ్లు– 4 , ఉల్లిపాయ– 1 (మీడియం సైజు, చిన్నగా తరగాలి), పచ్చిమిర్చి– 3 (చిన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్– 1 టీస్పూన్, కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు– తగినంత, చిల్లి ఫ్లేక్స్, మిరియాల పొడి, గరం మసాలా– అర టీస్పూన్ చొప్పున, కీమా– అర కప్పు (మసాలా, ఉప్పు, కారం వేసుకుని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదా పిండి, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. తరువాత, కొద్దికొద్దిగా నీళ్ళు కలుపుతూ, చపాతీ పిండి కంటే కొంచెం మృదువుగా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దకు నూనె రాసి, ఒక తడి క్లాత్తో కప్పి కనీసం 30 నిమిషాల నుంచి 1 గంట వరకు పక్కన ఉంచాలి. ఇలా చేయడంతో పిండి బాగా నాని, పరోటాలు సాఫ్ట్గా వస్తాయి. ఈలోపు ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేసుకుని, వేడి కాగానే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, చిల్లి ఫ్లేక్స్ అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, మైదా పిండి జల్లుకుంటూ, దీర్ఘచతురస్రాకారంగా, బాగా పలుచటి చపాతీల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో పరోటాలో, నాలుగు టేబుల్ స్పూన్ల కీమా–మసాలా మిశ్రమాన్ని నింపుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని, చివర్లు చేత్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్రతి పరోటాను అలానే చేసుకుని, పాన్ లో కొద్దికొద్దిగా నూనె పోసుకుని, ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.తూలుంబా మాసిడోనియా జిలేబీకావలసినవి: పంచదార– 3 కప్పులు, ఏలకుల పొడి– అర టీ స్పూన్నిమ్మరసం– ఒక టేబుల్ స్పూన్, నీళ్లు, నూనె– సరిపడామైదాపిండి– 2 కప్పులు, బేకింగ్ పౌడర్– ఒక టీస్పూన్, గుడ్లు– 6తయారీ: ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పులు నీళ్లు, అర కప్పు నూనె వేసుకుని, బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ చిన్న మంట మీద పెట్టి, మరుగుతున్న మిశ్రమంలో కొద్దికొద్దిగా మైదా పిండి, బేకింగ్ పౌడర్ వేస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. ముద్దలా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. తర్వాత గుడ్లు కొట్టి అందులో వేసుకుని బాగా గిలకొట్టినట్లుగా, క్రీమ్లా మారేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కవర సాయంతో, కేక్స్పైన డిజైన్స్ వాడే కోన్స్లా చేసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని నింపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి నూనె కాచి, దానిలో ఈ కోన్స్ తో గట్టిగా నొక్కి, ముక్కలుగా కత్తెరతో కట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈలోపు పంచదార, సరిపడా నీళ్లు, ఏలకుల పొడి, నిమ్మరసం వేసుకుని లేత పాకం పట్టుకుని.. ఆ పాకంలో వేగిన ముక్కలను వేసుకుని నాననిచ్చి సర్వ్ చేసుకోవాలి.పనీర్ బర్ఫీకావలసినవి: పనీర్ తురుము– ఒక కప్పుమిల్క్ క్రీమ్– పావు కప్పు, పంచదార పొడి– రుచికి సరిపడాఏలకుల పొడి– చిటికెడు, నెయ్యి– 4 లేదా 5 టేబుల్ స్పూన్లుపిస్తా, కుంకుమపువ్వు– కొద్దికొద్దిగా (గార్నిష్ కోసం, సన్నగా తరిగినవి)తయారీ: ముందుగా నాన్–స్టిక్ పాన్లో నెయ్యి వేసుకుని, వేడి చేసుకోవాలి. అనంతరం దానిలో పనీర్ తురుము, మిల్క్ క్రీమ్, ఏలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఉంచి, ఆ మిశ్రమంలో పంచదార పొడి వేసుకుని, సుమారు 5 నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం దగ్గరపడగానే చిన్న చిన్న పేపర్ కప్స్లో నింపుకుని చేత్తో ఒత్తుకుని నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవాలి. (చదవండి: అప్పుడు ఆశ్చర్యపరిచాయి..ఇప్పుడు అలవాటుగా మారింది..! విదేశీ మహిళ ప్రశంసల జల్లు) -
ఈ డాక్యుమెంట్ కెమెరాతో ఆన్లైన్ క్లాస్ ఈజీ..
టీచర్లు టెక్తో టచ్లోకి రావాలన్నా, విద్యార్థులు విజ్ఞానంలో విండో ఓపెన్ చేయాలన్నా.. వారి వద్ద ఈ టెకీ టూల్ మాస్టార్లు ఉండాల్సిందే!క్లాస్లో స్క్రీన్ స్టార్ఆన్లైన్ క్లాసుల్లో విద్యార్థులు బయటకు కనబడేలా భయపడితే, టీచర్లు లోలోపల భయపడుతుంటారు. ఎందుకంటే ముందే పీపీటీలు సిద్ధం చేయకపోతే, ‘సార్, స్క్రీన్ షేర్ చేయండి’, ‘మిస్, స్లయిడ్ మిస్ అయింది’ అంటూ సందేశాల వర్షం కురిపిస్తారు విద్యార్థులు. ఇక నెట్ స్లో, లైట్ తక్కువ, ఫాంట్ చిన్నది లాంటి ఇతర సమస్యలతో ఆన్లైన్ క్లాస్ మొత్తం గాలిలో కలిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్లకు తోడుగా ఉండే నేస్తమే ఈ ‘డాక్యుమెంట్ కెమెరా’. దీని ముందు పుస్తకం పెడితే చాలు, స్పష్టంగా సమాచారాన్ని స్క్రీన్పై చూపిస్తుంది. టచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, బటన్ నొక్కితే బ్లర్ లేకుండా చూసుకుంటుంది. మీరు పేజీ తిప్పితే ఇది కూడా తిప్పి చూపిస్తుంది. స్లయిడ్స్ అవసరం లేకుండా బుక్తోనే క్లాస్ పూర్తవుతుంది. ధర రూ. 2,999.ఆర్ట్ మాస్టర్!పిల్లలు బొమ్మలు గీస్తారు, కట్ చేస్తారు, స్టిక్ చేస్తారు. ఇలా చేస్తూ చేస్తూ చివరకు చేతికి బ్యాండేజ్ వేసుకుంటారు! ఇలాంటి చిన్న చిన్న గాయాలకు ఇకపై ఈ ‘స్కాన్ అండ్ కట్’ మెషిన్ గుడ్బై చెప్తుంది. బొమ్మ చూపిస్తే, ఏ మెటీరియల్పై అయినా కట్ చేయగలదు. కాగితం, ఫ్యాబ్రిక్, ఫోమ్.. ఏదైనా సరే, స్క్రీన్ మీద టచ్ చేస్తే చాలు, రెండు వందలకు పైగా రెడీ డిజైన్లతో సిద్ధంగా ఉంటుంది. ఒక్క క్లిక్తో కావాల్సిన ఆర్ట్ని రెడీ చేసి ఇస్తుంది. ఇది కేవలం కటింగ్ మెషిన్ కాదు. స్కానింగ్, డిజైనింగ్, కటింగ్ అన్నీ కలిపిన ఒక క్రాఫ్ట్ మాస్టర్. ఇంట్లోనైనా, క్లాస్రూమ్లోనైనా ఒక్కసారి పెట్టి చూడండి. అప్పుడు చిన్న చేతులు పెద్ద ఆర్ట్ చేయడం చూస్తారు. ధర రూ. 22,000. -
బుక్స్, బ్యాగ్స్ కాదు... మనసు సిద్ధం చేయాలి!
ప్రతి ఏడాది జూన్లో పాఠశాలలు మొదలవుతాయి. పుస్తకాలు, యూనిఫామ్లు, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు కొనడంలో తల్లిదండ్రులు దుకాణాల వద్ద బిజీగా ఉంటారు. కాని, ఈ హడావుడిలో మర్చిపోయే విషయం ఒక్కటే– ‘స్కూలుకు బిడ్డ మనసు సిద్ధంగా ఉందా లేదా?’వేసవి సెలవుల సరదాను వదిలి బయటకు రావడం, కొత్త క్లాసులో కొత్త టీచర్లు ఎలా ఉంటారో? అనే ఆందోళన, మళ్లీ మార్కుల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావడం చిన్నారుల మనసులో ఆందోళన రేకెత్తిస్తుంటాయి. పిల్లలు భయపడ్డప్పుడు వారి మెదడులోని అమిగ్డాలా (భయ కేంద్రం) తీవ్రంగా స్పందిస్తుంది. అది వారు నిర్ణయం తీసుకునే, జ్ఞాపకాలను నిలుపుకునే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ను బంధించి వేస్తుంది. ఫలితంగా వారి మెదడు కొత్త విషయాలను గ్రహించలేదు.భావోద్వేగ భద్రత ఉన్న పిల్లలు మాత్రమే చదువులో, స్వభావంలో, జీవిత గమ్యంలో ముందుకు వెళ్లగలుగుతారని ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీలోని డెవలపింగ్ చైల్డ్ సెంటర్ అధ్యయనంలో వెల్లడైంది. అందుకోసం ఈ ఐదు సూత్రాలను పాటించండి... 1. వాళ్ల భయాలను గౌరవించండికొత్త విషయాలు మొదలయ్యేప్పుడు భయపడటం సర్వసాధారణం. అది తప్పు కాదు. భావోద్వేగాలను పేరు పెట్టి పలకడం వల్ల మెదడులోని ఎమోషనల్ కేంద్రం శాంతిస్తుందని డాక్టర్ డ్యాన్ సీగల్ చెప్పారు. అందుకే స్కూల్ గురించి పిల్లలతో మాట్లాడటం మొదలుపెట్టండి. ∙‘‘ఈసారి స్కూలుకు సంబంధించి ఏది బాగా నచ్చింది?’’∙‘‘ఏమైనా భయంగా ఉందా?’’∙‘‘ఈసారి నిన్ను నీవు ఎలా మెరుగుపరచు కోవాలని అనుకుంటున్నావు?’’2. ఉదయాల్ని రణరంగం చేయకండిప్రతిరోజూ ఉదయం ‘‘త్వరగా లే! బ్రష్ చేయి! బస్ మిస్ అవుతాం!’’ అని అరవకండి. ఇంటిని రణరంగంగా మార్చకండి. పిల్లల నెర్వస్ సిస్టమ్ను శాంతంగా ఉంచేందుకు ఈ చిట్కాలు ఉపయోగించండి. లైట్ మ్యూజిక్ ప్లే చేయండిరెండు నిమిషాలు పక్కన కూర్చుని, ప్రేమను పంచండి. ‘‘ఈరోజు నీ స్టైల్లో మెరిసిపోతావ్’’ అని సానుకూల వాక్యాన్ని పలకండి.3. పాత ఫ్రెండ్స్ ను రీకనెక్ట్ చేయండి‘‘మా ఫ్రెండ్స్ నన్ను గుర్తుపెట్టుకుంటారా?’’, ‘‘ఎవరైనా తోడు ఉంటారా?’’ అనేదే పిల్లలకు ముఖ్యమైన భయం. ఈ భయాన్ని అధిగమించేందుకు ఈ పనులు చేయండి. ఇవి వారి మెదడులో ఆక్సిటోసిన్ను పెంచుతాయి. భావోద్వేగ భద్రతను పెంపొందిస్తుంది. స్కూల్ మొదలయ్యే ముందు ఒక ప్లే డేట్ ఏర్పాటు చేయండిఒకరిద్దరు క్లాస్మేట్లతో ఫోన్ ద్వారా మాట్లాడనివ్వండిక్లాసులో నడిచే కొన్ని సన్నివేశాలను రోల్ ప్లే చేయండి4. భావోద్వేగ లక్ష్యాలు కూడా పెట్టండిచాలామంది తల్లిదండ్రులు పిల్లలను ‘‘ఎన్ని మార్కులు వస్తాయి?’’ అని అడుగుతుంటారు. దీనికి బదులుగా భావోద్వేగ లక్ష్యాలను పెట్టండి. అది పిల్లల్లో అంతర్గత ప్రేరణను పెంచుతాయి.‘‘ఈ సంవత్సరం నువ్వు ఎలా అనిపించుకోవాలని అనుకుంటున్నావు?’’‘‘ఎలాంటి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నావు?’’‘‘నీ గురించి నువ్వు గర్వపడేలా ఏం చేస్తావు?’’5. మీ స్కూల్ అనుభవాలను పంచుకోండిమీరు కూడా స్కూలుకు వెళ్లేటప్పుడు భయపడ్డారని చెప్పండి. ఉదాహరణకు:‘‘ఒకసారి టీచర్ నన్ను బాగా కొట్టింది. అప్పట్లో చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆ సంఘటన వల్ల నేను మరింత మృదువుగా మాట్లాడటం నేర్చుకున్నాను’’ అని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల బిడ్డ ‘‘నా భావోద్వేగాలు తప్పు కావు’’అన్న భద్రతను పొందుతాడు.ప్రతి రోజు అడగాల్సిన మూడు ప్రశ్నలుమీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ప్రతిరోజూ ఈ మూడు ప్రశ్నలూ అడగండి. ఇవి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, భావోద్వేగ పరిణతిని, అనుబంధాన్ని పెంచుతాయి.1. ‘‘ఈ రోజు నీకు ఏం నచ్చింది?’’2. ‘‘ఏదైనా బాధించిందా?’’3. ‘‘ఏ విషయం పట్ల నీకు గర్వంగా అనిపించింది?’’చేయకూడనిమూడు పొరపాట్లు1. ‘‘అన్నయ్య/చెల్లెలు ఎలా టాపర్ అయ్యారో చూడు!’’ అంటూ పోల్చవద్దు. ఇది అవమానాన్ని కలిగిస్తుంది.2. ‘’90 శాతం మార్కులొస్తే ఫోన్ కొనిస్తా’’ అని చెప్పొద్దు. ఇది పిల్లల్లో బాహ్య ప్రేరణను పెంచుతుంది. బహుమతుల కోసమే చదవడం అలవాటవుతుంది. 3. పిల్లలను అతి ఎక్కువ ట్యూషన్లతో నింపొద్దు. వారిలో మానసిక అలసట పెరుగుతుంది.సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: ఆ చేదు అనుభవమే స్టార్టప్గా అంకురార్పణ..! ఇవాళ అమెరికాలో..) -
కాల్గరీ.. హోరాహోరీ..
పండుగల్లో జరుపుకొనే సంబరాలకు సాహస విన్యాసాలు కూడా తోడైతే, ఆ మజానే వేరుంటుంది. కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్కు చెందిన కాల్గరీ నగరంలో జరిగే ‘కాల్గరీ స్టాంపీడ్ ఫెస్టివల్’ అలాంటిదే! ఇది కెనడియన్ పశ్చిమ సంస్కృతికి ప్రతీక. ప్రతి ఘట్టంలోనూ ఉద్వేగం, ప్రతి క్షణమూ ఆశ్చర్యం ఈ వేడుక ప్రత్యేకత! హార్స్ రైడింగ్లు, బుల్ ఫైటింగ్లతో ఈ సంబరాలు హోరెత్తిపోతాయి. ఈ పండుగను ‘ప్రపంచంలోనే గొప్ప ఔట్డోర్ షో’ అని పిలుస్తారు. ఈ పండుగను జూలై మొదటి శుక్రవారం నుంచి ప్రారంభించి, పదిరోజుల పాటు నిర్వహిస్తారు. ఈసారి జూలై 4న మొదలైన ఈ వేడుక జూలై 13వ తేదీ వరకు జరగనుంది. కెనడా చరిత్రను కళ్ళకు కట్టే ‘చక్–వ్యాగన్’ రేసులను ‘హాఫ్–మైల్ ఆఫ్ హెల్’ అని పిలుస్తారంటే అర్థం చేసుకోవచ్చు, ఆ పోటీల్లో ఎంతటి ఉత్కంఠ ఉంటుందో! ‘ఇవి కేవలం ఆటలు కాదు, నైపుణ్యానికి, ధైర్యానికి నిలువెత్తు నిదర్శనాలు’ అంటారు స్థానికులు. ఈ పదిరోజులు రాత్రిపూట కల్గరీ నగరం విద్యుద్దీపాల ధగధగలతో మెరిసిపోతుంది. అలాగే అంతర్జాతీయ కళాకారుల సంగీత కచేరీలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతుంది. ఇక్కడ పాశ్చాత్య సంగీతానికి చిందులు వేస్తూ అలుపు లేకుండా ఆనందించవచ్చు. స్థానిక కళలు, రుచికరమైన ఆహార పదార్థాలు మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. అద్భుతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన పోటీలు, స్నేహపూర్వక వాతావరణం కలగలిసిన కాల్గరీ స్టాంపీడ్, జీవితంలో ఒక్కసారైనా చూడదగిన అద్భుతమైన పండుగ! -
జంభాసుర సంహారం
పూర్వం జంభాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మ కోసం తపస్సు చేసి, అనేక దివ్యవరాలు పొందాడు. అంతటితో సంతృప్తి చెందక శివుడి కోసం తపస్సు చేశాడు. తపస్సుతో శివుడిని మెప్పించి, వరాలుగా అనేక దివ్యాయుధాలను పొందాడు. ఇన్ని వరాలు పొందిన తాను త్రిలోకాధిపత్యం సాధించాలని తలచాడు. తలచినదే తడవుగా పెద్దసంఖ్యలో రాక్షస సైన్యాన్ని సమకూర్చుకుని; స్వర్గ, మర్త్య, పాతాళ లోకాల మీదకు దండయాత్రకు బయలుదేరాడు.మర్త్య పాతాళ లోకాలు జంభాసురుడికి తేలికగానే వశమైపోయాయి. స్వర్గంపై దండెత్తిన జంభాసురుడి రాక్షస సైన్యానికి, దేవ సైన్యానికి భీకర యుద్ధం జరిగింది. జంభాసురుడి ధాటికి తట్టుకోలేక దేవతలు చివరకు ఓటమిని అంగీకరించి, స్వర్గాన్ని విడిచిపెట్టి పారిపోయారు. స్వర్గం నుంచి పారిపోయిన దేవతలు భూలోకంలోని ఒక పర్వతారణ్య ప్రాంతానికి చేరుకున్నారు. అది వాలఖిల్యాది మహర్షుల తపోభూమి. దేవగురువు బృహస్పతి కూడా అక్కడకు చేరుకున్నాడు. బృహస్పతి ఆధ్వర్యంలో దేవతలంతా మహర్షుల వద్దకు వెళ్లి, వారికి తమ గోడు చెప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీమహావిష్ణువును ఆశ్రయించడం తప్ప వేరే దిక్కులేదని వాలఖిల్యాది మహర్షులు దేవతలకు చెప్పారు. శ్రీమహావిష్ణువు భూలోకంలో దత్తాత్రేయుడిగా అవతరించి, సహ్యాద్రి ప్రాంతంలో విహరిస్తున్నాడని తెలిపారు. అతడు మదవతీ మద్యలోలుడిగా, నింద్యాచారుడిగా కనిపిస్తాడని; అతడిని సేవిస్తూ కనిపించే మదవతి సాక్షాత్తు లక్ష్మీదేవి అని, అతడిని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టమని, గత్యంతరం లేదు కనుక అతడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించక తప్పదని మహర్షులు చెప్పారు.మహర్షుల మాటలతో ఇంద్రాది దేవతలు బృహస్పతిని ముందు నిలిపి, సహ్యాద్రి ప్రాంతానికి వెళ్లారు. కొంత వెదుకులాట తర్వాత దత్తాశ్రమాన్ని కనుగొన్నారు. ఆశ్రమం లోపల ఉన్న గది మధ్యభాగంలో విశాలమైన తల్పంపై మానినుల ఒడిలో విశ్రాంతిగా సేదదీరుతూ, ఒక భామిని ముందుగా తాను రుచి చూసి, చషకంలో నింపి అందిస్తున్న రకరకాల మధువులను అదేపనిగా తాగుతూ దత్తాత్రేయుడు కనిపించాడు. ఆశ్రమంలోని దృశ్యానికి దేవతలందరూ చకితులయ్యారు. వారు ఒకరికొకరు సైగలు చేస్తూ ఆశ్రమంలో ఎవరికి వారే సర్దుకున్నారు. దత్తాత్రేయుడికి, ఆయన ఆశ్రమ వాసులకు సేవలు చేయడం మొదలుపెట్టారు. ఇంద్రుడు స్వయంగా దత్తాత్రేయుడికి ఆంతరంగిక సేవకుడయ్యాడు. కొన్నాళ్లు గడిచాక దత్తాత్రేయుడు తనకు ఆంతరంగికంగా మెలగుతూ, అన్ని సేవలూ చేస్తున్న ఇంద్రుడిని పిలిచి, ‘ఎవరు మీరంతా? ఆశ్రమంలోకి వచ్చి, ఏమీ అడగకుండా మా అందరికీ ఎందుకు సేవలు చేస్తున్నారు?’ అని అడిగాడు. దత్తాత్రేయుడు అన్నిరోజుల తర్వాత నోరుతెరిచి ప్రశ్నలు అడగటంతో ఇంద్రుడు అతడి పాదాల ముందు సాష్టాంగపడ్డాడు. తర్వాత లేచి, వినయంగా వంగి నిలబడి, ‘దత్తయోగీంద్రా! ఏమీ తెలియనట్లు నువ్విలా అడగడం విడ్డూరంగా ఉంది. నేను ఇంద్రుడిని. నాతో వచ్చిన మిగిలిన వారంతా దేవతలు. జంభాసురుడు దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించుకోవడంతో దిక్కుతోచక ఇక్కడకు వచ్చాం. నీ అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాం’ అని బదులిచ్చాడు ఇంద్రుడు.‘ఏమిటీ? నువ్వు దేవేంద్రుడివా? వీరంతా దేవతలా? అష్టదిక్పాలకులతో సేవలు పొందే నీ సేవలు నేను పొందడమా? అపచారం.. అపచారం. నేను నీ సేవలు పొందడం గాని, మా ఆశ్రమవాసులు దేవతల సేవలు పొందడం గాని తగనిపని. ఈ క్షణం నుంచి మీరందరూ మీ సేవలను విరమించుకోండి. మీకే మేమంతా సేవలు చేసి, తరిస్తాం. ఇక జంభాసురుడు ఆక్రమించుకున్న స్వర్గాన్ని తిరిగి నువ్వు పొందడానికి సహకరించమంటావా? తప్పకుండా! నేను ఆచారభ్రష్టుడినైన మామూలు తపస్విని. మా ఆశ్రమవాసులను చూశావు కదా, మేమెంతటి వీరులమో నీకు అర్థమయ్యే ఉంటుంది. రణరంగానికి రాలేము గాని, శిబిరాల్లో ఉంటూ, క్షతగాత్రులకు సేవలు చేయడం ద్వారా సహకరించగలం’ అని పలికాడు దత్తాత్రేయుడు.‘దత్తయోగీంద్రా! కాపాడవలసిన నాథుడే మాతో పరాచికాలడటం తగునా? నువ్వు అనుగ్రహించకుంటే, సేవలు చేసుకుంటూ ఇదే ఆశ్రమంలో ఉండిపోతాం’ అన్నాడు ఇంద్రుడు.‘దేవేంద్రా! అపార్థం చేసుకున్నావు. నా దినచర్య కళ్లారా చూశావుగా, ఇంద్రియాలనే జయించలేని నేను ఇంద్రుడికి సహకరించడమా, విడ్డూరం! మీకు ఏ సేవలు అందించాలో ఆజ్ఞాపించండి. తప్పకుండా ఆ సేవలు అందిస్తాం’ అన్నాడు దత్తాత్రేయుడు.‘స్వామీ! నీ పరీక్షలను తట్టుకోలేం. నువ్వు జగన్నాథుడివైన శ్రీమన్నారాయణుడివని నాకు తెలుసు. నీకు అనుదినం చషకంతో మధువును అందించే భామిని సాక్షాత్తు లక్ష్మీదేవి అని కూడా తెలుసు. నీ ఆశ్రమ బృందం, మధుసేవ, మానినీ వినోదం అంతా మాయ అని తెలుసు. మా అపరాధాలకు ఇదే విరుగుడు’ అంటూ ఇంద్రుడు దత్తాత్రేయుడి పాదాల వద్ద మోకరిల్లి, పాదాలను పట్టుకున్నాడు.దత్తాత్రేయుడు పకపక నవ్వి, ‘నీ స్వర్గాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. జంభాది రాక్షసులను నాకు కనిపించేలా చేయి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను’ అని అభయమిచ్చి పంపాడు.దత్తత్రేయుడి ఆశీస్సులతో ఇంద్రుడు దేవతలతో బయలుదేరి, జంభాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించాడు. దేవతలకు, రాక్షసులకు భీకర సంగ్రామం జరిగింది. యుద్ధంలో దేవతలు పారిపోతున్నట్లు నటించి, రాక్షసులను దత్తాశ్రమం వరకు తీసుకొచ్చారు. ఆశ్రమంలో సౌందర్యరాశిలా కనిపించిన లక్ష్మీదేవిని చూసి, రాక్షసుల మతులు పోయాయి. వారు ఆమెను తమ నాయకుడైన జంభాసురుడికి సమర్పిస్తే, సంతోషిస్తాడని తలచారు. తమ మాయతో బంగారు పల్లకిని సృష్టించి, అందులో కూర్చోమని లక్ష్మీదేవిని గద్దించారు. ఆమె దత్తాత్రేయుని వైపు చూసింది. కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు. ఆమె నెమ్మదిగా వచ్చి, పల్లకిలో కూర్చుంది. అంతటి సౌందర్యరాశి కూర్చున్న పల్లకిని భుజాల మీద మోయడం కంటే తల మీద మోయడం బాగుంటుందనుకుని, రాక్షసులు ఆమె కూర్చున్న పల్లకిని నెత్తికెత్తుకుని మోసుకుపోయారు.అప్పుడు దత్తాత్రేయుడు, ‘దేవతలారా! మీ కోరిక నెరవేరింది. లక్ష్మీదేవి వారి నెత్తికెక్కింది. అంటే, వారికి సర్వనాశనం తప్పదు’ అన్నాడు. ఆ మాటలతో దేవతలు రెట్టించిన ఉత్సాహంతో చేతికందిన ఆయుధాలను పట్టుకుని, రాక్షసుల వెంట పడ్డారు. అప్పటి వరకు విజృంభించిన రాక్షసులు ఒక్కసారిగా నీరసించి, యుద్ధరంగంలో పిట్టల్లా రాలిపోయారు. చివరకు జంభాసురుడు ఇంద్రుడి వజ్రాయుధానికి బలయ్యాడు. స్వర్గం తిరిగి దేవతల వశమైంది.∙సాంఖ్యాయన -
అప్పుడు ఎస్కేప్... ఇప్పటికీ వాంటెడ్!
2023 జనవరి 7న ఒకేరోజు హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లకు చెందిన ఐదు పోలీసుస్టేషన్ల పరిధిలో పంకజ్ అలియాస్ పింకు నేతృత్వంలోని గ్యాంగ్ విరుచుకుపడింది. కేవలం రెండున్నర గంటల వ్యవధిలో ఏడు చైన్ స్నాచింగ్స్ చేసిన ఈ ముఠా 20 తులాలకు పైగా బంగారం కాజేసింది. వీళ్లను పట్టుకోవడానికి టాస్క్ఫోర్స్, స్పెషల్ ఆపరేషన్ టీమ్లకు (ఎస్వోటీ) చెందిన 14 ప్రత్యేక బృందాలు ఐదు రాష్ట్రాల్లో గాలించినా, పాత్రధారి తప్ప సూత్రధారి చిక్కలేదు. 2016లోనూ ఇదే పంథాలో పంజా విసిరిన ఈ ముఠా నాయకుడు అప్పట్లో ‘చిక్కడం–పారిపోవడం’తో ఇప్పటికీ వాంటెడ్గానే ఉన్నాడు.ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాలో ఉన్న 12 గ్రామాలకు చెందిన కొందరు దేశవ్యాప్తంగా స్నాచింగ్స్ చేయడాన్నే వృత్తిగా ఎంచుకున్నారు. పోలీసు పరిభాషలో వీటిని బవారియా గ్యాంగ్స్గా పిలుస్తారు. ఆ జిల్లాలోని బడా కాన్పూర్ గ్రామానికి చెందిన మన్ప్రీత్ అలియాస్ మంగళ్ నేతృత్వంలో పనిచేసే ముఠాలో పింకుతో పాటు రాజీవ్, గోవింద్ సభ్యులుగా ఉండేవారు. 2016 ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చిన మంగళ్ గ్యాంగ్ శాస్త్రీపురంలో డెన్ ఏర్పాటు చేసుకుంది. సైబరాబాద్ పరిధిలో సీరియల్ స్నాచింగ్స్ చేసింది. ఆ ముఠాలో సభ్యుడిగా ఉన్న గోవింద్ను రాజేంద్రనగర్ పోలీసులు అదే ఏడాది మార్చిలో అరెస్టు చేశారు. అప్పటికి పరారీలోనే ఉన్న మంగళ్ షామ్లీ జిల్లాలోని అహ్మద్గఢ్, బడా కాన్పూర్ కాలా, నయాబస్ గ్రామాలకు చెందిన సోను కుమార్, రాజీవ్ కోహ్లీ, పింకులతో మరో ముఠా కట్టాడు. ఈ గ్యాంగ్ 2016 మార్చి రెండో వారంలో హైదరాబాద్ వచ్చింది. వస్తూ వస్తూ ఢిల్లీ నుంచి రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసి రైలులో పార్సిల్ ద్వారా తీసుకువచ్చింది. వీళ్లు పీర్జాదిగూడ ఆదర్శ్నగర్ కాలనీలో డెన్ ఏర్పాటు చేసుకున్నారు. 2016 మార్చి 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని సైదాబాద్, చందానగర్, కేపీహెచ్బీ కాలనీ, మీర్పేట్ తదితర ఠాణాల పరిధిలో పన్నెండు స్నాచింగ్స్ చేశారు. వీటితో పాటు మరో రెండు చోట్ల స్నాచింగ్కు విఫలయత్నాలు చేశారు. అప్పట్లో ఈ ఉదంతాలు సంచలనం సృష్టించడంతో నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 2016లో రెండో దఫా జరిగిన సీరియల్ స్నాచింగ్స్ను సీరియస్గా తీసుకున్న పోలీసులు ముమ్మరంగా వేటాడి వారం రోజుల్లోనే పింకును పట్టుకున్నారు. అతడిని అదుపులో ఉంచుకుని మిగిలిన వారి కోసం గాలిస్తుండగా, అదను చూసుకుని పారిపోయాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు అనేక ప్రాంతాల్లో గాలించారు. రాజస్థాన్లో నయాబస్ గ్రామంలో అతడి ఆచూకీ కనిపెట్టి, మరోసారి పట్టుకున్నారు. ఈ ప్రయత్నాల్లో అతడికి గాయం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులే అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. దీన్నీ పింకు తనకు అనువుగా మార్చుకున్నాడు. ప్రాథమిక చికిత్స తర్వాత హైదరాబాద్ తీసుకురావాలని పోలీసులు భావించారు. ఈ విషయం అక్కడి న్యాయస్థానం వరకు వెళ్లడంతో చికిత్స పూర్తయ్యే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు వచ్చాయి. దీంతో పింకు కోసం ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడే ఉంచిన అధికారులు కొన్ని రోజులు అతడిపై కన్నేసి ఉంచేలా చర్యలు తీసుకున్నారు. గాయాల నుంచి కోలుకున్న పింకు ఆ విషయం బయటపడనీయకుండా క్షతగాత్రుడిగానే నటిస్తూ వచ్చాడు. ఒకరోజు హాస్పిటల్ వద్ద కాపలాగా ఉన్న పోలీసు కళ్లుగప్పి పారిపోయాడు. దీంతో అవాక్కైన అధికారులు ఇక్కడ నుంచి అదనపు సిబ్బందిని పంపారు. వాళ్ల కృషి ఫలితంగా ఒక స్నాచర్ చిక్కగా, పింకు సహా ముగ్గురు పరారీలోనే ఉండిపోయారు. కొన్నాళ్లకు పింకు విషయాన్ని పోలీసులు మరచిపోయారు. ఇలాంటి అదను కోసమే వేచి ఉన్న అతడు 2023లో మరోసారి పంజా విసిరాడు. మరో ముగ్గురితో ముఠా కట్టి ఆ ఏడాది జనవరి 8న బెంగళూరులో నేరాలు చేసి, మరుసటి రోజు హైదరాబాద్ వచ్చాడు. నాంపల్లిలో ద్విచక్ర వాహనాన్ని తస్కరించిన ఈ ముఠా, ఉప్పల్లో మొదలెట్టి రామ్గోపాల్పేట వరకు వరుసపెట్టి ఏడు చైన్ స్నాచింగ్స్ చేసింది. ఈ నేరాలు చేయడానికి పింకు సహా నలుగురు హైదరాబాద్ రాగా, ఇద్దరు కాచిగూడ రైల్వేస్టేషన్లోనే వేచి ఉన్నారు. స్నాచింగ్స్ చేయడానికి వాడిన వాహనాన్ని పింకు, మరో నిందితుడు రామ్గోపాల్పేటలో వదిలేసి కాచిగూడ వచ్చి మిగిలిన ఇద్దరితో కలిసి పారిపోయారు. బవారియా గ్యాంగ్ 2016–23 మధ్య హైదరాబాద్పై మూడుసార్లు పంజా విసిరింది. 2016 ఫిబ్రవరిలో మంగళ్ నేతృత్వంలో పింకు సహా నలుగురు వచ్చి స్నాచింగ్స్ చేయగా, గోవింద్ ఒక్కడే చిక్కాడు. అదే ఏడాది మార్చిలో మంగళ్ లీడర్గా పింకుతో పాటు మరో ఇద్దరితో కలిసి వచ్చి నేరాలు చేశారు. ఆ కేసుల్లో కేవలం సోను మాత్రమే చిక్కాడు. 2023 జనవరిలో పింకు నేతృత్వంలో మంగళ్ (ఇతడు మరో మంగళ్), లక్ష్మణ్, సెహ్వాగ్ వచ్చి రాచకొండ, హైదరాబాద్ల్లో ఏడు స్నాచింగ్స్ సహా తొమ్మిది నేరాలు చేశారు. ఈసారి మంగళ్ మాత్రమే చిక్కగా, పింకు సహా ముగ్గురు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. చోరీ సొత్తు సైతం వారి వద్దే ఉండిపోవడంతో రికవరీ కాలేదు. ఈ స్నాచర్ల కోసం పోలీసులు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో గాలించారు. టాస్క్ఫోర్స్, ఎస్వోటీ బృందాలు ఉత్తరప్రదేశ్లోని షామ్లీ, బవారియాలలో గాలించినా, పింకు మాత్రం చిక్కలేదు. -
ఈ వారం కథ: నీడకు పట్టిన చీడ
ముంబై–బెంగళూరు నేషనల్ హైవేలో ఓ కారులో వేగాన్ని సూచించే ముల్లు నూటయాభై కిలోమీటర్లకు అటూ ఇటూగా ఊగిసలాడుతున్నది. డ్రైవరు మినహా కారులోని మిగతా అందరూ కడుపులోని సల్ల కదలకుండా జోగుతున్నారు. ప్రయాణం మొదలైన మూడుగంటల తర్వాత రోడ్డు పక్క చెట్లు అడ్డొచ్చినప్పుడల్లా ఉదయపు సూర్యుడి వెలుగు కారు లోపలికి పడీపడక దోబూచులాడుతున్నది. ఎప్పుడు మేలుకున్నాడో వెనకున్న కొడుకు ‘‘ఏంటి నాన్నా, చెట్లన్నీ వెనక్కి పోతున్నాయి’’ అంటూ ఊహించని ప్రశ్న వేశాడు. డ్రైవరు పక్కన కూర్చున్న నేను మెలకువగా ఉన్నా, ఏడేండ్లు కూడా నిండని వాడికి ఎలా సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. పక్కనే కూర్చున్న వాళ్ళమ్మ కూడా మౌనాన్నే ఆశ్రయించింది. నేను పుట్టిన ఊరు పుట్టపర్తి చేరేవరకు కొడుకు ప్రశ్న తిరగదోడుతూనే ఉన్నాడు. ముంబై నుంచి ఎప్పుడు ఊరొచ్చినా విమానంలోనే వచ్చి వెళ్ళే వాళ్ళం. అందుకే మా కొడుక్కు రైలు ప్రయాణానుభవం లేదు. వాడి స్కూలు కూడా ఇంటికి అందుబాటులో ఉండడంతో బస్సు ప్రయాణం కూడా అందనిదే! అందుకే చెట్లెందుకు వెనక్కి పోతున్నాయో అనే ప్రశ్న వాడి బుర్రలోకి వచ్చిందనుకుంటా.నేనిప్పుడు ముంబైలోని హోమీబాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సీనియర్ సైంటిస్టుగా ఉద్యోగం చేస్తున్నానంటే మా గురువు రాఘవేంద్రరావు సారు పుణ్యమే! నేనెప్పుడు మా ఊరు పుట్టపర్తి వచ్చినా,హైస్కూల్లో నాకు భౌతికశాస్త్రం పాఠం చెప్పిన ఆ సారు ‘దర్శనం’ చేసుకోకుండా వెళ్ళిన సందర్భమే లేదు. దర్శనం అని ఎందుకన్నానంటే ఆయన నాకు కేవలం గురువే కాదు దైవం కూడా!చాలాసార్లు నా భార్య ‘‘ఎందుకు ఆ సారు అంటే అంత ఇష్టం? ఆ ఒక్క సారు పాఠం చెబితేనే నువ్వు ఇంతటి సైంటిస్టయ్యావా? ఎప్పుడో పదో తరగతిలో పాఠాలు చెప్పిన సారును గుర్తు పెట్టుకుని వాళ్ళింటికి వెళ్తావు, పాద నమస్కారం చేస్తావు, ఆయన ఎంత వారిస్తున్నా బట్టలు కొనిస్తావు. అయినా ఆ తర్వాత నీ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ గురువులకు ఎందుకు ఇంతటి గౌరవం ఇవ్వవు? ఆ సారు మాత్రమే ఎలా ముఖ్యుడయ్యాడు?’’ అంటూ ప్రశ్నించేది. నేను నవ్వేసేవాడిని. కార్లో ‘‘ఇప్పుడు ఖాళీగా ఉన్నావుగా ఆ సారు గురించి చెప్పవూ’’ అంటూ నా కూతురు స్వర్ణమ్మ గోల మొదలెట్టింది. భార్య, కొడుకు కూడా చెప్పాల్సిందే అన్నారు.‘‘ఆరున్నొక్కటి ఎనిమిది/సారంబుగ నేడు నైదు సద్గుణ మూడున్/ ధీరత రెండును తొమ్మిది/శ్రీరాముని కిత్తు నాల్గు సీతాఫలముల్’’–‘‘ఈ పద్యంలో దాగిన విషయం చెప్పిన వారికి సోమవారం బహుమతి లభిస్తుంది’’ మా పాఠశాలకు బదిలీ మీద వచ్చిన భౌతికశాస్త్ర అధ్యాపకుడు సాయంత్రపు గంట మోగగానే, ఈ పద్యం బోర్డుపై రాసి, మేమంతా పద్యం నోటుపుస్తకంలో రాసుకున్న తర్వాతనే తాను తరగతి గది నుంచి బయటకు వెళుతూ పైమాట చెప్పాడు. అసలే చివరి పీరియడ్, ఆపై శనివారం. ఒక్కరోజు సెలవు కోసం ఆరురోజులుగా వేచి చూస్తున్న వాళ్ళం. పద్యం బుర్రలకెక్కలేదు. పైగా ‘‘సెలవురోజు కొత్తయివారితో ఇదెక్కడి గొడవ’’ ఒకరికొకరు అనుకున్నాం.సోమవారం పాఠశాలకు వెళ్ళాం. మొదటి పీరియడ్ భౌతికశాస్త్రం సారొచ్చారు. అటెండ¯Œ ్స తీసుకోగానే పాఠం మొదలెట్టారు. క్లాస్ ముగుస్తుందనగా, ‘‘మొన్న బోర్డుపై రాసిన పద్యంలో దాగిన విషయం ఎంతమంది తెలుసుకున్నారో చేతులెత్తండి’’ అన్నారు.ఒక్కరూ సారు వైపు చూడలేదు. ఒకరిద్దరు సారు వైపు చూసినా తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. చేతులెత్తలేదు. ‘‘బహుమతి నాకే మిగిలింది’’ అన్నాడు సార్.‘‘నిన్నటి పద్యంలో విషయం ఇది’’ అన్నాడు. అందరమూ బోర్డు వైపు చూశాం.బోర్డుపై అటు మూడు, ఇటు మూడు గడులు వేసి పద్యంలో అంకెలు ఒకో గదిలో ఒకటి వేశాడు. పైనుంచి కిందకి, కింది నుంచి పైకి, మూలలకి కూడమన్నాడు. ఎటు చూసినా పదిహేనే వచ్చింది. పిల్లలందరమూ ‘భలే’ అన్నట్టు చూశాం. ఈయప్ప భౌతికశాస్త్రం పాఠం చెప్పకుండా తెలుగు, లెక్కలు చెబుతున్నాడేమిటా అనుకున్నాం.బయటకు వెళుతూ పిల్లల భుజాలపై చేతులు వేసి ‘‘పద్యంలో దాగున్న విషయం ఎందుకు కనుక్కోలేదు’’ అన్నారు సారు. ‘‘మేం పద్యం కంఠస్థం చేసుకొస్తిమి సార్’’ అంటూ క్లాసులో అందరమూ ఆయన్ను కూడా తోసుకుంటూ తరగతి బయటపడ్డాం.‘‘నేను అడిగింది మీకు అర్థం కాలేదేమోలే’’ మనసులో అనుకున్నట్లు పైకే అనేశాడు సార్.మరుసటి శనివారం పీరియడ్ ముగింపు సమయంలో మరో పద్యం బోర్డుపై వ్రాశాడు.‘‘అన్నాతి గూడ హరుడవు/ అన్నాతిని గూడకున్న అసుర గురుడవు/ అన్నా తిరుమలరాయా!/ కన్నొక్కటి లేదు గాని కంతుడ గావే’’పిల్లల వైపు తిరిగి ‘‘ఈ పద్యంలోని విషయం చెప్పాలి. బహుమతి విషయం మరచిపోవద్దు’’ అన్నాడు.మరుసటి సోమవారం తిరిగి అదే పరిస్థితి. పద్యం అందరమూ కంఠస్థం చేసుకుపోయిన సంగతి చెప్పాం. సార్ మొహంలో చికాకు కనిపించింది. ‘‘తిరుమలరాయడనే తుళువ రాజవంశస్థుడికి మశూచి సోకి ఒక కన్ను పోయింది. ఎలా ఉన్నా, రాజకుటుంబంలోని వ్యక్తిని పొగడక తప్పదు. ఆ పొగడడం ఎలా అని ఆలోచించి, ‘తిరుమల రాయుడు తన భార్యతో కలిసి జంటగా ఉన్నపుడు మూడుకన్నులు కలిగిన శివుడి వంటి వాడవు, భార్యతో లేనపుడు ఒకే కన్ను కలిగిన అసురగురువైన శుక్రాచార్యుడంతంటి వాడవు. అసలు నీకో కన్ను లేదు గానీ, ఉంటే మన్మథుడంతటి అందగాడివి కదా! అని పొగిడాడని పద్య విశేషం’’ అన్నాడు.మరో పది వారాలు సారు నుంచి అలాంటివే సమస్యలు, విద్యార్థుల నుంచి కొంచెం ఇంచుమించు అదే రకం జవాబులు, లేదా ప్రశ్నకు అతకని జవాబులు. ఆ తరగతి చివరి శనివారం ‘‘సదువెందుకు సంకనాకనా పదిలముగా పదియావులు మేపుకున్న పాలిచ్చును, జున్నిచ్చును, పెరుగిచ్చును, మజ్జిగిచ్చును, గంధరమిచ్చును, పేడిచ్చును, పైగా పిడకలిచ్చును’’ అంటూ రాసి ‘‘సోమవారానికి ఈ వాక్యంలో అర్థం తెలుసుకుని రండి. ఈసారి బహుమతి ఉండదు’’ కఠినంగా అన్నాడు. తరగతి గదిలోని విద్యార్థులు మనసులో చిర్రుబుర్రులాడుకున్నారు, నాకైతే సారును తన్నాలన్నంత కోపమొచ్చింది.ఇంటికెళ్ళి అమ్మతో స్కూల్ మారతానని మొండికేశాను, అమ్మ చాలా చెప్పింది. ‘‘ఇంత దగ్గర మరో స్కూలు లేదు. వేరే స్కూలు అంటే బస్సులో పోవాలి’’ అంటూ ఎంత చెప్పినా నేను వినలేదు. ఆ రాత్రి నేను అన్నం తినలేదు. ఇంతలో మా మోడల్ పరీక్ష లొచ్చాయి. మా ముందు చదివిన వారినుంచి తెలుసుకున్న దాని ప్రకారం, మా పాఠశాలలో మోడల్ పరీక్షలు రాయడం, మంచి మార్కులు తెచ్చుకోవడం సులభం. ఎవరికి వారు పుస్తకాలు తెచ్చుకోవచ్చు. ఒకరికొకరు కాపీలు అందించుకోవచ్చు. పొట్టి జవాబులన్నీ సారోల్లే బోర్డుపై రాసేవారు. మా మోడల్ పరీక్షల నాటికి కాపీలు తెచ్చుకోనీలేదు. కనీసం కాపీలు అందించేవాళ్లు లేరు, బోర్డుపై పొట్టి జవాబులు రాసేవాళ్ళు లేరు. అందరూ తెలుసుకున్న విషయమేమంటే, ప్రిన్సిపల్ గారు కూతురి పెళ్లని మూడు నెలలు సెలవుపై వెళ్లారు. భౌతికశాస్త్రం సారు ఇన్చార్జ్ ప్రిన్సిపల్ అయ్యారు.‘‘పది ఫైనల్ పరీక్షల్లో కూడా కాపీలు అనుమతించబడవు’’ అంటూ స్కూల్లో ప్రకటించారు. ‘‘ఇన్చార్జ్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్’’ అంటూ రెండు రోజులు అరిచాము. మాకు గొంతు నొప్పి మాత్రం మిగిలింది. ఇక లాభం లేదని, సారును మార్చమని డీఈవోకు లేఖ తయారు చేసుకొస్తానని మా తరగతి విధ్యార్థులకు చెప్పాను. అందరిలో ఉత్సాహం కనపడింది. నేను రాసుకొచ్చిన లేఖలో ఆ సారు ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని రాశాను. ఆ ఉత్తరంపై ఇద్దరు ఆడపిల్లలు మినహా అందరూ సంతకం చేశాం. ఆ ఇద్దరి సంతకం కూడా నేనే గెలికాను. మొదటి సంతకం నాదే. సంతకం చేస్తూ గర్వంగా అనిపించింది.భౌతికశాస్త్రం సారుతో మా సమస్య తీరి పోతుందనుకున్నాం. నేను రాయడంలో తప్పో, నా రాత డీఈవోకు అర్థం కాలేదో భౌతికశాస్త్రం సారుకు ట్రాన్స్ఫర్ కాలేదు. నిరుత్సాహపడ్డాం.ఫైనల్ పరీక్షలు విద్యార్థులపై కక్ష కట్టినట్లు చాలా కఠినంగా జరిగాయి. నెలరోజుల్లో రిజల్టు వచ్చింది. ముప్పై మంది విద్యార్థుల్లో ఇద్దరే పాసయ్యారు. ఒకరు భౌతికశాస్త్రం సార్ కూతురు, రెండవవారు వారి పక్కింటి అమ్మాయి. డీఈవోకు ఉత్తరం రాసినపుడు సంతకం పెట్టకుండా వ్యతిరేకించింది వాళ్ళిద్దరే! భౌతికశాస్త్రం సారే ఆ ఇద్దరినీ మంచి మార్కులతో పాస్ చేయించుకొని ఉంటాడని తరగతిలో ఫెయిల్ అయిన వాళ్లందరమూ అనుకున్నాం.రిజల్ట్స్ వచ్చిన రోజు ‘‘నన్ను స్కూలు మార్పించమంటే మార్పించలా’’ అంటూ మా అమ్మను తిట్టాను. ‘‘బస్ చార్జీలకు కక్కుర్తిపడి పక్క ఊర్లో స్కూలుకు పోనీకుండా నేను ఫెయిల్ కావడానికి నువ్వే కారణం’’ అన్నాను. అన్నం తినకుండా అలిగి పడుకున్నాను. అన్నం తినకపోతే బతిమాలే అమ్మ ఆ రోజు బతిమాలలేదు.రాత్రి తొమ్మిది గంటలకు మా నాన్న వచ్చారు. తను అన్నం తినకుండానే నన్ను లేపాడు. కోపం కొద్ది చెంపలు పగలుగొట్టాడు. నా కన్నీళ్ళకు ఆయన కరిగిపోలేదు. నాన్న కొడుతుంటే అమ్మ అడ్డం రాలేదు. ఇంకా కొడతాడేమోనని భయపడడంతో నిక్కరు తడిసి పోయింది. ‘‘నేను తినొచ్చే లోపల స్నానం చేసిరా’’ అన్నాడు. ఏమీ మాట్లాడకుండా స్నానానికి వెళ్లిపోయాను.నేను తిరిగొచ్చే సరికి నాన్న కోపంగా లేడు, సాధారణంగా ఉన్నాడు. నాలో భయం కూడా తగ్గింది. ‘‘భౌతికశాస్త్రం సారుతో నీకు గొడవెందుకు?’’ సార్ ఇచ్చే ప్రశ్నలు, రాసే పద్యాలు, చివరగా రాసిన ఆవు–పేడ వివరాలు కూడా ఏడుస్తూనే చెప్పాను.‘‘పబ్లిక్ పరీక్షల్లో సారు కాపీలు కొట్టనీయలేదని చెప్పడం మరిచావు.’’ అసలు విషయం తెలిసిపోయినందుకు నేనేమీ జంక లేదు. ఎలాగూ ఇంకో వాయి దెబ్బలు తప్పవు, ఇక భయపడి లాభమేమిటి అనుకున్నాను. ‘‘ఇప్పుడు పడుకో పో, రేపు మాట్లాడుకుందాం.’’ నాకు రెండో వాయి పడాల్సిన దెబ్బలు మిగిలిపోయినట్లుగా అనుకుని మొండిగా పడక మీదికి చేరాను. ఒకవైపు నాన్న కొట్టిన దెబ్బల నొప్పి, మరోవైపు నా పట్ల మా అమ్మానాన్నల నిర్లక్ష్యం నన్ను రాత్రంతా నిద్రకు దూరం చేశాయి. ఏదేదో కలవరించానని అమ్మే ఉదయం చెప్పింది.నాన్న ఇంట్లో లేడు. అమ్మ రాత్రి ఉన్నంత ముభావంగా లేదు. ఉదయపు కార్యక్రమాలు ముగించుకు రాగానే సద్దన్నం పెట్టింది. తినడం ముగియగానే వీధిలోకెళ్లాను. నాలాంటి బాధితులను ఒకరిద్దరిని పలకరించాను.వాళ్ళు తిన్నవి నాకంటే పెద్ద తన్నులే. గంట తరువాత ఇంటికొచ్చాను.‘‘నాన్నకు మడి కాడికి అన్నం తీసుకుపో, నీకు కూడా అన్నం అక్కడికే పెట్టాను’’ అంది అమ్మ.‘‘అప్పుడే ఎందుకు? మధ్యాహ్నం కదా అన్నం తీసుకుపోయేది.’’ నా మనసులో, మాటలో ఏదో అసంతృప్తి.‘‘మీ నాన్న రాత్రి తినకుండానే పడుకున్నార్రా’’ అంటూ అన్నం గంప తలపైకెత్తింది. నేను ఆలోచనలో పడ్డాను. నన్ను కొట్టినందుకు బాధపడి ఉంటాడా? అందుకే అన్నం తినకుండా పడుకుని ఉంటాడా? నాకు జవాబు తోచలేదు.నాన్న నన్ను చూసి అన్నపుగంప గెనెంపై దించి కయ్యలోకి రమ్మన్నాడు, వెళ్ళాను. నాన్న మడక మేడి పట్టుకోమని చెప్పి ములుకోల చేతికిచ్చాడు. నాలుగు నిముషాలు నాతో దున్నించాడు. మడక అడ్డదిడ్డంగా పోతున్నపుడు, మేడి నా చేతిలోంచి జారిపోతున్నపుడు నాన్న నా వెనకే వస్తూ సాయం చేశాడు.అయినా మడక ఎక్కడా కుదురుగా పోలేదు. ఎలాగోలా నాన్న దున్నుతూ ఉన్న కొండ్ర దున్నేశాను. ‘‘ఇప్పుడు కొండ్ర వేయి’’ అంటూ, మేడి నా చేతికి వదిలేశాడు. నాన్న కొండ్ర వేసినప్పుడు చాలాసార్లు చూశాను. సరళరేఖలా నేరుగా దున్నడమే కదా! అనుకుని కొండ్ర వేశాను. పాము పోయినట్టు వంపు సొంపులుగా సాలు వచ్చింది. అది సరిపోదన్నట్లు, కొండ్ర మొదట్లో బారన్నర వెడల్పుతో మొదలు పెట్టింది కొండ్ర పూర్తయ్యేసరికి రెండు బార్ల వెడల్పయింది. కొండ్ర మొదట వెడల్పును, చివరి వెడల్పును కళ్ళతోనే కొలిచి సిగ్గుపడ్డాను.అప్పుడు నాన్న కాడి నుంచి ఎద్దుల పలుపులు విప్పి గెనెంపైకి తోలాడు.ఇద్దరమూ గెనం మీద కానుగ చెట్టు కింద కూర్చున్నాం.తినడానికి ఇద్దరికీ ఒకే ప్లేట్ పెట్టినట్లుంది. ఆ ప్లేటులోని కలిపి నాన్న నా చేతిలో ముద్దలు పెట్టాడు. నేను కడుపు నిండా తిన్న తరువాత గాని నాన్న ముద్ద నోట్లో పెట్టుకోలేదు. నన్నింతగా ప్రేమించే నాన్న రాత్రి అంతగా ఎలా కొట్టాడు. ఆలోచిస్తున్నాను. ఇంతలో నాన్న తినడం ముగించాడు.‘‘నీ భౌతికశాస్త్రం సారును గత ఆర్నెల్లుగా నెలకోసారైనా కలిసే వాడిని. తరగతి గదిలో నువ్వు చేయలేని పనులు, తరగతి గది బయట నువ్వు చేస్తున్న పనులు, నువ్వు నీ తోటి విద్యార్థులతో కలిసి డీఈవోకు ఉత్తరం రాయడం అన్నీ చెప్పాడు. నేనే వెళ్ళి సారును బదిలీ చేయవద్దని డీఈవోను బతిమాలుకున్నాను. నీ సిగ్గుమాలిన పనులు తెలుసుకున్న నేను నిన్ను కొట్టి దార్లోకి తెస్తానన్నాను, సారు ఒప్పుకోలేదు. అంటు కట్టాల్సిన సమయంలోనే కట్టాలి ముందు కట్టడం వల్ల ప్రయోజనం లేదన్నాడు. అందుకే పరీక్షా ఫలితాలు వచ్చేవరకు ఆగాను.’’ నాన్న చాలా అనునయంగా మాట్లాడాడు.‘‘కాపీలు కొట్టనియ్యలేదని మీ సారును నేరుగా తిట్టావు’’ అన్నాడు.ఎక్కడో తిడితే నాన్నకెలా తెలిసిందా? అని తలొంచుకున్నాను.‘‘నీ వయసులో తెలుసుకోవాల్సిన విషయమేమంటే, చదువు వృక్షమైతే దాని స్థాయిని అంచనా వేసేందుకు ఆధారపడేవే పరీక్షలనే నీడలు, అనేకసార్లు ఆ పరీక్షలనే నీడలకు చీడ పడుతుంది. పరీక్షల సమయంలో కాపీలు అందజేసే తల్లిదండ్రులు, కాపీలు అందజేసే టీచర్లు, పొట్టి జవాబులు బోర్డుపై రాసే టీచర్లు, రావలసిన మార్కులకంటే ఎక్కువ మార్కులు వేయించే ఉపాధ్యాయులు విద్యార్థుల నాశనం కోరేవాళ్ళే తప్ప వారి మంచి కోరేవాళ్ళు కాదు. వాళ్ళతో పాటు స్కూల్లో తక్కువ శాతం పాస్ కావడానికిఅధ్యాపకులను, అధికారులను దూషించిన రాజకీయ నాయకులు కూడా విద్యార్థుల నాశనం కోరే వాళ్ళేనని తెలుసుకో. అంతగాక, చదువుకున్న సబ్జెక్టు పూర్తిగా అర్థం చేసుకుని, తక్కువ మార్కులు తెచ్చుకున్నా సరే, ఆ విద్యార్థే జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించగలడని గుర్తుంచుకో’’ అప్పటికి నాన్న మోరల్ పాఠం చెప్పడం ఆపాడు. కాని, నాకు జవాబు తెలియని రెండు కొత్త ప్రశ్నలు వేశాడు.‘‘ఇప్పుడు చెప్పు, నువ్వు కొండ్ర సరళరేఖలా వేసి ఉండాలి కదా? ఎందుకు సరళ రేఖలా రాలేదు?’’‘‘అదే అర్థం కాలేదు నాన్నా. నేను ఆ ఎదురుగా గెనుం వైపుండే వెంపల చెట్టుకు దారం పట్టినట్లు నేరుగా మడక సాలు తోలితే సరళరేఖలా కొండ్ర వస్తుందనుకున్నాను, ఎందుకో రాలేదు.’’‘‘రెండో ప్రశ్న, కాలం మొదలై ఎన్ని సంవత్సరాలైంది? ఎప్పుడు ముగుస్తుంది?’’ కొండ్ర సరిగ్గా రాలేదని నేను సిగ్గు పడుతుంటే ఈసారి నాన్న నా తల తిరిగే ఈ ప్రశ్న వేశాడు. బిక్క మొహం వేశాను.‘‘ఏమో నాకెట్ల తెలుస్తుంది?’’ అన్నాను.‘‘అదే పుస్తకంలో చదువుకు, విజ్ఞానానికి తేడా. సాయంత్రం మీ భౌతికశాస్త్రం సార్ దగ్గరికి వెళ్ళి ఈ రెండు ప్రశ్నలకు జవాబు అడుగు. వారు సమాధానం చెబుతారు. అప్పుడే నీకు సార్ తిట్టుకు అర్థం తెలుస్తుంది’’ అన్నాడు.ఏ తిట్టు గురించా అని ఆలోచిస్తున్నాను. అంతలో నాన్నే చెప్పాడు.‘‘సదువెందుకు సంకనాకనా, పదిలముగా పది యావుల మేపుకున్న...’’ అనేదే అన్నాడు.సంకోచంగా నాన్న వైపు చూశాను. ‘‘సారు ఏమనడులే వెళ్ళు’’ అన్నాడు.సార్ దగ్గరికి వెళ్లడానికి నాకే సిగ్గుగా ఉంది, తప్పదని వెళ్ళాను.‘‘రారా శీనయ్య, బాగున్నావా?’’ అన్నాడు సారు, మా ఇంట్లో జరిగింది, మా పొలంలో జరిగింది ఏమీ తెలియనట్లు, సారు కళ్ళతో కుర్చీ చూపించాడు కూర్చోమని. రెండోసారి నోటితో చెప్పాడు. సారుకు కాస్త దూరంగా నేలపై కూర్చున్నాను.‘‘సార్ మా నాన్న రెండు ప్రశ్నలకు జవాబు తెలుసుకుని రమ్మన్నాడు, అందుకే వచ్చాను’’ అన్నాను. రెండు ప్రశ్నలు చెప్పాను. సార్ జవాబు చెప్పలేదు. వాళ్ళ కూతురు, నా సహాధ్యాయి అయిన శారదను నీళ్ళు తీసుకు రమ్మన్నాడు. ఆమె ఇచ్చిన నీళ్ళు తాగాను.‘‘శీనయ్య ప్రశ్నలు మళ్ళీ చెప్పు’’ అన్నాడు. మళ్ళీ అడిగాను.‘‘మన స్కూల్ నుంచి నేరుగా ఎంత దూరం వరకు రోడ్డు చూడగలవు?’’ అంటూ నన్ను ప్రశ్నించారు సారు. ఒక కిలోమీటరు దూరంలో మలుపు వస్తుందని గుర్తెరిగి, ‘‘ఒక కిలోమీటర్ చూడగలం సార్’’ అన్నాను.‘‘మరి స్కూల్ వద్ద నుంచి చూస్తే ఎంత వెడల్పు కనబడుతుందో అంతే వెడల్పు కిలోమీటరు దూరంలో కూడా అనిపిస్తుందా?’’‘‘స్కూల్ వద్ద మూడు బార్ల వెడల్పు అనిపిస్తుంది సార్, ఆ కిలోమీటరు దూరంలో బారెడు వెడల్పు మాత్రమే స్కూల్ నుంచి చూస్తే అనిపిస్తుంది సార్’’ అంటూ జవాబిచ్చాను.‘‘అంటే రోడ్డు వెడల్పు ఒకటే, మన దృష్టిలో తేడా ఉంది కదా! రోడ్డంతా ఒకే వెడల్పు ఉన్నట్లు కొలవడం చదువు. దృష్టిలో తేడాతో వెడల్పు ఎలా తగ్గిందో తెలుసుకోవడం విజ్ఞానం’’ చెప్పారు సారు. శారద అక్కడే నిల్చుని ఉంది. సార్ నా అవివేకాన్ని తెలుపుతూ ఉంటే విని, ఆ అమ్మాయి సంతోషిస్తున్నదేమోననే అనుమానమొచ్చింది. అయినా చేయగలిగిందేముంది? సిగ్గుతో అలాగే కూర్చున్నాను.‘‘ఇక నీ రెండవ ప్రశ్న. కాలం మొదలై ఎన్ని సంవత్సరాలైంది? ఎప్పుడు ముగుస్తుంది?’’ నా ప్రశ్న నాకే అప్పజెప్పాడు. ‘జవాబు తెలుసా’ అన్నట్లు కూతురి వైపు చూశాడు సారు.‘‘తెలియదు నాన్నగారు’’ అంది. తన మాటతో నన్ను అవమానించడానికే శారద అక్కడ ఉందని అనుకోలేకపోయాను. నా సిగ్గు కొంత తగ్గింది.‘‘ఇప్పుడు క్రీ.శ.2025 కదా! కాలం ఈ 2025 ఏళ్ళ క్రితం మొదలు కాలేదు. రోమన్ సామ్రాజ్యం నాలుగువేల ఏండ్ల నాటిది కదా! అప్పుడూ కాలం మొదలు కాలేదు. మూడు వందల మిలియన్ల సంవత్సరాల ముందు డైనోసార్లున్నాయి కాబట్టి అప్పుడూ కాలం మొదలు కాలేదు. హిందూ పురాణాల్లో చెప్పినట్లు నాలుగు యుగాల ముందూ కాలం మొదలు కాలేదు.’’ సారు జవాబు చెప్తుండగానే యుగాలు ఏవేవి నాన్నా అంటూ అడిగింది శారద. సార్ జవాబు చెప్పాడు.‘‘పోనీ కాలం ఎప్పుడు అంతమవుతుందో చెప్పు’’ అన్నాడు తన కూతుర్ని చూసి.ఆ అమ్మాయి తనకు తెలీదన్నట్లు బిక్కమొహం పెట్టింది.‘‘కాలం ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకోవడానికి స్కేలు కోసం వెతకడమే చదువు. కాలం కూడా వలయంలా ఉంటుందేమో, తుది మొదలు లేనిదేమో అని తెలుసుకోవడమే విజ్ఞానం.’’ అంటూ ముగించాడు సారు.ఏదో గొప్ప విషయం తెలుసుకున్నట్లు శారద మొహంలో వెలుగు కనిపిస్తోంది. ఆ వెలుగు నాలో ఎందుకు లేదో, సార్ నాకు చెప్పాలనుకున్నాడెమో శారదను లోపలికి వెళ్లమన్నాడు.‘‘చదువుకు, విజ్ఞానికి తేడా మీ క్లాసులో ఒకసారి చెప్పాను గుర్తుందా?’’ అన్నాడు. తల అడ్డంగా ఊపాను.‘‘సదువెందుకు సంకనాకనా పదిలముగా పది యావుల మేపుకున్న... అంటూ ఆపాడు.గుర్తొచ్చినట్లు తలూపాను.‘‘కంఠస్థం చదువుల కంటే, కాపీలు కొట్టి పాస్ కావడం కంటే, మార్కులు వేయించుకుని పాస్ కావడం కంటే, పది ఆవులు మేపుకోవడం మేలని తెలిసే చెప్పాను’’ అన్నాడు సార్.ఆ సారు చెప్పింది నాకేమి అర్థమైందో ఇప్పుడు చెప్పలేను గాని, మళ్ళీ స్కూలు మారతానని అమ్మా నాన్నలతో చెప్పలేదు. అదే స్కూల్లో, అదే భౌతికశాస్త్రం సారు వద్ద పదో తరగతి మళ్ళీ చదివి, జిల్లాలో మొదటి ర్యాంకు, రాష్ట్రంలో పదిహేనవ ర్యాంకు సాధించాను. ఇంటికి వెళ్ళి అమ్మానాన్నలను పలకరించి, నేరుగా సార్ దగ్గరకు వెళ్ళి పాద నమస్కారం చేశాను. రాఘవేంద్రరావు సార్ నన్ను పొత్తిళ్లలోని కన్నబిడ్డను అదుముకున్నట్టు హృదయానికి హత్తుకున్నాడు. ఏమనుకున్నారో నా భార్యా పిల్లలు కూడా నా తర్వాత వారికి పాద నమస్కారం చేశారు. మా అలికిడి విని సార్ కూతురు, భార్య అక్కడికొచ్చారు. నా భార్యకు వాళ్ళిద్దరూ ముందే తెలుసు.నా పిల్లలకు తన కూతురిని చూపిస్తూ ‘‘అక్క పేరు శారద, తన భార్యను చూపుతూ స్వర్ణమ్మ’’ అన్నారు సార్.సారు ఇంట్లోనే టిఫిన్ తిన్నాం. అప్పుడు పిల్లల వైపు చూసి ‘‘కారులో వస్తున్నపుడు నన్ను ఏదో ప్రశ్న వేస్తిరి కదా! ఇప్పుడు సారును అడగండి’’ అన్నాను. వాళ్ళకు ఆ ప్రశ్న ఏదో గుర్తున్నట్లు లేదు. చివరికి నేనే అడిగాను.మనం ముందుకెళ్తుంటే చెట్లు వెనక్కి వెళుతున్నట్లు అన్నదానికి ‘‘సాపేక్ష చలనం అనే భావన ద్వారా అర్థం తెలుసుకోవాలి’’ అంటూ సార్ సమాధానం ముగించాడు.‘‘అర్థం కాలేదు తాతా’’ అంది నా కూతురు స్వర్ణమ్మ.‘‘రైలులో సీట్లు, లగేజ్, తోటి ప్రయాణికులు మనతో పాటే స్థిరంగా ఉన్నట్లు తోస్తుంది. కానీ రైలుబోగీలు, రైలులో సీట్లు, లగేజ్, రైలుతో పాటు ముందుకు సాగుతున్నాయి. మనం రైల్లో స్థిరంగా ఉన్నట్లు అనిపించడం వలననే, భూమిపై స్థిరంగా ఉన్న చెట్లు వేగంగా వెనక్కి పోతున్నట్లు అగుపిస్తాయి. నిజానికి చెట్లు కూడా భూమితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. ఈ పరస్పర వేగ వ్యత్యాసాన్ని తెలుసుకోవడమే సాపేక్ష వేగం.’’ ఆ సాపేక్ష వేగంలోని తేడా వలననే చెట్లు వెనక్కి పోయినట్లపిస్తుంది. మాట ముగించి ‘‘అర్థమైందా రాఘవేంద్రా’’ అన్నాడు సారు, తన పేరును తనే పలుకుతూ.‘‘అయినా సాపేక్ష వేగం గురించి అర్థం చేసుకోవడానికి నీ వయసు చాలదురా నాన్నా. ఇప్పుడు మీరు చదివే చదువు రేపటి మీ విజ్ఞానానికి తోడ్పడాలి. చదువు, విజ్ఞానాలలో ఏది నిజమో, ఏది నీడో మున్ముందు మీకే తెలుస్తుంది’’ అని కూడా అన్నాడు.ఆ పూట మధ్యాహ్న భోజనం కూడా అక్కడే. భోంచేసేటపుడు మా దంపతులకు జీవితంలో మరచిపోరాని పాఠం చెప్పాడు సార్. ‘‘నీ బిడ్డలకు ఎన్ని మార్కులొచ్చాయని ఎప్పుడూ అడగకు, ఆలోచించకు. వాళ్ళు చదువుతున్న అంశాలను తార్కికంగా, విమర్శనాత్మకంగా, సమగ్రంగా, అవగాహనతో చదివేటట్లు మాత్రం చూడు.’’అంత పాతకాలపు రాఘవేంద్రరావు, స్వర్ణమ్మ అనే పేర్లు తనతో పోట్లాడి మరీ మా బిడ్డలకు ఎందుకు పెట్టానో నా భార్యకు అర్థమైనట్లుగా ఆమె ముఖకవళికల్లో తోచింది.నేనెందుకు సారుతోనే కొడుకు ప్రశ్నకు జవాబు చెప్పించానో పిల్లలకు అర్థమైనట్లు కూడా నాకు తోచింది. -
మేజిక్ స్టార్
ఇంద్రజాల కళను స్వయంకృషితో సాధించి, మేజిక్స్టార్గా గుర్తింపు పొందిన ప్రతిభ ఆయన సొంతం. ఆయనే భీమవరం పట్టణానికి చెందిన దంతులూరి సత్యనారాయణరాజు (బోస్). ఇంద్రజాల ప్రదర్శనలు చేయడమే కాకుండా, ఇంద్రజాల కళకు సంబంధించి పలు పుస్తకాలను కూడా రాశారు. తన ప్రదర్శనలు, పుస్తకాల ద్వారా దేశ విదేశాల్లో ‘మేజిక్ బోస్’గా ప్రసిద్ధి పొందారు. బోస్ కామర్స్లో డిగ్రీ, మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేశాక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 27 ఏళ్లు ఉద్యోగం చేసి, మేజిక్ మీద మక్కువతో 2001లో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు.తొలినాళ్లలో మేజిక్పై ఎలాంటి అవగాహన లేని బోస్, ‘మేజిక్ ఇన్ ఫ్యామిలీ సర్కిల్’ అనే పుస్తకం చదివి, ఈ కళపై ఆకర్షితులయ్యారు. చాలామంది ఇంద్రజాలికులు గురువుల పర్యవేక్షణలో సాధన చేస్తుంటారు. బోస్ మాత్రం తనకు ప్రత్యక్ష గురువు ఎవరూ లేకపోయినా, స్వయంకృషితో, పట్టుదలతో మేజిక్ కళను సాధన చేసి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ‘మేజిక్ కళ మాత్రమే కాదు, సైన్స్ కూడా’ అంటారు బోస్. ప్రేక్షకుల ఇంద్రియాలను మభ్యపరచి, వారి తెలివితేటలను తప్పుదారి పట్టించేదే మేజిక్. ఈ కళ ఆత్మస్థైర్యాన్ని కలిగించి, ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, ఆలోచనాశక్తిని పెంచుతుందని కూడా ఆయన చెబుతారు.మేజిక్ స్కూల్ స్థాపనక్లోజప్ మేజిక్, కంజారింగ్ మేజిక్, స్టేజి మేజిక్, స్ట్రీట్ మేజిక్ ప్రక్రియల్లో బోస్ సిద్ధహస్తుడిగా పేరు పొందారు. ఇతరులు సులువుగా మేజిక్ నేర్చుకోడానికి అనేక పుస్తకాలు రాయడమే కాకుండా, ‘మాయాదండ’ పేరుతో ఇంద్రజాలంపై ప్రత్యేక మాసపత్రికను నడిపారు. ‘మాయాబజార్’ అనే సంస్థను నెలకొల్పి, ఆ సంస్థ ద్వారా మేజిక్ స్కూల్ను స్థాపించి, ఔత్సాహికుల అభ్యాసానికి ఉపయోగపడేలా అందులో మేజిక్ పరికరాలను అందుబాటులో ఉంచారు. సాటి మెజీషియన్లకు సేవలు అందించడానికి ‘పీపుల్స్ మేజిక్ సర్కిల్’ను ఏర్పాటు చేశారు.అసంఖ్యాకమైన అవార్డులుభీమవరం పట్టణంలో కళ్లకు గంతలు కట్టుకుని ప్రదాన రహదారిపై మోటారు సైకిల్ నడిపి ప్రేక్షకులను విస్మయానికి గురిచేసిన బోస్– దాదాపు 38 అవార్డులందుకున్నారు. 1988లో సొసైటీ ఆఫ్ ఇండియన్స్ మెజీషియన్స్ జాతీయస్థాయి అవార్డుతో ప్రారంభమై; ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ మెజీషియన్స్ అసోసియేష¯Œ గోల్డ్మెడల్, కోల్కతాలో నేతాజీ అవార్డు, గోవా భారతీయ కళారత్న అవార్డు, ఇంద్రజాల బ్రహ్మ, నేషనల్ లివింగ్ లెజండ్ అవార్డు వంటి ఎన్నో అవార్డులను అందుకున్నారు.ప్రపంచ రికార్డులుమేజిక్లో ఎన్నో పరిశోధనలు చేసిన బోస్, స్వయంగా వందకు పైగా కొత్త ట్రిక్కులు కనిపెట్టారు. మరొక వంద కొత్త మేజిక్ పరికరాలను సృష్టించారు. మేజిక్ మాయాజాలంతో ఎన్నో ప్రపంచ రికార్డులు సాధించారు. ఆయన సాధించిన రికార్డుల్లో యూనిక్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డె¯Œ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటివి ఉన్నాయి.బిరుదులు, సత్కారాలు పీపుల్స్ మెజీషియన్, మేజిక్ స్టార్, మేజిక్ గైడ్, ఇంద్రజాల విద్యావిశారద, మేజిక్ చక్రవర్తి, మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ వంటి ఎన్నో బిరుదులతో సత్కారాలు, ప్రముఖ రాజకీయనాయకులు, సినీప్రముఖల ప్రశంసలు అందుకున్నారు.స్వదేశంలో విరివిగా ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా; సింగపూర్, మలేషియా, థాయ్లండ్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నెదర్లండ్స్, ఆస్ట్రియా, వాటికన్ సిటీ, ఇటలీ తదితర దేశాల్లోనూ అనేక ప్రదర్శనలు ఇచ్చి, అక్కడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. తన మేజిక్ ప్రదర్శనల ద్వారా మూఢనమ్మకాలపై పోరాటం, బౌద్ధ ప్రచారం, జైలోని ఖైదీలకు బౌద్ధ పుస్తకాల పంపిణీ, పేద బాలలకు ఆర్ధిక సహాయం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందారు. ∙ -
మీటింగులే పెట్టని మెటాస్టార్!
∙సాక్షి, స్పెషల్ డెస్క్: చిన్న కంపెనీని నడపటమైనా పెద్ద విషయమే. అలాంటిది ఒక పెద్ద కంపెనీని నడపాలంటే? చిన్న విషయం కాదు. వేలు, లక్షల సిబ్బందిని మేనేజ్ చెయ్యాలి. మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతూ ఉండాలి. మేనేజర్ల దగ్గర నుంచి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకోవాలి. టాప్–టు–బాటమ్ ఒక బలమైన అధికార శ్రేణి (హైరార్కీ)ని నిర్మించాలి. తన పైవాళ్లను దాటి, ఆ పైవాళ్ల దగ్గరికి వెళ్లకుండా ఉద్యోగికి పరిధులు, పరిమితులు ఉండాలి. ఇన్ని ఉంటేనే బండి పట్టాలు తప్పకుండా ఉంటుంది! అయితే... ఇవేవీ లేకుండానే ‘మెటా‘ కంపెనీ సీఈవో మార్క్ జుకర్బర్గ్, బండిని దానంతటదే నడిచేలా చక్కగా ‘ఆటో పైలట్’ మోడ్లోకి మళ్లించారు. 1.524 ట్రిలియన్ డాలర్ల తన మెగా కంపెనీ ‘మెటా’ను– ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది..’ అన్నంత తాపీగా, స్ట్రెస్ లేకుండా – చల్ మేరా సాథీ అంటూ స్వారీ చేస్తున్నారు! ఒక్క మనిషి.. వందల బిలియన్లుప్రపంచంలోని టాప్ 10 టెక్నాలజీ కంపెనీలలో ‘మెటా’ ఒకటి. తాజా నివేదిక ప్రకారం 2025 మే మొదటి వారం నాటికి ఈ కంపెనీలో 76,834 మంది ఫుల్ టైమ్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇండియాలో హైదరాబాద్, బెంగళూరు, గురుగావ్, న్యూఢిల్లీ, ముంబై నగరాలతో పాటు, ప్రపంచ దేశాలలోని అనేక ప్రాంతాలలో అసంఖ్యాకంగా మెటా ఆఫీసులు, డేటా సెంటర్లు ఉన్నాయి. 2024లో మెటా మొత్తం వార్షిక ఆదాయం 164.5 బిలియన్ డాలర్లు. మొత్తం ఆస్తులు 276 బిలియన్ డాలర్లు.మహావృక్షంలో తనూ ఒక కొమ్మే!ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలమంది ఉద్యోగ పక్షులకు ఆశ్రయం ఇస్తూ, సమృద్ధిగా ఆదాయ ఫలాలను కాస్తున్న ఈ మహావృక్షంలో సీఈవో జుకర్బర్గ్ సీటెక్కడో కనిపెట్టటం కష్టం! ‘ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై..’ అన్నట్లుగానే ఆయన తన మెటా కంపెనీలో కలిసిపోయి ఉంటారు. కంపెనీని నడపటంలో ఆయన వ్యవహార శైలి భిన్నమైనది. ఒక కంపెనీకి ఉండవలసిన పద్ధతులు, నిబద్ధతలు అన్నీ ఉంటాయి కాని, వాటి ఆధారంగా మాత్రమే జుకర్బర్గ్ కంపెనీని నడపరని ‘స్ట్రయిప్’ కంపెనీ కో ఫౌండర్ జాన్ కాలిసన్తో ఇటీవల జుకర్బర్గ్ జరిపిన చిట్చాట్లో వెల్లడైంది.కోర్ ఆర్మీతోనే మాటా మంతీమీటింగులు ఉంటాయి. అస్తమానం ఉండవు. టీమ్ లీడర్లు ఉంటారు. అదే పనిగా సీఈవోను కలవరు. రిపోర్టులు తయారవుతుంటాయి. ఆ ఫైల్స్ని పట్టుకుని డైరెక్టర్లు సీఈవో కోసం వేచి చూస్తూ కూర్చోరు. జుకర్బర్గ్ కూడా ఎవరితోనూ రోజువారీ వన్–ఆన్–వన్ మీటింగ్ (ఇద్దరి మధ్య మాత్రమే జరిగే సమావేశం)లో కూర్చోరు. ‘కోర్ ఆర్మీ’ని మాత్రం ఒక పక్కన ఉంచుకుంటారు. మేనేజ్మెంట్లోని సీనియర్ లీడర్లు 25 నుంచి 30 మంది అందులో ఉంటారు. అత్యవసరం అయినప్పుడు మాత్రమే జుకర్బర్గ్ వారితో సమావేశం అవుతారు. మొత్తం మీద ఎవరి పని వారికి ఉంటుంది. గాడి తప్పకుండా ప్రతి పనీ నడుస్తుంటుంది. కంపెనీ కోసం... ఖాళీ సమయంజుకర్బర్గ్ ప్రతి రోజూ తన కోసం కొంత ఖాళీ సమయాన్ని ఏర్పరచుకుని ఉంటారు. ఆ సమయంలో తన పని గురించి ఆలోచిస్తుంటారు. పని చేస్తుంటారు. సమస్యలకు పరిష్కారాలను వెదుకుతుంటారు. తన ఉద్యోగులకు కూడా తన సమయంలో కొంత ఇస్తుంటారు. అందుకు ఫలానా సమయం అంటూ ఉండదు కానీ, కచ్చితంగా ఖాళీ అయితే ఉంటుంది. ఉద్యోగులు వచ్చి ఆయన్ని కలిసినప్పుడు ఆ ఖాళీ సమయాన్ని వారికి ఇస్తారు. లేదా, తనే ఒక టీమ్ను కలవాలనుకున్నప్పుడు ఆ ఖాళీని ఆ టీమ్ కోసం వినియోగిస్తారు. ఆ విధంగా ఉద్యోగులు ఆయన్ని కలవటం కంటే , ఉద్యోగులను ఆయన కలవటమే ఎక్కువగా ఉంటుంది. ఏ రిపోర్టూ జుకర్బర్గ్కు వెళ్లదుమెటా భారీ నెట్వర్క్లో జుకర్బర్గ్ చిన్న మీటగా మాత్రమే ఉండాలని కోరుకుంటారు. పై స్థాయిలోని వారికి ఎవరికి వారుగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. చర్చలు, సమావేశాలన్నవి ‘కోర్ ఆర్మీ’ గ్రూపు మధ్యలోనే ఉంటాయి. ప్రోడక్ట్ ఆపరేషన్స్ కూడా వేటికవే జరిగిపోతుంటాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యాడ్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్చువల్ రియాలిటీ... ఇలా దాదాపు 15 ఆపరేషన్లకు అధిపతులు ఉంటారు. వాళ్లెవరూ నేరుగా జుకర్బర్గ్కి నివేదికలు అందించరు. బదులుగా చీఫ్ ప్రొడక్టివ్ ఆఫీసర్ క్రిస్ కాక్స్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జేవియర్ ఒలివన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్వర్త్కు వాటిని సమర్పిస్తారు. ఉద్యోగుల తర్వాతే టీమ్ లీడర్లు!జుకర్బర్గ్ ఉద్యోగులను ప్రోత్సహిస్తారు. ప్రయోగాలకు ప్రేరణ ఇస్తారు. నిరంతరం నేర్చుకుంటూ ఉండే స్వేచ్ఛను కల్పిస్తారు. ఉద్యోగులే ఆయన కంపెనీ ఆస్తిపాస్తులు. కంపెనీ పట్ల ఉద్యోగులకు అంకిత భావం కలిగేందుకు అవసరమైన సానుకూలనమైన పని వాతావరణాన్ని కల్పిస్తారు. తమ టీమ్ లీడర్ల వ్యవహార శైలిపై ఉద్యోగుల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. ఏం చేయాలో చెబుతారు. ఎలా చేయాలో చెబుతారు. ఎప్పటిలోపు చేయాలో చెబుతారు. స్పష్టమైన, సాధ్యమయ్యే టార్గెట్లతో ఉద్యోగుల ద్వారా తన లక్ష్యాన్ని సాధిస్తారు. · -
క్షమాపణే శాంతి మంత్రం
ఎన్నో రక్తపు మరకలకు, ఎందరో ఆర్తనాదాలకు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే హీనగుణాలే కారణమని ప్రాచీన పురాణాలే కాదు, ఆధునిక చరిత్ర కూడా చెబుతోంది. నేటికీ లోకంలో జరుగుతున్న అనేకానేక అకృత్యాలకు మూలకారణం ఈ అరిషడ్వర్గాలే! మరి, లోకాన్నే అతలాకుతలం చేసే ఈ అరిషడ్వర్గాల మెడలు వంచే గొప్ప సుగుణం ఏదైనా ఉందా అంటే, అది ‘క్షమా గుణమే’ అంటాయి అన్ని మతాలూ! ఎన్నో సందర్భాలు ఆ విషయాన్ని రుజువు చేశాయి కూడా! నిజానికి దేన్నైనా మన్నించగలిగేంత నిబ్బరం; దేన్నైనా తట్టుకోగలిగేంత సహనం; దేన్నైనా త్యజించేంత త్యాగశీలత– ఇవి మనిషికి ఊరికే వస్తాయా? క్షమ వల్ల వచ్చే మనశ్శాంతిని మనసారా నమ్మినప్పుడు, మానవత్వాన్ని ఆత్మవిలీనం చేసుకోగలినప్పుడు, స్వార్థాతీతంగా స్వచ్ఛమైన భావాలు ఉద్భవించినప్పుడు మాత్రమే వస్తాయి!గడ్డి లేని చోట ఎంత పెద్ద నిప్పు కణిక పడినా, కాసేపటికే బూడిదైనట్లు.. కోపం, ద్వేషం, ప్రతీకారం లేని మనిషి ముందుకు, ఎంతటి చెడ్డవాడు వచ్చినా గెలవలేడు అంటుంది శాస్త్రం. అందుకే ‘మనసు నిండా క్షమను నింపుకోవడం ఉత్తమం’ అంటాడు మహాభారతంలో విదురుడు. సోదరులైన పాండురాజు సంతానానికి, ధృతరాష్ట్రుడి సంతానానికీ ఎన్నోమార్లు సయోధ్య కుదర్చాలని విఫలయత్నం చేసిన ధర్మజ్ఞుడు అతడు! మరి క్షమించడం అంత తేలికా? జీవితాలను ఛిద్రం చేసిన వారిని, బంధాలను దూరం చేసిన వారిని, జీవితానికి సరిపడా దుఃఖాన్ని మిగిల్చిన వారిని నిజంగానే క్షమించగలమా? అసలు క్షమాగుణం గురించి చరిత్రేం చెప్పింది? మతమేమంటోంది? శాంతి, కరుణ, జాలి, దయ, సానుభూతి, త్యాగం, సహనం లాంటి ఉదాత్త గుణాలు కలిగిన ఉన్నతమైన మనుషులకే అసాధ్యమనిపించే క్షమాగుణం... నిత్యం ప్రతికూల ఆలోచనలతో లోలోపలే రగిలిపోయే దుర్జనులను ఎలా మార్చగలుగుతుంది?చరిత్రను తవ్వాలంటే మొదటిగా దక్షిణాఫ్రికా నుంచే మొదలుపెట్టాలి. అక్కడ జరిగినవన్నీ మనసులను మెలిపెట్టే ఉదంతాలే! అక్కడ శ్వేతజాతీయుల పాలనలో కొనసాగిన జాతి వివక్షకు లక్షలాది మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. 1948లో నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్కడి నల్లజాతీయులు అన్ని హక్కులనూ కోల్పోయారు. శ్వేతజాతీయుల దురహంకారానికీ, అమానుష చర్యలకూ ఎన్నో బతుకులు తెల్లారిపోయాయి. ఈ భయంకరమైన చీకటి కాలం నెల్సన్ మండేలా పోరాటంతో అంతమైంది. నాటి ఆకృత్యాలకు ఆయన కూడా బాధితుడే! ఏకంగా ఆయన 27 ఏళ్ల జీవితం జైల్లోనే గడిచింది. 1964 నుంచి 1990 వరకూ బందీగానే ఉన్న ఆయన బయటకి వచ్చిన తర్వాత ప్రతీకారంతో రగిలిపోలేదు. క్షమాపణ, సయోధ్య అనే అసాధారణ మార్గాలను ఎంచుకున్నారు. ప్రజాస్వామ్యం మొదలై, అధ్యక్షుడు అయిన తర్వాత ఆ దార్శనికతతోనే ‘ట్రూత్ అండ్ రీకాన్సిలియేషన్ కమిషన్’ (టీఆర్సీ) ఏర్పాటు చేశారు. జాతి వివక్ష కాలంలో జరిగిన అన్యాయాలన్నీ అప్పుడే ప్రపంచానికి తెలిశాయి. ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం నల్లజాతీయులను బాధించిన నేరస్థులను శిక్షించడం కాదు, నాటి కాలంలో జరిగిన అమానుష చర్యలను వెలికి తీయడం. అందుకే బాధితులు, నేరస్థుల మధ్య క్షమాభిక్షతో సయోధ్యను తీసుకురావడం ప్రపంచాన్నే కదిలించింది. ఎంతోమంది శ్వేతజాతి అధికారులు నల్లజాతి బాధితుల ముందే తమ నేరాలను అంగీకరించారు. అయితే ఆ ఉదంతాల్లో హృదయం ద్రవించే యధార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని స్వయంగా.. టీఆర్సీ చైర్మన్ ఆర్చ్బిషప్ డెస్మండ్ టుటు తన ‘నో ఫ్యూచర్ వితౌట్ ఫర్గివ్నెస్’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. ఆయన రాసిన ఓ గాథ ఎందరినో కంటతడిపెట్టించింది.టీఆర్సీ చైర్మన్ టుటు చెప్పిన గాథట్రూత్ అండ్ రీకాన్సిలియేషన్ కమిషన్ (టీఆర్సీ) చైర్మన్ ఆర్చ్బిషప్ డెస్మండ్ టుటు ముందు ‘వ్యాన్ డెర్ బ్రూక్’ అనే శ్వేతజాతి అధికారి తాను చేసిన నేరాలను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, చాలా నిర్లిప్తంగా అంగీకరించాడు. అప్పుడు, ‘బిట్రిస్ నాండ్రంగా’ అనే 70 ఏళ్ల నల్లజాతి వృద్ధురాలు అక్కడే కూర్చుని అతడి మాటలను స్పష్టంగా వింటోంది. బ్రూక్ చంపేసింది ఆమె కన్నకొడుకును, భర్తనే!బిట్రిస్ కొడుకును బ్రూక్ ఒక వాహనంలో బంధించి, అతని చేతులు, కాళ్లు కట్టి, ఒక నదిలోకి విసిరివేసి చంపేశాడు. కొన్ని నెలల తర్వాత బిట్రిస్ భర్తను లాక్కెళ్లి బంధించాడు. బిట్రిస్ తన భర్త కోసం ఎన్నో రోజులు వెతికింది. ఒకరోజు బ్రూక్ ‘నీ భర్తను చూపిస్తాన’ని బిట్రిస్ని తీసుకెళ్లి, ఆమె కళ్లముందే ఆమె భర్తకు నిప్పు అంటించి చంపేశాడు. కోర్టులో బ్రూక్ అహంభావాన్ని చూస్తున్న బిట్రిస్ కోపంతోనో, ద్వేషంతోనో ఊగిపోతుందని బ్రూక్స్ మాటలు విన్నవారంతా భావించారు. బ్రూక్ నేరాంగీకార ప్రకటన ముగిసిన తర్వాత బిట్రిస్ మాత్రం బ్రూక్నే కాదు, యావత్ ప్రపంచాన్నే కదిలించేలా స్పందించింది. ‘నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే! మిస్టర్ వ్యాన్ డెర్ బ్రూక్, నా కొడుకును ఎలా చంపాడో, నా భర్తను ఎలా హత్య చేశాడో చాలా వివరంగా చెప్పాడు. అతను వాళ్ళను చిత్రహింసలు పెట్టాడు. నా కొడుకు చనిపోవడానికి ముందు ఎంతగా బాధపడ్డాడో, ఎంత భయపడ్డాడో ఊహించుకోగలను.నా భర్త శరీరం తగలబడిపోవడం నేను కళ్లారా చూశాను. కాని, నాకు ఒక విషయం కావాలి. మిస్టర్ వ్యాన్ డెర్ బ్రూక్, దయచేసి నాకు ఒక చిన్న సహాయం చేయగలరా? నా కొడుకు శరీరాన్ని నదిలో విసిరేసినప్పుడు, నన్ను అమ్మా అని పిలిచాడా? అది చెప్పండి. అప్పుడు నేను వెళ్లి ఆ నదిలో ఆ అమ్మా అనే పిలుపును వెతుక్కుంటాను. నా భర్త కాలిపోతున్నప్పుడు అతి సమీపంలో ఉన్న మీకు నన్ను పిలవడం వినిపించిందా? పోనీ అది చెప్పండి. నేను వెళ్లి ఆ ప్రదేశంలో ఆ చివరి మాటను వెతుక్కుంటాను. నాకిక మీ మీద కోపం లేదు. నాకు కావాల్సింది ఈ ఒక్క వివరమే! నేను మిమ్మల్ని క్షమిస్తాను. కాని, నేను మిమ్మల్ని క్షమించాలంటే, నేను క్షమించానన్న సంగతి మీకు అర్థం కావాలి కదా! దయచేసి వచ్చి నన్ను ఆలింగనం చేసుకోండి’ అందట ఆమె. ఆ మాటల తర్వాత కోర్టులో నిశ్శబ్దం ఆవరించింది. వ్యాన్ డెర్ బ్రూక్ ఈ మాటలకు చలించిపోయాడు. అతను ఆమె దగ్గరకు వెళ్లి, ఆమె పాదాల వద్ద మోకరిల్లి, కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. బిట్రిస్, అతన్ని క్షమించి, తల్లిలా అక్కున చేర్చుకుంది. ఈ సంఘటన క్షమాగుణంలోని అపారమైన శక్తిని, నెల్సన్ మండేలా నమ్మిన సయోధ్య ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇది దక్షిణాఫ్రికా ట్రూత్ అండ్ రీకాన్సిలియేషన్ కమిషన్ విజయ గాథలలో ఒకటిగా నిలిచిపోయింది. అయితే ఈ కథ ఒక్క బిట్రిస్ది మాత్రమే కాదు, ఇలా బాధితులైన ఎంతోమంది నల్లజాతీయులు– జాతివివక్ష నేరాలకు పాల్పడ్డ శ్వేతజాతీయులు ఎందరినో క్షమించారు.దశాబ్దాల పాటు జైల్లో శిక్ష అనుభవించిన నెల్సన్ మండేలా– అధ్యక్షుడు అయిన తర్వాత కూడా క్షమాగుణమే ఆయుధం అన్నారు. ‘మనసులో ప్రతీకారముంటే, విషం తాగినట్లు ఉంటుంది. అది నీ శత్రువులను చంపుతుందని ఆశిస్తావు, కాని నిన్నే చంపుతుంది. ప్రతీకార చర్యల కంటే దయతో కూడిన పనులతోనే ఈ ప్రపంచంలో ఎక్కువగా సాధించగలం. క్షమ అనేది గతంలో జరిగిన వాటిని మరచిపోవడం కాదు, భవిష్యత్తును శాంతియుతంగా కొనసాగించగలగడం. అందుకే మనం గతంలోని ద్వేషాన్ని, ఘర్షణలను అధిగమించడానికి, ఉదారమైన స్ఫూర్తితో ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. క్షమాపణ ఆత్మకు స్వేచ్ఛనిస్తుంది, అది భయాన్ని తొలగిస్తుంది. అందుకే అది అంత శక్తిమంతమైన ఆయుధం’ అని చెప్పారు.2006లో పెన్సిల్వేనియాలోని ప్రశాంతమైన అమిష్ కమ్యూనిటీ (క్రైస్తవ మత సమూహం)లో ఒక విషాదం జరిగింది. తమ పిల్లలు చదివే స్కూల్లోకి ఒక దుండగుడు తుపాకీతో చొరబడి ఐదుగురు పిల్లల ప్రాణాలను తీసేశాడు. ఆ వెంటనే అతడూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన ఎవరికైనా కోపాన్ని, ప్రతీకారాన్ని కలిగించేదే. కాని, బాధిత అమిష్ కుటుంబాలు, ఆ కమ్యునిటీ చాలా భిన్నంగా స్పందించాయి. వారి స్పందన కరుణ, క్షమాగుణం, అచంచలమైన విశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే, వారు దాడి చేసిన వ్యక్తి కుటుంబానికి సానుభూతిని, మద్దతును అందించారు. వారి తమ విలువలకు కట్టుబడి, గాయాలను మాన్పడం ద్వేషం కంటే గొప్పదని నిరూపించారు. ఏసుక్రీస్తు బోధనలను అనుసరించి, కరుణలో ఉన్న శక్తిని తమ చర్యలతోనే ప్రపంచానికి చూపారు. నాటి అమిష్ కమ్యూనిటీ స్పందన చీకటిలో వెలుగులా, ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే హృదయాలకు శాంతి మార్గాన్ని చూపింది.1963లో వియత్నాంలో బౌద్ధ సన్యాసి థిచ్ కాంగ్ డక్ ఆత్మార్పణ– అక్కడి అణచివేతకు వ్యతిరేకంగా జరిగింది. అసాధారణ పోరాటానికి, అద్భుత క్షమాగుణానికి అది సాక్ష్యమని చెబుతారు. వియత్నాం ప్రభుత్వ క్రూర విధానాలకు నిరసనగా, ఆయన తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నారు. ఇది కేవలం వ్యతిరేకత కాదు, శాంతి, క్షమ పట్ల ఆయనకు ఉన్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. థిచ్ కాంగ్ డక్ నాటి దారుణమైన అణచివేతను ఖండిస్తూ, తనను తాను అర్పించుకోవడంతో పాటు కరుణతో కూడిన బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఇతరులకు హాని చేయకుండానే, అణచివేతను ధిక్కరించారు.థిచ్ కాంగ్ డక్ ఆత్మార్పణ చిత్రం ప్రపంచాన్ని కదిలించింది. ఉన్నత ఆశయం కోసం అసాధారణ త్యాగానికి సిద్ధపడిన గొప్ప వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. మంటల్లోనూ ఆయన భంగిమలో ఉన్న ప్రశాంతత, క్షమాశక్తిని, శాంతి సందేశాన్ని మరింత బలంగా ప్రపంచానికి తెలియజేసింది.1994లో రువాండాను వణికించిన మారణహోమం, కేవలం కొన్ని నెలల్లో 8 లక్షల మందిని బలిగొంది. జాతి విద్వేషంతో దేశం ముక్కలయ్యింది. కాని, ఈ భయంకర విషాదం మధ్య, క్షమాగుణం ఆశారేఖలా వెలిగింది. గాయాలను మాన్పి, సయోధ్యను సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ద్వేషాన్ని వీడి, అవగాహనతో ముందుకు సాగడం రువాండా కోలుకోవడానికి పునాదిగా నిలిచింది. ఊహించని నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ, బాధితులు, నేరస్థులు ప్రతీకారానికి బదులుగా క్షమించుకున్నారు. ఈ చర్య అక్కడి హింసాకాండకు శాంతియుతమైన ముగింపు పలికింది. ఇందుకు ‘ఇమ్మాకులీ ఇలిబగిజా’ కథ ఓ ఉదాహరణ. 91 రోజులు బాత్రూమ్లో దాక్కుని ప్రాణాలతో బయటపడిన ఆమె, తన కుటుంబ హంతకులను క్షమించింది. ఆమెతో పాటు ఎందరో, గతాన్ని మార్చలేకపోయినా, క్షమాపణతో భవిష్యత్తును సరిదిద్దవచ్చని నిరూపించారు.2015లో చార్లెస్ట¯Œ లోని ఒక చారిత్రక చర్చిలో జరిగిన ఘోరం ప్రపంచాన్ని కదిలించింది. డిలాన్ రూఫ్ అనే శ్వేతజాతి దురహంకారి జరిపిన కాల్పుల్లో తొమ్మిదిమంది ఆఫ్రికన్–అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం మొదట తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అయితే, ఆ తర్వాత కనిపించిన స్థైర్యం, కరుణ ద్వేషపు చీకటిని సవాలు చేశాయి. దుండగుడి కోర్టు విచారణ సమయంలో బాధితుల కుటుంబాలు నిందితుడిని బేషరతుగా క్షమించాయి. ఇలా ఒకటా రెండా ఎన్నో కథలు, మరెన్నో వ్య«థలు. గాయం నుంచి క్షమాపణ వరకు ఎందరో సాగించిన ప్రయాణం క్షమాశక్తిని కళ్లకు కడుతుంది. మొన్నటికి మొన్న పహల్గామ్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ భార్య హిమాంశీ నార్వాల్ వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె తన భర్తను కోల్పోయిన తీవ్ర దుఃఖంలో కూడా ‘ముస్లింలు, కాశ్మీరీల పట్ల ద్వేషాన్ని పెంచుకోవద్దు, శాంతిని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ఆమె స్పందనపై ఎన్నో భిన్న వాదనలు వినిపించినప్పటికీ శాంతి, కరుణ, విజ్ఞత కలిగిన మనుషుల స్పందన అలానే ఉంటుందేమో అనిపిస్తుంది.ఏ మతం ఏం చెబుతోంది?బంధాలను నిలిపేటప్పుడు, మంచివాళ్లకు నచ్చజెప్పేటప్పుడు ‘క్షమయా ధరిత్రి’ అని ఉదహరిస్తారు పెద్దలు. నిజానికి అన్ని మతాలు, ఆధ్యాత్మిక మార్గాలలో క్షమాగుణమే కేంద్ర బిందువుగా కనిపిస్తుంది. ప్రతి మతమూ క్షమాపణకు అత్యంత ప్రాధాన్యమిస్తుంది. క్షమాపణ– ఈ ఒక్క పదం వెనుక అపారమైన మానసిక శక్తి, ఆధ్యాత్మిక ముక్తి దాగి ఉన్నాయి. ఇది కేవలం ఇతరులను క్షమించడం మాత్రమే కాదు, మనసును శుభ్రపరచుకోవడానికి, అంతర్గత శాంతిని పొందడానికీ ఒక ఉన్నతమైన మార్గం. ప్రతి మతమూ ఈ క్షమాగుణాన్ని ఎలా వివరిస్తుందో చూద్దాం.హిందూ మతంహిందూ ధర్మంలో క్షమాగుణాన్ని గొప్ప సుగుణంగా పరిగణిస్తారు.వేదాలు, ఉపనిషత్తులు: ఇవి క్షమను కేవలం ఒక నైతిక నియమంగా కాకుండా, అహింస, సత్యం, అస్తేయం (దొంగిలించకపోవడం) వంటి మహత్తర ధర్మ సూత్రాలతో కలిపి ప్రస్తావిస్తాయి. అంటే ఇది ఒక జీవన విధానం అని చెబుతున్నాయి.భగవద్గీత: క్షమించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని, కర్మ బంధాలు తెగిపోతాయని భగవద్గీత చెబుతుంది. భగవద్గీతలోని 13వ అధ్యాయం, 7వ శ్లోకంలో ‘అమానిత్వం, అదంభత్వం, అహింస, క్షాంతిః’ (వినయం, నిగర్వం, అహింస, క్షమ) అంటూ శ్రీకృష్ణుడు జ్ఞానానికి అవసరమైన లక్షణాలను వివరిస్తాడు. ఈ లక్షణాలు మానవుడు ఆత్మజ్ఞానాన్ని, మోక్షాన్ని పొందడానికి అవసరం అని బోధిస్తాడు. ఇతరులు చేసిన తప్పులను, వారివల్ల వచ్చిన కష్టాలను, అన్యాయాలను సహించి, వారి పట్ల ద్వేషం లేకుండా ఉండటమే క్షమ. ఇది కేవలం బాహ్యంగా సహించడం కాదు, అంతర్గతంగా కూడా క్షమ విలువ తెలుసుకుని; ప్రశాంతంగా, స్థిరంగా ఉండటాన్ని సూచిస్తుంది.పురాణాలు, ఇతిహాసాలు: రామాయణంలో శ్రీరాముడు చూపిన క్షమ, మహాభారతంలో యుధిష్ఠిరుడి ఓర్పు క్షమాగుణానికి గొప్ప ఉదాహరణలు. భూదేవికి ‘క్షమాదేవి’ అని పేరు. భూమి అన్నింటినీ భరిస్తున్నట్లుగా, మనం కూడా ఇతరుల తప్పులను సహించాలని దీని అర్థం. క్రైస్తవ మతంక్రైస్తవ మతంలో క్షమాపణకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇది ఏసుక్రీస్తు బోధనలలోని ప్రధానాంశం.బైబిల్: ఏసుక్రీస్తు తన అనుచరులకు ‘ఏడు మార్లు డెబ్భై మార్లు’ క్షమించమని బోధించాడు ఇది ఏదో లెక్క ప్రకారం కాదు, అపరిమితంగా, నిరంతరం క్షమించాలనే అర్థంలో వివరించారు.ప్రభువు ప్రార్థన: క్రైస్తవుల ప్రసిద్ధ ప్రార్థనలో ‘మేము మమ్మును అపరాధపడిన వారిని క్షమించిన ప్రకారము మమ్మును క్షమించు’ అనేది ప్రతి క్రైస్తవుడి ప్రార్థన. ‘మనం దేవుని నుంచి కరుణను, క్షమాపణను ఆశించినట్లయితే, మనం కూడా అదే కరుణను ఇతరుల పట్ల చూపాలి’ అనేది క్రైస్తవ విశ్వాసంలో ప్రేమ, దయ, సహనానికి పునాది.ఏసు సిలువే ఓ బోధన : తనను సిలువ వేస్తున్న వారిని చూసి ‘తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు; వీరిని క్షమించుము’ అని ప్రార్థించాడు జీసస్. అందుకే క్షమాగుణానికి, నిస్వార్థ ప్రేమకు మించిన ఉదాహరణ మరొకటి లేదంటారు క్రైస్తవులు.ఇస్లాం మతంఇస్లాంలో క్షమాపణ అనేది అల్లాహ్ చెప్పిన ప్రధాన గుణాలలో ఒకటి. ముస్లింలంతా ఆ గుణాన్ని అలవరచుకోవాలని చెబుతుంది.ఖురాన్: ఖురా లో అల్లాను ‘అల్–గఫూర్‘ (సంపూర్ణంగా క్షమించేవాడు), ‘అల్–అఫువ్‘ (అత్యంత ఉపశమనం కలిగించేవాడు) అని వర్ణిస్తారు. ‘ఎవరైతే కోపాన్ని అణచుకుంటారో, ప్రజలను క్షమిస్తారో, అలాంటి సత్పురుషులను అల్లాహ్ ప్రేమిస్తాడు’ అని ఖురా¯Œ లో ఉంది.హదీసులు: ‘క్షమించిన వ్యక్తికి అల్లాహ్ గౌరవాన్ని పెంచుతాడు’ అని ముహమ్మద్ ప్రవక్త తన బోధనల్లో పదే పదే నొక్కి చెప్పారు. క్షమాగుణం వల్ల అల్లాహ్ అనుగ్రహాన్ని పొందడమే కాకుండా, మనసులో శాంతి, ప్రవక్త పట్ల ప్రేమ, గౌరవాన్ని పెంపొందించుకోవచ్చని ముస్లింలు నమ్ముతారు.రంజాన్ మాసం: క్షమాపణ కోరడానికి, ఇవ్వడానికి రంజాన్ మాసం ఒక ప్రత్యేకమైన, పుణ్యమైన సమయంగా పరిగణిస్తారు.జైన మతంఆత్మశుద్ధికి క్షమాపణే కీలకం అని చెబుతుంది జైన మతం.అహింస: జైన మతం అహింసకు అత్యధిక ప్రాధాన్యమిస్తుంది. ఇది కేవలం ఇతరులకు శారీరకంగా హాని చేయకపోవడం మాత్రమే కాదు, వారి పట్ల చెడు ఆలోచనలు, భావనలు కలిగి ఉండకపోవడం కూడా ముఖ్యమే అంటుంది.పర్యూషణ పర్వం: జైనులకు పర్యూషణ పర్వం అనేది క్షమాపణ కోరడానికి, ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎనిమిది రోజుల పండుగ. చివరి రోజును క్షమాపణ దినంగా జరుపుకుంటారు, ఒకరినొకరు క్షమించుకుంటారు.కర్మ సిద్ధాంతం: క్షమించకపోవడంతో కర్మ బంధాలు పెరుగుతాయని, క్షమాపణ కర్మ నిర్మూలనకు సహాయపడుతుందని జైనం బోధిస్తుంది. అదే మోక్షానికి మార్గమంటోంది.బౌద్ధమతంబౌద్ధమతంలో క్షమాపణ అనేది కరుణ, స్నేహపూర్వక ప్రేమ, సహనం వంటి భావనలతో లోతుగా ముడిపడి ఉంది.బుద్ధుని బోధనలు: బుద్ధుడు తన ధమ్మపదంలో ‘ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము, ప్రేమతోనే జయించగలం’ అని బోధించాడు. ఇతరుల బాధను అర్థం చేసుకోవడం, వారి మంచి కోరడం అనేది క్షమకు ఆధారమని బౌద్ధమతం చెబుతోంది. ఇతరుల పట్ల ప్రేమను పెంపొందించుకుంటే క్షమ సహజంగా వస్తుందని బౌద్ధులు నమ్ముతారు.త్రిపీఠకాలు: బౌద్ధ గ్రంథాలు క్షమను కేవలం ఒక నైతిక విధిగా కాకుండా, ఆంతరంగిక శాంతికి, ఆధ్యాత్మిక విముక్తికి అవసరమైన ఒక శక్తిమంతమైన సాధనగా వివరిస్తాయి. క్షమించడం అనేది ద్వేషాన్ని అంతం చేసే ఏకైక మార్గమని, దుఃఖం నుంచి స్వేచ్ఛను పొందే మార్గమని నొక్కి చెబుతాయి.ప్రపంచంలోని ప్రధాన మతాలన్నీ క్షమాగుణాన్ని ఆధ్యాత్మిక ఉన్నతికి, అంతర్గత శాంతికి, సామాజిక సామరస్యానికి అత్యవసరం అని బలంగా నొక్కి చెబుతాయి. క్షమాపణ అనేది మనసులోని ద్వేషం, కోపం వంటి ప్రతికూల భావాలను తొలగించి, వాటి స్థానంలో ప్రేమ, కరుణ, ప్రశాంతతలను నింపుతుంది. ఇది కేవలం ఇతరులకు చేసే మేలు మాత్రమే కాదు. అన్నింటికంటే ముఖ్యంగా, మనసుకు, ఆత్మకు మనం చేసుకునే అత్యున్నతమైన మేలు!ఏది ఏమైనా, విధి ఆడే వింతనాటకంలో కాలం చేసే గాయాలను కర్మసిద్ధాంతానికి, మనుషులు చేసిన గాయాలను ప్రతీకారేచ్ఛకు ముడిపెట్టుకోవడం మనిషికి అలవాటే! ఆ గాయం చిన్నదైనా, పెద్దదైనా మనసు లోతుల్లోంచి శాంతియుతమైన విశ్లేషణ చాలా అవసరం! అందుకే పిల్లలకు అన్నింటికంటే ముఖ్యంగా క్షమాగుణం గురించి, ఆత్మశుద్ధి గురించి బోధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే, తరం మారాలన్నా, గాయం మానాలన్నా, ప్రపంచం ప్రశాంతంగా ఉండాలన్నా, రేపటి తరంలో ద్వేషానికి బదులు ప్రేమ వికసించాలి! క్షమ అనే బీజం పడాలి!చివరిగా ఒక్క మాట, ఎవరి మీదైనా కోపం, ద్వేషం లాంటివి ఏర్పడినప్పుడు.. ‘తను నన్ను బాధపెట్టి ఇన్ని ఏళ్లు, ఇన్ని నెలలు, ఇన్ని వారాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు అయ్యింది’– అనే లెక్కలు తగ్గించుకుంటే మన ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. -
వెరైటీగా రస్క్ గులాబ్ జామ్, క్యాబేజీ ఖీర్ ట్రై చేద్దాం ఇలా..!
రస్క్ గులాబ్జామ్కావలసినవి: రస్క్ పౌడర్– ఒక కప్పుమైదాపిండి– ఒక టేబుల్ స్పూన్కొబ్బరి పాలు– తగినన్నిపంచదార– అర కప్పు (పాకానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి)ఏలకుల పొడి– కొద్దిగా, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక పాత్రలో రస్క్ పౌడర్, మైదాపిండి వేసుకుని ఒకసారి బాగా కలపాలి. తర్వాత దానిలో కొద్దికొద్దిగా కొబ్బరి పాలు కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని, నూనెలో దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మరో పాన్లో పంచదార పాకం పెట్టుకుని, అందులో ఏలకుల పొడి వేసుకుని, దోరగా వేగిన ఉండలను అందులో వేసుకోవాలి. రెండు గంటలు కదలకుండా ఉంచి, చల్లారాక సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ముంబై క్యాబేజీ ఖీర్కావలసినవి: క్యాబేజీ తురుము– ఒక కప్పుచిక్కటి పాలు– 4 కప్పులుపంచదార– అర కప్పు పైనేసేమియా పుల్లలు– 5 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి వీటిని వేసుకోవచ్చు, అయితే ముందుగా నేతిలో వేయించాలి)నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు పైనేఏలకుల పొడి – అర టీస్పూన్డ్రై ఫ్రూట్స్ తురుము– కొద్దిగా (గార్నిష్ కోసం)తయారీ: ముందుగా తురిమిన క్యాబేజీని కొద్దిగా నేతిలో వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఈలోపు మరో స్టవ్ మీద, మందపాటి గిన్నెలో పాలు పోసి, సగం అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో వేయించిన క్యాబేజీ తురుము, పంచదార, ఏలకుల పొడి వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. మధ్యలో సేమియా పుల్లలు, నెయ్యి వేసి తిప్పుతూ సుమారు 7 నిమిషాల పాటు ఉడికించాలి. మిశ్రమం బాగా దగ్గరపడిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.మలేషియన్ కుయ్ కారా బెర్లౌక్కావలసినవి: చికెన్ కీమా– అర కప్పు (కారం, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తరుగు అన్నీ కొద్దికొద్దిగా కలిపి, 8 గంటల పాటు ఫ్రిజ్లో పెట్టి, అనంతరం నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి)మైదా పిండి– ఒక కప్పు, గుడ్లు– 4, పసుపు– ఒక టీ స్పూన్కొబ్బరి పాలు– పావు కప్పు, నీళ్లు– సరిపడాబేకింగ్ సోడా– ఒక టీ స్పూన్, ఉప్పు,నూనె– తగినంతమసాలా, ఉప్పు, కారం కలిపి ఉడికించిన లేదా వేయించిన రొయ్యలు, కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – గార్నిష్కితయారీ: ముందుగా మైదాపిండిలో పసుపు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మరో గిన్నెలో కొబ్బరి పాలు, కొద్దిగా ఉప్పు, గుడ్లు, 2 టీ స్పూన్ల నూనె వేసుకుని బాగా కలిపి, ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోసుకుంటూ మైదా మిశ్రమాన్ని క్రీమీగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గంట పక్కన పెట్టుకుని, పొంగనాల ట్రేకు అడుగున నెయ్యి లేదా నూనె రాసి, మైదా మిశ్రమంతో గుంతలన్నీ సగం వరకూ నింపుకోవాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా కీమా మిశ్రమాన్ని అందులో వేసుకుని, పైన మళ్లీ మైదా మిశ్రమంతో ఫిల్ చేసుకుని, బేక్ చేసుకోవాలి. అవి బాగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని, ఒక్కో మైదా–కీమా బైట్ మీద ఒక్కో రొయ్యను, కొన్ని కూరగాయ ముక్కలను వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. (చదవండి: ది బెస్ట్ ఐస్ క్రీమ్లుగా ఆ ఐదు భారతీయ బ్రాండ్లకు చోటు..! నటి దీపికా పదుకొణె) -
Beauty Tips: చేయంత యంత్రం..ముఖమంతా మెరుపు..!
అందమైన, కాంతిమంతమైన చర్మం కోసం ఇప్పుడు బ్యూటీ సెలూన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ బ్రూనో ఈఎమ్ఎస్ ఫేషియల్ లిఫ్ట్ పరికరం, ఇంట్లోనే సౌకర్యవంతంగా, పూర్తి స్థాయి చర్మ సంరక్షణను అందిస్తుంది. అందం కోసం ఉపయోగిస్తున్న ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్ పద్ధతికి ఆధునిక హంగులు దిద్ది, ఈ పరికరం వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.ఈ డివైస్ నాలుగు ప్రత్యేకమైన ఆప్షన్స్ని కలిగి ఉంది. ఇందులోని ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్ ఆప్షన్ ముఖ కండరాలను ఉత్తేజపరచి, చర్మాన్ని బిగుతుగా చేసి, ముడతలను తగ్గిస్తుంది. అలాగే దీనిలోని హాట్ అండ్ కోల్డ్ ఫంక్షన్ చల్లని రోజుల్లో చర్మాన్ని వెచ్చగా ఉంచడానికి, వేడి రోజుల్లో చర్మాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని బూస్టర్ ఫంక్షన్ సౌందర్య ఉత్పత్తులు చర్మంలోకి లోతుగా ఇంకేలా చేసి, వాటి ప్రభావాన్ని పెంచుతుంది. మరోవైపు దీనిలోని అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ చర్మాన్ని మరింత బిగుతుగా, దృఢంగా మారుస్తుంది. ఇది వాటర్ప్రూఫ్ కావడంతో తడి చర్మంపై కూడా సురక్షితంగా ఉపయోగించవచ్చు. కేవలం ముఖానికే కాకుండా, మెడ, చేతులు, కాళ్ళపై కూడా దీనిని ఉపయోగించి మంచి ఫలితాలను పొందవచ్చు. సుమారు 183 గ్రాముల బరువుతో, స్టాండ్, స్టోరేజ్ బ్యాగ్తో లభిస్తుంది. ఇది ఎక్కడికైనా తీసుకెళ్లడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలోని ‘త్రీ మినిట్స్ ఆటో పవర్–ఆఫ్’ ఫీచర్ వల్ల సురక్షితంగా దీనిని వాడుకోవచ్చు.సెల్యులైట్కు శాశ్వత పరిష్కారం!ఎందరో మహిళలను వేధించే సాధారణ సమస్య సెల్యులైట్. తొడలు, పిరుదులపై చర్మం గుంతలు పడినట్లు, నారింజ తొక్కలా వడిలిపోయినట్లుగా కనిపించడమే సెల్యులైట్ లక్షణాలు. సెల్యులైట్కు అసలు కారణం చర్మంలోని కొవ్వు కణజాలం కింద ఉండే ఫైబ్రస్ బ్యాండ్లు. ఇవి చర్మాన్ని లోపలికి లాగడం వల్ల గుంతలు ఏర్పడతాయి. ఆహారపు అలవాట్లతో, వ్యాయామాలతో తగ్గని ఈ సమస్యకు ఆధునిక పరిష్కారం సెల్ఫినా చికిత్స. నిపుణులు సన్నటి సూదిలాంటి పరికరాన్ని ఉపయోగించి ఫైబ్రస్ బ్యాండ్లను కత్తిరించి, వాటి ఒత్తిడిని తొలగిస్తారు. బ్యాండ్లు విడుదలైన వెంటనే, చర్మం మళ్లీ నునుపుగా మారుతుంది. కొన్నిసార్లు స్వల్పంగా నొప్పి, వాపు, గాయాలు ఉండవచ్చు, కాని, అవన్నీ కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. (చదవండి: వాల్నట్స్ షెల్స్తో వైట్ హెయిర్కి చెక్పెడదాం ఇలా..!) -
అదిరే గ్యాడ్జెట్స్.. హోమ్ హ్యాపీస్
ఇప్పుడు ఇంట్లో పని గట్టిగా కాదు, గాడ్జెట్స్తో స్మార్ట్గా చేయండి. ఎందుకంటే పని తగ్గించి, సమయాన్ని ఆదా చేసి, సంతోషాన్ని ఇచ్చే కొన్ని హౌస్ గాడ్జెట్లు ఇవిగో మీ కోసం!ఈగలకు నో ఎంట్రీకిటికీ తీయగానే, ఈగలు వచ్చి చుట్టూ తిరగడం కామన్! అలాగని, అవి చెవి దగ్గరకు వచ్చి ‘జూయ్.. జూయ్.. ’ రాగాలు వినిపిస్తూ విసిగిస్తుంటే, చేతికి గాజు వేసుకోండి. అవును, ఈ గాజు పేరు ‘వ్రోక్సీ’ ఇది చూడటానికి గాజులాగే ఉంటుంది కాని, దీని లోపల నేచురల్ ఆయిల్స్, ఇతర ఆయుర్వేద మూలికల వాసనలతో ఈగలకి నో ఎంట్రీ బోర్డు పెడుతుంది. సాఫ్ట్ సిలికాన్తో ఉంటుంది కాబట్టి చేతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోజూ వాడేలా స్టయిలిష్గా, తేలికగా ఉంటుంది. ఇది ఇంట్లోకి, పిక్నిక్కి, క్యాంపింగ్కి బెస్ట్ ఆప్షన్. ధర రూ. 299 మాత్రమే!చేతులకు వెచ్చదనంచలికాలం వచ్చిందంటే మీ చేతులు జారిపోతున్నాయా? ఇంట్లో పని చెయ్యాలన్నా, మొబైల్ స్క్రోల్ చేయాలన్నా, చేతులు తిమ్మిరితో మొద్దుబారితే ఎలా? అప్పుడు వెంటనే మీకు కావాల్సింది మామూలు రూమ్ హీటర్ కాదు, ఈ ‘ఒకూపా హ్యాండ్ వార్మర్’. ఇది చిన్న లిప్స్టిక్ సైజులో ఉంటుంది. ఇందులో రెండు చేతులకూ సరిపోయేలా రెండు మినీ హ్యాండ్ వార్మర్లు మాగ్నెట్కు అంటిపెట్టుకొని ఉంటాయి. వేరుచేసి వాడితే, రెండు చేతులకు వెచ్చదనాన్ని ఇస్తాయి. రెండింటినీ కలిపి వాడితే, చిన్న రూమ్ హీటర్లాగా కూడా పనిచేస్తుంది. అదిరే కాంబో కదా! ఒక్కసారి చార్జ్చేస్తే దాదాపు ఆరుగంటల వరకు పనిచేస్తుంది. ధర రూ. 3,999.వెచ్చని కౌగిలి! ఇంటి పని అంతా ముగించుకుని కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటే; వెన్నునొప్పులు, కాళ్ల నొప్పులు వెంటనే ‘‘హాయ్ సిస్టర్!’’ అని వచ్చేస్తాయి. నెలసరి సమయంలో ఇవి మరింత ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పడే ఒక మంచి సహాయం మసాజ్తో కాదు, వెచ్చదనంతో కావాలి. ఆ వెచ్చదనం అందించే స్నేహితురాలే ఈ ‘హగ్బ్యాగ్’! ఇది కేవలం బొమ్మ కాదు. ఇది ఓ చిట్టి డాక్టర్ లాంటిది. క్యూట్ టాయ్లా కనిపిస్తుంది కాని, లోపల మాత్రం వాటర్ బాటిల్తో ఉంటుంది. అందులో వేడి నీళ్లు పోసి, వెచ్చని చికిత్సను ఇంట్లోనే పొందొచ్చు. వంటింట్లో గంటల పాటు నిలబడి పని చేసిన తర్వాత ఇది పట్టుకొని పడుకోండి, గట్టిగా నిద్ర పడుతుంది. నెలసరి నొప్పుల నుంచి ఇది చక్కని ఉపశమనం కూడా ఇస్తుంది. ధర రూ.799 మాత్రమే!మీ మాటే తనకు శాసనం!చెప్పిందే పది సార్లు చెప్పినా కూడా టీవీలో మునిగిపోయిన భర్త వినడు, గేమ్స్లో లీనమైపోయిన పిల్లలు వినరు. ఇక అత్త మామలకైతే వాట్సాప్లో మెసేజ్ చేసినా, బ్లూటిక్ పడటానికి పదిరోజులు పడుతుంది. ఇలా ఇంట్లో ఎవరూ మీ మాట వినకపోయినా! ఈ ‘అలెక్సా ఎకో పాప్’ మాత్రం మీ మాటే శాసనంగా పాటిస్తుంది. ఎందుకంటే, ఇది అలెక్సా సరికొత్త, స్మార్ట్ మోడల్. మీకు టైమింగ్ గుర్తు చేస్తుంది, పాటలు పాడుతుంది, టీవీ, లైట్లు ఆన్, ఆఫ్ చేస్తుంది. అలాగే, లేటెస్ట్ షాపింగ్కు కావాల్సిన డిస్కౌంట్ ఆఫర్లు కూడా చెబుతుంది. ఇది మీ ఇంట్లో ఉండాలంటే, పెద్ద కారణాలు అవసరం లేదు. కాని, ఇది ఉంటే మాత్రం మీ పనులు చకచకా చిటికెలో జరిగిపోతాయి. ఇకపై ‘మా ఇంట్లో ఎవరూ నా మాట వినరు’ అనే ఫీలింగ్ కూడా ఉండదు. ధర రూ. 4,499. -
32 వేల ఏళ్ల నాటి మొక్క పుష్పించింది..!
మంచుయుగం నాటి పురాతన పుష్పం ముప్పయిరెండు వేల ఏళ్ల తర్వాత పునరుత్థానం పొందింది. ఏనాడో అంతరించిపోయిన ఈ పురాపుష్పానికి రష్యన్ శాస్త్రవేత్తలు పునర్జీవం కల్పించారు. ‘సైలిని స్టెనోఫిలా’ అనే ఈ పువ్వు దాదాపు ముప్పయిరెండు వేల ఏళ్ల కిందట పూసేదట! సైబీరియా మంచు ఎడారుల్లో పరిశోధనలు జరుపుతున్న రష్యన్ శాస్త్రవేత్తలకు ఈ పూల మొక్కకు చెందిన విత్తనాలు ఒక ఉడుత బొరియలో దొరికాయి. వీటిని ల్యాబొరేటరీలో మొలకెత్తించడానికి వారు చేసిన ప్రయత్నం విజయవంతమైంది. మొత్తం విత్తనాలన్నీ మొలకెత్తాయి. మొలకలు మొక్కలుగా ఎదిగి, చక్కగా పూలు పూశాయి. వేల ఏళ్ల కిందట కాలగర్భంలో కలిసిపోయిన విత్తనాలు బయటపడటం, వాటి నుంచి మొక్కలను మొలకెత్తించడం చరిత్రలో ఇదే మొదటిసారి. రష్యన్ శాస్త్రవేత్తలు 2012లో చేసిన ప్రయోగం సఫలం కావడంతో ‘సైలిని స్టెనోఫిలా’ పూల మొక్కలు ఇప్పుడు చాలా ఇళ్లల్లోని కుండీల్లోకి చేరాయి. (చదవండి: ఆ ఊళ్లో నెమళ్ల బెడద..) -
తెలుగులో ఎప్పుడో నటించిన దీపికా.. ఆమె ఆస్తి ఎంతో తెలుసా?
బ్యాడ్మింటన్ కోర్టు వదిలేసి, మోడలింగ్ ప్రపంచంలో నాజూకు అడుగులతో మొదలుపెట్టింది. నేడు వెండితెర మీద తనదైన సామ్రాజ్యం నిర్మించుకుంది నటి దీపికా పదుకొణే. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని త్వరలో రాబోతుండటంతో, ఎక్కడ చూసినా ఆమె పేరే ఒక హాట్ టాపిక్! అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందే సినిమాలో ఆమెను కథానాయికగా ఎంపిక చేయడం సినీ పరిశ్రమలో పెద్ద వార్తగా మారింది. ఆమె గురించి కొన్ని విషయాలు మీకోసం..బ్యాడ్మింటన్ ఆట నుంచి..దీపికా పదుకొణె (Deepika Padukone) కొంకణి అమ్మాయి. ఆమె తండ్రి ప్రకాశ్ పదుకొణే భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. తండ్రి ప్రభావంతో బ్యాడ్మింటన్ ఆడిన దీపికా, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ పాల్గొంది. కాని తనకు సినిమా, మోడలింగ్పై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో నటన వైపు మొగ్గుచూపింది. ఆమె సినీ ప్రయాణం తెలుగు సినిమా ‘మన్మథుడు’ ఆధారంగా రూపొందిన కన్నడ రీమేక్ ‘ఐశ్వర్య’ చిత్రంతో మొదలైంది. తెలుగులో ఎప్పుడో యాక్ట్ చేసిందితెలుగు దర్శకుడు జయంత్ సి. పరాన్జీ, దీపికాకు తెలుగులో మొదటి అవకాశం ఇచ్చారు. ఓ యువ ప్రేమకథలో ప్రత్యేక పాటలో నాట్యం చేసింది. ఆ సినిమా పూర్తయింది. కానీ, ఇప్పటికీ విడుదల కాలేదు. లేకపోతే ఆమె టాలీవుడ్లో ఎప్పుడో అడుగుపెట్టేది. ‘కల్కి’ సినిమాలో సుమతి పాత్రతో ఆకట్టుకున్న దీపికా, ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.గ్లామర్లో తగ్గేదేలే‘రామ్ లీలా’ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్వీర్ సింగ్తో పరిచయం ప్రేమగా మారింది. అంతకు ముందు రణ్బీర్ కపూర్తో ప్రేమలో ఉన్న ఆమె, ఆ బ్రేకప్ తర్వాత కొత్త జీవితం మొదలుపెట్టింది. పెళ్లి అయినా, తల్లి అయినా, దీపికా తన గ్లామర్ను తగ్గించుకోలేదు. తన పని పట్ల నిబద్ధతతో ప్రవర్తించేది. హిందీ సినీ ప్రపంచంలో ఆమె తొలి సినిమా ‘ఓం శాంతి ఓం’, షారుఖ్ ఖాన్తో కలసి నటించింది. ఆ చిత్రం ఆమె సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘చెన్నై ఎక్స్ప్రెస్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘పఠాన్’, ‘జవాన్’లాంటి హిట్ సినిమాల్లో నటించింది.రూ.500 కోట్లకు పైగా ఆస్తులుహాలీవుడ్లోనూ నటించే అవకాశం పొందిన దీపికా, ప్రపంచ సినీరంగంలో కూడా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం దీపికా ఆస్తుల విలువ దాదాపు రూ.500 కోట్లకు పైగా ఉంది. ముంబైలో ఆమెకు అంధేరి, బాంద్రా, ప్రభాదేవి ప్రాంతాల్లో మూడు ఇళ్లు ఉన్నాయి. 2022లో ఆమె సొంతంగా సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ను ప్రారంభించింది. ఇళ్లపై పెట్టుబడులు పెట్టడాన్ని ఆమె ఇష్టంగా భావిస్తుంది.రహస్యాన్ని అతడికే చెప్తాఓ ఇంటర్వ్యూలో తల్లి అయ్యాక, తన పాత్రల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నానని, బిడ్డకు సమయాన్ని ఇచ్చేలా ప్రయత్నిస్తున్నానని చెప్పింది. ఓ కార్యక్రమంలో ‘ఒక రహస్యాన్ని చెవిలో చెప్పాలంటే ఏ హీరోకి చెబుతారు?’ అన్న ప్రశ్నకు వెంటనే షారుఖ్ ఖాన్ అని బదులిచ్చింది. 2007లో రణ్బీర్ కపూర్తో పరిచయం, ప్రేమగా మారింది. ఒకే మేకప్ ఆర్టిస్ట్ కారణంగా ఫోన్ నంబర్లు మార్చుకుని ప్రేమలో పడ్డారు. తన మెడ వెనక అతడి పేరు టాటూ వేయించుకుంది. కాని, ఏడాదిలోనే బ్రేకప్ జరిగింది.డిప్రెషన్రణ్బీర్ కపూర్ మరో అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం వల్ల విడిపోయినట్లు ఓ సందర్భంలో దీపిక చెప్పింది. దీని వలన డిప్రెషన్కు లోనైనా, కెరీర్పై ప్రభావం రాకుండా చూసుకుంది. ‘ఏ జవానీ హై దివానీ’ సినిమా అదే సమయంలో పూర్తి చేసింది. ఇప్పుడు ఇద్దరూ ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోయారు. దీపికా – రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది. మరోవైపు రణ్బీర్ కపూర్ – ఆలియా భట్ను వివాహం చేసుకుని పాపకు తండ్రయ్యాడు. ఇప్పటికీ వీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రొఫెషనల్గానే పలకరించుకుంటారు.చదవండి: స్క్విడ్ గేమ్ 3 రివ్యూ.. ఊహించని క్లైమాక్స్, అందరికీ రుచిస్తుందా? -
ప్లాన్ చేస్తున్నాం కానీ...
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. నా రెండు రొమ్ముల్లో గడ్డల్లాగా ఉన్నాయి. కాని, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లా¯Œ చేస్తున్నాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– అనిత, విజయవాడ.మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుండగా రొమ్ముల్లో గడ్డలు కనిపిస్తే, అది చిన్న సమస్య అయి ఉండొచ్చు, కాని నిర్లక్ష్యం చేయరానిది. చాలా సందర్భాల్లో ఇది ఫైబ్రో ఎడినోమా అనే సాదారణ సమస్యగా ఉంటుంది. ఇది నొప్పి లేకుండా కనిపిస్తుంది. మీ వయస్సు, కుటుంబంలో బ్రెస్ట్ కేన్సర్ చరిత్ర, బాడీ మాస్ ఇండెక్స్ 35 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, థైరాయిడ్, బీపీ వంటి సమస్యలుంటే, తప్పకుండా బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ చెక్ చేయించాలి. గడ్డల పరిమాణం, ప్రదేశం, స్వభావం ఆధారంగా దానికి బైరాడ్స్ గ్రేడింగ్ చేస్తారు. చాలా సందర్భాల్లో ఇది తక్కువ గ్రేడింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఇది ప్రమాదకరం కాదు. అలాగే ఇది భవిష్యత్తులో బ్రెస్ట్ ఫీడింగ్కు కూడా అంత అడ్డు రాదు. కానీ బ్రెస్ట్లో ఆకస్మికంగా వాపు, రంగు మారటం, నొప్పి రావడం లాంటివి కనిపిస్తే వెంటనే వైద్యుని కలవాలి. సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. అలాగే స్వయంగా పరిశీలించి చూసుకోవడం వలన ఏదైనా మార్పు ఉంటే వెంటనే గుర్తించవచ్చు. అవసరమైతే డాక్టర్ ఎఫ్ఎ¯Œ ఏసీ లేదా బయాప్సీ చెయ్యమని సూచిస్తారు. ఎక్కువ మార్పులు కనిపిస్తే శస్త్రచికిత్స కూడా చేస్తారు. ఇది ప్రెగ్నెన్సీకి ఏ ప్రమాదం చేయదు. అయితే ప్రతి మార్పును గమనిస్తూ రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ, డాక్టర్ సూచించిన పరీక్షలు, స్కానింగ్లను తప్పకుండా చేయించుకోవాలి.నేను ఇప్పుడు మూడు నెలల గర్భవతిని. మా ఫ్యామిలీలో చాలామందికి థైరాయిడ్ ఉంది. అందుకే, ప్రెగ్నెన్సీలో నాకు కూడా వస్తుందేమో అనిపిస్తోంది. ఇందుకు ఏవైనా పరీక్షలు చేయించుకోవాలా?– సుమలత, నూజివీడు.మీ కుటుంబంలో థైరాయిడ్ సమస్యలు ఉన్నట్లయితే, ప్రెగ్నెన్సీ సమయంలో మీరు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు ఉంటే అవి శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మెదడు అభివృద్ధి, నరాల వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో టీఎస్హెచ్ అనే థైరాయిడ్ పరీక్ష చేయించాలి. ఈ సమయంలో టీఎస్హెచ్ స్థాయి 2.5 కంటే తక్కువగా ఉండాలి. అలాగే కుటుంబంలో ఇప్పటికే థైరాయిడ్ ఉన్నవారు ఉంటే, థైరాయిడ్ యాంటీబాడీ పరీక్ష కూడా చేయించాలి. ఈ పరీక్షలో యాంటీబాడీలు పాజిటివ్గా ఉంటే, గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే, అలాంటి సందర్భాల్లో వైద్యుని సూచనల మేరకు తక్కువ మోతాదులో థైరాక్సి¯Œ అనే మందును వాడాలి. ప్రెగ్నెన్సీ మొత్తం వ్యవధిలో టీఎస్హెచ్ స్థాయిని ప్రతి నెలా పరీక్ష చేయాలి. మూడో నెల దాటిన తర్వాత టీఎస్హెచ్ స్థాయి 3 వరకు ఉండవచ్చు. అంతకంటే ఎక్కువైతే, వైద్యులు మందుల మోతాదును సరిచేస్తారు. గర్భవతిగా ఉన్నప్పుడు టీఎస్హెచ్ స్థాయి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అందువలన ప్రతిసారీ పరీక్షల ద్వారా స్థాయిని గమనించి, మందుల మోతాదును మార్చుకుంటూ ఉండాలి. చాలామంది గర్భవతులకు డెలివరీ తర్వాత కూడా థైరాయిడ్ యాంటీబాడీలు కొనసాగుతాయి. అందుకే డెలివరీ అనంతరం కూడా మందులను కొనసాగించే అవసరం ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నా కూడా శిశువు ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంది. ఇందుకోసం ముఖ్యంగా శిశువు మెదడు, చురుకుదనం, శరీరాభివృద్ధి బాగా జరగాలంటే మొదటి మూడు నెలల్లో టీఎస్హెచ్ స్థాయిని 2.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అందుకే, ఎప్పటికప్పుడు డాక్టర్ను సంప్రదిస్తూ, వారు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం చాలా అవసరం. ∙ -
తొలి అడుగుకు భరోసా ఇవ్వాలి!
ఒక చిన్నారి పుట్టినప్పటి నుంచి తల్లి, తండ్రి, ఇల్లు, బొమ్మలు, తన పడకే ప్రపంచంగా ఉంటుంది. వాటితోనే, వారితోనే బంధం, అనుబంధం అన్నీ. ఈ పరిసరాలకు దూరంగా కొత్త వ్యక్తుల మధ్యకు, కొత్త ప్రదేశంలోని వెళ్లాలంటే అగ్నిపరీక్షే! నర్సరీ ప్రవేశం అలాంటిదే! నర్సరీ అనేది చిన్న అడుగు కాదు. జీవితంలో పెద్దమార్పు. నర్సరీకి పంపడం అన్ని రోజుల్లా ఒక మామూలు రోజు కాదు, బిడ్డ జీవితం కోసం వేసే ముందడుగు. పిల్లల మనసులో ప్రేమతో కూడిన తొలి పాఠశాల అనుభవాన్ని నాటగలిగితే, వారు భవిష్యత్తులోనూ ప్రపంచాన్ని భయపడకుండా ఎదుర్కొంటారు. ఆ మేరకు పిల్లలను నర్సరీకి పంపే ముందే వారి మనసును సిద్ధం చేయాల్సిన బాద్యత తల్లిదండ్రులదే! ఈ వయసులో పిల్లలకు అమ్మ కనిపించకపోతే, నన్ను వదిలిపెట్టిందేమో అనే భయంతో బాధపడతారు. ఇది సెపరేషన్ యాంగ్జయిటీకి దారితీస్తుంది. ఈ దశలో తల్లిదండ్రుల ప్రేమ, మానసిక మద్దతు అత్యంత అవసరం. నర్సరీలోని మొక్కలను జాగ్రత్తగా కాపాడుకున్నట్లే చిన్నారులను కూడా ప్రేమగా కాపాడుకోవాలి. వారికి దూరంగా ఉన్నా, తమకే ఆపద రాదని; ప్రమాదం జరగదని నమ్మకం కలిగించాలి. కథలతో సిద్ధం చేయండినర్సరీ లేదా ప్రీస్కూల్ అనేది పిల్లలకు తెలియని ప్రదేశం. ఆ ప్రదేశం గురించి తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యే భాషలో వివరించాలి. ‘‘నీకు తెలుసా... బంటి అనే బాబు స్కూల్కు వెళ్లి అక్కడ కొత్త అక్కలతో ఆడుకుని ఆనందించాడు తెలుసా’’ అంటూ కథల రూపంలో చెప్పి పిల్లలకు స్కూల్ పట్ల ఆసక్తి కలిగించాలి. ఇలా చెప్పడం వల్ల పిల్లల మనసులో స్కూల్ అంటే భయం కాకుండా, ఆటలాడుకునే ప్రాంతమనే ఆలోచన ఏర్పడుతుంది. ముందుగానే పరిచయం చేయాలిఒక చిన్న పిట్ట కొత్త గూటిని ఎలాగైతే ముందుగా చుట్టూ తిరిగి గమనించి వెళ్తుందో, అలాగే పిల్లలు కూడా కొత్త ప్రదేశాన్ని ముందే చూశారంటే భయం తగ్గుతుంది. అందుకే వారిని ముందుగానే స్కూల్ ప్రాంగణానికి తీసుకెళ్లి, ‘ఇదిగో, నీ ఆటబొమ్మలు ఇక్కడ ఉంటాయి. టీచర్ అక్కలతో మాట్లాడవచ్చు’ అని చెప్పండి. ఈ పరిచయం వారిలో భరోసాను నింపుతుంది. ముందే ఆశ నింపాలిబెలూన్ చేతి నుంచి విడిచే ముందు, దాన్లో గాలి నింపుతాం. అలాగే, పిల్లలను స్కూల్లో వదిలే ముందు భరోసా అనే గాలిని నింపాలి. ‘‘కాస్సేపు ఇక్కడ ఆడుకో, ఆ తర్వాత నన్ను పిలుస్తారు. నేను వస్తాను, అమ్మ వస్తుంది’’ అని భరోసా నింపండి. మీ భయాన్ని పసిగట్టేస్తారు జాగ్రత్త‘‘పిల్లాడు ఏడుస్తాడేమో!’’ అని మీరు మనసులో అనుకుంటే, అది మీ బిడ్డకు స్పష్టంగా తెలుస్తుంది. అతడి మనస్సు మీ ముఖాన్ని అద్దంగా చూస్తుంది. కాబట్టి, మీ హావభావాల్లో ఆనందం, నమ్మకం కనిపించాలి. మీ భయం బిడ్డ మనసులోని భద్రతను దెబ్బతీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక లవ్ టోకెన్ ఉండాలి పిల్లలను స్కూల్లో వదిలే సమయంలో వారి చేతిలో ఒక చిన్న బొమ్మ, అమ్మ హ్యాంకీ, లేదా ఫోటో ఉండాలి. ఈ చిన్న చిన్న వస్తువులు అనురక్తికు సంకేతాలు. వారు తల్లికి దూరంగా ఉన్నా, ప్రేమ దగ్గరగా ఉంది అని అనిపించేలా చేస్తాయి.చిన్న విడిపోవడం – పెద్ద శాంతికి ప్రారంభంపక్షి పిల్ల తమ గూటిని వదిలి ఎగిరే ముందు చిన్న చలనం అవసరం. అలాగే, పిల్లలను స్కూల్కు తీసుకెళ్ళే ముందు ఇంట్లోనే చిన్న విడిపోవడాల్ని ప్రాక్టీస్ చేయండి. మామయ్య, చిన్నమ్మ దగ్గర అరగంట వదిలి అబ్జర్వ్ చేయండి. ఇలా వదలడం ‘అమ్మ వదిలిపోదు, నాకోసం వచ్చేస్తుంది’ అనే నమ్మకాన్ని కల్పిస్తుంది. సెపరేషన్ యాంగ్జయిటీకి ఇది దివ్యౌషధం.ప్రీస్కూల్లో చిన్నారి ఆలోచనలు... పిల్లల మెదడు ఇంకా పూర్తిగా వికసించక పోవడం వల్ల ఎందుకు స్కూల్ వెళ్తున్నాం? ఎందుకు వెళ్లాలి? అనే లాజిక్ వారికి ఉండదు. అమ్మ లేదు– భయం మొదలవుతుంది.పదజాలం పరిమితం– భావాలను చెప్పలేక తంటా పడుతుంటారు.ఎక్కువ మంది పిల్లలు– నా బొమ్మ నా వద్ద లేదు అనే అసూయ మొదలవుతుంది.క్లాస్ టైమ్, ఆట టైమ్, భోజన టైమ్– అన్నీ షెడ్యూల్, కష్టంగా ఉంటుంది. -
ప్రపంచంలో అభయారణ్యాలు
ప్రపంచంలో అభయారణ్యాలు ఉండటం సహజం. అడవులలోని కొండ కోనలను, వాగు వంకలను, చెట్టు చేమలను, పక్షులు, జంతువులను పరిరక్షించడానికి అభయారణ్యాలను ఏర్పాటు చేస్తుంటారు. కొన్ని చోట్ల అభయారణ్యాలే కాదు, భయారణ్యాలు కూడా ఉంటాయి. ఆ అరణ్యాలలోకి అడుగు పెట్టాలంటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. సాహసించి ఎవరైనా ఆ అరణ్యాలలోకి వెళ్లినా, వారికి చిత్రవిచిత్రమైన రీతిలో అంతుచిక్కని అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న అలాంటి కొన్ని భయారణ్యాల గురించి, వాటి విశేషాల గురించి తెలుసుకుందాం.ఎల్ఫిన్ ఫారెస్ట్అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న కీకారణ్యం ఇది. ఈ అడవిలోకి అడుగు పెట్టడానికి పట్టపగలు కూడా జనాలు భయపెడతారు. ఈ అడవి చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అడవిలో అమెరికన్ మూలవాసుల ఆత్మలు సంచరిస్తుంటాయని, ఒక మంత్రగత్తె ఆత్మ కూడా సంచరిస్తూ ఉంటుందని స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎల్ఫిన్ అడవి నడిబొడ్డున ఒక సన్నని రాతి దారి ఉంది. మెలికలుగా ఉన్న ఈ దారిలోనే ఇక్కడ మూలవాసులు అతీంద్రియ శక్తుల కోసం ఆత్మలను ఆవాహన చేసేవారని చెబుతారు. ఈ అడవిలోని లోయకు ఎగువనున్న కొండల మీద మూలవాసుల సమాధులు ఉన్నాయంటారు. ఈ ప్రాంతంలో అక్కడక్కడా కనిపించే చిన్నారుల పాదముద్రలు మూలవాసుల పిల్లలవి కావచ్చని భావిస్తారు. ఈ అడవిలో కొన్ని అంతుచిక్కని హత్యలు సహా పలు అంతుచిక్కని సంఘటనలు జరిగాయి. కొందరు సాహసించి ఈ అడవిలోకి వెళితే, వాళ్లకు అంతుచిక్కని అనుభవాలు ఎదురయ్యాయని చెబుతారు. రకరకాల ప్రచారాలు, భయాల కారణంగా స్థానికులెవరూ ఈ అడవిలోకి వెళ్లడానికి సాహసించరు. అందుకే, ఈ అడవి నిత్యం నిర్మానుష్యంగా ఉంటుంది.బ్లాక్ ఫారెస్ట్పగలు, రాత్రి దాదాపు ఒకేలా ఉండే ఈ అడవి జర్మనీ నైరుతి ప్రాంతంలో ఉంది. ఈ అడవి అసలు పేరు ‘ష్వార్జ్వాల్డ్’. అడవి నిండా ఎత్తయిన చెట్లు దట్టంగా పెరిగి ఉండటంతో పట్టపగటి వేళలో కూడా ఇక్కడి నేల మీద సూర్యకిరణాలు దాదాపు పడవు. అందువల్ల పగటి వేళలో కూడా ఈ అడవి చీకటిగానే ఉంటుంది. నిత్యం చీకటిగా ఉండటం వల్లనే దీనికి ‘బ్లాక్ ఫారెస్ట్’ అనే పేరు వచ్చింది. ఈ అడవిలో కొన్ని అంతుచిక్కని సంఘటనలు జరిగాయి. ఇక్కడ కొందరు అంతుచిక్కకుండా గల్లంతైపోయారు. ఈ అడవిని అల్లుకుని ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా జర్మన్ రచయితలు బ్రదర్స్ గ్రిమ్ (జాకోబ్, విల్హెల్మ్) ‘హాన్సెల్ అండ్ గ్రెటెల్’ అనే పుస్తకం రాశారు. ఇందులో ఈ అడవిలో అంతుచిక్కకుండా తప్పిపోయిన ఇద్దరు పిల్లల ఉదంతాన్ని రాశారు. ఈ అడవిలో ఇప్పటికీ కనిపించే పిల్లల పాదముద్రలు అప్పట్లో తప్పిపోయిన వారివేనని స్థానికులు నమ్ముతారు. ప్రపంచంలోనే అత్యంత నిర్మానుష్యంగా కనిపించే అడవుల్లో బ్లాక్ ఫారెస్ట్ కూడా ఒకటి.డెవిల్స్ ట్రాంపింగ్ గ్రౌండ్అమెరికాలోని ఉత్తర కరోలినాలో అడవి నడిమధ్యన ఉన్న విచిత్ర ప్రదేశం ఇది. ‘బెయిర్ క్రీక్ ’ వాగు సమీపంలో ఉన్న దేవదారు వృక్షాల అడవి నడిమధ్యన ఈ వృత్తాకర ప్రదేశం ఖాళీగా కనిపిస్తుంది. దట్టమైన అడవిలో కనీసం గడ్డిపరకలైనా మొలవని ఈ ప్రదేశం ఇప్పటికీ ఒక అంతుచిక్కని మర్మమే! దాదాపు 40 అడుగుల పరిధిలో ఉన్న ఈ ప్రదేశంలో అడవిలో సంచరించే జంతువులేవీ అడుగు పెట్టవు. దీని సమీపానికి వచ్చినా, చుట్టూ తిరిగి వెళతాయే గాని, దీని లోపల అడుగు పెట్టి, ఇటు నుంచి అటు దాటే ప్రయత్నం చేయవు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని కొందరు ఔత్సాహికులు ఇక్కడకు పెంపుడు జాగిలాలను తీసుకు వచ్చినా, ఆ జాగిలాలు దీని చుట్టూ తిరిగి, విచిత్రంగా మొరిగాయే తప్ప దీని లోపలకు అడుగు పెట్టలేదు. ఒక్కోసారి ఇక్కడ ఎవరో పారవేసినట్లుగా అంతుచిక్కని వస్తువులు కనిపిస్తుంటాయి. అలాగే, అంతుచిక్కని పాదముద్రలు కూడా కనిపిస్తుంటాయి. అందుకే, స్థానికులు దీనిని ‘దయ్యాల మైదానం’గా అభివర్ణిస్తుంటారు. రాత్రివేళ ఇక్కడ దయ్యాలు వచ్చి ఆటలాడుకుంటూ, నృత్యం చేస్తూ కాలక్షేపం చేస్తాయని కథలు కథలుగా చెప్పుకుంటారు.ఎపింగ్ ఫారెస్ట్ఇంగ్లండ్లోని అత్యంత పురాతనమైన అడవి ఇది. దాదాపు ఆరువేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ దట్టమైన అడవి అతీంద్రియ శక్తులకు ఆలవాలమని స్థానికులు చెబుతుంటారు. నాలుగు శతాబ్దాల కిందట నాటి రాజులు ఈ అడవిలో వేట సాగించేవారట! నేరాలు చేసి పారిపోయేవారికి, దోపిడీ ముఠాలకు, యుద్ధం నుంచి పారిపోయిన సైనికులకు ఈ అడవి ఒకప్పుడు సురక్షిత స్థావరంగా ఉండేదని చెబుతారు. పద్దెనిమిదో శతాబ్దిలో డిక్ టర్పిన్ అనే దోపిడీ ముఠా నాయకుడు ఈ అడవిని అడ్డాగా చేసుకుని, అటవీ మార్గం గుండా వచ్చే బాటసారులను దోచుకునేవాడు. తనను ఎదిరించేవారిని నిర్దాక్షిణ్యంగా చంపేవాడు. ఇరవయ్యో శతాబ్దిలో ఈ అడవిలో కనీసం పదకొండు హత్యలు జరిగాయని చెబుతారు. అరవయ్యేళ్ల కిందటి వరకు హంతక ముఠాలు తమ చేతిలో హత్యకు గురైనవారి మృతదేహాలను ఈ అడవిలో పారవేసేవారు. అంతుచిక్కని చాలా హత్యలకు కేంద్రంగా ఉన్న ఈ అడవిలో హత్యలకు గురైనవారి ఆత్మలు సంచరిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. ఈ అడవిలోకి అడుగుపెట్టిన కొందరు తమకు అంతుచిక్కని రీతిలో విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని చెబుతుంటారు. సాహసికులు, అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులు తప్ప మామూలు మనుషులెవరూ ఈ అడవి జోలికి వెళ్లరు.డౌహిల్ ఫారెస్ట్ఇది పశ్చిమ బెంగాల్లోని కుర్సియాంగ్ పట్టణానికి చేరువలో ఉంది. ఈ అడవికి సమీపంలోనే వందేళ్ల నాటి విక్టోరియా బాయ్స్ హైస్కూల్ ఉంది. దట్టంగా దేవదారు చెట్లు పెరిగిన ఈ అడవిలోనే కాకుండా, అడవికి దగ్గరగా ఉన్న స్కూల్లో కూడా అతీంద్రియ శక్తులు సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. చీకటి పడిన తర్వాత ఈ పరిసరాల్లో మానవమాత్రులు కనిపించడం చాలా అరుదు. డౌహిల్ అడవి నుంచి విక్టోరియా బాయ్స్ హైస్కూల్ వైపు వెళ్లే దారిని ‘డెత్ రోడ్’గా పిలుచుకుంటారు. ఈ దారిలో అనేక అసహజమైన సంఘటనలు జరగడమే దీనికి కారణం. చీకటి పడ్డాక ఈ దారిలో వస్తుండగా దయ్యాలను చూశామని కొందరు చెబుతుంటారు. ఈ దారిలో ప్రయాణిస్తున్నప్పుడు వికృతమైన నవ్వులు, భయపెట్టే ధ్వనులు వినిపించినట్లు ఇంకొందరు చెబుతుంటారు. స్థానికులు చెప్పే మరో విచిత్రమైన ఉదంతమేమిటంటే, ఈ ప్రాంతంలో రాత్రివేళ తలలేని బాలుడు ఒకడు కాపలాగా తిరుగుతుంటాడని, ఎవరైనా గమనిస్తే, పరుగుతీస్తూ అడవిలోకి పారిపోయి, అదృశ్యమైపోతాడని చెబుతారు. ఆ బాలుడికి తల ఉండదని, మెడ ఉండాల్సిన చోట ఒక నిలువైన కట్టె ఉంటుందని చెబుతుంటారు. రాత్రివేళ ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టడానికి స్థానికులు ఇప్పటికీ భయపడతారు.హోయా బాచూప్రపంచంలో అతీంద్రియ శక్తులకు ఆలవాలంగా పేరుమోసిన అడవుల్లో ‘హోయా బాచూ’ ఒకటి. ఇది రుమేనియాలో ఉంది. అడ్డదిడ్డంగా మెలికలు తిరిగి దట్టంగా పెరిగిన ఇక్కడి చెట్లను పగటి వేళలో చూస్తేనే జనాలు భయపడతారు. ఇక రాత్రివేళ అయితే, ఈ అడవి పరిసరాల్లోకి అడుగు పెట్టడానికి కూడా సాహసం చేయరు. సాధారణంగా ఈ అడవి నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు ఔత్సాహికులు ఇక్కడి అంతుచిక్కని రహస్యాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళుతుంటారు. అలా వెళ్లినవారు కూడా చాలామంది ఈ అడవిలో కొంతదూరం ప్రయాణించాక కడుపులో వికారం మొదలై వాంతులయ్యాయని, గుండెదడ మొదలైందని చెబుతుంటారు. ఈ అడవి పరిసరాల్లో కనిపించిన ‘యూఎఫ్ఓ’ను ఒక సైనికుడు 1968లో ఫొటో తీయడంతో ఇక్కడ అతీంద్రియ శక్తులపై ప్రచారం మరింత ఎక్కువైంది. ఆ ఫొటో ప్రచారంలోకి వచ్చిన తర్వాత శాస్త్రవేత్తల బృందాలు ఈ అడవిలో పరిశోధనలు జరిపాయి. అడవి పైనుంచి యూఎఫ్ఓ సంచరించిన ప్రాంతంలో చెట్లు చచ్చిపోయాయి. ఆ ప్రదేశంలో ఇప్పటి వరకు ఒక్క మొక్క కూడా మొలవలేదు. దీనికి శాస్త్రవేత్తలు కచ్చితమైన కారణాలను చెప్పలేకపోతున్నారు. బహుశా, యూఎఫ్ఓ రేడియేషన్ ప్రభావం కారణంగానే ఈ ప్రదేశంలో తిరిగి మొక్కలు మొలవడం లేదని చాలామంది భావిస్తున్నారు. -
గాంధీ కొండ... చూద్దామా!
∙చెన్నాప్రగడ శర్మ, విజయవాడ విజయవాడ పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ముచ్చటగా మూడు కొండలు. ఒకటి దుర్గ కొండ, రెండోది గాంధీ కొండ, మూడోది గుణదల కొండ. మహాత్మాగాంధీ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం గాంధీ కొండ పేరిట స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ పశ్చిమ ద్వారానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఒకప్పుడు పర్యాటకులతో కిటకిటలాడిన కొండ కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. మళ్లీ ఇప్పుడిప్పుడే పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది.నాటి ఓర్ కొండే నేటి గాంధీ కొండవిజయవాడ తారాపేటలో 500 అడుగుల ఎత్తున గాంధీ కొండ ఉంది. కెప్టెన్ చార్లెస్ ఓర్ అనే ఇంజినీరు 1852లో కృష్ణా నదిపై తొలి ఆనకట్ట నిర్మించినప్పుడు ఈ కొండపై నుంచే నిర్మాణ పనులను పర్యవేక్షించేవారు. అప్పట్లో దీన్ని ఓర్ కొండ అనేవారు. దీనిపై 1948లో బాపూజీ స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. విజయవాడ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎంతో ఆసక్తిగా తిలకించేవారు. ఆ తర్వాత పలు జిల్లాలు, క్రమేణా ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకుల రాక ఊపందుకుంది. 1921లో స్వాతంత్య్ర పోరాట సమయంలో మహాత్మాగాంధీ బెజవాడ వచ్చి కొండ దిగువన నిర్వహించిన సభలో ప్రసంగించారు. అప్పటి నుంచి ఓర్ కొండ గాంధీ కొండగా పేరు పొందింది. గాంధీ స్మారక నిధి ఇక్కడ రూపొందించిన గాంధీ స్మారక చిహ్నానికి 1964 నవంబర్ 9న నాటి ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పునాదిరాయి వేశారు. దేశంలో ఒక కొండపై ఉన్న మొట్టమొదటి గాంధీ స్మారక చిహ్నమిది. 1967లో అప్పటి ఉప ప్రధాని మొరార్జీదేశాయ్ గాంధీ హిల్ సొసైటీని స్థాపించారు. దశాబ్దం తర్వాత ఈ సొసైటీని గాంధీహిల్ ఫౌండేషన్ పేరిట ట్రస్టుగా మార్చారు. గాంధీజీ శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా 1968 అక్టోబర్ 6న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ 52 అడుగుల పొడవుగల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. చికుబుకు చికుబుకు రైలే...కొండపై ప్రధానంగా ఆకట్టుకునేది పిల్లల టాయ్ రైలు. 1969లో ఇండియన్ రైల్వేస్ రైలుమార్గాన్ని వేసింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రైలును బహూకరించింది. ఇది కొండను చుట్టివస్తుంది. లోపల కూర్చొని విజయవాడ నగరాన్ని చూడవచ్చు. ఒకప్పుడు ఈ రైలు ఎక్కేందుకు జనాలు పోటీపడేవారు. ఇప్పుడు రైల్వే ట్రాక్ పాడయింది. రైలు కూడా జీర్ణావస్థకు చేరడంతో ఏడాదిన్నరగా తిప్పడం లేదు. ప్రస్తుతం ఒకవైపు కొత్త ట్రాక్ పనులు, మరోవైపు విద్యుద్దీకరణ జరుగుతోంది.నేల మీదికి నింగి...అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి సౌండ్ అండ్ లైట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 1969లో సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ఖాన్ ప్రదర్శన ప్రారంభించారు. ఇందులో గాంధీజీ జీవితం, స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను ప్రదర్శిస్తారు. 1971లో ప్లానెటోరియంను ప్రారంభించారు. న్యూయార్క్కు చెందిన ఫోర్డు ఫౌండేషన్ దీనికి టెలిస్కోప్ బహూకరించింది. పిల్లలు, పెద్దలు ఎవరికైనా ప్రవేశ రుసుం 40 రూపాయలు. కనీసం పదిమందికి పైగా వస్తేనే ప్రదర్శన వేస్తారు. కొండపై గ్రంథాలయం ఒకటుంది. ఇందులో మహాత్మాగాంధీ జీవితానికి సంబంధించినవి, ఆయన స్వయంగా రాసిన పుస్తకాలు దాదాపు వెయ్యి ఉంటాయి. ఇంకా పలు ఛాయాచిత్రాలు చూడవచ్చు. పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా పార్కులున్నాయి. దశలవారీగా అభివృద్ధి...రాష్ట్ర విభజన అనంతరం 2017లో కొత్తగా ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి పేరుతో రిజిస్టర్ అయింది. కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. ప్రస్తుతం గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టనున్నారు. ముందుగా కొండను సుందరీకరించనున్నారు. ఘాట్ రోడ్డు ప్రారంభంలో ఆర్చ్ని అందంగా తీర్చిదిద్దుతారు. అక్కడి నుంచి స్థూపం వరకు అప్రోచ్ రోడ్డును అభివృద్ధి చేస్తారు. పచ్చదనాన్ని మరింత పెంచుతారు. పిల్లలు ఆడుకునే ఆట ప్రదేశాల్లో కొత్త పరికరాలను అమర్చుతారు. ఇవన్నీ అక్టోబరు రెండు నాటికి పూర్తయితే గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. గాంధీ కొండను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకెళుతున్నామని గాంధీ స్మారక నిధి చైర్మన్ గాంధీ పి.సి. కాజా చెప్పారు.ఫొటోలు: కిశోర్ నడిపూడి సాక్షి–విజయవాడపర్యాటకానికి అండ గాంధీ కొండవిజయవాడ నగరంలో పర్యాటకంగా ప్రసిద్ధిగాంచిన ప్రదేశాల్లో గాంధీ కొండ ఒకటి. టాయ్ ట్రైన్ తిరిగినప్పుడు పిల్లలు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ఇప్పుడది మరమ్మతులకు గురైంది. మరో ఏడాదిన్నరకుగాని పట్టాలెక్కదు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి 8–30 గంటల వరకు కొండను సందర్శించవచ్చు. ఎంట్రన్్స టికెట్ 10 రూపాయలు. ప్రతి మంగళవారం సెలవు. రైల్వే స్టేషన్ పశ్చిమ ద్వారానికి అతి సమీపంలో ముఖ ద్వారం ఉంటుంది. కాలినడకన వెళ్లవచ్చు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి 1.9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ∙ఉప్పలూరి రవితేజ, మేనేజర్–గాంధీ హిల్ -
కొట్టలేకపోయిన వారిని కొట్టించాడు!
∙పార్ట్–2 - కేరళలో ఇటీవల ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక స్కూల్ పూర్వ విద్యార్థులు కొందరు గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ బాలకృష్ణన్, అతడి స్నేహితుడు మాథ్యూ కలిసి బాబుపై (62) దాడి చేశారు. అదేమంటే, 50 ఏళ్ల క్రితం నాలుగో తరగతిలో ఉండగా బాబు తనను కొట్టాడని, బలహీనంగా ఉన్న తాను అప్పుడు కొట్టలేకపోయానని, ఆ కక్ష ఇప్పుడు తీర్చుకున్నానని చెప్పాడు. ఉస్మాన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనీస్ను భరూచ్లో పట్టుకున్న పోలీసులకు ఇదే అనుభవం ఎదురైంది. డిగ్రీ వరకు చదువుకున్న అనీస్ తెలివైనవాడే అయినా, అతడికి శరీర దారుఢ్యం లేదు. దీంతో స్కూలు, కాలేజీ రోజుల్లో కొందరు స్నేహితులు, క్లాస్మేట్స్ చేతిలో దెబ్బలు తిన్నాడు. మిగతా వారిని మర్చిపోయిన అనీస్, తనను విచక్షణారహితంగా కొట్టిన ఇద్దరు క్లాస్మేట్స్ను మాత్రం గుర్తుంచుకున్నాడు. తన ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తితో మంచినీళ్ల విషయమై అనీస్కు గొడవ జరిగింది. దీంతో అతడు దాడి చేసినా, ఇతడు ప్రతిదాడి చేయలేకపోయాడు. ఈ విషయంతో అతడిపైనా కక్ష పెంచుకున్న అనీస్ సరైన సమయం కోసం ఎదురు చూశాడు. అనీస్ను భరూచ్ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చిన టాస్క్ఫోర్స్ పోలీసులు సహ నిందితులు, బాలుడి ఆచూకీ కోసం ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇద్దరు క్లాస్మేట్స్తో పాటు పక్కింటి యజమానిపై కక్ష తీర్చుకోవాలని భావించిన అనీస్– వారి పేర్లు, వివరాలు చెప్పి, వాళ్లతో కలిసే నేరం చేశానని, బాలుడు వారి వద్దే ఉన్నాడని చెప్పాడు.అనీస్ పథకం విషయం తెలియని పోలీసులు బాలుడిని కాపాడాలనే ఉద్దేశంతో వారిని తీసుకువచ్చి ప్రశ్నించడం, వాళ్లు తమకు ఏమీ తెలియదని చెప్పడంతో ‘ఇంటరాగేషన్’ మొదలుపెట్టారు. వీరిలో ఓ ఏఎస్సై కుమారుడు సైతం ఉండటంతో ఆ అధికారి కూడా వచ్చి ‘ఇంటరాగేషన్’లో పాల్గొన్నారు. ఇలా నలుగురిని తీసుకువచ్చి, ‘ఇంటరాగేషన్’ చేసి, వారి పూర్వాపరాలు పరిశీలించాక టాస్క్ఫోర్స్ పోలీసులకు అనుమానం వచ్చింది. అనీస్ తప్పుదోవ పట్టిస్తున్నాడని భావించారు. అప్పటి వరకు అతడిని ‘ఇంటరాగేషన్’ చేయని అధికారులు ఆపై తమ పంథాలో ముందుకు వెళ్లారు. దీంతో అసలు విషయం చెప్పిన అనీస్, ‘వాళ్లు అందరూ ఒకప్పుడు నన్ను కొట్టారు. అప్పుడు నేను తిరిగి కొట్టలేకపోయాను. ఇప్పుడు అవకాశం రావడంతో మీతో కొట్టించాను’ అని చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. ఈ పరిణామంతో పోలీసుల ట్రీట్మెంట్ కూడా మారిపోవడంతో నోరు విప్పిన అనీస్... కిడ్నాప్ చేసిన గంటలోపే అనుకోని పరిస్థితుల్లో ఉస్మాన్ తమ చేతిలో హత్యకు గురయ్యాడని బయటపెట్టాడు. కిడ్నాప్ చేసిన 2009 ఏప్రిల్ 20నే బాలుడిని తీసుకుని నిందితులు మారుతీ వ్యాన్లో శంషాబాద్ వైపు వెళ్తుండగా, మార్గమధ్యంలో పోలీసుల నాకాబందీ నిర్వహిస్తున్నారు. దీంతో తాము వారి కంట పడకూడదని అనీస్ తదితరులు భావించారు. అప్పటికే ఉస్మాన్ గొడవ చేస్తుండటంతో చెకింగ్ పాయింట్ దాటే వరకు నోరు మూసి, వాహనం కిటికీల్లోంచి కనపడనంత కిందకు ఉంచాలని భావించారు. ఆ ప్రయత్నాలో భాగంగా వీళ్లు పొరపాటున ఉస్మాన్ ముక్కు కూడా మూసేయడంతో చనిపోయాడు. చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత బాలుడిని గమనించిన నిందితులు అతడు చనిపోయినట్లు గుర్తించారు. మృతదేహాన్ని షాద్నగర్ సమీపం వరకు తీసుకువెళ్లి, రోడ్డు పక్కన గుంతలో పడేసి, పైన చెత్తకప్పి ఎవరికి వారుగా పారిపోయారు. బాలుడు చనిపోయిన విషయం అతడి కుటుంబానికి తెలియదు కాబట్టి తమ వద్దే ఉన్నాడని చెబుతూ డబ్బు గుంజాలనే ఉద్దేశంతో ఫోన్లు చేశాడు. ఉస్మాన్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు 2009 ఏప్రిల్ 20 తర్వాత రాష్ట్రంలోను, చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ దొరికిన గుర్తుతెలియని శవాల వివరాలను ఆరా తీశారు. వాటిలో 10–15 ఏళ్ల మధ్య వయస్సు వారివి లేకపోవడంతో ఆ దిశలో దర్యాప్తు సాగలేదు. ఉబ్బిపోయిన స్థితిలో ఉన్న ఉస్మాన్ మృతదేహాన్ని 2009 ఏప్రిల్ 23న గుర్తించిన పశువుల కాపరులు షాద్నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదేదో సాధారణ కేసుగా భావించిన ఆ ఠాణా అధికారులు ఓ హెడ్–కానిస్టేబుల్ను ఘటనాస్థలికి పంపారు. అక్కడకు వెళ్లిన ఆ అధికారి మృతదేహం ఉబ్బి ఉండటంతో అది 25–30 ఏళ్ల మధ్య వయస్కుడిగా భావించి అలానే రికార్డుల్లో నమోదు చేయడంతో ఆ విషయం టాస్క్ఫోర్స్ దృష్టికి రాలేదు. ఉస్మాన్కు సంబంధించి తొలుత శాలిబండ పోలీసుస్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అనీస్ నుంచి ఫోన్లు వచ్చిన తర్వాత ఇది కిడ్నాప్గా మారింది. షాద్నగర్లో మృతదేహం దొరికిన వెంటనే అక్కడ పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. ఈ మృతదేహానికి షాద్నగర్ పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా, ఎందరో చంపినట్లు బయటపడంతో గుర్తుతెలియని హత్యగా కేసును మార్చారు. ఇలా రెండు పోలీసుస్టేషన్లలో వేర్వేరుగా నమోదైన ఉస్మాన్ కేసు నాలుగు రకాలుగా మారింది. షాద్నగర్ పోలీసులు ఉస్మాన్ మృతదేహంపై లభించిన చొక్కాను భద్రపరచారు. దీని ఆధారంగానే కుటుంబీకులు అది తమ కుమారుడి మృతదేహమే అని గుర్తించగలిగారు. ఈ కేసు దర్యాప్తు మొత్తం పూర్తి చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు 2009 జూన్ 9న అనీస్తో పాటు అతడి సోదరులు షంషుద్దీన్ అలియాస్ అక్రం, ఖాజీ హఫీజుద్దీన్ అలియాస్ అస్లంలను అరెస్టు చేశారు. ఈ నేరం చేసిన తర్వాత అత్యంత తెలివిగా వ్యవహరించిన అనీస్ బాలుడి కుటుంబంతో కలిసే ఉన్నాడు. ఓ దశలో పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు తనకు అనేక రుగ్మతలు ఉన్నాయని, ఇంటరాగేషన్ చేయకూడదంటూ నకిలీ పత్రాలు చూపించి బయటపడ్డాడు. వెంటనే తన తండ్రి సహాయంతో కిడ్నాప్ డ్రామా ఆడి కామాటిపురాలో కేసు నమోదు చేయించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ∙ -
ఈ వారం కథ: బదిలీ
‘వద్దు నాకు ఇష్టం లేదు.’‘వెరీ స్ట్రేంజ్ అందరూ ప్రమోషన్ కోసం ఆరాటపడతారు. మీరూ?!... ఆశ్చర్యంగా ఉందే!’‘ప్రమోషన్ వరకూ ఓకే! ప్రమోషన్ వచ్చిందంటేనే పక్కన ట్రాన్స్ఫర్ ఉంటుంది. అలా వెళ్ళటం, నాకు?! అయినా ప్రైవేట్ జాబ్లో ఓ బ్రాంచ్ నుండి ఓ బ్రాంచ్కేగా ప్రమోషన్.’ ‘మీరు ఎంచుకున్న చోటుకి వేయించుకోండి. అనుకూలమైన చోటుకి వెళ్ళండి. అంతేగాని, ప్రమోషన్ ఎందుకు వద్దూ!? ఏ ఉద్యోగంలోనైనా ఈ బదిలీలు మామూలేగా! మళ్ళీ మధ్యలో బదిలీ కావాలంటే ఉండదు ఆలోచించుకోండి’శ్రేయోభిలాషులు, ఆఫీసు మేనేజర్ ఎంత నచ్చచెప్పాలని చూసినా వినలేదు సుమబాల.ప్రమోషనూ, ట్రాన్స్ఫర్ ఆగిపోయాయి.తండ్రి లేని పిల్ల, ఏ బాధా కలగకుండా చూసుకోవటమే తల్లిగా తన బాధ్యత.విదూష ఇప్పుడు ఆరో క్లాస్ చదువుతోంది.బాల ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది.తన కంటే ముందే వచ్చి, పక్కింట్లో ఆడుకుంటున్న విదూషను తీసుకువచ్చి,స్నానం చేయించి, హోమ్ వర్క్ చేయించాలి. విదూషను తీసుకురావటానికి వెళ్ళింది. అక్కడ సింధూరతో ఆడుతోంది విదూష. ఎంతగానో చక్కగా కిలకిలలాడుతూ, నవ్వుతూ, గంతులేస్తూ ఆడుతున్న విదూషను, తీసుకుని రాలేక అలాగే సింధూర వాళ్ళమ్మతో తనూ, ఆఫీస్ విషయాలూ, లోకాభిరామాయణం మాట్లాడుతూ కూర్చుంది.‘విదూ! చీకటి పడుతోంది.హోమ్ వర్క్ చేసుకోవాలి పద నాన్నా!’లేచి సింధూరకు ‘బై’ చెప్పి తల్లి వెనుకే వచ్చేసింది. ఇంటికి వచ్చాక, సుమబాల ఇంటిపనిలోనూ, విదూష హోమ్ వర్క్లోనూ బిజీ అయిపోయారు. దాదాపు గంటన్నర తర్వాత ఇద్దరూ భోజనానికి కూర్చుని, విదూషను ‘విదూ! ఏంటి విశేషాలూ!’ అడిగింది.స్కూల్ విశేషాలు చెప్పినవి తక్కువే కాని, సింధూర గురించి చెప్పిన విషయాలే ఎక్కువున్నాయ్. విదూష ఏం చెప్పినా, విని ఆమెను అంచనా వేయటం సుమబాలకు అలవాటు. సింధూరతో తను ఎలా ఆడుకుందీ, సింధూర ఎలా తినేదీ, ఎలా మాట్లాడేదీ! ఎంతో సంతోషంగా ఏకరువు పెడుతోంది. ఆ సంతోషం చూస్తూనే...సుమబాల మనసు గతంలోకి తొంగి చూస్తోంది. సవ్యసాచిదీ, తనదీ పెద్దలు అంగీకరించిన ప్రేమవివాహం. రెండేళ్ళు ఆనందంగా గడిచినాయి. తమ కలల పంట కడుపులో ఉండగానే, సవ్యసాచి తనను వదిలేసి పైలోకాలకు పోయాడు. ఆ దుఃఖంలోంచి బయటికి రావటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. సవ్యసాచికి ఓ పెద్ద ప్రైవేట్ లిమిటెడ్లో జాబ్. అన్ని రాష్ట్రాలలోనూ బ్రాంచ్లు ఉండటం వల్ల, తరచూ కంపెనీలో ఉద్యోగులు మారుతూనే ఉంటారు.సవ్యసాచి పోయాక ఆ ఉద్యోగం తనకు ఇచ్చారు. పాప కోసమైనా కన్నీళ్లు తుడుచుకుని, జాయిన్ అయింది. తల్లిదండ్రులకు వాళ్ళు ఉన్న ఊళ్ళోనే కాలక్షేపం కనుక వారిని తీసుకొని రాలేదు.పైగా తీసుకువస్తే, తన గురించి దిగులుపడుతూ, తనను రెండోపెళ్లి కోసం ఇబ్బంది పెడతారు. అందుకే! వాళ్ళని శెలవులలో కలవడమే!కాని, తోడులేని ఒంటరి ప్రయాణం, సింగిల్ పేరెంట్గా తన అవస్థలు, పాపను పెంచటంలో తను పడే పాట్లు, ఓ గ్రంథాన్ని వ్రాయవచ్చు.ఇంటా బయటా ఎన్నో సమస్యలు తట్టుకుంటూ, మధ్యలో దూరిపోయి భయపెట్టేసే అపరిచితులను దాటుకుంటూ, తప్పించుకుంటూ, బాధపెట్టే ఎన్నో అనుభవాలు.. విదూష నుండి కూడా...పాప విదూష యూకేజీలో ఉండగా, ఓ స్కూల్లో జాయిన్ చేసింది. అక్కడ విశాలాక్షి అనే పాపతో స్నేహం కుదిరింది విదూషకు. ఎంతో చనువుగా, చక్కగా ఉండేవారు. విశాలాక్షి ఇల్లూ తమ ఇంటికి రెండు ఇళ్ళ అవతలే కాబట్టి, ఎప్పుడూ విశాలాక్షితోనే ఉండేది విదూష. వాళ్ళ నాన్న ఉంటే విదూషను బండి మీద ఎక్కించుకుని తిప్పేవారు. తను ఎక్కడ తిప్పగలదు. ఆఫీసు, ఇంటిపనీ! అప్పటికే అలసట.పాపం ఏదో కాలక్షేపం చేస్తోందిలే అనుకుంది. విశాలాక్షి తింటేనే తినేది. తను పడుకుంటేనే పడుకునేది. స్కూల్ లేని సమయంలో తప్ప దాదాపు వాళ్ళింట్లోనే ఉండేది.రెండేళ్ళలో విడదీయరాని బంధం. విశాలాక్షి తండ్రికి గవర్నమెంట్ జాబ్. ట్రాన్స్ఫర్ అయింది.విశాలాక్షితో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు.ఆరోజు విదూష ఏడ్చిన ఏడుపు, తను ఇప్పటికీ మరచిపోలేదు.‘అమ్మా! విశా కావాలమ్మా!’ అంటూ కిందపడి ఏడుస్తూ ఉంటే, ఏం చేయాలి? అనుబంధాలు పెంచుకోకూడదని చెప్పటానికీ, ఆమె వినటానికి, ఎంత వయసనీ? రెండురోజులు ఆఫీసుకు సెలవు పెట్టి, అమ్మమ్మ దగ్గరకూ, షాపింగ్లకూ తిప్పాక, వారంరోజులకు కాస్త తెప్పరిల్లింది. స్కూల్కి వెడుతోంది.రెండో తరగతిలో శశికళతో విదూషకు చక్కని స్నేహం కుదిరింది. ఒకరితో ఒకరు కలిసి హోమ్ వర్క్ చేసుకోవటం; కలిసి ఐస్ క్రీమ్లకు డబ్బులు తీసుకుపోవటం; ఇద్దరూ కలిసి ఏవో గుసగుసలు, నవ్వులూ, మరే! మరే! అంటూ ఎన్నో ముచ్చట్లు, కేరింతలూ, ఆటవస్తువులూ, బిల్డింగ్ కట్టే క్లిప్స్, బొమ్మను తయారు చేయండి అనే చార్టులూ, ఆటా, పాటా, డాన్సూ, రెండేళ్లలో శశికళ నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది.ఇక విదూష ఏడ్చిన ఏడుపు సుమబాల మనసును పిండేసింది. గుండెను కుదిపేసింది. ఏం చెప్పి, ఎలా చెప్పి ఓదార్చాలీ? తనకైనా బుద్ధి ఉండక్కర్లా?ఒకసారి జరిగాక జాగ్రత్త పడాలిగా!ఇంత స్వచ్ఛమైన మనసు ఇన్నిసార్లు గాయపడితే? ఈ పిల్ల ఏమైపోతుంది? ఏం చేయాలి? ఎలా జాగ్రత్త పడాలి? అసలు స్నేహాలు చేయకుండా ఎలా ఉంటాం. ప్రతిసారి ఇలా భంగపడి ఏడిస్తే ఎలా?పిల్లలంతా ఇలాగే ఉంటారా? సున్నిత మనస్కులైన ఇలాంటి పిల్లలకు ప్రత్యేక శిక్షణ, చికిత్స అవసరమా? మరి అవన్నీ ఎవరు ఇస్తారు? ఎక్కడికి వెళ్ళి ఎవరినడగాలి? సుమబాలకు ఆలోచనలతో మనసు కలచివేస్తోంది. విదూషను కాపాడుకోటం ఎలా? ఎవరైనా వ్యసనాల బారిన పడకుండా తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలి? అని ఆలోచిస్తారు. తనూ!? స్నేహం చేయకుండా ఎలా కాపాడుకోవాలి? అని ఆలోచిస్తోంది.స్కూల్లో విదూష ఎవరితోనూ స్నేహం చేయకుండా, సరైన జాగ్రత్త కోసం తనే దగ్గరుండి దింపటం, స్కూల్ వదలిన వెంటనే ఎవరితోనూ మాట్లాడకుండా తీసుకొచ్చేయటం అలవాటు చేసుకుంది.నాలుగు రోజుల నుండి విదూష దిగులుగా ఉండటం గమనించింది. గుండె గుభేలుమంది.‘విదూ! ఏమయిందిరా? అలా ఉన్నావ్?’‘అమ్మా! ట్రాన్స్ఫర్ అంటే ఏంటమ్మా?’‘ట్రాన్స్ఫర్ అంటే బదిలీ! ఉద్యోగంలో ఉన్నవారిని ఓ ఊరు నుండి మరో ఊరికి, ఉద్యోగ సేవలు ఆ ఊరిలో వారికి అందించాలని పంపిస్తారు. అలాగే, చాలా బదిలీలు... డబ్బు బదిలీ, అంటే మనీ ట్రాన్స్ఫర్... అలాగే పేపర్స్... ఇంకా...’మాట పూర్తికాక ముందే ‘అసలు ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు ఉండకూడదమ్మా! నేను పెద్దయ్యాక పెద్ద ఆఫీసర్నై, ఈ బదిలీలు లేకుండా చేస్తానమ్మా!’ అంటూ ఏడ్చింది.సమబాలకూ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.‘ట్రాన్స్ఫర్ అంటే! ఇష్టమైన వాళ్ళని వదిలేసి వెళ్ళటం అని, అంతే నాకు తెలిసిందమ్మా! అసలీ బదిలీలు ఉండకూడదమ్మా! మా స్కూల్లో శాంతారాంగాడు నాలాగానే ఫస్ట్ ర్యాంకర్. ఇద్దరం కలిసి పోటీపడి చదువుతున్నాం ఫస్ట్ యూనిట్లో తను ఫస్ట్, సెకండ్ యూనిట్లో నేను.తర్వాత నేను, ఇలా చక్కగా పక్కపక్కనే కూర్చుని, కంబై¯Œ ్డ స్టడీ చేసేవాళ్ళం. కాని, వాళ్ళమ్మకి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయింది. అమ్మ ఉన్నచోటే శాంతారాం ఉండాలిగా! వెళ్ళిపోతున్నాడు. నేను ఎవరితోనూ స్నేహం చేయకూడదమ్మా!చేస్తే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారమ్మా! ఇక అంతే, ఎవరూ వద్దు నాకు’ అంటూ గదిలోకి వెళ్ళి పడుకుంది అన్నం తినకుండా...భగవంతుడా! ఇప్పుడేమి చేయటం? ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయి, తెల్లవారి స్కూల్కి వెళ్ళలేకపోతే, తనూ సెలవు పెట్టాల్సి వచ్చింది. మనసులో ఇంత సున్నితత్వం ఉండటం మంచిదే కాని, మన ఉనికే ప్రశ్నార్థకం అయ్యేలా కాదేమో!మరోసారి ఇలా జరిగితే? ఈ సంఘటనల పర్యవసానం భవిష్యత్తులో విదూష ఆలోచనలలో జరిగే మార్పుల ఫలితం ఎలా ఉంటుంది? మంచా? చెడా?సింధూరతో విదూష స్నేహమూ బలపడుతోంది.కేవలం సింధూరతో విదూష స్నేహం కోసమే ప్రమోషన్ వద్దనుకుంది. ట్రాన్స్ఫర్ వల్ల విదూషకు కొత్త వాతావరణంలో సంతోషంగానే ఉంటుందా? సింధూర, మరో విదూషలాగా ఏడ్చి మారాం చేస్తే, ఆ తల్లికి ఎంతకష్టం! ఆ చిన్న మనసుకు ఎంత గాయం! తన పిల్ల విషయంలో జరిగింది, సింధూర విషయంలో జరగకూడదు. సింధూర విదూషను చాలా ఇష్టపడుతోంది. అందుకే ప్రమోషన్, ట్రాన్స్ఫర్ వదులుకుంది. కాని, ఇద్దరినీ సున్నితంగా నొప్పి తెలీకుండా వేరు చేయాలి. ఏదో చేయాలి. ఏం చేయాలి ఆలోచిస్తోంది సుమబాల.‘విదూ! ఈరోజు సెలవు పెట్టాం కదా! మనం ఓ చోటికి వెడదామా?’‘కరుణామయీ! వికలాంగుల సంక్షేమ ఆశ్రమం’ దగ్గర బండి ఆపి, లోపలికి తీసుకువెళ్ళింది విదూషను.అక్కడ అన్ని రూములలోనూ పిల్లలు. అందరూ వికలాంగులే! మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు.భయం భయంగా చూసింది విదూష.అందరికీ తను తెచ్చిన, స్వీట్స్ పళ్ళూ ఇప్పించింది సుమబాల. అక్కడ కన్వీనర్తో మాట్లాడుతూ కూర్చుని, విదూషను పరిశీలిస్తోంది. విదూష ఏదో కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు, చూస్తూ మనసులో దేన్నో నింపుకోటానికి ప్రయత్నిస్తోంది. వాళ్ళ దగ్గరకు వెళ్ళటానికి భయపడుతోంది.వాళ్ళల్లో కొంతమంది బయటి ప్రపంచంతో సంబంధం లేనట్లుగా, వీళ్ళు ఇచ్చిన, పళ్ళు తింటూ, కూర్చున్న చోటునే, విరిగిపోయిన బొమ్మలను ఏదో తోచినట్లు ఆడిస్తూ, ఆడుకుంటున్నారు.కానీ! కొంతమంది శారీరక వైకల్యం కలిగిన పిల్లలు మాత్రం విదూషతో మాట్లాడటానికి చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వాళ్ళతో బిడియంగా, కొత్తగా ఫీలవుతూ చేయి కలిపింది విదూష.సాయంత్రం వరకూ అక్కడే ఉండి, విదూషను ఇంటికి తీసుకువచ్చింది.‘విదూ! వీరికి వేరే ప్రపంచం తెలీదు.కొంతమందికి స్నేహం చేయటమూ తెలీదు. పసితనం ఓ శాపంలా బతుకుతారు. కేవలం ఎవరు అన్నం పెడతారా? బిస్కట్ ఇస్తారా! తిందామా! ఎంత దైన్యం, కదా!’‘అమ్మానాన్నలు ఉండరా అమ్మా!’‘అమ్మ గాని, నాన్న గాని ఉంటే వాళ్ళు ఇక్కడుంటారా? చెప్పు! వాళ్ళని చూశాక నువ్వు ఎంత అదృష్టవంతురాలివీ అనుకోవాలి. అయినదానికీ కానిదానికీ ఏడ్చి అమ్మను బాధ పెట్టకూడదు. స్నేహం చేయదలచుకుంటే రోజూ అక్కడికి వెడదాం. నీ స్నేహం వాళ్ళకి పంచు. ఆనందపడతారు. అంతేగాని, ఫ్రెండ్స్ వెళ్ళిపోయినప్పుడల్లా ఏడుస్తావెందుకు?దీని ద్వారా ప్రకృతి నీకేం చెప్పదలచుకుందో అది విను. అందరితోనూ స్నేహం చేయమని, కేవలం ఏం ఒక్కరితోనో కాదని సందేశం ఇస్తోందేమో! ఏడుపు మానేస్తే అది వినబడుతుంది. మామూలు మాటలతో చెబితే ఏమీ అర్థం కాదని ఇక్కడికి తీసుకువచ్చా!’‘మరి వీళ్ళంతా నాతో స్నేహం చేసి, ఎప్పటికీ ఉంటారా?’విదూష మనసులో ఎన్నో ఆలోచనలు.‘తెలుసుకో! పదిసార్లు ఇక్కడికి వచ్చావనుకో వాళ్ళే నీ ప్రియ నేస్తాలవుతారు. ఇంకొంచెం పెద్దయ్యాక వాళ్ళ కోసం నువ్వేమైనా చేయగలనేమో అనే ఆలోచన నీకే వస్తుంది.’విదూష ఆలోచనలలో శాంతారాం వెనుక పడ్డాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది సుమబాల.‘కానీ రోజూ అక్కడికి వెళ్ళటం కుదరదుగా!’అంది. సాయంత్రం రిలాక్స్ అవుతున్న సమయంలో సింధూర వాళ్ళ అమ్మగారు రావటం సుమబాలకు ఆశ్చర్యం కలిగించింది.‘ఏమిటీ! విశేషాలు?’‘మీ విదూష, మా సింధూర కలిసి మా యింట్లో ఆడుకుంటున్నారు.మీతో ఓ విషయం మాట్లాడాలని వాళ్ళకి తెలీకుండా వచ్చాను’ అంది.సుమబాల గుండె మళ్ళీ గుభేలుమంది.‘మాది హోటల్ వ్యాపారమని మీకు తెలిసిన విషయమే కదా!’‘అవును... తెలుసండీ’‘ఇక్కడ బిజినెస్ సరిగా సాగట్లేదు. అందుకని హైదరాబాద్ వెళ్లి అక్కడ బిజినెస్ చేద్దామని మావారు అంటున్నారు.అయితే. ఫ్రెండ్స్ దూరమైనప్పుడల్లా విదూష, ఆమెతో పాటు మీరు తల్లడిల్లిపోవటం విన్నాను. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అయితే విదూష గురించి బాధగా ఉంది. సింధూర కొత్త ప్లేస్ కాబట్టి ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటున్నాను. మరీ!...’సుమబాల దేనికైతే భయపడి ఆరునెలల క్రితం ట్రాన్స్ఫర్ వద్దనుకుందో, అదే తన కళ్ళముందు ప్రత్యక్షమవటం భయం కలిగించింది. కాని, మెల్లగా– ‘మీరు ఉద్యోగస్తులు కాదు! కాబట్టి, ఈ సమస్యే రాదు. నావల్ల వస్తే, సింధూర బాధపడుతుందనుకుని, ఆ బాధ మీరు పడకూడదు అనే అనుకున్నాను ఇన్నాళ్ళూ!’‘తెలుసు! మీకు చెప్పకుండా మేం వెళ్ళిపోవచ్చు. కాని, మీరు ప్రమోషన్ కూడా వదులుకున్నారు మన పిల్లల కోసం... అందుకే చెప్పటానికి వచ్చాను. ఈవిషయం సింధూరకు చెప్పలేదు చెబితే విదూషకు ఎక్కడ తెలుస్తుందో అనీ!...’‘నిజమే ఇది తెలిస్తే?’... విదూషను తలచుకుంటే ఒళ్ళు జలదరించింది.ఇప్పుడు ఆర్థిక సంవత్సరం మధ్యలో, ట్రాన్స్ఫర్ కావాలన్నా ఇవ్వరు. ఎలా?పిల్లలను పసితనంలో ఏ ప్రభావమూ పడకుండా పెంచటం ఇంత కష్టమా? అందరి పిల్లలూ విదూషలా లేరు.ఇలా ఉన్న పిల్లలను కాపాడే తీరాలి. అప్పుడే సమాజం పట్ల సున్నితమైన అవగాహనతో మెలుగుతారు. లేదంటే ఒక కసితో... ఇక ఆలోచించలేక‘నేను చూసుకుంటాలెండి’ అని మాత్రం అనగలిగింది. ఆమె వెళ్ళిపోయింది.∙∙ ‘విదూ! నాకు బదిలీ అయింది. నీ పుట్టినరోజు సందర్భంగా నీకో సర్ర్పైజ్ గిఫ్ట్.’ ‘ఎక్కడమ్మా! ఏంటమ్మా అదీ! ప్లీజ్ చెప్పవా?’ విదూష సంతోషం చూసి, తేలికగా ఊపిరి పీల్చుకుంది.‘చూపిస్తా పద!’ఇద్దరూ కలిసి వెళ్ళారు.‘ఇదిగో! కొత్త ఇల్లు. మన కోసమే!’‘ఇక్కడ ... మన కోసం’‘వావ్! కరుణామయి వికలాంగుల సంక్షేమ ఆశ్రమం.. మొన్న ఈ ఆశ్రమానికి వచ్చాముగా! మరి ట్రాన్స్ఫర్ అన్నావ్?’‘అవును! బదిలీ! అక్కడి నుండి ఇక్కడికి ఇంటి బదిలీ! ఆలోచనల బదిలీ.ఆశయాల బదిలీ. పరిస్థితుల బదిలీ.’‘అంటే? ఏంటమ్మా? సింధూరనూ తెద్దామా?‘అలాగే! ఏ పిల్లలలోనూ లేని ఓ ప్రత్యేకత నీలో ఉంది. అది తోటివారికి ప్రేమను పంచటం. ప్రేమ పంచిన వారి పట్ల తపన పడటం. అందుకే నువ్వు ఉండాల్సిన చోటు ఇదే. నీ ప్రేమ, తపన, వీరితో స్నేహం చేసి వీరికి పంచు. ఏదో ఓరోజు నువ్వూ మదర్ థెరిస్సా అంతటి దానివవుతావో, లేదంటే... మార్గం మారుతుందో కాలం చెబుతుంది. అందుకే ఆశ్రమానికి పక్కనే ఇల్లు తీసుకున్నాను. మరి ఇది బదిలీనేగా!’ ‘అమ్మా! అదిగో! నాకిష్టమయిన బ్లూమింగ్ మైండ్స్ స్కూల్’‘అవును అందులో చేరు. నీ సాయంత్రాలూ, ఖాళీ సమయాలూ, ఆశ్రమంలో.. ఓకేనా?’‘మరి సింధూర?’‘ముందు నీకు నచ్చితే... సింధూరను తీసుకువద్దాం. సరేనా?’విదూష తలూపటం చూసి, తేలికైన మనసుతో... ఆశ్రమం వంక చూస్తూ నిట్టూర్చింది సుమబాల.కాని, రోజూ అక్కడి పిల్లలతో కలిసిపోయి ఆడుతూ పాడుతూ ఉన్న విదూషతో పాటు తనూ పాలు పంచుకుంటూ, తనలో తనను చూసుకుంటే విదూషకు కాదు, తనకే ఒంటరితనపు దుఃఖం నుండి కొత్త జీవితానికి బదిలీనేమో! -
ఆనందో బ్రహ్మ
వరుణ మహర్షి కొడుకు భృగు మహర్షి. తండ్రి వద్ద భృగువు సకల శాస్త్రాలూ నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత భృగువుకు బ్రహ్మజ్ఞానం సాధించాలనే కోరిక కలిగింది. ఒకనాడు తండ్రి వద్దకు వెళ్లి తనకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని అడిగాడు.‘కుమారా! అన్న ప్రాణ నేత్ర శ్రోత్ర మనో వాక్కులన్నీ పరబ్రహ్మ సాధనకు మార్గాలే! వీటన్నింటిలోనూ బ్రహ్మతత్త్వం ఇమిడి ఉంది. అది దేని నుంచి ఉత్పన్నమైనదో, దేనితో పోషణ పొందుతున్నదో, చివరకు దేనిలో లయమవుతున్నదో, దానికి మూలమేమిటో తెలుసుకోవాలి. దానిని తపస్సు ద్వారా మాత్రమే సాధించాలి. అందువల్ల వెళ్లి తపస్సు చెయ్యి’ అన్నాడు.తండ్రి ఆదేశంతో భృగు మహర్షి దీక్ష తీసుకుని, ఒక నిర్జనారణ్యానికి చేరుకుని, అక్కడ నియమ నిష్ఠలతో తపస్సు ప్రారంభించాడు. కొంతకాలం గడిచాక ‘అన్నమే పరబ్రహ్మ స్వరూపం’ అని అతడికి స్ఫురించింది. అన్నం ద్వారానే అన్ని ప్రాణులూ ఉత్పన్నమవుతున్నాయి. అన్నం వల్లనే పోషణ పొందుతున్నాయి. అన్నం భూమి నుంచి పుడుతోంది. మరణించిన తర్వాత అన్ని ప్రాణులూ ఈ భూమిలోనే కలసిపోతున్నాయి. కాబట్టి ‘అన్నమే పరబ్రహ్మ స్వరూపం’ అని నిర్ధారణకు వచ్చాడు. వెంటనే తండ్రి వద్దకు వెళ్లి ఇదే విషయాన్ని తెలియజేశాడు. భృగువు మాటలు విన్న వరుణ మహర్షి, ‘కుమారా! నువ్వు ఇంకా మొదటి మెట్టు మీదనే ఉన్నావు. ఇంకా సాధన చేయాలి’ అన్నాడు.భృగు మహర్షి మళ్లీ అడవులకు వెళ్లి, తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంకొంత కాలం గడిచింది. ‘ప్రాణమే బ్రహ్మ’ అని ఆయన గ్రహించాడు. లోకంలోని సమస్త జీవులు ప్రాణం వల్లనే జీవిస్తున్నాయి. ప్రాణం ఉన్నప్పుడే మనుగడ సాగిస్తున్నాయి. ప్రాణం పోయినప్పుడు మృత్యువులో లయమైపోతున్నాయి అందుకే ప్రాణమే సర్వసృష్టికి మూలాధారమని భావించి, ఇదే సంగతిని తండ్రికి చెప్పాడు.కొడుకు మాటలకు వరుణుడు నవ్వి, ‘కుమారా! ఇదివరకటి కంటే కాస్త ముందుకు వెళ్లావు. ప్రాణం వల్లనే జీవులు మనుగడ సాగిస్తున్నా, ప్రాణమే బ్రహ్మ కాదు. బ్రహ్మజ్ఞానం నీకు పూర్తిగా అవగతం కావాలంటే, మరింత సాధన అవసరం. ఇంకా తపస్సు కొనసాగించు’ అన్నాడు.తండ్రి మాటలకు భృగుమహర్షి నిరాశ చెందకుండా, యథప్రకారం మళ్లీ అడవులకు వెళ్లి, మరింత కఠిన నియమ నిష్ఠలతో తపస్సు ప్రారంభించాడు. కొంత కాలం గడిచింది. సృష్టికి మూలం మనస్సు అని తలచాడు భృగువు.మనస్సు వల్లనే స్త్రీ పురుషులు పరస్పరం ఆకర్షితులవుతున్నారు. మనస్సు వల్లనే లోకంలోని సమస్త ప్రాణులు ఉద్భవిస్తున్నాయి. జన్మించిన తర్వాత కూడా మనోధర్మం ప్రకారం ఇంద్రియాల ద్వారానే జీవనం సాగుతోంది. మరణం తర్వాత ఇంద్రియాలకు జ్ఞానం ప్రసాదించే శక్తి పోతుంది. అవన్నీ మనస్సులోనే లీనమైపోతాయి. అందువల్ల మనస్సే బ్రహ్మ అనుకున్నాడు.తండ్రి వద్దకు వెళ్లి, తపస్సులో తాను గ్రహించినది చెప్పాడు. ‘తండ్రీ! మనస్సే బ్రహ్మ’ అని నాకు తపస్సులో స్ఫురించింది.అందువల్ల మనస్సే బ్రహ్మ అనుకుంటున్నాను’ అన్నాడు.‘కాదు. నీకు బ్రహ్మతత్త్వం పూర్తిగా అవగతం కాలేదు. మళ్లీ తపస్సు కొనసాగించు’ అన్నాడు వరుణుడు.భృగువు మళ్లీ మొక్కవోని దీక్షతో తపస్సు కొనసాగించాడు. తపస్సులో కొన్నేళ్లు గడిచిపోయాయి. ‘ఆనందమే పరబ్రహ్మ స్వరూపం’ అని స్ఫురించింది. సర్వమూ ఆనందం నుంచే జనిస్తుంది, ఆనందంలోనే లయమవుతుంది. ఆనందానికి అతీతమైనది మరేదీ లేదు.అందువల్ల ‘ఆనందో బ్రహ్మ’ అనుకున్నాడు. తండ్రి వద్దకు వెళ్లి ఇదే సంగతిని తెలియజేశాడు.భృగువు ‘ఆనందో బ్రహ్మ’ అని పలకడంతోనే వరుణ మహర్షి పరమానందభరితుడయ్యాడు.‘కుమారా! లెస్సగా గ్రహించావు. ఉత్తమోత్తమ పరమాత్మ తత్త్వం ఆనందం. అన్నం, ప్రాణం, మనస్సు, విజ్ఞానం కూడా పరబ్రహ్మ స్వరూపాలే! కాని, ఇవి ఒకదాని కన్నా మరొకటి సూక్ష్మమైనవి. వీటన్నింటినీ మించినది ఆనందం. ఈ ఆనందం క్షణికమైనది కాదు, శాశ్వతమైనది. పరబ్రహ్మోపాసన క్రమంగా జరగాలి. అంటే, ఒక్కొక్క మెట్టు పైకి వెళ్లాలి. అన్నాన్ని ఎన్నడూ నిందించరాదు. ప్రాణం, మనస్సు అన్నంపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే, మానవులు తినడం కోసం జీవించరాదు, జీవించడానికి తినాలి. అన్నాన్ని నియమ ప్రకారమే స్వీకరించాలి. అన్నాన్ని పూజిస్తే, తర్వాతివన్నీ లభిస్తాయి. అందువల్ల ఆహారాన్ని వదలకుండా, ప్రాణాన్ని నిలుపుకుంటూ, మనస్సును వికసింపజేసుకుని, విజ్ఞానానుభవం ద్వారా బ్రహ్మానందం పొందాలి’ అంటూ కొడుకుకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు వరుణుడు.తండ్రి ఆదేశం ప్రకారం విడువకుండా మళ్లీ మళ్లీ కొనసాగించిన తన తపస్సు ఫలవంతమైనందుకు భృగుమహర్షి పరమానందం చెందాడు.∙సాంఖ్యాయన -
ప్రపంచ దేశాల ప్రోగ్రెస్ కార్డు
ఒక చిన్న పాఠశాల గది నుంచే ఒక దేశం మారవచ్చు ఒక నోట్బుక్ పేజీ నుంచే ఒక తరం చరిత్రను తిరగరాయవచ్చు అందుకే, ప్రపంచం మొత్తం విద్యావిధానమే అభివృద్ధికి ఆలంబన కాగలదని విశ్వసిస్తోంది.ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఒక అద్భుతమైన రేసులో ఉన్నాయి. అయితే, ఇది రన్నింగ్ రేసు కాదు, రీడింగ్ రేసు! ఈ రేసులో పరుగులు తీసేది విద్యార్థులే అయినా, ఫలితాలు మాత్రం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. ఇక్కడ కుల, మత, వర్ణ భేదాలకు చోటు లేదు – ఒక్కటే అవసరం: విద్యపై నిబద్ధత! దేశాలన్నీ పాఠశాల వేదికపై ఎగబడి, చదువు అనే శక్తిమంతమైన ఆయుధంతో భవిష్యత్తులో తమ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇందుకోసం, ఆ పక్కన క్యాలిక్యులేటర్ పెట్టుకుని, స్మార్ట్ బోర్డు ముందు నిలబడి, ల్యాబ్ కోట్స్ వేసుకుని ప్రభుత్వాలు తమ విద్యా వ్యవస్థలపై ఉన్న విజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాయి.కాని, ఈ రేసులో ఎవరు ముందున్నారో, ఎవరు ఇంకా నిద్రలోనే జోగుతున్నారో తెలుసుకోవడానికి ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ సంస్థ 2025 సంవత్సరానికి విద్యా నాణ్యత ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ జాబితాలో కొన్ని దేశాలు దుమ్మురేపేలా టాప్ గేర్లో దూసుకెళ్తుంటే, మరికొన్ని మాత్రం ఖాళీ బ్యాగు వేసుకుని, ఫస్ట్ పీరియడ్ మిస్ చేసుకున్నట్లుగా దిగాలుగా ఉంటున్నాయి. ఇంకా, ఇందులో ఏ దేశానికి పరీక్షల్లో ఎన్ని మార్కులొచ్చాయి? ఎవరు టాప్ స్కోర్ కొట్టారు? ఎవరు ‘పాస్’ అయ్యారు? మరెవరు ఇంకా ప్రోగ్రెస్ కార్డులో రెడ్ లై¯Œ దాటి నిలబడినవాళ్లు? వంటి విషయాలన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచ విద్యా పోటీకి ఒక స్పష్టమైన ఫలితాల బోర్డు ఇది!ప్రపంచ దేశాల విద్యా ప్రమాణాలను విశ్లేషించేటప్పుడు మూడు ప్రధాన అంశాలను ఆధారంగా తీసుకున్నారు. అవేంటంటే: 1. ప్రభుత్వ విద్యా వ్యవస్థ స్థిరత్వం, ప్రభావం2. విశ్వవిద్యాలయాల గ్లోబల్ ఆకర్షణ 3. విద్యలో ప్రపంచ స్థాయి నాణ్యతఈ మూడు విభాగాల్లో మెరుగైన ఫలితాలను సాధించిన దేశాలు ప్రపంచ విద్యా నాణ్యత ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశాల్లో ముందంజలో ఉన్నాయి. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు మార్పు దిశగా నెమ్మదిగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ఇంకా కొన్ని దేశాల్లో ప్రాథమిక విద్య కూడా అందని పరిస్థితి ఉంది. ఉదాహరణకు చాద్, దక్షిణ సూడాన్ వంటి దేశాల్లో అక్షరాస్యత రేటు అత్యల్పంగా ఉండటంతో, అవి అభివృద్ధికి ఇంకా చాలా దూరంగా ఉన్నాయి. 2025 సంవత్సరానికి ప్రపంచ విద్యా నాణ్యత ర్యాంకింగ్స్ జాబితాను ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ విడుదల చేసింది. అందులో టాప్ 10 దేశాలు విద్యారంగంలో ముందు వరుసలో నిలిచాయి – అవేంటో చూద్దాం!దక్షిణ కొరియామేధాశక్తిదక్షిణ కొరియా అంటే కేవలం కే– పాప్, టెక్నాలజీ మాత్రమే కాదు, దాని అసలైన శక్తి అక్కడి విద్యా వ్యవస్థలో ఉంది. చిన్న దేశం అయినా, గణితశాస్త్రం, సాంకేతిక విద్యా ప్రమాణాల్లో ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తోంది. ఒక అధ్యయనంలో 15 ఏళ్ల విద్యార్థులలో చైనా తర్వాత అత్యధిక ఐక్యూ స్కోర్లు సాధించిన దేశం ఇదే! ఇది క్రమశిక్షణ, కుటుంబాల సహకారం, ప్రభుత్వ ప్రాధాన్యాల వలనే సాధ్యమైంది. ఇక్కడ చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాదు, టెక్నాలజీతో మిళితమై, పిల్లల భవిష్యత్తుకు మార్గం వేస్తోంది.డెన్మార్క్ఒత్తిడిలేని బోధనవైకింగ్ల చరిత్రతో ప్రసిద్ధి చెందిన డెన్మార్క్ నేడు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థలలో రెండో దేశంగా నిలుస్తోంది. జనాభా అరవై లక్షలే అయినా, చదువులో దీని స్థానం గొప్పది. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన పెంపొందించడం, ఒత్తిడిలేని బోధన ఈ దేశం ప్రత్యేకతలు. ఇక్కడ చదువు అనేది పరీక్షల కోసమే కాదు, జీవిత పాఠాలను నేర్చుకునే మార్గం. ప్రభుత్వం విద్యపై సమగ్రంగా ఖర్చు చేస్తూ, సమానావకాశాలు కల్పిస్తుంది. పాఠశాలలోనే పిల్లలు చర్చా వేదికల్లో పాల్గొంటూ సమాజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ విధానాల వలనే డెన్మార్క్ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండే దేశాల జాబితాలోనూ చేరింది.నెదర్లండ్స్స్వేచ్ఛగా ఆలోచించే విద్యార్థులే నెదర్లాండ్స్ లోని విద్యా విధానం కేవలం విద్యార్థుల ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించేలా రూపొందించారు. తక్కువ ఒత్తిడి, ఎక్కువ చర్చలతో పిల్లలు చదవటం ఈ దేశ ప్రత్యేకత. ఇక్కడ చదువు కేవలం పాఠశాలలోనే కాదు, సమాజంలో కూడా నేర్చుకోవాల్సిన ప్రక్రియగా ఉంటుంది. విద్యార్థుల స్వతంత్ర ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తుంది. ప్రభుత్వ పెట్టుబడులతో నాణ్యమైన బోధన అందించడం, టెక్నాలజీని తరగతి గదికి తీసుకురావడం ఈ దేశాన్ని ముందు వరుసలో నిలిపాయి. జనాభాలో మెజారిటీ డచ్ వారే అయినా, వలసదారులకు కూడా సమానమైన విద్యా అవకాశాలు లభిస్తున్నాయి. ఇది విద్యలో సమానత్వానికి నిజమైన ఉదాహరణ.బెల్జియంఅందరికీ విద్యభిన్నత్వంలో ఏకత్వం సాధించాలంటే, చదువే అసలైన మార్గం అని బెల్జియం చెబుతుంది. అత్యుత్తమ విద్యా విధానాల్లో విశేషంగా ఎదుగుతూ, అగ్రస్థానాల్లో నిలుస్తోంది ఈ దేశం. రాజధాని బ్రసెల్స్ యూరోపియన్ యూనియ¯Œ కు కేంద్రంగా ఉండటం, దీని విద్యా ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. ఇక్కడి విద్యా వ్యవస్థ బహుభాషా విధానం, సమానత్వం ఆధారంగా ఉంటుంది. డచ్, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో విద్య అందుతుండటంతో పిల్లలలో బహుభాషా సామర్థ్యం పెరుగుతుంది. అలాగే, ఫ్లెమిష్, వాలున్, జర్మన్ వలసదారులు అందరూ చదువులో భాగస్వాములవడం ఇక్కడ సాధారణం. ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.స్లోవేనియావలసదారులకూ సమాన విద్యకేవలం 20 లక్షల జనాభా ఉన్నా ఈ చిన్న దేశం వంద శాతం అక్షరాస్యతతో ఐదవ స్థానంలో ఉంది. నాణ్యమైన బోధన, ప్రభుత్వం మద్దతు, వలస వచ్చిన జనాభాకు కూడా సమానంగా విద్యను అందించడంతో ఇది సాధ్యమైంది. చదువు సమాజాన్ని ఏకీకృతం చేసే మార్గంగా ఎలా పనిచేస్తుందో చెప్పే ఒక ఉదాహరణగా ఈ దేశం నిలిచింది. జపాన్క్రమశిక్షణ శక్తి పురాతన దేవాలయాలు, మౌంట్ ఫుజీ వంటి ప్రకృతి అందాలతో పాటు, జపా¯Œ విద్యా రంగంలోనూ విశేషమైన గుర్తింపు పొందింది. ఇక్కడ విద్యా వ్యవస్థ క్రమశిక్షణ, కఠిన శ్రమ, నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. చిన్న వయస్సులోనే పిల్లలు గణితం, శాస్త్రం, సాంకేతికతలో చురుకుగా మారతారు. ప్రభుత్వ పెట్టుబడులు, బలమైన బోధన పద్ధతులు ఈ విజయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు. జపా¯Œ లో 98 శాతం జనాభా జాపనీస్ ప్రజలే. జాతి పరంగా ఏకత్వం ఉన్నా, విద్యకు విస్తృత దృక్కోణంలో ఉంది.జర్మనీఉచితంగా ఉన్నత విద్యకోటలు, ఆధునిక నగరాలతో ప్రసిద్ధి గాంచిన జర్మనీ, విద్యా రంగంలోను అగ్రగామిగా నిలుస్తోంది. టెక్నాలజీ, ఇంజినీరింగ్, పరిశోధన రంగాల్లో ఇది ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది. ఇక్కడ విద్యా వ్యవస్థ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఉచిత ఉన్నత విద్యతోపాటు ప్రభుత్వ మద్దతుతో విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది. విద్యార్థుల ప్రాక్టికల్ స్కిల్స్కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మతాలు, భాషలు భిన్నమైనా, చదువు విషయంలో సమానత్వం కొనసాగుతుంది.ఫిన్లండ్చదువు చల్లగా, బతుకు హాయిగా స్వచ్ఛమైన సరస్సులు గుర్తొచ్చే దేశం ఫిన్లండ్. ఇక్కడ విద్య అనేది పోటీకి సిద్ధం చేసే మార్గం కాదు, బలమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధనం. ఒత్తిడిలేని తరగతులు, ప్రాజెక్టు ఆధారిత బోధన, విద్యార్థులే కేంద్రంగా రూపొందించిన పద్ధతులు ఫిన్లండ్ విద్యకు ప్రత్యేకత తీసుకొచ్చాయి. పరీక్షలు తక్కువ, ఆలోచన ఎక్కువ ఇక్కడి విద్యార్థుల విజయ రహస్యం. ఈ దేశం ప్రపంచ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్లో తొలిస్థానంలో ఉండటానికి కారణం కూడా ఇదే!నార్వే ఆలోచనా శక్తి పెంచే బోధననార్దన్ లైట్స్ వంటి ప్రకృతి అద్భుతాలకు నిలయమైన నార్వే, విద్యా ప్రమాణాల్లో ముందంజలోనే ఉంది. ఇక్కడ విద్యా వ్యవస్థ స్వేచ్ఛ, సమానత్వం, నాణ్యతతో కూడినది. విద్యార్థులలో ఆలోచనాశక్తిని పెంచేలా బోధన సాగుతుంది. ప్రభుత్వ మద్దతుతో విద్య ఉచితంగా అందుతూ, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. అలాగే, నార్వే జీవన ప్రమాణాలు చాలా ఉన్నతమైనవి. చదువుతో పాటు అక్కడ లభించే ఉన్నతమైన ఆరోగ్యసేవలు కూడా విద్యార్థుల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయి.ఐర్లండ్విద్యలో వైవిధ్యంటెక్నాలజీ ఆధారిత విద్యా రంగంలో వేగంగా ఎదుగుతున్న దేశం ఐర్లండ్. రాజధాని డబ్లి¯Œ వంటి నగరాల్లో వలసదారుల పెరుగుదలతో విద్యలో వైవిధ్యం పెరిగింది. ఇక్కడ విద్యా విధానం ఆచరణాత్మక జ్ఞానానికి ప్రాధాన్యమిస్తూ, విద్యార్థుల ఆలోచనా స్వాతంత్య్రాన్ని ప్రోత్సహిస్తోంది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఈ దేశం, సాంకేతిక, జైవ శాస్త్ర రంగాల్లో విద్యను శక్తిగా వినియోగిస్తోంది. ఉద్యోగావకాశాలకు అనుగుణంగా ఉంటూ అనేక అంతర్జాతీయ విద్యార్థులకు ఆశ్రయంగా మారింది.ఈ జాబితా నుంచి మనం గమనించగలిగేది ఏమిటంటే అత్యుత్తమ స్థాయిలో విద్యను అందిస్తున్న దేశాలు అన్నీ ఏకకాలంలో ఆర్థికంగా, సాంకేతికంగా, సమాజపరంగా కూడా ముందున్నాయి. వీటిల్లో వంద శాతం అక్షరాస్యతతో స్లోవేనియా అత్యుత్తమ విద్యా నాణ్యతకు ఒక అద్భుత నిదర్శనం. మిగతా దేశాలలో అక్షరాస్యత శాతం గణాంకాలు అందుబాటులో లేవు గాని, విద్యా నాణ్యత అత్యుత్తమంగా ఉండడం వల్ల వాటి స్థానం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దేశాలు తమ విద్యా విధానాలను సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించు కొని, విద్యార్థులకు ఒత్తిడి లేని, పరిశోధన ప్రాతిపదికన ఉన్న, ఆచరణాత్మకమైన విద్యను అందిస్తున్నాయి. ఫలితంగా ఈ దేశాల్లో ఉన్నత జీవన ప్రమాణాలు, ఉచిత లేదా తక్కువ ధరల్లో ఉన్నత విద్య అవకాశాలు, స్వేచ్ఛాయుత విద్యా వాతావరణం కనిపిస్తున్నాయి.ఇండియాఇంకా ‘వికాస దశ’లోనే! ఇండియా అంటేనే విశాలమైన సంస్కృతి, శాస్త్రవేత్తలు, ఐటీ మేధావులు గుర్తొస్తారు. కాని, ప్రపంచ విద్యా రంగపు ర్యాంకింగ్స్లో చూస్తే, మన దేశం ఇంకా ‘వికాస దశ’లోనే ఉంది. 2025 విద్యా ర్యాంకింగ్స్లో భారత్ 101వ స్థానంలో నిలవడం కొంచెం చేదుగా అనిపించినా, ఇది మన విద్యా వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లను స్పష్టంగా చూపిస్తుంది. మన పక్కనున్న దేశాల పరిస్థితి చూస్తే చిన్న దేశాలైన నేపాల్ 56, భూటాన్ 88వ స్థానాల్లో మనకంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. పాకిస్థాన్ 136, అఫ్గానిస్తాన్ 146, బంగ్లాదేశ్ 122వ స్థానాల్లో మన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ఈ జాబితాలో అసలైన షాక్ ఏంటంటే, మన పొరుగునే ఉన్న చైనా మాత్రం 13వ స్థానంలో మెరిసిపోతూ ప్రపంచానికి చదువుల దారులు తెరుస్తోంది.మన వెనుకబాటుకు కారణాలుఇందుకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వసతుల లోపం అని చొప్పొచ్చు. అందుకే మన అక్షరాస్యత రేటు 74 శాతం దగ్గరే నిలిచిపోయింది. కాని, మార్పు మొదలైంది. నూతన విద్యా విధానం, డిజిటల్ లెర్నింగ్, గ్రామీణ విద్యపై దృష్టి, బాలికల విద్యకు ప్రాధాన్యం వంటి చర్యలు మన ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నాయి. అయితే, టాప్ 10లోకి వెళ్లాలంటే ప్రాథమిక విద్యా నాణ్యత, ఉపాధ్యాయుల శిక్షణ, సమానత్వం కీలకం. ఇప్పుడు ఉన్నదంతా ప్రారంభం మాత్రమే! సరైన దిశగా నడిస్తే, భారతదేశం కూడా భవిష్యత్తులో ప్రపంచ విద్యా శిఖరాలను అధిరోహించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పుడు మన దేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.పేజీ కూడా తెరవలేదుప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు చదువును ఓ శస్త్రాయుధంలా వాడేస్తుంటే, ఇంకా కొన్ని దేశాల్లో మాత్రం ‘ఏ ఫర్ ఆపిల్’ అనే పదం రాయటమే గొప్ప విజయంగా పరిగణిస్తున్నాయి. చాద్ (27 శాతం), బుర్కినా ఫాసో (34శాతం), సౌత్ సూడాన్ (35 శాతం) వంటి దేశాలు ప్రపంచ అక్షరాస్యత రేటులో అసలైన రెడ్ జోన్ లో ఉన్నాయి. స్కూల్కి దూరం, పుస్తకాలు అరుదు, టీచర్లు లేని తరగతులు. ఇక్కడ ‘ఎలా చదవాలి?’ అనే ప్రశ్న కంటే ముందు, ‘ఎక్కడ చదవాలి?’ అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే, ఇక్కడ స్కూల్స్ ఉండటమే అరుదు. బాల్యవివాహాలు, పేదరికం, యుద్ధాలు ఇవన్నీ కలసి చదువును పక్కకు నెట్టి, చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి బాలికలకు చదువు అందని మానిపండే!చిన్న దేశాల గొప్ప విజయాలుఒకప్పుడు ‘చిన్న దేశాలు’ అనే పేరు వింటే, మనకు గుర్తొచ్చేది వాటి పరిమిత వనరులు, అభివృద్ధి లోపం, పెద్ద దేశాల మీద ఆధారపడే పరిస్థితులు. కాని, ఇప్పుడు? అవే చిన్న దేశాలు పుస్తకాలతో పరుగు తీస్తూ, ప్రపంచ విద్యా వేదికపై సగర్వంగా నిలుస్తున్నాయి. కజక్స్తాన్, ఉజ్బెకిస్తాన్, లాట్వియా, ఇస్టోనియా, లిథువేనియా... వీటి పేర్లు చాలామందికి టూరిజం బ్రోషర్ల ద్వారా మాత్రమే తెలిసి ఉండొచ్చు కాని, ఇప్పుడు ఇవే దేశాలు విద్యలో వందశాతం అక్షరాస్యతతో టాప్ లైన్ లో నిలబడ్డాయి! చదువు విషయంలో ఇవి చిన్న దేశాలు కాదు, చదువుల మహారాజులు! నేపాల్ (71 శాతం) భూటాన్ (72 శాతం) వంటి హిమాలయాల మధ్యన ఉన్న దేశాలు కూడా అక్షరాస్యతలో అగ్రస్థానానికి చేరుతున్నాయి. 2025 నాటికి ప్రపంచం మొత్తం అక్షరాస్యత సగటు 72.91 శాతం అంటే, ఈ చిన్న దేశాల ప్రభావం ఎంత ఉంటుందో ఊహించండి! వనరులు తక్కువైనా, విజన్ పెద్దది. డబ్బు లేకపోయినా, గొప్ప సంకల్పం ఉంది. ప్రభుత్వాల నిబద్ధత, విద్యా విధానాలలో స్పష్టత, ప్రతి పాఠశాలలో బలమైన ఫౌండేషన్... ఇవే ఈ దేశాలను అగ్రస్థానాలకు చేర్చాయి.టాపర్లాంటిది! విద్యా వ్యవస్థలో టాప్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన, చదువులో టాప్ స్కోర్ వస్తుందన్న గ్యారంటీ లేదు! పేరుకు ప్రపంచంలో ఉత్తమ విద్యా సంస్థలు కలిగిన దేశాల జాబితాలో అమెరికా నంబర్ వన్. కానీ సబ్జెక్ట్ వైజ్లో చూస్తే? గణితంలో 38వ స్థానం, సై¯Œ ్సలో 24వ స్థానం – అచ్చం ‘టాపర్’ ముసుగులో ‘బోర్డర్ పాస్’ అన్నట్టు! ‘బిజినెస్ ఇన్సైడర్’ అనే సంస్థ ఇచ్చిన గణాంకాలు, బెస్ట్ కంట్రీస్ రిపోర్ట్ లెక్కలు– ఇలా ఒక్కో సంస్థ ఒక్కో విధంగా మార్కులు వేస్తుండడంతో, ర్యాంకింగ్ ఒక పజిల్లా మారిపోయింది. ఎక్కడైనా పుస్తకాలతో కప్పేసి ‘ఉత్తమ విద్యా సంస్థ’ అన్న ట్యాగ్ పెడితే సరిపోదు. అసలైన విషయాలు చూడాలి. పిల్లలు చదువుతున్నారా? టీచర్లు బాగా బోధిస్తున్నారా? ప్రభుత్వ పెట్టుబడులు నిజంగా ఉపయోగపడుతున్నాయా? అనే విషయాలు కూడా కీలకమే! ఇక ‘గ్లోబల్ సిటిజన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ వంటి సంస్థలు బాగానే మ్యాటర్ను పసిగట్టాయి. విద్యా వ్యవస్థ అంటే చిన్నారి స్కూల్ అడ్మిషన్ నుంచీ పెద్దల అక్షరాస్యత వరకూ మొత్తం జీవన ప్రయాణాన్ని గమనించాలి అని అంటున్నాయి. సింపుల్గా చెప్పాలంటే టాప్ ర్యాంక్ అనేది పేపర్లో ఉండే డిజైన్ మాత్రమే! అసలైన చదువు ఏమిటో, అది జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో చూసే చూపు అవసరం. లేదంటే టాపర్ గుండెల్లోని ర్యాంక్ కాస్త, రిజల్ట్ వచ్చాక ‘ఒక్క మార్క్ మిస్ అయ్యింది!, లేకుంటే నేనే టాప్’ అని అంటాయి. విద్య అనేది కేవలం ఒక పాఠశాల గది వరకు మాత్రమే పరిమితమైంది కాదు. అది వ్యక్తిని మారుస్తుంది. వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది; కుటుంబం మారితే సమాజం మారుతుంది; సమాజం మారితే దేశం మారుతుంది. అందుకు విద్యే మార్గం, విజ్ఞానమే శక్తి.పేజీ కూడా తెరవలేదుప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు చదువును ఓ శస్త్రాయుధంలా వాడేస్తుంటే, ఇంకా కొన్ని దేశాల్లో మాత్రం ‘ఏ ఫర్ ఆపిల్’ అనే పదం రాయటమే గొప్ప విజయంగా పరిగణిస్తున్నాయి. చాద్ (27 శాతం), బుర్కినా ఫాసో (34శాతం), సౌత్ సూడాన్ (35 శాతం) వంటి దేశాలు ప్రపంచ అక్షరాస్యత రేటులో అసలైన రెడ్ జో¯Œ లో ఉన్నాయి. స్కూల్కి దూరం, పుస్తకాలు అరుదు, టీచర్లు లేని తరగతులు. ఇక్కడ ‘ఎలా చదవాలి?’ అనే ప్రశ్న కంటే ముందు, ‘ఎక్కడ చదవాలి?’ అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే, ఇక్కడ స్కూల్స్ ఉండటమే అరుదు. బాల్యవివాహాలు, పేదరికం, యుద్ధాలు ఇవన్నీ కలసి చదువును పక్కకు నెట్టి, చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడి బాలికలకు చదువు అందని మానిపండే! -
ఈ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటే ఆఫీస్ పని అవ్వదు భారం!
ఆఫీసు అంటేనే బోరింగ్గా, ఆఫీసు పని చాలా భారంగా అనిపిస్తోందా! అయితే, ఒక్కసారి ఈ టెక్ కొలీగ్స్ను కలవండి, అప్పుడు మీ ఆఫీస్ పని ఆటలాగా మారుతుంది.మ్యాజిక్ మౌస్!ఇప్పటి వరకు మౌస్ అంటే కేవలం క్లిక్లు కోసమే అనుకున్నారా? అయితే మీరు ఈ ‘చీర్డాట్స్ 2’ గురించి తెలుసుకోవాల్సిందే! ఇది ఒక మల్టీ టాలెంట్ కాంబినేషన్. ఎయిర్ మౌస్, టచ్ప్యాడ్, క్లికర్, ఏఐ చాట్, డేటా సమ్మరీ ఇచ్చే అడ్వైజర్ అన్నీ ఇదే! ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు స్క్రీన్ మీద దీనితో ఇలా ఊపేస్తే, అలా స్లైడ్స్ మారిపోతాయి. ఒక బటన్తో స్క్రీన్పై స్పాట్లైట్ వేసి అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. ఇంకా చెప్పాలంటే, మీరు మాట్లాడిన మాటలను ఈ మౌస్ ఏఐ సాయంతో రికార్డ్ చేసి, సింపుల్ సమ్మరీలుగా మార్చేస్తుంది. మొబైల్, బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని కూడా దీనిని వాడుకోవచ్చు. ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు ఇరవై రోజులు పాటు పనిచేస్తుంది. ధర 99 డాలర్లు (రూ. 8,475).ట్రిపుల్ ట్రీట్ చార్జ్!ఆఫీస్ అంటే ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎయిర్పాడ్స్ వంటి చాలా రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ రోజూ ఫుల్ చార్జ్ అవ్వాల్సిందే! కాని, ఒక్కోటి వేర్వేరు వైర్లు అడిగితే, ఆఫీస్లో మేనేజర్ కన్నా మనకే ఎక్కువ టెన్షన్! ఈ సమస్య తీర్చడానికే వచ్చింది ఈ ‘జీహూ క్యూబ్ ట్రిక్ ఎక్స్’. ఇది ఒక త్రీ ఇన్ వన్ చార్జర్. ఇది ఉంటే ఇక మీ డెస్క్ మీద ఒక్క కేబుల్ కూడా కనిపించదు. ఫోన్, వాచ్, ఎయిర్పాడ్స్ అన్నింటిని ఒకేచోట, ఒకేసారి చార్జ్ చేసుకోవచ్చు. ఇందులోని ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ మిమ్మల్ని మరింత స్మార్ట్గా చేసేస్తుంది! ధర 55 డాలర్లు (రూ. 4,708)డేటా గార్డ్ఆఫీస్ ఫైల్స్ అంటే మామూలు విషయం కాదు, అవి ప్రమోషన్కి టికెట్ లాంటివి. ఒక్కసారైనా సిస్టమ్ సడన్గా క్రాష్ అయ్యిందంటే? అంతే సంగతులు. ఇక మీరు మీ కొత్త రెజ్యూమే రెడీ చేసుకోవాల్సిందే! పైగా హ్యాకర్లు, వైరస్లు, సాఫ్ట్వేర్ బగ్స్– అన్నీ డేటాపై పంజా విసురుతున్న ఈ రోజుల్లో డిజిటల్ ఫైల్స్ను భద్రంగా ఉంచడం అంటే, ఫ్రిజ్లో పిల్లలకు కనిపించకుండా ఐస్క్రీమ్ దాచినంత కేర్ తీసుకోవాలి. అందుకే వచ్చింది ఈ ‘కింగ్స్టన్ ఐరన్ కీ వాల్ట్ ప్రైవసీ 80’. ఇది డ్రైవ్ కాదు, డేటాకు ఒక డిజిటల్ బౌన్సర్ లాంటిది. టచ్ స్క్రీన్తో, పాస్వర్డ్, పిన్లాంటి లాకింగ్ సిస్టమ్తో వస్తోంది.ఏకంగా 3.8 టీబీ డేటా స్టోర్ చేసుకోవచ్చు. అంటే పదేళ్ల ఆఫీస్ ఫైల్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, పర్సనల్ ఫొటోలు, వీడియోలు అన్నీ ఇందులో భద్రంగా దాచుకోవచ్చు. ఒకే డ్రైవ్ను మల్టిపుల్ యూజర్లుగా వాడుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో పాస్వర్డ్ కూడా ఇవ్వవచ్చు. హ్యాకర్ ట్రై చేస్తే వెంటనే రిడ్–ఓన్లీ మోడ్ ఆన్ చేసి ‘బాబూ, కాస్త పక్కకు వెళ్లి ఆడుకోమ్మా!’ అంటూ అడ్డుపడుతుంది. అంత భద్రంగా డేటాను చూసుకుంటుంది. ధర 729 డాలర్లు (రూ. 62,422). -
త్రిప్తి డిమ్రి ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమెలాగే హెయిర్కట్..
‘ఆ ఛాన్స్ నాకు ఎక్కడ దక్కుతుంది?’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన త్రిప్తికి.. కొన్ని రోజుల్లోనే ఆ అవకాశం పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ చుట్టూ తిరిగి చివరకు ఆమెనే వరించింది. దీపికా పదుకొణే ప్లేస్ని భర్తీ చేసిన త్రిప్తి తాజా జర్నీ ఆసక్తికరమే కాదు, ఆశ్చర్యకరమైనది కూడా!టాలీవుడ్లోనూ గుర్తింపుబాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి (Tripti Dimri).. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాలో నటించి టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడదే దర్శకుడు ప్రభాస్తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకొని ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. త్రిప్తి.. దీపికా పదుకొణెకు పెద్ద అభిమాని. చిన్నతనంలో ‘చాందినీ చౌక్ టు చైనా’ సినిమాలో దీపికా లుక్ చూసి, అదే స్టయిల్లో హెయిర్ కట్ చేసుకుందట!మందు జోలికి వెళ్లనుమొన్నటి వరకు టీ ఎక్కువగా తాగే త్రిప్తి, ఇప్పుడు కాఫీ మీద మక్కువ పెంచుకుందట. టీ, కాఫీ తప్ప... ఇప్పటివరకు ఎప్పుడూ ఆల్కహాల్ టేస్ట్ చేయలేదని, భవిష్యత్తులో చేయాలనే ఆలోచన కూడా లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇండియన్ సినిమాల్లో న్యూడ్గా నటించేందుకు ధైర్యం చేసిన అరుదైన నటీమణుల్లో త్రిప్తి ఒకరు. ‘యానిమల్’లో బోల్డ్ సీన్లు చేసిన తర్వాత స్టార్ అయింది. అయితే ఆ సీన్లు చూసి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారని ఒప్పుకుంది. అయినా కెరీర్ కోసం ఇలాంటి సాహసాలు అవసరమే అంటోంది.యానిమల్ మూవీతో దశ తిరిగిందిత్రిప్తి 2017లో ‘పోస్టర్ బాయ్స్’ సినిమాతో రంగ ప్రవేశం చేసింది. ‘లైలా మజ్ను’, ‘బుల్ బుల్’ వంటి చిత్రాల్లో నటించినా పెద్దగా పాపులారిటీ రాలేదు. చిన్నప్పటి నుంచే టాప్ హీరోయిన్ కావాలని కలలు కన్న త్రిప్తి, అవి నెరవేరక మొదట్లో చాలా డిజప్పాయింట్ అయిందట! సరిగ్గా అలాంటి సమయంలో ‘యానిమల్’ ఛాన్స్ రావడంతో వదులుకోలేకపోయింది. ఆ సినిమా ఆమె కెరీర్ను ఊహించని ఎత్తులకు చేర్చింది. రష్మిక మందన్నా కన్నా త్రిప్తికి ‘ఛోటా భాభీ’గా ఎక్కువ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ సినిమాలుఆ తర్వాత కూడా బోల్డ్ కథలే త్రిప్తిని వెతుక్కుంటూ వచ్చాయి. ‘బ్యాడ్ న్యూస్’ చిత్రంలో ఇద్దరు బాయ్ఫ్రెండ్స్లో ఎవరి వల్ల గర్భం దాల్చిందో తెలియని యువతి పాత్రలో నటించింది. అలాగే, ‘విక్కీ విద్యా కా వోహ్ వాలా వీడియో’ అనే సినిమా హాలీవుడ్ సెక్స్ టేప్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది. కొత్తగా పెళ్లైన జంట తమ మొదటి రాత్రిని షూట్ చేయడం, ఆ వీడియో లీక్ కావడం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావుతో కలిసి నటించింది.విమర్శలుత్రిప్తి నటనపై, డ్యాన్స్పై కొన్ని విమర్శలు వచ్చినా.. గ్లామర్, టాలెంట్, సక్సెస్ వల్ల అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ‘యానిమల్’లో న్యూడ్ సీన్ తీసే సమయంలో డైరెక్టర్, హీరో ఎంతో మద్దతు ఇచ్చారని తెలిపింది. ఆ సీన్ను చాలా అందంగా చూపించారని, ఏ కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినా షూటింగ్ ఆపేస్తామని మాట ఇచ్చిన తర్వాతే షూట్ చేశారని చెప్పింది త్రిప్తి.స్పిరిట్లో నేనా?ఒకసారి ఓ జర్నలిస్టు త్రిప్తిని ‘స్పిరిట్ సినిమాలో మీకు ఛాన్స్ వస్తుందా?’ అని అడిగినప్పుడు ‘ఒక్క శాతం కూడా అవకాశం లేదు. అంత పెద్ద ప్రాజెక్ట్లోకి ఎలా వస్తాను?’ అని ఆశ్చర్యంగా అంది. పైగా సందీప్ రెడ్డి వంగా తనకే మళ్లీ ఛాన్స్ ఇస్తాడా? అంటూ ఎదురు ప్రశ్నించింది. కానీ, విధి, సినిమా రంగం రెండూ మాయామయం! చివరకు దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తి వచ్చి చేరింది.చదవండి: షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్? -
దారపు నరాలు..ఇట్టే నయం..!
చర్మంపై నరాలు తేలి అవి పైకి కనిపిస్తే అందవిహీనంగా కనిపిస్తుంది. నిజానికి ఈ సమస్యను దారపు నరాలు లేదా స్పైడర్ వీన్స్ అంటారు. ఇవి ఎక్కువగా కాళ్లు, తొడల భాగాల్లో నరాలు చర్మంపైకి నల్లటి లేదా ఎర్రటి చారల్లా కనిపిస్తాయి. సమస్య తీవ్రతను బట్టి అవి ముఖంపై కూడా వస్తుంటాయి. వాటికి సమర్థమైన చికిత్స ‘లిక్విడ్ స్క్లెరో థెరపీ’. ఈ ప్రక్రియలో, ఒక ప్రత్యేక రసాయనిక ద్రావణాన్ని, నేరుగా ప్రభావిత నరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. చిన్న చారల నుంచి మధ్యస్థాయి చారల వరకు, ఈ చికిత్స చేస్తే ఫలితం ఉంటుంది. చాలామందికి ఒకటి కంటే ఎక్కువ సెషన్స్ అవసరం కాకపోవచ్చు. చికిత్స తర్వాత స్వల్ప అసౌకర్యం, వాపు ఉండవచ్చు కాని, అదంతా త్వరగా తగ్గిపోతుంది. ఈ థెరపీ చాలా సురక్షితం.చర్మ సౌందర్యానికి, జుట్టు ఆరోగ్యానికి వేర్వేరు పరికరాలను ఉపయోగిస్తున్నారా? ఇక ఆ అవసరం లేదు. ‘మైట్రెక్స్ ప్రూవ్ టోటల్ లిఫ్ట్’ అనే ఈ పరికరంలో ముఖం, తల, శరీర సంరక్షణకు అవసరమైన అన్ని ఫీచర్స్ కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్తో హై పవర్ పల్స్తో చర్మాన్ని ఉత్తేజపరచి, కండరాలను బలోపేతం చేస్తుంది. దాంతో చర్మాన్ని బిగుతుగా మార్చి, నిగారింపునిస్తుంది.అలాగే ఈ మెషిన్ మూడు విభిన్న అటాచ్మెంట్లతో రూపొందింది. దీనికున్న బ్రష్ అటాచ్మెంట్ తలకు మసాజ్ చేసి, జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది. దీని కర్వ్డ్ అటాచ్మెంట్ ముఖంపై చర్మాన్ని బిగుతుగా మార్చి, ముడతలను నివారిస్తుంది. ఫ్లాటర్ అటాచ్మెంట్ శరీర భాగాలైన చేతులు, కాళ్లు వంటి వాటిపై చర్మాన్ని మెరుగుపరుస్తుంది.ఇది వాటర్ప్రూఫ్ డివైస్ కావడంతో తడి చర్మంపై కూడా సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో ఐదు లెవల్స్, రెండు మోడ్స్ ఉండటంతో అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. దీనికి ఒక్కసారి చార్జ్ పెడితే 7 నుంచి 11 గంటల వరకు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం, నిరంతరాయంగా పని చేస్తుంది. 15 నిమిషాల తర్వాత ఆటో–ఆఫ్ టైమర్ ఉండటంతో దీనిని వినియోగించడం చాలా తేలిక. (చదవండి: ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?) -
బ్రెయిన్ షార్ప్గా ఉండాలంటే..?
మన శరీర భాగాల్లో ఎక్కువ శ్రమపడేది– మెదడు. ఇది అద్భుతమైన శక్తులతో కూడినది. కాని, దానికి ఇచ్చే విశ్రాంతి, శ్రద్ధ మాత్రం చాలా తక్కువ. మెదడును పదిలంగా ఉంచుకోవాలంటే గంటల తరబడి యోగా, వ్యాయామం అవసరమేమీ కాదు. రోజుకు ఐదు నిమిషాల ‘చిన్న అలవాట్లు’ మన మెదడును శక్తిమంతంగా మార్చగలవని తాజా న్యూరో సైన్స్ పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ ఐదు నిమిషాల అలవాట్లు కేవలం ప్రస్తుతానికే కాక, భవిష్యత్తులో వృద్ధాప్యంలో మెదడు మందగించడం నుంచి మిమ్మల్ని రక్షించే సాధనాలవుతాయి. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం. 1. ముక్కుతోనే పీల్చాలిమనం బతకాలన్నా, మెదడు బతకాలన్నా శ్వాస కావాలి. అయితే మనం ఎలా ఊపిరి పీలుస్తున్నామన్నది మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది. ముక్కు ద్వారా పీల్చే శ్వాస నేరుగా ‘అల్ఫ్యాక్టరీ బల్బు’కు అనుసంధానమై ఉంటుంది. దీని వల్ల మెమరీ సెంటర్లు యాక్టివేట్ అవుతాయి. ముక్కు ద్వారా ఊపిరి తీసుకునే సమయంలో మెదడు స్మృతి కేంద్రాలను ప్రేరేపించే ‘సబ్టల్ ఎలక్ట్రికల్ రిథమ్స్’ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్లనే నోటిద్వారా శ్వాస తీసుకునే వారికంటే ముక్కుద్వారా శ్వాసతీసుకునేవారు 40శాతం మెరుగైన మెమరీ చూపించారు.2. బాక్స్ బ్రీతింగ్నాలుగు సెకన్లు శ్వాస తీసుకొని, నాలుగు సెకన్లు శ్వాస నిలిపి, నాలుగు సెకన్లు విడిచి, మరో నాలుగు సెకన్లు ఖాళీగా ఉండటం. ఈ విధానాన్ని రోజుకు ఐదు నిమిషాలు పాటిస్తే, మీ మెదడు ముందు భాగంలో (ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్) 25శాతం అదనపు ఆక్సిజన్ చేరుతుంది. ఇది నిర్ణయం తీసుకోవడం, ఫోకస్, మెమరీ వంటివి మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఇది మీ పారా సింపథటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తూ, కార్టిసాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఒక్క రోజు బాక్స్ బ్రీతింగ్ చేయడం, ఫోకస్ను పదిశాతం పెంచుతుంది. అదే అలవాటు 30 రోజులు కొనసాగితే మీ మెదడు పనితీరులో 40శాతం మెరుగుదల ఉంటుంది. 3. డెస్క్ వర్కవుట్స్... అధిక తీవ్రత గల వ్యాయామం చేసిన వారు రెండు గంటలపాటు మెరుగైన మెదడు పనితీరు చూపారని ఒక అధ్యయనంలో వెల్లడైంది.. దీనివల్ల బ్రెయిన్ అండ్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) విడుదల అవుతుంది, ఇది మెదడు న్యూరాన్ల వృద్ధిని పెంచుతుంది. కేవలం మీ డెస్క్ దగ్గరే ఐదు నిమిషాల్లోనే సాధ్యమయ్యే వ్యాయామాల ఉదాహరణ: 30 సెకన్లు బాడీ వెయిట్ స్క్వాట్స్, 30 సెకన్లు ఆర్మ్ సర్కిల్స్, 30 సెకన్లు హై నీస్, 30 సెకన్లు వాల్ పుషప్స్– ఈ చర్యలతో మెదడులో రక్తప్రసరణ పెరిగి, మీ ఫోకస్, శక్తి, ఆలోచనా సామర్థ్యం మెరుగుపడతాయి.4. విభిన్న మేధా కార్యకలాపాలుపజిల్స్, బ్రెయిన్ గేమ్స్ కాకుండా, మీ మెదడుకు ‘కొత్త’ అనుభవాలు ఇవ్వడం వల్ల అత్యంత ప్రభావం ఉంటుంది. రోజుకు ఒక కొత్త పదాన్ని నేర్చుకొని మూడు వేర్వేరు సందర్భాలలో ఉపయోగించడం, చిన్న గణిత సమస్యలను కాగితం–పెన్సిల్ లేకుండా లెక్కించడం, లేదా సాధారణ వస్తువులకు అసాధారణ ఉపయోగాలను కనుగొనడం వంటివి మెదడులో క్రియేటివ్, భాగాలను కలుపుతూ డైవర్జెంట్ థింకింగ్ను మెరుగుపరుస్తాయి. మళ్లీ మళ్లీ అదే ఆటలు ఆడే కన్నా, చిన్న కొత్త విషయాలే మెరుగైన న్యూరోప్లాస్టిసిటీని అందిస్తాయి.5. సంగీతంతో సరళతసంగీతం మనసుకు సాంత్వననిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గిటార్, పియానో లాంటి వాయిద్యాలను వాయించడం వల్ల మెదడులోని అనేక భాగాలు ఒకేసారి ఉత్తేజితమవుతాయి. ‘అరె... నాకే వాయిద్యమూ రాదండీ’ అని బాధపడకండి. బీట్కు సరిపడేలా వేలితో ట్యాప్ చేయడం వల్ల మెదడులోని మోటార్ కార్టెక్స్, ఆడిటరీ కార్టెక్స్, అటెన్షన్ భాగాలు యాక్టివ్ అవుతాయి. ఇది మీకు గణనీయమైన కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ ఇస్తుంది.6. నలుగురితో మాట్లాడండిఐదు నిమిషాల సామాజిక సంభాషణలు మీ మెదడు పనితీరు, విశ్లేషణ సామర్థ్యం, వర్కింగ్ మెమరీని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో, కొత్త విషయాలపై చేసిన సంభాషణలు మీ మెదడుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. పాత పరిచయాల కన్నా వయస్సులో తేడా గలవారితో సంభాషణ వల్ల మెదడు కొత్త దృక్కోణాలనూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సరదా కబుర్ల కన్నా లోతైన సంభాషణలు మెరుగైన కాగ్నిటివ్ బెనిఫిట్స్ను అందిస్తాయి. వీడియో, ఫోన్ సంభాషణలు టెక్స్ట్ మెసేజెస్ కంటే నేరుగా మాట్లాడటమే మెరుగైన ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?) -
గాల్లో ఎగిరే బైక్..! 'స్కై స్కూటర్'..
రోజూ ట్రాఫిక్లో గంటసేపు వేచి ఉండి, రెండు సార్లు హారన్ కొట్టి, మూడోసారి ఆరెంజ్ లైట్లో బ్రేక్ వేసి, చివరికి కాళ్లు బైక్ పెడల్స్పై కంటే నేలపైనే పెట్టుకుంటూ ప్రయాణం చేస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ప్రయాణ కష్టాలన్నింటికీ ఓ సింపుల్ జెట్ ఇంజిన్ పరిష్కారం చూపుతోంది. ఇది ‘హోవర్ బైక్’. పోలండ్కు చెందిన ‘వోలోనాట్’ అనే సంస్థ, అచ్చం ‘స్టార్ వార్స్’ సినిమాలో స్కైవాకర్ వాడిన స్పీడర్ బైక్ మాదిరిగా, చక్రాలు లేకుండా, ప్రొపెల్లర్లు లేకుండా, గాల్లో తేలిపోయేలా ఈ బైక్ను రూపొందించింది. గంటకు 200 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో దూసుకెళ్లే ఈ హోవర్ బైక్ స్టార్ట్ చేసిన క్షణమే, నేలను తాకకుండా నేరుగా గాల్లోకి దూసుకెళ్లిపోతుంది. అయితే ఇంకా అసలు మజా ఏంటంటే.. దీనికి స్టీరింగ్ ఎలా ఉందో? బ్రేకులు ఎక్కడ పెడతారో? ధర ఎంతవుతుందో? ఇవన్నీ ఇంకా మిస్టరీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇది కేవలం ట్రయల్ రైడ్లో మాత్రమే కనిపించింది. కాని, ఇప్పటికే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తే, ఇక మన ట్రాఫిక్ పోలీసులు గాలిలో ఎగిరే ఈ బైక్ల వెంబడి డ్రోన్లు పంపించి ఫైన్ వేయాల్సిన రోజులు వస్తాయేమో! (చదవండి: అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..! ప్రకృతిని, స్త్రీ శక్తిని..) -
వావ్.. బాంబూ గ్రోవ్..
ప్రకృతి ప్రియులు, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు తప్పక సందర్శించాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశం ‘అరాషియామా బాంబూ గ్రోవ్’. జపాన్లోని కియోటో నగరానికి పశ్చిమాన ఉన్న అందమైన వెదురు వనం ఇది. ఈ వనంలో వేలాది వెదురు మొక్కల మధ్య నుంచి కాలిబాట ఉంటుంది. ఆ దారిన నడిచి వెళ్తుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఈ ప్రాంతం ఒక ప్రత్యేకమైన వాతావరణానికి నిలయం. సన్నని వెదురు కాండాలు ఆకాశాన్ని చీల్చుకుంటూ ఎత్తుగా పెరిగి, పచ్చని గుడిసెలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. వెదురు ఆకుల గుండా ప్రసరించే సూర్యకాంతి భూమిని చేరే తీరు, తేలికపాటి గాలికి వెదురు కాండాలు ఒకదానికొకటి తాకుతూ సృష్టించే మృదువైన శబ్దం మనసుని మైమరపిస్తుంటాయి. ఈ మార్గంలో నడుస్తున్న కొద్దీ, వెదురు కాండాలు వివిధ కోణాల నుంచి కనిపిస్తాయి. ప్రతి మలుపులోనూ కొత్త దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. (చదవండి: అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..! ప్రకృతిని, స్త్రీ శక్తిని..) -
అరుదైన వేడుక ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’..!
అస్సాంలో జరిగే ‘అంబుబాచీ మేళా’ అరుదైన వేడుక. గువాహటిలో కొలువైన శక్తిపీఠం కామాఖ్య దేవి ఆలయంలో ఏటా జరిగే ఈ మేళా ఒక విలక్షణ ఆధ్యాత్మిక ఉత్సవం. ఇది ‘ఈస్టర్న్ మహా కుంభమేళా’గా ప్రసిద్ధి చెందింది, ప్రకృతిని, స్త్రీ శక్తిని ఆరాధించే ఈ మేళా పురాతన శాక్తేయ సంప్రదాయానికి, అస్సామీ సంస్కృతికి ప్రతీక.అంబుబాచీ మేళా అనేది కామాఖ్యదేవి రుతుచక్రాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో దేవి గర్భగుడిలో ఉన్న యోని పీఠం నుంచి రుతుస్రావం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ కాలాన్ని భూమి తన పునరుత్పత్తి శక్తిని తిరిగి పొందే సమయంగా భావిస్తారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసి ఉంచుతారు. ఈ కాలంలో ఏ విధమైన వ్యవసాయ పనులు, పూజలు, శుభకార్యాలు నిర్వహించరు. ఐదోరోజు శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తర్వాత, ఆలయం తిరిగి తెరిచి, దర్శనం చేసుకోవడానికి భక్తులను అనుమతిస్తారు. అంబుబాచీ మేళా ఈ ఏడాది జూన్ 22న ప్రారంభమై జూన్ 26న ముగుస్తుంది.ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా హిమాలయాల నుంచి వేలాదిమంది సన్యాసులు, అఘోరాలు, తాంత్రికులు వస్తారు. వీరి దర్శనం, ఆశీర్వచనాల కోసం భక్తులు బారులు తీరుతుంటారు. ఈ నాలుగు రోజులు ఆలయాన్ని మూసివేసినా, పరిసరాలన్నీ మంత్ర పఠనాలతో, భజనలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో హోరెత్తుతాయి. మేళా ముగిసిన తర్వాత, దేవి ‘శుద్ధి’ అయినప్పుడు, భక్తులకు ప్రత్యేకమైన ‘అంబుబాచీ వస్త్రం’ లేదా ‘అంబుబాచీ సిందూరం’ ప్రసాదంగా ఇస్తారు. ఈ వస్త్రం దేవి రుతు రక్తంతో తడిసిందని నమ్ముతారు. (చదవండి: అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!) -
అక్కడ ప్రతిరోజూ.. క్రిస్మస్ వేడుకే..!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ ఏడాదికోసారి వస్తుంది. ఏటా డిసెంబర్ 25న వివిధ దేశాల్లోని క్రైస్తవులు ఈ వేడుకను ఘనంగా జరుపుకొంటారు. కాని, ఒకచోట మాత్రం ఏడాది పొడవునా– ప్రతిరోజూ క్రిస్మస్ వేడుక జరుగుతుంది. అదెక్కడి వింత ప్రదేశం అనుకుంటున్నారా? ఇక అసలు కథలోకి వచ్చేద్దాం.అదొక థీమ్ పార్కు. ఇంగ్లండ్లోని చెసింగ్టన్ పట్టణంలో ఉంది. ఏడాది పొడవునా– ప్రతిరోజూ జరిగే క్రిస్మస్ వేడుకలకు ఇదే కేంద్ర బిందువు. దీని పేరు ‘చెసింగ్టన్ వరల్డ్ ఆఫ్ అడ్వెంచర్స్’. ఈ థీమ్ పార్కులో కూడా మిగిలిన థీమ్ పార్కుల్లో మాదిరిగానే అన్ని రకాల క్రీడా వినోద విలాసాలన్నీ ఉంటాయి. రంగుల రాట్నాలు, ఇతర వినోద క్రీడా సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇదే పార్కు ప్రాంగణంలో ఒక ఫోర్స్టార్ సఫారీ హోటల్ కూడా ఉంది. ఈ హోటల్లోని కొన్ని గదుల్లో నిత్యం క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి.ఈ హోటల్లోని ఓరియో, జుమాంజీ, గ్రఫాలో అనే ప్రత్యేక గదుల్లో ప్రతిరోజూ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. క్రిస్మస్ పండుగ రోజున ఇళ్లల్లో అలంకరించినట్లుగానే ఈ గదులు నిత్యం క్రిస్మస్ అలంకరణతో కళకళలాడుతూ కనువిందు చేస్తాయి. గదుల మూలల్లో క్రిస్మస్ ట్రీలు, గదుల్లో పైనుంచి వేలాడే రంగురంగుల బెలూన్లు, బంగారు రంగులో ధగధగలాడే నక్షత్రాలు, కిటికీలకు ఎర్రని కర్టెన్లు సహా కళ్లుచెదిరే రంగుల అలంకరణలతో ఈ గదుల్లోకి అడుగుపెడుతూనే పండుగ వాతావరణం కనిపిస్తుంది. గదుల్లోని మంచాలపై ఎర్రని దుప్పట్లు, ‘మెర్రీ క్రిస్మస్’ అని రాసి ఉన్న దిండు గలీబులు పండుగ వాతావరణాన్ని మరింతగా ఇనుమడింపజేస్తాయి. ఈ ఆకర్షణ కోసమే చాలా కుటుంబాలు పిల్లలతో కలసి ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి, రోజుల తరబడి బస చేస్తుంటాయి. ఈ హోటల్ గదుల కారిడార్లో ప్రతి సాయంత్రం క్రిస్మస్ బ్యాండ్ సంగీతం అతిథులను ఉర్రూతలూపుతుంది. ఇక్కడ బసచేసే వారికి క్రిస్మస్ మెనూ వంటకాలనే వడ్డిస్తారు. పిల్లలకు ప్రత్యేకంగా చాక్లెట్లు, బాణసంచా, బెలూన్లు వంటివి పంచిపెడతారు. క్రిస్మస్ టోపీలు, పూలగుత్తులు వంటివి కూడా ఇస్తారు. శాంటాక్లాజ్ వేషధారులు పిల్లలకు సర్ప్రైజ్ గిఫ్టులు ఇచ్చి, వారిని ఆనందాశ్చర్యాలలో ముంచెత్తుతారు. ఈ హోటల్లో నిత్యక్రిస్మస్ గదులను బుక్ చేసుకుంటే, ఉచితంగా థీమ్పార్కు టికెట్లు ఇస్తారు. (చదవండి: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సీక్రెట్..! అదొక్కటి చాలు..) -
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్యాషన్ సీక్రెట్..! అదొక్కటి చాలు..
చిరునవ్వుతో ట్రెండ్ సెట్ చేయడమే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టయిలింగ్ టెక్నిక్! మేకప్ కాదు, ఫిట్నెస్, ఫన్ , ఫ్యాషన్ ఈ మూడింటి మిక్స్తో తన లుక్ని మెరిపిస్తుండటం ఆమె అలవాటు. అయితే, ఆమె లుక్లో అసలైన మెరుపు చిరునవ్వులోనే దాగి ఉందట!నేను ఫాలో అయ్యే స్టయిలింగ్ రూల్ ‘ఒకటి ఎక్కువ అయితే, మరొకటి తక్కువ’. అంటే, చెవిపోగులు హెవీగా ఉంటే, మెడలో జ్యూలరీ ఉండదు. డ్రెస్ హైలైట్ అయితే, మేకప్ మ్యూట్గా ఉంటుంది. ఇది నా ఫ్యాషన్ సీక్రెట్! కానీ ఇన్నాళ్ల ఫ్యాషన్ జర్నీలో నేర్చుకున్న అసలైన విషయం ఏంటంటే, ఏది ధరించినా హ్యాపీగా ఉంటే చాలు, అదే బ్యూటీ! అంటోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్అందాన్ని రెట్టింపు చేయాలంటే ముందుగా చేతులనే ముస్తాబు చేయాలి! దానికి బెస్ట్ ఆప్షన్ ఈ ‘హాథ్ ఫూల్’ జ్యూలరీ. ఇది బ్రేస్లెట్ కాదు, రింగ్ కాదు... చేతి మణికట్టు నుంచి వేళ్ల చివరి వరకు సాగే ఒక గొలుసు. ఇది వేసుకున్నాక చూసే వాళ్లు చేతులను చూడకుండా ఉండలేరు. అంతలా అట్రాక్ట్ చేస్తుంది. పూర్వం రాజకుమార్తెలు, మహారాణులు వేసుకునే ఈ ఆభరణం, ఇప్పుడు మోడ్రన్ పెళ్లికూతుర్లకు, ఫ్యాషన్ లవర్స్కి ఫేవరెట్గా మారింది. అయితే, ఇది వేసుకున్నాక చేతులను చాలా జాగ్రత్తగా స్టయిలింగ్ చేసుకోవాలి. హాథ్ ఫూల్ పెద్దదైతే చేతిని వేరే ఏ జ్యూలరీతోనూ స్టయిల్ చేయొద్దు.లేదంటే మీ చెయ్యి ఒక డిజైనర్ షోరూమ్లా కనిపిస్తుంది. సింపుల్ మేకప్, లైట్ జ్యూలరీ, మల్లెపూల బన్ దీనికి బెస్ట్ కాంబినేషన్. అప్పుడు చీర, లెహంగా, అనార్కలీ డ్రెస్ ఏదైనా హాథ్ ఫూల్ వేసుకుంటే లుక్కే మారిపోతుంది. ముఖ్యంగా ఫొటో షూట్స్, మెహందీ ఫంక్షన్లు, సంగీత్ పార్టీల్లో ఇది ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. ఇక్కడ జాక్వెలిన్ ధరించిన జ్యూలరీ బ్రాండ్: కోహార్ బై కనికా, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆమె ధరించిన చీర బ్రాండ్: ఎకయాధర: రూ. 40,075.(చదవండి: సైలెంట్ డీ హైడ్రేషన్..! హెచ్చరిస్తున్న వైద్యులు) -
అమరజీవి ఆత్మశోకం
అవి 20వ శతాబ్దం తొలి దశకాల రోజులు. జాతీయోద్యమం ఊపందుకుంటోంది. గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో నిత్యం జాతీయవాదులు చర్చలు, ప్రణాళిక రచనల్లో మునిగిపోయేవారు. వారిలో అంకితభావంతో పని చేస్తున్న కొందరిని ఎంపిక చేసి ‘మీమీ ప్రదేశాలకు వెళ్లి జాతీయోద్యమం పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయండి’ అని సూచించారు గాంధీజీ. వారిలో ఒకరు పొట్టి శ్రీరాములు. మద్రాసులోని మెరీనా బీచ్లో గాంధీజీ ఉపన్యసిస్తున్నప్పుడు ఓ వ్యక్తి ‘హరిజనులకు ఆలయ ప్రవేశం’ అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని ఉన్నారు. అప్పుడు శ్రీరాములుగారిని వేదిక మీదకు ఆహ్వానించి గాంధీజీ ప్రశంసా పూర్వకంగా ‘శ్రీరాములు వంటి మరో పదకొండుమంది ఉంటే ఏడాదిలో స్వాతంత్య్రం వస్తుంది’ అన్నారు. ఆ తర్వాత కూడా శ్రీరాములుగారు గాంధీజీకి ఉత్తరాల ద్వారా స్వాతంత్య్ర ఉద్యమం గురించి వివరిస్తూ ఉత్తరాలు రాసేవారు. శ్రీరాములు సంస్కరణలుపొట్టి శ్రీరాములు స్వాతంత్య్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహం(1930), క్విట్ ఇండియా ఉద్యమంతోపాటు అనేక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మూడు దఫాలు జైలు పాలయ్యారు. దళితుల అభ్యున్నతి కోసం ప్లకార్డులు పట్టుకుని నెల్లూరు పట్టణంలో ఎర్రటి ఎండలో పాదరక్షలు లేకుండా నడిచారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించడం కోసం దీక్ష చేశారు. నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలోకి అనుమతించిన తరవాత దీక్ష విరమించారు. శ్రీరాములు తలపెట్టిన మరొక మహోన్నత ఘట్టమే తెలుగు వాళ్ల కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు వారికి ఎదురవుతున్న వివక్ష ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించింది. అంతే! శ్రీరాములు గారు మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహారదీక్ష చేపట్టారు. అమరుడి అంతియ యాత్ర‘ఆంధ్ర రాష్ట్ర సాధనకై అక్టోబర్ 19న ప్రాయోపవేశ దీక్ష పూనిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు 15 తేదీ రాత్రి 11.23 గంటలకు పరమపదించారు’ అని 1952, డిసెంబర్ 16వ తేదీన ప్రముఖ దినపత్రిక ఆంధ్రపత్రికలో ప్రచురితమైంది. పొట్టి శ్రీరాములుగారు అమరుడు కావడంతో తెలుగు ప్రజల్లో భావోద్వేగాలు పెల్లుబికాయి. ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న వేలాదిమంది అభిమానులు ‘ప్రతి అరవ వాడు మరణించాలి, మాకు ఆంధ్రరాజ్యం కావాలి’ అని నినదించారు. ఆయన త్యాగానికి గౌరవం 1953, అక్టోబర్ 1న దక్కింది. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలను వేరు చేసి కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956, నవంబర్ 1న ఆంధ్రరాష్ట్రానికి తెలంగాణను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ అవతరించింది. శ్రీరాములు జ్ఞాపకార్థం ఆయన పేరును ఆయన సొంత జిల్లాకు పెట్టాలని అనేక ఉద్యమాలు జరిగాయి. ఎట్టకేలకు 2008 జూన్ 4న నెల్లూరు జిల్లాను శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ప్రభుత్వం అధికారికంగా నామకరణం చేసింది. ఇవన్నీ గుండెను బరువెక్కించే వాస్తవాలు. నేటి చేదు నిజాలుపొట్టి శ్రీరాములు సొంతూరు జువ్వలదిన్నె గ్రామంలో ఆయన ఇంటిని స్మారక భవనంగా మార్చారు. దానికి నిత్యం తాళం వేసి ఉంటుంది. అది కాకుండా జువ్వలదిన్నెలో సముద్ర తీరానికి వెళ్లే దారిలో ఆయన పేరు మీద పర్యాటక శాఖ మరొక స్మారక భవనాన్ని నిర్మించింది. ఆ భవనం తలుపులకు తాళాలు లేవు. నిర్వహణ లేదు. ఆ స్మారక భవనంలో జరుగుతున్న అకృత్యాలకు ఆయన ఆత్మ రోజుకొకసారి మరణిస్తోంది. స్మారక భవనానికి ఎదురుగా రోడ్డుకు అవతల మద్యం దుకాణం. మద్యం ప్రియులు ఆ దుకాణంలో మద్యం కొని స్మారక భవనంలోకి తెచ్చుకుని సేవిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. మద్యసేవనంతో పాటు పేకాట ఆడుతున్న ఆనవాళ్లు కూడా కనిస్తుంటాయి. పర్యాటక శాఖ నిర్మించిన స్మారక భవనం ప్రాంగణంలో శ్రీరాములు విగ్రహం ఉంది. తన కళ్ల ముందే జరుగుతున్న అకృత్యాలకు అమరజీవి ఆత్మ రోదిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.∙వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
2198 కిలోమీటర్ల వేట!
హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో నివసించే రియల్టర్ ఖాదర్ ఖాద్రీ కుమారుడు ఉస్మాన్ ఖాద్రీ (10) 2009లో కిడ్నాప్ అయ్యాడు. బాలుడి తండ్రికి ఫోన్ చేసిన కిడ్నాపర్లు రూ.3 లక్షలు పౌండ్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకోవడానికి టాస్క్ఫోర్స్కు చెందిన అన్ని బృందాలు రంగంలోకి దిగాయి. ప్రధాన నిందితుడి కదలికలపై చిన్న ఆధారం లభించడంతో ఢిల్లీ వెళ్లిన పోలీసులు– అక్కడ నుంచి మొదలు పెట్టి గుజరాత్లోని భరూచ్ చెక్పోస్టు వరకు ఏకబిగిన 2,198 కిలోమీటర్లు వేటాడి పట్టుకున్నారు. శాలిబండకు చెందిన ఖాదర్ ఖాద్రీ, కామాటిపుర ప్రాంతానికి చెందిన ఖాజీ అనీసుద్దీన్ అలియాస్ అనీస్ భాగస్వాములుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఖాదర్ తనను మోసం చేసి నష్టాలు మిగులుస్తున్నాడని భావించిన అనీస్ అతనిపై కక్ష కట్టాడు. ఖాదర్ ఇంట్లో కూడా తిరిగే చనువు ఉన్న అనీస్ అతని కుమారుడు సయ్యద్ ఉస్మాన్ మహ్మద్ ఖాద్రీని కిడ్నాప్ చేసి, డబ్బు వసూలు చేయాలని భావించాడు. దీనికోసం తన సోదరులు ఖాజా షంషుద్దీన్ అలియాస్ అక్రం, ఖాజీ హఫీజుద్దీన్ అలియాస్ అస్లంలతో కలిసి రంగంలోకి దిగాడు. 2009 మే 20న ఖాదర్ ఇంటికి వెళ్లిన అనీస్.. ఆ సమయంలో ఖాదర్ కుటుంబం ఖాజీపురకు వెళుతోందని తెలుసుకున్నాడు. వారి కంటే ముందే ఖాజీపుర చేరుకున్న అనీస్ అక్కడ కాపు కాశాడు.ఆ ఇంటి వద్దకు చేరుకున్న ఉస్మాన్ను బైక్ రైడింగ్ పేరుతో అనీస్ బయటకు తీసుకువచ్చాడు. తన పల్సర్ వాహనంపై ఎక్కించుకుని బహదూర్పుర చేరుకున్న తర్వాత మారుతీ వ్యాన్ తీసుకురమ్మని తన సోదరుడైన అక్రమ్కు సందేశం ఇచ్చాడు. అతడు వచ్చాక ఇద్దరూ బాలుడిని వ్యానులోకి మార్చి శంషాబాద్ వైపు తీసుకువెళ్లారు. బాలుడు కనిపించట్లేదని భావించిన ఖాదర్ అదే రోజు రాత్రి శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. ఖాదర్కు లండన్ ఫోన్ నంబర్ కనిపించేలా ఇంటర్నెట్ ద్వారా కాల్ చేసిన అనీస్... ఉస్మాన్ను తామే కిడ్నాప్ చేశామని, రూ.3 లక్షల మొత్తాన్ని పౌండ్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఆ నెల 22 నుంచి మొదలైన ఈ ఫోన్లు 25 వరకు కొనసాగడంతో మిస్సింగ్ నుంచి కిడ్నాప్గా ఆ కేసు మారింది. ఓపక్క ఇలా ఫోన్లు చేస్తూనే అనీస్... ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి రెండు మూడు రోజుల పాటు ఉస్మాన్ కుటుంబంతో కలిసి బాలుడి కోసం గాలిస్తున్నట్లు నటించాడు. ఆపై హఠాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. నగరం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లిన అనీస్ అక్కడ బోగస్ వివరాలతో రెండు సిమ్కార్డులు తీసుకుని ఢిల్లీ చేరుకున్నాడు. బాలుడి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ బృందం అనీస్ ఇంటిపై దాడి చేసి సోదాలు చేసింది. ఆమె సోదరి రహస్యంగా దాచి ఉంచిన ఈ సెల్ఫోన్ బయటపడింది. దీన్ని వినియోగించి ఆమె అనీస్తో సంప్రదింపులు జరుపుతోందని, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అతడికి చెప్తోందని గుర్తించారు. మరికొందరిని విచారించగా, ఉస్మాన్ను మారుతీ వ్యాన్లో కిడ్నాప్ చేసినట్లు బయటపడింది. దీంతో అనీస్ బాలుడిని తీసుకుని సంచరిస్తున్నాడని భావించిన పోలీసులు అతడు వాడుతున్న సెల్ఫోన్ నంబర్ లోకేషన్ చూసి ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ముగ్గు్గరు అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందం హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీ చేరుకుంది. ఇలా వెళ్లిన అధికారులు సాధారణంగా అక్కడి ఏపీ భవన్లో బస చేసే వాళ్లు. ఈ టీమ్ను రిసీవ్ చేసుకుని, ఏపీ భవన్లో దింపడానికి వీరిలో ఓ అధికారి స్నేహితుడైన ట్రావెల్స్ యజమాని బల్బీర్ సింగ్ స్వయంగా వచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి కేవలం 14 కి.మీ. ఉన్న ఏపీ భవన్లో దింపేసి, తన దైనందిన విధుల్లో నిమగ్నం అవ్వాలని ఆయన భావించారు. ఈ టీమ్ ఏపీ భవన్కు చేరుకునే లోపే హైదరాబాద్ నుంచి మరో అప్డేట్ అందింది. అనీస్ లోకేషన్ రాజస్థాన్లోని జైపూర్ అన్నది దాని సారాంశం. దీంతో బల్బీర్ సింగ్ వాహనంలోనే టాస్క్ఫోర్స్ బృందం జైపూర్ వెళ్లింది. అనీస్ లోకేషన్ అజ్మీర్ మీదుగా అహ్మదాబాద్ చేరుకోవడంతో పోలీసులూ అనుసరించాల్సి వచ్చింది. అనీస్ లోకేషన్ సూరత్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్టాండ్ వద్ద చూపిస్తుండటంతో పోలీసులు అక్కడకు చేరుకుని కాపు కాశారు. హఠాత్తుగా బయలుదేరిన అనీస్... వడోదరా వైపు వెళ్తున్నట్లు హైదరాబాద్లో ఉన్న అధికారులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి అక్కడి టీమ్కు సమాచారం ఇచ్చారు.కేవలం ఏపీ భవన్ వరకే అనుకుని వచ్చిన బల్బీర్సింగ్ సైతం బాలుడిని రక్షించాలనే ఉద్దేశంతో తన వాహనంతో సహా పోలీసులతో కలిసి ప్రయాణించాడు. అహ్మదాబాద్–వడోదరా మధ్య 81.1 కిమీ పొడవునా ఓ ఎక్స్ప్రెస్ హైవే ఉంది. దీనికి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు ద్వారా అనీస్ ప్రయాణిస్తున్నట్లు అతడి సెల్ఫోన్ లోకేషన్ ద్వారా పోలీసులు గుర్తించారు. తాము ఎక్స్ప్రెస్ హైవే మీదుగా వెళ్తే ముందే వడోదరా చేరుకుని కాపు కాయవచ్చని, అక్కడకు మారుతీ వ్యాన్లో వచ్చే అనీస్ను పట్టుకుని బాలుడిని రెస్క్యూ చేయవచ్చని భావించారు. దాదాపు 30 కి.మీ. ప్రయాణించిన తర్వాత అనీస్ లోకేషన్ మళ్లీ అహ్మదాబాద్ వచ్చినట్లు టీమ్కు తెలిసింది. వాహనం ఈ హైవేలో ఓసారి ప్రవేశించిన తర్వాత చివరి వరకు వెళ్లి తిరిగి రావాల్సిందే తప్ప ఎక్కడా యూటర్న్స్ ఉండవు. అంత సమయం లేకపోవడంతో అధికారులు డివైడర్కు అటు–ఇటు రాళ్లు పెట్టి వాటి మీదుగా, అత్యంత ప్రమాదకర రీతిలో యూ–టర్న్ తీసుకుని వెనక్కు వచ్చారు. అనీస్ వద్ద ఉన్న ఫోన్ స్విచాఫ్ కావడంతో అక్కడే వేచి చూస్తూ ఉండాల్సి వచ్చింది.కొన్ని గంటల తర్వాత అనీస్ లోకేషన్ మళ్లీ వడోదరా వైపు హైవే మీద కదలడం మొదలుపెట్టింది. దీంతో అతడి దాంతో పాటు ఈ టీమ్ లైవ్ లోకేషన్లు ఒకేసారి చూసేలా ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. వీరి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఒకరి లోకేషన్ను మరొకరు నాలుగుసార్లు క్రాస్ చేసినట్లు బయటపడింది. అయితే తమ మార్గంలో తమకు ఎక్కడా మారుతీ వ్యాన్ తారసపడకపోవడంతో అనీస్ వేరే వాహనంలో ప్రయాణిస్తున్నట్లు గ్రహించారు. దీంతో ఆ మార్గం చివరలో ఉన్న భరూచ్ టోల్ప్లాజా వద్దకు వెళ్లి కాపు కాశారు. కొద్దిసేపటికి అహ్మదాబాద్లోని నీతా ట్రావెల్స్కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు రావడాన్ని గమనించి టోల్ప్లాజా సిబ్బంది సహకారంతో దాన్ని ఆపారు. అప్పటి వరకు పోలీసుల వద్ద అనీస్ ఫొటో కూడా లేదు. కేవలం గుర్తులు, లొకేషన్, వాహనం ఆధారంగానే గాలిస్తున్నారు. ఆ బస్సు లోపలకు వెళ్లిన ఒక అధికారి గుజరాత్ పోలీసుగా పరిచయం చేసుకుని, రొటీన్ చెకింగ్ మాదిరిగా ఒక్కో ప్యాసింజర్ వద్దకు వెళ్లి గుర్తింపుకార్డు చూపాల్సిందిగా అడిగారు. ఈ అధికారి అనీస్ వద్దకు వెళ్లి గుర్తింపుకార్డు అడగ్గా ‘మేరే పాస్ నయ్యే సాబ్’ అంటూ హైదరాబాదీ హిందీలో సమాధానం ఇచ్చాడు. దీంతో అతడే అనీస్ అని నిర్ధారించిన ఆ అధికారి ‘బహుత్ హోగయా... చల్ రే అనీస్’ అనడంతో తాను చిక్కినట్లు తెలుసుకున్న అతగాడు ‘చలో సాబ్’ అంటూ బస్సు దిగాడు. అక్కడే ఉన్న మిగిలిన ఇద్దరు టాస్క్ఫోర్స్ అధికారులు అతడిని చుట్టుముట్టి మిగిలిన నిందితులు, బాలుడి విషయం ప్రశ్నించగా..వాళ్లు హైదరాబాద్లోనే ఉన్నారని, తాను మాత్రం పోలీసుల దృష్టి మళ్లించడానికి వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ ఫోన్లు చేసి డబ్బు డిమాండ్ చేస్తున్నానని సమాధానం ఇచ్చాడు. అనీస్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భరూచ్ నుంచి హుటాహుటిన హైదరాబాద్కు బయల్దేరారు. అప్పటికి మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఏకబిగిన 1197 కి.మీ. ప్రయాణించినా, బాలుడిని సురక్షితంగా రక్షించాలనే ఉద్దేశంతో విశ్రాంతి విషయం మర్చిపోయి హైదరాబాద్కు పయనయమయ్యారు. టాస్క్ఫోర్స్ బృందంలో కేవలం ఒక్కరికే డ్రైవింగ్ వచ్చి ఉండటంతో ఆ అధికారితో పాటు బల్బీర్ సింగ్ డ్రైవ్ చేసుకుంటూ మరో 1001 కిమీ ప్రయాణించి మర్నాడు హైదరాబాద్ చేరుకున్నారు. అనీస్తో పాటు పోలీసులకు ఇక్కడ వదిలి ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. బాలుడి కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్. నిందితుడు అనీస్ తన చిన్నప్పటి ప్రతీకారం తీర్చుకోవడానికి పోలీసులను వాడుకున్నాడు. అదెలాగో వచ్చేవారం తరువాయి భాగంలో చదవండి.∙శ్రీరంగం కామేష్ -
జానశ్రుతి మహారాజు – రైక్వుడు
పూర్వం జానశ్రుతి అనే మహారాజు ఉండేవాడు. దానధర్మాలలో ఆయనకు సాటి వచ్చే రాజులెరూ లేరు. జానశ్రుతి ధర్మపరాయణుడు. నిత్యం పండిత గోష్ఠి నిర్వహిస్తూ సాధు సత్పురుషుల ప్రసంగాలను శ్రద్ధగా ఆలకించేవాడు. అతిథి అభ్యాగతులను ఆదరించేవాడు. పండితులను ఘనంగా సత్కరించేవాడు. తరచుగా యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, విప్రులకు విరివిగా దానాలు చేస్తూ ఉండేవాడు. జానశ్రుతి పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండేది.ఒకనాడు సాయంత్రం జానశ్రుతి మహారాజు తన ఏడంతస్తుల రాజసౌధం పై అంతస్తులో డాబాపై తూగుటుయ్యాలలో కూర్చుని, విశ్రమిస్తున్నాడు. అదే సమయంలో రెండు రాజహంసలు ఆకాశంలో ఎగురుతూ తమలో తాము సంభాషించుకున్న మాటలు జానశ్రుతి చెవిన పడ్డాయి. ఒక రాజహంస జానశ్రుతి దానశీలతను, ధర్మపరాయణతను పొగడసాగింది. ‘ఇదిగో! ఇదే జానశ్రుతి మహారాజు రాజధాని. భూలోకంలో ఆయనంతటి దాత, ధార్మికుడు, జ్ఞాని మరొకరు లేరు’ అంది.అంతలో మరో హంస ఆ మాటలను కొట్టి పారేస్తూ, ‘చాలు చాల్లే! నీ జానశ్రుతి మహారాజు సంగతి ఎవరికి కావాలోయ్! ముల్లోకాలలోనూ రైక్వుడికి మించిన మహానుభావుడు మరొకడు లేడు. జానశ్రుతి మహారాజు ఎన్ని దానధర్మాలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, బండివాడైన రైక్వుడి పాదాలను కడగడానికి కూడా అర్హుడు కాడు’ అని పలికింది.ఆ రాజహంసలు నిజానికి దేవతలు. భూలోకంలో అసలైన ధార్మికుడు ఎవరో కనిపెట్టే ఉద్దేశంతో రాజహంసల రూపంలో ప్రపంచ సంచారానికి బయలుదేరారు.జానశ్రుతి తల పైకెత్తి ఆ హంసలను గమనించసాగాడు. అవి రెండూ వాదించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ‘రైక్వుడి ముందు జానశ్రుతి మహారాజు ఎందుకూ కొరగాడు’ అందొక హంస.జానశ్రుతి చూస్తుండగానే, అవి దూరంగా ఎగురుతూ కనిపించకుండా పోయాయి.‘రైక్వుడి ముందు ఎందుకూ కొరగాడు’ అనే మాటలు జానశ్రుతి మహారాజులో కలత రేపాయి.ఆనాటి రాత్రి జానశ్రుతికి సరిగా నిద్రపట్టలేదు.మర్నాడు వేకువనే జానశ్రుతి నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, త్వర త్వరగా సిద్ధమై సభాంగణానికి చేరుకున్నాడు. వెంటనే సారథిని పిలిపించాడు.‘సారథీ! రైక్వుడు అనే పేరు గల మహాజ్ఞాని ఎవరో ఉన్నాడట, ఆయన బండివాడట! ఆయన ఎక్కడ ఉన్నాడో వెదికి తీసుకురా! నేను ఆయన పాదపూజ చేసి, ఆయన ద్వారా బ్రహ్మజ్ఞానం పొందుతాను’ అని చెప్పాడు.రాజాజ్ఞతో సారథి రాజధాని నలువైపులా సంచరించి, గాలించాడు. మరోవైపు జానశ్రుతి ఇంకొందరు భటులను కూడా రైక్వుని వెదుకులాట కోసం పంపించాడు. వారు కూడా వెదుకులాట సాగించారు. కొన్నాళ్ల వెదుకులాట తర్వాత రాజధానికి వెలుపల చాలా దూరంలో ఒక బండి కింద గొప్ప తేజస్సుతో వెలుగొందుతున్న వ్యక్తి ఒకరు కనిపించాడు. ఎండ వేడికి అతడి శరీరం చెమటోడుతూ ఉంది. అతడి దుస్తులు మురికిగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లోనూ అతడి ముఖంలో దివ్యతేజస్సు కనిపిస్తూ ఉంది.రాజభటులు అతడిని సమీపించి, ‘మహానుభావా! తమరేనా రైక్వ నామధేయులు?’ అని అడిగారు.‘ఔను! నా పేరు రైక్వుడు’ అన్నాడు.భటులు వెంటనే జానశ్రుతి మహారాజు వద్దకు వెళ్లి, రైక్వుడి తాము ఎక్కడ కనుగొన్నదీ చెప్పారు.జానశ్రుతి మహారాజు వెంటనే బళ్లు సిద్ధం చేయించి, విలువైన బంగారు హారాన్ని, ఆరువందల గోవులను తీసుకుని రైక్వుడి వద్దకు చేరుకున్నాడు.రైక్వుడికి ప్రణామం చేసి, ‘మహానుభావా! నేను జానశ్రుతి మహారాజును. నేను తెచ్చిన ఈ కానుకలను స్వీకరించి, దయతో నాకు బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించండి’ అని వినయంగా అభ్యర్థించాడు.రైక్వుడు ఆ కానుకల వంక ఒకసారి చూసి, వెంటనే చూపు తిప్పేసుకున్నాడు. ‘నువ్వు తగిన దాతవు కాదు. నీ కానుకలను నేను పుచ్చుకోను. వచ్చిన దారినే తిరిగి వెళ్లు’ అని కటువుగా పలికాడు.అప్పటికే బ్రహ్మజ్ఞానం పొందిన రైక్వుడు, ఇకపై సంసారయాత్ర ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్నాడు. జానశ్రుతి మహారాజు తీసుకొచ్చిన కానుకలు అతడి సంసారయాత్రకు సరిపోవు. జానశ్రుతి మహారాజు రాజధానికి తిరిగి వచ్చి, కాస్త ఆలోచించాడు. అతడికి రైక్వుడి మనోగతం కొంత అర్థమైంది.ఈసారి రకరకాల తినుబండారాలను, వెయ్యి గోవులను, విలువైన ఆభరణాలను, ఒక కన్యను కూడా తీసుకుని రైక్వుని వద్దకు పోయాడు. ‘మహానుభావా! నా కానుకలను స్వీకరించి, ఈ కన్యారత్నాన్ని వివాహమాడి గృహస్థాశ్రమం స్వీకరించండి. నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి’ అని కోరాడు.ఈసారి రైక్యుడు ప్రసన్నుడయ్యాడు. జానశ్రుతి తీసుకువచ్చిన కన్యను పరిగ్రహించి, అతడి కానుకలను స్వీకరించి, అతడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. బ్రహ్మజ్ఞానం పొందిన జానశ్రుతి రాజులలో అగ్రగణ్యుడిగా వెలుగొందాడు.∙సాంఖ్యాయన -
ఇసుకను చూసి ఉప్పందిస్తారు!
డిటెక్టివ్ ‘షెర్లాక్ హోమ్స్’ పేరు మీరు వినే ఉంటారు. బ్రిటిష్ రచయిత సర్ ఆర్థర్ కానన్ డోయల్ సృష్టించిన పాత్ర అతడు. నేర పరిశోధనలో అతడిది డేగ దృష్టి! రాలిన వెంట్రుకలు, నేలపై పడి ఉన్న సిగరెట్ పీకలు, ఆఖరికి ఆ... నుసి నుంచి కూడా అతడు నేరస్థుడి జాడల్ని, నీడల్ని కనిపెట్టగలడు. ఆ డిటెక్టివ్ హెర్లాక్ హోమ్స్ని మించిన వారే... ‘పాగీ’లు! గుజరాత్లో, మూడు ఎడారి జిల్లాల సరిహద్దుల్లో నివసిస్తుండే ఈ పాగీలు... ఇసుకలో పాదముద్రలను బట్టి చొరబాటు దారుల వివరాలను చెప్పటంలో సిద్ధహస్తులు. మొన్నటి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాగీలు భారత సైన్యానికి సహాయపడ్డారు.అలా చెప్పేస్తారంతే! సరిహద్దుల్లో శత్రువు కదలికల్ని పసిగట్టేందుకు భారత్ దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. హైటెక్ గాడ్జెట్స్ ఉన్నాయి. సైనికులు నిరంతరం మూడంచెలుగా గస్తీ కాస్తుంటారు. చీమ చిటుక్కున్నా మన తుపాకులు మేల్కొనే శాటిలైట్ వ్యవస్థ ఉంది. ఇవేమీ అవసరం లేకుండానే ‘పాగీ’లు తమ సహజ పరిశీలనా శక్తితో ఎడారిలో ఇసుక ముద్రల్ని డీకోడ్ చేసి సైన్యానికి ఉప్పందించగలరు. పాగీల దగ్గర వంశపారంపర్యంగా సంక్రమిస్తూ వస్తున్న ప్రాచీన అపరాధ పరిశోధనా నైపుణ్యం తప్ప, సాంకేతిక పరిజ్ఞానం ఉండదు. అయినా, ఇసుకపై ముద్రల్ని బట్టి అటువైపు ఎవరు నడిచారు, ఎంతమంది నడిచారు అన్నది విశ్లేషించి చెప్పేయగలరు. కాలం చెల్లినట్లుగా కనిపించే ఈ పాగీలు ఒక విధంగా ఇంటెలిజెన్స్ సిబ్బందికి దీటైనవారు.పేగుల్ని లెక్కపెట్టే వేగులుఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చి చూస్తే పాగీలు ఆదిమానవుల కింద లెక్క. కానీ ఈ మానవ ‘ట్రాకింగ్ వ్యవస్థలు’ ఎడారి చొరబాట్ల వివరాల విశ్లేషణల్లో అత్యంత విశ్వసనీయమైనవి. ఉదాహరణకు : సరిహద్దును ఎవరు దాటారు అన్నదొక్కటే కాకుండా, ఎంత మంది దాటారు? వారు ఏమి మోసుకెళ్లారు? వారి లక్ష్యం ఏమిటి? అన్నవి కూడా పాగీలు అంచనా వేయగలరు. మాదకద్రవ్యాల స్మగ్లర్ల కదలికలను కనిపెట్టటం దగ్గర్నుండి, పూర్తిస్థాయి యుద్ధాల సమయంలో సైనికులకు అత్యవసర సమాచారం అందించటం వరకు ఈ సరిహద్దు సంరక్షకులు దేశం ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. 1965, 1971లో పాకిస్తా¯Œ తో జరిగిన యుద్ధాలలో భారత సైన్యం శత్రు భూభాగాలలో చొచ్చుకు వెళ్లటానికి, శత్రువుల కదలికలను గుర్తించడానికి పాగీల నుండి కీలకమైన సహాయం తీసుకుంది. తరచు యుద్ధాల గమనాన్ని నిర్ణయించటంలో కూడా పాగీల భాగస్వామ్యం ఉంటుంది. మెడలిస్టులు కూడా ఉన్నారుబనస్కాంత, కచ్, పటాన్ జిల్లాల్లో ఉండే పాగీలు ఇటీవలి భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యానికి మళ్లీ కీలకం అయ్యారు. పారంపర్య జ్ఞానమే తప్ప, ఎలాంటి శిక్షణా ఉండని పాగీలు సాధారణ నేత్రాలకు కనిపించని ప్రమాద సూచనలను గుర్తించటంలో అత్యద్భుతమైన ప్రావీణ్యం గలవారు. బనస్కాంత జిల్లాలోని సుయిగామ్ తాలూకా, జలోయా గ్రామానికి చెందిన రేవాజీ రాథోడ్ ఇందుకొక నిదర్శనం. 1927లో జన్మించిన ఆయన 1962 ఆగస్టు 4న పాగీగా పోలీసు దళంలో చేరారు. సుయిగామ్, వావ్, ధనేరా సరిహద్దు ప్రాంతాల వెంబడి 28 ఏళ్లపాటు, రెండు యుద్ధాల సమయంలో భారత దళాలకు భూభాగాలపై మార్గ నిర్దేశం చేశారు. ఆ నైపుణ్యాలు ఆయనకు ‘సంగ్రామ్ మెడల్’ ‘వెస్ట్రన్ స్టార్’ పురస్కారాలతో సహా కీర్తి ప్రతిష్ఠల్ని, గుర్తింపును సంపాదించి పెట్టాయి. రంగంలోకి దూకేందుకు సిద్ధంగుజరాత్ సరిహద్దులో కొన్ని చోట్ల కంచె లేకపోయినప్పటికీ ఆ ప్రాంతాలు సురక్షితంగా ఉండటానికి ఒక కారణం.. పాగీల నిరంతర నిఘా. వారు కేవలం పాదముద్రలను గుర్తించడమే కాదు, వాటిని అర్థం చేసుకుంటారు కూడా. శత్రువు ఎలాంటి బూట్లు వేసుకున్నాడు, ఏ మార్కెట్లలో ఆ బూట్లు అమ్ముడవుతాయి, అలాగే – ఎంత బరువుతో వారి నడక సాగింది, ఆ వెళ్లినవారు స్త్రీలా, పురుషులా అనేది కూడా పాగీలు కనిపెడతారు. అవసరం అయిన వెంటనే భద్రతా దళాలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న 5–10 మంది శిక్షణ పొందిన పాగీలు, వారికి సహాయంగా ఉండే 20 మంది యువకుల బృందం ప్రస్తుతం సైన్యానికి అందుబాటులో ఉంది. ఇరవై ఐదు మందికి ఉద్యోగాలుకొంతమంది పాగీలను అధికారికంగా సైన్యంలోకి తీసుకున్నప్పటికీ, వారి సంఖ్య తక్కువగానే ఉంది. ‘‘వారు ట్రాకర్లు మాత్రమే కాదు, అపరాధ పరిశోధకులు కూడా..’’ అని గుజరాత్ పోలీసు సరిహద్దు పరిధి ఐజీపీ చిరాగ్ కొరాడియా అంటారు. ‘‘పాదముద్రలను బట్టి వారు ఒక వ్యక్తిని గుర్తించగలరు. వారిలో ఎవరైనా బరువులు మోస్తున్నారా, వారి వద్ద జంతువులు ఉన్నాయా అని కూడా తెలుసుకోగలరు. ఇంకా అనేక ఇతర వివరాలను అందించగలరు. 2013 హోమ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించి 2014లో క్లాస్ 4 పే గ్రేడ్లో 25 మంది పాగీలను శాశ్వతంగా నియమించుకున్నాం’’ అని కొరాడియా తెలిపారు. యూనిఫాం ఉండని సైనికులుపాగీలు కేవలం చారిత్రక యోధులు కారు. వారి అవసరం నేటికీ కొనసాగుతోంది. కచ్కు చెందిన 70 ఏళ్ల పాగీ తేజ్మల్జీ సోధా 2001 – 2017 మధ్య సైన్యానికి సహాయంగా పనిచేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణానే కాక, అనేకానేక చొరబాట్లను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించారు. ‘‘వారు ఎంత దూరం వెళ్లినా, నేను కచ్చితంగా ట్రాక్ చేయగలను..’’ అని ఆయన అంటారు. పాగీలు ఇప్పుడు తమకు గుర్తింపును, తగిన పరిహారాన్ని, తర్వాతి తరానికి శాశ్వతకాల ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ‘‘మేము యూనిఫాం ధరించం. అయినప్పటికీ మాతృభూమిని కాపాడతాం’’ అని అంటున్నారు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ఫీల్డ్ మార్షల్ జనరల్ శామ్ మానెక్షాపాగీలలో అత్యంత పురాతన వ్యక్తులలో దివంగత రణ్ ఛోడ్ పాగి ఒకరు. ఆయన అసలు పేరు రణ్ ఛోడ్ రబారి. తన 100వ యేట వరకు ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. యుద్ధాల సమయంలో భారత దళాలకు సహాయంగా ఉన్నారు. జనరల్ శామ్ మా¯ð క్షా స్వయంగా రణ్ ఛోడ్ సేవల్ని గుర్తించి 1971లో రూ. 300 వ్యక్తిగత నగదు బహుమతిని కూడా అందజేశారు. రణ్ ఛోడ్ పాగి 2013లో తన 112 ఏళ్ల వయసులో మరణించిన తర్వాత బి.ఎస్.ఎఫ్. ఆయన గౌరవార్థం బనస్కాంత ఔట్పోస్టులలో ఒకదానికి ఆయన పేరు పెట్టింది. -
ఈ వారం కథ: బతకటానికి భయం ఎందుకు?
ప్రతిరోజూ ఉదయాన్నే ఆఫీసుకు బయలుదేరే ముందు, అద్దంలో నా మొఖం చూసుకోవటం ఎంత పరిపాటో, జేబులోని పర్సులో డబ్బులున్నాయా లేదా అని చూసుకోవటం కూడా అంతే పరిపాటి.పర్సులో కనీసం పది పచ్చ కాగితాలు లేనిదే కాలు బయట పెట్టను. పర్సులో డబ్బులుంటే నా వెంట ఓ వందమంది సైన్యం వున్నంత ధైర్యం ఉంటుంది .నాకే కాదు, ఈ దేశంలో చాలామందికి ధైర్యం చెప్పి ముందుకు నడిపించేవి రెండే: ఒకటి మందు, రెండోది మనీ. మందు కొడితే మన ఎదురుగా మహారాజులున్నా బలాదూర్! అదే మనీ మన జేబుల్లో వుంటే మనమే మహారాజులం. రెండూ వుంటే ఇంక తిరుగేముంది, ఆ కిక్కే వేరు!కాని, ఏం చేస్తాం ప్రతి మధ్య తరగతి మనిషి జీవితం, నెలలో మొదటి పదిహేను రోజులు కృష్ణపక్షంలా, మిగిలిన రోజులు శుక్లపక్షంలా గడచి పోతుంది. నా జీవితం కూడా అంతకన్నా గొప్పగా ఏమీ లేదు.ఫస్టు తారీఖున చేతిలో జీతం పడగానే, ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్లా అనిపిస్తాను నాకు నేను. నెల చివరకు వచ్చే సరికి చేతిలో చిల్లి గవ్వ లేక గుడి ముందు బిచ్చ గాడిలా అనిపిస్తాను. అందుకే అడుగు బయట పెట్టాలంటే భయం వేస్తోంది. జీతం వచ్చి పదిరోజులు అవుతోంది. ముందు జేబులో పర్సు మందం కూడా ఇంకా తగ్గలేదు. అందుకని ఆఫీసుకు వెళ్ళటానికి కారు బయటకు తీశాను. దారిలో బస్టాపు దగ్గర శంకరరావుగారు కనపడ్డారు. ఆయన ఎదురుగా కారు ఆపి, ‘‘రండి సార్! ఎక్కండి. ఆఫీసుకేనా?’’ పలకరిస్తూ ఆయన్ని కారులోకి ఆహ్వానించాను.కాని, అయన మాత్రం సున్నితంగా, ‘‘పర్లేదండి, సిటీ బస్సు వస్తుంది’’ అన్నాడు పొడిపొడిగా, నా ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ.అలా తిరస్కరించటం అది మొదటిసారి కాదు , చివరసారి కాదు. అడిగిన ప్రతిసారి అదే సమధానం.శంకరరావుగారు ఆఫీసులో నాకన్నా బాగా సీనియర్ ఆఫీసర్. నాకన్నా జీతం ఓ లక్ష దాకా ఎక్కువే! కారు కొనుక్కోవడం ఆయనకు పెద్ద సమస్య కాదు, కాని ఎందుకో రోజు బస్సులోనే వస్తారు ఆఫీసుకి. మనిషి కూడా చాలా సాదాసీదాగా వుంటారు. పైజమా లాల్చీ, కాళ్ళకు హవాయి చెప్పులు, భుజాన ఓ చేతి సంచితో.ఆయనకు సెల్ఫోన్ కూడా లేదు. ఈ రోజుల్లో ప్రతి పనికిమాలిన వెధవ దగ్గర ఓ పదివేల సెల్ఫోన్ ఉంటోంది. ఫోన్ లేకుండా ఎలా బతుకుతున్నారు అని చాలాసార్లు అనుకున్నా మనసులో. అలా అని ఆఫీసు ఫోన్ కూడా ఆయన స్వంత పనులకు ఎప్పుడూ వాడినట్లు నేను చూడలేదు. ఆయన కేడర్కు ఆఫీసు వాళ్ళు కారు ఇస్తారు, కాని ఆయన ఏనాడూ ఆఫీసు కారు వాడుకోలేదు.ఇదే విషయం ఆయన్ని ఓ రోజు కదిలించి చూశాను.‘‘నా ఒక్కడికి కారు ఎందుకు? పెట్రోల్ దండగ. పైపెచ్చు మన ఆఫీసు నష్టాల్లో ఉంది’’ అనేవాళ్ళు.‘‘మరి సెల్ఫోన్ ఎందుకు వాడట్లేదు అంటే?’’‘‘సెల్ఫోన్ వాడాల్సినంత అర్జంటు పనులు మనకు ఏముంటాయి చెప్పు’’ అంటూ నవ్వారు.నిజమే! ఆయన మాటల్లో చాలా నిజం వుంది. నాకు కూడా సెల్ఫోన్తో పెద్దగా అవసరం లేదు. కాని, ఓ ఐఫోన్ కొన్నా. నిజానికి నాకొచ్చే జీతానికి ఐఫోన్ కొనటం కష్టమే, కాని ఆఫీసులో నా ఫ్రెండ్స్ కొంటుంటే నేను కొన్నా, వాళ్ళ ముందు లోకువ అవ్వటం ఇష్టం లేక.ఇదే మాట నా స్నేహితుల దగ్గర ప్రస్తావిస్తే, ‘‘ఆయనో చాదస్తపు మనిషి. మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి. కాలం ఎంతో విలువైనది. కాలాన్ని కొనలేము, కాని కొత్త కొత్త సాంకేతిక వస్తువులను కొని కాలాన్ని మిగుల్చుకోవచ్చు’’ అంటూ నాకు క్లాసు పీకాడు వాళ్ళలో ఒకడు.నిజమే స్నేహితులు చెప్పింది కరక్టే కాని, అంత పెద్దాయనకి కాలం విలువ తెలియకుండా వుంటుందా?‘‘చాదస్తమే కాదురా బాబు, పిసినారి కూడా! ఆయన శ్రీమతి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరు. ఆవిడకి ఓ రెండు లక్షల దాకా జీతం వస్తుంది. ఆయనకి, ఆయన భార్యకి కలిపి ఎలా లేదన్నా నెలకు ఓ మూడు నాలుగు లక్షలు వస్తాయి. బస్సుల్లో వేలాడక పోతే ఓ కారు కొనుక్కోవచ్చు కదా? ఎన్నైనా చెప్పు, రోజూ బస్సులోనే వస్తాడు. అదేమంటే, ‘అందరం కార్లు కొంటే వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది, సహజవనరులు కరిగి పోతాయి’ అంటూ మెట్ట వేదాంతం చెబుతాడు. బహుశా, డబ్బు మొత్తం ఏ వడ్డీకో తిప్పుతూ ఉండి ఉండాలి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారమన్నా చేస్తూ ఉండాలి’’ అంటూ ఆయన మీ అభాండాలు వేశాడు మరొకడు.‘‘జీవితం అనుభవించటం చేతకాని మనిషి. ఏమి చేస్తాం జాలి పడటం తప్ప!’’ అంటూ పెదవి విరిచారు అందరూ.నాకెందుకో వాళ్ళు అంటున్న మాటలు కరెక్టు కాదు అనిపిస్తోంది. కాని, కళ్ళెదురుగా కనబడేవి చూస్తుంటే వాళ్ళ మాటలు నిజమే అనిపిస్తోంది. వాళ్ళ మాటల్లో నిజమెంతో తెలుసుకుందామని ఒకసారి ఆయన ఇంటికెళ్లాను.∙∙ ఇల్లు చూడగానే నా స్నేహితుల మాటలే నిజమనిపించాయి. నేనే అమాయకంగా ఆయన్ని ఎక్కువ మంచిగా ఊహించుకున్నాను. ‘బయట చాల సాదాసీదాగా ఉంటాడు కాని, గురుడు చాలా పెద్ద ఇల్లు కట్టాడు’ అని అనుకున్నా మనసులో.అది ఓ రెండంతస్తుల మేడ. లిఫ్ట్ కుడా ఉంది. ఇంటి బయట ఇద్దరు ముగ్గురు నిలబడి ఉన్నారు.శంకరరావుగారి గురించి అడిగాను. పైన రెండో అంతస్తు అని చెప్పగానే, లిఫ్ట్లో పైకి వెళ్లాను. బయట నుంచి కాలింగ్ బెల్ నొక్కగానే, ‘‘ఎవరూ..’’ అంటూ ఆయనే వచ్చి తలుపు తీశారు.నన్ను చూడగానే, ‘‘సురేష్, నువ్వా! ఏమిటి చెప్పా పెట్టుకుండా వచ్చావు.. రా లోపలికి’’ అంటూ లోపలికి ఆహ్వానించాడు. లోపలికి అడుగు పెడుతూ ఇల్లంతా ఒకసారి తేరిపార చూశాను. లోపల అంతా చాలా సాదాసీదాగా ఉంది. ఎటువంటి ఖరీదైన సోఫాలు, ఫర్నిచర్, షోకేసులు వంటివి కనపడలేదు. ఓ మూల మాత్రం పాతకాలం నాటి చెక్కతో చేసిన ఓ రాతబల్ల, దానికెదురుగా రెండు చెక్క కుర్చీలు ఉన్నాయి.ఆ రెండు కుర్చీలను హాలు మధ్యలోకి లాగి, ‘‘కూర్చో..’’ అంటూ ఒక దానికి నాకు చూపించారు.నేను కుర్చీలో కుర్చుంటూ ఉండగా, ఓ పెద్దావిడ బహశా శంకరంగారి శ్రీమతి అనుకుంటా మా దగ్గరకు వచ్చి, ‘‘ఏమండి కింద పేషంట్స్ వెయిట్ చేస్తున్నారు, మళ్ళీ వచ్చి మీకు కాఫీ ఇస్తాను’’ అంటూ సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది.ఒక్క క్షణం ఆమె వైపు చూశాను. చాలా సాదాసీదాగా ఉంది మనిషి. ఒంటిమీద నలిగిపోయిన కాటన్ చీర, చేతులకి మట్టిగాజులు, మెడలో సన్నటి మంగళసూత్రం. ఓ దిగువ మధ్యతరగతి మనిషి భార్య ఎలా ఉంటుందో అలా ఉంది. ఆమె వెళ్ళిన వంకే నేను చూస్తూ ఉంటే, ‘‘ఆవిడ నా శ్రీమతి . తను డాక్టర్, కింద హాస్పిటల్ రన్ చేస్తోంది’’ అన్నారు పొడి పొడిగా.‘అంటే కింద హస్పిటల్ అన్నమాట, అయితే స్నేహితులు అన్నట్లు రెండు చేతులేమి ఖర్మ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు’ అని మనసులో అనుకుంటూ ఉండగా– ‘‘సురేష్.. మంచినీళ్ళు తాగుతావా’’ అనే పిలుపు చెవిన బడటంతో, ‘‘అబ్బే వద్దండి’’ అన్నాను, ఆలోచనల నుండి బయటకు వస్తూ. ‘‘ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పావు కాదు’’ అంటూ అడిగారు శంకరం గారు. ఏం జవాబు చెప్పాలో ముందు అర్థం కాలేదు.‘‘ఏమీ లేదు సార్! మిమ్మల్ని చూస్తుంటే ఒకోసారి నాకే అసూయ వేస్తుంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా చిరునవ్వుతో నడుచుకుంటూ ఓ సామాన్యుడిలా వెళుతుంటారు. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. అందుకే మిమ్మల్ని, మీ ఇంటిని చూద్దామని వచ్చాను’’ అంటూ సమాధానం ఇచ్చాను‘‘చూశావుగా! ఏమనిపించింది?’’ అని అడిగారు‘నీ అంత పీనాసివాడు ఇంకొకడు లేడు’ అని అరుద్దామనిపించింది. కాని సంస్కారం అడ్డు వచ్చి, ‘‘మీరు డబ్బు ఖర్చు పెట్టరనుకుంటా’’ అన్నాను వ్యంగ్యంగా.నా అంతర్యం అర్థం అయ్యిందో ఏమో , ‘‘డబ్బు సంపాదించడం గొప్ప కాదు సురేష్, దాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టకుండా సద్వినియోగం చెయ్యటం గొప్ప’’ అన్నారు శంకరంగారు.‘సద్వినియోగం అంటే వడ్డీలకు తిప్పటం, మూడంతస్తుల మేడలు కట్టటం అన్నమాట’ అని మనసులో అనుకుంటూ, ‘‘అవును సార్... మిమ్మల్ని చూసి తెలుసుకున్నాను’’ అంటూ ఓ జీవంలేని నవ్వు నవ్వాను.‘‘ఏమి తెలుసుకున్నావు..?’’ అంటూ ప్రశ్నించారు.ఏమి జవాబు చెప్పాలో తెలియక తెల్లమొహం వేశాను.‘‘సరే... నా వెంటరా’’ అంటూ నన్ను వెంట బెట్టుకుని కింది అంతస్తుకు తీసుకు వెళ్ళారు.అక్కడ ఓ చిన్నసైజు కార్పొరేట్ హాస్పిటల్ దర్శనం ఇచ్చింది. ఓ పదిమంది పేషంట్స్ బయట రిసెప్షన్ దగ్గర కూర్చుని ఉన్నారు.‘‘ఇది మా స్వంత హాస్పిటల్. నా శ్రీమతే వైద్యం చేస్తుంది. పగలు ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తుంది. సాయంత్రం ఇక్కడ.’’వాళ్ళని దాటుకుని లోపలకి వెళ్ళాం ఇద్దరం. అక్కడ ఓ పెద్ద హాలు ఉంది. అందులో బెడ్స్ వరసగా వేసి ఉన్నాయి.వాటి మీద పేషంట్స్ పడుకుని ఉన్నారు.మమ్మల్ని చూడగానే అక్కడున్న వాళ్ళందరూ లేచి నమస్కారం చేశారు. వాళ్ళని శంకరరావుగారు ‘‘ఎలా వున్నారు..’’ అంటూ పలకరించసాగారు.‘‘బాగున్నాను అయ్యా! మీ దయ వల్ల జబ్బు తగ్గిపోతోంది’’ అంటూ ఓ పెద్దావిడ నమస్కారం చేసింది.‘‘సురేష్! వీళ్ళందరూ చాలా పేదవాళ్ళు. ఒక పూట భోజనానికి కూడా నోచుకోని వాళ్ళు. వీళ్లందరికీ ఇక్కడ ఉచిత వైద్యం అందిస్తున్నాము’’ అంటూ చెప్పుకుపోతున్నారు.‘‘అవునయ్యా! మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు’’ అంటూ నమస్కారం చేశాడు మరో నడి వయస్కుడు.‘‘వైద్యమే కాదండి.. ఉచితంగా భోజన సదుపాయాలు కూడా అందిస్తున్నారు.. దేవుళ్ళు’’ అంటూ మా దగ్గరకి వచ్చాడు మరో ముసలాయన.‘‘నాదేముంది, ఆ భగవంతుడు ఇస్తున్నాడు. అదే మీకు ఖర్చు పెడుతున్నాను’’ అంటూ నవ్వేశారు.బయటకొస్తుంటే ఒక పేషంట్ ఎదురు పడ్డాడు, అతని వాలకం చూస్తుంటే డిశ్చార్జ్ అయినట్టున్నాడు.అతన్ని చూస్తూ, ‘‘డబ్బు తీసుకున్నావా? ఆరోగ్యం జాగ్రత్త. జబ్బు తగ్గే దాక అట్టే కష్టపడకు’’ అన్నారు శంకరంగారు. ‘‘అలాగే సార్..’’ అంటూ ఆయనకు నమస్కారం చేశాడు.‘‘సురేష్ కిందకి వెళ్దాం రా’’ అంటూ గ్రౌండ్ ఫ్లోరుకు దారితీశారు.అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యపోయాను. అంతా ఒక కలలా వుంది. నేను నా స్నేహితుల మాట విని ఆయన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అర్థమయ్యింది ఆ క్షణాన.‘‘ఏమిటి సురేష్ ఆగిపోయావ్ ..’’ అన్నారు నా వంక చూస్తూ.‘‘అబ్బే, ఏమీ లేదు.. వస్తున్నా సార్ ’’ అంటూ ఆయన వెనకాలే నడుస్తూ ‘‘సార్! ఉచితంగా వైద్యం చేస్తున్నారు, భోజనం కూడా పెడుతున్నారు. మళ్ళీ డబ్బులిస్తున్నారేమిటి పేషంట్లకి?’’ అనుమానంగా అడిగాను.‘‘జబ్బు నయం అయినంత మాత్రాన, పని చేసుకోవటానికి ఓపిక ఉండాలి కదా? అందుకనే ఓ నాలుగు రోజులకు సరిపడ సరుకులు, వాళ్ళ ఊరు వెళ్ళటానికి చార్జీలు ఇచ్చి పంపుతాను’’ అన్నారు నవ్వుతూ.ఆయన మాటలు విన్న నేను, ఆయన పెద్ద మనసుకు మనసులోనే జోహార్లు అర్పించాను.కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద డైనింగ్ హాలు, పక్కనే వంటశాల ఉంది. పక్కనే దానికి ఆనుకుని స్టోర్ రూము. స్టోర్ రూము నిండా సరుకులున్నాయి. డైనింగ్ హాలులో చాలామంది కూర్చొని ఉన్నారు. బహుశా భోజనం కోసం అనుకుంటా!ఆయన వాళ్ళని చిరునవ్వుతో పలకరిస్తూ, నేరుగా వంటగదిలోకి వెళ్ళి, ‘‘ఇవాళ ఏమి వండుతున్నారు..’’ అంటూ అక్కడి వంట వాళ్ళను పలకరించారు‘‘ముక్కల పులుసు, బీట్రూట్ కూర సార్’’ అన్నాడు వంటవాళ్ళలో ఒకడు.వంటగదిలో నుంచి బయటకు వచ్చి,‘‘రోగుల కూడా వచ్చిన బంధువులకు ఇక్కడ ఉదయం టిఫిన్తో సహా రెండు పూటలా భోజనం పెడతాము, ఉచితంగా’’ అన్నారు.ఆయన మాటలు వింటుంటే నా కళ్ళలో నుంచి అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చాయి. ‘ఇంత మంచిమనిషిని అనవసరంగా అపార్ధం చేసుకున్నాను’ అని నన్ను నేను నిందించుకున్నాను.నా కన్నీళ్లు చూసి, ‘‘ఏమిటి సురేష్? ఏమైయ్యింది.. ఎందుకా కన్నీళ్ళు..’’ కంగారుగా అడిగారు.‘‘మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నా సార్! నన్ను క్షమించండి’’ అంటూ ఆయన చేతులు పట్టుకున్నా.‘‘ఛఛ.. అవేం మాటలు.. ఊరుకో! నువ్వే కాదు, నా గురించి తెలియని చాలామంది నీలానే అనుకుంటారు’’ అంటూ అనునయించారు.‘‘మీరు దేవుడు సార్..’’ అన్నాను గద్గద స్వరంతో.‘‘అంత పెద్ద మాటలు వద్దు సురేష్. ఆ భగవంతుడు నాకేదో ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన దాంట్లో కొంత నలుగురికీ పంచుతున్నా అంతే!’’అన్నారు చాలా నెమ్మదిగా.‘‘అది అందరి వల్లా సాధ్యం కాదు సార్..’’ అన్నాను ఆయన కళ్ళలోకి చూస్తూ.‘‘ఎందుకు సాధ్యం కాదు? కాస్త నాది, నేను అనే స్వార్థం వీడితే అది సాధ్యం అవుతుంది. కాని, చాలామందికి బతుకు మీద భయం. రేపు ఏమవుతుందో అని లక్షలకు లక్షలు వెనకేస్తుంటారు.. పిరికివాళ్ళు’’ ‘‘అవును సార్! వాళ్ళలో నేనూ ఒకడిని’’‘‘చూడు సురేష్! నేను ఏనాడూ నా జేబులో డబ్బు లేదని బాధపడలేదు, భయపడలేదు. ఎవ్వరి ముందూచెయ్యి చాచలేదు. నేను ఈ హాస్పిటల్ ఉచితంగా నడపకుండా, ఆ డబ్బు వెనకేస్తే మరో రెండు మేడలు కట్టేవాడిని. మా ఆవిడ మెడలో మరో నాలుగు నెక్లెస్సులు వేలాడదీసేవాడిని లేదా హాయిగా నాలుగు కార్లలో తిరిగేవాడిని. కాని అదే డబ్బుతో ఓ పది మంది ప్రాణాలు నిలుపుతున్నా. ఓ పది కుటుంబాలు రోడ్డున పడకుండా చూస్తున్నా. అదే గొప్ప తృప్తిని, గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మనం సంపాదించిన డబ్బుకు అప్పుడే నిజమైన విలువ ఏర్పడుతుంది’’ అంటూ చెప్పుకొచ్చారు‘‘అవును సార్! డబ్బు విలువ అంటే ఏమిటో ఇప్పుడే నాకు అర్థం అవుతోంది’’ అన్నాను.‘‘అంతేకాదు సురేష్, మనం సుఖంగా బతకటానికి కావలసిన వస్తువులన్నీ కొంటే భౌతికమైన భద్రత దొరుకుతుందేమో కాని, మానసికంగా మాత్రం అభద్రత వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే, మనం కొన్న వస్తువులు, కార్లు, ఫోన్లు ఇవేవీ మనకు తోడు రావు. మనం సాయం చేసిన మనుషుల్లో కొంతమందైనా మన వెనక వస్తారు. వాళ్ళు మన వెనక ఉన్నారు అనేది మనకు కొండంత మానసిక ధైర్యం ఇస్తుంది’’అప్పటికి గాని నాకు అర్థం కాలేదు ఓ సెల్ఫోన్ లేకుండా, సొంత కారు లేకుండా, జేబులో పది రూపాయలు కూడా లేకుండా ధైర్యంగా ఎలా మనగలుగుతున్నారో!‘‘మరొక మాట సురేష్ , నువ్వు నిజాయితీగా ఉన్నంత కాలం నువ్వు ఎవ్వరికీ భయపడక్కరలేదు. మనం చేసే తప్పులే మనకు శత్రువులు. అవే మనల్ని వెంటాడుతూ భయపెడుతుంటాయి. చాలామంది స్తోమతకు మించి అప్పులు చేసి, ఖర్చు పెట్టి వాటిని తీర్చలేక భయపడుతుంటారు. నిజానికి మనకి ఎవ్వరూ శత్రువులు లేరు సురేష్. మనకు మనమే శత్రువులం’’ అంటూ ముగించారు‘‘నిజం సార్! మీరు మానసికంగా చాలా ధైర్యవంతులు. మీలా ఉండగలనా..?’’ అంటూ ప్రశ్నించా.‘‘ఎందుకు ఉండలేవు? నాలో ఉన్నదేమిటి, నీలో లేనిదేమిటి? ప్రయత్నించి చూడు, తప్పక ధైర్యవంతుడివి అవుతావు’’ అన్నారు నవ్వుతూ.వచ్చిన పని అయిపోవటంతో ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను.మరుసటి రోజు ఆఫీసుకు బయలుదేరే ముందు నన్ను నేను అద్దంలో చూసుకున్నా. ఎందుకో కొత్తగా అనిపించా. అలా ఎందుకు అనిపించానో నాకు అర్థమయ్యింది. అందుకే జేబులోని పర్సును మాత్రం బయటకు తియ్యలేదు. డబ్బుతో ఓ పదిమంది ప్రాణాలు నిలుపుతున్నా. ఓ పది కుటుంబాలు రోడ్డున పడకుండా చూస్తున్నా. అదే గొప్ప తృప్తిని, గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తుంది. మనం సంపాదించిన డబ్బుకు అప్పుడే నిజమైన విలువ ఏర్పడుతుంది. -
అతి చేరువలో అమరత్వం!
అమరత్వం మానవాళి పురాకాంక్ష.. ఇంతవరకు అది ఒక అపూర్ణస్వప్నం..అమరత్వం అసాధ్యమైనదేమీ కాదు, అచిరకాలంలోనే సాధ్యమవుతుందట!అపూర్ణస్వప్నంగా మిగిలిన అమరత్వం అచిరకాలంలోనే సాధ్యమవుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రకటనలు మానవాళిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. భౌతిక శరీరంతో యథాతథంగా అమరత్వం పొందడానికి ఇంకా చాలాకాలమే పట్టవచ్చు గాని, సాంకేతిక అమరత్వం సాధించడానికి అట్టేకాలం పట్టదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరణం తర్వాత శరీరం నుంచి వేరుపడిన మానవ చేతనను కంప్యూటర్లలోకి అప్లోడ్ చేయడం ద్వారా సాంకేతిక అమరత్వం సాధించే ప్రక్రియ మరో పాతికేళ్లలోనే అందుబాటులోకి రాగలదని అంచనా వేస్తున్నారు. ఇప్పటి ప్రమాణాల ప్రకారం ఒక మనిషి వందేళ్లు బతకడమే చాలా గొప్ప. అయితే, ఇదివరకటితో పోల్చుకుంటే, ప్రపంచవ్యాప్తంగా శతాయుష్కుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. మరో పాతికేళ్లలో వైద్యరంగం సాధించే అభివృద్ధి మానవుల ఆయుఃప్రమాణాన్ని గణనీయంగా పెంచగలదని శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. మనుషులు భౌతిక అమరత్వం సాధించడానికి ఇంకెంత కాలం పడుతుందో ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నా, మనుషులు శతాయుష్షును అధిగమించడం త్వరలోనే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక పురోగతి మరింత వేగం పుంజుకుంటే, మనుషులు దాదాపుగా భౌతిక అమరత్వం సాధించడం కూడా అసాధ్యమేమీ కాదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమరత్వ భావన గురించి, అమరత్వ సాధన దిశగా శాస్త్ర సాంకేతిక పరిశోధకులు సాగిస్తున్న పరిశోధనలు, శాస్త్రవేత్తల అంచనాలను గురించి స్థూలంగా తెలుసుకుందాం.నాలుగేళ్లలోనే యంత్రాలతో అనుసంధానం‘మరో నాలుగేళ్లలోనే కృత్రిమ మేధ పూర్తిగా అభివృద్ధి చెంది, మానవ మేధకు దీటుగా తయారవుతుంది. మానవులు యంత్రాలతో అనుసంధానమయ్యే కొత్త శకం ప్రారంభమవుతుంది. కంప్యూటర్లు, ఆండ్రాయిడ్ శరీరాల ద్వారా మనుషులు అమరత్వం పొందే పరిస్థితులు 2045 నాటికే సాధ్యమవుతాయి. ఈ సాంకేతికత మరింతగా అభివృద్ధి చెంది 2050 నాటికి అపర కుబేరులకు అందుబాటులోకి వస్తుంది’ అని గూగుల్ ఇంజినీరింగ్ డైరెక్టర్ రే కర్జ్వీల్ చెబుతున్నారు. ఇదివరకు ఆయన వేసిన సాంకేతిక అంచనాలు పూర్తిగా నిజయం కావడంతో మనుషుల అమరత్వంపై ఆయన తాజా అంచనాలు కూడా నిజం కాగలవని ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిశోధకుల్లో చాలామంది విశ్వసిస్తున్నారు. కంప్యూటర్లు చదరంగం చాంపియన్లను ఓడించగలవని, స్మార్ట్ఫోన్లు సామాన్యుల చేతుల్లోకి రాగలవని కర్జ్వీల్ దశాబ్దాల కిందటే అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా అంచనాలపై శాస్త్ర సాంకేతిక రంగంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.పన్యాల జగన్నాథదాసుఅమరత్వం పొందాలనేది మనిషి చిరకాల స్వప్నం. ఎంతటి ధైర్యశాలి మనిషినైనా భయపెట్టేవి రెండే రెండు: అవి జరా మరణాలు. పురాణకాలం నుంచే జరా మరణాలను జయించాలనే తపన మనుషుల్లో ఉంది. ప్రాక్ పాశ్చాత్య పురాణాలలో ఇందుకు సంబంధించిన గాథలు కనిపిస్తాయి. అమరత్వం కోసమే దేవ దానవులు క్షీరసాగర మథనం చేశారు. క్షీరసాగరం నుంచి పుట్టిన అమృతాన్ని సేవించడం వల్లనే దేవతలు అమరులయ్యారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి గాథ పురాతన గ్రీకు పురాణాల్లోనూ ఉంది. ‘అంబ్రోజియా’ అనే ఆహార పదార్థాన్ని ఆరగించి, ‘నెక్టర్’ అనే అమృతంలాంటి పానీయాన్ని సేవించడం వల్లనే ఒలింపస్ పర్వతంపై నివసించే దేవతలు అమరులుగా మారారని గ్రీకు పురాణాల కథనం. ప్రపంచంలోనే ఆది పురాణమైన ‘గిల్గమేష్’లో కూడా అమరత్వ భావనకు ఉంది. ‘గిల్గమేష్’ క్రీస్తుపూర్వం 2100 సంవత్సరాల నాటిది. అంటే, అప్పటి నుంచే అమరత్వం సాధించాలనే తపన మనుషుల్లో ప్రబలంగా ఉండేదనడానికి ఇదొక నిదర్శనం.ఆ తర్వాత వచ్చిన కాల్పనిక సాహిత్యంలోనూ అమరత్వంపై అనేక కల్పనలు ఉన్నాయి. ఆంగ్లో–ఐరిష్ రచయిత జొనాథన్ స్విఫ్ట్ రాసిన ‘గలివర్స్ ట్రావెల్స్’లో ‘లుగ్నాగ్’ అనే కాల్పనిక ద్వీపరాజ్యంలో ఉండే ‘స్ట్రల్బ్రగ్స్’ అనే మనుషులు ఎంత వృద్ధులైపోయినా, మరణం లేకుండా ఉంటారు. అమరత్వం చుట్టూ ఎన్ని కల్పనలు ఉన్నా, చాలామంది దానిని ఎప్పటికీ నెరవేరని కలగానే భావిస్తూ వచ్చారు. పుట్టిన వారికి మరణం తప్పదని, అది ప్రకృతి సహజ ధర్మమని చెబుతూ వచ్చారు. భగవద్గీత కూడా ఇదే విషయాన్ని ‘జాతస్య హి ధ్రువో మృత్యుః’ అని చెప్పింది. అయినా మనిషికి అమరత్వం మీద ఆశ చావలేదు. అమరత్వ సాధనకు ప్రయత్నాలనూ మానుకోలేదు.శాస్త్రవేత్తల ప్రయత్నాలుమరణానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. వీటిలో అతి సాధారణమైన కారణం వార్ధక్యం. ఇప్పటికీ చాలామంది వార్ధక్యాన్ని జీవితంలో ఒక సహజమైన దశగానే పరిగణిస్తున్నారు. కొందరు వైద్య శాస్త్రవేత్తలు మాత్రం వార్ధక్యాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తున్నారు. ఎలాంటి వ్యాధికైనా నివారణ మార్గాన్ని కనుగొనడమే శాస్త్రవేత్తల పని. అంతకంటే ముందుగా వ్యాధి మూలకారణాన్ని కనుగొనడం ముఖ్యం. శరీరంలోని జీవకణాలకు వయసు మళ్లకుండా నిరోధించగలిగితే, వార్ధక్యాన్ని నివారించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. కనీసం శరీరంలోని జీవకణాల్లో వయసు మళ్లే ప్రక్రియను నెమ్మదించేలా చేయగలిగితే గణనీయంగా ఆయుర్దాయాన్ని పొడిగించడం సాధ్యమవుతుందని వారు అభిప్రాయ పడుతున్నారు. జీవకణాల్లో వయసు మళ్లే ప్రక్రియ నెమ్మదించేలా చేయడానికి, కుదిరితే పూర్తిగా వయసు మళ్లే ప్రక్రియను నిలిపివేయడానికి సాధ్యమయ్యే మార్గాలపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇందుకు అనేక ప్రయోగాలను సాగిస్తున్నారు. బ్రిటిష్ ఫ్యూచరాలజిస్ట్ ఇయాన్ పియర్సన్, గూగుల్ ఇంజినీరింగ్ డైరెక్టర్ రే కర్జ్వీల్, బ్రిటిష్ జన్యుశాస్త్ర నిపుణుడు అబ్రీ డి గ్రే వంటి శాస్త్రవేత్తలు 2050 నాటికల్లా కంప్యూటర్లలోకి, రోబోలలోకి మెదడులోని ఆలోచనలను అప్లోడ్ చేసే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని, అప్పుడు ప్రపంచంలోని అపర కుబేరులు ఈ ప్రక్రియ ద్వారా అమరత్వాన్ని పొందగలరని అంచనా వేస్తున్నారు. మరో పాతికేళ్లలో ప్రపంచంలోని సంపన్నులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని, మరణానంతరం తమ చేతనను కంప్యూటర్లలోకి లేదా రోబోల వంటి ఆండ్రాయిడ్ శరీరాల్లోకి అప్లోడ్ చేయడం ద్వారా అమరత్నాన్ని సాధించగలరని ఇయాన్ పియర్సన్ చెబుతున్నారు. మరో నాలుగేళ్లలోనే– అంటే, 2029 నాటికల్లా మానవ మేధకు దీటుగా కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతుందని అబ్రీ డి గ్రే చెబుతున్నారు. మానవ మేధకు దీటైన స్థితికి కృత్రిమ మేధ చేరుకున్నాక మనుషులకు, యంత్రాలకు మధ్య అనుసంధానం తేలికవుతుందని, ఈ ప్రక్రియ ద్వారా 2045 నాటికే మనుషులు అమరత్వం సాధించే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. అంతేకాదు, రానున్న పాతికేళ్లలో వైద్యరంగం కూడా శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని, 2050 నాటికి వార్ధక్యాన్ని నయం చేయగలిగే పరిస్థితులు ఏర్పడతాయని, ఫలితంగా 2050 తర్వాత మనుషులు వెయ్యేళ్లకు పైగా ఆయుర్దాయాన్ని పొందగలుగుతారని కూడా గ్రే అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని అమిత సంపన్నులు 2050 నాటికల్లా తమ భౌతిక మరణం తర్వాత కూడా అమరులుగా ఉండటానికి సాంకేతికతను వినియోగించుకుంటారని, తమ చేతనను కంప్యూటర్లలోకి, ఆండ్రాయిడ్ శరీరాల్లోకి అప్లోడ్ చేయడం ద్వారా అమరత్వాన్ని సాధించగలుగుతారని పియర్సన్ చెబుతున్నారు. తొలినాళ్లలో ఈ సాంకేతికత చాలా ఖరీదుగా ఉంటుందని, మరో దశాబ్దం తర్వాత ఎగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. కంప్యూటర్లలోకి, ఆండ్రాయిడ్ శరీరాల్లోకి మేధా చేతనను అప్లోడ్ చేసే సాంకేతికత 2060 నాటికల్లా కొంత తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి రాగలదని చెబుతున్నారు. ఇదేకాలంలో వైద్యరంగం కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని; క్యాన్సర్, గుండెజబ్బులు వంటి ప్రాణాంతకమైన వ్యాధులను పూర్తిగా నయం చేయగలిగే చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తాయని; జన్యు సవరణ పద్ధతులు మరింతగా అభివృద్ధి చెంది, వయసు మళ్లిన కణాల వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించగలిగే స్థాయికి చేరుకుంటుందని పియర్సన్ చెబుతున్నారు. త్రీడీ ప్రింటింగ్ ద్వారా కృత్రిమ అవయవాల తయారీ, కృత్రిమ మేధ సహాయంతో రూపొందే చికిత్స పద్ధతులు రానున్న కొద్ది దశాబ్దాల్లోనే మనుషుల ఆయుర్దాయాన్ని గణనీయంగా పొడిగించగలవని ఆయన అంటున్నారు.‘మ్యూటంట్’ మానవులుమనుషులకు మానవాతీత శక్తులు ఉండటం కాల్పనిక సాహిత్యంలోను, సినిమాల్లోను మాత్రమే చూసి ఉంటాం. ఇలాంటి మానవులు త్వరలోనే మన మధ్య సంచరిస్తారని, మరో ఐదేళ్లలోగా ‘మ్యూటంట్’ మానవులు మన మధ్య తిరుగాడుతారని లండన్కు చెందిన ఫ్యూచరిస్ట్, టెక్నాలజీ ఇన్వెస్టర్ హెర్బర్ట్ సిమ్ చెబుతున్నారు. కొత్తగా రాబోయే ఈ ‘మ్యూటంట్’ మానవజాతిని ‘ఎక్స్–మెన్’గా అభివర్ణిస్తున్నారు. జన్యు ఉత్పరివర్తనల ద్వారా రూపొందే ఈ ‘పరివర్తిత’ మానవులు లేదా ‘మ్యూటంట్’ మానవుల శక్తి సామర్థ్యాల ముందు ప్రస్తుతం ఉన్న మానవుల శక్తి సామర్థ్యాలు ఎందుకూ కొరగావని సిమ్ చెబుతున్నారు. త్వరలోనే ‘మ్యూటంట్’ మానవుల రాకతో ఇప్పటి ఆధునిక మానవులు వాడుకలో పనికిరాకుండా పోతారని ఆయన అంచనా వేస్తున్నారు. ‘మ్యూటంట్’ మానవుల రూపకల్పన కోసం చేపట్టే పరిశోధనలకు హెర్బర్ట్ సిమ్ భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తున్నారు. హెర్బర్ట్ సిమ్ తన స్టార్టప్ సంస్థ ‘న్యూరోచిప్ డాట్ కామ్’ ద్వారా ‘మ్యూటంట్’ మానవుల రూపకల్పన కోసం ప్రయోగాలు సాగిస్తున్నారు. మెదడులోని ఆలోచనలను చదవగల హెల్మెట్పై ఆయన ప్రయోగాలు చేపడుతున్నారు. ‘మ్యూటంట్’ మానవులు ప్రాణాంతక వ్యాధులను సైతం తట్టుకుని, సులువుగా ఐదువందల ఏళ్లు బతకగలరని సిమ్ చెబుతున్నారు.అమరత్వంపై నైతిక మీమాంసలుఅమరత్వం చేరువలోనే సాధ్యమవుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమరత్వ సాధన ఎలా ఉన్నా, మానవుల ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుందని పలువురు శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. ఈ పరిణామాలు సంభవిస్తే, భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మానవులు అమరత్వం సాధించినా, కనీసం శతాబ్దాల తరబడి బతకగల స్థితికి చేరుకున్నా, ప్రపంచం మరింత జటిలంగా మారుతుందని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రపంచ జనాభా అదుపు తప్పి పెరుగుతుందని, అప్పుడు వనరుల పంపిణీలో మరిన్ని వ్యత్యాసాలు తలెత్తి, మనుషుల మధ్య కీచులాటలు, నేరాలు పెరుగుతాయని, దేశాల మధ్య యుద్ధాలు పెచ్చరిల్లుతాయని వారు హెచ్చరిస్తున్నారు. మనుషులు అమరులైతే, జనాభా మరింతగా పెరగడం తప్ప ప్రపంచానికి ప్రయోజనం ఉండదని, పైగా పర్యావరణానికి తీరని హాని జరుగుతుందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జీవితంలో మరణం ఒక సహజ పరిణామమని, మరణం ఉన్నప్పుడే మనుషులకు జీవితం విలువ అర్థమవుతుందని, మరణమే లేకుండాపోతే జీవితానికి విలువ ఉండదని, అలా ఎంతకాలం జీవించినా దండగేనని కొందరు తత్త్వవేత్తలు పెదవి విరుస్తున్నారు. ఎవరు ఏమన్నా, ‘అమరత్వం అతి చేరువలోనే’ అని ఊరిస్తున్న శాస్త్రవేత్తలు మాత్రం తమ పరిశోధనలను మరింత ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నారు.త్వరలో జరగబోయే పరిణామాలుఅమరత్వ సాధన దిశగా త్వరలోనే పలు పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఎప్పుడెప్పుడు ఏయే మార్పులు జరుగనున్నాయో చూద్దాం.. 2029ఈ ఏడాది నాటికి మానవులకు, యంత్రాలకు అనుసంధానం ఏర్పడుతుంది. మనుషులు తమ మేధా చేతనను కంప్యూటర్లలోకి లేదా ఆండ్రాయిడ్ శరీరాల్లోకి ఎక్కించగలుగుతారు. ఆ విధంగా భౌతిక మరణం తర్వాత కూడా జీవితాన్ని కొనసాగించగలుగుతారు.2050ఈ ఏడాది నాటికి వైద్యరంగం వార్ధక్యాన్ని ఇతర వ్యాధుల మాదిరిగానే నయం చేయగలదు. జన్యు సవరణ పరిజ్ఞానం వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించే స్థాయికి అభివృద్ధి చెందగలదు. అబ్రీ డి గ్రే చెబుతున్న ప్రకారం వెయ్యేళ్లు బతకగల మనుషులు ఇప్పటికే పుట్టి ఉంటారు. జీవకణాల వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించే పద్ధతులపై పరిశోధనల కోసం డి గ్రే ‘లాంజివిటీ ఎస్కేప్ వెలాసిటీ ఫౌండేషన్’ నెలకొల్పి, ఇతర శాస్త్రవేత్తలతో కలసి విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నారు.2030మనుషులకు, యంత్రాలకు మధ్య దాదాపుగా ఏకత్వం ఏర్పడుతుంది. మరణం వల్ల మనుషుల భౌతిక శరీరం అంతరించిపోయినా, యంత్ర శరీరాల ద్వారా మనుగడ సాగించగల సాంకేతికత అభివృద్ధి చెందుతుంది. మనుషులకు, యంత్రాలకు మధ్య ఏకత్వం చేరువలోనే ఉందంటూ, సరిగా ఏడాది కిందట– 2024 జూన్లో రే కర్జ్వీల్ ‘ది సింగులారిటీ ఈజ్ నియరర్’ పేరుతో పుస్తకం రాశారు.2045ఈ ఏడాదిలోగా మనుషులు మరణానంతరం ‘సైబోర్గ్’లుగా మనుగడ కొనసాగించగలరు. కంప్యూటర్లలోకి అప్లోడ్ చేసిన మేధాచేతనను ఇతర అధునాతన సాంకేతికతతో రూపొందించిన యంత్ర శరీరాల్లోకి డౌన్లోడ్ చేయడం సాధ్యమవుతుంది. ఈ యంత్ర శరీరాలు మనుషుల మాదిరిగానే పని చేస్తాయి.వార్ధక్య నివారణ సుసాధ్యంకొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా 2050 నాటికి అమరత్వ సాధన మాట ఎలా ఉన్నా, ‘సెనోలైటిక్’ ఔషధాలతో వార్ధక్య నివారణ సుసాధ్యమవుతుందని బ్రిటిష్ శాస్త్రవేత్త ఆండ్రూ స్టీల్ చెబుతున్నారు. ఈ అంశంపై ఆయన ‘ఏజ్లెస్’ అనే పుస్తకం రాశారు. ‘సెనోలైటిక్’ ఔషధాలు శరీరంలోని మృతకణాలను, జోంబీ కణాలను తొలగించి, జీవకణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి వార్ధక్య లక్షణాలను వెనక్కు మళ్లించడంతో పాటు ఆయుర్దాయాన్ని గణనీయంగా పొడిగించడానికి ఉపయోగపడతాయి. వార్ధక్యం వల్ల మరణం సంభవించడమనేది 2050 తర్వాత చరిత్రగానే మిగిలిపోతుందని ఆండ్రూ స్టీల్ చెబుతున్నారు. -
సేఫ్టీ గాడ్జెట్స్.. ఈ టైంలో హెల్ప్ అయ్యే సేఫ్టీ గాడ్జెట్స్
స్కూల్ బెల్ మోగింది. పిల్లలు కొత్త బుక్స్, బ్యాగ్స్తో రెడీ. కాని, పిల్లలకు చదువుతో పాటు వారి సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. అందుకే, ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్లో పుస్తకాలతో పాటు, ఇలాంటి కొన్ని చిన్న చిన్న సేఫ్టీ గాడ్జెట్స్ గిఫ్ట్ చేయండి!క్యూట్ ఫ్రెండ్! స్కూల్లో హోంవర్క్, టెస్టులు, ప్రాజెక్టులతో కొన్నిసార్లు ఒత్తిడిగా, ఒంటరిగా అనిపించవచ్చు. అప్పుడు పక్కన ఓ సపోర్టివ్ ఫ్రెండ్ ఉంటే ఎంతో బాగుంటుంది కదా? అలాంటి ఓ మిత్రుడే ఇప్పుడు వచ్చేశాడు. పేరు ‘ఎంకరేజింగ్ పిక్కల్’. ఇది బొమ్మ అయినా, దీని నవ్వు, రంగుల కళలు, మృదువైన స్పర్శతో పిల్లల మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ఓ టెస్టులో తక్కువ మార్కులొచ్చినా, ప్రాజెక్ట్ ఆలస్యం అయినా, ఈ పిక్కల్ను చూసి ఒక్కసారి మాట్లాడితే చాలు. మనసులో ఈ మాటలు వినిపిస్తాయి: ‘ఇంకొంచెం ట్రై చెయ్య్, నువ్వు చాలా గ్రేట్’ అని. ఒక చిన్న సైజు మానసిక మిత్రుడు అనే చెప్పొచ్చు. కార్న్, క్యాబేజీ, హనీపీచ్ లాంటి ఇతర ఆకారాల్లోనూ దొరుకుతుంది. ఎవరి స్టయిల్కి తగ్గట్టు వారు సెలెక్ట్ చేసుకోవచ్చు. ధర డిజైన్ మీద ఆధారపడి ఉంటుంది.నో‘లాస్’స్కూల్ టైమ్ వచ్చేసింది! బ్యాగ్, బాటిల్, టిఫిన్ , బాక్స్– ఇలా వీటిలో ఏ ఒక్కటి మిస్ అయ్యినా అమ్మానాన్నలకు టెన్షన్ గ్యారంటీ! ‘అమ్మా, నా బాటిల్ పోయింది’, ‘నాన్నా, బ్యాగ్ మర్చిపోయా’ అన్న డైలాగ్స్తో వాటిని తిరిగి తెచ్చే వరకు పిల్లలు విసిగిస్తూనే ఉంటారు. ఇందుకు పరిష్కారమే ఈ ‘ఎయిర్ ట్యాగ్’. ఇది చిన్న బిళ్లలాగ ఉండే మాయపరికరం. దీనిని పిల్లల వస్తువులకు తగిలించండి. ఇకపై వారు ఏది ఎక్కడ మరచిపోయినా, దీనికి అనుసంధానమైన యాప్ ద్వారా ఫో¯Œ లో వాటి లొకేషన్ కనిపెట్టచ్చు. ధర రూ.11,900 కి నాలుగు ట్యాగ్స్ వస్తాయి.బాడీగార్డ్ బర్డీ! ఇప్పటివరకు ప్రమాదం వచ్చిన ప్రతిసారి ‘అమ్మా! నాన్నా!’ అని ఒక్క అరుపుతో పరుగులు తీసే చిన్నారులు, స్కూల్కు వెళుతున్నారంటే, తమను తాము కాపాడుకునే స్టేజ్కి వచ్చేశారని అర్థం. అందుకే, కండబలం కంటే ముందు బుద్ధిబలంతో సమస్యను పరిష్కరించేలా నేర్పించాలి. ఇందుకోసం, పిల్లలతో పాటు స్కూల్కి ఈ బాడీగార్డ్ను కూడా పంపించండి. పేరు ఈ ‘బర్డీ’. చిన్న కీ చైన్లా ఉంటుంది. కాని, ప్రమాదం వచ్చినప్పుడు పిల్లలు ఒక్కసారి దీనికున్న బటన్ నొక్కితే చాలు. ఇక అది చేసే శబ్దంతో దొంగలు పారిపోవాల్సిందే! వెంటనే, ఒక పెద్ద అలారం చెవుల్లో మెగాఫోన్ పెట్టినట్టు అరుస్తుంది. ఇంకా చీకట్లో కూడా ఈ బర్డీ టార్చ్ మోడ్లో వెలుగుతూ, ‘ఇదిగో లైట్ ఉంది, నువ్వు కామ్గా పో’ అనే వార్నింగ్తో దొంగలను తరిమి కొడుతుంది. ఇది పిల్లల బ్యాగ్కు వేలాడే ఒక మినీ సూపర్ హీరో! (చదవండి: ఆ కుంటుంబంలో 56 ఏళ్ల తర్వాత పండంటి పాపాయి..! ఏ రేంజ్లో స్వాగతం పలికారంటే..) -
ఆ తండ్రి ప్రాణం నిలుపుతుంటే..కుమార్తె ప్రాణం పోస్తోంది..
నాన్న.. అమ్మతో పోల్చితే నాన్నెందుకో కాస్త వెనుకబడ్డారు అంటుంటారు. కానీ తన పిల్లలు ముందుండాలని తపనతో నాన్న కాస్త వెనుకబడి ఉంటారు, వారి వెనకే ఉంటారు. పిల్లల ప్రతి విజయం వెనక, వారి ప్రతి లక్ష్యం వెనుక కనిపించని నా అన్న కృషే నాన్నది. నాన్న ఒక బాధ్యత, ఒక ముందు చూపు. అలాంటి నాన్నకి ఏం చేస్తే రుణం తీరుతుంది అనుకున్నారో ఏమో.. తన తండ్రి ఒక్కసారి ప్రాణం పోసి జన్మనిస్తే, తాను మాత్రం అనేక సార్లు రక్తదానం చేసి పలువురికి ప్రాణదాతగా నిలుస్తున్నారు డా.సంపత్ కుమార్. ఎన్ని గొప్ప పనులైనా చేయ్యి.. రక్తదానానికి మించింది లేదు అని తన తండ్రి చెప్పిన మాట నుంచి స్ఫూర్తి పొంది.. అనేక సార్లు రక్తదానం చేసి తండ్రి పై తన ప్రేమను చాటుకుంటున్నారు. నేటి ఫాదర్స్ డే నేపథ్యంలో తండ్రికి తనంటే ప్రాణం.. ప్రాణం పోయడం అంటే తనకి ఇష్టం అంటున్నారు సంపత్ కుమార్. తండ్రికి తగ్గ తనయుడు.. సుమారు 25 ఏళ్ల క్రితం రక్తదానం గురించి తన తండ్రి కోట మోహన్ రావు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుందన్నారు నగరానికి చెందిన సంపత్ కుమార్. నాన్న నింపిన స్ఫూర్తితో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక మరణించిన వ్యక్తి చావుతో ఒక ఉద్యమంగా రక్తదానాన్ని చేస్తూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 10, 50, 100 కాదు.. ఏకంగా 322 సార్లు రక్తంతో పాటు ప్లేట్లెట్స్, ప్లాస్మా, డబ్ల్యూబీసి దానం చేసి ప్రాణదాతగా నిలుస్తున్నారు. నాన్న నాకు పోసిన ప్రాణం కొన్ని వందల మందికి ప్రాణాలు నిలిపే వారధిగా నిలవడమే తన లక్ష్యమని, ఇదే తన తండ్రికి తీర్చుకునే రుణమని చెబుతున్నారు. ప్రతి ఏడాది ఫాదర్స్ డే రోజు ఒక గొప్ప కొడుకుగా సంతృప్తిగా ఉండడానికి ఈ రక్తదానం కారణంగా నిలుస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేను ప్రాణం నిలుపుతా, తాను ప్రాణం పోస్తుంది.. నాన్న కోరికకు అనుగుణంగా అనేక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా నిలవడం చాలా సంతోషంగా ఉంది. రక్తదానంతో ప్రాణదాతగా నిలిస్తే.. అసలు ప్రాణదాత డాక్టర్ అని నా నమ్మకం. అందుకే నేను డాక్టర్ కాలేకపోయినా నా కూతురిని డాక్టర్ని చేసి అటు ఒక తండ్రికి కొడుకు గానూ, ఇటు ఒక కూతురికి తండ్రిగానూ నా వంతు బాధ్యతను నిర్వహించాను. నా కోరికకు అనుగుణంగా నా కూతురు కోట శృతి మెడిసిన్ పూర్తి చేసి డాక్టర్గా ఎంతో మంది ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. – సంపత్ కుమార్, హైదరాబాద్. (చదవండి: -
ఆధునిక ఇంటికి గిరిజన కళ..!
ఇల్లు రిచ్గా ఉండాలా, కళాత్మకంగా ఉండాలా అనే ఆలోచన యువతలో కలుగుతుంది. అందుకు తగినట్టుగా ఇంటి అలంకరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రిచ్నెస్ తగ్గకుండా కళాత్మకంగానూ కనిపించాలనే అభిరుచి గలవారికి గిరిజన జీవనశైలిని ప్రతిబింబించే కళాత్మక వస్తువులు, ప్రింట్లు ఆధునిక గృహాలంకరణలో వినూత్నంగా రూపుదిద్దుకుంటున్నాయి.సరైన నమూనాలుగిరిజన కళ ఉట్టిపడాలి కదా అని ఉన్న స్థలంలో మొత్తం అవే డిజైన్స్తో ముంచెత్తకుండా సంప్రదాయ, ఆధునిక అలంకరణతో బ్యాలెన్స్ చేయాలి. సోఫా కవర్లు లేదా కుషన్లు, బొమ్మలు.. వంటి చిన్న గిరిజన వస్తువులతో ప్రారంభించవచ్చు. రగ్గులు, లాంప్షేడ్లు, గిరిజన మోటిప్స్ ఉన్న టేబుల్వేర్ వంటివి అలంకరణను అద్భుతంగా మార్చేస్తాయి. రంగులు, అల్లికలతో బ్యాలెన్స్అలంకరణలో గిరిజన ప్రింట్లను ప్రవేశపెట్టేటప్పుడు, రంగుల గురించి కూడా ఆలోచించాలి. గోధుమ, ఆకుపచ్చ, మట్టి టోన్లతో ఆ కళను తీసుకురావచ్చు. నేత ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన కర్టెన్లు, కుషన్ కవర్లు, బెడ్షీట్లు వంటివి ఎంపిక చేసుకోవచ్చు. వాల్ హ్యాంగింగ్స్గా అల్లికలను జోడించవచ్చు. గిరిజన కళాఖండాలను చేర్చడంగిరిజన కళాఖండాలలో ప్రధానంగా చెప్పుకోదగినవి శిల్పాలు. ఇవి గదికి ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తాయి. అయితే, ఇవి ఇతర డిజైన్ అంశాలను అధిగమించేంత ఎక్కువ ఉండకూడదు. గిరిజన కళాఖండాలను గాజు అల్మరాల్లో ఉంచడం లేదా వాల్ ఆర్ట్గా ఉపయోగించడం వల్ల అలంకరణలో కొత్తదనాన్ని తీసుకురావచ్చు.ఎన్.ఆర్ (చదవండి: హలో మూవీ కళ్యాణి ప్రియదర్శిని బ్యూటీ సీక్రెట్ ఇదే..!) -
'లక్ష'ణమైన గ్రంథాలయం
ఆధునిక దేవాలయాలుగా భావించే గ్రంథాలయాలకు ఘన చరిత్రే ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించాయి. అలాంటి వాటిలో విజ్ఞాన కాంతులు వెదజల్లే సరస్వతీ నిలయం– శత వసంతాల సారస్వత నికేతనం అతి పురాతనమైనది. ఇప్పటికీ ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో కొనసాగుతున్న ఈ పుస్తక భాండాగారానికి 1918 అక్టోబరు 15న విజయదశమి రోజున బీజం పడింది. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా వేటపాలెంలో కొంతమంది యువకులు హిందూ యువజన సంఘంగా ఏర్పడి గ్రంథాలయాన్ని నెలకొల్పారు. రెండు దినపత్రికలు, మూడు వారపత్రికలు, వంద పుస్తకాలతో ప్రారంభించగా ఆదిలోనే హంసపాదు ఎదురైంది. నిర్వహణ వ్యయం భరించలేక నాలుగేళ్లకే తాళం వేశారు. అప్పట్లో సాహితీ ప్రియుడైన ఊటుకూరు వెంకట సుబ్బరాయ శ్రేష్ఠి సంస్థకున్న అప్పులు తీర్చి, రూ.3 వేలతో మూలనిధి ఏర్పాటు చేశారు. మరో రూ.2 వేలు విరాళంగా అందించారు. 1923లో వేటపాలెం నడిబొడ్డున పెంకుటిల్లు కొని 1924 సెప్టెంబర్లో తిరిగి ప్రారంభింపజేశారు. దానికి ‘సుబ్బరాయ మహల్’గా నామకరణం చేశారు. 1929 ఏప్రిల్ 4న నూతన భవన నిర్మాణానికి మహాత్మాగాంధీ పునాది రాయి వేశారు. ఆ సందర్భంగా ఆయన తన చేతికర్రను జ్ఞాపకంగా ఇక్కడ వదిలివెళ్లారు. సందర్శకులు దాన్ని ఒకమారు తాకి బాపూజీని తాకిన అనుభూతికి గురవుతుండడం విశేషం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, జమునాలాల్ బజాజ్ చేతుల మీదుగా ప్రారంభమైన నూతన గ్రంథాలయం సారస్వత నికేతనంగా పేరు మార్చుకుంది.స్మారక మందిరాలు1933లో బాబూ రాజేంద్రప్రసాద్ భవనం ఎదుట ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. తదుపరి కాలంలో మీనాక్షి కోటిలింగం స్మారక మందిరం, వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, శారదాదేవి స్మారక మందిరం నిర్మించారు. శ్రేష్ఠి మరణానంతరం ఆయన సతీమణి కమలమాంబ గ్రంథాలయ బరువు బాధ్యతలు స్వీకరించారు. ఎం.కామయ్య, ఎం.ఆంజనేయశర్మ, కె.సుబ్రహ్మణ్యం గ్రంథ పాలకులుగా వ్యవహరించారు. మహిళలు, వయోజనులు, పాత్రికేయుల కోసం శిక్షణ తరగతులు నిర్వహించేవారు. ముద్రణ, సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల్లో ఆరితేరినవారితో ప్రసంగాలు, చర్చలు ఇక్కడే జరిగేవి.వేల అక్షరాలు.. లక్ష పుస్తకాలువంద పుస్తకాలతో ప్రారంభమైన గ్రంథాలయంలో ఇప్పుడా సంఖ్య లక్షా ఇరవై వేలకు చేరింది. 1942 నుంచి 2025 వరకు అన్ని ప్రధాన తెలుగు దినపత్రికలు లభ్యమవుతాయి. పాత పత్రికలను బైండింగ్ చేసి మరీ భద్రపరచడం విశేషం. వార పత్రికలు, ప్రాచీన, ఆధునిక కవులు, రచయితల సాహిత్యం, గాంధీజీ రచనలు, తాళపత్ర గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. పింగళి వెంకయ్య, ఆచార్య ఎన్జీ రంగా, కొండా వెంకటప్పయ్య, దామోదరం సంజీవయ్య, పీవీ నరసింహారావు, బెజవాడ గోపాలరెడ్డి, ఉన్నవ లక్ష్మీనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం, రావూరి భరద్వాజ, చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, ఊటుకూరి లక్ష్మీకాంతం, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, అడివి బాపిరాజు, త్రిపురనేని రామస్వామి చౌదరి, కట్టమంచి రామలింగారెడ్డి, అయ్యంకి వెంకటరమణయ్య, పాతూరి నాగభూషణం, వావిలాల గోపాలకృష్ణయ్య, వెలగా వెంకటప్పయ్య. జానుమద్ది హనుమచ్ఛాస్త్రి, స్వామి విద్యాప్రకాశనందగిరి, సి.నారాయణరెడ్డి వంటి ప్రముఖులు సారస్వత నికేతనాన్ని సందర్శించారు. పాత్రికేయ సుప్రసిద్ధులు పొత్తూరి వెంకటేశ్వరరావు, నార్ల వెంకటేశ్వరరావు, తుర్లపాటి కుటుంబరావు, నండూరి రామ్మోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ తదితరులు ఇక్కడి పుస్తకాలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు.ఉద్యోగార్థులకు వరండిగ్రీ ఉత్తీర్ణులై ఉద్యోగాల వేటలో ఉన్న యువతకు వేటపాలెం గ్రంథాలయం ఒక వరమనే చెప్పాలి. అనేక రకాలైన పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ప్రతిరోజూ ఇక్కడికొచ్చి పుస్తక పఠనంలో నిమగ్నమవుతారు. ప్రకాశం, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి దాదాపు 50 మంది వరకు వస్తుంటారు. పరిశోధనలు చేసే కొందరు విదేశీయులు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తారు. మార్కెట్లో దొరకని ఎలాంటి పాత పుస్తకమైనా ఇక్కడ లభ్యం కావడం తథ్యం. ముగ్గురు సిబ్బంది సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సాహితీప్రియులు ఒక్కసారైనా ఈ గ్రంథాలయాన్ని సందర్శించి తీరాలి.డిజిటలైజేషన్ దిశగా అడుగులుమా గ్రంథాలయంలో తెలుగు, ఆంగ్లం, హిందీ, సంస్కృతం, ఇంకా ఇతర భాషలకు సంబంధించి లక్షా ఇరవై వేల పుస్తకాలున్నాయి. ప్రాధాన్యత క్రమంలో పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నాం. ఇందుకుగాను ఇండెక్స్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యాం. ప్రధానంగా సివిల్స్, గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు నిత్యం చుట్టుపక్కల ఊళ్ల నుంచి వచ్చి పుస్తక పఠనం గావిస్తారు. పీహెచ్డీ పరిశోధక విద్యార్థులు కూడా అధ్యయనం సాగిస్తుంటారు. గ్రంథాలయం రోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. శుక్రవారం సెలవు.పి.శ్రీవల్లి, గ్రంథాలయాధికారి (చదవండి: ఇంట్లోనే స్పా సౌకర్యం..! పట్టులాంటి చర్మం కోసం..) -
హలో మూవీ కళ్యాణి ప్రియదర్శిని బ్యూటీ సీక్రెట్ ఇదే..!
‘ఫ్యాషన్ అంటే హంగులు కాదు, ఫ్యాషన్ అంటే వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేది.’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటూ, సంప్రదాయాన్ని ఆధునికతతో మేళవిస్తూ ఎంతోమంది మనసులు దోచుకున్న అమ్మాయి నటి కళ్యాణి ప్రియదర్శిని. ఆమె శైలి, సౌందర్య రహస్యాలే ఇప్పుడు మీ ముందుంది.నటి కళ్యాణి ప్రియదర్శిని ధరించిన డ్రెస్ బ్రాండ్: పింక్సిటీ బై సారిక ధర: రూ. 38,500 కాగా, జ్యూలరీ బ్రాండ్: కళ్యాణ్ జ్యూవెలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. తేనె, నెయ్యి కలిపిన ప్యాక్, పసుపు ఫేస్ మాస్క్, తగినంత నిద్ర, జుట్టుకు కొబ్బరి నూనె మసాజ్ – అంతే! ఇవే నా బ్యూటీ సీక్రెట్. అయితే, ప్రతి అమ్మాయిలోనూ ఒక అందం ఉంటుంది. అది వెలుగులోకి రావాలంటే, సరైన శ్రద్ధ అవసరం. అప్పుడు మీరు సహజంగా మెరుస్తారు. ఇలా సహజమైన చిట్కాలను పాటిస్తూనే అందాన్ని వెలికితీయొచ్చు అని చెబుతోంది కళ్యాణి ప్రియదర్శినినెత్తికెక్కిన అందంమెడలో కాదు, చెవుల్లో కాదు, ఈ ఆభరణం దక్కించుకున్న స్థానం తలమీదే! అన్నింటి కంటే పైస్థాయి అంటే ఇదే. నెత్తిమీదకు ఎక్కిందంటే అది అహంకారం వల్ల కాదు, ఆత్మవిశ్వాసంతో. చూశారంటే సింపుల్గా ఉంటుంది, ‘ఇది ఎలాంటి జ్యూలరీ?’ అనిపిస్తుంది. కాని, వేసుకుంటే చూసే వారి చూపులను ఆకట్టుకోగల సత్తా ఉంది ఈ అభరణానికి. ఈ మినిమలిస్ట్ హెడ్ బ్యాండ్ ఒకవైపు ఆధునికత, మరోవైపు సంప్రదాయాల కలబోత. ఇప్పటి ఫ్యాషన్ భాషలో దీన్ని ‘హెడ్ బ్యాండ్ జ్యూలరీ’ అంటారు. కాని, మన పూర్వీకులు దీనిని ‘తలమిన్న’, ‘శిరోభూషణం’ అని పిలిచేవారు. పేర్లు పాతవైనా స్టయిల్ మాత్రం పక్కా ట్రెండీ! ఇది తలపై ధరించిన వెంటనే మీ లుక్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మామూలు చీర, కుర్తా, లెహంగా ఏదైనా సరే దీన్ని జత చేస్తే మీరు కేవలం రెడీ అవ్వరు రాయల్గా రెడీ అయిపోతారు. మేకప్ లేకపోయినా, ఈ తలమిన్న ఒక్కటే ముఖాన్ని గ్లో మోడ్లోకి మార్చేస్తుంది. లైట్ మేకప్, వదిలేసిన జుట్టు దీని స్టయిలింగ్కు బెస్ట్ కాంబో. ఇంత తక్కువ బరువుతో, ఇంత ఎక్కువ ఫ్యాషన్ ఎఫెక్ట్ ఇచ్చే జ్యూలరీ ఇంకా ఏదీ దొరకదు! (చదవండి: మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు) -
బిడ్డ కోసం తల్లడిల్లిన తల్లి..! సాక్షాత్తు ఆ దేవుడే..
దేవుడు పిలిస్తే పలుకుతాడు. ప్రార్థిస్తే స్పందిస్తాడు అనేది చాలామంది భక్తుల నమ్మకం. ఆశ్చర్యకరంగా ఈసారి తల మీద అభయహస్తం ఉంచి ఆశీర్వదిస్తూ కెమెరాకు చిక్కాడు. నిజం, ఫొటోలో కనిపిస్తున్న చేయి, మామూలు చేయి కాదని, ఇది స్వర్గం నుంచి వచ్చిన దేవుని అభయహస్తమని నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగతి ఏంటంటే, కెంటకీ అమాండా అనే మహిళ, ఎనిమిది నెలల గర్భవతి. అంతా మూములుగా సాగుతున్న ఆమె జీవితంలో అనుకోకుండా ఒక చేదునిజం, రోజూ ఆమెను కలతకు గురిచేసింది. కడుపులోని బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో, ఆ తల్లి ప్రతి స్కాన్కి ముందు దేవుడిని ఒక్కటే అడిగేది– ‘దేవుడా! నా బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించు’ అని. అలా ఒకరోజు అల్ట్రాసౌండ్ స్క్రీన్పై బిడ్డ తల మీద ఒక పెద్ద చేయి పెట్టి ఆశీర్వదిస్తున్నట్లు కనిపించి దేవుడు ఆమె ప్రార్థనలకు సమాధానం ఇచ్చాడు. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. ‘దేవుడు నా బిడ్డను ఆశీర్వదించాడు’ అంటూ సంతోషంలో మునిగిపోయింది. ‘ఇది ఫొటో కాదు, ఆకాశం నుంచి వచ్చిన దేవుని ప్రేమ. దేవుడు నా ప్రార్థనకు ఇచ్చిన సమాధానం’ అంటూ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొంతమంది ‘అది బిడ్డ చేయే’ అని వాదించినా, చాలామంది ఇది నిజంగానే దేవుడి ఆశీర్వాదంగా... ‘ఈ ఫొటోలో దేవుడి చేయి మాత్రమే కనిపించలేదు. నీ బిడ్డను తాకాడు. భరోసా ఇచ్చాడు. తన ప్రేమను చూపాడు. ’ అంటూ ఆమె నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నారు. (చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?) -
పీసీఓఎస్తో మానసిక సమస్యలు..
నేను గర్భవతిని అని మూత్రపరీక్ష ద్వారా తెలిసింది. డాక్టర్ను ఎప్పుడు కలవాలి?– రమ్య, గుంటూరుగర్భ నిర్ధారణ జరిగిన వెంటనే డాక్టర్ను కలవాలి. ఎందుకంటే శరీరంలో థైరాయిడ్, సుగర్, రక్తపోటులాంటి సమస్యలు ఉంటే, శిశువుపై వాటి ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ను కలిసిన వెంటనే వారు రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు చేస్తారు. అలాగే, శరీర పరిస్థితిని బట్టి ఫోలిక్ యాసిడ్, విటమిన్ –డి వంటి మాత్రలు సూచిస్తారు. ఇంతకు ముందు నుంచి ఏవైనా మందులు వాడుతుంటే, ఇప్పుడు కూడా అవి కొనసాగించాలా, వద్దా అనే విషయం మీద స్పష్టత ఇస్తారు. మొదటి వారాల్లోనే శుభ్రమైన, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు తగిన ఆహార నియమాలు కూడా డాక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబంలో వంశపారంపర్య వ్యాధులు, జన్యుపరమైన లోపాలు భర్తవైపు లేదా భార్యవైపు ఉన్నా, అవి శిశువుకు వచ్చే అవకాశముంటుంది. అందుకే ప్రారంభ దశలోనే ఆయా సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే, దానికి తగిన వైద్యం తీసుకోవాలి. సాధారణంగా గర్భం ఎనిమిదో వారం వచ్చేసరికి మొదటి స్కాన్ చేస్తారు. దానితో బిడ్డ గుండె చప్పుడు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. తర్వాతి స్కా మూడో నెలలో చేస్తారు. ఈ స్కానింగ్, మొదటి దశ రక్తపరీక్షల ద్వారా చాలా ముఖ్యమైన విషయాలను గుర్తించవచ్చు. అవసరమైన మందులు, తీసుకోవాల్సిన చికిత్సలు కూడా సూచిస్తారు. శరీర బరువు, రక్తపోటు స్థాయిని బట్టి ప్రారంభ దశలో చేయవలసిన వ్యాయామాలు, ఆరోగ్యకరమైన అలవాట్లను సూచిస్తారు. ఆహార నిపుణుల సలహాలు, జన్యుపరమైన కౌన్సెలింగ్ కూడా ఇప్పటి నుంచే తీసుకోవాలి. అందుకే ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ప్రసూతి నిపుణులను తప్పనిసరిగా కలవాలి.పీసీఓఎస్తో మానసిక సమస్యలుప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది మహిళలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఒకటి. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం, శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, ముఖంపై మొటిమలు ఎక్కువగా రావడం, తల మీద జుట్టు పల్చబడిపోవడం వంటి శారీరక సమస్యలే కాకుండా పలు మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పీసీఓఎస్తో బాధపడే మహిళలకు నడివయసుకు చేరుకునే సరికి మతిమరపు బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే, దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఒక్కోసారి మానసిక కుంగుబాటుకు లోనవడం వంటి లక్షణాలతో బాధపడతారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీదర్ హడల్స్టన్ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలో తేలింది. అలాగే, పీసీఓఎస్తో బాధపడే మహిళలకు టైప్–2 డయాబెటిస్ ముప్పు సాధారణ మహిళల కంటే రెట్టింపుగా ఉంటుందని కూడా ఈ పరిశోధనలో బయటపడింది. ఈ సమస్యల కారణంగానే పీసీఓఎస్తో బాధపడే మహిళలు నడివయసులో కెరీర్లోను, ఆర్థిక వ్యవహారాల్లోను వెనుకబడిపోతారని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధన సారాంశం ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురితమైంది.ఆత్మహత్యా ధోరణులు కూడా..పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో రకరకాల శారీరక, మానసిక సమస్యలతో పాటు ఆత్మహత్యా ధోరణులు కూడా పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే పీసీఓఎస్తో బాధపడే మహిళల్లో ఆత్మహత్యా ధోరణులు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే, పీసీఓఎస్తో బాధపడే మహిళలు ఆత్మహత్యా ప్రయత్నాలకు పాల్పడే అవకాశాలు మూడు శాతం ఎక్కువగా ఉన్నట్లు తైవాన్లోని తైపీ వెటరన్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ము హాంగ్ చెన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. (చదవండి: మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు) -
మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు
తల్లిదండ్రుల మాటలు పిల్లల్లో భద్రతనివ్వాలి, బలమవ్వాలి, ఉత్సాహాన్ని నింపాలి. కానీ చాలా సందర్భాల్లో అవే మాటలు పిల్లల్లో భయాన్ని నాటేస్తాయి. దాంతో పిల్లలు తమ తప్పులను భయంతో దాచడం నేర్చుకుంటారు. లేదా మౌనంగా తిరగబడతారు. చివరకు తల్లిదండ్రుల ప్రేమకూ, పిల్లల బాధకూ మధ్య ఓ అఘాతం ఏర్పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే, పిల్లల వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చే మాటలు; ప్రేమను బెదిరింపుగా మార్చే పదాలు; పిల్లల వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించే వ్యాఖ్యల గురించి తెలుసుకోవాలి. వాటిని మార్చుకుని పిల్లల్లో ఆశనూ, ఆశయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడాలి. అప్పుడే బంధాలు బలపడతాయి. ‘‘నీకు అన్నీ కొనిపెడుతున్నాం, చదివిస్తున్నాం. ఇంకేం కావాలి?’’చాలామంది తల్లిదండ్రులు ఈ వాక్యాన్ని ప్రేమతో, బాధ్యతతో, త్యాగాన్ని గుర్తుచేసే కోణంలో చెబుతారు. కాని, పిల్లలకు ఇది లావాదేవీలా అనిపిస్తుంది. ప్రేమ అనేది కేవలం తినిపించడం, చదివించడం వంటి బాహ్య సౌకర్యాలకు మాత్రమే పరిమితం అనుకుంటారు. దాంతో, వారు తమ ఎమోషనల్ అవసరాలను తల్లిదండ్రుల నుంచి కాకుండా, బయటి ప్రపంచం నుంచి పొందాలని ప్రయత్నిస్తారు. కొంచెం సానుభూతి చూపినా వారికి దగ్గరవుతారు. (చదవండి: హాట్టాపిక్గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?)‘‘నీకు అన్నీ సమకూర్చడం పేరెంట్స్గా మా బాధ్యత. నువ్వు ఆనందంగా ఉన్నావా?’’ అని అడిగితే చాలు. తల్లిదండ్రులు తనతోనే ఉన్నారనే అనుభూతిని పెంచుతుంది. ‘నా భావాలు తల్లిదండ్రులకు ముఖ్యం’ అనే భద్రతా భావన పెరుగుతుంది. కంగారు పడకుండా తమ బాధలను, కలలను, భయాలను పంచుకుంటారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, అనుబంధం, కృతజ్ఞత లాంటి భావాలు పెరుగుతాయి. ‘‘నీ కోసమే బతుకుతున్నా!’’ఈ వాక్యం తల్లిదండ్రుల త్యాగాన్ని చెప్పేదే అయినా, బిడ్డ వల్లనే తన బతుకు భారమైపోయిందన్న సందేశాన్ని పంపిస్తుంది. ‘‘అమ్మ, నాన్న నాకోసం జీవితాన్నే వదిలేశారు. మరి నేను నా కోరికల కోసం బ్రతికితే ఎలా?’’ అనే భావనను నాటుతుంది. కోర్సులు, కెరీర్, పెళ్లి నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోలేరు. ప్రేమ అనేది త్యాగం కావాలన్న తప్పుడు నమ్మకం వారిలో చెరగని చిహ్నంలా మిగిలిపోతుంది. తర్వాత కూడా ఇతరులతో సంబంధాల్లో తామే త్యాగం చేయాలన్న కండిషనింగ్తో బతకాల్సి వస్తుంది. ‘‘నీతో జీవించడం నా జీవితంలో అతి గొప్ప భాగం. నువ్వు నీ పంథాలో నడవాలి, నేను నీ వెంటే ఉంటాను’’ అని చెప్పి చూడండి. ఈ ఒక్క వాక్యంలో ఆత్మీయత, స్వేచ్ఛ, అనుబంధం మూడూ వ్యక్తమవుతాయి. తల్లిదండ్రుల ప్రేమ నిబంధనలపై ఆధారపడదన్న నమ్మకంతో వారు తమ నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోగలుగుతారు. కొడుకు/కూతురు అనే పరిధిలో కాకుండా తమ వ్యక్తిగతమైన గమ్యాన్ని అన్వేషించే బలమైన వ్యక్తిగా ఎదుగుతారు.‘‘నీ మాటలు వింటుంటే గుండె పగిలిపోతుంది!’’ఈ వాక్యం తల్లిదండ్రుల భావోద్వేగ బాధను వ్యక్తపరుస్తోంది అనిపించినా, నిజానికి ఇది పిల్లల వ్యక్తిత్వ అభివ్యక్తిని అణచివేసే వాక్యం. తమ మాటలు పెద్దవాళ్లకు బాధ కలిగించవచ్చని, కాబట్టి నిశ్శబ్దంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయాన్ని నాటుతుంది. దీంతో పిల్లలు తమ అసలు భావాలను పంచుకోకుండా దాచేస్తారు. ఫేక్ పర్సనాలిటీలో జీవించడం ప్రారంభిస్తారు. దీర్ఘకాలంలో ఇది యాంగ్జయిటీ, డిప్రెషన్ లేదా కోపానికి దారి తీస్తుంది. దీనికి బదులుగా ‘‘నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసుకోవాలనుంది. అదేమిటో చెప్పడం వల్ల మనం నిజంగా దగ్గర కావచ్చు’’ అని చెప్పడం వల్ల పిల్లలలో భద్రతను, విశ్వాసాన్ని, స్పష్టతను నాటుతుంది. ఎలాంటి భావాలనైనా తల్లిదండ్రులతో పంచుకోవాలనిపిస్తుంది. వారు తమ నిజమైన భావాలను అంగీకరించడంలో సామర్థ్యం, ఆత్మగౌరవం పెరుగుతుంది.‘‘నువ్విలా ఉంటే నీతో ఎవ్వరూ కలవరు!’’ఈ వాక్యం ఇతర మాటలకంటే తీవ్రంగా పిల్లల ఆత్మగౌరవంపై తీవ్రమైన దెబ్బ తీస్తుంది. తమ వ్యక్తిత్వం పట్ల అసహనం, తమలో మారలేని లోపాలు ఉన్నాయన్న అపోహ, భవిష్యత్తులో ఒంటరిగా ఉండిపోతామన్న భయం నాటుతుంది. దీనివల్ల సోషల్ యాంగ్జయిటీ మొదలవుతుంది. వారిని బంధాలకు దూరంగా ఉంచుతుంది. ఇతరులకు నచ్చేందుకు తమ అసలైన భావనలను, అభిరుచులను దాచిపెడతారు. ‘‘నేను కలవదగిన వ్యక్తిని కాను’’ అన్న కోర్ బిలీఫ్ బలపడుతుంది.‘‘నువ్వు మారాలనుకునే క్షణం నుంచే, నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారటం మొదలవుతుంది’’ అని చెప్తే మార్పును శిక్షగా కాక, శక్తిగా చూపుతుంది. ‘నాలో మార్పు సాధ్యమే’, ‘నేను మారగలను’ అనే గ్రోత్ మైండ్ సెట్ను నాటుతుంది. దీనివల్ల నా జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయనే భావన చిగురిస్తుంది. మార్పు అవకాశం బయట ఎక్కడో లేదని, తనలోనే మొదలవుతుందనే ఇంట్రాస్పెక్షన్తో పిల్లలు ఎదుగుతారు. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్) -
అక్షర భ్రమణం
రశ్మిరేఖ రచయిత్రి. ఇప్పటికి వరకు నాలుగు నవలు రాశారు. మొదటిది 2013లో. నాల్గవది 2023లో. అస్సామీ భాషలో ఉండే ఆ పుస్తకాలలో ఏముందో, ఆ పుస్తకాల టైటిల్స్కు అర్థం ఏమిటో అస్సామీని చదవటం రాని వారికి తెలియకపోవచ్చు. కానీ, రశ్మిరేఖ జీవితం గురించి తెలుసుకుంటే మాత్రం ఆ పుస్తకాల్లో ఆమె ఏం రాసి ఉంటారో కొంతైనా ఊహించవచ్చు.రశ్మి వయసు 39. రోజంతా వీల్ చెయిరే ఆమెను తిప్పుతూ ఉంటుంది. ఉత్తర అస్సాంలోని సూటీ ప్రాంతంలో తను పాఠాలు చెబుతుండే ఖానగురి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు తిప్పుతుంటుంది, అస్సాంలో ఎప్పుడూ ఎక్కడో ఒకచోట జరుగుతుండే సాహితీ సభలూ సమావేశాలకూ తిప్పుతుంటుంది. చిన్నప్పుడే చెప్పేశారు!రశ్మి ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ (ఎస్.ఎం.ఎ.) పేషెంట్. అందుకే వీల్ చెయిర్ ఆమె శరీరంలో ఒక భాగం అయిపోయింది. చిన్నప్పుడే ఆమె గురించి వైద్యులు ఆమె తల్లిదండ్రులకు చెప్పేశారు... మీ అమ్మాయికి పెద్దయ్యాక ఎస్.ఎం.ఎ. వస్తుందని, అందుకు ఆమెను మానసికంగా సిద్ధం చేయమనీ! ఆ ఎరుకతో రశ్మి తన జీవితంలో పూర్తి ‘పాజిటివిటీ’ని అలవాటు చేసుకుంది. ‘అంతా మన మంచికే’ అనే ధోరణి అది. టీచర్లు ప్రోత్సహించారుఖానగురికి కాస్త దగ్గర్లో ఉండే రశ్మి ఇల్లు, ఇంటి పరిసరాలు ఆమె చిన్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉండేవి. అందమైన భావాలు రశ్మిలో అక్కడ పూతలు వేసేవి. ఆమె ఆలోచనల్లోని మార్దవాన్ని, సృజనశీలతను ఆమె తల్లిదండ్రులతో పాటు, టీచర్లూ గమనించి ఆమెను రచన వైపు ప్రోత్సహించారు. ఆ తర్వాత నెమ్మదిగా అస్సామీ దినపత్రికల్లో, వార పత్రికల్లో, మేగజీన్స్ లలో ఆమె వ్యాసాలు రావటం మొదలైంది. చివరికి అవి ఆమెను నవలా రచనకు ప్రేరేపించాయి. ఆమె రాసిన ‘మేఘే ధోక అకక్సార్ జూన్స్ ’, ‘జీబన్స్ మీనార్ సుర్’, ‘గిగోలో’, ‘మటి ఈశ్వర్’ అనే నవలలు అస్సాంలో ఆమెను ప్రముఖ రచయిత్రిని చేశాయి. పుస్తకాలు స్ఫూర్తినిచ్చాయిఇంటి వాతావరణంతో పాటు, 750 వరకు పుస్తకాలు రాసిన 72 ఏళ్ల అస్సామీ రచయిత రంజూ హజారికా కూడా రశ్మికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన పుస్తకాలను, 88వ యేట 2021లో కన్నుమూసిన అస్సామీ రచయిత హోమెన్స్ బోర్గోహెయిన్స్ రచనల్ని కూడా రశ్మి ఇష్టంగా చదివేవారు. హోమెన్స్ ను ఆమె పెదనాన్న అని పిలిచేవారు. ఆమెను ఆత్మకథ రాయమని ప్రోత్సహించింది ఆయనే. ‘‘మమోని బైద్యు (ఇందిరా గోస్వామి) పుస్తకాలు కూడా నాలో రాసే ధైర్యాన్ని నింపాయి’’ అంటారు రశ్మి. హోమెన్, బైద్యు 2011లో చనిపోయినప్పుడు ఆ విషాదం నుంచి త్వరగా తేరుకోలేకపోయారు రశ్మి. రాష్ట్రం మొత్తం మీద నలుగురే!రశ్మి గువాహటి యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ్సలో పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేశారు. ఆ సమయంలోనే బైద్యు, హోమెన్, రంజూ హజారికా పుస్తకాలను ఎక్కువగా చదివారు. తర్వాత టీచర్గా ఉద్యోగం. ఆ తర్వాత 2020లో రశ్మి పెళ్లి. ఇప్పుడు ఎనిమిది నెలల కూతురు. ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ’ ఉండి, తల్లి అయిన తొలి అస్సామీ మహిళ రశ్మి. రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ వ్యక్తులు నలుగురు మాత్రమే ఉన్నారు. తక్కిన ముగ్గురిలో ఒకరు రశ్మి చెల్లెలు ఛాయానిక. ఇంత పెద్ద కష్టంలోనూ మామూలు జీవితాన్ని గడుపుతున్నారు ఈ అక్కచెల్లెళ్లు. ‘‘ఆ మాటే నాకు నచ్చదు’’అయితే ఈ మాటే అనొద్దంటారు రశ్మి! ‘‘మామూలు జీవితం అంటే ఏంటి? వీల్ చెయిర్లో ఉంటే మాత్రం మామూలు జీవితం కాకుండా పోతుందా? ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ అనే మాటైతే నాకు అస్సలు నచ్చదు. వికలాంగుల్ని వికలాంగులు అనకుండా ఆ సొగసైన భాష ఏమిటి.. కృత్రిమంగా!’’ అంటారు రశ్మిరేఖ. ‘‘ఎవరైనా సరే సానుభూతి చూపకూడదు. సానుభూతి కోరుకోకూడదు’’ అన్నది ఆమె భావన. ఆమె అభ్యర్థన. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
మ్యూజియంలలో బస చేస్తారా?
మ్యూజియంలు సాధారణంగా పగలు తెరుచుకుంటాయి. రాత్రి మూతబడతాయి. ఒక్కో ప్రదేశంలో ఉన్న మ్యూజియంలకు ఒక్కో నిర్దిష్ట వేళలు ఉంటాయి. వేళ ముగిశాక మ్యూజియంలలో ఎవరినీ ఉండనివ్వరు. అలాంటిది మ్యూజియంలలో బస చేయడమేంటి? అవేమైనా హోటళ్లా, లాడ్జింగులా అనుకుంటున్నారా? ప్రపంచంలో తొమ్మిది మ్యూజియంలు మాత్రం రాత్రి బస చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో, వాటి విశేషాలేమిటో తెలుసుకుందాం.స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీఈ మ్యూజియం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. రాత్రి ఇక్కడ బస చేసేవారు ఇందులోని డేవిడ్ కోచ్ హాల్ ఆఫ్ ఫాసిల్స్లోను, దానికి దగ్గరలోనే ఉన్న సాంట్ ఓషన్ హాల్లోను థీమ్ పార్టీలు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తోంది. రాత్రంతా ఇక్కడ బస చేయాలంటే, ఒక్కొక్కరు 150 డాలర్లు (సుమారు రూ.12,900) చెల్లించాల్సి ఉంటుంది. పదిమంది లేదా అంతకు మించిన జనాలు బృందాలుగా వెళితే, ఒక్కొక్కరికి 120 డాలర్లు (సుమారు రూ.10.300) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ అవకాశం అన్నిరోజుల్లోనూ ఉండదు. ఈ ఏడాది జూన్ 20, 28 తేదీల్లోను; జూలై 11, 19 తేదీల్లోను; ఆగస్టు 1, 8 తేదీల్లోను మాత్రమే ఇక్కడ బస చేసే అవకాశం అందుబాటులో ఉంటుంది.మేరీలండ్ సైన్స్ సెంటర్అమెరికాలోని మేరీలండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ఉంది ఈ మ్యూజియం. ఏడాదిలో రెండుసార్లు రెండేసి రోజుల చొప్పున రాత్రివేళ బస చేసేందుకు ఈ మ్యూజియం అనుమతిస్తుంది. ఏటా మే, జూన్ నెలల్లో ‘స్టార్వార్స్’ థీమ్ నైట్ పార్టీ నిర్వహిస్తుంది. అలాగే, ‘పైజమా పార్టీ’ నిర్వహిస్తుంది. ఏటా రెండేసి రోజులు సాగే ఈ పార్టీలలో ఐదేళ్లకు పైబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొనవచ్చు. రాత్రి ఇక్కడే బస చేయవచ్చు. ఈ పార్టీలలో పాల్గొనే పిల్లలకు స్లైమ్, బ్లాక్ బిల్డింగ్ సహా రకరకాల హస్త కళలు, ప్లానెటేరియం షో, ఐమాక్స్ షో కూడా ఉంటాయి. ఇందులో బస చేసేవారు ఒక్కొక్కరు 71 డాలర్లు (రూ.6,104) చెల్లించాల్సి ఉంటుంది.ఇంట్రెపిడ్ మ్యూజియంఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులోని విమానవాహక నౌకలో డిన్నర్ పార్టీలు చేసుకోవడానికి, రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఐదేళ్ల నుంచి పదిహేడేళ్ల లోపు వయసు గల పిల్లలు ఆస్వాదించడానికి అనువుగా ఇందులో రకరకరాల వినోద విజ్ఞాన కార్యక్రమాలను రూపొందించారు. ఫ్లాష్లైట్ గైడెడ్ టూర్లు, అపరిమితంగా రకరకాల సిమ్యులేషన్ రైడ్లు ఇందులోని ప్రత్యేక ఆకర్షణలు. బస చేసేవారికి ఇక్కడ అల్పాహారం, చిరుతిళ్లు, భోజనం అన్నీ ఉచితం. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఒక్కొక్కరు 130 డాలర్లు (రూ.11,182), బసతో పాటు పార్టీలు చేసేకునేవారు ఒక్కక్కరు 145 డాలర్లు (రూ.12,472) చెల్లించాల్సి ఉంటుంది. బృందాలుగా వచ్చేటట్లయితే, ఒక్కొక్కరు 99 డాలర్లు (రూ.8,515) చెల్లించాల్సి ఉంటుంది. ఫీల్డ్ మ్యూజియంఇది అమెరికాలోని షికాగో నగరంలో ఉంది. పురాతన డైనోసార్ల శిలాజాలను భద్రపరచిన ఈ మ్యూజియం రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. భూగ్రహ పరిణామానికి చెందిన అనేక ఆధారాల అవశేషాలను ఈ మ్యూజియంలో భద్రపరచారు. రాత్రివేళ బస చేసే వారికి ఇక్కడ పలు వినోద, విజ్ఞాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలతో ప్రత్యేక ఉపన్యాసాలు, వైల్డ్లైఫ్ డిటెక్షన్ పోటీలు, థీమ్డ్ చాలెంజెస్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పిల్లలతో కలసి కుటుంబాలు, పదిహేను మంది లోపు బృందాలు ఇందులో రాత్రి బస చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఇందులో వారు ఎంపిక చేసుకునే ప్యాకేజీలను బట్టి ఒక్కొక్కరు 95–200 డాలర్లు (రూ.8,171–రూ.17,203) వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి బస చేసేవారికి అల్పాహారం, భోజనం, చిరుతిళ్లు, మరునాటి ఉదయం మ్యూజియం సందర్శనకు ప్రవేశం పూర్తిగా ఉచితం.యూఎస్ఎస్ హార్నెట్ మ్యూజియంఈ మ్యూజియం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం యాలమీడాలో ఉంది. ఇది ఏటా ఒకరోజు ‘హిస్టరీ మిస్టరీ ఓవర్నైట్’ పేరిట ఏర్పాటు చేసే కార్యక్రమాల సందర్భంగా రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో కుటుంబాలు, బృందాలు పాల్గొనవచ్చు. పదహారేళ్ల వయసు పైబడిన వారికోసం ఇందులో అర్ధరాత్రివేళ రెండో ప్రపంచయుద్ధం నాటి విమానవాహక నౌక సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మ్యూజియం ప్రతినిధులు సందర్శకులకు దీని విశేషాలను వివరిస్తారు. రాత్రివేళ ఇందులో నిద్రించే అవకాశం కూడా కల్పిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య అతీంద్రియ శక్తుల అన్వేషణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏడేళ్ల నుంచి పదహారేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా వినోదాత్మక వైజ్ఞానిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే బృందాలు పదిమంది వరకు ఉంటే వెయ్యి డాలర్లు (సుమారు రూ.86 వేలు), పదిమందికి పైబడి ఇరవైమంది వరకు ఉంటే రెండువేల డాలర్లు (సుమారు రూ.1.72 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది.ఓరెగాన్ మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీఇది అమెరికాలోని పోర్ట్లండ్ నగరంలో ఉంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పారిశ్రామిక అభివృద్ధికి ఎలా దోహదపడిందో వివరించే రకరకాల వస్తువులను ఇందులో భద్రపరచారు. విద్యార్థులు బృందాలుగా వారి ఉపాధ్యాయులతో కలసి ఈ మ్యూజియం సందర్శించడంతో పాటు రాత్రివేళ ఇక్కడే బస చేసేందుకు అనుమతి ఇస్తారు. ఒక్కో విడతలో యాభైమందికి లోపుగా వచ్చే బృందాలను మాత్రమే అనుమతిస్తారు. మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ఇందులోకి అనుమతి ఉంటుంది. మ్యూజియం సందర్శనకు వచ్చే బృందాలు తమకు అనువైన తేదీలను చెప్పి, ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. బృందంలో ముప్పయి మంది వరకు ఉంటే 3300 డాలర్లు (రూ.2.83 లక్షలు), ముప్పయి మందికి మించి ఉంటే, అదనంగా ఉండేవారు ఒక్కొక్కరికి 90 డాలర్ల (రూ.7,737) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బృందంలోని సభ్యుల సంఖ్య యాభైమందికి మించరాదనే పరిమితి ఉంది. ఇక్కడ బస చేసేవారికి అల్పాహారం, భోజనం ఉచితం. ఆరుబయట నిద్రించేవారికి టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు కూడా ఉచితంగానే అందిస్తారు.మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీఇది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఉంది. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుకునే స్కౌట్స్ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అనుమతిస్తుంది. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసిన రకరకాల ఆవిష్కరణలను పొందుపరచిన ఈ మ్యూజియంలో బస చేయడానికి ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో అనుమతి ఉంటుంది. బస కోసం బృందాలుగా వచ్చేవారు ముందుగానే సంప్రదించి, బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముప్పయి మంది వరకు ఉండే బృందాలు 1300 డాలర్లు (రూ.1.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. బృందంలో ముప్పయిమందికి అదనంగా ఉంటే పిల్లలు ఒక్కొక్కరికి 48 డాలర్లు (రూ.4,126), పెద్దలు ఒక్కొక్కరికి 36 డాలర్లు (రూ.3,094) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.ప్లిమత్ ప్యాటక్సెట్ మ్యూజియంఇది అమెరికాలోని బోస్టన్ నగరానికి చేరువలో ఉంది. ఇంగ్లండ్లోని పదిహేడో శతాబ్దినాటి జనజీవనానికి అద్దంపట్టే వస్తువులను భద్రపరచే ఈ మ్యూజయంలో అప్పటి కాలంలో మాదిరిగానే గడపడానికి వీలుగా వసతులు ఉన్నాయి. ఇందులో రాత్రి బస చేయడానికి స్కౌట్స్కు, పాఠశాలల విద్యార్థి బృందాలకు ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియంలో హిస్టారిక్ ప్యాటక్సెట్ హోమ్సైట్, ప్లిమత్ కాలనీ అనే రెండు విభాగాలు ఉన్నాయి. ఇరవైమందికి పైబడిన బృందాలు ఇక్కడ బస చేయవచ్చు. ఇందులోని ఒకే విభాగంలో గడపాలనుకునే బృందాల్లో కనీసం ఇరవైమంది ఉండాలి. నలభై మందికి పైగా ఉండే బృందాలకు రెండు విభాగాల్లోనూ గడిపేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో బసకు ఒక్కొక్కరు 81 డాలర్లు (రూ.6,963) చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో బస చేసేవారికి అల్పాహారం, భోజనం, ఇతర వసతులు పూర్తిగా ఉచితం.నేచురల్ హిస్టరీ మ్యూజియంరాత్రి బసకు వీలు కల్పించే మ్యూజియంలు ఎక్కువసంఖ్యలో అమెరికాలో ఉంటే, ఇది యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్లో ఉంది. డైనోసార్ల శిలాజాలు సహా ప్రకృతి పరిణామాలకు, చరిత్రకు సంబంధించిన పలు వస్తువులను భద్రపరచిన ఈ మ్యూజియం విద్యార్థులకు రాత్రి బస చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియం పిల్లల కోసం ప్రత్యేకంగా ‘డైనోస్నోర్స్’ అనే ఈవెంట్ను నిర్వహిస్తోంది. ఏడేళ్ల నుంచి పదకొండేళ్ల లోపు వయసుగల విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో కలసి ఇక్కడ రాత్రి బస చేయవచ్చు. రాత్రి బస చేసే విద్యార్థులకు ఈ మ్యూజియంలో పలు వినోద విజ్ఞాన కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో బస చేయడానికి పిల్లలు ఒక్కొక్కరికి 114 డాలర్లు (రూ.9,800), పెద్దలు ఒక్కొక్కరికి 197 డాలర్లు (రూ.16,935) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం ఈ ఏడాది జూన్ 13, జూలై 4, జూలై 18, ఆగస్టు 1, ఆగస్టు 22, సెప్టెంబర్ 30 తేదీల్లో ఈ అవకాశం కల్పిస్తోంది.స్మిత్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీఈ మ్యూజియం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. ఎనిమిదేళ్ల నుంచి పద్నాలుగేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. రాత్రి ఇక్కడ బస చేసేవారు ఇందులోని డేవిడ్ కోచ్ హాల్ ఆఫ్ ఫాసిల్స్లోను, దానికి దగ్గరలోనే ఉన్న సాంట్ ఓషన్ హాల్లోను థీమ్ పార్టీలు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తోంది. రాత్రంతా ఇక్కడ బస చేయాలంటే, ఒక్కొక్కరు 150 డాలర్లు (సుమారు రూ.12,900) చెల్లించాల్సి ఉంటుంది. పదిమంది లేదా అంతకు మించిన జనాలు బృందాలుగా వెళితే, ఒక్కొక్కరికి 120 డాలర్లు (సుమారు రూ.10.300) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ అవకాశం అన్నిరోజుల్లోనూ ఉండదు. ఈ ఏడాది జూన్ 20, 28 తేదీల్లోను; జూలై 11, 19 తేదీల్లోను; ఆగస్టు 1, 8 తేదీల్లోను మాత్రమే ఇక్కడ బస చేసే అవకాశం అందుబాటులో ఉంటుంది.మేరీలండ్ సైన్స్ సెంటర్అమెరికాలోని మేరీలండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ఉంది ఈ మ్యూజియం. ఏడాదిలో రెండుసార్లు రెండేసి రోజుల చొప్పున రాత్రివేళ బస చేసేందుకు ఈ మ్యూజియం అనుమతిస్తుంది. ఏటా మే, జూన్ నెలల్లో ‘స్టార్వార్స్’ థీమ్ నైట్ పార్టీ నిర్వహిస్తుంది. అలాగే, ‘పైజమా పార్టీ’ నిర్వహిస్తుంది. ఏటా రెండేసి రోజులు సాగే ఈ పార్టీలలో ఐదేళ్లకు పైబడిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి పాల్గొనవచ్చు. రాత్రి ఇక్కడే బస చేయవచ్చు. ఈ పార్టీలలో పాల్గొనే పిల్లలకు స్లైమ్, బ్లాక్ బిల్డింగ్ సహా రకరకాల హస్త కళలు, ప్లానెటేరియం షో, ఐమాక్స్ షో కూడా ఉంటాయి. ఇందులో బస చేసేవారు ఒక్కొక్కరు 71 డాలర్లు (రూ.6,104) చెల్లించాల్సి ఉంటుంది.ఇంట్రెపిడ్ మ్యూజియంఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులోని విమానవాహక నౌకలో డిన్నర్ పార్టీలు చేసుకోవడానికి, రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఐదేళ్ల నుంచి పదిహేడేళ్ల లోపు వయసు గల పిల్లలు ఆస్వాదించడానికి అనువుగా ఇందులో రకరకరాల వినోద విజ్ఞాన కార్యక్రమాలను రూపొందించారు. ఫ్లాష్లైట్ గైడెడ్ టూర్లు, అపరిమితంగా రకరకాల సిమ్యులేషన్ రైడ్లు ఇందులోని ప్రత్యేక ఆకర్షణలు. బస చేసేవారికి ఇక్కడ అల్పాహారం, చిరుతిళ్లు, భోజనం అన్నీ ఉచితం. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఒక్కొక్కరు 130 డాలర్లు (రూ.11,182), బసతో పాటు పార్టీలు చేసేకునేవారు ఒక్కక్కరు 145 డాలర్లు (రూ.12,472) చెల్లించాల్సి ఉంటుంది. బృందాలుగా వచ్చేటట్లయితే, ఒక్కొక్కరు 99 డాలర్లు (రూ.8,515) చెల్లించాల్సి ఉంటుంది. ఫీల్డ్ మ్యూజియంఇది అమెరికాలోని షికాగో నగరంలో ఉంది. పురాతన డైనోసార్ల శిలాజాలను భద్రపరచిన ఈ మ్యూజియం రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. భూగ్రహ పరిణామానికి చెందిన అనేక ఆధారాల అవశేషాలను ఈ మ్యూజియంలో భద్రపరచారు. రాత్రివేళ బస చేసే వారికి ఇక్కడ పలు వినోద, విజ్ఞాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రవేత్తలతో ప్రత్యేక ఉపన్యాసాలు, వైల్డ్లైఫ్ డిటెక్షన్ పోటీలు, థీమ్డ్ చాలెంజెస్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పిల్లలతో కలసి కుటుంబాలు, పదిహేను మంది లోపు బృందాలు ఇందులో రాత్రి బస చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో రాత్రి బస చేయాలనుకునే వారు ఇందులో వారు ఎంపిక చేసుకునే ప్యాకేజీలను బట్టి ఒక్కొక్కరు 95–200 డాలర్లు (రూ.8,171–రూ.17,203) వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాత్రి బస చేసేవారికి అల్పాహారం, భోజనం, చిరుతిళ్లు, మరునాటి ఉదయం మ్యూజియం సందర్శనకు ప్రవేశం పూర్తిగా ఉచితం.యూఎస్ఎస్ హార్నెట్ మ్యూజియంఈ మ్యూజియం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం యాలమీడాలో ఉంది. ఇది ఏటా ఒకరోజు ‘హిస్టరీ మిస్టరీ ఓవర్నైట్’ పేరిట ఏర్పాటు చేసే కార్యక్రమాల సందర్భంగా రాత్రివేళ బస చేయడానికి అనుమతిస్తుంది. ఇందులో కుటుంబాలు, బృందాలు పాల్గొనవచ్చు. పదహారేళ్ల వయసు పైబడిన వారికోసం ఇందులో అర్ధరాత్రివేళ రెండో ప్రపంచయుద్ధం నాటి విమానవాహక నౌక సందర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మ్యూజియం ప్రతినిధులు సందర్శకులకు దీని విశేషాలను వివరిస్తారు. రాత్రివేళ ఇందులో నిద్రించే అవకాశం కూడా కల్పిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య అతీంద్రియ శక్తుల అన్వేషణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏడేళ్ల నుంచి పదహారేళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా వినోదాత్మక వైజ్ఞానిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే బృందాలు పదిమంది వరకు ఉంటే వెయ్యి డాలర్లు (సుమారు రూ.86 వేలు), పదిమందికి పైబడి ఇరవైమంది వరకు ఉంటే రెండువేల డాలర్లు (సుమారు రూ.1.72 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది.ఓరెగాన్ మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీఇది అమెరికాలోని పోర్ట్లండ్ నగరంలో ఉంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పారిశ్రామిక అభివృద్ధికి ఎలా దోహదపడిందో వివరించే రకరకాల వస్తువులను ఇందులో భద్రపరచారు. విద్యార్థులు బృందాలుగా వారి ఉపాధ్యాయులతో కలసి ఈ మ్యూజియం సందర్శించడంతో పాటు రాత్రివేళ ఇక్కడే బస చేసేందుకు అనుమతి ఇస్తారు. ఒక్కో విడతలో యాభైమందికి లోపుగా వచ్చే బృందాలను మాత్రమే అనుమతిస్తారు. మూడో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు ఇందులోకి అనుమతి ఉంటుంది. మ్యూజియం సందర్శనకు వచ్చే బృందాలు తమకు అనువైన తేదీలను చెప్పి, ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. బృందంలో ముప్పయి మంది వరకు ఉంటే 3300 డాలర్లు (రూ.2.83 లక్షలు), ముప్పయి మందికి మించి ఉంటే, అదనంగా ఉండేవారు ఒక్కొక్కరికి 90 డాలర్ల (రూ.7,737) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బృందంలోని సభ్యుల సంఖ్య యాభైమందికి మించరాదనే పరిమితి ఉంది. ఇక్కడ బస చేసేవారికి అల్పాహారం, భోజనం ఉచితం. ఆరుబయట నిద్రించేవారికి టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు కూడా ఉచితంగానే అందిస్తారు.మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీఇది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఉంది. మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుకునే స్కౌట్స్ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలసి బస చేయడానికి ఈ మ్యూజియం అనుమతిస్తుంది. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసిన రకరకాల ఆవిష్కరణలను పొందుపరచిన ఈ మ్యూజియంలో బస చేయడానికి ప్రతి గురు, శుక్ర, శనివారాల్లో అనుమతి ఉంటుంది. బస కోసం బృందాలుగా వచ్చేవారు ముందుగానే సంప్రదించి, బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ముప్పయి మంది వరకు ఉండే బృందాలు 1300 డాలర్లు (రూ.1.11 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. బృందంలో ముప్పయిమందికి అదనంగా ఉంటే పిల్లలు ఒక్కొక్కరికి 48 డాలర్లు (రూ.4,126), పెద్దలు ఒక్కొక్కరికి 36 డాలర్లు (రూ.3,094) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.ప్లిమత్ ప్యాటక్సెట్ మ్యూజియంఇది అమెరికాలోని బోస్టన్ నగరానికి చేరువలో ఉంది. ఇంగ్లండ్లోని పదిహేడో శతాబ్దినాటి జనజీవనానికి అద్దంపట్టే వస్తువులను భద్రపరచే ఈ మ్యూజయంలో అప్పటి కాలంలో మాదిరిగానే గడపడానికి వీలుగా వసతులు ఉన్నాయి. ఇందులో రాత్రి బస చేయడానికి స్కౌట్స్కు, పాఠశాలల విద్యార్థి బృందాలకు ఈ మ్యూజియం అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియంలో హిస్టారిక్ ప్యాటక్సెట్ హోమ్సైట్, ప్లిమత్ కాలనీ అనే రెండు విభాగాలు ఉన్నాయి. ఇరవైమందికి పైబడిన బృందాలు ఇక్కడ బస చేయవచ్చు. ఇందులోని ఒకే విభాగంలో గడపాలనుకునే బృందాల్లో కనీసం ఇరవైమంది ఉండాలి. నలభై మందికి పైగా ఉండే బృందాలకు రెండు విభాగాల్లోనూ గడిపేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో బసకు ఒక్కొక్కరు 81 డాలర్లు (రూ.6,963) చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో బస చేసేవారికి అల్పాహారం, భోజనం, ఇతర వసతులు పూర్తిగా ఉచితం.నేచురల్ హిస్టరీ మ్యూజియంరాత్రి బసకు వీలు కల్పించే మ్యూజియంలు ఎక్కువసంఖ్యలో అమెరికాలో ఉంటే, ఇది యునైటెడ్ కింగ్డమ్ రాజధాని లండన్లో ఉంది. డైనోసార్ల శిలాజాలు సహా ప్రకృతి పరిణామాలకు, చరిత్రకు సంబంధించిన పలు వస్తువులను భద్రపరచిన ఈ మ్యూజియం విద్యార్థులకు రాత్రి బస చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మ్యూజియం పిల్లల కోసం ప్రత్యేకంగా ‘డైనోస్నోర్స్’ అనే ఈవెంట్ను నిర్వహిస్తోంది. ఏడేళ్ల నుంచి పదకొండేళ్ల లోపు వయసుగల విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో కలసి ఇక్కడ రాత్రి బస చేయవచ్చు. రాత్రి బస చేసే విద్యార్థులకు ఈ మ్యూజియంలో పలు వినోద విజ్ఞాన కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో బస చేయడానికి పిల్లలు ఒక్కొక్కరికి 114 డాలర్లు (రూ.9,800), పెద్దలు ఒక్కొక్కరికి 197 డాలర్లు (రూ.16,935) చెల్లించాల్సి ఉంటుంది. ఈ మ్యూజియం ఈ ఏడాది జూన్ 13, జూలై 4, జూలై 18, ఆగస్టు 1, ఆగస్టు 22, సెప్టెంబర్ 30 తేదీల్లో ఈ అవకాశం కల్పిస్తోంది. -
ఈ వారం కథ: టైగర్
మంచం మీద అసహనంగా కదులుతున్నాడు నిమ్మయ్. ఎంత ప్రయత్నించినా అతనికి నిద్ర రావటం లేదు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వ్యాపారి మనసులో మెదులుతున్నాడు. ఓ పెద్ద రాజకీయ నేతను ఎదిరించి ధైర్యంగా అతను మాట్లాడటం నమ్మశక్యం కాకుండా ఉంది. ఇంకెవరయినా ఈ విషయం చెబితే నమ్మేవాడు కాదేమో, కాని తన కళ్ల ముందు జరిగిన సంఘటనను ఎలా కాదనగలడు? ఆ నిమిషంలో తన ఆఫీసు గుర్తొచ్చింది. తను రోజూ గాడిద చాకిరీ చేసినా స్పెషల్ సెక్రటరీ తనను అవమానకరంగా ఏదో ఒక మాట అంటుంటాడు. ఆ రోజు కూడా తన మహిళా పీఏ ఎదుట తనను అతను తిడుతుంటే, ఆమె చిరునవ్వులు చిందిçస్తుండటం చూసి తలకొట్టేసినట్టయ్యింది. ‘అసలు ఆ అధికారిగాడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? వెధవ హైడ్రా మొహం వాడూనూ– ఉదయం 11 గంటలకు తాపీగా ఆఫీసుకొచ్చి కాఫీలు, టీలు, సిగరెట్లతో మధ్యాహ్నం 1 వరకూ కాలక్షేపం చేస్తాడు. ఆ తర్వాత ఇంటికి తగలడి మళ్లీ 3 గంటలకు ఆఫీసు మొహం చూస్తాడు. సాయంత్రం 5 గంటలకు స్టెనోని పిలిచి డిక్టేషన్ మొదలుపెడతాడు. సరిగ్గా ఆ సమయానికే నిమ్మయ్ని పిలిచి ఏదో ఒక సాకుతో తిట్టటం మొదలుపెడతాడు’ ఆలోచించసాగాడు నిమ్మయ్. ఆ అధికారి ఆఫీసులో మరెవరినీ ఇలా తిట్టటం లేదన్న విషయం నిమ్మయ్ దృష్టికి వచ్చింది. ‘నువ్వెలా పరీక్ష రాసి ఈ ఉద్యోగానికి ఎంపికయ్యావో నేను కూడా పోటీ పరీక్షలు రాసి ఈ ఉద్యోగానికి వచ్చాను. నన్ను తిట్టటానికి నీకేం అధికారం ఉందని నిలదీయాలని అనిపించేది. కాని, భార్యా పిల్లలు, ఊళ్లో మంచం పట్టిన నాన్న కళ్ల ముందు మెదిలేవారు. దాంతో ఆ తిట్లన్నింటినీ మౌనంగా భరించడం అలవాటయ్యింది. కాని ఎంత చిత్రం! ఓ మామూలు కూరగాయల వ్యాపారి తనలా కాదు. నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థి కృపాసాగర్ పట్నాయక్పైన తిరగబడ్డాడు. ఆయన నవ్వుకుంటూ వెళ్లిపోయాడు తప్ప వ్యాపారిని ఏమనలేదు. బహుశా ఈ కూరగాయలతని దగ్గర ఏవో శక్తులు ఉండొచ్చు. అదేమిటో తెలుసుకుంటే తనకు కూడా ఉపయోగపడతాయన్న ఆలోచన వచ్చింది. ‘ఇప్పుడు బాగా పొద్దు పోయింది.రేప్పొద్దున వెళ్లి ఆ రహస్యం తెలుసుకోవాలి’ అనుకున్నాడు. దాంతో ప్రశాంతంగా నిద్రపట్టింది.మరుసటి రోజు దినచర్య పూర్తి చేసి, కాయగూరల బ్యాగు డిక్కీలో పెట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చాడు నిమ్మయ్. కాలనీ మార్కెట్లో అతను కూరగాయలు అమ్ముతున్నాడు. తలచుట్టూ తువ్వాలు చుట్టుకుని ఉన్నాడు. ఎదురుగా తట్టల్లో రకరకాల కూరగాయలు ఉన్నాయి. ఎవరి కోసమో బంగాళదుంపలు త్రాసులో తూస్తున్నాడు. పక్కకు చూడనయినా చూడకుండా, ‘అలా బెండకాయల చివర్లని విరవకండి. అలా చేస్తూపోతే సరుకు అమ్ముడుపోవటం కష్టం’ గట్టిగా అరిచి చెప్పాడు. బహుశా ఇతనికి ఒళ్లంతా కళ్లు ఉన్నాయేమో అని మనసులో అనుకుని బెండకాయల మీద నుంచి చేతులు వెనక్కి తీశాడు నిమ్మయ్. గబగబా ప్లాస్టిక్ బుట్టలో కొన్ని బెండకాయలు వేసి అతని చేతికిచ్చాడు.‘ఎంత కావాలి?’‘పావు కేజీ’ నిమ్మయ్ చెప్పాడు.అతను వాటిని తూచి బుట్ట అందించాడు. పర్సులోంచి డబ్బులు తీసి అతని చేతికందిస్తూ కాస్తంత దగ్గరగా జరిగాడు నిమ్మయ్. ‘మీ దగ్గర ఏదో మంత్రం ఉంది’ అన్నాడు నర్మగర్భంగా. ‘అలాంటిదేమీ లేదు’ తేలిగ్గా నవ్వేస్తూ చెప్పాడు ఆ వృద్ధుడు. ‘అయితే నీ ఒంటి మీద ఏదైనా ఉంగరమో, తాయెత్తో, లేకపోతే మంత్రించిన నెక్లెస్సో ఏదో ఒకటి ఉండి తీరాలి’ అన్నాడు.‘సార్! అలాంటివేవీ లేవు. ఏదో కూరగాయలు అమ్ముకునేవాడిని.’‘ఇవేం లేకపోతే కృపాసాగర్ని ఎలా ఎదిరించగలవు? ఆయన మామూలు వాడా? వందలాది అనుచరులున్న పెద్ద రాజకీయ పార్టీ నేత. అలాంటి వాడిని ఎదిరించేవంటే, నీ దగ్గర ప్రత్యేకమైనది ఏదో ఉండి ఉండాలి. లేకపోతే ఈ పాటికి నిన్ను అతను శవంగా మార్చి ఉండేవాడు’ అన్నాడు.అంతలోనే ఆఫీసు వాతావరణం గుర్తొచ్చి, ‘నేను పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. నువ్వే నన్ను కాపాడాలి’ అన్నాడు దీనంగా.దాంతో ఆ కూరగాయల వ్యాపారి రామేశ్వర్ సింగ్ చలించిపోయాడు. ‘నిన్ను చూస్తే 30, 35 ఏళ్ల వాడిలా కనిపిస్తున్నావు. నీకు నాలాంటి వృద్ధుడు ఏం సాయం చేయగలడు. నువ్వేదో కష్టాల్లో ఉన్నావన్న విషయం మాత్రం అర్థమైంది. అదేంటో చెప్పు?’ అనడిగాడు.నిమ్మయ్ తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఆఫీసులో బాస్ వేధింపుల గురించి వివరించాడు. అంతా విన్న తర్వాత, ‘సాయంత్రం మా ఇంటికి రా! ఆ ఫ్లాట్ వెనకాల మామిడి చెట్టు పక్కనున్న ఇంట్లో ఉంటా. ఈ లోపుగా నేను నీకు ఏదైనా పరిష్కారం ఆలోచించి ఉంచుతా’ హామీ ఇచ్చాడు రామేశ్వర్. నిమ్మయ్కి ఏదో బరువు దించుకుంటున్నట్టుగా అనిపించింది. కచ్చితంగా రామేశ్వర్ ఏదో మంత్రదండం ఇస్తాడు. దానితో స్పెషల్ సెక్రటరీకి తను గుణపాఠం చెబుతాడు. ‘నీ పని నువ్వు చేసుకో’ అని ఆయన మొహం మీదనే తను అంటే ఆయన మొహం ఎలా మాడిపోతుందో ఊహిస్తే గమ్మత్తుగా అనిపించింది.నిమ్మయ్ రౌత్ మనసారా నవ్వాడు చాలారోజుల తర్వాత. బ్యాగును ఊపుకుంటూ స్కూటర్ దగ్గరకు నడిచాడు. ఆ తర్వాత ఆఫీసుకు వెళుతుంటే రోడ్డుకిరువైపులా ఉన్న ప్రపంచం అంతా కొత్తగా కనిపించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు రాగానే ఎర్రలైటు వెలిగింది. దానితో తలమీద ఉన్న హెల్మెట్ను తీసి ఆకాశం వైపు తలెత్తి చూశాడు. పక్షులు రివ్వున ఎగురుతూ కనిపించాయి. ‘రేపటి నుంచి నేను కూడా మీలాగే స్వేచ్ఛగా విహరిస్తాను. రెక్కలు లేకపోయినా’ అని మనసులో అనుకున్నాడు.సెక్రటేరియట్ ఇంకా కొద్ది దూరంలోనే ఉంది. సిగ్నల్ లైటు ఎరుపు నుంచి ఆకుపచ్చకు మారి ట్రాఫిక్ కదులుతూండగా, స్పెషల్ సెక్రటరీ కారు పక్కనుంచి సాగిపోయింది. అందులో వెనక సీట్లో కూర్చున్న జీనా సాహెబ్ను చూడగానే అతనిలో ఉత్సాహం నీరుగారిపోయింది.సాయంత్రం 4 గంటలకు జీనా సాహెబ్ నుంచి పిలుపు వచ్చింది. ‘ఎలక్షన్ రోజులు దగ్గర పడుతున్నాయి. మన ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్లు ఎందరికి అందాయో వాటి వివరాలు నాకు కావాలి’ అన్నాడు. ఓ నిమిషం ఆగి మళ్లీ అన్నాడు. ‘పదిహేను రోజుల క్రితం ఈ పని పూర్తి చేయమని నీకు చెప్పాను. ఇంత వరకూ ఎందుకు పూర్తి చేయలేదు?’ నిలదీశాడు. నిమ్మయ్ మౌనంగా నిలబడ్డాడు.‘నీ మొహం చూపించటానికి ఇక్కడకు వచ్చావా?’ గట్టిగా అరిచాడు స్పెషల్ సెక్రటరీ. నిమ్మయ్ నోరు మెదపలేదు. ‘ఎక్కడ చదువుకుని వచ్చి తగలబడ్డావ్?’నిమ్మయ్ జవాబు చెప్పలేదు. ‘నీలాంటి పనికిమాలిన వెధవలంతా ప్రభుత్వం పరువు తీస్తున్నారు. మా ఖర్మ’నిమ్మయ్లో దుఃఖం తన్నుకొచ్చింది.‘గెటవుట్’ సెక్రటరీ ఉరుము ఉరిమినట్టుగా అన్నాడు. ‘రేపు ఉదయం 11 గంటలకల్లా ఈ వివరాలు నా ముందు ఉండాలి. అర్థం అయ్యిందా ఈడియట్..’నిమ్మయ్ కాళ్లు వణికాయి. స్పెషల్ సెక్రటరీ చాంబర్ నుంచి నిస్సత్తువగా బయటకు వచ్చాడు. తలుపు దగ్గర పీటమీద కూర్చుని కనిపించాడు ప్యూన్. అతనికి కన్నీళ్లు కనిపించకుండా వాటిని దాచుకుంటూ మెల్లగా వాష్రూంలోకి అడుగుపెట్టాడు. అద్దంలో తన ముఖం ఓడిపోయిన వ్యక్తిలా వాడిపోయి కనిపించింది. గట్టిగా రెండుసార్లు శ్వాస విడిచి వదిలాడు. సెక్రటరీ మాటలు గుర్తొచ్చాయి. నిజానికి ఆ పని అప్పగించింది తనకు కాదు. ఆ పని చేయవలసింది బలరాంబాబు. అది తెలిసి చెప్పలేని తన బలహీనతను తిట్టుకున్నాడు. నిమ్మయ్ తన సీటు దగ్గరకు వచ్చాడు. ఈవెంట్ మేనేజర్ ఎవరో తన డిపార్టుమెంట్కు వచ్చాడు.అందరికీ వడ, సమోసా, టీ సిద్ధం చేసి ఉంచాడు.తనను ఎవరో పిలిచారు. ‘వడ తీసుకోండి’ అన్నారు. ‘నాకు తినాలని లేదు’ నిమ్మయ్ బలహీనంగా చెప్పాడు. ‘అవునవును. ఇప్పుడే జీనా చాంబర్కి వెళ్లొచ్చాడు. ఆయన కడుపు నిండా పెట్టుంటాడు. ఇక మిగతావి ఏం తినగలడు’ అని ఎవరో వేళాకోళమాడితే మిగతావాళ్లంతా ఫక్కుమని నవ్వారు. ఇక అక్కడ ఉండలేక బయటకొచ్చేశాడు. ‘నీ కోసం నేను ప్రత్యేకంగా ఒకటి సిద్ధం చేశాను. నీకు కావలసినన్ని రోజులు దాన్ని ఉంచుకోవచ్చు’ అన్నాడు రామేశ్వర్ తన ఇంటికి వచ్చిన నిమ్మయ్ని చూడగానే. ‘కానీ నీ పనయిన తర్వాత మాత్రం నువ్వు దాన్ని తిరిగి ఇవ్వాలి’‘అలాగే తప్పకుండా’ అన్నాడు నిమ్మయ్.‘ఇది మా నాన్న ఆస్తి. తను నమ్ముకున్న ఆస్తి’‘నాన్నా! ఆయన ఎక్కడున్నారు?’ గబుక్కున అడిగాడు నిమ్మయ్. అంతలోనే తను ఎంత పిచ్చి ప్రశ్న వేశాడో అర్థమైంది. ఓ 70, 75 ఏళ్ల వ్యక్తి తండ్రి జీవించి ఉండే అవకాశం ఉంటుందా?’అంతలోనే అతని భార్య టీ తీసుకొచ్చి ఇద్దరికీ ఇచ్చింది. అప్పుడు నిమ్మయ్ గది అంతా పరికించి చూశాడు. రెండు గదుల ఇల్లు. ఒక ఇంట్లో ఉన్న ఔట్ హౌస్ అది. ‘ఇంతకీ ఆ వస్తువు ఎక్కడ?’ ఎప్పుడెప్పుడు దాన్ని తీసికెళదామా అన్న ఆత్రంగా ఉంది. ‘ఒక్క నిముషం. ఆ మనిషికి కబురుపెట్టాను, ఈపాటికి వస్తూండాలి’ అన్నాడు రామేశ్వర్. ‘మీరు ఎంత ఇవ్వమన్నా అంత ఇస్తాను. నా జీవితకాలంలో మీరు చెల్లించమన్న మొత్తం చెల్లించేస్తా’. ‘అదేం అవసరం లేదు. మీ పని అయ్యాక నాకు తిరిగి ఇచ్చేస్తే చాలు. టైగర్ మంత్రంతో అది తయారయ్యింది. ఆ విషయం ఎవరితోనూ పంచుకోవద్దు’ హెచ్చరించాడు రామేశ్వర్. ‘అయితే ఒక్క విషయం. మీరు దాన్ని దుర్వినియోగం చేస్తే అది ప్రతికూలతలకు దారి తీస్తుంది’‘టైగరా?’ ఆశ్చర్యానికి లోనయ్యాడు నిమ్మయ్.‘అవును. టైగరే!’ అంతలో ఎవరో బయట నుంచి పిలిచారు. రామేశ్వర్ బయటకు వెళ్లి ఓ పాలిథీన్ బ్యాగ్తో లోపలకు వచ్చాడు. ‘ఈ బ్యాగును ఇంటికి తీసికెళ్లు. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆఫీసుకు వెళ్లేటప్పుడు వేసుకో. మార్పు నీకే అర్థం అవుతుంది’మళ్లీ చెబుతున్నాను. ఇందులో ఓ మనిషి గాని, మంత్రంగాని, తంత్రంగాని ఏవీ లేవు. ఇదంతా నడిపేది ఓ టైగర్ మాత్రమే’ అని ఇంకోసారి చెప్పాడు. ఇంటికి వెళుతూ టైగర్.. టైగర్.. టైగర్ అని మనసులో అనుకోసాగాడు.మరుసటి రోజు ఆఫీసుకు వెళుతుండగా, దారిలో ఓ గుంపు కనపడింది. ట్రాఫిక్ పోలీసు ఎవరో సైక్లిస్టు చొక్కా కాలర్ పట్టుకుని బూతులు తిడుతున్నాడు. కొట్టటానికి సిద్ధం అవుతున్నాడు.‘దయచేసి నన్ను వదిలేయండి. రెడ్ సిగ్నల్ చూసుకోలేదు’ ఆ సైకిలు కుర్రాడు బతిమాలుతున్నాడు.‘కళ్లు పోయాయా?’ కానిస్టేబుల్ అరిచాడు.అది చూస్తూ ఊరుకోలేకపోయాడు నిమ్మయ్. ‘ఎందుకు అంత గట్టిగా అరుస్తారు. చూసుకోలేదని చెబుతున్నాడు కదా, వదిలెయ్యండి. కావాలంటే అతనికి జరిమానా వేయండి’ స్కూటర్ మీద కూర్చునే గద్దించినట్టుగా అన్నాడు.పక్కన ఉన్న నలుగురైదుగురు నిమ్మయ్కి మద్దతిచ్చారు. దాంతో కానిస్టేబుల్ ఆ కుర్రాడిని వదిలేశాడు.హఠాత్తుగా నిమ్మయ్కి ఓ విషయం అర్థమైంది. తను కోపాన్ని ప్రదర్శించగలిగాడు. తనలో మార్పు వచ్చింది. రామేశ్వర్ తనకిచ్చిన జాకెట్ను చూసుకున్నాడు. ఖాదీ, గోధుమరంగు, కింద కొంచెం ఎర్రగా ఉంది. అది రక్తమా? లేకపోతే పెయింటా? అనేది నిమ్మయ్కి అర్థం కాలేదు.అతను ఆఫీసుకు వెళ్లేసరికి 10.30 అయ్యింది. తన విభాగంలో ఉన్న సీనియర్ క్లర్క్ ప్రతిమా మొహంతి ఎవరినో గట్టిగా తిడుతోంది. ఆ వ్యక్తి ఏదో చెప్పాలని ప్రయత్నించినా ఆమె వినటం లేదు. ఆమె మొహం తను రోజు చూసే జీనా సాహెబ్లాగా ఉంది. ‘మేడమ్’ గట్టిగా పిలిచాడు నిమ్మయ్. కుర్చీని వెనక్కి లాక్కుని కూర్చుంటూ ‘మనకు జీతం ఇచ్చేది సామాన్యులకు సేవలందించటానికే తప్ప వాళ్లను తిట్టటానికి కాదు’ అన్నాడు.ఆ మాటలకు ప్రతిమా మొహంతి మొహం మాడిపోయింది. తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని కూర్చోమని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ వ్యక్తి నిమ్మయ్ వంక కృతజ్ఞతగా చూశాడు. మధ్యాహ్నం టీ తాగుతున్నప్పుడు సెక్షన్ ఆఫీసరు పలకరించాడు.‘నిమ్మయ్.. కొత్తగా కనిపిస్తున్నావు. నువ్వు వేసుకున్న జాకెట్ నీ ఒంటికి అతికినట్టు సరిపోయింది. ఎక్కడ తీసుకున్నావ్?’‘టైగర్’ అని చెప్పబోయి గబుక్కున ఊరుకున్నాడు. ‘సర్! వ్యక్తిగత విషయాలు ఆఫీసులో అవసరమా?’ అని గట్టిగా అన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ నిమ్మయ్ ఇలా మాట్లాడటం అతను చూడలేదు.మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో నిమ్మయ్కి చీఫ్ సెక్రటరీ నుంచి పిలుపొచ్చింది. నిమ్మయ్ జాకెట్ను నెమ్మదిగా స్పృశించాడు. ఒక చేత్తో పాడ్, పెన్ను, రెండో చేత్తో జాకెట్ను పట్టుకుని తలుపు నెట్టుకుంటూ లోపలకు అడుగుపెట్టాడు.నిమ్మయ్ని చూడగానే స్పెషల్ సెక్రటరీ గట్టిగా కేకలు ప్రారంభించాడు. ‘పొద్దున 11 గంటలకల్లా లబ్ధిదారుల జాబితా ఇవ్వమని అడిగాను కదా? ఇంతకీ ఆ ఫైల్ ఎక్కడ?’‘మీరు ఆ పనిని అప్పగించింది నాకు కాదు’ నిమ్మయ్ కూల్గా అన్నాడు. బలరాం నాయక్.. అతన్ని పిలిచి మాట్లాడితే మీకు సరైన సమాధానం లభిస్తుంది’‘నాకే ఎదురు సమాధానం చెబుతావా? ఈడియట్’నిమ్మయ్ అంతరంగంలో పులి నిద్ర లేచింది. ‘నాకు అదేం తెలియదు. ముందు ఆ ఫైల్ పట్టుకొచ్చి చావు’ గద్దింపుగా అన్నాడు స్పెషల్ సెక్రటరీ. నిమ్మయ్ ఇక నిగ్రహించుకోలేకపోయాడు. స్పెషల్ సెక్రటరీ ఎదురుగా ఉన్న కుర్చీల్లో ఒకదాన్ని వెనక్కి లాక్కుని దర్జాగా కూర్చున్నాడు. ఆ తర్వాత స్వరాన్ని పెంచి స్పెషల్ సెక్రటరీ వంక చూస్తూ ‘మీరు కావాలనే నన్ను అవమానిస్తున్నారు. మీకు అలా మాట్లాడే హక్కులేదు’ అన్నాడు సూటిగా. దాంతో కోపంతో ఊగిపోయాడు స్పెషల్ సెక్రటరీ. ‘ఒక సాధారణ క్లర్క్ నన్ను సవాల్ చేస్తాడా? వీడికి బుద్ధి చెప్పాలి’ అనుకున్నాడు. ‘ఇంటికి పోయి నీ పెళ్లాం ముందు ఈ ఫోజులు కొట్టు.నా దగ్గర కాదు’ఆ మాటలకు నిమ్మయ్ లొంగలేదు సరికదా, ‘మీరు మాట్లాడేది చాలా దురుసుగా ఉంది’ అని ఓ నిముషం ఆగి, ‘నా భార్య దగ్గర ప్రదర్శించటానికి కొత్తగా నా దగ్గర ఏదీ లేదు. మీ ఇంట్లోలా నా భార్య నన్ను వదిలి వెళ్లలేదు. భగవంతుడి దయవల్ల మేం ఇద్దరం సుఖంగా జీవిస్తున్నాం’ అన్నాడు. ‘మీ విడాకుల కేసు విచారణ సందర్భంగా మీ అబ్బాయిని మీతో కలిసి జీవించాలని అడిగారు. దానికి వాడు మీ కొడుకేనని నమ్మకం ఏమిటని మీ ఆవిడ మిమ్మల్ని నిలదీశారు. అదృష్టవశాత్తు నా జీవితంలో ఇలాంటి దురదృష్టకర పరిస్థితి లేదు’ అని కూడా అన్నాడు.దీనితో జీనా సాహెబ్ హతాశుడయ్యాడు. అతనికి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా అనిపించింది. కోపం, బాధ ఒకేసారి అతనిపై దాడిచేశాయి. వెంటనే కాలింగ్ బెల్ నొక్కాడు. అదీ ఆపకుండా. ఒక అంబులెన్స్ ప్రాంగణలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం అక్కడ ఏర్పడింది.దాంతో గది బయట నిలబడిన ప్యూన్ ఒక్క అంగలో లోపలకొచ్చాడు. నిమ్మయ్ని బయటకు పంపమని సైగ చేసి చెప్పాడు జీనా సాహెబ్. ప్యూన్ నిమ్మయ్ చేతిని పట్టుకుని వెళ్లమని మెల్లగా బతిమాలాడు. ఆ చేతుల్ని విదుల్చుకుని స్పెషల్ సెక్రటరీ వంక చూస్తూ అన్నాడు నిమ్మయ్. ‘నీలాంటి ఆఫీసర్లు ఎందుకూ కొరగారు. అందరూ తాడిచెట్లలాంటి వాళ్లు. ఇతరులకు ఫలాలు ఇవ్వరు లేదా కోరుకున్నట్టుగా చెట్టు నీడా దొరకదు’ అని, కాసేపు ఆగి, ‘ఇతరులను గౌరవించటం నేర్చుకో. అప్పుడు కూడా నీకు గౌరవం లభిస్తుంది. మన దేశంలో రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది. దాని ద్వారా అందే హక్కులకు సుప్రీం కోర్టు నుంచి రక్షణ లభిస్తుంది. ఆ సంగతి మరిచిపోకు’ పులిలా గర్జిస్తూ జీనా సాహెబ్ చాంబర్ నుంచి బయటపడ్డాడు నిమ్మయ్. ఎన్నో సంవత్సరాల నుంచి దిగమింగుకుంటున్న కోపం, అసహనం ఆ నిమిషంలో ఆవిరైపోయి, శరీరం బాగా తేలికగా అనిపించింది. మళ్లీ తన సీటు దగ్గరకు వెళ్లి యథావిధిగా పనిలో లీనమయ్యాడు.ఆ రోజు సాయంత్రం ఆఫీసు ముగిసే సమయానికి ఓ వార్త దావానలంలా సెక్రటేరియట్ అంతా వ్యాపించింది.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటులో పనిచేసే క్లర్క్ నిమ్మయ్ రౌత్ స్పెషల్ సెక్రటరీకి మాటకి మాట సమాధానం చెబితే ఆయన వారం రోజులు సెలవు మీద వెళ్లిపోయాడట. ఈ విషయాన్ని అందరూ విచిత్రంగా చెప్పుకున్నారు. ఆ రోజు నుంచి ఆఫీసు మొత్తానికి హీరో అయిపోయాడు. ప్యూన్ నుంచి ఆఫీసర్ల వరకూ అందరూ అతన్ని గౌరవించటం మొదలుపెట్టారు. ఏదయినా పని మీద వేరే డిపార్టుమెంటులోకి అడుగుపెడితే వాళ్లంతా లేచి నిలబడి స్వాగతం చెప్పటం మొదలుపెట్టారు.ఇదంతా రామేశ్వర్ అందించిన టైగర్ జాకెట్ మహిమ అని గుర్తించాడు నిమ్మయ్. వారం రోజుల తర్వాత సెలవు నుంచి తిరిగొచ్చిన స్పెషల్ సెక్రటరీ నిమ్మయ్ని పిలిపించాడు. తన దురుసు ప్రవర్తనకు క్షమాపణలు కోరటమే కాదు. బీపీ కారణంగా తను కోపాన్ని నిగ్రహించుకోలేకపోయేవాడినని, నిమ్మయ్ ఇదంతా మరచిపోవాలని ప్రాధేయపడ్డాడు.బయట, మార్కెట్లో కూడా నిమ్మయ్కి సరికొత్త అనుభవాలు ఎదురయ్యాయి. ఆ ఊళ్లోనే పెద్ద గూండాగా, అందరినీ చందాలు ఇవ్వమని పీక్కుతినే వాడుగా పేరున్న యువ సంఘ సెక్రటరీ అతని దగ్గరకు వచ్చి వినయంగా చేతులు జోడించి, ‘ఈ ఏడాది చందాలు వసూళ్లను నిలిపివేయమని డీజీపీ చెప్పారు. దసరా సంబరాలకు మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేకపోతే లేదు’ అంటూ వెళ్లిపోయాడు.నిమ్మయ్ జీవితం పూర్తిగా పరివర్తన చెందింది.ఇప్పుడతను పెద్ద నాయకుడయిపోయాడు. ఊళ్లో ఏ చిన్న పని కావాలన్నా నిమ్మయ్ని కలిస్తే చాలు అన్న అభిప్రాయం బలపడిపోయింది. కాలనీ యువకులంతా అతని ప్రభావంలో పడిపోయారు. పూజ కమిటీ అతన్ని నాయకునిగా ఎంచుకోవాలని నిర్ణయించింది. రామేశ్వర్ని కలిసి అప్పటికి మూడు నెలలు గడిచాయి. పని పూర్తి కాగానే జాకెట్ను తిరిగి ఇవ్వమని అతను చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. అతనికి దాన్ని ఇచ్చేయాలనే అనిపించింది. వెంటనే కొన్ని స్వీట్లు కొని, జాకెట్ ధరించి రామేశ్వర్ ఇంటికి వెళ్లాడు. అది పౌర్ణమి రాత్రి. చందమామ వెలుగు ముందు వీధి దీపాలు వెలవెలపోతున్నాయి. వాన కురిసి వెలిసింది. భాద్రపద మాసపు గాలులు చల్లగా వీస్తున్నాయి. ‘నేనెక్కడికీ పోవటం లేదు. ఈ జాకెట్ను ఇంకో నెలా రెండు నెలలు ఉంచుకో’ రామేశ్వర్ సలహా ఇచ్చాడు. ‘ఈ జాకెట్ లేకపోయినా ధైర్యంగా ఉండగలనని నువ్వు భావించినప్పుడు దాని తిరిగి ఇవ్వు’‘నేను మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను. అడగొచ్చా?’‘దానిదేం ఉంది. అడుగు. నాకు తెలిస్తే సమాధానం చెబుతాను’ ‘నిజంగా ఇది పులి జాకెట్టేనా?’‘అవును. ఎందుకంత సందేహం?’ రామేశ్వర్ నవ్వుతూ అడిగాడు. ఆ తర్వాత ‘మాది బిహార్. మా తండ్రి చనిపోయేనాటికి నాకు రెండేళ్లు’ తన కథ చెప్పటం ప్రారంభించాడు. ‘అప్పట్లో మా తండ్రి లాల్గఢ్ జమీందారు దగ్గర పని చేసేవాడు. ఆ జమీందారు అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. రైతులకు అప్పులిచ్చి వాళ్లు సకాలంలో చెల్లించకపోతే వాళ్లను వేధించేవాడు. అలాగే వాళ్ల కూతుళ్లను, కోడళ్లను, భార్యలను ఇలా ఆడవాళ్లందరినీ లైంగికంగా లొంగతీసుకునేవాడు. నిమ్మయ్ చెవులు రిక్కించి వింటున్నాడు. ‘ఒకసారి ఎందుకో ఆ జమీందారుకు మా నాన్నపైన కోపం వచ్చిందట. దానితో పులికి ఆహారంగా వేయమని ఆదేశాలిచ్చాడట. రెండు రోజులపాటు పులికి ఎలాంటి ఆహారం పెట్టలేదు. ఒక పంజరంలో నుంచి మా నాన్నను, ఇంకో పంజరంలో నుంచి మేకను ఒకేసారి పులి ఉన్న ప్రదేశంలోకి వదిలారు. పులి ఇద్దరినీ తింటుందా? ఒక్క మా నాన్ననేనా అనేది ఆసక్తిగా చూశారు.అయితే అక్కడ ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది.పులి మేకను ఆహారంగా చేసుకుని మా నాన్నను వదిలేసిందట. అప్పటికే చిగురుటాకులా వణికిపోతూ బిక్కచచ్చిపోయిన మా నాన్న దగ్గరకు వచ్చి మేకరక్తంతో తడిసిన తన పంజాను మా నాన్న జాకెట్కు తాకించింది. ఆ జాకెట్ మరేదో కాదు. ఇప్పుడు నువ్వు వేసుకున్నదే! ఆ తర్వాత జమీందారు మనుషులు మా నాన్నను వదిలి పెట్టారు. కాని, ఆయన ఇంటికి తిరిగి రాలేదు. అడవుల్లోకి వెళ్లిపోయి సాధువుగా మారాడని కొందరు, పిచ్చి పట్టిందని కొందరు, చనిపోయాడని మరి కొందరు చెప్పుకున్నారు గాని, ఆయన ఆచూకీ తెలియలేదు. ఆయన ధరించిన జాకెట్ మాత్రం మా ఇంటికి చేరింది. తర్వాత మేం ఆ గ్రామం విడిచి వచ్చేశాం. ఈ జాకెట్ను నాకందిస్తూ మా అమ్మ ఈ కథ అంతా నాకు చెప్పింది.‘అప్పుడు ఏమైంది?’ ఆసక్తిగా అడిగాడు నిమ్మయ్.‘నేను ఆ జాకెట్ను ధరించినప్పుడల్లా నాలోకి కొత్త శక్తి ప్రవేశించేది. దీనికి సంబంధించి నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి.నీకు కూడా అనుభవం అవుతోంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు,‘అంతే కాకుండా ఈ జాకెట్కి అతీంద్రయ శక్తులు ఉన్న మాట నిజం. కానీ నేను చెప్పిన విషయం గుర్తుంది కదా? దాన్ని నిందించావంటే దాని శక్తి హరించుకుపోతుంది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని జాగ్రత్తగా వినియోగించుకో. పనయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇవ్వు’ అని ముగించాడు రామేశ్వర్.సరికొత్త జీవనోత్సాహంతో ఇంటికి తిరిగి వచ్చాడు నిమ్మయ్. ఆ రోజు నుంచి సంతోషంగా ఉండటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆఫీసు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం భార్యా, పిల్లలతో గడుపుతున్నాడు. కాలనీలోనూ, ఆఫీసులోనూ అందరికీ ఇష్టుడయ్యాడు. అలా రోజులు గడుస్తున్నాయి.అంతలో మునిసిపల్ ఎన్నికల ప్రకటన విడుదలయ్యింది.ఆ రోజు ఆదివారం. ఉదయం టీ తాగి విశ్రాంతి తీసుకుంటున్నాడు నిమ్మయ్. అంతలోనే ఓ పదిమంది యువకులు కార్లు దిగి గబగబా గేటు తోసుకుని లోపలకు వచ్చారు.వాళ్లు కూర్చోవటానికి కూడా ఆ ఇంట్లో తగినన్ని కుర్చీలు లేవు. ఇంటి ప్రాంగణంలోనే పెద్ద జామచెట్టు ఉంది. దానికి చుట్టూతా చప్టా చేసి ఉంది. వాళ్లను అక్కడే కూర్చోమని చెప్పాడు. ‘నిమ్మయ్ భాయ్. మేం మీ సమయం ఎక్కువ తీసుకోం. రాజు భాయ్ ఓ విషయం చెప్పి రమ్మని మమ్మల్ని పంపారు’ బ్లూ జీన్స్, తెల్ల చొక్కా ధరించి ఉన్న వ్యక్తి మాట్లాడటం ప్రారంభించాడు. ‘వచ్చే మునిసిపల్ ఎన్నికల్లో నువ్వే మా పార్టీ అభ్యర్థిగా ప్రచారానికి దిగాలి. ఈ పరగణాలో నీలాంటి సమర్థుడు మరొకడు లేడు. అందుకే నిన్ను ఎంపిక చేశాం. నువ్వు కాదనుకూడదు. ఇదిగో నా కార్డు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి నిన్ను పార్టీ అధ్యక్షుని దగ్గరకు తీసికెళతాను’అతనికి ఎలా సమాధానం చెప్పాలో నిమ్మయ్కి అర్థం కాలేదు. ఆలోచనలో పడ్డాడు. తను ఓ పేద కుటుంబంలో పుట్టాడు. సాధారణమైన క్లర్క్గా జీవిస్తున్నాడు. తన నెలజీతం రూ.40వేలు కూడా లేదు. ఇంకా చెప్పాలంటే అన్ని కోతలు పోను తన చేతికి వచ్చేది కేవలం రూ.26 వేలు మాత్రమే. గ్రామంలో తనకి భూమిలాంటి ఆస్తిపాస్తులేం లేవు. మొత్తం కుటుంబం– ఆఖరికి మంచం పట్టిన తండ్రితో సహా అందరూ తన నెలజీతంపైనే ఆధారపడి ఉన్నారు. తనలాంటి వాడికి రాజకీయాలు అవసరమా? అనిపించింది.‘నాకు ఆలోచించుకోవటానికి కొంత సమయం ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపేశాడు. ఈ రాజకీయాలు తనకు నప్పేవి కాదనిపించింది. అంతలోనే రామేశ్వర్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. జాకెట్ను కనుక దుర్భాషలాడితే శక్తులు మొత్తం నశిస్తాయి. ఇప్పటి వరకూ జరిగింది చాలు. ఈ జాకెట్ను తిరిగిచ్చే సమయం వచ్చేసింది అనుకున్నాడు. ఒంటి పైన టీషర్టు ధరించి స్కూటర్ బయటకు తీశాడు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఆలోచనలన్నీ వరుసగా కళ్ల ముందు కదిలాయి.రామేశ్వర్ సమావేశంలో కృపాసాగర్ పైన తిరగబడటం, ‘నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావని నిందించటం, తన రోజువారీ జీవితం హీనంగా సాగటం, తనకు రామేశ్వర్ పరిచయం కావటం, చివరకు టైగర్ జాకెట్తో తన జీవితం మొత్తం మారిపోవటం అంతా అద్భుతంగా అనిపించింది.మనసు అంతరాంతరాల్లో రామేశ్వర్ పట్ల అభిమానం, కృతజ్ఞత పెల్లుబికింది. ఓ రకంగా అతను తనకు అకస్మాత్తుగా తారసపడిన గురువుగా అనిపించాడు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ జాకెట్ తిరిగిచ్చే సమయం వచ్చేసింది.రామేశ్వర్ ఇంటి ముందు జనం గుంపుగా కనిపించారు. నిమ్మయ్ స్కూటర్ ఆపి అక్కడున్న వ్యక్తిని పలకరించే ప్రయత్నం చేశాడు. అతను వినిపించుకోనట్టు అక్కడి నుంచి కదిలిపోయాడు. నిమ్మయ్ స్కూటర్ను పక్కన నిలిపివేసి, హడావుడిగా రామేశ్వర్ ఇంట్లోకి పరుగుపెట్టాడు.వరండాలో రామేశ్వర్ భార్య ఏడుస్తూ కనిపించింది. ఆమె ఎదురుగా నేల మీద నిర్జీవంగా రామేశ్వర్ శరీరం. తెల్లటి దుప్పట్లో చుట్టి ఉంది. నిమ్మయ్ నిర్ఘాంతపోయాడు. మౌనంలోకి జారిపోయాడు. ‘ఇప్పుడు తను ఆ జాకెట్ను ఎవరికి అందించాలి?’ మనసులో గుంజాటన మొదలయ్యింది. ∙ఒడియా మూలం: గౌరహరి దాస్∙అనువాదం: డాక్టర్ పార్థసారథి చిరువోలు -
చిన్న కాగితంతో పెద్ద కుట్ర భగ్నం
ఎలాంటి నిఘా హెచ్చరికలు లేవు, ఎలాంటి అనుమానాస్పద ఉదంతాలు జరగలేదు; పోలీసు, ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రయత్నించలేదు. అయినా 2004 ఆగస్టులో భారీ కుట్రను సిటీ టాస్క్ఫోర్స్ భగ్నం చేయగలిగింది. సికింద్రాబాద్లోని గణేశ్ దేవాలయం పేల్చివేతతో పాటు నగరాన్ని సందర్శిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ టూరిస్టుల హత్యకు ఉగ్రవాదులు పన్నిన పథకం వెలుగులోకి వచ్చింది. ఓ వాహనచోరుడి వద్ద యాదృచ్ఛికంగా లభించిన చిన్న కాగితం ఈ పెద్ద కుట్రను బట్టబయలు చేసింది.నగర టాస్క్ఫోర్స్ విభాగం నిత్యం అసాంఘికశక్తులపై నిఘా ఉంచి, నేరగాళ్లను పట్టుకోవడానికి పని చేస్తుంటుంది. భారీ నేరాల కోసమే కాదు, కొన్ని సందర్భాల్లో చిన్నా చితకా కేసుల కోసమూ ఈ టీమ్స్ పరుగులు పెడుతుంటాయి. 2004 ఆగస్టులో సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు– అది నెలలో ఆఖరి వారం కావటంతో ఏదో ఒక ముఠా లేదా నేరగాడిని పట్టుకుని ఉన్నతాధికారులకు చూపించడానికి కసరత్తులు చేస్తున్నారు. అప్పుడే ఓ వేగు ద్వారా అందిన చిన్న సమాచారం అధికారుల్లో కోటి ఆశలు రేపింది. ఓ వాహనచోరుడి సంబంధించిన ఆ సమాచారం ఆధారంగా టీమ్ వర్కౌట్ చేయడం మొదలెట్టింది. నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి వచ్చి పహాడీషరీఫ్లోని హఫీజ్బాబానగర్లో మెకానిక్గా స్థిరపడిన సయ్యద్ అబ్దుల్ ఖదీర్కు పలు వాహన చోరీలతో ప్రమేయం ఉందన్నది ఆ వేగు అందించిన సమాచారం. దీంతో టాస్క్ఫోర్స్ అతడి కోసం ముమ్మరంగా గాలించి అదుపులోకి తీసుకుంది. అప్పటి వరకు తాను చేసిన వాహనచోరీలను అతడు అంగీకరించాడు. వాటిలో కొన్నింటిని రికవరీ చేసి నిందితుడిని అరెస్టు చేయాలని టాస్క్ఫోర్స్ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ తతంగంలో భాగంగా చోరీ వాహనాలతో పాటు నిందితుడి వద్ద లభించిన వస్తువులను సీజ్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఖదీర్ను తనిఖీ చేసిన అధికారులు అతడి జేబుల్లో ఉన్న కాగితాలను సైతం తీసి పరిశీలించారు. అన్నీ మామూలుగానే ఉన్నా, ఓ చిన్న స్లిప్లోని వివరాలు మాత్రం అనుమానాస్పదంగా కనిపించాయి. అతడి వద్ద లభించిన స్లిప్లో కశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన నంబర్లు ఉండటమే పోలీసుల అనుమానానికి కారణం. దీంతో లోతుగా విచారించగా, అతడి స్నేహితుడైన ఒమర్ ఫారూఖ్ షరీఫ్ (స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల), లంగర్హౌస్లకు చెందిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ పేర్లు వెలుగులోకి రావడంతో పాటు వారిద్దరూ బండ్లగూడలోని గౌస్నగర్లో ఓ ఇంట్లో డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపెట్టాడు. తాను చోరీ చేసిన వాహనాల్లో కొన్ని వారికి ఇచ్చానని, ఆ నంబర్లు వారికి సంబంధించినవే అని అంగీకరించాడు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో విషయం ‘పెద్దదని’ అనుమానించిన టాస్క్ఫోర్స్ బృందాలు హుటాహుటిన గౌస్నగర్లోని డెన్పై దాడి చేశాయి. అక్కడ ఫారూఖ్ చిక్కగా, అజీజ్ తప్పించుకున్నాడు. అప్పటికే అజీజ్ ఆయుధ చట్టం కింద నమోదైన కేసులో అరెస్టై ఉండటం, ఇప్పుడు పారిపోవడంతో పోలీసులు ఇది కచ్చితంగా ‘పెద్ద విషయం’ అని నిర్ధారించుకున్నారు. ఖదీర్, ఫారూఖ్లను కలిపి విచారించడంతో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. సిటీలో ఘర్షణలు రెచ్చగొట్టాలని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తోయిబా’ పథకం వేసినట్లు బయటపడింది. గణేశ్ నిమజ్జనం రోజు సికింద్రాబాద్లోని గణేశ్ దేవాలయం పేల్చివేతకు కుట్ర పన్నినట్లు బయటపడింది. దీనికోసం ‘లష్కరే తోయిబా’ నగరానికి చెందిన తెహరీక్ తెహఫూజ్ షరియా ఓ ఇస్లామీ (టీటీఎస్ఐ) నేత మౌలానా నసీరుద్దీన్ (2020లో చనిపోయాడు), గులాం యజ్దానీలతో (2006లో ఢిల్లీ ఎన్కౌంటర్లో హతుడయ్యాడు) పాటు మరో 12 మందిని రంగంలోకి దింపి పేలుడు పదార్థాలు అందించింది. వినాయక నిమజ్జనం రోజు ఈ గ్యాంగ్కు చెందిన కొందరు ఇతర మతస్థులుగా వేషం వేసుకుని గణేశ్ దేవాలయంలోకి ప్రవేశించి బాంబు పెట్టాలని పథకం సిద్ధం చేసుకున్నారు. గులాం యజ్దానీ ఆదేశాల మేరకు ఈ పేలుడు హడావుడి సద్దుమణగక ముందే సిటీలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ టూరిస్టులనూ చంపాలని భావించారు. అందుకు అవసరమైన పేలుడు పదార్ధాలు, వాహనాలు సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో వరుస దాడులు చేసిన పోలీసులు 2004 ఆగస్టు 28న ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కొందరు నిందితులు పరారీలోనే ఉన్నారు. ఈ కేసు తొలుత నగర నేర పరిశోధన విభాగంలో నమోదైంది. దీనికి సంబంధించి అప్పట్లో టాస్క్ఫోర్స్ విభాగం అత్యంత వివాదాస్పదమైంది. అమాయకులను కేసుల్లో ఇరికించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. అన్ని కోణాల్లోనూ లోతుగా ఆరా తీసిన సీఐడీ పోలీసులు అరెస్టుల్లో ఎలాంటి కుట్ర లేదని తేల్చారు. ఆపై కేసు సీఐడీకే బదిలీ అయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో తుది విచారణలో ఉంది. భవానీనగర్కు చెందిన గిడ్డా అజీజ్ తండ్రి మెహతబ్ అలీ హెడ్–కానిస్టేబుల్గా పని చేశారు. ఈ కేసులో అరెస్టు నుంచి గిడ్డా అజీజ్ తృటిలో తప్పించుకున్నాడు. అప్పటికే తన వద్ద ఉన్న బోస్నియా పాస్పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్ది నకిలీ పాస్పోర్ట్ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్గా ఉన్న అజీజ్పై 2008లో ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్కు బలవంతంగా తిప్పి పంపించారు. 2001 నాటి విధ్వంసాల కుట్ర కేసులో అజీజ్కు 2022లో పదహారేళ్ల శిక్ష పడటంతో జైలులో ఉన్నాడు. -
ఇంద్రద్యుమ్నుడి కథ
పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలకు కష్టం తెలియనివ్వకుండా పరిపాలించాడు. అనేక పుణ్యకార్యాలు చేశాడు. యజ్ఞయాగాలు చేశాడు. తనువు చాలించిన తర్వాత పుణ్య ప్రభావం వల్ల స్వర్గానికి వెళ్లాడు. అక్కడ అనేక సంవత్సరాలు సుఖభోగాలను అనుభవిస్తూ కాలం గడిపాడు. ఏళ్లు గడిచాక భూలోకంలో అతడి కీర్తి అంతరించింది. ఒకప్పుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడనే సంగతిని కూడా ప్రజలు మరచిపోయారు. భూలోకంలో అతడి కీర్తి అంతరించిపోవడంతో దేవతలు ఇంద్రద్యుమ్నుడిని తిరిగి భూలోకానికి తోసేశారు. స్వర్గం నుంచి తిరిగి భూమ్మీద పడ్డ ఇంద్రద్యుమ్నుడు జరిగిన దానికి బాధపడుతూ, అడవులలో సంచరిస్తూ ఒకనాడు మార్కండేయ మహర్షిని కలుసుకున్నాడు. ‘మహర్షీ! నేనెవరో మీకు తెలుసు కదా! నా పేరు ఇంద్రద్యుమ్నుడు’ అన్నాడు.మార్కండేయుడు అతడిని తేరిపార చూసి, ‘నాయనా! నువ్వెవరివో నాకు తెలియదు. నీ పేరు ఎన్నడూ వినలేదు. అయినా నేను తాపసిని. రాజులతోను, వారి చరిత్రలతోను నాకు పనిలేదు’ అని బదులిచ్చాడు.‘మహర్షీ! మీకంటే ముందుగా పుట్టినవారు, సజీవులుగా ఉన్నవారు ఎవరైనా మీకు తెలుసా? తెలిస్తే, వారెక్కడ ఉంటారో చెప్పండి. కనీసం వారికైనా నేను తెలుసేమో కనుక్కుంటాను’ అభ్యర్థించాడు ఇంద్రద్యుమ్నుడు.‘మంచుకొండ మీద ఒక గుడ్లగూబ ఉంది. అది నా కంటే ముందు పుట్టింది. దాని పేరు ప్రావారకర్ణుడు. దానిని అడిగి చూడు’ అన్నాడు మార్కండేయుడు.ఇంద్రద్యుమ్నుడు తనతో మార్కండేయ మహర్షిని వెంటబెట్టుకుని, మంచుకొండ వద్ద గుడ్లగూబ దగ్గరకు వెళ్లాడు. ‘ఓ ఉలూకమా! నేను ఇంద్రద్యుమ్నుడిని. నీకు నేను తెలుసునా?’ అని అడిగాడు.తెలీదని బదులిచ్చింది గుడ్లగూబ.కాస్త నిరాశ చెందిన ఇంద్రద్యుమ్నుడు, ‘పోనీ! నీ కన్నా ముందుగా పుట్టి సజీవులుగా ఉన్నవారు ఎవరైనా నీకు తెలుసునా?’ అని అడిగాడు.గుడ్లగూబ కాసేపు ఆలోచించి, ‘ఇక్కడకు దగ్గరలోనే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో నాడీజంఘుడు అనే కొంగ ఉంది. ఆ కొంగ నాకంటే ముందు పుట్టింది’ అని చెప్పింది. ఇంద్రద్యుమ్నుడు ఈసారి మార్కండేయుడిని, గుడ్లగూబను వెంటబెట్టుకుని సరస్సు వద్దకు వెళ్లాడు. అక్కడ కొంగను కలుసుకుని, ‘నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’ అని అడిగాడు.‘నాకు తెలీదు గాని, నా కంటే ముందుగా పుట్టిన తాబేలు ఇదే సరస్సులో ఉంటోంది. దానికి తెలుసేమో’ అంది కొంగ.‘దయచేసి, ఆ తాబేలుని పిలుస్తావా? కనుక్కుంటాను’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు.తాబేలుకు కబురు పంపింది కొంగ.ముసలి తాబేలు నెమ్మదిగా తడబడుతూ సరస్సు ఒడ్డుకు వచ్చింది. ‘కచ్ఛపరాజమా! నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా?’ అని అడిగాడు.తాబేలు కాసేపు ఆలోచించి, ‘ఆ మహారాజు తెలియకపోవడమేంటి? చల్లని మహారాజు. వెయ్యి యజ్ఞాలు చేశాడు. గొప్ప దానాలు చేశాడు. ఆయన పాలన సాగినన్నాళ్లూ రాజ్యంలో నిత్య సంతర్పణలు జరిగేవి. ఆ మహారాజు భూసురులకు వేలాది గోవులను దానం చేయడం వల్ల, ఆ గోవులు తొక్కుతూ సంచరించడం వల్లనే ఇక్కడ ఈ సరోవరం ఏర్పడింది. అసలు ఈ సరస్సు పేరు ఏమిటనుకున్నావు? ఇది ఇంద్రద్యుమ్న సరోవరం’ అని బదులిచ్చింది.‘హమ్మయ్య! నా గురించి తెలిసిన జీవి ఒకటి ఇంకా ఈ భూమ్మీద జీవించి ఉంది’ అని మనసులో సంతోషించాడు ఇంద్రద్యుమ్నుడు.తాబేలు మాటలకు ఆనందపరశుడయ్యాడు. ‘కచ్ఛపరాజమా! నేనే ఆ ఇంద్రద్యుమ్న మహారాజును’ అని చెప్పి, ఆ తాబేలుకు నమస్కరించాడు.ఇంద్రద్యుమ్నుడి కీర్తి ఇంకా భూమ్మీద మిగిలే ఉండటంతో దేవతలు దివ్యవిమానంలో అక్కడకు చేరుకున్నారు.‘ఇంద్రద్యుమ్నా! నీ కీర్తి మాసిపోనందుకు మాకు సంతోషంగా ఉంది. నువ్వు వెంటనే మాతో వచ్చి, స్వర్గంలో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ముక్తకంఠంతో పలికారు దేవతలు.ఇంద్రద్యుమ్నుడు వారితో పాటు దివ్యవిమానమెక్కి స్వర్గానికి తిరిగి బయలుదేరాడు.∙సాంఖ్యాయన -
చెంచా రాయుడు!
రోబో సినిమాలో విలన్స్ వెపన్స్ అన్నింటినీ మ్యాగ్నెట్ మోడ్లో మారి చిట్టీ లాగేసుకున్నట్లు, ఇరాన్ లోని ఓ వ్యక్తి స్పూన్ మ్యాగ్నెట్ మనిషిగా మారాడు. పేరు అబోల్ఫజ్ సాబిర్ ముఖ్తారీ. కాని, అతని పేరు కన్నా అతను చేసిన పనే పవర్ఫుల్! అతను ఏం చేశాడంటే, తన శరీరంపై ఏకంగా 96 చెంచాలను అంటించుకొని గిన్నిస్ రికార్డు సాధించాడు. అవును, తక్కువేం కాదు, అంటే రౌండ్ ఫిగర్కి ఇంకా నాలుగు మాత్రమే మిగిలిందంటే, అతని స్పూన్ ఫిక్షన్ లెవెల్ ఆ రేంజ్లో ఉంది మరి. 2021లో ముఖ్తారీ మొదటిసారి 85 చెంచాలతో రికార్డు చేశాడు. 2023లో ‘ఇదేం సరిపోదు’ అనుకున్నాడేమో 88 చెంచాలతో మళ్లీ తనదైన మార్క్ వేశాడు. ఇప్పుడేమో ‘ఇంకో స్పూన్ స్పెషల్స్ కలపాలి’ అని, నేరుగా 96 చెంచాలతో రికార్డే కాదు, నమ్మకాలకే చాలెంజ్ విసిరాడు. ‘చెంచాలు కూడా మనుషుల్ని ప్రేమించగలవా?’ అన్న ప్రశ్నకి ఔననే సమాధానాన్ని తన శరీరంతో చెప్పాడు!. ఇతని శరీరంపై చెంచాలు అతుక్కునే తీరు చూస్తే, చెంచాలకి మార్గం చూపించే గూగుల్ మ్యాప్లా ముఖ్తారీ కనిపిస్తాడు. ఈ విషయమై ముఖ్తారీ మాట్లాడుతూ, ‘నేను ఏ వస్తువునైనా నా శరీరానికి అతికించుకోగలను. ప్లాస్టిక్, గాజు, రాయి, చెక్క– ఇంకా ఎన్నో వస్తువులతో ప్రయోగాలు చేస్తున్నాను. త్వరలోనే మరో కొత్త రికార్డు చేస్తాను’ అని చెప్పాడు. -
దేవుడు ముడివేసిన బంధం
లోకం తెలియని పసితనం బుడిబుడి అడుగులతో నాన్నను అనుసరించే దృశ్యం, ఎప్పుడూ మురిపెంగానే ఉంటుంది. చూసేందుకే అంత ముచ్చటగా ఉండే ఆ బంధం, స్వయంగా తన చేతినే తాకినప్పుడు.. ఆ తండ్రి పొందే ఆనందం.. అమితం, అమరం, అనిర్వచనీయం! అలాంటి అనుభూతిని కోరే నాన్న ఎప్పుడూ ఉన్నతమైన ఆదర్శాలనే తలకెత్తుకుంటాడు. గొప్ప తండ్రిగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకుంటాడు. తనతో పాటు తన పిల్లల్ని కూడా ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేస్తాడు. దైవత్వాన్ని నింపుకుని, వారి తలరాతలను తనే రచిస్తాడు. అందుకే ‘డాడ్ ఈజ్ గాడ్’పితా ధర్మః పితా స్వర్గః పితా హి పరమం తపఃపితరి ప్రీతిమాపన్నే ప్రీయతే సర్వదేవతాః‘తండ్రి దైవ సమానుడు, ధర్మ స్వరూపుడు. తపస్సుకు అత్యుత్తమ మార్గం ఏదైనా ఉందంటే అది తండ్రికి సేవ చేయడమే. తండ్రిని సంతోషపెడితే సమస్త దేవతలు సంతోషిస్తారు’ ఇది కుటుంబవ్యవస్థ మెచ్చే ధర్మం! అయితే ఎందరో తండ్రులు, తమ పిల్లల నుంచి అవేమీ ఆశించకుండా కేవలం వారి క్షేమం కోసమే అహర్నిశలు తపిస్తుంటారు. జీవితాన్ని, కాలాన్ని అంకితమిస్తూ స్వచ్ఛమైన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యమవుతున్నారు. ఒకసారి బరాక్ ఒబామా, తండ్రి గురించి స్పష్టమైన కొటేషన్ చెప్పారు. ‘మగతనం ఉంటే చాలు, ఎవరైనా బిడ్డను కనగలరు! కాని, అది వారిని తండ్రిని చేయలేదు. బిడ్డను పెంచడానికి ధైర్యంగా అడుగులు వేసేవారే నిజమైన తండ్రి’ అంటారాయన. దానిలో ఎంత అర్థముంది! నాన్న కనబడితే– గౌరవంతో తలుపు చాటున దాక్కునే అలనాటి రోజుల నుంచి నాన్న కనబడితే– గారాబంతో సరదాగా పోట్లాడుకునే ఈనాటి రోజుల వరకూ, ప్రతి జీవితంలోనూ ఆయనే హీరో! కాలం విసిరిన సవాళ్లకు జీవితాన్ని పణంగా పెట్టే ప్రతి నాన్న చేతుల్లోనూ ఓ చిట్టి చేయి దాగుంటుంది. ఆ చేయి ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి, తన ఆదర్శవంతమైన కథను సగర్వంగా పరిచయం చేస్తుంది. తన కోసం, తన తండ్రి కన్న కలలన్నింటినీ గొంతెత్తి చాటుతుంది. నిజానికి ఈలోకంలో నాన్న అనే పిలుపు కోసం తపించే నాన్నలు కొందరైతే, నాన్నగా గెలిచిన నాన్నలు ఇంకొందరు. ఏదేమైనా నాన్న అనే పిలుపే ఓ ఎమోషన్. ఆ ఎమోషన్స్ కి త్యాగం తోడైతే? తెలియకుండానే గుండె తడవుతుంది. ఫాదర్స్డే సందర్భంగా అలా గెలిచి, నిలిచిన కొన్ని నిజజీవిత విజయగాథలు మీకోసం. లోకం మెచ్చిన తండ్రులుఈ అద్భుతమైన సృష్టిలో హద్దులు లేని ఆప్యాయతే అసలైన అమ్మతనం. నిస్వార్థమైన ప్రేమకు అదో మారు గుణం. అలాంటి అమ్మతనాన్ని అందించే నాన్న దొరకడం మహా వరం. ప్రేమను పంచడంలో, పిల్లల్ని పెంచడంలో తండ్రి పాత్రకు వీరంతా సజీవ నిదర్శనం!దేవుడు ముడివేసిన బంధంమధ్యప్రదేశ్, ఇండోర్లోని ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ అనాథాశ్రమం సాక్షిగా మొదలైన ఈ తండ్రీ కొడుకుల కథ చాలా ప్రత్యేకం. 2014 సెప్టెంబర్ 13 ఉదయాన్నే 27 ఏళ్ల ఆదిత్య తివారీ.. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పని చెయ్యాలనే ఉద్దేశంతో, ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఆ చారిటీకి వెళ్లాడు. అక్కడ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తున్న ఆరు నెలల అవనీశ్ను తొలిసారి చూసి, ఏమైందని ఆరా తీశాడు. ఆ బాబుకున్న ఆరోగ్య సమస్యల గురించి విని అల్లాడిపోయాడు. డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్న అవనీశ్ను ఎవ్వరూ దత్తత తీసుకోవడం లేదని తెలిసి, ఆ బాబుకి తానే తండ్రి కావాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే అధికారులతో చర్చించాడు. అయితే అధికారులు అందుకు అభ్యంతరం చెప్పారు. దత్తత తీసుకునే ఒంటరి పురుషుడికి 30 ఏళ్లు నిండాలనే రూల్స్ని ముందుంచారు. దాంతో ఆ రూల్స్ మార్చాలని న్యాయపోరాటం మొదలుపెట్టాడు ఆదిత్య. అవనీశ్ లాంటి స్పెషల్ చిల్డ్రన్ని దత్తత తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిస్తూనే, అవనీశ్ దత్తత కోసం సుమారు రెండేళ్లు ఫైట్ చేశాడు. అయితే ఒక ఒంటరి పురుషుడు, ఇలాంటి వికలాంగుడైన బిడ్డను చూసుకోవడం కష్టమనే వారు ఎక్కువయ్యారు. ఆ మాటలకు ‘బిడ్డ తండ్రివైతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయీ ముందుకు రాదు’ అనే హెచ్చరికలు తోడయ్యాయి. అయినా వెనక్కు తగ్గని ఆదిత్య ఈ ప్రయత్నంలో తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకున్నాడు. చివరికి దత్తత తీసుకోవడంలో సింగిల్ ఫాదర్కి ఉండాల్సిన వయసును 30 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు మార్పించగలిగాడు. అలాగే 2016 జనవరి 1న అవనీశ్కి అధికారికంగా తండ్రి అయ్యి, దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఒంటరి తండ్రిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్థిక, సామాజిక సవాళ్లు ఎదుర్కొంటూ బాబుకి మంచి ఆహారం, మంచి వైద్యం ఇప్పించగలిగాడు.అయితే రెండేళ్ల పోరాటక్రమంలో అర్పిత అనే అమ్మాయితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారేముందు అవనీశ్ తల్లిగా అర్పిత పాసైంది. వీరి పెళ్లికి పదివేల మంది నిరాశ్రయులు అతిథులుగా వచ్చారు. ప్రస్తుతం అవనీశ్ ఆరోగ్యవంతుడిగా మారుతూ, పాఠశాలకు వెళ్తూ, చదువులో చురుకుగా ఉంటున్నాడట. ఆదిత్య తివారీ అంకితభావానికి గుర్తింపుగా, 2020లో ఆయనకు ‘వరల్డ్స్ బెస్ట్ మామీ’ అవార్డు లభించింది. తల్లి ప్రేమ ఒక లింగానికే పరిమితం కాదని, తండ్రి కూడా ఆ ప్రేమను చూపగలడని నిరూపించినందుకు అతడికి ఈ గౌరవం దక్కింది.అవనీశ్లాంటి పిల్లలున్న 10 వేల మంది తల్లిదండ్రులకు ఆదిత్య కౌన్సెలింగ్ ఇచ్చాడు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కలిసి ఇప్పటివరకు దేశంలో 22 రాష్ట్రాల్లో పర్యటించారు. సెమినార్లు, వర్క్షాపులు అంటూ ఇలా ఎక్కడికి వెళ్ళినా అవనీశ్ను ఆదిత్య వెంటబెట్టుకునే వెళ్తాడు. ఐక్యరాజ్య సమితిలో సైతం, వైకల్యమున్న పిల్లల పెంపకం గురించి ఆదిత్య ప్రసంగించారు. జెనీవాలో జరిగిన ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’లో కూడా ఈ తండ్రీ కొడుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అవనీశ్కి ఇంకా కొన్ని సర్జరీలు జరగాల్సి ఉందని, అవి చేయించడానికి తగిన వయసు కోసం ఎదురు చూస్తున్నామని ఆదిత్య తెలిపారు. ఇది దేశానికే ఆదర్శవంతమైన కథ. అన్నిటినీ చిన్నబుచ్చిన ప్రేమ!ముంబైలోని ఓ చిన్న ఇంట్లో, నాలుగేళ్ల సుశాంత్ దివిగికర్ కార్లు, బ్యాట్లతో ఆడుకోకుండా, తల్లి చీర కొంగులతో, ఆమె మేకప్ సామాగ్రితో తనదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. స్టేజ్ డ్రామాలు, నృత్యాలు ఇష్టమంటూ ఆ దిశగానే అడుగులు వేశాడు. ఇక యవ్వనంలోకి వచ్చేసరికి అమ్మాయిలపైన కాకుండా అబ్బాయిలపై ఆకర్షితుడయ్యాడు. అప్పుడే తను ఒక గే అని, తనలో స్త్రీ లక్షణాలు కూడా ఉన్నాయని గ్రహించాడు. రహస్యంగా గే పార్టీలకు అటెండ్ అయ్యేవాడు. 2008లో ఒకరోజు సుశాంత్ కజిన్ కరణ్.. సుశాంత్ని ‘గే’లతో తిరగడం చూసి షాకయ్యాడు. వెంటనే సుశాంత్ తండ్రి ప్రదీప్ దివిగికర్కి చెప్పేశాడు. విషయం తెలిసిన ప్రదీప్.. సుశాంత్ని ఆరా తియ్యగా భయపడుతూనే తండ్రికి నిజం చెప్పాడు. వెంటనే ప్రదీప్ కొడుకుని హత్తుకుని.. ‘నువ్వు ఎలా ఉన్నా నా బిడ్డవే.. ఈ ప్రపంచం నిన్ను ఏమైనా అననీ.. నేను మాత్రం నీకు అండగానే ఉంటాను’ అని మాటిచ్చాడు. అప్పుడు సుశాంత్కి 18 ఏళ్లు. వెంటనే ప్రదీప్.. తన కొడుకు గే అనే విషయాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పారు. తండ్రి ప్రోత్సాహంతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ‘మిస్టర్ గే ఇండియా’ 2014 టైటిల్ను గెలుచుకున్నాడు. ‘మిస్టర్ గే వరల్డ్’ చరిత్రలో అత్యధిక సబ్–టైటిల్స్ గెలుచుకున్న ఏకైక ఇండియన్ తనే. అదే ఏడాది సల్మాన్ ఖాన్ హోస్ట్గా ఉన్న మహారాష్ట్ర ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్గా వెళ్లి, ఏడో వారంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీకి ఆఫర్ వచ్చినా.. ‘అదో డర్టీ గేమ్’ అని అభివర్ణించి ఆఫర్ని తిరస్కరించాడు. తర్వాత కాలంలో తండ్రి ప్రోత్సాహంతోనే ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు. ‘రాణీ కోహినూర్’ అనే పేరుతో ప్రస్తుతం సుశాంత్కి ఇన్స్టాగ్రామ్లో 3.6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.‘బిడ్డ బిడ్డే అయినప్పుడు లింగంతో సంబంధం ఏంటీ? ఒకే బిడ్డలో కొడుకు, కూతురు ఇద్దరూ ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడ్ని’ అంటుంటారు ప్రదీప్. కలలను వదులుకునేంత బాధ్యతముంబైకి చెందిన లహర్ జోషీ చిన్నప్పటి నుంచి కెరీర్ గురించి ఎన్నో కలలు కన్నాడు. 2015 నాటికి కోరుకున్నట్లే సొంతంగా బ్రాండింగ్ ఏజెన్సీని స్థాపించి, విజయవంతంగా నడపసాగాడు. అయితే ఆ సమయంలోనే అతడి భార్య రుతుమ గర్భవతి అయ్యింది. స్కానింగ్లో కవలలు అని తెలిసినప్పటి నుంచి పట్టలేని ఆనందంతో పాటు రెట్టింపు కానున్న బాధ్యతలు అతణ్ణి కుదురుగా ఉండనివ్వలేదు. పిల్లలు పుట్టిన తర్వాత నుంచి భార్యభర్తలిద్దరికీ పిల్లలకోసం సమయాన్ని కేటాయించడం కూడా సమస్యగానే మారింది. పిల్లల కోసం ఎవరో ఒకరు ఇంటి దగ్గర ఉండటంతో పాటు ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు లహర్ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య రుతుమతో పోలిస్తే తన నెల సంపాదన తక్కువ ఉండటంతో, విజయవంతంగా సాగుతున్న తన బ్రాండింగ్ ఏజెన్సీని మూసివేసి, పూర్తిస్థాయిలో పిల్లల సంరక్షణకు అంకితం కావాలని ఫిక్స్ అయ్యాడు. అలా, లహర్ జోషీ ఒక ‘స్టే–ఎట్–హోమ్ డాడ్’గా మారారు.ఈ నిర్ణయం సమాజంలో మిశ్రమ స్పందనలను తెచ్చింది. కొందరు ఆయన్ని అభినందిస్తే, మరికొందరు ఆశ్చర్యంగా చూశారు. కానీ లహర్కు తన తండ్రి నుంచి పూర్తి మద్దతు లభించింది. అది ఆయనకు ఎంతో ధైర్యాన్నిచ్చింది.పిల్లల్ని ఇంటి వద్దే ఉండి పెంచిన అనుభవం తనను మరింత మంచి వ్యక్తిగా మార్చిందని లహర్ బలంగా నమ్ముతాడు. తొలినాళ్లలో పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కాస్త కష్టంగా అనిపించినా, వారి ఎదుగుదలను దగ్గరగా చూసే అనుభూతి అద్భుతమని ఆయన గర్వంగా చెబుతుంటాడు. లహర్ తన ఈ ప్రయత్నంతో దేశంలో పాతుకుపోయిన లింగ వివక్షను సవాలు చేస్తున్నారు. ఒక తండ్రి పాత్ర కేవలం డబ్బు సంపాదించడమే కాదు, పిల్లలకు ఓ మార్గదర్శిగా, కోచ్గా ఉండటం కూడా అంటారు ఆయన. ఈరోజు, లహర్ జోషీ తన కవలలను ఎంతో ఆనందంగా పెంచుకుంటూ, సమాజానికి ఓ కొత్త సందేశాన్ని ఇస్తున్నారు. తండ్రి ప్రేమ, సంరక్షణ పిల్లల ఎదుగుదలకు ఎంత అవసరమో వివరిస్తూ, లహర్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అమ్మలా పెంచిన నాన్నగుజరాత్, అహ్మదాబాద్కి చెందిన ప్రముఖ గాయని ‘శైలీ షా’ను కదిలిస్తే ఆదర్శవంతమైన తన తండ్రి ‘రాజేష్ షా’ కథను ప్రత్యేకంగా చెబుతుంది. శైలీకి పదేళ్లు కూడా నిండకుండానే ఆమె తల్లి ఆశ మరణించింది. ఆరోజు నుంచి తన అన్న నిసర్గను, తనని కంటికి రెప్పలా పెంచి పోషించారు రాజేష్. మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినలేదు. ప్రేమించి పెళ్లాడిన భార్య మరణంతోనే జీవితం శూన్యం అనుకున్న రాజేష్.. కేవలం పిల్లల కోసమే బతికారు. అయితే అతడి భార్య ఆశా తన కూతురు శైలీని సింగర్ చేయాలని ఆశపడింది. అందుకే అహర్నిశలు శ్రమించి కూతుర్ని సింగర్ని చేశారు రాజేష్. శైలీ షా కేవలం గాయని మాత్రమే కాదు. ఆమె ‘మోర్తంత్ర’ అనే బొటిక్ జ్యూలరీ బ్రాండ్తో విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్రాండ్ గుజరాత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జ్యూలరీ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ఇక నిసర్గ, ప్రింటింగ్ కేంద్రాన్ని నడపుతూ తండ్రికి అండగా ఉంటున్నాడు.‘నాన్నే మాకు జీవిత పాఠాలు నేర్పించారు, అమ్మలా పెంచారు. ఆయనే మాకు స్ఫూర్తి’ అని శైలీ గర్వంగా చెబుతుంది.నాన్న అనే పిలుపు కోసం ఏళ్ల పోరాటంయూసఫ్ ఖాన్తో కబీర్, డా.కేదార్ పడ్తేఅది 2007. యూసఫ్ ఖాన్ అనే 26 ఏళ్ల మ్యూజిక్ టీచర్.. పుణే చారిటీల చుట్టూ తిరగడం అప్పుడప్పుడే మొదలుపెట్టాడు. దుబాయ్లో ‘ద మ్యూజిక్ బాక్స్’ అనే మ్యూజిక్ స్కూల్ను నడుపుతున్న యూసఫ్.. వైవాహిక జీవితంపై ఆసక్తి లేకపోవడంతో, పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే పిల్లల మీద ఉన్న ఇష్టంతో అనాథను దత్తత తీసుకోవాలని ఆశపడ్డాడు. అందుకే భారత్ వచ్చి చారిటీలకు తన విన్నపాన్ని తెలిపి, దత్తత కోరినప్పుడు.. అందుకు రూల్స్ అంగీకరించలేదు. తాను తండ్రి కావాలనే బలమైన కోరికతో సుమారు పదేళ్ల పాటు దత్తత కోసం దుబాయ్కి, ఇండియాకి తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఫలితం లేకపోవడంతో 2017 నుంచి సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాడు. సుమారు పదకొండు సార్లు సరోగసీ విధానం ఫెయిల్ అయ్యింది. అయినా తన కలను చంపుకోవడానికి యూసఫ్ అంగీకరించలేదు. విసుగు చెందలేదు. పదే పదే ఎదురైన వైఫల్యాలు, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడి ఏవీ తనని నిరాశపరచలేదు. చివరికి సరోగసీలో 12వ ప్రయత్నం ఫలించి, 2019 డిసెంబర్ 3న పనాజీలో కబీర్ అనే పండంటి మగబిడ్డను పొందాడు. గోవాకు చెందిన డా. కేదార్ పడ్తే పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. ప్రస్తుతం కొడుకుతో సహా దుబాయ్లోనే ఉంటున్నాడు యూసఫ్. వీరికి సంబంధించిన ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందుబాటులో లేవు. అయితే ఎన్నో కష్టాలకు ఓర్చి, ఏళ్లపోరాటం చేసి పొందిన బిడ్డను యూసఫ్ ఎలా పెంచుతాడనేది ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంతులేని అన్వేషణచైనా తూర్పు తీరంలోని షాన్స్ డాంగ్ ప్రావిన్స్కు చెందిన ‘గువో గ్యాంగ్టాంగ్’ అనే తండ్రి కథ యావత్ ప్రపంచానికీ భావోద్వేగాలను నింపింది. ఈ కథ 1997, సెప్టెంబర్ 21న మొదలైంది. ఆ రోజు ఆదివారం. స్కూల్స్ లేక పిల్లలంతా ఇంటి బయటే ఆడుకుంటున్నారు. గువో రెండో కొడుకు రెండున్నరేళ్ల జిన్స్ జెన్స్ ను ఎవరో లాక్కెళ్లారని పెద్ద కొడుకు పరుగున లోపలికి వచ్చి చెప్పాడు. అప్పటికే కిడ్నాపర్ల వీరంగం గురించి చాలాసార్లు విన్న గువో.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో కడు నిరుపేదైన గువో.. కష్టపడి ఓ పాత మోటర్ సైకిల్ కొనుక్కుని, దాని వెనుక మిస్ అయిన కొడుకు ఫొటోను బ్యానర్గా కట్టుకుని, తనే స్వయంగా వెతకడం మొదలుపెట్టాడు. అదే బండి మీద చాలా దూరం వెళ్లాడు. సుమారు 24 ఏళ్ల పాటు కిడ్నాప్ అయిన కొడుకును అలా వెతుకుతూనే ఉన్నాడు. వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. తన ఆర్థిక స్తోమతను బట్టి పాత మోటర్ సైకిళ్లనే కొంటూ, మార్చుకుంటూ.. తిరగని చోటు లేదన్నంతగా తిరిగాడు. అన్నేళ్ల ప్రయాణంలో కొన్నిసార్లు తినడానికి తిండి దొరికేది కాదు. కొన్ని రాత్రులు వంతెనల కింద, రోడ్ల మీద పడుకోవాల్సి వచ్చేది. అయినా విసుగు చెందలేదు. పిచ్చివాడని కొందరు, దొంగ అయి ఉంటాడని ఇంకొందరు అనుమానించినా, అవమానించినా తగ్గలేదు. అతడి పట్టుదలను చూసిన ఎందరో చైనీయులు అతడ్ని ‘సింబల్ ఆఫ్ ది సెర్చింగ్ ఫర్ మిస్సింగ్ చిల్డ్రన్’ అనే పేరుతో కీర్తించడం మొదలుపెట్టారు. అతడి ప్రయత్నం నాయకులను, అధికారులను కూడా కదిలించింది. చివరికి 2021 జూలై 11న, గువోకు చైనా ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పటికి అతడి వయసు 61 ఏళ్లు. ‘న్యూ డీఎన్ఏ టెక్నాలజీతో జిన్ జిన్ ను కనుగొన్నామని, అతడు హేనాన్ ప్రాన్స్లో ఒక దత్తత కుటుంబంతో నివసిస్తున్నాడు’ అని గువోతో అధికారులు చెప్పారు. అతడి 24 ఏళ్ల ఆవేదన ఒక్కసారిగా ఆనందంగా మారింది. 2021 జూలై 13న జిన్స్ జెన్ 26ఏళ్ల యువకుడి రూపంలో గువో కళ్లముందుకు వచ్చినప్పుడు అతడి కన్నీళ్లు చూసి ప్రపంచమే కంటతడి పెట్టింది. వారి కౌగిలిలో ఏళ్లనాటి నిరీక్షణ, ప్రేమ, ఆనందం అన్నీ కళ్లకు కట్టాయి. గువో కథ ‘లస్ట్ అండ్ లవ్’ అనే సినిమాగా మారి, ఎందరో మనసులను కదిలించింది.నిజానికి ఈ కథలన్నీ చూస్తుంటే ‘లియో బుస్కాగ్లియా’ అనే అమెరికా రచయిత మాటలు గుర్తు రాక మానవు. ‘అమరత్వం అనేది మనం వదిలి వెళ్లే ప్రేమలో మాత్రమే ఉంటుంది. అంతటి ప్రేమను పంచే తండ్రులకు ఎప్పటికీ చావు ఉండదు’ అన్నారు ఆయన. అలాంటి తండ్రులందరికీ పాదాభివందనం!హ్యాపీ పాదర్స్ డే! -
వర్షం వచ్చిందంటే ఈ గాడ్జెట్స్ ఉండాల్సిందే..
వానొచ్చిదంటే ఎన్నో సరదాలను తెస్తుంది. వాటితో పాటు ఎన్నో సమస్యలను కూడా! అయితే, వాన తెచ్చే తిప్పల్లో అన్నీ కాకపోయినా కొన్నింటికి చెక్ పెట్టే స్మార్ట్ సొల్యూషన్సే ఈ గాడ్జెట్స్!వాటర్ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్వాన పడుతుంటే చాలామంది చాయ్లో బిస్కట్ ముంచేస్తారు. కాని, అంతకంటే ఎక్కువమంది వానలో మంచి మ్యూజిక్తో మూడ్ని మిక్స్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు. అలాగని, వర్షంలో స్పీకర్ పెడితే అప్పుడు అది సింకింగ్ షిప్ అయిపోతుంది. ఇందుకోసమే ఓ అద్భుతమైన ఆవిష్కరణ వచ్చేసింది. వాటర్ప్రూఫ్ బ్లూటూత్ స్పీకర్. దీనిని బయటపెట్టి మ్యూజిక్ ప్లే చేస్తే రెయిన్ డాన్స్ పార్టీని క్రియేట్ చేయొచ్చు. ధర వివిధ బ్రాండ్స్, డిజైన్స్ బట్టి ఉంటుంది. ఆన్లైన్లో లభ్యం.ఇది వర్షం చూసి పారిపోయే కెమెరా కాదు..వర్షం వచ్చిన వెంటనే కాఫీ చేతిలో పట్టుకొని, ఓపెన్ టెర్రస్ మీద సరదాగా ఓ సెల్ఫీ తీసుకోవాలనిపించిందా? కాని, ఫోన్ జారిపోతుందేమోననే భయంతో, కేవలం కాఫీనే ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు అవన్నీ పాత కథలు! ఎందుకంటే ఇప్పుడు మీ చేతిలోకి వచ్చింది ‘ఇస్టా 360’. ఈ చిన్న గాడ్జెట్ తీసే ఫొటోలు, వీడియోలు హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. అన్ని యాంగిల్స్ల్లోనూ అద్భుతంగా తీయగల ఈ చిన్న కెమెరా ఉంటే ఇక పెద్ద పెద్ద కెమెరాలతో పని ఉండదు. పైగా ఇది వర్షం చూసి పారిపోయే కెమెరా కాదు. ఇది తానే నీళ్లలోకి దూకేస్తుంది. అంటే పది మీటర్ల లోతు వరకు వాటర్ ప్రూఫ్ అన్నమాట. చక్కగా షర్ట్కి అంటించి పెట్టుకొని వాడుకోవచ్చు. పైగా కెమెరాను ఎక్కడైనా మర్చిపోతే, మీ ఫోన్ మాత్రం ‘ఏయ్, ఇక్కడ ఉంది కెమెరా’ అని ఇందులోని అలర్ట్ సిస్టమ్ చెప్తుంది. ధర. 599 డాలర్లు (రూ. 51,003). వాన జాడ చెప్పే గొడుగు..‘వాన వస్తుందా లేదా? గొడుగు తీసుకెళ్దామా? వద్దా?’ అని ఇలా మీలో మీరు ప్రశ్నలు వేసుకునే ముందు ఒక్కసారి ఈ ‘డ్యావెక్ అలర్ట్ గొడుగు’ను అడిగి చూడండి. వాతావరణం ఎలా ఉండబోతుందో ఈ గొడుగే చెప్తుంది. పైగా దీనిని ఫోన్కు కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇందులోని అలెర్ట్ సిస్టమ్ ఎప్పుడైనా గొడుగును తీసుకెళ్లడం మర్చిపోయారో, వెంటనే, టింగ్ అని ఫోన్కి మెసేజ్ వస్తుంది ‘నన్ను మర్చిపోయావ్ బాస్’ అని గొడుగు మీకు గుర్తుచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది గొడుగు కాదు. బ్రహ్మానందం లెవల్ కామెడీ ప్లస్ స్మార్ట్నెస్ను కలిపిన వస్తువు. పైగా ఇది సాధారణ గొడుగులా కాకుండా చాలా బలంగా ఉంటుంది. ఈదురు గాలులకు కూడా కదలదు. ఇక దీని స్టయిల్లో చూసుకుంటే, పెద్ద పెద్ద డిజైనర్ గొడుగులు కూడా దీనితో పోటీ పడలేవు. ధర 69 డాలర్లు (రూ. 5,870). -
దీపకుని గురుసేవ
ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు. పుణ్యమైనా, పాపమైనా ఎవరి కర్మలకు వారే ఫలితాన్ని అనుభవించాలి కదా! నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని ఈశ్వరానుగ్రహాన్ని, మోక్షాన్ని పొందలేను పూర్వం దీపకుడు అనే బ్రహ్మచారి ఉండేవాడు. అతడు పరమ నైష్ఠికుడు. శాస్త్రాలలో చెప్పిన ‘శిశువుకు తల్లిదండ్రులు, శిష్యుడికి గురువును మించిన దైవం లేరు. వారి సేవను మించిన తీర్థ యజ్ఞాదులు లేవు. జన్మను తరింపజేసుకోవడానికి మాతాపితరుల సేవ, గురుసేవను మించిన మార్గం లేదు’ అనే సూక్తిని చదివి, గురువు కోసం అన్వేషణ ప్రారంభించాడు.ఇంటి నుంచి దీపకుడు కాలినడకన బయలుదేరాడు. దారిలో కనిపించిన వారిని తగిన గురువు కోసం వాకబు చేయసాగాడు. గోదావరి తీరంలో వేదధర్య మహర్షి వేదవేదాంగ పారంగతుడని, గురుకులం నిర్వహిస్తూ ఎందరికో విద్యాబోధన చేస్తున్నాడని చాలామంది చెప్పారు. వేదధర్యుడి ఆశ్రమం ఎక్కడ ఉన్నదో బాటసారులను కనుక్కొని తన ప్రయాణం కొనసాగించాడు. కొద్దిరోజుల ప్రయాణం తర్వాత ఆశ్రమానికి చేరుకున్నాడు. శిష్యులతో వేదం వల్లె వేయిస్తున్న వేదధర్యుడిని చూసి, నేరుగా ఆయన వద్దకు వెళ్లి, సాష్టాంగ నమస్కారం చేశాడు.దీపకుడి వినయశీలతకు వేదధర్యుడు ముచ్చటపడ్డాడు. అతడిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. దీపకుడు గురుసేవ చేసుకుంటూ, విద్యాభ్యాసం కొనసాగించాడు. అనతికాలంలోనే వేద శాస్త్ర పురాణాలన్నింటినీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. శిష్యుడి విద్యాతేజస్సుకు వేదధర్యుడు అబ్బురపడ్డాడు. ఒకనాడు ఆయన దీపకుడిని పిలిచి, ‘కుమారా! నేను గత జన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. రెండు భయంకరమైన పాపాలకు మాత్రం ఫలితాన్ని ఇంకా అనుభవించాల్సి ఉంది. చేసిన కర్మమే చెడని పదార్థం కదా! సాక్షాత్తు విశ్వనాథుని ధామమైన పవిత్ర కాశీక్షేత్రంలో నేను ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోదలచాను.పుణ్యక్షేత్రంలో ఏ పనికైనా ఫలితం రెండింతలుగా ఉంటుంది. నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తం కోసం ఆవాహన చేయగానే నాకు భయంకరమైన కుష్ఠురోగం వస్తుంది. శరీరమంతా చీము నెత్తురు కారుతూ ఉంటుంది. వికార రూపం వస్తుంది. కొన్నాళ్లకు అంధత్వం వస్తుంది. అలాంటి పరిస్థితిలో కఠినాత్ముడినై, ఇతరుల సేవ కోసం దీనంగా ఎదురుచూస్తుంటాను. నేను ఆ దుస్థితిలో ఉన్నప్పుడు నాకు సేవ చేయగలవా?’ అని అడిగాడు.‘గురువర్యా! నేను మీ పాపాలను ఆవాహన చేసుకుని, వాటి ఫలితాన్ని అనుభవిస్తాను. దయచేసి నాకు అనుమతి ప్రసాదించండి’ అని వేడుకున్నాడు దీపకుడు.‘దీపకా! నువ్వు నీ వంశానికే కులదీపకుడవు. అయినా, ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు. పుణ్యమైనా, పాపమైనా ఎవరి కర్మలకు వారే ఫలితాన్ని అనుభవించాలి కదా! నా పాపాలకు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని ఈశ్వరానుగ్రహాన్ని, మోక్షాన్ని పొందలేను’ చెప్పాడు వేదధర్యుడు.గురువు ఆనతి ప్రకారం దీపకుడు ఆయనను కాశీకి తీసుకువెళ్లాడు.కాశీలోని మణికర్ణికకు ఉత్తరాన ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరుకుని, అక్కడ బస ఏర్పాటు చేసుకున్నారు.గురువు చెప్పినట్లే జరిగింది. కాశీకి చేరుకున్న కొద్దిరోజులకే వేదధర్యుడి కుష్ఠువ్యాధి సోకింది. క్రమక్రమంగా అతడి శరీరం క్షీణించసాగింది. శరీరమంతా చీము నెత్తురు కారుతూ, వేళ్లు తెగిపోయి, వికృతాకారుడిగా మారాడు. ఇంకొన్నాళ్లకు అంధుడైపోయాడు. గురువు పరిస్థితికి దీపకుడు చాలా దుఃఖించాడు. గురువును కంటికి రెప్పలా చూసుకుంటూ, నిత్యం ఆయన శరీరాన్ని శుభ్రం చేస్తూ, పరిచర్యలు చేసేవాడు. భిక్షకు వెళ్లి, దొరికిన భోజనాన్ని గురువుకు పెట్టేవాడు. ప్రతిరోజూ దీపకుడు తెచ్చిన భిక్షను తానొక్కడే తినేస్తూ, ‘ఇంత కొంచెమే తెచ్చావెందుకు?’ అంటూ దుర్భాషలాడేవాడు. గురువు కోపతాపాలను సహిస్తూనే దీపకుడు ఆయనను అంటిపెట్టుకుని ఉంటూ సేవలు చేసేవాడు.దీపకుడి అచంచల గురుభక్తికి కాశీ విశ్వనాథుడు ముగ్ధుడయ్యాడు. రోజూ మాదిరిగానే ఒకనాడు విశ్వనాథుడి ఆలయానికి వెళ్లిన దీపకుడికి ఆ పరమేశ్వరుడే ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! నీ గురుభక్తికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.‘స్వామీ! నాకు ఈ లోకంలో గురుసేవ తప్ప మరేదీ తెలియదు. మా గురువు అభీష్టమేదో కనుక్కొని చెబుతాను’ అన్నాడు. ఆశ్రమానికి వెళ్లాక గురువుకు ఈ విషయం చెప్పాడు. ‘గురుదేవా! మీకు స్వస్థత కోరుకుంటాను’ అన్నాడు.‘నాయనా! ఎవరి పాపాలకు ఫలితాన్ని వారు అనుభవిస్తేనే పోతాయి’ అని చెప్పాడు వేదధర్యుడు.మరునాడు విశ్వనాథుడి ఆలయానికి వెళ్లిన దీపకుడు పరమేశ్వరుడిని ఏ వరమూ కోరుకోలేదు.పరమేశ్వరుడు దీపకుడి సంగతిని పార్వతీదేవికి, ఆ తర్వాత శ్రీమన్నారాయణుడికి, సమస్త దేవతలకు చెప్పి సంబరపడిపోయాడు.శ్రీమన్నారాయణుడు దీపకుడికి ప్రత్యక్షమై, ‘వత్సా! సాక్షాత్తు పరమేశ్వరుడినే మెప్పించిన నీ గురుభక్తి అసామాన్యం. ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు.‘స్వామీ! నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు, చాలు’ అని పలికాడు దీపకుడు.‘తథాస్తు’ అని అనుగ్రహించాడు శ్రీమహావిష్ణువు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: దృశ్యమాలిక
గలగలా మాట్లాడుతూ చైతన్యానికి ప్రతీకలా ఉండే అమ్మని ఇలా చూస్తుంటే దుఃఖం ఆగడం లేదు. కష్టసుఖాల్లో నా వెన్నంటే ఉన్న ఆవిడ నాకు అమ్మ మాత్రమే కాదు; స్నేహితురాలూ, గురువూ, దైవం అన్నీనూ! భర్తతోనూ, పిల్లలతోనూ, స్నేహితురాళ్ళతోనూ, మరెవ్వరితోనూ చెప్పుకోలేని విషయాలని అమ్మతో పంచుకుంటుండే నాకు ఏ ఒక్కరోజైనా అమ్మతో మాట్లాడలేకపోతే ఆ రోజంతా ఎంతో వెలితిగా వుండేది. నిన్న రాత్రి కూడా అమ్మతో దాదాపు గంటసేపు ఏదో పిచ్చాపాటి మాట్లాడాను. అలాంటిది తెల్లవారు జాముకల్లా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందన్న దుర్వార్తని వినవలసి వస్తుందని నేను కలలోనైనా ఊహించలేదు. ‘జాతస్య మరణం ధ్రువం’ అని తెలిసినా, నాకు అత్యంత ఆత్మీయురాలైన అమ్మ విషయంలో మాత్రం నేను దాన్ని అన్వయించుకోలేకపోతున్నాను. ‘చదువుకో తల్లీ నీకు సౌఖ్యమబ్బేను, ఆడుకోవమ్మా నీకు హాయి కలిగేను’ అంటూ అమ్మ చల్లని గొంతుతో పాడే జోల నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే వుంది.‘చిన్నా, చిన్నా’ అంటూ అమ్మ నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తోంది. ఒకటా, రెండా– ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు. నా మదిలో అలలు అలలుగా కదులుతూ నన్ను ఒక రకమైన సుషుప్తిలోకి నెట్టేస్తున్నాయి. ‘అమ్మా, చూడు అన్నయ్య నన్ను కొడుతున్నాడు’ అని చెప్పగానే, ‘ఎవరమ్మా నా చిట్టితల్లిని కొట్టిందీ, హన్నా’ అంటూ నా తరఫున వకాల్తా పుచ్చుకొని, అన్నయ్యకి రెండు అంటించి మురిపెంగా నన్ను ఎత్తుకుని ముద్దాడిన అమ్మ! ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరంలో చివరి పరీక్షకి ముందురోజున ‘నేను ఈ సబ్జెక్టు సరిగ్గా చదవలేదు, ఫెయిలయిపోతాను’ అంటూ అమ్మ ఒళ్లో తల పెట్టుకుని భోరుమని ఏడుస్తుంటే, ‘ఊరుకో చిన్నా, ముందు కాసేపు ప్రశాంతంగా నిద్రపో’ అంటూ తన ఒళ్లో నన్ను నిద్రబుచ్చి, రెండుగంటల తర్వాత ‘చిన్నా, ఇంక మేలుకోమ్మా’ అంటూ నా చేతిలో కాఫీ పెట్టి నేను చదువుకుంటున్నంతసేపూ నాతో పాటే తనూ ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చోవడమే కాకుండా, ఆ మరుసటి రోజు నన్ను వెంటబెట్టుకుని కాలేజీ వద్ద దిగబెట్టి, నేను పరీక్ష రాసి బైటకి వచ్చేదాకా కాలేజీ గేటు పక్కనే నా కోసం ఓపిగ్గా ఎదురుచూస్తూ నిలుచున్న అమ్మ!సివిల్ సర్వీసెస్ ఎంట్రన్స్లో నెగ్గాక ఇంటర్వ్యూ ముందు రోజున ‘అమ్మా బోర్డులో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఏమో’ అని నేను భయపడుతుంటే, ‘ఏడాది పాటు ఒకే లక్ష్యంగా, అకుంఠిత దీక్షలా, అహర్నిశలూ చదివిన నీకు ఈ ఇంటర్వ్యూ ఒక లెక్కా? అంతా సవ్యంగానే జరుగుతుంది, ధైర్యంగా వుండమ్మా’ అంటూ నాపై నాకు నమ్మకాన్ని పెంచిన అమ్మ! ఐఏఎస్కి సెలక్టయి ట్రైనింగ్కి వెళ్ళాక ‘అమ్మా, ఇక్కడ అంతా నార్త్ ఇండియన్సే వున్నారు. వాళ్ళతో నేను కలవలేక పోతున్నాను. హాస్టల్లో భోజనం కూడా అస్సలు బావుండడం లేదు. పుల్కాలు, మసాలా కూరలూ తినలేక పోతున్నాను’ అంటూ ఫోన్లో నా కష్టాలని ఏకరువు పెట్టిన పదిహేను రోజుల్లోనే ఆవకాయ, మాగాయ జాడీలు పట్టుకుని నా దగ్గరకు వచ్చేసి, నా ట్రైనింగ్ పూర్తయ్యేదాకా నాకు వండి పెడుతూ, నా దగ్గరే ఉండిపోయి, వచ్చీరాని హిందీలో అక్కడ అందరితో మాట్లాడుతూ వాళ్లకి మన వంటలనీ, ఆప్యాయతనీ రుచి చూపిస్తూ మెల్లిమెల్లిగా వాళ్లందరినీ నాకు ఫ్రెండ్స్ని చేసేసిన అమ్మ! ‘అమ్మా, ఎప్పుడూ నా తోడూనీడగా ఉండేదానివి. ఇలా ఉన్నట్టుండి నన్ను ఒంటరిని చేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? లేమ్మా, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. నన్ను ఒక్కసారి చిన్నా అని పిలువమ్మా’ అంటూ పెద్దగా ఏడ్చేస్తున్నాను.∙∙ ‘‘అమ్మా, అమ్మా’’ అంటూ పిల్లలు గట్టిగా కుదుపుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను.ఎదురుగా చేతిలో పుష్పగుచ్ఛం పట్టుకుని మా పిల్లలు మన్వి, తన్వి.‘ఏమిటి సిరీ, అత్తయ్యగారుగాని మళ్ళా కలలోకి వచ్చారా?’ అన్న మావారి మాటలకు అవునన్నట్టుగా తలుపాను.పిల్లలిద్దరూ కలిసి నా చేతిలో పుష్పగుచ్ఛం పెట్టి ‘హ్యాపీ బర్త్ డే అమ్మా’ అంటుంటే వాళ్లవైపు నిరాసక్తంగా చూశాను. దాంతో పిల్లల్లోని ఉత్సాహం అంతా నీరు కారిపోవడం గమనించిన మా వారు వెంటనే ‘మీరు వెళ్లి హాల్లో ఏర్పాట్లు చేస్తుండండి. నేను అమ్మని తీసుకొస్తాను’ అని చెప్పి వాళ్ళని పంపించారు.‘అలాగే డాడీ’ అంటూ పిల్లలు హాల్లోకి వెళ్ళాక ‘ఇప్పుడు ఈ వేడుకలు ఎందుకండీ’ అంటున్న నన్ను మధ్యలోనే ఆపేసి, ‘అత్తయ్యగారు పోయి ఇంతకాలమైనా నువ్వింకా ఇలాగే ఉంటే ఎలా సిరీ? రోజుల తరబడి నువ్విలా నిస్తేజంగా ఉంటుంటే నిన్ను చూసి పిల్లలు ఎంత బెంగ పడుతున్నారో నీకేమైనా తెలుస్తోందా అసలు?’ అన్న ఆయన మాటలకి నాలో కోపం ఉవ్వెత్తున పొంగుకొచ్చింది.‘అదేమిటండీ, అలా మాట్లాడతారు? పోయింది ఎవరో దూరపు బంధువు కాదు, మా అమ్మ. ఆవిడతో నాకున్న అనుబంధం తెలిసీ మీరిలా...’ అంటుంటేనే నా గొంతు గద్గదమైంది.అది చూసి మా వారు తగ్గిపోయారు.‘నిన్ను బాధపెట్టాలని కాదు సిరీ. నిజమే, తల్లి లేని లోటు ఎవరూ తీర్చేది కాదు. అలాగని నీ విధుల్ని నువ్వు మర్చిపోకూడదు కదా! నీపై ఆధారపడ్డ ఒక కుటుంబం ఉంది. నువ్వు ఇద్దరు పిల్లలకి అమ్మవి, నాకు భార్యవి’ అన్నారు.‘మీకు చేయవలసిన వాటిలో నేను ఏ విధమైన లోటు చేశానండీ? మనసులో బాధ పొంగి పొర్లుతున్నా వేళకి అందరికీ అన్నీ అందిస్తూనే ఉన్నానుగా’ ఉక్రోషంగా అన్నాను.‘నిజమే, అన్నీ చేస్తూనే ఉన్నావు. కాని, ఇలా మొహంలో కళాకాంతులు లేకుండా, జీవితంలో సర్వం కోల్పోయినదానికి మల్లే తిరుగుతున్న నిన్ను చూసి పిల్లలు కూడా దిగాలుగా, మొహాలు వేళ్ళాడేసుకుని వుంటున్నారు. వాళ్ళల్లో హుషారు రోజురోజుకీ తగ్గిపోతుందన్న విషయం నువ్వు గమనించావా? అయినా పుట్టినరోజు పూట మన మధ్య ఇటువంటి వాదనలు వద్దుగాని, నీకోసం పిల్లలిద్దరూ కలిసి నీ పుట్టినరోజుని ప్రత్యేకంగా చేసి నిన్ను సంతోషపెట్టాలని చూస్తున్నారు సిరీ. నీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంచారు. నువ్వు కాదంటే వాళ్ళు బాధపడతారు, పద’ అంటూ హాల్లోకి తీసుకెళ్లారాయన.అక్కడ టేబుల్పైన అందంగా అలంకరించిన కేకు, క్యాండిల్స్, ఇంకా రకరకాల గిఫ్టులు.వాటిని చూసిన నా మొహం విప్పారలేదు. ఎందుకంటే, పుట్టినరోజు అనగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది అమ్మే! నెలరోజుల ముందునుండే పిల్లలకి ఫోన్ చేసి, ‘పిల్లలూ, ఈసారి అమ్మ పుట్టినరోజు ఎలా చేస్తున్నారూ, అమ్మకి ఏం బహుమతులిస్తున్నారూ’ అంటూ హడావిడి చేస్తూండేది అమ్మ! ఇంక ఆరోజునైతే అందరికంటే ముందే ఫోన్ చేసి, ‘చిన్నా, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. నా ఆయుష్షు కూడా పోసుకుని పదికాలాల పాటు చల్లగా ఉండు చిట్టితల్లీ’ అంటూ ఆశీర్వదించేది. అలాంటి అమ్మ లేని పుట్టినరోజు పండుగా, ఒక పండుగేనా ! అమ్మ ఆశీస్సులతో మొదలయ్యే వేడుకని అమ్మ లేకుండా జరుపుకోవడం నాకేమాత్రం ఇష్టం లేకున్నా, ఆయన చెప్పినట్టుగా పిల్లల మనసుల్ని కష్టపెట్టకూడదన్న ఉద్దేశంతో కేకు కట్ చేసి పిల్లలకీ, ఆయనకీ నా చేత్తో తినిపించాక, నిర్లిప్తంగా వంటింట్లోకి నడవబోతుంటే, ‘ఉండమ్మా, అసలైన సర్ప్రైజ్ పైనుంది, రా’ అంటూ పిల్లలిద్దరూ నా చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్లారు. మాది రెండంతస్తుల మేడ. పై అంతస్తులో మేమంతా క్రికెట్ మ్యాచ్లూ, సినిమాలూ చూసే హోమ్ థియేటర్ ఉంది.అక్కడ స్విచ్ ఆన్ చేయగానే చిరునవ్వుతో కనిపించిన అమ్మని అబ్బురంగా చూస్తుండిపోయాను.‘చిన్నా, ఎలా ఉన్నావురా? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నిండునూరేళ్లు సుఖశాంతులతో ఆనందంగా జీవితాన్ని గడపాలన్నదే నా ఆకాంక్ష’ అన్న అమ్మ మాటలకి నాలో ఆనందం పరవళ్ళు తొక్కింది.శివసాన్నిధ్యాన్ని చేరుకున్న అమ్మ ఇలా నా ఎదురుగా నిలుచుని ఎలా మాట్లాడగలుగుతోందో అర్థంకాక నేను తెల్ల మొహం వేస్తే, పిల్లలిద్దరూ ముసిముసిగా నవ్వుతూ, ‘ఇంకా ఉంది చూడమ్మా’ అన్నారు.దాదాపు గంట నిడివి ఉన్న ఆ త్రీడీ వీడియోలో అమ్మతో నా మధురస్మృతులని పొందుపరచిన ఎన్నో ఫొటోలు, మేమిద్దరం కలిసి వెళ్లిన టూర్లలో, ఫంక్షన్లలోని చిన్న చిన్న వీడియో క్లిప్పింగులు, అక్కడక్కడ అమ్మ స్వయంగా తన గళంతో చెబుతున్న కబుర్లూ!అదంతా చూశాక చెప్పలేనంత ఆనందంతో నా మనసు నిండిపోయింది. ఇన్నాళ్ళుగా నా హృదయాన్ని కలచివేస్తున్న బాధంతా ఒక్కచేత్తో తీసేసినట్టుగా బుగ్గలపై నుండి జాలువారుతున్న అశ్రువులను తుడుచుకుంటూ ‘ఎప్పుడు చేశారమ్మా ఇవన్నీ?’ అని నేను అడుగుతుంటే మా వారు నా వెనక నుండి ముందుకొచ్చి, ‘దాదాపు నెలరోజుల పైనుండి పిల్లలు ఎంతో కష్టపడి ఈ వీడియోని తయారు చేశారు. ఇప్పుడొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా త్రీ డీ టెక్నాలజీ సాయంతో అత్తయ్యగారు నీ ఎదురుగా నిలబడి, నీతో మాట్లాడుతున్నట్టుగా వీడియో క్లిప్పింగులు, స్పెషల్ ఎఫెక్ట్లు జత చేసి తయారుచేశారు. ఇదంతా కూడా నిన్ను ఆనందపెట్టాలన్న తపనతో చేశారు వాళ్ళు. అలాంటిది, నువ్విలా ఏడుస్తుంటే ఎలా చెప్పు?’ అంటూ తన చేత్తో నా కన్నీళ్ళని తుడిచారు.‘ఇవి కన్నీళ్ళు కావండీ, ఆనందభాష్పాలు. నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళేగా వచ్చేది’ అంటూ పిల్లలిద్దరినీ దగ్గరికి రమ్మన్నట్టుగా చేత్తో పిలవడం ఆలస్యం, మొహాలు చాటంత చేసుకుని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారిద్దరూ.వాళ్ళ నుదుటిన ముద్దాడుతూ, ‘థాంక్యూ సో మచ్ బుజ్జి కన్నలూ. మీ అమ్మమ్మకి తిరిగి ప్రాణం పోసి నా కళ్ళ ముందు నిలిపారు’ అన్నాను.నా మాటలకి వాళ్ళ మొహాలు మతాబుల్లా వెలిగిపోగా ‘అక్కా, ఎన్ని రోజులయింది కదా అమ్మ మనల్ని ఇలా ‘బుజ్జికన్నలూ’ అని పిలిచి’ అన్న మన్వి మాటలకి ‘అవును తన్వీ, ఇంకా కొన్నాళ్ళయితే మనం ఆ పిలుపే మర్చిపోయేవాళ్ళమేమో’ అంది తన్వి.ఆ మాటలు వింటుంటే ‘అయ్యో, నా నిరుత్సాహంతో పిల్లలని నేను ఇంత బాధపెట్టానా’ అనిపించింది. అదే మాట మా వారితో అనగానే, ఆయన వెంటనే ‘తల్లి పోతే బాధ ఉండడం సహజమే సిరీ. అందులోనూ నువ్వు ఆవిడ గారాల కూతురివి కాబట్టి ఆ బాధ నుండి బయటపడేందుకు నీకు మరింత సమయం కావాల్సి వచ్చింది, అది నేను అర్థం చేసుకోగలను. నిజానికి, మనుషులు చనిపోవడం అంటే భౌతికంగా వాళ్ళు ఇక్కడ మనతో లేకపోవడం. అంతే! వాళ్లతో మనకున్న అనుబంధమూ, వారి జ్ఞాపకాలూ ఎప్పుడూ సజీవంగానే ఉంటాయి, వాటికి మరణం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నంతకాలం వారు వదిలి వెళ్ళిన ఆ మధురస్మృతులని నెమరేసుకుంటూ మనసులో మరింత ఆనందాన్ని పోగేసుకుంటూ, వాటిని తరగని ఆస్తిగా మలచుకుని రాబోయే తరాలకి అందివ్వాలే తప్ప, వాళ్ళు మన మధ్యన లేరన్న విషయాన్ని అదేపనిగా తలుచుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు’ అన్నారు.ఆయన చెబుతున్నదాన్ని శ్రద్ధగా వింటున్న నాకు, ఆ మాటల్లో ఆ క్షణాన ఏదో అంతర్లీనమైన సందేశం వున్నట్టనిపించింది.∙∙ ఆ మరుసటి రోజున మన్వి స్కూల్కీ, ఇంకా తన్వి దాని స్నేహితురాలి ఇంటికీ వెళ్ళాక అమ్మతో కలిసి దిగిన ఫొటోలున్న ఆల్బమ్స్ అన్నింటినీ మంచంపై పరచుకుని తీరిగ్గా ఒక్కో ఫొటో తిరగేయసాగాను. ప్రతి ఫొటో వెనకా మరచిపోలేని అందమైన జ్ఞాపకాలు నా ఎదుట నిలిచి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ‘ఈ స్మృతులన్నింటినీ దృశ్యమాలికలుగా నిక్షిప్తం చేస్తే కలకాలం సజీవంగా వుంటాయి కదా’ అన్న ఆలోచన తళుక్కుమనగానే వెంటనే లేచి అల్మారాలో వున్న డిజిటల్ కెమెరాని బయటకి తీశాను.ఒక్కో ఫొటోపై కెమెరాని ఫోకస్ చేస్తూ ఆ ఫొటోకు సంబంధించిన సందర్భాన్ని చక్కటి మాటల్లో నాకు తోచినట్టుగా అర్థవంతంగా వివరించడం మొదలెట్టాను. అలా చేస్తూ ఎంతసేపున్నానో తెలియదు.కాలింగ్ బెల్ మోగడంతో లేచొచ్చి తలుపు తీస్తే ఎదురుగా మన్వి !‘అప్పుడే స్కూల్ అయిపోయిందా’ అంటూ గోడగడియారం వైపు చూసి, ‘అమ్మో, సాయంత్రం నాలుగు గంటలు దాటింది. పనిలో పడి టైం చూసుకోలేదు. మీకోసం నేనింకా టిఫిన్ కూడా తయారు చేయలేదు’ అని నేను కంగారుపడుతుంటే తన్వి కూడా లిఫ్ట్ తలుపు తెరుచుకుని రావడం కనిపించింది.దాంతో ‘కాళ్ళూ చేతులూ కడుక్కురండి. ఈలోగా నేను మీకోసం స్నాక్స్ చేస్తాను’ అంటూ గబగబా వంటింట్లోకి నడిచాను.ఫ్రిజ్లో నుంచి దోసెపిండిని బయటకి తీసి, ఉల్లిపాయలూ, పచ్చి మిరపకాయలూ సన్నగా తరిగి కలిపి వాటితో వేడి వేడిగా పొంగనాలు వేసి ప్లేట్లలో సర్ది హాల్లోకి తీసుకోచ్చేటప్పటికి అక్కడ నేను పరిచిన ఫొటోలని తదేకంగా చూస్తూ కనిపించారు పిల్లలు.నా చేతుల్లో నుండి టిఫిన్ ప్లేట్లు అందుకుంటూ ‘అమ్మా, ఈ ఫొటోల్లో అమ్మమ్మ ఎంత చిన్నగా, సన్నగా వుందో! అన్నట్టు, కెమెరాతో ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ఫొటోలని డిజిటలైజ్ చేస్తున్నావా?’ అని అడిగిన పిల్లలకి నేనేం చేస్తున్నదీ వివరించాను.‘నువ్వు బ్యాక్ గ్రౌండ్లో ఉంటూ నీ గొంతు మాత్రమే వినిపించేకంటే, నువ్వు కూడా ఫొటో పక్కనే కనిపిస్తుంటే బాగుంటుంది కదమ్మా! ఫొటోని చూపిస్తూ నువ్వు మాట్లాడుతుంటే నేను వీడియో తీస్తాను’ అంది ఫొటోగ్రఫీ మీద మక్కువున్న నా చిన్నకూతురు మన్వి.‘మన్వి చెప్పింది బావుందమ్మా. ఎప్పటికప్పుడు ఒక వీడియో అయిపోగానే అది నాకు ఇచ్చేశావంటే నేను దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెరుగులు దిద్దుతాను’ అంది ఇంజినీరింగ్ చదువుతున్న నా పెద్ద కూతురు తన్వి. ఆ వెంటనే ‘నేను ఎలాగో నెలరోజుల తర్వాత హాస్టల్కి వెళ్ళిపోవాలి కదా. అక్కడ ఈ వీడియోలని చూసుకుంటే నువ్వు నా దగ్గరే ఉన్నట్లుగా ఉంటుంది’ అని కూడా అంది.దాని మాటలకి ఆలోచనలో పడ్డాను.‘పిచ్చిపిల్ల, ఇప్పుడైతే హాస్టల్లో దూరంగా ఉంది కాబట్టి అమ్మని తన దగ్గరే చూసుకోవాలని అనుకుంటోంది, అదే ఆ తర్వాత, మా అమ్మలాగే నేనూ ఈ లోకాన్ని వీడిపోయాక? ఎప్పుడోకప్పుడు నేను కూడా వెళ్ళిపోవలసిన దాన్నేగా! ఎవరి ఆయుష్షు ఎన్నాళ్ళో ఎవరికి తెలుసు?’నా మనసు పరిపరివిధాలు పోసాగింది.‘తన్వి మనసు చాలా సున్నితం. చిన్న చిన్న వాటికే బెంగ పెట్టేసుకుంటుంది. నేను ఎప్పుడైనా ఆఫీసు పనిపై ఊరు వెళ్ళవలసి వస్తే నాలుగురోజుల ముందునుండే దిగులు పడుతుండేది. ఇంజనీరింగులో చేరి సంవత్సరంన్నర దాటినా ఇంకా దానికి హోం సిక్నెస్ పోలేదు. సెలవులకి ఇక్కడి వచ్చీ తిరిగి వెళ్ళిపోయే రోజున చాలా అయిష్టంగా హాస్టల్కి వెళ్తుంది. ఇంక మన్వికైతే ఇంకా చిన్నతనం పోలేదు. పసిపిల్లకి మల్లే మారాం చేస్తుంటుంది నా దగ్గరా, వాళ్ళ అక్క దగ్గరా! నేను కాస్త దిగులుగా ఉంటేనే తట్టుకోలేని ఈ పిల్లలు నేను ఏకంగా ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతే, ఆ బాధని తట్టుకోగలరా? మా అమ్మని తలచుకుంటూ నేను ఇంతలా బాధపడుతున్నాను కదా, మరి నేను వెళ్లిపోయాక నా పిల్లలూ నాలాగే నా గురించే ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో! అమ్మో, అలా అస్సలు కాకూడదు’అలా అనుకోగానే నా మదిలో చటుక్కున ఒక ఆలోచన అంకురించింది .‘నేను పోయాక, ఆ బాధ నుంచి పిల్లలు త్వరగా కోలుకునేందుకుగానూ వాళ్ళతో వర్తమానంలో నాకున్న అనుబంధం గురించే కాకుండా, భవిష్యత్తులో వాళ్లకి ఎదురయ్యే వివిధ సమస్యలకి నా అనుభవంతో నేను ఇచ్చే సలహాలనీ, సూచనలనీ నా మాటలతో వివరించే వీడియోలను చేస్తే, అవి పిల్లలకి సాంత్వనని కలిగించడమే కాకుండా ముందుముందు వాళ్లకి ఉపయోగకరంగా కూడా ఉంటాయి.’అలా అనుకున్నాక నా మనసు కాస్త ఊరటపడింది. ∙∙ ఆ రాత్రి నా ఆలోచనని ఆయన ముందుంచుతూ ‘యాభైఏళ్లకే నేనిలా ఆలోచించడం అశుభం అంటారా? నా ఆలోచనా విధానంలో లోపం ఉందంటారా, నేను నెగటివ్గా ఆలోచిస్తున్నానంటారా?’ అని అడిగాను.‘అదేం లేదు సిరీ. జీవితం క్షణభంగురం. ఎవరికైనా సరే నుదుటిన రాసిపెట్టి ఉన్నంత కాలమే ఈ పృథ్విపై స్థానం ఉంటుంది. పోయిన వాళ్లతో కలిసి మనమూ పోలేము కాబట్టి వాళ్ళతో పంచుకున్న అనుభూతులని పదిలపరుచుకోవడమూ, అలాగే మనమూ ఎల్లకాలమూ ఇక్కడ ఉండబోమన్న అవగాహనతో మన పిల్లలతో ముడిపడి వున్న బాంధవ్యాన్ని పదిలంగా భద్రపరుచుకోవడమూ చక్కటి ఆలోచనే. కాబట్టి మనసులో ఏ శంకలూ పెట్టుకోకుండా గో ఎహెడ్. అలాగే నువ్వు కూడా ఇంక ఆఫీసుకి వెళ్ళడం మొదలెడితే కాస్త త్వరగా మనుషులలో పడతావు. నీ చదువు, ఉద్యోగం వెనకాల అత్తయ్యగారి ప్రోత్సాహం అంతా ఇంతా కాదనీ, ఆవిడే లేకపోతే జీవితంలో నువ్వేమీ సాధించలేకపోయే దానివనీ నాతో నువ్వే చాలాసార్లు చెప్పావు. అలాంటిది ఇప్పుడు ఆవిడ ఈ లోకంలో లేదన్న బాధతో నువ్వు నీ శక్తిసామర్థ్యాలని కుదించేసుకుని ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఆవిడ ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించు. ఇకనైనా నీ సెలవుని రద్దు చేసుకుని ఆఫీసులో చేరిపోయి మనుషుల్లో పడేందుకు ప్రయత్నం చేయి సిరీ’ ఆయన మాటలతో నా ఆలోచనకి బలం కలగడమే కాకుండా నా కర్తవ్యం కూడా నాకు బోధపడింది..∙∙ ఆ మరుసటి సోమవారమే ఆఫీసులో చేరిపోయాను. ఇంక అప్పటి నుంచి తీరిక సమయాల్లో అమ్మతో, పిల్లలతో ఇంకా మావారితోనూ నా అనుబంధాన్ని దృశ్యమాలికలుగా మలుస్తూ , మా అమ్మ జ్ఞాపకాలకి ప్రాణం పోస్తూ ఆవిడ ఈలోకంలో లేదన్న బాధనుంచి మెల్లిమెల్లిగా తేరుకోవడం మొదలెట్టాను. దాంతో, మావారూ హ్యాపీ, పిల్లలూ హ్యాపీ, వెరసి కుటుంబమంతా హ్యాపీ. కాలం అన్ని గాయాలనీ మాన్పుతుంది. నిజమే కాని, దానికి మనవంతు కృషి మనమూ జోడిస్తే గాయం కాస్త త్వరగా నయమవుతుంది కదూ! -
కొండవీడు కత్తుల బావి
పర్యాటక ప్రాంతాల్లో అలనాటి రాజుల కోటలు ముందు వరుసలో ఉంటాయి. వాటి చరిత్ర, శిల్పకళ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. దేశంలో అనేక కోటలు పర్యాటక కేంద్రాలుగా మారి, చరిత్ర ప్రేమికులను, సాహస యాత్రికులను, సాధారణ పర్యాటకులను కూడా అలరిస్తున్నాయి. అలాంటి కోవకు చెందినదే ఈ కొండవీడు కోట.ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ కోటల్లో ఒకటి. కోటకు వెళ్లేమార్గం, పాములా వంకర్లు తిరిగిన ఘాట్ రోడ్డుపై ప్రయాణం ఉత్సాహభరితంగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే పర్యాటకంగా కొండవీడు నూతన శోభను సంతరించుకుంటోంది. ఒకప్పటి ఈ అద్భుత నిర్మాణం నేడు శిథిలావస్థకు చేరింది. అయినా ఆనాటి కట్టడాలు, ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో కొండవీటి కొండపై ఉంటుందీ కోట. రెడ్డి రాజుల్లో మొదటి వాడైన ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అనంతరం అతని కుమారుడు అనపోతారెడ్డి రాజయ్యాక, అద్దంకి నుంచి రాజధానిని కొండవీడుకు మార్చాడు. శత్రుమూకల దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడటానికి ఈ కోటను నిర్మించాడు.2010లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ రుచీ సింగ్, హిస్టరీ ప్రొఫెసర్ కేవీ రావులు కొండవీడును సందర్శించారు. అదే సమయంలో శివాలయం గర్భగుడి కింద బౌద్ధ చైత్యం వెలుగు చూసింది. శాతవాహనుల కాలంలోనే కొండవీడు బౌద్ధక్షేత్రంగా విరాజిల్లిందని చరిత్ర చెబుతోంది.ఆ బురుజులే కాపలాకేంద్రాలు కొండవీడు దుర్గంలో 72 కోట బురుజులతో పాటు ప్రాకారాలు, ధాన్యాగారాలు, దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాల, మసీదు, ఖజానా వంటి నిర్మాణాలు నాటి చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి. తారా బురుజు, జెట్టి బురుజు, నెమళ్ల బురుజులు వీటిలో ప్రత్యేకమైనవి. ఈ బురుజులే నాటి సైనికుల కాపలా కేంద్రాలుగా ఉండేవి. శత్రువులు కొండ వరకు రాకుండా కొండల దిగువ చుట్టూ కందకాలను వెడల్పుగా తవ్వి, ఆ నీటిలో మొసళ్లను వదిలారు.నీటి సమస్య రాకుండా..కోట పరిసరాల్లో పురావస్తుశాఖ తవ్వకాలు జరపగా రెండువేల ఏళ్లనాటి బౌద్ధస్థూపం, మట్టిపాత్రలు, చైనాకు సంబంధించిన పింగాణీ పాత్రల ముక్కలు బయటపడ్డాయి. నీటి అవసరాల కోసం కొండమీద ముత్యాలమ్మ, పుట్టాలమ్మ, వెదుళ్ల అనే మూడు గొలుసుకట్టు చెరువులు తవ్వారు. ఈ మూడూ సుమారు 12 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ మూడూ పూర్తిగా నిండితే కొండలమీదుగా కింది ప్రాంతాల్లోకి ప్రవహించి అక్కడి చెరువులు నిండేలా ఏర్పాటు చేసిన వ్యవస్థ నేటి తరానికి ఆదర్శప్రాయం.కత్తుల బావి నేపథ్యమిదీ!కొండవీడు కోట పేరు ప్రస్తావించగానే ముందుగా గుర్తుకొచ్చేది కత్తుల బావి. దీని వెనుక ఓ పెద్ద కథే వినిపిస్తుంది. ఆనాటి రెడ్డిరాజ్యంలోని 72 మంది సామంత రాజులను మట్టుబెట్టేందుకు ఓ బ్రాహ్మణుడు ఈ ఆలయం నిర్మించాడని ప్రతీతి. గర్భగుడి చెంతనే ఓ బావిని తవ్వించి, అందులో కత్తులు దాచి, సామంతరాజులను విందుకు ఆహ్వానించారని, బాలకృష్ణుని ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన సామంత రాజులంతా హత్యకు గురయ్యారని ఓ కథ ప్రచారంలో ఉంది. అలా ఆ బావిలో కత్తులు దాచినందువల్ల కత్తుల బావిగానూ, ఆ ప్రాంతం చీకటిగా ఉన్నందున చీకటి కోనేరుగానూ పేరొచ్చింది.విజయానికి చిహ్నంఈ ఆలయానికి అభిముఖంగా 45 అడుగుల ఎత్తులో ఏకశిలా విజయస్థూపం ఉంది. విజయనగర రాజులు కొండవీడును హస్తగతం చేసుకున్న విజయానికి సూచికగా ఈ ఏకశిలా స్థూపాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డిరాజుల పతనానంతరం కోట విజయనగర ప్రభువుల పరమైంది. అనంతరం గోల్కొండ సుల్తానుల చేతుల్లోకి వెళ్లింది.యునెస్కో గుర్తింపు లభిస్తే!2016లో తొలిసారిగా కొండవీడును చారిత్రక ప్రదేశంగా గుర్తించి, యునెస్కో జాబితాలో చేర్చాలంటూ ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై సమగ్రంగా పరిశీలించి నివేదిక పంపించాలంటూ కేంద్రప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కొండవీడు సమగ్ర స్వరూపాన్ని వివరించే బ్లూప్రింట్ పనులు నిర్వహించేందుకు హైదరాబాద్లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్కిల్ సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక దీన్ని యునెస్కో చారిత్రక వారసత్వ కట్టడ జాబితాలో చేర్చితే ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న కట్టడాలకు పునరుజ్జీవం లభిస్తుంది. కోట పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకంగా అభివృద్ధికి నోచుకుంటాయి. -
దొంగను పట్టుకుంటే ఘోరం వెలుగులోకి
సాధారణంగా పోలీసులు ఓ దొంగని పట్టుకుని విచారిస్తే ఏమవుతుంది? అప్పటి వరకు అతడు చేసిన చోరీల చిట్టా బయటకు వస్తుంది. కొన్నిసార్లు మాత్రం ఆ చోరుడితో పాటు అతడికి తెలిసిన దొంగల జాబితాలు బహిర్గతం అవుతాయి. అరుదైన సందర్భాల్లో మాత్రం పోయిన సొత్తు, సొమ్ముకు సంబంధించి యజమానులు తమ ఫిర్యాదుల్లో చెప్పిన తప్పుడు లెక్కలు తెలుస్తుంటాయి. 2002లో హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలోని షాహినాయత్గంజ్ పోలీసులు సాజిద్ అనే ఘరానా దొంగను పట్టుకున్నారు. ఇతడి విచారణలో కుందన్బాగ్ ప్రాంతంలో జరిగిన తల్లీ, ఇద్దరు కూతుళ్ల సామూహిక ఆత్మహత్య విషయం బయటపడింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జయప్రదకు హైదరాబాద్కు చెందిన బడా వ్యాపారవేత్తతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు కలిగిన తరవాత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి భర్త వేరే ప్రాంతంలో ఉంటుండగా, జయప్రద తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కుందన్బాగ్లోని రెండంతస్తుల సొంత భవనంలో నివసించేది. కొన్నాళ్ల పాటు కుమార్తెలు తమ చదువుల కోసం కాలేజీలకు వెళ్లివెళ్లేవారు. కానీ, హఠాత్తుగా మానేశారు. తల్లితో పాటు ఇంట్లోనే ఉండిపోయారు. బయట నుంచి అందంగా కనిపించే ఆ భవంతి ప్రాంగణం మాత్రం పట్టించుకునే వాడు లేకపోవడంతో పిచ్చి మొక్కలు, పొదలతో నిండిపోయింది. పోర్టికోలో మాత్రం ఎప్పుడూ ఓ కారు ఆగి ఉండేది. తాను బయటకు వచ్చి పరిచయస్తులతో సంప్రదింపులు జరిపినా, ఇరుగుపొరుగు వారితో మాట్లాడినా తన గతం ప్రస్తావన వస్తుందనే ఉద్దేశంతో జయప్రద బాహ్యప్రపంచానికి దూరంగా ఉండిపోయింది. అదే భావనతో తన పిల్లల్నీ ఇంటి నాలుగు గోడలకే పరిమితం చేసింది. ఫలితంగా ఈ కుటుంబానికి చుట్టుపక్కల వారితో పరిచయాలు, స్నేహాలు లేకుండా పోయాయి. ఈ ఇంటికి రాకపోకలు సాగించే వారు కూడా ఎవ్వరూ ఉండేవారు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పగటిపూట గడప దాటని ఈ కుటుంబం అప్పుడప్పుడు అర్ధరాత్రి వేళ మాత్రం బయటకు వచ్చి క్యాండిల్ వెలుగులో ఇంటి చుట్టూ సంచరిస్తుండేవారు. అలా వాళ్లు ఎందుకు చేస్తున్నారనే దానిపై స్థానికులు కొన్నాళ్లు ఆరా తీసినా విషయం తెలియలేదు. దీంతో కొందరు వీరి విషయం పట్టించుకోవడం మానేశారు. మరికొందరు భయంతో జయప్రద కుటుంబానికి, ఆ ఇంటికి దూరంగా ఉండిపోయారు. మిస్టరీగా మెలిగే ఈ కుంటుంబం అన్ని చెల్లింపులు ముందస్తుగానే చేసేది. కరెంట్ బిల్ ఏకంగా రెండుమూడేళ్లకు అడ్వాన్స్ కట్టేసేది. పాలు పోసే వ్యక్తికి, పేపర్ బాయ్కి దాదాపు ఏడాదికి సరిపడ డబ్బు ముందే ఇచ్చేది. ఏడాదికి అవసరమైన సరుకులు తెచ్చి ఇంట్లో పెట్టుకునేది. ఎవ్వరి కంటా పడకూడదనే ఉద్దేశంతో ఇంటికి సమీపంలో ఉన్న చెత్తడబ్బా దగ్గరకీ తమ కారులో వెళ్లి చెత్తను పడేసి వచ్చేది. ఎవరికీ పట్టని, ఎవరినీ పట్టించుకోని ఈ కుటుంబంతో సమీపంలో ఉండే ఓ కాలేజీ విద్యార్థులు మాత్రం ఓ సందర్భంలో ఘర్షణపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రపంచానికి దూరంగా జయప్రద కుటుంబం నివసిస్తున్న ఈ ఇంట్లో 2002 జూన్ నెల నుంచి నిశ్శబ్దం నెలకొంది. అయినా ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. పట్టించుకుని పోలీసులకు సమాచారం అందించలేదు.షాహినాయత్ గంజ్ పోలీసులు అదే ఏడాది సెప్టెంబర్ 15న ఇళ్లల్లో దొంగతనాలు చేసే ఘరానా దొంగ మహ్మద్ సాజిద్ను పట్టుకున్నారు. ఇతడి విచారణలో అనేక నేరాలు వెలుగులోకి వచ్చాయి. వాటితో పాటే లోకం చూడని సామూహిక ఆత్మహత్యల సమాచారమూ వెల్లడైంది. కుందన్బాగ్లోని ఓ బంగ్లాలో తాను చోరీకి వెళ్లానని, ఆ ఇంటి ప్రధాన ద్వారం లోపలి నుంచి తాళం వేసి ఉండగా, పక్క ఉన్న మరో తలుపు తీసి ఉండటంతో లోపలకు ప్రవేశించానని చెప్పాడు. ఆ ఇంట్లోని బెడ్రూమ్లో మంచంపై ముగ్గురు మహిళల మృతదేహాలు పడి ఉన్నాయని, దీంతో తొలుత కాస్త భయపడినా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పదేపదే ఆ ఇంట్లోకి వెళ్లి వస్తూ అందినకాడికి సొత్తు ఎత్తుకుపోయానని బయటపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న షాహినాయత్గంజ్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కుందన్బాగ్ ప్రాంతం పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో ఆ అధికారులకు సమాచారం ఇచ్చి, వారితో కలిసి చోరుడిని తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అతగాడు వరుస చోరీలు చేసిన ఇంటిని చూపించమని కోరారు. సాజిద్ నేరుగా తీసుకువెళ్లి జయప్రద ఇంటిని చూపించాడు. ఆ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో, బెడ్రూమ్లో మంచంపై ఉన్న మూడు మృతదేహాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంటి వరండాలో గుట్టగా పడి ఉన్న వార్తాపత్రికలను సేకరించి పరిశీలించారు. అవి ఆ ఏడాది జూన్ 21 తేదీ నుంచి ఆ రోజు వరకు (సెప్టెంబర్ 15) సంబంధించినవిగా తేలడంతో 2002 జూన్ 20 రాత్రి ఈ ఆత్మహత్యలు జరిగినట్లు అంచనా వేశారు. ఆ గదిలో దొరికిన గుర్తుతెలియని విషం ఫినాయిల్గా తేలింది. మృతదేహాలకు సమీపంలోనే ఫినాయిల్ బాటిల్ సైతం పోలీసులకు లభించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో కుందన్బాగ్తో పాటు హైదరాబాద్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సామూహిక ఆత్మహత్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. -శ్రీరంగం కామేష్ -
అన్వేషణ
మృగరాజు సింహం చిట్టికూన గుహ ముందు ఆడుకుంటూ తప్పిపోయింది.మధ్యాహ్నం బయటకి వెళ్లి ఇంటికి రాలేదు. చిట్టికూన బుల్లి ఎలుగు, గున్న ఏనుగుతో ఆడుకునేది. మృగరాజు వాటిని పిలిచి విచారించాడు. ‘రాజా! ఇప్పటి వరకు ఇక్కడే కలిసి ఆడుకున్నాం!’ అంది బుల్లి ఎలుగు. ‘చెరువుకు వెళ్లి నీళ్లు తాగి ఎవరింటికి వాళ్లం వెళ్లాం!’ అంది గున్న ఏనుగు. మృగరాజు వెంటనే చెరువుకు వెళ్లి వెతికాడు. కాని, చిట్టికూన కనిపించలేదు.మృగరాజు వద్ద ఎంతోకాలంగా కొంగ, గుడ్లగూబలు గూఢచారులుగా కొలువు చేస్తున్నాయి.అవి అడవంతా తిరుగుతూ మృగరాజుకు రహస్య సమాచారాలు అందించేవి. మృగరాజు వెంటనే కొంగ, గుడ్లగూబలను పిలిపించాడు. మృగరాజు చెప్పేది వింటూనే కొంగ తన పొడవాటి మెడను నలుదిక్కులా తిప్పి పరిశీలించింది. వెంటనే ఎగిరి చెరువుకు పోయింది. చెరువు నుంచి గుహకు వస్తూ మర్రిచెట్టు దగ్గర ఆగింది.తన పదునైన నేత్రాలతో చుట్టూ పరికించి చూసింది. ఒక్క క్షణం ఆలోచించి వెంటనే గుహకు వచ్చి ‘ప్రభూ! చిట్టికూన తప్పిపోలేదు. ఎవరో ఎత్తుకు పోయారు!’ అంది కొంగ. ‘ఎత్తుకు పోయారా?’ లేచి నిలుచుంది సింహం.‘వేగులుగా మా ప్రతిభ మీకు తెలియంది కాదు. చిట్టికూన జాడ చిటికెలో కనిపెడతాం! మీరు నిశ్చింతగా ఉండండి!’ అంటూ గుడ్లగూబతో కలిసి గాలిలోకి ఎగిరింది కొంగ.అవి రెండూ వెళ్లి మర్రిచెట్టు మీద వాలాయి. ‘మిత్రమా! చిట్టికూనను నక్క ఎత్తుకుపోయి ఉండవచ్చు. నక్క పాద ముద్రలు మృగరాజు గుహ చుట్టుపక్కల కనిపించాయి. నాకు అనుమానం వచ్చి చెరువు దగ్గరకు వెళ్లాను. అవే పాదముద్రలు చెరువు దగ్గర కనిపించాయి. ఇక చిట్టికూన పాదముద్రలు, నక్క పాదముద్రలు పక్కపక్కనే ఈ మర్రిచెట్టు వరకే ఉన్నాయి. మర్రిచెట్టు దగ్గర చిట్టికూన పాదముద్రలు మాయమయ్యాయి. ఇక్కడి నుంచి తూర్పు దిక్కుగా కేవలం నక్క పాదముద్రలు ఉన్నాయి!’ పాదముద్రలు చూపిస్తూ వివరించింది కొంగ. పాదముద్రల వైపు పెద్ద పెద్ద కళ్లతో పరిశీలనగా చూసి చదునైన గుండ్రని తలను ఊపింది గుడ్లగూబ.‘మిత్రమా! చీకటి పడింది. నేను చీకట్లో ప్రయాణించలేను. చీకట్లో నీ దృష్టి, వినికిడి శక్తి అసాధారణం. ప్రత్యేకమైన నీ ఈకలతో నిశ్శబ్దంగా ఎగరగలవు. పాదముద్రల వెంట నక్క ఇంటికి వెళ్లి తనఖీ చేసిరా! పో..!’ అని పంపింది కొంగ.పాదముద్రలు పట్టుకొని నక్క గుహ దగ్గరకు చేరింది గుడ్లగూబ. గుహ బయట చిట్టికూన మల మూత్రాలను గమనించింది.గుహ లోపల గుర్రు పెట్టి నిద్రపోతుంది నక్క పక్కనే కట్టేసిన చిట్టికూన కనిపించింది.ఇంతలో తెల్లారింది. గుడ్లగూబను వెతుక్కుంటూ. మృగరాజు వెంట కొంగ రానే వచ్చింది. ‘రాజా! పక్క అడవి పులిరాజు చిట్టికూనను తెచ్చి ఇస్తే ఆ అడవికి మంత్రిని చేస్తానంటే ఆశతో ఎత్తుకొచ్చాను! నన్ను చంపొద్దు! మన్నించండి!’ అని కాళ్లు పట్టుకుంది. మృగరాజు నక్కకు అడవి బహిష్కరణ శిక్ష విధించాడు. వేగులైన కొంగ, గుడ్లగూబలు వేగంగా అన్వేషించి చిట్టికూనను కాపాడినందుకు అభినందించాడు మృగరాజు.-భార్గవి -
ఏమేమి తినచ్చు?
నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను. ఇంట్లో చాలామంది రకరకాల ఆహారపదార్థాలు తినొద్దు, బిడ్డకు సమస్య అవుతుంది అని అంటున్నారు? ఏ విధమైన ఆహారం, మందులు పాలిచ్చే తల్లులకు సురక్షితమో చెప్పండి? – దేశీత, అమరావతి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న తల్లులు ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పత్యం ఉండాల్సిన అవసరం లేదు. కాని, మరీ ఎక్కువ పరిమితిలో ఆహారం తీసుకోకూడదు. డైట్లో మాంసం, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, పండ్లు, గింజలూ ఉండాలి. సమతుల ఆహారం అవసరం. కొన్ని చేపల్లో ఎక్కువగా పాదరసం ఉంటుంది. వాటికి దూరంగా ఉండండి. ఆల్కహాల్ వద్దు. కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోవద్దు. టీ, కాఫీ, చాకొలేట్, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కోల్డ్ అండ్ ఫ్లూ మెడిసిన్స్ వాడకూడదు. ఎక్కువ కాఫీ తాగితే బేబీకి నిద్ర సమస్యలు వస్తాయి. మీకు టీ, కాఫీ అలవాట్లు ఉంటే డీకెఫీనేటెడ్ కాఫీ, టీ తాగొచ్చు. లెమన్ అండ్ హనీ వాటర్ తీసుకోవచ్చు. జలుబు, దగ్గు వస్తే యాంటీబయోటిక్స్ బదులు సింపుల్ కాఫ్ సిరప్ వాడాలి. మలబద్దకానికి హై ఫైబర్ డైట్ అవసరం. ఇందుకు లాక్టులోజ్ సిరప్ వాడొచ్చు. పైల్స్ ఉంటే ఆయింట్మెంట్స్ లేదా సపోజిటరీస్ వాడొచ్చు. తలనొప్పి, ఒళ్లునొప్పులు ఉంటే తగినంత విశ్రాంతి తీసుకోవాలి లేదా పారాసెటమాల్ టాబ్లెట్స్ వాడొచ్చు.నాకు డెలివరీ అయి ఒకనెల అవుతుంది. నెల తర్వాత మళ్లీ చెకప్ కోసం రమ్మన్నారు. కాని, నేను మా ఊరిలో ఉన్నాను. ఈ సమయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? – జాగృతి, శ్రీకాకుళం. డెలివరీ తరువాత రెండు నెలలు లేదా ఆరు వారాల్లో గైనకాలజిస్ట్ని తప్పనిసరిగా కలవాలి. నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా ఆరు వారాల్లో శరీరం కోలుకుంటుంది. బేబీకి ఆరు వారాల్లో వ్యాక్సినేషన్ కూడా ఇవ్వాలి. కుట్లు వేసిన చోట హీలింగ్ ఎలా ఉందో, బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఉందో, యూటిరస్ సైజు తగ్గిందో లేదో, వెజైనల్ హీలింగ్, యూరిన్, మోషన్ ప్రాబ్లెమ్స్ ఉన్నాయా, మల్టీ విటమిన్స్ అవసరమా, బీపీ, షుగర్ లేదా ప్రెగ్నెన్సీ నుంచి ఇస్తున్న మెడిసిన్స్ ఇంకా అవసరమా అనేది టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే పాప్ స్మియర్ లేదా సర్వికల్ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని డాక్టర్ చెప్తారు. ఈ టెస్ట్ ప్రతి మూడు ఏళ్లకు ఒకసారి చెయ్యాలి. హెచ్ పీవీ వ్యాక్సిన్ లేదా సర్విక్స్ కేన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్ ఈ టైమ్లో సజెస్ట్ చేస్తారు. వ్యాయామం చేయటం ఇప్పుడే మొదలుపెట్టాలి. పెల్విక్ ఫ్లోర్ వ్యాయామం అవసరమని చెప్తారు. అబ్డామినల్ బెల్ట్ను సజెస్ట్ చేస్తారు. బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ లేదా నిపుల్ ఇన్ఫెక్షన్ను చెక్ చేస్తారు.బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ లేదా నిపుల్ డిశ్చార్జెస్ ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. వ్యాక్సినేషన్ ప్రెగ్నెన్సీ తరువాత కూడా అవసరం ఉంటే ఇస్తారు. యూరిన్ లీక్, మోషన్ లీక్ ఉంటే రక్తం, మూత్ర పరీక్షలు చేయాలి. ఓవులేషన్ స్టార్ట్ అయిన తర్వాత కాంట్రాసెప్షన్ అవసరం ఉంటుంది. డిఫరెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేయాలి. కాపర్–టి వంటి లాంగ్ టెర్మ్ కాంట్రాసెప్టివ్స్ ఇవ్వొచ్చు. బేబీ బర్త్ రిజిస్ట్రేషన్ కూడా చెక్ చేయాలి. ఆరు వారాల తరువాత డెలివరీ విజిట్ చాలా ముఖ్యం. కాబట్టి, తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లి డాక్టరును సంప్రదించండి. -డా‘‘ భావన కాసు-గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ , హైదరాబాద్ -
దెయ్యప్పిల్ల
పాపం మంచమ్మాయే! ‘దెయ్యప్పిల్ల’ అని పేరొచ్చేసిందంతే. అసలు పేరు జో రోత్(Girl Zoe Roth). ఆమె నాలుగేళ్ల వయసులో తండ్రి తీసిన ‘విపత్తు’ ఫొటోపై ఇరవై ఐదేళ్లుగా ఇంటర్నెట్లో ‘మీమ్స్’ వస్తూనే ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా పెద్ద విపత్తు సంభవించింది అనుకుందాం. ఆ విపత్తు ఫొటోను, ఈ పాప ఫొటోను జాయింట్ చేసి ఇంటర్నెట్లోకి వదిలేస్తుంటారు ‘మీమర్స్’. టైటానిక్ నౌక ఎప్పుడో వందేళ్ల క్రితం కదా మునిగిపోయింది.ఆ ఫొటోక్కూడా ఈ పాప ఫొటోను తగిలించేశారు. సరదాకే అనుకోండి. ఆ చిన్నారి ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతి అయింది. ఇటీవలే తన చిన్నప్పటి ‘విపత్తు ఫొటో’లో తనెక్కడైతే నిలబడి ఉందో సరిగ్గా అక్కడే నిలబడి ఫొటో తీయించుకుని ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టింది. సీన్ని రీక్రియేట్ చేసిందన్నమాట! ఇదంతా సరే, అసలు పాతికేళ్ల క్రితం నాటి జో రోత్ ఫొటోపై సోషల్ మీడియాలో ఇప్పటికీ మీమ్స్ ఎందుకు వస్తున్నాయి?ఓసారి 2005లోకి వెళ్దాం. ఇయర్ సరే. ప్లేస్ ఎక్కడ? అమెరికాలోని నార్త్ కరోలినా. అప్పుడు జో రోత్ వయసు 4 సంవత్సరాలు. ఆ రోజు.. వీధిలో ఏదో కాలిపోతున్నట్లు పొగలు వస్తుంటే చుట్టు పక్కల వాళ్లు ఇళ్లల్లోంచి బయటికి వచ్చారు. జో రోత్ ఇంట్లోంచి ఆమె తండ్రి డేవ్, ఆమె వచ్చారు. డేవ్ ఫొటోగ్రాఫర్. అతడి మెడలో ఎప్పుడూ కెమెరా వేలాడుతూ ఉంటుంది. ఇంట్లోంచి వాళ్లొచ్చి చూసేటప్పటికి బయట ఎవరిదో ఇల్లు కాలిపోతోంది! అగ్ని మాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. డేవ్కు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. కెమెరాను సెట్ చేసుకుని, ‘‘తల్లీ.. ఫొటోకు పోజ్ ఇవ్వరా..’’ అన్నాడు.బ్యాక్ డ్రాప్లో కాలిపోతున్న ఇంటి మంటలు. వాటి ముందు రోత్. ఇదీ యాంగిల్. తండ్రి చెప్పినట్లే రోత్ పోజ్ ఇచ్చింది. ‘‘కొంచెం నవ్వు ముఖం పెట్టు’’ అన్నాడు! తనకేం తెలుసు. తండ్రి స్మైల్ అన్నాడు కాబట్టి స్మైల్ ఇచ్చింది. ఇల్లు కాలిపోతుంటే నవ్వుతున్నట్లుగా ఉంది జో రోజ ఆ ఫొటోలో!జో రోత్ సీన్ రీక్రియేషన్ ఫొటో ఐదు లక్షల డాలర్ల ఫొటో!ఆ ఫొటోలో రోత్ నవ్వు ‘డెవిలిష్’గా ఉంది. అంటే దెయ్యప్పిల్ల నవ్వుతున్నట్లు! రెండేళ్ల తర్వాత ఆ ఫొటోను ఏదో పోటీకి పంపుతూ ‘డిజాస్టర్ గర్ల్’ అనే పేరు పెట్టాడు డేవ్. ప్రైజ్ వచ్చింది. అలా ఆ ఫొటో ప్రపంచానికంతటికీ తెలిసింది. అప్పట్నుంచీ జో రోత్ ‘డిజాస్టర్ గర్ల్’ అయింది. ప్రపంచంలో ఎక్కడైనా ఘోరం జరిగితే ఫొటోషాప్ తెలిసిన సృజనశీలురు ఆ ఘటనకు, రోత్ చిరునవ్వు ఫొటోను కలిపి సోషల్ మీడియాలో పెట్టేవారు.అలా ఆ ఫొటో ఇంకా పాపులర్ అయింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలితే రోత్ ఫొటో. సునామీలు వస్తే రోత్ ఫొటో. ఘోర ప్రమాదాలు జరిగితే రోత్ ఫొటో. అలా నెట్లో, వార్తాపత్రికల్లో తరచు తన చిన్ననాటి ఫొటోని చూస్తూ పెరిగింది రోత్. ఇప్పుడు ముప్పై ఏళ్ల యువతి అయింది. అప్పటి చిరునవ్వులో మాత్రం మార్పులేదు. అన్నట్లు – ఐదేళ్ల క్రితం ఆ ‘విపత్తు ఫొటో’ ఒరిజినల్ ఐదు లక్షల డాలర్లకు వేలంలో అమ్ముడైంది. రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడన్నట్లు – ఆ రోజు రోత్ తండ్రి డేవ్ ఎందుకు అలా వెనుక మంటలు, ముందు కూతురి చిరునవ్వులు కలిపి ఫొటో తీసినట్లు! ఎప్పటికైనా ఆ ఫొటో భారీ ధరకు అమ్ముడుపోతుందని ముందే ఊహించాడా? లేదు లేదు. ఊరికే అతడికో సరదా ఆలోచన వచ్చింది.ఆ సరదా ఆలోచన కూడా ఎందుకొచ్చిందంటే.. పొగని చూసి హడావిడిగా బయటికి వచ్చారు తండ్రీ కూతుళ్లు.. అయితే అది అగ్ని ప్రమాదం కాదనీ, అగ్ని మాపకదళం వారే ట్రైనింగ్లో భాగంగా ఒక సెట్టింగ్ను తగలబెట్టి మంటల్ని ఆర్పుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని, ఆ సంతోషంలో కూతురి ముఖంలో నవ్వుల్ని పూయించాడు డేవ్. ఆ ఫొటోని చూస్తే ఎవరికైనా వెంటనే వచ్చే ఆలోచన.. ‘‘ఏంటీ పిల్ల.. ఇల్లు తగలబడిపోతుంటే నవ్వుతూ చూస్తోంది!’’... అనే కదా. అలాంటి ఆలోచన రప్పించడం కోసమే డేవ్ అలా ఫొటో తీశాడు. అనుకోకుండా ఫొటోగ్రాఫర్గా ఆయనకు పేరు, ఫొటోలో ఉన్న చిన్నారిగా రోత్కు భారీగా డబ్బూ వచ్చాయి. -
బెస్ట్ టూరిస్ట్ స్పాట్
రియో డి జనీరో– బ్రెజిల్లోని ఒక పెద్ద, అందమైన నగరం. ఇది అద్భుతమైన బీచ్లకు, పర్వతాలకు, ఉత్సాహభరితమైన కార్నివాల్ వేడుకలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కోపాకబానా, ఇపనేమా అనే బీచ్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. ఇవి అందమైన ఇసుక తిన్నెలతో, అహ్లాదకరమైన వాతావరణానికి నిలయమనే చెప్పుకోవాలి. కోర్కోవాడో పర్వతంపైనున్న ఈ భారీ జీసస్ విగ్రహం రియోకు ఒక చిహ్నం.ఇది 2007లో న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్లో స్థానం దక్కించుకుంది. అక్కడి షుగర్లోఫ్ మౌంటైన్ మీదున్న కేబుల్ కార్ ఎక్కితే ఆ నగరాన్ని మొత్తం వీక్షించవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రైస్తవ కార్నివాల్ ఈ నగరంలోనే ఘనంగా నిర్వహిస్తుంటారు. అలాగే ఈ నగరం ప్రపంచమే మెచ్చే.. సాంబా నృత్యాలకు పుట్టినిల్లు.చెప్పుకోదగ్గ పోటీలుఆస్ట్రేలియాకు చెందిన ‘డార్విన్ బీర్ క్యాన్ రిగటా ఫెస్టివల్’ ఒకటి. ప్రతి ఏడాది జరిగే ఈ వేడుకను చాలా వినోదాత్మకంగా నిర్వహిస్తారు. ఖాళీ బీర్ బాటిళ్లు, ప్లాస్టిక్ సీసాలు, పాల డబ్బాలు ఇలా ఉపయోగం లేనివాటిని ఉపయోగించి తయారుచేసిన పడవలతో బీచ్లో పోటీపడటం ఈ వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పోటీలను 1974లో లయన్స్ క్లబ్ ఆఫ్ డార్విన్ కమ్యూనిటీ సభ్యులైన లట్జ్ ఫ్రాంకెన్ ఫెల్డ్, పాల్ రైస్–చాప్మాన్ అనే వ్యాపారవేత్తలు ప్రారంభించారు. ఆస్ట్రేలియా ఉత్తర ప్రాంతంలోని డార్విన్ వీధుల్లో చెల్లాచెదురుగా ఉన్న చెత్తను శుభ్రం చేయడానికి సరైన మార్గంగా ఈ పడవల తయారీ, పోటీ అనే ఆలోచన వచ్చింది. దాన్ని ప్రారంభించినప్పుడే మంచి స్పందన రావడంతో దాన్ని ప్రతి ఏడాదీ కొనసాగిస్తున్నారు. మిండిల్ బీచ్లో జరిగే ఈ పండుగలో పాల్గొనేవారు వేలాది డబ్బాలతో సృజనాత్మకంగా పడవలను తయారు చేస్తారు. కొన్ని పడవలు పోటీ మధ్యలో విరిగిపోతుంటాయి. దానితో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందే జాగ్రత్తపడటంతో విరిగిపోవడం కూడా వినోదాన్ని పండిస్తుంది.ఇక ఈ ఏడాది ఈ పండుగ జూన్ 8న జరుగుతోంది. పడవ పోటీలతో పాటు, ఇసుక కోటల నిర్మాణం, థాంగ్ త్రోయింగ్ వంటి ఇతర సరదా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. లయన్స్ క్లబ్ ఆఫ్ డార్విన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనితో వచ్చే నిధులు స్థానిక కమ్యూనిటీ ప్రాజెక్టులకు ఉపయోగపడతాయి. ఈ సంబరాల్లో ‘థాంగ్ త్రోయింగ్ కాంపిటీషన్’ కాస్త వింతైన కామెడీ పోటీ. ఈ పోటీలో పోటీదారులు తమ తేలికపాటి చెప్పు(ఫ్లిప్ఫ్లాప్)లను దూరంగా విసురుతారు. ఎవరు ఎంత ఎక్కువ దూరం తమ చెప్పును విసరగలిగితే వాళ్లే గెలిచినట్లు. ఇక ఈ వేడుకలో భాగంగా ఐరన్ పర్సన్ కాంపిటీషన్, టగ్–ఆఫ్–వార్ ఇలా మరిన్ని పోటీలు జరుగుతుంటాయి. పైగా ఈ పోటీలను జూనియర్లకు వేరుగా, సీనియర్లకు వేరుగా, గ్రూప్ పోటీలు వేరుగా నిర్వహిస్తారు. దాంతో ఈ వేడుకలో వీక్షకులు, పోటీదారులతో సందడి మామూలుగా ఉండదు. -
ఓ మై డాగ్స్!
ఒక అసాధారణమైన స్నేహానికి మూడడుగుల ఎత్తు తేడా ఏమాత్రం అడ్డు రాలేకపోయింది. ఒకటి టీ కప్పు సైజులో పరిగెత్తే పిల్లోడు, ఇంకొకటి సోఫాను బెడ్డుగా వాడే బలమైన కుర్రాడు, కాని, ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం చూస్తే – ఇది శునకాల స్నేహం కాదు, నిజమైన ప్రేమపాఠం అనిపిస్తుంది. ఈ స్నేహం ఐడహోలో గిన్నిస్ వరల్డ్ రికార్ట్స్ అధికారుల కారణంగా మొదలైంది.ప్రపంచంలోనే అతి పొడవైన శునకం రెజీకి (39.6 అంగుళాలు), అతి చిన్నదైన కుక్క పెర్ల్ను (3.59 అంగుళాలు) మొదటిసారి పరిచయం చేసినప్పుడు, ఎవరూ ఊహించని విధంగా కళ్ల ముందు ఒక డిస్నీ మ్యాజిక్ కనిపించింది. రెజీ, పెర్ల్ కలిసింది మొదటిసారే అయినా, ‘ఓయ్ బాస్, ఈ ప్రపంచంలోనే మేమే గ్రేట్ బెస్ట్ ఫ్రెండ్స్’ అని అందరిని నమ్మించేశాయి! రెజీ భారీ ఆకారం చూసి పెర్ల్ భయపడకుండా ధైర్యంగా దాని చుట్టూ తిరుగుతూ ఆటలాడుకుంటుంటే, రెజీ తన భారీ కాళ్లను నెమ్మదించి, చిట్టి స్నేహితుడితో కలిసి నడిచింది.ఈ అందమైన కలయికకు కారణం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కావొచ్చు కాని, ఫలితంగా ప్రపంచం నిండా నవ్వులు పూశాయి, సోషల్ మీడియా హ్యాష్ట్యాగ్లతో నిండిపోయింది. చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. ఎత్తుల్లో తేడా రావచ్చు, రకాలు భిన్నంగా ఉండొచ్చు కాని, ఒక స్నేహానికి ఇవేమీ అవసరం లేదు, ఒక మంచి మనసే చాలు అని ఈ జంట మరోసారి నిరూపించింది. -
ఆ.. డిస్కషన్స్ రావు
స్టార్ హీరోయిన్గా మామూలు వెలుగు వెలగలేదు కాజల్ అగర్వాల్. పెళ్ళయిన తర్వాత కెరీర్ ముగింపుకి వచ్చినట్లే అని అనుకున్న వాళ్ల నోరు మూయించేలా మళ్లీ తెరపైకి రాబోతోంది.⇒ ఈ ఏడాది కాజల్ అగర్వాల్కి ఓ రకంగా స్పెషల్ ఇయర్. జూన్ 19న 40వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది.⇒ 2020లో పెళ్ళయిన తర్వాత ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణతో కలిసి నటించింది. ‘ఆచార్య’లో చిరంజీవితో కలిసి నటించే చాన్స్ వచ్చినా, మొదట్లోనే ఆ క్యారెక్టర్ని స్క్రిప్టులో నుంచి తీసేశారు. చిత్రీకరించిన సీన్స్, సాంగ్ కూడా డిలీట్ చేసేశారు.⇒ హీరోయిన్ ఓరియెంటెడ్ జోనర్ సినిమా ట్రై చేసి, ‘సత్యభామ’తో మంచి రిజల్ట్స్ అందుకోలేకపోయింది.⇒ సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ సినిమా డిజాస్టర్ అనే మాట అటుంచి, అసలు ఏ మాత్రం ప్రాధాన్యం లేని క్యారెక్టర్ చేసి, అందరిని షాక్కి గురి చేసింది కాజల్ అగర్వాల్.⇒ ఇటువంటి దశలో – కాజల్కి అద్భుతమైన అవకాశం వచ్చింది. విష్ణు మంచు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో పార్వతీదేవిగా నటిస్తోంది. కాజల్కి ఇది మొదటి పౌరాణిక పాత్ర.⇒ కాజల్ అగర్వాల్ పార్వతీదేవి గెటప్ చూసే, మండోదరి పాత్ర ఆఫర్ వచ్చింది. సాయి పల్లవి, రణ్బీర్ కపూర్ – సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణం’ సినిమాలో యశ్ రావణాసురుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతని సరసన మండోదరిగా కాజల్ అగర్వాల్ నటించబోతోందని సమాచారం.⇒ విష్ణు మంచుకి ట్విన్ సిస్టర్గా ‘మోసగాళ్ళు’ సినిమాలో నటించింది కాజల్ అగర్వాల్. ఆ పరిచయం కారణంగానే పార్వతీదేవి పాత్ర వచ్చింది.⇒ అక్షయ్ కుమార్ శివుడు క్యారెక్టర్ చేస్తున్నాడనే సంగతి తెలిసిందే! కొన్నేళ్ళ ముందు అక్షయ్ కుమార్ కాంబినేషన్లో ‘స్పెషల్ ఛబ్బీస్’ సినిమాలో చేసింది కాజల్ అగర్వాల్ .⇒ వ్యక్తిగత విషయాలకొస్తే, భర్త గౌతమ్ ఇంటీరియర్ డెకార్స్కి సంబంధించిన ఇ కామర్స్ బిజినెస్ చేస్తుంటాడు. భర్త ఆదాయం కన్నా– కాజల్ అగర్వాల్ ఆస్తి పాస్తులు ఎక్కువ. తామిద్దరి మ«ధ్య ఫైనాన్షియల్ మేటర్స్ గురించి డిస్కషన్స్ రావని చెప్పింది కాజల్.⇒ నటిగా ఎంత బిజీగా ఉన్నా, బాబు ఆలనా పాలనకి ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పింది. ‘సత్య భామ’ షూటింగ్కి కొడుకుని ముంబై నుంచి తనతో పాటు తీసుకొచ్చింది. ప్రైవేట్ హౌస్లో ఉండి, బాబుతో టైమ్ స్పెండ్ చేసింది.⇒ పెళ్ళయిన తర్వాత హీరోయిన్లకి కెరీర్ ముగిసి పోయిందనేది ఇప్పుడు కరెక్ట్ కాదని, కొత్తదారులకు తలుపులు తెరుచుకుంటాయని అంటుంది కాజల్ అగర్వాల్. -
కడలి కబుర్లు
అగాధ జలనిధి కడలి.. అది అనంత జీవరాశికి ఆలవాలం... నేలపై ఉండే జీవులకు ప్రాణవాయు ప్రదాత.. సాగరగర్భం అనేక వింతలకు నిలయం... సముద్రాలను కాపాడుకోవడం మానవాళి కర్తవ్యం.. సముద్రాలను కాపాడుకుంటేనే మనకు మనుగడ. సముద్రం ఒక వేదికైతే... అందులో చేపల నాటకం.. ఆక్టోపస్ డాన్స్.. డాల్ఫిన్ పాటలు.. ఇలా మరెన్నో కళాకారులతో నిండుతుంది. అయితే, ఆకతాయులు వేసే ప్రతి ప్లాసిక్ బాటిల్కు ఒక రంగురంగుల చేప ఊపిరి ఆగిపోతోంది. అలలు నవ్వడం మానేస్తున్నాయి. అందుకే, ప్రతి ఏటా జూన్ 8న జరుపుకునే ‘ప్రపంచ సాగర దినోత్సవం’(World Oceans Day) రోజునైనా, సముద్రం అంటే సరదా కాదు, ఒక జీవనిధిగా గుర్తించి కాపాడుకుందాం.సముద్రం అంటే ఒక పరిగెడుతున్న చేపల రాజ్యమని, అందులో నీళ్లు, చేపలు, బోట్లు తప్పే మరేం ఉంటాయ్! అని చాలామంది అనుకుంటుంటారు. కాని, సముద్రం ఎంత గొప్పది అంటే సముద్రమంత! ‘సాగరః సాగరోపమః’ అని వాల్మీకి మహర్షి చెప్పాడు. అంటే.. సముద్రం సముద్రమంత గొప్పదని అర్థం. సముద్రాన్ని మరోదానితో పోల్చడం సాధ్యం కాదు. అంతటి మహాసముద్రం లోపల వేలాది ర హస్యాలు. భయంకరమైన నిజాలు, వింతలు, విశేషాలు ఎన్నో దాగున్నాయి. వాటిలో బయటకు తెలిసినవి కొన్నే! కాని, సముద్రంలో ఒక చిన్న వినోదం కూడా ఉంటుంది.అది ఒక చక్కని కామెడీ కథల వేదిక. అక్కడి చేపలు చేసే శబ్దాలు రేడియోలో కంటే ఎక్కువగా మాట్లాడతాయి, ఆ శబ్దాలు మనకు వినపడవంతే! ఆక్టోపస్లు ఎనిమిదేసి చేతులతో మాయాజాలం చూపిస్తాయి. జెల్లీఫిష్ సిల్లీ విన్యాసాలు చేస్తూ ఉంటుంది. ఒకపక్క తాబేలు స్లో మోషన్ డాన్స్ చేస్తుంటే మరోపక్క డాల్ఫిన్లు, తిమింగలాలు ‘ప్లాస్టిక్ తినకురా! ఓ నీలి నేస్తమా!’ అంటూ రీమిక్స్ చేస్తూ ర్యాప్ పాడుతుంటాయి. ఇక సముద్రపు స్టార్ షార్క్ని సెల్ఫీ అడిగి, దాని నవ్వు చూసిన అలలు పరుగెడుతుంటాయి.ఇలా సముద్రంలో ఎన్నో వింతలు.. విడ్డూరాలు ఉన్నాయి. అలాగే జీవం కూడా ఉంది. అందుకే, మనుషులు ఆనందంగా ఉండాలంటే సముద్రం కూడా ఆనందంగా ఉండాలి. అలా ఆనందంగా ఉండాలంటే మనం సముద్రానికి ప్లాస్టిక్ బ్యాగ్లను టోపీలుగానూ, బాటిళ్లను సీ డెకరేషన్లగానూ చేయకూడదు. సముద్రాన్ని ప్రేమించడం అంటే, మన భవిష్యత్తును మనం ప్రేమించడమే! పుడమికి ప్రాణవాయువును అందిస్తున్న సాగరునికి ప్రతి ఒక్కరూ ‘థ్యాంక్స్’ చెప్పుకునేలా.. ఈ ప్రత్యేక కథనం.. అలా మొదలైంది... ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచం నీలికడలి గురించి ఒక నిలువెత్తు నిజాన్ని గుర్తు చేసుకుంటుంది. అదే సముద్రాలు మనకు ఒక ముఖ్య జీవనాధారం అని. ఆక్సిజన్ లేకుంటే ఎంత ప్రమాదమో, సముద్రాలు లేకున్నా కూడా అంతే ప్రమాదం. ఒకరకంగా చెప్పాలంటే మనం పీల్చుకునే ఊపిరిలో సగానికి సగం సముద్రాల నుంచే వస్తుంది. ఇంతటి ముఖ్యమైన వనరును కూడా మానవులు కాలుష్యంతో నింపి నాశనం చేస్తున్నారు. అందుకే, 1992లో బ్రెజిల్లో జరిగిన ‘ఎర్త్ సమ్మిట్’లో కెనడా మొదటిసారి ‘సముద్రాలకు ఒక ప్రత్యేక దినోత్సవం కావాలి’ అని చెప్పింది. ఆ కలను 2008లో ఐక్యరాజ్యసమితి సాకారం చేసింది. ఇక అప్పటి నుంచి ఏటా జూన్ 8న ‘ప్రపంచ సాగర దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. సముద్రంలో సినిమా.. అద్భుతమైన సముద్ర ప్రపంచాన్ని కళ్ల ముందుకు తీసుకొచ్చిన సినిమా ‘అండర్ ది సీ 3డీ’. ప్రముఖ సంస్థ ఐమాక్స్ తెరకెక్కించిన ఈ సినిమా మామూలు సినిమా కాదు. ఇదొక డాక్యుమెంటరీగా తీసుకొచ్చిన సముద్ర మాయాజాలం. ప్రముఖ డైరెక్టర్ హవర్ట్హాల్ దర్శకత్వం వహించగా, మిచెల్ హాల్ దీనికి రచన అందించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరూ సముద్రం లోతుల్లో తేలియాడుతూ, చుట్టూ రంగురంగుల చేపలను, నిగనిగలాడే పగడాల దిబ్బలను, నెమ్మదిగా కదిలే వివిధ సముద్రపు జీవులను చూస్తున్నట్లు ఉంటుంది.ఈ సినిమా కేవలం రంగుల బొమ్మలనే కాదు, ప్రకృతి చేసే అలజడి, వాతావరణ మార్పులు, పెరిగే ఉష్ణోగ్రతలు, మానవ తప్పిదాలు– ఇలా ఇవన్నీ సముద్రానికి చేస్తున్న ముప్పును చక్కగా చూపిస్తూనే, మనుషుల్లో ‘ఇక కొంతకాలంలో ఈ అందాలను చూసే అవకాశం లేకుండా పోతుందా?’ అనే ప్రశ్నను రేకెత్తించేలా చేస్తుంది. ఇందుకోసం ‘కర్ల్ ట్రయాంగిల్’ అనే సముద్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన సముద్ర జీవులు నివాసం ఉండే ప్రాంతం. అక్కడ చిత్రీకరణ అత్యంత ప్రమాదకరం.ఒక తప్పు జరిగినా అక్కడి జీవ వ్యవస్థ మొత్తానికి ముప్పు వాటిల్లుతుంది. అందుకే, ఈ ఇద్దరు ప్రతి ఫ్రేమ్ను చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఒక పెద్ద కెమెరాను ఉపయోగించారు. దాని బరువు సుమారు ఆరువందల కిలోలు ఉంటుంది. వివిధ ప్రత్యేక అనుమతులు తీసుకొని సుమారు కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేశారు. అలా ఒక అద్భుత ప్రపంచాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.సంభ్రమపరచే సాగర వాస్తవాలు⇒ సముద్రం లోపల ఏకంగా 37 ‘భారలోహాలు’ ఉన్నాయి. లిథియం, కోబాల్ట్, మాంగనీస్, టైటానియం ఇలా మరెన్నో మినరల్స్ ఉన్నాయి.⇒ సముద్రంలో ఉన్న మొత్తం ఉప్పుని ఉపయోగిస్తే, భూమిపై నేల అంతటినీ ఐదు వందల అడుగుల ఎత్తుతో కప్పేయొచ్చు.⇒ మనకి సముద్రపు లోతుల గురించి కంటే అంతరిక్షం గురించి ఎక్కువ తెలుసు. ఇంకా 90 శాతం సముద్రం మ్యాప్ కూడా గుర్తించలేదు. సముద్ర గర్భంలో ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు ఎన్నో ఉన్నాయి.⇒ సముద్రపు నీటి స్థాయి అప్పుడప్పుడు పైకి, కిందికి ఊగుతుంది. శీతాకాలం వస్తే నీరు మంచుగా మారుతుంది. అలాగే, తాపం పెరిగితే భూమి మీదకు వస్తుంది.⇒ సముద్రం భూమి మీద 71% విస్తీర్ణాన్ని కలిగి ఉంది. సముద్రాల్లోని నీటిని కలిపితే 320 మిలియన్ క్యూబిక్ మైళ్ల నీళ్లు! అంతేకాదు, సముద్రాల్లో నీళ్లు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. అవి ఎక్కడో వర్షంగా పడతాయి, మరెక్కడో మంచుగా మారతాయి. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ⇒ సముద్రం అంటే ఉప్పు నీరు మాత్రమే ఉండదు. ఉప్పు లేని సముద్రాలు ఉన్నాయి. వాటిని ‘గ్రేట్ లేక్స్’ అంటారు. అంటే సముద్రం కాదు. కాని, ఈ సరస్సులు సముద్రాల్లో ఉంటాయి.⇒ సముద్రంలో ఏకంగా 2.2 మిలియన్ జాతుల జీవులు ఉన్నాయని అంచనా. వాటిలో కొన్నింటిని మాత్రమే ఇప్పటి వరకు కనుక్కోగలిగాం.⇒ సముద్రపు నేల ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది! అగ్నిపర్వతాల వలన వచ్చిన మాగ్మా ఎత్తైన పర్వతాలను సృష్టిస్తుంటుంది. వీటిపై అక్కడక్కడ ఉండే ‘బ్లాక్ స్మోకర్స్’ అనే పగుళ్లు సముద్రంలో పొగను కూడా వదులుతాయి. హద్దుల్లేని భజంత్రీలుఒకప్పుడు పెళ్లి అంటే పందిరి, లైట్ల మెరుపులు, మైక్ పట్టుకుని చేసే ‘వేదపారాయణం’. కాని, ఈ స్టయిల్ పెళ్లిళ్లను ఈ కాలపు జంటలు అసలు ఒప్పుకోవడం లేదు. అన్నింటికంటే ముందు పెళ్లికి కచ్చితంగా కావాల్సింది అంతులేని తీరాలతో ఉండే ప్రేమ అని కొందరు అంటున్నారు. అంటే పెళ్లి వేదికలుగా సముద్ర తీరాలకు ఓటు వేస్తున్నారు. కాబట్టి పెళ్లి అనగానే పురోహితుడి కంటే ముందు ప్యాకేజీలో బీచ్ బుకింగ్స్ చేస్తున్నారు. ఇలాంటి ప్యాకేజీలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో ది బెస్ట్ ఇవి.గోవా: గోవాలో పెళ్లంటే.. పెళ్లి కంటే ముందు పెళ్లి విందు మిన్న అన్నట్లే! శుభ ముహూర్తానికి ముందే ‘సన్సెట్ క్లిక్స్’, ‘బీచ్ బేస్డ్ బంగ్లా’ బుక్ అయిపోతాయి. వేదమంత్రాల పక్కనే డీజే ప్లే అవుతుంది. పక్కా ఎంజాయబుల్ పెళ్లికి వెళ్లాలంటే గోవాలో జరిగే పెళ్లికి పిలవకుండా వెళ్లినా తప్పులేదు.అండమాన్: జీవిత ఖైదీని అందంగా బంధించాలంటే అండమాన్లో పెళ్లి చేసుకోవాలి. వధువు వస్తే ఫ్లవర్స్ కాకుండా, టైడల్ షవర్ ఫీల్స్ వస్తాయి.కేరళ: వరుడు బోటులో వస్తే, వధువు కొబ్బరి చెట్టు కింద నిలబడి ‘నన్ను తీసుకెళ్తావ్ కదా’ అని చెప్పే ఓ చక్కని సన్నివేశంలాంటిది కేరళ పెళ్లి.గోకర్ణ: గోకర్ణలో పెళ్లంటే ఒక చిన్న పండగలాంటిది. ఓం కారంతో శుభారంభం పలికి, పెళ్లి, తర్వాత సంగీతం, చివర్లో బీచ్ ఫైర్ డాన్స్తో అలరించేదే ఈ పెళ్లి.పుదుచ్చేరి: ఫ్రెంచ్ వీధుల్లో ప్రేమగా నడుస్తూ, బీచ్ సరసన ప్రేమ పంచుకుంటే, ఫొటోల్లోనే కాదు, జీవితమే ఒక రొమాంటిక్ సినిమాలా కనిపిస్తుంది. అటువంటి సినిమాటిక్ ఫీల్ కోసం పుదుచ్చేరి బెస్ట్ ప్లేస్.డయ్యూ: తక్కువ ఖర్చుతో హైవోల్టేజ్ బీచ్ పెళ్లి కావాలంటే ఇది బెస్ట్. ఓ వైపు పోర్చుగీస్ ఇళ్లు, మరోవైపు బ్రైట్ లైట్స్తో ఉంటుంది. ఈ పెళ్లిని చూసిన తర్వాత పెళ్లికాని అబ్బాయిలు కూడా తమ పెళ్లి ఇక్కడే చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు.మహారాష్ట్ర: ఇక్కడ బీచ్ వెడ్డింగ్ అంటే పక్కనే కోటలు, వెనుక సముద్రం, ముందు మేకప్ ఫెయిల్ అయిన వధూవరులు. ఎందుకంటే, ఇక్కడ సూర్యుడు తన శక్తిని కొంచెం ఎక్కువే చూపిస్తాడు. అయినా కూడా అందంగానే ఉంటారు.లక్షద్వీప్: ఇది పెళ్లి కాదు బాస్, అడ్వెంచర్! ఇక్కడ పెళ్లి చేసుకుంటే పంచభూతాలే సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఎందుకంటే, ఇక్కడ చాలామంది స్కూబా డైవింగ్ చేస్తూ, ‘ఐ లవ్ యూ’ చెçప్పుకుంటారు. బంధువులు ఎవరైనా రావాలంటే, ముందే స్విమ్మింగ్ తెలిసుండాలి.కాబట్టి పెళ్లి అంటే ‘పెద్దవాళ్ల దీవెనలు, బంధుమిత్రులతో విందుభోజనాలు’ అనుకునే రోజులు పోయాయి! ఇప్పుడు పెళ్లి అంటే– ‘ఐలాండ్ ప్యాకేజీ బుక్ చేసి, టెంట్లు వేసుకుని, సముద్రపు హోరుకు హార్ట్బీట్ జోడించి, ప్రేమను చాటాలి అనుకుంటున్న రోజులివి. అయితే, ఈ సముద్ర సంబరాలకు వెళ్లడానికి ముందు సన్స్క్రీన్ను రాసుకెళ్లడం మర్చిపోకండి.సముద్రంలో మిస్టరీగా మిగిలిన ప్రదేశాలు.. సముద్రాల్లో కొన్ని ప్రదేశాల గురించి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నా, అవి ఇప్పటికీ ప్రశ్నలు, సమాధానాల కంటే అర్థం కాని కథల్లానే మిగిలిపోయాయి. అలాంటి ఐదు అత్యంత రహస్యమైన సముద్ర ప్రదేశాలు ఇవే..బెర్ముడా ట్రయాంగిల్ ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతంలో విమానాలు, నౌకలు చాలా అదృశ్యమయ్యాయి. అవన్నీ ఎక్కడికి పోయాయి? కారణం ఏమిటి? ఇంకా తెలియలేదు. ఇది సాంకేతిక సమస్యా? లేక ఏదైనా భౌతిక శక్తుల మాయాజాలమా అనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు.మారియానా ట్రెంచ్ మనం సముద్రాన్ని కేవలం ఐదు శాతమే అన్వేషించాం. కానీ అంతకంటే లోతైన ప్రదేశం కూడా ఉంది. అదే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ‘చాలెంజర్ డీప్’ అనే ప్రదేశం. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువే ఉండవచ్చని అంచనా. ఇందులో కంటికి చిక్కని లోకం ఉండవచ్చు అనే అనుమానం శాస్త్రవేత్తల్లో ఉంది. సర్గాసో సముద్రం ఈ సముద్రంలో ప్రవాహాలు కనిపించవు. కానీ అందులో తేలే సర్గాసం అనే సముద్రపు మొక్కలు, అక్కడి జీవవైవిధ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాయి. ఇది సముద్రానికి మధ్యలో ఉన్న, అతిపెద్ద సర్గాసం మొక్కల రాజ్యం లాంటిది.బాల్టిక్ సీ అనోమలీ సోనార్ స్కాన్లలో కనిపించిన ఒక నిర్మాణం చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇది ఏలియన్స్ నిర్మించారా లేదా సహజంగానే ఏర్పడిందా లేక మానవ నిర్మాణమా అనేది ఇప్పటికీ ఎవ్వరూ తేల్చలేకపోయారు.గ్రేట్ బ్లూ హోల్ బెలీజ్ సమీపంలో ఉన్న అతిపెద్ద సింక్ హోల్ ఇది. ఈ సముద్ర గుంత లోతుల్లో దిగుతున్న కొద్దీ నీటి ఉష్ణోగ్రత, పీడనం మారుతూ ఉంటుంది. ఇవి చూపుతున్న ప్రభావాలు శాస్త్రవేత్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇలా సముద్ర గర్భం ఒక్కొక్క చోట ఒక్కో విధంగా విశేషమైన ప్రత్యేకతతో ఉంటుంది. ఇవే కాకుండా సముద్ర గర్భం ఎన్నో రాజ్యాలను తనలో దాచుకుందని చరిత్ర చెప్తుంది.అలాంటి అతిపెద్ద నగరాల్లో శ్రీకృష్ణుడి నగరంగా చెప్పుకునే ‘ద్వారక’ ఒకటి. టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు జరుగుతున్న ప్రతిసారి ఎంతో కొంత భూమి సముద్రంలోకి దిగిపోతుంది. అలాగే కొంత భూమి సముద్రం బయటికి చొచ్చుకొని కూడా వస్తుంది. అలా మనకి ఒక ఖండమే మునిగిపోయినట్లు కూడా చరిత్ర చెప్తుంది. అందుకే, టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా, ఇప్పటికీ మనిషి పరిశోధన చేయాలంటే భయపడే అతిపెద్ద అంశం ఒక్క సముద్రం మాత్రమే!సముద్రపు వింత జీవులు...సముద్రంలోని కొన్ని నమ్మలేని, వింత జీవులు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.. క్రిస్మస్ ట్రీ వర్మ్: ఈ చిన్న జంతువుల శరీరంపై ఉండే స్పైరల్ ఆకారాల ‘ప్లూమ్స్’ క్రిస్మస్ ట్రీలలా కనిపిస్తాయి! ఇవి శ్వాస తీసుకోవడానికి, ఆహారం సేకరించడానికి ఉపయోగ పడతాయి.లీఫీ సీ డ్రాగన్: ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో కనిపించే ఈ జీవి, సీ హార్స్ కుటుంబానికి చెందినది. దాని శరీరంపై ఆకుల్లా కనిపించే చేతులు ఉంటాయి. వీటిని శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఒక ఆయుధంలా ఉపయోగిస్తుంది.ఆంగ్లర్ ఫిష్: సముద్రం లోలోతుల్లో ఉండే జీవి ఈ ఆంగ్లర్ ఫిష్, దాని నోటిపైన మెరిసే గ్లో లైట్తో మామూలు చేపలను ఆకర్షించి వెంటనే చంపి, తినేస్తుంది.నార్తర్న్ స్టార్గేజర్: ఈ చేప మట్టిలో దాగి, తన కళ్లతో పైకి చూస్తూ, చిన్న చేపలు ఎప్పుడొస్తాయా అని వేచి చూసి చంపి తినేస్తుంది. ఒక్కసారిగా పైకి దూకి, శత్రువును హడలెత్తిస్తుంది.రెడ్హ్యాండ్ ఫిష్: ఈ జీవి ఈత కొట్టదు, నడుస్తుంది. రెడ్హ్యాండ్ ఫిష్ అనే ఈ చేప, టాస్మానియా సముద్ర తీరానికి ఆవల కనిపిస్తుంది. ఇది చేతుల్లా ఉండే మొప్పలతో సముద్రం అట్టడుగు నేలమీద నడుస్తూ తిరుగుతుంది.సముద్రంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు చూస్తే, ప్రకృతి మనకేదో బలమైన సంకేతాలను పంపుతున్నట్లు అనిపిస్తోంది. కాని, మనం వాటిని గమనిస్తున్నామా? సముద్రపు లోతుల్లో నివసించే కొన్ని జీవులు అకస్మాత్తుగా భూమి మీదకు రావడం మనకు సమాధానం కావాల్సిన ప్రశ్నలు. ఈ మధ్యే ఆస్ట్రేలియాలో ఒకేసారి 150 కిల్లర్ వేల్స్ చనిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఇవి చాలా తెలివైన, సమూహంగా జీవించే జలచర జీవులు. ఒక్కసారిగా ఈ స్థాయిలో వీటి మరణం సంభవించడం సాధారణ విషయం కాదు.ఇక ‘బ్లాక్ డెవిల్ ఫిష్’ గురించి చెప్పాలంటే, ఇది ఆరువేల మీటర్ల లోతుల్లో ఉండే జీవి. అలాంటి జీవి ఒడ్డుకి వచ్చి చనిపోవడం అత్యంత అరుదైన ఘటన. అలాగే ‘ఓర్ ఫిష్’ లేదా ‘డూమ్స్ డే ఫిష్’ అనే చేప కూడా, సాధారణంగా మూడు నుంచి ఐదువేల మీటర్ల లోతులో జీవిస్తుంది. ఇది భూకంపాల ముందు ఉపరితలానికి వస్తుందన్న నమ్మకాలు కొన్ని దేశాల్లో ఉన్నాయి, ముఖ్యంగా జపాన్ లో. 2011 సునామీకి ముందు ఈ చేపలు ఎక్కువగా కనిపించాయి. ఇలా ఈ మధ్య కాలంలో సముద్రంలో అట్టడుగున ఉండే చాలా జీవులు బయటకు వస్తున్నాయి.శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, భూమి లోతుల్లో జరిగే టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు, ఈ జీవులను పైకి తేలుస్తున్నాయేమో అని భావిస్తున్నారు. అయితే, ఇలా ఒకేసారి మూడు రకాల సంఘటనలు ఓర్ ఫిష్ ఉపరితలానికి రావడం, బ్లాక్ డెవిల్ ఫిష్ మరణం, కిల్లర్ వేల్స్ గుంపుగా నశించడం అన్నీ దాదాపుగా ఒకే సమయంలో చోటు చేసుకోవడం అనేది ప్రళయానికి సంకేతం అని, ఇది ప్రకృతి మనకు ‘జాగ్రత్త పడండి,’ అని హెచ్చరిస్తున్నట్లు చాలామంది భావన. త్వరలోనే దాదాపు అన్ని మతాల పురాణాల్లో ఉండే అతిపెద్ద జలచర జీవి ‘లేవియతాన్’ కూడా నిద్ర లేచిందని కథలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే, త్వరలోనే యుగాంతం జరగక మానదనే ప్రచారం కూడా వినిపిస్తోంది. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, సముద్రాల్లో వేసే ప్లాస్టిక్ను తగ్గించడం అనేది పెద్ద మార్పు కాదు కాని, మంచి ఫలితాన్ని ఇచ్చే అతిపెద్ద విషయం. -
జోర్ హుషార్.. సిమ్లా సమ్మర్
‘సిమ్లా–ప్రకృతి అందాలకే కాదు, ప్రత్యేక వేడుకలకూ నిలయమే’ అంటోంది హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం. దేశవిదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే క్రమంలో ప్రతి ఏటా నిర్వహించే ‘సిమ్లా సమ్మర్ ఫెస్టివల్’ నేటి (జూన్ 1) నుంచి ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 1960 నుంచి ప్రతి ఏటా జరుగుతూ వస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ ఉత్సవాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఈ సంబరాల్లో పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, ప్రముఖ విద్వాంసుల సంగీత కచేరీలు, సంప్రదాయ జానపద కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. స్థానిక కళాకారులు కూడా ఈ ఉత్సవాల్లో ఏర్పాటయ్యే వేదికలపై తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. జోరుగా హుషారుగా సాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించడానికి పెద్దసంఖ్యలో దేశ విదేశాల పర్యాటకులు వస్తుంటారు. గతంలో లతా మంగేష్కర్, ఆశా భోంస్లే వంటి లెజెండరీ కళాకారులు ఈ వేడుకల్లో తమ గాత్ర మాధుర్యంతో శ్రోతలను ఓలలాడించారు.హిమాచలీ వంటకాల రుచులను ఆస్వాదించడానికి, స్థానిక చేతివృత్తులు, ఉన్ని దుస్తులు, ఇతర ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఇక్కడ అనేక స్టాళ్లు ఏర్పాటవుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జనం పోటెత్తుతారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన సంప్రదాయ దుస్తులను ప్రదర్శించే ఫ్యాషన్ షోలు కూడా జరుగుతాయి. సంగీత, నృత్య ప్రదర్శనలతో ఈ వేడుక పర్యాటకులకు ఆటవిడుపుగా నిలుస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనడం ఒక మరపురాని అనుభూతి కలిగిస్తుందంటారు వీక్షకులు. ఈ సంబరాలు జూన్ 5న ముగియనున్నాయి. (చదవండి: మొన్న ‘గిబ్లీ’ నేడు బేబీ పాడ్కాస్ట్..) -
ఈ సండే వెరైటీగా విదేశీ వంటకాలు ట్రై చేద్దాం ఇలా..
అమెరికన్ ఫ్రైడ్ స్ట్రాబెర్రీస్కావలసినవి: గుడ్డు– ఒకటి, పాలు– ఒక కప్పు, పంచదార– 3 టేబుల్ స్పూన్లు, నూనె– ఒక టేబుల్ స్పూన్, వెనీలా ఎసెన్స్– ఒక టీస్పూన్, మైదాపిండి– ఒకటిన్నర కప్పులుబేకింగ్ పౌడర్– ఒక టేబుల్ స్పూన్స్ట్రాబెర్రీలు– 10 లేదా 15తయారీ: ముందుగా ఒక గిన్నెలో గుడ్డు, పాలు, పంచదార, నూనె, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక గిన్నెలో మైదాపిండి, బేకింగ్ పౌడర్ వేసికలుపుకోవాలి. ఇప్పుడు మైదా మిశ్రమంలో పాల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ, ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా లేదా మరీ గట్టిగా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీలను శుభ్రంగా కడిగి, తొడిమలను తొలగించి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక బాణలిలో నూనె వేడి చేసుకుని, డీప్ ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఒక్కో స్ట్రాబెర్రీని మైదా– పాల మిశ్రమంలో ముంచి మళ్లీ నూనెలో వేయించుకోవాలి. కాస్త చల్లారగానే, నచ్చిన విధంగా కట్ చేసుకుని, చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.ఇటాలియన్ కాన్నోలికావలసినవి: గుల్లల కోసం: మైదాపిండి– 2 కప్పులు, పంచదార పొడి– పావు కప్పు, దాల్చినచెక్క పొడి– అర టీస్పూన్, వెన్న– 3 టేబుల్ స్పూన్లు, మార్సాలా వైన్– అర కప్పు, నీళ్లు– 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్– ఒక టేబుల్ స్పూన్, నూనె– డీప్ ఫ్రైకి సరిపడా, గుడ్డు– 2 క్రీమ్ కోసం: రికోటా చీజ్– 500 గ్రాములు, పంచదార పొడి– అర కప్పు, వెనీలా ఎసెన్స్– ఒక టీస్పూన్, దాల్చినచెక్క పొడి– అర టీస్పూన్, నిమ్మతొక్క తురుము– కొద్దిగాగార్నిష్ కోసం (అభిరుచిని బట్టి): చాక్లెట్ చిప్స్– కొన్నిపంచదార పొడి– కొద్దిగా, పిస్తా తరుగు– కొద్దిగా చెర్రీలు– కొన్నితయారీ: ముందుగా ఒక పెద్ద గిన్నెలో మైదాపిండి, పంచదార పొడి, దాల్చినచెక్క పొడి వేసి బాగా కలపాలి. వెన్న కరిగించి, మైదా మిశ్రమంలో వేసి ఉండలు లేకుండా చేసుకుని, మధ్యలో గుంతలా చేసుకోవాలి. అనంతరం దానిలో మార్సాలా వైన్, నీళ్లు, వెనిగర్, గుడ్లు (ఒక తెల్లసొన తీసి పక్కనపెట్టుకోవాలి) వేసుకుని బాగా ముద్దలా కలుపుకోవాలి. అవసరం అయితే నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆ మిశ్రమానికి క్లాత్ చుట్టి రెండుగంటలు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, కాస్త కోలగా చపాతీలు మాదిరి ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక్కో చపాతీని కాన్నోలి ట్యూబ్కి చుట్టి, రెండు అంచులు అతుక్కునే చోట గుడ్డు తెల్లసొన కొద్దిగా రాస్తే అది ఊడిపోదు. ఇప్పుడు అన్నీ చపాతీలు అలానే చేసుకుని మరుగుతున్న నూనెలో వేసుకుని దోరగా వేయించుకోవాలి. చల్లారాక కాన్నోలి ట్యూబ్లను తొలగిస్తే, చిత్రంలో కనిపిస్తున్న గుల్లల మాదిరి ఉంటాయి. అనంతరం ఒక గిన్నెలో రికోటా చీజ్ను హ్యాండ్ బ్లెండర్తో క్రీమీగా చేసుకుని దానిలో పంచదార పొడి, వెనిల్లా ఎసెన్స్ దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మైదా మిశ్రమంతో తయారుచేసిన గుల్లల్లో ఈ మిశ్రమం నింపుకుని, పిస్తా ముక్కలు, చాక్లెట్ చిప్స్, పంచదార పొడి, చర్రీస్ ఇలా నచ్చిన వాటితో, నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోవచ్చు. (చదవండి: Jamai Sasthi: కొత్త అల్లుడికి కొసరి..కొసరి..) -
పులిలా కనిపించే పిల్లి..!
ఈ పిల్లి వాక్ చేస్తే ఫర్నిచర్ వణుకుతుంది. ఓరకంట ఒక్క చూపు చూస్తే మొరుగుతున్న కుక్కలు కూడా గప్చిప్గా నోరు మూసుకుంటాయి. అది పిల్లి కాదు, పులి అని అనుకుంటున్నారా? కానేకాదు, నిజంగానే అది పిల్లే, పేరు జ్యూస్. చూడ్డానికి పెద్దపులిలాగా కనిపిస్తుంది. పదమూడు కిలోల బరువు, నాలుగు అడుగుల మూడు అంగుళాల పొడవుతో ఎదుగుతున్న పులిపిల్లలా ఉంటుంది. దానికున్న భారీ ఆకారమే జ్యూస్ను తమ వీథిలోని పెంపుడు జంతువులకు డాన్గా మార్చేసింది. ఆహారం కూడా దాని సైజుకు తగ్గట్టుగానే రోజుకు రెండు కిలోల మాంసం, టాప్ బ్రాండ్ ట్రీ ట్స్తో స్పెషల్ డైట్ ఫుడ్ మాత్రమే తీసుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో దీనికున్న క్రేజ్ మామూలుగా ఉండదు. జ్యూస్ నిద్రపోయే వీడియోకు కూడా మిలియన్స్లో లైక్స్ వస్తాయి. జ్యూస్ గురించి దాని యజమానురాలు డానియేలా మాట్లాడుతూ ‘నాకు ఇది చిన్న పిల్లికూనగా వీథిలో దొరికింది. ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటుంటే, రోజు రోజూకు భారీగా పెరిగిపోయింది. ఇది ఇంత పెద్దగా మారుతుందని అసలు అనుకోలేదు. మీరెవరైనా ఇకపై పిల్లిని పెంచుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించుకోండి.’ అని చెప్పింది. (చదవండి: ఈ సాలీడు టాలెంట్కి సాటిలేరెవ్వరూ..! కటౌట్తో పనిలేదు బ్రదర్..) -
నటి మడోన్నా సెబాస్టియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
చక్కని చిరునవ్వుతో మనసు గెలుచుకునే నటి మడోన్నా సెబాస్టియన్. తెరమీద కనిపిస్తే ఆ ఫ్రేమ్కే అందం తెచ్చిపెట్టగలిగేంత అందంగా ఉంటారు. అలా తెరమీదనే కాదు, తెరవెనుక కూడా కనులవిందుగా ఉంటుంది ఆమె స్టయిలింగ్. ఇందుకోసం ఆమె సెలెక్ట్ చేసుకున్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్సే ఇవి.చెవి దగ్గర మొదలై మెడ చుట్టూ తిరిగి జడలో ముగిసే అందమైన కథే చెంపసరాలు. ఇవి కేవలం ఆభరణాలే కాదు. జడలోకి దిగి వచ్చే పూల గొలుసులు. ఇవి పెట్టుకున్న అమ్మాయి ఎక్కడ కనిపించినా ఆ ఫ్రేమ్ మొత్తం అందంగా మెరిసిపోతుంది. చెంపసరాల ట్రెండ్ కొత్తేమీ కాదు. కాని, ఇప్పుడు వీటి ప్రెజెంటేషన్, స్టయిలిష్గా మారడంతో మళ్లీ వీటికి రీబర్త్ వచ్చింది. మోడర్న్ వన్ పీస్ డ్రెస్స్ల్లోకి కూడా అమ్మాయిలు స్టేట్మెంట్ లుక్గా వీటిని వేసుకుంటున్నారు. ముత్యాలు, కుందన్, రుబీ, టెంపుల్ ఇలా రకరకాల డిజైన్లలో లభించే చెంపసరాలను వేసుకుంటే, చుట్టూ ఉన్నవాళ్ల చూపులన్నీ మీ చెవులవైపు తిప్పేలా చేస్తాయి. చీర, లెహంగా, లాంగ్ ఫ్రాక్ డ్రెస్ ఏదైనా, వీటిని వేసుకోవడానికి కమ్మలను మాత్రం పెద్దవిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, బోసిగా ఉంచిన మెడ, చెంపసరాలకు తగ్గట్టుగా ఉండే హెయిర్ స్టయిల్, సింపుల్ గాజులు ఇవన్నీ కలిస్తేనే అందం. అప్పుడే చెంపసరాలకు, వాటిని వేసుకున్న మీకు పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. అచ్చం నటి మడోన్నా లుక్లాగా.అందం అందులో ఉండదు..అందం అంతా క్రీమ్స్, మేకప్స్లో ఉండదు. మంచి స్కిన్ కేర్లోనే ఉంటుంది. ఆల్మండ్ ఆయిల్ మసాజ్, నేచురల్ ప్రాడక్ట్స్, హైడ్రేటింగ్ స్కిన్ కేరే నా బ్యూటీ సీక్రెట్. దుస్తుల్లో కూడా ‘ఇది నాకు నప్పుతుందా?’ అని కాకుండా ‘ఇది నేను కంఫర్ట్గా వాడతానా?’ అని ఆలోచించి సెలక్ట్ చేస్తానని చెబుతోంది మడోన్నా సెబాస్టియన్. -దీపిక కొండి(చదవండి: ఘనంగా ముగిసిన మిస్ వరల్డ్ అందాల పోటీలు) -
చూడటానికి అదొక దేవాలయం..! కానీ కింద చూస్తే..
అదొక పుస్తక నిలయం. లక్షల సంఖ్యలో గ్రంథాలతో కళకళలాడే జ్ఞానభాండాగారం. కాని, అక్కడికి వెళితే, అక్కడ ఒక దేవాలయం మాత్రమే గోచరిస్తుంది. గుడిలోకి ప్రవేశించాక నేలమాళిగలోకి వెళ్లేందుకు భూగర్భమార్గం కనిపిస్తుంది. అలా మెట్ల మార్గంలో కిందికిపోతే, అరుదైన భూగర్భ గ్రంథాలయం ఆశ్చర్యపరుస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ గ్రంథాలయమది. అత్యంత అరుదైన ఈ భూగర్భ గ్రంథాలయం కథా కమామిషు తెలుసుకుందాం...పదహారడుగుల లోతులో...రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లా భడారియా గ్రామం చుట్టూ ఎడారి వాతావరణం. ఊరిలో భడారియా దేవాలయం ప్రత్యేక ఆకర్షణ కేంద్రం. కారణం ఈ ఆలయం భూ ఉపరితలానికి పదహారడుగుల కింద కొలువైన భూగర్భ గ్రంథాలయం. విశాలమైన వరండాలు, గాజు అలమరాలలో భద్రపరచిన పుస్తకాలు, పెద్దపెద్ద ర్యాకులు, ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం ప్రత్యేకతలు. భడారియా గ్రంథాలయాన్ని రెండు విభాగాలుగా వర్గీకరించారు. ఒకటి అధ్యయన భవన్, మరొకటి సంగ్రహణ భవన్. అధ్యయన భవన్లో వందలాది మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా విశాలమైన గదులను నిర్మించారు. సంగ్రహణ భవన్లో పలు అరుదైన గ్రంథాలను అందుబాటులో ఉంచారు. వీటికోసం 562 అలమరాలు, 16వేల అడుగుల పొడవులో ర్యాక్స్ ఏర్పాటు చేశారు. ఏటా ఈ గ్రంథాలయానికి వచ్చేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది ప్రాచీన ప్రతులు, రాష్ట్రపతులు, ప్రధానుల ప్రసంగాలు లభిస్తాయి. భడారియా మహారాజు కృషి ఫలితంభడారియా మహారాజు 1960లో శక్తిపీఠమైన భడారియామాత మందిరాన్ని సందర్శించి. అక్కడే స్థిరపడిపోయారు. ఆయన అసలు పేరు హరివంశ్సింగ్ నిర్మల్. ఇక్కడి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇక్కడ గ్రంథాలయాన్ని నెలకొల్పాలని అనుకున్నారు. 1983లో నిర్మాణానికి సంకల్పించారు. బయట ఎడారి వాతావరణం కాబట్టి పాఠకులకు, సందర్శకులకు ఇబ్బంది లేకుండా దీనిని నేలమాళిగలో నిర్మించారు. దీనివల్ల లోపల చల్లని వాతావరణం ఉంటుంది. ఎలాంటి అసౌకర్యానికి గురికారు. మహారాజు పదిహేనేళ్ల కృషికి ఫలితంగా 1998లో ఈ గ్రంథాలయం అందుబాటులోకి వచ్చింది. దీని నిర్మాణం ప్రారంభం నుంచే పుస్తకాల సేకరణ ప్రారంభించారు. అలా ఇప్పటికి తొమ్మిది లక్షల పుస్తకాలను ఇందులో అందుబాటులో ఉంచారు. వీటిలో ప్రపంచస్థాయిలోని పలు మత గ్రంథాలు, చారిత్రక, భాషా, న్యాయ శాస్త్రాలకు సంబంధించిన అనేక పుస్తకాలున్నాయి. వీటితోపాటు వినోద, విజ్ఞానాలను పంచే పుస్తకాలనూ ఉంచారు. ఇక్కడికి వచ్చే పరిశోధకులు, విజ్ఞానార్థులు వేరేచోట అన్వేషించాల్సిన అవసరం లేకుండా సకల గ్రంథాలూ లభించేలా సమకూర్చారు. విశాలమైన భోజనశాలలుపలు అంశాలపై అధ్యయనం చేయడానికి వచ్చే వారికోసం పద్దెనిమిది గదులు నిర్మించారు. అలాగే విశాలమైన భోజనశాలలు ఏర్పాటు చేశారు. ఎడారి ప్రాంతమైనా, ఈ గ్రంథాలయంలో ఎక్కడా వేడి వాతావరణం కనిపించదు. పాలరాతి గోడలతో చుట్టూ చల్లటి వాతావరణం ఉండేలా దీనిని నిర్మించారు. ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుంచే కాదు, యూరోప్ నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి కూడా అధికంగా ఉంటుందని గ్రంథాలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆసియాలోనే అతిపెద్దదిఆసియాలో పేరున్న భూగర్భ గ్రంథాలయాల రెండే ఉన్నాయి. వాటిలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని స్టార్ ఫీల్డ్ లైబ్రరీ ఒకటి కాగా రెండోది మన భడారియా గ్రంథాలయం. ఈ రెండిటిలో భడారీయా పుస్తక నిలయమే పెద్దది కావడం విశేషం. తిరుమలరావు కరుకోల(చదవండి: Mayanmar Began: ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!) -
సినిమా హిట్టయినా అవకాశాలు నిల్.. దానిపైనే ఫోకస్ పెట్టిన బ్యూటీ
కృతి శెట్టి అంటే చటుక్కున గుర్తు రాకపోవచ్చు. కాని, బేబమ్మ అంటే ‘సి’ సెంటర్ ప్రేక్షకుడు కూడా గుర్తు పట్టేస్తాడు. పక్కించి అమ్మాయిలా కనిపించే కృతి చెప్పిన ముచ్చట్లు కొన్ని మీకోసం... తెలుగులో కృతి శెట్టి (Krithi Shetty) మొదటి సినిమా ‘ఉప్పెన’లో బేబమ్మగా అందరినీ మైమరపింపజేసింది. ఆ తర్వాత వరుసగా ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ సినిమాల సక్సెస్తో హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది. లక్ ఫ్యాక్టర్ ఎంతోకాలం పని చేయలేదు. రామ్ పోతినేనితో నటించిన ‘వారియర్’, నితిన్తో నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’, నాగ చైతన్యతో నటించిన ‘కస్టడీ’ అన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో అవకాశాలు తగ్గాయి. మాతృ భాష ఏదంటే?అనుష్క శెట్టి, ఐశ్వర్యా రాయ్, పూజా హెగ్డేలాంటి అందాల భామలు వచ్చిన మంగుళూరు ప్రాంతం నుంచే కృతి శెట్టి కూడా వచ్చింది. తుళు ఆమె మాతృభాష. కృతి శెట్టి తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గర కావడానికి పట్టుదలతో తెలుగు నేర్చుకుంటోంది. తెలుగు భాష మీద గ్రిప్ సంపాదిస్తే, క్యారెక్టర్ని ఇంకా బాగా పండించవచ్చని కృతి శెట్టి నమ్ముతుంది.ఆచితూచి..‘ఉప్పెన’ సూపర్ హిట్ తర్వాత రెమ్యునరేషన్ విపరీతంగా పెంచిన కృతి శెట్టి – ఇప్పుడు మాత్రం ఆచి తూచి అడుగేస్తోంది. ‘లవ్ టు డే’, ‘డ్రాగన్’ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువ అయిన ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తున్న– ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా మీదే కృతి శెట్టి ఆశలన్నీ పెట్టుకుంది. నయనతార ఈ సినిమాకి నిర్మాత కాగా, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ డైరెక్టర్. అయితే ఈ సినిమా రిలీజ్, రిజల్ట్ కోసం ఇంకో నాలుగు నెలలు ఆగాల్సిందే!హిట్ అయినా అవకాశాలు నిల్మలయాళంలో టొవినో థామస్తో చేసిన ‘ఎఆర్ఎమ్’ హిట్ అయినా, మలయాళంలో అవకాశాలు రాలేదు. తనతో జీవితం పంచుకునేవాడిలో నిజాయితీ, దయ ఉండాలని, అన్ని విషయాల్లో పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. భరించరాని ఒత్తిడికి లోనయినప్పుడు, ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు నిద్రపోతానని, ఏ ఆర్టిస్టుకి అయినా తగినంత గాఢ నిద్ర అవసరం అని చెప్పింది. మోహన్లాల్ కుమారుడు ప్రణవ్ యాక్ట్ చేసిన ‘హృదయం’లోని ‘దర్శనా’ సాంగ్ అంటే పిచ్చి. కారులో ట్రావెల్ అవుతున్నంత సేపు అదే పాట వింటూ ఉంటానంది.చదవండి: కుమారుడి కోసం కలిసొచ్చిన ధనుష్-ఐశ్వర్య.. రజనీ ఏమన్నారంటే? -
కింగులా బతికాడు సింగిల్గా..!
రోజూ పొద్దునే లేస్తాడు. ఆకలైతే తింటాడు. వ్యవసాయం తన వృత్తి. ఇంటి ముందే కొన్ని పండ్లు, కూరగాయల మొక్కలను పెంచుకుంటుంటాడు. మనుషులెవ్వరితోనూ మాట్లాడడు. మూగజీవాలు, పక్షులే అతని ఫ్రెండ్స్. కాలక్షేపం కోసం ఇంటి పనులు, మరమ్మతులు, నీటి గుంటలు తవ్వటం వంటివి చేస్తాడు. అన్ని పనులూ పూర్తి చేసుకున్నాక అలసట వస్తే, స్వయంగా నిర్మించుకున్న తన తాటాకుల గుడిసెలో సేద తీరుతాడు. అతన్ని సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ఎవరు ఎంతగా ప్రయత్నించినా, ప్రతిసారి పెద్ద యుద్ధమే చేసి, విజయం సాధించాడు. అడగకుండా ఎన్ని ఇచ్చినా పుచ్చుకోకుండా, చేయి చాచని మహారాజులా నిలబడేవాడు. ఆఖరుకు ఎక్కడికైనా చేరగల ఇంటర్నెట్ కూడా అతని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులేవీ అతన్ని మచ్చిక చేసుకోలేక పోయాయి. ఇలా హాయిగా తన పని తాను చేసుకునేవాడు. ఇంతే! ఇదే తన జీవితం. ఎంతో అందమైన, ప్రశాంతమైన జీవితం. ఇలా అందరూ బతకలేరు. ఎవరికీ సాధ్యం కాని పనికూడా! అయినప్పటికీ అతను ఈ సూపర్ సింగిల్ లైఫ్ని గత మూడు దశాబ్దాలుగా ఎంజాయ్ చేశాడు. ఇంతకీ అతనెవ్వరో కాదు, 1996లో తొలిసారి అమెజాన్ అటవీ అధికారులు గుర్తించిన ఒంటరి గిరిజనుడు. అతని తెగ మొత్తం అంతరించిపోయినా, అతను మాత్రం ఒక్కడే అడవిలో జీవిస్తున్నాడని తెలిసింది. ఎన్నో ప్రయత్నాల అనంతరం అతన్ని 2018లో కెమెరాలో రహస్యంగా వీడియో తీసి, వివరాలు తెలుసుకున్నారు. ఇక ఈ మధ్యనే అధికారులకు అతని శరీరం గుడిసెలో కనిపించింది. నిద్రలో ప్రశాంతంగా మరణించాడు. ఇరవై ఆరేళ్లపాటు ఎవ్వరితోనూ మాట్లాడకుండా, కలవకుండా, ఒంటరిగా మహారాజులా బతికి, అంతే రాజసంగా లోకం నుంచి నిష్క్రమించాడు. (చదవండి: Mayanmar Began: ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!) -
పాలిచ్చే తల్లులూ..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...!
నాకు త్వరలో తొమ్మిదో నెల నిండుతుంది. మొదటి ప్రెగ్నెన్సీ కావటంతో చాలా భయంగా ఉంది. మా ఊరి నుంచి దగ్గర్లో ఉన్న మంచి ఆసుపత్రికి వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతుంది. అందుకే, ముందుగానే ఆసుపత్రికి ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లాలి?– రమణి, శ్రీకాకుళం. మొదటి ప్రెగ్నెన్సీలో కొంచెం గందరగోళం ఉంటుంది. ఏ సమయంలో నొప్పులు వస్తాయో తెలియదు కాబట్టి, తొమ్మిదో నెల వచ్చినప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్స్, బ్యాగ్ ఎప్పుడూ సిద్ధంగా ఒక చోట పెట్టుకోండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. మీకు వెన్నునొప్పి లేదా కాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నా, బ్లీడింగ్ అవుతున్నా, ఉమ్మనీరు పోతున్నా వెంటనే ఆసుపత్రికి బయలు దేరాలి. నొప్పులు మొదటి డెలివరీలో అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. కొంతమందికి టైమర్ పెట్టుకొని పది నిమిషాల్లో ఎన్నిసార్లు పొట్ట గట్టిగా అవుతుందో నోట్ చెయ్యమని చెప్తాం. పది నిమిషాల్లో మూడుసార్లు టైట్గా అయినా, నొప్పి ఎక్కువ అయినా, అవి డెలివరీ పెయిన్స్ అని అర్థం. ప్రతిసారి నొప్పి వచ్చినప్పుడు ముప్పయి సెకండ్ల నుంచి ఒక నిమిషం ఉంటుంది. కొంతమందికి నొప్పులు ప్రతి అర్ధగంటకొకసారి ఎక్కువ అవుతుంటాయి. అంటే కాన్పు సమయం దగ్గరకు వచ్చిందని అర్థం. కేవలం నొప్పి ప్రతి అర్ధగంటకొకసారి వస్తుంటే రెండు నుంచి మూడు గంటలు చెక్ చేసుకొని, నొప్పి ఎక్కువ అవుతుంటే ఆసుపత్రికి వెళ్లండి. కొంతమందికి నొప్పి వచ్చి ఒక గంటలో తగ్గిపోతుంది. అంటే అది ఫాల్స్ లేబర్ పెయిన్స్ అని అర్థం. అందుకే నొప్పి అనిపించిన తరువాత రెండు నుంచి మూడు గంటలు ఆగాలి. మొదటి ప్రెగ్నెన్సీలో నొప్పి మొదలైన పన్నెండు నుంచి ఇరవైనాలుగు గంటలకు కాని, కాన్పు కాదు. అందుకే, హడావిడి పడనవసరం లేదు. కాని, బ్లీడింగ్ లేదా వాటర్ లీక్ అవుతుంటే మాత్రం, నొప్పి లేకపోయినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. మీ ప్రెగ్నెన్సీ ఫైల్ మొత్తం తీసుకొని వెళ్లాలి. మీరు ఆసుపత్రికి వెళ్లినప్పుడు మీ పల్స్, బీపీ, బేబీ హార్ట్బీట్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చెక్ చేస్తారు. వాటిని బట్టే ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తారు. ఫాల్స్ లేబర్ అయితే కొన్ని పరీక్షలు చేసి ఇంటికి పంపిచేస్తారు.నాకు డెలివరీ అయి రెండు నెలలు అవుతోంది. చాలాసార్లు నిపుల్ క్రాక్స్ వస్తున్నాయి. బ్లడ్ కూడా వస్తోంది. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? – లావణ్య, తిరుపతి. బేబీకి ఒక సంవత్సరం వచ్చేవరకు తల్లిపాలు చాలా అవసరం. అందుకే, బ్రెస్ట్ ఫీడింగ్లో వచ్చే సమస్యలకు చాలా త్వరగా చికిత్స తీసుకోవాలి. పాలు తగ్గినా, నిపుల్ క్రాక్స్ ఉన్నా బేబీకి పాలు తాగటం కష్టం అవుతుంది. మీకు కూడా చాలా నొప్పి ఉంటుంది. పుండు లేదా పగిలిన చనుమొనలకు చికిత్స తీసుకోవడానికి ముందు చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ఇందుకు మాయిశ్చరైజర్ సబ్బులని మాత్రమే స్నానానికి ఉపయోగించాలి. కాటన్ లోదుస్తులను వేసుకోవాలి. దానితో రొమ్ములకు మంచి ఎయిర్ సర్కులేషన్ వస్తుంది. వ్యాసలిన్ లేదా పారాఫిన్ లేదా ప్యూరిఫైడ్ లోషన్తో నిపుల్ మీద మసాజ్ చెయ్యాలి. ఇలా ప్రతి ఫీడ్ తరువాత చెయ్యండి. మళ్లీ ఫీడ్కి ముందు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, ఫీడింగ్ ఇవ్వండి. బ్రెస్ట్ ప్యాడ్స్ వాడుతున్నవారు, వాటిని ప్రతి ఫీడ్ తరువాత మార్చుకోవాలి. ఇలా క్రాక్స్ కాకుండా ప్రివెంట్ చెయ్యడానికి ఫీడ్ అయిన వెంటనే కొంచెం బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి నిపుల్ మీద రాసి, తరువాత కవర్ చేసుకోవాలి. ఇలా ప్రతిసారి చేస్తే అసలు క్రాక్స్ రాకుండా ఉంటాయి. నిపుల్ షీల్డ్ అని మెడికల్ షాప్స్లో రబ్బర్ కవరింగ్స్ దొరుకుతాయి. ఒకవేళ క్రాక్స్ ఎక్కువ ఉండి, బ్లీడింగ్ అవుతుంటే క్రీమ్స్ రాసి దాని తరువాత సరైన సైజ్లోని షీల్డ్ పెట్టి ఫీడింగ్ ఇస్తే నిపుల్కి విశ్రాంతి దొరికి, బ్లీడింగ్ అవకుండా ఉంటుంది. బేబీకి నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, నిపుల్ క్రాక్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి, ఒకసారి పిల్లల డాక్టర్కి బేబీని చూపించండి. తరచు క్రాక్స్కి ఇది కారణం కావచ్చు. బేబీ సకింగ్ పొజిషన్ కూడా చాలా ముఖ్యం. రొమ్ముల ఐరోలా, నిపుల్ మొత్తం నోటిలో పెట్టుకొని బేబీ సక్ చెయ్యాలి. అప్పుడే పాలు బాగా వస్తాయి. నిపుల్ క్రాక్స్ తగ్గుతాయి. నిపుల్ ఒక్కటే పట్టుకొని సక్ చేస్తే క్రాక్స్ ఎక్కువ అవుతాయి. ఒకసారి లాక్టేషన్ కన్సలెంట్ని కలసి మీకు పొజిషన్స్ ఫర్ ఫీడింగ్ గురించి తెలుసుకోండి. ఇవి అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఫీడింగ్ బాగా వస్తుంది, నిపుల్ క్రాక్స్ తగ్గుతాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: '2 పర్ 20 వాకింగ్ రూల్' అంటే..! వ్యాయామాలు చేయకుండానే..) -
ఆకాశం నుంచి ఆలయ దర్శనం..!
మయాన్మార్లోని బాగన్ ఒక అద్భుతమైన చారిత్రక ప్రదేశం. ఒకప్పుడు పేగన్ సామ్రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన ఈ ప్రాంతం, వేలాది పురాతన బౌద్ధ దేవాలయాలు, స్థూపాలు, పగోడాలకు ప్రసిద్ధి చెందింది. 11 నుంచి 13 శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ నిర్మాణాలు బర్మీస్ నిర్మాణ కళకు అద్భుతమైన సాక్ష్యాలుగా కనిపిస్తాయి.విస్తారమైన మైదానంలో ఎటు చూసినా కనిపించే ఈ ఆలయాల దృశ్యం గొప్ప అనుభూతినిస్తుంది. సంధ్యవేళలో బంగారుకాంతితో మెరిసే ఈ నిర్మాణాలు, సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆనంద టెంపుల్, శ్వేదగాన్ పగోడా, థాబ్యిన్యు టెంపుల్ వంటి ముఖ్యమైన ఆలయాలు అక్కడి చరిత్రను చాటి చెబుతాయి.బాగన్ అందాలను ఆస్వాదించడానికి ‘హాట్ ఎయిర్ బెలూన్ రైడ్’ భలేగా ఉంటుంది. ఆ రైడ్తో ఆకాశంలో గిరికీలు కొడుతూ ఎత్తయిన ప్రదేశం నుంచి ఈ పురాతన నగరంలోని విశాలమైన ఆలయాల దృశ్యాన్ని చూడటం ఒక మరపురాని అనుభవం కలిగిస్తుందంటారు పర్యాటకులు. కాలక్రమేణా ఇక్కడ కొన్ని ఆలయాలు శిథిలమైనప్పటికీ, బాగన్ చారిత్రక ప్రాముఖ్యతతో పాటు ఆధ్యాత్మిక వైభవం మాత్రం చెక్కుచెదరలేదు. ఇది చరిత్ర, సంస్కృతిని ప్రేమించే వారు, తప్పక చూడవలసిన ప్రదేశం. (చదవండి: Krishna's Butterball: కృష్ణుడి వెన్నబంతి: సైన్స్కే అందని మిస్టరీ..!) -
వందేళ్ల అందాల బామ్మ..మేకప్ పాఠాలు! నెటిజన్లు ఫిదా
వందేళ్లు దాటిన అందాలబామ్మ ఆమె. ‘ఆన్లైన్’లో ఈ బామ్మ పేల్చే బ్లష్ బ్లాస్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. తర్వాత ఆమె చెప్పే పాఠాలు వింటే వెంటనే మీరు కూడా మేకప్ బ్రష్ పట్టుకొని అద్దం ముందుకు వెళ్తారు. బామ్మలు అంటే కుకీస్ చేయటం, కథలు చెప్పడమే కాదు; సౌందర్య పోషణతో సోషల్ మీడియాను షేక్ చేయవచ్చని నిరూపించింది ఇంగ్లండ్కు చెందిన జోన్ పార్ట్రిడ్జ్. ఈమె వయసు 103.సరదా సరదాగా బ్యూటీ పాఠాలురోజూ ఉదయం కాఫీ కప్పు చేతిలో పట్టుకోవడం కంటే ముందు ఈ బామ్మ మేకప్ బ్రష్ పట్టుకుంటుంది. ఆపై మొబైల్ కెమెరా ఆన్ చేసి, టిక్టాక్లో మేకప్ ట్యూటోరియల్ వీడియోలు చేస్తుంది. బామ్మ చెప్పే పాఠాలు బోరింగ్ అనుకోకుండా సుమారు రెండున్నర లక్షల మంది చాలా శ్రద్ధగా వింటారు. ఒకరోజు బ్లష్ బ్రష్ తీసుకొని చెంప మీద మెల్లగా తిప్పుతూ ‘బ్లష్ ఎప్పుడూ నవ్వుతూ వేయమంటారు. కాని, నేను నవ్వితే ముడతలే కనిపిస్తాయి.’ అనే పంచ్ వేసింది. ఈ మాట వినగానే స్క్రీన్ ముందు ఉన్న జనాలంతా నవ్వుల వర్షం కురిపించేశారు. ఈ ఒక్క వీడియోకి లక్షల్లో లైక్స్, కామెంట్లు, షేర్లు! ఇక అప్పటి నుంచి ఆమె మేకప్ టెక్నిక్స్ చూసి కొంతమంది ఫిదా అయితే, బామ్మ కామెడీకి చాలామంది డబుల్ ఫిదా అయ్యారు. ‘ఇలా కాజల్ వేయాలి, ఇలా బ్రష్ తిప్పాలి, ఇలా బ్లష్ టచప్ చేయాలి’ అని అందరికీ అర్థమయ్యేలా చక్కగా బోధపరుస్తుందీ బామ్మ. ఏ టిప్ అయినా, సీరియస్గా చెప్పదు, చెణుకులు వేస్తూ సరదాగా చెప్తుంది. ‘టిక్టాక్’లో ఈ బామ్మ హవా తెలుసుకున్న టీవీ చానళ్లు కూడా ఇంటర్వ్యూల కోసం ఈమె ముందు క్యూ కడుతున్నాయి. బీబీసీ సహా పలు అంతర్జాతీయ చానళ్లు ఈమెను ఇప్పటికే ఇంటర్వ్యూ చేశాయి.వరుస గిఫ్ట్ హ్యాంపర్లు దీనికి తోడు, ఆమె ఉపయోగించే మేకప్ ఐటమ్స్ను కొంతమంది ఫాలోవర్స్ ఫ్యాషన్ బ్రాండ్స్కు ట్యాగ్ చేశారు. బ్రాండ్స్ వాళ్లు కూడా బామ్మ టాలెంట్ చూసి ఆశ్చర్యపోయి, వెంటనే గిఫ్ట్ హ్యాంపర్స్ పంపించారు. ఇక ఆ హ్యాంపర్స్ వచ్చాకే అసలు మజా మొదలైంది. బామ్మ మేకప్ ప్రాడక్ట్స్ ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. వందేళ్ల వయసులోనూ బామ్మ టిక్టాక్లో వైరల్ స్టార్, మేకప్ గురు, బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయింది. ఈ బామ్మని చూసిన తర్వాత ‘మా అమ్మమ్మకు, బామ్మకు ఫేస్బుక్ ఖాతా లేదని సిగ్గేస్తోంది’ అని అనిపించకుండా ఉండదు. కొంతమంది యువత వాళ్ల అమ్మమ్మలకూ, బామ్మలకు ఈ బామ్మ వీడియోలను షేర్ చేస్తున్నారు. బ్లష్ ఎలా వేయాలో నేర్చుకోవటానికి కాదు, వాళ్ల అమ్మమ్మలు, బామ్మలు కూడా టిక్టాక్ స్టార్లుగా రెడీ అవ్వడానికి! (చదవండి: ఎవరీ ధీర..మయూర? ఆశావాదం, అసామాన్య ధైర్యానికి చిరునామ..) -
ఇంటర్ తర్వాత... మీ దారి కనిపెట్టాలి!
ఇంటర్మీడియట్ పూర్తవగానే విద్యార్థి జీవితంలో మొదలయ్యే అసలైన టెన్షన్– ‘ఇప్పుడేం చేయాలి?’ పేరెంట్స్, టీచర్స్, బంధువులు, ఫ్రెండ్స్ రకరకాల సలహాలిస్తుంటారు. ‘‘ఇంజినీరింగ్ చెయ్, ఫ్యూచర్ బాగుంటుంది.’’‘‘నీట్ రాయి, ఎంబీబీఎస్ అయిపోతే జీవితం సెట్ అవుతుంది.’’‘‘బీకామ్ తీసుకుని సీఏ చెయ్యి, ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు.’’ఈ సలహాలు విని గుడ్డిగా ఒకదాన్ని ఎంచుకోవడం కాదు. మీకు సరిపోయే దారి కనిపెట్టడమే అసలైన విజయం.మీ మనసేం చెప్తోంది? ఇంటర్ తర్వాత ఏం చేయాలో ఇంకా అర్థం కాలేదంటే అది మీ తప్పు కాదు. ఎవరూ సరైన ప్రశ్నలు అడగలేదని మాత్రమే. అందుకే మీ మనసేం చెప్తుందో అడగండి. ఇది నిజంగా నా దారేనా? నేను నేనుగా ఉండే దారేది? నాలోని విజేతను వెలికితీసే కోర్సు ఏది? నాలో నిద్రిస్తున్న టాలెంట్ను తట్టి లేపే దిశ ఏది? వీటికి సమాధానం దొరకలేదా, కెరీర్ కౌన్సెలింగ్ మీకు సహాయపడుతుంది. మిమ్మల్ని మెప్పించే దారి కాకుండా, మీరు గర్వపడే దారిని చూపిస్తుంది. కొత్త దారిలో నడవండి...ఇంటర్ తర్వాత అనేక ప్రవేశపరీక్షలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. వాటిలో జయాపజయాలు మీ జీవితాన్ని నిర్ణయించలేవు. పరీక్షలు ఆటల్లాంటివి. మీ గెలుపు ఆటలో కాకుండా, మీ ఆట మీరే రాసుకున్నప్పుడు వస్తుందని గుర్తించండి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ తీసుకోకుంటే జీవితం వృథా అనే సలహాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించేవిగా ఉంటాయి. సంప్రదాయ కోర్సులు కాకుండా, కొత్త దారిలో నడిచేందుకు ధైర్యం చేయండి. బైపీసీ తర్వాత మెడిసిన్ తప్ప మరేం చేసినా వేస్ట్. బైపీసీ తర్వాత మెడిసిన్ ఒక మార్గం మాత్రమే. మెడిసిన్ సీటు రాకుంటే జీవితం ఆగిపోయినట్లేం కాదు. న్యూట్రిషన్, ఫోరెన్సిక్ సై, జెనెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, అగ్రిటెక్లాంటి రంగాలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంపీసీ అంటే బీటెక్, లెక్కలే!ఎంపీసీ తర్వాత ఐఐటీలోనో, ఎన్ఐటీలోనో సీటు రాకపోతే కొంపలేం మునిగిపోవు. ఆర్కిటెక్చర్, డేటాసైన్స్, డిఫెన్స్ (ఎన్డీఏ), రోబోటిక్స్, ఏఐ వంటి మోడర్న్, ఫ్యూచరిస్టిక్ రంగాల్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కామర్స్ అంటే సీఏ తప్ప దారిలేదుకామర్స్ స్ట్రీమ్లో సీఏ ఒక్కటే కాదు. మరెన్నో కోర్సులు, అవకాశాలు ఉన్నాయి. ఫిన్ టెక్, బిజినెస్ అనలిటిక్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, డిజిటల్ బ్రాండింగ్, క్రిప్టో స్ట్రాటజీ వంటి అధునాతన కెరీర్స్ ఇప్పుడు కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారిని అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్నాయి. ఆర్ట్స్ తీసుకుంటే స్కోప్ ఉండదు.. ఇది ఒక పెద్ద అపోహ. ఏ స్ట్రీమ్ చదువుతున్నామనే దానికంటే అందులో ఏ స్థాయిలో చదువుతున్నామనేది ముఖ్యం. సైకాలజీ, పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, మీడియా, కాగ్నిటివ్ సైన్స్ లాంటి సృజనాత్మత, మేధా రంగాలు కొత్త దారులు చూపిస్తున్నాయి. దారి చూపించే మూడు ప్రశ్నలు...ముఖ్యమైన విషయమేమిటంటే, నిజానికి ఇది కోర్సు ఎంచుకునే దశ కాదు. ఇది జీవితాన్ని డిజైన్ చేసుకునే దశ. వందల కోర్సులు ఉన్నా, మీకు సూటయ్యే కోర్సు ఒక్కటే. అది మీకు ప్యాషన్ కలిగించాలి.అది మీకు పర్పస్ నేర్పించాలి.అది మీకు అవకాశాలను తెచ్చిపెట్టాలి.అందుకే ఈ దశలో సమాజం చూపించే మార్గాల కన్నా, మీ లోపల ఉన్న ఓపిక, ఊహ, ఉత్సాహం ఏ దిశ చూపుతుందో వినాలి. ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. అందుకోసం మీరు మూడు ప్రశ్నలు వేసుకోవాలి. నాకు నచ్చేది ఏంటి? ఏ పని చేస్తుంటే కాలం తెలియకుండానే గడిచిపోతుంది? అదే మీ ఫ్యాషన్. నాకు బాగా వచ్చేది ఏంటి? ఇంకొకరికి వదలకుండా చేయగలిగే పని ఏది? అదే మీ బలం. నాకు ఎలాంటి జీవితం కావాలి? స్వేచ్ఛా? గౌరవమా? సృజనాత్మకతా? ప్రభావమా? అదే మీ విజన్. ఈ మూడు సమాధానాలు కలిసి మీలోని గందరగోళాన్ని తుడిచేసి స్పష్టమైన వ్యూహంగా మార్చుతాయి. సెల్ఫ్ అండ్ అవేర్నెస్ స్కిల్ అండ్ మ్యాపింగ్ + ఫ్యూచర్ విజన్= రైట్ కెరీర్. ఈ ఫార్ములాతో నడిస్తే కోర్సు మాత్రమే కాదు, జీవితం మారుతుంది. డిగ్రీ కాకుండా డైరెక్షన్ వస్తుంది. కేవలం ఉద్యోగం కాకుండా ఊపిరిలాంటి పని వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్! -
ఇదో టైపు ఇంటరాగేషన్ !
పోలీసు ఇంటరాగేషన్ ఎలా ఉంటుందో దాదాపు అందరికీ తెలిసిందే! థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, నిందితులను కొట్టడం, వారి పట్ల అమానుషంగా ప్రవర్తించడం వంటివి కూడా తెలిసిందే! హైదరాబాద్ గోకుల్చాట్, లుంబినీపార్క్ పేలుళ్లు జరిగాయి. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ (సిక్) అధికారులు ఒక పేలుడు పదార్థాల తయారీ కంపెనీ యజమానికి రొటీన్కు భిన్నంగా ఇంటరాగేట్ చేశారు. పోలీసు రికార్డులకెక్కని ఈ ఉదంతంతో సంబంధం ఉన్నవారి పేర్లు గోప్యంగా ఉంచడం అనివార్యం.హైదరాబాద్ మక్కామసీదులో 2007 మే 18 మధ్యాహ్నం బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనలను లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులు రెండు బాంబులు ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి పేలింది. మరోదాన్ని పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ సంఘటనలో 11 మంది మరణించారు, 19మంది గాయపడ్డారు. దీనిపై హుస్సేనీ ఆలం పోలీస్స్టేషన్లో నమోదైన ఈ కేసు హైదరాబాద్ సీసీఎస్ అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి, తర్వాత సీబీఐకి బదిలీ అయింది. ఈ పేలుడు కోసం గ్రెనేడ్స్ డిజైన్లో పోతపోసి ప్రత్యేకంగా తయారు చేసిన షెల్స్ను వినియోగించారు. ఇందులో నింపిన పేలుడు పదార్థం ఆర్డీఎక్స్గా తేలింది. అదే ఏడాది ఆగస్టు 25 సాయంత్రం కోఠీలోని గోకుల్చాట్, లుంబినీపార్కు లేజేరియంలో రెండు బాంబులు పేలాయి. దిల్సుఖ్నగర్లోని వెంకటాద్రి థియేటర్ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి సమీపం నుంచి పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ పేలుళ్లలో 42 మంది మరణించగా, 68 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు చెక్కపెట్టెలో అమోనియం నైట్రేట్ స్లర్రీని నింపి పేల్చినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. ఈ పేలుళ్లకు, పేలని బాంబులకు సంబంధించి సుల్తాన్బజార్, సైఫాబాద్, మలక్పేట పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు కొన్నాళ్లకు జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్ఐఏ) బదిలీ అయ్యాయి. ఈలోగా ఈ కేసుల దర్యాప్తుకు హైదరాబాద్ పోలీసులు ‘సిక్’ ఏర్పాటు చేశారు.‘సిక్’ అధికారులు వివిధ కోణాలను విశ్లేషిస్తూ ముందుకు వెళ్లారు. మక్కా మసీదులో పేలిన బాంబులో ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ వినియోగించారు. అది కేవలం పాకిస్తాన్ నుంచి సరఫరా కావడానికి, రక్షణ శాఖ నుంచి అక్రమంగా బయటకు రావడానికి మాత్రమే అవకాశం ఉండటంతో ఆర్డీఎక్స్ సరఫరాలో స్థానిక సహకారం ఉంటుందని పోలీసులు అనుమానించలేదు. అయితే, జంట పేలుళ్లకు వినియోగించిన బాంబులు అమోనియం నైట్రేట్తో తయారు చేసినవి కావడంతో ‘సిక్’ అప్రమత్తమైంది. క్వారీల్లోను, నిర్మాణరంగంలోను వినియోగించడానికి అమోనియం నైట్రేట్ తయారు చేసే కంపెనీలు రాష్ట్రంలో ఉన్నాయి. గతంలో మావోయిస్టులు సైతం విధ్వంసాల కోసం దీనినే వాడారు. అందువల్ల అమోనియం నైట్రేట్ సరఫరాలో ‘సిక్’ అధికారులు స్థానికుల పాత్రను అనుమానించారు.ఈ కేసుల దర్యాప్తులో వందల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. కొందరిని ప్రశ్నించి విడిచిపెట్టగా, మరికొందరిని లోతుగా ఇంటరాగేట్ చేశారు. ఇందులో అనేకం అక్రమ నిర్బంధాలు కావడంతో, ఇలా కస్టడీలోకి తీసుకున్న వారిని రహస్య ప్రదేశాల్లో ఉంచి విచారించారు. రహస్య విచారణ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్హౌస్లు, గెస్ట్ హౌస్లు, ఖాయిలా పరిశ్రమలు, మూతపడిన కంపెనీలను వినియోగించారు. అప్పట్లో అలా వినియోగించిన ఓ కంపెనీ హైదరాబాద్కు దక్షిణ దిక్కులో ఉంది. నగర శివార్లలో ఉంటూ, శివారు జిల్లాలో అమోనియం నైట్రేట్ స్లర్రీ తయారీ కంపెనీ నిర్వహిస్తున్న ఒక బడా వ్యాపారి అప్పట్లో ‘సిక్’ విచారణ ఎదుర్కొన్న వారిలో ఉన్నారు. ఆయన వయసు, ప్రొఫైల్ తదితరాలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు రొటీన్ కు భిన్నంగా, ఏమాత్రం హింసకు తావు లేకుండా అతడి నోరు విప్పించాలని భావించారు.ఓ రోజు ఉదయం ఆ వ్యాపారి ఇంటికి వెళ్లిన సిక్ బృందం, అతణ్ణి అదుపులోకి తీసుకుని, దక్షిణాన ఉన్న కంపెనీకి తీసుకువచ్చింది. అక్కడ ఒక గదిలో నిర్బంధించింది. దాదాపు 15 రోజుల పాటు ఇలా ఉంచినా, కనీసం ఒక్కరోజు కూడా ఏ పోలీసూ అతనితో మాట్లాడలేదు. ఈ పక్షంరోజుల్లో రెండుసార్లు మాత్రమే బ్రష్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కోటీశ్వరుడైన ఆ వ్యాపారిని అన్ని రోజులు స్నానం చేయనీయలేదు. ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం నుంచి ఒక గార్డును ఏర్పాటు చేశారు. అతడితో మాట్లాడకూడదని సిక్ అధికారులు నిర్ణయించుకున్నారు. గార్డులకూ ఇదే ఆదేశాలు జారీ చేశారు. ఒకటి రెండు రోజుల తర్వాత గార్డుకు అతనితో పరిచయం ఏర్పడి, మాట్లాడే అవకాశం ఉంటుందని అధికారులు అనుమానించారు. దీంతో ప్రతి రోజూ అక్కడ పనిచేసే గార్డును మార్చేవారు. కేవలం ఆహారం అందించడం, కాలకృత్యాలకు తీసుకువెళ్లడమే అతడి డ్యూటీ. ఇలా ఈ ‘ఇంటరాగేషన్ ’ నాలుగు రోజులు సాగిన తర్వాత ఆ వ్యాపారి పోలీసులను బతిమాలుకోవడం మొదలెట్టాడు. ఎవరైనా వచ్చి తనతో మాట్లాడాలని, ఏవైనా ప్రశ్నలు అడగాలని, అవసరమైతే కొట్టాలని వేడుకున్నాడు. ఈ మౌనం కంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించినా తట్టుకోగలనంటూ నెత్తినోరు బాదుకున్నాడు. అతడు ఉన్న గది నుంచి ఆ కంపెనీ వెనుక వైపు కొండపై ఉన్న ఓ చిన్న దేవాలయం కనిపిస్తుండేది. శారీరక, మానసిక వైకల్యం లేకుండా అక్కడ నుంచి బయటకు వస్తే ఆ దేవాలయాన్ని పెద్దగా కడతానంటూ దాన్ని చూస్తూ మొక్కుకునే వాడు. ఒక దశలో తనంతట తానే పెద్దగా అరుస్తూ, గతంలో మావోయిస్టుల నుంచి బెదిరింపులు రావడంతో తప్పనిసరై వారికి అమోనియం నైట్రేట్ అక్రమంగా సరఫరా చేశానని, ఈ పేలుడుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మొత్తుకున్నాడు. ఇలా పక్షం రోజుల తర్వాత సదరు వ్యాపారి ఆ కంపెనీ నుంచి, సిక్ కస్టడీ నుంచి బయటకు రాగలిగాడు. నెల రోజులకే తాను మొక్కుకున్నట్లు ఆ దేవాలయం అభివృద్ధి పనులు ప్రారంభించాడు.ఈ జంట పేలుళ్ల కేసుల్ని దర్యాప్తు చేసిన ఎన్ ఐఏ అధికారులు పేలుడు పదార్థమైన స్లర్రీ కర్ణాటకలో ఉగ్రవాదులకు అందినట్లు తేల్చారు. అక్కడే బాంబుల్ని తయారు చేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది రియాజ్ భత్కల్ బస్సులో ఇక్కడకు పంపినట్లు నిర్ధారించారు. ఈ విధ్వంసానికి సూత్రధారులైన రియాజ్ భత్కల్, అమీర్ రజా ఖాన్ ఇప్పటికీ పరారీలోనే ఉండగా, మిగిలిన నిందితులకు 2018లో న్యాయస్థానం శిక్ష విధించింది. -
కాలకల్పుని కథ
పూర్వం మథురా పట్టణంలో సోమశేఖరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. విశాలాక్షి అనే యువతిని వివాహమాడి గృహస్థ జీవనం గడపసాగాడు. వేదవేదాంగ పారంగతుడైన సోమశేఖరుడు ధర్మబద్ధంగా జీవిస్తూ, అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఉండేవాడు. నిత్య నైమిత్తిక కార్యక్రమాలను నియమం తప్పక ఆచరిస్తూ ఉండేవాడు. నిత్యాగ్నిహోత్రుడై దేవ ముని పితృదేవతారాధన క్రమం తప్పక సాగించేవాడు. కొన్నాళ్లకు సోమశేఖరుడు, విశాలాక్షి దంపతులు పుణ్య సముపార్జన కోసం తీర్థయాత్రలు చేయాలని తలచారు. ఒక సుముహూర్తాన తీర్థయాత్రలకు బయలుదేరి, గంగా తీరానికి చేరుకున్నారు. గంగానదిలో స్నానమాచరించారు. సోమశేఖరుడు గంగానది ఒడ్డున సంధ్యావందనం చేసుకునేలోగా, విశాలాక్షి కలశంతో గంగాజలాన్ని నింపుకొని వచ్చింది. అందులో తులసిదళాలను వేసింది. సోమశేఖరుడి సంధ్యాదికాలు పూర్తి కాగానే దంపతులిద్దరూ గంగాకలశంతో కాలినడకన బయలుదేరారు.వారు అలా నడక సాగిస్తుండగా, పశ్చిమదేశం నుంచి ఎడ్లబండిపై సరుకులు నింపుకొని పోతున్న వర్తకుడు ఒకరు ఎదురయ్యాడు. కాలకల్పుడు అనే చోదకుడు ఆ బండి తోలుతున్నాడు. బండికి కట్టిన ముసలి ఎద్దు సరుకుల భారాన్ని లాగలేక లాగలేక భారంగా ముందుకు కదులుతోంది. కొద్దిసేపటికి అది బండిని మరి లాగలేక మొండికేసి ఆగిపోయింది.కదల్లేని మొండిఎద్దు తీరుకు కాలకల్పుడికి కోపం ముంచుకొచ్చి, దానిని కర్రతో బాదాడు. ముసలి ఎద్దు ఆ బాధ భరించలేక నేలమీద పడిపోయింది. బండి పక్కకు ఒరిగిపోయింది. బండి బరువు మీద నుంచి తొలగిపోవడంతో ఆ ఎద్దు విదిలించుకుని పైకిలేచి, తనను మళ్లీ కొట్టడానికి వస్తున్న కాలకల్పుడిని కసితీరా కొమ్ములతో పొడిచింది. కాలకల్పుడు ఆ పోటు భరించలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తగని బాధతో విలవిలలాడుతూ విలపించసాగాడు. సోమశేఖరుడు, విశాలాక్షి ఈ దృశ్యాన్ని చూసి విచలితులయ్యారు. కాలకల్పుడి దుస్థితికి వారు జాలిపడ్డారు. శ్రీహరిని పూజించి కలశంలో తీసుకువస్తున్న గంగాజలాన్ని సోమశేఖరుడు అతడి నోట్లో పోశాడు. అతడి శరీరంపై గంగాజలాన్ని చల్లి, తులసిదళాన్ని వేశాడు. తర్వాత సోమశేఖరుడు, విశాలాక్షి తమ దారిన తాము ముందుకు నడవసాగారు. కొంతసేపటికి కాలకల్పుడు అక్కడే ప్రాణాలు విడిచాడు.కాలకల్పుడిని విడిచిపెట్టి, సోమశేఖరుడు, విశాలాక్షి ముందుకు సాగుతుండగా, దారిలో వారికి కొందరు క్షతగాత్రులు కనిపించారు. కాళ్లు చేతులు విరిగిపోయి, నడవలేక, నెత్తురు కక్కుకుంటూ మూలుగుతూ అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నారు వారు. వారిని చూసి కలవరపడిన సోమశేఖరుడు, ‘అయ్యా! మీరంతా ఎవరు? ఎందుకిలా బాధపడుతున్నారు? ఎవరైనా మీ మీద దాడి చేశారా?’ అని ఆందోళనగా ప్రశ్నించాడు.‘విప్రోత్తమా! మేము యమదూతలం. మాకు, విష్ణుదూతలకు పెద్ద వాదం వచ్చింది. వారిని మేము ఎదిరించలేకపోయాం. వారు మమ్మల్ని ఇలా శిక్షించారు’ అని చెప్పారు.‘విష్ణుదూతలు మిమ్మల్ని ఎందుకు దండించారు?’ ప్రశ్నించాడు సోమశేఖరుడు.‘ఒక వర్తకుడి సేవకుడు అయిన కాలకల్పుడి ప్రాణాలను కొనితెమ్మని మా ప్రభువు యమధర్మరాజు మమ్మల్ని ఆదేశించారు. జీవితాంతం అతడు చేసినవన్నీ పాపకార్యాలే! చివరిదశలో కూడా బండి లాగలేని ముసలి ఎద్దును నిర్దాక్షిణ్యంగా హింసించాడు. ఇదే సంగతిని మేము విష్ణుదూతలకు చెప్పాము. అతడి ప్రాణాలను కొనిపోతున్న మమ్మల్ని అడ్డుతొలగమన్నాం. వారు ఒప్పుకోలేదు. అందుకే వారితో వాదం జరిగి, యుద్ధంగా మారింది’ అని వివరించారు యమకింకరులు.‘విష్ణుదూతలు ఎందుకు ఒప్పుకోలేదు?’ అడిగాడు సోమశేఖరుడు.‘ఇతడు పాపాత్ముడు కాదు, మహాపుణ్యాత్ముడు. ఎద్దు కుమ్మడంతో గాయపడి, అంత్యదశలో ఉన్నప్పుడు పవిత్ర గంగాజలాన్ని తులసిదళాలతో సేవించాడు. అంతేకాదు, ప్రాణాలు విడిచిపెట్టే సమయంలో నారాయణ నామస్మరణాన్ని ఆలకించాడు. అంతటితో ఇతడి పాపాలన్నీ నశించాయి. ఇంక ఇతడికి పాపాలు ఎక్కడ ఉన్నట్లు? అందువల్ల మీరు ఇతడిని యమపురికి తీసుకుపోవడానికి వీల్లేదు’ అని చెప్పారు.‘మా యమధర్మరాజు ఆదేశాన్ని మేము పాటించాల్సిందే! అడ్డుతప్పుకోండి అని హెచ్చరించాం. వారు వినలేదు. మాతో పోరుకు దిగారు. ఇదిగో ఫలితం! విష్ణుదూతల చేతిలో చావుదెబ్బలు తిని మేమిలా మిగిలాం’ అని గద్గదస్వరంతో చెప్పారు యమకింకరులు. పవిత్ర గంగాజల మహిమను, తులసి మహాత్మ్యాన్ని, అంత్యకాలంలో హరినామస్మరణ వల్ల దక్కే ఫలితాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలిగినందుకు సోమశేఖరుడు, విశాలాక్షి సంతోషించారు. వారు మనసులోనే శ్రీహరికి వందనాలు సమర్పించారు.గంగాతీరం వెంబడి సాగుతూ, శ్రీహరి క్షేత్రాలను సందర్శించుకుని, శాస్త్రోక్తంగా పూజాదికాలు చేస్తూ కొన్నాళ్లకు వాళ్లు తీర్థయాత్రలను ముగించుకుని, సంతోషంగా ఇంటికి చేరుకున్నారు.∙సాంఖ్యాయన -
వజ్రాలు ఉచితం
ధగధగలాడే వజ్రాల మెరుపులు కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. వజ్రాల మెరుపులే కాదు, వాటి ధరలు కూడా కళ్లు చెదిరేట్లు చేస్తాయి. వజ్రాల విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో ధర చెల్లిస్తే గాని, రవ్వంత వజ్రమైనా కొనడం సాధ్యం కాదు. అలాంటిది వజ్రాలు ఉచితం ఏమిటని ఆశ్చర్యంగా ఉందా?ప్రపంచంలో వజ్రాలు ఉచితంగా దొరికే చోటు ఒకే ఒక్కటి ఉంది. ఈ ఫొటోల్లో కనిపిస్తున్నది ఇదే! ఇది అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉంది. మర్ఫ్రీబరో గ్రామానికి చేరువలో ఉన్న ఈ వజ్రాల ఆలవాలం పేరు ‘క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్’. దాదాపు 37.5 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు వజ్రాల గని. దీనిని 1972లో స్టేట్ పార్కుగా మార్చారు. అప్పటి నుంచి ఇది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్కులో 35 వేలకు పైగా వజ్రాలు దొరికాయి. వీటిలో కొన్ని అరుదైన రకాలకు చెందినవి కూడా ఉన్నాయి.ఈ పార్కులోకి ప్రవేశించడానికి, ఇందులో టెంట్లు ఏర్పాటు చేసుకుని బస చేయడానికి మాత్రమే డబ్బు చెల్లించాలి. ఇక్కడ ఎవరైనా నేల తవ్వుకుని, వజ్రాలను ఏరుకోవచ్చు. చాలామంది సెలవురోజుల్లో ఇక్కడకు కుటుంబ సమేతంగా వచ్చి, తవ్వకాలు జరుపుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. మట్టిని, ఇసుకను జల్లెడపడుతూ గంటల తరబడి ఓపికగా వెదుకులాట సాగిస్తుంటారు. తవ్వకాల్లో ఎవరికైనా ఒక్క వజ్రం దొరికినా, వారి పంట పండినట్లే! ఈ పార్కులో గడపడానికి పెద్దలకు రోజుకు 15 డాలర్లు (రూ.1285), పన్నెండేళ్ల లోపు పిల్లలకు 7 డాలర్లు (రూ.600) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కొందరు ఇక్కడ టెంట్లు వేసుకుని రోజుల తరబడి వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తుంటారు. పార్కు బయట టెంట్లను అద్దెకు ఇచ్చే దుకాణాలు, తవ్వకాల కోసం ఉపయోగించే పనిముట్లు, పరికరాలను అద్దెకిచ్చే దుకాణాలు కూడా ఉంటాయి. ఇంటి నుంచి పలుగు పార వంటివి తెచ్చుకోనివారు వాటికి ఈ దుకాణాల్లో అద్దెకు తీసుకోవచ్చు. ఇక్కడ వజ్రాలు దొరికినట్లయితే, వాటిని ఎలాంటి మూల్యం చెల్లించాల్సిన పనిలేదు. చక్కగా వాటిని ఉచితంగానే ఇంటికి తీసుకుపోవచ్చు.మిన్నెసోటా ప్రాంతానికి చెందిన డేవిడ్ డికుక్ అనే వ్యక్తికి ఇక్కడ అరుదైన బ్రౌన్ డైమండ్ దొరికింది. గత నెల అతడు ఇక్కడ వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తుండగా, చాక్లెట్ రంగులో «మెరుస్తున్న రాయి కనిపించింది. దానిని పరీక్షించి చూస్తే, అది 3.81 కేరట్ల బ్రౌన్ డైమండ్గా తేలింది. ఈ పార్కులో ఇప్పటి వరకు దొరికిన వజ్రాల్లో ఎక్కువ శాతం పారదర్శకమైన తెల్లవజ్రాలే అయినా, కొందరికి అరుదైన బ్రౌన్ డైమండ్స్, యెల్లో డైమండ్స్ కూడా దొరికాయి. ఈ పార్కులో వజ్రాలు మాత్రమే కాకుండా కొంత తక్కువ విలువ కలిగిన అమెథిస్ట్, జాస్పర్, ఎగేట్, క్వార్ట్జ్ వంటి రత్నాలు కూడా దొరికాయి. అర్కాన్సాస్–టెక్సస్ సరిహద్దులో ఉన్న ఈ పార్కు సెలవురోజుల్లో జనాలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. -
ఈ వారం కథ: ప్రేమించేందుకు వీలులేదా?
ఆ ఉదయం ఇంకా తెల్లవారలేదు. ఫోన్లో చిన్ని పిచ్చుక పిల్ల పలకరింపు.ఆ చప్పుడుకి నిద్ర కళ్ళతో పక్కన టీపాయ్పై తడిమి, ఫోన్ అందుకుని మెసేజ్ తెరిచి చూశాడు.పచ్చటి ఆకుల మధ్య నుండి తొంగి చూస్తున్న విచ్చుకున్న మల్లెపూవు ఫోటో, ఆ కింద ‘‘మా ఇంట్లో మల్లె తీగకి పూసిన మొదటి పూవు. ఇది నీ కోసం. ఈ ఉదయం తోటలోకి రాగానే, ఆ పువ్వును చూడగానే, ఎంత ఆనందం వేసిందో. నువ్వు గుర్తొచ్చావు. నిద్రలేవగానే చూస్తావని’’ ఆమె. ఇలాంటి పిల్లపై నిద్రపాడుచేసింది అని ఎట్లా కోపం తెచ్చుకోగలడు. అతని పెదవులపై చిన్న నవ్వు.‘‘ ఒకే పూవు. మరి అక్కడ నేను లేనుగా’’‘‘సరిగ్గా చూడు. ఆ పక్కన ఓ చిన్న మల్లె మొగ్గ వుంది. ఈ పూచిన పూవు రాలిపోతుంది కదా. అప్పుడు దానికి వికసించడానికి చోటు దొరుకుతుంది’’అతనికి కొంచం దిగులనిపించింది. రెండు పూలూ ఒకేసారి పూసి, ఒకేసారి రాలిపోవచ్చు కదా అనుకున్నాడు మనసులో.‘‘ఈ మల్లె ఏ జాతిదో, ఎక్కడ నుండి వచ్చిందో తెలీదు. ఎంత పరిమళం వెదజల్లుతూ వుందో! రెండు సీతాకోక చిలుకలు వాలాయి ఆ కొమ్మపై. ఆ అదురుకో, వీచిన గాలికో, పూవు రాలిపోయింది’’ ఒక కన్నీటి చుక్క ఎమోజీ. కాసేపటికి ‘‘ఆ రాలిన పూవు చూడు, కొంచెంసేపు బుద్ధుడి ఒడిలో, ఈ మొక్కల మధ్య... దానిది కాని చోటైనా, ఎంతో అందంగా లేదూ!’’చిన్ని చిన్ని పక్షులతో అలంకరించిన వేలాడే పింగాణీ కుండీలో ఆకుల మధ్య ఆ మల్లెపూవు.అతనికి అప్పుడా పిల్ల దగ్గరికి పరుగెత్తుకెళ్ళి గుండెలకు హత్తుకోవాలని అనిపించింది.‘‘ఇవ్వాల్టి ఉదయపు చిన్ని, చిన్న ఆనందాలు ఇవి. ఇప్పటికి ఇక బై’’‘‘అప్పుడేనా’’ అన్నాడు అతను.అటుపక్క నవ్వు.‘‘నీకు ఇక ఎప్పటికీ తెల్లవారదు. నాకోసం కలలు కనడంలోనే సమయం గడిచిపోయిందని అంటావు కదూ’’మరో నవ్వు ఎమోజీతో సంభాషణ ఆగిపోయింది.అతను లేచాడు. తలుపు తెరిచి ఆకాశం కేసి చూశాడు.అది ఎప్పటిలానే వుందా? అతనికి అది గాఢనీలంలోకి మారినట్లు అనిపించింది నిన్నటి కన్నా. అక్కడ రెండు తెల్లటి మేఘాలు ఒకదాన్ని ఒకటి అందుకునేందుకు చేతులు చాస్తునట్లు. ఆ రెండు చాచిన చేతులు ఒకటి ఆమె, రెండు నేను అనిపించి సంతోషంగా కలిగింది.అతనికి తెలుసు, కాసేపు అయితే ఆ దృశ్యం మారుతుందని.అందుకని అతను ఆఖరున చూసిన ఆ మేఘాలను తన లోపల అలానే నిలుపుకుని లోనికి వెళ్ళాడు.కాఫీ తాగి, స్నానించి, టిఫిన్ తిని ప్రతిరోజు వలే అతను తనదైన పనిభారపు భేతాళుడిని భుజానికి వేసుకొని వేటకు బయలుదేరాడు.ఆమె పిల్లలకు పాఠం చెబుతూ వుంటే వైబ్రేషన్ మోడ్లో వున్నా, ఫోన్ ఒక్కసారి కదలి ఆగిపోయింది. ఆమెకి తెలుసు క్షణకాలం, రెండు రింగ్స్కే ఆగిపోయిన ఆ కాల్ ఎవరిదో. ఆ రింగ్టోన్ మిగిలినవాటి కన్నా భిన్నంగా వుంటుంది. ఆమె ఏమీ తొందర పడలేదు. అతను మళ్ళీ తాను పలకరించే దాకా మౌనంగానే ఉండగలడని ఆమెకి తెలుసు.స్టాఫ్ రూమ్లోకి వచ్చి, ఫోన్ తీసి చూసింది.నీలాకాశంలో చేతులు చాచిన చేతుల్లా అగపడే రెండు తెల్లటి మేఘాలు. ‘‘ పొగ మేఘాలు కదూ, అవి తేలి విడిపోయి, ఎటో వెళ్లిపోయేలోగా ఇలా నీకు మేఘ సందేశం’’ఆమె ఒక హృదయపు గుర్తును అతనికి పంపింది. ‘‘నువ్వు ఎందుకు గుర్తుకొస్తావో ఇలా నాకు? ఇప్పుడీ సిస్టం ముందు కూర్చుని నాకు ఎన్నడూ ఏ మాత్రం ఆసక్తి లేని పనులు చేస్తూ... ఇదంతా బతకడం కోసం కదూ?’’‘‘తప్పదు బతకాలి కాదా’’ అందామె క్లుప్తంగా.‘‘అవుననుకో, నీకూ తెలుసు కదా! ఇదంతా ఎంత నరకంగా వుంటుందో?నాకు పారిపోవాలని అనిపిస్తుంది’’‘‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా! ఏడు సముద్రాలూ ఈది, ఏడు పర్వతాలూ దాటి? నిన్ను నువ్వు కట్టేసుకున్న రాటను ఊడ బెరుక్కొని... ఎటుపోతావ్? ఎచటికి పోతావ్ ఈ రాత్రి’’ అందామె చిన్ని నవ్వుతో.‘‘అవును. వెళ్ళాలి అని వున్నా వెళ్ళలేను’’‘‘సరే, పని చేసుకోవాలి నువ్వూ నేనూ. కూలి ముట్టాలి అంటే పని చేయలి కదా!’’‘‘సరే’’ఆమె దిద్దాల్సిన పిల్లల పరీక్ష పేపర్లు ముందేసుకు కూర్చుంది. ఏమి తెలుసు అతని గురించి ఆమెకి?ఆమె గురించి అతనికి ఏమి తెలుసు?అట్లా తెలుసుకోవాలని ఇద్దరికీ ఎందుకనిపించలేదో తెలీదు?తాము ఒకరికొకరు ఏనాటి నుండో, తెలిసినట్లు ఎందుకు అనిపించిందో కూడా వాళ్ళకి తెలీదు. లేదా తమ గత కాలాలు ఏవో, అన్నీ రద్దయిపోయి, జీవితం ఆ క్షణం నుండే మొదలైనట్లుగా వుంది. అతను ఒక సంగీత కచేరీలో పరిచయం అయ్యాడు.సంగీతం మన లోలోపల, మనకే తెలియని భావోద్వేగాలను తట్టిలేపుతుంది.సమూహానికి కాస్త ఎడంగా ఒక్కతీ కూర్చుని వింటోంది. ‘‘ఆజా బాలమ్ పరదేశీ’’ అంటూ పాడుతూవుంది కౌశికీ చక్రబర్తి, భైరవిలో. రాగానికి అనుగుణంగా గాలిలో కదులుతున్న ఆమె సన్నటి పొడవాటి చేతివేళ్ళ విన్యాసాన్ని చూస్తోంది ఆమె. అందంగా, సుకుమారంగా వున్న ఆమె, మరేదో లోకంలో ఉన్నట్లు, తన చుట్టూ ఏమి జరుగుతోందో, ఎవరున్నారో, లేరో తనకేం ప్రమేయం లేనట్లు ఎంత తాదాత్మ్యతతో పాడుతున్నదో. ఆమె స్వరం ఎంత మధురంగా ఉందంటే, ఆ పాట విన్న ఆ పరదేశీ ఎవడో, ఆమె చెంత అలా వశీకరణ చెందినవాడుగా కూర్చుండి పోడూ అనుకుందామె.పాడుతున్న ఆ గాయనిని, అరమోడ్పు కళ్ళతో, తలూపుతూ వింటున్న ఆమెనీ చాలసేపటి నుండి మార్చి, మార్చి చూస్తూ వున్న అతను ‘‘మీరు కూడా పాడతారా?’’ అన్నాడు. ఆ అపరిచిత వ్యక్తి కేసి చూసి, తల అడ్డంగా ఊపి ‘‘ఇష్టం. వినడం’’ అంది.అడక్కుండానే ‘‘నాక్కూడా! కర్ణాటక సంగీతంలో కొంచెం ప్రవేశం వుంది’’ అన్నాడు.కొన్ని మాటలు కలిసి, ఇష్టాలు కలిసి కాఫీని ఆస్వాదించి, సంగీతం గురించి అతనికి తెలిసిన సంగతులు చెబుతుంటే, ఆసక్తిగా విని, అట్లా మొదలైంది వాళ్ళ పరిచయం.ఆమె పని చేసే కాలేజీకి దగ్గరలోనే అతని ఆఫీసు. ఏదో కమర్షియల్ బ్యాంకులో ఉద్యోగి. మద్రాసు నుండి డిప్యుటేషన్ మీద వచ్చాడు ఏడాది కాలానికి.ఇద్దరికీ కుదిరినప్పుడు సాయంత్రాలు కలిసి కాస్త దూరం నడిచి, ఏ కాఫీనో తాగి, ఆమెతో పాటూ ఆటో ఎక్కి, మరి కాసేపటిలో శ్రీనగర్ కాలనీలో ఆమె ఇల్లు వస్తుందనగా, కాస్త దూరంలోనే దిగి పోయేవాడు. అతనికి తెలుసు ఆమె ఎక్కడ వుంటుందో. ఆమె అతడిని ఇంటికి రమ్మని ఎన్నడూ పిలవలేదు. వెళ్ళాలని అతనూ అనుకోలేదు.యూసఫ్గూడలో వున్న నిసిట్ (ఎన్ఐఎస్ఈటీ) క్యాంపస్ గెస్ట్హౌస్లో వుండేవాడు. ఎప్పుడన్నా వీలు దొరికినప్పుడు ఆమె అతని దగ్గరకు వచ్చేది.అతని గదిలోనో, ఆరుబైట చెట్ల కిందో కూర్చుని గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళ మాటల్లో అనేక విషయాలు దొర్లినా, వ్యక్తిగతమైన సంగతులు వచ్చేవి కావు. బహుశా అలాంటి సంభాషణ మొదలవుతే అది ఎక్కడికి దారి తీస్తుంది? మనుషులు ఒంటరి జీవులు కాదనీ, అనేకానేక సంబంధాల మధ్య వాళ్ళు జీవిస్తారని వాళ్ళకు తెలుసు.జీవితంలోని ఆ పొరలను విప్పినప్పుడు ఊపిరాడక, తమ ఇద్దరికీ ఎంతో శాంతిని, నిశ్చింతను ఇస్తున్న ఇప్పటి ఈ బంధం, ఏ మురికి కాలువలోకో ప్రవహించి, అసహ్యాన్నో, అవమానాన్నో మిగిల్చి చివరకు అంతం అవుతుందన్న భయం కూడా వాళ్ళను మాట్లాడనివ్వలేదు.వాళ్ళ ఇద్దరి మధ్య కలిగిన అద్భుతము, అపురూపము అని వాళ్ళు అనుకునే ఈ పేరు లేని ప్రేమయో, బంధమో అనుకునే ఆ భావన, గాలి బుడగవలే టప్పుమని పగిలి పోతుందేమో అన్న భయం వాళ్ళకి లోలోపల వుండి వుండాలి. కొన్ని నెలల తరువాత, ఇదంతా ఎక్కడి దాకా పోతుందో అనిపించి, ఆమె అన్నది ‘‘మనం మాట్లాడుకోవాలి’’‘‘మాట్లాడి? నీ స్థితిని నువ్వూ, నా స్థితిని నేనూ మార్చగలమనే అనుకుంటున్నావా?’’ అన్నాడు అతను ఒకసారి. తాము ఇద్దరం ఎప్పటికీ ఇట్లానే వుండగలమన్న ఈ భ్రమని నమ్మినంత కాలం, ఇలా సాగినంత కాలం ఇట్లా సాగనివ్వాలనే వాళ్లకు వుంది.అతను అన్నాడు ఒకసారి ఆమె చేతి వేళ్ళతో ఆడుకుంటూ ‘‘ఆనందం అనిపించిన ప్రతిదాన్నీ మనం శాశ్వతంగా స్వంతం చేసుకోవాలి అనుకుంటాం. అది అప్పటికి కలిగించిన సంతోషం.అట్లా అది మనకి అప్పుడు మనం వున్న స్థితి, కాలం వల్ల కలిగిన ఆనందమో, హాయో! ఈ మనిషి కావాలి శాశ్వతంగా నాకు, అని ఎంతో ఇష్టపడి, ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళలోనూ, వాళ్ళతోనే, ఆ బంధంలోనే వున్నా, ఆ ఇద్దరు మనుషులలో చాలా సందర్భాలలో చెప్పరానంత డిసపాయింట్మెంట్ వుంటుంది ఎందుకో’’‘‘అవును. అది వాళ్ళు గుర్తించినా, అప్పటికే వాళ్ళ చుట్టూ అనేక కొత్త బంధాలు బిగుసుకుపోతాయి. ముఖ్యంగా పిల్లలు. అప్పుడు అది దాటడం కష్టం’’ అందామెఅతను మౌనంగా విన్నాడు.‘‘ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. ఇట్లా మరొక మనిషి నా హృదయానికి ఇంత దగ్గరగా వస్తుందని నేను ఎన్నడూ ఊహించలేదు.’’‘‘ఆడమనిషి’’ అని సవరించి నవ్వింది.‘‘ఉహు, నాకు మనిషే. ఇద్దరు మనుషులు.అంతే’’ అన్నాడు ఆమె నుదుటి మీద ముద్దుపెడుతూ.అతని వొడిలో పడుకున్న ఆమె లేచి కూర్చుని ‘‘ఏం? ఎందుకింత ఇష్టం? ఎందుకింత మోహం నీకూ, నాకూ మధ్య? మనం ఒక ఆడ, మగ మనుషులం. మన ఇద్దరికీ మనసులే కాదు, శరీరాలు కూడా వున్నాయి మరిచిపోకు’’ అంది ఆమె.‘‘అవును ఈ శరీరాలు కూడా ఒకరికి ఒకరు కావాలని కోరుకుంటాయి’’ అని, ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. ఆమె దూరంగా జరిగింది అతనికి. ‘‘ఈ దాగుడుమూతలు ఎందుకు నీకూ నాకూ మధ్య’’ అన్నాడు.‘‘భయం. నిజంగా భయం నాకు. నా మనసును, దేహాన్నంతా నీకు ఇచ్చేసి, నాకు నేను కాకుండా పోతానని భయం. నా ఉద్వేగాలను నా లోపలే దాచుకోలేనితనపు భయం. హు, ఇంకా, లోకభయం, నా కుటుంబ భయం, ఈ దాటలేని అగడ్తల మధ్య పడి, మనుషుల తీర్పుల మధ్య పడి నలిగి నువ్వూ, నేనూ చచ్చిపోతామేమోననే భయం’’ఆ తరువాత అతన్ని ఆనుకొని, అతని చేయి గట్టిగా పట్టుకుని, ఆమె ఒక్క మాటన్న మాటలాడకుండా అతనికేసి నీళ్ళు నిండిన కళ్ళతో చూసింది.కాస్సేపటికి ‘‘నువ్వు చెప్పాలి అనుకుంటున్నదంతా చెప్పేయి ఇవ్వాళ’’ అన్నాడు అతను. ‘‘నాకే తెలీదు. ఈ ద్వైదీభావం ఏమిటో. నువ్వు కావాలి, వద్దు కూడా, నువ్వు పూర్తిగా కావాలి. అట్లా వద్దు కూడా. కొంచెం, నీ చేయి పట్టుకుని, నీ భుజం మీద తలవాల్చి, నువ్వు అట్లా నా కళ్ళ మీద ముద్దు పెట్టి ..’’అతను ఆమె తలను దగ్గరికి లాక్కొని కళ్ళ మీద ముద్దు పెట్టాడు.ఆ నీటి తడి అతడి పెదవులకు కొంచెం ఉప్పగా తాకింది.‘‘నీకు కష్టం కలిగించే, నీకు ఇష్టంలేని పని ఏమీ జరగదు మన మధ్య’’ అన్నాడు. ‘‘నేను ఇది చెప్పడం మన మధ్య ఏర్పడిన ఈ బంధపు తప్పు, ఒప్పుల గురించి, నీతో మాట్లాడటానికి కాదు, నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు. బయట హాస్టల్లో వుంటారు. మా అమ్మ, నాన్న, ఒక మానసిక వైకల్యం వున్న చెల్లి ఇంట్లో’’‘‘అతను? అదే మీ ఆయన’’‘‘వున్నాడు, కానీ వుండీ లేనట్లే’’‘‘అంటే’’‘‘చాలా ఆస్తులు తగలేశాక, ఎన్నో గొడవలయ్యాక, ఆ మిగిలినవి ఏవో మా అత్తింటి వాళ్ళు పిల్లల పేర్లపై పెట్టాక, మమ్మల్ని గాలికి వదిలేసి, అతను ఎక్కడెక్కడో తిరిగి, ఆ మిగిలిన ఆస్తి కోసం నన్నూ, అతని తల్లిదండ్రులను కూడా చాలా వేధించడం మొదలు పెట్టాక, వాళ్ళు కూతురు దగ్గరికి అమెరికాకి వెళ్ళిపోయారు. నేను మా అమ్మా వాళ్ళ దగ్గరికి వచ్చేశాను.’’‘‘మరి అతను’’‘‘నేను విడాకులు అడిగాను. ఆడపిల్లలు కదా. తండ్రి లేకపోతే కష్టం అట. పెద్దవాళ్ళు వద్దన్నారు. పిల్లలు అనే పేరుతో వస్తాడు. వుంటాడు. కొన్నాళ్ళు. చాలా కోపం, అసహ్యం నాకు. నన్ను ముట్టుకునే సాహసం చేయడు. అతను నా మేనబావే. ఆస్తులు, బంధుత్వాలు అంటూ నాకు ఇష్టం లేకుండానే చేసిన పెళ్లి ఇది’’‘‘చాలా కష్టం కలిగింది కదూ!’’ అతను ఆమె తలనిమురుతూ అన్నాడు.ఆమెకి నిజంగా చాలా దుఃఖం కలిగినా అతనికేసి చూసి, ‘‘అందుకే మరింత దుఃఖాన్ని మోయలేనని అనిపిస్తుంది. ఇప్పుడు అమ్మ, నాన్న, మానసికంగా ఎదగని చెల్లి, ఆ, ఇంకా నా పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఇదంతా దాటి నీ కోసం వచ్చేయాలి అనుకున్నా, నిజంగా చేయగలనా? ఇక దుఃఖం వద్దు అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఒక కొత్త దుఃఖాన్ని తెచ్చేలా ఉన్నావు’’ అని నవ్వింది.‘‘నువ్వు నమ్మవేం? అట్లా చేయను. అంటే, నీకు దుఃఖం కలిగంచే పని. అలా అయితే వెళ్ళనా’’ అతడు ఆమె చేయి విడిపించుకుని లేచి నిలబడ్డాడు.ఆమె నవ్వి, అతని చేయి పట్టి లాగి కూర్చోబెట్టి ‘‘మరి నీ సంగతి ‘‘ అని అతని మొఖంకేసి చూసి, కళ్ళు తమాషాగా ఎగరేసింది.‘‘నీ అంత దుఃఖభాజిత కుటుంబ కథాచిత్రం కాదులే నాది. కొంచం ప్రేమించే చేసుకున్నాం. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం.’’‘‘కొంచం ప్రేమించుకోవడం ఏమిటి?’’‘‘మరి? అప్పుడు చాలా ఎక్కువనుకున్నాంలే. తరువాత పెళ్లి చేసుకుని కలిసి జీవించడం మొదలుపెట్టాక అది కొంచెమే అని తెలిసిందిలే’’ అని నవ్వాడు.‘‘ఊ, చెప్పు?’’‘‘బహుశా, ఈ దేశంలో పిల్లలని పుట్టించడం అంత సులువైన విషయం మరోటి లేదనుకుంటా’’‘‘అర్థం అయింది. నేను చేసిందీ అదేగా’’‘‘కలిసి ఉండటానికి ప్రయత్నం చేశాం. నా కొడుక్కి అప్పుడు ఐదేళ్ళు. తనకి ఈ ఇల్లూ, సంసారం ఇదంతా ఊపిరాడనితనంగా అనిపించడం మొదలైంది. తను ఓవర్ యాంబిషస్ అనుకున్నాను నేనప్పుడు. తను ఇంకా పైకి ఎదగాలి, ఏ ఆక్స్ఫర్డ్లోనో పైచదువులు చదవాలి, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో వుండాలి అనుకుంది. ఇదంతా ఎందుకు వున్నదాంట్లోనే వుండచ్చు కదా అనిపించేది నాకు’’‘‘అట్లా నువ్వు అనుకోవడం ఆమెపై నీకు చాలా ప్రేమ ఉండటం వల్లా, లేక నువ్వు, నేను, నా కుటుంబం కోసమే ఆమె అనుకునే నీ స్వార్థం వల్లా’’‘‘పెళ్ళంటే బాధ్యత కదా?’’ అని ఒక్క క్షణమాగి, ‘‘స్వార్థం కూడానేమో! కొంచెం చాలా ఎక్కువ. ఇంకొంచెం ప్రయాస లేకుండానే దొరికేసే దేహసుఖం, ఇంకా నిలకడ, నిశ్చింతతో పాటూ, ఆడ, మగ ఆ ఇద్దరు మనుషుల, కట్టడి చేసే లోకం స్వార్థం కూడా ఉంటుందేమో, మనం గుర్తించం కానీ’’‘‘నిజమే’’ అంది ఆమె ‘‘మేము అప్పుడు దిల్లీలో వుండేవాళ్ళం. మా అమ్మకి తెలిసింది మా ఘర్షణ. బహుశా తను మా అబ్బాయి ‘అనిరు«ద్ కీ మా’ అని చిన్నగా నవ్వి, ‘‘నా భార్య చెప్పినట్టు వుంది. అమ్మే అనింది పట్టి ఉంచేవి బంధాలు ఎలా అవుతాయి, బందిఖానాలు అవుతాయి కానీ అని. మేము విడిపోయాం.’’‘‘మరి బాబు?’’‘‘తనకి బాబు పట్ల ప్రేమ చాలానే వున్నా, మేం మాట్లాడుకున్నాం, ఒక నిర్ణయానికి వచ్చాక స్నేహితుల్లా వుందాం అనుకున్నాం. బాబు బాధ్యత నేను తీసుకున్నాను. తను యూకే వెళ్ళింది. తను అనుకున్నట్లుగానే చదువుకుంది. మంచి పొజిషన్లో వుంది. అక్కడే స్థిరపడింది. వీలైనప్పుడు తల్లీ, కొడుకు కలుసుకుంటారు.’’‘‘మరి..’’ఆమెకి నోటిదాకా వచ్చి, అది అంత సంస్కారం కాదేమోనని ఆగిపోయింది.‘‘ఉన్నారు. ఆ తరువాత ఒకరిద్దరు స్త్రీలు నా జీవితంలో. ఏ రిలేషన్ పెళ్లి దాక వెళ్ళలేదు. దానికన్నా ముందుగానే వాళ్ళ నిందారోపణలు, పొసెసెసివ్నెస్లు, నా అపరాధ భావనల బరువులు, ఏమి చేయాలో తోచక, అంత ఎమోషనల్ బరువు మోయలేక పారిపోవడాలు... ఇంకో రిలేషనో, పెళ్ళో ఇక వద్దనుకునేలా చేశాయి నన్ను’’ అన్నాడు.ఆమెకేసి అట్లా దిగులుగా చూశాడు.‘‘ఇదిగో నువ్వు ఇట్లా వచ్చావు. ఎందుకు ఇలా వచ్చావో, వున్నావో, వుంటావో లేదో తెలియకుండా’’ అన్నాడు. ఆమె అతన్ని క్షణకాలం తదేకంగా చూసి, ‘‘ఇంతటి నిశ్చింతను, శాంతిని, నేను ఎన్నడూ ఎరుగను. ఇదంతా ఎక్కడి దాకా వెడుతుందో, ఎక్కడ ఆగిపోతుందో కూడా నాకూ తెలీదు. ఈ లోకంలో పరమ కుతూహలమైన సంగతి ఏదైనా వుందీ అంటే, ఇద్దరు మనుషులు, ఉహూ ఇద్దరు ఆడా, మగా మధ్య వున్న సంబంధం ఏవిటో తెలుసుకోవడమే అనుకుంటాను. నువ్వు నాకు కావాలి. కానీ..’’ఆమె తన మాట పూర్తి చేయకుండానే ‘‘కానీ వద్దు కూడా’’ అన్నాడు నవ్వి.అతని రెండు చేతులను తన దగ్గరికి లాక్కుని ఆ చేతులలో తన మొఖాన్ని దాచుకుని, అరచేతుల్ని ముద్దుపెట్టుకుని, ఆమె మెల్లిగా లేచి తన చేతి సంచీ తీసుకుని, వెనక్కి తిరిగి, కంటి నుండి రాలిన కన్నీటి చుక్కను తుడుచుకోకుండానే నడిచి వెళ్లి పోయింది. ఆమె మళ్ళీ రేపు కూడా, నిన్నటి మల్లెమొగ్గ, రేపు ఉదయం విరిసి పూవు అవ్వగానే, తనకు ఆ బొమ్మ పంపుతే బావుండును. ఉహు, రెండు విరిసిన మల్లెపూలు అనుకుంటూ వుంటే, ఎందుకో తనలోంచి తానంతా ఖాళీ అయిపోయినట్లు అనిపించింది అతనికి. -
బొద్దింక పాలు: మీరు ఎప్పుడూ చూడని సూపర్ఫుడ్!
ఒక పూట పాలు లేకపోతే, ఆ రోజు ఎంత కష్టంగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉదయాన్నే టీ, కాఫీలు పెట్టుకోవడం దగ్గర నుంచి, రాత్రిపూట మజ్జిగ తాగే వరకు ఇంట్లో ఏదోరకంగా పాల అవసరం కనిపిస్తూనే ఉంటుంది. పెరుగు, వెన్న, నెయ్యి ఇలా ప్రతి పాల ఉత్పత్తితోనూ రోజువారీ అవసరాలు, అలవాట్లు ముడిపడే ఉంటాయి. అందుకే, కుదిరితే పాడినయినా పెంచుకుంటాం, లేదా పాలకేంద్రంలో ఖాతానైనా పెట్టుకుంటాం. ఏదేమైనా రోజుకు లీటరో అరలీటరో పాలు స్టవ్ మీద కాగాల్సిందే! ప్రతి ఇంట్లోనూ పాలకున్న డిమాండ్ అలాంటిది.నిజానికి పాలు ఒక సంపూర్ణ ఆహారం. పాలు మన శరీరానికి కావలసిన కాల్షియం, ప్రొటీన్, విటమిన్లు, ఖనిజాలు ఇలా చాలా పోషకాలనే అందిస్తాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కాల్షియం చాలా ఉపయోగపడుతుంది. అలాగే కండరాలు, కణజాలాల నిర్మాణానికి ప్రొటీన్ ఎంతగానో సహాయపడుతుంది. పాలలో విటమిన్–డి, విటమిన్–బి12తో పాటు పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. పాలు తాగటంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పాలు ఎముకలను బలపరుస్తాయి, కండరాలను అభివృద్ధి చేస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్ని వయసుల వారికి పాలు ఒక ముఖ్యమైన పోషకం. పిల్లలు ఎదగడానికి, పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి పాలు చాలా అవసరమని డాక్టర్లు ఎప్పుడూ చెబుతుంటారు.మనిషి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న నాటి నుంచి పాడిని పెంచి, పాలను వినియోగించుకోవడం మొదలుపెట్టాడని చరిత్ర చెబుతోంది. అంటే దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నుంచే, పశువుల పాలతో ప్రయోజనాలను అందుకుంటున్నాం.ఏ జంతువుల పాలు.. ఏమేమి ఫలితాలు?పాలల్లో ఆవు పాలు శ్రేష్ఠమైనవి. ఇక గేదె పాలు, మేక పాలు, ఒంటె పాలు కూడా అనేక సంస్కృతులలో ప్రత్యేకంగా వినియోగిస్తారు. ప్రత్యేక రుచి, పోషక విలువలు, ప్రత్యేక లక్షణాల కారణంగా వాటి పాలను వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.బొద్దింక పాలుకీటకమైన ఈ బొద్దింకల నుంచి పాలను తియ్యడం చాలా అసాధారణమైన పని. పసిఫిక్ బీటిల్ బొద్దింకలు ‘బొద్దింక పాలు’ అని పిలవబడే ఒక పోషకసమృద్ధ స్ఫటికాకార పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి బొద్దింకల గర్భధారణ సమయంలో వాటి పిల్లలకు పోషణను అందించడానికి ఉపయోగపడతాయి. ఇవి అధిక ప్రొటీన్ కంటెంట్ను కలిగి ఉంటాయి. వీటిని మనుషులు వినియోగించుకోవడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వాణిజ్యపరంగా బొద్దింకల పాలను ఉత్పత్తి చేయడం లేదు. దీనిని ఒక ‘సూపర్ ఫుడ్’గా మార్కెట్ చేసే ప్రయత్నాలను కొన్ని పరిశోధనా సంస్థలు సాగిస్తున్నాయి. కానీ ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సాంకేతిక, ఆర్థిక, సామాజిక అడ్డంకులు చాలా ఉన్నాయి.ఆవు పాలుఇవి ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పాలు. ఇవి కాల్షియం, ప్రొటీన్, విటమిన్–డిలతో నిండి ఉంటాయి. ఈ పాలను నేరుగా తాగడానికి, పెరుగు, వెన్న, చీజ్ వంటి ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు.గొర్రె పాలు ఇవి చాలా పోషకమైనవి, వీటిలో కొవ్వు, ప్రొటీన్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. గొర్రె పాలను ఎక్కువగా చీజ్ తయారీకి వినియోగిస్తారు. ముఖ్యంగా ఫెటా, రోక్ఫోర్ట్ వంటి చీజ్లు వీటితోనే తయారు చేస్తారు.గేదె పాలుఆవు పాల కంటే ఈ పాలల్లో కొవ్వు, మినరల్స్, ప్రొటీన్లు కొంత ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా భారతదేశం, పాకిస్తాన్, ఇటలీ వంటి దేశాలలో ఎక్కువగా దొరుకుతాయి. పెరుగు, మొజారెల్లా చీజ్, ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఈ పాలనే వినియోగిస్తారు. గేదె పాలు చాలా క్రీమీగా ఉంటాయి. ఇందులో లాక్టోస్ కూడా ఎక్కువ.గాడిద పాలుఇవి చాలా అరుదుగా లభిస్తాయి, కానీ వాటి పోషక విలువలు చర్మ సంరక్షణకు, ఉబ్బసం నయం చేయడానికి ప్రసిద్ధి చెందాయి. అందుకే వీటిని చర్మ సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. శిశువులకిచ్చే ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా కూడా సూచిస్తారు.మేక పాలు ఆవు పాల కంటే తేలికగా జీర్ణమవుతాయి. కొంత భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిలో కాల్షియం, విటమిన్–ఎ అధికంగా ఉంటాయి. మేక పాల నుంచి చీజ్, పెరుగులతో పాటు సబ్బులు కూడా తయారు చేస్తారు. ఈ మేక పాలు ప్రపంచ పాల ఉత్పత్తిలో సుమారు 2% వాటాను కలిగి ఉన్నాయి. పోషక విలువలు ఎక్కువగా ఉండటంతో గత 20 సంవత్సరాలలో దీని ఉత్పత్తి దాదాపు 60% పెరిగింది. మేకపాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అవయవాల పనితీరుకు సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి మంచివి.ఒంటె పాలుపశ్చిమాసియా, ఆఫ్రికాలోని ఎడారి ప్రాంతాలలో ఒంటె పాలు శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన ఆహారం. ఈ పాలలో విటమిన్–సి, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఒంటె పాలు తేలికగా జీర్ణమవుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు ఈ పాలు మంచి ఔషధం. ఈ పాలు కొన్ని వైద్యపరమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఈ పాలను ఐస్క్రీమ్, చీజ్ వంటి ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.గుర్రపు పాలుఖజక్స్తాన్, మంగోలియా, తూర్పు ఐరోపాలో గుర్రపు పాలను కూమిస్, అయిరాగ్ వంటి సంప్రదాయకంగా పులియబెట్టే పానీయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ పానీయాలు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండటమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. గుర్రపు పాలు తల్లి పాలను పోలి ఉంటాయి. అమైనో ఆమ్లాలు, కొవ్వు శాతం ఈ పాలలో ఎక్కువగా ఉండటంతో చీజ్ తయారీకి ఇవి చక్కగా పనికొస్తాయి.మూస్ పాలుఇవి చాలా అరుదుగా లభిస్తాయి. వీటిని స్వీడన్, రష్యా, కెనడాలో వాణిజ్యపరంగా ఉపయోగిస్తాయి. మూస్ పాలను చీజ్, పెరుగు, ఐస్ క్రీమ్ తయారీకి ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్లలో మూస్ చీజ్ ఒకటి.రెయిన్ డీర్ పాలుసైబీరియా, ఉత్తర స్కాండినేవియా వంటి చల్లని ప్రాంతాలలో నివసించే ప్రజలు రెయిన్ డీర్ పాలను వినియోగిస్తారు. ఆవు పాల కంటే వీటిలో కొవ్వు, ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి, ఇవి చాలా శక్తిమంతమైన ఆహారం.జిరాఫీ పాలు జిరాఫీ పాలు అసాధారణమైనవి. మానవ వినియోగానికి సాధారణంగా లభ్యం కావు. వీటి పాలలో కొవ్వు, ప్రొటీన్ అధికంగా ఉంటాయి. ఇవి జిరాఫీ పిల్లల వేగవంతమైన పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయి. అయితే, జిరాఫీల నుంచి పాలు తీయడం చాలా కష్టం. అది పెద్ద సవాలుతో కూడుకున్న పని.యాక్ పాలుహిమాలయ ప్రాంతంలో ఈ యాక్ పాలు చాలా ప్రత్యేకం. ఇవి ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి, టిబెటన్లు, ఇతర పర్వత నివాసుల ఆహారంలో ఈ పాలను తప్పనిసరి తీసుకుంటారు. ఈ పాలు చిక్కగా, ఎక్కువ కొవ్వులతో ఉండటంతో వెన్న, చీజ్ తయారీకి అనుకూలంగా ఉంటాయి.అపోహలు నిజాలుపాలు తాగితే బరువు పెరుగుతారు!ఇది నిజం కాదు. పాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా అవసరం. పాలు బరువును పెంచుతాయా లేదా అనేది మీరు తీసుకునే పాల రకం (ఫుల్ క్రీమ్, స్కిమ్డ్ మిల్క్), తీసుకునే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. క్రీమ్ తొలగించిన పాలను తీసుకుంటే క్యాలరీ కంటెంట్ తగ్గుతుంది, ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.పాలను ఎక్కువగా కాగబెడితే పోషకాలు తగ్గుతాయి!ఇది పూర్తిగా తప్పు. పాలను కాగబెట్టడంతో అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది, పాలు తాగడానికి సురక్షితంగా మారతాయి. పదేపదే మరిగించడంతో పోషకాలకు ఎటువంటి హాని జరగదు.పాలు ఎముకల నుంచి కాల్షియంను బయటకు తీస్తాయి!ఈ అపోహకు శాస్త్రీయ ఆధారాలు లేవు. వాస్తవానికి, పాలు కాల్షియంకు అద్భుతమైన వనరు. ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.పాలు తాగితే కఫం ఉత్పత్తి అవుతుంది!ఈ వాదన పూర్తిగా సరైనది కాదు. దగ్గు సమయంలో స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడంతో కఫం పెరుగుతుందని కొందరు నమ్ముతారు, కానీ పాలు తాగడానికి, కఫం ఉత్పత్తికి ప్రత్యక్ష సంబంధం లేదు.పాలు మొటిమలు రావడానికి కారణమవుతాయి!పాల వినియోగం, మొటిమల మధ్య ప్రత్యక్ష సంబంధానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. జన్యుశాస్త్రం, హార్మోన్లు, మనం తీసుకునే ఆహారం వంటి ఎన్నో అంశాలు చర్మ ఆరోగ్యంలో కీలకంగా మారతాయి.తల్లిపాలు పట్టిస్తున్నప్పుడు తల్లి అనారోగ్యంతో ఉంటే బిడ్డకు పాలు ఇవ్వకూడదు!అనారోగ్యంతో ఉన్న తల్లి, తన పిల్లలకు పాలు ఇవ్వడంలో ఎటువంటి సమస్య ఉండదు. తల్లికి అనారోగ్యంగా ఉంటే, ఆమె శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. అవి శిశువులకు రక్షణనిస్తాయి. తల్లి నుంచి పిల్లలకు వ్యాధి వ్యాపించడం చాలా అరుదుగా జరుగుతుంది.ముర్రుపాలు బిడ్డకు పట్టించకూడదు!ప్రసవానంతరం లేత పసుపు రంగులో వచ్చే ముర్రుపాలు బిడ్డకు చాలా ముఖ్యమైనవి. అవి రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, పోషకాలను నిండి ఉంటాయి.పాలు లాభాలుపాలు కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అవి పోషకాల మిశ్రమం. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లతో పాటు కీలకమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. మన రోజువారీ ఆరోగ్యానికి పాలు ఎంతగానో దోహదపడతాయి. పాలలో ఉండే ప్రధాన పోషకాలు, అవి మన శరీరానికి చేసే మేలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.విటమిన్–ఎఇది కంటిచూపుకు ఎంతో అవసరం. కణాల పెరుగుదలను ప్రోత్సహించి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.విటమిన్–డిఎముకల ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. శరీరం క్యాల్షియంను సమర్థంగా గ్రహించేలా చేస్తుంది. దాంతో ఎముకలకు పటుత్వం లభిస్తుంది.విటమిన్–బి3 (నియాసిన్) మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.విటమిన్–బి5 (పాంటోథెనిక్ ఆమ్లం)శరీరంలోని జీవక్రియలు సజావుగా సాగేందుకు ఈ విటమిన్ తోడ్పడుతుంది.విటమిన్–బి12నాడీవ్యవస్థ పనితీరుకు, డీఎన్ఏ నిర్మాణానికి ఇది అత్యవసరం.విటమిన్–ఈఇవి పాలలో తక్కువ శాతం ఉంటాయి. అయితే పాలిచ్చే జంతువులను బట్టి, అవి తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా వ్యత్యాసం ఉంటుంది. మనిషి పాలలో విటమిన్ ఈ ఎక్కువగా లభిస్తుంది.క్యాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, వాటి దారుఢ్యాన్ని కాపాడటానికి ఇది ప్రధాన పోషకం.ఫాస్ఫరస్క్యాల్షియంతో కలిసి ఎముకలు, దంతాల నిర్మాణానికి ఫాస్ఫరస్ దోహదపడుతుంది.అయోడిన్థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ కీలకమైనది, ఇది శరీర విధులను నియంత్రిస్తుంది.సెలీనియంఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, వాటికి రక్షణ కల్పిస్తుంది.జింక్రోగనిరోధక శక్తిని కాపాడటంలో జింక్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. గాయాలు త్వరగా మానేలా కూడా చేస్తుంది.ప్రొటీన్కండరాల పెరుగుదలకు ప్రొటీన్ అత్యవసరం. కణజాలం నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలం కోలుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది.కార్బోహైడ్రేట్స్పాలలోని లాక్టోస్ ఒక కీలకమైన కార్బోహైడ్రేట్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.కొవ్వులుకొవ్వులు శరీరానికి శక్తినిస్తాయి. అలాగే విటమిన్లు(ఎ, డి, ఈ వంటివి), శరీరంలో ఇముడ్చుకోవడానికి ఈ కొవ్వులు ఎంతగానో తోడ్పడతాయి.నిజానికి లాక్టోస్ అలర్జీ ఉన్నవారు పాలు, పాల పదార్థాలను తీసుకోకూడదు. వాటికి బదులుగా, కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, మొక్కల ఆధారిత పాలు (సోయా మిల్క్, బాదం మిల్క్) వంటివి తీసుకోవచ్చు. పాలు అలవాటు ఉన్నవారు, పాలు తాగడంతో ఎలాంటి సమస్య లేనివారు ఏదో ఒక రూపంలో, తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. -
కృషి ఉంటే కావ్య అవుతారు!
ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎవరైనా నెలనెలా బంగారు గుడ్డు పెట్టే బాతులానే చూస్తారు. పైగా కావ్యా ధొబాలే–దత్ఖిలే జీతం నెలకు 76 వేలు. ముంబైలోని ప్రతిష్ఠాత్మక సయాన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు తను! చిన్న వయసులోనే అంత పెద్ద ఆసుపత్రి, అంత పెద్ద జీతం అంటే మున్ముందు సర్వీసుతో పాటు పెరిగే జీతం లక్షల్లోనే కదా ఉంటుంది! అయితే కావ్య ఈ లెక్కలేమీ వేసుకోలేదు. ఆసుపత్రి ఉద్యోగానికి రాజీనామా చేసి, వ్యవసాయ క్షేత్రం వైపు మళ్లారు!కావ్య లక్ష్యం ఏమిటి? ఏం లేదు, మనుషుల ఆరోగ్యం కాపాడటం మాత్రమే. సయాన్ ఆసుపత్రిలో ఆ పనే కదా ఆమె చేస్తున్నారు! కానీ అంతకుమించి, అసలు మనుషులకు ఆసుపత్రి అవసరమే కలుగకుండా చేసే పనిని ఆమె ఎంచుకున్నారు. ఎలాగంటే – వర్మి కంపోస్ట్తో పండించే పంటల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని తెలుసుకున్న కావ్య ఏకంగా వర్మి కంపోస్ట్ ఉత్పత్తినే ప్రారంభించారు! అంతేకాదు, రసాయన రహిత పంటల గురించి అవగాహన కల్పించటం మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 200 మంది ఔత్సాహిక వర్మి కంపోస్ట్ వ్యవస్థాపకులకు శిక్షణ ఇచ్చారు. అంటే – కావ్య తన లాంటి కావ్యల్ని వందలాదిగా తయారు చేశారు. కారణం లేదు.. ప్రేరణ ఉంది ఎవరైనా ఉద్యోగం మానటానికి, ఉద్యోగం మారటానికి ఒక కారణం ఉంటుంది. కానీ కావ్య ఉద్యోగం వదలి వ్యవసాయంలోకి రావటం వెనుక ఒక ప్రేరణ ఉంది. ఆ ప్రేరణ వెనుక.. ఇతరులకు సహాయం చేయాలని చిన్నప్పట్నుంచీ ఆమెతో పాటు ఎదుగుతూ వస్తున్న తపన ఉంది. ఆ తపనే ఆమెను మొదట నర్సింగ్ కోర్సు వైపు మళ్లించింది. జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీలో డిప్లొమా చేశాక, ముంబైలోని ‘లోకమాన్య తిలక్ మునిసిపల్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్’లో (ఇదే సయాన్ హాస్పిటల్) నర్సుగా చేరారు కావ్య. తర్వాత టాటా క్యాన్సర్ హాస్పిటల్లో రెండేళ్లు పని చేశారు. 2017లో నర్సింగ్లో బీఎస్సీ పూర్తి చేశాక ఏడాది పాటు ఒక ప్రైవేటు కాలేజీలో నర్సింగ్ పాఠాలు చెప్పారు. ఆ తర్వాత తిరిగి సయాన్ ఆసుపత్రిలో ఉద్యోగిగా చేరి స్టాఫ్ నర్స్ అయ్యారు. అలా చేరటమే ఆమె కెరీర్ను వ్యవసాయం వైపు మలుపు తిప్పింది. అన్ని మరణాలను చూశాక..!2019 నుంచి 2022 వరకు సయాన్ లో నర్సుగా ఉన్నారు కావ్య. అది కరోనా వ్యాపించిన పాడు కాలం. నర్సుగా ఆమె కొన్ని నెలల పాటు అనేక మంది తన కళ్ల ముందే కరోనాతో మరణించటాన్ని దగ్గరగా చూశారు. దాంతో ఆమె జీవిత దృక్పథమే మారిపోయింది. ‘‘నేను కూడా అదే సమయంలో కరోనా వైరస్ బారిన పడ్డాను. దాదాపుగా మరణశయ్యపై ఉన్నాను. కానీ నా రోగ నిరోధక శక్తి నన్ను రక్షించింది. మనం పండిస్తున్న, మనం తింటున్న రసాయనాలతో కూడిన ఆహారం వల్ల మన శరీరాలు బలహీనమౌతున్నాయని నాకు అర్థమైంది. అప్పుడే నేనొక నిర్ణయానికి వచ్చాను. రసాయనాల జాడలు లేని పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాను’’ అంటారు కావ్య. ఉద్యోగం వదలి వర్మి కంపోస్ట్లోకిఅయితే అందుకోసం ఉద్యోగం మానేయాలన్న కావ్య నిర్ణయాన్ని ఆసుపత్రిలో, ఇంట్లో, బంధువుల్లో ఎవరూ హర్షించలేదు. ఆమె భర్త రాజేశ్ దత్ఖిలే ఒక్కరే ఆమె వైపు నిలబడ్డారు. అలా 2022లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబై నుంచి భర్త స్వగ్రామమైన పుణె దగ్గరి జున్నార్కు మారిపోయారు కావ్య. అక్కడే ఆమె వర్మి కంపోస్ట్ను ఉత్పత్తి చేయటం మొదలు పెట్టారు. దాని కన్నా ముందు వర్మి కంపోస్ట్ను ఎలా తయారు చేయాలో కొన్ని నెలల పాటు వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకున్నారు. అలా ఆసుపత్రి బెడ్ల మధ్య నుంచి వర్మి కంపోస్ట్ ‘బెడ్’ల మధ్యకు వచ్చారామె.కిలో వానపాములే పెట్టుబడి‘‘నా ప్రారంభ పెట్టుబడి సున్నా. 2022 ఆగస్టులో ఒక రైతు నుంచి కిలో వాన పాములను తీసుకుని చిన్న ‘బెడ్’తో (ఎత్తు మడి) పనిలోకి దిగాను. ఆవు పేడలో వాన పాములను జోడించాను. వాటికి ఆహారంగా ఇతర పశువుల పేడ, రాలిన చెట్ల ఆకులు, పంట అవశేషాలు, కూరగాయల వ్యర్థాలు, ఇతర సేంద్రియ పదార్థాలను ఉపయోగించాను. 2022 అక్టోబర్ నాటికి తొలి విడత వర్మి కంపోస్ట్ సిద్ధమైపోయింది’’ అని ఎంతో ఎగ్జయింట్గా చెబుతారు కావ్య. తర్వాత ‘బెడ్’ల సంఖ్య పెరిగింది, వర్మి కంపోస్ట్ ఉత్పత్తీ పెరిగింది. చివరికి అదొక వ్యాపారంగానూ మారింది.ఈ ఆర్థిక సంవత్సరానికి కావ్య టర్నోవర్ ఎంతో తెలుసా? 24 లక్షల రూపాయలు! టర్కీ, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలకు ‘కృషి కావ్య బ్రాండ్’ పేరుతో కావ్య వర్మి కంపోస్ట్ ఎగుమతి అవుతోంది. కావ్య దగ్గర శిక్షణ తీసుకున్న రెండు వందల మందీ మహారాష్ట్ర వ్యాప్తంగా వర్మి కంపోస్ట్ను తయారు చేస్తూ ఆరోగ్యవంతమైన ప్రకృతి వ్యవసాయానికి తోడ్పతున్నారు. తామూ ఉపాధి పొందుతున్నారు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
రంగులు మార్చుకునే ఎడారి..!
సోసుస్వ్లీ– ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది నమీబియా ఎడారిలో ఉన్న మైదానం. దాని చుట్టూ ఎత్తయిన ఎర్రని ఇసుక, బంకమట్టితో కూడిన మట్టితిన్నెలు ఇట్టే ఆకట్టుకుంటాయి. వేళను బట్టి, కాలాన్ని బట్టి ఇవి అద్భుతమైన రంగులను సంతరించుకుంటాయి. రంగురంగుల మట్టితిన్నెలతో కూడిన ఈ ప్రాంతం ఫొటోగ్రాఫర్స్ మెచ్చే ప్రత్యేకమైన ప్రదేశం. ఇక్కడ డ్యూన్–45 అనే మట్టితిన్నె ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సందర్శకులు దీని పైకెక్కి చుట్టుపక్కల విశాలమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తుంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన చోటు ఏంటంటే డెడ్వ్లీ అనే ప్రదేశం. ఇక్కడ వందల సంవత్సరాల నాటి చనిపోయిన కేమెల్ థోర్న్ చెట్లు తెల్లటి బంకమట్టి నేలపై నిటారుగా నిలబడి ఉంటాయి. అవి ఒక అద్భుతమైన దృశ్యాన్నిస్తాయి. (చదవండి: ఇదేం పండుగ సామీ..! ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టి..) -
బొడ్డు తాడుని ఆలస్యంగా ఎందుకు కట్ చేస్తారంటే..?
నాకిప్పుడు తొమ్మిదోనెల. ఈ మధ్యన ఇంటర్నెట్లో బొడ్డుతాడును ఆలస్యంగా కత్తిరించడం గురించి చదివాను. అది ఎలా ఉపయోగపడుతుంది? – వెన్నెల, కర్నూలు. బొడ్డుతాడును ఆలస్యంగా కత్తిరించడం అనేది ఇప్పుడు అన్ని ఆసుపత్రులూ రొటీన్గా ఫాలో అవుతున్నాయి. బొడ్డుతాడు బేబీని, తల్లి ప్లాసెంటాకు జాయిన్ చేస్తుంది. ఈ తాడును డెలివరీ తరువాత కట్ చేస్తాం. ఈ పద్ధతిలో కనీసం ఒక నిమిషం నుంచి మూడు నిమిషాలు ఆగి ఆలస్యంగా కట్ చేస్తే బేబీకి ఉపయోగాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఇందులో అధిక రక్తప్రసరణ జరిగి, బేబీకి మంచి జరుగుతుంది. అందుకే, దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సపోర్ట్ చేస్తోంది. అకస్మాత్తుగా బొడ్డుతాడును కత్తిరించినప్పుడు బేబీ బ్లడ్ ప్రెజర్ సడన్గా డ్రాప్ అవుతుంది. ఈ బొడ్డుతాడుతో బేబీకి బ్లడ్ ఐరన్ లెవెల్స్ స్టేబుల్గా ఉంటాయి. మెదడు ఎదుగుదలకు కూడా ఇది సహాయం చేస్తుంది. ఈ ప్రాసెస్ నార్మల్ డెలివరీ అయిన కేసెస్లో ఫాలో కావాలి. బేబీ పుట్టిన వెంటనే డ్రై చేసి, పొత్తిళ్లలో చుట్టి, పిల్లల డాక్టర్ అసెస్మెంట్ చేస్తారు. బేబీ ఏడుపు బాగుంటే, కనీసం ఒక నిమిషం ఆగి, బొడ్డుతాడును కత్తిరిస్తారు. ప్రీ ట్రర్మ్, సిక్ బేబీస్కి ఇలా ఆలస్యంగా బొడ్డుతాడును కత్తిరించడం ఇంకా మంచిది. అయితే, మరీ, ఆలస్యంగా బొడ్డుతాడును కత్తిరించడం కారణంగా, కొంతమంది బేబీస్కి ఎక్కువ రక్తం వెళ్తుంది. చాలా అరుదుగా జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది కంట్రోల్ చెయ్యటానికి బేబీస్కి ఫొటోథెరపీ అవసరం. కానీ, కొంతమందికి కాన్పు కష్టంగా జరిగినప్పుడు, ఆలస్యం చేయకుండా వెంటనే బొడ్డుతాడును కత్తిరిస్తారు. కానీ, తల్లి ఆరోగ్యం నిలకడగా ఉంటే, బేబీ బొడ్డుతాడుని తప్పకుండా ఒక నిమిషం ఆగి, ఆ తర్వాతే కత్తిరిస్తారు. నాకు బిడ్డపుట్టి నెలవుతుంది. డెలివరీ అయినప్పటీ నుంచి నాకు పాలు తక్కువగానే వస్తున్నాయి. పాలు బాగా రావటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – శైలజ, తిరుపతి. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు చాలా ముఖ్యం. బేబీ కనీసం పదిహేను నుంచి నలభై నిమిషాల పాటు రొమ్ములను కంటిన్యూయస్గా సకింగ్ చెయ్యాలి. అప్పుడు ఆ స్టిమ్యులేషన్కి పాలు కూడా బాగా ఉత్పత్తి అవుతాయి. కొంతమంది బేబీ బాగా నిద్ర పోయినప్పుడు పాలు ఇవ్వకుండా ఉంటారు. అలా చేయకూడదు. బేబీ నిద్రపోయినా సరే, మీరు బేబీని రొమ్ముకి పెట్టుకొని నిద్రలేపటానికి ప్రయత్నించాలి. కనీసం రోజులో ఎనిమిదిసార్లు పాలు తాగేటట్టు చేయాలి. కొంత సమయం, ఓపిక, సపోర్ట్ ఇచ్చినప్పుడు బ్రెస్ట్ఫీడ్ చెయ్యలేకపోవటం అనేది ఉండదు. కొంతమంది బేబీస్ అసలు పాలు తాగడానికి కూడా ప్రయత్నం చెయ్యరు. అప్పుడు మీరు హ్యాండ్ ఎక్స్ప్రెస్ చేసి, ఉగ్గు గిన్నెలో నుంచి పట్టడానికి లేదా బ్రెస్ట్ బిల్క్ బాటిల్ నిపుల్ ద్వారా ఇవ్వటానికి ప్రయత్నించండి. బేబీకి బ్రెస్ట్ ఫీడ్ అలవాటు కావటానికి ఎప్పుడూ స్కిన్ టు స్కిన్ దగ్గరగా ఉంచండి. రెండు గంటలకు ఒకసారి పాలు ఇవ్వండి. బేబీ నిపుల్ని నోటితో పట్టుకునేటట్లు ప్రతి గంటన్నరకు ప్రయత్నించండి. చాలా డల్గా ఉంటే బేబీని ఒకసారి పిల్లల డాక్టర్కు చూపించండి. కొన్నిసార్లు షుగర్ డౌన్ అయితే అలా ఉంటారు. అప్పుడు ఫార్ములా ఫీడ్ ఎలా ఇవ్వాలో చెప్తారు. బ్రెస్ట్ పంప్ ఉపయోగించడం చాలా మంచిది. బేబీ నిపుల్ పట్టుకోకపోతే ప్రతి రెండు గంటలకు ఎలక్ట్రానిక్ పంప్ వాడడం వల్ల నిపుల్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది. దీనితో ప్రోలాక్టిన్ రిసెప్టర్స్ స్టిమ్యులేట్ అవుతాయి. సాధారణంగా డెలివరీ అయిన రెండు వారాల తరువాతే బ్రెస్ట్ మిల్క్ ఫ్లోలాగా చాలామందికి వస్తుంది. అందుకే ముందే మిల్క్ రావట్లేదు అని టెన్షన్ పడి, బ్రెస్ట్ ఫీడింగ్కి దూరం చేసే బాటిల్ ఫీడ్, ఫార్ములా ఫీడ్ ఇవ్వకండి. ట్రై చేస్తూనే ఉంటే ఫీడింగ్ ఇంప్రూవ్ అవుతుంది. పోషకాహారాలు ఎక్కువ ఉండే డైట్, లాక్టేషన్ డైట్ కౌన్సెలర్ని కలసి సలహా తీసుకోండి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఈ చికిత్సతో..పుట్టుమచ్చలను ఈజీగా తొలగించుకోవచ్చు..!) -
ఈ చికిత్సతో..పుట్టుమచ్చలకు చెక్..!
పుట్టుమచ్చ అంటే జీవితాంతం ఉండే మచ్చ అన్నట్లుగా ఫీలవుతుంటాం. కానీ పుట్టుమచ్చ నచ్చకుంటే ‘సర్జికల్ ఎక్సిషన్ ట్రీట్మెంట్’తో తొలగించవచ్చు. నిజానికి ఈ ట్రీట్మెంట్ సాధారణంగా వైద్య ప్రక్రియలో చర్మ క్యాన్సర్లకు వినియోగించే చికిత్స. అయితే దీన్ని సౌందర్య కారణాల కోసం కూడా వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో, మొదట తొలగించాల్సిన పుట్టుమచ్చ దగ్గర మత్తు ఇంజెక్షన్ చేస్తారు. దాంతో ఆ భాగం తిమ్మిరిగా మారి, నొప్పి తెలియకుండా అవుతుంది. తర్వాత, ప్రత్యేకమైన శస్త్రచికిత్స పరికరాన్ని ఉపయోగించి పుట్టుమచ్చను, దాని చుట్టూ ఉన్న కొద్ది చర్మాన్ని తొలగిస్తారు. ఇలా చేయడంతో పుట్టుమచ్చ పూర్తిగా పోతుంది. తిరిగి వచ్చే అవకాశం 99 శాతం తగ్గుతుంది. తొలగించిన చర్మానికి కుట్లు వేస్తారు. చికిత్స జరిగిన ప్రదేశాన్ని బట్టి కొన్ని రోజుల నుంచి వారాల వరకు ఆ కుట్లు ఉంచుతారు. శస్త్రచికిత్స తర్వాత, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచు కోవడం, వైద్యుడు ఇచ్చిన సూచనలను పాటించడం చాలాముఖ్యం. (చదవండి: ఈ డివైజ్తో అవాంఛిత రోమాలు మాయం..!) -
ఈ డివైజ్తో అవాంఛిత రోమాలు మాయం..!
ముఖం, మెడపై అవాంఛిత రోమాలుంటే ఏ మేకప్ వేసుకున్నా వృథానే అనిపిస్తుంది. ఇక కాళ్లు, చేతుల మీద వెంట్రుకలు పెరిగితే నచ్చిన డ్రెస్లు కూడా వేసుకోలేం. అన్నింటికీ ఒకటే పరిష్కారం అవాంఛిత రోమాలను తొలగించడం. అందుకోసం హెయిర్ రిమూవల్ క్రీమ్ వాడుకోవడం లేదా వ్యాక్సింగ్ చేయించుకోవడం ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు చాలామంది. అలాంటి వారికి చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఈ డివైస్.నిమిషానికి 120 ఫ్లాష్లతో ఈ మెషిన్ పని చేస్తుంది. 12 వారాల పాటు దీనితో ట్రీట్మెంట్ అందుకుంటే తర్వాత మంచి ఫలితాలుంటాయి. దీనికి పవర్ కేబుల్తో పాటు నాలుగు ప్లగ్ అడాప్టర్స్ లభిస్తాయి. మొదటిగా వెంట్రుకలను ట్రిమ్ చేసుకుని, అనంతరం ఈ డివైస్ లైట్ ఫ్లాష్లను తీసుకుంటే ఆ భాగంలో రోమాలు మటుమాయం అవుతాయి.ఈ గాడ్జెట్ వెంట్రుకలను లోతుగా తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. దీని లైట్ టెక్నాలజీ వెంట్రుకల కుదుళ్లను లక్ష్యంగా చేసుకుని, వాటి పెరుగుదలను తగ్గిస్తుంది. ఈ ఎపిలేటర్ చర్మానికి ఎటువంటి హాని కలిగించదు. దీనిలో చర్మాన్ని చల్లబరిచే వ్యవస్థ ఉంటుంది. ఈ మెషిన్ సున్నితంగా ఉండేలా సిలికాన్ రక్షక కవచంతో రూపొందింది. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఈ డివైస్ల్లో చాలా కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇదే మోడల్లో ఫ్లాష్ ఫ్రీక్వెన్సీని బట్టి, ఎక్స్ట్రా ఆప్షన్స్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉండొచ్చు. (చదవండి: అందంతో మాయ చేసే ముద్దుగుమ్మ మృణాలిని బ్యూటీ రహస్యం ఇదే..!) -
చేపల టీచర్..!
అక్వేరియం చేపల పెంపకంలో ఉన్న పార్వతి నెలకు రు.50 వేలకు పైగానే సంపాదిస్తారు. కానీ అంతకు మించిన సంతోషం ఆమెకు వేరే ఉంది! చేపల పెంపకంలో శిక్షణ కోసం తన దగ్గరకు వచ్చే కొల్లమ్లోని ‘కాలేజ్ అండ్ ఫిషరీస్ స్కూలు’ విద్యార్థులు తనను ‘‘టీచర్.. టీచర్..’’ అంటూ సందేహాలు అడుగుతుండటం మనసుకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని చెబుతారామె.పార్వతి సోషియాలజీ గ్రాడ్యుయేట్. 18 ఏళ్ల క్రితం – పెళ్లయే వరకు ఆమెకు అక్వేరియం చేపల పెంపకం అనే ఆలోచనే లేదు. మెట్టినింటి వాళ్లకు చేపల వ్యాపారం ఉంది. ఎనిమిది చేపల చెరువులు ఉన్నాయి. వాటిల్లో వేటికవిగా... తినే చేపల్ని, అక్వేరియం చేపల్ని పెంచుతుంటారు. భర్తతో కలిసి చేపల చెరువులకు వెళ్లొస్తుండటం, వాటిని మార్కెట్ చేయటం వంటివి చూస్తూ క్రమంగా తనూ చేపల పెంపకంపై ఆసక్తి పెంచుకున్నారు పార్వతి. అయితే పార్వతి కేవలం అక్వేరియం చేపల పెంపకాన్ని మాత్రమే ఎంచుకున్నారు. వీటినే ఆర్నమెంట్ చేపలనీ, రంగు చేపలనీ అంటారు. ఇప్పుడంటే ఆమె తన ‘దేవూస్ ఆక్వా ఫామ్’ నిర్వహణతో పూర్తిగా మెలకువల్ని తెలుసుకోగలిగారు కానీ, మొదట్లో ఆ చేపల్ని పెంచటం చాలా కష్టంగా ఉండేదట! ‘‘కొన్నిసార్లు కుంటలోని అక్వేరియం చేపలు మొత్తం చనిపోయి కనిపించేవి. నష్టం మాట ఎలా ఉన్నా ఆ చిన్ని ప్రాణులు విగతజీవులై నీటి పైన తేలియాడుతూ ఉండటం చూసి మనసుకు ఎంతో బాధ కలిగేది’’ అంటారు పార్వతి. దాచుకున్న డబ్బుతో..!వివిధ సైజులలోని 21 సిమెంటు కుంటలలో అక్వేరియం చేపల్ని పెంచుతున్నారు పార్వతి. ఈ బ్రీడింగ్ ట్యాంకులు పెద్దవిగా ఉంటాయి. బేబీ ఫిష్లను ఆ పెద్దవాటికి దూరంగా ఉంచటం కోసం ప్రత్యేకంగా మరి కొన్ని చిన్న ట్యాంకులు ఉంటాయి. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ పథకం కింద రుణంగా తీసుకున్న డబ్బు కొంత, తన దగ్గరున్న దాచుకున్న డబ్బు కొంత కలిపి రు.15 లక్షల పెట్టుబడితో ఈ అక్వేరియం చేపల (ఆర్నమెంట్ ఫిష్) బిజినెస్ను ప్రారంభించారామె. పార్వతికి కొల్లమ్, అలెప్పి, కొట్టాయం, తిరువనంతపురం, పఠనంతిట్ట, ఇంకా ఉత్తర కేరళలోని కొన్ని ప్రాంతాలలో క్లయింట్లు ఉన్నారు. చిన్న దుకాణాల వాళ్లు కూడా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. నెలకు తక్కువలో తక్కువగా రు.15 వేలు, ఎక్కువలో ఎక్కువగా లక్ష వరకు రాబడి ఉంటోంది. ప్రస్తుతం కాయ్ కార్ప్, మార్ఫ్, క్రిబెన్సిస్, జులిడోక్రోమిస్, బ్యూటికాఫ్యూరి, ఫ్రంటోసా, జెబ్రా డేనియోస్, రెయిన్ బో సిక్లిడ్, హెకెల్లి, మూన్ లైట్ గోరమి రకం రంగు చేపల్ని తన ఫామ్లో ఉత్పత్తి చేస్తున్నారు పార్వతి. మొదట్లో అన్ని చోట్లా దొరికే ఏంజెల్, గుప్పి, ఫైటర్, గోల్డ్ఫిష్ రకాల్ని మాత్రమే పెంచేవారు. చేప రకాన్ని బట్టి బ్రీడింగ్ ఉంటుంది. ‘‘మార్ఫ్ వెరైటీలో ఆడ చేపలు గుడ్లు పెడతాయి. ఆ గుడ్లను మగ చేపలు తమ నోటిలో పొదుగుతాయి. అది మాకు తెలుస్తుంది. అప్పుడు ఆ మగ చేపల్ని వేరే కుంటలోకి మారుస్తాం’’ అని ఎంతో ఆసక్తికరంగా వివరిస్తారు పార్వతి. ప్రస్తుతం ఆమె తన బిజినెస్ను మరింతగా విస్తృతపరచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. దాచుకోని విద్యతో...!అక్వేరియం చేపల పెంపకంలోని ఈ అనుభవం అంతా కేవలం నేర్చుకోవటం ద్వారానే పార్వతికి లభించలేదు. పనగఢ్లోని ‘కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్డడీస్’లో రీసెర్చర్గా ఉన్న యానా మెర్సీతో కలిసి కొంతకాలం పని చేశారామె. ‘‘ప్రతి పనిలోనూ కష్టం ఉంటుంది. రాబడిలో ఒడిదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ ముందుకు సాగిపోవాలి. మనకు తెలిసిన విద్యను దాచుకోకుండా, రాబోయే తరాల వారికి పంచాలి.. ’’ అంటారు పార్వతి.కొన్ని విశేషాలుప్రపంచంలో స్టాంప్ కలెక్షన్ తర్వాత అతి పెద్ద హాబీ ఇంట్లో అక్వేరియం ఉంచుకోవటమే!అక్వేరియంలోని రంగురంగుల చేపల్ని చూస్తుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో రూఢి అయింది.రంగు చేపల అమ్మకానికి, పెంపకానికి చెన్నైలోని కొళత్తూరు ప్రసిద్ధి.ఆసియాలోని అతి పెద్ద ‘రంగు చేపల మార్కెట్’గా కొళత్తూరు గుర్తింపు సంపాదించింది.అక్వేరియంలో ఉండే చేపలు చాలా సున్నితమైనవి. వాటికి సమపాళ్లలో రెండు పూటలా ఆహారం అందించాలి.అక్వేరియంలో అధిక సంఖ్యలో చేపల్ని ఉంచితే, వాటి విసర్జితాలు ఎక్కువై నీటిలో అమోనియం అధికమౌతుంది. చేపలకు హానికరంగా మారుతుంది. అక్వేరియంలో నీటిని తరచు మారుస్తుండాలి. పెద్ద తొట్టె అయితే వారానికోసారి, చిన్నదైతే రెండు రోజులకోసారి నీటిని మార్చాలి. అక్వేరియంలో నీటికి మార్చకపోతే బాక్టీరియా చేరి చేపలు చనిపోయే అవకాశం ఉంది. చేపలకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ప్రత్యేక మోతాదుల్లో ఇవ్వాలి. ఈ వివరాలను షాపు వాళ్ల నుంచి తెలుసుకోవచ్చు. సాక్షి, స్పెషల్ డెస్క్ (చదవండి: మన ముచ్చట: పుస్తకానికి గుడి) -
వేచవుల మామిడి
వేసవిలో మామిడి సందడి తెలియనిది కాదు. పండ్లలో రారాజైన మామిడి రుచికైనా, ఆరోగ్యానికైనా ముందు వరుసలోనే నిలుస్తుంది. భిన్న ఆకారాలు, విభిన్న పరిమాణాలలో పండుతున్న మామిడి పండ్లలో నాణ్యతను గుర్తించడం ఎలా.? అసలు సిసలు మామిడి రుచులను ఎన్నుకోవడం ఎలా? మ్యాంగో లవర్స్కి ఇది పెద్ద సమస్యే. అయితే, మామిడిలో నిజమైన, అసలైన రుచులను చవిచూడాలంటే జీఐ ట్యాగ్ (భౌగోళిక గుర్తింపు) పొందిన మామిడి రకాల వివరాలు తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఆ వివరాలు తెలుసుకుందామా?లంగ్డా(ఉత్తరప్రదేశ్)వారణాసి ప్రాంతానికి చెందిన ఈ మామిడి పండు ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. కొద్దిగా పులుపు, తీపితో చాలామందికి ఇది నచ్చుతుంది. పైగా ఈ కాయ, ముగ్గిన తర్వాత కూడా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది.కుట్టియత్తూర్ (కేరళ)కేరళలోని కన్నూర్ జిల్లాలో పండించే ఈ మామిడి పండు మృదువైన, మచ్చలేని తొక్కతో ఉంటుంది. మెత్తని గుజ్జుతో తీపిగా చాలామందికి నచ్చుతుంది. ఇది సాధారణంగా చాలామంది ఇంటి పెరటిలో భాగమైంది.బంగినపల్లి – బనగానపల్లె (ఆంధ్రప్రదేశ్) ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన ఈ మామిడి పండు తీపి రుచితో పాటు తక్కువ పీచు ఉంటుంది. అంతా గుజ్జే ఉంటుంది. పైగా ఎక్కువ కాలం నిల్వ ఉండటమే దీని ప్రత్యేకత.మలిహాబాది దసేహరి (ఉత్తరప్రదేశ్)ఉత్తరప్రదేశ్లోని మలిహాబాద్ ప్రాంతంలో పండించే ఈ మామిడి రకం తియ్యటి రుచి, చక్కటి సువాసనకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలోని సారవంతమైన నేల, వాతావరణం దీని ప్రత్యేకమైన రుచికి కారణం అవుతాయి.రతౌల్ (ఉత్తరప్రదేశ్)ఇవి ఉత్తరప్రదేశ్, బాగ్పత్ జిల్లా, రతౌల్ గ్రామంలో పండే ఒక ప్రత్యేకమైన మామిడి రకం. పాకిస్తాన్ లో కూడా ఈ రతౌల్ మామిడి సాగు చేస్తారు. అయితే భారతదేశంలో దీనిని రతౌల్ అని పిలిస్తే, పాకిస్తాన్ లో అన్వర్ రతౌల్ అని పిలుస్తారు.జర్దాలు (బిహార్) బిహార్లోని భగల్పూర్ ప్రాంతంలో పండించే ఈ మామిడి పండు లేత పసుపు రంగులో ఉంటుంది. దీని సువాసన మరింత ఆకట్టుకుంటుంది. వీటిని ఎక్కువగా బహుమతులుగా ఇస్తుంటారు.హిమసాగర్ (పశ్చిమ బెంగాల్) పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, నాదియా జిల్లాల్లో పండించే ఈ మామిడిపండు పీచు లేని గుజ్జుతో తియ్యగా ఉంటుంది. వీటి పరిమళాన్ని చాలామంది ఇష్టపడతారు.గిర్ కేసర్ (గుజరాత్)గుజరాత్లోని గిర్నార్ కొండల ప్రాంతంలో పండించే ఈ మామిడి పండు కుంకుమపువ్వు రంగు గుజ్జుతో, తియ్యని రుచికి ప్రసిద్ధి చెందింది. దీనిని ‘మామిడిపండ్ల రాణి’ అని పిలుస్తారు.కరి ఇషాద్ (కర్ణాటక) కర్ణాటక తీర ప్రాంతంలో పండించే ఈ మామిడి పండు తియ్యటి గుజ్జుతో, ప్రత్యేకమైన రుచితో ప్రసిద్ధి చెందింది. దీనిని సాధారణంగా తొక్క, టెంకతో సహా మొత్తం తింటారు.అల్ఫోన్సో (మహారాష్ట్ర)‘మామిడిపండ్ల రాజు’ అని పిలువబడే అల్ఫోన్సో మ్యాంగో అద్భుతమైన రుచి, మృదువైన ఆకృతి, ఆకర్షణీయమైన సువాసనతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలోని రత్నగిరి, సింధుదుర్గ్, రాయ్గఢ్ ప్రాంతాలలో ఇది ప్రత్యేకంగా పండుతుంది.ఫజ్లీ (పశ్చిమ బెంగాల్) ఇది ఆలస్యంగా పరిపక్వం చెందే మామిడి రకం. అంటే ఇతర మామిడి పండ్లతో పోలిస్తే ఇవి సీజన్లో ఆలస్యంగా పండుతాయి. ఇవి బరువు ఎక్కువగా, పెద్ద పరిమాణంలో కాస్తాయి. వీటిని బంగ్లాదేశ్లో కూడా పండిస్తారు. వీటిని జామ్లు, పచ్చళ్ళ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.లక్ష్మణ్ భోగ్ (పశ్చిమ బెంగాల్)ఈ తియ్యటి మామిడిని పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో పండిస్తారు. వీటిని అధికంగా యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.అప్పెమిడి (కర్ణాటక)దీన్ని కర్ణాటకలో మల్నాడు ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. ఇది చూడటానికి చిన్నగా ఉంటుంది. ఎక్కువగా ఊరగాయలకు వినియోగిస్తారు. ఈ జాతిలో కచప్ప అప్పెమిడి, కర్నాకుండల అప్పెమిడి వంటి అనేక ఉప రకాలు ఉన్నాయి. అవన్నీ ప్రత్యేకమైన రుచిని, సువాసనను కలిగి ఉంటాయి.మరాఠ్వాడా కేసర్ (మహారాష్ట్ర)ఇవి మహారాష్ట్రలోని, మరాఠ్వాడా ప్రాంతంలో సాగు చేసే ఒక రకం మామిడి. ఈ మామిడి కుంకుమపువ్వు రంగుతో గాఢమైన రుచికి, తియ్యదనానికి ప్రసిద్ధి చెందింది. జీఐ ట్యాగ్ ఉన్న మామిడి పండ్లనే ఎన్నుకుని కొనుగోలు చేయడంతో నాణ్యమైన పండ్లు తినొచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాటినే ఎంచుకుని, కొనుగోలు చేయడంతో ఆయా పంటను పండించే రైతులకు మద్దతు ఇస్తున్నట్లు కూడా అవుతుంది. మరోవైపు ప్రపంచ దేశాల్లో మన దేశీయ వ్యాపారం మెరుగుపడుతుంది. -
పదో తరగతి తర్వాత
పదో తరగతి తర్వాత ఏం చదవాలి? ఏం చేయాలి? ప్రతి విద్యార్థి, ప్రతి పేరెంట్ ఎదుర్కొనే సాధారణమైన ప్రశ్న. మీ బిడ్డకు ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే కార్పొరేట్ కాలేజీలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లేదంటే ఆ కాలేజీల మార్కెటింగ్ ఏజెంట్లు వస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఐఐటీ, నీట్, ఎంసెట్ అంటూ ఆశలు చూపిస్తారు. లేదంటే సీఈసీ ప్లస్ సీఏ అంటూ వస్తారు. తమ కాలేజీల్లో చేర్పించుకుంటారు. చాలామంది ఇలాగే స్నేహితులు, పొరుగింటివాళ్లు, బంధువులు, సమాజం ప్రభావం వల్ల ‘అందరూ ఎంచుకునే దారి’లోనే ప్రయాణిస్తుంటారు. ఆ తర్వాత అక్కడ ఒత్తిడి భరించలేక నానా అవస్థలు పడుతుంటారు. అనేకమంది విద్యార్థులు మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనలాంటి సమస్యలతో కౌన్సెలింగ్ కోసం వస్తుంటారు. కొందరు కోరుకున్నది సాధించలేక తీవ్ర మానసిక సమస్యల్లో పడిపోతుంటారు. ఈ పరిస్థితులు మారాలంటే, మార్చాలంటే కావాల్సింది– కెరీర్ కౌన్సెలింగ్. కెరీర్ కౌన్సెలింగ్ అంటే...పదో తరగతి తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ జీవిత దశ, దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఈ దశలో కెరీర్ కౌన్సెలింగ్ ఒక గేమ్ చేంజర్గా నిలుస్తుంది. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఆసక్తి, సామర్థ్యాలు ఉంటాయి. ఒకరు ఎదిగే దారి మరొకరికి సరిపోదు. కెరీర్ కౌన్సెలింగ్లో ‘ఏది ఫేమస్’ అని కాకుండా, ‘ఏది మీకు బెస్ట్’ అనే ప్రశ్నకు శాస్త్రీయమైన, మానసికమైన సమాధానం దొరుకుతుంది. ఇది గూగుల్ మ్యాప్ లాంటిది. మీ లక్ష్యానికి సులువైన దారి చూపిస్తుంది. తప్పుడు మార్గంలో వెళ్తే హెచ్చరిస్తుంది.ఉదాహరణకు ఏనుగు, కోతి, చేపకు చెట్టెక్కమనే పరీక్ష పెడితే? ఒక్క కోతి మాత్రమే గెలుస్తుంది. మిగతావన్నీ ఓడిపోతాయి. అలాగని అవన్నీ పనికిరానివి అనగలమా? దేని బలం దానిదే, దేని ప్రత్యేకత దానిదే! అలాగే పదో తరగతి తరువాత ఏం చదవాలనే నిర్ణయం కూడా వ్యక్తిగతంగా ఉండాలి.కెరీర్ కౌన్సెలింగ్ ఎందుకు అవసరమంటే... ∙మనకు తెలియని అంతర్గత శక్తులను బయటకు తేవడానికి ∙మనకున్న ఆసక్తి, వ్యక్తిత్వం, సామర్థ్యానికి సరిపడే కోర్సు ఏదో కనుగొనడానికి ∙‘అందరూ చేస్తున్నది నేనూ చేయాలి’ అనే ఉచ్చులోంచి బయటపడడానికి ∙భవిష్యత్తులో ఉన్న అవకాశాలు, సవాళ్లు, రిస్క్లు తెలుసుకోవడానికి ∙మన లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందు స్పష్టత కోసం.పదో తరగతి తర్వాత విద్యావకాశాలు... పదో తరగతి తర్వాత అందరికీ తెలిసింది ఇంటర్మీడియట్ చదవడం. దానిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు ఉంటాయి. ఇవి కాకుండా హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, మల్టీమీడియా, ట్రావెల్ అండ్ టూరిజం కోర్సులు కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్ చదివి ఆ తర్వాత ఇంజినీరింగ్ చేసే అవకాశమూ ఉంది. తక్షణ ఉద్యోగావసరం ఉన్నవాళ్లు ఐటీఐ చేస్తే ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇవి కాకుండా అరుదుగా తెలిసిన, భవిష్యత్తులో హై డిమాండ్ ఉన్న కోర్సులు కూడా ఉన్నాయి. ఇవి ఉన్నట్లు కూడా చాలామందికి తెలియదు. కాని, వీటిలో ఆసక్తి, సామర్థ్యం, ప్యాషన్ ఉంటే చాలా గొప్ప కెరీర్ అవకాశాలున్నాయి. ఉదాహరణకు, యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్లో డిప్లొమా, సైబర్ ఫోరెన్సిక్ డిప్లొమా, గేమింగ్ డిప్లొమా, రోబోటిక్స్, ఏఐ డిప్లొమా, ఫైర్ ఇంజినీరింగ్, పారామెడికల్ కోర్సులు. కౌన్సెలింగ్ లేకుండా నిర్ణయం తీసుకుంటే వచ్చే నష్టాలు∙తల్లిదండ్రులు, ఇతరుల మాటలు విని తీసుకున్న కోర్స్ మధ్యలోనే బోర్ కొడుతుంది. ∙మనకు సామర్థ్యం లేని సబ్జెక్టుల వల్ల పరీక్షల్లో తప్పే అవకాశాలు పెరుగుతాయి. ∙‘నాక్కావాల్సింది ఇది కాదు’ అని గుర్తించినప్పుడు మళ్ళీ రీ–స్టార్ట్ చెయ్యాలి. ∙విలువైన సంవత్సరాలు, డబ్బు, మెంటల్ ఎనర్జీ వృథా అవుతాయి. ∙చివరికి వృత్తి, ఉద్యోగం, జీవితంలో అసంతృప్తికి దారితీస్తుంది.కౌన్సెలింగ్ తీసుకుంటే వచ్చే లాభాలు∙మీకు సరిపడే స్ట్రీమ్ లేదా కోర్స్ను గుర్తించగలుగుతారు. ∙స్పష్టత, ఆత్మవిశ్వాసం, నిబద్ధత వస్తాయి. ∙‘అందరూ వెళ్తున్న దారి’ కంటే ‘నాకు సరిపోయే దారి’ఎంచుకునే ధైర్యం వస్తుంది. ∙భవిష్యత్తులో ఉండే కెరీర్ అవకాశాలపై పూర్తి అవగాహన పెరుగుతుంది. ∙ప్రవేశ పరీక్షలు, అందుకు కావాల్సిన నైపుణ్యాల గురించి ముందే తెలుసుకుని సిద్ధంగా ఉంటారు. -
క్రిమినల్... కిడ్నాపర్స్
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు జి.కృష్ణంరాజును 2006 సెప్టెంబర్13న దుండగులు కిడ్నాప్ చేశారు. ఆయన పెంపుడు శునకాన్ని కూడా వారు ఎత్తుకుపోయారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, కోటి రూపాయలు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై మల్లగుల్లాలు పడుతున్న పోలీసు అధికారుల్లో ఒకరికి వచ్చిన ‘విసిగించే కాల్’ విలువైన సమాచారం ఇచ్చింది.నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గౌరు సురేష్ బీకాం పూర్తి చేశాడు. ఎంబీఏ చదవాలనే లక్ష్యంతో 1999లో హైదరాబాద్కు వచ్చి, బద్రుకా కాలేజీలో చేరాడు. అనివార్య కారణాలతో ఆ కోర్సులో డ్రాపౌట్గా మిగిలిన సురేష్.. బతుకుతెరువు కోసం దిల్సుఖ్నగర్లో ‘మార్చ్ స్టడీ సర్కిల్’ ఏర్పాటు చేశాడు. అది నష్టాల్నే మిగల్చడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరాలబాట పట్టాడు. 17 దోపిడీలు, 11 బందిపోటు దొంగతనాలు చేసి, జైలుకు వెళ్లి వచ్చాడు. 2003 నుంచి కిడ్నాపర్ అవతారం ఎత్తిన సురేష్, పలువురు బడా బాబుల్ని కిడ్నాప్ చేసి, భారీ మొత్తాలు వసూలు చేసుకున్నాడు. ప్రతి నేరానికి ముందూ ఓ ముఠా కట్టే సురేష్ ఒకసారి వినియోగించిన అనుచరుడిని మరోసారి వాడడు. కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని నిర్మానుష్య ప్రాంతాల్లో నిర్భంధించేవాడు. కొందరినైతే వాహనంలోనే ఉంచుకుని, వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ, వారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి డబ్బు వసూలు చేసేవాడు. తిరుపతికి చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడిని కిడ్నాప్ చేయడానికి పథకం వేసిన సురేష్ 2006 ఏప్రిల్లో అక్కడి పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో బెయిల్పై బయటకు వచ్చి హైదరాబాద్కు మకాం మార్చాడు. ఘరానా కిడ్నాపర్ గౌరు సురేష్ కన్ను జి.కృష్ణంరాజుపై పడింది. బి.సురేష్ కుమార్, ఎ.పరమేష్, కె.శ్రీనివాస్, కె.వెంకన్న, బి.నాగేశ్వరరావులతో ముఠా కట్టాడు. వీరిలో ఇద్దరు సస్పెన్షన్లో ఉన్న పోలీసులు. 2006 సెప్టెంబర్ 9న యూసుఫ్గూడలోని ఒక లాడ్జిలో గదులు బుక్ చేసుకున్న ఈ గ్యాంగ్ అక్కడే బస చేసింది. మూడు రోజుల పాటు జి.కృష్ణంరాజు కదలికలను నిశితంగా గమనిస్తూ, రెక్కీ చేసింది. ఈ కిడ్నాప్కు ముందు సురేష్ టవేరా వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు. కిడ్నాప్ తర్వాత కృష్ణంరాజును దాచి ఉంచడానికి జగద్గిరిగుట్ట సమీపంలో ఉన్న ఎల్లమ్మ బండను ఎంచుకున్నాడు. హైదరాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అక్కడ ఫామ్హౌస్ ఉండేది. ఆయన వీకెండ్స్లో కుటుంబంతో వెళ్లి అందులో గడిపేవారు. మిగిలిన రోజుల్లో కాపలాదారుడి దగ్గరే ఆ ఫామ్హౌస్ తాళాలు ఉండేవి. ఈ విషయం తెలుసుకున్న సురేష్ రెండు రోజుల కోసం ఫామ్హౌస్ ఇస్తే రూ.లక్ష ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. తన యజమానులు వారాంతాల్లో వస్తుండటం, సురేష్ కోరింది బుధ, గురువారాలు కావడంతో ఆ కాపలాదారు అంగీకరించాడు. 2006 సెప్టెంబర్ 13, బుధవారం లాడ్జి నుంచి బయలుదేరిన సురేష్ గ్యాంగ్, వాకింగ్ కోసం బయటకు వచ్చిన కృష్ణంరాజును ఆయన పమేరియన్తో సహా కిడ్నాప్ చేసింది. టవేరా వాహనంలో వెళ్తూ మాదాపూర్ ప్రాంతంలో ఆ శునకాన్ని కారు నుంచి బయటకు విసిరేసింది. టవేరా వాహనాన్ని సురేష్ నేరుగా ఎల్లమ్మబండకు తీసుకువెళ్లాడు. అయితే ఆ రోజు అనుకోకుండా ఫామ్హౌస్ యజమాని అక్కడకు రావడంతో కాపలాదారు చేతులెత్తేశాడు. దీంతో సురేష్ తనకు షెల్టర్ ఇచ్చే ఇతర వ్యక్తులు ఎవరనేది ఆలోచించాడు. ఇలా అతడికి గుర్తుకు వచ్చిన పేరే ఇక్బాల్ (పేరు మార్చాం). ఘరానా నేరగాడైన ఇక్బాల్తో సురేష్కు చంచల్గూడ జైలులోనే పరిచయం ఏర్పడింది. నగర పోలీసులకు ఉన్న ఇన్ఫార్మర్స్లో ఇక్బాల్ కూడా ఒకడు. అతడు వంద ఫోన్లు చేస్తే అందులో 95 మద్యానికి అవసరమైన డబ్బు కోసమే అయుండేది. దీంతో పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో అతడి ఫోన్లు ఎత్తేవాళ్లు కాదు. ఒకవైపు కృష్ణంరాజు కిడ్నాప్ ఉదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు, టాస్క్ఫోర్స్ అధికారులు ఈ కేసుపై వరుస సమావేశాల్లో బిజీగా ఉన్నారు. సురేష్ తన వద్ద ఉన్న ఫోన్కు కేవలం అవసరమైనప్పుడు ఆన్ చేస్తుండటంతో దర్యాప్తు మరింత కష్టసాధ్యమైంది. మరోవైపు ఎల్లమ్మబండలో షెల్టర్ దొరక్కపోవడంతో సురేష్– ఇక్బాల్కు అసలు విషయం చెప్పి, రెండు రోజుల కోసం షెల్టర్ కోరాడు. ఈ విషయంపై టాస్క్ఫోర్స్లో తనకు నమ్మకస్తుడైన అధికారికి ఉప్పందించాలని భావించిన ఇక్బాల్, ఆయనకు వరుసపెట్టి ఫోన్లు చేశాడు. అయితే కృష్ణంరాజు కేసు బిజీలో ఉన్న ఆ అధికారి ఫోన్ కాల్ను కట్ చేస్తూ పోయారు.అయినా పట్టువదలని ఇక్బాల్ పదేపదే కాల్స్ చేస్తుండటంతో ఆయన అసహనం వ్యక్తం చేయడానికి ఫోన్ లిఫ్ట్ చేశారు.‘సాబ్ సిటీ మే కోయీ కిడ్నాప్ హువా క్యా’ అని ఇక్బాల్ అడగడంతో ఆ అధికారి అప్రమత్తమయ్యారు. సురేష్కు ఆశ్రయం ఇస్తానని చెప్పాలని, ఆపై అతడి ముఠాను తమకు పట్టించాలని కోరారు. దీనికి అంగీకరించిన ఇక్బాల్– సురేష్కు ఫోన్ చేసి కూకట్పల్లి వద్దకు రమ్మన్నాడు. అక్కడ ఇక్బాల్ను రోడ్డు పైన ఉంచిన పోలీసులు కాస్త దూరంలో కాపు కాశారు. సురేష్ టవేరాలో ఇక్బాల్ వద్దకు వచ్చి, అతడినీ ఎక్కించుకుని ఉడాయించేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఇక్బాల్ కొద్దిదూరం వెళ్లాక డ్రైవింగ్ సీటులోకి మారాడు. పాతబస్తీలో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఇల్లు సిద్ధంగా ఉందని చెప్తూ, వాహనాన్ని సిటీలోకి తీసుకువచ్చాడు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులకు నాంపల్లిలోని ఓ హోటల్ అడ్డాగా ఉండేది. అక్కడ ఏ సమయంలో అయినా కొందరు అధికారులు, సిబ్బంది ఉండేవాళ్లు. వేగులతో సమావేశాలను అక్కడే ఏర్పాటు చేసుకునే వాళ్లు. ఇక్బాల్కు ఈ విషయం తెలుసు. ఆ హోటల్ సెల్లార్ కేవలం ఓ చిన్న కారు పట్టేంత మాత్రమే ఉండేది. దీనిపై అవగాహన ఉన్న ఇక్బాల్, కారును నేరుగా సదరు హోటల్ సెల్లార్లోకి తీసుకువెళ్లిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశాడు. హుటాహుటిన సెల్లార్లోకి దూసుకువచ్చిన అధికారులు సురేష్ ముఠాను పట్టుకోవడంతో పాటు కృష్ణంరాజును రెస్క్యూ చేశారు. ఇక్బాల్ను అభినందించిన పోలీసులు రివార్డు సైతం అందించారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చినా తన పంథా మార్చుకోని సురేష్ 2008 జూలై 18న బేగంపేటలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్ వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. -
సంతప్తకుడు పంచప్రేతాలు
పూర్వం సంతప్తకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సంసార వ్యామోహం లేనివాడై, తపోవృత్తితో జీవించేవాడు. తపోబలంతో పాపరహితుడై, అరణ్యాలలో సంచరిస్తూ ఉండేవాడు. బాహ్యచిత్తవృత్తులను నిరోధించి, ఇంద్రియాలను జయించాలనే తలపుతో అతడు తీర్థయాత్రలకు బయలుదేరాడు. అటవీమార్గంలో ప్రయాణిస్తుండగా, సంతప్తకుడు దారితప్పిపోయాడు. కాకులు దూరని కారడవిలాంటి కీకారణ్యంలోకి చేరుకున్నాడు. అడవిలో మహావృక్ష్యాలు, నేలంతా పాకి ఉన్న లతలు, గుబురుగా వ్యాపించి ఉన్న పొదలు నిండి ఉండటంతో అతడికి దారీ తెన్నూ కానరాలేదు. అక్కడక్కడా క్రూర జంతువులు, సాధు జంతువులు, పక్షులు తప్ప ఆ కీకారణ్యంలో ఎక్కడా నరసంచారం లేదు. సంతప్తకుడికి భయం కలగలేదు గాని, దారి తోచలేదు. దైవసంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుందని అనుకుంటూ ముందుకు సాగాడు. ఇంతలో చీకటి పడింది. అసలే కీకారణ్యం, ఆపై చిమ్మచీకటి. కీచురాళ్ల రొద, కర్ణకఠోరంగా గుడ్లగూబల అరుపులు, అక్కడక్కడా క్రూరమృగాల గర్జనలు వినిపించసాగాయి. అయినా సంతప్తకుడు ఆగలేదు. ముందుకు నడవసాగాడు. ఇంతలో అత్యంత జుగుప్సాకరమైన దృశ్యం కనిపించడంతో, నిశ్చేష్టుడై అక్కడే నిలిచిపోయాడు.ఒక మర్రిచెట్టు వద్ద ఐదు ప్రేతాలు ఒక శవాన్ని పీక్కు తింటున్నాయి. అవి చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి. మనిషి అలికిడి వినిపించడంతో ప్రేతాలు తేరిపార చూశాయి. వాటికి సంతప్తకుడు కనిపించాడు. అతడిని చూసి, ప్రేతాలు ఆనందంగా గంతులు వేశాయి. ‘వీణ్ణి నేను తింటాను’ అంటే ‘నేను తింటాను’ అంటూ అవి అతడి వైపు పరుగుతీశాయి. అతడి కాళ్లను రెండు ప్రేతాలు, చేతులను రెండు ప్రేతాలు పట్టుకోగా, ఐదో ప్రేతం తల పట్టుకుంది. అవన్నీ అతడిని తీసుకుని ఆకాశంలోకి ఎగిరాయి. కిందనున్న శవంలో ఇంకా మాంసం ఉండటంతో, దానిని వదిలేయడం ఇష్టంలేక మళ్లీ కిందకు వచ్చి, దానిని కాళ్ల మధ్య ఇరికించుకుని, మళ్లీ పైకిలేచి ఎగరసాగాయి. ఈ పరిణామానికి సంతప్తకుడు భయభ్రాంతుడై, తనను ఆపద నుంచి గట్టెక్కించమంటూ మహావిష్ణువును ప్రార్థించడం ప్రారంభించాడు.సంతప్తకుని ప్రార్థనకు కరిగిన మహావిష్ణువు తానే స్వయంగా బయలుదేరాడు. ఆయన అక్కడకు చేరుకునే సరికి సంతప్తకుడు ప్రేతాల మూపులపై హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. మహావిష్ణువు సంతప్తకుడిని తీసుకుపోతున్న ప్రేతాలను అనుసరించసాగాడు. తోవలో మణిభద్రుడు అనే యక్షరాజు కనిపించాడు. విష్ణువు అతడికి కనుసైగ చేయడంతో అతడు ప్రేతాలకే భయంగొలిపే భీకరరూపం దాల్చి వాటి ఎదుట నిలిచాడు. మణిభద్రుడి భీకరాకారాన్ని చూసి ఆ ప్రేతాలు కొయ్యబారిపోయాయి. అతడు రెండు ప్రేతాలను చేతుల్లోను, రెండు ప్రేతాలను కాళ్లలోను చిక్కించుకుని, మరో ప్రేతాన్ని నోట కరచుకున్నాడు. వాటి చేతుల నుంచి సంతప్తకుడిని విడిపించాడు. పంచప్రేతాలనూ పిడిగుద్దులతో ఒళ్లు హూనం చేశాడు. ప్రేతాల వద్దనున్న శవం పట్టుకుని, అతడు మాయమైపోయాడు.మణిభద్రుడి శిక్షతో, మహావిష్ణువు దయతో ఆ పంచప్రేతాల పాపాలు నశించాయి. మానవాకృతిలో సంతప్తకుడి ముందు మోకరిల్లి, ‘బ్రాహ్మణోత్తమా! మమ్మల్ని క్షమించు. విష్ణుభక్తుడవైన నిన్ను అపహరించి, ఆరగించాలనుకున్నాం. మా పొరపాటుకు మన్నించు’ అని కోరారు.‘బాబూ! మీరెవరు? ఇదంతా మాయా? లేక నా చిత్తభ్రమా?’ అని ప్రశ్నించాడు సంతప్తకుడు.‘విపోత్తమా! మాయా కాదు, భ్రమా కాదు. మేం ప్రేతాలం. పూర్వజన్మ పాపాల ఫలితంగా ప్రేతాలుగా మారాం’ అని చెప్పారు.‘మీ పేర్లేమిటి? మీకీ దుర్దశ ఎందుకు ప్రాప్తించింది?’ అడిగాడు సంతప్తకుడు.‘మా పేర్లు పర్యుషిత, సూచీముఖ, శీఘ్రగ, రోధక, లేఖకులు’ చెప్పాయి ప్రేతాలు.పూర్వజన్మలో అమాయకుల పట్ల, సాధుజనుల పట్ల చేసిన అపచారాలను, అఘాయిత్యాలను పొల్లు పోకుండా చెప్పుకుని, పశ్చాత్తాపం వ్యక్తం చేశాయి. ప్రేత రూపాల్లో తాము పడుతున్న అగచాట్లను వివరించాయి.సంతప్తకుడు ప్రేతాల బాధలను వింటుండగా, మహావిష్ణువు అతడి ఎదుట సాక్షాత్కరించాడు.మహావిష్ణువును చూడగానే సంతప్తకుడు పులకాంకితుడయ్యాడు. వెంటనే విష్ణువుకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆయనను రకరకాలుగా స్తుతిస్తూ స్తోత్రపఠనం మొదలుపెట్టాడు. సంతప్తకుడి సన్నిధిలో ఉండటం వల్ల ప్రేతాలు కూడా విష్ణువును ప్రత్యక్షంగా చూడగలిగాయి. మహావిష్ణువు దర్శనమాత్రంతోనే ఆ ప్రేతాల జన్మాంతర పాపాలన్నీ పూర్తిగా నశించాయి.‘ప్రాణులను ఉద్ధరించేది నీవే, పాపాలను పరిహరించేదీ నీవే! పూర్వజన్మ పాపాలకు ఏళ్లతరబడి అగచాట్లు పడుతున్న ఈ ప్రేతాలకు ఉత్తమగతులను ప్రసాదించు స్వామీ’ అని ప్రార్థించాడు సంతప్తకుడు.అతడి ప్రార్థనకు మహావిష్ణువు ప్రసన్నుడయ్యాడు.గంధర్వులు, అప్సరలతో కూడిన ఆరు దివ్యవిమానాలను అక్కడకు రప్పించాడు.సంతప్తకుడిని, అతడితో పాటు పంచప్రేతాలను ఆ విమానాల్లో వైకుంఠానికి తీసుకుపోయాడు.∙సాంఖ్యాయన -
ఈ వారం కథ: పూలమ్మి
ఒక పూల పరిమళం నన్ను ఆవహించిన వేళ– ఒక శూన్యం, నా నుంచి వీడ్కోలు తీసుకునే సమయం నేను ఊహించని సంఘటన– ఘటన. ఒక నటన, నన్ను పూలమ్మికి దగ్గర చేసింది. వేసవి సాయంకాలం, సముద్రం ఒడ్డున సేదతీరే సమయం. అలలు అప్పుడప్పుడు వచ్చి పాదాలను పలకరిస్తూ, వెనక్కి వెళ్తూ, మళ్ళీ అల్లరిగా ముందుకు వస్తూ దోబూచులాడుతున్నాయి.ప్రతిరోజు చీకటి పడగానే బీచ్కు రావడం రామకృష్ణకు ఆనవాయితీ.బీచ్తో రామకృష్ణకు, రామకృష్ణ (ఆర్కే) బీచ్కి అనుబంధం పెరిగిపోవడానికి కారణం పూ..ల...మ్మి..పెళ్లికాని రామకృష్ణకు పెళ్ళైన పూలమ్మితో పరిచయం. రామకృష్ణకి పెళ్లి కాకపోవడానికి కారణం రామకృష్ణే!అతని జీవితంలో పెళ్లి అనే పదాన్ని వివిధ రూపాల్లో చూశాడు. పెళ్లితో ఒక్కటైనా అమ్మానాన్నల గొడవలు మొదలు, స్నేహితుల కష్టాలు, స్వేచ్ఛ కోల్పోవడాలు చూశాడు.‘సరదాగా స్నేహితులతో మందు కొట్టడానికి కూడా స్వేచ్ఛలేని పెళ్లి’ అని తరచూ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు రామకృష్ణ.ఆడవాళ్ళు పెళ్లి కాకముందు, మగవాళ్ళు పెళ్లయ్యాక భర్తలుగా మారాక, అద్భుతమైన నటనా కౌశలం ప్రదర్శించి అబద్ధాలు చెప్పడం, నేర్చుకోవడం మొదలు పెడతారని చెబుతాడు. ఇలాంటి చాలా కారణాలకు తోడు అతడిని ఇంప్రెస్ చేసే అమ్మాయి తారసపడలేదు. అందుకే బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని డిసైడయ్యాడు. ఆఫీస్ వదలగానే, ‘ఎక్కడికెళ్లారు? ఎప్పుడొస్తారు? ఏం చేస్తున్నారు? ఎవరితో ఉన్నారు? వాట్సాప్ వీడియో కాల్ చెయ్’..లాంటి సమస్యలు లేవు కాబట్టి, పెళ్ళైన ఫ్రెండ్స్ బుద్ధిగా, భయంగా ఆఫీస్ వదలగానే ఇంటిముఖం పడతారు కాబట్టి, తనకు అలాంటి బాదరబందీలు లేవు కాబట్టి, ఆఫీస్ వదలగానే ‘ఓ రోజు అలా జగదాంబ సెంటర్కు, మరో రోజు గుడికి, ఇంకో రోజు రామకృష్ణ బీచ్కు వెళ్తూ ఉంటాడు.అలా ఒకరోజు గుడికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది పూలమ్మి. పరిచయం అయ్యింది అనడం కన్నా తారసపడింది అనాలేమో!సాధారణంగా రామకృష్ణకు గుడికి వెళ్లడం పెద్దగా ఇష్టం ఉండదు కాని, ఇంట్రెస్ట్ మాత్రం ఉంటుంది. నిండుగా చీర కట్టుకుని, ఒద్దికగా పూలసజ్జతో గుడికి వచ్చే అమ్మాయిలను చూస్తుంటే, ఒక మంచి పెయింటింగ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.పెందరాళే ఇంటికి వెళ్లి ఒరగబెట్టే రాచకార్యాలు లేకపోవడం వల్ల ఇలా చేస్తాడు. తన ఫ్రెండ్ తమ్ముడు శ్రీధర్ దీనికి పెట్టిన పేరు ‘టీపీ టైం’– టైం పాస్ టైం.అలా ఆ రోజు సాయిబాబా గుడికి వచ్చాడు. గుడి బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటే, అతని దృష్టి పూలు అమ్మే అమ్మాయి మీద పడింది.గుడికి వచ్చిన అమ్మాయిల అందమంతా ఆమెలోనే కనిపించింది. వైజాగ్ అమ్మాయిల నవ్వులన్నీ ఆమె పెదవుల్లో కనిపించాయి. కాటన్ చీరలో, చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించేంత అందం.అలాంటి అందం పూలమాల కట్టి అమ్ముతుంటే, ఆమె అందమే పువ్వుల్లో చేరి పరిమళాలు వెదజల్లుతుందేమో అనిపించింది.మాట్లాడుతున్న ఫోన్ను మధ్యలో కట్ చేశాడు. చేతిలోని స్మార్ట్ఫోన్ జేబులోకి వెళ్ళింది. అతని కాళ్ళు ఆమె వైపు కదిలాయి.‘రండి సర్, రండి మేడం’ అంటూ వచ్చేవారిని చిరునవ్వుతో పలకరిస్తోంది. పొడవాటి సన్నటి చేతివేళ్ళు పువ్వులను మాలగా కడుతుంటే, ఆ పువ్వులు పులకరించి పోతున్నట్లు వుంది.‘సర్ పూలు కావాలా?’ అడిగింది రామకృష్ణను చూసి.‘వద్ద’ంటూనే పర్స్లో నుంచి డబ్బులు తీశాడు.‘ఎన్ని మూరలు సర్...’ అంటూనే చేత్తో మూరలు కొలుస్తుంటే, తన మనసును కొలుస్తున్నట్టు అనిపించింది.శనివారం వేంకటేశ్వరస్వామి గుడిలో కనిపించింది. శుక్రవారం మరో గుడిలో– ఎప్పుడు కలిసినా పూలు కొంటూనే వున్నాడు.ఇంటికి వెళ్ళాక అతని మంచం పక్కనే ఆ పూలు టీపాయ్ మీద పేరుకు పోతూనే ఉన్నాయి.ఆమె మెడలో మెరిసే పసుపుతాడు, నుదుట సిందూరం, కాలివేళ్లకు మెట్టెలు, ఆమెకు పెళ్లయిందని చెప్పకనే చెబుతున్నాయి. అయినా ఆమెను చూస్తుంటే ఒక ప్లెజెంట్ ఫీలింగ్.ఒకరోజు నవ్వుతూ అన్నాడు. ‘నీ దగ్గర పూలు కొనడానికి రోజుకో గుడి దగ్గరికి రావలసి వస్తోంది’ అని.ఆమె ఏమాత్రం అతడిని నొప్పించకుండా ‘బీచ్లో అయితే రోజూ సాయంత్రం నుంచి చీకటి పడే వరకు ఉంటాను. మేడం కోసం పూలు కొనాలనుకుంటే అక్కడికి రండి’ అంది అదే చిరునవ్వుతో.అలా అతనికి ఆమె ద్వారా, బీచ్తో మరింత అనుబంధం పెరిగింది.సాయంత్రం ఆఫీస్ వదలగానే బీచ్కు వెళ్లడం ఆమెతో కాసేపు మాట్లాడ్డం, పూలు కొనడం.‘రోజూ మేడంకు పూలు తీసుకువెళ్తారు. మేడంను ఒకసారి తీసుకురండి సర్’ అంది కాస్త చనువు పెరిగాక.నవ్వి ఊరుకున్నాడు రామకృష్ణ. పెళ్ళైన అమ్మాయి పట్ల తాను ఏర్పరచుకున్న ఫీలింగ్ ఏమిటో అతనికే అర్థం కాలేదు.ఒకరోజు అడిగాడు, ‘నీ పేరేమిటి?’ అని ధైర్యం చేసి.‘అందరూ పూలమ్మి అంటారు. అదే నా పేరనుకోండి’ అంది ఆమె నవ్వుతూ. ఆ నవ్వు ఆమె అమ్మే పూల కన్నా ఎక్కువ పరిమళాలు వెదజల్లుతున్నట్టు అనిపించింది.ఆమె దృష్టిలో అతను వివాహితుడు. అతను అలాగే నటించేశాడు. బీచ్లో జంటలను చూసినప్పుడు ఒకప్పుడు ఏమీ అనిపించేది కాదు. కాని, ఇప్పుడు కొద్దిగా ఏదో ఫీలింగ్. పూలమ్మి పక్కన నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆమె జడలోని సన్నజాజులు అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేసున్నాయి.సరిగ్గా అపుడే అతని జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన జరిగింది.ఆ రోజు పూలమ్మి రాలేదు. ఆ రోజే కాదు మరుసటి రోజు కూడా రాలేదు. మూడవరోజు, నాలుగో రోజు...పూలమ్మితో పరిచయం అయిన నాటి నుంచి ఇప్పటి వరకు పూలమ్మి పూలు అమ్మని రోజు లేదు. వర్షం వచ్చినా సరే, గొడుగు వేసుకుని మరీ బీచ్కు వచ్చేది.రామకృష్ణ కుదురుగా ఉండలేకపోయాడు. పూలమ్మి పూలు అమ్మే ప్రతి గుడికి వెళ్ళాడు. సాయిబాబా గుడికి, వేంకటేశ్వరస్వామి గుడికి, దుర్గ గుడికి– ఎక్కడా కనిపించలేదు. బీచ్కు రావడం లేదు.పూలమ్మికి ఏమైంది?రామకృష్ణ అన్వేషణ మొదలైంది. గుడిలో పూలు అమ్మే వాళ్ళను, బీచ్లో పూలు అమ్మే వాళ్ళను ఎంక్వయిరీ చేశాడు. ఎట్టకేలకు పూలమ్మి చిరునామా సంపాదించాడు. ఆఫీస్ వదలగానే పూలమ్మిని వెతుక్కుంటూ బయలుదేరాడు.∙∙ పూలమ్మి ఇల్లు ఊరికి చివర వుంది. పూలమ్మి ఇంటిని సమీపిస్తున్న కొద్ది రామకృష్ణలో ఉద్వేగం, పూలమ్మిని చూడబోతున్నానన్న ఉద్వేగం ఓ వైపు, ‘ఎందుకొచ్చారు?’ అని అడిగితే ఏం చెప్పాలి? కాళ్ళు పూలమ్మి ఇంటి ముందు ఆగాయి.చిన్న ఇల్లయినా పర్ణకుటీరంలా వుంది. చుట్టూ చెట్లతోనే ప్రహరీ, చిన్న చెక్క గేటు. దానికి అల్లుకున్న మల్లెతీగ. రెండువైపులా చామంతి, బంతి, గులాబీ మొక్కలు. కనకాంబరాలు ఓ పక్క, మరువం ఇంకో పక్క మల్లెతీగలు ఇంటిని అల్లుకుని...ఒక ఉద్యానవనంలోకి వచ్చినట్టు వుంది.చెక్క గేటు తీసుకుని లోపలి అడుగు పెట్టగానే మంచం మీద పడుకుని ఉన్న నాలుగేళ్ల పాప కళ్ళు తెరిచింది. పూలమ్మిని చూసినట్టే వుంది. తన అడుగుల శబ్దం విని కప్పుకున్న దుప్పటి తొలిగించి లేవబోయింది. కాళ్లు చచ్చుబడి సహకరించడం లేదు.రామకృష్ణ మనసు చివుక్కుమంది. పూలమ్మి కూతురికి ఈ కష్టమా?‘అమ్మ లేదా పాపా?’ అడిగాడు రామకృష్ణ. ఛ పాపకు ఏమైనా కొని తీసుకు రావాల్సింది. అయినా తనకు తెలిస్తే కదా, పూలమ్మికి ఓ పాప ఉందని. తానెప్పుడూ అడగలేదు. పూలమ్మి చెప్పనూ లేదు.‘అమ్మ హాస్పిటల్ నుంచి ఇప్పుడే వచ్చింది అంకుల్’ అంటూ హాలు వైపు చూసింది.రామకృష్ణ లోపలికి అడుగుపెట్టాడు.అప్పుడే పూలమ్మి లైటు వేసింది. లైటు వెలుతురులో పూలమ్మిని అలానే చూస్తూ ఉండిపోయాడు. పూలమ్మి తన మెడలోని మంగళసూత్రం తీసి, ఎదురుగా ఉన్న దేవుని పటం ముందు పెట్టింది. మెట్టెలు తీసేసింది. నుదుట సిందూరం చెరిపేసింది. వెనుతిరిగింది.ఎదురుగా రామకృష్ణ .‘సర్ మీరా? ఇక్కడ.. నా కోసం?’‘నీ అనుమతి లేకుండా నీ ఇంటికి వచ్చాను. సారీ పూలమ్మి’ తలొంచుకుని అన్నాడు రామకృష్ణ.చిన్నగా జీవంలేని నవ్వు నవ్వింది పూలమ్మి.‘మనల్ని సృష్టించిన ఆ దేవుడు మన అనుమతి లేకుండా, మన తలరాతలు తన ఇష్టం వచ్చినట్టు రాస్తున్నాడు. నా తలరాత చూడటానికి వచ్చారా?’ ఆమె కంట్లో సన్నటి కన్నీటిపొర.‘కాళ్లు చచ్చుబడి పోయిన నా కూతురు, వైధవ్యాన్ని శాపంగా భరిస్తున్న నేను– ఇదీ నా కుటుంబం, తాగుబోతు భర్త, తాగిన మైకంలో యాక్సిడెంట్ చేసి ఇద్దరి చావుకు కారణమై, తనూ చచ్చాడు. ఆ పాపం, ఏ పాపం తెలియని నా బిడ్డను వెంటాడింది. నా బిడ్డ కాళ్ళు చచ్చుబడ్డాయి. ఆపరేషన్ చేస్తే తిరిగి నా కూతురు మామూలుగా అవుతుందని చెప్పారు. నా బిడ్డ కాళ్ళు బాగుపడడం కోసం పూలమ్మిగా కొత్త పాత్రలోకి వచ్చాను. ఒకప్పుడు ఇష్టంగా వ్యాపకంగా పెంచుకున్న చెట్లు, నాకు జీవనాధారం అయ్యాయి. గుడిలో దేవుని పాదాల చెంతకు, బీచ్లో అమ్మాయిల జడల్లో కొలువుతీరే పువ్వులు అమ్మే ఈ పూలమ్మి, నుదుట కుంకుమ లేకుండా, వైధవ్యంతో పూలు అమ్మితే అపశకునం అనుకోవచ్చు. అందుకే సుమంగళిగా నటించాను. మోసం చేయడానికి కాదు. నా బిడ్డను బతికించుకోవడానికి నటించాను. ఇంతకు మించి నా కథలో ఏ మలుపులు లేవు’ కళ్ళు తుడుచుకుని చెప్పింది పూలమ్మి.‘ఇప్పుడు ఆ నటనను నిజం చేయొచ్చుగా! నేను సూటిగా చెబుతున్నాను. నాకు పెళ్లి కాలేదు. నాకు నచ్చిన అమ్మాయి తారసపడలేదు. నిన్ను చూశాక, ఎందుకో ఒక అందమైన భావం, నీకు పెళ్లయిందని తెలిసినా నిన్ను ప్రేమించకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు నీ కథ తెలిశాక, జాలితో కాదు, మరింత ఇష్టంతో నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను’ రామకృష్ణ మనసులో మాట చెప్పాడు.‘క్షమించండి. మీ మంచి మనసుకు శిరస్సు వంచి నమస్కరించడం తప్ప ఈ పొగచూరిన మనసును ఇవ్వలేను. నా బిడ్డ కాళ్లు బాగైతే, నా నటనకు స్వస్తి చెప్పి, మరో దారి చూసుకుంటాను. ఈ పూలమ్మిని మర్చిపోండి’ చెప్పింది.‘పోనీ కొన్నాళ్ళు నేను నీకు భర్తగా కాకుండా, నీ బిడ్డకు తండ్రిగా నటిస్తాను. మన బిడ్డకు, సారీ.. నీ కూతురికి కాళ్ళు వచ్చేవరకు. నీకు భర్తగా జీవించే అవకాశం లేనప్పుడు, ఇలా నటించే అవకాశాన్ని కోరడం తప్పు కాదు కదా! ఊహ తెలియకముందే నాన్న విదేశాల్లో ఉన్నాడని నమ్మించి నటించావు. ఆ నాన్నను నేనే అని చెప్పు. ఆ సంతోషంతో త్వరగా నడుస్తుంది. కొన్నాళ్ళైనా నాకు ఇష్టమైన నిన్ను నా జీవితంలోకి నటిగా ఆహ్వానించే అవకాశం ఇవ్వు’ అన్నాడు రామకృష్ణ.అప్పటికే కూతురు వాకింగ్ స్టిక్ సహాయంతో అక్కడికి వచ్చి, ‘ఎవరమ్మా.. నాన్నా.. నాన్నొచ్చాడా? ఆ చిన్నారి కళ్ళలో వెలుగు.కూతురు కళ్ళలో వెలుగు చూసి ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేక పోయింది. అప్పటికే రామకృష్ణ ఆ పాపను దగ్గరకు తీసుకున్నాడు.‘భలే కనిపెట్టావ్.. ఎంతైనా నా కూతురువి కదా..’ అన్నాడు పూలమ్మి వైపు చూడకుండా.‘నేనంతే నాన్నా!’ అప్రయత్నంగా అంది. ఆ పిలుపుకు చిన్నప్పటి నుంచి దూరమైన ఆ పాప.‘మరి నీ బట్టలు తెచ్చుకోలేదు. నా కోసం ఏమీ తేలేదు. నువ్వు బోల్డు గిఫ్టులు తీసుకు వస్తావని చెప్పింది అమ్మ’ అంది అమాయకంగా.‘ఆఫీస్ పని మీద వచ్చాను. నీ కాళ్ళు బాగయ్యాక మిమ్మల్ని పెద్ద ఇంట్లోకి తీసుకు వెళతాను’ చెప్పాడు. ఆ పాప ఆ నటన నిజమేనని నమ్మి బయటకు వెళ్లి పూలతో మాట్లాడుతోంది.‘మా నాన్నొచ్చాడ’ని చెబుతూ మురిసిపోతోంది.ఆలా అతని పాత్ర నటన మొదలైంది. కానీ అతను జీవిస్తున్నాడు.అతని దినచర్య మారిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పాప కోసం బొమ్మలు తీసుకురావడం, పాపను బయటకు తీసుకు వెళ్లడం– అనివార్యంగా పూలమ్మి కూడా అతనితో పాటు వెళ్ళక తప్పడం లేదు.ఒకరోజు బీచ్కి వెళ్లారు. మొదటిసారి బీచ్కి వచ్చిన పాప అక్కడ ఉన్న పిల్లలను చూసి కేరింతలు కొట్టింది. ఇద్దరి చేతులు పట్టుకుని ఇద్దరి భుజాల మీద ఆడుకుంది. సినిమాకు తీసుకువెళ్లాడు. అమ్మ ఒడిలో కూర్చుంది. పూలమ్మి భుజం తాకుతుంటే, రామకృష్ణ మనసులో చిన్నపాటి ఉద్వేగం.పాపకు రామకృష్ణకు మధ్య బంధం పెరిగింది. అయినా తన పరిధిని మించి ఎప్పుడూ పూలమ్మి ఇంట్లోకి, ఆమె గదిలోకి అడుగు పెట్టలేదు. పాప ఎన్నోసార్లు ‘ఎందుకు నాన్న లోపలికి రావు’ అంటే ఏదో కారణం చెప్పేవాడు.పూలమ్మి రామకృష్ణ కోసం టిఫిన్ చేయడం మొదలుపెట్టింది.తర్వాత వంట చేసి క్యారేజీ ఇవ్వడం మొదలైంది.ఆ తర్వాత అతనికి కోసం ఎదురు చూడటం అలవాటైంది. ఒకరోజు వర్షంలో తడిసి వస్తే (అ)ప్రయత్నంగా అతని తల తుడిచింది తన చీర కొంగుతో. అతని బట్టలు ఉతికి ఆరేసింది. ఇస్త్రీ చేసింది.తాను పాప కోసం నటిస్తోందా? అతని మీద ప్రేమతో జీవిస్తోందా? అర్థం కాలేదు పూలమ్మికి.పాపకు ఆపరేషన్ అయ్యింది. కాళ్లు బాగుపడ్డాయి. లేచి నడుస్తోంది. పరుగెత్తుతోంది. ఆ రోజు పాప పుట్టినరోజు. పెద్ద కేక్ తెచ్చాడు. కొత్త బట్టలు తెచ్చాడు. పాపతో కేకు కట్ చేయించాడు. పెద్ద సందడి. అతని మనసులో చిన్న అలజడి.హడావుడి ముగిసింది. అర్ధరాత్రి కావస్తోంది. అప్పటి వరకు ఆడుకుని అలిసిపోయిన పాప నిద్రలోకి జారుకుంది. గడప లోపల పూలమ్మి. గడపకు ఇవతల రామకృష్ణ.‘నేను వెళ్తున్నాను’ చెప్పాడు రామకృష్ణ.‘రేపు కొద్దిగా పెందరాళే రావొచ్చుగా! మీకు ఇష్టమైన మినప్పప్పు మిక్సీకి వేశాను. మినప వడలు, సాంబారు, మీకిష్టమైన పల్లీ చట్నీ’ అని, ‘పోనీ ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవచ్చుగా...’ ఆశగా అంది పూలమ్మి.‘వెళ్లిపోతానని అంటున్నది ఈ వూరి నుంచి. పాపకు కాళ్లు వచ్చాయి. నా జ్ఞాపకాలకు సరిపడా అనుభూతి దొరికింది. ఇంకా నటించి, ఒక నటుడిగా బతకలేక పోతున్నాను. ఎప్పుడైనా సినిమా పూర్తయితే, పాత్రను, పాత్ర నటనను వదిలి వెళ్ళిపోవలిసిందేగా! అందుకే, ఇప్పుడే ఇక సెలవని...’ రామకృష్ణ గొంతు గాద్గదికం అవుతోంది.‘పాపకు నాన్న ఆఫీస్ పనిమీద మళ్ళీ వెళ్లాడని చెప్పు. నువ్వు జాగ్రత్త పూలమ్మి’ వెనుదిరిగాడు. పూలమ్మి కళ్ళలోకి చూసి అక్కడి నుంచి వెళ్లలేక.పూలమ్మి అలాగే నిలబడి పోయింది.మొదటిసారి రామకృష్ణ తెచ్చిన చీర కట్టుకుంది.మొదటిసారి మనస్ఫూర్తిగా జడలో రామకృష్ణకు ఇష్టమైన పువ్వులు పెట్టుకుంది.మొదటిసారి నటించడం మాని జీవించింది.‘వెళ్ళండి ... ఎంతైనా మగ మహారాజులు కదా! కూతురి పుట్టినరోజు కూడా బలాదూర్ తిరగండి. ఇంట్లో భార్య ఉంది. అది తన కోసం ఎదురుచూస్తుంది అని ఆలోచించకుండా వెళ్ళండి’ పూలమ్మి ఉక్రోషంగా అంది. గొంతులో దుఃఖం తన్నుకు వస్తోంది.ఒక్కసారిగా గిరుక్కున వెనక్కి తిరిగాడు. గుమ్మం ముందు నిలబడి తాను తెచ్చిన చీర కట్టుకుని, తలలో పువ్వులు పెట్టుకుని, తన పూలమ్మి, కళ్ళనుండి నీళ్లు ఒంపుకొని... మనసు నిండా ప్రేమ నింపుకొని... రెండు చేతులు చాచి, గుమ్మానికి అడ్డు తొలగి లోపలి గది లోపలికి, తన మనసు గదిలోకి ఆహ్వానిస్తూ...నుదుట కుంకుమ చెదిరి, తలలో పూలు అలసి, ఒంటిమీద ఉన్న ఆచ్ఛాదనలు చెదిరి, దేహాలు ఒక్కటై, తెల్లవారు ఝామున వినిపించే కువకువల సుప్రభాతం వింటూ... ఒకరినొకరు చుట్టుకుని... నిన్నటి వరకు నటించిన పాత్రలకు జీవం పోసి, నటన వదిలి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.మరోసారి పూలమ్మిని చుట్టేస్తూ ‘అవును నీ పేరేమిటి పూలమ్మీ’ అడిగాడు.‘మీరు ప్రేమతో పిలిచే పేరే. పూలమ్మి...’ అతని గుండెలో ఒదిగిపోతూ చెప్పింది పూలమ్మి. -
మన ముచ్చట: పుస్తకానికి గుడి
దేవుళ్లు, దేవతలకు ఆలయాలు నిర్మించడం అందరికీ తెలిసిందే. అదే మనుషులకైతే ఒకింత ఆశ్చర్యమే మరి! అప్పుడెప్పుడో తమిళనాడులో నటి ఖుష్బూకు అభిమానులు గుడి కట్టించారు. అదే రాష్ట్రంలోని అరియలూర్ జిల్లాలో భార్యపై గల ఇష్టంతో ఓ భర్త ప్రేమ మందిరం నిర్మించాడు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఓ భార్యామణి మరణించిన భర్త జ్ఞాపకాలను పదిలపరుస్తూ గుడి కట్టారు. ఆమధ్య శ్రీకాకుళంలో ఓ పుత్రుడు తల్లికి, విశాఖపట్నంలో ఇంకో కొడుకు తండ్రికి ఆలయాలు నెలకొల్పి వార్తల్లోకెక్కారు. వీటన్నింటినీ పక్కన పెడితే, కేరళ రాష్ట్రంలో విశేషమైన జ్ఞాన ఆలయం ఒకటుంది. కన్నూర్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో చెరుపుళ పట్టణ సమీపంలోని ప్రపోయిల్ అనే చిన్న గ్రామంలో పుస్తకానికి గుడి కట్టారు. లోపల దేవుళ్లుండరు. పుస్తకమే దేవత. దానికే పూజాదికాలు నిర్వహిస్తారు. నైవేద్యంగా సమర్పించిన పుస్తకాలనే తిరిగి ప్రసాదంగా వితరణ చేస్తారు. కులమతాలకు అతీతంగా ఎవరైనా ఈ గుడికి వెళ్లి పూజలు చేయవచ్చు. ఇక్కడ పూజారులు ఉండరు, హుండీలు కనిపించవు. ఇది నవపురం మతాతీత ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా లేదంటే అతిశయోక్తి కాదు.తొలి అడుగు...జ్ఞానం కంటే ఉన్నతమైన మతం మరొకటి ఉండదని భావించిన విద్యావేత్త, చెరుపుళ విన్నర్స్ కళాశాల ప్రిన్సిపాల్ పి.నారాయణ ఈ పుస్తకాలయ రూపశిల్పి. సహజ సిద్ధమైన పెద్ద రాతిపై విగ్రహ రూపంలో పుస్తకం దర్శనమిస్తుంది. దీన్ని కాసర్గోడ్ జిల్లా కంబల్లోర్ గ్రామానికి చెందిన సంతోష్ మానసం అందంగా చెక్కారు. 2021 మార్చి 4న ఆలయ నిర్మాణం ప్రారంభం కాగా, అక్టోబరులో విగ్రహ ప్రతిష్ఠాపన జరిపి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. రెండు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆలయం చుట్టూ పచ్చదనం పరచుకుని ఉంటుంది. సందర్శకులు ప్రవేశ ద్వారం గుండా లోపలికి అడుగిడగానే నిశ్శబ్దం రాజ్యమేలుతోందా అన్నట్లు ఉంటుంది. ప్రవేశ ద్వారం గోడలు కేరళ రాష్ట్ర సాహితీ సాంస్కృతిక వారసత్వాలను వివరించే శిల్పాలతో నిండి ఉంటాయి. ఒకవైపు బుద్ధుడి చిత్రం, మరో చిహ్నంగా రాతి దీపం కనిపిస్తుంటాయి. ఆలయ ప్రధాన దేవత ఒక భారీ కాంక్రీటు పుస్తకం. 30 అడుగుల ఎత్తులో సహజమైన రాయిపై ఉంది. దాని చుట్టూ అనేక పొత్తాలు చిత్తాన్ని దోచే రీతిలో అందంగా అలంకరించి ఉంటాయి. ఒకవైపు పాత, కొత్త పుస్తకాల వాసన, మరోవైపు చందన పరిమళాలు, ఇవి చాలవన్నట్లు వేసిన ధూపం తాలూకు గుబాళింపు నాసికా రంధ్రాలకు చేరి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి.ఆలయానికి రూ.7.6 కోట్లువారసత్వ ఆస్తిగా రెండెకరాల భూమి దక్కించుకున్న నారాయణ స్వయంకృషితో సంపాదించిన ప్రతి రూపాయి ఈ ఆలయం కోసం వెచ్చించారు. తొలినాళ్లలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు పరిస్థితి ఫర్వాలేదు. గుడి కోసం ఇప్పటి వరకు రూ.7.6 కోట్లకుపైగా ఖర్చుచేశారు. ఇందులో కొద్ది శాతం మాత్రమే విరాళాలుగా స్వీకరించారు. ఈ నాలుగేళ్లలో భక్తులు నైవేద్యంగా సమర్పించిన పుస్తకాల సంఖ్య ఐదు వేలకు చేరుకుంది. ఆలయం ఆవరణలో రచయితలు చక్కగా కూర్చుని రాసుకునేందుకు వీలుగా మూడు షెడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏటా రెండు ప్రధాన ఉత్సవాలను నిర్వహిస్తారు. సాహిత్య చర్చలు, నృత్య ప్రదర్శనలు, పుస్తకావిష్కరణలు, సెమినార్లు, నాటక ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా రచయితలకు అవార్డులు ప్రదానం చేస్తారు. జ్ఞానోదయం దైవత్వానికి నిజమైన మార్గమని ఈ ఆలయం దర్శించుకున్నవారికి అనుభూతి కలుగుతుంది. జ్ఞానం, విద్య, మానవ పురోగతి, ఆధ్యాత్మిక ప్రగతికి ఈ ఆలయం పునాది అనే నమ్మకం అందరిలోనూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జ్ఞానారాధన కేంద్రం. ∙ -
టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్కార్న్, మ్యాంగో కేక్ చేద్దాం ఇలా..!
రొయ్యల పాప్కార్న్కావలసినవి: రొయ్యలు– 25 పైనే (మరీ చిన్నవి కాకుండా, నచ్చిన సైజ్ ఎంచుకోవచ్చు. తల, తోక తీసి, శుభ్రం చేసుకోవాలి)అల్లం–వెల్లుల్లి పేస్ట్– 2 టేబుల్ స్పూన్లుకారం– ఒక టీ స్పూన్ గరం మసాలా– ఒక టేబుల్ స్పూన్+ఒక టీ స్పూన్నిమ్మరసం– ఒక చెక్కమైదా, జీలకర్ర పొడి– ఒక టేబుల్ స్పూన్ చొప్పునబ్రెడ్ పౌడర్– పావు కప్పుపైనేగుడ్డు– 2 (2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు కలుపుకుని పక్కనపెట్టుకోవాలి)ఉప్పు– తగినంతనూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా రొయ్యలు ఒక గిన్నెలో తీసుకుని, అందులో అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె, నిమ్మరసం వేసి, ఆ మిశ్రమం రొయ్యలకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక చిన్న బౌల్లో బ్రెడ్ పౌడర్, జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేడి చేసుకుని, ఒక్కో రొయ్యను మొదట గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి, ఆపై బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది.ట్రినిడాడ్ అండ్ టొబాగో మ్యాంగో కేక్కావలసినవి: గోధుమ పిండి– ఒకటిన్నర కప్పులుబేకింగ్ పౌడర్– ఒక టీ స్పూన్బేకింగ్ సోడా– అర టీ స్పూన్ఉప్పు– చిటికెడు గడ్డ పెరుగు– ఒక కప్పుపంచదార– ముప్పావు కప్పుపాలు, నూనె– అర కప్పు చొప్పునవెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్మామిడి పండ్లు– 2 (బాగా పండి, తియ్యగా ఉండాలి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)నీళ్లు– కొద్దిగానిమ్మరసం– ఒక టేబుల్ స్పూన్మీగడ– అర కప్పువైట్ చాక్లెట్– 200 గ్రాములు (మార్కెట్లో దొరుకుతుంది)మ్యాంగో ఐస్క్రీమ్– పావు కప్పు పైనేతయారీ: ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని బాగా కలిపి, జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు మరో గిన్నెలో పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి. అనంతరం అందులో నూనె, వెనీలా ఎసెన్స్ వేసి మరోసారి కలపాలి. కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు గోధుమ మిశ్రమాన్ని, పెరుగు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి, నెయ్యి పూసిన వెడల్పాటి పాత్రలో వేసుకుని, రెండు అంగుళాల మందంలో, సమానంగా ఉండేలా చూసుకోవాలి. దాన్ని ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకుని, చల్లారాక, çముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను మిక్సీలో వేసుకుని, వాటిలో నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసుకుని జ్యూస్లా చేసుకోవాలి. ఆ జ్యూస్ని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీగడను కరిగించి, దానిలో కరిగించిన వైట్ చాక్లెట్ను కలపాలి. దానిలో మామిడిపండు గుజ్జు వేసుకుని, క్రీమ్లా అయ్యే వరకూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ముక్క తీసుకుని, దానిపై పెరుగు మిశ్రమాన్ని అర అంగుళం మందంలో పూసుకుని, దానిపైన కొద్దిగా ఐస్క్రీమ్ పావు అంగుళం మందంలో పరుచుకోవాలి. మరో కేక్ ముక్కను దానిపై పెట్టుకోవాలి. ఇదే మాదిరి అన్ని ముక్కలు పెట్టుకుని.. వాటిపై మరోసారి పెరుగు మిశ్రమం, ఐస్క్రీమ్తో నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.అసోమీయా తిల్ పిఠాకావలసినవి: బియ్యం– ఒక కప్పుబెల్లం తురుము, నల్ల నువ్వులు– అర కప్పు చొప్పుననీళ్లు, నూనె, ఉప్పు– సరిపడాతయారీ: ముందుగా బియ్యాన్ని 3 లేదా 4 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు తీసేసి, ఒక గంట పాటు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని మిక్సీలో మెత్తని పిండిలా చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు నల్ల నువ్వులను దోరగా వేయించి, కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఆ నువ్వుల మిశ్రమాన్ని బెల్లం తురుములో వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బియ్యప్పిండిలో సరిపడా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా దోసెల పిండిలా కలుపుకోవాలి. ఆపై పాన్ మీద కొద్దికొద్దిగా నూనె వేడి చేసుకుని, చిన్న చిన్న అట్లు వేసుకోవాలి. అట్టు కొద్దిగా ఉడుకుతుండగా, మధ్యలో నువ్వులు–బెల్లం మిశ్రమాన్ని ఉంచి నచ్చిన విధంగా రోల్ చేసుకోవచ్చు. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. -
ఈ వారం కథ: రీట్వీట్
నువ్వు అలా స్క్రోల్ చేస్తున్నావు. డెడ్ లైన్ల మధ్య ఓ క్షణం. నైట్ లాంప్ వుండీ లేనట్లు వెలుగుతోంది. ప్లాస్టిక్ కంటైనర్లోని గోట్ బిర్యానీ చల్లారిపోయింది. క్యాంపస్ అంతా నిశ్శబ్దంగా వుంది, మంచు తెరలతో మూసుకుపోయినట్లు. ఎక్కడి నుంచో పోలీసు హారన్లు. నువ్వు ఏదో చెప్పాలనో, మాట్లాడాలనో అనుకోవటం లేదు. అది నీ తత్త్వం కాదు. అంత మాత్రాన నీకు హృదయం లేదని కాదు. పేదరికం నీ పెదాల్ని మూసేసింది. కానీ ఆ రోజు, నువ్వొక ఫొటో చూశావు. చిన్న పిల్ల. ఆరేడేళ్ళు వుంటాయేమో. ఆ పసిదాని మొహం సగం బూడిదలో కప్పడిపోయింది. ఆ తల్లి ఏడుపు ఆ ఫొటోలో నుంచి నీ గుండెను తాకింది. శిథిలాల మధ్య చిక్కుకున్న ఆ మృతదేహాన్ని చూడలేక కళ్ళు వాల్చుకున్నావు. ఆ పసిదాని పేరు నీకు తెలీదు. తెలియక్కర లేదు కూడా. దుఃఖానికి వూర్లు, పేర్లు, దేశాలు, భాషలు అక్కరలేదు. ఆ రోజుకి ఇంకేమీ రాయలేకపోయావు. ఎన్ని మరణాలు? ఎన్ని దేహాలు? ఎన్ని యుద్ధాలు? ఎంత విధ్వంసం? "Being human is not a crime''ట్వీట్లో వున్నది ఆ ఒక్క వాక్యమే! ఆ వాక్యం రాసింది నువ్వు కాదు. నువ్వు దాన్ని ఎడిట్ చేయలేదు. రీట్వీట్ జస్ట్ రీట్వీట్ చేశావు. ఒక్క క్లిక్. దాహంతో వున్న వాళ్ళకు ఓ గ్లాసు నీళ్ళు ఇచ్చినట్లు. That's it. అనుకోకుండా ఆ రీట్వీట్ వైరల్ అయింది. కామెంట్లు వరదలాగా ముంచెత్తాయి.కొందరు నిన్ను ప్రశంసిస్తే, మరికొందరు "unamerican' అని విమర్శించారు. ఇమ్మిగ్రెంట్లకు అసలేం పని ఈ దేశంలో అన్నారు. వెళ్లిపొమ్మని కొందరంటే, వెళ్లగొడతామని మరికొందరన్నారు. రాడికల్ అని కొందరంటే, ట్రైటర్ అన్నారు మరికొందరు. నిజం చెప్పద్దు. ఒక్కసారి నీ రీట్వీట్, ఆ స్పందన, ఆ కామెంట్లు ఆ పాపులారిటీ నువ్వు భలే ఆనందించావు. కానీ ఆ ఆనందానికి నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏమిటో అప్పుడు నువ్వూహించలేదు. నీ పాలిట అదే ఉరితాడవుతుందని. అదే నీకు వ్యతిరేక సాక్ష్యం అవుతుందని. ఒక్క వాక్యం. Hashtags లేవు. నినాదాలు లేవు. యూనివర్సిటీలో జరిగిన ప్రదర్శనలో అనుకోకుండా నువ్వొక ప్లకార్డు పట్టుకున్నావు. డైలీ పెన్సిల్వేనియన్ పత్రిక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలో నువ్వే ప్రముఖంగా కనిపిస్తున్నావు. ఇప్పుడు మీ యూనివర్సిటీలో భారతి అంటే మరో సుబ్రహ్మణ్య భారతి. ఈ ప్రదర్శనలు, ఈ ట్వీట్లు, ఈ డిబేట్లు వీటన్నింటితో నీలోపలి కవిత్వం మళ్ళీ బయటకొచ్చింది. నీ కవితలు స్టూడెంట్స్ నోటి వెంట పద్యాలయ్యాయి.∙∙ మరోవైపు ఏం జరుగుతోందో నువ్వు ఊహించలేకపోయావు. వీటన్నింటినీ ఓ నిఘా కన్ను చూస్తోంది. నిన్నే, నిన్నే, నిన్నే. జింకలకు తెలియాలి సింహాలు ఎప్పటికైనా వేటాడి తీరతాయని. ఇమ్మిగ్రెంట్లకు తెలియాలి ఎప్పటికైనా తిరిగెళ్లిపోవాలని. నీ ఒంటి రంగు ఎప్పటికీ తెలుపు కాబోదని. నీ నిక్ నేమ్ ఎప్పటికీ ‘బ్రౌనీ’నే అని. నువ్వు హక్కులడిగితే, వాళ్ళు నీ బాధ్యతలు గుర్తుచేస్తారు. లిబర్టీ బెల్ ఉన్న ఊర్లో లిబర్టీ నేతిబీరకాయలో నెయ్యి. తెలుసుకొనవే చెల్లీ, అలా మసలుకొనవే తల్లీ!∙∙ నీకు తెలియదు నీ పేరు అట ingtonలోని ఓ అధికార కార్యాలయపు టేబుల్ మీద ఓ ఫోల్డర్ లోకి చేరుతుందని. నీకు తెలియదు నీ పేరు ‘భారతి రాఘవన్’ ఒక జాబితాలోకి అంత సులువుగా చేరిపోతుందని. నీకు తెలియదు నీ వొంటి రంగు, నీ వీసా స్టేటస్, నీ కోపం, నీ ఆలోచన ఇవి చాలు నువ్వు నేరస్థురాలివని నిర్ధారించడానికని. నీకు తెలియదు ఆ అల్గారితమే ఒక ఆయుధమవుతుందని. ఎందుకంటే, నువ్వొక ఇమ్మిగ్రెంట్వి. నీ ధర్మాగ్రహం ఓ ఎర్రజెండా. ప్రతి జెండా ఓ ప్రమాద హెచ్చరిక! ఎక్కడేం జరుగుతోందో వూహించలేని నువ్వు, చల్లారిన నీ గోట్ బిర్యానీని తినటానికి ఉపక్రమించావు. కానీ నీ కళ్ళు పదే పదే ఆ దృశ్యాన్ని చూపిస్తుంటే, తినలేక, తినకుండా పారేసే ఆర్థిక శక్తి లేక రేపటి కోసం దాచి పెట్టావు. నీ ఇవాళనీ రేపటినీ మార్చేసింది అది. కాన్ఫరెన్స్ పేపర్ అసంపూర్తిగా వదిలేసి రూమ్కి బయలుదేరావు. టైమ్ చూశావు. వచ్చే నెల అక్క పెళ్లి ఆలోచనలతో నీ మొహాన ఓ చిరునవ్వు వెలిగింది.∙∙∙INTERNAL DHS MEMO & CLASSIFIEDసబ్జెక్ట్: భారతి రాఘవన్ డేట్ ఆఫ్ బర్త్: 04/14/1997సిటిజన్షిప్: ఇండియా స్టేటస్: ఎఫ్–1 యూనివర్సిటీ: యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా రెడ్ ఫ్లాగ్: యు.ఎస్. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు. సాక్ష్యం: సోషల్ మీడియా యాక్టివిటీ. రికమెండేషన్: సెక్షన 212(a)(3)(B)కింద వీసా రద్దుకేటగిరీ: సంఘ వ్యతిరేక సంస్థలకు మద్దతు నోట్: జాతీయ భద్రతా ముప్పు యాక్షన్: సాఫ్ట్ డెటెన్షన్ ప్రోటోకాల్. ∙∙ ఓ వారం తర్వాత యూనివర్సిటీ లైబ్రరీ ద్వారం దగ్గర నీ బ్యాడ్జ్ పని చేయలేదు. కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టి వెళ్లిపోయావు. అక్క పెళ్లి కోసం ఇండియా వెళ్ళే హడావిడిలో. నీ వీసా స్టేటస్ మారిందని నీకు తెలియను కూడా తెలియదు. ఎయిర్పోర్టు రెండో సెక్యూరిటీ గార్డు కూడా నీ వైపు చూడకుండా కంప్యూటర్ వంక చూస్తున్నప్పుడు, నీకేం అర్థం కాలేదు. నీ మొహంలో భయం, ఆందోళన.‘‘మేమ్, ప్లీజ్ కొంచెం ఈ పక్కకు రండి’’ సెక్యూరిటీ గార్డు రిక్వెస్ట్గా అడిగినా, అందులో అధికారమే ధ్వనిస్తోంది. ‘‘ఏమైనా ప్రాబ్లమా సార్?’’ అతి వినయంగా అడిగిన నీ మాటలకు, ‘‘ఇది జస్ట్ రొటీన్’’ చెప్పాడతను. చాలాసార్లు అది నిజమే. కానీ ఈసారి కాదు. ∙∙ ఏజెంట్స్ ఫీల్డ్ నోట్స్: సబ్జెక్ట్ కామ్గా కనిపించింది. ఏ మత సంస్థలతోనూ ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది. మానవహక్కులు, అకడమిక్ ఫ్రీడంలాంటి పదాలు తరచూ ప్రయోగించింది. ఆ పోస్ట్ రీట్వీట్ చేయటంలో కానీ, ఆ ప్రదర్శనలో ప్లకార్డ్ పట్టుకోవడంలో కానీ ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పింది. పదే పదే ప్రశ్నించాకా,‘‘ఎవరి పట్లనైనా మానవత్వంతో స్పందించటం నేరమా?’’ అని ఎదురు ప్రశ్నించింది. ∙∙ నీ చేతికి వేసిన సంకెళ్ళు నిన్ను చూసి చులకనగా నవ్వాయి. ఆ నిశ్శబ్దం నిన్ను భూతంలా చుట్టుముట్టి భయపెట్టింది. వాళ్ళంతా చాలా ప్రశాంతంగా ఇది చాలా అలవాటైన పనిలాగా చేసుకుంటూ వెళ్లిపోవటం నిన్ను నిలువునా కూల్చేసింది. నువ్వు మొదట్లో మామూలుగానే అడిగే ప్రయత్నం చేశావు, కానీ నీ గొంతులో కోపం, భయం, ఆందోళన అన్నీ వాళ్ళకు కనిపించాయి. వేటాడే పులికి తన నోటికి చిక్కిన జింక మొహం చూస్తే చాలు. తినక ముందే కడుపు నిండిపోతుంది. వాళ్ళ మొహాలు నీ కంటికి వేటాడే సింహాల్లాగానే కనిపించాయి. ‘‘నా మీద పెట్టిన చార్జ్ ఏమిటి?’’ ‘‘దేశ భద్రతకు ముప్పు.’’ దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్రజెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు.∙∙ ఆ రాత్రి నిన్ను వ్యాన్లో మరో చోటికి తీసుకెళ్లారు. అక్కడ కిటికీల్లేవు.కొందరు గార్డులు నీ వంక సానుభూతిగా చూశారు. కొందరు ఇది మా ఉద్యోగం అన్నట్లు కళ్ళతోనే చెప్పుకున్నారు. కొందరి కళ్ళల్లో బాగా శాస్తి జరిగిందన్న ఆనందం. నీ దవడ బిగుసుకుంది. నీ పళ్ళు గట్టిగా కరుచుకోవటం వల్లనో, మరి దేని వల్లనో నాలుకకి రక్తపు రుచి తెలిసింది. ఫోన్ కాల్ ట్రాన్ స్క్రిప్ట్: ICE మానిటర్డ్ లైన్ ‘‘చిన్నీ’’ ‘‘అమ్మా’’ వొణికిన గొంతులోంచి కన్నీళ్లు లోపలకి ఇంకిపోతున్నాయి. ‘‘మొన్న ఫ్లయిట్ ఎందుకు కాన్సిల్ చేశావ్? అంతా ఓకే కదా? నిజం చెప్పు. ఏమైనా జరిగిందా? ఏదేదో వింటున్నాం ఇక్కడ’’ భారతి సమాధానం ఇవ్వకముందే ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోంది. ‘‘అంతా బాగానే వుంది మీరు వర్రీ కావద్దు. వీసా సమస్యలు. పేపర్లు సబ్మిట్ చేశా. బహుశా అక్క పెళ్ళికి నే రాలేకపోవచ్చు’’‘‘నీ వీసా Extensionకి ఎప్పుడనగానో అప్లై చేశావుగా ’’‘అనుమానాలు ముందు పుట్టి తర్వాత అమ్మలు పుట్టి వుంటారు. అంత తొందరగా దేన్నీ నమ్మరు.’ ‘‘ఇక్కడ పరిస్థితులు కొంచెం టెన్షన్గా వున్నాయి. నేను ఫోన్ చేయకపోతే కంగారు పడొద్దు.’’ తన మాటలు తనకే నిర్జీవంగా వినిపించాయి. ఫోన్ కాల్ టైమ్ అయిపోయింది. ∙∙ Asylum కోసం మిగతా బందీలకు వీలు కుదిరినప్పుడల్లా ఉత్తరాలు రాసి పెడుతున్నావు నువ్వు. చేయటానికి వేరే పని ఏముంది? ఆలోచనల్లో మునిగిపోవటం తప్ప. ప్రపంచానికి పెదరాయుడులాంటి అమెరికానే గెంటేస్తుంటే, ఇంకే దేశానికిAsylum అప్లికేషన్స్ పెట్టుకోగలరు ఎవరైనా? కదా!∙∙ ఆ సెంటర్లో అనేక దేశాల వాళ్ళు, భాషల వాళ్ళు. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళతో పాటు, నేరాలు ఆపాదించబడ్డ వాళ్ళు కూడా. Like Bharati.. స్పీడ్గా కారు నడిపి ఫైన్ కట్టని చిన్న నేరాల నుంచి హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు: అందరికీ ఒకటే డిటెన్షన్ సెంటర్. కాపలా కాస్తున్న వారి కళ్ళకు ఎవరేమిటో తెలియదు. తెలియక్కరలేదు కూడా. గార్డులకు, డిటైనీలకు తెలిసింది నల్లటి ఊచలు మాత్రమే!ఊచలు పట్టి వుంచేది వ్యక్తులనే కానీ వ్యక్తిత్వాలను కాదు. ఆవేశాన్నే కానీ ఆలోచనలను కాదు. దేశం కళ్ళల్లో నువ్వొక ముప్పు. నువ్వొక ప్రమాద హెచ్చరిక. నువ్వొక ఎర్ర జెండా. ఇవేమీ తెలియని అమ్మా, నాన్నా రోజులాగానే నీ భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేస్తూనే వున్నారు. కల్పనా రెంటాల(చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!) -
స్మార్ట్ అండ్ బెస్ట్ క్లీనర్..!
అందంగా మెరిసిపోవడానికి నచ్చిన మేకప్ వేసుకోవడం ఎంత ముఖ్యమో, ఆ మేకప్ వేసుకునే బ్రష్లను శుభ్రంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. నిజానికి మురికి మేకప్ బ్రష్లు బ్యాక్టీరియాకు నిలయంగా మారిపోతాయి. అలాంటి బ్రష్లు వాడితే చర్మ సమస్యలు తప్పవు. అంతేకాకుండా మేకప్ వేసుకునేటప్పుడు కూడా మనం ఎంచుకున్న కలర్ కాకుండా మరో కలర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ మేకప్ బ్రష్ క్లీనర్తో మేకప్ బ్రష్లను సులువుగా శుభ్రం చేసుకోవచ్చు.ఈ ఆటోమేటిక్ క్లీనర్ మేకప్ బ్రష్లను సమర్థంగా శుభ్రం చేస్తుంది. ఇది ఒక స్పిన్నర్, క్లీనింగ్ మ్యాట్తో వస్తుంది. బ్రష్ను సరైన అడాప్టర్కు కనెక్ట్ చేసి, క్లీనింగ్ బౌల్లో కొద్దిగా నీళ్లు, క్లీనింగ్ లిక్విడ్ వేసుకుని ఆపై, బటన్ను నొక్కితే చాలు. బ్రష్ను నీటిలో తిప్పుతూ అదే క్లీన్ చేస్తుంది. మేకప్ బ్రష్ మీద పేరుకుపోయిన మొండి అవశేషాలను, ధూళిని ఈ డివైస్ ఇట్టే తొలగిస్తుంది.చిత్రంలోని క్లీనర్తో వచ్చే క్లీనింగ్ మ్యాట్ వివిధ రకాల బ్రష్ల కోసం వేర్వేరు టెక్స్చర్లను కలిగి ఉంటుంది, ఇది మరింత లోతుగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ మేకప్ బ్రష్ క్లీనర్ మహిళలకు, ముఖ్యంగా మేకప్ వేసుకోవడానికి ఇష్టపడే వారికి ఒక చక్కటి బహుమతి. ఇక ఇది నీళ్లతో బ్రష్ని క్లీన్ చేయగానే, డివైస్ నుంచి నీళ్లు ఉన్న కప్ను వేరు చేసుకుని, ఆ నీటిని పారబొయ్యాలి. ఆ తర్వాత ఆ కప్ను మరోసారి మంచి నీటితో క్లీన్ చేసుకుని మళ్లీ డివైస్కి అటాచ్ చేసి, బ్రష్ను దానిలో ఉంచి, బటన్ ఆన్ చేసుకుని, తడి లేకుండా ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు బ్రష్లను క్లీన్ చేసుకునేటట్లయితే మేకప్ బ్రష్లు ఎక్కువ మన్నికతో ఉంటాయి. (చదవండి: 'టీ బ్యాగులు' తింటే ఏమవుతుందో తెలుసా..!) -
జస్ట్ కాఫీతో బయటపడ్డ నేరం..! కానీ పోలీసులే విస్తుపోయేలా..
2000 హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో పదమూడు నెలల వయసున్న సాకీ అనే రాయల్ బెంగాల్ జాతి ఆడపులిని కొందరు దుండగులు చంపేశారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ సంఘటన 2000 అక్టోబర్ 5న జరిగింది. ఈ సంఘటనపై బహదూర్పుర పోలీస్స్టేషన్లో నమోదైన కేసు సీఐడీ వరకు వెళ్లింది. తర్వాత సీబీఐ విచారణకు డిమాండ్ వచ్చింది. దీనిపై అనేక రాజకీయ అంశాలు తెరపైకి రావడంతో పోలీసులు సాకీ హంతకుల సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయలు రివార్డుగా ప్రకటించారు. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసు కప్పు కాఫీతో యాదృచ్ఛికంగా కొలిక్కి వచ్చింది.మహారాష్ట్రకు చెందిన మహ్మద్ సలావుద్దీన్ హైదరాబాద్కు వలసవచ్చి, రియాసత్నగర్లో స్థిరపడ్డాడు. ఆటోడ్రైవర్గా పనిచేస్తూ, జల్సాలకు అలవాటుపడ్డాడు. డబ్బు కోసం చిన్న చిన్న చోరీలతో నేరజీవితం ప్రారంభించాడు. వీరప్పన్ స్టోరీలు విన్న ఇతడి కన్ను గంధపు చెక్కలపై పడింది. హైదరాబాద్లోని జూ పార్క్లో గంధపు చెట్లు ఉన్నట్లు తెలుసుకుని, వాటిని కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నాడు. వెన్నెల లేని చీకటి రాత్రుల్లో జూ పార్క్ ప్రహరీ గోడ దూకి లోపలకు వెళ్లేవాడు. అక్కడున్న గంధపు చెట్లను నరికి తీసుకువెళ్లి అమ్ముకునేవాడు. ఈ కేసుల్లో అరెస్టు కావడంతో అతడికి ‘హైదరాబాదీ వీరప్పన్’ అనే పేరు వచ్చింది. సలావుద్దీన్ ఇళ్లల్లో చోరీలు, చైన్ స్నాచింగ్స్ కూడా చేసేవాడు. చోరీ సొత్తు పంపిణీ వివాదంలో ఒక సహచరుడిని హత్య చేసిన ఆరోపణలపై కేసు కూడా నమోదైంది. గంధపు చెట్ల కోసం ఎప్పటిలాగే 2000 అక్టోబర్లో జూ పార్క్లోకి వెళ్లాలని భావించిన సలావుద్దీన్తో అతడి స్నేహితుడైన ఇస్మాయిల్ ఓ చాలెంజ్ చేశాడు. ‘జూలో ఉన్న పులిని చంపడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు ఆ పని చేసి చర్మం, గోళ్లు తేగలవా?’ అంటూ రెచ్చగొట్టాడు. దీంతో సలావుద్దీన్ అదే నెల 4 రాత్రి తన అనుచరులైన అహ్మద్, సమద్లతో కలసి జూపార్క్ వెనుక ఉన్న మీర్ఆలం ట్యాంక్ వైపు నుంచి లోపలకు ప్రవేశించాడు. సఫారీకి సమీపంలోని పులుల ఎన్క్లోజర్ వద్దకు వెళ్లాడు. అక్కడ తొమ్మిది బోనుల్లో 14 పులులు ఉండగా, వాటిలో సాకీని ఎంపిక చేసుకున్నాడు. బోనులో ఉన్న దాని మెడకు ఉరి బిగించి చంపేసిన సలావుద్దీన్– తన వెంట తెచ్చుకున్న కత్తితో దాదాపు నాలుగు గంటలు ప్రయత్నించి దాని చర్మం, గోళ్లు ఒలిచేశాడు. ఈ ఘాతుకాన్ని చూసిన మిగిలిన పులులు తీవ్ర షాక్కు గురయ్యాయి. కొన్ని రోజుల పాటు అవి ఆహారం సైతం తీసుకోలేదు. సాకీ హత్యపై బహదూర్పుర పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. జూ పార్క్లో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. సీఐడీ అధికారులు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసినా, చిన్న క్లూ కూడా లభించలేదు. సమాచారం ఇచ్చిన వారికి రూ.లక్ష రివార్డు ప్రకటించినా ఫలితం దక్కలేదు. ఈలోగా సాకీ హత్య రాజకీయ రంగు పులుముకుంది. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ నేత క్షుద్ర పూజల కోసం ఇక్కడి కొందరు పెద్దలే సాకీని చంపి, దాని చర్మం, గోళ్లు పంపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సాకీని చంపిన తర్వాత సలావుద్దీన్ సైతం చోరీ, స్నాచింగ్ తదితర కేసుల్లో మూడుసార్లు పోలీసులకు చిక్కినా నోరు విప్పలేదు. 2005 నాటికి సాకీ కేసు కూడా కొలిక్కి చేరని కేసుల జాబితాలోకి చేరిపోయింది. ఆ రోజుల్లో సలావుద్దీన్ మీద పోలీసుల కళ్లు ఉండేవి. 2005 ఫిబ్రవరిలో సలావుద్దీన్ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అప్పట్లో రాజీవ్ త్రివేది హైదరాబాద్ నేర విభాగానికి అదనపు పోలీసు కమిషనర్గా ఉండేవారు. సాధారణంగా సీసీఎస్ పోలీసులు పట్టుకున్న ప్రతి ఘరానా దొంగనూ ఆయన ఎదుట హాజరుపరచే వాళ్లు. అధికారులు సలావుద్దీన్ను అలానే హాజరుపరచారు. అతడి నేర చరిత్ర తెలుసుకున్న ఆయన ‘ఇంక మారవా?’ అంటూ కాస్సేపు ముచ్చటించారు. తాను కాఫీ తాగే సమయం కావడంతో సలావుద్దీన్ను కూర్చోబెట్టి, అతడికీ కాఫీ ఇచ్చారు. దీంతో రాజీవ్ త్రివేదీతో సలాదుద్దీన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు. కాఫీ తాగడం పూర్తయ్యాక ఇంకేమేం నేరాలు చేశావంటూ రాజీవ్ త్రివేదీ ప్రశ్నించగా, ఐదేళ్ల కిందట జూపార్క్లో సాకీని తానే చంపానని బయటపెట్టాడు. ఆ మాట విన్న వెంటనే షాక్కు లోనైన పోలీసులు సలావుద్దీన్ అరెస్టు ప్రక్రియను వాయిదా వేశారు. అతడు చెప్పే మాటలపై నమ్మకం కుదరకపోవడంతో పదేపదే ప్రశ్నించారు. దీంతో తన మాట మీద నమ్మకం లేకపోతే అనుచరులను పట్టుకుని ప్రశ్నించాలని, మహారాష్ట్రలోని తన బంధువుల ఇంటికి వెళ్లి చూస్తే సాకీ చర్మం, గోళ్లు లభిస్తాయని చెప్పాడు. మహారాష్ట్ర వెళ్లిన బృందం వాటిని రికవరీ చేశాక పోలీసులు సలావుద్దీన్ను, అతడి అనుచరులను అరెస్టు చేసి, మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసుల సమక్షంలోనే తాను జైలు నుంచి పారిపోతానని, మళ్లీ నేరాలు చేస్తానని సవాల్ చేశాడు. దీనికి స్పందించిన రాజీవ్ త్రివేది ‘నిన్ను చర్లపల్లి జైలులో పెడుతున్నాం. ఎస్కేప్ కాగలిగితే రూ.లక్ష ఇస్తా’ అని అన్నారు. ఈ మాటనూ సలావుద్దీన్ సీరియస్గా తీసుకున్నాడు. 2005 ఫిబ్రవరి నుంచి జైల్లో ఉన్న అతడు పారిపోవడానికి అదను కోసం ఎదురు చూశాడు. చివరకు 2006 నవంబర్ 24న జైలు నుంచి తప్పించుకున్నాడు. దుప్పట్లను తాడుగా చేసుకుని, వాచ్టవర్ పైనుంచి దాని సాయంతో దిగుతూ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడికి నడుము విరగడంతో ఎక్కువ దూరం వెళ్లలేక సమీపంలోని పొదల్లో దాగుండిపోయాడు. మర్నాడు ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న జైలు సిబ్బందికే చిక్కాడు. జైలు అధికారులు సలావుద్దీన్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తనను కలసిన మీడియాతో ‘రాజీవ్ త్రివేది సాబ్ చేసిన సవాల్లో నేనే నెగ్గా. గాయం వల్ల ఆగిపోయినా, జైలు నుంచి అయితే ఎస్కేప్ అయ్యా. ఆయనకు ఈ విషయం చెప్పి రూ.లక్ష ఇప్పించండి. వైద్య ఖర్చులకైనా పనికొస్తాయి’ అని చెప్పి అవాక్కయ్యేలా చేశాడు. ఆ తర్వాత తన పాత పంథా కొనసాగిస్తూ చోరీలు, గంధపు చెట్ల నరికివేత చేసిన సలావుద్దీన్ కొన్నేళ్లుగా స్తబ్ధుగా ఉంటున్నాడు. శ్రీరంగం కామేష్ (చదవండి: ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..! రీజన్ తెలిస్తే షాకవ్వుతారు..) -
సీజనల్ సైకాలజీ: వేసవి ప్రభావం దీర్ఘకాలం..
వేసవి కాలంలో పిల్లలు ఏం చేయాలి, పెద్దలు ఏం చేయాలనే విషయం గురించి మూడు నాలుగు వారాలుగా తెలుసుకుంటున్నాం. అయితే ఈ కాలంలో వచ్చే మార్పులు తాత్కాలికమా? దీర్ఘకాలికమా? వేసవి మనసులో కేవలం తాత్కాలిక మార్పులు కాకుండా, దీర్ఘకాలం ప్రభావితం చేసే సైకోబయలాజికల్ ప్రాసెస్లు కూడా జరుగుతాయని సీజనల్ సైకాలజీ, న్యూరో సైన్సు పరిశోధనలు చెబుతున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.దీర్ఘకాలిక ఆత్మవిశ్వాసంవేసవి వేడితో పెరిగిన సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోకెమికల్స్ తాత్కాలికంగా మూడ్ను పెంచుతాయని, శక్తిని పెంచుతాయని ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్’పై రోసెంథల్ (1984) చేసిన పరిశోధనను వెల్లడించింది. వేసవిలో ప్రారంభించిన ధ్యానం వంటివి మనల్ని మనం నియంత్రించుకునేందుకు రిజర్వ్లా పనిచేస్తాయని జపాన్లోని కియో యూనివర్సిటీలో జరిగిన దీర్ఘకాలిక అధ్యయనం కూడా తెలిపింది. ఉదాహరణకు నా దగ్గరకు కౌన్సెలింగ్ కోసం వచ్చిన కిరణ్ అనే ఐటీ ఉద్యోగి వేసవిలో ప్రారంభించిన ప్రాణాయామం, ఆపై ఏడాది పాటు కొనసాగించటం వలన అతని ఆందోళన స్థాయి, ఒత్తిడి 45శాతం తగ్గినట్లు తన జర్నలింగ్లో రికార్డ్ చేసుకున్నాడు. వేసవిలో వచ్చే మూడ్ బూస్ట్ను అలవాటుగా మార్చుకుంటే దీర్ఘకాల ఆత్మవిశ్వాసం సిద్ధమవుతుంది.అలవాటుగా మార్చుకోవాలివేసవిలో ఏర్పడిన కొత్త అలవాట్లు మెదడులో బలంగా ‘లాక్’ అవుతాయని స్మిత్, క్లీన్ 2017లో చేసిన అధ్యయనంలో తెలిపారు. ఇది కాగ్నిటివ్ సైకాలజీలోని హెబియన్ లెర్నింగ్తో కలిసి కాలంతో పాటు గాఢమవుతుంది. ఉదాహరణకు గత వేసవిలో నేను నిర్వహించిన వర్క్షాప్లో పొమోడోరో స్టడీ మెథడ్ గురించి చెప్పాను. సునీల్ అనే విద్యార్థి ఆ అలవాటును వేసవి తర్వాత కూడా కొనసాగించాడు. దీంతో ఈ ఏడాది అతని ఏకాగ్రత, మార్కులు గణనీయంగా మెరుగయ్యాయి. ఒక సీజనల్ అలవాటును 21 రోజుల నుంచి 90 రోజుల వరకు కొనసాగిస్తే అది దీర్ఘకాలిక అలవాటుగా మారుతుంది. బలపడే బంధాలువేసవిలో పెళ్లిళ్లు, కుటుంబ కలయికలు ఎక్కువగా జరుగుతాయి. ఇవి ఎమోషనల్ యాంకర్స్గా పనిచేస్తాయి. వేసవిలో ఏర్పడే ఈ సోషల్ బాండ్స్ ఆ తర్వాత ఆరునెలల పాటు ఒంటరితనాన్ని 30శాతం వరకు తగ్గిస్తాయని బార్బీ, గ్రాఫ్మన్ 2010లో జరిపిన అధ్యయనంలో వెల్లడించారు. ఉదాహరణకు నా క్లయింట్ రామకృష్ణ గత వేసవిలో తన బాల్యమిత్రుడిని కలిశాడు. ఆ తర్వాత తరచు అతనితో మాట్లాడుతూ తమ మధ్యనున్న బంధాన్ని బలంగా నిర్మించుకున్నాడు. ఫలితంగా అతని ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిడిని నియంత్రించుకోగలిగాడు. పెరిగే సృజనాత్మకతవేసవిలో సృజనాత్మకత తారస్థాయిలో ఉంటుందని కాఫ్మన్ 2016లో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ కాలంలో కాగ్నిటివ్ ఫ్లెగ్జిబిలిటీ ఎక్కువగా ఉంటుందని చూపించారు. దీన్ని హార్వర్డ్ క్రియేటివ్ లాబ్ 2021లో తిరిగి నిర్ధారించింది. ఉదాహరణకు సుశీల్ వేసవిలో ఆర్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు. ఆ తరువాత అదే ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్ట్లో ప్రదర్శించటానికి అవకాశం దొరికింది.భావోద్వేగ ప్రజ్ఞను బలోపేతం చేసుకోండి వేసవిలో ప్రారంభించిన జర్నలింగ్ సీజన్తో పాటు మారే భావోద్వేగాలను గమనించడానికి అద్భుతమైన సాధనమని కాబట్–జిన్ 2003లో జరిపిన మైండ్ఫుల్నెస్ అధ్యయనంలో వెల్లడైంది. బండూరా సోషల్ కాగ్నిటివ్ థియరీ ప్రకారం కూడా భావోద్వేగాల నియంత్రణలో ఇంట్రాస్పెక్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు గత వేసవిలో ఎమోషనల్ డైరీ ప్రారంభించిన అనిత ఆందోళన తగ్గడంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగింది. వేసవి తర్వాత పాటించవలసిన టిప్స్...వేసవిలో మొదలైన ధ్యానం, జర్నలింగ్ను ఒక అలవాటుగా మార్చుకోండి. ప్రతినెల ఒక రోజు ఇంట్రాస్పెక్షన్కు కేటాయించండి. మా బంధాలను కొనసాగించడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక మెసేజ్ పంపించండి. వేసవిలోని నిద్ర అలవాటును ఏడాది పొడవునా కొనసాగించండి. ప్రతి మూడు నెలలకు ఒక కొత్త పుస్తకం చదవండి.మీ భావోద్వేగాలను ఎలా తట్టుకున్నారనే విషయం జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయండి.ప్రతీ సీజన్లో 30 రోజులు డిజిటల్ డిటాక్స్ చాలెంజ్ చేపట్టండి. ఒక కొత్త స్కిల్ను మీ చదువులో భాగం చేసి, మాస్టర్ చేయండి. క్రియేటివ్ ప్రాజెక్ట్స్కు డెడ్లైన్స్, గోల్స్ పెట్టుకోండి. సీజనల్ రిఫ్లెక్షన్ రిపోర్ట్ రాయడం ద్వారా మీ ఇంట్రాస్పెక్షన్ను శక్తిమంతం చేయండి. సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: Summer Holidays: ట్రావెల్ ఎక్స్పీరియన్స్: ఎందుకు రాయాలో తెలుసా..?) -
ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..!
‘అద్దె కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు– అబ్బా! ఎలారా ఫ్యామిలీ మన్ అందరూ మ్యానేజ్ చేస్తున్నారు’ అనే సినిమా డైలాగ్ మాదిరిగానే చాలామంది ఫ్యామిలీని రన్ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అయితే, అమెరికాలోని లానెట్, జోహాన్ అనే దంపతులు ఈ కష్టాలన్నింటికీ దూరంగా బతికేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు. అదే నౌకాజీవితం. వారికున్న కార్లన్నీ ఆమ్మేసి, ప్రపంచయాత్ర చేసే నౌకలో యావజ్జీవిత యాత్రను ప్రారంభించారు. ఈ నౌక మూడున్నరేళ్లల్లో 147 దేశాలకు చెందిన 425 ఓడరేవులలో ఆగుతుంది. ఇప్పటికే ఈ దంపతులు 25 దేశాలను సందర్శించారు. ఇలానే తర్వాతి పదిహేనేళ్లు కూడా ఇందులోనే గడిపేయాలని నిర్ణయించుకున్నారు. అద్భుతమైన వారి నౌకాజీవితాన్ని ‘లివింగ్ లైఫ్ ఆఫ్ ఏ క్రూజ్’ పేరుతో యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసి, ‘ఇక్కడ మేము నెలకు రూ. 2.85 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఇది మా సాధారణ ఖర్చుల కంటే చాలా తక్కువ. పైగా వంట వండటం, బట్టలు ఉతకడం, రూమ్ క్లీనింగ్ ఇలా ఏ పనీ చేయాల్సిన పనిలేదు. పడుకున్న దుప్పట్లు కూడా వారే మడతేసి పెడతారు. కేవలం ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టుకొని తినడం, ఎంజాయ్ చేయటమే మా పని. ఇదే మా అడ్రస్. అయితే, అప్పుడప్పుడు భూమి మీదకు వెళ్లినప్పుడు నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాం’ అని చెప్పారు. (చదవండి: కళ్లు చెదిరే కాంతుల వేడుక..!) -
మనమంతా ఒక్కటే... శాంతే మార్గం!
పోప్ లియో–14 ఈస్టర్ ఆది వారం రోజు ప్రసంగిస్తూ చెప్పిన ‘మనమంతా ఒక్కటే’ అనే మాటలు ప్రపంచంలో శాంతి నెలకొనడానికి ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలియ చేస్తున్నాయి. మే 8న 267వ అగస్టినియన్ పోప్గా, సెయింట్ పీటర్ వారసుడిగా ఎన్నికైన పోప్ లియో మే 18న ఆ సర్వోన్నత చర్చి పదవిని స్వీకరించనున్నారు. రెండు వేల ఏళ్ల క్యాథలిక్ చర్చి చరిత్రలో ఆయన తొలి అమెరికన్ పోప్ కావడం విశేషం. అంతే కాదు ద్వంద్వ పౌరసత్వాలు (అమెరికన్, పెరువియన్) కలిగిన తొలి పోప్ కూడా ఆయనే. పారిశ్రామిక యుగం తొలి నాళ్లలో సామాజిక న్యాయం కోసం, కార్మికుల హక్కుల కోసం గళమెత్తి నిరసన తెలిపిన పోప్ లియో–13 గౌర వార్థం ఆయనకు ‘లియో–14’ అనే పాపల్ పేరు (పోప్ అయ్యాక పెట్టే పేరు) పెట్టారు. ఆయన అసలు పేరు రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివస్ట్.పోప్ లియోది అమెరికాలోని చికాగో. కానీ జీవితంలో ఎక్కువ భాగం పెరూలోని చిక్లాయోలో గడిపారు. పెరువి యన్ జీవనశైలిలో ఆయన మమేకమై వారితో కలిసి పోయారు. కేవలం ఆ భాష నేర్చుకోవడంతోనే ఆగిపో కుండా వారి జీవితాల్లోని పలు పార్శా్వలను పరిశీలించారు. వారి బాధల్నీ, వేదనల్నీ గమనించారు. అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడుతూ మారుమూల పల్లెల్లో సైతం ఆయన ప్రయాణించారు. ఎల్లవేళలా శాంతి, న్యాయం, మతస్వేచ్ఛ, సమానత్వం, దేశభక్తి, మనిషిని మనిషిగా గౌరవించడం వంటి అంశాల కోసం పని చేశారు. అందుకే పెరువియన్లు ఆయనను తమ కొత్త నాయకుడని పిలుస్తారు. ఇక పోప్ పదవిని ఓ అమెరికన్ స్వీకరిస్తాడన్న నమ్మకం చాలా మందికి చాలా కాలంపాటు లేదు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు పోప్ లియో ఆ పదవిలోకి వచ్చి అమెరికన్ల ఆధ్యాత్మిక అంతస్తును పెంచారు.1982లో ప్రీస్ట్గా మారిన పోప్ లియోకు చర్చి చదు వులో పలు డిగ్రీలు ఉన్నాయి. ఇతరుల మాటలు ఆలకించడంలో, వారి అభిప్రాయాలను గౌరవించడంలో పోప్ లియోది అందె వేసిన చెయ్యి. ఈ గుణమే ఆయనను తోటి వారికి, అంతర్జాతీయ నేతలకు దగ్గర చేశాయి. ఆంగ్లం, స్పానిష్, ఇటాలియన్, ఫ్రెంచ్, పోర్చుగీస్ భాషలు అనర్గ ళంగా మాట్లాడగలిగిన పోప్ లియో ఈ బహుభాషలను ఆడంబరం కోసం కాక, ప్రపంచంలోని అనేకులతో నేరుగా సంభాషించి, వారితో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఉపయోగిస్తున్నారు. 2004, 2006లలో రెండుసార్లు లియో భారతదేశాన్ని సందర్శించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ సమయంలో ఆయన ఎటువంటి ప్రత్యేక వసతులూ కోరలేదు. చాలా నిరాడంబరంగా ఉన్నారు. ఆయన పద్ధతి, సామాన్య జీవనశైలి భారతీయులను ఆకట్టుకుంది.పోప్ లియో రాబోయే రోజులలో ఎటువంటి ప్రభావం చూపబోతున్నారో ఆయన వెల్లడి చేస్తున్న భావాల ద్వారా అర్థం చేసుకునేందుకు ప్రపంచం ప్రయత్ని స్తున్నది. ఈస్టర్ ఆదివారం నాడు ఆయన చేసిన తొలి ప్రసంగంలో ‘మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని దేశాధి నేతలను అభ్యర్థిస్తున్నాను’ అన్నారు. ఇప్పటికే రెండు మహా యుద్ధాలను చూసిన ప్రపంచం మరో భారీ యుద్ధా నికి సిద్ధంగా లేదని వివరించారు. తన ముందు పోప్గా ఉన్న ఫ్రాన్సిస్ సందేశమే తన సందేశమని ఆయన పేర్కొన్నారు. గాజాలో శాంతి నెలకొనాలని పిలుపునిచ్చారు. భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని అభి నందించారు. చేతిలో ఆయుధం పెట్టుకొని ఎవరూ ప్రేమను పంచలేరని, యుద్ధాల నిరోధానికి ఐక్యరాజ్య సమితి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పోప్ లియో తన ప్రసంగంలో సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు దాని వెనకే ఉన్న దుష్పరిణామాల గురించి వివరించడం గమనార్హం. సాంకేతిక పరిజ్ఞానం ఎల్లప్పుడూ బాధ్యతా యుతంగా వ్యవహరించాలనీ, సర్వమానవాళి శ్రేయస్సును కాంక్షించాలనీ అంటున్న ఆయన మాటల్ని బట్టి చూస్తే, ఈ ఏఐ యుగంలో ఆధునిక సాధువులా కనిపిస్తున్నారాయన.ఇటీవల అంతర్జాతీయ మీడియాతో పోప్ లియో మాట్లాడుతూ ‘మీడియాను నియంత్రిస్తే కొంతమేర ప్రజల ఆలోచనా విధానాన్ని నియంత్రించినట్లు అవుతుంది’ అన్నారు. క్రైస్తవులు సార్వజనీన మానవులని పోప్ మాట. అందర్నీ సమానంగా సోదరభావంతో చూడలేనివారు క్రైస్త వులు కారనేది ఆయన మాట.ప్రపంచంలోని అనేక దేశాల మధ్య యుద్ధాలు నడు స్తున్నాయి. దాయాది దేశాల మధ్య సమస్యలు నెల కొన్నాయి. ఇవి ప్రస్తుతం పోప్ ముందున్న సవాళ్లు. తన తొలి ప్రసంగంలోనే శాంతి కోసం ఆయన పడిన తపనను బట్టి తప్పకుండా ఆయన ఈ సమస్యలకు పరిష్కారం చూపుతారని చాలామంది విశ్వసిస్తున్నారు. దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు వారి మధ్య సయో ధ్యను కుదిర్చి, యుద్ధాన్ని నివారించే పెద్దలు ఈ సమాజా నికి చాలా అవసరం. అటువంటివారే పోప్. ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోప్ ఏర్పరిచే శాంతిబాటలకు ఎంతో ప్రాధాన్యం ఉందని అందరూ భావిస్తున్నారు.జహారా బేగం, - వ్యాసకర్త సామాజిక కార్యకర్త, అమెరికా -
ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
గ్లామర్, గ్రేస్, క్లాస్, క్యూట్... ఇలా అందాన్ని పొగిడే ఎన్ని పదాలున్నా, అన్నింటినీ కలిపి ఒకేసారి వాడినా కూడా నటి రాశీ ఖన్నా ఫ్యాషన్ లుక్స్ని నిర్వచించలేం. ట్రెడిషనల్ నుంచి జెండర్ ఫ్లూయిడ్ ఫ్యాషన్ వరకు ప్రతి స్టయిలింగ్లోనూ తన ఫ్యాషన్ స్టేట్మెంట్ స్కోర్ సెంచరీనే! అలాంటి ఒక ఫస్ట్క్లాస్ లుక్, ఇందుకోసం తను ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ అండ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూసేయండి. చెవి కప్పేస్తే కళ్లకందం దుద్దులు, బుట్టకమ్మలు, జూకాలు– ఇలా ఎన్ని రకాల కర్ణాభరణాలున్నా, వేటి గొప్ప వాటికే ఉంటుంది. అలా ఒకప్పటి గొప్ప ఆభరణం. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది. అదే ఫుల్ కవర్డ్ ఇయర్ కఫ్స్. ఇవి సాధారణ ఇయర్ కఫ్స్లాగా సపరేట్గా ఉండవు. కింద కమ్మలతోపాటే, కఫ్ రెండూ కలిపి ఒకే తరహా డిజైన్లో ఉంటాయి. వీటిని చెవికి పెట్టుకోకుండా హుక్తో తగిలించుకుంటే చాలు. సంప్రదాయ దుస్తులకు ఇది సరైన జోడీ. వేడుకల్లో వీటిని ధరిస్తే ప్రత్యేక ఆకర్షణగా మీరే నిలుస్తారు. అయితే, ఇలాంటి ఇయర్ కఫ్స్ వేసుకునేటప్పుడు మెడను బోసిగా ఉంచుకోవాలి. అప్పుడే వీటి లుక్ ఎలివేట్ అవుతుంది. హెయిర్ స్టయిల్ కూడా బన్ లేదా సెంటర్ బన్ వేసుకోవాలి. వేవీ లేదా లూస్ హెయిర్ స్టయిల్ అస్సలు నప్పదు దీనికి. అలాగే మరో చిన్న టిప్ ఏంటంటే, మొత్తం ఎఫర్ట్ చెవులకే కాకుండా, కాస్త చేతులకు కూడా ఇవ్వండి. అంటే చేతికి మీ డ్రెస్కు తగ్గట్టు మ్యాచింగ్ గాజులు వేసుకుని లుక్ని కాస్త బ్రైట్ చేయండి. అచ్చం నటి రాశీ ఖన్నా లాగా.. "ఫ్యాషన్లో లెస్ ఈజ్ మోర్ అనే ఫిలాసఫీని నమ్ముతా. అలాగని, ఫ్యాషన్లో ప్రయోగాలు చేయడానికి భయపడను. ఎలాంటి దుస్తులనైనా ఆత్మవిశ్వాసంతో ధరిస్తే, అందంగా కనిపిస్తారు." అంటోంది రాశీ ఖన్న. ఇక్కడ రాశీ కన్నా ధరించిన ఇయర్ రింగ్స్ బ్రాండ్: కోహర్ బై కనికాధర రూ. 6,500/-.(చదవండి: 'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..) -
వీరవాహనుడికి వశిష్ఠుడు చెప్పిన కథ
పూర్వం విరాధ నగరాన్ని వీరవాహనుడు పాలించేవాడు. అతడు గొప్ప ధర్మాత్ముడు, దానశీలి, సత్యవాది. ఒకనాడు అతడు వేట కోసం అడవికి వెళ్లాడు. అదే అడవిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉందని తెలుసుకుని, ఆయనను దర్శించుకుని, ధర్మసందేహాలను నివృత్తి చేసుకోవాలని తలచి, అక్కడకు వెళ్లాడు. ఆశ్రమంలో వశిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు పాదాభివందనం చేశాడు. పరస్పర కుశల ప్రశ్నలయ్యాక వీరవాహనానుడు ‘మహర్షీ! యథాశక్తిగా నేను ఎన్నో ధర్మకార్యాలను చేస్తూనే ఉన్నాను. అయినా నాకు నరక భయం తొలగిపోవడం లేదు. యమధర్మరాజును గాని, నరకాన్ని గాని చూడకుండా, నరకబాధలు లేకుండా మరణానంతర జీవనం గడిపే వీలుందా?’ అని అడిగాడు.‘మహారాజా! మన మునివరేణ్యులు ఎన్నో ధర్మాలను ప్రవచించినా, కర్మ మోహితులైన జనాలు వాటిని పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, పితృకార్యం, సన్యాసం– ఇవన్నీ గొప్ప ధర్మాలు. చివరిగా వృషోత్సర్గం– అంటే, ఆబోతును యథావిధిగా విడిచిపెట్టడం గొప్ప మహిమాన్వితమైన ధర్మకార్యం. మరణానంతరం అపరకర్మలు జరిపేటప్పుడు పుత్రులు గాని, ఇతరులు గాని వృషోత్సర్గం చేయకపోతే, ఆ మృతజీవుడు ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు. అందువల్ల మహారాజా! నువ్వు కూడా ఒక ఆబోతును విడిచిపెట్టు. వృషోత్సర్గ మహిమ నీకు తెలియాలంటే, ఒక కథ చెబుతాను విను’ అని వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు:ఒకప్పుడు విదేహ నగరంలో ధర్మవత్సుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు, విద్వాంసుడు. ఒకనాడు ఆయన పితృకార్యం కోసం దర్భలను, మోదుగు ఆకులను సేకరించడానికి అడవికి వెళ్లాడు. అడవిలో తిరుగుతూ ఆయన వాటిని సేకరిస్తుండగా, అకస్మాత్తుగా ఆయన ఎదుట నలుగురు దివ్యపురుషులు ప్రత్యక్షమయ్యారు. వారు ఆయనను ఆకాశమార్గాన తీసుకుపోయి, విశాలమైన వనం మధ్యనున్న ఒక నగరంలో వదిలారు. అద్భుతమైన ఆ నగరంలో ధర్మవత్సుడికి రెండు రకాల మనుషులు కనిపించారు. కొందరు మలిన వస్త్రాలు ధరించి, దీనులై, నీరసులై ఉన్నారు. మరికొందరు ధగధగలాడే నగలు, రంగురంగుల వస్త్రాలు ధరించి, ఉల్లాసంగా ఉత్సాహంగా సంచరిస్తూ ఉన్నారు. ఇదంతా చూసి, అతడు ‘కలయా, వైష్ణవ మాయా’ అనుకున్నాడు. ఇంతలో అతణ్ణి అక్కడకు తీసుకువచ్చిన నలుగురు దివ్యపురుషులు అతడిని మహారాజు వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఒక మహారాజు రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. చుట్టూ వందిమాగధులు, పరిజనం, ఎదురుగా సభాసదులు కొలువుతీరి ఉన్నారు. అంతటి మహారాజు కూడా ధర్మవత్సుడిని చూడగానే, సింహాసనం మీద నుంచి లేచి వచ్చి, అతడిని తన సింహాసనంపై కూర్చోబెట్టాడు. ‘విప్రవర్యా! మీవంటి విష్ణుభక్తుని దర్శనంతో నేడు నా జన్మ సఫలమైంది, నా వంశం పవిత్రమైంది’ అంటూ నమస్కరించాడు. ఘనంగా కానుకలు సమర్పించి, సత్కరించాడు.ధర్మవత్సుడు కాస్త తేరుకుని, ‘మహారాజా! ఇది ఏ దేశం. ఇక్కడి జనాల్లో కొందరు దీనులై ఉంటే, ఇంకొందరు సంతోషంగా ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది. దేవేంద్ర వైభవంతో నువ్వు విరాజిల్లుతుండటానికి కారణమేంటి? నన్నెందుకు ఇక్కడకు తీసుకువచ్చారు?’ అని అడిగాడు.‘విప్రోత్తమా! నా చరిత్రను వర్ణించి చెప్పే సామర్థ్యం నాకు లేదు. అందుకు మా మంత్రివర్యులే తగినవారు’ అని పలికాడు మహారాజు. మహారాజు మనసెరిగిన మంత్రి ఇలా చెప్పడం ప్రారంభించాడు: ‘భూసురోత్తమా! గతజన్మలో మా మహారాజు విధిరా నగరంలో వైశ్యునిగా జన్మించారు. గోబ్రాహ్మణ సేవ చేస్తూ, నిత్యాగ్నిహోత్రుడై, అతిథి పూజ చేస్తూ, ధర్మబద్ధమైన జీవనం సాగించేవారు. ఒకనాడు ఆయన తీర్థయాత్రలు పూర్తి చేసుకుని, స్వస్థలానికి తిరిగి వస్తుండగా, తోవలో లోమశ మహర్షి దర్శనం లభించింది. వెంటనే ఆయన లోమశ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! నా యాత్రా ఫలం వెంటనే కనిపించింది. మీ దర్శన భాగ్యం లభించింది. నాదో చిన్న కోరిక! అంతర్బాహ్య స్థితులలో ఒకేలా ఉండే శుద్ధతను, కష్టసుఖాలను ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞను పొందే సాధనమేదో తెలపండి’ అని కోరారు. అప్పుడు లోమశ మహర్షి, ‘వైశ్యవర్యా! సత్సాంగత్యం, సాధన, భక్తి, సద్విచారం ద్వారా మాత్రమే మనసు అదుపులో ఉంటుంది. మానవ జన్మలోని పాపకర్మల నుంచి విముక్తి పొందాలంటే వృషోత్సర్గం చేయాలి. వృషోత్సర్గం చేయనిదే పురుషార్థాలు నెరవేరవు. వెంటనే పుష్కర తీర్థానికి పోయి, వృషోత్సర్గం చేయి’ అని ఆదేశించాడు. లోమశుని ఆదేశంతో గతజన్మలో వైశ్యునిగా ఉన్న మా మహారాజు వరాహస్వామి వెలసిన పుష్కరతీర్థానికి వెళ్లి, అక్కడ వృషోత్సర్గం చేశారు. ఆ తర్వాత లోమశుని సమక్షంలో అనేక యజ్ఞాలను ఆచరించారు. ఆ పుణ్యఫలం వల్ల చాలాకాలం దివ్యలోకాలలో సకల భోగాలను అనుభవించారు. తిరిగి భూమ్మీద పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజు అయ్యారు’ అని చెప్పాడు మంత్రి. ‘ఈ విప్రోత్తములను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో అక్కడ సురక్షితంగా దిగవిడిచి రండి’ అని మహారాజు తన భటులను ఆదేశించాడు.ధర్మవత్సుడు ఆశ్చర్యపోయి, ‘అకస్మాత్తుగా ఎందుకు తీసుకొచ్చారు? మళ్లీ ఎందుకు పంపేస్తున్నారు?’ అని అడిగాడు. ‘విప్రోత్తమా! మీ వంటి విష్ణుభక్తులను నా సన్నిధికి పిలిపించి, సత్కరించడం నాకు అలవాటు. ఇందులో మీకు అసౌకర్యం కలిగించి ఉంటే మన్నించండి’ అని వినయంగా ప్రార్థించాడు మహారాజు. ధర్మవత్సుడు మహారాజును, ఆయన పరివారాన్ని ఆశీర్వదించి, ఆయన భటులతో కలిసి ఇంటికి వెళ్లాడు.∙సాంఖ్యాయన (చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!) -
కళ్లు చెదిరే కాంతుల వేడుక..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాల అందాలను చూడటం కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఎగబడుతుంటారు. పారమాట నది ఒడ్డునున్న సిడ్నీ అందాలు చూడటానికి సుమనోహరంగా ఉంటాయి. అయితే, సిడ్నీ అందాలను మరింత ప్రత్యేకంగా చూడాలంటే, వివిడ్ సిడ్నీ ఫెస్టివల్కి వెళ్లాల్సిందే! ఈ వేడుకలు మే 23 నుంచి ప్రారంభమై జూన్ 14 వరకు దాదాపు మూడు వారాల పాటు కొనసాగుతాయి. ఇక్కడ కనిపించే ప్రతి కట్టడం, చీకటిపడితే విద్యుత్ వెలుగులతో మిరుమిట్లు గొలుపుతాయి. సిడ్నీ ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ వంటి ప్రదేశాలు అద్భుతమైన కాంతి ప్రదర్శనలతో కళ్లుచెదిరే కళాఖండాలుగా మారుతాయి. అంతేకాదు, నగరమంతా ఏర్పాటు చేసే విద్యుద్దీపాలంకరణ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ఈ వేడుక కేవలం కాంతులకే పరిమితం కాదు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శనలుంటాయి. వినూత్న ఆలోచనలు పంచుకునే చర్చలు, చవులూరించే ఆహార వేదికలు కూడా ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొన్నిసార్లు ప్రత్యేకంగా నీటిపై విజువల్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. హార్బర్లో ప్రయాణించే పడవలు కూడా లైట్లతో అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వేడుకకు స్థానికులతో పాటు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో సిడ్నీకి విచ్చేస్తుంటారు. ఈ వేడుకకు 2023లో రికార్డు స్థాయిలో 32.8 లక్షలమంది హాజరయ్యారు. దాంతో ఈ ఏడాది కూడా అదే స్థాయి అంచనాలున్నాయి. (చదవండి: డ్రాగన్స్ సృష్టించిన అద్భుతం!) -
డ్రాగన్స్ సృష్టించిన అద్భుతం!
వియత్నామ్లోని హాలాంగ్ అఖాతం ప్రకృతి అందాలకు ఆలవాలం అనే చెప్పుకోవాలి. సహజ సౌందర్యం, చారిత్రక ప్రాముఖ్యత కలగలిసిన ఈ ప్రదేశం తప్పక చూడాల్సిందే అంటారు పర్యాటక ప్రియులు. ఇది వియత్నామ్కు, దక్షిణ–చైనాకు సముద్ర సరిహద్దు భాగం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ ప్రాంతంలో సుమారు రెండువేల సున్నపురాతి దీవులు ఉన్నాయి. ఇవి చూడటానికి వివిధ ఆకారాల్లో, వివిధ పరిమాణాల్లో ఎత్తుగా, పచ్చదనం చుట్టిన పర్వతాల్లా, లోతైన నీళ్ల మధ్యలో కనిపిస్తూ, కనువిందు చేస్తాయి. ఆ పర్వతాలను, గుహలను, నీటిలో తేలియాడే గ్రామాలను చూడటానికి పడవ ప్రయాణాలు చేస్తూ వెళ్లాలి. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఈ ప్రాంతం మరింత మనోహరంగా ఉంటుంది. అక్కడి పురాణాల ప్రకారం, ‘ఒకప్పుడు వియత్నామ్ను కాపాడటానికి దేవతలు డ్రాగన్ల కుటుంబాన్ని పంపారు. ఆ డ్రాగన్లు తమ నోటి నుంచి రత్నాలను ఉమ్మివేశాయి. అవి సముద్రంలో పడి దీవులుగా ఏర్పడ్డాయి. అవే దురాక్రమణదారుల నుంచి దేశాన్ని రక్షించాయి’ అని చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘డిసెండింగ్ డ్రాగన్’ అని పిలుస్తారు. (చదవండి: మంచుకొండల్లో మహిళారాజ్యం..! ఆ ఒక్క జిల్లాలో పాలనాధికారులంతా..) -
అజ్ఞాత ప్రేమికుడు..!
ఆకాశాన్ని మేఘాలు కమ్ముకోసాగాయి. మెల్లమెల్లగా మట్టి వాసనను మోసుకొచ్చి ముక్కుపుటాలను తాకేలా చేసింది చిరుగాలి. మేఘాల నుంచి జారి నేలను ముద్దాడటానికి అన్నట్టుగా ఒక దానితో మరొకటి పోటీ పడసాగాయి వర్షపు చినుకులు. ఆ క్షణం నాకు చాలా అసహనంగా తోచింది. సాధారణంగా ధైర్యంగా ఉండే నాకు ఆ వాతావరణం బెదురుగా అనిపించింది.పూలు అమ్ముకొనే ఒక వృద్ధురాలు అదే బస్టాండ్లోకి వచ్చి ఒక చివరన కూర్చుంది. ఒక మనిషి తోడు ఉండటం మూలంగా నేను కాస్త కుదుటపడ్డాను. ఇంకాసేపటికి ఒక వృద్ధుడు వచ్చాడు. అతను నేరుగా వెళ్లి పూలు అమ్ముకునే వృద్ధురాలి పక్కన కూర్చున్నాడు. వారి సంభాషణను బట్టి, వారిద్దరూ భార్యాభర్తలు అని అర్థమైంది. ఈ వయసులో వారి అన్యోన్యతను చూసి ముచ్చటగా అనిపించి నవ్వుకున్నాను. వెంటనే అతను గుర్తొచ్చాడు. బస్టాండ్ షెల్టర్ నుంచి ఒక్కో వాన చినుకు ఒక దాని తర్వాత ఒకటి నేలను తాకసాగాయి. నా జ్ఞాపకాలు గతంలోకి పరుగులు పెట్టాయి.సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి తిరిగి చేరుకొనే సమయంలో వాన జల్లులు పడుతున్నాయి. అప్పుడే చూశాను అతన్ని పదునైన చూపులతో కోటేరులాంటి ముక్కుతో, సన్నటి చిరునవ్వుతో ఉన్న అతని అందం నన్ను ఆకర్షించింది. చినుకులుగా రాలిన వానజల్లు జోరువానగా మారింది. ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న నన్ను నా చేయి అందుకొని పక్కనే ఉన్న చెట్టు కిందకి తీసుకుని వెళ్ళాడు అతను. నేను హతాశురాలిని అయ్యి అతన్నే చూస్తూ ఉన్నాను. వెంటనే అతను ‘క్షమించండి వర్షం ఎక్కువ అవుతుంది. మీరు ఎటు వెళ్ళాలో తెలియక సతమతమవుతుంటే ఇక్కడికి తీసుకొచ్చాను’ అన్నాడు. ‘పర్వాలేదండి’ అన్నాను నేను. అరక్షణంలోనే తను తన స్నేహితులతో వానలో మాయమైపోయాడు.ఏదోలా ఇంటికి చేరుకున్న నేను అతని చిరునవ్వును గుర్తు చేసుకుంటూ ఆ రోజును ముగించేశాను.తెల్లవారుతుండగా ఇంటి ముందు బండిలో నుండి సామాను దించుతున్న శబ్దాలు వినిపిస్తుంటే, అటుగా వెళ్లి చూశాను. ఎవరో ఎదురింట్లో కొత్తగా వచ్చినట్లున్నారు అనుకొని నా పనిలో నేను మునిగిపోయాను. అలా మూడు రోజులు గడిచాయి..యథావిధిగా ఒక రోజు ఆఫీసు నుంచి తిరిగి వస్తుండగా, ఎదురింట్లోంచి అతను బయటకి వస్తూ ఎదురయ్యాడు. అతనెవరో తెలియనట్లు నా దారిన నేను వెళ్తుంటే అతనే నన్ను గుర్తుపట్టి ‘బాగున్నారా’ అని పలకరించాడు. నేను అతనెవరో తెలియనట్లు ‘ఎవరండీ మీరు?’ అని అడిగాను. దాంతో అతను ఆ రోజు వర్షంలో జరిగిన సంఘటన గుర్తు చేశాడు. ‘గుర్తొచ్చారండి’ అన్నాను నేను. ‘ఇక్కడేం చేస్తున్నారు?’ అని అడిగాను. ‘మూడు రోజుల క్రితమే మీ ఎదురింట్లోకి అద్దెకు వచ్చాను’ అని చెప్పాడు. ‘ఔనా!’ అనేసి వెంటనే తేరుకొని, ‘మా ఎదురింట్లో అంటున్నారు నేను ఇక్కడే ఉంటానని మీకెలా తెలుసు?’ అని అడిగాను. అతను తడబడుతూ, ‘అంటే.. అది.. మీరు ఈ ఇంట్లోకే వెళుతున్నారు కదా! ఇదే మీ ఇల్లు అని అనుకొని అలా చెప్పాను’ అన్నాడు. నాకెందుకో అతని వాలకం అనుమానంగా తోచింది. దాన్ని అంతటితో వదిలేసి ఇంట్లోకి వచ్చేశాను.రోజులు గడుస్తున్నాయి. అతను అప్పుడప్పుడు ఎదురు పడుతూనే ఉన్నాడు. ఒకరోజు నా పుట్టినరోజు సందర్భంగా శివాలయానికి వెళ్ళాను. అక్కడ ఎవరో ఒకతను ఒకావిడ పేరు మీద అర్చన చేయిస్తూ ఉన్నాడు. అతని ముఖం కన్పించలేదు. అటు వైపు తిరిగి ఉన్నాడు. అర్చన అయిపోయి ప్రసాదం తీసుకొని అతను వెళ్ళిపోయాడు. నేను కూడా దేవునికి దండం పెట్టుకొని వెనుతిరుగుతూ ఉండగా చిరిగిన అర్చన టికెట్ నాకంట పడింది. అందులో ఉన్న పేరు చూసి షాక్ అయ్యాను.అందులో ఉన్నది నా పేరే, ‘మేఘన సుబ్రమణ్యం‘. వెంటనే పంతులుగారిని అడిగాను. అర్చన చేయించింది ఎవరని. ‘అతనెవరో నాకు తెలీదమ్మా! కాని మూడేళ్లుగా ఈ పేరుమీద ఇదేరోజున అర్చన చేయిస్తున్నాడు’ అని పంతులుగారు చెప్పారు. నాకేమీ అర్థం కాలేదు కొంతసేపటి వరకు. కాని, ఒకటైతే అర్థమైంది. అతనెవరో నన్ను కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నాడని. మరి అతను ఎవరు? నేనెలా అతన్ని కనిపెట్టేది అని తెగ ఆలోచించసాగాను. కాని నా బుర్రకు ఏ ఆలోచనా తట్టలేదు. నా ఆలోచనలు అలా సాగుతూ ఉన్నాయి. ఈ ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాను. అదే రోజు మధ్యాహ్నం మా ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది నా పేరు మీద. ఏంటా అది అని తెరిచి చూస్తే అందులో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో–‘‘సుందరి! ఇది నేను నీకు పెట్టుకున్న ముద్దు పేరు. ‘ఇదే ఎందుకు పెట్టుకున్నాడు?’ అని నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే నాకు ‘సుందరీ నేనే నువ్వంటా, చూడని నీలో నన్నంటా’. అనే దళపతి సినిమాలో పాట చాలా ఇష్టం. ఆ పాట వింటూ నేను నిన్ను నా సుందరిగా ఊహించుకుంటూ ఉంటాను. ఇంతకు నేనెవరో నీకు తెలియదు కదూ! నేను నీ అజ్ఞాత ప్రేమికుడిని. గత మూడేళ్లుగా నిన్ను చూస్తూ, ఆరాధిస్తూ, ప్రేమిస్తూ రోజులు గడుపుతూ ఉన్నాను. నిన్ను చూసిన మొదటి క్షణం ఒక తండ్రి తనకు కూతురు పుట్టింది అని తెలియగానే పడే ఆనందపు తాలుకా అనుభూతిని నాలో నేను చూశాను. ఆ అనుభూతి ఇంతకు ముందెప్పుడు నాకు కలగలేదు. అప్పుడే ఫిక్స్ అయ్యాను నువ్వే నా సుందరివని, నిన్ను ఎప్పుడు విడువలేనని. కాని, ఇక్కడే పెద్ద సమస్య వచ్చిపడింది. అదేంటంటే, నేను నీ ముందుకు రాలేనని, నేనెవరినో నీకు తెలియకుండా ఉండాలని నా తలరాత నాకు చెప్పింది. అందుకే ఈ దాగుడుమూతలాట. తెలియకుండా ఉండాలని అనుకొని ఇప్పుడు ఈ లెటర్ ఎందుకు రాశాడని నువ్వు అనుకోవచ్చు. కాని, నాలో అంతా ఇంతా కాదు, బోలెడంత ప్రేమ ఉంది నీ మీద. ఆ ప్రేమ నా మనసులో సరిపోలేక, అందులో దాగక బయటకి వస్తా వస్తా అని మొర పెడుతోంది. అందుకే దాని మొరకు ఈరోజు విముక్తినిచ్చాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నా ప్రేమ నీ చెంతకు చేరిందని...’’ఇట్లు అజ్ఞాత ప్రేమికుడు.ఎవరు ఈ అజ్ఞాత ప్రేమికుడు? ఇన్నేళ్లుగా నన్ను ఫాలో అవుతుంటే నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? అంత ప్రేమను నామీద పెంచుకొని ఎందుకు నా దగ్గరకు రాలేకపోతున్నాడు? నన్ను కలవలేకపోతున్నాడు? ఇలా నా మైండ్, నా మనను ఒకదానితో ఒకటి పోటీపడి మరీ పరిపరివిధాలుగా ఆలోచిస్తున్నాయి. ఎంతకూ అర్థంకాలేదు కాని, ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యాను. ఆ అజ్ఞాత ప్రేమికుడిని ఎలాగైనా కలవాలని, తన ప్రేమను కళ్ళారా చూసి, అనుభూతి పొందాలని. అలా ఆలోచనలతోనే ఆ రోజు గడిచిపోయింది.నేను ఆ ఆజ్ఞాత ప్రేమికుడిని వెతికే పనిలో పడ్డాను. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజూ మా ఎదురింటి అబ్బాయి నాకు తారసపడుతూనే ఉన్నాడు ఏదో ఒక సందర్భంలో. అలా మా మధ్య స్నేహం కూడా కుదిరింది. నాకు ప్రతి విషయంలో సహాయం చేస్తునే ఉన్నాడా అబ్బాయి. ఎందుకో తనని చూస్తే నాకు నేను ఒంటరినన్న ఫీలింగ్ని మరిచిపోతాను. నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమను తన నుంచి పొందుతున్నానన్న భావన కలుగుతుంది. అతను కూడా నాలాగే అనాథ. అందుకేనేమో, ఇద్దరి బాధలు ఒకటై ఒకరిలో ఒకరం అమ్మనాన్నల ప్రేమను వెతుక్కుంటూ ఉన్నాం. అతని స్నేహం నా అజ్ఞాత ప్రేమికుని వెతుకులాటను మరచిపోయేలా చేసింది. కాని, మధ్య మధ్యలో అతను రాసిన లెటర్ గుర్తొచ్చేది. ఎంత వెతికినా అతను నాకు దొరకలేదు. కాని, ఎందుకో అతను నాదగ్గరే ఉన్నట్లు, నన్ను ప్రతిరోజు గమనిస్తున్నట్లు, నా చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుండేది. ఎందుకో కొన్ని రోజుల నుంచి మా ఎదురింటి అబ్బాయి నాకు కనిపించలేదు. ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడులే అని అనుకున్నాను. అలా రోజులు కాదు, నెలలు కూడా అయ్యాయి. అయినా ఆ అబ్బాయి ఇంకా రాలేదు. ఏమై ఉంటాడు, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అనే సందేహం కలిగింది. కాని, ఏదైనా ముఖ్యమైన పనిమీద వెళ్ళి ఉంటాడని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. అలా ఒక రోజు నేను ఎప్పుడూ వెళ్ళే శివాలయానికి వెళ్ళాను చాలా రోజుల తర్వాత. పూజ పూర్తి చేసుకుని బయలుదేరుదాం అన్న సమయానికి నా పుట్టినరోజున మాట్లాడిన పంతులుగారు ఎదురుపడి, ‘ఆరోజు నువ్వు ఒక అబ్బాయిు గురించి అడిగావు కదా! ఆ అబ్బాయి తన విజిటింగ్ కార్డు గుళ్లో పడేసుకున్నాడు. అది నాకు దొరికిందమ్మా! దాన్ని చూస్తే నువ్వే నాకు జ్ఞాపకం వచ్చావు. అందుకే నీ కోసమే దాన్ని దాచి ఉంచాను’ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి నాకిచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. ఎన్నో రోజుల నుండి వెతికినా, ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరో నాకు తెలిసే సమయం ఆసన్నమైందని మనసు పులకరించిపోయింది. దాన్ని తీస్కోని చూశాను. అందులో ‘సూర్య జాగర్లముడి’ అని పేరు ఉంది. ఈ పేరు నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు. వెంటనే అడ్రస్ చూశాను. చూడగానే నా మైండ్ ఒక్కసారిగా పని చేయడం ఆగిపోయింది. ఎందుకంటే ఆ అడ్రస్ మా వీధిలో ఉండే ఒక ఇంటి అడ్రస్. నేను నమ్మలేకపోయాను. వెంటనే తేరుకుని పంతులుగారికి థాంక్స్ చెప్పేసి, పరుగుపరుగున ఆ ఇంటికి దారితీశాను. ఆ ఇల్లు ఉన్న అడ్రస్కు చేరుకున్నాను. తాళం వేసి ఉంది ఆ ఇంటికి. ఏం చేయాలో తోచలేదు. సమయానికి మా ఎదురింటి అబ్బాయి కూడా లేడు. నాకే ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఒక రాయి తీసుకొని తాళం పగులగొట్టాను. తలుపులు తీసుకొని గదిలోకి అడుగు పెట్టాను. అంతా చీకటిగా ఉంది. ఏమీ కనిపించలేదు. వెంటనే గోడ మీద స్విచ్బోర్డు వెతికి స్విచ్ వేశాను. అంతే గోడకు ఉన్న ఫోటో చూసి హతశురాలయ్యాను. ఆ ఫోటోలో ఉన్నది మా ఎదురింటి అబ్బాయి కిరణ్. అంటే అతని పూర్తి పేరు ‘సూర్య కిరణా!’నేను నమ్మలేకపోతున్నాను, ఇదంతా ఒక కలలా తోచింది. ఇన్ని రోజులు నా దగ్గరే ఉంటూ, నాతో మాట్లాడుతూ ఎందుకు ఈ దాగుడు మూతలాడటమో నాకు అర్థం కాలేదు. నా స్నేహితుడే నా అజ్ఞాత ప్రేమికుడు అని తెలిసి, నా మనసు అతలాకుతలమైంది.కాని, ఆ సంతోషం నీటి ఆవిరిలా క్షణకాలంలో మాయమైపోబోతోందని ఆ క్షణంలో నాకు తెలియలేదు. అప్పుడే నా కంట పడింది ఒక ఉత్తరం అది తీసి చదవడం మొదలుపెట్టాను. అందులో...‘సుందరి నువ్వు వస్తావని నాకు తెలుసు. కాని, నువ్వు వచ్చే సమయానికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. అవును క్యాన్సర్తో పోరాడుతున్న రోజులవి. అప్పుడే నేను నిన్ను మొదటిసారి చూశాను. చిన్న పిల్లలాంటి నీ మనస్తత్వం నిన్ను ప్రేమించేలా చేసింది. కాని, నీకు నా ప్రేమను చెప్పుకునే పరిస్థితిలో లేను. చెప్పి నిన్ను కూడా నా ప్రేమలో పడేసి, నీకు దూరంగా వెళ్ళిపోయి, తీరని బాధని నీకు మిగల్చకూడదు అనుకున్నాను. అందుకే నీకు దూరంగా ఉంటూ, నిన్ను చూస్తూ, ప్రేమిస్తూ ఉన్న సమయంలో నువ్వే నా దగ్గరకు వచ్చావు. నన్ను చూస్తూ మైమరచిపోయిన ఆ రోజును నేను మరచిపోలేను. వర్షంలో తడుస్తూ ఎటు వెళ్లాలో తెలియక సతమతమవుతున్న నిన్ను గట్టుకు చేర్చాను. ఆ రోజు అనుకున్నాను నేను ఇంకా నీకు దూరంగా ఉండలేనని. అందుకే మీ ఎదురింటికి వచ్చేశాను. నీతో స్నేహం చేశాను. నిన్ను కంటికి రెప్పలా ఎప్పటికప్పుడు కాచుకుంటూ ఉన్నాను. కాని, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చింది. అందుకే నీకు చెప్పలేక దూరంగా వెళ్ళిపోయాను. ఎంతో వేదనతో ఈ ఉత్తరం నీకోసం రాశాను– ఎప్పటికైనా నీదగ్గరికి చేరుతుందని నమ్ముతూ...ఉత్తరం నా చేయి జారిపోయింది. ఎడతెరపి లేని వానలా, ఉప్పొంగే వరదలా, ఉగ్రరూపం దాల్చిన సముద్రపు అలల్లా నా మనసు రోదించింది. నా జ్ఞాపకాలు గతం నుంచి బయటకు వచ్చాయి. నా కన్నీరు ఏ కంటికి కానరాకుండా ఇదే వాన నీటిలో కనుమరుగయ్యాయి. ఎందుకో తనని చూస్తే నాకు నేను ఒంటరినన్న ఫీలింగ్ని మరిచిపోతాను. నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమను తన నుంచి పొందుతున్నానన్న భావన కలుగుతుంది. అతను కూడా నాలాగే అనాథ. (చదవండి: యువ కథ: వసంత కోకిల) -
షుగర్ ఉంటే..ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా?
నాకు ఇప్పుడు మూడోనెల. గతంలో గర్భస్రావం కావడం వలన చాలా డిస్టర్బ్ అయ్యాను. నన్ను ఇంట్లో ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. మళ్లీ ప్రెగ్నెన్సీ కోసం సిద్ధంగా లేను. చాలా బాధగా ఉంది. ఈ సమయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి?– రమ్య, హైదరాబాద్ మీ పరిస్థితిని అర్థం చేసుకోగలం. ప్రెగ్నెన్సీ మానసికంగా చాలా ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు. దీంతో బాధ, కోపం, అసహనం, ఆందోళన ఎవరికైనా వస్తాయి. మళ్లీ ప్రెగ్నెన్సీ మీద భయం ఉంటుంది. ఇలాంటప్పుడే మీరు ధైర్యంగా ఉండాలి. సహాయం తీసుకోవాలి. డాక్టర్ని సంప్రదించి మీ భావాలను వివరంగా వారితో పంచుకోవాలి. టాకింగ్ థెరపీ ద్వారా మనసులో ఉండే బాధను తొలగించుకోవచ్చు. అలా ఎందుకు అయింది, ఏమి చేస్తే మళ్లీ అలా జరగకుండా ఉంటుంది. ఏ పరీక్షలు చేయించుకోవాలి. ఇలా అన్ని కోణాల్లో మాట్లాడుతూ మీ మనసులోని అనుమానాలను తొలగించుకోవచ్చు. దీంతో డాక్టర్ అవసరమైన పరీక్షలు చేసి సమస్య తీవ్రతను అంచనా వేస్తారు. అవసరమైతే మానసిక నిపుణుడిని సంప్రదించమని చెప్తారు. ఇది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (పీటీఎస్డీ) కావచ్చు. దీనికి కౌన్సెలింగ్, థెరపీ అవసరం. సాధారణంగా నాలుగు నుంచి ఐదు వారాల్లో ఉపశమనం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో రెండు వారాల్లోనే తేడా కనిపిస్తుంది. ఎలాంటి మందులూ వీళ్లకి అవసరం ఉండదు. అందుకే, భయపడకుండా ఒకసారి డాక్టర్ని కలవండి. కొంతమందికి ఈ సమస్య ఎక్కువగా ఉండచ్చు. వీరికి లాంగ్ టర్మ్ కౌన్సెలింగ్ సెషన్స్తోపాటు కొన్ని మందులు సూచిస్తాం. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) అనేది ఒక రకమైన టాకింగ్ థెరపీ. దీనిలో మీ మనస్సులోని ఆలోచనలు మేనేజ్ చేసే ఫోకస్డ్ కౌన్సెలింగ్ చేస్తారు. మీకు రొటీన్గా కొన్ని పనులు చెయ్యమని చెప్తారు. రెండు నుంచి మూడు నెలల సీబీటీ చికిత్సతో ఉపశమనం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో సెర్ట్రాలిన్ మాత్రలను తాత్కాలికంగా ఉపయోగిస్తారు. ఇది కొన్ని వారాలు మాత్రమే. ఈ లోపల కౌన్సెలింగ్, ఆరోగ్యకరమైన అలవాట్ల వలన మానసిక స్థితి మెరుగవుతుంది. నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. నాకు మధుమేహం ఉంది. మందులు వాడుతున్నాను. ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – శారద, వరంగల్. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. అప్పుడు వారు కొన్ని పరీక్షలను ముందే చేయించి, దాదాపు అన్నీ కంట్రోల్లో ఉంటేనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చెయ్యమని చెప్తున్నారు. వీటిలో మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, మూర్ఛ, ఆస్తమా లాంటివి ఉంటాయి. ముందే డాక్టర్ని సంప్రదించినప్పుడు , మీ సమస్య ఎంతవరకు కంట్రోల్లో ఉందో తెలుసుకోవచ్చు. దీని వలన తల్లికి, బిడ్డకి భవిష్యత్తులో ఏ సమస్యలు ఉండవు. డయాబెటిక్ క్లినిక్స్లో వెంటనే సంప్రదించి, హెచ్బీ1సీ పరీక్ష చేయించుకోండి. ఇందులో చక్కెర స్థాయి 5.5 నుంచి 6. 5 శాతం మధ్యలో ఉండాలి. ఒకవేళ మీ షుగర్ కంట్రోల్లో ఉంటే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం తగ్గుతుంది. షుగర్ ఎక్కువ ఉంటే కొన్ని నెలలు స్ట్రిక్ట్ డైట్, వ్యాయామం చేయాలి. మందులు అవసరమైతే మార్చాలి. కొన్ని రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ 5 ఎమ్జీ మాత్రలు రోజూ తీసుకోవటం ప్రారంభించండి. ఈ సమయానికి డాక్టర్ సూచించిన మందులు మాత్రమే వాడాలి. ఇన్సులిన్ వాడటం సురక్షితమే. ఐ స్క్రీనింగ్, మూత్రపిండాలు, కాలేయం, హార్మోన్ పరీక్షలు కూడా చేయించాలి. ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ఏ ఇబ్బందులు రాకుండా చూస్తాయి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: మంచుకొండల్లో మహిళారాజ్యం..! ఆ ఒక్క జిల్లాలో పాలనాధికారులంతా..) -
చాయ్ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!
‘ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్/ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్’ అనే సినీగీతం చాలామందికి తెలిసినదే! చాయ్ చమక్కులు చాలానే ఉన్నాయి. చాయ్ చరిత్ర కూడా చాలానే ఉంది. మే 21న ప్రపంచ తేనీటి దినోత్సవం సందర్భంగా కొన్ని చాయ్ చమక్కులు మీ కోసం...చాయ్, టీ అనే పదాలతో పిలుచుకునే తేనీరు చాలామందికి అభిమాన పానీయం. చాయ్, టీ– ఈ రెండు పదాలూ తేయాకుకు పుట్టినిల్లయిన చైనాలోనే పుట్టాయి. ఓడమార్గం వర్తకుల ద్వారా ‘టీ’ అనే మాట పాశ్చాత్య ప్రపంచంలో ప్రాచుర్యం పొందింది. ‘చాయ్’ అనే మాట సిల్క్రూట్ ద్వారా భారత్ సహా పలు ఆసియన్ దేశాలకు వ్యాపించింది. తొలి రోజుల్లో డచ్ వర్తకులు చైనాతో నౌకా వాణిజ్యం సాగించేవారు. వారు ఎక్కువగా చైనా తీర ప్రాంతంలోని ఫుజియన్ మాండలికం మాట్లాడే వర్తకులతో లావాదేవీలు జరిపేవారు. వారు తేయాకుకు, తేనీటికి ‘టీ’ అనే మాటను ఉపయోగించేవారు. వారి ద్వారా ఈ మాట ఇంగ్లిష్ సహా పలు యూరోపియన్ భాషలకు చేరింది. భూమార్గంలో సిల్క్రూట్ గుండా చైనాకు వచ్చే విదేశీ వర్తకులు ఎక్కువగా చైనాలో మాండరిన్ చైనీస్ భాష మాట్లాడే వర్తకులతో లావాదేవీలు సాగించేవారు. వారి ద్వారా ‘చాయ్’ మాట భారత్ సహా పలు ఆసియా దేశాలకు, అరబ్ దేశాలకు వ్యాపించింది. ఎన్నో రకాలు.. ఎన్నో రుచులుప్రపంచవ్యాప్తంగా మూడువేలకు పైగా తేయాకు రకాలు ఉన్నాయి. వీటిలో ఆరు రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఉలాంగ్ టీ, వైట్ టీ, పూఎయిర్ టీ, యెల్లో టీ రకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఈ ఆరురకాలు మాత్రమే కాకుండా, రకరకాల తేయాకుల నుంచి రకరకాల రుచులతో తయారు చేసే తేనీటి పానీయాలు కూడా వాడుకలో ఉన్నాయి. ప్రపంచంలో విస్తృత ప్రాచుర్యం పొందిన రకాలు, అరుదైన రకాల తేనీటి పానీయాలు కొన్నింటి గురించి తెలుసుకుందాం...పూఎయిర్ టీచైనాలో దొరికే అరుదైన తేయాకుతో దీనిని తయారు చేస్తారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నుంచి ఇది వాడుకలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ రకం తేయాకు ఎంత పాతబడితే దీనితో తయారు చేసే టీ అంత రుచిగా ఉంటుందని చైనీయుల నమ్మకం. పూఎయిర్ టీని ‘గోంగ్ఫు చా’ అని కూడా అంటారు. వేడి నీటితో శుభ్రం చేసిన పాత్రలో ముందుగా ఈ రకం తేయాకును వేసి, అందులో మరుగుతున్న నీటిని పోస్తారు. తేయాకు మరుగునీటిలో ఐదు నిమిషాలు నానిన తర్వాత వడగట్టి, కప్పుల్లో పోసుకుని తాగుతారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్లో ఈ రకం తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. యునాన్ ప్రావిన్స్లో ఈ తేనీటిని పులియబెట్టి, తాగే ముందు మరిగించి సేవించే పద్ధతి కూడా ఉంది. ఇది జీర్ణసమస్యలకు విరుగుడుగా పనిచేస్తుందని చైనీయుల నమ్మకం.బటర్ టీఇది టిబెట్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో పొందిన సంప్రదాయ పానీయం. జడలబర్రె వెన్నకు, కొద్దిగా బార్లీ పొడి, ఉప్పు జోడించి, వెన్నను బాగా చిలికి, మరుగుతున్న బ్లాక్ టీలో వేస్తారు. కొందరు ఇందులో పాలు, పంచదార కూడా జోడిస్తారు. పొద్దున్నే ఈ బటర్ టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, ఒంట్లోని శక్తి తరిగిపోకుండా ఉంటుందని చెబుతారు. ఇటీవలి కాలంలో డెయిరీ ఫామ్స్లో దొరికే వెన్నను ఉపయోగించి కూడా బటర్ టీని తయారు చేస్తున్నారు.చా యెన్ఇది థాయ్లాండ్లో ప్రసిద్ధి పొందిన పానీయం. గాఢంగా తయారు చేసిన బ్లాక్టీలో చక్కెర, పాలు కలిపి, అనాసపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలను జోడించి మరిగిస్తారు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మంచుముక్కలు వేసుకుని శీతల పానీయంలా సేవిస్తారు. కొందరు దీనికి పసుపు, నారింజ ఫుడ్కలర్స్ను కూడా జత చేస్తారు.చాయ్ఇది మన భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం. చాయ్ అన్నా, టీ అన్నా మనకు తెలిసిన పద్ధతి ఒకటే! తేయాకు పొడివేసి మరిగించిన నీటిలో పాలు, పంచదార కలిపి తయారు చేస్తారు. కొన్ని చోట్ల ఈ తేనీటికి బాగా దంచిన అల్లం జోడించి అల్లం టీ తయారు చేస్తారు. ఇంకొన్ని చోట్ల సుగంధ ద్రవ్యాల పొడులు జోడించి, మసాలా చాయ్ తయారు చేస్తారు. చాయ్ ఒకరకంగా మన జాతీయ పానీయం అనే చెప్పుకోవాలి!రూయిబోస్నిజానికి ఇది తేయాకుతో తయారు చేసే టీ కాదు. ‘రూయిబోస్’ అంటే ఎర్రని పొద అని అర్థం. దక్షిణాఫ్రికాలో పెరిగే రూయిబోస్ ఆకులతో దీనిని తయారు చేస్తారు. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి, మరికాసేపు మరిగిన తర్వాత వడగట్టి కప్పుల్లో పోసుకుని వేడి వేడిగా సేవిస్తారు. ఇందులో కెఫీన్ ఉండదు. కెఫీన్ వద్దనుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం అని చెబుతారు. రూయిబోస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతారు.వైట్ టీఇది చాలా అరుదైన రకం పానీయం. తేయాకు మొక్కల్లో అత్యంత అరుదైన ‘కేమెలియా సైనెసిస్’ అనే మొక్క నుంచి లేత చిగురుటాకులను, మొగ్గలను సేకరించి, వాటితో వైట్ టీ తయారు చేస్తారు. వైట్ టీ కోసం లేత చిగురుటాకులను, మొగ్గలను వసంతకాలం ప్రారంభమయ్యే సమయంలో సేకరిస్తారు. బ్లాక్ టీ, గ్రీన్ టీల కంటే వైట్ టీ గాఢత చాలా తక్కువగా ఉంటుంది. చైనాలోని ఫుజియన్ ప్రావిన్స్లో ఈ అరుదైన తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, వాపులను తగ్గించే ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.యెల్లో టీతేయాకు మొక్కల నుంచి సేకరించిన లేత ఆకులను ప్రత్యేకమైన పద్ధతిలో ఆరబెట్టి యెల్లో టీకి తగిన తేయాకును తయారు చేస్తారు. కొరియాలో యెల్లో టీ వినియోగం ఎక్కువ. కొరియన్లు దీనిని ‘హ్వాంగ్ చా’ అని, చైనీయులు దీనిని ‘హువాంగ్ చా’ అని అంటారు. తయారీ పద్ధతిలోని కష్టనష్టాల కారణంగా దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి తేనీటిని తయారు చేస్తారు. ఇది పారదర్శకమైన లేత పసుపు రంగులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు.∙∙ పురాతన చరిత్రటీ ఆధునిక పానీయమని చాలామంది పొరబడతారు. ఇలా పొరబడటానికి కారణం లేకపోలేదు. మధ్యయుగాల వరకు తేయాకు వినియోగం కేవలం చైనాకు మాత్రమే పరిమితమైంది. డచ్ వర్తకులు, పోర్చుగీసు వర్తకులు క్రీస్తుశకం పదిహేడో శతాబ్ది తొలినాళ్లలో తేయాకును యూరోప్కు పరిచయం చేశారు. క్రమంగా ఇది ఇంగ్లండ్కు, అక్కడి నుంచి బ్రిటిష్ వలస రాజ్యాలకు చేరింది. అయితే, తేనీటి వినియోగం క్రీస్తుపూర్వం 2732 నాటికే చైనాలో మొదలైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఒక అనుకోని సంఘటన వల్ల ఆనాటి చైనా చక్రవర్తి షెన్ నుంగ్కు తేయాకు మహిమ తెలిసివచ్చిందట! ఒకనాడు ఆయన ఆరుబయట కూర్చుని, నీరు మరిగిస్తున్నప్పుడు ఆ నీటిలో ఒక చెట్టు నుంచి రాలిన ఆకులు పడ్డాయి. ఆ నీటిని ఆయన సేవించాడు. దాని రుచి, పరిమళం ఆయనకు తెగ నచ్చాయి. అంతేకాదు, ఆ పానీయం తన శరీరంలోని అణువణువును శోధిస్తున్న అనుభూతి కూడా కలిగిందట! అందుకే ఆయన ఈ పానీయానికి ‘చా’ అని పేరుపెట్టాడు. చైనీస్ భాషలో ‘చా’ అంటే శోధించడం లేదా తనిఖీ చేయడం అని అర్థం. క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్దిలో బౌద్ధ గురువు డెంగ్యో దైషీ తొలిసారిగా జపాన్కు తేయాకును పరిచయం చేశాడు. ఆయన ద్వారా అనతికాలంలోనే తేనీరు జపనీయుల అభిమాన పానీయంగా మారింది. మిగిలిన ప్రపంచానికి ఇది పరిచయం కావడానికి మాత్రం మరికొన్ని శతాబ్దాల కాలం పట్టింది. ఇరవయ్యో శతాబ్ది నాటికి తేనీటి మహిమ ప్రపంచమంతటికీ తెలిసివచ్చింది. తేయాకు మొక్కలు సాధారణంగా పొదలుగా పెరగడమే చూస్తుంటాం. నిజానికి ఇవి మొక్కలు కావు, చెట్లు. ఇవి వంద అడుగుల ఎత్తువరకు పెరగగలవు. వీటి జీవితకాలం యాభైఏళ్లకు పైగానే ఉంటుంది.గ్రీన్ టీ కోసం సాధారణంగా ఆరబెట్టిన తేయాకునే వాడతారు. జపాన్లో అత్యంత అరుదుగా కొందరు తాజా తేయాకును నేరుగా మరిగించి, గ్రీన్ టీ తయారు చేస్తారు. దీనిని ‘టెన్చా’ అంటారు.చైనాలో తడిపి ఆరబెట్టిన తేయాకును ఒత్తిడికి గురిచేసి, కేకుల్లా మార్చి నిల్వచేసేవారు. వీటిని రెండేళ్ల నుంచి యాభయ్యేళ్ల వరకు నిల్వ ఉంచి, తేనీటి తయారీకి వినియోగించేవారు. వీటితో తయారు చేసిన తేనీటిని ‘కొంబూచా’ అంటారు. అలాగే, ఈ తేయాకు కేకులను నగదుగా కూడా ఉపయోగించే వారు.తేయాకు యూరోప్కు పరిచయమైన కొత్తరోజుల్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. ఇంగ్లండ్లో తేనీటి సేవనం రాచవంశీకులకు, సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేది. పద్దెనిమిదో శతాబ్దిలో తేయాకు తోటల్లో విందులు జరుపుకోవడం సంపన్నుల వేడుకగా ఉండేది.తేయాకు కోసం బ్రిటన్కు, చైనాకు యుద్ధం కూడా జరిగింది. బ్రిటన్లో తేయాకుకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దిగుమతి చేసుకోవాలంటే, చైనా మాత్రమే ఆధారం. తేయాకు కోసం వెండి రూపంలోనే చెల్లింపులు జరపాలని చైనా బిగదీసుకుంది. బ్రిటిష్ ఖజానాలోని వెండి నిల్వలన్నీ తేయాకుకే ఖర్చవుతుండటంతో బ్రిటిష్ సైన్యం చైనాతో యుద్ధం చేసింది. ‘మొదటి నల్లమందు యుద్ధం’ పేరుతో 1839–42 వరకు చరిత్రలో నమోదైన ఈ యుద్ధానికి అసలు కారణం తేయాకు గిరాకీనే! (చదవండి: వ్యోమయాత్రకు భారతీయుడు) -
వ్యోమయాత్రకు భారతీయుడు
పన్యాల జగన్నాథదాసు..ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రబిందువుగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) తొలిసారిగా ఒక భారతీయుడు వెళ్లనున్నారు. భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లా(Subhanshu Shukla)కు ఈ అరుదైన అవకాశం దక్కింది. సోవియట్ సోయుజ్ టీ–11 ద్వారా రాకేశ్ శర్మ 1984లో తొలిసారిగా అంతరిక్షయానం చేసి వచ్చారు. ఆయన తర్వాత ఇప్పటి వరకు భారత్ నుంచి వ్యోమగాములు ఎవరూ లేరు. ఇన్నాళ్లకు శుభాంశు శుక్లాకు అంతర్జాతీయ బృందంతో కలసి అంతరిక్షయానం చేసే అవకాశం రావడం విశేషం.మే 29న ఐఎస్ఎస్కు బయలుదేరనున్న వ్యోమగాముల బృందంలో శుక్లాతో పాటు అమెరికన్ జాతీయ అంతరిక్ష సంస్థలో (నాసా) పనిచేసిన వ్యోమగామి పెగ్గీ విట్సన్, పోలిష్ అంతరిక్ష సంస్థ (పోల్సా) సభ్యుడు స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరియన్ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్ఎస్ఓ) సభ్యుడు టైబర్ కాపు కూడా ఉన్నారు. ‘పోల్సా’, ‘హెచ్ఎస్ఓ’లకు ఈ మిషన్లో యురోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) సహకారం అందిస్తోంది. ఈ బృందం మే 29న ఐఎస్ఎస్కు చేరుకోనుంది. ‘ఏక్సియమ్ మిషన్–4 (ఏఎక్స్–4)’ పేరిట చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోనున్న ఈ బృందం అక్కడ ఏడు ప్రయోగాలను చేపట్టనుంది.ఏఎక్స్–4 భారత్ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి స్వయంగా చేపట్టనున్న ‘గగన్యాన్’ ప్రయోగానికి బాగా ఉపకరించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శుభాంశు శుక్లా ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళుతుండటం వల్ల ఆయన పొందే ఆచరణాత్మక అనుభవం భారత్ చేపట్టనున్న ‘గగన్యాన్’కు ఎంతగానో ఉపయోగపడుతుందని భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) మైక్రోగ్రావిటీ ప్లాట్ఫామ్స్ గ్రూప్ హెడ్ తుషార్ ఫడ్నిస్ తెలిపారు.ఏఎక్స్–4 మిషన్అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకునేందుకు తాజాగా చేపడుతున్న ఏఎక్స్–4 మిషన్ భారత్తో పాటు పోలండ్, హంగరీ దేశాలకు కూడా గొప్ప మైలురాయి కాగలదు. దశాబ్దాల తర్వాత ఈ దేశాలకు చెందిన వ్యోమగాములు అంతరిక్షయాత్రకు వెళుతుండటమే దీనికి కారణం. ఈ ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చేపట్టనున్నారు. ఇక్కడ చేపట్టనున్న దాదాపు అరవైకి పైగా ప్రయోగాల్లో 31 దేశాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో పాటు అంతరిక్ష పర్యాటకం వంటి కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా, భూమి చుట్టూ రెండువేల కిలోమీటర్ల దూరాన ఉండే భూ నిమ్న కక్ష్యలో (లో ఎర్త్ ఆర్బిట్–ఎల్ఈఓ) వాణిజ్యపరంగా అంతరిక్ష కేంద్రాలను నిర్మించే వెసులుబాటును ఏఎక్స్–4 మిషన్లో అధ్యయనం చేయనున్నారు.అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘ఏక్సియమ్ స్పేస్’ మరో ప్రైవేటు సంస్థ ‘స్పేస్ ఎక్స్’తోను, అమెరికా జాతీయ అంతరిక్ష సంస్థ ‘నాసా’తోను కలసి ఈ ఏఎక్స్–4 మిషన్ చేపడుతోంది. ఈ మిషన్కు అమెరికన్ మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ దీనికి కమాండర్గా నాయకత్వం వహిస్తున్నారు. ‘ఇస్రో’ తరఫున భారత వైమానికదళం గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లా పైలట్గా వ్యవహరించనున్నారు.మిషన్ స్పెషలిస్టులుగా యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) తరఫున పోలండ్కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరియన్ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్ఎస్ఓ) తరఫున టైబర్ కాపు ఇందులో పాల్గొంటున్నారు. ఈ మిషన్తో పెగ్గీ విట్సన్ ఐదోసారి అంతరిక్షయాత్రకు వెళుతుంటే, శుభాంశు శుక్లా సహా మిగిలినవారికి ఇదే తొలి అంతరిక్షయాత్ర కావడం విశేషం. స్పేస్ ఎక్స్ పాత్రఏక్సియమ్ మిషన్–4లో ఎలాన్ మస్క్ స్థాపించిన అమెరికన్ అంతరిక్ష సాంకేతిక పరిశోధనల సంస్థ ‘స్పేస్ ఎక్స్’ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఎక్స్–4 మిషన్(AX-4 mission) కోసం స్పేస్ ఎక్స్ ‘ఫాల్కన్ 9 బ్లాక్ 5’ రాకెట్ను, క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఏఎక్స్–4 మిషన్ మే 29న భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10.33 గంటలకు అంతరిక్ష యాత్ర ప్రారంభం కానుంది.ఇక్కడి నుంచి ఫాల్కన్ 9 బ్లాక్5 రాకెట్ నలుగురు వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకను భూ నిమ్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. క్రూ డ్రాగన్ సీ213 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకోనున్న వ్యోమగాములు అక్కడ రెండు నుంచి మూడు వారాల పాటు పరిశోధనలు సాగించనున్నారు. ఏఎక్స్–4 మిషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకకు ఇదే మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణం.అ‘ద్వితీయుడు’ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పుట్టి పెరిగారు. భారతీయ వైమానిక దళానికి 2006లో ఎంపికయ్యారు. యుద్ధ విమానాలను నడపడంలో విశేష అనుభవం ఉన్న శుభాంశు శుక్లాను ఏఎక్స్–4 మిషన్ ఏరి కోరి పైలట్గా ఎంపిక చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట– 1984లో రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసి, తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డులకెక్కారు. అప్పటి సోవియట్ రష్యా చేపట్టిన ‘సోయుజ్ టీ–11’ మిషన్లో భాగంగా రాకేశ్ శర్మ అంతర్జాతీయ బృందంతో కలసి, సాల్యూట్–7 అంతరిక్ష కేంద్రానికి చేరుకుని, అక్కడ వారం రోజులు గడిపి వచ్చారు. ‘సోయుజ్ టీ–11’ మిషన్కు సోవియట్ వ్యోమగామి యూరీ మాలెషెవ్ పైలట్గా వ్యవహరించారు.అయితే, ఇప్పుడు ఏఎక్స్–4 మిషన్లో శుభాంశు శుక్లాకు పైలట్గా అవకాశం లభించింది. అంతర్జాతీయ వ్యోమగాముల బృందం జరిపే అంతరిక్ష యాత్రకు ఒక భారతీయుడు పైలట్ కావడం ఇదే తొలిసారి. శుక్లాను ‘ఇస్రో’ 2019లో భారత్ తరఫున వ్యోమగామిగా ఎంపిక చేసింది. అంతరిక్ష యాత్ర చేయడానికి తగిన శిక్షణను పొందడానికి శుక్లా రష్యా వెళ్లారు. మాస్కోలో స్టార్ సిటీలోని యూరీ గాగరిన్ వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొంది వచ్చారు. ప్రస్తుతం ఆయన ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్లడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. ‘ఇస్రో’, ఇతర భారతీయ సాంకేతిక సంస్థలు రూపకల్పన చేసిన ప్రయోగాలను శుక్లా ఐఎస్ఎస్లో చేపట్టనున్నారు.ఈ ప్రయోగాల్లో భాగంగా ఆయన అంతరిక్షంలో సూక్ష్మజీవుల మనుగడకు గల అవకాశాలు, గురుత్వాకర్షణ లేని అంతరిక్ష పరిస్థితుల్లో ఏర్పడే కండరాల క్షీణత, తెరపై దృశ్యాలను చూడటం వల్ల మెదడుపై ఏర్పడే దుష్ప్రభావాలు తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్లో శుక్లా సాగించబోయే ప్రయోగాలు త్వరలోనే భారత్ చేపట్టనున్న ‘గగన్యాన్’ ప్రయోగానికి బాగా ఉపయోగపడగలదని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శుక్లా ప్రస్థానంభారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) నుంచి అంతరిక్ష యానానికి ఎంపిక కావడం వరకు శుభాంశు శుక్లా ప్రస్థానంపై అనేక కథనాలు వచ్చాయి. లక్నోలోని సిటీ మాంటిసోరీ స్కూల్లో సాదా సీదా విద్యార్థిగా ఉన్న శుక్లా ఐఏఎఫ్లో చేరడం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. స్కూల్లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) దరఖాస్తు తెచ్చివ్వడంతో శుక్లా తన పదహారో ఏట ఎన్డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంగతిని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అనుకోకుండా రాసిన పరీక్షలో నెగ్గి, 2006 జూన్ 17న ఐఏఎఫ్కు ఎంపికయ్యారు.ఎన్డీఏలో సైనిక శిక్షణ పొందుతూనే, ఉన్నత విద్యను కొనసాగించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో ఎంటెక్ పూర్తి చేశారు. ఐఏఎఫ్లో అంచెలంచెలుగా, గ్రూప్ కెప్టెన్ స్థాయికి ఎదిగారు. ప్రధాని నరేంద్ర మోదీ 2018 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా భారత్ ‘గగన్యాన్’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘గగన్యాన్’ కోసం ‘ఇస్రో’ ఎంపిక ప్రక్రియ ప్రారంభించినప్పుడు 2019లో శుక్లా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ ఏరోస్పేస్ మెడిసిన్ (ఐఏఎం) నిర్వహించిన పరీక్షలో ఎంపికైన నలుగురిలో శుక్లా కూడా ఉన్నారు.ఐఏఎం ఎంపిక చేసిన నలుగురినీ ‘ఇస్రో’ పరీక్షించి, చివరిగా శుక్లాను ‘గగన్యాన్’కు ఎంపిక చేసింది. అంతరిక్షయాత్రల్లో శిక్షణ కోసం రష్యాలోని యూరీ గాగరిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్కు పంపింది. రష్యా నుంచి ప్రాథమిక శిక్షణ పొంది 2021లో తిరిగి వచ్చేశాక, ‘ఇస్రో’ ఆయనను బెంగళూరులోని వ్యోమగాముల శిక్షణ కేంద్రానికి పంపింది. అక్కడ కూడా శుక్లా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ‘గగన్యాన్’ ప్రారంభానికి ముందే ‘ఏఎక్స్–4’ మిషన్లో పైలట్గా అవకాశం రావడంతో తొలి అంతరిక్షయాత్రకు వెళుతున్నారు.గగన్యాన్ సన్నాహాలుభారత అంతరిక్ష పరిశోధక సంస్థ ‘ఇస్రో’ ఇప్పటి వరకు అనేక ప్రయోగాలు చేపట్టింది. ‘ఇస్రో’ ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన వ్యోమనౌకలన్నీ మానవరహితమైనవే! మనుషులను అంతరిక్షంలోకి పంపాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘గగన్యాన్’ను తలపెట్టింది. ప్రతిష్ఠాత్మకమైన ‘గగన్యాన్’ కోసం ‘ఇస్రో’ సన్నాహాలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ‘గగన్యాన్’లో అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ గత ఏడాది ఫిబ్రవరి 27న ప్రకటించారు. వారిలో శుభాంశు శుక్లాతో పాటు ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ ఉన్నారు. ‘గగన్యాన్’లో చేపట్టడానికి ‘ఇస్రో’ ఇప్పటికే ఐదు ప్రయోగాలను ఎంపిక చేసింది.నిజానికి ‘గగన్యాన్’ ప్రయోగాన్ని గత ఏడాదిలోనే చేపట్టాలని ప్రభుత్వం తలపెట్టినా, అనివార్య కారణాల వల్ల ఇందులో జాప్యం ఏర్పడింది. ఈ జాప్యానికి ముఖ్య కారణం ‘కోవిడ్–19’ మహమ్మారేనని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ రాణా పార్లమెంటులో వెల్లడించారు. ‘గగన్యాన్’ సన్నాహాల్లో భాగంగా ‘ఇస్రో’ ఈ ఏడాదిలో ఆరుసార్లు ఆర్బిటల్ క్యాప్సూల్స్ను అంతరిక్షంలోకి పంపుతోంది. ఒకరు లేదా ముగ్గురు వ్యోమగాములతో 2027లో ‘గగన్యాన్’ అంతరిక్షయాత్ర చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే, ఈ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.ఇదిలా ఉంటే, ‘గగన్యాన్’ ప్రయోగాన్ని 2027 సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే చేపట్టనున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ కొద్దిరోజుల కిందట జరిపిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఇస్రో’ చైర్మన్ వి.నారాయణన్తో కలసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘గగన్యాన్’ ప్రయోగాల్లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను అంతరిక్షానికి పంపనున్నట్లు తెలిపారు. అంతరిక్షంలో మన సొంత అంతరిక్ష కేంద్రం ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ ఏర్పాటుకు ‘గగన్యాన్’ ప్రయోగం బాటలు వేయగలదని ‘ఇస్రో’ చైర్మన్ నారాయణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత రూ.10 వేల కోట్లుగా అంచనా వేసిన ‘గగన్యాన్’ బడ్జెట్ను ప్రభుత్వం రూ.20.193 కోట్లకు పెంచిందని ఆయన తెలిపారు.అంతరిక్ష ప్రయోగాలతో పాటు సముద్రగర్భంలో కూడా భారత్ ప్రయోగాలు చేపట్టనుందని, ఈ ప్రయోగాల్లో ‘ఇస్రో’కు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎస్సీ, వైమానిక, నావికా దళాలు కీలక సహకారాన్ని అందిస్తున్నాయని వెల్లడించారు. ‘గగన్యాన్’ తొలివిడత ప్రయోగంలో మన వ్యోమగాములు మూడురోజుల పాటు అంతరిక్షంలోని భూనిమ్న కక్ష్యలో గడిపి తిరిగి రానున్నారు. దీనివల్ల అంతరిక్ష ప్రయోగాలను చేపట్టడంలో భారత్కు గల స్వయంసమృద్ధి, ప్రతిభాపాటవాలు ప్రపంచానికి వెల్లడవుతాయి. అంతరిక్షంలో మరిన్ని అన్వేషణలు, ప్రయోగాలు చేపట్టడానికి ‘గగన్యాన్’ వీలు కల్పిస్తుంది. అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్న ఇతర అగ్రరాజ్యాలకు దీటైన శక్తిగా భారత్ ఎదిగేందుకు దోహదపడుతుంది.ఏక్స్–4 బృందంలో మిగిలినవారుపెగ్గీ విట్సన్అమెరికన్ వ్యోమగామి. ఏక్స్–4 మిషన్కు కమాండర్. ‘నాసా’ తరఫున మూడుసార్లు, ‘ఏక్సియమ్’ తరఫున ఒకసారి అంతరిక్షానికి వెళ్లి వచ్చిన అనుభవం ఉంది. ఐఎస్ఎస్కు తొలి మహిళా కమాండర్ అయిన ఘనత ఆమెకే దక్కుతుంది. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామిగా అరుదైన రికార్డు కూడా ఆమెకు ఉంది. ‘నాసా’ నుంచి 2018లో రిటైరైన తర్వాత పెగ్గీ ‘ఏక్సియమ్’లో చేరారు. ‘ఏక్సియమ్’ చేపట్టిన ఏఎక్స్–2 మిషన్లో కమాండర్గా ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఏఎక్స్–4 మిషన్లో ఐదోసారి అంతరిక్షయాత్రకు నాయకత్వం వహించనున్నారు.స్లావోజ్ ఉజ్నాన్స్కీయూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో (ఈఎస్ఏ) పనిచేస్తున్న పోలిష్ ఇంజినీర్. ఏఎక్స్–4 మిషన్లో తొలిసారిగా అంతరిక్షయాత్రకు వెళ్లనున్నారు. సోవియట్ చేపట్టిన ‘సోయుజ్–30’ మిషన్లో పోలిష్ వ్యోమగామి మిరోస్లా హెర్మాస్జెవ్స్కీ 1978లో అంతరిక్షయాత్రకు వెళ్లారు. ఆ తర్వాత ఉజ్నాన్స్కీ అంతరిక్షానికి వెళ్లనున్న రెండో పోలిష్ వ్యోమగామి కానున్నారు. పోలిష్ అంతరిక్ష కేంద్రం ‘పోల్సా’, ఈఎస్ఏ చేపడుతున్న ‘ఇగ్నిస్’ అంతరిక్షయాత్రకు ఎంపికైన బృందంలో ఉజ్నాన్స్కీ కూడా ఉన్నారు. ఏఎక్స్–4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోనున్న ఉజ్నాన్స్కీ, అక్కడ సాంకేతిక, జీవశాస్త్ర సంబంధిత ప్రయోగాలు చేయనున్నారు.టైబర్ కాపుసోవియట్ రష్యా చరిత్ర ముగిసిన తర్వాత తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లనున్న హంగేరియన్ వ్యోమగామి. మెకానికల్ ఇంజినీర్ అయిన టైబర్ కాపును హంగేరియన్ ప్రభుత్వం 2021లో ‘హనార్’– హంగేరియన్ టు ఆర్బిట్ ప్రయోగం కోసం ఎంపిక చేసింది. సోవియట్ హయాంలో హంగేరియన్ వ్యోమగామి బెర్టాలన్ ఫర్కాస్ ‘సోయుజ్–36’లో తొలిసారిగా 1980లో అంతరిక్షయాత్ర చేశారు. ఆ తర్వాత అంతరిక్ష యాత్ర చేయనున్న రెండో హంగేరియన్ వ్యోమగామి టైబర్ కాపు కావడం విశేషం. ఏఎక్స్–4 మిషన్లో ఐఎస్ఎస్కు వెళ్లనున్న టైబర్ కాపు, అక్కడ పలు సాంకేతిక ప్రయోగాలు చేయనున్నారు. -
వేసవిలో మారే మనసు..!
వేసవి అనగానే మనకు గుర్తొచ్చేది.. మండే ఎండలు, కారే చెమటలు, పిల్లల అల్లరి. కానీ వేసవి అంటే కేవలం ఈ వాతావరణ మార్పు మాత్రమే కాదు; మన ఆలోచనలను, భావోద్వేగాలను, ప్రవర్తనలను మార్చే ఒక సీజనల్ సైకలాజికల్ స్టిములస్ కూడా. ఈ వేసవి మన మనసుపై, మానసిక స్థితిపై కలిగించే ప్రభావం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు తెలుసుకుందాం.1. సూర్యకాంతి పెంచే సంతోషంవేసవిలో పెరిగిన సూర్యకాంతి మన శరీరంలో విటమిన్–డి స్థాయిని పెంచుతుంది. ఇది మెదడులో సెరటోనిన్ అనే ముఖ్యమైన న్యూరోకెమికల్ స్థాయిని పెంచుతుంది. సెరటోనిన్ ఒక ఫీల్ గుడ్ కెమికల్. ఇది శరీరంలో మూడ్ బ్యాలెన్సింగ్, నిద్ర, ఆకలి, సామాజిక ప్రవర్తనలపై ప్రభావం చూపుతుంది. మానసిక స్థైర్యానికి ఒక పునాదిలా ఉంటుంది. మానసిక శక్తి, ఉత్సాహం, జీవితానికి అర్థాన్ని తీసుకు రావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే వేసవిలో మనకు ‘ఏదో కొత్తగా చేద్దాం’ అనే మైండ్సెట్ కలుగుతుంది. అందుకే ఎక్కువ వెలుతురు వాతావరణంలో జీవించే వ్యక్తులలో డిప్రెషన్ స్థాయులు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.2. మానసిక సంబంధాల పునరుజ్జీవం... వేసవి అనేది సహజ సంబంధాల కాలం. కలుసుకోవడానికి, పంచుకోవడానికి, బయటికి వెళ్లేందుకు ఇదొక మంచి సీజన్. పెళ్లిళ్లు, పండుగలు, పర్యటనలు– ఇవన్నీ సామాజిక బంధాలను బలపరుస్తాయి. ఈ సమయంలో మెదడులో డోపమైన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మనలో ఆనందాన్ని, బంధాన్ని పెంచుతుంది. అంతేకాదు ఈ వేసవిలో మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది. ‘నేను ఎవరు?’, ‘నాకు ఏం కావాలి?’ అన్న ప్రశ్నలకు సమాధానాల కోసం ఆలోచించగలిగే అవకాశమే వేసవి. 3. చిన్ననాటి జ్ఞాపకాల చల్లదనం... చిన్నప్పటి వేసవి జ్ఞాపకాలు మనలో భద్రత, ప్రేమ, స్వేచ్ఛ అనే భావాలను తిరిగి మేల్కొలుపుతాయి. ఈ ప్రక్రియను సైకాలజీలో ‘నాస్టాల్జిక్ రిట్రీవల్ ఫర్ ఎమోషనల్ బ్యాలెన్స్’ అంటారు. నాస్టాల్జియా వల్ల మానసిక ఒత్తిడి తక్కువ అవుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. మనిషిగా మన విలువను గుర్తించగలుగుతాం. ఇలాంటి అనుభూతులను డైరీలో రాయడం ద్వారా మానసికంగా మరింత భద్రతా స్థితిలోకి వస్తాం.4. పెరిగే మానసిక అలసట...ఎండ ఎక్కువగా ఉండటం, హ్యూమిడిటీ పెరగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో మార్పులు వస్తాయి. ఇది మన శరీరాన్ని త్వరగా అలిసిపోయేలా చేస్తుంది. ముఖ్యంగా అడ్రినల్ గ్లాండ్స్పై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సందర్భాల్లో మెదడులో ‘ఓవర్హీట్ అయిన కంప్యూటర్’ లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒత్తిడితో నిండిన మైండ్ క్లారిటీ కోల్పోతుంది. అందుకే వేసవిలో మనసు చురుకైనట్టే అనిపించినా, లోపల చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకూ ఎండ పొడ లేకుండా చూసుకోండి. 5. నిద్రలేమి నుండి నిరాశ వరకూ... వేసవిలో పగలు, వెలుతురు ఎక్కువగా ఉండటం వల్ల మెదడులోని పైనీయల్ గ్రంథి మెలటోనిన్ను తక్కువగా విడుదల చేస్తుంది. మెలటోనిన్ అనేది మెదడులో నిద్ర ప్రారంభానికి అవసరమైన హార్మోన్. ఇది తక్కువగా ఉత్పత్తి అయితే మంచి నిద్ర ఉండదు. ఉదయం అలసట ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి ఉన్న వ్యక్తులలో ఎమోషనల్ రెగ్యులేషన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారు చిన్న చిన్న విషయాల్లో కూడా అసహనానికి లోనవుతారు.వేసవిలో చేయాల్సిన పది పనులురోజూ ఉదయం 15 నిమిషాలు సూర్యకాంతిలో గడపండి. దీనివల్ల సెరటోనిన్ స్థాయులు పెరిగి మూడ్ మెరుగవుతుంది.ఒకే సమయానికి పడుకుని, ఒకే సమయానికి లేవండి. మీ ఛిజీటఛ్చిఛీజ్చీn టజిy్టజిఝ ‘సర్కాడియన్ రిథమ్’ స్థిరపడుతుంది.రోజుకు కనీసం 30 నిమిషాలు మీ ఫోన్కు బ్రేక్ ఇవ్వండి.మీ ఆలోచనలను రాయండి, మీ అంతరంగాన్ని తేలిక చేయండి.తేలికపాటి వ్యాయామాలతో నెగటివ్ బాడీ ఇమేజ్ నుంచి బయట పడండి.వారానికోసారైనా ప్రకృతిలో నడవండి, ప్రయాణించండి.నచ్చిన పుస్తకాలు చదవండి, మనసుకు హాయిగా ఉంటుంది.సంగీతం, నృత్యం, పెయింటింగ్లాంటి కొత్త హాబీని ప్రారంభించండి.మీ బంధాలను రివ్యూ చేసుకుని, వాటిని బలపరచుకోండి.రోజుకు కనీసం పది నిమిషాలు మౌనంగా కూర్చుని మీ మనసు చెప్పే మాటలు వినండి. సైకాలజీ విశేష్(చదవండి: ఏఐ దేవత..! కష్టసుఖాలు వింటుంది, బదులిస్తుంది కూడా..) -
ఈ హెయిర్ గాడ్జెట్తో జుట్టు సమస్యలకు చెక్..!
నిగనిగలాడే పొడవాటి కేశాలతో వచ్చే అందమే వేరు. అయితే ఆధునిక జీవనశైలి, కాలుష్యం కారణంగా జుట్టు నిర్జీవంగా మారి, పలుచబడిపోయి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సెల్రిటర్న్ ఆల్ఫా రే హెయిర్ గాడ్జెట్ కేశ క్లేశాలకు చెక్ పెడుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు కోసం ఈ అత్యాధునిక పరికరం చాలా చక్కగా పని చేస్తుంది. ఇది ఎల్ఈడీ సాంకేతికతతో పనిచేస్తుంది. తలలోని రక్త ప్రసరణను మెరుగుపరచి, జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడుతుంది.ఈ గాడ్జెట్లో మొత్తం 720 ఎల్ఈడీ లైట్లు ఉంటాయి, వీటిలో ఎరుపుకాంతితో వెలువడే ఆల్ఫా ఈ కాంతి కిరణాలు జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోయి, వాటికి ఆక్సిజన్ను అందిస్తాయి. ఈ పరికరాన్ని వైర్లెస్గా వినియోగించుకోవచ్చు. రోజుకు ఇరవై నిమిషాలు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఇది సాఫ్ట్, నార్మల్, పవర్ అనే మూడు వేర్వేరు మోడ్లను కలిగి ఉంటుంది. ఈ పరికరంలో ఒకదానికొకటి అనుసంధానమై టాప్, సెంటర్, ఆల్ఫా ప్యాడ్ అనే మూడు భాగాలు ఉంటాయి. క్లినికల్ అధ్యయనాల ప్రకాశం ఈ సెల్రిటర్న్ ఆల్ఫా రే హెయిర్ గాడ్జెట్ జుట్టు సాంద్రతను, మందాన్ని బాగా మెరుగుపరుస్తుంది. పని పూర్తయ్యాక దీని భాగాలను విడి విడిగా విడదీసుకోవచ్చు. దీనికి మెత్తటి దిండును కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేసుకుని చిత్రంలో చూపినట్లుగా సేదతీరితే సరిపోతుంది. ఉత్తమ ఫలితాలు అందుతాయి. -
కోత తక్కువ.. కరిగించే కొవ్వు ఎక్కువ
సన్నగా నాజూకుగా ఉంటేనే అందం, ఆరోగ్యం బాగుంటాయి. కొవ్వు పెరిగి లావెక్కిపోతే, ఒంట్లో అదనంగా చేరిన కొవ్వును కరిగించడానికి చక్కని సౌందర్య చికిత్స ‘లేజర్ లిపోలిసిస్ ట్రీట్మెంట్’. ఈ చికిత్స శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడానికి ఉపయోగపడుతుంది. కొవ్వు ఎక్కువగా ఉన్న చోట చిన్న కోతలు కోసి, వాటి నుంచి ఒక సన్నని ట్యూబ్ను చొప్పిస్తారు. ఈ ట్యూబ్ ద్వారా లేజర్ను పంపి, కొవ్వు కణాలను కరిగిస్తారు. ఇలా కరిగిపోయిన కొవ్వు శరీరం నుంచి సహజంగా బయటకు పోతుంది. మరీ ఎక్కువగా ఉంటే, ఒక పరికరం ద్వారా కొవ్వును పీల్చేసి, తొలగిస్తారు. ఈ పద్ధతి లిపోసక్షన్ కంటే సులభంగా తక్కువ నొప్పితో పూర్తవుతుంది. ఇది చర్మం బిగుతుగా మారడానికి కూడా సహాయపడుతుంది. మెడ, చేతులు, తొడలు, పొట్ట వంటి ప్రాంతాల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. అయితే, ఇది బరువు తగ్గించే ప్రక్రియ కాదని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో కలిపి చేస్తేనే ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇలాంటి చికిత్సలను నిపుణులైన వైద్యుల ద్వారా మాత్రమే చేయించుకోవాలి. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో ముక్కు నుంచి రక్తం కారడం ప్రమాదమా..?) -
ప్రెగ్నెన్సీ టైంలో ముక్కు నుంచి రక్తం కారడం ప్రమాదమా..?
నాకు ఇప్పుడు ఏడవ నెల. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ, నా ముఖం, చేతులు, కాళ్లల్లో ఒక్కసారిగా వాపులు మొదలయ్యాయి. ఇది సాధారణమా లేక ప్రమాదమా?– లక్ష్మీ, నెల్లూరు. వాపు అనేది శరీర భాగాలలో ద్రవం నిలిచిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఇది గర్భధారణ సమయంలో తరచుగా కనిపించేదే. సాధారణంగా ఎక్కువ సేపు కూర్చోవటం, నుంచోవటం వలన ప్రెగ్నెన్సీలో వస్తుంది. ఎక్కువ ఉప్పు పదార్ధాలు తిన్నా, బరువు ఎక్కువ ఉన్నా, బీపీ మందులు, స్టెరాయిడ్స్, ఇతర మందులు వాడుతున్నా వస్తుంది. చాలా అరుదుగా కాలేయం, గుండె, మూత్రపిండాల సమస్యల వల్ల కూడా ఈ వాపులు రావచ్చు. ప్రెగ్నెన్సీలో వచ్చే సాధారణ వాపు ఎక్కువగా రాత్రి వేళల్లో కనిపిస్తుంది. ఉదయానికి తగ్గిపోతుంది. కానీ, ఒక్కసారిగా వాపు రావడం, బీపీ పెరగడం, తలనొప్పి, చూపు మసకబారడం వంటివి కనిపిస్తే అది ప్రీ ఎక్లాంప్షియా అంటాం. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఈ వాపులు ప్రెగ్నెన్సీలో నెలలు పెరిగే కొద్దీ, ఆ బరువుకి కాళ్లలో రక్త ప్రసరణ తక్కువగా ఉండటంతో వస్తుంది. ఇది తగ్గించుకోవడానికి ఎక్కువ సేపు నిలబడకూడదు. అనుకూలమైన సాక్సులు, చెప్పులు వేసుకోవాలి. బాగా వాకింగ్, వ్యాయామం చేయాలి. ఒకసారి మీరు డాక్టరుని కలిస్తే బీపీ, బరువు అన్నీ పరీక్షించి ఇది నార్మల్ ఏనా కాదా అనేది చెప్తారు.నేను మూడునెలల గర్భవతిని. చాలా అలసటగా ఉంటుంది. నిద్ర పట్టడం లేదు. నిద్రలో చెడు కలలు ఎక్కువగా వస్తున్నాయి. ఏం చేయాలో చెప్పండి?– నందిని, సంగారెడ్డి.ప్రెగ్నెన్సీలో హార్మోన్ల మార్పుల వలన మొదటి మూడు నెలల్లో అలసట, బలహీనత, నిస్సహాయత భావం ఎక్కువగా ఉంటుంది. ఇవి మానసికంగా చాలా ప్రభావితం చేస్తాయి. అందుకే, అన్నింటికీ సమాధానం విశ్రాంతి తీసుకోవటమే. ఈ సమయంలో కాళ్లు రెండు ఎత్తులో పెట్టుకొని కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. పోషకాహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. నెలలు నిండిన తర్వాత అధిక బరువుతో బలహీనంగా, డల్గా ఉంటారు. పొట్ట పెరిగే కొద్దీ నిద్రపట్టడం కష్టం కావచ్చు. దీని వలన బేబీకి ఏ ప్రమాదం ఉండదు. రిలాక్సినేషన్, బ్రీతింగ్ టెక్నిక్స్ పాటించాలి. మృదువైన దిండు వాడటం, నిద్రకు అనుకూలంగా పడుకోవడం చేయ్యాలి. అంటెర్నల్ క్లాసెస్లలో ఇవీ నేర్పిస్తారు. వ్యాయామం చేయటం వలన కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆహారం తిన్న తర్వాత తప్పకుండా వాకింగ్ చెయ్యాలి. కొంతమందికి నిద్రలేమితోపాటు అలసట, చిరాకు, నిస్సహాయత భావం, పనుల మీద ఆసక్తి లేకపోవటం ఉంటాయి. ఇవి ఉంటే డిప్రెషన్ కావచ్చు. ఇలాంటి సమయంలో మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.నాకు ఇప్పుడు తొమ్మిదవ నెల. ఒక వారం నుంచి ముక్కు నుండి రక్తం వస్తోంది. ఐస్ ప్యాక్ పెట్టుకోమన్నారు. ఇది సాధారణమేనా? ఏవైనా పరీక్షలు చేయించుకోవాలా?– మమత, యాదాద్రి.ప్రెగ్నెన్సీలో ముక్కులో ఉండే రక్తనాళాలు విస్తరించి, సున్నితంగా మారుతాయి. అప్పుడు ముక్కు నుంచి రక్తం రావడం సాధారణమే. ఇది హార్మోన్ల మార్పులు, ఎక్కువ రక్త ప్రసరణ వలన జరుగుతుంది. కొంతమందికి కొన్ని సెకన్ల నుంచి నిమిషాలపాటు రక్తం రావచ్చు. నిద్రలో కూడా ఇలా జరగచ్చు. ఇలా అయినప్పుడు వెంటనే నిటారుగా కూర్చొని, ముక్కు పై భాగాన్ని గట్టిగా మూసివేసి కొన్ని సెంకడ్ల పాటు పట్టుకుంటే తగ్గిపోతుంది. నోటితో శ్వాసతీసుకోవటం మంచిది. ఐస్ప్యాక్ పెట్టుకోవచ్చు. అలా చేసినా తగ్గకపోతే డాక్టర్ని కలవాలి. ముక్కుని ఎక్కువ చీదటం, కిందకు వంగటం, వ్యాయామం చేయటం ఒక రెండు రోజులు మానేయాలి. పది నుంచి పదిహేను నిమిషాల్లో తగ్గకపోతే, వెంటనే డాక్టర్ని కలవాలి. అలసటగా, బలహీనంగా ఉన్నా డాక్టర్ను కలవాలి. ఆసుపత్రిలో సన్నని గాజుగుడ్డతో నోస్ ప్యాకింగ్ చేస్తారు. తగ్గిన తర్వాత యాంటీసెప్టిక్ క్రీమ్స్ ముక్కు లోపల ఉపయోగించమని చెప్తారు. ఈ క్రీమ్స్ వలన క్రస్టింగ్, మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి. కానీ, కొన్ని కేసెస్లో బ్లీడింగ్ డిసార్డర్స్ ఉన్నా, రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడుతున్నా, ఈ బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు. అందుకే వెంటనే ఆసుపత్రికే వెళ్లాలి. (చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..) -
నోరూరగాయ.. ఆవకాయ..! ఇప్పుడు చాలా కాస్టలీ గురూ..
‘ముద్దపప్పు మిత్రమై వర్థిల్లే ఆవకాయ వేసవిలో పుట్టి చవులూరించే ఆవకాయ‘ వేసవి వచ్చిందంటే చాలు వంటగదిలో హడావుడి మొదలయ్యేది.. ఆ ఏడాది ఆవకాయ పెట్టే కార్యక్రమం గురించి చర్చోపచర్చలు జరిగేవి.. మంచి మామిడి కాయలు తెచ్చుకోవాలి.. కరెక్ట్ సైజులో ముక్కలు కొట్టించాలి.. సరైన మోతాదులో సంబారాలన్నీ కలుపుకోవాలి.. శుచిగా శుభ్రంగా చేసుకోవాలి. ఎందుకంటే ఏడాదంతా నిల్వ ఉండాలి కదా.. ఆవకాయ పెట్టే విధానం గురించి కొత్త కోడలికి పాఠాలు.. సరిగ్గా నేర్చుకోవడం లేదని కూతురికి అక్షింతలు.. ఇంటి పెద్ద హడావుడే హడావుడి.. ఇదంతా గతం. ఇప్పుడు ఆవకాయ పెట్టే ఓపిక, తీరిక ఎవరికుంది? ఆవకాయ పెట్టడం ఎందరికి వచ్చు? పెరిగిన ధరలతో అది భారంగా మారిన వేళ అంత శ్రమ ఎవరు తీసుకుంటారు?ఊరగాయ ఒక్కటి చాలు.. ముద్దపప్పులో కలుపుకొని తినొచ్చు.. నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని ఆరగించవచ్చు.. పెరుగన్నంతో నంజుకుంటూ.. ఆహా ఏమి రుచి అని రాగాలు తీయవచ్చు. ఎక్కువ వంటలు చేయడానికి అవకాశం లేకపోతే ఆ పూట గడిపేయడానికి ఊరగాయ ఒక్కటి చాలు.. కానీ ఏం లాభం.. ఈ తరం రుచులే మారిపోయాయి. వారు కొత్త కొత్త వంటకాలు కోరుతారు. బీపీ పెరుగుతుందని తినే వారిని కూడా తిననివ్వరు. ఇదీ నేటి పరిస్థితి. అయితే ఆవకాయ పెట్టడం అంత ఆషామాషీకాదు. తగ్గిన మామిడి దిగుబడి, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఆవకాయ వాసనలు అక్కడక్కడ మాత్రమే ముక్కుపుటాలను సోకుతున్నాయి. ధరల దరువు కొన్ని దశాబ్దాలుగా ఆవకాయ పచ్చడితో ఆంధ్రులకు మంచి అనుబంధం ఉంది. ప్రతి ఇంటా కచ్చితంగా తయారు చేసేవారు. కానీ సరకుల ధరలు ఆకాశాన్నంటడంతో రానురాను ఆవకాయ పెట్టేవారు తగ్గిపోతున్నారు. 40 మామిడి కాయలనుపయోగించి ఆవకాయ పెట్టాలంటే సుమారు రూ.5 వేల వరకు ఖర్చవుతోంది. ప్రస్తుతం మామిడి కాయల దిగుబడి అంతంతమాత్రంగానే ఉంది. మార్కెట్లో మామిడి కాయలు ఒక్కొక్కటి రూ.20లకు కొనుగోలు చేసి ఆవకాయ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నాణ్యమైన మామిడి కాయలేవీ? వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి బాగా తగ్గిపోయింది. దీనికితోడు తెగుళ్లు కూడా బాగా సోకడంతో నాణ్యమైన మామిడి కాయలు దొరకడం కష్టంగా ఉంటోందని గృహిణులు, పచ్చడి తయారీదార్లు వాపోతున్నారు. ఆవకాయ కోసం ఎక్కువగా కోలంగోవా, కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ, కలెక్టర్ తదితర రకాల మామిడి కాయలను వినియోగిస్తుంటారు. ఈ ఏడాది కలెక్టర్ మినహా మిగతా రకాల మామిడి కాయల దిగుబడి తగ్గిపోయింది. ఏడాదిపాటు నిల్వ ఉండే ఆవకాయకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. సరైన సమయంలో లేతపరువుతో ఉన్న కాయలనే ఆవకాయ కోసం వినియోగిస్తుంటారు. కొత్తపల్లి కొబ్బరి కాయ రకంతోనే ఆవకాయ పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నాణ్యమైన మామిడికాయల కొరత తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చాలామంది సొంతంగా ఆవకాయ పెట్టుకునే బదులు సీజనల్ వ్యాపారుల వద్ద సూపర్మార్కెట్లో లభించే ఆవకాయ డబ్బాలను కొనుగోలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇన్ని వ్యయప్రయాసలు పడి నిల్వ ఉండే పచ్చళ్లు పెట్టే బదులు మార్కెట్లో రెడీమేడ్గా దొరికే పచ్చళ్లు కొనుగోలు చేయడానికే కొంతమంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇంట్లో తయారు చేసిన ఆవకాయకు మరేదీ సాటి రాదన్న ఉద్దేశంతో ఖర్చుకు వెనుకాడకుండా ఇళ్లల్లోనే తయారు చేసేవారూ ఉన్నారు. ఆవకాయ చాలా కాస్ట్లీ గురూ.. 40 మామిడి కాయలతో ఆవకాయ పెడితే ఖర్చు ఇలా అవుతోంది. మామిడి కాయల ధర రూ.800లు, పొట్టు తీసిన ఆవపొడి 2 కిలోలు రూ.560లు, కారం 2 కిలోలు రూ.1450లు, 2 కిలోల దంపిన ఉప్పు రూ.100లు, వెల్లుల్లి కిలో రూ.200లు, గానుగ నూనె 4 కిలోలు రూ.1600లు, కాయలు ముక్కలుగా కోయించడానికి రూ.240లు.. ఇలా 40 కాయల ఆవకాయకు సుమారు రూ.5 వేలు ఖర్చవుతోంది. ఒక కాయకు ఖర్చు రూ.124లు అవుతోంది. ఒక మామిడి కాయను 12 ముక్కలుగా కట్ చేస్తారు. ఈ లెక్కన ఒక ఆవకాయ ముక్క ఖరీదు రూ.10లు పడుతోంది.జాగ్రత్తలు తీసుకుంటేనే ఎక్కువ కాలం నిల్వ నిల్వ ఉండే ఊరగాయలు సొంతంగా పెట్టుకుంటేనే మంచిది. ఆవకాయ పెట్టినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏడాదిపాటు నిల్వ ఉంటాయి. నాణ్యమైన మామిడికాయలు తెచ్చుకోవాలి. నెంబర్ వన్ సరకులు ఉపయోగించాలి. గానుగ నూనె వాడటం మంచిది. మాగాయి, తొక్కుడు పచ్చడి వంటి వాటికి ఉప్పులో ఊరబెట్టి అప్పటికప్పుడు ఉప్పు కారం నూనె వంటివి కలుపుకుని వాడుకోవచ్చు. ఆవకాయ అలా కాదు కదా అన్ని ఒకేసారి కలుపుతాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. 50 మామిడి కాయలతో ఊరగాయ పెట్టాలంటే రూ.6 వేలకు పైగానే ఖర్చవుతోంది. తప్పని పరిస్థితుల్లో ఖర్చయినా ఇళ్లల్లో వాడకం కోసం పెట్టక తప్పడం లేదు. తయారు చేసిన ఆవకాయను పింగాణీ జాడీల్లో పెడితే పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంది. ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచకూడదు. – విశ్వమోహిని, గృహిణి, ఉద్దండపురం(చదవండి: బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ గైడ్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..) -
సన్నని సైజుకు లావైన డిస్కౌంట్..! ఇది మాములు ఆఫర్ కాదు..
థాయ్ల్యాండ్లోని ఓ రెస్టారెంట్, కస్టమర్స్కి విచిత్రమైన ఆఫర్ ఇస్తోంది. ఇక్కడ భోజనం ఆర్డర్ చేయడానికి ముందు ‘మెటల్ గేట్ చాలెంజ్’ అనే ఫిట్నెస్ టెస్ట్లో పాల్గొనాలి. అంటే ఒక ఐదు రకాల వెడల్పు అయిన మెటల్ బార్స్ మధ్య ఏర్పాటు చేసిన సన్నని సందు నుంచి బయటకు రావాలి. ఎంత సన్నని సందు నుంచి బయటకు వస్తే, అంత పెద్ద డిస్కౌంట్ ఇస్తారు. అలా ఐదు నుంచి ఇరవై శాతం వరకు డిస్కౌంట్ పొందచ్చు. అయితే, ఈ విషయం సోషల్ మీడియాలో వివిధ చర్చలకు దారితీసింది. చాలామంది ఫన్నీగా తీసుకున్నా, కొంతమంది మాత్రం దీనిని బాడీషేమింగ్గా పేర్కొంటూ మండిపడుతున్నారు. కాని, హోటల్ యజమానులు మాత్రం ‘ఇది ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికి చేసిన వినోదాత్మక ప్రయోగం’ అని అంటున్నారు. View this post on Instagram A post shared by Ameana Finds (@ameana_finds) (చదవండి: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!) -
నటి ప్రియాంక మోహన్ ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..! ఎక్కడికెళ్లినా అది తప్పనిసరి..
ట్రెండ్స్ వెంట పరుగెత్తకుండా, సింపుల్ స్టయిలింగ్తోనే క్లాసీ లుక్ చూపించే నటి ప్రియాంక మోహన్. చీరలైనా, మోడర్న్ డ్రెసుల్లోనైనా తన ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రం సింపుల్ అండ్ ఎలిగెన్స్గానే ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఎలిగెన్స్నూ చూపిస్తోంది ఈ ఫ్యాషన్ బ్రాండ్స్తో..ఫ్యాషన్లో ఎప్పుడూ స్థానాన్ని కోల్పోని క్లాసిక్ ఆభరణమే ఈ మల్టీ లేయర్ చోకర్. మగువ మెడను అంటిపెట్టుకొని ఉంటూ అందాన్ని వెంట తీసుకొని వస్తుంది. అందుకే, చోకర్స్పై మోజూ ఎప్పటికీ తరగనిది. సాధారణ చోకర్స్ మాదిరి కాకుండా రెండు నుంచి ఐదు వరుసల వరకు ముత్యాలు, వివిధ పూసలతో తయారుచేసే వీటికి మధ్యలో ఒక డాలర్ తగిలిస్తే వాటి అందం మరింత ఆకట్టుకునేలా మారుతుంది. కాటన్, సిల్క్, ఆర్గంజా చీరలు, లెహంగాలకు డీప్ నెక్ బ్లౌజులతో ధరిస్తే ఎవ్వరికైనా బాగా నప్పుతుంది. అనార్కలీలకు కూడా అద్భుతంగా మ్యాచ్ అవుతుంది ఈ చోకర్. అయితే, ఈ చోకర్ ధరించినప్పుడు మినిమల్ జ్యూలరీతో స్టయిల్ చేసుకోవడం ఉత్తమం. చెవులకు చిన్న స్టడ్స్, సింపుల్ ఉంగరం ధరించాలి. అలాగే హెయిర్ స్టయిల్స్ కూడా సింపుల్ బన్ లేదా వేవీ హెయిర్ స్టయిల్స్ ట్రై చేసి, చోకర్ అందాన్ని హైలెట్ చేసేయొచ్చు. వివాహాది శుభకార్యాలకు, స్పెషల్ డేస్కు ఈ టిప్స్తో స్టయిలింగ్ చేసి, మినిమలిస్టిక్ గ్రేస్ఫుల్ లుక్ సొంతం చేసుకోండి అచ్చం నటి ప్రియాంక మోహన్లా. "చర్మం ఎంత నేచురల్గా ఉంటే అంత అందంగా కనిపిస్తాం. అందుకే, మినిమల్ మేకప్నే ప్రిఫర్ చేస్తా. ఇక ఎక్కడికెళ్లినా సరే, సన్ స్క్రీన్ తప్పనిసరి. అంటోంది". ప్రియాంక మోహన్. (చదవండి: liposuction: సౌందర్య చికిత్సలు ఇంత డేంజరా..? పాపం ఆ మహిళ..) -
Istanbul Airport: అక్కడ తింటే.. పర్సు ఖాళీ!
చేతిలో ఐఫోన్, ముంజేతికి రోలెక్స్ వాచ్ ఉన్న వాడు కాదు రిచ్కిడ్ అంటే, ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో బర్గర్ తిన్నవాడే నిజమైన రిచ్కిడ్. ఎందుకంటే, ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విమాశ్రయాల్లో ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ ఒకటి. అక్కడి తినుబండారాల ధరలు ఏకంగా అంతరిక్షాన్నే దాటేస్తున్నాయి. ఒక లాసాగ్నే (ఇటాలియన్ వంటకం) రూ. 2,180. అదిపెద్ద డిన్నరేం కాదు, ఈ వంటకంలోని చిన్న ముక్క మాత్రమే సర్వ్ చేస్తారంతే! ఇక చిన్న బర్గర్ ధర అయితే రూ. 2,245, నాలుగు చికెన్ వింగ్ ఫ్రైస్ రూ.1,560. బయట దొరికే బీరు బాటిల్ రూ.రెండువందలైతే, ఇక్కడ బీరు ధర రూ. 1,915. అది కూడా పూర్తిగా బాటిల్ ఇవ్వరు, కేవలం వంద మిల్లీలీటర్లే! వీటి ధరలన్నీ తెలిసి తలనొప్పి వస్తుందని ఒక కప్పు కాఫీ అడిగారో మరో రూ. 700 ఖర్చు చేయాలి. అదీ తెలిసి, బీపీ పెరిగిందని కనీసం అరటిపండు కొనాలనుకుంటే రూ.535 ఖర్చు చేయాలి. చివరికి మంచినీళ్లు అయినా తాగి గొంతు తడుపుకుందాం అనుకుంటే లీటరు వాటర్ బాటిల్ రూ. 300. ఏదేమైతేనేం, బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకొని అయినా, అంత ఖర్చు చేసి, బాగా తిని రిలాక్స్ అయ్యారనుకోండి, మీ బ్యాగ్ జాగ్రత్త! ఎందుకంటే, ప్రపంచంలోనే చోర భయం ఎక్కువగా ఉండే ఎయిర్పోర్టుల్లో ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు నంబర్ వన్ అని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ కంటే ముందే బ్యాగు, పర్సు రెండూ టేకాఫ్ అయిపోతున్నాయని ఇస్తాంబుల్ ఎయిర్పోర్టు బాధితులు సోషల్ మీడియాలో లబోదిబో మంటున్నారు.(చదవండి: బలమైన ఎముకలకు బెస్ట్ ఇండియన్ గైడ్ ఇదే..! ఆ నాలుగింటిని మాత్రం..)