Funday
-
సమ్మర్లో కడుపు చల్లగా ఉంచే వంటకాలు చేసేయండిలా
ఎండలు మండే వేసవి కాలంలో కడుపు చల్లగా ఉంటేనే ఆరోగ్యం. వేసవి ప్రత్యేకంగా పిల్లా పెద్దా అందరికీ కడుపు చల్లగా ఉంచే వంటకాలు మీ కోసం... స్వీట్కార్న్ స్టూ (6 నెలల పైబడిన పిల్లలకు)కావలసినవి: స్వీట్కార్న్: 1 టిన్ (160 గ్రాములు) వెల్లుల్లి: 1 చిన్న రెబ్బ, నూనె: 1 టీస్పూన్ ఉల్లిపాయ: పావు వంతు (చిన్న ముక్కలుగా కోసినది), పాలు: 200 మి.లీ మిక్స్డ్ హెర్బ్స్: పావు టీస్పూన్ (ఆప్షనల్)తయారీ: ఒక పాన్లో నూనె వేసి వేడి చేయండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి 1 నుంచి 2 నిమిషాల పాటు అవి మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత అందులో స్వీట్కార్న్, పాలు పోయాలి. పాలు మరిగిన తర్వాత, మంటను తగ్గించి సుమారు 15 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనిచ్చి, ఆ తర్వాత దీనిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి. దీనిని ఆరు నెలల పైబడిన పిల్లలకు రోజుకు 40 గ్రాముల వరకు తినిపించవచ్చు. దీనిని నిల్వ పెట్టుకోవాలనుకుంటే ఒక గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రీజర్లో పెట్టాలి. దీనికి తోడుగా ఉడికించిన కూరగాయలు, హోల్మీల్ బ్రెడ్ ముక్కలను కూడా కలిపి తినిపించవచ్చు. జల్ జీరాకావలసినవి: తాజా పుదీనా ఆకులు: 1/2 కప్పు జీలకర్ర పొడి: టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు: టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు: టీస్పూన్, నిమ్మరసం: టేబుల్ స్పూన్ బెల్లం పొడి: టేబుల్ స్పూన్, నీళ్లు: 4 కప్పులు నిమ్మకాయ ముక్కలు: అలంకరణ కోసంతయారీ: ఒక బ్లెండర్లో పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు, నల్ల ఉప్పు, నిమ్మరసం, బెల్లం పొడి వేయండి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక జగ్గులోకి వడకట్టండి. ఇప్పుడు మిగిలిన నీటిని పోసి బాగా కలపండి. ఈ జల్ జీరాను కొన్ని గంటల పాటు రిఫ్రిజిరేటర్లో బాగా చల్లబడే వరకు ఉంచాలి. ఈ చల్లబడిన జల్ జీరాను గ్లాసుల్లో పోసి, ఐస్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేయండి. మీ రుచికి తగినట్లుగా పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు. జల్ జీరా వేసవికి చాలా మంచిది. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.చికూ పెకాన్ కుల్ఫీ కావలసినవి: పెకాన్ గింజలు (సిమ్లా అక్రోట్): 30 నుంచి 40 సపోటాలు: 5 నుంచి 6 (గింజలు తీసి, తొక్కతో సహా ముక్కలుగా కోసినవి) చక్కెర: 1/4 కప్పు పాల పొడి: 3 టేబుల్ స్పూన్లు ఏలకుల పొడి: 1/2 టీస్పూన్ మరిగించి చిక్కబరిచిన పాలు: 3 కప్పులు గార్నిష్ కోసం: సపోటా ముక్కలు, పెకాన్ గింజలు. తయారీ: 15 నుంచి 20 పెకాన్ గింజలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన పెకాన్ గింజలను మిక్సీ జార్లో వేసి రఫ్గా గ్రైండ్ చేయాలి. అందులోనే సపోటా ముక్కలు, చక్కెర, పాల పొడి, ఏలకుల పొడి వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో సగం కోసిన పెకాన్ ముక్కలు, చిక్కబరిచిన పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మోల్డ్స్లో పోసి, మూతలు పెట్టి 6 నుంచి 8 గంటల పాటు ఫ్రీజర్లో ఉంచాలి. కుల్ఫీ గడ్డకట్టిన తర్వాత బయటకు తీసి, మిగిలిన పెకాన్ ముక్కలపై దొర్లించాలి. ప్రతి కుల్ఫీని మధ్యలోకి కట్ చేసి, సపోటా ముక్కలు, పెకాన్ గింజలతో అలంకరించి చల్లగా వడ్డించాలి.(చదవండి: ఐస్క్రీం షాపే పెళ్లి వేదికగా..ఒక్కటైన జంట!) -
కాంతివంతమైన మెరిసే ముఖం కోసం..!
పెదవుల ఆకృతిని మార్చుకోవడానికి ఫిల్లర్ చికిత్సలపై ఆధారపడే మహిళలకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ బ్యూటీ టెక్నాలజీ సంస్థ సిల్కెన్ పెదవుల సంరక్షణ, అందం కోసం ‘లూమిలిప్స్ ఎల్ఈడీ లిప్ మాస్క్’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.ఫేస్ మాస్క్లు సాధారణంగా ముఖం అంతటికీ కాంతిని అందిస్తాయి. కానీ, ఈ లూమిలిప్స్ మాస్క్ ప్రత్యేకంగా పెదవులు, వాటి చుట్టూ ఉండే చర్మంపై దృష్టి పెడుతుంది. ఇది కాంతి కిరణాల సహాయంతో పెదవులలోని కొవ్వు పొరను లక్ష్యంగా చేసుకుని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పెదవులు సహజంగానే మృదువుగా, నిండుగా కనిపిస్తాయి. ఈ పరికరం రెండు మోడ్లలో పనిచేస్తుంది. ఒకటి: వాల్యూమ్ యాంటీ ఏజింగ్ మోడ్. ఇది పెదవుల చుట్టూ ఉండే ముడతలు, స్మైల్ లైన్స్, వయసురీత్యా వచ్చే మార్పులను తగ్గిస్తుంది. మరొకటి: గ్లో అండ్ సూతింగ్ మోడ్. ఇది చర్మ ఛాయను మెరుగుపరచడమే కాకుండా, పెదవులకు సహజమైన మెరుపును ఇస్తుంది. ఈ మాస్క్ని రోజుకు 3 నుంచి 5 నిమిషాలు ఉపయోగిస్తే చాలు. కేవలం రెండు వారాల్లోనే స్పష్టమైన మార్పును గమనించవచ్చు. దీనిని ఉపయోగించినప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు.వైనో థెరపీ..వైన్ తాగడం పురాతన కాలం నుంచి మామూలే! కానీ పురాతన కాలంలో వైన్ను ఒక సౌందర్య సాధనంగా కూడా ఉయోగించేవారు. రోమన్ మహిళలు ద్రాక్ష గింజలు, తొక్కలతో చేసిన మాస్క్లను ముడతలు పోగొట్టుకోవడానికి వాడేవారు. అలాగే ద్రాక్ష గుజ్జును బుగ్గలకు మంచి రంగు రావడం కోసం వాడేవారట! తరువాత 17వ శతాబ్దంలో ఫ్రాన్స్లోని ఉన్నత వర్గాల మహిళలు చర్మం కాంతిమంతంగా మెరవడానికి రెడ్ వైన్తో ముఖం కడుక్కునేవారట! ముఖ్యంగా ఈ ప్రక్రియకే ఆధునికులు ‘వైనోథెరపీ’గా పేరుపెట్టారు. వైనోథెరపీ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం 1990లో. ఫ్రాన్స్కి చెందిన మథిల్డే థామస్, ఆమె భర్త బెర్ర్టాండ్ థామస్ ఈ ఆధునిక వైనోథెరపీకి మూలకారకులు. ఫ్రాన్స్లో మొదలైన ఈ వైనోథెరపీ ఇప్పుడు జపాన్, అర్జెంటీనా, అమెరికా, భారత్ వరకు విస్తరించింది.అతి జాగ్రత్తలే అసలు సమస్య!జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ఒక్కోసారి మనం అతి జాగ్రత్తలతో చేసే పనులు సమస్యను తగ్గించడానికి బదులుగా మరింత పెంచుతాయి. జుట్టు జిడ్డుగా మారుతుందని తరచు షాంపూలతో తలస్నానాలు చేస్తుంటారు. దీనివల్ల తలలో సహజంగా ఉండే నూనెలు పోతాయి. చర్మం మరింత పొడిబారి, ఇంకా ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల మైల్డ్ షాంపూలను మాత్రమే ఉపయోగించాలి. అలాగే వేసవిలో చాలామంది జుట్టును బిగుతుగా ముడి వేస్తుంటారు. దీనివల్ల తలలో చెమట, వేడి పెరిగి జుట్టు కుదుళ్లు బలహీన పడతాయి. అలాగే డ్రై షాంపూలు, స్ప్రేలు వాడినప్పుడు అవి చెమటతో కలిసి తల మీద ఒక పొరలా పేరుకుపోతాయి. ఇవి చర్మరంధ్రాలను మూసివేసి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అందువల్ల తలపై పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి సున్నితమైన స్క్రబ్ను వాడాలి. ఎండలో వెళ్లేటప్పుడు హ్యాట్, లేదా స్కార్ఫ్ ధరించాలి. సూర్యరశ్మి వల్ల తల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. మన ముఖ చర్మం లాగే, తల చర్మం కూడా చాలా ముఖ్యం. అందువల్ల తలపై దురద పెడుతున్నా, జుట్టు పల్చబడుతున్నా, జిడ్డుగా ఉంటున్నా– అది మీ సహాయం కోరుతోందని అర్థం. అందువల్ల సమస్య చిన్నగా ఉన్నప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. -
వరుణుడు కోసం అగ్నిబాణాలు
వానలు సమృద్ధిగా కురవాలి; పంటలు పుష్కలంగా పండాలి. ఇంటికి సిరిసంపదలు తేవాలి– ప్రతి దేశంలోనూ రైతులందరి ఆశ ఇది. ఇదే ఆకాంక్షతో థాయ్లాండ్, లావోస్ ప్రజలు ప్రతి ఏటా ‘బున్ బాంగ్ ఫై’ అనే రాకెట్ ఫెస్టివల్ను అత్యంత ఉత్సాహభరితంగా, అంగరంగ వైభవోపేతంగా జరుపుకొంటారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ అద్భుత వేడుక యసోథోన్ ప్రావిన్స్లో మే 8న ప్రారంభమై మే 10తో ముగుస్తుంది.తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. లావోస్ వానదేవుడైన ‘పయా థేన్’ ఒక నాగ సర్పం కారణంగా ఆగ్రహించడంతో వర్షాలు కురవక కరవు వాటిల్లింది. దీంతో ప్రజలు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి వెదురుతో తయారు చేసిన భారీ రాకెట్లను ఆకాశంలోకి ఎగురవేశారట! ఈ పురాణం ఆధారంగా వానదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వెదురు రాకెట్లను ఎగురవేసే సంప్రదాయం మొదలైంది. వీరు ఎగురవేసే రాకెట్లు నేరుగా స్వర్గానికి చేరుకుని, ప్రజల అవసరాలను వానదేవుడికి విన్నవిస్తాయని, ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. థాయ్లాండ్ ఈశాన్య ప్రాంతంలోని మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. కాబట్టి వారికి వర్షాలు చాలా కీలకం. రుతుపవనాలు సకాలంలో రావడం వారికి చాలా ముఖ్యం. ఈ ప్రకృతి పండుగను థాయ్లాండ్లోని ఈశాన్య ప్రాంతాలైన యసోథోన్, రోయి ఎట్, కలసిన్, ఉడాన్ థాని, నోంగ్ ఖై, మహా సారఖామ్, సిసాకెట్, నోంగ్ బువా లాంఫు, లోయి, అమ్నాత్ చారోయెన్ ప్రావిన్స్లతో పాటు ఉత్తర ప్రాంతంలోని కొన్ని ప్రావిన్స్లలో విస్తృతంగా జరుపుకొంటారు. మూడు రోజుల పాటు నిర్వహించుకునే ఈ ఉత్సవం రంగురంగుల ఊరేగింపులతో, జానపద నృత్యాలతో కోలాహలంగా సాగుతుంది. సుమారు 20 నుంచి 25 కిలోల గన్పౌడర్తో నింపిన ఈ రాకెట్లను బౌద్ధ పురాణాల్లోని ‘నాగ’ అనే పౌరాణిక సర్పం బొమ్మతో అలంకరిస్తారు. రాకెట్లను ప్రయోగించే ముందు బౌద్ధ సన్యాసులు వీటికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదిస్తారు. రాకెట్లను తయారు చేసిన బృందాలకు బహుమతులు అందజేస్తారు. అయితే, ఒకవేళ ఏదైనా రాకెట్ ప్రయోగం విఫలమైతే, ఆ రాకెట్ తయారుచేసిన వాళ్లని సరదాగా బురదలో ముంచి శిక్షిస్తారు. ఇది దేవుడికి ఆగ్రహం కలిగించిందని భావించి చేసే ఒక వినోదాత్మక ఆచారం. పురుషులు, స్త్రీల వేషధారణలో కనిపిస్తూ, హాస్యభరితమైన ప్రదర్శనలతో పర్యాటకులను అలరిస్తారు. వ్యవసాయ ఇతివృత్తాలతో కూడిన జానపద నృత్యాలు ఇక్కడ ప్రధానం. ముఖ్యంగా ‘లామ్ వాంగ్’ అనే నృత్యంలో పాల్గొనేవారు వృత్తాకారంలో లయబద్ధంగా నర్తిస్తారు. వేడుక సందర్భంగా బంధుమిత్రులతో కలిసి విందులు చేసుకుంటారు. ఈ బున్ బాంగ్ ఫై కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా, ఒక అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణగానూ మారింది. టూరిజం అథారిటీ ఆఫ్ థాయ్లాండ్ 1974 నుంచి ఈ వేడుకలకు అండగా నిలుస్తోంది. ఈ మూడురోజుల పండుగ కాలాన్ని ఈశాన్య ప్రాంతంలో సెలవుదినంగా గుర్తిస్తారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమవ్వడానికి ముందు రైతులు జరుపుకునే ఈ వినోదభరిత ఉత్సవం ప్రకృతికి, మానవ సంకల్పానికి మధ్య ఉన్న విడదీయలేని బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. రమా జంబుల(చదవండి: -
ఆవకాయదే అగ్రస్థానం!
వేసవి అంటే ఊరగాయల సీజన్ కూడా! మామిడికాయలతో తయారు చేసే ఆవకాయ, నిమ్మకాయ ఊరగాయ, మిర్చి ఊరగాయ– ఇలా ఎన్ని రకాలు ఉన్నా, ఊరగాయల మార్కెట్లో అగ్రస్థానం మామిడి ఆవకాయకే దక్కుతుంది. మన దేశంలో తయారయ్యే ఊరగాయల్లో దాదాపు మూడోవంతు వాటా ఆవకాయదే! ఉత్పాదన ప్రకారం ఊరగాయల వివరాలు గణాంకాల్లో చూద్దాం...దేశవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న రకరకాల ఊరగాయల ఉత్పాదనలో దాదాపు 70% కుటీర పరిశ్రమల్లా ఇళ్ల వద్ద తయారు చేసిన ఊరగాయలే ఉంటాయి. ఊరగాయల మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తుల వాటా సుమారు 30% మాత్రమే! ఊరగాయల ఉత్పాదనలో రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఊరగాయల ఉత్పాదనలో మొదటి పది స్థానాల్లో ఉన్న రాష్ట్రాల వివరాలు ఇవీ:చేపలు, రొయ్యలు, చికెన్, మటన్ ఊరగాయల ఉత్పత్తి కేరళలలోను, ఈశాన్య రాష్ట్రాల్లోను అత్యధికంగా ఉంటోంది. ఈశాన్య రాష్ట్రాల్లోను, తూర్పు రాష్ట్రాల్లోను వెదురు మొలకలు, తామరతూళ్ల ఊరగాయలు, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో యాపిల్ ఊరగాయ వంటివి ప్రత్యేకంగా తయారు చేస్తారు. (చదవండి: కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!) -
సూపర్ ఎల్ నినో భయం వద్దు.. సిద్ధం కండి!
ప్రపంచానికి ప్రళయ ఘంటికలు వినిపిస్తున్నాయి. ఈ మే నెల నుంచి భూగోళం నిప్పుల కొలిమిలా మారబోతోంది! పసిఫిక్ మహా సముద్రం నుంచి అప్పుడే సంకేతాల అలజడి కూడా మొదలైంది! చరిత్రలోనే ఇది అత్యంత ‘మండే ఎండల’ ఏడాది అవబోతోంది. ఇప్పటి వరకు మనం విన్నది ‘ఎల్ నినో’ అనే మాట మాత్రమే. ఇప్పుడు వింటున్నది ‘సూపర్’ ఎల్ నినో! ఏమైనా కానివ్వండి. భయం వద్దు. సిద్ధం కండి. భద్రంగా ఉండండి.ఈ ఏడాది మే, లేదా జూన్ నెలల నాటికే బలమైన సూపర్ ‘ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించింది . ఈ శతాబ్దంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత వేగంగా పసిఫిక్ మహాసముద్రపు నీరు వేడెక్కుతోందట! పర్యవసానమే సూపర్ ఎల్ నినో అంటున్నారు. అంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరబోతున్నాయి. ‘‘గత వందేళ్లలోనే ఇది అత్యంత బలమైన ఎల్ నినో కావచ్చు. సముద్ర ఉష్ణోగ్రతలు సగటు కంటే 1.5 సెల్సియస్ డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది’’ అని బ్రిటన్ వాతావరణ సంస్థ ‘మెట్ ఆఫీస్’ ప్రకటించింది. ‘‘ఉష్ణోగ్రతలు 2 సెల్సియస్ డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగి, ‘అత్యంత బలమైన’ ఎల్ నినో వచ్చే అవకాశం 25 శాతం వరకూ ఉంది’’ అని అమెరికా సముద్ర వాతావరణ సంస్థ ‘నేషనల్ ఓషియానిక్ అండ్ ఎట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్’ (ఎన్.ఓ.ఎ.ఎ.) హెచ్చరించింది.వ్యక్తిగతంగా శాస్త్రవేత్తలు కూడా ‘భద్రం బీ కేర్ ఫుల్’ అంటున్నారు. ‘‘చాలా వాతావరణ నమూనాలు (క్లైమేట్ మోడల్స్) ఉష్ణోగ్రత పెరుగుదల 2 సెల్సియస్ డిగ్రీల లోపే ఉంటుందని చెబుతున్నప్పటికీ, అది 2 సెల్సియస్ డిగ్రీలను దాటే అవకాశం కూడా ఉండటం అన్నది ఆందోళన కలిగిస్తోంది’’ అని ‘యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్’ సంస్థ సభ్యులు డాక్టర్ మార్క్ అలెస్సీ కలవర పడుతున్నారు. ‘‘గత 140 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైన ‘ఎల్ నినో’ వచ్చే అవకాశం ఈ ఏడాది మే నెలలో ఉంది’’ అని న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ పాల్ రౌండీ అంటున్నారు. ‘ఎల్ నినో’ అంటే తెలిసిందేప్రకృతిలో సహజంగా జరిగే మార్పుల్లో ‘ఎల్ నినో’ ఒకటి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలోని నీరు సాధారణం కంటే ఎక్కువ వేడెక్కినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెద్ద మార్పులు వస్తాయి. కానీ ఇప్పుడొస్తున్నది సూపర్ ఎలన్ నినో అంటున్నారు. అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 2 సెల్సియస్ డిగ్రీల కంటే ఎక్కువ పెరిగినప్పుడు సంభవించే పరిణామం. అయితే శాస్త్రవేత్తలు అధికారికంగా ‘సూపర్’ అనే ఈ పదాన్ని పెద్దగా వాడరు. వాతావరణ నమూనాలన్నీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ‘ఎల్ నినో’ మరింత తీవ్రం కానుంది. అంటే ఈ మే నెల నుంచి రాబోయే రోజుల్లో ప్రపంచం భారీ ఎండలను, ఎండలతో పాటుగా అసాధారణ వాతావరణ మార్పులను, అకాల భారీ వర్షాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎల్ నినో అన్నది లక్షల ఏళ్లుగా ఉన్నదే అయినా, ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తున్న సంకేతాల ప్రకారం ఈ ఏడాది, చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోలలో ఒకటిగా నమోదయ్యే అవకాశం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.వేడి ఎలా పెరుగుతుంది?ఎల్ నినో సమయంలో, పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కిన నీరు అంతటా విస్తరిస్తుంది. దీనివల్ల భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. సముద్రంలోని ఈ వేడి, వాతావరణంలోకి విడుదలయ్యి, కొన్ని నెలల పాటు భూమిని వేడెక్కిస్తుంది. ఈ ఏడాది ఎల్ నినో, సూపర్ ఎల్ నినో అవొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా ఏప్రిల్ నెలలో ఉండే వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తును అంచనా వేయడం కష్టం. ఈ అడ్డంకిని శాస్త్రవేత్తలు ‘ఏప్రిల్ అడ్డంకి’ అంటారు. వాళ్ల పరిభాషలో అది ‘స్ప్రింగ్ ప్రిడిక్టబిలిటీ బారియర్’. అయినప్పటికీ, ఈసారి సూపర్ ఎల్ నినో వస్తుందని శాస్త్ర నిపుణులు గట్టిగానే చెబుతున్నారు.ఎల్ నినో చరిత్రలో 2024వాతావరణ మార్పు, ఎల్ నినో అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఎల్ నినో అనేది వాతావరణ మార్పుల వల్ల ఏర్పడేది కాదు. ఇది ప్రకృతిలో సహజంగా జరిగే ప్రక్రియ. అలాగే గ్రీన్హౌస్ ప్రభావం వల్ల ఎల్ నినో మరింత తీవ్రమవుతుందని చెప్పడానికి కూడా ఇప్పటి వరకు శాస్త్రవేత్తల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవు. వాతావరణ మార్పుల వల్ల భూమి వేడెక్కుతోంది. దీనికి బలమైన ఎల్ నినో కూడా తోడైతే, ఆ అదనపు వేడి కారణంగా ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగిపోతాయి. గ్రీన్హౌస్ వాయువులు, బలమైన ఎల్ నినో కలవడం వల్లే 2024 చరిత్రలోనే అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచింది. ఇక ఇప్పుడు ‘సూపర్’ ఎల్ నినో వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో, ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ వర్షాలు, లేదా కరువు కాటకాలు సంభవించ వచ్చు. ఈ ఏడాదే ఎందుకని?!ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం, ఈ ఏడాది మే, జూన్ నెలల్లో భూమిపై దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, కరీబియన్ దీవులు, యూరప్, ఉత్తర ఆఫ్రికాలో ఈ ప్రభావం కనిపించవచ్చు. దీనివల్ల దక్షిణమెరికా, తూర్పు ఆఫ్రికా ప్రాంతం, మధ్య ఆసియాలో విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంది; ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో తీవ్రమైన కరవు ఏర్పడవచ్చు. ఆగ్నేయ ఆసియా దేశాలలో అడవులు అంటుకుని మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి, నీటి లభ్యత, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. ‘సూపర్’ అనే మాట కొత్తది!పసిఫిక్ మహాసముద్రంలో క్రమబద్ధంగా మారే వాతావరణ మార్పులను ‘ఎల్ నినో సదరన్ ఆసిలేషన్’(ఇ.ఎన్.ఎస్.ఓ.) అని పిలుస్తారు. ఇందులో ప్రధానంగా రెండు దశలు ఉంటాయి. ఒకటి: ‘ఎల్ నినో’ (వేడి దశ), రెండు : ‘లా నినా’ (చల్లని దశ). ఈ దశలు ప్రతి రెండు నుండి ఏడు సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, గాలులు వర్షపాతంలో ఊహించని మార్పులను కలిగిస్తాయి. ఇక, ఇ.ఎన్.ఎస్.ఓ.లోని మూడో దశ ‘తటస్థ స్థితి’. ఎల్ నినో ఈ ఏడాది తీవ్రంగా ఉంటుందని చెప్పటానికే దీనిని ‘సూపర్ ఎల్ నినో’ అని అభివర్ణిస్తున్నారు.ఎల్ నినో : ఈ దశలో పసిఫిక్ మహాసముద్రం; మధ్య, తూర్పు ప్రాంతాల్లో నీటి ఉపరితలం సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతుంది. భూమధ్యరేఖ వెంబడి తూర్పు నుండి పడమరకు వీచే గాలులు బలహీనపడతాయి. కొన్నిసార్లు ఇవి అందుకు భిన్నంగా పడమర నుండి తూర్పుకు వీస్తాయి. ఈ ప్రభావంతో ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోతాయి. కానీ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో వర్షాలు పెరుగుతాయి!లా నినా : ఈ దశలో పసిఫిక్ మహాసముద్రం; మధ్య, తూర్పు ప్రాంతాల్లో నీరు సాధారణం కంటే ఎక్కువగా చల్లబడుతుంది. తూర్పు నుండి వీచే గాలులు మరింత బలంగా మారుతాయి. ఆ ప్రభావంతో ఇండోనేషియాలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, కానీ పసిఫిక్ మహాసముద్ర మధ్య ప్రాంతంలో వర్షాలు తగ్గుతాయి.తటస్థ స్థితి : ఇది ఎల్ నినో గానీ, లా నినా గానీ ఉండని సమయం. ఈ స్థితిలో పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు సాధారణంగా సగటు స్థాయిలోనే ఉంటాయి. ్చపసిఫిక్ మహా సముద్రంలోనే ఎందుకు?నిజానికి ఇతర మహాసముద్రాల్లో కూడా చిన్నపాటి వాతావరణ మార్పులు జరుగుతుంటాయి, కానీ ‘ఎల్ నినో’ అంతటి శక్తిమంతమైన మార్పులు కేవలం పసిఫిక్ మహాసముద్రంలోనే రావడానికి ముఖ్య కారణం ఆ సముద్ర పరిమాణం. ఉదా : అట్లాంటిక్ మహాసముద్రం ఒక నీళ్ల టబ్ లాంటిదైతే, పసిఫిక్ మహాసముద్రం ఒక పెద్ద చెరువు లాంటిది. టబ్లో నీటిని కదిలిస్తే చిన్న అలలు మాత్రమే వస్తాయి, కానీ పెద్ద చెరువులో నీరు కదిలితే అది చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఇక్కడా అంతే. పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ఎంత వెడల్పుగా ఉంటుందంటే, భూమధ్యరేఖ వద్ద ఇది భూమి చుట్టుకొలతలో దాదాపు సగానికి పైగా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం చాలా విశాలంగా ఉండటం వల్ల, దాని తూర్పు ప్రాంతానికి (దక్షిణమెరికా), పశ్చిమ ప్రాంతానికి (ఇండోనేషియా) మధ్య ఉష్ణోగ్రతల్లో భారీ తేడా ఉంటుంది. ఈ భారీ తేడానే ప్రపంచవ్యాప్త గాలులను శాసిస్తుంది. చిన్న సముద్రాల్లో ఉష్ణోగ్రత తేడాలు తక్కువగా ఉంటాయి, కాబట్టి అవి వాతావరణాన్ని అంతగా ప్రభావితం చేయలేవు.‘క్లైమేట్ మోడల్స్’ అంటే?భూమి, సముద్రాలు, భూతలం పైన వాతావరణాలు ఎలా మారుతాయో అంచనా వేసే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్ ప్రోగ్రాములే ‘క్లైమేట్ మోడల్స్. ఇవి గాలి వేగం, ఉష్ణోగ్రత, గ్రీన్హౌస్ వాయువుల వంటి గణిత సమీకరణాలను ఉపయోగించి భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉండబోతుందో ముందే చెబుతాయి. శాస్త్రవేత్తలు వీటిని ఉపయోగించి ఎల్ నినో వంటి మార్పులను లెక్కిస్తారు.‘బాల యేసు’ అని అర్థం!‘ఎల్ నినో’ అనే పదం స్పానిష్ భాష నుండి వచ్చింది, దీని అర్థం ‘బాలుడు‘ లేదా ‘బాల యేసు’ (బేబీ జీసస్). పసిఫిక్ మహాసముద్రంలో ఈ వేడి నీటి ప్రవాహం సాధారణంగా డిసెంబర్ (క్రిస్మస్) సమయంలో కనిపిస్తుంది కాబట్టి, దక్షిణ అమెరికా జాలర్లు దీనికి ఆ పేరు పెట్టారు. దక్షిణ అమెరికాలోని పెరూ దేశపు జాలర్లు వందల ఏళ్ల క్రితమే ఎల్ నినో ఉనికిని కనిపెట్టారు. -
హేమకాంతుడి వైశాఖధర్మం
కృతయుగంలో వంగదేశాన్ని కుశకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడి కుమారుడు హేమకాంతుడు. ఒకనాడు హేమకాంతుడు కొందరు భటులను వెంటబెట్టుకుని, వేట కోసం అడవికి వెళ్లాడు. అది వైశాఖమాసం. హేమకాంతుడు అడవిలో అనేక మృగాలను వేటాడాడు. మధ్యాహ్నవేళ ఎండ నడినెత్తికి వచ్చేసరికి అతడు బాగా అలసిపోయాడు. విశ్రాంతికి తగిన చోటు కోసం వెదుకులాడుతూ, అడవిలోనే ఉన్న మునుల ఆశ్రమ ప్రదేశానికి చేరుకున్నాడు.అక్కడ ఉండేవారు శతర్చినులు అనే మునులు. వారు అతిథి సత్కారాల వంటి విప్రకృత్యాలను ఎరుగరు. వారెరిగిన కర్మ తపశ్చర్య మాత్రమే! హేమకాంతుడు ఆ ఆశ్రమ ప్రదేశంలో అడుగుపెట్టే వేళకు శతర్చినులు తపస్సమాధిలో ఉన్నారు. బాహ్యస్పృహను మరచి సమాధి స్థితిలో ఉన్న వారికి హేమకాంతుడి ఆగమనం తెలియలేదు. హేమకాంతుడు సమీపానికి వచ్చినా, వారు అతడి రాకను గుర్తించలేదు. రాజైన తనను మునులు పట్టించుకోనందున హేమకాంతుడు ఆగ్రహం చెందాడు. వారిని చంపాలని నిశ్చయించుకుని, వారిపైకి కత్తి దూశాడు. హేమకాంతుడి దూకుడు గమనించిన శతర్చినుల శిష్యులు అక్కడకు పరుగు పరుగున వచ్చారు. ‘‘ఓరీ దురాత్ముడా! మా గురువులైన శతర్చినులు తపస్సమాధిలో ఉన్నారు. బాహ్యస్పృహలో లేని వారిపైకి కత్తి దూయడం తగని పని. మునులను వధించబూనడం మహాపాతకం, పాపాత్ముడా!’’ అని పలికారు.ముని శిష్యుల మాటలకు హేమకాంతుడు ‘‘విప్రులారా! నేను వేట కోసం ఈ అడవిలోకి వచ్చాను. వేటలో అలసిపోయి, ఇక్కడకు చేరుకున్నాను. మీ గురువులకు వీలు లేకపోతే, మీరైనా నాకు భోజనం పెట్టండి’’ అన్నాడు.‘‘రాజా! మేము గురువులు పెట్టిన భిక్ష తిని బతుకుతున్నాము. వారి అనుమతి లేకుండా ఏ పనీ చేయలేము. వారి ఆజ్ఞ లేనిదే నీకు అతిథి సత్కారాలు చేయడం మాకు కుదరని పని’’ అని పలికారు ముని శిష్యులు. వారి మాటలకు హేమకాంతుడు మండిపడ్డాడు. వారి చంపడానికి విల్లు సంధించాడు. ‘‘దుర్మార్గమైన దొంగలు, క్రూరమృగాలు లేకుండా ఈ అరణ్యాన్ని చక్కదిద్దాను. మీకు భయం లేకుండా చేశాను. మీరు మా వలన అగ్రహారాది సత్కారాలను, ఉపకారాలను పొందారు. ఈ మునులు చేసిన మేలు మరచి, నేను ఇక్కడకు వచ్చినా, నా వంక చూడటం లేదు. ఆకలి దప్పులతో అలసి సొలసి వచ్చిన నాకు అన్నం పెట్టడానికి మీరు వెనుకాడుతున్నారు. మీలాంటి క్రూరులను సంహరించినా పాపం ఉండదు’’ అని పలికి, బాణం విడిచాడు.హేమకాంతుడు ఆగ్రహంతో బాణం సంధించేసరికే ముని శిష్యులు భయభ్రాంతులై అడవిలోకి పారిపోయారు. కోపం చల్లారని హేమకాంతుడు వారిని వెంబడించి, వారిపై బాణ ప్రయోగం చేశాడు. అతడి బాణాలకు మూడువందల మంది శిష్యులు మరణించారు. మిగిలిన వారు పారిపోయారు.ఈ కలకలం సద్దుమణిగాక, హేమకాంతుడి ఆజ్ఞపై రాజభటులు ఆశ్రమాల్లోకి చొరబడి, దొరికిన వంట పదార్థాలను తీసుకొచ్చారు. అందరూ వాటిని ఆరగించాక, కాసేపు విశ్రమించి, సాయంత్రం ఇంటికి బయలుదేరారు.అడవిలో తన కొడుకు హేమకాంతుడు చేసిన దుష్కార్యం తెలుసుకుని, కుశకేతుడు దుఃఖించాడు. కొడుకును నిందించాడు. ‘‘నీవంటి దుర్మార్గుడు రాజ్యపాలనకు తగడు’’ అని పలికి అతడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు.తండ్రి ఆజ్ఞతో హేమకాంతుడు ఇల్లు వదిలి, కీకారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ అతడు బ్రహ్మహత్యా పాతకంతో బాధపడుతూ కిరాతునిలా దొరికిన పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసం తింటూ జీవించసాగాడు. హేమకాంతుడు అలా ఇరవై ఎనిమిదేళ్లు ఆ అరణ్యంలోనే గడిపాడు. ఒక వైశాఖ దినాన త్రితుడు అనే ముని తీర్థయాత్రలకు బయలుదేరి ఆ అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ, మధ్యాహ్న వేళ ఎండ వేడికి తాళలేక మూర్ఛపోయాడు. అదృష్టవశాత్తు హేమకాంతుడు మూర్ఛిల్లిన మునిని గమనించి, అతడికి మోదుగు ఆకుల గొడుగు నీడ కల్పించి, శైత్యోపచారాలు చేశాడు. ముని స్పృహలోకి వచ్చాక అతడికి సొరకాయ బుర్రలో ఉన్న నీరు ఇచ్చి, దప్పిక తీర్చాడు. మార్గాయాసంతో మూర్ఛిల్లిన మునికి శైత్యోపచారాలు చేయడం వల్ల హేమకాంతుడి బ్రహ్మహత్యా పాతకం నశించింది. అతడి మనసు నిర్మలమైంది. అప్పటి నుంచి అతడు సదా శ్రీహరిని స్మరించసాగాడు. కొంతకాలానికి హేమకాంతుడు వ్యాధిగ్రస్థుడై మరణించాడు. అతడిని తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. అదే సమయంలో విష్ణుదూతలు వచ్చి, యమదూతలను అడ్డుకున్నారు. హేమకాంతుడు వైశాఖ ధర్మాలను నెరవేర్చాడని, అందువల్ల అతడి పాపాలన్నీ నశించాయని, అతడిని వైకుంఠానికి తీసుకు రమ్మని శ్రీహరి ఆజ్ఞ అని చెప్పి, యమదూతలను తరిమేశారు. విష్ణుదూతలతో కలసి హేమకాంతుడు వైకుంఠానికి చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
క్లూషియల్: అతడే హంతకుడు
ఒక్కసారిగా ఆ ప్రాంతం పోలీస్ సైరన్లతో నిండిపోయింది.కరుడుగట్టిన నేరస్థుడు, రెండు రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చిన రాకీ సెవెన్హిల్స్ బస్టాప్ దగ్గర హత్యకు గురయ్యాడు. అతడి గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది కూడా అదే! ఇన్స్పెక్టర్ అభిమన్యు దర్యాప్తులో ముందుగా రాకీ క్రిమినల్ హిస్టరీ చూశాడు. అతను చేయని నేరం లేదు, పాల్పడని ఘోరం లేదు. గంజాయి అమ్మకం నుంచి ఆడపిల్లల్ని వేధించడం వరకు అతని మీద చాలా కేసులు ఉన్నాయి.రాకీ చనిపోవడానికి మూడు గంటల ముందు ఒక అమ్మాయిని వెంటపడి ఏడిపించాడు. ఆమె చెప్పు తీసి అతడిని బెదిరించింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రాత్రి తొమ్మిది గంటలకు ఈ గొడవ జరిగింది. అప్పుడే పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ రావడం చూసి, రాకీ అక్కడి నుంచి తప్పుకున్నాడు.ఇది జరిగిన మూడు గంటల తర్వాత పోలీస్ స్టేషన్కు ఫోన్ వచ్చింది. సెవన్హిల్స్ బస్టాప్ దగ్గర రాకీ శవం పడి ఉందని ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్లో చెప్పాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.ఇన్స్పెక్టర్ అభిమన్యు అక్కడ గుమిగూడిన జనాన్ని జరిగిన హత్య గురించి అడిగాడు. వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. ఒక వ్యక్తి మాత్రం ముందుకు వచ్చాడు. రాకీని రాజీవి అనే అమ్మాయి బెదిరించిందని, తాను అప్పుడు అక్కడే ఉన్నానని చెప్పాడు. ఆ సంఘటనను తన ఫోన్లో చిత్రించినట్టు చెప్పి, తన ఫోన్ ఇచ్చాడు. అందులో రాజీవి అనే అమ్మాయి ‘నిన్ను చంపేస్తాను’ అని రాకీని బెదిరించడం స్పష్టంగా ఉంది. మరో గంటలో రాజీవి ఇంటి ముందున్నాడు అభిమన్యు. తాను కోపంతో అతడిని చంపేస్తానని బెదిరించిన మాట నిజమే అని, ఆ తర్వాత భయంతో ఇంటికి వచ్చేశానని రాజీవి చెప్పింది.ఒక మామూలు అమ్మాయి ఒక్కతే అంత దృఢంగా ఉండే రాకీని చంపగలదా?రాకీ ఒంటిపై ఉన్న గాయాలు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చేసినట్లుగా ఉన్నాయి.అభిమన్యు రాకీ ఫోన్ రికార్డులను పరిశీలించాడు. చనిపోవడానికి ముందు రాకీకి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించాడు.‘‘నీ పేరేంటి?’’ అడిగాడు అభిమన్యు అతడిని.రాకీని రాజీవి బెదిరించిన వీడియో తీసింది అతనే!‘‘రాజు...’’ తడబడుతూ చెప్పాడు అతడు.‘‘నీ అసలు పేరు చెప్పు వేలాయుధం’’ అన్నాడు అభిమన్యు. ఉలిక్కిపడిన ఆ వ్యక్తి కంగారుగా లేవబోయాడు.‘‘ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. నువ్వూ రాకీ తోడు దొంగలు. చెన్నైలో మీ పరిచయం. అతడు ఇక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. నువ్వు తప్పించుకున్నావు. మీ ఇద్దరి మధ్య డబ్బు గొడవలు ఉన్నాయి. బెయిల్ మీద విడుదలైన రాకీని చంపాలని నీ ప్లాన్. రాజీవితో రాకీకి జరిగిన గొడవ నీకు కలిసొచ్చింది. రాజీవిని దోషిగా నిలబెట్టి నువ్వు ఎస్కేప్ అవ్వాలనుకున్నావు. ఆ ప్రయత్నంలో నీ రెండో సిమ్తో పోలీసులకు ఫోన్ చేశావు. మొదటి సిమ్తో వీడియో తీశావు.రాకీకి ఫోన్ చేసి సెవెన్ హిల్స్ బస్టాప్ వెనుక వైపు రమ్మన్నావు. అక్కడ సీసీ కెమెరాలు లేవన్నది నిజమే. కానీ కాస్త దూరంలో నిర్మాణంలో వున్న ఒక భవన యజమాని సీసీ కెమెరాలు పెట్టించాడు. ఆ సీసీ కెమెరాల్లో నిర్మాణంలో వున్న భవనంలోకి నువ్వెళ్ళడం రికార్డు అయ్యింది. నీ క్రిమినల్ రికార్డు బయట పడింది. నువ్వు ఇందాక ఫోన్ ఇచ్చినప్పుడు ఫోన్ మీద నీ ఫింగర్ ప్రింట్స్, రాకీ ఒంటి మీద వున్న గుర్తులతో మ్యాచ్ అయ్యాయి. శిక్షకు సిద్ధంగా వుండు...’’ అన్నాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.వేలాయుధాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.‘‘థాంక్యూ సర్! నన్ను సేవ్ చేశారు...’’ రాజీవి కృతజ్ఞతగా అంది.‘‘నేను న్యాయం చేశాను. నీ ధైర్యమే కరెక్ట్. కానీ వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఈ ఇబ్బంది ఉండేది కాదు’’ అంటూ ముందుకు కదిలాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. - శ్రీసుధామయి -
లిట్వరల్డ్: పేరు ‘జింకపిల్ల’, బెబ్బులి కూనయా...
సంగీత సారస్వతాలను చదువులతల్లి స్తన్యంతో పోల్చాడు మహాకవి కాళిదాసు. సంగీతం ఆపాతమధురంగానూ, సాహిత్యం ఆలోచనామృతంగానూ వుంటాయని కూడా ‘కవికులగురువు’ అన్నాడట. సంస్కృతం చదువుకోకపోయినా ఆ విషయం తెలిసిన ఇరవయ్యొకటో శతాబ్ది రచయిత్రి ఒకరున్నారు– ఆమె పేరు ఎల్ఫ్రైడ్ జెలెనిక్. ఆమె సాహిత్యం చదువుతుంటే శ్రావ్యంగా వుంటుందనేది అందరి అనుభవం; దాని గురించి ఆలోచించే కొద్దీ, మన సామాజిక జీవనం గురించిన ఆలోచన పదునెక్కుతూ పోతుందనేది మాత్రం కొందరి అనుభవమే! నవలా రచన– రూపక ప్రక్రియల్లో అందెవేసిన చెయ్యి అనిపించుకున్న ఎల్ఫ్రైడ్ జెలెనిక్ది ఆస్ట్రియా. 2004 నోబెల్ సాహిత్య పురస్కారం ఎల్ఫ్రైడ్ గెల్చుకున్నట్టు ప్రకటిస్తూ ఎంపిక సంఘం చేసిన ‘అధికారిక ప్రకటన’లో రచయిత్రి శైలికి జేజేలు పలుకుతూ ఇలా అన్నారు: ‘ఆమె నవలలూ, రూపకాల్లో సంగీతబద్ధమైన స్వరాలూ, అనుస్వరాలూ అసాధారణమైన భాషాభినివేశంతో జాలువారతాయి. జనం నెత్తిన లోకం రుద్దిన అరిగిపోయిన మూసకట్టు పదబంధాల అసంబద్ధతనూ, వాటి పెత్తందారీ పోకడలనూ ఎల్ఫ్రైడ్ శైలి బట్టబయలు చేస్తుంది!’– ఓ మూసకట్టు పదబంధాన్నే ఉపయోగించదలిస్తే, ‘ఈ మాటల్లో ఆవగింజంతైనా అతిశయోక్తి లేదూ’ అనొచ్చు. బాల్యం నుంచే, అరడజను సంగీతవాద్యాల్లో సుశిక్షితురాలైనందువల్లనే ఎల్ఫ్రైడ్ శైలి అంత శ్రావ్యతను ఆపాదించుకున్న దేమో! వియెన్నా సంగీత విశ్వవిద్యాలయం నుంచి –పిన్న వయసులోనే– ఆర్గనిస్టుగా పట్టా పొందారామె. ఆర్గన్తో పాటు పియానో, వయోలిన్, వయోలా, గిటార్, రికార్డర్ తదితర వాద్యాల్లో కూడా ఆమె ప్రవీణురాలు. పట్టా పొందిన కొద్ది రోజులకే, కుటుంబసంబంధాల కారణంగా ఎల్ఫ్రైడ్ తీవ్రమైన మానసిక ఆందోళన పాలబడ్డారు. చిత్తశాంతి కోసం తడుముకునే క్రమంలోనే ఆమె ఇరవయ్యేళ్ళ ప్రాయంలో కలంపట్టారు. మరుసటి సంవత్సరమే, తన తొలి కవితా సంకలనం ‘లిజా నీడ’తోనే ఎల్ఫ్రైడ్ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. నాటినుంచి నేటివరకూ, ఆమె సాహిత్యప్రస్థానం ఎదురులేకుండా సాగుతూనేవుంది.ఎల్ఫ్రైడ్ అంటే, చెక్ భాషలో ‘ప్రశాంతపాలిక’ అని అర్థమట! ఇక జెలెనిక్ అంటే, ‘జింకపిల్ల’ అని అర్థమట! బహుశా అందుకే కొందరు విమర్శకులు ఆమెని ‘ప్రశాంత హరిణం’ అనడం కద్దు. కానీ తొలి రచన మొదలుకొని నోబెల్ పురస్కారం అందుకున్న ఇరవయ్యేళ్ళకు –2024లో– రాసిన ఆత్మకథాత్మక నవల ‘వ్యక్తిగత వివరాలు’ వరకూ ఎక్కడా ఆమె ప్రశాంత హరిణంలా కనిపించదు. (ఈ రచనకు ప్రామాణిక ఇంగ్లిష్ అనువాదం ఇంతవరకూ వెలువడనే లేదు!) ‘అది ఓ కృతో, ఓ కీర్తనో కావచ్చు– లేదా, ఓ కథో కథానికో కావచ్చు అనునిత్యం ఓ కళాఖండం జీవం కోల్పోతూనే వుంటుంది. చరిత్రలో దాని చెలామణీ చెల్లిపోవడం వల్లనే అలా జరుగుతూ వుంటుంది. ఒకప్పుడు మరణమెరుగని కళాఖండాలుగా భావించిన రచనలే కాలక్రమంలో కనుమరుగైపోవచ్చు. వాటి గురించి భవిష్యత్ తరాలవారికి ఏమీ తెలియకుండానూ పోవచ్చు. అయినప్పటికీ, ప్రతి ఒక్క కళాఖండానికీ నాలుగు కాలాల పాటు బతికిబట్టకట్టే హక్కు ఉంది!’ అని ఎరికా కోహుట్తో అనిపిస్తారు ఎల్ఫ్రైడ్ ‘ద పియానో టీచర్’ నవలలో. (ఆ నవలకు ప్రధాన పాత్ర ఎరికాయే. 28 సంవత్సరాల తర్వాత మైకేల్ హానెక్ ఈ నవలను సినిమాగా తీశారు!) వియెన్నా సంగీత విశ్వవిద్యాలయంలో పియానో శిక్షణ విభాగంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకున్న ప్రొఫెసర్ ఎరికా. ఆమె అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న కళాకారిణి; మంచి శిక్షకురాలు కూడా! అయితే చండశాసనురాలి లాంటి తల్లి పెంపకంలో ఆమె ప్రతిభ రెక్కలు ముడుచుకుని బతుకీడుస్తూ వుంటుంది. వృత్తిజీవితం విషయానికివస్తే ఎరికా విద్యార్థులతో కటువుగా వ్యవహరించే శిక్షకురాలన్నట్లు రచయిత్రి చిత్రించారు. తన విద్యార్థులు అత్యున్నత ప్రమాణాలు సాధించాలనే ఆమె అలా ప్రవర్తిస్తూ వుంటుంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం, తల్లి పెట్టే ఆరళ్ళ కారణంగా ఎరికా చిత్తక్షోభకు గురవుతూ వుంటుంది. ఈ వైరుధ్యాన్ని ఎరికా ఎలా పరిష్కరించుకున్నదనేదే ఈ నవల్లో కథాంశం. ప్రొఫెసర్ ఎరికాకూ, యువ విద్యార్థి వాల్టర్ క్లెమర్కూ మధ్య అల్లుకున్న అనుబంధం ఆసరాతోనే ఆమె తన జీవన వైరుధ్యం పరిష్కరించుకున్నట్లు రాశారు ఎల్ఫ్రైడ్.ఈ వైరుధ్యం ఎరికాకే పరిమితమైంది కాదు– ఎల్ఫ్రైడ్ జీవితంలోనూ ఆమె ఇలాంటి వైరుధ్యం ఎదుర్కొన్న విషయం రచయిత్రే వెల్లడించారు. ఎరికా పాత్రకు రక్తమాంసాలతో పాటు ఆత్మను సైతం సమకూర్చడానికి ఈ ‘ఆత్మానుభవం’ రచయిత్రికి ఎంతో తోడ్పడి వుంటుంది. పైపైన చూస్తే ఇది చవకబారు ‘శృంగార నవల’గా అనిపించవచ్చు. సాహిత్యం ఆలోచనామృతమనే వాస్తవాన్ని మనసులో పెట్టుకుని చూసేవారికే, ఎల్ఫ్రైడ్ జెలెనిక్ దృష్టికోణంలోని విశిష్టత కనిపిస్తుంది.- మందలపర్తి కిషోర్ -
దేనినీ అతి చేయవద్దు
‘ఈ రోజుల్లో పిల్లలను అన్ని విషయాల్లోనూ అదే పనిగా పట్టుకొని ఉండటం వల్ల వారి ఎదుగుదలలో సమస్యలు వస్తున్నాయి’ అంటున్నారు సినీ దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్. ‘‘అమ్మను భూమాతతో పోల్చుతాం. భూమి ఎక్కడా ఆగిపోకుండా, తిరుగుతూనే ఉంటుంది. కానీ, పిల్లలమైన మనల్ని పడిపోకుండా నిలబెడుతుంది. అమ్మ కూడా అంతే. పిల్లలు వారి జీవితంలో నిలదొక్కుకోవడానికి తిరుగుతూనే ఉండాలి. కానీ, అతిగా పట్టుకోకూడదనేది నా ఆలోచన.ఆ(హా)ర్ట్ ఫుల్గా!నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారు నన్ను ఆర్ట్స్ నేర్చుకోమని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్ నేర్చుకున్నాను. ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ బుక్స్ చదివేదాన్ని. వేవిళ్లతో ఉన్నప్పుడు అవి నేర్చుకోవడం కష్టమనిపించేది. కానీ, తప్పేది కాదు. బాబు పుట్టాక వాడి కోసం మా ఆయన కేరింగ్ మరింత ఎక్కువయ్యింది. ‘ఇంత పొసెసివ్గా ఉండటం ఎందుకు?’ అనేదానిని. మా బంధువుల్లో కూడా చాలా మంది అంటుండేవారు. కానీ, ఆయన పట్టించుకునేవారు కాదు. నేను అది పొసెసివ్నెస్ అనుకున్నాను. అలాంటిది 6వ తరగతిలో ఉన్న బాబును స్టేట్ ఆర్ట్ కాంపిటీషన్కు మైసూరుకు ఒక్కణ్ణే పంపించారు. ఆ సమయంలో నేను భయపడ్డాను చిన్నపిల్లాడు కదా అని. కానీ, తను వినలేదు. తరుణ్ ఆ కాంపిటిషన్లో పాల్గొన్నాడు, ప్రైజ్ కూడా తీసుకొచ్చాడు. బాబు కోసం ఫుల్టైమ్ జాబ్ వద్దనుకున్నాను. దీనికి కూడా మావారే కారణం. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లినే ముందుగా వెతుక్కుంటారు. వారు ఒక దశకు వచ్చేవరకు తల్లితో ఉన్న అటాచ్మెంట్ దూరం అవకూడదు అనేవారు. దీంతో ఆర్ట్ టీచర్గా ఫుల్టైమ్ జాబ్ చేసే నేను పార్ట్ టైమ్కి షిఫ్ట్ అయ్యాను.ఈజీ ఫీలింగ్ వద్దుడబ్బులు పొదుపు, సంపాదన గురించి ఎప్పుడూ చెప్పలేదు. అలాగని, ఎప్పుడూ కండిషన్స్ పెట్టలేదు. ప్రతి తల్లీతండ్రీ సాధ్యమైనంత వరకు పిల్లల అవసరాలు తీర్చడానికే ప్రయత్నం చేస్తారు. మేం ఆర్థికంగా కష్టపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ, అవేవీ బాబుకు చెప్పలేదు. కానీ, నన్ను డబ్బులు అడిగితే మాత్రం నేరుగా ఇచ్చేదాన్ని కాదు. మావారికి డబ్బులు ఇచ్చి, ఆయననే ఇవ్వమనేదానిని. ‘అమ్మ సంపాదిస్తుంది. నేను అడిగితే ఈజీగా ఇచ్చేస్తుంది’ అనే ఫీలింగ్ బాబులో రాకూడదనుకున్నాను. డబ్బు గురించి కాదు ఆనందించే సందర్భాలు కోల్పోకూడదు అని తాపత్రయపడేదాన్ని. ఎందుకంటే మళ్లీ ఆ రోజులు, ఆ సందర్భాలు తిరిగి రావు.కథలా చెప్పాలినాకు ప్రతీదానితో కనెక్ట్ చేసి కథలు చెప్పడం అలవాటు. అలాగే సోలార్ ఎనర్జీతో మనకున్న బంధం, మన శరీరంలో ఉన్న అవయవాలతో బంధం ఎలా ఉంటుందో చెప్పేదాన్ని. నాన్న దేవాలయం, అమ్మ అందులో దేవత, బ్రదర్ పూజారి, ప్రసాదం అందరం కలిసి తినేది.. ఇలా ఒక కథలా చెబితే పిల్లలు ఆనందంగా వింటారు, ఆలోచిస్తారు. ఆ కుటుంబ బంధం కూడా బాగుంటుంది. పిల్లల ముందు బంధువుల్లో ఎవరి గురించీ చెడుగా చెప్పకూడదు.సరి చేయాలనుకోకూడదుపిల్లల మెదళ్లలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. పెయింటింగ్లో అయినా, ఏ సృజనాత్మక పనులు అయినా వారు చేసింది మనం సరిచేయవద్దు అనేది నా ఆలోచన. వారి మైండ్లో ఏముందో అది మన ముందు పెడతారు. దానిలో మనం కల్పించుకోవద్దు. మా అబ్బాయి ఎక్కడా పెయింటింగ్ నేర్చుకోలేదు. కానీ, పోర్ట్రయిట్స్ చాలా బాగా వేస్తాడు. తబలా వాయిస్తాడు. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లో కాలేజీ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి. నేను ఆర్ట్ టీచర్ని. కానీ, ఏదీ బాబు చేయిపట్టి నేర్పలేదు. కాలేజీ రోజుల్లోనే షార్ట్ ఫిల్మ్లు ప్లాన్ చేస్తుండేవాడు. అందుకు వాడి స్నేహితులు కూడా ఇంటికి వచ్చేవారు. వారందరికీ కావల్సినవి అమర్చిపెట్టేదాన్ని. తరుణ్ స్నేహితులు నాకు కూడా పిల్లలైపోయారు. ఇప్పటికీ వారందరితో స్నేహబంధం బాగుంటుంది.ఏ కాలానికి ఆ కాలంలో పిల్లల పెంపకంలో వివక్ష ఉంది. ఒత్తిడి ఉంది. ‘ఎక్కడికి వెళ్లావు, ఏం చేస్తున్నావు, అదెందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు ఉన్నావు... ’ అంటూ పదే పదే అంటూనే ఉంటారు. అయితే, పిల్లలకు కూడా బాధ్యత తెలుసు. ఎలా ఉండాలో తెలుసు. మనం ఒక ఫ్రెండ్లా గైడ్ చేయాలి. అంతవరకే మన విధి. అంతకు మించి ఎక్కువ పట్టుకోకూడదు’’ అని తెలిపారు. ∙నిర్మలారెడ్డి -
పీఛే చల్! ఇలా నడిచి చూశారా?
వాకింగ్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. కానీ అదే వాకింగ్ను వెనక్కి చేస్తే డబుల్ ఆరోగ్యం లభిస్తుందంటే నమ్మగలరా? నిజమే! ఫిట్నెస్ ప్రపంచంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ – ‘రెట్రో వాకింగ్’ బాగా పాపులర్ అవుతోంది. నిపుణుల ప్రకారం, ఇది సాధారణ వాకింగ్ కంటే మరింత ప్రయోజనాలు ఇచ్చే వ్యాయామం. ఇలా వెనక్కి నడిస్తే మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ముందుకు నడిచేటప్పుడు ఎక్కువగా పని చేయని కాళ్ల కండరాలు కూడా వెనక్కి నడిచేటప్పుడు యాక్షన్లోకి దిగుతాయి. సాధారణ వేగంతో నడిచినా దాదాపు ‘నలభై శాతం ఎక్కువ క్యాలరీలు’ కరిగిపోతాయి. అంటే తక్కువ టైమ్లో ఎక్కువ పని చేసినట్టే! ఇంకా మెదడు సంగతి చెప్పాలంటే, వెనక్కి నడవడం కొత్త పని కాబట్టి అది ఫుల్ అలర్ట్లోకి వెళ్లి బ్యాలెన్స్, ఫోకస్, జ్ఞాపకశక్తి అన్నింటినీ మరింత పదును పెడుతుంది. కొందరికి వెన్నునొప్పి, కాళ్లు బిగపట్టడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఒక విషయం మాత్రం తప్పక గుర్తుంచుకోండి. మొదట రెండు నుంచి మూడు నిమిషాలు నెమ్మదిగా, ఖాళీ ప్రదేశంలో మాత్రమే ప్రయత్నించండి. లేదంటే వ్యాయామం కంటే ముందు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది! ∙ -
ఈ వారం కథ: కొత్త రంగుల పొద్దు
‘‘ఆహా... జిల్లా అయిపోవడంకాదు గాని, ఏందసి పట్టింది ఈ ఏరియాకి! ఒకప్పుడు దెయ్యాలు తిరిగే సోటిది. నా సిన్నపుడు సేపలు పడ్డానికి కూడా ఇటైపు రావడానికే బయమేస్సీది..’’ నిర్మానుష్యంగా కంకరరోడ్లతో అక్కడక్కడా వేసిన కరెంటు స్తంభాల్ని, కట్టిన భవంతుల్ని చూస్తూ అన్నాడు మరియదాసు.‘‘ఎద్దెప్పుడు ఒకేపక్క తొంగోదు. ఊరెప్పుడూ ఒకేలాగ ఉండిపోదు సిన్నాన్న. ఆటో వచ్చీసింది. పద... పద... సామాన్లు దించిద్దుము.’’ దూరంగా నిల్చున్న ఇద్దరిలో ఒకడైన కృపారావు నడుస్తూ అన్నాడు. రంగులు వేయని భారీ మట్టివిగ్రహంలా బూడిద రంగులో వారివెనుకే అంతెత్తున కనిపిస్తోంది కొత్త ఇల్లు.ఆటోలో నుంచి బకెట్లు, బ్లేడ్లు, పుట్టిబస్తాలు, కేరేజీలు కిందకి దించి; లోపల వాటిని జాగ్రత్తగా భద్రపరచారు. విశాలమైన రూములు, కిచెన్, వెయిటింగ్ హాల్, ఔటర్ బాత్రూమ్, లావెట్రీలతో చుట్టూ కాంపౌండ్ వాల్తో ఇల్లు ముచ్చటగా వుంది. నడివేసవి. ఉదయం పదిగంటల సమయం. బహిరంగప్రదేశం అయినప్పటికీ వాతావరణంలో ఉక్కపోత. ముందు రూమ్లో ముగ్గురూ వరసలో నిలబడి అర్ధనిమీలిత నేత్రాలతో, భక్తిప్రపత్తులతో చేతులు జోడించి నోరు విప్పారు.‘‘ఆదియునూ అంతమునూ అయిన యేసయ్యా... లోకంలో సర్వశక్తిమంతుడైన ప్రభువా... మేము ఈరోజు నుంచి తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమగునటుల...’’ దైవప్రార్ధన ముగిసింది. ఒంటిమీద షర్టుల్ని, ఫాంటుల్ని విప్పి ఒక దగ్గర ఒబ్బిడిగా ఉంచి, షార్ట్లు, బనియన్లు వేసుకున్నారు.పెద్దబ్లేడ్లతో గోడల్ని గీకే పనిని కృపారావు, ఎర్రయ్య మొదలుపెట్టారు. బకెట్లో మెషిన్ ఆన్ చేసి పుట్టి పౌడర్ను నీటితో కలియబెట్టే పనిలో పడ్డాడు దాసు.‘‘సిన్నాన్న... మనలో మన మాట. ఇల్లు సూస్తే పెద్దది. పని చేస్తే ఎక్కువే. ఓనరు ఇచ్చిన లచ్చాఏభైవేల వర్కులో మన కూల్లు పోగా మనకేటైనా మిగుల్తాదా?’’ తొలి ప్రశ్న వేసేడు పాతికేళ్ల కృపారావు.‘‘నీకా డవుటేల? అందిన కూల్లే మనకు గట్టి.’’ బ్లేడ్లకు సర్దిన పుట్టిముద్దను గోడకు రాస్తూ అన్నాడు దాసు.‘‘మరి ఇంతోటి పనిని కాంట్రక్టుకి సెయ్యడమేల?’’‘‘సెయ్యక ఏటి సేస్తామురా? మనుషులెట్టి, లచ్చలకు లచ్చలు మదుపులెట్టి కాంట్రాక్టు పనులు సేస్తూ బొక్లీసుగా తిరగడానికి మనకాడ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులున్నాయేటి? కూలాడితేనే గదా కుండాడతాది...’’‘‘అవునులే సిన్నన్నా.’’‘‘అందికే అన్నీ మూసుకొని మన పని మనం కామ్గా సేసుకోవాల. ఇలాంటి పనులు సెయ్యమని నిగడదీసి తొంగుంటే నష్టం మనకే, ఆలకి కాదు. కూడు జల్లితే కాకులు కరువా! ఇరవైరోజుల్లోన ఈ వర్క్ అయిపోవాలట. అద్దమైందా...’’ దాసు మాటకి బుద్ధిగా తలూపేడు కృపారావు‘‘షాపు ఓనర్ల పనే బాగుందన్నా. ఒక పక్క ఏపారాలు, మరోపక్క లాభాలు...’’ నవ్వాడు ఎర్రయ్య.‘‘షాపు ఓనరుకి మనతోన అగ్రిమెంట్ లక్షాఏభై. ఇంటి ఓనరుతో ఎంతకి వప్పన్నమో మనకి తెలీదు. అయినా అతనెంత తింటే మనకెందుకు? మన పని మనం సూస్కోవాలి గానీ...’’మొదటి రూమ్ పుట్టిపని పూర్తయ్యింది. రెండో రూమ్ కోసం సిద్ధమవుతున్నాడు దాసు.ఇంతలో టీలు వచ్చాయి. ముగ్గురూ టీలు తాగి విశ్రాంతిగా కూర్చున్నారు. నోట్లో ఒంపుకున్న ఖైనీలు పళ్లకింద నలుగుతున్నాయి.మధ్యాహ్నం రెండింటికి అన్నాలు తిని పని ముగించేసరికి చీకటి పడింది. ఇరవైయ్యో రోజున ఇంటి ఓనరు వచ్చాడు. మార్పు చేర్పులేవో చెప్పాడు. దానికో రోజు పట్టింది. తర్వాత రోజు సాయంత్రం.., గంగరాజు షాపు దగ్గరికి ముగ్గురూ చేరేరు. అంతవరకూ ఇచ్చిన మెటీరియల్ మొదలుకొని ఆటోచార్జీలు, నిచ్చెనల అద్దె వరకూ అయిన ఖర్చులన్నీ లెక్కలేసి చివరకు లక్షాఏభై మూడువేలుకు బిల్లు తేల్చాడు షాపు ఓనరు. అదనంగా తనకు మూడు వేలు ఖర్చయ్యిందని కనుక చివరిరోజు కూలీ రాదని దాసుతో చావుకబురు చివరికి చల్లగా చెప్పాడు. అవాక్కయ్యాడు దాసు. కృపారావుకి ఒళ్ళు మండింది.‘‘ఇదన్నేయం... కూలీ ఇవ్వననడం మీకు దరమ్ము కాదు.’’ బతిమాలుతున్న ధోరణిలో ఆక్రోశించాడు దాసు. పక్కనున్న గొడౌన్లోకి వెళ్లేందుకుగాను కిందకు దిగిన గంగరాజు సన్నగా నవ్వి అన్నాడు..‘‘చివరిరోజు కూలీ నీక్కావాలి. మంచిదే. కాదనను. కానీ అనుకున్న దానికంటే మూడు వేలు ఎక్కువయ్యింది. మరి దాని మాటేటి? ఇరవై రోజుల్లో పనవ్వాలని కండిషను. అయ్యిందేటి? ముందే కంప్లీట్ చేసేస్తే కాదంటానా? మిగిల్తే తీసుకోవడానికి రడీగా ఉన్నప్పుడు తగిలినప్పుడు కూడా భరించాలోయ్.రోజంతా పన్చేసి వట్టిసేతుల్తో ఇంటికి తిరిగి ఎలాగెల్లమంటారు సర్..’’ అన్నాడు కృపారావు.‘‘సరే. మీ కూలీ మీకిచ్చేస్తాను. కానీ నాకో పని చెయ్యాలి.’’‘‘ఏటి సార్ అది?’’‘‘పుట్టిబస్తాలు, రంగుడబ్బాల లోడు రేపొస్తది. మనషాపు ముందే వేను ఆపుతాడు. మీ ముగ్గురూ ఉదయం ఏడింటికల్లా వచ్చి పెరిగీయండి. చాలు... ఎంత... రెండు గంటల పని. మీ డబ్బులు మీకిచ్చేస్తాను. ఇంకో పనికి కూడా మీరు వెళ్లిపోవచ్చు.’’ తను చెప్పాల్సింది చెప్పి గోడౌన్లోకి దూరిపోయాడు ఓనరు.ముఖాలు వేలాడేసుకొని ముగ్గురూ ఇళ్లకు తిరిగొచ్చేశారు. నీళ్లలో ఉడుకుతోన్న గవ్వసున్నం మాదిరిగా దారిపొడవునా కృపారావు కుతకుతలాడుతూనే ఉన్నాడు. జేవురించిన ముఖంతో ముద్దగా ఉండిపోయాడు దాసు.రాత్రి పదకొండయ్యింది. కృపారావుకి చాలాసేపు నిద్ర పట్టలేదు. చివాల్న లేచి బయటకి వచ్చాడు. ఆరుబయట వేసుకున్న మంచాలపై పగలంతా పడ్డ కష్టాన్ని మరిచి మత్తుగా నిద్రపోతోంది ఇందిరా కాలనీ. ఎక్కడో వీధికుక్కొకటి అరుస్తూ ఉంది. ఎదురింట్లోకి వెళ్లి నిద్రపోతున్న దాసుని తట్టి లేపాడు.కృపారావుని అలా చూసేసరికి దాసుకి నిద్రమత్తంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది.‘‘ఎక్కడా సూడనేదు ఇంత అన్నేయం... అన్ని కర్సులు మన మీద పడీసి అనవసర కండీషన్లు పెట్టీసి, సివరికి ఒకపూట కూలీ ఎగ్గొట్టీసి మల్లీ రేపు పనికొస్తే డబ్బులు ఇస్తానంటాడా... ఏటి ఆడికంత సోస. మనకేటి సేతకాదన... సెయ్యలేమన... అసలు తప్పు ఆడిది కాదు, నీది. ఎంటనే కాలరు పట్టుకొని నలుగుర్లో కడిగీసి ఉంటే దెబ్బకి అటో ఇటో తేలిపోను. ఇప్పుడు సూడు... సచ్చినట్టుగా ఎల్లాలి.’’పిచ్చెక్కినవాడిలా అరిచాడు కృపారావు. గ్లాసుతో అతనికి నీళ్లిచ్చి, తాగమని చెప్పి తాపీగా బీడీ వెలిగించి గట్టిగా దమ్ము లాగాడు దాసు.‘‘ఒరేయి ఎర్రినాయాల... నువ్వీ మజ్జిన వచ్చినావు. నీకివి కొత్త. నువ్వే కాదు, నేను కూడా నీకంటే గట్టిగా అరవగల్ను. దానివలన లాభమేటి? అక్కడితో కట్... ఇంకో పనికి మనల్ని పిలరు. పిలనియ్యరు. బ్లాక్ లిస్ట్ అంటారే, అలాగ... ఓనర్లంతా ఇక్కడ సిండికేటురా నాయన.’’ అన్నాడు దాసు.‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము?’’‘‘పలాన ఇన్ని రోజులని ఇంకనుకోలేదురా. అనుకున్న ఎంటనే చెప్తాన్లే..’’ పకాలున నవ్వాడు దాసు.‘‘ఇదిగో... అలాటి కుయ్యోత్తులాడితేనే నాకు సిరాకు..’’‘‘లేకపోతే యేట్రా? పెశ్నించడం సులువే... జవాబు సెప్పడమే కష్టం. అందులోని నువ్వడిగిన పెశ్నకు జవాబు తెలిస్తే మనమెందుకిలాగ ఉంటాము. మన బతుకులెందుకిలాగుంటాయి.?’’ నిదానంగా అన్నాడు దాసు.‘‘మా గొప్పగా సెలవిచ్చెవులే... నిన్నడగడం నాదే బుద్ది తక్కువ.’’ చిరాగ్గా వెళ్ళిపోయాడు కృపారావు.మంచంపై పడుకున్నాడేగానీ దాసుకి కూడా ఎంతకూ నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ దొర్లుతున్నాడు.‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము?’’తన యవ్వనారంభ దశలో తండ్రికి వేసిన అదే ప్రశ్న. ఈసారి కృపారావు నుంచి మరోసారి... నిద్ర రానివ్వని ప్రశ్న.. జవాబు దొరకని ప్రశ్న... మనసులో సుళ్ళు తిరుగుతూ... సుమారు పాతికేళ్ల నాటి పరిస్థితి. పేరుకే ఆ ఊరు మున్సిపాలిటీ. పల్లె కంటే కొంచెం ఎక్కువగానూ పట్నం కంటే చాలా తక్కువగానూ ఉంటుందా ఊరు. ఊరి చివరన ప్రధాన రహదారికి ఒక పక్కన చాకలి వీధి, గొడగలవీధి, మొండివీధి, దిగువ రాజ్యం... ఇలా అనేక వీధుల సముదాయంలో ఇందిరాకాలనీ ఇంకొంచెం ముందుంటుంది. ముందుగా ఎండియ్య టీకొట్టు,దానిపక్కనే కొత్తపట్నం షావుకారి కిరాణా దుకాణం, ఇంకొంచెం దూరంలో పొంగడాలు, బూరెలు, దుంపలు అమ్మే నీలవేణి బడ్డీ, అంతా కలిపి వంద గడపతో కనిపిస్తుంది. కంపు గొడుతూ పందులు తాగే కుడితి తొట్టెలు అన్ని చోట్లా... ప్రభుత్వ రుణాలతో అగ్గిపెట్టెల్లా లేచిన స్లాబ్ ఇళ్ళు కొన్ని చోట్ల కనిపిస్తాయి.‘‘నాలుగైపోతంది... మాట గాసేస్తానేటో... దాసుగాడేడి?’’చివికిన రెల్లుగడ్డితో పొగచూరిన పైకప్పును చూస్తూ మట్టి అరుగుపై ఉన్న బొంతపై అటూ ఇటూ దొర్లుతున్న ఆదెయ్య, నర్సమ్మను అలా అడగడం నాలుగోసారి.‘‘అడివి నుంచి ఇప్పుడే వొచ్చినాను గదా. నాకేటి తెల్సు?’’రెండురూపాయలిచ్చి ఎండియ్య టీకొట్టు నుంచి దోసకాయచెంబు నిండా టీ తీసుకువచ్చిన నరసమ్మ అంది. రెండు గ్లాసుల నిండా సర్ది భర్తకొకటి ఇచ్చి తనొకటి తీసుకొని తాగడం మొదలుపెట్టిందామె.పొద్దున్ననగా గంజన్నం, పిండొడెంతో కారేజీ సర్దుకొని, దగ్గర్లో ఉన్న అడవికి వెళ్తుందామె. మారేడు, ఉసిరిక పత్రీ, బంగాళాకుల్ని తెంపి, పెద్ద గోనె సంచిలోకి మూటకట్టి ఇంటికి తీసుకువస్తుంది. పత్రిని చిన్న కట్టలుగా కట్టి రోజూ గుడికి వెళ్లే శ్రీమంతుల ఇళ్లకూ, బంగాళాకుల్ని పెద్ద కట్టలుగా కట్టి హోటళ్లకూ, కిరాణా షాపులకు సరఫరా చేస్తూ నెలకింతని సంపాదిస్తుందామె. అందుకని ఆమెకు ఆకుల నర్సమ్మ అని మరోపేరు. ‘‘అదిగో... మాటల్లోనే వస్తన్నాడు బాబు.’’ తువ్వాలు మూటను చేత్తో పట్టుకుని వస్తోన్న దాసుని చూసి అంది నరసమ్మ. గడపలోకి రాగానే మూటను విప్పి దాసు గచ్చు మీద విదిల్చాడు.‘‘ఎక్కడ పట్టేర్రా ఇవి.?’’ కిందామీదా పడుతూ కొట్టుకుంటోన్న మిట్టల్ని చూస్తూ అంది నరసమ్మ.‘‘పెట్రోలుబంకు ఎనకాతల మళ్లల్లో గుమ్ములు నేవా... అక్కడ. నానూ, పిట్టడు, సొట్టరాజుగాడు ముగ్గురము కలిసి పట్టేము.’’ అన్నాడు దాసు.సంబరంగా తపేలాలో వాటిని సర్ది లోపలకు వెళ్ళిపోయిందామె.‘‘దాసు... టైము నాలుగైంది. పిల్లల్ని తీసుకురాడానికి ఎల్లవేటి?’’ అన్నాడు ఆదెయ్య.‘‘ఆ... ఇదిగిదిగో... ఎల్తన్నాను.’’ఇంటి పక్కనున్న రిక్షాను రోడ్ మీదకు ఎక్కించి రయ్మని తొక్కుకుంటూ వెళ్లిపోయాడు దాసు.మూడిళ్లల్లోని పిల్లల్ని రోజూ స్కూలుకు రిక్షామీద తిప్పే ఆదెయ్యకు గత వారం నుంచి బాగోలేదు.అందుకని డాక్టర్ సలహా మేరకు కొడుక్కి ఆ పనిని ఒప్పజెప్పాడు ఆదెయ్య. కొడుకు తెచ్చిన చేపలకి తోడు నెయ్యిల సీతమ్మ దగ్గర పదిరూపాయిలకు పిత్తపరిగెల వాటాను తీసుకుంది నరసమ్మ. పరిగెల్ని పులుసుగానూ, మిట్టల్ని ఇగురుగానూ వండింది. భార్యచేత తిట్లు తినడం ఇష్టంలేని ఆదెయ్య మందెయ్యకుండానే తొలిసారి నీసుకూరతో ఆ రాత్రికి భోజనం కానిచ్చాడు.దాసుకి ఆటలంటే ఇష్టం. ఇంటరు పోవడానికి అతని ఆటలే సగం కారణం. పగలంతా పక్కనున్న రామయ్యబందలో రోజూ మిత్రులతో కలిసి వాలీబాల్ ఆడతాడు. శుక్రవారం రాత్రయితే చాలు ఉత్సాహంగా రోడ్లపై తిరుగుతాడు. షాపులు కట్టే వేళల్లో దిష్టికని వాటిముందు కొట్టే కొబ్బరి చిప్పల్ని వరసగా ఏరతాడు. కొత్తపట్నం షావుకారి దగ్గర కొన్న పది రూపాయల పంచదార పొట్లాన్నీ, తన వాటాగా వచ్చిన కొబ్బరిచిప్పల్నీ తల్లికిస్తాడు. వాటితో కొబ్బరి చక్కీల్ని పొయ్యడమో, ఒక్కోసారి అంబలితో కారంగా నంజుకునే కొబ్బరిపచ్చడి చెయ్యడమో చేసేదామె. రోజులో రెండు తడవలు పిల్లల్ని స్కూల్లో దింపాక బయట బేరాలకని నెయ్యిల వీధి సెంటర్లో రిక్షాను ఉంచుతాడు ఆదెయ్య. పాసెంజర్లకు మొదట బేరమెంతో చెప్పి ఆనక వాళ్ళెంత ఇస్తే అంత అందుకుని ‘సాలదు బాబూ’ అని గొణుక్కుంటూ వెళ్లిపోవడం అతనికలవాటు. అందుచేత అతని వ్యవహారం చూసి అసలుబేరం కంటే తక్కువ ఇచ్చేవాళ్లే ఎక్కువ. ఆదివారంనాడు శుభ్రంగా తయారై బైబిల్ చేత పట్టుకొని కుటుంబంతో సహా చర్చికి వెళ్లి దైవవాక్యం వినడం అతనికిష్టం.అదేరోజు సాయంత్రం కలిగినవారి కుటుంబాల్ని సినిమా థియేటర్లకు దిగబెట్టి వాళ్ళెంత ఇస్తే అంత తీసుకొని తిరిగొచ్చేయడం అతని బలహీనత. ఇక్కడే దాసుకీ, ఆదెయ్యకి నప్పేది కాదు. శ్రమకి తగిన డబ్బుని అడగడంలో తప్పేముందని తండ్రిని ప్రశ్నించేవాడు. గొడవ పడేవాడు.‘‘అలాగడిగిన మనిషికి ఇలువుండదురా. ఆలంతా పెద్దోలు. అవకాశాలున్నోలు. మనం ఆమాత్రం మురాబు వుంచుకుంటే ఎవరైన సాయపడరేటి..?’’ అనేవాడు తండ్రి.‘‘అది నీ బ్రెమ... ఎవరైనా ఎందుకు చేస్తారు?’’‘‘అలగనీకరా... ఏమో... ఎవరితో ఏ అవసరముంతాదో!’’‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము? ’’జవాబు చెప్పలేక మౌనంగా ఉండే ఆదెయ్యను మరిక రెట్టించేవాడు కాదు దాసు. కాని ఆ ప్రశ్నమాత్రం అతనిలో బలంగా పాతుకుపోయింది. కొన్నాళ్లకి తల్లిదండ్రులు గతించడంతో గానుగెద్దులా కష్టపడటమే తప్ప అతనికి మరొకటి తెలియకుండా పోయింది.కాలక్రమేణా టౌన్ రూపురేఖలతోపాటు, వీధి రూపురేఖలు కూడా మారిపోయాయి. రిక్షాలు మాయమై ఆటోలు, తోపుడు బళ్ళు ప్రవేశించాయి. రిక్షా కార్మికులు, సిమెంట్, ఐరన్ షాపుల్లో కళాసీలుగానూ, తాపీ మేస్త్రీలుగానూ, కాయగూరలు అమ్మే చిల్లర వర్తకులుగాను మారేరు. పది పాసైన కుర్రాళ్లంతా ఆర్మీలోకి వెళ్ళిపోతే, పోయిన వాళ్లంతా నగరాల్లో సెక్యూరిటీ గార్డులయ్యారు. కొద్దిమంది మాత్రమే ఉద్యోగస్తులయ్యేరు. ఎటూ వెళ్లలేని దాసులాంటి వారు పెయింటర్లయ్యారు. కానీ అతనితో పాటు అతనిలో ఏళ్ల తరబడి అంటుకట్టుకొని పోయిన ఒకప్పటి అతనిప్రశ్న మాత్రం సలపరించే గాయమై బాధిస్తూనే ఉంది. కొన్ని తరాల నుంచి తమ కుటుంబం సమాజం పట్ల ప్రదర్శించిన విధేయత, మంచితనం వలన ఒరిగిందేంటి? తండ్రి ఆశించిన మేలేదైనా జరిగిందా? లేదే! అలాంటప్పుడు ఎందుకీ అనవసరపు తాపత్రయం. స్వతంత్రంగా బతకలేమా... సగౌరవంగా బతికి చూపించలేమా... సగం రాత్రి వరకు దాసులో సాగిన ఆలోచనలెన్నో! మూత్రం పోయడానికని బయటకు వచ్చి, ఆ పని కానిచ్చి యథాలాపంగా బయట నిల్చున్నాడు దాసు. నిర్మానుష్యంగా... నిశ్శబ్దంగా ఉన్న రోడ్డుపై ఒక చేత్తో వెలుగు దారి చూపిస్తూ, మరొక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని నిల్చుని ఉన్న నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం వీధి లైటు వెలుతురులో దూరంగా, మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. వెలుగు రేఖలేవో ప్రసరించినట్టయ్యింది.‘లోడు దించడానికి ఉదయాన్నే గభీల్న ఎల్లాల... ఏటయితే అదవ్వనీ... తర్వాత సూద్దుము.’ మంచంపై పడుకుంటూ మనసులో అనుకున్నాడు దాసు. తెల్లవారి మూడు దాటాక అతనికి మాగన్నుగా నిద్ర పట్టింది.∙∙ తర్వాత రోజు ఉదయం పదిగంటలకు షాపు తెరవడానికి వచ్చిన గంగరాజు అక్కడి దృశ్యం చూసి కోపోద్రిక్తుడయ్యాడు. పట్టరాని ఆవేశంతో సెల్ తీసి దాసుకి ఫోన్ చేశాడు. నిమిషాల్లో ఎర్రయ్య, కృపారావులతో పాటు మరికొంతమందిని వెంటబెట్టుకొని వచ్చాడు దాసు..‘‘దాసూ... నేను చెయ్యమన్నదేంటి... నువ్వు చేసిందేంటి? ‘‘షాపుముందు వరసగా పేర్చి ఉన్న పుట్టి బ్యాగుల్ని, రంగు డబ్బాల్ని చూస్తూ అన్నాడు గంగరాజు.‘‘మీరు సెప్పిందే గదేటి... ఇంకేటి సేశాను?.’’ అన్నాడు దాసు.‘‘ఏం చెప్పాను..?’’‘‘లోడుని పెరిగీమన్నారు... పెరిగీసాం గదా..’’‘‘పెరిగీడమంటే గౌడౌన్ లోపలకి పెట్టాలని తెలీదా?’’ విరుచుకుపడ్డాడు గంగరాజు.‘‘ఆ మాట నిన్న మీరనలేదు గదా.’’‘‘అలాగని రోడ్ మీద దించేస్తారా ..’’‘‘టైమెక్కడిది సారూ? మీరే గదా రెండు గంటల్లో దించేసి ఇంకో పనికి ఎళ్లిపొమ్మన్నారు?’’‘‘ఏటివోయ్ దాసు... కొత్తగా మాట్లాడుతున్నావు. ఏటి సంగతి...’’‘‘మేమేటి కొత్తగా అనడంలేదు. మీరన్నదే... మా కూల్లు మాకిచ్చేస్తే మేమింకో పనికి ఎళ్ళిపోతాం.’’‘‘గోడౌన్ తాళాల కోసం ఇంటికి రాకపోతే లోడు రాలేదేటోననుకున్నాను. ఇలాంటి మడతపేచీ ఉందనుకోలేదు. సరే, తగువెందుకులే గానీ ముందు లోపలకి సామాన్లు పెరిగీయండి. డబ్బులిచ్చేస్తాను.’’ కొంచెం మెత్తబడి అన్నాడు గంగరాజు.‘‘కుదరదు.’’‘‘ఏం... ఎందుకని? ‘‘‘‘నిన్నటిది ఇయ్యాల్టిది... కలిపి రెండు రోజులు కూలవుద్ది... పెరిగీమంటారా?’’‘‘కూలీ ఒక్కరోజుదే కదా... రెండు రోజులేటి?’’‘‘అదంతే... ఇష్టం నేకపోతే సెప్పండి. లోడు ఇక్కడే ఇక్కడే వుంటాది... మా దారిన మేము పోతాము. ఎవులుతో పెరిగిస్తావో చూస్తాము. అంతేకాదు ముందు డబ్బిస్తేనే పని. నేదంటే నేదు...’’ఆ మాటకి గంగరాజు కోపం నషాళానికి అంటింది. అయినా తమాయించుకున్నాడు. చేసేదేంలేక నాలుగువేల ఎనిమిది వందల రూపాయలు జేబులోనుంచి చిరాగ్గా తీసి దాసుకి అందించాడు. లోడు గోడౌన్లోకి చేరింది. ఊపిరి పీల్చుకున్నాడు గంగరాజు. జేబులోనుంచి పన్నెండు వందలు తీసి అతని చేతిలో పెట్టాడు దాసు. ప్రశ్నార్థకంగా చూశాడతను.‘‘నిన్నటిది పూర్తి కూలీ. ఈ రోజుది సగం కూలీ. పోను మిగతాది ఈ డబ్బు... మీరే దాసుకోండి. కోట్లు గడించీయండి. మాకేటి ఎంగిలి కూడు అక్కర్లేదు మీలాగ...’’అన్నాడు దాసు. చేతిలో నలిగిన నోట్లనీ... నిశ్చలంగా ఉన్న దాసు ముఖాన్నీ చూస్తూ ఏదో మాట్లాడబోయాడు గంగరాజు. కానీ దాసు అవేవీ వినిపించుకోలేదు. నింగికెగసిన పక్షుల గుంపులో తానొక పక్షిలా స్వేఛ్ఛగా తనవారితో కలిసి వడివడిగా రోడ్డు దాటి వెళ్ళిపోయాడు.- పాలకొల్లు రామలింగస్వామి -
ఆరోగ్యవంతమైన సోడా..!
రంగు రంగుల చల్లని సోడా పానీయాలకు వేసవిలో గిరాకీ విపరీతంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతుంటారు. కృత్రిమ రంగులు, మితిమీరిన మోతాదులో చక్కెర కలిపి తయారుచేసే సోడా పానీయాలు ఆరోగ్యానికి హానికరమే అనడంలో ఎలాంటి సందేహాం లేదు. అయితే, జపాన్లో దొరికే ఈ సోడా పానీయం మాత్రం చాలా ఆరోగ్యకరమైనది. ఎందుకంటే, ఇది మజ్జిగతో తయారు చేసే సోడా.‘కాల్పికో సోడా’ పేరుతో 1919 నుంచి ఇది జపాన్లో అమ్ముడవుతోంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఇందులోనూ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇది పొట్టకు మేలు చేస్తుంది. ఇందులో ఎలాంటి హానికర రసాయనాలు, కృత్రిమ రంగులు ఉండవు. ఒకరకంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన సోడా పానీయం అని చెప్పవచ్చు. (చదవండి: ఈ ఐస్క్రీమ్... చాలా హాట్ గురూ!) -
కథాకళి: ఓ వర్షం రాత్రి
జిగ్నేష్కి అతని క్లాస్మేట్ కావ్యమణి ఐదేళ్ళ తర్వాత అకస్మాత్తుగా మెట్రోలో తారసపడింది. ఇద్దరూ ఒకే స్టేషన్ లో దిగాక జిగ్నేష్ ఆమెని ఎదురుగా ఉన్న కాఫీ షాప్కి ఆహ్వానించాడు. మోమోస్ తిని, కాఫీ తాగుతూ ఒకరి గురించి మరొకరు చెప్పుకున్నారు. కావ్యమణికి పెళ్ళై విడాకులు కూడా అయ్యాయని తెలిశాక అతను ఆహ్వానించాడు.‘‘మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఈ రాత్రికి మా ఇంటికి రారాదు? నువ్వు వర్కింగ్ ఉమెన్ ్స హాస్టల్లో ఉంటున్నావు కాబట్టి ఎవరి అనుమతి అవసరం లేదు.’’‘‘ఆలోచిస్తాను. ఇందుకు మెంటల్గా నేను ప్రిపేర్ అవడానికి కొంత సమయం పడుతుంది. సాయంత్రం ఐదు తర్వాత ఫోన్ చేస్తాను.’’ కావ్యమణి జవాబు చెప్పింది. ‘‘నేను వంట కూడా బాగా చేస్తాను.’’ జిగ్నేష్ ‘వంట’ పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పాడు. ఆరున్నర దాకా అతను ఆమె ఫోన్ చేస్తుందా, లేదా అనే ఆదుర్దాకి గురయ్యాడు. ఆరు ముప్ఫై ఐదుకి కావ్యమణి నుంచి ఫోన్ వచ్చింది. ‘‘మీ ఇంటికి ఎలా రావాలో లొకేషన్ పంపు. నేను ఎనిమిదిన్నరకి రావచ్చా?’’‘‘ష్యూర్ అండ్ థాంక్స్.’’ విప్పారిన మొహంతో చెప్పాడు.అతను ఎనిమిదింటికి బియ్యం నానపెట్టాడు. ఫ్రిజ్ తెరచి కూరగాయలు తరిగి సిద్ధం చేశాడు. ఎనిమిదింపావుకి ఆకాశంలో మబ్బులు కనిపించాయి. మెరుపులని చూసి వర్షం వస్తుందని అనిపించాక కావ్యమణి రావటం విరమించుకుంటుందా అని భయపడ్డాడు.వంటపనిలో ఉండగా డోర్ బెల్ మోగితే తలుపు తెరిచాడు. మంచి పెర్ఫ్యూమ్ వాసన. కావ్యమణి వచ్చింది. ఆమె తన హెల్మెట్ని సోఫా మీద ఉంచి అడిగింది.‘‘నా స్కూటీని కార్ పార్క్లో నీ కారు వెనక పార్క్ చేశాను. ఓకే కదా?’’‘‘ఓకే.’’ఆమె ఫ్రెంచ్ డోర్ని తెరిచి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోకి కొద్ది క్షణాలు చూసి మళ్ళీ లోపలకి వచ్చి అడిగింది.‘‘స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? ఆకలిగా ఉంది.’’‘‘కూర్చో. నాలుగైదు నిమిషాల్లో బర్గర్ చేస్తాను.’’అతను బర్గర్ పేటీని డీప్ఫ్రీజర్లోంచి తీసి, రెండువైపులా నెయ్యి స్ప్రే చేసి, ఏర్ ఫ్రైయర్లో ఉంచి, మూడు నిమిషాల తర్వాత వెనక్కి తిప్పాడు. ఈలోగా టొమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర కోసి, బర్గర్ బన్ మధ్యకి కోసి పెనం మీద కాల్చాడు. బర్గర్లో అన్నిటినీ పెట్టేముందు టొమాటో, మస్టర్డ్, చిల్లీ సాస్లు వేశాడు.‘‘బావుంది. బావుంది కాదు. ఎక్సలెంట్.’’ చెప్పి ఆమె జీరో కోక్ తాగింది.జిగ్నేష్ భార్య పుట్టింటికి కానుపుకి వెళ్ళి నాలుగు నెలలైంది. అతనికి అప్పటి నించి స్త్రీ సంపర్కం లేదు. తొందరగా ఉంది.‘‘వాతావరణం బావుంది కదా?’’ బాల్కనీలోంచి ఫ్రెంచ్ డోర్ ద్వారా చల్లటి గాలి వీస్తూండటంతో అడిగాడు.‘‘అవును. మనకి చక్కటి మూడ్ ఇచ్చే వాతావరణం.’’ కావ్యమణి చెప్పింది.ఆమెకి తన భార్య నైటీ ఇచ్చాడు. అతని ఎదురుగానే దాన్ని మార్చుకుంది. ఆమెని కౌగిలించుకుని చుంబించబోయాడు. అకస్మాత్తుగా ఫ్రెంచ్ డోర్ లోంచి తూనీగలు, రెక్కల పురుగులు, వందల సంఖ్యలో లోపలికి రాసాగాయి. అతను ఆమెని వదిలి ఫ్రెంచ్ డోర్ మూయబోయాడు.‘‘ఒద్దు.’’ కావ్యమణి అతన్ని ఆపి చెప్పింది.‘‘ఒద్దేమిటి? దీపం పురుగులు.’’ ఆశ్చర్యంగా చెప్పాడు.కావ్యమణి నేలరాలిన ఓ పురుగుని తీసి పరిశీలించి చూసి ఆనందంగా చెప్పింది.‘‘ఉసుళ్ళు.’’‘‘ఉసుళ్ళా?’’‘‘అవును. వీటిని ఉసుళ్ళు అంటాం. మీ ఇంటి దగ్గరలో చెదల పుట్టలు ఉండి ఉండాలి. వాటికి ఎండాకాలం వానకి రెక్కలు వచ్చి, మూకుమ్మడిగా పుట్టలోంచి బయటికి వస్తాయని, వీటి ఆయుష్షు నాలుగైదు గంటలు మాత్రమేనని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది. ఇవి ప్రొటీన్ ఫుడ్ అని తెలుసా? వీటిని వేయించుకుని తింటాం. చాలా రుచిగా ఉంటాయి. చాలా కాలానికి భలే దొరికాయి.’’కావ్యమణి ఓ బేసిన్ లో నేలరాలిన ఉసుళ్ళని ఏరి, వాటి ట్రాన్స్పరెంట్ రెక్కలను తుంచి, పురుగులను బేసిన్ లో వేయడాన్ని జిగ్నేష్ అసహ్యంగా చూశాడు. ఆమె ఆ పనిని అరగంటకి పైగా పూర్తి చేశాక స్టవ్ వెలిగించి, ఆ పురుగులను నూనెలో వేయించి ఉప్పు కారం కలిపి రెండు ప్లేట్లలో పెట్టి తెచ్చింది.‘‘తిను. చాలా టేస్టీ.’’‘‘నో. థేంక్స్. నువ్వే తిను.’’ఆమె వాటిని తింటూంటే చెప్పాడు.‘‘నేను బయటికి వెళ్ళొస్తాను.’’అతను ఆ రాత్రి తిరిగి రాలేదు. మర్నాడు ఉదయం అతను వచ్చేసరికి కావ్యమణి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమై, అతని కోసం ఎదురుచూస్తోంది.‘‘రాత్రి నువ్వు రానని టెక్స్ట్ మెసేజ్ ఇచ్చావు. ఏమైంది?’’ అడిగింది.‘‘అర్జంట్గా ఆఫీస్ పని చేయాల్సివచ్చింది.’’ఆమె వెళ్ళాక అతను బేసిన్ ను, బాణలిని చెత్త డబ్బాలో పడేసి, ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ అనుకున్నాడు.‘ఇంకా నయం. త్వరపడి కావ్యమణి పెదాలని ముద్దు పెట్టుకోలేదు’ ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
మెల్లగా కరిగే నైస్..ఐస్
నిశ్శబ్దంగా గ్లాసు అంచున చేరి, చల్లని స్పర్శతో పరిచయం అవుతుంది. ఆయుష్షు రెండు నిమిషాలే అయినా, వచ్చిన క్షణం నుంచే చిరునవ్వులు కురిపిస్తుంది. ఉన్నంత సేపూ ‘చిల్’ చేస్తూ, రోజంతటి అలసటను కరిగించేస్తుంది.మాయమైయ్యే ఆఖరి క్షణం కూడా మనసు నిండా ప్రశాంతతను నింపి, మీకొక ‘కూల్ క్యారెక్టర్’నిస్తుంది. ఇంతకీ ఎవరీ కూల్ ఫ్రెండ్ అనుకుంటున్నారా? ఇంకెవరు.. మన పానీయాల ప్రథమ బంధువు, ‘ఐస్’! అవును, నిన్నటి దాకా ఒక తెల్లటి మొండి మంచు గడ్డగా మాత్రమే కనిపించే ఇది. నేడు, ఒక అపురూపమైన వజ్రంలా ‘క్రాఫ్ట్ ఐస్’గా రూపు మార్చుకుని, విలాసానికి చిరునామాగా మార్కెట్లో మెరిసే ఐస్వర్యంగా మారిపోయింది! ఒక రాతిని మలిస్తే ఎలా శిల్పంగా మారుతుందో, అచ్చం అలాగే ఐస్ కూడా వివిధ రూపాల్లో క్రాఫ్ట్ ఐస్గా మారి, ప్రత్యేకమైన గౌరవం, హోదా, అందాన్ని సొంతం చేసుకుంటోంది. ఎందుకంటే, ఈ క్రాఫ్ట్ ఐస్, సాధారణ ఐస్ క్యూబ్ కంటే చాలా స్పష్టంగా అందంగా మెరుస్తూ, నెమ్మదిగా కరుగుతుంది. ఇది డ్రింక్ రుచిని కూడా మెరుగ్గా చేస్తుంది. అందుకే, ఇప్పటి ప్రపంచంలో డ్రింక్కి మొదటి హీరో క్రాఫ్ట్ ఐస్గామారింది. ఇదివరకు అది గ్లాస్లో నిశ్శబ్దంగా కూర్చునే ఒక ‘ఎక్స్ట్రా ప్లేయర్’. కాని ఇప్పుడు ఒక డ్రింక్ రుచి, లుక్ను మార్చేసే పవర్ సొంతం చేసుకొని స్టేజ్పై స్పాట్లైట్ దక్కించుకున్న ‘స్టార్’. ఎందుకంటే అది సాధారణ ఐస్ నుంచి క్రాఫ్ట్ ఐస్గా రూపాంతరం చెందింది. డ్రింక్ ఆర్డర్ చేసినప్పుడు చాలామంది అడిగేది ‘చల్లగా ఉందా?’ అని, కాని, గ్లాస్లో పడే ఐస్ ముక్క గురించి ఎవరూ ఆలోచించరు. దాని క్వాలిటీ, సైజ్, డిజైన్ వంటివన్నీ అసలు పట్టించుకునే వారే కారు. కాని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మబ్బుల్లేని మంచు! ఇంట్లో తయారు చేసే ఐస్ క్యూబ్స్ను గమనించారా? మధ్యలో తెల్లగా, మబ్బు పట్టినట్టు కనిపిస్తాయి. సైన్స్ పరంగా, ఆ తెల్లటి మసక వివిధ గాలి బుడగలు, నీటిలోని చిన్న మలినాలు కలిసి గడ్డకట్టిన గుర్తు. కానీ క్రాఫ్ట్ ఐస్ మాత్రం అలా ఉండదు. ఇది ప్రత్యేక పద్ధతిలో నెమ్మదిగా, ఒకే దిశలో గడ్డకట్టేలా తయారవుతుంది. దాంతో గాలి బుడగలు బయటకు వెళ్లిపోతాయి, మిగిలేది మాత్రం పూర్తిగా పారదర్శకమైన స్వచ్ఛమైన మంచు. అందుకే దీనిని మబ్బుల్లేని మంచు అని కూడా అంటారు. ఇది అచ్చం పటిక బెల్లంలా, లేదా ఒక ఖరీదైన వజ్రంలా గ్లాస్లో మెరిసిపోతూ, చూడటానికి అందంగా ఉండటమే కాదు. నెమ్మదిగా కరిగి డ్రింక్ అసలు రుచిని అలాగే కాపాడుతుంది. చిన్న తేడా మాత్రమే అనిపించినా, ఇదే స్పష్టత ఒక సాధారణ పానీయానికి ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.ఎందుకు ముఖ్యం?సాధారణ ఐస్కి, క్రాఫ్ట్ ఐస్కి మధ్య ఉన్నది చిన్న తేడాలే అయినా, వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దవి. ఉదాహరణకు, ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుని ఊహించండి. అందులో వేసిన ఐస్ మసకగా, బుడగలతో నిండిపోయి ఉంటే అది కొంచెం అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. అదే గ్లాస్లో క్రిస్టల్లా మెరిసే క్రాఫ్ట్ ఐస్ ముక్క పడితే? ఆ గ్లాస్ ఒక్కసారిగా ప్రొఫెషనల్ లుక్లో స్టార్ హోటల్ రేంజ్ను సొంతం చేసుకుంటుంది. కేవలం చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, రుచి కూడా మెరుగ్గా అనిపిస్తుంది.ఐ స్ డిజైనర్స్! ఐస్ కూడా ఇప్పుడు ఒక డిజైనర్ ప్రాడక్ట్గా మారింది. బ్రాండెడ్ వాచీలు, ఖరీదైన ఫర్నిచర్ తరహాలోనే ఐస్ కూడా ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్. అందుకే మార్కెట్లో ‘ఐస్ డిజైనర్స్’ హడావుడి కూడా మొదలైంది. వీరు సృష్టించే మంచు ముక్కలు వజ్రంలా మెరిసే డైమండ్ షేప్లో, పర్ఫెక్ట్ ట్రైయాంగిల్, ఒక అందమైన పూల ఆకారాల్లో దర్శనమిస్తూ గ్లాసులో పడగానే ‘ఇది డ్రింక్ కాదు, ఒక అద్భుతమైన కళాఖండం’ అనే భావనను కలిగిస్తాయి. ఇందుకోసం, మార్కెట్లో కూడా ఈ ఐస్ తయారీకి ప్రత్యేకమైన టూల్స్, ట్రేలు, పిల్లలకు నచ్చేలా జంతువుల, మౌల్డ్స్, బాక్స్లు, టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో ఇంట్లో కూడా ఈ కొత్త ట్రెండ్ జోరుగా కనిపిస్తోంది.కామన్ ఐస్∙మసకగా, మబ్బుగా కనిపిస్తుంది. ∙త్వరగా కరిగిపోతుంది.∙త్వరగా కరిగిపోతే డ్రింక్ నీరుగా మారుతుంది.∙రుచి తగ్గిపోతుంది.క్రాఫ్ట్ ఐస్∙క్రిస్టల్లా స్పష్టంగా, పారదర్శకంగా కనిపిస్తుంది.∙నెమ్మదిగా కరుగుతుంది.డ్రింక్ రుచిని అలాగే ఉంచుతుంది. గ్లాస్ లుక్ కూడా మెరుగ్గా, మరింత స్టయిలిష్గా కనిపిస్తుంది.∙అంటే చిన్న ఐస్ ముక్కే పెద్ద డిఫరెన్స్ చేస్తుంది!చిన్న ట్విస్ట్!ప్రత్యేకమైన ఈ క్రాఫ్ట్ ఐస్ తయారీ విధానం వలన, ఈ ఐస్ తయారయ్యేందుకు సాధారణ ఐస్తో పోలిస్తే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈ నెమ్మదిగా గడ్డకట్టే ప్రక్రియ వలనే దీనికి ఆ స్పష్టత, బలం, అందం కూడా వస్తుంది. అంటే త్వరగా తయారయ్యే ఐస్ ఒక ‘ఫాస్ట్ ఫుడ్’ అయితే, క్రాఫ్ట్ ఐస్ మాత్రం నిజంగా ఒక ‘ఫైన్ డైనింగ్’ అనుభవం లాంటిదే! అందుకే దీని డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.సీక్రెట్ సైన్స్!క్రాఫ్ట్ ఐస్ ఇలా అద్దంలా మెరుస్తుందంటే, దానికి వెనుక ఒక చిన్న మాయ కాదు. ఒక పెద్ద సైన్స్ ఉంది. దీనికోసం ‘డైరెక్షనల్ ఫ్రీజింగ్’ అనే ప్రత్యేక టెక్నిక్ వాడతారు. పేరు వినగానే కొంచెం కష్టంగా అనిపించినా, కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్. అంటే నీరు అన్ని వైపులా కాకుండా, ఒకే ఒక వైపు నుంచి నెమ్మదిగా గడ్డకట్టేలా’ చేస్తారు. ఇలా చేస్తే, నీటిలో ఉన్న గాలి బుడగలు, చిన్న మలినాలు అన్నీ కింద భాగంలోకి వెళ్లిపోతాయి. పై భాగంలో మాత్రం అచ్చం అద్దంలా, వజ్రంలా మెరిసే స్వచ్ఛమైన మంచు మిగులుతుంది. అందుకే క్రాఫ్ట్ ఐస్ చూడగానే, ‘గ్లాస్ డైమెండ్గా’లా అనిపిస్తుంది.లక్షల ఏళ్ల నాటి చల్లదనం!కథ ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు దుబాయ్ లాంటి నగరాల్లో కొన్ని లగ్జరీ బార్లు మరింత స్పెషల్గా ఆలోచిస్తున్నాయి. ప్రత్యేకమైన అతిథుల కోసం సాధారణ క్రాఫ్ట్ ఐస్ కాదు. గ్రీ¯Œ లాండ్ గ్లేషియర్ల నుంచి తెప్పించిన లక్ష ఏళ్ల నాటి మంచు గడ్డలు వాడుతున్నారు. అవును, నిజంగానే! మనం రోజూ ఫ్రీజర్లో తయారు చేసే ఐస్ కొన్ని గంటల వయసు మాత్రమే ఉంటుంది. కానీ ఈ గ్లేషియర్ ఐస్ మాత్రం లక్ష ఏళ్ల చరిత్రను తనలో దాచుకుని ఉంటుంది. అందుకే ఇప్పుడు లగ్జరీ ప్రపంచంలో ఒక కొత్త జోక్ కూడా వినిపిస్తోంది. ‘డ్రింక్ ఎంత పాతదో కాదు, ఐస్ కూడా ఎంత పాతదో చెప్పాలి!’. అలా ఇప్పుడు లగ్జరీని గ్లాస్లో పడే ఐస్ ముక్కతో కూడా కొలుస్తున్నారు.ఇదొక పెద్ద బిజినెస్.. అప్పట్లో ప్రపంచంలో కాలుష్యం అనే మాటే లేదు! అందుకే ఆ కాలంలో ఏర్పడిన ఈ మంచు గడ్డలు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనవిగా భావిస్తారు. ఈ అరుదైన మంచును ‘ఆర్కిటిక్ ఐస్’ అనే స్టార్టప్ సేకరించి, ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ఇలా మీరు తాగుతున్నది కేవలం ఒక కాక్టెయిల్ మాత్రమే కాదు, హిమయుగం నాటి స్వచ్ఛతతో కూడిన చల్లదనం అంటూ, ఇదే విధంగా మరికొన్ని సంస్థలు కూడా వివిధ రకాల క్రాఫ్ట్ ఐస్ బిజినెస్ చేస్తున్నాయి. అంతేకాదు, ప్రపంచ మార్కెట్ లెక్కల ప్రకారం, క్రాఫ్ట్ ఐస్ మార్కెట్ 2031 నాటికి భారీగా పెరిగి, సుమారు 138.9 బిలియ¯Œ డాలర్లకు చేరుకోనుందని అంచనా. అంటే చిన్నగా కనిపించే ఈ ఐస్ ముక్క వెనుక ఇప్పుడొక పెద్ద బిజినెస్, పెద్ద ట్రెండ్, పెద్ద స్టేటస్ సింబల్ దాగి ఉన్నాయి.ప్రయోగాలన్నీ రుచికోసమే! ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే కాకుండా, ప్రతి ముద్దలోనూ, ప్రతి గుటకలోనూ ఒక సరికొత్త అనుభూతిని వెతకడమే అసలైన భోజన ప్రియుల లక్షణం. అందుకే, జ్యూస్ గ్లాస్లో పడే ఐస్ ముక్క నుంచి కూరలో చివరగా చల్లే కొత్తిమీర వరకు మనం చేసే ప్రతి ప్రయోగం వెనుక ఒక అద్భుతమైన ‘రుచి రహస్యం’ దాగి ఉంటుంది. ఇలాంటి వారికోసమే, క్రాఫ్ట్ ఐస్ జ్యూస్కు ప్రాణం పోసే చిన్న చిన్న ప్రయోగాలు, రుచిని రెట్టింపు చేసే ఆ చిట్కాలు పాటిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం కొన్ని ‘ఇన్ఫ్యూజ్డ్ ఐస్’ పేరుతో వివిధ రకాల రుచికరమైన క్రాఫ్ట్ ఐస్ అందుబాటులో ఉన్నాయి.టీ ఫ్లేవర్డ్ ఐస్ఎడారిలో కూడా టీ తాగేటటువంటి చాయ్ లవర్స్కి ఇదొక కూల్ సొల్యూషన్. ఐస్డ్ టీలు లేదా కాక్టెయిల్స్ తాగేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఐస్ కరుగుతున్న కొద్దీ టీ ఫ్లేవర్ తగ్గకుండా, మరింత పెరుగుతుంది. ఇందుకోసం, ముందుగా మాచా టీ, గ్రీన్ టీ లేదా మీకు నచ్చిన ఏదైనా ఫ్లేవర్డ్ టీని డికాక్షన్లా మరిగించి చల్లార్చాలి. ఆ నీటిని ఐస్ ట్రేలలో పోసి గడ్డకట్టించాలి. కేవలం ఇంట్లో ఉండే టీ పొడి లేదా టీ బ్యాగులతో కేవలం రూ. 5 నుంచి రూ. 10లతో వీటిని తయారు చేసుకోవచ్చు.సిట్రస్ ఐస్డ్రింక్కి ఒక తాజాదనాన్ని ఇచ్చేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం రుచినే కాదు, గ్లాసుకి మంచి సువాసనను కూడా ఇస్తుంది. సిట్రస్ రకాలకు చెందిన నిమ్మకాయ లేదా నారింజ పండు పై తొక్కల సన్నని తురుము ఇందుకోసం చాలా అవసరం. ఒక ఐస్ ట్రేలో నీళ్లు పోసి, అందులో ఈ తురుమును లేదా చిన్న నిమ్మ చెక్కలను వేసి ఫ్రీజ్ చేయాలి. దీనికి అయ్యే ఖర్చు దాదాపు సున్నా. కేవలం మనం వాడేసి పారేసే నిమ్మ తొక్కలతోనే వీటిని సిద్ధం చేసుకోవచ్చు.ఫ్రూట్ ఐస్పిల్లలకి ఇచ్చే జ్యూస్ల నుంచి పెద్దలు తాగే పానీయాల వరకు ఇది ఒక విజువల్ అండ్ టేస్టీ ట్రీట్. పుచ్చకాయ, దానిమ్మ , దాక్ష రసాన్ని తీసి, వడకట్టి నేరుగా ఐస్ ట్రేలలో పోయాలి. మరింత అందంగా కనిపించాలంటే రసంతో పాటు చిన్న పండ్ల ముక్కలను కూడా అందులో వేయవచ్చు. సాధారణంగా ఒక ట్రే ఐస్ కోసం రూ.20 నుంచి రూ. 50 వరకు ఖర్చు అవ్వచ్చు.డిఫరెంట్ షేప్డ్ ఐస్ఆకారమే ఇక్కడ ప్రధాన ఆకర్షణ. గుండ్రంగా, స్టార్ ఆకారంలో, హార్ట్ షేప్లో ఇలా ఎన్నో ప్రత్యేక ఆకారాల్లో ఐస్ తయారు చేస్తున్నారు. ఇవి గ్లాస్లో పడిన క్షణం నుంచే డ్రింక్ను ఒక స్టయిలిష్ ప్రెజెంటేష¯Œ గా మార్చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మార్కెట్లో లభించే సిలికా¯Œ ట్రేలు లేదా మోల్డ్లు ఉపయోగిస్తారు. ఒకసారి కొనుగోలు చేస్తే చాలా రోజుల పాటు వాడుకోవచ్చు. సాధారణంగా ఈ ట్రేలు రూ. 100 నుంచి రూ. 300 వరకు ఉంటాయి.ఎడిబుల్ గోల్డ్ – ఫ్లవర్ ఐస్ఇది అల్టిమేట్ రాయల్ లుక్ ఇచ్చే పద్ధతి. లగ్జరీ ఈవెంట్లలో దీనికి భలే క్రేజ్ ఉంటుంది. విజువల్ ట్రీట్ కోసం ఈ ఐస్ క్యూబ్స్ మధ్యలో అందమైన పువ్వులు, బంగారు రేకులను ఉంచుతూ గ్లాసును ఒక చిన్న సర్ర్పైజ్ బాక్స్లా తయారు చేస్తారు. ఇది కాస్త ఖరీదైన వ్యవహారం. రూ. 500 నుంచి పదివేలు అంతకు మించి కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది.రంగు రంగుల ఐస్గ్లాస్లో రంగులు మెరిస్తే, మనసు కూడా ఫ్రెష్ అయిపోతుంది కదా! అందుకే ఇప్పుడు రంగురంగుల ఐస్ కొత్త ట్రెండ్గా మారింది. ఇది ముఖ్యంగా పిల్లల పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్లు లేదా సమ్మర్ డ్రింక్లకు స్పెషల్ అట్రాక్ష¯Œ గా ఉంటుంది. ఇందుకోసం నీటిలో సహజ రంగులు ఇచ్చే పండ్ల రసం లేదా ఫుడ్ కలర్ కొద్దిగా కలిపి ఐస్ ట్రేలలో పోసి గడ్డకట్టించాలి. ఖర్చు కూడా రూ. 10 నుంచి రూ. 30ల మధ్యలోనే సిద్ధం చేసుకోవచ్చు.ఫ్లేవర్డ్ ఐస్ఇది నిజంగా ఒక చిన్న సర్ప్రైజ్ లాంటిది. ఐస్ కరుగుతున్న కొద్ది కొత్త రుచి మెల్లగా డ్రింక్లో కలుస్తుంది. పుదీనా, తులసి, అల్లం, లేదా బెర్రీ పండ్లతో తయారు చేసే ఫ్లేవర్డ్ ఐస్ ఇప్పుడు చాలా పాపులర్. ఇందుకోసం మీకు నచ్చిన ఫ్లేవర్ పదార్థాలను చిన్నగా కట్ చేసి నీటిలో కలిపి ఐస్ ట్రేలో పోసి గడ్డకట్టించాలి. ఇది కేవలం చల్లదనం మాత్రమే కాదు, ఒక కొత్త రుచి ఇస్తుంది. దీని ఖర్చు రూ. 15 నుంచి రూ. 40 మధ్యలో ఉంటుంది.చల్లని సత్యం! కరిగిపోయే లోపే కంటికి విందును, మనసుకి హాయిని ఇచ్చే ఈ క్రాఫ్ట్ ఐస్– అచ్చం మన జీవితం లాగే షార్ట్ అండ్ స్వీట్! అందుకే, మీరు కూడా ఈ ‘కూల్ ఫ్రెండ్’తో ఒక్క రెండు నిమిషాలు చిల్ అవ్వండి, రోజంతటి అలసటను ఇట్టే మర్చిపోండి!-కొండి దీపిక -
ఈ ఐస్క్రీమ్... చాలా హాట్ గురూ!
ఐస్క్రీమ్ అంటే చల్లచల్లగా తియ్యతియ్యగా ఉంటుందనేగా మీ అంచనా! ఈ ఐస్క్రీమ్ను గనుక ఒక్కసారి రుచి చూస్తే మీ అంచనాలన్నీ పటాపంచలైపోతాయి. దీని రుచి నాలుకను తాకిన తక్షణమే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఒళ్లంతా ముచ్చెమటలు పడతాయి. ఇదెక్కడి ఐస్క్రీమ్ బాబోయ్! అని నోరెళ్లబెట్టి, గుడ్లు తేలేస్తారు. ఇది అలాంటిలాంటి ఐస్క్రీమ్ కాదు, దీని పేరు ‘కోల్డ్ స్వెట్’. అన్ని ఐస్క్రీమ్ల మాదిరిగానే చాలా చల్లగా ఉంటుంది. రుచి చూస్తేనే దీని అసలు తడాఖా తెలిసొస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన రకాల మిరపకాయలు, మిర్చి సాస్ వంటి వాటితో తయారు చేయడం వల్లనే ఇది ప్రపంచంలోనే ఘాటైన ఐస్క్రీమ్గా పేరుపొందింది. అమెరికాలో నార్త్ కరోలినా రాష్ట్రం ఏంజియర్ పట్టణానికి చెందిన ‘సన్నీ స్కై హోమ్మేడ్ ఐస్క్రీమ్స్’ సంస్థ ఈ ఐస్క్రీమ్ను ఇరవై ఏళ్ల కిందట ప్రారంభించింది. విచిత్రమైన రుచులను ఆస్వాదించాలనుకునేవారు దీని కోసం ఇక్కడకు వస్తుంటారు. (చదవండి: జ్ఞాన శంఖం 'పూరి'ద్దాం!) -
బేబీ బ్లూస్..! డెలివరీ తర్వాత ఇలా ఎందుకనిపిస్తోంది..
నాకు వారం రోజుల క్రితం సిజేరియన్ ద్వారా డెలివరీ అయింది. బేబీ కూడా బాగానే ఉంది, నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను. కానీ గత కొన్ని రోజులుగా నాకు చాలా సాడ్ ఫీలింగ్ వస్తోంది. మాటిమాటికి కళ్లలో నీళ్లు వస్తున్నాయి, బేబీతో ఆడుకోవాలని కూడా అనిపించడం లేదు. ఒంట్లో బలహీనంగా అనిపిస్తోంది. ఇది సాధారణమేనా?– లావణ్య, కడప.డెలివరీ తర్వాత కొంతమంది మహిళల్లో ఇలా సడెన్గా సాడ్ ఫీలింగ్ రావడం, ఏడుపు రావడం, బలహీనంగా అనిపించడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సాధారణంగా ‘పోస్ట్పార్టమ్ బ్లూస్’ అంటారు. డెలివరీ అయిన తర్వాత మొదటి రెండు నుంచి మూడు వారాల వరకు సుమారు 70 నుంచి 80 శాతం మహిళల్లో ఈ మార్పులు కనిపించడం సాధారణమే. ఇది ఎక్కువగా జీవనశైలిలో ఒక్కసారిగా వచ్చే మార్పుల వల్ల జరుగుతుంది. డెలివరీ తర్వాత తల్లి పూర్తిగా కోలుకోకముందే ప్రతి రెండు గంటలకు లేచి బిడ్డను చూసుకోవడం, పాలివ్వడం వంటి బాధ్యతలు పెరుగుతాయి. అలాగే శరీరంలో హార్మోన్ మార్పులు కూడా ఈ భావోద్వేగ మార్పులకు కారణం అవుతాయి. సాధారణంగా ఈ బేబీ బ్లూస్ రెండు వారాల లోపే తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయం, కొద్దిగా ప్రోత్సాహం, సరైన విశ్రాంతి, సపోర్ట్ ఉంటే ఎక్కువగా ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే సమస్య సద్దుమణుగుతుంది. అయితే కొంతమందిలో ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే దాన్ని ‘పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ అంటారు. ఇది భారతదేశంలో దాదాపు 10 నుంచి 25 శాతం మహిళల్లో కనిపించే సమస్య. దీనికి ప్రధాన కారణాలు హార్మోన్ మార్పులు, ముందుగా ఉన్న ఆందోళన లేదా డిప్రెషన్ సమస్యలు, డెలివరీ సమయంలో ఎదురైన ఒత్తిడి లేదా కుటుంబంలో సరైన సపోర్ట్ లేకపోవడం వంటి అంశాలు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి చాలా లో మూడ్లో ఉండటం, బిడ్డపై ఆసక్తి తగ్గడం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, చిరాకు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులు తల్లి ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పులను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. డాక్టర్ను సంప్రదిస్తే కొన్ని ప్రత్యేక ప్రశ్నల ద్వారా ఈ సమస్యను సులభంగా గుర్తించవచ్చు. అవసరమైతే కౌన్సెలింగ్, సైకాలజికల్ థెరపీ వంటి చికిత్సలు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా మందులు కూడా ఇవ్వవచ్చు. ఈ మందులు సాధారణంగా తల్లి పాలిచ్చే సమయంలో కూడా సురక్షితంగా వాడేలా ఉంటాయి. సరైన చికిత్స, కుటుంబ సభ్యుల ప్రేమ, సహాయం, ప్రోత్సాహం ఉంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. డా. కప్పగంతుల అపర్ణ , సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ ∙(చదవండి: ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే.. -
మారిన పేరు..ఏడేళ్లు జైలు శిక్ష
పేరు మనిషికి గుర్తింపునిస్తుంది. అదే పేరు తారుమారై, తప్పుగా నమోదైతే? గుర్తింపు సరిగా లేకపోతే ఏమౌతుంది? జీవితం నాశనమై, కుటుంబం కకావికలం అవుతుంది. మహారాష్ట్రలో ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఏడేళ్ల జైలు శిక్షకు కారణమైంది. కుటుంబానికి దూరం చేసింది. ‘పదిమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. కాని, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’ అనేది ప్రాథమిక న్యాయసూత్రం. అయితే కొన్ని సందర్భాల్లో విచారణలో పొరపాట్లు జరిగి నిర్దోషులు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. అలాంటి సంఘటనలు అరుదు. వాటి ప్రభావం బాధితుల జీవితాలపై తీవ్రంగా ఉంటుంది. ఈ తరహా ఘటనలో ఓ వ్యక్తి అత్యాచారం కేసులో నిందితుడిగా సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించాడు. తరువాత అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. తనకు జరిగిన అన్యాయానికి రూ. 200 కోట్లు పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. కేసు నమోదు..శిక్ష ఖరారుమహారాష్ట్రలోని ఘట్కోపర్ రైల్వే స్టేషన్ వంతెనపై ఓ మహిళ నిద్రిస్తోంది. తెల్లవారుజామున ఓ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేసిన వ్యక్తి పేరు ‘గోపి’ అని పేర్కొంది. పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించారు. కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. న్యాయమూర్తి దోషిగా తేల్చారు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 400 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో నెల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని 2010లో తుది తీర్పు వెలువరించారు.నిర్దోషి అని తేలింది.. కానీబాధితురాలు చెప్పిన వ్యక్తి, పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ఒకరేనా? నిందితుడి గుర్తింపులో పొరపాటు జరిగిందా? అనే సందేహాలు హైకోర్టు విచారణ సందర్భంగా వెల్లువెత్తాయి. బాధిత మహిళ తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి పేరు‘గోపి’ అని చెప్పింది. కానీ పోలీసులు అరెస్ట్ చేసింది గోపాల్ని. ‘ఈ కేసుకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, గుర్తింపులో పొరపాటు జరిగిందని’ గోపాల్ పేర్కొన్నాడు. ట్రయల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాడు. అది పెండింగ్లో ఉండగా, బెయిల్ కోసం అభ్యర్థించాడు. కోర్టు తిరస్కరించింది. దీంతో జైలులోనే గడపాల్సి వచ్చింది. చివరికి హైకోర్టులో అప్పీలు పిటిషన్ విచారణకు వచ్చింది. నిందితుడి గుర్తింపును ప్రాసిక్యూషన్ సరైన విధంగా చేయలేదని హైకోర్టు తెలిపింది. ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసి, గోపాల్ను నిర్దోషిగా ప్రకటించింది. తప్పు చేయలేదని తేలినా, అప్పటికే కాలం కరిగిపోయింది. ఏడేళ్లు గడిచిపోయింది. శిక్షా కాలం పూర్తయిపోయింది. పరిహారం కోసం పోరాటం‘నాపై తప్పుగా కేసు నమోదు చేశారు. ఏడేళ్లపాటు అన్యాయంగా కారాగారంలో బంధించారు. నా జీవితం నాశనం అయింది. నేను జైలుకు వెళ్లడంతో నా భార్య నన్ను వదిలి వెళ్లిపోయింది. మనోవేదనతో నా తండ్రి చనిపోయాడు. పిల్లలు అనాథశ్రమంలో చేరాల్సి వచ్చింది. నా ఉద్యోగాన్నీ కోల్పోయాను. కావున నాకు రూ. 200 కోట్లు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని గోపాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో తాత్కాలిక పరిహారంగా రూ. 100 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించాడు. తనను అన్యాయంగా కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ వ్యవహారంపై సీబీఐతో పునర్విచారణ జరిపించాలని పేర్కొన్నాడు. అతడ్ని అన్యాయంగా నిర్బంధించిన కారణంగా స్వేచ్ఛను కోల్పోయాడని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుకు ఇది విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ను హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడం వాస్తవమే కానీ, పరిహారం ఇవ్వాల్సిన పరిస్థితులు లేవని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కేసు నమోదు చేయడంలో పిటిషనర్పై దర్యాప్తు అధికారులకు ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. కోర్టు తీర్పు ఇలా..తనను ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులో ఇరికించారని పిటిషనర్ ఆరోపించారు. కానీ దురుద్దేశం ఉందని ఎక్కడా నిరూపించ లేకపోయారని కోర్టు పేర్కొంది. అతడ్ని కేసులో ఇరికించడానికి దర్యాప్తు అధికారులు, ఇతర సాక్షులు ప్రయత్నించారని అనడానికి కారణాలు కనిపించలేదు. కేవలం నిర్దోషిగా విడుదలయ్యాడనే కారణంతో పరిహారం కోరడం సరైంది కాదు’ అని కోర్టు అభిప్రాయపడింది. పబ్లిక్ లా కింద పరిహారం ఇవ్వడానికి తగిన ఆధారాలు లేవని తేల్చింది. ఈ కేసులో నిందితుడి విడుదల ‘తప్పు నిరూపించ లేకపోవడం వల్ల మాత్రమే జరిగింది. తప్పుడు కేసులో కావాలనే ఇరికించారని నిరూపణ కాలేదని పేర్కొంది. పిటిషనర్ కోరిన అభ్యర్థనకు చట్టపరంగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏడేళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదలైన వ్యక్తి పట్ల కోర్టుకు సానుభూతి ఉన్నా, చట్టపరంగా పరిశీలిస్తే అతని ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టు ఎక్కడా నిరూపించుకోలేకపోయాడని కోర్టు పేర్కొంది. పరిహారం చెల్లించాలని ప్రతీ కేసులో చెప్పలేమని, అది పూర్తిగా కేసు పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఈ కేసులో స్పష్టంగా తేల్చింది. పిటిషనర్కు ఎలాంటి పరిహారం లేదా ఉపశమనం ఇవ్వకుండా పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. దిలీప్ మాదిరెడ్డి(చదవండి: బొమ్మజెముడు పొద మీద నెత్తుటి మరక!) (చదవండి: ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే..) -
విశ్వానికి ఏడు డైమెన్షన్లు!
బయటికి బయల్దేరారు. మీ కారు ‘కీ’స్ కనిపించలేదు! లేదా, టీవీ ఆన్ చే శారు. రిమోట్ కనిపించలేదు! ‘కీ’స్ కోసం, రిమోట్ కోసం ఇంట్లో అవి ఉండే చోటంతా వెతికారు. కానీ కనిపించలేదు! ఇల్లంతా గాలించారు, అయినా కనిపించలేదు! కీస్ కానీ, టీవీ రిమోట్ గానీ అంతలా ఎలా మాయం అయినట్లు?! సరే.. ఇంట్లోంచే కాదు, ఈ విశ్వంలోనే మీ కారు తాళాలు, టీవీ రిమోట్ అదృశ్యం అయ్యాయనే అనుకుందాం. అప్పుడు అవి ఏ జగత్తులలోకి వెళ్లిపోయినట్లు?ఈ ప్రశ్నకు భౌతికశాస్త్రం (సాధారణ ఫిజిక్స్) ఏమంటుందంటే – ఇక అవి పోయినట్లేనని! అదే క్వాంటమ్ ఫిజిక్స్ అయితే, ‘‘ఎక్కడికీ పోవు. ఎక్కడికి పోయాయో ఆ సమాచారాన్ని కనిపెడితే అవి ఎక్కడున్నాయో తెలుస్తుంది’’ అంటుంది! ‘‘లేనివి ఎలా ఉంటాయి?’’ అని సాధారణ ఫిజిక్స్ అంటే.. ‘‘లేకుండా ఎలా పోతాయి?’’ అని క్వాంటమ్ ఫిజిక్స్ అంటుంది! గత యాభై ఏళ్లుగా రెండిటి మధ్యా ఇదే ఘర్షణ. అయితే ఇప్పుడా మహా శాస్త్ర యుద్ధం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లే ఉంది. తాజాగా శాస్త్రవేత్తలు ఈ విశ్వానికి మరో మూడు కొత్త డైమెన్షన్లు ఉన్నట్లు కనిపెట్టటమే అందుకు కారణం. ఏ థియరీ కరెక్ట్?! క్వాంటమ్ ఫిజిక్స్ థియరీనే కరెక్ట్ అంటున్నారు ‘స్లోవాక్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్’ సీనియర్ శాస్త్ర పరిశోధకులు రిచర్డ్ పిన్కాక్! ‘‘ఆ విషయం మీరెలా చెబుతారు?’’ అని ఆయన్ని అడిగితే, ఈ విశ్వంలో ఉన్నవి ఇప్పటి వరకు మనమంతా అనుకుంటున్నట్లు 4 డైమెన్షన్లు మాత్రమే కాదు, మరో మూడు డైమెన్షన్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా కలుపుకుని చూస్తే, అదృశ్యమైపోయిన వస్తువును కూడా, అంజనం వేయకుండానే అది ఎక్కడుందో కనిపెట్టవచ్చు’’ అని పిన్కాక్ చెబుతున్నారు!ఆ నాలుగు.. ఈ మూడుభారత జాతీయ చిహ్నంలో మూడు సింహాలు కనిపిస్తూ ఉంటాయి. వాటితో పాటుగా, ‘కనిపించని నాలుగో సింహం’ కూడా, ఆ వెనుక వైపు ఉంటుంది. అదే విధంగా ఈ విశ్వానికి నాలుగు డైమెన్షన్లు ఉన్నాయి. అంటే నాలుగు కొలమానాలు. అవి : పొడవు, వెడల్పు, ఎత్తు/లోతు, సమయం. అయితే ఈ నాలుగే కాకుండా, కనిపించని మరో మూడు కొలమానాలు కూడా ఉన్నాయని తాజాగా పిన్కాక్ ప్రకటించారు! ఆ మూడు కొలమానాలు ఇచ్చే సమాచారాన్ని బట్టి వస్తువు ఎక్కడ ఉండి ఉంటుందో కనిపెట్టొచ్చని చెబుతున్నారు. అంటే, సాధారణ ఫిజిక్స్ భావిస్తున్నట్లు ‘సమాచారం’ అన్నది లుప్తమైపోదు. క్వాంటమ్ ఫిజిక్స్ భావిస్తున్నట్లు ‘సమాచారం’ నిగూఢంగా ఉండిపోతుంది’!మెలిక, ముడి, బాహ్య బలంకొత్తగా శాస్త్ర పరిశోధకులు కనిపెట్టిన అదనపు డైమెన్షన్లు ఈ మూడూ! ఇవి పొరలుగా మడత పడి ఉంటాయి కనుక పైకి కనిపించవని, వాటి లోపలికి వెళ్లి చూడగలిగితే అదృశ్యమైపోయిన వస్తువు తాలూకూ సమాచారం (అద్కెడుందో, ఎలా ఉందో..) తెలుస్తుందని పిన్కాక్ బృందం భావిస్తోంది. సైన్స్ చరిత్రలో ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న ‘ఇన్ఫర్మేషన్ పారడాక్స్’ అనే పెద్ద చిక్కుముడిని విప్పడానికి ఈ ఏడు (ఇప్పటికే ఉన్న 4, కొత్తగా కనిపెట్టిన 3) డైమెన్షన్ల తాజా సిద్ధాంతం ఉపయోగపడుతుందని వారు విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా, బ్లాక్ హోల్స్ (కృష్ణ్ల బిలాలు) అంతమైపోయేటప్పుడు ఏం జరుగుతుందో ఈ థియరీ వివరిస్తుందట! మనమున్నది త్రీడీ ప్రపంచంసాధారణంగా మనం దేనినైనా త్రీ–డైమెన్షనల్ (త్రీడీ) లోనే చూడగలం. అసలు మనం నివసిస్తున్న ప్రపంచమే త్రీడీ ప్రపంచం. ఒక వస్తువు స్థానాన్ని, రూపాన్ని చెప్పటానికి ఉపయోగించే 1. పొడవు, 2. వెడల్పు, 3. ఎత్తు లేదా లోతుల కొలమానాలు అవి. అల్బర్ట్ ఐన్స్టీన్ ఈ మూడు కొలమానాలకు ‘సమయం’ అనే కొలతను జోడించటంతో త్రీడీ కాస్తా 4డీ అయింది. ‘‘మీరు ఒక స్నేహితుడిని కలవాలనుకున్నప్పుడు అతడి ఉనికి (స్థలం)తో పాటుగా అతడిని ఏ సమయంలో కలవాలనుకుంటున్నదీ ముఖ్యం అవుతుంది. అంటే స్థలం, కాలం విడదీయలేవి..’’ అంటారు ఐన్స్టీన్. అందుకే ఇది త్రీడీ కాదు, 4డీ ప్రపంచం అని ఆయన సిద్ధాంతం.హాకింగ్ వల్లే ‘ఫిజిక్స్ వార్’గతంలో శాస్త్రవేత్తలు, బ్లాక్ హోల్స్ అంటే అన్నీ మింగేసే శూన్య ప్రదేశాలని, వాటిలో పడిపోయినదేదీ ఇక బయటకు రాలేదని అనుకునేవారు. ఆ భావనను సమర్థించే విధంగా 1970లో స్టీఫెన్ హాకింగ్, బ్లాక్ హోల్స్ నుండి రేడియేషన్ వస్తుందని, ఆ ప్రభావంతో కాలక్రమేణా ఆ బ్లాక్హోల్స్ ఉనికే లేకుండా (సమాచారం లేకుండా) ఆవిరైపోతాయని ప్రతిపాదించారు. అయితే క్వాంటమ్ ఫిజిక్స్ నియమాల ప్రకారం ఏ సమాచారం కూడా పూర్తిగా నాశనం కాకూడదు. మరి బ్లాక్ హోల్ ఆవిరైపోతే అందులోని సమాచారం ఏమవుతుంది? దానికి సమాధానమే ఈ ఏడు డైమెన్షన్ల థియరీ అంటున్నారు పిన్కాక్. ‘మంటల్లో పుస్తకం’.. మంచి ఉదాహరణ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఏ సమాచారమూ పూర్తిగా నశించదు అనేందుకు పరిశోధకుడు రిచర్డ్ పిన్కాక్ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. మీరు ఒక పుస్తకాన్ని మంటల్లో వేశారనుకోండి. ఆ పుస్తకం కాలిపోతుంది. కానీ సిద్ధాంతపరంగా, ఆ మంటల నుండి వచ్చిన పొగ, బూడిద, వేడిని పరిశీలిస్తే.. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరాన్ని మనం తిరిగి సేకరించవచ్చు అంటారు పిన్కాక్! పుస్తకాన్ని పునర్నిర్మించటానికి అగ్ని నుండి వెలువడిన ప్రతి కాంతి రేణువును, గాలిలోని ప్రతి కంపనాన్ని (వేడిని), మసిలోని ప్రతి రేణువు కచ్చితమైన స్థానాన్ని గుర్తించగలిగితే అది సాధ్యమేనంటారు పిన్కాక్. దానర్థం, సమాచారం రూపు మారుతుంది తప్ప, పూర్తిగా నిర్మూలన జరగదని. ఎలా నిరూపించగలం?ఒకవేళ ఈ ఏడు కొలతల సిద్ధాంతం నిజమే అయితే, మనం ‘కాలుజా–క్లీన్ పార్టికల్స్’ అనే ప్రత్యేక కణాలను గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఇవి మనకు తెలిసిన భారీ కణాల కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అతిపెద్ద యంత్రం ‘లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్’ సామర్థ్యం కూడా వీటిని కనిపెట్టడానికి సరిపోదు. అయితే విశ్వం పుట్టినప్పుడు వెలువడిన కిరణాల (కాస్మిక్ మైక్రోవేవ్ రేడియేషన్) ద్వారా లేదా స్పేస్టైమ్లోని ఆదిమ గురుత్వాకర్షణ తరంగాల ద్వారా వీటి జాడను కనుగొనే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సాంకేతికత ఇందుకు సరిపోదు. కాబట్టి, ఈ సిద్ధాంతం ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఇది ఒక పరిశోధన స్థాయిలోనే ఉంది. దీనిని నిరూపించాలంటే మనం మరికొంత కాలం వేచి చూడాలి.∙ సాక్షి స్పెషల్ డెస్క్బ్లాక్హోల్ ‘మెమరీ చిప్’తాజా పరిశోధకుల సిద్ధాంతం ప్రకారం, ఒక బ్లాక్ హోల్ సాధ్యమైనంత సూక్ష్మ పరిమాణాలకు ఆవిరైపోతున్నప్పుడు, దాని ఏడు డైమెన్షన్లు ప్రాథమికంగా ఒక ముడిలా చిక్కువడిపోతాయి. ఆ ముడి తగినంత చిన్నదిగా మారినప్పుడు, ఈ దాగి ఉన్న డైమెన్షన్లు ముడుచుకోవటం వల్ల ఒక బాహ్య బలం (బయటి నుంచి లోపలికి నెట్టే శక్తి) ఏర్పడి అది బ్లాక్హోల్ పూర్తిగా కూలిపోకుండా నిరోధిస్తుంది. చివరికి అక్కడ ఒక అతి సూక్ష్మమైన పదార్థం మిగిలిపోతుంది. ఇది ఒక ఎలక్ట్రాన్ కన్నా 1000 కోట్ల రెట్లు చిన్నది. ఇది చూడడానికి ఏమీ లేనట్టు అనిపించినా, ఆ ‘మెలిక పడిన ముడి’ లోపల బ్లాక్ హోల్ మింగేసిన సమాచారం అంతా భద్రంగా ఉంటుంది. అంటే, సమాచారం ఎక్కడికీ పోలేదు! ఒక చిన్న జ్ఞాపకంలా ఆ ఏడు కొలతల ‘మెమరీ చిప్’ ముడిలో దాగి ఉంటుందన్నమాట.విశ్వానికి ‘టార్షన్ ఫీల్డ్’ మెలిక మూడు అదనపు కొలమానాలైన మెలిక, ముడి, బాహ్య బలాల ఉనికిని నిరూపించటానికి రిచర్డ్ పిన్ కాక్ ‘స్పేస్టైమ్’ (స్థలం–సమయం) నిర్మాణాన్ని కొత్త కోణంలో చూశారు. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం స్పేస్టైమ్ అనేది ఒక నాలుగు కొలతల షీట్ (చాప) లాంటిది. అది వంగగలదు, సాగగలదు. అయితే తాజా సిద్ధాంతం ప్రకారం, ఈ స్పేస్టైమ్లో ఏడు కొలతలు ఉన్నాయి. మనకు కనిపించని ఆ మూడు అదనపు కొలతల్ని పట్టుకోగలిగితే బ్లాక్ హోల్స్లో సమాచారం ఎలా దాగి ఉంటుందో వివరించడం సాధ్యమవుతుంది అంటారు పిన్కాక్! ఈ సిద్ధాంతం ప్రకారం ఏం జరుగుతుందో చూడండి. ‘స్పేస్టైమ్’ (నాలుగు కొలతల ఏకీకృత నిర్మాణం) వల్ల ఈ విశ్వం వంగే గుణాన్ని, సాగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ మూడు అదనపు కొలమానాలలో ఒకదాని వల్ల అది ‘మెలిక’ కూడా పడుతుంది. దీనినే శాస్త్రవేత్తలు ‘టార్షన్ ఫీల్డ్’ అని పిలుస్తున్నారు. బ్లాక్హోల్స్ అదృశ్యమైనట్లు కనిపించినప్పుడు అక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవటానికి ఈ టార్షన్ ఫీల్డ్ ఉపయోగపడుతుంది. కృష్ణబిలాలు అదృశ్యం కాకుండా, ఎంతగానో కుంచించుకుపోతాయి. వాటి అంతర్గత డైమెన్షన్లు ముడివడి, మెలిక తిరిగి ఒక ఆకారాన్ని ఏర్పరుస్తాయి. దాంతో సమాచారం అంతా ఒక చిన్న శాశ్వత చిహ్నంలా ఎప్పటికీ దానిని పట్టుకునే ఉంటుంది. విశ్వానికి ఏడు డైమెన్షన్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు! ఇప్పటికే ఉన్న పొడువు, వెడల్పు, ఎత్తు / లోతు, కాలం అనే నాలుగు డైమెన్షన్లతో పాటుగా, ‘దాగి ఉన్న’ పొరల్లాంటి డైమెన్షన్లు మరో మూడు కూడా ఉన్నాయని, అవి ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయని వారు భావిస్తున్నారు. -
ఇరవై రూపాయలు.. నిండు జీవితం
ఇరవై రూపాయలు... మనం చేసే రోజువారీ ఖర్చులో తెలియకుండానే ఖర్చయిపోతుంది. కానీ, అదే ఇరవై రూపాయలు ఓ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టింది. కోర్టుల చుట్టూ తిప్పింది. అవినీతిపరుడని ముద్ర వేసింది. ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసింది. అయినా తట్టుకున్నాడు. న్యాయం కోసం కళ్లు కాయలు కాసేలా చూశాడు. ఏడాదో, రెండేళ్లో కాదు– ఏకంగా 30 ఏళ్లు. చివరికి ఫలితం వచ్చింది. ‘నేను ఏ తప్పు చేయలేదు’ అని మొదటి నుంచి అతడు చెబుతున్నదే నిజమైంది. నిర్దోషిగా బయటపడాలనే అతని కోరిక తీరింది. కానీ∙ఆ సంతోషం, సంబరం ఎక్కువ సేపు నిలవలేదు. తీర్పు వచ్చిన తెల్లారే అతని గుండె ఆగిపోయింది. అదే అతడికి చివరి రోజు అయింది. ఓ కానిస్టేబుల్ న్యాయపోరాటం కన్నీటి గాథగా మిగిలింది. బాబూభాయ్ ప్రజాపతి అహ్మదాబాద్లోని వేజల్పూర్కు చెందిన ఓ కానిస్టేబుల్. రూ.20 లంచం తీసుకున్నాడని అతనిపై ఆరోపణ. సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ తీర్పుపై ప్రజాపతి హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాడు. సుమారు 22 ఏళ్ల పాటు అక్కడ కేసు నడిచింది. చివరికి తీర్పు వెలువడింది. హైకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అసలేం జరిగింది?1996లో ఓ ట్రక్కు డ్రైవర్ ఫిర్యాదుతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్నారు. ట్రక్కు డ్రైవర్కు ఫినాల్ఫ్తేలీన్ పౌడర్ పూసిన నోట్లను ఇచ్చారు. ఆ నోట్లు ప్రజాపతి చేతిలో ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం తీసుకున్నాడని కేసు నమోదు చేశారు. నాలుగేళ్లు జైలు శిక్షఅహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో 1997లో చార్జిషీట్ దాఖలైంది. కోర్టులో కేసు విచారణ జరిగింది. తనకేమీ తెలియదని, కేసులో అన్యాయంగా ఇరికించారని, బలవంతంగా తన చేతులో డబ్బులు పెట్టారని ప్రజాపతి వాపోయాడు. తనను నిర్దోషిగా ప్రకటించాలని కోర్టుకు విన్నవించాడు. వాదోపవాదాల తర్వాత ప్రజాపతిని కోర్టు దోషిగా నిర్ధారించింది. నాలుగేళ్లు కఠిన కారాగార శిక్ష, మూడువేలు జరిమానా విధించింది. హైకోర్టుకు అప్పీలుసెషన్స్ కోర్టు తీర్పుపై ప్రజాపతి హైకోర్టులో అదే ఏడాది అప్పీలు చేశాడు. ఏళ్ల తరబడి పెండింగ్ తర్వాత కేసు విచారణ మొదలైంది. అప్పీలుదారు తరపు న్యాయవాది నితిన్ గాం«ధీ కేసు విశ్వసనీయత, సాక్షుల వాంగ్మూలాల్లో వైరుధ్యాలపై పలు ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తారు. నిర్దోషిగా తీర్పువిచారణ సందర్భంగా కేసులోని పలు లోపాలను హైకోర్టు గుర్తించింది. డబ్బులు డిమాండ్ చేశారనే దానికి ఆధారాలు చూపలేదని పేర్కొంది. అభి యోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించ లేదని ప్రజాపతిని నిర్దోషిగా ప్రకటిస్తూ కేసు కొట్టేసింది. సంతోషం..విషాదంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ప్రజాపతి తన న్యాయవాది నితిన్ గాంధీని ఆయన కార్యాలయంలో కలుసుకున్నాడు. నిర్దోషిగా బయటపడినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ‘నాపై పడిన మచ్చ తొలగింది. ఇక ఆ దేవుడు పిలిచినా సంతోషంగా వెళతాను’ అన్నాడు. ఆ రోజు గడిచింది. కానీ ప్రజాపతికి అదే ఆఖరి రోజైంది. నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని, అది సహజ మరణ మని అతని న్యాయవాది వెల్లడించాడు. న్యాయం కోసం జీవితమంతా పోరాడాడు. గెలిచిన సంతోషం ఒక్కరోజే మిగిలింది. మరికొన్ని రోజులైనా జీవిస్తే బాగుండేది. లేదా న్యాయం అయినా ముందే దక్కి ఉండాల్సిందని బంధువులు వ్యాఖ్యానించారు.-దిలీప్ మాదిరెడ్డి -
ప్రెగ్నెన్సీ 7వ నెలలో వైట్ డిశ్చార్జ్.. సమస్యేనా?
నాకు ఇరవై ఐదు సంవత్సరాలు. నాకిది రెండో ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఏడవ నెల. గత కొన్ని రోజులుగా యోనిలో ఎక్కువగా తెల్లటి డిశ్చార్జ్ కనిపిస్తోంది. కొన్నిసార్లు దురద కూడా ఉంది. ఇది పెద్ద సమస్యేనా? – రమ్య, నెల్లూరు.గర్భధారణ సమయంలో యోనిలో తెల్లటి డిశ్చార్జ్ కనిపించడం చాలా సాధారణం. గర్భధారణలో శరీరంలో హార్మోన్ మార్పులు ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి పెరగడం వల్ల యోని స్రావం కూడా కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. ఇది సాధారణ ప్రక్రియ. ఈ డిశ్చార్జ్ యోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడంలో, హానికరమైన ఇన్ఫెక్షన్లు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఆరోగ్యకరమైన డిశ్చార్జ్ తెలుపు లేదా పారదర్శకమైన రంగులో ఉంటుంది. పలుచగా లేదా కొద్దిగా జిగురుగా ఉంటుంది. తేలికపాటి వాసన లేదా వాసన లేకుండా ఉంటుంది. దురద, మంట లేదా అసౌకర్యం లేకుండా ఉంటుంది. గర్భధారణ ముందుకు సాగేకొద్దీ ఇది కొంచెం ఎక్కువగా కనిపించడం సహజమే. అయితే మీరు చెప్పినట్లుగా డిశ్చార్జ్తో పాటు దురద కూడా ఉంటే, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియా అసమతౌల్యం వంటి చిన్న సమస్యల సంకేతం కావచ్చు. సాధారణంగా ఇవి సులభంగా చికిత్సతో తగ్గిపోతాయి. బలమైన దుర్వాసన రావడం, చేప వాసనలాగా ఉండటం. పసుపు, ఆకుపచ్చ లేదా బూడిద రంగులో మారడం. ముద్దలాగా గట్టిగా ఉండటం. తీవ్రమైన దురద, మంట లేదా ఎర్రదనం ఉండటం. ఒక్కసారిగా ఎక్కువగా నీళ్లలాగా కారడం. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు చేసి, అవసరమైతే సరైన మందులు ఇస్తారు. గర్భధారణలో స్వయంగా మందులు వాడటం మంచిది కాదు. డాక్టర్ సలహాతో మాత్రమే చికిత్స తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్లు నివారించడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. యోని బయట భాగాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి. లూజుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఆ ప్రాంతంలో ఎక్కువగా సబ్బులు, వాష్లు లేదా పౌడర్లు వాడకూడదు. డాక్టర్ సలహా లేకుండా క్రీములు లేదా మందులు కూడా వాడకూడదు. సాధారణంగా ఇది చిన్న సమస్యే అయినా, మీరు 7 నెలల గర్భంతో ఉన్నందున ఒకసారి డాక్టర్ను కలసి చెక్ చేయించుకుంటే మరింత మంచిది.ప్రసవ నొప్పులేనా? నేను 36 వారాల గర్భిణిని. ఇది నా మొదటి గర్భం. కొన్నిసార్లు పొత్తికడుపు గట్టిగా పట్టేయటం, పీరియడ్స్లా నొప్పులు వస్తున్నాయి. కొన్ని నిమిషాల్లో అవి మామూలుగా మారిపోతాయి. ఇవి ప్రసవ నొప్పులేనా? – స్వాతి, విజయనగరం.మీరు 36 వారాల గర్భంతో ఉన్నప్పుడు పొత్తికడుపు కొన్నిసార్లు గట్టిపడటం లేదా పీరియడ్స్లా నొప్పులు రావడం చాలా సాధారణం. కొన్ని నిమిషాల్లో తగ్గిపోతే అవి నిజమైన ప్రసవ నొప్పులు కావు. నిజమైన ప్రసవానికి ముఖ్యమైన లక్షణం గర్భాశయ సంకోచాలు క్రమంగా రావడం. ఇవి తప్పుడు నొప్పుల కంటే భిన్నంగా ఉంటాయి. మొదట కొద్దిగా ప్రారంభమై, తర్వాత సమయం గడిచేకొద్దీ మరింత బలంగా, ఎక్కువసేపు కొనసాగుతాయి. విశ్రాంతి తీసుకున్నా తగ్గవు. ఒక సులభమైన నియమం ఏమిటంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి నొప్పి రావడం, ప్రతి నొప్పి కనీసం ఒక నిమిషం పాటు కొనసాగడం, ఈ పరిస్థితి దాదాపు ఒక గంట పాటు ఉండటం. ఇలా జరిగితే మీరు ఆసుపత్రికి వెళ్లాలి. మరొక ముఖ్యమైన సంకేతం నీరు కారడం. అంటే ఒక్కసారిగా ఎక్కువగా ద్రవం రావడం లేదా నెమ్మదిగా నిరంతరం కారడం అనిపించవచ్చు. ఆ ద్రవం సాధారణంగా పారదర్శకంగా ఉంటుంది. ఒకసారి నీరు కారితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. కొన్నిసార్లు గులాబీ రంగులో లేదా కొద్దిగా రక్తం కలిసిన మ్యూకస్లా డిశ్చార్జ్ కనిపిస్తే ప్రసవం త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అలాగని వెంటనే డెలివరీ జరుగుతుందని చెప్పలేం.ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి: ∙ఎక్కువగా రక్తస్రావం కావడం ∙తీవ్రమైన పొత్తికడుపు నొప్పి ఉండటం ∙బిడ్డ కదలికలు తగ్గిపోవడం లేదా ఆగిపోవడం. ∙ఎక్కువ జ్వరం రావడం ∙తీవ్రమైన తలనొప్పి లేదా చూపు మసకబారడం ∙ముఖం లేదా చేతులు ఒక్కసారిగా ఉబ్బడం ∙మొదటిసారి గర్భిణులలో ప్రసవం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కానీ నొప్పులు క్రమంగా, దగ్గర దగ్గరగా వస్తూ బలంగా మారితే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లడం మంచిది. ∙ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండటం మంచిది. మీకు ఏదైనా కొత్త లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం సురక్షితం. -
మాయమైన హారం
పెళ్లి పందిరంతా పూల వాసనలు, బాజాభజంత్రీలతో సందడిగా ఉంది. కానీ పెళ్లి కూతురు దివ్య ముఖంలో మాత్రం కళ లేదు. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, పెళ్లి కొడుకు మదన్ ప్రవర్తన ఏదో తేడాగా ఉందని తన స్నేహితురాలు, లేడీ డిటెక్టివ్ సుగాత్రికి ముందే చెప్పింది.‘కట్నం అక్కర్లేదు. అబ్బాయికి పెద్ద బిజినెస్ వుంది. అందగాడు’... మధ్యతరగతి తండ్రి ఆలోచన... అందుకే కూతురిని బలవంతంగా పెళ్లికి ఒప్పించాడు.పెళ్లి ముహూర్తానికి సరిగ్గా గంట ముందు ఒక్కసారిగా పెళ్లి మండపంలో కలకలం మొదలైంది.పెళ్ళికి వచ్చిన కనకం మెడలోని కోటి రూపాయల విలువైన వజ్రాలహారం మాయమైంది. పెళ్లి పెద్దలు కంగారు పడుతుంటే, సుగాత్రి లోపలికి అడుగు పెట్టింది.దివ్య తండ్రిలో ఆందోళన. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఈ అపశకునం ఏమిటని...?పోలీసులు పెళ్లి మండపాన్ని చుట్టుముట్టారు. అన్ని గదులూ వెతికారు.పెళ్ళికొడుకు రూమ్ మిగిలి వుంది. దివ్య తండ్రి అడ్డు చెప్పబోయాడు. ‘కాబోయే అల్లుడిని సోదా చేస్తే బాగుండద’ని...సుగాత్రి నచ్చచెప్పింది. పెళ్ళికొడుకు గది సోదా చేస్తే తను క్లీన్ చిట్తో బయటకు వస్తాడని చెప్పింది.మదన్ రూమ్ అణువణువూ వెతికారు. ఎక్కడా హారం దొరకలేదు.పెళ్ళికొడుకు మదన్ సీరియస్ అయ్యాడు. ‘అసలు హారం పోయిందో నాటకం ఆడుతున్నారో’ అంటూ అరిచాడు.‘‘నిజమే హారం పోలేదు కానీ, దొంగ దొరికాడు.’’ అంది సుగాత్రి. ‘‘అదెలా?’’ ఆశ్చర్యంగా అడిగాడు మదన్.‘‘హారం పోతే రికవరీ చేసుకోవచ్చు.. కానీ జీవితం పోతేనో?’’... అంటూ సుగాత్రి మదన్ సూట్కేస్ తెరిచి, అందులో ఉన్న రహస్య అరను పగులగొట్టింది. అందులో వేర్వేరు దేశాల పాస్పోర్టులు, వివిధ పేర్లతో ఉన్న ఐడీ కార్డులు బయటపడ్డాయి.‘‘ఇప్పుడేమంటావ్ మిస్టర్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ మదన్?’’ అంటూ పెళ్లికి వచ్చిన అందరి వైపు, దివ్య తండ్రి వైపు చూసి, ‘‘ఇతడు అంతర్జాతీయ స్థాయిలో పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేసే మ్యారేజ్ ఫ్రాడ్. గతంలో ముగ్గురు అమ్మాయిలను ఇలాగే పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిలను అమ్మేసి పరారయ్యాడు. చాలా చోట్ల ఇతని మీద కేసులు వున్నాయి. మధ్యతరగతి అమ్మాయిలే ఇతడి టార్గెట్. కూతురు పెళ్ళైతే చాలు, అనుకునే మధ్యతరగతి తల్లిదండ్రుల బలహీనతలను, ఆశలను క్యాష్ చేసుకునే ఘరానా మోసగాడు ఇతను. నిజానికి హారం పోలేదు. కానిస్టేబుల్ కనకంతో నేను ఆడించిన నాటకం.దివ్య పెళ్ళికొడుకు మీద అనుమానం వ్యక్తం చేయడంతో మదన్ ఫోటోను డేటాబేస్లో చెక్ చేశాను. ఇతని నేరాలు ఒక్కొక్కటిగా బయట పడ్డాయి. ఒక్కోచోట ఒక్కో పేరుతో మోసాలు చేస్తాడు.’’ చెప్పింది లేడీ డిటెక్టివ్ సుగాత్రి.మదన్ను పోలీసులు అరెస్టు చేశారు.‘‘నాలాంటి మధ్య తరగతి తల్లిదండ్రుల కళ్ళు తెరిపించావు తల్లీ! బిడ్డ పెళ్ళైతే చాలు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి’... చేతులు జోడించి చెప్పాడు దివ్య తండ్రి.‘‘థాంక్యూ మై ఫ్రెండ్ లేని హారాన్ని పోయిందని చెప్పి ఆధారాలు దొరక్కుండా తప్పించుకుంటున్న నేరస్తుడిని పట్టుకుని... నా జీవితాన్ని నాలాంటి అమ్మాయిల జీవితాలను కాపాడావు’’ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది దివ్య.‘‘మ్యాట్రిమోనీలలో సంబంధాలు చూసేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి. అబ్బాయిల ఆస్తిపాస్తులు, అర్హతల కన్నా వ్యక్తిత్వం, అసలు స్వరూపం తెలుసుకోవాలి.’’ చెప్పింది లేడీ డిటెక్టివ్ సుగాత్రి. -
తల్లిదండ్రులే రోల్ మోడల్స్
పిల్లల మనస్సుల్లో మీ కలలను రుద్దకండి. ప్రతి శిశువు తన స్వంత ఆశయాలతో జన్మిస్తుంది అని చెబుతారు ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి. పేరెంటింగ్పై ఆమె మాటలు ఎందరికో స్ఫూర్తిదాయకం. పిల్లల పెంపకంపై ఆమె పలు పుస్తకాలను కూడా రాశారు. పిల్లలను మంచి దారిలో నడిపించేందుకు ఆమె చెప్పిన కొన్ని మాటలు...పిల్లలకు తల్లిదండ్రులే మొదటి రోల్ మోడల్స్. పిల్లలు మనం చెప్పే మాటల కంటే, మనం చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు, అనుకరిస్తారు. కాబట్టి మంచి ప్రవర్తనను ఆచరించి చూపడం చాలా ముఖ్యం. మనం ఒక మంచి ఉదాహరణగా నిలిచినప్పుడు, పిల్లలకు ప్రత్యేకంగా క్రమశిక్షణ నేర్పాల్సిన అవసరం ఉండదు.తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అతిపెద్ద బహుమతి విద్య. అయితే, చదువు అంటే కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదు, అందులో జీవన నైపుణ్యాలు, జిజ్ఞాస, సాంస్కృతిక అవగాహన కూడా ఉండేలా నేర్పించాలి. అంతేకాకుండా తల్లిదండ్రుల జీవితాల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన లక్ష్యాలను పిల్లలతో పూర్తిచేయించాలనుకోవడం పొరపాటు. పిల్లలు వారి సొంత ఆశలు, ఆశయాలతో వస్తారు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు చేయగలిగిన ఉత్తమమైన పని– పిల్లలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించడంలో సహాయపడటం.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. డబ్బు ఉందని అహం చూపిస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని పేరెంట్స్ ఫాలో అయితే పిల్లలు కూడా ఆ లక్షణం నేర్చుకుంటారు. అలాగే పిల్లలకు ఉన్నదానితో తృప్తి చెందడం, కృతజ్ఞతా భావంతో ఉండటం నేర్పించాలి. వస్తువుల కంటే సంబంధాలే ముఖ్యమని నేర్పాలి. కుటుంబంతో కలిసి భోజనం చేయడం వంటి చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం వల్ల పిల్లల్లో వినయం, సానుభూతి పెరుగుతాయి. ఖరీదైన బహుమతుల కంటే అర్థవంతమైన అనుభవాలను పంచుకోవడం ద్వారా తల్లిదండ్రులు ఈ విలువలను పిల్లలకు నేర్పవచ్చు. చాలామంది జీవితంలో మనం కష్టపడ్డాం కదా, మన పిల్లలకు ఆ కష్టం తెలియకూడదు అని వారికి అన్నీ అడగకముందే సమకూరుస్తుంటారు. కానీ పిల్లలకు కూడా కష్టం విలువ తెలిసేలా చేయాలి. పిల్లలకు చిన్న చిన్న పనులు నేర్పడం, ఇంటి పనుల్లో వారిని భాగస్వాములను చేయడం ద్వారా వారు తాము కూడా కుటుంబంలో ఒక భాగమని, తాము కూడా సహకరించాలని అర్థం చేసుకుంటారు. పిల్లల్లో దయ, సానుభూతిని పెంపొందించాలి. పిల్లల పెంపకంలో ఇది ప్రధానమైనది. పిల్లల్లో కరుణను నింపడం వల్ల సమాజానికి మేలు జరగడమే కాకుండా, వారు అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకుంటారు. పిల్లలను ఇతరులతో పోల్చకండి. ప్రతి బిడ్డకు వారి స్వంత బలాలు, బలహీనతలు ఉంటాయి. వారిలోని ప్రత్యేకతను గుర్తించకుండా ఇతరులతో పోల్చడం వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ.పిల్లలు ఏదైనా అడిగినప్పుడు, వెంటనే ఇచ్చేయకండి. అది నిజంగా అవసరమో కాదో తెలుసుకోండి. పిల్లలు అడిగే వస్తువు ప్రాముఖ్యతను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అడిగిన వెంటనే పిల్లలకు అందించడం వల్ల వారికి ఆ వస్తువు విలువ తెలియదు. అలాగే ప్రస్తుతం పిల్లలకు పాకెట్ మనీ అని డబ్బులు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. దానివల్ల వారికి డబ్బు విలువ తెలియదు. పిల్లలతో నిత్యం మాట్లాడుతూ, సమయం గడపండి. ప్రతి విషయం గురించి వారితో చర్చించండి. మీ పిల్లల మనస్సులో ఏముందో తెలుసుకోవాలంటే వారితో సంభాషించడం, వారు చెప్పేది వినడం ద్వారా వారి సంతోషాలు, ఆసక్తులు, ప్రపంచం పట్ల వారి దృక్పథం అర్థమవుతుంది. ఎదుటివారి హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం నేర్పించాలి. పెద్దల మాదిరిగానే పిల్లలకు కూడా ఏకాంతంగా, స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను అతిగా పర్యవేక్షించడం, ప్రతి చిన్న విషయంపై ప్రశ్నించడం వంటివి చేసినప్పుడు, పిల్లలు తాము నమ్మకాన్ని కోల్పోతున్నామని భావిస్తారు. దాంతో విషయాలను దాచడం లేదా అబద్ధాలు చెప్పడం మొదలుపెడతారు. అలాకాకుండా పిల్లలు స్నేహపూర్వకంగా మెలగాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. ఇది పిల్లలు తమను తాము నమ్ముకోవడానికి, సవాళ్లను అధిగమించడానికి, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడటానికి సహాయపడుతుంది. ‘నువ్వు ఏదైనా సాధించగలవు’, ‘నీ ప్రయత్నం నాకు చాలా గర్వంగా ఉంది’ వంటి సానుకూలమైన మాటలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. -
కృషి ఏకోన్ముఖం ప్రతిభ బహుముఖం!
నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ఆఫ్రికన్ రచయితలు– పంచపాండవుల్లా– అయిదుగురే! ఇవాళ మనం ఎవరి గురించి చర్చించుకోబోతున్నామో ఆ పెద్దమనిషి కూడా వారిలో ఒకరు. అతని తండ్రి తరఫు పూర్వికులు, నాలుగైదు వందల సంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాకు తరలి వెళ్ళిపోయిన డచ్ (నెదర్లండ్స్) జాతీయులు. తల్లి తరఫు వాళ్ళు డచ్–జెర్మన్–పోలిష్ జాతీయులు. 1940లో పుట్టిన ఈ బహుళజాతి రచయిత బాల్య కౌమార ప్రథమ యవ్వన దశలు గడిపింది దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నగరంలో. ఇరవైరెండో యేట బ్రిటన్ చేరి, ఐబీఎం సంస్థలో కంప్యూటర్ ప్రోగ్రామర్గా జీవనం మొదలుపెట్టాడు. అతని పేరు జాన్ మ్యాక్స్వెల్ కూట్సీ. 2003లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న విశిష్ట రచయిత! కూట్సీ సిద్ధాంత పత్రానికి 1963లో కేప్ టౌన్ యూనివర్సిటీ మాస్టర్స్ పట్టా ప్రసాదించింది. మరో ఆరేళ్ళకు, శామ్యూయెల్ బెకెట్ వచనంలో వాక్యనిర్మాణరీతి– పదప్రయోగ శైలి– ధ్వని తదితర విశేషాల గురించి కూట్సీ సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ డాక్టరేట్ ప్రసాదించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ పెద్దమనిషి సృజనాత్మక సాహిత్యాన్నీ, భాషా సాహిత్యాలపై పరిశోధనను రెండు చక్రాలుగా చేసుకుని బండి నడిపిస్తూనే వున్నాడు! అలాంటి మనిషికి ఇంగ్లిష్, ఆఫ్రికాన్స్, డచ్, నామా, మలయ్ తదితర భాషలు తెలిసివుండడంలో వింతేముంది? సామాన్య శకం 450 సంవత్సరం నుంచి 1150 వరకూ వాడుకలో వుండి అంతరించిన ‘ఓల్డ్ ఇంగ్లిష్‘ అనే యాంగ్లో శాక్సన్ భాషలో కూడా నిష్ణాతుడు కావడం కూట్సీ సాధించిన ఘనవిజయాల్లో ఒకటి! టూకీగా చెప్పుకుంటేనే కూట్సీ కథ ఇంతవచ్చింది!కూట్సీ పుట్టి పెరిగిన దేశం దక్షిణాఫ్రికాలో 1994 వరకూ, రంగువెలి (అపార్థీడ్) అనే జాతి వివక్ష విధానం అమల్లో వుంది. గాంధీజీ ఆ దేశంలో అవమానాల పాలబడిన కథ చిన్నప్పుడు చదువుకున్నాంగా. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు నిర్బంధం అనుభవించాల్సి రావడానికి ఇదే విధానం కారణం. కూట్సీ మొదటి నుంచి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూనే రావడం నిజంగానే విశేషం! పాతికేళ్ళకు ముందే యూరపియన్– అమెరికన్ దేశాల్లో విస్తృతంగా తిరిగే అవకాశం కూట్సీకి దక్కడం వల్లే, ఈ విశాల దృష్టి ఏర్పడి వుంటుంది. అలా జాతిపరమైన అస్తిత్వ రేఖలను చెరిపేసుకుని, అక్షరాలా అంతర్జాతీయ స్వభావం సంతరించుకున్న రచయితల్లో కూట్సీ మొదటివాడూ కాడు– బహుశా చివరివాడు కూడా కాడేమో! ‘ఇంట గెలిచి, రచ్చ గెలవ’మనే నానుడి కూట్సీ మాతృభాష ఆఫ్రికాన్లో కూడా వున్నట్లుంది! అందుకే, అతగాడు 1977లో దక్షిణాఫ్రికాలోని ప్రతిష్ఠాత్మక పురస్కారం సీఎన్ఏ (సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ) సాహిత్య పురస్కారంతోనే తన విజయ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇదే పురస్కారాన్ని 1980లో మరోసారి, ’84లో ఇంకోసారి కూడా గెల్చుకున్నాడు కూట్సీ. బుకర్ ప్రైజును రెండుసార్లు గెల్చుకున్న రచయిత తొలిరచయిత కూడా కూట్సీయే!‘ఇన్ ద హార్ట్ ఆఫ్ ద కంట్రీ’ నవలలో అధ్యాయాల విభజన లాంటిది కనిపించదు. రచయిత దీన్ని 266 పేరాగ్రాఫులుగా విభజించారు. సినిమా స్క్రిప్టులో కనిపించే సీన్ పేపర్ల కట్టలా వుంటుంది ఈ నవల. 1985లో మేరియన్ హ్యాన్సల్ ఈ దృశ్యమాన నవలను ‘డస్ట్’ అనే సినిమాగా తీశాడంటే తీయడూ మరి? ఈ నవల వెలువడ్డానికి మూడేళ్ళు ముందే, కూట్సీ రెండు నవలికలను కలిపి ‘డస్క్ ల్యాండ్స్’ అనే ఒకే నవలగా రాశాడు. వియెత్నాంలో మనోవైజ్ఞానిక యుద్ధానికి వ్యూహ రచన చేసిన యూజిన్ డాన్ క్రమంగా ఉన్మాదంలోకి దిగజారి కన్నకొడుకునే పొడిచి చంపేసిన కథనే ‘ద వియెత్నాం ప్రాజెక్ట్’ అనే నవలిక రాశాడు కూట్సీ. ‘ద నెరేటివ్ ఆఫ్ జాకబస్ కూట్సీ’ అనే మలి నవలిక, వాస్తవానికి కాలక్రమంలో ముందు రావాలి. వలసవాదులూ, సామ్రాజ్యవాదుల మానసికతలో అంతర్నిహితంగా వుండే హింసాత్మకత ఇతివృత్తంగా రాసిన నవలికలివి. ఆ రెండింటికీ అదే సామాన్య గుణం! ఇది కూడా గొప్పగా విజయవంతమైన ప్రయోగం. కాగా, నిత్యాధునికవాదం అనే పోస్ట్ మాడర్నిస్టు నవలా రచనకు ఇదే ఆదిగ్రంథమంటారు విమర్శకులు.1999లో, కూట్సీకి రెండోసారి బుకర్ ప్రైజ్ సంపాదించిపెట్టిన నవల ‘డిస్గ్రేస్.’ దక్షిణాఫ్రికాలో ఒకప్పుడు తెల్లదొరలు పాటించిన వివక్ష విధానాలు తర్వాతి రోజుల్లో ఎలాంటి విషఫలితాలు ఏర్పడడానికి దారితీశాయో చూపించిన రచన ఇది. ల్యూరీ అనే కీచకోపాధ్యాయుడు అప్రతిష్ఠాకరమైన జీవనం తర్వాతి కాలంలో పెత్తనం చెలాయించిన ‘నల్లదొరలు’ అనుకరిస్తే ఏమవుతుందనేదే ఈ నవలకు ఇతివృత్తం. 2019లో బీబీసీ ఎంపిక చేసిన ‘నూరు స్ఫూర్తిదాయకమైన నవలల జాబితా’లో స్థానం సంపాదించుకున్న నవల ఇది!డేనియల్ డీఫో సుప్రసిద్ధ రచన– ఇంగ్లిష్ భాషలో తొలి నవల– ‘రాబిన్సన్ క్రూసో’ సామాన్యశకం 1719లో తొలిముద్రణగా వెలువడింది. 1986లో, ఈ కథను దేశకాలమాన పరిస్థితులకు తగిన రీతిలో పునరూహ చేస్తూ, పునః రచించాడు కూట్సీ. దానికి ఆయన పెట్టిన పేరు ‘ఫో.’ నాలుగేళ్ళ తర్వాత, కూట్సీ తిరిగి దక్షిణాఫ్రికా ఇతివృత్తం వైపు దృష్టి మళ్ళించి, ‘ద ఐరన్ ఏజ్’ అనే నవల రాశారు. కూట్సీ రచనలన్నింట్లోనూ, ‘ఆశ్చర్యకరమైన రీతిలో పరాయివ్యక్తి జోక్యం జరుగుతూ ఉంటుంద’ని నోబెల్ పురస్కార ఎంపిక సంఘం పేర్కొంది. ఈ సామాన్య గుణంతో కూడివుండే కూట్సీ రచనలన్నింటికీ కలిపి నోబెల్ సాహిత్య పురస్కారాన్ని 2003లో అందించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారం పొందిన రచయితల్లో, ఈ ఆఫ్రికన్–ఆస్ట్రేలియన్ రచయితతో పోల్చదగిన వ్యక్తి మరొక్కరు కూడా కనిపించరని కూట్సీ అభిమానుల అభిప్రాయం! -మందలపర్తి కిషోర్ -
ఈ వారం కథ: ప్రశ్న
‘‘వల్లీ! మా డాడీ ఫోన్ చేశారు. పదో తారీఖున మనందర్నీ ఊరికి రమ్మన్నారు...’’ హబ్బీ వాసు మాటలకు ఆశ్చర్యంగా చూశాను. ‘‘ఎనీథింగ్ ఇంపార్టెంట్?’’‘‘అహ. వీలునామా రాస్తారట. తమ్ముళ్ళనీ చెల్లినీ కూడా పిలుస్తున్నారు ’’‘‘బావుంది. చాలామంది కరోనా తర్వాత రాశారు. మామగారు ఇప్పుడు రాస్తున్నారన్నమాట. మంచిదే! ఏమైనా ఆయనకు ముందు చూపు ఎక్కువే. కాని, అందరికీ ముందే చెబితే లేనిపోని గొడవలు రావూ!’’‘‘వస్తాయి. వాటిని మొదట్లోనే పరిష్కరించేయొచ్చు అన్నారు’’ బ్రేక్ఫాస్ట్ చేస్తూంటే వాసు చిన్న తమ్ముడు రఘు ఫోన్ చేశాడు.‘‘అన్నయ్యా, నాన్న వీలునామా రాస్తారట. నా సంగతి నీకు తెలుసుగా. నాది పెన్షన్ లేని ప్రైవేటు జాబు. ఎప్పుడు వూడుద్దో తెలీదు. మీ పిల్లలు బాగా సెటిలయ్యారు. నా పిల్లలింకా కాలేజీలోనే వున్నారు. అంచేత నాక్కొంచెం అదనంగా...!’’‘‘ఫేవర్ చేయించమంటావు? డాడీకి అందరి, అన్ని సంగతులూ తెలుసు. ఒకరితో చెప్పించుకోరు. నీకెలా న్యాయం చేయాలో అలా చేస్తారు గాని వూరికే భయపడకు’’వాసు ఫోన్ పక్కన పెడుతోంటే మళ్ళీ ఫోన్ మోగింది. డిస్ప్లే చూసి,‘‘పెద్ద తమ్ముడు శేషు’’ నాకు చెప్పి, ‘‘చెప్పరా. వీలునామా గురించేనా!’’ అడిగాడు.‘‘ఆ మాట విన్నప్పట్నుంచీ యమ టెన్షన్ గా వుందన్నయ్యా...’’‘‘ఎందుకురా!’’‘‘డాడీ సంగతి నీకు తెలుసుగా. అందరూ సమానమేనంటూ సమానంగా పంచుతారు. నేను నిండా మునిగిపోతాను!’’‘‘ఏం?’’‘‘నాకు ముగ్గురూ ఆడపిల్లలే. వాళ్ళ దుస్తులకూ, చదువులకూ చాలా ఖర్చయ్యింది. ఇక అసలు ఖర్చంతా ముందుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, పురుళ్ళూ పుణ్యాలూ...!’’‘‘శేషూ! ఉద్యోగం చేస్తున్నావు. మొన్ననే రెండో ప్రమోషన్ తీసుకున్నావు. నువ్వు బీదార్పులు అరవడం ఏం బాగోలేదు. పిల్లలకు పెళ్లి చేయాల్సిన బాధ్యత మనది కానీ డాడీది కాదు. అయినా నాన్నను అడక్కుండా నాకు చెబుతావేంటి!’’‘‘నువ్వు చెబితే నాన్న వింటారు...!’’‘‘అంతా ఓపెన్ గా చెప్పే చేస్తానన్నారు. అందరం అక్కడే వుంటాం గనుక అప్పుడే మాట్లాడదాం...!’’ ‘‘నన్ను సపోర్టు చేస్తావనుకున్నాను అన్నయ్యా!’’‘‘నాకు నువ్వెంతో రఘూ అంతే. ఏం చేసేదీ, ఎలా చేసేదీ అంతా డాడీ ఇష్టం. ఆయన ఏం చేస్తారో వినకుండా ముందే ఆందోళన పడటం అనవసరం’’ ఫోన్ పెట్టేసి, ‘‘నా సపోర్టు కోసం చేశాడు’’ చెప్పాడు వాసు. ‘‘అన్న గారిగా మీకూ బాధ్యత వుందిగా, చెయ్యండి’’ ఆఫీసుకు రెడీ అవుతుంటే అడబడుచు రమ కాల్ చేసింది. ‘‘నాకు చేశావేంటి రమా. మీ తమ్ముళ్ళిద్దరూ ఇంతక్రితమే మీ అన్నయ్యకు చేశారు’’ ‘‘వాళ్ళు చేయడమే కాదు బుడిబుడి దీర్ఘాలు తీస్తారనీ నాకు తెలుసు. అందుకే నీకు చేశాను. నువ్వేం చెప్పినా డాడీ వింటారు. బాగా చదువుకున్న దానివి, లాజిక్తో మాట్లాడతావని నువ్వంటే ఎంతో గౌరవం!’’‘‘సరి సరే. ఆఫీసుకు టైమయ్యింది. త్వరగా చెప్పు రమా’’‘‘నీ తమ్ముడి గురించి తెలుసుగా వదినా. మంచి ఉద్యోగం చేస్తున్నారని నన్నిచ్చి పెళ్లి చేశారు. అయిదేళ్ళు గడవకుండానే ఉద్యోగానికి రాజీనామా చేసి మిత్రుడితో కలిసి వ్యాపారం మొదలెట్టారు. అందులో ఎంత నష్టపోయామో నీకు తెలుసుగా. తర్వాత రియల్ ఎస్టేట్ అన్నారు. లక్షలొచ్చి పడతాయన్నారు. కొన్న భూమి కోర్టు గొడవల్లో ఇరుక్కుంది. ఈలోగా రొయ్యల చెరువుల్లో కోట్లు మిగుల్తాయని అందులోకి దూకారు. రొయ్యల సాగు గురించి చెప్పేదేముంది. ఎప్పుడే వైరస్ వచ్చి అవి తేలి, మమ్మల్ని ముంచేస్తాయో తెలీదు. కంటి నిండా నిద్రపోలేకుండా ఉన్నామంటే నమ్ము!’’ ‘‘ఇవన్నీ మీ నాన్నతోనో అన్నయ్యతోనో చెబితే లాభం వుంటుంది. నాతో ఏమవుతుంది చెప్పు!’’ ‘‘నీ వల్ల కానిది వుండదు వదినా. చెప్పేనుగా నువ్వన్నా నీ మాటలన్నా మా డాడీకెంతో గురి!’’‘‘సరే. ఆయన నీకు అన్యాయం చేసినట్టు అనిపిస్తే అప్పుడు కల్పించుకుంటాన్లే’’‘‘నువ్వు మాటిస్తే నా పని అయిపోయినట్టే’’ పొంగిపోయింది. కార్లో ఆఫీసుకు వెళుతూ, ‘‘రమ నాకు ఫోన్ చేసింది’’ చెప్పాను.‘‘ఏవిటో అనవసరంగా డాడీ తేనెతుట్టె కదిలిస్తున్నారు!’’‘‘మామయ్యగారికి ఇవన్నీ తెలీవనుకోను . ఈపాటికి ఏదో ఒక నిర్ణయానికొచ్చేసే వుంటారు. మనం వెళ్ళి శంఖంలో పోయడమే!’’ ‘‘చూద్దాం. నువ్వు సెలవు పెట్టడం మర్చిపోకు సుమా...’’ ఒకరోజు ముందే అత్తవారి వూరుకెళ్ళాం. అప్పటికే మిగతా మూడు కుటుంబాలూ వచ్చేశాయి. ‘‘పెద్ద పండుగ మళ్ళీ వచ్చినట్టుగా వుంది’’ అత్తయ్య ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ‘‘వంటా వడ్డనా మాకు అప్పగించి మీరు హాయిగా రెస్టు తీసుకోండి అత్తయ్యా’’ అన్నారు శేషు భార్య ప్రియదర్శిని, రఘు భార్య లలితకుమారి. ‘‘మేమిక్కడ వున్నంతకాలం మేమే వంటింటి మహారాణులం అత్తయ్యా !’’ అంటూ జత కలిశాను. మురిసిపోయిందావిడ. ‘‘ఆ మాటన్నారు అదే పదివేలు. నా బిడ్డలకు నేను వండిపెడితేనే నాకు తృప్తిగా వుంటుంది. మీరెళ్ళి కబుర్లు చెప్పుకోండి’’‘‘మీ బిడ్డలకే గాని మాకు వండిపెట్టరా!’’ నవ్వుతూ చురక వేశాను.‘‘అయ్యో, ఎంత మాట శ్రీవల్లీ. మీ ముగ్గురూ ఈ ఇంటి మహాలక్షు్మలు!’’ ‘‘నగలు అలంకరించుకుని కూర్చోడానికే గాని, మీ వంటింటి సామ్రాజ్యంలో అడుగు పెట్టకూడదన్నమాట!’’ నిష్ఠూరంగా అంది ప్రియదర్శిని. ‘‘అంతేనా లేక మేం మీలాగా వండలేమని వద్దంటున్నారా!’’ లలిత కుమారి ఆరా తీసింది. ‘‘అదేం కాదర్రా. మీరు మా బంగారాలు. రోజూ మీ వంటే తింటున్నారుగా. ఈ మూడు నాలుగు రోజులూ నా చేతి వంట తిననివ్వండి’’ ‘‘అయితే ఒక షరతు. మాకూ కొన్ని పనులు పురమాయించాలి. మా సాయమూ తీసుకోవాలి’’ మరి కాదన్లేక పోయారు. అవాళంతా కబుర్లతో ఛలోక్తులతో ప్రశంసలతో సరదాగా గడిచింది. ‘‘మీరెప్పుడూ ఇలాగే కలిసిమెలిసి వుండాలి. సంతోషంగా వుండాలి. ఒకరికొకరు సాయసంపదలు అందించుకోవాలి...’’ చెమ్మగిల్లిన కళ్ళతో అన్నారు మామయ్య. వెంటనే కొడుకులూ కూతురూ, ‘‘ఓ అలాగే డాడీ’’ అనేశారు.మర్నాడు ఎలాంటి తుపాను వస్తుందోనని వారి గుండెల్లో గుబులుగానే వుందన్న సంగతి వారి ముఖాలే చెబుతున్నాయి! పదకొండింటికి మామయ్యగారు అందర్నీ హాల్లోకి పిలిచారు. అందరం వెళ్ళి ఆయన వంక ఆసక్తిగా చూశాం. మామయ్యగారు కొన్ని పేపర్లు బయటికి తీశారు. ‘‘ఈమధ్య నా ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. రేపు లేనిపోని తేడాలు, గొడవలు రాకుండా ఇప్పుడే మీతో ఒక మాట చెప్పి వీలునామా రాసేయాలనుకున్నాను’’ ఆగి అందరి వంకా చూశారు. అంతా మౌనంగా ఉండిపోయేసరికి తిరిగి తనే అన్నారు ‘‘మేం ఒకర్ని ఎక్కువగా ఒకర్ని తక్కువగా చూడలేదు. అందర్నీ సమానంగా చూశాం, పెంచాం, చదివించాం. మీమీ శక్తియుక్తుల్ని బట్టి చదువుకున్నారు. ఉద్యోగాలో, వ్యాపారమో చేసుకుంటూ బాగానే సంపాదించుకుంటున్నారు. సంతోషం.మనకిప్పుడు పదెకరాల పొలం, రెండెకరాల మామిడితోట, టౌన్లో ఇళ్ళ స్థలాలు, ఇక్కడో ఇల్లు ఉన్నాయి. వీటన్నిట్నీ ఇవాళ్టి విలువని బట్టి లెక్కగట్టి ఆరు వాటాలు వేశాను...’’ఉలిక్కిపడ్డామంతా. ‘‘మేం నలుగురమే కదా డాడీ’’ వెంటనే శేషు అడిగాడు. ‘‘నాకూ మీ అమ్మకూ విడిగా వాటాలు వేశాను. ఇవాళ రేపు ఆసుపత్రులకు ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసుగా. ఏమంటావమ్మా శ్రీవల్లీ’’ నన్నడిగారు. ఆసరికే నా ముఖం ఎర్రబడింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. లోలోపల మండుతూ మౌనంగా వుండిపోయాను. ‘‘మీ ఆస్తి ఎలా పంచుతారో మీ ఇష్టం. మధ్యలో ఎవరి పెత్తనం అక్కర్లేదు’’ విసురుగా అన్నాడు వాసు. ‘‘అక్కకి పెళ్లిలోనే ఇంత మూట ఇచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు వాటా పంచడమంటే డబుల్ షేర్ ఇవ్వడమే!’’ రఘు ముఖాన గంటు పెట్టుకున్నాడు.‘‘అది కట్నం. ఇచ్చింది నాకు కాదు మా అత్తవారికి! ఇది నా హక్కు. నా వాటా నాకివ్వాల్సిందే!’’ రమ గొంతు పెంచింది. ‘‘ఆడబడచుకు ఒక రూపాయి పెట్టాలిగాని దానికి పెట్టిన దాని గురించి లెక్కలేయకూడదురా చిన్నోడా!’’ అన్నారు అత్తయ్య. ‘‘ఏం అన్నయ్యా మాట్లాడవేం!’’‘‘డాడీ ఆస్తి. తన ఇష్టానుసారం పంచే హక్కు అధికారం డాడీకి వున్నాయి. కాదనడానికి మనమెవరంరా!’’ అన్నాడు వాసు. తను ఎప్పుడూ అంతే. అందరితో మంచివాడు అనిపించుకోవాలని చూస్తారు తప్ప ఎటూ తేల్చి చెప్పరు! ‘‘డాడీ సంపాదించిందే కాదు, ఆ తాత, ఈ తాత ఇచ్చిందీ వుంది. వాటి మీద మనవలుగా మనకే పూర్తి హక్కు వుంటుందని ప్లీడరు చెప్పాడు’’ అన్నాడు శేషు. అంతా అదిరిపడి చూశారు.‘‘ఇది మన కుటుంబ వ్యవహారం. మనలో మనం తెముల్చుకోవాలి. కిందా మీదా పడినా ఫరవాలేదు గాని గొడవలు పడకూడదు. రేపు ఎవరూ కోర్టు గడప తొక్కకూడదనేగా ఇప్పుడు వీలునామా తలపెట్టింది!’’ అన్నారు మామయ్య. ‘’ఆస్తి పంచుతున్నప్పుడు ఇంకా వీలునామా ఎందుకు అంకుల్, ఏకంగా వాటాలు పంచి ఇచ్చేయండి. ఎవరి వాటా వాళ్ళు ఇప్పట్నుంచే అనుభవిస్తారు’’ ప్రియదర్శిని కల్పించుకుంది. ‘‘ప్రియదర్శిని చెప్పింది సబబుగా వుంది. ఆలోచించండి మామయ్యా!’’ అన్నాను. ‘‘శ్రీవల్లి బలపరుస్తోంది గనుక అందరికీ సమ్మతమైతే అలాగే చేద్దాం. ఏమంటారు’’‘‘పంచడమే కాదు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఎవరి కాగితాలు వారికి ఇచ్చేయ్యండి అంకుల్’’ అన్నాడు ఇంటల్లుడు అనిల్.‘‘అలాగే చెయ్యండి గాని సమాన వాటాలంటే మాత్రం నేనొప్పుకోను. అన్ని చేతి వేళ్ళూ ఒకేలా వుండవు. అందరి బరువు బాధ్యతలూ ఒకే రకంగా లేవు. అన్నయ్యలకు ఖర్చు పెట్టినంత నాకు ఖర్చు పెట్టలేదు..!’’రఘు మాటలకు, ‘‘వాళ్ళుపై చదువులకు వెళ్ళారు. నువ్వెళ్ళలేదు. అది నీ తప్పు. దాని పర్యవసానాలకు నువ్వే బాధ్యుడివి గాని, నేను కాదు కదురా!’’ అన్నారు మామయ్య.‘‘మేం కాదనటం లేదు. అన్నయ్య పిల్లలు త్వరగా ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. మా ఇద్దరి పిల్లలు ఆ స్థాయికి రావడానికి చాలా టైము పడుతుంది..’’ అని రఘు అంటే, ‘‘నాకు ముగ్గురూ ఆడపిల్లలే. నేను అందరి కన్నా ఎక్కువ బరువులు మోయాలి. దాన్ని లెక్కలోకి తీసుకోరా?!’’ సూటిగా బాధగా ప్రశ్నించాడు శేషు.‘‘ఆగండాగండి. మీ వదిన కరెక్టుగా చెబుతుంది. ఏమమ్మా, శ్రీవల్లీ, నీ అభిప్రాయం ఏమిటి?’’ నన్ను అడిగారు మామయ్య.నోరు తెరవక తప్పలేదు. ‘‘మాకు ఈ వ్యవహారంలో సంబంధం వుందా మామయ్యా!’’ సూటిగా అడిగాను.దెబ్బతిన్నట్టు చూశారు. ‘‘అలా మాట్లాడతావేంటమ్మా. ఇది మన కుటుంబ వ్యవహారం. పెద్ద కోడలిగా నీకెక్కువ బాధ్యత వుందమ్మా!’’‘‘మేం బరువు బాధ్యతలు మోయటానికే నన్నమాట!’’‘‘చిత్రంగా మాట్లాడతావేంటి వల్లీ. అసలు నీకివాళేమైంది’’ వాసు ముఖం చిట్లించాడు.‘‘జ్ఞానోదయం అయింది!’’‘‘ఇప్పుడు జరక్కూడనిదేం జరగిందమ్మా. నీ మాటెవరూ కాదన్లేదుగా!’’ అత్తయ్య అన్నారు.‘‘ఆస్తి పంపకాల్లో కోడళ్ళనీ సంప్రదించాలన్న ఆలోచనే మీకు రాకపోవడం చాలా దారుణం మామయ్యా!’’‘‘లోకతీరుని బట్టే చేస్తారు తప్ప నీకేదో స్పెషల్ సింహాసనం వెయ్యరు’’ కోప్పడ్డాడు వాసు.‘‘ఇంకా పంపకాలవ్వలేదు శ్రీవల్లీ. నీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పు ’’ అన్నారు మామయ్య.‘‘ఎన్ని వాటాలు వేస్తున్నారో ముందే చెప్పేశారుగా!’’‘‘కొడుకులకూ, కూతురికీ వాటాలేశాను. మా తనువులు వెళ్ళాలి గనుక మా ఇద్దరికీ చెరో వాటా వేసుకున్నాం. అది తప్పంటావా?’’‘‘అనను. కాని ఆ కుటుంబ సభ్యుల్లోకి కోడళ్ళు ఎందుకు రాలేదన్నది నా ప్రశ్న!’’‘‘కొడుకులకే కాదు కోడళ్ళకూ వాటా ఇమ్మంటోంది డాడీ!’’ రమ హేళనగా నవ్వింది.‘‘అప్పుడింక మా చేతికొచ్చేది ఆస్తి కాదు, ఖాళీ చిప్ప!’’ శ్రుతి కలిపాడు రఘు.‘‘కొడుకులకిస్తే మీకిచ్చినట్టు కాదా?’’ మామయ్య ప్రశ్నించారు.‘‘కానే కాదు. ఎవరిది వారిదే!’’‘‘ఆ మాట బాగోలేదమ్మా శ్రీవల్లీ. మొగుడూ పెళ్ళాలు ఎప్పుడూ ఒకటే’’ నొచ్చుకున్నారు అత్తయ్య.‘‘నీ ఉద్దేశమేంటి అక్కయ్యా’’ ప్రియదర్శిని అడిగింది.‘‘పెళ్ళవుతూనే ఈ ఇంటికొచ్చాం. ఈ ఇంటి సభ్యులం అయ్యాం. పెళ్లితో వీరి గోత్రమే మనదైంది. ఈ ఇంటి పేరే మనదైంది!...’’‘‘ ఇప్పుడు కాదని ఎవరన్నారు?’’ మామయ్య అడిగారు.‘‘ మా పెళ్లి అవుతూనే ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మీరే మన్నారో గుర్తుందా మామయ్యా. ‘నువ్వు ఇంటి పెద్ద కోడలివి గనుక కుటుంబ పరువు ప్రతిష్ఠలు, మర్యాదలు, సంప్రదాయాలు అన్నీ నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి అన్నారు. వదిన అంటే తల్లే. అంచేత మరుదుల్ని, ఆడపడుచుని చక్కగా చూసే బాధ్యత కూడా నీదే!’ అన్నారు’’‘‘అవును. అవే మాటలన్నాను. నువ్వు, నీ తోడికోడళ్లు అవి చక్కగా పాటించిన మాటా నిజమే. అయితే ఇప్పుడు ఏంటి!’’‘‘పూర్వం పెద్దకొడుకు అంటే పెద్ద పాలేరు అని అదనంగా ఏదో ముట్టచెప్పేవారు. ఇప్పుడు అన్నయ్యకి కాకపోయినా వదినకి ఇవ్వమనేమో!’’ వంకరగా నవ్వాడు శేషు .నా వంక కొరకొరా చూశాడు వాసు.‘‘మేము ఈ ఇంటి సభ్యులుగా కుటుంబ పరువు మర్యాద కాపాడాలి. కుటుంబ బరువు బాధ్యతలు పంచుకోవాలి. మేం ఈ కుటుంబ సభ్యులమే అయినప్పటికీ మాకు బాధ్యతలు తప్ప ఇంటి మీద గాని, కుటుంబ ఆస్తి మీద గాని ఎలాంటి హక్కూ అధికారం ఎందుకు లేవన్నది నా ప్రశ్న! ఈ ఇంట్లో కోడళ్ళు ఉత్త సభ్యులే అంటే మాత్రం నేను అంగీకరించను!’’‘‘అలా ఆలోచిస్తే అక్క అన్నది సమంజసమే’’ ప్రియదర్శిని అంది.‘‘ఇదేమీ వ్యాపార భాగస్వామ్యం కాదు, కుటుంబస్వామ్యం!’’ వాసు కసురుకున్నాడు.‘‘తెలుసు. నేనడిగేది కుటుంబ ఆస్తిలోని భాగమే!’’‘‘వదిన అతి తెలివిగా మాట్లాడుతోంది. అప్పుడు తను పుట్టింటి నుంచి తెచ్చుకున్నదీ ఉమ్మడి ఆస్తే అవుతుందిగా!’’ రఘు అన్నాడు.‘‘అవ్వదు. అది నాది. కూతురు గనుక రమకీ వాటా ఇస్తున్నాంగా. అలాగే మేమూ పుట్టిళ్ళ నుంచి తెచ్చుకున్నాం. మరి మాకు అత్తింటి నుంచి ఎందుకని ఏమీ ఇవ్వరు ?’’‘‘నువ్విలా అడ్డంగా మాట్లాడటం నాకు నచ్చలేదు’’ ముఖం మాడ్చుకున్నారు మామయ్య.‘‘పితృస్వామ్య ఆలోచనా దృక్పథంలోంచి బయటికొచ్చి చూస్తే నా మాటలెంత న్యాయమో అర్థమవుతాయి మామయ్యా. అత్తయ్యగారు తెచ్చుకున్నది రమకి కట్నంగా ఇచ్చారు. ఆవిడకేం మిగల్లేదు గనుకే వాటా ఇస్తున్నారు. రఘూ వాళ్ళది లవ్ మ్యారేజ్. లలిత ఏమీ తెచ్చుకోలేదు. ఇలాగే ఒక్కో కోడలి ఆర్థిక స్థితి ఒక్కో రకంగా వుంటుంది. వారికి కుటుంబ ఆస్తిలో భాగం ఇవ్వకపోవడమంటే తోటి కుటుంబ సభ్యులకు ముమ్మాటికీ అన్యాయం చేస్తున్నట్టే!’’ నా స్వరం మరింత పెరిగింది.‘‘మొగుడూ పెళ్లాల్ని వేరు వేరుగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావటం లేదు’’ బాధగా అన్నారు మామయ్య.‘‘ఒకటే ఎలా అవుతారు? నిజంగా మీరా సంగతి మనస్ఫూర్తిగా నమ్మితే, ఆస్తి కొడుకులకు కాక కోడళ్లకు రాయండి. రాయగలరా? కచ్చితంగా రాయలేరు! ఆయన ఆస్తే నా ఆస్తి, ఆయన ఇల్లే నా ఇల్లు, ఆయన సంపాదనే నా సంపాదన అనుకోమంటారు? నాకు విడిగా ఎలాంటి గుర్తింపూ లేదంటారు? ఆయన నీడలా ఉంటూ ఆయన దయాదాక్షిణ్యాల మీద ఎప్పటికీ ఆధారపడే ఉండాలంటారు? ఇదేనా కుటుంబ వ్యవస్థ ఇంటి కోడళ్లకు ఇచ్చే గౌరవం? నేను ఉద్యోగం చేస్తున్నాను గనుక ఓకే, లేకపోతే నా పరిస్థితి ఏమిటి? ప్రతిదానికీ మొగుడి మీద ఆధారపడాలి. అంటే గాలిలో వేలాడాలి !’’‘వేరు వేరు అనుకుంటే తేడాగానే ఉంటుంది. అంతా ఒకటే అనుకుంటే ఏమీ ఉండదు!’’ అన్నారు అత్తయ్య.‘‘రేపేం జరుగుతుందో ఎవరు ఊహించగలరు అత్తయ్యా? ఏమైనా జరగొచ్చు. మేం విడిపోవచ్చు. వేరే మోజులోపడి నాకూ పిల్లలకూ అన్యాయం చేయొచ్చు. వ్యసనాలకు తగలేయొచ్చు. ‘ఇది నా ఇల్లు’ అంటూ ఇంట్లోంచి తన్ని తరిమేయొచ్చు. అటువంటప్పుడు కుటుంబం ఆయా సభ్యులకు అండగా నిలబడాలిగా! మరప్పుడు విడిగా ఆస్తిహక్కు ఎందుకివ్వరు? మిమ్మల్నొక్కర్నే కాదు, మొత్తం ఈ పితృస్వామ్య సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను!’’ఎవరూ మాట్లాడలేదు. మధ్యలో శవం వున్నట్టు మౌనంగా వుండిపోయారు.‘‘అవసరం రానంతవరకూ ఉమ్మడిగానే వుంటుంది. అవసరమైనప్పుడు ఎవరిది వారికే అవుతుంది’’ గొణుక్కున్నారు మామయ్య.‘‘అది నా ప్రశ్నకు సమాధానం కాదు మామాయ్యా!’’‘‘నీ ప్రశ్న చాలా చిత్రంగా ఉంది. ఏ ఇంట్లోనూ లేనిది మన ఇంట్లోనే ఎందుకు?’’‘‘దానర్థం నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని స్థితిలో కుటుంబం వుంది. అంటే నేనీ ఇంట్లో ఒక డమ్మీని! అది తెలిసి కూడా నేనిక్కడ బొమ్మలా కూర్చుని మీ రేడియో సంభాషణ వినడంలో అర్థం లేదు!’’ విసురుగా లేచి వచ్చేశాను.నా వెనుకే ప్రియదర్శిని, కాస్సేపటికి లలిత కుమారి వచ్చేశారు. ‘‘మీ నిర్ణయానికి నిరసనగా మీ కోడళ్ళు వాకౌట్ చేశారు డాడీ!’’ మా వెనుక ఎవరో అన్నారు.అవును, మాది వాకౌటే. కుటుంబంలోంచి వాకౌటే! ‘‘శ్రీవల్లీ!’’ పిలుస్తూ అత్తయ్య వచ్చారు. ‘‘ఇంట్లో మీకు లేని హక్కులు నాకూ ఉండవు గాని లోపలికి పదండి’’‘‘అది కాదు అత్తయ్యా!’’‘‘లోపలికి రండి. నేనున్నాగా!’’ మౌనంగా అనుసరించాం. ‘‘వీళ్లు నాలాగానే ఈ కుటుంబంలోకి వచ్చారు. కుటుంబ సభ్యులయ్యారు. కోడళ్ళకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీదా వుంది. ఉమ్మడి ఆస్తిలో వారికీ వాటా వేయాల్సిందే!’’మేం చప్పట్లు కొట్టాం! -సింహప్రసాద్ -
ప్లాస్టిక్ అడ్రెస్
ప్లాస్టిక్ లేకుండా మన రోజువారీ జీవితం సాగని పరిస్థితి వచ్చేసింది. ఈ ప్లాస్టిక్ మన ఇంట్లోకే కాదు ఇప్పుడు ఒంటి మీదకు వచ్చేసింది. సౌకర్యం కోసం ఎంచుకున్న దుస్తులు– అనారోగ్య సమస్యలను ‘కొని’ తెస్తున్నాయి. ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ఇవి త్వరగా చెడిపోక వ్యర్థాలుగా పేరుకుపోయి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.మీ పిల్లల్ని కొత్త స్కూల్లో చేర్చారా? మీ పిల్లలు వాడుతున్న యూనిఫామ్లు సరిపోవడం లేదా? అయితే ఈ ఏడాది మరో యూనిఫామ్ కొనాల్సిందే! కొనడం సరే, అసలు పిల్లలు వాడుతున్న యూనిఫామ్లు ఆరోగ్యకరమేనా? పర్యావరణ హితమేనా? పాత యూనిఫామ్స్ సంగతేంటి? వాటిని ఏం చేస్తున్నాం? వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఈ ప్రశ్నలు సాధారణంగా మనం వేసుకోం. ఎందుకంటే యూనిఫామ్ తప్పనిసరి అవసరం. ఏడాదికో జత మార్చేదే కదా? అది అందుబాటు ధరలో లభిస్తే సరిపోతుంది అని భావిస్తాం కాని, ఈ యూనిఫామ్ వెనుక అనేక వాస్తవాలు దాగి ఉన్నాయి.మన దేశంలో సుమారు 24 కోట్లకు పైగా విద్యార్థులు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ ఏడాదికి తమ యూనిఫామ్లోని ఒక షర్టు వాడకుండా పక్కన పడేస్తే, దాదాపు 32,000 టన్నుల వ్యర్థాలు పోగుపడతాయి. యూనిఫామ్ షర్టులు ఎక్కువగా పాలిస్టర్తో తయారవుతాయి. ఒక కిలో పాలిస్టర్ తయారీకి సుమారుగా 62 లీటర్ల నీరు అవసరం. 1.53 కిలోల పెట్రోలియం. 217 మెగా జూల్స్ శక్తి అవసరం అవుతుంది. పాలిస్టర్ తయారీ ప్రక్రియలో 21 కిలోగ్రామల కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది.పాలిస్టర్ను ఎక్కువగా ఎందుకు వినియోగిస్తారు?మన దేశంలో పాలిస్టర్ను ఎక్కువగా వాడడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ బట్ట ముడతలు పడదు. దీంతో ఇస్త్రీ అవసరం ఉండదు. ఉతికిన తర్వాత త్వరగా ఆరుతుంది. ఇది వినియోగదారులకు అదనపు సౌలభ్యం.ఏటా 70 లక్షల టన్నులకు పైగా వస్త్ర వ్యర్థాలుమన దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై జరుగుతున్నంత చర్చ వస్త్ర వ్యర్థాలపై జరగడం లేదు. పేరుకుపోతున్న వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నా, పర్యావరణానికి ముప్పుగానే పరిణమిస్తోంది. కేంద్ర జౌళిశాఖ లెక్కల ప్రకారం దేశంలో ఏటా 70.73 లక్షల టన్నుల వస్త్ర వ్యర్థం ఉత్పత్తి అవుతోంది. దీంట్లో 42% ఫ్యాక్టరీల్లో తయారీ సమయంలో వస్తుండగా, 58% వినియోగం తర్వాత వచ్చే వ్యర్థం. ఇందులో 70% వ్యర్థాల్ని రీసైక్లింగ్, పునర్వియోగం చేస్తున్నారు. ప్రపంచంలోని వస్త్ర వ్యర్థాల్లో భారతదేశం సుమారు 8% వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది.విద్యార్థులపై ప్రభావంపాలిస్టర్ వస్త్రాన్ని పాలిథిలిన్ టెరెఫ్లాలెట్ (పెట్) అనే రసాయనంతో తయారు చేస్తారు. పెట్రోలియం ఆధారిత రసాయనాలను వేడిచేసి, వాటిని ప్లాస్టిక్ చిప్స్గా మార్చి ఆపై సన్నని దారాలుగా మారుస్తారు. పెట్ బాటిల్స్ అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం– వాటిని కూడా ఈ మెటీరియల్తోనే తయారు చేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇదే వాస్తవం. విద్యార్థులు ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం యూనిఫామ్ వేసుకుంటారు. ఈ దుస్తులు చెమట పీల్చుకోవు. చర్మంపై ఎక్కువ సేపు తడి ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి కొంతమందిలో అలర్జీలు, చర్మ సమస్యలు వస్తాయి.ఇది మరిన్ని అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఈ దుస్తులు ఉతికిన ప్రతిసారీ కంటికి కనిపించనంత చిన్న పరిమాణంలో ప్లాస్టిక్ రేణువులుగా విడిపోయి నీటిలో కలుస్తాయి. నీటిశుద్ధి కేంద్రాలు సైతం వీటిని పూర్తిగా వడపోయలేవు. ఇవి నదుల్లోకి, సముద్రాల్లోకి చేరుతాయి. చేపలు, ఇతర జీవులు వీటిని ఆహారంగా తీసుకుంటాయి. ఆ జీవులను మనం తింటే ఆ ప్లాస్టిక్ రేణువులు మన శరీరంలోకి చేరుతాయి. ఇవి కేవలం నీటిలోనే కాదు గాలిలోనూ కలుస్తాయి. ఇవి శ్వాస ద్వారా మన శరీరంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది.పర్యావరణానికి ముప్పు కొంతమంది దుస్తులను కాలువలు, నదులు, నీటి కుంటల్లో పడేస్తారు. కొన్ని డంపింగ్ యార్డుకు చేరుతాయి. ప్రధానంగా పాలిస్టర్ వస్త్రాలు మట్టిలో కలిసిపోవు. ఏళ్ల తరబడి అలానే ఉంటాయి. మరికొన్ని పీలికలుగా అయిపోతాయి కానీ నేలలో పూర్తిగా కలిసిపోవు. కొన్నిచోట్ల దుస్తులను బహిరంగంగా కాలుస్తారు. ఇది తక్షణ పరిష్కారంగా కనిపించినా, సింథటిక్ వస్త్రాలు కాల్చినప్పుడు విషపూరిత వాయువులు విడుదల అవుతాయి. ఇవి గాలిలో చే రి మనం పీల్చే గాలిని కలుషితం చేసి, మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.రీ సైక్లింగ్ పరిష్కారమా? తాత్కాలిక ఉపశమనమా?వస్త్ర వ్యర్థాలు భారీగా పెరిగిపోతున్నాయి. కొండల్లా పేరుకుపోతున్నాయి. ఈ దశలో సహజంగా వచ్చే ఆలోచన రీ సైక్లింగ్. ఈ వ్యర్థాలను మళ్లీ ఉపయోగించగలమా? వీటితో కొత్త ఉత్పత్తులు తయారు చేయగలమా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. భారతదేశంలో వస్త్రాల రీ సైక్లింగ్ కొత్త వ్యవస్థేమీ కాదు. ఏళ్ల తరబడి అనధికారికంగా, కుటీర పరిశ్రమల స్థాయిలో నిరంతరాయంగా ఈ వ్యవస్థ పనిచేస్తోంది.దేశంలోని కొన్ని ప్రాంతాలు రీసైక్లింగ్ హబ్లుగా మారాయి. వాడిన దుస్తులు, ఫ్యాబ్రిక్ ముక్కలు, పరిశ్రమ వ్యర్థాల నుంచి సేకరించిన వాటిని ఈ హబ్లలో వర్గీకరిస్తారు. పునర్వినియోగానికి అనుగుణంగా మారుస్తారు. అయితే ఇదంత సులభమైన ప్రక్రియ కాదు. సేకరించిన వాటిలో ఉపయోగపడేవి, ఉపయోగపడని వాటిని ముందుగా వర్గీకరించాలి. పనికొచ్చే వాటిని ప్రాసెస్ చేసి దుప్పట్లు, దిండ్లు, ఫిల్లింగ్ మెటీరియల్స్, తక్కువ నాణ్యత గల దుస్తులు తయారు చేస్తారు.రీసైక్లింగ్కు పలు పరిమితులురీసైక్లింగ్ ఒక పాక్షిక పరిష్కార మార్గం మాత్రమే. మొత్తం వ్యర్థాల నిర్మూలన కు ఇది పూర్తి పరిష్కారాన్ని చూపడం లేదు. ముఖ్యంగా పాలిస్టర్ వ్యర్థం పూర్తి స్థాయి వినియోగానికి పనికి రాదు– ఇది మొదటి సమస్య. సేకరించడం, వర్గీకరించడం, శుద్ధి చేయడం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి– ఇది రెండో సమస్య. ఇక మూడో సమస్య సాంకేతికత. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతులనే వినియోగిస్తున్నారు.ఫలితంగా పాలిస్టర్ మిక్స్డ్ కాటన్ వంటి వస్త్రాల్లో వ్యర్థాలు ఎక్కువగా మిగిలిపోతున్నాయి. కెమికల్ రీసైక్లింగ్ పద్ధతులు అందుబాటులో ఉన్నా, అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. వీటికి ఖర్చు ఎక్కువ. సాంకేతికత విస్తృతంగా అందుబాటులో లేదు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా ఉత్పత్తి పెరుగుతోంది. వినియోగమూ అదే స్థాయిలో ఉంది. దుస్తులను తక్కువ కాలం వాడి పారేస్తున్నాం. ఈ విధానంలో మార్పు రాకపోతే పునర్వినియోగం మాత్రమే సమస్యను పరిష్కరించలేదు.అటకామా ఎడారిలో వ్యర్థవస్త్రాలుచిలీలోని అటకామా ఎడారి వ్యర్థవస్త్రాల చెత్తకుప్పలా మారుతోంది. అమెరికా, యూరోప్ దేశాలు పనికిరాని దుస్తులను తీసుకొచ్చి, అటకామా ఎడారిలో అక్రమంగా పడేస్తున్నారు. ఈ తతంగం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. చిలీకి వివిధ దేశాల నుంచి ఏటా వాడేసిన దుస్తులు దాదాపు 1.23 లక్షల టన్నుల వరకు వస్తుంటాయి. వీటిలో సెకండ్ హ్యాండ్ మార్కెట్కు కూడా పనికిరాని దుస్తులు 39 వేల టన్నుల వరకు ఉంటాయి. వీటినే అటకామా ఎడారిలో పడేస్తున్నారు. వీటిలో ఎక్కువగా సింథటిక్ దుస్తులే ఉండటం వల్ల ఇవి పర్యావరణానికి సమస్యగా మారుతున్నాయి.ఇతర పరిష్కారాలు⇒ వస్త్ర వ్యర్థాల సమస్య పరిష్కారం కావాలంటే ఉత్పత్తి నుంచి వినియోగం వరకు వ్యవస్థలో మార్పు రావాలని పరిశోధకులు, పర్యావరణవేత్తలు చెబుతున్నారు.⇒ ఒకే తరహా వస్త్రాలను ఎక్కువగా వినియోగించే యూనిఫామ్ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అత్యంత అవసరం. ఇది సులభతరం కూడా!⇒ ఈ వస్త్రాల తయారీలో పర్యావరణానికి అనుకూలమైన పదార్థాలను ఉపయోగించాలి. సహజసిద్ధమైన దారాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. దుస్తుల్లో పాలిస్టర్ శాతాన్ని పరిమితం చేయాలి. పర్యావరణ అనుకూల ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలి.⇒ విద్యార్థులు సుమారు ఎనిమిది నుంచి పది గంటల సేపు యూనిఫామ్ వేసుకుని ఉంటారు. కాటన్ దుస్తులు శరీరానికి అనుకూలంగా ఉంటాయి. చెమటను పీల్చుకుంటాయి. ఆరోగ్యపరంగాను మేలు చేస్తాయి. వీటి వాడకం పెరిగితే నేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. కునారిల్లుతున్న నేత పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుంది.⇒ పాఠశాలల నిర్వాహకులు, తల్లిదండ్రులు ముందుగా ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. యూనిఫామ్ ధర ఆధారంగా కాకుండా పిల్లల ఆరోగ్యం, పర్యావరణహితం ఆధారంగా ఎంపిక చేసుకోవాలనే అవగాహన పెరగాలి. ⇒ మన ఎంపిక పిల్లల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.⇒ పత్తి మంచిది పాలిస్టర్ చెడు అనేది సమస్య కాదు. పత్తి సాగులో కూడా అత్యధికంగా నీటి, రసాయనాల వినియోగం, కాలుష్యం వంటి సమస్యలు ఉన్నాయి. పర్యావరణానికి అనుకూలమైన సాగు పద్ధతులు, వస్త్రాల తయారీ కీలకం. ఆ దిశగా పరిశ్రమలు ముందడుగు వేయాలి.⇒ వస్త్ర వ్యర్థాల తగ్గింపులో అతి ముఖ్యమైన పాత్ర తయారీదారులది. ఒక వస్త్రం తయారు చేసిన తర్వాత అది వ్యర్థంగా మారినపుడు కూడా ఆ కంపెనీ బాధ్యత వహించాలి. ఈ విధానాన్ని అమలు చేస్తే ఉత్పత్తి దశలోనే పలు మార్పులు వస్తాయి. వ్యర్థాల శాతం తగ్గేలా పరిశ్రమలు జాగ్రత్తలు తీసుకుంటాయి.⇒ సమాజపరంగా చూస్తే దుస్తుల వినియోగపు అలవాట్లలో మార్పు కీలకం. ఎన్ని దుస్తులు కొనుగోలు చేస్తున్నాం? ఎంత కాలం వాడుతున్నాం? ఈ రెండు ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనవి. ఒక దుస్తు విలువ దాని ధరలో కాదు, ఎన్నాళ్లు వాడుతున్నామనే దానిలో ఉందనే అవగాహన పెరగాలి.యూనిఫామ్ మార్కెట్ వృద్ధి⇒ 1980ల నాటికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు అన్ని విద్యాసంస్థలు యూనిఫామ్ తప్పనిసరి చేశాయి. ∙గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా సంస్థల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. దీంతో యూనిఫామ్ వినియోగం, వ్యాపారం రెండూ పెరిగాయి.ప్రపంచవ్యాప్తంగా యూనిఫామ్ మార్కెట్⇒ 2024 18.9బిలియన్ డాలర్లు⇒ 2034(అంచనా) 33.1 బిలియన్ డాలర్లువస్త్రాల వ్యర్థం – ప్రపంచస్థాయి సమస్య⇒ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ గతేడాది ఆగస్టులో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 మిలియన్ టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. ⇒ వీటితో 200కి పైగా ఒలింపిక్ స్టేడియాలను నింపవచ్చని పేర్కొంది. 2030 నాటికి ఈ వ్యర్థం 150 మిలియన్ టన్నులకు చేరవచ్చని అంచనా.⇒ ప్రపంచవ్యాప్తంగా దుస్తుల ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ డంప్యార్డులకు చేరే వాటి సంఖ్యా పెరుగుతోంది. ⇒ కాల్చివేసే లేదా విదేశాలకు ఎగుమతి చేస్తే బట్టల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటోంది.⇒ అమెరికా, యూరప్ నుంచి పెద్ద మొత్తంలో వస్త్ర వ్యర్థాలు మన దేశంలోని హరియాణాలో ఉన్న పానిపట్కి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద టెక్స్టైల్ రీసైక్లింగ్ కేంద్రంగా గుర్తింపు పొందింది. ∙దిగుమతి అయిన పాత బట్టలను రీసైకిల్ చేసి కొత్త దుస్తులు లేదా దుప్పట్లు తయారు చేస్తారు.ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం⇒ వస్త్రాల వ్యర్థాలు ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపుతున్నాయి. వస్త్ర వ్యర్థాల నుంచి వచ్చే విషపూరిత రసాయనాలు, రంగులు, సూక్ష్మ ప్లాస్టిక్ నేలలోకి, నీటిలోకి చేరి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. ⇒ డంపింగ్ యార్డుకు చేరిన వ్యర్థాలు క్రమంగా కుళ్లే సమయంలో ప్రమాదకర విషవాయువులు విడుదలై వాతావరణ మార్పులకు కారణం అవుతాయి.⇒ ఏటా సుమారు 5లక్షల టన్నుల మైక్రోఫైబర్లు సముద్రంలో కలుస్తున్నాయి.నీటి వినియోగం ఎంత?⇒ ఒక కాటన్ షర్ట్ తయారీకి సుమారు 2,649 లీటర్ల నీరు అవసరం. ఒక వ్యక్తి రోజుకు 8 గ్లాసుల చొప్పున తాగితే సుమారు మూడు నుండి నాలుగు సంవత్సరాలకు ఆ నీరు సరిపోతుందని అంచనా.⇒ పాలిస్టర్తో పోలిస్తే కాటన్ షర్ట్ తయారీకి నీటి వినియోగం చాలా ఎక్కువ. అయితే పాలిస్టర్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువ.సహజ సిద్ధ వస్త్రాలకు ప్రాధాన్యం⇒ పర్యావరణానికి హాని తక్కువ.⇒ గాలి, నేల కాలుష్యం తగ్గుతుంది.⇒ నీటి వినియోగాన్ని తగ్గిస్తాయి⇒ రైతులు, కార్మికులకు ఆరోగ్యకరం.ప్రపంచవ్యాప్తంగా ఏటా 92 మిలియన్ టన్నుల వ్యర్థవస్త్రాలు పోగవుతున్నాయి. ప్రతి సెకనుకు ఒక చెత్తలారీ లోడుకు సమానమైన వ్యర్థవస్త్రాలు తగులబడుతున్నాయి. వీటిలో ఎక్కువగా ఉంటున్న సింథటిక్ వస్త్రాలు నేలలో పూర్తిగా కలిసిపోవడానికి కనీసం రెండువందల ఏళ్లు పడుతుంది. వీటి వల్ల భూసారం దెబ్బతింటోంది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. వీటిని తగులబెట్టడం వల్ల పర్యావరణంలోకి విషవాయువులు వెలువడుతూ, జీవజాలం మనుగడకు ముప్పుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న దుస్తుల్లో దాదాపు 57 శాతం వరకు ఏడాదిలోగానే వ్యర్థంగా మారుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఈ పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చుతున్నా, ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకు ఎవరూ సరైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేకపోవడమే విచారకరం. టైక్స్టైల్, రీ సైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. విషపూరిత రసాయనాలు, దుమ్ము, సూక్ష్మఫైబర్ కణాల విడుదల కారణంగా వారు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారు. మహిళలు కూడా ఈ రంగంపై ఎక్కువగా ఆధారపడ్డారు. వారికి తగిన భద్రత, రక్షణ సదుపాయాలు లేవు. కంటి సంబంధిత సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలు సాధించాలంటే పని పరిస్థితులను మెరుగుపర్చి, భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ∙దిలీప్ మాదిరెడ్డి -
నేను క్లాస్ తను మాస్!
రహస్య గోరఖ్ నటనతోనే కాదు, తన నిజాయితీ మాటలతో కూడా అందరినీ ఆకట్టుకునే తెలుగింటి అమ్మాయి. జీవిత భాగస్వామిగా కిరణ్ అబ్బవరంను ఎంచుకున్న ఈ సుందరి, తన మనసులోని భావాలను మనతో పంచుకుంది. ఆ విషయాలే మీకోసం..నాది సినిమా ప్రేమకథనా అసలు పేరు ఐశ్వర్య గోరఖ్. సినిమా ప్రపంచమే నాకు రహస్య అనే పేరు పెట్టింది. అదే ప్రపంచం నా మొదటి సినిమా ‘రాజా వారు రాణి గారు’తో జీవిత భాగస్వామిని కూడా ఇచ్చింది. మా ప్రేమకథ ఒక చిన్న రహస్యంలా మొదలై, ఇప్పుడు అందరి ఆశీస్సులతో పెళ్లి వరకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.చదువుకే ప్రాధాన్యంచదువు విషయంలో నేను చాలా శ్రద్ధ చూపించాను. బీబీఏ పూర్తి చేసిన తర్వాత, అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో అడ్వరై్టజింగ్ అండ్ మార్కెటింగ్ కోర్సు చేశాను. ఆ సమయంలోనే నటనపై ఆసక్తి పెరిగింది. అయినా చదువును మధ్యలో వదిలిపెట్టకుండా, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాకే పూర్తిస్థాయిలో కెమెరా ముందుకు వచ్చాను.ఫొటోగ్రఫీ నా ప్రశాంత ప్రపంచంషూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా అందమైన ప్రదేశాలను కెమెరాలో బంధించడం నాకు ఎంతో ఇష్టం. ఆ పని నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.ఊరోడిని పెళ్లి చేసుకున్నా!నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్లోనే, కాని, కిరణ్ మాత్రం పక్కా పల్లెటూరోడు. షూటింగ్ సెట్లో మొదలైన మా పరిచయం ఎప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలియదు. ఐదేళ్ల పాటు సాగిన మా ప్రయాణాన్ని మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో గౌరవంగా అంగీకరించారు.వంట చేయడం నా ప్రత్యేక హాబీకొత్త కొత్త వంటకాలు చేయడం నాకు హాబీ. ముఖ్యంగా స్వీట్లు తయారు చేయడంలో నాకు మంచి నైపుణ్యం ఉంది. పెళ్లి తర్వాత కిరణ్ కోసం మరిన్ని ఆంధ్ర శైలి వంటకాలు కూడా నేర్చుకున్నాను.బిర్యానీ అంటే ఒక ఎమోషన్హైదరాబాదీస్కు బిర్యానీ అంటే ఒక ఎమోషన్. నా ఫేవరెట్ ఫుడ్ కూడా బిర్యానీనే. అయితే ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహారంపై కొంత శ్రద్ధ పెడుతున్నాను. అయినా అప్పుడప్పుడు బిర్యానీ రుచిని ఆస్వాదిస్తున్నాను.భవిష్యత్తు కుటుంబం, కెరీర్ రెండూ కలిసిభవిష్యత్తులో నటిగా కొనసాగుతూనే, కిరణ్తో కలిసి ఒక అందమైన కుటుంబ జీవితం గడపడం నా లక్ష్యం. అభిమానులు చూపిస్తున్న ప్రేమే నాకు అతిపెద్ద విజయం. ప్రస్తుతం ‘కిరణ్ అబ్బవరం’ నిర్మాణ సంస్థ పనులతో బిజీగా ఉన్నాను. -
కళ్లకు జోడు... స్టయిల్కు తోడు!
కళ్లద్దాలు అంటే కేవలం చూపు కోసం మాత్రమే అనుకుంటే, అది పెద్ద పొరపాటు! ఒక చిన్న యాక్సెసరీగా మీ పర్సనాలిటీని స్టయిల్గా చూపించే పవర్ ఈ కళ్లజోడుకే ఉంది. అందుకే, ఈ చిన్న సీక్రెట్స్ ఫాలో అయితే, మీ లుక్ ఆటోమేటిక్గా లెవల్ అప్ అవుతుంది!ఫేస్ షేప్కు సరిపోయే ఫ్రేమ్ప్రతి ఒక్కరి ముఖం ఒకేలా ఉండదు. అందుకే, ఫేస్ షేప్కు తగ్గ ఫ్రేమ్ ఎంచుకుంటేనే లుక్ సూపర్గా కనిపిస్తుంది. రౌండ్ ఫేస్ ఉన్నవారికి స్క్వేర్ లేదా రెక్టాంగిల్ ఫ్రేమ్స్ బాగా సెట్ అవుతాయి. ఓవల్ ఫేస్ ఉన్నవారు దాదాపు అన్ని స్టయిల్స్ ట్రై చేయొచ్చు. షార్ప్ జా లైన్ ఉన్నవారికి రౌండ్ ఫ్రేమ్స్ ఒక క్లాసీ టచ్ ఇస్తాయి.కలర్ కూడా క్యారెక్టర్ చెప్పేస్తుందిబ్లాక్, బ్రౌన్ , గ్రే లాంటి కలర్స్ ఎప్పటికీ క్లాసిక్. ఇవి ఏ డ్రెస్కైనా సెట్ అవుతాయి. అదే రెడ్, బ్లూ, గ్రీన్ లాంటి బ్రైట్ కలర్స్ అయితే మీరు కాస్త బోల్డ్, ఫన్ లవింగ్ పర్సన్ అన్న ఫీలింగ్ ఇస్తాయి. సన్ గ్లాసెస్లో డార్క్ షేడ్స్ కూల్ లుక్ ఇస్తే, లైట్ టింట్స్ ఒక ట్రెండీ వైబ్ ఇస్తాయి.సందర్భానికి తగ్గట్టుగాఆఫీస్కి వెళ్తే సింపుల్, స్లిమ్ ఫ్రేమ్ స్పెక్ట్స్ ఒక ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి. బీచ్ ఔటింగ్ లేదా ట్రిప్కి వెళ్తే, పెద్ద ఫ్రేమ్ సన్గ్లాసెస్. పార్టీలు లేదా ఫొటో షూట్స్కి అయితే, ట్రెండీ షేప్ ఉన్న గ్లాసెస్ మీ లుక్ను హైలైట్ చేస్తాయి.చిన్న ఫ్రేమ్తో పెద్ద ఇంపాక్ట్కొన్నిసార్లు చిన్న సైజ్ ఫ్రేమ్స్ కూడా పెద్ద స్టేట్మెంట్ పీస్ అవుతాయి. ముఖానికి సరిగ్గా ఫిట్ అయ్యే ఫ్రేమ్ ఉంటే, అది మీ ఫీచర్స్ను మరింత హైలైట్ చేస్తుంది.సన్ గ్లాసెస్ అంటే ప్రొటెక్షన్ మాత్రమే కాదుసన్ గ్లాసెస్ మీ కళ్లను సూర్యకిరణాల నుంచి కాపాడడమే కాదు, మీ స్టయిల్ను కూడా షీల్డ్ చేస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ట్రావెలింగ్లో లేదా ఔట్డోర్ యాక్టివిటీస్లో ఒక మంచి సన్ గ్లాసెస్ ఉంటే, మీరు కంఫర్ట్గా, కూల్గా కనిపిస్తారు.జాగ్రత్తలు!⇒ స్పెక్ట్స్ లేదా సన్ గ్లాసెస్ ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.⇒ చీప్గా కనిపించే ఫ్రేమ్లను తీసుకోవద్దు. మంచి క్వాలిటీ ఫ్రేమ్ అయితేనే లుక్ క్లాసీగా ఉంటుంది.⇒ ఫేస్కు సరిపోని సైజ్ తీసుకుంటే, ఎంత ఖరీదైన గ్లాసెస్ అయినా అందంగా ఉండదు.⇒ గ్లాసెస్ను తరచుగా క్లీన్ చేయండి. మసకగా ఉంటే లుక్ కూడా డల్గా కనిపిస్తుంది. ⇒ గుర్తుంచుకోండి.. స్పెక్ట్స్ కళ్లకు మాత్రమే కాదు, మీ స్టయిల్కు కూడా ఫ్రేమ్ వేస్తాయి!∙ దీపిక కొండి -
బొమ్మజెముడు పొద మీద నెత్తుటి మరక!
హంగేరియన్ భాషలో ‘కెర్తేజ్’ అంటే తోటమాలి అని అర్థం. 2002లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని పొందిన హంగేరియన్ రచయిత ఇమ్రా కెర్తేజ్ పేరులోని ఆ మాటకూ అదే అర్థం! యూరప్లోని హరిత దేశాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న హంగరీ అక్షర ఉద్యానంలో తొలి నోబెల్ పురస్కారాన్ని పూయించిన తోటమాలి ఇమ్రా కెర్తేజ్. అతని సాహిత్యం బొమ్మజెముడు పొద మీద నెత్తురు ముద్ద! తన సాహిత్యమంతటా, కెర్తేజ్ అనుభవించి పలవరించింది ఒకేఒక్క పీడకల. దాన్నే ‘హోలోకాస్ట్ నైట్మేర్’ అన్నారు తర్వాతి తరాలవారు. ఇది యూదులకూ, లౌకికవాదులకూ, ప్రగతిశీల రాజకీయపక్షాలకూ మరపురాని పీడకల. ఆ పీడకలలో కనిపించేవన్నీ తెగిన గాలిపటాలే! సంసార వృక్షం తాలూకు విరిగిపడిన కొమ్మలకు వేలాడుతూ కనిపిస్తాయవి. గాలివాటుగా కొట్టుకుపోయే ఆ గాలిపటాలు తరచు ముళ్ళకంపల్లో చిక్కుకుపోతుంటాయి. ఒకరో యిద్దరో ఈ స్థితి నుంచి బతికి బయటపడుతుంటారు. వారిలో ఒకరో యిద్దరో మాత్రమే ఎలాంటి ఉద్వేగం లేకుండా తమ కలతలూ కలవరాలను మనతో పంచుకుంటారు. కెర్తేజ్ అలాంటి ఒకరిద్దర్లో ఒకరు. అందుకే ఆయన రచనలు తేనుపొచ్చిన సలపరింతల్లా సాగుతుంటాయి! అలాంటి రచనలతో సామాన్య పాఠకులు తాదాత్మ్యం చెందలేరు. పరిణతి చెందిన కొద్దిమంది పాఠకులు మాత్రమే వాటితో అభేదావస్థ అనుభవించగలరు. అలాంటివాళ్ళలో కొందరు ‘నోబెల్ సాహిత్యపురస్కారం ఎంపిక సంఘం’లో సభ్యులుగా వున్నందువల్లనే కెర్తేజ్కు, 2002లో ఆ పురస్కారం దక్కింది!రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంగా చరిత్రను పరిశీలిస్తే, భయంకరమైన వైరుధ్యాలెన్నో కనిపిస్తాయి. వలసవాదం కాడిబరువు వదిలించుకుని ఎన్నో దేశాలు– మన దేశంతో సహా– విముక్త వాయువులు పీల్చుకున్న సందర్భమది. వైజ్ఞానిక, తాత్త్విక, కళాత్మక రంగాలన్నింటా సౌమ్య, సౌహార్ద వీచికలు ప్రసరించిన యుగమది. మానవాళి చిరకాలంగా కంటూవచ్చిన జంటకలలు–స్వేచ్ఛా సమానత్వాలుగా– విశ్వకేదారంలో మొలకలెత్తిన ఘడియలవి. అయితే, ఆ యుద్ధ నేపథ్యంలోనే, ‘పుట్టుక ప్రాతిపదికగా జాతిమత వివక్ష’ పడగవిప్పి బుసకొట్టిన దుర్ముహూర్తమూ అదే! ఈ అమానుష వికారం తాలూకు అత్యంత వికృతరూపాన్ని ప్రదర్శించినవారిగా నాజీలు చరిత్రలో పాతుకుపోయారు. నాజీలు ఎదురులేకుండా పాలించిన జర్మనీకి పొరుగుదేశం కావడమనే ఏకైక పాపానికి గానూ, హంగరీకి కూడా వివక్ష జ్వాలలు పాకిపోయాయి. అప్పట్లో నాజీల చేతికి చిక్కిన పద్నాలుగేళ్ళ కుర్రాడు ఇమ్రా కెర్తేజ్. పుట్టుకతో యూదు మతస్థుడు కావడమే అతని నేరం. దానికే అతన్ని ఆష్విట్జ్, బుషెన్వాల్ట్›్జ నిర్బంధ శిబిరాల్లోకి తోసి చిదిమి పారేయాలనుకున్నారు నాజీలు. కానీ, అంతలోనే ప్రపంచ యుద్ధం ముగిసిపోవడం– దానితోనే నాజీజం సహగమనం చెయ్యడం చకచకా జరిగిపోయాయి! అలా మృత్యువు నీడల్లోంచి వెంట్రుకవాసిలో తప్పించుకోగలిగాడు కెర్తేజ్. అయితే బతికి బయటపడినందుకు అతను సంతసించిన దాఖలాలు ఆయన సాహిత్యంలో ఎక్కడా కానరావు! ∙∙ నాజీ నిర్బంధ శిబిరాలన్నింట్లోకీ పెద్దది ఆష్విట్జ్. ఇది దక్షిణ పోలెండ్లో వుంది. పదకొండు లక్షల మంది అమాయకులైన పెద్దలూ పిన్నల ప్రాణాలను బలితీసుకున్న నరకకూపమిది. ప్రపంచ యుద్ధం ముగిసిన రెండేళ్ళకు, 1947లో ఆష్విట్జ్ను మ్యూజియంగా మార్చారు.నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత ఇమ్రా కెర్తేజ్, ఆష్విట్జ్ గురించి ఓ చోట ఇలా రాశారు:‘ఆష్విట్జ్ నిర్బంధ శిబిరంలో నేను అనుభవించిన నరకయాతనల గురించి తల్చుకున్నప్పుడల్లా, దాన్నుంచి బతికి బయటపడిన వాళ్ళ శక్తి సామర్థ్యాల గురించిన ఆలోచనల్లో మునిగిపోతాను. ఆష్విట్జ్ గురించి ఆలోచన తలెత్తినప్పుడల్లా నేను గతం గురించి కన్నా భవిష్యత్తు గురించే ఎక్కువ ఆందోళన చెందుతాను!‘ పద్నాలుగేళ్ళ వయసులో తన పాలబడిన నిర్బంధ శిబిరాల జీవితానుభవాన్ని ‘దిక్కుమాలినతనం‘ (ఫేట్లెస్నెస్) అనే నవలగా రాయడానికి మరో పద్నాలుగేళ్ళు తీసుకున్నాడు కెర్తేజ్. అయితే, 1975లో గానీ ఆ నవల అచ్చుకాలేదు. అందులోని ప్రధాన పాత్ర గ్యోర్గియ్–‘గ్యూరీ‘– కోవ్స్ కూడా పద్నాలుగేళ్ళ యూదు బాలుడే. రచయిత ఆ కుర్రాడి పేరు మార్చాడంతే– మిగతా కథ అంతా, అటూయిటూగా, ఒక్కటే! ఈ నవల వెలువడిన పదమూడేళ్ళకు ‘వైఫల్యం‘ (ఫియాస్కో) అనే మరో నవల వెలువరించాడు కెర్తేజ్. ఇది జరిగిన పుష్కరానికి ‘పుట్టని బిడ్డ కోసం ప్రార్థన’ (కాదిష్ ఫర్ యాన్ అన్ బోర్న్ చైల్డ్) అనే ఇంకో నవల రాశాడు. ఈ మూడు నవలలనూ కలిపి ‘హొలోకాస్ట్ ట్రైలజీ‘ అంటారు. ముఖ్యంగా, మూడో నవల రచనా సంవిధానం, విశిష్టంగా వుందని విమర్శకులు అంటారు.వాస్తవానికి కెర్తేజ్ ఆలోచనావరణం అంతటా నాజీ విలయమే ఆవరించుకుని ఉందని ఆయనకూ తెలుసు– పాఠకులకూ తెలుసు– విమర్శకులకు మరింత బాగా తెలుసు!‘నేను ఓ కొత్త నవలకు ఇతివృత్తం గురించి– ఆ మాటకొస్తే, ఏది రాసే విషయం పైనైనా– ఆలోచించడం మొదలుపెట్టగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది నిర్బంధ శిబిరాల జీవితానుభవమే! దానితో సంబంధం లేని విషయం గురించి మాటాడాలనుకున్నా, నాకు తెలియకుండానే ఆ విషయం గురించే మాటాడతా! ఆష్విట్జ్ ప్రేతాత్మ నా మీద సవారీ చేస్తోంది– అదే నా మాటల్లో పలుకుతోంది. దానితో పోలిస్తే మిగతా విషయాలన్నీ అర్థం లేనివని అనిపిస్తుంది నాకు!’ అన్నాడందుకే కెర్తేజ్ తన రచన ‘గ్యాలీ డయరీ’లో. 1961–91 మధ్యకాలంలో తాను రాసిన సర్వరచనల సంకలనంగా ‘గ్యాలీ డయరీ’ని 1993లో వెలువరించారాయన. ఆ తర్వాత పదేళ్ళకు విడుదలైన ‘ముగింపు’ (లిక్విడేషన్) ఇతివృత్తం సైతం హొలోకాస్ట్ పీడకలే కావడంలో వింతేముంది? మందలపర్తి కిషోర్ -
ఓవర్నైట్ చాంపియన్లు కారు
వరల్డ్ టేబుల్ టెన్నిస్ సింగిల్ టైటిల్స్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఆకుల శ్రీజ. ఆమె అర్జున అవార్డు సహా ఎన్నో పతకాలు గెలుచుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తోంది. ‘పిల్లలకు చదువు ఒక్కటే కాదు, క్రీడారంగాన్నీ పరిచయం చేసినట్లయితే అన్ని వైపులా అభివృద్ధి చెందుతారు’ అంటారు శ్రీజ తల్లిదండ్రులు ఆకుల ప్రవీణ్కుమార్, సాయిసుధ. పిల్లల పెంపకంలో తమ పాత్ర గురించి ప్రవీణ్కుమార్ తెలిపిన సంగతులు...‘‘నేను టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని. రోజూ ప్రాక్టీస్కి వెళ్లేవాడిని. పిల్లల చిన్నప్పుడు వారిని రెండు, మూడు స్పోర్ట్స్ మీట్స్కు తీసుకెళ్లాను. అక్కడ మ్యాచ్లో గెలుపొందినవారికి ప్రైజులు ఇవ్వడం, అందరూ చప్పట్లు కొట్టడం చూసి, మా పెద్దమ్మాయి చాలా ఇంప్రెస్ అయ్యింది. ‘డాడీ నాకు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారా’ అని అడిగింది. అంతేకాదు, స్కూల్ నుంచి వస్తూనే స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని గ్రౌండ్కు వెళదామని రెడీ అయిపోయేది. ‘నేను కూడా చాంపియన్ని అవుతాను’ అనేది. రోజూ నాతో పాటు ప్రాక్టీస్కు రావడం చూసి, అకాడమీకి తీసుకెళ్లాను. అక్కడ తను బాగా ఆడటం చూసినవాళ్లు మెచ్చుకోవడంతో మరింతగా ప్రాక్టీస్ చేసేది. అక్కను చూసి చెల్లెలు..రవళి మెడల్స్ తీసుకోవడం చూసి, చిన్నమ్మాయి శ్రీజ ‘నేను కూడా టేబుల్ టెన్నిస్ ఆడతాను’ అంది. శ్రీజను కూడా టేబుల్ టెన్నిస్లో చేర్పించాను. ఇద్దరూ స్పోర్ట్స్లో మంచి ప్రతిభ చూపించేవారు. దీంతో ప్రతి కాంపిటిషన్లో వాళ్లు పాల్గొనేలా చూసేవాడిని. గేమ్ పూర్తయ్యేంతవరకు ఉండి, తీసుకొచ్చేవాడిని. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ప్రైవేట్గా..!పిల్లల చిన్నప్పుడు నాకు ఓరియంటల్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ ఉద్యోగం. నా భార్య ఎల్ఐసీలో జాబ్. ప్రభుత్వ ఉద్యోగాలే అయినా జీతాలు తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉండేవి. దీంతో, ఆ జాబ్ మానేసి, జనరల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేరాను. అప్పుడు ‘మా అమ్మనాన్నలు, బంధువులు గవర్నమెంట్ జాబ్ వదులుకోవద్దు’ అని చెప్పారు. కానీ, వాళ్ల మాటలను పట్టించుకోలేదు. నా భార్య సపోర్ట్ చేసింది. నెల జీతం పెరగడం వల్ల ఇద్దరమ్మాయిలను అకాడమీలో చేర్పించడం, వారు కాంపిటిషన్స్లో పాల్గొనేలా చూడటం సులువైంది. రాత్రికి రాత్రి చాంపియన్లు అవరుమనమేవో త్యాగాలు చేస్తున్నాం కాబట్టి పిల్లలు రాత్రికి రాత్రి చాంపియన్లు కావాలనుకోకూడదు. ‘గెలుపు ఓటములు పట్టించుకోకుండా, మీ కృషి మీరు చేయండి. ప్రతీసారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి’ అని పిల్లలకు చెబుతుండేవాళ్లం. పిల్లలు ఓడిపోయినప్పుడు మా బంధువులు ‘అయ్యో, మీరు గవర్నమెంట్ జాబ్ వదలుకున్నారు, కానీ వాళ్లు ఓడిపోయారు’ అన్నట్టుగా మాట్లాడేవారు. ‘పిల్లలను బెస్ట్గా ప్రయత్నంచమని చెప్పండి. అంతేకాని, వారు చిన్నబుచ్చుకునేలా మాట్లాడకూడదు’ అని మా పేరెంట్స్కి, బంధువులకు గట్టిగా చెప్పాం. బంగారు పతకాలుపెద్దమ్మాయి టెన్త్ పూర్తయ్యాక ఒక కాన్సెప్ట్ కాలేజీలో జాయిన్ చేశాం. వాళ్లు ముందుగా స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తాం అన్నారు. తర్వాత మూడు నెలలకు ‘మీ అమ్మాయి బాగా చదువుతోంది – గ్రేడ్స్ ముఖ్యం’ అన్నారు. దీంతో రవళి స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఆపేసింది. చిన్నమ్మాయి విషయంలో అలా జరగకూడదని తనని బద్రుకా కాలేజీలో చేర్పించాం. ముందుగానే కాలేజీ యాజమాన్యంతో ‘స్పోర్ట్స్కు ప్రాముఖ్యం ఇస్తేనే చేర్పిస్తాం’ అని చెప్పాం. కాలేజీ వాళ్లు సపోర్ట్ చేశారు. శ్రీజ ఇంటర్మీడియట్లో కాలేజీ టాపర్గా గోల్డ్ మెడల్ సాధించింది. దానికి కారణం మా ఆవిడ సాయిసుధ. శ్రీజతో పాటు తనూ టోర్నమెంట్స్కు వెళ్లేది. ట్రెయిన్లో, రూములో, మ్యాచ్ మధ్యలో వీలు దొరికనప్పుడల్లా చదివించేది. ఇద్దరి కృషి...పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులిద్దరి కృషి ఉండాలి. స్పోర్ట్స్లో నేను కేర్ తీసుకుంటే, చదువు విషయంలో సాయిసుధ శ్రద్ధ తీసుకుంది. పిల్లల కెరీర్ గురించి ఆలోచించి మా ఆవిడ జాబ్లో ప్రమోషన్లు కూడా తీసుకోలేదు. ప్రమోషన్ తీసుకుంటే ట్రాన్స్ఫర్లు అవుతాయని ఆలోచించి అధికారి హోదాను కూడా వద్దనుకుని, వీలైనంత టైమ్ పిల్లలకు కేటాయించేది. పిల్లలిద్దరూ స్పోర్ట్స్లో రాణిస్తూ, చదువులోనూ గోల్డ్ మెడల్స్ సాధించారు. స్పోర్ట్స్.. జాబ్..పెద్దమ్మాయి ఇంటర్మీడియట్లో ఆపేసిన స్పోర్ట్స్ సీబీఐటీలో చేరాక స్టార్ట్ చేసింది. ఇంటర్ కాలేజీ టోర్నమెంట్స్ లీడ్ చేసేది. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసింది. ఇప్పుడు అమెరికాలో సెటిలైంది. చిన్నమ్మాయి శ్రీజకి పద్దెనిమిదేళ్లకు ఆర్బీఐలో జాబ్ వచ్చింది. ప్రాక్టీస్కు, టోర్నమెంట్స్లో పాల్గొనడానికి వీలుంటుంది. డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూనే ఫిజికల్ ఫిట్నెస్, ప్రాక్టీస్, టైమ్ ప్లానింగ్ గురించి చాలా క్రమశిక్షణగా ఉంటుంది. తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాం. వారికోసం ఏమైనా చేస్తాం. దానిని పిల్లలు అర్ధం చేసుకొని, వారి భవిష్యత్తును బాగా మలచుకుంటే పెద్దలుగా మనకూ ఆనందం. నేటి తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. దాంతో పిల్లలకు ఒకవైపు మాత్రమే అవకాశాలు ఉంటున్నాయి. స్పోర్ట్స్లో అన్నివైపులా వృద్ధి ఉంటుంది. -
కథాకళి: డర్టీ మెటల్
ఐదేళ్ళుగా మేం ఐదుగురం మిత్రబృందం ప్రతి ఆదివారం రమ్మీ ఆడటం అలవాటు. అలా రోజు సిట్టింగ్లో... ‘‘మనిషి ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాడు?’’ ఆ ఆదివారం వశిష్ట అడిగాడు.‘‘చాలావాటిని.’’ ఒకరు చెప్పారు.‘‘ఆ చాలావాటిలో దేన్ని అధికంగా ప్రేమి్తాడన్నది నా ప్రశ్న.’’‘‘అది మనిషికి మనిషికి మారుతూంటుంది.’’ చెప్పాను.‘‘నీకేం ఇష్టం? ఎన్నటికీ పోగొట్టుకోడానికి ఇష్టపడనిది.’’ వశిష్ట నన్ను అడిగాడు.‘‘మా నాయనమ్మ నా చిన్నప్పుడు ఇచ్చిన రూపాయి కాసు. దాన్ని ఖర్చు చేయకుండా దాచుకున్నాను.’’ చెప్పాను.‘‘నాకు ఉప్మా ఇష్టం. నేను చేసుకునే వెజిటబుల్ ఉప్మా.’’ మాలోని హాస్యప్రియుడైన లాయర్ చెప్పాడు.‘‘నువ్వు ఉప్మాని మించి ఇష్టపడేది ఏం లేదా?’’‘‘ఇష్టం అనేది కాలాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి మారుతూంటుంది. నాకు ఉదయం కాఫీ ఇష్టం. సాయంత్రం టీ ఇష్టం. రాత్రికి బీర్ ఇష్టం. నేను పోయే టైమ్ని బట్టి ఆ సమయంలో కాఫీ లేదా టీ తాగుతూ లేదా ఉప్మా తింటూ పోవాలనుకుంటున్నాను.’’‘‘నాకు నా ఇంట్లో, నా పక్కలో, నిద్రలో మరణించడం ఇష్టం. ఓసారి ఓ బంధువుని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశాను. స్ట్రెచర్ మీద తీసుకెళ్ళే ఓ వ్యక్తి, వెనకే ఆక్సిజన్ సిలిండర్ని తోసుకెళ్ళే ఓ అటెండర్. ఆయన కళ్ళల్లో భయాన్ని చూశాక అనిపించింది, రోగం రొష్టు రాకుండా, ఇంట్లోనే మరణించడానికి మించిన యోగం లేదని. ఇంట్లో మరణం నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైంది.’’ మరొకరు చెప్పారు.‘‘ఫిలసాఫికల్.’’ నేను చెప్పాను.‘‘చిన్న సవరణ. ఉప్మా కాదు. ఉప్మాలోని ఉప్పు. సరిపడ ఉప్పు. ఓసారి నేను ఎక్కువ ఉప్పు వేసి తినలేకపోయాను. సరిపడ ఉప్పు వేసిన ఉప్మా.’’ లాయర్ వృత్తిలోని అతను నవ్వుతూ సవరించాడు.‘‘నీకు?’’ నాలుగోవాడిని అడిగాను.‘‘మన జెండా.’’ వాడు చేతిలోని ముక్కలని చూసి, ఓ ముక్కని వేశాక చెప్పాడు.కొద్దిసేపు ఆగి నేను అడిగాను.‘‘వశిష్టా. తమరికి ఏమి ఇష్టమో సెలవివ్వనా? మీ ఆవిడ ముక్కంటే కదా?’’అంతా నవ్వారు.‘‘వశిష్ట తన భార్య ముక్కు మీద కవిత్వం రాశాడు.’’ చెప్పాను.‘‘కాని మీ ఆవిడకి బంగారం అంటే ఇష్టం. కాబట్టి నువ్వు కూడా బంగారాన్ని ఇష్టపడుతున్నావేమో?’’ ఒకరు అడిగారు.వశిష్ట ప్రతీ మేరేజ్ ఏనివర్సరీకి, తన భార్య పుట్టినరోజుకి, ఉమెన్స్ డేకి భార్యకి ఏదైనా బంగారు ఆభరణాన్ని బహుకరిస్తుంటాడని మాకు మా భార్యల ద్వారా తెలుసు. ‘మీరూ ఉన్నారు ఎందుకు? మీ ఫ్రెండ్ వశిష్ట వాళ్ళ ఆవిడకి ఏం కొనిచ్చాడో తెలుసా?’ అనే డైలాగ్ మేము చాలాసార్లు విన్నాం. ఇలాంటి ఆడవాళ్ళ ముచ్చట్లకి ఆ ఐదుగురికి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ‘‘ప్రపంచంలోని పద్దెనిమిది శాతం బంగారం ఇండియన్ భార్యల దగ్గరే ఉందని చదివాను. అది పాతికవేల టన్నుల బంగారమట. అందులో చాలా భాగం వశిష్ట భార్య దగ్గరే ఉంది.’’ ఒకరు నవ్వుతూ చెప్పారు.‘‘మా ఆవిడకి బంగారం ఇష్టం కాబట్టి ఆమెని సంతోషపెట్టడానికి కొనిస్తూంటాను. నాకు నా భార్యంటే ఇష్టం. నా భార్య మీద ఇష్టాన్ని నేను అలా ప్రదర్శిస్తూ ఉంటాను.’’ వశిష్ట చెప్పాడు.ఈ చర్చ జరిగిన కొంత కాలానికి వశిష్ట భార్య మరణించింది. ఈ కాలంలో అకాల మరణానికి కారణమైంది కేన్సర్. అది ఫోర్త్ స్టేజ్లో కాని బయటపడలేదు. బయటపడ్డ రెండు నెలలు తిరగకుండానే ఆమె గతించింది.వశిష్ట దుఃఖాన్ని పట్టలేకపోయాం. ఆ పదిహేను రోజులు మేము నలుగురం అతని వెన్నంటే ఉన్నాం. ఆ తర్వాత చాలా ఆదివారాలు మేము నలుగురమే రమ్మీ ఆడాం. తన భార్య పోయిన ఎనిమిదో ఆదివారం వశిష్ట వచ్చాడు. ఐదారు నిమిషాల తర్వాత వశిష్ట చెప్పాడు. ‘‘ఓసారి ‘మనిషి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు?’ అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను అధికంగా ప్రేమించేది మా ఆవిడని చెప్పాను. గుర్తుందా?’’‘‘అవును. అందులో మాకు ఎలాంటి సందేహం లేదు.’’ చెప్పాను.‘‘కాదు. మా ఆవిడ మరణించాక నాకు తెలిసింది. నేను ప్రేమించేది మా ఆవిడని కానే కాదు. ఆవిడ ప్రేమించే డర్టీ మెటల్ని. బంగారాన్ని.’’ నెమ్మదిగా చెప్పాడు.‘‘అంటే నువ్వు ఇంతకాలం మీ ఆవిడ ఇష్టపడుతుందని బంగారం కొనలేదా?’’ అడిగాను.‘‘ఆవిడ మరణించకపోతే అసలు నాకీ సంగతే తెలిసేది కాదు. ఆవిడ శవాన్ని వైకుంఠ రథంలో తరలించేటప్పుడు నేను ఆవిడ నోట్లోని రెండు బంగారు కట్టుడు దంతాలని కటింగ్ ప్లయర్తో పెకలించి తీసుకున్నాను. భార్యని ప్రేమించే ఎవరైనా, జీవం లేనంత మాత్రాన చేసే పనేనా అది?’’ వశిష్ట ప్రశ్నించాడు.అతని మెళ్ళోని బంగారు గొలుసుకి ఆవిడ రెండు దంతాలు మెరుస్తూ కనిపించాయి. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
కిరాయి సైన్యాలు!
అదృశ్య సైన్యాలు అంటే కిరాయి సైనికులు. వాళ్లు ఏ దేశానికీ, ఏ జెండాకూ కట్టుబడి ఉండరు. కేవలం వృత్తిపరమైన సైనికులు. ఎవరు డబ్బు ఇస్తే వారి తరపున ప్రాణాలకు తెగించి పోరాడతారు. రష్యాకు చెందిన ‘వాగ్నర్ గ్రూప్’ మొదలు, కొలంబియాకు చెందిన భయంకరమైన ‘డెజర్ట్ ఉల్వ్స్’ వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సైన్యాలు చాలానే ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులు, కాంగో అడవులు, ఇరాక్ ఎడారులు.. ఇలా యుద్ధం ఎక్కడ మొదలైతే అక్కడికి వాళ్లు కిరాయికి వెళ్లిపోతారు.ఔట్సోర్సింగ్ ‘యుద్ధం’!సాధారణ సైన్యానికి కొన్ని అంతర్జాతీయ యుద్ధ నియమాలు ఉంటాయి. కిరాయి సైన్యాలకు అవేమీ పట్టవు. అందుకే ప్రభుత్వాలు తాము నేరుగా చేయలేని పనులను వీరితో చేయిస్తుంటాయి. యుద్ధ క్షేత్రంలో శత్రువులను దెబ్బతీయడం, యుద్ధం వెలుపల తిరుగుబాట్లను అణచివేయడం, విదేశాల్లో ఉగ్రదాడులు చేయడం వీరి పని. వీరు ప్రభుత్వాల నీడలో పని చేస్తారు. ప్రస్తుతం ఇరాన్ తన శత్రువులను దెబ్బతీయడానికి ఈ కిరాయి ఏజెంట్లను వాడుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇరాన్ చేస్తున్న ఈ ‘ఔట్సోర్సింగ్’ యుద్ధంపై, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఎం15’ (సెక్యూరిటీ సర్వీస్కు సంబంధించినది) చీఫ్ కెన్ మెకల్లమ్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. కేవలం గత ఏడాదిలోనే బ్రిటన్ లో ఇరాన్ మద్దతుతో జరిగిన 20కి పైగా ప్రాణాంతక కుట్రలను తమ ఏజెంట్లు అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు!రెండు రకాల ‘కిరాయి’లు కిరాయి సైన్యంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి: ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు. ఇవి ప్రభుత్వాల అవసరాలకు, ఆదేశాలకు లోబడి పనిచేస్తాయి. రెండు: అక్రమ ముఠాలు. డబ్బు కోసం ఆ ముఠాలు ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాయి. 1960లలో ఆఫ్రికా దేశాల్లో జరిగిన దాడుల్లో తొలిసారి వీరి గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ‘డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’లో జరిగిన యుద్ధం– కిరాయి సైనికుల ఉనికికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. కాంగోలోని ‘కటంగా’ అనే ప్రాంతంలో అపారమైన రాగి నిక్షేపాలు ఉండేవి. బెల్జియంకు చెందిన స్థానిక మైనింగ్ కంపెనీలు ఆ వనరులను కొల్లగొట్టటానికి బ్రిటన్, అమెరికాల మద్దతుతో కిరాయి సైనికులను అక్కడ దింపాయి. దేశాన్ని అస్థిరపరచి, ఆ ఖనిజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా కిరాయి మూకలు కటంగాలో బీభత్సాన్ని సృష్టించాయి.పెంచిన కుక్కే కరిచే ప్రమాదంప్రభుత్వాలు తమ పనుల కోసం కిరాయి ముఠాలకు ఆయుధాలు, డబ్బు ఇస్తాయి. ప్రభుత్వానికి, కిరాయి ముఠాకు మధ్య సయోధ్య ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ, ఎప్పుడైతే కాస్త తేడా వస్తుందో అప్పుడు ఆ ముఠా, ప్రభుత్వం మీదకే తిరగబడుతుంది! దీనికి ఒక ఉదాహరణ అఫ్ఘానిస్తాన్ లోని ముజాహిదీన్లు. రష్యాతో పోరాడటానికి అమెరికా ముజాహిదీన్లకు ‘స్టింగర్’ క్షిపణులను అందించింది. ఆ తర్వాత అవే ఆయుధాలు అమెరికాకు తలనొప్పిగా మారాయి. ఒకసారి కనుక కిరాయి సైన్యానికి భారీగా ఆయుధాలు, సాంకేతిక నైపుణ్యం ఇస్తే.. వారు ప్రభుత్వ నియంత్రణలో ఉండరు. సొంతంగా ఒక శక్తిగా ఎదిగి ఆ దేశానికే ముప్పుగా మారుతారు.కిరాయి సైన్యాల అవసరం ఏంటి? ప్రభుత్వాలు ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లను ఎంచుకోటానికి అనేక కారణాలు ఉన్నా, ప్రధానమైన కారణం మాత్రం సొంత సైనికుల రోటేషన్ సమస్య. ఏ దేశమైనా ఒక బెటాలియన్ సైన్యాన్ని యుద్ధంలో ఉంచాలంటే, మూడు బెటాలియన్లు అవసరం! మూడు ఎందుకంటే.. ఒకటి యుద్ధంలో ఉంటే, రెండోది సెలవులో ఉండాలి, మూడోది శిక్షణలో ఉండాలి. ప్రైవేటు కంపెనీలకైతే, కేవలం పని జరిగినన్ని రోజులు మాత్రమే డబ్బు ఇస్తారు. వారికి పెన్షన్లు ఇవ్వక్కర్లేదు, యుద్ధం అయిపోయాక వారి బాధ్యత ఉండదు. దీనినే మిలిటరీ భాషలో ‘ఫోర్స్ మల్టిప్లయర్’ అంటారు. అంటే సంఖ్యను పెంచకుండా, సామర్థ్యాన్ని పెంచుకోవటం. ఉక్రెయిన్పై యుద్ధానికి ఆఫ్రికా డబ్బు!2022లో మార్చి 27 నుంచి 31 వరకు మాలి దేశంలోని మౌరా పట్టణంలో ఊచకోత జరిగింది. దాదాపు 500 మంది అమాయకులను స్థానిక సైనికులు, ‘తెల్లటి చర్మం కలిగిన అపరిచిత భాష మాట్లాడే వ్యక్తులు’ (రష్యాకు చెందిన వాగ్నర్ సైనికులు) కలిసి చంపేశారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. రష్యా మాత్రం ఆ ఊచకోతను ‘ఉగ్రవాదంపై విజయం’గా అభివర్ణించింది. రష్యా పెంచి పోషిస్తున్న వాగ్నర్ గ్రూప్ ఆఫ్రికాలోని అవినీతి నియంతలకు లేదా మిలిటరీ పాలకులకు కూడా భద్రత కల్పిస్తోంది. దాని వెనుక పెద్ద ఆర్థిక ప్రయోజనమే ఉంది. డబ్బుకు బదులుగా ఆ దేశాల్లోని బంగారం, యురేనియం వంటి విలువైన ఖనిజాల తవ్వకం హక్కులను రష్యా పొందుతుంది. గత రెండేళ్లలోనే ఆఫ్రికా నుండి రష్యా çరూ. 20,000 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని రాబట్టుకుంది. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధానికి ఈ డబ్బునే రష్యా వాడుతోంది.వాట్సాప్లో రిక్రూట్మెంట్ కిరాయి సైనికుల నియామకం ఒక పద్ధతిలో సాగుతుంది! మాజీ సైనికులను వాట్సాప్ ద్వారా సంప్రదించి, వారికి దుబాయ్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఒక కిరాయి సైనికుడికి నెలకు సుమారుగా రూ. 3.3 లక్షల జీతం ఉంటుంది! అది వారు సైన్యంలో పొందే పెన్షన్ కంటే ఆరు రెట్లు ఎక్కువ! కొన్ని దేశాలు నేరుగా మద్దతు ఇచ్చే ‘మిలీషియా’ (తీవ్రవాద సైనిక దళాల) గ్రూపులు కూడా యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇరాన్, మిలీషియాను పెంచి పోషిస్తోంది. తన సొంత సైన్యాన్ని నేరుగా రంగంలోకి దించకుండా, ఇతర దేశాల్లో ఉన్న కొన్ని గ్రూపులకు డబ్బు, ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయిస్తోంది. ఇరాన్ కనుసన్నలలో పనిచేసే హిజ్బుల్లా (లెబనాన్), హమాస్ (గాజా), హౌతీలు (యెమెన్) ఇలాంటి మిలీషియాలే. యుద్ధం ముగిశాక...?యుద్ధం ముగిశాక, శాంతిని కాపాడటానికి ప్రైవేట్ సైన్యాలు అవసరమవుతాయి. అవి కిరాయి సైన్యానికి భిన్నమైనవీ, చట్టపరిధిలో పని చేసేవీ. ఇలా – డబ్బు కోసం పోరాడే సైన్యం ఒకవైపు విధ్వంసాన్ని సృష్టిస్తుంటే, చట్టబద్ధమైన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు యుద్ధం తర్వాత పరిస్థితులను చక్కదిద్దడంలో సహాయపడుతుంటాయి. డెసర్ట్ వుల్వ్స్ రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూపులాగే, కొలంబియాకు చెందిన మాజీ సైనికులు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో పాల్గొంటున్నారు. వారిని ‘డెసర్ట్ వుల్వ్స్’ అని పిలుస్తారు. ప్రస్తుతం సూడాన్ లో జరుగుతున్న భీకర యుద్ధంలో, ‘రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్’ (ఆర్.ఎస్.ఎఫ్.) అనే గ్రూపు తరపున ఈ కొలంబియన్ కిరాయి సైనికులు పోరాడుతున్నారు. ఆర్.ఎస్.ఎఫ్. జాతి నిర్మూలన, సామూహిక అత్యాచారాలు, పసిపిల్లలను చంపడం వంటి ఘోరమైన యుద్ధ నేరాలకు పాల్పడుతోంది! అధికారం కోసం ఆర్.ఎస్.ఎఫ్., సూడాన్ అధికారిక సైన్యం మధ్య ఈ పోరు జరుగుతోంది. గత అక్టోబర్లో ఆర్.ఎస్.ఎఫ్. ‘ఎల్ ఫాషర్’ అనే నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దాదాపు 60,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. విషాదం ఏమిటంటే, కొలంబియాకు చెందిన టీనేజర్లు కూడా కిరాయి సైనికులుగా పోరాడాల్సి రావటం. వాగ్నర్ గ్రూప్ అమెరికా లేదా బ్రిటన్ దేశాల ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు కేవలం దేశ రక్షణ విధులను మాత్రమే చేపడతాయి. కానీ రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ కథే వేరు! ఇది రష్యా ప్రభుత్వం (క్రెమ్లిన్) నిధులు ఇచ్చి నడిపే ఒక రహస్య సైన్యం. 2023లో వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పైనే తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించటం మీకు గుర్తుండే ఉంటుంది. అయితే అంతా ఊహించిన విధంగానే వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ కథ విషాదాంతమైంది. పుతిన్ ను బాహాటంగా విమర్శించి, తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్, ఒక ప్రైవేట్ జెట్ ‘ప్రమాదంలో’ ప్రాణాలు కోల్పోయాడు. ప్రిగోజిన్ మరణం తర్వాత, వాగ్నర్ గ్రూప్ ఇప్పుడు పేరు మార్చుకుని ‘ఆఫ్రికా కోర్స్’ గా చలామణి అవుతోంది. ∙ సాక్షి స్పెషల్ డెస్క్ -
రైవతుడి జననం
పూర్వం ఋతవాక్కు అనే మునికుమారుడు విద్యాభ్యాసం తర్వాత బ్రహ్మచర్యం వీడి, తగిన కన్యను వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. చాలాకాలమైనా సంతానం కలగకపోవడంతో సూర్యుడి కోసం తపస్సు చేశాడు. సూర్యుడి వర ప్రసాదం వల్ల ఋతవాక్కుకు కొడుకు పుట్టాడు. అతడు రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించాడు.ఋతవాక్కు ఆ బాలుడికి యథావిధిగా జాతకర్మాదులు జరిపించాడు. అయితే, ఆ బాలుడు పెరిగేకొద్ది బుద్ధివికాసం పొందకపోగా, వెర్రివాడిలా తిరగసాగాడు. కొడుకు పరిస్థితికి ఋతవాక్కు, అతడి భార్య తీవ్రంగా కలత చెందారు. మనోవ్యధతో వారు వ్యాధిగ్రస్థులయ్యారు. కొడుకు పరిస్థితిని చక్కదిద్దడానికి తరుణోపాయం కోసం ఋతవాక్కు ఒకనాడు గర్గముని ఆశ్రమానికి వెళ్లాడు. గర్గమునిని దర్శించుకుని, తన కొడుకు పరిస్థితిని వివరించి, తరుణోపాయం చెప్పమని కోరాడు.‘‘మునిపుంగవా! నీ కొడుకు రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టాడు. నక్షత్రదోషం కారణంగానే అతడు మూర్ఖుడయ్యాడు’’ అని పలికాడు గర్గుడు. ఋతవాక్కు ఆ మాటలకు కోపించి, ‘‘రేవతీ నక్షత్రం ఆకాశం నుంచి నేల రాలిపోవు గాక!’’ అని శపించాడు.వెంటనే రేవతీ నక్షత్రం ఆకాశం నుంచి రాలిపోయి, కుముద పర్వతంమీద ఉన్న ఒక కొలనులో పడింది. ఆ కొలనులో అనేక పద్మాలు ఉండేవి. వాటిలోని ఒక పద్మం నుంచి రేవతీ నక్షత్రం ఒక కన్యక రూపంలో పుట్టింది. ప్రముచుడు అనే ముని ఆ కన్యకను చూసి, తన ఆశ్రమానికి తీసుకువెళ్లి, పెంచుకోసాగాడు. ఆమెకు రేవతి అని పేరు పెట్టాడు. కొన్నాళ్లకు రేవతి యుక్తవయస్కురాలైంది. ప్రముచుడు ఆమె కోసం వరాన్వేషణ ప్రారంభించాడు.ప్రముచుడు ఒకనాడు అగ్నిదేవుడిని ‘‘దేవా! నా కుమార్తెకు యోగ్యుడైన వరుడు ఎక్కడ దొరుకుతాడో నువ్వే చెప్పు’’ అని అభ్యర్థించాడు.‘‘మునీశ్వరా! కొద్దిరోజుల్లోనే దుద్ధముడు అనే రాజు నీ ఆశ్రమానికి వచ్చి, నీ కుమార్తెను చూస్తాడు. అతడే ఆమెకు తగిన వరుడు. నీ కుమార్తె రేవతిని అతడికిచ్చి వివాహం జరిపించు’’ అని పలికాడు అగ్నిదేవుడు.కొన్నాళ్లకు ప్రియంవద వంశీయుడైన దుద్ధముడు అడవిలో సంచరిస్తూ, ప్రముచుడి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడే, ఆశ్రమంలోంచి ప్రముచుడు బయటకు వచ్చాడు. ‘‘ప్రియంవద వంశోద్భవా! నిన్ను చూసి చాలాకాలమైంది. నువ్వు నాకు అల్లుడివి’’ అని పలికి, అతడికి అర్ఘ్యమిచ్చి, లోనికి స్వాగతించాడు.‘‘మహర్షీ! మీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. నేను మీకెలా అల్లుడినయ్యాను?’’ అడిగాడు దుద్ధముడు.‘‘రాజా! నా కుమార్తె రేవతిని నీకిచ్చి పెళ్లి చేయదలచాను. నువ్వు నా ఆశ్రమానికి వస్తావని, నా కుమార్తెకు తగిన వరుడివి నువ్వేనని అగ్నిదేవుడు చెప్పాడు’’ అన్నాడు ప్రముచుడు.తండ్రి మాటలు విన్న రేవతి, ‘‘తండ్రీ! నాకు ఈ రాజుతో వివాహం చేయదలిస్తే, రేవతీ నక్షత్ర ముహూర్త సమయంలోనే చేయాలి’’ అని చెప్పింది.ప్రముచుడు తన తపోమహిమతో రేవతీ నక్షత్రాన్ని ఆకాశంలో నిలిపి, అదే ముహూర్తంలో అగ్ని సమక్షంలో రేవతీ, దుద్ధముల వివాహం వేదోక్తంగా జరిపించాడు. వివాహం ముగిశాక, ‘‘జామాతా! నీకే వరం కావాలో కోరుకో’’ అని అడిగాడు ప్రముచుడు.‘‘మునివర్యా! నేను స్వాయంభువ మనువు వంశంలో పుట్టాను. నాకు నీ కుమార్తె రేవతి ద్వారా జన్మించే కుమారుడు ఈ మన్వంతరానికి అధిపతి అయ్యేలా వరం అనుగ్రహించండి’’ అని కోరాడు.‘‘తథాస్తు’’ అని ఆశీర్వదించాడు ప్రముచుడు.కొన్నాళ్లకు రేవతికి పండంటి కొడుకు పుట్టాడు. దుద్ధముడు అతడికి జాతకర్మాదులు జరిపించి, రైవతుడు అని నామకరణం చేశాడు.రైవతుడు సకల శాస్త్రాలను, అస్త్రశస్త్ర విద్యలను క్షుణ్ణంగా అభ్యసించాడు. కొన్నాళ్లకు దుద్ధముడు ఒక సుదినాన రైవతుడికి పట్టాభిషేకం జరిపించి, భార్యలతో కలసి వానప్రస్థానికి వెళ్లిపోయాడు.రైవతుడు సమస్త భూమండలాన్ని జయించి, రైవత మనువుగా ప్రఖ్యాతి పొందాడు.∙సాంఖ్యాయన -
క్లూషియల్: పాంట్రీ కారులో శవం
సమయం ఉదయం 10 గంటలు.. హైదరాబాద్లోని నాంపల్లి స్టేషన్ కు చెన్నై ఎక్స్ప్రెస్ చేరుకుంది. రైలు పాంట్రీకారులో సినిమా ప్రొడ్యూసర్ తంగవేలు శవమై కనిపించడం పెను సంచలనం సృష్టించింది. ఈ మిస్టరీని చేధించడానికి డిటెక్టివ్ సిద్ధార్థ రంగంలోకి దిగాడు.తంగవేలు మృతదేహం పాంట్రీకారులోని స్టోరేజ్ క్యాబిన్ దగ్గర పడి ఉంది. అతని గొంతుపై లోతైన గాయం ఉంది, కాని, ఆశ్చర్యకరంగా రక్తపు మరకలు చాలా తక్కువగా ఉన్నాయి.సిద్ధార్థ తన విచారణను పాంట్రీ సిబ్బంది నుంచి ప్రారంభించాడు.మొదటి అనుమానితుడిగా వంటవాడిని ప్రశ్నించాడు. అతడు ‘‘నేను రాత్రంతా బిజీగా ఉన్నాను, నాకేం తెలియదు’’ అని చెప్పాడు.రెండవ అనుమానితుడైన మేనేజర్ను ప్రశ్నించాడు సిద్దార్థ. తంగవేలు తనను డబ్బుల కోసం వేధించాడని ఒప్పుకున్నాడు కాని, తాను చంపలేదని వాదించాడు.సిద్ధార్థ పాంట్రీకారులోని డీప్ ఫ్రీజర్ని పరిశీలించాడు. అక్కడ గడ్డకట్టిన రక్తపు చుక్కలను గుర్తించాడు. అలాగే తంగవేలు చేతి గడియారం 11:30 గంటలకు ఆగిపోయి ఉంది. కానీ రైలు సిబ్బంది ఆయన 1:00 గంటకు కూడా సజీవంగా ఉన్నాడని సాక్ష్యం చెప్పారు.అదే సమయంలో రాత్రి ఒంటి గంటకు తంగవేలు బోగీలో నడుచుకుంటూ వెళ్లడం చూశానని అదే బోగీలో ప్రయాణిస్తున్న సంతోష్ అనే కుర్రాడు చెప్పాడు. తన తాతకు మూలికా వైద్యం కోసం చెన్నైలో ఉంటున్న ఆయుర్వేద వైద్యుడు సుబ్బారాయుడు దగరికి వెళ్లి అదే ట్రైన్లో అదే బోగీలో ప్రయాణించినట్టు సాక్ష్యం చెప్పాడు.‘రాత్రి 11:30 గంటలకు చనిపోయిన వ్యక్తి ఒంటి గంటకు నడుస్తూ కనిపించడం ఎలా సాధ్యం?’ అక్కడే సిద్దార్థ డిటెక్టివ్ బుర్ర వేగంగా పని చేసింది.రైలు నాంపల్లి స్టేషన్ కు చేరుకున్నాక, రైల్వే క్లీనింగ్ సిబ్బంది పాంట్రీకారులోని స్టోరేజ్ క్యాబిన్ (సామాన్లు ఉంచే గది) తలుపు తీసినప్పుడు అక్కడ తంగవేలు మృతదేహం బయటపడింది.అసలు ఏం జరిగింది? సిద్ధార్థ పరిశోధన మొదలుపెట్టాడు.రాత్రి 11:30 గంటలకే తంగవేలును పాంట్రీకారులోని సీక్రెట్ స్టోరేజ్ ఏరియాలో ఎవరో చంపేశారు.సిద్ధార్థ తంగవేలు చేతి గడియారాన్ని గమనించాడు. అది రాత్రి 11:30 గంటలకే ఆగిపోయి ఉంది. గొడవ జరిగిన సమయంలో గడియారం కింద పడి ఆగిపోయిందని గ్రహించాడు.శవాన్ని రైలు నుంచి బయట పడేయడం సాధ్యం కాదు కాబట్టి, హంతకుడు ఎవరికీ అనుమానం రాకుండా కూరగాయలు, ఖాళీ డబ్బాలు ఉంచే పెద్ద డీప్ ఫ్రీజర్ అడుగున శవాన్ని దాచిపెట్టి, పైన సామాన్లు సర్దేశారు.రాత్రి ఒంటి గంట సమయంలో తంగవేలులాగే డ్రెస్ వేసుకున్న ఒక సిబ్బంది, తల వంచుకుని పాంట్రీ నుంచి బయటకు వెళ్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.రైలు నాంపల్లి స్టేషన్ ప్లాట్ఫారమ్ మీద ఆగడానికి సరిగ్గా 5 నిమిషాల ముందు, అందరూ సామాన్లు సర్దుకోవడంలో బిజీగా ఉన్నప్పుడు మేనేజర్ తెలివిగా శవాన్ని ఫ్రీజర్ నుండి తీసి, పాంట్రీకారులోని ఒక మూలగా ఉన్న సర్వీస్ డోర్ దగ్గర పడేశాడు. రైలు ఆగగానే అందరూ దిగిపోతుంటే, తను కూడా ఏమీ తెలియనట్టు పక్కకు తప్పుకున్నాడు.సిద్ధార్థ ఆ స్టోరేజ్ క్యాబిన్ తలుపుల దగ్గర రక్తపు మరకలు నేల మీద కాకుండా, పైభాగంలో ఉండటం గమనించాడు. అంటే శవాన్ని ఎక్కడి నుంచో తీసి ఇక్కడ పడేశారని గ్రహించాడు. ఫ్రీజర్ తెరిచి చూస్తే, అక్కడ తంగవేలు కోటు బటన్ దొరికింది. దాంతో అసలు రహస్యం బయటపడింది.మేనేజర్ గురించి ఎంక్వయిరీ చేస్తే అసలు విషయం బయటపడింది.తరచూ సినిమా పనుల మీద పెద్దమొత్తం డబ్బుతో తిరిగే తంగవేలుతో పరిచయం పెంచుకుని, అతని దగ్గర పెద్దమొత్తం డబ్బు ఉండటం గమనించి, అదంతా బ్లాక్ మనీ అని తెలుసుకుని దొంగిలించే ప్రయత్నం చేశాడు. కుదరకపోవడంతో పెనుగులాటలో చంపేశాడు.ఆ హత్యను కప్పి పుచ్చుకోవడానికి ఈ డ్రామా ఆడాడు. వ్యక్తిగతమైన విషయాలు అపరిచితులతో పంచుకోవడం తంగవేలు చేసిన తప్పయితే, అత్యాశతో నేరం చేసి కటకటాల్లోకి వెళ్లడం మేనేజర్ స్వయంకృతాపరాధం. నేరానికి శిక్ష తప్పదు. ∙శ్రీసుధామయి -
అలాంటి వ్యక్తి దొరకాలి!
చూడగానే పక్కింటి అమ్మాయిలా స్క్రీన్ మీద మెరిసిన ‘సీతామహాలక్ష్మి’ మన మృణాల్ ఠాకూర్. తన మనసులో ఏమున్నా దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆమె స్టయిల్. బాడీ ఇమేజ్ పోరాటాల నుంచి, తనపై వచ్చే గాసిప్స్ వరకు ప్రతి విషయాన్ని ధైర్యంగా పంచుకున్న ముచ్చట్లు ఇప్పుడు మీకోసం..గాసిప్స్? నవ్వేసి ముందుకెళ్తాను!నా పెళ్లి గురించి వచ్చే వార్తలు చూస్తే నాకే నవ్వొస్తుంది. ముఖ్యంగా ఒక తమిళ హీరోతో వచ్చిన పెళ్లి వార్తల్లో అస్సలు నిజం లేదు. అలాంటి వార్తలు చదివితే, ‘ఫిబ్రవరి 14 ఒక్కసారిగా ఏప్రిల్ 1 అయిపోయిందేమో’ అని అనిపిస్తుంది.ట్రోల్ చేసినా.. నిలబడ్డాను!బాడీ షేమింగ్ గురించి చాలా బాధపడ్డాను. నన్ను ‘మట్కా’ అని పిలిచినప్పుడు చాలా కుంగిపోయాను. కానీ ఇప్పుడు నా శరీరంపై నాకు గౌరవం ఉంది. ఎవరో నన్ను నిర్వచించడం కాదు. నేను నన్ను ఎలా చూసుకుంటున్నాననేదే ముఖ్యం.బ్రేకప్ ఇచ్చిన బలంప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నాను. నా కోసం ఎవరినీ వెతకడం లేదు. ఎందుకంటే, నాకు కియానూ రీవ్స్ లాంటి వ్యక్తి దొరికితే బాగుంటుంది అని అనిపిస్తుంది. గతంలో ఒక రిలేషన్ ఉంది. అయితే, నేను నటిని అనే నిజాన్ని అతను అంగీకరించలేక పోయాడు. ఆ బ్రేకప్ నన్ను మరింత బలంగా మార్చింది.అమ్మకు ఇచ్చిన మాట!చిన్నప్పుడొక బాధాకరమైన జ్ఞాపకం ఉంది. మా ఆర్థిక పరిస్థితి బాగోలేని రోజుల్లో, మా అమ్మను చుట్టాలు తమ కార్లలో కూర్చోనివ్వని సందర్భాలు చూశాను. అప్పుడే నేను ఒక మాట ఇచ్చాను. ‘ఒకరోజు నువ్వు ఊహించని కారు కొనిస్తాను’ అని. ఈ రోజు ఆ మాటను నిలబెట్టుకున్నాను.చీకటి దశ నుంచి వెలుగులోకి!నా జీవితంలో ఒకప్పుడు చాలా కష్టమైన దశ వచ్చింది. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ ఆలోచించేటప్పుడు చాలాసార్లు నిరాశగా అనిపించేది. ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం, నా పోరాటానికి నిదర్శనం. ప్రస్తుతం గ్లామర్ పాత్రలు చేసినా, టెలివిజన్ నుంచి వచ్చిన అమ్మాయి అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను. అదే నా పునాది.నేను సిద్ధంగా లేనప్పుడు నో వే!నా కెరీర్ మొదట్లో చాలా పెద్ద అవకాశాలు వచ్చాయి. కాని, ఆ పాత్రలకు నేను మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వాటిని వదిలేశాను. ఒకవేళ అప్పుడు బలవంతంగా చేసి ఉంటే, నన్ను నేను కోల్పోయేదాన్ని. అలాగే, కెరీర్ మొదట్లో కొన్ని సన్నివేశాలు చేయాల్సి వస్తుందని తెలిసి, చాలా పెద్ద సినిమాలు వదిలేశాను. అవకాశాలు కోల్పోయినా, నా విలువల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అదే నా అసలైన విజయం. -
ఈ వారం కథ: గడ్డి మందు
అర్ధరాత్రి దాటింది. వీధుల్లో భోగి మంటలు ఇంకా ఉన్నాయి. పండగ రోజులు కావడంతో ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద హడావుడి లేదు. లోపల రోగులు మందుల మత్తులో నిద్రిస్తున్నారు. వాళ్ల అటెండర్లు మాత్రం బెంగతోనో, భయంతోనో బయట తచ్చాడుతున్నారు నాలాగ. నైట్ డ్యూటీలో ఉన్న స్టాఫ్ భోగి మంట చుట్టూ చేరి జోకులేసుకుంటున్నారు. తెల్లారితే సంక్రాంతి. ఎవరికి సెలవు కావాలి, ఎవరు కొత్త అల్లుళ్లు, పోయిన పండక్కి ఎవరు ఎవరికోసం త్యాగాలు చేశారు, పెద్ద డాక్టర్తో పండగపూటా తిట్లు తిన్నదెవరులాంటి విషయాలు వాళ్ల మధ్య చర్చకొస్తున్నాయి. ఇంతలోనే ఆసుపత్రి ముందుకి దూసుకొచ్చిన ఒక షేర్ ఆటో– అప్పటిదాకా భోగి మంట చుట్టూ అలముకున్న సరదాలతో పాటు అప్పుడప్పుడే కుదురుకుంటున్న ఆ రాత్రి నిశ్శబ్దాన్ని కూడా పటాపంచలు చేసింది. ఆటో పూర్తిగా ఆగేలోపే గబగబా నలుగురు దిగారు. ‘పట్టండి పట్టండి’ అంటూ ఆటో లోపలినుంచి మాటలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ పరుగున వచ్చి ఆ నలుగురితో కలిశాడు. వాళ్లంతా కలిసి ఆటోలోంచి ఒక కుర్రాడ్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఏమైందో చూద్దామని మునివేళ్లపై నిలబడి వాళ్ల మధ్యలోకి చూపు సారించాను. స్పృహలో లేని ఒక కుర్రాడు. అతడి నూనూగు మీసాల కంటే ముందు చెంపలకంటిన తెల్లటి నురుగు కనిపించింది. నిండా ఇరవై కూడా ఉండవు. కాళ్లూ చేతులూ పట్టుకుని నలుగురు మోసుకెళ్లడం చూసి నా మనసంతా అదోలా అయిపోయింది. దాదాపు ఆటోలో వచ్చినవాళ్లంతా లోపలికి పరుగు తీశారు. ఒక్క వ్యక్తి మాత్రం మెట్ల పక్కనే ఉన్న అరుగుమీద కూలబడి అలా గోడకు జారబడిపోయాడు. మోకాళ్ల పైకి కట్టిన గళ్ల పంచె అక్కడక్కడా తెల్లటి తడి మరకలు. చొక్కా మధ్యగుండీ, చివరిదీ వదిలేసి ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేవు. కాస్త పరిశీలించి చూస్తే మన్ను, పేడ కలిసి అంటుకుని ఆరిపోయినట్టుగా ఉన్నాయి పాదాలు. ముఖం చూస్తే రైతు అని అర్థమవుతుంది. చుట్టూ ఏమున్నా అతను చీకట్లో ఉన్నట్టే ఉన్నాడు. ఇంతలో ముగ్గురు మనుషులతో ఒక టూ వీలర్ వచ్చి ఆగింది. అందులో వెనక కూర్చున్న ఇద్దరూ బండి దిగుతూనే లోపలికి పరిగెడుతూ, పార్కింగ్ చేస్తున్న మూడో మనిషితో ‘‘ఒరేయ్ వెంకన్నా! చతురుడు ఇక్కడున్నాడు చూస్కో’’ అంటూ అరుగుమీద ఉన్న అతన్ని చూపిస్తూ వెళ్లిపోయారు. ‘చతురుడా..!’ అని నేను ఒక్కక్షణం ఆ పేరు దగ్గరే ఆగేలోపే వెంకన్న అతని దగ్గరగా వచ్చి పక్కనే కూర్చున్నాడు. అతని చెయ్యి భుజం మీద భరోసాగా పడేసరికి చతురుడు దుఃఖంతో వణికిపోయాడు. చేతిలో తుండు గుప్పెట నిండా పట్టుకుని నోట్లో కుక్కుకున్నాడు. గుండెల్లోని బాధ కళ్ల వెంట జలజలా జారుతున్నా అడ్డుకోలేకపోతున్నాడు. వెంకన్న తన చేతిని భుజం మార్చి సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు కాని, అతని ముఖంవైపు చూడలేకపోతున్నాడు. అప్పటికే వెంకన్న కళ్లు కూడా చెరువయ్యాయి. ఇంతలో లోపలినుంచి వచ్చిన ఒక వ్యక్తి గుమ్మం దగ్గర ఉన్న ఇద్దరినీ చూసి,‘‘ఒరేయ్! ఏంట్రా ఇది. వెంకన్నా నువ్వు కూడా ఏంటెహె, పక్కనే ఉండి దైర్నం సెప్తావంటే.’’ఆ మాటలు విన్న వెంకన్న కళ్లు తుడుచుకుంటూ నువ్వు చూసుకో అన్నట్టుగా అతనికి సైగ చేసి పక్కకు వెళ్లిపోయాడు. చతురుడి దుఃఖం పోటెత్తిన గోదారిలా ఉంది. అది గమనించి పక్కనే కూర్చున్నాడు ఆ వ్యక్తి. ‘‘ఊరుకోరా చతురూ... భయమేం లేదు. డాట్రగారు వచ్చేసేడు. ఆడికేం కాదురా. కుర్రోడు, ఉడుకురత్తం. గెంటుకొచ్చేత్తాడులే. బయటడిపోతాడు నువ్వు కంగారడక,’’ అంటూ నోటికి అడ్డంగా పెట్టుకున్న ఆ తువ్వాలు నెమ్మదిగా కళ్లమీదకు జరిపి చతురుడి కన్నీటిధారలు కట్టే ప్రయత్నం చేశాడు. హోరు వానలో పిల్లలగూడు చెదిరిన పక్షిలా వణుకుతున్నాడు చతురుడు. ఇప్పుడు అతన్ని తండ్రి స్థానంలో స్పష్టంగా చూస్తున్నాను నేను. తెలియకుండానే గుండె ఇంకాస్త బరువెక్కినట్టు అనిపించింది. అసలేం జరిగిందో? లోపలి నుంచి ఒక నర్సు పేపరు తీసుకొని వచ్చింది. కూడా వచ్చిన మనిషి చతురుడ్ని చూపించేసరికి, ఆ కాగితం మీద అతని వేలిముద్ర తీసుకొని వెళ్లిపోయింది.పక్కనే బైక్ను ఆనుకుని కూర్చున్న వెంకన్న వైపు మళ్లాయి నా చూపులు. పాదాలు కూడా అప్రయత్నంగానే అటు కదిలాయి. ఇంతలో అతని చొక్కా జేబులో ఉన్న ఫోన్ మోగడంతో పక్కకు తిరిగి రెండడుగుల దూరంలోనే ఆగాను. ఫోన్ ఎత్తి ‘హలో’... అనేలోగానే అవతలి గొంతు బయటకు వినిపిస్తోంది నాకు. ‘‘ఎంకన్నా... ఏవన్నారు, డాట్రగారు ఉన్నారా, పర్లేదు కదా! కళ్లు తెరిసి సూత్తన్నాడా..?’’ ఏం సమాధానం వినాల్సి వస్తుందో అనే భయంతో సాగుతున్న ప్రశ్నల వర్షంలా అనిపించింది నాకు. ‘‘డాట్రగారు వచ్చేరు, సూత్తన్నారు. మీరేం కంగారడకండి,’’ వెంకన్న సమాధానం నిశ్శబ్దంగా విన్నారు. ఆ వెంటనే...‘‘నువ్వు లోపలే ఉన్నావా, ఎలా ఉందిపుడు?’’ మళ్లీ అదే ప్రశ్న అవతలి నుంచి.‘‘లేదు, అందరూ లోపలికెలిపోతే డాట్రగారు దెబ్బలెడతారని బయటున్నాను. ఆడికేం అవదు. వదిన జాగ్రత్త!’’చతురుడు, వెంకన్న అన్నదమ్ములనే విషయం స్పష్టం చేసింది ఆ మాట. చెవులు ఫోన్ మీద పెట్టి ఒకసారి ఎందుకో చతురుడి వంక చూశాను. కళ్లు పొడిబారి ముఖమంతా బెంగటిల్లి ఉన్నాడు. ఇంతలో ఫోన్లో మాటలు నా దృష్టిని మరల్చాయి.‘‘ఏం జాగర్తరా బాబూ, ఎవరూ ఆపలేకపోతన్నారు. తల బాదేసుకుంటంది, నా కొడుకో... నా కొడుకో... అంటా నేలంతా పొర్లాడిపోతంది. నీళ్ల చుక్క ఇచ్చినా గిరాటేసి కొట్టేత్తంది. నన్ను తీసుకెళ్లండి ఆస్పటల్కి, నేను నా కొడుకును చూడాలంటంది. దాని బాధ సూళ్లాపోతన్నాంరా!’’ మాటలు విన్న వెంకన్న దుఃఖాన్ని ఆపుకుంటూనే, ‘‘అస్సలా... మీరెవరూ ఇటుకేసి రాకండి. మావున్నాం కదా!, ఏదైనా అవసరమైతే కవురెడతాం. బానేవుంది కళ్లు తెరిసాడని సెప్పండి వదినికి. ఇక్కడకి మాత్రం బయల్దేరొద్దు. కుసేపాగి నేనే పోన్ సేత్తాన్లే,’’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు వెంకన్న. అవతలి నుంచి ’అలాగే అలాగే సెయ్యి ఎంకన్నా’ అనే మాట వినిపించింది. వెంకన్న ఫోన్ కట్ చేశాడు. ఇదంతా వింటున్నాడో లేదోగాని, గండిపడ్డ చెరువు ముందరి పంటచేనులా ఉన్నాడు చతురుడు. అన్నయ్య వైపు చూస్తే ఏమైనా అడుగుతాడేమో, ఏమైనా చెప్పాల్సి వస్తుందేమో అన్నట్టుగా అటుపక్కగా తిరిగిపోయాడు. దగ్గరకు వెళదాం అనిపించినా, అతను కాస్త కుదురుకున్నాక మాట కలుపుదామని ఆగిపోయాను. ఇంతలో లోపలి నుంచి ఇంకో వ్యక్తి బయటకు వచ్చాడు. వాళ్ల మనిషే, ఇంతకు ముందు ఆటోలోనుంచి దిగేటప్పుడు చూసిన గుర్తుంది. నేను ఉన్నవైపే నడుస్తూ వచ్చి,‘‘ఎంకన్నా, ఇంటికాడ ఎలావుందో, పోన్ సెయలాకపోయావా ఓసారి?’’ తోడొచ్చిన మనిషి కాబట్టి కాస్త నిబ్బరంగా ఉంది మాట.‘‘ఉప్పుడే ఇంటికాణ్ణుంచి సేసారు మాయా, డాట్రగారు సూత్తన్నారు కంగారడద్దొని సెప్పాను.’’ వెంకన్న కాస్త భయం భయంగానే,‘‘ఏవంటన్నారు మాయా?’’ ‘‘కాస్త కూస్తయితే పర్లేదుగానీ, ఈడమ్మ మొత్తం పట్టించేసాడ్రా కుర్రెదవ. మా సెడ్డా యాతన తెచ్చేడు. ఆయనగారు ప్రయత్నం సేత్తన్నాడు. చూద్దాం, భగమంతుడే ఉన్నాడు,’’ అంటూ వెంకన్న దగ్గర అగ్గిపెట్టె తీసుకొని జేబులో చుట్ట బయటకు తీసి దాని కొస కొరికి బయటకు ఊస్తూ, ఇప్పుడే వస్తా అన్నట్టుగా పక్కకు కదిలాడు ఆ వ్యక్తి. వయసు యాభై దాటి ఉంటుంది. జుట్టు నెరిసింది. ఇలాంటి మంచి చెడ్డా బాగా చూసి, నలుగురి కోసం తిరిగి నలిగినవాడిలా ఉన్నాడు. వెంకన్నను కదిపి బాధ పెంచడం కంటే ఇతనితో మాట కలపడం కరెక్ట్ అనిపించింది. ఆటో అవతల కాస్త దూరంగా పొగ వదులుతున్న ఆ పెద్దాయన్ను చూసి అటువైపు కదిలాను. ఆస్పత్రి ఆవరణం కదా, అందరూ ఏదో ఒక బాధ మోస్తూనే ఇక్కడ నిలబడతారని తెలిసిన మనిషిలా నన్ను పలకరింపుగా చూశాడు. అది చూసి నేను ఇంకాస్త దగ్గరకు అడుగులేశాను.‘‘ఏ ఊరండీ?’’ మాట కలిపాను.‘‘మన్యంవారిపాలెం, మీది?’’ ‘‘గండేపల్లి. మా అమ్మకు బాగోకపోతే తీసుకొచ్చాం. సడన్ గా మనుషుల్ని గుర్తుపట్టలేకపోతుంది. సోడియం తగ్గిందట. మందులిచ్చారు, రాత్రికి ఇక్కడే ఉంచమన్నారు. పొద్దున్నే రాజమండ్రి తీసుకెళ్లాలి స్కానింగ్ కోసం.’’ నేను అడగాల్సిన సంగతి ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అని, ఆయన అడక్క ముందే నా వివరం మొత్తం పూర్తి చేసేశా. నా మాటలు విన్న ఆ పెద్దమనిషి నిట్టూర్పుగా,‘‘ఏంటో యింత యింత రోగాలు. ఒక వయసు దాటాక ఏది ఎలా ముంచుకొత్తందో చెప్పలాకపోతన్నాం. హాయిగా బతకాల్సిన కుర్రెదవలేమో ఇలా చేత్తన్నారు.’’ ప్రాణం మీదకు తెచ్చుకున్న ఆ కుర్రాడిపై బాధతో నిండిన కోపంతో అన్నాడు. ‘‘ఏమైంది..?’’ నా ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం విన్నాక మళ్లీ చతురుడి వైపు చూడటానికి ధైర్యం సరిపోలేదు. నిజానికి అతని అసలు పేరు చతురుడు కాదు. ఎప్పుడూ చుట్టూ ఉన్న వాళ్లతో చతుర్లాడుతూ, నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడని ఊళ్లో అలా పిలుచుకుంటారు. అసలు పేరు వీరన్న. బయట ఊరోళ్లకు, ఇంట్లోవాళ్లకు, చుట్టాలకు తప్ప ఆ పేరు ఊళ్లో పెద్దగా తెలియదు. అతని నైజానికి పూర్తి విరుద్ధమైన స్థితిలో ఇప్పుడు వున్నాడనిపించింది. ఎప్పటిలాగే పొలం పని చూసుకొని కాస్త పెందరాడే ఇంటికి బయలుదేరిన చతురుడు, ఇంటికి దగ్గరలో ఉన్న గొడ్ల సావిడి దగ్గర ఆగాడు. అక్కడ అంతా శుభ్రం చేసుకుని పాలు పితుకుతున్నాడు. ఇంతలోనే ఇంటినుంచి కబురు. కుర్రాడు మందు తాగేశాడు అర్జంటుగా రమ్మని. కాళ్ల మధ్యలో ఉన్న పాలక్యానుతో పాటు అతని గుండె జారిపోక ఏమవుతుంది? ఉన్న మనిషి ఉన్నట్టే పరిగెత్తాడు. అక్కడ నుంచి నేరుగా ఆటో ఎక్కి ఆస్పత్రికి వచ్చి ఇక్కడ కూలబడిపోయాడు. ఒక్కడే కొడుకు. పేరు శ్యామ్సుందర్. పెద్దాయన ఆ పేరు చెప్పగానే నోటి వెంట తెల్లటి నురుగు కారుతూ ఉన్న ఆ పిల్లాడి ముఖం గుర్తొచ్చింది. పదవతరగతి మంచి మార్కులతో పాసయ్యాడు. తాను పెట్టిన కండిషన్ ప్రకారం స్మార్ట్ఫోన్ బహుమతిగా కొనిపించుకున్నాడు. ఇప్పుడు ఇంటర్ సెకండియర్. నెలరోజుల్లో పరీక్షలున్నాయి. ఇంతలోనే బలవంతపు చావుకి సిద్ధపడి కన్నవాళ్లకు ఇంత పెద్ద పరీక్ష పెట్టాడు. ‘‘ఏదైనా అనండి, ఇయ్యాలా రేపు పిల్లలకు అదుపు లేకుండా పోయిందండీ. ఏదడిగితే అది కొనేయడం, కొనకపోతే కొనేదాకా ఆళ్లు అమ్మాబాబుని తినేయడం,’’ ఆలోచనగా వింటున్న నన్ను చూసి ఇంకాస్త గట్టిగా తనే, ‘‘కాలేజీకి పోయే కుర్రగాళ్ల చేతికి పోనెందుకు సెప్పండి? ఆళ్లు పాటాలింటారా, పోనే సూత్తారా? గట్టిగా ఏవన్నా అంటే ఆ మేస్టర్ల మీదకి కూడా మనమే యుద్ధానికి పోతన్నాం. ఇదంతా ఎవరిని ఉద్దరించడానికి?’’ నిలదీసినట్టుగా అడిగేసరికి నేను తలూపాను. శ్యామ్సుందర్ ఎందుకిలా చేశాడో చెప్పేసరికి అతని ఆవేదన నాలోనూ అనేక ప్రశ్నల్ని రేపింది.స్మార్ట్ ఫోన్ చేతికొచ్చేసరికి చాలామంది కుర్రాళ్ల మాదిరే శ్యామ్సుందర్ లోకం కూడా మారిపోయింది. తెల్లారగానే చూసేది ఆ ఫోన్ ముఖమే, రాత్రి నిద్రపోయేది కూడా దాని ముఖం చూస్తూనే. ’ఎప్పుడూ ఆ పోన్లోనే తలకాయ పెట్టుకుని ఉంటావ్, ఏం చూత్తావ్రా గంటల గంటలు’ అనే మాట చాలామంది తల్లిదండ్రుల్లాగే చాలాసార్లు అన్నాడు చతురుడు. చదువుకు సంబంధించింది ఏదో చూస్తున్నామనో, ఫ్రెండు నోట్స్ పంపుతానన్నాడనో ఏదో ఒక కథ చెప్పి వాళ్లను ఏమార్చడం తప్ప మాట వినిందే లేదు సుందర్. అంతకు మించి పట్టించుకునే తీరిక ఆ కష్టజీవికి లేదు. ఆ అలవాటు నెమ్మదిగా సుందర్ను బెట్టింగ్ యాప్స్ వైపు ఆకర్షితుడయ్యేలా చేసింది. డబ్బులు రాగానే ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చేయడం, సినిమాలకు వెళ్లిపోవడం, డబ్బు పోతే ఎవర్నో అప్పు అడగటం, ఇంట్లో అయితే ఆ ఫీజులని, ఈ ఫీజులనీ అబద్ధం చెప్పి తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. మొత్తానికి కొన్ని నెలలుగా ఆ మాయావలయంలో చిక్కుకు పోయాడు. ఇంట్లో డబ్బు దొంగతనంగా తియ్యడం నుంచి బీరువాలో అమ్మ నగలు కూడా చాటుగా తీసుకెళ్లి పట్నంలో తాకట్టు పెట్టేయడం వరకు అయిపోయింది. తెల్లారితే పెద్దపండగ. పెద్దలకు దండం పెట్టుకొని, మూలన పెట్టుకున్న కొత్త బట్టలు కట్టుకోవడం ఇంట్లో ప్రతి యేటా జరిగే తంతు. అమ్మ బీరువాలో నగలు కచ్చితంగా తీసుకొని వేసుకునే రోజు. ఎలాగైనా బెట్టింగ్ గెలిచి ఆ ముందు రోజే నగలు తెచ్చి బీరువాలో పెట్టేద్దాం అనుకున్నాడు సుందర్. కానీ... అతనికి అప్పటికీ తెలియంది ఏంటంటే, అది పోయే డబ్బు తప్ప వచ్చే డబ్బు కాదని; అదంతా పచ్చి మోసం అని. అమ్మ నగల కోసం అప్పు తెచ్చి పెట్టిన డబ్బు కూడా పోయింది. దిక్కుతోచక, ఇంట్లో అమ్మానాన్నకు నిజం చెప్పలేక, తెల్లారితే నిజం తెలిసిపోతుందనే భయంతో ఈ దారుణానికి ఒడికట్టాడు. చదువురాని తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాసిపెట్టి, పొలంలో కొట్టడానికి తెచ్చిన గడ్డిమందు గడగడా తాగేశాడు. ‘‘ఆడి పిచ్చిగానీ... ఇలా ఎదవ పని చేశానని ఇంట్లో అమ్మాబాబుకి సెప్పడానికి జడిసినోడు, చావడానికి ఎందుకు భయపడలేదని!? సచ్చి సెప్పాలనుకున్నది కూడా అదే కదండీ? ఇది కూడా అర్థమై ఏడ్వకపోతే ఇంకేం సదువులు సంకనాకడానికి. ఉప్పుడేదైనా ఐతే ఈడేవైపోను, ఆయమ్మి ఏమైపోను. ఉన్నదొక్కడే ఒంటిగాడు. ఈడ్ని సూసుకునే కదా ఆళ్లు బతుకుతుంటా!’’ పెద్దాయన ఆసుపత్రి లోపలికెళ్లి చాలాసేపైనా నాకు మాత్రం ఆయన ప్రశ్నలే లోపల తిరుగుతున్నాయి. ఎందుకోగాని కాళ్లు నిలవడం లేదు, ఒక్కసారి లోపలికెళ్లి సుందర్ని చూడాలనిపించింది. వీలైతే డాక్టరుతో మాట్లాడి ఆ భరోసాను బయటకొచ్చి చతురుడికి చెప్పాలనిపించింది. అమ్మని చూసి కూడా చాలాసేపయింది. చెల్లి నిద్రపోయిందో, మెలకువగా ఉందో కనపడినట్టు కూడా ఉంటుందని అనుకున్నాను. ఎమెర్జెన్సీ రూము బయట అంతా గడబిడగా ఉంది. సుందర్ను తీసుకొచ్చినవాళ్లు, ఆ తర్వాత చూద్దామని వచ్చిన వాళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు తప్ప ఎవరి కళ్లలోనూ ఆశ కనిపించడం లేదు. నిర్లిప్తంగా తచ్చాడుతున్నారే కానీ ఏం జరుగుతుందో అనే ఆందోళన కూడా లేదు. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. మనసు కీడు శంకిస్తోంది. వాళ్లను తప్పించుకుని లోపలికి వెళ్లబోతుంటే ఒక ఏడుపు వినిపించింది. నన్ను నెట్టుకుంటూనే కట్టలు తెంచుకున్న దుఃఖంతో బయటకు వెళ్లిపోతున్నాడు వెంకన్న. తడిసిన కళ్లు తుడుచుకొని సుందర్ను చూసే ధైర్యం చేశాను. తెల్లటి గుడ్డ అతని ముఖం మీద నుంచి కప్పుతుండగా చూశాను చివరిసారి. తొలిసారి చూసినప్పటి కంటే బాగున్నాడు. నూనూగు మీసాలను కప్పేసిన నురుగు ఇప్పుడు లేదు. కాకపోతే ఇప్పుడు సుందర్ కూడా లేడు. గుండె బరువెక్కిపోయింది. ఊపిరి సలపనట్టుగా దేహం బిగుసుకుపోతున్నట్టుగా ఏదోలా ఉంది. వెంటనే అమ్మను చూడాలనిపించింది. నాలుగడుగులు వేసి పేషెంట్లు ఉన్న రూముల దగ్గరకు వెళ్లాను. బెంగగా అమ్మ బెడ్వైపు చూశాను. సెలైన్ బాటిల్ ఎక్కుతోంది. చెల్లెలు అక్కడే బెంచిమీద కూర్చుని అదే బెడ్ మీద అమ్మ కాళ్ల దగ్గర తలవాల్చి కునుకు తీస్తుంది. నెమ్మదిగా వెళ్లి అమ్మ పాదాలను ఒకసారి తాకి ముఖంవైపు చూశాను. సుందర్ తల్లి గర్తుకొచ్చింది. గబగబా నడుచుకుంటూ బయటకొచ్చాను. చతురుడ్ని చూడాలి అర్జంటుగా అన్నట్టు. తిరిగి వస్తుంటే ఎమెర్జెన్సీ రూమ్ దగ్గర అంతా ఇంకా గోలగానే ఉంది. కాగితాలు, సంతకాలు, అంబులెన్ ్స గొడవేదో నడుస్తుందక్కడ. వాళ్లందరినీ తప్పించుకుని బయటపడ్డాను. అరుగుమీద అటూ ఇటూ పొర్లుతున్న చతురుడ్ని చూసి గుండె చెరువైపోయింది. ఇందాక లోపలికి వెళ్లేటప్పుడైనా నాలుగు మాటలు మాట్లాడాల్సింది. పక్కనే వెంకన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్నకు ధైర్యం చెప్పే దారిలేక, వదినకు ఫోన్ చేసే ధైర్యం లేక, కాలి మునివేళ్లు నేలకు గుచ్చుతూ కన్నీళ్లు ఒంపుతున్నాడు.ఫార్మాలిటీస్ అయిపోయాయి. లోపలనుంచి ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. అంబులెన్ వెనకపక్కకు వెళ్లడం చూస్తూ ఒక్కసారిగా గొల్లుమన్నారు చతురుడు, వెంకన్న. ‘‘ఇంటికెవరూ పోన్ గట్టా చెయ్యకండిరా, ఆయమ్మిని కాయలేరు,’’ అంటూ జరగాల్సినవి చక్కబెడుతున్నాడు పెద్దాయన. ముందు చతురుడ్ని, వెంకన్నను ఆటో ఎక్కించమన్నాడు. వాళ్లు కాదన్నాసరే వినలేదు. ‘‘ఆ కుర్రోడి ముఖం సూత్తూ అంబులెన్సులో కూసోలేరు, ముందు ఆటో తీసేయండి, మీరు కదలండ్రా... వెనకాల అంబులెన్సు ఎంతసేపొత్తాది! నడండి,’’ అనేసరికి నలుగురూ కలిసి చతురుడ్ని లేవదీయ బోయారు. ఎక్కడా మనిషి నేలను అంటి పెట్టుకుని కదలడం లేదు. అది చూసిన పెద్దాయన కాస్త దగ్గరకెళ్లి, ‘‘రేయ్ చతురా! ఇంక లేదు మనకి, అంతే రుణం. నువ్వు ఎంత బాదుకున్నా ఎనక్కి తీసుకురాగలవా? ఇంటికాడ ఆడమనిషి పరిస్థితి ఏంటో ఆలోసించు కాస్త,’’ అంటుండగా నలుగురు మనుషులు అతన్ని పట్టుకుని బలవంతంగా ఆటో ఎక్కించారు. ‘‘ఇంత బాధ నా అన్న ఎలా తట్టుకుంటాడని ఎల్లిపోయావ్రా సుందరా,’’ అంటూ బోరున విలపిస్తున్న వెంకన్నను పెద్దాయన జబ్బ పట్టుకుని లేపి ఓదారుస్తూ,‘‘బాధే మరి, బాధ కాదేటి. కొరివెడతాడు అనుకున్నోడు మనకంటే ముందే కాటికెల్లిపోతే బాధ కాదా! ఏం చేత్తాం, రాతలు కనలేం,’’ అంటూ ఆటోలో కూర్చోబెట్టి పోనీమన్నాడు.ఇప్పుడు ఆటో వెళుతుంటే రాత్రి వచ్చినప్పుడు ఉన్నంత శబ్దం అనిపించలేదు నాకు. కానీ, అప్పటికంటే బరువుగా కదిలినట్టుంది. ఇంతలోనే హారన్ మోగింది. ఆస్పత్రి వెనకనుంచి వచ్చిన అంబులెన్సు ఆటో వెనకాలే వెళ్లిపోయింది తేలిగ్గా! సుందర్ని మోసుకుంటూ!మళ్లీ అక్కడంతా నిశ్శబ్దంగా అనిపించింది. అయితే అది మునుపటి నిశ్శబ్దం కాదు. సమయం తెల్లవారి నాలుగు కావొచ్చింది. అప్పుడప్పుడే లేచిన పేషెంట్ల అటెండర్లు, అంతవరకు జరిగిన విషయం గురించి ఆరా తీస్తున్నారు. ‘‘చిన్న వయసంటమ్మా... ఒక్కడే కొడుకంట... గడ్డి మందు తాగేశాడంట. చానా తంటాలు పడ్డారంట డాట్రగారు. అప్పుడుకే రక్తంలో పట్టేసిందంట. బతకలేదు, కన్నపేగు ఏమైపోద్దో,’’ అవే మాటలు నాకు చెవుల చుట్టూ తిరుగుతున్నాయి. లోపలికి వెళ్లబోయి మళ్లీ వెనక్కి వచ్చి అరుగుమీద కూర్చుని గోడకు తల ఆన్చాను.చతురుడు పొలంలో గడ్డి మందు కొడుతున్నాడు. బెట్టింగ్ యాప్లు అన్నీ పురుగుల్లా రాలిపోతున్నాయి. వాడిపోయి మాడిపోతున్న కలుపులో యావజ్జీవ ఖైదీల్లా వికారంగా కనిపిస్తున్నారు యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు. ఇంతలో ఎవరో గట్టుమీద నిలబడి చతురుడ్ని ‘వీరన్నా!’ అని పిలవడంతో ఉలిక్కిపడి లేచాను. ఎప్పుడు పట్టిందో చిన్న మాగన్ను పట్టేసినట్టుంది. కలత కల పడింది. నిజమైతే ఎంత బాగుండో! పూడి శ్రీనివాసరావు -
రణభారం
యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరెవరి మధ్య జరిగినా, యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. జరిగే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇరాన్కు, అమెరికా, ఇజ్రాయెల్లకు జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఉభయ పక్షాల సైనికులు సహా దాదాపు పదివేల మంది ఇప్పటికే మరణించారచమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు సహా భారీ ఆస్తినష్టం కూడా జరిగింది. అయినా, ఇది ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధంలో వినియోగిస్తున్న అధునాతన విధ్వంసక ఆయుధాలు విపరీతమైన ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా అంతులేని చేటు తెచ్చిపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల తలెత్తే విపరిణామాల గురించి ఒక విహంగ వీక్షణం...భారత్కు భారీ ఆర్థిక నష్టంప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అమెరికా–ఇరాన్ యుద్ధంతో భారత్కు ఎలాంటి సంబంధం లేదు. అయినా, ఈ యుద్ధం భారత్లో ఆర్థిక భూకంపాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్లో మదుపరుల సొమ్ము ఏకంగా రూ. 41 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు రూ.89 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 93.30 మేరకు పడిపోయింది. రూపాయి విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిల్వల నుంచి దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇక ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు పైబడటంతో భారత్ ప్రతినెలా దిగుమతి బిల్లు వేలాది కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ‘ఇంధన’ సెగ భారత్నూ తాకుతోంది. దీనివల్ల వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి పర్యవసానంగా నిత్యావసరాల ధరలూ పెరిగి, సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.భారత్పై యుద్ధ ప్రభావం⇒ డాలర్తో రూపాయి విలువ పతనం రూ. 93.30⇒ రిజర్వ్ బ్యాంకు నిల్వల నుంచి ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లు⇒ స్టాక్ మార్కెట్ నష్టాలు రూ. 41.00 లక్షల కోట్లుఅమెరికా, ఇజ్రాయెల్ల సైనిక ఖర్చుయుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా ఏకంగా రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు చేసింది. యుద్ధం ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు పడిన భారం దాదాపు రూ.17.4 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాన్పై దాడుల కోసం ఇజ్రాయెల్ వారానికి సగటున రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున రూ. 7,500 కోట్లు, ఇజ్రాయెల్ రోజువారీగా సగటున రూ. 2,700 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచానికి ఆర్థిక విఘాతంప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఆర్థిక విఘాతం తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా ఈ ఏడాది పలు దేశాల స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) గణనీయమైన నష్టం వాటిల్లనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా అంచనాల ప్రకారం యుద్ధం వల్ల ఇరాన్ జీడీపీకి అత్య«ధికంగా సుమారు 20%–25% మేరకు నష్టం వాటిల్లనుంది. ఇజ్రాయెల్ జీడీపీకి సుమారు 5%, అమెరికా జీడీపీకి 1.2% నష్టం కలగనుంది. యుద్ధంతో సంబంధం లేకున్నా, దీని ప్రభావం భారత్ జీడీపీని 1.1% మేరకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.‘నాటో’ దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్నా, చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా ‘నాటో’ దేశాల జీడీపీ 0.5% నుంచి 2% మేరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల యూరోపియన్ యూనియన్ సహా ‘నాటో’ దేశాలు రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి. రష్యాతో తెగతెంపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇంధన ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగేటట్లయితే, యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేని దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. యుద్ధం ఫలితంగా పలు దేశాలలో వృద్ధి గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ధరల పెరుగుదల ఎక్కువై ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితుల్లో ఉత్పాదకత, ఉపాధి కుంటుపడతాయి. ఫలితంగా చాలా దేశాల్లో సామాన్యులపై పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయి.విధ్వంసకరమైన ఆయుధాలుఅమెరికా–ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఈ యుద్ధంలో విధ్వంసకరమైన ఆయుధాలతో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు వినియోగించిన ఆయుధాలు అత్యంత ఖరీదైనవి, అధునాతనమైనవి. ఈ ఆయుధాలు ఎంత ఖరీదైనవో, ఇవి సృష్టించే విధ్వంసం వల్ల సంభవించే నష్టం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉభయ పక్షాలూ ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్న ప్రధానమైన ఆయుధాల వివరాలుఎఫ్ 35 లైటెనింగ్–2 విమానంరాడార్లకు చిక్కకుండా లక్ష్యాలపై బాంబులను జారవిడవగల యుద్ధవిమానం ఇది. ఈ విమానాలను అమెరికా పదుల సంఖ్యలోనే ఇరాన్పై దాడుల కోసం రంగంలోకి దించింది. ఇరాన్ క్షిపణుల దెబ్బకు ఇప్పటి వరకు ఎఫ్35 లైటెనింగ్ విమానాలు రెండు నేలకూలాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.960 కోట్లు.లూకాస్ డ్రోన్లుశత్రు స్థావరాల మీద దాడుల కోసం రూపొందించిన డ్రోన్ ఇది. తక్కువ ఖరీదు చేసే ఈ డ్రోన్లను అమెరికా బలగాలు ఇరాన్పై దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.32 లక్షలు.టొమాహాక్ క్రూజ్ మిసైల్స్దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగిన క్షిపణి ఇది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అమెరికా బలగాలు దాదాపు 850 టొమాహాక్ క్షిపణులను ఉపయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.23 కోట్లు.ఎస్ఎం3 ఇంటర్సెప్టర్ క్షిపణులుశత్రువుల క్షిపణులను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయడానికి రూపొందించిన శక్తిమంతమైన ఆయుధం ఇది. ఇరాన్పై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు అమెరికా బలగాలు దాదాపు వంద వరకు ఈ క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ. 116 కోట్లు.యారో–3ఇది శక్తిమంతమైన ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 100 కిలోమీటర్ల ఎత్తులోనే నాశనం చేయగల సామర్థ్యం గల అధునాతన ఆయుధం ఇది. ఇరాన్పై జరుగుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు 35 వరకు యారో–3 క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.33 కోట్లు.ఐరన్ డోమ్ఇది కూడా ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 70 కిలోమీటర్ల దూరంలోనే పడగొట్టగల సామర్థ్యం గల ఆయుధం ఇది. ఇరాన్పై దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఐరన్ డోమ్ క్షిపణులను ఇప్పటి వరకు వందల సంఖ్యలోనే ప్రయోగించినట్లు సమాచారం. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.42 లక్షలు.ఫతా–2ధ్వని వేగాన్ని మించిన వేగంతో దూసుకుపోయి, సుమారు 1500 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. దీని ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.93 లక్షలు.ఖైబర్ షెకాన్ఇది దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. అమెరికా బలగాలు ‘ఆపరేషన్ ఫ్యూరీ’ మొదలుపెట్టిన తర్వాత ఇరాన్ బలగాలు దాదాపు 180 వరకు ఖైబర్ షెకాన్ క్షిపణులను ప్రయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.35 కోట్లు.షాహెద్–136 డ్రోన్లుశత్రు స్థావరాలపై దాడుల కోసం తక్కువ ఖరీదుతో రూపొందించిన డ్రోన్లు ఇవి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు రెండువేల వరకు ఈ డ్రోన్లను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.27 లక్షలు.ప్రపంచ దేశాలకు ఇక్కట్లుఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాలకు అనేక ప్రతికూల ఫలితాలు తప్పవని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి దొరికితే చాలా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ముడి చమురు ధరలు మరో ముప్పయి శాతం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంతర్జాతీయ నిపుణుల అంచనా. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు గడ్డు పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పలు దేశాల జీడీపీ వృద్ధి తిరోగమనం చెందవచ్చని కూడా చెబుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్తో పాటు పశ్చిమాసియా దేశాలకు తీవ్ర నష్టం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పర దాడుల్లో ఇరాన్ సరిహద్దుల్లోని సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలలో భారీ నిర్మాణాలకు ముప్పుతో పాటు, తీవ్ర జననష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయి.చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడి పశ్చిమాసియా దేశాలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పశ్చిమాసియాలో ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. పశ్చిమాసియాకు వెలుపల చమురు ఉత్పాదనలో కీలకమైన రష్యా తనతో సానుకూల సంబంధాలు కలిగిన దేశాల చమురు లోటు తీర్చడానికి ముందుకు వచ్చి, బలమైన కూటమిని ఏర్పాటు చేసుకునే సూచనలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే! -
మల్లెల్లో మనమే టాప్!
వేసవి వచ్చేసింది. వేసవిలో ఎండల ధాటి ఎలా ఉన్నా, మల్లెల పరిమళాలు మనసుకు ఊరటనిస్తాయి. మల్లెల పరిమళాలే లేకుంటే, వేసవి తాపాన్ని భరించడం మానవమాత్రుల వల్ల అయ్యే పని కాదు. వసంతారంభం నుంచి గ్రీష్మం ముగిసే వరకు మల్లెలు విరివిగా పూస్తాయి. బొండు మల్లెలు, కాడ మల్లెలు సహా మల్లెల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మల్లెలు అత్యధికంగా పూసే దేశాలలో మన దేశం అగ్రగామిగా ఉంటుంది. మల్లెలు విరివిగా పూసే దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...మల్లెల ఉత్పాదనలో మన దేశం మొదటి స్థానంలోనే ఉన్నా, ఎగుమతుల్లో మాత్రం రెండో స్థానంలో ఉంది. మన దేశంలో మల్లెల ఉత్పాదన స్థాయిలోనే స్థానిక వినియోగం కూడా భారీగానే జరుగుతుండటం దీనికి కారణం. -
చొక్కాకు పూలకళ
పూల డిజైన్లు కేవలం అమ్మాయిల దుస్తులపై మెరవడానికే అనుకుంటే, మీరు చెవిలో పూలు పెట్టుకున్నట్టే! ఎందుకంటే, ఒక అబ్బాయి సరైన స్టయిల్లో పూల చొక్కా వేసుకుంటే, ఆ లుక్ ముందు ఎవరైనా సరే కాస్త సైడ్ అవ్వాల్సిందే! అది ఎలాగో మీరే చూడండి!సందర్భాన్ని బట్టి పూల సైజ్ ఎంచుకోండిపెద్ద పూల ప్రింట్స్ క్యాజువల్ ఔటింగ్స్, బీచ్ డేస్కు బెస్ట్. చిన్న పూల ప్రింట్స్ పార్టీలు లేదా సెమీ ఫార్మల్ ఈవెంట్స్కి క్లాసీ లుక్ ఇస్తాయి. ఎక్కువ మందికి పెద్ద పూల కంటే చిన్న లేదా మధ్యస్థ పరిమాణంలో ఉన్న పూల డిజైన్లు అందంగా కనిపిస్తాయి. ఒక సిక్స్ ఫీట్ కటౌట్ ఉన్న అబ్బాయి రంగురంగుల పూల ప్రింట్స్ ధరిస్తే అది అతనిలోని ‘సాఫ్ట్ పవర్’ చెప్పకనే చెప్తుంది.లైట్ అప్ ది కలర్స్ఫేవరెట్ కలర్స్ కంటే ఎప్పుడూ సూట్ అయ్యే కలర్స్ మీ లుక్ను లైట్ అప్ చేస్తాయి. అందుకే, ఎలిగెంట్ లుక్ కోసం బ్లూ, బీజ్, బ్లాక్ లాంటి కలర్స్ బాగా సెట్ అవుతాయి. యెల్లో, పింక్, మింట్ గ్రీన్ కలర్స్ ఎనర్జీ, ఫన్ వైబ్ ఇస్తాయి. డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్పై లైట్ పూల డిజైన్ ఉంటే లుక్ మరింత షార్ప్గా కనిపిస్తుంది.బాటమ్స్తో పర్ఫెక్ట్ బ్యాలెన్స్పూల చొక్కాతో పాటు ప్లెయిన్ ప్యాంట్ లేదా జీన్స్ వేసుకుంటే లుక్ ఎక్కువ గందరగోళంగా కాకుండా నీట్గా కనిపిస్తుంది. ప్యాటర్న్ ఎక్కువైతే, మిగతా డ్రెస్ సింపుల్గా ఉంచండి. అలాగే, కూల్ లుక్ కోసం షార్ట్లు, బీచ్ వైబ్స్ కోసం లినెన్ షార్ట్లు, లోఫర్స్ ఫ్లోరల్ షర్ట్స్కు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్తాయి.రఫ్డ్ గేమ్అమ్మాయిలు పూల డ్రెస్సులు వేస్తే అది అలవాటు, అదే అబ్బాయిలు వేస్తే అది ఒక అడ్వెంచర్! ఆ అడ్వెంచర్ను మరింత రియలిస్టిక్గా చూపించడానికి, రఫ్గా ఉండే గడ్డం, హెయిర్కట్కు జతగా ఒక వైబ్రంట్ ఫ్లోరల్ షర్ట్ ఇచ్చే కిక్ వేరే లెవెల్!డిజైనర్ షర్ట్పూల చొక్కా వేసుకున్నప్పుడు మీరు గమనించాల్సింది, మీరు వేసుకున్నది డిజైనర్ షర్ట్లా హై క్వాలిటీతో ఉండాలి. కానీ, పొరపాటున అది మీ చెల్లెలి దుపట్టానో లేదా అమ్మ చీరనో కుట్టించుకున్నట్టుగా కనిపించకూడదు.బటన్ల మ్యాజిక్ప్లెయిన్ ప్యాంట్, స్లీవ్లెస్ బనియన్ పై ఓపెన్ ఫ్లోరల్ షర్ట్ లుక్కు ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది. అలాగే, షర్ట్ పై బటన్లు రెండు వదిలేసి, చేతులు మడతపెట్టి పూల చొక్కాలో నడుస్తుంటే ఎవ్వరైనా మీపై నుంచి కళ్లు తిప్పుకోలేరు. అప్పుడు మీరు ‘నేనే వరల్డ్ హ్యాండ్సమ్, ఏమైనా సందేహమా?’ అన్నట్టుగా ఇచ్చే ఫొటో పోజులు కూడా అదిరిపోతాయి.దీపిక కొండి -
42 ఏళ్ల న్యాయపోరాటం... 100 ఏళ్ల వయసులో ముగింపు
‘న్యాయంలో జాప్యం న్యాయ నిరాకరణతో సమానం’ అని న్యాయ కోవిదులు చెబుతుంటారు... న్యాయం ఆలస్యం అయినా.. సుదీర్ఘకాలం ఎదురుచూసినా.. చివరకు తమకు న్యాయం దక్కింది.. అదే చాలని ఓ కుటుంబం సంతోషపడుతోంది.. కానీ ఆ సంతోషం వెనుక 42 ఏళ్ల నిరీక్షణ ఉంది.. కాలం మాటున కరిగిపోయిన ఓ వ్యక్తి జీవితం దాగుంది. మధ్య వయసులో నిందితుడిగా ఆ వ్యక్తిపై ముద్ర పడింది. కోర్టు జీవితఖైదు విధించింది. బెయిల్ వచ్చినా ‘పంజరం’ బతుకైంది. కాటికి కాళ్లు చాపిన వయసులో ఉన్నత న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. స్వేచ్ఛ లభించింది. కానీ, జీవితాన్ని అనుభవించడానికి వయసు, ఒంట్లో సత్తువ రెండూ మిగల్లేదు. కాలం వెనక్కి రాదు. అంతే కాదు, మరో విషాదమూ ఉంది.. ‘నేను ఏ నేరమూ చేయలేదు. నా కేసు కొట్టేశారు. నేను నిరపరాధిని’ అని సంతోషించేందుకు ఆ వ్యక్తికి జ్ఞాపకశక్తి లేదు.. ఎవరైనా చెబితే వినేందుకు వినికిడి శక్తీ మిగల్లేదు. 42 ఏళ్ల నిరీక్షణకు... 100 ఏళ్ల వయసులో కోర్టు ముగింపు పలికింది. ఆలస్యంగానైనా న్యాయం దక్కింది. నిందితుడనే మచ్చ తొలగింది. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా భువ్సీ గ్రామంలో భూ వివాదం ఓ వ్యక్తికి హత్యకు దారి తీసింది. పోలీసులు ముగ్గుర్ని నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు పత్తా లేకుండా పోయాడు. మరో నిందితుడు అప్పీలు విచారణలో ఉండగానే చనిపోయాడు. సజీవంగా ఉన్న వ్యక్తి న్యాయం కోసం సుదీర్ఘకాలం ఎదురు చూశాడు. జీవిత చరమాంకంలో నిర్దోషిగా కేసు నుంచి బయటపడ్డాడు. హత్యకు దారి తీసిన భూ వివాదం1982 ఆగస్టు 9న రాజుభయ్యా, అతని సోదరుడు గునువా చెరువు నుంచి నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన మైకు, సత్తి్తదిన్, ధనీరామ్ ఎదురుపడ్డారు. గతంలో తన తుపాకీని లాక్కున్నాడని, తన భూమిని ఆక్రమించాడనే కోపం మైకులో ఉంది. ఇదే అదనుగా భావించి అతడిపై కాల్పులు జరిపాడు. తుపాకీ గుండు శరీరంలోకి దూసుకెళ్లింది. గునువా నేలకొరిగాడు. సత్తి్తదిన్, ధనీరామ్ చేతుల్లోనూ ఈటె, గొడ్డలి ఉన్నాయి. కాల్పుల శబ్దానికి చుట్టుపక్కల వారు రావడంతో ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు–శిక్ష ఖరారుమైకు, సత్తిదిన్, ధనీరామ్లపై కేసు నమోదైంది. మైకు పరారయ్యాడు. ధనీరామ్ కోర్టులో లొంగిపోయాడు. 1984 జూన్లో హమీర్పూర్ అదనపు సెషన్స్ కోర్టు ఐపీసీ సెక్షన్ 302, సెక్షన్ 34 కింద దోషులుగా తేల్చి సత్తిదిన్, ధనీరామ్లకు జీవిత ఖైదు విధించింది. అదే ఏడాది ధనీరామ్కు బెయిల్ మంజూరైంది. అలహాబాద్ కోర్టులో అప్పీలులోయర్ కోర్టు విధించిన శిక్షపై ఇద్దరు నిందితులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. అప్పీలు దశలోనే సత్తిదిన్ మృతి చెందాడు. ధనీరామ్ ఒక్కడే మిగిలాడు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఈ కేసు నడిచింది. ఇద్దరు సాక్షులను కోర్టు మరోసారి విచారించింది. కేసు పత్రాలన్నీ పరిశీలించింది. సాక్ష్యాలు.. ఎఫ్ఐఆర్లో తేడాలు కేసులో ప్రధాన సాక్షి రాజుభాయ్, మరో సాక్షి రామా కింది కోర్టులో చెప్పిన సాక్ష్యానికి, హైకోర్టులో చెప్పిన వివరాలకు తేడాలను గుర్తించింది.. వారు చెప్పిన దానికి భిన్నంగా వైద్య నివేదిక ఉంది. వారి వాంగ్మూలాలు నమ్మదగినట్టుగా లేవని కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఎఫ్ఐఆర్లోనూ పలు లోపాలు విచారణలో బయటపడ్డాయి. ధనిరామ్ చేతిలో గొడ్డలి ఉంది తప్ప మృతుడిపై ఆ మారణాయుధం తాలూకు గాయాలు లేవని వైద్యుడి నివేదిక స్పష్టం చేసింది.కింది కోర్టు తీర్పు కొట్టివేతసాక్ష్యాధారాలను సహేతుకమైన సందేహాలతో కింది కోర్టు విశ్లేషించలేదని హైకోర్టు ధర్మాసనం భావించింది. ప్రాసిక్యూషన్ నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను చూపించలేకపోయిందని పేర్కొంది. కేసు సుదీర్ఘకాలం నడవడం, నిందితుడి వయస్సు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పింది. గతంలో ఈ తరహా కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ ‘సాక్ష్యాల’ పరిశీలనపై ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవితఖైదును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పీలుదారుకి విముక్తి కల్పించింది. ‘నాతండ్రి నిర్దోషి అని తేలడం మాకు ఆనందం. చాలా ఆలస్యమైనా మాకు న్యాయం జరిగింది’ అని ధనీరామ్ కుమారుడు లల్లూరామ్ భావోద్వేగంతో స్పందించాడు. -
లిట్వరల్డ్: కథబంధ ప్రహేళిక!
ఇరవై ఒకటో శతాబ్దిలో నోబెల్ పురస్కారాలు అందుకున్న పాతికమంది రచయితల్లో ప్రథముడు సర్ విదియాధర్ సూరజ్ పర్సాద్ నైపాల్. ఇక ఈ వరసలో ఇరవైఆరో రచయిత పేరు ఈ అక్టోబర్లో వెల్లడవుతుంది– అందాకా వేచిచూద్దాం! 1932లో కరీబియన్ దేశం ట్రినిడాడ్లో పుట్టి– పదిహేడోయేట బ్రిటన్ కు మెట్టి– 2018లో కన్నుమూసిన నైపాల్ను వ్యక్తిగా గానీ, రచయితగా గానీ ఓ చట్రంలో బిగించడం దాదాపు అసాధ్యం! ఐనా అలాంటి మెట్ట వడ్రంగానికి మనమెందుకు పూనుకోవాలి? నైపాల్ను మనవాళ్ళు ‘నోబెల్ పురస్కారం పొందిన రెండో భారతీయుడు’గా చెప్పుకుని జబ్బలు చరుచుకుంటూ ఉంటారు. కానీ సర్ విదియా తనను తాను భారతీయ రచయితగా ఎన్నడూ చెప్పుకోనూలేదు– గర్వించింది అసలే లేదు! నైపాల్ తనను ట్రినిడాడియన్–బ్రిటిష్ రచయితననే భావించుకున్నాడు, అలాగే సంభావించుకున్నాడు! అందుకాయన్ని తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు!!అంచేత, సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక భారతీయుడు రబీంద్రనాథ్ టాగోర్. ‘గీతాంజలి’ కావ్యానికి ఆయనకా బహుమతి 1913లో దక్కింది. 88 యేళ్ళ తర్వాత నైపాల్ రాసిన ‘ద ఎనిగ్మా ఆఫ్ అరైవల్’ అనే ఆత్మకథాత్మక నవలకు సైతం నోబెల్ పురస్కారం దక్కింది. సదరు పురస్కారం అందుకుంటూ, నైపాల్ చేసిన ప్రసంగానికి ఆయన ఇచ్చిన శీర్షిక ‘రెండు ప్రపంచాలు.’ అవి ప్రాచ్య– పాశ్చాత్య ప్రపంచాలు కావు. అమెరికన్– బ్రిటిష్ ప్రపంచాలు మాత్రమే!ట్రినిడాడ్ లోని ‘హిందువుల’ జీవన సరళి నైపాల్కు కొట్టిన పిండి. అందుకే ఆయన ‘కాల్పనిక’ సాహిత్యంలో ప్రముఖంగా ప్రతిఫలించేది అదే. ఐతే, 1961లో అచ్చయిన ‘ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్’తోనే నైపాల్కు నవలా రచయితగా చెప్పుకోదగిన గుర్తింపు దక్కింది. 1998 నాటి మోడర్న్ లైబ్రరీ ‘20వ శతాబ్దిలో వచ్చిన నూరు ఉత్తమ నవలల’ జాబితాలో ఈ నవలకు 72వ స్థానం దక్కింది. టైమ్ మ్యాగజీన్ రూపొందించిన ‘1928–2005 మధ్యకాలంలో ఇంగ్లిష్లో వచ్చిన నూరు ఉత్తమ నవలల’ జాబితాలో కూడా ఈ నవలకు చోటు దక్కింది. 1971లో ఆంద్రె డాయిష్చ్ ప్రచురణ సంస్థ వెలువరించిన ‘ఇన్ ఎ ఫ్రీ స్టేట్’ అనే నవల అదే యేడాది బుకర్ ప్రైజ్ గెల్చుకుంది. నిజానికిది మూడు గొలుసు కథల సంకలనం. ఈ శిల్పం మరీ అపూర్వమేమీ కాదు– బృహత్కథ, పంచతంత్రం, వెయ్యిన్నొక్క రాత్రులు, క్యాంటర్బరీ టేల్స్ నుంచి మన కాశీ మజిలీ కథల వరకూ అన్నీ ఇలాంటి గొలుసుకట్టు చట్రంలో బిగించిన కథలే! 1983లో నైపాల్కు ‘జెరూసలేం పురస్కారం’, 1990లో ట్రినిడాడ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం ‘ద ట్రినిటీ క్రాస్’ బహుమతి దక్కాయి. అదే సంవత్సరం బ్రిటిష్ రాజరికం ఈ ట్రినిడాడియన్– బ్రిటిష్ రచయితకు నైట్హుడ్ ప్రసాదించింది. ఈ బహుమతులన్నిటికీ తలమానికంగా, సర్ విదియాకు 2001లో నోబెల్ సాహిత్య పురస్కారమూ దక్కింది! అది కూడా ఓ నవలకే దక్కడం గమనార్హం. అర్ధశతాబ్దికి పైగా విస్తరించి వున్న తన సాహిత్య జీవితంలో నైపాల్ 11 నవలలు ఎందుకు రాశాడో ఈ నేపథ్యం వివరిస్తోంది!కాలుగాలిన పిల్లిలా ప్రపంచమంతా కలతిరిగిన నైపాల్ తొమ్మిది పది యాత్రా చరిత్రలు రాసివుండడంలో వింతేముంది? తన– తన కుటుంబ సభ్యుల పౌరసత్వ–వారసత్వాల గురించి ఆలోచించడానికే జీవితమంతా ఖర్చు పెట్టిన నైపాల్ తన పూర్వికుల పురిటిగడ్డ భారతదేశం గురించి మూడు పుస్తకాలు రాశాడు. ‘యాన్ ఏరియా ఆఫ్ డార్క్నెస్’, ‘ఇండియా–ఎ వూండెడ్ సివిలిజేషన్’, ‘ఇండియా– ఎ మిలియన్ మ్యూటినీస్ నౌ’ అనే ఈ పుస్తకాలు మూడూ నైపాల్ యాత్రా చరిత్రల్లో ముఖ్యమైనవి. వాటిని రాజకీయ– చారిత్రక యాత్రా చరిత్రలనవచ్చు. వాటిల్లో ఏ కోశాన్నా భారతదేశమన్నా, దాని చరిత్రన్నా ప్రేమాదరాలు వ్యక్తమైనట్టు నాకెక్కడా కనిపించలేదు!అయితే, ఈ వరసలోని మూడో పుస్తకంలో భారతదేశంలోని పీడిత తాడిత వర్గాల పట్ల ఒకింత సహానుభూతి వ్యక్తమైందని ‘నైపాల్ నిపుణులు’ కొందరు అంటారు.నైపాల్ పూర్వికులు ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్గా పిల్చుకునే ప్రాంతంలో తూర్పు భాగానికి చెందినవాళ్ళు. ఒకప్పుడు దాన్ని యునైటెడ్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు. అలా, అది అప్పుడూ యూపీయే, ఇప్పుడూ యూపీయే! ఆనాటి మరో బ్రిటిష్ వలస ట్రినిడాడ్–టొబాగోకు నైపాల్ పూర్వికులు వలస వెళ్ళారు. 1837–’38లో, యూపీ డెల్టా అనే ‘గంగా జమునా దోఅబ్’ ప్రాంతాల్లో ఘోరమైన కరువు వచ్చింది. దాని ధాటికి తట్టుకోలేక విదేశాలు పట్టిపోయిన వాళ్ళలో నైపాల్ పితామహుడు పండిత దూబే, మాతామహుడు పండిత కపిల్ దేవ్ కూడా వున్నారు. ఈ పండితులు ఇద్దరూ, గత్యంతరం లేక, ఇండెంచర్డ్ లేబర్ (ఇప్పటి వాడుక ప్రకారం కాంట్రాక్టు కూలీలు అనాలేమో!)గా మారవలసివచ్చింది. ట్రినిడాడ్ చెరుకు తోటల్లో కూలిపని చేసుకుంటూనే పిల్లల్ని చదివించుకున్నారు; వృత్తివ్యాపారాల్లో రాణించేలా తీర్చిదిద్దుకున్నారు. నైపాల్ పితామహుడి పేరు కూడా నాకెక్కడా తగల్లేదు కానీ, అతగాడు తన కుమారుడు ‘శీకుమార్ నైపాల్’ను ఇంగ్లిష్ జర్నలిస్టుగానూ, రచయితగానూ స్థిరపడే రీతిలో పెంచుకోగలిగాడు. ఇంగ్లిష్ సాహిత్యమన్నా, రచయితలన్నా అభిమానించే శీకుమార్ పెంపకంలో విదియాధర్ సూరజ్ పర్సాద్ నైపాల్ నోబెల్ లారియెట్ కావడంలో విడ్డూరమేముంది? ∙ _ - మందలపర్తి కిషోర్ -
తామస మనువు జననం
పూర్వం సురాష్ట్రుడు అనే రాజు ఉండేవాడు. వీరాధి వీరుడిగా విఖ్యాతి పొందిన సురాష్ట్రుడి సుపరిపాలనలో అతడి రాజ్యం సుభిక్షంగా ఉండేది. అతడి మంత్రి నరసింహ శర్మ. అమిత రాజభక్తి కలిగినవాడు. రాజుకు అన్ని వ్యవహారాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేవాడు.రాజుకు మరింత మేలు చేయాలనే తలంపుతో నరసింహ శర్మ సూర్యుడి కోసం తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన సూర్యుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. ‘సూర్య భగవంతుడా! మా మహారాజుకు అమితమైన ఆయుర్దాయాన్ని అనుగ్రహించు. అది చాలు నాకు’ అన్నాడు నరసింహ శర్మ. ‘తథాస్తు’ అని వరాన్ని అనుగ్రహించి, సూర్యుడు అదృశ్యుడయ్యాడు.వెంటనే మంత్రి నరసింహ శర్మ రాజు వద్దకు వెళ్లి, జరిగినదంతా చెప్పాడు.తన గురించి మంత్రి పొందిన వరం తెలుసుకున్న రాజు సురాష్ట్రుడు ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయసాగాడు.రాజుకు అమితాయుర్దాయం కలిగినా, అతడి భార్యలకు అంత ఆయుర్దాయం లేనందున, వారు ఒక్కొక్కరు గతించిపోయారు. భార్యలు ఒక్కొక్కరుగా గతించిపోవడంతో సురాష్ట్రుడికి విరక్తి కలిగింది. రాజ్యాన్ని మంత్రికి అప్పగించి, తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లిపోయాడు.అతడు తపస్సు చేసుకుంటూ ఉండగా, కొంతకాలానికి వర్షాకాలం వచ్చింది. ఒకసారి విపరీతమైన వర్షం కురిసింది. వరదనీటితో అడవి జలమయమైంది. సురాష్ట్రుడు ఆ వరదనీటిలో కొట్టుకుపోసాగాడు. అదే నీటిలో కొట్టుకు వస్తున్న ఒక లేడి అతడికి ఆధారంగా దొరికింది. లేడిని పట్టుకుని ఎలాగోలా సురాష్ట్రుడు కాసేపటికి ఒడ్డుకు చేరుకున్నాడు.ఒడ్డుకు చేరుకున్నాక సురాష్ట్రుడు కృతజ్ఞతతో ఆ లేడిని దువ్వుతూ, దాని మీద మోహంలో పడ్డాడు. లేడి మీద తనకు మోహం కలగడం అతడికి ఆశ్చర్యం అనిపించింది. ఇది మామూలు లేడి కాదనుకున్నాడు.‘ఓ హరిణమా! నువ్వెవరివి? నిన్ను తాకగానే నాకు నీ మీద మోహం మొదలైంది. దీనికి కారణమేంటి?’ అని అడిగాడు.‘మహారాజా! గతజన్మలో నేను దృఢధన్వుడు అనే రాజు కుమార్తెను. నీ గతించిన భార్యలలో నేను మొదటిదానిని. నా పేరు ఉత్పలమాల’ అని పలికింది. సురాష్ట్ర మహారాజు సంభ్రమాశ్చర్యాలు చెందాడు. ‘మరి నీకు ఈ లేడి జన్మ ఎందుకు కలిగింది?’ అని అడిగాడు.‘నేను దృఢధన్వుని కుమార్తెగా ఉన్నప్పుడు ఒకసారి చెలికత్తెలతో వనవిహారం చేస్తుంటే, ఒక ముని కుమారుడు ఎదురయ్యాడు. అతడు నన్ను మోహించి, వివాహం చేసుకోమని అడిగాడు. నేను క్షత్రియ కన్యను. నిన్ను వివాహమాడలేను. యోగ్యురాలైన బ్రాహ్మణ కన్యను చూసుకుని వివాహం చేసుకోమని అతడికి నచ్చజెప్పాను. అతడు కినుక వహించి, వచ్చే జన్మలో హరిణమవుతావని శపించాడు. శాప విముక్తి చెప్పవలసిందిగా ప్రార్థిస్తే, నీ పూర్వజన్మ భర్త అయిన రాజు ప్రవాహంలో కొట్టుకువస్తూ, నిన్ను ఆధారంగా పట్టుకుని ఒడ్డుకు వస్తాడు. అతడు నీ కంఠాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు నీకు పూర్వరూపం వస్తుంది అని చెప్పాడు. మహారాజా నా కంఠాన్ని ఆలింగనం చేసుకోండి’ అంది లేడి రూపులోనున్న ఉత్పలమాల. సురాష్ట్రుడు ఆ లేడి మెడను ఆలింగనం చేసుకున్నాడు. లేడికి పూర్వరూపం వచ్చింది. ఆమెను వెంటతీసుకుని, సురాష్ట్రుడు రాజధానికి చేరుకున్నాడు. మంత్రికి, పరివారానికి జరిగినదంతా చెప్పాడు. వారంతా సంతోషించారు.కొన్నాళ్లకు ఉత్పలమాల గర్భందాల్చింది. నెలలు నిండాక ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. సురాష్ట్ర మహారాజు పుత్రుడికి జాతకర్మ జరిపించి, తామసుడు అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా చూసుకోసాగాడు. ఇలా రోజులు సాగుతుండగా, ఒకనాడు ఆకాశవాణి ‘రాజా! నీ కుమారుడు తామసుడు మనువుగా ప్రఖ్యాతి పొందుతాడు’ అని పలికింది. తామసుడు సూర్యోపాసన చేసి, సకల విద్యలూ నేర్చుకున్నాడు. సమస్త భూమండలాన్నీ జయించి, పాలించాడు. అతడి పాలనాకాలం తామస మన్వంతరంగా ప్రసిద్ధి పొందింది.∙సాంఖ్యాయన -
భర్తను భయపెట్టి చంపే ప్లాన్.. చివరికి జైలుకెళ్లిన భార్య!
‘‘నన్నెవరో చంపడానికి వెంట పడుతున్నారు’’ అంటూ దివాకర్ అనే వ్యక్తి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. స్టేషన్లో వణుకుతూ కూర్చున్న దివాకర్ను చూసి ఇన్స్పెక్టర్ సూర్యకు మొదట జాలి కలిగింది. తాగడానికి నీళ్లు ఇచ్చి, ‘‘ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు’’ అన్నాడు.‘‘ఈ మధ్య నా మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి... సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కూడా ఒక వ్యక్తి నన్ను వెంబడించాడు’’ భయం భయంగా చెప్పాడు దివాకర్. వెంటనే ఇన్స్పెక్టర్ సూర్య – దివాకర్ ఆఫీస్ నుంచి వచ్చే దారిలో సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాడు. అందులో దివాకర్ ఒక్కడే పరిగెత్తుకుంటూ రావడం చూశాడు. అంత రాత్రివేళ ఒక్కడినే ఇంటికి బలవంతంగా పంపడం సేఫ్ కాదని ఇన్స్పెక్టర్ సూర్య స్వయంగా అతడిని ఇంటి దగ్గర దింపాడు. దివాకర్ భార్య అప్పటికే భర్త కోసం ఎదురు చూస్తోంది. ఇన్స్పెక్టర్ విషయం చెప్పాడు. దివాకర్ భార్య రవళి మౌనంగా లోపలికి వెళ్లి, కొన్ని కాగితాలు తెచ్చి ఇన్స్పెక్టర్కు ఇచ్చింది. అవి డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్...దివాకర్కి ‘పారనాయిడ్ స్కిజోఫ్రీనియా’ అనే సైకలాజికల్ డిజార్డర్ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అవి.ఇన్స్పెక్టర్ సూర్య– దివాకర్ వైపు జాలిగా చూసి ఒక నిట్టూర్పు విడిచి బయటకు వచ్చాడు.ఇన్స్పెక్టర్ బయటకు వస్తుంటే, దివాకర్ తనని కాపాడమని తనను ఎవరో చంపేస్తారని అరవడం గుర్తొచ్చింది. జీపులో స్టేషన్కు బయల్దేరిన సూర్య రెడ్ సిగ్నల్ దగ్గర ఆగిపోయాడు. అది దివాకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే రోడ్డు. కుడి వైపు పోలీస్ స్టేషన్కు వెళ్లే రోడ్డు వస్తుంది. సూర్యకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఆ సిగ్నల్ దగ్గర సీసీ కెమెరాలు బిగించి ఉన్నాయి. వెంటనే దివాకర్ ఇంటికి వెళ్లే రోడ్డుకు ఉన్న సీసీ ఫుటేజ్ చూశాడు. అందులో దివాకర్ను ఒక వ్యక్తి బైక్ మీద వెంబడిస్తున్నాడు. అప్పుడు దివాకర్ వెనక్కి వచ్చి పోలీస్ స్టేషన్ వైపు పరుగెత్తాడు.అతడిని బైక్ మీద వెంబడించిన వ్యక్తి అక్కడే ఆగిపోయాడు. అందుకే ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్కు వచ్చే రూట్లో సీసీ ఫుటేజ్లో అతను కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది సూర్యకు– తను దివాకర్ను ఇంటి దగ్గర దింపినప్పుడు దివాకర్ ఇంటికి దూరంలో ఉన్న బైక్... దివాకర్ను వెంబడించిన అదే బైక్...వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జీపు వెనక్కి తిప్పాడు. దివాకర్ ఇంటి వైపు...దివాకర్ అపరిచిత వ్యక్తి వైపు భయంగా చూస్తున్నాడు. ముఖానికి మాస్క్ వుంది. అతని చేతిలో చీర వుంది. ఈ చీరతో ఉరేసుకో... నిన్ను నేను చంపను... నువ్వే హాయిగా చచ్చిపోవచ్చు...దివాకర్ పారిపోవాలని చూస్తున్నాడు. ఎదురుగా ఉన్నది ప్రాణంగా ప్రేమించిన భార్య రవళి.‘‘చచ్చిపో దివాకర్... నిన్ను చంపి నేను జైలుకు వెళ్లడానికా ఇంత ప్లాన్ చేసింది. నువ్వు చచ్చిపోతే, పారనాయిడ్ స్కిజోఫ్రీనియాతో చచ్చిపోయావని నమ్మించొచ్చు. దానికి ఇన్స్పెక్టర్ కూడా సాక్ష్యం. రవళి నవ్వుతోంది వికృతంగా... అదంతా చూస్తున్న ఇన్స్పెక్టర్ సూర్య లోపలికి అడుగు పెట్టాడు.‘‘ఇప్పుడు సాక్ష్యంతోనే వచ్చాను మిసెస్ రవళి. నీ భర్తకు ఉన్న పారనాయిడ్ స్కిజోఫ్రీనియాను అడ్డం పెట్టుకుని నీ ప్రియుడితో నాటకం ఆడి నువ్వు చేసిన ప్లాన్ ఇప్పుడు నీకే బెడిసికొట్టింది. నీ భర్తను పోలీస్ స్టేషన్కు వెళ్లేలా భయపెట్టి సాక్ష్యాన్ని సృష్టించుకోవాలనుకున్నావు. కాని, ఇలా చట్టం చేతికి చిక్కావు. ఆస్తి కోసం, అక్రమ సంబంధం కోసం భర్తను వదిలించుకోవాలని వేసే ఇలాంటి క్రిమినల్ ప్లాన్స్ ఎప్పటికైనా పోలీసుల చేతికి చిక్కాల్సిందే!’’ అని రవళిని చూసి చెప్పాడు. ‘‘ఒక సీసీ ఫుటేజ్ నీ ప్రాణాన్ని కాపాడింది. నీ భార్య ప్రియుడితో కలిసి ఆడిన నాటకానికి చెక్ పెట్టింది’’ దివాకర్కు ధైర్యం చెబుతూ అన్నాడు. రవళిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఈ వారం కథ: ప్రాణదాత
‘‘లే నాయనా! మరేమీ భయం లేదు’’ అన్నారు శాస్త్రిగారు. రామచంద్ర వినయంగా లేచి నిలబడ్డాడు. జేబులోంచి ఓ కాగితం తీసి ఆయన చేతిలో పెట్టాడు. మడతవిప్పి చదువుతుండగానే, ఆ ఉత్తరంలో తన తండ్రి శాస్త్రిగారికి వ్రాసిన సందేశాన్ని క్లుప్తంగా వినిపించాడు.‘‘రుణాలు దారుణంగా ఉన్నాయి స్వామీ! తొందరలో తీర్చకపోతే ఇల్లు అప్పులవాళ్ల పరమైపోతుంది. నాకేమో శిల్పాలు చెక్కడం తప్ప మరే పనీ చేతకాదు. ఈ మధ్యన చేతినిండా పని దొరకడం లేదు. డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది. డబ్బుకోసం, పని కోసం పట్టకూడని వాళ్ల కాళ్లు కూడా పట్టాను. ఈ కష్టాలకు అంతూదరీ చిక్కడం లేదు. దీనికి పరిష్కారం మీరే చూపించగలరని మా నాన్న చెప్పాడు. అన్యథా శరణం నాస్తి’’ అంటూ మళ్లీ శాస్త్రిగారి కాళ్లమీద పడ్డాడు రామచంద్ర.‘‘ఇలా మాటిమాటికీ ఇబ్బంది పెట్టకు నాయనా! ఏదీ జాతకం కాగితాలు తెచ్చావా?’’ అని అడిగారు శాస్త్రిగారు అంతకుముందు అతడిచ్చిన కాగితాన్ని పక్కన పెడుతూ... మరో కాగితాల దొంతర తీసి ఆయనకు అందించాడు రామచంద్ర. శాస్త్రిగారు పరీక్ష చేస్తున్నారు. ద్వితీయాధిపతి దశ నడుస్తోంది. అష్టమ వ్యయాధిపతులు అంతర ప్రత్యంతర దశల్లో ఉన్నారు. గోచార రీత్యా క్రూరగ్రహమైన వ్యయాధిపతి ధన స్థానంలోకి చేరబోతున్నాడు. అన్నీ అపశకునాలే కనిపిస్తుండగా శాస్త్రిగారి మనస్సు కలవరపడింది. రామచంద్ర దీనంగా ముఖంపెట్టుకుని శాస్త్రిగారినే చూస్తున్నాడు. ఆయన ఒక్కక్షణం కళ్లుమూసుకుని తన ఉపాస్యదేవతను స్మరించారు. ఆయన భృకుటియందు ఒక దృశ్యం ఆవిష్కృతమైంది.మహాకాలసర్పం ఒకటి సూర్యుణ్ణి మింగబోతుండగా, ఒకానొక త్రిశూలం దాన్ని ఎత్తి గిరవాటేసింది. శివుని జటాజూటంలో జారిపడ్డ ఆ పాము గంగలో ఈదులాడుతోంది... ఈ దృశ్యాన్ని చూసిన తరువాత నెమ్మదిగా కళ్లు తెరిచారు శాస్త్రిగారు.ప్రసన్న వదనంతో చిరునవ్వు నవ్వుతూ, ‘‘నాయనా! నీకు తళుకేశ్వరం తెలుసా?’’ అని అడిగారు. ‘‘తెలియదండి.’’‘‘ఇప్పుడు దాన్నే తడికలపూడి అంటున్నారు. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే దారిలో ఉంది. అక్కడ గాంగేశ్వరస్వామి ఆలయం ఉంది. గంగాపుత్రుడైన భీష్మపితామహుడు ప్రతిష్ఠించిన శివలింగం...’’శాస్త్రిగారు చెబుతున్నారు. రామచంద్ర వింటున్నాడు.‘‘వచ్చే అమావాస్య... సోమవారం. సోమావతీ అమావాస్య అంటారు. పవిత్రమైన రోజు. ఆ రోజు ఉదయం ఆ స్వామికి శక్తివంచన లేకుండా అభిషేకం చేయించుకో.’’‘‘స్వామీ! నా ఆర్థిక పరిస్థితి చెప్పాను కదా’’ ఆదుర్దాగా మాటకడ్డం వచ్చాడు రామచంద్ర.‘‘మరేం పరవాలేదు. శక్తివంచన లేకుండా అంటే భక్తిలోపం లేకుండా మనసు తీరా చేయమని కానీ, డబ్బు ఖర్చుపెట్టమని కాదు.’’ వివరించారు శాస్త్రిగారు. ‘‘అలాగే స్వామీ!’’‘‘ఆనాటి ఉదయం అక్కడ అభిషేకం చెయ్యి. అక్కడి నుంచి తూర్పుకు ఐదుమైళ్ల దూరంలో కుడివైపున తోటల మధ్యలో అష్టభైరవ నిర్మితమైన శివాలయం ఉంటుంది. ఆ రాత్రికి నీవు ఆ ఆలయంలో జాగారం చేయాలి. జాగ్రత్త సుమా! అసలే నిర్జన ప్రదేశం. తగిన ఏర్పాట్లతో వెళ్లు. మెలకువతో రాత్రంతా ఉండి, తెల్లవారిన తరువాత నా వద్దకు నేరుగా రా’’ అంటూ కొంత డబ్బుతీసి రామచంద్ర ముందు పెట్టారు శాస్త్రిగారు.‘‘అయ్యో! నేనివ్వాల్సింది పోయి మీరే ఎదురిస్తున్నారా?’’ మొహమాట పడ్డాడు రామచంద్ర.‘‘ఇన్నేళ్లుగా నా మొగమైనా తెలీని నిన్ను, మీ నాన్న ఇప్పుడే నా దగ్గరకు పంపాడంటే దానికేదో కారణం ఉంటుందని గ్రహించు. ఈ డబ్బు మీ నాన్న ఇచ్చిందే అనుకో’’ లాలనగా చెప్పారు శాస్త్రిగారు.రామచంద్ర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. అది 1966వ సంవత్సరం, ఫాల్గుణమాసం. అమాసోమవారం తెల్లవారింది. ఆ వేళ ఉదయం ఎనిమిది కావస్తుండగా రామచంద్ర తడికలపూడికి చేరుకున్నాడు. ప్రధాన రహదారి నుంచి ఎడమ పక్క సందులోకి ప్రవేశించాడు. అల్లంత దూరాన వేంగీ చాళుక్యుల కాలంనాటి ఆలయ శిఖరం నీరెండ ఛాయలో మెరుస్తూ కనిపిస్తోంది. నడుచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. జనావాసాల మధ్యలోనే ఉన్న మల్లెతోటల నుంచి సువాసనలు దారంతా విరజిమ్ముతున్నాయి. జనాలంతా నీళ్లకావిళ్లతో ఎదురొస్తున్నారు. చెరువు దూరంగా ఉన్నట్లుంది. రామచంద్ర ఆలయాన్ని సమీపించాడు. ఆలయ ప్రాకారాన్ని చుట్టిరావడానికి వీలులేదు. రెండుపక్కల ఇళ్లు. అయిమూలగా దక్షిణదిక్కున ఒక రోడ్డుంది. గుడిలోకి ప్రవేశించాడు రామచంద్ర. తువ్వాలు చుట్టుకున్న ఆలయ పూజారి బలిపీఠం దగ్గర శుభ్రం చేసుకుంటున్నాడు. కుడివైపు బావి వుంది. ‘‘అయ్యా! ఆ బావిలో నీళ్లు స్నానానికి పనికొస్తాయా?’’ అడిగాడు రామచంద్ర.ఒక్కక్షణం అతణ్ణి పరకాయించి చూసి, ‘‘ఆ బావిలో నీళ్లు తోడటం నీవల్ల కాదు. స్నానానికైతే చెరువుంది’’ చెప్పాడు పూజారి.నిజమే. బావి చాలా లోతుగా ఉంది. నీళ్లు అట్టడుగున ఉన్నాయి.‘‘పేరుకి గాంగేశ్వర స్వామి వెలసిన క్షేత్రం. ఊళ్లో నీటిచుక్క ఉండదు. వేసవికాలం వస్తే ఉన్న ఒక్క చెరువూ ఎండిపోతుంది. జీవుడికి తాగునీటికి కరవు. గుళ్లో అయ్యవారి స్నానానికి కరవు’’ పూజారి తనలో తానే గొణుక్కుంటున్నాడు.రామచంద్ర ఎడమభుజం మీద సంచీని ఎగదోసుకుని ముందుకి కదిలాడు. ‘‘బాబూ! వచ్చేటప్పుడు ఆ కావిడితో నీళ్లు తెచ్చిపెట్టగలవా?’’ అడిగాడు పూజారి. ‘‘మహద్భాగ్యం’’ అంటూ కావిడిని కుడిభుజం మీదకు ఎత్తుకున్నాడు రామచంద్ర. చెరువులో స్నానం చేసి, నీళ్లు తీసుకుని వచ్చాడు. అప్పటికే అభిషేకం మొదలైనట్లుంది. పూజారితో గొంతు కలుపుతూ గాంగేశ్వరస్వామిని నమక చమకాలతో అర్చించాడు రామచంద్ర. అనంతరం కొంత దక్షిణ ఆయనకు సమర్పించాడు. ‘‘లేచిన వేళ బాగుంది’’ అనుకుంటూ దానిని అందుకున్నాడు పూజారి. ‘‘బాబూ! చాలాదూరం నుంచి వచ్చినట్లున్నావు’’ రామచంద్రని అడిగాడు ఆప్యాయంగా.‘‘అవునండీ. ఒక పని మీద వచ్చాను. ఈవేళ ఇక్కడే ఉంటాను’’ చెప్పాడు రామచంద్ర.‘‘అయితే ఈ పూటకి మా ఇంటిలో చేయి కడుక్కోవచ్చు’’ ఆదరంగా చెప్పాడు పూజారి.కృతజ్ఞతగా నమస్కరించాడు రామచంద్ర. భోజనం తరువాత, కాసేపు ఆలయ శిల్పాలను గమనిస్తూ గడిపాడు. కొద్దిసేపటికి దూరంగా ఆకాశంలో ఉరుముల సవ్వడులు వినిపించసాగాయి. ఎండ పూర్తిగా తగ్గలేదు కానీ వాతావరణం చల్లబడింది. శాస్త్రిగారు చెప్పిన గుర్తుల ప్రకారం ఆలయానికి తూర్పుముఖంగా సాగిపోయాడు రామచంద్ర. ఒక గంటన్నర వ్యవధిలో జీడిమామిడి తోటల మధ్యలో ఉన్న ఒక శిథిలాలయాన్ని కనుగొన్నాడు. మహా అయితే నాలుగడుగుల ఎత్తుంటుంది. అయిదడుగుల పొడవు, మూడడుగుల వెడల్పు ఉంటుంది. ఆ కాస్తచోటులోనే ఎనిమిదివైపులా భైరవశిల్పాలున్నాయి. ఆ శిల్పసౌందర్యం అమోఘంగా ఉంది. రామచంద్ర గుడిచుట్టూ పరికిస్తుండగా, తోట రైతు కాబోలు వచ్చాడు. ‘‘ఎవురు బాబూ! ఈయేళప్పుడు వచ్చారు? బేగ ఎల్లిపోండి. వాన పడేనాగుంది’’ అని సలహా ఇచ్చాడు. రామచంద్ర చిరునవ్వు నవ్వి, ‘‘లేదు. ఈరాత్రికి ఇక్కడే ఉండాలని వచ్చాను’’ అన్నాడు.రైతు అతడిని అయోమయంగా చూశాడు. ‘‘సూడు బాబూ! ఈడ రాత్రైతే మావే ఉండలేం. కట్టం. ఏడనుంచొస్తాయో... ఎందుకొస్తాయో తెలవదు గానీ, చీకటి పడగానే ఈడకి కుక్కలొస్తాయి. మనుషుల్ని చెండాడేస్తాయి. ఆటితో నువ్వు పడలేవు బాబూ! నా మాటిని ఎల్లిపో’’ బుజ్జగింపుగా చెప్పాడు.‘‘ఈ గుడిలో నిద్ర చేస్తానని మొక్కుకున్నాను. అంచేత ఈ రాత్రికి ఉండాల్సిందే’’ చెప్పాడు రామచంద్ర.‘‘ఈ గుడికి ఇట్టాంటి మొక్కులతో కూడా జనాలొత్తన్నారా? ఇడ్డూరంగా ఉందే. సరే బాబూ! జాగ్రత్త’’ అంటూ రైతు అక్కడినుంచి వెళ్లిపోయాడు.ఇంకా సంధ్యాసమయం కాలేదు. కానీ ఆకాశం మేఘావృతం కావడం వల్ల చీకట్లు కమ్ముకుంటున్నాయి. కనుచీకటి ఉండగానే రామచంద్ర గుళ్లో ప్రవేశించాడు. అడుగున్నర ఎత్తున్న ద్వారానికి తలుపులేమీ లేవు. వంగి పాక్కుంటూ లోపలికి వెళ్లి చూస్తే గుడికి మధ్యలో పానపట్ట రహితంగా నేలలో పాతేసినట్లుగా శివలింగం ఉంది.ఇంకు సీసా మూతకి కన్నంపెట్టి ఒత్తిని దూర్చి, లోపల కిరసనాయిల్ పోసి మూతపెడితే ఇల్లాయిబుడ్డి తయారవుతుంది. ఆ బుడ్డిలో కిరసనాయిల్ బదులుగా ఆవునెయ్యి పోసి తెచ్చాడు రామచంద్ర. దేవుడిముందు వెలిగించాడు. ఆ వెలుగులో రాత్రంతా అక్కడ కాలక్షేపం చెయ్యాలి. అందుకోసం కూడా తగిన ఏర్పాట్లు ముందే చేసుకున్నాడు. ఏవైనా బొమ్మలు గీసుకోవచ్చని కొన్ని కాయితాలు తెచ్చుకున్నాడు. ఆ గుడిని చూసేవరకు ఏం గీయాలో అనుకోలేదు. కానీ అక్కడికి వచ్చిన తరువాత, ఇదే గుడి అర ఎకరం నేలలో విశాలమైన గుడిగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించి, బొమ్మ గీయాలనిపించింది. ఆ పనే మొదలుపెట్టాడు. బయట ఉరుముల శబ్దం అంతకంతకూ ఎక్కువవుతోంది. సన్నగా చినుకు కూడా ప్రారంభమైనట్లుంది. ఇంతలో ఉన్నట్లుండి అక్కడికో కుక్క వచ్చింది. ఆ గూడులో రెండు జీవులు తలదాచుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆ కుక్క ముందరికాళ్లను బాగా ముందుకు జాపి, విశ్రాంతిగా ద్వారానికి అడ్డంగా కూచుంది.రామచంద్ర కొద్దిసేపు ఆ కుక్కని గమనించి, తన పనిలో మునిగిపోయాడు. ఆలయం బయటి దృశ్యాన్ని మొదటిబొమ్మగా గీయడం పూర్తయ్యేసరికి సుమారుగా మూడుగంటల సమయం పట్టింది. లోపలి ఆలయాన్ని గీయాలని రెండో బొమ్మ మొదలుపెట్టాడు.ఇంతలో వర్షం పూర్తిగా పెద్దదయింది. గాలి తాకిడి కూడా ఉద్ధృతంగా ఉంది. తానున్నది చిన్న గూడు కనుక గాలి లోపలికి పెద్దగా రావడం లేదు. అందువల్లనే దీపం నిలబడింది కానీ లేకపోతే కష్టమయ్యేది. మరో గంట గడిచింది. రామచంద్ర కూర్చుని ఉన్నచోట నేల చెమ్మతేరడం మొదలయ్యింది. వెంటనే పక్కన పెట్టిన సంచీని తీసి ఒళ్లో పెట్టుకున్నాడు. వర్షం ఇంకా పెద్దదయితే, నీళ్లు లోపలికి వచ్చేస్తాయి కాబోలు... అప్పుడెలా అని మథన పడసాగాడు.అతను ఊహించిందే నిజమైంది. రెండో బొమ్మ ఇంకా పూర్తి కాకుండానే గుళ్లోకి నీళ్లు రాసాగాయి. అప్పటికే రామచంద్ర కట్టుకున్న పంచె పూర్తిగా తడిసిపోయింది. గొంతుకు కూర్చుంటే చీలమండల వరకు నీళ్లు వచ్చేశాయి. ఇక అక్కడ ఉంటే క్షేమం కాదనిపించింది. లోపలినుంచి బయటికి వెళ్దామంటే కుక్క అడ్డంగా ఉంది. దానికి బయటికి పోవడం ఇష్టం లేదు కాబోలు, చేత్తో ముందుకు తోసినా కదలలేదు. కొద్దిసేపటికి రామచంద్రకు బయటకు వెళ్లడానికి తోవ ఇచ్చింది. అతడితోపాటు తాను కూడా బయటకు నడిచింది. యట అంతా గాఢాంధకారంగా ఉంది. నేలమీద పిక్కలవరకు నీళ్లున్నాయి. ‘ఇంతలోనే ఎంత వర్షం పడింది?’ అని ఆశ్చర్యపోతూనే, ఒక్క ఉదుటన ఆలయంపైకి ఎక్కి కూచున్నాడు. ఎలా ఎక్కిందో తెలియదు కానీ ఆ కుక్క కూడా ఆలయంపైకి చేరింది. అక్కడ కూచునేందుకు బాగుంది. ఎటొచ్చీ పైనుంచి కుండపోత వాన. చప్పగా తడిసిపోయాడు. కొద్దిగా ఒణుకు కూడా వస్తోంది. ఆకాశం చిల్లుపడినట్లుగా ఆ రాత్రంతా వాన పడుతూనే ఉంది. గాలి విసిరి కొడుతూనే ఉంది. మెరుపు వెలుగు పడినప్పుడల్లా నీటిమట్టం పెరుగుతున్నట్లుగా తెలుస్తూనే ఉంది. కొద్దిసేపటి తరువాత ఉన్నట్లుండి కుక్క మొరగడం ప్రారంభించింది. అది ఎందుకు మొరుగుతోందో ముందు అర్థం కాలేదు. అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో... గుడిపైకి ఒక నల్లత్రాచు వచ్చి పడగ విప్పి వుండడం రామచంద్ర కంటపడింది. గుండె గుభేలుమంది. ఆ త్రాచు కాటువేసేందుకు సన్నద్ధంగా ఉంది. రామచంద్రకి కిందికి దూకి తప్పించుకుపోయే అవకాశం లేదు. కుక్క కూడా అక్కడే ఉండి నిస్సహాయంగా చూస్తోంది. పామును నేర్పుగా పట్టుకుని విసిరేయగలిగితే బాగానే ఉంటుంది కానీ, ధైర్యం చాలలేదు. కొద్దిగా వెనక్కి జరిగాడు. వీపుకి భైరవశిల్పం తగిలింది. దాని చేతికి త్రిశూలం ఉందనే సంగతి స్ఫురణకు వచ్చింది. చేతులు రెండూ వెనక్కి పెట్టి ఆ త్రిశూలాన్ని ఊడబెరికాడు. త్రాచుపామును త్రిశూలంతో ఎత్తిపట్టి, దూరంగా విసిరేశాడు. అదికాస్తా నీళ్లలో పడి, ఎటో కొట్టుకుపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే తెల్లవారింది. కానీ గుడిమీద నుంచి కిందికి దిగే అవకాశం మాత్రం లేదు. నేలమట్టానికి నాలుగడుగుల ఎత్తులో ఉన్న ఆ ఆలయానికి దాదాపు సమానంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లలో కిందికి దిగితే తాను బయటపడగలనో లేదో తెలియని పరిస్థితి. ఎందుకైనా మంచిదని మరో భైరవశిల్పం చేతిలోని శూలాన్ని ఊడబెరికి పట్టుకున్నాడు.రాత్రి నుంచి తనతోపాటు ఉన్న కుక్క తప్ప మరో తోడు లేదు. ఇప్పట్లో ఎవరైనా వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. ఆ కుక్కకి పాపం ఆకలి వేస్తున్నట్టుంది. కానీ చేసేదిలేక దిక్కులు చూస్తూ కూచుండిపోయింది. ఆ పూట సూర్యుడు ఉదయించలేదు. మధ్యాహ్నం కావస్తుండగా వర్షం తగ్గుముఖం పట్టింది. రామచంద్రకు తాను కూచున్న ప్రదేశం నుంచి కిందికి దిగడానికి ధైర్యం చాలలేదు. అంతలోతు నీళ్లలో దిగి నడవడం కానీ, ఈదుకుంటూ వెళ్లడం కానీ మహాప్రమాదంగా తోచింది.ఇంతలో, ‘‘ఒహోయ్ పెద్దమడిసీ! మెల్లిగా దిగిరా’’ అని అల్లంత దూరంలో ఎత్తయిన గట్టుమీద నుంచి ఎవరిదో తోట రైతు అరుస్తున్నాడు.‘నువ్వే దగ్గరకు రా!’ అన్నట్లు సైగ చేశాడు రామచంద్ర. రైతు నవ్వుకుంటూ, ‘‘బయపడమాకు. అవకాడ సెరువుకి గండి కొడతన్నాం. ఓ గంటలో నీళ్లన్నీ తీసేస్తాయి. ఆనక వద్దువు గానిలే’’ అని చెప్పి వెళ్లిపోయాడు.రైతు చెప్పింది నిజమయ్యేందుకు సుమారుగా రెండుగంటల సమయం పట్టింది. సాయంత్రం నాలుగు కావస్తుండగా తోటలో నీళ్లు తగ్గి, బురదనేల బయటపడింది. రామచంద్రతో పాటు పక్కనే ఉన్న కుక్క కూడా నేలకు దిగింది. గబగబా అడుగులు వేస్తూ గట్టుమీదికి వెళ్లిపోయింది. రామచంద్ర భయంభయంగా అడుగులు వేస్తున్నాడు. చీలమండల వరకు బురద నిలిచి ఉంది కానీ, మరేమీ ప్రమాదం లేదు. ఒక్కోచోట కాలు దిగబడి పిక్కల వరకు బురద వస్తోంది. నిన్నరాత్రి నుంచి తన చేతిలోని శూలాన్ని అలాగే ఉంచుకున్నాడు. ఆ శూలాన్ని నేలలో గుచ్చుతూ, ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తరువాతే అడుగు వేస్తున్నాడు. పాతిక అడుగులు వేసేసరికి ఒకచోట శూలం బొరియలో దిగబడినట్లుగా లోపలికి పోయింది. కొద్దిగా పక్కకు జరిగి అదే చోట మళ్లీ నేలలో బలంగా గుచ్చాడు రామచంద్ర. సందేహం లేదు... అక్కడ రాళ్లున్నాయి. అందుకే శూలం కంగున మోగుతోంది.‘‘జాగర్తయ్యోవ్’’ అన్నాడు గట్టుమీదనుంచి రైతు. రామచంద్ర అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. శూలంతో చుట్టూ గీస్తూ ఏదో పరీక్షిస్తున్నాడు. చివరకు అతడు తాను గతరాత్రి ఊహించినది నిజమే అయినందుకు సంబరపడ్డాడు. ఈ ఆలయం కిందనే పూర్వం అతిపెద్ద ఆలయమేదో ఉండేది. అది శిథిలం కాగా, ఎవరో దానిపై చిన్న ఆలయాన్ని నిర్మింప చేశారు అనే నిర్ధారణకు వచ్చాడు. ఆ లోపలి ఆలయం ఇప్పుడు ఉండి ఉంటే ఎలా ఉండేదన్న ఊహతో రాత్రి తాను గీసిన నమూనా కాయితాలన్నీ వానలో నానిపోయి, ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రామచంద్రకు మనసులో కష్టం వేసింది. కానీ ఇప్పుడు స్థిమిత పడ్డాడు. గట్టుకు వస్తూనే, ‘‘చూడు బాబూ! ఈ ప్రాంతంలో ఇదివరకు ఏదైనా పెద్దగుడి ఉండేదా?’’ అడిగాడు రైతుని రామచంద్ర.‘‘అదేమో తెలవదు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి అదే గుడి’’ చెప్పాడు రైతు.‘‘కాదు. నాకు అర్థమైనంత వరకు ఇక్కడ ఓ పెద్ద గుడి ఉండేది. ఉండేది ఏమిటి ఉంది. నేను చూశాను. నువ్వొప్పుకుంటే నేను దాన్ని వెలికి తీస్తాను’’ ఉత్సాహంగా చెప్పాడు రామచంద్ర.‘‘సూడయ్యా! మమ్మల్నిలా బతకనియ్యి. ఈ తోటంతా మాదే అయినా ఆ గుడి వున్నంతమేరా సెట్టు పెట్టకుండా వదిలేసి మా పొట్ట మేం పోషించుకుంటున్నాం. ఇప్పుడు గుడీ అదీ అంటూ అల్లరి మొదలెట్టావంటే... గవర్నమెంటోళ్లతో, బత్తులతో నానా తలనొప్పులూ పడాల్సొస్తుంది. ఆనక మా తోట ఏటవుద్దో నువ్వు గేరంటీ సెప్పగలవా?! అంచేత సూసిందంతా మర్సిపో. దీనికింద పెద్దగుడి వుందని నాకూ తెలుసు. కానీ చెప్పాను కదా, ఇక్కడ పలుగు పడితే భైరవసామి ఊరుకోడు. కుక్కలొచ్చి కండలు పీకేస్తాయి. ఇగ తొవ్వడం మొదలెడితే ఇంకేం వత్తాయో సెప్పలేం. వచ్చిన పని పూర్తయింది కాబట్టి, జాయిగా ఇల్లు జేరుకో’’ అని చెప్పేసి వెళ్లిపోయాడు రైతు.రామచంద్ర అక్కడినుంచి మళ్లీ తడికలపూడి గాంగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాడు. స్వామికి నమస్కరించి బయలుదేరాడు. ఆ రాత్రికి రాత్రి నడుచుకుంటూ వెళ్లి తెల్లవారేసరికి శాస్త్రిగారి ఇంటిముందు నిలబడ్డాడు.‘‘నిన్నంతా ఏమైపోయావు? తుపానులో చిక్కుకుపోయావేమో అని కంగారు పడ్డాను’’ అడిగారు శాస్త్రిగారు అతడిని చూస్తూనే.‘‘నిజమేనండీ. మీ ఆశీస్సులు ఉండబట్టి బతికిపోయాను. లేకపోతే ఈపాటికి చనిపోయే వాడిని’’ అంటూ ముందురోజు రాత్రి తనకు ఎదురైన అనుభవాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు రామచంద్ర.‘‘హమ్మయ్య. గండం గడిచింది. ఇంక నీకేమీ భయం లేదు. నీ వృత్తిలో కూడా పైకొస్తావు. ఇదిగో ఈ ఉత్తరం తీసుకో. హైదరాబాదులో ఉన్న మా స్నేహితుడికి నీ గురించి రాశాను. అక్కడేదో గుడి కడుతున్నారట. నీకేదైనా పని దొరకచ్చు. కానీ రాతి శిల్పాలే చెక్కుతా... సిమెంటు తాపీ పట్టుకోను అంటూ పిచ్చి సిద్ధాంతాలు వల్లెవేయకు. దొరికిన పనిలో దూరిపో. రోజులు బాగుపడితే మనసుకు నచ్చిన పని దొరకచ్చు’’ అని బోధించారు శాస్త్రిగారు.ఆయనకు మరోసారి నమస్కరించి వచ్చేశాడు రామచంద్ర. ...ఇదంతా నా కథ. ఇందులోని రామచంద్రను నేనే. ఆనాడు శాస్త్రిగారి వద్దనుంచి వచ్చిన తరువాత ఎంతో జీవితాన్ని చవిచూశాను. ఎన్నెన్నో అనుభవాలను పొందాను. నాకొచ్చిన కళను నా పిల్లలకు నేర్పించాను. కానీ వారికి రాతిశిల్పాలతో పనిచేసే అవకాశం రాలేదు. ఇప్పుడు నా మనుమళ్లు రాతిశిల్పాలను కంప్యూటర్ల సాయంతో చెక్కుతున్నారని తెలిసి ఆనందంగా ఉంది. స్థాపత్య కళలో వారు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మళ్లీ మన ఆలయాలకు పూర్వవైభవం వస్తోంది కదా అని చాలా సంతోషంగా ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ప్రాణదానం చేసిన ఆ అష్టభైరవ నిర్మిత ఆలయాన్ని మరిచిపోలేదు నేను. ఇప్పటివరకు ఆ ఆలయాన్ని మూడుసార్లు సందర్శించాను. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ ఏవేవో కొత్త అనుభూతులు కలిగేవి. ప్రతిసారీ ఆ రైతును కలిసేవాడిని. పెద్దగుడిని బయటికి తీయడానికి కానీ, తోటను అమ్మడానికి కానీ అతడెప్పుడూ ఒప్పుకోలేదు. ఇప్పుడు నాకు వయసు మీరింది. బహుశా ఈపాటికి ఆ తోట రైతు మనవళ్ల పరమై ఉంటుంది. వాళ్లయినా అక్కడ తవ్వకాలకు ఒప్పుకుంటారని నేను అనుకోవడం లేదు. ఇటీవలే గాంగేశ్వర స్వామి ఆలయానికి పునరుద్ధరణ జరిగిందని తెలిసి సంతోషించాను. ఇక ఆ గుడి కూడా జీర్ణోద్ధరణ పొందితే... అది కూడా నా వంశం వారివల్ల జరిగితే నాకు కావాల్సింది అంతకంటే ఏమీ లేదు.ఇట్లురామచంద్ర అని రాసివున్న డైరీని మూడోసారి చదివి, మూసి పక్కన పెట్టాడు కిషోర్. తన తాతయ్య ప్రాణం కాపాడిన ఆ మందిరాన్ని ఒక్కసారి చూసి రావాలనిపించింది అతనికి.నేల నాలుగుచెరగులా ఎక్కడ తడిమి చూసినా శిథిలాల కింద చరిత్ర మూలుగుతూ ఉంటుంది. కొన్నింటికి మహర్దశ పడుతుంది. బయటికి వస్తాయి. రాజ్యమేలతాయి. మరికొన్నింటి భవిష్యత్తు కాలాలమీద కానీ తేలదు. ఏ స్వార్థమూ లేకుండా ఒకనాటి జ్ఞాపకాలను తవ్వితీసి మళ్లీ అందరిముందు ఠీవిగా నిలబెట్టాలని తపించేవారు నూటికో కోటికో ఒక్కరుంటారు. కొన్నిసార్లు వాళ్లు తమ ప్రయత్నంలో విజయం సాధిస్తారు కూడా. -
కథాకళి: ఫటాఫట్
అతని శ్రావ్యమైన కంఠం, మెత్తని నడవడిక అతనిలోని దుర్మార్గానికి తెరలని ఆమె ఆలస్యంగా తెలుసుకుంది.ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుజీవ్ ఆమెని ఇంటర్వ్యూ చేశాడు. ఆమె అందం అతన్ని ఆకర్షించింది. పౌడర్ తప్ప మరే మేకప్ లేని, కనుబొమలని కట్ చేసుకుని దిద్దుకోని ఆమె సహజమైన అందం, ఆమె చురుకుదనం అతన్ని ఆకర్షించాయి.సుజీవ్ తండ్రి ఉద్యోగరీత్యా తూర్పు గోదావరి జిల్లాకి పోలీస్ సూపరింటెండెంట్. ఆయన అన్యాయార్జితంతో తన పేర స్థాపించిన ఫైనా¯Œ ్స కంపెనీని సుజీవ్ మేనేజ్ చేస్తున్నాడు. హైద్రాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఇరవై ఆరు అంతస్తుల భవంతిలో, టాప్ ఫ్లోర్లో ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణం గల అపార్ట్మెంట్లో సుజీవ్ ఒంటరిగా ఉంటాడు. అది సుజీవ్ తండ్రి అక్రమసంపాదనతో తన భార్య పేర కొన్న ఆస్తి.ఓరోజు ఆఫీస్లో లంచ్ చేస్తూ సుజీవ్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించి తెలుసుకున్నాడు. ‘‘నా భార్యకి పబ్ కల్చర్ అంటే ఇష్టం. వద్దన్నానని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి బతిమాలి తెస్తానని ఎదురుచూసింది. కాని విడాకులు తీసుకుంటానని ఆమె ఊహించలేదు. నువ్వు అన్నీ ఫటాఫట్ చేసేస్తూంటావు. మన వ్యాపారానికి అది ముఖ్యం. నీకు అభ్యంతరం లేకపోతే మన పెళ్ళి గురించి మీ పెద్దలతో మాట్లాడతాను.’’ఆమె దిమ్మెరపోయింది. తను ఎక్కడ? అతను ఎక్కడ? ఆమె గాల్లో తేలుతూ ఇంటికి వెళ్ళింది. వారం తర్వాత ఆమె అర్జెంట్ కాగితాల మీద సంతకాలు తీసుకోడానికి అతని అపార్ట్మెంట్కి వచ్చింది. అతను చొరవ తీసుకుంటే ఆమె సిగ్గుగా అభ్యంతరం చెప్పింది తప్ప ఎదురు తిరగలేదు.మూడు వారాల తర్వాత ఓరోజు ఆమెకి సుజీవ్ నించి ‘నువ్వు అర్జెంట్గా నా ఇంటికి వస్తావా?’ అనే మెసేజ్ వచ్చింది. ‘మా నాన్నగారికి వడదెబ్బ కొట్టి ఇప్పుడే తేరుకుంటున్నారు. అందుకే సెలవు పెట్టాను సర్. ఆయన్ని చూసుకోవాలి’ సమాధానం పంపింది.‘‘పర్సనల్గా మాట్లాడాలి. ఓ అరగంట వచ్చి వెళ్ళలేవా?’’ ఫోన్ చేసి అడిగాడు.‘‘సరే సర్.’’ అతని కంఠంలోని అభ్యర్థనని గుర్తించి చెప్పింది.‘‘జాగ్రత్తమ్మా. నగరంలో హీట్ వేవ్తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని టీవీలో చూపిస్తున్నారు.’’ తల్లి హెచ్చరించింది. ఆమెని చూడగానే సుజీవ్ చెప్పాడు.‘‘మా నాన్నగారు చిక్కుల్లో పడ్డారు. బయటపడటానికి ఒకరిని మంచి చేసుకోవాలి. లేదా ఆయన ఉద్యోగం ఊడొచ్చు.’’‘‘అయ్యో.’’‘‘అందుకు నువ్వో మనిషిని సంతోషపెట్టాలి.’’‘‘నాకు అర్థం కాలేదు సర్.’’ అయోమయంగా చూస్తూ చెప్పింది.‘‘అర్థం కాకపోడానికి ఏంలేదు. నన్ను సంతోషపెట్టినట్లే. అతన్ని వచ్చే బుధవారం మన ఆఫీస్ గెస్ట్ హౌస్లో కలుసుకోవచ్చు.’’ఆమె తను విన్నది నమ్మలేకపోయింది. తనని పెళ్ళి చేసుకుంటానని అడిగిన ఇతనేనా ఈ మాట అన్నది? అతను తనని పెళ్ళి చేసుకోడని ఆమెకి వెంటనే తట్టింది. ఆమె దుఃఖం కోపంగా మారడంతో కంఠం పెంచి చెప్పింది.‘‘సారీ! నేను అలాంటిదాన్ని కాదు. నేను ఇప్పుడే రాజీనామా చేస్తున్నాను.’’‘‘నీకా అవకాశం లేదు. ఆ ఏíసీబీ డైరెక్టర్ని నువ్వు తృప్తి పరచాలి.’’అతను లేప్టాప్లో వాళ్ళిద్దరి రతికేళి వీడియోని ప్లే చేసాడు.‘‘ఏమిటిది? ఏమిటీ మోసం?’’ ఆమె మరోసారి నిర్ఘాంతపోతూ గట్టిగా అరిచింది.‘‘దీన్ని మీ తల్లిదండ్రులు చూడకూడదనుకుంటే, బుధవారం ఎక్కడ పికప్ చేయటం నీకు సౌకర్యమో చెప్పు.’’తను బ్లాక్మెయిల్లో చిక్కుకుందని ఆమెకి అర్థమైంది. ఆమె కన్నీళ్ళు ఆపుకుంటూ లేచి మెట్లెక్కి టెర్రేస్లోకి వెళ్ళింది.ఆమె ఏకాంతంగా ఏడవడం కోసం పైకెళ్ళిందని సుజీవ్కి అర్థమైంది. పది నిమిషాలు గడిచినా ఆమె రాకపోవడంతో అతను టెర్రేస్లోకి వెళ్ళాడు. తలుపు వెనక పొంచి ఉన్న ఆమె చటుక్కున మెట్లమీదకి వెళ్ళి టెర్రేస్ తలుపు మూసి గడియ పెట్టింది.‘‘తలుపు తీయి. ఏమిటిది?’’ సుజీవ్ తలుపు బాదుతూ అరిచాడు.తలుపు తెరచుకోలేదు. పావుగంట తర్వాత ఇక ఆమె తలుపు తెరవదని బోధపడింది. పిట్టగోడ మీంచి దూకడానికి వీలులేకుండా లోపలివైపు ఆరడుగుల ఎత్తున గ్లాస్ వాల్ ఉండటంతో, అతను కింద రోడ్ మీద వారిని సహాయం కోరే అవకాశం లేకపోయింది. ఎక్కడా నీడ కనిపించలేదు. ఎండకి చెమటతో అతని షార్ట్స్, టీషర్ట్ తడిసిపోయాయి. టీషర్ట్ విప్పి తల మీద కప్పుకున్నాడు. అతని ఒంట్లోని నీరు చెమట రూపంలో కారిపోతూ దాహంతో నాలుక పిడచకట్టుకు పోయింది. లేప్టాప్లోని తమ వీడియోని డిలీట్ చేశాక, టీవీ చూస్తూ కాలక్షేపం చేసిన ఆమె సూర్యాస్తమయ సమయంలో పైకెళ్ళి టెర్రేస్ తలుపు తెరిచింది. ఆమె ఆశించినట్లుగా నేల మీద మగతగా పడున్న సుజీవ్కి వడదెబ్బ కొట్టింది. చక్కెర, ఉప్పు నీళ్ళు తాగించి, సెలైన్ ఎక్కిస్తే అతను జీవిస్తాడని ఆమెకి తెలుసు. అతన్ని కిందకి మోసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టింది. అతను ఏం జరుగుతోందో కూడా అర్థం కానంత అపస్మారకంలో ఉన్నాడు. ఆమెని వంచించడానికి సుజీవ్ ఏ మంచాన్ని ఆయుధంగా చేసుకున్నాడో ఆ మంచం మీదే ఆ రాత్రి ఆమె ఫటాఫట్ నిర్ణయంతో ప్రాణం వదిలాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఇవ్వాల్సింది ధైర్యమే!
భవిష్యత్తులో పిల్లలు ఇబ్బందులు పడకూడదని, అందుకు ఆస్తులు సంపాదించి పెట్టాలని చాలావరకు తల్లిదండ్రులు అనుకుంటుంటారు. ‘కానీ, పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, ధైర్యమే!’ అంటారు నీలిమ. కోర్టు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన శ్రీదేవి అప్పల్ల నీలిమ కూతురు.సింగిల్ పేరెంట్గా ఇద్దరు కూతుళ్ల పెంపకంలో తను తీసుకున్న జాగ్రత్తలు, జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమించిన విధానాలను ఇలా మన ముందుంచారు..‘‘నేను రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేదాన్ని. చాలా పనుల్లో ఆడ మగ అనే తేడా చూపుతారు. నేను చిన్నప్పటి నుంచి అలా చూసేదాన్నికాదు. అందుకే, ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇద్దరు అమ్మాయిలను పెంచాను. మాది కాకినాడ. మాకు కొద్దిపాటి ఆస్తి ఉంటే, దాన్ని అమ్మి, తిరిగి మరో ఆస్తి కొని, అమ్మి... అలా వచ్చిన డబ్బులతో పిల్లలిద్దరినీ సాకాను. నా పిల్లలు కూడా నాలాగా ధైర్యంగా ఉండాలనుకుంటాను. నా పెద్ద కూతురు దివ్యజ్యోతి బీఎస్సీ పూర్తయ్యాక, జాబ్ చేస్తుంది. చిన్నమ్మాయి శ్రీదేవి సినిమాలలో తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. సినిమా స్టార్ కావాలనుకున్నాను...మా అక్క తమిళ, మలయాళ సినిమాలలో నటించేది. ఆ సమయంలో నేను నాకు కూతురు పుడితే, సినిమాల్లోకి తీసుకురావాలని ఆ రోజుల్లోనే అనుకునేదాన్ని. కానీ, ఆ విషయాన్ని కాలక్రమంలో మర్చిపోయాను. ఆ తర్వాత మా అక్క సినిమాలు మానేసి, కుటుంబ వాతావరణంలోకి వచ్చేసింది. నాకూ కుటుంబ పరిస్థితుల వల్ల చిన్న వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు కూతుళ్లు పుట్టాక, ఒంటరిగా జీవితాన్ని మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దివ్యకు బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలని ఉండేది. శ్రీదేవికి టీచర్ అవ్వాలని ఉండేది. ఇద్దరినీ చదువుకోమనే ప్రోత్సహించాను. అయితే, ఇంట్లో శ్రీదేవి టీచర్లా యాక్ట్ చేస్తుండేది. అది చూసి, ఈ అమ్మాయి చేత రీల్స్ చేయిస్తే బాగుంటుందనుకున్నాను. తను స్కూల్ నుంచి రాగానే ఓ గంట రెస్ట్ ఇచ్చి, గ్రీనరీ ప్లేస్ల్లోకి తీసుకెళ్లి రీల్స్ చేసేవాళ్లం. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో శ్రీదేవికి మంచి పేరు రావడంతో పాటు, సినిమా అవకాశాలూ వచ్చాయి. మంచి – చెడు చూసే విధానంలోనే..!ఒకప్పటి రోజులకు ఇప్పటి రోజులకు అన్ని చోట్లా చాలా మార్పులు వచ్చాయి. అవకాశాలూ పెరిగాయి. అమ్మాయిలు ఒంటరిగానే ప్రతి సమస్యను సాల్వ్ చేసుకుంటున్నారు. ‘ఎవరినో తప్పు పట్టడం కాదు, మనం మన జాగ్రత్తలో ఉండాలి’ అని చెబుతుంటాను. దానిని శ్రీదేవి కూడా బాగా అర్థం చేసుకుంటుంది. ఏ పని చేసినా డబ్బు సంపాదించడానికే. కానీ, చదువు మాత్రం ఉండాలి. శ్రీదేవి జూనియర్ ఇంటర్ పూర్తి చేసింది. పై చదువుల కోసం డిస్టెన్స్లో ప్లాన్ చేస్తున్నాం. నేను చెప్పేవి ఇద్దరూ బాగా వింటారు. వారేం అనుకున్నారో అవి కూడా స్పష్టంగా చెబుతారు. వాటిలో మంచి చెడులు చెబుతాను. సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కలిసే టూర్లు..బయటి స్నేహాలను ఎంకరేజ్ చేయడం లేదు. ఫ్రెండ్స్తో టూర్స్కి వెళ్లచ్చు కదా అంటారు. కానీ, ‘నో’ అనే చెబుతాను. నాకూ ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి మేం ముగ్గురం కలిసి టూర్స్కి వెళుతుంటాం. దివ్యకు సినిమా డైరెక్షన్ అంటే ఇష్టం అని చెబుతుంటుంది. కానీ, చదువుకు న్యాయం చేసే జాబ్ కొన్నాళ్లు తప్పక చేయమని చెబుతాను. శ్రీదేవికి సావిత్రి, సౌందర్యలాగా పేరు తెచ్చుకోవాలని కోరిక. వారిలాగే ట్రెడిషనల్గా ఉండటం, అలాంటి పాత్రలతో మెప్పించడం ఇష్టం. నేను కూడా అలాంటి ఇష్టాలను ఎంకరేజ్ చేస్తుంటాను. నాటి నటీనటుల సినిమాలు కలిసి చూస్తాం.కష్టం విలువ తెలుసుకున్నారు.. సింగిల్ పేరెంట్గా పిల్లల పెంపకంలో కష్టపడ్డాను అని చెప్పలేను. ఎందుకంటే, నా కష్టాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు. నా మాట విన్నారు. నా వరకు చూసుకుంటే తండ్రి ఉంటేనే పిల్లల్ని బాగా పెంచగలుగుతారు అనుకోవడం తప్పు అనిపిస్తుంది. నా భర్త సపోర్ట్ లేకపోయినా పిల్లల్ని పెంచాను. అయితే, పిల్లలిద్దరూ నా మాట విన్నారు కాబట్టి వారి పెంపకం సులువై ఉంటుంది. అందరి పిల్లలు అలా వినాలని ఏమీ లేదు. నేను ఏదైనా విషయంలో బాధపడితే పిల్లలిద్దరికీ విషయం వెంటనే అర్థమైపోతుంది. వాళ్లు అర్థం చేసుకుని, నన్ను కష్టపెట్టకూడదని సెట్ అయిపోతారు. సాయం చేసే గుణం..నేను ఒక్కదాన్నే పిల్లల్ని కష్టపడి పెంచుకుంటున్నప్పుడు ఎవరూ సాయం చేయలేదు. కానీ, పిల్లలకు ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చి, డబ్బు సంపాదిస్తున్నారని.. కొందరు దగ్గరవుతుంటారు. అలాంటప్పుడు పిల్లలు వాళ్లను దూరం పెట్టమని చెప్పరు. ‘కష్టంలో ఉన్నారు కదా! హెల్ప్ చేయమ్మా!’ అని నాకే చెబుతారు. ఎదుటివారికి సాయపడే గుణం ఇద్దరికి వచ్చిందని సంతోషిస్తాను.. ‘మీకు భవిష్యత్తులో పెళ్లిళ్లు అయ్యి, మీ కుటుంబాలు మీకు ఉన్నా.. నేను నాలాగే, మీకు తల్లిలా, ఓ స్నేహితురాలిగా ఉంటాను’ అని చెబుతాను. ‘నువ్వు కోల్పోయిందంతా మేం తిరిగి తీసుకొస్తాం అమ్మా!’ అని పిల్లలు అంటుంటారు. వాళ్లు జీవితంలో మంచిగా స్థిరపడితే అంతే చాలు అనుకుంటాను. నేను, నా ఇద్దరు కూతుళ్లు ఫ్రెండ్స్లా ఉంటాం. మా ఇద్దరి కూతుళ్లతో పాటు మైకి అని ఓ పెట్ ఉంది. అది కూడా మా కుటుంబంలో ఓ సభ్యురాలే. నలుగురం ఒకదగ్గర ఉంటే మా సందడి అంతా ఇంతా కాదు. మా ఆనందం ఇలా మాతో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను’’ అని వివరించారు తల్లిగా నీలిమ.∙నిర్మలారెడ్డి -
బిడ్డ బాగానే ఉందా?
నాకు 26 సంవత్సరాలు. మా పెళ్లై ఆరు నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పుడు నాకు రెండు నెలల గర్భం ఉంది. ఇది నా మొదటి గర్భధారణ. ఎలాంటి ఆరోగ్య సమస్యలు నాకు గతంలో లేవు. కాని, నా కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉందా, ఎదుగుదల సరిగ్గా జరుగుతుందా అని కొంచెం ఆందోళనగా ఉంది. ఇలాంటి సమయంలో ఏయే పరీక్షలు చేయించుకోవాలి? – స్వప్న, తిరుపతి.ఒక ప్రైమీ పేషెంట్, అంటే మొదటిసారి గర్భం దాల్చిన మహిళ, మీకు మొదటగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత సాధారణంగా ఐదు నుంచి ఆరు వారాల సమయంలో ఒక స్కాన్ చేస్తాము. ఈ స్కాన్ ద్వారా గర్భసంచిలో జెస్టేషనల్ సాక్ సరైన స్థానంలో ఉందా లేదా అన్నది చెక్ చేస్తాము. అంటే గర్భం గర్భసంచిలోనే సరిగ్గా ఉందా లేదా అన్నది నిర్ధారించుకుంటాము. దాని తర్వాత సుమారు ఏడు నుంచి ఎనిమిది వారాల సమయంలో మళ్లీ ఒకసారి స్కాన్ చేస్తాము. దీనిని వయబిలిటీ స్కాన్ అంటారు. ఇందులో బిడ్డ హార్ట్బీట్ సరిగ్గా ఉందా, ఎదుగుదల ఎలా జరుగుతోంది అన్నది చెక్ చేస్తాము. హార్ట్బీట్, ఎదుగుదల సరిగ్గా ఉంటే తగిన ఫోలిక్ యాసిడ్ వంటి మందులు ఇచ్చి గర్భధారణను కొనసాగిస్తాము. తర్వాత 11 నుంచి 14 వారాల మధ్య, అంటే దాదాపు మూడు నెలల సమయంలో ఒక ప్రత్యేక స్కాన్, రక్తపరీక్ష చేస్తాము. దీనిని మొదటి త్రైమాసిక స్క్రీనింగ్ అంటారు. ఇందులో బిడ్డలో ముఖ్యమైన అవయవాల నిర్మాణం ఎలా ఉందో స్కాన్ ద్వారా పరిశీలించి, రక్తపరీక్ష ఫలితాలతో కలిపి కొన్ని జన్యు సమస్యల ప్రమాదం ఎంత ఉందో అంచనా వేస్తాము. ఉదాహరణకు డౌన్ సిండ్రోమ్ వంటి సాధారణ జన్యు సమస్యల రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల్లో రిస్క్ తక్కువగా ఉంటే గర్భధారణను సాధారణంగా కొనసాగిస్తాము. తర్వాత ఐదో నెలలో ఒక ముఖ్యమైన స్కాన్ చేస్తాము. దీనిని టిఫా స్కాన్ అంటారు. ఇందులో బిడ్డ అన్ని అవయవాలు సరిగ్గా ఏర్పడ్డాయా లేదా అన్నది పూర్తిగా పరిశీలిస్తాము. టిఫా స్కాన్ లో కూడా ఎలాంటి సమస్యలు కనిపించకపోతే ఎక్కువగా ఇది ఆరోగ్యకరమైన గర్భధారణగా భావిస్తాము. కానీ మొదటి త్రైమాసిక పరీక్షల్లో రిస్క్ కొంచెం ఎక్కువగా లేదా మధ్యస్థంగా కనిపిస్తే, తదుపరి కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు మరింత కచ్చితమైన రక్తపరీక్షలు లేదా అవసరమైతే ఉమ్మనీరు పరీక్ష చేసి బిడ్డలో జన్యు సమస్యలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవచ్చు. అలాగే టిఫా స్కాన్ లో ఏదైనా మార్పులు కనిపిస్తే, ఉదాహరణకు మెదడు లేదా గుండె అభివృద్ధిలో ఏదైనా తేడా ఉంటే, దానికి అనుగుణంగా ప్రత్యేక పరీక్షలు చేయవచ్చు. ఉదాహరణకు బిడ్డ గుండె పనితీరును తెలుసుకోవడానికి ప్రత్యేక హార్ట్ స్కాన్ లేదా మెదడు అభివృద్ధిని చూడటానికి మరింత వివరమైన స్కాన్ చేయవచ్చు. ఇంకా కుటుంబంలో ఎవరికైనా జన్యు సమస్యలు ఉన్నాయా లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహం జరిగిందా అన్నది కూడా తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా రిస్క్ ఎంత ఉందో అంచనా వేసి, అవసరమైన పరీక్షలు చేయవచ్చు. సాధారణంగా ఈ అన్ని పరీక్షలు క్రమంగా చేయించుకుంటూ వెళ్తే గర్భధారణ సురక్షితంగా కొనసాగుతుందా లేదా అన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు. అన్ని పరీక్షలు సాధారణంగా ఉంటే ఎక్కువగా గర్భధారణ ఆరోగ్యకరంగానే కొనసాగుతుంది. డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ -
నా లోపల రెబెల్
సౌమ్యమైన చూపులు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాళవిక నాయర్, జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే...నా బాల్యమే నా బలం!నేను ఢిల్లీలో ఒక మలయాళీ కుటుంబంలో పుట్టాను. నా బాల్యం నాన్నగారి వృత్తిరీత్యా కొన్నిసార్లు ఢిల్లీ హడావుడి, మరికొన్నిసార్లు కేరళ ప్రశాంతత మధ్య సాగింది. ఒకసారి మా కుటుంబంలో జరిగిన బైక్ ప్రమాదం నాపై చాలా ప్రభావం చూపింది. అప్పటి నుంచి నేను స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.నాన్న నా పెద్ద సపోర్టర్!‘అమ్మాయివి, బైక్ ఎందుకు?’ అని చాలామంది చెప్పినా, మా నాన్న వినలేదు. నాకు బైక్ నేర్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను నేనే కాపాడుకోగలగాలి అని ఆయన కోరుకున్నారు.కెమెరా బయట నా ప్రపంచం!షూటింగ్ లేకపోతే నేను ఎక్కువగా పుస్తకాల్లో మునిగిపోతుంటాను లేదా స్కెచింగ్ చేస్తుంటాను. నేను ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో తత్త్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశాను. ఆ చదువు నాకు పాత్రలను కొత్త కోణంలో అర్థం చేసుకునే దృష్టిని ఇచ్చింది.నేను కేవలం నటించను!నా ప్రయాణం చిన్నప్పుడే మలయాళం సినిమా ‘కరుత్త పక్షికల్’లో మొదలైంది. కానీ, ‘కుక్కూ’ నాకు అసలైన గుర్తింపు ఇచ్చింది. అంధురాలైన పాత్రలో కళ్లతో కాదు, మనసుతో ప్రపంచాన్ని చూడటం నేర్చుకున్న అనుభవం. అందుకే, పాత్రలోని భావాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.చిన్న సీక్రెట్స్!ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. కానీ నా లోపల ఒక చిన్న రెబెల్ ఉంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నాకు కొన్ని టాటూలు ఉన్నాయి. ఒక చిన్న నిమ్మకాయ ముక్క ఆకారంలో ఒక టాటూ ఉంది. అలాగే పోలినేషియన్ స్టయిల్లో ట్రయాంగిల్స్, ట్రైబల్ డిజైన్స్ తో మరో టాటూ కూడా ఉంది. అవి నా జీవితంలో ప్రత్యేకమైన గుర్తుల్లాంటివి.వ్యక్తిత్వం ముఖ్యం!మొదట్లో ‘గ్లామర్’ అనే భావన నాకు పెద్దగా నచ్చేది కాదు. ఇండస్ట్రీలో ప్రెజెంటబుల్గా ఉండాలి కానీ, వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు అని నేను నమ్ముతాను.అరుదైన గుర్తింపు!చిన్నప్పుడే ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్నందుకు, కొందరు నన్ను ప్రముఖ నటి శారదతో పోలుస్తుంటారు. ఆ గుర్తింపు కాపాడుకోవడానికే పారితోషికం కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను.ఫుడ్ అంటే ఫుల్ లవ్!నేను పక్కా ఫూడీని. ఢిల్లీలో పెరిగాను కాబట్టి అక్కడి స్ట్రీట్ ఫుడ్, మసాలా చాట్ ఎప్పటికీ నా ఫేవరెట్. అలాగే మా ఇంట్లో చేసే మటన్ రసం కలిపిన అన్నం. నెమ్మదిగా ఉడికిన ఆ మాంసం నోట్లో కరిగిపోతుంది. అది నా ఆల్టైమ్ కంఫర్ట్ ఫుడ్. ఇప్పుడు షూటింగ్లు ఎక్కువగా ఉండటంతో, శక్తి కోసం ఆర్గానిక్, హెల్తీ ఫుడ్ కూడా నా మెనూలో చేరింది.ఇష్టమైన స్టార్!చిన్నప్పటి నుంచే నేను మోహన్ లాల్ సర్కి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పని చేసిన రోజు నాకు ఒక కలలా అనిపించింది. అలాగే జ్యోతిక నటనలోని శక్తి, ఒక సినిమాను తన భుజాలపై మోసే ధైర్యం నాకు పెద్ద ఇన్ స్పిరేషన్ . -
తలకట్టు... కనికట్టు
అబ్బాయిలకు ఏం స్టయిల్ ఉంటుందిలే అని చాలామంది అనుకుంటారు. కాని, బార్బర్ కుర్చీలో కూర్చునే పది నిమిషాలు చాలు, మామూలు అబ్బాయి కూడా సినిమా హీరోలా మారిపోవడానికి. సరైన హెయిర్ కట్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవల్! చక్కని తలకట్టుతో రూపం కనికట్టు చేసినంతగా మారిపోతుంది. అందుకే ఈ సమ్మర్లో కంఫర్ట్తో పాటు కూల్గా కనిపించే కొన్ని ట్రెండీ హెయిర్ స్టయిల్స్ చూద్దాం...జెంటిల్మన్ ఫ్యాడ్ – క్లాసీ స్టయిల్! జెంటిల్మన్ ఫ్యాడ్ అనేది ఇప్పటికీ ఎవర్గ్రీన్ స్టయిల్! చెవుల దగ్గర జుట్టు క్రమంగా తగ్గుతూ, పైన మాత్రం సెట్ చేసుకునేలా ఉండటం. ఈ కట్ వేసుకుంటే ముఖం మరింత షార్ప్గా, సన్నగా కనిపిస్తుంది. ఆఫీస్కు వెళ్లినా, ఫంక్షన్ కు వెళ్లినా సూట్ అయ్యే సేఫ్ అండ్ స్మార్ట్ స్టయిల్ ఇదే! అండర్కట్ – యూత్ ఫేవరెట్అండర్కట్ అనేది కొంచెం బోల్డ్గా, ట్రెండీగా కనిపించాలనుకునే వాళ్లకు బెస్ట్. సైడ్స్ షార్ట్గా, పైన కొంచెం లెంగ్త్ ఉంచడం వల్ల మీరు స్టయిల్ను మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఫార్మల్గా నీట్గా దువ్వుకోవచ్చు, లేదా క్యాజువల్గా మెస్సీగా వదిలేయొచ్చు. ఒకే కట్తో రెండు వేర్వేరు లుక్స్ రావడం దీని కున్న ప్లస్ పాయింట్. టాప్ నాట్ – డిఫరెంట్ టచ్జుట్టు కొంచెం పొడవుగా ఉంటే, టాప్ నాట్ వేసుకోవడం ఒక స్మార్ట్ ఐడియా. జుట్టు మొత్తాన్ని పైకి తీసుకుని చిన్న ముడి వేయడం వల్ల కూల్గా, కంఫర్ట్గా ఉంటుంది. ఈ స్టయిల్ మీకు కొంచెం ఆర్టిస్ట్ లుక్ లేదా ట్రావెలర్ వైబ్ ఇస్తుంది. ముఖ్యంగా వేసవిలో జుట్టు ముఖంపై పడకుండా క్లీన్ గా ఉంచుతుంది. బజ్ కట్ – కంఫర్టబుల్ చాయిస్వేసవిలో చాలామంది ఇష్టపడే సింపుల్ స్టయిల్ ఈ బజ్ కట్. జుట్టు చిన్నగా ఉండటం వల్ల చెమట తక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ, పైగా షాంపూ, నూనె ఖర్చును ఆదా చేస్తుంది. ఉదయం లేట్గా లేచినా, దువ్వుకోవాల్సిన టెన్షన్ ఉండదు. టైమ్ కూడా సేవ్ చేస్తుంది. కట్ చిన్నదే అయినా, కంఫర్ట్ మాత్రం పెద్దది.టెక్చ్సర్డ్ క్రాప్ – మెస్సీగా.. మోడ్రన్ గా..నేచురల్గా, కొంచెం మెస్సీగా కనిపించే స్టయిల్ కావాలనుకుంటే టెక్స్చర్డ్ క్రాప్ మంచి ఎంపిక. ఈ కట్ వల్ల జుట్టు మరింత వాల్యూమ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా థిన్ హెయిర్ ఉన్నవాళ్లకు ఇది మంచి సొల్యూషన్ . ఎక్కువగా సెట్ చేయకపోయినా, స్టయిల్గా కనిపిస్తారు. ఇలా స్టయిలిష్గా కనిపించడానికి పెద్ద ఖర్చు అవసరం లేదు. మీ ఫేస్ షేప్కు సరిపోయే చిన్న హెయిర్ కట్ చాలు, మీ లుక్కి వెంటనే కొత్త చార్మ్ వస్తుంది. -
ఈ ఆభరణాలూ సువర్ణాలే!
ప్రపంచం ఏమైనా సరే, యుద్ధాలు వచ్చినా, ఆర్థిక మాంద్యం తలుపు తట్టినా మన మధ్యతరగతిని వణికించేవి రెండు మాత్రమే! మొదటిది ఇంధన ధరలు, రెండోది బంగారం ధరలు. ఇప్పుడు బంగారం ధర ఆకాశానికెక్కి, అందని నక్షత్రంలా మెరుస్తోంది. బంగారం కేవలం లోహం మాత్రమే కాదు, తరతరాల సంప్రదాయం కూడా! నేటి ట్రెండ్, రేపటి భద్రత. ‘ఏమైనా సరే, నగలు కొనాల్సిందే!’ అనుకునే వారికి రంగు రంగుల్లో దొరికే బంగారు మిశ్రమ లోహాలు సహా పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా బడ్జెట్లోనే మెరిపించే బంగారు మార్గాల గురించిన ప్రత్యేక కథనం...బంగారానికి ప్రత్యామ్నాయ లోహాలు...బంగారం అంటే భారతీయులకు తగని మోజు. ముఖ్యంగా భారతీయులకు బంగారం చూసినప్పుడల్లా దాని మెరుపు మాయలో పడిపోవటం అలవాటు. కాని ఇప్పుడు దానిని తాకగానే, బడ్జెట్ ఒక్కసారిగా సీరియస్ అయి ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త కథ మొదలైంది. ‘బంగారం మాత్రమే కాదు, మేమూ ఉన్నాం’ అని చెప్పే లోహాలు ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టాయి. పెరుగుతున్న ధరలు, రోజురోజుకీ మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్, తేలికగా ఉండే డిజైన్లపై పెరుగుతున్న ఆసక్తి, ఇలా ఇవన్నీ కలిసి బంగారానికి ప్రత్యామ్నాయ ఆభరణాలుగా మారి చిన్న చిన్న తారల్లా తళుక్కుమంటున్నాయి.పైగా ఇవి సరసమైన ధరల్లో దొరుకుతుండటమే కాకుండా, స్టయిల్లో కూడా తగ్గేదే లేదంటూ సూపర్ మోడల్స్లా మెరిసిపోతున్నాయి. దీంతో అన్ని వయసుల వారూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు బంగారం మాత్రమే వివాహాది శుభకార్యాలకు తప్పనిసరి ఎంపికగా ఉండేది. ఇప్పుడు ఆ ఎంపికల ప్రపంచం పెద్దదైంది. అందుకే ఇప్పుడు ఈ ‘న్యూ హీరోస్’ గురించి తెలుసుకోవడం కూడా ఒక చిన్న ఫ్యాషన్ అడ్వెంచర్లాంటిదే!ప్లాటినమ్ – లగ్జరీ లెజెండ్ జ్యూలరీ ప్రపంచంలో ఒక సైలెంట్ కింగ్ ప్లాటినమ్. ఎక్కువ హడావిడి చేయకుండా, తన క్లాస్తోనే అందరినీ ఆకట్టుకుంటుంది. సహజంగా వెండిలాంటి తెల్లటి మెరుపుతో కనిపించే ఈ లోహం చాలా బలమైంది. కాలం గడిచినా తన అందాన్ని కోల్పోదు. అందుకే ‘ఒకసారి కొనిస్తే, సంవత్సరాలు గడిచినా కొత్తదానిలానే మెరిసిపోతుంది’ అంటారు. చరిత్రలో కూడా ప్లాటినమ్ రాజరికపు కథలతో నిండిపోయింది. ఒకప్పుడు ఇది చాలా అరుదుగా దొరికే లోహం కావడం వల్ల రాజులు, ధనవంతులు మాత్రమే దీనితో నగలు చేయించుకునేవారు.ఆ కాలంలో ప్లాటినమ్ ధర కేవలం డబ్బుతో కాదు, ప్రతిష్ఠతో కూడా కొలిచేవారు. ఇప్పటికీ పెళ్లి ఉంగరాలు, ఎంగేజ్మెంట్ రింగ్స్, ప్రీమియం జ్యూలరీలో ప్లాటినమ్ను ఒక శాశ్వత బం«ధానికి గుర్తుగా భావిస్తారు. స్క్రాచ్లు వచ్చినా, వేడి, చెమట, నీరు ఏదైనా సరే తన మెరుపును అలాగే నిలబెట్టుకుంటుంది. అందుకే మెడికల్ పరికరాలు, ఆధునిక సాంకేతిక పరికరాల తయారీ రంగాల్లో కూడా ప్లాటినమ్ కీలక పాత్ర పోషిస్తోంది. ధరలో సాధారణంగా బంగారంతో సమానంగా, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ ధరలో లభిస్తుంది. వెండి – బంగారానికి దగ్గరి బంధువుప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా లభించే విలువైన లోహం వెండి. ఇది బంగారానికి దగ్గరి బంధువు లాంటిది. మెరుపులో ఏమాత్రం తగ్గదు, కానీ ఖర్చులో మాత్రం మనసుకు కాస్త హాయినిస్తుంది. బంగారం కంటే ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల వెండి తక్కువ ధరలో సులభంగా దొరుకుతుంది. అయితే వెండి కథ కేవలం ఫ్యాషన్ తోనే మొదలైపోలేదు; దానికి గొప్ప చరిత్ర, సంప్రదాయం కూడా ఉన్నాయి.పురాతన కాలంలో రాజులు, సంపన్నులు వెండి పాత్రల్లోనే భోజనం చేసేవారు. ఆరోగ్యానికి మంచిదని, నీటిని శుభ్రంగా ఉంచుతుందని నమ్మకం ఉండేది. అందుకే ఇప్పటికీ చాలా ఇళ్లలో చిన్నపిల్లలకు వెండి గ్లాస్, వెండి చెంచా వాడే సంప్రదాయం కొనసాగుతోంది. అంతేకాదు, వెండి సహజంగా బ్యాక్టీరియాను తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. అందుకే పాతకాలంలో చిన్న గాయాలకు కూడా వెండి పూత వాడేవారు. అలాగే పండుగల సమయంలో, ముఖ్యంగా శుభకార్యాల్లో వెండి నాణేలను కానుకగా ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. ఇక పరిశ్రమల ప్రపంచంలో కూడా వెండి ఒక ట్రెండీ హీరోనే. ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ అడుగుపెట్టి రోజువారీ నగలు, స్టయిలిష్ అండ్ సింపుల్ గొలుసులు, మోడ్రన్ జ్యూలరీ డిజైన్ల రూపంలో అందరి చేతుల్లో మెరిసిపోతోంది. సింపుల్గా చెప్పాలంటే సంప్రదాయం, ఆరోగ్యం, స్టయిల్, అందుబాటు ఈ నాలుగు కలిసి వెండిని ఒక స్మార్ట్ చాయిస్గా నిలబెడుతున్నాయి.పలేడియమ్ – సైలెంట్ స్టార్పలేడియమ్ ప్లాటినమ్ కుటుంబానికి చెందిన అరుదైన లోహం. అందుబాటు కొంచెం తక్కువే, కానీ స్టయిల్లో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేస్తుంది. మొదట్లో ఇది పెద్దగా ఫ్యాషన్ లో కనిపించలేదు. కాని, ఇప్పుడు వెడ్డింగ్ రింగ్స్, ప్రీమియం డైలీ వేర్ జ్యూలరీలో ఇది సైలెంట్గా ట్రెండ్ సెట్ చేస్తోంది. సహజంగా తెల్లటి మెరుపుతో ఉండటం వల్ల ప్రత్యేక కోటింగ్ అవసరం లేకుండా సింపుల్గా మెరిసిపోతుంది. మెయింటెనెన్స్ తక్కువ, బరువు తక్కువ, లుక్ మాత్రం హై–ఎండ్. ఇదే దీని అసలు స్టయిల్ సీక్రెట్. 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు.ఆ తర్వాత కాలక్రమేణా జ్యూలరీ ప్రపంచం దాని ప్రత్యేకతను గుర్తించింది. ముఖ్యంగా వైట్ గోల్డ్కు ఒక సులువైన ప్రత్యామ్నాయంగా దీనిని భావిస్తున్నారు. ధర విషయానికి వస్తే, పలేడియమ్కు కూడా కొంచెం మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. కొన్ని రోజులు బంగారంతో పోలిస్తే తక్కువ ధరలో ఉంటుంది, మరికొన్ని రోజులు ‘నేను కూడా లగ్జరీనే!’ అని అంటుంది. బడ్జెట్కి పెద్ద షాక్ ఇవ్వకుండా లగ్జరీ ఫీలింగ్ ఇచ్చే స్మార్ట్ ఎంపికగా పలేడియమ్ నిలుస్తోంది.టైటానియమ్ – ఫ్యూచర్ మెటల్ టైటానియమ్ అంటే మోడర్న్ జ్యూలరీ ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్. బరువు తక్కువ, బలం ఎక్కువ. ఇదే దీని అసలైన స్టయిల్. చేతిలో పెట్టుకున్నప్పుడు లైట్గా అనిపించినా, మన్నికలో మాత్రం స్టీల్కే చాలెంజ్ చేస్తుంది. అందుకే స్పోర్టీ లుక్ కోరుకునే వారికి టైటానియమ్ బెస్ట్ చాయిస్. అయితే, టైటానియమ్ మొదట విమానాలు, రాకెట్ల తయారీలో ఉపయోగించారు.అక్కడ తన దారుఢ్యాన్ని నిరూపించుకున్న తర్వాతే ఇది ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మెన్స్ జ్యూలరీ, స్మార్ట్ వాచ్ స్ట్రాప్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్లో ఇది ఫుల్ స్పీడ్తో ట్రెండ్ అవుతోంది. ఇది తుప్పు పట్టదు, స్క్రాచ్లు తక్కువగా పడతాయి, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. పైగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి కూడా సేఫ్. దీంతో, అలెర్జీ సమస్యలు తక్కువగా ఉంటాయి. అందుకే రోజువారీ వాడకానికి చక్కగా సరిపోతుంది. ఇది బంగారంతో పోలిస్తే చాలా తక్కువ ధరలో లభిస్తుంది.బంగారం రంగుల రహస్యం.. బంగారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దాని పసుపు రంగు మెరుపు. అయితే, బంగారం కేవలం ఒక రంగు కథ మాత్రమే కాదు, అది ఒక రంగుల పండుగ. శతాబ్దాలుగా మనుషులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ విలువైన లోహం, కాలంతో పాటు కొత్త కొత్త అవతారాలు తీసుకుంటూ ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్స్ను సృష్టిస్తోంది. పసుపు నుంచి తెలుపు, గులాబీ, ఆకుపచ్చ, ఇంకా నీలం, నలుపు వరకు ఇలా ప్రతి రంగు వెనుక ఒక ప్రత్యేక కథ, ప్రత్యేక మిశ్రమం, ప్రత్యేక స్టయిల్ దాగి ఉంది.యెల్లో గోల్డ్ – సంప్రదాయానికి చిరునామా..బంగారం అసలైన రూపం యెల్లో గోల్డ్. ఇది శతాబ్దాలుగా సంపద, రాజసం, శుభం అనే భావాలకు ప్రతీకగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారం అత్యంత శుద్ధమైన రూపం. దాదాపు 99.9 శాతం బంగారం ఉంటుంది. కానీ అది చాలా మృదువుగా ఉండటం వల్ల ఆభరణాల తయారీలో 22 క్యారెట్లు, 18 క్యారెట్లు లాంటి మిశ్రమాలను ఎక్కువగా వాడుతారు. పెళ్లి నగలు, గొలుసులు, సంప్రదాయ ఆభరణాలు తదితరమైన వాటన్నింటికీ ఇప్పటికీ ఇది మొదటి ఎంపిక. అలెర్జీ సమస్యలు తక్కువగా ఉండటం, మెరుపు ఎక్కువ కాలం నిలవడం, సింపుల్గా మెయింటైన్ చేయగలగడం దీని ప్రధాన ప్లస్ పాయింట్స్. అయితే ఎక్కువ క్యారెట్ల బంగారం కొంచెం సాఫ్ట్గా ఉండటం వల్ల సులభంగా గీతలు పడే అవకాశం ఉంటుంది. అయినా కూడా ‘క్లాసిక్ లుక్’ అంటే ఇప్పటికీ యెల్లో గోల్డ్నే.వైట్ గోల్డ్ – స్టయిల్కు సిల్వర్ టచ్ వైట్ గోల్డ్ అంటే మోడ్రన్ ఫ్యాషన్ కు సింబల్. సాధారణ పసుపు బంగారానికి భిన్నంగా, బంగారంలో నికెల్, పలేడియమ్ లేదా వెండిలాంటి ఇతర తెల్లటి లోహాలను కలిపి ఈ ప్రత్యేక రంగు బంగారాన్ని తయారు చేస్తారు. తర్వాత దీనిపై రోడియమ్ అనే మెటల్తో కోటింగ్ వేయడం వల్ల ఇది మరింత ప్రకాశవంతంగా, ప్లాటినమ్లా మెరిసే లుక్ను ఇస్తుంది. చరిత్రలో చూస్తే, 1920ల కాలంలో ప్లాటినమ్ చాలా ఖరీదుగా ఉండటంతో, తక్కువ ఖర్చులో అందించడానికి వైట్ గోల్డ్ ప్రాచుర్యం పొందింది.అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది మోడ్రన్ జ్యూలరీలో ఒక ముఖ్యమైన ట్రెండ్గా కొనసాగుతోంది. ఇది స్ట్రాంగ్గా ఉండటం, స్క్రాచ్లు తక్కువగా కనిపించడం దీని ప్రత్యేకత. అయితే రోడియం కోటింగ్ కొంతకాలానికి తగ్గిపోవచ్చు కాబట్టి అప్పుడప్పుడు మళ్లీ కోటింగ్ చేయాల్సి ఉంటుంది. అయినా కూడా స్లీక్, స్మార్ట్, మోడ్రన్ లుక్ కోసం వైట్ గోల్డ్ బెస్ట్ చాయిస్.గ్రీన్ గోల్డ్ – అందాల ఆకుపచ్చ మెరుపుగ్రీన్ గోల్డ్ కొంచెం డిఫరెంట్ అండ్ రేర్. బంగారంలో ఎక్కువ శాతం వెండి కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది. పాత కాలంలో దీనిని ‘ఎలెక్ట్రం’ అని పిలిచేవారు. ఇది మార్కెట్లో ఎక్కువగా కనిపించదు. కాని, ఫ్యాషన్లో చాలా పాత ట్రెండ్. ప్రాచీన రాజులు, కళాకారులు ప్రత్యేక ఆభరణాల కోసం ఈ మిశ్రమాన్ని వాడేవారు, ఎందుకంటే ఇది బంగారంతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపించేది.కొన్నిసార్లు రాగిలాంటి లోహాలను కూడా బంగారంలో కొద్దిగా కలిపి మరింత స్ట్రెంగ్త్ ఇస్తారు. ఇది కాస్త నేచురల్ గ్రీన్ టచ్లా సాఫ్ట్గా కనిపిస్తుంది. కాలక్రమేణా ఇందులో ఉన్న వెండి కారణంగా రంగు కొంచెం డార్క్ కావచ్చు, అదే దానికి ఒక యూనిక్ క్యారెక్టర్ను ఇస్తుంది. భారతీయ దుస్తులైనా, వెస్ట్రన్ ఔట్ఫిట్లైనా ఏ స్టయిల్కైనా ఇది మ్యాచ్ అవుతుంది. కొంచెం డిఫరెంట్, క్లాసీ లుక్ కావాలని అనుకునే వారికి గ్రీన్ గోల్డ్ ఒక బెస్ట్ చాయిస్.రోజ్ గోల్డ్ – ప్రేమకు గులాబీ మెరుపు స్టయిల్లో సాఫ్ట్నెస్ ఇచ్చేదే ఈ రోజ్ గోల్డ్. దీని రంగు కాస్త రొమాంటిక్ లుక్ ఇస్తుంది. బంగారంలో రాగి ఎక్కువగా కలిపితే ఈ అందమైన గులాబీ టోన్ వస్తుంది. అందుకే దీనిని ‘పింక్ గోల్డ్’ అని, పాతకాలంలో ‘రష్యన్ గోల్డ్’ అని పిలిచేవారు, ఎందుకంటే 19వ శతాబ్దంలో రష్యాలో ఇది మొదట ప్రాచుర్యం పొందింది. చరిత్రలో రాజ కుటుంబాలు, ప్రత్యేక సందర్భాల ఆభరణాల్లో ఈ రంగును ఉపయోగించేవారు.ఇది సాఫ్ట్గా కనిపించినా, రాగి కారణంగా ఇతర గోల్డ్ రకాల కంటే కొంచెం బలంగా ఉంటుంది. పైగా దీని రంగు కాలక్రమేణా తగ్గిపోకుండా స్థిరంగా ఉంటుంది. అన్నిరకాల చర్మానికి ఈ రంగు సూట్ అవ్వడం వల్ల యువతలో ఇది ఒక ఫ్యాషన్ ట్రెండ్గా మారింది. ముఖ్యంగా ఎంగేజ్మెంట్ రింగ్స్, గిఫ్ట్ జ్యూలరీ, డైలీ వేర్ ఆభరణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రొమాంటిక్గా, ట్రెండీగా కనిపించాలనుకునే వారు రోజ్ గోల్డ్ ఎంచుకోవటం మంచిది.బ్లూ గోల్డ్ – అరుదైన నీలి మెరుపుజ్యూలరీలో రేర్ స్టార్ బ్లూ గోల్డ్. బంగారంలో ఇండియమ్ లేదా ఐరన్ వంటి లోహాలను కలిపి, నియంత్రిత ప్రక్రియలో ఆక్సిడేషన్ చేయడం వల్ల దీనికి నీలి రంగు వస్తుంది. ఈ షేడ్ గాఢంగా కాకుండా, మెటాలిక్ టచ్తో సాఫ్ట్గా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ రకం బంగారం ఎక్కువగా ఆధునిక కాలంలోనే అభివృద్ధి చెందింది, ముఖ్యంగా ప్రత్యేక డిజైన్లు, ఆర్టిస్టిక్ జ్యూలరీ కోసం దీనిని ఉపయోగించేవారు. ఇది మార్కెట్లో అసలు కనిపించదు; ఎక్కువగా స్టేట్మెంట్ జ్యూలరీ, కలెక్షన్ పీసెస్, ప్రత్యేక ఆర్డర్ డిజైన్లలో మాత్రమే కనిపిస్తుంది. తయారీ ప్రక్రియ క్లిష్టంగా ఉండటం, నైపుణ్యం అవసరం కావడం వల్ల దీని ధర కూడా ఎక్కువే. బ్లూ గోల్డ్ ఎక్కువగా కలెక్షన్ ఐటమ్స్ లేదా ప్రత్యేక సందర్భాల కోసం మాత్రమే తయారు చేస్తారు, అందుకే బ్లూ గోల్డ్ ఒక లగ్జరీ స్టేటస్గా నిలుస్తోంది.బ్లాక్ గోల్డ్ –బోల్డ్ స్టయిల్ బ్లాక్ గోల్డ్ అంటే బోల్డ్ స్టేట్మెంట్. ఇది సహజంగా ఏర్పడే రంగు కాదు. ప్రత్యేక టెక్నాలజీ, కోటింగ్ లేదా ట్రీట్మెంట్ ద్వారా తయారు చేసే మిశ్రమం. రోడియం ప్లేటింగ్, ఆక్సిడేషన్ లేదా లేజర్ ట్రీట్మెంట్ వంటి ఆధునిక పద్ధతులతో బంగారానికి ఈ నలుపు రంగు అందిస్తారు. ముఖ్యంగా మోడ్రన్ జ్యూలరీ ట్రెండ్స్ పెరిగిన తర్వాత ఎక్కువగా పురుషుల జ్యూలరీ, హై ఫ్యాషన్ డిజైన్లు, స్టేట్మెంట్ రింగ్స్, బ్రేస్లెట్స్లో ఇది కనిపిస్తుంది. జ్యూలరీతో అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే బ్లాక్ గోల్డ్ ఒక ట్రెండీ ఆప్షన్.కొత్త డిజైన్లు..బంగారం ధరలు రోజు రోజుకీ పైకి ఎగబాకుతున్నాయని, స్టయిల్లో తగ్గాల్సిన అవసరం లేదు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం స్మార్ట్గా డిజైన్స్ ఎంపిక చేసుకుంటే, తక్కువ ఖర్చులోనే అందమైన నగలను పొందుతూ అందం, ఆనందం రెండింటినీ ఆస్వాదించవచ్చు.అవతారాలు ఎత్తే ఆభరణంఒకే నగను మూడు విధాలుగా మార్చుకునే డిజైన్లు ఇప్పుడు చాలా పాపులర్. పెద్ద హారం నుంచి చిన్న చైన్గా, లేదా లాంగ్ నెక్లెస్ను రెండు చిన్న నెక్లెస్లుగా మార్చుకోవచ్చు. ఒకసారి కొనుగోలు చేసి, మూడు సందర్భాల్లో వివిధ విధాలుగా వాడుకోవచ్చు.పాతకు కొత్త రూపం పాతకాలపు ఆభరణాలను కొత్తగా మార్చి, ఆధునిక డిజైన్స్ తో కలిపి తయారు చేయడం ఇప్పుడు ట్రెండ్గా మారుతోంది. దీంతో పాత బంగారం అమ్మి కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా, వాటినే కొత్తగా మార్చుకోవచ్చు. పెళ్లి కూతురి నగలలో కూడా కొత్త ఆకృతులు, కొత్త కలయికలు కనిపిస్తున్నాయి. అందుకే, ఇప్పుడు బంగారం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, సృజనాత్మకతకు కొత్త వేదిక.హాలో టెక్నిక్ ఈ టెక్నిక్ ఒక చిన్న మ్యాజిక్లాంటిది. నగ లోపల ఖాళీగా ఉండేలా తయారు చేస్తారు. బయట నుంచి చూస్తే మాత్రం పెద్దగా, ఘనంగా కనిపిస్తుంది. 40 గ్రాముల్లా కనిపించే నెక్లెస్ అసలు బరువు 20 నుంచి 25 గ్రాములే ఉండొచ్చు. పాతకాలపు భారీ టెంపుల్ జ్యూలరీ కూడా ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ లో వస్తోంది. అంటే స్టయిల్ డబుల్, ఖర్చు హాఫ్.రెండు మెరుపులు బంగారాన్ని ఇతర లోహాలతో కలిపి తయారు చేసే మిక్స్డ్ మెటల్ డిజైన్స్ ఇప్పుడు ఫ్యాషన్ లో టాప్లో ఉన్నాయి. ఒకే నగలో రెండు రంగుల మెరుపు కనిపించడం వల్ల అది కొత్తగా, మోడర్న్గా కనిపిస్తుంది. ఖర్చు తగ్గుతుంది, డిజైనర్ లుక్ కూడా వస్తుంది.పూత పరి^è యాలుఈ టెక్నిక్లో నగ పూర్తిగా బంగారంతో కాకుండా, పైపైన మాత్రమే బంగారం పొర వేస్తారు. దీంతో అది గోల్డ్లా మెరిసిపోతుంది, కానీ ధర మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వన్ గ్రాము గోల్డ్ లాంటివే కనిపిస్తాయి, కానీ అసలు బంగారం కాదు. పార్టీలు, ఫంక్షన్ లలో గ్రేస్ చూపించడానికి ఇది సూపర్ చాయిస్.తక్కువలో ఎక్కువ అందం. ఇప్పటి యువత ఎక్కువ నగలు ధరించడం కన్నా, ఒకే నగతో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఒక చిన్న గొలుసు, ఒక అందమైన ఉంగరం, ఒక జత చెవిపోగులు. ఇవే ఇప్పుడు పూర్తి అలంకరణగా మారుతున్నాయి. సాదాసీదాగా, కానీ ఆకర్షణీయంగా కనిపించడం – అందానికి ఇదే నేటి కొత్త మంత్రం.సంప్రదాయం చిన్న ప్యాక్లో జ్యూలరీలో ‘లైట్ ఈజ్ రైట్’ అనే ట్రెండ్ సూపర్ హిట్గా మారింది. పెద్దగా కనిపించే హారం అయినా, చెవి రింగులు అయినా లోపల స్మార్ట్గా తక్కువ బంగారంతో డిజైన్ చేసి, బయటకు మాత్రం బీడ్స్, రంగురంగుల స్టోన్స్ , మెరిసే ముత్యాలు జోడించి ఫుల్ రిచ్ లుక్ తీసుకొస్తున్నారు. చేతిలో పెట్టుకుంటే బరువు తక్కువగా ఉంటుంది, కానీ చూసినవారికి మాత్రం ‘ఇది ఎంత గ్రాండ్గా ఉంది!’ అనిపించేలా మెరుస్తుంది.కాలం మారుతోంది, ఖర్చులు పెరుగుతున్నాయి, బంగారం ధర రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయినా మన ఇంట్లో ఒక మాట మాత్రం మారదు. ‘బంగారం కొంటేనే భద్రత’ అనే నమ్మకం. అందుకే, బంగారం ఎప్పటికీ ప్రత్యేకమే! ∙ దీపిక కొండి -
లివర్ షివర్
భారత దేశంలో లివర్ జబ్బులు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. లివర్ జబ్బుల కారణంగా సంభవించే మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. లివర్ జబ్బులకు మద్యపానం ప్రధాన కారణంగా ఉంటోంది. హెపటైటిస్–ఏ, బీ, సీ, డీ, ఈ; నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ); కొన్ని రకాల ఔషధాల వాడకం, రసాయనాల కాలుష్యం; జన్యు కారణాలు, ఆటో ఇమ్యూన్ పరిస్థితులు కూడా లివర్ జబ్బులకు కారణం అవుతుంటాయి.మన దేశంలోని పరిస్థితులు చూసుకుంటే, గడచిన దశాబ్ద కాలంలో లివర్ జబ్బులతో మరణాల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగినట్లు జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ రకాల లివర్ జబ్బులు, వాటి వల్ల సంభవిస్తున్న మరణాల వివరాలను గణాంకాల్లో తెలుసుకుందాం... -
డ్రైవింగ్ లైసెన్స్ కోసం... 139 విఫలయత్నాలు
సాధారణంగా మనం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే థియరీ, ప్రాక్టికల్ టెస్ట్లలో ఒకటి రెండుసార్లు ప్రయత్నం చేస్తాం. అలా సాధ్యం కాకపోతే ‘ఇక మనకు డ్రైవింగ్ సెట్ కాదులే’ అని అనుకుని ఏ ఓలానో, ఊబర్నో ఆశ్రయిస్తాం. కానీ పోలండ్లోని టార్నోకి చెందిన ఓ వ్యక్తి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అలా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు అనుకుంటున్నారా... ఏకంగా 139 సార్లు, తొమ్మిదేళ్ల పాటు విసుగు చెందకుండా విఫల యత్నాలు చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ థియరీ టెస్ట్లో పాస్ కావడం కోసం ఏకంగా రూ. 1,90,000 కూడా ఖర్చు చేశాడు.చివరికి అంటే 140వ ప్రయత్నంలో ఎట్టకేలకు థియరీ టెస్ట్లో పాసయ్యాడు. అయితే, అసలైన మరో ట్విస్ట్ మరొకటి ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే థియరీ పాస్ అయిపోతే సరిపోదు. ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ కూడా పాసై పోవాలి. కారు నడపడంలో తడబడినా, రివర్స్ సరిగ్గా తీయకపోయినా.. రూల్స్ ప్రకారం మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. మరోవిషయం.. 140 సార్లే ఎక్కువ అనుకుంటే, పోలండ్లోనే ఇతడిని మించిన ఇంకో ఘనుడు కూడా ఉన్నాడు. అతను డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏకంగా 163 ప్రయత్నాలు చేశాడట. అది కూడా 17 ఏళ్ల పాటు! -
ఈ కోర్టే నకిలీది!
నకిలీ డాక్టర్ల గురించి విన్నాం. నకిలీ లాయరు. నకిలీ జడ్జి గురించి చదివాం. ఫేక్ ఆఫీసర్లు.. డూప్లికేట్ ప్రొడక్టులు.. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే, గుజరాత్లో ఓ వ్యక్తి ఓ కొత్త మోసానికి తెరలేపాడు. ఏకంగా నకిలీ కోర్టే ఏర్పాటు చేశాడు.. ఏంటీ కోర్టా? అని ఆశ్చపోతున్నారా.. కోర్టే కాదు.. లాయర్లు, ఉద్యోగులు, తీర్పులు అన్నీ నకిలీనే...సివిల్ కేసులు.. ఓ పట్టాన పరిష్కారం కావు. తరాలు మారినా ఎటూ తెగవు. ఏళ్లతరబడి ఎదురుచూపులు. కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు తప్పవు. ఇలా తిరిగి. విసిగి వేసారిన వారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రభుత్వం నియమించిన ఆర్బిట్రేటర్ని అని చెప్పాడు.. కోర్టు సెటప్ వేసి నమ్మించాడు. కేసులు పరిష్కరించినట్టు, తీర్పులు చెప్పినట్టు నటించాడు. లక్షల్లో ఫీజులు గుంజాడు. ఐదేళ్ల పాటు ఈ దందా సాగించాడు.ఓ కేసు వ్యవహారంలో ‘అసలు’ కోర్టుకు అనుమానం వచ్చి, ఆరా తీసింది. మోసం బట్టబయలైంది. ‘నకిలీ’ని కటకటాల్లోకి పంపింది. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ ఉత్తుత్తి కోర్టు వెలిసింది. మోరిస్ శామ్యూల్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. ఓ గదిలో కోర్టు సెటప్ ఏర్పాటు చేసి, జడ్జిగా గెటప్ వేశాడు. కొంతమంది నకిలీ లాయర్లు, ఉద్యోగులను నియమించుకున్నాడు. భూమి వివాద బాధితులే లక్ష్యంభూ సంబంధిత కేసుల్లో బాధితులను టార్గెట్ చేసేవాడు. అమాయకులను గుర్తించి, బుట్టలో వేసుకునేవాడు. ప్రభుత్వం తనను ‘అధికారిక మధ్యవర్తి’గా నియమించిందని నమ్మించేవాడు. కోర్టుల్లో కేసుల పరిష్కారానికి ఎక్కువ కాలం పడుతుందని, తాను త్వరగా పరిష్కారం చూపుతామని నమ్మించి..‘ఉత్తుత్తి’ కోర్టుకు రప్పించేవాడు. ఐదేళ్ల పాటు కొనసాగిన మోసంఈ ఉత్తుత్తి కోర్టు కార్యకలాపాలు 2019 నుంచి 2024 వరకు కొనసాగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శామ్యూల్కు ఆర్బిట్రేటర్గా ఎటువంటి అధికారిక హోదా లేదని, ఐదేళ్లలో అనేక కేసుల్లో నకిలీ ఆదేశాలు జారీ చేశాడని గుర్తించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై మార్చేలా కలెక్టర్లకు సైతం ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ ఆర్బిట్రేటర్ కోర్టులో తన క్లయింట్లకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసేవాడు. ఆ తర్వాత ఆ నకిలీ క్లెయిమ్లను కోర్టులో సమర్పించి తన క్లయింట్లకు అక్రమ లాభం కలిగించేవాడు. ఎలా బయటపడిందిఈ ‘నకిలీ’ వ్యవహారం ఒక కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది. శామ్యూల్ ఇచ్చిన తీర్పు కాపీని ఓ కేసులో అహ్మదాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో సమర్పించగా, ఆ పత్రాలను పరిశీలించిన కోర్టు అధికారి అనుమానాస్పద అంశాలను గుర్తించారు. వాస్తవాలను పరిశీలించి, విచారణలో ఆ తీర్పు నకిలీదిగా తేల్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్ట్.. కేసుల నమోదుపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతని కార్యాలయంలో నకిలీ పత్రాలు, కోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మోరిస్ శామ్యూల్ను అరెస్టు చేశారు. మోసం చేయడం, నకిలీ పత్రాలు తయారు చేయడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. ఆ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని శామ్యూల్ మోసానికి పాల్పడ్డాడు. ‘జాప్యాన్ని’ సాకుగా చూపి బాధితుల నిస్సహాయతను తనకు అనుకూలంగా మలచుకున్నాడు. చట్టపరమైన వ్యవహారాల్లో సరైన అధికారిక మార్గాలనే ఎంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన రుజువు చేస్తోంది. అరుదైన మోసమే కాదు, అనేక ప్రశ్నలు లేవనెత్తే ఉదంతంగానూ దీన్ని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.దిలీప్ మాదిరెడ్డి -
యముడితో కీర్తిమంతుడి యుద్ధం
పూర్వం కాశీక్షేత్రాన్ని రాజధానిగా చేసుకుని, ఇక్ష్వాకు వంశానికి చెందిన కీర్తిమంతుడు పాలించేవాడు. ఒకనాడు కీర్తిమంతుడికి వేట మీద కోరిక పుట్టి, అడవిలో వసిష్ఠాశ్రమ పరిసరాలకు వెళ్లాడు. అప్పుడది వైశాఖమాసం. వసిష్ఠ మహర్షి శిష్యులందరూ వైశాఖమాస ధర్మాలను ఆచరిస్తూ సందడిగా కనిపించారు. వైశాఖమాస ధర్మకార్యాలను అప్రతిహితంగా కొనసాగించడానికి వసిష్ఠ మహర్షి అప్పటికే ఆశ్రమానికి చేరువలో బాటసారుల దప్పిక తీర్చడానికి చలివేంద్రం, వారు సేదదీరడానికి అనువుగా చలువ పందిరితో ఒక విడిది మంటపం ఏర్పాటు చేశాడు. వసిష్ఠుడి శిష్యుల్లో కొందరు చలివేంద్రం వద్ద నిలబడి బాటసారుల దప్పిక తీరుస్తున్నారు. ఇంకొందరు విడిది మంటపంలో ఉన్నవారికి రసభరితమైన పండ్లు అందిస్తున్నారు. మరికొందరు సేదదీరుతున్న బాటసారులకు విసనకర్రలతో గాలి విసురుతూ సపర్యలు చేస్తున్నారు. ఇదంతా చూసిన కీర్తిమంతుడు ఆశ్చర్యపోయాడు. వసిష్ఠుడి శిష్యులను సమీపించి, ‘మునికుమారులారా! మీరంతా ఎవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.‘రాజా! మేమంతా వసిష్ఠ మహర్షి శిష్యులం. ఆయన ఆదేశం మేరకు వైశాఖ ధర్మాలను నెరవేరుస్తున్నాం’ అని బదులిచ్చారు.‘ఏదైనా క్రతువులో భాగంగా ఈ పనులన్నీ చేస్తున్నారా? ఏ దేవత ప్రీతి కోసం ఇదంతా చేస్తున్నారు? దీనివల్ల ఫలితమేమిటి?’ అడిగాడు కీర్తిమంతుడు.‘రాజా! గురువు ఆజ్ఞ మేరకు ఈ పనులన్నీ చేస్తున్నాం. వివరాలేవీ మాకు తెలియవు. ఆయనను కలుసుకుని, నేరుగా అడిగితే, ఆయనే చెప్పగలరు’ అని చెప్పారు శిష్యులు.కీర్తిమంతుడు వసిష్ఠాశ్రమంలోకి ప్రవేశించి, వసిష్ఠ మహర్షికి నమస్కరించాడు. ‘మహర్షీ! నేను ఇటువైపుగా వస్తుంటే, మీ శిష్యులందరూ బాటసారులకు కని విని ఎరుగని సపర్యలు చేస్తూ కనిపించారు. ఇది ఏమైనా ప్రత్యేకమైన క్రతువా? దీని వల్ల ఫలితమేమిటి? మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది’ అని అభ్యర్థించాడు.వసిష్ఠుడు కీర్తిమంతుడి జిజ్ఞాసకు సంతోషించాడు.‘రాజా! నా శిష్యులు చేస్తున్నవన్నీ వైశాఖమాస ధర్మాలు. వైశాఖమాసంలో మానవులందరూ తప్పనిసరిగా ఆచరించాల్సినవి– స్నానం, దానం. ఎన్ని ధర్మాలను ఆచరించినా, స్నాన దానాలను ఆచరించని మానవులు శ్రీహరికి ప్రీతిపాత్రులు కాలేరు. వైశాఖధర్మాలు సులభసాధ్యాలు. దప్పిగొన్న వారికి నీరు ఇవ్వడం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, అలసిన వారికి విశ్రాంతి పొందడానికి ఏర్పాట్లు చేయడం వంటి సామాన్య చర్యలే వైశాఖధర్మాలు. వీటిని ఆచరించిన మానవులకు శ్రీహరి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది’ అని చెప్పాడు.కీర్తిమంతుడు సంతోషంతో వసిష్ఠుడికి కృతజ్ఞతలు తెలుపుకొని, తన రాజధానికి చేరుకున్నాడు. మరునాడే తన భటులతో రాజ్యమంతటా ఇలా చాటింపు వేయించాడు: ‘నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎనిమిదేళ్ల పైబడిన బాలలు మొదలుకొని వృద్ధుల వరకు వైశాఖమాసంలో అనుదినం స్నానం చేయాలి. సంపన్నులు చలివేంద్రాలను, బాటసారులకు భోజనశాలలను, విడిది మందిరాలను ఏర్పాటు చేయాలి. స్నాన దానాలు చేయనివారికి కఠిన శిక్షలు తప్పవు’. కీర్తిమంతుడి రాజ్యంలో ప్రజలందరూ రాజాజ్ఞను తు.చ. తప్పకుండా పాటించసాగారు. రాజ్యంలో ఎవరూ ధర్మం తప్పనందున కాలంతీరి ఎవరు మరణించినా, వారందరూ నేరుగా విష్ణులోకానికి పోతున్నారు. యమలోకానికి వెళ్లేవారు ఎవరూ లేకపోయారు.ఇదే పరిస్థితి కొనసాగితే తన ఉనికికే ముప్పు వస్తుందని తలచిన యముడు తన పరివారంతో బయలుదేరి, కీర్తమంతుడి రాజ్యాన్ని ముట్టడించాడు. యుద్ధానికి పిలుపుగా భీకర శంఖారావం చేశాడు.కీర్తిమంతుడు సైన్య సమేతంగా యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు. ఉభయ సైన్యాలకు భీకర పోరు సాగింది. కీర్తిమంతుడు తన శక్తిమంతమైన బాణాలతో యమదూతలను రణరంగం నుంచి తరిమికొట్టాడు. యముడు నేరుగా కీర్తిమంతుడితో తలపడ్డాడు. తీక్షణమైన బాణాలతో కీర్తిమంతుడిని నొప్పించి, సింహనాదం చేశాడు. కీర్తిమంతుడు మూడు బాణాలతో యముడి ధనుస్సును విరిచేశాడు.ఆగ్రహించిన యముడు కాలదండాన్ని తీసుకుని, కీర్తిమంతుడిపైకి విసిరాడు.తన భక్తుడైన కీర్తిమంతుడి రక్షణ కోసం శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని సంధించాడు. ఆ చక్రం శరవేగంతో దూసుకొచ్చి, కాలదండాన్ని విసిరికొట్టింది. అది యముడి మీదకొచ్చింది. ఈ పరిణామానికి దేవతలంతా హాహాకారాలు చేసి, యముడిని క్షమించమని ప్రార్థించడంతో విష్ణువు తన చక్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కీర్తిమంతుడి చేతిలో ఎదురైన ఓటమికి తలవంచుకుని, యముడు తిరిగి తన లోకానికి బయలుదేరాడు. ∙సాంఖ్యాయన -
గర్భం దాలుస్తున్నాను... కానీ...
నాకు 30 సంవత్సరాలు. మా పెళ్లై ఐదు సంవత్సరాలు అయ్యింది. ప్రతిసారి నేను గర్భం దాల్చుతున్నాను, కానీ రెండు నుంచి మూడు నెలల్లోనే మిస్క్యారేజ్ అవుతోంది. ఇది మూడుసార్లకు పైగా జరిగింది. మాకు ఒక హెల్దీ బేబీ కావాలి. దీనికి కారణం ఏమిటి? ఎలా ట్రీట్ చేయాలి?– సుజాత, విజయవాడ.మూడుసార్లకు పైగా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతుంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. అంటే ప్రతిసారి ఎందుకు మిస్క్యారేజ్ అవుతోంది అన్నది తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేసి కారణాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ పరిశీలనలో ముందుగా డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవాలి. అసలు స్కాన్ చేయించారా లేదా, ఎన్ని రోజులకు లేదా ఎన్ని వారాలకు మిస్క్యారేజ్ అవుతోంది అన్నది తెలుసుకోవాలి. రెండు నెలలు పూరై్తన తర్వాత జరుగుతుందా, లేక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయిన వెంటనే జరుగుతుందా అన్నది కూడా అడగాలి. అలాగే స్కాన్ లో బేబీ హార్ట్బీట్ ఫార్మేషన్ ఉందా లేదా, ఒకసారి హార్ట్బీట్ వచ్చి పోయాక మిస్క్యారేజ్ అవుతోందా అన్నది కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది పూర్తిగా పరిశీలించాలి. సాధారణంగా మొదటి మూడు నెలల్లో, అంటే 12 వారాల లోపల రిపీటెడ్గా మిస్క్యారేజ్ కావడానికి కారణాలు; అలాగే మూడు నెలల తర్వాత మిస్క్యారేజ్ కావడానికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ పేషెంట్కు మొదటి మూడు నెలల్లోనే జరుగుతోంది కాబట్టి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే, ముందుగా తల్లికి, తండ్రికి జెనెటిక్ పరీక్షలు చేసి, జెనెటిక్ సమస్యలు ఉన్నాయా అని చెక్ చేయాలి. అలాగే మిస్క్యారేజ్ అయినప్పుడు బయటికి వచ్చిన టిష్యూ ఉంటే దానికి కూడా జెనెటిక్ పరీక్షలు చేసి, ఏదైనా జెనెటిక్ సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలా ఉంటే జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా సరైన మార్గదర్శకాలు తీసుకోవచ్చు. వయస్సు కూడా చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా తల్లి వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం లేదా తండ్రి వయస్సు 40 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం వల్ల మిస్క్యారేజ్ వచ్చే ప్రమాదం కొంచెం పెరుగుతుంది. అలాగే మధుమేహం ఉందా, థైరాయిడ్ సమస్య ఉందా, లేదా ఇతర వ్యాధులు ఉన్నాయా అన్నది కూడా పరిశీలించాలి. ముఖ్యంగా రక్త సంబంధిత లేదా ఇతర శరీర వ్యవస్థల సమస్యలు ఉన్నా కూడా మిస్క్యారేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒక స్కాన్ ద్వారా గర్భసంచి ఆకారం ఎలా ఉంది అన్నది చూడాలి. గర్భసంచిలో ఏదైనా నిర్మాణ లోపం ఉందా లేదా గర్భసంచి ఆకారం సాధారణంగా ఉందా అన్నది చెక్ చేయాలి. మంచి స్కాన్ ద్వారా గర్భసంచిలో ఏదైనా పొర లాంటిది ఉండి, దాని వల్ల బ్లడ్ సప్లై సరిగ్గా అందకపోతుందా అన్నది తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉంటే కొన్ని సందర్భాల్లో చిన్న ప్రొసీజర్ ద్వారా దాన్ని సరిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన కారణం రక్తం గడ్డకట్టే సమస్యలు. వీటిని థ్రాంబోఫీలియాస్ అని అంటారు. అంటే రక్తంలో ఉండే గడ్డకట్టే లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భానికి సరైన రక్తప్రసరణ జరగక మిస్క్యారేజ్ కావచ్చు. ఇందులో కొన్ని ప్రత్యేక పరీక్షలు చేసి, ఏదైనా తేడా ఉంటే దానికి సరైన మందులు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు అన్ని పరీక్షలు చేసినా కూడా కారణం స్పష్టంగా కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాలను అనెక్స్ప్లెయిన్ మిస్క్యారేజ్ అంటారు. అయినప్పటికీ, చిన్న చిన్న కారణాలు గుర్తించినా వాటిని ట్రీట్ చేయడానికి ప్రయత్నించి, భవిష్యత్తులో ఒక హెల్దీ బేబీ కోసం తల్లిదండ్రులు డాక్టర్ కలిసి ప్రయత్నించవచ్చు. ∙మేని మాటశరీరం ‘తనను తానే శుభ్రం’ చేసుకుంటుంది!రోజూ స్నానం చేస్తూ శరీరాన్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటున్నారని అనుకుంటున్నారా? కానీ, అసలు క్లీనింగ్ మాత్రం లోపలే జరుగుతోంది! మన శరీరంలో ‘అటో ఫాగీ’ ప్రక్రియ నిరంతరాయంగా పనిచేస్తూ, పాడైన కణాలను తొలగించి కొత్త కణాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా మనం నిద్రపోతున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ ‘ఇన్నర్ క్లీనింగ్’ స్పీడ్ మరింత పెరుగుతుంది. డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ -
క్లూషియల్: బిలియనీర్ అనుమానాస్పద మృతి
‘శ్రీవాత్సవ బిజినెస్ ఎంపైర్ టవర్స్..‘ప్రముఖ వ్యాపారవేత్త శ్రీవాత్సవ అనుమానాస్పదంగా మరణించాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన వందమందిలో ఒకరైన అతని మరణం సంచలనమైంది. పరిశోధన మొదలైంది.ఢిల్లీ నుంచి వచ్చిన వైద్యబృందం తీవ్రమైన ఒత్తిడి వల్ల మరణించి ఉండవచ్చని అభిప్రాయపడింది. ఎన్ఐఏ– స్పెషల్ ఏజెంట్ అభిమన్యుని రంగంలోకి దించింది. హైదరాబాద్ చేరుకున్నాడు అభిమన్యు. టైమ్ అర్ధరాత్రి రెండు గంటలు. ఆ చాంబర్లో కమిషనర్ ప్రద్యుమ్న, శ్రీవాత్సవ భార్య, అభిమన్యు ఉన్నారు.‘‘సారీ మిసెస్ శ్రీవాత్సవ గారు! ఈ టైమ్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు. శ్రీవాత్సవగారు ఏ విషయంలోనైనా టెన్షన్ ఫీలవ్వడం గమనించారా?’’ అడిగాడు అభిమన్యు.‘‘లేదు, తను స్ట్రెస్ ఫీలవ్వడం ఎప్పుడూ చూడలేదు. కోవిడ్ టైమ్లో అయిదు వందల కోట్ల నష్టం ఎదురైనప్పుడే తేలిగ్గా తీసుకున్నారు’’ చెప్పింది మిసెస్ శ్రీవాత్సవ. తనకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? ‘‘బెదిరింపులకు భయపడడు. చాలా మొండి మనిషి.’’ మిసెస్ శ్రీవాత్సవ చెప్పింది.అభిమన్యు ఆలోచనలో పడ్డాడు. ‘శ్రీవాత్సవను ఒత్తిడికి గురిచేసిన విషయం ఏమై ఉంటుంది?’శ్రీవాత్సవ ఫోన్ను అన్లాక్ చేసి; ఫోన్ డేటాను పరిశీలించాడు. అనుమానించదగినది ఏదీ కనిపించలేదు. చాంబర్లో అనుమానం కలిగించేవేవీ కనిపించలేదు. స్టాఫ్ను విచారించాడు. అభిమన్యు దృష్టి ‘కీ చైన్’ మీద పడింది. శ్రీవాత్సవ పిడికిట్లో వుంది. సిక్స్ నైన్ అనే అంకెలు ఉన్న కీ చైన్. ఎలాంటి కీ లేదు.ఆ కీ చైన్ మిసెస్ శ్రీవాత్సవకి చూపించి, ‘‘దీని గురించి చెప్పగలరా?’’ అని అడిగాడు.‘‘లాస్ట్ వీక్ స్విట్జర్లండ్ వెళ్లినప్పుడు తెచ్చుకున్నాడు. అంతకు మించి విశేషమేమీ లేదు’’ చెప్పింది మిసెస్ శ్రీవాత్సవ.‘‘కేసు క్లోజ్ చేయాల్సిందేనా?’’ కమిషనర్ అడిగాడు.‘‘కేసు ఇప్పుడే మొదలైంది’’ అంటూ అభిమన్యు కీ ఎక్కడ కొన్నదో చెక్ చేశాడు. ఆ చైన్ శ్రీవాత్సవ క్యాష్ పే చేసి కొన్నట్టు తేలింది. అవి ప్రత్యేకంగా ఆర్డర్ చేసి, తమ లక్కీ నంబర్లు కలిసొచ్చేలా ఆర్డర్ చేస్తారు. ఈ అంకెల్లో ఏదో ఉంది!అభిమన్యు ఆలోచిస్తూనే నేమ్ ప్లేట్ వైపు చూసి వెంటనే మిసెస్ శ్రీవాత్సవకు ఫోన్చేసి, ‘‘క్షమించండి. ఈ టైమ్లో డిస్టర్బ్ చేసినందుకు. మీ వారికి న్యూమరాలజీ మీద నమ్మకం ఉందా?’’ అడిగాడు.‘‘ఉంది. తన పేరును శ్రీవాత్సవ్ గా మార్చుకోవడానికి కారణం అదే...’ అని ఇంకేదో చెప్పబోతుండగా, ‘‘థాంక్యూ’’ అని ఫోన్ పెట్టేసి, కమిషనర్ వైపు తిరిగి ‘‘అర్జెంట్ గా స్విట్జర్లాండ్ వెళ్ళాలి... ఈ సిక్స్ నైన్ కీ చైన్కు, స్విట్జర్లండ్కు సంబంధం ఉంది.. నైన్ అంకె శ్రీవాత్సవ పేరు.. సిక్స్ అంకె...’’ అని ఆగి, వెంటనే ‘‘గాటిట్...’’ అని కమిషనర్ వైపు తిరిగాడు.‘‘శ్రీవాత్సవ ఒక్కడే స్విట్జర్లండ్ వెళ్లాడు. బిజినెస్ పనిమీద కాదు. స్విస్ బ్యాంకులు శ్రీవాత్సవలాంటి బిలియనీర్లకి కామధేనువులు. శ్రీవాత్సవ తెలివైన వ్యాపారవేత్త. సిక్స్ అంకె ‘లాకర్’ను సూచిస్తుంది. ఏదో క్లూ కీ చైన్లో ఉంది.’’ అన్నాడు.స్విట్జర్లండ్...మిసెస్ శ్రీవాస్తవ తరఫున లీగల్ డాక్యమెంట్లు సమర్పించడంతో స్విస్ బ్యాంకు లాకర్ను ఓపెన్ చేశారు.లాకర్లో విదేశాల్లో కొన్న ఖరీదైన ఫోన్. అందులో ఒకే కాంటాక్ట్– సెక్రటరీ మాయ నంబర్. శ్రీవాత్సవ రికార్డ్ చేసిన వాయిస్.‘‘మీరు నా వాయిస్ వినేసరికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. నేను నా అంతరాత్మకు తప్ప ఎవరికీ భయపడను. ఒక బలహీన క్షణంలో సెక్రటరీతో నా సంబంధం నన్ను ట్రాప్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్తగా నాకున్న పరిచయాలు వాడుకోవాలని చూసింది. మేము సన్నిహితంగా ఉన్న వీడియోలు పంపి బ్లాక్ మెయిల్ చేసింది. హోంమంత్రిని, రక్షణ శాఖ అధికారులను పరిచయం చేయమంది. లేకపోతే వీడియోలు బహిర్గతం చేస్తానని బెదిరించింది. వీడియోలు బయటకు వస్తే నా కంపెనీ షేర్లు పడిపోతాయి. నా సంస్థల మీద ఆధారపడ్డ వేలాది కుటుంబాలు వీధిన పడతాయి. అలా అని దేశ రక్షణను పణంగా పెట్టను. నా మరణాన్ని పరిశోధించడానికి మీరొస్తారని తెలుసు...’’ ఒకవిధంగా శ్రీవాత్సవ మరణవాంగ్మూలం.శ్రీవాత్సవ స్విట్జర్లండ్కు రావడానికి కారణం తెలిసిపోయింది. అప్పటికే పారిపోయే ప్రయత్నంలో ఉన్న మాయను అరెస్ట్ చేశారు. అభిమన్యు సూచన మేరకు శ్రీవాత్సవ సెక్రటరీ మాయ– అతడు మరణించిన విషయం తెలుసుకుని, అతని కోటు జేబులో ఉన్న డబ్బు దొంగిలించి పారిపోతూ సీసీ కెమెరాలకు చిక్కింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు’’ అన్న వార్త మీడియాలో ఫ్లాష్ అయ్యింది.ఎన్ఐఏ కార్యాలయం..మాయ ఎదురుగా అభిమన్యు.‘‘చాలా సిల్లీ పెట్టీ కేసు కదూ! నువ్వు బయట కనబడితే జనం, పోలీసులు వదలరు. నీ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. రికార్డుల్లో లేని ఖైదీవి. నీ కోసం మీ వాళ్ళు కూడా గాలిస్తారు. లైఫ్లో హనీ ట్రాప్ చేయకుండా, శ్రీవాత్సవ ఆత్మ శాంతించేలా నీకు ఈ శిక్ష ...’’అభిమన్యు ఇంటరాగేషన్ సెల్ నుంచి బయటకు నడిచాడు. -
ఈ వారం కథ: పోడుస్తున్న పోద్దు
‘‘నువ్వెప్పుడైనా నిలువుటద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకుంటావా?’’ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పార్కుకి తీసుకువచ్చి, అవీ ఇవీ చెపుతూ వున్నట్టుండి ఇలా వ్యక్తిగతమైన ప్రశ్న వేసిన తులసి కేసి ఆశ్చర్యంగా చూసింది ప్రగతి.‘‘అద్దంలో చూసుకోవడం రోజూ అందరూ చేసే పనే కదా? నా గురించి ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావ్?’’‘‘నువ్వు ప్రత్యేకం కాబట్టి. నిన్ను చూసుకుని నువ్వే మోహించేటంత, ముట్టుకొంటే డాగు పడేటంత అపురూపమైన అందాన్ని నీకు భగవంతుడిచ్చాడు. సినిమాతారలకు మించిన సహజ సౌందర్యం నీది. కానీ ఏం లాభం? దాన్ని అడవికాసిన వెన్నెల చేస్తున్నావ్. ఈ వయసులో ఓ బాయ్ఫ్రెండు, బాడీగార్డు, ప్రేమ – దోమ ఎఫైరూ –ఎంజాయ్మెంటూ, థ్రిల్లూ – గిల్లూ... ఇలాంటివేం లేకుండా జీవితాన్ని చప్పగా గడిపేస్తున్న నిన్ను చూస్తుంటే ఆశ్చర్యమే కాదు – జాలేస్తోంది కూడా...’’‘‘తులసీ, ఇలా క్లాస్ పీకడానికా నన్నిక్కడికి తీసుకొచ్చింది?’’ ప్రగతి అసహనంగా చూసింది.‘‘సారీ, నీ మంచి కోరి చెబుతున్న నన్నర్థం చేసుకో. ‘ఓ ప్రేమ లేఖ – ప్రపోజలూ, అచ్చటా – ముచ్చటా దేనికీ నోచుకోని దరిద్రగొట్టు బతుకుల్ని మాకెందుకిచ్చావు దేవుడా!’ అని ఏడ్చే నాలాంటి అమ్మాయిలు ఎందరున్నారో నీకు తెలియదు. ఎందుకంటే కొమ్ములు తిరిగిన కుర్ర హీరోలు వెర్రివాళ్ళలా వెంటపడుతున్న అదృష్ట జాతకురాలివి నువ్వు. కానీ దేవుడు నీకు యిచ్చిన వరానికి ఏమాత్రం గర్వపడక ఇంత రిజర్వ్డ్గా మడిగట్టుకుని ఉండడానికి కారణం తెలుసుకుందామని, ఇలా వసంతంలాంటి వయసును వ్యర్థం చేసుకుంటే, ఆ తర్వాత పోగొట్టుకున్న దానికోసం ఎంత పరితపించినా ప్రయోజనం ఉండదని చెప్పడానికే...’’‘‘చెప్పింది చాలు. నా బుర్ర తినకు. నేనే పొరపాటూ చేయడం లేదు. నా తీరు, నా దారి చాలా తృప్తికరంగానూ. ప్రశాంతంగానూ వున్నాయి.’’ ‘‘కాదు. నువ్వు ఆత్మవంచన చేసుకుంటూ అబద్ధాలు చెబుతున్నావ్. నీ మనస్సాక్షిగా నిజం చెప్పు. నీకు ఎప్పుడూ శృంగారపరమైన ఊహలూ, కవ్వించే కలలూ రావడం లేదూ? ఒంటరిగా ఉన్నప్పుడు వయస్సు పోరుతో మానసికంగా పులకింతలూ, గిలిగింతలూ కలగడం లేదూ? అబ్బాయిలు నీకేసి అదే పనిగా ఆరాధనాపూర్వకంగా చూస్తూంటే నీకే ‘ఫీలింగ్స్’ కలగడం లేదంటే నేను చస్తే నమ్మను...’’‘‘నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కొచ్చిన నష్టం లేదు. అనవసరమైన విషయాలు ప్రస్తావించి నన్ను విసిగించకు’’‘‘పిచ్చి పిల్లా, నేను చెప్పేవన్నీ వయోధర్మాలు, మర్మాలూ! కాని, సర్వసామాన్యమైన పచ్చినిజాల్ని ఒప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావ్. ఈ కాలంలో హైస్కూల్ దశలోనే ఆడపిల్లలు ప్రేమపిచ్చితో రెచ్చిపోతూ మొబైల్స్ని వదలడం లేదంటే – ఇంజనీరింగ్ ఫైనల్కొచ్చి నువ్వింత బుద్ధిగా వుండడం సాధ్యమా? నువ్వు మరోలా అనుకోకపోతే నిన్నో ప్రశ్న సూటిగా అడుగుతున్నాను – ఇంతవరకు ఏ మగధీరుణ్ని చూసినా నీ మనస్సు చలించలేదా? నా మీద ఒట్టేసి చెప్పు’’లేదన్నట్టు ప్రగతి అడ్డంగా తల ఆడించింది.‘‘యూ ఆర్ రియల్లీ గ్రేట్. అయితే నువ్వెంతగా పట్టించుకోకపోయినా నీ లాంటి అందాలరాశికి నిన్ను వెంటాడే మృగాళ్ల వల్ల ముప్పు రావచ్చు. మనం తరచుగా వార్తల్లో చూస్తున్నాం కదా! ప్రేమను అంగీకరించని నేరానికి ఎంతమంది అమాయక యువతులు యాసిడ్ దాడులకు, కత్తిపోట్లకు, అఘాయిత్యాలకు బలి అవుతున్నారో! అందుచేత నీలాంటి బుద్ధిమంతురాలికి భద్రత అవసరం. ప్రేమరొంపిలో దిగమనను కాని, నువ్వంటే పడిచచ్చే బకరాల్లో ఒకణ్ణి ఎంచుకొని ఊరిస్తుంటే చాలు నీ రక్షణ సంగతి వాడు చూసుకుంటాడు...’’‘‘తులసీ, నాకిలాంటి చెత్త సలహాలివ్వకు ఏకపక్షంగా నా జోలికి ఎవరొచ్చినా. ఆ పోకిరీగాళ్లకు బుద్ధి చెప్పగలననే ధైర్యం నాకుంది...’’ ప్రగతి మాటల్లో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోంది.‘‘సెభాష్. నువ్వు నాకు నచ్చావ్. అలాగే మా అన్నకూ తెగ నచ్చేశావ్..’’‘‘మీ అన్నెవడు? అతగాడికి నాకూ ఏం సంబంధం?’’ ప్రగతి ప్రశ్నల్లో కరకుదనానికి తులసి తుళ్లిపడింది.‘‘కోప్పడకుండా పూర్తిగా విను. మా అన్నంటే నా కజిన్. పేరు భూపతి. నా కోసం కాలేజీకి వచ్చినప్పుడెప్పుడైనా చూసుంటావ్. అచ్చం సినిమా హీరోలా వుంటాడు. ఆపైన కోటీశ్వరుడు. ఈ నెక్లెస్ మొన్న రాఖీ కట్టిన సందర్భంగా వాడిచ్చిందే...’’‘‘అయితే ఏమిటి? సూటిగా చెప్పు’’ ప్రగతి మొహం ఎర్రబడ్డం తులసి గమనించింది.‘‘కూల్ డౌన్ ప్రగతీ. ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడైన మా అన్న మీద పడుతున్న వాళ్లందరినీ కాదని నువ్వంటే ఇష్టపడుతున్నాడు.వాడెంత మర్యాదస్తుడంటే – నీ ఎదుటపడి ‘ఐ లవ్ యు’ అని చెప్పలేక నిన్ను పరిచయం చేస్తే చాలని నన్ను చంపుకొని తింటున్నాడు...’’‘‘అర్థమైంది. ఇదన్నమాట అసలు సంగతి. ఈ విషయం చెప్పడానికా ఇంత ‘బిల్డప్’ ఇచ్చావ్? మీ అన్నకు నిర్మొహమాటంగా చెప్పు. నా మీద ఎలాంటి పిచ్చి భ్రమలూ పెట్టుకోవద్దని!, అతను అపర కుబేరుడైనా, నలకూబరుడైనా నా మనసు చలించదనీ, ప్రేమ నాకు ఆమడ దూరమనీ! పాపం మీ అన్నకు దూతికగా నువ్వు చాలా శ్రమపడ్డావు చాలు. ఇక పద క్లాసుకు టైమవుతోంది...’’ అంటూ విసుగ్గా విసురుగా పైకి లేచింది ప్రగతి. ఆమె నిగ్రహానికి, మనోబలానికి విస్తుపోయిన తులసి ఇంకేం చెప్పినా వినదని మౌనంగా ప్రగతి వెంట కాలేజ్ వైపు నడిచింది...ఎంత నచ్చజెప్పినా, బతిమాలినా కనీసం భూపతి ఎదుటపడ్డానికి కూడా అంగీకరించని ప్రగతి దృఢవైఖరి తులసి అహాన్ని దెబ్బతీసింది. భూపతి మెప్పు కోసం అతణ్ణి ప్రగతిని నీడలా వెంటాడమని, అందుకు తాను సహకరిస్తానని తులసి అతనికి మాటిచ్చి ప్రోత్సహించింది. తులసి కోసమనే వంకతో తరచుగా కాలేజీకి వస్తూ భూపతి ప్రగతి పెడమొహం పెట్టినా పరిచయం చేసుకున్నాడు. ఎన్నోసార్లు తన కారులో ‘లిఫ్ట్’ ఇచ్చే భాగ్యాన్ని ఇమ్మని ప్రాధేయపడ్డాడు, బలవంతపెట్టాడు కూడా. పిక్నిక్కనీ, కార్తిక వనసమారాధనకనీ, పుట్టిన రోజనీ... ఇలా వివిధ సందర్భాలకు తులసితో కలిసి ఆహ్వానించినా, అన్నిటినీ ప్రగతి తిరస్కరించింది. ప్రగతి సినిమాకో, షాపింగ్ కో, ఏదైనా సభకో... ఎక్కడికెళ్లినా ఆ సమాచారం ముందుగా తెలుసుకొని అక్కడ ప్రత్యక్షమై అతి మర్యాదలు చెయ్యబోయే భూపతిని ఆమె కటువుగా హెచ్చరించింది. తులసి పుట్టినరోజు వేడుకకు మాత్రం స్నేహితురాళ్ల బలవంతం మీద వాళ్లతో కలిసి వెళ్లిన ప్రగతికి అక్కడ కూడా భూపతి పీడ తప్పలేదు. ప్రగతికి అతి ప్రాధాన్యమిచ్చి, పాడడం రాదన్నా పాటలు పాడమని వేధించి, వద్దంటుంటే చనువుగా కేకు తినిపించి, ఆమెకు ప్రత్యేకంగా వీడియో ఏర్పాటు చేసి, అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న భూపతి హింసను భరించలేక – తలనొప్పి సాకుతో మధ్యలోనే ప్రగతి అక్కణ్ణుంచి వెళ్లిపోయింది. కారులో డ్రాప్ చేస్తానని భూపతి వెంటబడితే ఆమె అందరిముందు చీదరించుకోవడంతో ఆ పురుష పుంగవుడికి తల కొట్టేసినట్టయింది. ఆ సంఘటనతో అతను తోక తొక్కిన త్రాచులా రెచ్చిపోయాడు. కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఆమెను ఫ్రెండ్స్ ముందు అసభ్య పదజాలంతో వేధించడమే గాక ఆమె శీలం మీద బురద చల్లే పుకార్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించాడు.భూపతి ఆవూళ్లో రెండు థియేటర్లు, జిల్లా అంతటా పెట్రోలు బంకులూ, మద్యం దుకాణాలూ వగైరావున్న సంపన్నవ్యాపారి శ్రీపతి ఏకైక పుత్రరత్నమనీ, పోలీసులను కూడా శాసించే యువ రాజకీయవేత్తనీ, అతనికి లేని వ్యసనం లేదనీ తెలిసిన ప్రగతి అతని వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడి, అతని సంగతి తనను పెంచి పెద్దచేసిన అమ్మమ్మ అనసూయమ్మ చెవిన వేసింది. ఆవిడ కంగారుపడి ఎప్పటి నుంచో అనుకుంటున్న దగ్గర సంబంధం – సాఫ్ట్ వేర్ ఇంజినీరు, అన్ని విధాలా యోగ్యుడు అయిన వివేక్తో పెళ్లి నిశ్చయించి, ముహూర్తం కూడా పెట్టించింది.తులసి ద్వారా ప్రగతి పెళ్లి వార్త తెలిసిన భూపతి తనకు దక్కని ప్రగతిని ఎవరికీ దక్కనివ్వనన్నాడు. దారికాసి ప్రగతిని అటకాయించి మంచిగా తనతో పెళ్లికి అంగీకరిస్తే కళ్లలో పెట్టుకొని చూసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఆమె ‘ఛీ’ కొట్టి తిరస్కరించడంతో ఇరవై నాలుగు గంటలలోగా ఆమె వివేక్తో పెళ్లి రద్దు చేసుకొని తనకు ఓకే చెప్పకపోతే ఆమె అంతు చూస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులను లెక్కచెయ్యకుండా గడువులోగా ఎటువంటి సమాధానమూ చెప్పని ప్రగతి ముందు అతను ప్రత్యక్షమై కొన్ని ఫోటోలు ఆమె చేతికిచ్చి, ఆ కాపీలు వివేక్కి పంపిస్తానని బ్లాక్ మెయిలింగ్ ఆయుధాన్ని ప్రయోగించాడు. అవి మార్ఫింగ్ చేసిన కొన్ని ప్రగతి అర్ధనగ్న చిత్రాలు, మరికొన్ని ఆమె భూపతి కౌగిలిలో ఉన్నవీ! ఆ ఫోటోలు చూసిన ప్రగతి అగ్నిహోత్రమైంది. ఆమె మనోనేత్రాల ముందు అలాంటి బెదింపులకు బలయిన తల్లి ప్రతిమ దీనగాథ కదలాడింది...ప్రతిమ గోదావరి జిల్లాకు చెందిన సంప్రదాయ కుటుంబం నుంచి పీజీ చెయ్యడానికి వాల్తేరు వెళ్లింది. ఆమె పేరుకు తగ్గ బంగారు బొమ్మ. ఇంట్లో వాళ్లకిచ్చిన హామీకి తలవొగ్గి ఎవరితోనూ ఎటువంటి పరిచయాలు పెంచుకోని ప్రతిమ మంచిగాయని అనే విషయం లేడీస్ హాస్టల్ అంతటికీ తెలిసింది. ఫ్రెండ్స్ బలవంతం మీద యూనివర్సిటీ సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండు మూడుసార్లు పాల్గొన్న ఆమె సమ్మోహన గానం ఆమెను అభినందించడానికి వచ్చిన మోహన్ని పరిచయం చేసింది. అతను ఇంజినీరింగ్ విద్యార్థి. పాటలు రాయడమే కాకుండా మధురంగా స్వరకల్పన చేయగల సంగీతజ్ఞుడుగా అప్పటికే అతనికి కేంపస్లో మంచిపేరుంది. క్రమంగా అతని పాటల్ని ఆమె పాడ్డం, పరస్పర ప్రశంసలు – వాళ్ల ప్రేమకు దారి తీశాయి. వలపు చిగురించి, ప్రేమలేఖలు పుష్పించి, వాళ్ల అనుబంధం మధుమాసమై పరిమళించింది. ఇటు భీమిలి బీచ్ నుంచి అటు సింహాచలం వరకు ఎందరో ప్రేమికుల్ని చూసిన సంకేత స్థలాలన్నీ వాళ్ల ప్రణయానికి విహారవేదికలయ్యాయి. ‘మరో చరిత్ర’లో బాలు–స్వప్నల్లా రాళ్ల మీద కాకపోయినా ఆ ప్రేమ జంట ఇసుకలో తమ పేర్లను ఎన్నోసార్లు రాసుకొన్నారు...ప్రతిమ మోహన్ల ప్రేమాయణానికి అసూయపడిన ప్రతిమ రూమ్మేట్ రజని ఆ సంగతిని ప్రతిమ తల్లిదండ్రులకు తెలియపరచింది. అప్పటికే గాలివార్తను విన్నా, ప్రతిమ మీద నమ్మకంతో దానిని పట్టించుకోని వాళ్లు రజని ఇచ్చిన సమాచారంతో ఆ పొగ వెనక నిప్పు వుందని నిర్ధారించుకొని ఆగమేఘాల మీద వాల్తేరు వెళ్లి, ఉన్నపళంగా ప్రతిమను ఇంటికి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా కూతురు గోడు వినకుండా ఆమెను ప్రభాకర్ అనే ఇంజినీరుకిచ్చి ఆ మూడు ముళ్లూ వేయించి, ఊపిరి పీల్చుకున్నారు. క్రమంగా ప్రభాకర్ సాహచర్యంలో సంసార పర్వంలో ఏ లోటు లేని ప్రతిమ గతాన్ని, మోహన్ని పూర్తిగా మర్చిపోయింది. ఓ ఆడపిల్లకు తల్లయింది.నాలుగేళ్లు ఆనందంగా గడిచిన తర్వాత అనూహ్యంగా ఆ ఇంటిలో మోహన్ ప్రత్యక్షమయ్యాడు. ప్రభాకర్ పనిచేస్తున్న ఆఫీసుకు కొత్తగా వచ్చిన అతణ్ని ఆయన లంచ్కి పిలిచాడట! తనెవరో ఎరగనట్టున్న ప్రతిమను చూసి మోహన్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ప్రభాకర్ లేని సమయంలో వచ్చి గతాన్ని గుర్తుచేశాడు. ప్రతిమకేమైందో తెలియక ఆమె కోసం ఎదురు చూసి చూసి చివరకు కల్లబొల్లి కబుర్లతో తనకు చేరబడిన రజనినే పెళ్లిచేసుకున్నాననీ, కాని ఆమె నరకాన్ని చూపిస్తోందనీ ఆమెకు విడాకులిచ్చి తిరిగి ప్రతిమను చేసుకుంటాననీ ప్రపోజ్ చేశాడు. చేజారిన పెన్నిధి అదృష్టం కొద్దీ తిరిగి ఇలా కంటపడిందనీ, తను చెయ్యని తప్పును అర్ధం చేసుకొని తమ ప్రేమకు ప్రాణం పొయ్యమనీ అర్థించాడు. అతని రాకకూ కోరికకూ అప్రతిభురాలైన ప్రతిమ అతనికి చేతులెత్తి దణ్ణంపెట్టి పచ్చని తమ సంసారంలో చిచ్చు పెట్టవద్దనీ, తనను మరచిపొమ్మనీ వేడుకొంది. కాని అతను పట్టువిడిచి పెట్టకుండా ఆమె తనతో రావడానికి అంగీకరించకపోతే తను భద్రంగా దాచివుంచిన ఆమె ప్రేమలేఖల్ని ప్రభాకర్కి చూపిస్తానని బెదిరించాడు. మోహన్తో ఎప్పుడూ హద్దు మీరకపోయినా అతని బ్లాక్ మెయిలింగ్కి భయపడిపోయిన ప్రతిమ పసిగుడ్డును తల్లి చేతుల్లో పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది!తనకు యుక్తవయసు వచ్చిన తర్వాత తల్లి మరణ రహస్యాన్ని చెప్పిన అమ్మమ్మ ఆ అనుభవం నేర్పిన పాఠంతో ఎన్నడూ ప్రేమవ్యవహారంలో చిక్కుకోనని తన చేత ఒట్టేయించుకొంది. నాన్న స్పందన తెలుసుకోకుండానే ‘అమ్మ అనవసరంగా ఉద్రేకపడింది. అప్పటి కథ పునరావృతం కాకూడదు. నేను అమ్మలా చేయని తప్పుకు బేలనై బెదిరిపోక, ఈ తరం స్త్రీ అబల కాదనీ చీకటిని చీల్చుకొని వచ్చే పొడుస్తున్న పొద్దు లాంటిదనీ నిరూపిస్తాను. భూపతి ఆట కట్టిస్తాను..’ అని దృఢమైన నిర్ణయాన్ని తీసుకొని ధైర్యంగా నేరుగా కాబోయే భర్త వివేక్ దగ్గరకు వెళ్లింది. భూపతి బ్లాక్ మెయిలింగ్ గురించి చెప్పి ఆ ఫోటోలను సిగ్గుపడకుండా అతనికి చూపించింది. నిజానిజాలను తెలసుకొని తన నిజాయితీ పట్ల నమ్మకముంటే మాత్రమే తనను పెళ్లి చేసుకోమని, నిర్ణయాన్ని అతనికే విడిచి పెడుతున్నాననీ నిర్భయంగా చెప్పింది. ప్రగతి సాహసోపేతమైన చర్యకు ఆశ్చర్యపోయిన వివేక్ ఆమెకేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ – ‘‘డార్లింగ్, నీ ధైర్యాన్నిఅభినందిస్తున్నాను. నీలాంటి సాహసి అయిన ప్రేయసి తోడుంటే జీవితంలో నాకు అసాధ్యాలుండవు. నిన్ను నిస్సందేహంగా నా దానిని చేసుకుంటాను. పద, ఈ ఫొటోలు స్టేషన్లో చూపించి ఈ దారుణానికి కారకుడైన భూపతిని నిర్భయ కేసు కింద అరెష్టు చేయిద్దాం...’’ అంటూ ఆమెకు చేయి అందించాడు. ప్రగతి ఆనందంగా అతని చేతినందుకొని ముందుకు నడిచింది...! -
కథాకళి: కొత్త పొరుగు
మా పై ఫ్లాట్లోకి ఎవరో కొత్తగా అద్దెకి వచ్చారు. పైనుంచి చప్పుళ్ళు వినిపించసాగాయి. ‘‘నిన్న రాత్రి ఆ చప్పుళ్ళకి నాకు నిద్రపడితే ఒట్టు.’’ మర్నాడు మావారికి చెప్పాను.చక్రాల కుర్చీని తోసుకుంటూ బ్రేక్ఫాస్ట్ బల్ల దగ్గరికి వెళ్ళాను. పై ఫ్లాట్ నుంచి వచ్చిన ఆమ్లెట్, చికెన్ సేండ్విచ్లు చూపించి మావారు చెప్పారు. ‘‘అదృష్టం. ఫ్రెండ్లీ పీపుల్.’’రెండు రాత్రుల తర్వాత పై ఫ్లాట్లోంచి మళ్ళీ అరుపులు వినిపించాయి.‘‘భార్యాభర్తల పోట్లాట.’’ మావారు చెప్పారు.‘‘వాళ్ళకి ఫర్నిచర్ సర్దిన అలసట తీరినట్లుంది.’’ నవ్వుతూ చెప్పాను.మరో రెండు రోజుల తర్వాత బ్రేక్ఫాస్ట్ అయ్యాక మావారితో కబుర్లు చెప్తూ కాఫీ తాగసాగాను. డోర్ బెల్ మోగడంతో మావారు వెళ్ళి తలుపు తెరిస్తే ఓ ముప్ఫై ఏళ్ళ యువతి బయట నించుని కనిపించింది. ఆమె చేతుల్లో ఓ పసిబిడ్డ ఉంది.‘‘హలో. గుడ్ మార్నింగ్. మేము మీ పై అపార్ట్మెంట్కి అద్దెకి వచ్చాం. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉండటంతో ప్రైవసీ బావుందని దీన్ని తీసుకున్నాం.’’ నవ్వుతూ చెప్పింది.‘‘రండి. పాప పేరేమిటి?’’ నవ్వుతూ ఆహ్వానించాను.ఆమె చెప్పాక మావారు నన్ను పరిచయం చేసి చెప్పారు.‘‘థాంక్స్. సేండ్విచెస్ చాలా రుచిగా ఉన్నాయి.’’‘‘మీకు బాగా శబ్దాలు వినిపించి ఉంటాయి. అపాలజీగా వాటిని పంపాను.’’‘‘మీ పిల్లల్ని మా ఆవిడ దగ్గర వదిలి మీరు షాపింగ్కి కాని, ఎక్కడికైనా వెళ్ళచ్చు.’’ మావారు సూచించారు.‘‘ఓ. థాంక్స్. అత్యంత అవసరమైతే తప్ప మీకా శ్రమ ఇవ్వను. మీ కాలికి ఏమైంది?’’ ఆమె నా కాలికి ఉన్న కట్టుని చూసి అడిగింది.‘‘పడ్డాను. సూపర్ బజార్లో పిల్లలు అరటిపళ్ళని నేలమీద పడేశారు. చితికిన అరటిపళ్ళు రోడ్ మీద ఒలికిన ఆయిల్ కన్నా ప్రమాదం. వాటి మీద కాలు వేసి జారిపడడంతో కుడికాలు విరిగింది. ఇంకో మూడు వారాల దాకా అది అతుక్కోదని డాక్టర్ చెప్పాడు.’’ జవాబు చెప్పాను.‘‘అందులో మన అపార్ట్మెంట్కి లిఫ్ట్ కూడా లేదు. ఐయాం సారీ. ప్లీజ్ గెట్వెల్ సూన్.’’ ఆమె చెప్పింది.‘‘తలకి తగలకపోవడం అదృష్టం.’’ మావారు చెప్పారు.∙∙∙ఆ రాత్రి మావారికి పై ఫ్లాట్నుంచి వినిపించే ఏడుపుకి మెలకువ వచ్చి నన్ను లేపారు. అది ఆమె ఏడుపుగా గుర్తించాను. ఆమె భర్త అరుపులు వినిపించాయి. ఆ ఏడుపు కొద్దిసేపు విని ఆయన విసుగ్గా అరిచారు.‘‘ఈ కొత్త పొరుగు న్యూసెన్స్ ఏమిటి? మన సెక్రటరీతో చెప్పి వాళ్ళని ఖాళీ చేయించాలి. నాకు రేపు ప్రజంటేషన్ కూడా ఉంది.’’ కోపంగా చెప్పారు.మర్నాడు ఉదయం మావారు వెళ్ళాక ఇంటర్నల్ ఇంటర్కమ్ మోగింది. ఆమె నుంచి ఆ కాల్. ఇద్దరం ఒకరినొకరం పలకరించుకున్నాక ఆమె అడిగింది.‘‘నేను ఈ సందు చివర కార్నర్ స్టోర్కి వెళ్ళిరావాలి. నేను వచ్చేదాకా మా అమ్మాయిని మీ దగ్గర ఉంచుకుంటారా? సరిగ్గా ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను.’’‘‘తప్పకుండా. తీసుకురండి.’’‘‘నిద్రపోతోంది. లేస్తే ఎవరూ కనపడకపోతే ఏడుస్తుందని.’’వెంటనే చక్రాల కుర్చీలో తలుపు దగ్గరకి వెళ్ళి దాన్ని తెరిచాను. నాలుగైదు నిమిషాల్లో భుజం మీద చిన్నపాపతో ఆమె వచ్చింది. రబ్బర్ షీట్ కూడా తెచ్చింది. గెస్ట్ రూమ్లోని మంచాన్ని చూపించాను.‘‘థాంక్స్ ఎలాట్.’’ పాపని పడుకోబెట్టి వెళ్ళిపోయింది.ఆమె చెప్పినట్లుగా ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది.‘‘మా అమ్మాయి లేవలేదుగా?’’‘‘లేదు.’’‘‘లేవదని తెలుసు. థాంక్స్ అగైన్.’’ కేరీ బేగ్తో పైకి వెళ్తూ చెప్పింది.∙∙∙ఆ రాత్రి పైనుంచి మళ్ళీ మాకు పోట్లాటతో మొదలై కొట్టిన చప్పుళ్ళు, తాగుబోతు మగ గొంతు వినిపించాయి. దాంతోపాటు ఆమె ఏడుపు కూడా.‘‘రేపు ఆ ఇంటాయనకి ఫోన్ చేసి ఈ న్యూసెన్స్ ఏమిటని అడుగుతాను.’’ మావారు కోపంగా అరిచారు.మర్నాడు ఉదయం డోర్ బెల్ మోగింది. చక్రాల కుర్చీని తోసుకుంటూ వెళ్ళి తలుపు తెరిస్తే ఎదురుగా వాచ్మేన్. భయంగా మెట్లవైపు చూపించాడు. లుంగీలోని ఓ ముప్ఫై ఐదేళ్ళ వ్యక్తి ఆఖరు మెట్టు మీద పడున్నాడు. అతని మెడ అసహజ రీతిలో తిరిగి ఉండడంతో అతను జీవించిలేడని గ్రహించాను.‘‘సెక్రటరీని పిలుచుకురా.’’ భయంగా అరిచాను.సెక్రటరీ డాక్టర్కి, పోలీసులకి ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చేలోగా కింది మెట్టు మీద పడున్న అతన్ని పరిశీలనగా చూశాను.అతని అరిపాదాలకి చితికిన అరటిపళ్ళ గుజ్జు అంటుకుని కనిపించింది.చూస్తే పై మెట్ల మీద చాలా చోట్ల ఆ గుజ్జు కనిపించింది!క్రితం రోజు ఆమె నా దగ్గర తన కూతుర్ని ఉంచి షాప్కి వెళ్ళి తెచ్చిన కేరీ బేగ్లో అరటి పళ్ళు చూశానని గుర్తొచ్చింది! -మల్లాది వెంకట కృష్ణమూర్తి -
నా పెంపకంలో ఈ స్థాయికి ఎదిగింది
విజయవాడ దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రభావిత మదనజనక సోదరీ..’ అంటూ గాయని శ్రీలలిత పాడిన పాటను ప్రధాని నరేంద్ర మోదీ ట్యాగ్ చేయడంతో వైరల్గా మారింది. శ్రీలలిత తల్లి భమిడిపాటి సత్యవాణి ఈ సంతోషాన్ని పంచుకుంటూ, శ్రీలలిత చిన్ననాటి నుంచి తను తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.‘‘పాప పుట్టినప్పుడు తను ఏ స్థాయికి వెళ్లాలి అనుకున్నానో, ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. బాబు శ్రీనికేత్, తర్వాత శ్రీలలిత. మావారు భమిడిపాటి రాజశేఖర్ బ్యాంకు ఉద్యోగి. ఆయన ఉద్యోగరీత్యా కొన్నాళ్లు బిహార్లో ఉన్నాం. నాకు మా పిల్లల నెలల వయసు నుంచే వారిని సంగీతంలో తీర్చిదిద్దాలనే ఆలోచన ఉండేది. మా పుట్టిల్లు, మెట్టిల్లు వైపు పాతికమంది వరకు సంగీత విద్వాంసులు ఉన్నారు. నేనూ సంగీతం క్లాసులు తీసుకుంటాను. పిల్లలు స్టేజీపైన ప్రదర్శన ఇవ్వడానికి వారిలో భయం ఉండకూడదు. అందుకని, చిన్నప్పుడే బేబీ షోలలో పాల్గొనేలా చేసేదాన్ని. లలితకు ఎనిమిది నెలల వయసులో చీరకట్టి, పెళ్లికూతురులా రెడీ చేసి, బేబీ షోలో స్టేజీపైన నిలబెట్టాను. ఆ వయసులోనే తనకు ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది. కూరగాయలతోనూ డ్రెస్సులు కుట్టి, వేసి, షోలకు తీసుకెళ్లేదాన్ని. నాకు మిషన్ కుట్టడం వచ్చు కాబట్టి పాప డ్రెస్సులన్నీ నేనే కుట్టేదాన్ని. బొమ్మలను తయారుచేసి ఇచ్చేదాన్ని. పాప రెండేళ్ల వయసులో తణుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఉద్యోగరీత్యా ఎటు మారినా, ఎక్కడ పిల్లల ప్రదర్శన జరిగినా, అక్కడకు శ్రీలలితను తీసుకెళ్లేదాన్ని. View this post on Instagram A post shared by Srilalitha Gudipati (@srilalithagudipati) ఒడిలో కూర్చోబెట్టుకొని...పాప మూడేళ్ల వయసులో ఓ షోలో పాల్గొనడానికి ఇంగ్లిష్ రైమ్ నేర్పించాను. కాని, అక్కడకు వెళ్లాక లింగాష్టకం పాడింది. ‘మూడేళ్ల వయసులో ఎలా పాడింది’ అంటూ అందరితో సహా నేనూ ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు అనిపించింది. ఉదయాన్నే పూజ చేసేటప్పుడు పాప అటూ ఇటూ వెళ్లకుండా ఒడిలో కూర్చోబెట్టుకొని, శ్లోకాలు, స్తోత్రాలు చదువుతుండేదాన్ని. తను కూడా వాటిని వింటూ, పాడుతూ అమ్మవారికి పూలు పెడుతూ అలాగే కూర్చొనేది. ఒడిలో కూర్చోబెట్టుకొని రోజూ స్తోత్రాలు చదవడం వల్ల, అవన్నీ గుర్తుపెట్టుకుని, అలవోకగా పాడేసిందని అర్థమైంది. ఇక ఆ రోజు నుంచి ‘పాట’ తన చెవిన పడాలి అని తపించేదాన్ని. మూడేళ్ల వయసులోనే...మూడేళ్ల వయసులో నేను తీసుకునే మ్యూజిక్ క్లాస్ తను తీసుకుంటాననేది. నా పని ముగించుకొని, క్లాస్కు వచ్చేసరికి పిల్లలందరినీ కూర్చోబెట్టి, పాడుతుండేది. ఒక సిరీస్ అంతా ఘంటసాల పాటలు పాడించాం. ఇంట్లో ఓ మైకు ఏర్పాటు చేసుకున్నాం. సాయంత్రం అయ్యిందంటే మా అందరి ప్రోగ్రామ్ పాటలే! View this post on Instagram A post shared by Srilalitha Gudipati (@srilalithagudipati)దీక్ష తీసుకునేవాళ్లం..మా బంధువుల్లో చాలా మంది నన్ను కొంచెం విసుక్కునేవారు ‘ఏంటో నువ్వు, పిల్లకు పాత తరంలోలాగా లంగా జాకెట్టు, పెద్ద బొట్టు.. అమ్మాయిని ట్రెండ్కు తగినట్టుగా పెంచడం లేదు..’ అనేవారు. వాటిని పట్టించుకునేదాన్ని కాదు. లలిత అంటే నాకు అమ్మవారు. అలాగే ఉండాలనుకునేదాన్ని. బాలసుబ్రహ్మణ్యం, కోటిగారు ‘లలిత పాడుతుంటే అమ్మవారే పాడుతున్నట్టు’ ఉంది అనేవారు. ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నా, అక్కడకు నేను, మావారు వెళ్లిపోయి, ఓ పక్కన కాళ్లు లాగేస్తున్నా నిల్చుండేవాళ్లం. తను ఎక్కడెక్కడ పాడింది, ఎవరితో పాడింది, ఎవరెవరు తనను ప్రోత్సహించారు– అవన్నీ ఫొటో ఆల్బమ్గా చేసి, తనతో పాటు తీసుకెళ్లి, అక్కడున్నవారికి చూపించేవాళ్లం. సంగీతంలో లలిత ఉన్నత దశకు చేరుకోవాలనే తపన తప్ప మరింకేమీ లేదు. ఇన్నేళ్లలో మేం ఒక్క సినిమాకి వెళ్లింది లేదు, టీవీ చూసింది లేదు, ఒక యాత్రకు వెళ్లింది లేదు. సాధన మానకూడదు..ఏ రియాల్టి షో అయినా నేను, లలితనే వెళ్లేవాళ్లం. షో ముగించుకొని బయల్దేరేసరికి చాలాసార్లు అర్ధరాత్రి దాటిపోయేది. విదేశాలకు, ఏ ఊరు వెళ్లాలన్నా మా వారు వెంట వెళ్లేవారు. ఇంటి దగ్గరే ఉండి, టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి, 90 శాతం మార్కులు తెచ్చుకుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. లలిత పుట్టకముందు మా ప్రపంచం సంగీతం. పుట్టాక మా ప్రపంచం అంతా లలితనే అయిపోయింది. తను ఎక్కడా డల్ అవకుండా చూసేవాళ్లం. ఎవరో ప్రోత్సహించడం లేదనో, ప్రైజు రాలేదనో ఆలోచన పెట్టుకోవద్దని, ప్రాక్టీస్ ఎప్పుడూ మానద్దని చెప్పేవాళ్లం. ఆరేళ్లపాటు యూ ట్యూబ్లో..దసరా రోజుల్లో అమ్మవారి దీక్ష తీసుకుంటాను. నాతో పాటు శ్రీలలిత కూడా దీక్ష తీసుకుంటుంది. కరోనా సమయంలో మా అబ్బాయి చెల్లెలి కోసం యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేశాడు. ఆరేళ్లపాటు వరుసగా శ్రీలలితతో సాంగ్స్ చేయించాం. దుర్గా నవరాత్రుల సందర్భంగా చేసిన పాటలకు మంచి పేరొచ్చింది. కాంతారా పాటకు అన్నాచెల్లెళ్లిద్దరూ చాలా కష్టపడ్డారు. View this post on Instagram A post shared by Srilalitha Gudipati (@srilalithagudipati) మా అబ్బాయి మంగళూరులో ధార్మిక పాఠశాలను ప్రారంభించాడు. అమ్మాయి పెళ్లి చేసి, అత్తగారింటికి పంపించాక ఇప్పుడు మా జర్నీని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాం. పిల్లలకు సంగీతం క్లాసులు చెబుతుంటాను. బొమ్మలు చేస్తుంటాను.’’ అని చెప్పారు సత్యవాణి.∙ నిర్మలారెడ్డి -
హెయిర్ కట్.. 2కోట్లు!
జుట్టు ఉన్న ఆమె ఎన్ని ముడులైనా వేస్తుందట....అలానే ఓ యువతి తన కురులను మరింత అందంగా.. ఆకట్టుకునేలా మార్చుకోవాలనుకుంది..దీనికోసం స్టార్ హోటల్లోని ఓ బ్యూటీ సెలూన్కి వెళ్లింది. ఎలా చేయాలో హెయిర్ డ్రెస్సర్కు చెప్పింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది..అందం మాట అటుంచి..ఉన్న జుట్టును కోల్పోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని, పరిహారం అందించాలని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. పెద్ద మొత్తంలో పరిహారాన్ని కోరింది..ఏడేళ్ల పాటు ఈ కేసు సాగింది. ఓ హెయిర్ కట్ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేరింది..చివరకు పరిహారం విషయంలో కీలక తీర్పుతో కేసు ముగిసింది.ఢిల్లీకి చెందిన ఆశ్నా రాయ్ ఓ కార్పొరేట్ ఉద్యోగి. ఓ ప్రముఖ హోటల్లోని బ్యూటీ సెలూన్కి వెళ్లి...తన జుట్టును చివరి నుంచి నాలుగు అంగుళాలు కత్తిరించాలని చెప్పింది. అయితే, ఆమె చెప్పిన దానికి భిన్నంగా జరిగింది. పైనుంచి కిందికి నాలుగు అంగు ళాలు మాత్రమే జుట్టు మిగిలింది. దీనిపై నిర్వాహకులను నిలదీసింది..‘సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..’ అని ఆమె అంతటితో సరిపెట్టుకోలేదు. న్యాయపోరాటం ప్రారంభంఆశ్నారాయ్ 2018లో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ని ఆశ్రయించింది. సేవల్లో లోపంపై ఫిర్యాదు చేసింది. మానసికంగా తాను పడిన ఆవేదనను వెళ్లగక్కింది. మోడలింగ్, సినిమా రంగాల్లోకి అడుగు పెట్టాలనుకున్నానని..తన జుట్టు కారణంగా ఉన్న ఉపాధి అవకాశాలు పోయాయని, కొత్తవి చేజారాయని ఫిర్యాదులో పేర్కొంది. విచారణ అనంతరం ఆమెకు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని ఎన్సీడీఆర్సీ ఆదేశించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుఆ తీర్పును సవాల్ చేస్తూ హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సేవల లోపంపై కమిషన్ నిర్ధారణను ‘సుప్రీం’ సమర్థించింది..కానీ ‘పరిహారాన్ని కేవలం డిమాండ్ ఆధారంగా కాకుండా, సరైన ఆధారాలతో నిర్ణయించాలని స్పష్టం చేసింది. కేసును తిరిగి కమిషన్కు పంపింది. మరోసారి విచారించి రూ. 2 కోట్ల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలపై సందేహాలుబాధితురాలి వాదనతో యాజమాన్యం ఏకీభవించ లేదు. సమర్పించిన పత్రాలన్నీ ఫొటోకాపీలేనని, వాటికి విశ్వసనీయత లేదని వాదించింది. తనకు జరిగిన నష్టం, మానసిక వేదనకు పరిహారం చెల్లింపులో సాంకేతిక అంశాలు అడ్డంకి కాకూడదని బాధితురాలు వేడుకుంది. తన పత్రాల్లో లోపాలు లేవని పేర్కొంది. తుది తీర్పు.. కీలక సందేశంరూ.కోట్లలో నష్ట పరిహారం కోరినా విశ్వసనీయ ఆధారాలు సమర్పించలేదని ఆశ్నా రాయ్ను ‘సుప్రీం’ తప్పుబట్టింది. ఆమె సమర్పించిన పత్రాల్లోని లోపాలను ఎత్తి చూపింది. ‘‘కేవలం ఊహాగానాలు లేదా వ్యక్తిగత భావాల ఆధారంగా భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించలేం, నష్టం జరిగినట్టు స్పష్టమైన, నమ్మదగిన సాక్ష్యాలు ఉండాలి’’ అని బెంచ్ స్పష్టం చేసింది. రూ. 2 కోట్ల పరిహారం ఆర్డర్ను రద్దు చే సింది. రూ. 25 లక్షలు తుది పరిహారంగా ప్రకటించింది. సేవల్లో లోపం ఉంటే పరిహారం కోరే హక్కు ఉంది..అయితే తగిన, బలమైన సాక్ష్యాలు అవసరమని ఈ తీర్పు స్పష్టం చేసింది. ‘న్యాయం భావోద్వేగాలపై కాదు, ఆధారాలపై నిలబడాలి’ అనే సూత్రాన్ని ఈ కేసు మరోసారి బలంగా తెలియజేసింది. మరోవైపు, ఈ తీర్పు పరిహారం నిర్ణయంలో మార్గదర్శకంగా నిలవనుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అమెరికాకు చెందిన జోనథాన్ లీ రిచెస్ ప్రపంచంలోనే అత్యధిక వ్యాజ్యాలు దాఖలు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇతను సుమారుగా 2,600 పై చిలుకు కేసులు వేసినట్టు సమాచారం. ప్రముఖ వ్యక్తులు, సంస్థలపై కూడా కేసులు దాఖలు చేశాడు..అతను బిల్గేట్స్, జార్జ్బుష్ వంటి ప్రముఖులే కాదు.. ఈఫిల్టవర్, చివరికి ఫ్లూటో గ్రహం తనపై ప్రభావం చూపిందని ఆ గ్రహంపై కూడా కేసు వేశాడు. ఇలా నిత్యం ఏదో ఒక కేసు దాఖలు చేసి వార్తల్లో నిలవడంతో గిన్నిస్ బుక్ సైతం ఇతని పేరును రికార్డుల్లోకెక్కించింది.తన ప్రమేయం లేకుండా పేరు నమోదు చేశారంటూ గిన్నిస్ బుక్ నిర్వాహకులపై సైతం రిచెస్ కేసు వేయడం విశేషం. ఎక్కువ కేసులు సరైన ఆధారాలు లేవని, అసంబద్ధంగా ఉన్నాయని కోర్టులు కొట్టేశాయి. అర్థం,పర్థం లేని అంశాలపై కేసులు వేసి కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని తీవ్రమైన హెచ్చరికలు సైతం జారీ చేశాయి. ఓ కేసులో ఇతను శిక్షను సైతం అనుభవించాడు. అతడి మానసిక స్థితి సరిగా లేని కారణంగానే ఈ విధంగా ప్రవరిస్తున్నాడని పలువురు విమర్శించారు. దిలీప్ మాదిరెడ్డి -
పుష్పవిలాసం... ఉద్యాన వినోదం
ప్రకృతి ప్రేమికులకు పండుగ సమయం వచ్చేసింది. టులిప్పూల నేల నెదర్లాండ్స్లోని క్యూకెన్ హాఫ్ గార్డెన్ సందర్శకుల కోసం ముస్తాబయింది. మార్చి 19న ప్రారంభమైన ఈ పూలతోట వేడుకను మే 10 వరకు వీక్షించవచ్చు. పెరటితోట స్థాయి నుంచి ప్రపంచ వేదికగా మారిన ఈ అందమైన పూలవనం చరిత్ర చాలా పురాతనమైంది. ఈ తోట 1949లో చిన్నగా మొదలై, నేటికి 34 హెక్టార్లకు చేరుకుని భూతల స్వర్గాన్ని తలపిస్తోంది.డచ్ భాషలో ‘క్యూకెన్ హాఫ్’ అంటే వంటింటి తోట అని అర్థం. పదిహేనో శతాబ్దంలో కౌంటెస్ జాకోబా వాన్ బీరెన్ తన వంటింటి ఉపయోగం కోసం ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలను పండించేవారు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు స్థిరపడిపోయింది. ఆమె 1417 నుంచి 1433 వరకు బావేరియా–స్ట్రాబింగ్, హాలండ్, జీలండ్ కౌంటెస్, హైనాట్ కౌంటెస్గా ఉన్నారు. డచ్ ఈస్టిండియా కంపెనీలో కెప్టెన్గా పనిచేసి, 1627లో పదవీ విరమణ చేసిన తర్వాత, ఆడ్రియన్ మార్టెన్ బ్లాక్ క్యూకెన్ హాఫ్ కోటలోకి మారారు. ఆయన విధుల్లో ఉన్నప్పుడే ఈ కోట నిర్మాణానికి పునాది వేశారు. అనంతరం ఎన్నో ఏళ్ల తరువాత 1857లో ప్రసిద్ధ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్లు జాన్ డేవిడ్ జోచర్, అతని కుమారుడు లూయిస్ పాల్ జోచర్ కోట చుట్టూ పార్కును రూపొందించారు. వీరు డిజైన్ చేసిన ఇంగ్లీష్ ల్యాండ్స్కేప్ శైలే నేటి ఆధునిక క్యూకెన్హాఫ్ తోటలకు పునాది.ఈ ఆధునిక క్యూకెన్ హాఫ్ చరిత్ర 1949లో మొదలైంది. అప్పటి లిస్సే మేయర్ నేతృత్వంలో 20 మంది డచ్ పూల పెంపకందారులు ఏకమై, నెదర్లాండ్స్ పూల ఎగుమతులను ప్రోత్సహించేందుకు దీనిని ఒక ప్రదర్శన కేంద్రంగా మార్చారు. మొదటిసారిగా 1950లో ఈ తోటలోకి పర్యాటకులను అనుమతించగా, తొలి ఏడాదిలోనే 2.36 లక్షల మంది సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి శరదృతువులో 32 హెక్టార్ల విస్తీర్ణంలో, తోటమాలులు 70 లక్షల టులిప్ పూల మొక్కలను ఒక ప్రత్యేకమైన డిజైన్ లో చేతులతో నాటుతారు. ఇందులో సుమారుగా 800 రకాల విభిన్నమైన టులిప్ మొక్కలు ఉంటాయి. వీటిని నాటడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుంది.టులిప్ తోటలతో పాటు క్యూకెన్ హాఫ్లో ఇంగ్లీష్ ల్యాండ్స్కేప్ గార్డెన్, జాపనీస్ ల్యాండ్స్కేప్ గార్డెన్, స్ప్రింగ్ మెడో, నేచురల్ గార్డెన్, చారిత్రక వనాలు, గార్డెన్ మేజ్ వంటి ప్రతి ఏడాది ప్రత్యేకంగా నాటే అనేక అందమైన తోటలు ఉన్నాయి. ప్రకృతి ఒడిలో రంగురంగుల పూల మధ్య ఆహ్లాదంగా గడపాలనుకునే వారికి, చరిత్రను ఆస్వాదించాలనుకునే వారికి క్యూకెన్ హాఫ్ ఒక మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. అంతేకాదు నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించే పూల పరిశ్రమకు ఒక సజీవ ప్రదర్శనశాల ఈ ఫ్లవర్ గార్డెన్స్. -
మండుటెండల్లో... అనారోగ్య సమస్యల బారిన పడకూడదంటే..!
వేసవి వచ్చేసింది. ఎండలు చండప్రచండంగా నిప్పులు చెరుగుతున్నాయి. భూతాపం పెరుగుతుండటం వల్ల ఇటీవలి ఏడాదుల్లో వేసవులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. భూతాపం పెరుగుదల ఫలితంగా సముద్రాలు వేడెక్కుతున్నాయి. ఆ ప్రభావం భూమ్మీద ప్రతిచోటా పడుతోంది. నడి వేసవిలో దేశవ్యాప్తంగా పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తాకిడి పెరుగుతున్నాయి. వేసవిలో ఎండల బాధ ఒకవైపు అయితే, మరోవైపు ఎండలతో పాటు ఇబ్బంది పెట్టే రకరకాల ఆరోగ్య సమస్యలు జనాలను సతమతం చేస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే, వేసవి తాపం నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పగటి వేళల్లో ఆరుబయటకు వెళ్లడం క్షేమంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎండల ధాటి ఎలా ఉన్నా, అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగులు, కార్మికులు సహా రకరకాల వృత్తుల్లోని వారు నడివేసవి మధ్యాహ్న వేళల్లో కూడా ఆరుబయటకు వెళ్లక తప్పని పరిస్థితులు ఉంటున్నాయి. వేసవి తీవ్రత నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వేసవిలో వడదెబ్బ బారినపడటం; దాహార్తి తట్టుకోలేక వీథుల్లో అపరిశుభ్ర పరిసరాల్లో దొరికే చెరకు రసం, పండ్లరసాలు వంటివి తాగడం వల్ల జీర్ణకోశ సమస్యల బారినపడటం; ఎండ ధాటికి చర్మం కమిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. వేసవిలో ఎండల ధాటికి తోడు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా జనాలను బాధిస్తాయి.వేసవిలో ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ సోకడం; శరీరమంతా చెమటకాయలు పుట్టుకొచ్చి చర్మం మంటపెట్టడం; విపరీతమైన చెమటల వల్ల ఒంట్లోని నీరంతా బయటకు పోయి డీహైడ్రేషన్ ఏర్పడటం; వేడి వాతావరణంగా అలసట, నీరసం; చర్మంపై ర్యాష్, దురదలు, ఇన్ఫెక్షన్లు పెరగడం; కళ్లు పొడిబారి ఎర్రబడటం, కళ్లకు ఇన్ఫెక్షన్లు ఏర్పడటం; ఎండ వేడి నుంచి సేదదీరడానికి ఈతకొలనుల్లోకి దిగితే, వాటిలోని నీటి కాలుష్యం వల్ల చెవులకు, ఇన్ఫెక్షన్లు సోకడం; ఉబ్బసం రోగులకు సమస్య తీవ్రం కావడం; రకరకాల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావడం; నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం వల్ల రకరకాల జీర్ణకోశ సమస్యలు కలగడం వంటి సమస్యలు బాధిస్తాయి. తగిన ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యలను చాలా వరకు నివారించుకోవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒకవేళ ఈ సమస్యలు తలెత్తినట్లయితే, వెంటనే ప్రాథమిక చికిత్స చేయడం, అవసరమైతే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.వడదెబ్బ బారిన పడొద్దు...వేసవిలో ఎండ వేడి వల్ల తలెత్తే సమస్యల్లో తీవ్రమైనది వడదెబ్బ. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ప్రాంతాల్లో వడదెబ్బ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, ఒక్కోసారి వడదెబ్బ ప్రాణాంతకంగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉండటం, తగినంత నీరు తాగకపోవడం, ధారాళంగా గాలి సోకని ప్రదేశాల్లో ఉండటం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మితిమీరిన శారీరక శ్రమ చేయడం వల్ల వడదెబ్బ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ సోకినప్పుడు తీవ్రమైన జ్వరం రావచ్చు. తలనొప్పి, తలతిరగడం, విపరీతమైన నిస్సత్తువ, అలసట, చర్మం పొడిబారిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం లేదా మలబద్ధకం ఏర్పడటం, గందరగోళానికి లోనవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి రోజూ తగినంత నీరు తాగడం, కొబ్బరినీరు, మజ్జిగ, తాజా పండ్లరసాలు తాగడం మంచిది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ ధరించడం, చలవ కళ్లద్దాలు పెట్టుకోవడం, వదులైన కాటన్ దుస్తులు ధరించడం వల్ల కొంత ఉపశమనంగా ఉంటుంది. వడదెబ్బ ముప్పు తగ్గాలంటే, కెఫీన్ పానీయాలు, మద్యపానం బాగా తగ్గించుకోవాలి.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి వడదెబ్బ సోకవచ్చు. అలాంటప్పుడు వడదెబ్బ సోకిన బాధితులను వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకువెళ్లాలి. ఫ్యాన్ లేదా ఏసీ కింద ఉంచాలి. శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి. చల్లని నీళ్లు లేదా ఓఆర్ఎస్ ఇవ్వాలి. పరిస్థితి తీవ్రమై, స్పృహకోల్పోయే పరిస్థితులు ఉంటే, వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి.జీర్ణకోశ సమస్యలు...వేసవిలోని వేడి వాతావరణంలో వండిన ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండదు. పగలు వండిన ఆహారం సాయంత్రానికే పాడైపోతుంది. అపరిశుభ్ర పరిసరాల్లో ఆహారం వండే టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది. అలాగే, అపరిశుభ్ర పరిసరాల్లోని పండ్లరసాలు, చెరకురసం బండ్ల వద్ద పానీయాలు తాగకుండా ఉండటం మంచిది. అపరిశుభ్ర పరిసరాల్లో పాడైన ఆహారం తీసుకున్నా, పానీయాలు తీసుకున్నా వేసవిలో జీర్ణకోశ సమస్యల ముప్పు ఎక్కువవుతుంది. కలుషిత ఆహార పానీయాల కారణంగా వేసవిలో టైఫాయిడ్, అతిసార వ్యాధులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, ఇంట్లో తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారమైనా ఎక్కువసేపు నిల్వ ఉన్నది తినకపోవడమే మంచిది. తాగే నీరు, తినే ఆహారం స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండేటట్లు చూసుకుంటే వేసవిలో జీర్ణకోశ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఒకవేళ వాంతులు, విరోచనాలు, జ్వరం, తలతిరగడం, నిస్సత్తువ వంటి సమస్యలు తలెత్తితే, డీహైడ్రేషన్ వల్ల నీరసించిపోకుండా ఉండటానికి ఓఆర్ఎస్ తీసుకోవాలి. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు మందులు వాడుకోవడం తప్పనిసరి.వేసవిలో దోమల బెడదవేసవిలో కూడా కొన్నిచోట్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే చోట్ల, పరిసరాల్లో మురుగునీటి గుంతలు ఉండే పరిసరాల్లో దోమలు విజృంభిస్తాయి. వేసవి రాత్రుళ్లలో గాలి సోకడం కోసం చాలామంది ఇళ్ల కిటికీలను తెరిచి ఉంచుతారు. ఇవి దోమలకు రాచమార్గంగా ఉంటాయి. కిటికీలు తెరిచినా, దోమల బెడద లేకుండా ఉండాలంటే, కిటికీలకు దోమలు చొరబడని రీతిలో తెరలను అమర్చుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమ తెరలు వాడాలి. దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరానికి క్రీమ్స్ రాసుకోవాలి. దోమల బారిన పడితే డెంగీ, మలేరియా, చికున్ గున్యాలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యా«ధులు సోకితే జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి.వేసవిలో కంటి సమస్యలువేసవిలో ఎండ తీవ్రతకు రకరకాల కంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండలోని అతినీలలోహిత కిరణాల ప్రభావంతో పాటు దుమ్ము« దూళి కాలుష్యం వల్ల కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, కళ్ల నుంచి నీరు కారడం, తరచుగా పుసులు రావడం, కళ్లు మంటపెట్టడం, కళ్ల వాపు, వెలుతురు చూసినప్పుడు ఇబ్బంది కలగడం, కనుపాపపై పుండుç ఏర్పడం వంటి సమస్యలు కలుగుతాయి. వీటిలో కొన్ని అలెర్జీల వల్ల, ఇంకొన్ని ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు పదేపదే చేతితో కళ్లు రుద్దకుండా ఉండాలి.కళ్లు తుడుచుకోవడానికి శుభ్రమైన పొడి రుమాలు లేదా న్యాప్కిన్ వాడుకోవాలి. కళ్లు బాగా ఎర్రబడటం, పుసులు రావడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కంటివైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవడం మంచిది. వేసవిలో కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అతినీలలోహిత కిరణాలను వడగట్టగలిగే చలవ కళ్లద్దాలను ధరించడం మంచిది. అలాగే, నేరుగా ఎండ కళ్ల మీద పడకుండా ఉండటానికి గొడుగు లేదా టోపీ వాడుకోవడం మంచిది.ఎండల ధాటిని మనం ఎలాగూ తగ్గించలేం. కాబట్టి, ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే చేయగలం. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికి తగినట్లుగా వారికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి ఇంట్లో ఎవరో ఒకరు వడదెబ్బ బారినపడి, తీవ్ర అనారోగ్యానికి లోను కావచ్చు. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఎండల తీవ్రత పెరిగే కొద్ది ఎవరికి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే, ఎండల వేడి వల్ల వచ్చే ఇబ్బందులను పూర్తిగా అధిగమించి, సురక్షితంగా ఉండవచ్చు. చర్మ సమస్యలువేసవిలో ఎండలోని అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మం కందిపోవడం, చెమటలు ఎక్కువై చెమటకాయలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చెమటకాయలను నివారించుకోవాలంటే రోజుకు రెండు మూడుసార్లు శుభ్రంగా స్నానం చేయాలి. శరీరాన్ని పూర్తిగా పొడిగా తుడుచుకున్న తర్వాత వదులుగా ఉండేలా చెమటను తేలికగా పీల్చుకునే కాటన్ దుస్తులు ధరించాలి. ఉక్కపోత ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. ఫ్యాన్, కూలర్ లేదా ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది. అప్పటికీ చెమటకాయలు ఉంటే, ఉపశమనానికి ప్రిక్లీహీట్ పౌడర్ లేదా కేలమైన్ లోషన్ వాడటం మంచిది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా సన్స్క్రీన్ వాడాలి. సన్స్క్రీన్ వల్ల చర్మం కందిపోకుండా ఉంటుంది.రోజూ తగినంత మంచినీరు, కొబ్బరినీరు, పానకం, తాజా పండ్ల రసాలు వంటివి తీసుకోవడం, తేలికగా జీర్ణమయ్యేలా తాజాగా వండిన ఆహారం తీసుకోవడం మంచిది. వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం వల్ల చెమటకాయలే కాకుండా, చర్మానికి రకరకాల ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా ఉంటుంది. రోజూ శుభ్రంగా స్నానం చేయడం, చర్మం పొడిగా ఉండేట్లు చూసుకోవడం, గాలిసోకి చెమటను పీల్చుకునేలా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా చర్మానికి ఇన్ఫెక్షన్లు సోకినట్లయితే, వారు వాడే తువ్వాళ్లు, దుస్తులు వేరుగా ఉంచి, ఉతకడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనలపై తగిన చికిత్స తీసుకోవాలి.వృద్ధులకు జాగ్రత్తలువేసవిలో వృద్ధులు మరింతగా ఇబ్బంది పడతారు. ఎండల ధాటికి వృద్ధులు త్వరగా అలసట చెంది, నీరసించిపోతారు. ఇక డయాబెటిస్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారి పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. వేసవిలో వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్కగలుగుతారు.⇒ వేసవిలో వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్కు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల తరచు మంచినీళ్లు, గ్లూకోజ్, మజ్జిగ, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగడం మంచిది.⇒ చక్కగా గాలి వచ్చే గదుల్లో ఉండాలి. ఫ్యాన్, కూలర్, ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది.⇒ ఎండ తీవ్రత ఉన్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి.⇒ బీపీ, సుగర్ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సూచనపై వేళకు మందులు వేసుకోవాలి.⇒ ఉప్పు, నూనెలు తక్కువగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవాలి.⇒ తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి.⇒ విపరీతంగా చెమటలు పోయడం, తలతిరగడం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి.పిల్లలకు జాగ్రత్తలువేసవి తీవ్రత ఆరోగ్యవంతులైన పెద్దలకే దుర్భరంగా ఉంటుంది. అలాంటప్పుడు వేసవిలో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే, వేసవి తాపం నుంచి పిల్లలకు రక్షణ కల్పించవచ్చు.⇒ పిల్లలు ఆటల్లో పడితే ఆకలి దప్పులను మరచిపోతారు. వేసవిలో దాహంగా ఉన్నా, లేకపోయినా పిల్లల చేత మంచినీళ్లు, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగిస్తూ ఉండాలి.⇒ పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయట ఆటలు ఆడనివ్వకండి.⇒ ఎండ ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీ లేదా గొడుగు వాడాలి.⇒ పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి. ఇంట్లో తాజాగా వండిన ఆహారంతో పాటు పుచ్చకాయలు, కీరదోసకాయలు, పెరుగు వంటివి ఇవ్వడం మంచిది.⇒ పిల్లలకు వేసవిలో తేలికపాటి వదులైన కాటన్ దుస్తులు వేయడం మంచిది.⇒ చెమటకాయల నివారణ కోసం తరచు స్నానం చేయించాలి. స్నానం తర్వాత శరీరం పూర్తిగా పొడిగా ఉండేలా తుడిచాక దుస్తులు తొడగాలి.⇒ పిల్లల్లో అలసట, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఎండ తీవ్రత ఎప్పుడు ప్రమాదకరం?వేసవిలో ఎండ తీవ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినప్పటి నుంచి సమస్యలు పెరుగుతాయి. వేసవి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉన్నప్పుడు బయట ఎక్కువసేపు తిరిగే వారిలో డీహైడ్రేషన్, తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎండల ధాటి 40–45 డిగ్రీలకు చేరుకుంటే, ప్రమాద స్థాయి మరింతగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరినప్పుడు బయట ఎక్కువసేపు ఉంటే త్వరగా అలసట, నీరసం ముంచుకొచ్చి, డీహైడ్రేషన్కు లోనవడం, వాంతులు, తలతిరగడం, వడదెబ్బకు లోనవడం వంటి ప్రమాదాలు తలెత్తవచ్చు.ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లయితే, వడదెబ్బ సోకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. గడచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వేసవి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.5–42.5 డిగ్రీల వరకు; తెలంగాణలో 41.5 నుంచి 43.5 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. విజయవాడ, కర్నూలు, రామగుండం, భద్రాచలం వంటి కొన్ని ప్రాంతాల్లో వేసవి సగటు గరిష్ఠ ఉస్ణోగ్రతలు 45–47 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. అందువల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకినప్పటి నుంచి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. -
ఎనర్జిటిక్ కలర్స్ అవీ!
ట్రెడిషనల్ నుంచి ట్రెండీ మోడ్రన్ లుక్స్ వరకు, ప్రతి స్టయిల్ను తన స్మైల్తో స్పెషల్గా మార్చేసే నటి శ్రీలీల. ఇందుకోసం ఆమె ఫాలో అయ్యే ఆ సింపుల్, స్టయిలింగ్ టిప్స్ ఇప్పుడు మీకోసం!‘డల్ కలర్స్ కంటే వైబ్రెంట్ కలర్స్ నన్ను మరింత ఎనర్జిటిక్గా ఉంచుతాయి. ఒకవైపు ట్రెడిషనల్ లంగా ఓణీ, మరోవైపు మోడ్రన్ కోఆర్డ్ సెట్స్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఇష్టం. కాని, నేను వేసుకునేది ఏదైనా, అది నా డ్యాన్స్ కి అడ్డురాకూడదు. అంత కంఫర్టబుల్గా ఉండాలి. ఇక షూటింగ్స్ వల్ల ఎంత బిజీగా ఉన్నా నా స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండటానికి విటమిన్–సి సీరమ్స్, ఫ్రూట్ జ్యూసెస్ని అస్సలు మిస్ చేయను. అదే నా గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్! – శ్రీలీలజ్యూలరీ బ్రాండ్: కశ్నీవాచీ ధర రూ. 2,999, హ్యాండ్ పీస్ ధర రూ. 2,299, నెక్ పీస్ ధర రూ. 1,299డ్రెస్.. బ్రాండ్: ఛవీ అగర్వాల్ ధర రూ. 40,500స్టయిల్కు సమయం వచ్చింది!చేతిపై ఈ వాచ్ పడితే, అది టైమ్ చెప్పడమే కాదు, స్టయిల్ కూడా చూపిస్తుంది! సాధారణంగా వాచ్ అంటే టైమ్ చూడటానికే అనుకుంటాం, కాని, ఇది ‘ నేను జ్యూలరీ కూడా!’ అని గర్వంగా చెప్తుంది. చిన్న డయల్ చుట్టూ మెరిసే రాళ్లు, నాజూకైన చైన్ డిజైన్ తో చేతికి తొడుక్కున్న క్షణంలోనే లుక్కి స్పెషల్ గ్లామ్ టచ్ వచ్చేస్తుంది. టైమ్ చూసే ముందు, అందరూ మీ చేతినే చూసేలా చేసే చిన్న మాయ ఇదే.ట్రెడిషినల్, వెస్ట్రన్ వేర్, ఆఫీస్ వేర్, పార్టీ వేర్తో ఇలా ఏ సందర్భానికైనా ఇది ఈజీగా సెట్ అవుతుంది. అయితే, జ్యూలరీ వాచ్ వేసుకున్నప్పుడు చేతికి బ్యాంగిల్స్ వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే, ఈ వాచే షో స్టాపర్ కదా! అలాగే, స్లీవ్ కొంచెం పైకి ఉండే డ్రెస్సులు లేదా తక్కువ స్లీవ్ ఉంటే, ఇది మరింత హైలైట్ అవుతుంది. అలా మొత్తానికి, ఈ జ్యూలరీ వాచ్ స్టయిల్కు టైమ్ స్టార్ట్ అయింది! మార్కెట్లోనూ, ఆన్ లైన్ లోనూ ఆక్సిడైజ్డ్, మోడర్న్, ఫంకీ ఏ డిజైన్స్ కావాలన్నా ఇవి సులభంగా లభిస్తాయి. -
అందమైన సైలెంట్ లైఫ్!
గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేస్తూ, రంగుల ప్రపంచంలో తన ప్రయాణాన్ని ఎంతో హుందాగా కొనసాగిస్తున్న తెలుగమ్మాయి నటి ఆనంది. ఆ విశేషాలన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే..నా పేరు అది కాదు..నా అసలు పేరు రక్షిత. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక ‘ఆనంది’గా మారాను. నేను పుట్టి పెరిగింది వరంగల్లో. పక్కా తెలంగాణ అమ్మాయినే అయినా, చెన్నై వెళ్లాక తమిళ సంస్కృతికి కూడా బాగా కనెక్ట్ అయిపోయాను.బాల్యం ఇచ్చిన బలం!చిన్నప్పుడు స్కూల్ ఫంక్షన్లలో స్టేజ్పైకి వెళ్లాలంటే కాళ్లు వణికేవి. అలాంటిది, ఈ రోజు వేలమంది చూసే వెండితెరపై కనిపిస్తున్నానంటే అది కేవలం నాపై నాకు ఉన్న నమ్మకమే. హాస్టల్ లైఫ్లో ఫ్రెండ్స్తో కలిసి చేసిన అల్లరి, రాత్రిపూట దొంగచాటుగా తినడం వంటి చిన్న చిన్న సాహసాలు కూడా నన్ను మానసికంగాస్ట్రాంగ్గా చేశాయి.నా చాయిస్ సైలెంట్ లైఫ్!సినిమాల్లో నేను ఎంత సైలెంట్గా కనిపిస్తానో, నిజ జీవితంలో కూడా అంతే. పార్టీలకు వెళ్లడం కంటే షూటింగ్ అయిపోగానే నా గదిలో ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతాను. నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా చిన్నదే. సోక్రటీస్తో నా వివాహం 2021లో చాలా సింపుల్గా జరిగింది. నా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ లో ప్రొఫైల్లోనే ఉండాలని నేను కోరుకుంటాను.ఒక్క సినిమా, జీవితాన్ని మార్చింది!‘బస్టాప్’ సినిమాతో నా ప్రయాణం మొదలైంది. కానీ ‘కాయల్’ సినిమా నా కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా తర్వాత అందరూ నన్ను ‘కాయల్ ఆనంది’ అని పిలవడం మొదలుపెట్టారు. అది నాకు లభించిన అతిపెద్ద గుర్తింపు.పుస్తకాలే నా ప్రపంచం!నేను ఒక పక్కా బుక్వర్మ్. నా బ్యాగ్లో ఎప్పుడూ ఒక పుస్తకం తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా హారర్, సస్పె¯Œ ్స, థ్రిల్లర్ నవలలంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం.నో డైట్!ఫుడ్లో తెలంగాణ వంటకాలు, ముఖ్యంగా పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం. డైట్ పేరుతో నన్ను నేను కష్టపెట్టుకోను. మితంగా తినడం, సింపుల్గా జీవించడం నా స్టైల్.పవర్ఫుల్ పాత్రలు!సినిమాల్లో ‘విలేజ్ గర్ల్’ పాత్రలే ఎక్కువగా వచ్చినా, ‘జాంబీ రెడ్డి’లాంటి సినిమాలతో నాలోని మరో కోణాన్ని చూపించగలిగాను. నటిగా ఏ ఒక్క ఇమేజ్కో పరిమితం కాకుండా, భవిష్యత్తులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు లేదా ఒక పవర్ఫుల్ పీరియడ్ డ్రామాలో నటించాలన్నదే నా ఆశ. -
ఒక హత్య.. ముగ్గురు హంతకులు
సమయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు... హైదరాబాద్ శివార్లలోని ఒక విలాసవంతమైన విల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖర్జీ దారుణ హత్యకు గురయ్యాడు. గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి, ముఖర్జీ సోఫాలో ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు. అతని మెడపై గట్టిగా నొక్కిన గుర్తులు ఉన్నాయి. హత్యకు గురైంది ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో కమిషనర్ కూడా వచ్చాడు. క్లూస్ టీమ్ తన పని తాను చేసుకుపోతోంది.క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ వైపు చూసి అన్నాడు కమిషనర్... ‘‘మీరు ఎంత త్వరగా కేసు క్లోజ్ చేస్తే అంత మంచిది. ఈ కేసులో అనుమానితులు ముగ్గురు...ముఖర్జీ మేనల్లుడు అజయ్ భారీ అప్పుల్లో వున్నాడు.సెక్రటరీ స్నేహ– ముఖర్జీ తనను ఉద్యోగంలోంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మరో వ్యక్తి ముఖర్జీ బిజినెస్ పార్టనర్ వినాయక్... ఈ ముగ్గురిలో అసలు హంతకుడు ఎవరో కనిపెట్టాలి.’’ఇన్స్పెక్టర్ విక్రమ్ క్రైమ్ స్పాట్ను నిశితంగా గమనిస్తున్నాడు. టేబుల్ మీద మూడు కాఫీ కప్పులు ఉన్నాయి. కాని, గదిలో ఇద్దరు మాత్రమే ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఏసీ ఇంకా ఆన్లోనే వుంది. గదిలో ఏసీ 16 డిగ్రీల వద్ద ఉంది. ‘‘సర్ ... వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తాగితే ఈ కూల్లో వెచ్చగా ఉంటుంది’’ పనిమనిషి ఏసీ ఆఫ్ చేయబోతుంటే వారిస్తూ అన్నాడు. ఇన్స్పెక్టర్ విక్రమ్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ తెలిసిన కమిషనర్ కాఫీ తీసుకురమ్మని వంటమనిషికి పురమాయించాడు. ముఖర్జీ మేనల్లుడు అజయ్ని గదిలోకి పిలిచాడు. ‘‘మీ మేనమామను చంపాలనే బ్రిలియంట్ థాట్ ఎలా వచ్చింది?’’ సూటిగా చూస్తూ అడిగాడు.‘‘నేను చంపడం ఏంటి సర్! మా మామయ్య చనిపోతే నాకేంటి లాభం? బతికుంటే ఎంతోకొంత చిల్లర అయినా వస్తుంది’’ అని చెప్పాడు. అజయ్ని బయటకు పంపించి సెక్రటరీ స్నేహను పిలిచాడు. ‘‘పనిలో నుంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చినందుకు లైఫ్లో నుంచే మీ బాస్ను తీసేశావా?’’ ఆమె వైపే చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రమ్.‘‘సర్! నేను ఒక మాములు ఉద్యోగిని. నేనెలా చంపగలను? చంపితే నాకు ఒరిగేది ఏముంది?’’ సెక్రటరీ స్నేహ అంది.‘‘గుడ్ ఆన్సర్... యు మే గో...’’ అన్నాడు.స్నేహ బయటకు వెళ్ళగానే, ఆ గది మొత్తం మరోసారి పరిశీలించాడు. ఏసీ ఆఫ్ చేయడానికి వెళ్లి రిమోట్ తీసుకుని, ఒకసారి ఏసీ వంక చూశాడు. వంటమనిషి కాఫీ తెచ్చింది. కాఫీ తాగి వంటమనిషిని బయటకు పంపించి, మంచం ఎక్కి ఏసీని పరిశీలనగా చూశాడు.ఒక చిక్కుముడి వీడిపోయింది. ఇన్స్పెక్టర్ విక్రమ్ కిందకి దిగి ముఖర్జీ బిజినెస్ పార్టనర్ను పిలిపించాడు.‘‘మిస్టర్ వినాయక్! మీ లాయర్కు ఫోన్ చేస్తే మనం బయల్దేరుదాం’’ అన్నాడు.‘‘ఎందుకు ఎక్కడికి?’’ అయోమయంగా అడిగాడు వినాయక్.‘‘మీ బిజినెస్ పార్టనర్ను హత్య చేసినందుకు’’ అన్నాడు.‘‘ముఖర్జీ మేనల్లుడు అజయ్, సెక్రటరీ స్నేహ అంతా ఒప్పుకున్నారు’’ వినాయక్ వంక చూస్తూ చెప్పాడు.‘‘వాళ్ళ మాటలు విని నన్ను అరెస్టు చేస్తారా? సాక్ష్యం లేకుండా’’ వినాయక్ కోపంగా అన్నాడు.‘‘ఈ సాక్ష్యం సరిపోతుందా? నువ్వూ... అజయ్... స్నేహ కలిసి ముఖర్జీని చంపడం... ఎలాంటి ఎడిటింగులు లేకుండా ఉన్న ఆధారం ఓకేనా?’’ వినాయక్ను అడిగాడు.కమిషనర్ అలానే చూస్తుండిపోయాడు. ‘‘మీరు అన్నంత మాత్రాన అది నిజం అవుతుందా?’’ వినాయక్ అన్నాడు.‘‘అవుతుంది... ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్ ఏసీకి మోషన్ సెన్సార్ కెమెరా ఉంది. అందులో మీ ముగ్గురి ముఖాలు స్పష్టంగా పడ్డాయి. నువ్వు అజయ్ని, స్నేహను ఇరికించాలనుకున్నావు. అజయ్ అప్పులను తీరుస్తానని ప్రామిస్ చేశావు. స్నేహను మంచి జీతంతో నీ దగ్గర సెక్రెటరీగా పెట్టుకుంటానన్నావు.స్నేహ నిద్రమాత్రలు ఇచ్చింది. అజయ్ నువ్వు రహస్యంగా ఇంట్లోకి రావడానికి సహకరించాడు.’’ముఖర్జీ చనిపోతే అతడి అన్ని వ్యాపారాలనూ తన వ్యాపారంలోకి కలిపేసుకోవచ్చని వినాయక్ అనుకున్నాడు.‘‘ముగ్గురూ కలిసి హత్య చేశాక గది లోపల గడియ పెట్టి కిటికీ గుండా బయటకు వెళ్లారు. కాని, వినాయక్ గమనించని విషయం ఏంటంటే, ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్ ఏసీకి మోషన్ సెన్సర్ కెమెరా! అందులో రికార్డు అయిన వాళ్ళ మొహాలు...’’ అంటూ కమిషనర్ వైపు తిరిగి.‘‘ఇదిగోండి ఎవిడెన్స్ ఒక హత్య... ముగ్గురు హంతకులు.’’హత్య చేసినందుకు వినాయక్ను; డబ్బు మీద ఆశతో సహకరించినందుకు అజయ్ను, క్షణకాలం ఆవేశంతో, స్వార్థంతో చేతులు కలిపినందుకు స్నేహను అరెస్ట్ చేశారు.‘‘థాంక్యూ విక్రమ్! కేవలం గంట వ్యవధిలోనే కేసును మైండ్ గేమ్తో సాల్వ్ చేశావు’’ అభినందిస్తూ అన్నాడు కమిషనర్. -
ఈ వారం కథ: మరణం కంటే భయంకరం ఏమిటో తెలుసా?
దబ్బుమని చప్పుడు వచ్చింది. కొంచెం పెద్దదే. అందరికీ వినపడగలిగేంత పెద్దది. దాని వెంబడి ఒక మూలుగు, ఆర్తనాదం వంటిది. అది కొందరికైనా వినపడే అవకాశం తక్కువ. పద్దెనిమిది ఫ్లోర్ల వంతునున్న రెండు టవర్లు. ఫ్లోరుకు రెండు వంతున మూడు పడగ్గదుల ఇళ్లు. పైచివరి అంతస్తులో పొందికైన పెంట్ హవుసులు చెరొకటి. వెంటిలేషన్ కోసం అన్నట్టుగా రెండు టవర్ల మధ్య ఖాళీ సందు. చుట్టూతా వాహనం తిరగగలిగేపాటి బాట. ఓపాటి గార్డెన్ లాంటి ఏర్పాటు. లోపలకు బయటకు కూడా చూడగలిగేలా సీసీ కెమెరాలను పొదువుకున్న ఎత్తయిన ప్రహరీగోడ. దాని నెత్తిన శిరోభూషణంలాగా ఎలక్ట్రిక్ కంచె. మూడు షిఫ్టుల్లో అప్రమత్తంగా కాపలా ఉండే గార్డుల ఏర్పాటుతో ప్రధాన గేటు. అది ఒక చిన్న కమ్యూనిటీ.మొత్తానికి అక్కడే ఎక్కడో వచ్చింది చప్పుడు.పక్కనున్న ఖాళీ నేలలో బోరు డ్రిల్లింగ్ జరగడం లేదు. ఆకాశం ఉరమడం లేదు. జోరు వాన హోరు లేదు. ఆలయాలూ ప్రార్థనస్థలాల మైకుసెట్లు గొంతెత్తిన పాటలూ పిలుపులూ గాలిసవారీ చేయడం లేదు. పంచభూతాతీతమైన ఎటువంటి శబ్దోపద్రవాలూ ఆ సమయానికి అక్కడ లేవు. అలాగని, ఆ ప్రాంతమంతా నిర్జనంగా ఉందని కాదు– కిక్కిరించని జనసందోహం చెదురుమదురుగా ఒంటరి ఒంటరిగా పరచుకుని ఉన్నారు. పరివేష్టించిన జాగా ట్రాకుగా మార్నింగ్ వాకులు చేస్తున్నారు, పచ్చిక మేటలే మ్యాటుగా దేహాన్ని వంగదీస్తూ, సాగదీస్తూ యోగాది కసరత్తుల్లో మునిగి ఉన్నారు, ఒకరో ఇద్దరో సిమెంటు బెంచీలమీద ప్రాణాల్ని కుదేసి మాటలాడుకుంటున్నారు. కానీ ఆ చప్పుడు ఎవరికీ వినపడలేదు. అలాగని, బధిరులు కాదు, చెవులు దిబ్బెడలు వేయలేదు– అయినా ఎవరూ ఆ చప్పుడు వినలేదు. మరేం చేస్తున్నారు? మెజారిటీ చెవులు వాంఛిత కర్ణభూషణాలతో అలరారుతున్నాయి. ఫోను సంభాషణాలూ, సంగీతమూ, పాటలూ ఆ చెవుల్లోకి ప్రవహిస్తున్నాయి. కొందరి చెవుల్లోకి పక్కనున్నవాడి నోర్లు ప్రవహిస్తున్నాయి. ఆ నోర్లలోకి, ఆ ఇద్దరి సమక్షంలో లేని ఇంకొకరి ప్రెవేటు వ్యవహారాలన్నీ జలలాగా ఊరుతున్నాయి. ఏ ప్రవాహాలూ లేని చెవులు, నిష్క్రియగా పరధ్యానంలో ఉన్నాయి. ఎ..వ్వ..రూ ఆ చప్పుడు వినలేదు. క్షణాలూ నిమిషాలు కాదు, అరగంట గడిచిపోయింది. మైలో: నేను నిద్రలేచినంత మాత్రాన నా దినచర్య మొదలు కాదు. నా యజమాని కూడా లేవాల్సిందే. విశ్వాసం అనే పదాన్ని ముద్దర కొట్టి వదిలేసిన పరాధీన బతుకు. నా పేరు మైలో. కుక్కని. రాట్వీలర్ జాతి నాది. పేరును బట్టి నేను సోల్జర్ని. నన్ను పెంచుకునే అదృష్టాన్ని పొందిన వాడి పేరు రాజేంద్ర. అవును మరి.. అదృష్టం వాడిదే. వాడి మిత్రుల్ని, చుట్టాల్ని పోగేసినప్పుడెల్లా.. నన్ను వాడి హోదాకు ఒక చిహ్నంలాగా ప్రదర్శిస్తాడు. ‘మీ కుక్క భలే ఉంది గురూ’ అంటారు. నా జాతిలో ఏ కుక్కయినా ఒకలాగే ఉంటుంది. నా జాతికుక్కలు మాత్రమే ఎరిగిన వాడికి, బహుశా ఇక్కడి వీధుల్లో ఊరకుక్క ‘భలే’ అనే ఫీలింగిస్తుందేమో. ‘నువ్వు సూపర్ గురూ’ అంటారు రాజేంద్రని.నాలాగా నేను ఉండడంలో, వాడి సూపర్ ఏమిటో నాకు అర్థం కాదు! సరే, విషయానికి వస్తాను. నేను లేచి అరగంటైంది. వాడింకా లేవలేదు. బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాలి. నేను వెళ్లి, రాగలను. కానీ వాడు నన్ను ఒంటరిగా వెళ్లనివ్వడు. తలుపుకు గొళ్లెమే అయితే తీసుకుని వెళ్లేదాన్నేమో.. తాళమూ వేస్తాడు. అందమైన గొలుసు చేతిలో పట్టుకుని నా వెంట నడవడం వాడికి మజా. ఏసీ పడగ్గదిలో సుఖంగానే ఉన్నదిగానీ, దేహం తొందరపెడుతోంది. వాడి పడకమీదికి చేరి, ప్రేమగా చేత్తో నిమిరాను, మెలకువలోకి వచ్చి నన్ను వాటేసుకుని గిలిగింతలు పెట్టాడు. నేను గారాలు పోయాను! మొత్తానికి ట్రాక్ సూటు తొడిగి తయారై నా వెంట వచ్చాడు. ముందు బయటకు తీసుకెళ్లాడు. అవసరం తీర్చుకున్నాను. తిరిగొచ్చాక, రెండు టవర్లను ప్రదక్షిణం చేసినట్టుగా నాలుగు రౌండ్లు తిరిగాం. ఇంకో రౌండు తిరిగితే ఇంట్లోకి తీసుకెళ్లిపోతాడు. కానీ నా కుక్క బుద్ధికి ఏదో తేడా కొడుతోంది. కొంచెం గింజుకున్నాను. నడవకుండా మొరాయించాను. అటుకేసి గొలుసును ఈడ్వడానికి ప్రయత్నించాను. రాజేంద్రకు ఏదో అనిపించింది. అటువైపు ఆడకుక్క ఉందేమో అనుకున్నాడు. ‘యూ నాటీ బోయ్’ అంటూ చిలిపితనం ప్రదర్శిస్తూ వంగి నా మెడపట్టీ దగ్గరున్న క్లిప్ వదిలేశాడు. ఉరికాను. రెండు టవర్ల మధ్య, సన్నని ఇరుకైన చీకటి గుయ్యారం వంటి ఆ సందులోకి. ఫ్లాట్లలో వెంటిలేషన్ కోసం అని ఆ ఖాళీ వదిలారు గానీ, గ్రౌండ్ లెవెల్లో మసగ్గానే ఉంటుందక్కడ.అనుకున్నదానికంటె ఘోరంగా ఉంది. అరమీటరు మందాన కాస్త కుంకుమరంగు ఎరుపుతో పరచుకుని ఉంది. దగ్గరికెళ్లి చూద్దునుకదా.. తల పగిలే ఉంది. మొహానికి దగ్గరగా నా తల నిక్కించి వాసన చూశాను, శ్వాస లేదు. ఎడమకాలిని చాచి చిక్కబడుతున్న ఎరుపుని తడిమాను. జిగటగా తగిలింది. ఇంకా ఎక్కువసేపు స్టడీ చేయాల్సిందేమీ లేదు. కన్ఫర్మ్. ఒక్క పరుగున తిరిగి వెళ్లేసరికి.. ‘అప్పుడే వచ్చేశావా మైబోయ్’ అంటూ రాజేంద్ర గొలుసు క్లిప్ అందుకున్నాడు. తగిలించబోతే వెనక్కు తగ్గి రుంజుకున్నాను. అరుస్తూ, ఆ సందుకేసి గెంతి, ఆగి, రెండుసార్లు అరచి, మళ్లీ రాజేంద్ర కాళ్ల దగ్గరకు వచ్చి, సందు దిక్కుగా తిరిగి తోకాడిస్తూ నిల్చున్నాను. వాడు గ్రహించాడు. గొలుసు తగిలించకుండానే, నా వెనుక వచ్చాడు. చూసిన వాడికి విషయం అర్థమైంది. నేను అరవకుండా తోకాడిస్తూ వాడినే చూస్తున్నాను. నిజంగానే భయపడ్డాడు. పెద్దగా కేక పెట్టాడు.‘‘సె..క్యూ..రి..టీ..’’ఆ చప్పుడుకు– ఈ అరుపుకు మధ్య గంట గడిచింది!సెక్యూరిటీ పోస్టు:‘‘పతా హై.. యే హై కౌన్’’‘‘నహీ సాబ్’’నన్ను ఆశ్రయించి జీవిస్తున్న వాడు.. కనీసం ఆ శవం దగ్గరికెళ్లి మొహం చూసే ప్రయత్నాన్ని, మొహమాటానికైనా చేయకుండానే, జవాబిచ్చాడు. వాణ్ణి తప్పుబట్టలేం. నిజమే చెప్పాడు. వాడికి ఎవ్వరూ తెలియదు. చివరికి ‘పతా హై’ అంటూ అడిగిన వాడితో సహా! జాలిపడ్డాను. మావాడి మీద కాదు. చుట్టుముట్టిన వాళ్లందరి మీద! తమకు రక్షణగా ఎవరుంటున్నారో, వారికి తామెవ్వరో తెలియకపోవడమంత దౌర్బల్యం ఇంకేం ఉంటుంది. నా పేరు సెక్యూరిటీ పోస్టు. నా ఒంటి మీద ‘సెక్యూరిటీ’ అని రాయిస్తే సరిపోయేది. కానీ ‘పోస్టు’ అని కూడా జోడించారు. అదేదో నా కులం తోకలాగా! అందువల్ల నేను పోస్టు డబ్బా కంటె కొంచెం పెద్దదిగా ఉంటాను. ఫోర్ బై ఫోర్ స్క్వేర్ కట్టడం అనుకోండి. ఒకవైపు ద్వారం ఓకే. రెండు వైపుల నిలువెత్తు గవాక్షాలు! ప్రహరీ గేటు వైపుండే గవాక్షానికి వెలుపల ఓ పాత కుర్చీ, బల్ల. దాని మీద విజిటర్సు రిజిస్టరూ, దానికి ప్లాస్టికు దారంతో కట్టిన పేనా, పక్కనే ఇంటర్ కమ్ ఫోనూ. లోపల కిటికీ లేని వైపు యూనిఫాంలు తగిలించే కొక్కేలు. íసీసీ కెమెరాల ఫుటేజీ చూసే టీవీ, వాటిని రికార్డు చేసే హార్డ్ డిస్కు. నెత్తిన నెలవంక లాగా ఒక కెమెరా. ఇదీ నా స్వరూపం. కేక వినపడగానే నా చెంత ఉన్న ఇద్దరిలో ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. తర్వాత రెండోవాడిని కూడా పిలిచారు. వాడు కూడా తెలియదనే చెప్పాడు. ఎలా తెలుస్తుంది వాళ్లకసలు? మాది పోష్ డీలక్స్ అపార్టుమెంట్స్ అనే చెప్పాలి. వాచ్మెన్ ఫ్యామిలీకి ఓ చిన్న ఇల్లు వేసి ఇక్కడే కాపురం ఉంచడం, వాడికో ఇస్త్రీ బండి పెట్టివ్వడం వీళ్లకు నచ్చదు. సెక్యూరిటీని ఏజన్సీకి అప్పగించారు. ఆ ఏజన్సీ రోజూ తమ మనుషుల్ని పంపుతుంది. ఒక్కొక్కడికీ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ. రోజుకు నలుగురు వస్తారు. ఒకసారి వచ్చినవాడు మరురోజు వస్తాడని గ్యారంటీ లేదు. వాళ్ల డ్యూటీ గేట్ సెక్యూరిటీ మాత్రమే. పైగా వీళ్లంతా పైనున్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు. మన భాషారాదు, ఇంగ్లీషూ రాదు. ఎవడైనా లోపలకు రావాలనుకుంటే ‘నామ్’ అంటారు.. ‘ఫ్లాట్’ అంటారు.. చెబితే ఆ ఫ్లాట్కు ఇంటర్ కమ్లో కాల్ చేసి చెప్తారు. పంపమంటే, సంతకం చేయించుకుని పంపుతారు.. లేదంటే లేదు అంతే!వాకింగులోని వాళ్లూ, యోగ ముద్రాంకితులూ, ఉదయపు ఎండకోసం వచ్చి తీరిగ్గా కూచుని కబుర్లు చెప్పుకుంటున్నవాళ్లూ.. ఓ యాభైమందికి పైగా ఆ చిన్న ఇరుకు సందులో.. అప్పటికే చుట్టూ చేరారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ చేరినవాళ్లు మొబైళ్లలో పైన తమ ఫ్లాట్స్లోని వాళ్లకు కాల్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరూ వస్తున్నారు. అందరిలోకి కాస్త చొరవగా ఉన్న ఒక మనిషి.. ‘డిడ్ ఎనీ బడీ నో హిమ్.. ఇతనెవరో ఎవరికైనా తెలుసా.. ఇవన్ యారో..’ అని భాషలు మార్చి మార్చి పదేపదే అడుగుతున్నాడు. జవాబు రావడం లేదు. గుమికూడిన జనంలో.. ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నట్టే లేదు.. చాలా వరకు!నా దగ్గరినుంచి వెళ్లిన రెండో సెక్యూరిటీ వాడు కొంచెం నయం.. ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి చూసిన తర్వాత.. ‘‘ఫ్లాట్ తో మాలూమ్ నై సాబ్. యే తో అందర్వాలా హీ హై.. కన్ఫర్మ్’’ అన్నాడు. మహా అయితే అంతా డెబ్భయి ఇళ్లు. అందరూ మహా సంపన్నులు. పెద్దపెద్ద వాళ్లు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా టైం లేని వాళ్లు. ఇక పోయిన ప్రాణాన్ని, జిగటగా గడ్డకట్టిన ఒక చిన్న ఎర్రటి మడుగులో సగం మునిగిన మొహాన్ని ఎలా గుర్తుపడతారు. ఎవరనేది తెలియలేదు. ఎవరో అన్నారు.. ‘కాల్ ది పోలీస్ ఫస్ట్’.చొరవైన వాడే.. మొబైల్ అందుకుని 100 నొక్కాడు.ఆ చప్పుడుకు– ఈ నొక్కడానికి మధ్య గంటన్నర గడిచింది.రక్షక్:నా పేరు రక్షక్. సెక్టార్ వెహికల్ అంటుంటారు నన్ను. 100 నుంచి మా మాధాపూర్ స్టేషన్కు కాల్ వచ్చింది. అక్కడ నుంచి రౌండ్స్లో ఉన్న సెక్టార్ వెహికల్లోకి సెట్లో సమాచారం వచ్చింది. నన్ను అధిరోహించి ఒక హెడ్ కానిస్టేబులు, ఇంకో కానిస్టేబులు మాత్రమే ఉన్నారు. అయినా వాళ్లకు జంకేమిటి? ఎంచక్కా ఇక్కడకు వచ్చేసాం. ఇలాంటివి ఎన్ని చూసి ఉంటారని? ఏమీ జడుసుకోలేదు. ఆశ్చర్యపోలేదు. కాకపోతే, అక్కడ ఏడుపులూ పెడబొబ్బలు లేకపోవడం, అనుభవం కొద్దీ, గమనించి ‘‘ఇంకా ఎవరిదో గుర్తుపట్టలేదా’’ అని మాత్రం అన్నారు. ఆ మాటకు, గుమికూడిన వాళ్లలో ఎవరైనా సిగ్గుపడ్డారో లేదో నేను గమనించలేదు. ‘‘లైబ్రరీలో చూశాను.. ఫ్లాట్ తెలీదు గానీ..’’ అని ఒకే పెద్దాయన అన్నాడు. ఇప్పుడైనా వాళ్లు సిగ్గుపడ్డారో లేదో!మరో అరగంటలో మోటారు సైకిల్పై ఎస్సై కూడా వచ్చేశాడు. అనుభవమే వారికి పనిలో వేగం అందిస్తుందనుకుంటా. ఆయన వచ్చాక టైం వేస్ట్ జరగలేదు. ఆ ఇరుకు సందువైపు ఫేస్ చేస్తూ ఉన్న రెండు టవర్లలోని ఫ్లాట్స్ నంబర్లన్నింటినీ రెండు కాగితాలపై వరుసగా రాశాడు మొత్తం 36 తేలాయి. ఆ ఫ్లాట్స్ వాళ్ళు ఎవరైనా అక్కడ గుమికూడిన జనంలో ఉన్నారేమో అని ఒక్కొక్క నంబరూ ఎలుగెత్తి అరుస్తూ అటెండెన్స్ పిలిచినట్లుగా పిలవసాగాడు. 20 మంది దాకా అక్కడే ఉన్నారు. ఆ నంబర్లు అన్నింటినీ స్ట్రైక్ ఆఫ్ చేసిన కాగితాలను చెరో కానిస్టేబుల్ చేతికిచ్చి రెండు బ్లాకుల్లోని మిగిలిన ఫ్లాట్ల వద్దకు వెళ్లి ఇంట్లో ఎవరైనా కనిపించడం లేదేమో అడిగి రమ్మని పురమాయించాడు.ఆ చప్పుడుకు– ఈ పురమాయింపుకు మధ్య మూడు గంటలు గడిచాయి.కాఫీ కప్పు: ఏ13బీ. కాలింగ్ బెల్ మోగింది. ముందుగదిలోనే కూర్చుని కాఫీ తాగుతున్న అనిల్.. ‘‘అమ్మా వాకింగు నుంచి నాన్నొచ్చినట్టున్నాడు చూడూ’’ అని కేకేశాడు. వంటింట్లోంచి ఆమె వచ్చి తలుపుతీసింది. ఎదురుగా కానిస్టేబులు. విషయం తెలిశాక, ‘కిందికి వెళ్లి చూసొస్తా’నంటూ అనిల్ శాండల్స్లో కాళ్లు పెట్టాడు. ‘వాకింగుకు వెళ్లిన మీ నాన్న కూడా అక్కడే ఉంటాడేమో.. తొందరగా రమ్మను.. ఆయన టిఫినుకు లేటైంది’ వెనుకనుంచి అమ్మణ్ణమ్మ కేకేసింది. ఆ జనంలో ఆయన లేడని ఆమెకు తెలీదు. నా పేరు కాఫీ కప్పు. ఫిల్టర్ కాఫీ నా ప్రత్యేకత. ‘ఆయన’కు శ్రీమతి అందించే ప్రతి ఉదయపు జీవనోత్సాహాన్ని నేనే! ఆయన నాకు కొన్నేళ్లుగా చాలా బాగా తెలుసు. తెల్లారిందని పల్లెకు చెప్పడానికి తాము కూస్తున్నామని కోళ్లు అనుకుంటాయి. ఆకలేసిందని తనకు చెప్పడానికి అవి కూస్తున్నాయని ఆయన అనుకుంటాడు. వాటి కూత పూర్తికాక ముందే లేచి, మేతతో తయారవుతాడు. ఒక్కో గంపను ఎత్తి, కోళ్లను వదులుతూ గింజలు నేలపై చల్లుతూ తన రోజును మొదలెడతాడు. వేసిన గింజలన్నీ తిన్న కోళ్లు తమ స్వప్రయత్నం ప్రారంభిస్తూ పెరటి బాట పట్టేసరికి ఆరుగంటలవుతుంది. గంట కొట్టినట్టుగా అమ్మణ్ణి కాఫీ గ్లాసుతో వాకిట్లోకి వస్తుంది. (అది కూడా నేనే. పల్లెలో నా రూపం గ్లాసే) ఇద్దరూ కలిసి మట్టి అరుగు మీద కూర్చుని కాఫీ తాగుతారు. ఆ తర్వాతే మిగిలిన దినచర్య. అలా బతకడం అలవాటైన ఈశ్వరయ్యని తెచ్చి ఇక్కడ నాలుగు గోడల మధ్య బందీ చేశారు. తారసిల్లిన ప్రతిప్రాణినీ పలకరించుకుంటూ ఊరంతా తిరగడం, గుడికో పొలానికో వెళ్లి రావడం మాత్రమే తెలిసిన ఈశ్వరయ్య కొత్తగా వాకింగ్ నేర్వలేకపోయాడు. ప్రయత్నించాడు గానీ పలకరింపు కూడా ఉండని, మౌన శవయాత్ర లాంటి ఆ నడకలు రుచించక మానుకున్నాడు. ఎప్పుడైనా లైబ్రరీ దాకా వెళ్లి వచ్చేవాడు. ఇంతకుముందు ఎవరో ‘చూసినట్టుగా ఉన్న’దని అనడం అందువల్లే. ఇవాళ కూడా అమ్మణ్ణి ఆరు గంటలకే ఆయన చేతికి నన్ను అందించింది. అనిల్, అతడి భార్య అప్పటికి నిద్ర లేవలేదు. అప్పుడే లేవరు. నన్ను అందించి, ఆమె వంటగది శుభ్రం చేసే పనిలో పడింది. ఆయన నాతో సహా బాల్కనీలోకి చేరాడు. చివరి చుక్క వరకు, నాలోని ఉత్తేజాన్ని ప్రతిసారీ తనలోకి వంపుకునే ఈశ్వరయ్య.. కనీసం నన్ను ఒక్కసారైనా చుంబించకుండా.. పొగలు కక్కుతూ ఆశ్చర్యపోతున్న నన్ను రెయిలింగ్ గోడపై ఒక చివర్న ఉంచాడు. లోపల సుడిగుండాలు. ఎన్నో, ఏవేవో, ఎందుకు, ఎలా తిరుగుతున్నాయో ఎవరికి తెలుసు? నానుంచి కాస్త దూరం జరిగి రెయిలింగ్ మీదుగా ముందుకు వంగాడు. ‘రెయిలింగ్ యోగా’ భంగిమేమో అని నవ్వుకున్నాను, పొగలు కక్కుతూనే. ఇంకొంచెం వంగాడు. ఇంకా వంగాడు. ఇంకా.. వంగాడు! అసలు అది వంగడమేనా? నేను కంగారు పడేలోగానే అది జరిగింది.ఈశ్వరయ్య పైనుంచి కిందికి జారిపోయాడు. నేను నిశ్చేష్టనైపోయాను. పొగలూ చల్లారిపోయి, కాఫీ పొక్కు కట్టింది.కొన్ని క్షణాలకు దబ్బున చప్పుడు వినిపించింది. కొన్ని నిమిషాలకు, ఇప్పుడు, అనిల్ కిందకు వెళ్లిన తర్వాత, ఏడుపు వినిపించింది. నా అంతఃకర్ణాలను గ్రౌండ్ ఫ్లోర్ దాకా రిక్కించాను. వెక్కుతూ వెక్కుతూ ‘‘మా.. నాన్న’’ అంటున్నాడు. నా అంతఃచక్షువులను కూడా కిందికి సారించాను. నాన్న పక్కనే మోకాళ్లపై కూలబడ్డాడు. చుట్టూ ఉన్న గుంపు మొత్తం కాస్త స్థిమితపడ్డారు. అప్పటిదాకా ఉన్న సస్పెన్స్ తీరిపోయినందుకు! ‘‘ఏ ఫ్లాట్?’’ ఎవరిని ఉద్దేశించామనే స్పష్టత లేకుండా అనేక సిగ్గులేని గొంతుకలు గునగున గొణుగుతున్నాయి. కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరకెళ్లి ‘‘ఏ13బీ సార్’’ అనడంలో అందరికీ జవాబు దొరికింది. సస్పెన్స్ తీరిపోయింది గనుక.. ఒకరిద్దరు తమ ఇళ్లకు మళ్లుతున్నారు. ఒకరిద్దరు మళ్లీ చెవులకు తగిలించుకుంటున్నారు. ఈలోగా అంబులెన్సు సైరన్ కూడా వినిపించింది.ఆ చప్పుడుకు– ఈ సైరన్ చప్పుడుకు మధ్య మూడున్నర గంటలు గడిచాయి.గీతామందిరం: నా పేరు గీతామందిరం. ఈ గేటెడ్ ప్రపంచానికి నేనే కమ్యూనిటీ హాలును. నాలుగు అల్మరాలను ఓ మూలగా పేర్చిన లైబ్రరీ అనే పదార్థం కూడా యిక్కడే. పదిరోజుల కిందట తొలుత ఉస్మానియా అంబులెన్సు మీద, తర్వాత వైకుంఠరథం మీద సవారీ వెళ్లిన పెద్దాయన నాకు తెలుసు. ఇవాళ ఆయనకు పెద్దకర్మట. ఇక్కడ నా సమక్షంలో ప్రవచనం ఏర్పాటుచేశారు. ఆత్మానంద స్వామి వచ్చాడు. నీట్గా ట్రిమ్ చేసిన బెత్తెడు గడ్డం, పొందికైన బట్టతలతో ఉన్నాడు. కాషాయాంబరాలు, మెడలో రంగురంగుల పూసలు. దణ్ణం పెట్టించుకోడానికి తగిన గెటప్పులోనే ఉన్నాడు. స్వామీజీ వస్తున్నారని వాట్సాప్ గ్రూపులో బాగా ప్రచారం జరగడం వలన.. చాలా ఫ్లాట్స్ నుంచి మనుషులొచ్చారు. అనిల్ కుటుంబం ఎటూ ఉంది. ఆయన ప్రారంభించాడు.‘‘ఈశ్వరయ్య పరమేశ్వరుడిలో లీనమయ్యాడు. మీరందరూ ఇక్కడ ఉండేవాళ్లే.. కానీ, ఈశ్వరయ్య శివైక్యం చెందిన మూడున్నర గంటల దాకా ఆయన ఎవరో మీలో ఎవ్వరూ గుర్తుపట్టలేదంటే ఎంత సిగ్గు?’’ ఆత్మానంద పాజ్ ఇచ్చాడు.‘అలా గడ్డిపెట్టు వెధవలకి. ముదనష్టపు ప్రపంచం. ఇరుగు పొరుగు ఎవ్వరో తెలియకుండా ఇనుప తెరలు కట్టేసుకున్న ప్రపంచం. హృదయాల్ని హిడెన్ ఫోల్డర్లలో దాచేసి.. కృతకమైన బంధాల్ని, ఉద్వేగాల్ని వెలుపలినుంచి తమపైకి వెల్లువెత్తించుకునే ప్రపంచం! అమానవీయత తమ తరం లక్షణంగా మారుతోందనే స్పృహ కూడా లేని దౌర్భాగ్యపు ప్రపంచం!’ ఆత్మానందకు జేజేలు అనుకుంటూ మిగిలినోళ్లను ఈసడించుకున్నాను నేను. ఆయన కొనసాగించాడు. ‘‘ఇది తప్పు. మనుషుల మధ్య బంధాలు ఉండాలి. సత్సంగాలు జరుగుతూ ఉండాలి. కలుస్తూ ఉండాలి. మీలో మీరు కలవడం కాదు, గురువుల్ని పిలిచి, సద్బోధలు గ్రహిస్తూ ఉండాలి..’’ వీడి పాసుగూల. పెద్దదినాన్ని కూడా మార్కెటింగుకు వాడుకుంటున్నాడే! ‘‘ఈశ్వరయ్య మరణం లాంటిది మరొకటి జరగకూడదు. మంత్రంలాంటి మాట చెబుతాను పాటించండి’’‘నీ మార్కెటింగ్ ఎలా తగలడ్డా పర్లేదుగానీ, మంచి మంత్రం చెప్పు స్వామీ..’ ఆశగా ఎదురుచూస్తున్నాను. ‘‘తమ ఇళ్లలో పెద్దవాళ్లను, ముసలివాళ్లను ‘మెయింటైన్’ చేస్తున్న ప్రతి ఒక్కరూ..’’భళా.. ఇలాంటి పాఠాలే స్వాములనుంచి ప్రపంచానికి అందాలి. నా ఉత్సుకత పెరిగిపోయింది. ‘‘తమ బాల్కనీలకు గట్టి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసుకోండి..’’ ఆత్మానంద ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు. గంట ప్రవచనానికి మాట్లాడుకున్నారంట. అప్పుడే ఎందుకు ఆపుతాడు?చివరగా నేను: నా పేరు ఈశ్వరయ్య. ఆ రోజున నేను, నా విముక్తిని, బలవంతంగా, ఈశ్వరేచ్ఛతో నిమిత్తం లేకుండా, పుచ్చుకున్నాను. ఇవాళ్టిదాకా నేను ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండాలని అందరూ అనుకుంటుండబట్టి.. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని వేచిచూశాను. ఇక చాలు. «పరమేశ్వరుడి లీలలో లీనమయ్యే ముందు.. ఈ నాటకం చాలించేముందు, ఎవడో స్వామిట కదా, నాకోసమే వస్తున్నాడుట కదా.. విందామని ఆగాను. ఆ అమృతోపదేశాన్ని విన్నాను. రాయజాలని భాషలో, ఎవరికీ వినపడదని తెలిసినా, గట్టిగా తిట్టుకుని, నా దారిన చక్కాపోయాను. -
కథాకళి: మంచివాడు
చిత్రాంక్ని రెండు రోజుల నుంచి ఓ సమస్య బాధిస్తోంది. అతనికి ఎదురు చూడని డబ్బు వచ్చింది. అదీ పెద్ద మొత్తంలో. అతను పనిచేసే కంపెనీలోని ఓ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేస్తూండగా, ఆఖరి దశలో ఓ గడ్డు సమస్య వచ్చి ఆ ప్రాజెక్ట్ ముందుకి కదలడం లేదు. ఆ కంపెనీ సీఈవో ఆందోళనగా ఉన్నాడు. చిత్రాంక్ దాన్ని ఆవిష్కరించటంతో సీఈవో అతనికి పదిలక్షల రూపాయల నగదు బహుమతిని ఇచ్చాడు. సెకండ్ హ్యాండ్ కారుని అమ్మేసి ఆ పదిలక్షలతో కొత్త కారుని కొనాలని అనుకున్నాడు. కాని అందుకు అతనికి మరో ఆలోచన అడ్డం వస్తోంది. చిత్రాంక్కి చిన్నప్పటి నుంచి తన తండ్రివైపు బంధువులని ఆదుకోవాలని కోరిక. వారంతా పేదవారు. తన బీద అత్తయ్యకి అప్పుడప్పుడు చిన్న మొత్తాలు సహాయం చేస్తుండేవాడు. ఈ మధ్య చిత్రాంక్ని అతని అత్తయ్య తన ఇద్దరు పిల్లల కోసం పెద్ద మొత్తం అడిగింది. డబ్బు లేక ఆ కోరిక తీర్చలేకపోయాడు. తనకి ఆ పదిలక్షలు లేకపోయినా ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేదు. అన్ని అవసరాలకి ఇప్పుడున్న కారు చాలు. కాబట్టి ఆ పదిలక్షలని తన అత్తయ్య పిల్లలకి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. కొద్దిరోజుల క్రితమే అత్తయ్య రెండో కొడుకు తనకి నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ షాప్ పెట్టుకోవాలని ఉందని మాటల్లో చెప్పాడు. అతనికి నాలుగు లక్షలు, మిగిలింది వాడి అక్క పెళ్ళికి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది.ఆ ఆలోచన వచ్చినంత త్వరగా దాన్ని ఆచరించడానికి అతనికి మనసు రాలేదు. తక్కువ డబ్బు ఉన్నవాళ్ళు దాన్ని తేలిగ్గా దానం చేయగలుగుతారని, ఎక్కువ మొత్తం డబ్బున్న వాళ్ళు చేయలేరన్న నిజం అతనికి అనుభవపూర్వకంగా తెలిసింది. అతనికి ఆ సొమ్ముని అత్తయ్య కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని ఉంది. అదే సమయంలో చూస్తూ చూస్తూ అంత మొత్తం ఇవ్వడానికి మనస్కరించడం లేదు. గత రెండు రోజులుగా చిత్రాంక్ మనసులో ఈ విషయం మీద తర్జనభర్జనలు, తర్కవితర్కాలు సాగుతున్నాయి. చిత్రాంక్ బ్రహ్మచారి. కాబట్టి సలహా తీసుకోడానికి భార్య కాని, తల్లితండ్రులు కాని లేరు.అతను ఆ ఆదివారం సాయంత్రం తను చాలాకాలంగా వెళ్ళాలనుకునే చెరువుకి చేరుకున్నాడు. చుట్టూ కొబ్బరి చెట్లు. దూరంగా కొండల వరుస. అతనికి అక్కడి ప్రశాంతత నచ్చుతుంది. కారుని పార్క్ చేసి నడిచి, చెరువు ఒడ్డున ఉన్న సిమెంట్ బెంచ్ దగ్గరికి చేరుకుని జేబురుమాలుతో దాని మీద దులిపి కూర్చున్నాడు. ఎదురుగా దాదాపు వంద ఎకరాలకి పైగా విస్తీర్ణం ఉన్న ఆ చెరువు మీంచి చల్లటి గాలి వీస్తోంది. అవతల ఓ చిన్న గ్రామం ఉంది. నీళ్ళ వంకే చూస్తూంటే అందులో కొన్ని బాతులు కనిపించాయి.కొద్దిసేపటికి ఒకాయన చెరువు దగ్గరికి వచ్చాడు. ఆయన ఒంటి మీద మాసిన ఖాకీ రంగు నిక్కర్, బనీన్ ఉన్నాయి. ఆయనకి అరవై ఏళ్ళ దాకా ఉండచ్చని తెల్ల జుట్టుని, మొహాన్నిబట్టి అంచనా వేశాడు. ఆయన బెంచ్ మీద కాక ఒడ్డున కూర్చున్నాడు. కొద్దిసేపాగి తనతో తెచ్చిన మూట తీసి అందులోంచి ఏదో తీసి నీళ్ళలోకి చల్లాడు. తర్వాత ఆయన వెల్లకిలా పడుకుని కూనిరాగం తీస్తూ ఆకాశంలోకి చూడసాగాడు. ఆయన లోకంలో ఎలాంటి దుఃఖం లేనివాడుగా చిత్రాంక్కి తోచింది. బాతులు దూరం నుంచి బిలబిలా ఆయనవైపు ఈదుకుంటూ వచ్చాయి. ఆయన నీళ్ళల్లో చల్లిన, నీటి మీద తేలే మరమరాలని అవి తినసాగాయి. చిత్రాంక్కి ఆశ్చర్యం వేసింది. ఆయన దరిద్రుడిలా ఉన్నాడు. ఆ బాతులు ఆయనవి కావు. అయినా ఆయన వాటికి మేత తెచ్చి వేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి అడిగాడు.‘‘ఏం చేస్తున్నావు?’’‘‘ఆకాశంలోకి చూస్తున్నాను.’’‘‘వాటికి ఏదో వేస్తున్నట్లున్నావు?’’‘‘అవును. మరమరాలు.’’‘‘అవి నీ పెంపుడు బాతులా?’’‘‘కావు.’’‘‘నువ్వు ఉండేది ఎక్కడ?’’దూరంగా ఉన్న గ్రామం వంక చేత్తో చూపించాడు.‘‘రోజూ వాటికి మరమరాలు తెచ్చి వేస్తుంటావా?’’‘‘మూడు నాలుగు రోజులకోసారి.’’తనకేమీ కాని బాతులని ఆయన ఆదుకుంటున్నాడు. తన తండ్రి మేనల్లుడిని, మేనకోడల్ని ఆదుకోవాలని చాలాకాలంగా అనుకుంటున్నా, అవకాశం వచ్చేసరికి తను వెనక్కి వెళ్ళడం సబబు కాదనే గట్టి నిర్ణయాన్ని ఆయన్ని చూసి చేసుకోగలిగాడు. ఆయన నిశ్శబ్దంగా మూటలోంచి గుప్పెడు మరమరాలు తీసి చిత్రాంక్ చేతిలో పోశాడు. చిత్రాంక్ వాటిని నీళ్ళలోకి చల్లగానే బాతులు వాటి మీదకి ఎగబడ్డాయి. తను మనిషి. స్వార్థం ఆవరించుకున్న మనిషి అనుకున్నాడు. తన సమస్యకి ఇంత తేలిగ్గా జవాబు దొరుకుతుందని ఎదురుచూడని చిత్రాంక్ ఆయనతో చెప్పాడు.‘‘నువ్వు చాలా మంచివాడివి.’’ఆయన జవాబు చెప్పలేదు. చిత్రాంక్ తన కారు దగ్గరికి నడిచి తాళం తీసి, లోపలకి ఎక్కి కూర్చుని తేలికపడ్డ మనసుతో ఇంటి దారి పట్టాడు. కారు శబ్దం బాగా దూరం అయ్యేదాకా ఆగి ఆ వ్యక్తి లేచి ఓసారి చుట్టూ చూశాడు. తర్వాత సంచీలోంచి మరమరాలని తీసి ఒడ్డున పోసి సంచీని ఖాళీ చేశాడు. కొన్ని బాతులు నీళ్ళల్లోంచి నేల మీదకి వచ్చి వాటిని తినసాగాయి. ఆయన ఓ బాతుని అందుకుని దాని మెడ విరిచాడు. అది రెక్కలు కొట్టుకుంటూంటే దాన్ని ఆ సంచీలో వేసుకుని లేచాడు. కొద్దిసేపట్లో ఎర్రబడ్డ సంచీ నిశ్చలమైంది. ఆ వ్యక్తి చెరువు వెనక ఉన్న తన గ్రామానికి బయలుదేరాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
క్లాసిక్స్ అంటే ఏమిటి
‘ప్రపంచంలోని పుస్తకాలన్నీ రెండే రకాలు! కొన్ని క్షణకాలం నిలిచేవి – మరికొన్ని కలకాలం నిలిచేవి’ అన్నాడు పందొమ్మిదవ శతాబ్దపు బహుముఖ ప్రజ్ఞావంతుడు జాన్ రస్కిన్. అలా కలకాలం నిలిచే పుస్తకాలనే ‘క్లాసిక్స్’ అంటూవుంటారు. సాహిత్య విమర్శలో ఏ మాట చెప్పినా, ఆలంకారికంగానే చెప్తారు; అంచేత ‘కలకాలం’ అంటే సుదీర్ఘకాలమనే మనం అర్థంచేసుకోవాలి. ‘ఎంత కాలంగా నిలువనున్న సరుకైతే అది అంత ప్రశస్తమైనది’ అనే ప్రమాణం చింతకాయ పచ్చడికీ ఉసిరిపచ్చడికీ వర్తించినంతగా క్లాసిక్స్కు వర్తించదు. ‘పురాతన కళాఖండాలు మనకు శ్రేష్ఠమైనవిగా అనిపించడానికి వాటి ప్రాచీనత కారణం కాదు! అలాంటి క్లాసిక్స్ ఎప్పుడు చదివినా ఎంతో తాజాగానూ, శక్తిమంతంగానూ, ఆరోగ్యదాయకంగానూ అనిపించడం వల్లనే అవి క్లాసిక్స్ అయ్యాయి‘ అన్నాడు గోథే. ప్రతి విషయాన్ని చమత్కారంగా చెప్పే అమెరికన్ మహారచయిత మార్క్ ట్వైన్ మాత్రం క్లాసిక్స్నూ వదలలేదు! ‘ప్రతిఒక్కరూ చదవాలని అనుకున్నప్పటికీ, ఏ ఒక్కరూ చదవని ఉద్గ్రంథాలే క్లాసిక్స్’ అన్నాడట ఆ మహానుభావుడు. అది తప్పని ఆయన విషయంలోనే రుజువైంది. హెమింగ్వేలాంటి వాళ్లు, ట్వైన్ రాసిన ‘హక్ల్ బెరీ ఫిన్’ నవలను క్లాసిక్గా పరిగణించిన మాట – దాన్ని చదవాలని ఒకప్పుడు మనమంతా ఉవ్విళ్లూరిన మాట నిజమే కదా! అంచేత, ఈ మాట అంటున్నప్పుడు మార్క్ ట్వైన్ తన గుబురు మీసాల మాటున నవ్వుకునే వుంటాడని గ్రహించాలి!! ఏతావాతా, దీర్ఘకాలం మనగలగడం ఒక్కటే క్లాసిక్స్ లక్షణం కాదు – కనీసం అది వాటి ప్రధాన లక్షణం కూడా కాదని తేలిపోయింది! జనజీవనంలో అనంతంగానూ, స్థిరంగానూ కొనసాగే కొన్ని ప్రమాణాలు క్లాసిక్స్లో ప్రముఖంగా కనిపించి తీరాలి. మానవమేధను మరింత రసవంతం చేసే లక్షణం దాంట్లో ఉండి తీరాలి. భూగోళమంతా విస్తరించుకుని వున్న మానవాళిలో ప్రతి నిత్యం దర్శనమిచ్చే భావావేశం క్లాసిక్స్లో పెల్లుబుకుతూ ఉండాలి. ఒక్కమాటలో చెప్పుకుంటే, క్లాసిక్స్లో – ఏదో ఒక రూపంలో– మౌలికమైన, విస్తృతమైన, లోతైన ఆలోచన – అనుశీలన – ఆవిష్కరణ వ్యక్తమై ఉండాలి. టీయస్ ఇలియట్ లాంటి నవ్య సంప్రదాయవాదుల లెక్క ప్రకారం, క్లాసిక్స్లో అంతర్నిహితంగా నిర్దిష్ట నైతికబోధన ఉండాలి. పాశ్చాత్య సాహిత్య ప్రపంచంలో, ఈ ప్రతిపాదనను సమర్థించేవాళ్లకన్నా, పట్టించుకోనివాళ్లే ఎక్కువ! విషయమేమిటంటే, కొన్ని తరాలపాటు పాఠక లోకాన్ని ప్రభావితం చేసే లక్షణాలున్న గొప్ప పుస్తకాలన్నీ క్లాసిక్సే. ఉదాహరణకి గురజాడ ‘కన్యాశుల్కం’, చలం ‘మైదానం’, విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలు’, దేవులపల్లి ‘కృష్ణపక్షం’, సురవరం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది!’, దాశరథి ‘అగ్నిధార’, నవీన్ ‘అంపశయ్య’ – ఇవన్నీ క్లాసిక్సే. నాలాంటి వాడికి మల్లారెడ్డి, రాంభట్ల, సినారె అనువదించిన ‘మఖ్దూం కవిత’, సదాశివ ‘యాది’ కూడా క్లాసిక్స్ గానే కనిపిస్తాయి! అవి ఫలానా దేశంలో, ఫలానా భాషలో, ఫలానా కాలంలో వెలువడి వుండాలనేం లేదు. మనం ఈ విషయం గురించి ఇక్కడ చర్చించుకుంటూ ఉండగానే, ఏదో గొప్ప క్లాసిక్కు శ్రీకారం చుట్టడం జరిగివున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మాటకొస్తే, ప్రతి క్లాసిక్ అలా వేర్వేరు కాలాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో, వేర్వేరు భాషల్లో పుడుతూ వచ్చిందే! నోబెల్ బహుమతో – లేదా పులిట్జర్ పురస్కారమో – లేదా బుకర్ ప్రైజో పొందిన రచనలే క్లాసిక్స్ అని ఎవరూ అనరు – అనలేరు! సామాన్యయుగానికి పూర్వం ఏడో శతాబ్దిలో హోమర్ గానం చేసిన ‘ఇలియడ్’, ‘ఒడిస్సీ’లకు ఏ నోబెల్ ప్రైజ్ వచ్చిందని అవి క్లాసిక్స్ కాగలిగాయి? దానికి ఒక రెండువేల సంవత్సరాల తర్వాత వెలువడిన వాల్మీకి ‘రామాయణ’ కావ్యానికి ఏ పులిట్జర్ ప్రైజ్ వచ్చిందని అది క్లాసిక్ కాగలిగింది? దానికి ఒక రెండువేల సంవత్సరాల తర్వాత వెలువడిన వ్యాస ‘మహాభారత’ ఇతిహాసానికి ఏ బుకర్ ప్రైజ్ వచ్చిందని అది క్లాసిక్ కాగలిగింది? అంతెందుకు – టాల్ స్టాయ్ రాసిన ‘ఆనా కెరినినా’ గానీ, ‘యుద్ధం–శాంతి’ గానీ ఏ పురస్కారానికీ నోచుకోలేదు. అవి క్లాసిక్స్ కాదనడానికి ఎవరికైనా గుండెలున్నాయా? ఇక, జేమ్స్ జాయిస్ రాసిన ‘యులిసెస్’కు ఏ బహుమతీ దక్కకపోగా తీవ్రమైన ఆంక్షల పోటులూ, సెన్సార్ కత్తెర వేటులూ మాత్రమే ప్రాప్తమయ్యాయి. అది మేలిరకం క్లాసిక్ సుమా! అని పనిగట్టుకుని చెప్పాలా? హోర్హే లూయీ బోర్హే రాసిన ‘ఫిక్షన్’కు నోబెల్ పురస్కారం దక్కకపోవడానికి, ఆయన రాజకీయ అభిప్రాయాలే కారణం కావడం అందరికీ తెలిసిందే! అంతమాత్రాన అది క్లాసిక్ కాకపోతుందా? ఈ జాబితా సుదీర్ఘమైంది. జార్జ్ ఆర్వెల్, వర్జీనియా వూల్ఫ్, చినువా అచెబే, స్కాట్ ఫిట్జెరాల్డ్ లాంటి మహా రచయితల రచనలెన్నో ఉన్నాయి అందులో! క్లాసిక్స్ అంటే ఏమిటో – స్థూలంగా – అర్థం చేసుకోవడానికి ఈ చర్చ సరిపోతుందనుకుంటా. -
సాహిత్య దీపాన్ని అందించే ప్రయత్నం చేశా!
‘పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల గుండెల్లో వారి స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే! భవిష్యత్తుకు భరోసాగా నిలిచే ఈ తరం పిల్లల పెంపకంలో ఎప్పుడూ అశ్రద్ధగా ఉండకూడదు.’ అంటారు సినీ గీతరచయిత సుద్దాల అశోక్తేజ. పిల్లల పెంపంకంలో ఎదురయ్యే సాధకబాధకాల గురించి ఆయన పంచుకున్న ముచ్చట్లు...‘జోలాలి జోలాలి జోలాలి.. జోల పాడుతా బజ్జో నా తల్లి / నిదుర తల్లిని బతిమలాడని .. నీలి కళ్లలో నిదురపొమ్మని/ రా రమ్మని ఇమ్మని తీపికలలు ఎన్నో..’ ఇది నేను రాసిన సినిమా పాట. నిజానికి రాత్రివేళల్లో పిల్లలను జోకొడుతూ నిద్రపుచ్చితే, పిల్లలు చెప్పే విషయాలు వింటే.. వారు ఎంతో భరోసాగా ఫీలవుతారు. ఎన్ని పనులున్నా తల్లిదండ్రులు చేయాల్సిన పని రోజులో కొంతసేపు పిల్లలతో గడపడం. నాకు ఓ కూతురు, ఇద్దరు కొడుకులు. వారు పుట్టే సమయానికి మేం కడు పేదరికంలో ఉన్నాం. నాకు ఉద్యోగం లేదు. నా భార్య నిర్మల మిషన్ కుట్టేది, బీడీలు చుట్టేది. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా మేడిపల్లిలో అతికష్టమ్మీద ప్రైవేట్స్కూల్ ప్రారంభించాను. అప్పుడు మా జీవనం కొంత మెరుగైంది. మా నాన్న హయాంలో కూడా ఆయనకు వచ్చేది కొద్దిపాటి ఆదాయమే. అయినా అంతా అందులోనే బతికాం. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా పిల్లల పెంపకంలో మా అమ్మనాన్నలు ఏం చేశారో, నేనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాను. మా అమ్మనాన్నలు మా దోసిట్లో పెట్టిన సాహిత్య దీపాన్ని మా పిల్లల చేతుల్లో పెట్టి, వెలిగించే ప్రయత్నం చేశాను. వాళ్లూ నా అంచనా మేరకు జీవితంలో చక్కగా స్థిరపడ్డారు. చలం ‘బిడ్డల శిక్షణ’..స్కూల్ నడుపుతున్న సమయంలో గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. అక్కణ్ణుంచి మా జీవనం మరికాస్త మెరుగైంది. ఇంటి పనులు, పిల్లల పనులు మా ఆవిడతో పాటు నేనూ కలిసి చేసేవాడిని. మా ఆవిడకు నేను చేసే పనులను చూసి, పిల్లలు కూడా ఇంటి పనుల్లో సాయం చేసేవారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చలం ‘బిడ్డల శిక్షణ’ పుస్తకం చదివింది. అది మా ఇంటి వాతావరణాన్నే మార్చేసింది. పిల్లలు ఎంత అల్లరి చేసినా, ఎంత చిరాకు సృష్టించినా ఒక్కనాడు కూడా వారి మీద చిన్న దెబ్బ కూడా వేయకుండా పెంచింది. మా ఇంట్లో పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం అలవాటుండేది కాబట్టి, మా తమ్ముడు, చెల్లెలికి కథలు చెబుతుంటే మా పిల్లలు కూడా వినేవాళ్లు. ఇప్పుడు మా మనవలు, మనవరాళ్లకు మహాభారతం, భాగవతం చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. అప్పట్లో సెల్ఫోన్లు, టీవీలు లేకపోవడం వల్ల సామాజిక పరిస్థితులు కూడా నాకు సహకరించాయి. ఇప్పుడు నా పిల్లల పిల్లలు వచ్చేసరికి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి పిల్లలకు ‘చందమామ రావే.. ’ పాటలు, ‘చందమామ కథలు’ లేవు. యాంత్రికంగా పరుగులు వద్దుఈ రోజుల్లో భార్యభర్తలు ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబం నడవని పరిస్థితులు వచ్చాయి. అందుకు ఇంట్లో అవసరానికి మించిన ఆడంబర వస్తువులూ వచ్చి చేరాయి. వాటి కోసం సంపాదన తప్పనిసరి అయ్యింది. కెరీర్ పరుగు పందెంలో జీవితాలు యాంత్రికం అయ్యాయి. స్మార్ట్ ఫోన్లకు, టీవీలకు, గూగుల్కు పిల్లలను అప్పజెబుతున్నారు. డిజటల్లో ఏం చూసి నేర్చుకుంటున్నారో, అదే నేటి పిల్లలు.పిల్లలతో ఆటలు మేలుపిల్లల చిన్నప్పుడు వారితో ఆటలాడేవాడిని. ఉదయం వాకింగ్కు తీసుకెళ్లేవాడిని.. వారితో మాట్లాడే ఆ కాసేపు ‘నా తండ్రి నా వెనకాల ఉన్నాడు’ అనే ఫీలింగ్ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇలా రోజూ కొంత సమయం గడిపితే పిల్లలు తప్పక మంచి స్థానంలో ఉంటారు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చు. వంద పుస్తకాలు చదివినంత జ్ఞానం..సెలవుల్లో మా అమ్మ దగ్గరకు పిల్లలను తీసుకొని వెళ్లేవాళ్లం. ఇంట్లో పెద్ద తినుబండారాలేమీ లేకపోయినా వేడి అన్నంలో చింతకాయ పచ్చడి కలిపి, పిల్లలందరికీ తనే గోరుముద్దలు పెట్టేది. ఆ సమయంలో సహస్ర శిరచ్ఛేద అపూర్వచింతామణి వంటి కథలన్నీ చెప్పేది. ఇప్పుడు చిన్నకుటుంబాలు పెరిగాయి. అలాగే, పెంపకంలో చింతనలు కూడా పెరిగాయి. ఇప్పటి పిల్లలు ‘బియ్యం చెట్లు ఎలా ఉంటాయి?’, ‘ప్యాకెట్ల నుంచే కదా పాలు వచ్చేవి’ అని అడుగుతుంటారు. వాస్తవానికి దూరంగా పిల్లలు పెరుగుతున్నారు. పండుగల జీవన విధానం...మన పండగలన్నీ మానవసంబంధాలను కాపాడే క్రమంలో ఏర్పాటు చేసినవే. పెసర గారెలు, బూరెలు, భక్ష్యాలు, నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు... ఇలా పండగలను బట్టి చేసే వంటలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇప్పుడు డబ్బు ఉంటుంది, అందుకు తగిన జంక్ ఫుడ్ సులభంగా లభిస్తుంది. ఫలితంగా పిల్లలకు సరిగ్గా విరేచనాలు కావు, రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు. పిల్లల ఆరోగ్యం, లోకజ్ఞానం, పరిసరాల జ్ఞానం తప్పనిసరి. వీటిని ఈ రోజుల్లో సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.నిర్మలారెడ్డి -
రూ.500 లంచం.. 36 ఏళ్ళు పోరాటం... ఏడాది జైలు
అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తిమింగలాలతో పోలుస్తారు. తాజాగా అనకొండలను చేర్చారు. ఏ జంతువుతో పోల్చినా, కేసులు నమోదు చేస్తున్నా, కొన్ని ప్రభుత్వ శాఖల్లో ‘పైసా వసూల్’ కానిదే ఫైలు కదలదు, పని జరగదు. లంచం తీసుకోవడం తమ ప్రాథమిక విధుల్లో భాగమని, ఇవ్వడం ప్రజల బాధ్యతని కొంతమంది ఉద్యోగులు భావిస్తుంటారు. అంటే, ‘డ్యూటీకి వచ్చినందుకు జీతం... పనిచేయాలంటే లంచం’ మెజార్టీ ఉద్యోగులు ఇలానే ఉన్నారు. అడిగింది ఇచ్చేదాకా వేధిస్తుంటారు. అడ్డంకులు సృష్టిస్తుంటారు. అయితే, అందరూ వీటిని భరించరు. హక్కుగా పొందాల్సిన సేవలకు లంచం ఇవ్వరు. అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తారు. లంచగొండులను పట్టిస్తారు. ఇలా ఓ ఉద్యోగి దొరికాడు. కేసులో ఇరుక్కున్నాడు. చిన్న మొత్తమే కదా బయట పడతాననుకున్నాడు. కోర్టుల చుట్టూ తిరిగాడు. కాళ్లరిగాయి, ఏళ్లు గడిచాయి. చివరికి న్యాయం గెలిచింది. అవినీతికి శిక్ష ఖరారైంది. కానీ చాలా ఆలస్యమైంది.అది 1990... ఉత్తరాఖండ్లోని ఉద్ధమ్సింగ్ నగర్కి చెందిన రాజ్బహుదూర్ సింగ్ ఎక్సైజ్ కానిస్టేబుల్. ఓ గ్రామంలో తనిఖీలకు వెళ్లాడు. అక్రమ మద్యం ఉందంటూ ఓ వ్యక్తితో బలవంతంగా కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. లంచంగా రూ. 500 డిమాండ్ చేశాడు. అడిగింది ఇవ్వకపోతే కేసు కోర్టుకు పంపుతానని బెదిరించాడు. వేధింపులు భరించలేక వ్యాపారి విజిలెన్స్ శాఖ ఎస్పీని కలిశాడు. జరిగింది చెప్పాడు. దీంతో వలపన్నారు. కానిస్టేబుల్ను రెస్టారెంట్కు రప్పించారు. డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. మూడు కోర్టులు... ముప్పయ్యారేళ్లుతొలుత ట్రయల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కోర్టు ఇద్దరు ప్రధాన సాక్షులను విచారించింది. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 7, సెక్షన్ 13(2) కింద మార్చి 2006లో శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్లు జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించింది. ఈ కోర్టులో కేసు 16 ఏళ్లు నడిచింది. ఈ తీర్పుపై నిందితుడు ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు కొట్టేయాలని అభ్యర్థించాడు. ఆరేళ్లు కేసు నడిచింది. ఏప్రిల్ 2012లో హైకోర్టు ఆ అప్పీల్ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుహైకోర్టులో చుక్కెదురవడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. కేసు కొట్టేయాలని వేడుకున్నాడు .వాయిదాలతో 14 సంవత్సరాలు కేసు కొనసాగింది. 2012 ఆగస్టులో మొదటిసారి విచారణ జరిగింది. 21 సార్లు వివిధ బెంచ్ల ముందు విచారణకు వచ్చింది. ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. ‘సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన ట్రయల్ కోర్టు, హైకోర్టులు నిందితుణ్ణి దోషిగా తేల్చడంలో ఎటువంటి పొరపాటు చేయలేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, దాన్ని హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తన తీర్పులో స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూనే ‘నిందితుడికి ప్రస్తుతం 75 ఏళ్లు. అతడి వయస్సును దృష్టిలో పెట్టుకుని శిక్షను కనీస స్థాయికి తగ్గించవచ్చని మేం భావిస్తున్నాం’ అని తన ఆదేశంలో పేర్కొంటూ శిక్షను ఏడాదికి పరిమితం చేసింది. గతంలో కొంత కాలం జైలులో ఉండడంతో మిగిలిన కాలానికి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసులో తీర్పు ఆలస్యం అయింది. కానీ, న్యాయం గెలిచింది. తప్పుకు శిక్ష తప్పదని వెల్లడైంది. అయితే నాణేనికి ఇది ఒక వైపే! మరోపైపు చూస్తే, 40 ఏళ్ల వయసులో చేసిన నేరానికి 75 ఏళ్ల వయసులో శిక్ష పడింది. రూ. 500 లంచం తీసుకున్నందుకు చట్ట ప్రకారం శిక్ష ఖరారైంది. అవినీతి పరులను శిక్షించాల్సిందే కానీ, 36 ఏళ్ల కాలానికి విలువ కట్టేదెవరు? -
ఆర్డర్ పెడితే చాలు.. అర్ధరాత్రి కూడా ఎండ!
అర్ధరాత్రి బిర్యానీని ఆర్డర్ చేసినట్టు, ఇకపై రాత్రి పన్నెండు గంటల సమయంలోనైనా సరే, ‘కాస్త ఎండను పంపండి బాబూ.. బట్టలు ఆరేసుకోవాలి’ అని మనం ఆర్డర్ పెట్టుకునే కాలం.. దాదాపుగా దగ్గరకు వచ్చేసినట్లే! ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ అనే ఒక అమెరికన్ స్టార్టప్ కంపెనీ, అంతరిక్షంలోకి ఏకంగా 50,000 అద్దాలను పంపి, ఎవరికి కావలిస్తే వారికి రాత్రి పూట కూడా భూమి మీదకు ఎండను డెలివరీ చేసేందుకు త్వరలోనే ఒక ప్రయోగాన్ని చేపట్టబోతోంది.రిఫ్లెక్ట్ ఆర్బిటల్ ప్రయోగాత్మకంగా ఈ వేసవిలోనే సుమారు 60 అడుగుల (18.3 మీటర్లు) వెడల్పు ఉన్న ఒక మోడల్ అద్దాన్ని అంతరిక్షంలో అమర్చనుంది. అది భూమికి 640 కిలోమీటర్ల ఎత్తులో ఉండి, భూమి మీద ఉన్న సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలోని చీకటి ప్రదేశాన్ని వెలుగుతో నింపేస్తుంది. ఇందుకు అమెరికా ప్రభుత్వం కనుక అనుమతి ఇస్తే ఇకపై రాత్రిపూట వెన్నెలతో పాటు కృత్రిమ సూర్యకాంతి కూడా భూమికి అందుబాటులోకి వస్తుంది. 30 ఏళ్ల క్రితమే రష్యా ప్రయోగం!నిజానికి ఇలాంటి ఆలోచన రావడం మానవ మేధావులకు ఇదే మొదటిసారి కాదు. 1993లో రష్యా వారు ‘జ్ఞామ్యా’ అనే ఒక ఉపగ్రహం ద్వారా 65 అడుగుల వ్యాసం కలిగలిన అద్దాన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేసి, రెండు మూడు నిండు చంద్రుళ్లులు ఇచ్చేంత వెలుగును భూమి మీదకు పంపగలిగారు. సైబీరియా వంటి మంచు ప్రాంతాల్లో పగలు తక్కువగా ఉంటుంది కాబట్టి, అక్కడ పగటి సమయాన్ని పెంచాలని అలా చేశారు. కానీ అది అప్పట్లో అంతగా ఫలించలేదు. ఇప్పుడు ఈ ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ కంపెనీ అదే ఆలోచనను భారీ ఎత్తున ముందుకు తీసుకెళుతోంది. అందుకోసం దాదాపు 28 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 235 కోట్లు) పెట్టుబడులు కూడా సమకూర్చుకుంది.ఎండకు ‘సబ్స్క్రిప్షన్’ ‘‘మేము శిలాజ ఇంధనాల (పెట్రోల్, బొగ్గు) స్థానంలో ప్రపంచం మొత్తానికి ఈ అద్దాల కాంతితో విద్యుత్తును ఇస్తాం చూడండి..’’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాస్ బెన్ నోవాక్ ధీమాగా చెబుతున్నారు. ఆయన చెబుతున్న దానిని బట్టి 2027 నాటికి మరో రెండు మోడల్ అద్దాలు పైకి పంపిస్తారు. 2028 నాటికి ఏకంగా 1,000 పెద్ద సైజు అద్దాల ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపాలని చూస్తున్నారు. మొత్తం మీద ఆకాశంలో అద్దాలు అనే కొత్త నక్షత్రాలను మనం చూడబోతాం అన్నమాట. ఈ కంపెనీ ఉత్సాహం చూస్తుంటే భవిష్యత్తులో ఓటీటీ రీచార్జ్ లానే ఎండను కూడా చందా కట్టి కొనుక్కునే అవకాశం కల్పించేలా ఉంది. ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ కంపెనీ 2030 నాటికి 5,000 అద్దాలు, 2035 నాటికి ఏకంగా 50,000 అద్దాలను అంతరిక్షంలో పరచాలన్న కృత నిశ్చయంతో ఉంది. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ ప్రస్తుత అంచనాల ప్రకారం, రాత్రిపూట మనకు ఒక గంటసేపు సూర్యకాంతి కావాలంటే సుమారు 5,000 డాలర్లు (రూ. 4,62,000) చెల్లించాలి. అది కూడా కనీసం 1,000 గంటల ఒప్పందం చేసుకుంటేనే అంత తక్కువ ధర అట! ఇక, సోలార్ ప్లాంట్ యజమానులతో కూడా – ‘‘మేము రాత్రి పూట మీకు వెలుగు ఇస్తాం. దాని ద్వారా మీరు తయారు చేసే కరెంటు లాభాల్లో మాకు వాటా ఇవ్వండి’’ అని డీల్ కుదుర్చుకోబోతున్నారు.‘పొద్దు కుదరని’ ప్రమాదం!ఎన్ని ప్రయోజనాలున్నా, తక్కిన శాస్త్రవేత్తలు మాత్రం ఈ ప్రయోగాన్ని ‘సర్కాడియన్ రిథమ్’ (నిద్ర, మెలకువల లయ)పాలిట శాపంగా చూస్తున్నారు. మన శరీరంలో ఒక జీవ గడియారం ఉంటుంది. చీకటి పడగానే నిద్రపోవాలని, వెలుగు రాగానే లేవాలని అది చెప్తుంది. రాత్రి పూట అద్దాల వెలుగు వస్తే ఆ గడియారం దెబ్బతింటుంది. మన ఆరోగ్యాన్నీ దెబ్బ తీస్తుంది. ఇది అక్కడితో ఆగదు. జంతువులు ఆహారం దొరకని సమయంలో పిల్లల్ని కనడం, శీతకాలంలో నిద్రావస్థలోకి వెళ్లే జంతువులు మధ్యలోనే మేల్కొనడం వంటి ప్రకృతి విరుద్ధమైన పరిణామాలు సంభవిస్తాయి. ఎక్కడెక్కడికో వలస వెళ్లే పక్షులు ఈ కృత్రిమ వెలుగును చూసి ‘వేసవి కాలం వచ్చేసింది’ అని పొరబడి, చలి తీవ్రంగా ఉన్న చోట్లకు వెళ్లి ప్రాణాలు వదిలే ప్రమాదం ఉంది.. తేనెటీగలకు, పూలకు ‘పొద్దు’ కుదరక, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది.పైలట్లు తికమక పడొచ్చుమనుషుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఆకాశంలో హఠాత్తుగా మెరిసే ఈ అద్దాల వెలుగు విమాన పైలట్లను అయోమయానికి గురి చేయవచ్చు. టెలిస్కోపుల ద్వారా అంతరిక్షాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఈ అద్దాలు పెద్ద అడ్డంకిగా మారవచ్చు. ఆరోగ్యం విషయానికొస్తే, రాత్రి పూట కూడా వెలుగు ఉంటే మన శరీరంలో నిద్రకు కారణమయ్యే హార్మోన్లు విడుదల కావు. ఫలితంగా ఇన్సోమ్నియా (నిద్రలేమి) వంటి రోగాలు దరి చేరవచ్చు. ఇవన్నీ అలా ఉంచి, ఈ ప్రయోగం వల్ల మొత్తంగా చీకటి మాయమైపోయే ప్రమాదం ఉందని ‘డార్క్ స్కై’ అనే సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఖగోళ శాస్త్రవేత్తల కలవరం!ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశంలో వేల సంఖ్యలో పరిభ్రమిస్తు్తన్న ఉపగ్రహాల వల్ల నక్షత్రాలను, గ్రహాలను సరిగ్గా చూడటం వారికి కష్టమవుతోంది. ఒక పక్క స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు తమ శాటిలైట్లు తక్కువ వెలుగును ప్రతిబింబించేలా (వీటిని డార్కర్ శాటిలైట్స్ అంటారు) ప్రయత్నిస్తుంటే, ఈ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ వాళ్లు మాత్రం తమ శాటిలైట్లను వీలైనంత ఎక్కువ మెరిసేలా అమర్చబోతున్నారు. మరోవైపు, టెలిస్కోపులతో తీసే అంతరిక్ష ఫోటోల్లో ఈ అద్దాల వెలుగు ఒక తెల్లటి గీతలా పడి, అసలైన నక్షత్రాల సమాచారాన్ని మింగేసే ప్రమాదం ఉందని కూడా శాస్త్రవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం నుండి కాంతి కాలుష్యంప్రిన్స్ టన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ గ్యాస్పర్ బాకోస్ ఈ అద్దాల ఆలోచనపై నిప్పులు చెరుగుతున్నారు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ వాళ్లు.. ‘‘మేము కేవలం ఒక చిన్న ప్రదేశంలోనే (సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణం) వెలుగు వచ్చేలా చూస్తాం, పక్కన ఉన్న టెలిస్కోపుల జోలికి వెళ్లము’’ అని నమ్మకంగా చెబుతున్నప్పటికీ, ‘‘ఆకాశం నుండి వచ్చే కృత్రిమ అద్దాల కాంతి.. వాతావరణంలోని మేఘాలు, గాలి కణాల వల్ల అటు ఇటు చెల్లాచెదురు అవుతుంది. దీనివల్ల ఆ ప్రాంతం చుట్టూ ఒక పెద్ద ‘లైట్ పొల్యూషన్’ ఏర్పడుతుంది. ఇది ఖగోళ పరిశోధనలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది’’ అని ప్రొఫెసర్ గ్యాస్పర్ అంటున్నారు. ‘‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్ లాంటి కంపెనీలను అంతరిక్షంలో అద్దాలు పెట్టకుండా ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఇది మన పర్యావరణానికి చాలా రకాలుగా హాని కలిగిస్తుందని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. ఏమైనా, ఈ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీకి అమెరికా ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతుందా, లేక శాస్త్రవేత్తల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.ఉపయోగాలు అనేకం!అంతరిక్షంలో అద్దాలు బిగించి, సూర్యకాంతిని భూమి పైన ఉన్న వారికి డెలివరీ చేయటం అనే ఈ ఐడియా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా సన్నివేశంలా ఉన్నప్పటికీ, ఇది కనుక నిజంగా కార్యాచరణలోకి వస్తే, దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని రిఫ్లెక్ట్ ఆర్బిటర్ చెబుతోంది. రాత్రి పూటాసౌర శక్తి ఉత్పత్తిసోలార్ ప్యానెల్స్ రాత్రిపూట కరెంట్ తయారు చేయలేవన్నది తెలిసిందే. కానీ ఈ అద్దాలు ఉంటే, రాత్రి కూడా సూర్యకాంతిని ప్యానెల్స్ మీద వేసి 24 గంటలూ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. అంటే సోలాన్ విద్యుత్తును నిల్వ ఉంచే బ్యాటరీల అవసరం తగ్గుతుంది.విపత్తు సమయాల్లో వెలుగుభూకంపాలు, వరదలు, దుర్ఘటనలు రాత్రివేళ సంభవించినప్పుడు కరెంట్ పోయి అంతా చీకటిగా ఉంటుంది. అలాంటి సమయాల్లో గాలింపు చర్యల బృందాలకు ఆకాశం నుండే వెలుగు అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు.వేగంగా ప్రాజెక్టు పనులుమారుమూల ప్రాంతాల్లో మైనింగ్ లేదా నిర్మాణ పనులు జరిగేటప్పుడు, రాత్రి పూట కూడా పగలు మాదిరిగానే పని చేసుకోవడానికి ఈ అద్దాల వెలుగు ఉపయోగపడుతుంది. పని గంటలు పెరుగుతాయి, ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి.సైన్యానికి బాసటగా..!మిలిటరీ ఆపరేషన్లు జరిగేటప్పుడు నిరంతరాయంగా సోలార్ పవర్ అందించడానికి, చీకటిలో శత్రువుల కదలికలను కనిపెట్టడానికి ఈ అద్దాల వెలుగును వాడుకోవచ్చు.వ్యవసాయానికీ పండగేమొక్కల ఎదుగుదలకు సూర్యరశ్మి ముఖ్యం. కాబట్టి పంట కాలాల వ్యవధిని పెంచడానికి, మొక్కలకు కావాల్సినంత వెలుగును అందించి దిగుబడిని పెంచడానికి దర్పణకాంతిని వాడుకోవచ్చు.నగర వీధులు కళకళరోడ్ల మీద వేల సంఖ్యలో స్ట్రీట్ లైట్లు పెట్టే బదులు, నేరుగా పై నుండే వెలుగును వాడుకోవచ్చు. అంతేకాదు, దీనివల్ల భూమి మీద ‘లైట్ పొల్యూషన్’ తగ్గుతుందని కూడా ఈ కంపెనీ అంటోంది.కాంతులీనే వేడుకలుపెద్ద పెద్ద ఈవెంట్లు, బహిరంగ కార్యక్రమాలు, పర్యాటక క్షేత్రాలలో రాత్రి పూట ఒక వింతైన అనుభూతిని కలిగించడానికి ఈ ఆర్టిఫిషియల్ సన్ లైట్ ను వాడుకోవచ్చు. -సాక్షి స్పెషల్ డెస్క్ -
ఐశ్వర్య పయనం!
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి ఐశ్వర్య అర్జున్. అతికొద్ది రోజుల్లోనే తన నటనతో మెప్పించి ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. ఇప్పుడు తెలుగు తెరపై ‘సీతా పయనం’ మొదలుపెట్టింది. ఆ ప్రయాణంలోని విశేషాలు ఆమె మాటల్లోనే మీకోసం...క్రమశిక్షణ నా బలంక్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరగడం వల్ల కావచ్చు, క్రమశిక్షణ అనేది నా రక్తంలోనే ఉంది. ఫిట్నెస్ విషయంలో కూడా నేను చాలా కట్టుదిట్టంగా ఉంటాను. యోగా చేయకుండా నా రోజు గడవదు.విమర్శలే ఇష్టంసోషల్ మీడియాలో నా గురించి వచ్చే వార్తల కంటే, నా పని గురించి వచ్చే విమర్శలనే నేను ఎక్కువగా ఇష్టపడతాను. అవే మనల్ని మంచి నటిగా మారుస్తాయని నమ్ముతాను.నాన్న చాలా స్ట్రిక్ట్బెంగళూరులో పుట్టాను. కాని, నా విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది. సేక్రెడ్ హార్ట్ స్కూల్, తర్వాత స్టెల్లా మేరీస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశాను. ఫ్యామిలీ మొత్తం సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నా, చదువు విషయంలో నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు.వెనుక పెద్ద పేరు ఉన్నా...వెనుక ‘అర్జున్ సర్’ అనే పెద్ద పేరు ఉండొచ్చు. కాని, సెట్స్లోకి వెళ్లినప్పుడు నేను కేవలం ఒక నటిని మాత్రమే. ‘పట్టాతు యానై’తో నా ప్రయాణం మొదలైనప్పుడు నాన్న చెప్పిన ఒకే మాట ఇప్పటికీ గుర్తుంది ‘‘నువ్వు చేసే పనికి వంద శాతం న్యాయం చెయ్, మిగిలింది ప్రేక్షకులు చూసుకుంటారు.’’ ఆ మాటలను ఇప్పటికీ పాటిస్తాను.ఫ్యాషన్ పై ఆసక్తియూకేలోని బర్మింగ్హామ్ సిటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. గ్లామర్ ప్రపంచంలోకి రాకపోయి ఉంటే, నేను కచ్చితంగా ఒక ఫ్యాషన్ డిజైనర్గా స్థిరపడేదాన్ని. అందుకే నా దుస్తుల ఎంపికలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.ఇంటి వంటలంటే ఇష్టంఎన్నో రకాల ఇంటర్నేషనల్ వంటకాలు తిన్నా, ఇంట్లో చేసే వేడి వేడి అన్నం, పప్పు రుచే వేరు. వీకెండ్స్లో నా చెల్లెలు అంజనతో కలిసి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తుంటాను. అలాగే నాన్నతో కలిసి అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటాను.నటిగా మరింత ముందుకుపవర్ఫుల్, ఎమోషనల్ పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటిగా నన్ను నేను నిరూపించుకునే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాను. -
అదే గ్లామర్ డిసైడర్!
సహజమైన అందం, కంఫర్ట్ ఫ్యాషన్ తోనే గ్లామర్కి కొత్త నిర్వచనం ఇస్తూ, తనదైన గ్రేస్తో ప్రతి లుక్ను ప్రత్యేకంగా మలుస్తోంది నటి రుక్మిణి వసంత్. ఇందుకోసం ఆమె పాటించే ఫ్యాషన్ టిప్స్ ఇప్పుడు మీకోసం...లెహంగా.. స్టయిలింగ్: రుతుజ స్టయిల్స్జ్యూలరీ బ్రాండ్: కుందన్కలీ జ్యూలరీ ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.సింప్లిసిటీనే నా సూపర్పవర్. హెవీ మేకప్ కంటే కాన్ఫిడెన్స్ ఇచ్చే మెరుపు అసలైన గ్లామర్ని డిసైడ్ చేస్తుంది. ఇక ఫ్యాషన్లో నాకు హెరిటేజ్ టచ్ను మోడ్రన్ గా క్యారీ చేయడం ఇష్టం. – రుక్మిణి వసంత్.రంగురంగుల హారం!ఏ డ్రెస్లోకైనా ఇట్టే మ్యాచ్ అయ్యే ఆల్–ఇన్ –వన్ హారం కావాలా? అయితే ఈ మల్టీ కలర్డ్ నెక్పీస్ మీ వార్డ్రోబ్లో ఉండాల్సిందే! మెడపై ఒక్కసారి రంగుల హరివిల్లు విరిసినట్టే అనిపిస్తుంది. ఒక్క రంగులోనే కాదు, ఎన్నో రంగులు కలిసిన ఈ హారం ఏ ఔట్ఫిట్కైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది. అయితే, ఈ హారం వేసుకుంటే ఇయర్రింగ్స్ సింపుల్గా ఉండాలి. లేకపోతే మీ లుక్ కంటే జ్యూలరీ మీపై ఓవర్టేక్ చేస్తుంది! అలాగే, నెక్లైన్ సింపుల్గా ఉంటేనే ఈ హారం ఫుల్గా షైన్ అవుతుంది. హై నెక్తో అయితే అది కొంచెం ‘హైడ్ అండ్ సీక్’ ఆడేస్తుంది, కాబట్టి అప్పుడు దీనిని అవాయిడ్ చేయడం మంచిది.హెయిర్ ఓపెన్ గా కంటే, బన్ లేదా జడగా కట్టుకుంటే ఈ హారం క్లియర్గా హైలైట్ అవుతుంది. అప్పుడు ఫొటోలలో కూడా ఫుల్ మెరుపే మీదే! చేతిలో పెద్దగా ఆభరణాలు పెట్టకపోయినా పర్లేదు; ఒక్క ఈ రంగురంగుల హారం చాలు మీ మొత్తం లుక్ని హైలైట్ చేసేస్తుంది. మార్కెట్లో సింపుల్ నుంచి గ్రాండ్ వరకు ఎన్నో డిజైన్లలో అందుబాటులో ఉండటంతో, ప్రతి స్టయిల్ ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ దొరుకుతుంది. -
మృత్యువుపై ఘనవిజయం... క్రీస్తు పునరుత్థానం
ఈస్టర్ ఓ జయధ్వని; ఈస్టర్ ఓ ఆశల హారం; ప్రతి హృదయంలో వికసించిన ప్రేమ పరిమళం. సమాధి తలుపులు తెరిచి దివ్యవర్చస్సుతో క్రీస్తు నిలిచిన రోజు. ప్రతి హృదయంలో ప్రేమ సందేశం మార్మోగుతున్న సమయం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మనిషిని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది.యేసుక్రీస్తు జీవితం ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తెచ్చింది. ప్రేమ, దయ, వినయం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా; పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి; కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా; పరమాత్ముని బాటలో నడవాలని బైబిల్ ప్రబోధిస్తు్తంది. మొదటి శతాబ్దకాలంలో ఇశ్రాయేలు దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో పౌలు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు యూదుజాతిలో పేరెన్నికగలవాడు. తార్సు ప్రాంతంలో జన్మించి ధర్మశాస్త్రంలో అమితాసక్తిని కలిగియుండి గమలియేలు అనే వ్యక్తి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. శరీరాకారంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడన్న సత్యంతో పౌలు మొదట్లో ఏకీభవించలేదు. క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న వారిపై అపరిమితమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. యేసు ‘క్రీస్తు’ కాదని వాదించుటే గాక, యేసుక్రీస్తును విశ్వసించినవారిని హింసించుటకు, దూషించుటకు ఇష్టపడ్డాడు.సిరియా దేశంలోని దమస్కు ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారని తెలిసి వారిని నాశనం చేయడానికి బయలుదేరాడు. దానికి యెరూషలేములోని క్రీస్తును ద్వేషించే మతపెద్దలు అంగీకరించారు. సరిగ్గా దమస్కు పొలిమేరకు చేరుకొనేసరికి మతగర్వంతో, ద్వేషంతో రగిలిపోతున్న పౌలుకు క్రీస్తు ప్రత్యక్షత దొరికింది. సమున్నతమైన క్రీస్తు రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తల్లిఒడిలో పరవశించే బిడ్డవలే దేవుని దివ్యరూపాన్ని చూసి పరవశించిపోయాడు. తన గత జీవిత దౌర్భాగాన్ని తలచుకొని కన్నీళ్ళు విడిచి నూతన వ్యక్తిగా మార్పు చెందాడు.ఈ విశిష్ట సంఘటనలను పౌలు స్వయంగా రోమన్ గవర్నర్ ఫేస్తు ముందు, రాజు అగ్రిప్ప ముందు వివరించాడు.ఒకానొక సందర్భంలో రోమా పట్టణంలో ఉన్న దేవుని ప్రజలకు ఓ పత్రిక వ్రాస్తూ యేసుక్రీస్తు మరణాన్ని గురించి ఇలా అన్నాడు: ‘మనుష్యులమైన మనమంతా బలహీనులముగా ఉన్నప్పుడే క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును గాని, మనమింకను పాపులమై యుండగానే యేసు మన కొరకు చనిపోయెను, సర్వశక్తుడైన దేవునితో సమాధానాన్ని గలిగి రక్షించబడు నిమిత్తం క్రీస్తు సిలువమీద మరణించాడు’. దేవుడు ప్రేమాస్వరూపి అనే బైబిల్ బోధకు ఋజువు క్రీస్తు సిలువ మరణమే. పౌలు మూడు సువార్తయాత్రలు చేశాడు. వాటిలో ప్రతిచోటా తాను ఎక్కువగా మాట్లాడింది, తన వ్రాతల్లో వ్రాసింది క్రీస్తు మరణ పునరుత్థానాలను గురించే!‘యేసుప్రభువు సిలువపై చనిపోయారా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారా?’ అని ప్రశ్నించే చాలామందికి ఇటలీ దేశంలోని ట్యురిన్ నగరంలో ఉన్న ట్యురిన్ వస్త్రం నిలువెత్తు నిదర్శనంగా ఉంది. యేసు చనిపోయిన తర్వాత ఆయన మీద ఒక విలువైన వస్త్రాన్ని కప్పారు. యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్ట చుడతారు. యేసు చనిపోయిన తరువాత ఆయనకు చుట్టబడిన వస్త్రం నేటికి ఉందని పండితులు నిర్థారించారు. ఒక మనిషి ఆకారం దానిలో కనబడుతుంది. అతని చేతుల్లో మేకులు గాయాలు ఉన్నాయి. అతని దేహమంతా కూడా తూట్లు తూట్లుగా ఎవరో విభజించినట్లు విపరీతమైన గాయాలు కనబడుతున్నాయి.శాస్త్రవేత్తలు ఈ వస్త్రాన్ని చాలా సంవత్సరాల తర్వాత కనుగొని, దానిమీద పరిశోధనలు చేశారు. ఈరోజుకు కూడా ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ వస్త్రాన్ని మనం చూడవచ్చు. క్రీస్తు మరణ పునరుత్థానములకు సాక్ష్యం ఆ వస్త్రం. చరిత్రలో చాలామంది ఆ వస్త్రాన్ని దొంగిలించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు కాని, వారి వల్ల కాలేదు. అయితే ఆ వస్త్రం యేసుకు సంబంధించినది కాదు, 12 లేదా 13వ శతాబ్దికి చెందిన వస్త్రమని వాదించేవారు లేకపోలేదు. వాస్తవమేమంటే క్రీస్తు ప్రభువు మీద కప్పబడిన వస్త్రం ఆ తర్వాత కాలంలో చాలామంది చేతులు మారడం వలన అక్కడక్కడ పాడైంది. కొంతమంది మఠకన్యలు క్రీ.శ . 1534లో పాడైపోయిన వస్త్రానికి ఎక్కడెక్కడ అయితే రంధ్రాలు పడ్డాయో అక్కడ బాగు చేశారు. ఆ కారణాన్ని బట్టి ఆ వస్త్రం అనేది 13వ శతాబ్దానికి చెందినదని చాలామంది భావించడానికి అవకాశం దొరికింది. ఇటలీలో ఉన్న ట్యురిన్ వస్త్రాన్ని కొందరు ‘ద ఫిఫ్త్ గాస్పెల్’ అని కూడా పిలుస్తారు. యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందు రోజు కొన్ని సంఘటనలు జరిగాయి. గెత్సేమనే తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. నేటికీ యెరూషలేములో గెత్సేమనే తోట ఉంది. దానిలోని కొన్ని ఒలీవ చెట్లు యేసుక్రీస్తు కాలానికి సంబంధించినవే. అక్కడ ఆయన ప్రార్థించిన రాయి కూడా ఉంది. దానిమీద ఓ గొప్ప దేవాలయం నిర్మించబడింది. దానిని ‘చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్’ అని పిలుస్తారు. ఇశ్రాయేలును సందర్శించే వారందరూ కచ్చితంగా వాటిని చూస్తారు. ఆ తోటలో శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను.అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తబిందువులుగా మారింది. వైద్య పరిభాషలో దానిని హెమటోహైడ్రోసిస్ అంటారు. ఒక వ్యక్తి అత్యంత తీవ్రమైన ఒత్తిడికి లోనైనపుడు అతని స్వేద రంధ్రాలనుండి రక్తం స్రవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు దేహం నుండి కూడా రక్తం స్రవించడానికి కారణం ఇదే. పొందబోయే ఆ భయంకర శిక్ష తీవ్రత గ్రహించినవాడై వేదనతో ప్రార్థించాడు. పండిత పురుషోత్తమ చౌదరి అనే కవి క్రీస్తు గెత్సేమనే అనుభవాన్ని ఓ అద్భుతమైన పాటలో ఇలా వర్ణించాడు. ‘శ్రమచేత తన దీన శరీరము నుండి దిగజార చెమట రక్తపు బొట్లుగా నమితమౌ లోకపాపము చూచి నిట్టూర్పులప్పటప్పటికి బుచ్చి క్రమముగా దూత తన కడకరుగుదెంచి శాంతము బల్కి చనిన పిదపం తమ మనంబుల బోలు తమసమున యూద సైన్యము లేగుదెంచెనపుడు గెత్సేమనే వనికి’. ‘అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను’ (యెష 53:8). జగద్రక్షకుడైన యేసుక్రీస్తు సిలువ మరణాన్ని గూర్చిన ప్రవచనాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో స్పష్టంగా చూడగలము. ఏడువందల సంవత్సరాలకు పూర్వమే రక్షకుని గూర్చిన సిలువ మరణంతో పాటుగా ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడతాడు అని తెలియచెప్పబడింది. కఠినమైన సిలువ మరణానికి ముందు ఆయన ఎందుకు తీర్పు తీర్చబడ్డాడు? ప్రభువు తీర్చబడిన తీర్పు అన్యాయమైనదిగా ఎందుకు ఎంచబడింది? ఇస్కరియోతు యూదా ద్వారా అప్పగింపబడిన యేసుక్రీస్తు ప్రభువు నేరుగా అన్న, కయపల యొద్దకు తీసుకొని రాబడ్డారు. వాస్తవానికి మొదట అన్న యొద్దకు ఆ తదుపరి కయప యొద్దకు కొనిపోబడ్డారు. ఈ విషయం లేఖనాల్లో రెండు చోట్ల ప్రస్తావించబడింది.(యోహాను 18:1224, మత్తయి 26:57) వీరిద్దరూ యేసును అవమానించారు, హేళన చేశారు. ఆయన మీద ఉన్న అక్కసును వెళ్ళగక్కారు. అక్కడ నుండి రోమన్ గవర్నర్ అయిన పొంతి పిలాతు నొద్దకు తీసుకొని వెళ్ళారు. క్రీస్తు ప్రభువు గలలియ ప్రాంతంలో పెరిగినవాడు గనుక హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని గ్రహించి పిలాతు హేరోదు నొద్దకు పంపెను.హేరోదు మొదట యేసును చూచి మిగుల సంతోషించాడు. ఎన్నో ప్రశ్నలు అడిగినప్పటికి యేసు అతనికి బదులియ్యలేదు. కాసేపటి తరువాత హేరోదు యేసు ప్రభువును తృణీకరించి అపహసించి పిలాతు నొద్దకు తిరిగి పంపివేశాడు. చివరగా పొంతి పిలాతు అన్యాయపు తీర్పు తీర్చి యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించాడు. యేసుక్రీస్తు అన్యాయపు తీర్పు ఎలా తీర్చబడ్డాడు?మానవ చరిత్రలో ఏ వ్యక్తిని పన్నెండు గంటలు వ్యవధిలో ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టలేదు. కాని, యేసుక్రీస్తును నిలువబెట్టారు. సిలువ మరణానికి ముందు యేసుక్రీస్తును యూదా మతపెద్దల ముందు మూడుసార్లు, రాజుల ముందు మూడుసార్లు నిలువబెట్టారు. అప్పటి కాలపు ప్రధాన యాజకుడైన కయప, అతని మామయైన మాజీ ప్రధాన యాజకుడు అన్న, యూదుల ఆలోచన సభయైన ‘సన్హెడ్రీన్’ ముందు యేసును దోషిగా నిలువబెట్టారు. యేసు తాను దేవుడనని, దేవుని కుమారుడనని ప్రకటించుకున్నాడు, మోషే ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా ప్రవర్తించాడన్నది వారు చేసిన నేరారోపణ. ఆ తదుపరి మూడుసార్లు రోమన్ న్యాయస్థానం ముందు నిలువబెట్టారు.రోమన్ కైసరుకు పన్నులు కట్టవద్దన్నాడని, ప్రజలను రోమన్ చక్రవర్తులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని, తాను రాజునని చెప్పుకొనుచున్నాడని యేసుక్రీస్తు మీద నేరారోపణ చేశారు. అయితే పిలాతు ఏ నేరమును కనుగొనలేకపోయాడు. ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టించాడు. చివరగా పస్కాపండుగ సమయంలో ఒక నేరస్థుని విడుదల చేయగలిగే అధికారాన్ని వినియోగించాలని చూచినా, ప్రజల ఒత్తిడికి లోనై సిలువ మరణాన్ని అమలు చేయడానికి ఒప్పుకున్నాడు. తన తీర్పులో న్యాయంలేదని తెలిసినా ‘ప్రజల’ కోసం అన్యాయ తీర్పును అమలుపరచాడు. ధర్మశాస్త్ర ప్రకారం పస్కా పండుగ సమయంలో ఎవరినీ తీర్పు తీర్చకూడదు, శిక్ష విధించకూడదు. అయితే జరిగిందేమిటి? యేసుక్రీస్తు విషయంలో తీర్పు తీర్చారు. మరణశిక్షను అమలు పరిచారు. అపొ.కా 12:4 ప్రకారం పేతురును చెరసాలలో పెట్టింది పస్కా పండుగ సమయంలోనే. అంతకుముందు యాకోబును ఖడ్గంతో చంపేశారు. పేతురును కూడా పట్టుకున్నారు. అయితే పస్కా సమయంలో శిక్ష అమలు చేయకూడదు కాబట్టి పేతురును చెరసాలలో పెట్టారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు, యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. అయితే అసలు వాస్తవం ధర్మశాస్త్రోపదేశకులు అని చెప్పుకొనేవారే ధర్మాన్ని అతిక్రమించారు. యూదుల ఆలోచన సభ లేదా న్యాయస్థానమైన సన్హెడ్రీన్లో గాని, రోమన్ కోర్టులో గాని నిబంధన ప్రకారం ఒక వ్యక్తి నేరస్థుడు అని తీర్పు వెలువడాలంటే ఆ న్యాయస్థానంలోని ప్రతి సభ్యుడు వారి వారి అభిప్రాయాలు తెలిపాక అందరి సమ్మతి, అంగీకారంతో శిక్ష అమలు చేయాలి. కాని యేసుక్రీస్తు ప్రభువు విషయంలో ప్రజల కేకలే గెలిచాయి.ఒక వేళ నేరం ఋజువై మరణశిక్ష విధించబడితే, అలా శిక్ష విధింపబడిన వ్యక్తికి కనీసం ఒక రోజు లేదా ఒక రాత్రి గడువును ఇవ్వాలి. ఆ వ్యక్తి మానసికంగా మరణానికి సిద్ధపడడానికి ఆ సమయం అవసరం. అయితే యేసుక్రీస్తు విషయంలో అలా కూడా జరగలేదు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత క్రూరమైన మరణాన్ని అమలుపరచారు. ఈ మానవ ప్రపంచ చరిత్రలో ఎంత భయంకర నేరస్థుడినైనా కూడా రాత్రివేళ న్యాయస్థానాల్లో నిలువబెట్టలేదు. నిబంధనల ప్రకారం చీకటి పడేలోపు తీర్పు వెలువరించాలి లేదా వాయిదా వేయాలి. అయితే యేసుక్రీస్తును ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టింది రాత్రివేళలోనే! ఇది అన్యాయం కాకపోతే మరేమిటి?ఏ దేశంలోనైనా ఏ న్యాయస్థానంలోనైనా నేరారోపణ ఎదుర్కొను వ్యక్తి తరుపున కనీసం మరొక వ్యక్తి వాదిస్తాడు. అటువంటి వ్యక్తి కోసం వాదించడానికి ఎవరూ లేకపోయినా, ఒకవేళ అడ్వొకేటుకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోయినా ప్రభుత్వం గాని, కోర్టువారు గాని ఆ వ్యక్తి కోసం వాదించడానికి ఒక ఉత్తరవాదిని నియమిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు కోసం వాదించేవారు ఒక్కడు కూడా లేడు. ఎన్నిసార్లు ప్రశ్నలు అడిగినా కొన్నింటికి సమాధానాలు చెప్పారు; కొన్ని సార్లు ఆయన నోరు తెరవలేదు. ఆయన పక్షాన వాదించే వ్యక్తి లేకపోయినా తీర్పు తీర్చేశారు. ఇదికూడా అన్యాయమే!న్యాయవంతుడైన దేవునికి ఈ లోకం అన్యాయపు తీర్పు తీర్చింది. దేవున్ని విడిచి, మరచి బతుకుతున్న కర్కశ సమాజం ఆఖరకు సృష్టికర్తనే అన్యాయానికి గురిచేసింది. కొన్నిసార్లు నాకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నావు కదూ! నీ ప్రభువునే విడిచిపెట్టలేదు ఈ లోకం. నీవు నేను ఓ లెక్కా ఈ పాషాణ సమాజానికి? అయితే యేసుక్రీస్తు అన్యాయపు తీర్పును ఎందుకు సహించాడు? నిలదీసి అడుగుతున్న వ్యక్తులకు సమాధానం చెప్పలేక యేసు మౌనంగా ఉండిపోలేదు, ఆయన ఓ అద్భుత కార్యం నెరవేర్చబోతున్నాడు కాబట్టే అన్యాయాన్ని సహించాడు. ఆయన సహించింది కేవలం నీకోసం, నాకోసం. తప్పు చేసినపుడు శిక్షను భరించడం సమంజసమే కాని, ఏ నేరం లేని నిర్దోషియైన ప్రభువు ఘోర శిక్షను భరించాడంటే ఏదో బలమైన కారణం ఉంది. అదే అవధులు లేని ఆయన ప్రేమ! శుభ శుక్రవారం రోజున యెరూషలేములోని కల్వరి కొండపై యేసు తన ప్రాణాన్ని సకలలోక పాప పరిహారార్థమై అర్పించారు. అమూల్యమైన ఏడు మాటలు సిలువలో పలికి తన ప్రాణాన్ని అర్పించారు. ‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’ అని క్షమాపణ ప్రాముఖ్యతను తెలిపాడు. ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు’ అని తన పక్కన వేలాడుచున్న దొంగతో మాట్లాడి నిత్యత్యపు పరమార్థాన్ని తెలిపాడు. ‘అమ్మా! ఇదిగో నీ కుమారుడు’ అని మరియమ్మతో పలికి తల్లి బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ‘ఏలీ ఏలీ లామా సక్తాని’ అని పలికి దేవునితో ఎడబాటు తీవ్రతను తెలిపాడు.‘దప్పిగొనుచున్నాను’ అని పలికి తాను మానవునిగా శ్రమను అనుభవిస్తున్నానని తెలిపాడు. ‘సమాప్తమైనది’ అని పలికి తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దాని అర్థాన్ని నెరవేర్చాడు. ‘తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’ అని పలికి రక్షింపబడిన వ్యక్తి గమ్యస్థానము దేవున్ని చేరుకొని శాశ్వత ఆనందాన్ని పొందడమే అనే సత్యాన్ని తెలిపాడు. క్రీస్తు సిలువలో పలికిన ప్రతి మాట సర్వలోకానికి ఓ అద్భుత సందేశమే! క్రీస్తు మరణం శాస్త్రీయంగా ధ్రువీకరించబడింది. వందలాదిమంది రోమన్ సైనికులు క్రీస్తును సిలువ వేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. యేసు విచారించి అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు గురించిన చారిత్రక విషయాలు ఈ మధ్య కాలంలో కైసరయలో బయటపడ్డాయి. ఆకాలంలో ప్రధాన యాజకుడైన కయపకు సంబంధించిన విషయాలను కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. యేసుప్రభువును బల్లెపుపోటు పొడిచినప్పుడు ఆయన దేహంలో నుండి రక్తం, నీళ్లు బయటకు వచ్చిన అంశాన్ని అనేకమంది శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఒక వ్యక్తి పూర్తిగా చనిపోయినప్పుడే ఆ వ్యక్తి దేహంలో నుంచి ఆ నీరులాంటి ద్రవం బయటకు వస్తుందని వారు కూడా ధ్రువీకరించారు.క్రీస్తు సిలువపై మరణించినప్పుడు అనేక అద్భుత సంఘటనలు చోటుచేసుకున్నాయి. అన్నింటిలోనూ ముఖ్యమైనది దేవాలయపు తెర చినిగిపోవుట. పాతనిబంధన కాలంలో నిర్మించబడిన దేవాలయంలో పరిశుద్ధ స్థలాన్ని అతిపరిశుద్ధ స్థలాన్ని వేరుచేయడానికి మూడు వందలమంది యాజకులచే తయారుచేయబడిన తెర ఉండేది. దాని మందం నాలుగు అంగుళాలు. మనుష్యులెవ్వరూ దానిని చింపలేనంత బలంగా ఉండేది. క్రీస్తు ప్రభువు మరణించగానే, ఆ తెర పైనుండి కిందకు చిరిగిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దాని అర్థం ‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. విశ్వాసంతో ఆయన్ను అంగీకరించే ప్రతి ఒక్కరూ ఆయన దివ్య సన్నిధిని ధారాళంగా అనుభవించవచ్చును. యేసుక్రీస్తు మరణించిన సిలువపై ‘ఐఎన్ఆర్ఐ’ అనే మాటలు ఒక పత్రంపై వ్రాయబడ్డాయి. సిలువ వేయబడిన వ్యక్తి చేసిన నేరమేంటో బాహాటంగా అందరికీ తెలిసేటట్లు ఒక పత్రంపై అలా వ్రాసి దానిని అతని తలకుపైగా సిలువమీద పెట్టేవారు. కాబట్టి క్రీస్తుకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు ‘నజరేయుడైన యేసు యూదులకు రాజు’ అనే పై విలాసాన్ని వ్రాయించి సిలువమీద పెట్టించాడు. అది హెబ్రీ, గ్రీకు, రోమా(లాటిన్) భాషలలో వ్రాయబడింది. పిలాతు పై విలాసాన్ని ఆ విధంగా వ్రాయించడం ప్రధాన యాజకులకు నచ్చలేదు. యూదులరాజు అనికాక, యూదుల రాజునని తాను చెప్పుకున్నాడు అని వ్రాయమని కోరారు. వ్రాయబడిన పైవిలాసాన్ని మార్చడానికి పిలాతు నిరాకరించాడు. కొన్ని విషయాలను మార్చడం ఎవరివల్లా కాదు అని ఋజువైంది.అలెగ్జాండర్ అనే వ్యక్తి ఈ విషయాలన్ని ఇలా వ్యాఖ్యానించాడు. ‘హెబ్రీ, గ్రీకు, లాటిన్ ఈ మూడు భాషలూ మూడు జాతులను, వారి భావాలైన ప్రత్యక్షత, కళ, సాహిత్యం, అభివృద్ధి, యుద్ధం, ధర్మశాస్త్రం అనువాటిని తెలియచేస్తున్నాయి. ఎక్కడయితే మానవజాతికి గల ఈ మూడు కోరికలు ఉనికిలో ఉంటాయో, ఎక్కడయితే మానవ భాషలో ప్రాచుర్యం సాధ్యపడుతుందో, ఎక్కడయితే పాపం చేయడానికి ఒక హృదయం ఉంటుందో, మాట్లాడడానికి నాలుక ఉంటుందో, చదవడానికి కన్ను ఉంటుందో అక్కడ సిలువ ఒక సందేశాన్ని కలిగి యుంటుంది. శుభశుక్రవారం రోజున క్రీస్తు సిలువపై మరణించిన తరువాత ఆ సాయంత్రం ఆయన్ను సిలువమీద నుండి క్రిందకు దించి అరిమతమయి యోసేపు అనే ధనికుని సమాధిలో ఉంచారు. వాస్తవానికి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. యోసేపు ప్రఖ్యాతిగాంచిన సన్హెడ్రీన్ సభ్యుడు గనుక పిలాతు అతని విన్నపాన్ని మన్నించి క్రీస్తు దేహాన్ని అప్పగించాడు. వాస్తవానికి యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తు ప్రభువుకు ఇచ్చివేశాడు. ఆ దినాల్లో ధనికులు తన మరణానికి ముందే తమ సమాధిని సిద్ధపరచుకొనేవారు. క్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడవరోజున సజీవుడై తిరిగిలేచాడు. బైబిల్ ప్రబోధించే అనేక దివ్యసత్యాల్లో ఒకటి క్రీస్తు పునరుత్థానము. మానవ చరిత్రలోనే ఓ అపూర్వ సంఘటన.వాస్తవానికి క్రీస్తు పునరుత్ధానం గూర్చి పాతనిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు, పోలికలు పుష్కలంగా ఉన్నాయి. ఆదికాండం మొదలుకొని మిగతా లేఖనాల్లో కూడా పునరుత్థానం గురించి తెలియపరచబడింది. లేవీయకాండం పదునాలుగవ అధ్యాయంలో రెండు పక్షులు కనబడతాయి. యేసులోని రెండు ప్రాముఖ్యమైన క్షణాలు ఆ పక్షులలో మనకు తారసపడతాయి. ఒక వ్యక్తికి కుష్ఠు వ్యాధి గనుక వస్తే ఆ వ్యాధి తగ్గేంతవరకు పాళెమునకు వెలుపల జీవించాలి. తన్ను తాను ప్రత్యేకించుకుని ప్రజలకు దూరంగా నివసించాలి. కనీసం తమ ఇంటివారితో కూడా కలవకూడదనే నిబంధన ఉండేది.కొంతకాలానికి ఆ వ్యక్తికి కుష్ఠు తగ్గినట్లు అతడు భావిస్తే దానిని నిర్ధారించడానికి ఆ కాలంలో ఉండే ప్రధాన యాజకునికి తన్నుతాను కనుపరచుకోవాలి. ఒకవేళ రోగి యొక్క దేహమును పరిశీలించి రోగము నుండి అతని దేహము బాగుపడిందని ప్రధాన యాజకుడు నిర్ధారిస్తే ఆ వ్యక్తి పవిత్రుడుగా కొనసాగేవాడు. తిరిగి సమాజంలో కలిసేందుకు ముందు ఆ వ్యక్తి రోగము నుండి విడుదల పొందాక ప్రధాన యాజకుడు నియమించిన ధర్మశాస్త్ర కట్టడి ప్రకారం అతడు రెండు పక్షులు తీసుకురావాలి. అవి సజీవమైన పక్షులై ఉండాలి. సదరు వ్యక్తి వాటిని యాజకుని యొద్దకు తీసుకువచ్చిన తర్వాత ఒక పక్షిని మట్టి పాత్రలో పెట్టి చంపాలి. చంపిన తర్వాత ఆ పాత్రలోని రక్తాన్ని ఎవరైతే పవిత్రత పొందాలి అని అనుకుంటున్నారో అతని మీద ఏడుసార్లు ప్రోక్షించాలి.అలా చేసిన తర్వాత ఆ మిగిలిన రెండో పక్షిని ఆ రక్తంలో ముంచి ఆ రక్తపు ముద్రలు దానిమీద ఉండగానే దానిని విడిచి పెట్టాలి. ప్రస్తావించబడిన ఆ రెండు పక్షులు యేసుప్రభువు జీవితంలోని రెండు ప్రధానమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక పక్షి మట్టి పాత్రలో చంపబడింది. మట్టి పాత్ర యేసయ్య మంటి దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చాడు అని సూచిస్తుంది. మట్టి పాత్రలో చంపబడిన ఆ పక్షి యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు అనేదానికి ఒక సూచనగా కనబడుతుంది. ఆయన మరణించడం ద్వారా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న ఒక మనిషికి ఆయన రక్తాన్ని ఆ మనిషి మీద ప్రోక్షించడం ద్వారా ఆయన మరణం ద్వారా విడుదల అనేది కలిగిందని ఆ రెండో పక్షి సూచిస్తుంది. విడిచిపెట్టబడిన రెండవ పక్షి క్రీస్తు పునరుత్థానమును సూచిస్తుంది.‘‘మరియు క్రీస్తు లేపబడియుండిన యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే’’ (1 కొరింథీ 15:14). యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచాడా? అన్నది ఈ రోజుల్లో అనేకుల మదిలో మెదలుతున్న ప్రశ్న! అసత్యానికి, సత్యానికి మధ్య ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరు వాదించే అంశాలు చాలా విడ్డూరంగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. వాస్తవాన్ని దాచిపెట్టి, అసత్యాన్ని ప్రతిబింబించేలా అపవాది వారిని ప్రోత్సహిస్తున్నాడు అనుటలో ఏ సందేహం లేదు. యేసుక్రీస్తు సిలువపై మరణించలేదని, సుగంధ ద్రవ్యాలు పూసి, ఔషధాలు ఇచ్చి, స్పృహ కోల్పోయిన వ్యక్తిని బ్రతికించారని; ఆ తదుపరి ఆయన మగ్దలేనే మరియను పెండ్లి చేసుకొన్నాడని; కొందరైతే ఆయన కాశ్మీర్ వచ్చాడని రకరకాల కథలు చెబుతూవున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పటివేమీ కాదు. మొదటి శతాబ్దం నుండి ఉన్నవే. శిష్యులు ఆయన దేహమును ఎత్తుకొనిపోయి దాచిపెట్టి మృత్యుంజయుడైనాడని ప్రకటించారని వారి వాదన. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు సమాధి దగ్గర ఉంచినంత కావలివారిని బహుశా ఎవరి సమాధి దగ్గర పెట్టలేదేమో! ఆ తరువాతి కాలంలో ఒక్క యోహాను తప్ప క్రీస్తు శిష్యులందరూ పునరుత్థానాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ ప్రపంచం నలుమూలల హతసాక్షులయ్యారు. ఈస్టర్ శుభదినాన అనేక క్రైస్తవ సంఘాల్లో మిక్కిలి సమూయేలు వ్రాసిన ఈ భక్తిగీతాన్ని ఆలపిస్తారు. క్రీస్తు పునరుత్థాన సత్యాన్ని కీర్తిస్తారు. ‘యేసు పునరుత్థానమాయెను... చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలన్బరవాసులుగ దాజేయు నిప్పుడు’. యేసుక్రీస్తు జీవితాన్ని అద్భుతంగా వివరించే నాలుగు సువార్తలు బైబిల్లో ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ నాలుగు సువార్తలలో క్రీస్తు పునరుత్థానం గూర్చి చాలా స్పష్టంగా వివరించబడింది. శిష్యులైన మత్తయి, యోహానులు క్రీస్తు పునరుత్థానానికి ప్రత్యక్ష సాక్షులు. వైద్యుడైన లూకా రెండు గ్రంథాలను వ్రాశాడు. యేసుక్రీస్తును సమాధిలో పెట్టిన తరువాత విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లియైన మరియయు, సలోమేయు సుగంధ ద్రవ్యములను కొని తమ దగ్గర ఉంచుకున్నారు. ఆదివారం పెందలకడ లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి దగ్గరకు వస్తూ సమాధి ద్వారము నుండి మనకొరకు ఎవరు ఆ రాయిని పొర్లించును అని మాట్లాడుకున్నారు. ఆ రాతికి రోమా వారు ముద్రవేసి సైనికులను కావలి ఉంచారని కూడా వారికి తెలుసు. అయితే వారు వచ్చి చూసేసరికి అప్పటికే రాయి దొర్లించి ఉంది. రాయి దొర్లింపబడకుండా కూడా పునరుత్థానుడైన క్రీస్తు బయటకు వచ్చుండేవాడే కానీ మనుష్యులు లోపలికి వెళ్ళి పునరుత్థానం గూర్చి సాక్ష్యమిచ్చునట్లుగా రాయి దొర్లించబడింది.వారు సమాధిలో ప్రవేశించి నిలువుటంగీ ధరించిన ఒక పడుచువానిగా కనిపిస్తున్న ఒక దేవదూతను చూశారు. ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడని చెప్పి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి అద్భుతమైన కొన్ని విషయాలను వారికి తెలియచేశాడు. యోహాను భక్తుడు తాను వ్రాసిన సువార్తలో క్రీస్తు పునరుత్థాన ప్రత్యక్షలను చాలా స్పష్టంగా వివరించాడు. మగ్దలేనే మరియ క్రీస్తు పునరుత్థానుడయ్యాడన్న సత్యాన్ని పేతురు, యోహానులకు తెలిపింది. వారు పరుగెత్తుకుంటూ సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి ఖాళీగా ఉంది. సమాధి లోపల నారబట్టలు పడియుండడం చూశారు.ఇక్కడ ఓ ప్రత్యేకమైన విషయాన్ని యోహాను ప్రస్తావించాడు. క్రీస్తు ప్రభువు తలకు చుట్టబడిన రుమాలు నారబట్టల యొద్ద ఉండకుండా వేరుగా ఒకచోట చుట్టిపెట్టి యుండడం చూశారు. యేసుక్రీస్తు సమాధి నుండి ఏదో తొందరపాటుతో వెళ్ళిపోలేదని, అక్కడ జరిగిన సంఘటనలన్నియు ఒక పద్దతి ప్రకారం జరిగాయని చూపడానికి ఈ వివరణ అందించబడింది. ఒకవేళ క్రీస్తు దేహాన్ని ఎవరైనా ఎత్తుకుపోయినా, వారు తల రుమాలును ఇంత జాగ్రత్తగా చుట్టిపెట్టి ఉంచరు. పునరుత్థానం జరిగిన ఆదివారం సాయంత్రం శిష్యులందరూ సమావేశమయ్యారు. వారిలో ఏదో తెలియని కలవరం, భయం ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. భయం వలన వారు కూడియున్న గది తలుపులు గట్టిగా బిగించుకొనియున్నారు. అకస్మాత్తుగా క్రీస్తు వారి మధ్య నిలిచి ‘‘మీకు సమాధానం కలుగును గాక’’ అని ప్రకటించాడు. వారికి ఏది అవసరమో ఆయనకు తెలుసు కదా. తలుపులు తెరవకుండానే లోపలికి ప్రవేశించడం క్రీస్తు మహిమ. దేహాన్ని కలిగియుండుట వలన అది సాధ్యమయింది. యేసు చేసిన ప్రతి పనిలోనూ మనిషికి సమాధానం అనుగ్రహించడం చూస్తాం. ప్రస్తుత రోజులో మనిషికి అన్నీ ఉన్నాయి గాని, నిజమైన సమాధానం లేదు. వ్యక్తిగతంగా మనశ్శాంతి లేకపోవడం, కుటుంబంలో కలహాలు, సమాజంలో గొడవలు, రాజ్యం మీదకి రాజ్యాలు లేవడం సర్వసాధారణంగా కనబడుతూనే ఉన్నాయి. నిజమైన శాంతి సమాధానాలు మనిషికి ఎక్కడ లభిస్తాయి? దేవుడు సమాధానకర్త గనుక ఆయన్ను ఎవరైతే తమ హృదయాలలోనికి ఆహ్వానిస్తారో వారికి సమాధానం, పాపక్షమాపణ, ఆత్మరక్షణ, మోక్షరాజ్యం లభిస్తాయని బైబిల్ ప్రబోధిస్తుంది. పాప పశ్చాత్తాపంతో నూతన జీవితాన్ని ఆకాంక్షిస్తూ క్రీస్తు సిలువ చెంతకు చేరి ఆయన దివ్య చరణాలను ఆశ్రయించి ఆయన రక్తం ద్వారా తమ పాపములను కడుగుకొని, క్రీస్తు అనుగ్రహించు పునరుత్థాన శక్తితో జీవితయాత్రలో ఒక గమ్యాన్ని కలిగి విశ్వాసంతో సాగిపోవడం ద్వారా సర్వశక్తుడైన దేవుని మహిమపరచగలము అని క్రైస్తవులు విశ్వసిస్తారు. యేసు వారిని ఎదుర్కొని వారికి శుభమని చెప్పెను అని వ్రాయబడినట్లుగా ఈ మాటలు చదువుచున్న ప్రతి ఒక్కరికి ప్రేమమయుడైన క్రీస్తు ప్రభువు కృపాసింహాసనం నుండి అన్ని విషయాల్లో శుభం కలుగును గాక. ఈస్టర్ శుభాకాంక్షలు.‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. విశ్వాసంతో ఆయన్ను అంగీకరించే ప్రతి ఒక్కరూ ఆయన దివ్య సన్నిధిని ధారాళంగా అనుభవించవచ్చును.మానవ చరిత్రలో ఏ వ్యక్తిని పన్నెండు గంటలు వ్యవధిలో ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టలేదు. కాని, యేసుక్రీస్తును నిలువబెట్టారు. శుభశుక్రవారం రోజున క్రీస్తు సిలువపై మరణించిన తరువాత ఆ సాయంత్రం ఆయన్ను సిలువమీద నుండి క్రిందకు దించి అరిమతయయి యోసేపు అనే ధనికుని సమాధిలో ఉంచారు. వాస్తవానికి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. యోసేపు ప్రఖ్యాతిగాంచిన సన్హెడ్రీన్ సభ్యుడు గనుక పిలాతు అతని విన్నపాన్ని మన్నించి క్రీస్తు దేహాన్ని అప్పగించాడు. వాస్తవానికి యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తు ప్రభువుకు ఇచ్చివేశాడు.యేసు పునరుత్థానమాయెను... చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలన్బరవాసులుగ దాజేయు నిప్పుడు. డా. జాన్ వెస్లీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమహేంద్రవరం -
హోమియోలో మనమే టాప్
ప్రపంచంలోని ప్రధాన వైద్యవిధానాల్లో ఒకటైన హోమియోపతికి పుట్టినిల్లు జర్మనీ. పద్దెనిమిదో శతాబ్ది చివరినాళ్లలో జర్మన్ వైద్యుడు శామ్యూల్ హానిమన్ ఈ వైద్యవిధానాన్ని రూపొందించాడు. తొలినాళ్లలో ఆనాటి వైద్యుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నా, హానిమన్ తన ప్రాక్టీసు కొనసాగించాడు. ఆయన వద్దకు రోగులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేవారు. వార్ధక్యంలో జర్మనీని విడిచిపెట్టి 1835లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్కు వలసవెళ్లిపోయి, అక్కడే తాను 1843లో మరణించేంత వరకు విజయవంతంగా ప్రాక్టీసు కొనసాగించాడు. జర్మనీలో పుట్టిన హోమియో వైద్య విధానం యూరోపియన్ మిషనరీల ద్వారా పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో భారత్లోకి అడుగుపెట్టింది. గడచిన రెండు శతాబ్దాల కాలంలో భారత్ హోమియో వైద్యానికి ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా హోమియో వైద్యులు, రోగుల సంఖ్యలో టాప్–5 దేశాలను ఒకసారి పరిశీలిద్దాం... -
రూ.500 లంచం... 36 ఏళ్లు పోరాటం... ఏడాది జైలు
అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తిమింగలాలతో పోలుస్తారు. తాజాగా అనకొండలను చేర్చారు. ఏ జంతువుతో పోల్చినా, కేసులు నమోదు చేస్తున్నా, కొన్ని ప్రభుత్వ శాఖల్లో ‘పైసా వసూల్’ కానిదే ఫైలు కదలదు, పని జరగదు. లంచం తీసుకోవడం తమ ప్రాథమిక విధుల్లో భాగమని, ఇవ్వడం ప్రజల బాధ్యతని కొంతమంది ఉద్యోగులు భావిస్తుంటారు. అంటే, ‘డ్యూటీకి వచ్చినందుకు జీతం... పనిచేయాలంటే లంచం’ మెజార్టీ ఉద్యోగులు ఇలానే ఉన్నారు. అడిగింది ఇచ్చేదాకా వేధిస్తుంటారు. అడ్డంకులు సృష్టిస్తుంటారు. అయితే, అందరూ వీటిని భరించరు. హక్కుగా పొందాల్సిన సేవలకు లంచం ఇవ్వరు. అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తారు. లంచగొండులను పట్టిస్తారు. ఇలా ఓ ఉద్యోగి దొరికాడు. కేసులో ఇరుక్కున్నాడు. చిన్న మొత్తమే కదా బయట పడతాననుకున్నాడు. కోర్టుల చుట్టూ తిరిగాడు. కాళ్లరిగాయి, ఏళ్లు గడిచాయి. చివరికి న్యాయం గెలిచింది. అవినీతికి శిక్ష ఖరారైంది. కానీ చాలా ఆలస్యమైంది.అది 1990... ఉత్తరాఖండ్లోని ఉద్ధమ్సింగ్ నగర్కి చెందిన రాజ్బహుదూర్ సింగ్ ఎక్సైజ్ కానిస్టేబుల్. ఓ గ్రామంలో తనిఖీలకు వెళ్లాడు. అక్రమ మద్యం ఉందంటూ ఓ వ్యక్తితో బలవంతంగా కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. లంచంగా రూ. 500 డిమాండ్ చేశాడు. అడిగింది ఇవ్వకపోతే కేసు కోర్టుకు పంపుతానని బెదిరించాడు. వేధింపులు భరించలేక వ్యాపారి విజిలెన్స్ శాఖ ఎస్పీని కలిశాడు. జరిగింది చెప్పాడు. దీంతో వలపన్నారు. కానిస్టేబుల్ను రెస్టారెంట్కు రప్పించారు. డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. మూడు కోర్టులు... ముప్పయ్యారేళ్లుతొలుత ట్రయల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కోర్టు ఇద్దరు ప్రధాన సాక్షులను విచారించింది. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 7, సెక్షన్ 13(2) కింద మార్చి 2006లో శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్లు జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించింది. ఈ కోర్టులో కేసు 16 ఏళ్లు నడిచింది. ఈ తీర్పుపై నిందితుడు ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు కొట్టేయాలని అభ్యర్థించాడు. ఆరేళ్లు కేసు నడిచింది. ఏప్రిల్ 2012లో హైకోర్టు ఆ అప్పీల్ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుహైకోర్టులో చుక్కెదురవడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. కేసు కొట్టేయాలని వేడుకున్నాడు. వాయిదాలతో 14 సంవత్సరాలు కేసు కొనసాగింది. 2012 ఆగస్టులో మొదటిసారి విచారణ జరిగింది. 21 సార్లు వివిధ బెంచ్ల ముందు విచారణకు వచ్చింది. ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. ‘సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన ట్రయల్ కోర్టు, హైకోర్టులు నిందితుణ్ణి దోషిగా తేల్చడంలో ఎటువంటి పొరపాటు చేయలేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.అందువల్ల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, దాన్ని హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తన తీర్పులో స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూనే ‘నిందితుడికి ప్రస్తుతం 75 ఏళ్లు. అతడి వయస్సును దృష్టిలో పెట్టుకుని శిక్షను కనీస స్థాయికి తగ్గించవచ్చని మేం భావిస్తున్నాం’ అని తన ఆదేశంలో పేర్కొంటూ శిక్షను ఏడాదికి పరిమితం చేసింది.గతంలో కొంత కాలం జైలులో ఉండడంతో మిగిలిన కాలానికి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసులో తీర్పు ఆలస్యం అయింది. కానీ, న్యాయం గెలిచింది. తప్పుకు శిక్ష తప్పదని వెల్లడైంది. అయితే నాణేనికి ఇది ఒక వైపే! మరోపైపు చూస్తే, 40 ఏళ్ల వయసులో చేసిన నేరానికి 75 ఏళ్ల వయసులో శిక్ష పడింది. రూ. 500 లంచం తీసుకున్నందుకు చట్ట ప్రకారం శిక్ష ఖరారైంది. అవినీతి పరులను శిక్షించాల్సిందే కానీ, 36 ఏళ్ల కాలానికి విలువ కట్టేదెవరు?దిలీప్ మాదిరెడ్డి -
కథాకళి: ఉపదేశం
భవిష్యత్తులో ఓ రోజు. ఓ తప్పనిసరి రోజు. ఆ రోజు టోక్యోలోని యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్లో సభ్య దేశాల రాయబారులు సమావేశమయ్యారు. బీద దేశాల్లోని ఖనిజాలు, ఇతర ప్రకృతి సంపదని తమదిగా చేసుకోడానికి కొన్ని దేశాలు, తమ మతాన్ని రక్షించుకోవడానికి కొన్ని దేశాలు, తమ మతవ్యాప్తికి మరికొన్ని దేశాలు, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఆయుధ సంపత్తి గల కొన్ని దేశాలు చాలాకాలంగా యుద్ధాలు చేస్తున్నాయి. సైనికులతోపాటు కోట్లాదిమంది పౌరులు మరణిస్తున్నారు. ఆ యుద్ధాల నివారణకి, ప్రపంచశాంతికి సంప్రదింపులు జరుగుతున్నాయి.సెక్రటరీ జనరల్ ఆ సమావేశాన్ని ఆరంభిస్తూ చెప్పాడు.‘‘మిత్రులారా! మన చర్చలు ప్రతిష్టంభనతో ముగిశాయి. దాంతో ఐదవ ప్రపంచ యుద్ధం కూడా జరిగి మానవాళి పూర్తిగా నాశనం అవచ్చు. ఇప్పటికే అణ్వస్త్రాలకి తోడు లేజర్ ఆయుధాల వల్ల భూమిలో సారం తగ్గి, అంతరిక్షంలోని ఉపగ్రహం మీద పండించుకుని తింటున్నాం. మానవాళి ప్రమాదం అంచున ఉంది. కాబట్టి కృత్రిమ మేధస్సుని ఉపయోగించాలని నిర్ణయించాను. నూటముప్ఫై ఏడు దేశాల సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుని, ఎలాంటి సమస్యకైనా పరిష్కారాన్ని సూచించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సూపర్ బ్రెయి¯Œ ని తయారు చేయించాను.’’ఆ గది మధ్యలో మనిషి మెదడు ఆకారంలో, దానికన్నా పాతిక రెట్లు పెద్దదిగా ఉన్న ఆ యంత్రాన్ని అంతా చూశారు. ప్రపంచాన్ని ముప్ఫైసార్లు నాశనం చేయగల ఆయుధ సంపత్తి గల, నియంత అధికారంలోని, అంతా భయపడే నార్త్ కొరియా రాయబారి చెప్పాడు.‘‘మన సమస్యకి ఓ యంత్రం పరిష్కారం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.’’‘‘కావచ్చు. కాని ‘సరైన పరిష్కారం మూర్ఖుడి నించి వచ్చినా స్వీకరించదగ్గదే’ అని మా దేశ సామెత.’’ ఉత్తరప్రదేశ్ రాయబారి చెప్పాడు.‘‘విందాం. ఈ యంత్రం ఏం చెప్తుందో, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించగలదేమో విందాం. మనం ఇప్పటికే చాలా పరిష్కారాలని విన్నాం. తిరస్కరించాము. కాబట్టి దీన్ని వినడంలో అవమానం లేదు.’’ సెక్రటరీ జనరల్ చెప్పాడు.‘‘అవును. అందులో విజ్ఞత ఉంది.’’ టెక్సస్ రాయబారి చెప్పాడు.అన్ని దేశాల్లా అమెరికా కూడా చాలా చిన్న దేశాలుగా విడిపోయింది. పదవుల కోసం చాలా రాష్ట్రాలని, దేశాలని రాజకీయ నాయకులు విడగొట్టారు. అవి రక్షణకి వివిధ మిలటరీ కూటములను ఏర్పాటు చేసుకుని అందులో సభ్యులయ్యాయి.‘‘మనకన్నా దీనికున్న క్వాలిఫికేషన్ ఏమిటి?’’ రాజస్థాన్ రాయబారి ప్రశ్నించాడు.‘‘భౌగోళిక, రాజకీయ, చరిత్ర, మతపరమైన, ఇంకా ఎన్నో అంశాలకి చెందిన అంశాలని శాస్త్రజ్ఞులు ఈ మెదడులో నమోదు చేశారు. వాటన్నిటిని క్రోడీకరించి, ఆలోచించి పక్షపాతం లేకుండా పరిష్కారాన్ని సూచించగలదు. మనిషి మెదడుకి ఈ శక్తి లేదు. కాబట్టి ఈ సూపర్ మైండ్ని సృష్టించాము.’’దాన్ని ఉపయోగించటం అవమానంగా భావించిన కొన్ని దేశాలు ఓటింగ్ కోరాయి. ప్రపంచంలోని 1862 దేశాల్లోని 73% మంది దాన్ని ఉపయోగించాలనే ఓటు వేశారు.‘‘లేడీస్ అండ్ జెంటిల్మెన్. థేంక్యూ. మన ముందున్న ఈ అద్వితీయ మెదడు వంద శాతం తృప్తికరంగా పనిచేస్తోంది. ప్రపంచ దేశాల చరిత్ర, వివాదాలు దీనికి తెలుసు. ఈ మీటని నొక్కగానే శాంతికి పరిష్కారాన్ని ఇది చెప్తుంది. మీ అంగీకారంతో దీన్ని నొక్కుతున్నాను. ఒన్... టు... త్రీ...’’ఆయన మీట నొక్కగానే అందులోని కోట్లాది న్యూరా¯Œ ్స ఒకదానితో మరొకటి కలిసి సమాచారాన్ని మార్పిడి చేసుకోవడాన్ని, మెరుపు తీగల్లా ప్రయాణించిన ఆలోచనా తరంగాలని అంతా విస్మయంగా చూశారు. క్షణం కన్నా తక్కువ కాలంలో అలా సాగాక, అది మానవ గొంతుతో గంభీరంగా పలికింది. ‘‘నన్ను పరిష్కారాన్ని కోరినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. మీరు నాకు మూడు సమస్యలని ఇచ్చారు. కొరియన్ భాషని ప్రపంచ భాషగా చేయాలనే సమస్య; ప్రజల మధ్య, దేశాల మధ్య శాంతి నెలకొల్పడం మిగిలిన రెండు. వీటి పరిష్కారం మీకు అనాదిగా తెలిసి ఉండి కూడా ఎందుకు ఆచరించడం లేదని నాకు ఆశ్చర్యంగా ఉంది.’’అంతా ఆ పరిష్కారం ఏమిటా అని ఆసక్తిగా వినసాగారు.‘‘సమస్యని చూస్తున్న మీరు, పరిష్కారాన్ని ఎందుకు చూడటం లేదు? దీన్ని ఏనాడో మీ పూర్వీకులు, అంటే ముత్తాతల ముత్తాతల ముత్తాతలు మీ క్షేమం కోసం ఉపదేశించారు. ఆ ఉపదేశాన్ని విస్మరించడమే మీరు నష్టపోవడానికి ప్రధాన కారణం. ఒక్క ఆ ఉపదేశంలోనే అన్ని మతాల వందలకొద్దీ బోధనలు నిబిడీకృతమై ఉన్నాయి. ఈ ఒక్క ఉపదేశాన్ని పాటిస్తే మనిషికి, మనిషికి మధ్య ఎలాంటి సంఘర్షణా ఉండక ప్రపంచ శాంతి నెలకొంటుంది.’’‘ఆ ఒక్క ఉపదేశం ఏమిటి?’ అని కొందరు గుసగుసలాడుకున్నారు. ఆ కంఠం గంభీరంగా పలికింది.‘‘ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్ ఏషధర్మః సనాతనః... అంటే, ‘నీకు ఏది చేస్తే బాధ కలుగుతుందో దాన్ని ఇతరులకి చేయకు. ఇది శాశ్వత ధర్మం’ కురుక్షేత్ర యుద్ధం తర్వాత, అనుశాసనపర్వంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద నుంచి ధర్మరాజుకి బోధించిన ఈ సూత్రం మానవాళి శాంతికి కిరీటం లాంటిది. తల మీద కిరీటాన్ని విస్మరించి పాదాలవైపు చూడటం ఆపండి.’’కొన్ని దేశాలవారు కరతాళ ధ్వనులు చేస్తే, మరికొందరు మొహాన్ని మొటమొటలాడించారు. -మల్లాది వెంకట కృష్ణమూర్తి -
గౌరముఖుడి వృత్తాంతం
పూర్వం కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. ఎన్నేళ్లు గడిచినా వారికి సంతానం కలగలేదు. ఆ కాలంలో మహాతపస్వి అయిన ఆత్రేయ మహర్షి చిత్రకూట పర్వతం మీద ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉండేవాడు. సంతానాపేక్షతో సుప్రతీకుడు ఒకనాడు తన భార్యలిద్దరితో కలసి వెళ్లి ఆత్రేయ మహర్షిని దర్శించుకున్నాడు. ఆత్రేయుడి అనుగ్రహంతో కొన్నాళ్లకు సుప్రతీకుడికి దుర్జయుడనే కొడుకు పుట్టాడు.దుర్జయుడు అమిత శక్తిమంతుడిగా ఎదిగాడు. సుప్రతీకుడు కొడుకుకు రాజ్య పాలనను అప్పగించి, తపస్సు చేసుకోవడానికి వానప్రస్థానానికి వెళ్లిపోయాడు. దుర్జయుడు అపార సైన్యసంపత్తిని సమకూర్చుకుని, దండయాత్రకు బయలు దేరాడు. ఎక్కడా అపజయం ఎరుగకుండా, సమస్త భూమండలాన్ని అవలీలగా జయించాడు. ఆ తర్వాత అష్టదిక్పాలకులనూ ఓడించి, తన దారికి తెచ్చుకున్నాడు. విజయగర్వంతో తన రాజ్యానికి తిరుగు ప్రయాణం అవుతుండగా, తోవలో గౌరముఖుడు అనే మహర్షి ఆశ్రమం కనిపించింది. దుర్జయుడు తన సైనిక పటాలాన్ని బయటనే నిలిపి ఉంచి, తానొక్కడే మహర్షి ఆశ్రమంలోకి వెళ్లి, ఆశీస్సులు కోరాడు. గౌరముఖుడు మహారాజైన దుర్జయుడిని సాదరంగా ఆహ్వానించి, గౌరవించాడు. ‘మహారాజా! ఘనవిజయాలు సాధించి నా ఆశ్రమానికి వచ్చావు. నీకు, నీ పరివారానికి ఆతిథ్యమిస్తాను’ అన్నాడు.ఒంటరిగా ఆశ్రమంలో ఉంటున్న మహర్షి తనకు, తన వెంట వచ్చిన లక్షలాదిమంది సైనికులకు ఆతిథ్యం ఎలా ఇస్తాడా అని దుర్జయుడు ఆశ్చర్యపోయాడు.అంతలోనే గౌరముఖుడు స్నాన సంధ్యలు ఆచరించి వస్తానని చెప్పి, సమీపంలోనే ఉన్న గంగానదికి వెళ్లాడు. గంగలో నిలిచి, భక్తిగా నారాయణుడిని స్తుతించాడు.గౌరముఖుడి స్తుతికి ప్రసన్నుడైన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు.‘స్వామీ! దుర్జయ మహారాజు సైన్యసమేతంగా నా ఆశ్రమానికి వచ్చాడు. అతడికి, అతడి పరివారానికి ఆతిథ్యం ఇస్తానని చెప్పాను. వారందరికీ ఆతిథ్యమిచ్చే శక్తినివ్వు’ అని ప్రార్థించాడు. నారాయణుడు ఒక దివ్యమణిని గౌరముఖుడికి ఇచ్చి, ‘ఈ మణి నువ్వు కోరినవన్నీ తక్షణమే ఇవ్వగలదు’ అని చెప్పి అదృశ్యమయ్యాడు.గౌరముఖుడు ఆ మణి మహిమతో దుర్జయుడు, అతడి పరివారం విడిది కోసం అప్పటికప్పుడే చలువరాతి సౌధాలు, దాస దాసీ జనాలు, ఉద్యాన వనాలతో కూడిన ఒక సువిశాల సుందర నగరాన్ని సృష్టించాడు. దుర్జయుడికి, అతడి పరివారానికి కోరిన పదార్థాలన్నింటినీ సుష్టుగా వడ్డించాడు. భోజనానంతరం వారంతా అక్కడే హాయిగా విశ్రమించారు. మరునాటి ఉదయం దుర్జయుడు, అతడి పరివారం కాలకృత్యాలు, స్నాన సంధ్యల కోసం నదికి వెళ్లారు. వారు తిరిగి వచ్చే సరికి ముందురోజు తాము బస చేసిన నగరం కనిపించలేదు. గౌరముఖుడి శక్తికి దుర్జయుడు, అతడి పరివారం చకితులయ్యారు. గౌరముఖుడి వద్ద సెలవు తీసుకుని రాజధాని వైపు ప్రయాణం మొదలుపెట్టారు.మార్గమధ్యంలో ఉండగా, దుర్జయుడికి ఒక దురాలోచన వచ్చింది. గౌరముఖుడు తమందరికీ ఎలా ఆతిథ్యం ఇచ్చాడో, ఆ రహస్యమేమిటో కనుక్కుని రమ్మని చారులను పంపాడు. నారాయణుడి వరం వల్ల పొందిన మణి మహిమతో అతడు తమకు ఆతిథ్యం ఇవ్వగలిగాడని చారులు చెప్పారు. ఆ మణిని అడిగి తెమ్మని దుర్జయుడు భటులను పంపాడు.గౌరముఖుడి వద్దకు వెళ్లిన భటులు మణిని ఇవ్వమని తమ రాజు ఆదేశించినట్లుగా చెప్పారు. నారాయణ వరప్రసాదమైన మణిని తాను ఇచ్చేది లేదని గౌరముఖుడు నిర్మొహమాటంగా చెప్పాడు. వారు దుర్జయుడి వద్దకు వెళ్లి మణిని ఇవ్వడానికి గౌరముఖుడు తిరస్కరించిన సంగతి చెప్పారు.దుర్జయుడు సైన్యసమేతంగా గౌరముఖుడిపైకి దండెత్తి వచ్చాడు. గౌరముఖుడు మణి మహిమతో సైన్యాన్ని సృష్టించాడు. ఆ సైన్యం చేతిలో దుర్జయుడి సైన్యం తుడిచిపెట్టుకుపోయింది. దుర్జయుడు కరవాలం దూసి గౌరముఖుడిపైకి దూసుకు వస్తుండగా, గౌరముఖుడు నారాయణుడిని ప్రార్థించాడు. నారాయణుడు చక్రం సంధించి, దుర్జయుడి కంఠాన్ని ఉత్తరించాడు.∙సాంఖ్యాయన -
క్లూషియల్: క్రైమ్ సీన్..
రాత్రి పది గంటలు . క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు అప్పుడే అక్కడకు చేరుకున్నాడు.వెంటనే క్లూస్ టీమ్ అతని దగ్గరికి వచ్చి చెప్పింది. ‘ఫుడ్ పాయిజనింగ్.., ఒక విధంగా విషప్రయోగం... పూర్తి రిపోర్ట్స్ వెంటనే అందేలా ఏర్పాటు చేస్తాం’,,, ఆ మాట వింటూనే మరణించిన తన పదహారేళ్ళ కూతురు లీల శవం దగ్గర నుంచి లేచి వచ్చి, ‘నాకు తెలుసు ఇన్స్పెక్టర్ ఇదంతా నా రెండో భార్యే చేసింది. సవతి తల్లి కదా’... తన కూతురి దగ్గర ఏడుస్తూ కూర్చున్న రెండో భార్య నీలవేణి వైపు కోపంగా చూస్తూ అన్నాడు దివాకర్. రెండు గంటల్లో పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఆర్సెనిక్ మూలకాన్ని ఎక్కువ మోతాదులో కలిసిన నూడుల్స్ తినడం వల్ల లీల చనిపోయినట్టు తేలింది. రోజూ నూడుల్స్ తినిపించే నీలవేణి ని చూస్తూ, ‘నా కూతురికి ఇష్టమని నూడుల్స్ తెస్తే, అందులోనే విషం కలిపి నా కూతురిని చంపిన ఈ రాక్షసిని ఉరి తీయాలి’ దివాకర్ అరుస్తున్నాడు.ప్రతిఘటన లేకుండా, ఎలాంటి సమాధానం చెప్పకుండా పోలీసులకు సరెండర్ అయ్యింది నీలవేణి. ‘కేసును ఇంత త్వరగా క్లోజ్ చేస్తారనుకోలేదు. కూతురులాంటి బిడ్డను సవతితల్లి చంపుకుంది?’ కటకటాల్లో ఉన్న నీలవేణి వైపు చూస్తూ అన్నాడు డీసీపీ.ఇన్స్పెక్టర్ అభిమన్యు కస్టడీలో వున్న నీలవేణి దగ్గరికి వెళ్లి, ‘ఎందుకు చేశావీ పని?’ అడిగాడు. తలెత్తింది నీలవేణి.‘సవతితల్లిని కదా... నాకు పిల్లలు వద్దనుకున్నానుగా... వున్న బిడ్డను చంపుకుని హాయిగా బ్రతకాలని’ ఏడుస్తూ తల దించుకుంది... కన్నీళ్లు కనిపించకుండా...కారులో వెళ్తున్న ఇన్స్పెక్టర్ అభిమన్యు నీలవేణి మాటలను రీకలెక్ట్ చేసుకుంటున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగింది. యథాలాపంగా ఎడమ వైపు చూస్తుంటే హాస్పిటల్ కనిపించింది. కారును లెఫ్ట్ వైపు పోనించాడు. న్యాయాన్ని బతికించడానికి.బార్ ముందు ఇన్స్పెక్టర్ కారు ఆగింది. లోపలకి వెళ్లేసరికి ఒక టేబుల్ దగ్గర మందు కొడుతూ కనిపించాడు దివాకర్.అక్కడికి వెళ్లి అతను ముందు కూర్చుని, ‘నాకూ ఆర్డర్ చేయండి?’ అన్నాడు. దివాకర్ ఇన్స్పెక్టర్ను చూసి కంగారుపడ్డాడు. అంతలోనే సర్దుకుని, ‘నా కూతురి మరణాన్ని తట్టుకోలేక’... ‘మందు కొడుతున్నావా? ఆ మందులో ఆర్సెనిక్ విషాన్ని కలిపితే బాగుంటుంది. జైల్లో కూర్చుని’... ‘మీరేమంటున్నారు?’‘నీ కూతురు ఇష్టంగా తినే నూడుల్స్లో ఆర్సెనిక్ విషాన్ని కలిపావు. నీ రెండో భార్య నీ కూతురికి నూడుల్స్ తినిపిస్తుందని తెలిసి... నీ రెండో భార్య పెళ్లి కాగానే తనకు ఇక బిడ్డలు వద్దని, లీలే తన కూతురు అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది... ఆ విషయాన్ని మీ ఫ్యామిలీ డాక్టర్ ద్వారా తెలుసుకున్నాను. ఆర్సెనిక్ విషం గురించి నువ్వు గూగుల్లో సెర్చ్ చేసి మరీ క్రైమ్ చేసినట్టు నీ మెయిల్ ద్వారా తెలిసింది. నువ్వు పనిచేస్తున్న కంపెనీలో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు చేసిన వరస్ట్ క్రైమ్’ చెప్పాడు. అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చి, దివాకర్ను అరెస్టు చేశారు. దివాకర్ కటకటాల్లోకి వెళ్ళాడు.కటకటాల నుంచి బయటకు వచ్చింది నీలవేణి.‘థాంక్యూ ఇన్స్పెక్టర్. నన్ను శిక్ష నుంచి బయట పడేసినందుకు కాదు, నా కూతురి ఆత్మ శాంతించేలా చేసినందుకు’... కన్నీళ్లతో చెప్పింది, అభిమన్యు ముందు నిలబడి చేతులు జోడించి.‘చట్టాన్ని మాత్రమే కాదు. అమ్మ మనసునూ కాపాడటం నా బాధ్యత.’ చెప్పి ముందుకు కదిలాడు ఇన్సె్పక్టర్ అభిమన్యు .∙శ్రీసుధామయి -
ఈ వారం కథ: కావిడి పెట్టె
ప్రముఖ రచయిత, ఉత్తమ అవార్డు గ్రహీత భయ్యా కన్నుమూత.. హుష్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.అదేమిటి మొన్న సాయంత్రం వరకు బాగానే ఉన్నారు కదా... విజయవాడ పుస్తక మహోత్సవంలో వేదికపై నేను రాసిన ‘బతుకు బస్టాండు’ పుస్తకం ఆవిష్కరించి నాతో చాలాసేపు మాట్లాడారు. ఇంతలోనే ఏమైంది?.. నాలో ఆదుర్దా మొదలైంది.రిమోట్ అందుకుని వేరే చానల్ మార్చా. అందులోనూ ఇదే వార్త స్క్రోలవుతోంది. మనసాగక మరో చానల్కు వెళ్లా.. ఇదే సమాచారం ఫ్లాష్ న్యూస్గా వేస్తూ ఆయన ఫొటోలు చూపుతున్నారు. లైవ్ దృశ్యాలు ఇంకా ఏ చానల్లోనూ ప్రసారం కావడం లేదు. వెంటనే ఆయన అభిమాన సంఘం ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసి వార్తను నిర్ధారించుకున్నాను.భయ్యాగారు నాకంటే ఇరవై రెండేళ్లు పెద్ద. రచనాపరంగా ఆయన శైలి, భాష, ముక్కుసూటిగా చెప్పే తత్వం బాగా నచ్చి ఆయనకు వీరాభిమానినయ్యా. ఇంటర్లో ఉన్నప్పుడు ఆయన మా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారు. కళాశాల సావనీరులో నేను రాసిన కథ చదివి అభినందించారు. ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి పిలిపించి కథలు రాయడంలో మెలకువలు నేర్పారు. అందుకే ఆయన్ను రచనా వ్యాసంగానికి తొలి గురువుగా స్వీకరించాను. అత్యంత నిరాడంబరంగా ఉండే రచయితల్లో భయ్యా ఒకరు. నేను పుస్తకాలు చదవడం ప్రారంభించిన రోజుల్లో ఏ దినపత్రిక, వారపత్రిక, మాసపత్రిక చూసినా ఆయన రచనలే కనిపించేవి. ప్రతి కథనూ, వ్యాసాన్ని మొదటి నుంచి చివరి వరకూ పొల్లు పోకుండా చదివేవాడిని. ఆయనంటే నాకెంతటి అభిమానమో.. ఆయనకూ నేనంటే అంతే ఇష్టం. ఆయనతో సన్నిహితంగా మెలిగిన క్షణాలు, ఆయన చెప్పిన మాటలు నా కళ్ల ముందు సినిమా రీల్లా తిరుగుతుంటే ఫోన్ రింగయింది. మా ఇద్దరితో పరిచయం ఉన్న మిత్రుడు సారథి చేశాడు.. ‘భయ్యాగారు ఎలా పోయారు?’ అని.ఆ...ఆ.. ఇప్పుడే తెలిసింది. రాత్రి టిఫిన్ తిని ‘ఖ్యాతిముత్యం’ సీరియల్ రాస్తున్నారట. అలా రాస్తుండగా గుండెపోటు వచ్చింది. ఒంటరిగా ఉంటారేమో ఉదయం పేపర్ బోయ్ వచ్చేవరకు ఎవరూ చూడలేదు. ఆ కుర్రోడు అంబులెన్స్కు కాల్ చేస్తే వాళ్లొచ్చి చూసి రాత్రే చనిపోయారని నిర్ధారించారు..మిత్రుడితో మాట్లాడుతూనే ఆషామాషీ టీవీ చానల్ మార్చాను.భయ్యా ఆకస్మిక మృతిని మేజర్ వార్తగా కవరేజి ఇస్తున్నారు.భయ్యా అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. అసలు పేరు భగవంతం బలరామయ్య. మొదటి అక్షరం ‘భ’, చివరి అక్షరం ‘య్య’ను కలిపి ‘భయ్యా’గా కలం పేరు పెట్టుకుని అమూల్యమైన, స్ఫూర్తిదాయకమైన రచనలు చేశారు. యువత వికాసానికి చాలా పుస్తకాలు వెలువరించారు.. నాటకాలు, సినిమాలకు కథలు సమకూర్చారు. వందలకొద్దీ అవార్డులు, రివార్డులు అందుకున్న ఘనత భయ్యా సొంతం. ఆయన వయసు 77 ఏళ్లు. రచనా వ్యాసంగానికి అడ్డుకాకూడదనుకుని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయారు.. అంటూ న్యూస్ రీడర్ గుక్కతిప్పుకోకుండా చెబుతోంది. ఆయన పాత ఫొటోలు, పుస్తకాల కవర్ పేజీ క్లిప్పింగులు, సాహితీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటి వీడియోలు చూపిస్తూ అక్షర నివాళి అర్పిస్తున్నారు. పార్థివ దేహాన్ని విజయవాడలోని స్వగృహానికి తరలించినట్లు చెబుతూ.. అంత్యక్రియలు ఎప్పుడు జరిగేదీ ఇంకా స్పష్టత రాలేదన్నారు.నాకేమో ఎప్పుడెప్పుడు వెళ్లి ఆయన పార్థివదేహాన్ని చూద్దామా అని మనసు పీకుతోంది. అనుకోకుండా ఆరోజు విజయవాడలో ఆటోవాలాలు సమ్మె చేస్తున్నారు. నాకైతే యాక్టివా ఉంది.. భుజం నొప్పితో బాధపడుతూ డాక్టర్ సలహా మేరకు నెల రోజులుగా బండి నడపడం లేదు.వెంటనే మిత్రుడు సారథికి ఫోన్ చేస్తే మంగళగిరి నుంచి హడావుడిగా వచ్చాడు. ఇద్దరం కలిసి వాడి కారులో లబ్బీపేటలోని భయ్యాగారింటికి బయలుదేరాం. దగ్గరలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద కారు నిలిపి నడుచుకుంటూ వెళ్లాం. ఆ ఇల్లు వారి తాతల నుంచి వచ్చిన వారసత్వపు ఆస్తి. నాలుగు గదుల డబుల్ పోర్షన్ డాబా ఇల్లు. దాదాపు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుత మార్కెట్ ధరను బట్టి మూడు కోట్లకు పైనే పలుకుతుంది.అప్పటికే నగరంలోని సాహితీ మిత్రులందరూ భయ్యా పార్ధివదేహం వద్ద పూలు జల్లి నివాళులర్పిస్తున్నారు. నేను తీసుకెళ్లిన ఆయన ఫొటోను, రాసిన కొన్ని ప్రముఖ పుస్తకాలనూ అక్కడున్న చెక్క కుర్చీమీద పెట్టి నమస్కరించాను. టీవీ చానల్స్వారు లైవ్ కవరేజి కోసం హడావుడి చేస్తున్నారు. బందరు రోడ్డుపై ఓబీ వ్యాన్లన్నీ కవాతు చేస్తున్న సైనికుల్లా వరుసగా నిలిపి ఉన్నాయి. ఒక యాంకరమ్మ వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తోంది. నన్ను చూడగానే ఇంకో చానల్ యాంకర్ నా వద్దకు వచ్చి ఆయన గురించి నాలుగు ముక్కలు చెప్పాలని గొట్టం నా ముఖం మీద పెట్టింది.రెండు మూడు గంటల్లో సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ వీధిలోని వారంతా వలంటీర్లుగా మారిపోయారు. వచ్చినవారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. మరికొంతసేపటికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేశారు.నిజానికి భయ్యాగారు ఒంటరి. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు లేరు. పెద్దమ్మ పిల్లలు, బాబాయి పిల్లలు ఉన్నప్పటికీ వారంతా అమెరికాలో సెటిలయ్యారు. పాతికేళ్లుగా ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు లేవు. కనీసం ఫోను సంభాషణలు కూడా శూన్యం. భయ్యా తదనంతరం ఆస్తిపాస్తుల్ని, సంపాదించిన డబ్బును కొట్టేయాలన్న కాంక్షతో బందరు, నూజివీడు, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఉన్న బీరకాయ పీచు చుట్టాలు టీవీలో వార్తలు చూసి మధ్యాహ్నానికల్లా కార్లలో వాలిపోయారు. ఎవరికి వారే ఖరీదైన పూలదండలు మోసుకొచ్చారు. తమకు భయ్యాతో ఉన్న అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకుంటూ ఆరున్నొక్క రాగం ఆలపించారు. ‘ఆస్తి మూరెడు..ఆశ బారెడు’ నవల్లో రాసినట్లు వాళ్లంతా తమలోని నటులను వెలికితీశారు. ఒక పెద్దాయనైతే ‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందాన్ని మరిపించాడు.మధ్యాహ్నం 2 గంటలు. ఆగస్టు నెలలోనూ ఎండ ప్రచండంగా మండిపోతోంది. సందర్శకులు ఆకలి దప్పులను సయితం మరిచి ఉదయం నుంచి షామియానాల కింద ఉసూరుమంటూ కూర్చుని సెల్ఫోన్లో వీడియోలు చూసుకుంటున్నారు. ఇంకొందరేమో ఆయన పార్థివదేహం వద్ద నిలబడి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాను పిచ్చపిచ్చగా వాడేసుకుంటున్నారు.యూట్యూబర్లయితే ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది మాట్లాడించి రికార్డు చేస్తున్నారు. తమ చానల్ను సబ్స్క్రైబ్ చేయించాలని బతిమలాడుతున్నారు.భయ్యా అభిమానులు అందరికీ పెరుగన్నం పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు.ఓ బీరకాయ పీచు చుట్టం వాలంటీర్ను పిలిచి ‘వీటన్నింటికీ డబ్బులెక్కడివి? మీరే పెట్టుకుంటున్నారా? లేక మా బాబాయి ఖాతాకు కన్నం పెడుతున్నారా?’ చెవిలో గొణిగాడు.ఆ కుర్రాడు ఆయన్ను ఎగాదిగా చూసి ‘మీ బాబాయెవరు?’ అంటూ అయోమయంగా ప్రశ్నించాడు.‘అదేనయ్యా! మెడనిండా పూలదండలేసుకుని శాశ్వత నిద్ర పోతున్న ఆ పెద్దాయన’ అంటూ భయ్యా గారి శవపేటిక వైపు వేలు చూపెట్టాడు.వాలంటీర్ ఆయన్ను కూరలో కరివేపాకులా తీసిపారేసి ముందుకు సాగాడు.బీరకాయ పీచులు మెల్లగా జారుకుని బందరు రోడ్డెక్కారు. పీకల్దాకా బిర్యానీలు మెక్కి తిరిగొచ్చారు.ఒక తెలివైన ప్రచురణకర్త భయ్యాగారు రాసిన పుస్తకాలను ఆటోలో తీసుకొచ్చి విక్రయాలు ప్రారంభించాడు. తెచ్చిన గంటసేపట్లోనే సరుకంతా అయిపోగా, మళ్లీ తేవడానికి నిష్క్రమించాడు.భయ్యాగారి అభిమానులను, వాడకట్టు నివాసితులను చూసి ఆనందపడాలో.. ధనార్జనే ధ్యేయంగా శవం ముందు డబ్బులేరుకుంటున్న ప్రచురణకర్తను చూసి బాధపడాలో అర్థం కాక మిన్నకుండిపోయాను.∙∙ మధ్యాహ్నం 3 గంటలు. కర్మకాండలు నిర్వహించేందుకు ఇద్దరు పురోహితులు, సహాయకుడు ఇల్లు వెతుక్కుంటూ చేరుకున్నారు. అందుకు కావాల్సిన సరంజామా వెనకాలే ఆటోలో వచ్చింది.అంత్యక్రియలు ఎన్ని గంటలకు చేస్తారండి అని ఒకరు, ఎవరు చేస్తారండి అని మరొకరు నా వద్దకొచ్చి అడిగారు.ఇంకా ఏమీ అనుకోలేదండి.. ఆయనకు కావాల్సినవాళ్లమంతా కూర్చుని మాట్లాడాక నిర్ణయిస్తాం.. చెప్పాను.‘మేం కావాల్సినవాళ్లం కాదా?’ అని ఓ బీరకాయ పీచు మైండ్ వాయిస్ బయటికి వినిపించింది.భయ్యాగారికి అంత్యక్రియలు ఎవరు చేయాలనే విషయమై అంతా తర్జనభర్జన పడుతున్నారు. ఆయన అభిమాన సంఘం అధ్యక్షుడు ముందుకొచ్చి ‘మా సంస్థ తరఫున నేనే తలకొరివి పెడతా’నని చెప్పాడు.నగరంలోని రచయితల సంఘాలన్నీ కలిసి ఈ తంతు పూర్తిచేస్తే బాగుంటుందని నా అభిప్రాయం కుండబద్దలు కొట్టాను.‘బంధువుని నేనుంటే.. మీరెలా పెడతారు?’ ఆవేశంగా అడిగాడు గుంటూరు గురునాథం.‘భయ్యా బాబాయికి తలకొరివి నన్నే పెట్టమని పైలోకంలో ఉన్న అమ్మ నాకు పదేళ్ల కిందటే చెప్పింది’ బందరు బాబు లైన్లోకి వచ్చాడు. ‘గతంలో అమ్మ బెజవాడ వచ్చినప్పుడల్లా బందరు లడ్డూలు, నల్ల హల్వా తెచ్చిస్తే బాబాయి ఇష్టంగా తినేవాడురా.. నేను పోయాక ఆయనకు ఏ కష్టం రాకుండా చూసుకోరా.. అని చాలాసార్లు నాతో అంది’.. అంటూ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లిపోయాడు.‘మీకు మీరే నిర్ణయాలు తీసేసుకునే లెక్కయితే ఇక మేమొచ్చిందెందుకు? నలుగురం కూర్చొని మన శంకర వరప్రసాదుగారిలా టీమ్ మీటింగు పెట్టుకుని ఒక అంగీకారానికి వద్దాం’ నూజివీడు, ఒంగోలు నుంచి వచ్చిన నీలాంబరం, రామ్మూర్తి ముక్తకంఠంతో పలికారు. అప్పటివరకు నాకు వాళ్లేమిటో, వారి వైఖరేమిటో పూర్తిగా అర్థం కాలేదు. వాళ్లొచ్చింది ఆయనపై ప్రేమతో కాదు, ఆస్తిమీద ఆశతోనని నిర్ధారించుకోవడానికి అట్టే సమయం పట్టలేదు.పట్టరాని కోపంతో నీలాంబరం, రామ్మూర్తి జుత్తు పట్టుకుని పక్కకు ఈడ్చేద్దామనుకున్నాను. ఇద్దరిదీ బట్టతలే కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేనా ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చింది.చర్చోపచర్చలు, వాదోపవాదాలు సీరియస్గా సీరియల్గా నడుస్తూనే ఉన్నాయి శిఖరాగ్ర సమావేశాలకు దీటుగా.‘ఏదో ఒకటి త్వరగా తేల్చండి.. ఆవతల సూర్యాస్తమయం కావస్తోంది’ పొరుగింట్లో ఉండే వృద్ధమనిషి తొందరపెట్టారు.ఇంతలో అక్కడికి నల్లకోటు వేసుకున్న వ్యక్తి జనాలను తోసుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. వస్తూనే అందరికీ నమస్కరించాడు. ఆయన వాలకం చూస్తే లాయర్ అని గ్రహించడానికి నాకెంతో సమయం పట్టలేదు.నా పేరు విశ్వనాథ్. పాతికేళ్లుగా భయ్యాగారితో పరిచయం ఉంది. కోవిడ్ సోకి దాదాపు చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆయన కోలుకున్న తర్వాత వీలునామా రాశారు. దాన్ని ఇంతకాలం నావద్ద భద్రంగా ఉంచారు. తాను మరణించాక దాన్ని బహిర్గతం చేయాలని నాతో చెప్పి మాట తీసుకున్నారు. ఆ ప్రకారం ఇప్పుడు నేనొచ్చా అంటూ బ్యాగ్లోంచి వీలునామా బయటికి తీశాడు.అందరి కళ్లూ ఆ వీలునామాపైనే కేంద్రీకృతమయ్యాయి. మరీ ముఖ్యంగా బీరకాయ పీచులు గోతికాడ నక్కల్లా అందులో ఏం రాశారోనని ఆబగా ఎదురుచూస్తున్నారు.ఎవరికీ నోట మాట రావడం లేదు. నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. ముఖంపై చెమటను కర్చీఫ్తో ఒకటికి పదిసార్లు అద్దుకుంటున్నారు. టాంటాం టీవీ చానల్ కెమెరామేన్ రాంబాబు కెమెరా జూమ్ చేశాడు. రిపోర్టర్ గంగ జింకపిల్లలా చెంగు చెంగున గెంతుతూ జనాలను తోసుకుని ముందుకొచ్చింది.ఏదో అయిపోతుందని హడావుడిగా మరో రెండు మూడు చానల్స్ కెమెరామెన్, కొంతమంది యూట్యూబర్లు అనుసరించారు.ఈ హడావుడి చూసి ప్రతి ఒక్కరూ జేబులోంచి ఫోన్ తీసి ఫొటోలు తీయసాగారు.ఈ తంతు నిశితంగా గమనిస్తున్న బీరకాయ పీచు చుట్టాలు... ముసలోడు గట్టిగానే సంపాదించి ఉంటాడనుకున్నారు. ఆమధ్య చెన్నయ్లో లావుపాటి గండపెండేరం తొడిగినప్పుడు టీవీలో చూసిన సన్నివేశం వారి మదిలో మెదిలింది. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఎవరికి వారు ఆశ పడుతున్నారు.ఈ ఆలోచనల నుంచి వారు పూర్తిగా తేరుకోకముందే లాయర్ అందులో ఏముందో చదివి వినిపించారు. భయ్యాగారు రాసినట్లు డాబా ఇంటిని జిల్లా గ్రంథాలయ సంస్థకు అప్పజెప్పాలి. తనకు ఎవరైతే అంత్యక్రియలు నిర్వహిస్తారో వారికి తన కావిడిపెట్టె కానుకగా అందజేయాలని పేర్కొన్నారు. అది కూడా దశ దిన కర్మ రోజు వారికి స్వాధీనపరచాలని స్పష్టంగా రాశారు.నేనూ ఆయన అభిమానులూ అందరం పెద్దగా చప్పట్లు చరిచాం.‘భయ్యాజీ అమర్ రహే’ అని కొందరు, ‘కలం సలాం’ అని ఇంకొందరు జేబుల్లోంచి పెన్నులు తీసి పైకెత్తి పట్టుకుని నినదించారు.అంతా పెద్దాయన దొడ్డ మనసుకు జోహార్లర్పించి అభినందిస్తుంటే ఆ నలుగురు బంధువుల ముఖాలు ఫిల్మంటు తెగిన బల్బుల్లా మాడిపోయాయి. ‘ఇంతకీ విల్లు రిజిస్ట్రీ గట్రా చేశారా?’ ఒకాయన అడిగాడు..‘రిజిస్టర్ చేశారండి.. ఇవిగో చూడండి’.. అంటూ స్టాంపు పేపర్లు అందరికీ చూపించాడు విశ్వనాథ్. పనిలో పనిగా జిరాక్సు కాపీ సెట్టొకటి ఇచ్చాడు. ఆలస్యం చేయకుండా వారంతా టీమ్ మీటింగు పెట్టుకున్నారు. రహస్య మంతనాలు జరిపి తామంతా ఉమ్మడిగా అంత్యక్రియలు నిర్వహిస్తాం.. ఆ కావిడిపెట్టెను తమకివ్వాలని లాయర్ను అభ్యర్థించారు... డబ్బూదస్కం, గండపెండేరాల్లాంటి బంగారు వస్తువులు అందులో ఉంటాయని భావించి!ముందుచూపంటే అదే మరి... వెనకాల ఎవరో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.‘ఏం ముందుచూపో ఏమో... ముసలాడు ఘటికుడే. గట్టిగానే మెలికపెట్టాడు. ఎంతైనా రచయిత కదా! ఇంకొక డైలాగు గుంపులోంచి వినిపించింది.లాయర్ ఏం చెబుతారా అని అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సరే.. ఏం చేద్దాం.. చెప్పండి సార్.. నలుగురు బంధువులు లాయర్ వంక తేరిపార చూశారు.‘భయ్యాగారికి దూరపు బంధువులాయె.. మీరు దహనక్రియలు నిర్వహిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది’ అని చెప్పగానే ఆనందంతో ఎగిరి గంతేయాలనుకున్నారు. మరీ అతి చేసినట్లవుతుందని భావించి ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అభిమానులంతా కార్యకర్తల్లా ముందుకొచ్చి ఏర్పాట్లు చకచకా చేసేశారు. అంతిమయాత్ర శకటాన్ని పచ్చిపూలతో అందంగా అలంకరించారు. ఆయన పుస్తకాల తాలూకు కవర్ పేజీ ఫొటోలతో ఫ్లెక్సీలు ముద్రించి వ్యాన్ చుట్టూ తోరణాల్లా కట్టారు. నగరంలోని ప్రముఖులతోపాటు పాటు పొరుగూళ్ల నుంచి వచ్చిన కవులు, రచయితలు కొంత దూరం భయ్యా పాడె మోశారు. ఆ తర్వాత భౌతికకాయాన్ని వ్యానెక్కించారు. పెళ్లికొడుకును ఊరేగించినట్లు ఊరేగించగా... సాహితీ లోకమంతా ఆయన వెంట కృష్ణలంకలోని మరుభూమి వరకు నడిచింది.ఆ విధంగా భయ్యాగారి అంతిమ సంస్కారం అంగరంగ వైభవంగా ముగిసింది. మరుసటి రోజు అన్ని పత్రికల్లోనూ ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. ఆరోజు భయ్యాగారి పెద్దకర్మ. ఇంటి వద్దే ఏర్పాటుచేశారు. బీరకాయ పీచు చుట్టాలు కర్మకాండలకు కావాల్సినవన్నీ సమకూర్చారు. అన్ని రకాల దానాలు ఘనంగా జరిపించారు. వచ్చిన వారందరికీ పెన్నులూ, పుస్తకాలు పంచిపెట్టారు. నభూతో నభవిష్యతి అన్నట్లు పసందైన విందు భోజనం పెట్టారు.జనం తిరునాళ్లలా వచ్చి పోతున్నారు. సాయంత్రం నాలుగింటి వరకు తింటూనే ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు లాయర్ విశ్వనాథ్ ప్రెస్మీట్ పెడుతున్నట్లు అన్ని చానళ్లలో స్క్రోలింగ్ వస్తోంది. ఆ వీలునామాలో ఏముందోనని అందరూ టీవీలకు అతుక్కుపోయారు. భయ్యా ఇంటి వద్దా అదే పరిస్థితి. అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆ నలుగురిలో ఇద్దరు చేతి గడియారం వంక పదేపదే చూసుకుంటున్నారు. మరో ఇద్దరికి వాచీ లేదేమో సెల్ఫోన్లో టైం చూసుకుంటూ గోళ్లు కొరుక్కుంటున్నారు. సాయంత్రం ఐదు గంటలు... లాయర్ విశ్వనాథ్ మీడియా సమావేశం ప్రారంభించారు. గుండుసూది కిందపడినా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. భయ్యా గురించి నాలుగు మంచి మాటలు చెప్పి.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకుని నివాళులర్పించారు. అనంతరం పెద్దాయన కోరిక మేరకు కావిడి పెట్టె తాళం చెవిని మీడియా సమక్షంలో ఆ నలుగురు బంధువులకూ అప్పచెప్పడంతో అప్పగింతల తంతు ముగిసింది.లోపల ఏముందో చూడాలని తెగ ఆరాటపడిపోతున్నారంతా. చానల్స్ కెమెరాలన్నీ కావిడిపెట్టె వైపే చూస్తున్నాయి. గురునాథం తాళం తెరిచాడు. కెమెరాలు ముందుకొచ్చాయి .. మూత పైకి లేవనెత్తాడు. కెమెరాలు జూమ్ చేసేశారు. అందరూ ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. లోపల భయ్యాగారు ప్రచురించిన పుస్తకాలు, శాలువాల దొంతర, మరికొన్ని జ్ఞాపికలు, సర్టిఫికెట్లు బూజుపట్టి దర్శనమిచ్చాయి. అతి కష్టం మీద అన్నింటినీ వెలికితీసి దుమ్ము దులిపారు. అందరూ ఊహించిన డబ్బుగాని, నిధిగాని అందులో లేదు. నలుగురూ కంగుతిన్నారు. ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోక స్థాణువుల్లా నిలబడిపోయారు. ఒకటికి రెండుసార్లు కార్లేసుకుని బెజవాడ వచ్చినందుకు అయిన పెట్రోలు ఖర్చు, హోటల్ ఖర్చు, పెద్దకర్మ ఖర్చులు.. అన్నీ ఒక్కొక్కటిగా మదిలో మెలిగాయి. అబ్బో చేతిచమురు గట్టిగానే వదిలింది.. అని తెగ బాధపడిపోయారు.ఏదో లప్ప వస్తుందని ఆశపడి ఇంత దూరం వచ్చి ఇన్ని పాట్లు పడితే .. ఇత్తడి తాళం కప్ప దక్కిందని బావురుమన్నారు. సమయమూ డబ్బూ రెండు వృథా చేసుకుని ప్రయాస పడ్డామని ఎవరికి వారే ఘొల్లుమన్నారు.టీవీ యాంకర్లు నలుగురి ముఖాల ముందు గొట్టాలు పెట్టి స్పందన తెలియజేయాలని అడుగుతుంటే.. ఎవరి ముఖంలోనూ నెత్తుటి చుక్క లేదు. ఏడుపొక్కటే తక్కువ! ∙చెన్నాప్రగడ శర్మ -
26 కేసులు గెలిచిన 'నకిలీ' లాయర్
ఎవరైనా కాస్త గడుసుగా మాట్లాడినా.. తర్కంతో ప్రశ్నించినా..‘పట్టా’ లేని ప్లీడరు అంటారు. బయట ప్రశ్నించడానికి, అవతలి వాళ్లను నిలదీయడానికి ‘పట్టా’ అక్కర్లేదు. కానీ కోర్టులో అలా కాదు, కోటుంటే సరిపోదు.. న్యాయవిద్య చదివుండాలి.. సెక్షన్లూ తెలిసుండాలి. ఓ వ్యక్తి పట్టా లేకపోయినా కోర్టులో వాదించాడు. కేసులూ గెలిచాడు. చివరికి అతని బండారం బయటపడింది. గుట్టు రట్టయ్యింది. జీవితం జైలు పాలైంది. అయినా ‘తగ్గేదేలే ’ అంటూ కోర్టును అభ్యర్థించాడు. తన కేసును తనే వాదించు కున్నాడు. షరతులతో కూడిన బెయిల్ పొందాడు. అలాగని ఇది విజయ గాథ కాదు, తీసేయదగ్గదీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తెలుసుకోదగ్గ అంశంగా మారింది. కెన్యాలో ఈ ఉదంతం జరిగింది.న్యాయవాదిగా కోర్టులో వాదించాలంటే ఏ దేశంలో అయినా న్యాయ విద్యను అభ్యసించాలి. సంబంధిత కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకోవాలి..అప్పుడే అర్హత వస్తోంది. కెన్యాలో కూడా అంతే. న్యాయవాదుల నమోదును ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’ పర్యవేక్షిస్తోంది. ఇందులో పేర్లు నమోదు అయిన వారు మాత్రమే ప్లీడరుగా ప్రాక్టీసు చేయాలి. బ్రియాన్ మ్వెండా న్త్విగా అనే వ్యక్తి ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’లో అడ్వకేట్గా రిజిస్టర్ అయ్యాడు.మోసానికి బీజం పడిందిక్కడేబ్రియాన్ న్త్విగా వివరాలను బ్రియాన్ మ్వెండా న్జాగీ అనే వ్యక్తి టాంపర్ చేసి అక్కడ తన ఈమెయిల్ నమోదు చేశాడు, ఫొటో మార్చాడు. ఇలా పట్టా లేకుండానే ప్లీడర్ అయ్యాడు. లోయర్ కోర్టు నుంచి హయ్యర్ కోర్టుల వరకు కేసులు వాదించాడు. సుమారుగా 26 కేసుల్లో విజయం కూడా సాధించాడు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రాక్టీసు కొనసాగించాడు.ఎలా బయటపడిందిబ్రియాన్ మ్వెండా న్త్విగా ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా ఓపెన్ కాలేదు. తన వివరాలు మారిపోయినట్టు గుర్తించి, లా సొసైటీ ఆఫ్ కెన్యాకు ఫిర్యాదు చేశాడు. అధికారులు దర్యాప్తు చేశారు. ఓ వ్యక్తి అక్రమంగా తన పేరును బ్రియాన్ న్త్విగా వివరాల్లో నమోదు చేసినట్టు గుర్తించారు. కేసు నమోదుఅధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. న కిలీ లాయరు జైలు కెళ్లాడు. కేసు విచారణ మొదలైంది. కోర్టును అభ్యర్థించి తన కేసు తనే వాదించుకోవడం సంచలనంగా మారింది. తన ‘నకిలీ’ అనుభవం అక్కరకు వచ్చింది. షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భిన్నాభిప్రాయాలునకిలీ లాయర్కు కొందరు బాసటగా నిలిచారు. అతని తెలివితేటల్ని మెచ్చుకున్నారు. న్యాయ విద్య చదివితే మరింతగా రాణిస్తావని సలహా ఇచ్చారు. మరికొందరు.. ఇది ప్రమాదరకరమైందన్నారు. లాయర్ల రిజిస్ట్రేషన్లోని డొల్లతనాన్ని బయటపెట్టిందని విమర్శించారు. ఈ ఘటన కెన్యాలో న్యాయవ్యవస్థపై చర్చకు దారి తీసింది.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. గతంలో అతడు విజయం సాధించిన 26 కేసుల్లోనూ సాక్ష్యాలు బలంగా ఉండడంతో కోర్టులు వాటి పునఃసమీక్షకు అంగీకరించకపోవడం కొసమెరుపు.-దిలీప్ మాదిరెడ్డి -
కుటుంబమే కీలకం
ప్రముఖ మనస్తత్వవేత్త ఎరిక్ ఎరిక్సన్ తన ఎనిమిది దశల వికాస సిద్ధాంతంలో మొదటి దశను ‘ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్’ అని పిలిచారు. శిశువు జన్మించిన మొదటి ఏడాదిలో తల్లిదండ్రులు ఇచ్చే ఆదరణ, రక్షణ ఆ బిడ్డలో ‘ఈ ప్రపంచం సురక్షితమైనది’ అనే నమ్మకాన్ని కలిగిస్తాయి. ఒకవేళ ఆ దశలో నిర్లక్ష్యానికి గురైతే, ఆ బిడ్డ పెద్దయ్యాక ఎవరినీ నమ్మలేని వ్యక్తిత్వాన్ని అలవరచుకుంటాడు. మానవ పరిణామ క్రమంలో మనిషిని ఒక సామాజిక జీవిగా తీర్చిదిద్దే మొదటి పాఠశాల ‘కుటుంబం’. ఒక వ్యక్తి సమాజంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడు, ఇతరులతో బంధాలను ఎలా కొనసాగిస్తాడు అనే అంశాలన్నీ ఆ వ్యక్తి పెరిగిన కుటుంబ వాతావరణంపైనే ఆధారపడి ఉంటాయి. సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే, వ్యక్తిత్వం అనేది కేవలం జన్యువుల కలయిక మాత్రమే కాదు, అది అనుభవాల సమాహారం. ఆ అనుభవాలకు కేంద్ర బిందువు కుటుంబం.ఒక కుమ్మరి మట్టిని ఎలాగైతే తన చేతులతో నొక్కుతూ, సరిచేస్తూ ఒక అందమైన పాత్రగా మలుస్తాడో, తల్లిదండ్రులు కూడా తమ ప్రవర్తనతో పిల్లల మనసులను అలాగే మలుస్తారు. బాల్యంలో కుటుంబం ఇచ్చే సంస్కారం, క్రమశిక్షణ వ్యక్తిత్వానికి శాశ్వత ముద్ర వేస్తాయి.మాటల కంటే చేతలు మిన్నకుటుంబం అనేది ఒక అద్దం లాంటిది. తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకుంటే, పిల్లలు ‘గౌరవం’ అనే విలువను సహజంగానే నేర్చుకుంటారు. వారు విన్న దానికంటే, కళ్లారా చూసిన దాన్నే ఎక్కువగా నమ్ముతారు. పెద్దలను గమనించడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారని అల్బర్ట్ బండూరా తన ‘సోషల్ లెర్నింగ్ థియరీ’లో నిరూపించారు. ఇంట్లో తండ్రి కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడు? తల్లి సమస్యలను ఎలా ఎదుర్కొంటోంది? తాతయ్య ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాడు? ఇవన్నీ బిడ్డ మెదడులో నిక్షిప్తమైపోతాయి.ఉదాహరణకు, ఒక ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి, బయట చాలా సౌమ్యంగా ఉంటూ ఇంట్లో మాత్రం భార్యపై అరుస్తూ ఉంటాడు. అతని కుమారుడు అది చూస్తూ పెరిగాడు. ఆ అబ్బాయి పెద్దయ్యాక తన భాగస్వామితో కూడా అదే ‘అగ్రెసివ్’ ప్రవర్తనను ప్రదర్శిస్తాడు. ఎందుకంటే, అతని దృష్టిలో మగతనం అంటే అధికారం చలాయించడం అనే తప్పుడు భావన నాటుకుపోయింది. దీనినే ‘ఇంటర్జెనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ బిహేవియర్’ అంటారు.ఫ్యామిలీ డైనమిక్స్ – ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వ్యక్తిత్వ వికాసంలో ఐక్యూ (తెలివితేటలు) కంటే ఈక్యూ (భావోద్వేగ పరిణతి) ముఖ్యం. కుటుంబంలో భావోద్వేగాలను పంచుకునే స్వేచ్ఛ ఉంటేనే బిడ్డలో ఈక్యూ పెరుగుతుంది. ‘మగపిల్లలు ఏడవకూడదు‘ అని అణచివేయడం వల్ల, వారు పెద్దయ్యాక తమ భావాలను వ్యక్తపరచలేని ‘ఎమోషనల్లీ స్టంటెడ్’ వ్యక్తులుగా మారుతారు. కుటుంబం అనేది ఒక సురక్షిత ్రపదేశంగా ఉండాలి, అక్కడ తప్పులు చేసినా క్షమించబడతామనే ధైర్యం ఉండాలి.మనం ఇంటికి వేసే రంగులు (బయట ప్రపంచానికి కనిపించే మన నడవడిక) అందంగా ఉండవచ్చు. కాని, వర్షం వచ్చినా, భూకంపం వచ్చినా ఇల్లు నిలబడాలంటే పునాది (కుటుంబం ఇచ్చిన మానసిక స్థైర్యం) బలంగా ఉండాలి. పునాదిలో పగుళ్లు ఉంటే, పైన ఎన్ని రంగులు వేసినా ప్రయోజనం లేదు. అలాగే, వ్యక్తిత్వంలో లోపాలు ఉంటే, అవి కుటుంబ వాతావరణం నుండి వచ్చినవే అయి ఉంటాయి.మార్పు మన నుండే...కుటుంబం వ్యక్తిత్వానికి పునాది అనగానే, మనలోని లోపాలకు తల్లిదండ్రులను నిందించడం పరిష్కారం కాదు. కార్ల్ జంగ్ అన్నట్లు, ‘నేను నా గతాన్ని మార్చలేను కాని, నా భవిష్యత్తును నేను నిర్మించుకోగలను.’ మన కుటుంబం నుంచి మనకు వచ్చిన నెగటివ్ పాటర్న్స్ను గుర్తించడం మొదటి అడుగు. ఆ తర్వాత వాటిని మార్చుకుంటూ, మన తర్వాతి తరానికి ఒక ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణాన్ని అందించడం మన బాధ్యత.నేటి కాలంలో కుటుంబ సభ్యులంతా ఒకే గదిలో ఉన్నా, ఎవరి మొబైల్స్లో వారు నిమగ్నమై ఉంటున్నారు. దీనిని ‘ఫబ్బింగ్’ అంటారు. ఇది పిల్లల్లో ‘నిర్లక్ష్యానికి లోనవుతున్నాం’ అనే భావనను కలిగిస్తుంది. నాణ్యమైన సమయం గడపకపోవడం వల్ల పిల్లలు తమ వ్యక్తిత్వానికి కావాల్సిన సామాజిక నైపుణ్యాలను కోల్పోతున్నారు. ముఖాముఖి సంభాషణలు లేకపోవడం వల్ల సహానుభూతి తగ్గుతోంది.-సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com -
ఇదేమైనా సీరియస్ సమస్యా?
నాకు ఇరవై ఐదు సంవత్సరాలు. తరచు బ్రెస్ట్లో నొప్పి అనిపిస్తోంది. ఇది ఎందుకు వస్తుంది? ఇది ఏమైనా సీరియస్ సమస్యా? – లత, గుంటూరుబ్రెస్ట్ నొప్పి అనేది చాలా కామన్ గా కనిపించే సమస్య. ఎక్కువగా ఇది ఎలాంటి ప్రమాదకర వ్యాధి లక్షణం కాదు. ముఖ్యంగా హార్మోన్ల మార్పుల వల్లే ఎక్కువగా వస్తుంది. ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు నెలసరి చక్రంలో మార్పులు చూపుతాయి. ఈ మార్పుల కారణంగా కొంతమందికి నెలసరి ముందు లేదా తర్వాత బ్రెస్ట్ నొప్పి అనిపిస్తుంది. కొందరికి ఇది ప్రతి నెలా కూడా రావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఇతర కారణాల వల్ల కూడా బ్రెస్ట్ నొప్పి ఉండొచ్చు. ఉదాహరణకు బ్రెస్ట్ ఇన్ ఫెక్షన్ (మాస్టిటిస్), ఫైబ్రోసిస్టిక్ మార్పులు, చిన్న సిస్టులు వంటి సమస్యలు. చాలా అరుదుగా మాత్రమే బ్రెస్ట్ క్యాన్సర్తో కూడా నొప్పి ఉంటుంది. బ్రెస్ట్ నొప్పితో పాటు జ్వరం, చర్మం ఎర్రబడటం, గట్టిపడటం, నిపుల్ నుంచి స్రావం రావడం, గడ్డలు ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ పరీక్ష చేసి అవసరమైతే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ వంటి పరీక్షలు సూచిస్తారు. కొన్నిసార్లు బయాప్సీ కూడా అవసరం కావచ్చు. సాధారణంగా నొప్పి తేలికగా ఉంటే పారాసిటమాల్, ఐబుప్రొఫెన్ వంటి మందులు ఉపశమనం ఇస్తాయి. వేడి లేదా చల్లని కంప్రెస్ కూడా ఉపయోగపడుతుంది. విటమిన్–ఈ సప్లిమెంట్స్ కొందరికి బాగా పనిచేస్తాయి. జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా సహాయపడతాయి. సరైన సైజ్ బ్రా ధరించడం, కెఫీన్ తగ్గించడం, ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, తగినంత నీరు తాగడం మంచిది. కుటుంబంలో బ్రెస్ట్ లేదా ఒవేరియన్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా బ్రెస్ట్ నొప్పి పెద్ద సమస్య కాకపోయినా, సందేహం ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించడం ఉత్తమం. నాకు యాభై ఐదు సంవత్సరాలు. దాదాపు పదిహేనేళ్ల క్రితం గర్భసంచి తీసే ఆపరేషన్ (హిస్టరెక్టమీ) చేయించుకున్నాను. ఇప్పుడు యోని భాగంలో ఏదో బయటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. దగ్గినా, తుమ్మినా అది బయటికి ఉబ్బినట్లుగా కనిపిస్తోంది. మూత్రం నియంత్రణలో కూడా కొంత ఇబ్బంది ఉంది. ఇది ఏ సమస్య? ఏమి చేయాలి? – రమణమ్మ, అనంతపురం. మీరు చెప్పిన లక్షణాలు పోస్ట్ హిస్టరెక్టమీ ప్రోలాప్స్ అనే సమస్యకు సూచనలు. అంటే గర్భసంచి తీసిన తర్వాత, యోని పైభాగం (వాల్ట్), మూత్రాశయం (బ్లాడర్), లేదా రెక్టమ్ కిందికి జారిపోవడం. హిస్టరెక్టమీ చేసిన తర్వాత పెల్విక్ ఫ్లోర్ కండరాలు, లిగమెంట్లు బలహీనపడితే ఈ సమస్య వస్తుంది. వయసు పెరగడం, ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల టిష్యూలు సడలిపోవడం కూడా దీనికి ఒక కారణం. అలాగే అధిక బరువు, దీర్ఘకాలిక దగ్గు, మలబద్ధకం, బరువైన వస్తువులు ఎత్తడం వంటి కారణాలు సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా తీవ్రత పెరిగి మూత్రం అదుపు లేకపోవడం, మల విసర్జనలో ఇబ్బందులు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించడం అవసరం. డాక్టర్ పూర్తి శరీర పరీక్ష చేసి, సమస్య స్థాయిని అంచనా వేస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్, యూరోడైనమిక్ స్టడీస్ వంటి పరీక్షలు కూడా సూచించవచ్చు. సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఇలా ఉంటుంది. ప్రారంభ దశలో అయితే, పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు (కెగెల్ ఎక్సర్సైజ్లు), సపోర్టివ్ డివైజ్లు (పెస్సరీ) వినియోగం సరిపోతుంది. అదే తీవ్రంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరం. ప్రస్తుతం ల్యాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయి, ఇవి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. అదనంగా, బరువు నియంత్రణ, మలబద్ధకం నివారణ, బరువైన వస్తువులు ఎత్తకుండా ఉండటం, నియమిత వ్యాయామాలు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యను నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా, తొందరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. -డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ ,హైదరాబాద్ -
పిల్లలకి ఇవ్వాల్సింది ధైర్యమే!
‘నా విజయంలో అమ్మదే ప్రధాన పాత్ర’ అంటారు అరుంధతీరెడ్డి. భారత మహిళా క్రికెట్ టీమ్లో ఆమె సాధించిన విజయాలు తెలిసినవే! ‘పిల్లల ఇష్టాలను గమనించి, గైడ్ చేయడమే మనం చేయగలిగేది’ అంటారు అరుంధతీరెడ్డి తల్లి భాగ్య. ఆమెకు కొడుకు, కూతురు. ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.‘‘ఈ రోజుల్లో తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంటోందంటే... ‘డబ్బులు ఎన్నయినా పెడతాం, ఏదైనా చేయండి’ అనేట్టుగా ఉంటున్నారు. పిల్లలేమో ‘మీరే అన్నీ చూసుకోవాలి. మాకేం సంబంధం లేదు’ అనేలా ఉన్నారు. కష్టపడితేనే డబ్బు వస్తుందనే విషయాన్ని పిల్లలకు నేర్పించడం లేదు. ఏది అడిగినా పెద్దలు ఇచ్చేస్తారు అనే ధోరణి బాగా పెరిగింది. మా పిల్లలు స్కూల్ టైమ్లో నన్ను డబ్బులు అడిగినప్పుడు నిజంగా ఏది అవసరమో తెలుసుకొని, దానికే ఇచ్చేదాన్ని. మిగతావి ఎందుకు అనవసరమో కూడా చెప్పేదాన్ని.పాకెట్ మనీ కావాలంటే కొన్ని పనులు తప్పనిసరిగా కేటాయించేదాన్ని. అవి పూర్తి చేస్తేనే డబ్బులు ఇచ్చేదాన్ని. దీని వల్ల డబ్బు విలువ తెలియజెప్పేదాన్ని. మేముండేది సికింద్రాబాద్లోని సైనిక్పురిలో. ప్రవైట్ స్కూల్ టీచర్ని. ఇద్దరు పిల్లల పెంపకం, పెద్ద టాస్క్. విజయవంతంగా పూర్తి చేయాలంటే అన్నింటిలో క్రమశిక్షణ అవసరం.ఎమోషన్స్ ముఖ్యంభావోద్వేగాలు బ్యాలెన్స్ చేసుకోవడం ఈ రోజుల్లో తగ్గిపోయిందనే చెప్పాలి. పిల్లలు స్నేహితులకు ఇచ్చే విలువ తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు. ముందు అమ్మనాన్న, తర్వాతనే మిగతావి అనేది క్లియర్గా చెప్పాలి. ఇప్పటికీ మా పిల్లలకు ‘మీరు పెద్దయ్యారు. అన్నీ తెలుసుకుంటున్నారు. కాని, ఏ విషయంలోనైనా స్టెప్ తీసుకునేముందు సెల్ఫ్గానూ, కుటుంబానికి ఎంత వరకు మంచిదో నిర్ణయించుకోండి’ అని చెబుతుంటాను. ఈ రోజుల్లో మగపిల్లలకన్నా ఆడపిల్లలు చాలా బెస్ట్గా ఉన్నారు. కాని, సమాజం ఎంత ఆధునికంగా మారినా అబ్బాయి–అమ్మాయి అనే వివక్ష మాత్రం ఉంది. ఈ వ్యత్యాసం ఇంట్లో పిల్లల మీద చూపకూడదు. చదువుతో పాటు సంస్కారంవిలువలు చాలా ముఖ్యం. సంస్కారం, క్రమశిక్షణ లేకుండా చదువు ఎంత ఉన్నా అది వృథానే. ఇప్పుడు పిల్లల్లో చదువు స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రుల్లోనూ ‘ఫీజులు లక్షల్లో కడుతున్నాం, చదువు రావడం లేదు’ అనే ఒత్తిడి పెరిగింది. పిల్లల గురించి టీచర్స్ ఏదైనా రిమార్క్ చెబితే స్కూల్లో అందరి ముందే వారిని తిట్టేస్తుంటారు. లేదంటే, ‘ఇక వీళ్లింతే...’ అని వదిలేస్తున్నారు. ఇలాంటి భావన ఈ రోజుల్లో చాలా ప్రమాదంగా మారుతోంది. మా షమ్మూ (ముద్దు పేరు) చదువులోనూ ముందుండేది.చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్ పిల్లలతో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేది. టీవీలో క్రికెట్ తెగ చూసేది. స్పోర్ట్స్లో చాలా చురుకుగా ఉండేది. ‘నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్ని. స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నా, కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురి ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను. పన్నెండేళ్ల వయసు నుంచి తన ఇష్టం వైపుగా సపోర్ట్ చేశాను. ఈ రోజు ఫలితాన్ని చూస్తున్నాం. అందుకని, చదువు ఒక్కటే కాదు, పిల్లల ఇష్టాలు ఎటుగా సాగుతున్నాయో, వారి అభిరుచులు ఏంటో కూడా తెలుసుకోవడం, సూచనలు ఇవ్వడం ముఖ్యం.త్యాగాలు ఎన్నో!పెంపకంలో ఎన్నో త్యాగాలు ఉంటాయి, కష్టం ఉంటుంది. పిల్లలు ఏ మార్గం ఎంచుకున్నారు, వారు ఎందుకు దానిని వదలుకుంటున్నారు.. ఆ సమయంలో వారి ఆలోచన ఏ విధంగా ఉంటోంది అని కూడా కనిపెట్టాలి. 2017లో మా అమ్మాయి రైల్వేలో ఉద్యోగంలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఎర్పరచుకుంది. అండర్ 23 జోనల్ టోర్నమెంట్లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్– జాబ్ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. నిజానికి.. జాబ్ చేసుకుంటూ సాధారణ జీవితం గడపవచ్చు. కాని, కష్టపడటానికే సిద్ధపడింది. మేమూ తన ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఆసక్తులను ప్రోత్సహించాలి... అరుంధతికి క్రికెట్తో పాటు పాటలు పాడటం చాలా ఇష్టం. కాస్త సమయం దొరికితే మెలోడీస్ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ‘ఈ ఏడాది పిల్లలను స్పోర్ట్స్ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్ అయిపోవాల’ని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా. ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా కెనడాలో స్ధిరపడ్డాడు. కూతురు దేశం గర్వించే స్థాయిలో ఉంది. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్ ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా ప్రయాణంలో మా అమ్మ నాకు సపోర్ట్గా నిలిచింది. మా పిల్లల ఎదుగుదలలో నేనూ అంతే. ఎంచుకున్న మార్గం వైపు రిస్క్ ఎంత ఉన్నా ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను’’ అని వివరించారు భాగ్య.పిల్లల పెంపకం గురించి ప్రముఖుల అభిప్రాయాలు, అనుభవాలు, సూచనలు ఇదే శీర్షికలో ప్రతివారం...∙ నిర్మలారెడ్డి -
మానస మనసులో మాటలు
హైదరాబాద్ మట్టిలో మొదలైన నటి మానస వారణాసి అడుగు ప్రపంచ వేదికపై నడిచే వరకు చేరుకుంది. అలా కోడింగ్ నుంచి మిస్ ఇండియా కిరీటం వరకూ సాగిన ప్రయాణంలోని మెరుపు వెనుక ఉన్న విశేషాలు ఆమె మాటల్లోనే...నా ప్రపంచం రెండు దేశాల మధ్యనేను హైదరాబాద్ అమ్మాయినే. అయితే నా బాల్యం అంతా మలేషియాలో గడిచింది. కౌలాలంపూర్లో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాను. నేనొక యావరేజ్ స్టూడెంట్నే కాని, ఫ్రెంచ్లో మాత్రం ఎప్పుడూ టాప్.కోడింగ్ నుంచి కిరీటంఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నేను ఫైనాన్షియల్ అనలిస్ట్గా పని చేశాను. ఒకవైపు సాఫ్ట్వేర్ కోడింగ్, మరోవైపు మోడలింగ్ అలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే అందాల పోటీలో విజయం సాధించాను.కళ్లతో వింటానుసైన్ లాంగ్వేజ్ అంటే నాకు ఆసక్తి. అలా నేనే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ‘వినడం’ అంటే కేవలం చెవులతోనే కాదు, కళ్లతో కూడా వినొచ్చని అప్పుడు అర్థమైంది. అలాగే, లాక్డౌన్ లో నేర్చుకున్న ఎంబ్రాయిడరీ నాకు ఓపికను నేర్పింది.నా బలం నా కుటుంబంమా అమ్మ, నాయనమ్మ, నా చెల్లి మేఘనా ఈ ముగ్గురు మహిళలే నా బలం. వాళ్లే నాకు నిజమైన ప్రేరణ. సినిమాల్లో అయితే హాలీవుడ్లో ఎమ్మా స్టోన్, ప్రియాంక చోప్రా నాకు ఇన్ స్పిరేషన్ .అభిరుచులు! రోజులో ఒక్క పూటైనా అన్నం లేకపోతే నాకు కడుపు నిండదు. స్వీట్స్లో తిరామిసు, ఫ్రూట్ పుడ్డింగ్ అంటే ఇష్టం. దుస్తుల్లో ఫైరీ రెడ్ రంగు నాకు బాగా నప్పుతుంది. సెంట్స్లో చెర్రీ బ్లోసమ్, పెస్టో వాసనలు నన్ను రిఫ్రెష్ చేస్తాయి.సెల్ఫ్ బిలీఫ్మిస్ ఇండియా 2020 సమయంలో పాండమిక్ కారణంగా చాలా భాగం ఆన్లైన్ లో జరిగింది. అప్పుడు నాకు నేనే మేకప్ ఆర్టిస్ట్, కెమెరాపర్సన్ , కోచ్. నాపై నాకు ఉన్న నమ్మకంతో ఆ సమయంలో నా సేవింగ్స్ అంతా ఖర్చు చేశాను. అదే నన్ను సినిమాల్లోకి తీసుకువచ్చింది.సంగీతం నా మరో స్వరంఫ్రీ టైమ్ దొరికితే నేను సంగీతంలో మునిగిపోతాను. కాలేజీలో ‘నైన్ డేస్’ అనే మ్యూజిక్ బ్యాండ్లో మెంబర్ని. స్టేజ్పై పాడడం నాకు మరో ఎనర్జీ ఇస్తుంది. అలాగే, యోగా, మ్యూజిక్, పేజెంట్స్ ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ నా భయాలను నేనే ఓడించాను.‘మీన్ గర్ల్’ మోడ్లోకి మారుతున్నాఇప్పుడిప్పుడే కొంచెం ‘మీన్ గర్ల్’లా ఉండడం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే ‘నో’ అనడం కూడా జీవితంలో చాలా అవసరం. -
నేటికీ పీడిస్తున్న పోషకాహార లోపం
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తులలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. అయినా, పోషకాహార లోపం మన దేశాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. ఎక్కువగా పిల్లలు, మహిళలు పోషకాహార లోపంతో రకరకాల సమస్యలకు లోనవుతున్నారు. ఈ విషయాన్ని పలు జాతీయ సంస్థల సర్వేలతో పాటు ‘పోషణ్ ట్రాకర్’–2024–25 గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.పోషకాహార లోపం వల్ల ఆరేళ్ల లోపు వయసు గల పిల్లల్లో పలువురు ఎదుగుదల లోపాలతో, వయసుకు తగిన బరువు పెరగక బాధపడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నా, దేశంలో దాదాపు 2.10 కోట్ల మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బక్కచిక్కిపోతున్నారు. -
సదా మీ సేవలో... ఆతిథ్య రంగంలో రోబోలు
‘రండి రండి రండి... దయచేయండి... తమరి రాక మాకెంతో సంతోషం సుమండి’ అంటూ అతిథులకు స్వాగతం పలుకుతుంది ఒక రోబో ‘డిన్నర్కి ఏం కావాలో ఆర్డర్ చెప్పండి బాస్’... అంటూ వినయంగా అడుగుతుంది ఇంకో రోబో మరో రోబో ముందుకొచ్చి మీ లగేజీని అందుకుంటుంది మీకు కేటాయించిన గదిలో చక్కగా సర్దిపెట్టేస్తుంది... పర్యటనలో భాగంగా మీరు హోటల్లో అడుగుపెట్టినది మొదలుకొని, తిరుగు ప్రయాణానికి బయలుదేరే వరకు సదా మీ సేవల్లో రోబోలు అడుగడుగునా ముందుంటాయి. ఆతిథ్యరంగం ఏఐ సాంకేతికతతో నానాటికీ స్మార్ట్గా మారుతోంది. రోబోలను సేవల్లోకి దించి అతిథి సేవలకు హైటెక్ హంగులద్దుతోంది.మన దేశంలో రోబోల వాడకం అంతగా పెరగలేదు గాని, అగ్రరాజ్యాల్లో రోబోలు ఆతిథ్యరంగ సేవలను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. హోటళ్లు, రెస్టరెంట్లు, బార్లలో రిసెప్షన్ నుంచి రూమ్ సర్వీస్ వరకు; కిచెన్ నుంచి ఫుడ్ డెలివరీ వరకు రోబోలు సేవలందిస్తున్నాయి. అమెరికా, జపాన్ వంటి దేశాలలో గత పదేళ్లుగా రోబోల సేవలు విస్తృతం కావడం మొదలైంది. ‘కోవిడ్–19’ తర్వాత ఆతిథ్య రంగంలో రోబోల సేవలు మరింతగా వేగం పుంజుకున్నాయి. తొలితరం రోబోలు వెయిటర్లుగా సేవలందించడం ప్రారంభిస్తే, ఏఐ సాంకేతికతతో పనిచేస్తున్న ఇప్పటి రోబోలు ఆతిథ్య రంగానికి చెందిన దాదాపు అన్నిరకాల సేవలనూ నిరంతరాయంగా అందించగలుగుతున్నాయి.మనుషులు అందించే సేవల్లో తేడాలు ఉండవచ్చేమో గాని, రోబోలు అందించే సేవల్లో ఎలాంటి తేడాలూ ఉండవని వీటి సేవలు అందుకుంటున్న అతిథులు కితాబునిస్తున్నారు. మనుషులు చేసే పనులను రోబోలు సునాయాసంగా చేసేస్తుండటంతో హోటళ్ల యాజమాన్యాలకు కూడా లాభసాటిగా ఉంటోంది. రోబోలను రంగంలోకి దించిన హోటళ్లకు కాసులపంట పండుతోంది. ఇటీవలి కాలంలో రోబోలు హోటళ్లలో ఎలాంటి సేవలను అందిస్తున్నాయో తెలుసుకుందాం...రోబో రిసెప్షనిస్ట్పలు దేశాల్లోని స్టార్ హోటళ్లు ఇప్పుడు రిసెప్షనిస్టులుగా రోబోలను వినియోగించు కుంటున్నాయి. మొదటగా జపాన్లోని నాగసాకి నగరానికి చెందిన ‘హెన్ నా హోటల్’ దాదాపు పదేళ్ల కిందట రిసెప్షనిస్టు స్థానంలో హ్యూమనాయిడ్ రోబోను రంగంలోకి దించింది. తొలినాళ్లలో జనాలు దీనిని విచిత్రంగా చూసేవారు. క్రమంగా అలవాటైపోయారు. కాలం గడిచే కొద్ది సాంకేతికతలో అనేక మార్పులు వచ్చాయి. అచ్చంగా మనుషులను పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఏఐ సాంకేతికత తోడైంది.ఇటీవలి కాలంలోని హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల కంటే మిన్నగా పనిచేస్తుండటంతో అగ్రదేశాల్లోని పలు హోటళ్లు అమ్మాయిల రూపంలో ఉండే హ్యూమనాయిడ్ రోబోలను రిసెప్షనిస్టులుగా ఉపయోగిస్తున్నాయి. ఇవి కస్టమర్లను సాదరంగా స్వాగతించి, పలకరించడం, వారి అవసరాలను కనుక్కుని, వారికి కావలసిన సమాచారాన్ని అందించడంలోను, ఎల్లవేళలా అతిథులకు అందుబాటులో ఉండటంలోను విజయవంతంగా పనిచేస్తున్నాయి.రోబో రిసెప్షనిస్టులు ప్రత్యేక ఆకర్షణగా ఉండటంతో, వీటిని ఏర్పాటు చేసుకున్న హోటళ్లకు అతిథుల రాక కూడా మిగిలిన వాటి కంటే ఎక్కువగా ఉంటోంది. రోబో రిసెప్షనిస్టులు లాభసాటిగా ఉండటంతో పలు అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు వీటిని తమ ప్రధాన శాఖలన్నింటికీ విస్తరించుకుంటూ వస్తున్నాయి.కేర్ టేకర్ రోబోలుహోటల్లో అడుగుపెట్టే అతిథులకు అవసరమైన సమాచారం అందించడం మొదలుకొని అన్ని రకాలుగా సహాయపడే రోబోలు ఇవి. ఈ కేర్ టేకర్ రోబోలను ‘కోనీ’రోబోలు అని కూడా అంటున్నారు. ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎం పదేళ్ల కిందట తొలి కోనీ రోబోను రూపొందించింది. తర్వాత మరిన్ని టెక్ సంస్థలు వీటి రూపకల్పనకు రంగంలోకి దిగాయి. ఇటీవలి కాలంలో ఏఐ సాంకేతికతతో కోనీ రోబోలను మరింతగా అభివృద్ధి చేశాయి.ఇవి హోటల్కు వచ్చే అతిథులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతాయి. స్థానిక సందర్శనీయ స్థలాలు, తదితర అంశాలపై సమాచారం అందిస్తాయి. లోకల్ టూర్ బుకింగ్స్కు, తిరుగు ప్రయాణాల టికెట్ బుకింగ్స్కు సులువైన మార్గాలు చెబుతాయి. ప్రస్తుతం హోటళ్లు వినియోగించే పలు కేర్ టేకర్ రోబోలు బహు భాషా సామర్థ్యాలతో పనిచేస్తున్నాయి.రిలే డెలివరీ రోబోలుఅంతర్జాతీయ హోటళ్లు కొన్ని రోబోలను రిసెప్షన్ సేవలకు మాత్రమే పరిమితం చేసుకోవడం లేదు. పలు ఇతర సేవలకూ వినియోగించుకుంటున్నాయి. బహుళ అంతస్తుల స్టార్ హోటళ్లలో కొన్ని రిలే డెలివరీ రోబోలను ఉపయోగించుకుంటున్నాయి. ఇవి రూమ్ నుంచి ఆర్డర్ ఇచ్చే అతిథులకు కావలసిన ఆహార పానీయాలను అందించడం; రూమ్ సర్వీస్ వస్తువులను అవసరమైన గదుల వద్దకు మోసుకెళ్లడం; హోటల్కు వచ్చే అతిథులను వారి గది వరకు తోడ్కొని వెళ్లడం; వారి లగేజీని మోసుకెళ్లడం వంటి పనులు సమర్థంగా చేయగలుగుతున్నాయి. వీటిని ‘బట్లర్బో’ అని కూడా అంటున్నారు.ఆతిథ్య రంగంలో రోబోల తొలి అడుగుఆతిథ్యరంగంలో రోబోల వాడకం ఇటీవలి కాలంలో పెరిగింది కాని, నిజానికి వీటి ప్రస్థానం 1983 నుంచే మొదలైంది. తొలిసారిగా అమెరికాలో ఒక రెస్టరెంట్ జపాన్లో తయారైన ‘టాన్బో ఆర్–1’, ‘టాన్బో ఆర్–2’ అనే రెండు రోబోలను అప్పట్లోనే 20 వేల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. వీటిని బేరర్ల స్థానంలో అతిథులకు పదార్థాలతో నిండిన ప్లేట్లు, పానీయాలతో నిండిన గ్లాసులు వంటివి అందించడానికి ఉపయోగించింది. ఇటీవలి కాలంలో డైనర్ రోబోలుగా పిలిచే రోబో బేరర్లు చాలా దేశాలకు విస్తరించాయి. మన దేశంలో కూడా ‘ది యెల్లో హౌస్’ హోటల్ చెయిన్ ఉత్తరాదిలోని కొన్ని నగరాల్లో ఉన్న తన రెస్టరెంట్లలో రోబో బేరర్లను ఉపయోగించుకుంటోంది. అంతర్జాతీయ నిపుణుల అంచనాల ప్రకారం 2030 నాటికి ఆతిథ్యరంగంలో 25 శాతం ఉద్యోగుల స్థానాలను రోబోలే పూర్తిగా భర్తీ చేస్తాయి.లగేజ్ హ్యాండ్లింగ్ రోబోలుహోటల్లో దిగేటప్పుడు కొందరు అతిథులు భారీ లగేజీలతో వస్తుంటారు. వారు తీసుకొచ్చే భారీ లగేజీని వాహనం నుంచి దించి, హోటల్లో వారికి కేటాయించిన గది వరకు మోసుకొచ్చే పని ఇదివరకు రూమ్ సర్వీస్ సిబ్బంది చేసేవారు. లగేజీ మరీ ఎక్కువగా ఉంటే, ఒకరికిద్దరు మనుషులు అవసరమయ్యేది. అంత లగేజీని రూమ్ వరకు మోసుకొచ్చినందుకు వారికి టిప్పు ముట్టజెప్పాల్సి వచ్చేది. కొన్ని అంతర్జాతీయ హోటళ్లు ఇప్పుడు ఈ పనికోసం లగేజ్ హ్యాండ్లింగ్ రోబోలను ఉపయోగిస్తున్నాయి. ఎంత లగేజీనైనా ఇవి అవలీలగా మోసుకొచ్చి, జాగ్రత్తగా సర్దిపెట్టేస్తాయి. మనుషులు శక్తికి మించిన లగేజీ మోసేటప్పుడు ఏదో ఒకటి జారిపోవడం, లోపలి వస్తువులు దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. లగేజ్ హ్యాండ్లింగ్ రోబోలతో అలాంటి సమస్యలేవీ ఉండవు. వాటికి టిప్పులివ్వాల్సిన అవసరం కూడా లేదు. తొలిసారిగా న్యూయార్క్లోని ఒక హోటల్ పదిహేనేళ్ల కిందటే ‘యోబో’ పేరుతో లగేజ్ హ్యాండ్లింగ్ రోబోను ప్రవేశపెట్టింది. ఇటీవలి కాలంలో లగేజ్ హ్యాండ్లింగ్ రోబోలు మరింతగా అభివృద్ధి చెందాయి. హోటళ్లతో పాటు పలుచోట్ల విమానాశ్రయాలు, కర్మాగారాలలో కూడా వీటి వినియోగం నెమ్మదిగా పెరుగుతోంది.రూమ్ సర్వీస్ రోబోలుహోటళ్లలో గదులు, బాత్రూమ్లు శుభ్రం చేయడం వంటి రూమ్ సర్వీస్ పనులను సాధారణంగా హౌస్కీపింగ్ సిబ్బంది చేస్తుంటారు. ఇటీవలి కాలంలో కొన్ని అంతర్జాతీయ స్టార్ హోటళ్లు ఈ పనుల కోసం రూమ్ సర్వీస్ రోబోలను ఉపయోగించుకుంటు న్నాయి. ఒక అమెరికన్ హోటల్ తన శాఖలు కొన్నింటిలో రూమ్ సర్వీస్ రోబోలను తొలిసారిగా పన్నెండేళ్ల కిందటే ప్రవేశపెట్టింది. ఇటీవలి కాలంలో మరిన్ని హోటళ్లు ఇదే దారిని అనుసరిస్తున్నాయి. వీటిలో అమర్చిన కెమెరాలు, సెన్సర్ల ఆధారంగా ఇవి గదుల మూలల్లో ఉన్న దుమ్ము ధూళిని కూడా చిటికెలో తొలగించేస్తాయి.హోటళ్ల కారిడార్లు, లాబీలు వంటి ప్రదేశాలలోని చెత్తను, దుమ్ము ధూళిని వాక్యూమ్తో తొలగిస్తాయి. హోటళ్లతో పాటు వీటిని పలుచోట్ల కార్యాలయాలు, ఆస్పత్రులు వంటి చోట్ల కూడా ఉపయోగిస్తున్నారు. రూమ్ సర్వీస్, క్లీనింగ్ రోబోలలో పలు రకాల వాటిని అంతర్జాతీయ హోటళ్లు ఉపయోగిస్తున్నాయి. వీటిలో కొన్ని వాక్యూమ్ క్లీనింగ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ వంటి పనులు మాత్రమే చేస్తుంటే, మరింత అధునాతనమైనవి సర్ఫేస్ స్క్రబ్బింగ్, మాపింగ్, వాటర్ ట్యాంక్ క్లీనింగ్ వంటి పనులు కూడా చేయగలుగుతున్నాయి. సెక్యూరిటీ రోబోలుహోటళ్లు, రెస్టరెంట్లు, ఆస్పత్రులు, కార్యాలయాలు– ఇలా ఎక్కడ చూసినా సెక్యూరిటీ గార్డులు కనిపిస్తారు. సెక్యూరిటీ గార్డులు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని అంతర్జాతీయ హోటళ్లు, కార్యాలయాలు సెక్యూరిటీ గార్డులకు బదులుగా సెక్యూరిటీ రోబోలను ఉపయోగించు కుంటున్నాయి. ఇవి నిరంతరాయంగా పనిచేస్తాయి. జపాన్లో సెక్యూరిటీ రోబోలను పదిహేనేళ్ల కిందట ప్రయోగాత్మకంగా రంగంలోకి దించారు.తర్వాతి కాలంలో వీటిని మరింతగా అభివృద్ధి చేశారు. ‘కోవిడ్–19’కాలంలో పలు అభివృద్ధి చెందిన దేశాలలో సెక్యూరిటీ రోబోల వినియోగం పెరిగింది. వీటిలో అమర్చే థర్మల్ కెమెరాల సాయంతో ఇవి నిరంతరం పరిసరాలను గమనిస్తూ ఉంటాయి. హోటల్ పరిసరాల్లోను, పార్కింగ్ ప్రదేశాల్లోను, లాబీల్లోను కలియదిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను, వస్తువులను గుర్తించి నిర్వాహకులను అప్రమత్తం చేస్తాయి. ఫుడ్ డెలివరీ రోబోలు‘కోవిడ్–19’ దరిమిలా ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. చాలా చోట్ల ఇప్పటికీ మనుషులే ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తున్నారు. హోటళ్లు, రెస్టరెంట్లకు అనుసంధానమై పనిచేసే యాప్స్ ద్వారా వినియోగదారులు తమకు కావలసిన ఆహార పదార్థాలను ఇళ్ల వద్దకు తెప్పించుకుంటున్నారు. యాప్స్కు చెందిన సంస్థల్లో పనిచేసే ఫుడ్ డెలివరీ బాయ్స్ వీటిని ఇళ్లకు తెచ్చి అందిస్తున్నారు. కొన్ని సంపన్న దేశాల్లోని హోటళ్లు, రెస్టరెంట్లు ఈ సేవల కోసం ఫుడ్ డెలివరీ రోబోలను ఉపయోగించుకుం టున్నాయి.చిన్నసైజు వాహనాల్లా కనిపించే ఈ రోబోలు కోరుకున్న చోటుకు ఆహార పదార్థాలను అందిస్తున్నాయి. మనుషులు నడిపే వాహనాల కంటే ఇవి చిన్నగా ఉండటంతో కిక్కిరిసిన ట్రాఫిక్లో కూడా ఇవి వేగంగా ముందుకు పోగలుగుతున్నాయి. అధునాతనమైన కెమెరాలు, సెన్సర్లు అమర్చి తయారు చేసిన ఫుడ్ డెలివరీ రోబోలు డ్రైవర్తో పనిలేకుండానే ఎలాంటి దారుల్లోనైనా సులువుగా ప్రయాణించగలవు. అగ్రరాజ్యాల్లో ఫుడ్ డెలివరీ రోబోలకు ఆదరణ బాగా పెరుగుతోంది. త్వరలోనే ఇవి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా అందుబాటులోకి రాగలవని అంచనాలు ఉన్నాయి.డైనర్ రోబోలుటిఫిన్ చేయడానికో, భోజనం చేయడానికో హోటల్ లేదా రెస్టరెంట్లోకి అడుగుపెడితే, మనం కూర్చున్న టేబుల్ వద్దకు సర్వర్లు వచ్చి ఆర్డర్లు తీసుకుంటారు. కొద్దిసేపు నిరీక్షణ తర్వాత మనం ఆర్డర్ చేసిన పదార్థాలను తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు. మనం వెళ్లే చోట రద్దీ ఎక్కువగా ఉంటే, మనం ఆర్డర్ చేసిన పదార్థాల రాక కోసం ఎదురుచూడాల్సిన సమయం సహజంగానే పెరుగుతుంది. సర్వర్లు రెండు చేతులతోనూ వీలైనన్ని ప్లేట్లను బ్యాలెన్స్ చేస్తూ వచ్చినా, ఒక్కోసారి సర్వీస్లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితికి పరిష్కారంగానే డైనర్ రోబోలు అందుబాటులోకి వచ్చాయి.దాదాపు నాలుగు అడుగుల ఎత్తుండే ఈ రోబోలు చక్రాల మీద వేగంగా తిరుగుతూ సేవలు అందించగలవు. అంతేకాదు, వీటికి రెండువైపులా అరడజను చొప్పున ట్రేలు అమర్చడం వల్ల ఏకకాలంలో దాదాపు నలభై కిలోల బరువు ఉండే ఆహార పదార్థాలను టేబుళ్ల వద్ద ఆగుతూ కస్టమర్లకు అందించగలవు. కీనన్ రోబోటిక్ సంస్థ పదేళ్ల కిందట తొలిసారిగా డైనర్ రోబోను రూపొందించింది. ఇది విజయవంతం కావడంతో మరికొన్ని కంపెనీలు కూడా ఇలాంటివి రూపొందిస్తున్నాయి. పలు దేశాల్లోని హోటళ్లు, రెస్టరెంట్ల నుంచి వీటికి ఆదరణ కూడా నానాటికీ పెరుగుతూ వస్తోంది. రోబో బార్టెండర్లుపలు స్టార్ హోటళ్లలోను, బార్లలోను బార్టెండర్లు పనిచేస్తుంటారు. రకరకాల మద్యాలను అతిథుల అభిరుచులకు అనుగుణంగా అందించడం బార్టెండర్ల పని. రకరకాల ద్రవాల సమ్మేళనంతో, వాటికి తగిన అలంకరణతో అతిథులకు అందించే పనికి చాలా నైపుణ్యం కావాలి. బార్టెండర్లు ఒక పానీయాన్ని సిద్ధం చేయడానికి దాని సంక్లిష్టతను బట్టి కొద్ది నిమిషాల సమయం తీసుకుంటారు. ఇటీవలి కాలంలో వచ్చిన రోబో బార్టెండర్లు నిమిషంలోనే ఎలాంటి పానీయాన్నైనా ఇట్టే సిద్ధం చేయగలుగుతున్నాయి.ఏఐ సాంకేతికతతో రూపొందించిన రోబో బార్టెండర్లు అతి సంక్లిష్ట పానీయ సమ్మేళనాలను సైతం ఏమాత్రం రుచి తగ్గకుండా శరవేగంగా చేయగలుగుతున్నాయి. తొలితరం రోబో బార్టెండర్లు రంగప్రవేశం చేసి, పుష్కరం పైనే గడిచింది. తొలినాళ్లలో వచ్చిన ‘టోనీ’ వంటి రోబో బార్టెండర్లు పానీయాలు తయారు చేసేటప్పుడు ఒక్కోసారి ఐస్ ముక్కలు, పానీయాలు కొంత నేల మీద చిందేవి. వీటిని మరింతగా అభివృద్ధి చేశాక ఇప్పుడు ఈ సమస్యలేవీ లేకుండా సమర్థంగా పనిచేయగలుగుతున్నాయి.రోబో కిచెన్ అసిస్టెంట్లురోబోలు ఇటీవలి కాలంలో వంటింటి పనులనూ చక్కబెడుతున్నాయి. చేయితిరిగిన షెఫ్లలా వంటకాలు వండేస్తున్నాయి. అంతేకాకుండా, వంటింటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, ఎక్కడి వస్తువులను అక్కడ క్రమపద్ధతిలో సర్దిపెట్టేస్తున్నాయి. కూరలు, సూప్లు కలపడం, కూరగాయలు తరగడం, వంటకానికి తగిన ఉష్ణోగ్రతను నియంత్రించడం, రొట్టెలు కాల్చడం వంటి పనులు చేయగలుగుతున్నాయి. వీటిలో కొన్ని ‘రోబో ఆర్మ్స్’గా దొరుకుతున్నాయి. ఇవి మనిషి చేతి ఆకారంలో ఉండి, మనిషి చేతితో చేయగలిగే వంటింటి పనులన్నీ సునాయాసంగా చేయగలుగుతాయి.ఇంకొన్ని పూర్తిస్థాయిలో మనిషిని పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోలు. ఇవి షెఫ్లతోనే పోటీపడే స్థాయిలో వంటకాలను సిద్ధం చేయగలవు. వీటిలోని మరో సౌలభ్యం ఏమిటంటే, వీటిలో చాలా రోబోలు ‘సెల్ఫ్ క్లీనింగ్’. పని ముగిశాక ఇవి తమను తాము శుభ్రం చేసేసుకుంటాయి. అధునాతనమైన కెమెరాలు, సెన్సర్లతో తయారైన ఈ రోబో కిచెన్ అసిస్టెంట్లు ఏఐ సాయంతో నలభీముల్లాంటి షెఫ్లకు దీటుగా హోటళ్లు, రెస్టరెంట్ల వంట పనిని సులభతరం చేస్తున్నాయి.∙ పన్యాల జగన్నాథదాసు -
మానవాళి కోసం సిలువనెక్కిన క్రీస్తు
మన అతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది... ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడు ఆయెను.అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసేను – యెషయా 53:4,5,12.పైన ఉటంకించిన ప్రవచనాలన్నీ క్రీస్తు మరణం ద్వారా నెరవేరాయి. యేసు మాంసయుక్త దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరుస్తున్నాడు అనునది పౌలు యొక్క క్రీస్తు మరణ సువార్త సందేశం. ‘క్రీస్తు యేసు– మరణమును నిరర్థకం చేశాడు’ అన్న పౌలు బోధలు ఉజ్జీవం కలిగించుటలో ప్రసిద్ధికెక్కాయి.ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించునట్లు యేసు మరణం పొందాడు.దీని భావం ఏమంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. ఆత్మకు మరణం లేకున్నా పాపం వలన క్షమాపణ పొందని పాప జీవితం వలన నిత్య మరణం అనే స్థితి సంభవిస్తుంది. అది అడ్డుకొని తన మీద వారి మరణం వేసుకొని ఇలా పాపం వలన ప్రతి ఒక్కరికి ప్రాప్తించే పాప శిక్షను తాను భరించాడు.సర్వమానవాళి అనబడే దేవుని పిల్లలు రక్తమాంసములు గలవారు. దేవుడు వీరిని రక్షించమని వీరిని క్రీస్తు వశం చేశాడు. మరణం యొక్క బలం గలవాడు సాతాను. విధేయ మార్గం మినహా మరో మార్గం లేదు. ఆ అపవాదిని మరణం ద్వారానే నశింపచేయాలి. జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యానికి లోబడిన మానవాళిని విడిపించుటకు యేసు కూడా రక్త మాంసాలలో పాలి భాగస్థుడు కావలసివచ్చింది. యేసు చేసిన ఒక గొప్ప అసాధారణ బోధ ఏమంటే, ‘నేను మీతో చెప్పునది ఏమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము’ ఇలాంటి స్వభావం గల వ్యక్తి, అతడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు.‘నేను దేవుని కుమారుడను’ అన్న విషయం మరచి తన్ను తాను రిక్తునిగా చేసికొని శ్రమలను ఆహ్వానిస్తూ శ్రమలకు ఎదురువెళ్ళాడు. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనుటకు ఎల్లవేళలా సంసిద్ధుడయ్యాడు. అలాంటి ఆయన ఆకారంలో మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడు. దేవుని సంకల్పానికి విధేయంగా లోబడిన క్రీస్తు వంటి విధేయుడు ఈ భూమ్మీద మరొకడు లేడు.‘ఎందుకనగా మనము ఆయనయందు దేవుని నీతి ఆగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను’ ( 2కొరిం«థీ 5:21 ). ‘క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మ శాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది’ (గలతీ 3:13,14, 1కొరింథీ 12:3 ).పరిశుద్ధుడైన ఆ మహాదేవునితో పాపముగా చేయబడి సిలువ మ్రానున వ్రేలాడే శాపగ్రస్తుడిగా ఉన్న యేసుకు ఆ దేవ దేవుని ఎడబాటును ఇలా చూస్తాము. ‘ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు –‘ఏలీ, ఏలీ, లామా సబక్తానీ’ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం... యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను’ (మత్తయి 27 : 45–50).‘దేవుడు తన సొంతకుమారుని పాప శరీరాకరముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను’ (రోమా 8:3,4 ). లోక పాపములను మోసికొనిపోయే దేవుని గొర్రెపిల్లయైన క్రీస్తు విధేయతా బలియాగం నిత్యం గుర్తుంచుకొంటూ ఆయన వచ్చువరకు ఆ ప్రభువు మరణమును ప్రచురించవలసిన విధేయులమై ఉంటున్నాము.‘అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును’ (హెబ్రీ 9:28 )ఈ వచన భావం దేవుని యెడల తిరుగుబాటు చేసే అవిధేయుల పాపములను తన మీద వేసుకొని క్రీస్తు మరణించాడు అనునదే. పాపము లేకుండా రెండోసారి రావడం అంటే మొదటిసారి పాపముతో వచ్చాడు అని కాదుగాని, మానవాళి పాపమును తనమీద వేసుకున్నాడు. ఇందువలననే క్రీస్తు మరణం అనేకుల జీవితాలను కదిలిస్తూ వారిని విధేయులుగా మారుస్తూ ఉంది.‘నేను దేవుని కుమారుడను’ అన్న విషయం మరచి తన్ను తాను రిక్తునిగా చేసికొని శ్రమలను ఆహ్వానిస్తూ శ్రమలకు ఎదురువెళ్ళాడు.∙ జేతమ్ -
నా ఒరిజినాలిటీ..!
సింప్లిసిటీకి స్టయిలిష్ టచ్ ఇస్తూ ప్రత్యేకంగా నిలిచే పేరు ప్రీతి ముకుందన్ . మినిమల్ స్టయిలింగ్తో, ప్రతి లుక్ను కంఫర్ట్తో కలిపి క్లాసీగా మలచడం ఆమె ప్రత్యేకత. ఆ సైలెంట్ స్టయిల్ సీక్రెట్స్ ఇప్పుడు మీకోసం!చీర.. బ్రాండ్: సమీనాస్జ్యూలరీ బ్రాండ్: అరణ్య జ్యూలరీధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.‘‘నా ఫ్యాషన్ సీక్రెట్? కంఫర్ట్. అలాగే ‘లెస్ ఈజ్ మోర్’ అనే మేకప్ రూల్ను పాటిస్తాను. సంప్రదాయ దుస్తులు, ఆభరణాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే జడగంటలు, ముక్కుపుడకలు లాంటి ట్రెడిషనల్ టచ్ను మోడ్రన్ గా క్యారీ చేయడం నా స్పెషాలిటీ. ట్రెండ్స్ కోసం కాదు, నా ఒరిజినాలిటీ కోసం డ్రెస్ అవుతాను.’’ – ప్రీతి ముకుందన్ .చేతికి చిన్న మెరుపు వేసుకుంటే లుక్ పెద్దగా మారిపోతుందా? అంటే అవుననే చెప్తోంది ఈ బాజుబంద్. భుజం కింద భాగంలో కూర్చుని సున్నితంగా మెరిసే ఈ హ్యాండ్ జువెలరీ, మీ మొత్తం ఔట్ఫిట్కే రాయల్ అప్గ్రేడ్ లుక్ ఇస్తుంది. ఒకప్పుడు రాజకుటుంబాల స్టయిల్ సీక్రెట్గా ఉన్న ఇది, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కమ్బ్యాక్ కొట్టి ట్రెండింగ్లో టాప్ ర్యాంక్ సాధించింది. చిన్న రాళ్లు, ముత్యాలు, గోల్డ్ ఫినిష్ డిజైన్లతో రూపొందిన బాజుబంద్లు చేతి ఆకృతిని, జిమ్ అవసరం లేకుండానే! చిన్నగా చూపించడంలో సాయం చేస్తాయి.లెహెంగా, చీర, ఫ్యూజన్ వేర్ ఏది వేసుకున్నా ఇది సరిపోతుంది. హెవీ జ్యూలరీ పెట్టుకోకపోయినా, ఒక్క బాజుబంద్ చాలు మిగతావన్నీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్లిపోతాయి. స్లీవ్లెస్ లేదా హాఫ్ స్లీవ్ డ్రెస్సులతో అయితే ఇది ఫుల్గా షో ఆఫ్ అయ్యి, చూపుల్ని కట్టిపడేస్తుంది. మార్కెట్లో సింపుల్ నుంచి గ్రాండ్ వరకు అనేక డిజైన్లలో లభిస్తున్నాయి. -
ఈ సండే సరదాగా 'కేసర్ పిస్తా దోసె' ట్రై చేయండిలా..!
కేసర్ పిస్తా దోసెకావలసినవి: బియ్యం–ఒక కప్పు, మినపప్పు–పావు కప్పు , శనగపప్పు–ఒక టేబుల్ స్పూన్ , మెంతులు–ఒక టీ స్పూన్ , ఉప్పు– రుచికి సరిపడా, కుంకుమ పువ్వు–15, వేడి పాలు–2 టేబుల్ స్పూన్లు, నెయ్యి– 2 టేబుల్ స్పూన్లు, ఏలకులు–3 (పొడి చేయాలి)పిస్తా చట్నీ కోసం: పిస్తా–100 గ్రాములు, పచ్చి మిరకాయలు–2, తురిమిన కొబ్బరి–2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం–ఒక టీ స్పూన్ , జీలకర్ర పొడి–అర టీ స్పూన్, ఉప్పు –రుచికి సరిపడా. తయారీ: ముందుగా బియ్యం, మినప్పప్పు, శనగపప్పులను కలిపి ఆరు గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఎనిమిది గంటల సేపు పులియబెట్టండి. తర్వాత పాలను వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పావుగంట ఉంచండి. ఈ పాలను పులిసిన దోసెపిండిలో వేసి, బాగా కలపండి. అదే సమయంలో ఏలకుల పొడి కూడా కలపండి. అంతే దోసెపిండి రెడీ. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యితో దోసెలు వేసుకోవాలి.పిస్తా చట్నీ తయారీ: పిస్తా, పచ్చి మిరపకాయలు, కొబ్బరి తురుము, నిమ్మరసం, జీలకర్ర, ఉప్పుని అన్నింటినీ కలిపి మిక్సీ పట్టండి. రుచికి సరిపడా ఉప్పు కలపండి. అంతే టేస్టీ పిస్తా చట్నీ రెడీ. ఈ వేడి వేడి దోసెలను ఈ చట్నీతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.రష్యన్ మష్రూమ్ జూలియన్ కావలసినవి: పుట్టగొడుగు ముక్కలు–250 గ్రాములు ఉల్లిపాయ–1, వెల్లుల్లి రెబ్బలు–2, వెన్న–ఒకటిన్నర టేబుల్ స్పూ¯Œ హెవీ క్రీమ్–ముప్పావు కప్పు, మోజరెల్లా చీజ్– ఒక కప్పు (తురిమినది), మిరియాల పొడి–ఒక టీ స్పూన్, ఉప్పు– రుచికి సరిపడా. తయారీ: ముందుగా ఒక కడాయిలో టీ స్పూన్ వెన్న వేసి కరిగించండి. అందులో పుట్టగొడుగు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి. కాసేపు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలపాలి. పుట్టగొడుగుల్లోని నీరు ఆవిరయ్యేంత వరకు వేయించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బయటకు తీసి చిన్న సిరామిక్స్ బౌల్స్లో వేయాలి. అదే పాన్లో అర టీస్పూన్ వెన్న వేసి కరిగించండి. అందులో హెవీ క్రీమ్ వేసి మిక్స్ చేయండి. ఇందులో మిరియాల పొడి, ఉప్పు వేసి సాస్లా బాగా కలపండి. ఈ సాస్ను ముందుగా రెడీ చేసిన పుట్టగొడుగుల మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత మోజరెల్లా చీజ్ కూడా వేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని 375 ఫారన్హీట్ డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన మైక్రోవేవ్ ఒవెన్లో 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేయండి. అంతే టేస్టీ రష్యన్ మష్రూమ్ జూలియన్ రెడీ.ఛత్తీస్గఢీ ఫరా కావలసినవి: అన్నం–ఒక కప్పు, బియ్యప్పిండి–2 కప్పులు, ఎండు మిరపకాయలు–2, నువ్వులు–ఒక టేబుల్ స్పూన్ , జీలకర్ర– ఒక టేబుల్ స్పూన్, ఆవాలు–ఒక టీ స్పూన్ , కరివేపాకు–రెండు రెమ్మలు, పచ్చిమిర్చి–3 (ముక్కలుగా చేసుకోవాలి), కొత్తిమీర–కొద్దిగా, నూనె–తాలింపు కోసం, ఉప్పు–రుచికి సరిపడా.తయారీ: ముందుగా వండిన అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో బియ్యప్పిండి, ఉప్పు, తురిమిన అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు వేసి చపాతీ ముద్దలా తయారు చేసి కాసేపు ఉంచండి. ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నిలువుగా చిత్రంలో చూపిన ఆకారంలో చుట్టుకోవాలి. వీటిని స్టీమర్ సాయంతో 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. మరోవైపు పాన్ లో కొద్దిగా నూనె వేసి 2 ఎండు మిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, నువ్వులు వేసి వేయించండి. ఇందులో ముందుగా తయారు చేసిన అన్నం మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాలు వేయించండి. అంతే టేస్టీ ఫరా రెడీ. వీటిని పుదీనా చట్నీతో తింటే బాగుంటాయి. -
సహజ మెరుపుని అందించే 'ఐస్ కంప్రెస్ ఫేస్ మసాజర్'
ఎండ వేడి, కాలుష్యం, ఒత్తిడి వంటి వివిధ కారణాలతో చాలామందిలో నల్లటి మచ్చలు, ముఖం మీద సన్నని రంధ్రాలు వంటి సమస్యలు వస్తుంటాయి. వీటితో ముఖం నిస్తేజంగా మారుతుంది. ఇటువంటి సమయంలో ముఖంలోని సహజ మెరుపును తిరిగి పొందేందుకు చాలా మంది పార్లర్లకు వెళుతుంటారు. అయితే చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మార్చుకునేందుకు ఈ ఐస్ కంప్రెస్ ఫేస్ మసాజర్ సాయపడుతుంది. ఇది చర్మాన్ని చల్లగా మార్చి తాజాగా ఉంచుతుంది. దీని సాయంతో ఎటువంటి రసాయనాలు లేకుండానే ఇంట్లోనే సహజమైన నిగారింపు పొందవచ్చు.ఐస్ క్యూబ్లను నేరుగా ముఖానికి రాసుకుంటే చర్మం ఎర్రగా మారడం, మంట, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ ఐస్ కంప్రెస్ ఫేస్ మసాజర్ ఉపయోగిస్తే చల్లని స్పర్శ ముఖం అంతటికి సమానంగా అందుతుంది. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం సహజంగా కాంతిమంతంగా మారుతుంది. చర్మం ఎర్రబారడం వంటి సమస్యలు రావు. ఈ పరికరంతో సున్నితంగా మసాజ్ చేస్తే చర్మంపై ఏర్పడిన సన్నని రంధ్రాలు తగ్గి, చర్మం నునుపుదేరుతుంది. కళ్ల కింద వాపు, ముఖంపై అలసట మటుమాయం అవుతాయి. ఎండ ధాటికి చర్మం వడలిపోయే పరిస్థితి నుంచి రక్షణ పొందేందుకు కూడా ఈ మసాజర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మసాజర్ను ఉపయోగించడం చాలా తేలిక. మసాజర్లో నీటిని నింపి ఫ్రీజర్లో ఉంచాలి. నీరు గడ్డకట్టిన తర్వాత ముఖంపై మసాజ్ చేస్తే చాలు, మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఈ మసాజర్ కేవలం అందాన్ని పెంచడమే కాకుండా, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది పోర్టబుల్ సైజులో ఉండటంతో ఉపయోగించడం చాలా సులభం. తక్కువ ఖర్చుతో, ఎలాంటి రసాయనాలు లేకుండా ముఖాన్ని మెరిపించుకునేందుకు ఈ ఐస్ కంప్రెస్ ఫేస్ మసాజర్ మంచి ఎంపికనే చెప్పుకోవాలి. ఆన్లైన్లో లభిస్తున్న ఈ పరికరం ధర కేవలం రూ. 2,299 మాత్రమే.(చదవండి: పక్షవాతానికి వార్నింగ్ బెల్..!) -
పట్టులాంటి జాలువారే కురులు కోసం..
పట్టులా జాలువారే జుట్టు కోసం చాలామంది బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు. పార్లర్లలో క్రీములు వాడి, ఆవిరి పట్టించి జుట్టుకు సత్వరమే మెరుపును, మృదుత్వాన్ని అందిస్తారు. అయితే ఆ మెరుపు ఎక్కువ కాలం ఉండదు. ఇక్కడ చెప్పిన చిన్న ట్రిక్తో ఇంట్లో ఉండే వస్తువులతోనే జుట్టును మెరిసేలా, సిల్కీగా మార్చుకోవచ్చు. ఇందుకోసం బియ్యం కడిగిన నీటిని ఒక గ్లాసులో తీసుకోండి. ఈ నీటిలో మూడు స్పూన్ల కలబంద గుజ్జు కలిపి బాగా గిలకొట్టండి. తల స్నానం చేసిన వెంటనే తల తడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. తర్వాత నీటిలో ముంచిన మెత్తని కాటన్ గుడ్డను తలకు చుట్టుకోవాలి. కాసేపటికి ఫ్యాన్ గాలి తగిలేలా కూర్చోవాలి. పది నిమిషాల తర్వాత తలస్నానం చేసుకుంటే చాలు మెరిసే, పట్టుకుంటే జారిపోయే కురులు మీ సొంతమవుతాయి. -
ప్రెగ్నెన్సీ టైంలో శరీరమంతా దురదలు వస్తాయా..?
నేను ఎనిమిదో నెల గర్భిణిని. రెండు రోజులుగా శరీరం అంతా కొద్దిగా దురదగా ఉంటోంది. ఇది ఏమైనా సమస్యా? ఏమి చేయాలి?– రమ్య, గుంటూరు.సాధారణంగా 30 నుంచి 32 వారాల గర్భధారణలో, ముఖ్యంగా మొదటి గర్భం సమయంలో, కొంతమందికి శరీరం మీద దురదలు రావచ్చు. ఇలాంటి సమయంలో ముందుగా కొన్ని వివరాలు తెలుసుకోవడం అవసరం. దురదలు శరీరం అంతా ఉన్నాయా లేక అరికాళ్లు, అరిచేతుల్లో మాత్రమే ఉన్నాయా అని తెలుసుకోవాలి. అలాగే పగలు ఎక్కువగా ఉంటాయా, రాత్రి ఎక్కువగా ఉంటాయా అన్నది చూడాలి. కొంతమందికి దురదలు ఎక్కువగా ఉండి నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇవి మైల్డ్గా ఉన్నాయా లేక తీవ్రమైనవా అన్నది అంచనా వేయాలి. ఇలాంటి సందర్భంలో తల్లి ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షిస్తారు. రక్తపోటు వంటి ముఖ్యమైన అంశాలను పరీక్షిస్తారు. అలాగే బిడ్డ బాగున్నాడా లేదా అన్నది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి, డాప్లర్ పరీక్ష ద్వారా బిడ్డ బరువు, గర్భంలో ఉన్న ఉమ్మనీరు పరిమాణం, బిడ్డకు రక్తప్రవాహం ఎలా ఉందో పరీక్షిస్తారు. దురదలు తేలికగా ఉంటే సాధారణంగా యాంటీహిస్టమిన్ మందు, చర్మానికి రాసుకునే లోషన్ లేదా మాయిశ్చరైజర్ ఇచ్చి రెండు రోజులు పరిశీలిస్తారు. చాలాసార్లు ఇవి తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది. అయితే దురదలు ఎక్కువగా ఉన్నా లేదా మందులతో రెండు రోజులలో తగ్గకపోవడం జరిగినా పరీక్షలు చేయాలి. ముఖ్యంగా సీరమ్ బైల్ యాసిడ్స్, లివర్ ఫంక్షన్ టెస్టులు చేసి ఆబ్స్టెట్రిక్ కొలెస్టాసిస్ అనే సమస్య ఉందా లేదా చూడాలి. ఈ పరిస్థితిలో బైల్ యాసిడ్స్ పెరగడం వల్ల గర్భిణికి ఎక్కువగా దురదలు రావచ్చు. అలా ఉంటే దానికి ప్రత్యేకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స తీసుకుంటే దురదలు తగ్గి బిడ్డ ఎదుగుదల కూడా సాధారణంగా కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భధారణ కాలంలో, ముఖ్యంగా 38 వారాల వరకు లివర్ ఫంక్షన్ టెస్టులు, బైల్ యాసిడ్స్ పరీక్షలు తరచూ చేయించు కోవాలి. సాధారణంగా 38 వారాలు వచ్చిన తర్వాత డెలివరీ చేయడం సురక్షితంగా భావిస్తారు. ఎందుకంటే ఆబ్స్టెట్రిక్ కొలెస్టాసిస్ ఉన్నప్పుడు 38 వారాల కల్లా డెలివరీ చేస్తే తల్లీబిడ్డలు ఇద్దరికీ మంచిది.నాకు నలభై నాలుగు సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు కాకుండా శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను. అయితే, గత నాలుగు నుంచి ఆరు నెలలుగా నెలసరిలో చాలా ఎక్కువగా రక్తస్రావం అవుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది? ఏమి చేయాలి?– లక్ష్మీ దేవి, కర్నూలు.ఇలాంటి సమస్యతో వచ్చినప్పుడు ముందుగా రోగి డీటెయిల్డ్ హిస్టరీ తెలుసుకోవాలి. సైకిల్ రెగ్యులర్గా ఉన్నా రక్తస్రావం మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే ఉందా, లేక ఏడు రోజులు లేదా పది రోజులకంటే ఎక్కువ కొనసాగుతుందా అన్నది తెలుసుకోవాలి. అలాగే రోజుకు ఎన్ని ప్యాడ్లు మార్చాల్సి వస్తోంది, రాత్రిపూట కూడా లేచి మార్చాల్సి వస్తుందా, గడ్డలు పడుతున్నాయా, కడుపునొప్పి ఉందా వంటి వివరాలు కూడా తెలుసుకోవాలి. నలభై నాలుగు ఏళ్ల వయసు పెరిమెనోపాజ్ దశకు దగ్గరగా ఉండే వయసు కాబట్టి ఇలాంటి బ్లీడింగ్ ఎందుకు అవుతోంది అన్నది పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. అందుకోసం హిమోగ్లోబిన్ , సీబీపీ, థైరాయిడ్ హార్మోన్ పరీక్షలు, అలాగే మధుమేహానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేస్తారు. అదనంగా అల్ట్రాసౌండ్ స్కాన్ తప్పనిసరిగా చేస్తారు. స్కాన్లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయా, ఒవేరియన్ సిస్టులు ఉన్నాయా, లేదా ఎడినోమయోసిస్ వంటి సమస్యలు ఉన్నాయా అన్నది పరిశీలిస్తారు. ఇవి లేకపోయినా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే గర్భసంచి పొర మందం, అంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎంత ఉందో చూస్తారు. ప్రాథమికంగా రక్తస్రావం తగ్గించడానికి నాన్ హార్మోనల్ మందులు ఇస్తారు. హార్మోనల్ చికిత్స ప్రారంభించే ముందు బ్లీడింగ్కి కారణమేమిటో కచ్చితంగా తెలుసుకోవాలి. ఫైబ్రాయిడ్లు లేదా ఇతర సమస్యలు లేకపోయినా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే హిస్ట్రోస్కోపీ గైడెడ్ ఎండోమెట్రియల్ బయోప్సీ చేస్తారు. హిస్ట్రోస్కోపీ ద్వారా గర్భసంచి లోపల పరిస్థితిని నేరుగా చూసి, అక్కడి నుంచి చిన్న టిష్యూ నమూనా తీసి పరీక్షకు పంపడం. దీనివల్ల హార్మోన్ మార్పులు ఉన్నాయా లేదా కేన్సర్కు సంబంధించిన మార్పులు ఉన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత, నాన్ హార్మోనల్ మందులతో సమస్య తగ్గకపోతే హార్మోనల్ చికిత్స ఇవ్వచ్చు. ఇది మాత్రల రూపంలో ఇవ్వొచ్చు. మరో విధానం గర్భసంచి లోపల పెట్టే ప్రత్యేక పరికరం. ఇది కాపర్ టీ లాంటిదే కానీ ఇందులో హార్మో నెమ్మదిగా విడుదల అవుతుంది. దీనిని పెట్టిన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల వరకు పనిచేస్తుంది. దీని వల్ల నెలసరి క్రమంగా రావడం, రక్తస్రావం తగ్గడం, రోజువారీ జీవన నాణ్యత మెరుగుపడడం సాధ్యమవుతుంది. ∙డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ (చదవండి: పక్షవాతానికి వార్నింగ్ బెల్..!) -
వైరల్ వీడియో వెనుక భయంకర నిజం
హర్ష ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వయసు ఇరవై ఏడేళ్లు. మంచి జీతం. అతనికి పెళ్లి కుదిరింది. ఇక పెళ్లిపనులు మొదలుపెడదాం అనుకున్న అతనికి ఆరోజు జరిగిన సంఘటన అతని జీవితాన్ని కుదిపేసింది. ఒకరోజు ఉదయం అతని ఫోన్ మోగింది. అటు పక్కనుంచి అతడి స్నేహితుడు ఆదిత్య.‘‘హర్షా .. నువ్వేంటి ఇలాంటి దందా పనులు చేయడం ఎప్పటినుండి మొదలుపెట్టావు?’’ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘ఏంట్రా నేనేం దందా పనులు చేస్తున్నాను?’’ ఆందోళనగా అడిగాడు హర్ష. ‘‘నువ్వు చేస్తున్న పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నువ్వు చేసే పనులు వీడియోలు ఉన్నాయి... ఆ వీడియోలు నీకు కాబోయే భార్య చూసిందంటే... నీ పెళ్లి క్యాన్సిల్ కావచ్చు... జాగ్రత్త!’’ అని చెప్పి ఆదిత్య ఫోన్ పెట్టేశాడు. హర్ష ఆందోళనగా ఆదిత్య పంపిన వీడియో చూడసాగాడు. అందులో హర్ష చేతిలో తుపాకీ పట్టుకుని, కర్కశమైన గొంతుతో మాట్లాడుతూ ఒక ప్రముఖ వ్యాపారవేత్తను బెదిరిస్తున్నాడు. ఆ వ్యాపారవేత్త భయంభయంగా వదిలేయమన్నట్టుగా హర్షను వేడుకుంటున్నాడు. ఆ వీడియో చూడగానే అతని గుండె ఒక్కసారిగా బరువైంది. ‘ఇది... ఇదెలా సాధ్యం?’ హర్షకు ఒక్కసారిగా భయంతో మెదడు మొద్దుబారింది. ఇది అసలు తాను కాదు. మరి ఇదెలా సాధ్యం? ఆలోచనలు... ఆందోళన కమ్ముకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.కొద్ది నిమిషాల తరువాత...హర్ష ఫోన్ ఆగకుండా అలా మోగుతూనే ఉంది. తేరుకున్న అతను ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ పేరు చూడగానే, తన జీవితం ఇక ముగిసింది అనుకున్నాడు హర్ష. కారణం ఫోన్ చేసింది తన కాబోయే భార్య స్నేహ...తాను కూడా ఆ వీడియోస్ తప్పకుండా చూసే ఉంటుంది. తనతో తెగతెంపులు చేసుకోవడానికి ఫోన్ చేస్తోంది అని అర్థం అయింది అతడికి. చివరిసారిగా ఆమెతో మాట్లాడాలని వణుకుతున్న చేతులతో ఫోన్ తీసాడు హర్ష.‘‘హలో...’’ కంపిస్తున్న స్వరంతో అన్నాడు హర్ష. ‘‘నేను ఆ వీడియోస్ చూశాను’’ అన్నది స్నేహ. కొన్ని నిముషాలు అలా మౌనంగా ఉండిపోయాడు హర్ష.‘‘ఆ వీడియోలో ఉన్నది నేను కాదు’’ మెల్లగా అన్నాడు హర్ష. తన కళ్ళముందే తన కలలసౌధం కూలిపోతున్నట్టు అనిపిస్తోంది అతడికి.‘‘ఆ వీడియోస్లో ఉన్నది మీరు కాదని నాకు తెలుసు’’... ప్రశాంతంగా చెప్పింది స్నేహ‘‘ఇది బహుశా సైబర్ మోసం కావచ్చు. డీప్ ఫేక్ తో ఇలా ఒకరి మొహాన్ని, స్వరాన్ని అనుకరించి అనుసరించి మోసాలు చేస్తారని తెలుసు. మీరు వెంటనే ఆ వీడియో గురించి సైబర్ కంప్లయింట్ ఇవ్వండి.’’ చెప్పింది.స్నేహ మాటలు హర్షకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి.వెంటనే సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదు అయింది. సైబర్ క్రైమ్ అధికారి సాగర్ కేసు విచారణ మొదలుపెట్టాడు.ఆ వీడియోని జాగ్రతగా పరిశీలిస్తున్నాడు సాగర్. వీడియోలోని ముఖం, స్వరం అన్నీ హర్షవే...‘‘ఇది కచ్చితంగా డీప్ ఫేక్ వీడియో.’’ అన్నాడు సాగర్. హర్ష కొద్దిగా కుదుటపడ్డాడు.‘‘డీప్ ఫేక్ అంటే?’’ అడిగాడు.‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎవరి ముఖాన్నైనా, స్వరాన్నైనా ఉపయోగించి నకిలీ వీడియోలు తయారు చేయడం.’’ వివరించాడు. ఆ వీడియోను సాగర్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాడు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ విశ్లేషణ జరిగింది. కళ్ల కదలికల్లో స్వల్ప అసమానత. లైట్ రిఫ్లెక్షన్లో చిన్న తప్పులు. చివరకు నిర్ధారణ అయ్యింది– అది డీప్ ఫేక్.కాని, ఎవరు చేశారని అసలు విచారణ ఇప్పుడు మొదలైంది.అసలు నేరస్థుడు హర్ష కంపెనీలో పని చేసిన మాజీ ఉద్యోగి రాహుల్. అతను చేసిన ఒక మోసం వల్ల కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. హర్ష అతని ప్రాజెక్ట్ లీడర్.రాహుల్ సోషల్ మీడియాలో హర్ష ఫోటోలు, వీడియోలు సేకరించాడు. ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్ ఉపయోగించి అతని ముఖం, స్వరం కాపీ చేశాడు. ఆ వీడియోతో వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ వీడియో ముందుగానే లీక్ అయింది.సైబర్ ట్రేసింగ్ ద్వారా రాహుల్ ల్యాప్టాప్లో ఆ సాఫ్ట్వేర్, డ్రాఫ్ట్ ఫైళ్లు దొరికాయి.అతను అరెస్ట్ అయ్యాడు.హర్ష నిర్దోషిగా బయటపడ్డాడు. కాని, అతని మనసులో ఒక ప్రశ్న మాత్రం మిగిలింది.‘‘ఇప్పటి ప్రపంచంలో మన ముఖం కూడా మనదేనా?’’∙∙ ‘థాంక్యూ స్నేహా..పెళ్ళికి ముందే కాబోయే భర్త నిర్దోషి అని నమ్మావు. మోరల్ సపోర్ట్ ఇచ్చావు’’ స్నేహని చుట్టేస్తూ అన్నాడు హర్ష.‘‘టెక్నాలజీ చాలా శక్తిమంతమైనది. కాని, బాధ్యత లేకుండా వాడితే అది ఆయుధం అవుతుంది.’’ ముఖ్యంగా డీప్ ఫేక్ గురించి అవగాహన, సైబర్ నేరాల పట్ల ఎవేర్నెస్ లేకపోతె ప్రమాదం. భయపడటం మానేస్తే నేరాలను ఎదుర్కోవడం కష్టమేమీ కాదు’’ చెప్పింది స్నేహ. గమనిక:ఇన్నాళ్లూ కొనసాగించిన ‘క్రైమ్ రిపోర్టర్’ కాలమ్ను పాఠకులు ఆదరించారు. పాఠకుల్లో చాలామంది ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్ఫిక్షన్ కోరుకుంటున్నందున ఈవారం నుంచి ‘క్రైమ్ రిపోర్టర్’ స్థానంలో కొత్తగా ‘క్లూషియల్’ శీర్షికను ప్రవేశ పెడుతున్నాం. ఇందులో వారం వారం క్రైమ్ కథలు అందించనున్నాం.∙శ్రీసుధామయి -
పిల్లలకు కష్టం విలువ చెప్పాలి
చదువు, ఉద్యోగం, వివాహం– ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలోనూ కొనసాగే దశలే! కాని, ఇప్పుడు ప్రతిదీ అపసవ్యంగా జరుగుతోంది. దానికి కారణం పెంపకం లోపాలే! జీవితంలో ఏదీ సులువుగా రాదు, కష్టపడాల్సిందే అని పిల్లలకు నేర్పాలి. ‘మా చిన్నతనంలో మేం కష్టపడ్డాం. పిల్లలు ఇప్పుడు సుఖంగా పెరగాలి’ అనే ఆలోచనతో వారి అవసరానికి మించి ఖర్చుపెట్టే వాళ్లున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి. మనం ఎంత సామాన్యంగా జీవిస్తామో పిల్లలు అంత ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఉచితంగా ఇచ్చేదానికి విలువ ఉండదు. ఏదైనా ఒక వస్తువు కొనాలంటే నా చిన్నతనంలో ఎంత కష్టపడ్డానో, అవసరానికి ఎవరి ముందు చేయి చాపకుండా ఎలా జీవించాలో, దాని వల్ల జీవితం ఎంత బాగుంటుందో చెప్పేదాన్ని. దీని వల్ల పిల్లల్లో అవగాహన పెరుగుతుంది. ఈ రోజుల్లో పేరెంట్స్ ఎలా ఉన్నారంటే పిల్లలు ఏదైనా కళ నేర్చుకుంటే వాళ్లు నెల రోజుల్లో దానిని స్టేజీపైన ప్రదర్శించాలి. త్వరగా ఫేమస్ అయిపోవాలి. అంతా షార్ట్ టర్మ్లో జరిగిపోవాలనే ధోరణి బాగా పెరిగింది.నా చిన్నతనంలో ఆర్థిక సంక్షోభంలో ఉండే కుటుంబాలు ఎక్కువ. ఎక్కువ సంతానం, తక్కువ సంపాదన. చాలా కష్టపడి పిల్లల్ని పెంచేవారు. ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటిగా భావించేవారు. అలాంటి స్థితిలో నేను పెరిగాను. మాది చేనేత కుటుంబం. ఆడపిల్లలను చదివించి, పెళ్ళిళ్లు చేయాలంటే మరీ భారంగా ఉండేది. నాకు చదువు మీద ఇష్టం ఉండటంతో కాలేజీ వరకు వెళ్లగలిగాను. బీఎస్సీ చదువుతున్నప్పుడు పెళ్లయ్యింది. పెళ్లయ్యాక ఉమ్మడి కుటుంబం. అయినా ఎమ్మెస్సీ చేయగలిగాను. టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా నాకు నేను నిలదొక్కుకోగలిగాను. మా అక్క, అన్నయ్యలు సాహిత్యం అంటే ఇష్టం చూపేవారు. మా వారు సాహితీవేత్త. సాహిత్యాభిలాషతో నేనూ రచనలు చేస్తుండేదానిని. నాకు ఒక్కగానొక్క కూతురు పల్లవి. నా కూతురు బాగా చదువుకోవాలని ఉండేది. అలాగని నా ఇష్టాలను తనమీద రుద్దలేదు. నేను చదువుకుంటూ, రాసుకుంటూ ఉండేదాన్ని. బహుమతి రూపంలో పుస్తకమే ఇచ్చేదాన్ని. దీని వల్ల తనకూ సాహిత్యం అంటే ఇష్టం ఏర్పడింది. సంగీతం, చిత్రలేఖం నేర్చుకుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసింది. పెళ్లయిన తర్వాత అమెరికా వెళ్లి, అక్కడా ఉద్యోగం చేసింది. తిరిగి హైదరాబాద్ వచ్చాక కూడా ఉద్యోగం కొనసాగించింది. టెక్నాలజీని చెడుగా ఉపయోగిస్తున్నారు...నా చిన్నతనంలో వినోద కార్యక్రమాలు పెద్దగా లేవు. ఖాళీ సమయం ఎక్కువ ఉండేది. దీని వల్ల పుస్తకాలు, సంగీతం, సాహిత్యం పట్ల ఆసక్తి చూపేవాళ్లం. ఈ రోజుల్లో టీవీ చానెళ్లు, స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా పిల్లల ఆలోచనలను త్వరగా డైవర్ట్ చేస్తున్నాయి. టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవడం లేదు. తల్లిదండ్రులు టెక్నాలజీ గురించి మంచి చెడులు చెప్పగలిగి, ఫోకస్డ్గా ఉంటే పెంపకం బాగుంటుంది. కాని, వాళ్లే చేతిలో సెల్ఫోన్ పెట్టి అన్నం తినిపిస్తున్నారు. ఇక వారేం మంచి చెప్పగలుగుతారు. మా ఇంట్లో ఇప్పటికీ ఎవరమూ సీరియళ్లు చూడం. జాగ్రఫిక్ చానెల్స్, పాత సినిమాలు చూస్తాం. దీని వల్ల సమయం ఉంటుంది. మా అమ్మాయి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంది. ట్రాన్స్లేషన్స్ చేస్తుంటుంది. మా మనవరాలు ఆశ్లేష ఇంగ్లిష్ సాహిత్యం చదవడం, రాయడం చేస్తుంది. మేం ముగ్గురం కలిసి పుస్తకాల గురించి చర్చించుకుంటాం. పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఎలా పరిష్కరించుకోవచ్చో కూడా తెలుస్తుంది. ఇస్కూలు కథలునేను మ్యాథ్స్ టీచర్గా ఉద్యోగం చేశాను. అయినా పిల్లల కల్చరల్ యాక్టివిటీస్ చూసేదాన్ని. పిల్లల చేత పాటలు పాడించడం, డ్యాన్సులు, నాటకాలు వేయించడం చేసేదాన్ని. నా ఉద్యోగ అనుభవాలతో ‘ఇస్కూలు కథలు’ పేరుతో 30 కథలతో బుక్ తీసుకువచ్చాను. మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ పుస్తకంలోని ‘ఒకే తాను ముక్కలం’ అనే కథ వారి స్కూల్ పాఠ్య పుస్తకాలలో ఒక పాఠంగా చేర్చింది. ఆ బుక్ హిందీలోకి కూడా అనువాదమైంది.మా దగ్గరున్న పుస్తకాలతో మా అమ్మాయి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసింది. వాటిలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అన్ని రకాల పుస్తకాలు ఉంచాం. ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు, చదువుకోవచ్చు అని మా చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలియజేశాం. కాని, రిటైర్ అయిన ఒకరిద్దరు తప్ప మిగతా ఎవ్వరూ రావడం లేదు. పిల్లలు స్కూల్ బుక్స్, ట్యూషన్స్తో, పెద్దలు సీరియల్స్తో టైమ్ గడిపేస్తున్నారు. ఈ విధానం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఎవరూ ఊహించడం లేదు. హాస్టల్లో ఉంటున్నవారి శాతమూ పెరిగింది. వాళ్లు పెరిగి, పెళ్లయ్యాక కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోతున్నారు. దీంతో త్వరగా విడాకులవైపుగా వెళ్లడమూ పెరిగింది. పేద–ధనిక అనే తేడా లేదు పిల్లల పెంపకంలో అందరిలోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి. ఆ ప్రభావాలు పిల్లల మీద నెగటివ్గా పడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సింది తల్లిదండ్రులే!కేరెంటింగ్- శీలా సుభద్రాదేవి శీలా సుభద్రాదేవి ప్రముఖ రచయిత్రి, కవయిత్రి. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవంతో ఇస్కూలు కథలు సంపుటి వెలువరించారు. దీనితో పాటు తొమ్మిది కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు, ఒక నవలను అందించారు. ∙ నిర్మలారెడ్డి -
ఈ వారం కథ: అమ్మ పుట్టినరోజు
భాద్రపద మాసం, ఋషి పంచమి. నిండా పూలతో మందారం చెట్టు ఆకుపచ్చ చీరలో అప్పుడే కుంకుమ పూజ చేయించుకున్న అమ్మవారిలా ఉంది. ఇంటిముందు విరజాజి మొక్క రోజూ ఫోన్లో పలకరించే కూతురిలా పరిమళం వెదజల్లుతోంది.అటూ ఇటూ ఉన్న మామిడి, పనస సీజనల్ చెట్లు అప్పుడప్పుడూ వచ్చిపోయే కొడుకుల్లా గంభీరంగా ఉన్నాయి.‘‘అమ్మా రావాలి కేక్ కరిగిపోతోంది’’ చిన్నోడు తొందరపెట్టాడు.‘‘అయిపోయిందిరా వచ్చేస్తున్నాం’’ గదిలోంచి అమ్మకి పట్టుచీర కట్టి తీసుకొచ్చింది కూతురు. పెద్ద కొడుకు కవర్లోంచి శాలువా తీసి ట్యాగ్ చింపి పట్టుకుని రెడీగా ఉన్నాడు. జయంతి సోఫాలో కూర్చుంది. ఎదురుగా టీపాయ్ మీద ‘బిస్కఫ్’ కేక్ ఆమె వయసు డెబ్బై ఐదుగా ప్రకటిస్తోంది. కొడుకులిద్దరూ, కోడళ్ళు, కూతురు ఆమె చుట్టూ కూర్చున్నారు. అదే వీధిలో ఉంటున్న చిన్ననాటి స్నేహితురాలు శాంతమ్మ కూడా వచ్చింది. అల్లుడు కొంచెం దూరంగా కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. అతనికీ అత్తగారంటే అభిమానమే కాని, ఇలాంటి ఆర్భాటాలు అంతగా నచ్చవు. ఎక్కడెక్కడో ఉన్న మనవలు వీడియో కాల్లో చూస్తుండగా కేక్ కట్ చేసింది. పెద్దకొడుకు శాలువా కప్పాడు. పెద్దకోడలు అక్షింతలు కలిపి తెచ్చింది. ఒక్కొక్క జంటా కాళ్ళకి నమస్కారం పెడితే, బట్టలమూటతో వీధి వీధి తిరిగే బంగారయ్య దగ్గర కొన్న లుంగీ, తువ్వాలు, డజను జేబురుమాళ్ళు, ఆడవాళ్ళకి చీర జాకెట్టుతోబాటు పసుపు కుంకుమ, కవర్లో కొంత డబ్బు సర్ది ఉంచి కూతురిచేత అందరికీ ఇప్పించి, తనని కూడా తీసుకోమంది. వాళ్ళు సంతోషంగా తీసుకున్నారు. చిన్నోడు అక్క చేసిన మామిడికాయ పులిహోర క్యాన్తో తీసుకెళ్లి పక్కవీధిలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఇచ్చి వచ్చాడు. జయంతి ఆరోజు ఉపవాసం ఉండటంతో మిగిలిన వాళ్లంతా కలిసి భోంచేస్తూ కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం టీ తాగి రాత్రికి ఇంత పులిహోర బాక్స్ కట్టుకుని ఎవరి ట్రైన్కి వాళ్ళు వెళ్లిపోయారు. దగ్గరే కాబట్టి కూతురు అల్లుడు కార్లో బయలుదేరారు. అలా ఆ ఏడు కూడా జయంతి పుట్టినరోజు వినాయకచవితి మర్నాడు ఘనంగా జరిగింది. జయంతి, ఆమె పెంచుకున్న వనం, పనమ్మాయి మిగిలారు. ∙∙ ‘‘ఏవండీ అత్తయ్యగారి ఫోను. చాలాసార్లు చేశారు’’ అంది రాధ ఫోన్ చిన్నోడి చేతికిస్తూ.‘‘టైం లేదు, దార్లో మాట్లాడతాలే’’ అన్నాడు టక్ సరిచేసుకుంటూ.‘‘చాలాసార్లు చేశారు. ఏం అర్జెంటో? ఒకసారి మాట్లాడొచ్చు కదా’’ అంది రాధ కొంచెం ఆందోళనగా ‘పోనీ నేనెత్తనా’ అన్నట్టు సైగ చేస్తూ.‘‘అదేం లేదు. సెప్టెంబర్ లో ఆవిడ పుట్టినరోజు కదా. మళ్ళీ టిక్కెట్లు దొరకలేదంటామని అరవైరోజుల ముందే చెప్పటాని కయ్యుంటుంది’’ అన్నాడతను లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ.‘‘అవును కదూ. అయితే మనం ఊరెళ్తున్నామోచ్’’ అంది రాధ చిన్నపిల్లలా. ‘‘లేదు, లేదు. ఈసారి వెళ్ళటానికి కుదరదు’’ అన్నాడతను విసుగ్గా.‘‘అదేంటండీ, ప్రతీ ఏడూ వెళ్తున్నాం. పేరుకి ఆవిడ పుట్టినరోజైనా ఎంజాయ్ చేసేది మనమే కదా. ఓ వేడుకలా జరుగుతుంది. నాకెంతో ఇష్టం అలా గడపటం’’ అందామె గుర్తుచేసుకుంటూ.‘‘నీకేం, చక్కగా ఆవిడిచ్చిన చీర కట్టుకుని డబ్బులు తీసుకుంటావు’’ అంటూ ఉండగానే రాధ అడ్డుపడి, ‘‘పాపం పెద్దావిడ అంత అభిమానంగా పిలిస్తే అలా అంటారేంటి’’ అంది.దానికతను సోఫాలో కూర్చుని షూ వేసుకుంటూ, ‘‘నిజమే. ఆవిడదేం పోయింది? అందరూ రావాలంటుంది. మన నలుగురూ ఫ్లైట్లో వెళ్ళొస్తే కనీసం ఏభైవేలవుతుంది. పిల్లలతో రైల్లో రోజున్నర కూర్చోగలమా. పోనీ వాళ్ళని వదిలేసి వెళదామా అంటే మనం ఎదురుగా ఉంటేనే చదవట్లేదు. ఇంక వదిలి వెళితే ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి గందరగోళం చేస్తారు. పైగా చవితి మర్నాడు వర్కింగ్ డే. అమ్మ పుట్టినరోజుకి ఆఫీస్లో వారం సెలవంటే నవ్వుతారు. వెళ్లినంతకాలం వెళ్ళాం. ఇక చాల్లే. నువ్వు కూడా ఓ రెండు రోజులు ఫోనెత్తకు. తర్వాత ఫోన్ చేసి టికెట్స్ అయిపోయాయి అని చెబుదాం. పండక్కి ఎలానూ వెళతాం కదా.’’ అన్నాడు.‘‘పోనీ ఇప్పుడెళ్ళి పండక్కి మానేయొచ్చుగా?’’ అందామె.‘‘పండక్కి నా ఫ్రెండ్స్ అంతా వస్తారు. వాళ్ళని కూడా కలవొచ్చు’’ అన్నాడతను కార్ కీస్ తీసుకుని బయల్దేరుతూ. ఆమె చేతిలో ఫోన్ మోగుతూనే ఉంది. భర్త వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయింది రాధ.∙ ‘‘చెప్పమ్మా’’ అంది పద్మ భర్తకి ఇడ్లీలోకి రెండో పచ్చడి మిక్సీ చేస్తూ. ‘‘అదేనే ఈ ఏడు చవితి సెప్టెంబర్ ఆరున పడింది. ఆ మర్నాడే నా పుట్టిన రోజు. ఓ నాలుగు రోజులు ముందుగా వస్తే, జంతికలు, మిఠాయి చేసుకుందాం. మీరు చవితి ఇక్కడే చేసుకోవచ్చు’’ అంది జయంతి.‘‘అమ్మా ఆయనతో ఈ టాపిక్ ఎత్తాలంటేనే భయంగా ఉంది. ‘అస్తమానూ మీ ఇంటికి నన్ను రమ్మనకు, కావాలంటే నువ్వెళ్లిరా’ అని తిడుతున్నారమ్మా’’ అంది పద్మ మిక్సీ జార్లోని పచ్చడి బాక్స్లోకి ఒంపుతూ.‘‘అదేంటే, పెళ్ళై నలభై ఏళ్లయినా ఇంకా అత్తవారింటికి వెళ్లే అదృష్టం ఎంతమందికి ఉంటుంది. ఉన్న వారం రోజులూ ఎంత మర్యాదగా చూస్తాం. అక్కడైనా అతను ఇంట్లో కూర్చోవటమేగా. అదేదో ఇక్కడే కూర్చోమను. అల్లుడుగారికి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతా’’ అనగానే టిఫిన్ ప్లేట్తో బాటు ఫోన్ కూడా భర్తకిచ్చింది పద్మ. దగ్గరి బంధువే కావటంతో జయంతికి అల్లుడంటే అభిమానంతో బాటు చనువెక్కువ. ‘‘నమస్తే అత్తయ్యా. మీ ఆరోగ్యం బావుందా?’’ అన్నాడతను.‘‘బావున్నాను అల్లుడుగారూ. అదే.. వినాయకచవితికి మీరు అమ్మాయిని తీసుకుని రావాలి, ఆ మర్నాడు నా పుట్టినరోజుకి కూడా ఉండి వెళ్ళాలి’’ అంది జయంతి అభిమానంగా. ‘‘శుభం అత్తయ్యా. మీరు ఇలా నిండు నూరేళ్లు పుట్టినరోజులు జరుపుకోవాలి’’ ‘‘అది సరే, అల్లుడూ మీరు రావాలి’’దానికతను ‘‘అత్తయ్యా, నేనూ పెద్దవాడినైపోయాను. ఎక్కడివాళ్ళు అక్కడ ఇంత తిని రెస్ట్ తీసుకుంటే మంచిది. మీ జనరేషన్ వాళ్లకి ఇమ్యూనిటీ ఎక్కువ. మా దినచర్యలో చిన్న మార్పు వచ్చినా దగ్గో, జలుబో వచ్చేస్తోంది. ఈ తిరుగుళ్లు వల్ల, నీరు మార్పిడి వల్ల ఏమైనా వస్తే మీ పిల్లలు దేశంలోనే ఉన్నారు, వస్తారు. నా పిల్లలు విదేశాల్లో ఉన్నారు, రాలేరు, అక్కడ స్థిమితంగా ఉండలేరు. అంచేత మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీ అమ్మాయికి నచ్చచెప్పండి. మీరు పెద్దవారు, నొప్పిస్తే క్షమించండి’’ అన్నాడు అనునయంగా. జయంతి మరేం మాట్లాడలేకపోయింది. జయంతి పెద్దకొడుకు ఇల్లు. ‘‘ప్రశాంతీ’’ పిలిచాడు సాగర్.‘‘మీకు రెండోసారి కాఫీ ఇచ్చేసినట్టు గుర్తు. కావాలంటే మళ్ళీ ఇస్తాను’’ అంది ప్రశాంతి పూజకి ఏర్పాటు చేసుకుంటూ. ‘‘అదికాదు నీతో ఓ విషయం మాట్లాడాలి’’‘‘నేను దేవుళ్ళని తోముకోవాలి. ఓ గంట పడుతుంది. అంతవరకూ టిఫిన్ చెయ్యను. టాబ్లెట్ కూడా వేసుకోటానికి లేదు. ఈ మూడ్లో మీరు చెప్పే విషయం నాకు నచ్చినదైతే పరవాలేదు, నచ్చనిదైతే కొంచెం నెగటివిటీ పెరుగుతుంది. అదే టిఫిన్ చేసి మాత్ర వేసుకున్నాక ప్రశాంతంగా వింటే ఒకవేళ నచ్చకపోయినా మనం శాంతంగా పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి ఏమిటి విషయం’’ అంది ప్రశాంతి దగ్గరకొచ్చి. ‘‘అర్జెంటేమీ లేదులే. నీ పని చూడు. తర్వాత మాట్లాడుదాం’’ అన్నాడతను పేపర్ తిరగేస్తూ. ఓ గంట పోయాక అతనికి టిఫిన్ ఇచ్చి, తనూ తెచ్చుకుని ఎదురుగా కూర్చుని ‘‘ఇప్పుడు చెప్పండి’’ అంది ప్రశాంతి. ‘‘అదే అమ్మ ఫోన్ చేసింది’’‘‘అవునా! ఏమిటట? బావున్నారా?’’ ‘‘హా! బావుంది. అదే భాద్రపద మాసంలో ఆవిడ పుట్టినరోజు కదా. ఎప్పటిలానే రమ్మంటోంది’’ అన్నాడు నసుగుతూ. ‘‘మీరేమన్నారు?’’ అడిగింది ‘‘నిన్నడిగి చెబుతానన్నాను’’ ‘‘దానికి ఆవిడేమన్నారు?’’ అతనేం మాట్లాడలేదు. ‘‘పర్లేదు చెప్పండి’’ ‘‘భార్యకి సమాన విలువ ఇవ్వటం, ఏదైనా నిర్ణయం కలిపి తీసుకోవటం, ఇవన్నీ నేనూ సమర్థిస్తానురా. కానీ ఇంత చిన్న విషయం కూడా ఆవిడని కనుక్కుని చెబుతాను అనటం అన్యాయంరా’’ తల్లి అన్న మాటలు గుర్తు చేసుకుని తలదించుకున్నాడు. ‘‘అర్థమైంది’’ అంది ప్రశాంతి నెమ్మదిగా ఎరుపెక్కుతూ. ‘‘అలా అని కాదు శాంతీ, ఆవిడ అన్నది కూడా నిజమేగా, ఇది చాలా చిన్న విషయం’’ అన్నాడతను నెమ్మదిగా.‘‘నిజమే. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. మామూలుగా అయితే వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు. రాత్రి స్వామి పవళింపు సేవ అనంతరం ఎక్కితే సుప్రభాత సేవ టైంకి దిగిపోతాం. చక్కగా మీకూ నాకూ బట్టలు పెడతారు, మనం కూడా ఓ చీర, స్వీట్స్ కొని పట్టికెళతాం, ఓ పూట అందరం కలుస్తాం. కానీ ఆ ముందురోజు వినాయక చవితి. ఇంట్లో వినాయకుణ్ణి పెట్టుకుని దీపం, నైవేద్యం పెట్టకుండా ఇల్లు తాళం పెట్టటం మంచిది కాదు. అలా అని మీరొక్కరూ వెళితే ఇప్పటికే గడుసుదానిగా పడిన ముద్ర మరింత బలపడుతుంది. పోనీ మీరు నా తరఫున బలంగా చెబుతారా అంటే ఏమీ మాట్లాడరు. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం’’ అని, ఇలా కొనసాగించింది. ‘‘ఈ వయసులో ఆవిడకి ఈ సరదాలు అవసరమా అని నేననను. చెప్పానుగా ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం?’’ సాగర్ ఏమీ మాట్లాడలేదు. ∙∙ మరో నాలుగు సంవత్సరాల తర్వాత భాద్రపద మాసం, ఋషి పంచమి.పనమ్మాయి సాయంతో జయంతి తలస్నానం చేసింది. పెద్దకోడలు కేక్ ఆర్డర్ పెట్టింది. చిన్న కొడుకు ఫ్లవర్స్ పంపాడు. కూతురు ఆన్లైన్లో చీర పంపింది. అందరూ వీడియో కాల్లోకి వచ్చారు. జయంతి కేక్ కట్ చేసింది, ఆమె ఎడం కన్ను అదే పనిగా నీరు కారుతోంది. మొహం పొంగి ఉండటం గమనించి కాళ్ళ వాపు చూసి, తనకున్న సోషల్ మీడియా పరిజ్ఞానంతో డై యూరెటిక్ టాబ్లెట్ వేసుకోమన్నాడు చిన్నోడు. పండక్కి వచ్చినప్పుడు టోటల్ బాడీ చెకప్ చేయిద్దామన్నాడు పెద్దోడు. అంతా ఫోన్ పెట్టేసారు. మూణ్నెల్లు ముందే ఎవరి కవర్లలో వాళ్ళకి సర్ది ఉంచిన బట్టలు, పసుపు కుంకుమ ఎదురింటి అబ్బాయికిచ్చి కొరియర్ చేయించింది. డబ్బులు కూడా అతనికే ఇచ్చి యాప్ ద్వారా పంపమంది. కేక్ని వీధిలో పిల్లలందరికీ పంచింది పనమ్మాయి. ∙∙ ధనుర్మాసం.జయంతికి వొంట్లో బాగోలేకపోవటంతో అందరూ పండక్కొచ్చారు. అంతకుముందు హాల్లోనే కూర్చుని హడావిడి చేసే జయంతి గదిలో మంచానికి పరిమితమైంది. పెద్దగా తిండి సహించటం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్లారు, వార్ధక్యం మినహా పెద్దగా జబ్బులేవీ బయటపడలేదు. ఆకలి పెరగటానికి టానిక్ రాసి పంపేశారు. ‘పుట్టినరోజు జరుపుకోకపోతే ఇంతలా బెంగ పడిపోవాలా’ అని పిల్లలు బాధపడ్డారు. ‘బర్త్డే బ్లూస్’ గురించి, ‘నార్సిజం’ గురించి కాసేపు మాట్లాడుకున్నారు. అంతలో శాంతమ్మ మనవడి సాయంతో వచ్చింది. జయంతిని పలకరించి హాల్లోకొచ్చింది. జయంతి పిల్లలు ముగ్గురూ ఆవిడని బాగా ఎరుగుదురు. ఆవిడకి కాఫీ ఇచ్చి కూర్చున్నారు. ‘‘అదే పిన్నీ, టెస్ట్లు చేయిస్తే అంతా నార్మల్గానే ఉంది అన్నారు. ఎనభై వచ్చాయి, ఇంకా ఒంటరిగా ఉండొద్దు, వచ్చెయ్యమంటే వినదు. ఈమధ్య ఏవో కారణాలవల్ల ముగ్గురం రాలేక పోయాం. అప్పటి నుంచి ఇలా మంచం పట్టింది. మా చిన్నప్పుడెప్పుడూ అమ్మ తన పుట్టినరోజు జరుపుకున్నట్టు గుర్తులేదు. అదేంటో మేమంతా వేరే ఊళ్ళల్లో స్థిరపడ్డాకే మొదలెట్టిందీ అలవాటు’’ అని విసుక్కున్నారు. శాంతమ్మ అంతా విని, నెమ్మదిగా చెప్పటం మొదలు పెట్టింది. ‘‘మనుషుల మధ్య ఇప్పటికీ గోడలుగా ఉన్న కులం అప్పట్లో కోటలుగా ఉండేది. ఒకర్నొకరు ఇష్టపడ్డ కారణానికి రెండు కుటుంబాలనీ వదులుకోవలసి వచ్చింది. అప్పుడు మీరు చిన్నపిల్లలు. మీ నాన్న పుట్టినరోజున శాంతి ఆశ్రమానికి వెళ్లొస్తూ ఉండగా ఓ కారు గతితప్పి దూసుకొచ్చింది. మీ అమ్మని తప్పించబోయే ప్రయత్నంలో మీ నాన్న ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రిలో రెండు నెలలు ట్రీట్మెంట్ జరిగినా లాభం లేకపోయింది. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు దూరమైన బాధ ఆ క్షణం అతనిలో స్పష్టంగా తెలిసింది. చివర్లో వాళ్ళు వచ్చినా ఐసీయూలో ఒకరి తర్వాత ఒకరిని, అదీ కొన్ని నిమిషాలపాటు మాత్రమే చూడగలిగారు. అప్పుడే ఆయన తన చివరి కోరికగా మీరంతా పెద్దయ్యాక ఎక్కడెక్కడ స్థిరపడినా కనీసం ఏడాదికోసారైనా కలిసి సంతోషంగా గడిపేలా చూడమని మీ అమ్మకి చెప్పాడు. పండక్కి కలుద్దామంటే ఆడపిల్ల వాళ్ళ అత్తవారింటికి వెళుతుంది. పెద్దోడిని అతని భార్య తన పుట్టింటికి తీసుకువెళ్తుంది. చిన్నోడు వచ్చినా వాడి స్నేహితులతో గడపటానికే సరిపోతుంది’’ అనగానే ముగ్గురూ తలదించుకున్నారు. ఆమె కొనసాగించింది. ‘‘మీ నాన్న పుట్టినరోజు వేడుకంటే ఎవరైనా ఆక్షేపిస్తారేమోనని అదే రోజు మీ అమ్మ తన పుట్టినరోజుగా మిమ్మలందర్నీ రప్పిస్తోంది. ఆ రోజు మీరంతా కలిస్తే మీ నాన్న ఆత్మకి శాంతి కలుగుతుందని తన నమ్మకం. ఈమధ్య మీరు రావటం మానేశారు. బహుశా అదే ఆమె బెంగకి కారణం కావొచ్చు. ఈ విషయాలేవీ మీ అమ్మెప్పుడూ మీకు చెప్పాలనుకోలేదు. నేను చెప్పినట్టు తనకి తెలియనివ్వకండి’’ అని, కాసేపాగి ఆయాసం తగ్గాక పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కొద్దిగా తాగింది.ఇదంతా విని అందరి కళ్ళూ చెమర్చాయి. తండ్రి మరణం, తల్లి కారుణ్య నియామకంలో ఉద్యోగంలో చేరి తమని పెంచి ప్రయోజకులని చెయ్యటం, ఇదంతా తెలుసు. కానీ ఈ పుట్టినరోజు వేడుకలు అమ్మ సరదా అనే అనుకున్నారు ఇంతకాలం. వయసు, బాధ్యతలూ, పెరుగుతున్నకొద్దీ పుట్టినరోజుకి తను చేసే ఆర్భాటాన్ని చూసి విసుక్కుని రాకుండా తప్పించుకుంటున్న మాట వాస్తవం. ఈ విషయం శాంతమ్మ ద్వారా తెలిశాక అంతా ఓ నిర్ణయానికొచ్చారు. ముందుగా చిన్నవాడు మొదలుపెట్టాడు. ‘‘మనకి అమ్మే నాన్న. రాబోయే పుట్టినరోజు అమ్మకి ఎనభై నిండుతాయి. ఘనంగా చేద్దాం.’’ అన్నాడు. ‘‘వీలైంతమందికి అన్నదానం చేద్దాం’’ అంది కూతురు. ‘‘వస్త్రదానం కూడా చేస్తే మంచిది. అది కూడా ప్లాన్ చేద్దాం’’ అంది పెద్ద కోడలు.అందరూ సంతోషంగా లేచి వెళ్లి తల్లికి ఈ విషయం చెప్పారు. జయంతి సంతోషించింది. లేచి కొంత అన్నం తింది. తమతో రమ్మని ఎంత బతిమిలాడినా జయంతి రాలేనంది. ‘ముక్కనుమ’ అవగానే అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరారు. భాద్రపద మాసం – ఋషి పంచమి.ముందురోజు చవితి కావటంతో ‘పత్రి’ కోసం కొమ్మల్ని అర్పించుకోవటం వల్లో, మరో కారణం చేతో, చెట్లన్నీ బోసిపోయినట్లున్నాయి. అనుకున్నట్టుగానే అందరూ వచ్చారు. పేదలకీ, పనివాళ్ళకీ భోజనాలు పెట్టి, బట్టలు పంచారు. ప్రతీ ఏటా అందరూ ఇలా కలవాలని మాట్లాడుకున్నారు. కానీ ఇవేవీ చూడ్డానికి జయంతి లేదు. పిల్లలు ఏడాదికొకసారైనా కలవాలనే భర్త కోరిక తీర్చలేకపోయాననే లోటు తప్ప ఆమెదేమీ అకాలమరణం కాదు. తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి, సంపూర్ణమైన జీవితం గడిపాకే శివైక్యం పొందింది. జగమంత పందిరేసినా ‘జయంతి’ జన్మదినం కాబోదు. జన్మంత ప్రేమ ఒలకపోసినా పోయినవాళ్ళు తిరిగిరారు. ఏదైనా ఉన్నప్పుడే! ∙ఉమా మహేష్ ఆచాళ్ళ -
కథాకళి: అమ్మ భయపడ్డ మనిషి
రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. సమయం తెల్లవారుజాము. ఆ దేశాల సరిహద్దులోని అతి ముఖ్యమైన పోస్ట్ దగ్గర ఇద్దరు సెంట్రీ డ్యూటీలో ఉన్నారు. ట్రెంచ్లో ముప్ఫై రెండేళ్ళ వయసుగల సెంట్రీకి కొన్ని గజాల దూరంలో నలభై మూడేళ్ళ మరో సెంట్రీ కూడా డ్యూటీలో ఉన్నాడు. ఇద్దరి రైఫిల్స్లో చెరో ఆరు గుళ్ళు ఉన్నాయి. వారిద్దరూ మేలుకుని బైనాక్యులర్స్లోంచి ఎదురుగా ఉన్న చెట్లవైపు చూస్తున్నారు. ఆ చెట్ల వెనక శత్రుసైన్యం ఉందన్న సమాచారం వారికి అందింది. ఒకరి తర్వాత మరొకరు బైనాక్యులర్స్లో ఆ చెట్లవంక వంతులు ప్రకారం చూస్తున్నారు. శత్రుసైనికుల కదలికలని ఎంత త్వరగా గుర్తిస్తే అంత భద్రత కాబట్టి, వారు అప్రమత్తంగా ఉన్నారు.‘‘రేపు మధ్యాహ్నం మా ఆవిడతో మాట్లాడబోతున్నాను.’’ నలభై మూడేళ్ళ సైనికుడు ఉత్సాహంగా చెప్పాడు.‘‘ఫ్రంట్లో ఉన్నావు కదా. నీ గొంతు వింటే వాళ్ళకి ఎంతో తృప్తి.’’బైనాక్యులర్స్లోంచి చూసే మొదటి సైనికుడికి కొద్దిసేపటికి ఎదురుగా చెట్లు వెనక నుంచి ఎవరో రావడం కనపడింది.‘‘చూడు.’’ అతను రెండో సైనికుడ్ని అప్రమత్తం చేశాడు.‘‘అవును.’’ రెండో సైనికుడు కూడా బైనాక్యులర్స్లోంచి వెంటనే చూసి చెప్పాడు.నలుగురు శత్రుసైనికులని చూశాక ఇద్దరూ బైనాక్యులర్స్ పక్కనపెట్టి, రైఫిల్స్ అందుకుని దాని నైట్ విజన్ టెలిస్కోప్లోంచి చూడసాగారు.‘‘వంద మీటర్ల దూరంలో ఉన్నారు. వాళ్ళు రేంజ్ లోకి రావాలి.’’ మొదటి సైనికుడు లెన్స్ అడ్జస్ట్ చేసి చూసి చెప్పాడు.నక్కి వస్తున్న ఆ నలుగురు శత్రుసైనికుల చేతుల్లోని రైఫిల్స్ పేలడానికి సిద్ధంగా ఉన్నాయి.‘‘కుడివైపు ఇద్దరు నా టార్గెట్స్. ఎడమవైపు ఇద్దరు నీ టార్గెట్స్.’’ మొదటి సైనికుడు చెప్పాడు.శత సైనికులు రేంజ్లోకి వచ్చాక, మొదటి సైనికుడు గుసగుసగా చెప్పాడు.‘‘ఇప్పుడు.’’ఇద్దరూ రైఫిల్స్ని ఏకకాలంలో కాల్చారు. రెండో సైనికుడి గురి తప్పలేదు. ఎడమవైపున్న మొదటివాడు నేలకూలాడు. కుడివైపు చివరివాడు అదే సమయంలో రెండు అడుగులు పక్కకి వేయటంతో, మొదటి సైనికుడి గురి తప్పింది. అతను తక్షణం మళ్ళీ కాల్చాడు. ఈసారి అతను నేలకూలాడు.‘‘టు డౌన్.’’ రెండో సైనికుడు ఉత్సాహంగా చెప్పాడు.వెంటనే మిగిలిన ఇద్దరు శత్రు సైనికులు నేలమీద బోర్లా పడుకున్నారు. అవతలి నుంచి కూడా రైఫిల్స్ పేలసాగాయి. రెండో సైనికుడు చూడటానికి ట్రెంచ్లోంచి కొద్దిగా పైకి లేవగానే, శత్రుసైనికుడు కాల్చిన గుండు నుదుటిలోంచి లోపలకి వెళ్ళడంతో వెనక ట్రెంచ్ గోడకి గుద్దుకున్నాడు. మొదటి సైనికుడు అతని దగ్గరకి పాక్కుంటూ వెళ్ళి చూసి, అతను మరణించాడని గుర్తించాడు. అతను కోపంగా కాల్చిన నాలుగు గుళ్ళల్లో ఒకటి తాకి మరో శత్రుసైనికుడు నేలకూలాడు. ముగ్గురు మరణించాక మిగిలిన ఒక్క శత్రుసైనికుడు రైఫిల్ని పేలుస్తూ ముందుకి పాకసాగాడు.ట్రెంచ్లోంచి కొద్దిగా పైకి లేచిన మొదటి సైనికుడికి, దాని ముందు పాకుతూ వచ్చే శత్రుసైనికుడు మూడు అడుగుల దూరంలో కనిపించాడు. అతని రైఫిల్ తనకి గురిపెట్టి ఉంది. అదే సమయంలో మొదటి సైనికుడి రైఫిల్ కూడా శత్రుసైనికుడి మొహానికి గురిపెట్టి ఉంది. ఒకరికి మరొకరు గురిపెట్టిన రైఫిల్స్తో చలనరహితంగా, నిశ్శబ్దంగా ఉండిపోయారు. అలా కొద్ది క్షణాలు గడిచాయి. ఎవరు పేల్చినా రెండోవారు కూడా పేలుస్తారనే భయంతో వాళ్ళ చూపుడువేలు ట్రిగర్ని నొక్కలేదు. పది క్షణాల తర్వాత శత్రు సైనికుడు సందేహించలేదు. తను కాల్చిన మరుక్షణం తనని శత్రువు కాలుస్తాడని తెలిసీ ట్రిగర్ నొక్కాడు. దురదృష్టం. అది క్లిక్మంది తప్ప పేలలేదు. అందులోని గుళ్ళు అయిపోయాయి. అతనికి బెల్ట్లోంచి గుండుని తీసి మళ్ళీ లోడ్ చేసే వ్యవధి లేదు. అతను భయంగా ట్రెంచ్లోని సైనికుడి వంక చూశాడు. తర్వాత నెమ్మదిగా తన రైఫిల్ని కిందపడేసి, మోకాళ్ళ మీద కూర్చుని, రెండు చేతులనీ తల వెనక ఆనించి లొంగిపోయి భయంగా చూడసాగాడు. లొంగిపోయినవాడిని, నిరాయుధుడిని చంపకూడదు అన్నది అంతర్జాతీయ యుద్ధ నియమం. అయినా, అతను దాన్ని అతిక్రమించినా, అది ప్రపంచానికి తెలీదని శత్రుసైనికుడికి తెలుసు. అతిక్రమించి తనని కాల్చి చంపుతాడా? మొదటి సైనికుడు ట్రైంచ్లోంచి పైకి వచ్చి, అతని వెనక్కి వెళ్ళి రైఫిల్ గొట్టాన్ని అతని వీపుకి ఆనించి నెమ్మదిగా చెప్పాడు.‘‘నడు.’’‘‘మా అమ్మ భయపడ్డ మనిషివి– నా ప్రాణాలు తీసే శత్రువువి నువ్వే.’’ శత్రు సైనికుడు నెమ్మదిగా చెప్పాడు. ఇద్దరూ కొద్ది నిమిషాల దూరంలోని గుడారాల దగ్గరికి చేరుకున్నారు. మొదటి సైనికుడు తను తెచ్చిన శత్రుసైనికుడి ఎదురుగా నిలబడి, రైఫిల్ బేరల్ని అతనికి ఛాతీకి నొక్కిపెట్టాడు. అతను కాల్చబోతున్నాడని గ్రహించిన శత్రుసైనికుడు భయంతో కళ్ళు మూసుకుని చావుకోసం ఎదురు చూశాడు. మొదటి సైనికుడు ట్రిగర్ని నొక్కాడు.అది క్లిక్మంది తప్ప, దాంట్లోంచి గుండు బయటికి రాలేదు.‘‘నేను నా రైఫిల్లోని గుళ్ళని లెక్కపెట్టుకుంటూ పేల్చాను. నీలా నాకూ రీలోడ్ చేసే సమయం లేకపోయింది. నువ్వు ఇప్పుడు యుద్ధ ఖైదీవి.’’ మొదటి సైనికుడు నవ్వుతూ చెప్పాడు. మిగిలిన సైనికులు పగలబడి నవ్వసాగారు.∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
జల కాలుష్యం... జబ్బులు ప్రాణాంతకం
సురక్షితమైన మంచినీరు ఇప్పటికీ సమస్యగానే ఉంటోంది. ‘జల జీవన్ మిషన్’ వంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నా, దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడితో అల్లాడుతూనే ఉన్నారు. సురక్షితమైన మంచినీరు దొరకక తరచుగా వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు.మన దేశంలో 2020–25 మధ్యకాలంలో నమోదైన లెక్కలు చూసుకుంటే, జల కాలుష్యం వల్ల రోగాల బారిన పడుతున్నవారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. నీటి కాలుష్యం వల్ల తలెత్తే జబ్బులు, వాటి బారిన పడున్నది సుమారుగా ఎందరో ఒకసారి పరిశీలిద్దాం... -
5 పైసలు..5 లక్షల ఖర్చు
సంస్థ సొమ్మును కాజేయాలని చూసిన ఉద్యోగికి శిక్ష పడాల్సిందేనని కార్పొరేషన్, ‘నేను ఏ తప్పు చేయలేదు.. నాకు న్యాయం చేయండని’ ఆ ఉద్యోగి... 40 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. కేసు కోసం లక్షలు ఖర్చు చేశారు.. సంస్థ ఏళ్ల తరబడి పోరాడిందంటే ఆ ఉద్యోగి భారీగానే ‘ నొక్కేసుంటాడు’, అవినీతి సొమ్ము ‘మెక్కేసుంటాడని’ అనుకుంటున్నారా.. అయితే మీరు ‘చిల్లర’లో కాలేసినట్టే... ఎందుకంటే ఆ ఉద్యోగి సంస్థకు చెందాల్సిన ‘5పైసలు’ తన జేబులో వేసుకున్నాడని సంస్థ ఆరోపణ. అవును మీరు చదివింది నిజమే ‘5 పైసలే’. భారత న్యాయవ్యవస్థలో ‘5 పైసల కేసు’గా గుర్తింపు పొందింది. అసలేం జరిగింది.. చివరికి ఎవరికి న్యాయం దక్కిందో తెలుసుకుందాం..ఇప్పుడంటే యూపీఐ పేమెంట్లు, కార్డులతో చెల్లింపులు వచ్చాయి.. కానీ ఒకప్పుడు బస్సుల్లో ‘చిల్లర పోరాటాలు’ సర్వసాధారణం. ‘టికెట్కు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్కు సహకరించండి’ అని బస్సుల్లో రాసేవారు. చిల్లర ఇవ్వకుండా కండక్టర్ ‘నొక్కేశాడని’ ప్రయాణికుల నుంచి ఆరోపణలు వినిపించేవి. ఢిల్లీకి చెందిన రణవీర్ సింగ్ యాదవ్ ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్(డీటీసీ)లో కండక్టర్గా పనిచేసేవాడు. 1973లో ఆయన డ్యూటీలో ఉండగా స్క్వాడ్ బస్సును ఆపి తనిఖీ చేసింది. ఓ ప్రయాణికురాలి దగ్గర నుంచి 15 పైసలు తీసుకుని, ఆమెకు పది పైసల టికెట్ ఇచ్చాడు. మిగిలిన 5 పైసలు అతను జేబులో వేసుకున్నాడని స్క్వాడ్ ఆరోపణ. విచారణ జరిపి డీటీసీ 1976లో అతడ్ని విధుల నుంచి తొలగించింది. కోర్టులో పోరాటంతనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ రణవీర్సింగ్ లేబర్ కోర్టును ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. కేవలం ‘5 పైసల’ విషయంలో ఒక ఉద్యోగిని విధుల నుంచి తొలగించడం చాలా కఠినమైన శిక్ష అని కోర్టు పేర్కొంది. గతంలోనూ అతను విధుల్లో నిర్లక్ష్యం వహించాడన్న డీటీసీ వాదనల్ని కోర్టు తోసి పుచ్చింది. అతడికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని 1990లో తీర్పు ఇచ్చింది. హైకోర్టులో అప్పీలులేబర్ కోర్టు తీర్పును డీటీసీ ఢిల్లీ హైకోర్టులో 1991లో సవాలు చేసింది. అప్పటి నుంచి ఏళ్ల పాటు ఈ కేసు కొనసాగింది. చివరికి ఢిల్లీ హైకోర్టు డీటీసీ పిటిషన్ను కొట్టేసింది. అతనికి రావాల్సిన గ్రాట్యూటీ, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలని ఆదేశించింది. ‘ 5 పైసల’ కోసం ఇన్నేళ్లు కేసు నడపడానికి ఎంత ఖర్చు చేశారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించగా, ఇరు పక్షాలు కలిపి సుమారుగా రూ. 5 లక్షల వరకు ఖర్చు చేసినట్టు వెల్లడైంది. కేసు గెలవాలి.. తను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బాధితుడు తన ఆస్తిని అమ్మేశాడు. కష్టపడి కూడగట్టుకున్న పొదుపు సొమ్మును ఖర్చు చేశాడు..డీటీసీ ‘5పైసల’ కోసం సుమారుగా రూ. 47,000 కోర్టు ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టింది. ఒక చిన్న వివాదం కోర్టుల్లో ఏళ్ల తరబడి ఎలా సాగుతోంది..ఓ వ్యక్తి న్యాయపోరాటం అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.. ఈ తరహా చిన్న ఘటనలు కోర్టు విలువైన సమయాన్ని వృథా చేస్తాయనే దానికి ఈ కేసు ఓ ఉదాహరణ. ‘నేను మోసం చేశానా అని నా పిల్లలు కూడా అడిగేవారు. నేను తప్పు చేయలేదని వారికి చెప్పడం చాలా బాధగా ఉండేది’.. నేను తప్పుచేయలేదని నిరూపించుకోవడానికి నా జీవిత కాలం చేసిన పొదుపు మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చింది.‘ నా వయస్సు వారు తీర్థయాత్రలకు వెళ్లేవారు... నేను మాత్రం ఏళ్ల తరబడి కోర్టుల యాత్ర’ చేశాను. – రణవీర్సింగ్ యాదవ్, బాధితుడు -
నా సీక్రెట్ వరల్డ్
తెలుగు తెరపై ఎనర్జీ, అల్లరి, గ్లామర్ ఈ మూడు పదాలు కలిస్తే గుర్తొచ్చే పేరు నభా నటేశ్. స్క్రీన్ పై చిలిపి నవ్వుతో మెరిసే ఆమె, నిజజీవితంలో ఎలా ఉంటారో? అమె మాటల్లోనే మీకోసం..చిన్నప్పటి కల! సినిమాల్లోకి రావాలనే కల చిన్నప్పటి నుంచే ఉంది. ఉడుపిలో ఇంజినీరింగ్ చే సి, మోడలింగ్ వైపు వెళ్లాను. మొదట్లో చాలా కష్టపడ్డాను. చాలాసార్లు అన్నీ వదిలేసి ఏదైనా జాబ్ చేద్దామని కూడా అనుకున్నాను. అందుకే, నాకు వచ్చిన ప్రతి అవకాశం వెనుక ఒక దీర్ఘమైన ఆలోచన, భయం, ఎగై్జట్మెంట్ అన్నీ ఉన్నాయి.‘ఇస్మార్ట్’ ఇమేజ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత నా జీవితం మారిపోయింది. ఒక్కసారిగా ప్రజలు నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఆ మాస్ క్యారెక్టర్ నాకో పెద్ద చాలెంజ్. కాని, తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చేవి. నాకు ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలనే ఉంటుంది. టైప్కాస్ట్ అవ్వడం అసలు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు ’స్వయంభూ’, ’నాగబంధం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో మీ ముందుకు వస్తున్నాను.రెస్ట్ కావాలి! స్క్రీన్ పై ఎంత గ్లామర్గా కనిపించినా, ఇంట్లోనైతే ఓవర్సైజ్ టీషర్ట్, జీన్స్, నూట్ వేర్స్తో నేను పూర్తిగా చిల్ మోడ్లోనే ఉంటాను. షూటింగ్ లేని రోజుల్లో మేకప్ అస్సలు వాడను. నా స్కిన్ కి రెస్ట్ ఇస్తాను. నా అందం వెనుక రహస్యం ఖరీదైన క్రీములు కాదు; సరైన నిద్రపోవడం, ఎక్కువ నీరు తాగడమే!సింపుల్ గర్ల్చాలామంది నన్ను ఔట్గోయింగ్ అనుకుంటారు కాని, నేను చాలా రిజర్వ్డ్ పర్సన్. నా ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నది. ఇండస్ట్రీలో కూడా నమ్మిన వాళ్లతోనే ఎక్కువగా మెలుగుతాను. నా పర్సనల్ స్పేస్ నాకు చాలా విలువైనది.మల్టీ టాలెంటెడ్ చిన్నప్పుడు భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నాను. అలాగే ఖాళీ సమయం దొరికితే కాన్వాస్పై పెయింటింగ్స్ వేస్తుంటాను. 2013లో ఫెమినా మిస్ ఇండియా బెంగళూరులో ‘మిస్ ఇంటెలెక్చువల్’ టైటిల్ గెలుచుకున్నాను.మిస్టరీ మంచిదే! గాసిప్స్ వస్తుంటాయి, పోతుంటాయి. వాటిపై ఫోకస్ పెట్టను. నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడాలని అనిపించదు. కొంచెం మిస్టరీ ఉండటం కూడా మంచిదే కదా!నా సీక్రెట్ వరల్డ్కొత్త ప్రదేశాలు, కొత్త కల్చర్స్ చూసేటప్పుడు, ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు కలిగే చిన్న చిన్న ఆనందాలతోనే నేను పూర్తిగా రీచార్జ్ అవుతాను. ఫ్యాన్ ్స పంపిన చిన్న చిన్న గిఫ్ట్స్,నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. అవే నా అసలు అవార్డ్స్.కష్టకాలం నేర్పిన పాఠంఒక ప్రమాదం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమయ్యాను. అది నా లైఫ్లో టఫ్ ఫేజ్. భుజానికి సర్జరీ జరిగి బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా కుంగిపోయాను. ఆ బ్రేక్ నాకు సహనాన్ని, మళ్ళీ పోరాడే శక్తిని రెండింటినీ ఇచ్చింది.ఇష్టాయిష్టాలు⇒ నాకు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. వారి సినిమాలను మిస్ అవ్వను. హీరోయిన్లలో దీపికా పదుకొణే స్టయిల్, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా నచ్చుతుంది. ⇒ నేను సౌత్ ఇండియన్ ఫుడ్ లవర్ని, బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, లంచ్లో సాంబార్ రైస్ ఉంటే చాలు. ⇒ రంగుల్లో బ్లాక్ అండ్ వైట్ నా ఫేవరెట్. గ్లామరస్ డ్రెస్సులు వేసినా, చీరలు కట్టుకోవడం అంటే ఇష్టం. ఎనిమిదేళ్ల వయసులోనే సొంతంగా చీర కట్టుకోవడం నేర్చుకున్నాను. -
అందాల పోటీల్లో ఒంటెలపై అనర్హత
ఒమన్లో ఇటీవల ఒంటెలకు అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పెద్దసంఖ్యలో ఒంటెలు క్యామెల్ వాక్ చేస్తూ వయ్యారాలు ఒలకబోశాయి. వేలాది మంది జనాలు ఈ పోటీలను అబ్బురంగా తిలకించారు. న్యాయ నిర్ణేతలు ఒక్కొక్క ఒంటెనూ నిశితంగా పరిశీలించారు.పోటీల్లో పాల్గొన్నవాటిలో ఇరవై ఒంటెలపై అనర్హత వేటు వేశారు. ఎందుకంటారా? తమ ఒంటెలు అందంగా కనిపించడానికి యజమానులు వాటికి బోటాక్స్ ఇంజెక్షన్లు ఇప్పించారు. బోటాక్స్ ఇంజెక్షన్లతో వాటి పెదవులు, చెక్కిళ్లు ప్రస్ఫుటంగా కనిపించేలా తీర్చిదిద్దించి మరీ పోటీకి తీసుకొచ్చారు. ఈ సంగతి కనిపెట్టిన న్యాయనిర్ణేతలు, అందాల పోటీల్లో కృత్రిమ సౌందర్యానికి చోటులేదని కరాఖండిగా తేల్చి చెప్పి, ఇరవై ఒంటెలను పోటీ బరి నుంచి తప్పించారు. -
డాక్టర్లకూ రేటింగ్ తంటాలు పేషెంట్లు జాగ్రత్త!
ఒకప్పుడు డాక్టర్ అంటే దైవంతో సమానం. ఇప్పుడు ఒక ‘ప్రోడక్ట్’తో సమానం!అమెజాన్ లో మిక్సీ కొనేటప్పుడు ముందు రేటింగ్, తర్వాత రివ్యూలు చూస్తాం. ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడూ ఇదే స్టోరీ ‘రేటింగ్ తక్కువగా ఉందంటే వద్దు!’ఇప్పుడు ఇదే అలవాటు ఆరోగ్య రంగంలోకి కూడా వచ్చేసింది. ఫోన్ లో డాక్టర్ పేరు టైప్ చేస్తే చాలు, పక్కనే మెరుస్తున్న ఐదు స్టార్లు. అంతే, మన మెదడు వెంటనే ‘ఈ డాక్టర్ బాగుంటారు!’ అనే తీర్పు చెప్పేస్తుంది. ఇలా వైద్యుడి నైపుణ్యం కంటే, వెబ్సైట్లో కనిపించే స్టార్లకే ప్రాధాన్యత! అయితే ఆన్ లైన్ లో జరుగుతున్న ఈ స్టార్ వార్స్లో, ప్రాణం విలువ నిజంగా ఆ ఐదు స్టార్లేనా?డిజిటల్ యుగం పుణ్యమా అని, ఒకప్పుడు ఆసుపత్రి క్యూల్లో గంటల తరబడి తపస్సు చేయాల్సిన పేషెంట్లు ఇప్పుడు సోఫాలో కూర్చునే స్మార్ట్ఫోన్ స్క్రీన్ పై డాక్టర్ల ‘జాతకాలు’ చూసేస్తున్నారు. అపాయింట్మెంట్ బుక్ చేయడం ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసినంత ఈజీ అయిపోయింది! ముందు ఆసుపత్రి నాలుగు గోడల మధ్య గుట్టుగా సాగిపోయే వైద్యం ఇప్పుడు రివ్యూలు, రేటింగ్స్తో పారదర్శకంగా మారింది. రోగుల చేతిలోకి ఒక డిజిటల్ మైక్ వచ్చినట్టే. తమ అనుభవాన్ని ప్రపంచానికి చెప్పే అవకాశం దొరికింది. కాని, ఇక్కడే అసలు కామెడీ మొదలైంది. కొన్ని రివ్యూలు చదివితే నవ్వాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కాదు. ‘డాక్టర్ ప్రాణాలు కాపాడారు. కాని, క్లినిక్ బయట పార్కింగ్ లేదు. అందుకే ఒక స్టార్!’ అని ఒకరు.ఇంకొకరు, ‘నా సర్జరీ సక్సెస్ అయింది. హాస్పిటల్లో వైఫై సిగ్నల్ సరిగ్గా లేదు’ అని, మరొకరు, ‘డాక్టర్ గారు రాసిన మందులు వాడాక జ్వరం తగ్గింది. కాని, ఆయన చెప్పిన డైట్ పాటించడం చాలా కష్టంగా ఉంది.’ అంటూ కొన్ని కొన్ని విచిత్రమైన కారణాలతో సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చే బ్యాచ్ తయారైంది. ఇలాంటి బ్యాచ్తో వైబ్సైట్లో వైద్యుడి హస్తవాసితో పనిలేకుండానే, ఆయన స్టార్ పవర్ తగ్గుతూ పోతుంటే, ఇంకొంతమంది ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్యాకేజీలు, పేషెంట్లను ప్రత్యేకంగా రివ్యూలు పెట్టమని అడగడం, సోషల్ మీడియా క్యాంపెయిన్లు నిర్వహించడం, లేదా డిజిటల్ మార్కెటింగ్ సహాయంతో మంచి రేటింగ్స్ను పెంచుకోవడం జరుగుతోంది.ఇలా నిజమైన వైద్య నైపుణ్యంతో సంబంధం లేకుండానే, కొందరి ప్రొఫైల్లు ఆన్ లైన్ లో ఎక్కువ ‘స్టార్స్’తో మెరిసి పోతుంటాయి. దీంతో, కొత్తగా డాక్టర్ను వెతుకుతున్న పేషెంట్లకు, ఎవరి నైపుణ్యం నిజంగా ఎంత ఉందో అర్థం చేసుకోవడం కష్టంగా మారుతోంది. మరి ఇది నిజంగా పెరిగిన జవాబుదారీతనమా లేక డిజిటల్ లోకం తెచ్చిన కొత్త రకం రేటింగ్ వెర్రా అనే ఈ వింత పరిస్థితిని చూస్తుంటే, ఈ ‘స్టార్ల’ వెనుక ఉన్న అసలు కథను కాస్త లోతుగా తవ్వి చూడాల్సిందే! ఒకప్పుడు డాక్టర్ ఎంపిక ఎలా ఉండేది?కొన్ని సంవత్సరాల క్రితం వరకు డాక్టర్ను ఎంచుకోవడం ఒక చిన్న సామాజిక ప్రక్రియలా ఉండేది. మంచి డాక్టర్ పేరును గూగుల్ కంటే ముందు పక్కింటి వాళ్లే చెప్పేవారు. అందుకే, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే, మొదట ఫోన్ తిప్పేది పక్కింటి వారికే. ‘ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతారు’ అనే ఒక మాటే సిఫారసుగా సరిపోయేది. ఇలా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహచరుల మాటలతోనే నమ్మకం పంచుకునేది. ఆ నమ్మకం ఒక్కరోజులో ఏర్పడేది కాదు. అనుభవాల నుంచి, కాలంతో పెరిగిన విశ్వాసం నుంచి అది వస్తుంది. కాని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైద్యం కూడా ఒక కొత్త స్టార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రపంచంలో ఏళ్ల తరబడి చదువు, అనుభవం, వేలాది రోగులకు చేసిన చికిత్స ఇవన్నీ ఐదు చిన్న స్టార్లలోనే సరిపెట్టేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ ఆన్ లైన్ డాక్టర్ రేటింగ్స్ను నిజంగా విశ్వసించాలా? లేక కొంచెం ఆలోచించాలా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు కొన్ని విషయాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. రేటింగ్స్ చెప్పేది ఏమిటి? ఆన్ లైన్ రివ్యూలు ఎక్కువగా ఒక రోగి అనుభవాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి. అందుకే, ఆ రివ్యూలు చదువుతుంటే మనకు డాక్టర్ ‘సర్జరీ’ కంటే, అక్కడ దొరికే ‘లగ్జరీ’ గురించే ఎక్కువ సమాచారం ఉంటుంది. డాక్టర్ ఎలా మాట్లాడారు? ఎంతసేపు వేచి చూడాల్సి వచ్చింది? సిబ్బంది ఎలా వ్యవహరించారు? హాస్పిటల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి అంశాలపై ఆధారపడి ఎక్కువగా రివ్యూలు వస్తాయి. ఇవి ఆరోగ్య సేవలో ముఖ్యమైన భాగమే అయినా, ఇక్కడే, డాక్టర్ అసలు నైపుణ్యం ఈ స్టార్ల మధ్యలో నలిగిపోతోంది. వైద్యం అంటే కేవలం తీపి మాటలు, మెరిసే టైల్స్ కాదు. అది ఏళ్ల తరబడి చేసిన తపస్సు, క్లిష్ట పరిస్థితుల్లో సెకన్ల వ్యవధిలో తీసుకునే ప్రాణసంకట నిర్ణయాల సమ్మేళనం! అందుకే, ఒకే చికిత్స ఇద్దరు వేర్వేరు పేషెంట్స్కు చేసినా ఫలితం ఒకేలా ఉండదు. ఒకరు వారం రోజుల్లో జిమ్కి వెళ్తే, మరొకరు నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి రావచ్చు.వయసు, వ్యాధి తీవ్రత, ఆ వ్యక్తి శరీర తత్త్వం వంటి బోలెడు ట్విస్టులు ఈ చికిత్స వెనుక ఉంటాయి. కాని, ఆన్ లైన్ రివ్యూ ఇచ్చే పేషెంట్ మాత్రం, ‘పక్కింటి పుల్లయ్యకి మూడు రోజుల్లో తగ్గింది, నాకు ఐదు రోజులైనా తగ్గలేదు.. సో వన్ స్టార్!‘ అని తీర్పు ఇచ్చేస్తుంటారు. పాపం, మెడికల్ సైన్ ్స లోని లోతుపాతులను పక్కన పెట్టి, కేవలం ఆ క్షణం కలిగిన ‘అనుభవం’ ఆధారంగానే మార్కులు వేసేస్తున్నారు. అందుకే గుర్తుంచుకోండి– ఆ స్టార్ రేటింగ్స్ అవి ఒక అనుభవాన్ని మాత్రమే నమోదు చేస్తాయి. కాని, అది డాక్టర్ మేధస్సుకు సర్టిఫికెట్ కాదు! అసంతృప్తి గళం ఎక్కువగా వినిపిస్తుంది! మనిషి సాధారణ నైజం, అన్నీ బాగానే ఉన్నప్పుడు హాయిగా నిశ్శబ్దంగా ఉండిపోతాడు. అదే ‘మౌనం అర్ధాంగీకారం’ అన్నట్టే. చికిత్స అద్భుతంగా జరిగి ప్రాణాలు నిలబడినా, ‘అబ్బా, డాక్టర్ గారు దేవుడండీ!’ అని మనసులో అనుకుని ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకుంటాడు. కాని, ఫోన్ తీసుకుని రివ్యూ రాయాలని మాత్రం ఎక్కువగా అనిపించదు. అదే, ఆసుపత్రి వాతావరణంలో కాని, డాక్టర్ నిర్లక్ష్యం, మరేదైనా చిన్న అసంతృప్తి వచ్చినా సరే, వెంటనే, తనలోని ‘సోషల్ మీడియా సింహం’ గర్జిస్తుంది! ఎవరూ అడగకపోయినా పేజీల కొద్దీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్ అడ్వైజ్ సంస్థ నివేదిక ప్రకారం, కొత్త వైద్యుడిని ఎంచుకునే ముందు దాదాపు 94 శాతం రోగులు ఆన్ లైన్ రివ్యూలను పరిశీలిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ రివ్యూలలో చాలా భాగం అసంతృప్తి చెందిన రోగుల నుంచే వస్తున్నాయి. సుమారు 70 శాతం మంది రోగులు తమకు కోపం వచ్చినప్పుడు మాత్రమే రివ్యూ రాస్తారని ఈ సర్వే చెబుతోంది. దాంతో చికిత్సతో సంతృప్తి చెందిన చాలామంది రోగుల అభిప్రాయాలు ఆ వెబ్సైట్లలో కనిపించకుండా పోతున్నాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా వందమందికి ప్రాణం పోసిన డాక్టర్కు వచ్చిన ప్రశంసలు నిశ్శబ్దంగా ఉండిపోతే, పార్కింగ్ దొరకలేదని ఒక పేషెంట్ ఇచ్చే ఆ ఒక్క ‘స్టార్’ మాత్రం పెద్దగా కనిపిస్తుంది. ఆ ఒక్క రేటింగ్ వెనుక వందలమంది సంతృప్తి చెందిన రోగుల మౌనం దాగి ఉందని చాలామంది గుర్తించరు. అందుకే ఆన్ లైన్ స్టార్లను చూసి డాక్టర్ను అంచనా వేయడం అంటే, సినిమా ట్రైలర్లో ఒక సీన్ చూసి, సినిమా మొత్తం ఎలా ఉందో తీర్పు చెప్పేసినట్టే! ఒక నక్షత్రం, ఒక ప్రతిష్ఠ! నెగటివ్ రివ్యూల ప్రభావం ఇప్పుడు ఒక సైలెంట్ వైరస్లా మారుతోంది. ఒక్క నెగటివ్ రివ్యూ కూడా కొన్ని సందర్భాల్లో ఒక డాక్టర్ ప్రతిష్ఠను తీవ్రంగా ప్రభావితం చేయగలదు. వందమంది రోగుల వ్యాధులను నయం చేస్తే వచ్చే కాస్తో కూస్తో గుర్తింపు, అసంతృప్తి చెందిన ఒక్క రోగి రాసే ఘాటైన రివ్యూతో ఆ డాక్టర్ ప్రతిష్ఠ డిజిటల్ నడిబజారులో మంటగలసిపోతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ నెగటివ్ వ్యాఖ్యలు నిమిషాల్లో వేలాది మందికి చేరిపోతాయి. నిజం బయటపడేలోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చినట్టే, ఆ డాక్టర్ నైపుణ్యంపై ఒక వ్యతిరేక ముద్ర పడిపోతుంది.ఇక్కడ అసలు చిక్కు ఏమిటంటే, డాక్టర్లు తమ వృత్తి గోప్యత, నైతిక విలువల కారణంగా ఈ రివ్యూలకు బహిరంగంగా స్పందించలేరు. పేషెంట్ తన అనుభవాన్ని బహిరంగంగా చెబుతాడు. కాని, ‘ఆపరేషన్ థియేటర్లో నిజంగా ఏమైంది?’ అనే విషయాన్ని డాక్టర్ డిజిటల్ వేదికలపై వివరించలేడు. దాంతో ఆయన మౌనంగా ఉండాల్సిందే. ఈ ఏకపక్ష పరిస్థితి వల్ల డాక్టర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినడమే కాకుండా, కొత్తగా వచ్చే పేషెంట్లు కూడా ఆ స్టార్ రేటింగ్స్ చూసి భయపడి మంచి వైద్యులను దూరం చేసుకునే ప్రమాదం ఉంది. ఇంకో వైపు, సరుకు లేని డబ్బా ఎక్కువ చప్పుడు చేసినట్లు, కొన్ని ఆసుపత్రుల్లో జరిగే హడావిడి ప్రచారం, ఆకర్షణీయమైన ప్రదర్శనలతో మెరిసే రేటింగ్స్ చూసి మోసపోయే పేషెంట్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది.వైద్యులపై ఆన్ లైన్ రేటింగ్స్ విశ్లేషణ1 చెప్పటం లేదు?సుమారు 88 శాతం సంతృప్తి చెందిన రోగులు రివ్యూ రాయడానికి ముందుకు రారు.2 అసంతృప్తి అసంతృప్తి చెందిన రోగులు సుమారు 21 శాతం ఎక్కువగా ఆన్ లైన్ లో రివ్యూ రాస్తున్నారు.3 సౌకర్యాలు దాదాపు 70 శాతం రివ్యూలు వెయిటింగ్ టైమ్, సిబ్బంది ప్రవర్తన, పార్కింగ్ వంటి సౌకర్యాలు, బిల్లింగ్ వెసులుబాట్లు, ఆఫర్లు, ప్యాకేజీల గురించే ఉంటాయి.4 నైపుణ్యం కేవలం 30 శాతం రివ్యూలు మాత్రమే డాక్టర్ నైపుణ్యం, చికిత్స నాణ్యత ఆధారంగా ఉంటున్నాయి.5 నకిలీ రివ్యూలు కొన్ని సందర్భాల్లో సంస్థలు తమ ప్రతిష్ట పెంచుకోవడానికి సుమారు 10 శాతం వరకు రివ్యూలను స్వయంగా జోడించే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.ఆన్ లైన్ వైద్య రేటింగ్స్పై పరిశోధనలు – గణాంకాలు...హార్వర్డ్ వైద్య పాఠశాల అధ్యయనం ప్రకారం, ఆన్ లైన్ రేటింగ్స్ వైద్య రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. సుమారు 800 మంది వైద్యులు, 400 మందికి పైగా రోగులు పాల్గొన్న వివిధ పరిశోధనల విశ్లేషణ ప్రకారం, దాదాపు 78 శాతం వైద్యులు ఆన్ లైన్ లో వచ్చే నెగటివ్ వ్యాఖ్యలు తమపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సుమారు 46 శాతం వైద్యులు ఈ రేటింగ్స్ వల్ల వైద్యుడు, రోగి మధ్య ఉండాల్సిన నమ్మకం, సంబంధం దెబ్బతింటున్నాయని అభిప్రాయపడ్డారు.డిజిటల్ ప్రపంచంలో స్టార్లు మెరుస్తున్నాయంటే, నిజం చీకటిలో దాగుందని అర్థం. అందుకే డాక్టర్ను ఎంచుకునేటప్పుడు స్టార్స్ కంటే, అనుభవం, సామర్థ్యాన్ని నమ్ముకోవడం ఉత్తమం. చివరికి జీవితాన్ని కాపాడేది వెబ్సైట్లో మెరిసే స్టార్లు కాదు, వైద్యుడి చేతిలోని నిజమైన నైపుణ్యమే.డాక్టర్లకు స్మార్ట్ టిప్స్ఈ డిజిటల్ ప్రపంచంలో స్టెతస్కోప్ పక్కనే ఇప్పుడు మరో శక్తిమంతమైన సాధనం ఉంది. అదే స్టార్ రేటింగ్. అందుకే ఇప్పుడు వైద్యరంగంలో పేషెంట్ను మాత్రమే కాదు, రివ్యూను కూడా కేర్ చేయాలి! దాదాపు 94 శాతం మంది పేషెంట్లు ఒక డాక్టర్ను ఎంచుకునే ముందు ఆన్ లైన్ రివ్యూలు చదువుతారు. దాదాపు 77 శాతం మంది కొత్త డాక్టర్ కోసం వెతకడం కూడా గూగుల్తోనే మొదలుపెడతారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే, నాలుగు స్టార్లకంటే తక్కువ రేటింగ్ ఉంటే 84 శాతం మంది సిఫారసు చేసిన డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లరు! అంటే ఇప్పుడు వైద్య నైపుణ్యం ఎంత ముఖ్యమో, డిజిటల్ స్టార్ పవర్ కూడా అంతే ముఖ్యమైపోయింది.మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సెర్చ్ రిజల్ట్స్లో ర్యాంకింగ్లో దాదాపు 13 శాతం ప్రభావం ఆన్ లైన్ రివ్యూలదే. ఎందుకంటే 92 శాతం మంది గూగుల్లో మొదటి పేజీ కూడా దాటరు. అంటే మొదటి పేజీలో కనిపించకపోతే, మీరు ఉన్నా లేనట్టే! అందుకే, ఆన్ లైన్ లో డాక్టర్ లేదా ఆసుపత్రి యాజమాన్యం తమ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి నిపుణులు సూచించిన కొన్ని సింపుల్, స్మార్ట్ టిప్స్ ఇవి. ముందుగా వినండి, తర్వాత స్పందించండి.సోషల్ మీడియా, గూగుల్ రివ్యూలు, కామెంట్లు ఇవన్నీ ఇప్పుడు పేషెంట్ల డిజిటల్ ఫీడ్బ్యాక్ బాక్స్ లాంటివి. అక్కడ ఏమి జరుగుతోంది అన్నది తరచు గమనించాలి. ఎక్కడైనా పేషెంట్ ప్రశంసిస్తే వెంటనే స్పందించాలి. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే మరింత త్వరగా స్పందించాలి. హ్యాష్ట్యాగ్లు, కామెంట్లు, ఫొటోలు, వీడియోలు ఏదైనా మీ హాస్పిటల్ గురించి వస్తే అది మీకు ఒక ముఖ్యమైన సూచనగా తీసుకోవాలి.స్పందనకు ఒక ప్లాన్ ఉండాలి.ఎవరైనా రివ్యూ పెట్టగానే ఎలా స్పందించాలి? ఎవరు స్పందించాలి? ఏ టోన్ లో మాట్లాడాలి? ఇవన్నీ ముందుగానే నిర్ణయించుకోవాలి. మీ హాస్పిటల్ వ్యక్తిత్వానికి తగ్గట్లుగా ఒక ‘వాయిస్’ ఉండాలి. సున్నితంగా, మానవీయంగా, నిజాయితీగా. ముఖ్యంగా పేషెంట్ సమాచారాన్ని ఎప్పుడూ పబ్లిక్గా చెప్పకూడదు. అవసరమైతే ప్రైవేట్గా మాట్లాడి సమస్యను పరిష్కరించాలి.రోజువారీ అలవాటుగా మార్చండి.రివ్యూలను ఒకసారి చూసి వదిలేయడం కాదు. ప్రతిరోజూ గమనించడం, స్పందించడం అలవాటుగా మారాలి. టీమ్లో ఎవరికైనా ఈ బాధ్యత అప్పగించాలి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఎక్కువగా వస్తోంది? ఎక్కడ మెరుగుపరచాలి? అన్నది అనలిటిక్స్ ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆన్ లైన్ సెర్చ్ ద్వారా హాస్పిటల్లకు వచ్చే పేషెంట్లు ఆఫ్లైన్ పద్ధతుల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.∙ దీపిక కొండి -
వసంత పుష్పవిలాసం
చలికాలం గాఢనిద్ర వీడి, వసంతంలోకి నెమ్మదిగా అడుగుపెడుతున్న వేళ.. జపాన్ వీథులన్నీ గులాబి రంగుతో మెరిసిపోతూ అందాల పందిళ్ళలా కనువిందు చేస్తాయి. ఇప్పటి వరకు మంచు ముసుగులో నిశ్శబ్దంగా ఉన్న కొమ్మలన్నీ చెర్రీ పూల విరబూతతో కళకళలాడుతాయి. నింగి నుంచి గులాబి మబ్బులు నేలకు దిగివచ్చాయా అన్నట్లుగా ఈ పూలు సందర్శకులను ఒక మాయలోకంలోకి తీసుకువెళతాయి. గాలికి రాలిపడే పూల రేకులు దారి పొడవునా మెత్తని తివాచీలా మారి నడిచే ప్రతి అడుగును మధుర స్వప్నంలా మారుస్తాయి. చెర్రీ బ్లోసమ్ ప్రకృతి పలకరింపు మాత్రమే కాదు. తరతరాల సంప్రదాయాన్ని, నేటి ఆధునిక జీవన వేగాన్ని ఏకం చేసే భావోద్వేగాల వేడుక.ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ చెర్రీ బ్లోసమ్ పండుగ జరుగుతుంది. ఈ కాలంలో గులాబి రంగు చెర్రీపూలను చూస్తూ జపనీయులు ఆనందిస్తారు. దీన్ని ‘హనామి’ అని పిలుస్తారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ, జపనీయులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆరుబయట చెర్రీ చెట్ల నీడలో వనభోజనాలు చేస్తారు. ఆటపాటలతో సరదాగా గడుపుతారు. ఈ ఏడాది మార్చి 21 నుంచి పూలు వికసిస్తాయని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది. పగటి పూట కనువిందు చేసే లేత గులాబీ వర్ణపు సొగసులు, రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగుల్లో మరింత శోభాయమానంగా కనిపిస్తాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ‘యోజాకురా’ అంటారు.ఈ పూల సందడితో టోక్యోలోని యునో పార్క్, క్యోటోలోని ఫిలాసఫర్స్ పాత్, ఒసాకా కోట పరిసరాలు గులాబీ రంగులో కళకళలాడతాయి. చెర్రీ పూలు వికసించిన వారం పది రోజుల్లోనే రాలిపోతాయి. వికసించిన కొద్దిరోజుల్లోనే రాలిపోయే ఈ పూలు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతాయి. జీవితం చిన్నది. ఉన్నంతలో పరిమళించాలి, ప్రతి క్షణాన్నీ ప్రేమగా ఆస్వాదించాలి అనే జీవన సందేశాన్ని అందిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు ఈ సీజన్ ఒక మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది. ఈ పండుగ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది పర్యాటకులతో జపాన్ లోని ఊరూరా వీథులు కళకళలాడతాయి. ఈ సమయంలో సంప్రదాయ వాయిద్యాలైన కోటో, వెదురు వేణువులతో కళాకారులు సంగీత ప్రదర్శనలిస్తారు. గాలికి ఊగిసలాడే పూల మధ్యలో వేణుగానం పర్యాటకులను పరవశింపజేస్తుంది. స్థానిక కళాకారుల చేతి వృత్తుల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. పండగ సమయంలో చెర్రీ పూల పరిమళంతో తయారు చేసే మొచి, టీ, స్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంహిత నిమ్మన -
రాముడికి జాబాలి ఉద్బోధ
పితృవాక్య పరిపాలన కోసం రాముడు అడవులకు బయలుదేరాడు. భర్త తోడిదే లోకం అనుకుని సీత, అన్నకు తోడుగా లక్ష్మణుడు కూడా రాముడిని అనుసరించారు. రాముడు అడవులకు వెళ్లిపోయాడనే దుఃఖంతో దశరథుడు కన్నుమూశాడు. భరతుడు దశరథుడికి అంత్యక్రియలు చేశాడు. రాముడిని తిరిగి అయోధ్యకు తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో సపరివారంగా రాముడి వద్దకు వెళ్లాడు. అయోధ్యకు తిరిగి రావాలని, రాజ్యాన్ని చేపట్టాలని పలురకాలుగా బతిమాలుకున్నాడు. భరతుడి కోరికను రాముడు అంగీకరించలేదు. ‘తమ్ముడా! దుఃఖించకు. అయోధ్యకు వెళ్లి పరిపాలన సాగించు. మన తండ్రి ఆదేశాన్ని పాటించు. వనవాసం చేయడం ద్వారా నేను ఆయన మాటను నెరవేరుస్తాను. మహారాజైన మన తండ్రికి ఇచ్చిన మాటను ఉల్లంఘించరాదు. నువ్వు కూడా ఆయన ఆజ్ఞను పాలించు. పరలోకంలో సుఖాలను కోరే మానవుడు క్రూరత్వం లేకుండా గురు శుశ్రూష చేయాలి. తండ్రి మాటను పాటించాలి’ అని పలికాడు. భరతుడికి రాముడు ఇలా నచ్చజెప్పి, అయోధ్యకు తిరిగి వెళ్లి పరిపాలించమని ఆదేశించాడు. అంతలోనే రాముడి మాటలు విన్న జాబాలి కలగజేసుకున్నాడు.‘రామా! బాగు బాగు! ఉత్తమ బుద్ధిమంతుడవు, ఆత్మాభిమానవంతుడవు అయిన నీకు, సామాన్య మూఢుని వంటి నిష్ప్రయోజనమైన ఆలోచనలు రాకూడదు. లోకంలో ఎవడైనా ఒక్కడే పుడుతున్నాడు. ఒక్కడే మరణిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవడికి ఎవడు బంధువు? ఎవడి నుంచి ఎవడు పొందగలిగేది ఏమిటి? తల్లి అని, తండ్రి అని అనుకుంటూ వారిపై అధికానురాగం పెంచుకునేవాడు ఉన్మత్తుడితో సమానుడు. ఎవరికి ఎవరు ఏమవుతారు? గ్రామాంతరానికి వెళ్లినవాడు ఒకచోట బస చేసి, మర్నాడు ఆ బసను విడిచిపెట్టి ప్రయాణం కొనసాగిస్తాడు. మనుషులకు తల్లి, తండ్రి, ఇల్లు, ధనం అనేవి కూడా తాత్కాలిక బసలాంటివి మాత్రమే! సజ్జనులకు వాటిపై వ్యామోహం ఉండరాదు. తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యాన్ని విడిచి, అనేక ప్రమాదాలకు నెలవైన, దుఃఖాలకు దారితీసే ఈ అడవి మార్గాన్ని అవలంబించడం నీకు తగదు. అందువల్ల సర్వసమృద్ధమైన అయోధ్య నగరానికి తిరిగి చేరుకుని, పట్టాభిషేకం చేసుకుని, రాజ్యపాలన స్వీకరించు. పరదేశానికేగిన భర్త రాక కోసం ఎదురుచూసే పతివ్రతలా అయోధ్య నగరం నీకోసం ఎదురు చూస్తోంది. నువ్వు రాజభోగాలను అనుభవిస్తూ, దేవేంద్రుడు స్వర్గంలో విహరించేలా అయోధ్యలో విహరించు. నీకు దశరథుడు ఏమీ కాడు. నువ్వు దశరథుడికి ఏమీ కావు. ఆ రాజెవరో, నువ్వెవరో! అందువల్ల నా మాట విని, నేను చెప్పినట్లు చేయి. ఆ దశరథ మహారాజు తాను ఎక్కడికి వెళ్లాలో, అక్కడకు వెళ్లిపోయాడు. నువ్వు మాత్రం అనవసరంగా కష్టాలను కొనితెచ్చుకుంటున్నావు. కేవలం అర్థం కోసం, ధర్మం కోసం పాటుపడే వారిని చూస్తే నాకు జాలి కలుగుతుంది. అర్థధర్మపరులు బతికినంత కాలం కష్టాలను అనుభవిస్తూ, మరణానంతరం కూడా నాశనం చెందుతారు. పరం అనేది ఏదీ లేదని నిశ్చయించుకుని, ప్రత్యక్షమైన దానినే ఆచరించు. పరోక్షమైన దానిని లెక్కచేయకు. పాపం, నీ సోదరుడు భరతుడు కూడా నిన్ను బతిమాలుకుంటున్నాడు. నా మాటలు ఆలకించి, రాజ్యాన్ని స్వీకరించు’ అని పలికాడు.‘నీ మాటలు పైకి హితవచనాల్లా కనబడినా, నిజానికి అవి అహితమైనవి. పాపాచారవంతుడై, సద్బుద్ధికి దూరమై, మంచికి విరుద్ధంగా సంచరించే మానవుడు ఎవడైనా, అతడు సత్పురుషుల గౌరవం పొందలేడు. అధర్మాన్ని ధర్మవేషంతో ఆచరిస్తూ, దుష్టమార్గాన్ని అనుసరిస్తే, లోకంలో ఎవడైనా గౌరవిస్తాడా? నేను ప్రతిజ్ఞను విడిచి, రాజ్యాన్ని చేపడితే ఎవరికి హితవును ఉపదేశించగలను? అప్పుడు నా మాట వినేవారు ఎవరైనా ఉంటారా? నేనే మార్గం తప్పితే, జనాలు స్వైరసంచారులు అయిపోరా? అతి పురాతనం, శాశ్వతం అయిన రాజధర్మం సత్యస్వరూపమైనది. ఇందులో క్రూరత్వానికి తావులేదు. రాజ్యం సత్యప్రధానం. దేవతలు, ఋషులు కూడా సత్యమే పరమధర్మమని అంగీకరించారు. సత్యమే స్వర్గానికి మూలకారణమని అంటారు. నేను సత్యప్రతిజ్ఞ కలవాడిని. తండ్రి ఎదుట నేను చేసిన శపథం సత్యమైనప్పుడు, ఆ ప్రతిజ్ఞను ఎలా వదిలేయగలను? నువ్వు నాస్తికుడివి. ధర్మచ్యుతుడివి. నీలాంటి వాణ్ణి చేరదీసినందుకు మా తండ్రిని నిందించాలి’ అని రాముడు కోపావేశంతో బదులిచ్చాడు.రాముడి కోపాన్ని గమనించిన వసిష్ఠుడు, ‘రామా! మరణానంతరం మనుషులు కర్మానుసారం స్వర్గ నరకాలకు పోతారని, తిరిగి జన్మిస్తారని జాబాలికి కూడా తెలుసు. నిన్ను తిరిగి అయోధ్యకు రప్పించి, పట్టాభిషిక్తుడిని చేయాలనే ఉద్దేశంతో అలా అన్నాడు’ అని నచ్చజెప్పి, ‘ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడే రాజ్యాధికారం స్వీకరించడం తర తరాల ఆచారం. జ్యేష్ఠుడు ఉండగా, కనిష్ఠుడు రాజు కాడు. కాబట్టి, ఇక్ష్వాకు వంశాచారాన్ని మంటగలపకు. అయోధ్యకు బయలుదేరి, రాజ్యాన్ని స్వీకరించు’ అని చెప్పాడు.రాజగురువు అయిన వసిష్ఠుడు స్వయంగా నచ్చజెప్పినా, రాముడు తన ప్రతిజ్ఞను పక్కనపెట్టి, రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించలేదు. ఇక చేసేదేమీ భరతుడు పరివారంతో కలసి అయోధ్యకు మరలక తప్పని పరిస్థితి ఏర్పడింది.సీతమ్మవారి కోవెలశ్రీలంకలో సీతమ్మవారికి ప్రత్యేక ఆలయం ఉంది. వనవాసంలో ఉండగా సీతను అపహరించిన రావణుడు ఆమెను ఇదేచోట అశోకవనంలో బంధించినట్లు స్థలపురాణ కథనం. ఈ ఆలయ ప్రాంగణంలో పురాతన అశోకవృక్షం కూడా ఉంది. ఆ చెట్టు కిందనే సీతమ్మవారు కూర్చుని ఉండేదని చెబుతారు. ‘సీతా అమ్మన్ కోవిల్’ అనే ఈ ఆలయం శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్లోని నువారా జిల్లా కేంద్రానికి చేరువలో ఉంది.→ సాంఖ్యాయన -
ది న్యూ అడిక్షన్ ఎకానమీ.. మీ మెదడుపై అదృశ్య యుద్ధం!
ప్రపంచం మొత్తం మీ అరచేతిలో ఉందని మీరు సంబరపడుతున్నారా? కానీ వాస్తవానికి ఆ అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోనే మిమ్మల్ని బందీని చేస్తోందని మీకు తెలుసా? సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలు కేవలం సాఫ్ట్వేర్ను మాత్రమే తయారుచేయడం లేదు; అవి మన ప్రమేయం లేకుండానే మనల్ని బానిసలుగా మార్చే ‘డిజిటల్ డ్రగ్స్’ను డిజైన్ చేస్తున్నాయి. దీనినే నిపుణులు ‘అడిక్షన్ ఎకానమీ’ అని పిలుస్తున్నారు. మీ సమయమే వారి పెట్టుబడి!సాధారణంగా ఏదైనా వస్తువు కొనాలంటే మనం డబ్బులు చెల్లిస్తాం. కాని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్స్ మనకు ఉచితంగా సేవలు అందిస్తున్నాయని మనం భ్రమపడుతుంటాం. ఒక వస్తువుకు మీరు డబ్బు చెల్లించడం లేదంటే, అక్కడ మీరే ఒక వస్తువు అని అర్థం. మీ సమయం, శ్రద్ధ, వ్యక్తిగత సమాచారమే వారి పెట్టుబడి. మీరు ఫోన్ చూస్తూ గడుపుతున్న ప్రతి అదనపు నిమిషం ఈ కంపెనీల పాలిట ఒక బంగారు గుడ్డు. మీరు ఎంత ఎక్కువ సమయం స్క్రీన్కు అతుక్కుపోతే, ఆ కంపెనీల షేర్ల విలువ అంతగా పెరుగుతుంది. 2026 ముగిసే నాటికి సోషల్ మీడియా యాడ్ మార్కెట్ సుమారు రూ.26 లక్షల కోట్లకు చేరుకోనుందంటే, మన ఏకాగ్రతను వారు ఎంత ఖరీదైన వస్తువుగా మార్చారో అర్థం చేసుకోవచ్చు. మెటా, గూగుల్ వంటి సంస్థలు రోజుకు వేల కోట్లు సంపాదిస్తున్నాయంటే, దానికి ఇంధనం మన మెదడులోని డోపమైన్, మన చేతిలోని సమయమే!దిగ్భ్రాంతికర గణాంకాలు 2025–26 నివేదికల ప్రకారం ఇటీవలి గణాంకాలు చూస్తుంటే మనం ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది.→ సగటు భారతీయుడు రోజుకు దాదాపు 6.5 గంటల సమయాన్ని ఇంటర్నెట్పై గడుపుతున్నాడు. ఇందులో మూడు గంటల కంటే ఎక్కువ సమయం కేవలం వినోదం, సోషల్ మీడియాకే పరిమితం. → ఒకప్పుడు మనుషుల్లో పన్నెండు సెకన్లుగా ఉన్న అటెన్షన్ స్పాన్, ఇప్పుడు ఎనిమిది సెకన్లకు పడిపోయింది. ఒక గోల్డెన్ ఫిష్ అటెన్షన్ స్పాన్ తొమ్మిది సెకన్లు. అంటే మనం దానికంటే ఘోరంగా ఉన్నామన్నమాట! → రోజుకు ఐదుగంటల కన్నా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న టీనేజర్లలో ఆత్మహత్య ఆలోచనలు లేదా తీవ్రమైన ఒత్తిడి వచ్చే అవకాశం 35 శాతం పెరిగినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నివేదిక చెబుతోంది. → ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్ వల్ల 2025లో భారతీయ కుటుంబాలు దాదాపు 50 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టపోయినట్లు అంచనా.బయటపడటం ఇలా... ఈ ‘అడిక్షన్ ఎకానమీ‘లో మీ విలువైన జీవితాన్ని, సమయాన్ని తాకట్టు పెట్టకండి. ఈ రోజే మీ డిజిటల్ ప్రయాణాన్ని నియంత్రించుకోండి. స్మార్ట్ఫోన్ కంటే మీ స్మార్ట్నెస్ గొప్పదని నిరూపించండి! → మీ ఫోన్ స్క్రీన్ను రంగులు లేకుండా ‘బ్లాక్ అండ్ వైట్’లో మార్చండి. రంగులు లేకపోతే మెదడుకు ఆ దృశ్యాలు ఆకర్షణీయంగా అనిపించవు, తద్వారా ఫోన్ వాడకం 30 శాతం తగ్గుతుంది. → ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. ఇది కంటి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, మెదడుకు చిన్న విరామాన్ని ఇస్తుంది. → డైనింగ్ టేబుల్, బెడ్రూమ్లో ఫోన్ను అనుమతించకండి. ముఖ్యంగా నిద్రపోయే గంట ముందు ఫోన్ను పక్కన పెట్టడం వల్ల ’మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి గాఢ నిద్ర పడుతుంది. → మీ ఫోన్లోని సెట్టింగ్స్లో ’డిజిటల్ వెల్–బీయింగ్’ ఆప్షన్ ద్వారా ప్రతి యాప్కు సమయాన్ని కేటాయించుకోండి. సమయం ముగియగానే యాప్ లాక్ అయ్యేలా చూసుకోండి. → ఖాళీ సమయం దొరకగానే ఫోన్ తీయకండి. ఆ ఖాళీ సమయాన్ని ఆలోచనల కోసం, ప్రకృతిని గమనించడం కోసం కేటాయించండి. సృజనాత్మకత ఎప్పుడూ ఖాళీ మెదడులోనే పుడుతుంది.మెదడును హ్యాక్ చేస్తున్న సైకాలజీటెక్ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు వందల సంఖ్యలో సైకాలజిస్టులను నియమించుకుంటాయి. ఎందుకో తెలుసా? మన మెదడులోని బలహీనతలను కనిపెట్టడానికి. జూదం ఒక వ్యసనం. ఒక లాటరీలో ఎప్పుడు జాక్పాట్ తగులుతుందో తెలియదు. సైకాలజిస్టుల సహాయంతో అలాంటి వ్యసనాన్ని సోషల్ మీడియాలో ‘నోటిఫికేషన్స్’ ద్వారా సృష్టించారు. అలాగే మెదడులోని రివార్డ్ సిస్టమ్ను ప్రేరేపించే డోపమైన్ను రిలీజ్ చేసేలా లైక్స్, కామెంట్స్ పనిచేస్తాయి.నెవెర్ మైండ్ స్మార్ట్ఫోన్ మోసుకొచ్చిన మాయ రోగాల్లో ‘డూమ్ స్క్రోలింగ్’ ఒకటి. ‘డూమ్ స్క్రోలింగ్’ బారినపడిన వారు అదేపనిగా స్మార్ట్ఫోన్లో కలత రేపే వార్తలను స్క్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి వార్తలను చూస్తూ ఆందోళనకు, దిగులుకు లోనవుతారు. అయినా, వారు ‘డూమ్ స్క్రోలింగ్’ను నియంత్రించుకోలేరు.సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ -
ఆనందమే అందం!
ఇంట్లో ఉన్నా, స్టేజ్ మీద ఉన్నా, స్క్రీన్ మీదనైనా ఎప్పుడూ అందంగా కనిపించే నటì నేహా శెట్టి. ఇందుకోసం ఆమె పాటించే ఫ్యాషన్ టిప్స్, బ్యూటీ సీక్రెట్స్ ఇప్పుడు మీ కోసం..లెహంగా.. బ్రాండ్: సితారా కుడిగా ధర రూ. 22,000జడగంటలు.. బ్రాండ్: వైదాన్ జ్యూలరీ ధర రూ. 7,200కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా సరదాగా గడపటం మాత్రం మానేయకూడదు. ఆనందంగా ఉంటేనే అందంగా ఉంటాం. ఇక ఫ్యాషన్లో ప్రయోగాలు చేయటం అంటే ఇష్టం. సడన్గా ఏదైనా ఈవెంట్కు వెళ్లాల్సి వచ్చినా కూడా, త్వరగా స్టయిలింగ్ చేసుకొని, అందంగా కనిపిస్తా. నా దగ్గర ఎప్పుడూ వివిధ రకాల దుస్తులు, జ్యూయల్స్ కలక్షన్స్ ఉంటాయి. – నేహా శెట్టి. -
పంచాంగము (2026–2027)
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, వసంతఋతువు, చైత్రమాసంతేది/మాసం శుభసమయం 19/03 సా.05:00 ∙బ.అమావాస్య గురు ఘ.02:14, ఉ.గం.7:04, చైత్ర శుద్ధ పాడ్యమి ఘ.57:12, తె.గం.5:56. ఉత్తరాభాద్ర రా.తె.గం.5:11. శుక్లం రా.గం.2:20. నాగవం ఉ.గం.7:04. కింస్తుఘ్నం సా.గం.6:30. అహస్సు ఘ.29:52. వర్జ్యం ప.గం.3:09ల 4:43వ. అమృ రా.గం.12:30ల 2:04వ. భు.ఘ.0:32:55. మ.దు.2:56ల 3:44వ. ఉగాది.20/03 ఉ.10:35 శు.విదియ శుక్ర ఘ.55:29, తె.గం.4:21, రేవతి రా.గం.4:19. బ్రహ్మం రా.గం.12:00. బాల సా.గం.5:35. అహస్సు ఘ.29:54. వర్జ్యం ప.గం.4:43ల 6:16వ. అమృ రా.గం.2:00ల 3:30వ. భు.ఘ.00:40:54. ఉ.దు.8:42ల 9:30వ. మ.దు.12:32ల 1:20వ.21/03 ఉ.10:35 శు.తదియ శని ఘ.50:35, రా.గం.2:22, అశ్విని రా.తె.గం.3:03. ఐంద్రం రా.గం.9:15. తైతుల ప.గం.3:21. అహస్సు ఘ.29:56. వర్జ్యం రా.గం.11:15ల 12:45వ. అమృ రా.గం.8:13ల 9:44వ. భు.ఘ.00:48:54. ఉ.దు.6:08ల 7:44వ. సౌభాగ్య గౌరీవ్రతం, శివడోలోత్సవం22/03 ఉ.07:30 శు.చవితి ఆది ఘ.45:12, రా.గం.12:12, భరణి రా.గం.1:37. వైధృతి సా.గం.6:24. వనిక్ ప.గం.1:18. అహస్సు ఘ.29:59. వర్జ్యం ప.గం.12:04ల 1:34వ. అమృ రా.గం.9:07ల 10:37వ. భు.ఘ.00:48:53. సా.దు.4:31ల 5:19వ. గణేశచతుర్థీ (గణేశపూజ)23/03 ప.08:30 శు.పంచమి సోమ ఘ.39:23, రా.గం.9:52, కృత్తిక రా.గం.12:00. విష్కంభం ప.గం.3:23. బవ ప.గం.11:12. అహస్సు ఘ.30:02. వర్జ్యం ప.గం.12:49ల 2:18వ. అమృ రా.తె.గం.9:46ల 11:16వ. భు.ఘ.1:4:51. ప.దు.12:08ల 12:56వ. పునః ప.2:56ల 3:44వ. నాగపూజ, శ్వేతవరాహకల్పం, శ్రీపంచమీ(లక్ష్మీపూజ)24/03 సా.05:50 శు.షష్ఠి మంగళ ఘ.33:24, రా.గం.7:28 రోహిణి రా.గం.10:19. ప్రీతి ప.గం.12:17. కౌలవ ఉ.గం.8:39. అహస్సు ఘ.30:04. వర్జ్యం ప.గం.2:52ల 4:21వ. పునః రా.గం.3:31ల 5:00వ. అమృ రా.గం.7:20ల 8:50. భు.ఘ.1:12:50. ఉ.దు.8:28ల 9:16వ. రా.దు.10:53ల 11:42వ.25/03 ఉ.09:30 శు.సప్తమి బుధ ఘ.27:13, సా.గం.4:59, మృగశిర రా.గం.8:36. ఆయుష్మాన్ ఉ.గం.9:07. సౌభాగ్యం రా.తె.గం.6:00. వనిక్ సా.గం.4:59. అహస్సు ఘ.30:06. వర్జ్యం రా.తె.గం.4:28ల 5:58వ. అమృ ప.గం.12:26ల 1:56వ. భు.ఘ.1:20:49. మ.దు.11:48ల 12:37వ. 26/03 ప.12:10 శు.అష్టమి గురు ఘ.21:37, ప.గం.2:44, ఆర్ద్ర రా.గం.7:05. శోభ రా.గం.3:04. బవ ప.గం.2:44. అహస్సు ఘ.30:08. వర్జ్యం లేదు. అమ ఉ.గం.9:43ల 11:13వ. భు.ఘ.1:28:48. ఉ.దు.10:07ల 10:56వ. మ.దు.2:58ల 3:47వ. భవానీయాత్ర, అశోకరుద్రపూజ27/03 ప.02:30 శు.నవమి శుక్ర ఘ.16:13, ప.గం.12:33, పునర్వసు సా.గం.5:41. అతిగండ రా.గం.12:16. కౌలవ ప.గం.12:33. అహస్సు ఘ.30:10. వర్జ్యం ఉ.గం.6:22ల 7:52వ. పునః రా.1:18ల 2:49వ. అమృ ప.గం.3:26ల 4:56వ. భు.ఘ.1:36:47. ఉ.దు.8:30ల 9:19వ. మ.దు.12:32ల 1:21వ. శ్రీరామనవమి28/03 ప.01:15 శు.దశమి శని ఘ.11:26, ప.గం.10:37, పుష్యమి సా.గం.4:33. సుకర్మ రా.గం.9:41. గరజి ప.గం.10:37. అహస్సు ఘ.30:12. వర్జ్యం తె.గం.4:55ల 6:02వ. అమృ ప.గం.10:27ల 11:58వ. భు.ఘ.1:44:46. ఉ.దు.6:03ల 7:30వ.29/03 సా.06:20 శు.ఏకాదశి ఆది ఘ.7:21, ఉ.గం.8:58, ఆశ్లేష ప.గం.3:43. ధతి రా.గం.7:22. భద్ర ఉ.గం.8:58. అహస్సు ఘ.30:15. శేష వర్జ్యం ఉ.గం.6:02ల 6:28వ. పునః రా.గం.3:30ల 5:04వ. అమృ ప.గం.2:10ల 3:43వ. భు.ఘ.1:52:45. సా.దు.4:30ల 5:18వ. 30/03 సా.06:15 శు.ద్వాదశి సోమ ఘ.4:18, ఉ.గం.7:44, మఘ ప.గం.3:17. శూల రా.గం.5:43. బాలవ ఉ.గం.7:44. అహస్సు ఘ.30:18. వర్జ్యం రా.గం.11:17ల 12:53. అమృ ప.గం.12:55ల 2:29వ. భు.ఘ.2:00:44. ప.దు.12:29ల 1:18వ. పునః ప.2:55ల 3:44వ.31/03 ప.12:00 శు.త్రయోదశి మంగళ ఘ.2:12, ఉ.గం.6:53, పుబ్బ ప.గం.3:17. గండ ప.గం.3:46. తైతుల ఉ.గం.6:53. అహస్సు ఘ.30:20. వర్జ్యం రా.గం.10:38ల 12:16వ. అమృ ఉ.గం.8:52ల 10:28వ. భు.ఘ.2:8:43. ఉ.దు.8:25ల 9:14వ. రా.దు.10:53ల 11:32వ. 01/04 ఉ.07:10 శు.చతుర్దశి బుధ ఘ.1:23, ఉ.గం.6:33, ఉత్తర సా.గం.3:47. వృద్ధి ప.గం.2:55. వనిక్ ఉ.గం.6:33. అహస్సు ఘ.30:22. వర్జ్యం రా.గం.12:56ల 2:36వ. అమృ ఉ.గం.8:26ల 10:04వ. భు.ఘ.2:16:42. మ.దు.11:39ల 12:28. 02/04 ఉ.09:15 ఝ శు.పౌర్ణమి గురు ఘ.2:14, ఉ.గం.6:53, హస్త సా.గం.4:46. ధ్రువం ప.గం.1:41. బవ ఉ.గం.6:53. అహస్సు ఘ.30:24. వర్జ్యం రా.గం.1:15ల 2:57వ. అమృ ఉ.గం.10:31ల 12:11వ. భు.ఘ.2:24:41. ఉ.దు.10:01ల 10:50వ. మ.దు.2:54ల 3:43వ. 03/04 ప.03:00 బహుళ పాడ్యమి శుక్ర ఘ.3:32, ఉ.గం.7:24. చిత్త సా.గం.6:15. వ్యాఘాతం ప.గం.1:17. కౌలవ ఉ.గం.7:24. అహస్సు ఘ.30:27. వర్జ్యం రా.గం.12:18ల 2:02వ. అమృ ప.గం.11:27ల 1:09. భు.ఘ.2:32:40. ఉ.దు.8:23ల 9:12వ. మ.దు.12:27ల 1:16వ.04/04 ఉ.11:00 బ.విదియ శని ఘ.6:45, ఉ.గం.8:40. స్వాతి రా.గం.8:10. హర్షణం ప.గం.1:11. గరజి ఉ.గం.8:40. అహస్సు ఘ.30:30. వర్జ్యం రా.గం.2:18ల 4:03వ. అమృ ఉ.గం.10:40ల 12:24వ. భు.ఘ.2:40:39. ఉ.దు.5:58ల 7:36వ.05/04 ఉ.9:30 బ.తదియ ఆది ఘ.10:24, ప.గం.10:07. విశాఖ రా.గం.10:26. వజ్రం ప.గం.1:25. విష్టి ప.గం.10:07. అహస్సు ఘ.30:32. వర్జ్యం రా.గం.2:52ల 4:38వ. అమృ ప.గం.12:48ల 2:33వ. భు.ఘ.2:48:38. సా.దు.4:32ల 5:21వ. సంకటహర చతుర్థి06/04 సా.07:00 బ.చవితి సోమ ఘ.15:12, ప.గం.12:01. అనురాధ రా.గం.12:58. సిద్ధి ప.గం.1:51. బాలవ ప.గం.12:01. అహస్సు ఘ.30:34. వర్జ్యం లేదు. అమృ ప.గం.1:28ల 3:14వ. భు.ఘ.2:56:37. ప.దు.12:26ల 1:16వ. పునః 2:54ల 3:44వ.07/04 సా.05:15 బ.పంచమి మంగళ ఘ.20:24, ప.గం.2:05. జ్యేష్ఠ రా.గం.3:37. వ్యతీపాత ప.గం.2:27. తైతుల ప.గం.2:05. అహస్సు ఘ.30:37. వర్జ్యం ఉ.గం.7:11ల 8:57వ. అమృ సా.గం.5:50ల 7:36వ. భు.ఘ.3:4:36. ఉ.దు.8:21ల 9:11వ. రా.దు.10:51ల 11:41వ. మత్స్యజయంతీ08/04 ఉ.07:00 బ.షష్ఠి బుధ ఘ.25:37, ప.గం.4:09. మూల పూర్తి. వరీయాన్ ప.గం.3:03. వనిక్ ప.గం.4:09. అహస్సు ఘ.30:40. వర్జ్యం ప.గం.12:26ల 2:12వ. పునః తె.గం.5:20ల 5:53వ. అమృ రా.గం.11:03ల 12:49. భు.ఘ.3:12:35. మ.దు.11:37ల 12:27వ. 09/04 సా.05:00 బ.సప్తమి గురు ఘ.30:23, సా.గం.6:02. మూల ఉ.గం.6:06. పరిఘ ప.గం.3:30. బవ సా.గం.6:02. అహస్సు ఘ.30:42. వర్జ్యం శేషం ఉ.గం.5:53ల 6:06వ. పునః సా.3:38ల 5:23వ. అమృ రా.తె.గం.3:09ల 4:54వ. భు.ఘ.3:20:34. ఉ.దు.9:57ల 10:47వ. మ.దు.2:53ల 3:43వ.10/04 రా.08:30 బ.అష్టమి శుక్ర ఘ.34:28, రా.గం.7:39. పూర్వాషాఢ ఉ.గం.8:24. శివం ప.గం.3:44. బాలవ ఉ.గం.6:50. అహస్సు ఘ.30:45. వర్జ్యం సా.గం.5:03ల 6:47వ. అమృ రా.తె.గం.3:25ల 5:09వ. భు.ఘ.3:28:33. ఉ.దు.8:18ల 9:08వ. మ.దు.12:25ల 1:15వ.11/04 ప.11:15 బ.నవమి శని ఘ.37:22, రా.గం.8:48. ఉత్తరాషాఢ ఉ.గం.10:19. సిద్ధం సా.గం.3:43. తైతుల ఉ.గం.8:13. అహస్సు ఘ.30:48. వర్జ్యం ప.గం.2:34ల 3:16వ. అమృ రా.గం.12:46ల 2:28వ. భు.ఘ.3:36:32. ఉ.దు.5:50ల 7:30వ.12/04 ప.11:15 బ.దశమి ఆది ఘ.39:04, రా.గం.9:28. శ్రవణం ప.గం.11:48. సాధ్యం ప.గం.3:14. వనిక్ ఉ.గం.9:07. అహస్సు ఘ.30:51. వర్జ్యం ప.గం.3:58ల 5:38వ. అమృ రా.గం.1:59ల 3:39వ. భు.ఘ.3:44:31. సా.దు.4:31ల 5:21వ.13/04 సా.07:00 బ.ఏకాదశి సోమ ఘ.39:35, రా.గం.9:39. ధనిష్ఠ ప.గం.12:49. శుభం ప.గం.2:26. విష్టి ఉ.గం.9:33. అహస్సు ఘ.30:54. వర్జ్యం రా.గం.8:09ల 9:47వ. భు.ఘ.3:52:30. ప.దు.12:25ల 1:15వ. పునః 12:53ల 3:43వ. 14/04 సా.05:15 బ.ద్వాదశి మంగళ ఘ.38:49, రా.గం.9:21. శతభిషం ప.గం.1:19. శుక్లం ప.గం.1:13. కౌలవ ఉ.గం.9:30. అహస్సు ఘ.30:56. వర్జ్యం రా.గం.7:43ల 9:19వ. అమృ ఉ.గం.5:58ల 7:36వ. భు.ఘ.4:0:29. పు.భు.4:2. ఉ.దు.8:18ల 9:07వ. రా.దు.10:49ల 11:39వ. అశ్వి 1 రవిః ప.11:49 మేష సంక్రమణం15/04 సా.04:30 బ.త్రయోదశి బుధ ఘ.36:41, రా.గం.8:28. పూర్వాభాద్ర ప.గం.1:19. బ్రహ్మం ప.గం.11:35. గరజి ఉ.గం.8:54. అహస్సు ఘ.30:58. వర్జ్యం రా.గం.10:46ల 12:20వ. అమృ ఉ.గం.5:48ల 7:20వ. భు.ఘ.00:6:22. మ.దు.11:35ల 12:25వ. వరాహజయంతీ, మాసశివరాత్రి నిశీధి వారికి16/04 సా.05:10 బ.చతుర్దశి గురు ఘ.33:37, రా.గం.7:14. ఉత్తరాభాద్ర ప.గం.12:55. ఐంద్రం ప.గం.11:37. విష్టి ఉ.గం.7:51. అహస్సు ఘ.31:00. వర్జ్యం రా.గం.12:30ల 2:02వ. అమృ ఉ.గం. 8:11ల 9:45వ. భు.ఘ.0:14:52. ఉ.దు.9:55ల 10:45వ. మ.దు.2:53ల 3:43వ. మాస శివరాత్రి (ధర్మశాం) ప్రదోషం వారికి, శివసన్నిధిస్నానం17/04 రా.08:30 ∙బ.అమావాస్య శుక్ర ఘ.28:28, సా.గం.5:21. రేవతి ప.గం.12:05. వైధతి ఉ.7:19. విష్కంభం తె.గం.4:49. నాగవం సా.గం.5:21. అహస్సు ఘ.31:3. వర్జ్యం లేదు. ఉ.గం.9:46ల 11:19. పునః అమృ తె.గం.4:06ల 5:38వ. భు.ఘ.000:23:22. ఉ.దు.8:15ల 9:05వ. మ.దు.12:24ల 1:14వ. కూర్మకల్పం, తర్పణాలకు అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, వసంతఋతువు, వైశాఖమాసం18/04 ప.11:00 శుద్ధ పాడ్యమి శని ఘ.24:39, సా.గం.3:38. అశ్విని ప.గం.10:58. ప్రీతి రా.గం.2:01. బవ సా.గం.3:38. అహస్సు ఘ.31:06. వర్జ్యం ఉ.గం.7:09ల 8:40. పునః రా.7:56ల 9:26వ. అమృ తె.గం.4:55ల 5:46వ. భు.ఘ.00:31:52. ఉ.దు.5:46ల 7:26వ. చంద్రదర్శనం (నెలపొడుపు), ధర్మఘటాదిదానం19/04 ఉ.09:30 శు.విదియ ఆది ఘ.19:15, ప.గం.1:27. భరణి ఉ.గం.9:23. ఆయుష్మాన్ రా.గం.11:01. కౌలవ ప.గం.1:27. అహస్సు ఘ.31:8. వర్జ్యం రా.గం.8:43ల 10:13వ. అమృ శేషం ఉ.గం.5:45ల 6:25వ. భు.ఘ.00:40:22. సా.దు.4:35ల 5:25వ.20/04 సా.07:00 శు.తదియ సోమ ఘ.13:25, ప.గం.11:06. కృత్తిక ఉ.గం.8:00. సౌభాగ్యం రా.గం.7:57. గరజి ప.గం.11:06. అహస్సు ఘ.31:10. వర్జ్యం రా.గం.10:53ల 12:22. అమృ ఉ.గం.5:51ల 7:21వ. పునరమ రా.తె.3:21ల 4:50వ. భు.ఘ.00:48:52. ప.దు.12:24ల 1:14వ. పునః ప.2:53ల 3:43వ. అక్షయతృతీయ, గౌరీపూజ21/04 ఉ.10:30 శు.చవితి మంగళ ఘ.7:22, ఉ.గం.8:41. రోహిణి ఉ.గం.6:22. మృగశిర తె.గం.4:40. శోభ సా.గం.4:52. భద్ర ఉ.గం.8:41. అహస్సు ఘ.31:12. వర్జ్యం ప.గం.11:34ల 1:03వ. అమృ రా.గం.8:29ల 9:58వ. భు.ఘ.00:57:22. ఉ.దు.8:13ల 9:03వ. రా.దు.10:49ల 11:39వ. శంకర జయంతి, నాగచతుర్థీ22/04 ఉ.09:45 శు.పంచమి బుధ ఘ.01:17, ఉ.గం.6:14. షష్ఠి ఘ.54:00, తె.గం.3:50. ఆర్ద్ర రా.తె.గం.3:02. అతిగండ ప.గం.1:47. బాలవ ఉ.గం.6:14. కౌలవ సా.గం.5:02. అహస్సు ఘ.31:14. వర్జ్యం ప.గం.12:29ల 1:58వ. అమృ సా.గం.5:42ల 7:11వ. భు.ఘ.1:5:52. మ.దు.11:43ల 12:33వ.23/04 సా.05:00 శు.సప్తమి గురు ఘ.49:50, రా.గం.1:39. పునర్వసు రా.గం.1:37. సుకర్మ ప.గం.10:50. గరజి సా.గం.4:38. అహస్సు ఘ.31:16. వర్జ్యం ప.గం.2:20ల 3:50వ. అమృ రా.గం.11:22ల 12:52వ. భు.ఘ.1:14:22. ఉ.దు.9:52ల 10:42వ. మ.దు.2:53ల 3:43వ. విద్యారణ్య జయంతి, గంగోత్పత్తి 24/04 ప.02:15 శు.అష్టమి శుక్ర ఘ.44:56, రా.గం.11:41. పుష్యమి రా.గం.12:23. ధృతి ఉ.గం.7:59. శూల తె.గం.5:15. విష్టి ప.గం.12:39. అహస్సు ఘ.31:18. వర్జ్యం ప.గం.9:12ల 10:42వ. అమృ రా.గం.6:19ల 7:49వ. భు.ఘ.1:22:52. ఉ.దు.8:12ల 9:02వ. మ.దు.12:23ల 1:13వ. అపరాజితాదేవీపూజ25/04 ప.11:00 శు.నవమి శని ఘ.40:56, రా.గం.10:03. ఆశ్లేష రా.గం.11:30. గండ రా.గం.2:55. బాలవ ప.గం.10:51. అహస్సు ఘ.31:20. వర్జ్యం ప.గం.12:43ల 2:16వ. అమృ రా.గం.9:58ల 11:30వ. భు.ఘ.1:31:22. ఉ.దు.5:41ల 7:31వ. 26/04 ప.11:30 శు.దశమి ఆది ఘ.37:39, రా.గం.8:45. మఘ రా.గం.10:57. వృద్ధి రా.గం.1:14. తైతుల ఉ.గం.9:24. అహస్సు ఘ.31:22. వర్జ్యం ప.గం.11:14ల 12:48వ. అమృ రా.గం.8:36ల 10:10వ. భు.ఘ.1:39:52. సా.దు.4:34ల 5:24వ. 27/04 సా.07:00 శు.ఏకాదశి సోమ ఘ.35:37, రా.గం.7:55. పుబ్బ రా.గం.10:53. ధ్రువం రా.గం.11:23. వనిక్ ఉ.గం.8:19. అహస్సు ఘ.31:25. వర్జ్యం ఉ.గం.6:56ల 8:32వ. అమృ సా.గం.4:32ల 6:08వ. భు.ఘ.1:48:22. ప.దు.12:23ల 1:13వ. పునః ప.2:54ల 3:44వ. అన్నవరం సత్యదేవ కళ్యాణం, మతత్రయ (మోహినీ) ఏకాదశి28/04 సా.05:10 శు.ద్వాదశి మంగళ ఘ.34:37, రా.గం.7:31. ఉత్తర రా.గం.11:14. వ్యాఘాతం రా.గం.9:45. బవ ఉ.గం.7:43. అహస్సు ఘ.31:28. వర్జ్యం ఉ.గం.6:11ల 7:48వ. అమృ ప.గం.3:56ల 5:33వ. భు.ఘ.1:56:52. ఉ.దు.8:10ల 09:00వ. రా.దు.10:49ల 11:30వ. పరశురామద్వాదశీ29/04 సా.04:20 శు.త్రయోదశి బుధ ఘ.35:02, రా.గం.7:40. హస్త రా.గం.12:08. హర్షణం రా.గం.9:01. కౌలవ ఉ.గం.7:35. అహస్సు ఘ.31:30. వర్జ్యం ఉ.గం.7:56ల 9:36వ. అమృ సా.గం.5:54ల 7:34వ. భు.ఘ.2:5:22. మ.దు.11:31ల 12:21వ.30/04 సా.05:00 శు.చతుర్దశి గురు ఘ.36:35, రా.గం.8:16. చిత్త రా.గం.1:28. వజ్రం రా.గం.8:30. గరజి ఉ.గం.8:03. అహస్సు ఘ.31:32. వర్జ్యం ఉ.గం.8:34ల 10:15వ. అమృ సా.గం.6:42ల 8:23వ. భు.ఘ.2:13:52. ఉ.దు.9:51ల 10:41వ. మ.దు.2:54ల 3:44వ. 01/05 ప.02:15 ఝ శు.పౌర్ణమి శుక్ర ఘ.39:28, రా.గం.9:25. స్వాతి రా.గం.3:20. సిద్ధి రా.గం.8:25. విష్టి ఉ.గం.8:50. అహస్సు ఘ.31:34. వర్జ్యం ఉ.గం.7:30ల 9:14వ. అమృ సా.గం.5:51ల 7:35వ. భు.ఘ.2:22:22. ఉ.దు.8:10ల 9:00వ. మ.దు.12:23ల 1:13వ. 02/05 సా.06:30 బహుళ పాడ్యమి శని ఘ.43:18, రా.గం.10:56. విశాఖ రా.తె.గం.5:32. వ్యతీపాత రా.గం.8:47. బాలవ ఉ.గం.10:10. అహస్సు ఘ.31:36. వర్జ్యం ప.గం.9:26ల 11:11వ. అమృ రా.గం.7:55ల 9:40వ. భు.ఘ.2:30:52. ఉ.దు.5:37ల 7:18వ.03/05 రా.07:00 బ.విదియ ఆది ఘ.48:01, రా.గం.12:49. అనురాధ పూర్తి. వరీయాన్ రా.గం.9:04. తైతుల ప.గం.11:53. అహస్సు ఘ.31:38. వర్జ్యం ఉ.గం.9:57ల 11:43వ. అమృ రా.గం.8:34ల 10:20వ. భు.ఘ.2:39:22. సా.దు.4:35ల 5:25వ.04/05 రా.07:00 బ.తదియ సోమ ఘ.53:06, రా.గం.2:50. అనురాధ ఉ.గం.8:04. పరిఘ రా.గం.9:38. వనిక్ ప.గం.8:17. అహస్సు ఘ.31:40. వర్జ్యం ప.గం.2:16ల 4:02వ. అమృ రా.గం.12:55ల 2:41వ. భు.ఘ.2:47:52. ప.దు.12:22ల 1:12వ. పునః 2:54ల 3:44వ. 05/05 ఉ.10:30 బ.చవితి మంగళ ఘ.58:17, తె.గం.4:55. జ్యేష్ఠ ప.గం.10:41. శివం రా.గం.10:24. బవ ప.గం.3:52. అహస్సు ఘ.31:42. వర్జ్యం రా.గం.7:33ల 9:19వ. భు.ఘ.2:56:22. ఉ.దు.8:08ల 8:58వ. రా.దు.10:49ల 11:39వ. సంకటహర చతుర్థి06/05 ఉ.09:30 బ.పంచమి బుధ పూర్తి. మూల ప.గం.1:15. సిద్ధం రా.గం.10:51. కౌలవ రా.గం.6:31. అహస్సు ఘ.31:44. వర్జ్యం ప.గం.11:29ల 1:15వ. పునః రా.గం.11:48ల 1:34వ. అమృ ఉ.గం.6:10ల 7:56వ. భు.ఘ.3:4:52. మ.దు.11:32ల 12:22వ.07/05 సా.05:00 బ.పంచమి గురు ఘ.2:55, ఉ.గం.6:45. పూర్వాషాఢ ప.గం.3:37. సాధ్యం రా.గం.11:11. తైతుల ఉ.గం.6:45. అహస్సు ఘ.31:46. వర్జ్యం రా.గం.12:18ల 2:02వ. అమృ ఉ.గం.10:21ల 12:07వ. భు.ఘ.3:13:22. ఉ.దు.9:49ల 10:39వ. మ.దు.2:55ల 3:45వ.08/05 సా.05:40 బ.షష్ఠి శుక్ర ఘ.6:49, ఉ.గం.8:18. ఉత్తరాషాఢ సా.గం.5:39. శుభం రా.గం.11:15. వనిక్ ఉ.గం.8:18. అహస్సు ఘ.31:48. వర్జ్యం రా.గం.9:55ల 11:37వ. అమృ ప.గం.10:42ల 12:26వ. భు.ఘ.3:21:52. ఉ.దు.8:07ల 8:57వ. మ.దు.12:21ల 1:11వ.09/05 ప.11:30 బ.సప్తమి శని ఘ.9:43, ఉ.గం.9:27. శ్రవణం రా.గం.7:16. శుక్లం రా.గం.10:56. బవ ఉ.గం.9:27. అహస్సు ఘ.31:50. వర్జ్యం రా.గం.11:27ల 1:08వ. అమృ ఉ.గం.8:11ల 9:53వ. భు.ఘ.3:30:22. ఉ.దు.5:34ల 7:15వ.10/05 ప.03:00 బ.అష్టమి ఆది ఘ.11:22, ఉ.గం.10:07. ధనిష్ఠ రా.గం.8:24. బ్రహ్మం రా.గం.10:16. కౌలవ ఉ.గం.10:07. అహస్సు ఘ.31:52. వర్జ్యం రా.తె.గం.3:45ల 5:23వ. అమృ ఉ.గం.9:30ల 11:11వ. భు.ఘ.3:38:52. దు.4:36ల 5:26వ. 11/05 రా.07:00 బ.నవమి సోమ ఘ.11:48, ఉ.గం.10:14. శతభిషం రా.గం.9:00. ఐంద్రం రా.గం.9:08. గరజి ఉ.గం.10:14. అహస్సు ఘ.31:54. వర్జ్యం రా.గం.3:26ల 5:03వ. అమృ ప.గం.1:37ల 3:15వ. భు.ఘ.3:47:22. ప.దు.12:22ల 1:13వ. పునః 2:55ల 3:46. చణ్డికాదేవీపూజ, హనుమజ్జయంతీ మధ్యాహ్న వ్యాప్తి ప్రధానం12/05 ప.12:00 బ.దశమి మంగళ ఘ.11:16, ప.గం.10:03. పూర్వాభాద్ర రా.గం.9:09. వైధృతి రా.గం.7:39. విష్టి ఉ.గం.10:03. అహస్సు ఘ.31:56. వర్జ్యం లేదు. అమృ ప.గం.1:06ల 2:43వ. భు.ఘ.3:55:52. ఉ.దు.8:06ల 8:57వ. రా.దు.10:49ల 11:40వ.13/05 ప.04:15 బ.ఏకాదశి బుధ ఘ.8:52, ఉ.గం.9:05. ఉత్తరాభాద్ర రా.గం.8:48. విష్కంభం సా.గం.5:45. బాలవ ఉ.గం.9:05. అహస్సు ఘ.31:58. వర్జ్యం ఉ.గం.6:36ల 8:11వ. అమృ సా.గం.4:04ల 5:39వ. భు.ఘ.4:4:22. మ.దు.11:31ల 12:22వ. 14/05 సా.06:00 బ.ద్వాదశి గురు ఘ.5:40, ఉ.గం.7:48. రేవతి రా.గం.8:05. ప్రీతి సా.గ.3:34. తైతుల ఉ.గం.7:48. అహస్సు ఘ.32:00. వర్జ్యం ఉ.గం.8:26ల 9:59వ. అమృ సా.గం.5:48ల 7:18వ. భు.ఘ.4:12:52. ఉ.దు.09:48ల 10:39వ. మ.దు.2:55ల 3:46వ.15/05 రా.09:00 బ.త్రయోదశి శుక్ర ఘ.1:32, ఉ.గం.6:09, చతుర్దశి ఘ.55:28, తె.గం.4:21. అశ్విని రా.గం.7:03. ఆయుష్మాన్ ప.గం.1:06. వనిక్ ఉ.గం.6:09. విష్టి సా.గం.5:15. అహస్సు ఘ.32:00. వర్జ్యం ప.గం.2:51ల 4:23వ. పునః తె.గం.4:06ల 5:36వ. అమృ ప.గం.12:09ల 1:41వ. భు.ఘ.4:21:22. పు.భు.4:23. ఉ.దు..9:05ల 8:56వ. మ.దు.12:21ల 1:12వ. కత్తి 2 వషభే రవిః ఉ.9:59 మాసశివరాత్రి, వృషభ సంక్రమణం16/05 ప.02:15 ∙బ.అమావాస్య శని ఘ.51:53, రా.గం.2:17. భరణి సా.గం.5:41. సౌభాగ్యం ప.గం.10:24. చతుష్పాత్ సా.గం.3:19. అహస్సు ఘ.32:02. వర్జ్యం రా.తె.గం.4:56ల 5:32వ. అమృ ప.గం.1:09ల 2:39వ. భు.ఘ.00:07:50. ఉ.దు.5:32ల 7:14వ. తర్పణాలకు అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం,17/05 సా.03:00 శుద్ధ పాడ్యమి ఆది ఘ.45:22, రా.గం.11:41. కృత్తిక సా.గం.4:10. శోభ ఉ.గం.7:30. అతిగండ తె.గం.4:31. కింస్తుఘ్నం ప.గం.12:59. అహస్సు ఘ.32:04. వర్జ్యం శేషం ఉ.గం.5:32ల 6:26వ. అమృ ప.గం.1:56ల 3:26వ. భు.ఘ.00:17:27. సా.దు.4:39ల 5:30వ. యాగకాలం18/05 రా.07:00 శు.విదియ సోమ ఘ.39:13, రా.గం.9:12. రోహిణి ప.గం.2:31. సుకర్మ రా.గం.1:25. బాలవ ప.గం.10:26. అహస్సు ఘ.32:6. వర్జ్యం ఉ.గం.7:04ల 8:34వ. పునః రా.7:45ల 9:14వ. అమృ ప.గం.11:33ల 1:02వ. పునరమ తె.గం.4:41ల 5:31వ. భు.ఘ.0:28:04. ప.దు.12:21ల 1:12వ. పునః ప.2:56ల 3:47వ. చంద్రదర్శనం 19/05 సా.05:15 శు.తదియ మంగళ ఘ.33:04, రా.గం.6:45. మృగశిర ప.12:51. ధృతి రా.గం.10:20. తైతుల ఉ.గం.7:58. అహస్సు ఘ.32:08. వర్జ్యం రా.గం.8:41ల 10:10వ. అమృ శేషం ఉ.గం.5:31ల 6:10వ. పునరమ రా.1:55ల 3:25వ. భు.ఘ.0:37:41. దు.8:04ల 8:55వ. రా.దు.10:49ల 11:44వ.20/05 సా.04:20 శు.చవితి బుధ ఘ.27:10, సా.గం.4:22. ఆర్ద్ర ప.గం.11:14. శూల రా.గం.7:21. భద్ర సా.గం.4:22. అహస్సు ఘ.32:10. వర్జ్యం రా.గం.10:30ల 12:00వ. భు.ఘ.0:47:18. మ.దు.11:31ల 12:22వ.21/05 రా.08:30 శు.పంచమి గురు ఘ.21:36, ప.గం.2:08. పునర్వసు ఉ.గం.9:45. గండ సా.గం.4:30. బాలవ ప.గం.2:08. అహస్సు ఘ.32:10. వర్జ్యం సా.గం.5:20ల 6:50వ. అమృ ఉ.గం.7:30ల 9:00వ. పునరమ రా.2:27ల 3:57వ. భు.ఘ.0:56:55. ఉ.దు.9:48ల 10:39వ. మ.దు.2:57ల 3:48వ.22/05 ఉ.07:15 శు.షష్ఠి శుక్ర ఘ.16:42, ప.గం.12:11. పుష్యమి ఉ.గం.8:31. వృద్ధి ప.గం.1:53. తైతుల ప.గం.12:11. అహస్సు ఘ.32:12. వర్జ్యం రా.గం.8:48ల 10:20వ. భు.ఘ.1:6:32. ఉ.దు.8:05ల 8:56వ. మ.దు.12:22ల 1:13వ.23/05 ప.11:15 శు.సప్తమి శని ఘ.12:28, ప.గం.10:29. ఆశ్లేష ఉ.గం.7:32. ధ్రువం ప.గం.11:18. వనిక్ ప.గం.10:29. అహస్సు ఘ.32:14. వర్జ్యం రా.గం.7:14ల 8:48వ. అమృ ఉ.గం.6:00ల 7:32వ. పునరమ తె.4:34ల 5:30వ. భు.ఘ.1:16:9. ఉ.దు.5:30ల 7:13వ.24/05 ప.11:15 శు.అష్టమి ఆది ఘ.9:09, ఉ.గం.9:10. మఘ ఉ.గం.6:55. వ్యాఘాతం ఉ.గం.9:42. బవ ప.గం.9:10. అహస్సు ఘ.32:14. వర్జ్యం ప.గం.2:51ల 4:26వ. అమృ శేషం ఉ.గం.5:30ల 6:08వ. పునరమ రా.గం.12:22ల 1:57వ. భు.ఘ.1:25:46. సా.దు.4:41ల 5:32వ. 25/05 ప.11:15 శు.నవమి సోమ ఘ.6:56, ఉ.గం.8:16. పుబ్బ ఉ.గం.6:44. హర్షణం ఉ.గం.7:38. కౌలవ ఉ.గం.8:16. అహస్సు ఘ.32:16. వర్జ్యం ప.గం.2:00ల 3:37వ. అమృ రా.గం.11:43ల 1:20వ. భు.ఘ.1:35:23. ప.దు.12:22ల 1:14వ. పునః 2:57ల 3:49వ.26/05 సా.06:00 శు.దశమి మంగళ ఘ.5:53, ఉ.గం.7:50. ఉత్తర ఉ.గం.6:59. వజ్రం ఉ.గం.5:36. సిద్ధం తె.గం.4:34. గరజి ఉ.గం.7:50. అహస్సు ఘ.32:18. వర్జ్యం ప.గం.10:37ల 12:16వ. అమృ రా.గం.1:31ల 3:10వ. భు.ఘ.1:45:00. ఉ.దు.8:04ల 8:56వ. రా.దు.10:50ల 11:42వ.27/05 ఉ.07:00 శు.ఏకాదశి బుధ ఘ.5:54, ఉ.గం.7:51. హస్త ఉ.గం.7:41. వ్యతీపాత తె.గం.4:31. భద్ర ఉ.గం.7:51. అహస్సు ఘ.32:18. వర్జ్యం సా.గం.4:08ల 5:49వ. అమృ రా.గం.2:13ల 3:54. భు.ఘ.1:54:37. మ.దు.11:31ల 12:43వ. 28/05 సా.06:00 శు.ద్వాదశి గురు ఘ.7:35, ఉ.గం.8:31. చిత్త ఉ.గం.9:02. వరీయాన్ తె.గం.4:29. బాలవ ఉ.గం.8:31. అహస్సు ఘ.32:20. వర్జ్యం ప.గం.3:02ల 4:45వ. అమృ రా.గం.1:20ల 3:03వ. భు.ఘ.2:4:14. ఉ.దు.9:48ల 10:40వ. మ.దు.2:59ల 3:51వ.29/05 ప.02:30 శు.త్రయోదశి శుక్ర ఘ.10:17, ఉ.గం.9:36. స్వాతి ఉ.గం.10:46. పరిఘ తె.గం.4:37. తైతుల ఉ.గం.9:36. అహస్సు ఘ.32:22. వర్జ్యం సా.గం.4:52ల 6:36. అమృ రా.గం.3:18ల 5:02. భు.ఘ.2:13:51. ఉ.దు.8:04ల 8:56వ. మ.దు.12:23ల 1:15వ.30/05 రా.08:00 శు.చతుర్దశి శని ఘ.14:02, ప.గం.11:06. విశాఖ ప.గం.12:55. శివం తె.గం.5:07. వనిక్ ప.గం.11:06. అహస్సు ఘ.32:22. వర్జ్యం సా.గం.5:19ల 7:05వ. అమృ తె.గం.3:53ల 5:28వ. భు.ఘ.2:23:28. ఉ.దు.5:29ల 7:13వ. 31/05 రా.06:15 ఝ శు.పౌర్ణమి ఆది ఘ.18:31, ప.గం.12:52. అనురాధ ప.గం.3:19. సిద్ధం పూర్తి. బవ ప.గం.12:52. అహస్సు ఘ.32:24. వర్జ్యం రా.గం.9:32ల 11:18వ. అమృ శేషం ఉ.గం.5:28ల 5:39వ. భు.ఘ.2:33:5. సా.దు.4:43ల 5:35వ.01/06 సా.07:00 బహుళ పాడ్యమి సోమ ఘ.23:31, ప.గం.2:52. జ్యేష్ఠ సా.గం.5:56. సిద్ధం ఉ.గం.5:45. కౌలవ ప.గం.2:52. అహస్సు ఘ.32:24. వర్జ్యం రా.గం.2:48ల 4:34. అమృ ఉ.గం.8:10ల 9:51. భు.ఘ.2:42:42. ప.దు.12:27ల 1:15వ. పునః 2:59ల 3:51వ. యాగకాలం02/06 సా.06:00 బ.విదియ మంగళ ఘ.28:39, సా.గం.4:56. మూల రా.గం.8:33. సాధ్యం ఉ.గం.6:24. గరజి సా.గం.4:56. అహస్సు ఘ.32:26. వర్జ్యం రా.గం.6:47ల 8:33వ. పునః రా.తె.3:08ల 4:54వ. అమృ ప.గం.1:27ల 3:13వ. భు.ఘ.2:52:19. ఉ.దు.8:04ల 8:56వ. రా.దు.10:51ల 11:43వ.03/06 సా.04:00 బ.తదియ బుధ ఘ.33:14, రా.గం.6:46. పూర్వాషాఢ రా.గం.10:59. శుభం ఉ.గం.7:00. వనిక్ ఉ.గం.5:50. అహస్సు ఘ.32:26. వర్జ్యం లేదు. అమృ ప.గం.11:42ల 1:28వ. భు.ఘ.3:1:56. మ.దు.11:32ల 12:24వ.04/06 సా.06:00 బ.చవితి గురు ఘ.37:08, రా.గం.8:19. ఉత్తరాషాఢ రా.గం.1:07. శుక్లం ఉ.గం.7:26. బాలవ ఉ.గం.7:32. అహస్సు ఘ.32:28. వర్జ్యం ఉ.గం.7:42ల 9:26వ. అమృ సా.గం.6:09ల 7:55వ. భు.ఘ.3:11:33. ఉ.దు.9:48ల 10:40వ. మ.దు.2:59ల 3:51వ. సంకటహర చతుర్థి05/06 సా.05:30 బ.పంచమి శుక్ర ఘ.40:01, రా.గం.9:28. శ్రవణం రా.గం.2:51. బ్రహ్మం ఉ.గం.7:34. కౌలవ ఉ.గం.8:54. అహస్సు ఘ.32:28. వర్జ్యం ఉ.గం.5:24ల 7:07వ. అమృ ప.గం.3:42ల 5:25వ. భు.ఘ.3:21:10. ఉ.దు.8:04ల 8:56వ. మ.దు.12:24ల 1:16వ.06/06 సా.06:00 బ.షష్ఠి శని ఘ.41:46, రా.గం.10:10. ధనిష్ఠ రా.తె.గం.4:09. ఐంద్రం ఉ.గం.7:22. గరజి ఉ.గం.9:49. అహస్సు ఘ.32:30. వర్జ్యం ఉ.గం.7:04ల 8:45వ. అమృ సా.గం.5:11ల 6:52వ. భు.ఘ.3:30:47. ఉ.దు.5:28ల 7:12వ.07/06 సా.06:00 బ.సప్తమి ఆది ఘ.42:06, రా.గం.10:18. శతభిషం రా.తె.గం.4:51. వైధృతి ఉ.గం.6:48. విష్టి ఉ.గం.10:14. అహస్సు ఘ.32:30. వర్జ్యం ప.గం.11:34ల 1:12వ. అమృ రా.గం.9:26ల 11:05వ. భు.ఘ.3:40:24. సా.దు.4:44ల 5:36వ.08/06 సా.06:00 బ.అష్టమి సోమ ఘ.41:17, రా.గం.9:59. పూర్వాభాద్ర తె.గం.5:08. విష్కంభం ఉ.గం.5:48. ప్రీతి తె.గం.4:41. బాలవ ఉ.గం.10:09. అహస్సు ఘ.32:30. వర్జ్యం ప.గం.11:08ల 12:45వ. అమృ రా.గం.9:02ల 10:39వ. భు.ఘ.3:50:1. ప.దు.12:24ల 1:16వ. పునః 3:01ల 3:53వ.09/06 సా.05:00 బ.నవమి మంగళ ఘ.39:8, రా.గం.9:07. ఉత్తరాభాద్ర తె.గం.4:51. ఆయుష్మాన్ రా.గం.2:41. తైతుల ఉ.గం.9:33. అహస్సు ఘ.32:32. వర్జ్యం ప.గం.2:37ల 4:12వ. అమృ రా.గం.12:06ల 1:41వ. భు.ఘ.3:59:38. ఉ.దు.8:04ల 8:56వ. రా.దు.10:53ల 11:45వ.10/06 సా.07:00 బ.దశమి బుధ ఘ.36:00, రా.గం.7:52. రేవతి తె.గం.4:14. సౌభాగ్యం రా.గం.12:34. వనిక్ ఉ.గం.8:30. అహస్సు ఘ.32:32. వర్జ్యం సా.గం.4:33ల 6:07వ. అమృ రా.గం.1:53ల 3:28వ. భు.ఘ.4:9:15. మ.దు.11:33ల 12:25వ.11/06 రా.06:00 బ.ఏకాదశి గురు ఘ.31:51, సా.గం.6:12. అశ్విని రా.తె.గం.3:12. శోభ రా.గం.10:06. బాలవ సా.గం.6:12. అహస్సు ఘ.32:34. వర్జ్యం రా.గం.11:22ల 12:54వ. అమృ రా.గం.8:18ల 10:50వ. భు.ఘ.4:18:52. ఋ ఉ.దు.9:49ల 10:41వ. మ.దు.3:01ల 3:53వ. మతత్రయ (పురుషోత్తమ) ఏకాదశి12/06 సా.05:40 బ.ద్వాదశి శుక్ర ఘ.26:59, ప.గం.4:16. భరణి రా.గం.1:56. అతిగండ రా.గం.7:28. తైతుల ప.గం.4:16. అహస్సు ఘ.32:34. వర్జ్యం ప.గం.12:09ల 1:39వ. అమృ రా.గం.9:07ల 10:36వ. భు.ఘ.4:28:29. ఉ.దు.8:04ల 8:56వ. మ.దు.12:25ల 1:17వ.13/06 సా.06:00 బ.త్రయోదశి శని ఘ.21:29, ప.గం.2:04. కృత్తిక రా.గం.12:24. సుకర్మ సా.గం.4:36. వనిక్ ప.గం.2:04. అహస్సు ఘ.32:34. వర్జ్యం ప.గం.1:10ల 2:39వ. అమృ రా.గం.10:10ల 11:40వ. భు.ఘ.4:38:6. ఉ.దు.5:28ల 7:12వ. మాసశివరాత్రి14/06 సా.06:00 బ.చతుర్దశి ఆది ఘ.15:42, ప.గం.11:46. రోహిణి ప.గం.10:49. ధృతి ప.గం.1:39. శుభం ప.గం.11:46. అహస్సు ఘ.32:34. వర్జ్యం సా.గం.3:21ల 4:50వ. పునః తె.4:01ల 5:30వ. అమృ రా.గం.7:50ల 9:19వ. భు.ఘ.4:47:43. సా.దు.4:46ల 5:38వ. తర్పణాలకు అమావాస్య15/06 ప.11:00 ∙బ.అమావాస్య సోమ ఘ.9:30, ఉ.గం.9:17. మృగశిర రా.9:09. శూల ఉ.గం.10:37. నాగవం ఉ.గం.9:17. అహస్సు ఘ.32:36. వర్జ్యం తె.గం.4:58ల 5:29వ. అమృ ప.గం.12:57ల 2:26వ. భు.ఘ.4:57:20. పు.భు.5:02. ప.దు.12:26ల 1:18వ. పునః 3:03ల 3:55వ. మృగ 3 రవిః రా.8:00 ప్రవేశాత్ పూర్వతః మిథున సంక్రమణం ప.దు.12:27ల 1:19వ. పునః ప.3:04ల 3:56వ. శుక్లాదేవీపూజ23/06 సా.05:00 శు.నవమి మంగళ ఘ.35:10, రా.గం.7:34. హస్త సా.గం.3:27. వరీయాన్ ప.గం.2:10. బాలవ ఉ.గం.7:35. అహస్సు ఘ.32:38. వర్జ్యం రా.గం.11:50ల 1:31వ. అమృ ఉ.గం.9:18ల 10:56వ. భు.ఘ.1:17:20. ఉ.దు.8:07ల 8:59వ. రా.దు.10:56ల 11:48వ. బ్రాహ్మణీదేవీపూజ24/06 సా.05:00 శు.దశమి బుధ ఘ.36:41, రా.గం.8:10. చిత్త సా.గం.4:37. పరిఘ ప.గం.1:33. తైతుల ఉ.గం.7:52. అహస్సు ఘ.32:38. వర్జ్యం రా.గం.10:36ల 12:18వ. అమృ ఉ.గం.9:54ల 11:35వ. భు.ఘ.1:27:46. మ.దు.11:35ల 12:27వ.25/06 సా.06:00 శు.ఏకాదశి గురు ఘ.39:17, రా.గం.9:14. స్వాతి సా.గం.6:15. శివం ప.గం.1:19. వనిక్ ఉ.గం.8:43. అహస్సు ఘ.32:38. వర్జ్యం రా.గం.12:19ల 2:03వ. అమృ ఉ.గం.8:51ల 10:33వ. భు.ఘ.1:38:12. ఉ.దు.9:52ల 10:44వ. మ.దు.3:05ల 3:57వ. మతత్రయ (నిర్జల) ఏకాదశి26/06 రా.09:00 శు.ద్వాదశి శుక్ర ఘ.42:46, రా.గం.10:38. విశాఖ రా.గం.8:18. సిద్ధం ప.గం.1:27. బవ ఉ.గం.9:57. అహస్సు ఘ.32:36. వర్జ్యం రా.గం.12:42ల 2:28వ. అమృ ఉ.గం.10:45ల 12:28వ. భు.ఘ.1:48:38. ఉ.దు.8:09ల 9:01వ. మ.దు.12:29ల 1:21వ. రామలక్ష్మణద్వాదశీ27/06 ప.02:00 శు.త్రయోదశి శని ఘ.47:17, రా.గం.12:27. అనురాధ రా.గం.10:42. సాధ్యం ప.గం.1:50. కౌలవ ప.గం.11:33. అహస్సు ఘ.32:36. వర్జ్యం తె.గం.4:37ల 5:32వ. అమృ ప.గం.12:15ల 2:01వ. భు.ఘ.1:59:4. ఉ.దు.5:32ల 7:16వ.28/06 ప.02:00 శు.చతుర్దశి ఆది ఘ.52:18, రా.గం.2:27. జ్యేష్ఠ రా.గం.1:17. శుభం ప.గం.2:26. గరజి ప.గం.1:27. అహస్సు ఘ.32:36. వర్జ్యం శేషం గం.5:32ల 6:19వ. అమృ ప.గం.2:46ల 4:28వ. భు.ఘ.2:9:30. సా.దు.4:49ల 5:41వ.29/06 ప.11:00 ఝ శు.పౌర్ణమి సోమ ఘ.57:23, రా.గం.4:29. మూల రా.గం.3:56. శుక్లం ప.గం.3:07. విష్టి సా.గం.3:28. అహస్సు ఘ.32:36. వర్జ్యం ఉ.గం.10:10ల 11:56వ. పునః రా.తె.2:10ల 3:56వ. అమృ రా.గం.8:50ల 10:36వ. భు.ఘ.2:19:56. ప.దు.12:29ల 1:21వ. పునః 3:06ల 3:58వ. 30/06 ప.12:00 బహుళ పాడ్యమి మంగళ పూర్తి. పూర్వాషాఢ పూర్తి. బ్రహ్మం ప.గం.3:46. బాలవ సా.గం.5:23. అహస్సు ఘ.32:36. వర్జ్యం ప.గం.2:31ల 4:17వ. అమృ రా.గం.1:05ల 2:51వ. భు.ఘ.2:30:22. ఉ.దు.8:09ల 9:01వ. రా.దు.10:57ల 11:49వ.01/07 ఉ.09:00 బ.పాడ్యమి బుధ ఘ.1:54, ఉ.గం.6:18. పూర్వాషాఢ ఉ.గం.6:22. ఐంద్రం ప.గం.4:14. కౌలవ ఉ.గం.6:18. అహస్సు ఘ.32:36. వర్జ్యం ప.గం.3:08ల 4:53వ. అమృ రా.గం.1:39ల 3:25వ. భు.ఘ.2:40:48. మ.దు.11:37ల 12:29వ.02/07 ఉ.10:45 బ.విదియ గురు ఘ.5:51, ఉ.గం.7:52. ఉత్తరాషాఢ ఉ.గం.8:39. వైధృతి ప.గం.4:26. గరజి ఉ.గం.7:52. అహస్సు ఘ.32:34. వర్జ్యం ప.గం.12:56ల 2:39వ. అమృ రా.గం.11:14ల 12:57వ. భు.ఘ.2:51:14. ఉ.దు.9:54ల 10:46వ. మ.దు.3:06ల 3:58వ.03/07 ప.02:00 బ.తదియ శుక్ర ఘ.8:44, ఉ.గం.9:02. శ్రవణం ప.గం.10:22. విష్కంభం ప.గం.4:18. భద్ర ఉ.గం.9:02. అహస్సు ఘ.32:34. వర్జ్యం ప.గం.2:36ల 4:17వ. అమృ రా.గం.12:44ల 2:25వ. భు.ఘ.3:1:40. ఉ.దు.8:09ల 9:01వ. మ.దు.12:30ల 1:22వ. సంకటహర చతుర్థి04/07 ప.02:00 బ.చవితి శని ఘ.10:30, ఉ.గం.9:45. ధనిష్ఠ ప.గం.11:45. ప్రీతి ప.గం.3:48. బాలవ ఉ.గం.9:45. అహస్సు ఘ.32:34. వర్జ్యం రా.గం.7:12ల 8:51వ. అమృ తె.గం.5:08ల 5:33వ. భు.ఘ.3:12:6. ఉ.దు.5:38ల 7:11వ. 05/07 ప.11:00 బ.పంచమి ఆది ఘ.10:55, ఉ.గం.9:55. శతభిషం ప.గం.12:35. ఆయుష్మాన్ ప.గం.2:53. తైతుల ఉ.గం.9:55. అహస్సు ఘ.32:34. వర్జ్యం సా.గం.7:05ల 8:42వ. అమృ ఉ.గం.5:33ల 6:47వ. పునరమ తె.గం.4:49ల 5:33వ. భు.ఘ.3:22:32. సా.దు.4:50ల 5:42వ.06/07 సా.06:00 బ.షష్ఠి సోమ ఘ.10:08, ఉ.గం.9:37. పూర్వాభాద్ర ప.గం.12:57. సౌభాగ్యం ప.గం.1:27. వనిక్ ఉ.గం.9:37. అహస్సు ఘ.32:32. వర్జ్యం రా.గం.10:29ల 12:04వ. అమృ ఉ.గం.5:33ల 6:26వ. భు.ఘ.3:32:58. ప.దు.12:30ల 1:22వ. పునః 3:07ల 3:59వ.07/07 సా.05:00 బ.సప్తమి మంగళ ఘ.7:59, ఉ.గం.8:46. ఉత్తరాభాద్ర ప.గం.12:46. శోభ ప.గం.11:50. బవ ఉ.గం.8:46. అహస్సు ఘ.32:32. వర్జ్యం రా.గం.12:31ల 2:05వ. అమృ ఉ.గం.8:01ల 9:36వ. భు.ఘ.3:43:24. ఉ.దు.8:10ల 9:02వ. రా.దు.10:59ల 11:51వ. 08/07 సా.04:00 బ.అష్టమి బుధ ఘ.5:03, ఉ.గం.7:35. రేవతి ప.గం.12:16. అతిగండ ప.గం.9:50. కౌలవ ఉ.గం.7:35. అహస్సు ఘ.32:32. వర్జ్యం లేదు. అమృ ఉ.గం.9:55ల 11:29. పునః తె.గం.4:26ల 5:39వ. భు.ఘ.3:53:50. మ.దు.11:38ల 12:30వ.09/07 సా.06:00 బ.నవమి గురు ఘ.1:00, ఉ.గం.5:59. బ.దశమి ఘ.55:17, తె.గం.4:06. అశ్విని ప.గం.11:23. సుకర్మ ఉ.గం.7:30. ధృతి తె.గం.4:58. గరజి ఉ.గం.5:59. వనిక్ సా.గం.5:02. అహస్సు ఘ.32:30. వర్జ్యం ఉ.గం.7:32ల 9:04వ. పునః రా.8:29ల 10:00వ. అమృ శేషం ఉ.గం.5:35ల 5:58వ. భు.ఘ.4:4:16. ఉ.దు.9:55ల 10:47వ. మ.దు.3:07ల 3:59వ.10/07 ఉ.07:30 బ.ఏకాదశి శుక్ర ఘ.50:38, రా.గం.1:50. భరణి ప.గం.10:10. శూల రా.గం.2:06. బవ ప.గం.2:58. అహస్సు 32:30. వర్జ్యం రా.గం.9:26ల 10:56వ. అమృ ఉ.గం.5:36ల 7:06వ. భు.ఘ.4:14:42. ఉ.దు.8:11ల 9:03వ. మ.దు.12:31ల 1:23వ. మతత్రయ యోగినీ ఏకాదశి11/07 సా.06:00 బ.ద్వాదశి శని ఘ.44:45, రా.గం.11:30. కృత్తిక ఉ.గం.8:44. గండ రా.గం.11:08. బాలవ ప.గం.12:40. అహస్సు ఘ.32:28. వర్జ్యం రా.గం.11:42ల 1:12వ. అమృ ఉ.గం.6:24ల 7:54వ. పునరమ తె.4:14ల 5:36వ. భు.ఘ.4:25:8. సా.దు.5:36ల 7:20వ. కూర్మజయంతీ12/07 సా.06:00 బ.త్రయోదశి ఆది ఘ.38:32, రా.గం.9:01. రోహిణి ఉ.గం.7:12. మృగశిర తె.5:32. వృద్ధి రా.గం.8:06. గరజి ఉ.గం.10:15. అహస్సు ఘ.32:28. వర్జ్యం ప.గం.12:24ల 1:53వ. అమృ శేషం ఉ.గం.5:36ల 5:44వ. పునరమ రా.గం.9:20ల 10:49వ. భు.ఘ.4:35:44. సా.దు.4:50ల 5:32వ. మాసశివరాత్రి నిశీధి వారికి13/07 ఉ.07:00 బ.చతుర్దశి సోమ ఘ.32:20, సా.గం.6:32. ఆర్ద్ర రా.తె.గం.3:47. ధవం సా.గం.5:02. శకుని ఉ.గం.7:46. అహస్సు ఘ.32:28. వర్జ్యం ప.గం.1:19ల 2:48వ. అమృ సా.గం.6:31ల 8:01వ. భు.ఘ.4:46:10. ప.దు.12:31ల 1:23వ. పునః 3:07ల 3:59వ. మాసశివరాత్రి ప్రదోషం వారికి14/07 ఉ.10:00 ∙బ.అమావాస్య మంగళ ఘ.25:39, ప.గం.3:52. పునర్వసు రా.గం.2:14. వ్యాఘాతం ప.గం.2:02. నాగవం ప.గం.3:52. అహస్సు ఘ.32:26. వర్జ్యం ప.గం.3:00ల 4:30వ. అమృ రా.గం.11:59ల 1:29వ. భు.ఘ.4:56:36. ఉ.దు.8:12ల 9:04వ. రా.దు.10:59ల 11:51వ. వటసావిత్రీవ్రతం, తర్పణాలకు అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, 17/07 నుండి దక్షిణాయనం గ్రీష్మఋతువు, ఆషాఢ మాసం15/07 ఉ.07:00 శుద్ధ పాడ్యమి బుధ ఘ.20:39, ప.గం.1:52. పుష్యమి రా.గం.12:50. హర్షణం ప.గం.11:09. బవ ప.గం.1:52. అహస్సు ఘ.32:26. వర్జ్యం ప.గం.9:46ల 11:16. అమృ రా.గం.6:48ల 8:18వ. భు.ఘ.5:7:2. మ.దు.11:39ల 12:31వ.16/07 ఉ.06:00 శు.విదియ గురు ఘ.15:33, ప.గం.11:49. ఆశ్లేష రా.గం.11:42. వజ్రం ఉ.గం.8:26. కౌలవ ప.గం.11:49. అహస్సు ఘ.32:24. వర్జ్యం ప.గం.1:02ల 2:34వ. అమృ రా.గం.10:11ల 11:43వ. భు.ఘ.5:17:28. ఉ.దు.9:55ల 10:47వ. మ.దు.3:06ల 3:58వ. రథోత్సవం17/07 ప.03:00 శు.తదియ శుక్ర ఘ.11:09, ఉ.గం.10:05. మఘ రా.గం.10:57. సిద్ధి ఉ.గం.5:57. వ్యతీపాత తె.గం.3:40. గరజి ఉ.గం.10:05. అహస్సు ఘ.32:22. వర్జ్యం ప.గం.11:20ల 12:53వ. అమృ రా.గం.8:38ల 10:11వ. భు.ఘ.5:27:54. పు.భు.5:30. ఉ.దు.8:12ల 9:04వ. మ.దు.12:31ల 1:23వ. పున 4 రవిః ప.11:53. ప్రవేశాత్ పూర్వతః దక్షిణాయన పుణ్యకాల. కర్కాటక సంక్రమణం18/07 సా.06:00 శు.చవితి శని ఘ.7:39, ఉ.గం.8:41. పుబ్బ రా.గం.10:31. వరీయాన్ రా.గం.1:45. భద్ర ఉ.గం.8:41. అహస్సు ఘ.32:22. వర్జ్యం ఉ.గం.6:49ల 8:23వ. అమృ సా.గం.4:14ల 5:48వ. భు.ఘ.00:7:51. ఉ.దు.5:38ల 7:22వ.19/07 సా.06:00 శు.పంచమి ఆది ఘ.5:12, ఉ.గం.7:43. ఉత్తర రా.గం.10:38. పరిఘ రా.గం.12:19. బాలవ ఉ.గం.7:43. అహస్సు ఘ.32:20. వర్జ్యం ఉ.గం.5:46ల 7:22వ. అమృ సా.గం.3:24ల 5:00వ. భు.ఘ.00:18:22. సా.దు.4:51ల 5:43వ. 20/07 ప.11:10 శు.షష్ఠి సోమ ఘ.3:55, ఉ.గం.7:13. హస్త రా.గం.11:08. శివం రా.గం.11:11. తైతుల ఉ.గం.7:13. అహస్సు ఘ.32:18. వర్జ్యం ఉ.గం.7:13ల 8:51వ. అమృ సా.గం.5:01ల 6:39వ. భు.ఘ.00:28:53. ప.దు.12:32ల 1:24వ. పునః ప.2:59ల 3:51వ. కుమారషష్ఠీ21/07 ప.12:10 శు.సప్తమి మంగళ ఘ.3:49, ఉ.గం.7:11. చిత్త రా.గం.12:11. సిద్ధం రా.గం.10:32. వనిక్ ఉ.గం.7:11. అహస్సు ఘ.32:18. వర్జ్యం ఉ.గం.7:29ల 9:09వ. అమృ సా.గం.5:29ల 7:09వ. భు.ఘ.00:39:24. ఉ.దు.8:14ల 9:06. రా.దు.10:59ల 11:51వ. వివస్వత్సప్తమీ22/07 సా.04:15 శు.అష్టమి బుధ ఘ.5:10, ఉ.గం.7:43. స్వాతి రా.గం.1:42. సాధ్యం రా.గం.10:12. బవ ఉ.గం.7:43. అహస్సు ఘ.32:16. వర్జ్యం ఉ.గం.6:09ల 7:51వ. అమృ సా.గం.5:09ల 6:51వ. భు.ఘ.00:49:55. మ.దు.11:40ల 12:32వ. 23/07 సా.05:00 శు.నవమి గురు ఘ.7:36, ఉ.గం.8:41. విశాఖ రా.తె.గం.3:41. శుభం రా.గం.10:16. కౌలవ ఉ.గం.8:41. అహస్సు ఘ.32:16. వర్జ్యం ఉ.గం.7:41ల 9:25వ. అమృ సా.గం.6:09ల 7:53వ. భు.ఘ.1:00:26. ఉ.దు.9:47ల 10:38వ. మ.దు.3:06ల 3:57వ. ఐంద్రీపూజ, చాక్షుషమన్వాది24/07 ఉ.07:30 శు.దశమి శుక్ర ఘ.11:34, ప.గం.10:17, అనురాధ పూర్తి. శుక్లం రా.గం.10:36. గరజి ప.గం.10:17. అహస్సు ఘ.32:14. వర్జ్యం ఉ.గం.8:04ల 9:50వ. అమృ రా.గం.7:37ల 9:23వ. భు.ఘ.1:10:57. ఉ.దు.8:15ల 9:07వ. మ.దు.12:32ల 1:24వ. మహాలకీ‡్ష్మవ్రతారంభం25/07 ప.10:30 శు.ఏకాదశి శని ఘ.15:36, ప.గం.11:54. అనురాధ ఉ.గం.6:03. బ్రహ్మం రా.గం.11:23. భద్ర ప.గం.11:54. అహస్సు ఘ.32:12. వర్జ్యం ప.గం.12:14ల 2:00వ. అమృ రా.గం.10:51ల 12:37వ. భు.ఘ.1:21:28. ఉ.దు.5:40ల 7:32వ. తొలిఏకాదశీ, మతత్రయ శయన ఏకాదశి, గోపద్మవ్రతారంభ26/07 ప.02:00 శు.ద్వాదశి ఆది ఘ.20:06, ప.గం.1:42. జ్యేష్ఠ ఉ.గం.8:35. ఐంద్రం రా.గం.11:51. బాలవ ప.గం.1:42. అహస్సు ఘ.32:10. వర్జ్యం సా.గం.5:28ల 7:14వ. అమృ రా.తె.గం.4:03ల 5:49వ. భు.ఘ.1:31:59. సా.దు.4:49ల 5:41వ. 27/07 సా.07:00 శు.త్రయోదశి సోమ ఘ.25:30, సా.గం.3:52. మూల ప.గం.11:13. వైధృతి రా.గం.12:30. తైతుల సా.గం.3:52. అహస్సు ఘ.32:10. వర్జ్యం ప.గం.9:27ల 11:13వ. పునః రా.గం.9:49ల 11:35వ. భు.ఘ.1:42:30. ప.దు.12:31ల 1:22వ. పునః3:06ల 3:57వ.28/07 సా.07:00 శు.చతుర్దశి మంగళ ఘ.30:13, సా.గం.5:45. పూర్వాషాఢ ప.గం.1:48. విష్కంభం రా.గం.1:01. వనిక్ సా.గం.5:45. అహస్సు ఘ.32:08. వర్జ్యం రా.గం.10:30ల 12:15వ. అమృ ప.గం.10:02ల 11:48వ. భు.ఘ.1:53:1. ఉ.దు.8:15ల 9:06వ. రా.దు.10:59ల 11:50వ. పవిత్రార్చనం, నోములకు పౌర్ణమి29/07 రా.07:00 ఝ శు.పౌర్ణమి బుధ ఘ.34:13, రా.గం.7:22. ఉత్తరాషాఢ సా.గం.4:01. ప్రీతి రా.గం.1:18. విష్టి ఉ.గం.6:33. అహస్సు ఘ.32:6. వర్జ్యం రా.గం.8:21ల 10:05వ. అమృ ఉ.గం.9:01ల 10:46వ. భు.ఘ.2:3:32. మ.దు.11:40ల 12:31వ. 30/07 రా.08:00 బహుళ పాడ్యమి గురు ఘ.37:18, రా.గం.8:36. శ్రవణం సా.గం.5:56. ఆయుష్మాన్ రా.గం.1:15. బాలవ ఉ.గం.7:59. అహస్సు ఘ.32:4. వర్జ్యం రా.గం.10:11ల 11:53. అమృ ఉ.గం.6:43ల 8:27వ. భు.ఘ.2:14:3. ఉ.దు.9:58ల 10:41వ. మ.దు.3:06ల 3:57వ.31/07 ఉ.07:30 బ.విదియ శుక్ర ఘ.39:05, రా.గం.9:20. ధనిష్ఠ రా.గం.7:24. సౌభాగ్యం రా.గం.1:48. తైతుల ఉ.గం.8:58. అహస్సు ఘ.32:02. వర్జ్యం రా.తె.గం.2:54ల 4:34వ. అమృ ఉ.గం.8:22ల 10:04వ. భు.ఘ.2:24:34. ఉ.దు.8:16ల 9:07వ. మ.దు.12:32ల 1:23వ. చాతుర్మాస్యద్వితీయ01/08 సా.06:00 బ.తదియ శని ఘ.39:44, రా.గం.9:36. శతభిషం రా.గం.8:23. శోభ రా.గం.11:59. వనిక్ ఉ.గం.9:28. అహస్సు ఘ.32:02. వర్జ్యం రా.గం.2:06ల 3:44వ. అమృ ప.గం.12:53ల 2:33వ. భు.ఘ.2:35:5. ఉ.దు.5:42ల 7:24వ.02/08 సా.06:00 బ.చవితి ఆది ఘ.38:55, రా.గం.9:16. పూర్వాభాద్ర రా.గం.8:48. అతిగండ రా.గం.11:40. బవ ఉ.గం.2:06. అహస్సు ఘ.32:00. వర్జ్యం లేదు. అమృ ప.గం.11:52ల 1:30వ. భు.ఘ.2:45:36. సా.దు.4:48ల 5:39వ. సంకటహర చతుర్థి03/08 ప.11:00 బ.పంచమి సోమ ఘ.37:2, రా.గం.8:29. ఉత్తరాభాద్ర రా.గం.8:48. సుకర్మ రా.గం.9:02. కౌలవ ఉ.గం.8:54. అహస్సు ఘ.31:58. వర్జ్యం ఉ.గం.6:24ల 8:00వ. అమృ సా.గం.4:00ల 5:36వ. భు.ఘ.2:56:7. ప.దు.12:31ల 1:22వ. పునః 3:04ల 3:55వ.04/08 ఉ.10:15 బ.షష్ఠి మంగళ ఘ.33:58, రా.గం.7:17. రేవతి రా.గం.8:19. ధృతి రా.గం.7:01. గరజి ఉ.గం.7:54. అహస్సు ఘ.31:56. వర్జ్యం ఉ.గం.8:33ల 10:07వ. అమృ సా.గం.5:58ల 7:32వ. భు.ఘ.3:6:38. ఉ.దు.8:16ల 9:07వ. రా.దు.10:58ల 11:49వ.05/08 ఉ.09:00 బ.సప్తమి బుధ ఘ.30:00, సా.గం.5:42. అశ్విని రా.గం.7:29. శూల ప.గం.5:00. బవ సా.గం.5:42. అహస్సు ఘ.31:54. వర్జ్యం ప.గం.3:37ల 5:10వ. పునః తె.4:36ల 6:07వ. అమృ ప.గం.12:32ల 2:05వ. భు.ఘ.3:17:9. మ.దు.11:40ల 12:31వ.06/08 ఉ.10:45 బ.అష్టమి గురు ఘ.25:11, సా.గం.3:47. భరణి సా.గం.6:19. గండ ప.గం.2:08. కౌలవ సా.గం.3:47. అహస్సు ఘ.31:52. వర్జ్యం తె.గం.5:33ల 5:43వ. అమృ ప.గం.1:45ల 3:16వ. భు.ఘ.3:27:40. ఉ.దు.9:58ల 10:49వ. మ.దు.3:03ల 3:54వ. ధర్మసావర్ణిమన్వాది07/08 రా.08:40 బ.నవమి శుక్ర ఘ.19:47, ప.గం.1:38. కృత్తిక సా.గం.4:47. వృద్ధి ప.గం.11:20. గరజి ప.గం.1:38. అహస్సు ఘ.31:50. వర్జ్యం శేషం ఉ.గం.5:43ల 7:03వ. అమృ ప.గం.2:33ల 4:03వ. భు.ఘ.3:38:11. ఉ.దు.8:16ల 9:07వ. మ.దు.12:30ల 1:21వ.08/08 ప.02:00 బ.దశమి శని ఘ.14:04, ప.గం.11:22. రోహిణి సా.గం.3:21. ధ్రువం ఉ.గం.8:25. వ్యాఘాతం తె.గం.5:19. విష్టి ప.గం.11:22. అహస్సు ఘ.31:48. వర్జ్యం ఉ.గం.7:50ల 9:20వ. పునః రా.8:34ల 10:04వ. అమృ ప.గం.12:21ల 1:51వ. పునరమ తె.5:30ల 5:44వ. భు.ఘ.3:48:42. ఉ.దు.5:44ల 7:26వ.09/08 ప.03:00 బ.ఏకాదశి ఆది ఘ.7:37, ఉ.గం.8:47. మృగశిర ప.గం.1:41. హర్షణం రా.గం.2:20. బాలవ ఉ.గం.8:47. అహస్సు ఘ.31:46. వర్జ్యం రా.గం.9:30ల 11:00వ. అమృ శేషం ఉ.గం.5:44ల 6:59వ. పునరమ రా.2:43ల 4:12వ. భు.ఘ.3:59:13. సా.దు.4:44ల 5:35వ. మతత్రయ కామిక ఏకాదశి10/08 సా.06:00 బ.ద్వాదశి సోమ ఘ.1:36, ఉ.గం.6:22. త్రయోదశి ఘ.53:55. తె.గం.3:56. ఆర్ద్ర ప.గం.12:01. వజ్రం రా.గం.11:15. తైతుల ఉ.గం.6:22. గరజి సా.గం.5:09. అహస్సు ఘ.31:44. వర్జ్యం రా.గం.11:04ల12:34వ. భు.ఘ.4:9:44. ప.దు.12:31ల 1:21వ. పునః 3:02ల 3:52వ.11/08 ఉ.10:30 బ.చతుర్దశి మంగళ ఘ.49:45, రా.గం.1:39. పునర్వసు ప.గం.10:28. సిద్ధి రా.గం.8:19. విష్టి ప.గం.2:48. అహస్సు ఘ.31:42. వర్జ్యం సా.గం.5:59ల 7:29వ. అమృ ఉ.గం.8:13ల 9:43వ. పునరమ రా.తె.3:00ల 4:30వ. భు.ఘ.4:20:15. ఉ.దు.8:17ల 9:07వ. రా.దు.10:57ల 11:47వ. మాసశివరాత్రి12/08 ఉ.09:30 ∙బ.అమావాస్య బుధ ఘ.44:39, రా.గం.11:37. పుష్యమి ఉ.గం.9:01. వ్యతీపాత సా.గం.5:34. చతుష్పాత్ ప.గం.12:38. అహస్సు ఘ.31:40. వర్జ్యం రా.గం.9:12ల 10:43వ. భు.ఘ.4:30:46. మ.దు.11:40ల 12:30వ.స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షఋతువు, శ్రావణమాసం13/08 ఉ.11:15 శుద్ధ పాడ్యమి గురు ఘ.40:15, రా.గం.9:51. ఆశ్లేష ఉ.గం.7:51. వరీయాన్ ప.గం.3:01. కింస్తుఘ్నం ప.గం.10:44. అహస్సు ఘ.31:38. వర్జ్యం రా.గం.7:24ల 8:56వ. అమృ ఉ.గం.6:20ల 7:51వ. పునరమ తె.4:38ల 5:46వ. భు.ఘ.4:41:17. ఉ.దు.9:59ల 10:49వ. మ.దు.3:02ల 3:52వ. యాగకాలం14/08 ప.02:00 శు.విదియ శుక్ర ఘ.36:45, రా.గం.8:28. మఘ ఉ.గం.6:58. పరిఘ ప.గం.12:45. బాలవ ఉ.గం.9:10. అహస్సు ఘ.31:36. వర్జ్యం ప.గం.2:48ల 4:22వ. అమృ శేషం ఉ.గం.5:46ల 6:10వ. పునరమ రా.12:16ల 1:50వ. భు.ఘ.4:51:48. ఉ.దు.8:17ల 9:07వ. మ.దు.12:30ల 1:20వ. చంద్రదర్శనం (నెలపొడుపు)15/08 సా.06:00 శు.తదియ శని ఘ.34:25, రా.గం.7:32. పుబ్బ ఉ.గం.6:33. శివం ఉ.గం.10:51. తైతుల ఉ.గం.8:00. అహస్సు ఘ.31:34. వర్జ్యం ప.గం.1:43ల 3:19వ. అమృ రా.గం.11:16ల 12:52వ. భు.ఘ.5:2:19. ఉ.దు.5:46ల 7:27వ. 16/08 సా.06:30 శు.చవితి ఆది ఘ.32:54, రా.గం.6:56. ఉత్తర ఉ.గం.6:26. సిద్ధి ఉ.గం.9:11. వనిక్ ఉ.గం.7:14. అహస్సు ఘ.31:32. వర్జ్యం ప.గం.2:50ల 4:26వ. అమృ రా.గం.12:26ల 2:02వ. భు.ఘ.5:12:50. సా.దు.4:42ల 5:32వ. 17/08 సా.07:00 శు.పంచమి సోమ ఘ.32:53, రా.గం.6:55. హస్త ఉ.గం.6:50. సాధ్యం ఉ.గం.7:58. బవ ఉ.గం.6:55. అహస్సు ఘ.31:30. వర్జ్యం సా.గం.3:09ల 4:49వ. అమృ రా.గం.1:07ల 2:47వ. భు.ఘ.5:23:11. పు.భు.5:31. ప.దు.12:29ల 1:19వ. పునః ప.3:00ల 3:50వ. మఘ 1 రవిః రా.11:08 ప్రవేశదినే సింహ సంక్రమణం18/08 సా.05:00 శు.షష్ఠి మంగళ ఘ.34:2, రా.గం.7:23. చిత్త ఉ.గం.7:46. శుభం ఉ.గం.6:45. కౌలవ ఉ.గం.7:09. అహస్సు ఘ.31:28. వర్జ్యం ప.గం.1:41ల 3:23వ. అమృ రా.గం.11:51ల 1:33వ. భు.ఘ.00:02:50. ఉ.దు.8:18ల 9:08వ. రా.దు.10:55ల 11:45వ. సూర్యపూజ 19/08 రా.07:30 శు.సప్తమి బుధ ఘ.36:32, రా.గం.8:24. స్వాతి ఉ.గం.9:11. శుక్లం ఉ.గం.6:45. గరజి ఉ.గం.7:54. అహస్సు ఘ.31:26. వర్జ్యం ప.గం.3:13ల 4:57వ. అమృ రా.గం.1:34ల 3:18వ. భు.ఘ.00:13:03. మ.దు.11:39ల 12:29వ.20/08 సా.06:00 శు.అష్టమి గురు ఘ.40:01, రా.గం.9:47. విశాఖ ప.గం.11:07. బ్రహ్మం ఉ.గం.6:43. విష్టి ఉ.గం.9:05.అహస్సు ఘ.31:24. వర్జ్యం ప.గం.3:26ల 5:11వ. అమృ రా.గం.1:55ల 3:40వ. భు.ఘ.00:23:16. ఉ.దు.9:58ల 10:48వ. మ.దు.3:00ల 3:50వ.21/08 ప.02:15 శు.నవమి శుక్ర ఘ.44:29, రా.గం.11:35. అనురాధ ప.గం.1:18. ఐంద్రం ఉ.గం.6:58. బాలవ ఉ.గం.10:41. అహస్సు ఘ.31:22. వర్జ్యం రా.గం.7:28ల 9:14వ. భు.ఘ.00:33:29. ఉ.దు.8:18ల 9:08వ. మ.దు.12:29ల 1:19వ. వరలకీ‡్ష్మవ్రతం, కౌమారీదేవీపూజ22/08 సా.06:00 శు.దశమి శని ఘ.49:26, రా.గం.1:34. జ్యేష్ఠ సా.గం.3:48. వైధృతి ఉ.గం.7:29. తైతుల ప.గం.12:35. అహస్సు ఘ.31:20. వర్జ్యం రా.గం.12:41ల 2:27వ. అమృ ఉ.గం.6:05ల 7:51వ. భు.ఘ.00:43:42. ఉ.దు.5:48ల 7:28వ. 23/08 ప.03:00 శు.ఏకాదశి ఆది ఘ.54:39, రా.గం.3:40. మూల సా.గం.6:26. విష్కంభం ఉ.గం.8:07. వనిక్ ప.గం.2:39. అహస్సు ఘ.31:18. వర్జ్యం సా.గం.4:40ల 6:26వ. పునః తె.5:04ల 5:48వ. అమృ ప.గం.11:20ల 1:06వ. భు.ఘ.00:53:55. సా.దు.4:36ల 5:26వ. 24/08 రా.07:00 శు.ద్వాదశి సోమ ఘ.59:30, రా.తె.గం.5:36. పూర్వాషాఢ రా.గం.9:00. ప్రీతి ఉ.గం.8:44. బవ సా.గం.4:38. అహస్సు ఘ.31:15. వర్జ్యం శేషం ఉ.గం.5:48ల 6:50వ. అమృ సా.గం.3:41ల 5:27వ. భు.ఘ.1:4:8. ప.దు.12:27ల 1:17వ. పునః ప.2:57ల 3:47వ. దామోదరద్వాదశీ, వాసుదేవ పవిత్రారోపణం25/08 రా.07:00 శు.త్రయోదశి మంగళ పూర్తి. ఉత్తరాషాఢ రా.గం.11:19. ఆయుష్మాన్ ఉ.గం.9:14. కౌలవ సా.గం.6:22. అహస్సు ఘ.31:12. వర్జ్యం ఉ.గం.5:46ల 7:31వ. పునః రా.3:40ల 5:24వ. అమృ సా.గం.4:18ల 6:04వ. భు.ఘ.1:14:21. ఉ.దు.8:18ల 9:08వ. రా.దు.10:53ల 11:43వ.26/08 సా.04:00 శు.త్రయోదశి బుధ ఘ.3:22, ఉ.గం.7:09. శ్రవణం రా.గం.1:21. సౌభాగ్యం ఉ.గం.9:32. తైతుల ఉ.గం.7:09. అహస్సు ఘ.31:10. వర్జ్యం తె.గం.5:37ల 5:48వ. అమృ ప.గం.2:04ల 3:48వ. భు.ఘ.1:24:34. మ.దు.11:37ల 12:27వ. 27/08 సా.06:00 శు.చతుర్దశి గురు ఘ.6:32, ఉ.గం.8:25. ధనిష్ఠ రా.గం.2:54. శోభ ఉ.గం.9:30. వనిక్ ఉ.గం.8:25. అహస్సు ఘ.31:8. వర్జ్యం శేషం ఉ.గం.5:48ల 7:19వ. అమృ ప.గం.3:50ల 5:32వ. భు.ఘ.1:34:47. ఉ.దు.9:57ల 10:47వ. మ.దు.2:55ల 3:45వ. నోములకు పౌర్ణమి28/08 ప.02:15 ఝశు.పౌర్ణమి శుక్ర ఘ.8:29, ఉ.గం.9:12. శతభిషం తె.గం.4:04. అతిగండ ఉ.గం.9:07. బవ ఉ.గం.9:12. అహస్సు ఘ.31:6. వర్జ్యం ఉ.గం.10:27ల 12:07వ. అమృ రా.గం.8:33ల 10:15వ. భు.ఘ.1:45:00. ఉ.దు.8:17 9:07వ. మ.దు.12:26ల 1:16వ. యాగకాలం, హయగ్రీవోత్పత్తి, యజుర్వేద ఉపాకర్మ, విఖనసజయంతీ29/08 సా.07:00 బహుళ పాడ్యమి శని ఘ.9:07, ఉ.గం.9:27. పూర్వాభాద్ర తె.గం.4:34. సుకర్మ ఉ.గం.8:18. కౌలవ ఉ.గం.9:27. అహస్సు ఘ.31:4. వర్జ్యం ప.గం.10:36ల 12:14వ. అమృ రా.గం.8:24ల 10:2వ. భు.ఘ.1:55:13. ఉ.దు.5:48ల 7:27వ.30/08 సా.06:00 బ.విదియ ఆది ఘ.8:36, ఉ.గం.9:14. ఉత్తరాభాద్ర తె.గం.4:41. ధృతి ఉ.7:08. శూల తె.గం.5:42. గరజి ఉ.గం.9:14. అహస్సు ఘ.31:2. వర్జ్యం ప.గం.2:12ల 3:48వ. అమృ రా.గం.11:50ల 1:26వ. భు.ఘ.2:5:26. సా.దు.4:33ల 5:23వ. బహత్తల్ప ద్వితీయ31/08 ప.11:00 బ.తదియ సోమ ఘ.6:57, ఉ.గం.8:35. రేవతి తె.గం.4:18. గండ తె.గం.3:42. భద్ర ఉ.గం.8:35. అహస్సు ఘ.31:00. వర్జ్యం ప.గం.4:30ల 6:05వ. అమృ రా.గం.1:46ల 3:20వ. భు.ఘ.2:15:39. ప.దు.12:25ల 1:14వ. పునః ప.2:54ల 3:43వ. సంకటహర చతుర్థి01/09 సా.04:30 బ.చవితి మంగళ ఘ.3:54, ఉ.గం.7:23. అశ్విని రా.తె.గం.3:32. వృద్ధి రా.గం.1:25. బాలవ ఉ.గం.7:23. అహస్సు ఘ.30:58. వర్జ్యం రా.గం.11:40ల 1:13వ. అమృ రా.గం.8:34ల 10:07వ. భు.ఘ.2:25:52. ఉ.దు.8:18ల 9:07వ. రా.దు.10:50ల 11:39వ.02/09 సా.04:00 బ.పంచమి బుధ ఘ.00:04, ఉ.గం.5:51. బ.షష్ఠి ఘ.55:23, రా.తె.గం.4:00. భరణి రా.2:22. ధ్రువం రా.గం.10:50. తైతుల ఉ.గం.5:51. గరజి సా.గం.4:55. అహస్సు ఘ.30:56. వర్జ్యం ప.గం.12:40ల 2:11వ. అమృ రా.గం.9:48ల 11:19వ. భు.ఘ.2:36:5. మ.దు.11:36ల 12:25వ. 03/09 సా.05:00 బ.సప్తమి గురు ఘ.50:05, రా.గం.1:52. కృత్తిక రా.గం.1:02. వ్యాఘాతం రా.8:04. విష్టి ప.గం.2:56. అహస్సు ఘ.30:53. వర్జ్యం ప.గం.1:43ల 3:13వ. అమృ రా.గం.10:46ల 12:16వ. భు.ఘ.2:46:18. ఉ.దు.9:57ల 10:46వ. మ.దు.2:53ల 3:42వ.04/09 ఉ.07:50 బ.అష్టమి శుక్ర ఘ.44:12, రా.గం.11:31. రోహిణి రా.గం.11:28. హర్షణం సా.గం.5:07. బాలవ ప.గం.12:41. అహస్సు ఘ.30:50. వర్జ్యం ప.గం.3:59ల 5:29వ. పునః తె.గం.4:40ల 5:50వ. అమృ రా.గం.8:28ల 9:58వ. భు.ఘ.2:56:31. ఉ.దు.8:18ల 9:07వ. మ.దు.12:24ల 1:13వ. శ్రీకష్ణ జన్మాష్టమీ, శ్రీకష్ణజయంతీ05/09 సా.06:00 బ.నవమి శని ఘ.38:08, రా.గం.9:05. మృగశిర రా.గం.9:48. వజ్రం ప.గం.2:04. తైతుల ప.గం.10:38. అహస్సు ఘ.30:48. వర్జ్యం శేషం ఉ.గం.5:50ల 6:09వ. పునః తె.గం.5:37ల 5:50వ. అమృ ప.గం.1:36ల 3:05వ. భు.ఘ.3:6:44. ఉ.దు.5:50ల 7:28వ. కౌమారీదేవీపూజ06/09 సా.06:00 బ.దశమి ఆది ఘ.31:57, రా.గం.6:37. ఆర్ద్ర రా.గం.8:07. సిద్ధి ప.గం.10:59. వనిక్ ఉ.గం.7:51. అహస్సు ఘ.30:46. వర్జ్యం శేషం ఉ.గం.5:50ల 7:06వ. అమృ ఉ.గం.10:49ల 12:18వ. భు.ఘ.3:16:57. సా.దు.4:29ల 5:18వ.07/09 ప.11:00 బ.ఏకాదశి సోమ ఘ.25:59, సా.గం.4:14. పునర్వసు సా.గం.6:30. వ్యతీపాత ఉ.గం.7:55. వరీయాన్ తె.గం.4:52. బాలవ సా.గం.4:14వ. అహస్సు ఘ.30:44. వర్జ్యం ఉ.గం.7:20ల 8:50వ. పునః రా.2:01ల 3:31వ. భు.ఘ.3:27:10. ప.దు.12:24ల 1:13వ. పునః ప.2:51ల 3:40వ. మతత్రయ అజా ఏకాదశి08/09 సా.04:30 బ.ద్వాదశి మంగళ ఘ.20:21, ప.గం.1:59. పుష్యమి సా.గం.5:03, పరిఘ రా.గం.2:04. తైతుల ప.గం.1:59. అహస్సు ఘ.30:41. వర్జ్యం తె.గం.5:11ల 5:51వ. అమృ ప.గం.11:03ల 12:33వ. భు.ఘ.3:37:23. ఉ.దు.8:18ల 9:07వ. రా.దు.10:48ల 11:36వ.09/09 సా.04:00 బ.త్రయోదశి బుధ ఘ.15:20, ప.గం.11:59. ఆశ్లేష ప.గం.3:48. శివం రా.గం.11:24. వనిక్ ప.గం.11:59. అహస్సు ఘ.30:38. వర్జ్యం శేషం ఉ.గం.5:51ల 6:51. పునః రా.3:20ల 4:52వ. అమృ ప.గం.2:17ల 3:47వ. భు.ఘ.3:47:36. మ.దు.11:33ల 12:22వ. మాసశివరాత్రి10/09 ఉ.06:30 బ.చతుర్దశి గురు ఘ.10:51, ఉ.గం.10:11. మఘ ప.గం.2:52. సిద్ధం రా.గం.9:06. శకుని ఉ.గం.10:11. అహస్సు ఘ.30:36. వర్జ్యం రా.గం.10:40ల 12:14వ. అమృ ప.గం.12:33ల 2:05వ. భు.ఘ.3:57:49. ఉ.దు.9:56ల 10:45వ. మ.దు.2:49ల 3:38వ. రుద్రసావర్ణిమన్వాది, తర్పణాలకు అమావాస్య11/09 రా.08:30 ∙బ.అమావాస్య శుక్ర ఘ.7:20, ఉ.గం.8:47. పుబ్బ ప.గం.2:17. సాధ్యం రా.గం.7:02. నాగవం ఉ.గం.8:47. అహస్సు ఘ.30:34. వర్జ్యం రా.గం.9:25ల 11:00వ. అమృ ఉ.గం.8:02ల 9:34వ. భు.ఘ.4:8:02. ఉ.దు.8:19ల 9:08వ. మ.దు.12:29ల 1:18వ. యాగకాలం కుశగ్రహణం, పోలాల అమావాస్య, శైవమౌనవ్రతము, అగస్త్యార్ఘ్యంస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షఋతువు, భాద్రపద మాసం12/09 సా.06:00 శుద్ధ పాడ్యమి శని ఘ.4:49, ఉ.గం.7:48. ఉత్తర ప.గం.2:08. శుభం సా.గం.5:43. బవ ఉ.గం.7:48. అహస్సు ఘ.30:32. వర్జ్యం రా.గం.10:38ల 12:15వ. అమృ ఉ.గం.6:58ల 8:33వ. భు.ఘ.4:18:15. ఉ.దు.5:52ల 7:30వ. చంద్రదర్శనం (నెలపొడుపు), మహత్తమవ్రతం13/09 సా.06:00 శు.విదియ ఆది ఘ.3:33, ఉ.గం.7:17. హస్త ప.గం.2:25. శుక్లం ప.గం.4:01. కౌలవ ఉ.గం.7:17. అహస్సు ఘ.30:29. వర్జ్యం రా.గం.10:41ల 12:20వ. అమృ ఉ.గం.8:21ల 9:58వ. భు.ఘ.4:28:28. సా.దు.4:27ల 5:16వ. 14/09 సా.06:30 శు.తదియ సోమ ఘ.3:27, ఉ.గం.7:15. చిత్త ప.గం.3:14. బ్రహ్మం ప.గం.3:06. గరజి ఉ.గం.7:15. అహస్సు ఘ.30:26. వర్జ్యం రా.గం.9:06ల 10:47వ. అమృ ఉ.గం.8:37ల 10:16వ. భు.ఘ.4:38:41. ప.దు.12:11ల 12:59వ. పునః ప.2:37ల 1:25వ. సువర్ణగౌరీవ్రతం, వినాయకచతుర్థీ, గణపతినవరాత్రి ప్రారంభం, గౌరీపూజ15/09 సా.05:30 శు.చవితి మంగళ ఘ.4:45, ఉ.గం.7:46. స్వాతి సా.గం.4:32. ఐంద్రం ప.గం.2:34. భద్ర ఉ.గం.7:46. అహస్సు ఘ.30:24. వర్జ్యం రా.గం.10:32ల 12:15వ. అమృ ఉ.గం.9:39ల 11:20వ. భు.ఘ.4:48:54. ఉ.దు.08:08ల 8:56వ. రా.దు.10:46ల 11:34వ. ఋషిపంచమీ16/09 సా.04:00 శు.పంచమి బుధ ఘ.7:19, ఉ.గం.8:48. విశాఖ సా.గం.6:16. వైధృతి ప.గం.2:24. బాలవ ఉ.గం.8:48. అహస్సు ఘ.30:22. వర్జ్యం రా.గం.10:38ల 12:23వ. అమృ ఉ.గం.8:50ల 10:33వ. భు.ఘ.4:59:7. మ.దు.11:32ల 12:20వ.17/09 సా.05:00 శు.షష్ఠి గురు ఘ.10:47, ప.గం.10:11. అనురాధ రా.గం.8:26. విష్కంభం ప.గం.2:35. తైతుల ఉ.గం.10:11. అహస్సు ఘ.30:20. వర్జ్యం రా.గం.2:36ల 4:22వ. అమృ ఉ.గం.9:06ల 10:51వ. భు.ఘ.5:9:20. పు.భు.5:17. ఉ.దు.9:54ల 10:42వ. మ.దు.2:45ల 3:33వ. కన్యా రవిః రా.11:29 ప్రవేశాత్ కన్యా సంక్రమణం18/09 ఉ.07:50 శు.సప్తమి శుక్ర ఘ.15:15, ప.గం.11:58. జ్యేష్ఠ రా.గం.10:52. ప్రీతి ప.గం.3:00. వనిక్ ప.గం.11:58. అహస్సు ఘ.30:17. వర్జ్యం లేదు. అమ ప.గం.1:10ల 2:56వ. భు.ఘ.00:02:45. ఉ.దు.8:17ల 9:05వ. మ.దు.12:17ల 1:08వ.19/09 ప.12:10 శు.అష్టమి శని ఘ.20:16, ప.గం.1:58. మూల రా.గం.1:30. ఆయుష్మాన్ ప.గం.3:34. బవ ప.గం.1:58. అహస్సు ఘ.30:14. వర్జ్యం ఉ.గం.7:44ల 9:30. పునః రా.11:44ల 1:30వ. అమృ రా.గం.6:24ల 8:10వ. భు.ఘ.00:13:00. ఉ.దు.5:52ల 7:29వ.20/09 సా.06:30 శు.నవమి ఆది ఘ.25:28, సా.గం.4:03. పూర్వాషాఢ రా.గం.4:06. సౌభాగ్యం ప.గం.4:11. కౌలవ సా.గం.4:03. అహస్సు ఘ.30:12. వర్జ్యం ప.గం.12:08ల 1:44వ. అమృ రా.గం.10:47ల 12:33వ. భు.ఘ.00:23:15. సా.దు.4:19ల 5:07వ. నందాదేవీపూజ, కేదారవ్రతం21/09 ప.11:00 శు.దశమి సోమ ఘ.30:23, సా.గం.6:01. ఉత్తరాషాఢ పూర్తి. శోభ సా.గం.4:42. గరజి సా.గం.6:01. అహస్సు ఘ.30:10. వర్జ్యం ప.గం.12:53ల 2:39వ. అమృ రా.గం.11:26ల 1:12వ. భు.ఘ.00:33:30. ప.దు.12:17ల 1:05వ. పునః ప.2:42ల 3:30వ. క్షీరవ్రతారంభ22/09 ప.12:00 శు.ఏకాదశి మంగళ ఘ.34:38, రా.గం.7:43. ఉత్తరాషాఢ ఉ.గం.6:27. అతిగండ సా.గం.5:02. వనిక్ ఉ.గం.6:52. అహస్సు ఘ.30:07. వర్జ్యం ప.గం.10:48ల 12:32వ. అమృ రా.గం.9:14ల 10:58వ. భు.ఘ.00:43:45. ఉ.దు.8:16ల 9:04వ. రా.దు.10:41ల 11:29వ. మతత్రయ పరివర్తన ఏకాదశి23/09 ఉ.09:00 శు.ద్వాదశి బుధ ఘ.37:50, రా.గం.9:01. శ్రవణం ఉ.గం.8:33. సుకర్మ సా.గం.5:04. బవ ఉ.గం.8:23. అహస్సు ఘ.30:04. వర్జ్యం ప.గం.12:49ల 2:31వ. అమృ రా.గం.11:05ల 12:48వ. భు.ఘ.00:54:00. మ.దు.11:29ల 12:15వ. కటదానం(దర్భాసనం), శక్రద్వాదశీ, కల్కిద్వాదశీ, వామన జయంతీ, శ్రవణద్వాదశీ24/09 సా.05:00 శు.త్రయోదశి గురు ఘ.40:01, రా.గం.9:53. ధనిష్ఠ ప.గం.10:12. ధృతి సా.గం.4:45. కౌలవ ఉ.గం.9:27. అహస్సు ఘ.30:02. వర్జ్యం సా.గం.5:45ల 7:26వ. అమృ రా.తె.గం.3:50ల 5:31వ. భు.ఘ.1:4:15. ఉ.దు.9:53ల 10:41వ. మ.దు.2:41ల 3:29వ.25/09 ఉ.07:45 శు.చతుర్దశి శుక్ర ఘ.40:45, రా.గం.10:11. శతభిషం ప.గం.11:23. శూల సా.గం.4:00. గరజి ఉ.గం.10:02. అహస్సు ఘ.30:00. వర్జ్యం సా.గం.5:58ల 7:36వ. అమృ తె.గం.3:50ల 5:29వ. భు.ఘ.1:14:30. ఉ.దు.8:17ల 9:05వ. మ.దు.12:17ల 1:05వ. అనంతవ్రతం (అనంత పద్మనాభచతుర్దశీ)26/09 ప.12:15 ఝ శు.పౌర్ణమి శని ఘ.40:21, రా.గం.10:01. పూర్వాభాద్ర ప.గం.12:06. గండ ప.గం.2:53. విష్టి ఉ.గం.10:06. అహస్సు ఘ.29:58. వర్జ్యం రా.గం.9:44ల 11:21వ. భు.ఘ.1:24:45. ఉ.దు.5:53ల 7:29వ. నోములకు పౌర్ణమి, ఉమా మహేశ్వరవ్రతం27/09 ప.02:30 బహుళ పాడ్యమి ఆది ఘ.38:31, రా.గం.9:17. ఉత్తరాభాద్ర ప.గం.12:15. వృద్ధి ప.గం.1:21. బాలవ ఉ.గం.9:39. అహస్సు ఘ.29:55. వర్జ్యం రా.గం.12:07ల 1:42వ. అమృ ఉ.గం.7:25ల 9:02వ. భు.ఘ.1:35:00. సా.దు.4:15ల 05:03వ. యాగకాలం, మహాలయపక్షప్రారంభః28/09 ప.11:00 బ.విదియ సోమ ఘ.35:50, రా.గం.8:14. రేవతి ప.గం.12:00. ధవం ప.గం.11:29. తైతుల గం.8:47. అహస్సు ఘ.29:52. వర్జ్యం లేదు. అమృ ఉ.గం.9:38ల 11:13వ. పునః అమృ తె.గం.4:19ల 5:52వ. భు.ఘ.1:45:15. ప.దు.12:16ల 1:03వ. పునః ప.2:39ల 3:26వ.29/09 సా.05:30 బ.తదియ మంగళ ఘ.31:52, సా.గం.6:39. అశ్విని ప.గం.11:19. వ్యాఘాతం ఉ.గం.9:16. వనిక్ ఉ.గం.7:26. అహస్సు ఘ.29:50. వర్జ్యం ఉ.గం.7:26ల 8:59వ. పునః రా.8:30ల 10:02వ. అమృ తె.గం.5:41ల 5:54వ. భు.ఘ.1:55:30. ఉ.దు.8:17ల 9:04వ. రా.దు.10:39ల 11:26వ. సంకటహర చతుర్థి, ఉండ్రాళ్ళతద్ది30/09 సా.04:30 బ.చవితి బుధ ఘ.27:14, సా.గం.4:48. భరణి ఉ.గం.10:17. హర్షణం ఉ.గం.6:45. వజ్రం తె.గం.4:05. బాలవ సా.గం.4:48. అహస్సు ఘ.29:48. వర్జ్యం రా.గం.9:38ల 11:09వ. అమృ శేషం ఉ.గం.5:54ల 7:12వ. భు.ఘ.2:5:45. మ.దు.11:27ల 12:14వ.01/10 సా.06:00 బ.పంచమి గురు ఘ.22:1, ప.గం.2:42. కృత్తిక ఉ.గం.8:59. సిద్ధి రా.గం.1:05. తైతుల ప.గం.2:42. అహస్సు ఘ.29:45. వర్జ్యం రా.గం.11:58ల 1:28వ. అమృ ఉ.గం.6:42ల 8:12వ. పునః రా.తె.4:28ల 5:58వ. భు.ఘ.2:16:00. ఉ.దు.9:51ల 10:38వ. మ.దు.2:36ల 3:14వ. 02/10 రా.08:00 బ.షష్ఠి శుక్ర ఘ.16:14, ప.గం.12:24. రోహిణి ఉ.గం.7:28, మృగశిర తె.5:52. వ్యతీపాత రా.గం.10:02. వనిక్ ప.గం.12:24. అహస్సు ఘ.29:42. వర్జ్యం ప.గం.12:42ల 2:11వ. అమృ రా.గం.9:39ల 11:09వ. భు.ఘ.2:26:15 ఉ.దు.8:16ల 9:03వ. మ.దు.12:14ల 1:01వ. వ్యతీపాత మహాలయం03/10 ఉ.08:45 బ.సప్తమి శని ఘ.10:14, ఉ.గం.10:00. ఆర్ద్ర రా.తె.గం.4:08. వరీయాన్ సా.గం.6:55. బవ ఉ.గం.10:00. అహస్సు ఘ.29:40. వర్జ్యం ప.గం.1:38ల 3:07వ. అమృ సా.గం.6:49ల 8:18వ. భు.ఘ.2:36:30. ఉ.దు.5:54ల 7:29వ. 04/10 ప.11:30 బ.అష్టమి ఆది ఘ.4:10, ఉ.గం.7:34. నవమి ఘ.53:57. తె.గం.5:09. పునర్వసు రా.గం.2:29. పరిఘ సా.గం.3:48. కౌలవ ఉ.గం.7:34. తైతుల సా.గం.6:21. అహస్సు ఘ.29:38. వర్జ్యం ప.గం.3:18ల 4:47వ. అమృ రా.గం.12:15ల 1:44వ. భు.ఘ.2:46:45. సా.దు.4:10ల 4:57వ. ఉమామహేశ్వరపూజ, మహాలకీ‡్ష్మ వ్రతోద్వాసనం, 05/10 రా.07:00 బ.దశమి సోమ ఘ.52:33, రా.గం.2:55. పుష్యమి రా.గం.12:58. శివం ప.గం.12:46. వనిక్ గం.4:06. అహస్సు ఘ.29:35. వర్జ్యం ప.గం.9:58ల 11:28వ. అమృ రా.గం.6:58ల 8:28వ. భు.ఘ.2:57:00. ప.దు.12:12ల 12:59వ. పునః ప.2:34ల 3:21వ.06/10 సా.05:15 బ.ఏకాదశి మంగళ ఘ.47:27, రా.గం.12:53. ఆశ్లేష రా.గం.11:39. సిద్ధం ప.గం.9:53. బవ ప.గం.1:54. అహస్సు ఘ.29:32. వర్జ్యం ప.గం.1:04ల 2:34వ. అమృ రా.గం.10:08ల 11:38వ. భు.ఘ.3:7:15. ఉ.దు.8:16ల 9:03వ. రా.దు.10:35ల 11:22వ.07/10 సా.04:10 బ.ద్వాదశి బుధ ఘ.43:11, రా.గం.11:10. మఘ రా.గం.10:39. సాధ్యం ఉ.గం.7:10. శుభం రా.తె.గం.4:38. కౌలవ ప.గం.12:02. అహస్సు ఘ.29:30. వర్జ్యం ప.గం.11:09ల 12:41వ. అమృ రా.గం.8:21ల 9:53వ. భు.ఘ.3:17:30. మ.దు.11:25ల 12:12వ. యతిమహాలయం08/10 సా.5:15 బ.త్రయోదశి గురు ఘ.39:43, రా.గం.9:48. పుబ్బ రా.గం.9:58. శుక్లం రా.గం.2:27. గరజి ఉ.గం.10:30. అహస్సు ఘ.29:28. వర్జ్యం ఉ.గం.6:27ల 8:00వ. పునః రా.తె.గం.5:05ల 5:55వ. అమృ ప.గం.3:45ల 5:18వ.భు.ఘ.3:27:45. ఉ.దు.9:20ల 10:07వ. మ.దు.2:33ల 3:20వ. కలియుగాది, మాసశివరాత్రి నిశీధి వారికి09/10 ప.02:30 బ.చతుర్దశి శుక్ర ఘ.37:21, రా.గం.8:51. ఉత్తర రా.గం.9:43. బ్రహ్మం రా.గం.12:41. విష్టి ఉ.గం.9:20. అహస్సు ఘ.29:26. వర్జ్యం శేషం గం.5:55ల 6:40వ. అమృ ప.గం.2:36ల 4:11వ. భు.ఘ.3:38:00. ఉ.దు.8:16ల 9:03వ. మ.దు.12:11ల 12:58వ. మాసశివరాత్రి ప్రదోషం వారికి, శహతమహాలయం10/10 ప.11:00 ∙బ.అమావాస్య శని ఘ.35:57, రా.గం.8:15. హస్త రా.గం.9:49. ఐంద్రం రా.గం.11:09. చతుష్పాత్ ఉ.గం.8:35. అహస్సు ఘ.29:24. వర్జ్యం ఉ.గం.6:09ల 7:45వ. అమృ ప.గం.3:48ల 5:24వ. శ్రాద్ధతిథి అమావాస్య. భు.ఘ.3:48:15. ఉ.దు.5:55ల 7:31వ. మహాలయ అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదతువు, ఆశ్వయుజ మాసం. 11/10 ప.02:30 శుద్ధ పాడ్యమి ఆది ఘ.36:13, రా.గం.8:25. చిత్త రా.గం.10:37. వైధృతి రా.గం.10:11. కింస్తుఘ్నం ఉ.గం.8:22. అహస్సు ఘ.29:21. వర్జ్యం ఉ.గం.6:06ల 7:45వ. పునః తె.గం.4:29ల 5:56వ. అమృ ప.గం.4:00ల 5:39వ. భు.ఘ.3:58:30. సా.దు.4:06ల 4:53వ. యాగకాలం, శారదానవరాత్రి ప్రారంభం 12/10 సా.06:00 శు.విదియ సోమ ఘ.37:16, రా.గం.8:50. స్వాతి రా.గం.11:46. విష్కంభం రా.గం.9:34. బాలవ ఉ.గం.8:38. అహస్సు ఘ.29:18. వర్జ్యం శేషం ఉ.గం.5:56ల 6:09వ. పునః తె.గం.5:45ల 5:56వ. అమృ ప.గం.2:34ల 4:15వ. భు.ఘ.4:8:45. ప.దు.12:10ల 12:56వ. పునః ప.2:31ల 3:17వ. చంద్రదర్శనం (నెలపొడుపు)13/10 రా.07:00 శు.తదియ మంగళ ఘ.40:8, రా.గం.9:59. విశాఖ రా.గం.1:26. ప్రీతి రా.గం.9:16. తైతుల ఉ.గం.9:25. అహస్సు ఘ.29:16. వర్జ్యం శేషం ఉ.గం.5:56ల 7:27వ. పునః తె.గం.5:47ల 5:56వ. అమృ సా.గం.4:02ల 5:45వ. భు.ఘ.4:19:00. ఉ.దు.8:16ల 9:02వ. రా.దు.10:33ల 11:19వ.14/10 ఉ.09:00 శు.చవితి బుధ ఘ.43:25, రా.గం.11:18. అనురాధ రా.తె.గం.3:30. ఆయుష్మాన్ రా.గం.9:18. వనిక్ ఉ.గం.10:38. అహస్సు ఘ.29:14. వర్జ్యం శేషం గం.5:56ల 7:31వ. అమృ సా.గం.4:12ల 5:56వ. భు.ఘ.4:29:15. మ.దు.11:24ల 12:10వ.15/10 ప.12:00 శు.పంచమి గురు ఘ.48:21, రా.గం.1:17. జ్యేష్ఠ రా.తె.గం.5:56. సౌభాగ్యం రా.గం.9:39. బవ ప.గం.12:18. అహస్సు ఘ.29:11. వర్జ్యం ఉ.గం.9:41ల 11:26వ. అమృ రా.గం.8:15ల 10:01వ. భు.ఘ.4:39:30. ఉ.దు.9:50ల 10:36వ. మ.దు.2:30ల 3:16వ. 16/10 రా.08:15 శు.షష్ఠి శుక్ర ఘ.53:28, రా.గం.3:20. మూల పూర్తి. శోభ రా.గం.10:10. కౌలవ ప.గం.2:19. అహస్సు ఘ.29:08. వర్జ్యం ప.గం.2:48ల 4:34వ. అమృ రా.గం.1:26ల 3:12వ. భు.ఘ.4:49:45. ఉ.దు.8:17ల 9:03వ. మ.దు.12:10ల 12:56వ. సరస్వతీపూజా ప్రారంభం 17/10 ప.02:00 శు.సప్తమి శని ఘ.58:48, రా.తె.గం.5:28. మూల ఉ.గం.8:33. అతిగండ రా.గం.10:46. గరజి సా.గం.4:24. అహస్సు ఘ.29:6. వర్జ్యం ఉ.గం.6:47ల 8:33. పునః రా.7:10ల 8:46వ. అమృ తె.గం.5:49ల 5:57వ. భు.ఘ.5:00:00. ఉ.దు.5:57ల 7:30వ. దేవీత్రిరాత్రవ్రతం18/10 ప.02:00 శు.అష్టమి ఆది పూర్తి. పూర్వాషాఢ ప.గం.11:8. సుకర్మ రా.గం.11:19. విష్టి సా.గం.6:29. అహస్సు ఘ.29:04. వర్జ్యం రా.గం.7:58ల 9:44వ. అమృ శేషం ఉ.గం.5:57ల 7:35వ. భు.ఘ.5:10:15. పు.భు.5:12. సా.దు.4:02ల 4:48వ. చిత్త 2 రవిః ఉ.9:54 ప్రవేశదినే మహాష్టమీ, దుర్గాష్టమీ, తులా సంక్రమణం19/10 రా.08:30 శు.అష్టమి సోమ ఘ.3:51, ఉ.గం.7:30. ఉత్తరాషాఢ ప.గం.1:40. ధృతి రా.గం.12:06. బవ ఉ.గం.7:30. అహస్సు ఘ.29:02. వర్జ్యం రా.గం.6:00ల 7:44వ. అమృ ఉ.గం.6:35ల 8:21వ. పునరమ తె.గం.4:27ల. భు.ఘ.00:09:00. ప.దు.12:09ల 12:55వ. పునః ప.2:28ల 3:14వ. మహానవమీ 20/10 సా.05:30 శు.నవమి మంగళ ఘ.8:00, ఉ.గం.9:10. శ్రవణం ప.గం.3:45. శూల రా.గం.11:46. కౌలవ ఉ.గం.9:10. అహస్సు ఘ.28:59. వర్జ్యం రా.గం.8:08ల 9:51వ. అమృ శేషం ఉ.గం.5:58ల 6:11వ. భు.ఘ.00:19:50. ఉ.దు.8:18ల 9:04వ. రా.దు.10:31ల 11:17వ. విజయదశమీ, శమీపూజ, అపరాజితాదేవీపూజ21/10 సా.04:15 శు.దశమి బుధ ఘ.11:05, ప.గం.10:25. ధనిష్ఠ సా.గం.5:28. గండ రా.గం.11:29. గరజి ప.గం.10:25. అహస్సు ఘ.28:56. వర్జ్యం రా.గం.1:05ల 2:46వ. అమృ ఉ.గం.6:15ల 7:58వ. భు.ఘ.00:29:40. మ.దు.11:22ల 12:08వ.22/10 ప.11:30 శు.ఏకాదశి గురు ఘ.13:24, ప.గం.11:21. శతభిషం సా.గం.6:49. వృద్ధి రా.గం.10:53. భద్ర ప.గం.11:21. అహస్సు ఘ.28:54. వర్జ్యం రా.గం.1:26ల 3:05వ. అమృ ప.గం.11:13ల 12:54వ. భు.ఘ.00:39:30. ఉ.దు.9:50ల 10:36వ. మ.దు.2:27ల 3:13వ.23/10 రా.08:10 శు.ద్వాదశి శుక్ర ఘ.14:19, ప.గం.11:39. పూర్వాభాద్ర రా.గం.7:39. ధ్రువం రా.గం.9:52. బాలవ ప.గం.11:33. అహస్సు ఘ.28:52. వర్జ్యం రా.తె.గం.5:23ల 5:59వ. అమృ ఉ.గం.11:23ల 1:02వ. భు.ఘ.0:49:20. ఉ.దు.8:17ల 9:03వ. మ.దు.12:08ల 12:54వ. 24/10 సా.06:00 శు.త్రయోదశి శని ఘ.13:53, ప.గం.11:32. ఉత్తరాభాద్ర రా.గం.7:59. వ్యాఘాతం రా.గం.8:23. తైతుల ప.గం.11:32. అహస్సు ఘ.28:50. వర్జ్యం శేషం ఉ.గం.5:59ల 7:00వ. అమృ ప.గం.3:07ల 4:44వ. భు.ఘ.1:00:10. ఉ.దు.5:59ల 7:31వ.25/10 సా.06:30 శు.చతుర్దశి ఆది ఘ.12:16, ప.గం.10:53. రేవతి రా.గం.7:47. హర్షణం సా.గం.6:35. వనిక్ ప.గం.10:53. అహస్సు ఘ.28:48. వర్జ్యం ఉ.గం.7:53ల 9:28వ. అమృ సా.గం.5:24ల 6:59వ. భు.ఘ.1:11:00. సా.దు.3:58ల 4:44వ.26/10 ప.11:30 ఝ శు.పౌర్ణమి సోమ ఘ.9:28, ప.గం.9:46. అశ్విని రా.గం.7:11. వజ్రం ప.గం.4:24. బవ ఉ.గం.9:46. అహస్సు ఘ.28:45. వర్జ్యం ప.గం.3:16ల 4:50వ. పునః రా.తె.గం.4:24ల 5:56వ. అమృ ప.గం.12:10ల 1:44వ. భు.ఘ.1:21:50. ప.దు.12:07ల 12:52వ. పునః ప.2:25ల 3:10వ. యాగకాలం27/10 ప.12:30 బహుళ పాడ్యమి మంగళ ఘ.5:44, ఉ.గం.8:18. భరణి సా.గం.6:13. సిద్ధి ప.గం.1:56. కౌలవ ఉ.గం.8:18. అహస్సు ఘ.28:42. వర్జ్యం తె.గం.5:35ల 6:00వ. అమృ ప.గం.1:37ల 3:09వ. భు.ఘ.1:32:40. ఉ.దు.8:18ల 9:03వ. రా.దు.10:29ల 11:14వ.28/10 ఉ.07:30 బ.విదియ బుధ ఘ.1:12, ఉ.గం.6:29. బ.తదియ ఘ.54:52, తె.గం.4:26. కృత్తిక సా.గం.4:57. వ్యతీపాత ప.గం.11:13. గరజి ఉ.గం.6:29. వనిక్ సా.గం.5:28. అహస్సు ఘ.28:40. వర్జ్యం శేషం ఉ.గం.6:00ల 7:05వ. అమృ ప.గం.2:41ల 4:11వ. భు.ఘ.1:43:30. మ.దు.11:22ల 12:07వ. అట్లతద్దె, లలితాదేవీయాత్ర29/10 ఉ.11:15 బ.చవితి గురు ఘ.50:21, రా.గం.2:09. రోహిణి ప.గం.3:30, వరీయాన్ ఉ.గం.8:20. పరిఘ తె.గం.5:20. బవ సా.గం.3:24. అహస్సు ఘ.28:38. వర్జ్యం ఉ.గం.7:59ల 9:29వ. పునః రా.8:43ల 10:12వ. అమృ ప.గం.12:29ల 1:59వ. పునరమ తె.గం.5:41ల 6:01వ. భు.ఘ.1:54:20. ఉ.దు.9:50ల 10:35వ. మ.దు.2:24ల 3:09వ. సంకటహర చతుర్థి30/10 రా.08:15 బ.పంచమి శుక్ర ఘ.44:22, రా.గం.11:43. మృగశిర ప.గం.1:53. శివం రా.గం.2:06. కౌలవ ప.గం.12:57. అహస్సు ఘ.28:36. వర్జ్యం రా.గం.9:41ల 11:10వ. అమృ శేషం ఉ.గం.6:01ల 7:11వ. పునరమ రా.గం.2:54ల 4:24వ. భు.ఘ.2:5:10. ఉ.దు.8:18ల 9:03వ. మ.దు.12:07ల 12:52వ.31/10 సా.06:00 బ.షష్ఠి శని ఘ.38:19, రా.గం.9:21. ఆర్ద్ర ప.గం.12:12. సిద్ధం రా.గం.11:01. గరజి ఉ.గం.10:33. అహస్సు ఘ.28:34. వర్జ్యం రా.గం.11:22ల 12:51వ. భు.ఘ.2:16:00. ఉ.దు.6:01ల 7:34వ.01/11 ప.11:00 బ.సప్తమి ఆది ఘ.32:29, రా.గం.7:02. పునర్వసు ప.గం.10:34 సాధ్యం రా.గం.7:57. విష్టి ఉ.గం.7:12. అహస్సు ఘ.28:32. వర్జ్యం సా.గం.6:03ల 7:33వ. అమృ ఉ.గం.8:20ల 9:49వ. పునరమ రా.తె.గం.3:02ల 4:32వ. భు.ఘ.2:26:50. సా.దు.3:55ల 4:40వ.02/11 సా.06:30 బ.అష్టమి సోమ ఘ.27:00, సా.గం.4:50. పుష్యమి ఉ.గం.9:02. శుభం సా.గం.4:58. కౌలవ సా.గం.4:50. అహస్సు ఘ.28:30. వర్జ్యం రా.గం.9:06ల 10:36వ. భు.ఘ.2:37:40. ప.దు.12:07ల 12:52వ. పునః ప.2:24ల 3:09వ.03/11 ప.12:30 బ.నవమి మంగళ ఘ.22:01, ప.గం.2:51. ఆశ్లేష ఉ.గం.7:40. శుక్లం ప.గం.2:12. గరజి ప.గం.2:51. అహస్సు ఘ.28:27. వర్జ్యం రా.గం.7:07ల 8:39వ. అమ ఉ.6:09ల 7:39వ. పునరమ తె.గం.4:17ల 5:41వ. భు.ఘ.2:48:30. ఉ.దు.8:19ల 9:04వ. రా.దు.10:28ల 11:13వ.04/11 ఉ.07:30 బ.దశమి బుధ ఘ.17:48, ప.గం.1:10. మఘ ఉ.గం.6:34. పుబ్బ రా.తె.గం.5:41. బ్రహ్మం ప.గం.11:38. భద్ర ప.గం.1:10. అహస్సు ఘ.28:24. వర్జ్యం ప.గం.2:17ల 3:49వ. అమృ రా.గం.11:31ల 1:03వ. దశమి తిథి ప్రాంతీయంగా మారును. భు.ఘ.2:59:20. మ.దు.11:21ల 12:06వ.05/11 ఉ.11:15 బ.ఏకాదశి గురు ఘ.14:28, ప.గం.11:51. ఉత్తర రా.తె.గం.5:22. ఐంద్రం ఉ.గం.9:22. బాలవ ప.గం.11:51. అహస్సు ఘ.28:22. వర్జ్యం ప.గం.3:30ల 5:05వ. అమృ రా.గం.10:16ల 11:50వ. భు.ఘ.3:10:10. ఉ.దు.9:51ల 10:36వ. మ.దు.2:23ల 3:08వ.06/11 రా.08:15 బ.ద్వాదశి శుక్ర ఘ.12:11, ప.గం.10:56. హస్త రా.తె.గం.5:24. వైధృతి ఉ.7:25. విష్కంభం తె.గం.5:40. తైతుల ప.గం.10:56. అహస్సు ఘ.28:20. వర్జ్యం ప.గం.01:48ల 3:24వ. అమృ రా.గం.11:28ల 12:59వ. భు.ఘ.03:21:00. ఉ.దు.8:20ల 9:05వ. మ.దు.12:06ల 12:51వ.07/11 సా.06:30 బ.త్రయోదశి శని ఘ.11:05, ప.గం.10:30. చిత్త రా.తె.గం.5:58. ప్రీతి తె.గం.4:29. వనిక్ ఉ.గం.10:30. అహస్సు ఘ.28:18. వర్జ్యం ప.గం.01:35ల 3:13వ. అమృ రా.గం.11:24ల 1:12వ. భు.ఘ.03:31:50. ఉ.దు.6:04ల 7:54వ. మాసశివరాత్రి08/11 ప.03:00 బ.చతుర్దశి ఆది ఘ.11:09, ప.గం.10:33. స్వాతి పూర్తి. ఆయుష్మాన్ రా.తె.గం.3:43. శకుని ఉ.గం.10:33. అహస్సు ఘ.28:16. వర్జ్యం ప.గం.11:51ల 1:32వ. అమృ రా.గం.9:56ల 11:37వ. భు.ఘ.03:42:40. సా.దు.3:53ల 4:38వ. స్వాత్యభ్యంగస్నానం, దీపావళీ, లకీ‡్ష్మపూజ, తర్పణాలకు అమావాస్య09/11 ఉ.07:30 ∙బ.అమావాస్య సోమ ఘ.12:40, ప.గం.11:09. స్వాతి ఉ.గం.7:10. సౌభాగ్యం రా.తె.గం.3:21. నాగవం ప.గం.11:09. అహస్సు ఘ.28:14. వర్జ్యం ప.గం.1:08ల 2:50వ. అమృ రా.గం.11:22ల 1:04వ. భు.ఘ.3:53:30. ప.దు.12:06ల 12:51వ. పునః ప.2:22ల 3:07వ. కేదారవ్రతం, ఆకాశదీపప్రారంభం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదతువు, కార్తీక మాసం10/11 ప.12:30 శుద్ధ పాడ్యమి మంగళ ఘ.15:25, ప.గం.12:15. విశాఖ ఉ.గం.8:45. శోభ రా.తె.గం.3:17. బవ ప.గం.12:15. అహస్సు ఘ.28:14. వర్జ్యం ప.గం.1:05ల 2:49వ. అమృ రా.గం.11:28ల 1:17వ. భు.ఘ.4:4:20. ఉ.దు.8:21ల 9:06వ. రా.దు.10:27ల 11:12వ. యాగకాలం, బలిచక్రవర్తి పూజ, చంద్రదర్శనం (నెలపొడుపు)11/11 ప.04:20 శు.విదియ బుధ ఘ.19:14, ప.గం.1:48. అనురాధ ఉ.గం.10:44. అతిగండ రా.తె.గం.3:33. కౌలవ ప.గం.1:48. అహస్సు ఘ.28:11. వర్జ్యం సా.గం.4:54ల 6:40వ. అమృ రా.తె.గం.3:25ల 5:11వ. భు.ఘ.4:15:10. మ.దు.11:23ల 12:08వ. యమద్వితీయ, భగినీహస్తభోజనం12/11 సా.06:00 శు.తదియ గురు ఘ.23:55, ప.గం.3:41. జ్యేష్ఠ ప.గం.1:06. సుకర్మ రా.తె.గం.4:01. గరజి ప.గం.3:41. అహస్సు ఘ.28:8. వర్జ్యం రా.గం.9:57ల 11:43వ. భు.ఘ.4:26:00. ఉ.దు.9:52ల 10:37వ. మ.దు.2:22ల 3:07వ. 13/11 ఉ.07:15 శు.చవితి శుక్ర ఘ.29:07, సా.గం.5:46. మూల ప.గం.3:38. ధృతి రా.తె.గం.4:35. భద్ర సా.గం.5:46. అహస్సు ఘ.28:06. వర్జ్యం ప.గం.1:52ల 3:38వ. పునః రా.గం.2:17ల 4:03వ. అమృ ఉ.గం.8:33ల 10:19వ. భు.ఘ.4:36:50. ఉ.దు.8:22ల 9:07వ. మ.దు.12:07ల 12:52వ. నాగచతుర్థీ14/11 ఉ.11:00 శు.పంచమి శని ఘ.34:31, రా.గం.7:55. పూర్వాషాఢ సా.గం.6:15. శూల తె.గం.5:08. బవ ఉ.గం.6:51. అహస్సు ఘ.28:04. వర్జ్యం రా.గం.3:05ల 4:51వ. అమృ ప.గం.12:56ల 2:42వ. భు.ఘ.4:47:40. ఉ.దు.6:07ల 7:37వ. నాగపంచమీ15/11 సా.06:15 శు.షష్ఠి ఆది ఘ.39:35, రా.గం.9:58. ఉత్తరాషాఢ రా.గం.8:46. గండ తె.గం.5:33. కౌలవ ఉ.గం.8:59. అహస్సు ఘ.28:02. వర్జ్యం రా.గం.1:09ల 2:54వ. అమృ సా.గం.5:54ల 7:40వ. భు.ఘ.4:58:30. సా.దు.3:53ల 4:38వ.16/11 ప.11:20 శు.సప్తమి సోమ ఘ.44:00, రా.గం.11:44. శ్రవణం రా.గం.11:01. వృద్ధి తె.గం.5:44. గరజి ఉ.గం.10:47. అహస్సు ఘ.28:00. వర్జ్యం రా.గం.3:22ల 5:06వ. అమృ ప.గం.11:40ల 1:25వ. భు.ఘ.5:09:20. ప.దు.12:06ల 12:51వ. పునః ప.2:21ల 3:06వ.17/11 ప.12:15 శు.అష్టమి మంగళ ఘ.47:31, రా.గం.1:08. ధనిష్ఠ రా.గం.12:58. ధ్రువం తె.గం.5:38. విష్టి ప.గం.12:26. అహస్సు ఘ.28:00. వర్జ్యం లేదు. అమృ ప.గం.1:44ల 3:28వ. భు.ఘ.5:20:10. పు.భు.5:24. ఉ.దు.8:23ల 9:08వ. రా.దు.10:27ల 11:12వ. విశాఖ 4 రవిః ఉ.7:15. ప్రవేశాత్పరతః గోష్ఠాష్టమీ, వృశ్చిక సంక్రమణం18/11 ప.04:45 శు.నవమి బుధ ఘ.49:40, రా.గం.1:01. శతభిషం రా.గం.2:23. వ్యాఘాతం తె.గం.5:05. బాలవ ప.గం.1:35. అహస్సు ఘ.27:58. వర్జ్యం ఉ.గం.8:36ల 10:18వ. అమృ సా.గం.6:46ల 8:28వ. భు.ఘ.00:10:48. íమ.దు.11:23ల 12:08వ. 19/11 సా.04:45 శు.దశమి గురు ఘ.50:36, రా.గం.2:24. పూర్వాభాద్ర తె.గం.5:20. హర్షణం తె.గం.4:10. తైతుల ప.గం.2:13. అహస్సు ఘ.27:56. వర్జ్యం ఉ.గం.9:03ల 10:43వ. అమృ సా.గం.7:02ల 8:42వ. భు.ఘ.00:22:8. ఉ.దు.9:53ల10:38వ. మ.దు.2:21ల 3:06వ.20/11 ప.03:40 శు.ఏకాదశి శుక్ర ఘ.50:05, రా.గం.2:12. ఉత్తరాభాద్ర తె.గం.3:43. వజ్రం రా.గం.2:46. వనిక్ ప.గం.2:18. అహస్సు ఘ.27:54. వర్జ్యం ప.గం.1:05ల 2:42వ. అమృ రా.గం.10:50ల 12:28వ. భు.ఘ.00:33:28. ఉ.దు.8:25ల 9:10వ. మ.దు.12:08ల 12:53వ. 21/11 ప.02:25 శు.ద్వాదశి శని ఘ.48:22, రా.గం.1:34. రేవతి తె.గం.3:43. సిద్ధి రా.గం.1:04. బవ ప.గం.1:53. అహస్సు ఘ.27:52. వర్జ్యం ప.గం.3:43ల 5:19వ. అమృ రా.గం.1:19ల 2:55వ. భు.ఘ.00:44:48. ఉ.దు.6:11ల 7:42వ. క్షీరాబ్ధిద్వాదశీ 22/11 ఉ.08:00 శు.త్రయోదశి ఆది ఘ.45:34, రా.గం.12:26. అశ్విని రా.తె.గం.3:10. వ్యతీపాత రా.గం.10:06. కౌలవ ప.గం.1:00. అహస్సు ఘ.27:50. వర్జ్యం రా.గం.11:16ల 12:50వ. అమృ రా.గం.8:08ల 9:42వ. భు.ఘ.00:56:8. సా.దు.3:51ల 4:36వ.23/11 ఉ.06:30 శు.చతుర్దశి సోమ ఘ.41:52, రా.గం.10:58. భరణి రా.గం.2:19. వరీయాన్ రా.గం.8:34. గరజి ప.గం.11:42. అహస్సు ఘ.27:48. వర్జ్యం ప.గం.12:14ల 1:46వ. అమృ రా.గం.9:41ల 11:13వ. భు.ఘ.1:7:28. ప.దు.12:09ల 12:53వ. పునః ప.2:23ల 3:07వ.24/11 ప.12:15 ఝ శు.పౌర్ణమి మంగళ ఘ.37:11, రా.గం.9:06. కృత్తిక రా.గం.1:05. పరిఘ సా.గం.5:53. విష్టి ఉ.గం.10:02. అహస్సు ఘ.27:46. వర్జ్యం ప.గం.1:42ల 3:12వ. అమృ రా.గం.10:59ల 12:29వ. భు.ఘ.1:18:48. ఉ.దు.8:27ల 9:11వ. రా.దు.10:29ల 11:13వ. కార్తీకవ్రతోద్యాపనం, కేశబంధనగౌరీవ్రతం, జ్వాలాతోరణం, కుమారస్వామి దర్శనం25/11 సా.04:30 బహుళ పాడ్యమి బుధ ఘ.32:01, రా.గం.7:02. రోహిణి రా.గం.11:41. శివం ప.గం.3:02. బాలవ ఉ.గం.8:04. అహస్సు ఘ.27:46. వర్జ్యం ప.గం.4:09ల 5:39వ. పునః తె.గం.4:54ల 6:14వ. అమృ రా.గం.8:40ల 10:10వ. భు.ఘ.1:30:8. మ.దు.11:25ల 12:09వ. యాగకాలం26/11 సా.04:30 బ.విదియ గురు ఘ.25:28, సా.గం.4:25. మృగశిర రా.గం.10:04. సిద్ధం ప.గం.12:01. గరజి సా.గం.4:25. అహస్సు ఘ.27:44. వర్జ్యం శేషం గం.6:14ల 6:23వ. పునః తె.5:52ల 6:15వ. అమృ ప.గం.1:51ల 3:20వ. భు.ఘ.1:41:28. ఉ.దు.09:57ల 10:41వ. మ.దు.2:22ల 3:16వ. చాతుర్మాస్యద్వితీయ, అశూన్యశయనవ్రతం27/11 రా.08:15 బ.తదియ శుక్ర ఘ.19:59, ప.గం.2:15. ఆర్ద్ర రా.గం.8:24. సాధ్యం ఉ.8:54. శుభం తె.గం.5:46. భద్ర ప.గం.2:15. అహస్సు ఘ.27:42. వర్జ్యం శేషం ఉ.గం.6:15ల 7:21వ. అమృ ప.గం.11:06ల 12:35వ. భు.ఘ.1:52:48. ఉ.దు.8:28ల 9:12వ. మ.దు.12:10ల 12:54వ. సంకటహర చతుర్థి28/11 సా.06:30 బ.చవితి శని ఘ.14:18, ప.గం.11:58. పునర్వసు సా.గం.6:39. శుక్లం రా.గం.2:28. బాలవ ప.గం.11:58. అహస్సు ఘ.27:42. వర్జ్యం ఉ.గం.7:32ల 9:01వ. పునః రా.గం.2:09ల 3:39వ. అమృ ప.గం.4:26ల 5:55వ. భు.ఘ.2:4:8. ఉ.దు.6:15ల 7:45వ. 29/11 ఉ.09:00 బ.పంచమి ఆది ఘ.8:45, ఉ.గం.9:46. పుష్యమి సా.గం.5:10. బ్రహ్మం రా.గం.11:34. తైతుల ఉ.గం.9:46. అహస్సు ఘ.27:40. వర్జ్యం రా.తె.గం.5:13ల 6:43వ. అమృ ప.గం.11:10ల 12:40వ. భు.ఘ.2:15:28. సా.దు.3:52ల 4:36వ.30/11 సా.06:30 బ.షష్ఠి సోమ ఘ.3:25, ఉ.గం.7:39. బ.సప్తమి ఘ.54:45, తె.గం.5:37. ఆశ్లేష ప.3:47. ఐంద్రం రా.గం.8:44. వనిక్ ఉ.గం.7:39. విష్టి సా.గం.6:36. అహస్సు ఘ.27:38. వర్జ్యం శేషం ఉ.గం.6:17ల 6:43. పునః రా.తె.గం.3:12ల 4:43వ. అమృ ప.గం.2:16ల 4:43వ. భు.ఘ.2:26:48. ప.దు.12:10ల 12:54వ. పునః ప.2:23ల 3:07వ. 01/12 సా.06:30 బ.అష్టమి మంగళ ఘ.54:03, రా.గం.3:54. మఘ ప.గం.2:37. వైధృతి సా.గం.6:01. బాలవ సా.గం.4:45. అహస్సు ఘ.27:36.వర్జ్యం రా.గం.10:20ల 11:53వ. అమృ ప.గం.12:20ల 1:51వ. భు.ఘ.2:38:8. ఉ.దు.8:31ల 9:15వ. రా.దు.10:31ల 11:15వ.02/12 సా.04:30 బ.నవమి బుధ ఘ.50:54, రా.గం.2:40. పుబ్బ ప.గం.1:46. విష్కంభం ప.గం.3:42. తైతుల ప.గం.3:17. అహస్సు ఘ.27:34. వర్జ్యం రా.గం.8:50ల 10:24వ. అమృ ఉ.గం.7:36ల 9:09వ. భు.ఘ.2:49:28. మ.దు.11:28ల 12:12వ.03/12 సా.05:00 బ.దశమి గురు ఘ.48:43, రా.గం.1:47. ఉత్తర ప.గం.1:19. ప్రీతి ప.గం.1:37. వనిక్ ప.గం.2:13. అహస్సు ఘ.27:34. వర్జ్యం రా.గం.9:43ల 11:19వ. అమృ ఉ.గం.6:15ల 7:49. భు.ఘ.3:00:48. మ.దు.11:28ల 12:12వ.04/12 ఉ.07:00 బ.ఏకాదశి శుక్ర ఘ.47:53, రా.గం.1:29. హస్త ప.గం.1:18. ఆయుష్మాన్ ప.గం.11:53. బవ ప.గం.1:37. అహస్సు ఘ.27:34. వర్జ్యం రా.గం.9:27ల 11:05వ. అమృ ఉ.గం.7:18ల 8:54వ. భు.ఘ.3:12:8. ఉ.దు.8:31ల 9:15వ. మ.దు.12:11ల 12:55వ.05/12 సా.06:30 బ.ద్వాదశి శని ఘ.48:06, రా.గం.1:33. చిత్త ప.గం.1:46. సౌభాగ్యం ఉ.గం.10:33. కౌలవ ప.గం.1:31. అహస్సు ఘ.27:32. వర్జ్యం రా.గం.7:36ల 9:16వ. అమృ ఉ.గం.7:15ల 8:53వ. పునరమ తె.గం.5:35ల 6:19వ. భు.ఘ.3:23:28. ఉ.దు.6:19ల 7:49వ.06/12 ప.02:30 బ.త్రయోదశి ఆది ఘ.49:50, రా.గం.2:15. స్వాతి ప.గం.2:44. శోభ ఉ.గం.9:35. గరజి ప.గం.1:44. అహస్సు ఘ.27:32. వర్జ్యం రా.గం.8:40ల 10:22వ. అమృ ఉ.గం.6:19ల 7:15వ. భు.ఘ.3:34:48. సా.దు.3:54ల 4:38వ.07/12 ఉ.06:50 బ.చతుర్దశి సోమ ఘ.52:35, రా.గం.3:22. విశాఖ ప.గం.4:12. అతిగండ 9:04. విష్టి ప.గం.2:49. అహస్సు ఘ.27:30. వర్జ్యం రా.గం.8:30ల 10:14వ. అమృ ఉ.గం.6:52ల 8:34వ. భు.ఘ.3:46:8. ప.దు.12:13ల 12:57వ. పునః ప.2:25ల 3:09వ. మాసశివరాత్రి08/12 ఉ.10:15 ∙బ.అమావాస్య మంగళ ఘ.56:38, రా.తె.గం.5:00. అనురాధ సా.గం.6:06. సుకర్మ ఉ.గం.8:51. చతుష్పాత్ సా.గం.4:11. అహస్సు ఘ.27:30. వర్జ్యం రా.గం.12:13ల 1:58వ. అమృ ఉ.గం.6:53ల 8:37వ. భు.ఘ.3:57:28. ఉ.దు.8:33ల 9:17వ. రా.దు.10:33ల 11:17వ. కౌముద్యుత్సవం, తర్పణాలకు అమావాస్యస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం09/12 ఉ.09:30 శుద్ధ పాడ్యమి బుధ పూర్తి. జ్యేష్ఠ రా.గం.8:21. ధృతి ఉ.గం.8:59. కింస్తుఘ్నం సా.గం.5:59. అహస్సు ఘ.27:28. వర్జ్యం రా.తె.గం.5:13ల 6:22వ. అమృ ఉ.గం.10:43ల 12:28వ. భు.ఘ.4:8:48. మ.దు.11:30ల 12:14వ. 10/12 సా.05:00 శు.పాడ్యమి గురు ఘ.1:32, ఉ.గం.6:59. మూల రా.గం.10:54. శూల ఉ.గం.9:21. బవ ఉ.గం.6:59. అహస్సు ఘ.27:28. వర్జ్యం శేషం ఉ.గం.6:22ల 6:59వ. పునః రా.గం.9:08ల 10:54వ. అమృ ప.గం.2:50ల 4:36వ. భు.ఘ.4:20:8. ఉ.దు.10:03ల 10:47వ. మ.దు.2:26ల 3:10వ. చంద్రదర్శనం (నెలపొడుపు)11/12 ప.03:30 శు.విదియ శుక్ర ఘ.6:54, ఉ.గం.9:09. పూర్వాషాఢ రా.గం.1:33. గండ ఉ.గం.9:53. కౌలవ ఉ.గం.9:09. అహస్సు ఘ.27:28. వర్జ్యం ఉ.గం.9:46ల 11:32వ. అమృ రా.గం.8:13ల 9:59వ. భు.ఘ.4:31:28. ఉ.దు.8:36ల 9:20వ. మ.దు.12:15ల 12:59వ. రంభావ్రతం12/12 సా.05:40 శు.తదియ శని ఘ.12:18, ప.గం.11:19. ఉత్తరాషాఢ రా.తె.గం.4:07. వృద్ధి ఉ.గం.10:26. గరజి ప.గం.11:19. అహస్సు ఘ.27:26. వర్జ్యం ఉ.గం.10:25ల 12:11వ. అమృ రా.గం.9:20ల 10:48వ. భు.ఘ.4:42:48. ఉ.దు.6:24ల 7:52వ.13/12 ప.11:40 శు.చవితి ఆది ఘ.17:3, ప.గం.1:14. శ్రవణం పూర్తి. ధ్రువం ఉ.గం.10:52. భద్ర ప.గం.10:14. అహస్సు ఘ.27:26. వర్జ్యం ఉ.గం.8:35ల 10:21వ. అమృ రా.గం.7:15ల 9:01వ. భు.ఘ.4:54:8. సా.దు.3:56ల 4:40వ.14/12 సా.06:30 శు.పంచమి సోమ ఘ.21:44, ప.గం.3:07. ధనిష్ఠ పూర్తి. వ్యాఘాతం ఉ.11:05. బాలవ ప.గం.3:07. అహస్సు ఘ.27:26. వర్జ్యం ఉ.గం.10:45ల 12:29వ. అమృ రా.గం.9:07ల 10:49వ. భు.ఘ.5:5:28. ప.దు.12:17ల 1:01వ. పునః ప.2:28ల 3:12వ. నాగపంచమీ15/12 రా.07:30 శు.షష్ఠి మంగళ ఘ.25:05, ప.గం.4:28. ధనిష్ఠ ఉ.గం.8:23. హర్షణం ప.గం.11:01. తైతుల ప.గం.4:28. అహస్సు ఘ.27:24. వర్జ్యం ప.గం.4:01ల 5:41వ. అమృ రా.గం.2:12ల 3:54వ. భు.ఘ.5:16:48. ఉ.దు.8:37ల 9:23వ. రా.దు.10:37ల 11:21వ. 16/12 ఉ.09:30 శు.సప్తమి బుధ ఘ.27:10, సా.గం.5:18. శతభిషం ఉ.గం.9:51. వజ్రం ఉ.గం.10:35. వనిక్ సా.గం.5:18. అహస్సు ఘ.27:24. వర్జ్యం ప.గం.4:32ల 6:12వ. అమృ రా.గం.2:34ల 4:14వ. భు.ఘ.5:28:8. పు.భు.5:34. మ.దు.11:34ల 12:18వ. మూల 1 రవిః 07:13. ప్రవేశదినే ధనుస్సంక్రమణం మిత్రసప్తమీ, నందాసప్తమీ17/12 ప.11:15 శు.అష్టమి గురు ఘ.28:01, సా.గం.5:39. పూర్వాభాద్ర ఉ.గం.10:56. సిద్ధి ఉ.గం.9:48. బవ సా.గం.5:39. అహస్సు ఘ.27:24. వర్జ్యం రా.గం.8:45ల 10:23వ. భు.ఘ.00:5:4. ఉ.దు.10:06ల 10:50వ. మ.దు.2:29ల 3:13వ. కాలభైరవాష్టమీ18/12 రా.08:30 శు.నవమి శుక్ర ఘ.27:39, ప.గం.5:31. ఉత్తరాభాద్ర ప.గం.11:29. వ్యతీపాత ఉ.గం.8:35. కౌలవ ప.గం.5:31. అహస్సు 27:24. వర్జ్యం రా.గం.11:30ల 1:06వ. అమృ ఉ.గం.6:34ల 8:12వ. భు.ఘ.00:15:5. ఉ.దు.8:39ల 9:23వ. మ.దు.12:19ల 1:13వ.19/12 ప.02:30 శు.దశమి శని ఘ.25:53, సా.గం.4:49. రేవతి ప.గం.11:32. వరీయాన్ ఉ.7:00. పరిఘ తె.గం.5:18. గరజి సా.గం.4:49. అహస్సు ఘ.27:24. వర్జ్యం లేదు. అమృ ఉ.గం.9:09ల 7:15వ. పునః రా.తె.గం.4:04ల 5:38వ. భు.ఘ.00:25:26. ఉ.దు.6:28ల 7:56వ.20/12 ప.11:25 శు.ఏకాదశి ఆది ఘ.23:08, ప.గం.3:43. అశ్విని ప.గం.11:09. శివం రా.గం.2:50. భద్ర ప.గం.3:43. అహస్సు ఘ.27:24. వర్జ్యం ఉ.గం.7:13ల 8:47వ. పునః రా.8:26ల 9:59వ. అమృ తె.గం.5:43ల 7:16వ. భు.ఘ.00:36:47. సా.దు.3:58ల 4:42వ. ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి21/12 సా.06:45 శు.ద్వాదశి సోమ ఘ.19:20, ప.గం.2:12. భరణి ఉ.గం.10:22. సిద్ధం రా.గం.12:12. బాలవ ప.గం.2:12. అహస్సు ఘ.27:24. వర్జ్యం రా.గం.9:48ల 11:20వ. అమృ ఉ.గం.7:16ల 8:46వ. భు.ఘ.00:47:38. ప.దు.12:19ల 1:03వ. పునః ప.2:31ల 3:15వ.22/12 సా.05:00 శు.త్రయోదశి మంగళ ఘ.14:45, ప.గం.12:23. కృత్తిక ఉ.గం.9:15. సాధ్యం రా.గం.9:22. తైతుల ప.గం.12:23. అహస్సు ఘ.27:22. వర్జ్యం రా.గం.12:21ల 1:51వ. అమృ ఉ.గం.6:58ల 8:30వ. పునరమ తె.గం.4:53ల 6:23వ. భు.ఘ.00:58:29. ఉ.దు.8:40ల 9:24వ. రా.దు.10:39ల 11:23వ. హనుమద్వ్రతం23/12 సా.04:40 శు.చతుర్దశి బుధ ఘ.9:36, ఉ.గం.10:19. రోహిణి ఉ.7:54. మృగశిర తె.గం.6:22. శుభం సా.6:22. వనిక్ ఉ.గం.10:09. అహస్సు ఘ.27:22. వర్జ్యం ప.గం.1:08ల 2:37వ. రా.గం.10:07ల 11:37వ. భు.ఘ.1:9:20. మ.దు.11:37ల 12:21వ. దత్తజయంతీ, పాషాణచతుర్దశీ, నోములకు పౌర్ణమి24/12 సా.06:00 ఝ శు.పౌర్ణమి గురు ఘ.3:57, ఉ.గం.8:05.బహుళ పాడ్యమి ఘ.54:11, తె.గం.5:45. ఆర్ద్ర రా.గం.4:42. శుక్లం ప.గం.3:17. బవ ఉ.గం.8:05. బాలవ సా.గం.6:55. అహస్సు ఘ.27:22. వర్జ్యం ప.గం.2:12ల 3:41వ. అమృ రా.గం.7:15ల 9:44వ. భు.ఘ.1:20:11. ఉ.దు.10:09ల 11:53వ. మ.దు.2:32ల 3:16వ. యాగకాలం25/12 సా.05:45 బ.విదియ శుక్ర ఘ.52:07, రా.గం.3:21. పునర్వసు రా.గం.3:00. బ్రహ్మం ప.గం.12:07. తైతుల సా.గం.4:33. అహస్సు ఘ.27:22. వర్జ్యం ప.గం.3:51ల 5:20వ. అమృ రా.గం.12:46ల 2:15వ. భు.ఘ.1:31:2. ఉ.దు.8:41ల 9:25వ. మ.దు.12:20ల 1:04వ.26/12 సా.06:30 బ.తదియ శని ఘ.46:26, రా.గం.1:05. పుష్యమి రా.గం.1:24. ఐంద్రం ఉ.9:00. వైధృతి తె.గం.6:00. వనిక్ ప.గం.2:13. అహస్సు ఘ.27:24. వర్జ్యం ప.గం.10:29ల 11:58వ. అమృ సా.గం.7:26ల 8:55వ. భు.ఘ.1:41:53. ఉ.దు.6:31ల 7:59వ.27/12 సా.06:30 బ.చవితి ఆది ఘ.41:6, రా.గం.10:57. ఆశ్లేష రా.గం.11:58. విష్కంభం రా.గం.2:56. బవ ప.గం.12:00. అహస్సు ఘ.27:24. వర్జ్యం ప.గం.1:26ల 2:56వ. అమృ రా.గం.10:27ల 11:57వ. భు.ఘ.1:52:44. సా.దు.4:02ల 4:46వ. సంకటహర చతుర్థి28/12 సా.06:00 బ.పంచమి సోమ ఘ.36:18, రా.గం.9:03. మఘ రా.గం.10:44. ప్రీతి రా.గం.12:12. కౌలవ ప.గం.10:01. అహస్సు ఘ.27:14. వర్జ్యం ప.గం.11:22ల 12:52వ. అమృ రా.గం.8:08ల 9:38వ. భు.ఘ.2:3:35. ప.దు.12:23ల 1:07వ. పునః ప.2:34ల 3:18వ.29/12 సా.06:00 బ.షష్ఠి మంగళ ఘ.32:21, సా.గం.7:28. పుబ్బ రా.గం.9:50. ఆయుష్మాన్ రా.గం.9:43. గరజి ఉ.గం.8:16. అహస్సు ఘ.27:24. వర్జ్యం ఉ.గం.6:26ల 7:58వ. పునః తె.గం.4:52ల 6:26వ. అమృ రా.తె.గం.3:40ల 5:12వ. భు.ఘ.2:14:26. ఉ.దు.8:44ల 9:28వ. రా.దు.10:44ల 11:28వ.30/12 సా.05:00 బ.సప్తమి బుధ ఘ.29:13, సా.గం.6:14. ఉత్తర రా.గం.9:16. సౌభాగ్యం రా.గం.7:32. విష్టి ఉ.గం.6:50. అహస్సు ఘ.27:24. వర్జ్యం తె.గం.5:38ల 6:34వ. అమృ ప.గం.2:14ల 3:48వ. భు.ఘ.2:25:17. మ.దు.11:41ల 12:25వ. 31/12 సా.06:00 బ.అష్టమి గురు ఘ.27:17, సా.గం.5:29. హస్త రా.గం.9:12. శోభ సా.గం.5:45. కౌలవ సా.గం.5:21. అహస్సు ఘ.27:24. వర్జ్యం ఉ.గం.6:34ల 7:14వ. పునః తె.గం.5:18ల 6:35వ. అమృ ప.గం.3:13ల 4:49వ. భు.ఘ.2:36:8. ఉ.దు.10:14ల 10:58వ. మ.దు.2:37ల 3:21వ.01/01 సా.03:30 బ.నవమి శుక్ర ఘ.25:26, సా.గం.4:45. చిత్త రా.గం.9:32. అతిగండ సా.గం.4:14. గరజి సా.గం.4:45. అహస్సు ఘ.27:26. వర్జ్యం ఉ.గం.6:35ల 6:55వ. పునః రా.తె.3:20ల 5:00వ. అమృ ప.గం.3:03ల 4:40వ. భు.ఘ.2:46:59. ఉ.దు.8:47ల 9:31వ. మ.దు.12:26ల 1:10వ.02/01 సా.06:00 బ.దశమి శని ఘ.26:56, సా.గం.5:21. స్వాతి రా.గం.10:23. సుకర్మ ప.గం.3:08. భద్ర సా.గం.5:21. అహస్సు ఘ.27:26. వర్జ్యం రా.తె.గం.4:17ల 5:58వ. అమృ ప.గం.1:17ల 2:56వ. భు.ఘ.2:57:50. ఉ.దు.6:35ల 8:03వ.03/01 సా.07:00 బ.ఏకాదశి ఆది ఘ.28:41, సా.గం.6:03. విశాఖ రా.గం.11:39. ధతి ప.గం.2:27. బాలవ సా.గం.6:03. అహస్సు ఘ.27:26. వర్జ్యం రా.తె.గం.3:57ల 5:41వ. అమృ ప.గం.2:23ల 4:04వ. భు.ఘ.3:8:41. సా.దు.4:07ల 4:51వ. 04/01 సా.07:00 బ.ద్వాదశి సోమ ఘ.31:43, రా.గం.7:17. అనురాధ రా.గం.1:34. శూల ప.గం.2:09. కౌలవ ఉ.గం.6:39. అహస్సు ఘ.27:26. వర్జ్యం లేదు. అమృ ప.గం.2:20ల 4:04వ. భు.ఘ.3:19:32. ప.దు.12:28ల 1:12వ. పునః ప.2:39ల 3:23వ.05/01 సా.06:00 బ.త్రయోదశి మంగళ ఘ.35:48, రా.గం.8:55. జ్యేష్ఠ రా.గం.3:44. గండ ప.గం.2:10. గరజి ఉ.గం.8:06. అహస్సు ఘ.27:28. వర్జ్యం ఉ.గం.7:40ల 9:25వ. అమృ సా.గం.6:08ల 7:53వ. భు.ఘ.3:30:23. ఉ.దు.8:48ల 9:32వ. రా.దు.10:47ల 11:31వ.06/01 సా.04:50 బ.చతుర్దశి బుధ ఘ.40:41, రా.గం.10:52. మూల రా.తె.గం.6:13. వృద్ధి ప.గం.2:27. విష్టి ఉ.గం.9:54. అహస్సు ఘ.27:28. వర్జ్యం ప.గం.12:34ల 2:20వ. పునః రా.తె.4:27ల 6:13వ. అమృ రా.గం.11:09ల 12:55వ. భు.ఘ.3:41:14. మ.దు.11:44ల 12:28వ.07/01 సా.06:00 ∙బ.అమావాస్య గురు ఘ.46:6, రా.గం.1:02. పూర్వాషాఢ పూర్తి. ధ్రువం ప.గం.2:55. చతుష్పాత్ ప.గం.11:57. అహస్సు ఘ.27:30. వర్జ్యం సా.గం.4:52ల 6:38వ. అమృ రా.తె.గం.3:32ల 5:18వ. భు.ఘ.3:52:5. ఉ.దు.10:17ల 11:01వ. మ.దు.2:41ల 3:25వ. తర్పణాలకు అమావాస్యస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, జనవరి 15 నుండి ఉత్తరాయనం హేమంతఋతువు, పుష్య మాసం08/01 రా.08:45 శుద్ధ పాడ్యమి శుక్ర ఘ.51:36, రా.గం.1:15. పూర్వాషాఢ ఉ.గం.8:53. వ్యాఘాతం ప.గం.3:28. కింస్తుఘ్నం ప.గం.2:09. అహస్సు ఘ.27:30. వర్జ్యం సా.గం.5:44ల 7:30వ. అమృ రా.తె.గం.4:22ల 6:08వ. భు.ఘ.4:2:53. ఉ.దు.8:49ల 9:33వ. మ.దు.12:29ల 1:13వ. యాగకాలం.09/01 ఉ.11:15 శు.విదియ శని ఘ.56:31, రా.తె.గం.5:13. ఉత్తరాషాఢ ఉ.గం.11:27. హర్షణం ప.గం.3:57. బవ ప.గం.4:14. అహస్సు ఘ.27:32. వర్జ్యం ప.గం.3:51ల 5:37వ. అమృ రా.గం.2:24ల 4:10వ. భు.ఘ.4:13:44. ఉ.దు.6:37ల 8:05వ. చంద్రదర్శనం.10/01 ఉ.08:00 శు.తదియ ఆది పూర్తి. శ్రవణం ప.గం.1:50. వజ్రం ప.గం.4:14. తైతుల సా.గం.6:05. అహస్సు ఘ.27:32. వర్జ్యం సా.గం.6:10ల 7:54వ. అమృ రా.గం.4:35ల 6:19వ. భు.ఘ.4:24:35. సా.దు.4:10ల 4:54వ.11/01 ఉ.07:00 శు.తదియ సోమ ఘ.00:49, ఉ.గం.6:57. ధనిష్ఠ ప.గం.3:53. సిద్ధి ప.గం.4:16. గరజి ఉ.గం.6:57. అహస్సు ఘ.27:32. వర్జ్యం రా.గం.11:35ల 1:17వ. భు.ఘ.4:35:26. ప.దు.12:30ల 1:14వ. పునః ప.2:42ల 3:26వ.12/01 ఉ.10:30 శు.చవితి మంగళ ఘ.4:04, ఉ.గం.7:15. శతభిషం సా.గం.5:31. వ్యతీపాత ప.గం.3:57. భద్ర ఉ.గం.7:15. అహస్సు ఘ.27:34. వర్జ్యం రా.గం.12:14ల 1:55వ. అమృ ప.గం.9:49ల 11:31వ. భు.ఘ.4:46:17. సిజేరియన్ ప.12:00. ఉ.దు.8:50ల 9:34వ. రా.దు.10:50ల 11:34వ.13/01 ఉ.07:00 శు.పంచమి బుధ ఘ.6:06, ఉ.గం.8:03. పూర్వాభాద్ర సా.గం.6:41. వరీయాన్ ప.గం.3:18. బాలవ ఉ.గం.8:03. అహస్సు ఘ.27:36. వర్జ్యం రా.తె.గం.4:33ల 6:11వ. అమృ ప.గం.10:18ల 11:59వ. భు.ఘ.4:57:8. మ.దు.11:47ల 12:31వ.14/01 ప.11:00 శు.షష్ఠి గురు ఘ.6:53, ఉ.గం.9:23. ఉత్తరాభాద్ర సా.గం.7:20. పరిఘ ప.గం.2:14. తైతుల ఉ.గం.9:23. అహస్సు ఘ.27:36. వర్జ్యం లేదు. అమృ ప.గం.2:25ల 4:03వ. భు.ఘ.5:7:59. పు.భు.5:18. ఉ.దు.10:19ల 11:03వ. మ.దు.2:44ల 3:28వ. మకరే రవిః రా.తె.3:06. ప్రవేశాత్ మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాలః భోగి, మకర సంక్రమణం15/01 ఉ.07:00 శు.సప్తమి శుక్ర ఘ.6:18, ఉ.గం.9:09. రేవతీ రా.గం.7:32. శివం ప.గం.12:46. వనిక్ ఉ.గం.9:09. అహస్సు ఘ.27:38. వర్జ్యం ఉ.గం.7:26ల 9:03వ. అమృ ప.గం.1:06ల 2:43వ. భు.ఘ.00:01:24. ఉ.దు.8:51ల 9:35వ. మ.దు.12:36ల 1:16వ. ఉత్తరాషాఢ 2 రవిః రా.తె.3:06. సంక్రాంతి. తర్పణాలకు ప.3:06 వరకు పుణ్యకాలం.16/01 ప.12:00 శు.అష్టమి శని ఘ.4:35, ఉ.గం.8:28. అశ్విని రా.గం.7:13. సిద్ధం ఉ.గం.10:56. బవ ఉ.గం.8:28. అహస్సు ఘ.27:40. వర్జ్యం ప.గం.3:16ల 4:51వ. పునః తె.గం.4:32ల 6:05వ. అమృ ప.గం.12:07ల 1:42వ. భు.ఘ.00:10:54. ఉ.దు.6:38ల 8:06వ. కనుమ17/01 ఉ.09:00 శు.నవమి ఆది ఘ.1:40, ఉ.గం.7:18. శు.దశమి ఘ.56:24, తె.గం.5:52. భరణి సా.గం.6:31. సాధ్యం ఉ.గం.8:44. శుభం తె.గం.6:19. కౌలవ ఉ.గం.7:18. తైతుల సా.గం.6:35. అహస్సు ఘ.27:40. వర్జ్యం రా.తె.గం.6:00ల 6:38వ. అమ ప.గం.1:52ల 3:25వ. భు.ఘ.00:20:24. సా.దు.4:14ల 4:58వ.18/01 సా.07:00 శు.ఏకాదశి సోమ ఘ.53:33, రా.తె.గం.4:03. కృత్తిక సా.గం.5:30. శుక్లం రా.తె.గం.4:37. వనిక్ సా.గం.4:58. అహస్సు ఘ.27:42. వర్జ్యం శేషం ఉ.గం.6:38ల 7:32వ. అమృ ప.గం.3:12ల 4:44వ. భు.ఘ.0:29:44. ప.దు.12:33ల 1:18వ. పునః ప.2:46ల 3:31వ. మతత్రయ పుత్రదా ఏకాదశి, రైవతమన్వాది19/01 రా.07:50 శు.ద్వాదశి మంగళ ఘ.48:04, రా.గం.1:52. రోహిణి ప.గం.4:10. బ్రహ్మం రా.గం.12:38. బవ ప.గం.2:57. అహస్సు ఘ.27:44. వర్జ్యం ఉ.గం.8:37ల 10:07వ. పునః రా.గం.9:22ల 10:51వ. అమృ ప.గం.1:09ల 2:39వ. పునఃతె.గం.6:16ల 6:38వ. భు.ఘ.0:39:24. ఉ.దు.8:51ల 9:36వ. రా.దు.10:54ల 11:39వ. కూర్మద్వాదశీ20/01 రా.08:00 శు.త్రయోదశి బుధ ఘ.41:53, రా.గం.11:23. మృగశిర ప.గం.2:27. ఐంద్రం రా.గం.9:33. కౌలవ ప.గం.12:37. అహస్సు ఘ.27:44. వర్జ్యం రా.గం.10:21ల 11:51వ. అమృ ఉ.గం.6:38ల 7:45వ. పునః తె.గం.3:36ల 5:06వ. భు.ఘ.0:48:54. మ.దు.11:49ల 12:34వ.21/01 రా.06:45 శు.చతుర్దశి గురు ఘ.36:29, రా.గం.9:14. ఆర్ద్ర ప.గం.1:01. వైధతి సా.గం.6:24. గరజి ఉ.గం.10:18. అహస్సు ఘ.27:46. వర్జ్యం రా.గం.12:11ల 1:40వ. భు.ఘ.0:58:24. ఉ.దు.10:120ల 11:05వ. మ.దు.2:47ల 3:32వ.22/01 ఉ.08:00 ఝ శు.పౌర్ణమి శుక్ర ఘ.30:34, రా.గం.6:52. పునర్వసు ప.గం.11:21. విష్కంభం ప.గం.3:15. విష్టి ఉ.గం.8:02. అహస్సు ఘ.27:48. వర్జ్యం రా.గం.6:52ల 8:21వ. అమృ ఉ.గం.9:07ల 10:36వ. పునరమ తె.గం.3:46ల 5:16వ. భు.ఘ.1:7:54. ఉ.దు.8:52ల 9:37వ. మ.దు.12:34ల 1:19వ. 23/01 సా.06:00 బహుళ పాడ్యమి శని ఘ.24:54, ప.గం.4:36. పుష్యమి ఉ.గం.9:44. ప్రీతి ప.గం.12:10. కౌలవ ప.గం.4:36. అహస్సు ఘ.27:50. వర్జ్యం రా.గం.9:44ల 11:14వ. శ్రాద్ధతిథి పాడ్యమి. భు.ఘ.1:17:24. ఉ.దు.6:38ల 8:07వ. 24/01 సా.06:50 బ.విదియ ఆది ఘ.19:36, ప.గం.2:28. ఆశ్లేష ఉ.గం.8:15. ఆయుష్మాన్ ఉ.గం.9:11. సౌభాగ్యం తె.గం.6:15. గరజి ప.గం.2:28. అహస్సు ఘ.27:52. వర్జ్యం రా.గం.7:36ల 9:06వ. అమృ ఉ.గం.6:45ల 8:15వ. పునరమ తె.గం.4:47ల 6:17. భు.ఘ.1:26:54. సా.దు.4:18ల 5:03వ.25/01 ప.12:00 బ.తదియ సోమ ఘ.14:51, ప.గం.12:36. మఘ ఉ.గం.6:58. పుబ్బ రా.తె.గం.5:52. శోభ రా.తె.గం.3:42. భద్ర ప.గం.12:36. అహస్సు ఘ.27:52. వర్జ్యం ప.గం.2:36ల 4:08వ. అమృ రా.గం.11:47ల 11:19వ. భు.ఘ.1:36:24. ప.దు.12:35ల 1:20వ. పునః ప.2:49ల 3:34వ. సంకటహర చతుర్థి26/01 ప.11:00 బ.చవితి మంగళ ఘ.10:57, ప.గం.11:01, ఉత్తర తె.గం.5:10. అతిగండ రా.గం.1:23. బాలవ ప.గం.11:01. అహస్సు ఘ.27:54. వర్జ్యం ప.గం.12:51ల 2:24వ. అమృ రా.గం.10:13ల 11:46వ. భు.ఘ.1:45:54. ఉ.దు.8:52ల 9:36వ. రా.దు.10:56ల 11:41వ.27/01 ప.09:50 బ.పంచమి బుధ ఘ.7:57, ఉ.గం.9:49. హస్త తె.గం.5:00. సుకర్మ రా.గం.11:28. తైతుల ఉ.గం.9:49. అహస్సు ఘ.27:56. వర్జ్యం ప.గం.1:31ల 3:06వ. అమృ రా.గం.11:02ల 12:37వ. భు.ఘ.1:55:24. మ.దు.11:51ల 12:36వ.28/01 సా.07:15 బ.షష్ఠి గురు ఘ.6:04, ఉ.గం.9:04. చిత్త తె.గం.5:11. ధతి రా.గం.9:50. వనిక్ ఉ.గం.9:04. అహస్సు ఘ.27:58. వర్జ్యం ప.గం.1:04ల 2:41వ. అమృ రా.గం.10:44ల 12:21వ. భు.ఘ.2:4:54. ఉ.దు.10:21ల 11:06వ. మ.దు.2:50ల 3:35వ.29/01 సా.04:00 బ.సప్తమి శుక్ర ఘ.5:19, ఉ.గం.8:45. స్వాతి తె.గం.5:57. శూల రా.గం.8:38. బవ ఉ.గం.8:45. అహస్సు ఘ.28:00. వర్జ్యం ప.గం.10:57ల 12:36వ. అమృ రా.గం.9:52ల 11:31వ. భు.ఘ.2:14:24. ఉ.దు.8:52ల 9:37వ. మ.దు.12:36ల 1:21వ.30/01 సా.06:00 బ.అష్టమి శని ఘ.5:55, ఉ.గం.8:59. విశాఖ పూర్తి. గండ రా.గం.7:48. కౌలవ ఉ.గం.8:59. అహస్సు ఘ.28:02. వర్జ్యం ప.గం.11:52ల 1:33వ. అమృ రా.గం.9:59ల 11:40వ. భు.ఘ.2:23:54. ఉ.దు.6:37ల 8:07వ.31/01 సా.07:00 బ.నవమి ఆది ఘ.7:52, ఉ.గం.9:46. విశాఖ ఉ.గం.7:17. వృద్ధి రా.గం.7:24. గరజి ఉ.గం.9:46. అహస్సు ఘ.28:04. వర్జ్యం ప.గం.11:34ల 1:17వ. అమృ రా.గం.9:50ల 11:33వ. భు.ఘ.2:33:24. సా.దు.4:22ల 5:07వ.01/02 సా.06:50 బ.దశమి సోమ ఘ.10:52, ఉ.గం.10:58. అనురాధ ఉ.గం.9:00. ధ్రువం రా.గం.7:18. భద్ర ఉ.గం.10:58. అహస్సు ఘ.28:6వర్జ్యం ప.గం.3:05ల 4:49వ. అమృ రా.గం.11:32ల 11:16వ. భు.ఘ.2:42:54. ప.దు.12:36ల 1:21వ. పునః ప.2:51ల 3:36వ.02/02 సా.05:40 బ.ఏకాదశి మంగళ ఘ.15:00, ప.గం.12:37. జ్యేష్ఠ ప.గం.11:06. వ్యాఘాతం రా.గం.7:33. బాలవ ప.గం.12:37. అహస్సు ఘ.28:08. వర్జ్యం రా.గం.7:55ల 9:41వ. అమృ తె.గం.6:29ల 6:36వ. భు.ఘ.2:52:24. ఉ.దు.8:51ల 9:36వ. రా.దు.10:58ల 11:43వ.03/02 ప.09:50 బ.ద్వాదశి బుధ ఘ.19:55, ప.గం.2:34. మూల ప.గం.1:30. హర్షణం రా.గం.7:56. తైతుల ప.గం.2:24. అహస్సు ఘ.28:10. వర్జ్యం ప.గం.11:46ల 1:30వ. పునః రా.గం.12:08ల 1:54వ. అమృ శేషం ఉ.గం.6:36ల 8:15వ. భు.ఘ.3:1:54. మ.దు.11:52ల 12:37వ.04/02 సా.04:30 బ.త్రయోదశి గురు ఘ.25:14, ప.గం.4:42. పూర్వాషాఢ ప.గం.4:06. వజ్రం రా.గం.8:30. వనిక్ సా.గం.4:42. అహస్సు ఘ.28:12. వర్జ్యం రా.గం.12:59ల 2:45వ. అమృ ఉ.గం.10:47ల 12:33వ. భు.ఘ.3:11:24. ఉ.దు.10:26ల 11:11వ. మ.దు.2:52ల 3:37వ. మాసశివరాత్రి05/02 సా.06:00 బ.చతుర్దశి శుక్ర ఘ.30:46, సా.గం.6:53. ఉత్తరాషాఢ సా.గం.6:42. సిద్ధి రా.గం.8:36. శకుని సా.గం.6:93. అహస్సు ఘ.28:14. వర్జ్యం రా.గం.11:07ల 12:53వ. అమృ ప.గం.10:09ల 11:55వ. భు.ఘ.3:20:54. ఉ.దు.8:51ల 9:36వ. మ.దు.12:37ల 1:22వ.06/02 సా.06:00 ∙బ.అమావాస్య శని ఘ.35:42, రా.గం.8:52. శ్రవణం రా.గం.9:09. వ్యతీపాత రా.గం.9:24. చతుష్పాత్ ఉ.గం.7:52. అహస్సు ఘ.28:16. వర్జ్యం రా.గం.1:31ల 3:15వ. అమృ ప.గం.9:42ల 11:28వ. భు.ఘ.3:30:24. ఉ.దు.6:34ల 8:04వ.స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, శశిరఋతువు, మాఘ మాసం07/02 ప.11:45 శుద్ధ పాడ్యమి ఆది ఘ.40:24, రా.గం.10:44. ధనిష్ఠ రా.గం.11:17. వరీయాన్ రా.గం.9:32. కింస్తుఘ్నం ఉ.గం.9:47. అహస్సు ఘ.28:18. వర్జ్యం లేదు. అమృ ప.గం.11:57ల 1:41వ. భు.ఘ.3:39:54. సా.దు.4:23ల 5:08వ. యాగకాలం, శ్యామలా నవరాత్రి ప్రారంభం08/02 రా.1:30 శు.విదియ సోమ ఘ.43:02, రా.గం.11:47. శతభిషం రా.గం.1:03. పరిఘ రా.గం.9:23. బాలవ ప.గం.11:15. అహస్సు ఘ.28:20. వర్జ్యం ఉ.గం.7:01ల 8:44వ. అమృ సా.గం.5:19ల 7:02వ. భు.ఘ.3:49:24. ప.దు.12:37ల 1:22వ. పునః ప.2:53ల 3:38వ. చంద్రదర్శనం09/02 సా.06:00 శు.తదియ మంగళ ఘ.45:00, రా.గం.12:34. పూర్వాభాద్ర రా.గం.2:31. శివం రా.గం.8:52. తైతుల ప.గం.12:10. అహస్సు ఘ.28:22. వర్జ్యం ఉ.గం.7:48ల 9:29వ. అమృ సా.గం.5:56ల 7:37వ. భు.ఘ.3:58:54. ఉ.దు.8:50ల 9:35వ. రా.దు.10:57ల 11:42వ. 10/02 సా.05:00 శు.చవితి బుధ ఘ.45:33, రా.గం.12:47. ఉత్తరాభాద్ర రా.గం.3:07. సిద్ధం రా.గం.7:54. వనిక్ ప.గం.12:40. అహస్సు ఘ.28:24. వర్జ్యం ప.గం.12:16ల 1:55వ. అమృ రా.గం.10:10ల 11:48వ. భు.ఘ.4:8:24. మ.దు.11:52ల 12:37వ. 11/02 సా.06:00 శు.పంచమి గురు ఘ.44:56, రా.గం.12:32. రేవతి రా.తె.గం.3:26. సాధ్యం సా.గం.6:35. బవ ప.గం.12:40. అహస్సు ఘ.28:26. వర్జ్యం ప.గం.3:16ల 4:53వ. అమృ రా.గం.1:00ల 2:37వ. భు.ఘ.4:17:54. ఉ.దు.10:22ల 11:07వ. మ.దు.2:55ల 3:40వ. శ్రీపంచమీ, వసంతోత్సవం12/02 రా.06:45 శు.షష్ఠి శుక్ర ఘ.42:58, రా.గం.11:45. అశ్విని రా.గం.3:11. శుభం సా.గం.4:52. కౌలవ ప.గం.12:09. అహస్సు ఘ.28:28. వర్జ్యం రా.గం.11:14ల 12:49వ. అమృ రా.గం.8:04ల 9:39వ. భు.ఘ.4:27:24. ఉ.దు.8:51ల 9:36వ. మ.దు.12:39ల 1:24వ.13/02 ప.12:00 శు.సప్తమి శని ఘ.39:59, రా.గం.10:33. భరణి రా.గం.2:35. శుక్లం ప.గం.2:49. గరజి ప.గం.11:09. అహస్సు ఘ.28:30. వర్జ్యం ప.గం.1:01ల 2:35వ. అమృ రా.గం.10:51ల 12:25వ. భు.ఘ.4:46:54. పు.భు.4:40. ఉ.దు.6:33ల 8:04వ. ధని 3 రవిః ప.1:55 ప్రవేశదినే కుంభ సంక్రమణం, రథసప్తమీ, సూర్యజయంతీ14/02 ప.11:45 శు.అష్టమి ఆది ఘ.35:54, రా.గం.8:55. కృత్తిక రా.గం.1:34. బ్రహ్మం ప.గం.12:26. విష్టి ఉ.గం.9:43. అహస్సు ఘ.28:32. వర్జ్యం ప.గం.2:05ల 3:37వ. అమృ రా.గం.11:18ల 12:50వ. భు.ఘ.00:5:46. సా.దు.4:27ల 5:12వ. భీష్మాష్టమీ15/02 రా.08:00 శు.నవమి సోమ ఘ.31:17, రా.గం.7:03. రోహిణి రా.గం.12:19. ఐంద్రం ఉ.గం.9:51. బాలవ ఉ.గం.7:58. అహస్సు ఘ.28:34. వర్జ్యం సా.గం.4:45ల 6:15వ. పునః తె.5:30ల 6:31వ. అమృ రా.గం.9:17ల 10:47వ. భు.ఘ.00:14:5. ప.దు.12:38ల 1:24వ. పునః ప.2:55ల 1:24వ. 16/02 రా.08:00 శు.దశమి మంగళ ఘ.25:58, ప.గం.4:54. మృగశిర రా.గం.10:49. వై«ధృతి ఉ.గం.6:56. విష్కంభం తె.గం.3:56. గరజి ప.గం.4:54. అహస్సు ఘ.28:37. వర్జ్యం శేషం ఉ.గం.6:31ల 7:00వ. అమృ ప.గం.2:34ల 4:04వ. భు.ఘ.00:22:24. ఉ.దు.8:47ల 9:33వ. రా.దు.10:59ల 11:45వ.17/02 ఉ.09:50 శు.ఏకాదశి బుధ ఘ.20:17, ప.గం.2:37. ఆర్ద్ర రా.గం.9:11. ప్రీతి రా.గం.12:35. భద్ర ప.గం.2:37. అహస్సు ఘ.28:40. వర్జ్యం ఉ.గం.6:38ల 8:07వ. అమృ ప.గం.11:52ల 1:21వ. భు.ఘ.00:30:43. మ.దు.11:51ల 12:37వ. మతత్రయ భీష్మ ఏకాదశి.18/02 ప.04:40 శు.ద్వాదశి గురు ఘ.14:51, ప.గం.12:26. పునర్వసు రా.గం.7:31. ఆయుష్మాన్ రా.గం.9:40. బాలవ ప.గం.12:26. అహస్సు ఘ.28:42. వర్జ్యం ఉ.గం.8:21ల 9:50వ. పునః వర్జ్యం రా.2:58ల 4:27వ. అమృ సా.గం.4:17ల 5:46వ. భు.ఘ.00:39:02. ఉ.దు.10:20ల 11:06వ. మ.దు.2:56ల 3:42వ. 19/02 సా.04:00 శు.త్రయోదశి శుక్ర ఘ.8:30, ఉ.గం.9:54. పుష్యమి సా.గం.5:53. సౌభాగ్యం సా.గం.6:33. తైతుల ఉ.9:54. అహస్సు ఘ.28:44. వర్జ్యం రా.తె.గం.5:52ల 6:30వ. అమృ ప.గం.11:55ల 1:24వ. భు.ఘ.00:47:21.ఉ.దు.8:48ల 9:34వ. మ.దు.12:38ల 1:24వ. వరాహకల్పం20/02 ప.02:40 శు.చతుర్దశి శని ఘ.2:45, ఉ.గం.7:36. శు.పౌర్ణమి ఘ.54:87, తె.గం.5:23. ఆశ్లేష ప.గం.4:20. శోభ ప.గం.3:32. వనిక్ ఉ.గం.7:36. విష్టి సా.గం.6:30. అహస్సు ఘ.28:46. వర్జ్యం శేషం ఉ.గం.6:30ల 7:22వ. పునః తె.గం.3:41ల 5:11వ. అమృ రా.గం.2:50ల 4:20వ. భు.ఘ.00:55:40. ఉ.దు.6:30ల 8:02వ. 21/02 ప.03:00 బహుళ పాడ్యమి ఆది ఘ.52:33, రా.గం.3:30. మఘ ప.గం.3:00. అతిగండ ప.గం.12:40. బాలవ సా.గం.5:04. అహస్సు ఘ.28:48. వర్జ్యం రా.గం.10:39ల 12:10వ. అమృ ప.గం.12:44ల 2:14వ. భు.ఘ.1:3:59. సా.దు.4:28ల 5:14వ.22/02 సా.07:00 బ.విదియ సోమ ఘ.48:32, రా.గం.1:53. పుబ్బ ప.గం.1:55. సుకర్మ ఉ.గం.8:48. తైతుల ప.గం.2:43. అహస్సు ఘ.28:50. వర్జ్యం రా.గం.8:54ల 10:27వ. అమృ ఉ.గం.7:48ల 8:20వ. పునరమ తె.గం.6:13ల 6:27వ. భు.ఘ.1:12:18. ప.దు.12:36ల 1:22వ. పునః ప.2:55ల 3:41వ.23/02 సా.05:00 బ.తదియ మంగళ ఘ.45:42, రా.గం.12:44. ఉత్తర ప.గం.1:11. «ధృతి ఉ.గం.7:36. శూల తె.గం.5:25. వనిక్ ప.గం.1:18. అహస్సు ఘ.28:52. వర్జ్యం రా.గం.9:28ల 11:03వ. అమృ శేషం ఉ.గం.6:27ల 7:46వ. భు.ఘ.1:20:37. ఉ.దు.8:45ల 9:31వ. రా.దు.10:58ల 11:44వ. యాగకాలం, వసంతోత్సవం, చూతకుసుమభక్షణం 24/03 సా.04:30 బ.విదియ బుధ ఘ.20:10, ప.గం.2:09. చిత్త రా.గం.8:30. గరజి ప.గం.2:09. ధ్రువం ఉ.గం.10:41. అహస్సు ఘ.30:04. వర్జ్యం రా.గం.1:01ల 2:39వ. అమృ ప.గం.2:05ల 3:41వ. భు.ఘ.1:10:34. మ.దు.11:37ల 12:25వ.25/03 ప.11:15 బ.తదియ గురు ఘ.20:33, ప.గం.2:18. స్వాతి రా.గం.8:58. వ్యాఘాతం ఉ.గం.8:52. భద్ర ప.గం.2:18. అహస్సు ఘ.30:06. వర్జ్యం రా.గం.8:49ల 10:29వ. అమృ ప.గం.12:00ల 1:38వ. భు.ఘ.1:18:32. ఉ.దు.10:07ల 10:55వ. మ.దు.2:55ల 3:43వ. సంకటహర చతుర్థి26/03 ఉ.07:00 బ.చవితి శుక్ర ఘ.20:03, ప.గం.2:05. విశాఖ రా.గం.9:59. హర్షణం ఉ.గం.8:13. బాలవ ప.గం.2:05. అహస్సు ఘ.30:08. వర్జ్యం రా.గం.2:14ల 3:57వ. అమృ ప.గం.12:48ల 1:28వ. భు.ఘ.1:26:30. ఉ.దు.8:29ల 9:17వ. మ.దు.12:30ల 1:18వ.27/03 ఉ.11:00 బ.పంచమి శని ఘ.21:53, ప.గం.2:49. అనురాధ రా.గం.11:27. వజ్రం ఉ.గం.7:12. తైతుల ప.గం.2:49. అహస్సు ఘ.30:10. వర్జ్యం రా.తె.గం.5:31ల 6:03వ. అమృ ప.గం.12:25ల 2:07వ. భు.ఘ.1:34:28. ఉ.దు.6:04ల 7:40వ.28/03 ఉ.08:30 బ.షష్ఠి ఆది ఘ.24:58, సా.గం.4:02. జ్యేష్ఠ రా.గం.1:24. సిద్ధి ఉ.గం.6:57. వనిక్ సా.గం.4:42. అహస్సు ఘ.30:12. వర్జ్యం శేషం ఉ.గం.6:03ల 7:15వ. అమృ సా.గం.3:53ల 5:37వ. భు.ఘ.1:42:26. సా.దు.4:31ల 5:19వ.29/03 ఉ.07:20 బ.సప్తమి సోమ ఘ.28:59, సా.గం.5:38. మూల రా.గం.3:39. వ్యతీపాత ఉ.గం.7:02. బవ సా.గం.5:38. అహస్సు ఘ.30:14. వర్జ్యం ప.గం.10:08ల 11:53. పునః రా.1:54ల 3:39వ. అమృ రా.గం.8:39ల 10:24వ. భు.ఘ.1:50:24. ప.దు.12:30ల 1:19వ. పునః ప.2:55ల 3:44వ. 30/03 ఉ.09:50 బ.అష్టమి మంగళ ఘ.33:52, రా.గం.7:34. పూర్వాషాఢ పూర్తి. వరీయాన్ ఉ.గం.7:22. బాలవ ఉ.గం.6:36. అహస్సు ఘ.30:17. వర్జ్యం ప.గం.2:17ల 4:03వ. అమృ రా.గం.12:55ల 2:41వ. భు.ఘ.1:58:16. ఉ.దు.8:28ల 9:17వ. రా.దు.10:54ల 11:43వ.31/03 ఉ.07:00 బ.నవమి బుధ ఘ.39:07, రా.గం.9:40. పూర్వాషాఢ ఉ.గం.6:14. పరిఘ ఉ.గం.7:55. తైతుల ఉ.గం.8:37. అహస్సు ఘ.30:20. వర్జ్యం ప.గం.3:06ల 4:52వ. అమృ రా.గం.1:45ల 3:31వ. భు.ఘ.2:6:14. మ.దు.11:47ల 12:36వ.01/04 ఉ.11:30 బ.దశమి గురు ఘ.44:19, రా.గం.11:44. ఉత్తరాషాఢ ఉ.గం.8:50. శివం ఉ.గం.8:30. వనిక్ ఉ.గం.10:41. అహస్సు ఘ.30:22. వర్జ్యం ప.గం.1:16ల 3:02వ. అమృ రా.గం.11:53ల 1:39వ. భు.ఘ.2:14:12. ఉ.దు.10:02ల 10:51వ. మ.దు.2:53ల 3:42వ.02/04 ప.02:00 బ.ఏకాదశి శుక్ర ఘ.49:09, రా.గం.1:19. శ్రవణం ప.గం.11:22. సిద్ధం ఉ.గం.8:53. విష్టి ప.గం.12:41. అహస్సు ఘ.30:24. వర్జ్యం ప.గం.3:45ల 5:30వ. అమృ రా.గం.2:17ల 4:02వ. శ్రాద్ధతిథి ఏకాదశి. భు.ఘ.2:22:10. ఉ.దు.8:25ల 9:14వ. మ.దు.12:27ల 1:18వ. మతత్రయ పాపమోచనీ ఏకాదశి03/04 సా.06:30 బ.ద్వాదశి శని ఘ.53:7, రా.గం.3:13. ధనిష్ఠ ప.గం.1:40. సాధ్యం ఉ.గం.9:24. కౌలవ ప.గం.2:25. అహస్సు ఘ.30:27. వర్జ్యం రా.గం.9:27ల 11:11వ. భు.ఘ.2:30:8. ఉ.దు.5:58ల 7:35వ.04/04 సా.06:30 బ.త్రయోదశి ఆది ఘ.56:7, రా.తె.గం.4:24. శతభిషం ప.గం.3:36. శుభం ఉ.గం.9:28. గరజి ప.గం.3:48. అహస్సు ఘ.30:30. వర్జ్యం రా.గం.10:24ల 12:06వ. అమృ ఉ.గం.7:49ల 9:33వ. భు.ఘ.2:38:6. సా.దు.4:30ల 5:19వ.05/04 సా.07:00 బ.చతుర్దశి సోమ ఘ.57:40, రా.తె.గం.5:00. పూర్వాభాద్ర సా.5:04. శుక్లం ఉ.గం.9:12. విష్టి సా.గం.3:41. అహస్సు 30:33. వర్జ్యం తె.3:05ల 4:45వ. అమృ ఉ.గం.8:35ల 10:17వ. భు.2:46:4. ప.దు.12:28ల 1:17వ. పునః దు.2:54ల 3:43వ. మాసశివరాత్రి06/04 ప.12:30 ∙బ.అమావాస్య మంగళ ఘ.58:14, రా.తె.గం.5:13. ఉత్తరాభాద్ర సా.గం.6:05. బ్రహ్మం ఉ.గం.8:33. చతుష్పాత్ సా.గం.5:06. అహస్సు 30:35. వర్జ్యం లేదు. అమృ ప.గం.1:05ల 2:45వ. భు.2:54:2. ఉ.దు.8:23ల 9:12వ. రా.దు.10:52ల 11:41వ.పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336Email: kappagantusomayajulu@gmail.com -
నవనాయక ఫలితాలు (2026– 2027)
రాజు గురువు: ద్విజులు సత్కర్మ నిరతులై ఉందురు. రాజులు, ప్రజలు న్యాయముగా సంచరించెదరు. రాజనీతి బాగుంటుంది. సుభిక్ష క్షేమ ఆరోగ్యములతో ప్రజలు సుఖించెదరు. సస్యానుకూల వృష్టిచే సస్యములు ఫలించును. అందరూ స్వధర్మ ఆచరణలో మంచి బుద్ధి ప్రదర్శించెదరు.మంత్రి కుజుడు: కలహములు, యుద్ధ, చోర, అగ్ని, రోగ భయములు పెరుగును. వాయుపీడ అధికము. వర్షము మధ్యమముగా ఉండును. పంటలకు తెగుళ్ళు రాగలవు. ధాన్యాదుల ధరలు పెరుగును. సేనాధిపతి చంద్రుడు: ఆహార ధాన్యములు, వెండి, బంగారం, బియ్యం, నూనెలు, నెయ్యి, పంచదార, నూలు ధరలు పెరుగును. మంచి వర్షములు ఉండును. సస్యములు బాగుగా ఫలించును. పశువులు క్షీరసమృద్ధి కలిగి ఉండును.సస్యాధిపతి శుక్రుడు: పంటలు బాగుగా పండును. తెల్లని ధాన్యము, తెల్లని భూమి బాగా ఫలించును. దేశమంతటను సుభిక్ష క్షేమారోగ్య సంపదలు ఉండును. సమస్త ధాన్యములు, వస్తువులకు ధరలు సరసమై ఉండును.ధాన్యాధిపతి బుధుడు: మధ్యస్థాయి వర్షములు పంటలు మధ్యస్థాయిగా ఫలించును. జనులకు భయము కలుగును. సూక్ష్మధాన్యములు బాగా ఫలించును.అర్ఘాధిపతి రవి: సువృష్టి సస్యాభివద్ధి కలుగును. ధరలు అధికం అవుతాయి. రాజులు సుఖించెదరు. ప్రజలకు అభివృద్ధి ఉంటుంది. నిత్యావసర సరుకులు ధరలు పెరుగును.మేఘాధిపతి చంద్రుడు: సర్వదేశములందు సువృష్టి. ధాన్యజాతులు అన్నియు ఫలించును. గోవులు విశేషంగా పాలిచ్చును.రసాధిపతి రవి: నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె మొదలగు రస జాతుల ధరలు లేనట్లుండును. ‘‘కార్పాస తైలేక్షు గుడాదికానాః’’ అని పాఠాంతరం ఉన్నది.నీరసాధిపతి శుక్రుడు: కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు అధిక ధరలకే లభించును.-పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
శ్రీ పరాభవ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం
∙డొల్లు కర్తరీ ప్రారంభం: ది.04–05–2026 రా.12:59లకు స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ బహుళ తదియ సోమవారం రోజు డొల్లుకర్తరీ ప్రారంభం. ∙పెద్ద కర్తరీ ప్రారంభం: ది.11–05–2026 రా.11:00లకు వైశాఖ బహుళ నవమి తత్కాల దశమి సోమవారం నిజకర్తరీ (పెద్ద కర్తరీ) ప్రారంభం. ∙కర్తరీ త్యాగం: 29–05–2026 ఉ.7:57 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశీ శుక్రవారం రోజు కర్తరీ త్యాగం అవుతుంది. మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మల ప్రారంభానికి కర్తరీ కాలంలో చేయరాదు. దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట, పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, పైకప్పు పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. ∙రాబోవు ప్లవంగ నామ సంవత్సరం (2027–28) కర్తరీ నిర్ణయము ∙ది.05–05–2027 ప్లవంగ చైత్ర బహుళ చతుర్దశీ బుధవారం డొల్లు కర్తరీ ప్రారంభం. ∙ది.12–05–2027 వైశాఖ శుద్ధ సప్తమీ మంగళ/బుధ నిజ కర్తరీ ప్రారంభం.∙ది.29–05– 2027 వైశాఖ బహుళ నవమీ శనివారం కర్తరీ త్యాగం. (సౌరమానం, చాంద్రమానం బార్హస్పత్య మానం అన్ని పంచాంగాలలోనూ కేవలం మాసం యొక్క ఆరంభం మార్పు తీసుకుంటుంది. చాంద్రమానం వారికి అమావాస్య వెళ్ళిన మరునాడు మాసం ప్రారంభం అవుతుంది. సౌరమానం వారికి రవి సంక్రమణం మరునాటి నుండి మాసం ప్రారంభం అవుతుంది. మిగతా అన్ని అంశాలలోనూ తిథి, వార నక్షత్రాలు ఒక్కటే ఉంటాయి.)-పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27
శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27చైత్ర మాసం మార్చి19 ఉగాది, తెలుగు సంవత్సరాది వసంతనవరాత్రి ప్రా.21 సౌభాగ్యశయినవ్రతం సౌభాగ్య గౌరీవ్రతం శివడోలోత్సవం27 శ్రీరామనవమీ29 ధర్మరాజదశమీ విష్ణుడోలోత్సవం, రుక్మిణీపూజ మతత్రయ (కామద) ఏకాదశి30 వామనద్వాదశీ31 అనంగత్రయోదశీ ఏప్రిల్01 నోములకు పౌర్ణమి02 సావిత్రీవ్రతం, ఇంద్రపూజ05 సంకటహర చతుర్థి07 మత్స్యజయంతీ13 మతత్రయ (వరూధినీ) ఏకాదశి14 మేష సంక్రమణం15 వరాహజయంతీవైశాఖ మాసం18 చంద్రదర్శనం (నెలపొడుపు)20 అక్షయతృతీయ, బలరామజయంతీ21 శంకర జయంతి, నాగచతుర్థీ23 విద్యారణ్య జయంతి, 24 అపరాజితాదేవీపూజ25 చండికాదేవీపూజ26 వాసవి జయంతి27 అన్నవరం సత్యదేవ కళ్యాణం, మోహినీ ఏకాదశి28 పరశురామద్వాదశీ30 నృసింహజయన్తీమే01 మహావైశాఖీ, సంపద్గౌరీవ్రతం11 హనుమజ్జయంతీ 15 వృషభ సంక్రమణంఅధిక జ్యేష్ఠ మాసం18 చంద్రదర్శనం జూన్15 మిథున సంక్రమణంనిజజ్యేష్ఠ మాసం16 చంద్రదర్శనం 25 మతత్రయ నిర్జల ఏకాదశి29 సావిత్రీవ్రతం, వృషభపూజజులై10 మతత్రయ యోగినీ ఏకాదశి11 కూర్మజయంతీ14 వటసావిత్రీవ్రతంఆషాఢ మాసం15 చంద్రదర్శనం 16 జగన్నాథ రథయాత్ర17 కర్కాటక సంక్రమణం20 కుమారషష్ఠీ25 తొలిఏకాదశీఆగస్టు09 మతత్రయ కామిక ఏకాదశిశ్రావణ మాసం14 చంద్రదర్శనం 16 నాగపూజ (నాగచతుర్థీ)21 వరలక్ష్మీవ్రతం, సెప్టెంబర్04 శ్రీకృ ష్ణ జన్మాష్టమీ 11 పోలాల అమావాస్య భాద్రపద మాసం12 చంద్రదర్శనం 14 వినాయకచతుర్థీ గణపతినవరాత్రి ప్రారంభం15 ఋషిపంచమీ17 కన్య సంక్రమణం27 మహాలయపక్ష ప్రారంభః29 ఉండ్రాళ్ళతద్ది, మహాభరణీ (పితృతిథి)అక్టోబర్10 మహాలయ అమావాస్యఆశ్వీయుజ మాసం12 చంద్రదర్శనం 16 సరస్వతీపూజా ప్రారంభం17 దేవీత్రిరాత్రవ్రతం18 మహాష్టమీ, దుర్గాష్టమీ తుల సంక్రమణం19 మహానవమీ20 విజయదశమీ, శమీపూజ28 అట్లతద్దె, లలితాదేవీయాత్రనవంబర్08 దీపావళీ, లక్ష్మీపూజ09 కేదారవ్రతం, ఆకాశదీప ప్రారంభంకార్తీక మాసం10 అఖండదీప ప్రారంభం చంద్రదర్శనం 13 నాగచతుర్థీ17 వృశ్చిక సంక్రమణం21 క్షీరాబ్ధిద్వాదశీ, 24 కార్తీక వ్రతోద్యాపనం తులస్యుద్వాసనండిసెంబర్04 మతత్రయ (ఉత్పన్నా) ఏకాదశి05 గోవత్సద్వాదశీమార్గశిర మాసం15 స్కందషష్ఠీ16 ధనుస్సు సంక్రమణం20 ముక్కోటి ఏకాదశి గీతా జయంతి22 హనుమద్వత్రం23 దత్తజయంతి జనవరిపుష్యమాసం09 చంద్రదర్శనం 14 భోగి, మకర సంక్రమణం15 సంక్రాంతి16 కనుమఫిబ్రవరిమాఘ మాసం11 శ్రీపంచమీ వసంతోత్సవం13 రథసప్తమీ కుంభ సంక్రమణం14 భీష్మాష్టమీ17 భీష్మ ఏకాదశీమార్చి06 మహాశివరాత్రి, మాసశివరాత్రిఫాల్గుణ మాసం09 చంద్రదర్శనం 15 మీన సంక్రమణం20 కామదహనం22 హోలికాపూర్ణిమ, హోలీ23 వసంతోత్సవంఏప్రిల్06 తర్పణాలకు అమావాస్య -పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
శ్రీ పరాభవ నామ సంవత్సర రాశిఫలాలు...
మేష రాశి ఆదాయం11, వ్యయం5, రాజయోగం2, అవమానం4.అశ్విని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)కృత్తిక 1వ పాదము (ఆ)విశేష గౌరవ మర్యాదలు అందుకుంటారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే విషయంలో శ్రద్ధ వహించరు. అనవసర విషయాలతో సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఏలినాటి శని ప్రభావంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపాలు ఉంటాయి. ఆర్థికంగా క్రమక్రమంగా మంచి మార్పులు ఉంటాయి. ఖర్చులు అదుపు చేయలేరు. వస్త్రాభరణ వాహనాదుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు. కొత్త ఋణాలు సమయానికి అందుబాటు అవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన రీతిగా ప్రమోషన్ లు ఉండవు. స్థానచలన ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ప్రతిపనిలోనూ శ్రమ, ఒత్తిడి ఎక్కువవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులకు ఒత్తిడి పెరిగినా, లాభదాయకంగానే ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు శుభ పరిణామాలు. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు వేగవంతం అవుతాయి. షేర్ వ్యాపారులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం, కాలం అధికంగా ఖర్చు అవుతాయి. కోర్టు వ్యవహారాలలో చిక్కులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల ప్రయత్నాలు జోరుగా సాగుతాయి. స్త్రీలకు ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్య రక్షణ, కుటుంబ రక్షణలో విజయవంతం అవుతారు. గర్భిణులకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. అశ్విని: ఉద్యోగంలో అధికారుల సహాయ నిరాకరణ ఎదురవుతుంది. బంధువులతో తరచుగా కలçహాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు విఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలలో అసంతృప్తి ఎదురవుతుంది. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకొని అవమానపడుతుంటారు.భరణి: ఆగ్రహావేశాలు ప్రదర్శించి, కలహాలలో చిక్కుకుంటారు. అన్ని అంశాలలో అగౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల జోలికి పోతే సమస్యలు తప్పవు. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలకు విఘ్నాలు ఎదురవుతాయి.కృత్తిక: ఓర్పు నేర్పులతో సాధించుకుంటూ ముందుకు వెడతారు. పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకార్యాలలో పాల్గొనడం ద్వారా ధనవ్యయం అధికంగా చేస్తుంటారు. నమ్మించి మోసం చేసేవారు అధికంగా ఉంటారు. వాహన మరమ్మతుల కోసం తరచు ధనవ్యయం అవుతుంది.శాంతి మార్గం: శనికి జప దాన తర్పణలు చేయిస్తూ ఉండండి. రోజూ శివాలయంలో ప్రదోష కాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. సుందరకాండ, గజేంద్రమోక్షం పారాయణ, పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. 10వ తేదీ తరువాత దూర ప్రయాణాలు విరమిస్తే మంచిది. ధనం వెసులుబాటు ఇబ్బందికరం అవుతూ ఉంటుంది. అధికారుల సహకారం తగ్గుతుంది. బుద్ధి చురుకుగా పనిచేసినా, పనులు శ్రమతో పూర్తవుతాయి. కొత్త ఋణాలు చేయడం మంచిది కాదు. వృథా కాలక్షేపాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య రీత్యా ఖర్చు పెరుగుతుంది. మే: తెలివి, ధైర్యం ఉన్నా, చాలా విషయాల్లో పనులు సానుకూలం కావు. ఆదాయ మార్గాలు బాగానే ఉన్నా, అనవసర ఖర్చులు నియంత్రించలేరు. ఆర్థిక వ్యవహారాలలో కుటుంబసభ్యులతో విభేదాలు రాగలవు. ఋణ సౌకర్యం బాగుంటుంది. ఆరోగ్యం చికాకు సృష్టిస్తుంది. విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు గురుబలం అనుకూలం. జూన్: పనుల్లో ఆటంకాలు ఉంటాయి. 8వ తేదీ తరువాత మంచి మార్పులు. 20 తేదీ నుంచి కాలం ఇంకా బాగుంటుంది. 20వ తేదీ లోపల ఆరోగ్యం బాగా చూసుకోవాలి. అన్ని వ్యవహారాలలోనూ మంచి సలహాలు అందుతాయి. ఇతరులకు సలహాలిచ్చి అవమానాలు పొందుతారు. తరచు దేవాలయ సందర్శన చేస్తారు. జులై: కుటుంబ వ్యవహారాలను బాగా చక్కదిద్దుతారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య స్నేహ బంధం బాగుంటుంది. వృత్తి విషయాలలో అధికారులకు, వర్కర్స్కు మధ్య బంధం బాగా ఉంటుంది. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలు స్వయంగా చేసుకోవడం మంచిది. ఆర్థిక విషయాలను స్వయంగా చక్కబెట్టుకుంటారు. గౌరవ మర్యాదలు పొందుతారు.ఆగస్ట్: వృత్తి విషయంలో ఆధిపత్యం సాధిస్తారు. కుటుంబ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. విద్యార్థులకు కాలం అనుకూలం. కోర్టు విషయాలు, శుభకార్య విషయాలు సానుకూలం. నూతన వస్తువుల కొనుగోలుకు అధిక ధనవ్యయం చేస్తారు. సెప్టెంబర్: అనవసర సంచారం పెరుగుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య పరిరక్షణ కారణంగా కొంతకాలం ఏ పనిలోనూ సమయపాలన కుదరదు. అధికారులు సహకరిస్తారు. ఋణాలు తీర్చే విషయంలో మాట నిలబెట్టుకోలేరు. 18వ తేదీ తరువాత మంచి మార్పులు ఉంటాయి. ఇతరుల పొరపాట్లకు మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అక్టోబర్: కొన్నిసార్లు శారీరక శ్రమ, కొన్నిసార్లు మానసిక చికాకులతో ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా వ్యవహరించినా, వారికి మంచి ఫలితాలు దక్కక ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. ఖర్చుల నియంత్రణ మీద దృష్టి పెట్టాలి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రాంతాలకు స్వయంగా వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదు. నవంబర్: ప్రతిపని సమస్యాత్మకం అవుతూ ఉంటుంది. ఉద్యోగ భద్రత మీద దృష్టి ఉంచండి. కుటుంబ విషయాలు సాధారణ స్థాయిగా ఉంటాయి. మనసుకు ఆనందం ఇచ్చే వార్తలు వింటారు. రోజువారీ పనుల్లో కూడా సొంత నిర్ణయాలు, సమయపాలన లేకపోవడం ఉంటాయి. పుణ్యకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు వేగం పుంజుకుంటాయి. డిసెంబర్: పనులేవీ సరిగా సాగవు. ప్రధానంగా కుటుంబ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. నూతన ప్రయత్నాలు సరిగా ఉండవు. కావలసిన వనరులు లభ్యంకాక వ్యాపారం ఇబ్బందికరం అవుతుంది. ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి పెడతారు. సమస్యలు పెరుగుతాయి. ధనం సర్దుబాటు కాకపోవడం వల్ల కొన్ని పనులను మధ్యలోనే వదిలేస్తారు. మాటతీరు నియంత్రించుకోవలసిన కాలం. జనవరి: ఆర్థిక లావాదేవీలను విజయవంతంగా నడుపుతారు. ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర ఫలితాలు అందుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొని సుఖపడతారు. చాలా ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. వీలైనంత వరకు మితభాషణ చేస్తూ ఉండండి. కొత్త ఋణాలు చేయవద్దు. ఫిబ్రవరి: అన్ని అంశాలలోను పురోగతి ఉంటుంది. తేలికగా పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. అందరి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతికూలత ఉన్న పనులు కూడా ఈ నెలలో ప్రారంభిస్తే సానుకూలం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో స్థానచలనం, ప్రమోషన్లు వంటివి ఆశించినట్లయితే, ఈ నెలలోనే వాటికి ప్రయత్నం ప్రారంభించాలి. మార్చి: ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిని దాటవేస్తారు. అధికారుల అండదండలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. శుభకార్య పుణ్యకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలంకరణ వస్తువులు, వాహనాల కొనుగోలు విషయాలలో దృష్టి పెంచుతారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండవలసిన కాలం. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు ఉంటాయి. వృషభ రాశిఆదాయం–5, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–4కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)మృగశిర 1,2 పాదములు (వే,వో)నిబద్ధతతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు విరోధం ఎక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి ధర్మ కార్యాచరణ చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తుంటారు. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి వార్తలు సంతోషం కలిగిస్తాయి. శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఆదాయ వ్యయాలను అదుపులోకి తెచ్చుకుంటారు. వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అలంకరణ వస్తువుల కొనుగోలు ఖర్చు పెరుగుతుంది. ఫైనాన్స్ వాప్యారులు లాభాలు అందుకుంటారు. సకాలంలో ఋణాలు దొరుకుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగ కార్యకలాపాలలో తెలివిగా వ్యవహరిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగ వ్యవహారాలలో తెలివితేటలతో, ధైర్య సాహసాలతో వ్యవహరించి ఊహకు అందని లాభాలను అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలతో కూడిన శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు శ్రమతో లాభాలు పొందుతారు. అధికారుల నుంచి సహకారం తక్కువ ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో సహకారం అందుతుంది. షేర్ వ్యాపారులకు దినదినాభివృద్ధిగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కోర్టు వ్యవహారాలు ఏదో రీతిలో పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు సమర్థతకు తగిన గుర్తింపు వస్తుంది. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలకు గ్రహానుగ్రహం బాగుంది. కృత్తిక 2, 3, 4: ఎన్నో విజయాలు సాధిస్తారు. నరఘోష తరచుగా అనుభవిస్తారు. బంధువులతో పొరపొచ్చాలు ఎదురు కావచ్చు. మాటతీరు నియంత్రించుకోవడం లాభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు బాగుంటాయి.రోహిణి: వృత్తిరీత్యా దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్య వంతులైన కుటుంబసభ్యులకు కావలసిన వసతులు సమకూరుస్తారు. ఏదో తెలియని మానసిక చికాకులు వెంటాడుతుంటాయి. బంధుమిత్రుల ద్వారా నరఘోషకు గురవుతారు.మృగశిర 1, 2: ఆటంకాలు ఎదురైనా, ప్రారంభించిన ప్రతిపనిలోనూ విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం సహకరించడం, పిల్లల వలన శుభ పరిణామాలు, కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం అనుకూలంగా ఉండడం వల్ల ఆనందంగా ఉంటారు. శాంతి మార్గం : రోజూ గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేయడం శుభప్రదం. దక్షిణామూర్తి స్తోత్రం రోజూ పారాయణ చేయడం ద్వారా విజయశాతం పెరుగుతుంది. అక్టోబర్లో రాహు కేతువులకు జప, దాన, తర్పణలతో పాటు తెల్లటి పుష్పాలతో అమ్మవారి అర్చన, సప్తముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: ఉద్యోగ, వ్యాపారాలలో అంతా సానుకూలం. కుటుంబంలో చికాకులు వస్తాయి. తెలివిగా సరిచేస్తారు. ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తపడతారు. తరచు మానసిక ఒత్తిడి ఉంటుంది. కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. విజయాలు సాధించి, గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన వాహనాలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. మే: వాతావరణ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి కేంద్రీకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 15వ తేదీ తరువాత పనులు వేగంగా చేయలేని పరిస్థితి ఉంటుంది. వద్దు అనుకుంటూనే అనేక ప్రయాణాలు చేస్తారు. స్నేహితులు, బంధువులతో వ్యవహార సమస్యలు సానుకూలం కాగలవు. జూన్: చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. సంబంధం లేని సమస్యలు రాగలవు. రోజువారీ పనులు కూడా సరిగా చేయలేరు. ఇతరుల వ్యవహారములలో కలుగచేసుకోవద్దు. ఆరోగ్య, ఋణ, కలహ విషయాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుతుంది. వ్యాపారులకు పనివారితో సమస్యలు ఎక్కవవుతాయి. ముఖ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని వ్యవహారాలలోను మంచి సలహాలు పొందుతారు. జులై: ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం కాపాడుకుంటారు. ఉద్యోగ భద్రత ఉంటుంది. పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారులు తమ ఆలోచనలను అమలు చేయగలుగుతారు. ఒక్కోసారి పెంపుడు జంతువుల సేవల కోసం ముఖ్యమైన పనులు ఆలస్యం చేస్తుంటారు. ఆగస్ట్: పనులు వేగంగా సాగినా, శ్రమాధిక్యం ఉంటుంది. వాహన, యంత్రాల మరమ్మతులకు అధిక వ్యయం జరుగుతుంది. పుణ్య, శుభకార్యాలలో బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యం సమస్యల విషయంలో వైద్యులను కలవడం శ్రేయస్కరం. గృహోపకరణాల కొనుగోలుకు ధనవ్యయం అవుతుంది. కోర్టు, ఇతర వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. సెప్టెంబర్: తరచు ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో సాధారణ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు అంతా శుభప్రదం. దూర ప్రయాణాలు చేస్తారు. ఋణాలు తీర్చేందుకు అవకాశాలు ఉండవు. ఓర్పుగా వ్యవహరించడం మంచిది. మార్కెటింగ్ ఉద్యోగులు, విద్యార్థులకు శ్రమాధిక్యం. ప్రతిరోజూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అక్టోబర్: కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. వాహనాలు అలంకరణ వస్తువుల కొనుగోలు గురించి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడండి. పిత్రార్జిత ఆస్తి వ్యవహారాలలో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. అధికారుల సహకారం బాగా ఉంటుంది. చదువు బాగా సాగుతుంది. మీ తెలివిని అందరూ గుర్తిస్తారు. నవంబర్: పెద్దల ఆరోగ్య విషయంగానూ, పిల్లల అభివృద్ధి విషయంలోనూ అసంతృప్తిగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో మొండిగా ఉంటారు. కోపావేశాలు నియంత్రించుకోవాలి. అవయవ ప్రతికూలతలు ఉంటాయి. వైద్యపరంగా అనవసర ఖర్చు ఉంటుంది. బంధుమిత్రులతో పాత విషయములలో కలహములు రాగలవు. పిల్లల విషయంలో ప్రత్యేక పర్యవేక్షణ ఉంచండి. డిసెంబర్: మామూలు పనులు కూడా ఒత్తిడితో పూర్తవుతాయి. ఉద్యోగ భద్రత ఉంటుంది. పనులు స్వయంగా చేసుకుంటే వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఋణాలను సకాలంలో చెల్లించకుంటే, ఇబ్బందులు తప్పవు. తరచు తలెత్తే అజీర్ణ సమస్యలు భయం కలిగిస్తాయి. జనవరి: నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. దూర ప్రయాణాలను విరమించండి. కుటుంబ, వృత్తి విషయాలకు సమయం సమతూకంగా కేటాయించలేక ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి. ఋణ సౌకర్యం బాగానే ఉంటుంది కాని, అది పొందకపోవడం భవిష్యత్కు మంచిది. ఫిబ్రవరి: తరచుగా భోజన సౌకర్యం లోపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో అనవసరంగా అధికారుల నుంచి, తోటివారి నుంచి మాట పడతారు. ఆర్థిక, కుటుంబ విషయాలు అనుకూలం. సమయపాలన లోపించి, పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అవమానకర సంఘటనలు ఎదురు కాకుండా వ్యవహరించండి. మార్చి: అప్రయత్నంగా కొన్ని వ్యవహారములు సానుకూలం అవుతాయి. ఉద్యోగాలలో పనులు తెలివిగా చేస్తారు. ఎంతో శ్రమతో ఆర్థిక సమస్యలను పరిష్కరించుకో గలుగుతారు. అన్ని విషయాలలో కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. అనవసర కాలక్షేపాలు చేయరు. కుటుంబ, వృత్తి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చిన వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యా వ్యాసంగంలో వారికి కాలం అనుకూలం.మిథున రాశిఆదాయం– 8, వ్యయం– 11, రాజయోగం– 1, అవమానం– 7.మృగశిర 3,4 పాదములు (కా, కి)ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)వృథా కాలక్షేపాలకు అవకాశం ఇవ్వవద్దు. కుటుంబ విషయాలలో అనుకూలత ఉన్నా, సంవత్సరాంతంలో తెలియని భయానికి గురవుతారు. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలలో పాల్గొంటారు. ఆర్థిక కార్యకలాపాలలో సానుకూలత. విఘ్నాలు ఎదురైనా, పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు అధికంగా చేయవలసి ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారులకు అక్టోబర్ వరకు అనుకూలం. సంవత్సరం ద్వితీయార్ధంలో ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య పరిస్థితులు అక్టోబర్ వరకు బాగుంటాయి. అక్టోబర్ నుంచి మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులకు అధికారుల మందలింపులు ఎక్కువ అవుతాయి. స్థానచలనం, ప్రమోషన్లలో సానుకూలతలు తక్కువ. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులు ఏడాది ప్రథమార్ధంలో ఒత్తిడి లేకుండా వ్యాపారం చేస్తారు. ద్వితీయార్ధంలో ఒత్తిడికి లోనవుతారు. మార్కెటింగ్ ఉద్యోగుల స్థితి కూడా ఇలాగే ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలకు అక్టోబర్ వరకు అద్భుతమైన కాలం. షేర్ వ్యాపారులకు మధ్యమధ్యలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు సంవత్సరాంతంలో అనాలోచితంగా ప్రవర్తించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో శుభపరిణామాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఒత్తిడి కలిగిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో మోసపోయే అవకాశాలు ఎక్కువ. ఈ రాశి స్త్రీలకు అక్టోబర్ వరకు సానుకూలంగానూ, అక్టోబర్ తర్వాత మానసిక ఒత్తిడితోనూ ఉంటుంది. శ్రమతో పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు పనివారితో ఇబ్బందులు. గర్భిణులు సాధారణస్థాయి జాగ్రత్తలు పాటించి మంచి ఫలితాలు పొందుతారు.మృగశిర 3, 4: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా అక్టోబర్ తరువాత పుణ్య, సామాజిక కార్యక్రమాలకు విరాళాల వంటివి హామీ ఇవ్వవద్దు. దూరప్రాంత ప్రయాణాలు కూడా చేయవద్దని సూచన. వృథా కాలక్షేపాలు, అనవసర శ్రమ ఎక్కువ చేస్తారు.ఆరుద్ర: కుటుంబ విషయంలో సరైన నిర్ణయాలు జరగవు. వృథా ఖర్చులు నియంత్రించలేని స్థితి. సంవత్సరం ద్వితీయార్ధంలో విచిత్రస్థితిని ఎదుర్కొంటారు. మానసిక ఇబ్బందులు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు శ్రేయస్కరం కాదు. పాత ఆరోగ్య, ఋణ సమస్యలు చికాకులు యిస్తాయి.పునర్వసు 1, 2, 3 : అన్ని అంశాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. ప్రణాళిక లేకుండా ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. గోప్యత పాటించక సొంత విషయాలను బయటపెట్టుకుని, చికాకులు పొందుతారు. అక్టోబర్ తరువాత వృథా కాలక్షేపాలు ఎక్కువ అవుతాయి.శాంతి మార్గం: అక్టోబర్లో రాహు కేతువులకు జప, దాన, తర్పణలు చేయించండి. స్వయంగా దత్తస్తవరాజం, విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం శ్రేయస్కరం. అక్టోబర్ నుంచి దుర్గా సప్తశ్లోకీ పారాయణ ప్రతిరోజూ 11 సార్లు చేయండి. మినుములతో చేసిన పదార్థాలను దానం చేయండి. త్రిముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: చక్కటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ముందు జాగ్రత్తలలో ఆరోగ్య రక్షణ చేసుకుంటారు. పనులు అర్ధాంతరంగా వదిలేయడం వంటివి ఎక్కువవుతాయి. కుటుంబ సభ్యులతో సయోధ్య పెరుగుతుంది. అవరో«ధాలు సృష్టించే సహచరులు ఉంటారు. వృత్తిలో పనివారితో ఒత్తిడి పెరుగుతుంది. తరచుగా వాహన సమస్యలు వస్తాయి. మే: పెండింగ్లో ఉన్న పనులు వేగంగా సాగుతాయి. వాహనాలతోనూ, స్నేహితులతోనూ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు తలెత్తుతాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ప్రయత్నాలన్నీ అధిక వ్యయంతో ముడిపడి ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. జూన్: బంధువులకు అనారోగ్య విషయంగా తరచుగా ప్రయాణాలు చేస్తారు. ఆదాయం బాగానే ఉన్నా, అనవసర వ్యయం ఎక్కువగా చేస్తుంటారు. వృథా ప్రయాణాలు చేస్తుంటారు. అకాల భోజనం నిత్యకృత్యం అవుతుంది. వ్యాపారులు కొత్త కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. జులై: రోజువారీ పనుల్లోను, వృత్తి విషయాల్లోను ఆటంకాలు తప్పవు. ఉద్యోగులకు అధికారుల నుంచి రక్షణ లభించని స్థితి ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తపడండి. వ్యాపారులు బాగా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. కొత్త ఋణాలు దొరకక పోగా, పాత ఋణాలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆగస్ట్: విజ్ఞాన వినోద కార్యాలలో పాల్గొంటారు. అవసరమైన పనులు వాయిదా వేస్తారు. రోజువారీ పనులు ఆలస్యం చేస్తారు. విద్యార్థులకు విద్యాభంగం అనేకసార్లు ఎదురవుతుంది. ఋణ సౌకర్యం అందుకుంటారు. ఎందులోనూ స్థిరబుద్ధి ఉండదు. అనవసర కాలక్షేపాలకు ఆకర్షితులవుతారు. కుటుంబ అవసరాలలో కూడా దృష్టి ఉంచరు. సెప్టెంబర్: ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. అందరి సహాయ సహకారాలతో మాసం చివర్లో విజయాలు సాధిస్తారు. పుణ్య కార్యాలలో ఆటంకాలు ఎదురవుతాయి. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. అలంకరణ వస్తువులు, వాహనాలు తరచు మరమ్మతులకు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చూసుకోవడం మంచిది. అక్టోబర్: కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు, విజ్ఞాన విహారయాత్రలు చేస్తారు. కొన్నిసార్లు అవయవ ప్రతికూలత ఉన్నట్లు భావనలోకి వెడతారు. వృత్తి విషయాలు సానుకూలం. దురలవాట్లు ఉన్నవారికి ఇబ్బందులు రాగలవు. వద్దు అనుకుంటూనే ఇతరులకు ధనం సర్దుబాటు చేస్తారు. ఆరోగ్య, ఆర్థిక వ్యవహారాలలో తెలివిగా మెలగుతారు. నవంబర్: మాట తీరు, నడవడి నియంత్రించుకుంటారు. భార్యా పుత్ర కలహం పెరుగుతుంది. ఉద్యోగం వ్యాపారాలలో తోటివారితో కలహాలు రాగలవు. వాహన మరమ్మతు ఖర్చులు ఉంటాయి. స్వయంగా వాహనాలు నడుపుతూ దూర ప్రయాణములు చేయవద్దు. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ అయినా, పనులు లాభిస్తాయి. డిసెంబర్: కాలం అనుకూలిస్తుంది. గత సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయండి. రోజువారీ పనులు అకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో విజయాలు అందుకుంటారు. సమస్యలు రాకుండా జాగ్రత్తపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. మంచి వ్యక్తులు మీకు మంచి సలహాలు ఇస్తుంటారు. జనవరి: కుటుంబ విషయంలోను, బంధుమిత్రులతోను జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాలు చేయవద్దు. ఆదాయ వ్యయాలపై పూర్తి నియంత్రణకు ప్రయత్నించండి. పాత ఋణములు, పాత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తపడండి. నూతన ప్రయత్నాలు ఆర్భాటంగా మొదలైనా, సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు లేవు.ఫిబ్రవరి: స్థిరచిత్తం ఉంచరు. మొండి ధైర్యంతో అనవసర విషయాలను కదిలిస్తారు. సోమరితనంతో తోటివారితో కలహాలు తెచ్చుకుంటారు. కుటుంబ అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఆర్థిక వనరులు బాగానే సమకూరుతాయి. విజ్ఞాన, వినోద, విహార కార్యక్రమాల వైపు మనసు లాగుతుంది. అత్యవసరమైన పనుల్లో సరిగా దృష్టి ఉంచక ఇబ్బంది పడతారు. మార్చి: ఏ సమస్యనైనా తెలివిగా సాధిస్తారు. బుద్ధి కుశలతతో ఉద్యోగ విధి నిర్వహణలో గౌరవం పెంచుకుంటారు. రాబోవు కాలంలో ప్రమోషన్ ఆశించేరీతి పనితీరు ఉంటుంది. ఆరోగ్యం బాగా కాపాడుకుంటారు. వ్యాపారులు సమస్యలను అధిగమిస్తారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపారాలలో ప్రణాళికతో ఉంటారు. పుణ్య కార్యాలు చేస్తారు. స్థానచలన, ప్రమోష¯Œ లకు ప్రత్యేక ప్రయత్నాలు సాగిస్తారు. విద్యా వ్యాసంగం బాగుంటుంది. కర్కాటక రాశిఆదాయం–2, వ్యయం–11, రాజయోగం–4, అవమానం–7.పునర్వసు 4వ పాదము (హి)పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)దైనందిన కార్యక్రమాలలో సమయపాలన, నియమపాలన లేకుండా వ్యవహరిస్తారు. భార్యాపుత్రల నడవడి మీకు నచ్చక, మీ నడవడి వారికి నచ్చక చికాకులు పొందుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడండి. స్నేహితులతో జాగ్రత్తలు వహించండి. అవసరానికి తగిన ఆదాయం అందదు. ఖర్చులు నియంత్రించలేరు. శుభ కార్యాల వలన ఖర్చులు పెరుగుతాయి. వృథా ఖర్చులు అధికమవుయి. ఋణాల వల్ల ఇబ్బందులు ఎదరవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలం. ఉద్యోగాలలో రావలసిన ప్రమోష¯Œ లకు అడ్డంకులు సృష్టించే వారు ఉంటారు. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. ట్రాన్స్ఫర్ వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కని అవకాశాలు జారిపోతాయి. వ్యాపారులు ఋణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. అవసరానికి కొత్త ఋణాలు సర్దుబాటు కావు. నూతన వ్యాపార ప్రయత్నాలలో ధనవ్యయం అధికం అవుతుంది. షేర్ వ్యాపారులకు లాభాలు ఉన్నా చికాకులు తప్పవు. విద్యార్థులకు శ్రద్ధ లోపిస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ధనవ్యయం, కాలహరణం తప్పవు. కోర్టు వ్యవహారాలు చికాకులను కలిగిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలు కలసిరావు. ఈ రాశి స్త్రీలకు పని ప్రదేశాల్లో తోటివారితోనూ, ఇంట్లోని పనివారితోను ఇబ్బందులు తలెత్తుతాయి. అక్టోబర్ తరువాత మొండి వైఖరి పెరుగుతుంది. గర్భిణులకు అనాలోచిత ప్రవర్తన ఎక్కువ అవుతుంది. జాగ్రత్త పడండి.పునర్వసు 4: పిల్లల నుంచి సహాయ సహకారాలు పెరుగుతాయి. రోజువారీ పనులు సకాలంలో జరుగుతాయి. ఆర్థిక జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో ఆలోచనలను వేగంగా అమలు చేసి జరగవు అనుకున్న పనులను సాధించగలుగుతారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది.పుష్యమి: ఒంటరి ప్రయాణాలు, అనవసర కాలక్షేపాలు మానుకోండి. సంబంధం లేని వ్యవహారాల గురించి సమయం పాడుచేసుకోవడం, అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు జరుగుతాయి.ఆశ్లేష: పుణ్యకార్యాలు చేస్తారు. మానసిక ఒత్తిడిని జయిస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత ఋణ వ్యవహారాలు అక్టోబర్ లోపుగా కొలిక్కి వస్తాయి. అక్టోబర్ తరువాత ఇతరుల నుంచి సహాయ నిరాకరణ పెరుగుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.శాంతి మార్గం: రాహు, కేతువులకు జపదాన హోమాదులు చేయండి. రాహు శాంతికి రోజూ దుర్గా సప్తశ్లోకీ పారాయణ చేయండి. కేతు శాంతికి రోజూ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయండి. మంగళవారాలలో పొయ్యిదానం చేయండి. షణ్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: ఆదాయం ఆలస్యంగా అందుతుంది. ఖర్చులు నియంత్రించలేరు. శరీరం శుష్కించే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. స్థిరాస్తి వ్యవహారాలు సరిగా సాగవు. మనస్పర్థలు, వృథా కాలక్షేపాలు విడనాడిన వారికి సౌఖ్యం ఉంటుంది. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. విద్యార్థులు జాగ్రత్త వహించాలి. మే: ఆదాయం తక్కువగా ఉన్నా, ఖర్చులు నియంత్రించగలుగుతారు. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. స్వేచ్ఛగా సంచరిస్తారు. ద్వితీయార్ధంలో వాహన సంబంధ చికాకులు ఉంటాయి. షేర్ వ్యాపారులకు కాలం బాగుంది. విద్యార్థులకు, రైతులకు ఈ నెల 15 తరువాత అసంతృప్తి ఉంటుంది. కళత్ర అవయోగాలు ఉంటాయి. జూన్: వాహన చికాకులు ఉంటాయి. పనిముట్ల వాడకంలో గాయపడే అవకాశం ఉన్నది. వృథా కాలక్షేపాలు చేస్తారు. మాటతీరు వల్ల కలహాలు, ఆరోగ్య సమస్యలు తరచుగా ఉంటాయి. పెంపుడు జంతువుల వలన ఇబ్బంది ఉంటుంది. చేసిన పనులకు గుర్తింపు దొరకదు. జులై: కొన్నిసార్లు ధైర్యంగా ఉంటారు. కొన్నిసార్లు తెలియని అధైర్యంతో తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ప్రశాంతత తగ్గుతుంది. ఉద్యోగ విధి నిర్వహణలో నిబద్ధత లేక అధికారుల ఆగ్రహావేశాలకు లోనవుతారు. ఆగస్ట్: సందర్భానుసారంగా ప్రవర్తింప లేకపోవడం, అందరినీ దూషించడం వంటి చేష్టలు అధికం అవుతాయి. సహకరిస్తారు అనుకున్న వారు సహకరించని స్థితి ఎదురవుతుంది. కొన్ని ముఖ్య వ్యవహారాలను మరచిపోయే అవకాశం ఉంటుంది. కుటుంబ కార్యక్రమాలలో పాల్గొంటారు. మాట తీరు అదుపులో ఉంచుకోవడం క్షేమం. సెప్టెంబర్: స్థానచలన ప్రయత్నాలు బాగా జరుగుతాయి. ఉద్యోగ వృద్ధిలో ఆటంకాలు ఉంటాయి. తల్లి దండ్రుల ఆరోగ్య విషయంలో చికాకులు రాగలవు. ప్రతి పనిలోనూ ఆర్థిక వెసులుబాటు తక్కువ. వ్యాపారులకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. భార్యాభర్తలకు; యజమానికి, పనివారికి సయోధ్య సరిగా ఉండని కాలం. కొన్ని పాత సమస్యలు సానుకూలం చేసుకుంటారు. అక్టోబర్: కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అనుకూలం. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. అన్ని వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం వలన విజయాలు సాధిస్తారు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటాయి. సమస్యలను ముందే గ్రహంచి. జాగ్రత్తలు పాటిస్తారు. భోజన వసతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ విషయాలకు ప్రాధాన్యం యిస్తారు. నవంబర్: అన్ని వ్యవహారాల్లోనూ సానుకూలత. ఆర్థిక ఇబ్బందులు దాటగలరు. స్నేహితుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శ్రమ ఎక్కువ అవుతుంది. విద్యా వ్యాసంగం బాగా ఉంటుంది. ఋణ వ్యవహారాలలో మాట నిలబెట్టుకోలేరు. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. డిసెంబర్: కాలం అనుకూలం. క్రమంగా చాలా విజయాలు సాధిస్తారు. నూతన ప్రయోగాలు చేస్తారు. కుటుంబంలో మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. ఒక్కో సమస్య పరిష్కరించే క్రమంలో మంచి సలహాలు అందుతాయి. అధికారుల సహకారం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. జనవరి: రోజువారీ పనులలోనూ బుద్ధి స్థిరత్వం ప్రదర్శించలేరు. కుటుంబ సభ్యుల సహకారం మాత్రం బాగుంటుంది. «ఖర్చుల నియంత్రణలో విఫలమవుతారు. పనులు స్వతంత్రంగా చేయడం శ్రేయస్కరం. నూతన ప్రయత్నాలు తగ్గించడం శ్రేయస్కరం. పాత సమస్యల విషయంలో మాత్రమే దృష్టి ఉంచండి. ఇతరులకు చేసే సహకారం ఇబ్బందికరం కాగలదు.ఫిబ్రవరి: వృత్తి్త విషయాలను స్వయంగా చూసుకోకపోతే భవిష్యత్తు ఇబ్బందికరం కాగలదు. ఉద్యోగ విషయాలలో మార్పులకు అవకాశం ఇవ్వవద్దు. ఆదాయం తగ్గుతుంది. కుటుంబ అవసరాలు తీర్చడంలో ఇబ్బంది పడతారు. పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరం. ప్రతిపనిలోనూ అధిక ధనవ్యయం జరుగుతుంది. మార్చి: అత్యవసరమైన వృత్తి విషయాలు సమయ పాలన లేకుండా చేసి ఇబ్బందిపడతారు. ఋణాలు చికాకు పెడతాయి. స్వల్పంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నూతన ప్రయత్నాలకు సానుకూలత లేదు. వృథా ఖర్చు పెరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. తరచుగా వాతావరణ ప్రభావానికి లోనవుతుంటారు.సింహ రాశిఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–7, అవమానం–3.మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)ఉత్తర 1వ పాదము (టే)దైనందిన కార్యక్రమాలలో పనులు సమయానికి పూర్తికావు. కుటుంబ విషయాలలో మీ ప్రవర్తన ఇతర కుటుంబ సభ్యులకు ఇబ్బందికరం కాకుండా జాగ్రత్తపడండి. శుభకార్యాలలో తరచుగా బంధుమిత్రులను కలుస్తుంటారు. రోజువారీ స్నాన భోజన నిద్రాసమయాలు భంగపడేలా అనవసర కాలక్షేపాలు పెరుగుతాయి. పిల్లల వలన ఖర్చు పెరుగుతుంది. విరో«ధాలు ఎక్కువ అవుతాయి. అనవసర భయం పెరుగుతుంది. ఒక అవసరం కోసం ఉంచుకొన్న డబ్బు మరొకదానికి ఖర్చవుతుంది. అనవసర హామీలు ఇవ్వకండి. అక్టోబర్ నుంచి క్రమంగా మంచి మార్పులు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. ఋణ వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ఉద్యోగాలలో సమయపాలన పాటించలేరు. మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి అక్టోబర్ తర్వాత క్రమంగా అనుకూలం. వ్యాపారులకు ద్వితీయార్ధం బాధాకరంగా ఉంటుంది. భాగస్వాములతో విభేదాలు వ్యాపారాలలో ఇబ్బందులు పెంచుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఆటంకాలు అధికం. షేర్ వ్యాపారులు ఓర్పుగా వ్యవహరించాలి. తప్పుడు సలహాలకు ఆకర్షితులై సమస్యలు తెచ్చుకుంటారు. విద్యార్థులకు వృథా కాలక్షేపాలు ఎక్కువవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఆలస్యంగా పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు అందవు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఆర్థిక అనుకూలత ఉండదు. ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వస్తువులు పోగొట్టుకోవడం వంటివి జరుగుతాయి. గర్భిణులు పెద్దలు, వైద్యుల సలహాలు అనుసరించడం మంచిది.మఘ: తెలివి బాగా పని చేస్తుంది. అక్టోబర్ నుంచి తెలివికి ధైర్యం తోడవుతుంది. ఆదాయ వ్యయ ఋణాలను సమతూకంగా నడపలేక శ్రమకు లోనవుతారు. కుటుంబ సభ్యులతో మోసపూరిత వాతావరణం ఉంటుంది.పుబ్బ: మానసికంగా చికాకులకు లోనవుతారు. ప్రయాణాలలో వస్తువులు మరచిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. స్నేహితులతో కలిసి చేసే పనులలో సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చులు అధికం అవుతాయి.ఉత్తర 1: ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోకండి. పనుల్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి. నమ్మినవారు సరిగా సహకరించరు. పనివారు తరచుగా ఇబ్బందులు సృష్టిస్తారు. వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. లాభాలు లేని వ్యాపారం చేయవలసి ఉంటుంది.శాంతి మార్గం: శని రాహు కేతు గురువులకు శాంతి చేయించండి. రోజూ గోపూజ, నవగ్రహ పూజ చేయడం శ్రేయస్కరం. నిత్యం రావిచెట్టు కింద ఆంజనేయస్వామి ఉన్న దేవాలయంలో ‘శ్రీరామ శ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం, చతుర్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: పుణ్యకార్యాలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి విషయాలలో దృష్టి ఉంచలేరు. మాటతీరు నియంత్రించుకోవాలి. ప్రయాణ అసౌకర్యాలు తరచుగా ఉంటాయి. బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సత్ఫలితాలను సాధిస్తారు. మే: ఆగ్రహావేశాలను అదుపు చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో గొప్పగా వ్యవహరిస్తారు. అయితే ఫలితాలు గొప్పగా ఉండవు. రోజువారీ కార్యక్రమాలు సరిగా సాగవు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. జూన్: ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. 20వ తేదీ తర్వాత ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో సరిగా దృష్టి ఉంచలేని స్థితి. శ్రమతో పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సక్సెస్ అవుతారు. జులై: ఉద్యోగరీత్యా తిరుగుడు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు గమనిస్తారు. జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలలో విశేష లాభాలు అందుకుంటారు. సమయపాలన పాటించక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు.ఆగస్ట్: వ్యర్థ ప్రయాణాలు, వ్యర్థ కాలక్షేపాలు విరమించుకోవడం మంచిది. వాహనాలు యంత్ర పరికరాలు ఇబ్బంది పెడతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. స్థిరాస్తులు, వాహనాల అమ్మకాలలో జాగ్రత్తలు పాటించాలి. సెప్టెంబర్: ఆరోగ్యం విషయంలో 18వ తేదీ తరువాత జాగ్రత్త వహించాలి. ఋణ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు 18వ తేదీ వరకు సానుకూలం షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాల్సిన కాలం. విద్యార్థులకు రైతులకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరము. అక్టోబర్: అధికారుల ఆగ్రహావేశాలు ఎక్కువ అవుతాయి. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. బుద్ధి స్థిమితం కోల్పోవుతారు. బంధువులతో కలసి చేసే పనులలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారులకు ఇబ్బందికర ఘటనలు ఎక్కువ అవుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండదు. నవంబర్: బుద్ధి స్థిరత్వం తరచుగా తగ్గుతుంది. ఇతరుల వ్యవహారాలలో కలుగచేసుకోవద్దు. కుటుంబ విషయాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కొత్త ప్రయత్నాలు చేయకండి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. నూతన ఉద్యోగ, వ్యాపారాలలో ప్రయత్నాలు సఫలం అవుతాయి. డిసెంబర్: ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురైనా, వాటిని అధిగమిస్తారు. ఓర్పుగా సమస్యలు దాటగలరు. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. మితభాషణ అవసరం. ఇతరులను నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. పాత ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తిరగ బెట్టకుండా జాగ్రత్తలు పాటించండి. జనవరి: ప్రతి విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం కాదు. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా సాగవు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా సానుకూలం కాదు. ఖర్చులు, అనారోగ్యం ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులకు వచ్చే సమస్యలు మీ పనులను పాడు చేస్తాయి. వాహన సౌకర్యం కూడా సరిగా ఉండదు అనే చెప్పాలి. ఫిబ్రవరి: పాత కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఋణ సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తపడండి. ఆదాయ వ్యయాలు సమన్వయంతో ఉండవు. అధికారుల అనాదరణ, తోటివారితో సహాయ నిరాకరణ వలన పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల మీద ఏమాత్రం ఆధారపడినా ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలు తగ్గించడం శ్రేయస్కరం. మార్చి: తొందరపాటుగా ప్రవర్తించడం మంచిదికాదు. భోజన సౌఖ్యం కొరవడుతుంది. వాహన చికాకులు ఉంటాయి. ఇతరుల నుంచి ఆశించిన రీతిగా సహకారం అందదు. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యం. ఉద్యోగంలో పని బాధ్యత పెరుగుతుంది. వ్యాపారులకు శ్రమ ఎక్కువ, లాభం తక్కువగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉంటుంది. ఋణాలు చేయకపోవడం మంచిది.కన్యా రాశిఆదాయం– 8, వ్యయం– 11, రాజయోగం– 3, అవమానం– 3.ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)చిత్త 1,2 పాదములు (పే, పో)ఈ సంవత్సరం గురువు మి«థునంలో (దశమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (లాభం), అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (వ్యయం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (సప్తమం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (షష్ఠం) కేతువు సింహంలో (వ్యయం); తర్వాత రాహువు మకరంలో (పంచమం) కేతువు కర్కాటకంలో (లాభం) సంచరిస్తారు.రోజువారీ పనులు ఆలస్యమైనా ఆ ప్రభావం ఇతర కార్యక్రమాలపై పడకుండా చూసుకుంటారు. కుటుంబ విషయాలలో సానుకూలం. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనలు. పనులు ఆలస్యమైనా, విజయవంతం. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలు సఫలం. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కొత్త కొత్త ఖర్చులు పెరుగుతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. తీర్థక్షేత్ర దర్శనం, వాహన మార్పులు చేస్తారు. ఫైనాన్స్ వ్యాపారులకు లాభాలు. బాకీల వసూలు ఆలస్యం. నరాలు, గుండె సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు. మిగిలినవారికి అనుకూలం. ప్రమోషన్ వ్యవహారాలు సానుకూలం. మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో నిదానంగా పనులు సానుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు మందకొడిగా సాగినా, ఫలితాలు లాభదాయకం. షేర్ వ్యాపారులకు లాభాలు మందగమనం. విద్యార్థులకు విద్యా వ్యాసంగం కుంటుపడుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో శుభపరిణామాలు. కోర్టు వ్యవహారాలలో సానుకూలత. స్థిరాస్తి వ్యవహారాలలో సత్ఫలితాలు. ఈ రాశి స్త్రీలకు సకాలంలో ఏ పనీ సాగదు. అవసరానికి తగిన ఆర్థిక వెసులుబాటు దొరకని పరిస్థితి. గర్భిణులకు ఇబ్బందులు ఉండవు కాని, ఏదో తెలియని ఆందోళనకు లోనవుతారు.ఉత్తర 2, 3, 4: ప్రమోషన్లు ఆలస్యం. పిల్లలు సహకరిస్తారు. పెద్దల ఆరోగ్యం అనుకూలం. హస్త: కిందిస్థాయి వారితో అవమానపడే పరిస్థితులు. తెలివిగా పనులు సాధించుకోగలుగుతారు. శ్రమాధిక్యత. చిత్త 1, 2: ఆర్థికంగా, శారీరకంగా శ్రమకు లోనవుతారు. ఇతరుల మీద ఆధారపడి పనులు పాడు చేసుకుంటారు. శాంతి మార్గం: దశరథకృత శని స్తోత్రం రోజూ పఠించండి. శ్రీరామ శ్శరణం మమ అని చెబుతూ ఆంజనేయస్వామికి రోజూ 11 ప్రదక్షిణలు చేయండి. బీదసాదలకు చెప్పులు, వస్త్రాలు దానం, శనివారం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయడం, షణ్ముఖ రుద్రాక్ష ధారణ శుభప్రదం.ఏప్రిల్: పాత ఋణములు ఇబ్బందికరం. కొత్త ఋణాలు అవసరానికి అందవు. ఖర్చులు నియంత్రించలేరు. విద్యార్థులు, షేర్ వ్యాపారులు, ఫైనాన్ వ్యాపారులకు చికాకులు. సామాజిక గౌరవం. మే: కుటుంబ విషయంలోనూ, వృత్తి విషయంలోనూ పనివారితో సమస్యలు. పనులు వాయిదా వేస్తుంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. జూన్: ఒత్తిడి లేకుండా పనులు నెరవేరవు. ఆర్థిక వెసులుబాటులో చికాకు పడతారు. నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. ఋణ వ్యవహారాలు, స్నేహితులతో కలసి చేసే పనులలో ఇబ్బందులు. కుటుంబ సభ్యులతో సఖ్యత తగ్గుతుంది. జులై: వాగ్వాదాలు తరచుగా ఉంటాయి. భోజన అసౌకర్యం. వాహనాలు, పనిముట్ల వల్ల గాయాలు. పిల్లల ప్రవర్తన నచ్చకపోవడం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రేగడం జరుగుతాయి. ఆగస్ట్: వ్యవహారాలలో లాభాలు అందుకుంటారు. ఆర్థిక, కుటుంబ అనుకూలత తక్కువ. సమాజంలో విలువ పెరుగుతుంది. సెప్టెంబర్: తేలికగా పనులు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం. విచిత్ర సందర్భాలు ఎదురవుతాయి. యంత్రాలు, పనిముట్లు, వాహనాలు ఇబ్బంది కలిగిస్తాయి. అక్టోబర్: కొత్త కొత్త ప్రణాళికలను అమలు చేస్తారు. చాలా లాభాలు అందుకుంటారు. విజయాలు, గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో శుభ పరిణామాలు. నవంబర్: రోజువారీ వ్యవహారాలు సరిగా సాగవు. సహకరించే వారు వ్యతిరేకించే అవకాశం ఉన్నది. సంబంధంలేని విషయాలలో అవమానాలు. అధిక ఖర్చులు, కలహాలు. డిసెంబర్: క్రమంగా మంచి మార్పులు. శుభవార్తలు వింటారు. లాభాలు బాగా అందుతాయి. సుఖశాంతులు, విజయావకాశాలు పెరుగుతాయి. జనవరి: పనులు ఆలస్యం. ఉద్యోగంలో ఒత్తిడి. వ్యాపారులకు పెట్టుబడులు అందినా, స్థిరమైన వ్యాపారం చేయలేని పరిస్థితి. ఫిబ్రవరి: అద్భుతమైన బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. అకారణంగా విచిత్ర సమస్యలు వస్తుంటాయి. విద్యా విషయంతో గౌరవం పొందుతారు. కుటుంబ విషయాలు అనుకూలం. వృథా కాలక్షేపంతో పనులకు ఆటంకాలు. మార్చి: రోజువారీ పనులలో ఆలస్యం. అవమానకర ఘటనలు. తరచుగా వృథా ఖర్చులు. ప్రయాణాలలో ఇబ్బందులు. శుభ, పుణ్యకార్యాలలో చికాకులు. ∙∙తులా రాశిఆదాయం– 5, వ్యయం– 14, రాజయోగం– 6, అవమానం– 3చిత్త 3,4 పాదములు (రా, రి)స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)ఈ సంవత్సరం గురువు మిథునంలో (భాగ్యం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (దశమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (లాభం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (షష్టం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (పంచమం) కేతువు సింహంలో (లాభం); తర్వాత రాహువు మకరం (అర్ధాష్టమం)లో కేతువు కర్కాటకంలో (రాజ్యం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలలో సాధారణ స్థితి. సమయపాలనతో పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయాలలో శ్రద్ధగా వ్యవహరిస్తారు. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు. ఆర్థిక సమస్యలను నివారించుకుంటారు. ఆదాయం సకాలంలో అందుతుంది. పెద్ద పెద్ద వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, శుభకార్య విజయాల వలన ఖర్చులు. పుణ్యకార్యాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు. కొత్త స్నేçహాలు భవిష్యత్తుకు ఉపకరిస్తాయి. సకాలంలో కావలసిన ఋణాలు. ఆరోగ్య అనుకూలత. ఉద్యోగ కార్యకలాపాలలో గౌరవ మర్యాదలు. ప్రమోషన్లకు, స్థానచలనాలకు, నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారులకు లాభాలు. వ్యాపార ఋణాలు తీర్చుకోవడానికి, మొండి బాకీల వసూలుకు అనుకూలం. మార్కెటింగ్ ఉద్యోగులకు, ఫైనాన్స్ వ్యాపారులకు పూర్తి సానుకూలత. షేర్ వ్యాపారులకు లాభాలు. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగుంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలో, కోర్టు వ్యవహారాలలో విజయావకాశాలు. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగ భద్రత అధికం. ఆదాయ వ్యయాల మధ్య సమతూకం. బంధువులతో వైరం రాకుండా జాగ్రత్తపడండి. గర్భిణులు చక్కటి జాగ్రత్తలు పాటిస్తారు. సుఖ ప్రసవం జరుగుతుంది.చిత్త 3, 4 : వృత్తి వ్యవహారాలలో గౌరవ మర్యాదలు. ఆదాయ వ్యయాలను అదుపు చేస్తారు. స్వాతి: కొన్ని పనులు తేలికగాను, మరికొన్ని పనులు అధిక శ్రమతోను పూర్తవుతాయి. విశాఖ 1, 2, 3: రోజువారీ పనులు అకాలంలో పూర్తి అవుతుంటాయి. వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు.శాంతి మార్గం: లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయండి. పుట్టతో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రంలో రోజూ అర్చనలు చేయండి. లేకుంటే ఇంటిలోనైనా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం, అష్టముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: మంచి నిర్ణయాలు తీసుకుంటారు.ఆరోగ్య, ఆదాయ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. అందరి నుంచి సహకారం. పనులు సకాలంలో అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం చికాకులు సృష్టిస్తుంది. మే: గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాలలో శ్రద్ధగా వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు అనుకూలం కాదు. జూన్: కొన్ని సందర్భాలలో కలహప్రదంగా వ్యవహరిస్తారు. పనులు సరిగా సాగవు. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు. జులై: బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు ఆగ్రహావేశాలకు లోనవుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో చికాకులు రాగలవు. ఆగస్ట్: సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులు, మిత్రులు సహకరిస్తారు. గౌరవ మర్యాదలు పొందుతారు. స్థానచలన ప్రయత్నాలు వేగవంతం. శుభకార్య ప్రయత్నాలకు అనుకూలం. సెప్టెంబర్: ఆర్థిక వనరులు అందుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పుణ్య, శుభకార్యాలలో శుభ పరిణామాలు. పెద్దలను, బంధువులను దర్శిస్తారు. అక్టోబర్: వాహనాల కొనుగోలు, పాడైన వస్తువుల మరమ్మతులపై శ్రద్ధ చూపుతారు. కుటుంబ అవసరాలు తీర్చడంలో, శుభకార్యాలలో లాభదాయక ఫలితాలు. నవంబర్: చాలా విజయాలు సాధిస్తారు. వాహన ఖర్చులు పెరుగుతాయి. పనుల వాయిదా వల్ల చికాకులు. ఉద్యోగ, ఆర్థిక విషయాలలో సత్ఫలితాలు. పిల్లల గురించి మంచి వార్తలు వింటారు. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. డిసెంబర్: తెలివిగా వ్యవహారాలు సాధిస్తారు. కొన్ని విషయాలు ఇబ్బందికరం. వృత్తి ఉద్యోగాలలో విజయాలు. ఋణ సౌకర్యం అవసరానికి తగిన విధంగా అందుకుంటారు. జనవరి: ఆదాయ వ్యయ ఋణ వ్యవహారాలలో సమన్వయం. ఇబ్బంది లేని జీవనం. క్షణం వృథా చేయకుండా ఉంటారు. ఎంతటి పని అయినా తేలికగా సాధిస్తారు. ఫిబ్రవరి: అనేక విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం. అవయవ ప్రతికూలతలు. ఉద్యోగంలో అభివృద్ధి. ఊహించని లాభాలు పొందుతారు. మార్చి: ఒక్కోసారి విజయపరంపర కొనసాగుతుంది. కొన్నిసార్లు ఇబ్బందికర ఘటనలు ఎదురవుతాయి. వృత్తి విషయాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో శ్రద్ధ చూపక కలహాలకు అవమానాలకు అవకాశం ఇస్తారు. వృథా కాలక్షేపాలు ఎక్కువ అవుతాయి. ఋణ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వ్యాపార భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు. ∙∙ వృశ్చిక రాశిఆదాయం– 11, వ్యయం– 5, రాజయోగం– 2, అవమానం– 6విశాఖ 4 వ పాదము (తొ)అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)ఈ సంవత్సరం గురువు మిథునంలో (అష్టమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (భాగ్యం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (రాజ్యం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (పంచమం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (అర్ధాష్టమం) కేతువు సింహంలో (దశమం); తర్వాత రాహువు మకరంలో (తృతీయం) కేతువు కర్కాటకంలో (భాగ్యం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలను సక్రమంగా పూర్తి చేస్తుంటారు. మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ విషయాలలో జూన్ వరకు చికాకులు. సంవత్సరం అంతా సాధారణ ఫలితాలు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం జూన్ వరకు ఇబ్బందికరంగానూ, జూలై నుంచి బాగా అనుకూలంగానూ ఉంటుంది. విద్యా విజ్ఞాన వినోద కార్యకలాపాలలో పిల్లలతో కలిసి పాల్గొంటారు. ద్వితీయార్ధంలో ఆర్థిక లాభాలు బాగుంటాయి. దాన ధర్మాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. పిల్లల శుభ కార్యాలకు అధిక వ్యయం చేస్తారు. చోరభయం, రోగభయం, అగ్నిభయంతో జులై వరకు ముఖ్య వ్యవహారాలను వదిలేస్తారు. ఋణ వ్యవహారాలు అనుకూలం. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకుంటారు. అక్టోబర్ వరకు చిన్న చిన్న ఇబ్బందులు. ఉద్యోగ వ్యవహారాలలో గౌరవ మర్యాదలు. మార్కెటింగ్ ఉద్యోగులకు ద్వితీయార్ధంలో అభివృద్ధికరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి. వ్యాపారులకు జులై నుంచి అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో శ్రమతో విజయాలు. షేర్ వ్యాపారులకు లాభాలు. విద్యార్థులు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఫలితాలు బాగుంటాయి. స్థిరాస్తి లావాదేవీలు నెమ్మదిగా సానుకూలం. ఈ రాశి స్త్రీలకు ఆదాయం బాగుంటుంది. అలంకరణ వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు. శుభకార్య ప్రయత్నాలు లాభిస్తాయి. గర్భిణులకు ప్రతిబంధకాలు ఉండవు. విశాఖ 4: శ్రమతో పనులు సాధ్యపడతాయి. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలు విజయవంతం.అనురాధ: ఆర్థికంగా ఎదుగుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు విజయవంతం. జ్యేష్ఠ: తెలియని భయం. కుటుంబ సభ్యులతో కలహాలు. అనవసర ప్రయాణాలు. గురువుల సందర్శన.శాంతి మార్గం: నవగ్రహ మండపం ఉన్న దేవాలయంలో రోజూ పూజ చేయండి. దత్తాత్రేయ స్వామి ఆరాధన విశేష ఫలప్రదం. పేద విద్యార్థులకు అవసరమైన వస్తువులు ఇవ్వడం మంచిది. షణ్ముఖ రుద్రాక్షధారణ శుభçప్రదం.ఏప్రిల్: కుటుంబంలో అనైక్యత. స్వబుద్ధితో పనులు సానుకూలం అవుతాయి. పనుల్లో చికాకులు. ఒంటరిగా దూర ప్రయాణాలు తగ్గించండి. ఋణ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మే: పనులు వాయిదా వేస్తారు. సొంత విషయాల్లో గోప్యత పాటించడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు. అనుకున్న ప్రణాళికలకు, ఆచరణకు పొంతన ఉండదు. జూన్: నూతన ప్రయత్నాలు సాగకున్నా, రోజువారీ వ్యవహారాలు బాగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో అధికారుల సహకారం పెరుగుతుంది. వ్యాపారంలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల సహకారం బాగుంటుంది. జులై: పనులు సానుకూలం అవుతున్నట్లుగా గోచరించినా, ఏదో ఒక చికాకు దాగి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, వ్యవహార చికాకులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పుణ్య, శుభకార్యాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. విద్యా వ్యాసంగం సరిగా సాగదు. ఆగస్ట్: చాలాసార్లు సోమరితనం ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు విజయలక్ష్యంతో ముందుకు వెడతారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తారు. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో సహకారం బాగుంటుంది. సెప్టెంబర్: క్రమక్రమంగా మంచి ఫలితాలు. ఉద్యోగ వ్యాపారాలలో పనుల సానుకూలతలో అన్ని వనరులు సహకరిస్తాయి. అక్టోబర్: ఉద్యోగులకు అనుకూలత తక్కువ. సకాలంలో అన్న వస్త్రాలు సమకూరని పరిస్థితి. ఇతరుల మాటలు విని కుటుంబ కలహాలు తెచ్చుకుంటారు. వ్యాపారులు ఓర్పు వహించాలి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. నవంబర్: బంధువుల సహకారం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరం. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు చక్కగా చేస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. జరగవని వదిలేసిన పనులు కూడా పూర్తవుతాయి.డిసెంబర్: కాలాన్ని లాభదాయకంగా మార్చుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రద్ధ పెంచుతారు. శుభకార్య ప్రయత్నాలలో భార్య తరఫు బంధువులు సహకరిస్తారు. కొత్త ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలకు సానుకూలం. జనవరి: మంచి మార్పులు ఉంటాయి. ఓర్పుగా ప్రవర్తించి విజయాలు సాధిస్తారు. స్నేహితులు, బంధువులు సహకరిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఫిబ్రవరి: కుటుంబ అవసరాలు తీర్చడానికి బాగా శ్రమిస్తారు. వృత్తి వ్యాపారాలలోను, కుటుంబ వ్యవహారాలలోను బంధు మిత్రుల సహకారం బాగుంటుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.మార్చి: పని ఒత్తిడి పెరుగుతుంది. ధైర్యంగా ఉంటారు. అందరి సహకారం ఉంటుంది. ఏదో తెలియని అంశాలలో కలహాలు తప్పవు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకం. అలంకరణ వస్తువుల కొనుగోలు, శుభకార్య ప్రయత్నాలు బాగుంటాయి. వాహనములు, ఎలక్ట్రికల్ వస్తువులకు మరమ్మతులు చేయించాల్సి వస్తుంది.ధనూ రాశిఆదాయం–14, వ్యయం–11, రాజయోగం– 5, అవమానం– 6మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)ఉత్తరాషాఢ 1వ పాదము (బే)ఈ సంవత్సరం గురువు మిథునంలో (సప్తమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (అష్టమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (నవమం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (చతుర్థం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (తృతీయం) కేతువు సింహంలో (భాగ్యం); తర్వాత రాహువు మకరం (ద్వితీయం)లో కేతువు కర్కాటకంలో (అష్టమం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలలో చిన్న చిన్న సమస్యలు. సకాలంలో పనులు పూర్తి చేసుకోవడానికి శ్రమిస్తారు. కుటుంబ విషయాలలో అనుకూలత తక్కువ. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. దేహ గాంభీర్యం కోల్పోయే అవకాశం ఉన్నది. ఫైనాన్స్ వ్యాపారులకు సమస్యలు రాగలవు. అనవసర ఋణాలు చేస్తారు. ఆరోగ్య విషయాలలో ద్వితీయార్ధంలో చికాకులు. ఉద్యోగ కార్యకలాపాలలో నిబద్ధతతో విధి నిర్వహణ చేయవలసిన కాలం. మార్కెటింగ్ ఉద్యోగులు ఎంతో శ్రమిస్తేనే తప్ప టార్గెట్లు చేరుకోలేరు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో చికాకులు. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఉన్నవారు తొందరపడి చేస్తున్న వ్యాపారం మానవద్దు. షేర్ వ్యాపారులకు శ్రమ ఎక్కువ. లాభాలు తక్కువ. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఎక్కడా ఇబ్బంది ఉండదు. కోర్టు వ్యవహారాలు సానుకూలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం. ఈ రాశి స్త్రీలకు అనాలోచిత ప్రవర్తన వల్ల చికాకులు. సంఘంలో గౌరవ మర్యాదలు. ఉద్యోగం ఒత్తిడి. వైద్య ఖర్చులు అధికం.మూల: ఆర్థిక లావాదేవీలు భారంగా ఉంటాయి. వ్యాపారులకు ఇబ్బందులు. సమయపాలన ఉండదు. పూర్వాషాఢ: తరచుగా అలసట, శ్రమ. చోర, అగ్ని, అధికార బాధలు. మాట తీరుతో సమస్యలు తలెత్తుతాయి. ఉత్తరాషాఢ 1: ప్రతిపనిలోనూ ప్రారంభంలో ధనం సమకూరక ఇబ్బందిపడటం, క్రమంగా సర్దుబాటు జరిగి పనులు పూర్తి చేసుకోవడం వంటివి ఉంటాయి. తరచుగా బుద్ధి భ్రంశానికి లోనవుతారు. శాంతిమార్గం: గురువుకు, శనికి శాంతి చేయించుకోవడం అవసరం. ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామి దేవాలయంలోనూ, ప్రదోషకాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయండి. నిత్యం గోసేవ చేయండి. కుదిరినప్పుడు యతీశ్వరులను ధర్శించి సేవించండి. చతుర్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: అన్ని వ్యవహారాలలోను 19వ తేదీ లోపల వేగం పెంచండి. 19వ తేదీ నుంచి వ్యవహార ప్రతిబంధక అంశాలలో బాగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి విషయాలలో దూకుడు తగ్గించాలి. షేర్ వ్యాపారులకు సామాన్య ఫలితాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు. మే: కోపావేశములు నియంత్రించుకోవాలి. రోజువారీ పనులపై దృష్టి కేంద్రీకరించండి. కొత్త పనులు చేపట్టవద్దు. ప్రతిపనీ స్వయంగా చేసుకోవలసి వస్తుంది. తద్వారా పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు, కింది ఉద్యోగల వల్ల చికాకులు. జూన్: ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. మీ వ్యవహారాలలో ఇతరుల ప్రమేయం తగ్గించండి. ఆదాయ వ్యయాల సమన్వయంపై దృష్టి ఉంచండి. ఉద్యోగ విధి నిర్వహణలో అన్యమనస్కంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. స్నేహితుల సహాయ నిరాకరణ తరచుగా ఉంటుంది. జులై: అన్ని వ్యవహారాలలో ఓర్పు ప్రదర్శించాలి. ఇతరుల మీద ఆధారపడి పనులు చేయవద్దు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించండి. పాత ఋణాల పట్ల జాగ్రత్తపడండి. అనవసర ప్రయాణాలు తగ్గించండి.ఆగస్ట్: చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కాలం. వృథా ఖర్చులు, అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇతరులకు హామీలు ఇవ్వవద్దు. భార్య తరపు బంధువుల రాకపోకలు పెరుగుతాయి. తరచుగా శుభకార్య నిమిత్తం చేసే ప్రయాణాలలో అధిక వ్యయం జరుగుతుంది.సెప్టెంబర్: ఎంతో శ్రమతో తెలివిగా పరిస్థితులు చక్కబెడతారు. భోజన, వస్త్ర, స్నాన సౌకర్యాలు కూడా ఇబ్బందికరం. కుటుంబ సభ్యులతో కలహాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ, వృత్తి విషయాలను ఇతరులతో చర్చించకండి. అక్టోబర్: తరచుగా శుభవార్తలు, పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యంలో మంచి మార్పు. తరచు చోర, అగ్ని, రోగ భయాలు. శరీర సౌష్టవం, మాటల గాంభీర్యం కోల్పోతారు. నవంబర్: ఇబ్బందుల నుంచి బయటపడతారు. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు వేగం అందుకుంటాయి. కావలసిన ఋణ సౌకర్యం, సహకారం అందుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలం. విద్యార్థులకు అనుకూలం కాదు. డిసెంబర్: మంచి మార్పులు ప్రారంభం. పనులు సానుకూలం. చాలాకాలంగా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు. ఆర్థిక వెసులుబాటు.ప్రయాణాలు, అలంకరణ వస్తువుల కొనుగోలు అధికం. జనవరి: తరచుగా చోర, రోగ, అగ్ని భయం. వాహన సమస్యలు, ఖర్చులు. తరచుగా ద్రవ్యలోపం. ఆరోగ్య, ఋణ విషయాలలో సమస్యలు. ఉద్యోగ వ్యాపారాలలో డబ్బు ఇబ్బందులు, అధికార ఒత్తిడి. నమ్మిన వారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి: మందకొడితనం ఆవహిస్తుంది. పనులు వేగం చేయలేరు. అన్ని పనులూ శ్రమతో పూర్తి అవుతాయి. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ విషయాలను సమన్వయం చేయలేరు. దూర ప్రయాణాలు విరమించడం మంచిది. విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించ వలసిన కాలం. మార్చి: ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసర విషయాలలో తలదూర్చవద్దు. ఉద్యోగ, కుటుంబ వ్యవహారాలలో శ్రమచేసి లబ్ధి పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపారాలు ఇబ్బందికరం. అధికారుల అండ ఉన్నా, వృత్తి చికాకులు తప్పవు. విద్యార్థులకు అనుకూలం కాదు.మకర రాశిఆదాయం– 2, వ్యయం– 8, రాజయోగం– 1, అవమానం– 2ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)ఈ సంవత్సరం గురువు మిథునంలో (షష్ఠం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (సప్తమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (అష్టమం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (తృతీయం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (ద్వితీయం) కేతువు సింహంలో (అష్టమం); తర్వాత రాహువు మకరంలో (జన్మం) కేతువు కర్కాటకంలో (సప్తమం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలకు ఆటంకాలు వస్తుంటాయి. వాటిని తెలివిగా దాటవేస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబ విషయాలలో ఇతరుల ప్రమేయం వల్ల తరచుగా కలహాలు. ఆర్థిక కార్యకలాపాలలో ఓర్పు అవసరం. ఖర్చులు పరిధి దాటతాయి. శుభకార్యాల కోసం, వస్తువుల మరమ్మతుల కోసం ఖర్చులు పెరుగుతాయి. ప్రతి పనిలోనూ ఓర్పు అవసరం. ఇతరులపై ఆధారపడి ఏ పనీ చేయవద్దు. ఫైనాన్స్ వ్యాపారులకు అక్టోబర్ నుంచి మోసపూరిత వాతావరణం. అవసరానికి కావలసిన ఋణాలు అందవు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉంటారు. అక్టోబర్ నుంచి ఆరోగ్య సమస్యల వల్ల పనులకు ఆటంకాలు. ఉద్యోగ కార్యకలాపాలలో మంచి ఫలితాలు. తోటివారి నుంచి సహకారం తక్కువ. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ. జూన్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అయోమయ పరిస్థితులు. వ్యాపారులకు అనవసర చికాకులు. శ్రమాధిక్యం, లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరుల సలహాలు విని పెట్టుబడుల జోలికి పోవద్దు. నూతన వ్యాపార ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. షేర్ వ్యాపారులు తెలివిగా వ్యాపారం చేసినా, అనుకున్న స్థాయి ఫలితాలు దక్కవు. విద్యార్థులకు విద్యా వ్యాసంగం దారి మళ్ళుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి సలహాలు సహకారం అందవు. కోర్టు వ్యవహారాలలో మోసపోయే అవకాశాలు ఎక్కువ. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగ విధి నిర్వహణలో చక్కటి పరిస్థితులు ఉంటాయి. అయితే, ఆర్థిక ఎదుగుదల తక్కువ. అక్టోబర్ తరువాత వైద్య విషయంలో కూడని సలహాలు అందుతాయి. గర్భిణులు అక్టోబర్ నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఉత్తరాషాఢ 2, 3,4: ప్రతిపనికీ అధిక శ్రమ చేయవలసి వస్తుంది. ఉద్యోగ విషయంగా రక్షణ అధికంగా ఉంటుంది. తోటివారి సహాయ సహకారాలు తక్కువ. కొత్త పెట్టుబడులకు కాలం అనుకూలం. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది.శ్రవణం: ఆదాయానికి తగిన ఖర్చు ఉంటుంది. వృథా ఖర్చులను నియంత్రించ గలుగుతారు. ణాలు తీర్చే ప్రయత్నంలో గొప్ప కృషి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలలో మంచి ఫలితాలు ఉంటాయి. అధిక శ్రమ తప్పదు. ధనిష్ఠ 1, 2: ఉద్యోగ వ్యాపారాలలో చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు. తరచుగా దూరప్రాంత సందర్శన చేస్తుంటారు. ఏ విషయంలోనూ స్థిరబుద్ధి ప్రదర్శించరు. వృత్తి విషయాలలో అవసరమైన సలహాలు అందవు. శాంతి మార్గం: ప్రతినిత్యం ఎక్కడ వేదపారాయణ జరుగుతున్నా వెళ్ళి వినడం ప్రారంభించండి. ప్రాతఃకాలంలో దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ లేదా శ్రవణం చేయండి. అక్టోబర్లో గురు రాహు కేతువులకు శాంతి చేయించండి. గురువారం శనగలు, తీపి పదార్థాలను దానం చేయండి. సప్తముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: ప్రతి విషయంలోనూ సానుకూల ఫలితాలు. ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగవు. వృత్తి విషయాలలో ఒత్తిడి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో అనుకూల వార్తలు. కోరుకున్న రీతిగా స్వేచ్ఛగా సంచరిస్తారు. సంతానం ద్వారా అనుకూలత. మే: పెద్దల ఆరోగ్య విషయంగా, పిల్లల వృద్ధి విషయంగా చికాకులు. రోజువారీ పనులలో సమయ పాలన చేయలేరు. ఆరోగ్య, ఋణ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. షేర్ వ్యాపారులకు 15వ తేదీ వరకు అనుకూలం. విద్యా వ్యాసంగం, ప్రయాణాలు ఇబ్బందికరం. జూన్: తెలివి బాగా పనిచేసినా, చాలా పనులు సాధించలేని పరిస్థితి. ఖర్చులు విచిత్రంగా వస్తుంటాయి. వాటిని నియంత్రించలేరు. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలం. ప్రయాణాలు తగ్గించాలి. వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు చేసి అమలు చేసి సఫలమవుతారు. జులై: సమస్యలు సరిచేసుకోవడంలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. ఆర్థిక విషయాలు సామాన్యం. వృత్తి విషయంలో తోటివారి సహాయ సహకారాలు, అధికారుల అండదండలు బాగుంటాయి. ఆగస్ట్: స్వయంగా చేసుకునే పనులు బాగా పూర్తవుతాయి. ఇతరుల సమస్యలపై దృష్టి పెట్టకుండా, మీ రోజువారీ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. విదేశీ నివాస ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. సెప్టెంబర్: శ్రమ ఎక్కువ అయినా, సోమరితనం ప్రదర్శించకుండా వేగంగా ప్రణాళికలు చేస్తే సానుకూల ఫలితాలు అందుతాయి. 18వ తేదీ తరువాత సానుకూలత తక్కువ. సహకరించేవారు తక్కువ. ఖర్చులు ఎక్కువ. ఋణ సౌకర్యం సరిలేక కొన్ని పనులు ఆగుతాయి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. అక్టోబర్: ఆకస్మిక ధనలాభం. వృత్తి రీత్యా తరచు అవరోధాలు. శుభ, పుణ్యకార్యాలలో మీ శ్రమ ఆలస్యంగా సఫలం అవుతుంది. ఋణ వ్యవహారాలలో అవమానాలు రాకుండా జాగ్రత్తపడండి. ఇతరుల మాటలు నమ్మి కొత్త ప్రయత్నాలు చేయవద్దు. వృత్తి విషయాలు స్వయంగా చూసుకోండి. నవంబర్: కుటుంబ వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. వృత్తిరీత్యా కలహాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా ఉండవు. ఆరోగ్య సమస్యలకు మంచి సలహాలు అందుతాయి. తరచుగా విద్యాభంగం పొందుతారు.డిసెంబర్: మంచి మార్పులకు శ్రీకారం పడుతుంది. వ్యాపారులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో శ్రద్ధ ప్రదర్శించి అధికారుల ప్రోత్సాహం అందుకుంటారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపారాలలో పనివారిపై ఆధారపడటం మంచిది కాదు. ఆర్థిక లాభాలు బాగుంటాయి. జనవరి: ఆర్థిక లావాదేవీలు సమస్య కాకుండా జాగ్రత్త పడతారు. రోజువారీ పనులలో అవాంతరములు ఉంటాయి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమస్యలు రాకుండా చూసుకుంటారు. స్నేహితులతో జాగ్రత్త వహించాలి. ప్రతి నిమిషం ఒక పరీక్షా కాలంగా ఉంటుంది. ఫిబ్రవరి: మోసపూరిత వాతావణానికి దగ్గరవుతారు. కలహాలు, ఋణాలు, వాహన చికాకులు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి నిత్యం వెంబడిస్తాయి. స్త్రీలు పని ఒత్తిడికి లోనవుతారు. ఋణ వ్యవహారాలలో తెలివిగా వ్యవహరిస్తే మంచిది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో శుభవార్తలు. మార్చి: మానసిక చికాకులు ఉంటాయి. అన్నీ తెలిసి కూడా పనులు సానుకూలం చేయలేని స్థితి. ఆర్థిక వెసులుబాటు సామాన్యంగా ఉంటుంది. వస్తువుల కొనుగోలులో మోసపోతారు. ఉద్యోగ, వ్యాపార విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. వృత్తి విషయంలో ఒత్తిడి పెరుగుతుంది.∙∙కుంభ రాశిఆదాయం– 2, వ్యయం– 8, రాజయోగం– 4, అవమానం– 2ధనిష్ఠ 3,4 పాదములు (గూ, గే)శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)ఈ సంవత్సరం గురువు మిథునంలో (పంచమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (షష్ఠం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (సప్తమం) సంచరిస్తారు. శని సంవత్సరమంతా మీనంలో (ద్వితీయం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (జన్మం) కేతువు సింహంలో (సప్తమం) తర్వాత రాహువు మకరం (వ్యయం)లో కేతువు కర్కాటకంలో (షష్ఠం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలలో ఒక మాయ వెంబడిస్తున్నట్లుగా ఉంటుంది. పనులు సమయపాలనతో చేయలేరు. ఫలితంగా ఇతర పనులు పాడవుతాయి. కుటుంబ విషయాలు సహా అన్ని వ్యవహారాలలోనూ ఏలినాటి శని, జన్మ వ్యయ రాహు ప్రభావంగా వృథా కాలక్షేపాలు, దాటవేత పద్ధతి, అవమానించడం, అవమానాలు పొందడం, పరుష వాక్య ప్రయోగంతో ఇబ్బందులు పొందుతారు. ఆర్థిక కార్యకలాపాలలో ఆదాయ వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. ఋణ వ్యవహారాలలో అవమానం ఎదురవుతుంది. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆరోగ్యం పట్ల తగిన దృష్టి ఉంచరు. పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగ కార్యకలాపాలలో సరైన నిర్ణయాలు చేయలేరు. తోటివారి సహాయ సహకారాలు తక్కువ. అధికారుల ఒత్తిడి జూన్ తరువాత పెరుగుతుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలత లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి సలహాలు అందవు. వ్యాపారులకు మానసిక ఒత్తిడి, మోసపూరిత వాతావరణం. స్వయంగా పరిశీలించాకనే నిర్ణయాలు చేయండి. ఇతరుల జోలికిపోవద్దు. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు సమయపాలనతో సాగవు. షేర్ వ్యాపారులలో ఆలోచనకు, అమలుకు పొంతన ఉండదు. విద్యార్థులకు మానసిక సానుకూలత ఉండదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు సరిగా సాగవు. కోర్టు వ్యవహారాలలో సమస్యలు పెరుగుతాయి. స్థిరాస్తి లావాదేవీలు ఇబ్బందికరం. ఈ రాశి స్త్రీలకు పని ఒత్తిడి ఎక్కువ. తరచుగా చికాకులు. కుటుంబ సభ్యులతో సఖ్యత తగ్గుతుంది. ఉద్యోగంలో ఎదుగుదల లోపిస్తుంది. గర్భిణులకు జాగ్రత్తలు అవసరం. పెద్దలు, వైద్యుల సలహాలు పాటించండి. ప్రయాణాలు తగ్గించండి.ధనిష్ఠ 3, 4 : మోసపూరిత వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మీద ఆధారపడిన పనులు ఇబ్బంది కలిగిస్తాయి. వస్తువులు మరచిపోవడం, చోరీ కావడం వంటివి జరుగుతాయి.శతభిష: కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. ఓర్పు, సహనం అవసరం. పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా జాగ్రత్తపడండి. కొత్త వ్యవహారాలలో తలదూర్చకండి. ఋణాలు చేయవద్దు. ఉద్యోగంలో జాగ్రత్తలు అవసరం.పూర్వాభాద్ర 1, 2, 3: ఆగ్రహావేశాలు తగ్గించాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోకండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగండి. వృథా కాలక్షేపాలకు స్వస్తి పలకండి. తక్కువ స్థాయి వారి నుంచి ప్రమాదాలకు అవకాశం. శాంతి మార్గం: గ్రహచారం పూర్తి విరుద్ధంగా ఉన్నందున రోజూ రామాయణ పారాయణ చేయడం శ్రేయస్కరం. శని గురు రాహు కేతువులకు శాంతి చేయించండి. ఇష్టదైవ నామస్మరణ చేయండి. రోజూ దుర్గా సప్తశ్లోకీ పారాయణ చేయడం ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయడం, అష్టముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. చాలావరకు పనులు సఫలం. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగుతాయి. 10వ తేదీ నుంచి పనులు వేగం అందుకుంటాయి. విద్యా వ్యాసంగం ఇబ్బందికరం. వృత్తిలో అధికారుల సహకారం గొప్పగా ఉంటుంది. పుణ్యకార్యాలు చేస్తారు. మే: ఒంటరి కాలక్షేపాలు, ఒంటరిగా ప్రయాణాలు శ్రేయస్కరం కాదు. మోసపూరిత వాతావరణం. ఇతరులపై ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మొండి ధైర్యం పెరుగుతుంది. తెలివిగా ఉంటారు. అలా ఉన్నా, చికాకుపడే అవకాశం ఉన్నది. స్థిరాస్తి వ్యవహారాలు చికాకులు సృష్టిస్తాయి. జూన్: ప్రతిపనికీ ఆదాయ వనరులు ఇబ్బందికరం. కుటుంబసభ్యులతో సఖ్యత లోపిస్తుంది. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు. విద్యార్థులు, ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు బుద్ధి స్థిరంగా పనిచేయక ఇబ్బందిపడే అవకాశం ఉంది. జులై: ఇతరుల విషయాల జోలికి వెళ్ళవద్దు. ఆర్థిక వ్యవహారాలు అదుపులో ఉండవు. తెలియక పొరపాటు చేసి పశ్చాత్తాపపడే పరిస్థితి ఎదురవుతుంది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు. విద్యావ్యాసంగం సరిగా సాగదు. ఆగస్ట్: కుటుంబ కలహాలు తలెత్తవచ్చు. సంబంధంలేని సమస్యలకు బాధ్యత వహించవలసి వస్తుంది. నూతన ప్రయత్నాలు విరమించడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. అజీర్ణ సమస్యలు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్: పనులు చక్కగా పూర్తవుతాయి. తెలియక పొరపాట్లు చేసి పశ్చాత్తాపపడతారు. అందరినీ గౌరవించడం, అందరి చేత గౌరవం పొందడం జరుగుతుంది. వృత్తి రీత్యా జాగ్రత్తలు తీసుకుని ఫలితాలు సాధిస్తారు. శ్రమ ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. అక్టోబర్: పుణ్యకార్యాలలో కాలక్షేపం చేస్తారు. ప్రతిపనినీ సానుకూలం చేసుకుంటారు. కుటుంబ సమస్యలకు పరిష్కారం అందుతుంది. ఇతరులకు సలహాలు చెప్పి కొన్ని సందర్భాలలో గౌరవం పొందుతారు. కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాలలో ఇబ్బందులు. నవంబర్: పని ఒత్తిడి ఎక్కువ. ఫలితాలు శూన్యం. రోజువారీ పనులు సరిగా సాగవు. పుణ్య శుభకార్యాలలో ఇబ్బందులు, ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలతలు. అవసరానికి కావలసిన ధనం, ఋణం సర్దుబాటు కాని స్థితి. డిసెంబర్: తెలివిగా వ్యవహరిస్తారు. శ్రమతో పనులు పూర్తి అవుతుంటాయి. ఆర్థిక వ్యవహారాలలో విచిత్ర పరిస్థితులు. అధిక వ్యయం ఉంటుంది. ఓర్పుతో కుటుంబ విషయాలు సర్దుబాటు చేసుకుంటారు. అనవసర విషయాలలో భయాందోళనలు పెరుగుతాయి. జనవరి: ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. మోసపూరిత వాతావరణం అధికం. కొత్త వ్యవహారాలు చేయరాదు. ఆర్థిక లావాదేవీలు సమన్వయం చేయలేక ఒత్తిడికి లోనవుతారు. అందరినీ అవమానించడం, అవమానింపబడడం వంటివి జరిగి చికాకులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి: ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలలో ముఖ్యమైన అంశాలు వదిలివేసి అధికారుల ఆగ్రహావేశాలకు లోనవుతారు. ప్రయాణ చికాకులు, వాహన చికాకులు ఉంటాయి. విద్యార్థులు కాలానుగుణంగా ప్రవర్తించని స్థితి ఉంటుంది. మార్చి: ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరం. కావలసిన సమయానికి ఋణాలు దొరకవు. ప్రయాణ అసౌకర్యం తరచుగా ఎదురవుతుంది. వస్తువులు మరచిపోవడం కాని, దొంగతనానికి గురవడం కాని జరుగుతుంది. మీ ప్రవర్తన పిల్లల దగ్గర తేలికపడేలా ఉంటుంది. మీన రాశి ఆదాయం– 14, వ్యయం– 11, రాజయోగం– 7, అవమానం– 5పూర్వాభాద్ర 4 వ పాదము (ది)ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)ఈ సంవత్సరం గురువు మిథునంలో (అర్ధాష్టమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (పంచమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (షష్ఠం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (జన్మం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (వ్యయం) కేతువు సింహంలో (షష్ఠం); తర్వాత రాహువు మకరంలో (లాభం) కేతువు కర్కాటకంలో (పంచమం) సంచరిస్తారు. దైనందిన కార్యక్రమాలో మిశ్రమ స్పందనగా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాలలో కుటుంబసభ్యుల ధోరణి సరిపడదు. మనసు సరిలేని స్థితి. తరచుగా పనులు మరచిపోతుంటారు. అక్టోబర్ వరకు ప్రతిభకు తగిన గుర్తింపు దొరకదు. పనులు సానుకూలమే కాని, ఆలస్యం అవుతాయి. అక్టోబర్ వరకు అనాలోచితంగా ఉంటారు. ఆర్థిక కార్యకలాపాలలో ఇబ్బంది ఉండదు. అన్ని కార్యక్రమాలోనూ తగిన ఆర్థిక వనరులను స్వయంగా సమకూర్చుకుంటారు. జూన్ తర్వాత శుభ పుణ్య సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఫైనాన్స్ వ్యాపారులు అక్టోబరు నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు. పాత ఋణాలు ఇబ్బందికరం కాదు. ద్వితీయార్ధం కొత్తవి కావలసిన రీతిగా అందుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలు తీరతాయి. చర్మవ్యాధులు ఉన్నవారికి ఇబ్బంది తప్పదు. ఉద్యోగ కార్యకలాపాలలో జూన్ వరకు పనులు ఆలస్యంగా సాగుతాయి. జూన్ తరువాత క్రమంగా అక్టోబర్ వరకు మంచి మార్పు ఉంటుంది. అక్టోబర్ తరువాత ప్రమోషన్ అవకాశాలు ఎక్కువ. మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు వేగంగా సాగుతాయి. వ్యాపార్తలకు ఆశించిన మంచి ఫలితాలు ప్రారంభంలో ఉండవు కాని, క్రమంగా భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశ చిగురిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు లేని స్థితి. షేర్ వ్యాపారులు నవంబర్ నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు అనుకున్న స్థాయిలో ఫలితాలు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు సజావుగా పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాలలో ఏదో ఒక స్థాయిలో సమస్య పరిష్కారం చేసుకునే అవకాశం వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. ఈ రాశి స్త్రీలకు బుద్ధికుశలత ప్రదర్శించడానికి అవకాశం లేని పరిస్థితులు. ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలలో సమస్యలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. గర్భిణులు జాగ్రత్తలు పాటించడం ద్వారా సుఖపడతారు.పూర్వాభాద్ర 4: ద్వితీయార్ధంలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ ధనవ్యయం అధికం. ఏ పనీ సకాలంలో చేయరు. అయినా అన్ని పనులు సానుకూలం. కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. ఉత్తరాభాద్ర: ఎక్కువ కాలం పనులు మందగమనం. తరచుగా జీర్ణ, చర్మసంబంధ సమస్యలు రాగలవు. ఆలోచనలు అమలు చేయుదిశగా ఎవరితోనూ మనోభావాలను పంచుకోరు. రేవతి: అద్భుతమైన మాటతీరుతో ఎన్నో విజయాలు అందుకుంటారు. బంధు మిత్రులు బాగా సహకారం చేస్తారు. వృత్తిరీత్యా ఏర్పడుతున్న ఆలస్యం గురించి చింతించకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు.శాంతి మార్గం: శని రాహు కేతువులకు సంవత్సరారంభంలోను, అక్టోబర్లో శని గురువులకు శాంతి చేయించడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ‘మంచం’ దానం చేయండి. నిత్యం ప్రదోషకాలంలో శివ సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. అష్టముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: చాలా వ్యవహారాలలో పనులు ఆలస్యం. నిత్యకృత్యాలు కూడా అకాలంలో సాగిస్తారు. అధికారుల వ్యతిరేకత ఉంటుంది. వాహనాలు తరచు మరమ్మతులకు వస్తుంటాయి. షేర్ వ్యాపారులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. మే: క్రమంగా మంచి ఫలితాలు ప్రారంభం అవుతాయి. భవిష్యత్ మీద ఆశ జనిస్తుంది. ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. శుభ కార్యాలలో పాల్గొనడం, పుణ్యకార్యాలు చేసే ఆలోచనలు పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు క్రమంగా మంచి ఫలితాలు ఉంటాయి. జూన్: పెద్దల ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు పాటించండి. పిల్లల విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఓర్పుగా ఉంటారు. అయితే చాలాసార్లు నిరుత్సాహంగా ఉంటారు. పనులు స్వయంగా చేసుకోవడం అవసరం. దూరప్రయాణాలు విడనాడండి. జులై: తెలివిగా పనులు సానుకూలం చేసుకుంటారు. రోజువారీ పనులు అకాలంలో జరుగుతాయి. స్వబుద్ధితో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారి ప్రయత్నాలు తేలికగా పూర్తి అవుతాయి. కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు, శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆగస్ట్: శ్రమతో పనులు పూర్తవుతాయి. మాటతీరు నియంత్రించుకోవాలి. అవగాహన లోపాలు పెరిగి ఉద్యోగ వ్యాపారాలలో చికాకులు. నూతన ప్రయత్నాలు వేగంగా చేసినా, ఫలితం ఉండదు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. సెప్టెంబర్: శుభకార్య ప్రయత్నాలలో విశేష ఫలితాలు. సోమరితనం ప్రదర్శించి పనులు పాడు చేస్తారు. ఆర్థిక లావాదేవీలను స్వయంగా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందికర ఘటనలు. మంచి పనులపై దృష్టి కేంద్రీకరిస్తారు. అక్టోబర్: నిత్యకృత్యాలు అకాలంలో చేయడం వలన వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు. ప్రతి పనిలోనూ వ్యాకులతకు లోనవుతారు. బంధుమిత్రులతో కలహాలకు అవకాశం ఇవ్వకండి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలం. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు తొందరపాటును విడనాడాలి. కోర్టు వ్యవహారాలు సానుకూలం. నవంబర్: రోజువారీ పనులు సరిగా సాగవు. సహకరించే వారు కూడా వ్యతిరేకించే పరిస్థితి. నూతన ప్రయత్నాలు విఫలం. ఉద్యోగ భద్రత, వ్యాపార అనుకూలత తక్కువ. కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఇతరుల నుంచి శత్రుభావం ఎక్కువ. పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. డిసెంబర్: ఆరోగ్యం జాగ్రత్తలు పాటించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోవాలి. రోజువారీ పనులకు, ఉద్యోగ విధులకు సమన్వయం కుదరక ఇబ్బందులు. ఆర్థిక, కుటుంబ, వృత్తి విషయాలలో ఇతరుల సలహాలు తీసుకోకండి. కొత్త ఋణాలు చేయవద్దు. జనవరి: బుద్ధికుశలతతో పనులు సానుకూలం చేసుకుంటారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. పాత సమస్యలు పరిష్కరించుకుంటారు. ధనం వెసులుబాటు, ఆరోగ్యం బాగుంటాయి. కుటుంబ సమస్యలు తీర్చుకోవడంలో తెలివిగా ఉంటారు. ఫిబ్రవరి: చేపట్టిన పనులు తేలికగా పూర్తికావు. తెలివి ధైర్యం విడనాడరు. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు సమర్థంగా సాధిస్తారు. నూతన ప్రయత్నాలు వేగం అవుతాయి. సామాజిక కార్యక్రమాలలో కీర్తి పెరుగుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలకు అనుకూలం. అందరి నుంచి ఆశించిన సహకారం అందుతుంది. మార్చి: మంచి ఫలితాలు ఎన్ని ఉంటాయో, ఇబ్బందికర అంశాలు కూడా అన్ని ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారు. అందరికీ సలహాలు ఇస్తుంటారు. అతిధోరణితో తోటివారి నుంచి చికాకులు కొని తెచ్చుకుంటారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, నూతన వృత్తి ప్రయత్నాలలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పుష్కర నిర్ణయముయమునా నదీ పుష్కరములు: ది.01–06–2026 తెల్లవారితే 02–06–2026 గం.12:17లకు గురువు కర్కాటక రాశిలో ప్రవేశం. యమునానదీ పుష్కరాలు ప్రారంభం. రాత్రికాలంలో గురువు ప్రవేశం అయినది కావున 2వ తేదీ నుంచి 12 రోజులు పుష్కరదినములుగా గణన చేయవలెను. అధిక జ్యేష్ఠ బహుళ విదియ మంగళవారం నుండి అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశీ శనివారం వరకు. ముఖ్య గమనిక : పితృశ్రాద్ధం చేశాక దేవాలయములకు వెళ్ళరాదు. నేడు పుష్కరాలు వ్యాపారధోరణిని అనుసరిస్తున్నాయి. పితృకార్యం చేసిన రోజు ఇతర దేవతా ఆరాధనలకు విశేషం లేదు. పితృ దేవతలే ప్రతిమనిషి జీవితంలోను ప్రధాన దేవతలు. పుష్కర యాత్రకు వెళ్ళినవారు ముందురోజే దేవాలయ సందర్శనం చేయండి. పితృ దేవతా సంబంధంగా కార్యం చేసిన రోజు దేవాలయ దర్శనం కూడదు. (పితృకార్యం అనంతరం). గమనించి సంచరించండి. పుష్కర సందర్భంగా ప్రారంభం నుంచి 12 రోజులు పూర్తిగా పుష్కరుడు ఆ పుష్కర నది మీదే విహరిస్తూ ఉంటారు. కావున 12 రోజులు 24 గంటలూ కూడా విశేషమే. అయినప్పటికీ రాత్రి 2వ యామము, 3వ యామము స్నానానికి నిషేధము. అలాగే కృత్రిమమైన మురికినీరుతో పుష్కరశ్రాద్ధము చేయుట కూడా నిషేధమే. పుష్కరాలు 12 రోజులు అయిన తరువాత ప్రతిరోజూ అపరాహ్ణ కాలంలో ఆ నదిమీదే పుష్కరుడు విహరిస్తాడు. అందువలన ఆ సంవత్సర కాలంలో ఏ రోజైననూ అపరాహ్ణ కాలంలో ఆ పుష్కరనదిని ఉద్దేశించి శుచిగా, శుభ్రమైన జలంతో పుష్కరశ్రాద్ధము నిర్వహించవచ్చు. అది ఈ 12 రోజుల మధ్యలో చేసిన ఫలితాన్నే సూచిస్తుంది. రాబోవు ప్లవంగ సంవత్సరంలో గోదావరి నది పుష్కరాలు: ది.26–06–2027 ప్లవంగ జ్యేష్ఠ బహుళ సప్తమీ శనివారం గోదావరి నదీ పుష్కరాలు ప్రారంభం. -పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
శ్రీ పరాభవ నామ సంవత్సర శుభ ముహూర్తములు (2026 – 27)
చైత్ర మాసం 19/03 చైత్ర శుద్ధ పాడ్యమి గురు ఉత్తరాభాద్ర ఉగాది నూతన వస్త్రాభరణధారణ వ్యాపారాదులకు వృషభం ఉ.11:00 (దుస్పక్). మిథునోపి ప.12:01 20/03 విదియ శుక్ర రేవతీ వృషభం ఉ.10:19. మి«థునం ప.11:45 (రహితం లేదు)21/03 తదియ శని అశ్విని దం, అన్న, అక్షర, సీమంత, పుంసవన, దేవతా ప్రతిష్ఠ, నిశ్చితార్థం, వాస్తు కర్మలు, రిపేర్లు మిథునం ప.12:01 విశేషం.25/03 సప్తమి బుధ మృగశిర అన్న, అక్షర, ఉప, వ్యాపార, దేవతా ప్రతిష్ఠ, సీమంత, పుంసవన, వాస్తుకర్మలు, రిపేర్లు నిశ్చితార్థం వృషభం ఉ.గం.9:5527/03 నవమి కళ్యాణములు కర్కాటక లగ్న ప.1:00–3:12. 1:00కు తలంబ్రాలు పోసేలాగా చూసుకోండి. దశమి పుష్యమి గృప్ర ధను రా.12:30.28/03 దశమి శని పుష్యమి అన్న, అక్షర, వ్యాపార, సీమంత, పుంసవన, వాస్తు కర్మలు, రిపేర్లు, బోరింగ్, ఉపనయనం, దేవతా ప్రతిష్ఠలు వృషభం ఉ.గం.9:43. 29/03 ద్వాదశీ ఆది మఘ వివాహం వృషభం రాత్రి 11:55 నిశీధి.30/03 త్రయోదశీ సోమ మఘ వివాహం వృషభం ప.గం.ఉ.9:30 (సగ్రహ)01/04 పౌర్ణమి, బుధ, ఉత్తర, అన్న, వాస్తుకర్మలు, వివాహం, దేవతాప్రతిష్ఠ, వివాహం, సీమంత, పుంసవన, నిశ్చితార్థం వ్యాపారం వృషభం మార్తాండ రహితం ఉ.గం.9:30. హస్త ధనుస్సు రా.గం.11:45 వివాహం.02/04 పాడ్యమి గురు హస్త అన్న, వాస్తుకర్మలు, రిపేర్లు, దేవప్రతిష్ఠ, వ్యాపార, సీమంత పుంసవన, బోరింగ్, నిశ్చితార్థం, వృషభం ఉ.గం.9:23 03/04 విదియ శుక్ర, చిత్త, గృప్ర, శంకు, వాస్తు కర్మలు దేవతాప్రతిష్ఠలు అన్న, సీమంత, పుంసవన, నిశ్చితార్థం, వ్యాపారం, బోరింగ్, దం మిధునం ప.11:01 శుభాంశ. స్వాతీ ధనస్సు రా.11:35.04/04 తదియ శని స్వాతి వివాహం, అన్న, అక్షర, వ్యాపార, దేవ ప్రతిష్ఠ, వాస్తుకర్మలు, రిపేర్లు, సీమంత పుంసవన, నిశ్చితార్థం, బోరింగ్లకు వృషభం 9:16.05/04 చవితి ఆది అనురాధ వివాహం, గృప్ర, గర్భాదానం, ధనస్సు రా.గం.11:45.06/04 చవితి సోమ అనురాధ వ్యాపారం, అన్న, సీమంత, పుంసవన, గృప్ర, శంకు, దేవతాప్రతిష్ఠ, వాస్తు రిపేర్లు, బోరింగ్, నిశ్చితార్థం వృషభం ఉ.గం.9:07. మిధునోపి ఉ.11:45 (6శుక్ర)08/04 షష్ఠి బుధ మూల సమస్త శుభకర్మలు దేవతా ప్రతిష్ఠ, వ్యాపార, అన్న, శంకు, బోరింగ్ వృషభం ఉ.గం.8:59 (8చం). మి«థునోపి ఉ.గం.11:00 (7చం)10/04 నవమి శుక్ర ఉత్తరాషాఢ వివాహం, గర్భాదాన, గృప్ర, ధనస్సు రా.గం.11:45.11/04 నవమి శని ఉత్తరాషాఢ సమస్త శుభకర్మలు వాస్తు కర్మలు వ్యాపారాదులకు బోరింగ్, నిశ్చితార్థ సీమంతాదులకు వృషభం ఉ.గం.8:51. శ్రవణం మిథునం ఉ.గం.11:00. దశమి శ్రవణం వివాహం, గర్భాదానం ధనుస్సు రా.గం.11:30.12/04 దశమి ఆది శ్రవణం వివాహం, శంకు, వాస్తుకర్మలు దేవ ప్రతిష్ఠలు, బోరింగ్, అన్న, అక్షర, ఉప, వ్యాపార, సీమంత, పుంసవన, వృషభం ఉ.గం.8:42. మిథునోపి 11:00. ఏకాదశీ ధనిష్ఠ వివాహం గృప్ర, గర్బ, ధనస్సు రా.గం.11:45.13/04 ఏకాదశీ, సోమ, ధనిష్ఠ, మిథునం ప.గం.11:00.వైశాఖ మాసం18/04 పాడ్యమి శని అశ్వినీ మిథునం ప.గం.11:01. పూర్ణచంద్రుడితో కూడిన సోమవారం వివాహమునకు దోషం కాదు. 20/04 తదియ సోమ రోహిణీ వివాహం అన్న, అక్షర, ఉప, సీమంత, పుంసవన దేవతాప్రతిష్ఠ, గృప్ర, శంకు, బోరింగ్, వ్యాపారం మిథునం ఉ.గం.10:51. కర్కాటకం ప.గం.12:01. చవితి వివాహం, గృప్ర, గర్భాదానం, వృశ్చికం రా.గం.8:27.23/04 సప్తమి గురు పునర్వసు, అన్న, అక్షర, సీమంత, పుంసవన, శంకుస్థాపన, బోరింగ్, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, మిథునం ఉ.గం.10:49. కర్కాటకోపి ప.గం.11:46. గర్భాదానాదులకు వృశ్చికం రా.గం.8:19.24/04 అష్టమి శుక్ర పుష్యమి కర్కాటకం బోరింగ్, పుంసవనం, అత్యవసర విషయాలకు ఉ.గం.11:38. గర్భాదానం వృశ్చికం రా.గం.8:15.25/04 నవమి శని మఘ వివాహం మకరం రా.గం.12:53 (8చం. సగ్రహచంద్ర)26/04 దశమి ఆది మఘ వివాహం వృషభం ఉ.గం.7:44. మిథునోపి ఉ.గం.10:33.29/04 త్రయోదశీ బుధ హస్త అత్యవసర ఉప నయనాది శుభాలకు ఉ.గం.11:01. చతుర్దశీ వివాహం, గర్భాదానం, నిశ్చితార్థం వృశ్చికం రా.గం.9:01. బుధ/గురు చిత్త మకరం రా.గం.12:33.30/04 చతుర్దశి గురు చిత్త అన్న, శంకు, గృప్ర, ప్రతిష్ఠ, బోరింగ్, వ్యాపారం, నిశ్చితార్థం, సీమంత పుంసవన వృషభం ఉ.గం.7:30. గృప్ర వశ్చికం రా.గం.7:47.01/05 పూర్ణిమ శుక్ర స్వాతి మిథునం ఉ.గం.10:15. సమస్త శుభాలకు కర్కాటకం ఉ.గం.11:14. వివాహం గప్ర వృశ్చికం రా.గం.7:43. మకరోపి వివాహార్థం రా.గం.12:29.03/05 విదియ ఆది అనురాధ వివాహం, శంకు, గృప్ర, వ్యాపారం, బోరింగ్, నిశ్చితార్థం, దేవతాప్రతిష్ఠ, సీమంత, పుంసవన, అన్న, అక్షర, ఉప, వృషభం మార్తాండ రహితం ఉ.గం.7:22 (12ర7చం) గర్భాదానం వివాహం మకరం రా.గం.12:21.04/05 తదియ సోమ అనురాధ, అన్న, అక్షర, ఉప, శంకు, గృప్ర, నిశ్చితార్థం, వివాహం, సీమంతం, గృప్ర, దేవతాప్రతిష్ఠ, వ్యాపారం వృషభం ఉ.7:14.06/05 పంచమి బుధ మూల అన్న, సీమంత, పుంసవన, వివాహం, నిశ్చితార్థం, బోరింగ్, వాస్తుకర్మలు, దేవతాప్రతిష్ఠ వృషభం ఉ.గం.7:05.07/05 షష్ఠి గురు ఉత్తరాషాఢ వివాహం గృప్ర వృశ్చికం రా.గం.7:23.08/05 షష్ఠి శుక్ర ఉత్తరాషాఢ అన్న, అక్షర, ఉప, సీమంత, పుంసవన, శంకు, గృప్ర, వివాహ నిశ్చితార్థం దేవతాప్రతిష్ఠ, వ్యాపారం, బోరింగ్ వృషభం ఉ.గం.6:58. సప్తమి మిథునం ప.గం.9:45. కర్కాటకం ప.గం.10:42. సప్తమి శ్రవణం వివాహం. సీమంత వేడుక నిశ్చితార్థం వృశ్చికం రా.గం.7:15.09/05 సప్తమి శని శ్రవణం మిథునం ఉ.గం.8:55 విశేషం. అష్టమి శని ధనిష్ఠ మకరం రా.గం.11:45.10/05 అష్టమి ఆది ధనిష్ఠ మిథునం ఉ.గం.9:39. నవమి వృశ్చికం రా.గం.7:10.అధిక జ్యేష్ఠ మాసంక్రింద యిచ్చిన ముహూర్తములు, అత్యవసరంలో బోరింగ్కు, వాస్తు రిపేర్లకు, నిత్యంలో అన్నప్రాశన, సీమంతం, వేడుక సీమంత, పుంసవన, జాతకర్మ, నామకరణలకు మాత్రమే.18/05 విదియ సోమ రోహిణీ కర్కాటకం ఉ.గం.10:01.20/05 పంచమి బుధ పునర్వసు ధనుస్సు ఉ.గం.8:30.21/05 పంచమి గురు పునర్వసు మిథునం ఉ.గం.8:50.22/05 షష్ఠి శుక్ర పుష్యమి మిథునం ఉ.గం.7:30.25/05 దశమి సోమ ఉత్తర మి«థునం ఉ.గం.8:30. కర్కాటకం ప.గం.9:26. ధనుస్సు రా.గం.8:00.27/05 ఏకాదశీ బుధ హస్త మిథునం ఉ.గం.7:30.28/05 ద్వాదశీ గురు చిత్త మిథునం ఉ.గం.7:30. త్రయోదశీ కర్కాటక ఉ.గం.9:30. ధనుస్సు సా.గం.8:00.29/05 చతుర్దశీ శుక్ర స్వాతీ కర్కాటకం ఉ.గం.10:01.30/05 పౌర్ణమి శని అనురాధ ధనుస్సు సా.గం.8:00.31/05 పౌర్ణమి ఆది అనురాధ మిథునం ఉ.గం.7:30.04/06 చవితి గురు ఉత్తరాషాఢ మిథునం ఉ.గం.7:00. ధనస్సు రా.గం.7:30.05/06 పంచమి శుక్ర శ్రవణం ధనిష్ఠ రా.గం.7:30.06/06 షష్ఠి శని ధనిష్ఠ కర్కాటకం ఉ.గం.10:01. ధనస్సు రా.గం.7:30. సగ్రహ చంద్రక్రాంతి దోషం07/06 సప్తమి ఆది శతభిషం కర్కాటకం ఉ.గం. 10:01. ధనుస్సు రా.7:30. సగ్రహ చంద్రక్రాంతి దోషం.నిజ జ్యేష్ఠ మాసం16/06 విదియ మంగళ / బుధ పునర్వసు బోరింగ్ వృషభం తె.గం.5:26.17/06 తదియ బుధ పునర్వసు అన్న, సీమంతం, పుంసవనం కర్కాటకం ఉ.గం.9:01. పుష్యమీ గర్భాదానం రా.గం.9:25.18/06 చవితి గురు పుష్యమీ అన్న, పుంసవన, సీమంత, బోరింగ్ కర్కాటకం ఉ.గం.8:03.19/06 షష్ఠి శుక్ర మఘ వివాహం మకరం రా.గం.9:18.20/06 షష్ఠి శని మఘ వివాహం కర్కాటకం ఉ.గం.7:55.21/06 అష్టమి ఆది ఉత్తర మకరం వివాహాది రా.గం.8:45. అష్టమి ఆది/సోమ ఉత్తర వివాహం వృషభం తె.గం.4:02. విశేషం.22/06 అష్టమి సోమ ఉత్తర సమస్త శుభాలకు కర్కాటకం ఉ.గం.9:01. నవమి హస్త మకరం వివాహం గృప్ర రా.గం.9:01.23/06 దశమి మంగళ/బుధ చిత్త, గృప్ర, బోరింగ్ వృషభం తె.గం.4:02.24/06 దశమి బుధ చిత్త (అన్న, అక్షర) ఏకాదశీ స్వాతి, వివాహం, గర్భాదానం మకరం రా.గం.9:01. ఏకాదశీ బుధ / గురు స్వాతీ వివాహం మేషం రా.గం.2:23.25/06 ఏకాదశి గురు స్వాతీ అన్న, అక్షర, వివాహ, బోరింగ్ కర్కాటకం ఉ.గం.7:38.27/06 త్రయోదశీ శని అనురాధ వివాహం మకరం రా.గం.8:46.28/06 చతుర్దశీ ఆది/సోమ మూల వివాహం మేషం రా.గం.2:01 విశేషం.29/06 పౌర్ణమి సోమ మూల వివాహాది శుభాలకు కర్కాటకం మార్తాండ రహితం ఉ.గం.7:30. వివాహం మకరం రా.గం.8:38 విశేషం.01/07 విదియ బుధ ఉత్తరాషాఢ అన్న, అక్షర, సీమంత, పుంసవన, బోరింగ్, వ్యాపార, దేవతాప్రతిష్ఠ, నిశ్చితార్థం, వివాహం, కర్కాటకం ఉ.గం.7:15. మేషం రా.1:30.02/07 విదియ గురు ఉత్తరాషాఢ అన్న, అక్షర, అకాలవటు, ఉప, వివాహ, సీమంత, పుంసవన, బోరింగ్ వ్యాపారం, దేవతాప్రతిష్ట, నిశ్చితార్థం కర్కాటకం ఉ.7:11 (8రా). తదియ శ్రవణం వివాహం మకరం రా.గం.8:22. వివాహం మేషం రా.గం.1:52.03/07 తదియ శుక్ర శ్రవణం అన్న, అక్షర, బోరింగ్, వివాహ, సీమంత, పుంసవన, వ్యాపారం ప్రతిష్ఠ నిశ్చితార్థం కర్కాటకం ఉ.7:07 (8రా). చవితి ధనిష్ఠ మకరం వివాహం రా.8:18. శుక్ర/శని మేషం వివాహం రా.1:48.08/07 నవమి బుధ అశ్వినీ వివాహం మకరం మార్తాండ రహితం రా.8:01. బుధ/గురు మేషం రాత్రి 1:31.ఆషాఢ మాసంసీమంత, పుంసవన, వాస్తు తదితరాలకు అత్యవసర ముహూర్తాలు 15/07 పాడ్యమి బుధ పుష్యమీ కర్కాటకం ఉ.7:30 19/07 షష్ఠి ఆది ఉత్తర ధనుస్సు సా.6:00.20/07 సప్తమి సోమ హస్త ధనుస్సు సా.6:00.22/07 నవమి బుధ స్వాతి ధనుస్సు సా.5:30.24/07 ఏకాదశీ శుక్ర అనురాధ ధనుస్సు సా.5:30.29/07 పౌర్ణమి బుధ శ్రవణం ధనుస్సు సా.5:00.30/07 పాడ్యమి గురు శ్రవణం ధనుస్సు సా.5:00.31/07 విదియ శుక్ర ధనిష్ఠ ధనుస్సు సా.5:00.08/08 ఏకాదశీ శని మృగశిర ధనుస్సు సా.4:30.19/07 షష్ఠి ఆది ఉత్తర తుల ప.11:55.24/07 ఏకాదశీ శుక్ర అనురాధ తుల ప.11:50.30/07 పాడ్యమి గురు శ్రవణం తుల ప.11:50.31/07 విదియ శుక్ర ధనిçష్ఠ తుల ప.11:50.08/08 దశమి శని రోహిణి తుల ప.11:50.శ్రావణ మాసం15/08 తదియ శని ఉత్తర నిశ్చితార్థం, అన్న, అక్షర, వ్యాపార, సీమంత, పుంసవన, వివాహ, శంకు, బోరింగ్లకు తుల ప.గం.12:00 (12చం/శు)16/08 చవితి ఆది హస్త, అన్న, వ్యాపార, బోరింగ్, శంకు, సీమంత, పుంసవన, వివాహములకు తుల ప.గం.11:55. హస్త ఆది/సోమ వివాహం వృషభం రా.12:32.20/08 అష్టమి గురు అనురాధ తుల ప.గం.11:50. నవమి గురు/శుక్ర అనురాధ వివాహం వృషభం రా.గం.12:30 (7చం). వివాహ శంకు కర్కాటకం తె.గం.4:01.21/08 నవమి శుక్ర అనురాధ వివాహం, అన్న, అక్షర, బోరింగ్, వ్యాపారం, సీమంత, పుంసవన, నిశ్చితార్థం తుల ప.గం.11:34.22/08 ఏకాదశీ శని/ఆది మూల వివాహం శంకు కర్కాటకం తె.గం.4:30.26/08 త్రయోదశీ బుధ శ్రవణం అన్న అక్షరాది శుభాలకు తుల ప.గం.10:01. చతుర్దశి శ్రవణం వివాహం వృషభం రా.గం.11:50. వివాహం, శంకు కర్కాటకం రా.గం.4:16.27/08 పౌర్ణమి గురు ధనిష్ఠ సమస్త శుభాలకు తుల ప.గం.11:01. గృప్ర, వివాహం వృషభం రా.గం.11:50 28/08 పాడ్యమి శుక్ర శతభిషం సీమంతం వేడుకలకు నిశ్చితార్థములకు మకరం ప.గం.4:33. గృప్ర, వివాహం, వృషభం రా.గం.11:42. శుక్ర/శని వివాహ, శంకు, వ్యాపార, బోరింగ్లకు కర్కాటక తె.గం.3:20.30/08 తదియ ఆది ఉత్తరాభాద్ర తుల ఉ.గం.10:54 . వివాహం గృప్ర వృషభం రా.గం.11:34. శంకు, వివాహం, బోరింగ్ కర్కాటకం తె.గం.3:18. తె.గం.4:01. శుభాంశ.31/08 చవితి సోమ రేవతి తుల ఉ.గం.10:56. వృషభం రా.గం.11:30.01/09 పంచమి మంగళ/బుధ అశ్విని కర్కాటకం తె.గం.4:05. అద్భుతమైన ముహూర్తం.03/09 అష్టమి గురు/శుక్ర రోహిణి కర్కాటకం తె.గం.3:50.04/09 అష్టమి శుక్ర రోహిణి తుల ప.గం.10:39. నవమి శుక్ర/శని మృగశిర శంకు, బోరింగ్ తె.గం.3:50 కర్కాటకం.05/09 నవమి శని మృగశిర తుల ప.గం.10:35.06/09 ఏకాదశీ ఆది పున వృషభం రా.గం.11:11. ఆది/సోమ కర్కాటకం తె.గం.3:45 శుభాంశ.07/09 ఏకాదశీ సోమ పున తుల ప.గం.10:25.భాద్రపద మాసంఅన్నప్రాశన, జాతకర్మ, సీమంత, పుంసవన, నామకరణాదులకు ముహూర్తములు12/09 విదియ శని ఉత్తర తుల ప.గం.10:01.13/09 తదియ ఆది హస్త తుల ప.గం.10:03.14/09 చవితి సోమ చిత్త తుల ప.గం.9:50.16/09 షష్ఠి బుధ అనురాధ మేషం రా.గం.8:01.17/09 షష్ఠి గురు అనురాధ తుల ఉ.గం.9:10.21/09 దశమి సోమ ఉత్తరాషాఢ తుల ఉ.గం.9:00. ఏకాదశీ మేషం రా.8:81.24/09 త్రయోదశీ గురు ధనిష్ఠ తుల ఉ.గం.9:10. శతభిషం మేషం రా.గం.7:50.25/09 చతుర్దశీ శుక్ర శతభిషం తుల ఉ.గం.9:20.26/09 పౌర్ణిమ శని ఉ.భాద్ర మేషం రా.గం.7:55. ఆశ్వీయుజ మాసం11/10 శుద్ధ పాడ్యమి ఆది చిత్త నవరాత్రి కలశ స్థాపనలకు తుల ఉ.గం.6:40–7:00. వ్యాపారాదులకు నిశ్చితార్థం మేషం రా.7:29.12/10 విదియ సోమ స్వాతి వ్యాపారం అన్న, అక్షర, నిశ్చితార్థం తుల ఉ.గం.8:01. నిశ్చితార్థం సీమంత వేడుకలు మేషం రా.గం.7:00.14/10 చవితి బుధ అనురాధ అన్న, అక్షర, సీమంత, పుంసవన, నిశ్చితార్థం వృశ్చికం ఉ.గం.8:51. సీమంతాదులకు మేషం రా.గం.7:00.మూలా నక్షత్రం అక్షరాభ్యాస నక్షత్రాలలో లేదు తెలుసుకోండి.17/10 సప్తమి శని మూల త్రిరాత్ర దీక్ష కలశస్థాపనలకు వృశ్చికం ఉ.గం.8:30.18/10 దుర్గాష్టమీ సందర్భంగా వాహనపూజ, యంత్రపూజలకు ఉ.గం.9:30.19/10 మహానవమి సందర్భంగా వాహనపూజలు యంత్ర పూజలకు ఉ.గం.9:30.20/10 విజయదశమి సందర్భంగా వ్యాపారులకు పూజ సమయం ఉ.9:50సా.6:0021/10 దశమీ బుధ ధనిష్ఠ అన్న, సీమంత, పుంసవనలకు వృశ్చికం 8:35. ఏకాదశీ శతభిషం మేషం సా.6:30.22/10 ఏకాదశీ గురు శతభిషం అన్న సీమంత పుంసవన వృశ్చికం ఉ.గం.8:00.24/10 చతుర్దశీ శని ఉత్తరాభాద్ర మేషం రా.గం.6:50.25/10 పౌర్ణమి ఆది రేవతి మేషం రా.గం.6:50.28/10 తదియ బుధ రోహిణి వృషభం రా.గం.7:45.29/10 చవితి గురు మృగశిర వృషభం రా.గం.7:41 (వివాహ, గృప్ర, గర్భాదానం)30/10 పంచమి శుక్ర మృగశిర వృశ్చికం ఉ.7:40.01/11 సప్తమి ఆది పునర్వసు అన్న, అక్షర, శంకు, బోరింగ్, సీమంత, పుంసవన వృశ్చికం ఉ.గం.7:30.02/11 అష్టమి సోమ పుష్యమి వృశ్చికం ఉ.గం.7:30.05/11 ఏకాదశీ గురు ఉత్తర వృశ్చికం ఉ.7:30.07/11 ధ¯Œ తేరస్ పూజలకు మిథునం రా.గం.8:309:00.08/11 దీపావళి పూజలకు మిథునం రా.గం.8:35.కార్తీక మాసం11/11 విదియ బుధ అనురాధ అన్న, అక్షర, వైశ్యోపనయన, నిశ్చితార్థం, సీమంత, పుంసవన, వివాహం, బోరింగ్, శంకు, గృప్ర, వ్యాపారం వృశ్చికం ఉ.గం.7:08.12/11 చవితి గురు మూల వివాహం మిథునం రా.గం.9:31.13/11 చవితి శుక్ర మూల అన్న, అక్షర, వైశ్యోప నయన, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, వివాహం, బోరింగ్, ధనుర్లగ్న ఉ.గం.10:13.14/11 పంచమీ శని ఉత్తరాషాఢ వివాహం, నిశ్చితార్థం, వేడుక సీమంత, గృప్ర వషభం రా.గం.6:50. షష్ఠి వివాహం కర్కాటకం రా.గం.10:30. 15/11 షష్ఠి ఆది ఉత్తరాషాఢ అన్న, అక్షర, వైశ్యోప నయన, వివాహ, దేవ ప్రతిష్ఠ, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, వ్యాపార, బోరింగ్, శంకు, గృప్ర, వృశ్చికం ఉ.గం.6:52. నిశ్చితార్థం, వివాహం, గృప్ర వృషభం రా.గం.6:36. మిథునం రా.గం.9:22.16/11 సప్తమి సోమ శ్రవణం అన్న, అక్షర, వైశ్యోప నయనం, శంకు, బోరింగ్, వ్యాపార, సీమంత, ప్రతిష్ఠ వ్యాపారం వృశ్చికం ఉ.గం.6:45. వేడుక సీమంతం, వివాహం, వృషభం రా.గం.6:29. మిథునం రా.గం.9:15.18/11 నవమి బుధ శతభిషం వివాహం, గృప్ర, గర్భాదాన, నిశ్చితార్థం మిధునం రా.గం.7:55. వివాహం కర్కాటకం రా.గం.10:02.20/11 ఏకాదశీ శుక్ర, ఉత్తరాభాద్ర అన్న, అక్షర, సీమంత, పుంసవన, వైశ్యోపనయన, వివాహ, శంకు, గృప్ర, ప్రతిష్ఠ, వ్యాపారం ధనుస్సు ఉ.గం.9:39. ద్వాదశీ శుక్ర/శని రేవతీ శంకు వివాహం తుల తె.గం.5:30.21/11 ద్వాదశీ శని రేవతీ వివాహం గృప్ర మిథునం రా.గం.8:57. వివాహం కర్కాటకం రా.గం.9:47. త్రయోదశీ శని/ఆది శంకు వివాహం తుల తె.గం.5:30.22/11 త్రయోదశీ ఆది అశ్వినీ అన్న, అక్షర, వైశ్యోప నయన, సీమంత, పుంసవన, వివాహం, శంకు, బోరింగ్, వ్యాపారం, ధనుస్సు ఉ.గం.9:32. వివాహం, గృప్ర, గర్భాదానం మిథునం రా.గం.8:50.24/11 బ.పాడ్యమి మంగళ/బుధ రోహిణి వివాహం, శంకు, బోరింగ్ తుల తె.గం.5:16.25/11 పాడ్యమి బుధ రోహిణి అన్న, వివాహ, శంకు, గృప్ర, ప్రతిష్ఠ, వ్యాపార, సీమంత, పుంసవన, ధనుః ఉ.గం.9:23. వివాహ, సీమంత వేడుక, గృప్ర, మిథునం రా.గం.8:30. వివాహం కర్కాటకం రా.గం.9:31.26/11 విదియ గురు మృగశిర అన్న, అక్షర, వైశ్యోప నయన, ప్రతిష్ఠ, వివాహం, గృప్ర, మిథునం రా.గం.8:30. కర్కాటకం రా.గం.9:27.28/11 పంచమి శని/ఆది పుష్యమి శంకుస్థాపన తుల తె.గం.4:59.29/11 పంచమీ ఆది పుష్యమీ అన్న, అక్షర, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం, వైశ్యోపనయన, దేవప్రతిష్ఠ ధనుః ప.గం.9:0402/12 దశమి బుధ/గురు ఉత్తర శంకు/వివాహ, బోరింగ్, తుల తె.గం.4:44.03/12 దశమి గురు ఉత్తర అన్న, అక్షర, వైశ్యోపనయన, శంకు, గృప్ర, బోరింగ్, సీమంత, పుంసవన, నిశ్చితార్థం, వ్యాపార, దేవతాప్రతిష్ఠ, ధనుః ఉ.గం.8:53. హస్త వివాహం గర్భాదానం మిథునం రా.గం.8:01.04/12 ఏకాదశీ శుక్రవారం హస్త అన్న, అక్షర, వైశ్యోపనయనం, శంకు, ప్రతిష్ఠ, బోరింగ్, వ్యాపార, వివాహం, ధనుస్సు ఉ.గం.7:50. చిత్త గృప్ర ధనుస్సు రా.గం.9:57.మార్గశిర మాసం10/12 విదియ గురు మూల ధనుస్సు ఉ.గం.8:24. వివాహం మిథునం రా.గం.7:35.11/12 తదియ శుక్ర/శని ఉత్తరాషాఢ వివాహం బోరింగ్ తుల తె.గం.4:08.12/12 చవితి శని ఉత్తరాషాఢ వివాహం నిశ్చితార్థం గృప్ర మిథున రా.గం.7:26. శని/ఆది వివాహం శంకు తుల తె.గం.3:50.13/12 చవితి ఆది శ్రవణం ధనుస్సు ఉ.గం.7:10. పంచమి ఆది శ్రవణం వివాహం నిశ్చితార్థం మిథునం రా.గం.7:28. ఆది/సోమ వివాహం శంకు తుల తె.గం.3:50.14/12 పంచమి సోమ ధనిష్ఠ వివాహ, అన్న, అక్షర, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం, సీమంత, పుంసవన, నిశ్చితార్థం, ప్రతిష్ఠ, ధనుస్సు ఉ.గం.8:10. షష్ఠి వివాహం గృప్ర నిశ్చితార్థం మిథునం రా.గం.7:24.16/12 సప్తమి బుధ శతభిషం వివాహం, గృప్ర, శంకు, నిశ్చితార్థం, బోరింగ్, వ్యాపారం, అన్న అక్షర, సీమంత, పుంసవన, ధనుస్సు ఉ.గం.8:02.17/12 నవమి గురు/శుక్ర ఉత్తరాభాద్ర వివాహం తుల తె.గం.3:45 (6చం)18/12 దశమి శుక్ర/శని రేవతి వివాహం వృశ్చికం తె.గం.4:42.19/12 ఏకాదశీ శని/ఆది అశ్విని వివాహం వృశ్చికం తె.గం.4:38.22/12 చతుర్దశీ మంగళ/బుధ రోహిణి వివాహం గృప్ర వృశ్చికం తె.గం.4:26.25/12 తదియ శుక్ర/శని పుష్యమి గృప్ర వృశ్చికం తె.గం.4:11.27/12 పంచమి ఆది/సోమ మఘ వివాహం వృశ్చికం తె.గం.4:02.30/12 అష్టమి బుధ/గురు హస్త సమస్త శుభాలకు వృశ్చికం తె.గం.3:56.31/12 నవమి గురు/శుక్ర చిత్త సమస్త శుభాలకు వృశ్చికం తె.గం.3:53.01/01 దశమి శుక్ర/శని స్వాతి సమస్త శుభాలకు వృశ్చికం తె.గం.3:49పుష్య మాసంపగటికాల ముహూర్తములు తక్కువ ఉన్నాయి. విప్రాజ్ఞతో శిశువులకు అన్నప్రాశనలు పూర్తి చేసుకోండి. మేషలగ్నం మాత్రమే సీమంతాదులకు గ్రాహ్యం.09/01 విదియ శని శ్రవణం మేషం ప.గం.12:30.10/01 తదియ ఆది శ్రవణం మేషం ప.గం.12:30.11/01 చవితి సోమ ధనిష్ఠ మేషం ప.గం.12:20.14/01 సప్తమి గురు ఉత్తరాభాద్ర మేషం ప.గం.12:15.15/01 అష్టమి శుక్ర రేవతి మేషం ప.గం.12:15.16/01 నవమి శని అశ్విని మేషం ప.గం.12:05.22/01 పౌర్ణమి శుక్ర పుష్యమి మేషం ప.గం.12:00.27/01 షష్ఠి బుధ హస్త మేషం ప.గం.11:15.28/01 సప్తమి గురు చిత్త మేషం ప.గం.11:30.31/01 దశమి ఆది అనురాధ మేషం ప.గం.11:00.మాఘ మాసం08/02 విదియ సోమ శతభిషం అన్న, అక్షర (ఉప10ర) దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, శంకు, బోరింగ్, సీమంత, పుంసవన మేషం ప.గం.11:28. తుల రా.గం.11:11.ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం బహుదోషం09/02 చవితి మంగళ / బుధ ఉత్తరాభాద్ర ధనుః తె.గం.4:30.10/02 చవితి బుధ ఉత్తరాభాద్ర మేషం ప.గం.11:20. తుల రా.గం.11:03. పంచమి బుధ/గురు ఉత్తరాభాద్ర వృశ్చికం రా.గం.1:08.11/02 పంచమి గురు రేవతి అన్న, అక్షర, అకాల వటు, ఉప, సీమంత, పుంసవన, నిశ్చితార్థం మేషం ప.గం.11:13. వషభం ప.గం.12:01. వివాహాదులకు తుల రాగం.12:04 నిశీధి. షష్ఠి గురు/శుక్ర రేవతీ వివాహం, గృప్ర వృశ్చికం రా.గం.1:01. అశ్విని వివాహం, బోరింగ్, శంకు ధనుస్సు తె.గం.3:13.12/02 షష్ఠి శుక్ర అశ్విని శంకు, బోరింగ్, నిశ్చితార్థం వివాహం (ఉప10ర) అన్న, అక్షర, సీమంత, పుంసవన ప్రతిష్ఠలకు మేషం ప.గం.11:13.14/02 నవమి ఆది/సోమ రోహిణి వివాహాదులకు వృశ్చికం రా.గం.2:01.15/02 నవమి సోమ రోహిణి, అన్న, అక్షర, ఉప, వివాహం, నిశ్చితార్థం, దేవతా ప్రతిష్ట, వ్యాపారం, శంకు, గృప్ర, అన్న, అక్షర మేషం ప.గం.11:01. వివాహం తుల రా.గం.11:30.17/02 ఏకాదశీ బుధ ఆర్ద్ర మేషం ప.గం.10:50. ద్వాదశీ బుధ పునర్వసు గర్భాదానం తుల రా.గం.11:43.18/02 ద్వాదశీ గురు పునర్వసు అన్న, సీమంత పుంసవన, శంకు బోరింగ్లకు వృషభం ప.గం.11:45. త్రయోదశీ పుష్యమి గృప్ర, గర్భాదానం వృశ్చికం రా.గం.12:33.19/02 చతుర్దశీ పుష్యమి శుక్ర అన్న, శంకు, బోరింగ్, సీమంత, పుంసవన, వృషభం ప.గం.11:46.20/02 పౌర్ణమి శని మఘ వివాహం తుల రా.గం.11:29.21/02 పౌర్ణమి శని మఘ వివాహం వృషభం ప.గం.12:01.22/02 విదియ సోమ ఉత్తర వివాహం తుల రా.గం.11:20. పూర్ణచంద్రుడు + సోమవారం దోషం కాదు.25/02 పంచమి గురు చిత్త అన్న, అక్షర, శంకు, గృప్ర, నిశ్చితార్థం, సీమంత, ఉప, పుంసవన ప్రతిష్ఠ, వ్యాపారం వృషభం ఉ.గం.11:52. స్వాతీ వివాహం తుల రా.గం.11:01. ధనుస్సు రా.గం.3:21. వృశ్చికం రా.గం.12:10.26/02 షష్ఠి శుక్ర స్వాతి వషభం అగ్నిపంచకం ప.గం.11:44.27/02 సప్తమి శని అనురాధ తుల అగ్నిపంచకం రా.గం.11:04. వివాహం, గృప్ర వృశ్చికం రా.గం.12:10. అష్టమి శని/ఆది అనురాధ వివాహ, గృప్ర, శంకు, ధనుః రా.తె.గం.3:13.ఫాల్గుణ మాసం 10/03 విదియ బుధ రేవతి నిశ్చితార్థం వృషభం ప.11:01. తదియ బుధ రేవతి వివాహం గర్భాదానం తుల రా.గం.10:19 వివాహ గృప్ర వృశ్చికం రా.గం.11:16.11/03 తదియ గురు రేవతి అన్న, అక్షర, వివాహ, శంకు, బోరింగ్, వ్యాపార, సీమంత, పుంసవన నిశ్చితార్థ, ప్రతిష్ఠ మేషం ఉ.గం.9:21. అశ్విని వృషభం ఉ.గం.11:30. చవితి గురు అశ్విని వివాహం తుల రా.గం.10:15. వృశ్చికం రా.గం.11:12.12/03 చవితి శుక్ర అశ్విని అన్న, వివాహ, శంకు, బోరింగ్, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం, ప్రతిష్ఠలకు వృషభం ఉ.గం.10:20 మార్తాండ రహితం.14/03 షష్టి ఆది రోహిణి వివాహ, గృప్ర, నిశ్చితార్థం, సీమంత, పుంసవన (ఉపనయన 10ర) అన్న, అక్షర, దేవతా ప్రతిష్ఠ, బోరింగ్, శంకు, వృషభం ఉ.గం.10:44. సప్తమి ఆది రోహిణి వివాహ గృప్ర రా.గం.12:12.15/03 సప్తమి సోమ మృగశిర సమస్త శుభాలకు, వాస్తు కర్మలకు ప్రతిష్ఠలకు మేషం ఉ.గం.09:01.17/03 దశమి బుధ పునర్వసు అన్న, అక్షర, అత్యవసర ఉప సీమంతం పుంసవనం, శంకు, బోరింగ్లకు మేషం ఉ.గం.8:49 వృషభం ఉ.గం.10:30.18/03 ఏకాదశీ గురు పుష్యమి అన్న, అక్షర, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, ప్రతిష్ట, శంకు, బోరింగ్, వ్యాపార, మేషం ఉ.గం.8:45. గృప్ర, గర్భాదానం వృశ్చికం రా.గం.10:40 (సగ్రహచంద్ర)20/03 త్రయోదశీ శని మఘ వివాహం వృషభం ఉ.గం.10:15. చతుర్దశీ మఘ వివాహం వృశ్చికం రా.గం.10:35.21/03 పౌర్ణమి ఆది ఉత్తర వివాహం గృప్ర వృశ్చికం రా.గం.10:30.22/03 పౌర్ణమి సోమ ఉత్తర అన్న, వివాహం, సీమంత, పుంసవన, నిశ్చితార్థ, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం మేషం ఉ.గం.8:36. వృషభం ఉ.గం.10:06. బ.పాడ్యమి సోమ హస్త తుల రా.గం.9:21. వృశ్చికం రా.గం.10:24.24/03 విదియ బుధ చిత్త అన్న, అక్షర, ఉప, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం, వషభం ఉ.గం.9:59. తదియ బుధ స్వాతి వివాహ, వృశ్చికం రా.గం.10:16.25/03 తదియ గురు స్వాతి వివాహాది మేషం ఉ.గం.8:28. వృషభం ఉ.గం.9:30.26/03 పంచమి శుక్ర అనురాధ వృశ్చికం రా.గం.10:30.27/03 పంచమి శని అనురాధ వృషభం ఉ.గం.9:51. షష్ఠి శని వృశ్చికం రా.గం.10:30.29/03 సప్తమి సోమ మూల వృషభం ఉ.గం.9:44. తుల రా.గం.8:56.31/03 నవమి బుధ ఉత్తరాషాఢ çవృషభం ఉ.గం.9:40. దశమి వృశ్చికం రా.గం.10:01.01/04 దశమి గురు శ్రవణం వృషభం ఉ.గం.9:28. వృశ్చికం రా.గం.9:45. -పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
వివక్షకు తిరగమోత పెడదాం
ఇళ్లల్లో రోజువారీ వంటచేసేది మహిళలే అయినా, బయట మాత్రం పాకనిపుణులుగా పురుషులే రాణిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ షెఫ్లుగా పేరుపొందిన వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నా, నెమ్మదిగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ రంగంలోకి మహిళలు మరింతగా రావాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే మహిళలు షెఫ్లుగా రాణిస్తూ ఉన్నా, ఈ రంగంలో మహిళా షెఫ్ల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. నేను వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ని అయినా, అమెరికాలో ఉన్నప్పుడు అనివార్యంగా వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్రమంగా వంటలపై ఆసక్తి పెరిగి, షెఫ్గా మారాను. మాది అనకాపల్లి. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఆర్క్, ఐఐటీలో ఎంఆర్క్ చేశాను. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లినప్పటి నుంచి నాకు వంటపై ఆసక్తి పెరిగింది. ఇండియాకి తిరిగి వచ్చేశాక ఒకవైపు ఆర్కిటెక్ట్గా పనిచేస్తూనే, మరోవైపు హోమ్ షెఫ్గా షెరటాన్, మేరియట్లాంటి హోటళ్లలో; ఇంట్లో ఓనం సధ్యలాంటివి హోస్ట్ చేయడం మొదలుపెట్టాను. పలు ఫైవ్ స్టార్ హోటల్స్లో తెలుగు వంటల ఈవెంట్స్ చేశాను. ఈ రంగంలోకి వచ్చిన మొదట్లో కొన్ని ఇబ్బందులూ ఎదుర్కొన్నాను. అమ్మాయినని చిన్నచూపు చూసేవారు. వెళ్లిన ప్రతిచోటా అమ్మాయిలు షెఫ్గా ఉన్నా, తొక్కేయాలనే చూస్తారు. అయితే, నా ప్రతిభా సామర్థ్యాల మీద నాకు నమ్మకం ఉంది.మీరా గిరిజ తాడిమేటి షెఫ్వివక్ష ఇంకా పోలేదు..అది 2000 సంవత్సరం. నేను వరంగల్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఆడపిల్లలకు క్లాస్ చెబుతున్నాను. ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ నా క్లాస్లోకి అడుగుపెట్టింది. ఏమైందని అడిగితే, కాలి మీద కాల్చిన వాత చూపించింది. గిన్నెలు కడగలేదని వాళ్ల నాన్న పొయ్యిలోని కట్టె తీసి కాల్చాడని చెప్పింది. వెంటనే అమ్మాయిని తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్లాను. వాళ్ల అమ్మా నాన్నలు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. ‘ఆడపిల్లను అలా కాలుస్తావా?’ అని వాళ్ల నాన్నను అడిగాను. ఆయన చాలా క్యాజువల్గా ‘తప్పేముంది, పని చేయకపోతే ఆడపిల్ల ఎందుకు?’ అని అడిగాడు. ఆడపిల్ల ఎందుకు చదువుకోవాలో వివరంగా చెప్పాను. చివరకు తప్పయిందని ఒప్పుకున్నాడు. ఇకపై స్కూలుకు పంపిస్తానని చెప్పాడు. ఈమధ్య నేను గోవాకు వెళ్లాను. అక్కడ బీచ్కి వెళ్లాం. నాకు ఒక దృశ్యం కనిపించింది. ఒక తండ్రి పదేళ్ల పాపను తిడుతూ, కాళ్లతో వెనకవైపు తంతున్నాడు. నేను వెళ్లి ఆ తండ్రిని అడిగేలోపే జనంలో కలిసిపోయారు. ఇన్నాళ్లలో ఆడపిల్లల జీవితాలు ఏమీ మారలేదు కదా అనిపించింది.నేను గత 26 సంవత్సరాలుగా ఆడపిల్లలు, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేస్తూ వస్తున్నాను. నేను 2000 సంవత్సరంలో నా సంస్థ మొదలుపెట్టినప్పుడు ఆడపిల్లలపై వివక్ష, భ్రూణహత్యలు, ఎనీమియా, పౌష్టికాహార లోపం, బాల్యవివాహాలు, బాల కార్మికులు, ఆడపిల్లలపై అత్యాచారాలు తదితర ఎన్నో అంశాలపై పనిచేయాల్సి వచ్చింది. ఆడపిల్లలను వద్దనుకుని, చెత్తకుండీలలో పడేస్తున్నప్పుడు ఆస్పత్రులు, బస్టాండ్లు, అంగన్వాడీ కేంద్రాలలో ‘తరుణి’ ఊయలలు పెట్టి, ఆడపిల్లలను రక్షించగలిగాం. ఎన్నో వేల బాల్యవివాహాలను ఆపగలిగి,ఆ ఆడపిల్లలను మళ్లీ చదువులో పెట్టగలిగాం. మేం 2004లో జాతీయ మానవ హక్కుల కమిషన్లో వేసిన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఫలితంగా బాల్యవివాహ నిరోధక చట్టం–2006 వచ్చింది. బాలికలపై లైంగిక అత్యాచారాలను నిరోధించడానికి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. తెలంగాణ పోలీసులతో కలిసి భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయగలిగాం. హైదరాబాద్లో మొదలైన ఈ భరోసా కేంద్రాలు ఇప్పుడు 33 జిల్లాలకూ విస్తరించాయి. అత్యాచార బా«ధితులైన బాలికల్లో ఆత్మహత్యలు పెరుగుతుండటం చూసి, వారి కోసం తరుణి స్వావలంబన రీహాబిలిటేషన్, స్కిల్ సెంటర్ను హైదరాబాద్లో రెండేళ్లుగా నడుపుతున్నాం.మహిళల్లో కూడా దురలవాట్లు, సంపాదించగలమనే ధైర్యంతో బాధ్యతారాహిత్యం పెరిగాయి. మహిళల్లో పెరిగిన దురలవాట్లను మాన్పించడానికి ‘సాంత్వన’ డీఅడిక్షన్ సెంటర్, అలాగే చంచల్గూడ మహిళా జైలులో ‘నివృత్తి’ డీఅడిక్షన్ సెంటర్ నడుపుతున్నాం. లింగవివక్షను రూపుమాపడానికి మా సంస్థ తరఫున ‘సమదృష్టి’ అనే వేదికను నిర్వహిస్తున్నాం. తరుణి సంస్థ పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆఫీసులలో ఎక్స్టర్నల్ మెంటర్గా అంతర్గత కమిటీలలో పనిచేస్తూ, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. డాక్టర్ ఆచంట, మమతా రఘువీర్, తరుణి స్వచ్ఛంద సంస్థ వంటల పుస్తకం రాసిన తొలి మహిళ అనా వెకర్. జర్మనీలోని న్యూరెంబర్గ్కు చెందిన అనా, 1596లో ‘న్యూ డిలైట్ఫుల్ అండ్ యూజ్ఫుల్ కుక్బుక్’ రాశారు. ఈ పుస్తకం పలు భాషల్లోకి అనువాదం పొంది ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇళ్లలో రోజువారీ వండుకునే వంటకాలు, ప్రత్యేక వంటకాలు, వంటకాల రుచిని పెంచే చిట్కాలను ఇందులో విపులంగా రాశారు. వంటకాల రచన మాత్రమే కాకుండా, అనా వెకర్ అరుదుగా కొన్ని కవితలు కూడా రాశారు.నిర్మలా రెడ్డి(చదవండి: ‘ఆమె’ ఆరోగ్యమే... సమాజ ఆరోగ్యం!) -
ప్రశ్నలే ఎక్కువవుతున్నాయి
స్త్రీవాదం ఒక ఉద్యమంగా మొదలై దశాబ్దాలు గడచి, స్త్రీలు ఓటింగ్ హక్కు సంపాదించుకుని శతాబ్దం దాటి, ప్రపంచమంతా స్త్రీల సాధికారతపై ప్రతి ఏటా మార్చి 8 న గొంతులు చించుకునే సందర్భంలో– ఈ 21 వ శతాబ్దంలో, జెన్ జీల కాలంలో– ఫ్రాన్స్లో ఒక భర్త తన భార్యకు మత్తుమందిచ్చి, తను రేప్ చెయ్యడమే కాక మరెందరో స్నేహితుల చేత ఆమెను కొన్ని ఏళ్ల పాటు రేప్ చేయిస్తాడు; ఒక మాజీ భర్త, తనకు విడాకులిచ్చి మళ్లీ పెళ్లి చేసుకుని 4 నెలల గర్భం దాల్చిన భార్యను నరికి చంపేస్తాడు. ప్రపంచనాయకత్వం ప్రకటించుకునే దేశంలో, మరింత గొప్ప వలసాధిపత్య దేశం రాజకుమారుడు, బాలికలపై ఏళ్ల తరబడి అత్యాచారం చేస్తాడు. అక్కడిదాకా ఎందుకు? యూట్యూబ్ ఛానెల్ నడిపే ఆడపిల్లలను ట్రోలింగ్తో మానసిక హింసకు గురిచేయడం తన జన్మహక్కు అనుకుంటాడు సగటు తెలుగు మగోడు; ఇక మన అగ్రేసర తెలుగు నటుడు, ‘థప్పడ్’ వంటి సినిమాలు వచ్చిన తర్వాత కూడా నాయికను లాగి చెంపదెబ్బ కొడతాడు; ఇంకో సూపర్ స్టార్ కొడుకు కమ్ అందాల హీరో దాదాపు ప్రతి సినిమాలోనూ తన నాయికను చెంపదెబ్బలు కొట్టందే ప్రేమించలేడు.జీవితంలోనూ, కళలోనూ కూడా అదే హింస. కాని, మనం మాత్రం స్త్రీలు చాలా చాలా ప్రగతి సాధించారు. రాజ్యాలేలుతున్నారు; బిజినెస్ టైకూన్లు అయ్యారు; పార్లమెంటులో గొంతు వినిపిస్తున్నారు. పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారు; అంతర్జాతీయ సమావేశాల నుంచి తమకు నచ్చకపోతే వాకౌట్లు చేస్తున్నారు– అని పొంగిపోతున్నాం. ఇంకా చెప్పాలంటే, స్త్రీలకట... స్వేచ్ఛ ఎక్కువైంది. కనక భర్తలను హతమారుస్తున్నారు; యూట్యూబ్లో రెచ్చిపోయి మగవాళ్లను ఆడిపోసుకుంటున్నారు. ‘అసలు స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వకుండా ఉండాల్సింది’ అని బాధపడిపోయే జనాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? 19 వ శతాబ్దిలో మొదలైన స్త్రీల అస్తిత్వ పోరాటాలు సత్ఫలితాలను ఇచ్చాయని, అందుకే ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్త్రీల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉందనీ పొంగిపోదామా? ఎందరో స్త్రీలు గృహహింసకు ఇప్పటికీ గురవుతూండగా, దొంగ కట్నం కేసులతో అత్తారింటివారిని జైళ్ళకు పంపుతున్న కొంతమంది స్త్రీల అవివేకానికి ఎక్కువ ప్రచారం వస్తోందని బాధపడదామా? ఎందరో భర్తలు అతి చిన్న కారణాలకు భార్యలను హతమారుస్తున్న రోజుల్లో, కొందరు భార్యలు భర్తలను, తాగుడు భరించలేకో, మరెందుకో హతమారుస్తున్నందుకు వారిపై తీర్పులు చెప్దామా? మరోవైపు, తమ తల్లులు ఊపిరాడనివ్వని బంధనాల నుంచి విముక్తి కోసం ఎంతగా పోరాడారో తెలిసి కూడా, తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటున్న ఆడపిల్లలను చూసి జాలి పడదామా? ఈ రోజున మహిళా దినోత్సవాన్ని గురించి మాట్లాడుకోవడం ఎప్పటికంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. రోజురోజుకీ ప్రశ్నలే ఎక్కువవుతున్నాయి, సమాధానాలు అంత సులభంగా దొరకడం లేదు. ప్రపంచమంతా స్వార్థపూరితమైపోతున్న వేళ, ప్రపంచమంతా ఒక మార్కెట్గా, లాభనష్టాలే అసలైన విలువలవుతున్న వేళ, ఎవరికీ తమ ప్రయోజనాలు తప్ప, ఏ విలువల పట్లా ఏ నిబద్ధతా, ఏ అంకితభావమూ లేకుండా పోతున్న వేళ– సమాజాన్ని కాస్తంత మానవీయం చేయడానికి స్త్రీలు మాత్రమే కాదు; వారితో పాటు పురుషులు ఏం చెయ్యగలరో ఆలోచించడం ఇప్పటి అవసరం.మృణాళిని, సాహితీవేత్తతొలి నవలా రచయిత్రిప్రపంచ సాహిత్యంలో తొలి నవలా రచయిత్రి మూరాసాకీ షీకీబు. జపాన్ రాజాస్థానంలో రాచ మహిళలకు సహాయకురాలిగా పనిచేసేది. పదకొండో శతాబ్దిలోనే ఆమె ‘గెంజీ మోనోగటారి’ (ది టేల్ ఆఫ్ గెంజి) నవల రాసింది. ఆమె ఈ నవల రాసేనాటికి ప్రపంచంలోని మరే భాషలోనూ నవలా పక్రియ రూపుదిద్దుకోలేదు. ఈ నవలను మూరాసాకీ షీకీబు క్రీస్తుశకం 1010–1021 కాలంలో రాసి ఉంటుందని చరిత్రకారుల అంచనా. అప్పట్లో జపాన్లో చైనీస్ భాష రాచభాషగా ఉండేది. హెలాన్ రాచమహిళలు చైనీస్ భాషను నేర్చుకోరాదనే నిషేధం ఉండేది. అయినా మూరాసాకీ తన తండ్రి ద్వారా చైనీస్ భాషను నేర్చుకుని, ఆ భాషలోని మేలి రచనలు చదువుకుంది. చైనీస్ సాహిత్యాధ్యయనం వల్ల అబ్బిన పరిజ్ఞానానికి తన సృజనాత్మకతను జోడించి, జపానీస్ భాషలో నవల రాసింది. ప్రపంచ సాహిత్యంలో ఇదే తొలి నవలగా పరిశోధకులు పరిగణిస్తారు.నిలదీతలో పదునెక్కుతున్నామా?ఏటా జరుపుకొనే మహిళా దినోత్సవమే. ఆ ప్రాతిపదికన మహిళలుగా మన ఆలోచనలను మెరుగుపరచుకునే దిశగా చూస్తున్నామా? సమాజంలో గుర్రపుడెక్కలా అల్లుకుపోయిన మూఢత్వాన్ని, అశ్లీలతనీ, హింసను నిలదీయటంలో పదునెక్కుతున్నామా? మనల్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? ఇటువంటి ప్రశ్నలకు ‘అవును’ అని చెప్పుకోవాలంటే అందుకు భూమికలు ఏవి; కాదు అని తలవాల్చుకునేట్లయితే, కారణాలు వెతికి పట్టుకుని పరిష్కారాలు ఏవి అని ఆలోచించవలసి వుంటుంది.భిన్న రంగాల్లో దూసుకుపోతున్న అమ్మాయిల తెలివితేటల్ని, చొరవను, ఆర్థికస్వేచ్ఛను– వీటన్నిటి ఫలితమైన స్వతంత్ర వ్యక్తిత్వాన్ని, నిర్ణయాత్మకతను– మగపిల్లలు సహించలేకపోతున్న స్థితి రాజ్యమేలుతున్నది. భారతదేశానికి గర్వకారణమైన క్రీడాకారిణి మిథాలీ ఏమన్నదో గుర్తున్నదా! తనకు ఎదురైన పెళ్ళి ప్రతిపాదనలలో ఒకరు ‘అత్తగారిని చూసుకోవాలి’ అన్నారు. (అది తప్పు కాదు– కానీ ఒక రంగంలో శిఖరస్థాయికి చేరిన వ్యక్తిని, కేవలం మహిళ అయిన కారణంగా, షరతులతో బంధించాలని చూడటం నేరం.) మరొకరు, ‘వేరే వ్యాపకం వద్దు– ఇల్లు, పిల్లల్ని చూసుకోవాలి‘ అన్నారని చెప్పిన మిథాలీ, ‘కనీసం ముందే చెప్పినందుకు వాళ్ళకి థాంక్స్‘ అన్నది. ఇటువంటి అనుభవాలే ఎందరో మహిళా డాక్టర్లు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలవి! అంటే తమకు ఏమి కావాలో నిర్ణయించుకోగల స్థాయిలో ఆధునిక యువతులు వుండగా, న్యాయమైన వారి ఆశలు ఆకాంక్షల్ని సహించలేని యువకులూ మన ముందే కనిపిస్తున్నారు.ప్రేమ, పెళ్ళి వంటి సొంత వ్యవహారాలలో తమ ఎంపిక, తమ నిర్ణయమే చెల్లాలనే అబ్బాయిల ధోరణి వల్ల తెల్లవారి లేస్తే దినపత్రికల నిండా ఏకపక్షపు ప్రేమ(!)వంటివాటి దుష్ఫలితాల్ని చూస్తున్నాం. అయితే స్వార్జన, స్వేచ్ఛ వల్ల అందరమ్మాయిలలోనూ వ్యక్తిత్వ పటిష్ఠత ఏర్పడటం లేదు. ఇప్పటికీ ప్రేమ పేరిట వంచనకు, అఘాయిత్యాలకు, ఆధునిక సాంకేతికత పుణ్యమా అని బ్లాక్ మెయిలింగ్ వంటి ద్రోహాలకూ అమ్మాయిలు ఆస్కారం ఇస్తుండటం విషాదకరం. తన ప్రేమికుడు వేరొక అమ్మాయితో సాన్నిహిత్యం వెలగబెడుతుంటే అతన్ని ఛీత్కరించి దూరంపెట్టవలసింది పోయి, ‘అతను నావాడు... నువ్వు పో’ అంటూ ఆ రెండో అమ్మాయి మీద దాడి చేయటం చూస్తున్నాం. మరోపక్క ఆధునిక ఉద్యోగ జీవితాలు, నిరంతరం కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక సౌకర్యాల వల్ల వెర్రితలలు వేస్తున్న ప్రలోభాలు మనుషుల్ని నిలవనివ్వక వ్యామోహాలపాలు, తత్ఫలితంగా నేరాలపాలు చేస్తున్నాయి. సరైన పెంపకం, మొక్కగానే వంచి బుద్ధులు చెప్పే సంస్కృతి నానాటికీ కొరవడుతున్నప్పుడు ఆడ, మగపిల్లలు శారీరక ఉద్వేగాలకు, ఉద్రేకాలకు, మానసిక ఘర్షణలకు లోనుకావటమే జరుగుతుంది. ఇరవైల వయసులోనే ఉద్ధృతమైన సంపాదనలతో విలసిల్లుతున్న నేటి అమ్మాయిలు, అబ్బాయిలకు మందలింపులు అటువుంచి– సలహాలు ఇచ్చేందుకూ పెద్దలు భయపడుతున్నారు కదా! ఈ సామాజిక సామూహిక విషమస్థితికి అంతర్జాల విషాలగాలం ముఖ్యకారణమని ఎన్నో అధ్యయనాలు తేల్చిచెప్తున్నాయి. యువతీ యువకులకే కాక, కౌమార దశలో వున్న పిల్లలకు– ముఖ్యంగా బాలికలకు అంతర్జాలపు కత్తిఅంచు ప్రాణాంతకమవుతున్నది. గర్భాలతో ప్రాణాల మీదకు తెచ్చే అశాస్త్రీయ గర్భస్రావాలతో మన నగరాలు, పల్లెలు ఒక్కలాగే అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు పూర్ణ వంటి అట్టడుగు సామాజిక స్థాయినుంచి వచ్చిన బాలికలు పర్వతారోహణ, క్రీడలు, శాస్త్రవిజ్ఞానం, కళలు, అంతరిక్షయానాల వంటి విభిన్న రంగాల్లో వజ్రాల్లా ప్రకాశిస్తుంటే, మరోవైపు జీవితాల్ని ఛిన్నాభిన్నం చేసుకుంటున్న బాలికలు, యువతులు, మహిళలు కొల్లలుగా కనిపిస్తూండటం బాధాకరం.ఇప్పటికీ మహిళలు గృహహింసకు గురవుతూనే వున్నారు. భార్యా పిల్లల్ని, ‘ఎముకలు విరిగేలా లేదా రక్తస్రావ మయ్యేలా కొడితే మాత్రమే‘ నేరమని, అదైనా ‘నిరూపించబడితేనే శిక్షార్హ’మని, ఆ శిక్ష కూడా గరిష్టంగా పదిహేనురోజులని చట్టం చేసిన తాలిబన్ రాజ్యం మన పొరుగునే ఉన్నది. ‘శారీరకంగా చొరబడకుండా కేవలం స్ఖలనం జరిగితే అత్యాచారం కాదు’ అని వాకృచ్చే న్యాయస్థానాలు మన దేశంలోనే ఉన్నాయి! ఇప్పటికీ కొందరు రాజకీయనాయకుల దృష్టిలో ‘రేప్’ అంత పెద్ద నేరం కాదు!మౌలికంగా మన ఇళ్ళలో ఆడ, మగ పిల్లల పట్ల సమదృష్టి, సమధోరణిలో వాళ్ళ పెంపకం, లింగవైవిధ్యం పట్ల శాస్త్రీయదృష్టి ఏర్పరచుకునే దిశగా ప్రోత్సాహం, విజ్ఞానం సద్వినియోగం పట్ల అవగాహన పెంపుదల, మనుషుల మధ్య లింగవివక్షతో సహా– ఎటువంటి విభజనలైనా కేవలం కృతకమైనవనే వాస్తవాలను బోధించే సంస్కారం, వివేచన పాదుకున్నప్పుడే నేటి సామాజిక రుగ్మతలబారి నుంచి తల్లులు, చెల్లెళ్ళు, యావత్ మానవజాతి బయటపడేందుకు దారులు ఏర్పడతాయి. ఘంటశాల నిర్మల కవయిత్రి, సీనియర్ జర్నలిస్ట్ఆఖరి మైలు వరకు నడవాలినన్ను నేను కచ్చితంగా ఒక మహిళగా భావిస్తాను, అలాగే ఒక ప్రచురణకర్తగా కూడా భావిస్తాను, కాని ఎప్పుడూ నన్ను నేను ఒక మహిళా ప్రచురణకర్తగా మాత్రం చూసుకోలేదు. ఒక మహిళగా నాకు అదనపు గౌరవం లభించిందని, అందువల్ల నేను వివక్షకు గురికాలేదని చెప్పడం సులభమే. కాని, ఈ ప్రయాణంలో ఇబ్బందులు ఉన్నాయి, అవి పని స్వభావం వల్ల ఎదురైనవే తప్ప, నేను చేస్తున్న ప్రచురణ వల్ల కాదు. ఉదాహరణకు, ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు కనీసం పబ్లిక్ టాయిలెట్లు కూడా ఉండేవి కావు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోనూ మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉండేవి. పుస్తకాలు అమ్మడానికి రోజంతా స్టాల్ వద్దే నిలబడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో పక్కనే ఉన్న ఇళ్లకు వెళ్లి వారి అనుమతి కోరడం లేదా వేరే దారి లేనప్పుడు మొహమాటాన్ని వదిలేసి పని పూర్తి చేయడమే ముఖ్యం అని నాకు తోచేది. పురుషులతో పని చేసేటప్పుడు వారు నాతో మాట్లాడటానికి సంకోచించేవారు. నేను పని మీద ఒకరి ఇంటికి వెళ్తే, వారు నన్ను నేరుగా చూడటానికి భయపడేవారు. ‘ఇంట్లోకి వెళ్లి మా ఆవిడతో మాట్లాడు’ అని వంటగది వైపు చూపించేవారు. కానీ నేను పని మీద వచ్చింది మిమ్మల్ని కలవడానికేనని స్పష్టంగా చెప్పేదాన్ని. సమాజంలో మార్పే లక్ష్యంగా..నక్సలైట్ ఉద్యమ స్ఫూర్తితో, సమాజంలో మార్పు తీసుకురావాలనే పట్టుదలతో 26 ఏళ్ల వయసులోనే ఈ రంగంలోకి అడుగుపెట్టాను. ఎందరో మహానుభావుల మార్గదర్శకత్వంలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఒక మహావృక్షంలా ఎదిగింది. ఆ రోజుల్లో ప్రజలు సమయాన్ని డబ్బుతో కొలిచేవారు కాదు, నిస్వార్థంగా పని చేసేవారు. ఆర్థిక సరళీకరణల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాఠకుల నమ్మకమే...మహిళనైనందుకు నాకు కొన్ని ప్రయోజనాలు కూడా కలిగాయి. వయసులో పెద్దవారైన రచయితలు, మేధావులు నన్ను ఎంతగానో ఆదరించారు. పాఠకులు మహిళలను ఎక్కువగా నమ్మేవారు. ఈ నమ్మకమే ఈ రంగంలో రాణించడానికి నాకు ఎంతగానో సహాయపడింది. కేవలం సాయంత్రం వేళల్లో జరిగే మందు పార్టీల చర్చలకు మాత్రం నేను దూరంగా ఉండాల్సి వచ్చేది. కీలక నిర్ణయాలన్నీ అక్కడే జరుగుతుంటాయి. ఒక మహిళగా ఆ వాతావరణంలో నేను ఇమడలేకపోయాను. అక్కడ నాకు ప్రవేశం కూడా ఉండేది కాదు. కొత్త తరం అమ్మాయిలు..నేడు చాలామంది మహిళలు ఈ రంగంలోకి రావడం సంతోషకరం. భాగ్యలక్ష్మి (మంచి పుస్తకం), పూర్ణిమ తమ్మిరెడ్డి (ఎలమి) వంటి వారు ముందు వరుసలో ఉంటే, జ్యోతి వలబోజు (జేవీ పబ్లికేషన్స్), శ్వేత (అజూ పబ్లికేషన్స్), ఉష ప్రత్యూష (బాలా బుక్స్), మానస ఎండ్లూరి, అపర్ణ తోట వంటి వారు ప్రస్తుతం ఈ రంగంలో రాణిస్తున్నారు. ప్రచురణ నా ప్యాషన్దశాబ్దాల కాలంలో పుస్తక విక్రేతలు, రచయితలు, అనువాదకులు, సమీక్షకులతో ఏర్పడిన అనుబంధం వెలకట్టలేనిది. ఈ రంగం అనుకున్నంత ఆడంబరంగా ఉండదు. దీనికి గుండె ధైర్యం, అంతులేని ఓపిక కావాలి. ఇక్కడ రకరకాల మనుషులు ఉంటారు. ప్రూఫ్ రీడింగ్ కోసం గంటల తరబడి కళ్లు కాయలు కాచేలా చూడటం, ప్రింటర్ల వెనుక పడటం, అనువాదకులను ఒప్పించడం, పుస్తక విక్రేతల నుంచి బాకీలు వసూలు చేయడం– ఇవన్నీ తెర వెనుక అలసటతో కూడిన పనులు. కొందరు రచయితల్లో అహం ఎక్కువగా ఉంటుంది. అనువాదకులు మాత్రం అణకువతో ఉండి పుస్తకాలను ప్రేమిస్తారు. ఇన్ని సవాళ్లున్నప్పటికీ మళ్ళీ అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా ప్రచురణనే ఎంచుకుంటాను కానీ మరే వృత్తినీ ఎంచుకోను.డబ్బుతో ముడిపెట్టలేనిదిప్రచురణ రంగం కేవలం పుస్తకం మీద ఉన్న మమకారంతో, ఆఖరి మైలు వరకు నడిచే సత్తా ఉన్నవారికి మాత్రమే! ప్రైవేట్ కంపెనీలకు కూడా ఈ రంగంలో వచ్చే లాభాలు చాలా తక్కువ. అవినీతి ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటేనో లేదా పాఠ్యపుస్తకాలు అమ్ముకుంటేనో తప్ప, ఇందులో ఆర్థికంగా స్థిరపడటం కష్టం. ఇది కేవలం ప్యాషన్తో చేసే అక్షర యజ్ఞం.గీతా రామస్వామి, ప్రచురణ కర్తజంబుల రమాదేవి(చదవండి: నేను... ఉమన్ జర్నలిస్ట్) -
నేను... ఉమన్ జర్నలిస్ట్
జర్నలిస్ట్గా 1980లో ప్రయాణం ప్రారంభించినప్పుడు నన్ను నేను ‘మహిళా జర్నలిస్ట్’ అని ఎప్పుడూ అనుకోలేదు. వేరే లేబుల్స్ లేకుండా నేను జర్నలిస్ట్ను. దిల్లీలో క్రైమ్బీట్ చూశాను. క్రైమ్బీట్ అంటే ‘ఇది పురుషులకు మాత్రమే’ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. తరువాత చెన్నైలో ఒక జాతీయ పత్రికకు కరస్పాండెంట్గా పనిచేశాను.గతతరం జర్నలిస్ట్లు ద్వారాలు తెరిచి, ఈ వృత్తిని ఎంచుకున్న మా తరం మహిళలకు పునాది వేశారు. అయినప్పటికీ శ్రీలంక, పాకిస్తాన్లలో విదేశీ కరస్పాండెంట్గా నా పోస్టింగ్ను అసాధారణంగా, ఆశ్చర్యంగా చూశారు. అయితే హైప్రొఫైల్ అసైన్మెంట్స్కు నా జెండర్ అడ్డు కాదనిపించింది. పాకిస్తాన్లో నేను మొదటి మహిళా జర్నలిస్ట్ అయ్యే అవకాశం వచ్చింది. భారతదేశాన్ని వదిలి పాక్కు వెళ్లే ముందు...‘నీకు అప్పగించిన బాధ్యత పురుషులకు కూడా కష్టమైనది. ఒంటరిగా ఉన్నందున ఆ అపాయింట్మెంట్ను తిరస్కరించడం మంచిది’ లాంటి సలహాలు వినిపించాయి. నేను ఆ సలహాలు పాటించనందుకు సంతోషంగా ఉంది. అక్కడి (పాక్) నుంచి రిపోర్టింగ్ చేయడం నాకు చాలా ఇష్టంగా అనిపించింది. ఒకటి నేను పురుషుడినై ఉంటే ఇంత కంటే బాగా చేసేదాన్ని అని చెప్పలేను కాని, జర్నలిజంలో నా పనికి గుర్తింపుగా రెండు అవార్డులు వచ్చాయి.రెండవది, ఆ దేశంలో నేను కలిసిన ప్రతి ఒక్కరూ, పాకిస్తాన్లో నియమితురాలినైన మొదటి మహిళా జర్నలిస్ట్ నేనే అని చెప్పడం ప్రారంభించారు. మూడవది, ‘మహిళా జర్నలిస్ట్’ అనే మాటకు అర్థం ఏమిటో నాకు పాకిస్తాన్లో అర్థమైంది. నేను భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చినప్పుడు నా స్థానంలో వేరొకరిని నియమించడానికి అన్వేషణ మొదలైంది. ఇతర విషయాల సంగతి ఎలా ఉన్నా మహిళ లేదా అవివాహితుడు అయితే బాగుంటుందని అనుకున్నారు.పూర్వకాలంలో పాక్లో పోస్ట్ చేసిన పురుషుల పిల్లలు అంతర్జాతీయ స్థాయి పాఠశాలలో చదవడానికి అయ్యే ఖర్చును ప్రచురణ సంస్థే భరించేది. ఎందుకంటే భారతీయ పిల్లలకు స్థానిక పాఠశాలల్లో చదవడం కష్టంగా ఉండేది. ఒక పురుష జర్నలిస్ట్ను ఇస్లామాబాద్లో నియమించారు. దీంతో ఆయన భార్య ఇక్కడ తాను చేసే ఉద్యోగాన్ని వదులుకొని భర్తతో వెళ్లాల్సి వచ్చింది. ఉద్యోగం వదులుకున్నందుకు సంస్థ ఆమెకు పరిహారం కూడా చెల్లించింది.కాని, కాలం మారిపోయింది. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు.పాక్ను వదిలి భారత్కు వచ్చే ముందు ఇస్లామాబాద్లోని నా స్నేహితులకు నా స్థానంలో వచ్చే మహిళ గురించి చెప్పాను. అప్పుడు వారి స్పందన ఇలా ఉంది... ‘వోహ్! వచ్చేది కూడా మహిళా జర్నలిస్టేనా? ఇక్కడ మాత్రమే మహిళలను ఎందుకు పోస్ట్ చేస్తున్నారు? హానీ ట్రాప్లుగా మహిళలను పంపాలనేది మీ నిఘా సంస్థల వ్యూహం అయి ఉండాలి’– అపోహల అద్దాలతో చూస్తున్నప్పుడు, అలాంటి సమయంలో వివరణ ఇవ్వడం అర్థరహితం అనిపించింది.‘మహిళా జర్నలిస్ట్లు మరింత ముందుకు సాగాలి. వారు గొప్ప కథనాలెన్నో రాయగలరు. అదే సమయంలో సంస్థ వారి దీర్ఘకాలిక కెరీర్ పురోగతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని ఒక అగ్ర సంపాదకుడు రాశారు. ఎందుకంటే చాలామంది మహిళా జర్నలిస్ట్లు వివాహం కాగానే రెండు, మూడు సంవత్సరాల్లోనే ఫీల్డ్ను వదిలిపెట్టారు. ఈ రకంగా ఆయన నిజం మాట్లాడారు.ఈరోజుల్లో ఎక్కువగా కనిపించే బైలైన్లను చూడండి. వారందరూ మహిళా జర్నలిస్ట్లే. కాని ఎడిటర్లు ఎవరో చూడండి. గత ఇరవయ్యేళ్లుగా మీడియాలో వచ్చిన మార్పుల కారణంగా కొంతమంది మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ప్రసార మాధ్యమాలు(బ్రాడ్కాస్ట్ మీడియా), ఆన్లైన్ వార్తా సంస్థలలో గ్రాఫ్ ఇప్పటికీ పురుషులకు అనుకూలంగానే ఉంది. జర్నలిజం స్కూల్స్లో పురుషులతో పోల్చితే మహిళా విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. నేను క్లాస్ చెప్పే ఒక జర్నలిజం స్కూల్లో పదిహేనుమంది విద్యార్థులలో ముగ్గురు మాత్రమే పురుషులు. వార్త సంస్థలలో మహిళల నాయకత్వానికి సంబంధించిన ఆశ బహుశా భవిష్యత్తులోనే ఉంటుంది.నిరూపమా సుబ్రమణియన్, సీనియర్ జర్నలిస్ట్ (చదవండి: హెల్త్కేర్’లో నారీశక్తి) -
‘హెల్త్కేర్’లో నారీశక్తి
హెల్త్కేర్ రంగంలో మహిళల భూమిక రోజురోజుకూ విస్తరిస్తోంది. ఆరోగ్యరంగంలో మహిళల ఆరోగ్యం కోసం కృషిచేయాల్సిన రంగాలు నిజానికి చాలా ఎక్కువే ఉన్నాయి. ఇటీవల తమ సాధికారతలో భాగంగా మహిళా డాక్టర్లు కేవలం చికిత్సకే పరిమితం అయిపోవడం లేదు. దాంతోపాటు కొత్త స్టార్టప్ల ఏర్పాటు; హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలూ; మహిళలకు పీరియడ్స్ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత; ప్రెగ్నెన్సీ ప్లానింగ్; సురక్షితంగా ప్రసవం జరపడం, హోమ్ సర్వీసెస్, పాలియేటివ్ కేర్ వంటి అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. ఈ అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు అందివస్తున్న కొత్త టెక్నాలజీ సహాయంతో మహిళలకు ఉపయోగపడే స్టార్టప్స్ ఏర్పాట్లు చేయడం వంటి అంశాల్లో చొరవ తీసుకుంటున్నారు. హస్పిటల్స్/ క్లినిక్స్ నిర్వహణ, స్టార్టప్స్, పబ్లిక్ హెల్త్, టెక్నాలజీ వంటి కీలకమైన నాలుగు అంశాల్లో మహిళల బాగు కోసం అనునిత్యం శ్రమించడంతో పాటు ఈ అంశాల్లో ఎంటర్ప్రెన్యూర్స్గా ఎదగడానికి మహిళా వైద్యులు విశేషంగా కృషిచేస్తున్నారు. ఆ నాలుగింటినీ విపులీకరిస్తే, తొలి అంశంగా– తాము ఎవరి కోసమో పనిచేయకుండా కేవలం తమ కోసం తామే సంస్థను ఏర్పాటు చేసుకోదలచుకున్న వారు... ఉదాహరణకు చూసినప్పుడు గైనకాలజీ రంగంలో సొంతంగా ఐవీఎఫ్ వంటి సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడమూ, కాస్మెటిక్ గైనకాలజీ, ఈస్తటిక్ గైనకాలజీ రంగాలలో విస్తృతంగా తమవైన క్లినిక్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే పీడియాట్రీ, డెర్మటాలజీ, యూరోగైనకాలజీ వంటి స్పెషాలిటీ క్లినిక్స్ కూడా ప్రారంభిస్తున్నారు. ఇక పెద్ద పెద్ద హాస్పిటల్ సెటప్స్ కష్టం అనుకుంటే పొద్దున్నే సర్జరీ చేసేసి, పేషెంట్ను సాయంత్రానికల్లా ఇంటికి పంపించే ‘డే కేర్’ సెంటర్స్ మొదటి కేటగిరీలోకి వస్తాయి. ఇక రెండో అంశానికి వస్తే, ఇందులోనే హెల్త్ యాప్స్ రూపొందించి, మెంటల్ హెల్త్ వంటి విభాగాల్లో బాధితులకు అవసరమైన మార్గదర్శకాలు చెప్పడం; ప్రెగ్నెన్సీ సమయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై సలహా, సూచనలందించడం వంటి స్టార్టప్స్ యాప్ల రూపకల్పన అనుకోవచ్చు. వీటిల్లో భాగంగానే డయాగ్నస్టిక్ సేవలందించే సంస్థలనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇక మూడో విభాగంలో వెల్నెస్తో పూర్తి సమగ్ర ఆరోగ్యం పొందడం కోసం అనుసరించాల్సిన యోగా, ధ్యానం వంటి ప్రక్రియల గురించి వివరించేందుకు అవసరమైన ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయడం. జీవనశైలి కారణంగా అందరిలోనూ వచ్చే లైఫ్స్టైల్ జబ్బులైన డయాబెటిస్ వంటివి మొదలుకొని మహిళల్లోనే వచ్చే పీసీఓఎస్ (పాలీ సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్), ఎండోమెట్రియాసిస్ వంటి వాటి విషయంలో అవసరమైన మేనేజ్మెంట్ గురించి అవగాహన కల్పించే కేంద్రాలను నెలకొల్పుతున్నారు. ఇక్కడ సమగ్ర చికిత్స అంటే... సమస్యకు ప్రిస్క్రిప్షన్ సూచించడం ఒక్కటే కాకుండా తీసుకోవాల్సిన ఆహారాలూ, చేయాల్సిన వ్యాయామాలు... ఇలా 360 డిగ్రీలలో అవసరమైనవన్నీ అందేలాంటి సెంటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక నాలుగో విభాగంలోకి వస్తే హోమ్ హెల్త్కేర్ సేవలు. ఇటీవల హాస్పిటల్ ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఒకరోజు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే లక్షల్లో ఖర్చు. కాని, అంతే క్వాలిటీ సేవలు ఇంట్లోనూ అందితే? ఈ కొత్త కాన్సెప్ట్తో పేషెంట్ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడానికి సర్జరీ అనంతర సేవలూ, వృద్ధులకు అవసరమైన కేర్, జీవిత చరమాంకంలో ఉన్నవారికి అవసరమైన పాలియేటివ్ కేర్ లాంటి అత్యంత కీలకమైన రంగంలోనూ ఎంటర్ ప్రెన్యూర్షిప్కు అవకాశాలు చాలా విస్తృతంగా పెరిగాయి. ఇవే కాకుండా, సాంకేతికత పెరుగుతున్న కొద్ది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందు బాటులోకి వస్తున్న కొద్ది అందివస్తున్న కొత్త సాంకేతికత సహాయంతో ఈ రంగాలను మరింత విస్తృతపరచే అవకాశం ఎంతో ఉంది. దానికి ఆకాశమే హద్దు. మరి మహిళలంటేనే ఆకాశంలో సగం అంటూ చెబుతుంటారు. ఇలా చూసినప్పుడు వారికి మరింత విశాలమైన అవకాశాలున్నాయో ఊహించవచ్చు. అంతేకాదు, వీటిలో మరింతగా విస్తరించడానికి మహిళల్లో సహజంగా ఉండే ఆర్ద్రత, దయ, సానుభూతి, సహానుభూతి, మల్టీ టాస్కింగ్ సామర్థ్యాల వంటి సహజ లక్షణాలు వారికి మరింతగా అవకాశమిస్తుంటాయి. అందుకే మహిళలు తమ సహజ లక్షణాలతో మరింతగా ముందుకు దూసుకుపోవాలనేది ఓ మహిళగా నా అభిలాష.డాక్టర్ మంజుల అనగాని, సీనియర్ గైనకాలజిస్ట్ ‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీతయాసీన్పరిష్కారాలు మనమే వెతుక్కోవాలియంగ్ జనరేషన్ గమనించాల్సింది ఏమిటంటే, మన చాయిస్ పట్ల మనం ప్యాషనేట్గా ఉండాలి. మన ప్రొడక్టివిటీని మగవాళ్లతో సమానంగా, చెప్పాలంటే కాస్తంత ఎక్కువగానే రిజల్ట్స్ చూపించాలి. మనం చేసే పని ప్యాషనేట్గా చేస్తూ, ఇతరులకు సహాయం చేయగలిగితే, పరిశోధనారంగంలో సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అమ్మాయిలు తమ అభిరుచి ఎందులో ఉందో గుర్తించి, మనస్ఫూర్తిగా ఆ రంగంలో పనిచేస్తూ పోవాలి. అయినా అందులోనూ ఆటంకాలు, అపజయాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినప్పుడు ఎవరో వచ్చి మనకు ఏదో చేస్తారని ఎదురుచూడకూడదు. మనకు మనమే ధైర్యంగా ముందుకు సాగాలి. సమస్యలు ఎదురైనప్పుడు సమస్యలకు పరిష్కారాలను మనమే వెతుక్కోవాలి. నేను అలాగే పనిచేశాను. మనం ఎవరికన్నా తక్కువ కాదు. మనం అందరితోనూ సమానం, సమానం కంటే మనం ఎక్కువ అనే భావనతో మనం పనిచేసినప్పుడే ఆనందంగా ముందుకు సాగిపోగలం.నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో పీజీ, జేఎన్టీయూ నుంచి బయోటెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశాను. అప్పట్లో నాకు యూజీసీ ఫెలోషిప్ వచ్చినా, సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లో పీహెచ్డీ చేయాలని మా ప్రొఫెసర్స్, పేరెంట్స్ ఒత్తిడి చేయడంతో ఇందులో చేరాను. అలాగని సీసీఎంబీలో చేరడం పట్ల నాకు ఎలాంటి విచారం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిధిలో పనిచేసే సీసీఎంబీ హైదరాబాద్లోని హబ్సిగూడలో ఉంది. సీసీఎంబీ ఫౌండర్ డైరెక్టర్ పుష్పమిత్ర భార్గవ, ప్రొఫెసర్ లాల్జీ సింగ్ నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆయన వద్దనే ఏడాదిన్నర పాటు డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ వర్క్, తర్వాత డాక్టర్ ఎం.ఆర్.దాస్ వద్ద బ్రెస్ట్ ట్యూమర్స్, హెపటైటిస్–బి వైరస్ పరిశోధనలు సాగించాను. ఆ తర్వాత 1996లో ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీకి మారి, అక్కడి పరిశోధనల్లో కొత్త వరివంగడాలను కనుగొనడం చాలా సంతోషకరమైన కాంట్రిబ్యూషన్. మన దేశంలోని రైతులకు ఉపయోగపడే వరివంగడం కనుగొనడంలో కీలక పాత్ర పోషించాను. వరి పంటకు ఎక్కువగా సోకే ఎండాకు తెగులు (బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్) తట్టుకునే వరివంగడాన్ని నాటి గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా 2008లో నల్లగొండ జిల్లా గడ్డపల్లిలో విడుదల చేయించాం. మా సూపర్వైజర్ డాక్టర్ రమేష్ శొంఠి. ఆయన ఆధ్వర్యంలో ఈ వర్క్ అంతా నేనొక్కదాన్నే చేశాను. నిజానికి ఇది ముగ్గురు మనుషులు చేయాల్సిన పని. మహిళలు తలచుకుంటే చేయలేనిది ఏదీ లేదు అనేదే నా సందేశం. మహిళల్లో మల్టీ టాస్కింగ్ టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. వరి వంగడాలపై నా పరిశోధనవరి పండించే రైతులకు ఎండాకు తెగులు (బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్) పెద్ద సమస్య. ఈ తెగులును తట్టుకునే రోగనిరోధక శక్తిగల జన్యువులను సన్నబియ్యం దిగుబడిని ఇచ్చే వరిలోకి ‘ఇంట్రోగ్రెస్’ చేసి, 2008లో ‘ఇంప్రూవ్డ్ సాంబ మసూరి’ రకాన్ని విడుదల చేశాం. ఇప్పుడు దాని మీద మరిన్ని పరిశోధనలు సాగి స్తున్నాం. ‘స్టీల్త్ బ్లైట్’, ‘బ్రౌన్ ప్లాంట్ హోపర్’ వంటి వ్యాధులను తట్టుకోవడమే కాకుండా, ఫాస్ఫరస్ లోపం, పొలంలో నీరు నిల్వ చేరడం, నీటిలో అధిక లవణీయత వంటి ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకునేలా దీనిని రూపొందించడానికి కొన్ని జన్యువులను ఇదే వరి వంగడంలోకి చొప్పించి, మూడు కొత్త వంగడాలను సృష్టించాం. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడు రకాల వంగడాలను జాతికి అంకితం చేశారు. వీటి విత్తనాలను త్వరలోనే రైతులకు ఉచితంగా పంపిణీ చేయనున్నాం. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్’ సహకారంతో సీసీఎంబీ వరి వంగడాలను అభివృద్ధి చేస్తోంది. సీసీఎంబీ రూపొందించిన వంగడాలను ఐఐఆర్ఆర్ బ్రీడింగ్ చేస్తోంది. మా పరిశోధనల ఫలితంగా రైతన్నలకు అధిక దిగుబడులు వచ్చి, వారికి గిట్టుబాటు ధర లభించి, వారి జీవితాల్లో కొంతైనా మార్పు తేగలిగినందుకు మాకు సంతృప్తిగా ఉంది.డాక్టర్ విష్ణుప్రియ, శాస్త్రవేత్త, సీసీఎంబీ గోపాలకృష్ణ మయ్యా(చదవండి: ‘ఆమె’ ఆరోగ్యమే... సమాజ ఆరోగ్యం!) -
‘ఆమె’ ఆరోగ్యమే... సమాజ ఆరోగ్యం!
ఓ ప్రఖ్యాత కవి అంటారు... ‘‘ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్చటనూ లేనే లేదనీ’’!. అంటే మీరు ఇలా ఇవ్వడం మొదలుపెట్టగానే దాన్ని కొనసాగించడం కోసమైనా ప్రకృతి మీకూ ఇవ్వడం ప్రారంభిస్తుంది. దాంతో మీకు ఇచ్చే సామర్థ్యం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. మహిళ విషయంలో కూడా ఎప్పుడూ ఇంతే. ‘మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ప్రతిసారీ ఆమె తన తల్లిదండ్రులకో, భర్తకో, పిల్లలకో, కుటుంబసభ్యులకో చెబుతూనే ఉంటుంది. ఇక భర్త విషయంలోనైతే ‘మీ యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోండి’ అంటూ పోరుతూ ఉంటుంది. వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం... వాళ్లు వేళకు మందులు తీసుకుంటున్నారా అంటూ చెక్ చేస్తూ ఉంటుంది. ఇక హాస్పిటల్ విషయానికి వస్తే... ఆ పని చేసేది కూడా ‘నర్స్’ రూపంలోని మహిళే. ఇక లేడీ డాక్టర్, లేడీ టెక్నీషియన్ రూపంలో మరిన్ని సేవలు అందిస్తూనే ఉంటుంది. భారతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో మహిళ ఎప్పుడూ ఓ భాగమే. కాని, ఇంతటి కీలకమైన ఆ మహిళ తన ఆరోగ్యం విషయానికి వచ్చేప్పటికీ ‘ఆ... రేపు చూసుకుందాం లే’ అనుకుంటుంది. తన ఆరోగ్య సంరక్షణను ఎప్పుడూ వాయిదా వేసుకుంటూ ఉంటుంది. దీనికి చెల్లించాల్సిన మూల్యం ఒక్కోసారి గణనీయంగానే ఉండవచ్చు. ప్రస్తుతం మన దేశంలో జీవనశైలి జబ్బులైన ‘నాన్ కమ్యూనికబుల్’ వ్యాధులు దాదాపు 65 శాతం మరణాలకు కారణమవుతున్నాయి. వీటిల్లోనూ ప్రతి నాలుగు మరణాల్లో ఒకదానికి గుండెజబ్బులే కారణంగా మారుతున్నాయి. ఇక క్యాన్సర్ విషయానికి వస్తే ప్రతి ఏటా 1,70,000 కొత్త కేసులు జాబితాకు జతవుతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ ఏటా వేలాది మహిళల ప్రాణాలను బలి తీసుకుంటోంది. సమయానికి చిన్న స్క్రీనింగ్ పరీక్ష చేయిస్తే, ఆ మరణాలను దాదాపుగా పూర్తిగా నివారించడం సాధ్యం. ఇక దేశంలోని మొత్తం మహిళల్లో సగం మందికి రక్తహీనత ఉంది. అది వారిని నిస్సత్తువగా, నీరసంగా మార్చేస్తోంది. దీర్ఘకాలంలో వాళ్ల వ్యాధినిరోధకతను బలహీనంగా మార్చేస్తోంది. మహిళల్లో రొమ్ముక్యాన్సర్ కేసులు గంటగంటకూ డజన్ల సంఖ్యలో పెరుగుతున్నాయి. దురదృష్టం ఏమిటంటే... వీటిల్లో చాలా వాటి నివారణ పూర్తిగా సాధ్యం. టైముకు కనుక్కుంటే మరికొన్నింటికి పూర్తి చికిత్సగాని, లేదా మేనేజ్మెంట్గాని సాధ్యమే. అయినప్పటికీ మహిళలు తమ ఇంటిపనుల్లో, కుటుంబాన్ని చూసుకునే పనుల్లో పడిపోయి తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందునుంచే నివారించుకోవడం గాని, లేదా ముందే కనుగొనడంగాని చేస్తే, మహిళల ముప్పయిలు లేదా నలభైల వయసులోనే మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. కుటుంబం మొత్తం ఆరోగ్యాన్ని చూసుకునే అత్యంత విలువైన మహిళల ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడవచ్చు. ఇక ఇప్పుడు అందివచ్చిన కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో ఇంకాస్త కచ్చితంగా మహిళల ఆరోగ్యాన్ని అంచనావేసి, రానున్న ముప్పును తప్పించవచ్చు. అందుకే ఆమె కోసం సగౌరవంగా వైద్యపరీక్షల స్లాట్ బుక్ చేసి హైబీపీ, చక్కెర, కొలెస్ట్రాల్ పరీక్షల వంటివి చేయించాలి. లేదంటే మహిళల ఆరోగ్యం చెడిపోయే ముప్పు నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంటుంది. ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్ ఏమిటంటే... ‘గివ్ టు గెయిన్’! మహిళ తన కుటుంబానికీ, ఈ సమాజానికీ ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. అందుకే ఈ నేపథ్యంలో ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ద్వారా ఆమెకు దక్కాల్సింది దక్కేలా చేయడమే ఇప్పుడు మనముందూ సమాజం ముందూ ఉన్న బాధ్యత. అప్పుడే మన భారత్లోని కుటుంబాల్లో ఆరోగ్యం నిండుతుంది. కార్యాలయాల్లో ఉత్పాదకత పెరుగుతుంది. దేశం ముందుకు పురోగమిస్తుంది. మహిళలు తమ ఇంటిపనుల్లో, కుటుంబాన్ని చూసుకునే పనుల్లో పడిపోయి తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ముందునుంచే నివారించుకోవడం గాని, లేదా ముందే కనుగొనడంగాని చేస్తే... మహిళల ముప్పయిలు లేదా నలభైల వయసులోనే మహిళల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. కుటుంబం మొత్తం ఆరోగ్యాన్ని చూసుకునే అత్యంత విలువైన మహిళల ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడవచ్చు. డాక్టర్ సంగీతారెడ్డిజాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్ యాసీన్(చదవండి: ఆత్మవిశ్వాసమే అసలు బలం) -
ఈ వారం కథ: పుత్ర కామేష్టి
‘‘శేఖర్ గారూ! మీ ఆవిడకు ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ సర్జరీ చాలా బాగా జరిగిందండీ! ఐవీఎఫ్ ప్రాసెస్లోని ప్రధానాంకం ముగిసింది. సక్సెస్ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తనను ఓ ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉంచి, ఇంటికి పంపిస్తాము. ఇచ్చిన మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకుంటూ, పదిహేను రోజుల తరువాత బ్లడ్ టెస్ట్కి రావాల్సి ఉంటుంది. ఓకేనా?’’ చెపుతున్న డాక్టర్ మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ, సరేనన్నట్లు తలాడించి, ‘‘థాంక్స్ డాక్టర్గారూ..!’’ అన్నాను.‘‘ఇంకా రెండుసార్లు వాడుకునేందుకు మీ ఎంబ్రియోస్ ఉన్నప్పటికీ మీకా అవసరం రాకపోవచ్చు లెండి. ఆల్ ది బెస్ట్! ఆమెను జాగ్రత్తగా చూసుకోండి!...’’ అంటూ ముందుకు కదిలింది డాక్టర్.‘ఇప్పుడు సక్సెస్ అయితే అయినట్లు. లేదంటే, నేరుగా ఎడాప్షన్ కు వెళ్ళిపోవడమే. గత నాలుగైదేళ్ళ నుంచి పడినపాట్లు చాలు. ఇంకా శ్రావ్యను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు...’ అనుకుంటూ, మగతగా పడుకున్న తనను కదిలించకుండా, బ్రేక్ఫాస్ట్ చేసి వద్దామని బయటకు నడిచాను. అలవాటుగా సుబ్బన్న బడ్డీ హోటల్ దాపుకు చేరుకున్నాయి నా కాళ్ళు. అక్కడి అనూహ్య దృశ్యాన్ని చూసి, నా చిన్నకళ్ళు పెద్దవయ్యాయి. ఆకలిని రెట్టింపు చేసే దోసెలను, అలసటను ఆవిరి జేసే ఇడ్లీలను, నోరును ఊట బావిగా మార్చేసే పూరీలను కొసరి కొసరి వడ్డిస్తూ, ఆ పదార్థాలంత కమ్మగా పలకరిస్తూ, పైరగాలి వీచినంత ఒడుపుగా పొట్లాలు కడుతూ నిత్యం పారే ఏరల్లే కనిపించే సుబ్బన్న– సముద్రుడిలా గంభీరంగా వంట సామాగ్రినంతా గోతాలకు సర్దేస్తున్నాడెందుకో!రాములవారి వెంట సీతమ్మలా, ఆదిశివుడిలో సగమైన గౌరమ్మలా సుబ్బన్న చేతి ఒడుపుకనుగుణంగా సైనికురాలిలా వెంట ఉంటూ, ముప్పొద్దులా వండి అందించే అతని ఇల్లాలేది, ఎక్కడా కనబడదే...!? తినడానికి వచ్చిన జనాలు పిలుస్తున్నా వినబడనట్లు అలా మిన్నకున్నాడేంటి ఈ సుబ్బన్న. ఏం జరిగుంటుంది? తెలుసుకోమని మనసు రొద పెడుతుంటే, అతనికి దగ్గరగా వెళ్ళి నిలబడి, ‘‘ఏంటి సుబ్బన్నగారూ.. ఏమయింది..?’’ అన్నాను. అతనేం మాట్లాడకపోయే సరికి మళ్లీ రెట్టించాను. తలెత్తకుండానే, ‘‘ఈ ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం సార్..!’’ అన్నాడు. ‘‘అరెరే... ఏమయింది?...’’ అని మొదలెట్టి, కొనసాగింపుగా ఓ పది ప్రశ్నలు వేశాను. దేనికీ జవాబు చెప్పలేదు కానీ, ‘‘ఇప్పుడేమీ అడగొద్దు సార్..!’’ అంటున్నప్పుడు అతని గొంతులో జీర నా చెవులను దాటిపోలేదు. ఏదో తీరని వేదనలో ఉన్నట్లున్నాడు. ముఖం కూడా చూపించలేక పోతున్నాడు. ఇంకా అక్కడే ఉండి, అతన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనిపించి, వేరేచోటకు వెళ్ళి తినేసి, శ్రావ్యకు పార్సిల్ కట్టించుకుని హాస్పిటల్కు చేరుకున్నాను.తనను ఎక్కువగా మాట్లాడించడమంత మంచిది కాదనిపించి, తన పనులన్నీ చూచి, పక్క బెడ్పై కూర్చున్నాను. తలపుల గూడులోకి సుబ్బన్న ప్రవేశించాడు. దాదాపు ఐదేళ్ళక్రితం.., ఈ హాస్పిటల్కు వచ్చిన మొదటిరోజు ఓపీ వ్రాయించి, ఏదైనా తిందామని మేమిద్దరమూ బయలుదేరాము. అక్కడికి దగ్గరలో ఓ ప్రభుత్వ భవనపు ప్రహరీగోడ మూల మీద నాలుగు రేకులు వేసి, వాటికింద నాలుగు అరుగులు కట్టి ఉన్నాయి. సుబ్బన్న దంపతులు వండి, అందిస్తుంటే... జనాలు కూర్చుని తింటున్నారు.‘‘ఇక్కడ తినేసి వెళదామా..?’’ అంది శ్రావ్య. ‘‘ఆ అరుగుల వెనక చూడు... అంతా బురద... పైగా పందులు, కుక్కలు పొర్లుతున్నాయి ఛండాలంగా... ఇక్కడెలా తింటాము?’’ అన్నాను. ‘‘ఒక్కసారి తిని చూడండి... వదిలిపెట్టరు...’’ అక్కడ తిని వెళుతున్న ఒక వ్యక్తి అన్నాడు. ఇక చేసేదిలేక, అప్పటికంత కన్నా దూరం వెళ్ళలేక అక్కడే తినడానికి కూర్చున్నాము. మా ఇంట్లో చేసుకున్నంత రుచిగా, శుచిగా అనిపించాయి దోసె, ఇడ్లీ... ధర కూడా చాలా సాధారణంగా అనిపించింది. డబ్బులు ఇచ్చేటప్పుడు మంచీ చెడ్డా మాట్లాడుతూ, అతని వివరాలు కనుక్కొని, ‘‘ఆ వెనక పందులవీ తిరగకుండా శుభ్రం చేయించకూడదా సుబ్బన్నగారూ?’’ అన్నాను నవ్వుతూ.‘‘చేయిద్దామనే అనుకుంటున్నాను సార్... ఏ నెలకానెల మా అబ్బాయి ఫీజులకనీ, పుస్తకాలకనీ వచ్చిన డబ్బు కాస్తా అయిపోతా ఉంది. వచ్చే నెల సెలవులు వస్తున్నాయిగా, కాస్తన్నా మిగుల్చుకుని గోడ పెట్టిచ్చేస్తా’’ అన్నాడతను. ‘‘ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి..? ఎందరు పిల్లలు మీకు?’’ అడిగాను. ‘‘ఒక్కడే అబ్బాయండి... ఆరోక్లాసయి పోయి, ఏడుకొస్తాడింక... మామూలు గవర్నమెంటు బడికి పంపుదామంటే, ఈ మనిషి వినకుండా పెద్దపెద్దోళ్ళ పిల్లలు చదివే బడిలో చేర్చాడు. ఆ ఖర్చులు పెరుగుతూనే వున్నాయి. తట్టుకోలేక పోతున్నాము’’ అంటున్న భార్యను వారించి, ‘‘మనం ముప్పొద్దులా తిప్పలు పడేదెందుకు... వాడికోసం కాదూ..?’’ అన్నాడు. ‘‘ఏంటో ఈ మనిషి పిచ్చి... ఆ కొడుకే లోకం. వాడిమీద ఈగ వాలనివ్వడు కదా..! పాతికేళ్ళ నుంచి చేయి కాల్చుకుంటున్నా గాని, తలదాచుకునేందుకు చిన్నపాక గూడా వేసుకోలేకపోయాము’’ అందామె.వాళ్ళిద్దరికీ నలభై ఏళ్ళపైనే ఉంటుంది వయస్సు. అతనేమో ఇనుపకడ్డీలాగ నల్లగా, పొడవుగా ఉన్నాడు. ఆమేమో, బంగారపు ముద్దలాగా తెల్లగా, బొద్దుగా ఉంది. ఇద్దరికీ కొడుకంటే పంచప్రాణాలు కాబోలు. అయినా పిల్లలు పుడితే అంతేనేమో! వాళ్ళకోసం సర్వ సుఖాలను ఒడ్డి, పోరాటం చేయాలనిపిస్తుందేమో..! త్వరగా మేము కూడా తల్లిదండ్రులమైతే ఎంత బాగుంటుంది..!? ఇద్దరం మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వచ్చేశాము. ఓ రెండునెలల తరువాత, మళ్ళీ హాస్పిటల్కు వెళ్ళినపుడు, సుబ్బన్న హోటల్కే వెళ్ళాము తినడానికి. ఆ వెనుక వైపంతా చదును చేయించి, నాపరాళ్ళు పరిపించి ఓ పరదా కట్టాడు. ‘‘ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది సుబ్బన్నగారూ..!’’ అన్నాను దోసె తింటూ. ‘‘గోడ పెడదామంటే, డబ్బులు చాల్లేదు సార్!’’ నొచ్చుకుంటున్నట్లు అన్నాడు. ‘‘పోన్లెండి, ఆ పందులవీ లేకుండా ప్రశాంతంగా ఉంది..’’ అన్నాను.‘‘అవి మురికి జీవాలు సార్... మిగిలిపోయినవి, మురిగిపోయినవి అక్కడ పారబోస్తే తిని, ఆ బురదలోనే పొర్లుతుండేవి. ఈ బండలు పరిచిన తరువాత, మేమేది పడేసినా తినడానికి కూడా రావట్లేదు. ఏ మురుగులో బతుకీడుస్తున్నాయో పాపం..!’’ అన్నాడు జాలిగా ముఖంపెట్టి. ‘‘పోన్లెండి... అవి పంకిల ప్రేమికులు కదా, నచ్చిన గూటికి చేరుంటాయి’’ అన్నాను అతన్ని నవ్విద్దామని. ‘‘డాడీ... అర్జెంట్గా ఓ తౌజెండ్ రూపీస్ కావాలి... రేపు మా స్కూల్ పిల్లలమంతా ఎక్స్కర్షన్కు వెళుతున్నాం’’ అంటూ సుబ్బన్న చెంతకు చేరుకున్నాడొక పిల్లవాడు. పదకొండేళ్ళు ఉంటాయేమో, చాలా తెల్లగా, బొద్దుగా ఉండి... భలే ముద్దొస్తున్నాడు. ‘‘మీ బాబు, వాళ్ళమ్మ పోలికట్లుందండి... చాలా బాగున్నాడు’’ అన్నాను. అతను గుంభనంగా నవ్వుకుంటూ, కొడుకుకు డబ్బులిచ్చి, జాగ్రత్తలు చెప్పి పంపించాక, ‘‘మీకు కూడా మా మనీష్ లాంటి మంచి బాబు పుడతాడు లెండి సార్!’’ అన్నాడు చిరునవ్వుతో.‘‘థాంక్సండి!’’ అంటూ డబ్బిచ్చి వచ్చేశాము. అలా డాక్టర్ రమ్మన్నప్పుడల్లా హాస్పిటల్కు, అటునుండి సుబ్బన్న హోటల్కు ఐదేళ్ళుగా తిరుగుతున్నా గాని, శ్రావ్య కడుపు పండలేదు, అమ్మానాన్నలు కావాలనే మా కాంక్ష తీరలేదు. కాని, సుబ్బన్నతో, అతని కుటుంబంతో మంచి స్నేహం ఏర్పడింది. ఈ ఊరు వచ్చినప్పుడల్లా అక్కడే తినడం, అతనితో పిచ్చాపాటీ మాట్లాడడం పరిపాటైపోయింది. జ్ఞాపకాల నుంచి బయటికొచ్చిన నాకు, ‘ఇప్పుడింత అర్ధాంతరంగా, మంచి ఆదాయాన్నిస్తున్న హోటల్ని ఎందుకు తీసేసుకుంటున్నట్లు? పుట్టి పెరిగిన ఊరునెందుకు వదిలి వెళుతున్నట్లు? ఏం కష్టమొచ్చిందో పాపం..! ఎలా అతని బాధ తెలుసుకోవడం..’ అనుకుంటూ లేచి కూర్చున్నాను. ‘‘శేఖర్..!’’ మెల్లిగా శ్రావ్య పిలుపు వినబడడంతో,తనకు చేరువగా వెళ్ళి, ‘‘ఏంటి శ్రావ్యా..!’’ అన్నాను. ‘‘ఈ పదిహేను రోజులు ఈ ఊళ్ళోనే ఉండనా... అదే మా వాణీ వాళ్ళింట్లో ఉండనా నేను? తననడిగితే, సంతోషంగా రమ్మంది. ఈ పరిస్థితిలో దూర ప్రయాణం అంత మంచిది కాదేమో కదా..!’’ ఆశగా అడిగింది. వాణి శ్రావ్య పెద్దమ్మ కూతురు. తనమాట తోసివేయలేక సరేనన్నాను. తరువాతి రోజు హాస్పిటల్ నుంచి వాణీ వాళ్ళింటికి చేరుకున్నాము. ప్రతిరోజూ బోలెడు మాత్రలు మింగడంతో పాటు, బొడ్డుకు ఇంజక్షన్లు కూడా చేయించవలసి రావడంతో, ఓ నర్సును మాట్లాడి, మిగతా ఏర్పాట్లన్నీ చూసి, వ్యాపార పనుల నిమిత్తమై నేను మా ఊరు వచ్చేశాను. కాల్ చేసినప్పుడల్లా, కన్సీవ్ అవుతుందో, లేదోనని ఆందోళన పడుతున్న శ్రావ్యకు ఒక దారి మూసుకు పోయినప్పుడు మరిన్ని దారులు తెరచుకుంటాయని, ఇది కాకపోతే దత్తతావకాశం ఉండనే ఉన్నదని, పాజిటివ్గా ఉండమని చెప్పి ధైర్యాన్ని అందించాను.పదిహేనవ రోజు శ్రావ్య రక్తం తీసుకుని, హాస్పిటల్ ల్యాబ్లో ఇస్తే, సాయంత్రం ఐదుగంటలకు రమ్మన్నారు వాళ్ళు. ఎంత వద్దనుకున్నా, గుండెలో అలల్లా అలజడి. ఓ క్షణం పాజిటివ్ తీరానికి చేరుకుంటుంది.. మరుక్షణమే నెగెటివ్ అగాధానికి తీసుకెళుతుంది. ఇలాంటి అనిశ్చితమైన మనసుతో శ్రావ్య ఎదుట ఎందుకు లెమ్మని, లేని పని కలిగించుకుని... ఊళ్ళో బలాదూరు తిరుగుడు మొదలెట్టాను. అలవాటుగా సుబ్బన్న హోటల్ వైపుకు మళ్ళాయి కాళ్ళు. సుబ్బన్న స్థానంలో మరొకతను కనిపించాడు. పరదా బదులు గోడ, అరుగుల స్థానే ప్లాస్టిక్ కుర్చీలు కనిపించాయి. ‘లోపలికెళ్ళి, సుబ్బన్న వివరాలు అడిగితేనో..’ మెదడు తలపును, తడబాటునున్న మనసు తోసిపుచ్చేసింది. కళ్ళు ఆ వైపుకే చూస్తున్నా, కాళ్ళు మాత్రం ముందుకు కదిలాయి. అలా మూడు, నాలుగు వీధులు నడుచుకుంటూ వెళ్ళాక... రోడ్డు దాటబోతుంటే, చాట్ మసాలా, పానీపూరితో కూడిన తోపుడుబండి ఎదురొచ్చింది.దాన్ని తప్పించుకునే క్రమంలో అప్రయత్నంగా బండిని తోసే వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయి, నిలబడిపోయాను. నేను తేరుకుని, అతన్ని పిలిచేటప్పటికల్లా.., గబగబా బండిని తోసుకుంటూ వీధి మలుపు తిరిగేశాడు. వెంబడిద్దామనుకున్నాను కాని, తను ఉద్దేశపూర్వకంగా వెళ్ళినపుడు ఎందుకు లెమ్మని వాచ్ చూసుకుని హాస్పిటల్ వైపుకు మళ్ళాను. వెళ్ళేదారిలో యథాలాపంగా హోటల్ వైపుకు మళ్ళాయి నా కళ్ళు. ‘‘రండి సార్... వేడివేడి బజ్జీలు తిందురు గానీ..!’’ అన్నాడా కొత్త యజమాని. విషయం తెలుసుకోవాలనే ఉత్కంఠకు ఆ పిలుపును జోడించి కాళ్ళను హోటల్లోకి మళ్ళించాను. ‘‘సుబ్బన్న ఉన్నప్పుడు మీరు తరచు వస్తుండేవారు కదా సార్..! నేను చాలాసార్లు చూశాను’’ బజ్జీలు అందిస్తూ అన్నాడతడు. తీగ లాగడానికి మార్గం సుగమమయిందని తృప్తిపడుతూ, ‘‘అవును వచ్చేవాణ్ణి. సుబ్బన్నకు ఏమైందసలు..? వాళ్ళబ్బాయి పానీపూరి బండి దగ్గరున్నాడేంటీ..!?’’ అడిగేశాను.అతను ఓ నిట్టూర్పు విడిచి, ‘‘ఏముంది సార్, ఆయనది చల్లటి గుండె కదా... రగిలిన మమతల మంటల్లో మండిపోయింది’’ అన్నాడు.‘‘మమతలేంటీ.. మండటమేంటి..? అర్థమయ్యేట్లు చెప్పవయ్యా..!’’ అన్నాను. ‘‘పదహారేళ్ళు ప్రాణప్రదంగా పెంచుకున్న కొడుకు... ఆ తల్లిదండ్రుల మనసుల్లో మంటలు రాజేసి వెళ్ళిపోయాడు సార్!’’ మరుగుతున్న నూనెలో వడల పిండి వేస్తూ చెపుతున్నాడతడు.‘‘పదహారేళ్ళ పసివాడు ఎక్కడికి వెళతాడు..? తల్లిదండ్రులను వదిలి ఎలా బతుకుతాడు..?’’ ఆవేశంగా అన్నాను.‘సుబ్బన్న దంపతులకు పెళ్ళయ్యాక పదిహేనేళ్ళు గడచినా బిడ్డలు కలగకపోతే, ఏడుగురు పిల్లలను సాకలేక తిప్పలు పడుతున్న వడ్డెర దంపతులతో మాట్లాడి, వాళ్ళకు కొంత పైకమిచ్చి, రెండు నెలల పసిగుడ్డయిన మనీషుని దత్తత తెచ్చుకున్నారంట! వాడు వీళ్ళ నీడన పెరుగుతూ.. చెడు స్నేహాలు పెంచుకుని, దురలవాట్లు నేర్చుకున్నాడు. అది తెలుసుకుని, సుబ్బన్న మందలిస్తుండేసరికి.., స్నేహితులు, చుట్టాల ద్వారా అసలు తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ కుటుంబంలో తండ్రీ, తోబుట్టువులంతా తాగుడికి బానిసలయ్యారని, ఇల్లు గడిచే పరిస్థితి లేదని మనీష్ కన్నతల్లి వీడిని చదువు మానిపించేసి, పనిలో పెట్టిందట. ‘అదేమిట్రా..’ అని అడిగితే, ‘నన్ను కన్నోళ్ళు, నాకు తోడబుట్టినోళ్ళే నావాళ్ళు, వాళ్ళతోనే బతుకుతాను... బతకలేక పోతే చస్తాను..’ అని తెగేసి చెప్పాడట!’ సుబ్బన్న దంపతులు తట్టుకోలేక, ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళూ సుబ్బన్న దంపతుల కష్టంతో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న వాడు, పశువుల పాక వంటి మురికింట్లో పడుకుంటూ, పానీపూరీ అమ్ముకుంటున్నాడు. ‘‘ప్రేమ పెంచుకున్న కొడుకు దూరమవడం, పదిమందిలో పరువు పోవడం జీర్ణించుకోలేక, పెంచిన మమతను వదులుకోలేక ఈ హోటల్ను నాకు అమ్మేసి, వాళ్ళెటో వెళ్ళిపోయారు సార్! ఈ పిల్లవాడికి తెలివిలేకపోయింది సరే.. కనీసం ఏడుగుర్ని కన్న ఆ తల్లికైనా వీళ్ళమీద జాలి లేకపోయింది. ఎవరో తెలియని అనాథను చట్టబద్ధంగా దత్తత తీసుకుని ఉంటే, ఇవాళ సుబ్బన్నకింతటి కడుపుకోత ఉండేది కాదేమో..! ఇట్లా ఎన్నెన్నో అనుకుంటాం గాని, కడుపున పుట్టినోళ్ళతో సాటిరాగలరా సార్, ఈ సాకుడు పిల్లలు..!?’’ అతడింకా ఏదో చెపుతున్నాడు. ఆ గాథ అంతా వినేసరికి, నా మనసంతా మొద్దుబారిపోయింది. ‘నాది అనే భావన ముందు ఇంకేదీ నిలవదా? అమ్మో... బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఎలా వస్తుందో..! మమతల విలువ తెలియని ఈ వ్యవస్థలో వేరెవరినైనా దత్తత తీసుకోవడమంటే, మరణంతో సమానమే కదా..! సుబ్బన్న వంటి దుస్థితిని ఎదుర్కోవడం మా వంటి సున్నిత మనస్కులకు సాధ్యమయ్యే పనేనా? ప్రస్తుతం ఫలితమెలా ఉన్నా..మిగిలున్న ఎంబ్రియోలను వాడుకోవడం నయం కదూ..? నేను వెళుతున్న కృత్రిమ పద్ధతే రాళ్ళదారి అనుకుంటే, దత్తత ముళ్ళదారైతే... పిల్లలు కలగని మావంటి వారి పరిస్థితి ఏమిటి? చట్టపరమైన దత్తతకు చెట్టు ఆకులన్ని నిబంధనలు ఉండటం వలనేకదా... సుబ్బన్న దంపతుల వంటివారు అవస్థలకు లోనవుతున్నది? అనేక మార్గాలవెంట పయనించి, పాట్లు పడుతున్నది..! ఇటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే, పెంపుడు తల్లిదండ్రులకు సమాజం నుంచి సవాళ్ళు ఎదురైతే, ఏ ఆదరణకూ నోచుకోని అనాథల గతేంకాను..? మమతలు పంచాలనుకునే మనస్సులెలా లభించేను!? మానవత్వపు చిరునామా ఎటుపోయేను..!?’ అనే సందిగ్ధ ఆలోచనలు, సంశయాల ఆందోళనల మధ్య హాస్పిటల్ మెట్లు ఎక్కాను. పెండ్యాల గాయత్రి -
ఆత్మవిశ్వాసమే అసలు బలం
అమ్మాయిలకు నేనిచ్చే సలహా– వీలైనంత త్వరగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించాలి. సంపాదించడం, దానిని ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ప్రపంచాన్ని చూసే కోణం మారుతుంది. దేనికైనా మీరు సిద్ధంగా లేరనుకుంటూ ఎక్కువకాలం వేచి చూడవద్దు. చాలా అవకాశాలు మీరు పూర్తిగా సిద్ధం కానప్పుడే వస్తాయి. పొరపాటు అయిందేమోనని మథనపడకండి. దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకోండి. కెరీర్ అనేది దశాబ్దాల కృషి. రాత్రికి రాత్రే జరిగిపోదు. ఈ ప్రయాణం మీది. మీరే సృష్టించుకోండి. అది వేరెవరి మాదిరో ఉండాల్సిన పనిలేదు.తొలినాళ్లలో నాతో నేనే ఎక్కువగా పోరాడాల్సి వచ్చింది, బయటివాళ్లతో కాదు. నా మీద నాకు నమ్మకం రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆర్థిక రంగం– మన పనితీరును అంకెల్లో కళ్లెదుట నిలపాల్సిన రంగం. ఈ రంగంలో మన చుట్టూ ఉండేవారు మామూలు వ్యక్తులు కాదు, చక్కని ట్రాక్ రికార్డు, స్పష్టమైన అభిప్రాయాలు ఉండే తెలివైనవారే! నా కెరీర్ తొలినాళ్లలో నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేనే అనుమానించాల్సి వచ్చేది. ఈ ప్రయాణంలో నాపై నేను నమ్మకాన్ని పెంచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రాను రాను నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఆత్మవిశ్వాసం పుట్టుకతో వచ్చే వ్యక్తిత్వ లక్షణం కాదు. అది మన చర్యల ద్వారా మనం నిర్మించుకునే కోట. నిర్ణయాలు తీసుకోవడం, ఫలితాలను స్వీకరించడం, అంతకంతకూ మెరుగుపడటం– ఇదో నిరంతర ప్రక్రియ. అదే మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుంది. ఆత్మవిశ్వాసమే అసలు బలం. అది ఎవరికి వారే సాధించుకోవాలి.అదే నా జీవితంలో మలుపుఏదో ఒకే ఒక్క కారణంతో నా జీవితం నాటకీయంగా మారిపోయిందా అంటే లేదనే చెబుతాను. ఇన్వెస్ట్మెంట్ల మాదిరే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతూ వచ్చింది. ఇదంతా నా అనుభవం, చేసిన తప్పులు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో కాలం గడుస్తున్న కొద్ది సాధించిన పురోగతి. వృత్తిపరంగా నేను ఎదుగుతున్న కొద్ది నేనెందులో రాణిస్తానో, ఎందులో రాణించనో నాకు స్పష్టంగా తెలుస్తూ వచ్చింది. ముందు మనం అంతర్గతంగా మారాలి. నాయకత్వం అంటే ఇలాగే ఉండాలని భావించి, అందులో ఇమడటానికి ప్రయత్నించడం మానేయాలి. మన బలాబలాలు తెలుసుకుని, దానికి తగ్గట్లు ముందుకెళ్లాలి. ఈ క్రమంలో నాయకత్వమే మన చేతుల్లోకి వస్తుంది. పురోగతి స్పష్టతనిస్తుంది. స్పష్టతతో ఆత్మవిశ్వాసం సాధ్యమవుతుంది. వైఫల్యాలు... గుణపాఠాలునా జీవితంలో ఇదొక్కటే అతిపెద్ద వైఫల్యమని చెప్పలేను. చిన్న చిన్న వైఫల్యాలు కూడా ఉన్నాయి. నేను ఊహించినట్లుగా రాణించని ఫండ్స్ ఉన్నాయి. మార్కెట్ కదలికలను సరిగా అంచనా వేయలేని సందర్భాలూ ఉన్నాయి. ఆర్థికరంగంలో ఫలితాలు స్పష్టంగా కనబడతాయి. అంకెలు అబద్ధాలు చెప్పవు. వైఫల్యాలే మానసిక దృఢత్వాన్ని నేర్పిస్తాయి. ప్రతి వైఫల్యానికీ కుంగిపోతూ ఉంటే మార్కెట్లో దీర్ఘకాలిక కెరీర్ను నిర్మించుకోవడం సాధ్యం కాదు. ఒక త్రైమాసికంలో మంచి ఫలితాలు రాకుంటే అది వ్యక్తి తప్పిదం కాదు. చేయాల్సింది ఒక్కటే, వేగంగా నేర్చుకోవడం– మరింత వేగంగా దానికి తగ్గట్లు మారడం, దృఢంగా నిలవటం, అంతే!మదర్స్కు చెప్పేదేమంటే...వృత్తిని, కుటుంబాన్ని చూసుకోవటంలో ఎంపికలు, ప్రా«ధాన్యాలే ఉంటాయి తప్ప కచ్చితమైన బ్యాలెన్స్ అంటూ ఏమీ ఉండదు. ఒక్కోసారి కుటుంబానికి, ఒక్కోసారి పనికి ఎక్కువ అంకితం కావాల్సి వస్తుంది. ప్రతిరోజూ రెంటికీ న్యాయం చేయాలని చూస్తే అనవసరమైన అపరాధభావాన్ని మోయాల్సి ఉంటుంది. పిల్లలకేమీ పర్ఫెక్షన్ అవసరం లేదు. స్థిరత్వం, ప్రేమ, తమ ఆశయాలను తాము గౌరవించుకునే రోల్మోడల్ ఉంటే చాలు. ‘మా అమ్మ చేస్తన్నదాంట్లో అర్థం ఉంది’ అని భావించిన నాడు వాళ్లూ స్వతంత్రంగా, దృఢంగా, ఇతరులకు ఆదర్శంగా నిలబడతారు. అపరాధభావం వద్దు, చేస్తున్న పనిపై ఫోకస్ పెట్టండి. వీటిని పాటిస్తే మంచిది...» ఇన్వెస్ట్మెంట్లను వీలైనంత త్వరగా మొదలుపెట్టండి. అది ఎంత చిన్నమొత్తమైనా సరే, దాన్ని కొనసాగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. » మీకు రావాల్సినవి అడిగి మరీ సాధించుకోండి. అవి వేరెవరూ మీకోసం చెయ్యరు.» ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సమర్థతను పెంచుకోండి. అదే చిరకాలం మిమ్మల్ని ముందు నిలబెడుతుంది.» మీ మానసిక, శారీరక ఆరోగ్యాలను నిరంతరం కాపాడుకోండి. అవి చాలా ఖరీదైనవి.» ఆర్థికంగానైనా, జీవితంలోనైనా దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి.-రమణమూర్తి మంథా -
సవాలే....అయినా సరే!
2022 ఫిబ్రవరి... సైబరాబాద్లోని మాదాపూర్లో ఉన్న ఓ హుక్కాపార్లర్ కేంద్రంగా జరుగుతున్న దందాల ఆట కట్టించడానికి ఒక ఐపీఎస్ అధికారిణి ఎస్సైతో కలిసి సాధారణ కస్టమర్స్ కపుల్లాగా వెళ్లారు. రెడ్హ్యాండెడ్గా చెక్ చెప్పారు.2026 ఫిబ్రవరి...రాత్రి విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారిణి సాధారణ ఫిర్యాదీగా హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసుస్టేషన్కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది పనితీరు, స్పందనను స్వయంగా పరిశీలించారు. బాధితులతోనూ మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ రెండు టాస్క్లు చేసిన ఐపీఎస్ అధికారిణి ఒక్కరే! ఆమె 2020 బ్యాచ్కు చెందిన కె.శిల్పవల్లి. అప్పట్లో మాదాపూర్ డీసీపీ, ఇప్పుడు ఖైరతాబాద్గా మారిన సెంట్రల్ జోన్ డీసీపీ. ఈ రెండు జోన్లకూ తొలి మహిళా అధికారిణి ఆమెనే కావడం విశేషం.‘పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అంటే మాటలా!’ అనే మాటను బొత్తిగా ఖాతరు చేయలేదు శిల్పవల్లి. నిజానికి ఆమె ఐఏఎస్ కావాలని బలంగా అనుకున్నారు. నాలుగు ప్రయత్నాల్లో సివిల్స్కు ఎంపిక కాకపోయినా, డీలా పడిపోలేదు.‘పోలీసు ఉద్యోగం అంటే బోలెడు రిస్కు. ఆడవాళ్లకు చాలా ఇబ్బంది’ అనే మాట పదే పదే వినిపిస్తున్నా, ఆ సవాలును స్వీకరించి ఖాకీ యూనిఫామ్ ధరించారు.1990లలో పాఠశాలలో చదువుకున్న వారందరికీ ఒక అనుభవం అనివార్యం. ఉపాధ్యాయులు క్లాసులో విద్యార్థుల్ని నిలబెట్టి ‘పెద్దయ్యాక ఏమవుతావు?’ అని అడిగేవారు. విద్యార్థులు ఏమాత్రం సంకోచించకుండా డాక్టర్ అనో, ఇంజినీర్ అనో ఏదో ఒకటి ఠక్కున చెప్పేవాళ్లు. నా వంతు వచ్చినప్పుడు నేను చెప్పిన మాట ‘సివిల్స్ రాసి కలెక్టర్ అవుతా’. అప్పట్లో చాలామంది పిల్లలకు సివిల్స్ అంటే ఏమిటో తెలియకపోవడంతో అంతా నన్ను ఆశ్చర్యంగా చూశారు. మా నాన్న సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. నేను సివిల్స్ రాయాలనుకోవడానికి ఆయనే స్ఫూర్తి.అలా ఐపీఎస్ అయ్యాను!సివిల్స్ కోసం నేర్చుకున్న అంశాలు గ్రూప్–1 ద్వారా డీఎస్పీని చేశాయి. ఆపై అదనపు ఎస్పీ, నాన్–క్యాడర్ ఎస్పీల తర్వాత 2020 బ్యాచ్ ద్వారా ఐపీఎస్ అయ్యాను. నా పరిధిలోని పోలీసుస్టేషన్లలో నమోదయ్యే ప్రతి కేసునూ స్వయంగా పర్యవేక్షించడం నాకు అలవాటు. నేరం జరిగినప్పుడు ఫోన్ ద్వారా అక్కడ ఉన్న అధికారులను సంప్రదించి, వివరాలు తెలుసుకోవడం కంటే క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తుంటాను. నేరస్థలాలతో పాటు ఇతర ప్రదేశాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను స్వయంగా అధ్యయనం చేస్తాను.కొండల్లో కోనల్లో...చేవెళ్ల డీఎస్పీగా పని చేస్తున్నప్పుడు ఫామ్హౌస్లో తల్లిదండ్రుల్ని చంపిన కుమారుడి కేసు దర్యాప్తు మంచి అనుభవాన్ని ఇచ్చింది. ముగ్గురు మహిళల్ని చంపిన సీరియల్ కిల్లర్ కేసు దర్యాప్తులో భాగంగా చెంగొముల్ అడవుల్లో గుట్టల పైకి చేసిన ట్రెక్కింగ్ మర్చిపోలేనిది. షాబాద్లో ఓ చిన్నారి కిడ్నాప్ అయినప్పుడు శంషాబాద్లో కిడ్నాపర్ను పట్టుకుని, బాలుడిని రెస్క్యూ చేసే వరకు ఫీల్డ్లోనే ఉన్నాను.ఆ బాలుడి తండ్రిని వెంట తీసుకుని, అతడి ద్వారానే కిడ్నాపర్ను ట్రాప్ చేసి చిన్నారిని రక్షించాం. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ)లో పని చేసినప్పుడు టెక్నికల్ అనాలసిస్ వింగ్ను పర్యవేక్షించాను. బీఏలో తీసుకున్న కంప్యూటర్స్ సబ్జెక్ట్ అక్కడ పని చేసింది. ఆ కోర్సులో ఆఖరి సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పేపర్ ఉంది. అలా నేర్చుకున్న విషయ పరిజ్ఞానం ఎస్ఐబీలో పనికి వచ్చింది. అలాంటి ఆలోచన వద్దు‘అమ్మాయిలకు ఐపీఎస్ ఎందుకు!’ అనే ఆలోచన అప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది. ఆ ఆలోచన నుంచి బయటికి రావాలి. దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళా ఐపీఎస్ అధికారులు తమ సత్తా చాటుకున్నారు, చాటుకుంటున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. గతంతో పోల్చితే అమ్మాయిలలో ఐపీఎస్పై ఆసక్తి పెరుగుతోంది. ఐపీఎస్ సాధించడం ఒక సవాలు అయితే, ఆ తరువాత వృత్తిజీవితంలో ప్రతిరోజూ ఎన్నో సవాళ్లు ఉంటాయి. అయినా సరే, అమ్మాయిలు వెనకడుగు వేయడం లేదు. ‘నేను ఐపీఎస్ అవుతాను’ అనే మాట వారి నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఇది శుభసూచకం. నేను ఐపీఎస్ కావాలని అనుకోనప్పటికీ, అయిన తరువాత గర్వంగా ఫీల్ అవుతున్నాను. వృత్తిజీవితంలో విలువైన అనుభవాలు సొంతం చేసుకున్నాను.ఆ అవసరం ఇప్పుడు మరీ ఎక్కువగతంలో కంటే ఇప్పుడే మహిళలు, యువతులలో ఎక్కువ సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువమంది మహిళలు పోలీస్ శాఖలోకి రావాలి. బాధిత మహిళలు విమెన్ పోలీస్ ఆఫీసర్లతో ఫ్రీగా, ఎలాంటి భయాలు లేకుండా మాట్లాడగలరు. సోదరితో మాట్లాడుతున్నట్లే కంఫర్ట్గా ఫీలవుతారు. ఇదే సందర్భంలో మహిళా అధికారుల వృత్తినిబద్ధత వల్ల బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుంది.ఎవరికీ చెప్పుకోలేని సమస్యలను చెప్పుకునేవారుమాదాపూర్లో పని చేసినప్పుడు దాదాపు 60–65 స్కూళ్లల్లో జరిగిన స్పోర్ట్స్, కల్చరల్, యాన్యువల్ డేలకు అతిథిగా వెళ్లాను. అక్కడికి వచ్చిన చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకూ డ్రగ్స్, డిజిటల్ హైజీన్, గుడ్ టచ్–బ్యాడ్ టచ్తో సహా వివిధ అంశాల గురించి చెప్పే అవకాశం దక్కింది. నా మాటలు విన్న ఎంతోమంది మహిళలు, యువతులు ఆ తర్వాత ఆఫీస్కు వచ్చి నన్ను కలిసే వాళ్లు. బాహ్యప్రపంచంలో ఎవరికీ చెప్పుకోలేని సమస్యల్ని నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు కోరేవారు. అలాంటి వారికి నా చేతనైనంతలో సాయం చేశాను.-శ్రీరంగం కామేష్ -
న్యాయదేవతగా రాణిద్దాం!
మహిళలు ఇంటర్ పూర్తి కాగానే మెడిసిన్, ఇంజనీరింగ్ తమ కెరీర్గా ఎంచుకుంటున్నారు. డిగ్రీ తర్వాత ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులవైపు మొగ్గు చూపుతున్నారు. చాలెంజింగ్గా ఉండే న్యాయవాద వృత్తిని ఎంచుకునే వారు చాలా తక్కువ. తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలు ఈ కెరీర్ను ఎంచుకోవడానికి ఇష్టపడని వారే ఎక్కువ. కోర్టులు, కేసులు అనగానే ఓ రకమైన భయం నిండి ఉంటుంది. అయితే, కాలం మారుతున్న కొద్ది ఇలాంటి ఆలోచనల్లో మార్పులొస్తున్నాయి. పాతికేళ్ల ముందుతో పోలిస్తే ఇప్పుడు మహిళా న్యాయవాదుల సంఖ్య పెరుగుతున్నా, మిగతా రంగాలతో పోలిస్తే తక్కువే. న్యాయవాద వృత్తి ఎంతో గొప్పది. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఈ వృత్తిని ఎంచుకోవాలి. తెలంగాణ హైకోర్టులో 32 మంది న్యాయమూర్తుల్లో ఏడుగురే మహిళలు ఉన్నారు. ఈ నిష్పత్తిలో మార్పు వచ్చేలా, సగం స్థానాల్లో మహిళలు ఉండేలా రాణించాలి. డిజిగ్నేటెడ్ సీనియర్స్లోనూ మహిళల శాతం అంతంతే. ఇది మారాలి. న్యాయవాద వృత్తిని ఎంచుకునే మహిళల సంఖ్య పెరుగుతున్నా, పలు కారణాల వల్ల ఉన్నత స్థానాలకు ఎదగడం లేదు. కాని, సమరంగా కెరీర్ సాగిస్తే, అందలాలు అధిరోహించ వచ్చనడానికి స్ఫూర్తిగా నిలుస్తున్నవారు ఎందరో! వచ్చే ఏడాది సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది ప్రతి మహిళా న్యాయవాది గర్వించదగిన సందర్భం. సమర్థతతో అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పేందుకు ఆమె నిదర్శనం. కోర్టు మెట్లెక్కాలంటే భయపడే మహిళలకు న్యాయం అందించాలంటే, అదే వర్గానికి చెందిన వారు నల్లకోటు ధరించాలి. ప్రజాప్రతినిధి, అధికారి సహా ఎవరు తప్పు చేసినా శిక్షించే అధికారం కోర్టులకు మాత్రమే ఉంటుంది. ప్రజలకు న్యాయం చేయాలనుకునే వారు ఈ వృత్తి స్వీకరించి, రాణించాలి. తొలుత కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, నేను నిలబడి గెలిచా. అత్యంత తక్కువ మంది న్యాయవాదులకు అందించే ‘డిజిగ్నేటెడ్ అడ్వొకేట్ హోదా’ను అతి చిన్న వయసులో అందుకున్నా. ఇంకా ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది. ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో కొన్ని ఆటుపోట్లు వచ్చినా పట్టుబట్టి పోరాడి సమర్థత నిరూపించు కోవాలి. కుటుంబ బాధ్యతల కారణంగా వనితలు ఎక్కువ గంటలు పనిచేయడం ఇబ్బందే! న్యాయవాదులుగా ఏటా నమోదు చేసుకుంటున్న వారిలో పురుషులే ఎక్కువ. ఆ ధోరణి మారాలి. ఒక మహిళ న్యాయవాద వృత్తిలోకి వస్తే చుట్టూ ఉన్న వందమందికి సాయం అందించగలదన్న విషయం గుర్తుంచుకోవాలి. కోర్టుల్లోనూ మహిళల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. భయాలు వదిలి నల్లకోటు ధరించి ‘న్యాయదేవత’లుగా మారే సమయం వచ్చింది. న్యాయం ఆశించే స్థాయి నుంచి అందించే స్థాయికి మగువ ఎదగాలి.దేశంలో తొలి న్యాయవాది1866, నవంబర్ 15న నాసిక్లోని పార్సీ కుటుంబంలో కార్నెలియా సొరాబ్జీ జన్మించారు. మహిళలకు, సమాజానికి ఏదో ఒకటి చేయాలన్నది ఆమె సంకల్పం. బాంబే వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్కాలర్షిప్ ఇచ్చేందుకు నాటి బ్రిటిష్ సర్కార్ నిరాకరించడంతో కొందరు సేకరించి ఇచ్చిన నిధులతో ఆక్స్ఫర్డ్లో బ్యాచిలర్ ఆఫ్ సివిల్ లాలో 1892లో ఉత్తీర్ణత సాధించినా, డిగ్రీ పట్టా ఇచ్చేందుకు కాలేజీ నిరాకరించింది.1920లో లండన్ బార్ మహిళలను లా ప్రాక్టీస్ చేయడానికి అనుమతించినప్పుడు కార్నెలియా అక్కడికి వెళ్లారు. తర్వాత కలకత్తా హైకోర్టులో తొలి మహిళా న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.దేశంలో తొలి మహిళా న్యాయమూర్తిఅన్నా చాందీ 1959 ఫిబ్రవరి 9న కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, దేశంలోనే తొలి మహిళా హైకోర్టు న్యాయమూర్తిగా అరుదైన ఘనత సాధించారు. అంతకు ముందు 1937లో తొలి మహిళా న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ట్రావెన్కోర్ రాజ్యంలో (ప్రస్తుతం కేరళ) 1905 ఏప్రిల్ 5న జన్మించిన అన్నా చాందీ, తిరువనంతపురంలో పెరిగారు. చిన్నప్పటి నుంచే చదువు, సామాజిక అవగాహన, మహిళా హక్కులపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆమె, ఆ కాలంలో మహిళలకు అరుదైన రంగమైన న్యాయ విద్యను ఎంచుకుని, 1926లో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి కేరళలో లా డిగ్రీ పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిసుప్రీం కోర్టు తొలి మహిళా న్యాయ మూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ 1989లో నియమితుల య్యారు. కేరళలోని పతనంతిట్టలో 1927 ఏప్రిల్ 30న మీరా సాహిబ్, ఖదీజా బీవీ దంపతులకు జన్మించారు. పతనంతిట్టలో పాఠశాల విద్య, తిరువనంతపురంలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం తిరువనంతపురంలో ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి బీఎల్ పట్టా పుచ్చుకున్న జస్టిస్ బీవీ 1950లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. సెషన్స్ కోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి 1983న హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1989లో సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1992 ఏప్రిల్ 29న పదవీ విరమణ చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్పర్సన్గా, ముస్లిం వర్గం నుంచి గవర్నర్గా నియమితురాలైన తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం.-గండ్రాతి అరవింద్ రెడ్డి -
జిమ్ చేద్దాం... ఫిట్గా ఉందాం...
పురుషులకే కాదు, మహిళలకూ వ్యాయామం అవసరం. నిజానికి మహిళలకు వ్యాయామం మరింత ముఖ్యం. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే, తర్వాతి తరం ఆరోగ్యంగా ఉంటుంది. మొత్తం సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాయామం చేసినా, చేయకపోయినా యవ్వనంలో సహజంగానే ఆరోగ్యంగా ఉంటాం. వయసు గడిచే కొద్ది కండరాల పటుత్వం సడలిపోతుంది. మన శరీరానికి శక్తి కావాలి, కండరాలకు పటుత్వం కావాలి. వయసు మళ్లినా, కండరాల్లో పటుత్వం సడలిపోకుండా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. తేలికపాటి వ్యాయామాలు మొదలుకొని బరువులు ఎత్తడం లాంటి వ్యాయామాలు చేస్తూ ఉంటే, క్రమంగా శక్తి పెరిగి, కండరాలు పటుత్వాన్ని సంతరించుకుంటాయి. హార్మోన్లలో అసమతుల్యతలు ఉన్నట్లయితే, క్రమంగా అవి ఒక కొలిక్కి వస్తాయి. నాకు చిన్నప్పటి నుంచే చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి ఉండేది. స్కూల్ రోజుల్లోనే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ వంటి పోటీల్లో బహుమతులు గెలుచుకునేదాన్ని. మా నాన్నగారు నన్ను ప్రోత్సహించేవారు. నా బాల్యమంతా కాకినాడలో జరిగింది. అక్కడే ఏడో తరగతి వరకు చదువుకున్నాను. టెంత్, ఇంటర్, డిగ్రీ రోజుల్లో స్టేట్ లెవల్కు వెళ్లాను. పెళ్లయిన తర్వాత వైజాగ్ వచ్చాను. జిమ్ నడపాలని అనుకుంటున్నట్లు మావారికి చెబితే, ప్రోత్సహించారు. వైజాగ్లో జిమ్ పెట్టడానికి ముందు ఏరోబిక్స్లో శిక్షణ తీసుకున్నాను. మహిళలు తలచుకుంటే ఏమైనా సాధించగలరు. అయితే, సాధించాలనే తపన ఉండాలి. క్రమశిక్షణ, చేసే పని పట్ల ఏకాగ్రత, అంకితభావం ఉండాలి. మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఈ సూత్రాలను తప్పకుండా పాటించాలి. నా దగ్గరకు వచ్చే మహిళల్లో ఎక్కువమంది నెలసరి క్రమం తప్పడం, స్థూలకాయం, హార్మోన్ అసమతుల్యతలు, కాన్పుల తర్వాత శరీరతత్త్వంలో మార్పులు వంటి సమస్యలతో బాధపడేవారే ఎక్కువ. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి వారి శరీర తత్త్వం తెలుసుకుని, వారి వయసును బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి ఎలాంటి వ్యాయామాలు చేయాలో, ఎలాంటి ఆహారం తీసుకోవాలో వారికి చెబుతుంటాను. చాలామంది మహిళలు ఒకటి రెండు రోజులు జిమ్కు వచ్చాక తర్వాత మానేస్తారు. ముందు వాళ్ల మైండ్సెట్ మార్చాలి. ఆరోగ్యం కాపాడుకోవడానికి అతిగా ప్రయాస పడనక్కర్లేదు. మన వంటిల్లే ఔషధాలయం. వంటింట్లో తరచుగా వాడుకునే దినుసులతోనే చాలావరకు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. జీలకర్ర, మిరియాలు, మెంతులు, దాల్చినచెక్క, లవంగాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉసిరి, గుమ్మడి గింజలు, కర్బూజా గింజలు, చియా విత్తనాలు వంటివి శరీరాన్ని డీటాక్స్ చేసుకోవడానికి బాగా ఉప కరిస్తాయి. ఫిట్నెస్ నిపుణురాలిగా ఈ సమాజం నాకు ఒక స్థానాన్ని ఇచ్చింది. సమాజానికి నేను తిరిగి ఇవ్వగలిగేది నా విద్యను మాత్రమే! నాకు తెలిసిన విద్య హెల్త్ అండ్ ఫిట్నెస్. నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ప్రతిరోజూ తప్పనిసరిగా ఒక ఫిట్నెస్ రీల్ పెడతాను. నాకు దాదాపు ఎనభైవేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంట్లోనే ఉంటూ మహిళలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ఉపయోగపడే వ్యాయామాలు, చిట్కాలతో పాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు తగిన రెసిపీస్ కూడా పెడుతుంటాను. పగటిపూట వేళకు తినడం, రాత్రివేళ త్వరగా భోజనం ముగించడం, రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. కూల్డ్రింక్స్, మద్యం, పొగతాగడం వంటివి మానుకుని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే చిరకాలం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఫిట్నెస్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదు, జిమ్లో వ్యాయామాలు చేయడం మాత్రమే కాదు. మనిషికి ఫిట్నెస్ నాలుగు రకాలుగా ఉండాలి. ఫిజికల్, మెంటల్, ఫైనాన్షియల్, స్పిరిచ్యువల్ ఫిట్నెస్ ఉంటేనే మనిషి సంపూర్ణంగా ఫిట్గా ఉన్నట్లు. -అను ప్రసాద్ , హెల్త్ అండ్ ఫిట్నెస్ మోటివేటర్ -
కలుపు మొక్కలకు భయపడొద్దు
సమాజం మనల్ని ఇలానే ఉండాలని నిర్దేశిస్తుంది. కొన్ని కలుపు మొక్కలు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి. మన లక్ష్యాలను నెరవేర్చుకోనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తాయి.అయినా ఆగిపోకుండా మహిళలు ధైర్యంగా బతుకుతూ ముందుకు సాగిపోవాలి అంటున్నారు నటి, దర్శకురాలు వరలక్ష్మి.⇒ నా స్కూల్ డేస్లో నేను ఈవ్ టీజింగ్కి గురైన సందర్భాలు చాలా ఎక్కువ. వాళ్లందరికీ నా స్టైల్లో నేను బుద్ధి చెప్పాను. కొందరికి మాటలతో చెబితే పనికి రాదు; అలాంటివాళ్లకు చెంప దెబ్బతో సమాధానం చెప్పడం చాలా అవసరం.⇒ అమ్మాయిలను వేధించేవాళ్లు ఎక్కడున్నా వారికి బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. కొత్త అమ్మాయిలనూ వేధిస్తారు... బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయిలనూ ఇబ్బందులపాలు చేస్తారు. వాళ్లకు ఎవరూ స్పెషల్ కాదు. నేనైతే సినిమాలో యాక్షన్ రోల్స్ చేసినప్పుడు ఎలా కొడతానో అలాగే రియల్ లైఫ్లోనూ. అయితే ‘అలాంటివాళ్లను ఇలా చేయండి’ అని నేను ఎవరికీ సలహా ఇవ్వను. ఎందుకంటే ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. కాని నేను చెప్పేదొక్కటే– పరిస్థితి ఏదైనా కావొచ్చు, ధైర్యంగా ఎదుర్కోండి.⇒ నా కెరీర్ ఆరంభంలో నేను ‘ఇన్సెక్యూరిటీ’కి గురయ్యాను. దానికి కారణం సరైన అవకాశాలు రాకపోవడమే. అయితే ఆ అభద్రతాభావం నన్ను మానసికంగా కుంగదీయలేదు. శరత్కుమార్గారి కూతురిగా నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటుంది. కాని, నన్ను నేను నిరూపించుకోవాల్సిందే! ఆర్టిస్ట్గా నాకు దక్కే ప్రతి చాన్స్ ద్వారా నన్ను నేను నిరూపించుకుంటూ వస్తున్నాను.⇒ అమ్మాయిలు వాళ్లకు నచ్చినట్లు వాళ్లు ఉండాలి. అమ్మాయిలు సున్నితంగానే ఉండాలి. అప్పుడే అందరికీ నచ్చుతారు. ఇగోయిస్ట్లను ఇష్టపడరని చాలామంది ఫిక్స్ అయిపోతారు. అసలు ఒకరికి నచ్చేట్లు ఉండాలని ఎందుకు అనుకోవాలి? మన వ్యక్తిత్వానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి. వేరేవాళ్ల కోసం మన తీరు మార్చుకుంటే మనకంటూ ఒక ఉనికి ఉండదు. సమానత్వం అనేది మనకి ఇక్కడే ఉంది. ఇక మనం ఎందుకు తక్కువ అవుతాం.⇒ మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ‘బాడీ షేమింగ్’ ఒకటి. సన్నగా ఉంటే మరీ సన్నగానా? అంటారు. బొద్దుగా ఉన్నా విమర్శిస్తారు. ఇప్పుడు ఒక గదిలో పదిమంది ఉంటే ఐదుగురికి వెజ్ పలావ్ నచ్చుతుంది, మరో ఐదుగురికి నాన్వెజ్ బిర్యానీ నచ్చుతుంది. ఎవరి టేస్ట్ వారిది. అలాగే ఎవరి బాడీ వారిది, ఎవరి చాయిస్ వారిది. దాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలానే ఉండాలి. ఎవరేం అనుకుంటే మనకేంటి? మన వ్యక్తిత్వమే మనం.⇒ కొన్ని విషయాల్లో అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులైపోతారు. చదువుకో! జాబ్ చెయ్! పెళ్లి చేసుకో!– ఇలా సలహాలు ఇస్తారు. ఒకవేళ పెళ్లి చేసుకోలేదనుకోండి, ‘ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఏంటి?’ అంటారు. ఆ అమ్మాయి వెనక కామెంట్ చేస్తారు. ఇలాంటి ఆడవాళ్ల తీరు మారాలి.⇒ సినిమా ఇండస్ట్రీలో నేను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలే ‘సేవ్ శక్తి’ పౌండేషన్ ఆరంభించేలా చేశాయి. నాకు ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నాను. నాలా ఎదుర్కోలేనివాళ్ల కోసమే ఈ ఫౌండేషన్ ఆరంభించాను. డిప్రెషన్కు గురైనవారిని అందులోంచి బయటకు తేవడానికి డాక్టర్స్ సహాయం తీసుకుంటాం. ఇప్పటివరకూ చాలామంది అమ్మాయిలకు హెల్ప్ చేశాం. ‘సేవ్ శక్తి’కి సంబంధించిన వ్యవహారాలను ఎక్కువగా మా అమ్మ ఛాయ చూసుకుంటారు.⇒ స్టేజి మీద నేను సాధారణంగా ఎమోషనల్ అవ్వను. కాని, ఆ రోజు (‘సరస్వతి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఈ సినిమా ద్వారా వరలక్ష్మి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు) అలా ఎందుకు అయ్యానంటే నటిగా స్టార్ట్ అయి, డైరెక్టర్ స్థాయికి రావడం చిన్న విషయం కాదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాకెన్నో అవకాశాలు ఇచ్చింది. అలాంటి ఒక ఇండస్ట్రీ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కాస్త ఎమోషనల్గా అనిపించింది. - డి.జి. భవాని -
12 రోజెస్
30 వయసుకి ముందు ‘ఏం చేశారు?’ అనడిగితే, పాత జెనరేషన్ ఆలోచిస్తుంది. కాని, ఈ జెనరేషన్ అమ్మాయిలు అప్పటికే సాధిస్తారు! చిన్న వయసులోనే ఎవరిపైనా ఆధారపడకుండా, ఆధిక్యతను నిరూపించుకుంటున్నారు. కలలకు డెడ్లైన్ పెట్టకుండా, తమ జీవితానికి తామే సింహాసనం వేసుకుంటున్నారు. అలా ‘ఫోర్బ్స్ 30 అండర్ 30– 2026’ జాబితాలో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న మహారాణులు వీళ్లే!ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్ లో ‘భోజనాలు ఎక్కడ?’ అని తెలుసుకునే లోపే,ముప్పై ఏళ్లు దాటిన వారిని ‘పెళ్లి ఎప్పుడు?’ అని అడిగే బంధువుల కోసం ఈసారి కొంతమంది అమ్మాయిలు స్పెషల్ సమాధానం రెడీ చేశారు. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 – 2026’ బ్యాచ్ని చూపిస్తూ, ఇది కేవలం లిస్ట్ కాదు, యాంబిషన్ కు ఆధార్ కార్డు; డ్రీమ్స్కు రేషన్ కార్డు; సక్సెస్కు అడ్రెస్ ప్రూఫ్. వయసుతో సంబంధం లేకుండా, ఫెయిల్యూర్కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, సక్సెస్తో సెల్ఫీ తీసుకున్న బ్యాచ్ ఇది.అందుకే ఇకపై ‘సెటిల్ అయ్యావా?’ అని అడిగే ముందు,‘మీరు స్కేల్ అప్ అయ్యారా?’ అంటూ మోటివేషన్ ఇస్తున్నారు. ఇలా ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఈ యంగ్ అచీవర్స్ గురించి,మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ. కలలు కనడం ఒక ఎత్తు, ‘అయ్యో, అవి నిజమవుతాయా?’ అని అనుమానం పెట్టుకోవడం మరో ఎత్తు. కాని, ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 – 2026’ జాబితాలో చోటు సంపాదించిన వాళ్లు మాత్రం కలలు కనే దశ దాటేసి, వాటికి గడువు పెట్టుకుని, నెరవేర్చుకుని, ఫ్రేమ్ కట్టేసిన బ్యాచ్. ఈ జాబితాలో వ్యాపారవేత్తలు, నిపుణులు, క్రీడాకారులు, సంగీతం, సినిమా కళాకారులు, రూపకర్తలు ఇలా రంగుల మేళవింపే కనిపించినా, వారిది ఒకే లక్షణం– అదే సాధించాలనే తపన! ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, ఆర్థిక రంగాల్లో పేరొందిన ఫోర్బ్స్ సంస్థ.భారత్లో ప్రతి ఏడాది విడుదల చేసే ఈ ప్రత్యేక జాబితా ఇప్పుడు పదమూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసే ఈ జాబితాలో ఈసారి పదిహేను విభాగాల్లో యువ ప్రతిభను గుర్తించగా, అందులో నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులు అందించే వ్యాపారాలు, దేశ రక్షణ, అంతరిక్ష రంగాలు, ప్రకటనలు, మార్కెటింగ్ వంటి కొత్త విభాగాలు చేర్చారు. ఇలా చిన్న వ్యాపారం నుంచి అంతరిక్ష ప్రయోగం దాకా ప్రతిభకు విస్తృత వేదిక సిద్ధమైంది. అసాధ్యాలను సాధించిన ఆణిముత్యాలుఈ యువ సైన్యం ‘సెటిల్ అవ్వడం’ అంటే కుర్చీలో కూర్చోవడం కాదు, కుర్చీని సృష్టించేవారిగా ఎదగడం అనే ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. సుమారు వెయ్యికి పైగా వచ్చిన దరఖాస్తులను జల్లెడ పట్టి, నిపుణుల కమిటీ చర్చలు, వాదోపవాదాల తర్వాత ఎంపికైన ఈ ముప్పై మందిలో పన్నెండు మంది మహిళలు తమ ప్రతిభతో వెలుగొందగా, మిగిలిన స్థానాలను యువకులు కైవసం చేసుకున్నారు. అమ్మాయిల దూరదృష్టి, అబ్బాయిల వినూత్న ఆలోచనలు కలగలిసి కృత్రిమ మేధస్సు నుంచి వ్యవసాయ సాంకేతికత వరకు, అజ్రక్–కాంతా వంటి సంప్రదాయ కళల నుంచి క్రీడలు, సినిమా, రక్షణ–అంతరిక్ష రంగాల వరకు పదిహేను విభాగాల్లో సంచలనం సృష్టించాయి. పన్నెండు ప్రేరణ గాథలు! ముప్పైమంది సభ్యులతో మెరిసిన ఈ జాబితాలో, అసలైన స్పాట్లైట్ మాత్రం ఆ పన్నెండుమంది మహిళలదే! కలలకు క్యాలెండర్ ఉండదని, విజయానికి డెడ్లైన్ పెడితే చాలు సాధ్యమవుతుందని వారు నిరూపించారు. కాంతా కుట్టుతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న మౌమితా బసాక్, అజ్రఖ్కు ఆధునిక ఊపు తెచ్చిన ముబస్సిరా ఖలిద్ ఖత్రి సంప్రదాయం కూడా స్టయిలిష్గా మెరవొచ్చని నిరూపించారు. దృశ్య కథలతో సమాజానికి కొత్త కళ్లద్దాలు పెట్టిస్తున్న ప్రియా దాలి, కళ అంటే కేవలం వినోదం కాదని గుర్తు చేశారు.పద్దెనిమిదేళ్లకే స్టార్టప్ స్టీరింగ్ పట్టిన కాజల్ భేడా, చికంకారీకి ఫ్యాషన్ ఫ్రేమ్ ఇచ్చిన ఆకృతి రావల్, పర్యాటకానికి కొత్త అడ్రస్ రాసిన సిమోనా మోహన్ , మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం తీసుకొచ్చిన రమ్య ఎల్లాప్రగడ, సంరక్షణ కేంద్రాల నుంచి బయటికొచ్చిన యువతకు దిక్సూచి అయిన అనీషా శర్మ ఇలా ప్రతి పేరు ఒక కథ, ప్రతి కథ ఒక ప్రేరణ. చెస్బోర్డుపై చక్రం తిప్పిన దివ్యా దేశ్ముఖ్, విలువిద్యలో లక్ష్యాన్ని ఛేదించిన శీతల్ దేవి క్రీడల్లో భారత ప్రతిష్ఠను ఎగరేశారు. ముప్పైమందిలో అందరూ ప్రతిభావంతులే! కాని, ఈ మహిళలు మాత్రం ‘ముందు మేముంటాం, మిగతావాళ్లు ఫాలో అవుతారు!’ అన్నట్టు నిలిచారు.సంక్షోభమైనా సరైన సమయమే! కాజల్ భేడాప్రపంచం మొత్తం మాస్కులు కట్టుకుని భయంతో కూర్చున్న రోజుల్లో కాజల్ భేడా, ఒక కొత్త ఆలోచనకు ముసుగు తీసేసింది. ‘బ్రాండ్ అంటే కేవలం ప్రకటన కాదు, అది ఒక కథ’ అనే ఆలోచనే 2020లో ముంబై నేలపై ‘స్క్రిబ్బల్డ్’ సంస్థ స్థాపించింది. బ్రిటన్ లో మీడియా నిర్మాణంలో పొందిన శిక్షణ, నమ్మకాన్ని బలంగా చేసుకొని, సంస్థలు చెప్పాలనుకునే అసలైన సందేశం, ప్రకటన ఏజెన్సీలు అందించే సాధారణ పనుల మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేయాలనే సంకల్పంతో ముందడుగు వేసింది. బయట పెట్టుబడుల కోసం తలుపులు తట్టకుండా, తన శ్రమనే మూలధనంగా మార్చి లాభాల్లో నడిచే సంస్థగా తీర్చిదిద్దింది. నేడు ఆమె నైకా, అమెజాన్, అదానీ వంటి ప్రముఖ సంస్థల కథలను కొత్త శైలిలో చెప్తోంది. ఇలా సంక్షోభం వచ్చినా, కలలకు స్టార్ట్ బటన్ నొక్కడానికి సరైన సమయమే అని చెప్తోంది.భావాలే బలం, ధైర్యమే దారి: అనీత్ పడ్డాచిన్నప్పటి నుంచి ఇంట్రావర్ట్గా మెలిగిన ఆ అమ్మాయి, ఒక రోజు అందరి చూపులు తనవైపు తిప్పుకుంటుందని ఎవరైనా ఊహించి ఉంటారా? అదే అనీత్ పడ్డా కథ. ‘నటనలో చేతి కదలికలకన్నా హృదయ స్పందన ముఖ్యం’ అని తల్లి చెప్పిన మాటలను గుండెల్లో దాచుకుని, నటనను సాధన చేసింది. ప్రకటన రంగంలో ప్రారంభించి, భావోద్వేగ ప్రధాన పాత్రలతో గుర్తింపు పొందింది. సామాజిక అంశాలపై అవగాహన కలిగించే కథలను ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత. కేవలం 23 ఏళ్ల వయసులోనే తనదైన ముద్ర వేసిన ఈ యువ నటి, తదుపరి చిత్రంలో మరో కొత్త అవతారంలో కనిపించేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో మరింత విభిన్న పాత్రలు, ప్రతి కథలోనూ కొత్త అనుభూతి పంచాలనే తపనతో ముందుకు సాగుతోంది.కథలతో కట్టిపడేసే సృజనశీలి: ప్రియా దాలిరూపకల్పన అంటే రంగులు మాత్రమే కాదు; కథనం అంటే మాటలు మాత్రమే కాదు; సమాజం అంటే జనాలు మాత్రమే కాదు అంటూ ఈ మూడింటినీ ఒకే తాడుతో కట్టి అందమైన గాలిపటంలా ఎగరేసింది ప్రియా దాలి. వివిధ దృశ్య కథనాల ద్వారా అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చింది. అలాగే, వివిధ సామాజిక అంశాలపై అవగాహన కలిగించే ప్రాజెక్టులు రూపొందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. టిండర్, గోద్రేజ్ గ్రూప్ వంటి సంస్థలతో కలిసి దీర్ఘకాలిక సహకారాల్లో భాగమైంది. పిల్లల పుస్తకాల ప్రచురణలోనూ తన ముద్ర వేసి, 2023లో ‘ఆర్ యూ సీరియస్?’ అనే సృజనాత్మక సంస్థను స్థాపించింది. ఆమె కథ చూస్తే అనిపిస్తుంది. నవ్వుతూ చెప్పిన కథ కూడా సమాజాన్ని ఆలోచింప జేయగలదని!స్టయిల్కు సవాల్!: ఆకృతి రావల్‘అమ్మా! ఈ చేతిపని చీరలు యువత కూడా కట్టుకుంటారా?’ అనే ప్రశ్నే ఆకృతి రావల్ కథకు ఆరంభం. 2020లో వాట్సాప్నే దుకాణంగా మార్చి ‘హౌస్ ఆఫ్ చికంకారీ’ని ప్రారంభించింది. లక్నో చుట్టుపక్కల కళాకారుల ఇళ్లలో మోగే సూదుల శబ్దాన్ని నేరుగా యువత అల్మరాలోకి తీసుకొచ్చింది. అసలైన చికంకారీకి తోడు కశ్మీరీ ఆరికారీ వంటి మరిన్ని చేతివృత్తులను చేర్చి, సంప్రదాయాన్నే ట్రెండ్గా మార్చేసింది. కళాకారులకు నెలకొక స్థిరమైన ఆదాయం కల్పిస్తూ, అసంఘటిత మార్కెట్లో ఒక క్రమశిక్షణను తీసుకొచ్చింది. ఆమె ప్రయాణం షార్క్ టాంగ్ వేదికపై మెరిసి, పలువురు పెట్టుబడిదారుల మద్దతును సంపాదించింది. అలా సంప్రదాయానికి స్టయిల్ అద్దిన ఈ యువ పారిశ్రామికవేత్త కథ చేతిపనికీ క్లాప్స్ కొట్టేలా చేస్తోంది.కథలు నేస్తున్న కళాకారిణి: మౌమితా బసాక్పశ్చిమ బెంగాల్ పల్లెలో పెరిగిన మౌమితా బసాక్ చేతిలో సూది పడితే అది కేవలం కుట్టు కాదు, ఒక కథ మొదలవుతుంది! మనం సాధారణంగా పాత బట్ట అని పక్కన పెట్టేసేదాన్ని, ఆమె ‘ఇదే నా కాన్వాస్’ అంటూ రంగుల కలలు నేస్తుంది. సంప్రదాయ కాంతా కుట్టును ఆధునిక భావాలతో కలిపి, చీరపై చిన్న చిన్న ముచ్చట్లు కుట్టేస్తుంది. టీ, కాఫీ రంగుల సహజ మరకలు, మిగిలిపోయిన వస్త్రాల ముక్కలు ఇవన్నీ ఆమె చేతిలో పడితే వినూత్న డిజైన్లుగా మారతాయి.ఆమె డిజైన్స్ దేశం దాటి స్పెయిన్ , బ్రిటన్ , పోలండ్ వరకు చేరి ప్రశంసలు అందుకున్నాయి. రాష్ట్ర, అంతర్జాతీయ వేదికల వరకు అనేక అవార్డులు, పురస్కారాలు ఆమె ఖాతాలో చేరాయి. మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, అసమానతలపై తన కుట్టులోనే సందేశాలు నేస్తూ ‘సూది చిన్నదైనా, సందేశం పెద్దది!’ అని నవ్వేస్తుంది. స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఆమెకు మరో గర్వకారణం. అలా పాతబట్టలలో కూడా కొత్త ప్రపంచం దాగి ఉంటుందని నిరూపిస్తోంది.ఇంటివద్దే సెలవుల మజా!: సిమోనా మోహన్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ఇరవై ఎనిమిది ఏళ్ల సిమోనా మోహన్, ఇప్పుడు పర్యాటక రంగంలో కొత్త పంథాను చూపిస్తోంది. పర్యావరణ హిత పర్యాటకానికి ప్రాధాన్యం ఇచ్చే సంస్థను నిర్వహిస్తోందామె. అతిథులకు కేవలం వసతి మాత్రమే కాదు, స్థానిక ప్రకృతి, సంస్కృతి, ఆహారం అన్నీ కలిసిన ప్రత్యేక అనుభవాన్ని అందిస్తోంది. నీలగిరుల మధ్య మూడు పడకగదుల కాటేజీలో కేవలం మూడువేల రూపాయలకే బస చేసే సౌకర్యంతో పాటు భోజనం, స్థానిక కొనుగోళ్లు, వాహన సదుపాయాలన్నీ ఒకే ప్యాకేజీలో ఏర్పాటు చేస్తోంది. ముందుగా ఒక ప్రాంతంలో బలపడిన తర్వాతే కొత్త మార్కెట్లలో అడుగుపెట్టాలనే స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది.చెస్ వేదికపై మహారాణి: దివ్యా దేశ్ముఖ్ఇరవై ఏళ్ల వయసులోనే చెస్ బోర్డుపై తన మేధస్సుతో ఆకాశాన్ని తాకేసింది దివ్య దేశ్ముఖ్! మహారాష్ట్రకు చెందిన ఈమె, అంతర్జాతీయ గ్రాండ్మాస్టర్ హోదా సాధించిన కొద్దిమంది భారతీయ మహిళల్లో ఒకరు. అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తనదైన ముద్ర వేసి, యువతలో చదరంగంపై ఆసక్తిని పెంచుతోంది. బోర్డుపై ఆమె నడిపే ప్రతి పావు ఒక వ్యూహం, ప్రతి కదలిక ఒక లెక్క, ప్రతి ఆట చివరికి చెక్మేట్ వైపు దారి తీసే తెలివైన అడుగు. ఎక్కడా తడబడకుండా, పాయింట్ టు పాయింట్గా ప్రత్యర్థిని కట్టడి చేస్తూ ముందుకు సాగే ఈ చిన్న మేధావి, ఇప్పుడు 2026 కాండిడేట్స్ టోర్నీపైనే ఉంది. ఆమె ఆటతీరు చూస్తే, చదరంగ బోర్డుపై రాజు, రాణి, కోట అన్నీ ఉన్నా, ఆ ఆటకు ప్రాణం పోసేది దివ్య చేతులే అనే భావన కలిగిస్తుంది.అజ్రక్కి ఆడపడుచుగా!: ముబస్సిరా ఖలీద్ ఖత్రిమూడు తరాలుగా ఆ ఇంట్లో మోగేది చెక్క ముద్రల శబ్దమే, కాని, ఆ ముద్రలు వేసేది మాత్రం మగవాళ్లే! ఆ సంప్రదాయానికి చిన్న నవ్వుతో ‘ఇప్పుడు నా వంతు’ అంటూ రంగంలోకి దిగింది ముబస్సిరా ఖలీద్ ఖత్రి. గుజరాత్ కచ్ ప్రాంతానికి చెందిన ఈమె, అజ్రక్ అనే ఆ క్లిష్టమైన ముద్రణ కళలో తొలి మహిళా కళాకారిణిగా అడుగుపెట్టి అడ్డుగోడలను బద్దలుకొట్టడమే కాదు, ఆంక్షల సరిహద్దులను కూడా చెరిపేసింది! సంప్రదాయ పద్ధతికి తన స్వేచ్ఛా చిత్రణను, హస్తకళా నైపుణ్యాన్ని జోడించి, చెక్క ముద్రల మధ్యలో కొంచెం తన స్టయిల్ చల్లి కొత్త డిజైన్స్ని చూపించింది. తర్వాత వ్యాపార నైపుణ్యాలను అభ్యసించి, కళకు వ్యాపార దక్షతను కూడా జోడించింది. ‘శ్రీ గౌరవ కిలారు సన్మాన్’ అందుకుంది. ఆమె డిజైన్స్ వస్త్రాలు దేశీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్నాయి. అనంతరం ‘ఎలీషియన్ ’ అనే తన బ్రాండ్ ద్వారా అజ్రక్ కూడా ఆధునికంగా మెరిసేలా చేసింది.మరచిపోయిన ధనం, మళ్లీ చేతిలోకి: పూజా మాలిక్, సరితా జైన్ డబ్బు పోతే బాధే కాని, ఎప్పుడో పెట్టి మరచిపోయిన డబ్బు ఒక్కసారిగా తిరిగి చేతిలో పడితే? ఆ ఆనందానికి మాటలు సరిపోవు! అదే ఆనందాన్ని అందిస్తున్న సంస్థే ‘ఈక్విట్రేసర్స్ వెల్త్ అడ్వైజర్స్’. స్థాపకురాలు పూజా మాలిక్, సహస్థాపకురాలు సరితా జైన్ కలిసి ఆర్థిక రంగంలో ఓ విభిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. పెట్టుబడిదారుల విద్య, రక్షణ నిధుల పరిధిలో పనిచేస్తూ, ఎప్పుడో మరచిపోయిన బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, లాభాంశాలు వంటి ఆస్తులను గుర్తించి, వాటి అసలైన హక్కుదారులకు తిరిగి అందించే బాధ్యత తీసుకున్నారు.‘ఇది ఎక్కడో ఉంది. కానీ ఎవరిది?’ అనే గందరగోళానికి ముగింపు పలుకుతూ, వారసులను గుర్తించడం నుంచి మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, సులభంగా పూర్తి చేయడం వరకూ అండగా నిలుస్తున్నారు. వందకు పైగా వినియోగదారులతో, ముఖ్యంగా అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, విదేశాల్లో నివసించే భారతీయులతో పనిచేస్తూ, 2025 ఆర్థిక సంవత్సరంలో యాభై లక్షల రూపాయల ఆదాయం సాధించారు. మరచిపోయిన సంపదకు మళ్లీ చిరునవ్వు తెప్పిస్తున్నారు ఈ ఇద్దరూ.వైకల్యం విజయానికి అడ్డుకాదు: శీతల్ దేవి జమ్మూ కశ్మీర్ పర్వత గ్రామం నుంచి వచ్చిన పారా ఆర్చర్ శీతల్ దేవి కథ, అసాధ్యాన్ని సాధ్యం చేసిన సాహసగాథ. చేతులు లేకున్నా, తన పాదాలనే చేతులుగా మార్చుకొని విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించే ఈ క్రీడాకారిణి, ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఆమెలోని సహజ సమతౌల్యాన్ని గమనించిన కోచ్లు ఆర్చరీకి దారి చూపించారు. అలా పవర్ఫుల్గా ట్రైనింగ్ తీసుకొని, పదిహేడేళ్లకే భారత యువతుల్లో అతిపెద్ద ప్యారాలింపిక్ పతకాన్ని గెలిచి, ప్రపంచ చాంపియన్ గా ఎదిగింది. డిసెంబర్లో సాధారణ దేశీయ ట్రయల్స్లో మూడవ స్థానం సాధించి, సాధ్యం కేవలం ఒక పదం మాత్రమే కాదు, కష్టపడి, ధైర్యంగా ముందుకు పోయినవారి ఆస్తి అని నిరూపించింది.మెదడు ఆరోగ్యానికి, సాంకేతిక స్పర్శ: రమ్య ఎల్లాప్రగడ, లక్షయ్ సాహ్నీరమ్య ఎల్లాప్రగడ, లక్షయ్ సాహ్నీ కలిసి 2020లో ప్రారంభించిన ‘మార్బుల్స్ హెల్త్’ మెదడు ఆరోగ్యానికి కొత్త దారిని చూపుతోంది. న్యూరాకిల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ, శస్త్రచికిత్స అవసరం లేకుండా మెదడు సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టింది. మందులు, మానసిక చికిత్సలకు తోడ్పడే విధంగా వైద్య అనుమతి పొందిన నాడీ ఉత్తేజక వ్యవస్థలను అభివృద్ధి చేసింది. వీరి ప్రధాన ఉత్పత్తి ‘ఈజ్’ దేశంలోనే తొలి వైద్య అనుమతి పొందిన నాడీ ఉత్తేజక పరికరంగా గుర్తింపు పొందింది. ఇది ప్రస్తుతం ఆసుపత్రుల్లో, వైద్య పర్యవేక్షణలో, గృహ సంరక్షణలోనూ వినియోగంలో ఉంది. ప్రధానంగా మానసిక వైద్యులు, ఆసుపత్రులతో కలిసి పనిచేస్తున్న ఈ సంస్థ,‘ఆరోగ్యం అంటే శరీరానికే కాదు, మనసుకు కూడా’ అని గుర్తుచేస్తోంది.అనాథాశ్రమం తర్వాత తోడుగా!: అనీషా శర్మ, గిరీశ్ మెహతాఅనాథాశ్రమంలో పెరిగి, పద్దెనిమిదేళ్లు నిండగానే బయట ప్రపంచం ముందు నిలబడ్డప్పుడు వచ్చే ఆ గందరగోళం గిరీశ్ మెహతా, అనీషా శర్మకు బాగా తెలుసు. ‘ఇక ఇల్లు లేదు, మార్గం ఎక్కడ?’ అన్న అనుభవమే వీరిని ఒక వేదికగా మలిచింది. అదే ‘ కేర్ లీవర్స్ ఇన్నర్ సర్కిల్ సంస్థ’. సంరక్షణ గృహాల నుంచి బయటకు వచ్చే యువతే, తమలాంటి వారికోసం నడిపే ఈ సమూహం ‘మన వాళ్లు మన కోసం’ అన్న భావనను కలిగిస్తుంది.ఓటరు కార్డ్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాలి? ఆధార్ ఎలా పొందాలి? ప్రభుత్వ పథకాల సాయం ఎలా అందుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు వీరు సమాధానం మాత్రమే కాదు, తోడుగా కూడా నిలుస్తారు. వారి సహాయవాణికి అప్పటి మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మద్దతు తెలపడం మరింత ఉత్సాహం ఇచ్చింది. ఇప్పటి వరకు మూడువేల మందికి పైగా యువత ఈ వేదికతో అనుసంధానమై ఉండగా, ఐదువందల మందికి పైగా అవసరమైన పత్రాల సాధనలో నేరుగా సహాయం అందించారు. ఒక చిన్న తోడు కూడా జీవితాన్ని ఎంత పెద్దగా మార్చగలదో చాటి చెప్తోంది.ఒకప్పుడు ముప్పై ఏళ్లు అంటే ‘సెటిల్ అయ్యే వయసు’. కాని ఈ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ బ్యాచ్ చూస్తే అర్థమవుతుంది, ముప్పై అంటే సెటిల్ అవ్వడం కాదు, ప్రపంచాన్ని స్కేలప్ చేయడం అని! కాబట్టి, కలలకు డెడ్లైన్ పెట్టి, కష్టానికి కమిట్ అవ్వండి. అప్పుడు సక్సెస్ మీ అడ్రస్ వెతుక్కుంటూ వస్తుంది! - దీపిక కొండి -
ఎవుసానికి ఏఐ ఊపు!
కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ఏ రంగం చూసినా దీని ప్రభావానికి ఆవల లేదు. అందుకు వ్యవసాయ రంగం కూడా మినహాయింపు కాదు. ‘అందరి సంక్షేమం–అందరి సంతోషం’ కోసం ఏఐని వినియోగించుకునే కృషి ఊపందుకుంది. ఈ దిశగా జరిగే కృషిలో ‘ఇండియా–ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 135 దేశాల ఏఐ నిపుణులు, ఆవిష్కర్తలు, సీఈవోలు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక ఏఐ శిఖరాగ్రసభ వివిధ రంగాలను ప్రభావితం చేస్తున్న ఏఐ సాంకేతికతలను వెలుగులోకి తెచ్చింది. మన రైతులకు ఉపయోగపడే 26 ఉత్తమ కృత్రిమ మేధ ఆధారిత వ్యవసాయ ఆవిష్కరణలను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఎంపిక చేసి, సంకలనాన్ని వెలువరించింది. రైతులోకం ఆదరణ పొందుతున్న మహిళల సార«థ్యంలోని ఏఐ వ్యవసాయ సంబంధ ఆవిష్కరణలపై ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ స్పెషల్ ఫోకస్...కార్బన్ డేటాకు ఏఐ సొబగుఆర్మ్స్4 ఏఐ... వరి సాగులో వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు తడి పొడి నీటిపారుదల (ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయ్యింగ్– ఎ.డబ్ల్యూ.డి.) పద్ధతి ఉపయోగపడుతుంది. నీటిని నిరంతరాయంగా నిల్వగట్టకుండా వరి పంటకు అవసరమైనప్పుడు తగినంతగా నీరు అందిస్తూ ఉండే పద్ధతి ఇది. హరిత గృహ వాయువు అయిన మీథేన్ వాయువు తీవ్రతతో పాటు ఎరువులు, సాగునీరు వినియోగం ఎ.డబ్ల్యూ.డి. పద్ధతి వరి సాగులో తక్కువగా ఉంటుంది. దిగుబడుల్లో రాజీ పడకుండా ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిలో వరి సాగు చేసే రైతులకు కర్బన ఉద్గారాలను తగ్గించినందుకు ‘కార్బన్ క్రెడిట్లు’ ఇస్తారు. ఈ కార్బన్ క్రెడిట్లను వాతావరణాన్ని కలుషితం చెయ్యక తప్పని పరిశ్రమల యజమానులు కొనుగోలు చేస్తారు. ఆ విధంగా ఈ రైతులకు కొంత ఆదాయం కూడా వస్తుంది. అయితే, ఎ.డబ్ల్యూ.డి. పద్ధతిని పాటించే ప్రతి పొలంలో క్రమం తప్పకుండా అన్ని వివరాలను, గణాంకాలను ఆధార సహితంగా నమోదు చెయ్యాల్సి ఉంటుంది. ఆ డేటాను థర్డ్పార్టీ వెరిఫికేషన్ తర్వాత కార్బన్ క్రెడిట్స్ మంజూరు చేస్తారు. అయితే, ఇక్కడే చిక్కంతా ఉంది. మన దేశంలో వరి రైతుల్లో కూడా అత్యధికులు చిన్న, సన్నకారు రైతులే. 'క్షేత్రస్థాయిలో సెన్సార్లు ఏర్పాటు చేసి, (వారానికి/ నెలకోసారి) తరచూ గణాంకాలను ప్రతి పొలంలోనూ నమోదు చేసే ప్రక్రియ (దీన్ని మానిటరింగ్, రిపోర్టింగ్, వెరిఫికేషన్– ఎం.ఆర్.వి. అంటారు) అత్యంత కష్టతరమైనది, వ్యయప్రయాసలతో కూడినది కూడా! ఈ సమస్యను అధిగమించేందుకు ఢిల్లీకి చెందిన ‘ఆర్మ్స్ 4 ఏఐ’ అనే స్టార్టప్ నూటికి నూరుశాతం ఉపగ్రహాలను ఉపయోగించి అత్యంత విశ్వసనీయమైన, ఆధారపడదగిన, సరిచూడదగిన డేటాను సేకరించే కృత్రిమ మేధతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ‘జియో ఏఐ – ఆధారిత డిజిటల్ ఎంఆర్వీ’ అని దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతిలో వరి పొలంలో నీటి తేమ, మీథేన్ స్థాయి వంటి వివరాల సేకరణకు ఎటువంటి సెన్సార్లను పెట్టాల్సిన పని లేదు. ఒక రైతు పొలం చిన్నదైనా, పెద్దదైనా, ఎన్ని పొలాల్లో అయినా ప్రతి రోజూ అధిక రెజొల్యూషన్తో కూడిన ఎర్త్ అబ్జర్వేషన్ చిత్రాలను సేకరించి, విశ్లేషించటం ద్వారా నమ్మదగిన డేటాను సేకరిస్తోంది. ఆర్మ్స్ 4 ఏఐ మొదట్లో 200 హెక్టార్ల వరి పొలాలతో ప్రారంభించి ఇప్పటికే 40 వేల హెక్టార్లలోని ఎ.డబ్ల్యూ.డి. వరి పొలాల్లో సేవలందిస్తోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాగృతి దబస్ తెలిపారు. నెలకోసారి క్షేత్రస్థాయి గణాంకాలు సేకరించే పాత పద్ధతికి బదులు కొన్ని నిమిషాలకోసారి డేటాను తక్కువ ఖర్చుతోనే నమోదు చేసే అవకాశం తమ ఏఐ ఆధారిత సాంకేతికత వల్ల సాధ్యమైందని ఆమె తెలిపారు. ఆపరేషనల్ రిలయబిలిటీ అధికం కాబట్టి ఆడిటర్లు, కార్బన్ క్రెడిట్ల బయ్యర్లకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని జాగృతి వివరించారు.ఏఐ ఆధారిత డిజిటల్ బిడ్డింగ్అ΄్జావో ఆగ్రోటెక్... వరి ధాన్యం నుంచి పప్పుధాన్యాలు, చిరుధాన్యాల వరకు అమ్ముకునే సమయంలో రైతులు నానా కష్టాలు పడుతుంటారు. గుజరాత్కు చెందిన అ΄్జావో ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ధాన్యాల నాణ్యతా నిర్ధారణను ఆధునీకరించేందుకు కృత్రిమ మేధ ఆధారిత యంత్రాలను, వీటికి అనుసంధానంగా డిజిటల్ బిడ్డింగ్ సదుపాయాలను కూడా రూపొందించింది. వరి, పప్పుధాన్యాల నాణ్యతను కేవలం నిమిషంలో పది కోణాల్లో నిర్ధారించి, నివేదికలను డిజిటల్ ΄్లాట్ఫామ్లో ఈ యంత్రాలు నిమిషంలో నమోదు చేస్తాయి. చెయ్యటంతోపాటు ఎక్కడ, ఏ రైతు వాటిని పండించారనే కచ్చితమైన ట్రేసబిలిటీ సమాచారాన్ని అందిస్తాయి. ఏఐ ఆధారిత సాంకేతికతలకు గాను ఈ సంస్థకు రెండు పేటెంట్లు లభించాయి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఈ సాంకేతికతలకు ఆమోదం తెలిపింది. ఈ ఏఐ–ఆధారిత ధాన్యం విశ్లేషణా యంత్రం తేమ, శిలీంధ్రాలు, మచ్చలు తదితర పది అంశాలకు సంబంధించి ధాన్యాల నాణ్యతను నిష్పాక్షికంగా అంచనా వేస్తుంది. నాణ్యత గ్రేడ్ల ఆధారంగా ధర నిర్ణయానికి తోడ్పడుతూ బయ్యర్లను, రైతులను నేరుగా అనుసంధానిస్తుంది. ధాన్యాల నాణ్యతా విశ్లేషణ, ట్రేసబిలిటీ ద్వారా కోత అనంతర విలువ గొలుసు వాణిజ్య లావాదేవీలను కృత్రిమ మేధతో ఆధునీకరించిన ఘనత తమదని అ΄్జావో ఆగ్రోటెక్ సహ వ్యవస్థాపకురాలు నీరజా మెహతా చె΄్పారు. డిజిటల్ ఓపెన్–మార్కెట్ ట్రేడింగ్ ΄్లాట్ఫామ్ను కూడా అ΄్జావో సంస్థ ఏర్పాటు చేసింది. డిజిటల్ బిడ్డింగ్ ద్వారా రైతులు ఏ సమయంలోనైనా ఏ నమోదిత వ్యాపారికైనా ఉత్పత్తులను విక్రయించడానికి వీలవుతుంది. రైతు మెరుగైన ధరకు అమ్ముకునే అవకాశాలను మెరుగుపరుస్తుంది. పరాఖ్ ΄్లాట్ఫామ్ ద్వారా ఓపెన్ డిజిటల్ ట్రేడింగ్ను మొట్టమొదటిగా వరి, సజ్జ ధాన్యాలను 300 మందికి పైగా గుజరాత్ రైతులు సుమారు రూ. 5 కోట్ల మేర అమ్మకాలు చేశారు. డిజిటల్ ట్రేడ్లో ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు పోటీ పడతారు. ధర విషయంలో పారదర్శకత ఏర్పడుతుంది. స్థానిక బ్రోకర్లు మోసం చెయ్యలేరు. తత్ఫలితంగా రైతులు 7% అధిక ధర పొందగలిగారు. గుజరాత్ సహకార శాఖ ధాన్యం కొనుగోళ్లలో కూడా ఈ ఏఐ ఆధారిత గ్రెయిన్ క్వాలిటీ అసెస్మెంట్ మిషన్లను వాడారు. సుమారు 500 మంది రైతులకు చెందిన 32 వేల పైచిలుకు ధాన్యపు బస్తాలను దాదాపు రూ. పది కోట్లకు విక్రయించారు. రైతులకు 5% అదనపు ఆదాయం వచ్చిందని నీరజా మెహతా వివరించారు.లక్షలాది రైతుల చేతుల్లో ‘ఫార్మర్చాట్’డిజిటల్ గ్రీన్ ట్రస్ట్.. లాభాపేక్షలేని అంతర్జాతీయ సాంకేతిక స్వచ్ఛంద సంస్థ. 17 ఏళ్ల అనుభవం గల ఈ సంస్థ రూపొందించిన ఏఐ అడ్వయిజరీ ΄్లాట్ఫామ్ ‘ఫార్మర్చాట్’. 4 లక్షల భారతీయ రైతులతో పాటు కెన్యా, నైజీరియా, ఇథియోపియా, బ్రెజిల్లో దాదాపు 10 లక్షల మంది వ్యవసాయదారులు, పశుపోషకులు, విస్తరణ సిబ్బంది, ఎఫ్పీఓలు, స్వయం సహాయక బృందాల సభ్యులు ఇప్పటికే దీని ద్వారా సలహాలు, సూచనలు పొందుతున్నారు. తమ పంటలు, పశువులకు సంబంధించిన ఫొటోలను రైతులు అప్లోడ్ చేసి స్థానిక భాషలో ప్రశ్నలు అడిగితే.. రైతులకు స్థానిక భాషలోనే వాయిస్, టెక్ట్స్ మెసేజ్ల ద్వారా, వారికి అత్యంత అవసరమైన సమయంలో మార్గదర్శనం చెయ్యటం ఈ మొబైల్ యాప్ ప్రత్యేకత. తాజా వాతావరణ స్థితిగతులతో పాటు, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన చర్యలపై ‘ఫార్మర్చాట్’ సమాచారాన్నిస్తోంది. చిన్న, సన్నకారు రైతుల అనుభవాల ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఫార్మర్చాట్’ డిజిటల్ విప్లవపు కొత్త శకానికి నిదర్శనమని డిజిటల్ గ్రీన్ ట్రస్ట్ ఇండియా సీఈఓ నిధి భాసిన్ తెలిపారు. మన దేశంలో 15 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతు కుటుంబాలుంటే వారిలో 58%కి సరైన విస్తరణ సేవలందటం లేదన్నారు. ఈ కొరత తీర్చటానికి కృషి చేస్తున్నామన్నారు. ఫార్మర్చాట్ జెనెరిక్ ఏఐ అవుట్పుట్స్పై యాంత్రికంగా ఆధారపడదని, అనుభవజ్ఞులైన వ్యవసాయ నిపుణుల అనుభవాలపై ఆధారపడి సూచనలు ఇస్తుందన్నారు. సంప్రదాయ విస్తరణ వ్యవస్థలో ఒక్కో రైతుపై 35 డాలర్లు ఖర్చు చేస్తుండగా, తాము కేవలం ఒక డాలర్ ఖర్చుతోనే సేవలందిస్తున్నామన్నారు. ఒక సర్వే ప్రకారం.. 74% మంది రైతులు ఫార్మర్చాట్ సూచనలు చాలా బాగా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. 83%మంది సులువుగా సమాచారం తెలుసుకుంటున్నామన్నారు. 80% మంది సమగ్రంగా ఉన్నాయన్నారు. ఎరువులు, చీడపీడలు, పశుపోషణ సూచనలను 60%మంది రైతులు ఆచరిస్తున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
తరచుగా కళ్లను రుద్దితో..డార్క్ సర్కిల్స్ వస్తాయా..?
నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు. నేను ఉద్యోగం వల్ల రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండాల్సి వస్తోంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్తో పాటు స్వల్పంగా వాపు కూడా వస్తోంది. అలాగే నాకు అలర్జీ సమస్య ఉంది. తరచుగా కళ్లను రుద్దుకుంటూ ఉంటాను.కవిత, విశాఖపట్నంఈ రోజుల్లో కళ్ల కింద డార్క్ సర్కిల్స్, వాపు చాలామందిలో కనిపిస్తున్న సాధారణ సమస్య. ముఖ్యంగా ముప్పై ఏళ్ల తర్వాత జీవనశైలి మార్పులు, పని ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ అంటే ఆ భాగంలో చర్మం రంగు మారడం, నీడలా కనిపించడం లేదా లోతుగా కనిపించడం వల్ల ముఖం అలసినట్టు లేదా వయస్సు ఎక్కువగా ఉన్నట్టు అనిపించడం. ఇవి సాధారణంగా ఒకే ఒక్క కారణం వల్ల కాకుండా అనేక కారణాల కలయిక వల్ల వస్తాయి. మీ విషయంలో రాత్రిళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండటం, సరైన నిద్ర లేకపోవడం, ఒత్తిడి, మొబైల్, ఇతర స్క్రీన్లను ఎక్కువగా ఉపయోగించడం వంటి జీవనశైలి కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అదనంగా అలర్జీ సమస్య ఉండటం, తరచుగా కళ్లను రుద్దుకోవడం కూడా డార్క్ సర్కిల్స్ను పెంచుతాయి. ముక్కు అలర్జీ లేదా సైనస్ సమస్యల వల్ల కళ్ల చుట్టూ రక్తప్రసరణ మారి నీలం లేదా ఊదా రంగులో వలయాలు కనిపించవచ్చు. తరచు రుద్దుకోవడం వల్ల చర్మంలో మెలనిన్ పెరిగి గోధుమరంగు పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. కొందరిలో కుటుంబ చరిత్ర, చర్మం పలుచగా ఉండటం లేదా కళ్లు లోతుగా ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని కొలాజెన్ తగ్గి చర్మం వదులుగా మారుతుంది. దాంతో లోపలి రక్తనాళాలు స్పష్టంగా కనిపించి కళ్ల కింద నీలి ఛాయ పెరుగుతుంది.కళ్ల కింద డార్క్ సర్కిల్స్ అన్నీ ఒకే రకంగా ఉండవు. కొందరిలో గోధుమరంగు పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. కొందరిలో చర్మం పలుచగా ఉండడం వల్ల నీలం లేదా ఊదా రంగు రక్తనాళాలు కనిపిస్తాయి. మరికొందరిలో కంటి కింద లోతు ఉండటం వల్ల నీడలా కనిపిస్తుంది. కొన్నిసార్లు కొవ్వు నిల్వ కావడం వల్ల వాపు లేదా బ్యాగ్స్ రూపంలో కనిపిస్తుంది. చాలా మందిలో ఇవన్నీ కలిసిన రూపం ఉంటుంది. అందుకే సరైన చికిత్స కోసం ముందుగా కొన్ని పరీక్షలు చేయించుకోవటం అవసరం. ఈ పరీక్షల్లో చర్మం రంగు, లోతు, వాపు, అలర్జీ లక్షణాలు వంటి అంశాలను పరిశీలిస్తాం. అవసరమైతే హీమోగ్లోబిన్, ఐరన్, విటమిన్ బి12, థైరాయిడ్ పరీక్షలు కూడా సూచిస్తాం. అయితే, చికిత్స కంటే ముందుగా జీవనశైలిలో మార్పులు చేయటం అవసరం. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. రాత్రిపూట అవసరం లేకుండా మేల్కొని ఉండకూడదు. కళ్లను రుద్దుకోవడం మానుకోవాలి. అలర్జీకి సరైన చికిత్స తీసుకోవాలి. చల్లని కంప్రెషన్ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం, సమతుల్యాహారం తీసుకోవడం వల్ల మంచి మెరుగుదల కనిపిస్తుంది. అయినప్పటికీ సమస్య ఎక్కువగా ఉంటే పరిస్థితిని బట్టి ప్రత్యేక చికిత్సలు సూచిస్తాం. సన్స్క్రీన్, విటమిన్ సి, తక్కువ శక్తి గల రెటినాయిడ్ను రాత్రిపూట వాడటం, కొజిక్ లేదా అజెలాయిక్ ఆమ్లం వంటి పిగ్మెంటేషన్ తగ్గించే క్రీములు ఉపయోగించడం చేస్తాం. అవసరమైన సందర్భాల్లో కెమికల్ పీల్స్ చేస్తాం. లోతు ఎక్కువగా ఉన్నవారిలో హయాలురోనిక్ ఆమ్ల ఫిల్లర్లు లేదా పీఆర్పీ చికిత్స ఉపయోగపడుతుంది. పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటే లేజర్ చికిత్సలు, రక్తనాళాలు స్పష్టంగా ఉంటే ప్రత్యేక లేజర్ విధానాలు, చర్మం వదులుగా ఉంటే చర్మాన్ని గట్టిపరచే చికిత్సలు కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి సమస్యలకు ఇంటి చిట్కాలు మాత్రమే పూర్తిగా సరిపోవు. స్టెరాయిడ్ కలిగిన ఫెయిర్నెస్ క్రీములను తప్పకుండా నివారించాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఒకే ఒక్క వ్యాధి కాదు, అనేక కారణాల సంకేతం. పూర్తిగా మాయం కావడం ప్రతి ఒక్కరికి సాధ్యం కాకపోయినా, సరైన నిర్ధారణతో వ్యక్తిగతంగా అనుకూలమైన చికిత్సను నిపుణుల పర్యవేక్షణలో తీసుకుంటే గణనీయమైన మెరుగుదల కనిపిస్తుంది. డా. ఇందిర పవన్ఎంబీబీఎస్,ఎండీ, సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ (చదవండి: స్మార్ట్ ఫోన్లు వద్దు..ల్యాండ్లైన్ ఫోన్లే ముద్దు..!: పేరెంట్స్) -
చలో హైదరాబాద్
ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ను (ఏఆర్సీఎఫ్) ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మార్చిన అమీర్ రజా ఖాన్ పాకిస్తాన్లో ఉంటూ ఇక్కడ కథ నడిపించాడు. 2005 నుంచి విధ్వంసాలు ప్రారంభించిన ఐఎంలో రియాజ్ భత్కల్ కీలక పాత్ర పోషించాడు. ఇతడికి ఖయాముద్దీన్ కపాడియా కుడిభుజంగా వ్యవహరించాడు. 2008లో అహ్మదాబాద్ పేలుళ్లు తర్వాత ముంబైలో దొరికిన వాహన చోరుల తీగ లాగితే ఢిల్లీలో బాట్లాహౌస్ ఎన్కౌంటర్ డొంక కదిలింది. దీంతో ఐఎం ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభం కావడంతో రియాజ్, కపాడియాలతో పాటు అనేక మంది ఐఎం ఉగ్రవాదులు హైదరాబాద్కు క్యూ కట్టారు. ఎందుకు? ఇక్కడ ఎవరిని కలిశారు?...దేశవ్యాప్తంగా పేలుళ్ల కోసం ఐఎం ఉగ్రవాద సంస్థ చెక్క పెట్టెలతో పడవల మాదిరిగా తయారు చేసిన షేప్డ్ బాంబ్స్ వాడారు. టైమర్ ఆధారంగా పేలే సర్క్యూట్ ఉన్న వీటిలో ఓ ఎలక్ట్రానిక్ మైక్రోచిప్ అత్యంత కీలకంగా పని చేసింది. వీటిని కేరళలోని మలప్పురం నుంచి వచ్చి హైదరాబాద్ శివార్లలోని రాజేంద్రనగర్లో స్థిరపడిన షయనుద్దీన్ అలియాస్ సత్తార్ తయారు చేశాడు. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన ఇతడికి కేరళలో ఉండగానే స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ) ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1995లో కేరళ ముఖ్యమంత్రి ఈకే నయనార్ను హత్య చేయడానికి కుట్రపన్నిన కేసులో అరెస్టు అయ్యాడు. సిమీ ద్వారానే రియాజ్ భత్కల్తో ఇతడికి సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో 2005 నుంచి ఎలక్ట్రానిక్ మైక్రోచిప్స్ తయారీ బాధ్యతల్ని రియాజ్ భత్కల్ ఇతడికి అప్పగించాడు.సత్తార్ అందించిన మైక్రోచిప్స్ను రియాజ్ భత్కల్ గుజరాత్, కర్ణాటక తదితర ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లకు వినియోగిస్తాడు. 2008 జూలైలో అహ్మదాబాద్, సూరత్లను ఐఎం టార్గెట్ చేసింది. ‘ది పూల్ ఆఫ్ ఆల్ టెర్రరిస్టు’ పేరుతో పెద్ద సంఖ్యలో వరుస పేలుళ్లకు పథకం వేస్తుంది. దీనికోసం తయారు చేసే దాదాపు 70 బాంబుల్లో ఉంచాల్సిన మైక్రోచిప్స్ తయారు చేసి ఇవ్వాల్సిందిగా రియాజ్ నుంచి సత్తార్కు ఆదేశాలు అందాయి. అన్నింటినీ తక్కువ సమయంలో తానొక్కడే తయారు చేయలేనని భావించిన సత్తార్... తన భార్య, కుమారులకు విషయం చెప్పకుండా ఈ పని అప్పగించాడు. వారికీ ఈ రంగంలో ప్రవేశం ఉన్నా, పరిపక్వత లేదు. వీరు తయారు చేసిన మైక్రోచిప్స్ను రియాజ్ ఆదేశాల మేరకు మరో ఐఎం ఉగ్రవాది నౌషాద్ వచ్చి తీసుకువెళ్లాడు. అహ్మదాబాద్లో పెట్టిన బాంబుల్లో సత్తార్ తయారు చేసిన చిప్స్, సూరత్ బాంబుల్లో అతడి భార్య, కుమారుడు తయారు చేసిన చిప్స్ వాడారు. ఈ కారణంగానే సూరత్లో ఒక్క బాంబు కూడా పేలకుండా దొరికాయి. బాట్లా హౌస్లో సజీవంగా దొరికిన ఉగ్రవాది ఆరిజ్ ఖాన్ విచారణ తర్వాత వివిధ ఏజెన్సీలు వరుసపెట్టి ఐఎం ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. 2008 అక్టోబరు 3న ఒకేసారి అరెస్టయిన 15 మందిలో సయ్యద్ నౌషాద్ ఒకడు. ఇతడి విచారణలోనే మాస్టర్మైండ్ రియాజ్ భత్కల్, సత్తార్ మధ్య ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తాయి. అదే సమయంలో జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో సత్తార్ సమీప బంధువు రహీంతో పాటు ఫయాజ్, ఫయీజ్ అనే ఉగ్రవాదులు చనిపోయారు. వారిద్దరూ 2008 సెప్టెంబరులో ఉగ్రవాద శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చి, సత్తార్ వద్ద ఆశ్రయం పొందారనే ఆరోపణ ఉంది. నౌషాద్ విచారణలోనే చిప్స్ను రియాజ్ ఆదేశాల మేరకు సత్తార్ తయారు చేసి ఇచ్చినట్లు, తాను హైదరాబాద్ వెళ్లి వాటిని తీసుకువచ్చినట్లు అంగీకరించాడు.ఐఎం మిస్టరీని ఛేదించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు 2008 సెప్టెంబరు, అక్టోబరుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 20 మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ మాడ్యుల్ మొత్తానికీ హైదరాబాద్లోని గోకుల్చాట్లో బాంబు పెట్టిన, జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ భత్కల్ కీలకమని గుర్తించి వేట ప్రారంభించి, 2008 అక్టోబరు 6న ఐఎం మీడియా సెల్ ఇన్చార్జ్ మహ్మద్ మన్సూర్ అస్ఫర్ పీర్భాయ్ను పుణేలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేశారు. ఆ సమయంలో రియాజ్ భత్కల్ అక్కడి ఖాండ్వాలోని డాక్టర్ అన్వర్ అలీ భగ్వాన్ ఫ్లాట్లో ఉన్నాడు. పీర్భాయ్ అరెస్టు సమాచారం అందుకున్న భత్కల్ తన అనుచరుడు ఖయాముద్దీన్ కపాడియాతో కలిసి అక్కడ నుంచి పరారై హైదరాబాద్ వచ్చి సత్తార్ను కలిసి ఆశ్రయం ఇవ్వాలని కోరాడు. అయితే హైదరాబాద్ నగరంలో ఉండటం అంత మంచిది కాదని అతడు చెప్పడంతో కర్ణాటకలోని కర్వార్కు పారిపోయారు. 2009 జనవరిలో తెలంగాణ, కేరళ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో సత్తార్ చిక్కాడు. అక్కడ నుంచి తన సోదరుడు ఇక్బాల్తో పాటు మరికొందరితో కలిసి రియాజ్ భత్కల్ దేశం దాటేశాడు. పాకిస్తాన్ చేరిన వీళ్లు ఐఎస్ఐ రక్షణలో అక్కడి నుంచే అమీర్ రజా ఖాన్తో కలిసి ఇక్కడ మరికొన్ని విధ్వంసాలు చేయించారు. రియాజ్ సమీప బంధువైన యాసీన్ భత్కల్ ఐఎంకు కో–ఫౌండర్గా మారాడు. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్ వద్ద మరికొందరు ఉగ్రవాదులతో కలిసి ఇతడే చేయించాడు. అదే ఏడాది ఆగస్టులో నేపాల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్లో యాసీన్ చిక్కాడు. ఈ కేసులో ఇతడితో పాటు మిగిలిన వారికీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధించింది. దీన్ని తెలంగాణ హైకోర్టు ఖరారు చేసింది. యాసీన్ సహా ఉగ్రవాదులపై ఇతర రాష్ట్రాల్లో నమోదైన కేసుల విచారణ పూర్తి కావడంతో పాటు ఇతర ఫార్మాలిటీస్ పూర్తి అయితే ఇది అమలయ్యే అవకాశం ఉంది. -
బతుకు కోసం కాదు..గుర్తింపు కోసం చేసిన పోరాటం..!
‘నేను జీవించే’ ఉన్నాను.. నమ్మండి..‘దెయ్యాన్ని’ కాదు.. మీలా మనిషినే.. అంటూ ఓ వ్యక్తి ‘తన ఉనికి’ కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు సాగించాడు.. గుర్తింపు కోసం అభ్యర్థించాడు... ఛీత్కారాలు.. చీదరింపులకు గురయ్యాడు. అయినా తన పోరాటం.. ఆపలేదు. కోర్టు మెట్లెక్కాడు.. చివరికి తాను బతికే ఉన్నానని నిరూపించుకున్నాడు. వ్యవస్థలో లోపాల్ని లోకానికి ఎలుగెత్తి చాటాడు.. డబ్బులకు కక్కుర్తిపడి కొంతమంది ఉద్యోగులు బతికున్నోడ్ని ‘కాగితాల్లో’ ఎలా చంపేస్తున్నారో బహిర్గతం చేశాడు.. ఇది బతుకు కోసం చేసిన పోరాటం కాదు. ‘నేను బతికే ’ ఉన్నానని ఓ వ్యక్తి రెండు దశాబ్దాల పాటు సాగించిన ‘గుర్తింపు’ పోరాటం. అతడే లాల్ బిహారి. ఉత్తర్ప్రదేశ్లోని ఖలీలాబాద్కు చెందిన లాల్ బిహారి సన్నకారు రైతు. వారసత్వంగా వచ్చిన అతని భూమిని కొట్టేసేందుకు బంధువులు అతడు చనిపోయినట్టు రికార్డులు సృష్టించారు. అవినీతి అధికారులు వారికి సహకరించారు. డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో బిహారి ‘లీగల్’గా చనిపోయాడు. ఎలా బయటపడిందిఅంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలనుకున్నాడు లాల్ బిహారి. 1976లో తన 22వ ఏట ఓ చిరు వ్యాపారం కోసం బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకున్నాడు. నివాస ధ్రువపత్రం కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. అప్పుడే అతనికి ‘తాను చనిపోయాననే ‘చావు కబురు ’ తెలిసింది. అధికారి చెప్పిన ఆ మాట విని గుడ్లు తేలేశాడు.. భయం.. భయంగాబిహారి ‘చనిపోయాడనే’ వార్త ఊరంతా వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల వారు అతన్నో దెయ్యంలా, బతికే ఉన్నాడా.. అనే అనుమానపు చూపులతో వేధించేవారు. చిన్న పిల్లలు సైతం ఆట పట్టించేవారు. బంధువులు అతన్ని దూరం పెట్టారు. న్యాయ పోరాటం తాను బతికే ఉన్నట్టు నిరూపించుకునేందుకు లాల్ బిహారి ప్రయత్నాలు ప్రారంభించాడు. స్థానిక అధికారిని కలిసి రికార్డులు సరిచేయాలని కోరాడు. తమ తప్పును సరిదిద్దేందుకు వారు ససేమిరా అన్నారు. తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో రికార్డులను సరి చేయాలని, తాను జీవించే ఉన్నానని అధికారికంగా ప్రకటించాలని కోర్టు మెట్లెక్కాడు. కేసు వాయిదాలు పడుతూనే ఉంది. ఏళ్లు గడిచినా ఎటూ తేలకపోవడంతో ఉద్యమ బాట పట్టాడు. అధికారుల తీరుకు నిరసనగా తన పేరు చివరిలో ‘మృతక్’ (చనిపోయిన) అని తగిలించుకున్నాడు. అప్పటి నుంచి ‘లాల్ బిహారి మృతక్’ అని పిలవడం మొదలు పెట్టారు. తాను చనిపోయాను కాబట్టి తన భార్యకు వితంతు పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన సమస్యను వెలుగులోకి తెచ్చేందుకు మాజీ ప్రధానులు రాజీవ్గాంధీ, వీపీ సింగ్లపై ఎన్నికల్లో పోటీకి సైతం దిగాడు. ఇలా అయినా తన ‘బతుకు’ పోరాటం చర్చనీయాంశం అవుతుందని భావించాడు. ‘మృతక్’ సంఘం ఆవిర్భావంఇది తనొక్కడి సమస్యే కాదని, ఉత్తరప్రదేశ్లోని కొంతమంది అవినీతి అధికారుల కారణంగా తనలాంటి అనేకమంది ‘రికార్డుల్లో’ చనిపోయారని అతనికి తెలిసింది. దీంతో ‘మృతక్ సంఘం’(అసోసియేషన్ ఆఫ్ ది డెడ్) ఏర్పాటు చేశాడు. బతికే ఉన్నా, రికార్డుల్లో చనిపోయిన వారి హక్కుల కోసం ఈ సంఘం పోరాటం ప్రారంభించింది. వందలాది మంది ఈ సంఘంలో చేరారు. జాతీయ/అంతర్జాతీయ మీడియా సైతం ఈ వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది. మీడియాలో వార్తలు.. మానవహక్కుల సంఘాల ఆందోళనలు.. ఇలా అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అలుపెరగని అతని పోరాటం చివరికి ఫలించింది. ‘అతడు బతికే ఉన్నాడు’ అని 1994లో ప్రభుత్వం గుర్తించింది. ‘లైవ్’ సర్టిఫికెట్ జారీ చేసింది. కోర్టు తీర్పు కూడా అనుకూలంగా వచ్చింది. ఇది అతనొక్కడి విజయం కాదు, తనలా పోరాటం చేస్తున్న అనేక మందికి ఆ విజయం దక్కింది. అయితే బిహారి తన పోరాటాన్ని ఇంతటితో ముగించలేదు. తనలా నష్టపోయిన వారికి అండగా పోరాటాన్ని కొనసాగించాడు. లాల్ బిహారి కేసు ఓ వ్యక్తి బతుకు పోరాటంగా మాత్రమే మనం చూడకూడదు. సమాజంలో వేళ్లూనుకున్న అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం, కోర్టుల్లో కేసుల సాగదీత.. న్యాయం కోసం ఏళ్లతరబడి ఎదురుచూపులు.. వంటి వైకల్యాల్ని తేటతెల్లం చేస్తోంది. అవమానాలు..అడ్డంకులు, ప్రతికూలతలు ఎదురైనా న్యాయం కోసం ఓ సామాన్యుడు సాగించిన పోరాటం, సాధించిన విజయం బాధితులకు, సమాజానికి స్ఫూర్తిదాయకం.తెరకెక్కిన ‘కాగజ్’లాల్ బిహారి కేసు ఎంతోమందిని ఆకర్షించింది. పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఎంతోమందికి అతని పోరాట గాథను కథలుగా మలిచారు. డాక్యుమెంటరీలు రూపొందించారు. సతీష్ కౌశిక్ అనే బాలీవుడ్ దర్శకుడు ‘కాగజ్’ పేరుతో 2021తో బిహారి పోరాటగాథను వెండి తెరకెక్కించారు. దిలీప్ మాదిరెడ్డి (చదవండి: సామాన్యురాలిలా కనిపించే అసామాన్య 'సువర్ణ'..! ఆమె ఆత్మవిశ్వాసానికి సలాం కొట్టాల్సిందే..) -
కథాకళి: నల్లని వెన్నెల
సన్నగా తెల్లగా ఉండే ఇరవై ఆరేళ్ళ సప్తపర్ణి ఎప్పుడూ తెల్ల నూలు చీరలే కడుతుంది. నల్లటి స్టికర్ బొట్టు పెట్టుకుంటుంది. ఆ రోజు ప్రభంజన్ లంచ్ అవర్లో తన బ్రేకప్ గురించి చెప్పాడు.‘‘బ్రేకప్, నల్లటి వెన్నెల. అవి రెండు రంగులూ కలిసి ఉంటాయి.’’‘‘అవును. మనిద్దరి బ్రేకప్లు ఒకే రోజు జరిగాయి!’’ ఆమె చెప్పింది.‘‘అమ్మ నన్ను పెళ్ళి చేసుకోమని పోరుతోంది. మీ అమ్మ కూడా నిన్ను పోరుతూండచ్చు. కలిసి ప్రయాణించినా, కలిసి ఉన్నా ఓ మనిషి గురించి ఇంకో మనిషి ఎక్కువగా అర్థం చేసుకోగలడు. మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. పాంజిమ్కి వెళ్దాం. అక్కడ ఒకరి ముందు మరొకరం లోదుస్తులని మాత్రం విప్పద్దు.’’ఆమె సరే అనడానికి కొన్ని రోజులు తీసుకుంది.సెలవులు రాగానే ఇద్దరూ ప్రయాణమయ్యారు. మాలాలోని ఏర్ బీఎన్బీకి చేరుకున్నాక, అతని ఐడీని చెక్ చేసి, స్టుడియోని హేండ్ ఓవర్ చేశారు. ఆమె మొహం కడుక్కోగానే పెర్క్లేటర్లో కాఫీ కలిపి ఇచ్చాడు. ఆమె స్నానం చేశాక చెప్పాడు.‘‘కూరగాయలు తెచ్చాను. ఇద్దరం కలిసి వంట చేద్దాం. నేను సాంబార్ మాస్టర్ని.’’సైట్ సీయింగ్ నుంచి తిరిగి వచ్చాక సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశారు. అతను యూట్యూబ్లో రాజేష్ ఖన్నా ఇన్స్ట్రుమెంటల్ మెలోడీస్ పెట్టాడు. ‘ఓ మెరే దిల్ కె చెయిన్’... ‘రూప్ తెరా మస్తానా’...‘‘ఇఫ్ యు డోంట్ మైండ్...’’ కొద్దిసేపాగి చెప్పాడు.ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని ఆమె మెళ్ళోని బంగారు గొలుసుతో ఆడుకోసాగాడు. ఆ ఆడియో అయ్యాక ‘జెంటిల్మేన్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ పెట్టి, ఆమె పొత్తి కడుపుకి తలని ఆనించి, ఆమె నడుం చుట్టూ చేతులు వేసి చెప్పాడు.‘‘బద్ధకపు బ్రహ్మ! నేను పుట్టిన రోజే నువ్వు మా పక్కింట్లో పుడితే, ఇంతకాలం నిన్ను మిస్ అయ్యేవాడిని కానుగా.’’ఇద్దరూ రాత్రి ‘ఎయిటీన్ జూన్’లోని ‘యాంగ్రీ సర్దార్జీ’ హోటల్లో భోజనం చేశారు. తను వంట ఎందుకు నేర్చుకుంది, ఏడాది పెద్దయిన అన్నయ్యతో సమష్టిగా నీవి, నావి అనే తేడా లేకుండా బట్టలు వాడటం... చాలా చెప్పాడు. ఆ రాత్రి ఆపిల్ని నిలువు ముక్కలు కోసి ఆమె నోటికి అందించాడు.‘‘నువ్వు నాకు కావాలి డకీ.’’ మంచం మీద చేరాక చెప్పాడు.అతను కుడిచేతి చూపుడువేలితో ఆమె జుట్టుని, కనుబొమలని, కళ్ళని, చెంపలని, ముక్కుని, చెవుల్ని, చిటికెన వేలుతో చెవుల్లోని భాగాన్ని, గడ్డాన్ని మృదువుగా మిల్లీమీటర్ మిస్ అవకుండా స్పర్శించాక అడిగాడు.‘‘నోరు తెరు.’’ ఆమె తెరిస్తే, వేలితో నాలికని, నాలిక కింద భాగాన్ని, దవడ లోపలి, పై భాగాన్ని స్పర్శించాక, ఆమె చేతుల్ని, చేతివేళ్ళ మధ్య భాగాన్ని, మెడ, నడుము, కాలి వేళ్ళ మధ్యని... అరిపాదాల దాకా స్పర్శిస్తూంటే ఆమె దాన్ని అనుభవించింది. వేలిని తన నాలికతో నాకి చెప్పాడు.‘‘చేదనేదే లేదు. అంతా తీపే. ఓ చోట చక్కెర, ఇంకోచోట తేనే, మరోచోట మకరందం. చిన్నప్పుడు పూలని కోసి కాడని నోట్లో ఉంచుకుని తాగిన మకరందం.’’ఆ రాత్రి సప్తపర్ణి తన బాల్యం గురించి చెప్పింది. ఆమె కాసేపటికి అటు తిరగగానే చెప్పాడు.‘‘ఇటు తిరుగు డకీ. నువ్వు అటువైపు తిరిగితే నాకు దూరమయ్యావు అనిపిస్తోంది.’’ఆమె మళ్ళీ అతనివైపు తిరిగాక, ఆమె నడుము మీద చేతిని, ఆమె కాలు మీద తన కాలుని వేసి, కళ్ళు మూసుకుని చెప్పాడు.‘‘ఇప్పుడు ఎంతో భద్రంగా ఫీల్ అవుతున్నాను.’’ఒకవైపే తిరిగి పడుకోవటం అసౌకర్యంగా ఉండటంతో అతను నిద్రపోయాక, అతని నుదుటి మీద చుంబించి, అవతలివైపుకి తిరిగి పడుకుంది. ‘డకీ’ అంటే ‘ప్రియమైన, ముద్దుల’ అని గూగుల్ చేసి తెలుసుకుంది.‘‘ఇది నీ మొహానికి నప్పుతుంది. బ్లాక్ స్టికర్ బాలేదు.’’ప్రభంజన్ మర్నాడు ఎడమ చేత్తో ఆమె చుబుకం పట్టుకొని, తనతో తెచ్చిన సింగార్ ఎర్ర తిలకం ట్యూబ్లోంచి పుల్లని తీసి, చిన్న పిల్లలు కదలకుండా అటెన్షన్ కోసం ‘ళో, ళో, ళో’ అన్నట్లుగా అంటూ ధనియం గింజంత బొట్టుని దిద్ది జుట్టుని దువ్వాడు.లంచ్లో కేబిన్లో ్రౖఫై డ్ రైస్, మష్రూమ్ కర్రీని ఆమెకి స్పూన్తో తినిపించాడు. ఆమె మనసు తడైంది. తన తాత తర్వాత మొక్కజొన్న గింజలని వొలిచి ఇచ్చింది, జడవేసింది, బొట్టు పెట్టింది, నోటికి తినిపించింది ఇతనే అనుకుంది.ఆ మూడు రోజులు అతను తన స్పర్శని వదలలేకపోవడం గుర్తించింది. ఇంట్లో జుట్టు కొసలని నిమురుతూ, భుజానికి తన తలని ఆనించి, తన నడుం చుట్టూ, లేదా భుజం మీద చేతిని వేసి, బయట చేతిని పట్టుకునే ఉంటాడు.ఆ రాత్రి మెలకువ వచ్చిన ప్రభంజన్ చేత్తో తడిమితే ఆమె ఒళ్ళు తగల్లేదు. కళ్ళు తెరిచి చూస్తే, కాళ్ళు మడిచి, మోకాళ్ళల్లో తల ఉంచుకొని ఏదో ఆలోచించే ఆమె కనిపించింది. అతను నిద్రమత్తులో ఆమె తలని తన ఛాతీ మీదకి జరిపి ‘పడుకో’ అని ఆమె వీపు మీద చిచ్చి కొడుతూ నిద్రపోయాడు.రైలు కాచిగూడ స్టేషన్కి చేరుకోడానికి ముందు సప్తపర్ణి అతనితో చెప్పింది.‘‘ప్రభూ. ఈ మూడు రోజుల్లో నన్ను నేను తెలుసుకున్నాను. ఈ మూడు రోజులూ నీ ప్రేమని అనుభవిస్తూంటే నా మనసు ఉక్కిరిబిక్కిరైంది. నీలో మా తాతని, ప్రేమికుడిని, తల్లి దూరమైపోతుందని భయపడే పిల్లవాడిని చూశాను. నిన్ను కోల్పోతే, తాతని కోల్పోయి నేను అనుభవించిన క్షోభకి ఎన్నో రెట్లు... అది తట్టుకోలేను. సామాన్య ప్రేమని తప్ప నువ్విచ్చిన లాంటి ప్రేమని కోల్పోవడం తట్టుకో... నన్ను నీలా ఎవరూ ప్రేమించలేరు. మనం పెళ్ళి చేసుకోవద్దు.’’అతను ఆమెవైపు విభ్రాంతిగా చూశాడు. ఇద్దరూ ఒకరి కన్నీటిని మరొకరు తుడిచారు. స్టేషన్లోంచి బయటికి వచ్చాక, చెరో ఆటో ఎక్కేముందు ప్రభంజన్ ఆమె చేతిలో ఎర్ర తిలకం ట్యూబ్ని ఉంచాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
అయ్యో... అత్తరికం!
ఉదయం 5 గంటలు.. పేపర్ బాయ్ ప్రతి ఇంటి గుమ్మానికి పేపర్ వేసుకుంటూ సైకిల్ మీద వెళ్తుంటే, మరోపక్క ఒక ఫేమస్ కోచింగ్ సెంటర్ బయట పెద్ద లైన్స్ . ఆ లైన్స్ లో వయసుపైబడిన వందలాది మంది ఆడవాళ్లు.తలపై బట్టలు కట్టుకుని, చేతిలో ఫైళ్లు పట్టుకుని, కళ్లల్లో పిల్లలు పరీక్ష రాసేటప్పుడు ఉండే టెన్షన్స్ తో నిల్చున్నారు! ఆ లైన్స్ మధ్యలో యాభై ఐదేళ్ల ఇన్నోసెంట్ మామ్ టైప్ మహిళ లలిత. మిగతా వాళ్లంతా భయంతో, టెన్షన్స్ తో ఉంటే, ఆమె మాత్రం కూల్గా, ఎగ్జామ్ పేపర్ ముందే తెలిసిన స్టూడెంట్లా కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది. ఆ నవ్వులు చిందిస్తున్న ముఖాన్ని గమనించిన వెనుక నిల్చున్న మహిళ ఓపిక పట్టలేక అడిగింది: ‘‘నువ్వెన్నిసార్లు ఈ ఎగ్జామ్ రాశావు?’’లలిత నవ్వుతూ ‘‘ఇదే ఫస్ట్ టైమ్!’’ అంటే, వెంటనే ఆమె వంకరగా నవ్వుతూ ‘‘ఓహో! అందుకేనా, ఇంత కాన్ఫిడెన్స్.నాకిది పదోసారి!’’లలిత ఆశ్చర్యంగా ‘‘ఏమయ్యింది? ఎందుకు అన్నిసార్లు ఫెయిల్ అయ్యావు?’’అంటే ఆమె ‘‘నా పేరు సూర్యకాంతం.’’లలిత ఒక్కసారిగా ‘‘అయ్యో! అందుకేనా పాస్ కాకుండా ఉన్నావు? నా పేరు లలిత. నేను చాలా మంచి అత్తను అబ్బా! అందుకే నాకు ఇంత కాన్ఫిడెన్స్. పైగా మా మేనకోడలు కూడా నన్ను మెచ్చుకుంది. ఈ కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికెట్ తీసుకుంటే, ఇక పెళ్లికి ఏ అభ్యంతరం లేదని చెప్పింది!’’సూర్యకాంతం బాధగా ‘‘నా పేరు చెప్పగానే, నన్ను ‘గయ్యాళి అత్త’ లిస్ట్లో పెడతారు. వచ్చిన సంబంధాల్లో సగం ఇంటివరకు కూడా రాకుండానే ఆగిపోతుంటాయి. వచ్చినవి కూడా నేను సమాధానం సరిగా చెప్పలేదని పోతున్నాయి.’’లలిత నవ్వుతూ ‘‘ఏం చేస్తాం! ఇంతకాలం పెళ్లి చూపుల్లో అత్తలే ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు కోడళ్ల రాజ్యం కదా! అందుకే కోడళ్లే అత్తలను ప్రశ్నలు అడుగుతున్నారు!’’అది విని సూర్యకాంతం తన గోడు చెప్పుకోవడం మొదలుపెట్టింది. ‘‘ఇప్పుడున్న కోడళ్లు ప్రతి ఒక్కరు పరీక్షలు, షరతులు, రౌండ్స్. ఇలా వచ్చిన సంబంధాలన్నింట్లోనూ నేను ఫెయిల్. అందుకే మా వాడు ఈ ‘ఉత్తమ అత్త ట్రైనింగ్ సెంటర్’లో చేర్పించాడు. ఇక్కడ పెళ్లి చూపుల్లో పాస్ అయ్యేలా ట్రైనింగ్ ఇస్తారట!’’లలిత ‘‘అంటే ఇప్పటివరకు ఎంతమంది కోడళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పావ్?’’సూర్యకాంతం తల పట్టుకుని ‘‘మొదట సైలెంట్ కోడలు. ఆ అమ్మాయికి మాట్లాడటం ఇష్టం లేదు. నన్ను ఐదు నిమిషాలు నోరు మూసుకోమంది. నేను కిచెన్స్ లో మాడు వాసన వచ్చిందని, ‘పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోయావమ్మా?’ అన్నా. అంతే, ఆ సంబంధం క్యాన్సిల్!’’లలిత ‘‘ఆహా! రెండోసారి?’’‘‘రెండోసారి మోడ్రన్స్ కోడలు. ‘నా పుట్టినరోజుకి ఏఐ యానిమేటెడ్ వీడియో చేసి రీల్ పెడతావా?’ అంది. నాకు అవి రాదనగానే ఆ సంబంధం కూడా ఫెయిల్.’’ఇంతలో లైన్ ముందుకు కదిలింది. ఇద్దరూ కూడా నడుస్తూనే మాటలు. సూర్యకాంతం ఎమోషనల్ ఫ్లోలో చెప్తూ.. ‘‘మూడోసారి వచ్చిన కోడలైతే వరుస ప్రశ్నలు:మీకు కొడుకు, కోడలును విడదీసే ప్లాన్స్ ్స ఏమైనా ఉన్నాయా?మీకు కాళ్లు చేతులు బాగానే పనిచేస్తున్నాయా? లేదా కోడలు వచ్చాక మంచాన పడతారా?మీకు చాడీలు చెప్పే అలవాటు ఉందా? మీ కూతురుతో నన్ను కంపేర్ చేస్తారా?నేను సంతోషంగా ఉంటే మీ మూతి వంకరపోతుందా? మీకు పెళ్లి అయిన రెండో నెలలోనే కోడలికి కడుపు రావాలని కోరుకుంటారా? మీ పని మీరు చూసుకుంటారా? లేదా అన్ని పనులూ మీరు చెప్పినట్లే చేయాలని అంటారా? మీ కోడలు బంగారం, కారు లేదా ఖరీదైన వస్తువులు ఏమైనా కొంటే, మీ బీపీ పెరిగిపోతుందా?మీ కూతురుకి పుట్టిన పిల్లలు అబ్దుల్ కలాంలానూ, కోడలికి పుట్టిన పిల్లలు ఆవారాగానూ కావాలనే కోరికలు ఏమైనా ఉన్నాయా? అని వరుస ప్రశ్నలతో నన్ను ఆసుపత్రికి పంపించింది!’’సూర్యకాంతం ఇవన్నీ చెప్తుంటే, లలిత ముఖం చిన్నబోయింది.‘‘ఇన్ని అడుగుతారా?’’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది.సూర్యకాంతం ‘‘ఇంకా ఏం! ఫిజికల్ ఫిట్నెస్ కూడా చెక్ చేస్తారు! అత్తమామలకు షుగర్, బీపీ ఉంటే ముందే రిజెక్ట్ చేస్తారు. నాకు షుగర్ లేదు కానీ బీపీ ఉంది!’’ అనగానే లలిత నవ్వు ఆపుకోలేకపోయింది.వెంటనే, సూర్యకాంతం ‘‘ఇప్పుడు వచ్చిన సంబంధం చాలా బాగుంది. మా వాడు ఎలాగైనా పాస్ అవ్వమ్మా అని రోజూ బతిమాలుతున్నాడు. ఆ సంబంధానికి మూడు రౌండ్ల పరీక్ష మెయిన్స్ ్స, ఇంటర్వ్యూ, ప్రాక్టికల్స్ అంట!’’లలిత ‘‘ఏంటీ ప్రాక్టికల్స్?’’సూర్యకాంతం ‘‘పెళ్లికూతురు రెండు రోజులు మా ఇంటికి వచ్చి నన్ను గమనిస్తుందట!’’పక్కనే మరో మహిళ వచ్చి ‘‘అప్పుడు నువ్వు ఉదయం లేవగానే ‘గుడ్ మార్నింగ్’ అంటూ టీ ఇచ్చేసి మచ్చిక చేసుకో! సెట్టయిపోతుంది!’’ వారిద్దరూ నవ్వుకున్నారు.సూర్యకాంతం మరోసారి విషయానికి వచ్చి ‘‘పాతకాలంలో అత్తలు చేసిన పెత్తనం ఫలితమే ఇదంతా, ఇప్పుడది తిరిగి మనకు శాపంగా మారి కోడళ్ల రాజ్యం వచ్చేలా చేసింది. వాళ్లే బాగుండి ఉంటే మనకు ఈ బాధ ఉండేదే కాదు.’’వెంటనే, వెనుక నిల్చున్న రాధ స్పందిస్తూ, ‘‘అవునమ్మా! మా అత్త నన్ను పెళ్లి చూపుల్లోనే నడవమని చెప్పి, ఇంట్లో పనులకు బాగా పనికి వస్తానా లేదా చెక్ చేసుకుంది! ఇక పెళ్లి తర్వాత అయితే, కూర్చోవడం నుంచి ఎలా నవ్వాలో, ఏడ్వాలో కూడా డైరెక్షన్స్ ఇచ్చేది!’’వెంటనే మరో మహిళ ‘‘ఇక ఏ రోజు అయినా, నేను కాస్త ఆరోగ్యం బాగోలేక మంచం మీద వాలితే చాలు, మా అత్త ఆసుపత్రిలో అడ్మిట్ అవుతుండేది. ‘ఈ కోడల్ని నేనే చూసుకోవాలేమో!’ అన్న భయంతో!’’మళ్లీ మరో మహిళ వాయిస్– ‘‘మా అత్త అయితే, మా ఆడపడుచుతో ఫోన్స్ మాట్లాడేటప్పుడు సిగ్నల్ బాగోలేదంటే నా దగ్గరే అన్స్ లిమిటెడ్ కాల్ రీచార్జ్ చేయించుకునేది!’’సూర్యకాంతం నవ్వుతూ ‘‘అదేమిటి! సీరియల్స్ చూసి స్ట్రాటజీలు నేర్చుకోవడానికి అన్స్ లిమిటెడ్ నెట్, డిష్ రీచార్జ్లు కూడా నీతోనే చేయించుకునేదని మర్చిపోయావా?’’వెంటనే అందరి దగ్గర నవ్వులు ‘‘అవునవునూ’’ అని అందరూ ఒకటేసారి రెచ్చిపోయారు.మరొక మహిళ ‘‘ఇంతకు ముందు అత్తలు కట్నాల కోసం మాత్రమే కష్టపెట్టేవారు. మన అత్తలు కట్నాలతో పాటు కోడళ్ల జీతాలు అడిగితే లోకం మారదూ!’’సూర్యకాంతం కాస్త ఊపిరి వదిలి ‘‘అందుకే పాత అత్తల వేషాలు చూసి అప్పటి కోడళ్లు అమ్మాయిలనే కనేసి ఈ బాధను రివర్స్ చేశారు.’’లలిత ‘‘కాని, ఇప్పుడు కూడా బాధితులం మనమే అయ్యాం కదా!’’సూర్యకాంతం పెదవి తిప్పేస్తూ, ‘‘అవును, కాని, మేం కూడా బాధితులమే. అయినా మేం మా అత్తల్లాగా చేయం. కావాలంటే ఏ వృద్ధాశ్రమంలో అయినా చేరుతాం. కావాలంటే సపరేట్గానైనా ఉంటామని చెప్పినా కూడా ‘పరీక్ష పాస్ అయితేనే పెళ్లి!’ అని పెళ్లికూతుళ్లు, వాళ్ల తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్తున్నారు.’’లలిత ‘‘అంటే అప్పుడు, ఇప్పుడు కూడా కష్టాలు పడాల్సింది మనమేనా?’’సూర్యకాంతం ‘‘అవునమ్మా, నాకు అబ్బాయి పుట్టిన రోజు.. ఎంత ఊపిరి పీల్చుకున్నానో! నాకు కూతురు పుట్టలేదు, హమ్మయ్య అని. పైగా అబ్బాయి పుట్టినందుకు శివయ్యకు వెయ్యి టెంకాయలు కొట్టి, మొక్కు చెల్లించుకున్నా.’’వెంటనే వెనక ఉన్న మరో ఫెమినిస్ట్ బామ్మ యాంగ్రీ బర్డ్ ఫేస్ పెట్టి.. ‘‘అదేంటీ? అమ్మాయి పుట్టకూడదని అనుకున్నావా? ’’ అని కాస్త గట్టిగానే అడిగింది. పాత కాలంలో అత్తలు చేసిన పెత్తనం ఫలితమే ఇదంతా, ఇప్పుడది తిరిగి మనకు శాపంగా మారి కోడళ్ల రాజ్యం వచ్చేలా చేసింది. వాళ్లే బాగుండి ఉంటే మనకు ఈ బాధ ఉండేదే కాదు. అందరూ ఒక క్షణం అయిష్టంగా చూడగా.. సూర్యకాంతం చాలా శాంతంగా ‘‘నువ్వు కాస్త ఆగుతావా.. మొదట మా అత్త వేసే వేషాలు చూసి, నా మాదిరే మా కూతురు కూడా కష్టపడి చదువుకొని, సంపాదించి చివరికి ఇంట్లో ఇలా ప్రతిక్షణం పరీక్షలు రాసుకుంటూ బతకాలి అనిపించి. అలా అనుకున్నానమ్మా!’’ అదంటూనే క్యూలో ఉన్న అత్తలందరూ సేమ్ ఫీలింగ్తో తల ఊపారు.‘‘ఇప్పుడిలా అమ్మాయిల జీవితాలు స్మార్ట్గా, స్వేచ్ఛగా మారి, అబ్బాయిల తల్లులకే ఇలాంటి శిక్షలు వస్తాయని తెలిసుంటే, అప్పుడే ఆ టెంకాయలన్నీ నా తల మీదే కొట్టుకునేదాన్ని!’’అని సూర్యకాంతం ముఖం చిట్లించగానే, మొత్తం క్యూలో నిల్చున్న అత్తలందరూ, ‘సాడ్ ఫేస్’ పెట్టుకున్నారు. అప్పుడే పక్కన ‘‘సమోసాలమ్మా! సమోసాలు!’’ అని ఓ అబ్బాయి అటుగా వెళ్తుంటే, సూర్యకాంతం అతన్ని ఆపి, ‘‘ఓ బాబు, నాలుగు సమోసాలు పెట్టమ్మా. కాస్త కడుపు నింపుకుందాం.’’ అని డబ్బు అతని చేతికి ఇచ్చింది. అతను కూడా ఓ పేపర్లో సమోసాలు ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సూర్యకాంతం ఒకటి గబగబా కొరికేసి, పేపర్ వైపు చూసింది.‘‘అయ్యో! ఇది ఇవాళ్టి పేపరే కదా? అప్పుడే ఉదయం పేపర్, బజ్జీల బండికి వచ్చేసిందా?’’ అని తలపైకెత్తి చూస్తూ, ‘‘ఏంటీ? నా బాధ చెప్పేలోపే సాయంత్రం అయిపోయిందా?’’ అని కోచింగ్ సెంటర్ గేట్ దగ్గరకు పరుగులు తీసింది. ఇంతలో ఒక సెక్యూరిటీ గార్డు క్లోజింగ్ బోర్డ్ గేటుకు తగిలిస్తూ.. ‘‘ఇవాళ్టి అడ్మిషన్స్ అయిపోయాయి! రేపు ఉదయం మళ్లీ ట్రై చేయండి! ’’ అని చెప్పి, సూర్యకాంతం బ్యాచ్ను అక్కడి నుంచి పంపించేశాడు. సూర్యకాంతం మూడు సమోసాలు చేతిలో, నాల్గోది నోట్లో పెట్టుకుని నడుస్తూ ‘‘అమ్మో! ఈ కోచింగ్ సెంటర్ అడ్మిషన్స్ దక్కలేదంటే నా కొడుకు ఎంత ఫీల్ అవుతాడో! పాపం!’’అంటూ కాస్త భయంగా, ఇంకాస్త సంతోషంగా ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరుకున్న వెంటనే, సూర్యకాంతం ఎదుట అప్పటికే ఒక గ్లాస్ ‘ఎమోషనల్ జ్యూస్’ను కళ్లల్లోంచే కార్చేసిన కొడుకు కనిపించాడు. కొడుకు చేతులు జోడించి ‘‘అమ్మా, ప్లీజ్! పెళ్లికూతురి తల్లి సర్టిఫికేట్ తప్పకుండా కావాలంది. లేకపోతే పెళ్లి కాదు!’’ అన్నాక, సూర్యకాంతం ఏం మాట్లాడకుండా, కళ్లతోనే ‘‘రేపు తప్పకుండా సాధిస్తా’’అనే భరోసా ఇచ్చి, నిద్రపోవడానికి గదిలోకి వెళ్లిపోయింది.కోడళ్ల పుట్టింటి ఇష్యూస్ చాలా సెన్సిటివ్.. పుట్టింటిపై అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉంటే, వెంటనే ‘తిరిగి రమ్మని’ చెప్పకూడదు. అమ్మను తిట్టలేక, మరీ మరీ బతిమాలలేక, కొడుకు కూడా గదిలోకి వెళ్లిపోయాడు.తర్వాతి రోజు ఉదయం 5 గంటలు.. ఈసారీ అందరికంటే ముందే సూర్యకాంతంతో పాటు లలిత, రాధ, జానకి, విశాలాక్షి అలా ఆమె మొత్తం ‘అత్తల బ్యాచ్’ క్యూలో ఫస్ట్లోనే నిలబడ్డారు.ఉదయం ఎనిమిది గంటలకు అడ్మిషన్స్ తీసుకుని, తొమ్మిదికల్లా క్లాస్లోకి బ్లాక్బస్టర్ ఎంట్రీ ఇచ్చేశారు!తర్వాత ఫుల్ జోష్తో ఆ ఒక నెల కోర్సు: కోడళ్ల సైకాలజీ,ఫ్యామిలీ రిలేషన్స్ మేనేజ్మెంట్,కోడళ్ల మూడ్ స్వింగ్స్ డీకోడ్ టెక్నాలజీ,అత్తగా నడుచుకోవాల్సిన విధానాలు, అత్త ఎప్పుడెప్పడు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడకూడదు?ఏ పనులు మాత్రమే అత్త చేయాలి, ఏ పనులు అసలు చేయకూడదు! ఇలాంటివన్నీ బాగా నేర్చుకుని, ప్రాక్టీస్ చేసి, చివరికి మొత్తం బ్యాచ్ ‘సర్టిఫైయిడ్ అత్తగార్లుగా’ బయటికి వచ్చేశారు.సరిగ్గా ఒక నెల తర్వాత సూర్యకాంతం ఎగ్జామ్ డే వచ్చేసింది. ఆ రోజు సూర్యకాంతం అలారం పెట్టుకుని, ఉదయం త్వరగా లేచింది. కోచింగ్లో నేర్పించిన పాఠాలన్నీ రివైజ్ చేసి, ‘ముఖ్యమైన ప్రశ్నల’ సమాధానాలను బట్టీకొట్టి రెడీ అయింది. ‘‘పట్టుచీర కట్టుకుంటే, పెళ్లికూతురు ఫీల్ అవుతుందేమో’’ అని అనుకుంటూ, తన ఫేవరెట్, అన్నయ్య కొనిచ్చిన సెంటిమెంట్ చీర కట్టుకుంది. దేవుడికి దండం పెట్టుకుని, ఫ్యామిలీతో కలిసి కొడుకు పెళ్లిచూపులకు బయలుదేరింది. సూర్యకాంతం మాత్రం టెన్షన్స్ తో వణుకుతుండగా, ఆమె కోచింగ్ బ్యాచ్ ఫ్రెండ్స్ సైలెంట్ సపోర్ట్గా పక్కనే కూర్చున్నారు. టేబుల్పై టీ గ్లాసులు, పూలదండలు, కొబ్బరికాయలు ఇలా సంప్రదాయ పెళ్లిచూపుల ఆంబియన్స్తో పెళ్లి సంబంధం వాళ్ల ఇల్లు ఉంది. పక్క గదిలోనే, అమ్మాయితో పాటు, ప్రశ్నపత్రం తీసుకొచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు కూడా సిద్ధంగా కూర్చున్నారు. అమ్మాయి నెమ్మదిగా హాల్లోకి వచ్చి కూర్చుంది.సూర్యకాంతాన్ని చూసి ‘‘మీరు సిద్ధంగా ఉన్నారా?’’ అని అడిగింది. సూర్యకాంతం భయంతో తల ఊపింది.అమ్మాయి చిన్నగా నవ్వుతూ, ఆమె తల్లి చేతిలోని పేపర్ తీసుకుని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది. మొదటి ప్రశ్న: ‘‘ఉదయం మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్లిన తర్వాత, మీరు ఎంతసేపు నాకు ‘తలనొప్పి ఉంది’ అని చెప్పి, గదిలోకి వెళ్లకుండా ఉండగలరు?’’సూర్యకాంతం కంగారు పడుతూ ‘‘చాలాసేపు ప్రయత్నిస్తా!’’ అని చెప్పింది.రెండో ప్రశ్న: ‘‘కోడలు చేసిన చపాతీ రౌండ్గా లేకపోతే ఏం చేస్తారు?’’ సూర్యకాంతం ‘‘వాట్ ఏన్ అమీబా చపాతీ! అనుకుంటూ తినేస్తా!’’ వెంటనే, సూర్యకాంతం ఫ్రెండ్స్ క్లాప్స్ కొట్టి ధైర్యం నింపారు. మూడో ప్రశ్న: ‘‘కోడలు పుట్టింటికి వెళ్తే ఎన్ని రోజులకు మీరు ఫోన్స్ చేస్తారు?’’ ఈ ప్రశ్నకు సూర్యకాంతం చాలాసేపు ఆలోచించింది.ఇది ఒక ట్రికీ ప్రశ్న అని వెంటనే గ్రహించి, కోచింగ్ సెంటర్లో నేర్పిన ‘క్రిటికల్ థింకింగ్ మోడ్’ని యాక్టివేట్ చేసింది.అమ్మాయి ఇంటిని ఒక్కసారి పూర్తిగా గమనించింది. ‘కోడళ్ల పుట్టింటి ఇష్యూస్ చాలా సెన్సిటివ్... పుట్టింటిపై అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉంటే, వెంటనే ‘తిరిగి రమ్మని’ చెప్పకూడదు. ‘అదే పుట్టింటి కంటే అత్తింట్లోనే ఆ అమ్మాయికి బాగుంటే వెంటనే పిలవాలి.’ అని తనలో తాను అనుకుంది. అలా కోచింగ్లో నేర్పినట్లే సిచ్యుయేషన్స్ ను అంచనా వేసి, చాలా తెలివిగా ‘‘ఒక గంటకే ఫోన్స్ చేస్తా. జాగ్రత్తగా చేరావా? అని తెలుసుకుంటా. తర్వాత తీరిక దొరికినప్పుడు నిన్నే తిరిగి కాల్ చేయమని చెప్తా.’’ అని సమాధానం చెప్పింది.అది విన్న వెంటనే సూర్యకాంతం ఫ్రెండ్స్ కళ్లతోనే ‘‘అద్భుతం! టాప్ ఆన్సర్!’’ అని అభినందనలు కురిపించారు.అప్పుడే అమ్మాయి లేచి, అత్తగారిని హత్తుకుంది. అబ్బాయి సగం ఆనందంతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే, అందరూ చప్పట్లతో పెళ్లి గంటలు మోగించారు.సూర్యకాంతం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నానని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నెల తిరగకముందే నిశ్చితార్థం, పెళ్లి, అన్ని పనులూ చకచకా పూర్తి చేసి, వారిద్దరినీ హనీమూన్స్ కి పంపించేసింది. నూతన దంపతులను హనీమూన్స్ కి పంపిన వెంటనే, సూర్యకాంతం కూడా ‘‘నాకు కూడా కాస్త బ్రేక్ కావాలి!’’ అంటూ, తన ఫ్రెండ్స్ అందరితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిపోయింది.అలా దేవుడిని దర్శించుకుంటూ, కొంచెం మానసిక ప్రశాంతత, కొంచెం స్వేచ్ఛ, కొంచెం ఆనందం ఇవన్నీ ఆస్వాదిస్తూ, రెండు నెలల తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంది.ఇంటికి వచ్చిన వెంటనే కోడలు ఆప్యాయంగా పలకరిస్తూ ‘‘అత్తగారూ, ఒక గుడ్ న్యూస్! మీరు వెంటనే ‘ఉత్తమ నాన్నమ్మగా మార్చే కోచింగ్ సెంటర్’లో జాయిన్స్ కావాలి. నేను తల్లి కాబోతున్నా!’’ అని చెప్పగానే, సూర్యకాంతం అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.‘‘అయ్యో దేవుడా! ఇప్పుడే అత్త పరీక్ష పాస్ అయ్యా, ఇప్పుడు మళ్లీ నాన్నమ్మ పరీక్షా?!’’ అని ఏడుస్తూ దేవుడిని ప్రశ్నించింది. ఆమె వెనకనే వచ్చిన కోడలి తల్లి సత్య, సూర్యకాంతాన్ని చూస్తూ, ‘‘నీకు బాగా అయ్యింది!’’ అంటూ పకపకా నవ్వుతూనే ఉంది.ఇంతలో ఒక మహిళ వాయిస్, ‘‘అమ్మాయి సత్యా, సత్యా.. నిద్ర లేయ్! ఎందుకలా నిద్రలోనే నవ్వుకుంటున్నావ్?’’ అని గట్టిగా పిలిచింది.సత్యా ఒక్కసారిగా నిద్రలేచి చూసింది. ఎదురుగా ఆమె అత్తగారు. ఆమె చేతులు నడుముపై పెట్టుకుని ‘‘అమ్మాయి సత్యా! నీకు ఆఫీస్కి టైమ్ అవుతోంది. వెళ్లి త్వరగా నాకు టీ పెట్టి, లంచ్ చేసుకుని, ఆఫీస్కి రెడీ అవ్వు!’’ అంటూ సత్యను కిచెన్ వైపు పంపింది. సత్యా మనసులో ‘‘అయ్యో! ఇదంతా కలా?’’ అనుకుంటూనే, తన స్నేహితురాలు సూర్యకు ఫోన్స్ చేసింది. ‘‘ఓసేయ్ సూర్య! నిన్న నన్ను ‘నీకు ఇద్దరూ ఆడపిల్లలేనా?’ నేను ఎంత అదృష్టవంతురాలినో! నాకు అబ్బాయి పుట్టాడు! అని నన్ను అవమానించావుగా.. ఒక ఇరవై ఏళ్లు ఆగు. ఎవరి అదృష్టం ఏంటో అప్పుడు తెలుస్తుంది!’’ అని చెప్పి ఫోన్స్ కట్ చేసింది.ఫోన్స్ అవతల సూర్యా ఇంకా అయోమయంలో ఉండగా, ఇవతల సత్య మాత్రం శ్రీకృష్ణుడి భార్య సత్యభామ కంటే ఎక్కువ గర్వంతో, చిన్న చిరునవ్వుతో తన రోజును ప్రారంభించింది. -దీపిక కొండి -
నో టెన్షన్... ఓన్లీ అటెన్షన్...
వసంత కాలం రాకతో ప్రకృతిలో కొత్త చిగుళ్లు ఎలా వస్తాయో, విద్యార్థుల జీవితంలో ‘పరీక్షల సీజన్’ కూడా వారి మేధస్సుకు కొత్త రెక్కలు ఇచ్చే సమయం. దురదృష్టవశాత్తు ఈరోజుల్లో ‘పరీక్ష’ అనే పదం వినగానే విద్యార్థుల గుండెల్లో ఒక తెలియని వణుకు, మెదడులో ఒక రకమైన నిశ్శబ్ద యుద్ధం మొదలవుతున్నాయి. కేవలం విద్యార్థులే కాదు, వారి తల్లిదండ్రులు కూడా ఒక రకమైన ఆందోళనలోకి జారిపోతున్నారు. ఇళ్లలో పండుగ వాతావరణం పోయి, ఒక రకమైన ‘యుద్ధ ప్రాతిపదిక’ వాతావరణం మొదలవుతుంది.అసలు పరీక్ష అంటే ఏమిటి? అదంటే ఎందుకంత భయం? అది కేవలం మూడు గంటల పాటు కాగితంపై పెన్నుతో చేసే యుద్ధమా? లేక మన జ్ఞాపకశక్తిని, సహనాన్ని పరీక్షించే కొలమానమా? పరీక్షల్లో విజయం సాధించడమెలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు తెలుసుకుందాం. పరీక్షలంటే ఎందుకు భయం? మన మెదడు పరిణామ క్రమంలో ప్రమాదాల నుండి మనల్ని రక్షించడానికి ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ (పోరాడు లేదా పారిపో) అనే మెకానిజాన్ని అభివృద్ధి చేసుకుంది. పూర్వకాలంలో అడవిలో పులి కనిపిస్తే మెదడులోని ‘అమిగ్డలా’ అనే భాగం అలర్ట్ అయ్యి, ఒంట్లో అడ్రినలిన్, కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లను విడుదల చేసేది. తద్వారా మనం ఆ పులితో పోరాడడమో లేదా అక్కడి నుంచి పారిపోవడమో చేసేవాళ్లం.నేటి కాలంలో విద్యార్థులకు ఆ ‘పులి’ మరేదో కాదు– ‘పరీక్ష’. ప్రశ్నపత్రం చూడగానే లేదా పరీక్ష గురించి ఆలోచించగానే, మెదడు దాన్ని ఒక ప్రాణాపాయ స్థితిగా గుర్తిస్తుంది. అందుకే చేతులు వణకడం, చెమటలు పట్టడం, చదివింది మరచిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే, ఇది మీ అసమర్థత కాదు.. మీ మెదడు మిమ్మల్ని రక్షించడానికి చూపిస్తున్న అతి స్పందన మాత్రమే! ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే సగం భయం పోతుంది.జ్ఞాపకశక్తి వర్సెస్ వ్యక్తిత్వం చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులు చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, పరీక్షల్లో వచ్చే మార్కులను విద్యార్థి తెలివితేటలతో లేదా వ్యక్తిత్వంతో ముడిపెట్టడం.» మీరు ఒక నిర్ణీత సమయంలో ఎంత సమాచారాన్ని గుర్తుంచుకోగలరు? దాన్ని పేపర్ మీద ఎంత స్పష్టంగా ప్రెజెంట్ చేయగలరు? మీ ప్రిపరేషన్ను ఎలా ప్లాన్ చేసుకున్నారు? అనే విషయాలను మాత్రమే పరీక్షలు కొలుస్తాయి.»మీలో ఉన్న సృజనాత్మకత, మీ నాయకత్వ లక్షణాలు, కష్టాల్లో ఉన్నప్పుడు మీరు స్పందించే తీరు, మీ జీవితంలోని అసలైన ప్రతిభను పరీక్షలు ఎప్పటికీ కొలవలేవు.అందుకే మనం మొదట మన మెదడులో ఉన్న ‘పరీక్ష అంటే భయం’ అనే పాత ప్రోగ్రామింగ్ను బ్రేక్ చేయాలి. పరీక్షను ఒక గండంలా కాకుండా, ఒక అవకాశంగా చూడటం అలవాటు చేసుకోవాలి.థామస్ ఆల్వా ఎడిసన్ నుంచి స్టీవ్ జాబ్స్ వరకు ఎందరో మహానుభావులు అకడమిక్ పరీక్షల్లో విఫలమైనవారే! కాని, వారు జీవితం అనే పరీక్షలో నెగ్గారు ఎందుకంటే వారు తమ మెదడును గొప్ప లక్ష్యాల కోసం తీర్చిదిద్దుకున్నారు. ఈ పరీక్షలు కేవలం మీ విద్యా ప్రయాణంలో ఒక చిన్న మలుపు మాత్రమే! ఈ మలుపు దగ్గర ఆగిపోకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడమే అసలైన విజయం.గుర్తున్నది గుర్తున్నట్లుగా రాయాలంటే? చాలామంది విద్యార్థులు రాత్రుళ్లు నిద్ర మానేసి గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చుంటారు. కాని, పరీక్ష హాల్లోకి వెళ్ళగానే అంతా ‘బ్లాంక్’ అయిపోతుంది. దీనికి కారణం మనం చదివే పద్ధతిలో లోపం ఉండటమే. మన మెదడు ఒక లైబ్రరీ వంటిది. అక్కడ పుస్తకాలు (సమాచారం) పేర్చడమే కాదు, అవసరమైనప్పుడు వాటిని వెతికి పట్టుకోవడం కూడా తెలియాలి. జ్ఞాపకశక్తి దేవుడిచ్చిన వరం కాదు, అది ఒక నైపుణ్యం. పైన చెప్పిన మెలకువలు వాడితే సగటు విద్యార్థి కూడా అసాధారణ ఫలితాలను సాధించగలడు. చదవడం అంటే కష్టపడటం కాదు, ‘స్మార్ట్’గా మెదడుకు నచ్చినట్లుగా నేర్చుకోవడం. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా టాపర్స్ వాడే టాప్ టెక్నిక్స్ మీకోసం... 1. స్పేస్డ్ రివిజన్మనం ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్న 24 గంటల్లోనే దానిలో దాదాపు 70శాతం మర్చిపోతాం. జర్మన్ సైకాలజిస్ట్ హెర్మాన్ ఎబ్బింగ్హాస్ దీన్ని‘ఫర్ గెట్టింగ్ కర్వ్’ అన్నారు. దీనికి పరిష్కారం ఒకే రోజు ఒక విషయాన్ని పదిసార్లు చదవడం కంటే, నిర్ణీత కాలవ్యవధుల్లో దాన్ని రివిజన్ చేయాలి. ఈరోజు ఒక టాపిక్ చదివితే, దాన్ని రేపు ఒకసారి, వారం తర్వాత ఒకసారి, నెల తర్వాత ఒకసారి రివైజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల సమాచారం మీ షార్ట్ టెర్మ్ మెమరీ నుంచి లాంగ్ టెర్మ్ మెమరీలోకి మారుతుంది. ఇది మీ మెదడులో శాశ్వతంగా నిలిచిపోతుంది.2. యాక్టివ్ రీకాల్చాలామంది విద్యార్థులు చేసే అతిపెద్ద తప్పు ‘పాసివ్ రీడింగ్’. అంటే పుస్తకం ముందు పెట్టుకుని పదే పదే చదువుతూ వెళ్లడం. ఇది మనకు ‘అన్నీ తెలుసు’ అనే భ్రమను కలిగిస్తుంది. ఒక పేజీ చదివిన తర్వాత పుస్తకాన్ని మూసేయండి. ‘ఇప్పుడే నేను ఏం చదివాను?’ అని మీకు మీరు ప్రశ్నించుకోండి. కళ్లు మూసుకుని ఆ సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. సమాచారాన్ని మెదడులోకి పంపడం కంటే, మెదడు నుంచి బయటకు తీయడానికి ప్రయత్నించినప్పుడే న్యూరాన్ల మధ్య సంబంధాలు బలపడతాయి. పరీక్షలో మనం చేసేది ఇదే.. కాబట్టి ఇంట్లోనే ఆ ‘ప్రాక్టీస్’ చేయాలి.3. ఫైన్మాన్ టెక్నిక్నోబెల్ విజేత రిచర్డ్ ఫైన్మాన్ అభివృద్ధి చేసిన ఈ టెక్నిక్, ఒక విషయం మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి బెస్ట్ టూల్. మీరు ఒక క్లిష్టమైన టాపిక్ నేర్చుకున్నప్పుడు, దాన్ని ఒక పదేళ్ల పిల్లాడికి వివరిస్తున్నట్లుగా ఊహించుకోండి. మనం ఇతరులకు వివరించాలి అనుకున్నప్పుడు క్లిష్టమైన పదాలను వాడలేము. సరళమైన ఉదాహరణల కోసం వెతుకుతాము. ఆ క్రమంలో మనకు ఎక్కడైతే వివరించడం రాదో, అక్కడ మనకు ‘సబ్జెక్ట్ గ్యాప్’ ఉందని అర్థమవుతుంది. ఆ గ్యాప్స్ను మళ్ళీ చదివి భర్తీ చేసుకోవాలి. మీకు ఒక విషయం సరళంగా వివరించడం రాకపోతే, మీకు ఆ విషయం సరిగ్గా అర్థం కాలేదని అర్థం.4. నిమోనిక్స్–విజువలైజేషన్మన మెదడుకు అక్షరాల కంటే ‘బొమ్మలు’, ‘కథలు’, ‘రంగులు’ అంటే ఎక్కువ ఇష్టం.» ఇంద్రధనుస్సులోని రంగులను గుర్తుంచుకోవడానికి ’VIBGYOR’ అనే పదాన్ని వాడతాం. ఇలా కీవర్డ్స్తో నిమోనిక్స్ తయారు చేసుకోండి.» మీ ఇంట్లోని గదులను గుర్తు తెచ్చుకుని, ఒక్కో గదిలో ఒక్కో ఇంపార్టెంట్ పాయింట్ను ‘పెట్టినట్లు’ ఊహించుకోండి (మెమరీ ప్యాలెస్) పరీక్షలో ఆ గదిని తలచుకోగానే ఆ పాయింట్ గుర్తొస్తుంది.5. పోమోడోరో టెక్నిక్ మెదడు ఏకాగ్రత సుమారు 25 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అది అలసిపోతుంది. అందుకే, 25 నిమిషాలు పూర్తి ఏకాగ్రతతో చదవండి. ఆ తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్లో ఫోన్ చూడకూడదు! కేవలం నీళ్లు తాగడం లేదా చిన్నపాటి నడక చేయాలి. 4 సైకిల్స్ తర్వాత 15–20 నిమిషాల పెద్ద బ్రేక్ తీసుకోండి. ఇది మీ మెదడును మళ్ళీ రీచార్జ్ చేస్తుంది.6. ‘క్యూ3ఆర్’ మెథడ్ ఇది ఒక టెక్స్ట్ బుక్ చదవడానికి అత్యుత్తమ పద్ధతి.సర్వే: ముందుగా లెసన్ హెడ్డింగ్స్, బొమ్మలు, హైలైట్ చేసిన పదాలను చూడండి.క్వశ్చన్: ఆ లెసన్ నుండి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? అని ప్రశ్నలు వేసుకోండి.రీడ్: ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ చదవండి.రిసైట్: చదివింది గట్టిగా లేదా మనసులో నెమరువేసుకోండి.రివ్యూ: చివరగా ఒకసారి అంతా రివైజ్ చేయండి.ఎగ్జామ్ డే స్ట్రాటజీ: ఫైనల్ టచ్క్రికెట్లో బ్యాటర్ నెట్స్లో ఎంత ప్రాక్టీస్ చేసినా, మైదానంలో ఆ బంతిని ఎలా ఎదుర్కొంటాడనేదే ముఖ్యం. అలాగే, మీరు నెలల తరబడి పడ్డ కష్టం, మీ మెదడులో నిక్షిప్తమైన వేల పేజీల సమాచారం మూడు గంటల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటాయి. పరీక్ష రోజున మీ మెదడును మీరు ఎలా ‘హ్యాండిల్’ చేస్తారనేదే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. దీనిని సైకాలజీలో ‘పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్’ అంటారు.పరీక్షకు ముందు రాత్రి: ప్లాన్ ‘అ’చాలామంది విద్యార్థులు పరీక్షకు ముందు రాత్రి ‘అవుట్ ఆఫ్ సిలబస్’లాగా రాత్రంతా మేల్కొని చదువుతుంటారు. ఇది అతిపెద్ద పొరపాటు.మెదడును చల్లబరచండి: పరీక్షకు ముందు రాత్రి తొమ్మిది గంటలకల్లా పుస్తకాలు మూసేయండి. కొత్త విషయాలు అస్సలు ముట్టుకోవద్దు. ఆ సమయంలో కొత్తవి చదివితే మెదడులో ‘కాగ్నిటివ్ ఓవర్లోడ్’ జరిగి, పాతవి కూడా కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది.వస్తువుల సిద్ధం: హాల్ టికెట్, పెన్నులు, పెన్సిల్స్ అన్నీ ముందురోజే ఒక బ్యాగులో పెట్టుకోండి. ఉదయాన్నే వాటి కోసం వెతుక్కోవడం వల్ల కలిగే ఒత్తిడి మీ జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుంది.పరీక్ష రోజు ఉదయం: పాజిటివ్ వైబ్రేషన్స్లైట్ ఫుడ్: ఖాళీ కడుపుతో వెళ్లొద్దు, అలాగని భారీగా తినొద్దు. పండ్లు లేదా ఇడ్లీ లాంటి తేలికపాటి ఆహారం తీసుకోండి. మెదడుకు శక్తి కావాలి, కాని, అది జీర్ణం కావడానికి ఎక్కువ రక్తం కడుపుకు వెళ్తే, మెదడు మొద్దుబారుతుంది.ఆందోళన కలిగించే మిత్రులకు దూరం: పరీక్ష సెంటర్ దగ్గర ‘ఈ క్వశ్చన్ చదివావా? అది చాలా ఇంపార్టెంట్ అంట కదా!’ అని భయపెట్టే స్నేహితులతో చర్చలు వద్దు. అది మీలో ‘యాంగ్జయిటీ స్పైక్’ కలిగిస్తుంది. మీకు మీరే ‘నేను సిద్ధంగా ఉన్నాను‘ అని చెప్పుకోండి.పరీక్ష హాలులో: ఆ మూడు గంటల మంత్రం1. మొదటి 15 నిమిషాలు ‘ది స్కాన్’:ప్రశ్నపత్రం చేతికి రాగానే కంగారు పడకండి. న్యూరోసై¯న్స్ ప్రకారం, ప్రశ్నలు చదువుతున్నప్పుడు మీ మెదడు లోపల సమాచారాన్ని వెతకడం మొదలుపెడుతుంది.పేపర్ మొత్తం ఒకసారి స్కాన్ చేయండి. మీకు బాగా తెలిసిన సమాధానాలను ముందుగా గుర్తించండి. ఇది మీ మెదడులో ‘డోపమైన్’ విడుదల చేసి, భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.2. అమిగ్డలా హైజాక్ – బ్రెయిన్ ఫ్రీజ్ అయితే?:ఒక్కోసారి కష్టమైన ప్రశ్న చూడగానే మైండ్ బ్లాంక్ అవుతుంది. దీనిని ‘బ్రెయిన్ ఫ్రీజ్’ అంటారు.అలా జరిగినప్పుడు, పెన్ను కింద పెట్టి, వెనక్కి ఆనుకుని కూర్చోండి. ఒక 30 సెకన్ల పాటు లోతైన శ్వాస తీసుకోండి. మీ శరీరానికి ఆక్సిజన్ అందగానే, భయం వల్ల ఆగిపోయిన మీ ‘ప్రీఫ్రంటల్ కార్టెక్స్’ (ఆలోచించే భాగం) తిరిగి పనిచేయడం మొదలుపెడుతుంది.3. ది త్రీ అండ్ పాస్ మెథడ్ఫస్ట్ పాస్: అతి సులభమైన, మీకు 100శాతం తెలిసిన సమాధానాలు రాసేయండి.సెకండ్ పాస్: కొంచెం ఆలోచిస్తే వచ్చే సమాధానాలపై దృష్టి పెట్టండి.థర్డ్ పాస్: చివరగా కష్టమైన, అసలు తెలియని ప్రశ్నలను లాజిక్తో రాయడానికి ప్రయత్నించండి.ప్రజెంటేషన్: ది సైకాలజీ ఆఫ్ ఇంప్రెషన్ ఎగ్జామినర్ మీ పేపర్ దిద్దేటప్పుడు వారి మనసును మీరు గెలవాలి. సమాధానాల మధ్య గ్యాప్ వదలండి. ముఖ్యమైన పదాలను అండర్లైన్ చేయండి. బొమ్మలు, ఫ్లో చార్ట్స్ వేయండి. ఎగ్జామినర్కు మీ సమాధానం ఎంత సులభంగా అర్థమైతే, వారు అన్ని ఎక్కువ మార్కులు వేసే అవకాశం ఉంటుంది. దీనినే సైకాలజీలో ‘హాలో ఎఫెక్ట్’ అంటారు.సమయ పాలన...ప్రతి సెక్షన్కు ఎంత సమయం కేటాయించాలో ముందే ప్లాన్ చేసుకోండి. ఒకే ప్రశ్న దగ్గర ఆగిపోవద్దు. వాచ్ చూసుకుంటూ, చివరి 15 నిమిషాలు కేవలం తప్పులు సరిచూసుకోవడానికి కేటాయించండి.పరీక్ష అయిపోయిన తర్వాత..ఒక పరీక్ష అయిపోగానే దాని గురించి పోస్ట్ మార్టం వద్దు. ‘ఆ ప్రశ్న తప్పు రాశాను’ అని బాధపడటం వల్ల తదుపరి పరీక్షపై ప్రభావం పడుతుంది. ‘గతం గతః’. మీ దృష్టి మరుసటి రోజు జరగబోయే యుద్ధంపైనే ఉండాలి.మీ లెగసీకి మీరే సృష్టికర్తలుడియర్ స్టూడెంట్స్, మీరు కేవలం ఒక రోల్ నంబర్ కాదు. మీరు ఒక అద్భుతమైన మేధస్సు కలిగిన వ్యక్తులు. పరీక్ష అనేది కేవలం మార్కుల కోసం కాదు, మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం కోసం. ఈ పరీక్షలు మీ క్రమశిక్షణను, మీ పట్టుదలను నిరూపించుకోవడానికి ఒక వేదిక మాత్రమే! నేడు మీరు పడుతున్న కష్టం, రేపు మీరు నిర్మించబోయే సామ్రాజ్యానికి పునాది. కాబట్టి ఆందోళనను వదిలేయండి, ప్లానింగ్ను నమ్మండి. మీ మెదడును మీరు సరైన విధంగా డిజైన్ చేసుకుంటే, ఏ పరీక్షా మీకు అసాధ్యం కాదు.2 నిమిషాల్లో ప్రశాంతత!ఒత్తిడి శత్రువు కాదు, అది మీ శరీరం మిమ్మల్ని సిద్ధం చేస్తున్న తీరు మాత్రమే! దాన్ని భయంగా కాకుండా, ఒక ‘ఎనర్జీ’గా భావించండి! పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం చూడగానే మైండ్ బ్లాక్ అయినా లేదా చదివేటప్పుడు విపరీతమైన ఆందోళన కలిగినా ఈ పద్ధతులను పాటించండి:బాక్స్ బ్రీతింగ్ఇది మన నాడీ వ్యవస్థను వెంటనే శాంతపరుస్తుంది. నాలుగు సెకన్లు నెమ్మదిగా ముక్కుతో గాలి పీల్చుకోండి. నాలుగు సెకన్లు గాలిని లోపలే పట్టి ఉంచండి. 4 సెకన్లు నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదలండి. నాలుగు సెకన్లు గాలి పీల్చకుండా ఖాళీగా ఉండండి. ఇలా 3–4 సార్లు చేస్తే మెదడుకు ఆక్సిజన్ అంది, ఆందోళన మాయమవుతుంది.ఇన్స్టంట్ మజిల్ రిలాక్సేషన్మీ అరచేతులను గట్టిగా ముడిచి, భుజాలను పైకి బిగబట్టండి. ఐదు సెకన్ల పాటు అలాగే ఉంచి, ఒక్కసారిగా వదిలేయండి. మీ ఒంట్లోని నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ ఒత్తిడితో పాటే బయటకు పోయినట్లు అనిపిస్తుంది.గ్రౌండింగ్ టెక్నిక్ మీ ఆలోచనలు భవిష్యత్తు గురించి భయపడుతున్నప్పుడు, మీ మనస్సును ప్రస్తుత క్షణంలోకి తీసుకురావడానికి ఇది బెస్ట్ మెథడ్. కళ్ళు తెరిచి మీ చుట్టూ ఉన్న ఐదు వస్తువులను చూడండి. నాలుగు వస్తువులను తాకండి. మూడు రకాల శబ్దాలను వినండి. రెండు రకాల వాసనలను పీల్చండి. ఒక మంచి విషయాన్ని తలచుకోండి.పాజిటివ్ అఫర్మేషన్కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకుంటూ, మనసులో ‘నేను ప్రశాంతంగా ఉన్నాను. నేను దీన్ని చేయగలను’ అని మూడుసార్లు చెప్పుకోండి. ఇది మీ సబ్–కాన్షియస్ మైండ్కు ధైర్యాన్ని ఇస్తుంది.పిల్లల విజయంలో పేరెంట్స్దే ప్రధాన పాత్ర!పరీక్షల సీజన్ రాగానే ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. టీవీలు ఆగిపోతాయి, శుభకార్యాలకు వెళ్లడం మానేస్తారు, అంతా ఒక రకమైన ‘కర్ఫ్యూ’ వాతావరణం నెలకొంటుంది. పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. తల్లిదండ్రులు సృష్టించే ఈ అతి జాగ్రత్తే పిల్లల్లో తెలియని ఒత్తిడిని పెంచుతుంది. అందుకే పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఒక వార్డెన్లా కాకుండా ఒక కోచ్లా వ్యవహరించాలి. ఈ కష్ట సమయంలో మీరు వారికి ఇచ్చే మద్దతు, ప్రేమ వారి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. వారి మీద నమ్మకం ఉంచండి, వారు అద్భుతాలు సృష్టిస్తారు.పోలిక అనే విషం: చాలామంది తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పు – తమ పిల్లలను పక్కింటి పిల్లలతోనో లేదా బంధువుల పిల్లలతోనో పోల్చడం. మీరు పోల్చిన ప్రతిసారీ పిల్లల సెల్ఫ్–ఎస్టీమ్ దెబ్బతింటుంది. ‘మా నాన్నకు నాకంటే నా మార్కుల మీదనే ప్రేమ ఎక్కువ’ అనే భావన వారిలో కలుగుతుంది. దీనివల్ల వారి మెదడులో అమిగ్డాలా యాక్టివేట్ అయ్యి, చదువు మీద ఆసక్తి తగ్గుతుంది.గుర్తుంచుకోండి, ప్రతి బిడ్డ ఒక ప్రత్యేకమైన ‘జీనియస్’. ఒక చేపను చెట్టు ఎక్కలేదని తిడితే అది జీవితాంతం తనను తాను తక్కువ చేసుకుంటుంది. మీ పిల్లల ఎదుగుదలను వారి నిన్నటి పర్ఫార్మెన్స్తో మాత్రమే పోల్చండి.సేఫ్ స్పేస్: పిల్లలు పరీక్షల గురించి భయపడుతున్నప్పుడు వారికి కావాల్సింది ఉపన్యాసాలు కాదు, ఒక భరోసా. ‘నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం’, ‘పరీక్ష పోతే జీవితం అయిపోదు, మేము నీకు తోడున్నాం’ అనే మాటలు పిల్లల మెదడులో భయాన్ని పోగొట్టి, వారిని మరింత ఏకాగ్రతతో చదివేలా చేస్తాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. తల్లిదండ్రులు టీవీలు, ఫోన్లకు దూరంగా ఉండి పిల్లలకు చదువుకునే వాతావరణం కల్పించాలి.వినడం నేర్చుకోండి: చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటం అంటే లెక్చర్ ఇవ్వడం అనుకుంటారు. పిల్లవాడు ‘నాకు ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉంది’ అన్నప్పుడు, ‘నువ్వు సరిగ్గా చదవట్లేదు’ అని అనకుండా, ‘అవునా, ఏ పార్ట్ కష్టంగా ఉంది? మనం ఎవరినైనా అడుగుదామా?’ అని అడగండి. వారి బాధను మీరు అర్థం చేసుకుంటున్నారని తెలిస్తే, వారి సగం ఒత్తిడి తగ్గిపోతుంది.ప్రాసెస్ మీద దృష్టి పెట్టండి: ‘నీకు 95% రావాలి’ అని టార్గెట్లు పెట్టకండి. దానికి బదులుగా ‘ఈరోజు నువ్వు అనుకున్న షెడ్యూల్ పూర్తి చేశావా?’ అని అడగండి. ఫలితం మన చేతుల్లో లేదు కాని, ప్రయత్నం మన చేతుల్లో ఉంది. ప్రక్రియ సరిగ్గా ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది.ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మద్దతు: పరీక్షల సమయంలో పిల్లల ఆహారం, నిద్ర విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. మెదడు చురుగ్గా ఉండటానికి కావాల్సిన పండ్లు, నట్స్, మరియు తగినంత నీరు అందిస్తూ ఉండాలి. రాత్రంతా మేల్కొని చదవమని ఒత్తిడి చేయకండి. ఏడు గంటల నిద్ర ఉంటేనే వారు పరీక్షలో చదివింది రాయగలరని గుర్తుంచుకోండి.మెదడుకు శక్తినిచ్చే ఇంధనం! మన మెదడు మన శరీర బరువులో కేవలం రెండు శాతంమాత్రమే ఉంటుంది, కాని, మనం తీసుకునే శక్తిలో 20 శాతం మెదడుకే అవసరం. పరీక్షల సమయంలో విద్యార్థులు చేసే అతిపెద్ద తప్పు – చదువు మీద పెట్టిన దృష్టిని శరీరం మీద పెట్టకపోవడం. మీ మెదడు ఒక రేసింగ్ కార్ అనుకుంటే, దానికి సరైన పెట్రోల్, టైర్ల మెయింటెనెన్స్ ఎంత అవసరమో, పరీక్షల సమయంలో విద్యార్థికి ‘బయోలాజికల్ సపోర్ట్’ కూడా అంతే ముఖ్యం.నిద్ర: మెమరీ సేవర్ చాలామంది విద్యార్థులు రాత్రంతా మేల్కొని చదువుతారు. కాని, సైన్స్ ఏం చెబుతుందంటే.. మీరు పగలు చదివిన విషయాలన్నీ నిద్రలోనే మెదడులో స్థిరపడతాయి. మనం నిద్రపోతున్నప్పుడు మెదడులోని హిప్పోకాంపస్ సమాచారాన్ని క్రమబద్ధీకరిస్తుంది. నిద్ర తక్కువైతే, మీరు ఎంత చదివినా అది ‘షార్ట్ టర్మ్ మెమరీ’లోనే ఉండిపోయి, పరీక్ష సమయంలో గుర్తుకు రాదు.పరీక్షల సమయంలో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్రకు ముందు ఫోన్ చూడటం మానేయాలి, ఎందుకంటే ఆ బ్లూలైట్ నిద్రను దూరం చేస్తుంది.హైడ్రేషన్–డైట్ మెదడులో 75 శాతంనీరు ఉంటుంది. కేవలం రెండు శాతం నీరు తగ్గినా మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. ప్రతి గంటకు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల మెదడు అలసిపోకుండా ఉంటుంది.ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే బాదం, వాల్నట్స్, గుడ్లు, తాజా ఆకుకూరలు మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, జంక్ ఫుడ్ తినకండి. ఇవి ‘షుగర్ క్రాష్’ కలిగించి మిమ్మల్ని నిద్రపోయేలా చేస్తాయి.వ్యాయామం: మెదడుకు ఆక్సిజన్ పరీక్షల సమయంలో వ్యాయామం అంటే సమయం వృథా అనుకుంటారు. కాని, అది తప్పు. మీరు ఒక 15–20 నిమిషాలు వేగంగా నడిచినా లేదా వ్యాయామం చేసినా మెదడులో ‘బీడీఎన్ఎఫ్’ (బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోపతిక్ ఫ్యాక్టర్) అనే ప్రోటీన్ విడుదలవుతుంది. ఇది మెదడు కణాలను రిపేర్ చేసి, కొత్త విషయాలను వేగంగా నేర్చుకునేలా చేస్తుంది. అందుకే చదువు మధ్యలో ‘బ్రేక్’ తీసుకున్నప్పుడు ఫోన్ చూడకుండా, కాసేపు డాబా మీద నడవండి లేదా చిన్నపాటి స్ట్రెచింగ్ చేయండి. -
వెదురు సందడి
ప్రకృతి ఒడిలో, ఎత్తయిన కొండల మధ్య ఉన్న మిజోరంలో మార్చి నెల వచ్చిందంటే చాలు సరికొత్త సందడి మొదలవుతుంది. విలక్షణమైన సంస్కృతికి పేరుగాంచిన మిజోరాం లోయల నిండా వెదురు గడల సంగీతం ప్రతిధ్వనిస్తుంది. ఆ ధ్వనులకు తగ్గట్టుగా సంప్రదాయ దుస్తులతో నృత్యం చేసే యువతీ యువకులతో మిజో కొండలు సరికొత్తగా మెరుస్తాయి. కష్టాన్ని వేడుకగా మార్చుకుంటూ ప్రాచీన సంప్రదాయాలను లోకానికి చాటిచెప్పే వేడుకే ఈ చాప్చార్ కూట్. ఇది ఒక పండగ మాత్రమే కాదు, మిజో ప్రజల ఐక్యతకు, వారి అస్తిత్వానికి సజీవ సాక్ష్యం. మిజో భాషలో చాప్ అంటే నరికిన చెట్లు, చార్ అంటే ఎండబెట్టడం, కూట్ అంటే పండుగ అని అర్థం. గతంలో మిజోరాంలో పోడు వ్యవసాయం ఎక్కువగా చేసేవారు. ఇందుకోసం చెట్లను నరికి అడవిని శుభ్రం చేసేవారు. నరికిన చెట్లు ఎండేందుకు కొంత సమయం పడుతుంది. ఖాళీ సమయంలో గతంలో పడిన కష్టాన్ని మరచిపోయేందుకు, ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పేందుకు చాప్చార్ కూట్ను జరుపుకునేవారు. కాలక్రమేణా ఏడు రోజులు పండుగ మారింది. ఈ ఏడాది మార్చి 6న ఇది ప్రారంభమవుతుంది.ఈ చాప్చార్ కుట్లో చెరావ్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించిన యువతీ యువకులు వెదురు గడల లయబద్ధమైన శబ్దాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేస్తుంటారు. వెదురు గడల మధ్య చిక్కుకోకుండా అత్యంత నైపుణ్యంతో చేసే ఈ వెదురు డ్యాన్స్ చూసేందుకు కనువిందుగా ఉంటుంది. ఈ నృత్యం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యం మిజో ప్రజల ఐక్యత, క్రమశిక్షణ, ఏకాగ్రతకు నిదర్శనంగా నిలుస్తుంది. చెరావ్తో పాటుగా ఖుల్లం, చై వంటి ఇతర జానపద నృత్యాలు కూడా ఈ పండగలో ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి చాప్చార్ కూట్లో పాల్గొంటారు. పండగ సమయంలో గ్రామాల్లో ప్రజలు సంప్రదాయ దుస్తులైన పువాన్ ధరించి ఈ వేడుకల్లో భాగమవుతారు. అందరూ ఒక చోట చేరి భోజనాలు చేస్తారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జానపద పాటలు పాడుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఈ పండగతో ప్రజలు తమ విలువలు, ఆచారాలు, సంప్రదాయాలను తర్వాతి తరానికి అందిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోడు వ్యవసాయం తగ్గినా చాప్చార్ కూట్ జోరు తగ్గలేదు. చాప్చార్ కూట్ వేడుకతో మిజోరాం ప్రజలు తమ సంస్కృతిని, ప్రత్యేకతలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ వేడుకలో మిజో ప్రజల కళలు, హస్తకళలు, స్థానిక వంటలు ప్రధానపాత్ర పోషిస్తాయి. వెదురుతో వివిధ రకాల డిజైన్ లలో అల్లిన బుట్టలు, టోపీలతో స్థానిక ప్రజలు తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు. పండగ సమయంలో వెదురు మొలకలు, గుమ్మడి ఆకులతో సంప్రదాయ వంటకాలతో విందులు చేసుకుంటారు. శాంతి, ప్రేమ, సోదరభావాన్ని పెంచే ఈ పండగ మిజోరం పర్యాటక రంగానికి మణిహారంగా నిలుస్తోంది. -
పెంపకం పెద్ద పజిల్
ఈ తరం తల్లిదండ్రులకు పిల్లల పెంపకం పెద్ద పజిల్ సౌకర్యాలు అమర్చిపెడితేనే సరిగ్గా పెరుగుతారు అనుకునే రకం స్క్రీన్లకు అడిక్ట్ అవుతున్నారని ఓ వైపు గగ్గోలు పెడుతూనే నాలుగు గోడల గదులకే బాల్యాన్ని అంకితం చేస్తుంటారు. ఆట పాటలంటే ఇప్పుడో ఖరీదైన వ్యవస్థ. హాయిగా నవ్వుకోవడం అంటే అదో అందని ద్రాక్ష. విశాలంగా పెరగని బాల్యం ఏమాత్రం వికసించదు అంటున్నారు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, ఆయన అర్ధాంగి అనుగీత. వీరి కుమారుడు ప్రణీత్ యండమూరి వరల్డ్ బ్యాంకులో ఆరు ఆసియా దేశాలకు ప్రతినిధిగా ఉన్నతోద్యోగంలో ఉన్నాడు. రచనా వ్యాసంగంలో బిజీగా ఉండే ఈ రచయితను సక్సెస్ఫుల్ పేరెంటింగ్ గురించి అడిగినప్పడు చెప్పిన ‘సింగిల్ బెడ్–రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్–రూమ్’ కాన్సెప్ట్ను పంచుకున్నారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే...‘‘పిల్లల ప్రతిభ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది జీన్స్, రెండోది పెంపకం. వంశపారంపర్యంగా వచ్చే జీన్స్ విషయంలో మనమేమీ చేయలేం కాని, పెంపకం మాత్రం మన చేతుల్లోనే ఉన్నది. పిల్లలు నాలుగు స్టేజిల్లో పెరుగుతారు. రెండో స్టేజ్లో ఉన్న ఆత్మన్యూనతా భావం, స్నేహితుల ప్రభావం వల్ల మూడో స్టేజీలో సుపీరియారిటీ కాంప్లెక్స్గా పరిణామం చెందే ప్రమాదం ఉంది. పిల్లలు చెడిపోయేది స్నేహితుల అభిరుచులు, వ్యసనాల వల్లనే. దాన్ని పీర్ ఇన్ ఫ్లుయన్స్ అంటారు. వారు తప్పుదారిలో వెళుతూ ఉంటే, అది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. మరీ డిటెక్టివ్లా నిఘా వెయ్యనవసరం లేదు గాని దుర్వ్యసనాల గురించి తెలుసు కోవడం పెద్ద కష్టం కాదు. అలాగే ప్రేమ (ఆకర్షణ) విషయం కూడా.పిల్లల భవిష్యత్తు పట్ల పెద్దలు నిర్దిష్టమైన అభిప్రాయం కలిగి ఉండాలి. మా అబ్బాయి టెన్త్ క్లాసులో స్టేట్ ర్యాంక్ వచ్చినప్పుడు రెండు మూడు కార్పొరేట్ కాలేజీల వాళ్ళు వచ్చి ఫ్రీ–సీట్ ఆఫర్ చేశారు. కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఇస్తామన్నారు. కాని, ఇంటి పక్కనే ఉన్న అతి సాధారణ కాలేజీలో చేరి ఇంటర్ కూడా స్టేట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు. ఆ తర్వాత నాగార్జున గ్రూపులో నెలకి 1500 కి ఉద్యోగం చేస్తూ, ఈవినింగ్ కాలేజీలో బీకాం ఆనర్స్ యూనివర్సిటీ థర్డ్గా పాస్ అయ్యాడు. బీకాం చదువుతున్న సమయంలోనే చార్టెడ్ అకౌంటెన్సీ కూడా పాస్ అవ్వటంతో, 22 ఏళ్లకే వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అక్కడ రెండేళ్లు ఉద్యోగం చేస్తూ. పై చదువులకు సరిపడా డబ్బు సంపాదించుకొని, సింగపూర్లో ఎంబీఏ చదివి, అక్కడే ఆరు ఆసియా దేశాలకు ప్రతినిధిగా ఏడాదికి అయిదు కోట్ల జీతంతో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. నేను తరచు చెప్పే ... ‘సింగిల్ బెడ్–రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్–రూమ్’ కాన్సెప్ట్ అదే. పిల్లల్ని ఎత్తుగా కాదు వెడల్పుగా పెంచాలి...ఈ పరిణామక్రమంలో నాకన్నా నా భార్య అనుగీత పాత్ర 90 శాతం (percentage wont go together) ఉంది. రచనలు, సినిమాల పనిలో నేను బిజీగా ఉండేవాడిని కానీ, ‘బద్ధకమూ, తీరిక లేకపోవటమూ’ అన్న పదాలకి అర్థం... చేసే పనులకి... మనం ఇచ్చుకునే ప్రాధాన్యాలపై ఉంటుంది. పిల్లవాడిని మేము ఎప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు. తనకి టీవీ అలవాటు కూడా లేదు. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేకపోవడం మా అదృష్టం. చదువుతోపాటు మరి ఏదైనా ఒక అభిరుచి ఉంటే పిల్లలు చక్కగా పెరుగుతారని మేము నమ్ముతాం. ‘పిల్లల్ని ఎత్తుగా కాదు, వెడల్పుగా పెంచాలి’ అంటుంది నా భార్య. ఆక్స్ఫర్డ్లో చదువుతున్న మా పెద్ద మనవడు గిటార్ వాయిస్తాడు. టెన్నిస్ ఆడతాడు. రెండో మనవడు సింగపూర్ క్రికెట్ టీమ్కి ఆడుతున్నాడు.తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే. కొన్ని చదువులకు తెలివితేటలు బాగా కావాలి. కొన్నిటికి జ్ఞాపకశక్తి అవసరం. పిల్లల్లో ఎటువంటి గ్రహణ శక్తి ఉందో చిన్నప్పుడే తెలిసిపోతుంది. దాన్ని బట్టివారి చదువుని ఎంపిక చేయాలి తప్ప, తాము జీవితంలో సాధించలేనిది పిల్లలపై రుద్దడం తప్పు. ప్రతి రోజూ ఓ పదినిమిషాలు..పక్క గదిలో తండ్రి స్నేహితులతో డ్రింక్ చేస్తూ, మరొక గదిలో తల్లి టీవీ చూస్తూ ఉంటే, ‘నేను తప్ప ప్రపంచం అంతా ఆనందంగా ఉన్నది’ అన్న ఫీలింగ్తో పిల్లవాడికి చదువు వంట పట్టదు. పెద్ద పెద్ద త్యాగాలు అవసరం లేదు. ప్రతిరోజూ ఒక పది నిముషాలు– ‘ఈ రోజు నువ్వేం చదువుకున్నావ్రా?’ అన్న వాకబు. రెండు మూడు ప్రశ్నలు... వారు సరిగ్గా సమాధానాలు చెప్తే చిన్న బహుమతి... ఇలాంటి చిన్న చిన్న చర్యలు పిల్లలలకి చదువు పట్ల ఆకర్షణ పెంచుతాయి. ‘కష్టపడే చదవరా’ అనేకొద్ది పిల్లలకి చదువు అంటే అదొక కష్టమైన బాధ్యత అన్న ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి చదువు పట్ల ఇష్టం పెరిగితే, అది టీవీ కన్నా ఎక్కువ ఆనందం ఇస్తుంది. పేరెంటింగ్లో మొదటి పాఠం అది. కొందరు పెద్దలకి తమ పిల్లల సిలబస్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా తెలీదు. ‘అంతా స్కూల్ వారే చూసుకుంటారు’ అని చేతులు దులిపేసుకోకుండా పిల్లలతో పాటు ప్రయాణం చేస్తూ, వారి చదువులో భాగం పంచుకుంటే, వారి కళ, నైపుణ్యం, గెలుపుకి సంబంధించిన చిన్న చిన్న అంశాలను గుర్తించి పెంచితే, ప్రతి పిల్లవాడు ఒక అబ్దుల్ కలాం అవుతాడు’ అని చెప్పారు. -ప్రణీత్ యండమూరినిర్వహణ: నిర్మలా రెడ్డి -
మాల్ లో మొదలైన మ్యాజిక్
పసిపాపగా మొదలైన నటి సారా అర్జున్ ప్రయాణం, ఇప్పుడు పాన్ఇండియా స్టార్డమ్ వరకూ చేరింది. ఇంకా ఎన్నో కలలు, ఎన్నో పాత్రలు, ఎన్నో విజయాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ విషయాలే మీకోసం..రెండేళ్లు కూడా లేవు!‘‘ఇంత చిన్న వయసులోనే ఇన్ని సినిమాలు ఎలా చేశావు?’’ అని చాలామంది అడుగుతుంటారు. కాని, కెమెరా ముందు నిలబడినప్పుడు నాకు రెండేళ్లు కూడా లేవు! ఒకరోజు అమ్మానాన్నలతో కలిసి మాల్కు వెళ్లినప్పుడు, ఒక ప్రకటన సంస్థ ప్రతినిధి మీ పాప యాడ్లో నటిస్తుందా? మా పేరెంట్స్ని అడిగారు. అలా పద్దెనిమిది నెలల పసిపాపగా నా ప్రయాణం మొదలైంది. ఐదేళ్లకే వందకు పైగా ప్రకటనల్లో నటించాను.క్రేజీ మెమరీ!‘నాన్న’ సినిమా షూటింగ్ సమయంలో నా డైలాగులే కాదు, విక్రమ్ అప్పా డైలాగులు కూడా నాకు కంఠస్థం అయ్యేవి. ఆయన ఎక్కడైనా మర్చిపోతే, నేనే గుర్తు చేసేదాన్ని! ఆ సమయంలో అనుష్క శెట్టితో నాకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ‘జంక్ ఫుడ్ అస్సలు తినకు, మంచి ఆహారం తీసుకోవాలి’ అని ఆమె ఇచ్చిన సలహా ఇప్పటికీ గుర్తుంది.గాసిప్స్ మామూలే!‘ధురంధర్’ సినిమాలో రణవీర్ సింగ్తో ఉన్న వయస్సు తేడా గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇక ఇటీవల రాకేష్ బేడీ ఆప్యాయంగా పలకరించడాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. హీరోయిన్ గా మారిన తర్వాత గాసిప్స్ సహజమే అని చాలా త్వరగా అర్థమైంది. మిగతావన్నీ తర్వాతే!ఎన్ని సినిమాలు చేసినా, ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కాలేదు. చిత్రీకరణలన్నీ సెలవుల్లోనే ఉండేలా నాన్న జాగ్రత్తగా ప్లాన్ చేసేవారు. చదువు, సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేయటం మా కుటుంబం ఇచ్చిన పెద్ద బలం.ప్రశ్నలే నా గురువులు!‘నాకు కొత్త ప్రదేశాలను చూడటం అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్లో ఎంతోమంది రకరకాల మనుషులు పరిచయమవుతుంటారు. ఎవరిని కలిసినా వివిధ ప్రశ్నలు అడుగుతుంటాను. వారి అలవాట్లు, మాట్లాడే తీరు గమనిస్తూ ఉంటాను. ఆ పరిశీలనే నేను చేసే పాత్రలకు ప్రాణం పోయడానికి సహాయపడుతుంది.ప్రేమ అంతా సినిమాలపైనే!పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తాను. ‘యుఫోరియా’లో నేను చేసిన పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, భావోద్వేగ భరితమైన, శక్తిమంతమైన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను.రికార్డుల దిశగా దూసుకెళ్తూ! ఇటీవల ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్డీబీ) విడుదల చేసిన ‘అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సెలబ్రిటీల’ జాబితాలో తొలి స్థానంలో నిలవడం నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగించింది. దానిని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇది ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం.ఇష్టాలు..!» అభిమాన నటుల్లో హీరో విజయ్ దేవరకొండ అంటే పెద్ద క్రష్! ఆయన ఎనర్జీ అంటే నాకు చాలా ఇష్టం. తమిళంలో సూర్య నా ఫేవరెట్. ఇక హీరోయిన్లలో ఐశ్వర్య రాయ్ని చూస్తూ పెరిగాను. ఆమె నా ఆదర్శం. »ఆహారంలో హైదరాబాద్ బిర్యానీ అంటే పిచ్చి. కాని, ఇప్పుడు ఆరోగ్యం కోసం డైట్ పాటిస్తున్నాను. అలాగే, నా డాగీతో గడిపే సమయం నాకు అత్యంత ప్రియమైనది. -
అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్
ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మారిన ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) కో–ఫౌండర్ సాదిక్ ఇష్రార్ షేక్– భత్కల్లో తన పరిచయాలను వాడుకుని అక్కడి వారినీ ఐఎంలో చేర్చుకున్నాడు. 2005 నుంచి విధ్వంసాలు ప్రారంభించిన ఐఎం పేరు 2007లో బయటకు పడింది. ఈ ఉగ్రవాదుల గుట్టు 2008లో వీడింది. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్కు చెందిన సాదిక్ ఇష్రార్ షేక్ మాదిరిగానే కర్ణాటకలోని భత్కల్కు చెందిన అన్నదమ్ములు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్లకూ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్తో (సిమి) సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ముగ్గురికీ పరిచయం ఏర్పడింది. రియాజ్, ఇక్బాల్లు ముంబైలో ఉంటూ గ్యాంగ్స్టర్స్గా మారారు. అక్కడే ‘ఆర్ఏఎన్ గ్యాంగ్’ పేరుతో ఓ ముఠా ఏర్పాటు చేసి, నేరాలు చేసేవారు. ఓ హత్య కేసులో ముంబై పోలీసుల నుంచి ఒత్తిడి పెరగటంతో భత్కల్కు వెళ్లి కొన్నాళ్లు షెల్టర్ తీసుకున్నారు. తర్వాత ఈ ఇద్దరూ కూడా సాదిక్ బాటలోనే ఐఎంలో చేరారు. భత్కల్ సోదరులు, సాదిక్ కలిసి ఐఎంలోకి అటు ఆజంగఢ్, ఇటు భత్కల్ ప్రాంతాలకు చెందిన పలువురు యువకుల్ని చేర్చారు. వీరిలో కొందరు అక్రమంగా సరిహద్దులు దాటి వెళ్లి పాక్లో శిక్షణ పొంది వచ్చారు. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించిన ఈ దేశవాళీ ఉగ్రవాద సంస్థ పేలుడు పదార్థాలనూ స్థానికంగానే సమకూర్చుకుంది. వారణాసిలోని దశాశ్వమేధఘాట్లో 2005 ఫిబ్రవరి 23న తొలి పేలుడుకు పాల్పడింది. అదే ఏడాది జూలై 29న యూపీలో శ్రమ్జీవి ఎక్స్ప్రెస్, అక్టోబర్ 29న ఢిల్లీలోని సరోజినీ మార్కెట్, 2006 మార్చి 7న వారణాసిలోని సంకట్ మోచన్ ఆలయం, అదే ఏడాది జూలై 11న ముంబై లోకల్ రైళ్లు, 2007 మే 22న గోరఖ్పూర్లో, అదే ఏడాది ఆగస్టు 25న హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీ పార్క్ లేజేరియంల్లో పేలుళ్లకు పాల్పడి అనేక మందిని పొట్టనపెట్టుకుంది. అయినా ఇదంతా చేస్తున్నదెవరో ఏ ఒక్క నిఘా సంస్థకూ తెలియలేదు. 2007 నవంబర్ 23న లక్నో, ఫరీదాబాద్, వారణాసిల్లో వరుస పేలుళ్లు జరిగాయి. దీనికి కొన్ని నిమిషాల ముందు వివిధ మీడియా సంస్థలకు ఓ ఈ–మెయిల్ వచ్చింది. దీని ద్వారానే తొలిసారిగా ఇండియన్ ముజాహిదీన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ ఉగ్రవాద సంస్థ పేరు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా నిఘా సంస్థలు చాన్నాళ్ల వరకు ఏమీ చేయలేకపోయాయి. ఫలితంగా 2008 మేలో జైపూర్ పేలుళ్లు జరిగాయి. తర్వాత ఐఎం ఉగ్రవాదులు ఆ ఏడాది జూలైలో గుజరాత్ను టార్గెట్ చేశారు. అహ్మదాబాద్లో భారీ విధ్వంసానికి కుట్రపన్నారు. ఈ ఆపరేషన్కు ‘ది పూల్ ఆఫ్ ఆల్ టెర్రరిస్టు’ అని పేరుపెట్టి, ఐఎం 2008 జూలై 26న అహ్మదాబాద్లో 17 పేళ్లకు పాల్పడ్డారు. సూరత్లోనూ కొన్ని పేలని బాంబులు పోలీసులకు దొరికాయి. ఈ బాంబుల్లో కొన్నింటిని ఉగ్రవాదులు వాహనాల్లో అమర్చారు. అక్కడే ఐఎం గుట్టు వీడటానికి అవసరమైన తొలి ఆధారం దొరికింది. రియాజ్ భత్కల్ కుర్లాలో ఉండగా బాంద్రాలో యాద్గార్ ఫ్యామిలీ రెస్టరెంట్ నిర్వహించే అఫ్జల్ ఉస్మానీతో పరిచయం ఏర్పడింది. ఒకప్పుడు వాహన చోరీలకు పాల్పడిన ఇతడికి ముంబైలో ఉన్న అనేక మంది దొంగలతో పరిచయాలు ఉన్నాయి. అహ్మదాబాద్లో వరుస పేలుళ్లకు పథకం వేసిన సాదిక్, రియాజ్లు అందుకు అవసరమైన వాహనాల సరఫరా బాధ్యతల్ని అఫ్జల్ ఉస్మానీకి అప్పగించారు. ఉస్మానీ ముంబైలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాహన చోరులతో కార్లను దొంగతనం చేయించి; వాటిని అహ్మదాబాద్, సూరత్లకు చేర్చాడు. ఈ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు రియాజ్ ఆదేశాల మేరకు ఆతిఫ్ అమీన్ అనే ఐఎం ఉగ్రవాది ముంబై వెళ్లి అఫ్జల్ను కలిశాడు. పేలుళ్లు జరిగిన వెంటనే వారిద్దరూ అక్కడి నుంచి రైలులో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి జామియానగర్లోని బాట్లా హౌస్ అపార్ట్మెంట్ ఫ్లాట్లో కొన్నాళ్లు ఉండి వచ్చేశారు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసు దర్యాప్తు చేసిన ఆ రాష్ట్ర ఏటీఎస్ అధికారులు వాహనాల నంబర్ల ఆధారంగా ముంబైలో చోరీ అయినట్లు గుర్తించారు.దీంతో మహారాష్ట్ర ఏటీఎస్, క్రైమ్బ్రాంచ్లు రంగంలోకి దిగి, నలుగురు వాహనచోరుల్ని పట్టుకుని విచారించాయి. అఫ్జల్ ఉస్మానీ ఆదేశాల మేరకు పని చేశామని వారు వెల్లడించారు. అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఉస్మానీ 2008 ఆగస్టు 21న ఉత్తరప్రదేశ్లో చిక్కాడు. ఇతడి ఇంటరాగేషన్లోనే రియాజ్ పేరు, ఇతర వివరాలు బయటపడ్డాయి. తనకు వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదని చెప్పిన ఉస్మానీ– ఓసారి మాత్రం బాట్లా హౌస్కు వెళ్లానని, అక్కడి ఎల్–18 ఫ్లాట్లో డెన్ ఉందని బయటపెట్టాడు. ఆ అపార్ట్మెంట్పై నిఘా పెట్టిన అహ్మదాబాద్, ముంబై పోలీసులు అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని, వారి వద్ద ఆయుధాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులను అప్రమత్తం చేశారు. 2008 సెప్టెంబర్ 19న ఇన్స్పెక్టర్ మోహన్చంద్ శర్మ నేతృత్వంలోని బృందం ఆ ఫ్లాట్పై దాడి చేసింది. అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో ఇన్స్పెక్టర్ శర్మతో పాటు ఉగ్రవాదులు ఆతిఫ్ అమీన్, మహ్మద్ సాజిద్ చనిపోయారు. ఆ ఎన్కౌంటర్లో సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది ఆరిజ్ ఖాన్ విచారణలో ఐఎం గుట్టు వీడి, ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభమై దుశ్చర్యలకు బ్రేక్ పడింది. (బాట్లా హౌస్ ఎన్కౌంటర్ తర్వాత దేశ వ్యాప్తంగా అరెస్టులు జరిగాయి. వీటిని తప్పించుకోవడానికి రియాజ్, ఇక్బాల్, సాదిక్ సహా అనేక మంది గజ ఉగ్రవాదులు హైదరాబాద్ బాటపట్టారు. ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఎవరి వద్ద షెల్టర్ పొందారు..? తదితర వివరాలతో తుది భాగం ‘చలో హైదరాబాద్!’ వచ్చే వారం) -
ఈ వారం కథ: సాక్షాత్కారం
సాక్షాత్కారం‘ఆయనెవరు?’‘సహ ప్రయాణికుడు!’‘ఆమె?’‘ఆయన భార్య.’‘వాళ్లిద్దరితో ఏమిటి బంధం?’‘ఏ బంధుత్వమూ లేదు.’‘మరి బాధ్యత భుజాలకెందుకెత్తుకున్నావ్?’ఆత్మ సంధించిన ఆ ప్రశ్నకు రామ్ దగ్గర సమాధానం లేదు.‘‘స్ట్రోక్ వచ్చింది. మూడు గంటలు గడిస్తేగాని చెప్పలేం. మా ప్రయత్నం మేం చేస్తాం...’’ డాక్టర్ మాటలు మనసులో కల్లోలం రేపుతున్నాయి.ఆమెనెట్లా ఓదార్చాలో తెలియక, టీ తాగి వస్తానంటూ రోడ్డు మీదికొచ్చాడు.అడుగులు ముందుకు పడుతున్నాయి. మనసు వెనక్కి నడుస్తోంది.∙∙ రమణీయంగా నవ్వాడు రామ్. అతని మొహమే అంత.ఆమె నవ్వలేదు. అరవై ఉంటాయా! పైనే ఉండొచ్చు.గర్భగుడిలో అమ్మవారి మోములా ఉంది. ప్రసన్నతలోనే కాస్త తేడా.సాయంత్రం అయిదున్నరకు హైదరాబాదులో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ బయల్దేరింది.ఆమె ఫోన్ మోగింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని, ‘‘లింగంపల్లి నుంచి ట్రైన్ బయల్దేరింది బాబూ. పొద్దున్నే స్టేష¯Œ కు కారు పంపించు’’ అని చెప్పి పెట్టేసింది.ఎదుటి బెర్తు మీది భర్త వైపు చూపు సారించింది. రామ్ కనుగుడ్లూ అటు తిరిగాయి.డెబ్భై దాకా ఉండొచ్చు. జర్కిన్ వేసుకొని, వెల్లకిలా పడుకొని ఉన్నాడు. క్లీ¯Œ షేవింగ్తో మొహం మెరిసిపోతోంది. దర్పానికి సాన పెడుతూ సన్నటి మీసకట్టు. రైలు బయల్దేరే వేళకే.. పవళింపుసేవలోకి వెళ్లడమనే అసహజత్వం, ఆయనలో కనిపిస్తున్న ధనబలం వల్ల వచ్చిన పొగరు కావచ్చు అనుకున్నాడు.సైడ్ లోయర్ బెర్తుపై రెండు కాళ్లూ చాపుకొని, రిలాక్స్ అయ్యాడు రామ్.అతనికంతా కొత్తగా ఉంది. ఏసీ సెకండ్ క్లాస్లో తొలిసారి ప్రయాణం.రైలు ప్రయాణమంటే అతనికిష్టం. లోకంలోని భిన్నత్వాన్ని ‘కంప్రెస్’చేసి ప్రదర్శించే రైలుపెట్టె అతనికిష్టం. బోగీ నిండా కలకలంగా, కలివిడిగా ఉండే మనుషులు ఇష్టం. ఒంటిగాడు గనుక ఊపుకుంటూ వచ్చి రైలెక్కుతాడు. చపాతీలూ చట్నీలూ పులిహోరలతో తయారయ్యే మనుషులు అతనికిష్టం. వాటిని తనకు కూడా పంచుతూ వారు కురిపించే ప్రేమ ఇష్టం. వారితో పంచుకునే కబుర్లు ఇష్టం. ఇలా అనేక ఇష్టాల్ని ప్రతి ప్రయాణంలోనూ తీర్చే స్లీపర్ క్లాస్ బోగీని దూరం చేసిందీ ప్రయాణం.‘ఇదంతా నెల్లూరు రైతు సంఘం వాళ్ల వల్ల కదా’ అనుకున్నాడు.గుంటూరుకు దగ్గర్లోని ఓ పల్లెటూరి పొలం ఒళ్లో పొట్ట పోసుకుంటూ తల్లిదండ్రులు; పటా¯Œ చెరు ప్రాంతంలో సింగిల్ బెడ్రూమ్లో చేతులు కాల్చుకుంటూ తను. ఆ రెండెకరాలూ అమ్మే అగత్యం రాకుండా ఏకైక పుత్రుడు ఏదోవిధంగా ఆదుకోగలడన్న ధీమాతో వాళ్లు; ఉద్యోగంలో ఎత్తులకెదిగి, ఆ ఆశయం నెరవేర్చగలనన్న ఆశతో తను.‘‘సార్, మీ ట్రైన్ తెల్లవారుజామున 2.50కి నెల్లూరు చేరుకుంటుంది. రెండున్నరకంతా కారు స్టేష¯Œ లో ఉంటుంది. మీరు తిరిగి వెళ్లేవరకు అది మీతోనే ఉంటుంది. డ్రైవర్ పేరు చంద్రం. మీకేం కావాలన్నా అతన్నడగండి’’ నిర్వాహకుడొకరు సమాచారమిచ్చి, డ్రైవర్ నంబరు పంపాడు.రైలు సికింద్రాబాదు స్టేషన్లో ఆగింది. సైడ్ లోయర్ బెర్తులోకి ఆర్.ఎ.సి.లో టిక్కెట్లు పొందిన దంపతులు వచ్చారు. క్యాబి¯Œ లో లోయర్ బెర్త్పై పడుకున్న పెద్దాయన అప్పుడే లేచి కూచోవటంతో, ‘‘సార్, నాది సైడ్ అప్పర్. కాసేపు ఇక్కడ...’’ అని అడిగి, ఆయన అనుమతితో పక్కనే కూచున్నాడు. ‘‘ఎక్కడిదాకా?’’ పెద్దాయన అడిగాడు.‘‘నెల్లూరు సార్. మీరు?’’‘‘తిరుపతి. ఏం చేస్తుంటావు?’’‘‘స్వచ్ఛంద సంస్థలో సర్’’‘‘అంటే అనాథాశ్రమాలూ, వృద్ధాశ్రమాలూ... విరాళాలూ’’ చివరి మాటకుముందు చిన్న విరామం ఇచ్చి, స్వరానికి కాస్త వ్యంగ్యం జోడించి అడిగాడు. రామ్కు ఇలాంటివి అలవాటే. వాళ్ల చిన్నచూపు పట్ల పుట్టే చిన్ననవ్వును తొక్కిపట్టుకోవడం కూడా!‘‘కాదు సర్. రెండు రాష్ట్రాల్లో సుమారు రెండువేల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించే ప్రాజెక్టుకు హెడ్గా ఉన్నాను. గవర్నమెంటు ఆర్గానిక్ ఫార్మింగ్పై నిర్వహిస్తున్న సదస్సుకు స్పెషల్ గెస్టుగా రమ్మంటే...’’‘‘ఇంట్రెస్టింగ్’’ కళ్లెగరేస్తూ చూశాడాయన.‘‘మీరేం చేసేవారు?’’ వినమ్రంగా అడిగాడు రామ్.‘‘హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో జీఎంగా పనిచేసి రిటైరయ్యాను. నాకూ వ్యవసాయమంటే చాలా ఇష్టం కాని, నాగలి పట్టుకునే అదృష్టం దక్కలేదు...’’‘‘భూమిని కౌగిలించుకోబోయి, ఏకంగా ఆకాశాన్నే అందుకున్నారు. అదింకా పెద్ద అదృష్టమేగా సార్’’ అన్నాడు నవ్వుతూ.‘‘ఘటికుడివేనోయ్. భలే చెప్పావ్’’ పెద్దగా నవ్వేశారాయన.‘‘మీ పేరు?’’‘‘గోపాలయ్య’’. ఎదుటి బెర్తు వైపు వేలు చూపిస్తూ ‘‘మా ఆవిడ... రుక్మిణి’’ అన్నాడు.‘‘నమస్తే అమ్మా. నా పేరు రామ్’’ చెప్పి, ‘‘బాలాజీ దర్శనానికేనా?’’ అనడిగాడు.‘‘అవునయ్యా రామూ. ఆయన డిమాండు రోజురోజుకూ పెరిగిపోతంది. ఎంపీలు, ఎమ్మెల్యేల లెటర్లు దొరకటం లేదు. మా ఇద్దరికీ శ్రీవాణి టిక్కెట్లు బుక్ చేసుకున్నాం, అది కూడా దొడ్డిదారిన’’ అన్నాడాయన చిరుమందహాసాన్ని మీసాల వెనక దాచుకుంటూ.మరికొన్ని ముచ్చట్లు నడిచినా, ఆమె మాత్రం మాట కలపలేదు.రాత్రి ఎనిమిది దాటుతుండగా ఆమె బ్యాగులోంచి బాక్స్ బయటకు తీసింది. ఇద్దరూ ఇడ్లీ తిన్నారు. చెయ్యి కడుక్కోటానికి వెళ్తున్నప్పుడు గమనించాడు... ఆయన తడబడుతూ నడవటం! రామ్ తన బెర్తుపైకి ఎక్కి, తెచ్చుకున్న టిఫిను ఇంకో ప్యాసింజరుకు పంచిపెట్టేవాళ్లు ఉండరని గ్రహించి– రైల్లో లభ్యమయ్యే చపాతీలనబడే ఆహారంతో కడుపు నింపుకొని, పుస్తకంలో మునిగిపోయాడు. రాత్రి పది దాటాక నిద్ర పట్టింది.తెల్లవారుజామున 2.40 గంటలకు సెల్ఫో¯Œ లోని అలారం మోగకముందే, ఏవో శబ్దాలు రామ్ చెవులకు లీలగా తాకుతుండటంతో మెలకువ వచ్చింది. కర్టెను పక్కకు జరిపి చూశాడు. మూసి ఉన్న కర్టెను లోపల్నుంచి భార్యాభర్తల మాటలు వినిపిస్తున్నాయి. ఆమె స్వరంలో ఆందోళన.టైమ్ చూస్తే, రెండున్నర. తెర కాస్త తొలగించి చూద్దామనుకొని, అంతలోనే విరమించుకున్నాడు. ఆమె స్వరంలో తీవ్రత పెరుగుతోంది. కిందికి దిగి, చెప్పులు తొడుక్కుంటుండగా, ఆమే తెరలోంచి తల బయటికి పెట్టి, ‘బాబూ, నువ్వు నెల్లూరులో దిగుతావు కదూ’ అనడిగింది.‘‘అవునమ్మా’’ చెప్పాడు రామ్.‘‘ఈయనకి ఆరోగ్యం బాలేదు. మేమూ ఇక్కడే దిగిపోతే, సాయం చెయ్యగలవా? స్టేషన్కు దగ్గర్లో ఆస్పత్రులేమైనా ఉన్నాయా?’’ ఆమె కంఠం కంగారుగా వణుకుతోంది.చొరవగా క్యాబిన్ కర్టెన్ జరిపాడు రామ్. లైటు వెలుగుతోంది. పై బెర్తుల్లోని ఇద్దరూ గాఢనిద్రలో ఉన్నారు. సైడ్ లోయర్ బెర్తులోని దంపతులు కూచునే నిద్ర పోతున్నారు.పెద్దాయన ఆయాసంతో కిందామీదా అవుతున్నాడు. విపరీతంగా దగ్గుతున్నాడు. స్థిరంగా కూచోలేడు; సుఖంగా పడుకోలేడు. గుండెలపై చేతులుంచుకొని, ఏటవాలుగా కూచున్నాడు. రామ్కు భయమేసింది. ఆయన పక్కనే కూచొని, ‘‘ట్యాబ్లెట్లేమైనా ఉన్నాయా?’’ అని అడిగాడు. ‘‘వేసుకున్నాడు బాబూ’’ చెప్పిందామె. ఆయన కూడా సైగలతో అదే విషయం చెప్పాడు. ‘‘హార్ట్ ప్రాబ్లమ్ ఉందా?’’ మాటల కొనసాగింపు యత్నమది.‘‘లేదు. షుగరుంది, పదేళ్ల పైనుంచే’’ ఆమె సమాధానం.ఆయన మెల్లగా బెర్తుపై పడుకున్నాడు.‘‘సార్కి ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా?’’‘‘లేవు. కాకపోతే ఒక వారం రోజుల్నుంచీ పనులనీ, ఫంక్షన్లనీ ఊళ్లు తిరుగుతున్నాం’’.‘‘బాగా అలసిపోయి ఉంటార్లెండి. మరేం ఫర్లేదు. అయిదు నిమిషాల్లో నెల్లూరు వస్తుంది’’.‘‘ఆయన్ని చూస్తుంటే భయమేస్తోంది బాబూ. నెల్లూరులోనే దిగిపోతాం. వెంటనే ఆస్పత్రికి వెళ్తే మంచిదనుకుంటున్నా’’.‘‘అదే మంచి పనమ్మా’’ ఆ మాట అంటూనే, తనకోసం వచ్చే కారు డ్రైవరుకు ఫోన్ చేశాడు.‘‘స్టేషన్ కు వచ్చాను సార్. మీరు దిగింతర్వాత నాలుగో నంబరు ప్లాట్ఫామ్ కల్లే రండి. ఒకటో నంబరు వైపు బ్రిడ్డి పనులు జరుగుతున్నాయి. రోడ్డు బాలేదు.’’‘‘అలాగేలే గాని, స్టేష¯Œ కు దగ్గర్లో మంచి ఆస్పత్రులేమైనా ఉన్నాయా?’’‘‘అపోలో దగ్గరే సార్. పావుగంటలో ఎల్లిపోవచ్చు. ఎందు...’’ చంద్రం ఇంకా ఏదో చెబుతూనే ఉన్నా, రామ్ డిస్కనెక్ట్ చేశాడు. రామ్ తన బ్యాక్ ప్యాక్ బ్యాగ్ను భుజాలకు తగిలించుకున్నాడు. వాళ్లదీ ఒక్కటే పెద్ద బ్యాగు. దాన్ని చేతుల్లోకి తీసుకొని, ‘మీరు సార్ని తీసుకొని దిగండమ్మా’ అని చెప్పి, డోర్ దగ్గరకు నడిచాడు.ఆమె భర్తను పొదివి పుచ్చుకొని, మెల్లగా నడిపించుకుంటూ వచ్చింది.రైలు ఆగగానే రామ్ చకచకా దిగి, బ్యాగులు ప్లాట్ఫామ్పై ఉంచి, చెయ్యందించి ఆమెను జాగ్రత్తగా కిందికి దించాడు. చెయ్యందించినా పెద్దాయన మాత్రం దిగలేకపోయాడు. కదిలే సమయమైందంటూ రైలు కూత వేస్తోంది. ఆమెలో ఆందోళన. రామ్ గభాల్న వెనక్కి తిరిగి, ఆయన్ని వీపుపైకి వాల్చుకొని, కిందికి దింపేశాడు. ఆయన రొప్పుతూనే అయిదారు అడుగులు వేసి, సిమెంటు సోఫాలో కూలబడ్డాడు. ఆమె గబగబా వెళ్లి, పక్కనే కూచుంది.‘‘మెల్లగా నడిపించుకుంటూ రండమ్మా’’ బ్యాగులు తీసుకుంటూ ముందుకు నడిచాడు రామ్.భర్త కుడిచేతిని తన భుజాలపై వేసుకొని కదిలిందామె.రామ్ మధ్యమధ్యలో ఆగి, వెనుదిరిగి చూస్తున్నాడు. సన్నగా వర్షం మొదలైంది. చల్లటి గాలి దురుసుగా వీస్తోంది. ఆయన అడుగుతీసి అడుగెయ్యటానికి యాతన పడుతున్నాడు.కొంత దూరం నడిచాక ర్యాంపు మొదలైంది. అందులోంచి కిందికి దిగారు. అయిదారు సార్లు ఆగి, సేదదీరి, ఆ దంపతులు దగ్గరయ్యారు. పైకి దారితీసింది ర్యాంపు. ఆయన ఎక్కగలిగే పరిస్థితి కనిపించలేదు. ఆమె కూడా అలసిపోయి, రొప్పుతోంది.‘‘ఎక్కడ సార్’’ చంద్రం ఫోన్ చేస్తూనే ఉన్నాడు.రామ్ గబగబా పైకెక్కి, రెండు బ్యాగులూ అక్కడుంచి, మళ్లీ ర్యాంపు మీంచి కిందికి దిగాడు. ఆమెను పక్కకు తప్పుకోమని, ఆయన్ని భుజాలపై ఎత్తుకొని, నాలుగో ప్లాట్ఫామ్ పైకి చేరుకున్నాడు. బయటికెళ్లే ప్రధాన ద్వారానికి దగ్గర్లో ఉన్న బెంచీపై ఆమె, ఆయన కూచున్నారు.అయిదు నిమిషాల్లో కారొచ్చింది. చంద్ర సాయంతో ఆయన్ని వెనక సీట్లో కూచోబెట్టారు. ఇరవై నిమిషాల తర్వాత కారు ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఆగింది. వీల్ చెయిర్లో ఆయన్ని లోపలికి తీసుకెళ్లి, బెడ్ మీద పడుకోబెట్టారు. ఇద్దరు నర్సులు వచ్చారు. ఒకరు వైటల్స్ చెక్ చేయటం మొదలు పెడితే; మరొకరు కార్డియాక్ మానిటర్, పల్స్ ఆక్సిమీటర్ అమర్చారు. ఫ్లూయిడ్స్ సిద్ధం చేశారు. ఆమె, రామ్ చూస్తూ నిలబడ్డారు. డ్యూటీ డాక్టరు వచ్చి, ఏం జరిగిందన్నట్లు ఇద్దరి వంకా చూశాడు. ఆమె గొంతు బొంగురు పోవటంతో, రామ్ వివరించాడు. ‘‘మీరు రిసెప్షన్ కౌంటర్ దగ్గరకెళ్లండి’’ అని, స్టెత్తో పరీక్షించటం మొదలు పెట్టాడు.‘‘ఆయన పేరు చెప్పండి’’ అడిగాడు కౌంటర్లోని వ్యక్తి.‘‘గోపాలయ్య. వయసు 68’’ చెప్పాడు రామ్.మిగతా వివరాలూ చెప్పాక, కన్సల్టన్సీ ఫీజు కట్టమన్నాడు. ఆమె తన వానిటీ బ్యాగ్లో డబ్బుల కోసం వెతుకుతుండగా, ‘నేను కట్టేస్తాలేమ్మా’ అంటూ ఫోన్ పే ద్వారా వెయ్యి రూపాయలు చెల్లించాడు.‘‘మీ పిల్లలు...?’’ వెయిటింగ్ హాల్లో పది నిమిషాల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగాడు రామ్.ఆమె ఫోను మోగింది. కట్ చేసింది. మాటల పొదుపరో, ఆ స్థితి కారణంగా మౌనంలో మమేకమైందో అంతుబట్టడం లేదు. రామ్కూ, ఆమెకూ మధ్యలో ఓ ఖాళీ కుర్చీ.‘‘ఇద్దరబ్బాయిలు. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు’’ కళ్లు తుడుచుకుంటూ చెప్పిందామె.‘‘ఆరోగ్యం బాగాలేనప్పుడు, తిరుపతి రావటం ఆగిపోవాల్సింది!’’ అన్నాడు ఆమె వైపు చూస్తూ.‘‘నేనా మాట అన్నాను బాబూ. మరేం ఫర్వాలేదన్నాడాయన...’’ ఇంకేదో చెప్పబోయిందిగాని, దుఃఖం పొంగుకు రావటంతో మూగవోయింది.‘‘ఆయనకేమీ కాదు. నన్ను నమ్మండి’’.‘‘నమ్మటం తప్ప వేరే దారిలేదు బాబూ’’.కొంత నిశ్శబ్దం తర్వాత ‘‘నీ పూర్తి పేరేంటి?’’ అడిగిందామె. చెప్పాడు రామ్.అయిదు నిమిషాలు గడిచాక నర్సు పిలవటంతో ఇద్దరూవెళ్లి డాక్టర్ని కలిశారు.‘‘మీరనుకుంటున్నట్లు ఆయాసం ఒక్కటే ఆయన సమస్య కాదు...’’ డాక్టర్ చెప్పటం మొదలు పెట్టాడు. ‘‘కండిషన్ క్రిటికల్గా ఉంది. పది నిమిషాల్లో స్పెషలిస్ట్ వస్తున్నాడు. మూడు గంటలు గడిస్తేగాని చెప్పలేం. కొన్ని ఫామ్స్ మీద మీ సంతకాలు కావాలి’’ చెబుతూనే, నర్సు వంక చూశాడు డాక్టర్. వాళ్లిద్దరినీ తనవెంట తీసుకెళ్లిందామె.సంతకాలయ్యాక ఇద్దరూ మళ్లీ వెయిటింగ్ హాల్లోకి వచ్చారు. ఆమె ఫోను మోగింది. కట్ చేసింది. ఇద్దరి మధ్యా భయంకరమైన నిశ్శబ్దం. గాయాలపాలైన కాలం ముందుకు కదల్లేకపోతోంది. గాఢమైన వేదనలోంచి గొంతు విప్పిందామె.‘‘అత్తమామలే కాదు, అమ్మనాన్నలు కూడా కులం పేరుతో అడ్డుకున్నారు. కలవటానికి వీల్లేదన్నారు. రచ్చబండ మీద గ్రామబహిష్కార ప్రకటన దగ్గర వికసించిన మా ప్రేమ... ఎన్ని ఆటంకాలు ఎదురైనా అలసిపోలేదు, అవిసిపోలేదు. ఆయన అందరినీ ఎదిరించారు. నాకోసం ఆస్తులన్నీ వదులుకున్నారు. కట్టుబట్టలతో నగరానికొచ్చాం. ఇప్పటికీ ఆయన నన్ను ‘అమ్మా’ అనే పిలుస్తా...’’ మాట పూర్తి కాకుండానే ఒక్క పెట్టున ఏడ్చేసింది.ఆమెనెలా ఓదార్చాలో అతనికర్థం కాలేదు.ఏడ్చీ ఏడ్చీ ఆమె కళ్లు ఎర్రబడ్డాయి. మెల్లగా దుఃఖాన్ని ప్రేమించటం అలవరచుకుంటోంది.రామ్లోనూ సందేహాల చిక్కుముళ్లు బిగుసుకుంటున్నాయి.ఏమవుతుంది? ఏం జరగబోతోంది? ఏమైనా జరిగితే? తన భాగస్వామ్యమేమిటి?...టీ స్టాల్ దగ్గర మనుషుల అలికిడికి రామ్ అడుగులు అటువైపు మళ్లాయి.కుర్చీలోనే దిగులుముద్దలా కూచొని ఉన్న ఆమె భుజంతట్టి పిలిచాడు రామ్.ఆమె కళ్లు విప్పి, మగతగా చూసింది. తన చేతుల్లోని కుంకుమపొట్లం ఆమెకు అందిస్తూ ‘‘అమ్మా, ఆయనకు చెప్పేశాను. దర్శనమిచ్చాడు. అభయమిచ్చాడు. నలభై నిమిషాల తర్వాత మీరు శుభవార్త వింటారు’’ అని చెప్పాడు. కిటికీ తెరిచాడు. ఆకాశం నుంచి తెల్లటి వెలుగు భూమ్మీదకు జాలువారుతోంది.కొత్త సంకల్పమేదో చిగురించి, మనసులో బలంగా స్థిరపడింది.‘‘నేను చెప్పేది నిజమమ్మా. నన్ను నమ్మండి’’ నమ్మకాన్ని నిలబెట్టే మాటసాయం తప్ప తనింకేమీ చేయలేడన్న విషయం రామ్కు తెలుసు.ఆమె రామ్ కళ్లల్లోకి చూసింది, నమ్మకంగా!ముప్ఫయ్యారు నిమిషాల ముళ్ల రక్కుళ్ల తర్వాత... డాక్టర్ నుంచి పిలుపు.‘‘హి ఈజ్ ఆల్రైట్. ప్రాణాపాయం లేదు. సాయంత్రం దాకా అబ్జర్వేషన్ లో ఉంచాలి.’’‘‘థాంక్యూ డాక్టర్’’ ఇద్దరూ ఒకేసారి అన్నారు.వార్డులోంచి ఇద్దరూ తేలికైన అడుగులతో హాల్లోకి నడిచారు. ఫోను మోగింది. ఆమె కట్ చేసింది. రామ్ బలవంతంపై ఆమె బ్రష్ చేసింది. తను వెళ్లి, టిఫిన్ పార్సిల్ తెచ్చాడు.మరో గంట గడిచింది. పేషెంటును స్పెషల్ రూముకు మార్చారు.తొమ్మిది కావస్తోంది. అప్పటికే డ్రైవరు అయిదారుసార్లు ఫోన్ చేశాడు.‘‘అమ్మా. మీరింక భయపడనక్కర్లేదు. రేపు మధ్యాహ్నానికి డిశ్చార్జ్ చేస్తారు. మీకెలాగూ రిటర్న్ టికెట్స్ ఉన్నాయి కదా, రేపు రాత్రికి ట్రైన్లో వెళ్లిపోండి’’ అని చెప్పి, బ్యాగ్ తగిలించుకున్నాడు.ఆమె రామ్ చెయ్యి పట్టుకొని బెడ్ దాకా నడిపించుకెళ్లి, ‘తను వెళ్లిపోతాడంట’ అంది భర్త కళ్లలోకి చూస్తూ. ఆయన తన నోటికి అడ్డంగా ఉన్న మాస్క్ను ఎడమచేత్తో తొలగించుకొని, కుడిచేతిని మెల్లగా పైకి లేపాడు. రామ్ కరచాలనం చేశాడు.ఆయన రెండు కళ్లనుంచీ బాష్పాలు ధార కట్టాయి. రామ్ కళ్లు సజలమయ్యాయి.ఆమె ఆస్పత్రి బయటదాకా వెంటవచ్చి, రెండు చేతులూ జోడించి, ‘‘బాబూ, నువ్వే లేకపోతే ఏమైపోయేవాళ్లమో...’’ అంటూ అతన్ని హత్తుకొని, కన్నీటి పర్యంతమైంది.‘‘అయ్యో, అదేంటమ్మా! నా స్థానంలో ఎవ్వరున్నా ఇలాగే చేస్తారు’’ అంటూ తనూ నమస్కరించి, గేటు దగ్గర ఆగి ఉన్న కారువైపు వడివడిగా వెళ్లిపోయాడు.ఫోను మోగింది. ఈసారి ఆన్ చేసిందామె. తిరుమల ఏజెంటు.‘‘ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటిరమ్మా... నెల్లూరు దాకా వచ్చి స్వామి ఎదటకు రాలేకపోతిరే!’’‘‘ఆయన చల్లటి చూపుంటే మళ్లీ రాకుండా పోతామా? ఎదటకు వచ్చినా పెద్దాయన్ని మేం కోరబోయేది ‘చల్లంగా చూడ’మనే కదా బాబూ. మనసులో ఘోష పెట్టిన మా మొర ఆలకించాడులే’’.‘‘అరుదుగా లభించే అదృష్టం. ప్రత్యేక దర్శనం మిస్సయ్యారనే నా బాధంతా...’’ ఆమెను వేదనలోకి నెట్టడానికి అవతలి గొంతు ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.‘‘సశరీరంగా వచ్చిన స్వామి అనుగ్రహాన్ని మనసారా అనుభూతించిన తర్వాత... కనులకు దక్కని భాగ్యం గురించి కించపడేదేముంది నాయనా’’ ఆమె చెబుతోంది, తన్మయంగా.అలా చెబుతున్నప్పుడు ‘తన ప్రశ్న, రామ్ జవాబు’ ఆమె మనసులో మార్మోగుతున్నాయి...‘‘నీ పూర్తి పేరేంటి బాబూ?’’‘‘చుట్టాల్లో రవణా అనే వాళ్లమ్మా. కాలేజీలో గిరీ అనీ, వెంకట్ అనీ పిలిచేవాళ్లు. తీరా ఉద్యోగంలో చేరాక ‘రామ్’ కుదురుకుంది. ఎవరెలా పిలిచినా పలకడం అలవాటైంది. నిజానికి నా పూర్తిపేరు – సప్తగిరి వెంకటరమణ.’’ -ఎమ్వీ రామిరెడ్డి -
కథాకళి: మేడమెట్లు
‘డిటెక్టివ్ పెద్దబ్బాయి’ అనే బోర్డ్ ఉన్న ఇంట్లో ఆయన తన అసిస్టెంట్ చిన్నబ్బాయితో పేకాడుతున్నాడు.‘‘రెండో డైమండ్ ఆసు బల్ల మీదకి ఎలా వచ్చింది సార్?’’ చిన్నబ్బాయి కోపంగా అడిగాడు.‘‘మోటివ్ నీకు తెలుసు. గెలిస్తే వెయ్యి రూపాయలు. ఎలా వచ్చాయో పరిశోధన చేసి కనుక్కోవాల్సిన బాధ్యత నీదే.’’ పెద్దబ్బాయి నవ్వుతూ చెప్పాడు.‘‘మీరు డిటెక్టివ్గా, నేను అసిస్టెంట్ డిటెక్టివ్గా ఒకరి కలంలోంచి పుట్టిన పాత్రలం. మన సృష్టికర్త ప్రతీ కేస్ని మీరే పరిశోధించేలా రాస్తున్నారు. కాబట్టి అది మీ పని.’’పెద్దబ్బాయి మొబైల్ మోగింది. అతను ఎవరి నుంచో చూసి ఆన్సర్ చేశాడు.‘‘ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయిని. దయచేసి ఈ ఎడ్రస్కి రాగలరా?’’ ‘‘ఎందుకు?’’అవతలివైపు నుంచి చెప్పింది విని చెప్పాడు.‘‘సరే. లొకేషన్ పంపించండి. వెంటనే బయలుదేరుతాం.’’లైన్ కట్ చేశాక తన వంక ప్రశ్నార్థకంగా చూసే తన అసిస్టెంట్తో డిటెక్టివ్ పెద్దబ్బాయి చెప్పాడు.‘‘ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి. హత్య. డూప్లెక్స్ ఇంట్లో మెట్ల మీంచి కిందపడి ఒకరు మరణించారు.’’‘‘ప్రతి మరణం హత్య కానవసరం లేదు.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘మనం ఇంతదాకా పరిశోధించిన ఏ కేస్ అయినా హత్య కాకుండా పోయిందా?’’పెద్దబ్బాయి లేచి షెర్లాక్ హోమ్స్ పైప్ని నోట్లో ఉంచుకుని, ఆయన పెట్టుకునేలాంటి టోపీని పెట్టుకున్నాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. బీఎండబ్ల్యూ కారు ఎక్కాక చిన్నబ్బాయి డ్రైవ్ చేస్తూ చెప్పాడు.‘‘థ్రిల్, సస్పెన్ ్స పేరిట మన సృష్టికర్త మనల్ని ఎన్ని బాధలు పెడుతున్నాడు! నా నెత్తి మీద రివాల్వర్ పిడితో విలన్లు ఎన్నిసార్లు బాదారో. నేను నిజం మనిషినైతే ఎప్పుడో చచ్చేవాడిని. లేదా పిచ్చెక్కేది. ఇవాళ్టి కేస్లో అలాంటిది కాని, మారువేషాలు కాని ఉండవని ఆశిస్తాను. పెట్టుడు గడ్డం జిగురు భయంకరమైన దురదని పుట్టిస్తుంది.’’వారి కారు ఓ డూప్లెక్స్ ఇంటికి చేరుకుంది. బయట పోలీస్ కార్లు ఉన్నాయి.పెద్దబ్బాయిని చూసి పోలీస్ కాన్ స్టబుల్ సెల్యూట్ చేసాడు. ఇద్దరూ లోపలికి నడిచారు. ఇద్దరూ శవాన్ని చూశారు.‘‘ఆయనకి రేచీకటి. మెట్ల మీంచి కాలుజారి పడ్డాడు. అయినా మీ అభిప్రాయం తెలుసుకుందామని రమ్మన్నాను.’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి చెప్పాడు.‘‘ఇది హత్య.’’ పెద్దబ్బాయి పైప్ గుప్పుగుప్పున పీలుస్తూ చెప్పాడు.‘‘ఎలా కనుక్కున్నారు?’’‘‘సింపుల్. ఇంతదాకా మేము ఎన్నడైనా ‘ఇది హత్య కాదు. ప్రమాదకర మరణం’ అని వెనక్కి తిరిగామా? హత్య అయితేనే మన పాత్రలకి ప్రయోజనం.’’ చిన్నబ్బాయి వివరించాడు.హతుడి వయసు అరవై పైనే ఉండొచ్చు. బట్టతల. సరిగ్గా తల మధ్యలో అయిన పెద్ద గాయం నుంచి రక్తం కారుతోంది. పైన నాలుగో మెట్టు మీంచి కింది మెట్టు దాకా కారిన రక్తపు చుక్కలు కనిపించాయి.‘‘ఇతను సంపన్నుడు. ఇతని వారసుల గురించి వాకబు చేశారా?’’ పెద్దబ్బాయి అడిగాడు.ఇన్స్పెక్టర్ సైగ చేస్తే సర్వెంట్ మెయిడ్ చెప్పింది.‘‘ఈరికి మనవడు తప్ప ఇంకెవరూ లేరు. కరోనాలో అంతా పోయారు. ఇందాక ఫోన్ చేస్తే ఆయన ఆన్సర్ చెయ్యలేదు.’’‘‘ఇవాళ అతను ఇక్కడికి వచ్చి వెళ్ళాడా?’’‘‘ఇవాళ మంగళవారం. ఇక్కడ రైతు బజార్ నుంచి కూరలబండి వస్తుంది. నేను కూరలకి వెళ్ళి వచ్చినప్పుడు వచ్చాడేమో తెలీదు. నేను తిరిగి రాగానే ఈయన ఇలా నేల మీద...’’ ఏడుపు వల్ల ఆవిడ మిగిలిన వాక్యాన్ని పూర్తి చేయలేదు.‘‘ఆ వారసుడి దగ్గర ఈ ఇంటి డూప్లికేట్ తాళంచెవి ఉందా?’’‘‘ఉంది.’’పెద్దబ్బాయి అతని నంబర్ అడిగి ఫోన్ చేశాడు.‘‘నా పేరు పెద్దబ్బాయి. డిటెక్టివ్ని. మీ తాతగారిని ఎవరో చంపారు.’’‘‘అరెరే. ఏమైంది?’’ అవతల నుంచి మనవడు ఆదుర్దాగా అడిగాడు.‘‘తల మీద గాయమై మరణించారు. అది హత్య. మీరు వెంటనే రండి.’’‘‘అది హత్య అని ఎందుకు అనుకుంటున్నారు?’’‘‘మీరు హంతకుడు కాబట్టి. ప్రతి కథలోనూ డిటెక్టివ్ ఎవరు హంతకుడో ఇట్టే కనుక్కుంటాడు.’’‘‘మా తాతయ్యకి రేచీకటి. మెట్లు దిగుతూ కాలుజారి మరణించి ఉండచ్చు.’’‘‘రాగానే ఆ హంతకుడిని అరెస్ట్ చేయండి.’’ పెద్దబ్బాయి ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయికి చెప్పాడు.‘‘అది మీరు గంభీరంగా ఓసారి పైప్ని తీసి దానివంక చూసి చెప్పాలి. అతనే హంతకుడనే ఆధారం ఏమిటి?’’ బుల్లెబ్బాయి అడిగాడు.‘‘అతనికి ఎవరూ అతని తాత ఎలా మరణించారో చెప్పలేదు. అయినా మెట్ల మీంచి జారిపడ్డాడని తెలిసిందంటే అతనే హంతకుడు. ఎవరైనా ఆస్తిని వీలైనంత త్వరగా అనుభవించాలని అనుకుంటారు. అందుకే ఈ దురాగతం చేశాడు.’’ఇంటికి వెళ్ళాక మళ్ళీ పేకాటకి కూర్చున్న చిన్నబ్బాయి చెప్పాడు.‘‘నాకు తెలీలేదు. మీరు నా బాస్ కాబట్టి ఈ బల్ల మీదకి రెండు డైమండ్ ఆసులు ఎలా వచ్చాయో మీరే కనుక్కోవాలి.’’ ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
అత్రీశ్వర మహాత్మ్యం
చిత్రకూట పర్వతానికి సమీపంలో కామదారణ్యం ఉంది. అపారమైన వృక్షసంపదతో, వనచరాలతో, పక్షుల కిలకిలరావాలతో అలరారే కామదారణ్యం పరమ పవిత్రమైన తపోభూమి. తపోధనులకు పెన్నిధిలాంటి కామదారణ్యంలో బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షి తన భార్య అనసూయతో కలసి ఆశ్రమం ఏర్పరచుకుని, తపోనిష్ఠతో ఉండేవాడు.కొంతకాలానికి కామదారణ్యంలో అనావృష్టి ఏర్పడింది. చెట్లు చేమలు ఎండిపోయాయి. మహావృక్షాలు సైతం మోడువారిపోయాయి. అరణ్యంలోని వాపీ కూప తటాకాది జలవనరులన్నీ ఎండిపోయాయి. ఆహారం దొరకక పశు పక్ష్యాదులు అల్లాడిపోయాయి. మోడువారిన వృక్షాలను ఆశ్రయించుకుని ఉన్న పక్షులు ఎండుటాకుల్లా నేలరాలాయి. కనుచూపు మేరలో పచ్చదనం కనిపించని పరిస్థితులు దాపురించాయి. నేల బిరుసెక్కి బీటలువారింది. పచ్చని అరణ్యం ఎండిపోవడంతో పశుపక్ష్యాదులు కళ్ల ముందే నశించిపోతుండటం చూసి, భూతదయ గల అనసూయ అమితంగా కలత చెందింది.‘స్వామీ! అనావృష్టి వల్ల పచ్చని అడవి ఎండిపోయింది. ఆకలి దప్పికలను తీర్చుకోలేక వన్యప్రాణులన్నీ కళ్లముందే నశిస్తున్నాయి. ఈ ప్రాణి వినాశనాన్ని చూడలేకున్నాను. ప్రాణులను రక్షించడానికి వర్షాగమనం కోసం వరుణదేవుడిని ప్రార్థించండి’ అని భర్తను కోరింది.అనావృష్టి కారణంగా జరుగుతున్న ప్రాణినష్టానికి అత్రి మహర్షి కూడా ఆవేదన చెంది, గంగాధరుడైన పరమశివుడిని ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించాడు. రోజుల తరబడి ఆయన తపస్సు కొనసాగుతున్నా, కామదారణ్యంలో చినుకు జాడ లేదు. అనసూయ తపోనిష్ఠలో ఉన్న భర్తను సేవించుకుంటూనే, ఆశ్రమంలో మట్టితో ఒక పార్థివ శివలింగాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజించసాగింది. అనసూయ నియమనిష్ఠలకు, అత్రి మహర్షి తపస్సుకు పరవశుడైన పరమశివుడు గంగా పార్వతీ సమేతంగా కామ్యదారణ్యానికి అరుదెంచాడు. తగిన తరుణం కోసం అక్కడే వేచి ఉండసాగాడు.ఒకనాడు అత్రిమహర్షి ధ్యానసమాధి నుంచి బయటకు వచ్చాడు.‘దాహంగా ఉంది. మంచినీళ్లు తీసుకురా’ అని భార్యను కోరాడు.ఆ సమయానికి ఆశ్రమంలో చుక్కనీరైనా లేకపోవడంతో అనసూయ కలశాన్ని తీసుకుని, అడవిలోకి వెళ్లింది. ఎక్కడైనా నీటిజాడ కనిపిస్తుందేమోనని వెదుకుతూ ముందుకు సాగింది. ఎంత దూరం వెళ్లినా ఆమెకు ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. అనసూయ నీటి కోసం వెదుకుతూ అలా ముందుకు వెళుతుండగా, ఒకచోట గంగాదేవి ఒక గిరిజన వనిత రూపంలో కనిపించింది. ‘ఎవరమ్మా నువ్వు! ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?’ అని ఆమె అనసూయను ప్రశ్నించింది.‘చిరకాలం తపస్సమాధిలో ఉన్న నా భర్త ఇందాకే తపో విరమణ చేశాడు. ఆయన దాహార్తితో నీళ్లు తెమ్మన్నాడు. అందుకే నీటి కోసం వెదుకుతున్నాను. దగ్గరలో నీరు దొరికే చోటు నీకేమైనా తెలిస్తే చెప్పవా?’ అభ్యర్థించింది అనసూయ.‘ఇక్కడే నువ్వు నిలుచున్న తావునే చేయిలోతు గోతిని తవ్వు. నీళ్లు దొరుకుతాయి’ అని చెప్పిందామె.అనసూయ ఆమె చెప్పినట్లే అక్కడ గొయ్యి తవ్వింది. చేయిలోతు తవ్వగానే స్వచ్ఛమైన నీరు ఉబికి వచ్చింది. ఆ నీటితో అనసూయ కలశాన్ని నింపుకుంది. చూస్తుండగానే అక్కడ స్వచ్ఛజలంతో నిండిన చక్కని తటాకం ఏర్పడింది. ‘కరుణామయీ! నువ్వు దేవతాస్త్రీలా ఉన్నావు. దయచేసి నేను నా భర్తతో కలసి తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఉండవూ! ఇప్పుడే మేమిద్దరం వచ్చి నీ దర్శనం చేసుకుంటాము’ అని అభ్యర్థించింది అనసూయ.ఆమె సరేనని పలికింది.అనసూయ ఆశ్రమానికి చేరుకుని, భర్తకు మంచినీరు ఇచ్చింది. ఆయన తృప్తిగా నీరుతాగి, ‘ఎక్కడా చినుకు జాడ లేకున్నా, ఇంత స్వచ్ఛమైన నీరు ఎక్కడ దొరికింది?’ అని ఆశ్చర్యంగా అడిగాడు.అనసూయ భర్తకు జరిగినదంతా చెప్పింది. వెంటనే ఇద్దరూ కలసి అడవిలో జలతటాకం ఏర్పడిన చోటుకు వెళ్లారు. అప్పటి వరకు గిరిజన వనిత రూపంలో ఉన్న గంగాదేవి వారికి నిజరూపంలో దర్శనమిచ్చింది. ‘ఏ వరం కావాలో కోరుకోండి’ అని ఆ దంపతులను అడిగింది.‘తల్లీ! ఈ తపోవనంలో నువ్వు నిత్యనివాసం ఉండాలి’ అని వారు ప్రార్థించారు.‘మీ దంపతులు ఏడాదికాలం శివార్చన ఫలాన్ని ధారపోస్తే ఇక్కడే శాశ్వతంగా ఉంటాను’ అని పలికింది గంగ.వెంటనే అత్రి మహర్షి, అనసూయ దంపతులు తమ శివార్చన ఫలాన్ని ధారపోశారు. వారి దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీసమేతంగా ప్రత్యక్షమయ్యాడు. ముని దంపతుల కోరికపై అనసూయ అర్చిస్తూ వచ్చిన పార్థివలింగంలోకి తేజోరూపంలో లీనమయ్యాడు. అనసూయ అర్చించిన ఆ శివలింగమే అత్రీశ్వర లింగంగా పురాణ ప్రసిద్ధి పొందింది.∙సాంఖ్యాయన -
అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్
ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మారిన ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) కో–ఫౌండర్ సాదిక్ ఇష్రార్ షేక్– భత్కల్లో తన పరిచయాలను వాడుకుని అక్కడి వారినీ ఐఎంలో చేర్చుకున్నాడు. 2005 నుంచి విధ్వంసాలు ప్రారంభించిన ఐఎం పేరు 2007లో బయటకు పడింది. ఈ ఉగ్రవాదుల గుట్టు 2008లో వీడింది. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్కు చెందిన సాదిక్ ఇష్రార్ షేక్ మాదిరిగానే కర్ణాటకలోని భత్కల్కు చెందిన అన్నదమ్ములు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్లకూ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్తో (సిమి) సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ముగ్గురికీ పరిచయం ఏర్పడింది. రియాజ్, ఇక్బాల్లు ముంబైలో ఉంటూ గ్యాంగ్స్టర్స్గా మారారు. అక్కడే ‘ఆర్ఏఎన్ గ్యాంగ్’ పేరుతో ఓ ముఠా ఏర్పాటు చేసి, నేరాలు చేసేవారు. ఓ హత్య కేసులో ముంబై పోలీసుల నుంచి ఒత్తిడి పెరగటంతో భత్కల్కు వెళ్లి కొన్నాళ్లు షెల్టర్ తీసుకున్నారు. తర్వాత ఈ ఇద్దరూ కూడా సాదిక్ బాటలోనే ఐఎంలో చేరారు. భత్కల్ సోదరులు, సాదిక్ కలిసి ఐఎంలోకి అటు ఆజంగఢ్, ఇటు భత్కల్ ప్రాంతాలకు చెందిన పలువురు యువకుల్ని చేర్చారు. వీరిలో కొందరు అక్రమంగా సరిహద్దులు దాటి వెళ్లి పాక్లో శిక్షణ పొంది వచ్చారు. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించిన ఈ దేశవాళీ ఉగ్రవాద సంస్థ పేలుడు పదార్థాలనూ స్థానికంగానే సమకూర్చుకుంది. వారణాసిలోని దశాశ్వమేధఘాట్లో 2005 ఫిబ్రవరి 23న తొలి పేలుడుకు పాల్పడింది. అదే ఏడాది జూలై 29న యూపీలో శ్రమ్జీవి ఎక్స్ప్రెస్, అక్టోబర్ 29న ఢిల్లీలోని సరోజినీ మార్కెట్, 2006 మార్చి 7న వారణాసిలోని సంకట్ మోచన్ ఆలయం, అదే ఏడాది జూలై 11న ముంబై లోకల్ రైళ్లు, 2007 మే 22న గోరఖ్పూర్లో, అదే ఏడాది ఆగస్టు 25న హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీ పార్క్ లేజేరియంల్లో పేలుళ్లకు పాల్పడి అనేక మందిని పొట్టనపెట్టుకుంది. అయినా ఇదంతా చేస్తున్నదెవరో ఏ ఒక్క నిఘా సంస్థకూ తెలియలేదు. 2007 నవంబర్ 23న లక్నో, ఫరీదాబాద్, వారణాసిల్లో వరుస పేలుళ్లు జరిగాయి. దీనికి కొన్ని నిమిషాల ముందు వివిధ మీడియా సంస్థలకు ఓ ఈ–మెయిల్ వచ్చింది. దీని ద్వారానే తొలిసారిగా ఇండియన్ ముజాహిదీన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ ఉగ్రవాద సంస్థ పేరు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా నిఘా సంస్థలు చాన్నాళ్ల వరకు ఏమీ చేయలేకపోయాయి. ఫలితంగా 2008 మేలో జైపూర్ పేలుళ్లు జరిగాయి. తర్వాత ఐఎం ఉగ్రవాదులు ఆ ఏడాది జూలైలో గుజరాత్ను టార్గెట్ చేశారు. అహ్మదాబాద్లో భారీ విధ్వంసానికి కుట్రపన్నారు. ఈ ఆపరేషన్కు ‘ది పూల్ ఆఫ్ ఆల్ టెర్రరిస్టు’ అని పేరుపెట్టి, ఐఎం 2008 జూలై 26న అహ్మదాబాద్లో 17 పేళ్లకు పాల్పడ్డారు. సూరత్లోనూ కొన్ని పేలని బాంబులు పోలీసులకు దొరికాయి. ఈ బాంబుల్లో కొన్నింటిని ఉగ్రవాదులు వాహనాల్లో అమర్చారు. అక్కడే ఐఎం గుట్టు వీడటానికి అవసరమైన తొలి ఆధారం దొరికింది. రియాజ్ భత్కల్ కుర్లాలో ఉండగా బాంద్రాలో యాద్గార్ ఫ్యామిలీ రెస్టరెంట్ నిర్వహించే అఫ్జల్ ఉస్మానీతో పరిచయం ఏర్పడింది. ఒకప్పుడు వాహన చోరీలకు పాల్పడిన ఇతడికి ముంబైలో ఉన్న అనేక మంది దొంగలతో పరిచయాలు ఉన్నాయి. అహ్మదాబాద్లో వరుస పేలుళ్లకు పథకం వేసిన సాదిక్, రియాజ్లు అందుకు అవసరమైన వాహనాల సరఫరా బాధ్యతల్ని అఫ్జల్ ఉస్మానీకి అప్పగించారు. ఉస్మానీ ముంబైలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాహన చోరులతో కార్లను దొంగతనం చేయించి; వాటిని అహ్మదాబాద్, సూరత్లకు చేర్చాడు. ఈ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు రియాజ్ ఆదేశాల మేరకు ఆతిఫ్ అమీన్ అనే ఐఎం ఉగ్రవాది ముంబై వెళ్లి అఫ్జల్ను కలిశాడు. పేలుళ్లు జరిగిన వెంటనే వారిద్దరూ అక్కడి నుంచి రైలులో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి జామియానగర్లోని బాట్లా హౌస్ అపార్ట్మెంట్ ఫ్లాట్లో కొన్నాళ్లు ఉండి వచ్చేశారు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసు దర్యాప్తు చేసిన ఆ రాష్ట్ర ఏటీఎస్ అధికారులు వాహనాల నంబర్ల ఆధారంగా ముంబైలో చోరీ అయినట్లు గుర్తించారు.దీంతో మహారాష్ట్ర ఏటీఎస్, క్రైమ్బ్రాంచ్లు రంగంలోకి దిగి, నలుగురు వాహనచోరుల్ని పట్టుకుని విచారించాయి. అఫ్జల్ ఉస్మానీ ఆదేశాల మేరకు పని చేశామని వారు వెల్లడించారు. అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఉస్మానీ 2008 ఆగస్టు 21న ఉత్తరప్రదేశ్లో చిక్కాడు. ఇతడి ఇంటరాగేషన్లోనే రియాజ్ పేరు, ఇతర వివరాలు బయటపడ్డాయి. తనకు వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదని చెప్పిన ఉస్మానీ– ఓసారి మాత్రం బాట్లా హౌస్కు వెళ్లానని, అక్కడి ఎల్–18 ఫ్లాట్లో డెన్ ఉందని బయటపెట్టాడు. ఆ అపార్ట్మెంట్పై నిఘా పెట్టిన అహ్మదాబాద్, ముంబై పోలీసులు అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని, వారి వద్ద ఆయుధాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులను అప్రమత్తం చేశారు. 2008 సెప్టెంబర్ 19న ఇన్స్పెక్టర్ మోహన్చంద్ శర్మ నేతృత్వంలోని బృందం ఆ ఫ్లాట్పై దాడి చేసింది. అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో ఇన్స్పెక్టర్ శర్మతో పాటు ఉగ్రవాదులు ఆతిఫ్ అమీన్, మహ్మద్ సాజిద్ చనిపోయారు. ఆ ఎన్కౌంటర్లో సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది ఆరిజ్ ఖాన్ విచారణలో ఐఎం గుట్టు వీడి, ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభమై దుశ్చర్యలకు బ్రేక్ పడింది.(బాట్లా హౌస్ ఎన్కౌంటర్ తర్వాత దేశ వ్యాప్తంగా అరెస్టులు జరిగాయి. వీటిని తప్పించుకోవడానికి రియాజ్, ఇక్బాల్, సాదిక్ సహా అనేక మంది గజ ఉగ్రవాదులు హైదరాబాద్ బాటపట్టారు. ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఎవరి వద్ద షెల్టర్ పొందారు..? తదితర వివరాలతో తుది భాగం ‘చలో హైదరాబాద్!’ వచ్చే వారం)-శ్రీరంగం కామేష్ -
టీనేజర్లకు డిజిటల్ డిసిప్లిన్...
టీనేజర్ల చేతుల్లో సెల్ ఫోన్ కేవలం ఒక పరికరం కాదు, వారి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ఒకప్పుడు ‘పదో తరగతి దాటాక ఫోన్ కొనిస్తాం’ అనే మాటలు వినిపించేవి. కాని, నేడు ఆరో తరగతి విద్యార్థుల వద్ద కూడా స్మార్ట్ఫోన్లు దర్శనమిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ నిప్పులాంటిది. దాన్ని వంట వండుకోవడానికి వాడుకోవచ్చు లేదా ఇల్లు తగలబెట్టుకోవడానికి వాడుకోవచ్చు. టీనేజర్లకు సెల్ ఫోన్ వాడకంలో స్వీయ నియంత్రణ నేర్పించడం ఒక కళ. ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు. ఓపికతో, ప్రేమతో, శాస్త్రీయ అవగాహనతో వారిని డిజిటల్ ప్రపంచంలో సురక్షితంగా ప్రయాణించేలా తీర్చిదిద్దడం నేటి తరం తల్లిదండ్రుల బాధ్యత. అదెలాగో ఈరోజు తెలుసుకుందాం. మెదడుపై డిజిటల్ ప్రభావంటీనేజ్ అనేది మానవ జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో మెదడులోని ‘ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్’ అనే భాగం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం, ఉద్వేగాలను అదుపు చేసుకోవడం, పర్యవసానాలను అంచనా వేయడం ఈ భాగం బాధ్యత.మరోవైపు, సోషల్ మీడియా యాప్స్ అన్నీ ‘డోపమైన్’ అనే రసాయనాన్ని విడుదల చేసేలా రూపొందించారు. ఒక ‘లైక్’ లేదా ‘నోటిఫికేషన్’ వచ్చినప్పుడు మెదడులో రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అందుకే టీనేజర్లు అంత త్వరగా వాటికి అడిక్ట్ అవుతారు. అలాగని వాళ్లనుంచి ఫోన్ తీసేయడం పరిష్కారం కాదు. అది వారిని మరింత మొండిగా మారుస్తుంది. దానికి బదులుగా ‘డిజిటల్ క్రమశిక్షణ’ నేర్పించాలి. అంటే టీనేజర్లను శిక్షించడం కాదు, వారి మెదడును రీవైరింగ్ చేయడం అని గుర్తుంచుకోండి.డిజిటల్ డీ–అడిక్షన్ యాక్షన్ ప్లాన్...1. క్రమంగా తగ్గించడం: ఒక్కసారిగా ఫోన్ లాగేసుకుంటే పిల్లల్లో ‘విత్ డ్రాయల్ సింప్టమ్స్’ వస్తాయి. అందువల్ల ప్రతి వారం వారి స్క్రీన్ టైమ్ను 15–20 నిమిషాలు తగ్గిస్తూ రండి.2. గ్రే స్కేల్ మోడ్: ఫోన్లోని రంగులు మన మెదడును ఆకర్షిస్తాయి. పిల్లల ఫోన్ సెట్టింగ్స్లో ‘గ్రేస్కేల్’ మోడ్ ఆన్ చేయండి. దీంతో మెదడుకు ఆ ఫోన్ పట్ల ఆసక్తి క్రమంగా తగ్గుతుంది. ఇది ఒక శక్తిమంతమైన సైకలాజికల్ ట్రిక్.3.డిజిటల్ కాంట్రాక్ట్: తల్లిదండ్రులు, పిల్లలు కూర్చుని ఒక ఒప్పందం రాసుకోవాలి. నో ఫోన్ జో¯Œ ్స, నో ఫోన్ టైమ్స్ స్పష్టంగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కూడా ముందే నిర్ణయించాలి. అలారం కోసం స్మార్ట్ఫోన్ కాకుండా విడిగా ఒక ‘అలారం క్లాక్’ కొనివ్వండి.4. డిజిటల్ లిటరసీ: ‘నువ్వు వాడుతున్న యాప్ ఉచితం అయితే, అక్కడ నువ్వే ఒక ప్రొడక్ట్వి’ అనే నిజాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అల్గారిథమ్స్ మనల్ని ఎలా బానిసలుగా మారుస్తాయో శాస్త్రీయంగా వివరించాలి.5. ప్రత్యామ్నాయ వ్యాపకాలు: మెదడు డోపమైన్ కోసం ఫోన్ను ఆశ్రయిస్తుంది. దానికి బదులుగా క్రీడలు, సంగీతం, పెయింటింగ్ లేదా ఇతర హాబీలను ప్రోత్సహించాలి. శారీరక శ్రమ వల్ల విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఫోన్ ఇచ్చే తాత్కాలిక సంతోషం కంటే మిన్నగా ఉంటాయి.6. డిజిటల్ కరెన్సీ సిస్టమ్: వారికి ఒక రివార్డ్ సిస్టమ్ ఏర్పాటు చేయండి. ఉదాహరణకు, ‘ఈ రోజు నువ్వు ఫిజికల్ రీడింగ్ లేదా ఇంట్లో సహాయం చేస్తే, దానికి బదులుగా నీకు 30 నిమిషాల ఎక్స్ట్రా గేమ్ టైమ్ వస్తుంది.’ దీనివల్ల వారు ఫోన్ సమయాన్ని ఒక ప్రివిలేజ్గా భావిస్తారు తప్ప హక్కుగా కాదు.7. ప్రొఫెషనల్ హెల్ప్: ఫోన్ లేకపోతే మీ పిల్లల్లో విపరీతమైన ఆందోళన, ఆహారం మానేయడం లేదా ఒంటరిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే, అది తీవ్రమైన అడిక్షన్ కావచ్చు. అటువంటప్పుడు ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది.మీరే వారి రోల్ మోడల్మీరు చేతిలో ఫోన్ పట్టుకుని, పిల్లలను ఫోన్ పక్కన పెట్టమంటే వారు వినరు. మనస్తత్వశాస్త్రంలో దీనిని ‘అబ్జర్వేషనల్ లెర్నింగ్‘ అంటారు.» ఆఫీసు నుంచి ఇంటికి రాగానే కనీసం ఒక గంట పాటు మీ ఫోన్ను పక్కన పెట్టండి.»పిల్లలతో ‘ఐ కాంటాక్ట్’ కలిపి మాట్లాడండి.»మీరు సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతున్నారో గమనించుకోండి.» గ్యాడ్జెట్స్ కంటే గొప్ప కనెక్షన్ మన మనుషుల మధ్య ఉండాలని గుర్తుంచుకోండి.- సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ -
ఊహా స్వర్గాలు... విఫల నగరాలు
సత్సంకల్పంతో ప్రారంభమైన కొన్ని నగరాలు చరిత్రలో నిలిచిపోతాయి. శతాబ్దాలు గడిచినా, తరతరాల జనావాసాలుగా కళకళలాడుతూ ఉంటాయి. సంకల్పశుద్ధి లేకుండా, భ్రమాత్మకమైన అంచనాలతో, అత్యాశతో, అనవసర స్పర్థలతో ప్రారంభించ తలపెట్టిన కొన్ని నగరాలు కార్యరూపం దాల్చకుండానే కనుమరుగైపోతాయి. అలాంటి నగరాల్లో కొన్ని అరకొర నిర్మాణాలతో కాలగతిలో అధోగతికి చేరుకుంటాయి. అవి కేవలం ఊహాస్వర్గాలుగా మాత్రమే మిగిలిపోతాయి. వనరుల వృథాకు, మానవశ్రమ వృథాకు కారణభూతమైన ఇలాంటి విఫల నగరాలు ప్రపంచంలో ఉన్నాయి. జనాలకు ఉపాధి లేకుండా, ఉత్పాదక కార్యకలాపాలు లేకుండా, కనీసం పర్యాటకుల రాకపోకలైనా లేకుండా భూతాల నిలయాల్లా కనిపించే అలాంటి కొన్ని విఫల నగరాల కథా కమామిషు తెలుసుకుందాం...జింగోనియా- ఇటలీఇటలీలోని అత్యంత పురాతన నగరాల్లో మిలాన్ ఒకటి. ప్రపంచ ఫ్యాషన్ రాజధానిగా పేరుపొందిన మిలాన్ నగరానికి ఆనుకొని, దానికి దీటైన నగరాన్ని నిర్మించాలని రోమన్ వాణిజ్యవేత్త రెంజో జింగోనె తలపెట్టాడు. జింగోనియా పేరుతో 1960లలో యాభైవేల జనాభా నివాసానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసి, నగర నిర్మాణాన్ని ప్రారంభించాడు. కార్మికుల వసతి కోసం జింగోనె ఈ నగర నిర్మాణానికి సంకల్పించాడు. వివిధ పరిశ్రమల కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు కర్మాగారాలకు చేరువలోనే ఆవాసాలను ఏర్పాటు చేస్తే, వారి రవాణా సమయం తగ్గి, ఉత్పాదకత పెరుగుతుందని ఆశించాడు.జింగోనియా నగరంలో కార్మికులకు ఇళ్లతో పాటు వారి అవసరాలకు అనుగుణంగా షాపింగ్ మాల్, ఆస్పత్రి, భారీస్థాయి హోటల్, క్రీడా మైదానం, హెలికాప్టర్ల రాకపోకల కోసం హెలిపోర్ట్ వంటి వాటితో భారీ ప్రణాళికను సిద్ధం చేసి, మొదలుపెట్టిన జింగోనియా నగర నిర్మాణం విఫలమైంది. ఐదు పట్టణాల సరిహద్దులకు అనుబంధంగా చేపట్టిన ఈ నగర నిర్మాణం పౌర సేవలు అందించడంలో, పాలనలోను వైఫల్యం వల్ల జనాలకు ఎందుకూ పనికిరాకుండా మిగిలింది. ప్లాన్ వాజిన్ - ఫ్రాన్స్ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ జనసమ్మర్దానికి, పారిశుద్ధ్య సమస్యలకు పరిష్కారంగా తలపెట్టిన నగరం ప్లాన్ వాజిన్. సెంట్రల్ ప్యారిస్ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, ఆ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పునర్నిర్మించడంతో పాటు సేన్ నది కుడివైపు ఒడ్డున ఆధునిక అవసరాలకు తగిన రీతిలో ప్రణాళికాబద్ధంగా నిర్మించ తలపెట్టిన నగరం ఇది. ఫ్రాన్స్లో స్థిరపడిన స్విస్ ఆర్కిటెక్ట్ ల కార్బ్యూజీర్ బహుళ అంతస్తుల భవంతులతో కూడిన ఈ అధునాతన నగర నిర్మాణం కోసం 1925లో ప్రణాళికను సిద్ధం చేశాడు. దీనికోసం సెంట్రల్ ప్యారిస్ నుంచి ప్యారిస్ శివారు ప్రాంతాలకు తరలిపోవడానికి సంపన్న ఉద్యోగ వర్గాలు సిద్ధపడినా, అదే ప్రాంతంలో తరతరాలుగా ఉంటున్న భూస్వాములు మాత్రం తమకు అలవాటైన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేందుకు నిరాకరించారు.కొంతమంది ఇళ్లు ఖాళీ చేసి తరలిపోవడంతో సేన్ నది కుడివైపు ఒడ్డున దాదాపు ఆరువందల ఎకరాల స్థలంలోని పాత కట్టడాలను పడగొట్టారు. మిగిలిన జనాలను కూడా ఇక్కడి నుంచి శివార్లకు తరలించి, ఈ ప్రదేశంలో ఒకేలాంటి అరవై అంతస్తుల ఆకాశ హర్మ్యాలను నిర్మించాలని అనుకున్నా, అది సాధ్యపడలేదు. ఖాళీ చేయడానికి మొండికేసిన భూస్వాములు నగరపాలక అధికారులపై పట్టు బిగించారు. భూస్వాముల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు– నది ఒడ్డున ఏకంగా అరవై అంతస్తుల భవంతులు నిర్మించడం వల్ల సమస్యలు తలెత్తవచ్చంటూ కార్బ్యూజీర్ ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఫలితంగా ఇది కార్యరూపం దాల్చకుండా శాశ్వతంగా మూలపడింది. టెలోసా - అమెరికాఅగ్రరాజ్యమైన అమెరికాలో భూతలస్వర్గంలాంటి నగరాన్ని నిర్మించాలని అపరకుబేరుడు మార్క్ లోర్ తలపెట్టాడు. మార్క్ లోర్ సంకల్పం మరీ భూతకాలంలోనిది కాదు, ఇట్టిటీవలిదే! ఆయన 2021లో టెలోసా పేరుతో లక్షన్నర ఎకరాల విస్తీర్ణంలో అమరధామంలాంటి అద్భుత ఆత్మనిర్భర, సుస్థిర నగరాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించాడు. ఒక నగరాన్ని నిర్మించాలంటే దశాబ్దాలు పట్టే పరిస్థితులు ఉంటాయి కదా, అలాంటిది ఐదేళ్లలోనే దీనిని విఫల నగరంగా ఎలా జమకట్టేస్తారనే అనుమానం వస్తోందా? ఎందుకంటే, ఈ నగరం కోసం ఇప్పటి వరకు ఎక్కడా భూమి కొనుగోలు చేయలేదు. ఇప్పటి వరకు దీనిని కచ్చితంగా ఎక్కడ నిర్మించదలచుకున్నదో కూడా తేల్చుకోలేదు. నెవాడ, యూటా, అరిజోనా, టెక్సస్, అపలాషియా ప్రాంతాల్లో ఏదో ఒకచోట దీనిని నిర్మించనున్నామని, 2030 నాటికల్లా ఈ నగరాన్ని యాభైవేల మంది నివసించేలా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. ఇప్పటి వరకు కేవలం కాగితాలకు, వెబ్సైట్కు మాత్రమే పరిమితమైన ఈ నగరం 2030 నాటికి ఒక ఆకారాన్ని సంతరించుకునే పరిస్థితులు కనుచూపు మేరలో లేవు కాబట్టి, ఇది కూడా విఫల నగరంగానే మిగిలిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.కాలిఫోర్నియా సిటీ - అమెరికాఅమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన నగరం కాలిఫోర్నియా సిటీ. కాలిఫోర్నియాలోని అతిపెద్ద నగరాలైన లాస్ ఏంజెలెస్, శాండియాగోలకు దీటైన నగరాన్ని నిర్మించాలని అమెరికన్ రియల్టర్ న్యాట్ మెండల్సన్ సంకల్పించుకున్నాడు. లాస్ ఏంజెలెస్కు ఈశాన్యాన సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని మోహవీ ఎడారి ప్రాంతంలో 82 వేల ఎకరాల స్థలాన్ని 1958లో కొనుగోలు చేశాడు. ఈ ఎడారి నేలలో నగర నిర్మాణాన్ని 1965లో ప్రారంభించాడు. ప్రారంభ దశలో 1.40 లక్షల జనాభా ఆవాసానికి తగిన విధంగా రహదారులు, నివాస భవనాలు, విమానాశ్రయం, గోల్ఫ్కోర్స్, విశాలమైన స్విమింగ్ పూల్, జైలు భవనం సహా పలు భారీ నిర్మాణాలు జరిపించాడు. నివాస భవనాల నిర్మాణాన్ని ప్రారంభించడానికి ముందే కిలోమీటర్ల కొద్ది విశాలమైన రోడ్లు నిర్మించారు.అనుకున్న సంఖ్యలో నివాస భవంతుల నిర్మాణం చేపట్టడంలో మెండల్సన్ విఫలమయ్యాడు. లాస్ ఏంజెలెస్పై స్పర్థతో అతడు ప్రారంభించిన ఈ నగరం ప్రస్తుతం జనసంచారం లేక మరుభూమిలా మిగిలింది. ఎడారి ప్రాంతంలో నిర్మించిన ఈ నగరం చివరకు ఎడారిలా మారిందని జనాలు వాపోవడం తప్ప దీనివల్ల సాధించినదేమీ లేదు. దీని నిర్మాణం కోసం చేసిన భారీ వ్యయమంతా వృథాగా మారింది. మెండల్సన్ ఇక్కడ నగరాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించగానే, చాలామంది ఈ ప్రాంతంలో స్థలాలు కొనుగోలు చేశారు. వారందరికీ కోలుకోలేని నష్టమే మిగిలింది. అలైస్ సిటీ - జపాన్జపాన్ రాజధాని టోక్యో నగరం జనసమ్మర్దంతో కిక్కిరిసి పోతుండటంతో దీనికి పరిష్కారంగా భూగర్భ నిర్మాణాన్ని తలపెట్టింది ఒక నిర్మాణ సంస్థ. టోక్యో నగరానికి దిగువన సమస్త సౌకర్యాలతో స్వర్గతుల్యమైన భూగర్భ నగరాన్ని నిర్మించడానికి జపానీస్ నిర్మాణ సంస్థ టాయ్సీ కార్పొరేషన్ 1989లో ప్రణాళికను కూడా రూపొందించింది. భూగర్భంలో బహుళ అంతస్తులతో నిర్మించ తలపెట్టిన ఈ నగరానికి అలైస్ సిటీ అని నామకరణం చేసింది. టౌన్ స్పేస్, ఆఫీస్ స్పేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ అనే మూడు విభాగాలతో ఈ నగర ప్రణాళికను పకడ్బందీగా తయారు చేసింది.టౌన్ స్పేస్లో నివాస భవనాలు, పార్కులు, సినిమా థియేటర్ల వంటి వినోద కేంద్రాలు; ఆఫీస్ స్పేస్లో కార్యాలయ భవనాలు, హోటళ్లు, క్లబ్బులు, పబ్బులు వంటి నిర్మాణాలు; ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో నగరం అంతటికీ సౌర విద్యుత్తు సరఫరాకు అవసరమైన సోలార్ డోమ్స్, మంచినీటి సరఫరా కేంద్రం, టోక్యో నగరం నుంచి రాకపోకలు జరిపేందుకు వీలుగా భూగర్భ మెట్రో రైలు మార్గం వంటి మౌలిక వసతులను నిర్మించాలని సంకల్పించుకుంది. అలైస్ సిటీ తలపెట్టిన అనతికాలంలో జపాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. మరోవైపు, భూగర్భంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టినా, అగ్నిప్రమాదాల వంటి విపత్తులు సంభవిస్తే జనాల ప్రాణాలకు భద్రత కల్పించడం సాధ్యమయ్యే పరిస్థితులు కూడా లేకపోవడంతో ఇది ప్రతిపాదనలకు, కాగితాల మీద రూపొందించిన ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైంది. మాడర్ఫాంటీన్ - దక్షిణాఫ్రికాదక్షిణాఫ్రికాలో జోహాన్నెస్బర్గ్కు చేరువలోనే మరో అద్భుత నగరాన్ని నిర్మించే ప్రతిపాదనతో చైనీస్ రియల్ ఎస్టేట్ డెవలపర్ షాంఘై జెండాయ్ 2013లో ముందుకొచ్చాడు. ఈ ప్రతిపాదనకు జౌటెంగ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా, జోహాన్నెస్బర్గ్ మునిసిపల్ అధికారులు మాత్రం దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రావిన్షియల్ ప్రభుత్వం వరుస మీడియా సమావేశాలు నిర్వహించింది. జోహాన్నెస్బర్గ్ పక్కనే ‘దక్షిణాఫ్రికా న్యూయార్క్’ నగరం సిద్ధమవుతోందని పత్రికలు, టీవీ చానెళ్లు కథనాలతో ఊదరగొట్టాయి. దాదాపు నాలుగువేల ఎకరాల స్థలంలో నిర్మించ తలపెట్టిన ఈ నగరం కోసం 8400 కోట్ల రాండ్లు (రూ.47 వేల కోట్లు) పెట్టుబడి పెట్టడానికి జౌటెంగ్ ప్రావిన్షియల్ ప్రభుత్వం సంసిద్ధత ప్రకటించింది.అధునాతన నగర నిర్మాణం కోసం జెండాయ్ స్థలం కూడా కొనుగోలు చేశాడు. దురదృష్టవశాత్తు దక్షిణాఫ్రికా ఆర్థిక ఇక్కట్లలో చిక్కుకుంది. మరోవైపు స్థానిక అధికారుల నుంచి జెండాయ్ని నమ్ముకుని వచ్చిన విదేశీ పెట్టుబడిదారులకు సమస్యలు మొదలయ్యాయి. అనుకున్న ప్రకారం నిర్మాణాలు మొదలు పెట్టాలనుకున్న నాటి నుంచి అధికారుల నుంచి అడుగడుగునా సహాయ నిరాకరణ ఎదురవడంతో పెట్టుబడిదారులు వెనక్కు తగ్గారు. ఆరంభంలో ఎంత ఊదరగొట్టినా, ఏళ్లు గడిచినా ఇక్కడ తలపెట్టిన నిర్మాణాలేవీ మొదలు కాలేదు. క్రమంగా జనాల్లో కూడా దీనిపై ఆసక్తి సన్నగిల్లింది. చివరకు కార్యరూపం దాల్చకుండానే మాడర్ఫాంటీన్ నగర ప్రణాళిక అటకెక్కింది. డోంగ్టాన్ - చైనాచైనాలోని షాంఘై పరిధిలో ఉన్న చాంగ్మింగ్ దీవిలో తలపెట్టిన ‘ఎకో సిటీ’ డోంగ్టాన్. బ్రిటిష్ ఇంజినీరింగ్ సంస్థ ‘అరూప్’ షాంఘై పారిశ్రామిక పెట్టుబడుల సంస్థతో (ఎస్ఐఐసీ) కలసి 2005లో ఈ నగర నిర్మాణానికి సంకల్పించింది. ‘అరూప్’ లండన్ కార్యాలయం నుంచి ఈ ప్రాజెక్టును ప్రపంచ ప్రఖ్యాత సివిల్ ఇంజినీర్ పీటర్ హెడ్ పర్యవేక్షిస్తూ వచ్చారు. షాంఘై కమ్యూనిస్టు పార్టీ అధినేత చెన్ లియాంగ్యు రాజకీయంగా అండగా నిలిచారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘వరల్డ్ అర్బన్ ఫోరమ్’ వేదికపై ఈ ఎకో సిటీ నమూనాను ప్రదర్శించి, ‘అరూప్’ సంస్థ ప్రశంసలు పొందింది. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి సుస్థిర, పర్యావరణహిత నగరంగా ‘డోంగ్టాన్’ నగరం రూపుదిద్దుకోనున్నట్లుగా మీడియా కథనాలు వెల్లువెత్తాయి.ఆర్థిక ఇబ్బందులు లేవు, ఆరంభంలోనే రాజకీయ ఆటంకాలు ఎదురవలేదు. ఇన్ని సానుకూలతలు ఉన్నాక ఇప్పటికే ఈ నగర నిర్మాణం ఒక కొలిక్కి వచ్చి ఉండాలి. అయినా, ఇది నేటికీ ప్రణాళికలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టుకు ఏమాత్రం సంబంధం లేని పింఛను కుంభకోణంలో చెన్ లియాంగ్యు, కీలకమైన ఆయన మద్దతుదారులు 2008లో అరెస్టయ్యారు. అనుకోని ఈ పరిణామంతో ‘అరూప్’ సంస్థకు రాజకీయ అండ కొరవడింది. అయినా వెనక్కు తగ్గకుండా ‘అరూప్’ సంస్థ ఈ ప్రాజెక్టు నమూనాను 2010లో జరిగిన ‘షాంఘై వరల్డ్ ఎక్స్పో’లో ప్రదర్శించింది.ఆ కార్యక్రమానికి హాజరైన నాయకులు దీనిని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడారు. నగర నిర్మాణానికి భూకేటాయింపులు కూడా జరిగాయి. అయితే, రాజకీయ నాయకుల అంతర్గత కుమ్ములాటలు, అవినీతి వ్యవహారాల కారణంగా పెట్టుబడిదారులు వెనక్కు తగ్గారు. క్రమంగా వార్తా కథనాల్లో కూడా ‘డోంగ్టాన్’ ప్రస్తావన వినిపించడం మానేసింది. తర్వాత చడీచప్పుడూ లేకుండా ఈ నగర నిర్మాణ ప్రణాళిక మూలపడింది. -
గులాబీ... ధర గుభేల్
గులాబీలు గుబాళించడం సహజమే గాని, ఈ గులాబీ గుబాళించడమే కాదు, దీని ధర తెలుసుకుంటే మాత్రం గుండె గుభేల్మంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన గులాబీ. అలాగని ఇది సహజసిద్ధమైన జాతికి చెందిన గులాబీ కాదు, ఇంగ్లిష్ ఉద్యాన శాస్త్రవేత్త డేవిడ్ ఆస్టిన్ సృష్టి. పదిహేనేళ్లు నిర్విరామంగా కృషి చేసి, సృష్టించిన ఈ గులాబీకి ‘జూలియెట్ రోజ్’ అని పేరు పెట్టారు.తొలిసారిగా 2006లో దీనిని మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు ఒక్కో పువ్వు మూడు మిలియన్ డాలర్ల (రూ.27.22 కోట్లు) ధర పలికింది. అందువల్ల దీనికి ‘త్రీ మిలియన్ రోజ్’ అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఈ గులాబీ ధర ఏకంగా 15.8 మిలియన్ డాలర్లకు (రూ.143.36 కోట్లు) చేరుకుంది. దీని ధర బంగారాన్ని మించి పెరుగుతూ పోతున్నా, ప్రపంచంలోని అపరకుబేరులు మాత్రం దీనిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతూనే ఉండటం విశేషం. -
కరిగిపోతున్న కలర్స్
రాత్రి నిద్రలో కలలో ఇంద్రధనుస్సు వచ్చి గుడ్బై చెప్పి వెళ్లిపోతే? ఉదయం లేచేసరికి ఆకాశం నీలంగా కాకుండా బూడిద రంగులో కనిపిస్తే? కళ్ల ముందు కనిపించే ప్రతి దృశ్యం ఒక నలుపు–తెలుపు ఫొటోలాగా మారిపోతే? మన వీథులు, ఇళ్లు, దుస్తులు, సినిమాలు, లోగోలు అన్నీ ఒకే నీరసపు ఛాయలోకి జారిపోతే? ఇది ఊహ కాదు, ఇదే మన ప్రస్తుత వాస్తవం! ఎందుకంటే, ప్రపంచం నిశ్శబ్దంగా, నెమ్మదిగా, ఎవరికీ తెలియకుండానే తన రంగుల్ని కోల్పోతోంది. మెరుపులు మసకబారుతున్నాయి; పచ్చని జీవం క్రమంగా బూడిదలో కలిసిపోతోంది. ఇప్పుడు ఆ జీవానికి మళ్లీ రంగులు నింపాల్సిన సమయం వచ్చింది!ఈ మార్పు కేవలం ట్రెండ్ కాదు. ఇది మన మనస్తత్త్వపు పరివర్తన. మన మనసుల్లో మనకు తెలియకుండానే జరిగిన సైలెంట్ సాఫ్ట్వేర్ అప్డేట్. ఇదే మనల్ని ‘కలర్ మోడ్’ నుంచి ‘బ్లాక్ అండ్ వైట్ మోడ్’లోకి మారిపోయేలా చేసింది. ఎంతలా అంటే ‘రంగులు మరీ ఎక్కువైతే ప్రమాదం’ అన్నట్టు ఒక లోతైన భయంలా మారిపోయింది. దాన్నే మనం సరదాగా ‘క్రోమోఫోబియా’(Chromophobia) అంటే రంగుల పట్ల భయం అని పిలవొచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న ఒక్కటే! ప్రపంచం నిజంగా మరింత శాంతంగా మారుతోందా? లేక మనం అనుభూతుల్ని కోల్పోతున్నామా? ఇది కేవలం రంగుల గురించే కాదు, ఇది మన చూపుల గురించి.మన సంస్కృతి గురించి, మన భావోద్వేగాల గురించి తెలుపుతోంది. ఒక్కసారి సాధారణ పార్కింగ్ స్థలంలో నడుస్తున్నారని ఊహించుకోండి. చుట్టూ ఏముంది? నలుపు, తెలుపు, వెండి రంగుల కార్లు అంతే! అది పార్కింగ్ కాదు, ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా షూటింగ్ సెట్ లోకేషన్లా కనిపిస్తుంది. అదే ఒకప్పుడు ఎరుపు రంగు కార్లు అగ్నిజ్వాలలాంటి ఉత్సాహంతో మెరిసేవి. ఆకుపచ్చ కార్లు ప్రకృతిని గుర్తు చేసేవి. నీలం కార్లు ఆకాశాన్ని నేలపైకి దించేవి. ఇప్పుడు? అన్నీ మౌనంగా, మెటాలిక్గా, నిర్లిప్తంగా నిలబడి ఉన్నాయి. కార్లకే ఎమోషన్స్ లేవేమో అన్నట్టు. మొత్తం పార్కింగ్ లాట్ ఒక పెద్ద బ్లాక్ అండ్ వైట్ మోడ్లోకి మారిపోయింది. ఇవన్నీ అకస్మాత్తుగా మారలేదు. మనమే మార్చేశాం. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా న్యూట్రల్ రంగుల్నే ఎంచుకోవడం మొదలుపెట్టారు. డిమాండ్ పెరిగింది, కంపెనీలు అదే ఉత్పత్తి చేశాయి, మార్కెట్ అదే నడిపింది. అంటే మన ఎంపికలే ప్రపంచాన్ని బీజ్, గ్రే, బ్లాక్ అండ్ వైట్ చేసేశాయి. సింపుల్గా చెప్పాలంటే, మనమే లైట్లు ఆర్పేసి, ‘ఎందుకు ప్రపంచం చీకటిగా ఉంది?’ అని అడుగుతున్నాం. కళ తప్పిన పండుగలు! ఒకప్పుడు ఫంక్షన్ అంటే రంగుల సర్కస్, వెలుగుల మేళా, డాన్స్ చేసే లైట్లు, నవ్వే పూలతోరణాలు ఇలా మొత్తం వేదికే ఒక రంగుల బాణసంచాలాగ పేలేది! పెళ్లి మండపం గులాబీ, ఊదా, బంగారం, ఎరుపుతో మెరిసేది. సంగీత్ అంటే నీయాన్ తుఫాను, హల్దీ అంటే పసుపు పరవశం, మెహందీ అంటే ఆకుపచ్చ కళా ప్రదర్శన. అతిథులు కూడా ఇంద్రధనుస్సులా ఒక్కొక్కరూ ఒక్కో రంగులో వచ్చేవారు. కాని, ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్తే ఏముంది? ‘‘వైట్–బీజ్–గ్రే’’ త్రిమూర్తులు పాలిస్తున్నారు! స్టేజ్ డెకర్ మినిమల్, లైటింగ్ స్మోకీ, ఫ్లవర్స్ పేస్టల్ సెటప్ చూస్తే పెళ్లా? లేక మ్యూజియం ఎగ్జిబిషనా? అన్న డౌట్ వస్తుంది. ఫొటోలు కూడా ఫిల్టర్లో పుట్టి, ఫిల్టర్లో పెరిగి, ఫిల్టర్లోనే జీవిస్తున్నట్టున్నాయి. అతిథుల డ్రెస్సుల్లోనూ మెరిసే రంగులు సెలవు పెట్టి వెళ్లిపోయాయి.అచ్చం ఇలాగే, పండుగలకూ ఇదే వైరస్ సోకింది. దీపావళి అంటే ఒకప్పుడు రంగోలీలు నేలపై ఇంద్రధనుస్సులా పాకేవి, దీపాలు నక్షత్రాల్లా మెరిసేవి. మరిప్పుడో? సింపుల్ డెకర్, తక్కువ రంగు, ఎక్కువ ఫొటోషూట్. సంక్రాంతి ముగ్గులు కూడా చిన్నవి, నీరసపు టోన్స్లో కనిపిస్తున్నాయి. హోలీ అంటే రంగుల సునామీ కదా? ఇప్పుడు చాలా చోట్ల ‘లైట్ హోలీ’ పేరుతో రెండు మూడు రంగులు, పది సెల్ఫీలతో సరిపెట్టుకుంటోంది. వినాయక చవితిలో భారీ రంగుల మండపాల బదులు వుడ్, బీజ్, గ్రే థీమ్ గణపతి కూడా ‘నేను పండుగకా? ఇంటీరియర్ షోకా?’ అని అడిగేలా డెకరేషన్స్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి మన ఫంక్షన్లు, పండుగలు నెమ్మదిగా రంగుల కళను కోల్పోతోంది.కార్ కలర్స్ బై ఇయర్ ప్రధాన ఆటో పెయింట్ సరఫరాదారులు, వివిధ అంతర్జాతీయ పెయింట్ కంపెనీలు ప్రతి ఏడాది చేసిన పరిశ్రమ స్థాయి సర్వేలు ఆధారంగా ఒక చార్ట్ విడుదల చేశారు. ఇదొక ఉత్పత్తి గణాంకాలు, డీలర్ అమ్మకాల డేటాను కలిపి రూపొందించిన విజువల్ మ్యాప్. ఇందులో అమెరికా, యూరప్, చైనా, జపాన్ , భారత్ వంటి ప్రధాన మార్కెట్లలో కొత్తగా అమ్ముడైన కార్ల రంగులను నమోదు చేశారు. ఇందులో మొత్తం 1990–2020 అంటే మూడు దశాబ్దాల ప్రయాణంలో రంగులు ఎలా మెరిశాయి, ఎలా మసకబారాయి అన్నదానికి స్పష్టమైన సాక్ష్యం దాగుంది. ఈ ‘కార్ కలర్స్ బై ఇయర్’ చార్ట్ను చూస్తే, తొంభైల్లో రోడ్లు చిన్న ఇంద్రధనుస్సుల్లా ఉండేవి: నీలం రంగు వాహనాలు పెద్ద భాగం ఆక్రమించి ఆకాశంలా విస్తరించింది, ఎరుపు రంగు ధైర్యంగా మెరిసేది. ఆకుపచ్చ రంగు ప్రకృతితో పోటీ పడేది. పసుపు, పర్పుల్ రంగు వాహనాలు చిన్న చిన్న అతిథుల్లా అప్పుడప్పుడు తళుక్కుమనేవి. కాని, 2000లు మొదలయ్యే సరికి సైలెంట్ తిరుగుబాటు మొదలైంది నలుపు నెమ్మదిగా పైకి ఎగబాకి పవర్ఫుల్ విలన్ లా బలపడింది, తెలుపు ఒక్కసారిగా పెరిగి శాంతి మంత్రంతో రాజ్యాన్ని నిర్మించింది, బూడిద ఎప్పటిలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా స్థిరంగా నిలిచింది. 2010ల నాటికి చార్ట్ స్పష్టంగా మారిపోయింది. రంగుల పార్టీ ముగిసింది, బ్లాక్–వైట్–గ్రే డామినేషన్ మొదలైంది. అదే సమయంలో ఎరుపు శాతం క్రమంగా పడిపోయి అరుదైన సెలబ్రిటీలా మారింది, నీలం జారిపోతూ కనుమరుగైంది, పచ్చ రంగు దాదాపు గ్రాఫ్ నుంచి మాయమై ‘ఎకో–లెజెండ్’గా మిగిలింది, ఈ సంఖ్యలన్నీ చెప్పేది ఒక్కటే చెప్తున్నాయి. రోడ్లు రంగుల్ని వదిలేసి మోనోక్రోమ్ మోడ్లోకి వెళ్లిపోయాయి, మనం మాత్రం దీన్ని ‘మినిమలిజం’ అని పిలుస్తూ చప్పట్లు కొడుతున్నాం. ఇంటిలోనూ రంగులు లేవు!ఒకప్పుడు రంగురంగుల ఇళ్లతో వీథులు ఆహ్వానం పలికేవి. ఇంట్లోకి అడుగు పెట్టగానే గోడలు పసుపు, పింక్, లైట్ గ్రీన్ లో మెరిసేవి. సోఫాలు ఎరుపు, నీలం, ఊదా కవర్లతో చిరునవ్వు చిందించేవి. కర్టెన్లు గాలికి ఊగుతూ ఇంద్రధనుస్సులా డాన్స్ చేసేవి. టీవీ యూనిట్ డిజైనర్ చెక్కతో మెరిసేది, షోకేస్ గ్లాస్ కాంతులతో కళకళలాడేది. కుషన్లు పూల డిజైన్లతో జీవం నింపేవి. కాని, ఇప్పుడు ఇంట్లోకి అడుగుపెడితే కనిపించేది రంగుల ఇల్లు కాదు ‘బీజ్ ఎగ్జామ్ హాల్’! గోడలు బూడిద, సోఫాలు గ్రే, కర్టెన్లు క్రీమ్, కార్పెట్ డస్ట్ షేడ్, కుషన్లు మ్యాట్ టోన్ . ప్రతిది నిశ్శబ్దంగా, నీరసంగా, డల్గా కనిపిస్తోంది. ఇక ఇంటీరియర్ వస్తువులైతే మరీ మినిమలిస్టిక్. వైట్, గ్రే, బ్లాక్, సిల్వర్ ఫ్రిజ్లు, వాషింగ్ మిషన్లు, డిష్వాషర్లు అన్నీ ఒకే ‘ఈస్తటిక్ డిసిప్లిన్ ’ను పాటిస్తున్నట్టు ఒకే రంగులో ఉంటున్నాయి. బెడ్రూమ్లో బెడ్షీట్లు కూడా నీయాన్ పోయి, పేస్టల్ ప్యాలెట్కు మారిపోయాయి. వంటగదిలో ప్లేట్లు, కప్పులు కూడా తెలుపు, బూడిద మోడ్లోకి వెళ్లిపోయాయి. పిల్లల గదిలో కార్టూన్ కలర్స్ పోయి, మ్యూట్ టోన్ వాల్పేపర్లు వచ్చేశాయి. ఇక దుస్తుల అల్మరా చూస్తే, ఒకప్పుడు ఎరుపు చీరలు, ఆకుపచ్చ లెహంగా, నీలం షర్టులు, పసుపు కుర్తాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం బ్రాండెడ్ పేరుతో బీజ్, బ్లాక్, వైట్, గ్రే రంగులతోనే అల్మరా నిండిపోతోంది. మొత్తానికి మన ఇళ్లు నెమ్మదిగా ‘కలల రంగుల ఇంటి’ నుంచి ‘ఇన్ స్టా–ఈస్తటిక్ గ్రే బాక్స్’గా మారిపోతున్నాయి. తత్త్వవేత్తల అనుమానం? రంగులంటే మనకున్న ఎంత ఎక్కువ ప్రేమ ఉన్నా, పాశ్చాత్య తత్త్వశాస్త్రానికి ఉన్న అనుమానం కూడా అంతే పెద్దది. ప్రాచీన గ్రీకు తత్త్వవేత్త ప్లేటో నుంచే మొదలైంది ఈ కలర్ డౌట్ డ్రామా. అతని మాటల్లో మనం చూస్తున్న ప్రపంచం ఒక మాయ. ‘గోడలపై పడే నీడలే మనకు కనిపించే నిజాలు. కళ్లతో కనిపించే రంగులన్నీ ఇంద్రియ మాయలే, అసలు సత్యం మాత్రం బుద్ధితోనే గ్రహించాలి’ అని చెప్పాడు. అంటే ఎరుపు, నీలం, పసుపు అన్నీ ప్లేటో లెక్కలో ‘నమ్మకానికి పనికిరాని విజువల్ ఎఫెక్ట్స్’. అతని శిష్యుడు అరిస్టాటిల్ వచ్చి ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు. ‘అందమైన రంగుల గందరగోళం కంటే రంగుల్లేని స్పష్టమైన రూపమే గొప్పది’ అని చెప్పాడు. సింపుల్గా చెప్పాలంటే పెయింట్ బాగున్నా డ్రాయింగ్ చెత్త అయితే వ్యర్థమే అన్నమాట. ఆ తర్వాత ప్రసిద్ధ జర్మన్ తత్త్వవేత్త ఇమాన్యుయేల్ కాంట్ రంగును కేవలం అలంకారంగా పక్కన పెట్టేశాడు. ‘రంగు కళను ఆకర్షణీయంగా చేస్తుంది. కాని అది నిజమైన సౌందర్యానికి ప్రమాణం కాదు’ అన్నాడు. ఇలా రంగు అంటేనే భావోద్వేగం, అస్థిరత, మాయ అని ముద్ర వేసి, రూపం అంటే తర్కం, క్రమం, సత్యం అని కిరీటం పెట్టేశారు తత్త్వవేత్తలు. ఆ ఫలితమే ఈ రోజు మన చుట్టూ కనిపించే బూడిద ప్రపంచం. ఈ గ్రే ఇళ్లు, డల్ సినిమాలు, మ్యూట్ దుస్తులు– వీటిని చూస్తుంటే అనిపిస్తుంది మనం రంగులను కోల్పోలేదు, తత్త్వశాస్త్రం చిన్నప్పుడే మనకు ‘కలర్ భయం’ నేర్పించిందేమో! అసలు నిజం! చరిత్ర మనకు చూపిస్తుందేమిటంటే, రంగు ఎప్పుడూ శత్రువు కాదు. బరోక్ కళలో బంగారం, ఎరుపు, పచ్చ, నీలం, మిగతా రంగులు కలసి ఒక క్రమబద్ధమైన భావోద్వేగ తుఫాన్లుగా మన మనసును కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి, దైవంతో కలిపిస్తాయి. అయితే, అలంకారం లేని గోడలు, భావోద్వేగం లేని భవనాలు, గాజు–స్టీల్ కార్యాలయాలు, ఒకేలా కనిపించే నగరాలు, మనసును తాకని నిర్మాణాలు. ఇవన్నీ అత్యల్ప ప్రయోగాలు, తక్కువ వైవిధ్యంతో తయారవడం వల్ల మనిషి ప్రతిభను, ఉత్సాహాన్ని, సృజనాత్మకతను దెబ్బతీస్తాయి. అందుకే, ఇక్కడ మనం కోల్పోతున్నది కేవలం అందమైన రంగుల వైవిధ్యాన్ని మాత్రమే కాదు. అంతకు మించి రంగులను కళ్లారా ఆస్వాదించే ఆనందాన్ని కూడా. అందుకే అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.ఇదొక వైరస్!మోనోక్రోమ్ ప్రపంచం అంటే విప్లవం కాదు, నిశ్శబ్దంగా నడుస్తున్న ‘గ్రే వైరస్’ లాంటిది. ఆటోమొబైల్ ప్రపంచాన్ని చూస్తేనే అర్థమవుతుంది: ప్రముఖ పెయింట్ కంపెనీల లెక్కల ప్రకారం కొత్త కార్లలో 80 శాతానికి పైగా నలుపు, తెలుపు, బూడిద, వెండి రంగులే, ఎరుపు అంటే ఇప్పుడు అరుదైన పక్షి, ఆకుపచ్చ అంటే దాదాపు లెజెండ్, పసుపు అంటే కేవలం కథల్లో వినే పురావర్ణం; ఒకప్పుడు కారు అంటే యజమాని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేది.ఫైర్ రెడ్ అంటే ఉత్సాహం, ఫారెస్ట్ గ్రీన్ అంటే ప్రకృతి ప్రేమ, స్కై బ్లూ అంటే స్వేచ్ఛ. అయితే, ఇదంతా కార్లకే పరిమితం కాదని బ్రిటన్ సైన్స్ మ్యూజియం ఏడువేల వస్తువులపై చేసిన అధ్యయనంలో తేలింది. ఇక్కడ సుమారు పద్దెనిమిది వందల రంగులు నెమ్మదిగా డైట్లోకి వెళ్లి ముదురు ఎరుపు, పల్చని గులాబీగా, జంగిల్ పచ్చ బూడిద పచ్చగా, మెరుస్తున్న పసుపు మట్టి వర్ణంగా మారిపోయాయని చెప్పారు. ఇలా మొత్తం ప్రపంచమే నవ్వులు తగ్గించుకుని సైలెంట్ మోడ్లోకి జారిపోతుంటే, మనం మాత్రం చప్పట్లు కొడుతూ ‘సింపుల్ డిజైన్!’ అని సెల్ఫీ తీసుకుంటున్నాం. సినిమా రంగు వెలిసిపోతోందా?సినిమా థియేటర్లో అడుగుపెట్టడం అంటే రంగుల పండుగ లాంటిది. తెరపై బాణసంచా పేలినట్టు వెలుగులు, పాటల్లో ఇంద్రధనుస్సు పరుగులు, బంగారు రేకుల్లా మెరిసే విలన్ కోటలు. రంగు రంగుల దుస్తుల్లో ఆడిపాడే నటీనటులు కనిపించేవారు. కాని, ఇప్పుడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే కనిపించేది కేవలం ‘ఫిల్టర్ ఫీవర్’ మాత్రమే! చారిత్రక చిత్రాల పేరుతో అప్పట్లో ఇలా ఉండేది అని చూపించడానికి టెక్నీషియన్స్ ఫైనల్ పింట్ర్కి పొగమంచు ఫిల్టర్స్ని ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు రిడ్లీ స్కాట్ దర్శకత్వంలోని నెపోలియన్ చిత్రాన్ని తీసుకోండి. షూటింగ్ సమయంలో అద్భుతమైన రంగుల సెట్లు ఉపయోగించారు. కాని, తుది చిత్రంలో అన్నీ చల్లని నీలి–బూడిద రంగులో మసకబారిపోయాయి.విచిత్రంగా ఇది ఇప్పుడు హాలీవుడ్ కొత్త ఫ్యాషన్ లా మారిపోయింది. ఇక మన భారతీయ సినిమాకు వస్తే పరిస్థితి ఇంకా ఫన్నీ. సంజయ్ లీలా భన్సాలీ సెట్స్ అంటేనే రంగుల రాజమహల్లా వెలుగు, వైభవం, ఆడంబరం అన్నీ కనిపిస్తాయి. కాని, అదే సినిమా థియేటర్లోకి వచ్చేసరికి అదే రాజమహల్ కాస్త డల్ బ్లూ–గ్రే ఫిల్టర్లో మునిగిపోతోంది. ‘అప్పట్లో ఇలా ఉండేది’ అని చూపించడానికి వేసే ఫిల్టర్స్, హీరోయిన్ల మెరిసే దుస్తులను కూడా మసకబారుస్తున్నాయి. ఇదే ట్రెండ్ తెలుగు, తమిళ, హిందీ థ్రిల్లర్లలోనూ కనిపిస్తోంది.‘దయ్యాలు రాత్రుళ్లే కదా కనిపించేది?’ అనే లాజిక్తో క్రైమ్, హారర్ సినిమాలన్నింటినీ డార్క్ మోడ్లో పెట్టేస్తున్నారు. అయితే పాటలు మాత్రం కాసిన్ని రంగులను బతికిస్తున్నాయి. ఒక్కసారిగా వచ్చే నీయాన్ లైట్లు, భారీ సెట్స్, రంగులు వర్షంలా వచ్చి, చిన్న నవ్వు నవ్వి, సెల్ఫీ తీసుకుని అతిథుల్లా వచ్చి వెళ్లిపోతున్నాయి. ఇలా మొత్తానికి సినిమా ప్రపంచం కూడా నెమ్మదిగా ‘కలల ప్యాలెట్’ను వదిలేస్తోంది. అందుకే, ఈ బూడిదలో మన భావోద్వేగాలు కూడా మసకబారుతున్నాయా?దీపిక కొండి -
చూపును కాపాడే ఔషధం
రెటీనా దెబ్బతినడం వల్ల చాలామంది కంటిచూపును కోల్పోతుంటారు. రెటీనా దెబ్బతినడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వయసు మళ్లడం, డయాబెటిస్, రెటీనా స్థానభ్రంశం చెందడం వంటి కారణాల వల్ల రెటీనా క్రమంగా దెబ్బతిని చూపు కోల్పోయే పరిస్థితులు వాటిల్లుతాయి. రెటీనా దెబ్బతినడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు నాలుగు కోట్లమందికి పైగా ప్రజలు చూపు కోల్పోతున్నారు. దెబ్బతిన్న రెటీనాను తిరిగి కోలుకునేలా చేసే పద్ధతులు ఇప్పటివరకు అందుబాటులో లేవు. అయితే, దెబ్బతిన్న రెటీనాను కోలుకునేలా చేసి, చూపును పునరుద్ధరించగల ఔషధాన్ని కొరియన్ శాస్త్రవేత్తలు ఇటీవల రూపొందించారు.కొరియన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కేఏఐఎస్టీ) శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ ఔషధం రెటీనాలో దెబ్బతిన్న నరాలకు పునరుజ్జీవం కల్పించడం ద్వారా కోల్పోయిన చూపును తిరిగి తెప్పిస్తుందని చెబుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఫార్మా కంపెనీ ‘సెల్లియాజ్’తో కలసి ‘కేఏఐఎస్టీ’ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ ఔషధం ప్రస్తుతం క్లినికల్ పరీక్షల దశలో ఉంది. రెటీనా దెబ్బతినడానికి కారణమయ్యే ‘ప్రాక్స్1’ ప్రొటీన్ను నిర్వీర్యం చేసే ‘సీఎల్జెడ్0001’ యాంటీబాడీతో రూపొందించిన ఈ ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించినప్పుడు సత్ఫలితాలు వచ్చాయి. క్లినికల్ పరీక్షల తర్వాత దీనిని 2028 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. -
ఫలకళా మహోత్సవం
అక్కడి వీథులన్నీ ఫలకళతో పరవశం కలిగిస్తాయి. నిమ్మజాతికి చెందిన పండ్లతో రూపొందించిన భారీ కళాకృతులు కనువిందు చేస్తాయి. సంప్రదాయ నృత్యగానాలతో జనాలు వీథుల్లో జరిపే ఊరేగింపులు ఉర్రూతలూగిస్తాయి. పండ్లు ఎవరైనా తింటారు గాని, పండ్లతో భారీ కళాప్రదర్శనలు చేయడమే ఫ్రెంచి ప్రజల ప్రత్యేకత. ఫ్రాన్స్ ఆగ్నేయ ప్రాంతంలో ఇటలీ సరిహద్దులకు చేరువలో ఉన్న మెంటన్ నగరం ఏడాదికి ఒకసారి ఫలకళను సంతరించుకుంటుంది. పదిహేను రోజుల పాటు అట్టహాసంగా జరిగే ఈ ఫలకళా మహోత్సవాన్ని ‘ఫెట్ డి సిట్రాన్’ అని, ‘ఫెస్టివల్ డి లిమన్’ అని అంటారు. ఫలకళాకృతుల ప్రదర్శనతో పాటు ఊరంతా వీథి వీథినా ఊరేగింపులు, నృత్యగాన ప్రదర్శనలు కూడా నిర్వహిస్తూ ఉండటం వల్ల ఈ వేడుక ‘కార్నివాల్ ఆఫ్ మెంటన్’గా కూడా ప్రసిద్ధి పొందింది.మెంటన్ నగరంలో ఈ ఫలకళా మహోత్సవం నిర్వహణ 1934 నుంచి ప్రారంభమైంది. నాటి నుంచి ఏటా జరిగే ఈ వేడుకలకు రెండో ప్రపంచయుద్ధం కారణంగా 1940–46 మధ్యకాలంలోను, గల్ఫ్ యుద్ధం కారణంగా 1991లోను, ‘కోవిడ్–19’ కారణంగా 2021లోను అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ ఆటంకాలు మినహా మిగిలిన సంవత్సరాలలో ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతూనే వచ్చాయి. అదే రీతిలో ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 14 నుంచి మార్చి 1 వరకు మెంటన్ నగరంలో ఫలకళా మహోత్సవం సందడిగా జరుగుతోంది. ఈసారి మెంటన్ ఫలకళా మహోత్సవం ‘వండర్స్ ఆఫ్ లైఫ్’ను థీమ్గా ఎంచుకుంది. ఇందులో భాగంగా నిమ్మ జాతికి చెందిన నిమ్మ, నారింజ, బత్తాయి, దబ్బపండ్లతో వైవిధ్యభరితమైన జీవరాశుల కళాకృతులను వీథుల్లో అలంకరించారు. ఈ ఏడాది ఫలశిల్పాల కోసం 140 టన్నులకు పైగా పండ్లను వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 15, 22 తేదీల్లోను; మార్చి 1న జరిగే ‘గోల్డెన్ ఫ్రూట్ పరేడ్’లో దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. మేళతాళాలు, నృత్య గానాలతో వీథి వీథినా జరిగే ఊరేగింపులతో మెంటన్ నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈసారి వాలెంటైన్స్ డే రోజు నుంచి ‘కార్నివాల్ ఆఫ్ మెంటన్’ కూడా ప్రారంభం కావడంతో మెంటన్ వీథులన్నీ యువజంటల కేరింతలతో కొత్త కళను సంతరించుకున్నాయి. -
అతనంటే విపరీతమైన క్రష్!
‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో అమాయకపు ఆకాంక్షగా, ‘సరైనోడు’లో పవర్ఫుల్ ఎమ్మెల్యేగా మనల్ని మెప్పించిన ఈ మలయాళ కుట్టి, తన వ్యక్తిగత జీవితం, కెరీర్ రహస్యాలను ఇప్పుడు మనతో పంచుకుంటోంది క్యాథరిన్ ట్రెసా. ఆ విశేషాలు...⇒ చిన్నప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అంటే విపరీతమైన క్రష్. ఆయన టీవీలో కనిపిస్తేనే అన్నం తినేదాన్నని అమ్మ ఇప్పటికీ ఆటపట్టిస్తుంది. అలా ఎందుకు చేసేదాన్నో ఇప్పటికీ నాకు మిస్టరీనే.⇒ నేను మలయాళీ క్రిస్టియన్ . పుట్టి పెరిగింది దుబాయ్లో. కాలేజీ రోజుల్లో బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాను. అక్కడే నా మోడలింగ్ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కన్నడ సినిమా ‘శంకర్ ఐపీఎస్’ అవకాశం నా కెరీర్కు కొత్త మలుపును ఇచ్చింది.⇒ సినిమాల్లోకి రాకముందు నేను ప్రొఫెషనల్ స్థాయిలో ఐస్ స్కేటింగ్ చేసేదాన్ని. మంచు మీద వేగంగా బ్యాలెన్ ్స చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ వెకేషన్ కు వెళ్తే స్కేటింగ్ షూస్ నా బకెట్లిస్ట్లో తప్పకుండా ఉంటాయి.⇒ సంగీతం నాకు మెడిటేషన్ లాంటిది. మనసు బాగాలేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పియానో వాయిస్తాను. నేను క్వాలిఫైడ్ పియానిస్ట్ని.⇒ తెలుగులో ‘చమ్మక్ చల్లో’తో ఎంట్రీ ఇచ్చాను. కాని, నిజమైన బ్రేక్ ఇచ్చింది ‘ఇద్దరమ్మాయిలతో’. ‘సరైనోడు’లో ఎమ్మెల్యే పాత్ర నా ఆల్టైమ్ ఫేవరెట్.⇒ కేరళలో ఒక సినిమా షూటింగ్ సమయంలో నేను ఏనుగుపై నుంచి కింద పడిపోయాను. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అప్పటి నుంచి ఏనుగులంటే ప్రేమ ఉన్నా, వాటి దగ్గరికి వెళ్లాలంటే భయం.⇒ ఒక గంట ఖాళీ దొరికినా బిజినెస్ మ్యాగజైన్స్ చదువుతాను. సినిమాల్లోకి రాకపోయి ఉంటే కచ్చితంగా సక్సెస్ఫుల్ బిజినెస్ వుమన్ గా మారేదాన్ని. నా ఆర్థిక నిర్ణయాలు అన్నీ నేనే తీసుకుంటాను.⇒ పాత ఫొటోలను ఆల్బమ్స్గా చేసి దాచుకోవడం నా అలవాటు. డిజిటల్ యుగంలో ఉన్నా, ప్రింట్ ఫొటోలే నా సెంటిమెంట్.⇒ నా జీవితంలో అతిపెద్ద బాధ నా తమ్ముడు క్రిస్టోఫర్ మరణం. ఎనిమిదేళ్ల క్రితం తను సూసైడ్ చేసుకున్నాడు. ఆ లోటు తీరనిది.⇒ స్వీట్స్ అంటే నాకు పిచ్చి. ముఖ్యంగా తాపేశ్వరం మడతకాజా, మైసూర్ పాక్. అలాగే ‘లిక్విడ్ డైట్’ మీద నాకు మంచి కంట్రోల్ ఉంది. బాడీని డీటాక్స్ చేయడానికి వారంలో ఒకరోజు కేవలం కొబ్బరి నీళ్లు, గ్రీన్ జ్యూస్లతోనే ఉంటాను. అదే నా గ్లామర్ రహస్యం.⇒ నా డ్రీమ్ మ్యాన్ పొడవుగా, ఫిట్గా ఉండాలి. ముఖ్యంగా మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి.⇒ గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఎంచుకుంటాను. అందుకే అప్పుడప్పుడు గ్యాప్ వస్తుంది. నా కెరీర్లో ఇంకా మంచి కామెడీ సినిమాలు చేయాలని ఉంది. -
పరమశివుడి భిక్షు పర్యావతారం
పూర్వం విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు పరిపాలించేవాడు. సత్యరథుడు పేరుకు తగినట్లే సత్యధర్మ పరాయణుడు. మహా శివభక్తుడు. విదర్భ రాజ్యాన్ని సత్యరథుడు సుభిక్షంగా పాలిస్తుండటం చూసి, సాల్వరాజుకు కన్నుకుట్టింది. ఒకనాడు అతడు విదర్భ రాజ్యంపై దండెత్తాడు. విదర్భ సాల్వ సేనలకు భీకర పోరాటం జరిగింది. సత్యరథుడు కూడా స్వయంగా యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధంలో విదర్భ సేనలు ఓడిపోయాయి.సత్యరథుడు సాల్వరాజు చేతిలో నేలకూలాడు.శత్రుసైన్యం అంతఃపురాన్ని ముట్టడించడానికి వస్తున్నట్లు సత్యరథుడి పట్టపురాణికి సమాచారం తెలిసింది. అప్పటికి ఆమె గర్భవతి. నమ్మకస్తులైన దాసీల సాయంతో ఆమె రహస్యమార్గం గుండా అంతఃపురాన్ని వీడి, అటవీ మార్గంలోకి చేరింది. అడవిలో శిథిలావస్థలో ఉన్న ఒక శివాలయంలో తలదాచుకోసాగింది. కొన్నాళ్లకు నెలలు నిండి, ఆమెకు సర్వశుభలక్షణాలు కలిగిన కొడుకు పుట్టాడు. ఆమె ఆ బాలుడిని అల్లారుముద్దుగా పెంచుకోసాగింది.ఒకనాడు ఆమె కొడుకును ఆలయంలోనే వదిలి, స్నానం చేయడానికి చేరువలోనే ఉన్న నదికి వెళ్లింది. స్నానం చేస్తుండగా ఆమె మొసలి నోటికి చిక్కింది. మొసలి ఆమెను అమాంతం తినేసింది. ఆలయంలో ఉన్న పసిబాలుడు తల్లి కోసం రోదించసాగాడు. అంతలో కొడుకుని చంకనెత్తుకుని అటుగా వెళుతున్న బ్రాహ్మణ వితంతువు ఆలయం నుంచి వినిపిస్తున్న శిశువు రోదనను గమనించి, ఆలయంలోకి వెళ్లింది. ఏడుస్తున్న బాలుడిని ఎత్తుకుని, అతడికి పాలిచ్చి ఓదార్చింది. అతడు ఎవరి బాలుడో తెలియక, ఆ బాలుడి కోసం ఎవరైనా వస్తారేమోనని ఆమె దిక్కులు చూడసాగింది. అప్పుడు పరమశివుడు భిక్షుక రూపంలో ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘తరుణీ! మనసులో శంకలు వీడి ఈ శిశువును కూడా నీ కుమారుడితో పాటే పెంచు. ఇతడి వల్ల నీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది’ అని చెప్పాడు.‘భిక్షుకా! ఇంతకీ ఈ బాలుడెవరు? ఇతడి జన్మవృత్తాంతం ఏమిటి?ఈ పిల్లవాణ్ణి నేను తీసుకువెళితే, రాజభటులు నాపై అపహరణ నేరం మోపి, ఉరితీస్తారేమో! అదే జరిగితే ఈ బాలుడితో పాటు నా శిశువు కూడా అనాథ అవుతాడు’ అని భయంగా పలికిందా బ్రాహ్మణ వనిత.‘తరుణీ! భయపడకు. నేను శంకరుడిని. నా సంకల్పం ప్రకారమే నువ్వు ఇక్కడకు వచ్చావు. నిస్సందేహంగా ఈ బాలుడిని తీసుకువెళ్లి పెంచు’ అని పలికి, ఆ బాలుడి వృత్తాంతమంతా వివరించి తన నిజరూపాన్ని ప్రదర్శించాడు.ఆమె వెంటనే శంకరుడికి పాదాభివందనం చేసింది. ‘పరమేశ్వరా! ఈ పసిబాలుడికి ఇంతటి దుర్గతి కలగడానికి కారణమేమిటి? అలాగే నా కుమారుడు నిరుపేద వితంతువునైనా నా కడపున పుట్టడానికి కారణమేమిటి?’ అని ప్రశ్నించింది.‘తరుణీ! మానవుల జనన మరణాలకు, వారి సుఖదుఃఖాలకు వారు చేసుకున్న కర్మలే కారణం. ఈశ్వరుడిని అయిన నేను ఈ విషయంలో నిమిత్తమాత్రుడను. ఈ రాకుమారుడి తండ్రి సత్యరథుడు గత జన్మలో రాజుగా పాలిస్తూ, ముందు వెనుకలు విచారించకుండా తన సామంతరాజును ఉరితీయించాడు. ఈ జన్మలో అదే సామంతరాజు చేతిలో హతమయ్యాడు. ఇతడి తల్లి గత జన్మలో తన సవతిని విషప్రయోగంతో చంపించింది. ఇక నీ కుమారుడు గత జన్మలో బ్రాహ్మణుడై, ఆశ్రమధర్మాలను విడనాడి నీచులైన వారి వద్ద నీచ ద్రవ్యాన్ని దానాలుగా స్వీకరించి, ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోకుండా జీవించాడు. అందుకే ఇప్పుడిలా జన్మించాడు’ అని పలికి అంతర్ధానమయ్యాడు.ఆ తర్వాత బ్రాహ్మణ స్త్రీ ఇద్దరు బాలకులను తీసుకుని ఏకచక్రపురానికి చేరుకుంది. అక్కడ నివాసం ఉంటూ ఇద్దరు బాలురను అల్లారుముద్దుగా పెంచసాగింది. తగిన వయసు రాగానే ఇద్దరికీ ఉపనయనాది సంస్కారాలను జరిపించింది. వారికి నిత్యం శివలీలలను వినిపిస్తూ, వారిచేత శివలీలలను గానం చేయిస్తూ, ఇద్దరినీ శివభక్తులుగా తీర్చిదిద్దింది. కొన్నాళ్లకు ఇద్దరు బాలకులను ఒక గురువు వద్ద గురుకులంలో చేర్చింది. బ్రాహ్మణ బాలకుడికి బ్రాహ్మణోచిత విద్యలలోను, క్షత్రియ బాలకుడికి క్షత్రియోచిత విద్యలలోను శిక్షణ ఇప్పించింది. ఇద్దరు బాలకులూ గురువు వద్ద వినయ విధేయతలతో మెసలుకొంటూ శీఘ్రంగానే సమస్త విద్యలనూ నేర్చుకున్నారు. యుక్తవయసు రాగానే బ్రాహ్మణ బాలకుడు తగిన కన్యను వివాహం చేసుకుని, ఏకచక్రపురం రాజు వద్దనే రాజ పురోహితుడిగా కుదురుకున్నాడు.క్షత్రియ కుమారుడు ఆ బ్రాహ్మణ కుమారుడి సాయంతో రాజాశ్రయం సంపాదించాడు. తన వృత్తాంతం చెప్పి, రాజును సైనిక సహాయం అర్థించాడు. రాజు సమకూర్చిన సైన్యంతో తన తండ్రిని హతమార్చిన సాల్వరాజుపై యుద్ధం ప్రకటించాడు.యుద్ధంలో సాల్వరాజును అంతం చేసి, తన తండ్రి పరిపాలించిన విదర్భ దేశాన్ని హస్తగతం చేసుకున్నాడు. విదర్భ రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత «సత్య ధర్మాలను తప్పకుండా జనరంజకంగా పరిపాలన కొనసాగించాడు.∙సాంఖ్యాయన -
ఐఎంగా ఏఆర్సీఎఫ్!
ఢిల్లీలోని తీహార్ జైలులో మసూద్ అజర్, ఒమర్ షేక్, అహ్మద్ జర్గర్లతో ఏర్పడిన పరిచయం అఫ్తాబ్ అన్సారీ, ఆసిఫ్ రజాలను ఉగ్రవాదం వైపు మళ్లించింది. ఖాదిమ్స్ అధినేత పార్థ్ ప్రతిమ్ రాయ్ బర్మన్ సహా పలువురిని కిడ్నాప్ చేసి, భారీ వసూళ్లకు పాల్పడింది. బర్మన్ కుటుంబం నుంచి తీసుకున్న మొత్తంలో రూ.కోటి హైదరాబాద్ మీదుగా అమెరికాలో జరిగిన 9/11 దాడులకు ఫండ్గా చేరింది. 2001లో ఆసిఫ్ రజా ఎన్కౌంటర్ తర్వాత తెరపైకి వచ్చిన అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) ఏర్పాటు చేశాడు. తర్వాత ఇదే ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మారింది. ఈ ఐఎం ఉగ్రవాదులే 2007, 2013ల్లో హైదరాబాద్పై విరుచుకుపడి 61 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏఆర్సీఎఫ్... ఐఎంగా ఎలా మారిందంటే..!కోల్కతాకు చెందిన కన్స్ట్రక్షన్ వ్యాపారి ఇషాఖీ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఆసిఫ్ రజా ఖాన్ కోల్కతాలోని మౌలానా ఆజాద్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటికే అతడికి నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాతో (సిమి) సంబంధాలు ఉన్నాయి. ఆపై ఆఫ్తాబ్ అన్సారీతో కలిసి 1997 నుంచి అనేక నేరాలు చేస్తూ, దేశవ్యాప్తంగా జరిగే ‘సిమి’ కార్యక్రమాలకు వెళ్లేవాడు. హైదరాబాద్లోని సైదాబాద్కు చెందిన ముజాహిద్ సలీం (2004లో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించాడు) కూడా వీటికి వెళ్లేవాడు. అలా ఇద్దరూ స్నేహితులయ్యారు. ముజాహిద్ సోదరికి ముంబై శివార్లలోని చీతాక్యాంప్కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. 2001 ఏప్రిల్లో తన సోదరి ఇంట్లో జరిగిన శుభ కార్యానికి ముజాహిద్ సలీం కూడా హాజరయ్యాడు. ఉత్తరప్రదేశ్లో ఆజమ్గఢ్ నుంచి ముంబైలోని అంధేరీకి వలస వచ్చిన మహ్మద్ సాదిక్ ఇష్రార్ షేక్ (2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషి) అక్కడి ఓ కంప్యూటర్స్లో డెస్క్టాప్ ఇంజనీర్గా పని చేసేవాడు. ముజాహిద్ సలీం బావకు ఇతడు సమీప బంధువు కావడంతో ఇతడు కూడా ఆ శుభకార్యానికి వెళ్లాడు. అక్కడే ముజాహిద్ సలీంతో సాదిక్ ఇష్రార్ షేక్కు పరిచయం ఏర్పడగా, కేవలం రెండు రోజుల్లోనే సాదిక్ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. సాదిక్ను చితాక్యాంప్లోని ఓ సైబర్కేఫ్కు తీసుకువెళ్లిన సలీం అతడికి ఈ–మెయిల్ ఐడీ రూపొందించి ఇచ్చాడు. దాన్ని క్రమం తప్పకుండా ఓపెన్ చేసి చూస్తుండాలని, ఈ–మెయిల్ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని చెప్పాడు. మరోపక్క సాదిక్ మెయిల్ ఐడీని ఆసిఫ్ రజా ఖాన్కు అందించిన సలీం అతడిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం వాడుకోవచ్చని చెప్పాడు. దీంతో 2001 జూలైలో సాదిక్కు తొలి మెయిల్ పంపిన ఆసిఫ్– అప్పటి నుంచి క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపేవాడు. చీతా క్యాంప్లోని మదీనా హోటల్ వద్ద ఈ ద్వయం కలుసుకున్నాక సాదిక్... ఆసిఫ్తో కలిసి పని చేయడం ప్రారంభించాడు. ఐసీ 814 ఉదంతం తర్వాత జైలు నుంచి విడుదలై పాకిస్థాన్ చేరిన మసూద్ అజర్ జైష్ ఏ మహ్మద్ (జేఈఎం) స్థాపించాక అందులో చేరతాడు. కిడ్నాప్లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడే ఆసిఫ్ ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు అందించేవాడు. ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు సీబీఐకి ఆసిఫ్ గ్యాంగ్ మోస్ట్ వాంటెడ్గా మారింది. 2001 అక్టోబర్ 29న ఢిల్లీ స్పెషల్ సెల్తో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే సీబీఐ ఢిల్లీ, గుర్గావ్, గుజరాత్ల్లో పలువురిని అరెస్టు చేసింది. అలా చిక్కిన వారిలో ఆసిఫ్ రజా ఖాన్ కూడా ఉన్నాడు. అప్పటికే అఫ్తాబ్, ఆసిఫ్పై నమోదై ఉన్న కేసుల్లో భాస్కర్ పరేఖ్, పరేష్ షా కిడ్నాప్ ఒకటి. 2000 నవంబర్లో 11 గుజరాత్లోని రాజ్కోట్లో సిమ్లా మిర్చి రెస్టారెంట్ వద్ద ఈ ఇద్దరు వస్త్ర వ్యాపారుల్నీ వీరి గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. అప్పటికి ఇది కేవలం గ్యాంగ్స్టర్ ముఠానే. ఈ కేసులో జైలుకు వెళిన్ల ఆసిఫ్ రజా ఖాన్ బెయిల్పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు గైర్హాజరవడంతో ఇతడిపై రాజ్కోట్ కోర్టు నాన్–బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆసిఫ్ను ఢిల్లీలో అరెస్టు చేశారన్న విషయం తెలుసుకున్న రాజ్కోట్ పోలీసులు తమ వద్ద ఉన్న వారంట్ అమలుకు ఉపక్రమించారు. 2001 డిసెంబర్ 7న ఢిల్లీ వెళ్లే రాజ్కోట్ పోలీసులు ఆసిఫ్ను తీసుకుని తిరిగి వస్తుండగా, వీరి వాహనం సర్దార్ ఔట్ పోస్టు వద్దకు చేరుకునే సమయానికి ఆసిఫ్ రజా ఖాన్ కాలకృత్యాలు తీర్చుకోవాలని పోలీసుల్ని కోరాడు. దీంతో వాహనాన్ని ఆపే పోలీసులు అతడి సంకెళ్లు తీయగా, ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వద్ద నుంచి ఏకే–47 లాక్కుని పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు. ఈ సందర్భంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆసిఫ్ మరణించాడు.ఆసిఫ్ మృతితో అతడి సోదరుడు అమీర్ రజా ఖాన్... ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్సీఎఫ్) ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి సాదిక్ అతడితో కలిసి పని చేయడం ప్రారంభించాడు. 2002 జనవరిలో ఏఆర్సీఏఫ్ కోల్కతాలోని అమెరికన్ కాన్సులేట్ సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్పై (యూఎస్ఐఎస్) దాడికి కుట్రపన్నింది. రెండు రోజుల పాటు దాని వద్ద రెక్కీ చేసే సాదిక్ అందించిన కీలక సమాచారంతోనే ఆ దాడి జరిగింది. ఇలాంటి దాడులతో మోస్ట్ వాంటెడ్గా మారిన అమీర్ రజా ఖాన్ పాకిస్తాన్కు చేరుకున్నాడు. అక్కడే ఐఎస్ఐ అతడిని తనకు అనువుగా మార్చకుని, భారత్లో ఉగ్రవాద దాడుల కోసం దేశవాళీ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో తన ఏఆర్సీఎఫ్ను అమీర్ రజా ఖాన్ 2003లో ఇండియన్ ముజాహిదీన్గా (ఐఎం) మార్చాడు. దీనికి సాదిక్ ఇష్రార్ షేక్ కో–ఫౌండర్గా వ్యవహరించాడు. అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించిన ఇండియన్ ముజాహిదీన్ పేరు 2007లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని గోకుల్చాట్–లుంబినీ పార్క్ సహా అనేక విధ్వంసాలకు పాల్పడిన ఈ ముష్కరులు చాలాకాలం చిక్కలేదు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో పట్టుబడిన వాహనచోరుడు ఇచ్చిన ఢిల్లీ చిరునామాతో దీని గుట్టు వీడింది. ఈ పూర్వాపరాలతో పార్ట్–4 ‘అహ్మదాబాద్ బ్లాస్ట్... ఢిల్లీ అడ్రస్!’ వచ్చేవారం.∙ -
ఈ వారం కథ: సోల్మేట్
‘‘అమ్మా, నాకేం తెలీదు.. నువ్వు రేపు నాన్నతో కలిసి లిటరరీ ఫెస్టివల్కు వెళ్తున్నావంతే’’ అంటూ స్వర తన అంతిమ తీర్పును చెప్పేసింది. ఆ ఇంట్లో ఆమె చిన్నదైనా, తల్లిదండ్రుల ఏకైక గారాలపట్టి కావడంతో, తన మాట ఎలాగైనా నెగ్గేలా చేసుకోవడం ఆమెకు కొట్టిన పిండి! ‘‘స్వరా, ప్లీజ్! ఈ విషయంలో నువ్వు నన్ను బలవంతం చెయ్యొద్దు. నేనెందుకు పానకంలో పుడకలా? అదంతా మీ నాన్న ఫ్రెండ్ ఒకరి పుస్తకావిష్కరణ వేడుక. ఆ రచనకు మీ నాన్న ముందుమాట రాశారు. ఆ పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. దాంతో పాటు ఉపన్యాసాలు, చర్చా కార్యక్రమాలు, కవిసమ్మేళనాలు, కథాగోష్ఠులు ఉన్నాయి. అక్కడ మీ నాన్నలాగే గొప్ప గొప్ప కవులు వచ్చుంటారు. ఇంకా కొంతమంది సాహిత్యాభిమానులు ఉపన్యాసం వినడానికి, కవితలు ఆస్వాదించడానికి వచ్చి ఉంటారు. నేను ఆ రెండు గుంపుల్లోనూ చేరని దాన్ని. అలాంటప్పుడు నేనెందుకు ఆ కార్యక్రమానికి వెళ్లి నా టైమ్ వేస్ట్ చేసుకోవాలి చెప్పు? నాకక్కడ చాలా అసౌకర్యంగా ఉంటుంది. నన్ను బలవంతం చేయొద్దు ప్లీజ్’’ అంటూ అరగంట నుంచి తనను బతిమాలుతున్న కూతురి ఒత్తిడికి లొంగడానికి ఇష్టపడని సౌదామిని తన మనసులో మాటను కూతురికి చెప్పింది.‘‘అమ్మా, కొన్నిసార్లు మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడటం తప్పనిసరి అవుతుంది. ఇది కూడా అలాగే అనుకో.’’కూతురి మాటల ధోరణి సౌదామినికి వింతగా అనిపించింది! ఈ అమ్మాయి ఎందుకింత మొండిగా పట్టుబట్టి కూర్చుంది? ‘అమ్మను కవి సమ్మేళనానికి రమ్మని ఒప్పించు’ అని తన భర్తేమైనా దీనికి చెప్పి ఉంటారా అనే చిన్న అనుమానం ఆమెను వేధించినా, ఆయనకు తాను రావాలని ఉంటే, ఆయనే స్వయంగా చెప్పేవారు. కూతురి ద్వారా ఎందుకు చెప్పిస్తారు అనుకుని, తన ఆలోచనకు నవ్వుకుంది సౌదామిని.‘‘నాకు చాలా పని ఉంది. ఇటు చూడు, ఎవరో మీ నాన్న ఫ్రెండ్ ఇంత పెద్ద పనసపండు ఇచ్చి వెళ్లారు. దాని తొనలు తీసి సాయంత్రం కొంచెం పాఠోళీ చేయాలి. మిగిలిన దానిలో రేపు ఉదయం పనసపండు ఆవిరి కుడుములు చేయాలి. మీ నాన్నకు పనసపండు, ఇంకా దాని వంటకాలంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. రేపు మీ నాన్న పుస్తకావిష్కరణ వేడుకకు వెళ్లేటప్పుడు ఆయనతో పాటు కారులో ఆయన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. అందుకే దారిలో తినడానికి ఏవైనా చిరుతిళ్లు చేయాలి. పోయినసారి చక్కిలాలు చేసిచ్చాను. అందరూ చాలా రుచిగా ఉందని ఇష్టపడి తిన్నారట. ఈసారి కొంచెం కారప్పూస చేస్తాను. ఇన్ని పనుల టెన్షన్లో నేనుంటే నువ్వు నాకు నక్షత్రకుడిలాగా తగులుకున్నావేమిటే?’’ అని విసుక్కుంది సౌదామిని.‘‘అమ్మా, కొంచెం నీ వంటగది ప్రపంచం నుంచి బయటికి రా. నువ్వు రేపు ఉదయం కుడుములు, గిడుములు అంటూ లేనిపోని పనులన్నీ నెత్తిన వేసుకుని కూర్చోకు. నాన్న తొందరగా బయలుదేరతారు. అందుకే నువ్వు ఆయనతో పాటు త్వరగా సిద్ధమై బయలుదేరు. రేపొక్క రోజుకు నేనే మ్యాగీ చేస్తాను. దట్స్ ఆల్!’’ అని స్వర చిరాకుగా చెప్పింది.‘‘స్వరా, నేను వెళ్ళను. నువ్వు నన్ను బలవంతం చేయకు. కొన్నిసార్లు నువ్వు కూడా, నేను ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్దాం పద అంటే ‘నేను రాను, నాకు అక్కడ డిస్కంఫర్టబుల్గా ఉంటుంది’ అంటూ తప్పించుకుంటావు కదా. నాకూ అలాగే ఉంటుంది. ఈ కవి సమ్మేళనం, సాహిత్య సంబరం, పుస్తకావిష్కరణ అంటూ నన్ను లాగొద్దు. మీ నాన్నతో ఇరవై ఐదు సంవత్సరాలు సంసారం చేశాను. మా ఇంట్లో జరిగిన గోష్ఠి తప్ప ఇప్పటివరకు ఆయనతో ఒక్క కవి సమ్మేళనంలోగాని, ఆయన పుస్తకావిష్కరణ వేడుకలోగాని నేను పాల్గొనలేదు. ఆయనా దాన్ని ఎక్స్పెక్ట్ చేయరు కూడా’’ సౌదామిని తల అడ్డంగా తిప్పుతూ, పనసతొనలు తీయడంలో లీనమైంది.‘‘అమ్మా, ఇన్నాళ్లు నువ్వు వెళ్లకపోయి ఉండవచ్చు. కాని, ఇక నువ్వు ఇలాగే కిచెన్ క్వీన్ అంటూ ఇంట్లోనే కూర్చుంటే, ఆ తర్వాత అంతే... నేను నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.’’‘‘ఏంటది, ఏదో చెప్పాలనుకుంటున్నావు. దాన్ని చెప్పడానికి ఇంతలా కష్టపడుతున్నావు? టెల్ మీ వాట్స్ ద మ్యాటర్?’’ ఇప్పుడు సౌదామినికీ ఏదో అనుమానం మొదలైంది.‘‘అమ్మా, విషయం ఇంకా చిన్నగానే ఉంది. కాని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అంటారే, ఇదీ కొంచెం అలాగే. నువ్వు ఏడ్చి గోల చేయనంటే చెబుతాను.’’ స్వర మరింత చిక్కుగా చెప్పింది.‘‘నువ్వు ఇంత సస్పెన్స్లో పెడితే ఎలా? నా గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది చూడు,’’ అని కొంచెం కలవరపడినట్లు పలికింది సౌదామిని.‘‘అమ్మా, అదీ నేను ఈ రోజు నాన్న స్నానానికి వెళ్ళినప్పుడు, నా మొబైల్లో చార్జ్ లేదని గూగుల్లో ఏదో సెర్చ్ చేయడానికి అని నాన్న మొబైల్ తీసుకున్నాను. సరిగ్గా అప్పుడే ఆయన వాట్సప్కి మానసగంగ అనే వారి నుంచి మెసేజ్ వచ్చింది. కుతూహలం ఆపుకోలేక చెక్ చేశాను... నీకు తెలుసా మానసగంగ ఎవరో?’’‘‘ఊ, ఎప్పుడో ఒకసారి మన ఇంటికి వచ్చినట్లుంది. హా! ఆ రోజు మీ నాన్న బర్త్డేకి మన ఇంట్లోనే కవి సమ్మేళనం ఉన్నప్పుడు చూశాను. నువ్వు అప్పుడు బెంగళూరులో ఇంజినీరింగ్ చేస్తున్నావు. యాక్చువల్గా ఆమె పేరు మానసగంగ కాదు, ఆమె పేరు సావిత్రి అంట. ఆ పేరు ఆమెకి ఇష్టం లేదంట, ఓల్డ్ ఫ్యాషన్డ్ అంట. ఆ పేరుతో కవిత రాస్తే ఎవరూ మెచ్చుకోరంట... అందుకే మానసగంగ అని కలంపేరు పెట్టుకున్నానని ఆ రోజే చెప్పింది. మీ నాన్నే తనకు కవిత రాయడానికి గురువు, స్ఫూర్తి అని కూడా చెప్పింది. ఆమె మీ నాన్నకు ఏం మెసేజ్ చేసింది?’’ సౌదామిని కనుబొమ్మలు ముడిచి అడిగింది.‘‘నాన్న మొబైల్లో ఆమె ఫోటో చూశాను. చాలా పిచ్చిగా ఉంది. ఎదురుగా ఎలా ఉంది?’’ స్వర కుతూహలంతో అడిగింది.‘‘చాలా ముద్దుగా ఉంది. అంతే బాగా మేకప్ వేసుకుని, స్టైల్గా చీర కట్టుకుని ఉంది. ఏదో కాలేజీలో తెలుగు లెక్చరర్గా వర్క్ చేస్తోందంట. ఎమ్మే చదివేటప్పుడే తన లెక్చరర్ ఒకరిని లవ్ చేసి పెళ్లి చేసుకుందంట. ఆ పెళ్లి రెండు సంవత్సరాలు కూడా నిలవలేదంట... అదంతా ఆ రోజు కవి సమ్మేళనానికి వచ్చిన ఆడవాళ్లలో కొంతమంది గుసగుస లాడుకున్నారు. ఆ రోజు ఆమెనే కార్యక్రమం యాంకరింగ్ చేసింది. ఆమె యాంకరింగ్ స్టైల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. అక్కడ సభలో కూర్చున్న ఎవరో ‘ఆహా, వగలాడి. అదేం స్టైలో, అదేం మేకప్పో, ఎవరినైనా మాటలతో లోబరచుకునే కళ ఈమెకు ఎంత బాగా అబ్బిందో చూడు’ అని తన పక్కన కూర్చున్న వారికి చెబుతున్నారు. దానికి పక్కనున్న ఆవిడ ‘ఏం చేస్తే ఏం లాభం? తన సంసారాన్ని నిలబెట్టుకోలేకపోయింది పాపం! ఈమె పంచవన్నెల చిలక అని తెలియగానే అతను ఈమెను వదిలేసి ఉంటాడు’ అని కిసుక్కున నవ్వింది. నాకు అయ్యో అనిపించింది. ఒక ఆడది ముందుకు వస్తే జనం ఎలా ఆమె గురించి లేనిపోనివన్నీ ఆడుకుంటారే అని చాలా చిరాకు కలిగింది. అదంతా సరే, నువ్వెందుకు ఆమె గురించి అడుగుతున్నావు? అలాంటిదేం మెసేజ్ పంపింది మానసగంగ, ఐ మీన్ సావిత్రి...’’‘‘అమ్మా, ఆమె నాన్నతో ఫ్లర్ట్ చేస్తోంది. నాన్నకు ఏవేవో మెసేజ్లు పంపింది. నాన్న కూడా దానికి అంతే రసికత్వంతో సమాధానమిచ్చారు. ఆమె పాత మెసేజ్లను కూడా నాన్న డిలీట్ చేయలేదు. నేను అదంతా స్క్రీన్ షాట్ తీసి నా మొబైల్కు ఫార్వర్డ్ చేసుకుని ఆ తర్వాత నిదానంగా చదివాను. ఐ వాస్ ఇన్ ఎ షాక్. ఇద్దరూ కొంచెం ఎక్కువే క్లోజ్ అయినట్లుంది.’’ స్వర తన గొంతు తగ్గించి పలికింది. నాన్న గురించి తన తల్లి ముందు ఇలా చెప్పడానికి ఆమె మనసు కాస్త వెనుకంజ వేస్తోంది.‘‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధి ఉందా నీకు? కేవలం సెక్స్, క్రైమ్, అనైతిక సంబంధాల చుట్టూనే అల్లిన సినిమాలను ఓటీటీల్లో చూడటం తగ్గించు. అప్పుడు ఇలా అందరిపై అనుమానం రావడం తగ్గుతుంది. ఆయన మీ నాన్న అన్న విషయం మర్చిపోయావా ఏంటి? ఈ మాట నీ బదులు వేరే ఎవరైనా చెప్పి ఉంటే, వాళ్ల నాలుకను కోసి ఇంటి గుమ్మానికి తోరణం కట్టి ఉండేదాన్ని!’’ సౌదామిని పనస తొనలు తీసే పనిని అక్కడితో ఆపి, చెంగున కత్తిపీట మీది నుంచి లేచి కోపంతో కూతురి వైపు చూసింది.‘‘ఆయన కేవలం నీకు భర్త మాత్రమే కాదు. నాకు నాన్న కూడా. అందుకే ఆయన గురించి చెప్పడానికి ముందు వందసార్లు ఆలోచించాను. వాళ్లిద్దరి చాటింగ్ల స్క్రీన్ షాట్ నీ మొబైల్కు పంపిస్తాను. నిదానంగా కూర్చుని చదువు.’’ అంటూ ఒక పనస తొనను నోట్లో వేసుకున్నది. కాని, ఎందుకో అది చేదుగా అనిపించి, దాన్ని ఊయడానికి వాష్ బేసిన్ వైపు వెళ్ళింది.∙∙ సౌదామిని భర్త శేషగిరి ఒక పెద్ద కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్. అనేక విషయాలపై ఆసక్తి, జీవితం పట్ల అనురక్తి కలిగిన వ్యక్తి అతను. విమర్శకుడు, కవి, కథకుడు, అనేక మంది వర్ధమాన రచయితలకు మార్గదర్శకుడు. ఏ విషయం గురించి అయినా సభికులకు విసుగు రాకుండా రసవత్తరంగా ఉపన్యాసం ఇవ్వగలిగే వాక్చతురుడు! అతనితో పాటు పనిచేసే సై లెక్చరర్లందరూ కాలేజీ ముగిసిన తర్వాత, అలాగే వేసవి సెలవుల్లో కోచింగ్ సెంటర్కు వెళ్లి పాఠం చెప్పి జీతంతో పాటు ఎక్స్ట్రా ఇ¯Œ కమ్ సంపాదించడంలో మునిగి ఉన్నా, ఇతనికి కూడా చాలామంది అలాంటి సలహా ఇచ్చినా, శేషగిరికి లక్ష్మి కంటే సరస్వతియే ఎక్కువ ప్రియమైనదై, కథలు, కవితలు, వ్యాసాలు రాసి పుస్తకాలు ప్రచురించడంలోనే ఎక్కువ ఆసక్తి చూపించాడు. సాహితీవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. ఏ లాబీయింగూ లేకుండానే కొన్ని అవార్డులు కూడా గెలుచుకున్నాడు. కాని, తానే మెచ్చి పెళ్లి చేసుకున్న సౌదామిని మాత్రం దానికి పూర్తి విరుద్ధం! ఎక్కువగా మాట్లాడని మౌనగౌరి ఆమె! కథలైనా కొంచెం చదివేదేమో కాని, కవితలంటే ఆమెకు అలర్జీ! పెళ్లైన కొత్తల్లో భార్యకు తన కవితలను చదివి వినిపించే అలవాటు శేషగిరికి ఉండేది. కాని, తాను కవితలు చదివి వినిపించేటప్పుడు భార్య మౌనంగా కళ్లు పెద్దవి చేసి చూసి, చివరకు ‘బాగుంది’ అని భావరహితంగా చెప్పడం చూసి, ఆమెకు దానిపై ఆసక్తి లేదని అర్థం చేసుకోవడానికి అతనికి ఎక్కువ కాలం పట్టలేదు. అందుకే నెమ్మదిగా అతను తన రచన గురించి భార్య ముందు చెప్పడమే మానేశాడు.సౌదామిని కూడా దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా, తన పనిలో తాను నిమగ్నమై తన పతివ్రతా ధర్మాన్ని ఏమాత్రం తప్పకుండా పాటిస్తూ పోయింది. విపరీతమైన జిహ్వచాపల్యం ఉన్న భర్త అవసరాలన్నీ అర్థం చేసుకుని, అతని కోరిక తీర్చడంలోనే తన జీవితానికి ఒక సార్థకత ఉందని ఆమె భావించింది.శేషగిరి కాలేజీ ముగించి ఇంటికి వచ్చి భార్య చేసి ఇచ్చిన అల్పాహారం తిని, కాఫీ తాగి తన లైబ్రరీ గదిలోకి వెళితే అంతే. చదవడం, రాయడంలోనే లీనమైపోయేవాడు. గోడపై ఉన్న పాతకాలం పెండ్యూలమ్ గడియారం తొమ్మిదిసార్లు కొట్టినప్పుడే బయటికి వచ్చేవాడు! భోజనం తర్వాత కూడా ఏవైనా సగం చదివిన పుస్తకాలు ఉంటే, పూర్తి చేసే పడుకునేవాడు.ఎన్ని పుస్తకాలు చదివి, విమర్శలు రాశాడో అతనికే లెక్క లేదు. ఆ విమర్శాత్మక వ్యాసాలన్నింటినీ సేకరించి కొన్ని విమర్శా గ్రంథాలను వెలువరించాడు. అనేక కథా సంకలనాలు, కొన్ని కవితా సంకలనాలు, మూడు జీవిత చరిత్రలు ఇలా శేషగిరి ఒకటి రెండు రచనలైనా ప్రతి సంవత్సరం విడుదల అవుతూనే ఉండేవి. ఈ మధ్య స్మార్ట్ఫోన్ వచ్చాక కవులతో అతని స్నేహం మరింత పెరిగింది. వేరే వేరే ఊర్లలో జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమాలకు అతిథిగా కూడా వెళ్లేవాడు. కాని, కవితల లోకంలో మునిగి ఉన్న తన భర్త, మానసగంగ అనే కవయిత్రితో రహస్యంగా చాటింగ్ చేస్తున్నాడనే చిన్న అనుమానం కూడా సౌదామినికి రాలేదు. దానికి కారణం వారిద్దరి మధ్య ఉన్న వయస్సు అంతరం! మానసగంగకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయస్సు, శేషగిరికి యాభై రెండు!∙∙ కూతురు తన మొబైల్కు పంపిన అన్ని మెసేజ్లను చదివిన తర్వాత, సౌదామినికి భర్తపై అంతులేని కోపం వచ్చింది. తానేం తక్కువ చేశానని తన భర్త ఇలా ఆమెతో సరస సల్లాపాలు మొదలుపెట్టాడో ఆమెకు అర్థం కాలేదు. తనకు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా జాబ్ చేసే ఇరవై మూడు సంవత్సరాల కూతురు ఉన్నా, తాను ఇంకా అందాన్ని కోల్పోలేదు. ఇప్పటికీ నాజూకైన తీగలా సన్నగా, తెల్లగా, లక్షణంగా ఉన్న తాను తన భర్త దృష్టిలో పాతబడిపోయానా? లేదా ఆ మానసగంగ అంతలా మార్చివేసిందా? చాటింగ్ మొదలుపెట్టింది ఆమెనే. తన కవితలను కొన్ని పంపి ‘ఎలా ఉన్నాయో చూడండి సర్’ అని పెట్టింది. శేషగిరి వాటి లోటుపాట్లను సరిచేసి పంపినప్పుడు, దాన్ని పత్రికలకు పంపి పేరు సంపాదించుకుంది. అలా ప్రచురించబడిన కవితలను మళ్లీ శేషగిరికి పంపి ‘దీని క్రెడిట్ మీకే చెందాలి’ అని ఒక హృదయం ఎమోజీ పెట్టింది.శేషగిరికి మరో అలవాటు ఉండేది. ఇంటర్నెట్లో దొరికే అందమైన అమ్మాయిల ఫొటోలకు, ప్రకృతి ఫొటోలకు తగిన కవిత రాసి దాన్ని తన స్టేటస్లో, వాట్సప్ గ్రూప్లో పెట్టే అలవాటు! కాని, ఈ మానసగంగ అతని కవిత్వానికి సవాలు విసిరినట్లు, మరులుగొలిపే అందమైన చీర కట్టుకున్న, జుట్టు వదిలేసిన, పెదవులకు రంగు అద్దుకున్న, ఆకర్షణీయమైన భంగిమల్లో తన ఫోటోలు పంపి ‘దీనిపై ఒక కవిత రాయండి చూద్దాం’ అని మెసేజ్ చేసినప్పుడు, శేషగిరి బుద్ధిమంతుడైన విద్యార్థిలా ఆ ఫొటోలన్నింటికీ ఆమె సౌందర్యాన్ని కొంచెం ఎక్కువే అనిపించేంతగా పొగిడి, శృంగారమయంగా కవితలు రాసి ఆమెకు పంపాడు. ఆ కవితలను చదివిన సౌదామిని గుండెలో అగ్నిపర్వతం బద్దలయ్యింది.సౌదామిని కన్నీళ్లు కారుస్తూ, స్వర రూమ్కు వచ్చి మంచంపై కుప్పకూలి కూర్చుంది. ‘‘నేను మీ నాన్నను దేవుడి లాంటి మనిషి అని నమ్మడం పెద్ద పొరపాటైంది. ఈ రోజు ఆయన ఇంటికి రానివ్వు. చెప్తాను. ఆయనకు. ఇరవై ఐదు సంవత్సరాలు నిష్ఠతో ఆయనతో సంసారం చేసినందుకు ఆయన నాకు మంచి బహుమతినే ఇచ్చారు. కవి సమ్మేళనం పేరుతో ఆమెతో సరసాలాడటానికి వెళ్తున్నారని నాకు ఈ రోజు తెలిసింది. అదీ నువ్వు చెప్పిన తర్వాత...’’ అని వెక్కివెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది.‘‘ఏడవొద్దమ్మా, అలాంటిదేం జరగలేదు...’’‘‘ఇంకేం జరగాలి...? ఆమె ఫొటోలన్నింటికీ అంత శృంగారమయమైన కవితలు రాశారు మీ నాన్న... ఇంకొన్ని రోజులు పోతే నన్ను కూడా ఇంటి నుంచి బయటికి తరిమేస్తుందేమో వగలాడి. ఆ రోజు ఆ ఆడవాళ్లు ఈమె గురించి ఆడిన మాటలు అబద్ధం కాదు...’’ సౌదామిని పళ్లు కొరుకుతూ చెప్పింది.‘‘అమ్మా, వాళ్లిద్దరి మధ్య అలాంటిదేం జరగలేదు. డోంట్ వర్రీ. నువ్వు నాన్న హృదయంలో ఖాళీగా వదిలిన స్థలాన్ని ఆమె ఆక్రమించింది అంతే. ప్రతి మనిషికి తన భావాలకు స్పందించే, తనను మెచ్చుకునే ఒక సోల్ మేట్ అవసరం ఉంటుంది. కళాకారులకు, కవులకు అలాంటి ఒక ఆత్మసఖుడు లేదా ఆత్మసఖి అవసరం ఎక్కువగా ఉంటుంది. కాని నువ్వు నాన్న కవితలను మెచ్చుకోలేదు, ఆయనలోని భావాలకు విలువ ఇవ్వలేదు. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచో దాని గురించి లోలోపల బాధపడి ఉండాలి. అలాంటి సమయంలో మానసగంగ ఆయన కవితలను మెచ్చి, అప్పుడప్పుడు గిలిగింతలు పెట్టే మెసేజ్లు చేస్తూ ఆయనకు దగ్గరైంది. కాని ఒక మాట మాత్రం నిజం. ఆమెతో చాటింగ్ చేసినప్పుడు బహుశా నాన్న మనసుకు ఏదో రిలాక్స్ ఫీల్ అవుతూ ఉండవచ్చు. అది తప్ప నాన్న ఆమెకు ఎక్కడా అశ్లీలంగా మెసేజ్ చేయలేదు... దాన్ని నువ్వు మర్చిపోవద్దు.’’‘‘ఊ, అదీ నిజమే. నేను ఆయనను అర్థం చేసుకోవాల్సింది. ఇప్పటికైనా నేను ఆయనకు ఒక ఫ్రెండ్గా అయ్యే, ఆయన తమ ఫీలింగ్స్ను పంచుకోవాలనుకునే ఆత్మసఖిగా అయ్యే ప్రయత్నం చేస్తాను. రేపు మీ నాన్నతో సాహిత్య కార్యక్రమానికి వెళ్తాను. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ నాన్న కవితలను, కథలను చదువుతాను. పాపం, ఊరంతా పొగిడే ఆయనను నేను ఒక్క రోజు కూడా మెచ్చుకోలేదు, పొగడలేదు...’’ సౌదామిని మనస్ఫూర్తిగా బాధపడుతూ పలికింది.‘‘నాన్నా, మీకు ఒక సర్ప్రైజ్. రేపు విజయవాడ లిటరరీ ఫెస్టివల్కు మీతో పాటు అమ్మ కూడా వస్తుందంట...’’ భోజనం చేస్తూ స్వర చెప్పినప్పుడు శేషగిరి నవ్వుతూ, ‘‘మీ అమ్మ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవడానికి వస్తుండాలి. ఆమెకు నా కవితల గురించి ఆసక్తి ఎక్కడుంది?’’ అన్నాడు.‘‘అయ్యో లేదులెండి, ఈ రోజు మీ బుక్ షెల్ఫ్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మీదొక కవితా సంకలనం దొరికింది. కొన్ని కవితలు చదివినప్పుడు చాలా ఇష్టమైంది... అందుకే నేను రేపు వద్దాం అని...’’ చెప్పింది సౌదామిని.శేషగిరి తనతో పాటు వచ్చే మరో ఇద్దరు కవులకు, మానసగంగకు తాను భార్య, కూతురితో కలిసి విజయవాడకు వస్తున్నానని, వారు వేరే కారు ఏర్పాటు చేసుకోవాలని మెసేజ్ చేశాడు.కారు వెనుక సీట్లో కూర్చున్న స్వర, ల్యాప్టాప్లో ఏదో వెబ్ సిరీస్ చూడటంలో లీనమైంది. డ్రైవింగ్ సీట్లో ఉన్న శేషగిరి తన పక్కన కూర్చున్న సౌదామిని మిరుమిట్లుగొలిపే సౌందర్యాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఈ రోజు సౌదామిని, తాను కట్టుకున్న ఆకాశనీలం రంగు డిజైనర్ చీరలో, కూతురు ఆసక్తిగా చేసిన మేకప్లో శేషగిరి కళ్లకు అతిలోక సుందరిగా కనిపించింది.పుస్తకావిష్కరణ, ఉపన్యాసం ముగిసిన తర్వాత, కవి సమ్మేళనంలో శేషగిరి భార్యపై ఒక అందమైన ఆశుకవిత వినిపించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. కార్యక్రమం చివర్లో ‘మేడమ్, శేషగిరిగారు ప్రణయ కవులు. మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది, ఇంత అందమైన భార్య ఉన్నప్పుడు ఆయన ప్రేమ కవితలు రాయకుండా ఉంటారా’ అని ఒకరిద్దరు పొగిడినప్పుడు సౌదామిని సిగ్గుపడింది. అయితే శేషగిరి ‘నిజం. నేను పెళ్లైన కొత్తల్లో ప్రచురించిన మూడు కవితా సంకలనాలు నా భార్య గురించే’ అన్నప్పుడు అవాక్కవడం సౌదామిని వంతు అయ్యింది.∙∙ ఇప్పుడు సౌదామినికి తీరికే లేదు. ఆమె ఇప్పుడు భర్తతో పాటు సాహిత్యానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికీ వెళ్తుంది. ఆసక్తిగా ఫొటోలు తీస్తుంది, అతని ఉపన్యాసం వీడియో చేసి తన ఫ్యామిలీ గ్రూప్కు షేర్ చేస్తుంది. నెమ్మదిగా ఆమెకు కూడా ఇప్పుడు సాహిత్యంపై ఆసక్తి మొదలైంది. భార్యలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పు శేషగిరిలో మరింత హుషారును నింపింది.మొన్న మొన్ననే తెనాలిలో జరిగిన నెలనెలా వెన్నెల కార్యక్రమానికి వెళ్లిన సౌదామిని కళ్లు మానసగంగ కోసం వెతికాయి. ఊహూ! ఆమె రాలేదు. అంతేకాదు, సౌదామిని భర్తకు తెలియకుండా ఆయన మొబైల్ కూడా చెక్ చేసి చూసింది. విజయవాడ కవి సమ్మేళనం తర్వాత మానసగంగ శేషగిరికి మళ్లీ మెసేజ్ చేయలేదు. ‘కవిత రాయండి’ అని తన అందమైన ఫోటో కూడా పంపడం మానేసింది. -
కథాకళి: నాతిచరామి
నా మిత్రుడు లీలాచరణ్ మందు మానేశాడని విని నేను నమ్మలేదు. అదే నిజమైతే అది ప్రపంచంలో ఎనిమిదో వింత అవుతుంది. లీలాచరణ్ భార్య, తల్లిదండ్రులు, స్నేహితులు, వాడితో పరిచయం ఉన్న ఎవరికైనా అది నమ్మలేని నిజమే. లీలాచరణ్ వయసు డెబ్బె ఏడు. వాడిని వాడు అంటున్నానంటే నా వయసుని మీరు ఊహించొచ్చు.నా కో–స్టూడెంట్గా పరిచయమయ్యే నాటికే లీలాచరణ్కి ఆల్కహాల్ అలవాటు ఉంది. అప్పుడే కొత్తగా ఆంధ్రాలో ప్రొహిబిషన్ తీసేశారు. ఓసారి మేథ్స్ టీచర్ వాడి నుంచి వాసన వస్తూంటే పట్టుకున్నప్పుడు మాకా సంగతి తెలిసింది. వాడి తండ్రి విద్యుత్ శాఖలో ఏదో కీలకమైన పోస్ట్లో ఉండడంతో పైసంపాదన చాలా వచ్చేది. పిల్లల మీద ప్రేమతో ఆయన వాళ్ళు అడిగినంత కాదనకుండా ఇస్తూండేవారు. లీలాచరణ్ తను తాగడమే కాక, కంపెనీకి మమ్మల్ని తన వెంట తీసుకెళ్ళి మా డ్రింక్ ఖర్చు కూడా తనే భరించేవాడు. నేను, మా క్లాస్లో చాలామంది మొదటిసారి మందు తాగింది లీలాచరణ్తోనే. ఆ కారణంగా లీలాచరణ్ మిత్రబృందం ఓ మందలా ఉండేది. కాలేజ్లో కూడా లీలాచరణ్ నా క్లాస్మేట్. వయసు పెరిగే కొద్దీ వాడిలో మందు అలవాటు కూడా పెరగసాగింది. లీలాచరణ్ తాగుడికి పరాకాష్ట గురించి చెప్పడానికి రెండు మూడు సంఘటనలని ఉదహరిస్తే చాలు. పెళ్ళిరోజున వాడు ఇంట్లోంచి మాయమయ్యాడు. మా మిత్రబృందం రైలు పట్టాల దగ్గర కూర్చుని తాగుతున్నవాడిని వెతికి తెచ్చాం.‘‘ఒరేయ్. బార్లో ఉంటే నన్ను పట్టుకుంటారని ఇక్కడికి వస్తే ఇక్కడా తగలడ్డారా మిత్రద్రోహుల్లారా!’’ దారిలో వాపోయాడు.ఈ కాలం పెళ్ళికూతుళ్లయితే ‘వాడికి నాకంటే మందు ముఖ్యమా? ఆ సీసాకి తాళి కట్టమనండి’ అని కోపంగా అరిచి వెళ్ళిపోయేవాళ్ళు. కాని 1970లలోని ఆడపిల్లల పరిస్థితి వేరు.వాడి తాగుబోతుతనాన్ని ఉదహరించదగ్గ రెండో సంఘటన. లీలాచరణ్ ఆ రాత్రి పన్నెండున్నరైనా ఇంటికి రాలేదని, వెతకమని మా ఇంటివారికి ఫోన్ చేసి నాకు చెప్పమని అతని భార్య చెప్పింది. నేను వెంటనే చెప్పులు తొడుక్కుని వెతకడానికి బయలుదేరాను. వాడు వెళ్ళే అన్ని బార్లకి వెళ్ళాను. ఓ బార్లోని వాళ్ళు చెప్పారు.‘‘మీవాడు చాలా తాగాడండి. ఎంత తాగాడంటే ఒంటి మీది లుంగీ ఊడిపోయిందని కూడా చూసుకోకుండా వెళ్ళిపోయాడు.’’నేను రోడ్లన్నీ తిరుగుతూంటే ఒంటి మీద కేవలం చొక్కా మాత్రమే ఉన్న, అండర్వేర్ కూడా లేని లీలాచరణ్ ఓచోట లైట్ స్తంభంతో ఏదో మాట్లాడుతూ కనిపించాడు.మరో సంఘటన, స్కూటర్ని నడుపుతూ దాన్ని ఓ లారీ కిందకి పోనించాడు. వాడి అదృష్టం, స్కూటర్ పిప్పి పిప్పి అయింది కాని వాడికి ఏం కాలేదు. వాడు ఇంటికి శంషాద్ బేగం పాట ‘తుమ్హారీ యాద్ సతాతీ హై’ అని పాడుతూ చేరుకున్నాడు.అతని భార్య సాధ్వి అనే పదానికి సరైన నిర్వచనం. నాతిచరామి అనే వాగ్దానానికి వాడు కట్టుబడి లేడు. వాడిని తాగద్దు అంటే మండిపడతాడని గ్రహించిన ఆవిడ పెళ్ళైన మూడో నెల నించే ఆ మాటని మానుకుంది. ‘‘మిత్రమా. నాకు రమ్మంటే ప్రాణమా లేక నా భార్యంటే ప్రేమా అన్నది తెలుసుకోలేకపోతున్నాను. ఆ రెంటిలో ఏది లేకపోయినా జీవించలేను.’’ తాగనప్పుడు ఓసారి నాకు చెప్పాడు.అలాంటి లీలాచరణ్ మందు మానేశాడని, అది నిజమని తెలిశాక నేను వాడి ఇంటికి వెళ్ళాను.‘‘నా నుంచి ఎప్పటిలా ఏ సువాసనలు రానందుకు మన్నించు మిత్రమా.’’ నన్ను చూసి నవ్వుతూ చెప్పాడు.‘‘నిజమేనన్న మాట?’’ అడిగాను.‘‘చిత్తం. నా చిత్తాన్ని కత్తితో నరికి పారేశాను.’’‘‘ఇంత కాలానికి ఆ కత్తి ఎలా దొరికింది?’’ ప్రశ్నించాను.‘‘ఓసారి అన్నా గుర్తుందా, నాకు ఆ రెంటిలో దేని మీద ఎక్కువ ప్రేమో తెలీడం లేదని? ఇప్పుడు తెలిసింది. నా భార్య అంటేనే ప్రేమ.’’ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.‘‘నీ తాగుడు ఆమెకి ఇష్టం లేదని ఇంత కాలానికి గ్రహించి మానేశావంటే నమ్మను. డాక్టర్ ఇంకా ఎన్ని రోజులని చెప్పారు?’’ నవ్వుతూ అడిగాను.‘‘ఆరోగ్యం చెడింది నాకు కాదు. మా ఆవిడకి. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ సమయంలో నేను తాగిన మత్తులో ఉండడంతో గోల్డెన్ అవర్లో కాక, ఆలస్యంగా మర్నాడు మధ్యాహ్నం హాస్పిటల్కి తీసుకెళ్ళబట్టి కాళ్ళు చచ్చుపడ్డాయి. వెంటనే తేవాల్సిందని డాక్టర్ మందలించాడు. ప్రతి రాత్రి మూడు దాటాక ఆవిడని బాత్రూంకి తీసుకువెళ్ళాలి. మనిషి సహాయం లేకుండా నడవలేదు. కాబట్టి మేలుకుని ఉండాలని మందు మానేశాను.’’‘అయ్యో’ అనకుండా ఉండలేకపోయాను.‘‘దేవదాసు, రోమియోలని మించిన ప్రేమ నీది.’’ మనస్ఫూర్తిగా చెప్పాను.‘‘నాది కాదురా పిచ్చి వెధవా. పార్వతీ, జూలియట్లని మించిన ప్రేమ మా ఆవిడది. చాలాకాలం క్రితం ఆవిడకి అనారోగ్యం వచ్చినప్పుడు, డాక్టర్ ప్రతి రాత్రి తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పిన మాత్రని నా మీద ప్రేమతో వేసుకోవడం మానేసింది. ఆ మాత్రలో నిద్రని కలిగించే లక్షణం ఉంది. నేను తాగినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఇంటికి వస్తానో, అసలు వస్తానో, రానో ఆ సమయంలో తను మెలకువగా ఉండాలని దాన్ని వేసుకోవడం మానేసింది. దాంతో డాక్టర్ హెచ్చరించినట్లుగానే ఆవిడ రోగం ఇంత దూరం వచ్చింది. ఆ సంగతి నాకు చెప్పి ఉంటేనా...’’నవ్వుతూ చెప్పినా లీలాచరణ్ కళ్ళల్లో తడిని స్పష్టంగా చూశాను. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఉద్యోగం మారాలా? ఈ బారుకెళ్లండి!
కొందరు మనసు బాగా లేకుంటే బారుకెళతారు. ఇంకొందరు సంతోషాన్ని పట్టలేక బారుకెళతారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకోవడానికి సురశాలలు సురక్షితమైన వేదికలు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నోరకాల బార్లు ఉన్నాయి. ఏ బారుకు ఎవరు వెళ్లినా, అక్కడ చేసేదొక్కటే! కాస్త మందు పుచ్చుకుని, మనసును సేదదీర్చుకోవడమే! జపాన్లోని యోకోహామాలో ఉన్న ‘తెన్షొకు సొడాన్’ బారు మాత్రం ఇంకొంచెం ప్రయోజనాత్మకమైన బారు. ఉన్న ఉద్యోగాల్లో విసిగిపోయిన ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారు ఇది. చాలాకాలంగా ఉద్యోగం చేస్తున్నా, ఎదుగూ బొదుగూ లేనివారు ఉద్యోగం మారాలనుకుంటున్నట్లయితే, అలాంటి ఉద్యోగులకు ఈ బారు సరైన వేదిక. ఉన్న ఉద్యోగం వదిలేసి మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. అలాంటి వారికి ఈ బారులో కెరీర్ కౌన్సెలర్లతో ప్రత్యేకమైన గదుల్లో ప్రైవేటు సిటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. గంట నుంచి గంటన్నర సేపు కొనసాగే ఈ సిటింగ్లలో కెరీర్ కౌన్సెలర్లతో కలసి మందేస్తూ, మారబోయే ఉద్యోగాల గురించి మనసు విప్పి చర్చించుకోవచ్చు. అర్హతలు, అదృష్టం బాగుంటే మంచి ఆఫర్ అక్కడికక్కడే పొందవచ్చు కూడా! ఈ విలక్షణమైన బారు ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభమైంది.


