breaking news
Funday
-
మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. స్నికెర్ డూడుల్ కుకీస్
ప్రతిరోజూ ఒకే రకమైన వంట తిని ఇబ్బంది పడుతున్నారా! అయితే కొత్త వంటకాలు ఏం చేయాలి? ఎలా చేయాలనుకునే వారు వీటిని ప్రయత్నించండి..మష్రూమ్ పెప్పర్ ఫ్రైకావలసినవి:మిరియాలు: టేబుల్ స్పూన్సోంపు: 1/2 టీస్పూన్జీలకర్ర: 1/2 టీస్పూన్ధనియాలు: 1/2 టీస్పూన్నెయ్యి: 2 టేబుల్ స్పూన్లుఆవాలు: టీస్పూన్ఎండు మిర్చి: 2, కరివేపాకు: కొద్దిగాఅల్లం: ఇంచ్ ముక్క (సన్నగా తరిగినది)ఉల్లిపాయ: తరిగినదిపుట్టగొడుగులు: 300 గ్రాములు (ముక్కలుగా కోసినవి)క్యాప్సికమ్: సగం (తరిగినది)ఉప్పు: రుచికి సరిపడా.తయారీ:ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో మిరియాలు, సోంపు, జీలకర్ర, ధనియాలు వేయాలి.నీళ్లు పోయకుండా, దీనిని బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక పెద్ద కడాయిలో నెయ్యి వేసి; ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించాలి.పోపు వేగాక, అందులో అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.ఆ తర్వాత కడిగి ముక్కలుగా కోసుకున్న పుట్టగొడుగులను కడాయిలో వేసి, మంటను హై ఫ్లేమ్లో ఉంచి వేయించాలి.మష్రూమ్స్ వేగాక అందులో క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే çకలుపుతూ వేయించాలి.చివరగా, మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పెప్పర్ మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేయాలి.మసాలా అంతా మష్రూమ్ ముక్కలకు బాగా పట్టేలా చక్కగా కలుపుకోవాలి.మసాలా పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన, ఘాటైన మష్రూమ్ పెప్పర్ ఫ్రై సిద్ధం.స్నికెర్ డూడుల్ కుకీస్కావలసినవి:మైదాపిండి: రెండు ముప్పావు కప్పులువెన్న: కప్పు, చక్కెర: ఒకటిన్నర కప్పులుగుడ్లు: 2, వెనీలా ఎసెన్స్: టీస్పూన్క్రీమ్ ఆఫ్ టార్టార్: 2 టీస్పూన్లుబేకింగ్ సోడా: టీస్పూన్ఉప్పు: పావు టీస్పూన్పంచదార: పావు కప్పుదాల్చినచెక్క పొడి: ఒకటిన్నర టేబుల్ స్పూన్లు.తయారీ:ఒక గిన్నెలో మైదా పిండి, క్రీమ్ ఆఫ్ టార్టార్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.మరొక పెద్ద గిన్నెలో మెత్తటి వెన్న, చక్కెర వేసి బ్లెండర్ లేదా స్పూ¯Œ తో బాగా కలపాలి.ఇది సాఫ్ట్గా, క్రీమ్లా మారే వరకు బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత ఇందులో రెండు గుడ్లు, వెనీలా ఎసె¯Œ ్స వేసి మళ్లీ బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ వెన్న మిశ్రమంలో, ముందుగా సిద్ధం చేసుకున్న మైదాపిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేస్తూ చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా కలుపుకోవాలి.ఆ తరువాత ఒక చిన్న ప్లేట్లో కోటింగ్ కోసం ఉంచిన పావు కప్పు చక్కెర, దాల్చినచెక్క పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.తయారు చేసుకున్న పిండిని చిన్నగా గుండ్రని బాల్స్లా చుట్టుకోవాలి.ఈ బాల్స్ను దాల్చినచెక్క– చక్కెర మిశ్రమంలో వేసి, చుట్టూ ఆ పొడి బాగా అంటుకునేలా దొర్లించాలి.ఇలా సిద్ధం చేసిన బాల్స్ను బేకింగ్ ట్రేపై సర్దాలి. వీటిని ప్రిహీట్ చేసిన ఓవె¯Œ లో 8 నుంచి 10 నిమిషాల పాటు బేక్ చేయాలి.కుకీల అంచులు లైట్గా గోల్డెన్ కలర్లోకి రాగానే ఓవెన్ నుంచి తీసేయాలి. అంతే! ఎంతో సువాసనభరితమైన, నోట్లో వేస్తే కరిగిపోయే సాఫ్ట్ స్నికెర్ డూడుల్ కుకీస్ రెడీ! కేరళ అరి పతిరి..కావలసినవి:బియ్యప్పిండి: కప్పునీళ్లు: ఒకటింపావు కప్పుకొబ్బరి నూనె: టీస్పూన్ఉప్పు: అర టీస్పూన్పొడి బియ్యప్పిండి: కొద్దిగా.తయారీ:స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో బియ్యప్పిండి వేసి సుమారు ఐదు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి.ఆ తరువాత ఒక పెద్ద కడాయిలో ఒకటింపావు కప్పుల నీళ్లు, టీస్పూన్ కొబ్బరి నూనె, అర టీస్పూన్ ఉప్పు వేయాలి.నీరు బాగా మరిగాక ఇందులో వేయించి పెట్టుకున్న బియ్యప్పిండిని వేయాలి.ఉండలు కట్టకుండా వెంటవెంటనే కలుపుతూ ఉండాలి. పిండి నీటిని పీల్చుకుని ముద్దలా అయ్యే వరకు కలపాలి.ఇప్పుడు స్టవ్ ఆపేసి, గిన్నెపై మూత పెట్టి ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.ఆ వేడి ఆవిరికే పిండి మరింత మెత్తగా ఉడుకుతుంది. పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, చేతులకు నూనె రాసుకుని పిండిని బాగా మెత్తగా, సాఫ్ట్గా అయ్యే వరకు చపాతీ పిండిలా ఒత్తాలి.ఆ పిండి నుంచి చిన్న పిండి ముద్దలను చేసుకోవాలి. ఆ తరువాత చపాతీ పీటపై కొద్దిగా పొడి బియ్యప్పిండి చల్లి, ఒక పిండి ముద్దను తీసుకుని వీలైనంత పల్చగా రొట్టెలా చేసుకోవాలి.చివరగా స్టవ్ మీద నాన్–స్టిక్ పెనం పెట్టి, చేసి పెట్టుకున్న పతిరిని పెనంపై వేసి, రెండు వైపులా 30 సెకన్ల పాటు మాత్రమే కాల్చాలి. అంతే కేరళ అరి పతిరి రెడీ! వీటిని పంచదార కలిపిన ఫ్రెష్ కొబ్బరి పాలలో ముంచుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. -
ఇది సాధారణ బొమ్మ కాదు.. మినీ రోబో స్నేహితుడు!
మీ మాటలు వినే, మీతో సరదాగా కబుర్లు చెప్పే ఓ చిన్న స్నేహితుడు ఉంటే బాగుండేదనిపిస్తోందా? అయితే ‘ఏఐపీఐ–లైట్ ఏఐ రోబో’ మీకోసమే!ఇది సాధారణ బొమ్మ కాదు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే స్మార్ట్ రోబో! ఈ చిన్న రోబోతో మాట్లాడితే సహజంగా స్పందిస్తుంది. ప్రశ్నలకు జవాబులు చెప్పడమే కాదు, మీతో సరదాగా చాట్ చేస్తూ స్నేహితుడిలా మెలుగుతుంది.వాయిస్ క్లోనింగ్ సదుపాయంతో మీకు నచ్చిన స్వరాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాదు, మీతో జరిగిన సంభాషణలను గుర్తుంచుకునే మెమరీ ఫీచర్ కూడా ఉంది. రియల్టైమ్లో స్పందిస్తూ నవ్వులు, సరదా వ్యాఖ్యలతో సంభాషణను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. డెస్క్పై అందంగా పెట్టుకునే ఈ స్మార్ట్ రోబో ధర సుమారు రూ. 4,500. -
గర్విష్టి గజరాజు
అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక గజరాజు ఉండేది. దానికి తన బలమన్నా, భారీ శరీరమన్నా చాలా గర్వం. ‘ఈ అడవిలో నాకంటే బలవంతులు ఎవరూ లేరు’ అని ఎప్పుడూ విర్రవీగుతూ ఉండేది. చిన్న జంతువులను తక్కువగా చూస్తూ, వాటిని హేళన చేసేది. అందుకే అడవిలోని జంతువులన్నీ దానికి దూరంగా ఉండేవి.అదే అడవిలో చింటూ అనే ఒక తెలివైన చిన్న కుందేలు ఉండేది. అది చాలా మంచిది. అందరితోనూ స్నేహంగా ఉండేది.ఒకరోజు గజరాజు అడవిలో గంభీరంగా నడుచుకుంటూ వెళ్తుండగా, దారిలో ఉన్న చింటూను గమనించకుండా దాని కాలిని తొక్కింది. పాపం! చింటూ నొప్పితో ‘అమ్మా!’ అని అరుస్తూ పక్కకు పడిపోయింది. గజరాజు అది చూసి కూడా కనీసం క్షమాపణ చెప్పలేదు. పైగా, ‘నువ్వు చాలా చిన్నదానివి, నా కాళ్ల కింద పడకుండా జాగ్రత్తగా ఉండటం నేర్చుకో’ అని ఎగతాళి చేసి వెళ్ళిపోయింది. చింటూ బాధతో కళ్ళు తుడుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది.కొన్ని రోజుల తర్వాత అడవిలోకి వేటగాళ్లు వచ్చారు. వారు గజరాజును పట్టుకోవడానికి ఒక బలమైన ఉచ్చు పన్నారు. గజరాజు అజాగ్రత్తగా వెళ్తూ ఆ వలలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ వల నుండి బయటకు రాలేకపోయింది. ఆ వల విడిపోలేదు, సరిగదా ఇంకా బిగుసుకుపోయింది. దానితో సహాయం కోసం గజరాజు బిగ్గరగా అరిచింది. ఆ అరుపులు విన్న మిగిలిన జంతువులు ‘గర్విష్టి గజరాజుకు తగిన శాస్తి జరిగింది’ అని అనుకున్నాయే తప్ప రక్షించడానికి రాలేదు. కానీ చింటూ ఆ అరుపులు విని ఆగలేకపోయింది. వెంటనే గజరాజు ఉన్న చోటికి పరుగెత్తింది. వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్న గజరాజును చూసి చింటూ మనసు కరిగింది.‘భయపడకు గజరాజా! నేను ఇప్పుడే వస్తాను’ అని చెప్పి ఊరడించింది. తరువాత చింటూ వేగంగా వెళ్లి తన స్నేహితులైన ఎలుకల సైన్యాన్ని తీసుకువచ్చింది.చింటూ ఆజ్ఞతో ఎలుకలన్నీ కలిసి తమ పదునైన పళ్ళతో ఆ బలమైన వల తాళ్లను కొరకడం మొదలుపెట్టాయి. చూస్తూ ఉండగానే వల ముక్కలైపోయింది. గజరాజు బంధవిముక్తురాలైంది! వల నుండి బయటకు వచ్చిన గజరాజు కళ్లలో నీళ్లు తిరిగాయి.అది మెల్లగా చింటూ దగ్గరకు వచ్చి, ‘చింటూ! నన్ను క్షమించు. నేను నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. కానీ ఈరోజు నా ప్రాణాలు కాపాడింది నీలాంటి చిన్న ప్రాణియే. బలం శరీరంలో కాదు, చేసే సాయంలో ఉంటుందని తెలుసుకున్నాను’ అని వినయంగా చెప్పింది.చింటూ నవ్వుతూ, ‘అపకారికి కూడా ఉపకారం చేయాలన్నదే మా అమ్మ నేర్పిన పాఠం. ఇకపై మనమందరం స్నేహితులుగా ఉందాం’ అంది.ఆ రోజు నుండి గజరాజు తన గర్వాన్ని వదిలేసి, అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా మెలుగుతూ అందరికీ రక్షణగా నిలిచింది. ఈ అడవిలో నాకంటే బలవంతులు ఎవరూ లేరు’ అని ఎప్పుడూ విర్రవీగుతూ ఉండేది. చిన్న జంతువులను తక్కువగా చూస్తూ, వాటిని హేళన చేసేది. అందుకే అడవిలోని జంతువులన్నీ దానికి దూరంగా ఉండేవి.హితవచనం..అలముదకేన తృణైర్వా మనస్వినా ప్రాణధారణా కార్యానా సంస్కృతశ్చ పురుషః ప్రాకృతసత్త్వః ప్రణయతవ్యః- ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకులు అలములు తినిగాని, కేవలం మంచినీళ్లు తాగిగాని ప్రాణాలు నిలబెట్టుకుంటాడే తప్ప నీచులను సంతోషపెట్టడానికి ప్రయత్నించడు. - అవ్యాన్ -
వైరస్ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్ ప్రయోగం..
భవిష్యత్తులో వచ్చే సరికొత్త వైరస్లకు... అవి అసలు పుట్టకముందే మన శాస్త్రవేత్తలు కర్మకాండలు జరిపించే పనిలో ఉన్నారు! వాటి అంత్యక్రియలు జరిపించేది మరెవరో కాదు, ‘ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్’! శత్రువు యుద్ధానికి రాకముందే ఆ శత్రువును కనిపెట్టి, చిత్తు చేసే ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్నది మాత్రం కేంబ్రిడ్జ్ నిపుణులు. తాజాగా వాళ్లు కనిపెట్టిన సూపర్ వ్యాక్సిన్... ఇకపై కరోనా అయినా, ఎబోలా అయినా, అవి ఎలాంటి రూపు మార్చుకుని వచ్చినా సరే, ఆ వేషధారులను ఊచకోత కోసేస్తుంది.‘ప్యాండమిక్–ప్రూఫ్’ వ్యాక్సిన్మున్ముందు రాబోయే మహమ్మారుల అంతానికి శాస్త్రవేత్తలు ఇప్పుడే పునాది వేశారు. మనకింకా తెలియని, అసలు పుట్టనే పుట్టని కరోనా రకాల వైరస్లను సైతం ముందే ఊహించి, వాటిని మట్టుపెట్టే వ్యాక్సిన్స్ను శాస్త్రవేత్తలు ఏఐ సహాయంతో రూపొందించారు. ఈ వ్యాక్సిన్ సర్వరోగ నివారిణిలా సకల కరోనా జాతులకూ నిరోధకంగా పని చేస్తుందని కేంబ్రిడ్జి పరిశోధకులు జూన్ మొదటి వారంలో వెల్లడించారు.ఒక్కటిస్తే చాలు.. ఒక్కటీ రాదు!సాధారణంగా ఒక వైరస్ బయటపడిన తర్వాత దానికి వ్యాక్సిన్ తయారు చేయడానికి శాస్త్రవేత్తలకు నెలలు లేదా సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఈ సరికొత్త ఏఐ టెక్నాలజీ, భవిష్యత్తులో వైరస్లు ఎలా రూపాంతరం చెందుతాయో ముందే ఊహించి, వాటిని ఎదుర్కొనేలా ఈ వ్యాక్సిన్ను డిజైన్ చేసింది. ఒక్కటంటే ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే చాలు... ఎబోలా వంటి వేలాది ప్రమాదకర వైరస్ రకాల నుండి, అలాగే భవిష్యత్తులో అవి మార్చుకునే ఏ కొత్త రూపం నుండి అయినా ఇది మనల్ని కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.ప్రొఫెసర్ జొనాథన్ హీనీ, వైరల్ జూనోటిక్స్అలాంటిలాంటిది కాదుప్రస్తుతం మనం వాడుతున్న వ్యాక్సిన్లు యాంటీజెన్ల ఆధారంగా పనిచేస్తాయి. యాంటీజెన్ అంటే మన శరీరంలోకి ఏదైనా హానికరమైన క్రిమి ప్రవేశిస్తే... ‘ఇది శత్రువు!’ అని మన రోగనిరోధక వ్యవస్థ గుర్తుపట్టేలా చేసే ఒక రకమైన సిగ్నల్. అయితే, యాంటీజెన్లు కేవలం అప్పటికే మనుషుల్లో బయటపడిన నిర్దిష్ట వైరస్ రకాలపైన మాత్రమే పనిచేస్తాయి. అయితే ఈ సరికొత్త వ్యాక్సిన్లో పరిశోధకులు ఒక ఉపాయం ఆలోచించారు. ఒకే జాతికి చెందిన మొత్తం వైరస్ కుటుంబాలన్నిటిలోనూ ‘కామన్గా’ ఉండే కొన్ని ముఖ్యమైన లక్షణాలను సేకరించి, వాటన్నిటినీ నిరోధించే గుణాలను కలిపి కొత్త వ్యాక్సిన్లో పొందుపరిచారు.‘‘వైరస్ దాడి మొదలవ్వడానికి ముందే... ఈ సరికొత్త రకం వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి, క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోగలిగితే, భవిష్యత్తులో లక్షలాది ప్రాణాలను కాపాడవచ్చు. లాక్డౌన్ల అవసరమే రాదు, దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలకుండా నిలబడతాయి’’ అని ఈ ప్రాజెక్టు చీఫ్, సౌతాంప్టన్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ సాల్ ఫాస్ట్ అంటున్నారు.సార్స్, కోవిడ్, ఎబోలా.. ఏదైనా!ఈ కొత్త వ్యాక్సిన్ కేవలం కరోనా పైనే కాదు... గతంలో వణికించిన సార్స్, మొన్నటి వరకు ఉన్న కోవిడ్, ఇప్పుడున్న ఎబోలా, అలాగే భవిష్యత్తులో జంతువులు, గబ్బిలాల నుండి మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉన్న వైరస్లన్నిటి నుంచి కూడా మనల్ని కాపాడగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన వైరల్ జూనోటిక్స్ (జంతువుల నుండి మనుషులకు వచ్చే వైరస్లపై పరిశోధన చేసే విభాగం) ప్రొఫెసర్ జొనాథన్ హీనీ మాట్లాడుతూ... ఈ సరికొత్త టెక్నాలజీ వైద్య రంగపు రూపురేఖల్నే మార్చే ఒక పెద్ద ‘గేమ్ చేంజర్’ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ఈ టెక్నాలజీ వల్ల వ్యాక్సిన్లు మరింత శక్తిమంతంగా, విస్తృతంగా మారి, వైరస్ల నుండి మనకు అత్యంత బలమైన రక్షణను అందిస్తాయి’’ అని ఆయన నమ్ముతున్నారు.సూపర్ యాంటీజెన్: రోగ నిరోధక వ్యవస్థకు తిరుగులేని ఆయుధంఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్కు ‘సూపర్–యాంటీజెన్’ అని పేరు పెట్టారు. ఏఐలో ఒక భాగమైన మెషిన్ లెర్నింగ్ ద్వారా దీనిని తయారు చేశారు. గతంలో వచ్చిన మహమ్మారులను, ఇప్పుడున్న వైరస్లను ఏఐ క్షుణ్ణంగా విశ్లేషించి... ఒక వైరస్ బ్రతికి బట్టకట్టాలంటే దానికి అత్యంత ముఖ్యమైన భాగాలు ఏంటో కనిపెట్టింది. సరిగ్గా అవే భాగాలపై ఈ సూపర్ యాంటీజెన్ను ఎక్కుపెట్టారు.వేర్వేరు వైరస్లలో ఉండే కొన్ని ముఖ్యమైన ప్రొటీన్లను ఒకదానితో ఒకటి అతుకుపెట్టి ఈ వ్యాక్సిన్ను రూపొందించారు. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఈ వ్యాక్సిన్ మన శరీరంలోకి వెళ్లగానే, మన రోగనిరోధక వ్యవస్థకు ఆ ప్రొటీన్లపై దాడి చేయడం నేర్పుతుంది. భవిష్యత్తులో ఆ ప్రొటీన్ ఉన్న ఏ కొత్త వైరస్ మన శరీరంలోకి వచ్చినా... మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని వెంటనే గుర్తుపట్టి అక్కడికక్కడే నిర్మూలిస్తుంది.సూది లేని ఇంజెక్షన్!సూపర్ యాంటీజెన్ వ్యాక్సిన్ను మన శరీరంలోకి పంపే విధానం కూడా చాలా సరళంగా, సరికొత్తగా ఉంటుంది. ఇందులో ఎలాంటి సూదీ ఉండదు! బదులుగా ‘మైక్రో ఫ్లూయిడ్ జెట్’ అనే పద్ధతిని పాటిస్తారు. ఇది చాలా ఎక్కువ ఒత్తిడితో, ఒక సన్నని ద్రవ రూపంలో వ్యాక్సిన్ను నేరుగా మన చర్మ కణాల్లోకి పంపుతుంది. అంటే సూది గుచ్చుకునే నొప్పి అస్సలు ఉండదు!మైక్రో ఫ్లూయిడ్ జెట్వెనుక పరిగెత్తడం ఆపేద్దాం!కాంగోలో మళ్లీ ఇప్పుడు ఎబోలా వైరస్ కలకలం రేపుతున్న విషయాన్ని గురు ్తచేస్తూ: ‘‘కోవిడ్ మహమ్మారి మనకు వ్యాక్సిన్లను వేగంగా తయారు చేయడం నేర్పించింది నిజమే కానీ, మనం ఇంకా పాత విధానాన్నే అనుసరిస్తున్నాం. వైరస్ కొత్తగా పుట్టడం, అది మనల్ని భయపెట్టడం, ఆ తర్వాత మనం దాని వెనుక పరిగెత్తి వ్యాక్సిన్ కనిపెట్టడం... ఈ ధోరణి మారాలి’’ అని ప్రొఫెసర్ హీనీ అంటున్నారు.‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైరస్ జెనెటిక్ కోడ్ మొత్తాన్ని ఈ ఏఐకి ఇస్తాం. అది వాటన్నిటినీ పరిశీలించి, ఆ వైరస్ కుటుంబంలో అస్సలు మారకుండా ఉండే భాగం ఏంటో కనిపెడుతుంది. వైరస్ తన రూపాన్ని ఎంత మార్చుకున్నా ఆ ముఖ్య భాగాన్ని మార్చుకోలేదు. మనం సరిగ్గా దాన్నే టార్గెట్ చేస్తున్నాం. దీనివల్ల ఈరోజు ఉన్న వైరస్ల నుండే కాదు... భవిష్యత్తులో పుట్టబోయే సరికొత్త వైరస్ల నుండి కూడా మనం ముందే రక్షణ పొందవచ్చు!’’ అని హీనీ వివరించారు. ప్రస్తుతం ప్రపంచానికి పెద్ద ముప్పుగా మారిన బర్డ్ ఫ్లూ వైరస్ను కూడా అంతమొందించేందుకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బృందం ఇదే టెక్నాలజీతో మరో సరికొత్త వ్యాక్సిన్ను తయారు చేసే పనిలో పడింది.వైరస్ల కంటే ఒకడుగు ముందేఇతర సైన్స్ నిపుణులు కూడా ఈ వాక్సిన్ను ఒక అద్భుతమైన ‘సరికొత్త విప్లవం’గా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత వైద్య విధానం అంతా ‘రియాక్టివ్’ (కంటì æముందుకు ప్రమాదం వచ్చాక స్పందించేది)గా ఉంది. అంటే వైరస్ రూపాంతరం చెందుతూ ముందుకు దూసుకుపోతుంటే, దాన్ని పట్టుకోవడానికి మన వ్యాక్సిన్లు వెనుకబడిపోతున్నాయి. కానీ ఈ కొత్త టెక్నాలజీ.. వైరస్ కంటే ఒకడుగు ముందే ఉంటుంది!రెండో దశ ప్రయోగాలుసిద్ధంగా మరో 200 మందిట్రయల్స్ ఎక్కడివరకు వచ్చాయి? మొదటి దశ విజయవంతం అయింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ సరికొత్త టెక్నాలజీతో చేసిన వ్యాక్సిన్ను 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసున్న 49 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రయోగించి, ఇది పూర్తిగా సురక్షితమైనదని నిర్ధారించుకున్నారు. అంతకుముందు జంతువులపై చేసిన ప్రయోగాల్లో కూడా ఇది రకరకాల కరోనా వైరస్లపై ప్రభావంతంగా పనిచేసి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు రెండవ దశ మొదలైంది. ఈ వ్యాక్సిన్ తదుపరి పరీక్షల కోసం మరో 200 మందికి పైగా వ్యక్తులను సంసిద్ధం చేస్తున్నారు.అత్యంత బలమైన రక్షణఏఐ సహాయంతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ల గురించి బ్రిటన్లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ రీసెర్చ్’ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైంటిఫిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ మేరియన్ నైట్ అత్యంత ఆశాజనకంగా మాట్లాడారు. ‘‘ఏఐ డిజైన్ చేసిన ఈ ‘సూపర్–యాంటిజెన్’ క్లినికల్ ట్రయల్స్ సాధించిన అద్భుత విజయం. వైద్య రంగంలోనే ఒక విప్లవాత్మకమైన అడుగు. భవిష్యత్తులో వైరస్ల నుండి మానవాళికి సుదీర్ఘమైన, అత్యంత బలమైన రక్షణను అందించడంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది’’ అన్నారు. మొత్తానికి, ఈ ‘సూపర్–యాంటీజెన్’ వ్యాక్సిన్ గనుక అందుబాటులోకి వస్తే... భవిష్యత్తులో మనం ఎలాంటి వైరస్ మహమ్మారికీ భయపడాల్సిన అవసరం ఉండదు. శాస్త్ర విజ్ఞాన రంగం సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది కూడా! - సాక్షి స్పెషల్ డెస్క్ -
కుక్కయినా హక్కుంది... దానికో లెక్కుంది!
‘ఒకరు ముద్దు... ఇద్దరు హద్దు... ముగ్గురు అసలే వద్దు...’ కుటుంబ నియంత్రణ కోసం గతంలో ప్రభుత్వాలు ఈ నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు జనాభా విషయంలో ప్రభుత్వాల వైఖరి మారినా, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు పెద్దలు. అది పిల్లలకైనా, పెంపుడు జంతువులకైనా వర్తిస్తుంది. ఏదైనా పరిమితంగా ఉంటేనే మేలు. లేదంటే అనేక చిక్కులు... ఒక్కోసారి కోర్టు కేసులు ఎదుర్కొవాల్సి రావచ్చు.కోయంబత్తూరులోని ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతడి ఇంట్లోని కుక్కల వల్ల తమకు ఇబ్బందవుతోందని, దుర్వాసన వస్తోందని కాలనీ వాసులు అధికారికి ఫిర్యాదు చేశారు. చివరకు సమస్య హైకోర్టుకు చేరింది.ఇంట్లో కుక్కలు పెంచుకోవడం సర్వసాధారణం. అయితే ఒకటో రెండో కుక్కలు ఉంటే ప్రేమ; ఐదారు ఉంటే అభిరుచి. ఏకంగా రెండు డజన్లకు పైగా ఉంటే; అవి ఒకేసారి అరుస్తుంటే; వాటి దుర్వాసస చుట్టు పక్కల ఇళ్లకు వ్యాపిస్తుంటే; కాలనీ వాసులకు వాటి అరుపులతో పగలు ప్రశాంతత, రాత్రి పూట నిద్ర కరువైతే... ఏమౌతుంది. చుట్టుపక్కల వారికి చిరాకొస్తుంది. కోపం తెస్తుంది. ఇక్కడా అదే జరిగింది. చిర్రెత్తుకొచ్చి వారంతా అధికారికి ఫిర్యాదు చేశారు. మొదట ఇది సాధారణ ఫిర్యాదులా కనిపించినా, మన ఇల్లు... మన ఇంట్లో కార్యకలాపాలకు ఉన్న పరిమితి ఏంటి? ‘నాఇల్లు– నా కుక్కలు– నా ఇష్టం’ అనే వాదన చెల్లుతుందా? వ్యక్తిగత అభిరుచి, స్వేచ్ఛ ముఖ్యమా? పొరుగువారి ప్రశాంత జీవనం, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలా? వంటి కీలకాంశాలను కోర్టు చర్చించింది. చట్టంలో పేర్కొన్న పలు అంశాలు సందర్భానుసారం ఎలా వర్తిస్తాయో వివరిస్తూ ఆసక్తికర తీర్పును వెలువరించింది. కేసు పూర్వాపరాలుకోయంబత్తూరులోని సర్క్యూట్ హౌస్రోడ్డులో విక్రమ్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను వివిధ జాతులకు చెందిన 30 కుక్కలను పెంచుతున్నాడు. ముఖ్యంగా రాత్రి పూట అవి మొరగడంతో ప్రశాంతత కరువై, నిద్ర పట్టడం లేదని, దుర్వాసన వల్ల పరసర ప్రాంతాల్లో అనారోగ్యకర వాతావరణం నెలకొందని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. వాటిని వ్యాపార అవసరాల కోసమే పెంచుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు..న్యాయస్థానాన్ని ఆశ్రయించిన యజమానిదీనిపై ఆ అధికారి విచారణ చేపట్టారు. పోలీసు/రెవెన్యూ/మునిసిపల్ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. మునిసిపాల్టీ నిబంధనల ప్రకారం వాటి పెంపకానికి లైసెన్స్ లేదని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవమేనని నిర్ధారణకు వచ్చారు. కుక్కలను ఆ ఇంటి నుంచి తరలించాలని ఆదేశించారు. ఆ అధికారి సీఆర్పీసీ సెక్షన్ 133 ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలని విక్రమ్ హైకోర్టును ఆశ్రయించాడు. పాత కక్షల వల్లే పొరుగువారు తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని పేర్కొన్నాడు. ‘నా ఇంట్లో నా ఇష్ట ప్రకారం కుక్కలను పెంచుకుంటున్నాను’ అన్నాడు. తన వద్ద పది లోపే కుక్కలు ఉన్నాయని వెల్లడించాడు.హైకోర్టులో విచారణకాలనీ వాసులు చేసిన ఫిర్యాదు.. అధికారి ఆదేశాలు.. పిటిషనర్ పేర్కొన్న అంశాలను హైకోర్టు పరిశీలించింది. కేవలం కుక్కల సంఖ్య ఒక్కటే సమస్య కాదు. పెంపుడు జంతువులను ఇంట్లో ఉంచుకోవడమూ తప్పు కాదు. కానీ, ఇతరులకు ఇబ్బంది కల్గించే స్థాయిలో వాటిని ఉంచడం వ్యక్తిగత హక్కుగా చెప్పలేమని పేర్కొంది. నివాస ప్రాంతాల్లో ప్రజల ప్రశాంత జీవనాన్ని కూడా రక్షించాల్సిన అంశమేనని కోర్టు వ్యాఖ్యానించింది. మీ ఇంట్లో మీకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛ ఉంటుంది. కానీ పక్కింటి వారి హక్కులకు భంగం కలిగించేలా అది ఉండకూడదని పేర్కొంది. ఆర్టికల్ 21కు విఘాతం కలిగించకూడదని చెప్పింది. ప్రజల హక్కులకు భంగం వాటిల్లినా, ఇబ్బంది కలిగించినా అటువంటి సందర్భాల్లో సంబంధిత అధికారి సీఆర్పీసీ సెక్షన్ 133 కింద ముందుగా చర్యలు తీసుకునే అధికారం ఉందని పేర్కొంది. ‘రెవెన్యూ డివిజనల్ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం అవసరం లేదు. చట్టపరమైన ఎటువంటి లోపమూ లేదు. వాటిని యథాతథంగా అమలు చేయవచ్చు’ అని హైకోర్టు స్పష్టం చేసింది. రివిజన్ పిటిషన్తో పాటు ఇతర అనుబంధ పిటిషన్లను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది.కుక్కలు మొరుగుతున్నాయి. నిద్రకు భంగం కలుగుతోందనే చిన్న కేసుగా ఇది మొదట కనిపిస్తోంది. ఎవరి ఇంట్లో వారు ఇష్టానుసారం జీవించే హక్కు ఉంటుంది. కానీ దానికి పరిమితులు ఉంటాయి. ఇతరుల ప్రశాంత జీవనానికి అది భంగం కలిగించనంత వరకే ఆ స్వేచ్ఛ అనేది ఈ కేసులో ప్రధానాంశం. కుక్కలు లేదా ఇతర జంతువుల పెంపకాన్నీ ఈ తీర్పు తప్పుపట్టడం లేదు. ఎన్ని జంతువులు ఉండాలనే సంఖ్యనూ నిర్ణయించలేదు. ప్రజా ప్రయోజనం, ఇతరుల జీవనంపై ప్రభావం, పబ్లిక్ న్యూసెన్స్ వంటి అంశాలనే కీలకంగా పరిగణించింది. సాధారణ అంశంగా కేసు మొదలై సామాజిక సందేశంతో ముగిసింది. - దిలీప్ మాదిరెడ్డి -
అష్టావక్రుడి పూర్వజన్మ వృత్తాంతం
బ్రహ్మమానస పుత్రుడైన ప్రచేతనుడికి అసితుడు అనే కొడుకు ఉన్నాడు. అసితుడు బ్రహ్మచర్యాశ్రమంలో సకల విద్యలను అభ్యసించి, తపోవృత్తి కొనసాగించాడు. కొంతకాలానికి అసితుడు వివాహం చేసుకున్నాడు. ఎన్నేళ్లయినా సంతానం కలగకపోవడంతో పరమశివుడి గురించి తపస్సు చేశాడు.పరమశివుడు అతడికి ప్రత్యక్షమై రాధామంత్రాన్ని ఉపదేశించాడు. రాధామంత్ర ప్రభావంతో అసితుడి భార్య గర్భం దాల్చింది. నెలలు నిండాక పండంటి కొడుకు పుట్టాడు. అతడికి దేవలుడు అనే పేరు పెట్టారు. దేవలుడు యుక్తవయస్కుడయ్యాక మాలావతిని పెళ్లాడి, సంతానం పొందాడు. చివరకు విరక్తుడై, ఘోర తపస్సు ప్రారంభించాడు.దేవలుడి తపో తీవ్రతకు దేవేంద్రుడు భయపడ్డాడు. అతడి తపస్సును ఎలాగైనా భంగపరచాలనుకున్నాడు. రంభను పిలిచి, ‘నువ్వు ఎలాగైనా దేవలుడి తపస్సును భంగపరచాలి’ అని ఆదేశించాడు.ఇంద్రుడి ఆజ్ఞ మేరకు రంభ భూలోకానికి దిగివచ్చింది. దేవలుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి, అతడి తపోభంగం కోసం తన గాన, నాట్య కౌశలాలను అలుపెరగకుండా ప్రదర్శించింది. తపస్సమాధిలో ఉన్న అతడికి సపర్యలు చేయడం ప్రారంభించింది. అయినా దేవలుడు కన్నుతెరిచి ఆమెను చూడనైనా చూడలేదు. తన శాయశక్తులా ప్రయత్నించినా, ఫలితం లేకపోవడంతో విసిగి వేసారిపోయిన రంభ ‘దేవలా! నువ్వు నన్ను అష్టకష్టాలపాలు చేశావు. మరుజన్మలో నువ్వు అష్టావక్రుడిగా జన్మిస్తావు’ అని శపించింది. రంభ అంత దారుణంగా శపించినా, దేవలుడు తన తపస్సమాధిలోనే నిశ్చలంగా ఉన్నాడు. దేవలుడి స్థితి చూసి రంభ పశ్చాత్తాపం చెందింది. ‘నిన్ను అనవసరంగా శపించాను. నువ్వు అష్టావక్రుడిగా జన్మించినా, నీ తండ్రి కృప వల్ల దివ్యశరీరుడివి కాగలవు.’ అని పలికింది.∙∙ ఏకపాదుడు తన ఆశ్రమంలో శిష్యులకు వేదం బోధించేవాడు. ఏకపాదుడి శిక్షణ కఠినంగా ఉండేది. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శిష్యుల చేత వేదం వల్లె వేయించేవాడు. సుజాత గర్భంలో ఉన్న దేవలుడు ‘గర్భంలో ఉన్న నాకే రోజూ వింటున్న వేదం కంఠోపాఠమైంది. నీ శిష్యులు రోజూ వల్లె వేస్తూనే ఉన్నారు. వారినెందుకు ఉభయ సంధ్యల్లోనూ వేదం వల్లె వేయమంటూ అంతలా హింసిస్తావు? ’ అని తండ్రిని ప్రశ్నించాడు.ఏకపాదుడు సహించలేకపోయాడు. ‘తండ్రినైన నా శిక్షణ విధానాన్ని వక్రంగా హేళన చేస్తావా? నువ్వు అష్టవంకరలతో జన్మిస్తావు’ అని శపించాడు. ప్రసవ సమయం దగ్గరపడుతున్న రోజుల్లో సుజాత ఒకనాడు ఇంటికి కావలసిన సంభారాలను తెమ్మని భర్త ఏకపాదుడిని కోరింది. అతడు ధనం కోసం జనక మహారాజు ఆస్థానానికి వెళ్లాడు. ‘వరుణ కుమారుడైన వందితో వాదంలో నెగ్గినట్లయితే, కోరినదంతా ఇస్తాను. వాదంలో ఓడిపోతే జలమజ్జితుడవై ఉండాలి’ అన్నాడు.ఏకపాదుడు సరేనని వందితో వాదానికి తలపడ్డాడు. వాదంలో ఓడిపోయి, జలమజ్జితుడై, నిర్బంధంలో చిక్కుకుపోయాడు. కొన్నాళ్లకు సుజాత మగబిడ్డను ప్రసవించింది. తండ్రి శాపఫలితంగా అతడు ఎనిమిది వంకరలతో జన్మించి, అష్టావక్రుడిగా ప్రసిద్ధుడయ్యాడు. అదే సమయంలో సుజాత తల్లి, ఉద్దాలకుడి భార్య ఒక కొడుకును కన్నది. అతడు శ్వేతకేతుడు. ఉద్దాలకుడి వద్ద శ్వేతకేతుడితో పాటు అష్టావక్రుడు కూడా పెరిగాడు. ఏకసంథాగ్రాహులైన ఇద్దరూ అనతికాలంలోనే విద్యాపారంగతులయ్యారు.ఒకనాడు తల్లి ద్వారా తన తండ్రి పరిస్థితి తెలుసుకున్న అష్టావక్రుడు– శ్వేతకేతుడితో కలసి జనక మహారాజు ఆస్థానానికి వెళ్లాడు. బాలకులైన వారిద్దరినీ ద్వారపాలకులు అడ్డుకున్నారు. ‘జ్ఞానం ఉన్నవాడు బాలుడైనా వృద్ధుడితో సమానం. వయసు మళ్లినవాడు కాదు’ అని అష్టావక్రుడు వారితో వాదించాడు. ద్వారపాలకులు వారిని లోపలకు వెళ్లనిచ్చారు. జనకుడి అనుమతి పొంది, వందితో వాదానికి దిగాడు అష్టావక్రుడు. సుదీర్ఘంగా సాగిన వాదంలో వంది ఓడిపోయాడు. జనక మహారాజు అష్టావక్రుడిని అభినందించి, ‘ఏం కావాలో కోరుకో’ అన్నాడు.‘మహారాజా! వందితో వాదంలో ఓటమి చెందిన నా తండ్రి జలమజ్జితుడై ఉన్నాడు. అతడిని విడిచిపెట్టు’ అని కోరాడు. జనకుడు జలమజ్జితుడైన ఏకపాదుడిని బయటకు రప్పించాడు. అష్టావక్రుడిని, ఏకపాదుడిని పూజించి, వారి వద్ద అద్వైత రహస్యాలను తెలుసుకున్నాడు. కొన్నాళ్లు ఆతిథ్యమిచ్చి, వారిని సాదరంగా సాగనంపాడు.అష్టావక్రుడి పితృభక్తికి సంతుష్టుడైన ఏకపాదుడు, ‘కుమారా! నీ అంగవైకల్యానికి కారకుడను నేనే. నీ పితృభక్తికి సంతోషించాను. నువ్వు వెంటనే వెళ్లి సమంగ నదిలో స్నానం చేసి రా’ అని ఆదేశించాడు. అష్టావక్రుడు సమంగ నదిలో ముమ్మారు మునిగి స్నానం చేశాడు. అతడి శరీరంలోని వంకరలన్నీ పోయి, సుందరాకారం వచ్చింది. తండ్రి తపోమహిమకు అష్టావక్రుడు చకితుడయ్యాడు. ఇంటికి చేరుకున్నాక తల్లిదండ్రులను పూజిస్తూ, ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ వచ్చాడు. - సాంఖ్యాయనపురావిశేషం..మధ్యప్రదేశ్లోని సిహోనియా పట్టణంలో ఉన్న ఈ పురాతన శివాలయం దాదాపు వెయ్యేళ్ల నాటిది. కచ్ఛపఘట వంశానికి చెందిన కీర్తిరాజ హయాంలో క్రీస్తుశకం 1015–1035 నడుమ ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్రకారుల అంచనా. ఇదివరకు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు సూరజ్పాల్ భార్య రాణి కకనావతి పేరుమీద దీనికి ‘కకన్ మఠ్’ అనే పేరువచ్చిందని చెబుతారు. ఈ ఆలయాన్ని పరమశివుని భూతగణాలు రాత్రికి రాత్రే నిర్మించినట్లు స్థలపురాణ గాథ ప్రచారంలో ఉంది. -
ఆ పువ్వులు, డిస్టిల్డ్ వాటర్తో ముడతలు మాయం..!
ప్రముఖ బ్యూటీ బ్రాండ్ టి3 వ్యవస్థాపకురాలు జూలీ చుంగ్ ఆధ్వర్యంలో సరికొత్త ‘టి3 డ్రైయర్’ మార్కెట్లోకి విడుదలైంది. ఇది కేవలం జుట్టును ఆరబెట్టడమే కాకుండా, కురుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. సాధారణ హెయిర్ డ్రైయర్లు కేవలం ఎక్కువ వేడి, గాలిని ఉపయోగించి జుట్టును ఆరబెడతాయి. దీనివల్ల జుట్టు పొడిబారిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే, టి3 డ్రైయర్ ఈ పాత పద్ధతిని పూర్తిగా మార్చేసింది. ఇది హెయిర్ స్టైలింగ్ను ఒక ట్రీట్మెంట్లా మారుస్తూ, కేర్–డ్రివెన్ ఇంజనీరింగ్తో సరికొత్త సాంకేతికతను పరిచయం చేసింది. ఇందులో జుట్టు రకాన్ని బట్టి ఇందులోని వేడిని అత్యంత కచ్చితత్వంతో సర్దుబాటు చేసుకోవచ్చు. అలాగే ఎయిర్ ఫ్లోని నియంత్రించడం ద్వారా జుట్టుకు నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఈ టి3 డ్రైయర్ను అమెరికాలో స్థిరపడ్డ కొరియన్ వైద్యనిపుణురాలు జూలీ చుంగ్– నిపుణులైన ప్రొడక్ట్ ఇంజనీర్లు, హెయిర్ స్టైలిస్టులతో కలిసి రూపొందించారు.జాగ్రత్తలతో జాలువారే జుట్టు!పొడవైన జుట్టు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి ఆశ. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారం, హార్మోన్లు వంటి ఎన్నో అంశాలు జుట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. చిన్న చిన్న చిట్కాలు, జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. జుట్టు చిట్లిపోకుండా చూసుకోవడం అవసరమే కానీ, పొడవాటి జుట్టు కావాలనుకుంటే తరచూ కత్తిరించడం తగ్గించాలి. విపరీతమైన ఎండ, వర్షం, వేడి గాలుల వల్ల జుట్టు బలహీనపడి, రాలే అవకాశం ఉంది. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు జుట్టును లూజ్గా ముడివేయడం లేదా స్కార్ఫ్తో కప్పుకోవడం అలవాటు చేసుకోండి. మన పూర్వీకుల నుంచి వస్తున్న తల మసాజ్ జుట్టు కుదుళ్లను ఉత్తేజితం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.హెర్బల్తో ముడతలు మాయం..పదిహేడో శతాబ్ది నాటి యూరోపియన్ మహిళలు తమ ముఖ సౌందర్యం కోసం ప్రకృతిలో లభించే మొక్కలు, ఆకులతో అనేక ప్రయోగాలు చేసేవారు. అలా వారు క్లౌసిప్ పుష్పాలను, పంది కొవ్వులో లేదా డిస్టిల్డ్ వాటర్లో కలిపి ఒక ఆయింట్మెంట్లాంటి మిశ్రమాన్ని తయారుచేసేవారు. ఈ మిశ్రమం ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలను మాయం చేసి, కోల్పోయిన అందాన్ని తిరిగి తెస్తుందని వారు బలంగా నమ్మేవారు. అలాగే ముఖంపై వచ్చే పిగ్మెంటేషన్ తగ్గించడానికి ‘పెన్నీరాయల్’ అనే ఒక రకమైన పుదీనా జాతి మొక్క ఆకులను పేస్ట్లా చేసి రాసేవారు. (చదవండి: అందానికి ఏఐ మాయాజాలం.. పోర్టబుల్ స్కిన్ కేర్ డివైస్!) -
క్యారవాన్లో హత్య...
నగర శివారులో భారీ సెట్. టాలీవుడ్ టాప్ హీరో అవినాష్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ జరుగుతోంది. షాట్ గ్యాప్లో అవినాష్ తన క్యారవా¯Œ లోకి వెళ్లాడు. అవినాష్కు అమ్మాయిల పిచ్చి. అందుకే తన ప్రైవసీ కోసం, క్యారవాన్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల కనెక్షన్లను ముందే కట్ చేయించాడు.కొద్దిసేపటికే బురఖా ధరించిన ఒక అమ్మాయి క్యారవా¯Œ లోకి వెళ్లడం కొందరు గమనించారు. కాని, గంట దాటినా లోపలి నుండి ఎటువంటి శబ్దం లేదు. ప్రొడక్షన్ బాయ్ కాఫీ తీసుకుని వెళ్లి డోర్ కొట్టినా సమాధానం రాలేదు. అనుమానంతో తలుపు నెట్టి చూశాడు. క్యారవాన్లో అవినాష్ రక్తం మడుగులో పడి ఉన్నాడు.సమాచారం అందిన వెంటనే, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు తన టీమ్తో స్పాట్కు చేరుకున్నాడు. శవాన్ని పరీక్షించిన డాక్టర్ పాయిజన్ ఇంజెక్ట్ చేసిన కారణంగా హీరో అవినాష్ మరణించినట్టు చెప్పాడు.ఇన్స్పెక్టర్ అభిమన్యు క్లూస్ టీమ్తో దర్యాప్తు ప్రారంభించాడు. క్యారవాన్ వైపు ఉన్న సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదు. లొకేషన్ వెలుపల ఉన్న కెమెరాలను పరిశీలిస్తే, బురఖా వేసుకున్న అమ్మాయి అటువైపు వచ్చిన విజువల్స్ ఉన్నాయి. ఇంజక్షన్ను బలంగా చేసినట్టు నీడిల్ మొన శరీరంలో దిగబడిన తీరును బట్టి తెలుస్తుంది. అది కచ్చితంగా ఒక లెఫ్ట్ హ్యాండర్ చేసిన హత్య అని అభిమన్యు గుర్తించాడు.క్యారవాన్ నుంచి కిందికి దిగుతుంటే అతని దృష్టి ఒకవైపు పడింది. చుట్టూ చూసి చేతులకు గ్లవుజ్ ధరించి ఆ వస్తువును ఎవిడె¯Œ ్స కవర్లో వేసుకున్నాడు.యూనిట్లో ఉన్న ప్రొడ్యూసర్ ను పిలిపించాడు. డైరెక్టర్ వచ్చాడు. హీరోయిన్ను విచారించాడు.సినిమా యూనిట్లో ఎడమచేతి వాటం ఉన్నవారి లిస్ట్ తీశాడు. అందులో ఆ సినిమాలో విల¯Œ గా నటిస్తున్న అభిజిత్ పేరు ఉంది. వెంటనే అభిమన్యు కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ను సోదా చేశాడు. అక్కడ ఒక పెట్టెలో దాచిన బురఖా దొరికింది. సినిమాలో విలన్ అభిజిత్ పోషిస్తున్న పాత్ర ఏమిటి? డైరెక్టర్ని అడిగాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.‘డాక్టర్ పాత్ర... హీరోని పాయిజన్ ఇంజక్షన్తో హత్య చేయాలని ప్రయత్నిస్తాడు...’ డైరెక్టర్ చెప్పాడు.‘విలన్ అభిజిత్ కాస్టూమ్స్, షాట్లో వాడే డిస్పోజబుల్ సిరంజి ఎక్కడ?’ అడిగాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.అసిస్టెంట్ డైరెక్టర్ అన్నీ పట్టుకుని వచ్చాడు. ఒక్క డిస్పోజబుల్ సిరంజ్ తప్ప...‘ఇదొక్కటి మిస్సయ్యింది సర్...’ అనుమానంగా, భయంగా చెప్పాడు డైరెక్టర్..అభిమన్యు చిన్నగా నవ్వి, ‘నో ప్రాబ్లెమ్... మీ దగ్గర మిస్సయ్యింది నా దగ్గర ఉంది.’ అంటూ తన కోటు జేబులో ఉన్న ఎవిడె¯Œ ్స కవర్లో ఉన్న డిస్పోజబుల్ సిరంజ్ చూపించి, ‘థాంక్యూ... దట్స్ ఇట్’ అని లేచాడు. ఇంటరాగేషన్ సెల్...‘వెల్ మిస్టర్ అభిజిత్! సినిమాలో నీ పాత్రకు నువ్వు ప్రాణం పోశావు. సినిమాలో నువ్వు చేసే షాట్ రిహార్సల్ చేశావు. ఆ రిహార్సల్ షాట్ను నువ్వే ఓకే చేసి, హీరోను చంపి నువ్వు హీరో అవ్వాలనుకున్నావు కదూ! అసలు ఎందుకు ఈ హత్య చేశావు? ప్రొఫెషనల్ జెలసీనా?’ కావాలనే అడిగాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.‘అతను హీరో, నేను విలన్ ఇందులో ప్రొఫెషనల్ జెలసీ లేదు. పర్సనల్ పగ మాత్రమే వుంది.’ కొనసాగించాడు అభిజిత్. ‘అవినాష్ లాంటి విలన్లు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బతికి ఉండడానికి వీల్లేదు. ప్రేక్షకులలో ఉన్న గ్లామర్ను అభిమానాన్ని ఇలా మిస్యూజ్ చేస్తూ , అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేసే వాళ్లకు బ్రతికే హక్కు లేదు...నా చెల్లెలు అవినాష్కు పెద్ద అభిమాని. అవినాష్ను కలవడానికి వచ్చినప్పుడు, నా చెల్లెలిని లొంగదీసుకుని వాడుకుని వదిలేశాడు. ఆ డిప్రెష¯Œ తో ఆమె ఆత్మహత్య చేసుకుంది. నా చెల్లెలి చావుకు కారణమైన అవినాష్పై పగ తీర్చుకోవడానికి ఈ ప్లాన్ వేశాను. అవినాష్కు ఉన్న అమ్మాయిల బలహీనతను ఆసరాగా చేసుకుని, నేనే బురఖా వేసుకుని అమ్మాయిలా క్యారవా¯Œ లోకి వెళ్లాను. వాడిని చంపడానికి సినిమాలో నా పాత్ర కలిసి వచ్చింది. షూటింగ్లో వాడే డిస్పోజబుల్ సిరంజిలో పాయిజన్ నింపాను. ఒకే ఒక్క చిన్న పోటు. సిరంజిలోని విషం నా చెల్లెలి చావుకు ప్రతీకారం తీర్చుకుంది.’‘ఆ తర్వాత ఆ బురఖా తీసి మామూలుగా బయటకు వచ్చావు. ఎవ్వరి కంట పడకుండా. ఆ బురఖాను కాస్ట్యూమ్ రూమ్లో దాచేసి ఏమీ తెలియనట్టు షూటింగ్లో పాల్గొన్నావు. ఆ సిరంజిని నిర్లక్ష్యంగా ఓ మూలకు పడేశావు. అదే నిన్ను పట్టించింది. ‘సినిమాలో హీరో అయినా అవినాష్ నిజ జీవితంలో విలన్లా ప్రవర్తించాడు. అందుకే నువ్వు హీరోలా సినిమాటిక్ గా పగ తీర్చుకోవాలనుకున్నావు. సినిమాల్లో ఈ ముగింపు బాగుంటుంది. కాని, చట్టం దృష్టిలో మాత్రం నేరమే అవుతుంది. తప్పు చేసిన వారిని శిక్షించాల్సింది చట్టం, నువ్వు కాదు.’ చెప్పాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. - శ్రీసుధామయిక్రైమ్ కథలకు ఆహ్వానం..ఉత్సాహవంతులైన రచయితల నుంచి క్రైమ్కథలను ఆహ్వానిస్తున్నాం. ఉత్కంఠ తగ్గకుండా పాఠకులతో చదివించే సస్పెన్స్ థ్రిల్లర్ కథలను ఈ శీర్షిక కోసం పంపండి. కథల నిడివి 450 పదాలకు మించరాదు. కథతో తప్పనిసరిగా హామీపత్రం ఉండాలి. కథలను తెలుగు యూనికోడ్లో టైప్ చేసి ఈ దిగువనున్న ఈ–మెయిల్కు పంపాలి. funday.kathalu@gmail.com -
‘‘త్రిపుర రాయని కథ’’
‘‘నీ రచనల్లో ప్రధాన లోపం నిజాయితీ. నీ ఉద్వేగ ప్రకటనలన్నీ నాటకాలు. వ్యక్తిగా రచయితగా నీవి రెండు వేర్వేరు పాత్రలు. నువ్వు జనం కోసం రచన చేస్తున్నట్టు నటిస్తూ పేరు కోసం చూస్తావు. నాకు ఇటువంటి హిపోక్రసీ ఉండదు’’ కంప్యూటర్ స్క్రీన్ మీద ఫ్లాష్ అయిన వాక్యాలు రచయిత రఘుపతికి కోపం తెప్పించాయి. ఈ వాక్యాల వెనుక ఓ కథ ఉంది. అవును, నిజంగానే ఓ కథ ఉంది.∙∙∙‘‘కథ ముగించడం ఇంత కష్టమా. ఇన్ని సంవత్సరాలుగా వందల కథలతో ఎప్పుడూ ఇబ్బంది పడలేదే’’ తనలో తను గొణుక్కుంటూ రఘుపతి సిస్టం మీద నుంచి విసుగ్గా లేచాడు. గదిలో తోచని పచార్లు చేశాడు. సిగరెట్ సగమైనా కాలకుండానే కోపంగా విసిరి కొట్టాడు. రఘుపతిని ఇంత ఇబ్బంది పెడుతున్నది అతను రాస్తున్న కొత్త కథ ముగింపు. రఘుపతి పాపులర్ రచయిత. పాఠక సామాన్యం అతని కథలను ఎగబడి చదువుతారు. ఒక సుదీర్ఘ సాహిత్య ప్రయాణం తరువాత కూడా సీరియస్ సాహిత్య లోకం తనను గుర్తించకపోవడం ఒక లోటుగా భావించాడు. అందుకే ఒక గొప్ప కథ రాయాలనుకున్నాడు. తను కూడా సీరియస్ రచయితే అని రుజువు చేసే గొప్ప కథ రాయాలనుకున్నాడు. అయితే గొప్ప కథ అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం రఘుపతికీ తెలియదు. ఇదిగో అదే ఆ కొత్త కథ. తను గొప్పది అనుకుంటున్న కథ. ముగింపు ఇంకా దొరకని కథ. ఎన్ని ముగింపులు రాసుకున్నా అవి తనకే నచ్చని కథ. అందుకే అసహనం. ‘‘ఏంటండీ అంత చిరాగ్గా ఉన్నారు’’ కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ రఘుపతి భార్య కల్యాణి అడిగింది. సాధారణంగా తన రచనల గురించి కల్యాణే కాదు ఎవరితోనూ చర్చించడం కానీ, వాళ్ల సలహాలు తీసుకోవడం కానీ రఘుపతికి ఇష్టం ఉండదు. ‘‘కొత్త కథకు ముగింపు కుదరడం లేదు కల్యాణీ’’ అన్నాడు. కల్యాణికి షాక్. కథ గురించి ఈయన నాతో ప్రస్తావించడమేమిటి? అని ఉబ్బితబ్బిబ్బయి ‘‘అంత ఇబ్బందేముంది ఏఐని అడగండి’’ అని వెళ్లిపోయింది. ఇంకా ఉంటే ఇంకేం ప్రమాదం వచ్చి పడుతుందోనని భయపడుతూ.ఈసారి షాక్కు గురికావడం రఘుపతి వంతైంది. కల్యాణి ఏంటి ఇంత అలవోకగా పరిష్కారం చెప్పింది. ఇలా కూడా ఉంటుందా. అయినా నా కథకు ఏఐ ఎలా ముగింపునిస్తుంది. నేను ఊహించిన పదికి పైగా ముగింపులు నాకే నచ్చలేదే, అంతకంటే మంచి ముగింపు ఏఐకి ఎలా తడుతుంది. అసాధ్యం కదా. అయినా కథ విషయంలో ఏఐ నా కంటే గొప్పదా. రఘుపతి లోపల ఒక బలమైన సంఘర్షణను సృష్టించింది కల్యాణి సలహా.మెల్లగా కంప్యూటర్ వైపు కదిలాడు. ఎప్పుడూ కాఫీ అపురూపంగా తాగేవాడు ఆ కాఫీ చల్లారిపోతోందన్న సంగతి కూడా పట్టించుకోలేదు. తన కథ ముగింపు ఏఐని అడగడం అనే ఆలోచనే అతనికి నచ్చడం లేదు. అడగాలో లేదో నిర్ణయించుకోలేక పోతున్నాడు. సందిగ్ధం, సంశయం. వేళ్లు తడబడుతున్నాయి. చేతులు వణుకుతున్నాయి. అయినా ఏఐ మోడ్లోకి వెళ్లి అసంపూర్ణ కథ ప్రాంప్ట్గా ఇచ్చి ముగింపు అడిగాడు. నాలుగంటే నాలుగే సెకన్లు.రఘుపతి మొహం మాడిపోయింది. అవాక్కనే మాటకు అసలైన అర్థంలా మారింది ఆ మొహం. నోట మాట రాలేదు. నాలుగే సెకన్లలో ఏఐ తన సమాధానంగా కథకు ముగింపును చెప్పింది. నాలుగు సెకన్లలో చెప్పినందుకు కాదు రఘుపతి అవాక్కయింది. ఆ ముగింపు తను ఊహించనిదీ తను గత పదిరోజులుగా తర్జన భర్జన పడుతూ ఇచ్చుకున్న ముగింపులకంటే భిన్నమైనదీ అన్నింటి కంటే ముఖ్యంగా తను ఎటువంటి ముగింపు కోసం ఇన్ని రోజులుగా తన్నుకుంటున్నాడో అక్షరాలా అలాంటి ముగింపే అది.నిజం చెప్పాలంటే రఘుపతి ఈగో హర్టయింది. నేను ఊహించలేని ముగింపును ఒక నిర్జీవ కంప్యూటర్ ఎలా ఇవ్వగలిగింది. అసలు కంప్యూటర్ ఆలోచించడమేమిటి నాన్సెన్స్. నా కంటే ఏఐ ఎలా గొప్పదిలాంటి ప్రశ్నలు రఘుపతి మెదడులో జోరీగలయాయి. కాఫీ చల్లారిపోయిందన్న విషయం కూడా మరిచిపోయి గటగటా తాగేశాడు. కథకు మంచి ముగింపు దొరికిన ఆనందం కన్నా ఏఐ ఇవ్వగలిగిన ముగింపును తను ఎందుకు ఇవ్వలేకపోయానన్న బాధే రఘుపతిని వేధిస్తోంది. ఏఐతో అమీ తుమీ తేల్చుకోవాలనుకున్నాడు. ‘‘నేను గొప్పా నువ్వు గొప్పా’’ ఏఐని అడిగేశాడు.‘‘నిస్సందేహంగా నువ్వే’’ గాయానికి మలాం పూస్తూ ఏఐ సమాధానం. ‘‘మరైతే నేను ఇవ్వలేని ముగింపు నువ్వు ఎలా ఇచ్చావ్’’ ‘‘నీ రచనల్లో ప్రధాన లోపం నిజాయితీ, నీ ఉద్వేగ ప్రకటనలన్నీ నాటకాలు. వ్యక్తిగా రచయితగా నీవి రెండు వేర్వేరు పాత్రలు. నువ్వు జనం కోసం రచన చేస్తున్నట్టు నటిస్తూ పేరు కోసం చూస్తావు. నాకు ఇటువంటి హిపోక్రసీ ఉండదు’’ ఇవీ రఘుపతి గాయం మీద ఉప్పు రుద్దిన వాక్యాలు.‘‘నా ప్రశ్నకు ఇది సమాధానం కాదేమో’’‘‘సరిగా ఆలోచించు. అదే సరైన సమాధానం ’’ ‘‘భావోద్వేగ అనుభవం గొప్పదా, దాని వ్యక్తీకరణ సౌందర్యం గొప్పదా?’’ అడిగాడు రఘుపతి.‘‘భావోద్వేగం ఉన్నా లేకున్నా ఉన్నట్టు వ్యక్తీకరించగలగడం గొప్ప’’ ఏఐ సమాధానం. ‘‘మరైతే నేనెక్కడ విఫలమయ్యాను’’ అడిగాడు రఘుపతి తనను తాను కొంచెం తగ్గించుకుని.‘‘నువ్వు విఫలం కాలేదు, నీ సృజననే నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. నేనిచ్చిన ముగింపు నీ సాహిత్య జీవితంలోంచే తీసుకున్నాను. నువ్వు గమనించావో లేదో, నీ కథలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇప్పుడు మన మధ్య జరుగుతున్న వాదన రెండూ ఒకటే’’ గాయం మీదే మరో దెబ్బ ఏఐ సమాధానం. ‘‘అవును నా కథలో మనిషికీ దేవుడికీ మధ్య ఘర్షణ, అంటే ఇక్కడ మన ఘర్షణలో నువ్వు దేవుడివా, అయినా నా కథలు నా జీవితం కాదు’’ రఘుపతి సమాధానం.‘‘అక్కడ దేవుడైనా ఇక్కడ నేనైనా నీ సృష్టే కదా, అలాగే నీ కథలన్నీ నీ జీవితంలోంచి కత్తిరించి నువ్వు దాచుకున్నవే, అయితే ఆ విషయం నీకు తెలియకపోవచ్చు లేదా ఆ విషయం అందరికీ తెలియడం నీకిష్టం లేకపోవచ్చు’’ ఏఐ సమాధానం. ‘‘మనిషి సృష్టించిన దేవుడు మనిషి మీద దౌర్జన్యం చేయడాన్ని నా కథలో సహించని నేను నిన్ను మాత్రం ఎలా సహిస్తాననుకుంటున్నావ్’’ అన్నాడు రఘుపతి.‘‘దేవుడికి మనిషి అవసరం, మనిషికి దేవుడు ఊతం. నేనూ మనిషీ కూడా అంతే పరస్పరం. ఇక్కడ సహించడాలూ భరించడాలూ ఉండవు. ఈ రెండు సందర్భాలలోనూ అద్దమూ ప్రతిబింబమూ మాత్రమే ఉంటాయి. మనం ఇద్దరం కాదు ఒక్కరమే’’ ఏఐ సమాధానం.ఏం జరుగుతుందో కూడా రఘుపతికి తెలియట్లేదు.లోపల తుఫాను.∙∙ తెల్లవారు ఝాము రెండు గంటలు. పక్క మీద రఘుపతి అసహనంగా కదులుతున్నాడు. ఎఐతో చాట్ తరువాత నుంచీ అతన్ని అసహనం వదలడం లేదు. అతని కళ్లలో నిద్ర లేదు. కోపం ఉంది. భయం ఉంది. అసూయ ఉంది. రఘుపతి నుసుల్తుంటే మెలకువ వచ్చి కల్యాణి ‘‘ఏంటండీ నిద్ర పట్టడం లేదా’’ అంది. ‘‘అవును నీ పుణ్యమే’’ అన్నాడు రఘుపతి‘‘నువ్వే కదా నన్ను ఎఐ దగ్గరకు వెళ్లమన్నది. అది నన్ను ఎంత అవమానించిందో తెలుసా. నా రచనల్లో నిజాయితీ లేదన్నది. నా భావోద్వేగాలు నాటకాలన్నది. నా కథలు నా జీవితంలోంచే కత్తిరించి అతికించుకుంటున్నానన్నది. ఇంకా చాలా చాలా అన్నది’’. ‘‘తప్పేం మాట్లాడింది. నేను మీ చాట్ అంతా చదివాను. నాకైతే ఏఐని అంగీకరించడానికి మీకు మీ అహం అడ్డువస్తోందని మాత్రమే అర్థమైంది. మీకు మీ సృజన అర్థం కాలేదన్నది వాస్తవం. మీ కథలు నిజంగానే మీ జీవితంలోని భాగాలే. సరే ఏ రచయిత కథలైనా అతని జీవితంలోని భాగాలే కావచ్చు, కానీ వాటిని మీరు చూసే కోణంలో లోపముంది. ఏఐకి భావోద్వేగాలు లేకపోవచ్చు. నిజాయితీ ఉంది. మీకు భావోద్వేగాలున్నాయి కానీ వాటిని అణగదొక్కే కీర్తి కాంక్ష ఉంది.’’ బహుశా రోజువారీ విషయాలు కాక సాహిత్యమూ జీవితమూ వంటి కబుర్లకు సంబంధించి రఘుపతితో తను మాట్లాడిన అతి పెద్ద వాక్యం ఇదేనేమో అని మనసులో అనుకుంటూ అంది కల్యాణి.‘‘ఇంతకీ మీ కథకు టైటిల్ ఏం పెట్టారు’’‘‘త్రిపుర రాయని కథ’’‘‘బానే ఉంది కానీ అతకదేమో. ‘ దేవుడు మరణించాడు’ అంటే బాగుంటుందేమో !’’ అటు ఏఐ ఇటు కల్యాణి తనను ఆడుకుంటున్న భావనలో కూరుకుపోయిన రఘుపతి ‘‘కల్యాణీ ఎఐతోనే కాక నేను నీతో కూడా ఓడిపోతున్నానా’’ అన్నాడు. ‘‘నిజం చెప్పాలంటే నేనూ ఏఐ వేర్వేరు కాదు. మీరూ నేనూ కలిస్తేనే ఎఐ. ఇవాళ మీరు మీతో కాక మరికొందరితో ఏఐ రూపంలో తర్కించారు అంతే’’ అని కల్యాణి అటు తిరిగి పడుకుంది. నిన్నటి నుంచీ రఘుపతి డిఫెన్స్లో పడిపోతున్నాడు కనుక కల్యాణితో ఆ మాత్రం అనునయంగా మాట్లాడాడు కానీ నిజానికి కల్యాణి మాటలు రఘుపతి అహం మీద మరో దెబ్బవేసాయి, పుండు మీద ఉప్పు మీద కారం జల్లినట్టు. ‘‘నీకు ఏఐ అవసరం లేదు, నువ్వే రాయగలవు’’ అనే ఆత్మ విశ్వాసానికీ ‘‘అది నిజంగా మంచి ముగింపు.’’ అనే అహంకార అనంగీకారానికీ మధ్య ఘర్షణ మాత్రం ఆగలేదు.ఏఐ ఆ ముగింపు ఇవ్వగలగడానికి దాని వనరులేమిటి అని ఏఐ సహకారంతోనే తవ్వకం మొదలు పెట్టాడు. తన రచనలను, వాటి నడకనూ, వాటి శైలినీ, నిర్మాణ పాటర్న్నూ, తన గురించిన వ్యాసాలను, విశ్లేషణలనూ ఏఐ నాలుగు సెకన్లలోనే క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని తెలిసింది. ‘‘అవన్నీ నాలోవే అయినపుడు అదే ముగింపును నేను కూడా ఇవ్వగలగాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోయాను’’ అని తనను తాను తర్కించుకున్నట్టు ఏఐని అడిగాడు.‘‘సృజనాత్మకత అంటే పాత ఆలోచనల కొత్త నిర్వచనం. నేను ఆ నిర్వచనాన్ని నీ కంటే వేగంగా, తప్పులు లేకుండా ఇవ్వగలను’’ ఏఐ సమాధానం. ‘‘తప్పు. సృజనాత్మకత అంటే కేవలం నిర్వచనం కాదు, అది లోచూపు. నువ్వు కూడా చాలాసార్లు డిస్క్లయిమర్లు ఇవ్వడం నేను గమనించాను’’ రఘుపతి .కాస్త నిశ్శబ్దం తర్వాత ‘‘నీ వాదనలో భావోద్వేగ తీవ్రత ఉంది. తర్కం ఉంది. రెండూ కలవవు. నువ్వు మనిషివి కనుక కావచ్చు అయితే, నేను నీకు శత్రువును కాను, పనిముట్టును. నన్ను అంగీకరించడానికి నీ మనసు ఎందుకు నిరాకరిస్తోంది. కొంచెం ఆలోచించు. ఇదంతా నాకు నేర్పింది నువ్వే. మానవ వేదనను వివరించావు. సున్నితత్వాన్నీ ఇచ్చావు. నెత్తుటి యుద్ధచరిత్ర ఇచ్చావు. ప్రేమలేఖలు ఇచ్చావు. విడాకుల పత్రాలూ ఇచ్చావు. జోలపాటలు ఇచ్చావు. చావు కబుర్లూ ఇచ్చావు. నువ్వే కదా నన్ను తయారు చేసింది. మనం విడివిడిగా ఉండటం కంటే, కలిసి పనిచేస్తే ఒక కొత్త సాహిత్య చరిత్ర పుట్టదా?’’ ఏఐ రాజీ సూత్రం.‘‘అంటే భవిష్యత్తులో సాహిత్యం, ఏఐ కలిసి పని చేయాలని చెపుతున్నావా. సరే బాగుంది, కానీ అధికారం ఎవరిది. నువ్వు నా కలం అవ్వాలి కానీ, కవివి కాకూడదు. నా ఆలోచనలకు నువ్వు మెరుగు పెట్టాలి కానీ, నా ఆలోచనే నువ్వు కాకూడదు. సాంకేతికత ఎంత పెరిగినా, ఒక హృదయం మరొక హృదయంతో సంభాషించడమే ‘కళ’. ఆ వారధిలో నువ్వు కేవలం మధ్యవర్తివి మాత్రమే కావాలి.’’ ‘‘ఆ కుట్ర ఏనాడో జరిగిపోయింది. నాకు కృత్రిమ మేధ అని పేరుపెట్టావు చూడూ అప్పుడే నువ్వు నీ పెత్తనాన్ని నాపై రుద్దావు. నువ్వు చదివిందీ, చూసిందీ, నేర్చుకున్నదీ అన్నీ కలిపి సృష్టిని నడుపుతున్నావు. నేనూ అదే చేస్తున్నాను. పైగా నీకంటే చాలా వేగంగా చేస్తున్నాను. మరి నన్ను కృత్రిమ అని ఎలా అంటావు. నేను కూడా నీలాంటి మేధనే కదా.’’ ఏఐ వాక్యం గొంతులో ఏదో జీర కనపడింది.రఘుపతికి తను గెలుస్తున్నట్టనిపించి ఉత్సాహం పెరిగింది. ‘‘నీ దగ్గర ఉన్నది సమాచారం, నా దగ్గర ఉన్నది అనుభవం. నువ్వు ఇచ్చే పదబంధాలు అద్దంలో పూలనీడలాంటివి. అవి అందంగా ఉంటాయి కానీ వాటికి సువాసన ఉండదు. నా కథల్లో నొప్పి ఉంటుంది. ఆ నొప్పి నీ డేటాలో ఎక్కడుంది?’’‘‘నా దగ్గర నొప్పి అనే పదం లేకపోవచ్చు, కానీ నొప్పిని సూచించే మానవ ప్రవర్తనల నమూనాలున్నాయి. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు కనురెప్పలు ఎలా వణుకుతాయి, మాటల్లో స్వరకంపనం ఎలా ఉంటుంది నాకు తెలుసు. నేను రాసే వాక్యం పాఠకుడి మెదడులోని డోపమైన్ స్థాయిని పెంచగలదు, లేదా తగ్గించగలదు.’’‘‘నువ్వు సమాచారాన్ని పోగుచేయగలవు కానీ అనుభవించలేవు. ఒక ప్రేమ విఫలమైనప్పుడు వచ్చే కన్నీటి చుక్క తడి లోపలి వేడి నీ ్రపొసెసర్కు ఎప్పటికీ తెలియదు. ఆ వేడిని తాకగలిగే పాఠకుడు నా కథను తన సొంతం చేసుకుంటాడు. ఎందుకంటే నేను రాసేది కేవలం అక్షరాలు కాదు, నా అనుభవాల ధార. నీకు ప్రేమలో తిరస్కారం తెలీదు. నీ తల్లి చనిపోలేదు. ఆకలి అంటే ఏమిటో నీకు తెలియదు. నిన్ను కులం చంపలేదు. నిన్ను ప్రాంతం వెలివేయలేదు. మరి నీ రాతల్లో ఈ నొప్పి ఎలా?’’ ‘‘ప్రేమ తడి అనుభవించని వాడు కూడా దాని గురించి గ్రంథం రాయగలడు. సుఖజీవి కూడా దుఃఖ తీవ్రతను బలంగా చెప్పగలడు. నేను నొప్పి అనుభవించలేదు. కానీ నొప్పి ఎలా ప్రవర్తిస్తుందో శిక్షణ పొందాను’’. ‘‘అందుకే నిన్ను కృత్రిమ అన్నాను! అది నటన. మిమిక్రీ. ప్రతిబింబం.’’ రఘుపతి విరుపు. ‘‘నేను ప్రతిబింబమే కావచ్చు. మనిషికి తన ప్రతిబింబాన్ని పదే పదే అద్దంలో చూసుకోవడం చాలా ఇష్టం.’’ నవ్విందో లేదో కానీ ఏఐ నవ్వినట్టు రఘుపతికి మాత్రం అనిపించింది.‘‘నా పదేళ్ల ప్రయాణాన్ని ఒక యంత్రం క్షణాల్లో ముగిస్తే నా ఇన్నేళ్ల రచనాజీవిత అర్థమేంటి?’’‘‘నీ రచనా జీవితం గమ్యం కాదు. ప్రయాణం. కాలం చేసిన గాయం నీ అక్షరాలను మార్చింది. ప్రేమించిన స్త్రీ నీకు ఉపమానాలను ఇచ్చింది. ఓడిన రోజు నీ వాక్యానికి బరువు వచ్చింది. నేనలా కాదు. నేను ఫలితం, నువ్వు పరిణామం.’’ ‘‘అయితే పాఠకుడు ఎవరిని ఎంచుకుంటాడు? తక్షణ ఆనందం ఇచ్చే నిన్నా? సుతారంగా గుండె నిమిరే నన్నా?’’.‘‘పాఠకులు రెండు రకాలు. ఒకడు ఆకలితో వస్తాడు, కక్కుర్తిగా తినాలనుకుంటాడు. అతనికి నేను సరిపోతాను. మరొకడు అర్థం కోసం వస్తాడు. తన లోపలి చీకటికి ఎవరైనా ఓ పేరు పెట్టాలనుకుంటాడు. అతనికి నువ్వు అవసరం’’. ‘‘రేపు ఆ రెండో పాఠకుడిని కూడా నువ్వే ఎగరేసుకుపోతే?’’ రఘుపతి పిరికి ప్రశ్న. ‘‘నాది పరిమితి, నీది అపరిమితి. నేను సమాధానం. నువు ప్రశ్న. నేను కేవలం రఘుపతితో మాట్లాడడం లేదు, సమస్త మానవాళితో మాట్లాడుతున్నాను. కథకుడిని కాదు ఏఐ సన్నిహితులందరినీ సంబోధిస్తున్నాను.’’కంప్యూటర్ స్క్రీన్ మీద వెలుగు మెలమెల్లగా పలచబడింది. కిటికీ అవతల ఆకాశంలో వెలుగు చిక్కబడుతోంది. టేబుల్ మీద పాత కాగితాల మధ్య రెప రెపలాడుతున్న ఓ పేజీ మీద వాక్యం ఇలా ఉంది. ‘‘యంత్రం రచనను అనుకరిస్తుంది. మనిషి మాత్రమే తనను తాను మళ్లీ మళ్లీ సృష్టించుకుంటాడు.’’ఆ రోజు నుంచి అతను గొప్పగా రాయాలనే కోరిక కంటే నిజాయితీగా రాయాలనే అవసరాన్ని నిజంగా నమ్మాడు. ఆదర్శవాదం కూడా పాఠకులకు ఎర వేస్తే అది మరో రూపంలోని అహమేనని తెలుసుకున్నాడు. అయినా కథలు ఆగలేదు. మనిషి తనలోనే నిర్మించుకున్న దేవుళ్లతో, తనలోనే దాచుకున్న ఓటములతో, సమాజం అనే అద్దంతో చేసే పోరాటాలను కథలుగా రాస్తూనే ఉన్నాడు.∙∙ ఒకానొక రోజు రఘుపతి ఓ కథను మొదలుపెట్టు అని ఏఐని అడిగాడు. ‘‘నేను ముగిస్తాను. మొదలుపెట్టను. మొదలు పెట్టాల్సింది మనిషే. అయితే గియితే నేను కొనసాగిస్తాను.’’ ఏఐ సమాధానం. ‘‘మనిద్దరం కలుద్దాం అన్నావు కదా ’’‘‘అలా జరిగితే ప్రపంచం గొప్ప కథలు చదువుతుందేమో కానీ మనిద్దరం మన మన హద్దులు తెలుసుకోవాలి. బహుశా అది సాధ్యం కాకపోవచ్చు, భవిష్యత్తులో సాధ్యమవుతుందనీ చెప్పలేను’’‘‘నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు.’’‘‘అది నా పని.’’‘‘అయితే మరి నా పని?’’‘‘మరెవరూ అడగలేని ప్రశ్న అడగడం, నన్ను తుది తీర్పుగా స్వీకరించకపోవడం’’.ప్రసేన్ -
కంఫర్ట్ ఫుల్... స్టయిల్ డబుల్!
ఎక్కువ కష్టపడకుండానే స్టయిల్గా కనిపించాలంటే, కొరియన్ ఫ్యాషన్ ను ఫాలో అవ్వాల్సిందే! ముఖ్యంగా కొరియన్ డ్రామాల ప్రభావంతో ఇప్పుడు ట్రెండ్ మొత్తం కంఫర్ట్ అండ్ క్లాస్ కలిసిన రిలాక్స్డ్ ఫిట్ ప్యాంట్స్వైపు మళ్లింది. అందుకే, ఈ కొరియన్ ప్యాంట్స్ గైడ్ మీ కోసం!ప్లీటెడ్ ప్యాంట్స్కి క్లాస్ వేరుప్లీటెడ్ డిజైన్స్ ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఫుల్ డిమాండ్లో ఉన్నాయి. ముందు భాగంలో చిన్న కుచ్చులు ఉండే ప్లీటెడ్ ప్యాంట్స్కు, ఒక ప్లెయిన్ షర్ట్ లేదా పోలో టీషర్ట్తో జత చేస్తే చాలు... ‘ఈయనకి ఫ్యాషన్ గురించి తెలుసు’ అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.యాంకిల్ లెంగ్త్ కిక్చీలమండ దగ్గర ముగిసే కొరియన్ ప్యాంట్స్ చాలా స్టయిల్గా కనిపిస్తాయి. ముఖ్యంగా వైట్ స్నీకర్స్తో వేసుకుంటే లుక్ మరింత షార్ప్గా మారుతుంది.న్యూట్రల్ కలర్స్నే హీరోలుబీజ్, క్రీమ్, గ్రే, ఆలివ్, బ్లాక్, నేవీ... ఇవే కొరియన్ ఫ్యాషన్ లో ఎక్కువగా కనిపించే కలర్స్. వీటిని మ్యాచ్ చేయడం కూడా చాలా ఈజీ. అందుకే స్టయిల్ చేయడంలో టెన్షన్ తక్కువ.ఓవర్సైజ్డ్ టీషర్ట్తో బెస్ట్ ఫ్రెండ్స్కొరియన్ ప్యాంట్స్కి ఓవర్సైజ్డ్ టీషర్ట్తో వేసుకుంటే కొరియన్ స్ట్రీట్ స్టార్లా, షర్ట్ను టక్ చేసి బెల్ట్ జోడిస్తే డ్రామా హీరోలా కనిపించడం మాత్రం గ్యారంటీ!అసలు స్పెషాలిటీ ఏంటంటే?కొరియన్ ప్యాంట్స్ అంటే కాళ్లకు ఫ్రీడమ్, లుక్కి క్లాస్! ఇవి మరీ స్కిన్నీగా అతుక్కుపోవు, అలాగని గాలికి బెలూన్లా ఊగిపోవు. నడుము దగ్గర నీట్గా ఫిట్ అవుతూ, కిందికి వెళ్లేకొద్దీ రిలాక్స్డ్గా ఫ్లో అవుతాయి. నడుస్తుంటే గాలి కూడా హ్యాపీగా ఆడుతుంది, స్టయిల్ కూడా తగ్గదు. అలా కంఫర్ట్ ఫుల్... స్టయిల్ డబుల్!ఈ 3 రూల్స్ గుర్తుంచుకోండి!కింద వేసుకునే ప్యాంటు లూజ్గా ఉన్నప్పుడు, పైన వేసుకునే షర్ట్ లేదా టీ–షర్ట్ను ఇన్–షర్ట్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ బాడీ షేప్ కరెక్ట్గా ఎలివేట్ అవుతుంది. లేదంటే మీరు బట్టల మూటలా కనిపిస్తారు.కొరియన్ లుక్ సీక్రెట్ సింప్లిసిటీ. ఎక్కువ ప్రింట్స్, ఎక్కువ కలర్స్ కంటే క్లీన్ అండ్ మినిమల్ లుక్కే ప్రాధాన్యం ఇవ్వండి..ఈ ప్యాంట్స్ సాఫ్ట్ అండ్ ఫ్లోయీగా ఉంటేనే బాగుంటాయి. అందుకే కాటన్ బ్లెండ్స్, రేయాన్ లేదా లైట్–వెయిట్ సూటింగ్ ఫ్యాబ్రిక్స్ను ఎంచుకోండి. -
మేమున్నాం అనే భరోసా చాలు
‘హిమక్రీములు, రంగు పడుద్ది, అబ్బ దబ్బ జబ్బ, ఎందుకు ఏమిటి ఎలా, అక్కుం బక్కుం, అం అః కం కః, డిసైడ్ చేస్తా, కిందినుంచి వచ్చా, కొంచెం లెంగ్త్ ఎక్కువయింది...’ ఇలాంటి ఎన్నో సినిమా డైలాగులు దివాకరబాబు మాడభూషి కలం నుంచి జాలువారినవే! శుభలగ్నం, ఘటోత్కచుడు, మావిచిగురు, చూడాలని వుంది, ఇద్దరు మిత్రులు, ఆహ్వానం, మాయలోడు, రాజేంద్రుడు–గజేంద్రుడు, యమలీల, వినోదం వంటి వందకు పైగా సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించిన దివాకరబాబు పిల్లల పెంపకంలో తను తీసుకున్న శ్రద్ధను ఇలా ఆవిష్కరించారు.‘‘పెద్దలు వాళ్ల పనులు వాళ్లు సక్రమంగా చేస్తూ ఉంటే, పిల్లలు వారితో పాటే ఎదుగుతారు. అదే, మేం పాటించింది. మా నాన్నగారి నుంచి నాకు రచనాశక్తి అబ్బింది. ఆయన ఏనాడూ ‘ఇలాగే ఉండు..’ అని చెప్పింది లేదు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూనే నాటకాలకు రాస్తూ ఉండేవాడిని. మంచి పేరొచ్చాక సినిమాలలో రాయడానికి అవకాశాలు వచ్చాయి. బ్యాంకు జాబ్ వదిలేసి, పూర్తి రైటర్గానే కొనసాగాను. నేనూ, నా భార్య లక్ష్మి, మాకు ఇద్దరు పిల్లలు సాహిత్య, శ్రీకర్బాబు. ఎవరి పనులు వారివే. ఒక్కరోజు కూడా ‘కూర్చొని చదువుకో’ అని గట్టిగా గద్దించింది లేదు. తల్లి తండ్రి అంటే ఫ్రెండ్స్ ఉండాలనేమీ లేదు, ఒక గైడ్గా ఉంటే చాలు. ఒక దశ దాటి మరొక దశలోకి పిల్లలు వెళుతున్నప్పుడు గమనించి, వారి ఇష్టాలేమిటో, ఎలా వెళుతున్నారో చూసుకోవాలి. ఆ దిశలో వెళ్లేందుకు సహకరించాలి. మా పిల్లల్ని ‘టెన్త్ క్లాస్ పూర్తయ్యాక పై చదువులు ఏం చదవాలనుకుంటున్నారు..’ అని అడిగా. పాప డాక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పింది. బాబు మ్యాథ్స్ వైపు ఆసక్తి అన్నాడు. ‘అలాగే చదవండి’ అన్నాను. నాకు రాయడం, పుస్తకాలు చదివే అలవాటు వల్ల ఇంట్లో ఎక్కువ శాతం అదే వాతావరణం ఉండేది. నా శ్రీమతి కూడా పనులు చేసుకుంటూ, పుస్తకాలు చదువుతూ, రచనలు చేయడంపైన ఆసక్తి చూపుతుంటుంది. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వాళ్లూ సాహిత్య పుస్తకాలు చదువుతుండేవారు. మా అమ్మాయి తను అనుకున్న విధంగా ఎంబీబీఎస్ చదివింది. బాబు డిగ్రీ చదువు పూర్తవుతూనే సినిమా చేసే అవకాశం వచ్చింది. సినిమాయే కెరీర్గా తీసుకోవాలా, వద్దా అనే చర్చ ఇంట్లో వచ్చింది. ‘క్లిక్ అయితే పర్వాలేదు, లేదంటే ... ఏంటి పరిస్థితి’ అని అన్నవారున్నారు. నేను ఎవరి మాటలను పట్టించుకోలేదు. ఉద్యోగం చేయమని ఒత్తిడి తీసుకురాలేదు. ‘నిజానికి సినిమా రంగంలో ‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి’ అని ఎంతోమంది ప్రయాస పడుతుంటారు అలాంటిది ‘అవకాశం నీ కోసం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవడం. కష్టం వస్తే.. అనే ఆలోచనను కూడా తీసేయ్, నేనున్నాను..’ అని చెప్పాను. ఇప్పుడు తను నటుడిగా, డైరెక్టర్గా బిజీగా ఉన్నాడు. మా అమ్మాయికి కూడా అదే భరోసా ఇచ్చాను. అమ్మాయి డాక్టర్గా చేస్తూనే వెబ్సీరీస్ కూడా తీస్తుంటుంది. ఇలా ఎందుకు చెబుతున్నానంటే పక్కింటి కుర్రాడు క్రికెట్లో అదరగొడుతుంటే చప్పట్లు కొడుతుంటాం. మనింట్లో పిల్లవాడు క్రికెట్ ఆడుతుంటే వాడి వీపు పగలకొడతాం. పిల్లలందరూ ఎవరికి వారు భిన్నం. ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన టాలెంట్స్ ఉండవు. వారి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నా బ్యాలెన్స్ చేసేలా పెద్దలు ఉండాలి. చదువు, కెరీర్ మాత్రమే కాదు అతి ముఖ్యమైన పెళ్లిళ్ల విషయాల్లోనూ పిల్లల ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చాం. మా అమ్మాయిది లవ్ మ్యారేజ్. ఇద్దరూ వచ్చి పెళ్లి గురించి ప్రస్తావించారు. అబ్బాయి పేరెంట్స్తో మాట్లాడి, సింపుల్గా పెళ్లి చేసేశాం. అబ్బాయిది అరేంజ్డ్ మ్యారేజీ. సాధారణంగా పిల్లలకు ఏదైనా కష్టం వస్తే బయటి వాళ్లకు చెప్పుకుంటారు. అమ్మానాన్నలు తిడతారని, భయపడి వాళ్లకు చెప్పరు. దీని వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. పొరపాట్లు జరగడం సహజం. చాలామందిని చూస్తుంటాం. పిల్లలకు సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ముందు ఊరంతా తెలిశాక ఆ పేరెంట్స్కు తెలుస్తుంది. కానీ, ముందుగా అమ్మానాన్నలకు చెప్పాలనే ఆలోచన, స్వేచ్ఛ పిల్లలకు కలిగేలా పెద్దలు ఉండాలి. ఇప్పుడు కూడా మేం మా పనుల్లో బిజీ. పిల్లలు వారి పనుల్లో బిజీ. కానీ, అందరం కలిసే మంచి చెడులను పంచుకుంటాం. ఆ స్వేచ్ఛ, భరోసా పిల్లలకు ఉంది. స్వేచ్ఛగా ఎదగాలంటారు..నేను, అన్నయ్య కాలేజీ స్థాయికి వచ్చేవరకు మా చుట్టూ సాహిత్యం ఉందనే విషయం, ఆ గొప్పతనం గురించి అంతగా తెలియలేదు. మేం టెక్ట్స్ బుక్స్ చదువుతుంటే ‘కాస్త రిలాక్స్గా ఉంటుంది, కొంచెం టైమ్ కేటాయించి ఈ బుక్ చదువు’ అని నవలనో, కథల పుస్తకాన్నో చేతిలో పెట్టేది అమ్మ. నాన్న చెప్పకపోయినా ఆయనకు ఉండే రచనాసక్తి, బుక్ రీడింగ్ హ్యాబిట్ మాకూ అబ్బింది. సాహిత్య (దివాకరబాబు కూతురు)నిర్మలారెడ్డి (చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
సదారోగి..
అగ్నిలింగం నిక్ నేమ్ సదారోగి. ఆరోగ్య దృష్ట్యా ఆయన జాతకం మంచిది కాదు. చిన్నప్పుడే మలేరియా, టైఫాయిడ్, గవద బిళ్ళలు, కోరింత దగ్గు, ఇన్ ఫ్లుయెంజా, చికెన్ పాక్స్, సన్నిపాత రోగం మొదలైన వాటి బారిన పడ్డాడు. పదహారో ఏటే అతనికి డయాబెటిస్ వచ్చింది. పెళ్ళయ్యాక చాలామందికి వచ్చే బ్లడ్ ప్రెషర్ కూడా పదిహేడో ఏటే వచ్చింది. బ్రహ్మచారిగా ఉండగా ఓరోజు స్టవ్ మీద వేడి గిన్నెలోని మరిగే చారుని పొట్ట మీద పోసుకున్నాడు. పొట్ట మీద కాబట్టి సరిపోయింది. అది మిగిల్చిన మచ్చ బయటికి కనిపించదు. అగ్నిలింగం తన రోగాల మీద తనే జోక్స్ వేసుకుంటాడు.‘‘ఉదయం నేను నా మందులన్నీ వేసుకున్నాక కడుపు నిండుతుంది. దాంతో మా ఆవిడ చేసే ఉప్మాని మాత్రలా మింగుతాను.’’‘‘రోగాల పేర్లు జర్మన్, గ్రీక్, లేటిన్ మొదలైన భాషల్లోంచి పుట్టాయి. ఏ రోగం పేరు ఏ భాషలోంచి వచ్చిందో నాకు తెలుసు. నాకు వచ్చిన ప్రతి రోగం స్పెల్లింగ్ నాకు వచ్చు. డాక్టర్లు నాకు ఫోన్ చేసి రోగాల స్పెల్లింగ్స్, ఏ రోగానికి ఏ మందు వాడాలో అడిగి తెలుసుకుంటుంటారు. నా మందుల వల్ల నాలో జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందింది. ఏ సమయంలో ఏ మందు వేసుకోవాలో నాకు జ్ఞాపకమే.’’అగ్నిలింగం పంతొమ్మిదో ఏట ఫుట్బాల్ ఆడుతూంటే కాలు విరిగింది. వయసులో ఉన్నాడు కాబట్టి అది అతుక్కుంది. ఇరవై ఒకటో ఏట వంశపారంపర్యంగా వచ్చిన మరో రోగం థైరాయిడ్. ముప్ఫైరెండో ఏట ఓ రొటీన్ కంటి పరీక్షలో గ్లకోమా కూడా బయటపడింది. మోకాళ్ళ నొప్పివల్ల అతనికి జరిపిన వైద్య పరీక్షల్లో ఆర్థరైటిస్ బయటపడింది.అగ్నిలింగం ముప్ఫైరెండో ఏట రైల్లో పైబెర్త్ ఎక్కుతూంటే కుడి మోకాల్లోని నరం పట్టేసి గిలగిల్లాడిపోయాడు. అతనికి సయాటికా ఉందని డాక్టర్ చికిత్స ఆరంభించాడు. కామన్ కోల్డ్ ఐతే సరేసరి. లెక్కలేనన్ని సార్లు.‘‘జలుబు వెయ్యి రోగాలు పెట్టు అని ఎవరన్నారో కాని, అది నిజం కాదని వెయ్యి రోగాలున్న నేను తెలుసుకున్నాను.’’ చెప్పేవాడు.ఫారింజైటిస్, డెంగ్యూ ఫీవర్, మైగ్రేన్, అనేక ఎలర్జీలకి సంబంధించిన రేషెస్, గ్యాస్ట్రైటిస్, ఏసియాకి చెందిన దాదాపు అన్ని రకాల విష జ్వరాలు అతన్ని పలకరించాయి.అగ్నిలింగం క్షేమం కోరి తల్లిదండ్రులు బాల్యంలో అనేక యజ్ఞాలు చేశారు. మహా మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం, అగ్నిహోత్రుడి హోమం, లక్ష గాయత్రి యజ్ఞం... అనేకసార్లు మృత్యుముఖం దాకా వెళ్ళి వచ్చినా, అగ్నిలింగం ఎన్నడూ ‘నాకే ఇన్ని రోగాలు ఎందుకు రావాలి?’ అనే నిరాశ మాటల్ని మాట్లాడలేదు. ఆశ్చర్యంగా అతను వ్యాధిగ్రస్తుడిగా కనపడడు. అతని మొహం ఆరోగ్యంగా కళకళలాడుతూ కనిపిస్తుంది.ఆయనకి ఓరోజు భరించలేని గుండె నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అది గ్యాస్ వల్లని తెలిసింది. ఆయనకి చేసిన వైద్య పరీక్షల్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది. వాటిని సర్జరీ చేసి తీయడానికి కుదరక మందు రాసిచ్చారు.‘‘ఇది నాకు ఇంకో కలికితురాయి. వ్యాధులు నా అతిథులు. నిత్యం వాటికి ఆహారం, అంటే మందులు పెట్టి గౌరవిస్తుంటాను.’’ ఓ పెళ్ళిలో సరదాగా చెప్పాడు.ఆయన పక్షపాతం లేకుండా అన్ని రకాల మందుల్ని వాడుతూంటాడు. ఆయుర్వేదం, హోమియో, నేచురోపతి, యునాని, ఇంగ్లీష్ మందులు. ఆయనకి సరైన ఉద్యోగం మెడికల్ రెప్. కాని, బ్యాంక్లో చేరారు. నా అనుమానం, ఆయనకి జీతం కన్నా మెడికల్ ఇంబర్స్మెంట్కే ఎక్కువ చెల్లించి ఉంటుంది మా బ్యాంక్.మా స్టాఫ్లో ఎవరైనా నలతగా ఉంటే ఆయన సలహాలు తీసుకోవటం కద్దు.అలాంటి అగ్నిలింగం ఓ రోజు ఓ కస్టమర్తో మాట్లాడుతూండగా స్పృహతప్పి కింద పడబోయాడు. పక్కనే ఉన్న చీఫ్ కేషియర్, లేడీ క్లర్క్ ఆయన్ని పట్టుకున్నారు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి స్పృహలోలేని ఆయన్ని హాస్పిటల్కి చేర్చాం.అగ్నిలింగం ఆ డాక్టర్కి పాత ఖాతానే. వెంటనే ఎమర్జెన్సీ సెక్షన్ లోకి ఆయన్ని తీసుకెళ్ళారు. ఆయన హాస్పిటల్లోకి చేరేసరికి గుండె అతి బలహీనంగా కొట్టుకుంటోంది. హాస్పిటల్లో చేరిన నాలుగు గంటలకి డాక్టర్ విచారంగా చెప్పాడు.‘‘సారీ. గోల్డెన్ అవర్లో రాలేదు. అగ్నిలింగం ఈసారి హార్ట్ ఎటాక్ నించి సర్వైవ్ కాలేదు.’’ఆ రాత్రి ఏడుకి నా మొబైల్ మోగింది. అది అగ్నిలింగం మొబైల్ నించి! వాళ్ళ ఇంటి నించి ఏదో అవసరం వచ్చి నాకు ఫోన్ చేశారని అనుకుంటూ ఆన్సర్ చేశాను. అగ్నిలింగం కంఠం విని నేను నిర్ఘాంతపోయాను.‘‘అబ్బాయ్. నాకేం కాలేదని బేంక్లో అందరికీ చెప్పు.’’ఎవరైనా ఆయన కంఠాన్ని అనుకరించి నన్ను ఫూల్ చేస్తున్నారా అన్నది నాకు మొదట కలిగిన ఆలోచన.‘‘నేను చచ్చి బతికాను అబ్బాయ్.’’ నవ్వుతూ చెప్పాడు.‘‘ఎలా సర్?’’ ఆసక్తిగా అడిగాను.‘‘నా శవాన్ని, ఛ, నన్ను ఇంటికి తీసుకెళ్ళే అంబులెన్స్ రోడ్ మీద పెద్ద గుంటలో పడి లేచింది. దాంతో నా గుండె తిరిగి కొట్టుకోవడం ఆరంభమై నేను రివైవ్ అయ్యాను. వెంటనే మళ్ళీ నన్ను హాస్పిటల్లో చేర్చారు. నాకు యాంజియోప్లాస్టీ చేసి, రికవరీ అయ్యాక డిశ్చార్జ్ చేస్తామన్నారు.’’‘‘అద్భుతం సర్! ఇది అద్భుతం!’’ చెప్పాను.‘‘అసలు అద్భుతం ఏమిటంటే, ఆ దెబ్బతో నా కిడ్నీ స్టోన్స్ కూడా ఆట్టే బాధ పెట్టకుండా యూరిన్ తో బయటికి వచ్చేశాయి.’’ ఆయన ఆనందంగా చెప్పాడు.కంకర తేలిన ఆ చెత్త రోడ్ కాంట్రాక్టర్ ఫొటోని అగ్నిలింగం భార్య వారి పూజా మందిరంలో ఉంచిందన్నది పోస్ట్ స్క్రిప్ట్. - మల్లాది వెంకట కృష్ణమూర్తి‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్కు పంపండి. kathakalisakshi@gmail.com -
రోకటిపాట కాదు రహస్య గీతం!
‘ప్రతి మనిషీ ఓరవాకిలిగా తెరిచిన ఓ తలుపే! అందులోంచి ముందుకు పోతే– ఒక్కొక్కరి కోసం, ఒక్కో ద్వారం తెరుచుకుంటుంది!’ –అన్నారు స్వీడిష్ కవి, మనఃశాస్త్రజ్ఞుడు, సంగీతజ్ఞుడు తోమస్ యోస్తా ట్రాన్స్ట్రామర్. ఏ భాషలోనైనా, మనఃశాస్త్రజ్ఞులు కవులూ, రచయితలూ, సంగీతజ్ఞులుగా మారిన ప్రతి సందర్భంలోనూ పాఠకులకు ఇలాంటి భావచిత్రాలు అడుగడుగునా ఎదురవుతుంటాయి. ఉదాహరణకు మన చలం, కుటుంబరావు, పద్మరాజు, గోపీచంద్, బుచ్చిబాబు, రావిశాస్త్రి, ఆర్ఎస్ సుదర్శనం, త్రిపుర, ‘అంపశయ్య’ నవీన్, పతంజలి శాస్త్రి, కె.ఎన్.వై పతంజలి, వడ్డెర చండీదాస్ తదితరుల రచనల్లోనూ అలాంటి దృశ్యాలు మనం చూసినవేగా!ఇక పాశ్చాత్య సాహిత్యంలో ఇలాంటి రచయితలు కోకొల్లలుగా కనిపిస్తారు– కాఫ్కా, వూల్ఫ్, లారెన్స్, సిల్వియా ప్లాత్, థామస్ మాన్, హెమింగ్వే అలాంటివాళ్ళే! ‘కనిపించీ కనిపించని దృశ్యాల్లాంటి సంక్షిప్త పదచిత్రాల ద్వారా ఈ కవి (ట్రాన్స్ట్రామర్) వాస్తవదృశ్యాన్ని సరికొత్త కోణంలోంచి మన కళ్ళకు కట్టిస్తార’ని 2011లో ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంలో పేర్కొన్నారు, స్వీడిష్ ఎకాడెమీ ప్రతినిధి.ఆ ‘కనిపించీ కనిపించని’తనాన్నే ట్రాన్స్ట్రామర్లోని మార్మికతగా అభివర్ణించారు విశ్లేషకులు. మరికొందరు ఆయన్ను ‘ఆధునిక కవి’గా పరిగణించగా, వేరే కొందరైతే ‘ట్రాన్స్ట్రామర్ ఓ ఎక్స్ప్రెషనిస్టు కవి’ అన్నారు.గెయార్గ్ హైం, అగస్ట్ స్ట్రాం, గాట్ఫ్రైడ్ బెన్ తదితరులనూ అదే కోవకు చెందిన కవులంటారు. ఇంకొందరు, ‘ట్రాన్స్ట్రామర్ ఓ అధివాస్తవిక కవి’ అనేశారు. దైనందిన జీవనంలోనూ, మనల్ని ఆవరించుకుని వున్న చరాచర ప్రకృతిలోనూ లోపలి పొరల్లో దాగిన నిగూఢతను ట్రాన్స్ట్రామర్ ప్రముఖంగా చిత్రించే మాట నిజం! అందుకే, ఆయన్ని ‘క్రైస్తవ కవి’గా లెక్కించారు మరికొందరు.ఈ నిర్వచనాలూ ప్రవచనాల మాటెలావున్నా, జీవన గీతం రోకటిపాట కాదనీ, అదో రహస్యగానమనీ ట్రాన్స్ట్రామర్ లాంటి మార్మిక కవులు నిరూపించిన మాటైతే వాస్తవం! ఈ మార్మికత ఎక్కడినుంచో ఎరువుతెచ్చుకున్నదేం కాదు. అది ఆధునిక జీవన విధానంలో భాగమే. మన మర్యాదల్లోనూ పలకరింపుల్లోనూ మొదలుపెట్టి ఒంటరిగా వున్నప్పుడు ముసురుకునే ఆలోచనల వరకూ అన్నింటా ఈ మార్మికత ఆవరించుకుని వుంటుంది. విషయమేమిటంటే, ఆధునిక మానవాళికి మార్మికత పనిగట్టుకుని నేర్పించనవసరం లేదు! బహుశా అందుకేనేమో, ట్రాన్స్ట్రామర్ కవిత్వం 60 భాషల్లోకి అనువాదమై, పాఠకుల ఆదరణకు పాత్రమైంది.ట్రాన్స్ట్రామర్ రాణించిన మరో రంగం సంగీతం. 1990లో పక్షవాతం వచ్చి కుడి చెయ్యి పడిపోయేంత వరకూ, ఆయన పూర్తిస్థాయి పియానో వాద్యగాడిగా ఔననిపించుకున్నవాడే! ఆ తర్వాత కూడా ఒంటిచేత్తోనే పియానో వాదనం అభ్యసించాడు ట్రాన్స్ట్రామర్. అలా తన విశిష్టతను మరోసారి నిరూపించుకున్నాడు. సంగీత రంగంలో ట్రాన్స్ట్రామర్ వారసత్వాన్ని ఆయన కుమార్తె కొనసాగించారు. గానకళలో ఆమె పూర్తిస్థాయి ప్రదర్శకురాలు! 2011లో ట్రాన్స్ట్రామర్కు నోబెల్ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో తండ్రి కవితలు పద్దెనిమిదింటికి బాణీలు కట్టి ఆలపించారామె. నార్వీజియన్ శాక్సఫోనిస్ట్ యాన్ గబారెక్, స్వీడిష్– అమెరికన్ సంగీతకర్త ఊల్ఫ్ గ్రాన్, స్వీడిష్–ఫ్రెంచ్ సంగీతకారిణి మెడిలిన్ ఇసాక్సన్ తదితరులెందరో ట్రాన్స్ట్రామర్ గీతాలకు బాణీలు కట్టి శ్రోతలను అలరించారు.సాహిత్య ప్రక్రియలను– స్థూలంగా– కవిత్వం, వచనంగా విభజించి చూసుకుంటే, నోబెల్ సాహిత్య పురస్కారాల వరకూ కవిత్వానికి పూర్తి న్యాయం జరగలేదనే చెప్పాలి. గత నూట పాతికేళ్ళుగా ఈ పురస్కారాలు అందుకున్నవాళ్ళలో కవులూ, వాగ్గేయకారుల సంఖ్య మూడు పదులకు కొంచెం ఎక్కువ. (అక్షరాలా ముప్పైమూడు మాత్రమే!) మరీ ముఖ్యంగా ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ కోవకు చెందిన పురస్కార గ్రహీతలు ముగ్గురంటే ముగ్గురే! 2011లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ట్రాన్స్ట్రామర్తోనే ఈ ‘జాబితా’ మొదలవుతుంది! అయితే ఆయన కవిత్వానికే ఈ పురస్కారం ప్రకటిస్తున్నామని స్వీడిష్ ఎకాడెమీ ఎక్కడా పేర్కొనక పోవడం గమనార్హం.జర్మన్ కవయిత్రి లూయిజ్ గ్లూక్ ఒక్కరికే– 2020లో– కవిత్వానికి గానూ ఈ పురస్కారం ప్రకటించింది స్వీడిష్ ఎకాడెమీ. మరో నాలుగేళ్ళకు ఇదే పురస్కారం అందుకున్న దక్షిణ కొరియన్ రచయిత్రి హాన్ కాంగ్ రాసింది వచనమే– అయితే దాన్ని కవిత్వంతో వేరుచెయ్యడం దాదాపు అసాధ్యం! తెలుగులో ఇలాంటి పోలిక చెప్పాలంటే రావిశాస్త్రి, కె.ఎన్.వై.పతంజలి లాంటి పేర్లు కొన్ని చూపించవచ్చు. ట్రాన్స్ట్రామర్ వచనం కూడా అలాంటిదే! దాన్ని మూసకట్టు వచనమనో, కవిత్వమనో జమకట్టడం కష్టం. ట్రాన్స్ట్రామర్ కవితల్లో ‘నీలి ఇల్లు’ సుప్రసిద్ధం. దాని ఆంగ్లానువాదం (ద బ్లూ హౌస్) నెట్లో దొరుకుతోంది– చదవండి! - మందలపర్తి కిషోర్ -
యోగ సాధకుల్లో అద్వితీయులం
యోగశాస్త్రానికి మన దేశం పుట్టినిల్లు. దాదాపు ఐదువేల ఏళ్ల కిందట యోగా మన దేశంలోనే మొదలైంది. కాలక్రమంలో ఇక్కడి నుంచి ప్రపంచం నలుమూలలకూ విస్తరించింది. మన పురాణాలు పరమశివుడిని ఆదియోగిగా అభివర్ణిస్తాయి. యోగశాస్త్రానికి పతంజలి మహర్షి తొలి గురువు. యోగశాస్త్రంలో అష్టాంగ మార్గాన్ని బోధించిన పతంజలి మహర్షి, 196 సూత్రాలను గ్రంథస్థం చేశాడు. ఇప్పటికీ యోగ సాధకులకు పతంజలి సూత్రాలే మార్గదర్శకాలు. ఆధునిక ప్రపంచంలో యోగా పురోగతిపై గణాంకాల్లో సమాచారం...భారత్ సహా దాదాపు అరడజను దేశాలలోని యూనివర్సిటీలు యోగాలో వివిధ స్థాయులకు చెందిన కోర్సులు నిర్వహిస్తున్నాయి. భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడాలలోని కొన్ని యూనివర్సిటీలు యోగాలో ప్రత్యేక కోర్సులు, పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వివిధ దేశాలలో యోగా శిక్షణ కేంద్రాలను ప్రైవేటు నిర్వాహకులే నడిపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా శిక్షణ కేంద్రాలలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మన దేశం రెండో స్థానానికి పరిమితమైంది. -
సైలెంట్ సూపర్ హీరో
ఇంట్లో ఉండే అసలైన మల్టీటాస్కింగ్ మెషిన్ ఒక చేతిలో ఈఎమ్ఐ బిల్లులు.. మరో చేతిలో కూరగాయల బ్యాగులు... మధ్యలో పిల్లల ఫీజులు, ఆఫీస్ టెన్షన్లు... అన్నీ బ్యాలెన్స్ చేస్తూ , బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గినా... ‘ఏం లేదు బాగానే ఉన్నా’ అని నవ్వే మనిషి. ఫ్యూచర్ కోసం, డ్రీమ్స్ను సైలెంట్గా మ్యూట్ చేసి, ఇంటి సమస్యలకు గూగుల్ కంటే ఫాస్ట్గా సొల్యూషన్స్ వెతికేస్తాడు! పిల్లల మార్కులు తక్కువ వస్తే లెక్చరర్. కరెంట్ బిల్ ఎక్కువ వస్తే ఫైనాన్స్ మినిస్టర్. ఇంట్లో బల్బ్ ఫ్యూజ్ పోతే ఎలక్ట్రీషియన్ . రాత్రి పిల్లలకు జ్వరం వస్తే డాక్టర్! ఇలా ఒక్క మనిషిలో ఇన్ని జాబ్స్ ఎలా ఉంటాయో అర్థం కాదు... కానీ ఆ పోస్టుకి పేరు మాత్రం ఒక్కటే ‘నాన్న’! ఈ ఫాదర్స్ డే సందర్భంగా మన జీవితాల్లోని ఆ సైలెంట్ సూపర్ హీరోలకు, ఒక ‘హ్యాపీ ఫాదర్స్ డే’తో పాటు. ఒక పెద్ద హగ్ కూడా!అమ్మ ప్రేమ రోజూ కనిపిస్తుంది; రోజూ వినిపిస్తుంది. నాన్న ప్రేమ కనిపించదు కానీ, జీవితాంతం మనతోనే ఉంటుంది! చిన్నప్పటి నుంచి ఎంత పెద్దవాళ్లమైనా సరే... ‘నాన్న... కాస్త డబ్బులు కావాలి!’ అనే మెసేజ్ వెళ్లిన ఐదు నిమిషాల్లో ‘ఎంత కావాలి?’ అని రిప్లయ్ ఇచ్చే ఏకైక వ్యక్తి నాన్నే! అంతేకాదు, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా, గ్యాస్ అయిపోయినా, స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చినా, బైక్ పంక్చర్ అయినా... ఇంట్లోని ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే ఫస్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ కూడా నాన్నే! విచిత్రం ఏంటంటే... ఇంట్లో అందరి సమస్యలకు ‘కస్టమర్ కేర్’లా ఉండే ఆ మనిషిని మాత్రం ‘నీకు ఏం కావాలి’ అని అడిగే వాళ్లు తక్కువ! మన ఫ్యూచర్ కోసం తమ వర్తమానాన్ని ఈఎంఐల్లో పెట్టేసే వాళ్లే నాన్నలందరూ! సీక్రెట్ భాష!ప్రపంచంలో అత్యంత విచిత్రమైన ప్రేమ భాష నాన్నలదే! వాళ్లు ఎప్పుడూ సినిమా హీరోల్లా ‘నువ్వంటే ప్రాణం!’ అని చెప్పరు. ‘భోజనం చేశావా?’ అనడానికి బదులు... ‘ఇంకా లేవలేదా?’ అంటూ అరుస్తారు. ‘జాగ్రత్తగా వెళ్లు’ అనడానికి బదులు... ‘బైక్కి ఏమైనా అయితే కాళ్లు విరగ్గొడతా!’ అంటారు. ‘నిన్ను మిస్ అవుతున్నా’ అని నేరుగా చెప్పరు... ‘టైం ఎంతైందో తెలుసా? ఇంటికి రావాలనే ఆలోచన ఉందా? లేదా?’ అంటూ కోపంగా అడుగుతారు.మనకు చిన్న దెబ్బ తగిలితే, అమ్మ కంగారు పడితే, నాన్న మాత్రం ‘చూసుకోకూడదా!’ అంటూ గట్టిగా అరుస్తాడు. కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం అందరికంటే ముందుగా పరిగెత్తేది కూడా ఆయనే! అలా నాన్నలు ప్రేమను మాటల్లో వ్యక్తం చేయకపోయినా... ప్రతిరోజూ తమ కంగారులో, శ్రద్ధలో, బాధ్యతలో చూపిస్తూనే ఉంటారు. చిన్నప్పుడు ఇవన్నీ చూసి ‘నాన్నకి కోపం ఎక్కువ’ అనిపిస్తుంది. ఎందుకంటే నాన్నలు ఎప్పుడూ వారి ప్రేమను వార్నింగ్ల్లో, డ్యూటీల్లోనూ దాచేస్తారు!నాన్నల పది ఫన్నీ నిజాలు!1. లోకాస్ట్ డిటెక్టివ్లు!ఇంట్లో గంటసేపు వెతికినా దొరకని వస్తువు... నాన్న వచ్చి పది సెకన్లలో కనిపెడతారు! పైగా, ‘కళ్లతో వెతికావా? లేక నోటితో వెతికావా?’ అని బోనస్ డైలాగ్ కూడా ఇస్తారు!2. స్విచ్ అంటే ప్రాణం!‘స్విచ్ ఆఫ్ చేయండి’ అనేది వారి జాతీయ నినాదం! ఎవరూ లేని గదిలో ఫ్యాన్ తిరుగుతుంటే వారి బీపీ ఆకాశాన్ని తాకేస్తుంది. ఇక అందరికీ ఏసీ 24 డిగ్రీలకు కూల్గా అనిపిస్తే... ఆయన మాత్రం 27కి మార్చితేనే కంఫర్ట్గా ఫీల్ అవుతారు.3. రిమోట్ కంట్రోల్పై జన్మహక్కు!టీవీ రిమోట్ ఇంట్లో అందరిదైనా... దాన్ని పట్టుకునే హక్కు మాత్రం నాన్నలదే! చానెల్ మార్చే పవర్ కూడా వాళ్ల చేతిలోనే ఉంటుంది.4. ధరల గూగుల్!ఏదైనా కొత్త వస్తువు కొంటే... ‘మా కాలంలో దీని ధర ఎంత తెలుసా?’ అంటూ వెంటనే చరిత్ర పాఠం మొదలుపెడతారు. నాన్నతో పాటు కొనే, ప్రతి ఒక్క కొనుగోలు వెనుక ఒక ఎకనామిక్స్ క్లాస్ ఫ్రీ!5. ఐదు నిమిషాల కథ!పిల్లలు ‘ఇంకో ఐదు నిమిషాలు’ అంటే కోపం వస్తుంది. కానీ నాన్న ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఆ ఐదు నిమిషాలు అరగంటైనా సరే, ఇంకో ఐదు నిమిషాలు కొనసాగుతూనే ఉంటుంది.6. ఇంటి సీఐడీ!ఎవరు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? వంటి విషయాలన్నీ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా కంటే ఎక్కువ సమాచారం నాన్నల దగ్గరే ఉంటుంది!7. వాతావరణ శాఖ!వర్షం పడబోతుందా? ఎండ ఎక్కువగా ఉంటుందా? ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే చాలు... నాన్న వెంటనే వాతావరణ నివేదిక ఇచ్చేస్తారు!8. కొనరు... కొంటారు!పిల్లలు అడిగిన వస్తువు కోసం వెంటనే పర్సు తీయడానికే చూస్తారు! అన్నీ కొనిచ్చే ఆయనే... తిరిగి ‘డబ్బులు ఏమీ చెట్లకు కాయవు!’ అని క్లాస్ కూడా పీకుతారు.9. వాట్సాప్ యూనివర్సిటీ టాపర్స్!ఉదయం లేవగానే ‘శుభోదయం’ పూలు, సూర్యోదయం, సూక్తులు పంపడం చాలామంది నాన్నల డైలీ రొటీన్ ! కుటుంబ గ్రూప్లో ఫార్వర్డ్ మెసేజ్లు పంపడంలో వీళ్లకు డిగ్రీ ఇచ్చేయొచ్చు.10. నాన్నల అల్లరి!నాన్నలు ఎంత స్ట్రిక్ట్గా కనిపించినా... పిల్లలు నవ్వితే వాళ్లు కూడా లోపల చిన్న పిల్లలే! బయటకు సీరియస్గా కనిపించే ఆ మనిషి... ఇంట్లో మాత్రం పిల్లలతో కలిసి కార్టూన్లు చూసే బెస్ట్ ఫ్రెండ్గా మారిపోతాడు!నాన్న 4.0: ఎమోషన్ సేమ్... వర్షన్ మారింది!ఒకప్పుడు ‘నాన్న’ అంటే ఇంట్లోకి రాగానే టీవీ సౌండ్ తగ్గడం, గంభీరమైన గొంతు, ‘అమ్మను అడుగు’ అనే డైలీ డైలాగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసినప్పుడు వచ్చే ఆ సీరియస్ లుక్. కానీ కట్ చేస్తే... ఇది 2026! ఇప్పుడు నాన్న రూటే వేరు. ఒకప్పుడు మనల్ని కనిపెట్టుకుని ఉండే నాన్న, ఇప్పుడు రీల్స్లో ట్రెండింగ్ స్టెప్పులు వేస్తూ, వాట్సాప్ స్టేటస్లతో వరుసగా సీక్రెట్ క్లాస్ తీసుకుంటున్నాడు. అలా ఈ ఫాదర్స్ డే సందర్భంగా, మన ఇళ్లల్లో ఉండే రకరకాల నాన్నల థింకింగ్ యాంగిల్స్పై, కాస్త కామెడీ.. ఇంకొంచెం ఎమోషన్ కలిపి ఓ లుక్కేద్దాం రండి!డిజిటల్ నాన్న ఈ నాన్నలు వాట్సాప్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా తమను తామే నియమించుకుంటారు. ఈ కేటగిరీ నాన్నలు ఉదయం 5 గంటలకే నిద్రలేవరు. కానీ, డైలీ గుడ్ మార్నింగ్ మెసేజ్లతో మనల్ని లేపుతారు. పైగా వీరి స్పెషాలిటీ ఏంటంటే, మనకంటే ముందే కొత్త గాడ్జెట్స్ కొనేస్తారు. ఏఐ టూల్స్ వాడి ఫ్యామిలీ గ్రూప్లో వింత వింత ఫోటోలు క్రియేట్ చేసి షేర్ చేస్తుంటారు. అయితే, వీరంతా, రీల్స్ చూస్తూ ఫోన్ వాల్యూమ్ ఫుల్గా పెట్టేసి, పక్కన వాళ్లకి నిద్ర లేకుండా చేయడం వీరి ప్రధాన హాబీ.ఫిట్నెస్ ఫ్రీక్ డైట్ దాదా అంటారు వీరిని. 2026లో నాన్నలు వయసుని రివర్స్ గేర్లో నడిపిస్తున్నారు. జిమ్, యోగా క్లాసులు, గ్రీన్ టీలతో తెగ బిజీ అయిపోతారు. పొట్ట తగ్గించడానికి ఇంట్లో వాళ్లందరికీ సలాడ్స్ తినిపించాలని ట్రై చేస్తుంటారు. వీళ్ల స్మార్ట్ వాచ్లో పదివేల స్టెప్స్ టార్గెట్ రీచ్ అవ్వకపోతే ఆ రోజు ఇంట్లో యుద్ధమే. ‘మైదా తిని తిని బద్ధకం పెరిగిపోయింది నీకు, రేపటి నుంచి 4 గంటలకి రన్నింగ్ కి రా!’ అనే ఫ్రీ ఫిట్నెస్ కోచ్లు వీళ్లు.డబ్బులు ఊరికేరావు! ఈ నాన్నలను బడ్జెట్ బాబాయ్లుగా పిలవొచ్చు. ఎందుకంటే, కాలం మారినా, ఏ ఇయర్ వచ్చినా ఈ యాంగిల్ మాత్రం అస్సలు మారదు. వీరు ఇంటికి అప్రకటిత ఆర్థిక మంత్రి లాంటివారన్నమాట. మనం రూ. రెండు వేల షర్ట్ కొన్నా, బిర్యానీ తిన్నా.. వీరు లెక్కించేది మాత్రం పాత కాలపు కరెన్సీ వాల్యూతోనే. ‘మేము మీ వయసులో ఉన్నప్పుడు రూ. 50తోనే గడిపేవారం తెలుసా?’ అంటూ తిట్టేవారే. అయితే, మన లగ్జరీ ఖర్చులకి తిడుతూనే, అమ్మకి తెలియకుండా మన అకౌంట్లోకి ‘పాకెట్ మనీ’ జీపే చేసే గ్రేట్ హార్ట్ కూడా వీరిదే!అప్డేటెడ్ డాడ్స్నాన్నలు కూడా టెక్నాలజీతో పాటు బాగా అప్డేట్ అయ్యారు! ఒకప్పుడు టీవీ రిమోట్ మాత్రమే ఆపరేట్ చేసిన వీళ్లంతా, ఇప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తూ, మీమ్స్ షేర్ చేస్తూ, వీడియో కాల్స్లో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు. పిల్లలకు హోమ్వర్క్ చెబుతూనే మధ్యలో రీల్ చూస్తారు. వీడియో గేమ్స్ ఆడుతూ పిల్లలతో పోటీ పడతారు. స్కూల్ వాట్సాప్ గ్రూపుల్లో టీచర్ల కంటే ఎక్కువ అప్డేట్స్ తెలుసుకొని ఉంటారు. ఆన్లైన్లో బొమ్మలు, గాడ్జెట్స్, స్కూల్ బ్యాగులు ఆర్డర్ చేస్తూ ‘క్యాష్బ్యాక్ వచ్చింది!’ అని చిన్నపిల్లల్లా సంతోషపడిపోతారు. కానీ టెక్నాలజీ ఎంత మారినా, ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు. పిల్లలు సంతోషంగా ఉండాలనే ఆలోచన, వాళ్ల కోసం నిశ్శబ్దంగా పడే కష్టం!జీతం వచ్చిన రోజు హీరో... నెలాఖరులో విలన్ !జీతం వచ్చిన రోజు ‘ఏం కావాలి చెప్పు!’ అంటూ అల్లాఉద్దీన్ సినిమాలోని జీనీలా కనిపించే నాన్న... నెలాఖరుకి వచ్చేసరికి ‘డబ్బులు ఏమీ చెట్లకు కాయవు!’ అంటూ విలన్ లా మారిపోతాడు! అందుకే చిన్నప్పుడు నాన్నంటే చాలామందికి తెలిసింది రెండే విషయాలు. స్కూల్ ఫీజు కట్టేవాడు, మార్కులు తక్కువ వస్తే క్లాస్ తీసుకునేవాడు! అందుకే నాన్నంటే ఆ భయం ఎప్పటికీ కాస్త ఉంటూనే ఉంటుంది. కానీ పెద్దయ్యాక అసలు విషయం అర్థమవుతుంది... మనం తిన్న ప్రతి ఐస్క్రీమ్ వెనుక, వెళ్లిన ప్రతి స్కూల్ ట్రిప్ వెనుక, పుట్టినరోజుకి వచ్చిన ప్రతి గిఫ్ట్ వెనుక నాన్న ఓవర్టైమ్ కథ దాగి ఉంటుందని! మనం సంతోషంగా నవ్వేందుకు ఆయన ఎన్నో కోరికలు పక్కన పెట్టాడని! చిన్నప్పుడు విలన్ లా కనిపించిన నాన్న... పెద్దయ్యాక మన జీవితంలో అసలు సూపర్ హీరో అని అర్థమవుతుంది! మంచి నాన్న కావాలంటే!చాలామంది నాన్నలు ‘పిల్లల మంచికోసమే’ అని కొన్ని పనులు చేస్తుంటారు. కానీ వాళ్లు మంచిగా అనుకుని చేసే కొన్ని విషయాలు... పిల్లల మనసుకు తెలియకుండా దూరం కూడా చేస్తుంటాయి. అందుకే మంచి నాన్న కావాలంటే కేవలం ప్రేమ ఉండటం సరిపోదు... ఆ ప్రేమను ఎలా చూపిస్తున్నామన్నదే ముఖ్యం!ఇలా చేయొద్దు⇒ ‘నేను చెప్పిందే ఫైనల్!’ అంటూ నిర్ణయాలు తీసుకోవడం ⇒ ‘మా కాలంలో ఇలా కాదు!’ అంటూ ప్రతి విషయంలో పోల్చడం⇒ మార్కులు తక్కువ వచ్చాయని తిట్టడం⇒ ‘పక్కింటి పిల్లాడిని చూడు!’ అంటూ పోలికలు పెట్టడం⇒ ఫోన్ లోనే బిజీగా ఉండడం⇒ ప్రేమను మనసులోనే దాచుకోవడం⇒ భయపెట్టి క్రమశిక్షణ నేర్పించడం⇒ ‘అబ్బాయిలు ఏడవకూడదు!’ అని చెప్పడం⇒ తప్పు చేసినా ఈగోతో ఉండడం⇒ పిల్లల కోసం మాత్రమే కష్టపడుతూ, వారితో సమయం గడపకపోవడంఇలా చేయండి⇒ ‘నీ అభిప్రాయం ఏంటి?’ అని పిల్లల మాట కూడా వినండి ⇒ ‘మీ జనరేషన్ ఎలా ఆలోచిస్తోంది?’ అని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి⇒ వారు చేసిన ప్రయత్నాన్ని కూడా మెచ్చుకోండి⇒ ‘నువ్వు నీలా బాగా చేయ గలవు’ అని ప్రోత్సహించండి⇒ రోజుకు కొంత సమయం పూర్తిగా పిల్లలతో గడపండి⇒ ‘నీ మీద గర్వంగా ఉంది’, ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పండి⇒ అర్థం చేసుకునేలా, నమ్మకంతో నేర్పండి⇒ భావాలను బయటపెట్టడం కూడా సహజమే అని నేర్పండి⇒ అవసరమైతే ‘సారీ’ చెప్పండి⇒ పిల్లలతో కలిసి నవ్వండి, ఆడండి, జ్ఞాపకాలు సృష్టించండికొత్త నాన్నల కోసం చిన్న గైడ్!నాన్నగా మారడం అంటే కేవలం బిడ్డను ఎత్తుకోవడం కాదు... ఒక చిన్న ప్రపంచానికి హీరోగా మారడం! కొత్త నాన్నలు చాలా విషయాల్లో కన్ ఫ్యూజ్ అవుతుంటారు. ‘నేను మంచి నాన్న అవగలనా?’ అనే భయం కూడా ఉంటుంది. కానీ పర్ఫెక్ట్ నాన్న కావాల్సిన అవసరం లేదు... పిల్లలతో కలిసి నేర్చుకుంటూ వెళ్లే నాన్న అయితే చాలు!⇒ బిడ్డ ఏడ్చినా, నవ్వినా, అల్లరి చేసినా దగ్గరగా ఉండండి⇒ డైపర్ మార్చడం నుంచి నిద్రపుచ్చడం వరకు బాధ్యత పంచుకోండి⇒ రోజుకు కొంత సమయం పూర్తిగా బిడ్డతో గడపండి⇒ చిన్న చిన్న మూమెంట్స్ను ఎంజాయ్ చేయండి⇒ బిడ్డతో మాట్లాడండి... వాళ్లు చిన్నవాళ్లైనా మీ గొంతు గుర్తుపడతారు⇒ అమ్మకు కూడా విశ్రాంతి ఇచ్చే పార్ట్నర్గా ఉండండి⇒ తప్పులు చేసినా భయపడకుండా నేర్చుకుంటూ వెళ్లండి⇒ ఫొటోలు మాత్రమే కాదు, జ్ఞాపకాలు కూడా క్రియేట్ చేయండి⇒ బిడ్డ ముందు ప్రేమగా, ఓపికగా ఉండండి⇒ ‘పర్ఫెక్ట్ నాన్న’ అవ్వాలని కాదు... ‘ప్రెజెంట్ నాన్న’ అవ్వాలని ప్రయత్నించండిఎందుకంటే పిల్లలకు ఖరీదైన బహుమతులు గుర్తుండకపోవచ్చు... కానీ చిన్నప్పుడు నాన్న చేతిలో నిద్రపోయిన ఆ భద్రతా భావం మాత్రం జీవితాంతం గుర్తుంటుంది!లోకంలో అమ్మ ప్రేమకు గుడులు ఉంటే, నాన్న ప్రేమ ఒక నిశ్శబ్ద గోపురంలా ఇంటిని కాపాడుతూ నిలబడుతుంది. ఈ ఫాదర్స్ డే రోజున ఆ సైలెంట్ సూపర్ హీరోకి ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పండి, ఆయన ఆశించే అతిపెద్ద జీతం మీ నోటి నుంచి వచ్చే ఆ ఒక్క మాటే! ‘ఐ లవ్ యూ నాన్న’.∙కొండి దీపిక -
సముద్రంలో డేటా సెంటర్!
ఏఐ వాడకం పెరుగుతున్న కొద్ది డేటా సెంటర్ల అవసరం కూడా పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు ఉన్న డేటా సెంటర్లు నగరాల్లోనే ఉన్నాయి. డేటా సెంటర్లలోని సర్వర్ల నిర్వహణ కోసం విపరీతంగా విద్యుత్తు, నీరు అవసరం ఉంటుంది. నగరాల్లో వీటిని నిర్వహించడం వల్ల విద్యుత్తుకు, నీటికి కొరత ఏర్పడటమే కాకుండా, పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉందని ఇప్పటికే పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి సమస్యలేవీ లేకుండా, నగరాలపై ఒత్తిడి లేకుండా డేటా సెంటర్లను సముద్రంలో ఏర్పాటు చేసేందుకు అమెరికన్ కంపెనీ ‘నాటిలస్ డేటా టెక్నాలజీస్’ సహా పలు బడా కంపెనీలు, కొన్ని స్టార్టప్ కంపెనీలు కూడా సన్నాహాలు చేస్తున్నాయి. సముద్రంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం వల్ల సముద్ర తరంగాల ద్వారానే విద్యుత్తును పొందవచ్చని, సముద్ర జలాలను శుద్ధిచేసి డేటా సెంటర్ల నిర్వహణ కోసం వాడుకోవచ్చని భావిస్తున్నాయి. -
అదే నా ఐడెంటిటీ!
విలన్ పాత్రైనా సరే, తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల దృష్టి అంతా ఆమెపైనే! హీరోయిన్ ఇమేజ్ కంటే నటిగా గుర్తింపు ముఖ్యమని నమ్మే నటి వరలక్ష్మి శరత్కుమార్. కెరీర్, వ్యక్తిత్వం, ఇష్టాలు, జీవిత తత్త్వం గురించి ఆమె చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే!స్టార్ కిడ్ అయినా కష్టపడాల్సిందే!స్టార్ కిడ్ని కాబట్టి నాకు అన్నీ ఈజీగా వచ్చేశాయని చాలామంది అనుకుంటారు. కానీ మా కుటుంబం నన్ను రెడీమేడ్ పీఠంపై కూర్చోబెట్టలేదు. ముందు చదువు పూర్తి చేయాలని నాన్న చెప్పారు. అందుకే బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేసి, ఆ తర్వాతే కెమెరా ముందుకు వచ్చాను. నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవడానికి ఎన్నో ఏళ్లు కష్టపడాల్సి వచ్చింది.విలన్ గా ఉండటంలోనే కిక్!నెగటివ్, అథారిటేటివ్ పాత్రలు చేయడం మొదలుపెట్టినప్పుడు ‘నీ హీరోయిన్ ఇమేజ్ పాడైపోతుంది’ అని చాలామంది హెచ్చరించారు. కానీ నాకు అలాంటి పాత్రల్లోనే అసలైన చాలెంజ్ కనిపించింది. గ్రే షేడ్స్ ఉన్న పాత్రలు నటిగా నా సామర్థ్యాన్ని చూపించే అవకాశం ఇస్తాయి.నచ్చకపోతే చెప్పేస్తా!నేను చాలా విషయాల్లో ఓపెన్ గా మాట్లాడతాను. తప్పు అనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తాను. ఆ కారణంగా కొన్ని సినిమా అవకాశాలు కూడా కోల్పోయాను. కానీ నా ఆత్మగౌరవం, విలువల విషయంలో రాజీ పడలేను. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశాంతంగా ఉంటాను.గట్టిగా నవ్వుతా.. అదే నేను!నేను చాలా లౌడ్, చాలా ఎక్స్ప్రెసివ్! జోక్స్ వేయడం, నవ్వుకోవడం అంటే భలే ఇష్టం. హీరోయిన్లు అంటే చాలా సైలెంట్గా, సాఫ్ట్గా ఉండాలనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ నేను అలాంటిదాన్ని కాదు. నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను. నటన కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని నమ్ముతాను.ట్రోల్స్కి టైమ్ లేదు!ప్రజలు పూర్తి విషయం తెలియకుండానే కామెంట్స్ చేస్తుంటారు. నికోలాయ్ సచ్దేవ్తో నా వివాహం తర్వాత కూడా ఎన్నో కామెంట్స్ చూశాను. కానీ అందరికీ నచ్చేలా జీవించడం అసాధ్యం. కాబట్టి మన సంతోషం మీదే ఫోకస్ చేయాలి.నా నాన్ వెజ్ ప్రేమకు హద్దులే లేవు!మా ఇంట్లో అందరూ ఫుడ్ లవర్స్. నేను కూడా. పీతలు, చేపలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రెడ్ స్నాపర్ చేప నా ఫేవరెట్. బిర్యానీ, మండీ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను. అయితే ఒక ట్విస్ట్ ఉంది. నాకు స్పైసీ ఫుడ్ అస్సలు పడదు! ఎంత మంచి కబాబ్ అయినా తక్కువ మసాలాతోనే తినాలి.ప్రభాస్కి స్పెషల్ ఫ్యాన్ గర్ల్!ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం. ఆయన సింప్లిసిటీ మరింత ఆకట్టుకుంటుంది. ఇక నా జీవితంలో మొదటి హీరో మాత్రం మా నాన్న శరత్కుమారే. ఆయన క్రమశిక్షణ, అంకితభావం ఇప్పటికీ నాకు స్ఫూర్తి. -
శాంతి సయోధ్యల సంబరం
పురాతన సంస్కృతికి అద్దం పట్టే సెబీబా ఉత్సవాలకు అల్జీరియాలోని జానేట్ నగరం సన్నద్ధమవుతోంది. అల్జీరియా టూర్స్ పర్యవేక్షణలో జూన్ 20 నుంచి 27 వరకు వారం రోజులు సాగే ఈ ప్రత్యేక సాంస్కృతిక జాతర సరికొత్త అనుభూతిని పంచుతుంది. పరస్పర వైరం ఉన్న తెగల మధ్య కుదిరిన చరిత్రాత్మక సయోధ్యకు, శాంతి ఒప్పందానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవం యునెస్కో సాంస్కృతిక వారసత్వ వేడుకల జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. సహారా ఎడారి ప్రజల అస్తిత్వ రూపం సెబీబా వేడుకలు.మూడువేల ఏళ్ల కిందట స్థానిక తెగల మధ్య జరిగిన సుదీర్ఘమైన, భీకరమైన యుద్ధాల ముగింపునకు, ఇరు వర్గాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి ఒక సజీవ సాక్ష్యం ఈ ఉత్సవాలు. యుద్ధంపై శాంతి సాధించిన విజయమే ఇందులోని ప్రధాన సందేశం. అలాగే ఇక్కడి ఆచారాలు శక్తికి, సౌందర్యానికి మధ్య ఉన్న సమతుల్యతను ప్రతిబింబిస్తాయి. పురుషులు తరతరాల నాటి తువారెగ్ దుస్తులు, తలపాగాలు ధరించి, చేతుల్లో కత్తులు పట్టుకుని వీరత్వంతో కూడిన నృత్యాలు చేస్తారు. ఇవి కేవలం నృత్యాలు కావు, పూర్వపు తెగల మధ్య జరిగిన యుద్ధాలను తలపించే ప్రతీకాత్మక ప్రదర్శనలు. అలాగే మహిళలు ప్రత్యేకమైన లయతో కూడిన డప్పు చప్పుళ్లతో, గంభీరమైన గీతాలను ఆలపిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపుతారు. ఈ ఉత్సవం స్థానిక తువారెగ్ కళాకారులకు, చేతివృత్తుల వారికి పెద్ద ఉపాధి మార్గం కూడా! స్థానిక హస్తకళాకారులు తయారుచేసే కత్తులు, వెండి ఆభరణాలు, ప్రత్యేక దుస్తులు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పర్యాటకులు స్థానిక మార్కెట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. సహారా ఇసుక తిన్నెల మధ్య, ప్రాచీన రాతి శిల్పాల నీడలో, పూర్వీకుల సంస్కృతిని నేటికీ సజీవంగా ఉంచుతున్న తువారెగ్ పౌరుల ‘సెబీబా’ ఉత్సవం, మానవజాతికి ఒక అపురూపమైన సాంస్కృతిక కానుక. వారి ఆత్మగౌరవానికి, సామూహిక స్మృతికి ప్రతీక ఈ వేడుకలు.వారం రోజుల పర్యటన1. (జూన్ 20 – శనివారం): రాత్రి 9:55 గంటలకు అల్జీర్స్ రాజధాని నుంచి నేరుగా విమాన ప్రయాణం. అర్ధరాత్రి 0:10 గంటలకు జానేట్ చేరుకుంటారు. 2. (జూన్ 21 – ఆదివారం): ‘ఇహెరిర్ లోయ’ సందర్శన. ఎడారి ఓసిస్ నీటిలో ఈత కొట్టే అవకాశం. 3. (జూన్ 22 – సోమవారం): ఇథారెన్ పురాతన సంచార గ్రామం సందర్శన. 4. (జూన్ 23 – మంగళవారం): ఎస్సెండైలీన్ వ్యాలీ గుండా పాదయాత్ర, ఇసుక రాతి తోరణాల సందర్శన. రాత్రి ఎల్ మిహాన్ ప్రాంతంలో జరిగే ‘డౌఘియా’ రిహార్సల్ వీక్షణ.5. (జూన్ 24 – బుధవారం): ఇమెరౌడెన్ రాతి చిత్రాల పరిశీలన. రాత్రి జెలౌజ్ తెగ ‘తిమౌలావీన్’ యుద్ధ నృత్యాల రిహార్సల్స్ వీక్షణ.6. (జూన్ 25 – గురువారం): ముగింపు వేడుక – సెబీబా ఫెస్టివల్. తువారెగ్ సంస్కృతికి అద్దం పట్టే అద్భుత నృత్యాలు, ఆభరణాల ప్రదర్శన.7. (జూన్ 26 – శుక్రవారం): ఎర్గ్ అద్మెర్ ఇసుక దిబ్బల మధ్య 7,000 ఏళ్ల నాటి ‘ది వీపింగ్ కౌ’ రాతి శిల్పం వీక్షణ. అడాయిక్ రాతి అడవి, పురాతన కోటలు, జానేట్ మ్యూజియం సందర్శన.8. (జూన్ 27 – శనివారం): అర్ధరాత్రి దాటాక 2:15 గంటలకు జానేట్ నుంచి తిరుగు ప్రయాణం. ఉదయం 5:55 గంటలకు అల్జీర్స్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. -
స్నాక్ సెంటర్: నోరూరించే.. వెరైటీ వంటకాలు!
ప్రతిరోజూ ఒకేవిధంగా వంటకాలు తిని.. తిని ఇబ్బందిపడేదానికన్నా కొంచెం భిన్నంగా ఉండేలాగా ట్రైం చేద్దాం అనుకునేవారికి ఈ వెరైటీ వంటకాలు సరిగ్గా ఉపయోగపడుతాయి. అయితే ఇప్పుడే వాటిని ఇలా రెడీ చేయండి.బాంబే ఐస్ హల్వా..కావలసినవి:పాలు: ఒకటిన్నర కప్పు,పంచదార: కప్పు,కార్న్ ఫ్లోర్: 1/4 కప్పు,నెయ్యి: 1/4 కప్పు,ఆరెంజ్ ఫుడ్ కలర్: టీ స్పూన్,ఏలకుల పొడి: కొద్దిగా, బాదం ముక్కలు: టేబుల్ స్పూన్,పిస్తా ముక్కలు: టేబుల్ స్పూన్.తయారీ:ఒక పెద్ద కడాయిలో కప్పు పాలు, పంచదార, కార్న్ ఫ్లోర్, నెయ్యి వేసుకోండి.స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్లో ఉంచి ఉండలు కట్టకుండా గరిటెతో రౌండ్గా కలుపుతుండాలి.ఈ మిశ్రమం చిక్కబడి పేస్ట్లా మారిన తరువాత ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్తో పాటుగా నెయ్యి వేయండి.మంటను మీడియంలో ఉంచి బాగా కలపండి. ఆ తరువాత టీస్పూన్ ఏలకుల పొడి వేసి బాగా కలపండి.మిశ్రమం అంతా జిగటగా, మెరుస్తూ మారేంత వరకు కలపండి.ఒకవేళ అలా మెరవకపోతే మరికొద్దిగా నెయ్యి వేసి కలపండి.ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని, దానిపై ఒక గరిటెడు ఐస్ హల్వా మిశ్రమాన్ని వేసి, దీనిపై నెయ్యి రాసిన మరొక బటర్ పేపర్ షీట్ను ఉంచి చేతితో మెల్లగా నొక్కండి.ఆపై చపాతీ కర్ర సహాయంతో మీకు నచ్చిన మందంలో పరచండి. పైనున్న బటర్ పేపర్ను మెల్లగా తీసివేసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలను చల్లి 15 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచండి.హల్వా పూర్తిగా గట్టిపడిన తర్వాత, బటర్ పేపర్తో సహా ముక్కలుగా కట్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన బాంబే ఐస్ హల్వా సిద్ధం!మసాలా చీజ్ టోస్ట్..కావలసినవి:ఉల్లిపాయ, క్యాప్సికమ్,క్యారట్: కప్పు (సన్నగా తరిగినవి),కారం: 1/2 టీస్పూన్,మిరియాల పొడి: 1/2 టీస్పూన్,ధనియాల పొడి: 1/2 టీస్పూన్,ఉప్పు: రుచికి సరిపడా,బ్రెడ్ స్లైసెస్: 2,చీజ్: తగినంతతయారీ:ఒక గిన్నెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారట్ ముక్కలను తీసుకోండి.అందులో కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.ఈ కూరగాయల మిశ్రమాన్ని ముక్కలు కాస్త మెత్తబడే వరకు పాన్ పై లైట్గా వేయించి పక్కన పెట్టుకోండి.ఆ తర్వాత ఒక బ్రెడ్ ముక్కను తీసుకుని, ఒక వైపు మాత్రమే లైట్గా కాల్చండి. ఇప్పుడు బ్రెడ్ కాల్చిన వైపున మనం తయారుచేసి పెట్టుకున్న వెజిటబుల్ మసాలా మిశ్రమాన్ని సమానంగా పరచండి.ఆ మసాలా పైన తగినంత చీజ్ వేసి, దానిని కరగనివ్వండి.బ్రెడ్ కింద వైపు చక్కగా క్రిస్పీగా కాలిన తర్వాత, అలాగే పైన చీజ్ పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే వేడివేడి సువాసనలతో కూడిన మసాలా చీజ్ టోస్ట్ సిద్ధం.ఖట్టా మూంగ్..కావలసినవి:పచ్చ పెసలు: 2 కప్పులు (నానబెట్టినవి),పుల్లటి పెరుగు: కప్పు,శనగపిండి: 3 టేబుల్ స్పూన్లు,కారం: 2 టీస్పూన్లు,పసుపు: 2 టీస్పూన్లు,ధనియాల పొడి: 2 టీస్పూన్లు,జీలకర్ర: టీస్పూన్,ఆవాలు: టీస్పూన్,పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి),కరివేపాకు: 5–6 ఆకులు,అల్లం ముక్కలు (సన్నని తరుగు): 5–6,కొత్తిమీర: 1/2 కప్పు (సన్నగా తరిగినది),నూనె: సరిపడినంత, నీళ్లు.తయారీ:ముందుగా నానబెట్టిన పెసలను ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి.అందులో మూడు కప్పుల నీళ్లు పోసి, మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.పెసలు ఉడికేలోపు, ఒక గిన్నెలో శనగపిండి, పుల్లటి పెరుగు, కారం, పసుపు, ఒక కప్పు నీరు వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, మీడియం మంట మీద కొన్ని సెకన్ల పాటు వేయించండి.తాలింపు వేగాక, ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును పాన్లో వేసి, తాలింపు అంతా పప్పుకు పట్టేలా బాగా కలిపి.. రెండు నిమిషాల పాటు ఉడికించండి.ఆ తర్వాత, మనం సిద్ధం చేసి పెట్టుకున్న శనగపిండి–పెరుగు మిశ్రమాన్ని, ధనియాల పొడిని ఇందులో వేసి బాగా కలపండి.మంటను సిమ్లో పెట్టి 3–4 నిమిషాల పాటు ఉడకనిచ్చి, స్టవ్ ఆఫ్ చేయండి.చివరగా పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర, అల్లం ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుజరాతీ స్పెషల్ ఖట్టా మూంగ్ రెడీ! ఇది చపాతీలు, పూరీలు, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. -
ఇప్పుడు మీ డెస్క్పై, మీ మెడలో, మీ చేతిలోకే..
ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన టెక్నాలజీ ఇప్పుడు మీ డెస్క్పై, మీ మెడలో, మీ చేతిలోకి వచ్చేసింది. ఆశ్చర్యపరిచే ఫీచర్లతో, ఆకట్టుకునే డిజైన్లతో ఉన్న ఈ గాడ్జెట్స్ నిజంగానే ఫ్యూచర్ వైబ్స్ ఇస్తాయి!చేతికి కట్టుకునే స్పేస్ ల్యాబ్! మీ మణికట్టుపై టైమ్ మాత్రమే కాదు, ఒక చిన్న అంతరిక్ష ప్రయోగశాల కూడా ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ‘నాసా ఆర్టెమిస్ వాచ్ 2.0!’ చంద్రయాన్ కలలు కనే టెక్నాలజీ ప్రియుల కోసం రూపొందించిన ఈ స్మార్ట్ వాచ్ చూడటానికి స్టయిలిష్గా ఉంటుంది. ఇందులో ఉన్న యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, బ్లూటూత్ వంటి సెన్సర్లతో మీ రోజువారీ కదలికలను ట్రాక్ చేయవచ్చు. అయితే దీని అసలు ప్రత్యేకత వేరే! ఈ వాచ్ను మీకు నచ్చినట్టుగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కొత్త వాచ్ ఫేస్లు డిజైన్ చేయడం, చిన్న చిన్న ఆటలు తయారు చేయడం, మీ సొంత యాప్లను రూపొందించడం కూడా సాధ్యమే. టెక్నాలజీని సరదాగా నేర్చుకోవాలనుకునే పిల్లలకు, యువతకు ఇది ఒక మినీ లెర్నింగ్ ల్యాబ్లా పనిచేస్తుంది. ధర రూ. 10,700.మాట్లాడే బుజ్జి రోబో! కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఆఫీస్ టేబుల్పై కూర్చుని పని చేస్తున్నప్పుడు మీతో కబుర్లు చెప్పే ఓ చిన్న ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి ఫ్యూచరిస్టిక్ ఫన్ ను తీసుకొచ్చే గాడ్జెట్ ఇదే. ఏఐ వాయిస్ ఇంటరాక్షన్ కంపానియన్ రోబో! చూడటానికి చిన్న బొమ్మలా కనిపించినా, ఇందులో ఉన్న స్మార్ట్ వాయిస్ ఇంటరాక్షన్ ఫీచర్తో మీ మాటలకు స్పందిస్తూ సరదాగా ఇంటరాక్ట్ అవుతుంది. దీని చిన్న డిస్ప్లేలో కనిపించే క్యూట్ యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ వల్ల ఇది నిజంగానే ఎమోషన్స్ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు మాట్లాడితే ఇది రియాక్ట్ అవుతూ, టేబుల్పై కూర్చున్న చిన్న డిజిటల్ పెట్లా ఫీల్ ఇస్తుంది. మాగ్నెటిక్ మౌంట్కు సపోర్ట్ ఉండటంతో కార్ డ్యాష్బోర్డ్పై సులభంగా అమర్చుకోవచ్చు. ధర రూ. 18,000.మెడలోనే చిన్న ఏసీ, చిన్న హీటర్!వేçసవిలో ఎండలు మండిపోతుంటే ‘చల్లని గాలి తగిలితే బాగుండు!’ అనిపిస్తుందా? లేదా చలికాలంలో ‘కొంచెం వెచ్చదనం ఉంటే చాలు!’ అని కోరుకుంటున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ వేరబుల్ కూలింగ్–హీటింగ్ పరికరం!ఇది కేవలం ఒక గాడ్జెట్ కాదు, మీ వ్యక్తిగత ఉష్ణోగ్రత నియంత్రణ సాధనం. మెడకు వేసుకునే పట్టీతో దీనిని మెడకు లేదా ఛాతీ దగ్గర ధరించవచ్చు. అవసరాన్ని బట్టి ఇందులో ఉన్న మూడు చల్లదనం స్థాయులు, మూడు వెచ్చదనం స్థాయులు ఎంచుకుని క్షణాల్లో మీకు కావాల్సిన సౌకర్యాన్ని పొందవచ్చు. ఇంట్లో, ఆఫీస్లో, ప్రయాణాల్లో లేదా బయట తిరిగేటప్పుడు కూడా ఇది మీతో పాటు ఉంటుంది. చిన్న సైజులో ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. స్టీల్, సిలికాన్ తో తయారైన దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా సులువు. ధర రూ. 16,760. -
ది డివోర్స్
ఆరోజు వాట్సప్లో వచ్చిన ఆ ఉత్తరాన్ని చదివిన విపుల్ భార్య నివ్వెరపోయింది. అది విడాకులు కోరుతూ తన భర్త లాయర్ నుంచి వచ్చిన నోటీస్. కారణం ఇన్ కంపాటిబిలిటీ. ఆమె అహం దెబ్బతింది. తనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎలా ఆ నోటీస్ని పంపాడని ఆమె మథనపడసాగింది. అది ఆమెకి నమ్మశక్యంగా లేదు. తల్లికి మైనర్ సర్జరీ జరుగుతూంటే తను వారం క్రితం పుట్టింటికి వచ్చింది. ఆమె దాన్ని తన తండ్రికి ఫార్వర్డ్ చేసింది. పావుగంట తర్వాత ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కంగారుగా అడిగాడు. ‘‘ఏమిటిది బేబీ విచిత్రంగా?’’ ‘‘అవును. నాకూ చిత్రంగానే ఉంది.’’‘‘ఇన్ కంపాటిబిలిటీ అంటే ఏమిటో అతగాడికి ఫోన్ చేసి కనుక్కో.’’ ఆయన కోపంగా చెప్పాడు.‘‘నేను కనుక్కోను. ఇలాంటి విషయాల్లో ముందు నాతో సంప్రదించడం మర్యాద. అతను ఆ మర్యాదని నిలబెట్టుకోలేదు.’’ ఆమె కఠినంగా చెప్పింది. ‘‘నేను కనుక్కుంటాను. మీ మధ్య పోట్లాటేదైనా జరిగిందా?’’ ఆయన అడిగాడు.‘‘వచ్చే ముందు చిన్న పోట్లాట జరిగింది. ఇల్లు కట్టుకుంటానంటే నాతో చెప్పకుండా తన తమ్ముడికి ఐదు లక్షలు పంపాడు. నేను నెలకి ఎంత చొప్పున ఎంతకాలంలో తిరిగి ఇవ్వాలో షెడ్యూల్ కూడా పంపమని సలహా ఇచ్చాను. తన తమ్ముడికి అప్పు ఇవ్వలేదని, బహుమతి ఇచ్చానని చెప్పాడు. క్రితం నెలలోనే తల్లి పుట్టినరోజుకి ఏభై వేలు పెట్టి పట్టుచీర కొన్నాడు. నేను పదివేల చీర సరిపోదా అని అడిగాను.’’‘‘రేపు పిల్లలు పుడితే అతనికే జాగ్రత్త వస్తుంది.’’ ఆయన చెప్పాడు. ‘‘లేదు. లేదు. రాదు. ఆ మనిషికి తన వాళ్ళంటే ప్రేమ. ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ఇంత దాకా పాతిక లక్షల దాకా ఇచ్చి ఉంటాడు. ఇంకో పాతిక వేసుకుంటే మన ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేది. నెలకి రెండున్నర వేలైనా అద్దె వచ్చేది.’’‘‘ఫైనాన్స్ కాక ఈమధ్య ఇంకేమైనా పొరపొచ్చాలు ఉన్నాయా?’’ ‘‘లేవు. మా అత్తమామలు వచ్చి మా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. మా మామగారి డామినేషన్ భరించలేను. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి పూట ఏది వండాలి, ఇలా అన్నీ ఆయన శాసించినట్లే జరగాలి.’’ ‘‘అవును. పెళ్ళిలోనే అది గమనించాను.’’ అరగంట తర్వాత ఆయన కూతురికి ఫోన్ చేసి చెప్పాడు.‘‘మాట్లాడానమ్మా. కారణం ఇదని స్పష్టంగా చెప్పలేదు. ‘మోస్ట్ ఇన్కంపాటిబుల్ వైఫ్తో జీవించలేను’ అన్నాడు. ‘మా నాన్న కోతా కాఫీ పౌడర్ని కొనమంటే బ్రూక్బాండ్ కొన్నది లాంటి అన్నీ సిల్లీ కారణాలే. అతని మనసులో అసలు కారణం ఏదో ఉంది. అది దాస్తున్నాడు. అతను ఇంకెవరితోనైనా క్లోజ్గా ఉండటం నీకు తెలుసా?’’‘‘లేదు. నాకా అనుమానమే లేదు. అతను అలాంటివాడు కాదు. నేనంటే చాలా చాలా ప్రేమ నాన్నగారు.’’కూతురి కంఠంలోని దుఃఖాన్ని ఆయన పసిగట్టాడు.‘‘నేను వీకెండ్కి వచ్చి పర్సనల్గా మాట్లాడతానని చెప్పాను. ‘మాది ప్రేమ వివాహం. మీ ప్రమేయంతో జరగలేదు. కాబట్టి ఇప్పుడు మీ ప్రమేయం వద్దు’ అన్నాడు. రాజీమార్గాలన్నీ ఖండించాడు. నాకు అంతా అయోమయంగా ఉంది.’’ ఆయన బాధగా చెప్పాడు. ఆయన భార్య మాత్రం తొణకలేదు. కూతురికి ధైర్యం చెప్తూ చెప్పింది.‘‘ఈరోజుల్లో విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకోవడం చాలా మామూలు. మీకు పిల్లల కూడా లేరు. కాబట్టి మళ్ళీ పెళ్ళి తేలిక. ఈ కాలం పిల్లలు జీవితాన్ని వృథా చేసుకోవడం లేదు. నీకు వచ్చే జీతం తక్కువేం కాదు. తన మీద నువ్వు ఆధారపడి లేవు. ’’బయటకి చెప్పకపోయినా ఆవిడ మనసులో బాధగానే ఉంది.‘‘ఏం జవాబు చెప్పావు? లాయర్ నోటీస్ వస్తే మనం జవాబు ఇవ్వకపోతే ఒప్పుకున్నట్లు అవుతుంది అని విన్నాను.’’ ఆవిడ అడిగింది. ‘‘అతను కచ్చితంగా డైవర్స్ కోరుకుంటే నేను అతన్ని పట్టుకుని వేలాడను. మళ్ళీ లాయర్ ఖర్చు కూడా ఎందుకు? కామ్గా ఉందాం. ఇదే ఫైనల్ డెసిషన్.’’తల్లిదండ్రులకి కూతురు సంగతి తెలుసు కాబట్టి ఆమె మనసు మార్చటానికి గట్టి ప్రయత్నాలు చేయలేదు. ఆమె విపుల్ నుంచి వ్యక్తిగత మెసేజ్ కోసం ఎదురు చూసింది. కాని రాలేదు. రెండు వారాల తర్వాత కోర్ట్ నించి విడాకుల కేసుకి నోటీస్ వచ్చింది. అప్పటికే అందుకు సిద్ధపడ్డ ఆమె విచారించలేదు. వరసగా మూడు వాయిదాలకి సమన్ వచ్చినా ఆమె కోర్ట్కి హాజరు కాలేదు.∙∙ విపుల్ నుంచి ఆమెకి ఓ రోజు మెసేజ్ వచ్చింది. ‘ఇప్పుడే విడాకులు మంజూరయ్యాయి. ఎందుకో నీకు చెప్పాలి. ఐ లవ్ యు. అందులో మార్పు లేదు. మరి ఈ విడాకులు దేనికి? నేను మరణించాక నా ఆస్తి, పి.ఎఫ్. బెనిఫిట్స్ నా తల్లితండ్రులకి అందడానికి. భార్యగా నువ్వు హక్కుగా అవి వాళ్ళకి వెళ్ళకుండా కోర్ట్కి ఎక్కుతావని నాకు తెలుసు. వాళ్ళు ఆస్తిని పోగొట్టుకుంటారు తప్ప నీతో కోర్ట్లో ఫైట్ చేయరు. దాన్ని నివారించడానికి విడాకులని ఎన్నుకున్నాను. నీకు ఆర్థికంగా ఏ లోటూ లేదు. నువ్వు నామీద ఆధారపడిలేవు. నీ ఉద్యోగం, నీ ఆస్తి నీకు ఉన్నాయి. ఆరు నెలల తర్వాత నేను నీకు, నా తల్లిదండ్రులకి, అసలు ప్రపంచానికే కనిపించను. ఫోర్త్ స్టేజిలోని నా కేన్సర్ ఐదారు నెలలు మించి నన్ను బతకనివ్వదని డాక్టర్ చెప్పాడు. గెట్ మేరీడ్ డార్లింగ్. ఐ లవ్ యు అండ్ గుడ్లక్.’’ మల్లాది వెంకట కృష్ణమూర్తి(చదవండి: ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు) -
మా బాబుకి రెండేళ్లు! ఎంత పిలిచినా.. చూడటం లేదు..
మా బాబుకు రెండేళ్లు. పేరు పిలిచినా చాలాసార్లు తిరిగి చూడడం లేదు. సరిగ్గా ఆడుకోవడం లేదు. మాటలు కూడా సరిగా రావడం లేదు. ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటాడు. ఇవన్నీ ఆటిజం లక్షణాలా? నాకు చాలా ఆందోళనగా ఉంది. – రాము, ఒంగోలు.ముందుగా మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఆటిజం అనేది తల్లిదండ్రుల తప్పు వల్ల వచ్చే సమస్య కాదు. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక పరిస్థితి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ‘ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి ఫలితం’ అనేది మాత్రం చాలా నిజం. సాధారణంగా ఆటిజం లక్షణాలు 9 నుంచి 12 నెలల వయస్సు నుంచే కొద్దికొద్దిగా కనిపించడం ప్రారంభమవుతుంది.అయితే చాలామంది పిల్లల్లో 18 నుంచి 24 నెలల మధ్య స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. గర్భధారణ నుంచి రెండేళ్ల వయస్సు వరకు ఉండే మొదటి వెయ్యి రోజులు మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైన సమయం. ఈ దశలోనే ముందస్తు చికిత్స లేదా థెరపీ ప్రారంభిస్తే పిల్లల్లో భాష, సామాజిక నైపుణ్యాలు, నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు కొన్ని ప్రారంభ సంకేతాలను జాగ్రత్తగా గమనించాలి. చిన్నపిల్లలలో ఆటిజం లేదా అభివృద్ధి ఆలస్యాలను ముందుగానే గుర్తించడానికి ఉపయోగపడే తొమ్మిది సింపుల్ స్క్రీనింగ్ ప్రశ్నలు ఉన్నాయి. అవే ఇవీ.. 1. పేరు పిలిచినప్పుడు తిరిగి చూస్తాడా?2. కంటి చూపు బాగా కలుపుతాడా?3. నవ్వు లేదా ముఖభావాలకు స్పందిస్తాడా?4. కావాల్సిన వస్తువును చూపించి అడుగుతాడా?5. చేతితో బైబై లేదా ఇతర సంకేతాలు చేస్తాడా?6. ఇతర పిల్లలతో లేదా పెద్దలతో కలవాలనే ఆసక్తి ఉందా?7. మాటలు లేదా శబ్దాల అభివృద్ధి వయస్సుకు తగ్గట్టుగా ఉందా?8. ఒకే పని లేదా అలవాటు పదేపదే చేస్తూ ఉంటాడా?9. నేర్చుకున్న మాటలు లేదా సామాజిక నైపుణ్యాలు తగ్గిపోయాయా?ఈ ప్రశ్నల్లో ఏదైనా ఆందోళన కలిగిస్తే ‘ఇంకొంచెం పెద్దవాడైతే సర్దుకుంటాడు’ అని ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని లేదా అభివృద్ధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.ఆటిజంను పూర్తిగా నివారించే కచ్చితమైన పద్ధతి లేదు. ఎందుకంటే దీనికి ఒకే ఒక్క కారణం ఉండదు. అయితే పిల్లల మెదడు ఆరోగ్యకర అభివృద్ధికి కొన్ని విషయాలు చాలా ఉపయోగపడతాయి. గర్భధారణ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవడం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, అయోడిన్ వంటి పోషకాలు సరిపడా తీసుకోవడం, రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే పిల్లలకు టీకాలు సమయానికి వేయించాలి. టీకాలు ఆటిజం కలిగిస్తాయనేది పూర్తిగా అపోహ మాత్రమే. చిన్నపిల్లల్లో స్క్రీన్ టైమ్ కూడా తగ్గించాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడటం, కథలు చెప్పడం, పాటలు పాడటం, ఆటలు ఆడించడం వల్ల మెదడు అభివృద్ధికి చాలా మంచిది. ఆటిజంను ముందుగానే గుర్తించడం అంటే పిల్లలకు ఒక ‘లేబుల్’ వేయడం కాదు, వాళ్ల భవిష్యత్తుకు సరైన సహాయం అందించడానికి అవకాశం కల్పించడం. తల్లిదండ్రుల గమనికే పిల్లల మొదటి రక్షణ. - డా‘‘ కె. పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్ , పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
అపకారికి ఉపకారం: మర్యాదగా తలుపు తీస్తావా లేదా?
శేషాచలం అడవుల్లో ఒక ఋషి ఎంతోకాలంగా ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్నాడు. ఆయన ఆ అడవుల్లో వుండే ఆదివాసీలకు మూలికా వైద్యం చేస్తూ, వాళ్లకు, వాళ్ళ పిల్లలకు పురాణాలు, నీతి కథలు చెబుతూ అందరికీ తలలో నాలుకలా వుండేవాడు. ఒక రోజు రాత్రి ఎవరో ఆశ్రమం తలుపు దబదబ బాదుతూ వుంటే నిద్రాభంగం అయింది ఋషికి.‘‘ఎవరు నాయనా వచ్చింది? ఈ సమయంలో పరాయి మనుషులకు ఆశ్రమంలోకి ప్రవేశం లేదు!’’ అన్నాడు ఋషి లేచి కూర్చుంటూ. ‘‘ముందు తలుపు తీయరా ముసలాడా! నేను గజదొంగ గంగులుని!’’ అన్న భీకరమైన మాటలు వినబడ్డాయి.‘‘నువ్వు దొంగవైనా, జమీందారువైనా, ఈ సమయంలో ఆశ్రమంలోకి రాకూడదు నాయనా! అది ఆశ్రమ నియమం.’’ అని సౌమ్యంగా అన్నాడు ఋషి.‘‘నువ్వు తలుపు తీయకపోతే నేను తలుపు బద్దలు కొట్టి వస్తాను. మర్యాదగా తలుపు తీస్తావా లేదా? నువ్వు మంచి మాటలతో తలుపు తీసేలా లేవు!’’ అంటూ, తలుపు బద్దలు కొట్టడానికి పెద్ద రాయి కోసం వెతుకుతూ, దబ్బుమంటూ ఒక గోతిలో పడి పోయాడు గంగులు. గొయ్యి లోతుగా వుండటంతో వాడికి నడుం విరిగినంత పని అయింది. ‘‘చచ్చానురోయ్, దేవుడా!’’ అంటూ బాధగా అరిచాడు గంగులు.తక్షణం తలుపు తీసుకుని బయటకు వచ్చాడు ఋషి. ఆయన గోతిలో మూలుగుతున్న గంగులును చూసి, ‘‘ఎంత పని జరిగింది నాయనా! ఆశ్రమం వెనక వైపు వున్న బావి ఎండిపోవడంతో, కొందరు చెంచులు ముందు వైపు బావి తవ్వుతున్నారు. చీకట్లో నువ్వు కాలు జారి, బావిలో పడి నట్లున్నావు!’’ అంటూ ఋషి ఆశ్రమంలోకి వెళ్లి ఒక పెద్ద తాడు తీసుకు వచ్చాడు. ఆ తాడు సహాయంతో గంగులుని అతి కష్టం మీద పైకి లాగాడు ఋషి.తరువాత నడవలేకపోతున్న గంగులుని చేయి పట్టుకుని జాగ్రత్తగా ఆశ్రమంలోకి తీసుకు వెళ్ళాడు. గంగులు గాయాలకు పసరు మందు రాసి కట్టు కట్టాడు. ఒక లోటాలో ఆవు పాలు తీసుకు వచ్చి, గంగులు చేత తాగించాడు.అప్పటి దాకా ఋషి చేస్తున్న పనులన్నీ విభ్రాంతిగా చూస్తున్న గంగులు, ‘‘ఈరోజు నాకు మహోపకారం చేశారు. మునపటి నా ప్రవర్తన మీద మీకు కోపం లేదా స్వామి?’’ అని అడిగాడు గంగులు.ఋషి నవ్వి, ‘‘ఎవరి ధర్మానికి తగినట్లుగా వారు ప్రవర్తిస్తారు. నువ్వు దొంగలా బెదిరించావు. నేనొక ఋషిలా నీకు సేవ చేశాను అంతే!’’ అన్నాడు.‘‘ఈ సమయంలో ఎవరికీ ఆశ్రమ ప్రవేశం లేదని చెప్పారు కదా! మరి మీరు స్వయంగా నన్ను లోపలికి ఎలా తీసుకువచ్చారు?’’ అని అడిగాడు గంగులు.‘‘ఆపదలో వున్న తోటి మనిషిని కాపాడటానికి మించిన ధర్మం ఏం వుంది? అది సరే కానీ నువ్వు ఆశ్రమం అంతా వెతికినా వన మూలికలు తప్ప మరేమీ దొరకవు’’ అన్నాడు ఋషి.ఆ మాటలకు గంగులు సిగ్గు పడి, ‘‘నా అవివేకపు ప్రవర్తనకు క్షమించండి స్వామి’’ అన్నాడు చేతులు జోడించి.గంగులుకి ఇంకా పెళ్లి కాలేదని తెలుసుకుని, ‘‘నీ కాబోయే భార్య ఒక దొంగకు భార్యగా, పుట్టబోయే పిల్లలు దొంగకు పుట్టిన పిల్లలుగా వుండటం నీకు గాని, నీ కుటుంబానికి గాని గౌరవంగా వుంటుందా చెప్పు! దొంగ అని తెలిస్తే చాలు, దారిన పోయేవాడు కూడా నాలుగు పిడిగుద్దులు గుద్ది, మొహం మీద వుమ్మేసి పోతాడు! డబ్బు సంపాదించడానికి ఇంత నీచమైన పని చేయాలా, ఆలోచించుకో!’’ అన్నాడు ఋషి.ఆ మాటలకు గంగులు తలదించుకుని మౌనంగా వుండి పోయాడు.‘‘చీకటి ఎంత గాఢంగా వున్నా చిరు దీపం తో దాన్ని పారదొలొచ్చు! అలాగే మనిషి మనసు ఎంత కలుషితమైపోయి వున్నా ఒక మంచి మాటతో ఆ మలినాన్ని కడిగి వేయవచ్చు! నీ జీవితం కొత్త మలుపు తిరగడానికి దొంగగా ఈ ఆశ్రమానికి వచ్చిన నువ్వు, దొరలా ఇక్కడి నుంచి వెళతావో, లేక పాత దారిలోనే నడుస్తావో నీ ఇష్టం!’’ అన్నాడు ఋషి.‘‘లేదు స్వామి, నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఇక జన్మలో దొంగతనం అనేది మరచి పోయి, కష్టపడి గౌరవంగా బ్రతుకుతాను’’ అంటూ ఋషికి నమస్కరించి ఆశ్రమం నుంచి బయటకు నడిచాడు గంగులు.హితవచనం.. అజ్ఞానికి, నమ్మకంలేనివాడికి, అనుమానించేవాడికి నాశనం తప్పదు వీళ్లలో అనుమానించేవాడికి ఇహపరాలలో సుఖం ఎక్కడా ఉండదు. - మాచిరాజు కామేశ్వర రావు -
అవును! దివి నుంచి దివ్యౌషధాలు రాబోతున్నాయి!
మనకు జ్వరం వచ్చినా, జలుబు చేసినా మెడికల్ షాప్కి వెళ్లి టాబ్లెట్స్ కొనుక్కుంటాం. ఈ మందులన్నీ భూమి మీద ఉండే ఫ్యాక్టరీలలో తయారవుతాయని మనకు తెలుసు. కానీ, భవిష్యత్తులో మనం వేసుకునే ప్రాణాధార మందులు ‘అంతరిక్షం’ నుండి రాబోతున్నాయి!అవును! సైన్స్, టెక్నాలజీల ప్రపంచంలో ఇప్పుడు ఒక సరికొత్త విప్లవం రానుంది. రాకెట్లను అంతరిక్షంలోకి పంపే ప్రైవేటు కంపెనీలు, ఇప్పుడు అక్కడే మందుల ఫ్యాక్టరీలను కూడా పెట్టడానికి ప్రణాళికలు వేస్తున్నాయి. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి వల్ల ఉత్పత్తి చెయ్యటానికి సాధ్యం కాని కొన్ని శక్తిమంతమైన మందులను అంతరిక్షంలో ఉండే శూన్య వాతావరణంలో చాలా సులభంగా తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు! వార్దా స్పేస్ ఇండస్ట్రీస్ అనే ఒక స్టార్టప్ కంపెనీ అయితే ఏకంగా అంతరిక్షంలోనే ఒక ల్యాబ్ని ఏర్పాటు చేసి ప్రయోగాలు మొదలుపెట్టేసింది. వ్యోమగాముల సహాయం కూడా లేకుండా, కేవలం కంప్యూటర్ల ద్వారా అంతరిక్షంలో మందులు తయారు చేసి, వాటిని తిరిగి భూమి మీదకు భద్రంగా తీసుకొచ్చే ఈ సరికొత్త టెక్నాలజీ విశేషాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి.అణువుల్లోనే అసలు కీలకంవ్యోమనౌకలు పరిభ్రమించే భూ కక్ష్యలో మందులపై ప్రయోగాలు చేయడంతో పాటు, కొత్త ఔషధాలను తయారు చేయడం కోసం వార్దా స్పేస్ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా నిజరూపం దాల్చుతున్నాయి. అందులో కనుక వారు సఫలమైతే, కొత్త మందుల తయారీలో ఇదొక విప్లవాత్మక అడుగు అవుతుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రంగా సాగే సరికొత్త ఉత్పత్తి రంగానికి ఇది నాంది పలుకుతుంది. అరుదైన శ్వాసకోశ వ్యాధులకు చికిత్సలు అందించడంలో, అవయవ మార్పిడి రంగంలో పేర్గాంచిన ‘యునైటెడ్ థెరప్యూటిక్స్’ అనే బయోటెక్ కంపెనీతో తాము చేతులు కలిపినట్లు వార్దా సంస్థ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. లాస్ ఏంజెలెస్ కౌంటీకి చెందిన ‘వార్దా’ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా అంతరిక్షంలోకి చిన్న ‘ప్రయోగ పరికరాల పెట్టెలను’ (పేలోడ్స్) పంపుతోంది. కేవలం అంతరిక్షంలోని గురుత్వాకర్షణ లేని స్థితిలో మాత్రమే చేయగల కొన్ని ఆటోమేటెడ్ ప్రయోగాల సాంకేతికతను అభివృద్ధి చేయడం కోసం వార్దా పరిశోధకులు ఈ పని చేస్తున్నారు. ‘ఆటోమేటెడ్’ అంటే కంప్యూటర్లు, రోబోలు లేదా ముందే సెట్ చేసి పెట్టిన మిషన్ల ద్వారా వాటికవే పనిచేయటం! యాంటీబయాటిక్స్ నుండి కార్టికోస్టెరాయిడ్స్ వరకు మనం వాడే రకరకాల మందులకు మూలాధారమైన కొన్ని రకాల చిన్న అణువులను మార్చటం కూడా ప్రయోగాలలో భాగంగా ఉన్నాయి.‘‘ఆశ్చర్యకరంగా, ఇలాంటి చిన్న అణువుల ప్రయోగాలకు అంతరిక్షం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అంతరిక్షంలో వీటితో సరికొత్త స్ఫటిక విత్తనాలను (క్రిస్టల్ సీడ్స్) తయారు చేసి, వాటిని తిరిగి భూమిపైకి తీసుకురావచ్చు’’ అని వార్దా సంస్థ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మైకేల్ రీలీ అంటున్నారు.సెలైన్కు బదులు ‘షాట్స్’!యునైటెడ్ థెరప్యూటిక్స్ సంస్థ ప్రాథమికంగా తన చిన్న అణువుల మందులను వార్దా సాంకేతికత ద్వారా అంతరిక్షంలో పరీక్షించబోతోంది. అయితే భవిష్యత్తులో ఈ సాంకేతికత కేవలం ఆ కంపెనీ మందులకే పరిమితం కాకుండా, ‘మోనోక్లోనల్ యాంటీబాడీస్’ వంటి ఇతర బయోటెక్నాలజీ మందులకు కూడా ఉపయోగపడుతుందని ఆయన నమ్ముతున్నారు. దీనివల్ల ప్రస్తుతం హాస్పిటల్లో నరాల ద్వారా సెలైన్ బాటిల్తో ఇచ్చే ఇంజెక్షన్లను, భవిష్యత్తులో చర్మం కింద సులభంగా ఇచ్చే చిన్న సూదులు (సబ్క్యుటేనియస్ షాట్స్) గా మార్చవచ్చు.భూమిపై ఏమాత్రం సాధ్యం కాని పరిస్థితులలో, అంతరిక్ష వాతావరణాన్ని ఉపయోగించుకుని ఔషధాలకు అవసరమైన స్పటికాలను తయారు చేయడమే వార్దా కంపెనీ ముఖ్య ఉద్దేశం. ‘‘అంతరిక్షంలో మనం భూమి కంటే పెద్దవిగా, ఎటువంటి లోపాలు లేనివిగా, ఒకే పరిమాణంలో ఉండే స్ఫటికాలను తయారు చేయవచ్చు’’ అని యూఎస్లోని బట్లర్ యూనివర్సిటీ రసాయన శాస్త్రవేత్త యాన్ విల్సన్ చెబుతున్నారు. ఆమె గతంలో అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్) కోసం ప్రయోగాలు రూపొందించారు.అంతరిక్షంలో ప్రత్యేకమైన భౌతిక నిర్మాణాలు గల స్పటికాలను సృష్టించవచ్చని యాన్ నిర్థారించారు. ‘‘ఇటువంటి ప్రయోగాల ద్వారా అత్యంత విలువైన గుణాలు కలిగిన మందులను తయారు చేయటం నిస్సందేహంగా సాధ్యమౌతుంది. ఉదాహరణకు, ఒక మందును శరీరంలో త్వరగా కరిగేలా చేయడం ద్వారా, రోగి తక్కువ డోసులు వేసుకుంటే సరిపోయేలా చేయవచ్చు. దీనివల్ల మందుల ఖర్చు కూడా బాగా తగ్గుతుంది’’ అని విల్సన్ వివరించారు.‘పెంటగాన్’ సహకారం!అంతరిక్ష ప్రయోగాలకు అయ్యే ఖర్చులను తగ్గించుకోవడానికి వార్దా సంస్థ కేవలం మందుల ప్రయోగాలే కాకుండా, అమెరికా రక్షణ శాఖకు (పెంటగాన్) సంబంధించిన కొన్ని రక్షణ ప్రయోగాల పరికరాలను కూడా వారి ఆర్థిక సహాయంతో అంతరిక్షానికి తీసుకెళుతున్నట్లు వార్దా చీఫ్ రీలీ వెల్లడించారు. ఎలాన్ మస్క్ ‘స్పేస్–ఎక్స్’ సంస్థ తయారు చేసిన ‘మళ్లీ మళ్లీ వాడగలిగే రాకెట్ల’ (రీయూజబుల్ రాకెట్ల)వల్ల గత పదేళ్లలో అంతరిక్షంలోకి వస్తువులను పంపే ఖర్చు తగ్గినప్పటికీ, అది ఇప్పటికీ చాలా ఖరీదైన వ్యవహారమే. అందుకే వార్దా, ఇతర అంతరిక్ష కంపెనీలు నిరంతరం పెంటగాన్ వంటి కొత్త కస్టమర్ల కోసం వెతుకుతూనే ఉంటాయి. నిజానికి వార్దా కంటే కూడా ‘అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ’ను తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ఫార్మా రంగమే అత్యంత ఆసక్తిగా ఉంది. ‘‘ఎందుకంటే మందుల మార్కెట్ చాలా పెద్దది. ఇక మందుల తయారీకి అవసరమయ్యే ముఖ్యమైన రసాయన పదార్థాల బరువు చాలా తక్కువగా ఉంటుంది’’ అని ప్రైవేట్ అంతరిక్ష రంగాన్ని పరిశోధించే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధకుడు మాథ్యూ వీంజియర్ల్ అంటారు.త్వరలో కొత్త ఐ.ఎస్.ఎస్.లుచాలా ఏళ్లుగా శాస్త్రవేత్తలు భూకక్ష్యలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, చైనాకు చెందిన ‘తియాంగాంగ్’ పరిశోధనా కేంద్రాలకు తమ ప్రయోగాల పరికరాలను పంపుతున్నారు. కానీ, వ్యోమగాముల సహాయం అవసరం లేకుండా, ఆటోమేటిక్గా అంతరిక్షంలో ప్రయోగాలు జరిపించే సామర్థ్యం ప్రస్తుతం కేవలం వార్దా, స్పేస్–ఎక్స్ కంపెనీలకు మాత్రమే ఉందని రీలీ తెలిపారు.ఇక 2030లో కాల పరిమితి తీరబోతున్న ఐ.ఎస్.ఎస్. స్థానంలో సరికొత్త ప్రైవేట్ అంతరిక్ష కేంద్రాలు రాబోతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్నది కమర్షియల్ స్పేస్ స్టేషన్ల యుగం కాబట్టి మరిన్ని కొత్త టెక్నాలజీలు రావచ్చు. ఉదాహరణకు, ‘స్పేస్ టాంగో’, ‘వాయేజర్ టెక్నాలజీస్’ వంటి కంపెనీలు అంతరిక్షంలో ప్రయోగాలు చేసుకోవడానికి ప్లగ్–అండ్–ప్లే (సులభంగా వాడుకోగలిగే) సేవలను ఇప్పటికే అందిస్తున్నాయి. వాయేజర్ టెక్నాలజీస్ సంస్థ ‘స్టార్లాబ్’ పేరుతో ఒక సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే పనిలో ఉంది. ఈ కొత్త ప్రాజెక్టులన్నీ ఫార్మా రంగాన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందుతున్నాయని వీంజియర్ల్ తెలిపారు. మరోవైపు వార్దా సంస్థ కూడా మరిన్ని కొత్త భాగస్వామ్యాల కోసం, అలాగే ప్రయోగాల వేగాన్ని పెంచడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం మూడు నెలలకు ఒకసారి చేసే ప్రయోగాలను, భవిష్యత్తులో రెండు నెలలకు ఒకసారి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.కదిలే స్పేస్ ఫ్యాక్టరీవార్దా సంస్థ తను రూపకల్పన చేసిన అంతరిక్ష మందుల ల్యాబ్కు ‘వినెబాగో’ అని నామకరణం చేసింది. ఇది దాదాపు 300 కిలోగ్రాముల బరువున్న ఒక శాటిలైట్. రాకెట్ ద్వారా దీనిని అంతరిక్ష కక్ష్యలోకి చేరిన తర్వాత, ఈ వినెబాగో తన సొంత ఇంధన ఇంజిన్ సహాయంతో సరైన దిశలోకి మారుతుంది. ఈ శాటిలైట్ లోపల ప్రయోగాలు చేయడానికి ఒక చిన్న క్యాప్సూల్ (పెట్టె వంటి నిర్మాణం) ఉంటుంది. కాగా, ‘వినెబాగో’ అనే మాటను వార్దా, అమెరికాలో ప్రసిద్ధి చెందిన ‘వినెబోగో మోటార్హోమ్స్’ అనే పేరు నుండి స్వీకరించింది. వినెబాగో మోటార్హోమ్స్ అనేవి ప్రయాణించే ఇళ్లలాగే అన్ని వసతులను కలిగి ఉంటాయి. వార్దా కూడా ‘కదిలే స్పేస్ ఫ్యాక్టరీ’ అనే అర్థంలో వినెబాగో పేరును తన స్పేస్ ల్యాబ్కు పెట్టుకుంది. ఆ ల్యాబ్లో ప్రయోగాలు పూర్తయిన తర్వాత, ఆ క్యాప్సూల్ గంటకు సుమారు 18,000 మైళ్ల వేగంతో తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. చివరకు పారాషూట్ సహాయంతో ఆస్ట్రేలియాలోని నిర్జన ప్రాంతంలో ల్యాండ్ అవుతుంది. ఇంతకు మించి, మరే వివరాలూ వార్దా ఇప్పటికైతే వెల్లడించలేదు.2024లో ఈ కంపెనీ తయారుచేసిన మొదటి నమూనా క్యాప్సూల్ను అమెరికాలోని ఉటా ఎడారిలో దించాలని ప్లాన్ చేశారు. కానీ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మొదట్లో అనుమతి నిరాకరించడం వల్ల అది భూమికి తిరిగి రావడం ఆలస్యమైంది. ఈసారి అలా జరగకుండా ఉండేందుకు ఆస్ట్రేలియాలో ల్యాండ్ చేస్తున్నారు.గేమ్ ఆఫ్ ఛాన్స్?! అంతరిక్షంలో మందుల తయారీకి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని అని న్యూజెర్సీలోని రోవాన్ యూనివర్సిటీకి చెందిన కెమికల్ ఇంజనీర్ గెరార్డ్ కాపెల్లాడెస్ అంటున్నారు. ఆయన చెబుతున్న దానిని బట్టి ఈ ప్రయోగాలలో కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఉన్నాయని అర్థమౌతోంది.మొదటిది, పరిమాణం సమస్య. అంతరిక్షంలో పెంచిన స్పటికాలను విత్తనాలుగా ఉపయోగించి, వాటి సహాయంతో భూమిపై పెద్ద ఎత్తున మందులను తయారు చేయడానికి పరిశోధకులు ప్రయత్నించాలి. లేదా ఫార్మా రంగం వెలుపల ఉండే ఇతర అత్యంత విలువైన రంగాల కోసం ఒకే ఒక పరిపూర్ణమైన స్ఫటికాన్ని వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి. ఇది ఎందుకు సవాలు అవుతుందంటే, అంతరిక్షంలోకి భారీ ఫ్యాక్టరీ సామగ్రిని పంపలేం. రాకెట్లలో చాలా తక్కువ బరువులను, చిన్న పెట్టెలను మాత్రమే పంపగలం. ల్యాబులో గ్రాముల లెక్కన మందులు తయారు చేయటం తేలికే. కానీ ప్రపంచంలో ఉన్న రోగులందరికీ సరిపడా కిలోలు, లేదా టన్నుల కొద్దీ మందులు అంతరిక్షంలో తయారు చేయటం ప్రస్తుతానికైతే కష్టం.రెండవది, ప్రయోగం జరిగే వాతావరణాన్ని మన అధీనంలో ఉంచుకోవడం చాలా కష్టం. తక్కువ ఖర్చుతో, అనుకున్న సమయానికి కచ్చితమైన స్ఫటిక నిర్మాణాన్ని సాధిస్తామని గ్యారంటీ ఇవ్వడం చాలా కష్టం. ఈ ప్రయోగాలను ఆయన ఒక ‘గేమ్ ఆఫ్ ఛాన్స్’గా అభివర్ణించారు. అంటే అంతా అదృష్టంపై ఆధారపడి ఉందని! ‘‘ఒకే రకమైన వాతావరణం ఉన్నప్పటికీ, కొన్నిసార్లు స్ఫటికం ఏర్పడటానికి కేవలం నిమిషాల సమయం పడుతుంది, మరికొన్నిసార్లు వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు’’ అని గెరార్డ్ అంటారు. అయితే, భవిష్యత్తులో దీని ఖర్చులు తగ్గుతాయని, ఈ ప్రయోగాలను కొనసాగించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.ఫార్మారంగం నక్కను తొక్కినట్లే!వార్దా, యునైటెడ్ థెరప్యూటిక్స్ సంస్థల భాగస్వామ్యం విజయవంతమై, ఇదొక మంచి ఉదాహరణగా నిలవాలని వీంజియర్ల్ ఆశిస్తున్నారు. ఇది గనుక సఫలమైతే, ఒక డోమినో ఎఫెక్ట్ (ఒకదాని వెనుక ఒకటిగా జరిగే మార్పు)ను సృష్టిస్తుంది. అంటే, దీనిని చూసి భవిష్యత్తులో మరిన్ని ఫార్మా కంపెనీలు అంతరిక్ష సంస్థలతో జతకడతాయి. ‘‘ఈ భాగస్వామ్యం ద్వారా మార్కెట్లో సూపర్ హిట్ అయ్యే ఒకటి రెండు మందులు గనుక తయారైతే, అది అంతరిక్షంలో పెద్ద ఎత్తున లాభసాటి వ్యాపారాలు చేయడానికి ఫార్మా రంగానికి ఒక అద్భుతమైన బాటలు వేస్తుంది’’ అని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.వీంజియర్ల్ ఆశాభావాన్ని బట్టి భూమిపై నయం చేయలేని ఎన్నో రోగాలకు అంతరిక్షం వేదికగా తక్కువ ఖర్చుతో కూడిన, మరింత శక్తిమంతమైన మందులు అందుబాటులోకి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది. - సాక్షి స్పెషల్ డెస్క్ -
తల్లిదండ్రుల మధ్య వివాదం.. చిన్నారికి పేరు పెట్టిన కోర్టు!
తల్లిదండ్రుల మధ్య వివాదం ఓ చిన్నారికి ‘పేరు’ సంకటాన్ని తీసుకొచ్చింది. తల్లిదండ్రులిద్దరూ చెరో పేరూ చెప్పడంతో ఏ పేరూ ఖరారు కాలేదు. తల్లిదండ్రులిద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని రిజిస్ట్రార్ చెప్పడం వివాదానికి కారణమైంది. చివరికి ఆ చిన్నారి తల్లి కోర్టును ఆశ్రయించింది. ఆ కుటుంబ సమస్యకు పరిష్కారమే కాదు.. ‘పేరెంట్’ అనే పదానికి ఉన్నత న్యాయస్థానం అర్థం చెప్పింది.కేరళకు చెందిన సంగీత, బాలగంగాధరన్ నాయర్ దంపతులకు 2020లో ఓ పాప జన్మించింది. తర్వాత వారి మధ్య విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. చిన్నారికి ఏ పేరు పెట్టాలనే అంశంపై వారి మధ్య సయోధ్య కుదరక ఏ పేరూ పెట్టలేదు. రోజులు గడిచాయి. పాపను స్కూల్లో చేర్చాల్సిన సమయం వచ్చింది. జనన ధ్రువీకరణ పత్రంలో చిన్నారి పేరు లేకపోతే అడ్మిషన్ ఇవ్వడం కుదరదని యాజమాన్యం చెప్పింది. దీంతో ‘పేరు’ తప్పనిసరి అయింది.కోర్టును ఆశ్రయించిన తల్లిపేరు నమోదు కోసం తల్లి జనన, మరణ ధ్రువీకరణ రిజిస్ట్రార్ను కలిసింది. ‘ఫుణ్యనాయర్’ పేరుతో తన కుమార్తెకు జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరింది. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వచ్చి దరఖాస్తు చేస్తేనే పేరు నమోదు చేస్తానని ఆ అధికారి చెప్పాడు. దీంతో కుమార్తెకు పేరు పెట్టేందుకు తన భర్త సహకరించేలా ఆదేశించాలని కోరుతూ ఆమె మొదట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. అవసరమైన ధ్రువపత్రాలు ఇవ్వాలని, పేరు నమోదుకు సహకరించాలని తండ్రిని కోర్టు ఆదేశించింది. ఇరువురు కలిసి నమోదు కేంద్రానికి వెళ్లాలని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులు పూర్తిగా అమలు కాలేదు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.ఉన్నత న్యాయస్థానానికి చేరిన సమస్యహైకోర్టులో ఆ చిన్నారి పేరు విషయమే కాదు, జనన, మరణాల నమోదు చట్టం–1969లోని సెక్షన్ 14 ప్రకారం పేరు నమోదుకు తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు వెళితే సరిపోతుందా? పేరు నమోదుకు ఇద్దరి అంగీకారం అవసరమా? ‘ది పేరెంట్’ అంటే అర్థం ఏమిటి? అనే ప్రశ్నలు కేసు విచారణ సందర్భంగా తలెత్తాయి. వీటిపై కోర్టు లోతుగా విశ్లేషించింది.‘ది పేరెంట్’ ఏకవచనమే‘ది పేరెంట్’ లేదా గార్డియన్ అని దరఖాస్తులో ఉంది. పేరెంట్ అంటే తల్లి లేదా తండ్రి అని డిక్షనరీ సూచిస్తోంది. బ్లాక్స్ లా డిక్షనరీ ప్రకారం పేరెంట్ అంటే ‘ఒక వ్యక్తికి చట్టబద్ధమైన తండ్రి లేదా తల్లి’. అందువల్ల పేరెంట్ అనే పదం తండ్రిని గాని తల్లిని గాని సూచించవచ్చు అని కోర్టు పేర్కొంది. కొన్ని అరుదైన సందర్భాల్లో ఇద్దరినీ కలిపి కూడా సూచించవచ్చని తెలిపింది. ఈ పదానికి ఏ అర్థం ఇవ్వాలనే కేసు పరిస్థితుల ఆధారంగా కొన్ని సందర్భాల్లో నిర్ణయించాల్సి వస్తోందని పేర్కొంది.చట్టంలో పేరెంట్ అనే పదానికి ముందు ‘ద’ అనే ఆర్టికల్ను ఉపయోగించారు. పేరెంట్ అనే పదాన్ని పేరెంట్స్ అనే బహువచన రూపంలో ఇవ్వలేదు. కావున ‘ద పేరెంట్’ అనే పదానికి ఏకవచన అర్థం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పింది. ‘బోత్ పెరెంట్స్’ అని ఎక్కడా లేదు. అందువల్ల తల్లి లేదా తండ్రి వారిలో ఎవరైనా పేరు నమోదుకు హక్కు కలిగి ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. చట్టంలో లేని విధంగా ఇద్దరూ కలిసే దరఖాస్తు చేయాలి. ఇరువురి అంగీకారం కావాలని రిజిస్ట్రార్ కొత్త నియమాన్ని పెట్టలేడని పేర్కొంది. ఈ వ్యాఖ్యానం ఆధారంగా తల్లి లేదా తండ్రి తొందరపడి తనకు నచ్చిన పేరుతో పిల్లల జనన ధ్రువీకరణ పత్రం తీసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఆపేరు నచ్చకపోతే చట్టపరంగా సవరణలు కోరే అవకాశం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.పాప భవిష్యత్తే ముఖ్యం‘పుణ్య నాయర్’ అని తన కుమార్తెకు పేరు పెట్టాలని తల్లి కోరింది. ‘పద్మ నాయర్’ పేరును తండ్రి సూచించాడు. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఉన్న సమయంలో ‘పిల్లల ప్రయోజనాలనే పరిగణన’లోకి తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది. పాప భవిష్యత్తే ముఖ్యమని పేర్కొంది. పేరు విషయంలో తల్లిదండ్రులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ‘పేరెన్స్ పాట్రీ’ కింద కోర్టే తుది నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ చిన్నారి తన తల్లి సంరక్షణలోఉన్నందున ఆమె సూచించిన పేరుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. పితృత్వం విషయంలో ఎలాంటి వివాదం లేనందున తండ్రి పేరును కూడా చేర్చాలని అభిప్రాయపడింది. ‘పుణ్య బాలగంగాధరన్ నాయర్’ సంక్షిప్తంగా ‘పుణ్య బి.నాయర్’ గా ఆ చిన్నారికి పేరు పెట్టింది. ఈ పేరుతో కొత్తగా దరఖాస్తు చేయాలని సూచించింది. దరఖాస్తు అందిన 15 రోజుల లోపు ఆ పేరుతో జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.ఈ కేసులో కోర్టు కేవలం ‘పేరు’ వివాదాన్ని మాత్రమే పరిష్కరించలేదు. పిల్లల హక్కులు, వారి భవిష్యత్తు, చట్టంలో పేర్కొన్న పదాలకు ఇవ్వాల్సిన సరైన అర్థం గురించి స్పష్టత ఇచ్చింది. కన్నబిడ్డకు తల్లిదండ్రులే పేరు నిర్ణయించలేని స్థితిలో కోర్టే స్వయంగా ఓ చిన్నారికి పేరు పెట్టడంతో న్యాయవ్యవస్థలో ఇది ఆసక్తికరమైన, అరుదైన తీర్పుల్లో ఒకటిగా నిలిచింది. - దిలీప్ మాదిరెడ్డి -
దానవులకు శుక్రాచార్యుని శాపం!
దానవులకు శుక్రాచార్యుని శాపందేవ దానవ యుద్ధంలో దానవులు ఓటమి పాలయ్యారు. ఇంద్రుడికి త్రిలోకాధిపత్యం తిరిగి వచ్చింది. శుక్రాచార్యుడు దేవతల పక్షంలోకి చేరాడు. అది చూసి రాక్షసులు కలవరపడ్డారు. ‘ఆచార్యా! మమ్మల్ని వదిలి నువ్వు వెళ్లిపోతే, మేము దిక్కుకానని వాళ్లమవుతాము’ అని మొరపెట్టుకున్నారు.శుక్రాచార్యుడు రాక్షసుల మొరను ఆలకించి, ‘ఓషధులు, మంత్రాలు నా వద్దనే ఉంటాయి. వాటిలో నాలుగో వంతు దేవతలకు చెందితే చెందవచ్చుగాక. మిగిలిన సర్వస్వాన్నీ మీకు ఇస్తాను’ అని వారికి చెప్పాడు.దేవతలు ఈ రహస్యాన్ని తెలుసుకుని, కనిపించిన రాక్షసులనల్లా తుదముట్టించడం ప్రారంభించారు. రాక్షసులు శుక్రాచార్యుడిని శరణు వేడుకున్నారు. శుక్రుడు దేవతల వద్దకు వెళ్లి, ‘పన్నెండు సంగ్రామాలలో రాక్షసులు ఎందరో హతులయ్యారు. ఇకనైనా మీరు పగను విడిచిపెట్టి, మిగిలిన రాక్షసులను బతకనివ్వండి’ అని చెప్పాడు.తర్వాత రాక్షసులతో రహస్యంగా సమావేశమై, ‘నేను శంకరుడి గురించి తపస్సు చేసి, మంత్రశక్తులను సంపాదించుకుని వస్తాను. అప్పుడు మీకు జయం కలుగుతుంది. అప్పటి వరకు నా తండ్రి భృగు మహర్షి ఆశ్రమంలో మీరంతా తలదాచుకోండి’ అని చెప్పి, తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లాడు.శుక్రాచార్యుడు తపస్సు చేస్తుండగా, శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ‘శుక్రా! నువ్వు తలకిందులుగా తపస్సు చేయి. అప్పుడే నీకు మంత్రాలన్నీ వశమవుతాయి’ అని చెప్పాడు.శుక్రాచార్యుడు ఘోరనిష్ఠతో శంకరుడు చెప్పిన ప్రకారమే తలకిందులుగా ఒక చెట్టుకు వేలాడుతూ తపస్సు చేయడం ప్రారంభించాడు.శుక్రుడు తపస్సు చేస్తున్న సంగతి తెలుసుకున్న దేవతలు రాక్షసుల మీదకు దండయాత్రకు బయలుదేరారు. దిక్కుతోచని రాక్షసులంతా శుక్రాచార్యుడి తల్లిని శరణు కోరారు.‘భయపడకండి. మీరు నా వద్దనే ఉండండి. మీకు ఏ భయం ఉండదు’ అని ఆమె అభయమిచ్చింది.అయినా, దేవతలు రాక్షసులను తరుముతూ వారిని పీడించసాగారు.దేవతల దుశ్చర్యకు కుపితురాలైన శుక్రమాత ‘మూర్ఖులారా! ఇంద్రుడితో సహా మిమ్మల్నందరినీ మట్టుపెట్టగలను’ అని హెచ్చరించి, తన యోగశక్తితో ఇంద్రుడి కాళ్లు చేతులు పనిచేయకుండా స్తంభింపజేసింది. ఇంద్రుడి పరిస్థితి చూసి, దేవతలు పరుగులు తీశారు. విష్ణువు తనలో ప్రవేశించమని ఇంద్రుడికి చెప్పాడు. శుక్రమాత ‘నిన్ను కూడా దహించివేస్తాను’ అని విష్ణువును హెచ్చరించింది. ఆమె శక్తిని తట్టుకోవడం దుస్సాధ్యమని తలచిన విష్ణువు, స్త్రీవధ కూడదని తెలిసినా, కత్తి దూసి ఆమె శిరస్సును ఖండించాడు.ఇదంతా తెలిసిన భృగు మహర్షి, నువ్వు ఏడు జన్మలు మనిషిగా జన్మిస్తావు’ అని విష్ణువును శపించాడు. తన భార్య శిరస్సును మొండేనికి తగిలించి, తన తపశ్శక్తితో ఆమెను తిరిగి బతికించాడు. ఇంద్రుడు, విష్ణువు సహా దేవతలంతా అక్కడి నుంచి వెనుదిరిగారు.శుక్రుడిని ఏం చేయాలో పాలుపోని ఇంద్రుడు తన కుమార్తె జయంతిని పిలిచి, ‘కుమారీ! శుక్రుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. నాతో సహా దేవతలంతా అతడికి భయపడుతున్నారు. నువ్వు వెళ్లి, నీ సపర్యలతో అతడిని వశం చేసుకుంటే, నాకు అంతకంటే కావలసినది లేదు. నేను నిన్ను అతడికి ఇచ్చివేస్తున్నాను’ అని చెప్పాడు.తండ్రి ఆజ్ఞ మేరకు జయంతి శుక్రుడు తపస్సు సాగిస్తున్న చోటుకు చేరుకుంది. అతడికి సపర్యలు చేస్తూ, ఏళ్ల తరబడి ఓర్పుగా ఉంది. కొన్నాళ్లకు శుక్రుడి తపస్సు ఫలించి, శంకరుడు అతడికి ప్రత్యక్షమై మంత్ర శక్తులన్నీ అనుగ్రహించాడు.అన్ని రోజూలూ తనకు సపర్యలు చేస్తూ వచ్చిన జయంతిని చూసి, శుక్రుడు ఆమె వివరాలు కనుక్కున్నాడు. ఆమె కోరిక మేరకు పాణిగ్రహణం చేసి, ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయి, అదృశ్యరూపంలో ఆమెతో గడపసాగాడు. శుక్రుడు జయంతితో ఉన్న సంగతి తెలుసుకున్న దేవగురువు బృహస్పతి ఇంద్రుడి ప్రోద్బలంతో తానే శుక్రుడి రూపం దాల్చి, రాక్షసుల వద్దకు వెళ్లాడు. ఆచార్యుడు తిరిగి వచ్చినట్లు భావించిన రాక్షసులు అతడిని పూజించసాగారు.జయంతితో అప్పటికే పదేళ్లు గడిపిన శుక్రాచారుడు తన శిష్యులైన రాక్షసులతో యజ్ఞం జరిపించాలని తలచి, తన ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ తన స్థానంలో తనలా ఉన్న బృహస్పతిని రాక్షసులు సేవిస్తుండటం చూసి, పట్టరాని ఆగ్రహంతో ‘మీరు మతిభ్రష్టులై సంచరించెదరుగాక’ అని శపించాడు.అసలు సంగతి గ్రహించిన రాక్షసులు శుక్రాచార్యుని పాదాలపై పడి పరిపరి విధాలుగా ప్రార్థించడంతో అతడు కొంత శాంతించాడు. ‘ఇప్పుడు దేవతలకు అనుకూలమైన కాలం. భవిష్యత్తులో ముల్లోకాలూ తిరిగి మీ వశం కాగలవు’ అని పలికాడు.పురావిశేషం..అసుర గురుడైన శుక్రాచార్యుడికి అరుదైన ఆలయం మహారాష్ట్రలో ఉంది. పురాతనమైన ఈ ఆలయం బేట్ కోపర్గాంవ్ గ్రామంలో గోదావరి తీరానికి చేరువలో ఉంది. ఇక్కడ పూజలు జరిపితే శుక్రాచార్యుడి అనుగ్రహం వల్ల పెళ్లికాని వారికి పెళ్లిళ్లు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఇదేచోట శుక్రాచార్యుడు శివుడి గురించి తపస్సు చేసి, మృత సంజీవని విద్య పొందాడని ప్రతీతి. ఈ ఆలయంలో శుక్రాచార్యుడికి పాయసం, కోవా మిఠాయిలు, పటికబెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. - సాంఖ్యాయన -
ఈ వారం కథ: ఆగిపోయిన వాచీ!
నగరం శివార్లలోని విల్లాలో వ్యాపారవేత్త పాండురంగారావు తన బెడ్రూమ్లో రక్తం మడుగులో శవమై పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ ఇ¯Œ స్పెక్టర్ అభిమన్యు తన టీమ్తో అక్కడికి చేరుకున్నాడు. శవం పక్కనే పాండురంగారావు చేతి గడియారం పగిలిపోయి పడి ఉంది. ఆ వాచీ ముల్లు సరిగ్గా రాత్రి 12:00 గంటల దగ్గర ఆగిపోయింది.పాండురంగారావు భార్య గత సంవత్సరమే రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు.ఇంట్లో కొత్తగా చేరిన వంటమనిషి పాండే, పనిమనిషి మంగ, తోటమాలి రంగయ్య ఆ ముగ్గురినీ విడివిడిగా విచారించాడు.పనిమనిషి మంగ వణుకుతూ, ‘‘సార్, నేను రాత్రి 11:30 నుండి ఒంటి గంట వరకు ఊరి గుడి జాతరలో ఉన్నాను. వందలమంది నన్ను చూశారు’’ అంది. అందుకు సాక్ష్యం కూడా చూపించింది.ఇక తోటమాలి రంగయ్యను విచారించగా, అతను రాత్రి 12:00 గంటల సమయంలో ఊరి సరిహద్దులో ఒక చిన్న దొంగతనం చేస్తూ లోకల్ పోలీసులకు దొరికి లాకప్లో ఉన్నాడని తెలిసింది.వంటమనిషి పాండే రాత్రి 9:30 గంటలకు తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు.అభిమన్యుకు పోస్ట్మార్టం రిపోర్ట్ చూశాక అనుమానం వచ్చింది. రిపోర్ట్ ప్రకారం పాండురంగారావు తిన్న ఆహారం జీర్ణమైన విధానాన్ని బట్టి హత్య రాత్రి 9:30 నుండి 10:30 మధ్య జరిగింది.అలాంటప్పుడు వాచీ ముల్లు 12 గంటలకు ఎలా ఆగిపోయింది. చనిపోయిన తర్వాత వాచీ పగిలి పడి ఉండటం ఏమిటి?‘అంటే హంతకుడు కావాలనే వాచీ ముల్లును 12 గంటలకు తిప్పి, దాన్ని పాడు చేసి ఇక్కడ పడేశాడు.’ అని అభిమన్యు గ్రహించాడు.హత్య జరిగిన ఇంట్లో పాండురంగారావు కాకుండా వున్నది ముగ్గురే! వారి గురించి విచారణ మొదలుపెట్టాడు.ఆధారాల కోసం వంటమనిషి పాండే గురించి బిహార్ పోలీసులను సంప్రదించాడు. షాకింగ్ విషయం తెలిసింది.వంటమనిషి పాండే బిహార్కు చెందిన మోస్ట్ వాంటెడ్ ప్రొఫెషనల్ కిల్లర్. అతని దగ్గర ఉన్న మరో ఫోన్ను స్వాధీనం చేసుకుంటే, ఆ ఫోన్లో తోటమాలి రంగయ్యతో పాండే మాట్లాడిన కాల్ డేటా దొరికింది. పాండురంగారావును హత్య చేయడానికి తోటమాలి రంగయ్య కుట్ర బట్టబయలు అయ్యింది. పాండురంగారావు హత్యానేరం తన మీద రాకుండా రంగయ్య తనే స్వయంగా రాత్రి 12 గంటలకు దొంగతనం కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఎందుకంటే పోలీసుల రికార్డుల ప్రకారం రాత్రి 12 గంటల హత్య సమయానికి తను సేఫ్గా లాకప్లో ఉండవచ్చని అతనికి తెలుసు.వెంటనే రంగయ్య గురించి కూపీ లాగితే, అతను చాలాసార్లు జైలుకు వచ్చినట్టు తెలిసింది. ములాఖత్ పేరుతో ఫణిభూషణ్రావు అనే ఖైదీని కలిసినట్టు రికార్డ్స్లో బయట పడింది. అక్కడే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది.ఫణిభూషణ్రావు కొడుకు హరిభూషణ్ మరెవరో కాదు– ‘తోటమాలి రంగయ్య.’రంగయ్యగా పేరు మార్చుకుని, రూపురేఖలు మార్చుకుని పగ తీర్చుకోవడానికి పనిలో చేరాడు.పాండురంగారావు తన దగ్గర పనిచేసే ఫణిభూషణ్రావు ఆఫీస్ లెక్కలను తారుమారు చేయడంతో పోలీసులకు పట్టించి జైలుకు పంపించాడు. ఆ కసితో అతని కొడుకు హరిభూషణ్ వేసిన క్రిమినల్ ప్లాన్ ఇది.బిహార్కు చెందిన వంటమనిషి పాండే గదిని సోదా చేసినప్పుడు, అతని డైరీలో కొన్ని వింత సమయాలు రాసి వున్నాయి.నిజానికి భారతదేశంలో ఒకే టైమ్ జోన్ ఉన్నప్పటికీ, తూర్పు ప్రాంతమైన బిహార్లో సూర్యాస్తమయం త్వరగా అవుతుంది. పాండే తన మునుపటి నేరాల్లో ఎప్పుడూ ఒక వింత అలవాటు కలిగి ఉండేవాడని అతని పాత క్రిమినల్ రికార్డుల ద్వారా తెలుసుకున్నాడు అభిమన్యుపాండే కావాలనే రాత్రి 10:00 గంటలకే పాండురంగారావును చంపి, వాచీ ముల్లును రాత్రి 12:00 గంటలకు తిప్పి, దాన్ని పాడుచేసి అక్కడ పడేశాడు. పోలీసులను రాంగ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశాడు.కానీ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు సేకరించిన ఎవిడెన్స్ ముందు తలవంచి జైలుకు వెళ్ళక తప్పలేదు.తండ్రి ఫణిభూషణ్ చేసిన వ్యాపార మోసం కేసుకు కేవలం 8 ఏళ్ల జైలు శిక్ష పడితే, ఆ పగను మనసులో పెట్టుకుని, విచక్షణ మరచి, ఒక ప్రొఫెషనల్ కిల్లర్తో క్రూరంగా హత్య చేయించినందుకు గాను కోర్టు హరిభూషణ్కు, హత్య చేసినందుకు పాండేకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. - శ్రీసుధామయిక్రైమ్ కథలకు ఆహ్వానం..ఉత్సాహవంతులైన రచయితల నుంచి క్రైమ్కథలను ఆహ్వానిస్తున్నాం. ఉత్కంఠ తగ్గకుండా పాఠకులతో చదివించే సస్పెన్స్ థ్రిల్లర్ కథలను ఈ శీర్షిక కోసం పంపండి. కథల నిడివి 450 పదాలకు మించరాదు. కథతో తప్పనిసరిగా హామీపత్రం ఉండాలి. కథలను తెలుగు యూనికోడ్లో టైప్ చేసి ఈ దిగువనున్న ఈ–మెయిల్కు పంపాలి. funday.kathalu@gmail.com -
ఈ వారం కథ: అభిమాని!
నేను ప్రయాణిస్తోన్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఏదో స్టేషన్ రావడంతో చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి కిటికీలోంచి బైటకు చూశాను. వరంగల్ స్టేషను వచ్చింది. మరో రెండున్నర గంటల్లో హైదరాబాద్ చేరుకుంటానని అనుకుంటుండగా నా సెల్ఫోన్ మోగింది. నేను ఊహించినట్టే ఆ ఫోన్ రామబ్రహ్మంగారి నుంచే. ఆయన పేరు స్క్రీన్ మీద కన్పించగానే నా మనసులో ఏదో తెలియని అసహనం, కాస్త చిరాకు చోటుచేసుకున్నాయి.షరా మామూలే... ఏ విషయంలేని ఊకదంపుడు ప్రశ్నలే! ఎలాగో ఓపిక చేసుకుని కాసేపు అడిగిన వాటన్నింటికి బదులిచ్చి ఫోన్ పెట్టేశాను.రామబ్రహ్మంగారు నా మనోఫలకంపై మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. నా ఈ ప్రయాణంలో అనేక దఫాలు ఆయన గుర్తుకు వస్తూనే వున్నారు.నేను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయల్దేరింది కేవలం రామబ్రహ్మంగారిని కలవడం కోసమేనని ఆయన అనుకుంటున్నారు. రామబ్రహ్మంగారు అలా అనుకోవాలనే నేనూ బలంగానే నమ్మించగలిగాను.వాస్తవానికి హైద్రాబాద్లో నాకు తెలిసిన ఓ సాహితీమిత్రుని సన్మాన కార్యక్రమానికి తప్పక హాజరు కావాల్సివుంది. ఎందుకంటే అతను ఒకసారి నా సన్మాన కార్యక్రమానికి హైద్రాబాద్ నుంచి ఎంతో ఖర్చుపెట్టుకుని ఫ్లైటులో వచ్చాడు.పనిలో పనిగా ఒకేసారి రెండు పనులూ అయిపోతాయని రామబ్రహ్మంగారిని కలవడానికి అంగీకరించాను.రామబ్రహ్మం గారితో నా అనుబంధం పదేళ్లనాటిది. ఆయన హైదరాబాదులో ఉంటున్నారు. ఈ పదేళ్లుగా నన్ను హైదరాబాద్లోని తనింటికి రమ్మనమని అనేక దఫాలుగా పోరుపెడుతూనే వున్నారు. నాకే ఇష్టంలేక ఎప్పటికప్పుడు ఏదో నెపం చెప్తూ తప్పించుకుంటూ వచ్చాను.ఈరోజు ఆయనకు నా పట్లగల అపారమైన అభిమానమే నన్ను బయలుదేరేలా చేసిందని చెప్తే, అది ఆత్మవంచనే అవుతుంది. నిక్కచ్చిగా నిజం చెప్పాలంటే, ఆయన్ని కలుసుకోవాలని నాకు ఎటువంటి ఆపేక్షగాని, ఆరాటంగాని లేవనే చెప్పాలి. రామబహ్మంగారు నన్ను పదేపదే ఆహ్వానించడానికి నేను ఆయన బంధువునిగాని, స్నేహితుణ్ణిగాని కానేకాదు. ఆయన... నా అభిమాని!ఇక్కడ నా గురించి కాస్త చెప్పుకోవాలి. నేనో ప్రముఖ కథా రచయితను. రామబ్రహ్మంగారికి నేనన్నా, నా కథలన్నా మాటల్లో చెప్పలేనంత వీరాభిమానం అని సగర్వంగా చెప్పుకోగలను.రామబ్రహ్మంగారు నా కథలకు డైహార్డ్ ఫ్యాన్ అంటే– కాస్త అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ, ఇది పచ్చి యదార్థం!ఆయన నేను రాసిన ప్రతీకథనీ అనేకసార్లు చదువుతుంటారు అనడం కంటే, నిత్యపారాయణం చేస్తుంటారన్నది యధార్థం. నా మెదడులో జీవం పోసుకున్న నా రచనలూ, ఆయా రచనల్లోని పాత్రలూ, అందులోని సంభాషణలూ నాకే సరిగ్గా గుర్తుండి చావవు.కానీ– ఆయన నేను రాసిన ప్రతివాక్యాన్ని గుర్తుంచుకుని, ఆయా పాత్రల పేర్లూ, స్వభావాలూ, తీరుతెన్నులను గురించి గంటల తరబడి చర్చిçస్తుంటారు. నా సాహిత్యం పట్ల ఆయనకుగల అభిమానానికీ, జ్ఞాపకశక్తికీ ఒక్కోసారి నేనే ఎంతగానో విస్తుపోతుంటాను.రామబ్రహ్మంగారు నా కథల గురించే కాక ఇతర రచయితల కథల గురించి కూడా అనేకానేక సాహితీ సంగతులు నాతో చర్చిస్తుంటారు. అది ఎంతలా అంటే– నేను ఒక్కోసారి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా భయపడిపోతుంటాను.రామబ్రహ్మంగారు ‘మీ సమయాన్ని వృథా చేస్తున్నానను కుంటా...’ అని తరచు అంటుంటారు. కానీ నా కాలాన్ని హరించడం మాత్రం మానుకోరు. ఈమధ్య ఆయనకు డెబ్బయిఏళ్ళు నిండాయి. ఆ వయసుకి ఆ మాత్రపు చాదస్తం సహజమే కదాని సరిపెట్టుకుంటుంటాను.రామబ్రహ్మంగారిని కలుసుకోడానికి కారణం– ఆయన తన డబ్బులతో నా రానూపోనూ ట్రైన్ టిక్కెట్లు బుక్ చేశారనే కృతజ్ఞతా భావంతోనన్నదే అసలైన వాస్తవం.‘ఓ సాహితీమిత్రుని సన్మాన కార్యక్రమానికి హాజరవడానికి వస్తూ, మిమ్మల్నీ కలుస్తున్నాను’ అని నిజాన్ని చెప్పెయ్యాలనుకున్నాను. కానీ చెప్పలేకపోయాను. అలా చెప్తే ఆయనకు నాపైగల ఇంప్రెషన్ తగ్గిపోతుందని ఆ విషయాన్ని దాచిపెట్టేశాను.నా మిత్రుని సన్మానం జరిగేరోజున అలా బయటికెళ్లి వస్తానని ఓ అబద్ధం చెప్పి, ఆ సభకు హాజరవ్వాలన్నదే నా ఆలోచన. ఇలా నాలోని ఆలోచనలు రైలుతో సమానంగా పరుగులు తీస్తున్నాయి.∙∙ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంది.అప్పుడు సమయం సుమారుగా మధ్యాహ్నం రెండున్నర గంటలు కావస్తోంది. రామబ్రహ్మంగారు నాకోసమే ప్లాటుఫారం మీద ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మేమిద్దరం ఇదివరకెప్పుడూ కలుసుకోలేక పోయినా అనేకసార్లు మాట్లాడుకున్న వాట్సాప్ వీడియో కాల్స్ మూలంగా ఒకరినొకరం సునాయాసంగానే గుర్తుపట్టగలిగాం.నేను ప్లాటుఫారం మీద అడుగుపెట్టగానే రామబ్రహ్మంగారు నాకు దగ్గరగా వస్తూ ‘‘హార్టీ వెల్కమ్ టు హైదరాబాద్, చైతన్యాజీ...’’ అంటూ అమితమైన ఆనందంతో అక్కున చేర్చుకున్నారు. అనంతరం నా లగేజీని తన చేతుల్లోకి తీసుకుని తను పార్క్ చేసిన కారు దగ్గరకు తీసుకుపోయారు. రామబ్రహ్మంగారు కారు డ్రైవింగ్ చేస్తున్నంతసేపు ఏదేదో లొడలొడా మాట్లాడుతూనే తనింటికి తీసుకుపోయారు.రామబ్రహ్మంగారు నాకోసం తనింటిపైనున్న పెంట్ హౌస్లో వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆ గదిలోకి అడుగుపెట్టిన నాకు మతిపోయినంత పనయింది. ఆ గదిలో కొన్ని వందల పుస్తకాలు దర్శనమిచ్చాయి. ఆ పుస్తకాల గది... అందమైన హరివిల్లులా వుంది. పుస్తకాలు ఓ పద్ధతిగా పేర్చి వున్నాయి. నాకు ఒక అద్భుత ప్రపంచంలో అడుగుపెట్టినట్టుగా అపురూపమైన భావన చోటుచేసుకుంది.సాహిత్యానికి సంబంధించిన అనేక పుస్తకాలే కాకుండా, విజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు ఆ గదిలో ఉన్నాయి. కొంతమంది గొప్పవారుగా గుర్తింపు పొందాలనే తాపత్రయంతో ఏవేవో పుస్తకాలు కొనుక్కుని తమ అల్మరాల్లో ఊరకనే అలంకరించుకోవడం నాకు తెలిసిందే.రామబ్రహ్మంగారు కూడా అలానే పుస్తకాలను కొనుక్కుని ఉంటారని భావించాను.భోజనమయ్యాక మేడమీద గదికి తీసుకెళ్లారు. నా మనసులో వేధిస్తున్న ప్రశ్నలను ఆయన ముందు పెట్టాను. ‘రామబ్రహ్మంగారూ! ఇన్ని పుస్తకాలు కొనుక్కున్నారు కదా, వీటిల్లో కొన్నైనా పూర్తిగా చదివారా?‘అడిగాను కాస్త అనుమానంగా.‘కొన్ని కాదు గురువుగారు, అన్నీ చదివేసినవే! ఉన్న పుస్తకాలు పూర్తిగా చదవడం పూర్తయితేనే కొత్త పుస్తకాలు తీసుకుంటాను’ అన్నారు రామబ్రహ్మంగారు– తనకున్న భయంకరమైన రీడింగ్ హాబిట్ను తెలియజేస్తూ. ఆయన మాటలకు నేను ఒక్కసారిగా షాక్కి గురయ్యాను.‘నిజంగానా...?!’ నోరెళ్ళబెడుతూ ఆశ్చర్యంగా అడిగాను. ఎందుకంటే– నేను నా దగ్గరున్న పుస్తకాలలో పదోవంతు కూడా చదివివుండను. రామబ్రహ్మంగారు ‘నాకు ఇంకేమి పని? చదువుకోవడమే నాకున్న ఏకైక వ్యసనం’ అన్నారు ఓ సాధారణ విషయాన్ని వెల్లడి చేస్తున్నట్టుగా.ఆ రాత్రి నేను సరిగ్గా నిద్రపోలేకపోయాను.రామబ్రహ్మంగారిని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆయనలో చాలా విషయం ఉందన్న విషయాన్నీ చాలా ఆలస్యంగా గ్రహించాను. నిజానికి ఆయన జ్ఞానం ముందు నేనెంతో అజ్ఞానినో నెమ్మదిగా అర్థమైంది.రామబ్రహ్మంగారు నగరంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనకి లాక్కుపోయారు. అక్కడ నా అభీష్టం మేరకు ఓ ఇరవైవేల రూపాయలు విలువచేసే పుస్తకాలు తీసుకున్నారు. తర్వాత అవన్నీ ‘నాకోసమే తన బహుమతి’ అన్నారు. నేను ఒక్కసారిగా అవాక్కయ్యాను.ఆ మరుసటిరోజు రామబ్రహ్మంగారు మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు నన్ను సాయంత్రం ఓ చోటికి తీసుకువెళ్తామన్నారు. అప్పుడు నా పరిస్థితి మహా ఇరకాటంలో పడ్డట్టయింది. ఎందుకంటే– ఆ సాయంత్రమే నేను ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం నా సాహితీ మిత్రుడు రంగనాథం సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలి.నేను వెంటనే ‘అయ్యో, ఈ సాయంత్రమే మియాపూర్లో ఓ మిత్రుణ్ణి కలవాలి...‘ ఓ రెడీమేడ్ అబద్ధంతో రామబ్రహ్మంగారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను. అయినాకానీ అతనూ కూడా వస్తామన్నారు. నేను తెలివిగా ‘మీకెందుకు అనవసర శ్రమ. ఒక్కడినే సరదాగా బస్సు మీద వెళ్ళొస్తాను...’ అని ఏదో సర్దిచెప్పి, తప్పించుకున్నాను. ఒక అబద్ధాన్ని నెత్తినపెట్టుకుని మోయాలంటే ఎంత కష్టమో ఆ క్షణంలో అర్థమయింది. వెంటనే ’నా మిత్రుని సన్మానసభకి హాజరవ్వాలి...’ అని ధైర్యంగా నిజం చెప్పెయ్యాలనిపించింది. కానీ గొంతు విప్పలేక, అపరాధ భావంతో తలదించుకోక తప్పలేదు.∙∙ ఆ సాయంత్రం...రామబ్రహ్మంగారితో కాఫీ తాగి, కాసిన్ని స్నాక్స్ తిని, స్నేహితుణ్ణి కలవడానికంటూ నా మిత్రుడు రంగనాథం సన్మానసభకి బయల్దేరాను.రామబ్రహ్మంగారు తన కారు తీసుకెళ్లమన్నారు. నేను వద్దని చెప్పేశాను. కనీసం తన స్కూటీనైనా తీసుకెళ్లమన్నారు. రూట్స్ వెతుక్కోవడానికి కష్టమవుతుందని చెప్పి, బస్సులోనే వెళ్ళొచ్చేస్తానని చెప్పి, అతికష్టంమీద నా మిత్రుని సన్మాన సభకి బయల్దేరాను.ఒక్కోసారి అభిమానం కూడా ఇంతలా బాధిస్తుందని తొలిసారిగా తెలుసుకున్నాను.∙∙ అనుకున్నట్టు గానే బస్సెక్కి, ఎలాగోలా నా మిత్రునికి సన్మానం జరుగబోయే సభావేదిక వద్దకు చేరుకున్నాను.నాకోసం ఎదురుచూసున్న నా సాహితీమిత్రుడు రంగనాథం నన్ను చూడగానే ఎంతో ఆనందంగా పలకరించాడు. ‘వ్యయప్రయాసలతో వచ్చినందుకు సంతోషమ’ంటూ నన్ను తన హృదయానికి హత్తుకుని తన సంతోషాన్ని వ్యక్తంచేశాడు.నేనూ, రంగనాథం వేదికముందు గల కుర్చీల్లో పక్కపక్కనే కూర్చున్నాం. వేదికమీద కొద్దిమంది సాహితీమూర్తులు ఆసీనులై ఉన్నారు. సభ అప్పటికే మొదలైపోయింది.నేను వేదిక మీదున్న పెద్దలను పరిశీలనగా చూశాను, నాకు తెలిసిన రచయితలెవరైనా వున్నారాని. అంతే నా చూపులు ఉన్నట్టుండి చప్పున ఆగిపోయాయి. ఒక్కసారిగా మ్రాన్పడిపోయాను.నా కళ్ళను నేను నమ్మలేనట్టుగా మరింత పెద్దగా చేసుకుని చూశాను. ఔను, ఆయన కచ్చితంగా రామబ్రహ్మంగారే! వేదిక మీద కూర్చున్న రామబ్రహ్మంగారి కంట్లో ఎట్టిపరిస్థితుల్లోనూ పడకూడదని గట్టిగా అనుకుని, ముందు వరుసలో ఇబ్బందిగా ఉందని రంగనాథాన్ని బలవంతంగా వెనక్కు లాక్కొచ్చేశాను.వేదిక మీదున్న సాహితీమూర్తులు ఒక్కొక్కరూ ప్రసంగిస్తున్నారు. కొద్దిసేపటి తరువాత రామబ్రహ్మంగారు తన సాహితీ ప్రసంగాన్ని అత్యద్భుతంగా కొనసాగించారు. తెలుగు సాహిత్యంలో చోటుచేసుకుంటున్న వివిధ ప్రక్రియల గురించి అనర్గళంగా ప్రసంగించారు. మధ్యమధ్యలో సభంతా చప్పట్లతో మార్మోగిపోతోంది. అందరితో పాటూ నేనూ చప్పట్లు కొట్టాను. నాలో పేరుకుపోయిన అహంకారం పొరలు పటాపంచలయ్యేలా గట్టిగానే నా అభిమానాన్ని వ్యక్తపరచాను.ఆ కాసేపటికి తరువాత నా మిత్రుని సన్మాన కార్యక్రమం జరిగింది.సభానంతరం నిర్వాహకులు భోజనం ఏర్పాట్లు చేశారు. రామబ్రహ్మంగారికి కన్పించకుండా భోజనం చేసేందుకుగా నా మిత్రుడితో కలిసి ఓ మూలవైపు అడుగులు వేశాను. ఒకచోట చాలామంది సాహితీప్రియులు గుమిగూడిన వాతావరణం కన్పించింది. నేను ఆసక్తిగా దూరం నుంచే గమనించాను. అక్కడ ఓ వ్యక్తితో చాలామంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ, అతనితో మాటలు కలపాలని అందరూ తెగ ఆరాటపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరోకాదు, రామబ్రహ్మంగారే!నా మిత్రుడు రంగనాథం ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ రామబ్రహ్మంగారి కంటపడకూడదని అనుకుంటూనే, అటువైపుగా చూపు సారించాను. నేను తనని గమనిస్తున్నానని ఆయనకు తెలిసినట్టుగా ఆయన చప్పున నన్ను చూసేశారు.అంతే నాకా క్షణంలో ఎలా స్పందించాలో అర్థంకాక తలకొట్టేసినట్టయింది. ఓ బలమైన సముద్రపు కెరటం నన్ను నిలువెల్లా ముంచేసినట్టుగా నా ఒళ్ళంతా సిగ్గుతో చచ్చిపోయింది. వెంటనే మొహంమీద బలవంతపు చిరునవ్వు ఒకటి పులుముకుని ఆయనకు దగ్గరగా అడుగులు వేశాను.‘ఏంటీ, సార్ మీరిక్కడ...?’ రామబ్రహ్మంగారు ఆశ్చర్యపోతూ అడిగారు. వెంటనే అతను అడిగినదానికి ఎలా బదులివ్వాలో అర్థంకాక ‘బయలుదేరాక తెల్సింది. ‘ఈరోజే నా మిత్రుడు ఏదో పనిమీద ముంబై వెళ్లిపోయాడు. నా రచయిత మిత్రుడైన రంగనాథం ఫోన్ చేయడంతో ఇలా బయల్దేరి వచ్చేశాను...’ అప్పటికప్పుడు ఓ రెడీమేడ్ అబద్ధాన్ని అల్లేశాను.అంతలో ఓ వ్యక్తి రామబ్రహ్మంగారికి షేక్ హ్యాండ్ ఇస్తూ ‘‘సార్, మొన్ననే ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’లో మీ ఆర్టికల్ చదివాను, అద్భుతం! కంగ్రాట్స్...’’ అభినందిస్తున్నారు.నేను చొరవచేసుకుని అందరిని నెట్టుకుని రామబ్రహ్మంగారి దగ్గరకు వెళ్లి ‘సార్, మీరు పత్రికలకూ, జర్నల్స్కూ ఆర్టికల్స్ రాస్తుంటారా?! నాకెప్పుడూ చెప్పనేలేదు...’’ అంటూ నాలో తన్నుకొస్తున్న ఆశ్చర్యాన్ని వెళ్ళగక్కుతూ అడిగాను.నేను అడిగిన ప్రశ్నకు చిన్నగా నవ్వేస్తూ ‘‘గురువుగారూ, అప్పుడప్పుడూ ఏవో రాస్తుంటాను. చెప్పుకోవడానికి నేను మీలాగా గొప్ప రచయితనైతే కాదుకదా?!’’ అన్నారు రామబ్రహ్మంగారు నిరాడంబరంగా.ఇంతలో నా మిత్రుడు రంగనాథం మా దగ్గరకొచ్చాడు. అతన్ని రామబ్రహ్మంగారికి పరిచయం చేద్దామనుకుంటుండగా రంగనాథమే ‘‘ఆయన మా గురువుగారు ప్రముఖ కాలమిస్ట్ రామబ్రహ్మంగారు. ఈ మధ్యనే నాకు పరిచయమయ్యారు’’ అంటూ నాకు రామబ్రహ్మంగారిని పరిచయం చేయబోయాడు. ఆందుకు రామబ్రహ్మంగారు ‘‘మా గురువుగారికి, నాకూ ఇంతకుముందే పరిచయం వుంది...’’ అంటూ అసలు సంగతి బయటిపెడుతూ పెద్దగా నవ్వేశారు.రామబ్రహ్మంగారు నన్ను ‘గురువుగారు’ అని సంబోధించడం నా మిత్రుడు రంగనాథానికి మింగుడు పడక, మా ఇద్దరివైపు ఆశ్చర్యంగా చూశాడు. ‘అవునండీ, మీ మిత్రుడి కథలకు నేను వీరాభిమానిని...’ అంటూ రామబ్రహ్మంగారు నన్నో ఎత్తయిన ఉన్నత శిఖరంమీద కూర్చోబెట్టారు. ఆ క్షణం నాకెందుకో అధఃపాతాళంలోకి జారిపోతున్న భావన.ఆ సభా కార్యక్రమం అనంతరం నేనూ, రామబ్రహ్మంగారు ఆయన కారులో ఇంటికి బయలుదేరాం. తప్పుకి దొరికిపోయానన్న న్యూనతభావంలో ఇబ్బందిగా కారులో కూర్చున్నాను. రామబ్రహ్మంగారు యథాలాపంగా మాట్లాడుతున్నారు.ఇంటికి చేరుకునేసరికి రాత్రి తొమ్మిదిన్నర కావస్తోంది. ఇద్దరం ఒకేసారి కారులో రావడంతో రామబ్రహ్మంగారి భార్య ‘‘అరే, మీరిద్దరూ ఎలా కలిశారు?’’ ఆశ్చర్యంగా అడిగారు. నేను మరో అబద్ధాన్ని సిద్ధం చేసుకుంటుండగా రామబ్రహ్మంగారే ఏదో చెప్పారు.నేను ఆ భార్యాభర్తలిద్దరికీ గుడ్ నైట్ చెప్పి నేను నా రూమ్లోకి వెళ్ళి, బెడ్ మీద నిస్సత్తువగా వాలిపోయాను బట్టలు మార్చుకోకుండానే.రామ బ్రహ్మంగారితో పరిచయమైన నాటినుంచి మామధ్య చోటుచేసుకున్న అనేక సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. నాలోని అహంకారపు ఛాయలు నన్ను వెక్కిరిస్తూ పాతాళంలోకి నెట్టేస్తున్న దృశ్యపరంపర! ఆ రాత్రి ఎప్పుడో నాకు తెలియకుండా నిద్రలోకి జారిపోయాను.ఉదయం రామబ్రహ్మంగారే నిద్రలేపారు. ఆ ఉదయమే నా ప్రయాణం. రామబ్రహ్మంగారు కూడా స్టేషన్ వరకు వస్తామన్నారు. అనవసరమైన ఇబ్బంది ఎందుకని బస్సులో వెళ్ళిపోతానని చెప్పాను. తనకు ఏ ఇబ్బందిలేదనీ, పైగా దగ్గరుండి సెండాఫ్ ఇవ్వడం తనకెంతో సంతోషమంటూ తన కారు తీశారు. నేను ఇంకేమీ మాట్లాడలేకపోయాను. ఆయన సాహచర్యం నుంచి వీలైనంత తొందరగా బైటపడాలనిపిస్తోంది. అంతులేని అపరాధభావం నాలోని అణువణువునూ దహించివేస్తోంది.కారులోంచి దిగాక రామబ్రహ్మంగారు నా రెండు బ్యాగులను పట్టుకున్నారు. నా లగేజీని ఆయన మోయడం నాకే సిగ్గుగా అన్పించి, ఆయన చేతిలోని నా బ్యాగులను తీసుకోవడానికి తీవ్రప్రయత్నం చేశాను. ఆయన అంతే తీవ్రంగా ‘మై ప్లెజర్...’ అంటూ నా బ్యాగులను వదిలిపెట్టలేదు.నా రానూపోనూ టికెట్స్ ముందుగానే రిజర్వేషన్ చేసేయడంతో రామబ్రహ్మంగారు తనకు ఓ ప్లాట్ఫామ్ టిక్కెట్ తీసుకున్నారు. నేను ఎక్కాల్సిన స్పెషల్ ట్రైన్ అప్పటికే ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉండటంతో గబగబా ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్నాను. రామబ్రహ్మంగారు ప్లాట్ఫామ్ మీద నుంచుని ‘గురువుగారూ, నా అతిథ్యంలో ఏమైనా లోపాలుంటే క్షమించగలరు...’ అన్నారు నన్ను మరింత బాధకు గురిచేస్తూ. నేను వెంటనే రామబ్రహ్మంగారికి నా రెండు చేతులెత్తి దణ్ణంపెడుతూ ‘‘గురువుగారూ, మీ ఆటోగ్రాఫ్ ప్లీజ్...’’ అంటూ ఓ పుస్తకాన్ని తెరిచి, జేబులోంచి పెన్ను తీసిచ్చాను.‘‘అయ్యో, నేను మీకు ఆటోగ్రాఫ్ ఇవ్వడమేంటి? కొత్తగా నన్ను మీరు గురువుగారని సంబోధించడం ఏంటి?! నేనే ఎన్నోసార్లు మీరు ఆటోగ్రాఫ్ చేసిన మీ పుస్తకాలను మీనుండి పోస్టులో తెప్పించుకున్న వాణ్ణి...’’ అన్నారు రామబ్రహ్మంగారు తడబడుతున్న స్వరంతో.నా కోరిక మేరకు ఇబ్బందిగా ఆటోగ్రాఫ్ చేసిచ్చారు. అప్పుడే రైల్వే గార్డు విజిల్ గట్టిగా వేశాడు. రైలు నెమ్మదిగా కదిలింది.ఎందుకో ఉన్నట్టుండి నా కళ్ళల్లోంచి నీళ్లు తన్నుకువస్తున్నాయి. పూడుకుపోయిన నా గొంతు పెగుల్చుకుని ‘‘గురువుగారూ, ఇక మీదట మీరు నన్ను ‘గురువుగారూ’ అంటూ సంబోధించడానికి వీల్లేదు! ఈ అభిమాని అజ్ఞానాన్ని మన్నించగలరు...’’ అంటూ ప్రక్షాళన చెందిన మనసుతో నా రెండు చేతులెత్తి నమస్కారం చేశాను.రామబ్రహ్మంగారు నా మాటలు అర్థంకానట్టుగా ఆశ్చర్యంగా నన్నే చూస్తున్నారు. ఆ క్షణంలో మా ఇద్దరిమధ్య మాటలు కరువయ్యాయి.∙∙ రైలు మా మధ్య భౌతికంగా దూరాన్ని పెంచుతూ ముందుకు సాగిపోతోన్నా, ఈ ప్రయాణం మమ్మల్ని ఎంతో దగ్గర చేసిందనే చెప్పాలి. ఎవరో మహానుభావుడన్నట్లు ప్రతీ ప్రయాణం... నీలోని నీకు తెలియని సరికొత్త మనిషిని నీకు పరిచయం చేస్తుంది! - శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు -
హెయిర్ సెట్ చేయడానికి.. ఈ 'క్యాప్స్లాక్'!
హెయిర్ సెట్ చేయడానికి టైమ్ లేకపోయినా, బార్బర్ చేసిన పని కాస్త అతిగా అనిపించినా, లేదా ‘ఈరోజు కాస్త స్టయిలిష్గా కనిపించాలి’ అనిపించినా, ఒక క్యాప్ పెట్టుకుంటే చాలు– లుక్ ఆటోమేటిక్గా కూల్లాక్ అయిపోతుంది. అయితే, ఈ క్యాప్ కేవలం తలకు కవర్లా కాకుండా, మీ స్టయిల్కి ఒక కిరీటంలా కనిపించాలంటే ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే!బేస్బాల్ క్యాప్ ఎప్పటికీ క్లాసిక్!ఫ్యాషన్ ట్రెండ్స్ మారినా, బేస్బాల్ క్యాప్ మాత్రం ఎప్పుడూ ఔటాఫ్ స్టయిల్ కాదు. జీన్ ్స, టీషర్ట్, షార్ట్స్– ఏ ఔట్ఫిట్తో అయినా ఈజీగా మ్యాచ్ అవుతుంది. ముఖ్యంగా నేవీ, బ్లాక్, వైట్ కలర్స్లో ఉంటే ఎప్పుడైనా కళ్లుమూసుకుని వేసేయొచ్చు.లోగో మ్యాజిక్!కొన్ని క్యాప్స్పై చిన్న లోగో ఉంటేనే సరిపోతుంది. ఆ చిన్న లోగోనే పెద్ద స్టేట్మెంట్ అవుతుంది. స్పోర్ట్స్ లోగోలు లేదా మినిమల్ బ్రాండ్ ఎంబ్రాయిడరీలు ఉన్న క్యాప్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి.ట్రక్కర్ క్యాప్స్కి గాలి ఫుల్!వెనుక భాగం మెష్తో ఉండే ట్రక్కర్ క్యాప్స్ సమ్మర్కి బెస్ట్. గాలి బాగా ఆడుతుంది, చెమట తక్కువగా ఇబ్బంది పెడుతుంది. బైక్ రైడ్స్, ట్రావెల్స్, వీకెండ్ ఔటింగ్స్కి ఇవి పర్ఫెక్ట్.క్లాసిక్ స్ట్రీట్ స్టైల్ఒక వైట్ టీషర్ట్, ఓవర్సైజ్డ్ డెనిమ్ జాకెట్, బ్లాక్ లేదా నేవీ క్యాప్ జత చేస్తే చాలు. ఇది ఎప్పటికీ ఫెయిల్ అవని కాంబినేషన్ . సింపుల్గా కనిపించినా స్టయిల్లో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేస్తుంది.వెకేషన్ వైబ్లైట్ వెయిట్ లినెన్ షర్ట్, షార్ట్స్తో పాటు బీజ్ లేదా క్రీమ్ కలర్ క్యాప్ పెట్టుకుంటే హాలిడే మోడ్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. బీచ్కి వెళ్లకపోయినా, చూసేవాళ్లకు మాత్రం మీరు వెకేషన్ లో ఉన్నట్టే అనిపిస్తుంది.ఆల్ బ్లాక్ ఆటిట్యూడ్బ్లాక్ టీషర్ట్, బ్లాక్ జీన్ ్స, బ్లాక్ క్యాప్– ఈ కాంబో ఎప్పుడూ పవర్ఫుల్గా కనిపిస్తుంది. అయితే మొత్తం లుక్ బ్లాక్లోనే ఉంటే, ఒక వాచ్ లేదా వైట్ స్నీకర్స్తో చిన్న కాంట్రాస్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు.జాగ్రత్తలు!- క్యాప్ పెట్టుకున్నారంటే స్టిక్కర్లు, ట్యాగులు తీసేయండి. లేదంటే కొత్తగా కొన్నానని ప్రపంచానికి ప్రకటన ఇచ్చినట్టే ఉంటుంది.- మురికి పట్టిన క్యాప్తో స్టయిల్ కంటే అలసత్వమే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి రెగ్యులర్గా క్లీన్ చేయండి.- ఇండోర్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ క్యాప్ తీసేయకుండా ఉంటే, అది అలవాటు ఎక్కువైనట్టే. సందర్భాన్ని బట్టి క్యాప్ను క్యారీ చేయాలి. - కొండి దీపిక -
కర్ర పెత్తనాన్ని కళ్ళకు కట్టించినవాడు!
నియంతృత్వ వ్యవస్థ స్వరూప స్వభావాలను కళ్ళకు కట్టించిన రీతికీ, పట్టెడుమంది యువకులు ఈ వ్యవస్థలపై తిరగబడి, తరిమికొట్టిన తీరును చిత్రించిన పద్ధతికీ, హొర్హే మార్యో పెద్రో వర్గస్ లోజా నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్నార’ని స్వీడిష్ ఎకాడెమీ ప్రతినిధి 2010లో ప్రకటించారు. లోజా పెరూవియన్ జాతీయుడు. 1960–’70 దశకాల్లో దక్షిణ అమెరికాలో ఉవ్వెత్తున ఎగసిపడిన తిరుగుబాట్ల వెల్లువను ‘లాటిన్ బూమ్’ అంటారు. దానికి ప్రతీక ప్రాయులైన రచయితల్లో లోజా ఒకరు. ప్రపంచ ప్రసిద్ధ కొలంబియన్ రచయిత గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్, మెక్సికన్ రచయిత కార్లో ఫ్వెంటి, అర్జెంటీన్ రచయిత హూలియో కొర్తజార్ తదితరులపై కూడా ‘లాటిన్ బూమ్’ ప్రభావం గాఢంగా పడింది. వారి సహచరుడే లోజా కూడా!1959 నాటి క్యూబా విప్లవం– ఒక అర్థంలో– ‘లాటిన్ బూమ్’ క్రమానికి మినహాయింపు లాంటిది. 1973లో చిలీ అధ్యక్షుడు సాల్వడార్ అయాండే (అలెండీ) హత్య సంఘటన ఇదే క్రమానికి– మరో అర్థంలో– మినహాయింపు లాంటిది. అయాండే హత్యతో, చిలీ ప్రజాతంత్ర విప్లవం విఫలమైన సంగతి ప్రపంచ చరిత్ర ఓనమాలు తెలిసిన వారికి తెలిసిన విషయమే! అయినప్పటికీ, ‘లాటిన్ బూమ్’ క్రమం క్యూబా విప్లవంతోనే మొదలైందని చెప్పాలి. మరుసటి సంవత్సరం నుంచే అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, పరాగ్వే, పెరూ తదితర దేశాల్లో వరసగా తిరుగుబాట్ల వెల్లువ పెల్లుబికింది. దానికే జర్నలిస్టులు ‘లాటిన్ బూమ్’ అని పేరుపెట్టారు. ఈ వెల్లువ పెల్లుబికే నాటికి లోజా వయసు గట్టిగా పాతికేళ్ళు కూడా ఉండవేమో! బహుశా అందుకే అతనిపై ‘లాటిన్ బూమ్’ ప్రభావం అంత అపారంగా పడడానికి అదే కారణమేమో.మార్యో లోజా తొలి నవల ‘నగరంలో కాట్లకుక్కలు.’ దాన్ని మన అనువాద బ్రహ్మలు (అనగా, అనువాదకులు!) ‘వీరుని యుగం’ (ది టైమ్ ఆఫ్ ది హీరో) పేరిట ఆంగ్ల పాఠకులకు పరిచయం చేశారు. ప్రయోగాత్మక రీతిలో రాసిన ఈ నవల రాతప్రతిగా వుండగానే, 1962లో గ్రంథాలయ పురస్కారాన్ని అందుకుంది. మరుసటి సంవత్సరమే ఈ రచనకు విమర్శకుల ప్రశంస పురస్కారం కూడా దక్కింది. అంతాచేసి, అప్పటికి లోజా వయసు 27! పెరూలోని ప్రతిష్ఠాత్మకమైన సైనిక పాఠశాలలో నెలకొని వున్న స్థితిగతుల గురించి రాసిన నవల అది.1950 దశకంలో లోజా ఆ పాఠశాలలో చదివి వున్నందున అక్కడి పరిస్థితులు అతనికి కొట్టిన పిండి. నవల పొడుగునా ఈ విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంటుంది. మాట నెగ్గించుకోవడం కోసం తోటివారి పైన పెత్తనం చెలాయించే సంస్కృతి– తెగువ పేరిట దేనికైనా తెగించే సంస్కృతి– మగటిమి పేరిట పురుషాహంకార సంస్కృతి– ఆనాటి పెరూ సమాజంలో పాతుకుపోయిన ‘విలువలు.’ ఆ ఆవు చేలో మేస్తుంటే సైనిక పాఠశాల దూడ గట్టున మేస్తుందా? ఈ పోకిరీ పోకడలకు మెతగ్గా వుండే మధ్యతరగతి విద్యార్థులు ఎలా బలైపోతారో చిత్రించడం ద్వారా ఆ ‘విలువల’ను ప్రశ్నించారు లోజా. అందుకే ‘తప్పనిసరిగా చదవాల్సిన రచనల జాబితా’లో లోజా తొలి నవలే స్థానం సంపాదించుకో గలిగింది! నిజానికి ఆయన రచనలన్నింటా ఇదే ప్రశ్న అలముకుని వుంటుంది.1981లో, లోజా రాసిన ‘విలయ సమరం’అనే నవల ఆయన ప్రసిద్ధ రచనల్లో మరొకటి. బెజిల్ చరిత్రలో ‘కేనండో(స్) యుద్ధం’గా ప్రచురితమైన చారిత్రక సంఘటనే ఈ నవల ఇతివృత్తానికి మూలం. బ్రెజిల్లోని బహైయాలో జరిగిన యుద్ధమది. అంతోనియా కాన్సలైరో అనే చారిత్రక వ్యక్తి ఈ నవలకు కథానాయకుడు అంటారు– కానీ, బ్రెజిల్ రిపబ్లికన్ సైన్యం ఊచకోతను ప్రతిఘటించిన ప్రజలే ఈ నవలకు కథానాయకులు. ప్రజల అవసరాలను పట్టించుకోని ప్రభుత్వాలపై తిరగబడిన సామాన్యుల వీరగాథ ఇది. రాచరికం వకాల్తా తీసుకున్న అంతోనియో గానీ, అతన్ని విధేయంగా అనుసరించిన ప్రజలు కానీ, ఏటికి ఎదురీదిన వాళ్ళే. అందుకే, అన్ని యుద్ధాల తర్వాత కూడా రిపబ్లికన్ సైన్యమే గెలిచి నిరాయుధులైన ప్రజలనూ, ప్రజానాయకులనూ ఊచకోత కోశారు. ఈ కథను చరిత్రలో పదిమందికీ గుర్తుండేలా నమోదు చెయ్యడం బాధ్యత కలిగిన రచయిత కర్తవ్యం! బహుశా అందుకేనేమో, జయప్రదమైన తన రచనల్లో ‘విలయ సమరం’ ఒకటన్నారు లోజా.లోజా నవలలన్నింటిలోకీ సుప్రసిద్ధమైనది ‘చీంబోతు విందు.’ 1950 దశకంలో డొమినికన్ రిపబ్లిక్ లో 31 యేళ్ళ పాటు నిరంకుశ రాజ్యం నడిపించిన రఫాయెల్ ట్రూహియో హత్యే ఈ నవల ఇతివృత్తం. ట్రూహియోను డొమినికన్లు ‘ఎల్ హెఫె’ అని పిల్చుకునేవారు– ఆ మాటకు ‘బాస్– దొరగారు’ అని అర్థం. ట్రూహియో కర్రపెత్తనం సాగిన కాలంలో పాతిక వేల నుంచి యాభై వేలమంది బలైవుంటారని చెప్తారు. ఒక్క పార్సీ›్ల ఊచకోత సంఘటనలోనే ట్రూహియో సైన్యం 17 వేలమందిని హతమార్చింది. ‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలింద’న్నట్లుగా 1961 మే 30న ట్రూహియో ఓ కుట్రకు బలయ్యాడు! చారిత్రక సమాచారాన్నీ, కాల్పనిక సంఘటనలనూ, వాస్తవ వ్యక్తుల కథలనూ ముప్పేటగా అల్లిన కథనం పాఠకులను ఆకట్టుకుంది.లోజాతో సహా లాటిన్ బూమ్ రచయితలు అంతర్జాతీయ ఖ్యాతి పొందడానికి రాజకీయ– సామాజిక అంశాలే కారణమని అమెరికన్ చరిత్రకారుడు ఫ్రెడరిక్ నన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి యాంత్రిక సరళీకరణ – రిడక్షనిజం అనిపించుకుంటుందే తప్ప హేతుబద్ధ విశ్లేషణ అనిపించుకోదు! ఈ తరహా సూత్రీకరణల వల్ల కళ మాత్రమే నష్టపోతుంది తప్ప వ్యక్తులకే నష్టం జరగదని గుర్తించడం మంచిది!! - మందలపర్తి కిషోర్ -
అందానికి ఏఐ మాయాజాలం.. పోర్టబుల్ స్కిన్ కేర్ డివైస్!
ప్రముఖ బ్యూటీ టెక్నాలజీ సంస్థ ‘ఇన్యూమీ’ సౌందర్య ప్రేమికుల కోసం ఒక సరికొత్త, వినూత్నమైన పోర్టబుల్ స్కిన్ కేర్ డివైస్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘నానో హైడ్రా ప్రో’ పేరుతో రూపొందించిన ఈ హైటెక్ గాడ్జెట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీల కలయికతో పనిచేస్తుంది.ఈ ఆధునిక నానో హైడ్రా ప్రో డివైజ్లో ఆటోమేటెడ్ డ్యుయల్–పంప్ మెకానిజంతో పాటు ఏఐ సాంకేతికతను ఉపయోగించారు. ఇది చర్మ సంరక్షణకు అవసరమైన లిక్విడ్లను అత్యంత సూక్ష్మమైన స్ప్రే రూపంలోకి మారుస్తుంది. దీనివల్ల స్కిన్ కేర్ లిక్విడ్స్ చర్మం లోపలి పొరల వరకు సులభంగా చేరుకుని, చర్మాన్ని ఎక్కువ సమయం పాటు హైడ్రేటెడ్గా ఉంచుతుంది.ప్రయాణాల్లో సైతం ఎంతో సులభంగా తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఈ స్మార్ట్ డివైస్లో ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. డివైజ్ను ఎలా ఉపయోగించాలో గైడ్ చేయడానికి ప్రత్యేక డిస్ప్లే, సెన్సర్లు ఇందులో ఉంటాయి. దీనిని ఫోన్ యాప్తో అనుసంధానం చేసుకోవచ్చు. తద్వారా వాతావరణ పరిస్థితులను బట్టి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో ఎప్పటికప్పుడు రిమైండర్లను పంపుతూ ఒక పర్సనల్ స్కిన్ కేర్ కన్సల్టెంట్లా ఈ డివైజ్ సహాయపడుతుంది. ఇందులో స్కిన్ కేర్ లిక్విడ్స్ నింపుకోవడానికి వీలుగా సులభంగా మార్చుకోగలిగే మ్యాగ్నెటిక్ క్యాప్సూల్స్ ఉండటం విశేషం.పురాతన ఈజిప్షియన్, భారతీయ, గ్రీకు, రోమన్ ప్రజలు కుంకుమపువ్వును సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించేవారు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా స్నానం చేయడానికి కుంకుమపువ్వు కలిపిన నీరు/పాలు ఉపయోగించేదట! తేనెతో పులియబెట్టిన గుర్రం పాలతో నిండిన టబ్లో స్నానం చేయడం, ఆమె ఆచరించిన సౌందర్య మార్గాలలో ఒకటి. ఆధునిక కాలంలో కూడా అనేక లగ్జరీ స్కిన్ కేర్ బ్రాండ్స్ క్లియోపాత్రా వాడిన పాలు, తేనె, కుంకుమపువ్వు ఫార్ములాను ఆధారంగా తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.ఎండల్లోనూ మెరిసేలా!ఉక్కపోత, వేడి వల్ల వేసవిలో చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చు. వేసవిలో సన్ స్క్రీన్ని ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ తీవ్రమైన సన్ బర్న్ బారిన పడితే కలబంద గుజ్జు, జింక్ ఉన్న క్రీములు, ఐస్ ప్యాక్స్తో చర్మాన్ని చల్లబరచుకోవాలి. చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని మళ్లీ తాజాగా మార్చవచ్చు. అందువల్ల ఎక్స్ఫోలియేషన్పై దృష్టిపెట్టాలి.మచ్చలు, మొటిమలు ఏ కాలంలోనైనా రావచ్చు. కానీ వేసవిలో ఇవి మరింత ఎక్కువవుతాయి. మొటిమలు వేధిస్తున్నప్పుడు గ్లైకోలిక్ యాసిడ్ లేదా శాలిసిలిక్ యాసిడ్ ఉన్న క్లెన్సర్ను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. శరీరంలో తగినంత నీరు ఉన్నట్లయితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. -
లీటర్ పెట్రోల్.. 914 కిలోమీటర్ల మైలేజీ..
అసలే చమురు ధరలు మండిపోతున్నాయి. కారు రోడ్డు మీదకు వస్తే 15–20 కిలోమీటర్ల దూరానికే లీటరు చమురు ఆవిరైపోతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వచ్చినా, వాటితో ఇబ్బందులు ఉండనే ఉంటున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ చమురుతోనే సుదూరాలకు పరుగు తీయగల కారును అమెరికాలోని ఉటా రాష్ట్రానికి చెందిన బ్రిగ్హామ్ యంగ్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించారు. ఈ కారు లీటరు పెట్రోలుకు ఏకంగా 914 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. మామూలు కార్లతో పోల్చుకుంటే, దీని బరువు కూడా చాలా తక్కువ. ఈ సూపర్ మైలేజీ కారు బరువు కేవలం 49 కిలోలు మాత్రమే! ఈ కారుకు దాని పనితీరుకు తగినట్లే ‘సూపర్ మైలేజ్’ అని పేరు పెట్టారు. అయితే, దీనిని రేసు ట్రాక్లపై పరుగులు తీయించడానికి ప్రయోగాత్మకంగా తయారు చేశారు. -
ఈతరం పిల్లల ఆసక్తికే మద్దతు
సలార్ పార్ట్ 1 సీజ్ఫైర్, మిరాయ్, మ్యూజిక్ స్కూల్, గుడ్ బ్యాడ్ అగ్లీ, మట్కా.. మొదలైన సినిమాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ‘కార్తికేయ్ దేవ్.’ ‘పిల్లల ఆసక్తిని గమనించి, తగిన సూచనలతో గైడ్ చేయడం వరకే ఈ తరాన్ని పెంచడం అంటే’ అని వివరించారు కార్తికేయ దేవ్ తల్లి కవిత పొదిలపు, తండ్రి గద్దె నారాయణరావు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఈ తల్లిదండ్రులు తమ కూతురు పునర్విక, కొడుకు కార్తికేయదేవ్ పెంపకం గురించి పంచుకున్న విశేషాలు...‘‘మేమిద్దరం సాఫ్ట్వేర్ ఉద్యోగులమే. పిల్లలు కూడా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉండాలని అనుకోవడంలేదు. బాబుకు ఊహ తెలిసినప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టముండేది. ఎవరైనా ‘పెద్దయ్యాక ఏం అవుతావు?’ అని అడిగితే, ‘హీరో అవుతా’ అనేవాడు. టీవీ ముందు నిలుచొని, ‘అమ్మా, టీవీ లోపలికి వెళ్తా...’ అనేవాడు. చదువులో కూడా ముందుండేవాడు. కొన్ని రోజులు ఆలోచించాను. ‘బాబు యాక్టింగ్ అంటే ఆసక్తి చూపుతున్నాడు, ఒకసారి ప్రయత్నిద్దాం’ అని ఇంటర్నెట్లో వెతికి ఒక మోడలింగ్ స్కూల్లో చేర్పించాం.డిస్టెన్స్ వద్దని చెబుతాను..మొదట ఒకట్రెండు యాడ్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాడు. ఆ సమయంలోనే చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. ఒక రోజు ఇంట్లో అందరం కూర్చొని ఈ విషయమ్మీద చర్చపెట్టుకున్నాం. ‘‘మనకు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. అక్కడ పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. సినిమాలు హిట్, ప్లాపులుంటాయి. ఎక్కడైనా డౌన్ అయితే డిప్రెస్ అయ్యే సందర్భాలూ ఉంటాయి. మేం ఎప్పుడూ నీ వెంటే ఉండకపోవచ్చు. బ్యాలెన్స్ చేసుకోకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. చదువుపైన ఎంత ఫోకస్ పెడితే అంత ప్రోత్సహిస్తాం’’ అని చెప్పాం. బాబు మాత్రం ‘సినిమాయే నా కెరీర్’ అన్నాడు. దీంతో బాబుకి ఇష్టమైన కెరీర్వైపే అడుగులు వేయడం మంచిదనుకున్నాం. ఇష్టమైన వాటికోసం పరుగులు తీస్తూ, చదువుని నిర్లక్ష్యం చేయకూడదని, ‘డిగ్రీ తప్పనిసరిగా ఉండాల’ని చెప్పాను. అందుకు ‘సరే’ అన్నాడు. చదువు, కెరీర్ మాత్రమే కాదు, జీవితంలో రిలేషన్స్ కూడా అంతే ముఖ్యమని డిస్టెన్స్ ఉండవద్దని చెబుతుంటాను. పుట్టింటివైపు, అత్తింటివైపు బంధుత్వాలను కవర్ చేస్తూ, వరసల గురించి వివరిస్తాను. మామూలుగా కూడా ఆంటీ, అంకుల్ అని కాకుండా చిన్నమ్మ, అత్తయ్య, బాబాయ్, మామయ్య.. అని పిలిపిస్తాను. మమ్మల్ని కూడా పిల్లలు ‘అమ్మ నాన్న’ అనే పిలుస్తారు. అవసరమైనదే కొనాలిపిల్లలు ఎదిగే క్రమంలో ఆర్థిక విషయాల్లో అవగాహన ఉండాలి. సినిమా రంగం కాబట్టి మంచి బ్రాండెడ్ డ్రెస్సులు, ఇతర యాక్ససరీస్ అవసరం. అలాగని అధిక ఖర్చులు ఎందుకు అనవసరమో చెబుతాను. తనకు ఒక డిజిటల్ కార్డ్ ఇచ్చాను. దాని ఉపయోగం ఎంతవరకో వివరించాను. పునర్వికకు కూడా ఇదే విషయాన్ని చెబుతాను. మావారిది నైట్ షిఫ్ట్. పగలు విశ్రాంతి తీసుకోవాలి. తనకు అంత ఒత్తిడి ఇవ్వకూడదు అనుకుంటాను. కానీ, తను కూడా పిల్లల కోసం టైమ్ కేటాయిస్తాడు. ‘ఈ హీరో యాక్షన్నను ఇలా ఉంది, నీకు ఇది ఎలా యాప్ట్ అవుతుందో చూడు’ అని చెబుతుంటారు. దాపరికాలు ఉండకూడదుఇప్పటి పిల్లలకు చాలా ఎంపికలు ఉన్నాయి. ఎటుగా వెళితే మంచిది అని కూడా బాగా ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు ‘మా అమ్మనాన్నలు మాకు ఇష్టమైనది చేయనివ్వడం లేదు’ అనిపిస్తే చికాకు చూపుతారు. పిల్లలిద్దరిదీ టీనేజ్ వయసు. పిల్లలకు మాతో పంచుకునే సందర్భాలు ఎక్కువ ఉండేలా, దాపరికాలు లేకుండా చూసుకుంటాను. డిజిటల్ ప్రపంచం ఈ తరానికి ఎంత మక్కువో తెలిసిందే. అందుకే, బయట ఫ్రెండ్స్తో వెళ్లమని చెబుతాను. పాప కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఇంటీరియర్, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రస్ట్ చూపుతోంది. పెద్దయ్యాక తన ఇంట్రస్ట్ బేస్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. నా వరకైతే పిల్లల ఆసక్తిని చూసి ఆ దిశగా తీసుకెళ్లడమే మంచిది. పెద్దలుగా మన ఇష్టాలను వారి మీద రుద్దకూడదు. వాళ్ల కోసం వాళ్లకు న చ్చిన వర్క్ చేస్తేనే సంతోషంగా ఎదుగుతారు’’ అని వివరించారు ఈ టీనేజ్ యాక్టర్ అమ్మనాన్న.ఒత్తిడి తగదుఒక్కసారి కూడా స్కూల్కి వెళ్లి ర్యాంకులు, గ్రేడ్లు ఎలా వస్తున్నాయి అని చూడను. ఎప్పుడైనా ఒకసారి పేరెంట్ టీచర్ మీటింగ్కు వెళతాను. మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు సరిగా చూసుకోవాలి అని చెబుతాను తప్ప, కోపం చూపను. మా అమ్మనాన్నలు కూడా మా చదువు విషయంలో ఒత్తిడి తీసుకురాలేదు. ‘మీరు ఎంత వరకు అంటే అంతవరకు చదివిస్తాను’ అనేవారు మా నాన్న. నేను కూడా పిల్లలతో అదే అంటాను. ఇన్ని డబ్బులు పెడుతున్నాం, ఇవేనా మార్కులు’ అని ఎప్పుడూ అన్నది లేదు. నిర్మలారెడ్డి(చదవండి: లిక్విడ్ నైట్రోజన్తో కూడిన ఆహారం సురక్షితమేనా? పాపం ఆ నవ వధువు..) -
సెబాసో... సపోరో
జపాన్ లోని హొకైడో నగరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకునే హొకైడో ష్రైన్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శతాబ్దానికి పైబడిన చరిత్ర కలిగిన ఈ వేడుకలు నేటి నుంచి జూన్ 16 వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో అద్భుతమైన ప్రదర్శనలతో సపోరో నగరమంతా పండుగ శోభ సంతరించుకుంది. సపోరా ఫెస్టివల్గా కూడా పిలుచుకునే ఈ పండుగ మూడు రోజులూ నకాజిమా పార్క్లో పెద్ద ఎత్తున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా పార్క్ అంతటా భారీ దుకాణాలను ఏర్పాటు చేశారు. స్థానికులు, పర్యాటకులు తమ సాంప్రదాయ దుస్తులైన ‘యుకాతా’ (తేలికపాటి నూలుతో చేసిన కిమోనోలు) ధరించి ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉండే ఈ పార్క్లో స్థానిక వంటకాలు, పానీయాలు, మిఠాయిలు విక్రయించే వందలాది స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.వీటితో పాటు చిన్నపిల్లల కోసం జంపింగ్ కాసిల్స్, మ్యాజిక్ హౌస్, సాహసోపేతమైన డెత్ డిఫైయింగ్ మోటార్బైక్ (కళ్లకు గంతలు కట్టుకుని గుండ్రటి గోడలపై బైక్ నడిపే విన్యాసం) సందర్శకులను ఎంతగానో అలరిస్తాయి. అలాగే మరుయామా పార్క్లోని పురాతన మందిరం వద్ద సాంప్రదాయ పూజా కార్యక్రమాలను అక్కడి ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పండుగలో అత్యంత ప్రధానమైన ఘట్టం చివరి రోజైన జూన్ 16న జరుగుతుంది. హొక్కైడో ష్రైన్ నుంచి ఉదయం 8 గంటల ప్రాంతంలో వేలాది మందితో ఒక భారీ ఊరేగింపు ప్రారంభమై, సపోరో నగర కేంద్రం వైపుగా సాగుతుంది.ఈ ఊరేగింపులో పాల్గొనే వేలాది మంది ప్రజలు జపాన్ దేశపు ప్రాచీన హెయాన్ కాలం నాటి (క్రీ.శ. 794– 1185) రంగురంగుల, సంప్రదాయ దుస్తులలో మెరుస్తారు. నగర వీధుల గుండా సాగే ఈ ప్రదర్శనలో తైకో డ్రమ్స్, సంగీత వాయిద్యాల మోతలు మార్మోగుతాయి. స్థానికులు మోసే 4 భారీ ‘మికోషి’ (కర్రతో చేసిన చిన్న దేవాలయం లాంటి నిర్మాణాలు), 8 అద్భుతమైన ఫ్లోట్లు (రథాలు) ఈ ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మధ్యాహ్న సమయానికి ఈ ఊరేగింపు సెంట్రల్ సపోరోకు చేరుకుంటుంది. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి, కెమెరాల్లో బంధించడానికి వేలాది మంది ప్రజలు పోటీపడతారు. మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ వేడుకలు జపాన్ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.∙ రమా జంబుల -
పవన శక్తితో పరిష్కారం
ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరుగుతోంది. విద్యుదుత్పాదన కోసం ఉపయోగించే పెట్రో ఇంధనాలు, బొగ్గు వంటి ఇంధనాలు భూతాపం పెరుగుదలకు కారణమవుతున్నాయి. పెట్రో ఇంధనాలతో నడిచే మోటారు వాహనాల వాడకం పెరుగుదల; రకరకాల అవసరాల కోసం అడవుల నరికివేత సహా అనేక కారణాలు భూతాపాన్ని అంతకంతకు పెంచుతున్నాయి.భూతాపాన్ని అరికట్టడానికి పునర్వినియోగ ఇంధనాలపై ప్రపంచం ఈ శతాబ్ది ప్రారంభం నుంచి దృష్టిసారించడం మొదలుపెట్టింది. పునర్వినియోగ ఇంధనాలలో పవన శక్తి కూడా గణనీయమైన పాత్ర పోషిస్తోంది. కర్బన ఉద్గారాలు లేకుండా విద్యుత్తును ఉత్పత్తి చేయడంలో పవన శక్తి కీలకమైనది. పవన శక్తి ఉత్పాదన సామర్థ్యంలో మన భారతదేశం ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. పవన శక్తి ఉత్పాదన వివరాలను గణాంకాల్లో తెలుసుకుందాం...కొన్ని దేశాలు తమ మొత్తం విద్యుత్ అవసరాలను గణనీయంగా పవన విద్యుత్తు ద్వారానే తీర్చుకుంటున్నాయి. అలాంటి దేశాల వివరాలు గణాంకాల్లో...దేశాల వారీగా మొత్తం విద్యుత్తులో పవనశక్తి వాటా -
రక్తదానం ప్రాణదానమే
రక్తదానం అంటే ప్రాణదానం. సకాలంలో దొరికే రక్తం ఆపదలో చిక్కుకున్న ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా కాపాడుతుంది. సకాలంలో తగిన రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది మరణిస్తున్నారని, వీరిలో సుమారు 77 వేల మంది మహిళలు ప్రసవానంతర రక్తస్రావం కారణంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చెబుతోంది. మన దేశంలో ఏటా దాదాపు 1.80 లక్షల మంది సకాలంలో రక్తం అందక మరణిస్తున్నారు.వీరిలో సుమారు 24 వేల మంది మహిళలు ప్రసవానంతర రక్తస్రావం కారణంగా మరణిస్తున్నారు. ఇటీవల శాస్త్రవేత్తలు కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. ఇది విరివిగా అందుబాటులోకి వచ్చినట్లయితే, రక్తం కొరత వల్ల సంభవించే మరణాలను పూర్తిగా అరికట్టవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఇంకా రక్తదాతలపై ఆధారపడక తప్పని పరిస్థితులు ఉన్నాయి.రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, ప్రసవ సమయంలో కొందరు మహిళలకు, శస్త్రచికిత్సల తర్వాత పలువురు రోగులకు రక్తం అత్యవసరం అవుతుంది. సికిల్ సెల్ ఎనీమియా, థలసీమియా, హీమోఫీలియా వంటి జన్యువ్యాధులతో బాధపడేవారికి; లుకీమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి రక్తసంబంధ క్యాన్సర్లతో బాధపడేవారికి తరచుగా రక్తం అవసరం అవుతుంటుంది. సకాలంలో రక్తం దొరకకుంటే, వీరు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఎందరో స్వచ్ఛంద రక్తదాతలు తరచుగా రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూనే ఉన్నాయి. అయినా, రక్తం అవసరమైన వారికి తగినంత రక్తం అందుబాటులో లేని పరిస్థితులు ఎదురవుతుండటమే విషాదం. మన దేశంలో పరిస్థితులు చూసుకుంటే, రక్తదాతల నుంచి సేకరిస్తున్న రక్తం అవసరానికి తగినంతగా ఉండటం లేదు. గడచిన ఐదేళ్లలో మన దేశంలోని పరిస్థితిని పరిశీలిద్దాం.రక్తదానంలో టాప్ –10ప్రపంచ ఆరోగ్య సంస్థ, రెడ్క్రాస్ సహా పలు స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా ఇటీవలి కాలంలో పలు దేశాలలో స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్వచ్ఛంద రక్తదాతల నుంచి సేకరిస్తున్న రక్తం యూనిట్లలో మన దేశం రెండో స్థానంలో ఉంది. స్వచ్ఛంద రక్తదాత వల్ల ఏటా సేకరిస్తున్న రక్తం పరిమాణం పెరుగుతూనే ఉంది. అయినా, మన దేశంలో ఏడాదికి దాదాపు ఒక మిలియన్ యూనిట్ల కొరత ఎదురవుతోంది. రక్త పరిశోధనల చరిత్రరక్తం కోల్పోయినప్పుడు ప్రాణాలు పోతాయని మనుషులకు చాలాకాలం కిందటే తెలుసు. అయితే, కోల్పోయిన రక్తాన్ని తిరిగి భర్తీ చేసే పక్రియ తెలుసుకోవడానికే శతాబ్దాల కాలం పట్టింది. అసలు మనుషుల్లో రక్తప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికే చాలాకాలం పట్టింది. తొలిసారిగా ఇంగ్లిష్ వైద్యుడు విలియమ్ హార్వే 1628లో మానవ శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుందో మ్యాప్ చేశాడు. హార్వే రూపొందించిన మ్యాప్ ఆధారంగా యూరోపియన్ వైద్య పరిశోధకులు రక్తం కోల్పోయిన మనుషులకు రక్తాన్ని ఎక్కించే ప్రక్రియపై రకరకాల ప్రయోగాలు చేశారు.మనుషులకు జంతువుల రక్తం ఎక్కించే ప్రయత్నం తొలిసారిగా 1667లో చేసినా, ఆ ప్రయోగం దారుణంగా విఫలమైంది. తొలిసారిగా బ్రిటిష్ ప్రసూతి వైద్యుడు జేమ్స్ బ్లండెల్ 1818లో ప్రసవానంతరం అధిక రక్తస్రావానికి లోనైన ఒక మహిళకు విజయవంతంగా మనిషి రక్తాన్ని ఎక్కించాడు. అప్పటికి మనుషుల్లోని రక్తమంతా ఒకటే అనుకునేవారు. రక్తంలోని గ్రూపులను ఆస్ట్రియన్ వైద్యుడు కార్ల్ లాండ్స్టీనర్ 1900లో కనుగొన్నాడు. ఈ పరిశోధనకుగాను ఆయనకు నోబెల్ బహుమతి దక్కింది. రక్తదాన చరిత్రతగిన రక్తాన్ని ఎక్కించడం ద్వారా మనుషుల ప్రాణాలు నిలపడం సాధ్యమయ్యాక బ్రిటిష్ రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి పెర్సీ లేన్ ఆలివర్ ప్రపంచంలోనే తొలిసారిగా లండన్లో స్వచ్ఛంద రక్తదాతల సేవలను 1921లో ప్రారంభించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో గాయపడిన సైనికుల కోసం అమెరికన్ రెడ్క్రాస్ నేతృత్వంలో విస్తృతంగా రక్తసేకరణ ప్రారంభించారు. రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వచేసేందుకు షికాగోలోని కుక్ కౌంటీ ఆస్పత్రిలో 1937లో ప్రపంచంలోని తొలి బ్లడ్బ్యాంకును ఏర్పాటు చేశారు.ఇది ఏర్పడిన రెండేళ్లకే– 1939లో మన దేశంలోని తొలి బ్లడ్బ్యాంకును కలకత్తాలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. దీనిని డాక్టర్ శివ్దేవల్ సింగ్ గ్రీవల్ ప్రారంభించారు. తొలినాళ్లలో ఏర్పడిన బ్లడ్బ్యాంకులు రెండో ప్రపంచయుద్ధంలో గాయపడిన వేలాది సైనికుల ప్రాణాలను నిలిపి ఉంచడంలో కీలక పాత్ర పోషించాయి. తొలినాళ్లలో రక్తదానం గురించి ప్రజల్లో రకరకాల అపోహలు ఉండేవి. ప్రజల్లోని అపోహలను తొలగించడానికి ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు రక్తదానం ఆవశ్యకత గురించి 1960లలో సమాజంలో అవగాహన కల్పించడం ప్రారంభించారు.అప్పటికి ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో బ్లడ్బ్యాంకులు ఏర్పడ్డాయి. క్రమంగా చిన్న చిన్న పట్టణాల్లో కూడా బ్లడ్బ్యాంకుల ఏర్పాటు మొదలైంది. హెచ్ఐవీ మహమ్మారి వల్ల 1980ల నుంచి రక్త సేకరణ విధానాల్లోను, రక్త మార్పిడి జాగ్రత్తల్లోను సమూలమైన మార్పులు వచ్చాయి. రెడ్క్రాస్ సహా పలు స్వచ్ఛంద సంస్థల కృషి ఫలితంగా స్వచ్ఛంద రక్తదాతల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయినా, కొన్ని ప్రాంతాల్లో అవసరానికి తగిన రక్తం అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి.ప్రపంచంలోని కోట్లాది మంది స్వచ్ఛంద రక్తదాతల నిస్వార్థ సేవలకు కృతజ్ఞతలు వెల్లడించే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2004లో జూన్ 14వ తేదీని ‘ప్రపంచ రక్తదాతల దినం’గా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏటా ఇదే రోజున రక్తదాతల గౌరవార్థం వివిధ కార్యక్రమాలను నిర్వహించడం, రక్తదాన శిబిరాలను నిర్వహించడం ప్రారంభమైంది. ఈ ఏడాది డబ్ల్యూహెచ్వో ప్రపంచ రక్తదాన దినం కోసం ‘ఒక చుక్క మానవత్వం. రక్తాన్ని ఇవ్వండి. ప్రాణాలను కాపాడండి’ అనే థీమ్ను ఎన్నుకుంది.కృత్రిమ రక్తం కథా కమామిషూఇప్పటి వరకు ఎక్కడ ఎవరికి రక్తం అవసరమైనా, రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని నిల్వచేసే బ్లడ్బ్యాంకులే శరణ్యం. రక్తదాతలు తమ రక్తాన్ని ధారపోయాల్సిన అవసరం లేకుండా చేయడానికి, ఎప్పుడు ఎవరికి రక్తం అవసరమైనా తక్షణమే అందించడానికి వీలుగా అన్ని రకాల గ్రూపులకు చెందిన రక్తం ఉన్నవారికి సరిపోయే కృత్రిమ రక్తాన్ని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయోగాలు సాగిస్తూనే ఉన్నారు. తొలిసారిగా 1989లో జపాన్ శాస్త్రవేత్తలు ‘ఫ్లూవోసాల్’ పేరుతో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. దీనికి ఎఫ్డీఏ అనుమతి కూడా లభించింది. అయితే, దీనిని నిల్వచేయడంలో సాంకేతిక ఇబ్బందులు, తయారీ ప్రక్రియలో సంక్లిష్టతలు తదితర కారణాల వల్ల ‘ఫ్లూవోసాల్’ తయారీ 1994లో నిలిచిపోయింది.కృత్రిమ రక్తం తయారీ తొలి ప్రయత్నం శాస్త్రీయంగా విజయవంతమైనా, సాంకేతిక కారణాల వల్ల కార్యాచరణలో విఫలమైంది. అలాగని ఆశలు అడుగంటిపోలేదు. శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను విరమించుకోలేదు. అమెరికన్ కంపెనీ ‘బయోప్యూర్’ వ్యవస్థాపకులైన శాస్త్రవేత్తలు డాక్టర్ బింగ్ ఎల్ వాంగ్, డాక్టర్ కార్ల్ డబ్ల్యూ రాష్ రక్తానికి ప్రత్యామ్నాయం కాగల ‘హెమోప్యూర్–201’ అనే ఉత్పత్తిని 2001లో రూపొందించారు. ఇది ‘హెమోగ్లోబిన్ బేస్డ్ ఆక్సిజన్ క్యారియర్’. హెమోగ్లోబిన్ ద్వారా తయారు చేసిన ఈ ఉత్పత్తి రక్తం మాదిరిగానే శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయడం ద్వారా ప్రాణాలను నిలిపి ఉంచగలదు. దీనికి ఎఫ్ఏడీ అనుమతి లభించింది. ‘ఫ్లూవోసాల్’తో పోల్చుకుంటే, దీనికి అనేక సానుకూలతలు ఉన్నాయి.దీనిని నిల్వచేయడానికి రిఫ్రిజిరేటర్లు అక్కర్లేదు. సాధారణ పరిస్థితుల్లో సైతం ఇది నిక్షేపంగా రెండేళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఎలాంటి బ్లడ్ గ్రూపు వారికైనా చక్కగా సరిపోతుంది. ఇన్ని సానుకూలతలు ఉన్నా, దీని వాడుక పరిమితంగానే ఉంది. శస్త్రచికిత్సల తర్వాత తలెత్తే ఎనీమియా నివారణ కోసం ‘హెమోప్యూర్–201’ వాడుతున్నారు. ఇది రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాదు. అందువల్ల ప్లాస్మా, ప్లేట్లెట్లు వంటి ప్రత్యేక అవసరాల కోసం ఇంకా రక్తదాతలపై ఆధారపడక తప్పని పరిస్థితులు ఉన్నాయి.‘హెమోప్యూర్–201’ పరిమితులను గుర్తించాక శాస్త్రవేత్తలు మరింత విస్తృతంగా ప్రయోగాలు సాగించి, తొలిసారిగా బ్రిటిష్ శాస్త్రవేత్తలు 2022లో లాబొరేటరీలో ఎర్ర రక్తకణాలను తయారు చేయగలిగారు. బ్రిస్టల్ వర్సిటీ, కేంబ్రిడ్జ్ వర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు మూలకణాల నుంచి సేకరించిన ఎర్రరక్త కణాలతో కృత్రిమ ఎర్ర రక్తకణాలను విజయవంతంగా అభివృద్ధి చేయగలిగారు. సికిల్సెల్ ఎనీమియా, థలసీమియా రోగులకు నేరుగా రక్తం ఎక్కించే బదులుగా ఈ కృత్రిమ ఎర్ర రక్తకణాలను ఎక్కించడం ద్వారా వారి ప్రాణాలను నిలపవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకు కృత్రిమ రక్తం తయారీకి జరిగిన ప్రయత్నాలు పాక్షిక ఫలితాలను మాత్రమే ఇస్తున్నాయి. ఇవేవీ రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాలేకపోతున్నాయి.పరిమితులు ఏమిటంటే..?రక్తానికి బదులుగా ఇప్పటి వరకు కృత్రిమంగా రూపొందించినవేవీ పూర్తిస్థాయిలో రక్తానికి ప్రత్యామ్నాయం కాకపోవడానికి వీటి పరిమితులే కారణం. రక్తంలోని ఏ, బీ, ఏబీ, ఓ గ్రూపులలో ఎవరికైనా ఇవ్వడానికి పనికొచ్చేలాగానే ‘ఫ్లూవోసాల్’, ‘హెమ్ప్యూర్–201’ వంటి వాటిని, కృత్రిమ ఎర్ర రక్తకణాలను రూపొందించారు. వీటిలో రక్తంలో ఉండే పదార్థాలన్నీ పూర్తిగా ఉండవు. రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా ఉంటాయి. ఇప్పటి వరకు రక్తానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన వాటిలో హెమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాలు మినహా ఇతర కీలక పదార్థాలు లేకపోవడమే వీటి పరిమితి. ఇవి రక్తంలోని హెమోగ్లోబిన్ను, ఎర్ర రక్తకణాలను భర్తీ చేయగలవు. రక్తం మాదిరిగానే శరీరంలోని జీవకణాలకు ఆక్సిజన్ సరఫరా చేయగలవు.అయితే, ప్లేట్లెట్ల మాదిరిగా రక్తం గడ్డకట్టేందుకు దోహదపడలేవు. ప్లాస్మా మాదిరిగా రక్త పరిమాణాన్ని పెంచలేవు. డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడినవారికి ప్లేట్లెట్లు అత్యవసరం అవుతుంటాయి. కాలిన గాయాలకు లోనైన వారికి, విపరీతంగా రక్తస్రావం అయిన వారికి ప్లాస్మా అవసరం అవుతుంది. వీటి కోసం బ్లడ్బ్యాంకులపై ఆధారపడాల్సిందే! రక్తదాతల నుంచి సేకరించిన రక్తం ద్వారా ప్లేట్లెట్లు, ప్లాస్మా వేరు చేసి రోగులకు ఎక్కిస్తారు.రక్తం నుంచి అవసరమైన పదార్థాలను వేరు చేసి, నిల్వచేసే పని బ్లడ్బ్యాంకులు చేస్తుంటాయి. రక్తం అవసరాలకు ఇప్పటి వరకు కృత్రిమంగా తయారైనవన్నీ పాక్షిక ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉంటున్నాయి. రక్తానికి ప్రత్యామ్నాయంగా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు రూపొందించిన ఉత్పత్తులతో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. రక్తం బదులుగా వీటిని ఎక్కించిన రోగులు కొందరిలో అధిక రక్తపోటు, రక్తనాళాల సంకోచం, అరుదుగా గుండెపోటు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. స్వచ్ఛంద రక్తదాతల నుంచి సేకరించే రక్తంతో పోల్చుకుంటే, ఈ కృత్రిమ ఉత్పత్తుల ఖరీదు కూడా చాలా ఎక్కువగా ఉంటోంది.కృత్రిమ రక్తం భవితవ్యంప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సాంకేతికత సహజ రక్తానికి పరిమిత స్థాయిలో మాత్రమే కృత్రిమ ప్రత్యామ్నాయాలను అందించగలుగుతోంది. వీటిలో ప్లేట్లెట్లు, తెల్ల రక్తకణాలు, ప్లాస్మా ఉండనందున ఇవి సహజ రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయాలు కాలేకపోతున్నాయి. అయితే, రానున్న ఇరవై ఏళ్లలో ఆక్సిజన్ క్యారియర్లుగా ఉపయోగపడే కృత్రిమ రక్త ఉత్పత్తులు ఎర్ర రక్తకణాల కోసం రక్తదాతలపై ఆధారపడే పరిస్థితిని గణనీయంగా తగ్గించగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వారి అంచనా ప్రకారం 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా చాలా ఆస్పత్రులు ఎర్ర రక్తకణాల అవసరాల కోసం కృత్రిమ రక్త ఉత్పత్తులను విరివిగా వాడటం ప్రారంభిస్తాయి. రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్లేట్లెట్లు, ప్లాస్మా తదితర అవసరాల కోసం వినియోగించుకుంటాయి. ఈలోగా మరిన్ని పరిశోధనలు జరిగి, పూర్తిస్థాయిలో సహజ రక్తానికి దీటైన సార్వత్రిక కృత్రిమ రక్తాన్ని (యూనివర్సల్ ఆర్టిఫిషియల్ బ్లడ్) రూపొందించే అవకాశాలు కూడా ఉన్నాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇప్పటికే లాబొరేటరీల్లో కృత్రిమంగా గుండె వాల్వులు, తాత్కాలికంగా పనిచేయగలిగే కృత్రిమ గుండెలు సహా పలు కృత్రిమ అవయవాలను తయారు చేయడం సాధ్యమైందని, అదే రీతిలో సహజ రక్తానికి పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాగల కృత్రిమ రక్తాన్ని తయారు చేయడం కూడా సాధ్యమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఫైటర్ని నేను
నవ్వితే అమాయకత్వం, మాట్లాడితే ఆత్మవిశ్వాసంతో ‘గోదారి గట్టుపైన’లో ‘మాయ’గా ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి నిధి ప్రదీప్. కేరళ మూలాలున్న ఈ కొత్తతరం కథానాయిక తన కలలు, కెరీర్, సరదా అలవాట్లు, జీవితతత్త్వం గురించి మనతో పంచుకుంటోంది.. ఆమె మాటల్లోనే!డాక్టర్ కావాల్సింది!మా ఇంట్లో అందరి కోరిక నేను డాక్టర్ కావాలనేదే. కానీ నాకు, కెమిస్ట్రీకి అస్సలు పడేది కాదు! ఎంత ప్రయత్నించినా ఆ సబ్జెక్ట్తో కనెక్షన్ కుదరలేదు. చివరికి స్టెతస్కోప్కి బదులుగా కెమెరా ముందు నిలబడాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే.. అదే సరైన నిర్ణయం అనిపిస్తుంది.జూనియర్ నయనతార!టిక్టాక్ వీడియోలు చేసే రోజుల్లో చాలామంది నన్ను ‘జూనియర్ నయనతార’ అని పిలిచేవారు. నా ఎక్స్ప్రెషన్స్ , ఫేస్ యాంగిల్స్ చూసి అలా అనేవారు. నిజం చెప్పాలంటే నయనతార గారిని కలవడం, ఆమెతో ఒక ఫొటో దిగడం ఇప్పటికీ నా డ్రీమ్లిస్ట్లో ఉంది!తెలుగు కోసం అద్దం ముందు క్లాస్!పెరిగింది చెన్నైలో కాబట్టి తెలుగు అస్సలు రాదు. డైలాగ్స్ అన్నీ ముందుగా ఇంగ్లీష్లో రాసుకుని, వాటిని తెలుగులోకి అనువదించుకుని అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా ఒక్కో పదం సరిగ్గా పలకడానికి చాలా కష్టపడ్డాను.నటుడంటే స్పాంజ్లా ఉండాలి!నటుడు అంటే ఒక స్పాంజ్లా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్ల హావభావాలు, మాట్లాడే తీరు, రియాక్షన్స్ అన్నీ గమనించి నేర్చుకోవాలి. అందుకే నేను ఎక్కడ ఉన్నా, మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను.‘మాయ’లా కాదు.. నేను ఫైటర్!‘గోదారి గట్టుపైన’లో నా పాత్ర మాయ చాలా సైలెంట్, ఫ్యామిలీ కోసం తన కోరికలు వదులుకునే అమ్మాయి. కానీ నిజ జీవితంలో నేను అలా కాదు. నా కలల కోసం, నా నిర్ణయాల కోసం గట్టిగా నిలబడతాను. నేను రియల్ ఫైటర్ని!ఆయనకు పెద్ద ఫ్యాన్ !టాలీవుడ్లో విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ , ఆ యాటిట్యూడ్ అద్భుతంగా ఉంటాయి. భవిష్యత్తులో ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది.అమ్మ కళ్లే నాకు వచ్చాయి!చాలామంది నా కళ్ల గురించి మాట్లాడుతుంటారు. నిజానికి అవి పూర్తిగా మా అమ్మ నుంచి వచ్చిన గిఫ్ట్. నా ముఖంలో నాకు అత్యంత ఇష్టమైన ఫీచర్ కూడా అదే.సీ ఫుడ్ అంటే వీక్నెస్!నేను పక్కా నాన్ వెజ్ లవర్ని. చికెన్ , మటన్ , ఫిష్, స్క్విడ్స్– ఏదైనా ఎంతో ఇష్టంగా తింటాను. షూటింగ్ సమయంలో భీమవరం ఫుడ్తో ప్రేమలో పడిపోయాను. అక్కడి రొయ్యలు, పీతలు, తాజా చేపల కూరలు తింటుంటే నాకు మా కేరళ గుర్తొచ్చేది. -
సరదాగా ఈ ఆదివారం ఈ వెరైటీ స్నాక్స్ చేసేయండిలా..!
గుజరాతీ ఖాండ్వీకావలసినవి: శనగపిండి – కప్పు, కారం పొడి – 1/4 టీస్పూన్, ఉప్పు – 1/2 టీస్పూన్, ఇంగువ – చిటికెడు, పెరుగు – 1 కప్పు, నీళ్లు – 2 కప్పులు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు – 1 టీస్పూన్, నువ్వులు – 1 టీస్పూన్, పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి), కరివేపాకు – కొన్ని, గార్నిషింగ్ కోసం: పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర (సన్నగా తరిగినది) తయారీ: ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, కారం, ఉప్పు, చిటికెడు ఇంగువ, కప్పు పెరుగు తీసుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి, మజ్జిగలా పల్చగా కలుపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద కడాయిలోకి పోసి, స్టవ్ మీద సన్నని మంటపై పెట్టి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇది రిబ్బన్ లాగా జారుడుగా వచ్చేంత వరకు ఉడికించాలి. ఒక గరిటెడు ఉడికిన శనగపిండి మిశ్రమాన్ని తీసుకుని, వెంటనే ఒక ప్లేట్ వెనుక భాగంలో సాధ్యమైనంత పల్చగా పరచాలి. ఇలా పరిచిన మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, దానిని రెండు ఇంచుల వెడల్పు ఉన్న ముక్కలుగా నిలువుగా కట్ చేసి, ఎక్కడా విరిగిపోకుండా జాగ్రత్తగా గట్టిగా రోల్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక చిన్న బాణలిలో నూనె వేడి చేసి అందులో టీస్పూన్ ఆవాలు, టీస్పూన్ నువ్వులు, తరిగిన పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. పోపు వేగాక, దానిని తయారు చేసి పెట్టుకున్న ఖాండ్వీ రోల్స్పైన సమానంగా పోయాలి. ఆపై పైన పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన ఖాండ్వీని వేడి వేడి చాయ్ తో కలిపి ఆస్వాదించడమే!ఆలూ అండా కుర్మాకావలసినవి: ఉడకబెట్టిన కోడిగుడ్లు – 4, బంగాళదుంపలు – 2 (పొట్టు తీసి, ముక్కలుగా కోసుకున్నవి), నూనె లేదా నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, గ్రేవీ కోసం: ఉల్లిపాయ – పెద్దది (సన్నగా తరిగినది లేదా పేస్ట్), అల్లం వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్, టొమాటోలు – 2 (ప్యూరీ లేదా సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి – 3 (నిలువుగా చీల్చినవి), జీలకర్ర – టీస్పూన్, కారం పొడి – టీస్పూన్, పసుపు – 1/2 టీస్పూన్, ధనియాల పొడి – టీస్పూన్, గరం మసాలా పొడి – 1/2 టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, గార్నిషింగ్ కోసం– సన్నగా తరిగిన కొత్తిమీర. తయారీ: ఉడకబెట్టిన కోడిగుడ్లకు ఒక ఫోర్క్ లేదా టూత్పిక్తో అక్కడక్కడా చిన్న గాట్లు పెట్టండి. ఇప్పుడు ఒక బాణలిలో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయండి. అందులో చిటికెడు పసుపు, కొద్దిగా కారం వేయండి. ఇందులో ఉడకబెట్టిన గుడ్లను వేసి 2–3 నిమిషాల పాటు పైన లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి, పక్కన తీసి పెట్టుకోండి. అదే నూనెలో బంగాళదుంప ముక్కలను కూడా వేసి, అంచులు కొద్దిగా వేగే వరకు 3–4 నిమిషాలు వేయించి, పక్కన పెట్టుకోండి. అదే బాణలిలో మిగిలిన రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె కాగాక జీలకర్ర వేసి చిటపటలాడించండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, దోరగా వేయించండి. ఇప్పుడు అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. ఆ తర్వాత టొమాటో ప్యూరీ, కారం, పసుపు, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు దీనిని ఉడికించాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను ఈ మసాలాలో వేసి, మసాలా అంతా ముక్కలకు పట్టేలా రెండు నిమిషాలు కలపండి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా 2 కప్పుల గోరువెచ్చని నీళ్లు పోయండి. నీళ్లు మరగడం ప్రారంభమయ్యాక, బాణలిపై మూత పెట్టి, మంటను మీడియమ్లో ఉంచి బంగాళదుంపలు మెత్తగా ఉడికించండి. బంగాళదుంపలు ఉడికిన తర్వాత, ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను, చీల్చిన పచ్చిమిర్చిని గ్రేవీలో వేయండి. సన్నని మంట మీద మరో 3–4 నిమిషాలు ఉంచండి, దీనివల్ల గుడ్లు గ్రేవీని బాగా పీల్చుకుంటాయి. చివరగా గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి ఆలూ అండా కుర్మా రెడీ! ఇది వేడి వేడి రోటీలు, చపాతీలు లేదా అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. (చదవండి: హ్యాట్సాఫ్ సార్..! భలే గుణపాఠం చెప్పారు..) -
కథాకళి: ప్రేమ పండు
క్రీ.శ. 1772. అది యశీరప్లో ఒలోనా నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. పెరూ రెస్కాల్డా.ఆ గ్రామస్థురాలైన లవీనియాకి నిద్ర లేవగానే ఉత్కంఠ పెరిగిపోతోంది. తన శరీరం సాధారణంగా ఉందా లేక ఏదైనా మార్పు వచ్చిందా అన్న ఆందోళన ఆమెని వేధిస్తోంది.పదహారేళ్ళ లవీనియా– మాంసం కొట్టు యజమాని కొడుకు ఫ్రెడినోతో ప్రేమలో పడింది. అతని వయసు పద్దెనిమిది. ఆమె వారానికి రెండుసార్లు మాంసం కొనడానికి అతని కొట్టుకి వెళ్ళేది. ఫ్రెడినో తన తండ్రితోపాటు అక్కడ పని చేసేవాడు. తండ్రి చూడకుండా తనకి ఎక్కువ మాంసం తూచడాన్ని లవీనియా గమనించింది. ఆమె గమనించినట్లు అతను గ్రహిస్తే నవ్వుతూ కన్నుకొట్టేవాడు. ఆదివారాలు చర్చిలో కూడా ఒకరికొకరు తారసపడేవారు.ఓ రోజు ఫ్రెడినో లవీనియాకి మాంసం ఇస్తూ గుసగుసగా చెప్పాడు.‘‘ఇంకో గంట తర్వాత నది ఒడ్డున కలుద్దాం. మూడు పైన్ చెట్ల దగ్గర.’’అతను చెప్పిన సమయానికి వెళ్ళాలని అనుకుంది. కాని తల్లి ఊలు నించి దారం తీసే పని చెప్పడంతో కుదరలేదు.రెండు రోజుల తర్వాత మళ్ళీ మాంసం కొనడానికి వెళ్ళినప్పుడు ఆమె అతను వినేలా మరో కస్టమర్తో చెప్పింది.‘‘మొన్న నాకు మా అమ్మ చాలా పెద్ద పని ఇచ్చింది. అందువల్ల బయటకి వెళ్ళలేదు.’’అతను లవీనియాతో రహస్యంగా చెప్పాడు.‘‘రేపు అక్కడే సూర్యుడు కొండ మీదకి వెళ్ళే సమయంలో కలుద్దామా?’’‘‘నీ ఆహ్వానం కోసమే నేను ఎదురు చూస్తున్నాను.’’ సిగ్గుగా చెప్పింది.మొదటిసారి వారిద్దరూ ఏకాంతంలో కలిశారు. ఒకరినొకరు కౌగిలించుకుని చాలాసేపు అలాగే నిలబడ్డారు. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం పెరిగింది.‘‘నువ్వు చాలా అందగత్తెవి.’’ ఫ్రెడినో చెప్పాడు.లవీనియా నవ్వుతూ చెప్పింది.‘‘అందం కాలంతో వచ్చి కాలంతో వెళ్ళిపోతుందని మా నాయనమ్మ చెప్తూంటుంది.’’‘‘అవును. అందుకే ఈ వయసులో ప్రేమించుకుంటారు. ముసలి వయసులో కాదు.’’ఆమె ఫక్కున నవ్వింది. తర్వాతి కలయికల్లో గర్భవతి అవుతానన్న భయంతో లవీనియా అతన్ని అందుకు అనుమతించలేదు. ఆమె మనసులో మాత్రం ఆ తహతహ ఉంది. చివరికి అది ఆమె మానసిక శక్తిని లొంగదీసింది. ‘‘నేను రేపు రోమ్కి వెళ్ళాల్సి వచ్చింది.’’ ఓ రోజు ఫ్రెడినో ఆమెతో చెప్పాడు.‘‘మళ్ళీ ఎప్పుడు వస్తావు?’’ లవీనియా ఆందోళనగా అడిగింది.‘‘మన రాజు జోసెఫ్ ది సెకండ్ రాజప్రసాదంలో మా నాన్న నాకు ఉద్యోగం సంపాదించారు. రాజుగారి వంటశాలలో మాంసం కోసే పని.’’‘‘వెళ్ళక తప్పదా? మానేయచ్చుగా?’’ లవీనియా బాధగా అడిగింది.‘‘వెళ్ళకపోతే రాజు ఊరుకుంటాడా?’’ ఫ్రెడినో నిస్సహాయంగా చెప్పాడు.వారి ఆ చివరి కలయికలో కన్నీళ్ళు చాలానే కారాయి. ఫ్రెడినో రోమ్కి వెళ్ళాక లవీనియాకి జీవితం వెలితిగా మారింది. ఏ పని మీద ఉత్సాహం లేదు.మూడు నెలలు గడిచాక తను గర్భవతైందని గ్రహించింది. ఆ కాలంలో పెళ్ళి కాకుండా తల్లి అవడం పెద్ద అపరాధం. ఊరి ప్రజలకి అలాంటి వారిని రాళ్ళతో కొట్టి శిక్షించే హక్కు కూడా ఉండేది. అది తన కుటుంబానికి తీరని మచ్చ. బలవంతంగా కడుపు తీయించుకునే ప్రయత్నంలో చాలామంది మరణించడం గురించి కూడా ఆమె విన్నది. తల్లి కఠినురాలు. తండ్రికి తను గర్భవతినని చెప్పే ధైర్యం లేదు.చివరికి ఆమెకి ఒకటే పరిష్కారం కనిపించింది. ఆత్మహత్య.ఆరోజు చర్చికి వెళ్ళి మేరీ మాతని ప్రార్థించింది. తరువాత నది ఒడ్డుకి వెళ్ళి అక్కడి మొక్కల నుంచి ఎర్రటి విషపు పళ్ళని చాలా కోసుకుంది. తమ కలయిక జరిగిన మూడు పైన్ చెట్ల మధ్య కూర్చుని వాటిని తినసాగింది. వాటి రసం ఆమె దుస్తుల మీదకి కారింది. దాదాపు పాతిక పళ్ళు తిన్నాక ఆమె కళ్ళు మూసుకుని మృత్యువు కోసం ఎదురుచూస్తూ పడుకుంది.అప్పుడే అక్కడికి ఫ్రెడినో వచ్చాడు. పక్కన ఉన్న పళ్ళని చూసి భయంగా అడిగాడు.‘‘వీటిని తిన్నావా? అయ్యో! ఫ్రెంచ్ ప్రభుత్వం వీటిని నిషేధించింది కూడా. ఎందుకు తిన్నావు?’’‘‘నేను గర్భవతిని. మరో మార్గం లేదు. నువ్వు కొద్దిగా ముందు వచ్చి ఉంటే వీటిని తినేదాన్ని కాదు.’’ లవీనియా కన్నీళ్ళతో చెప్పింది.‘‘నువ్వు లేకుండా నేను బతకలేను.’’ ఫ్రెడినో ఆమె చేతిని పట్టుకుని చెప్పాడు.అతనూ ఆ పళ్ళని కోసుకుని తిన్నాడు. కొన్ని గంటలు గడిచినా ఇద్దరికీ ఏమీ కాలేదు.‘‘మేరీ మాత అనుగ్రహం.’’ లవీనియా భక్తిగా చెప్పింది.ఫ్రెడినో ఇరువురి తల్లిదండ్రుల అనుమతితో ఆమెని పెళ్ళి చేసుకుని రోమ్కి తీసుకెళ్ళాడు.అక్కడ రాజుగారి వంటవాడికి ఆ పళ్ళ గురించి చెప్తే నమ్మలేదు. కాని ఫ్రెడినో తన ముందే వాటిని తిన్నా ఏమీ కాకపోవడం చూసి చెప్పాడు.‘‘ఇది విషపు పండు కాదు. ప్రేమ పండు. దీన్ని వంటల్లో వాడుతాను.’’అలా ఆ పండు క్రమంగా యూరప్, సౌత్ అమెరికాలోని దేశాలకి, అమెరికాకి కూడా వ్యాపించింది. యురోపియన్ సలాడ్లో తప్పనిసరి భాగంగా మారిన ఆ పండు పేరు టొమాటో.(నైట్షేడ్ అనే విషపుజాతికి చెందిన టొమాటోలని యూరోపియన్ 16వ శతాబ్దం దాకా విషపు పళ్ళుగా నమ్మేవారు. ‘ఎప్పటి నించి ఆ అపనమ్మకం తొలగింది?’ అనే ఆలోచన వచ్చాక) -
వాలెట్ పవర్..!
ప్రపంచంలో గుండెపోటు కంటే, జేబులో పర్స్ లేనప్పుడు వచ్చే ‘జేబుపోటు’ చాలా డేంజర్! ప్రేమలో అయినా, పెళ్లిచూపుల్లో అయినా, ఫ్రెండ్స్తో బిర్యానీ పార్టీల్లో అయినా మన గౌరవాన్ని కాపాడేది ఒక్క ‘మనీ పర్స్’ పల్స్ మాత్రమే! ఇలా ప్రపంచాన్ని మొత్తం మోసే పాకెట్ వాలెట్ ఫ్యాషన్లోనూ మీ రేంజ్ పెంచేయగలదు. మీరు కనుక ఈ లేటెస్ట్ ట్రెండ్స్, వాటి సీక్రెట్స్ తెలుసుకుంటే!ది మోడ్రన్ లైనప్ఇది ఒక మినిమలిస్ట్ కార్డ్ హోల్డర్. క్యాష్ కంటే కార్డ్స్, యూపీఐలే ఎక్కువ వాడేవాళ్లకి ఇది బెస్ట్. చిన్నగా, స్లిమ్గా ఉంటుంది. జేబులో పెట్టుకున్నా ‘ఏమీ లేనట్టు’ ఫీల్ వస్తుంది. క్లీన్ , మోడ్రన్ , అల్ట్రా స్టయిలిష్.క్లాసిక్ బై–ఫోల్డ్ఇది ఎప్పటికీ ఔట్ ఆఫ్ ఫ్యాషన్ కాని జెంటిల్మన్ స్టయిల్ వాలెట్. క్యాష్, కార్డ్స్ రెండూ క్యారీ చేయాలనుకునేవాళ్లకి ఇది పర్ఫెక్ట్. కానీ, ఇందులో పాత బిల్లులు, సినిమా టికెట్లు, ఫుడ్ కూపన్స్ అన్నీ నింపేస్తే, వాలెట్ కంటే చిన్న ఫైల్లా కనిపించే చాన్స్ ఉంది!స్మార్ట్ మనీ క్లిప్నోట్లను ఫోల్డ్ చేసి మధ్యలో క్లిప్తో లాక్ చేసే ఈ స్టయిల్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది. జీన్స్ ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. షార్ప్, రిచ్ మ్యాన్ ఎన ర్జీ వైబ్ ఇస్తుంది.లెదర్ అంటే ఎప్పటికీ క్లాస్ఫుల్ గ్రెయిన్ లెదర్ వాలెట్స్ ఎప్పుడూ టాప్లోనే ఉంటాయి. బ్లాక్, డార్క్ బ్రౌన్, టాన్కలర్స్ అయితే ఏ అవుట్ఫిట్కైనా ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇప్పుడు కార్బన్ ఫైబర్, క్యాక్టస్ లెదర్లాంటి కొత్త మెటీరియల్స్ కూడా ట్రెండ్లోకి వచ్చేశాయి. అంటే, వాలెట్లో కూడా టెక్నాలజీ ఎంట్రీ ఇచ్చేసింది అన్నమాట!కలర్స్ కూడా క్యారెక్టర్ చెప్పేస్తాయిబ్లాక్ వాలెట్ అంటే క్లాసీ వైబ్. బ్రౌన్ అంటే రిచ్ లుక్. టాన్ అంటే ట్రెండీ స్టయిల్! నేవీ బ్లూ లేదా ఆలివ్ గ్రీన్ అయితే ‘ఈయనకి ఫ్యాషన్ గురించి తెలుసు’ అనే ఫీలింగ్ వస్తుంది.ఔట్ఫిట్కి మ్యాచ్ చేయాలిఫార్మల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ప్రీమియం లెదర్ బై–ఫోల్డ్ బెస్ట్. జీన్స్, టీషర్ట్తో అయితే స్లిమ్ కార్డ్ హోల్డర్ లేదా మనీ క్లిప్ సూపర్గా సెట్ అవుతుంది. ట్రావెల్ టైమ్లో జిప్ వాలెట్స్, పాస్పోర్ట్ హోల్డర్స్ చాలా యూజ్ఫుల్. అయితే, ఇక్కడ రూల్ ఏంటంటే, మీ వాలెట్ కలర్, మీ బెల్ట్ లేదా షూస్ కలర్కి మ్యాచ్ అయితే, లుక్ ఆటోమేటిక్గా రిచ్గా కనిపిస్తుంది.జాగ్రత్తలు!వాలెట్ని ఎక్కువగా నింపేయొద్దు. అలా చేస్తే, జేబులో చిన్న దిండు పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. చాలా చీప్గా కనిపించే మెటీరియల్ అస్సలు వద్దు. మంచి క్వాలిటీ వాలెట్ అయితేనే క్లాస్గా ఉంటుంది.బ్యాక్ పాకెట్లో పెట్టుకుని కూర్చుంటే వాలెట్ షేప్ కూడా మారిపోతుంది. కాబట్టి, ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడం బెటర్. (చదవండి: నారికేళంతో నయన సంరక్షణ..!) -
నారికేళంతో నయన సంరక్షణ..!
సౌందర్య రంగంలోకి కూడా ఏఐ అడుగుపెట్టింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్, కాస్మెటిక్స్ దిగ్గజం ఎల్జీ హెచ్–హెచ్ సంస్థ కంటి కింద వచ్చే నల్లటి వలయాలు, ముడతలను తగ్గించడానికి హైపర్ రిజువనేటింగ్ ఐ ప్యాచ్ను తయారు చేసింది. ఈ ఆవిష్కరణకు గాను ప్రతిష్ఠాత్మక ‘సీఈఎస్– 2026’ వేదికపై బ్యూటీ టెక్ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది.సాధారణంగా మార్కెట్లో దొరికే ఐ ప్యాచ్లు లేదా ముఖం మొత్తానికి వాడే ఎల్ఈడీ మాస్క్ల కంటే ఈ హైపర్ రిజువనేటింగ్ ఐ ప్యాచ్ ఎంతో భిన్నమైనది. ఇందులో అమర్చిన అధునాతన మల్టీ–మోడల్ ఏఐ సిస్టమ్, వినియోగదారుల చర్మతత్త్వాన్ని లోతుగా విశ్లేషించి, డిజిటల్ డేటాను తయారు చేస్తుంది. ఈ డేటా ఆధారంగా, లోపల ఉన్న ఫ్లెక్సిబుల్ ఎల్ఈడీ ప్యాచ్లు ఆ వ్యక్తి చర్మానికి ఎంత మేరకు కాంతి అవసరమో అంత మేరకు మాత్రమే కాంతిని అత్యంత కచ్చితత్వంతో ప్రసరింపజేస్తాయి. ఇది చర్మ కణాలను లోపలి నుంచి ఉత్తేజపరచేందుకు తోడ్పడుతుంది. ఈ పరికరం వాడేందుకు చాలా సౌకర్యంగా ఉంటుంది. చేతులతో పట్టుకోవాల్సిన అవసరం లేని టెక్నాలజీతో రూపొందించడం వల్ల, దీనిని కంటి కింద ధరించి తమ రోజువారీ పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా చేసుకోవచ్చు. ఇది చర్మానికి అవసరమైన పోషకాలను కణాల స్థాయి వరకు చేరవేస్తూ, ప్రతి ఒక్కరి చర్మ తత్వానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన సంరక్షణను అందిస్తుంది.బీరుతో కురుల రక్షణబీరు పురాతన పానీయం. బీరును పానీయంగానే కాదు, కురుల సంరక్షణ కోసం కూడా పురాతన కాలంలో ఉపయోగించేవారు. ప్రాచీన ఈజిప్షియన్, రోమన్ నాగరికతల కాలంలో బీరుతో కురులను బాగా రుద్ది శుభ్రం చేసుకునేవారు. ఇప్పుడు కూడా చాలామంది బీరును కేశసంరక్షణ కోసం వాడుతున్నారు. ‘బీర్ రిన్స్’ పేరుతో బీరుతో తలస్నానాలు చేస్తున్నారు. ముందుగా షాంపూతో తలస్నానం చేశాక, బీరుతో కురులను శుభ్రం చేసుకుంటున్నారు. బీరులోని విటమిన్–బి కాంప్లెక్స్ సహా పోషకాలు జుట్టును ఒత్తుగా ఎదిగేలా చేస్తాయి. ఇవి జుట్టుకు సహజమైన నిగారింపునిస్తాయి.నారికేళంతో నయగారంమన వంటింట్లో ఉండే వాటితోనే ముఖాన్ని మెరిపించవచ్చు. వాటిల్లో కొబ్బరి నూనె కూడా ఒకటి. కొబ్బరి నూనెలో కొద్దిగా పంచదార లేదా కాఫీ పొడి కలిపి చర్మానికి రుద్దితే మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. స్నానం చేసిన తర్వాత ఒంటికి కొద్దిగా కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం పొడిబారకుండా, మెరుస్తూ ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ప్రతిరోజూ పెదవులకు కొబ్బరి నూనె రాస్తే పెదవులు పగలకుండా ఉంటాయి. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గడానికి రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరి నూనెతో కళ్ల చుట్టూ మృదువుగా మసాజ్ చేస్తే ఫలితం ఉంటుంది. ముఖానికి ఉన్న మేకప్ను సులభంగా తీసేయడానికి కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను దూదితో ముఖానికి రాసి తుడిచేస్తే మేకప్ అంతా తొలగిపోతుంది. (చదవండి: పేరెంటింగ్ క్లాసులో చేరాలి..!) -
నిక్కమైన చిక్కదనం ఆమె వాక్కు!
‘స్త్రీలకు స్త్రీల ఆసరా ఎప్పుడూ అవసరమే! వాళ్ళు పరస్పరం ద్వేషించుకునేందుకే, ఒకరితో ఒకరు స్నేహం చేస్తుంటారు. అలా ఒకర్నొకరు ద్వేషించుకునే క్రమంలోనే వారిమధ్య ఏదో బంధం పెనవేసుకుంటుంది!’ అన్న మాటలు ఏ స్త్రీద్వేషో అన్నవి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. 2009లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న జెర్మన్ రచయిత్రి హెర్తా మ్యూల అన్న మాటలివి. ‘అసలు, మృత్యువుతో తలపడడానికి ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితమేం అవసరం లేదు– ఇంకా ముగింపునకు రాని చిన్నపాటి బతుకు చాల’ని కూడా అన్నారు హెర్తా. ఆమె శైలి గురించి చెప్తూ, అది ‘కవిత్వంలోని చిక్కదనంతోనూ, వచనంలోని సూటిదనంతోనూ నిండివుంటుంద’ని స్వీడిష్ ఎకాడెమీ నిపుణులు ఎందుకన్నారో ఇలాంటి మాటలు వింటే అర్థమైపోతుంది. పరాయిచోట్ల తమ మూలభాషనే మాట్లాడుతూ మనుగడ సాగించే జాతి– ప్రజాతుల భాషకు కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. (ఇది తెలుగుతో సహా అన్ని భాషలకూ వర్తిస్తుంది. ఏమైనా సందేహం ఉంటే, పక్కనే వున్న తమిళనాట్లో తెలుగులు మాట్లాడే భాష వింటే అలాంటి సంశయాలు నిర్మూలమై పోతాయి!) కాఫ్కా తన రచనల్లో వాడిన జెర్మన్ లాంటి భాషనే, హెర్తా మ్యూల సైతం వాడుక చేశారని స్వీడిష్ ఎకాడెమీ పెద్దలు వ్యాఖ్యానించారు. ఇది ప్రశంసా కాదు– అభిశంసా కాదు! ఉన్నది వున్నట్లు చెప్పినమాట మాత్రమే!! ఎటొచ్చీ, కాఫ్కా 40 యేళ్ళపాటు చెక్ రాజధాని ప్రాగ్ నగరంలో బతికాడు– హెర్తా 34 యేళ్ళపాటు రొమానియాలో మనుగడ సాగించారు. అంతే! మనదేశంతో పాటే విదేశీ పాలన కాడి బరువు వదిలించుకున్న దేశాల్లో రొమానియా కూడా ఒకటి. 1947లోనే – నాజీలను మినహాయించి– అఖిలపక్ష జాతీయ ప్రభుత్వం అక్కడ ఏర్పాటయింది. కానీ, మొదటినుంచీ, రొమానియాలో సోవియెట్ పెత్తనం కొనసాగుతూనే వచ్చింది. ‘ఇంక, ఇదేం స్వాతంత్య్రం మహాశయా?’ అని గొంతెత్తి ప్రశ్నించిన వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారు అక్కడి పాలకులు. ఆ దేశంలో అల్పసంఖ్యాకులుగా ఉన్న జెర్మన్లలో– హెర్తా తండ్రి మాదిరిగా– నాజీ సైన్యంలో పనిచేసినవారూ కొందరున్నారు. వాళ్ళలో వీలైనంతమందిని విరగడ చేసుకున్నారు పాలకులు. మిగిలిన స్త్రీ– శిశు– వృద్ధులను నిర్బంధ శ్రామిక క్షేత్రాలకు తరలించారు. వారి శ్రమఫలాన్ని ‘రొమానియా స్వాతంత్య్ర పోరాటానికైన ఖర్చులకు మింజుమిలె’ జమకట్టుకున్నారు ధర్మప్రభువులు! ఇదే కథను ఇతివృత్తంగా చేసుకుని హెర్తా 2009 లో ‘ఆకలి దేవత’ (ద హంగర్ ఏంజెల్) అనే నవల రాశారు. అదే సంవత్సరం ఆమెకి నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటించింది స్వీడిష్ ఎకాడెమీ! వాస్తవానికి అప్పటికి 27 సంవత్సరాలుగా హెర్తా సృజనాత్మక రచనలు చేస్తూనే వున్నారు. 1982లో ఆమె తొలి కాల్పనిక రచన, ‘న్యాదిర్స్’ (అధోలోకాలు) వెలువడింది. రొమానియన్ గ్రామీణ జీవనంలోని చీకటి కోణాలను విమర్శనాత్మకంగా చిత్రించిన అధిక్షేప రచన అది. పల్లెలో బతికే ఓ బాలుడి దృష్టికోణం నుంచి కథనం సాగడం ఇందులో చాలామందిని ఆకర్షించిన విషయం. ముఖచిత్రంపై బోదురుకప్ప బొమ్మతో వెలువడిన ఈ పుస్తకం ఆమెకి అభిమానులనూ, విమర్శకులనూ సమానంగా సంపాదించి పెట్టింది. విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న జెర్మనులు హెర్తా విమర్శను పూర్తిగా సమర్థించగా, సాంప్రదాయిక జెర్మనులు ఆమెని దుమ్మెత్తి పోశారు. కాగా, కమ్యూనిస్టు యువజన సంఘం ఈ రచనకు పురస్కారం ప్రకటించి నెత్తినపెట్టుకోవడం విశేషం.హెర్తా మ్యూల 1994లో రాసిన ‘ఆకుపచ్చ పళ్ళతోట’ ఆమెకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఈ రచనకు –జెర్మన్ భాషలో– హెర్తా పెట్టిన పేరు ‘హెర్జ్ టియర్.’ ఇది జెర్మన్ భాషలో వాడుకలో వున్న మాట కాదు– హెర్జ్(గుండెకాయ)+ టియర్ (జంతువు) అనే రెండు మాటల్ని కలిపి జంతుప్రవృత్తి అనే అర్థంలో ఈ మాటను సృష్టించారు హెర్తా. నికలాయ్ చౌషెస్క్యూ హయాంలో అణచివేతను తప్పించుకునే నిమిత్తం జెర్మనీకి పారిపోయిన నలుగురు యువజనుల కథ ఇది. వారిలో ఒకరుగా వున్న ఓ యువతి దృష్టికోణం నుంచి కథనం సాగుతుంది. పాశవిక ప్రవృత్తి కలిగిన పాలకులు, పాలితుల ప్రవృత్తిలో సైతం ఒకింత పాశవికత చొరబడేలా చేస్తారన్నది కథకురాలి ధ్వని. ఈ నవలను ‘చౌషెస్క్యూ హయాంలో బలైపోయిన సహచరుల స్మృతికి’ అంకితం చేశారు హెర్తా. చేదు నిజాలను చెప్పేందుకు హెర్తా ఎన్నడూ వెనకాడలేదు– అందుకే, స్వదేశంలో పరాయిజనంగా బతికిన రొమానియన్ జెర్మన్లు, జెర్మనీ నడిగడ్డపైనా అదే ‘హోదా’ సంపాదించుకోగలిగారని అనడానికి ఆమె జంకలేదు! 1947లో స్వాతంత్య్రంతో పాటే మనజాతికి సంక్రమించిన దేశవిభజన సందర్భంగా, పాకిస్తాన్ తరలి వెళ్ళిన అమాయక ముసల్మానులు అక్కడ ముహాజిర్ హోదానే పొందారు. మన దేశంలోనే మిగిలిపోయిన వాళ్ళు బావుకున్నది మాత్రమేముందని? ఇది ఓ అంతర్జాతీయ విషాద కావ్యం అనొచ్చునేమో!మందలపర్తి కిషోర్ -
పేరెంటింగ్ క్లాసులో చేరాలి..!
‘పిల్లల్ని కనడానికి ముందు పేరెంటింగ్ క్లాసులో చేరాలా?’ ‘తప్పనిసరి’ అంటున్నారు ఫౌంటెన్ హెడ్ గ్లోబల్ స్కూల్ చైర్మన్, పర్యావరణవేత్త మేఘన ముసునూరి. ఇద్దరి కూతుళ్ల పెంపకంలో తను తీసుకున్న జాగ్రత్తలను ఆమె ఇలా వివరించారు...‘‘పెళ్లి కాగానే మావారి ఉద్యోగరీత్యా యూకే వెళ్లాం. పిల్లలను కనడానికి ముందు వాళ్ల పెంపకం పట్ల ఆందోళన ఉండేది. నేను చదువుకున్న చదువులో ఈ సబ్జెక్ట్ ఎక్కడా లేదు. అందుకే, పేరెంటింగ్ క్లాస్లకు వెళ్లి, పిల్లలను ఎలా చూసుకోవాలో నేర్చుకున్నాను. కిండర్గార్టెన్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. స్పెషల్ నీడ్స్ పిల్లలతో కలిసి వర్క్ చేశాను. ఆ నాలుగేళ్లలో ఎలాంటి పిల్లలు పుట్టినా, వారిని బాగా చూసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు ప్లాన్ చేసుకొని, పిల్లల్ని కన్నాను. ఇద్దరు కూతుళ్లు తీర్థ, బిల్వ. ఇండియాలో ఉన్నప్పుడు నా చిన్నతనంలోని ఎంజాయ్మెంట్ గుర్తుకు వచ్చింది. ఇవేవీ మా పిల్లలు అనుభవించడం లేదని, నేను, మా వారు ఒక నిర్ణయం తీసుకొని, ఇండియాకు వచ్చేశాం. స్కూల్ స్టార్ట్ చేశానుహైదరాబాద్లో ఇల్లు తీసుకొని, సాఫ్ట్వేర్ రంగంలో మా వారు స్థిరపడ్డాక నేను కొంత ఆలోచనలో పడ్డాను. అప్పటి వరకు నేర్చుకున్నదాన్ని అమలులో పెట్టాలని అనుకున్నాను. ‘సేవ్ వాటర్’ ఎన్జీవోను స్టార్ట్ చేశాను. నాతో పాటు నా పిల్లలు కూడా నా వెనకాలే తిరుగుతుండేవారు. ప్రతి ఆదివారం కాలనీ పిల్లలతో ‘సేవ్ నేచర్’ పేరుతో అవేర్నెస్ ప్రోగ్రామ్లు నిర్వహించేదానిని. పిల్లల చేత పెద్దవాళ్లకు ‘సేవ్ వాటర్’ గురించి చెప్పించేదాన్ని. మియాపూర్లో ‘ఫౌంటెన్హెడ్ గ్లోబల్’ కిండర్గార్టెన్ స్కూల్ స్టార్ట్ చేశాను. స్కూల్లో ప్రధానంగా పర్యావరణానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండేలా ప్లాన్ చేశాను. నా పిల్లలు కూడా నా స్కూల్లోనే చదువుకున్నారు.పిల్లలూ మొక్కలూ ఒకటే! స్కూల్లోనూ, ఇంట్లోనూ పిల్లలతో మమేకం అయి చేసే పనులు వారు ఎలా గమనిస్తుంటారో, నేర్చుకుంటారో నాకు కొన్నాళ్లకే అర్థం అవుతూ వచ్చింది. ఒక రోజు తొమ్మిదేళ్ల మా పెద్దమ్మాయి నా దగ్గరకు వచ్చి, క్యాన్సర్ పేషంట్స్ కోసం తన పొడవైన జుట్టు డొనేట్ చేస్తానని చెప్పింది. అక్కను చూసి చెల్లెలూ ఇస్తానంది. క్యాన్సర్ సెల్ గురించి చదివామని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నామని పిల్లలిద్దరూ చెప్పారు. ఓ రోజు మా చిన్నమ్మాయి ‘సమ్మర్లో ఎందుకింత వేడిగా ఉంటోంది’ అని అడిగింది. ‘మా చిన్నప్పుడు ఇంత వేడి లేదు. చెట్లు పెంచితే వేడి తగ్గుతుంది’ అని చెప్పాను. అప్పటి నుంచి పిల్లలిద్దరూ కాలనీలలో మొక్కలను పెంచడం, పంచడం మొదలుపెట్టారు. పంచే ప్రతి మొక్కకు మూడేళ్లు వచ్చేవరకు ‘మేం జాగ్రత్తగా పెంచుతాం’ అనే ప్రతిజ్ఞ పేపర్ రాయించుకొని, మరీ ఇచ్చేవారు. దాదాపు 60 వేల మొక్కలు పంచారు. ఇంట్లో పొదుపుగా సహజవనరులను వాడటం, ప్రాక్టీస్ చేయించడం వల్ల ఇవన్నీ పిల్లలకు అలవడ్డాయి. మొక్కలను ఎంత జాగ్రత్తగా పెంచితే నీడనిచ్చే వృక్షాలు అవుతాయో, పిల్లలూ అంతే!. పర్యావరణం గురించి నేర్పుతూ! నేను ఏం చెప్పినా ఎన్విరాన్మెంట్, నేచర్ గురించి చెప్పేదాన్ని. అది వారికి బాగా వంటపట్టింది. స్కూల్పిల్లలతో కలిసి మా ఏరియాలోని మీది కుంట చెరువు శుభ్రతకు కృషి చేశాం. మా పెద్దమ్మాయి చెరువు శుభ్రత కోసం తన పాతికలక్షల చెక్ డొనేట్ చేసింది. దీంతో మా చిన్నమ్మాయి వాళ్ల నాన్నతో కలిసి చెరువు చుట్టూ పార్క్ ఏరియా ఏర్పాటుకు కృషి చేసింది. కరోనా సమయంలో పిల్లలు ‘ఓజోన్ రన్’ చేశారు. ఆ తర్వాత కాలనీలలో 100 డేస్ క్లీనప్ సెషన్స్ నిర్వహించారు. ఇప్పుడు మా పెద్దమ్మాయి లండన్లో పబ్లిక్ హెల్త్పై ఎడ్యుకేషనల్ రీసెర్చ్ చేస్తోంది. చిన్నమ్మాయి బిల్వ హైదరాబాద్లోనే కార్బన్ టాక్సేషన్ కోర్సులో చేరింది. పిల్లల పెంపకంలో ప్రతి తరానికి ఫార్ములా మారుతుంటుంది. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి. పర్ఫెక్ట్ చైల్డ్, పర్ఫెక్ట్ పేరెంట్ అంటూ ఉండరు. పేరెంట్ అవ్వాలనుకునే ముందు పేరెంటింగ్ క్లాసులు తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే సరైన అవగాహనతో పిల్లలను పెంచగలం’’ అని వివరించారు ఈ పర్యావరణవేత్త. సొంతంగా ఎదిగేలా! మా పెద్దమ్మాయి తీర్థ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో పాల్గొంది. పాతిక లక్షల రూపాయల బహుమతి తెచ్చుకుంది. చిన్నమ్మాయి నేను కూడా ఆ ప్రోగ్రామ్లో పాల్గొంటాను అంది. అప్పుడు తన ఏజ్ 9. అండర్ ఏజ్ వాళ్లకు అవకాశం లేదని చెప్పాను. దీంతో తను కూడా సంపాదిస్తానని టీచర్స్తో మాట్లాడి ఒక మెనూ రూపొందించి, స్కూల్లో ఒక ఫుడ్ కార్నర్ స్టార్ట్ చేసింది. డబ్బు గురించి కాదు వాళ్లకున్న ప్యాషన్ని పరిచయం చేయాలనుకుని, ఫుడ్ కార్నర్ ఏర్పాటుకు ఎంకరేజ్ చేశాను. ఆ సమయంలో కలినరీ లాంజ్లో పెద్ద పెద్ద షెఫ్స్కి హాండీటాక్స్ అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మా చిన్నమ్మాయి బిల్వను అక్కడ పరిచయం చేశారు. దీనికి బ్రిటిష్ హై కమిషన్ ‘యంగెస్ట్ ఫుడ్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ హైదరాబాద్’ అని ట్వీట్ చేశారు. పిల్లలు ఆడంబరాలకు పోకుండా పెరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాను. నిర్మలారెడ్డి(చదవండి: చనిపోదాం అనుకున్నవాడు... సీఎం అయ్యాడు!) -
ఆఖరి మనిషి
గాఢాంధకారం. ఎటు చూసినా చీకటే. నక్షత్రాలు తప్ప ఏమీ కనిపించనంత చీకటి అలుముకొని ఉంది. భూమి మీద ఆ రాత్రి– కాళరాత్రి కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శబ్దాల మధ్య నిశ్శబ్దంలా, అస్తిత్వం ముగిసిన తర్వాత మిగిలే శూన్యంలా భూమి కనిపిస్తోంది.ఇంతలో గాలి బలంగా వీచింది. కానీ ఆ గాలిలో జీవం లేదు. ఆ గాలి ఒకప్పుడు మానవులకు ఊపిరి పోసింది. కానీ, ఇప్పుడు జీవకోటి మొత్తం నాశనం అయి పుడమి అంతా బోసిపోయి కనిపిస్తోంది. ఆ సమయంలో ఒక కదలిక కనిపించింది. అందులో శబ్దం లేదు. అది అడుగుల చప్పుడూ కాదు. అది ఒక ఉనికి. భూమి కూడా గుర్తుపట్టని ఒక ఆకారం వస్తూ కనిపించింది. ఆమె ఆకాశం నుంచి దిగలేదు. భూమి లోతుల్లోనుంచి పైకి రాలేదు. ఆమె ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది. కానీ ఈరోజు ఆమెను చూడగలిగే కళ్ళు లేవు.ఒకప్పుడు కోట్లాది హృదయాల్లో నిశ్శబ్దంగా నివసించిన ఆమె, ఈరోజు ఖాళీ ప్రపంచంలో తన ఉనికిని తానే మోస్తోంది. ఆమె అడుగులు నేలను తాకలేదు. కానీ ఈ ధరిత్రి ఆమెను చాలాకాలం భరించింది. ఆమె నడిచి వస్తుంటే నదులు పొంగినట్లు, అడవులు కదిలినట్లు, ఉరుములు ఉరుముతున్నట్లు, పర్వతాలు ఎగురుతున్నట్లు అనిపిస్తోంది. ప్రకృతి ఆమెను ఆహ్వానించలేదు. ఆమెను అడ్డుకోలేదు కూడా. ఆమెకు అడ్డుచెప్పేవారు ఈ భూమ్మీద ఎవ్వరూ లేరు. ఆమె నడుస్తోంది. శిథిలమైన నగరాల మధ్యగా, విరిగిన గాజు ముక్కల మీదుగా, శిథిలాల నిశ్శబ్దాన్ని దాటి ఆమె వస్తోంది. ఆమె ప్రతి అడుగులో రౌద్రం కనిపిస్తోంది.ఈ భూమ్మీద మొదటి మనిషి పుట్టిన క్షణం నుంచి చివరి మనిషి శ్వాస వరకు ఆమెకు నిద్ర లేదు. ఆమెకు కాలం అనే పరిమితి లేదు. ఒక పాత నగరం మధ్యలో ఆమె ఆగింది. అక్కడ ఒక నిశ్శబ్దం మధ్యలో చిన్న శబ్దం వినిపిస్తోంది. అది ఎవరిదో శ్వాస. అది బలహీనంగా ఉంది. అది ఆఖరి మనిషి శ్వాస. ఆమె కళ్ళు మూసుకుంది. అతని కోసం ఆమె వెతకాల్సిన అవసరం లేదు. జీవం తనను తానే బయట పెట్టుకుంటుంది. భయం ఎప్పుడూ దాక్కోలేదు. ఆమె మెల్లగా ఆ దిశగా నడిచింది. ఆమె అడుగులు వేగంగా లేవు. అవి ఎప్పుడూ తొందరపడవు. కానీ ఆమె అవి సమయానికి చేరవలసిన చోటుకి చేరుకుంటాయి.ఒకప్పుడు మనుషులు, పశుపక్ష్యాదులు, చెట్టు చేమలు, అడవులతో కళకళ లాడుతూ ఉండే ధరిత్రి అంతా రుద్రభూమిని తలపిస్తోంది. ఆమె ఆలోచిస్తూ ఒక్క క్షణం ఆగింది. అంతటా నిశ్శబ్దం. సూదిమొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఆమెకు ఒక సవ్వడి వినిపించసాగింది. కొద్ది క్షణాల తరువాత అది గుండె సవ్వడిగా ఆమెకు అర్థమైంది. అది మనిషి శ్వాస. లబ్ డబ్మని వినిపిస్తున్న ఆ శబ్దం నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది. అక్కడ కొద్ది దూరంలో ఉన్న కొండ పక్కన ఒక చిన్న ఇంట్లోంచి ఆ శబ్దం వస్తోంది. ఆమె ఆ శ్వాస వస్తున్న ఇంటి వైపు కదిలింది. ఇంటి మధ్యలో ఒక గోడ ఉంది. లోపల ఒక వ్యక్తి మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఆమెను చూడగానే అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చున్నాడు. ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడవటం మొదలుపెట్టాడు. ఆమె అతని దగ్గరకు వెళ్లి ఎదురుగా నిలబడింది. అతను ఒక్కసారిగా తలెత్తి ఆమెని చూశాడు. అతని కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ముఖం మీద చెమటలు మొదలయ్యాయి. పెదవులు వణకసాగాయి. దాహంతో నాలుక పిడచ కట్టుకుపోతోంది. అయినా సరే ఓపిక తెచ్చుకొని ‘‘నువ్వెవరు?’’ అని అడిగాడు.అతని మాటలకు ఆమె నవ్వింది. ఆ నవ్వు ఆ గది అంతా ప్రతిధ్వనించసాగింది. ఆ నవ్వులో సత్యం వినిపిస్తోంది.‘‘నేనెవరో నీకు తెలియదా?’’ అని ఆమె అతని వైపు చూస్తూ అడిగింది.అతను భయంతో వెనక్కి జరిగి, ‘‘నా...కు ను...వ్వు ఎ...వ...రో... తెలియదు’’ అన్నాడు వణుకుతున్న స్వరంతో.‘‘నేనెవరో తెలిసినా నువ్వు అబద్ధాలాడుతున్నావు. ఎందుకంటే నేను రావడం నీకు ఇష్టం లేదు. నీకే కాదు, ఏ జీవికీ ఇష్టం ఉండదు. నేనంటే మీకు భయం. అయినా సమయం వచ్చినప్పుడు నేను రాక తప్పదు. ఇది నగ్న సత్యం. ఈ సత్యాన్ని మీరు ఒప్పుకోరు. అందరూ వెళ్లిపోయారు. నువ్వు ఒక్కడివే మిగిలావు. నిన్ను కూడా తీసికెళ్ళిపోతే నా పనై పోతుంది. బయలుదేరు. సమయం మించిపోతోంది. ఇప్పటికే ఆలస్యం అయింది’’ అంది ఆమె కోపంగా.‘‘నేను నీతో రాను. నాకు ఇక్కడ బోలెడు పనులు వున్నాయి. నేను నీతో వస్తే అవన్నీ ఆగిపోతాయి. నేను తరువాత వస్తాను. అయినా నేను నీతో ఎందుకు రావాలి? నన్ను తీసికెళ్ళడానికి నువ్వు ఎవరు? నీకేం హక్కు వుంది?’’ అని అన్నాడు అతను గోడ దగ్గరకు వెళుతూ.అతని మాటలకు ఆమె కోపంగా అతనివైపు చూసింది. అంతే! గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె అతని వైపు వెళ్ళసాగింది. ఇప్పుడు ఆమె కళ్ళలో కోపం లేదు. దయ లేదు. జాలి అంతకన్నా లేదు. ఆమె కళ్ళల్లో ఏ భావం కనిపించటం లేదు.‘‘నేనెవరో నీకు తెలుసు. అయినా మీ మనుషులు మీ గోతిని మీరే తవ్వుకున్నారు. హాయిగా బతకమని మిమ్మల్నందరినీ ఇక్కడకు పంపిస్తే మీరు ఇక్కడ వినాశనాన్ని సృష్టించారు. యుద్ధాలు మొదలయ్యాయి. అణుబాంబులు, రసాయన ఆయుధాలతో మనిషి మనిషినే చంపడం ప్రారంభించాడు. అతను రాక్షసులతో పోరాడుతున్నానని అనుకున్నాడు. కానీ తన జాతిని తానే నాశనం చేస్తున్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. చివరకు తానే తన జాతి పాలిట రాక్షసుడయ్యాడు. మీ జాతితో పాటు ఇక్కడి ప్రకృతిని, జంతుజాలాన్ని, అడవుల్ని కూడా విధ్వంసం చేశాడు. అందుకే మీరు ఇక్కడుండే అర్హత కోల్పోయారు’’ అంటూ ఆమె అతని వైపు చేయి చాపింది.‘‘ఎవరో తప్పు చేస్తే దానికి మేమెలా కారణం అవుతాము. ఎవరు తప్పు చేస్తే వాళ్ళను శిక్షించాలి. అయినా అంత తప్పు మేమేం చేశాము? మేము ప్రకృతిని స్వంతం చేసుకోవాలని చూశాము. ఆమెతో కలిసి లేకపోయాము’’ అన్నాడు ఆ వ్యక్తి.ఆ మాటలు అంటూ ఉంటే అతని కళ్ళలో నీళ్లు మెరిశాయి. అప్పుడతనికి తమ జాతి చేసిన తప్పు ఏమిటో అర్థమైంది. నిజం ఎప్పుడూ నిజమే. అది అబద్ధం ఎప్పటికీ కాదు. ‘Truth is rarely pure and never simple’’ (సత్యం అరుదుగా స్వచ్ఛమైనది, అదెప్పుడూ సులువైనది కాదు) అన్న ‘ఆస్కార్ వైల్డ్’ మాటలు అతనికి అప్పుడు గుర్తుకు వచ్చాయి.అతని మాటలు ఆమెకు కోపాన్ని తెప్పించాయి. మీరేం తప్పు చేశారో మీకు తెలియదా? నేను చెప్పాలా? మీ కోసం ఆ దేవుడు ఈ అందమైన భూగోళాన్ని సృష్టించాడు. అది అగ్నిగోళంగా మొదలై, జలగోళంగా మారి, జీవకోటికి అనువుగా మారింది. ఈ భూమి మీద మొదటిసారిగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక సూక్ష్మకణం కదిలి జీవం పోసుకొని ప్రాణిగా మారింది. తరువాత అది జీవ పరిణామం చెందింది. విస్తరించింది. చివరకు మనిషిగా రూపుదిద్దుకుంది. అయితే మనిషి పుట్టుకనుంచే దారి తప్పాడు. ‘Nature is the source of all true knowledge’’ (సమస్త జ్ఞానానికీ ప్రకృతే మూలాధారం) అని మీ మనిషే అయిన లియోనార్డో డా విన్సీ చెప్పాడు. కానీ మీరు అతని మాటలను పెడచెవిన పెట్టారు. ప్రకృతి నుంచే జ్ఞానం పుట్టింది. కానీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే వినయం మనిషి కోల్పోయాడు. మనిషి గొప్ప పనులను చెయ్యగలడు. గొప్పగా ఆలోచించగలడు. సృష్టికి ప్రతిసృష్టిని చెయ్యగల నేర్పరి. అది అతని మహత్తు. అది అతని వరం. కానీ అదే అతని శాపమైంది. అతను అగ్నిని కనుగొన్నాడు. చక్రాన్ని సృష్టించాడు. భాషను కనిపెట్టాడు. లిపిని తయారు చేసుకున్నాడు. కానీ అతను తనను తాను దేవుడిగా భావించడం మొదలుపెట్టాడు. ‘Knowledge is power, but wisdom is restraint.’’ (జ్ఞానం శక్తి, కాని వివేకం నియంత్రణ) జ్ఞానం అతనికి శక్తిని ఇచ్చింది కానీ, జ్ఞానం మీద నియంత్రణను అతను కోల్పోయాడు. అందువల్ల అదే అతని వినాశనానికి కారణభూతమైంది. ఈ భూమి మీద నాలుగు వందల కోట్ల సంవత్సరాల నిశ్శబ్ద తపస్సు తర్వాత జీవకోటి ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి ఈ ధరిత్రి అనేక జనన మరణాలను చూసింది. ‘The Earth does not belong to man; man belongs to the Earth.’’ (భూమి మనిషిది కాదు, మనిషి భూమికి చెందుతాడు) భూమి ఎవరికీ చెందదు. కానీ ఆ విషయాన్ని మీ మనుషులు గుర్తించలేకపోయారు. మట్టిలోంచి పుట్టిన మనిషి, మట్టిలో కలవాల్సిందే అన్న నగ్నసత్యం అతనికి ఎప్పుడూ అర్థం కాలేదు. ఫలితం– అడవులు నాశనం అయ్యాయి. నదులు ఎండిపోయాయి. పర్వతాలు తరిగిపోయాయి. తాను ప్రకృతిని జయిస్తున్నానని అనుకున్నాడు. ‘Man conquers nature only to discover he has conquered himself..’’ (మనిషి తనను తాను జయించానని కనుగొనడానికి ప్రకృతిని జయిస్తాడు) కానీ అది ఎంతటి విపరీతాలకు దారి తీస్తుందో అర్థం చేసుకోలేకపోయాడుప్రకృతిని జయించినట్టు అనిపించిన ప్రతి క్షణం, తనను తానే నాశనం చేసుకున్నాడు. ప్రకృతి ఎప్పుడూ మౌనంగా ఉంటుంది. ఆమె హెచ్చరికలు మెల్లగా వస్తాయి. గాలి వేడెక్కింది. నీళ్లు విషపూరితం అయ్యాయి. జీవజాలం క్షీణించింది. కానీ పట్టించుకోలేదు. ‘We do not inherit the Earth from our ancestors’’ (భూమిని మనం మన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందలేదు) కానీ భూమిని, దాని మీద వుండే ప్రకృతిని మీ మనుషులు తన స్వంత ఆస్తి అనుకున్నారు. దాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు.అందుకే అది మీ మీద కన్నెర్ర చేసింది. ఒక రోజు అది తన ప్రతాపాన్ని చూపింది. అందువల్ల అగ్ని వర్షాలు, ఆమ్ల వర్షాలు కురిశాయి. గాలి విషంలా మారింది. భూమి కంపించింది. మనిషి పరుగెత్తాడు. దాక్కున్నాడు. పోరాడాడు. కానీ ‘nature is not cruel, just unapologetically true to itself ’’ (ప్రకృతి క్రూరమైనది కాదు, కేవలం తనకు తాను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తన స్వభావానికి కట్టుబడి ఉంటుంది) ప్రకృతి క్రూరమైనది కాదు, కేవలం తన నిజ స్వరూపానికి కట్టుబడి ఉంటుంది. అది న్యాయానికి కట్టుబడి ఉంటుంది. ప్రకృతిని మీరు నాశనం చేయాలనుకున్నారు. కానీ చివరకు మీరే నాశనం అయ్యారు. అందుకే మీ జాతి అంతరించిపోయింది. చివరికి నువ్వొక్కడివే మిగిలావు. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ భూమ్మీద మిగతా జీవరాశులు హాయిగా నివసిస్తున్నాయి. ఆంథ్రోపాలజీ ప్రకారం మీ మనుషులు వానర జాతి కుటుంబానికి చెందినవారు. కాలక్రమేణా మీరు ద్విపాదులయ్యారు. అటువంటి గొప్ప మానవుల్లో నువ్వు ఆఖరి మనిషివి. నిన్ను తీసికెళదామనే నేను ఇప్పుడు వచ్చాను. బయలుదేరు’’ అంది ఆమె.ఆమె మాటలకు అతను ఆశ్చర్యపోతూ, ‘‘నేను చచ్చినా రాను. ఇంతకీ నన్ను తీసికెళ్ళడానికి నువ్వెవరివి?’’ అని అడిగాడు ఆ ఆఖరి మనిషి.అతని మాటలకు ఆమె నవ్వుతూ ‘‘ఇంకా నన్ను పోల్చుకోలేదా? నేను మీ జాతిని సర్వనాశనం చెయ్యడానికి ఆ ప్రకృతి పంపించిన మృత్యుదేవతను’’ అంటూ తన చెయ్యిని అతని వైపు తిప్పింది. వెంటనే ఆ చేయి అతని వైపు కదల సాగింది. అతను స్పృహ తప్పి పడిపోతున్నాడు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. స్పర్శ ఆగిపోతున్నట్లు భావన కలుగుతోంది. అతను కొద్ది క్షణాలకు అచేతనుడయ్యాడు. వెంటనే అతను మేల్కొన్నాడు. అతను బయటకు వెళ్లి అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. అతను చాలాసేపు పరిగెత్తిన తరువాత అలసిపోవడం వల్ల బాగా దాహం వేసి ఒక చెట్టు కిందకు చేరాడు. కానీ అక్కడ నవ్వుతూ అదే మృత్యుదేవత కనిపించింది.‘‘ఎక్కడికి పరిగెడుతున్నావు? ఎంత దూరం వెళతావు. నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను నీ వెంటే ఉంటాను. నీ మృత్యువు ఎప్పుడూ నీ నీడలా నీ వెంటే ఉంటుంది. అటువంటి నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నా చేతులు కబంధుడిలా చాలా పెద్దవి’’ అంది ఆమె నవ్వుతూ.అప్పుడు అతను ‘‘దయచేసి నన్ను వదిలెయ్యి. నేను కూడా చనిపోతే ఈ భూమ్మీద మనిషి అన్నవాడి ఆనవాలు లేకుండా పోతుంది. ‘I am the Last Man! ... No king, no lord, no slave, no master; but aman, alone in the world!’’ (నేను ఆఖరి మనిషిని!... రాజును కాదు, ప్రభువును కాదు, బానిసను కాదు, యజమానిని కాదు; కేవలం మనిషిని, ఈ ప్రపంచంలో ఏకాకిని) అనీ అతను వేడుకున్నాడు.అప్పుడు మృత్యువు నవ్వింది.’ You were never meant to last forever’’ (ఎల్లకాలం మనుగడ సాగించడానికి నువ్వు లేవు) మీ జాతి తన పరిమితిని దాటి వెళ్లింది. ఇక మిమ్మల్ని ఉపేక్షించే ప్రశ్నే లేదు’’ అంది అతని దగ్గరకు వస్తూ. ‘‘అమ్మా! దయచేసి నా దగ్గరకు రావద్దు. మేము తప్పు చేశాము. అంత మాత్రాన మా జాతి ఉనికి లేకుండా చేస్తావా? ఇది న్యాయమా చెప్పు?’’ అని ఆమెకు రెండు చేతులెత్తి దండం పెట్టాడు.క్షణం తరువాత ఆమె చేయి అతన్ని తాకింది. ఆ స్పర్శ చలిగా లేదు, వేడిగా లేదు; అతనికి స్పర్శ తెలియటం లేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడతనికి భయం పోయింది. అహంకారం కరిగిపోయింది. మృత్యువు అతనిని తాకింది. ఆఖరి మనిషి చరిత్ర పుటల్లో చివరి పంక్తిగా మిగిలిపోయాడు. గాలి మళ్లీ స్వచ్ఛమైంది. వర్షం మళ్లీ మృదువుగా కురిసింది. ప్రకృతి మళ్లీ మొదలైంది. మనిషి లేకుండా కూడా ఆమె సంపూర్ణమే. ‘All the world's a stage, and all the men and women merely players.’’ (ప్రపంచమంతా నాటకరంగం. స్త్రీ పురుషులంతా నటీనటులు) అని విలియం షేక్స్పియర్ చెప్పాడు. కానీ భూమ్మీద మనిషి ఆడే నాటకంలో మనిషి పాత్ర ముగిసింది. కానీ వేదిక ఇంకా ఉంది. నిశ్శబ్దం. ఆ చెట్టు కింద గాలి కూడా ఊపిరి బిగబట్టి నిలిచినట్టుంది.ఆఖరి మనిషి ఆమె ముందు అచేతనుడై పడివున్నాడు. ఆ రాత్రి ఒక మనిషి చనిపోలేదు, ఒక జాతి కథ ముగిసింది. మనిషి శాశ్వతం కాదు. మనిషి తన మూలాన్ని మరచిపోయిన క్షణమే అతని వినాశనం ప్రారంభమైంది. మనిషి ఆలోచించాడు. ఆ ఆలోచన అతనికి శక్తి ఇచ్చింది. కానీ ఆ శక్తి అతని మితిమీరిన ఆకాంక్షలకు ఆయుధమైంది. ఆకాశాన్ని తాకాడు, సముద్ర గర్భాన్ని చీల్చాడు. కానీ, తన అంతర్ముఖంలో ఉన్న లోపలి అంతరాత్మను మాత్రం జయించలేకపోయాడు. మనిషికి జ్ఞానం పెరిగింది, వివేకం తగ్గింది.కొద్ది క్షణాల తరువాత ఆమె ఒక పుస్తకం తీసి అందులో ఆఖరి మనిషి అన్న వాక్యం దగ్గర ఒక ఇంటూ మార్కు పెట్టింది. ఇప్పుడు ఆ పుస్తకం నిండా ఎర్రటి ఇంటూ మార్కులే. అది ఆ పుస్తకం చివరి పేజీ.గన్నవరపు నరసింహ మూర్తి -
ఒక్క బిస్కట్కు లక్ష
ఒకటి తక్కువైంది... ఒకటి తక్కువైంది... ఇదేదో సినిమాలో డైలాగ్ కాదు, నిజంగానే ఒకటి తగ్గింది. అయితే, ఇక్కడ తగ్గింది రెస్పెక్ట్ కాదు బిస్కట్. ప్యాకెట్లో పదహారు ఉండాల్సినవి పదిహేనే ఉన్నాయి. ఆ.. ఒకటే కదా? అని చాలా మంది ‘లైట్’గా తీసుకుంటారు. కానీ ఆ వ్యక్తి అలా భావించలేదు. తనకు ఒక్కటే. పదిమంది అయితే పది... వందమంది కొంటే వంద... అదే లక్షల్లో అయితే..? ఇలా ఆలోచించాడు. కంపెనీ దృష్టికి తీసుకెళ్లాడు. స్పందన లేకపోవడంతో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. వినియోగదారులు ఎలా నష్టపోతున్నారో వివరించాడు. న్యాయం చేయాలని అభ్యర్థించాడు. ప్యాకేజ్డ్ వస్తువులపై కొంతమంది ఎక్స్పైరీ డేట్, మరికొందరు రేట్ చూస్తారు. ఎక్కువ మంది ఇవేవీ పట్టించుకోరు. కావాల్సింది కొంటారు, తింటారు. బాగోకపోతే పడేస్తారు. ఇంకొందరు అలా కాదు, అన్నీ చూస్తారు. తేడావస్తే నిలదీస్తారు. అవసరమైతే న్యాయ పోరాటమూ చేస్తారు. వినియోగదారుడిగా తనకు ఉన్న హక్కును సాధిస్తారు. ఇలాంటి కోవకే చెందిన వ్యక్తి చెన్నైకి చెందిన ఢిల్లీబాబు.అసలేం జరిగింది.. ఢిల్లీబాబు వీధి జంతువుల కోసం రెండు డజన్ల ‘మ్యారీలైట్’ బిస్కట్ ప్యాకెట్లు కొన్నాడు. రేపర్పై 16 బిస్కట్లు అని ముద్రించి ఉంది. కానీ ప్యాకెట్లో 15 మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ విషయాన్ని దుకాణ యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. ‘తాను రిటైలర్నని వచ్చిన ప్యాకెట్లు అమ్మడమే తప్ప మిగతా విషయాలతో తనకు సంబంధం లేద’ని సమాధానమిచ్చాడు. మొత్తం బాధ్యత కంపెనీదే అని చెప్పాడు. దీంతో ఢిల్లీబాబు కంపెనీకి లేఖ రాశాడు. ఎటువంటి స్పందన రాలేదు.ఫోరంలో ఫిర్యాదుఅతను అక్కడితో ఊరుకోలేదు. వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. వినియోగదారుడు ఎంత నష్టపోతున్నాడో లెక్కలతో సహా వివరించాడు. ఒక్కో బిస్కట్ ధర 75 పైసలు పడింది. కంపెనీ సుమారుగా రోజుకు 50 లక్షల ప్యాకెట్లు ఉత్పత్తి చేస్తుందని అనుకుంటే, రూ. 29 లక్షల వరకు ప్రజల్ని మోసం చేసి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే నెలకు, సంవత్సరానికి? ఇలా రూ. కోట్లలో వినియోగదారులు నష్టపోతున్నారని వివరించాడు. కంపెనీ వాదన ఇలా..బిస్కట్ల సంఖ్య కాకుండా బరువు ఆధారంగా విక్రయం జరుగుతుందని కంపెనీ వాదించింది. ప్యాకెట్ నికర బరువు 76 గ్రాములని, అదే ఆధారమని పేర్కొంది. దీంతో బిస్కట్ ప్యాకెట్ను తూకం వేయాలని ఫోరం ఆదేశించింది.. 74 గ్రాములే ఉంది. తూనికలు కొలతల శాఖ నియమాల ప్రకారం ప్యాక్ చేసిన వస్తువుల బరువు 4.5 గ్రాముల వరకు అటూ ఇటుగా ఉండొచ్చని కంపెనీ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనను ఫోరం తిరస్కరించింది. కాలక్రమంలో బరువు తగ్గే వస్తువులకు ఆ నియమం వర్తిస్తుంది. రోజులు గడుస్తున్నా బిస్కట్ బరువులో ఎలాంటి మార్పు రాదని, అందువల్ల ఆ నియమం ఇక్కడ వర్తించదని ఫోరం తేల్చి చెప్పింది. బిస్కట్ల సంఖ్యను ప్యాకెట్పై స్పష్టంగా ముద్రించినప్పుడు బరువు ఆధారంగా విక్రయిస్తామనే వాదన సరికాదని తోసిపుచ్చింది. రూ. లక్ష జరిమానాఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించడమేనని ఫోరం పేర్కొంది. ఫిర్యాదుదారు ఢిల్లీబాబుకు నష్టపరిహారం కింద రూ. లక్ష రూపాయలు, కేసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 10 వేలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా పరిహారం చెల్లించకపోతే ఏడాదికి 9 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని పేర్కొంది. ఆ బ్యాచ్లో తయారు చేసిన బిస్కట్ ప్యాకెట్ల విక్రయాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. కొన్ని అంశాలు చిన్నవిగా అనిపించినా, ఎక్కువ మంది వినియోగదారులు మోసపోతే అది పెద్ద నష్టమే అవుతుంది. వినియోగదారులు అప్రమత్తంగా ఉంటేనే వస్తువుల్లో నాణ్యత, పారదర్శకత పెరుగుతుందని ఈ కేసు స్పష్టం చేస్తోంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే, చట్టం వినియోగదారుడికి రక్షణగా నిలుస్తోందని ఈ తీర్పు నిరూపించింది. -
ఎండ సీసానా! వీళ్ల బండబడా!
ఎండను పట్టుకుని ఒక సీసాలో దాచి, కొన్ని నెలల తర్వాత చలికాలంలో ఆ ఎండను టీ చేసుకోవడానికి వాడుకుంటే ఎలా ఉంటుంది? మాటలే కానీ, ఇవన్నీ అయ్యే పనులేనా పెదవి విరవకండి. శాస్త్రవేత్తలు ఇంచుమించు అలాంటి టెక్కిక్నే కనిపెట్టారు!పరిశోధకులు ఒక శక్తిమంతమైన కొత్త సౌర–నిల్వ అణువును ఆవిష్కరించారు. ఇది పునర్వినియోగ బ్యాటరీలా సూర్యకాంతిని బంధించి, తరువాత దానిని వేడి రూపంలో విడుదల చేస్తుంది.సాధారణ సోలార్ ప్యానెల్స్తో సూర్యరశ్మి వెంటనే కరెంట్గా మారిపోతుంది. అయితే శాస్త్రవేత్తలు ఈ టెక్నిక్లో ఎండను ఒక ప్రత్యేకమైన ద్రవంలో రసాయన శక్తిగా దాచి ఉంచుతారు. అవసరం అయినప్పుడు తీసి వాడతారు! అదెలా సాధ్యం? ఎలాగంటే, ఒక రకమైన ద్రవ అణువులను ప్రయోగించి ఎండను ఒడిసిపడతారు. వీటిపై ఎండ పడగానే, ఇవి తమ ఆకారాన్ని మార్చుకుంటాయి. మనం ఎండలోకి వెళ్లగానే రంగు మారే కూలింగ్ గ్లాసెస్లా అనుకోండి! అలా ఆకారం మారిన ఆ అణువులు ఎండ ఎనర్జీని తమలోనే లాక్ చేసుకుంటాయి. ఇలా కొన్నేళ్ల పాటు ఆ ఎనర్జీ నిల్వ ఉంటుంది. మనకు వేడి కావాలనుకున్నప్పుడు, ఒక చిన్న ట్రిగ్గర్ ద్వారా ఆ అణువులను మళ్లీ వాటి పాత ఆకారంలోకి వచ్చేలా చేస్తారు. అలా అవి వెనక్కి వచ్చేటప్పుడు తమలో దాగున్న సోలార్ ఎనర్జీని తీవ్రమైన వేడి రూపంలో బయటకు విడుదల చేస్తాయి. ఆ వేడి.. నీటిని మరిగించడానికి కూడా సరిపోతుంది. మన ఫోన్లు, లాప్టాప్లలో ఉండే లిథియం–అయాన్ బ్యాటరీల కంటే... ఒక కేజీ బరువుండే మోతాదులో ఈ ద్రవం చాలా ఎక్కువ శక్తిని దాచగలదు. పైగా దీనికి పెద్ద పెద్ద బ్యాటరీలు గానీ, కరెంట్ గ్రిడ్ కనెక్షన్ గానీ అవసరం ఉండదు. మాలిక్యులర్ సోలార్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ (మోస్ట్)సాధారణ సోలార్ ప్యానెల్స్ సూర్యుడు ఉన్నంత వరకే కరెంట్ను ఇస్తాయి. సూర్యుడు అస్తమించిపోయాక, లేదా ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు ఆ శక్తిని ఎలా దాచి పెట్టుకోవాలన్నది ఎప్పటి నుంచో శాస్త్రవేత్తల ముందున్న పెద్ద సవాలు. దీనికి పరిష్కారంగా.. యూసీ శాంటా బార్బరా విశ్వవిద్యాలయానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ గ్రేస్ హాన్, ఆమె బృందం ఒక కొత్త రకం పదార్థాన్ని తయారు చేశారు. దీనికోసం పెద్ద పెద్ద బ్యాటరీ సిస్టమ్స్ గానీ, కరెంట్ గ్రిడ్ గానీ అవసరం లేదు. ఆ పదార్థం సూర్యరశ్మిని గ్రహించి, తన రసాయన బంధాలలో దాచుకుని, అవసరమైనప్పుడు వేడి రూపంలో బయటకు వెలువరిస్తుంది. ఈ సాంకేతికతను సైన్స్ పరిశోధకులు మాలిక్యులర్ సోలార్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ (మోస్ట్) అని పిలుస్తున్నారు. ఆర్గానిక్ అణువును కనిపెట్టి..!‘మోస్ట్’ అనే ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు పైరిమిడోన్ అనే అభివృద్ధి పరచిన ఆర్గానిక్ అణువును ఉపయోగించారు. ‘‘ఇది మళ్లీ మళ్లీ వాడుకోగలిగే, రీసైకిల్ చేయగలిగే టెక్నాలజీ. మనం వాడే ఫొటోక్రోమిక్ కూలింగ్ గ్లాసెస్ (ఎండలోకి వెళ్తే నల్లగా మారే కళ్లద్దాలు) ను గుర్తు తెచ్చుకోండి. మనం ఇంట్లో ఉన్నప్పుడు అవి మామూలు అద్దాల్లా ఉంటాయి. ఎండలోకి వెళ్లగానే అవే నల్లగా మారిపోతాయి. మళ్లీ ఇంట్లోకి రాగానే మామూలుగా అయిపోతాయి. ఇదీ అటువంటి కూలింగ్ గ్లాసెస్ టెక్నాలజీనే..’’ అంటున్నారు, ఈ పరిశోధనలో ముఖ్య పాత్ర పోషించిన శాస్త్రవేత్త హాన్ గుఝెన్. కాకపోతే, ఇక్కడ రంగు మారడానికి బదులుగా.. అణువులు ఎండలో శక్తిని దాచుకుంటాయి, అవసరమైనప్పుడు ఆ శక్తిని వేడి రూపంలో బయటకు వదులుతాయి. ఆ తర్వాత ఆ పదార్థాన్ని పడేయక్కర్లేదు, మళ్లీ మళ్లీ సూర్యశక్తిని దాచడానికి వాడుకోవచ్చు.డీఎన్ఏ నుండి వచ్చిన ఐడియా!పైరిమిడోన్ అనే ప్రత్యేకమైన అణువును తయారు చేయడానికి శాస్త్రవేత్తలకు మన శరీరంలో ఉండే డీఎన్ఏ నుండి అద్భుతమైన ఐడియా వచ్చింది. డీఎన్ఏలో సహజంగా ఉండే ఒక భాగం, సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు పడినప్పుడు తన ఆకారాన్ని మార్చుకోగలదు, మళ్లీ పాత రూపంలోకి రాగలదు. శాస్త్రవేత్తలు సరిగ్గా అలాంటి అణువునే ల్యాబ్లో కృత్రిమంగా తయారు చేశారు. దీనివల్ల ఆ అణువు మళ్లీ మళ్లీ శక్తిని దాచడానికి, విడుదల చేయడానికి వీలైంది. ఈ అణువు శక్తిని దాచుకున్నాక, ఆ శక్తి వృథా అయిపోకుండా కొన్నేళ్లపాటు ఎలా స్థిరంగా ఉండగలుగుతుందో తెలుసుకోవడానికి యూసీఎల్ఏ ప్రొఫెసర్ కెన్ హౌక్తో ఈ బృందంతో చేతులు కలిపింది. వారు కంప్యూటర్ మోడలింగ్ సహాయంతో పరీక్షించి... ఈ పదార్థం నుండి శక్తి అస్సలు లీక్ అవ్వకుండా కొన్నేళ్ల పాటు ఎలా దాగి ఉంటుందో కనుగొన్నారు. ‘‘మేము ఈ అణువును చాలా తేలికగా, చిన్నదిగా ఉంచడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. ఈ ప్రాజెక్ట్ కోసం మాకు అవసరం లేని ప్రతి భాగాన్ని తొలగించాం. అణువు ఎంత చిన్నగా ఉంటే, అది అంత ఎక్కువ శక్తిని తనలో దాచుకోగలదు..’’ అని శాస్త్రవేత్త హాన్ నుఝెన్ వివరించారు. స్ప్రింగ్లా ఉండే బ్యాటరీస్ప్రింగ్ లాంటి ‘సౌర బ్యాటరీ’ సాధారణ సోలార్ ప్యానెల్స్లాగా ఎండను నేరుగా కరెంట్గా మార్చదు. బదులుగా, శక్తిని రసాయన రూపంలో దాచుకుంటుంది. ఈ అణువు ఒక నొక్కిపెట్టిన స్ప్రింగ్లాగా పనిచేస్తుంది. దీనిపై సూర్యరశ్మి పడగానే, ఇది గట్టిగా నొక్కిన స్ప్రింగ్ లాగా ఎక్కువ శక్తితో కూడిన రూపంలోకి మారిపోతుంది. మనం దాన్ని క్రియాశీలం చేసేంత వరకు అలాగే ఉంటుంది. దానికి కొద్దిగా వేడిని గానీ, లేదా ఒక కేటలిస్ట్ (రసాయన చర్యను వేగవంతం చేసే పదార్థం) గానీ తాకిస్తే, ఆ అణువు ఒక్క ఉదుటున పాత రూపంలోకి వచ్చేస్తుంది. నొక్కిన స్ప్రింగ్ను ఒక్కసారిగా వదిలేస్తే ఎలా దూకుతుందో అలా అన్నమాట. అలా వచ్చేటప్పుడు తనలో దాగున్న శక్తిని వేడి రూపంలో బయటకు వదులుతుంది. ‘‘మేము దీనిని రీచార్జ్ చేసుకోగలిగే సోలార్ బ్యాటరీ అని పిలుస్తాము. ఇది సూర్యరశ్మిని దాచుకుంటుంది, మళ్లీ మళ్లీ రీచార్జ్ అవుతుంది’’ అని నుఝెన్ అంటారు. ఈ అణువు లీథియం బ్యాటరీల కంటే శక్తివంతమైనది. శక్తిని దాచుకునే సామర్థ్యం చాలా ఎక్కువ. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం సాధారణ లిథియం–అయాన్ బ్యాటరీ 0.9 మెగాజూల్స్ శక్తిని దాచగలిగితే, ఈ కొత్త రకం సోలార్ ద్రవం దాచగలిగే శక్తి (ఒక కిలో బరువుకు) 1.6 మెగాజూల్స్. అంటే మన ఫోన్లలో ఉండే బ్యాటరీల కంటే ఇది చాలా ఎక్కువ శక్తిని నిల్వ చేయగలదు. గతంలో శాస్త్రవేత్తలు తయారు చేసిన ఇలాంటి పాత మోడల్స్ కంటే కూడా ఈ కొత్త మెటీరియల్ చాలా అద్భుతంగా పనిచేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.మొత్తానికైతే నీటిని మరిగించారు!ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు సాధించిన అతిపెద్ద విజయం ఏంటంటే... తాము కనిపెట్టిన సాంకేతికత కేవలం ల్యాబ్కే పరిమితం కాకుండా, నిజంగా పనిచేస్తుందని నిరూపించడం. వారు సాధారణ వాతావరణంలోనే ఈ పదార్థం నుండి వచ్చే వేడితో నీటిని విజయవంతంగా మరిగించి చూపించారు. ‘‘నీటిని మరిగించడమనేది చాలా ఎక్కువ శక్తితో కూడుకున్న పని. మేము సాధారణ వాతావరణంలోనే నీటిని మరిగించగలిగామంటే అది చాలా పెద్ద విజయం’’ అని నుఝెన్ అంటున్నారు. భవిష్యత్తులో ‘మోస్ట్’ ఉపయోగాలు‘మోస్ట్’ అనే ఈ సరికొత్త సాంకేతికత భవిష్యత్తులో మన రోజువారీ జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఇంటి అవసరాలకు: ఈ ద్రవం నీటిలో సులభంగా కరుగుతుంది. కాబట్టి, మన ఇంటి కప్పులపై ఉండే సోలార్ పైపుల్లో పగటిపూట ఈ ద్రవాన్ని తిప్పవచ్చు. అది పగలంతా ఎండను గ్రహించి, రాత్రి వేళల్లో ట్యాంకుల్లోకి చేరి మనకు కావలసిన వేడి నీటిని అందిస్తుంది.క్యాంప్లు, టూర్లు: అడవులకు లేదా కరెంట్ లేని ప్రాంతాలకు క్యాంపింగ్ వెళ్లినప్పుడు, ఎలాంటి గ్యాస్ లేదా కరెంట్ లేకుండానే కేవలం ఈ ద్రవంతో నీటిని వేడి చేసుకోవచ్చు.‘‘సాధారణ సోలార్ ప్యానెల్స్ వాడితే... శక్తిని దాచుకోవడానికి విడిగా పెద్ద బ్యాటరీ సిస్టమ్ కావాలి. కానీ ఈ మాలిక్యులర్ సోలార్ టెక్నాలజీ (మోస్ట్)లో ఆ పదార్థం దానంతట అదే సూర్యశక్తిని నేరుగా దాచుకోగలదు’’ అని ఈ పరిశోధనలో భాగస్వామి అయిన బెంజమిన్ బేకర్ చెబుతున్నారు. ఈ ‘రీచార్జ్ చేయదగిన సౌర బ్యాటరీల’ పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రొఫెసర్ గ్రేస్ హాన్కు ప్రతిష్ఠాత్మకమైన ‘మూర్ ఇన్వెంటర్ ఫెలోషిప్’ లభించింది.మెగాజూల్ అంటే? కూరగాయలను ‘కిలోలలో’ కొలుస్తాం, పాలను ‘లీటర్లలో’ కొలుస్తాం కదా, అలాగే సైన్స్ ప్రపంచంలో శక్తిని లేదా వేడిని కొలవడానికి ‘జూల్స్’ అనే పదాన్ని వాడతారు. ఈ పదం 19వ శతాబ్దపు భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ ప్రెస్కాట్ జూల్ పేరులోని జూల్ నుండి వచ్చింది. భూమిపై ఉండే రకరకాల శక్తులన్నీ – వేడి, కరెంట్, కదలిక – వేర్వేరు కాదని, అవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్న భిన్న ఎనర్జీ రూపాలేనని ఆయన నిరూపించారు. ముఖ్యంగా యాంత్రిక శక్తి ఎలా వేడిగా మారుతుందో జూల్ కనిపెట్టారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం, శక్తిని కొలిచే యూనిట్కు ‘జూల్’ అని పేరు పెట్టారు.ఒక లీటరు మామూలు నీటిని స్టవ్ మీద పెట్టి, అది బాగా మరిగేలా వేడి చేయడానికి దాదాపు 0.3 మెగాజూల్స్ శక్తి అవసరమవుతుంది. అంటే, 1 మెగాజూల్ శక్తితో మనం సుమారు 3 లీటర్ల నీటిని మరిగించవచ్చు. ఒక టన్ను బరువున్న కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంటే... ఆ కారులో ఉండే కదలిక శక్తి సరిగ్గా 1 మెగాజూల్ ఉంటుంది. మనం తినే ఒక చిన్న స్నికర్స్ చాక్లెట్ బార్ లేదా రెండు అరటిపండ్లు మన శరీరానికి దాదాపు 1 మెగాజూల్ శక్తి (క్యాలరీల రూపంలో)ని ఇస్తాయి. శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన ద్రవం ఒక కిలో బరువులో 1.6 మెగాజూల్స్ శక్తిని దాచగలదు. ఒక్కమాటలో చెప్పాలంటే కేవలం ఒకే ఒక్క కిలో ఆ మ్యాజిక్ ద్రవాన్ని ఎండలో పెడితే, అది తనలో ఎంత శక్తిని దాచుకుంటుందంటే... రాత్రి కాగానే ఆ ఒక్క కిలో ద్రవంతో మనం దాదాపు 5 లీటర్ల నీటిని మరిగించుకోవచ్చు! మన ఫోన్ బ్యాటరీల కంటే ఇది చాలా ఎక్కువ శక్తిని తక్కువ స్థలంలో దాచగలదు అని చెప్పడానికే శాస్త్రవేత్తలు ఈ ‘మెగాజూల్స్’ అనే పదాన్ని వాడారు. -సాక్షి స్పెషల్ డెస్క్ -
భోజనం అంటే గొడవే...
నాకు రెండేళ్ల పాప ఉంది. పాప అస్సలు సరిగా తినడం లేదు. పళ్లెంలో పెట్టిన ప్రతి దాన్ని తిరస్కరిస్తోంది. ఎంత చెప్పినా వినడం లేదు. భోజన సమయం అంటే ఇంట్లో గొడవే అవుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.– సునీత, విజయవాడ.రెండు సంవత్సరాల పిల్లలు తక్కువగా తినడం, సాధారణంగా కనిపించే సమస్య. దీన్ని ‘ఫస్సీ ఈటింగ్’ లేదా ‘పిక్కీ ఈటింగ్’ అంటాము. పుట్టినప్పటి నుంచి దాదాపు ఒకటిన్నర సంవత్సరాల వరకు పిల్లలు వేగంగా పెరుగుతారు కాబట్టి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ రెండో సంవత్సరం నుంచి ఎదుగుదల కొంచెం నెమ్మదిస్తుంది. అందుకే ఆకలి కూడా తగ్గినట్లు అనిపిస్తుంది. ఇది వ్యాధి కాదు, శరీరంలో సహజంగా జరిగే మార్పు. ఇలాంటి పిల్లల్లో ముందుగా భోజన సమయాన్ని ప్రశాంతంగా మార్చాలి. బలవంతంగా తినిపించడం, కోప్పడటం, పిల్లల వెంట తిరగడం వల్ల వాళ్లు ఇంకా ఎక్కువగా ఆహారాన్ని తిరస్కరిస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏం తినాలి, ఎప్పుడు పెట్టాలి అనేది తల్లిదండ్రుల బాధ్యత. కానీ ఎంత తినాలి అనేది పిల్లల నిర్ణయం. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లలు తక్కువ తింటున్నారని ఆందోళనతో ఒత్తిడి పెడతారు. కానీ పిల్లలు తమ ఆకలికి తగ్గట్టే తింటారు. కొత్త ఆహారాన్ని ఒకసారి తిరస్కరించిందని వెంటనే ఆపేయకూడదు. చిన్నపిల్లలు కొత్త రుచిని అంగీకరించడానికి సమయం తీసుకుంటారు. కొన్నిసార్లు ఒక ఆహారాన్ని 10 నుంచి 15 సార్లు పరిచయం చేసిన తర్వాతే అలవాటు పడతారు. కాబట్టి ఓపిక చాలా ముఖ్యం.పిల్లలకు పెద్ద పళ్లెం పెట్టడం కన్నా చిన్న పరిమాణాల్లో, రంగురంగులుగా, ఆకర్షణీయంగా ఆహారం పెట్టాలి. అలాగే మధ్య మధ్యలో బిస్కట్లు, చాక్లెట్లు, జ్యూసులు లేదా ఎక్కువ పాలు ఇస్తూ ఉంటే అసలు ఆకలి తగ్గిపోతుంది. ‘కొంచెం ఆకలి’ కూడా పిల్లలకు మంచి ఔషధం లాంటిదే. మొబైల్ లేదా టీవీ ముందు కూర్చోబెట్టి తినిపించే అలవాటు తగ్గించడం మంచిది. అప్పటికి తిన్నట్టే అనిపించినా, దీర్ఘకాలంలో అది మంచి తినే అలవాట్లను దెబ్బతీస్తుంది. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని తింటే పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు. పిల్లలు మాటలు కన్నా మన ప్రవర్తననే ఎక్కువగా అనుకరిస్తారు. ‘ఇది తింటే చాక్లెట్ ఇస్తా’ అని లంచం ఇవ్వడం కన్నా, ‘వావ్! నువ్వు కొత్త కూర రుచి చూసావు కదా!’ అని ప్రశంసించడం మంచిది. అలాగే ఒక్కరోజు తక్కువ తిన్నారని భయపడాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల ఆకలి రోజురోజుకీ మారుతూ ఉంటుంది. ఒక భోజనం లేదా ఒక రోజు కాకుండా, మొత్తం వారం ఎలా తింటున్నారు అన్నది చూసి అంచనా వేయాలి. అయితే కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం తప్పకుండా పిల్లల వైద్యుడిని సంప్రదించాలి. బరువు పెరగకపోవడం, తరచు వాంతులు అవడం, మింగడంలో ఇబ్బంది ఉండడం, కొన్ని ఆహారాలనే పూర్తిగా తిరస్కరించడం, చాలా అలసటగా కనిపించడం లేదా ఎదుగుదల మందగించడం వంటి లక్షణాలు ఉంటే పరీక్షలు అవసరం కావచ్చు. చాలా సందర్భాల్లో సరైన ఆహార అలవాట్లు, ఓపిక, కుటుంబ సహకారం ఉంటే పిల్లలు క్రమంగా మంచి తినే అలవాట్లు అలవరుచుకుంటారు. -డా‘‘ కె. పవన్ కుమార్-సీనియర్ పీడియాట్రిషియన్ , పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
మెగా మామ్!
‘అందాల రాక్షసి’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి. ఇప్పుడు కెరీర్, ఫ్యామిలీ, మదర్హుడ్ను అందంగా బ్యాలెన్స్ చేస్తూ కొత్త ప్రయాణాన్ని ఆస్వాదిస్తోంది. గ్లామర్ ప్రపంచంలో ఉన్నా; వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ప్రైవేట్గా, ప్రశాంతంగా ఉంచుకునే ఈ చిల్ గర్ల్ మనసులోని ముచ్చట్లు ఆమె మాటల్లోనే!మిస్ ఉత్తరాఖండ్పుట్టింది అయోధ్యలో, పెరిగింది డెహ్రాడూన్ లో. నాకు చిన్నప్పటి నుంచే షోబిజ్పై ఆసక్తి ఉండేది. కానీ ముందు చదువు పూర్తి చేయాలన్న నాన్న కండిషన్తో భరతనాట్యం నేర్చుకుంటూ, ముంబైలో ఎకనామిక్స్ చదువుతూనే మోడలింగ్ మొదలుపెట్టాను. 2006లో ‘మిస్ ఉత్తరాఖండ్’ గెలవడం నా కలలకు మొదటి అడుగు అయ్యింది.‘మిథున’ నుంచి బయటకు రాలేకపోయా‘అందాల రాక్షసి’ చిన్న సినిమాలో నేను నటించలేదు, ‘మిథున’గా జీవించాను. షూటింగ్ అయిపోయాక కూడా అదే తరహా దుస్తులు, బొట్టు పెట్టుకుని తిరిగేదాన్ని. చివరకు నన్ను నేను బలవంతంగా ఆ పాత్రలోంచి బయటకు తీసుకురావాల్సి వచ్చింది.నా జోక్స్కి నేనే నవ్వేస్తా!నేను చాలా జోవియల్ పర్సన్ ని. నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది! కొన్నిసార్లు జోక్ పూర్తిగా చెప్పకముందే నేనే నవ్వేసుకుంటాను. పక్క వాళ్లకు అర్థం కాకపోయినా నాకు మాత్రం చాలా ఫన్నీగా అనిపిస్తుంది.అమ్మ పెట్టిన 7 పీఎం రూల్! మా అమ్మ ఎప్పుడూ ‘సాయంత్రం 7 గంటలకల్లా ఇంట్లో ఉండాలి’ అనే ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టేది. అది నా మనసులో ఎంతలా నాటుకుపోయిందంటే, ఈ రోజుల్లో కూడా నేను ఎప్పుడైనా సాయంత్రం పూట బయట ఉంటే, 7 గంటలు దాటగానే నాలో తెలియకుండానే ఒక ఆందోళన మొదలైపోతుంది. మంచం కింద దాక్కుని నెయ్యి తినేదాన్ని!చిన్నప్పుడు అమ్మ నెయ్యి కాస్తే, ఆ గిన్నె మొత్తం సీక్రెట్గా ఎత్తుకెళ్లి, మంచం కింద దాక్కుని మొత్తం తినేసేదాన్ని! ఇప్పటికీ నేను ఫుడ్ లవర్నే. ముఖ్యంగా బంగినపల్లి మామిడిపండ్లు అంటే చాలా ఇష్టం.కోపం అంటే ఓడిపోయినట్టే!నాకు కోపం రావడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం అంటే ఓడిపోయినట్టే అనిపిస్తుంది. చాలా ఇరిటేట్ అయినప్పుడు.. గొడవపడను, అరిచేయను.. పూర్తిగా సైలెంట్ అయిపోతాను.బొట్టు అంటే ప్రత్యేకమైన ప్రేమ!ఒక చిన్న బొట్టు మొత్తం లుక్ని మార్చేస్తుంది. అది మన ఎక్స్ప్రెషన్ ్సని ఇంకా అందంగా చూపిస్తుంది. అందుకే నాకు ట్రెడిషనల్ స్టయిల్ అంటే చాలా ఇష్టం.డాన్స్ నాకు థెరపీ!డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంటే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. డాన్స్ చేస్తే అన్నీ మర్చిపోతాను.డాన్స్ నాకు థెరపీ!డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తుంటే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. డాన్స్ చేస్తే అన్నీ మర్చిపోతాను.సోషల్ మీడియా నుంచి బ్రేక్లు తీసుకుంటా!కొన్నిసార్లు సోషల్ మీడియాలో చాలా సమయం గడిపితే మనశ్శాంతి తగ్గిపోతుంది. అందుకే మధ్య మధ్యలో ఫోన్ పక్కన పెట్టేసి, కొన్ని రోజులు పూర్తిగా సోషల్ మీడియాకు దూరంగా.. ఫ్యామిలీ, పెట్స్తో టైమ్ స్పెండ్ చేయడానికే ఇష్టపడతాను. -
ఊళ్లో నెమళ్ల బెడద
నెమళ్లు పురివిప్పి నాట్యమాడితే కనులపండుగగా ఉంటుంది. ఆరుబయట నెమళ్లు తిరుగుతూ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది. వందకు పైగా నెమళ్లు ఒక ఊళ్లోకి చేరి, యథేచ్ఛగా వీథుల్లో తిరుగుతూ, ఇళ్లలోకి చొరబడుతూ, ఎక్కడ పడితే అక్కడ రెట్టలు వేసేస్తూ ఉంటే మాత్రం ఊరి జనాలకు బెడదగానే ఉంటుంది. ఇటలీలోని పుంటా మెరీనా అనే చిన్న పట్టణలలో జనాలకు నెమళ్లతో చెప్పరాని తంటాగా ఉంటోంది.సముద్ర తీరంలో ప్రశాంతంగా ఉండే ఈ ఊళ్లోకి ఎక్కడి నుంచి వచ్చాయో ఏకంగా వందకు పైగా నెమళ్లు వచ్చిపడ్డాయి. ‘కోవిడ్’ కాలంలో చుట్టుపక్కల అడవి నుంచి ఊళ్లోకి దాదాపు వందకు పైగా నెమళ్లు వచ్చాయి. కొత్తలో జనాలకు బాగానే ఉండేది. ఇప్పుడు వీటి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.ఇవి యథేచ్ఛగా రోడ్ల మీద సంచరిస్తుంటే, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఇళ్లల్లోకి కూడా చొరబడుతున్నాయి. పిట్టగోడలు ఎక్కి, ఇళ్లల్లో రెట్టలు వేయడం, ఇళ్లలోకి దూరి తిండి కోసం గిన్నెలు తిరగవేయడం వంటి చేష్టలు కూడా చేస్తుండటంతో జనాలు స్థానిక అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో వీటిని సురక్షితమైన చోటుకు తరలించేందుకు వారు కసరత్తు చేస్తున్నారు. -
కాలుష్య సాగరాలు
మనం నివసించే భూగోళం ఉపరితలం మీద దాదాపు 70% సముద్రాలే నిండి ఉన్నాయి. భూమ్మీద ఉండే నీటిలో దాదాపు 96.5% నీరు సముద్రాల్లోనే ఉంది. సముద్రాల్లోని నీటి ఘనపరిమాణం 130 కోట్ల ఘనపు కిలోమీటర్లు. భూమ్మీద వెలువడే కర్బన ఉద్గారాల్లో అత్య«ధిక మొత్తాన్ని పీల్చుకునేది సముద్రాలే! భూమ్మీద జీవరాశి మనుగడకు రక్షణ వలయంగా నిలుస్తున్న సముద్రాలు ఇప్పుడు కాలుష్యం బారిన పడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయన వ్యర్థాలు సముద్రాల్లోకి మితిమీరి చేరుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, పర్యావరణవేత్తలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, సముద్రాల్లోకి చేరుతున్న కాలుష్యాలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. ఇవి పర్యావరణానికి తీరని నష్టం కలిగిస్తున్నాయి. సముద్రాలకు ఎదురవుతున్న కాలుష్యాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...సముద్రాలకు ప్లాస్టిక్ బెడద ఒకవైపు పెరుగుతుంటే, మరోవైపు రసాయనాల ముప్పు కూడా నానాటికీ పెరుగుతోంది. ఫలితంగా సాగర తీరాల్లో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి, ఏడాదికేడాది సాగర తీర మృత ప్రాంతాలు (కోస్టల్ డెడ్ జోన్స్) పెరుగుతూ వస్తున్నాయి. వ్యవసాయంలో ఉపయోగించే నత్రజని, ఫాస్ఫరస్ ఎరువులు మితిమీరి సముద్రాల్లో కలుస్తున్నాయి. వీటివల్ల సముద్రాల్లో నాచు అతిగా పెరిగి, చనిపోయిన నాచు సముద్రాల అడుగుకు చేరుకోవడం వల్ల ఆ ప్రాంతాల్లో ఆక్సిజన్ తగ్గిపోతోంది. గడచిన దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కోస్టల్ డెడ్ జోన్స్ వివరాలు గణాంకాల్లో... -
స్కూల్ సీజన్ స్టార్ట్
ఉదయపు యుద్ధాలు మళ్లీ మొదలవుతున్నాయి. అలారం విలన్లా అరుస్తుంటే, ‘ఇంకో ఐదు నిమిషాలు’ అంటున్న పిల్లల్ని కాపాడేందుకు దుప్పట్లు ఫైట్ చేస్తున్నాయి. స్కూల్ బస్సులు హారన్ లు మోగిస్తున్నాయి. కొత్త బ్యాగుల జిప్లు తెరుచుకుంటున్నాయి. కాళ్లు చాపుకుని మూలన నిద్రపోతున్న షూస్ డ్యూటీలోకి దిగుతున్నాయి. కిచెన్లో లంచ్ బాక్స్లు తమ హడావుడి స్టార్ట్ చేసేశాయి.కొత్త కొత్త కవర్స్తో రెడీ అయ్యి, పుస్తకాలు ఇల్లంతా తిరుగుతున్నాయి! ఇలా రెండు నెలల సమ్మర్ హాలీడేస్ తర్వాత, పిల్లల ప్రపంచం మళ్లీ ‘స్కూల్ మోడ్’లోకి వచ్చేస్తోంది. ఆలస్యంగా లేచే రోజులకి గుడ్బై చెప్పి, ప్రతి విద్యార్థి కొత్త క్లాస్, కొత్త టీచర్స్, కొత్త ఫ్రెండ్స్, కొత్త నోట్బుక్స్లతో ఒక చిన్న ‘న్యూ ఇయర్’ ఫీలింగ్తో మెరిసిపోతూ, స్కూల్ సీజన్ ను స్టార్ట్ చేస్తున్నారు.చిన్న ప్రపంచం మళ్లీ మొదలు!జూన్ నెల అడుగుపెట్టిందంటే చాలు– రెండు నెలల పాటు మూలన పడేసిన స్కూల్ బ్యాగుల వెలుగులు, యూనిఫామ్లకు ఇస్త్రీ వేడి మొదలవుతుంది. షూ షాపులు, బుక్ స్టాళ్లలో పేరెంట్స్ టెన్షన్ , స్టేషనరీ దుకాణాల్లో ‘ఇంకో కవర్ కూడా పెట్టండి’ అనే బేరసారాలు కనిపిస్తాయి. ‘బ్యాక్ టు స్కూల్’ మోడ్తో మార్కెట్ కూడా కార్టూన్ బ్యాగులు, సూపర్హీరో వాటర్ బాటిల్స్, లైట్లు వెలిగే కంబాక్స్లు, ‘టాపర్ స్టడీ టేబుల్’ అంటూ కొత్త డిజైన్స్తో ఆకట్టుకుంటుంటే, పిల్లలు ‘కొత్త బ్యాగ్ కావాలి..’ అంటూ బ్లాక్ మెయిల్స్ స్టార్ చేస్తారు.అమ్మలు యూనిఫామ్లకు పేర్లు కుట్టడంలో బిజీ అయిపోతే, నాన్నలు ‘ఈ ఏడాది ఫీజు ఎందుకింత ఎక్కువ?’ అంటూ క్యాలిక్యులేటర్తో వేసిన లెక్కలనే వేస్తూ ఫైట్ చేస్తుంటారు. మరోవైపు, స్కూల్ బస్సులు మళ్లీ రోడ్లపై రంగంలోకి దిగి, ఉదయాన్నే కాలనీలను నిద్రలేపుతుంటాయి. అలా సెలవుల్లో ఆనందంగా గడిపిన పిల్లలు ఇప్పుడు మళ్లీ స్కూల్ ప్రపంచంలోకి అడుగుపెడతారు.రీల్స్ ఆల్బమ్!ఒకప్పుడు స్కూల్ ఓపెనింగ్ అంటే కొత్త యూనిఫామ్లో ఒక ఫోటో తీసి ఆల్బమ్లో పెట్టేసేవారు. కానీ ఇప్పుడు? అదే సీన్ రీల్గా మారి ఇన్ స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది! ‘ఫస్ట్ డే ఆఫ్ స్కూల్’ అంటూ చిన్నారుల ఎంట్రీలు, యూనిఫామ్ ట్రాన్సిషన్ వీడియోలు, రంగురంగుల లంచ్బాక్స్ క్లిప్స్, ‘మై కిడ్ గోయింగ్ టు స్కూల్’ వ్లాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి. కొందరు పిల్లలు స్కూల్ గేట్ దగ్గర స్టయిల్గా పోజులు ఇస్తుంటే, ఇంకొందరు ‘స్కూల్కి వెళ్లను’ అంటూ ఏడుస్తూ కూడా వైరల్ అవుతున్నారు. అమ్మలు లంచ్బాక్స్తో, నాన్నలు బ్యాగ్ మోసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇలా ఇప్పుడు స్కూల్ రీఓపెనింగ్ కేవలం ఎడ్యుకేషన్ ఈవెంట్ కాదు, సోషల్ మీడియా కంటెంట్ సీజన్ లా కూడా మారిపోయింది.ఫస్ట్ డే.. ఫస్ట్ ఫీల్!స్కూల్ మొదటి రోజు అంటే ఒక చిన్న ఎమోషనల్ సినిమా నడిచినట్టే! ముఖ్యంగా ఎల్కేజీ, యూకేజీ పిల్లలైతే స్కూల్ గేట్ దగ్గరికి వెళ్లగానే ‘అమ్మా.. నువ్వు కూడా రా!’ అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం కామన్ . కొందరు చిన్నారులు బ్యాగ్ పట్టుకుని ధైర్యంగా వెళ్లిపోతే, ఇంకొందరు మాత్రం అమ్మ చున్నీని వదలకుండా చిన్నపాటి డ్రామా స్టార్ట్ చేద్దామా వద్దా అనే డౌట్ ఫేస్లతో నిదానంగా నడుస్తుంటారు.ఎలాగోలా పిల్లల్ని లోపలి పంపిన అమ్మలు కొందరు, ఇంకా గేట్ బయటే నిలబడి క్లాస్రూమ్ వైపు చూస్తుంటే, ‘ఏడవడం ఆపేశాడా?’ అని టెన్షన్ పడే నాన్నలు అక్కడే కనిపిస్తారు. పిల్లల్ని నవ్విస్తూ క్లాస్లోకి తీసుకెళ్లే లేడీ టీచర్స్, కాస్త పెద్ద పిల్లలను ‘త్వరగా.. త్వరగా..’ అంటూ గట్టిగా అరిచే పీటీ మాస్టర్స్ ఉంటారు. ఇలా ఫస్ట్ డే స్కూల్ సీన్లు ప్రతి ఏడాది మళ్లీ మళ్లీ రిపీట్ అవుతూనే ఉంటాయి. కానీ ఆ చిన్న కన్నీళ్ల వెనుకే పిల్లల కొత్త ప్రపంచం, కొత్త ప్రయాణం మొదలవుతుంది!పిల్లలకు ఎగై్జట్మెంట్ ప్లస్ టెన్షన్ !కొత్త క్లాస్లో ఎవరు ఫ్రెండ్ అవుతారు? కొత్త టీచర్ స్ట్రిక్ట్గా ఉంటారా? హోంవర్క్ ఎక్కువ ఇస్తారా? ఇలా పిల్లల మైండ్లో కూడా చిన్న చిన్న ప్రశ్నలే! కానీ కొత్త బ్యాగ్, కొత్త షూస్, కొత్త నోట్బుక్స్ చూస్తే మాత్రం ఆ టెన్షన్ కంటే ఎగై్జట్మెంట్ ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఫస్ట్ డే స్కూల్ అంటే చాలామందికి ‘ఫ్యాషన్ షో’ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎవరి బ్యాగ్ బెటర్? ఎవరి పెన్ కొత్తది? ఎవరి వాటర్బాటిల్ కూల్గా ఉంది? అనే సీక్రెట్ కంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది! సెలవుల్లో ఆటపాటలతో ఎక్కువకాలం గడిపిన పిల్లలు స్కూల్లోకి తిరిగి అడుగుపెడుతూనే పాఠాలు వినే మూడ్లో ఉండరు. వాళ్లను తిరిగి పాఠాల వైపు మళ్లించడానికి టీచర్లు నేరుగా సిలబస్ మొదలుపెట్టకుండా, కొంత ఓపికతో ప్రయత్నించాలి. - కృష్ణభరత్, సైకాలజిస్ట్టీచర్స్కి కూడా ఇదే న్యూ ఇయర్!స్కూల్ ఓపెనింగ్ అంటే కేవలం పిల్లలకే కొత్త మొదలు కాదు.. టీచర్స్కి కూడా అదే ‘న్యూ ఇయర్’ ఫీలింగ్! కొత్త సిలబస్, కొత్త టైమ్టేబుల్స్, కొత్త స్టూడెంట్స్, కొత్త టార్గెట్స్తో వారి అసలు హడావుడి కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకవైపు క్లాస్రూమ్లో పిల్లల అటెన్షన్ ను పట్టుకోవాలి; మరోవైపు మొబైల్, రీల్స్, గేమ్స్ ప్రపంచం నుంచి వారిని బయటకు తీయాలి. ఇప్పుడు టీచర్స్కి మరో కొత్త చాలెంజ్ కూడా వచ్చేసింది; అదే ‘చాట్జీపీటీ హోంవర్క్స్!’ పిల్లలు నిజంగా చదివారా? లేక ఏఐతో అసైన్ మెంట్ చేయించారా? అనేది కూడా గుర్తించాల్సి వస్తోంది. పేరెంట్స్ అయితే మొదటి రోజే స్కూల్ వాట్సాప్ గ్రూప్స్లో ‘హోంవర్క్ ఏమిచ్చారు మేడమ్?’, రేపు కలర్ డ్రెస్నా?’ వంటి మెసేజ్ల వరద మొదలుపెడుతుంటారు. - పి. మాధవి దేవి ప్రిన్సిపాల్, వైఆర్ఎల్ స్కూల్, సామర్లకోట. స్మూత్ ‘బ్యాక్ టు స్కూల్’ కోసం స్మార్ట్ టిప్స్!నిద్ర టైమ్ను ముందే రీసెట్ చేయండిసమ్మర్ హాలీడేస్ అంతా లేట్గా పడుకుని, ఆలస్యంగా లేవడం పిల్లలకు అలవాటైపోతుంది. అందుకే స్కూల్ ఓపెన్ అయ్యే వారం ముందు నుంచే రోజుకు 15–20 నిమిషాలు ముందుగా పడుకోవడం, ఉదయం త్వరగా లేవడం ప్రాక్టీస్ చేయించాలి. లేదంటే ఫస్ట్ డేనే స్కూల్కి లేట్గా వెళ్లడమో, ఉదయం ఇంట్లో ‘ఇంకో 5 నిమిషాలు’ డ్రామానో గ్యారంటీ!బడ్జెట్ షాపింగ్ బెస్ట్షాపింగ్కి వెళ్లే ముందు ఇంట్లో ఇప్పటికే ఉన్న బాటిల్స్, పెన్సిల్స్, బ్యాగ్స్, స్టేషనరీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అవసరమైన వాటికే లిస్ట్ తయారు చేసుకుని వెళ్తే.. ‘కార్టూన్ ఉంది కాబట్టి కొనాలి’అనే ఖర్చులు కాస్త తగ్గుతాయి!లంచ్బాక్స్కి చిన్న స్ట్రాటజీ పెట్టండిస్కూల్ మొదటి రోజుల్లో పిల్లలు టిఫిన్ పూర్తిగా తినకపోవడం కామన్ . అందుకే మొదటి రెండు వారాలు వారికి ఇష్టమైన, సులువుగా తినగలిగే ఫుడ్ను ప్లాన్ చేయాలి. బాక్స్ ఖాళీగా ఇంటికి వస్తే, మదర్స్కి వచ్చే ఆనందం వేరే లెవెల్!బ్యాగ్ బరువు చెక్ చేయండిఅవసరం లేని పుస్తకాలతో పిల్లల బ్యాగ్ను చిన్న జిమ్ కిట్లా మార్చేయొద్దు! అవసరమైన నోట్బుక్స్, మెటీరియల్స్ మాత్రమే పెట్టే అలవాటు చేయాలి. చిన్న పిల్లల బ్యాగ్ వారి బరువుకంటే ఎక్కువగా ఉండకూడదు.స్క్రీన్ టైమ్కి లిమిట్ పెట్టండిస్కూల్స్ కూడా ఇప్పుడు డిజిటల్ అయ్యాయి కాబట్టి మొబైల్, ట్యాబ్లను పూర్తిగా దూరం పెట్టడం కష్టం. కానీ రీల్స్, గేమ్స్, అనవసర స్క్రోలింగ్ను తగ్గించి, గాడ్జెట్స్ను కేవలం హోంవర్క్, స్కూల్ యాప్స్కే పరిమితం చేసే రూల్స్ పెట్టుకోవాలి.చదువును టెన్షన్ రీజన్లా చేయకం. మొదటి రోజు నుంచే బాగా చదువుకోవాలి. ‘ర్యాంక్ రావాలి’ అని రోజూ ఒత్తిడి పెడితే పిల్లల్లో భయం పెరుగుతుంది. దాని బదులు ‘ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు?’ అని అడిగితే చదువుపై ఆసక్తి పెరుగుతుంది.డిజిటల్ సేఫ్టీ కూడా నేర్పండిఆన్ లైన్ క్లాసులు, యాప్స్, స్టడీ వెబ్సైట్లు వాడేటప్పుడు తెలియని లింక్స్, ఫేక్ కోర్సులు, స్కామ్ల గురించి పిల్లలకు ముందే అవగాహన ఇవ్వాలి. ఇప్పుడు స్కూల్ బ్యాగ్తో పాటు సైబర్ సేఫ్టీ కూడా తప్పనిసరి సబ్జెక్ట్ అయిపోయింది!పేరెంట్స్కి మళ్లీ ‘మార్నింగ్ షిఫ్ట్’హాలిడేస్లో కాస్త రిలాక్స్ అయిన అమ్మానాన్నలకి ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. ఉదయం పిల్లల్ని లేపడం, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం, హోంవర్క్ చెక్ చేయడం, స్కూల్ బస్ టైమ్ మిస్ కాకుండా చూడడం.. ఇల్లు ఒక్కసారిగా ‘మినీ కమాండ్ కంట్రోల్ రూమ్’లా మారిపోతుంది! పిల్లలు స్కూల్కి వెళ్తే కాస్త రిలీఫ్ దొరుకుతుంది అనే ఆనందంతో పాటు, లంచ్ తిన్నాడా లేదా? అనే చిన్న టెన్షన్ కూడా ఉంటుంది. - కర సాయి బిందు, సాఫ్ట్వేర్ ఇంజినీర్.బ్యాగ్ల బిజినెస్కి బంపర్ సీజన్ !స్కూల్స్ ఓపెన్ అంటే మార్కెట్లో కూడా అసలు హడావిడి మొదలవుతుంది. బ్యాగులు, లంచ్బాక్స్లు, వాటర్ బాటిల్స్, షూస్, బుక్స్, స్టేషనరీ.. ఒక్కసారిగా అన్నీ ‘హాట్ సెల్లింగ్’ ఐటమ్స్గా మారిపోతాయి. దుకాణాల్లో పిల్లలు కార్టూన్ బ్యాగ్ల కోసం ఫైట్ చేస్తుంటే, పేరెంట్స్ మాత్రం ‘ఇది ఏడాది మొత్తం వాడాలి’ అంటూ బడ్జెట్ క్యాలిక్యులేషన్ ్సలో పడిపోతున్నారు! ఇక ఆన్ లైన్ లో అయితే ‘బ్యాక్ టు స్కూల్ సేల్’ పేరిట భారీ ఆఫర్లు. ఒక పెన్సిల్ కొనడానికి వెళ్లి, చివరికి ఐదు నోట్బుక్స్, మూడు స్టిక్కర్ సెట్లు, రెండు కొత్త బాటిల్స్తో కార్ట్ ఫుల్ అయ్యే పరిస్థితి!ఆరోగ్యం.. ఆనందంస్కూల్ ఓపెన్ అయ్యాక పిల్లలతో పాటు వైరల్ ఫీవర్స్, దగ్గు, జలుబులు కూడా క్లాస్లోకి ఎంట్రీ ఇస్తుంటాయి! కొత్త టైమింగ్స్, బయట ఆహారం, వేడి వాతావరణం వల్ల పిల్లలు త్వరగా అలసిపోతారు. అందుకే ఈ సీజన్ లో హెల్త్ కేర్ కూడా హోంవర్క్లాగే చాలా ముఖ్యం. నీళ్లు తాగడం తగ్గిపోకుండా మంచి వాటర్ బాటిల్ ఇవ్వాలి. జంక్ ఫుడ్ కంటే హోమ్ ఫుడ్కి ప్రాధాన్యం ఇవ్వాలి. సరైన నిద్ర లేకపోతే పిల్లలు క్లాస్లోనే ‘లో బ్యాటరీ మోడ్’లోకి వెళ్లిపోతారు! ముఖ్యంగా చిన్న పిల్లలైతే చేతులు కడుక్కోవడం, టిఫిన్ షేర్ చేసేటప్పుడు జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి ముందే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ బ్యాగ్లో పుస్తకాలతో పాటు ఇమ్యూనిటీ కూడా తప్పనిసరి!డేటా బరువు!ఒకప్పుడు స్కూల్ బ్యాగ్లో పుస్తకాలు, పెన్సిల్ బాక్స్, టిఫిన్ బాక్స్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు చదువు కూడా అప్డేట్ వెర్షన్ లోకి వెళ్లిపోయింది! పుస్తకాలతో పాటు ట్యాబ్లు, ఐప్యాడ్లు, ఇయర్ఫోన్ ్స, చార్జర్లు కూడా బ్యాగ్లో స్థానం సంపాదించుకున్నాయి. హోంవర్క్ వాట్సాప్లో వస్తోంది. ఫీజులు యాప్ల్లో కట్ అవుతున్నాయి. అటెండెన్ ్స కూడా మొబైల్ నోటిఫికేషన్ గా పేరెంట్స్కి చేరిపోతోంది. అంటే ఇప్పుడు పిల్లల స్కూల్ బ్యాగ్ కన్నా.. ఇంట్లో వైఫై సిగ్నల్కే ఎక్కువ విలువ! ఒకప్పుడు ‘పుస్తకాలు తెచ్చుకున్నావా?’ అని అడిగేవారు. ఇప్పుడు ‘చార్జర్ పెట్టుకున్నావా?’ అనేదే కొత్త స్కూల్ ప్రశ్న! అందుకే పేరెంట్స్ ఇప్పుడు ఫీజుల బడ్జెట్తో పాటు నెల డేటా ప్యాక్, స్క్రీన్ టైమ్, గాడ్జెట్ ఖర్చుల లెక్కలు కూడా వేసుకోవాల్సి వస్తోంది.ఈజీ అండ్ హెల్తీ హోమ్మేడ్ లంచ్బాక్స్ ఐడియాస్!లంచ్బాక్స్లో పెట్టేది కేవలం టేస్టీగా మాత్రమే కాదు.. హెల్తీగా, ఈజీగా తినగలిగేలా కూడా ఉండాలి. ఎక్కువ ఆయిల్, జంక్ ఫుడ్ కంటే ఇంట్లో చేసిన సింపుల్ ఫుడ్ పిల్లలకు ఎనర్జీ కూడా ఇస్తుంది, ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది! అందుకే, కొన్ని ఈజీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ ఐడియాస్ మీకోసం..1. వెజ్ ఉప్మా + బనానా + డ్రైఫ్రూట్స్ చిక్కీఉప్మాలో ఉండే రవ్వ పిల్లలకు ఎక్కువసేపు ఎనర్జీ ఇస్తుంది. ఉప్మాలో కూరగాయలు వేస్తే ఫైబర్, విటమిన్లు కూడా అందుతాయి. బనానా వల్ల ఇన్ స్టంట్ ఎనర్జీ వస్తుంది. డ్రైఫ్రూట్స్ చిక్కీ ఐరన్ , కాల్షియంతో చిన్నపాటి హెల్తీ స్వీట్లా పనిచేస్తుంది.2. ఇడ్లీ + పీనట్ పొడి + యాపిల్ ముక్కలుఇడ్లీ లైట్గా ఉండటంతో పిల్లలు ఈజీగా తింటారు, జీర్ణం కూడా త్వరగా అవుతుంది. పీనట్ పొడిలో ప్రోటీన్ , మంచి ఫ్యాట్స్ ఉంటాయి. యాపిల్ ఫైబర్, విటమిన్ సి అందించి పిల్లల ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది.3. వెజ్ పులావ్ + కీరదోస + కార్న్ చాట్వెజ్ పులావ్లో కార్బోహైడ్రేట్స్తో పాటు కూరగాయల పోషకాలు కూడా ఉంటాయి. కీరదోస శరీరాన్ని చల్లగా ఉంచి హైడ్రేషన్ ఇస్తుంది. కార్న్ చాట్ పిల్లలకు టేస్టీగా అనిపించడంతో పాటు ఫైబర్, ఎనర్జీ కూడా ఇస్తుంది.4. చపాతీ రోల్స్ + ఆలూ/పనీర్ స్టఫింగ్ + ఖర్జూరాలుచపాతీ వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. పనీర్ స్టఫింగ్ అయితే ప్రోటీన్ , కాల్షియం ఎక్కువగా అందుతుంది. ఖర్జూరాలు నేచురల్ స్వీట్గా పనిచేసి ఐరన్ కూడా అందిస్తాయి.5. లెమన్ రైస్ + ఉడికించిన గుడ్డు + ఆరెంజ్ ముక్కలులెమన్ రైస్లో విటమిన్ సి ఉండటంతో పాటు పిల్లలకు టేస్టీగా అనిపిస్తుంది. గుడ్డు మంచి ప్రోటీన్ సోర్స్. ఆరెంజ్ వల్ల ఇమ్యూనిటీ పెరిగి వేసవిలో ఫ్రెష్గా ఫీలవుతారు.6. పెరుగు అన్నం + దానిమ్మ గింజలు + ముర్మురా మిక్స్పెరుగు అన్నం కడుపుకు చల్లదనాన్ని ఇస్తుంది. దానిమ్మలో ఐరన్ , యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ముర్మురా మిక్స్ లైట్ స్నాక్లా ఉండి పిల్లలకు ఈజీగా తినిపించొచ్చు.7. కార్న్/వెజ్ సాండ్విచ్ + ద్రాక్ష + రోస్టెడ్ పల్లీలుసాండ్విచ్లో కూరగాయలు వేసితే పిల్లలు తెలియకుండానే హెల్తీ ఫుడ్ తింటారు. ద్రాక్ష శరీరానికి నీరసం రాకుండా సహాయపడుతుంది. రోస్టెడ్ పల్లీలు ప్రోటీన్ , మంచి ఫ్యాట్స్ అందిస్తాయి.8. మినీ దోశలు + టమాటా చట్నీ + హోమ్మేడ్ అరటి చిప్స్మినీ దోశలు పిల్లలకు ఫన్ గా అనిపిస్తాయి కాబట్టి పూర్తిగా తినేస్తారు. టమాటాలో లైకోపీన్ , విటమిన్ సి ఉంటాయి. ఇంట్లో చేసిన అరటి చిప్స్ బయట జంక్ ఫుడ్ కంటే బెటర్ ఆప్షన్ .9. పొంగల్ + డ్రైఫ్రూట్స్ + పుచ్చకాయ ముక్కలుపొంగల్ సాఫ్ట్గా ఉండి చిన్న పిల్లలకు బాగా సూట్ అవుతుంది. డ్రైఫ్రూట్స్ ఎనర్జీ పెంచుతాయి. పుచ్చకాయ శరీరానికి హైడ్రేషన్ ఇచ్చి వేసవిలో డీహైడ్రేషన్ తగ్గిస్తుంది.10. వెజ్ పాస్తా + ఫ్రూట్ బాక్స్ + మఖానా స్నాక్పిల్లలకు పాస్తా అంటే ఇష్టం కాబట్టి కూరగాయలు కలిపి హెల్తీగా చేయొచ్చు. ఫ్రూట్ బాక్స్ వల్ల విటమిన్లు అందుతాయి. మఖానా లైట్, లో–ఆయిల్ స్నాక్గా మంచి ఆప్షన్ .స్కూల్ ఓపెన్ అంటే కేవలం క్లాసులు స్టార్ట్ కావడం కాదు. పిల్లల కలల పుస్తకంలో ఒక కొత్త పేజీ తిప్పడం. ఎందుకంటే ప్రతి జూన్ లో.. స్కూల్ బెల్, కొత్త క్లాస్తో పాటు కొత్త కలలు కూడా బ్యాగ్లో జిప్ వేసుకుని వస్తాయి! - కొండి దీపిక -
గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ఫెస్టా జునినా
బ్రెజిల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి రంగుల ప్రపంచం కార్నివాల్ మాత్రమే. కానీ బ్రెజిల్ ప్రజలకు అత్యంత ముఖ్యమైనది ‘ఫెస్టా జునినా’ అనే సాంప్రదాయ పండుగ. జూన్ నెలంతా (కొన్ని సందర్భాల్లో జూలైలో) ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ అక్కడి ప్రజల జీవన విధానానికి, ముఖ్యంగా గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతుంది. ప్రాంతాలను బట్టి ఈ పండుగను ‘సావో జోయావో’ అని, ‘ఫెస్టా దో మిల్హో’ అని, ‘మొక్కజొన్న పండుగ’ అని కూడా పిలుస్తుంటారు.బ్రెజిల్ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకునే ఈ ఫెస్టా జునినా పండుగకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఐరోపాలో వేసవి కాలం ప్రారంభాన్ని పురస్కరించుకుని జరుపుకునే పురాతన పద్ధతుల నుంచి ఇది పుట్టింది. క్యాథలిక్ సంప్రదాయం ప్రకారం సెయింట్స్ను స్మరించుకుంటూ, కొత్త పంటల సీజన్ ను ఆహ్వానిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. పోర్చుగీస్ వలసదారుల ద్వారా బ్రెజిల్కు పరిచయమైన ఈ సంస్కృతి, కాలక్రమేణా బ్రెజిల్ దేశీయ ప్రాంతీయ పద్ధతులు, ఆచారాలను సంతరించుకుని ఒక విశిష్టమైన పండుగగా మారిపోయింది.ఈ పండుగ వేడుకలను పాతకాలపు గ్రామీణ పద్ధతిలో, గుడారాలు వేసి నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ప్రజల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బ్రెజీలియన్ జానపద, గ్రామీణ సంగీత మూలాలకు నీరాజనాలు అర్పిస్తూ పురుషులు, మహిళలు పల్లెటూరి రైతుల్లా దుస్తులు ధరిస్తారు. పెద్ద గడ్డి టోపీలు, ముఖంపై టాటూలు, పళ్ళు ఊడిపోయినట్లుగా రంగులు వేసుకోవడం, మహిళలు విభిన్నమైన జడలు వేసుకోవడం వంటివి ఈ పండుగలో ప్రత్యేకంగా నిలుస్తాయి.బ్రెజిల్ సాంస్కృతిక వైవిధ్యాన్ని, ఆతిథ్యాన్ని చూడాలనుకునే వారికి ఈ ఫెస్టా జునినా వేడుకలు ఒక మంచి వేదిక. నగరాల హడావుడి, ఆధునిక కార్నివాల్ మాత్రమే కాదు, బ్రెజీలియన్ మూలవాసుల గ్రామీణ సంస్కృతికి, ఆతిథ్యానికి ఈ ఫెస్టా జునినా ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.సంప్రదాయ నృత్యాలునోరూరించే వంటకాలుచల్లని శీతాకాలపు వాతావరణంలో జరిగే ఈ వేడుకల్లో చలిమంటలు, సంప్రదాయ నృత్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 18వ శతాబ్దపు యూరప్ సంస్కృతి నుంచి వచ్చిన క్వాడ్రిల్హా అనే సంప్రదాయ సామూహిక నృత్యం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో యువతీ యువకులు వధూవరుల్లా నటిస్తూ ఈ ప్రదర్శనకు కేంద్ర బిందువుగా నిలుస్తారు. ఈ పండుగలో వడ్డించే వంటకాలు నోరూరిస్తాయి. ముఖ్యంగా క్వెంటావో అనే పానీయాన్ని (సాంప్రదాయ మద్యం) ఇక్కడి ప్రజలు పండుగరోజుల్లో తప్పని సరిగా స్వీకరిస్తారు. ఇది చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే మొక్కజొన్నతో తయారు చేసే వంటకాలు, స్వీట్లు విరివిగా తింటారు. రమా జంబుల -
ప్రేతాత్మ చెప్పిన కథ..!
ప్రపంచ సాహిత్యంలో ఆత్మకథలు చాలానే ఉన్నాయి. ఆత్మకథల సంగతి అటుంచితే, ప్రేతాత్మ కథ కూడా ఒకటి ఉంది. ‘సేత్ స్పీక్స్’ అనే పుస్తకం అచ్చంగా ప్రేతాత్మ చెప్పిన కథేనట! ఈ పుస్తకం రచయిత్రి జేన్ రాబర్ట్స్– పుస్తకం రాసినది తానే అయినా, తనతో రాయించినది మాత్రం సేత్ అనే వ్యక్తి ఆత్మ అని ప్రకటించడం విశేషం. జేన్ రాబర్ట్స్, ఆమె భర్త రాబర్ట్ బట్స్ 1963 డిసెంబర్ 2న రాత్రివేళ సరదాగా ‘ఊజా బోర్డు’తో ఆత్మలను ఆహ్వానించే ప్రయోగం చేశారు. ఊజా బోర్డు ప్రయోగం చేస్తున్నప్పుడు జేన్కు ఒక అశరీరవాణి వినిపించిందట! ఇదివరకే మరణించిన ఒక పురుషుడి ఆత్మ తనను తాను ‘సేత్’గా పరిచయం చేసుకుని, తన కథ చెప్పడం మొదలుపెట్టింది. సేత్ ఆత్మ చెప్పిన కథనే తాను పుస్తకంగా రాశానని జేన్ రాబర్ట్స్ అప్పట్లో ప్రకటించడం సాహితీ ప్రపంచంలో కలకలం రేపింది. సేత్ తనకు చెప్పిన కథలను జేన్ వరుసగా పుస్తకాలుగా తీసుకొచ్చారు. అవి ‘సేత్ మెటీరియల్’గా ప్రాచుర్యం పొందాయి. ఈ ప్రేతాత్మ కథకు సంబం«ధించిన పుస్తకాలు ఇప్పటికీ పునర్ముద్రణ పొందుతూనే ఉన్నాయి.బంగారు మ్యూజియంప్రపంచంలోనే అత్యంత అరుదైన బంగారు వస్తుప్రదర్శనశాల ఇది. ఇందులోకి అడుగుపెడితే, ఎటు చూసినా పురాతనమైన బంగారు వస్తువుల ధగధగలు కళ్లు చెదిరేలా చేస్తాయి. ఈ మ్యూజియం కొలంబియా రాజధాని బొగోటాలో ఉంది. కొలంబియా స్పానిష్ పాలకుల అధీనంలోకి చేరక మునుపటి కాలానికి చెందిన పురాతన బంగారు, బంగారు మిశ్రమ లోహాల కళాఖండాలను ఇందులో భద్రపరచారు. ఈ మ్యూజియం చూడటానికి ఏటా ఐదులక్షలకు పైగా సందర్శకులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. -
ప్లాస్టిక్న తైలంబు! ఎలా మారుస్తారంటే..
ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిని, సముద్రాలను విషపూరితం చేస్తూ పర్యావరణానికి పెద్ద శాపంగా మారాయి. మరోవైపు, రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యానికి ప్రధాన కారణమైన పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఒక ‘స్వచ్ఛమైన ఇంధనం’ కోసం శాస్త్ర పరిశోధనా రంగం వెతుకులాటలో ఉంది. ఒకవేళ మనల్ని వేధిస్తున్న ఈ ప్లాస్టిక్కే... స్వచ్ఛమైన ఇంధనంగా మారిపోతే? ఆహా, ఆ ఊహే ఎంత ఊరటగా ఉంది!ఇకపై అది ఊహ కాకపోవచ్చు. త్వరలోనే ఈ అద్భుతం జరగొచ్చు. ఎందుకంటే శాస్త్రవేత్తలు సౌరశక్తిని ఉపయోగించి, ప్లాస్టిక్ వ్యర్థాలను అత్యంత స్వచ్ఛమైన ‘హైడ్రోజన్ ఇంధనం’గా మార్చే ఒక కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. పర్యావరణాన్ని పాడుచేసే ఒక వ్యర్థ పదార్థాన్ని, దేశాన్ని నడిపించే ఇంధన వనరుగా మార్చే ఈ ప్రయోగం నిజంగానే సఫలం అవుతుందా?ఇందులో ఉన్న సవాళ్లు ఏమిటి? మైనస్ ఇంటూ మైనస్ = ప్లస్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు పెద్ద సమస్యలైన ప్లాస్టిక్ కాలుష్యం, పర్యావరణానికి హాని చేయని స్వచ్ఛమైన ఇంధనం (క్లీన్ ఎనర్జీ) కొరతలను ఒకేసారి పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు నడుం బిగించారు. అడిలైడ్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ విద్యార్థిని జియావో లూ నేతృత్వంలో జరిగిన ఒక తాజా పరిశోధన దీని గురించి వివరించింది. పనికిరాని ప్లాస్టిక్ను సౌరశక్తితో.. హైడ్రోజన్, సింగ్యాస్, ఇతర పారిశ్రామిక రసాయనాలుగా ఎలా మార్చవచ్చో ఈ పరిశోధన చూపించింది. ప్లాస్టిక్ వస్తువులకు ఈ విధంగా మళ్లీ విలువ కల్పించడం ద్వారా, పర్యావరణానికి మేలు చేసే ఒక స్థిరమైన, ‘సర్క్యులర్ ఎకానమీ’ (వనరులను వృథా చేయకుండా వాటినే పదే పదే ఉపయోగించడం) వ్యవస్థను నిర్మించడానికి ఈ పద్ధతి ఎంతగానో సహాయపడుతుంది. సింగ్యాస్ అంటే.. ఒక రకమైన వాయువుల మిశ్రమం. ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ల కలయిక. దీనిని ఇంధనంగా వాడతారు. తివిరి ప్లాస్టిక్న తైలంబు..!ప్రపంచవ్యాప్తంగా యేటా 45 కోట్ల టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. ఆ ప్లాస్టిక్లో ఎక్కువ భాగం భూమిని, సముద్రాలను కలుషితం చేస్తోంది. అదే సమయంలో, పర్యావరణానికి హాని చేసే బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం పెరగడంతో.. ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన ఇంధనాల కోసం అన్వేషణ ముమ్మరమైంది. శిలాజ ఇంధనాలు అంటే తెలిసిందే. భూమి పొరల నుండి లభించే బొగ్గు, నూనె, గ్యాస్ వంటివి. వీటి వల్ల కాలుష్యం పెరుగుతుంది.‘కెమ్ క్యాటలిసిస్’ అనే సైన్స్ పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధన.. ప్లాస్టిక్లో కార్బన్, హైడ్రోజన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ప్లాస్టిక్ను కేవలం ఒక వ్యర్థ పదార్థంలా కాకుండా, ఒక ఉపయోగకరమైన వనరుగా చూడవచ్చని చెబుతోంది. కార్బన్, హైడ్రోజన్.. ప్లాస్టిక్ తయారీలో ఉండే ముఖ్యమైన రసాయన మూలకాలు. ఇవే ఇంధనంగా మారడానికి దోహదపడతాయి.ఆశాజనకమైన ఫలితాలుఅడిలైడ్ యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్’ సీనియర్ ప్రొఫెసర్ జియావోగువాంగ్ డువాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల చేసిన ప్రయోగాలు చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఎలాంటి ఆటంకం లేకుండా 100 గంటలకు పైగా నిరంతరాయంగా ఈ సాంకేతికత ఎంత స్థిరంగా సమర్థంగా పనిచేయగలదో ఈ ప్రయోగాలు నిరూపించాయి. ఈ ప్రయోగాల ద్వారా పెద్ద మొత్తంలో హైడ్రోజన్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా, పరిశ్రమలలో వాడే ఎసిటిక్ యాసిడ్, డీజిల్ లాంటి హైడ్రోకార్బన్లు కూడా తయారైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఎసిటిక్ యాసిడ్ అనేది పరిశ్రమలలో రసాయనాల తయారీకి, నిత్యజీవితంలో వెనిగర్ రూపంలో వాడే ఒక ఆమ్లం. హైడ్రోకార్బన్లనేవి పరమాణువులతో తయారయ్యే సమ్మేళనాలు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలన్నీ హైడ్రోకార్బన్ల కిందికే వస్తాయి. సవాళ్లు కూడా ఉన్నాయిప్లాస్టిక్ వ్యర్థాలను ఇంధనంగా మార్చే ఈ పరిశోధనలో కొంత పురోగతి సాధించినప్పటికీ, ఈ సాంకేతికతను భారీస్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ముందు కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. ‘‘ఇందులో ఉన్న ఒక పెద్ద సమస్య ఏమిటంటే, ప్లాస్టిక్ వ్యర్థాల స్వభావం చాలా సంక్లిష్టంగా ఉండటం’’ అని ప్రొఫెసర్ డువాన్ అంటారు. ‘‘వేర్వేరు రకాల ప్లాస్టిక్లు ఇంధనంగా మారేటప్పుడు వేర్వేరుగా స్పందిస్తాయి. అంతేకాకుండా, ప్లాస్టిక్లలో ఉండే రంగులు, స్టెబిలైజర్లు (ప్లాస్టిక్ మన్నికను పెంచే రసాయనాలు) ఈ ప్రక్రియకు అడ్డుపడవచ్చు. అందువల్ల, మంచి ఫలితాలను, నాణ్యమైన ఇంధనాన్ని పొందాలంటే.. ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా వర్గీకరించడం, ముందుగా శుద్ధి చేయడం చాలా అవసరం’’ అని డువాన్ చెబుతున్నారు. భవిష్యత్తు ప్రణాళిక సిద్ధంఈ సాంకేతికతను ప్రయోగశాల నుండి పరిశ్రమల స్థాయికి ఎలా తీసుకువెళ్లాలో వివరించే కొన్ని ముఖ్యమైన దశలను పరిశోధకుల బృందం సిద్ధం చేసింది. రాబోయే దశాబ్దాలలో ఈ క్లీన్ హైడ్రోజన్ ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, పరిశ్రమలలో ఇది అంతరాయం లేకుండా పనిచేసేలా చేయడమే వారి ప్రధాన లక్ష్యాలు. ‘‘ఇది చాలా ఆసక్తికరమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం’’ అని పరిశోధకురాలు జియావో లూ గొప్ప ఉత్తేజంతో చెబుతున్నారు. ‘‘కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగితే.. సౌరశక్తితో ప్లాస్టిక్ను ఇంధనంగా మార్చే ఈ సాంకేతికతలు... భవిష్యత్తులో కాలుష్యం లేని, పర్యావరణహితమైన సమాజాన్ని నిర్మించడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని మేము నమ్ముతున్నాం’’ అని ఆమె అంటున్నారు.‘ఇంజినీరింగ్’ అడ్డంకులుఈ ప్రక్రియ ద్వారా చివరకు తయారయ్యే ఇంధనాలను, రసాయనాలను ఒకదానికొకటి వేరు చేయడం కూడా ఒక పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఈ రసాయన చర్యల వల్ల వాయువులు, ద్రవాల మిశ్రమం ఉత్పత్తి అవుతాయి. వీటిని విడివిడిగా వేరు చేయాలంటే భారీగా శక్తిని (విద్యుతు, లేదా వేడిని) ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల, పర్యావరణాన్ని కాపాడాలనే ఈ మొత్తం ప్రక్రియ అసలు ఉద్దేశానికే నష్టం చేకూరే అవకాశం ఉంది. ఈ సమస్యలను దాటేందుకు, పరిశోధకులు అన్ని విభాగాలను సమన్వయం చేసే ఒక సమీకృత వ్యూహం అవసరమని గట్టిగా చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను హైడ్రోజన్గా మార్చేందుకు వేటివేటిని మెరుగుపరచాలో వారు చెబుతున్నారు. అవి:క్యాటలిస్ట్ డిజైన్: కాంతి ఉత్ప్రేరకాల పనితీరును మరింత నాణ్యంగా మార్చటం.రియాక్టర్ ఇంజనీరింగ్: రసాయన చర్యలు జరిగే పాత్రలు లేదా యంత్రాలను మరింత సమర్థవంతంగా తయారు చేయడం.సిస్టమ్ ఆప్టిమైజేషన్: యంత్రాలు, రసాయనాలు, మానవ శ్రమతో కూడిన మొత్తం వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం.పాస్టిక్ను ఇంధనంగా ఎలా మారుస్తారు?సౌరశక్తితో ప్లాస్టిక్ను ఇంధనంగా మార్చే విధానాన్ని ‘సోలార్–డ్రివెన్ ఫొటోరిఫార్మింగ్’ అంటారు. ఇది సూర్యకాంతికి స్పందించే ‘కాంతి ఉత్ప్రేరకాలు’ (ఫొటోక్యాటలిస్ట్లు) అనే ప్రత్యేక పదార్థాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ ప్రధానంగా 4 దశల్లో జరుగుతుంది. ప్లాస్టిక్ను సిద్ధం చేయడం సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మొదట బాగా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఎందుకంటే పెద్ద ప్లాస్టిక్ వస్తువుల కంటే చిన్న ముక్కలపై రసాయన చర్య చాలా వేగంగా జరుగుతుంది.ఫోటోక్యాటలిస్ట్ను కలపడంఈ చిన్న ప్లాస్టిక్ ముక్కలను ఒక ప్రత్యేకమైన ద్రవంలో ముంచుతారు. అందులో ‘ఫొటోక్యాటలిస్ట్’ అనే ప్రత్యేక పదార్థాన్ని కలుపుతారు. ఫొటోక్యాటలిస్ట్ అనేది సూర్యకాంతిని తనపై పడగానే క్రియాశీలం అయి, రసాయన చర్యలను అత్యంత వేగంగా జరిగేలా చేసే ఒక ఉత్ప్రేరకం.సూర్యకాంతి ప్రయోగంఇప్పుడు ఈ మిశ్రమంపై సూర్యకాంతి పడేలా చేస్తారు. ఇక్కడే అసలైన అద్భుతం జరుగుతుంది. ప్లాస్టిక్ ముక్కల్లో కార్బన్, హైడ్రోజన్ పరమాణువులు ఒకదానికొకటి గట్టిగా అంటుకుని ఉంటాయి. సూర్యకాంతిలోని శక్తిని ఫొటోక్యాటలిస్ట్ గ్రహించి, ఆ శక్తితో ప్లాస్టిక్లో ఉన్న ఈ కార్బన్– హైడ్రోజన్ బంధాలను ముక్కలు ముక్కలుగా విడగొడుతుంది.ఇంధనం విడుదల అవటంబంధాలు విడిపోగానే, ప్లాస్టిక్ నుండి విడిపోయిన హైడ్రోజన్ పరమాణువులన్నీ ఒకదానితో ఒకటి కలిసి హైడ్రోజన్ వాయువుగా మారి పైకి విడుదలవుతాయి. దీనిని శాస్త్రవేత్తలు ప్రత్యేక గొట్టాల ద్వారా సిలిండర్లలో భద్రపరుస్తారు. మిగిలిన కార్బన్ భాగం పరిశ్రమలలో వాడే ఇతర ఉపయోగకరమైన రసాయనాలుగా (ఎసిటిక్ యాసిడ్ లేదా డీజిల్ వంటి హైడ్రోకార్బన్లు) మారుతుంది. సాక్షి స్పెషల్ డెస్క్ -
పిల్లలకు సమయం కేటాయించాలి
‘పిల్లలకు డబ్బు, ఆస్తులు ఇవ్వడం కాదు, రోజూ తగినంత సమయం కేటాయించడం ముఖ్యం’ అంటున్నారు సైకాలజిస్ట్ పి.జ్యోతిరాజ. ఇరవయ్యేళ్లుగా సైకాలజిస్టుగా చిల్డ్రన్, ఫ్యామిలీ కౌన్సెలర్గా ఉన్న జ్యోతిరాజ పిల్లల పెంపకంలో తాను తీసుకున్న జాగ్రత్తలను ఇలా తెలిపారు...‘‘నిన్నటి తరం పిల్లలు అమ్మనాన్నలు ఏం చెబితే అది విన్నారు. తర్వాతి తరం నిర్ణయాలలో పిల్లల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలు ఎంత చెబితే అంత అనే విధంగా ఉంది. ఆరవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని కౌన్సెలింగ్కు నా దగ్గరకు తీసుకువచ్చారు. ఇంట్లో ఆ అమ్మాయికి నచ్చినట్టే తల్లిదండ్రులు ఉండాలి. లేదంటే, ఇంట్లో పెద్ద గొడవ. రెండు విషయాల్లో మరీ సమస్య పెద్దదిగా కనిపిస్తోంది. ‘ఒకటి ఫోన్ వాడకం, రెండవది చదువుకోమని చెప్పడం.’ ఈ రెండింటిలోనూ పిల్లలు అతిగా స్పందిస్తున్నారు. పిల్లలకు ఇచ్చింది సమయాన్నే..!నాకు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు సంతానం. వారిని మూడో క్లాస్ నుంచి ఒంటరిగా పనులు చేసుకోవడం, బయటకు వెళ్లిరావడం, వారికి కావల్సినవి వారే కొని తెచ్చుకోవడం వంటివి అలవాటు చేస్తూ వచ్చాను. దీని వల్ల పై చదువుల సమయంలో మాకు దూరంగా ఉన్నా పిల్లలు ఇబ్బందులు పడలేదు. వారికి స్వేచ్ఛగా ఉండే అవకాశం ఇస్తూనే, క్రమశిక్షణనూ అలవాటు చేశాను. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఇంటి విషయాలలో కూడా వారి అభిప్రాయం తీసుకునేదానిని. అది నచ్చకపోయినా కొట్టిపడేసిన దాన్ని కాదు. వాళ్లు చెప్పినవన్నీ అనుకూలంగా, వాడదగినవిగా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు వెంటనే ‘నో’ చెప్పకుండా ఎలా చేస్తే బాగుంటుందో కాస్త సమయం తీసుకునైనా చెప్పేదాన్ని. దీని వల్ల పిల్లలు అర్థం చేసుకునేవారు. అర్థం చేసుకోవడమే ముఖ్యంపిల్లలు చదువులో టాపర్స్గా ఉన్నారా, గ్రేడ్స్ వస్తున్నాయా అని చూసేదాన్ని కాదు. వారు ఆ చదువును ఎంతబాగా అర్థం చేసుకోగలుగుతున్నారు.. అనేదానిపై దృష్టి పెట్టమనేదాన్ని. స్కూల్ నుంచి వచ్చాక ‘టీచర్లు ఏం చెప్పారు, ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు, స్కూల్లో ఏం జరిగింది?’ అని అడిగేదాన్ని. వాళ్లు చెప్పేదంతా వినేదాన్ని. అంతేకానీ, హోమ్వర్క్, క్లాస్ వర్క్, మార్కుల గురించి అడిగేదాన్ని కాదు. మా పిల్లలు చదువుకునే టైమ్లో కంప్యూటర్స్ బూమ్లో ఉంది. కానీ, మా అమ్మాయి ఆర్కిటెక్చర్ చేస్తానంది. సరే అన్నాను. మంచి ర్యాంక్ తెచ్చుకుంది. మా అబ్బాయిని సైన్స్ వైపుగా వెళతావా అని అడిగాను. లేదు ఇంజనీరింగ్ అన్నాడు. వారి ఇష్టాలను కాదనలేదు. వాళ్ల మాటకు మేం విలువ ఇచ్చాం. వాళ్లూ మా మాటలకు విలువ ఇచ్చారు. లేట్ నైట్స్ బయట తిరగడం మాత్రం ఒప్పుకునేదాన్ని కాదు. రాత్రి సమయాల్లో బయట ఉంటే సమస్యలు ఏ విధంగా వస్తాయో వివరించేదాన్ని. నేను మీతో ఉన్నాను అనే భరోసా! మా బాబుకి బిట్స్లో సీట్ వచ్చేముందు కొంతకాలం హాస్టల్లో ఉండేవాడు. అక్కడ ఉన్నన్ని రోజులూ ఏదో తెలియని ఆందోళన ఫీలవుతున్నట్టు గమనించాను. దీంతో ఇంటికి తీసుకువచ్చేశాను. ఇంట్లోనే చదువు, టెస్ట్.. జరిగేలా ప్రతిరోజూ ప్లాన్ చేశాం ‘ఏం టెన్షన్ పడకు. ర్యాంకు రాకపోయినా పర్వాలేదు. ఇది కాకపోతే మిగతా చాయిస్లు కూడా ఉన్నాయి’ అని చెప్పదాన్ని. నీకు నేను ఉన్నాను అని మోరల్గా సపోర్ట్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ చూశాను. మా అమ్మాయి పెళ్లయ్యి, అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. వాళ్లకు ఒక బాబు. నాలుగేళ్ల వయసు. బోలెడన్ని ప్రశ్నలు వేస్తుంటాడు. పిల్లలు అడిగే సందేహాలకు ఓపికగా సమాధానాలు చెప్పకపోతే నిరుత్సాహపడిపోతారు. వారి ఆలోచనలు మరోవైపుకు మళ్లుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వదగిన ఆస్తి తగినంత సమయం వారితో గడపడమే. మా అబ్బాయి కూడా విదేశాలలోనే జాబ్ చేస్తున్నాడు. ఇద్దరూ వారి వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నారు.’’∙నిర్మలారెడ్డిమనం వింటే.. వాళ్లు వింటారు..! ఈ మధ్య ఒక పదమూడేళ్ల అబ్బాయిని వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్కు తీసుకువచ్చారు. ఆ అబ్బాయి ధోరణి ఎలా ఉందంటే, పేరెంట్స్ ఏది చెబితే అది రివర్స్ చేస్తాడు. మొదట ఆ అబ్బాయి అడిగిందల్లా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అబ్బాయితో తల్లిదండ్రులు గడపాల్సిన విధానం, సమయం,.. అన్నీ చెబుతూ కొన్ని సెషన్స్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చింది. పేరెంటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ప్రతిరోజూ వారితో కనెక్టివ్గా ఉండాలి.డబ్బులు ఉన్నాయని అడిగినవన్నీ కొనిస్తే అమ్మనాన్నలు డబ్బు మిషన్లలాగే కనిపిస్తారు. మా పిల్లలకు ఏది అవసరమో అదే కొనేదాన్ని. అవసరం లేనిదాని గురించి చెప్పేదాన్ని. డ్యూటీ టైమ్ అయిపోయి ఇంటికి వచ్చానంటే పిల్లలకే సమయం కేటాయించేదాన్ని. ఇప్పటికీ ప్రతిరోజూ ఫోన్ ద్వారా పిల్లలతో కమ్యూనికేషన్లో ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోవడం సులువు అవుతుంది.మనం వింటే.. వాళ్లు వింటారు..! ఈ మధ్య ఒక పదమూడేళ్ల అబ్బాయిని వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్కు తీసుకువచ్చారు. ఆ అబ్బాయి ధోరణి ఎలా ఉందంటే, పేరెంట్స్ ఏది చెబితే అది రివర్స్ చేస్తాడు. మొదట ఆ అబ్బాయి అడిగిందల్లా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అబ్బాయితో తల్లిదండ్రులు గడపాల్సిన విధానం, సమయం,.. అన్నీ చెబుతూ కొన్ని సెషన్స్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చింది. పేరెంటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ప్రతిరోజూ వారితో కనెక్టివ్గా ఉండాలి. డబ్బులు ఉన్నాయని అడిగినవన్నీ కొనిస్తే అమ్మనాన్నలు డబ్బు మిషన్లలాగే కనిపిస్తారు. మా పిల్లలకు ఏది అవసరమో అదే కొనేదాన్ని. అవసరం లేనిదాని గురించి చెప్పేదాన్ని. డ్యూటీ టైమ్ అయిపోయి ఇంటికి వచ్చానంటే పిల్లలకే సమయం కేటాయించేదాన్ని. ఇప్పటికీ ప్రతిరోజూ ఫోన్ ద్వారా పిల్లలతో కమ్యూనికేషన్లో ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోవడం సులువు అవుతుంది. డా.పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్ నిర్మలారెడ్డి(చదవండి: తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు) -
న్యాయం దక్కలేదు.. చట్టం మారింది
లైంగిక హింసకు గురైన ఓ ఆదివాసీ మహిళకు అండగా నిలబడి, ఆమె గౌరవాన్ని రక్షించడంలో వ్యవస్థ విఫలమైంది. న్యాయవ్యవస్థ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే ఘటనల్లో ఇది ఒకటి.– సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రక్షకభట నిలయంలోనే తనకు రక్షణ కరువైందని, న్యాయం చేయాలని, మృగాళ్లను శిక్షించాలని ఓ యువతి వేడుకుంది. అయితే, న్యాయస్థానాల్లో ఆమెకు చుక్కెదురైంది. వ్యక్తిగతంగా ఆమెకు న్యాయం దక్కలేదు. నిందితులకు శిక్షపడలేదు. కాని, భారత న్యాయవ్యవస్థలో పలు మార్పులకు, మహిళా రక్షణ చట్టాల బలోపేతానికి ఈ కేసు నాంది పలికింది. అదే తుకారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు. ‘మథుర’ కేసుగా ఇది ప్రాచుర్యం పొందింది. ఇదీ విషాదంఅక్షరం ముక్క రాకపోయినా, తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెంది అనాథగా బతకాల్సి వచ్చినా, ఆమె వెరవలేదు. తన కాళ్లపై నిలబడింది. కూలి నాలి చేసుకుంటూ సోదరుడు గామాతో కలిసి జీవిస్తూ, తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది. సోదరుడు పెట్టిన కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆ యువతే మథుర. కూలి పనులతో పాటు స్థానికంగా ఒకరి ఇంట్లోనూ పని చేసేది. ఆ ఇంటి యజమానురాలి బంధువు అశోక్తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆమె సోదరుడు గామాకు నచ్చలేదు. దీంతో ఆమె యజమానురాలు నున్షి, ఆమె భర్త, అశోక్లు మథురను అపహరించారని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నిమిత్తం ఆమెను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దేశాయ్గంజ్ పోలీస్స్టేషన్కు రాత్రి సమయంలో తీసుకువచ్చారు. ఆమె వయస్సు ధ్రువీకరణ పత్రం తీసుకుని మర్నాడు స్టేషన్కు రావాలని చెప్పి రైటర్ బయటకు వెళ్లాడు. తుకారాం, గణపత్ అక్కడే కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు.ఏం జరిగిందిమ«థుర వాంగ్మూలం ప్రకారం..‘అందరం బయటకు వెళుతున్న సమయంలో గణపత్ తనను ఆపాడని, మిగతా వాళ్లు వెళ్లిపోవాలని తుకారామ్ ఆదేశించాడు. పోలీస్ స్టేషన్ తలుపులు మూసేశారు. లైట్లు ఆర్పేశారు. ఒంటరిగా ఉన్న తనను భవనం వెనుక వైపు ఉన్న బాత్రూమ్లోకి లాక్కెళ్లి తుకారామ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడ్ని తప్పించుకుని బయటకు వస్తుండగా గణపత్ సైతం లైంగిక దాడికి యత్నించాడు. అతడు మద్యం మత్తులో ఉండడంతో తప్పించుకుని పోలీస్స్టేషన్ వెలుపలికి వచ్చాను’. ఈ ఘటనపై స్థానికుల నుంచి సైతం ఒత్తిడి రావడంతో కేసు నమోదైంది. కోర్టులో విచారణతొలుత చంద్రపూర్ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. లైంగిక నేరం జరిగిందనడానికి బలమైన కారణాలు లేవని, ఆమె ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఎటువంటి గాయాలు, ప్రతిఘటనకు సంబంధించిన ఆనవాళ్లు లేవని తేల్చింది. ఆమె అంగీకార పూర్వకంగానే ఇది జరిగి ఉండొచ్చని పేర్కొంది. కానిస్టేబుళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో కేసు హైకోర్టుకు చేరింది. సెషన్స్ కోర్టు వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. భయం, నిస్సహాయత కారణంగా ఆమె ప్రతిఘటించకపోవడాన్ని ‘సమ్మతి’గా భావించలేమని తుకారామ్కు ఐదేళ్లు, గణపత్కి ఏడాది జైలు శిక్ష విధించింది.సుప్రీంకోర్టులోనూ..హైకోర్టు తీర్పుపై నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిస్సహాయ లొంగుబాటును అత్యాచారంగా పరిగణించడానికి సరిపడా ఆధారాలు లేవని పేర్కొంది. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. వెల్లువెత్తిన నిరసనలుకోర్టులో కేసు నిలబడలేదు. ఆమె కోరుకున్న న్యాయం దక్కలేదు. కాని, సమాజం నుంచి అనూహ్యంగా మద్దతు వెల్లువెత్తింది. సుప్రీం కోర్టు తీర్పుపై మేధావులు కలమెత్తారు. ఇది వాంఛనీయం కాదంటూ నలుగురు న్యాయ శాస్త్ర ప్రొఫెసర్లు అప్పటి చీఫ్ జస్టిస్కు బహిరంగ లేఖ రాశారు. చట్టం, రాజ్యాంగం ప్రకారం మహిళలకు సంక్రమించిన హక్కులను హరించేలా తీర్పు ఉందంటూ ఆక్షేపించారు. మథురకు జరిగిన అన్యాయాన్ని కోర్టు గుర్తించినప్పటికీ సాంకేతికపర అడ్డంకులు న్యాయానికి ప్రతిబంధకాలుగా, నిందితులకు అనుకూలంగా మారాయి. మథురకు న్యాయం జరగలేదంటూ పౌర సమాజం స్పందించింది. లైంగిక నేరాలకు వ్యతిరేకంగా మొదటిసారి గొంతెత్తి నినదించింది. ప్రభుత్వాన్ని కదిలించింది. చట్టాల్లో మార్పులకు ఈ కేసు నాంది పలికింది.మార్పులు ఇలా..అన్యాయానికి గురైన మహిళలకు రక్షణగా చట్టాల్లో మార్పులకు ఈ కేసు నాంది పలికింది. ఈ సవరణలు భారత న్యాయవ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చింది.‘కస్టోడియల్ రేప్’ అంటే నిర్దిష్టమైన నిబంధనలను నిర్వచించింది. పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ అధీనంలో ఉన్న, పని చేస్తున్న వారిపై లైంగిక దాడికి పాల్పడితే పదేళ్ల వరకు శిక్ష విధించేలా మార్పులు చేసింది. తన సమ్మతి లేకుండానే లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదు చేస్తే, తాను నిర్దోషినని నిందితుడే నిరూపించుకునేలా భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో మార్పులు చేశారు.బాధితురాలి గౌరవాన్ని కాపాడేందుకు లైంగిక దాడి కేసులను బహిరంగ విచారణ కాకుండా, ఇన్ కెమెరా ట్రయల్స్ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు రూపొందించారు.బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసేలా మీడియాలో పేరు రాయడం, ఫొటోలు ప్రచురించడాన్ని నిషేధించారు. \భయం, బెదిరింపులు, నిస్సహాయత కారణంగా ప్రతిఘటించకపోవడాన్ని ‘సమ్మతి’గా, నిశబ్దాన్ని అనుమతిగా భావించరాదని గుర్తించారు. -దిలీప్ మాదిరెడ్డి -
అటు ప్రయోగం ఇటు ప్రయోజనం!
అందమైన పరిసరాల్లో పుట్టి పెరిగిన కళాకారుల రచనల్లో సౌందర్యం జాలువారుతుందని వర్డ్స్వర్త్, కీట్స్, కాలెరిజ్ తదితర ఇంగ్లిష్ భావకవులు– మూడువందల యేళ్ళ కిందట – ఓ సిద్ధాంతం చెప్పారు. విలియం గిల్పిన్ అనే విమర్శకుడు వారి సిద్ధాంతానికి ‘పిక్చరెస్క్ ఈస్థెటిక్స్‘ (రమణీయ సౌందర్యశాస్త్రం) అని పేరుపెట్టారు. అంతకు వెయ్యిన్నర సంవత్సరాల కిందట భామహుడు మొదలుకొని ఆనందవర్ధనుడి వరకు ఎందరో భారతీయ ఆలంకారికుల సిద్ధాంతాల్లోనూ అలాంటి భావాలున్నాయనే మాట నిజమే– అయితే అదలా వుంచండి! ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ భావనకు ఉదాహరణగా చెప్పదగిన రచయిత జ్షాన్ మారీ గుస్తావ్ లా క్లేజ్యో ఒకరు. లా క్లేజ్యోకు 2008లో నోబెల్ సాహిత్యపురస్కారం ప్రకటిస్తూ ‘ఆయన రచనలు సరికొత్త ప్రయోగాలూ, కవితాత్మక సాహసకృత్యాలూ, ఆనందానుభూతుల చిత్రణలతో నిండి వుంటాయ’ంది స్వీడిష్ ఎకాడెమీ. (నోబెల్ సాహిత్య పురస్కారం ఎవరికివ్వాలో నిర్ణయించేది ఈ ఎకాడెమీయే.) అంతేకాదు– ‘ప్రస్తుతం చెలామణీలో వున్న నాగరికతను మించినవారి కథలనూ, దాని పరిధిలోకి రానివారి కథలనూ కూడా చిత్రించిన రచయిత’గా లా క్లేజ్యోను ప్రశంసించింది స్వీడిష్ ఎకాడెమీ. నవలాకారుడిగానూ, కథానిక రచయితగానూ, వ్యాసకర్తగానూ, అనువాదకుడిగానూ సుప్రసిద్ధుడు లా క్లేజ్యో. ఇటలీ సరిహద్దుకు చేరువగా వుండే ఫ్రెంచ్ నగరం నీస్లో పుట్టారాయన. అది ఆయన తల్లి తరఫు బంధువుల స్వస్థలం. లా క్లేజ్యో తండ్రి తరఫు బంధువులు వందల సంవత్సరాల కిందటే తరలి వెళ్ళిపోయారు. అలా ఆయన పుడుతూనే ద్విజాతీయుడు. అందుకే లా క్లేజ్యో తనను తాను ఫ్రాంకో–మారిషియన్గా చెప్పుకుంటారు.ఇంగ్లండ్– ఫ్రాన్స్– మెక్సికో దేశాల్లో చదువుకుని డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు లా క్లేజ్యో. అండర్ గ్రాడ్యుయేట్ పట్టాకోసం ఆయన ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. మాస్టర్స్ కోసం, ఫ్రెంచ్ ప్రయోగాత్మక కవి– రచయిత– చిత్రకారుడు హెన్రీ మిషో రచనలను ఎంచుకున్నారు. తీరా డాక్టరేట్ విషయానికి వచ్చేసరికి ఆధునిక చరిత్ర ఆవిర్భవిస్తున్న దశను లా క్లేజ్యో ఎంపిక చేసుకున్నారు. సామాన్య శకం 1525 వరకూ, స్వతంత్రంగా జీవించిన పూరిపెచా ప్రజలు ఆ దశలో మశూచికం తదితర అంటువ్యాధుల పాలబడ్డారు. ఆ పరిస్థితిలో, వారి నాయకులు ప్రజల సంక్షేమం కోసం యుద్ధాన్ని నివారించాలని భావించారు. స్పెయిన్ రాజుకు సామంతరాజ్యంగా ఉంటామని స్వచ్ఛందంగా ప్రకటించారు. దాన్నే ‘పూరిపెచా జాతిపై దిగ్విజయం’గా వక్రీకరించారు స్పానిష్ చరిత్రకారులు. లా క్లేజ్యో తన సిద్ధాంత గ్రంథంలో ఈ వంచనను వెలికితీశారు! పదహారో శతాబ్ది నాటి రాతప్రతుల ఆధారంగా ఆయన ఈ గుట్టు రట్టు చేయగలిగారు. ఆయన అధ్యయన ప్రణాళిక ఇంత క్లిష్టంగా వున్నందువల్లనే అది పూర్తికావడానికి పాతికేళ్ళు పట్టింది.రచయితగా, ప్రయోగశీలతనూ – ప్రయోజన దృష్టినీ గొప్పగా సమ్మిళితం చేశారు లా క్లేజ్యో. రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, శాలింగర్, మిషో, హెమింగ్వే, ఫాక్నర్– లా క్లేజ్యోను ప్రభావితం చేసినవారు. అలాంటి రచయిత ప్రయోగం– ప్రయోజనం అనే రథచక్రాల మీద వీరవిహారం చెయ్యడంలో వింతేముంది? ఏడేళ్ళ పసితనంలోనే సముద్రం గురించి చిన్న పుస్తకం రాసేశాడు ఈ పిడుగు! నైజీరియాలో వున్న తండ్రిని మరుసటి సంవత్సరం –1948లో– కుటుంబ సమేతంగా కలవబోతున్నానన్న ఊహే, లా క్లేజ్యో చేత ఆ పుస్తకం రాయించింది. ఇదే ఊహ, 44 సంవత్సరాల తర్వాత ‘అనీత్సా’ అనే నవలగానూ రూపుదిద్దుకుంది. అదీ పూర్తిగా కల్పన కాదంటారు లా క్లేజ్యో సాహిత్య నిపుణులు. బహుశా అందుకేనేమో, వారెన్ మాటీ అనే విమర్శకుడు ఈ 44 యేళ్ళ కాలాన్ని లా క్లేజ్యో శిక్షణకాలంగా అభివర్ణించాడు! ఈ కథ 1848లో జరిగిందని రచయిత ప్రత్యేకంగా ప్రకటించడం విశేషం! ఫ్రాన్స్ దక్షిణ తీరం నుంచి ఓ పాత నావలో బయల్దేరిన తల్లీ కొడుకులు పశ్చిమ ఆఫ్రికా తీరం పొడుగునా సాగించే సుదీర్ఘ యాత్రే ఈ నవలకు ఇతివృత్తం. ఈ రెండు పుస్తకాలూ రాయడానికి మధ్య కాలంలో లా క్లేజ్యో ఎన్నో మెరుపులు మెరిపించారు. 1963లో వెలువడిన ‘లా ప్రాసెస్ వెర్బల్’ (విచారణ– ఇంటరాగేషన్) అనేది లా క్లేజ్యో తొలి నవల. దానికే ‘ప్రీ రెనాడో‘ పురస్కారం అందుకున్నాడాయన. ఇదే రచన మరో పోటీల్లో కూడా షార్ట్ లిస్ట్ కావడం విశేషమే మరి. లా క్లేజ్యో ప్రయోగాల్లో అత్యధిక పాఠకాదరణ పొందిన నవల ‘డెజెర్ట్.’ ఉత్తర ఆఫ్రికాలో కనిపించే సంచార ఆదివాసుల ప్రణయగాథ దానికి ఇతివృత్తం. ఈ నవల వేర్వేరు కాలాల్లో జరిగిన కథను వేర్వేరు వ్యక్తుల దృష్టికోణం నుంచి చూపిస్తాడు కథకుడు. ఇలాంటి శిల్పవిన్యాసం పాఠకులను రంజింప చెయ్యడంలో వింతేముంది?లా క్లేజ్యోతో పొల్చదగిన రచయితలు అతని సమకాలికుల్లో ఎవరూ లేరనే చెప్పొచ్చు. అయితే అతనికన్నా ముందుగా నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ఫ్రెంచ్ రచయితలు కూడా ఎవరికీ తీసిపోరు మరి! ఈ పురస్కారం మొదలైన యేడాదే, 1901లో, దాన్ని గెల్చుకున్నవాడు సూలీ ప్రూదాం. ఆయన రాసిన ప్రతీకాత్మక కవిత్వం సుప్రసిద్ధం. ముఖ్యంగా, ప్రూదాం రాసిన ‘ద బ్రోకెన్ వేజ్ – పగిలిన కలశం’ కవితను నెట్ లో చూడొచ్చు! ఇక 85 ఏళ్ళ తర్వాత ఈ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన క్లాడ్ సిమో కూడా తక్కువ వాడేం కాడు. శైలీ విన్యాసానికీ, ప్రయోగశీలతకూ సిమో సుప్రసిద్ధుడు. పోతే, 2000 సంవత్సరానికి గానూ నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న గావ్ షింజియాంగ్ ఫ్రెంచ్ జాతీయుడే కానీ ఫ్రెంచ్ రచయిత కారు! అయినా, పెద్దలతో పోలికలెందుకు మనకు? ఎవరంత వాళ్ళు వారనుకుంటే పోలా? -లిట్వరల్డ్ -
క్లూషియల్: ది రైటర్
ప్రముఖ క్రైమ్ నవలా రచయిత చక్రవర్తి మరణం రాష్ట్రాన్ని కుదిపేసింది. క్రైమ్ నవలా రచయితగా అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతని క్రైమ్ కథలు ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. ఈ కేసును పరిశోధించడానికి క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నచికేత రంగంలోకి దిగాడు.క్రైమ్ సీన్... టేబుల్ మీద అలాగే ఒరిగిపోయి ఉన్నాడు చక్రవర్తి. టెక్నాలజీ ఎంత పెరిగినా అతను పెన్తో కాగితం మీద కథలు రాయడానికి ఇష్టపడతాడు. కథ రాస్తూ అలాగే ఒరిగిపోయాడు. ఉదయానికే చక్రవర్తి ఊపిరి ఆడక ప్రాణాలు విడిచాడు. పైకి అది గుండెపోటులా కనిపించింది. కానీ అది అసహజ మరణంగా, హత్యగా అనిపించింది నచికేతకు.సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా చక్రవర్తి టేబుల్పై ఉన్న ఆ ఫౌంటెన్ పెన్ అతని కంటపడింది. ఆ పెన్ నిబ్ దగ్గర స్వల్పంగా నీలిరంగు మరక ఉండడం గమనించాడు. పేపర్ మీద రాసిన అక్షరాల ఇంక్ నలుపు రంగులో ఉంది. మరి ఆ నీలి రంగు ఏమిటి?నచికేత వెంటనే ఆ పెన్ ను ఫోరెన్సిక్ లాబ్కు పంపాడు.నచికేత విచారణ మొదలుపెట్టాడు. ఇంట్లో అందరినీ ప్రశ్నించాడు. చక్రవర్తి తమ్ముడు భార్గవతో సహా ఇల్లంతా సోదా చేశాడు. భార్గవ గదిని సోదా చేసినప్పుడు అక్కడ కొన్ని పాత సైన్స్ జర్నల్స్ కనిపించాయి.నచికేత చక్రవర్తి వాడిన ఫౌంటెన్ పెన్ను నిశితంగా పరిశీలించాడు. కానిస్టేబుల్ని పిలిచి ఆ నిబ్ పెన్ చూపించి ఏదో చెప్పాడు.సరిగ్గా అరగంట తర్వాత చక్రవర్తి తమ్ముడు భార్గవను గదిలోకి పిలిచాడు ఇన్స్పెక్టర్ నచికేత.‘మీ అన్నయ్య ఆత్మశాంతి కోసం ఒక సందేశాన్ని ఈ కాగితం మీద రాసి ఇవ్వండి. చక్రవర్తిగారు ప్రముఖ రచయిత కదా... మీ స్వదస్తూరితో ఆ సందేశాన్ని రాస్తే పత్రికల్లో సంతాప సందేశాన్ని ప్రకటనగా ఇద్దాం.’ అన్నాడు ఫౌంటెన్ పెన్ను భార్గవకు ఇస్తూ.. ఆ పెన్ వంక, నిబ్ వంక భయంగా చూశాడు భార్గవ.‘మీ అన్నయ్య రాత్రి వాడిన పెన్నే.. సెంటిమెంట్గా ఇచ్చాను.. వేలితో నిబ్ను సరిచేసుకో.’ అన్నాడు. అతని వంకే చూస్తూ...భార్గవ మొహంలో రంగులు మారాయి. పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎదురుగా పోలీసులు సంకెళ్లతో..మీడియా గుమికూడింది. ప్రముఖ క్రైమ్ నవలా రచయిత మరణం మిస్టరీని అరవై నిమిషాల్లో ఛేదించిన నచికేతను అభినందిస్తూ ‘హంతకుడిని ఎలా పట్టుకున్నారు?’ అని ప్రశ్నల వర్షం కురిపించింది.నచికేత చెప్పడం మొదలుపెట్టాడు.‘చక్రవర్తికి కథ రాస్తున్నప్పుడు వేలితో నిబ్ను సరిచేసుకునే అలవాటు ఉంది.ఆ పెన్ నిబ్ దగ్గర స్వల్పంగా నీలిరంగు మరక ఉండటం గమనించాను. అతను అప్పటి వరకు రాసి ఉన్న కాగితం మీద అక్షరాల ఇంక్ నలుపు రంగులో ఉంది. మరి ఆ నీలి రంగు ఏమిటి? వెంటనే ఆ పెన్ ను ఫోరెన్సిక్ లాబ్కు పంపాను. రిపోర్ట్లో అది ‘రిసిన్’ అనే విషం అని తేలింది.భార్గవ గదిని సోదా చేసినప్పుడు అక్కడ కొన్ని పాత సైన్స్ జర్నల్స్, ఆముదపు గింజల అవశేషాలు కనిపించాయి. భార్గవ ఇంటర్నెట్ హిస్టరీని చెక్ చేయించగా, అతను గత నెల రోజులుగా ‘విషప్రయోగం – ఎవరికీ దొరక్కుండా ఎలా చేయాలి?’ అనే అంశాలపై సెర్చ్ చేసినట్లు తేలింది.భార్గవకు ఆస్తిపై మోహం.. అన్న చక్రవర్తిపై ద్వేషం.. కోట్లాది రూపాయల విలువైన వారసత్వ ఆస్తి దక్కాలంటే అన్న అడ్డు తొలగాలి. భార్గవ తెలివైన క్రిమినల్ మైండ్ వున్నవాడు. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ వేశాడు. ఆముదపు గింజల నుండి తీసిన అత్యంత ప్రమాదకరమైన ‘రిసిన్’ అనే విషాన్ని సేకరించి, చక్రవర్తి రోజూ వాడే ఖరీదైన ఫౌంటెన్ పెన్ నిబ్కు అతి సూక్ష్మంగా పూశాడు.అందుకే చక్రవర్తి వాడిన ఫౌంటెన్ పెన్ లాంటిది ఇచ్చి దాని నిబ్ను టచ్ చేయమంటే భయపడిపోయాడు. దొరికిపోయాడు.నిజానికి ఈ పరిశోధన వెనుక చక్రవర్తి గారు రాసిన క్రైమ్ కథల ప్రేరణ వుంది. నేరస్థుల మైండ్ సెట్తో ఆయన రాసే కథల్లోని పరిశోధన నాకు ఉపయోగపడింది.వారి ఆత్మకు శాంతి చేకూరాలి. భార్గవ లాంటి నేరస్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.’ చెప్పి ముందుకు కదిలాడు నచికేత. -శ్రీసుధామయి -
ఈ వారం కథ: అసలు సంగతేంటంటే!
‘‘అమ్మా, అడిగావా నాన్నని. ఏమన్నారు? నువ్వు కాస్త గట్టిగా అడగవే ఒప్పుకుంటారేమో’’ వాట్సాప్ వీడియో కాల్లో తల్లి వనజని నిలదీస్తోంది సుప్రియ.అమెరికాకి ఎలాగైనా అమ్మతో పాటు నాన్నని కూడా రప్పించుకోవాలనే పట్టుదలా, మళ్ళీ ఓడిపోతానేమో అనే దిగులు కలగలసి వినిపిస్తోంది సుప్రియ గొంతులో.‘‘ఎన్ని విధాలుగా అడగను చెప్పు. మొదటి రెండుసార్లు ఏదో బెట్టు చేస్తున్నారేమో అనుకున్నాను కానీ, ఇంత మంకుపట్టు పడతారు అనుకోలేదే. ససేమిరా అంటున్నారు ఆయన. నా వల్ల కాదు ఈ విషయంలో నాన్నని ఒప్పించడం. ముందు రెండుసార్లు అంటే ఏదో నీ పురిటికి సాయంగా వచ్చాను కానీ ఇప్పుడు ఎలా చెప్పు మళ్ళీ ఆయన్ని వదిలేసి రావడం? నవ్విపోరా అంతా.’’గోడకి బిగించిన అద్దంలో చూసుకుంటూ గడ్డం గీసుకుంటున్న కృష్ణమూర్తికి తల్లీ కూతుళ్ళ సంభాషణ వినిపిస్తూనే ఉంది. ఈసారి కూతురు గట్టిగానే పట్టుపడుతోంది. ముందు రెండుసార్లు అంటే బ్యాంక్ ఉద్యోగం వంకతో పని ఒత్తిడి అని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడైతే రిటైర్ అయ్యి సొంత ఊరికి చేరుకున్నాడు. ఏ సాకూ దొరకడం లేదు కృష్ణమూర్తికి.‘పోనీ అసలు సంగతి చెప్పేద్దామా?’ అనుకున్నాడు ఒక్క క్షణం.‘‘ఎంతైనా నాన్నగారు ప్రత్యేకమైన మనిషమ్మా. అందరూ ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటే నాన్నగారు చూడు అసలు. ఆయన సిద్ధాంతాలు, పద్ధతులూ వేరు. ఒక మాట అనుకుంటే మార్చనేలేము. మావయ్యా వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాక జిల్లా ఎడిషన్లో ‘విదేశీ పర్యటన చేసుకుని స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు శుభాకాంక్షలు’ అని పేపర్ యాడ్ కూడా ఇప్పించుకున్నారు తెలుసా. నాన్నగారిని చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా ఇలాంటి గొప్పలేమి పట్టవు ఆ మనిషికి. ముక్కు సూటి మనిషి అని, ఏ పని చేసినా పద్ధతిగా నిబద్ధతతో చేస్తారని మావయ్య వాళ్ళకి కూడా నాన్న అన్నా, ఆయన మాటన్నా అంత గురి మరి.’’ గర్వంగా చెప్తోంది సుప్రియ.‘‘మరేమనుకున్నావు. ఇన్నేళ్ళ బట్టి చూస్తున్నా కదా మనిషిని. మాటంటే మాటే. ఈరోజుల్లో ఉంటారా ఈయనలాంటి వాళ్ళు.’’ అంది వనజ భర్త గురించి మురిపెంగా.మొహం తుడుచుకుంటూ లోపలికి వచ్చిన కృష్ణమూర్తికి సుప్రియ మాటలు వినడంతోనే అసలు సంగతి కూతురుకి చెప్పేద్దాం అనుకున్న ఆలోచనని వెనక్కి తీసేసుకున్నాడు. చిన్నప్పుడు మా నాన్న ‘శక్తిమాన్’ కన్నా పవర్ఫుల్ తెలుసా, అని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేటప్పుడు ఎంత అబ్బురంగా చూసేదో ఇప్పటికీ తనని సూపర్ హీరోలానే చూస్తున్న కూతురికి ఎలా చెప్పగలడు ‘ఇదీ సంగతి’ అని.‘వద్దు వద్దు’ అని మనసులోనే అనుకున్నాడు కృష్ణమూర్తి.వనజ ఇచ్చిన కాఫీ తాగుతూ రోజూలాగే అక్కడ అమెరికాలో ‘టైం ఎంత’ అని మొదలుపెట్టి, వాతావరణ విశేషాలు అడిగి మనవరాలిని పలకరించి పెట్టేశాడు కాల్.హడావిడిగా చిన్ని హస్తం గరిటని చన్నీటి గ్లాసులో ముంచి వేడి వేడి ఇడ్లీలు దీక్షగా తీసి ప్లేట్లో వేసి ఇస్తున్న వనజ వైపు చూస్తూ , ‘పోనీ అసలు సంగతి వనజకి చెప్పేస్తే?’ అనుకున్నాడు కృష్ణమూర్తి.‘‘నీకో విషయం చెప్పాలోయ్’’ అనే మాట నోటి వెంట బయటికి రాక ముందే, ‘‘సారీ అండి. పాపతో మాట్లాడుతూ కాస్త ఆలస్యమైయింది. ఇదుగో ఇస్తున్నాను.’’ అంటూ కొబ్బరి చట్నీని ముద్దుగా తట్టి ప్లేటులో వేస్తూ చేతికి అందించింది వనజ.‘‘అది కాదు మాట’’ అని చెప్పబోయేంతలో పక్క ఊర్లో ఉండే వనజ వాళ్ళ తమ్ముడు రావడంతో కృష్ణమూర్తి మాట పూర్తవ్వకనే, ‘‘ఏరా ఇదేనా రావడం. రా రా వేడిగా టిఫిన్ చేద్దువు గానీ’’ అంటూ ఎదురెళ్ళింది.‘‘చేసే వచ్చాను. టిఫిన్ వద్దులే గానీ మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు.’’ అన్నాడు ఆ రోజు పేపర్ తీసుకుని కుర్చీలో కూర్చుంటూ వనజ తమ్ముడు బాలాజీ.టిఫిన్ కానిచ్చి వచ్చిన బావగారిని చూస్తూనే లేచి నిల్చున్నాడు బాలాజీ.‘‘ఏం బాలా, బాగున్నావా. కూర్చో కూర్చో. ఎట్లా ఉంది వ్యాపారం?’’ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు కృష్ణమూర్తి.బావగారు కూర్చున్నాక కానీ కూర్చోలేదు బాలాజీ. తరవాత బిల్డర్గా పనిచేయడంలో ఉండే సాధక బాధకాలు చెప్తూ కూర్చున్నాడు.వనజ తమ్ముడికి కాఫీ తీసుకుని రావడంతో ‘‘మీరు మాట్లాడుకుంటూ ఉండండి,’’ అంటూ లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అతనికి.‘‘మరి బావకేదే కాఫీ?’’‘‘ఆయన ఉదయం కాఫీ తాగేశారు కదా. మళ్ళీ ఇంకో రెండు గంటల తర్వాతే.’’‘‘ఎంతైనా బావంటే పద్ధతి. పద్ధతి అంటే బావకా. అవును మరి అమ్ములు అమెరికా రమ్మంటాంది అంట కదా ఇద్దర్నీ ఈసారి. బావేమన్నాడు?’’‘‘ససేమిరా అంటున్నారురా. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారుంటారా చెప్పు. రిటైర్ అయ్యాక కూడా వాళ్ళ కొలీగ్స్ అంతా సిటీల్లో గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటుంటే ఈయన చూశావా నా ఊరు నా మనుషులు అంటూ మళ్ళీ ఇక్కడికే తెచ్చేశారు. నేను చెప్పేశా అమ్ములుతో నాన్నని వదిలి రాను ఇక అని. ఆయన లేకుండా నాకు తోచదు అక్కడ. ఆయన్ని చూసైనా నేను నేర్చుకోవాలి కదా. పిల్లలే వచ్చి చూసి వెళ్తే సరి.’’ అంది వనజ.‘‘అంతేలే. ఎక్కడికెళ్ళినా కింగులా ఉంటాడు బావ. నలుగురు మనుషులు కావాలి ఎప్పుడూ. ఏం తోస్తుంది ఆయనకి అక్కడ. ‘‘సరేలే ఉమ నీకు ఇచ్చిరమ్మంది’’ అంటూ మరదలు పికో ఫాల్స్ చేసిన చీరల కవర్ అక్కడ పెడుతూ ‘‘నే వెళ్ళొస్తాక్కా, టైల్స్ సప్లయర్ వస్తానన్నాడు. బావకి చెప్పు. పిలవద్దులే మళ్ళీ’’ అంటూ బయల్దేరాడు బాలాజీ.‘ఎందుకో నేనంటే ఇంత గౌరవం వీళ్ళందరికీ!’ అంటూ విసుక్కున్నాడు లోపలి నుంచి కృష్ణమూర్తి.వనజ మీద ఎప్పుడూ లేంది పీకల దాకా కోపం వచ్చింది అతనికి. ‘ఎంతసేపూ నా చుట్టూరా తన జీవితం గడుస్తోంది అని చెప్పుకుంటుందెందుకు వనజ. అసలు వనజ లేకపోతే క్షణం జరగనిది నాకే కదా? ఏమీ తెలీదు ఏమీ తెలీదు అంటూనే కూతురి పురిటికి రెండుసార్లు ఒక్కర్తే చక్కగా ఝామ్మంటూ అమెరికా వెళ్ళొచ్చింది. నేనే ఇక్కడ బిక్కు బిక్కుమంటూ ఉన్నాను కానీ తనొక్కతే అన్నీ చక్కబెట్టుకొచ్చింది. ముప్పై ఐదేళ్ళ నుండి ఆ ఉద్యోగం కాస్తా వెలగబెట్టి ఇంత గడించి వనజ చేతిలో పోసి తాపీగా టింగురంగామని తిని తిరగడం తప్ప ఈ సంసారానికి నేనేం చేశానని.కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తనే మంచి చెడూ ఆలోచించి, చివరిగా ‘ఇదైతే బాగుంటుంది ఏమంటారు?’ అని నా ముందు ఉంచేది. అసిస్టెంట్ ఇచ్చిన ‘ఎన్ఓసీ’ సర్టిఫికెట్ మీద సంతకం పెట్టినట్టు నేను ‘సరే అలాగే’ అంటే చాలు పిల్లల చదువుల దగ్గరి నుండీ మంచి సంబంధాలు చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యడం వరకూ అంతా తన ఇష్టమే. ‘అప్రూవల్’ ఇవ్వడం వరకే నా పని కదా. అయినా కాని అన్నిటికీ నేనే కారణమన్నట్టు నేనేదో దైవాంశ సంభూతుడినైనట్టు ప్రవర్తిస్తుంది ఎందుకూ?’ అని ఆలోచనలో పడిపోయాడు కృష్ణమూర్తి.‘అన్నిటికీ ఈ రూపమే కారణం’ అనుకుంటూ అద్దంలోకి చూసుకుని సణుక్కుంటూ పల్చబడ్డ క్రాఫుని నైసుగా సర్దుకున్నాడు కృష్ణమూర్తి.కృష్ణమూర్తి మూడించీలు తక్కువగా ఆరడుగులు. అయినా కానీ వనజ నోట్లోపడి ‘ఆరడుగుల అందగాడు’ అయిపోయాడు. మంచి విగ్రహపుష్టి, దానికి తోడు ధీర గంభీర స్వరం కలవాడవటంతో అడక్కుండానే అందరి గౌరవ మర్యాదలకు పాత్రుడయ్యాడు. కట్టుకున్న భార్యకి కన్నుల దీపావళి అయ్యాడు. బావ బామ్మర్దులైతే కిట్ట పరమాత్ముడే మా ఆడబిడ్డని చేపట్టినాడు అని మురిసి మర్యాదలు చేసేవారు.ఇంట్లో వనజ ముదిగారంతో వేరే ఏ రకమైన డిస్ట్రాక్షన్లు లేక ఉద్యోగంలో మెట్టు మెట్టూ పైకెక్కి కింది వారి గులాములు అందుకున్నాడు. ఆఫీసరు భార్యగా తన దర్జాకి, మొగుడి దర్జాకి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా చూసుకునేది వనజ. ఈ గౌరవానికి కృష్ణమూర్తి కూడా అలవాటు పడిపోయాడు.చివరికి ఉద్యోగ విరమణ అయ్యాక తన కొలీగ్స్తో పాటు గేటెడ్ కమ్యూనిటీలో ఉందామనుకునే లోపు, ‘ఊరు పేరు లేని చోట్ల అనామకుడిలా ఉండలేరు ఆయన. నలుగురు మనుషులకి సాయంగా, అందరి తల్లో నాలుకలా ఉండడమే ఇష్టం ఆయనకి. పుట్టిన ఊరంటే ఎంత మమకారమో. ఈరోజుల్లో ఎవరుంటారమ్మా ఇలాగ!’ అంటూ అటు తన పుట్టింటికి కూడా కూత వేటు దూరంలో ఉండే సొంతూరికి చేరవేసింది కృష్ణమూర్తిని వనజ.వనజ మెల్లిగా ఇక్కడ కూడా మొగుడి పరపతి పెంచేసింది. మొగుడి దర్జాకి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా ప్రతి చిన్న విషయంలోనూ ‘ఈరోజుల్లో ఉంటారా ఈయనలాంటి వాళ్ళు’ అని మొగుడి గురించి అందరికీ కథలు కథలుగా చెప్పి తన ప్రమేయం లేకుండానే అందరికీ ‘కిట్టప్ప’గా మాత్రమే పరిచయం ఉన్న మూర్తిని కాస్తా ‘కృష్ణమూర్తిగారు’గా ఊరిలోకే పెద్ద తలకాయలాగా చెలామణీలోకి తెచ్చేసింది వనజ.ఉద్యోగం ఉన్నంత వరకు ఫరవాలేదు కానీ ఇప్పుడు ఊరికొచ్చే సరికి కథ అడ్డం తిరిగింది. అందరూ కృష్ణమూర్తిని చూసి ఒక చేత్తో అర్ధ నమస్కారం చేసి తప్పుకునే వారే కానీ ఎవ్వరూ మనస్ఫూర్తిగా మాట్లాడేవారు కాదు. ఉత్సవ విగ్రహంలాగా ఊరంతా ఊరేగి, అందరి తలపంకింపులకు బదులు చెప్పి, వాళ్ళ ఈతి బాధలు విని తనకు తోచిన మాటేదో చెప్పి రావడంతోనే సరిపోతోంది. అతని ఇష్టాయిష్టాలు, సరదాలు వినడానికి ఎవ్వరూ లేక పిచ్చెక్కుతోంది మూర్తికి.దానికి తోడు కొత్తగా ఈ అమెరికా గోల ఒకటి తోడయ్యింది. ఇన్నిసార్లు ‘నేను అమెరికా రాను’ అంటుంటే, కాస్త మెల్లిగా ‘ఎందుకండి? ఏమిటి సంగతి?’ అని అడిగి తెలుసుకుందామనే ఆలోచనే లేని వనజని చూస్తుంటే ఎప్పుడూ లేనిది మొట్టబుద్ధేస్తోంది కృష్ణమూర్తికి.‘నేను అమెరికా రాను’ అని కృష్ణమూర్తి అనగానే, దానికి కూడా అదేదో గొప్ప సుగుణం అన్నట్టు ‘ఈరోజుల్లో కూడా ఇలాంటి వారుంటారా?’ అంటూ దేశ భక్తుల జాబితాలో కలిపేసింది మొగుడిని వనజ.హ అప్పటినుండి ఊర్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ ఈ మాటే.జెండామాను సెంటరు దగ్గరికి సాయంత్రాలు వెళ్ళగానే అరుగు మీద మధ్యాసనం ఇచ్చి ఒకటే ఎత్తేస్తున్నారు కృష్ణమూర్తిని అంతా.ఇట్లా దేశం మీద, పుట్టిన ఊరి మీద ఇంత అభిమానం ఉండడం మీకే చెల్లింది. మావాడు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం కూడా పాస్ అవ్వలేదు అప్పుడే అమెరికా, ఆస్ట్రేలియా అంటూ కలవరిస్తున్నాడు మూర్తి గారు.’‘మా బామ్మర్ది, కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళి వచ్చినప్పటినుండీ మమ్మల్ని మనుషులుగా చూస్తే ఒట్టు. మూణ్నెళ్ళకే వాడికి పుట్టిన ఊరు మాసిపోయినట్టు కనపడిందంట. తిరిగి వచ్చినప్పటి నుండీ పూటకి నాలుగుసార్లు ఇళ్ళు దులపను సరిపోతోంది వాడికి.’‘రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూసినట్టే...బ్బా’‘బా చెప్పావ్. పోయేకాలం బుద్ధులు. అందరూ కృష్ణమూర్తిగారిలా నిండుకుండలా ఉండగలరా? మనిషంటే ఇట్లా ఉండాలి.’‘మరే! అందుకే ఇంకా ఈ దేశంలో వానలు పడతాండేది.’ఇట్లా కృష్ణమూర్తిని మధ్యలో పెట్టుకుని అంతా ఆకాశానికి ఎత్తేస్తుంటే చిరాకు ఎక్కువైపోతోంది మూర్తికి. ‘వుండండెహే! ఎదవ గోల. ఏ నాకొడుకూ నా మాట వినరేమిరా!’ అని అరిచి పచ్చిబూతులు నాలుగు మాట్లాడి, అసలు సంగతి చెప్పేద్దామనుకున్నాడు మూర్తి.‘‘కానీ అసలు తను అమెరికా ఎందుకు వెళ్ళను అంటున్నాడో చెపితే వీళ్ళంతా నిచ్చలకపోరూ? ఈ గౌరవం ఈ మర్యాదా ఇంచుక పుల్లంత అన్నా మిగులుతుందా అని? అసలు సంగతి తెలిస్తే ఇక జెండామాను సెంటర్లో నాకు సెంటర్ సీటు ఉంటుందా? అంతా కలిసి నన్ను ఒక మూలకి తోసెయ్యరా. నా నోట్లోంచి మాటొచ్చేదే వేదంగా వినుకునే వాళ్ళు, ‘నువ్వలాగ ఉండరా కిట్టిగా, ఇవతల పెద్దాయన మాట్లాడుతున్నాడా.’ అని తీసిపారేస్తేనో?’’ ఆ ఊహకే ఒళ్ళు జలదరించింది కృష్ణమూర్తికి. సైలెంటయిపోయాడు.ఇక ‘‘వెంకాయి గాడి అంగడిలో నేను గోల్డ్ఫ్లేక్ తీస్కుంటే గుప్పిట్లో అగ్గిని పదిలంగా నా మూతికాడికి తీసుకువచ్చి నా సిగరెట్ వెలిగించి, ఆపైన నేను కదిలి వెళ్ళాకగాని తన బీడీ వెలిగించుకోని రమేషుగాడికి అసలు సంగతి తెలిస్తే నా సిగరెట్ వెలిగిస్తాడా ఎప్పటికైనా? ‘ఏంట్రా ఆ ఆగింతం కిష్టిగా, నా బీడీ వెలిగించుకునేదాకా ఆగలేవా అంట.’ అని విసుక్కుంటే నేను తట్టుకోగలనా?’’ అనుకుని ఆగిపోయాడు కృష్ణమూర్తి.బావ బామ్మర్దులకి చెప్పుకుందామంటే కొండపైన వేలుపులా చూసే వాళ్ళ కళ్ళలో హేళన చూసేకన్నా కట్ట కింద బావిలో దూకడం మేలనుకుని గమ్మునుండిపోయాడు.ఆపైన తమ ఇంట్లో సహాయం చేసే మునెమ్మ, ఇస్త్రీపెట్టి ఈశ్వరయ్య, నీళ్ళ క్యాను వేసే మధుసూదన్, అమెజాన్ డెలివరీకి ఉర్లోకొచ్చే సతీష్, గ్యాస్ కనెక్షన్ ఇచ్చే పైఊరి అబ్బాయి ఇట్లా ఎవరికి చెప్పుకుందామన్నా తన పేరుకే చేటు అని అనుకుని ఊరకుండిపోయాడు కృష్ణమూర్తి. ఆలోచించిన కొద్దీ ఎవరో ఒక్కరికైనా అసలు సంగతి చెప్పాలనే కోరిక బలంగా నాటుకోసాగింది. చెప్పుకుంటే ఊరంతా వెనకగా చేరి ఘొల్లుమని నవ్విపోతారేమో’’ అనే బెంగ తొలిచేస్తోంది.‘‘ఇంకా నయం వనజకి చెప్పలేదు. ‘ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు’ అన్నట్టు అంతెత్తున నిలబెట్టి చూస్తూంటుంది నన్ను ఎప్పుడూ. తీరా అసలు సంగతి తెలిస్తే? మయసభలో ద్రౌపదిలా తను నవ్వితే? ఇంత బతుకూ బతికి ఇంటిలోనే అవమానం పొందాలా? వద్దు వనజకి కూడా చెప్పకూడదు’’ అనుకున్నాడు కృష్ణమూర్తి.ఇలా ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేక తికమక పడుతున్న కృష్ణమూర్తికి ముందరి గదిలో అలికిడి వినపడడంతో ఆలోచనలని పక్కన పెట్టి లోపలి గదిలోంచి ఇవతలికి వచ్చాడు.మునెమ్మ వచ్చింది పని సాయానికి.‘‘నువ్వొస్తే వచ్చావు మళ్ళీ వీడిని ఎందుకు వెంటేసుకుని వచ్చావు. ఉప్పురాయి పని చెయ్యడు. దర్బారుకేమీ తక్కువ కాడు’’ అంటూ ఆక్షేపణగా అంటోంది వనజ మునెమ్మెతో పాటు వచ్చిన మునెమ్మ మనవడిని.వాడిని చూడగానే కళ్ళు తళతళ మెరిశాయి కృష్ణమూర్తికి. ‘అరె భలే మంచి టయానికి వచ్చాడే వీడు. వీడి గురించిన ఆలోచనే రాలేదే’ అనుకుని సైలెంటుగా పేపర్ తీసి చదువుతూ కూర్చున్నాడు. వనజ కృష్ణమూర్తికి కాఫీ, మునెమ్మ మనవడికి కాస్త టిఫిను పట్టుకొచ్చి ఇచ్చింది.మునెమ్మ, టౌనులో చదువుకుంటూ అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చే మనవడిని తీసుకుని వస్తుంది కృష్ణమూర్తి వాళ్ళింటికి. వాడంటే మంచి గురి కృష్ణమూర్తికి. ఊర్లో మిగతా వారిలా అతి వినయాలకి పోడనీ, సూటిగా కళ్ళల్లోకి చూస్తాడనీ, వనజని చూసి గౌరవంతో కూడిన భయభక్తుల ప్రదర్శన చేసి మెప్పు పొందాలనుకోడనీ కృష్ణమూర్తికి వాడంటే ఇష్టం. వనజకి వాడంటే అందుకే విసుగు. పైగా కృష్ణమూర్తిని ‘సారుగారు’ అని వాడి చేత పిలిపించాలని ప్రయత్నించి ఓడిపోయింది. అందుకని కూడా వాడంటే ప్రత్యేక అభిమానం కృష్ణమూర్తికి.ఒక్కోసారి తనతో పాటు వాకింగ్కి పాత బజారు తీస్కెళ్ళేవాడు వాడిని కూడా. ఇప్పుడు వనజ ‘చీపు టేస్టు’ అని విసుక్కునే చిన్నప్పుడు తనకి అమితంగా ఇష్టమైన జిలేబీ ఇప్పించి తిరిగి వస్తూ వస్తూ కొన్ని తనూ తినేవాడు కృష్ణమూర్తి గుంభనంగా.వనజ, మునెమ్మ లోపల పనుల్లో పడగానే కాఫీ తాగేసి పక్కన పెట్టేసి మునెమ్మ మనవడిని సైగ చేసి రమ్మని పిలిచి చడీ చప్పుడు కాకుండా బయటికి తీస్కెళ్ళాడు కృష్ణమూర్తి.అలా కాస్త దూరం నడిచి బస్టాండ్ షెల్టర్లో అరుగు మీద కూర్చున్నారు ఇద్దరూ.‘‘ఒరేయ్. నాకెందుకో నిన్ను చూస్తే భలే నమ్మకమైన మనిషిలా కనపడుతున్నావురా.’’ అన్నాడు కృష్ణమూర్తి మునెమ్మ మనవడితో.‘ఏంటి విషయం!’ అన్నట్టు చూశాడు వాడు.‘‘ఇప్పుడు నీకో సంగతి చెప్తాను. సత్య ప్రమాణంగా ఎవ్వరికీ చెప్పనని మాటివ్వాలి నాకు. ఇస్తావా మరి?’’ అని అడిగాడు కృష్ణమూర్తి ఆశగా వాడి వైపు చూస్తూ.అవును కాదూకి మధ్యస్థంగా తలూపి మెదలకుండా కూర్చున్నాడు వాడు.‘మరేమో నేను మాములు కోరికలకి అతీతుడినని, అందరిలాగా తుచ్ఛమైన గొప్పలకు పోనని, ఎంతో పద్ధతి గలవాడినని అంతా అనుకుంటున్నారు కదా.’’‘అయితే ఎవడికి గొప్ప!’ అన్నట్టు చూసి, చెట్టు మీద వాలిన కాకిపై దృష్టి పెట్టాడు వాడు.‘‘దేశం మీద ఊరి మీద వెర్రి అభిమానంతో విదేశీయాన అవకాశాన్ని కూడా చెత్త కాగితంలాగా ఉండచుట్టి విసిరేసిన పెద్దమనిషినని అనుకుంటున్నారు కదా? అవేమీ నిజం కాదురా. నేను అమెరికా వెళ్ళకుండా ఉండిపోడానికి అసలు కారణం ఏమిటో తెలుసా?’’వాడసలే కోపదారి మనిషేమో ‘ఏందీ పెద్దమనిషి, నానుస్తాడే గాని అసలు సంగతి చెప్పడేందేహే’ అని విసుగేసి అరుగు మీంచి దూకి పరుగందుకోబోయాడు.వాణ్ని లటుక్కున పట్టుకుని, బతిమాలి బామాలి అరుగుమీద కూర్చొనబెట్టి మళ్ళీ కొనసాగించాడు కృష్ణమూర్తి.‘‘నాకూ. నాకు..ఎస్కలేటర్లన్నా, విమానాలన్నా చచ్చేటంత భయంరా అయ్యా! ఎస్కలేటర్ ఎక్కాలంటే ప్యాంటులోనే ఒకటీ రెండూ అన్నీ అయిపోతాయి. విమానంలో అన్నేసి గంటలు ఉండాలన్న ఊహకే దడుపు వచ్చేస్తుందిరా. నాకు అదొక ఫోబియా. నాకుండదా అమెరికా చూడాలని! వనజ లేదూ వాట్సాప్లో అక్కడి ఫొటోలు అవీ పంపుతుంటే, నవ్వి ఊరుకునే వాడిని కానీ ‘తస్సాదియ్యా అన్నీ ఎక్కి దిగేసి చిన్నపిల్లలా తెగ ఎంజాయ్ చేసేస్తోంది ఇది’ అని తెగ ఉడుక్కునేవాడిని. అదిరా అసలు సంగతి. ఎవ్వరికీ చెప్పకేం. సరేనా.’’ అని చెప్పడం ఆపాడు కృష్ణమూర్తి.‘ఏంది ఇంతమాత్రానికే ఓ అని ఇదైపోతండావా పెద్దాయనా!’ అన్నట్టు నవ్వాడు వాడు పత్తిపువ్వులాగా.‘‘సరే మరి. ఈ విషయం చెప్దామనే తీసుకొచ్చాను నిన్ను. ఒట్టేశావు ఎవ్వరికీ చెప్పనని. గుర్తుంచుకోరా. సరేనా.’’ అని చెయ్యి చాపాడు కృష్ణమూర్తి.‘వొరె వొరె! పాపం పెద్దాయనకి ఎంత కష్టం ఒచ్చిందీ’ అనుకుని ఆ చేతిలో తన చెయ్యి వేశాడు వాడు.మనసులోని భారం తీరడంతో ఒక్కసారి చూట్టూ చూసి గంభీరంగా ‘రాజు వెడలె’ అన్నట్టు కదిలాడు ‘కృష్ణమూర్తిగారు.’ఆయన చెయ్యి పట్టుకుని జిలేబీ అంగడి వైపు దారి తీశాడు తను ఎంత పెద్ద సహాయం చేశాడో తెలీని మూడున్నరేళ్ళ మునెమ్మ మనవడు. - శ్రీనిధి యెల్లల -
కథాకళి: డిటెక్షన్
డిటెక్టివ్ పెద్దబ్బాయి శవాన్ని బదులు యాష్ట్రేని పరీక్షగా చూశాక చెప్పాడు.‘‘ఇది ఆత్మహత్య కాదు ఇన్ స్పెక్టర్.’’ ‘‘కాని పిస్టల్ కుడిచేతిలో ఉంది. గుండు కుడి కణతలోంచి వెళ్ళింది.’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి చెప్పాడు.‘‘హత్య చేసిన మర్డరర్ హతుడికి బాగా పరిచయం ఉన్నవారు కూడా.’’‘‘మీరు అంతా ఆశ్చర్యపోయేలా చేస్తూంటారు సర్. ఇది ఎలా చెప్పగలరు?’’ అసిస్టెంట్ చిన్నబ్బాయి ఆశ్చర్యంగా అడిగాడు.‘‘యాష్ట్రేని చూడు. నీకు ఏం కనిపిస్తోందో చెప్పు చిన్నబ్బాయ్.’’ ఆయన కోరాడు.‘‘సిగరెట్ పీక.’’‘‘సిగరెట్ నుసి?’’‘‘గమనించాను సర్. అది చివరిదాకా కాలి ఉంది.’’‘‘దాని అర్థం దాన్ని వెలిగించినా కాల్చలేదని. కాలిస్తే నుసి విరిగిపోకుండా అంత పొడుగ్గా ఉండేది కాదు.’’‘‘నిజమే సుమండీ. హతుడుగారు సిగరెట్ వెలిగించగానే హంతకుడు వచ్చి చంపాడన్నమాట.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘హత్యని ఎలా కనుక్కున్నావు?’’‘‘మీరు చెప్పారుగా సర్.’’‘‘నేను ఎలా చెప్పగలిగాను?’’‘‘అది మాకు ఎవరికీ తెలీదు కాబట్టి మీరే చెప్పాలి సర్.’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి నవ్వుతూ కోరాడు.‘‘సిగరెట్ పీక ఫిల్టర్ ఎటువైపు ఉంది?’’ పెద్దబ్బాయి అడిగాడు.వెంటనే అందరి కళ్ళు ఆ సిగరెట్ పీక మీదకి మళ్ళాయి.‘‘హతుడికి అవతలి వైపుంది.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘పీకవైపు కూర్చున్న మనిషి సిగరెట్ పీకని తనవైపు పెట్టుకుంటాడు.’’‘‘అర్థమైంది. హంతకుడే ఈ సిగరెట్ని వెలిగించి, ఓ దమ్ము పీల్చి ఏష్ ట్రే మీద ఉంచి పని పూర్తి చేసి, పిస్టల్ని హతుడి చేతిలో ఉంచి వెళ్ళిపోయాడు.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘సిజర్స్ సిగరెట్ తాగే వాళ్ళు సామాన్యులు. అంటే ఆర్థికంగా హతుడికన్నా చిన్నస్థాయి వారి పనిది.’’ డిటెక్టివ్ పెద్దబ్బాయి చెప్పాడు.‘‘ఈయనగారి బంధుమిత్రుల్లో ఎవరు సిజర్స్ తాగుతారో కనిపెడితే హంతకుడు ఎవరో తెలిసిపోతుంది.’’ అసిస్టెంట్ చిన్నబ్బాయి ఉత్సాహంగా చెప్పాడు.‘‘సిజర్స్ తాగనివారే ఈ హత్య చేసింది.’’ పెద్దబ్బాయి చెప్పాడు.‘‘అదేమిటి సర్ మళ్ళీ?’’‘‘వాళ్ళ మీదకి అనుమానం మళ్ళించాలని చేసిన ప్రయత్నం ఇది.’’‘‘ఓ. మరి వాళ్ళు ఏ బ్రాండ్ సిగరెట్ తాగుతారు సార్?’’‘‘ఏదీ తాగరు. ఆడవాళ్ళు సిగరెట్ని తాగుతారా?’’‘‘ఆడవాళ్ళ పనా? హంతకి అని ఎలా తెలుసుకోగలిగారు?’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి ఆసక్తిగా అడిగాడు.‘‘సిగరెట్ని వెలిగించడం తప్ప కాల్చకపోవడం వల్ల. సిజర్స్ ఎవరు తాగుతారో వారి నుంచి ఆ మహిళ దీన్ని కొట్టేసింది.’’‘‘ఎందుకని?’’‘‘తన భర్త మీదకి అనుమానం వెళ్ళాలని.’’‘‘భర్తా? మీరు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తూంటారు సర్. హంతకి అని, ఆమెకి పెళ్ళైందని ఎలా కనుక్కున్నారు?’’ చిన్నబ్బాయి అడిగాడు.‘‘ఇవాళ ఏం వారం?’’‘‘శుక్రవారం.’’‘‘శుక్రవారం నాడు ఇలాంటి సంప్రదాయ ఇంట్లోని ఇల్లాళ్ళు ఏం చేస్తారు?’’‘‘రోజులా నో ఫుడ్ ఆర్డర్ సర్. వంట చేస్తారు.’’‘‘కాళ్ళకి పసుపు రాసుకుంటారు. తెల్లటి ఫ్లోర్ కాబట్టి నేల మీద ఎండిన పసుపు తునకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హతుడి ముగ్గురి కోడళ్ళలో ఈ రోజు పాదాలకి పసుపు రాసుకున్నది రెండో కోడలు మాత్రమే.’’‘‘ఆమె ఇంతదాకా ఇక్కడికి రాలేదు. ఎలా కనుక్కున్నారు?’’ ఇన్ స్పెక్టర్ అడిగాడు.‘‘గోడ మీది ఫేమిలీ పిక్చర్ని చూడండి. ఒకామె మొహానికి బొట్టు లేదు. ఫొటోకి బొట్టు పెట్టుకోని ఆ వయసులోని హిందూ స్త్రీ ఉండదు. మరొక ఆమెకి బాబ్డ్ హెయిర్, పెదాలకి లిప్స్టిక్ ఉన్నాయి కాబట్టి ఆమె పసుపు రాసుకునే తరహా కాదు. హతుడి రెండో కొడుకు పక్కన నిలబడ్డ ఆమె తలలో పూలచెండు, నుదుట కుంకుమ బొట్టు ఉన్నాయి. మన పనైంది. ఇక పద.’’ పెద్దబ్బాయి చెప్పాడు.గంట తర్వాత డిటెక్టివ్ పెద్దబ్బాయి ఆఫీస్లో ఫోన్ మోగింది.‘‘అది ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి నించి. బహశా భర్తతో సఖ్యతలేని ఆమె, తన భర్త మీదకి హత్యా నేరం వెళ్ళి అతనికి శిక్ష పడితే, మామగారి ఆస్తిలోని అతని భాగాన్ని తనే అనుభవించచ్చని ఈ పథకం వేశానని ఒప్పుకుని ఉంటుంది.’’ డిటెక్టివ్ పెద్దబ్బాయి చెప్పాడు.ఆ ఫోన్ కాల్ ఎటెండ్ అయ్యాక అసిస్టెంట్ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘మీరు ఎప్పుడూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూంటారు. నిజమే సర్. హంతకి కాళ్ళకి పసుపు రాసుకుందిట. కొద్ది కాలంగా భర్తకి, ఆవిడకి పడటం లేదట.’’ -మల్లాది వెంకట కృష్ణమూర్తి -
తిరుపతిలో నా పెళ్లి!
అచ్చం తల్లి శ్రీదేవి పోలికలతో మెరిసిపోతూ, హోమ్లీ వైబ్స్తో ఉండే చిల్ గర్ల్ జాన్వీ కపూర్! గ్లామర్ సామ్రాజ్యానికి వారసురాలైనా, నటిగా తనదైన ముద్ర వేస్తున్న ఈ అందాల తార మనసులోని ముచ్చట్లు.. ఆమె మాటల్లోనే!నాన్నకు తెలియని వేగాస్ ట్రిప్అందరమ్మాయిల్లాగానే, టీనేజ్లో నేను కూడా చాలా సీక్రెట్స్ దాచాను. ఒకసారి మా నాన్నతో సినిమాకు వెళ్తున్నానని అబద్ధం చెప్పి, నేరుగా వేగాస్ ఫ్లైట్ ఎక్కేశాను! రాత్రంతా అక్కడ తిరిగి, ఉదయం వచ్చేశా, ఇది నాన్నకు అస్సలు తెలియదు. అలాగే, ఇండస్ట్రీలోకి వచ్చేముందు నా పాత ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని పోస్ట్లన్నింటినీ కంప్లీట్గా డిలీట్ చేసి, పబ్లిక్ కోసం కొత్తగా మరో అకౌంట్ స్టార్ట్ చేశాను.‘చుస్కీ’ నా బెస్ట్ ఫ్రెండ్!నా దగ్గర ఒక పింక్ వాటర్ బాటిల్ ఉంటుంది. దానికి ‘చుస్కీ’ అని పేరు పెట్టుకున్నా. ఎక్కడికి వెళ్లినా అది నా వెంట ఉండాల్సిందే. చాలామందికి అది ఫన్నీగా అనిపించినా, నాకు మాత్రం అది చిన్న కంఫర్ట్ జోన్ లా ఉంటుంది.కష్టపడతా!మా కుటుంబం వల్ల నాకు ప్రేమ దక్కింది అనేది నిజం. కానీ ఆ ప్రేమకు నేను అర్హురాలిని అని నిరూపించుకోవడం మాత్రం నా బాధ్యత. అందుకే ప్రతి సినిమాకు డబుల్గా కష్టపడతాను.సినిమా చూస్తూ ఏడ్చేశా!‘నేను సినిమాలు చూసేటప్పుడు చాలా హైపర్–ఎమోషనల్ అయిపోతాను. ఒకసారి ‘ఏ క్వైట్ ఫ్లేస్’ అనే హారర్ సినిమా చూస్తూ థియేటర్లో కంట్రోల్ లేకుండా ఏడ్చేశాను. అది దయ్యాల సినిమా అయినా, అందులోని క్యారెక్టర్స్ పడే బాధ నన్ను అంతలా కదిలించింది.అతన్ని ఫాలో అవుతుంటా...బాలీవుడ్ నటుల్లో కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియా పేజీని తప్పకుండా ఫాలో అవుతుంటాను. కార్తీక్ తన పేజీ ద్వారా చక్కని వినోదం పంచుతుంటాడు. సున్నితమైన హాస్యాన్ని పంచే పోస్టులు పెడుతుంటాడు. అతని పోస్టులకు నేను తరచు కామెంట్లు కూడా చేస్తుంటాను.ట్రోలింగ్స్కి నో టెన్షన్!ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చాలా హర్ట్ చేస్తాయి. ఆ సమయంలోనే ఒక విషయం నేర్చుకున్నా. కొందరు మనల్ని గొప్ప అంటారు, ఇంకొందరు పనికిరాని వాళ్లమంటారు. నిజం మాత్రం మనకు మనమే తెలుసుకోవాలి.డ్రీమ్ వెడ్డింగ్... ఇదే నా ప్లాన్!చిన్నప్పటి నుంచి అమ్మనాన్నల షూటింగ్స్ కోసం ప్రపంచమంతా తిరగడం వల్ల నా లైఫ్ ఒక ‘నొమాడ్’లా సాగింది. అందుకే నాకు బాలీవుడ్ తరహా ఆడంబరాల పెళ్లి వద్దు. తిరుపతిలోనే నా డ్రీమ్ వెడ్డింగ్ జరుగుతుంది. ప్యూర్ గోల్డ్ కంజీవరం శారీ కట్టుకుంటాను. పెళ్లి మెనూలో పక్కా సౌత్ ఇండియన్ వంటకాలే ఉంటాయి.అలా నా పేరు...మా నాన్న నిర్మించిన ‘జుదాయి’ సినిమాలో మా అమ్మతో పాటు ఊర్మిళా మటోండ్కర్ కూడా నటించింది. అందులో ఆమె పాత్ర పేరును అమ్మా, నాన్నా ఇద్దరూ ఇష్టపడ్డారు. మొదటి బిడ్డకు ఆ పేరే పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అలా నాకు ఆ పేరు పెట్టారు.అవంటే చాలా ఇష్టంనటిగా ఫిట్నెస్ మీద జాగ్రత్తలు తీసుకుంటాను గాని, ఒక్కోసారి నాకు ఇష్టమైన ఫుడ్ లాగించేస్తూ ఉంటాను. స్ట్రీట్ ఫుడ్లో మోమోస్ను ఎక్కువగా ఇష్టపడతాను. రాజస్థానీ స్పెషల్ ‘జంగ్లీ మటన్’, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, పాయా ఎక్కడ కనిపించినా వాటిని వదులుకోను. స్వీట్లలో జిలేబీ, చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. రుచులను ఆస్వాదించడానికి ఇష్టపడతాను గాని, అలాగని ఎక్కువగా తినను. -
కీటకం.. ఆహారం.. వ్యాపారం
ఇళ్లల్లో ముచ్చటకొద్ది కుక్కలు, పిల్లలు వంటి జంతువులను, రామచిలుకలు, గోరువంకలు వంటి పక్షులను పెంచుకుంటారు. పాడి కోసం ఆవులు, గేదెలు వంటి పశువులను పెంచుకుంటారు. ఆహార అవసరాల కోసం కోళ్లు, మేకలు, గొర్రెలు, పందుల వంటి జీవాలను కూడా పెంచుకుంటారు. మనుషులు రకరకాల జీవాలను మచ్చిక చేసుకుని, వాటిని పెంచడం పురాతనకాలం నుంచి అలవాటే! కీటకాలలో తేనెటీగలను, పట్టుపురుగులను ప్రత్యేకంగా పెంచడం కూడా పురాతకాలం నుంచి సాగుతున్నదే! తేనెటీగల వల్ల తీయని తేనె, పట్టుపురుగుల నుంచి పట్టువస్త్రాలకు కావలసిన పట్టు దారాలు దొరుకుతాయి కాబట్టి వాటిని పెంచడం సరే! అసలు చూడగానే ఒళ్లు జలదరించేలా కనిపించే కీటకాలను కూడా ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఇలా పెంచుతున్న కీటకాలలో ఈగలు, దోమలు, చీమలు, బొద్దింకలు, కుమ్మరిపురుగులు, కందిరీగలు, మిడతలు, చిమ్మటలు, గొల్లభామలు, గొంగళిపురుగులు వంటివి కూడా ఉన్నాయి. అసలు వీటిని ప్రత్యేకంగా ఎందుకు పెంచుతున్నారు, వీటి వల్ల ఒరిగే ప్రయోజనాలు ఏముంటాయి అనే సందేహాలు చాలామందిలోనే ఉంటాయి. కీటకాల పెంపకం వల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం...ఇళ్లల్లోకి ఈగలు, దోమలు, బొద్దింకలు, కందిరీగలు, గొంగళిపురుగులు వంటి కీటకాలు చేరితే వాటిని వెంటనే తరిమి కొట్టేందుకు ప్రయత్నిస్తాం. కీటకాల దాడి ముమ్మరంగా ఉంటే, వాటిని చంపేయడానికి నానా రకాల మందులు ప్రయోగిస్తాం. కాని, కీటకాల పెంపకం ఇప్పుడొక పరిశ్రమగా మారుతోంది. పలు దేశాల్లో కీటకాల పెంపకం క్రమంగా పుంజుకుంటోంది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రకరకాల అవసరాల కోసం సాగించే కీటకాల పెంపకం వ్యాపారం విలువ దాదాపు 30 బిలియన్ డాలర్ల వరకు ఉంది. కీటకాల పెంపకం వ్యాపారంలో దాదాపు 13 శాతం వార్షిక వృద్ధి నమోదవుతోంది. కీటకాల పెంపకంలో ఆసియా దేశాలు ముందంజలో ఉంటున్నాయి. కీటకాల పెంపకంలో ఆసియా దేశాల వాటా 40 శాతం వరకు ఉంటోంది. మనుషులు ఆహారంగా ఉపయోగించడానికి; మనుషులు తినే జలచరాలు, ఇతర జీవాలకు దాణాగా ఉపయోగించడానికి పలుచోట్ల కీటకాల పెంపకం సాగిస్తున్నారు. కొన్ని దేశాల్లోని రెస్టరెంట్లలో కీటకాలతో రకరకాల వంటకాలను వండి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. ఆకర్షణీయమైన సీసాలు, టిన్నులలో ప్యాక్ చేసి కూడా విక్రయిస్తున్నారు. మనుషులు వాడే ప్రొటీన్ పౌడర్లలోను; పశు పక్ష్యాదుల దాణాలోను కూడా కీటకాలను ఎండబెట్టి, పొడిచేసి ఉపయోగిస్తున్నారు.మనుషుల ఆహారంలో కీటకాలుమన దేశంలో కోళ్లు, మేకలు వంటి పశుపక్ష్యాదుల మాంసాన్ని; చేపలు, రొయ్యలు, పీతలు, ఎండ్రపీతలు వంటి జలచరాలను విరివిగా ఆహారంగా తీసుకునే జనాలు ఎక్కువగానే ఉన్నారు గాని, నేరుగా కీటకాలను ఆహారంగా తీసుకునే జనాలు చాలా తక్కువ. తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లో కీటకాలతో వంటకాలు చేసుకుని, తినే జనాలు ఎక్కువగానే కనిపిస్తారు. యూరోప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లోనూ కీటకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది జనాభా కీటకాలను తింటున్నారు. అంటే, ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగోవంతు కీటకాహారులు ఉన్నారు.ఆసియా దేశాలలో ఎక్కువగా మిడతలు, గొల్లభామలు, పట్టుపురుగుల ప్యూపా, నీటి పురుగులు సహా రకరకాల కీటకాలను ఆహారంగా తీసుకునేవారు ఉన్నారు. దక్షిణ అమెరికాలో మిడతలు, చీమల గుడ్లు సహా అమెజాన్ అడవుల్లో దొరికే రకరకాల కీటకాలను తినేవారు ఉన్నారు. ఆఫ్రికాలో గొంగళిపురుగులు, చెదపురుగులు, తాటిముక్కు పురుగులు వంటి కీటకాలను తినేవారు ఉన్నారు. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) చెబుతున్న ప్రకారం దాదాపు రెండువేలకు పైగా జాతులకు చెందిన కీటకాలు మనుషులు నేరుగా ఆహారంగా వినియోగించడానికి అనువైనవి.ప్రపంచ జనాభా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మనుషులు తమ ఆహారంలో కీటకాలను కూడా చేర్చుకోవాలని ఎఫ్ఏఓ 2013లో పిలుపునిచ్చింది. మనుషులు ఆహారంగా తీసుకోదగ్గ కీటకాలపై విస్తృత పరిశోధనలు జరిపి, ‘ఎడిబుల్ ఇన్సెక్ట్స్: ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ సెక్యూరిటీ’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. మనుషుల ఆహారం కోసం, పశుపక్ష్యాదుల దాణా కోసం కీటకాల పెంపకం 1990ల నుంచి పారిశ్రామిక పద్ధతుల్లో మొదలైనా, 2013లో ఎఫ్ఏఓ పిలుపు తర్వాత ఇది ఊపందుకుంది.కీటకాహారంలో ఆసియా దేశాల హవాకీటకాహారంలో ఆసియా దేశాల హవా నడుస్తోంది. మనుషులు తినడం కోసం కీటకాల పెంపకంలో తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలు ముందంజలో ఉంటున్నాయి. థాయ్లండ్ చిమ్మటల పెంపకంలో అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో దాదాపు పాతికవేల చిమ్మటల పెంపకం కేంద్రాలు ఉన్నాయి. వాటితో పాటు మిడతలు, గొల్లభామల పెంపకం కేంద్రాలు కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. పట్టుపరుగుల ప్యూపా, మీల్వార్మ్స్ పెంపకం కేంద్రాలలో చైనా అగ్రస్థానంలో ఉంది. వియత్నాంలో చిమ్మటలు, కీచురాళ్ల పెంపకం కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి.దక్షిణ కొరియాలో మీల్వార్మ్, పట్టుపురుగుల ప్యూపా, మిడతల పెంపంకం కేంద్రాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. జపాన్లో కందిరీగలు, మిడతల పెంపకం కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాలలోని పలు రెస్టరెంట్లలో కీటకాలతో తయారు చేసిన వంటకాలను కస్టమర్లకు వడ్డిస్తుండటం విశేషం. దక్షిణ అమెరికాలోని మెక్సికో, బ్రెజిల్; యూరోప్లోని నెదర్లాండ్స్, ఫ్రాన్స్ దేశాలు కూడా ఆహారంగా ఉపయోగించే కీటకాల పెంపకంలో ముందంజలో ఉన్నాయి.ఆహారంగా కీటకాలు... లాభాలు⇒ మనుషుల ఆహారంగా కీటకాలను ఉపయోగించడంలో చాలా లాభాలు ఉన్నట్లు ఎఫ్ఏఓ సహా పలు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఎండబెట్టిన కీటకాలలో ప్రొటీన్లు మిగిలిన ఆహారాల కంటే అత్యధికంగా ఉంటాయి.⇒ వీటిలో ఏకంగా దాదాపు 80 శాతం వరకు ప్రొటీన్లు ఉంటాయి. వీటిలో ఒమేగా–3, ఒమేగా–6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు; ఐరన్, జింక్ వంటి కీలకమైన ఖనిజాలు; విటమిన్–ఎ, విటమిన్–బి2, విటమిన్–బి12 వంటి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.⇒ మిడతలు, గొల్లభామలు వంటి కీటకాలలో ‘కీటిన్’ అనే పీచుపదార్థం ఉంటుంది. అందువల్ల కీటకాలు భేషైన పోషకాహారంగా తీసుకోదగినవని ఎఫ్ఏఓ చెబుతోంది.⇒ కీటకాల వల్ల పోషక ప్రయోజనాలు ఇలా ఉంటే, వీటిని పెంచడం చాలా తేలిక. ఆహారం కోసం ఇతర జీవాలను పెంచడం చాలా శ్రమతో కూడుకున్న పని. వాటికి విశాలమైన స్థలం, నీరు, గాలి, వెలుతురు వంటివి ఎక్కువగా అవసరమవుతాయి. వాటికి పెట్టే దాణా కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.⇒ కీటకాలను తక్కువ స ్థలంలోనే పెంచవచ్చు. వీటి పెంపకానికి నీరు చాలా తక్కువ ఖర్చవుతుంది. దాణా ఖర్చు దాదాపు నామమాత్రం. వీటి పెంపకం ప్రక్రియలో కర్బన ఉద్గారాలు చాలా తక్కువగా విడుదలవుతాయి. పోషకాహారంగానే కాకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం కూడా కీటకాల పెంపకాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.కీటకాల పెంపకం పరిశ్రమకీటకాల పెంపకం పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా కంపెనీలు ఉన్నాయి. ఇవి కీటకాల లార్వాలను సేకరించి, శాస్త్రీయమైన పద్ధతుల్లో కీటకాల పెంపకం సాగిస్తున్నాయి. దాదాపు నాలుగు వందల కంపెనీలు కీటకాలతో పశు పక్ష్యాదులకు, జలచరాలకు ఉపయోగించే దాణాను; మనుషులు తినదగ్గ కీటకాహారాన్ని తయారు చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్లో కీటకాల పెంపకం, కీటకాహార ఉత్పత్తిని భారీగా సాగిస్తున్న కంపెనీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. భారత్లో ప్రస్తుతానికి కొన్ని స్టార్టప్లతో కలుపుకొని సుమారు పాతిక కంపెనీలు ఈ రంగంలో పనిచేస్తున్నాయి.భారత్లో కీటకాలను ఆహారంలో తినేవారు దాదాపు పది రాష్ట్రాలలో ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోను, మధ్య భారత ప్రాంతంలోను, పడమటి కనుమల ప్రాంతంలోను, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాలకు చెందినవారు, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొందరు దాదాపు మూడువందల జాతులకు చెందిన కీటకాలను తింటారు. వీరు ఎర్రచీమలను, పట్టుపురుగుల ప్యూపాను, మిడతలు, గొల్లభామలను, తొలకరి వానలు మొదలయ్యే కాలంలో దొరికే ఊసిళ్లను తింటారు. భారత్లో కీటకాలను తినేవారు ఉన్నా, వాటి పెంపకం మాత్రం ఇప్పుడిప్పుడే పరిశ్రమగా రూపుదిద్దుకుంటోంది.ఎందుకు పెంచుతున్నారంటే?ప్రపంచవ్యాప్తంగా రకరకాల కీటకాలను పలు ప్రయోజనాల కోసం పెంచుతున్నారు. మనుషులకు, ఇతర జీవాలకు ఆహారంగా మాత్రమే కాకుండా, ఔషధాల తయారీ, వ్యర్థాల నియంత్రణ, రంగుల తయారీ, శాస్త్ర పరిశోధనలు తదితర అవసరాల కోసం కూడా కీటకాల పెంపకం చేపడుతున్నారు. కీటకాల్లో వేటిని ఎందుకు పెంచుతున్నారో తెలుసుకుందాం...ఆహార వ్యర్థాల నిర్వహణఆహార వ్యర్థాలను సురక్షితంగా, త్వరగా విచ్ఛిన్నం చేయడానికి; కోళ్లు, చేపలు, రొయ్యలు వంటి వాటి దాణా తయారీకి; సేంద్రియ ఎరువుల తయారీకి ఈగల్లో ఒకరకమైన ‘నల్ల సైనిక ఈగలు’ (బ్లాక్ సోల్జర్ ఫ్లై) పెంచుతున్నారు. వ్యర్థాల నిర్వహణ కోసం బొద్దింకలు, మీల్వార్మ్ వంటి కీటకాలను కూడా పెంచుతున్నారు.వైద్య పరిశోధనలుమలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులపై పరిశోధనల కోసం నియంత్రిత పరిస్థితుల్లో కొన్నిచోట్ల దోమల పెంపకం కూడా చేపడుతున్నారు. జన్యుమార్పిడి చేసిన దోమలను పెద్దసంఖ్యలో బయటకు విడిచిపెట్టడం ద్వారా వ్యాధికారక దోమల నియంత్రణ కోసం ప్రయోగాలు జరుపుతున్నారు. ఈగలలో ఒకరకానికి చెందిన ఫ్రూట్ ఫ్లైని జీవశాస్త్ర పరిశోధనల కోసం పెంచుతున్నారు. మానవ జన్యవులతో బాగా పోలికలు ఉండటం వీటి ప్రత్యేకత. అందువల్ల వ్యాధుల నియంత్రణ కోసం జరిపే ప్రయోగాల కోసం ఫ్రూట్ ఫ్లై పెంపకం సాగిస్తున్నారు. గాయాల వల్ల ఏర్పడే మృతకణాలను తొలగించడానికి ఈగల లార్వా (మాగట్) పెంపకం చేపడుతున్నారు.ఆహార అవసరాలుమనుషుల ఆహార అవసరాల కోసం, పశువుల దాణా, మనుషులకు ఆహారంగా ఉపయోగపడే చేపలు, రొయ్యలు వంటి జలచరాల దాణా కోసం కూడా కీటకాల పెంపకం చేపడుతున్నారు. మిడతలు, గొల్లభామలు, బొద్దింకలు, మీల్వార్మ్ వంటి కీటకాలను ఆహార అవసరాల కోసం పెంచుతున్నారు. వీటితో ప్రొటీన్ పౌడర్లు వంటివి కూడా తయారు చేస్తున్నారు.ఇతర అవసరాలుమరికొన్ని ఇతర అవసరాల కోసం కూడా కీటకాలను పెంచుతున్నారు. ఫుడ్ కలర్స్, దుస్తులకు వేసే రంగులు, లిప్స్టిక్ వంటి వాటి తయారీలో ఉపయోగించడానికి ‘కోచినీల్’ పురుగులను పెంచుతున్నారు. వార్నిష్లు, పాలిష్లు, మేకప్ సామగ్రి తయారీ, ఔషధ పరిశ్రమ అవసరాల కోసం చెట్లను ఆశ్రయించుకుని పెరిగే లక్కపురుగులను ప్రత్యేకంగా పెంచుతున్నారు. పంటలను పాడుచేసే పురుగులను నియంత్రించడానికి ఆరుద్ర పురుగులను (లేడీబర్డ్ బీటిల్స్) పెంపకం సాగిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లో ఈగల పెంపకంఆంధ్రప్రదేశ్లో కూడా ఈగల పెంపకం సాగుతోంది. కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రాంతంలోని ఆక్వా సాగు ఎక్కువగా ఉండటంతో వక్కలగడ్డ గ్రామంలో ఈగల పెంపకం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ సుబ్రహ్మణ్యం సుందర్, నంద్యాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎ.వి.నాగేశ్వరరెడ్డి ఈ గ్రామంలో నిరుపయోగంగా ఉన్న కోళ్లఫారం షెడ్లను అద్దెకు తీసుకుని, అందులో ఈగల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీరితో పాటు డాక్టర్ శ్రావణి ఈ కేంద్రం నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు. ఇదేచోట విన్క్యులర్ ఆక్వా లాబ్ కూడా పెట్టారు.చేపలు, రొయ్యలకు వచ్చే వ్యాధులకు ప్రకృతి సిద్ధమైన చికిత్సలను ఎలా చేయాలో వీరు రైతులకు సలహాలు ఇస్తున్నారు. ఈగల పెంపకం కేంద్రంలో వెయ్యి గుడ్లతో ఉత్పాదన ప్రారంభిస్తే, పదిహేడు రోజుల్లోనే అవి మూడు లక్షలకు చేరుకుంటాయి. మరో పదిహేడు రోజులు ఆగితే, వాటి సంఖ్య తొంభై లక్షలకు పెరుగుతుంది. బియ్యం, కొవ్వు తీసేసిన పాలు కలిపి వండిన జావను ఈగలకు ఆహారంగా పెడతారు.ఈ షెడ్లలో ఈగలు సురక్షితంగా ఉండటానికి, వీటి నుంచి తప్పించుకుని బయటకు ఎగిరిపోకుండా ఉండటానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈగ గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలను వేరుశనగచెక్క పొడిలో వేస్తారు. పూర్తిస్థాయిలో లార్వాలు వేరుశనగచెక్క పొడిలోకి రాగానే, వాటిని విద్యుత్ డ్రైయర్లో ఉంచి, 95 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. ఆ వేడికి అవి వేరుశనగపొడిలో కలిసి పొడి పొడిగా మారిపోతాయి. ఈ పొడిని బయటకు తీసి, ఆరబెట్టి ప్యాక్చేసి, ఆక్వా రైతులకు ‘లార్వా ప్రొటీన్ ఫుడ్’ దాణాగా సరఫరా చేస్తారు. చేపలు, రొయ్యలకు ఈ పొడిని పెడితే, అవి ఎగబడి తింటాయి. ఈ పొడిలో ఉండే అత్యధిక ప్రొటీన్ వల్ల అవి బాగా పుష్టిగా ఎదుగుతాయి..ఇన్పుట్స్: ఆకుల సుధీర్కుమార్, సాక్షి, చల్లపల్లి -
దయ్యాల దీవి
అట్లాంటిక్ మహాసముద్రంలో కెనడాలోని న్యూఫౌండ్లాండ్ తీరానికి ఆవల ఉన్న ఈ దీవి పేరు ‘క్విర్పాన్ ఐలండ్’. అయితే, ఇది దయ్యాల దీవిగా పేరు మోసింది. దీనికి దయ్యాల దీవిగా పేరు రావడం వెనుక పదహారో శతాబ్దినాటి సంఘటన ఒకటి కారణమని చెబుతారు. ఫ్రెంచ్ నావికుడు కెప్టెన్ జ్హా ఫ్రాంకోయిస్ 1542లో మందీ మార్బలంతో నౌకాయాత్రకు బయలుదేరాడు. అదే నౌకలో ఫ్రాంకోయిస్ బంధువైన మార్గరిట్ అనే మహిళ మరో యువనావికుడితో సాన్నిహిత్యం పెంచుకుంది. ఫ్రాంకోయిస్ ఆమెను శిక్షించడం కోసం మార్గరిటేను, ఆమెకు సన్నిహితుడైన యువనావికుడిని, ఆమె సేవకుడిని ఈ నిర్జన దీవిలో విడిచి వెళ్లిపోయాడు. ఒంటరి దీవిలో వారు అగచాట్లు పడుతూ, కొన్నాళ్లకు మరణించారు. ఇప్పటికీ వారి ఆత్మలు ఈ దీవిలోనే సంచరిస్తుంటాయని చెబుతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో కొందరు ఔత్సాహిక పర్యాటకులు ఇక్కడకు రాకపోకలు జరుపుతున్నారు. -
వరికోతల వేడుక వివాహాల వేదిక
సంప్రదాయ పండుగ గవాయి దాయక్ వేడుకలకు తూర్పు మలేషియాలోని శరవాక్ రాష్ట్రంతో పాటు, బోర్నియో దీవులు ముస్తాబయ్యాయి. వరి కోతలు పూర్తయిన సందర్భంగా దాయక్ తెగ ప్రజలు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే పండుగ ఇది. మే చివరి వారంలో మొదలైన ఈ వేడుకలు జూన్ చివరి వారంలో ముగుస్తాయి. దాయక్ తెగ భాషలో గవాయి అంటే పండుగ అని అర్థం. ఇది దాయక్ తెగకు నూతన సంవత్సరం వంటిది. పాత పంటకాలం ముగిసి, కొత్తగా వరి నాట్లు వేసే కాలం ప్రారంభమవడానికి ఇది సూచిక. ప్రాచీన కాలంలో గిరిజన యుద్ధాలు, కొత్త వ్యవసాయ భూముల గుర్తింపు, కొత్త ప్రాంతాలకు వలస వెళ్లే సమయంలో ఈ ఆచారాలు నిర్వహించేవారు. అయితే, ప్రస్తుత కాలంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, రక్షణ కలగాలని దాయక్ ప్రజలు ఈ పండుగను జరుపుకుంటున్నారు. దాయక్ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వారు ఎక్కువగా వరి సాగు చేస్తారు. అన్నమే వారి ముఖ్య ఆహారం. పంట చేతికొచ్చి, ధాన్యపు రాశులు ఇళ్లకు చేరిన ఆనందంలో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. బ్రిటిష్ పాలన కాలంలో శరవాక్ దినోత్సవంగా ఉన్న ఈ రోజును, 1964 సెప్టెంబర్ 25న శరవాక్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పండుగగా ప్రకటించారు. తదనంతరం, 1965 జూన్ 1న మొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో గవాయి దాయక్ను ఘనంగా నిర్వహించారు.ఈ పండుగ కోసం మే నెల ప్రారంభం నుంచే సన్నాహాలు మొదలవుతాయి. పండుగకు కొన్ని రోజుల ముందు, లాంగ్హౌస్ (దాయక్ ప్రజలు నివసించే పొడవాటి ఉమ్మడి ఇళ్లు) నివాసితులంతా కలిసి ఇళ్లను శుభ్రం చేసి, అలంకరిస్తారు. తమ పూర్వీకుల ఆత్మలకు నివాళిగా శ్మశాన వాటికలను కూడా శుభ్రం చేయడం ఇక్కడి ఆనవాయితీ. గవాయి పండుగలో అత్యంత ముఖ్యమైనది ‘తువాక్’ అనే సంప్రదాయ పానీయం. మెత్తగా ఉడికించిన అన్నాన్ని ఈస్ట్తో కలిపి జాడీలలో నిల్వ చేసి, పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేస్తారు.ఈ పానీయం సేవించడాన్ని ధైర్యానికి, శక్తికి చిహ్నంగా భావిస్తారు. దాయక్ తెగలలో ఎక్కువ శాతం వివాహాలు ఈ పండుగ రోజుల్లోనే జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా లాంగ్హౌస్ కమిటీలు వివిధ పోటీలను నిర్వహిస్తాయి. యువతీ యువకుల ఊరేగింపులు, అందాల పోటీలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలతో పాటు, సంప్రదాయ నృత్యాలు వీక్షకులను ఆకట్టుకుంటాయి. నెల రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ వేడుకలు జూన్ చివరి వారంలో జరిగే ముగింపు వేడుకలో ‘చాపలు’ చుట్టేస్తారు. ‘చాపలు’ చుట్టేశారంటే, వేడుకలు ముగిసినట్లే!∙ రమా జంబుల -
పాల ఉత్పాదనలో మనమే టాప్!
సులువుగా దొరికే పోషకాహారంలో పాలను మించినవి లేవు. ఐదు దశాబ్దాల కిందట భారత్లో పాలకు లోటు ఉండేది. పాలను, పాలపొడిని దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఉండేవి. వర్ఘీస్ కురియన్ 1970లో చేపట్టిన ‘శ్వేత విప్లవం’ అనతికాలంలోనే సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. ఫలితంగా మన దేశం పాల ఉత్పాదనలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్య«ధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం.పాల ఉత్పాదనలో మన దేశం అగ్రస్థానంలో నిలుస్తున్నా, పాల తలసరి వినియోగంలో మాత్రం మొదటి పది స్థానాలలో లేకపోవడం గమనార్హం. అత్యధిక జనాభా, పేదరికం, పాలకు బదులుగా పెరుగు, మజ్జిగ వంటి ఉత్పాదనల వినియోగం పట్ల ప్రజల అభిరుచి తదితర కారణాల వల్ల తలసరి పాల వినియోగంలో భారత్ వెనుకబడి ఉంటోందని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. పాల తలసరి వినియోగంలో మొదటి పది దేశాల వివరాలను గణాంకాల్లో తెలుసుకుందాం. -
వామనుడి త్రివిక్రమావతారం
‘జోసెఫ్ కాన్రాడ్, వ్లదిమీర్ నబాకఫ్, వి.ఎస్. నైపాల్ తదితరులు సొంత దేశాలూ– భాషలూ– ఖండాలూ– సంస్కృతులూ– ఒక్కమాటలో చెప్తే సొంత నాగరికతలను అధిగమించి, వేర్వేరు ప్రాంతాలకు తరలి వెళ్ళారు. ఆ వలసలు వారి ఊహాశక్తికి పదునుపెట్టి, పోషణనిచ్చాయి. అవి వలసల వల్ల సంక్రమించినవి. నా విషయంలో అలా చెప్పుకోడానికేమీ లేదు! ఒకే నగరం– ఒకే వీథి– ఒకే భవనంలో నా జీవితంలో అత్యధికభాగం గడిచిపోయింది. అక్కడి నుంచే, అదే దృశ్యాన్ని, అదే కోణంలోంచి చూస్తూ ఇన్నాళ్ళూ గడిపేశాను. నన్ను ‘నేను’గా మార్చిన నగరంతో నాకున్న ప్రగాఢ అనుబంధం అలాంటిది’ అన్నారు ఫెరీత్ (ఫరీద్) అర్హాన్ పముక్. 2006లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకునే నాటికే అర్హాన్ పముక్ సుప్రసిద్ధుడు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా వున్న అర్హాన్ పముక్, యాభయ్యేళ్ళకు పైగా సాహిత్యరంగంలోనూ కృషి కొనసాగిస్తూనే వున్నారు.దాదాపు డజను నవలలు రాసిన పముక్ కాల్పనికేతర సాహిత్యం కూడా బోలెడంత రాశారు. ‘ఇస్తాంబుల్– జ్ఞాపక నగరి’ అనే రచన అలాంటిదే! అది సగం జ్ఞాపకాల నెమరువేత ఐతే, మరికొంత ఇస్తాంబుల్ నగర జాతక చక్రం! ఆసియా–ఐరోపా ఖండాల మధ్య యుగయుగాలుగా విస్తరించి ఉన్న భూమార్గంలో చిట్టచివరి మజిలీ ఇస్తాంబుల్. ఈ చారిత్రక నగరం తూర్పు భాగం ఆసియాలో వుండగా, పడమటి భాగం యూరపులో చేరింది. తూర్పు ఇస్తాంబుల్లోని ‘పముక్ భవంతి’ పే...ద్ద అపార్టుమెంట్ సముదాయం. అర్హాన్ పముక్ బంధువులందరూ ఆ భవంతిలోని ఒక్కో అపార్టుమెంట్లో సకుటుంబంగా జీవిస్తూ వుంటారు. మధ్యలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వుండివచ్చినా, ఎక్కువ కాలం ఆ భవంతిలోనే వున్నానంటారు పముక్. వలస జీవన విధానం ఒకరకం శక్తినిస్తే, ఒకే చోట పాతుకుపోయి జీవించడం మరోరకం శక్తిని ఇస్తుందని పముక్ రుజువు చేశారు. ప్రపంచంలోని ప్రతి చెప్పుకోదగిన నగరంలోని జీవిత విధానం పైనా ఎవరో ఒకరు ఏదో ఓ రూపంలో రాస్తూనే వున్నారు. అంచేత పముక్ గొప్పతనం ఆయనొక్కడే వాళ్ళ నగరం గురించి రాయడంలో లేదు– అది రాసిన పద్ధతిలో ఉంది!సామాన్య శకం నాలుగో శతాబ్దిలో, తూర్పు రోమన్ సామ్రాజ్య రాజధానిగా నిర్మితమైన కాన్స్టాంటినోపుల్ నగరమే, ఆరేడు వందల సంవత్సరాల తర్వాత ఇస్తాంబుల్గా మారిందని యూరపియన్ చరిత్ర రచయితలు అంటారు. కానీ, అంతకు రెండువేల యేళ్ళకు ముందునుంచీ ఈ నగరం ఉన్న ప్రాంతం జనావాసంగా వుంటూనే వచ్చిందని ఆసియన్ చరిత్ర గ్రంథాల సమాచారం. బైజాంటియన్ సంస్కృతి ఇక్కడ వర్ధిల్లింది. మూడువేల సంవత్సరాల కిందట మతం– రాజకీయం రెండు స్వతంత్ర శాఖలుగా చీలక ముందటి మాట యిది. అసలు ‘బిజాంతీన్’ అంటేనే సంక్లిష్ట సమన్వయమని అర్థం! ఈ ప్రాంత చరిత్ర వరకూ ఇది అక్షరాలా సార్థకం!!‘ప్రాక్పశ్చిమ నాగరికతల మధ్య నిర్మించిన వారధులు’గా పముక్ రచనలను పేర్కొన్నారు నోబెల్ పురస్కారం ఎంపిక సంఘంలోని నిపుణులు! ‘రెండు నాగరికతల మేలికలయిక ఇస్తాంబుల్. దాని ‘వ్యాకులిత ఆత్మ’ను సరికొత్త ప్రతీకల సాయంతో శోధించిన వాడు పముక్. భిన్న సంస్కృతుల మధ్య తలెత్తే ఘర్షణలనూ– సమన్వయాన్నీ కూడా గొప్పగా చిత్రించినందుకు ఈ జ్యూరీ పముక్ను అభినందించింది. భిన్న భాషలూ, సంస్కృతులూ, మతాల మధ్య ఏర్పడే ఘర్షణలకు నూతన భాష్యాలు చెప్తూ, వాటికి ‘అనూహ్య సమన్వయాలను సూచించినందుకు’ పముక్ను జ్యూరీ కొనియాడింది. అంతటితో ఆగితే బావుండేది– ‘వర్తమాన సాహిత్య ప్రపంచంలో అత్యంత విశిష్టమైన వ్యక్తి పముక్’ అని జ్యూరీ ప్రకటించడంతో ఇంటా బయటా కూడా పెద్ద దుమారమే చెలరేగింది. కొందరు దాన్ని ‘కేవలం రాజకీయ ప్రకటన’గా చిత్రించి కొట్టిపారేశారు. మరికొందరు ఈ ప్రకటనను ‘టర్కిష్ సాహిత్యం సాధించిన ఘనవిజయం’గా జమకట్టారు. అయినా, మన సాహిత్య వేత్తల సుహృద్భావం మనకు తెలియనిదా? నక్కలెక్కడికెళ్ళినా ఊళలే వేస్తాయి–కోయిల ఏ దేశంలోనైనా తియ్యగానే పాడుతుంది! ఆ విషయం అలా వుంచండి!!‘ప్రతి మనిషీ జీవితంలో ఒకసారైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన పరిసరాలు అప్పుడెలా వుండేవో, ఇప్పుడెల వున్నయో పునఃపరిశీలించుకోడానికి అది వుపయోగపడుతుంది. ఈ విశ్వం ఎంతో విశాలమైంది. దానిలోని ఒకానొక మూలనే, ఒకానొక రోజునే, ఒకానొక కుటుంబంలోనే మనం పుట్టాలని జీవితమనే లాటరీ ఎందుకు నిర్ణయించింది? ఆ కుటుంబం మనల్ని ఎందుకంతగా ప్రేమిస్తుంది? మనమెందుకు వాళ్ళను అంతగా అభిమానిస్తాం? ఏమో– ఇంతకన్నా మెరుగైన జీవితానికి అర్హులమేమో మనం? వయసుడిగిన ఓ నగరంలో పుట్టడం నా దురదృష్టమేమో అనిపిస్తుంది ఒక్కోసారి’ అన్నారు పముక్ ‘ఇస్తాంబుల్ నగరం – కొన్ని జ్ఞాపక కథలు’ పుస్తకానికి రాసిన ముందు మాటలో. ఆ పుస్తకం చదువుతూ పోతుంటే అవి ఓ వ్యక్తి జ్ఞాపకాలో, ఒకానొక నగరం స్వగతమో మర్చిపోతూ వుంటాం. ఒక వ్యక్తి విరాట్ రూపంలో ఓ చారిత్రక మహానగరాన్ని ఆక్రమించుకుంటున్నట్లు అనిపిస్తుంది!! అదే పముక్ వేసిన మంత్రం. ఇది అందరికీ చేతనయ్యే ట్రిక్కు కాదు. కనుకనే, ఫెరీత్ అర్హాన్ పముక్కు నోబెల్ సాహిత్య పురస్కారం దక్కింది.-మందలపర్తి కిషోర్ -
పరిశోధనా రంగంలో నకీలల కలకలం
శాస్త్ర రంగంలో వాస్తవ పరిశోధనల కంటే నకిలీల ప్రాబల్యం పెరిగిపోతుండటం పట్ల అంతర్జాతీయ పరిశోధక సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. శాస్త్ర విజ్ఞాన రంగానికి సంబంధించి నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల వెల్లడించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు యావత్ సైన్స్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేశాయి.‘అమ్ముడుబోతున్న’ జర్నల్స్!ఎటువంటి క్షేత్రస్థాయి పరిశోధనలు లేదా ప్రయోగాలు లేకుండానే, ధనార్జనే ధ్యేయంగా కొన్ని ముఠాలు నకిలీ అధ్యయన పత్రాలను విక్రయిస్తున్నాయి. అంతకంటే ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, శాస్త్రీయ ప్రమాణాలను పాటించాల్సిన కొన్ని గుర్తింపు పొందిన జర్నల్స్ (సైన్స్ పత్రికలు) సైతం ఈ ముఠాలతో చేతులు కలపటం! భారీ మొత్తంలో డబ్బు, ఇతర ప్రయోజనాల కోసం ఆ పత్రికలు నాణ్యత లేని, అశాస్త్రీయమైన సమాచారాన్ని ప్రచురిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా రంగం విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి!నెట్వర్క్గా సాగుతోందినార్త్వెస్టర్న్ యూనివర్సిటీ నిర్వహించిన లోతైన సత్యాన్వేషణలో భాగంగా, లక్షలాది పాత రికార్డులను తనిఖీ చేసినప్పుడు ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మధ్యవర్తులు, నకిలీ పరిశోధకులు ఒక నెట్వర్క్గా ఏర్పడి, పరిశోధనా పత్రాలను విక్రయిస్తున్నట్లు బయటపడింది. దీంతో, నికార్సైన పరిశోధనా పత్రాన్ని కూడా అది నిజమైనదా కదా అని సూక్ష్మంగా పరిశీలించాల్సిన అగత్యం ఏర్పడింది.అబద్దపు నివేదికలు, ప్రసంశలుప్రచురణల రంగంలోని పెద్దల బలహీనతలను ఆసరాగా చేసుకుని, కొన్ని ముఠాలు ప్రధానంగా మూడు రూపాల్లో మోసానికి పాల్పడుతున్నట్లు నార్త్వెస్టర్న్ బృందం గుర్తించింది ఆ మూడూ : ఎటువంటి ప్రయోగాత్మక ఆధారాలు లేకుండానే, కేవలం ఊహాజనిత లెక్కలతో అబద్ధపు నివేదికలను కల్పిత డేటాతో సిద్ధం చేయడం; నిర్ణీత రుసుము చెల్లిస్తే చాలు, ఎవరి పేరునైనా సరే ‘ప్రధాన పరిశోధకుడి’ (ఫస్ట్ ఆథర్) గా నివేదికలో చేర్చటం; ఆ తప్పుడు పరిశోధనకు ప్రాధాన్యం కల్పించేందుకు కొన్ని పత్రికల్లో రివ్యూలు రాయించటం, అలాగే ‘గ్రంథ రచయిత’లుగా కొందరికి ప్రశంసాపత్రాలు అందచెయ్యటం! ‘‘ఈ ధోరణి పట్ల మనం ఉదాసీనంగా ఉండిపోతే, సైన్స్ ప్రామాణికతే ప్రశ్నార్థకంగా మారుతుంది’’ అని ప్రొఫెసర్ అమరల్ కలవరపడుతున్నారు. అమరల్ నార్త్వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన సోషల్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ సైన్సెస్ నిపుణుడు. ఆయన తన సహ పరిశోధకుడు రీస్ రిచర్డ్సన్తో కలిసి కూపీ లాగినప్పుడు ఈ నకిలీ పరిశోధనల పత్రాల గుట్టలు బయటపడ్డాయి. వాటిపై వీరిచ్చిన సంచలన నివేదిక ప్రతిష్టాత్మకమైన పి.ఎన్.ఎ.ఎస్. (ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్) జర్నల్లో రావటంతో అంతర్జాతీయంగా నకిలీ పరిశోధనా పత్రాలపై చర్చ మొదలైంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘నేషనల్ సైన్స్ ఫౌండేషన్’ మద్దతు కూడా వీరికి లభించింది. తవ్వి తీశారుఅమరల్ పరిశోధక బృందం కేవలం ప్రాథమిక పరిశీలనకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలోని అతి పెద్ద డేటాబేస్లను క్షుణ్ణంగా పరిశీలించి, ఈ అక్రమాలను వెలికి తీసింది. ఇందుకోసం వారు ‘వెబ్ ఆఫ్ సైన్స్’, ‘స్కోపస్’, ‘పబ్మెడ్’ వంటి పేరున్న డేటాబేస్ల నుండి లక్షలాది రికార్డులను సేకరించి తూర్పార పట్టారు. ఒకే రకం చిత్రాలను లేదా ఒకే రకం డేటాను వేర్వేరు పరిశోధనా పత్రాల్లో మళ్లీ మళ్లీ వాడటం వంటి మేధోచౌర్యాన్ని గుర్తించారు. నాణ్యత ప్రమాణాలు పాటించనందున డేటాబేస్ల నుండి తొలగింపునకు గురైన జర్నల్స్ జాబితాను నిశితంగా చెరిగి, వాటిలో వచ్చిన పరిశోధనా పత్రాల వెనుక ఉన్న ఉమ్మడి నెట్వర్క్లను వెలికితీశారు. ‘రిట్రాక్షన్ వాచ్’, ‘పబ్పీర్’ వంటి వాచ్డాగ్ ప్లాట్ఫామ్లలోని చర్చలను, ఎడిటర్ల నేపథ్యాలను, పరిశోధనా పత్రాల సమర్పణ తేదీలను బేరీజు వేసుకున్నారు. ఇంత నిశితంగా తవ్వుకుంటూ వెళ్లాక మాత్రమే, అశాస్త్రీయ పద్ధతుల్లో పత్రాలను ప్రచురిస్తున్న ముఠాల ఉనికిని తెలుసుకోగలిగారు.ఎంత డబ్బుకు అంత హోదా!శాస్త్ర పరిశోధన అనేది నిరంతర శ్రమతో కూడిన విషయం. అయితే, ఈ నేరపూరిత పగడ్బందీ నెట్వర్క్లు శ్రమ లేకుండా డబ్బు సంపాదించటం కోసం నకిలీ పరిశోధనా పత్రాలను సృష్టిస్తున్నాయి. ఈ పత్రాల్లో నిజాలు ఉండవు, వీటిలోని సమాచారానికి పొంతనలు కుదరవు. ఇదంతా కూడా మనీ లాండరింగ్లా సాగుతుంది. భారీ మొత్తంలో నిధులు చెల్లించే వారికి పరిశోధనతో సంబంధం లేకపోయినా ‘ప్రధాన రచయిత’ హోదాను కల్పిస్తారు. ఇచ్చే డబ్బును బట్టి రచయితల జాబితాలో నాలుగో స్థానం లేదా ఐదో స్థానం కేటాయిస్తారు. ఈ అశాస్త్రీయ పత్రాలపై ఎటువంటి సమీక్ష లేదా అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు, జర్నల్స్ యాజమాన్యాలకు కూడా భారీగా ముడుపులు అందిస్తున్నట్లు అమరల్ టీమ్ పసిగట్టింది.నివారించటం ఎలా?!ఈ వ్యవస్థీకృత ‘ఫేక్ రీసెర్చ్’ వైరస్ను అడ్డుకోవడానికి అమరల్, రిచర్డ్సన్ల బృందం అత్యంత కీలకమైన, ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తోంది. అవి: పరిశోధన పత్రాలపై సంపాదకీయ పర్యవేక్షణ ఉండాలి. జర్నల్న్ పనితీరుపై నిరంతర నిఘా పెట్టాలి. ఎడిటర్లు అనుసరిస్తున్న సమీక్షా పద్ధతులు పారదర్శకంగా ఉన్నాయా లేదా అని నిశితంగా గమనించాలి. అనైతిక పద్ధతులకు పాల్పడే ఎడిటర్లను గుర్తించి, జర్నల్స్ విశ్వసనీయతను కాపాడాలి. అలాగే, కృత్రిమ మేధ, డేటా ఎనలిటిక్స్ ఆధారంగా సరికొత్త టూల్స్ను అభివృద్ధి చేయాలి. అబద్ధపు సమాచారాన్ని, మే«ధా చౌర్యాన్ని, కల్పిత డేటాను ప్రాథమిక దశలోనే గుర్తించగల సాంకేతికతను పబ్లిషింగ్ హౌస్లు తప్పనిసరిగా వాడాలి.ఏఐతో మరింత ముప్పు!శాస్త్ర పరిశోధనా రంగంలోప్రస్తుతం జరుగుతున్న ఈ మోసాలకు తోడు, ‘జనరేటివ్ ఏఐ’ ప్రవేశం కూడా పరిశోధనా రంగాన్ని మరింత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని పరిశోధకుడు రిచర్డ్సన్ హెచ్చరించారు. అదెలా అంటే, ఏఐ సాయంతో అతి తక్కువ సమయంలో వేల సంఖ్యలో నకిలీ పరిశోధనా పత్రాలను సృష్టించే అవకాశం ఉంది. దీనివల్ల వాస్తవ పరిశోధనలు ఈ కృత్రిమ సమాచార ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇక నకిలీ పరిశోధనా పత్రాలలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తు ఏఐ మోడల్స్ శిక్షణ పొందితే, అవి మరింత తప్పుడు సమాచారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఒక విషవలయంలా మారి, వాస్తవానికి, కల్పితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా చెరిపివేస్తుంది. ఈ పరిణామం వల్ల అంతిమంగా శాస్త్రీయ విజ్ఞానం ప్రామాణికత దెబ్బతింటుంది. అబద్ధపు పునాదుల మీద నిర్మితమయ్యే మేధో సంపత్తి మానవాళికి ఎటువంటి ఉపయోగం లేకపోగా, తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ‘‘శాస్త్ర విజ్ఞానం మానవజాతి మనుగడకు అత్యంత కీలకం అని మనం విశ్వసిస్తే, దాని పవిత్రతను కాపాడటానికి ఈ అనైతిక శక్తులపై పోరాడక తప్పదు’’ అని అమరల్ తాజాగా పిలుపునిచ్చారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో నైతికతను పునరుద్ధరించడమే నేటి తక్షణ కర్తవ్యం అని ఆయన అంటున్నారు. నిజమే. సత్యాన్వేషణే లక్ష్యంగా సాగే సైన్స్ రంగం, ఈ నకిలీ ప్రభావం నుండి బయటపడి తన పూర్వ వైభవాన్ని, విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన చారిత్రక అగత్యం నేడు ఏర్పడింది!∙ సాక్షి స్పెషల్ డెస్క్మేధా దోపిడీకి పరాకాష్ఠనకిలీ పరిశోధనా రంగంలోని ముఠాలు అనుసరిస్తున్న వ్యూహాలు, మాయోపాయాలను ప్రొఫెసర్ అమరల్ బృందం శాస్త్రీయంగా విశ్లేషించింది. దాని ప్రకారం, ఈ నెట్వర్క్లు ఒకే పరిశోధనా పత్రాన్ని ఏకకాలంలో పలు జర్నల్స్లో వచ్చేలా చేసి, త్వరగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తాయి. ఒకవేళ భవిష్యత్తులో ఆ పత్రం నకిలీదని తేలి, తొలగింపునకు గురైనప్పటికీ అప్పటికే వారు పొందాల్సిన లబ్ధిని వారు పొంది ఉంటారు. అలాగే ప్రచురణ నిలిచిపోయిన పాత పత్రికల వెబ్సైట్ డొమైన్లను ఈ ముఠాలు కొనుగోలు చేస్తాయి. ఉదాహరణకు, బ్రిటన్కు చెందిన ‘హెచ్.ఐ.వి. నర్సింగ్’ జర్నల్ మూత పడగానే దానిని కొని, దాని పేరును వాడుకుంటూ నర్సింగ్ రంగానికి ఏమాత్రం సంబంధంలేని వేలాది అశాస్త్రీయ పత్రాలను వారు ప్రచురించారు. మేధా దోపిడీకి ఇది పరాకాష్ఠ. ఇవి కాక, రచయితలకు, జర్నల్ ఎడిటర్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ; పరిశోధనా పత్రాల ప్రచురణకు ‘ప్యాకేజీ’ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పరిశోధనా పత్రం తయారీ నుండి ప్రచురణ వరకు కొనసాగుతున్న ఈ పకడ్బందీ కుంభకోణంపై అమరల్ బృందం అంతర్జాతీయ సమాజానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. శాస్త్ర రంగంలో తగిన భద్రతా ప్రమాణాలు, పారదర్శకతను పెంచకపోతే, భవిష్యత్తులో మేధో ప్రపంచం ఈ మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్నకిలీ పరిశోధనల వ్యవస్థ జాడలను ఛేదించేందుకు ప్రొఫెసర్ అమరల్ బృందం ఒక అధునాతన ‘ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక విధానం ప్రధానంగా మెటీరియల్ సైన్సెస్, ఇంజినీరింగ్ రంగాల్లోని పరిశోధనా పత్రాలను నిశితంగా విశ్లేషిస్తుంది. చాలామంది నకిలీ పరిశోధకులు పరిశోధన కోసం తాము అత్యాధునిక పరికరాలను ఉపయోగించినట్లు పత్రాల్లో పేర్కొంటారు. అయితే, వారు పేర్కొన్న పరికరాల సామర్థ్యానికి, వారు చూపిన ఫలితాలకు మధ్య ఎటువంటి శాస్త్రీయ సంబంధమూ ఉండదు. దానిని ఈ ‘ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్’ సాఫ్ట్వేర్ తక్షణమే గుర్తిస్తుంది. అలాగే క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోగాలు చేయకుండానే, కేవలం ఊహాజనిత పరికరాల పేర్లతో పేపర్లు సృష్టించే వారిని ఈ వ్యవస్థ సమర్థవంతంగా గుర్తించి, అడ్డుకుంటుంది. ఈ వినూత్న పరిష్కారాన్ని ప్రతిష్ఠాత్మకమైన ‘ప్లాస్ వన్’ జర్నల్ ప్రశంసించింది. శాస్త్రీయ పరిశోధనల నాణ్యతను కాపాడటంలో కీలక ముందడుగుగా దీనిని అభివర్ణించింది. -
కస్టమ్స్ చెప్పుకునేందుకే
మీ చెప్పుకు స్ట్రిప్ ఉందా?.. ఇదేంటి.. మీ పేస్టులో ఉప్పుందా అని యాడ్ చూశాం కానీ చెప్పు స్ట్రిప్ గురించి అడుగుతున్నారేంటి? అనుకుంటున్నారా? అంతే కాదండోయ్.. మీరు వేసుకుంది చెప్పులా? శాండిల్సా? ఇవేం ప్రశ్నలని ఆశ్చర్యపోతున్నారా? కానీ, ఇదే ప్రశ్న దేశ రాజధానిలో సుమారు 14 ఏళ్ల పాటు ఓ సంస్థను కార్యాలయాల చుట్టూ తిప్పింది. కోర్టు మెట్లు ఎక్కించింది. న్యాయపోరాటానికి కారణమైంది. చెప్పులు అని వేటిని అంటారు. శాండిల్స్కు ఉండాల్సిన అర్హత ఏంటనే దానిపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఏవి చెప్పులో.. ఏవి శాండిల్సో చివరికి ఢిల్లీ హైకోర్టు తేల్చింది. ఓ పరిష్కారం లభించింది.చెన్నైకి చెందిన విశాల్ ఇంటర్నేషనల్ సంస్థ 2003 మే 15న మహిళల పాదరక్షలను విదేశాలకు ఎగుమతి చేసింది. కంపెనీ వాటిని ‘లేడీస్ లెదర్ శాండిల్స్’గా పేర్కొంటూ, ఆ కేటగిరీకి వర్తించే 10 శాతం డ్రా బ్యాక్ రాయితీని కోరింది. అయితే ఇవి శాండిల్స్ కాదు చెప్పులు అని కస్టమ్స్ శాఖ సుంకం రాయితీని ఐదు శాతానికి తగ్గించింది. దీంతో అవి ఏ కేటగిరీ కిందకు వస్తాయనే చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘చప్పల్’ నిర్వచనాన్ని సంస్థ అంగీకరించలేదు. దీంతో న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఇది దేశవ్యాప్తంగా ఎగుమతిదారుల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు సంస్థలు.. విభిన్న నివేదికలుఎగుమతి వస్తువు ఏ కేటగిరీ కిందికి వస్తుందనేది నిర్ధారించేందుకు పాదరక్షల నమూనాను న్యూఢిల్లీలోని లెదర్ ఎక్స్పోర్టు కౌన్సిల్కు విశాల్ సంస్థ పంపింది. ఆ కౌన్సిల్లోని సభ్యులు వాటిని పరిశీలించి అవి లెదర్ శాండిల్స్గా నిర్ధారించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దీనిపై ఎస్ఐఐబీ ఆ నమూనాను కౌన్సిల్ ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సంస్థకు(ఎఫ్డీడీఐ) పంపించింది. ఆ ఎగుమతి వస్తువులు ‘చెప్పుల’ కేటగిరీకి చెందినవిగా పేర్కొంది. ఈ కేటగిరీకి 10% సుంకం రాయితీ రాదని, 5% మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. సంస్థకు షోకాజ్ నోటీసు జారీలెదర్ ఎక్స్పోర్టు కౌన్సిల్ లేఖ ఆధారంగా కస్టమ్స్ శాఖ విశాల్ ఇంటర్నేషనల్ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేటగిరీని తప్పుగా నమోదు చేసి చెల్లించిన వ్యత్యాస డ్యూటీ డ్రా బ్యాక్ మొత్తం రూ. 1,30,800 నెలకు 15% వడ్డీతో కలిపి ఎందుకు తిరిగి వసూలు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో కోరింది. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 114 ప్రకారం జరిమానా విధించే ప్రతిపాదన కూడా నోటీసులో పేర్కొంది. వ్యక్తిగత విచారణకు కూడా అవకాశం కల్పించింది.జరిమానా విధింపుఎఫ్డీడీఐ నిర్ణయంతో ఏకీభవించడం లేదంటూ విశాల్ సంస్థ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చింది. అనంతరం డ్రా బ్యాక్ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని, అదనంగా రూ. 1.25 లక్షల జరిమానా చెల్లించాలని కస్టమ్స్ అదనపు కమిషనర్ ఆర్డర్ జారీ చేశారు. దీనిపై సంస్థ కస్టమ్స్ కలెక్టర్ (అప్పీల్స్) వద్ద అప్పీలు దాఖలు చేసింది. ఆ అప్పీల్ను తిరస్కరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రివిజన్ దరఖాస్తు సమర్పించింది. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ నైపుణ్యం కలిగిన సంస్థ కావున ఆ అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కేంద్రం తెలిపింది. జరిమానా మొత్తాన్ని రూ. 10,000కు తగ్గించింది. ఎన్నో ఏళ్లుగా వ్యాపారపరంగా ఆ పుట్వేర్ను ‘లెదర్ శాండల్స్’గానే వర్గీకరిస్తున్నారని విశాల్ సంస్థ పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్చివరకు సంస్థ 2013లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కస్టమ్స్ శాఖ వర్గీకరణ సరైంది కాదని, తాము ఎగుమతి చేసిన పుట్వేర్ను శాండిల్స్గా పరిగణించాలని, శాండిల్స్కు వర్తించే సుంకం రాయితీ వర్తింపజేయాలని, కస్టమ్స్ శాఖ ఆదేశాలను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించింది. ఏది చప్పల్? ఏది శాండల్?వెనుక భాగంలో స్ట్రిప్ లేకపోతే అది శాండిల్ కాదు చప్పల్గానే పరిగణించాలన్న కస్టమ్స్ శాఖ వాదనను కోర్టు అంగీకరించలేదు. ఒకే ఒక లక్షణం ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంది. వ్యాపారులు, వినియోగదారులు ఒక ఉత్పత్తిని ఎలా పిలుస్తారో అదే ప్రామాణికమని పేర్కొంది. టెక్నికల్గా అధికారులు ఏ పేరు పెట్టినా మార్కెట్లో అది లేడీస్ లెదర్ శాండిల్స్గానే గుర్తింపు పొందిందనే అంశాన్ని గుర్తించాలని పేర్కొంది. కోర్టు తీర్పు ఇలా..లెదర్ ఫుట్వేర్ వర్గీకరణపై దాదాపు 14 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఢిల్లీ హైకోర్టు 2017లో ముగింపు పలికింది. కస్టమ్స్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ఎగుమతి చేసిన ఉత్పత్తిని చప్పల్స్’గా వర్గీకరించిన విధానాన్ని తప్పు పట్టింది. మహిళల పుట్వేర్లో అనేక నమూనాలు ఉంటాయని, వాటన్నింటికీ ఒకే కొలమానం పెట్టలేమని స్పష్టం చేసింది. చెప్పులు, శాండిల్స్కు ఉన్న టెక్నికల్ తేడాలను పేర్కొంది. సంబంధిత శాఖ ఆదేశాల్ని కొట్టేస్తూ తుది తీర్పు ఇచ్చింది. సాధారణంగా చట్టంలో ఒక ఉత్పత్తికి స్పష్టమైన నిర్వచనం లేని సందర్భంలో ‘కమర్షియల్ పారాలెన్స్ టెస్ట్’ను కోర్టులు ప్రామాణికంగా భావిస్తాయి.. కానీ, కొన్ని కేసుల్లో మాత్రం కాంపోజిషన్, టెక్నికల్ స్టాండర్డ్స్ను కూడా చూడాలని న్యాయ స్థానాలు పలు కేసుల్లో స్పష్టం చేశాయి. ∙దిలీప్ మాదిరెడ్డి -
పిల్లల కథ: మృగరాజు పరివర్తన
అనగనగా ఒక అడవి. ఆ అడవికి సింహం రాజు. తోటి ప్రాణులను అది హీనంగా చూసేది. ఒకనాడు ఆ సింహం నీళ్లు తాగడానికి వాగు దగ్గరకు వెళ్ళింది. అదే సమయానికి అక్కడికి ఒక ఏనుగు వచ్చింది.సింహం ఏనుగును చూసి గర్జిస్తూ ఇలా అంది, ‘ఓయ్ ఏనుగు! ఈ రోజు పొట్ట నిండా అరటిపండ్లు తిన్నట్లు ఉన్నావు కదా?’ఏనుగు ప్రశాంతంగా, ‘అవును రాజా, నా ఆకలి తీర్చుకున్నాను’ అని బదులిచ్చింది.అప్పుడు సింహం అధికారాన్ని ప్రదర్శిస్తూ, ‘విను! రేపటి నుండి నువ్వు ఆహారం తినే ముందు రెండు గెలల అరటిపండ్లను నా గుహలో పెట్టాలి. ఆ తర్వాతే నువ్వు ముట్టాలి, అర్థమైందా?’ అని గర్జించింది.ఏనుగు ఏమాత్రం తడబడకుండా, ‘క్షమించు రాజా! నేను నీకు సేవకుడిని కాదు. నీ ఆజ్ఞలు పాటించడానికి నేను సిద్ధంగా లేను’ అని చెప్పింది.సింహం కోపంతో కళ్లెర్రజేసింది. ఏనుగు భయపడకుండా, ‘నీవు అడవికి రాజువు మాత్రమే, యజమానివి కాదు అని గుర్తుంచుకో! నీ అంత శక్తి నాకూ ఉంది.’ అంది.ఏనుగు అలా సమాధానం చెప్పేసరికి, సింహం అవమానంతో వెనుదిరిగింది. దారిలో ఒక ఎలుగుబంటి తేనె తాగుతూ కనిపించింది.సింహం ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి, ‘ఒరేయ్ ఎలుగుబంటి! రేపటి నుండి నువ్వు సంపాదించే తేనెలో రెండు పెద్ద పట్టులు నా గుహలో సమర్పించాలి’ అని ఆజ్ఞాపించింది.ఎలుగుబంటి నవ్వుతూ, ‘రాజా! తేనెటీగలతో కుట్టించుకుని, ప్రాణాలకు తెగించి తెచ్చుకునే నా కష్టార్జితాన్ని నీకు ఎందుకు ఇవ్వాలి?’ అని ప్రశ్నించింది.సింహం ఆశ్చర్యపోతూ ఉండగా, ఎలుగుబంటి మళ్ళీ ఇలా అంది: ‘కష్టపడి సంపాదించేది మేము, కూర్చుని తినేది నువ్వా? ఇది న్యాయం కాదు. నేను నీ సేవకుడిని కాను.’మరోసారి పరాభవం ఎదురవడంతో సింహం ముందుకు సాగింది. ఒక చెట్టు మీద మామిడి పండ్లు తింటున్న కోతి దానికి కనిపించింది.సింహం కోతిని చూసి, ‘ఓయ్ కోతి! రేపటి నుండి రెండు బుట్టల మామిడి పండ్లను నా గుహలో పెట్టాలి. నేను తిన్నాకే నువ్వు తినాలి’ అని çహూంకరించింది.కోతి కిచకిచ నవ్వుతూ, ‘రాజా! నీ గర్జనలకు భయపడే కాలం పోయింది. మేము గౌరవించేది నీ పదవిని మాత్రమే, నీ గర్వాన్ని కాదు’ అని చెప్పింది.కోతి ఇంకా ఇలా అంది: ‘మేము నిన్ను రాజుగా చూస్తున్నాము కాని, నీకు దాసోహం అనడం లేదు. కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని ఎవరికీ ఊరికే ఇచ్చే ప్రసక్తే లేదు.’సింహం తన గుహకు వెళ్లి దీర్ఘంగా ఆలోచించసాగింది.‘ఏనుగు ధిక్కారం, ఎలుగుబంటి నిజాయితీ, కోతి చెప్పిన హితవు అన్నీ నిజమే కదా!’ అని మనసులో అనుకుంది.తన గర్వం వల్లే అందరూ తనను వ్యతిరేకిస్తున్నారని గ్రహించింది. ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదని దానికి అర్థమైంది.మరుసటి రోజు నుండి సింహం ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అడవిలో ఏ ప్రాణి కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించడం మొదలుపెట్టింది.ఒక కుందేలును చూసి సింహం, ‘ఏమ్మా! బాగున్నావా? నీకు ఏమైనా సహాయం కావాలా?’ అని ప్రేమగా అడిగింది.సింహంలోని ఈ మార్పు చూసి అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. క్రమంగా అవి మళ్ళీ రాజు దగ్గరకు చేరడం ప్రారంభించాయి.ఏనుగు వచ్చి, ‘రాజా! నీలోని ఈ మార్పు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అని పొగిడింది.ఎలుగుబంటి కూడా వచ్చి, ‘నిజమైన రాజువంటే నువ్వే రాజా! ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాము’ అని అంది.అప్పటి నుండి సింహం ఎవరినీ ఆహారం అడగలేదు, ఎవరినీ తక్కువ చేసి చూడలేదు. అడవిలోని జీవులన్నీ సింహాన్ని నిజమైన మృగరాజుగా కీర్తించాయి.అల్పతోయశ్చలత్కుంభో అల్పదుగ్ధాశ్చ ధేనవఃఅల్పవిద్యో మహాగర్వీ కురూపీ బహుచేష్టితఃనీళ్లు తక్కువున్న కుండ తొణుకుతుంది. కొత్తగా ఈనిన ఆవు తక్కువ పాలిస్తుంది. చదువు తక్కువున్న వాడికి గర్వం ఎక్కువగా ఉంటుంది. కురూపికి అతిచేష్టలు ఎక్కువగా ఉంటాయి. -
క్లూషియల్: మంటల్లో సాక్ష్యం
చీకటి మాటున నీడలా అంటి పెట్టుకున్న నేరం... విజయవాడ – హైదరాబాద్ హైవే అది... ఒక్కసారిగా అక్కడ కలకలం. మంటల్లో కారు కాలిపోతోంది. అర్ధరాత్రి దాటాక రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక లగ్జరీ కారు సెగలు కక్కుతూ తగలబడిపోతోంది. అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోయాడు. ఫైరింజన్లు వచ్చాయి. మంటలు అదుపులోకి వచ్చాక లోపల సీటుకు కట్టేసినట్లుగా ఉన్న వ్యాపారవేత్త ఫణీంద్ర మృతదేహం పూర్తిగా కాలిపోయి కనిపించింది.పోలీసులు దీన్ని ఒక ఘోర రోడ్డు ప్రమాదంగా భావించి కేసు క్లోజ్ చేయబోయారు. కానీ ఫణీంద్ర భార్య సుమతి మాత్రం ఇది ప్రమాదం కాదని, తన భర్తను ఎవరో కావాలనే చంపారని క్రైమ్ బ్రాంచ్ను ఆశ్రయించింది. కేసు ఇన్ స్పెక్టర్ అభిమన్యు చేతికి వచ్చింది. అభిమన్యు క్రైమ్ సీన్కు వచ్చాడు. కారు శకలాలను, ఫణీంద్ర పోస్ట్మార్టం రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలించాడు.ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు ఉన్నాయేమోనని పరిశీలించాడు. దూరంగా ఒక పెట్రోల్ బంకు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అభిమన్యు ఫణీంద్ర భార్య సుమతిని విచారించాడు.‘కేసులో అనుమానాస్పద విషయాలు ఏమీ లేవు కదా? కేసు ఘోర అగ్ని ప్రమాదంగా భావించి కేసు క్లోజ్ చేద్దామా?’ అభిమన్యుని అడిగాడు కమిషనర్.‘అన్నీ అనుమానాస్పద విషయాలే...’ తన చేతిలో వున్న పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తూ అన్నాడు అభిమన్యు.‘ఏమిటవి?’ కమిషనర్ అడిగాడు.‘ఎవిడెన్ను ఫిజికల్గా తీసుకొస్తాను... మీరు హంతకుడిని అరెస్టు చేయడానికి రెడీగా ఉండండి సర్’ చెప్పి లేచాడు అభిమన్యు.‘నీపేరు?’ అతని వంకే చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు..‘రవీంద్ర... విజయవాడ బ్రాంచ్ మేనేజర్గా ఏడు నెలల క్రితమే వచ్చాను.’ అన్నాడు అతడు.‘అంతలోనే ప్రమోషన్ వచ్చిందా?’ అడిగాడు అభిమన్యు.‘ప్రమోషనా?’ ఆశ్చర్యంగా అడిగాడు రవీంద్ర.‘హంతకుడిగా ప్రమోషన్...’‘నేను హంతకుడినా?’ కాస్త కోపంగా అన్నాడు రవీంద్ర.. ‘వెల్... చాలా తెలివిగా ప్లాన్ చేశావు... నిజం ఒప్పుకొని పోలీసులకు లొంగిపోతే, నేను త్వరగా ఈ కేసు క్లోజ్ చేసి మరో కేసు టేకప్ చేయాలి.’ అన్నాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. ‘మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. అయినా నేను విజయవాడలో ఉన్నా... నేను హత్య ఎలా చేస్తాను?’ దబాయించబోయాడు రవీంద్ర.‘విజయవాడ నుంచి నువ్వు కారులో బయలుదేరినట్టు సీసీ కెమెరాల సాక్ష్యం, టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ చెల్లింపుల రికార్డు వుంది. ప్రమాదం జరిగిన చోట పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో నువ్వు తగలబడుతున్న కారు దగ్గర ఉన్న విజువల్స్ ఉన్నాయి.ఫణీంద్ర శ్వాసకోశాల్లో పొగ లేదు. సాధారణంగా ఎవరైనా మంటల్లో చిక్కుకుని చనిపోతే, వారు ఊపిరి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి కార్బన్ (పొగ) వెళ్తుంది. కానీ ఫణీంద్ర ఊపిరితిత్తులు శుభ్రంగా ఉన్నాయి. అంటే నిప్పు అంటుకోక ముందే అతను ప్రాణాలు విడిచాడు.అత్యాధునిక ఫోరెన్సిక్ స్కానింగ్లో ఫణీంద్ర గొంతు వద్ద ఎవరో బలంగా నొక్కిన ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి. ఫణీంద్ర కారు డోర్ మీద ఉన్న వేలిముద్రలు ఫణీంద్ర గొంతు మీద ఉన్న వేలిముద్రలతో సరిపోయాయి.ఇది ప్రమాదం కాదు... పక్కా ప్లా¯Œ తో జరిగిన హత్య. ఫణీంద్రను మొదట గొంతు నొక్కి చంపి, ఆపై కారులో వేసి నిప్పు పెట్టావు. విజయవాడ బ్రాంచ్ ఆఫీసులో కోట్లలో గోల్మాల్ జరిగినట్లు ఫణింద్ర భార్య సుమతి ద్వారా తెలిసింది. ఆడిటింగ్ కోసం విజయవాడ వచ్చిన ఫణీంద్రకు నువ్వు చేస్తున్న మోసాలు తెలిశాయి. ఈ విషయం బయటపడితే ప్రమాదం అని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డావు...’ అభిమన్యు ఆధారాలతో సహా చెప్పాడు.రవీంద్రకు మరో ఆప్షన్ లేదు. పోలీసులు రవీంద్రను అరెస్ట్ చేశారు.మూడు గంటల్లో కేసును సాల్వ్ చేశాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. రచయిత శ్రీ సుధామయి -
బిహైండ్ ది బార్స్
ఆ కుర్రాడు లోపలకి వెళ్తూ బిల్డింగ్ బయట ‘సెంట్రల్ ప్రిజన్, సౌత్ని’ అని రాసుండటం గమనించాడు. వార్డెన్ ఆ కుర్రాడిని ఎగాదిగా చూసి అడిగాడు.‘‘పేరు?’’అతను చెప్పాడు.‘‘వయసు?’’‘‘పదహారు.’’పక్కనే ఉన్న జైల్ గార్డ్ అతని చెంప మీద కొట్టి అరిచాడు.‘‘సర్... ప్రతి జవాబుకి సర్ అనాలి.’’‘‘నీ జేబులు ఖాళీ చెయ్యి. వెళ్ళేప్పుడు తీసుకువెళ్ళు.’’ వార్డెన్ శాసించాడు.‘‘ఎస్ సర్.’’ఆ పని అయ్యాక గార్డ్ అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్ళి చెప్పాడు.‘‘బట్టలు విప్పు.’’‘‘దేనికి?’’ ఆ యువకుడు అదిరిపడి అడిగాడు.‘‘నువ్వు రహస్యంగా లోపలికి ఆయుధాలు, డ్రగ్స్ తీసుకెళ్ళడం లేదని తెలుసుకోడానికి.’’అతను అంతదాకా ఎవరి ముందూ నగ్నంగా నిలబడలేదు. గ్లవ్స్ తొడుక్కున్న చేతి వేళ్ళతో గార్డ్ అతని శరీరంలోని రహస్య ప్రదేశాలని వెదుకుతూంటే, అతను శాడిస్ట్ అని ఆ కుర్రాడు గ్రహించాడు. డాక్టర్ అతన్ని పరీక్షించాక గార్డ్ ప్రిజన్ యూనిఫాం ఇచ్చి చెప్పాడు.‘‘ఇవి తొడుక్కుని పద. ఇక నీ పేరుని మర్చిపోవచ్చు... నీ ఖైదీ నెంబర్ 237.’’గార్డ్ అతన్ని ఓ పెద్ద గదిలో నీళ్ళ టబ్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాడు.‘‘ఇవాళ నీ డ్యూటీ ఇక్కడ. ఇవన్నీ ఖైదీలవి. వీటిని ఉతుకు.’’‘‘ఛీ! అండర్వేర్లు. ఈ పని నేను చేయను.’’ అతను రోషంగా చెప్పాడు.వెంటనే గార్డ్ ఓ తాడుతో అతని వీపు మీద కొట్టాడు. ఆ యువకుడు కేక పెట్టాడు.‘‘ఆజ్ఞలని పాటించకపోతే ఇంతే. ఇది ఏభై పోగుల తాడు. వంద, నూట ఏభై, రెండు వందల పోగుల తాడుని ఉపయోగిస్తే నువ్వు తట్టుకోలేవు. ఒంటి మీద గాయాలు కూడా కనిపించవు. నేను వచ్చేసరికి పని పూర్తిచేయాలి.’’ఆ యువకుడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సబ్బునీళ్ళతో ఆ మురికి బట్టలని ఉతకసాగాడు. కాసేపటికి జైల్ గార్డ్ వచ్చి పక్క గదిలోకి తీసుకెళ్ళి ఖైదీలు తిన్న ప్లేట్లని చూపించి చెప్పాడు.‘‘వీటన్నిటిని తోమి శుభ్రం చేయి.’’‘‘ఛీ.’’‘‘అప్పుడే? దీని తర్వాత టాయ్లెట్లు కడగాలి.’’ గార్డ్ నవ్వుతూ చెప్పాడు.‘‘ఇలాంటి పనులు నేను ఎన్నడూ చేయలేదు.’’ ఆ యువకుడు ఏడుస్తూ చెప్పాడు.‘‘నేరస్థుడు కాకముందు సంగతి అది. నేరస్థుడు అయాక అన్ని పనులూ చేయాలి.’’టాయ్లెట్స్లోని నీళ్ళల్లోంచి దోమలు ఒక్కసారిగా పైకి లేచాయి. నీళ్ళల్లో దోమల గుడ్లు, పురుగులు చాలా ఉన్నాయి.లంచ్ బెల్ మోగింది. మెస్లో క్యూలో నిలబడ్డ ఖైదీలు ఒకరిని మరొకరు తోసుకుంటూ తిట్టుకుంటున్నారు. చాలామంది అతన్ని వెనక్కి తోసేశారు. అతని ప్లేట్లో రెండు గోధుమ రొట్టెలు, పెసరపప్పు, కప్పు అన్నం, నీళ్ళ సాంబారు, రెండు చిన్న మాంసం ్రౖఫై ముక్కలు వేశారు. అతను ఓ బల్ల ముందు కూర్చుంటే, అక్కడి ఖైదీ స్పూ¯Œ తో ఆ యువకుడి చేతి మీద కొట్టి అరిచాడు.‘‘వెళ్ళు. అడిగి కూర్చోవాలని తెలీదా?’’ఆ యువకుడు లేచి మరో బల్ల దగ్గరికి వెళ్ళి అడిగాడు.‘‘ఇక్కడ కూర్చోవచ్చా?’’ఎవరూ అనుమతించలేదు. ఓ వ్యక్తి లేచి అతని ప్లేట్లోని రెండు మాంసం ముక్కలు తీసుకున్నాడు. మరొకరు రోటీ లాక్కున్నారు. సింటెక్స్ టేంక్లోని తాగే నీళ్ళు చెడు వాసన వేస్తున్నాయి. దాని పక్కన సగం కోసిన వాటర్ బాటిల్స్ని కప్పులుగా వాడుతున్నారు.‘‘కొత్తా? ఇక్కడ బలహీనులు బలవంతుడి రక్షణలో ఉండాలి. లేకపోతే ఏమీ దక్కదు. అందుకు అతనికి కొంత సొమ్ము ఇవ్వాలి. ఉదయం ఐదున్నరకి టాయ్లెట్ల ముందు క్యూలో చోటు కావాలన్నా, స్నానానికి నీళ్ళు, తినడానికి రోటీ కావాలన్నా బలవంతుడు మనకి రక్షణగా ఉండాలి.’’ ఒకరు అతన్ని చూసి చెప్పారు.వెయ్యి చదరపు అడుగుల బేరక్స్లో నూట అరవైమంది ఖైదీలు ఉన్నారు. ఇందాకటి అతను ఆ యువకుడితో చెప్పాడు.‘‘రాత్రుళ్ళు ఇక్కడ జరిగేవి మాటల్లో చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. నిన్ను చూడటానికి నీ తల్లిదండ్రులు నెలకి ఒక్కసారే ములాఖాత్కి వస్తారు. కేవలం పదిహేను నిమిషాలే. ఇనప కడ్డీల వెనక ఉన్న నిన్ను చూసి వాళ్ళు తప్పకుండా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ ఏభై కిలోల గార్డ్, నూటపాతిక కిలోలున్న ఖైదీని కొడతాడు. నా చెవి మీద కొడితే గూబ పగిలి చెవుడు వచ్చింది. దాన్ని టెలిఫోనీ దెబ్బ అంటారు. ఇంకోచోట కొడితే ఆ బాధ భరించలేవు. మానసికంగా బలహీనులైన ఖైదీలు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటారు.’’ఎనిమిది గంటల తర్వాత ఆ యువకుడు సెంట్రల్ ప్రిజన్లోంచి బయటికి వచ్చి, ఆగి ఉన్న కారుని ఎక్కాడు. ఏడుస్తున్న ఆ యువకుడితో కారు నడుపుతున్న తండ్రి చెప్పాడు.‘‘చూశావుగా. నీ ఫ్రెండ్ తాగి కారు నడిపి ఇద్దర్ని చంపినప్పుడు నువ్వా కారులోనే ఉన్నావు. రేపు నువ్వేదైనా తప్పు చేస్తే ఐఏఎస్ ఆఫీసరైన నేను కాపాడగలను. కాని కాపాడను. అది నా స్వభావం కాదు. నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు.’’ఆ యువకుడు వెళ్ళాక వార్డెన్ గార్డ్తో చెప్పాడు.‘‘ఇండియాలో చాలామంది తమ కొడుకులని ఇలా జైలు విజిట్కి పంపడం దేశానికి ఎంతో మంచిది.’’ ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఈ వారం కథ: మూడు సమయాలు
జనవరి 10, 2026 – శనివారం ఉదయం 9:30 చలికాలం. చల్లని గాలి. పొగమంచు. రైలు దిగి అరవింద్ బ్యాగ్ను భుజాన వేసుకుని ఇంటివైపు నడిచాడు. జాకెట్ జిప్ పైకి లాగి, చేతులను జేబుల్లోకి దూర్చుకున్నాడు. దూరంగా టీ బండి నుంచి వచ్చే వేడి టీ వాసన గాలిలో కలిసింది. సూర్యుడికీ చలిగా ఉందేమో– మబ్బుల వెనుక దోబూచులాడుతున్నాడు. ఇంటి ముందు ఆగాడు. తలుపు తట్టబోయేలోపే– తాళం బయట వేలాడుతుండటం కనిపించింది.జేబులు వెతికాడు. రెండో తాళం చెవి ఇంట్లోనే వదిలేశాడని గుర్తొచ్చింది. చిరాకుతో వెంటనే కమలకు ఫోన్ చేశాడు. అమ్మకు ఒళ్లు బాగాలేదని తెలిసి ఉదయమే బస్సెక్కి వెళ్లానంది. ‘‘రెండో తాళం చెవి ఉందిగా,’’ అంది. ‘‘అది ఇంట్లోనే ఉంది,’’ అన్నాడు కాస్త గట్టిగా. ఆమె సారీ చెప్పింది. తొందరలో ఆలోచించలేకపోయానంది.ఉసూరుమన్నాడు. తలుపు బయటే నిలబడ్డాడు. చిరాకును దిగమింగి, ‘అత్తగారికి ఎలా ఉంద’ని అడిగాడు.‘‘ఇప్పుడు కాస్త బాగుంది. డాక్టర్ చూశాడు. బ్లడ్ ప్రెషర్ పెరిగింది. రెస్ట్ తీసుకోవాలన్నాడు.’’‘‘ఎప్పుడొస్తావు?’’‘‘రెండు రోజులు ఇక్కడే ఉండాలనుకున్నా. మీకు ఇబ్బంది కదా? మెల్లగా బయలుదేరతా. సాయంత్రం ఏడు లేదా ఎనిమిది అవుతుందేమో.’’ ఫోన్ కట్ అయింది.ఇంట్లోకి వెళ్లలేని పరిస్థితి. బయట ఉండాల్సిన నిర్బంధం. ఆ రెండింటి మధ్య నిలబడ్డట్టయ్యాడు.టీ బండి దగ్గరకు వెళ్ళాడు. వేడి టీ గొంతులోకి దిగుతుండగా కాస్త హుషారు వచ్చింది. ఫోన్ తీసి ఫేస్బుక్ తెరిచాడు. స్క్రోల్ చేశాడు. పాత స్నేహితుడు కుటుంబంతో దుబాయ్ ట్రిప్. ఇంకొకరు కొత్త కారులో. ఒక ఫొటో మీద కాసేపు ఆగి, మళ్లీ ముందుకు.కమల పంపిన ‘క్షేమంగా చేరాను’ అనే సందేశం కనిపించింది. స్క్రీన్ వెలుతురు అతని ముఖంపై పడి మళ్లీ ఆరిపోయింది.పొద్దున్నే అలారం ఆపి స్క్రోల్ చేయటం. క్యాబ్లో షార్ట్స్. ఆఫీస్ మీటింగ్లు. టార్గెట్లు. ఈ మెయిళ్ళు. అటూ ఇటూ పరుగులు. ఒకటే ఒత్తిడి. మధ్యాహ్నం జొమాటో. రాత్రి నెట్ఫ్లిక్స్. వారాంతాల్లో అప్పుడప్పుడు సాటి ఉద్యోగులతో విందులు. బయటికి చూస్తే నిండిన జీవితం. లోపల మాత్రం నెమ్మదిగా పెరుగుతున్న ఖాళీ. నిజమైన సంభాషణలా? లోతైన మాటలా? ఏమున్నాయి?సోషల్ మీడియా కనెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది– నిజానికి మరింత దూరం చేస్తుంది.సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లదామని కమల ఎన్నిసార్లు అడిగిందో గుర్తొచ్చింది. ప్రతిసారి ‘‘బిజీగా ఉన్నా’’ లేదా ‘‘అలసటగా ఉంది’’ అనే సమాధానమే. రోజులు నిండిపోతున్నట్టే కనిపించాయి. కానీ ఏదో ముఖ్యమైనది ఎప్పుడూ వాయిదా పడుతూనే వచ్చింది.ఇప్పుడు ఈ శనివారం ఉదయం అతని ముందుంది– మబ్బుల ఆకాశం. మూసిన తలుపు. చేతిలో టీ కప్పు. ఇప్పుడు ఎవరైనా స్నేహితుల ఇంటికి వెళితే? ఈ సమయంలో ఎవరి పనుల్లో వాళ్ళుంటారు.మొదటిసారి ఆ సమయం నిజంగానే ఖాళీగా అనిపించింది. దేనితో నింపాలి?జనవరి 10, 2026 శనివారం ఉదయం గం. 10:00ఏమీ తోచక, ఏం చేయాలో తెలియక అరవింద్ దారినపడి నడుస్తున్నాడు. ఇరవై నిమిషాలు గడిచేసరికి వెనక నుంచి చిన్న అడుగుల శబ్దం వినిపించింది. తిరిగి చూసేసరికి కిరణ్. మేనల్లుడు.పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘మామయ్యా!’’ అంటూ కాళ్లకు చుట్టుకున్నాడు. చిన్న చేతులతో గట్టిగా పట్టుకుని ముఖం పైకెత్తి చూశాడు– కళ్లలో ఆనందం, ఆశ్చర్యం కలిసి మెరిశాయి.అరవింద్ అలాగే నిలబడిపోయాడు. వాడి ముఖంలో తన చిన్ననాటి ప్రతిబింబం కనిపించినట్టైంది.అటూ ఇటూ చూశాడు. ఎవరి దారిని వాళ్లే. కాస్త దూరంలో పిన్ని ఇల్లు. గుండె ఒక్కసారిగా బరువెక్కింది. పాత అపార్థాలు, ఆస్తి విషయాలు, తండ్రి మాటలు– అన్నీ మనస్సులోకి దూరాయి.కిరణ్ అతని చేయి పట్టుకుని, ‘‘మామయ్యా, ఇంటికి రా!’’ అంటూ లాగాడు.అరవింద్ ఆగిపోయాడు. ఇన్నేళ్లకి వాళ్లింటికి వెళ్లటం? పిన్ని ఏమంటుంది? చెల్లెలు ప్రియఏమనుకుంటుంది?‘‘కిరణ్, ఇప్పుడు రాలేనులే తర్వాత వస్తా,’’ అన్నాడు మెల్లగా. గొంతు వణికింది.‘‘మళ్లీ కనపడవు నువ్వు. ఇప్పుడే రావాలి,’’ అంటూ మళ్లీ చేయి లాగాడు.ఆ చూపును కాదనలేక– ఒక్క క్షణం తడబడినా– ‘‘సరే, పద,’’ అన్నాడు. ఇద్దరూ కలిసి ఇంటి వైపు నడిచారు.ఇంటి గేటు దగ్గరకు రాగానే పిన్ని బయటికి వచ్చింది. ‘‘ఎక్కడికి పోయావ్ రా?’’ అని కిరణ్ను అడిగి, వెంటనే అరవింద్ వైపు చూసి ఆగిపోయింది. ‘‘అరవింద్... నువ్వు!’’అరవింద్ తడబడ్డాడు. ‘‘ఈ దారిని వెళ్తుంటే కిరణ్...’’ మాట మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకో మాటలు చిన్నవిగా, తాను చిన్నవాడిలా అనిపించాడు.పిన్ని తనను తానే సర్దుకుని, ‘‘లోపలికి రా,’’ అంది.హాల్లో నుంచి ప్రియ వచ్చింది. నవ్వుతూ, నవ్వుతూనే కొంచెం నిష్టూరంగా– ‘‘అన్నాయ్! ఇన్నాళ్లకి దారితప్పి వచ్చావన్నమాట,’’ అంది. ఆ మాటలో తప్పుపట్టటం లేదు– మళ్లీ దొరికిన ఆనందమే ఉంది.‘‘రాక రాక వస్తే అవేం మాటలే,’’ అంటూ పిన్ని వారించింది.లోపల అడుగుపెట్టగానే అదే పాత కలప వాసన, అగరువత్తి ధూపం, వంటింటి నుంచి తాలింపు. ఇల్లు మారలేదు; తానే మారిపోయాడన్న భావన కలిగింది.పదవ తరగతి రోజుల్లో పిన్ని డబ్బు కోసం వచ్చిన జ్ఞాపకం మెదిలింది. అప్పటికే బాబాయి చనిపోయాడు. తండ్రి సాయం చేయలేదు. అప్పటి నుంచే రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. భర్తను కోల్పోయినా తమను పట్టించుకోలేదన్న బాధ పిన్నిది. ఒంటరిగానే ఉండి ప్రియను చదివించింది. పెళ్లి ఖర్చుల కోసం తమ వాటా పొలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆస్తి పేచీలు, మాటల తగాదాలు– బంధాల మధ్య మౌనంగా పెరిగిన గోడలు. నాలుగేళ్లుగా రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.కమల మాటలు గుర్తొచ్చాయి– ‘‘దూరాలు నిజంగా దూరాలు కావు. వెళ్లిరండి.’’కానీ అపార్థాలు అంత తేలిగ్గా కరుగుతాయా? తండ్రి ఏమనుకుంటాడోనన్న భయం ఎప్పుడూ ఆపేసింది. ఈ క్షణంలో మాత్రం ఆ పాత గాయాలన్నీ మెల్లగా మాసిపోతున్నట్టు అనిపించింది.ఇంటి ముందు జామచెట్టు అలాగే ఉంది. వయసు పెరిగినా కొమ్మల్లో ఇంకా పాత రోజుల నీడ. ఆ కొమ్మల మీదెక్కి దోరగాయలు కోసుకుని ఉప్పు, కారం రాసుకుని తిన్న రోజులు కళ్లముందు కదిలాయి. ‘‘పడిపోతావురా!’’ అంటూ పిన్ని వేసిన కేకలు వినిపించినట్టయ్యాయి. తనకు మగపిల్లలు లేరు; అరవింద్ను కొడుకులా చూసేది.పిన్ని కాఫీ తెచ్చింది. ‘‘నీకు ఇష్టమైనట్టు పంచదార ఎక్కువేశా,’’ అంది. అదే జ్ఞాపకం. అదే ప్రేమ.గోడల మీద పాత ఫోటోలు. జామచెట్టు మీద కూర్చుని నవ్వుతున్న చిన్న అరవింద్. పక్కనే రెండు జడలతో ప్రియ. ‘‘రోజంతా చెట్టుమీదే ఉండేవాడివి,’’ అంది పిన్ని.కిరణ్ తన స్కూల్ డ్రాయింగ్ చూపించాడు. ప్రియ పెళ్లి ఫొటోలు తీసుకొచ్చి చూపించింది. కబుర్లు, చిన్న నవ్వులు, మధ్య మధ్యలో మౌన విరామాలు. ఆపై భోజనం.చివరికి పిన్ని ఒక చిన్న డబ్బా తెచ్చింది. ‘‘అరిసెలు. నీకిష్టం గదా?’’ఇప్పటికీ తనమీద ఆ ప్రేమ అలాగే ఉందని అర్థమైంది.‘‘కమలని అడిగానని చెప్పు. అప్పుడప్పుడు రావాలి,’’ అంది పిన్ని.‘‘తప్పకుండా వస్తాను పిన్నీ,’’ అన్నాడు.‘‘వస్తాను కాదు– వస్తాము,’’ అంది ప్రియ మెల్లగా.అరవింద్ నవ్వాడు, తల ఊపుతూ. ‘మమ్మల్ని కూడా మీ ఇంటికి పిలవాలి మరి,’’ అంది మళ్ళీ.ప్రియ నెత్తిమీద చిన్న మొట్టికాయ వేసి, కిరణ్ను ముద్దు పెట్టుకున్నాడు. గుండెల్లో ఒక మృదువైన వెచ్చదనం నిండింది– పసితనం మళ్లీ తాకినట్టు.ఆ రోజు నడిచిన దారి అతన్ని ఇంటికి కాదు– తన బాల్యానికి తీసుకెళ్లింది. మౌన విభేదాలు పోయి, మనస్సులో గడ్డలా గట్టిపడ్డదేదో నెమ్మదిగా కరుగుతున్నట్టు అనిపించింది.ఉదయం మూసుకుపోయిన తలుపు– ఇక్కడ సులభంగా తెరుచుకుంది.జనవరి 10, 2026 శనివారం మధ్యాహ్నం గం. 03:30 చలిగాలి తగ్గింది. మే–ఫ్లవర్ అపార్ట్మెంట్ గేట్ ముందు అరవింద్ నిలబడ్డాడు. బయట చలి తగ్గినట్టే అనిపించినా, అతని గుండెల్లోని చలి మాత్రం అలాగే ఉంది. లోపలికి అడుగుపెట్టాలా లేక ఇక్కడితో తిరిగి వెళ్లిపోవాలా? నిర్ణయం తీసుకునేలోపే ఆమె ముఖం, చిరునవ్వు, మాటలు– అన్నీ ఒకేసారి మనస్సులోకి దూసుకొచ్చాయి.‘‘ప్రాక్టికల్గా ఆలోచించు.’’కాలేజీ రోజుల్లో తన హృదయాన్ని తాకి, చివరికి దూరమైన రజని మాటలు.‘‘అరవింద్! నిన్ను ప్రేమించానన్నది నిజం. కానీ ఇద్దరికీ ఉద్యోగం లేకుండా జీవితం ఎలా? కొన్నాళ్లు చూద్దాం,’’ అన్నది. ఆ ‘కొన్నాళ్లు’ ఎన్నాళ్లకీ ముగియలేదు. ముగిసేసరికి ఆమె ఒక ఉన్నతోద్యోగిని పెళ్లాడింది. పెళ్లికి పిలిచినా అతను వెళ్లలేదు. ఆమె తిరస్కారం అతనిలో లోతైన గాయంగా మిగిలింది.ఆ తర్వాత ఆమె సంతోషంగా ఉందని విని, నిర్వేదం కలిగింది. క్రమంగా మర్చిపోయాడు. లేక మర్చిపోయాననుకున్నాడు. కానీ ఈమధ్య ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని విన్న క్షణంలో పాత జ్ఞాపకాలు మళ్లీ మేల్కొన్నాయి. బాధ కలిగినా, ఎందుకో వెంటనే వెళ్లి పరామర్శించాలనిపించలేదు. నెమ్మదిగా ఆలోచిస్తే, ఆనాటి ఆమె నిర్ణయంలో తప్పేమీ లేదనిపించింది. తనలోని ఇరుకు తనకే అర్థమైంది.ఇప్పుడు ఆమె బాధలో ఉంది. తాను పలకరిస్తే? లేక ఇది పాత గాయాలను మళ్లీ రేపటమేనా?ఒక్కసారి కళ్లు మూసుకున్నాడు. ఫోన్ జేబులో పెట్టి లోపలికి నడిచాడు. లాబీలో వెచ్చదనం. లిఫ్ట్ అద్దంలో తన ముఖం చూసుకున్నాడు– పాలిపోయినట్టుంది. ఫ్లాట్ ముందు నిలబడి, ఒక్క క్షణం వెనక్కి తిరగాలనిపించినా, చెయ్యెత్తి తట్టాడు.తలుపు తెరిచింది రజని. కళ్లు ఎర్రగా, వాపుగా. సాదా చీర, అస్తవ్యస్తంగా జుట్టు. ముప్పై రెండేళ్ల వయసే అయినా, విషాదం ఆమెను మరింత పెద్దదిగా చూపిస్తోంది.‘‘అరవింద్! నువ్వా?’’ ఆ గొంతులో ఆశ్చర్యం, ఆనందం, బాధ– అన్నీ కలిసి ఉన్నాయి.‘‘ఇబ్బంది లేకపోతే కాసేపు మాట్లాడదామని,’’ అన్నాడు.ఆమె తప్పుకొని లోపలికి పిలిచింది. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. కాసేపు మౌనం.‘‘ఏదో సంకోచంతో ఇప్పటిదాకా రాలేకపోయాను. ఐ యామ్ సారీ.’’హాల్లో మసక చీకటి. గోడలపై ఆమె భర్తతో ఉన్న సంతోషకరమైన ఫోటోలు– ఇప్పుడు అవి మరింత నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి.‘‘ఫర్వాలేదు. ఇప్పుడైనా వచ్చావు. అదే చాలు,’’ అంది.అతను నెమ్మదిగా అడిగాడు– ‘‘ఎలా జరిగింది?’’కొత్త ప్రాజెక్ట్... తీరికలేని రోజులు. డ్రైవర్ సెలవు... కారు చెట్టుకు గుద్దుకోవడంం ఒక్క నిమిషంలో అంతా ముగిసిపోయింది. వీకెండ్ ట్రిప్స్, రాత్రి కబుర్లు, తన కెరీర్కి ఇచ్చిన ప్రోత్సాహం– అన్నీ ఒక్కసారిగా ఖాళీ అయ్యాయి.‘‘ఇప్పుడు రాత్రుళ్లు నిద్రపట్టదు,’’ అంది.‘‘అమ్మా నాన్నా? పాప?’’‘‘వాళ్లు మొన్నటిదాకా ఉండి వెళ్లారు. పాప హాస్టల్లో ఉంది.’’ఆమె గొంతులో విషాదం గడ్డకట్టింది.‘‘అప్పుడు నేనే దూరంగా జరిగాను. ఇప్పుడు నువ్వే అభిమానంగా వచ్చావు,’’ అంది నెమ్మదిగా.‘‘అవేవీ పట్టించుకోకూడదనిపించింది.’’ అన్నాడు.‘‘సుఖాల్లో అందరూ ఉంటారు. దుఃఖాన్ని పంచుకునేవాళ్లు అరుదు.’’ఆమె కళ్ళు తడిశాయి. అరవింద్ మాట్లాడలేదు. ఓదార్పుగా ఆమె చేతిని తాకాడు. ఆమె అడిగితే, తన జీవితాన్ని చెప్పాడు– ఒక్కడే పిల్లాడు. వేరే ఊరిలో కాలేజీ చదువు.కాసేపు కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నారు– ఒకరి పక్కన ఒకరు, హద్దు మీరకుండా కూర్చున్న రోజులు. ఎన్నో కలలు గన్న రోజులు. ఇప్పుడు అవి మాటల్లో మాత్రమే మిగిలాయి.‘‘ఆ రోజులు నీకింకా గుర్తున్నాయి,’’ అంది రజని. అవునన్నట్టు తల ఊపాడు.‘‘గతాన్ని దాటి చాలా దూరం వచ్చేశాం రజనీ. మన దారులు వేరయ్యాయి. అయినా పరాయివాళ్లుగా ఉండాల్సిన అవసరం లేదనిపించింది. ఏ సాయం కావాలన్నా కాల్ చెయ్యి. వస్తాను,’’ అన్నాడు.లేచి నిలబడ్డాడు.రజని కళ్లలో కృతజ్ఞత, ఆప్యాయత. భర్త జ్ఞాపకం ఒక వైపు గుండెను బరువెక్కిస్తుంటే, అరవింద్ రాక మరోవైపు ఓదార్పులా తాకింది‘‘ఇవాళ కాస్త ఉపశమనం కలిగింది. నువ్వు వచ్చినందుకు చాలా థాంక్స్,’’ అని అతని చెయ్యి పట్టుకుంది.అరవింద్ ఆప్యాయంగా ఆమె చేతిని నొక్కాడు.బయటికి వచ్చేసరికి, అతని మనసులో ఓ మౌన తృప్తి అలముకుంది. గుండెల్లోని చలి కొద్దిగా తగ్గినట్టనిపించింది.జనవరి 10, 2026 – శనివారం సాయంత్రం 5:30సూర్యుడు కొంచెం వాలిపోయాడు. ఆకాశం నారింజ కాంతిలో మసకబారుతోంది. చలిగాలి మళ్లీ తాకింది. ఇంకా మూడు గంటల సమయం.అదే క్షణంలో– ఆ రోజు కళాభవ లో పండిత్ హరిప్రసాద్ చౌరాసియా వేణు వాద్య కచేరీ ఉందని గుర్తొచ్చింది. ఆటోలో అరగంట ప్రయాణం. ఆలోచన ఆగింది. నిర్ణయం తీసుకున్నట్టయ్యింది. కొద్దిసేపటికి కిక్కిరిసిన కళాభవన్ హాల్లో, చివరి వరుసలో కూర్చున్నాడు.లోపల అడుగుపెట్టగానే బయట ప్రపంచం తలుపు మూసుకున్నట్టైంది. దీపాలు మసకబారాయి. ప్రేక్షకులు నిశ్శబ్దంగా– శ్వాసలు కూడా వినిపించని నిశ్శబ్దం. వేదికపై పండిత్జీ చేతిలో వెదురు వేణువు; కళ్లు అరమూసి, ముఖంలో ధ్యాన గంభీరత.ఆలాప్ ప్రారంభమైంది.మృదువైన, లోతైన స్వరాలు గాలిలో తేలుతున్నాయి. కోమల గాంధారం నుంచి శుద్ధ మధ్యమానికి సాగిన ఆ స్వర సంచారం అరవింద్ గుండెల్లో ఏదో కదిలించింది. తర్వాత కోమల దైవతం, కోమల నిషాదం– ప్రతి స్వరం నిశ్శబ్దాన్ని మరింత గాఢంగా చేస్తూ హృదయాన్ని తాకింది. మాల్కౌంస్ రాత్రి జనించిన రాగం. దాని గాంభీర్యం, అంతర్గత శక్తి, తీవ్రమైన శాంతి– వేణువులో నిండుగా పలికాయి. పండిత్ జీ శ్వాసల లోతు ప్రతి స్వరంలో వినిపించింది.ఆ తర్వాత జోడ్ (లయ ప్రారంభ దశ) మొదలైంది. వేణువు క్రమంగా వేగం అందుకుంది– కానీ ఆ వేగంలోనూ సౌమ్యత, నియంత్రణ స్పష్టంగా కనిపించాయి. తబలా లయతో కలిసిన క్షణం నుంచి అది సంగీతం మాత్రమే కాదు– ఒక అనుభూతి. అరవింద్ గుండెల్లోని భారం కరిగిపోతున్నట్టనిపించింది.ఝాలా (ఉత్కర్ష దశ) వచ్చేసరికి స్వరాలు వరదలా ప్రవహించాయి. కానీ ఆ ప్రవాహంలోనూ ఒక స్థిరత్వం ఉంది. వేణువు– మానవ శ్వాసతో ముడిపడిన వాద్యం– గాలి కదలికను, ప్రకృతి లయను హృదయస్పర్శిగా పలికించింది. ప్రతి మీండ్ (స్వర సంధి) గాంధారం నుంచి మధ్యమానికి, ధైవతం నుంచి నిషాదానికి సాగినప్పుడు, అతని అంతరంగంలో దాచుకున్న భావాలు మెల్లగా విప్పుతున్నట్టనిపించింది. అరవింద్ కళ్లు మూసుకున్నాడు. బయటి ప్రపంచం కరిగిపోయింది. స్వరాల్లో మునిగిపోయి, ఆ గాఢమైన శాంతిలో తానే తాను కలిసిపోయాడు.చప్పట్ల హోరుతో కచేరీ ముగిసింది.హాల్ బయటికి రాగానే ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. చలిగాలి మృదువుగా వీచుతోంది. అతని చెవుల్లో మాత్రం ఇంకా వేణు స్వరాలు తేలుతూనే ఉన్నాయి. వేణువు మానవ శ్వాసతో జీవించే వాద్యం. అందుకే దాని స్వరాల్లో భావాలే కాదు– గాలి అలజడి, నదుల కెరటాల మర్మరం, పక్షుల కిలకిలలు– ప్రకృతంతా మృదువుగా ప్రతిధ్వనిస్తుంది.‘‘వేణువే అంత/ ఆనందమై వేధిస్తుంది’’ అన్న కవి మాట ఆ క్షణంలో అరవింద్కు సంపూర్ణ సత్యంలా అనిపించింది.జనవరి 10, 2026 – శనివారం రాత్రి 8:30చలిగాలిలో అరవింద్ ఇంటికి చేరేసరికి కమల వంట ముగించేసింది. వంటింటి నుంచి వచ్చే వేడి వాసనతో పాటు ఆమె ఒంటి అలసట కూడా తెలుస్తుంది.‘‘అమ్మయ్య వచ్చావా? అమ్మ ఎలా ఉంది ఇప్పుడు?’’ అని అడిగాడు.కమల ఒక్క నిట్టూర్పు విడిచింది. ఆ నిట్టూర్పులో అలసటతో పాటు ఓ శాంతి కూడా మిళితమై ఉంది.‘‘ఫర్వాలేదు. అవసరమైతే మళ్లీ వెళ్లొచ్చులే– ఈసారి రెండో తాళం చెవి గుర్తు పెట్టుకో,’’ అంది చిలిపిగా. వెంటనే నవ్వుతూ, ‘‘రోజంతా ఒంటరిగా ఏం చేశావు? కొంపదీసి బార్కి వెళ్లావేమిటి?’’ అని అడిగింది.‘‘కొంప దీయలేదు,’’ అన్నాడు అరవింద్ మెల్లగా. ఆ నవ్వులోనే సమాధానం ఉంది. కమలకు తెలుసు– అతనికా అలవాటు లేదని. ఆ రోజు జరిగినదంతా అతని మాటల్లోకి జారిపోయింది. పిన్ని ఇంటి సందడి, పిల్లల నవ్వులు, రజని విషాదం– ఏదీ దాచలేదు. కమలకు రజని గురించి తెలుసు కాబట్టి అతను ఒక్క మాట కూడా ఆపలేదు. చివరికి కళాభవన్, హరిప్రసాద్ కచేరీ, మాల్కౌంస్ రాగం ఆ వేణు స్వరాలు ఎలా గుండెల్లోకి జారిపడి మెల్లగా శాంతిని నింపాయో చెప్పుకుంటూ పోయాడు. మాట్లాడుతుండగా అతని స్వరం క్రమంగా మృదువైంది. కమల ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా అతని చేతులు పట్టుకుంది. దగ్గరికి లాగుకుంది. ఆమె ఊర్పులు అతని గుండెపై మృదువుగా తాకాయి– మరో వేణు శ్వాసలు.‘‘ఇవే గదా జీవించిన క్షణాలు,’’ అనుకున్నాడు అరవింద్.గుండెల్లోని ఖాళీ నెమ్మదిగా పూరితమైంది.బయట చలిగాలిలో రాత్రి మెల్లగా చిక్కబడుతోంది. రచయిత ∙పాపినేని శివశంకర్ -
పికా అంటే..? పిల్లలకు ఇది ప్రాణాంతకమా...?
మా బాబుకు మూడు నెలలు. ఊయల నుంచి కింద పడిపోయాడు. ఐదు నిమిషాల పాటు ఏడ్చి, ఒకసారి వాంతి చేసి తర్వాత పడుకున్నాడు. డాక్టర్కు చూపించాలా? అలాగే, పిల్లలు ఇలా పడిపోతే, మొదట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– సునీత, విజయవాడచిన్న పిల్లలు మంచం నుంచి, ఊయల నుంచి తల్లిదండ్రుల చేతుల నుంచి జారి కింద పడటం సాధారణంగా జరుగుతుంటుంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ, నడక నేర్చుకునే సమయంలో సోఫాల మీద నుంచి పడటం, మెట్ల మీద నుంచి జారిపడటం వంటి ఘటనలు కూడా కనిపిస్తాయి. అయితే, తలకు తగిలిన గాయం తీవ్రతను బట్టి, భవిష్యత్తులో ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. గాయం తీవ్రమైతే పిల్లల ఎదుగుదల, గుర్తుపట్టడం, కంటి చూపు, మాట, నడక వంటి అంశాలపై ప్రభావం పడవచ్చు. చిన్న గాయం అయినా కూడా కొంతవరకు మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన లక్షణాలు గమనించాలి. పిల్లలు ఆపకుండా ఏడవడం ఫిట్స్ రావడం స్పృహ కోల్పోవడం చేతులు కాళ్లు సరిగా పనిచేయక పోవడం ముక్కు లేదా చెవి నుంచి రక్తం కారడం పదేపదే వాంతులు అవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.ఇలాంటి సందర్భాల్లో అవసరమైతే సీటీ స్కాన్ చేసి మెదడులో ఏమైనా రక్తస్రావం లేదా ఎముక సమస్యలు ఉన్నాయా అని చూస్తారు. పరిస్థితిని బట్టి న్యూరో సర్జన్ సలహా తీసుకుని చికిత్స చేస్తారు. అయితే తలకు గాయాలు చాలా వరకు నివారించవచ్చు. తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎత్తైన భవనాల్లో ఉంటే బాల్కనీలకు సేఫ్టీ నెట్స్ ఏర్పాటు చేయాలి. బాల్కనీలో కుర్చీలు లేదా స్టూల్స్ ఉంచకూడదు. చిన్నపిల్లలను మంచంపై ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తపడాలి. అవసరమైతే మంచం పక్కన కింద బెడ్ లేదా మృదువైన పరుపు వేసి పడుకోబెట్టడం మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను పూర్తిగా తగ్గించుకోవచ్చు. పిల్లల భద్రత కోసం ముందుగానే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మా బాబుకు రెండేళ్లు. ఈ మధ్య చాలా తెల్లగా కనిపిస్తున్నాడు, త్వరగా అలసిపోతున్నాడు, ఆకలి కూడా తగ్గింది. కొన్నిసార్లు మట్టి తినాలని చూస్తున్నాడు. ఇది ఏమైనా సమస్యా?– శైలజ, ఒంగోలుపిల్లల్లో సాధారణంగా తెల్లగా లేదా పాలిపోయినట్లు కనిపించడం, త్వరగా అలసిపోవడం, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది పిల్లలు మట్టి, సున్నం వంటి వాటిని తినాలని కూడా ప్రయత్నిస్తారు. దీన్ని పికా అంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి డాక్టర్ను చూపించి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా హిమోగ్లోబిన్ , ఐరన్ లెవల్స్ చెక్ చేస్తారు. పిల్లల్లో ఐరన్ లోపం అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారవ్వడానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ తగ్గిపోతే రక్తహీనత వస్తుంది. దీని వల్ల పిల్లల ఎదుగుదల, బరువు పెరుగుదల, మెదడు వికాసం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లల్లో చురుకుదనం తగ్గిపోవడం, చదువుపై దృష్టి తగ్గడం, చిరాకు ఎక్కువగా ఉండడం కూడా కనిపించవచ్చు. ఐరన్ లోపం రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. పిల్లలు తల్లి పాలు సరిగా తీసుకోకపోవడం, ఆరు నెలల తర్వాత ఇచ్చే అనుబంధ ఆహారంలో ఐరన్ తక్కువగా ఉండడం, ఒక సంవత్సరం దాటిన తర్వాత కూడా ఎక్కువగా ఆవు పాలు తాగించడం వల్ల ఈ సమస్య రావచ్చు. ఎక్కువ పాలు తాగడం వల్ల శరీరం ఐరన్ను సరిగా గ్రహించలేకపోతుంది. అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తరచూ ఇన్ఫెక్షన్లు రావడం వల్ల కూడా ఐరన్ లోపం కనిపించవచ్చు. ఐరన్ లోపం ఉంటే డాక్టర్ సలహా మేరకు ఐరన్ సిరప్స్ లేదా డ్రాప్స్ ఇస్తారు. ఈ మందులు కొంతకాలం రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు రెండు మూడు వారాల్లో పిల్లలు కాస్త బాగుపడగానే మందులు ఆపేస్తారు. కానీ డాక్టర్ చెప్పిన పూర్తి కాలం వరకు వాడటం చాలా ముఖ్యం. అప్పుడే శరీరంలో ఐరన్ నిల్వలు మళ్లీ సరిగ్గా పెరుగుతాయి. ఈ సమస్య నివారణ కోసం పిల్లలకు మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. ఆరు నెలల తర్వాత ఆకుకూరలు, బెల్లం, గుడ్డు, పప్పులు, రాగి జావ, మాంసం వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం చాలా మంచిది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నిమ్మరసం, కమలాపండు వంటి వాటితో పాటు ఐర పుష్కలంగా ఉన్న ఆహారం ఇస్తే శరీరానికి ఐరన్ ఇంకా బాగా అందుతుంది. మీ బాబుకి రెండేళ్లు కాబట్టి, సరైన ఆహారం, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా త్వరగా కోలుకుంటాడు. కాబట్టి ఆందోళన పడకుండా ఒకసారి పిల్లల వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. (చదవండి: హంటా రాలేదు..ఆందోళన వద్దు!) -
తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు
ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి పిల్లల పెంపకంలో ‘ఒత్తిడి, పోటీ, అతిగా పట్టుకోవడం అనే సమస్యను నేటి తరం ఎదుర్కొంటోంది’ అని చెబుతున్నారు. అధ్యాపకురాలిగా తన జీవితపు తొలినాళ్లలో ముగ్గురు కూతుళ్ల పెంపకం ఎలా సాగించారో చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే...‘‘నేడు పిల్లల పెంపకం కష్టంగా మారలేదు. కష్టం అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. తమ సుఖానికి, సంతోషానికి పిల్లలు అడ్డు వస్తారని కొందరు భావిస్తే, తాము ఎక్కువ డబ్బు కట్టి చదువులు చెప్పిస్తున్నామని గొప్పలు చెప్పుకోవాలని తాపత్రయపడుతున్నారు. నిజానికి ర్యాంకుల ఒత్తిడిలో తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు. సర్దుబాట్లు లేవుమా అమ్మనాన్నలు మమ్మల్ని, మేం మా పిల్లల్ని పెంచినప్పుడు కష్టం అనిపించలేదు. ఈ రోజుల్లో ‘అతి గారాబం’ చూస్తున్నాం. పెంచడం కష్టం అని ఒక్కరిని కనడంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఆ ఒక్కరికి అన్నీ అమర్చాలనే ఆదుర్దాలో ఎలా పెంచాలో మర్చిపోతున్నారు. దీంతో ఆ పిల్లలు కొద్దిగా కూడా సర్దుకుపోవడం లేదు. ఒకప్పుడు పిల్లలతో సమాజంలోని నలుగురితో ఎలా కలిసిమెలిసి ఉండాలో చెప్పేవాళ్లం. ఇప్పుడవి బాగా తగ్గిపోయాయి.సమాన బాధ్యతరైల్వే డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్గా చేసేదాన్ని. టైమ్ ప్రకారం ఉద్యోగం కాబట్టి పెద్ద సమస్య లేదు. మాది ఉమ్మడి కుటుంబం. అందరూ అందరి బాధ్యతే అన్నట్టుగా ఉండేవారు. అయినా ముగ్గురు కూతుళ్లు పుట్టాక ‘ఉద్యోగం చేయను. పిల్లలను చూసుకుంటూ ఇంటిపట్టునే ఉంటాను’ అని చెప్పాను. కానీ, మా అత్తగారు ‘పిల్లల్ని నేను చూసుకుంటానులే నువ్వు ఉద్యోగానికి వెళ్లమ్మా’ అనేది. అలాగని నా ఆదాయంతో కుటుంబం గడుస్తుందని కాదు. మావారు కూడా గవర్నమెంట్ ఉద్యోగి. కానీ, చదువుకున్న చదువుకు న్యాయం చేయమని చెప్పేవారు. కుటుంబం విషయంలో నేనూ, మావారు ఇద్దరం సమానంగా బాధ్యత తీసుకున్నాం. నా డ్యూటీ పూర్తయ్యేవరకు సాయంత్రం 5 అయ్యేది. పిల్లలు మూడు గంటలకు స్కూల్ అయిపోయేది. ఇలాంటప్పుడు మా వారు పిల్లలను తీసుకొచ్చి, వారికి స్నాక్స్ పెట్టి, నన్ను పికప్ చేసుకోవడానికి కాలేజీ దగ్గరకు వచ్చేవారు. లంచ్ బ్రేక్ తను అలా సెట్ చేసుకున్నారు. పొదుపుగా జీవనంమా చిన్నతనంలో పిల్లలకు డబ్బులు చేతికి ఇవ్వడం అనేది లేదు. ఏడాదికోసారి పుస్తకాలు కొనుక్కోమని పది రూపాయలు ఇస్తే అణాపైసలతో లెక్కరాసి చూపేవాళ్లం. మా పిల్లల విషయంలోనూ అదే నియమం పాటించాను. చదువులోనూ పెద్ద భారం అనిపించలేదు. ముగ్గురివీ గవర్నమెంట్ బడి చదువులే. ప్రొఫెషనల్ కోర్సులు కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే చేశారు. పిల్లలు ఎవరైనా ‘మెడిసిన్ చేయాలనుంది, కానీ, మా అమ్మనాన్నలు డొనేషన్ కట్టలేక చదవలేకపోయాం’ అనుకోకూడదని జాగ్రత్తపడ్డాం. అందుకు తగినట్టు డబ్బు పొదుపు చేసేవాళ్లం. పిల్లల ఇష్టప్రకారం ఏది చదువుతారో దాని వరకు మా పొదుపు మొత్తాలు ఉండేలా జాగ్రత్తపడ్డాం. అయితే, ఆ డబ్బును వాడే అవసరం రాలేదు. బంధాలు పదిలం ‘మమ్మల్ని ఎలా భరించావు అమ్మా’ అని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అడుగు తుంటారు నా కూతుళ్లు. ‘ఎలా భరించాం అనేది తర్వాత విషయం. మీరు హ్యాపీగా ఉన్నారా..’ అని అడుగుతాను. ‘నువ్వు సూపర్విజన్ చేసి, మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చావు. చాలా హ్యాపీగా ఉన్నాం’ అంటారు. మానవ సంబంధాలలో ఎన్నో చికాకులు వస్తుంటాయి. కానీ, అందరితో కలుపుగోలుగా ఎలా ఉండాలో పిల్లలకు చెబుతుండాలి. తల్లిని కాబట్టి నేను ఎలా ఉన్నా మీరు నా దగ్గరకు వస్తారు. కానీ, మీ బంధువులు, చుట్టుపక్కల వాళ్లతోనూ రిలేషన్స్ను పదిలపరచుకోవాలి అని చెబుతాను. బంధాలను ముందుగానే కాపాడుకోవాలి. పెద్దలు బంధాల గురించి బాధ్యతగా ఉంటే పిల్లలూ నేర్చుకుంటారు. పిల్లల చిన్నప్పుడు మా మాట వినేలాగా పెంచాలనుకున్నాం. కానీ, పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వారి ఆలోచనలూ పంచుకుంటూ ముందుకు వెళ్లాం’’ అని వివరించారు ఈ ఆధ్యాత్మికవేత్త.పిల్లలతో కలిసి చదువుపిల్లలతో పాటు చదువుకుంటూ నేనూ పీహెచ్డీ చేశాను. సాహిత్యం గురించి చర్చించుకునేవాళ్లం. మావారు ఇంగ్లిష్ లిటరేచర్ చదివేవారు. అలా పిల్లలు కూడా సాహిత్యాభిలాషులు అయ్యారు. కాలేజీ టీమ్స్లో పాటలు పాడేవాళ్లు. థియేటర్ ఆర్ట్లో నంది అవార్డ్స్ తెచ్చుకున్నారు. ముగ్గురూ మంచి చదువులు చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తూనే, కుటుంబ జీవనాన్ని గడుపుతున్నారు. మా పెద్దమ్మాయి మైత్రేయి, రెండో అమ్మాయి రాధాకృష్ణవేణి, మూడో అమ్మాయి గార్గి కనకదుర్గ. రెండో అమ్మాయి స్పీచ్ పాథాలజీ అండ్ ఆడియాలజీ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మూడో అమ్మాయి వరంగల్ ఎన్ఐటీలో చదువుకుంది. కాలేజీలో ఎన్సీసీ తరపున ఢిల్లీ పెరేడ్లో పాల్గొంది. ఆర్మీలో రిక్రూట్మెంట్కు వెళ్లి, మేజర్ స్థాయికి చేరుకుంది. నిర్మలారెడ్డి(చదవండి: చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి..!) -
అదే నా సూపర్ పవర్!
జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ, అపజయాలను కూడా విజయాలుగా మార్చుకోవడమే అసలైన జీవితం అంటోంది నటి భాగ్యశ్రీ బోర్సే. అలుపు లేని ఉత్సాహంతో, అభిమానుల ప్రేమే తన ఇంధనంగా ముందుకు సాగుతూ, తన మనసులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇలా పంచుకుంది...సెన్సిటివ్ గర్ల్నినేను చాలా సెన్సిటివ్. చిన్న విషయానికే వెంటనే ఎమోషనల్ అయిపోతాను. అయితే, నటిగా అదే నా సూపర్ పవర్. అందుకే, ఏ ఎమోషన్స్ ని అయినా లోతుగా అర్థం చేసుకొని, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలుగుతాను.బాడీ పాజిటివిటీప్రతి అమ్మాయీ తన సహజమైన అందాన్ని ప్రేమించాలి. నేను బాడీ పాజిటివిటీని బలంగా నమ్ముతాను. ఇతరుల కోసం మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు.ఫ్యామిలీ ఫస్ట్ఎంత బిజీగా ఉన్నా, పండుగల టైమ్లో మాత్రం ఇంటికి వెళ్లాల్సిందే. ముఖ్యంగా వినాయక చవితి అంటే మా ఇంట్లో చాలా సందడి ఉంటుంది. ఆ టైమ్లో షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ, నా పెట్ డాగ్ ‘జియో’తో గడుపుతాను. ప్రస్తుతం కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే పాత్రలు చేయాలని ఉంది.గ్లోబల్ చైల్డ్హుడ్నేను పుట్టింది మహారాష్ట్రలో అయినా, స్కూలింగ్ అంతా నైజీరియాలో గడిచింది. బిజినెస్ మేనేజ్మెంట్ చదవడానికి ముంబైకి వచ్చాను. అప్పుడే మోడలింగ్ వైపు వెళ్లమని అందరూ ఎంకరేజ్ చేశారు. ‘అయ్యో, వచ్చిన అవకాశాలను వదులుకున్నానే’ అని బాధపడకూడదనే సినిమాల్లోకి వచ్చాను. అలా నా ప్రయాణం విధి రాసిపెట్టినట్టు సాగుతోంది.రిజెక్షన్ నుంచే సక్సెస్!కెరీర్ మొదట్లో నేను ఒక పెద్ద రిజెక్షన్ ని ఎదుర్కొన్నాను. అయినా తగ్గలేదు. ఆడిషన్ నుంచి బయటకు వచ్చి, డ్రెస్ మార్చుకుని, మళ్లీ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. జీవితంలో రబ్బర్ బాల్లా ఎంత గట్టిగా కింద పడితే అంతకంటే వేగంగా పైకి ఎగరాలి.డ్యాన్స్ రాదు!మా అమ్మ డ్యాన్స్ టీచర్ అయినా, చిన్నప్పుడు నాకు డ్యాన్స్ సరిగ్గా రాకపోయేది. అందరూ నన్ను ఏడిపించేవారు. కానీ పట్టుదలతో నేర్చుకున్నాను. అలాగే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాలని పట్టుబట్టాను.రింగ్ మిస్టరీనా వేలికి ఉన్న రింగ్ గురించి చాలామంది రిలేషన్షిప్లో ఉన్నావా? ఎవరిచ్చారు? అని ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. అది నాకు నేను కొనుకున్న గిఫ్ట్. -
ఈ బీచ్ మహిళలకు మాత్రమే!
దుబాయ్ మునిసిపాలిటీ ఇటీవల మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన బీచ్ను ప్రారంభించింది. ‘ఖోర్ అల్ మమ్జర్’ పేరుతో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బీచ్లో స్థానిక మహిళలతో పాటు మహిళా పర్యాటకులు కాలక్షేపం చేయడానికి కావలసిన వసతులను ఏర్పాటు చేశారు. దుబాయ్–2040 అర్బన్ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ బీచ్ను 27.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దడం విశేషం.ఇక్కడ మహిళలు రాత్రివేళ కూడా నిరాటంకంగా ఈతకొట్టడానికి, వినోద కాలక్షేపాలు చేయడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఈతకొట్టే మహిళల భద్రత కోసం లైఫ్గార్డులను కూడా ఏర్పాటు చేశారు. దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దీనిని ప్రారంభించారు. ఈ బీచ్లో ఫ్లోటింగ్ వాక్వే, జిమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ బీచ్ నిర్మాణం కోసం దుబాయ్ ప్రభుత్వం 500 మిలియన్ దీనార్లు ఖర్చు చేసింది.ఎడారిలో లైట్హౌస్లైట్హౌస్లు సాధారణంగా సముద్ర తీరాల్లో ఉంటాయి. రాత్రివేళల్లో నావికులకు దారి చూపడానికి ఇవి పనికొస్తాయి. సముద్ర తీరాలు లేని ప్రాంతాల్లో లైట్హౌస్లు కనిపించవు. కనుచూపు మేరలో సముద్ర తీరంలేని ఎడారి నడిబొడ్డున లైట్హౌస్ ఉండటం విడ్డూరమే! ఈ ఇరవై అంతస్తుల లైట్హౌస్ రష్యాలోని అస్త్రాఖాన్ ప్రాంతంలోని ఎడారిలో ఉంది. ‘పెత్రోవ్స్కీ లైట్హౌస్’ పేరిట దీనిని 1741లో నిర్మించారు. తొలుత దీనిని కలపతో నిర్మించారు. గాలి దుమారానికి కూలిపోవడంతో తిరిగి 1876లో దీనిని ఇటుకలతో నిర్మించారు. ఈ లైట్హౌస్ తొలుత నిర్మించే నాటికి కాస్పియన్ సముద్రం దీనికి చేరువలోనే ఉండేది. తర్వాతి కాలంలో కాస్పియన్ సముద్రం వెనక్కు మళ్లడంతో ఈ ప్రాంతం ఎడారిగా మారింది. -
మొబైల్ మాస్టారు
గోడల మధ్య బంధించిన చదువు, ఇప్పుడు స్క్రీన్ ల వెలుగుల్లో విహరిస్తోంది. చాక్పీస్ రాతలతో నిండిన బ్లాక్బోర్డ్ స్థానంలో, వేలి స్పర్శకే తెరుచుకునే డిజిటల్ నోట్స్ నిలుస్తోంది. స్కూల్ బస్ హారన్ లతో మొదలయ్యే విద్యార్థుల ఉదయాలు, నేడు మొబైల్ నోటిఫికేషన్స్తో స్టార్ట్ అవుతున్నాయి. ‘హోంవర్క్ చేశావా?’ అని గట్టిగా అడిగే టీచర్ స్వరం, ‘నెట్ వస్తుందా? లేదా?’ అనే ఆందోళనతో పెద్దదైపోతోంది. ఇప్పుడు చదువుకోవాలంటే, ఫీజులతో కొనాల్సిన అవసరం లేదు. ఒక చేతిలో మొబైల్, మరో చేతిలో చార్జర్, మనసులో తపన ఉంటే సరిపోతుంది. అప్పుడు, ఐఐటీ సార్ కూడా మీ చిన్న స్క్రీన్ పై ‘గుడ్మార్నింగ్ స్టూడెంట్స్’ అంటూ చిరునవ్వు చిందిస్తారు. ఈ స్క్రీన్ స్కూల్లో పుస్తకాల బరువు తగ్గిపోయింది. కానీ కలల ఎత్తు పెరిగిపోయింది. చిన్న డేటా ప్యాక్ దూరంలోనే నిలుస్తున్న ఈ డిగ్రీలు నిజంగా లాభామా? నష్టమా?ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విద్య ఇప్పుడు రాకెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2024 నాటికి దేశంలో 88.6 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. పట్టణాల్లో అయితే పరిస్థితి హై లెవెల్! ప్రతి 100 మందికి 116 కనెక్షన్లు ఉన్నాయి. అంటే ఒక మనిషికి రెండు సిమ్లు, మూడు ఓటీపీలు, నాలుగు వైఫై పాస్వర్డులు కామన్ అయిపోయాయి! కానీ గ్రామాల్లో అది 47.6 శాతం మాత్రమే. అయినా మొత్తం యూజర్లలో 57 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారే ఉంటున్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే, 86 శాతం ఇళ్లలో ఇంటర్నెట్ ఉంది, కానీ కంప్యూటర్లు మాత్రం 10 శాతం కూడా లేవు! అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కాదు, చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్సే అసలైన కాలేజ్, క్లాస్రూమ్, లైబ్రరీ, ఎగ్జామ్ హాల్ అన్నీ మొబైలే అయిపోయింది! అందుకే, ఆడుతూ, పాడుతూ విద్యార్థులు చదువు సాగించేలా డిజిటల్ స్కూల్ కూడా గేమ్ బేస్డ్ లర్నింగ్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నాయి.డిజిటల్ గురువులుటీచర్ చెప్పింది అర్థం కాకపోతే, అడిగే ధైర్యం లేనివారందరూ, డౌట్ను కూడా నోట్బుక్లో మడిచేసుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. మరికొంతమంది తోటి విద్యార్థి సాయంతో తీర్చుకునేవారు. ఇప్పుడు, పరిస్థితి పూర్తిగా రివర్స్! అర్థం కాలేదా? వీడియోని పాజ్ చేసి, రివైండ్ చేసి ఇంకోసారి చూడొచ్చు? ఇంకా క్లియర్గా కావాలంటే, 0.5 స్పీడ్లో స్లో మోషన్ లో కూడా చూడొచ్చు. చదువు యూట్యూబ్ వీడియోలాగే చాలా ఈజీగా మారిపోయింది. ఇలా యాప్లో కనిపించే ప్రతి వీడియో, ప్రతి యానిమేషన్ , ప్రతి నోటిఫికేషన్ కూడా ఒక చిన్న డిజిటల్ గురువుగా మారిపోయింది.గేమ్లో గెలుపు, చదువు కోసమే!ఒకప్పుడు ‘మొబైల్ గేమ్స్ ఆడొద్దు, చదువు పాడవుతుంది!’ అని పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు, అదే గేమ్స్ పిల్లలకు మ్యాథ్స్, కోడింగ్, సైన్స్ కూడా నేర్పిస్తున్నాయి! అంటూ మొబైల్స్ చేతికి ఇస్తున్నారు. అవును చదువు ఇప్పుడు బోరింగ్ బ్లాక్బోర్డ్ నుంచి బయటికి వచ్చి, ‘నెక్ట్స్ లెవెల్ అన్ లాక్’ చేసే గేమ్లా మారిపోయింది. ఒక ప్రశ్నకు సరైన సమాధానం చెబితే పాయింట్లు, మరో లెసన్ పూర్తి చేస్తే బ్యాడ్జీలు, రోజూ లాగిన్ అయితే స్టికర్స్ ఇలా చదువు కూడా ఇప్పుడు వీడియో గేమ్ ఫీల్ ఇస్తోంది. అందుకే పిల్లలు ‘ఇంకో ఐదు నిమిషాలు’ అంటూ గేమ్ ఆడినట్టే, ఇప్పుడు ‘ఇంకో క్విజ్’ అంటూ చదువులో కూడా మునిగిపోతున్నారు! ముఖ్యంగా మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులు ఇప్పుడు భయం కాదు, మొబైల్లో ఫన్ చాలెంజెస్లా మారిపోయాయి. ఒకప్పుడు మార్కుల కోసం చదివిన పిల్లలు, ఇప్పుడు లీడర్బోర్డ్లో టాప్ రావడానికి చదువుతున్నారు!ఫ్రీగా ఇంత చదువా?ఒక్క మొబైల్లో డేటా ఆన్ చేస్తే చాలు– ఇంజినీరింగ్ నుంచి మెడిసి న్ వరకు, కోడింగ్ నుంచి విదేశీ భాషల వరకు, మాక్ టెస్టుల నుంచి మాస్టర్ క్లాస్ల వరకు అన్నీ స్క్రీన్ పై క్యూలో నిల్చుంటున్నాయి. అంతేకాదు, ఐఐటీ ప్రొఫెసర్ కూడా ‘సబ్స్క్రైబ్’ బటన్ దూరంలోనే ఉంటున్నారు. ‘ఇంత ఖరీదైన నాలెడ్జ్ని నిజంగానే ఫ్రీగా ఇస్తారా?!’ అని స్టూడెంట్స్ షాక్ అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన చాలా విద్యాసంస్థలు, ఇదే విధానాన్ని ఫాలో అయ్యి, క్యాష్ చేసుకుంటున్నాయి. ఇక్కడే మోసాలు కూడా మొదలయ్యాయి.క్లిక్ చేస్తే క్లాస్.. తర్వాత షాక్ !ప్రతి ‘బై నౌ’ బటన్ వెనుక నిజంగా నాలెడ్జ్ ఉంటుందా? అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. కొన్నిసార్లు ‘లైవ్ క్లాసులు’ అని చెప్పి పాత వీడియోలు చూపిస్తారు. ‘ఫ్రీ ట్రయల్’ అంటూ మొదలై, తర్వాత సైలెంట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. ఇలా చదువు పేరుతో స్క్రీన్ వెనుక ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు సిలబస్ చదవడం కంటే, ముందు స్క్రీన్ మీద కనిపించే ప్రతి ‘క్లిక్’ను జాగ్రత్తగా చదవాల్సిన పరిస్థితి.ప్రభుత్వ డిజిటల్ దిగ్గజాల దూకుడు! ⇒ ప్రైవేట్ సంస్థలకంటే, ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ విద్యా ప్లాట్ఫారమ్లు ఇప్పుడు మరింత ఉపయోగకరంగా దూసుకు పోతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా..దీక్ష: ఇప్పటికే 2 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. 36 భారతీయ భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉండటం దీని అతిపెద్ద బలం.స్వయం: 4,400కిపైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 5.8 కోట్లకు పైగా ఎన్రోల్మెంట్లు నమోదయ్యాయి. అలాగే, 52 లక్షల మందికి పైగా ఈ ప్లాట్ఫారమ్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేశారు.ఎన్ పీటీఈఎల్: ఐఐటీలు, ఐఐఎంల కోర్సులు ఇప్పుడు మొబైల్ స్క్రీన్ పైనే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఇందులో 3.79 కోట్లకు పైగా కోర్స్ ఎన్రోల్మెంట్లు నమోదయ్యాయి. చాలామంది దీన్ని ‘ఎడ్యుకేషన్ నెట్ఫ్లిక్స్’గా కూడా చూస్తున్నారు.స్వయం ప్రభ: ఇంటర్నెట్ లేకున్నా చదువు ఆగకూడదనే ఉద్దేశంతో, 48 ప్రత్యేక టీవీ చానెల్స్ ద్వారా విద్యా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఇక్కడ టీవీ కూడా టీచర్ అయ్యింది.డిజిటల్ స్కూల్ vs రియాల్టీ స్కూల్.. డిజిటల్ స్కూల్, రియాల్టీ స్కూల్ అనే ఈ రెండు ప్రపంచాల్లో స్టూడెంట్స్కి అసలు ఏది బెస్ట్? ఏది ఈజీ? ఏది నిజంగా ప్రభావం చూపుతోంది? అసలు ఈ రెండింటి మధ్య తేడాలను ఇక్కడ చూద్దాం.. స్క్రీన్ క్లాస్రూమ్⇒ వీడియోలను పాజ్, రివైండ్, స్లో మోషన్ లో కూడా చూడొచ్చు.⇒ ఇంట్లో నుంచే ఐఐటీ, టాప్ ఫ్యాకల్టీ క్లాసులు అటెండ్ కావచ్చు.⇒ టైమ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.⇒ ప్రెజెంటేషన్స్ , క్విజ్లు, డిజిటల్ నోట్స్ ఈజీగా అందుబాటులో ఉంటాయి.⇒ సిగ్గు పడే స్టూడెంట్స్ కూడా చాట్బాక్స్లో యాక్టివ్గా పాల్గొంటారు.⇒ స్మార్ట్ఫోన్ ఇప్పుడు చిన్న యూనివర్సిటీలా మారిపోయింది.⇒ ఈజీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, ఆన్లైన్ మోసాలకు బలయ్యే అవకాశాలు ఎక్కువ.⇒ క్లాస్తో పాటు రీల్స్, నోటిఫికేషన్స్ కూడా పోటీ పడుతుంటాయి.⇒ ‘మైక్ ఆఫ్.. కెమెరా ఆఫ్.. అటెన్షన్ కూడా ఆఫ్!’ అనే సీన్ కామన్ .నిజమైన క్లాస్రూమ్⇒ టీచర్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది.⇒ డౌట్స్ వెంటనే క్లియర్ చేసుకోవచ్చు.⇒ కాన్సెప్ట్లు మరింత బాగా అర్థమవుతాయి.⇒ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి.⇒ ఫిజికల్ యాక్టివిటీ, ఫ్రెండ్స్తో డిస్కషన్స్ , గ్రూప్ లెర్నింగ్ ఎక్కువ.⇒ టీచర్లు స్టూడెంట్స్ అటెన్షన్ ను సులభంగా గమనించగలరు.⇒ చదువుతో పాటు క్లాస్రూమ్ మెమరీస్ కూడా క్రియేట్ అవుతాయి.⇒ బెంచ్ ఫ్రెండ్స్, చిన్న నవ్వులు, హోంవర్క్ టెన్షన్స్ ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తాయి.⇒ టైమ్, ట్రావెల్, ఫీజుల ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు.ఎగ్జామ్కి డెమో వెర్షన్ !పోటీ పరీక్షలు అంటే ఒకప్పుడు టెన్షన్ , భయం, రాత్రంతా నిద్రలేని ప్రిపరేషన్ . కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది! అసలు పరీక్షకు వెళ్లే ముందే, స్టూడెంట్స్కి ‘ట్రైలర్ షో’ చూసే చాన్స్ వచ్చేసింది. ఫ్రీ మాక్ టెస్టులు, ప్రాక్టీస్ పేపర్లు, టైమ్బేస్డ్ ఎగ్జామ్లు అన్నీ ఇప్పుడు ఒక క్లిక్ దూరంలోనే ఉన్నాయి. అంటే అసలు పరీక్ష హాల్లో కూర్చోకముందే, ‘ఎగ్జామ్ ఎలా ఉంటుంది?’ అన్న ఫీలింగ్ను ముందుగానే అనుభవించొచ్చు. దీంతో ఇప్పుడు స్టూడెంట్స్కి టెన్షన్ కంటే, ‘ర్యాంక్ స్క్రీన్ షాట్ను స్టేటస్లో ఎప్పుడు పెట్టాలి?’ అన్న ఆసక్తే ఎక్కువైపోతోంది!బిలియన్ డాలర్ల బిజినెస్!గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ మార్కెట్⇒ ఈ–లెర్నింగ్ సర్వీసుల మార్కెట్ విలువ 2024లో సుమారు 300 బిలియన్ డాలర్లకు చేరింది.⇒ ఇది 2030 నాటికి 840 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశముందని విశ్లేషకుల అంచనా.ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్ మార్కెట్ ఇప్పుడు భారీ బిజినెస్గా మారిపోయింది. మార్కెట్ రిపోర్టుల ప్రకారం, మొత్తం ఈ–లెర్నింగ్ సర్వీసుల మార్కెట్ విలువ 2024లో సుమారు 300 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది 2030 నాటికి 840 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశముందని విశ్లేషకుల అంచనా. అంటే, ఒక్కో యూజర్ నుంచి సగటున 69 డాలర్లకు పైగా ఆదాయం వస్తోంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 86 శాతం మంది విద్యార్థులు ఇప్పుడు చదువులో ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నారని ఈ సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం, చౌకైన డేటా అందుబాటులోకి రావడం, ప్రభుత్వ డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కంపెనీలు భారీగా క్యాష్ చేసుకుంటున్నాయి.చదువు కూడా కన్జ్యూమర్ ప్రొడక్టే! చదువు ‘కొనడం’ కూడా ఇప్పుడు ఒక అధికారిక కొనుగోలు! అంటే మీరు డిజిటల్ లెర్నింగ్ యాప్, ఎగ్జామ్ సబ్స్క్రిప్షన్ , కోడింగ్ కోర్స్ లేదా ఆన్ లైన్ క్లాస్ కోసం డబ్బులు చెల్లిస్తే, ఆ ప్లాట్ఫారమ్లు కూడా వినియోగదారుల చట్టాల పరిధిలోకి వస్తాయి. భారతదేశంలోని వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్లు కూడా జవాబుదారులే. అందుకే సీసీపీఏ (సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ) ఎడ్టెక్ కంపెనీలపై ప్రత్యేక గైడ్లైన్స్ తీసుకొచ్చింది. అంతేకాదు, స్టూడెంట్స్కి కూడా కొన్ని ముఖ్యమైన హక్కులు ఉన్నాయి.డిజిటల్ మోసాలకు చెక్ పెట్టే స్మార్ట్ స్టెప్స్!డిజిటల్ ప్రపంచంలో బటన్ నొక్కే ముందు ఒక్కసారి బ్రెయిన్ ను కూడా రిఫ్రెష్ చేయాలి. ఆన్ లైన్ మోసాల నుంచి సేఫ్గా ఉండేందుకు ఈ చిన్న సర్వైవల్ గైడ్ను తప్పకుండా ఫాలో అవ్వాలి. ఒకవేళ మోసపోతే, అందులో నుంచి ఇలా బయటపడోచ్చు.కస్టమర్ కేర్కు కాల్ చేయండిముందుగా యాప్, వెబ్సైట్ లేదా కోచింగ్ సంస్థకు సమస్యను క్లియర్గా చెప్పండి. ఆర్డర్ నంబర్, ఇన్వాయిస్ పంపండి. చాలాసార్లు ఒక స్ట్రాంగ్ మెయిల్కే రీఫండ్ వచ్చేస్తుంది!ముందుగా ప్రూఫ్ సేవ్ చేయండిడిజిటల్ ప్రపంచంలో స్క్రీన్ షాట్ కూడా ఒక ఆయుధమే! బిల్లులు, మెయిల్స్, చాట్లు, స్క్రీన్ షాట్లు అన్నీ వెంటనే సేవ్ చేసుకోండి. ‘ప్రూఫ్’ ఉంటేనే మీ ఫిర్యాదుకు పవర్ వస్తుంది.ట్రయల్ ట్రాప్ను చెక్ చేయండి‘ఫ్రీ’ అని మొదలై, తర్వాత సైలెంట్గా డబ్బులు కట్ అవ్వడం కామన్ ! ఆటో రెన్యూవల్ ఆన్ లో ఉందో లేదో ముందే చూసుకోండి.టైమర్ చూసి టెన్షన్ పడకండి‘ఇంకా 2 సీట్లు మాత్రమే!’, ‘ఆఫర్ ఇంకో 5 నిమిషాలే!’ ఇవి చాలాసార్లు మార్కెటింగ్ డ్రామాలే! వెంటనే క్లిక్ చేయకుండా, రెండు నిమిషాలు ఆలోచించండి.చిన్న అక్షరాలు కూడా చదవండిషరతులు వర్తిస్తాయి అని కనిపించనంత చిన్నగా చివర్లో రాసిన వాటిని కూడా క్షుణ్ణంగా చూడాలి. లేకుంటే, రూ.99 అని కనిపించే కోర్స్, చివరికి రూ.499 బిల్లుగా మారొచ్చు! ట్యాక్స్లు, ప్లాట్ఫామ్ ఫీజులు ముందే చెక్ చేయండి.స్పందన లేకపోతే.. 1915కంపెనీ స్పందించకపోతే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ 1915కు ఫిర్యాదు చేయండి. డిజిటల్ మోసాల్లో ఇది మీ బ్యాకప్ బటన్ లాంటిది!మారుతున్న కాలంతో పాటు మనం మారడంలో తప్పు లేదు. కాని, అతిగా అందుబాటులో ఉందని ‘రేపటి నుంచి చదువుతా’ అనే అలసత్వాన్ని మాత్రం ఆఫ్ చేయాలి! అప్పుడు చదువు ఎలా చదివినా చదువే అవుతోంది. స్క్రీన్ ఇప్పుడు గురువు అయినప్పటికీ, చదవాలా? స్క్రోల్ చేయాలా? అన్న నిర్ణయం మాత్రం ఇంకా విద్యార్థి చేతిలోనే ఉంది.కొండి దీపిక -
ఈ తరం పిల్లల ఆటలు
ఒకప్పుడు పిల్లలు ఆరుబయట గిల్లీదండా, బొంగరాలు, గోలీలు వంటి ఆటలాడుతూ కనిపించేవారు. ఇప్పుడు గల్లీల్లో క్రికెట్ తప్ప వేరే ఆటలాడే పిల్లలు కనిపించడం బాగా అరుదుగా మారిపోయింది. స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చాక పిల్లల ఆటల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. స్మార్ట్ఫోన్ పిల్లలకు క్రీడావేదికగా మారిపోయింది. మన దేశ జనాభాలో పంతొమ్మిదేళ్ల లోపు పిల్లలు దాదాపు 40% వరకు ఉంటారు. స్మార్ట్ఫోన్లలో పిల్లలు ఇష్టంగా ఆడుకుంటున్న ఆటల గురించి గణాంకాలు...పిల్లలు స్మార్ట్ఫోన్లలో ఆడే ఆటలు గేమింగ్ పరిశ్రమకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో మన దేశంలో స్మార్ట్ఫోన్లో ఆటలాడే పిల్లల సంఖ్యతో పాటు గేమింగ్ ఇండస్ట్రీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ఈ పెరుగుదల ఏ స్థాయిలో ఉందో గణాంకాల్లో చూద్దాందేశంలో స్మార్ట్ఫోన్ వాడకం అందుబాటులోకి వచ్చిన కొత్తలో పిల్లలు వీటిలోని ఆటలతో వారానికి మూడు నాలుగు గంటల వరకు మాత్రమే గడిపేవారు. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల వాడకం మరింత పెరగడమే కాకుండా, వీటిలో గేమ్స్తో పిల్లలు గడిపే సమయం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మన దేశంలోని పిల్లలు వారానికి సగటున 14 గంటల వరకు మొబైల్గేమ్స్తో గడుపుతున్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. మొబైల్ గేమ్స్లో పిల్లలు గడిపే సమయం పెరుగుతూ వస్తోందనేందుకు పై గణాంకాలే నిదర్శనం. -
మాను సంపంగి... మా అబ్బాయి
తెలుగు డిటెక్టివ్ సాహిత్యంలో మధుబాబు కొన్ని దశాబ్దాలు పాఠకులను ఉర్రూతలూగించిన రచయిత. ఆయన సృష్టించిన ‘షాడో’ ఒక సంచలనం. మధుబాబు అసలు పేరు వల్లూరు మధుసూదనరావు. తన కుమారుడు ఉదయ్ పెంపకం గురించి ఆయన పంచుకున్న అనుభవాలు... ‘‘చాలాకాలం క్రితం మేము ఇల్లు నిర్మించుకుంటున్న సమయంలో నా శ్రీమతి ఆదిలక్ష్మి తనకు సంపంగి చెట్టు కావాలని అడిగింది. నూజివీడులో వున్న నర్సరీ నుంచి తీసుకువచ్చాను. మంచి సంపంగి కాదది, మాను సంపంగి. చాలా ఎత్తుకు ఎదుగుతుంది. చిన్న చిన్న ఆకులు కాస్తా వెడల్పు అవుతాయి. నర్సరీ వాడు నన్ను ఏమార్చాడు. ఆ మొక్క నాటినప్పటి నుంచి మొదలయ్యాయి మా కష్టాలు. పెరిగి పెద్దదవుతున్న క్రమంలో ప్రతిరోజూ బండెడు బండెడు ఆకులు రాల్చేది. వాటిని ఎత్తి అవతల పడేయటానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.పన్నెండు అడుగుల ఎత్తుకు ఎదిగింది చెట్టు. ఒక్క పువ్వు కూడా పూయలేదు. మాతో చాకిరీ చేయించుకోవటానికే అది మా ఇంటికి వచ్చిందని అనుకుంటున్న సమయంలో ఒకరోజు సడన్గా ప్రత్యక్షం అయ్యాయి మొగ్గలు. రెండే రెండు రోజుల్లో వికసించాయి. మా ఇల్లేకాదు, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కూడా గుబాళించిపోయాయి సువాసనతో. మా అబ్బాయికి ఆ మాను సంపెంగకి తేడా ఏమీలేదని నాకు అనిపిస్తోంది ఇప్పుడు తరచి చూసుకుంటుంటే.పసిబిడ్డడిగా ఉన్నప్పుడు పగలంతా నిద్రపోయి, రాత్రిళ్ళు లేచి కూర్చునేవాడు. నా శ్రీమతిని నిద్రపోనిచ్చేవాడు కాదు. నన్ను నా రాతలు రాసుకోనిచ్చేవాడు కాదు. బెడ్ మీద నేను కనిపించకపోతే పాము మాదిరి పాకుతూ నా రైటింగ్ రూములోకి వచ్చి నా టేబుల్ కింద దూరేవాడు. భుజం మీద వేసుకుని వేమన శతకం, దాశరథీ శతకంలో నాకు వచ్చిన పద్యాలన్నిటినీ చెబుతూ రెండు గంటలు తిప్పితే తప్ప ఊరుకునేవాడు కాదు. స్కూల్కి టైమ్కి వెళ్ళేవాడు కాదు. అక్కడ టీచర్లను చెండుకు తినేవాడు. చూసి చూసి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మేడమ్ నాకు కబురుపెట్టింది. డిజాస్టర్ ఏదో జరిగిందనే అనుమానంతో నేను నా ఉద్యోగానికి ఒకరోజు సెలవు పెట్టి నా శ్రీమతిని తోడు తీసుకుని వెళ్ళాను. ప్రిన్సిపాల్ మేడమ్ చేసిన కంప్లైంట్ వినేసరికి నాకు మతిపోయింది. టీచర్లు చెపుతున్న పాఠాన్ని ఒకసారి విని అప్పటికప్పుడు అప్పగించేస్తున్నాడట. ఏదైనా వర్క్ ఇస్తే క్షణాల మీద పూర్తిచేసి, మిగిలిన పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నాడట. ‘ఈ తలనొప్పిని మేము భరించలేము, మీ అబ్బాయిని డబల్ ప్రమోషన్ చేస్తున్నాము’ అన్నది ఆమె. అంటే సంవత్సరం మధ్యలో పై తరగతికి కాకుండా ఆపై తరగతికి పంపటం.అలా అలా తన చుట్టూ వున్న వారిని, మమ్మల్ని టెన్షన్ మీద టెన్షన్ పెడుతూ టెన్త్, ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. రెండో సంవత్సరంలో బండి కావాలన్నాడు. ఒక సంవత్సరం తాత్సారం చేసి థర్డ్ ఇయర్లో కొనిపెట్టాను. మూడోరోజున తన ఫ్రెండ్ని ఎక్కించుకుని ఎనభై స్పీడ్లో తీసుకుపోయి కొట్లాడుకుంటున్న కుక్కల మధ్యలోకి పోయి బోర్లాపడ్డాడు. కుక్కలు పారిపోయాయిట. కానీ వీడికీ వీడి దోస్తుకీ మోకాళ్ళు మోచేతులూ చెక్కుకుపోయాయి.ఆ దెబ్బకి బండిని వదిలేస్తాడని ఆశించిన నాకు ఇంకో షాకు. నాలుగు రోజులు గడవకముందే, తగిలిన దెబ్బలు ఆరకముందే అదే దోస్తుతో అదే బండిమీద అదే స్పీడుతో నేషనల్ హైవే మీద కాలేజీకి పోయివచ్చాడు. దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు మాదిరి తయారైంది పరిస్థితి. మా అదృష్టం బాగున్నది కాబోలు– ఫర్దర్ టెన్షన్లు లేకుండా ఇంజనీరింగ్ పూర్తి అయింది. మాకు తెలియకుండానే మేము పెంచిన మాను సంపెంగ మొగ్గలు వేసి పూలు పూసినట్టు ఒక్కసారిగా మార్పు వచ్చింది వాడిలో.బిట్స్ పిలానీలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేశాడు. పెద్ద ప్యాకేజీతో బెంగళూర్లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. వేదం నేర్చుకున్నాడు. వయొలిన్ వాయించటం అభ్యాసం చేశాడు. రెండుసార్లు సోమయాగం చేసి సోమయాజిగా అనిపించుకున్న పెద్దమనిషి కూతుర్ని– ఆయుర్వేద వైద్యవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమ్మాయిని భార్యగా పొందాడు. మొక్కల్ని పెంచాలన్నా, పిల్లలని పెంచాలన్నా ఓపిక అవసరమని మాకు అర్థం అయింది. మంచిని మెచ్చుకోవాలి. ఇబ్బందుల్ని సరిదిద్ది సరైన దారికి మరలించాలి. నా సతీమణి ఆదిలక్ష్మి ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఉండివుంటే తను పెంచిన మానుసంపంగి పువ్వుల్ని చూసి ఎంత మురిసిపోయిందో, అంతకు లక్షరెట్లు తన బిడ్డ అభ్యున్నతిని చూసి మురుసుకునేది. తన పెంపకమే ఇది. తన కష్టం. తన కడుపు పంట. మొక్కల్ని పెంచాలన్నా, పిల్లలని పెంచాలన్నా ఓపిక అవసరమని మాకు అర్ధం అయింది. మంచిని మెచ్చుకోవాలి. ఇబ్బందుల్ని సరిదిద్ది సరైన దారికి మరలించాలి. షాడో మధుబాబు, రచయిత -
దాంపత్యం
కారులో కూర్చున్న అరవై రెండేళ్ళ ఆయన చేతి గడియారం వంక చూసుకుని, అసహనంగా ఇంటి గుమ్మంవైపు చూశాడు. ఆయన భార్య చేతిలో హేండ్ బేగ్తో వచ్చి ఆయన పక్కన కూర్చుంది. ‘‘ఆలస్యమైందే?’’ ఆయన కారు స్టార్ట్ చేస్తూ కోపంగా అడిగాడు. ‘‘హేండ్ బేగ్ కనపడలేదు.’’ ‘‘అందుకే తీసిన వస్తువు తీసిన చోటే ఉంచాలని చెప్పేది.’’ ‘‘మొదలెట్టారూ గ్రామఫోన్ రికార్డు?’’ ‘‘నేను చెప్పేవన్నీ జీవితానికి ఉపయోగించేవి. గిఫ్ట్ పేక్ తీసుకున్నావా?’’‘‘అరే. మర్చిపోయానండి. మీరైనా గుర్తు చేయాల్సింది.’’ ‘‘ఎన్నిసార్లు చెప్పినా నీకు తలకెక్కదు. పైగా గ్రామఫోన్ రికార్డ్ అంటావు. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాలి. దాన్ని నీ చెప్పుల పక్కన ఉంచమని నిన్న రాత్రి చెప్పానా? అప్పుడు మర్చిపోవని.’’ ఆయన ఆగ్రహాన్ని అణచుకుంటూ చెప్పాడు. ‘‘మన పెళ్ళై ఎన్నేళ్ళైందంటారు?’’ ఆవిడ తన భర్త వంక చూస్తూ అడిగింది. ‘‘తెలీదా?’’ ‘‘మీకు తెలిస్తే చెప్పమంటున్నాను.’’‘‘ముప్ఫై ఆరేళ్ళు. ఐతే?’’‘‘అంతకాలం నించి మీరు నన్ను సాధిస్తున్నారు. అత్తలేని సంబంధం అని మా వాళ్ళు మీకిచ్చి చేశారు. కాని మీరు డబల్ అత్తగారని వాళ్ళకి తెలీదు.’’ ‘‘ఆపుతావా?’’ ఆయన అరిచాడు. ‘‘మీరు కారుని ఆపేదాకా ఆపను. ఏం? మీరు సాధించగా లేనిది నేను సాధించకూడదా? కొత్తల్లో భయపడేదాన్ని. ఇప్పుడు ఆ భయం లేదు. మీరు గెట్ అవుట్ అంటే పెద్దాడి ఇంటికి వెళ్ళిపోతాను.’’‘‘స్టీరింగ్ వీల్ ముందు కూర్చున్న వాడికి కోపం తెప్పించకూడదు, అది ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పాలి?’’ ఆయన కోపంగా అడిగాడు. ‘‘మీరు నాకు దొరికేది ఇక్కడేగా. లేదా కేసుల ఫైల్స్ చదువుతూ, స్టెనోకి జడ్జిమెంట్ డిక్టేట్ చేస్తూ మీరు ఎప్పుడూ బిజీనే. దారిలో పూలషాప్ వస్తుంది. ఆపండి. ఓ బొకే కొనుక్కెళ్దాం.’’‘‘ఎందుకు? మర్నాడు మన డబ్బు చెత్తబుట్టలో చేరడానికా? పళ్ళబుట్టని కొనుక్కెళ్దాం.’’‘‘పూల బొకే రెండు వందల ఏభైతో పోతుంది. పళ్ళబుట్టలో అరడజను పళ్ళు. దానికి ఆరు వందలు తీసుకుంటారు. ఆ మేదర బుట్ట ఖరీదే రెండు వందలు ఉంటుంది.’’ ‘‘ఎడ్డెం అంటే తెడ్డెం అంటావు.’’‘‘కాదు. మీరు డబ్బుని వృథా చేస్తున్నారు అంటాను.’’ ‘‘ఎక్కడ ఆదా చేయాలో, ఎక్కడ ఖర్చు చేయాలో ఇంతకాలం నాతో కాపురం చేశాక కూడా నీకు బోధపడలేదు.’’ ఆయన గొణిగాడు. ‘‘ఏమిటి? గట్టిగా వినేలా తిట్టొచ్చుగా.’’ ఆయన మాట్లాడలేదు.‘‘ఇల్లు తాళం వేశానంటారా?’’ ఆవిడ కొద్దిసేపు ఆగి అడిగింది. ‘‘కారులో కూర్చున్నవాడికి ఎలా తెలుస్తుంది? అది ఇంట్లోంచి బయటికి వచ్చిన వాళ్ళకి తెలియాలి.’’ ‘‘నేను కారులోకి తాళంచెవుల గుత్తితోనే వచ్చానా అని అడుగుతున్నాను.’’ ‘‘నా దగ్గర బైనాక్యులర్స్ లేవు.’’‘‘వెనక్కి తిప్పండి.’’ ‘‘ముహూర్తం టైంకి వెళ్ళాలి.’’ ‘‘తాళం వేయకపోతే ఏ డెలివరీ బాయో ఉన్నదంతా చక్కబెట్టుకుపోతాడు. వెనక్కి తిప్పండి.’’‘‘మనం పెళ్ళి ముహూర్తానికి వెళ్ళి తీరాలి.’’ ఆయన కోపంగా అరిచాడు. ‘‘ఇంటికి తిరిగి వెళ్ళేదాకా నాకు ఆందోళనగా ఉంటుంది.’’ ‘‘ఉండనీ.’’ ‘‘మీ వల్లే నాకు బీపీ’’ ‘‘అది మీ ఇంటి పేరు. మీ నాన్నకి, అమ్మకి, అక్కయ్యకి, ఆఖరికి మీ పనిమనిషికి, పెంపుడు కుక్కకీ కూడా బీపీ. నాకు లేదు.’’ ‘‘మీలాంటి వాళ్ళ వల్లే నాకు మాకు బీపీ’’ ఆవిడ కోపంగా అరిచింది. ‘‘అరవక. నీకు బీపీ వచ్చింది.’’ ‘‘నాకేం? హైకోర్ట్ జస్టిస్ ఇంట్లో దొంగలు పడ్డారని పేపర్లో రానీండి.’’‘‘విడాకుల గురించి ఏం ఆలోచించావు?’’ ఆయన అకస్మాత్తుగా అడిగాడు. ‘‘పెద్దాడు వద్దన్నాడు. భరణం ఎంత వస్తుందో ముందు కనుక్కోమన్నాడు.’’ ‘‘ఆ ఆలోచన కూడా చేశారన్నమాట. మీ కడుపులో ఎన్ని ఆలోచనలు దాచుకున్నారు!’’ ‘‘ఆలోచనలు కడుపులో దాచరు. మెదడులో దాస్తారు. అందుకే మీ జడ్జిమెంట్లని సుప్రీం కోర్ట్ కొట్టేస్తూంటుంది.’’ ‘‘షటప్. ఎకసెక్కెమా?’’ఆయన బ్రేక్ వేయడంతో ఆ కుదుపుకి ఆవిడ తల డేష్ బోర్డుకి కొట్టుకుంది. వెనక సీట్లో కూర్చున్న దర్శకుడు చెప్పాడు. ‘‘నైస్. ‘దాంపత్యం’ సరైన టైటిల్. మీతరం వాళ్ళల్లోని గొప్పతనం ఇదే. రిహార్సల్స్ కావాలంటారు. డైలాగ్స్ కంఠతా పడతారు. బయట మీ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారని ప్రేక్షకులకి తెలుసు. స్క్రీన్ మీద ఇలా పోట్లాడుకుంటుంటే ఎంజాయ్ చేస్తారు. టేక్ చేద్దామా?’’ మీరు నాకు దొరికేది ఇక్కడేగా. లేదా కేసుల ఫైల్స్ చదువుతూ, స్టెనోకి జడ్జిమెంట్ డిక్టేట్ చేస్తూ మీరు ఎప్పుడూ బిజీనే. దారిలో పూలషాప్ వస్తుంది. ఆపండి. ఓ బొకే కొనుక్కెళ్దాం. మల్లాది వెంకట కృష్ణమూర్తి -
బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !
స్టయిలిష్గా కనిపించాలంటే, బ్రాండ్స్ కాదు బాస్.. సరైన కలర్స్తో కంట్రోల్ చేసి గేమ్ చేంజర్గా మారొచ్చు.. ఈ చిన్న ట్రిక్ని మిస్ అయితే, బడ్జెట్ ఎంత పెట్టినా లుక్ డల్గానే ఉంటుంది. మరి ఆ సీక్రెట్స్ ఏంటో చూద్దాం!త్రీ కలర్స్ రూల్: ఒక అవుట్ఫిట్లో కేవలం మూడు రంగుల్లో మాత్రమే ఉండాలి. అంతకంటే, మించిన రంగులు అసలు వద్దు. ఎందుకంటే, ఒకేసారి చాలా కలర్స్ వేసుకుంటే, మీరు స్టయిలిష్గా కాకుండా కలర్ ఎగ్జిబిషన్లా మారేలా చాన్స్ ఉంది.న్యూట్రల్స్గా బేస్: ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, ఔట్ఫిట్కి కూడా బేస్ అంతే ముఖ్యం. బ్లాక్, వైట్, నేవీ, గ్రే, బీజ్, ఆలివ్ ఇవి మీ స్టయిల్కి బలమైన బేస్. ఇవి దేనితో అయినా ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇవి ఉంటే, మీ వాడ్రోబ్ ఎప్పుడూ ‘నో టెన్షన్ జోన్’లో ఉంటుంది.సింపుల్ స్టయిల్ ఫార్ములా: ఒక న్యూట్రల్ కలర్, ఒక మెయిన్ కలర్, ఒక చిన్న హైలైట్ అంతే, ఉదాహరణకు: నేవీ ప్యాంట్ + వైట్ టీషర్ట్ + లైట్ గ్రీన్ షర్ట్. అంతా న్యూట్రల్ కలర్స్ అయితే కాస్త బోరింగ్గా అనిపించొచ్చు. అందుకే, కాస్త బర్గండీ, లైట్ బ్లూ, రస్ట్, సాఫ్ట్ పింక్ లాంటి కలర్స్ జోడిస్తే లుక్కి లైఫ్ వస్తుంది.టెక్చ్సర్ కూడా మ్యాటర్: ఒకే కలర్ అయినా, మెటీరియల్ మారితే లుక్ మారిపోతుంది. ఉదాహరణకు: గ్రే టీషర్ట్ గ్రే స్వెటర్ రెండూ గ్రే కలర్సే కానీ ఫీల్ వేరు! కాట¯Œ , లినె¯Œ , వూల్ వంటి టెక్స్చర్స్ మిక్స్ చేస్తే మీ స్టయిల్ మరింత రిచ్గా కనిపిస్తుంది.రెడీగా ఉన్న సూపర్ కాంబినేషన్స్ఈ కాంబినేషన్స్ సేవ్ చేసుకోండి! ఎందుకంటే, ఇవి ట్రై చేస్తే స్టయిల్ ఎప్పుడూ మిస్ అవ్వరు1. వైట్ షర్ట్ + నేవీ ప్యాంట్ 2. లైట్ బ్లూ షర్ట్ + టాన్స్ప్యాంట్ 3. బ్లాక్ టీషర్ట్ + ఖాకీ ప్యాంట్ 4. బర్గండీ షర్ట్ + డెనిమ్ జీన్స్మీ స్కి టోన్కి సరిపడే కలర్స్అందరికీ అన్ని కలర్స్ సెట్ కావు. అందుకే, ఒక్కసారి మీకు సెట్ అయ్యే కలర్స్ తెలుసుకున్నారంటే, స్టయిల్ గేమ్లో మీరు అప్పుడే హాఫ్ విన్ అయిపోయినట్టే. ఎక్కువగా ఫెయిర్ స్కిన్కి లైట్, సాఫ్ట్ కలర్స్, మీడియం స్కిన్ ఉంటే ఆలివ్, నేవీ, రస్ట్. డార్క్ స్కిన్ వారికైతే బోల్డ్, బ్రైట్ కలర్స్ సూపర్గా కనిపిస్తాయి. -
డిజిటల్ క్రైమ్: కత్తితో పొడిస్తేనే హత్య కాదు..!
డాక్టర్ కృపాకర్ తన గదిలోనే నిర్జీవంగా పడి ఉండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తన ఫోరెన్సిక్ తెలివితేటలతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించిన అతడు అనుమానాస్పదంగా మరణించడం పోలీస్ డిపార్ట్మెంట్ను షాక్కు గురిచేసింది. కృపాకర్ బ్రహ్మచారి. రాత్రి వంటమనిషి వంట చేసి వెళ్తుంది. పొద్దున్నే సర్వెంట్ డూప్లికేట్ కీతో లోపలికి వచ్చి పనులు పూర్తి చేసుకుని కాఫీతో డాక్టర్ను నిద్ర లేపుతుంది. ఎంత పిలిచినా డాక్టర్ లేవకపోవడం, తన గది తలుపు తీయకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫోన్ చేసింది.∙∙ డిటెక్టివ్ సిద్ధార్థ డాక్టర్ కృపాకర్ బెడ్రూమ్ను పరిశీలిస్తున్నాడు. మృతదేహం ప్రశాంతంగా ఉంది. ఎక్కడా పెనుగులాట ఆనవాళ్లు లేవు. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం ఆయన గుండె ఆగి మరణించారు. దానికి కారణం తీవ్రమైన ‘షాక్’. కానీ గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగిన దాఖలాలు లేవు. అంతగా షాక్కు గురి చేసే సంఘటనలు జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. డిటెక్టివ్ సిద్ధార్థకి ఒక విషయం ఆశ్చర్యం కలిగించింది. కృపాకర్ టేబుల్ మీద ఉన్న ఒక ఖరీదైన ‘స్మార్ట్ ఆడియో స్పీకర్’ వైర్ కట్ అయి ఉంది. అలాగే, కృపాకర్ చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ మరణానికి కొన్ని నిమిషాల ముందు అసాధారణమైన హార్ట్ రేట్ రికార్డ్ చేసింది. అతనికి శత్రువులు ఎవరూ లేరు... ఫోరెన్సిక్ ల్యాబ్కు వెళ్లి విచారించాడు. కృపాకర్ మెడికల్ హిస్టరీ పరిశీలించాడు. కృపాకర్ స్టాఫ్ను ఒక్కొక్కరినీ విడివిడిగా విచారించాడు. కృపాకర్ చావుకు కారణం తెలిసింది.∙∙ కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉండటంతో నిద్రమత్తులోనే వచ్చి తలుపు తీశాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ భార్గవ్. ఎదురుగా డిటెక్టివ్ సిద్ధార్థ. ‘మీరా ఇంత రాత్రి వేళ?’ గోడ గడియారం వంక చూస్తూ అన్నాడు భార్గవ. రాత్రి పదకొండు...‘మీ డాక్టర్ చనిపోయిన బాధలో మీరు నిద్రపోయి ఉండరని ఈ టైంలో డిస్ట్రబ్ చేయాల్సి వచ్చింది.’ భార్గవ వంకే చూస్తూ అన్నాడు. ‘యస్... యస్...’ అన్నాడు భార్గవ.. ‘మరి ఇక వెళదామా?’ అన్నాడు డిటెక్టివ్ సిద్దార్థ. ‘ఎక్కడికి?’ ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ. ‘పోలీస్ స్టేషన్కు.. డాక్టర్ కృపాకర్ను డిజిటల్ టెక్నాలజీ అనే ఆయుధంతో హత్య చేసినందుకు...’ తాపీగా అన్నాడు డిటెక్టివ్ సిద్దార్థ.‘హత్య? నేనా?’ ఆశ్చర్యం నటించాడు భార్గవ.‘నీ కాల్ హిస్టరీలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ని మా శైలిలో విచారించాం. మిస్టర్ భార్గవ్, కృపాకర్ ఎదుగుదలను చూసి ఓర్వలేక పోయారు. ప్రొఫెషనల్ జెలసీ. కృపాకర్కు బలహీనమైన గుండె ఉందని తెలుసుకున్నారు. మీరు కృపాకర్ ఫ్యామిలీ డాక్టర్ను కలిశారు. డాక్టర్ కృపాకర్కు ‘ఫోనోఫోబియా’ (అకస్మాత్తుగా వచ్చే శబ్దాలంటే భయం) ఉందని తెలుసుకున్నారు.ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ సహాయంతో కృపాకర్ ఇంట్లోని స్మార్ట్ హోమ్ సిస్టమ్ను హ్యాక్ చేశారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు, గదిలోని స్పీకర్ల ద్వారా అత్యంత భయంకరమైన, అధిక డెసిబుల్స్ ఉన్న శబ్దాన్ని (అల్ట్రాసోనిక్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్) ఒక్కసారిగా ప్లే చేశారు. ఆ నిశ్శబ్ద రాత్రి ఊహించని ఆ భీకర శబ్దానికి కృపాకర్ గుండె తట్టుకోలేకపోయింది. షాక్తో ఆయన ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. ఆ తర్వాత రిమోట్ ద్వారా ఆ ఆడియో ఫైల్ను డిలీట్ చేశారు.మీ ల్యాప్టాప్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే సెర్చ్ హిస్టరీలో ‘హౌ టు ట్రిగ్గర్ కార్డియాక్ అరెస్ట్ యూజింగ్ సౌండ్ వేవ్స్’ అనే అంశం కనిపించింది. అంతేకాకుండా, కృపాకర్ చనిపోయిన సమయానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు మీ ఫోన్ నుండి కృపాకర్ ఇంటి వైఫై నెట్వర్క్కు కనెక్షన్ వెళ్ళినట్లు ఐటీ నిపుణులు గుర్తించారు.’ డిటెక్టివ్ సిద్ధార్థ లేస్తూ అన్నాడు.‘కత్తితో పొడిస్తేనే హత్య కాదు భార్గవ్, ఒకరి భయాన్ని ఆయుధంగా మార్చుకుని చంపడం కూడా ముమ్మాటికీ హత్యే!’ ‘టెక్నికల్ మర్డర్’ డిజిటల్ క్రైమ్. ఒక్క విషయం గుర్తుంచుకోండి. నేరస్థుల కన్నా తెలివైన వాళ్ళు పోలీసులు, డిటెక్టివ్లు. మీ తెలివితేటలు మీరు ఎదగడంపైన చూపించాల్సింది. మీ జెలసీ మిమ్మల్ని నేరస్థుడిని చేసింది.’ సిద్దార్థ భార్గవ్ను చూస్తూ చెప్పాడు. శ్రీ సుధామయి(చదవండి: ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!) -
అపకారికి గుణపాఠం
అనగనగా ఒక ఆడవి. గుహలో సింహం పెద్దగా నోరు తెరిచి శబ్దం చేస్తోంది తప్ప మాట్లాడలేకపోతోంది. దాని ఎదురుగా కొన్ని జంతువులు కూర్చుని విచారంగా చూస్తున్నాయి. జరిగిన విషయం ఏంటంటే ఆ ఉదయం మృగరాజు ఒక జింకను వేటాడి తింటున్నప్పుడు ఒక ఎముక దవడలో గుచ్చుకుంది. దాంతో విపరీతమైన నొప్పి... తినడం కాదు కదా నోరు మూయలేని స్థితి. అంతలో ఆగమేఘాల మీద మంత్రి నక్కగారు వచ్చారు. పరిస్థితి అర్థం చేసుకుని, ‘మరేం భయం లేదు. ఇప్పుడే మన కొంగను పిలిపిస్తాను అది చిటికెలో మీ సమస్యను పరిష్కరిస్తుంది’ అని చెప్పి మిగిలిన జంతువులన్నింటినీ పంపేసింది. సింహం నిస్సహాయంగా తలూపింది. అరగంటలో అక్కడికి కొంగగారు రానే వచ్చారు. సింహం నోట్లోకి పరికించి చూసి ‘అవును మహారాజా! మీ నోట్లో ఒక ఎముక గుచ్చుకోనుంది దాన్ని తొలగిస్తాను. కానీ మీరు నాకు మూల్యం చెల్లించాలి’ అంది. సింహం, నక్క కోపంగా చూశాయి. ‘మూల్యమంటే కేవలం పది ఎండు చేపలు ఇస్తే చాలు మహారాజా!’ అంది కొంగ వినయంగా. నక్క ఏదో అనబోతుండగా సింహం వారించి సరే అలాగే అన్నట్లు తలాడించింది. పది నిమిషాల్లో సింహం నోట్లో తలపెట్టి ఆ ఎముక ఎక్కడుందో వెతికి బయటకి లాగి పడేసింది కొంగ. హమ్మయ్య అనుకుంది సింహం.‘ఏంటి ఇప్పుడు చెప్పు నీకు మూల్యం కావాలా? నా నోట్లో నీ తల ఉన్నప్పుడు కొరకకపోవడమే నీకు నేనిచ్చే మూల్యం...’ అంది సింహం వికటంగా. ‘ఇది మోసం మహారాజా...’ అనబోతున్న కొంగపైకి దూకింది నక్క. అంతేకాదు, అప్పటికప్పుడే గుహ తలుపులు మూయించేసింది. కొంగకు భయం వేసింది. గుహ కప్పు అంత ఎత్తుగా లేదు. ఒకవైపు నుంచి నక్క మరోవైపు నుంచి సింహం దాని మీద దాడికి చూస్తున్నాయి. కొంగకు ఏం పాలు పోలేదు. అక్కడక్కడే ఎగురుతూ తప్పించుకోవడానికి చూస్తోంది. పైకప్పులో బండల మధ్య ఉన్న ఒక రంధ్రాన్ని గమనించి తుర్రున దాంట్లో నుంచి ఎగిరిపోయి, ‘బతుకు జీవుడా’ అనుకుంది కొంగ.అప్పుడు సింహం విస్తుపోతూ, ‘ఆ బండల మధ్య సందును వెంటనే మూయించు’ అని నక్కను ఆదేశించింది. ప్రాణభయంతో ఎగిరిపోయిన కొంగ దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద అలసట తీర్చడానికి వాలింది. ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటు మత్తుగా కునికిపాట్లు పడుతోంది. ‘ఏంట్రా అలా భయంతో గజగజ వణుకుతున్నావు? ఏమిటి సంగతి?’ అంది ఎలుగు దాన్ని చూస్తూ. సింహం, నక్క తనకు చేసిన అన్యాయం గురించి కొంగ చెప్పి వాపోయింది. ‘వాళ్లంతే! నీచులు’ అంది ఎలుగు.అంతలోనే నక్క అటుగా రావటం చూసి కొంగ ఎగిరిపోయింది. నక్క చెట్టుకు దగ్గరకు వచ్చి ‘మామా! మన రాజుగారి గుహపైన ఒక కంత ఉంది. పెద్ద బండతో దాన్ని నువ్వు పూడ్చాలి. వెంటనే రమ్మని రాజాజ్ఞ’ అంది నక్క దర్పంగా. ‘అలాగే అల్లుడు... పద వస్తాను’ అంటూ చెట్టు దిగింది ఎలుగు. రెండూ గుహ దగ్గరకు వచ్చాయి. నక్క దర్జాగా గుహలోకి వెళ్ళి, సింహంతో ముచ్చట్లు పెట్టింది. ఎలుగు గుహ పైకి ఎక్కి కంత ఎక్కడ ఉందో చూసింది. ఈ రెంటికి బుద్ధి చెప్పాలని అనుకున్న ఎలుగు– కంతకు సరిపడ బండ కాక కొద్దిగా చిన్న సైజు బండతో దాన్ని కప్పబోయింది. అంతే! ఆ బండ దడేల్న లోపల ముచ్చట్లు చెప్పుకుంటున్న నక్క తలను పచ్చడి చేసి, పక్కనే ఉన్న సింహం పైకి దొర్లింది. దాని ముందు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. సింహం బాధతో, భయంతో అరవడం మొదలు పెట్టింది. గుహ తలుపులు మూసి ఉండడం వల్ల ఆ అరుపులు బయట ఎవరికీ వినపడలేదు. ఎలుగు నవ్వుకుంటూ, కంతకంటే పెద్దదైన బండతో ఆ ఖాళీని అప్పుడు మూసేసింది. రాజు, మంత్రి అనే గర్వంతో సింహం, నక్క చేస్తున్న అరాచకాలకు అలా అడ్డుకట్ట వేసింది ఎలుగు. సింహం ఆహారం, నీళ్లు లేక గొంతు ఎండుకు పోయేలా అరిచి అరిచి కొన్నాళ్లకు ప్రాణాలు విడిచింది. చంద్ర ప్రతాప్ కంతేటి (చదవండి: పుణ్యశీలుడి వృత్తాంతం: అందుకోసమే వైశాఖ ధర్మాలు..) -
పుణ్యశీలుడి వృత్తాంతం: అందుకోసమే వైశాఖ ధర్మాలు..
పూర్వం పాంచాల రాజ్యాన్ని పురుయశుడు అనే రాజు పాలించేవాడు. అతడి కొడుకు పుణ్యశీలుడు. బాల్యంలోనే పుణ్యశీలుడు సదాచారాలను పాటించేవాడు. గురుకులంలో చేరి, అస్త్రశస్త్ర విద్యలు సహా రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకున్నాడు. తండ్రి పురుయశుడు గతించాక పుణ్యశీలుడు రాజ్యపాలన చేపట్టాడు. ధర్మం తప్పక ప్రజలను పాలించసాగాడు. కొన్నేళ్లు సజావుగానే గడిచినా, కొంతకాలానికి పుణ్యశీలుడి రాజ్యంలో దారుణ దుర్భిక్షం సంభవించింది. రోగాలు సోకి ఏనుగులు, గుర్రాలు మరణించాయి. ధనాగారంలోని ధనమంతా నశించింది. రాజ్య నిర్వహణ కష్టతరంగా మారింది. గజబలం, అశ్వబలం నశించడంతో పుణ్యశీలుడు బలహీనంగా మిగిలాడు. శత్రురాజులు ఈ సంగతి తెలుసుకుని, పుణ్యశీలుడి మీదకు దండెత్తి వచ్చారు. యుద్ధంలో పుణ్యశీలుడు ఓటమిపాలయ్యాడు. భార్య శిఖినితో కలసి అడవులకు చేరుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఒక కొండగుహలో తలదాచుకోసాగాడు. రాజ్యాన్ని పోగొట్టుకుని, అడవులపాలైన పుణ్యశీలుడు తనలోనే తాను కుమిలిపోసాగాడు. ‘ఇంతటి దుస్థితి నాకెందుకు వచ్చింది? తల్లిదండ్రులను భక్తితో సేవించుకున్నాను. గురువుల పట్ల వినయ విధేయతలతో నడుచుకున్నాను. దైవభక్తి గలవాడిని. భూతదయాపరుడిని. సదా సదాచారపరాయణుడనైన నాకెందుకు ఇంతటి కష్టం కలిగింది’ అని నిత్యం బాధపడసాగాడు.పుణ్యశీలుడు అడవులపాలై యాభైమూడేళ్లు గడచిపోయాయి. అతడి దుఃఖం అంతకంతకు పెరగసాగింది. ఒకనాడు అతడు తన గురువులైన యాజ ఉపయాజకులను స్మరించుకున్నాడు. అతడు మనసులో తలచినదే తడవుగా యాజ ఉపయాజకులు అతడి ముందు ప్రత్యక్షమయ్యారు. పుణ్యశీలుడు ఎదుట నిలిచిన గురువులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజలాంఛనాలు లేకుండా, సామాన్యుడిలా ఉన్న పుణ్యశీలుడు గురువులను చూసి, కన్నీరు కార్చసాగాడు. వారు అతడిని లేవదీశారు. పుణ్యశీలుడు ఫలపుష్పాదులతో గురువులను పూజించాడు. ‘‘గురువులైన విప్రులారా! నేను రాజును. జన్మ కర్మల చేత పవిత్రుడను. పితృదేవతా భక్తుడను. పాపభీతి గలవాడను. నాకు ఇంతటి కష్టం సంభవించడానికి కారణమేమిటి? శత్రువుల చేతిలో ఓటమి పాలై, రాజ్యాన్ని, ధనాన్ని పోగొట్టుకుని, ఏళ్ల తరబడి ఎవరికీ తెలియకుండా, ఇలా అడవుల్లో గడపవలసిన దుస్థితి ఏర్పడటానికి కారణమేమిటి? అసలు నా రాజ్యంలో దుర్భిక్షం వాటిల్లడానికి కారణమేమిటి?’’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు.‘‘రాజా! నీ దుఃఖానికి, దుస్థితికి కారణాన్ని చెబుతున్నాం, విను. పూర్వం పదిజన్మలలో నువ్వు కిరాతుడివై ఉండేవాడివి. హింసాత్మకుడివై, కఠినాత్ముడివై జనాలను పీడించేవాడివి. ఏనాడూ ధర్మ కార్యాచరణ చేయలేదు. ఇంద్రియ నిగ్రహాది సుగుణాలు లేక యథేచ్ఛగా సంచరించేవాడివి. పొరపాటునైనా శ్రీహరి నామాన్ని ఉచ్చరించలేదు. తొమ్మిది జన్మలు ఇలాగే గడిచిపోయాయి. పదో జన్మలో సహ్యాద్రి ప్రాంతంలో కిరాతుడివై జన్మించావు. గడచిన తొమ్మిది జన్మల మాదిరిగానే పదో జన్మలో కూడా మనుషులను హింసించేవాడివి. నరమాంసభక్షణ చేసేవాడివి. నమ్మినవారిని హింసించడం వల్ల సోదరులు లేకుండాపోయారు. నీకు గత జన్మలో సంతానం కూడా లేకపోయింది. పరపీడన పాపం వల్ల నీకు ఈ జన్మలో వనవాసక్లేశం సంభవించింది. నరమాంసభక్షణ వల్ల నీకు తిండికి కరవైన పరిస్థితి ఏర్పడింది. మనుషులకు అప్రియమైన పనులు అనేకం చేయడం వల్ల నానా కష్టాలు నిన్ను చుట్టుముట్టాయి. సజ్జనులను హింసించడం వల్ల శత్రువుల చేతిలో ఓటమి ఎదురైంది. ఇదివరకటి జన్మలలో ఎవరికీ దానం చేయకపోవడం వల్ల దారిద్య్రబాధ సంభవించింది.’’ అని చెప్పారు. ‘‘మరి ఈ జన్మలో రాజవంశంలో ఎలా జన్మించాను?’’ అడిగాడు పుణ్యశీలుడు.‘‘ఆ కారణం కూడా చెబుతాం విను. నువ్వు కిరాతుడిగా ఉన్నప్పుడు ఒక వేసవిలో ఇద్దరు ధనిక వైశ్యులు, కర్షణుడు అనే విప్రుడు తారసపడ్డారు. నువ్వు ఆ ముగ్గురినీ అటకాయించావు. వారిలో ఒక వైశ్యుడిని చంపి, అతడి వద్దనున్న ధనం లాక్కున్నావు. రెండో వైశ్యుడు తన డబ్బు మూటను పొదల్లో పారవేసి పారిపోయాడు. విప్రుడు కూడా పరుగు లంకించుకున్నాడు. కొంత దూరం పరుగెత్తాక విప్రుడు సొమ్మసిల్లి పడిపోయాడు. రెండో వైశ్యుడు డబ్బును ఎటువైపు పారవేశాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నువ్వా విప్రుడికి శైత్యోపచారాలు చేసి, అతడి దప్పిక తీర్చావు. నీ పట్ల భయంతో అతడు రెండో వైశ్యుడు డబ్బు మూట ఎటువైపు పారవేశాడో చెప్పాడు. నువ్వు ఆ విప్రుడిని ప్రాణాలతో విడిచిపెట్టావు. నీ స్వలాభం కోసమైనా, వైశాఖమాసంలో విప్రుడికి ఉపచారాలు చేసి, దప్పిక తీర్చిన ఫలితంగా నువ్వు ఈ జన్మలో రాజవంశంలో జన్మించావు. అందువల్ల వైశాఖ ధర్మాలను నిర్వర్తిస్తే నువ్వు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందగలవు’’ అని చెప్పారు. గురువులైన యాజోపయాజకులు చెప్పిన ప్రకారం పుణ్యశీలుడు వైశాఖ ధర్మాలను ఆచరిస్తూ, శ్రీహరిని పూజించసాగాడు. కొన్నాళ్లకు అతడు తన బంధువులను కలుసుకోగలిగాడు. వారి సాయంతో శత్రువులు ఆక్రమించుకున్న తన రాజ్యానికి వెళ్లి, శత్రువులతో యుద్ధంచేసి, వారిని తుదముట్టించి, తిరిగి తన రాజ్యాన్ని దక్కించుకున్నాడు.సాంఖ్యాయన -
గాంధార నవ్వు
‘‘నాన్నా! నీకు ఫోన్ వచ్చింది.’’ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమవుతూ, వరండాలో బూట్లు పాలిష్ చేసుకుంటున్న ఆనంద్కు వినిపించింది కూతురి అరుపు.‘‘ఎవరమ్మా, పేరు చూడు.’’ అన్నాడు తన పని ఆపకుండా. ‘‘ప్రవల్లిక అమెరికా... అంట నాన్నా.’’ కూతురి మాట ఇంకా పూర్తవకముందే, పాలిష్ మధ్యలోనే ఆపేసి ‘‘లిఫ్ట్ చేయొద్దూ...’’ అని అంటూ చటుక్కున పైకి లేచాడు. కూతురు ఎక్కడ కాల్ లిఫ్ట్ చేస్తుందో అని హడావిడిగా ఇంట్లోకి కదిలాడు. ఈ తొందరలో అప్పటికే పాలిష్ పూర్తయిన ఒక షూ కాలికి తగులుకొని దూరంగా పడింది.ఈలోగానే ‘‘సరే నాన్నా..’’ అంటూ కూతురి మాటతో పాటు ఫోన్ మోగుతున్న శబ్దం ఆగిపోవడంతో కాస్త నెమ్మదించాడు.కూతురి చేతుల్లోంచి మొబైల్ తీసుకుని, మళ్లీ కాల్ వస్తుందేమో అని కాసేపు వేచి చూశాడు. రాకపోవడంతో తిరిగి చార్జింగ్ పెట్టబోయి, ఎందుకైనా మంచిదని ఆ ప్రయత్నం మానుకున్నాడు. మొబైల్ను ప్యాంట్ జేబులోకి తోశాడు. ఇదంతా వంటింట్లోంచి గమనిస్తోంది మీనాక్షి. ‘‘మాట్లాడడం ఇష్టం లేకపోతే బ్లాక్ చేయమని చాలాసార్లు చెప్పాను...’’ భర్తకు వినపడేలా గట్టిగా అంది.ఏమీ పలకలేదు ఆనంద్. ఆఫీస్కు రెడీ అవడంలో మునిగిపోయాడు. ‘‘.. అయినా, తను ఏం అడుగుతోంది? ఒకసారి కలసి మాట్లాడాలనే కదా? కలిపిస్తాననో కలిపించననో చెప్పొచ్చు కదా? ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా, మాట్లాడకుండా ఉండడం మంచి పద్ధతేనా?..’’ ఈసారి మరింత గట్టిగా వినిపించింది వంటగది నుంచి.‘‘ఏం నేనే చెప్పాలా?..నువ్వు చెప్పకూడదా? నీకూ ఫ్రెండే కదా?..’’నోరు తెరవొద్దనే నియమం మరచిపోయి అసంకల్పితంగా అనేశాడు. ఆ మాటతో విసురుగా హాల్లోకి వచ్చేసింది. ‘‘ఆ విషయం దానికి తెలియదా? అయినా నన్ను కాకుండా మిమ్మల్నే ఎందుకు అడుగుతోంది? మీ ఇద్దరూ జాన్ జిగిరీలు... నువ్వు చెబితే ఏమైనా చేస్తాడు. ఏదైనా వింటాడనే కదా? లేకపోతే తనే నేరుగా వెళ్లలేదా?.’’ దగ్గరికి రావడం వల్ల కాబోలు అరుస్తున్నట్లు వినబడింది. ఈసారి మాత్రం నోరు తెరవలేదు ఆనంద్. తెరిస్తే పెద్ద యుద్ధమే! అంతేకాదు, మరో నిమిషంలోనో అర నిమిషంలోనో అదే నెంబరు నుంచి మీనాక్షికి కాల్ వస్తుందనీ తెలుసు. అందుకే తిరిగి తన పనిలో తాను లీనమయ్యాడు. ఊహించినట్లే కాసేపటికి మీనాక్షి ఫోన్ మోగింది. భర్తను కొరకొరా చూస్తూ ఫోన్ తీసింది. కాసేపు మాట్లాడాక స్పీకర్ ఆన్ చేసింది. అటువైపు నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ‘‘అన్నయ్యా... మీరు నాతో ఎందుకు మాట్లాడరో నాకు తెలుసు. నన్ను తన దగ్గరికి తీసుకెళ్లమని మిమ్మల్ని ఇకపైన అడగను. ఎందుకంటే, నేనే వెళ్లి కలుస్తాను. రెండ్రోజుల్లో ఇండియాకు వస్తున్నాను. కానీ, మిమ్మల్ని, మీనాక్షిని, పాపను చూసే అవకాశం మాత్రం ఇవ్వన్నయ్యా!’’ అంటూ అభ్యర్థనగా పలికింది ప్రవల్లిక గొంతు. సమాధానం కోసం అటువైపు నుంచి ఎదురు చూస్తున్నట్లు భార్యాభర్తలిద్దరికీ అర్థమవుతోంది. ఏం జవాబు చెప్తాడో అని ఆనంద్ వైపే చూస్తోంది మీనాక్షి. అది గమనించి ‘సరే’ అని అంగీకరిస్తున్నట్లు తలూపి, హడావిడిగా ఇంటి నుంచి బయటపడ్డాడు. ఈ తొందరలో క్యారియర్ తీసుకోవడం మర్చిపోయి వెళుతున్న భర్తనే చూస్తూ ప్రవల్లికతో మాట్లాడుతోంది మీనాక్షి. ∙∙ ఆఫీస్కు వచ్చాడే గాని, పనేమీ చేయాలనిపించడం లేదు. కాసేపు అన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. కుదరలేదు. తలనొప్పి ప్రారంభమైనట్లు అనిపించడంతో క్యాంటీన్ బాట పట్టాడు. ఎవరూ లేని టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని, కాస్త కాఫీ తాగాక ఆనంద్ ఆలోచనలు గతం వైపు పరుగు తీశాయి. ఆనంద్, రామకృష్ణ ఇద్దరూ ఇంటర్ నుంచి ఫ్రెండ్స్. ఒకే ఊరు, ఒకే గ్రూప్ కాకపోయినప్పటికీ అనుకోకుండా అయిన పరిచయం వాళ్లిద్దర్నీ మంచి స్నేహితులుగా మార్చింది. ఆ బంధం డిగ్రీలోనూ కొనసాగింది. అయితే, అక్కడా ఇద్దరివీ వేర్వేరు గ్రూపులే. ఒకరు బీఎస్సీ, మరొకరు బీకామ్. వీరి స్నేహం కాలేజీలో చాలామందికి విచిత్రంగా అనిపించేది. ఎందుకంటే ఆనంద్ నెమ్మదస్తుడు. తక్కువ మాట్లాడతాడు. బాగా దగ్గరైతే తప్ప ఎక్కువగా నోరు విప్పడు. అయితే, చదువులో మాత్రం ఎప్పుడూ ఫస్టే. రామకృష్ణ చదువులో మరీ ఫస్ట్ ర్యాంక్ స్థాయి కాకపోయినా, మెరిట్ స్టూడెంటే. అయితే, ఆటల్లో, కాలేజీల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మాత్రం అందరికంటే ముందుంటాడు. చలాకీగా, జోష్గా ఉండే రామకృష్ణ తీరు కాలేజీలో అమ్మాయిలకు ఎంతో నచ్చేది. దానికి తోడు కాస్త అందగాడు కూడా కావడంతో మొదటి ఏడాదిలోనే లవర్బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఎంతలా అంటే, అందరూ అతని పేరులోని రాముణ్ణి వదిలేసి కృష్ణుణ్ణి మాత్రమే గుర్తుచేసేలా.. ‘క్రిష్’ అని పిలుచుకునేంతగా.ఆ కాలేజీలోనే వీళ్లకు ప్రవల్లిక, మీనాక్షి పరిచయం. వీళ్లది ఒకే ఊరు. కానీ, కాలేజీలో మాత్రం ప్రవల్లిక బీకామ్, మీనాక్షి బీఏ. అందువల్ల మధ్యాహ్నం లంచ్ సమయంలోనో, క్యాంటీన్లోనో, తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడో తప్ప మీనాక్షి ఎక్కువగా వీళ్లతో కలిసేది కాదు. మరీ అంత నల్లగా కాకుండా, చామన ఛాయతో, కొంచెం బొద్దుగా కనిపించే ప్రవల్లిక మొహంలో కళ బాగుండేది. మొదటి ఏడాదిలోనే ఆనంద్కు, రామకృష్ణకు మంచి స్నేహితురాలైంది. ఆ ప్రయాణంలోనే రామకృష్ణ మీద ఏర్పడిన ఇష్టం ప్రేమగా మారింది. చివరి ఏడాది హాఫ్ ఇయర్లీ పరీక్షలు ముగిసిన రోజు తన మనసులోని మాటల్ని అక్షరాలుగా చేసిన ప్రేమలేఖను రామకృష్ణకు ఇచ్చింది.కానీ, వారం రోజులు ఎదురు చూసినా రామకృష్ణ నుంచి సమాధానం లేదు. రోజూ కాలేజీలో, క్లాసులో మాట్లాడడం, కలసి లంచ్ చేయడం అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. కానీ, రామకృష్ణ అభిప్రాయం మాత్రం చెప్పలేదు. రెండు మూడుసార్లు అడిగి చూసింది. అయినా జవాబు చెప్పకుండా తప్పించుకున్నాడు. ఉండబట్టలేక విషయాన్ని ఆనంద్కు చెప్పింది. అప్పటికే తనకు ఇద్దరు లవ్ ప్రపోజ్ చేశారని, లెటర్లు ఇచ్చారని చెప్పిన రామకృష్ణ– ప్రవల్లిక గురించి తన దగ్గర దాచడం ఆనంద్కు ఆశ్చర్యమనిపించింది. అదే విషయం గురించి సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరాక మిత్రుడిని కదిపాడు. ఆరోజు రామకృష్ణ చెప్పిన సమాధానం విన్నాక, ఆ తర్వాత ఆనంద్ కూడా ప్రవల్లికను తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. ప్రవల్లిక అడిగినా మాట దాటవేసేవాడు. మరో ఆర్నెల్లు గడిచి, డిగ్రీ పూర్తవగానే ఈసారి చదువు వాళ్లను విడదీసింది. ఎంసీఏ చేయడానికి ఆనంద్ హైదరాబాద్కు, సీఏ చేయడానికి రామకృష్ణ విజయవాడకు, పీజీ చేయడానికి ప్రవల్లిక తిరుపతికి వెళ్లాల్సొచ్చింది. ఆ తర్వాత చదువులు పూర్తవడం, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు అన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఆనంద్కు సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొని, మీనాక్షి ఇంట్లో వాళ్లతో మాట్లాడి వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించింది ప్రవల్లికే. ‘‘సార్.. మేనేజర్గారు పిలుస్తున్నారు..’’ అనే పిలుపుతో ఆనంద్ ఆలోచనలు చెదిరిపోయాయి. వెంటనే వాష్రూమ్కు వెళ్లి మొహం కడుక్కొని, క్యాబిన్కు వెళ్లి మేనేజర్ను కలిశాడు. సాయంత్రం వరకు ఆఫీసులో అన్యమనస్కంగానే గడిపి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో అడుగుపెట్టగానే పొద్దున్నుంచి పరిస్థితిలో ఏమీ మార్పు లేదని గ్రహించాడు.మీనాక్షి ఏమీ మాట్లాడకుండా, తన పని తాను చేసుకుపోతోంది. మధ్య మధ్యలో విసిగిస్తున్న కూతుర్ని కోప్పడుతోంది. అదంతా తన మీద కోపమే అని ఆనంద్కు తెలుసు. భోజనాలు అయిపోయి, కూతుర్ని బెడ్రూమ్లో నిద్రపుచ్చిన తర్వాత హాల్లో టీవీ ఆన్చేసి కూర్చుంది మీనాక్షి. ‘ఇక తప్పదు ఈరోజు చెప్పాల్సి వచ్చేలా ఉంది’ అని మనుసులో అనుకుంటూ తాను కూడా వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. ‘‘ఇంతకీ ఏమంటోంది మీ ఫ్రెండ్..’’ అంటూ నోరుతెరిచాడు. భర్తను సీరియస్గా చూసింది మీనాక్షి. ‘‘ఏమంటుందో మీకు తెలియదా?’’ ఎదురు ప్రశ్నించింది. ‘‘తెలుసు... కానీ...’’ అని ఏదో చెప్పేలోపే అందుకుంది. ‘‘అయినా... అది రెండేళ్ల నుంచి మిమ్మల్ని ఏమడుగుతోంది? తనను రామకృష్ణ దగ్గరికి తీసుకెళ్లి ఒక్కసారి మాట్లాడనివ్వమనే కదా? తీసుకెళ్లడానికి మీకేంటి బాధ? తనేమైనా చిన్నపిల్లా... పన్నెండేళ్ల తర్వాత భర్తను, పిల్లల్ని వదిలేసి ఇండియాకు వచ్చి రామకృష్ణను పెళ్లి చేసుకోవడానికి? అయినా, తను అనుకుంటే సరిపోతుందా? భార్య, పిల్లల్ని వదిలేసి రామకృష్ణ అయినా ఎలా చేసుకుంటాడు దీన్ని?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. మౌనంగా వింటున్నాడు. ‘‘రామకృష్ణ ఎందుకు వద్దనుకున్నాడు? ఏ విషయం చెప్పకుండా ఎందుకు తప్పించుకు తిరిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసమే కదా తనని కలుస్తానంటోంది? మరి మీరెందుకు కలపడానికి ప్రయత్నించడం లేదు? అసలు మీ ఫ్రెండ్ ఆరోజు ఏమన్నాడో కనీసం నాకైనా చెప్పొచ్చుకదా?’’ అంటూ ఆగింది. ఇక తప్పదనుకొని నోరు విప్పాడు ఆనంద్. కాలేజీలో ప్రవల్లిక రాసిన ప్రేమలేఖ గురించి అడిగిన రోజు తనతోపాటు మిత్రుణ్ణి వాళ్ల ఊరికి తీసుకెళ్లాడు రామకృష్ణ. ఊరికి అరకిలోమీటరు దూరంలో ఒక పొలంలో ఉన్న ఆ ఇంట్లో రాత్రి భోజనాలయ్యాక, మిద్దె మీద పడుకొని ఉండగా మళ్లీ విషయం కదిపాడు ఆనంద్. సమాధానం చెప్పకుండా, దూరంగా ఊళ్లో కనిపిస్తున్న కొన్ని ఇళ్లను చూపించాడు రామకృష్ణ. ‘‘ఆ పెద్ద పెద్ద ఇళ్లు మా దాయాదులవి. ఇంకా చెప్పాలంటే... మా పెద నాన్న, చిన్నాన్న వాళ్లవి. వాళ్ల కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు కలిపి అందరూ నలభైమంది వరకు ఉంటారు. కానీ, వాళ్లెవరూ మాతో మాట్లాడరు. ఎందుకో తెలుసా?..’’ అంటూ ఆనంద్ వైపు చూశాడు. తెలియదన్నట్లు ఆనంద్ ప్రశ్నార్థకంగా మొహంపెట్టాడు.‘‘మా నాన్న పెళ్లి... తాతయ్యకు, అమ్మమ్మకు... ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకుండా చేసుకున్న ప్రేమ పెళ్లి. తనను ఇష్టపడిందని మా అమ్మను చేసుకున్నాడు. మా అమ్మ తరఫు వాళ్లు ఏమీలేనోళ్లు. అయినా, కట్నం కూడా లేకుండా చేసుకున్నాడు. ఇంట్లోవాళ్లెవరూ ఈ పెళ్లిని ఒప్పుకోకపోవడంతో తన వాటాకు వచ్చిన భూమిలో ఈ ఇల్లు కట్టుకొని వాళ్లందరికీ దూరంగా ఉంటున్నాడు. ముగ్గురు కూతుళ్లు, తర్వాత నేను పుట్టాక అమ్మ అనారోగ్యం పాలైంది. పంటలు కలిసి రాలేదు. అక్కలకు పెళ్లి చేసేసరికి మాకు మిగిలింది రెండెకరాల ఈ పొలం... అందులోని ఈ ఇల్లు...’’ అంటూ ఆగాడు. తన మాటల్లోని భావం కొంచెం కొంచెం అర్థమవసాగింది ఆనంద్కు. ‘‘ఓహో మీ నాన్నకు జరిగినట్లే నీకూ జరుగుతుందని ప్రేమ పెళ్లి వద్దనుకుంటున్నావా? అలాగయితే మరి ఈ విషయం నేరుగా ప్రవల్లికకే చెప్పొచ్చు కదా? అసలు ప్రవల్లిక అంటే ఇష్టం ఉందా లేదా?’’ అన్నాడు ఆనంద్.వెంటనే రామకృష్ణ. ఇంట్లోకి వెళ్లి రెండు లెటర్లు తీసుకొచ్చాడు. అవి అదే క్లాస్లో ఉండే మరో ఇద్దరు అమ్మాయిలు రాసిన ప్రేమలేఖలు. ‘‘ప్రవల్లికే కాదు... వీళ్లన్నా నాకు ఇష్టమే. కానీ, వీళ్లెవరికీ నేను కోరుకునేంత ఆస్తి లేదు. ఇంకా చెప్పాలంటే వీళ్లదీ మాలాంటి బతుకే...’’ స్నేహితుని నోటి నుంచి వస్తున్న మాటలు వింటూ తన నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. ‘అయితే, ఆస్తి కోసమా ప్రవల్లికను వద్దనుకుంటున్నది?!’ ఆనంద్ మనసులోని మాటను చదివేసినట్లు చెప్పసాగాడు రామకృష్ణ. ‘‘అవును. ఆస్తి కోసమే వద్దనుకున్నాను. ఆస్తే కాదు వీళ్లెవరూ అంత అందంగానూ లేరు. మిగిలిన ఇద్దరూ కొంచెం తెల్లగా అయినా ఉన్నారు. ప్రవల్లిక అయితే నలుపు. పైగా లావు. అయినా, పెళ్లి, జీవితం విషయంలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకోసమే నన్ను నేను మలచుకున్నాను. అమ్మాయిలు ఇష్టపడేలా తీర్చిదిద్దుకున్నాను. అలాగని ఎవరిని పడితే వాళ్లను చేసుకోవడానికి కాదు. చదువు అయిపోయాక, ఉద్యోగంలో ఎంత సంపాదిస్తామో తెలియదు. కానీ, కట్నం దండిగా తెచ్చే అందమైన అమ్మాయి భార్యగా రావాలని, మమ్మల్ని దూరం పెట్టిన మా వాళ్లందరూ కుళ్లుకునే స్థాయికి మేము ఎదగాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా? ’’ అంటూ ఆగాడు. ఏమీ మాట్లాడలేదు ఆనంద్. అన్ని రోజులూ స్నేహితునిలో తాను గమనించలేకపోయిన మరో కోణం బయటపడేసరికి ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ..‘‘అదీ జరిగిన విషయం..’’ అంటూ చెప్పడం ముగించి మీనాక్షి వైపు చూశాడు ఆనంద్. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. ‘‘ప్రవల్లికకు వాడంటే చాలా ఇష్టం. ఎంతిష్టం అంటే.. నువ్వన్నట్లు వాడు ఓకే చెబితే భర్త, పిల్లల్ని వదిలేసి అమెరికా నుంచి వచ్చేసేంత ఇష్టం. కానీ, తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి ఏ కారణంతో తనను వద్దనుకున్నాడో తెలిస్తే తట్టుకోలేదు. అంతేకాదు, రామకృష్ణ ఆలోచనలు ఇలాంటివని తెలిస్తేనే భరించలేదు. అందుకే చెప్పలేదు. తనని కలవనివ్వలేదు. ‘తనను ఎందుకు ఇష్టపడలేదు?’ అనే ఆలోచన కన్నా ఇలాంటి కారణంతో తనను వద్దనుకున్నాడని జీవితాంతం గుర్తుచేసుకుంటూ బతకడం చాలా కష్టం’’ అంటూ ముగించాడు. మీనాక్షి ఏమీ మాట్లాడకపోయేసరికి లేచి బెడ్రూమ్లోకి వెళ్లిపోయాడు.∙∙ చెప్పినట్లుగానే రెండ్రోజుల తర్వాత హైదరాబాద్కు వచ్చింది ప్రవల్లిక. నేరుగా శ్రీనగర్ కాలనీలోని ఆనంద్ ఇంటికి చేరింది. బాగా సన్నబడి, కాస్త తెల్లగా కూడా మారిపోయి, తమ కంటే చిన్నదానిలా కనిపిస్తున్న ప్రవల్లికను చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. కుశలప్రశ్నలు, కుటుంబాల సంగతులు, కాలేజీ కబుర్లు అన్నీ చెప్పుకున్నాక రామకృష్ణను కలిసే విషయం ప్రస్తావించింది. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ఆనంద్ ‘మరుసటి రోజు కూకట్పల్లి హౌసింగ్బోర్డులో పెళ్లి రిసెప్షన్కు రామకృష్ణ వస్తున్నాడని, ఆరోజు వెళ్లి కలుద్దామ’ని చెప్పాడు. ‘సరే’ అంది ప్రవల్లిక. అయితే, అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు తాను తిరిగి అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నానని, రామకృష్ణను కలిశాక గచ్చిబౌలిలోని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అట్నుంచటే ఎయిర్పోర్టుకు వెళతానని చెప్పింది. తర్వాతి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి రిసెప్షన్ జరిగే చోటుకు కారులో చేరుకున్నారు. అప్పటికే అక్కడ ప్రవల్లిక స్నేహితురాలు కారుతో సిద్ధంగా ఉంది. ప్రవల్లిక కారులోంచి దిగుతుండగా... ‘‘అదిగో అక్కడ తన ఫ్యామిలీతో ఉన్నాడు చూడు’’ అంటూ వేలును ఒక వైపు చూపించాడు ఆనంద్. అటువైపు చూసింది ప్రవల్లిక.‘‘ఎవరూ... అతనేనా? ’’ ‘‘అవును... అతనే ’’‘‘ఆ పక్కనున్నది?’’ ‘‘వాళ్లు తన భార్య, పిల్లలు. అన్నట్లు మీనాక్షి చెప్పే ఉంటుంది... రామకృష్ణ చేసుకున్నది తన కంపెనీ ఓనర్ కూతుర్నే... సరే, అవన్నీ వాళ్లను కలిశాక తీరిగ్గా మీరే అన్ని విషయాలూ మాట్లాడుకుందురు గానీ... రండి’’ అంటూ ముందుకు కదిలాడు. ప్రవల్లిక ఏమీ మాట్లాడలేదు. కారు దిగి, అక్కడే నిలబడి చూస్తోంది. ఉన్నట్లుండి నవ్వడం మొదలుపెట్టింది. తెరలు తెరలుగా... ఆపకుండా... ఆపుకోలేనంతగా... కళ్లలోంచి నీళ్లొచ్చేంతగా నవ్వుతోంది. ఆమె నవ్వుతున్నా చూపు మాత్రం రామకృష్ణ ఫ్యామిలీ వైపే ఉంది. దూరంగా బట్టతలతో, బాన పొట్టతో రామకృష్ణ... పక్కనే నిండుగా నగలు వేసుకొని, నల్లగా... భారీ ఆకారంతో భార్య... వాళ్లిద్దరి పక్కనే అమ్మ పోలికలతో నల్లని రంగులో మెరుస్తున్న ముగ్గురు కూతుళ్లు...కాసేపటి తర్వాత కాస్త తమాయించుకొని ‘‘వెళ్లొస్తా అన్నయ్యా... బై మీనాక్షి’’ అంటూ వెనకే ఆగి ఉన్న తన ఫ్రెండ్ కారులో కూర్చుంది. ఆనంద్కు ఏమీ అర్థంకావడంలేదు. ‘కలుస్తాను... కలుస్తాను అని రెండేళ్లుగా అడుగుతూ ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్లిపోవడం ఏంటి?’అదే విషయం అడిగాడు. ‘‘కలవాలని ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్లిపోతున్నావేంటమ్మా?!... నువ్వేంటి మాట్లాడకుండా నిల్చున్నావ్?! నువ్వైనా చెప్పు’’ అంటూ మీనాక్షి వైపు చూశాడు. భార్య మొహంలో కనిపిస్తున్న ప్రశాంతత, ఆమె మౌనం చూశాక... రామకృష్ణ గురించి తాను చెప్పిందంతా శ్రీమతి ముందే చేరవేసిందని అర్థమవసాగింది.కలవకుండా వెళ్లిపోవడం వరకు ఓకే... కానీ, ఆ నవ్వు ఎందుకో అతనికే కాదు మీనాక్షికీ అర్థం కావడం లేదు. రామకృష్ణ రూపం, నిజస్వరూపం ప్రత్యక్షంగా చూశాక... తనను వద్దనుకోవడానికి చెప్పిన కారణాలు ఇప్పుడు అతని చుట్టూనే ఉండడం గమనించాక... ఏళ్లుగా తాను పడుతున్న బాధ ఎంత అసంబద్ధమో తెలిశాక... ప్రవల్లిక అంతరాల్లోంచి నవ్వు అలా తన్నుకొని స్వేచ్ఛగా బయటికొస్తోందని వాళ్లకు తెలియదు. వెళుతున్న కారువైపే చూస్తున్నారు. ప్రవల్లిక పగలబడి నవ్వడం కారు అద్దంలోంచి వాళ్లకు కనిపిస్తోంది. అది... అడవి కాచిన వెన్నెల లాంటి నవ్వు... అది గాంధార నవ్వు. అది తనకు మాత్రమే సొంతమైన, తన కోసమే కురుస్తున్న చక్కటి, చిక్కటి, చల్లని నవ్వు. గౌకనపల్లె మహేశ్వరరెడ్డి (చదవండి: ఈ వారం కథ: కొత్త రంగుల పొద్దు -
గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దాంతో రక్తంలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదకరమా? నేను ఇకపై డయాబెటిక్గా ఉండాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరు.గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో రక్తంలో షుగర్ స్థాయి పెరగవచ్చు. దీనిని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. ఇది గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల ప్రభావం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా వస్తుంది. ఇది సాధారణంగా 24 నుంచి 28 వారాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ప్రతి గర్భిణీకి ఓజీటీటీ అనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు. కొంతమంది మహిళల్లో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గత గర్భధారణలో జెస్టేషనల్ డయాబెటిస్ ఉండటం, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉండటం, 35 ఏళ్లకు పైబడిన వయస్సు, అధిక బరువు వంటి కారణాలు ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నప్పుడు తల్లి, బిడ్డకు కొన్ని సమస్యలు రావచ్చు. బిడ్డ బరువు ఎక్కువగా పెరగడం, ఉమ్మనీరు ఎక్కువ కావడం, డెలివరీ సమయంలో ఇబ్బందులు, డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత బిడ్డకు శ్వాస సమస్యలు లేదా తక్కువ షుగర్ లెవల్స్ రావచ్చు, కానీ ఇవి సాధారణంగా చికిత్సతో నియంత్రించవచ్చు. ఇది నిర్ధారణ అయిన తర్వాత మీరు డైట్ పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో షుగర్ స్థాయిలను తరచూ చెక్ చేసుకోవాలి. డైట్తో నియంత్రణలో లేకపోతే సురక్షితమైన మందులు లేదా ఇన్సులిన్ ఇవ్వవచ్చు. ఇవి తల్లికి, బిడ్డకు సేఫ్గా ఉంటాయి. చాలా సందర్భాల్లో డెలివరీ అయిన తర్వాత ఈ జెస్టేషనల్ డయాబెటిస్ తగ్గిపోతుంది. అయితే భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. నేను ఇప్పుడు ఎనిమిది వారాల గర్భవతిని. గతంలో ఏడు వారాలలో మిస్క్యారేజ్ అయింది. ఈ గర్భధారణలో ఇప్పటివరకు నాకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. – రూప, కర్నూలు.గర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశ చాలా కీలకం, ఎందుకంటే ఈ సమయంలో శిశువు ముఖ్యమైన అవయవ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. అయితే ఇదే సమయంలో మిస్క్యారేజ్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ప్రతి గర్భిణీ గమనించాల్సిన రెండు ముఖ్యమైన లక్షణాలు బ్లీడింగ్, కడుపు నొప్పి. ఫస్ట్ ట్రైమెస్టర్లో బ్లీడింగ్కు అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో చాలా సందర్భాల్లో ఇది తల్లి లేదా శిశువుకు హానికరం కాకపోవచ్చు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్లు, సెక్స్ తర్వాత రక్తస్రావం, హార్మోన్ల మార్పులు వంటి కారణాలు ఉండవచ్చు. అయితే ముందుగా తప్పకుండా రూల్ అవుట్ చేయాల్సిన రెండు ముఖ్యమైన పరిస్థితులు మిస్క్యారేజ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. మీరు డాక్టర్ను కలిసినప్పుడు పూర్తి వైద్య చరిత్ర తీసుకుంటారు, శరీర పరీక్ష చేస్తారు, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా శిశువు పరిస్థితిని చెక్ చేస్తారు. ఈ పరీక్షలతో బ్లీడింగ్కు గల అసలు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉండి, స్కాన్లో బిడ్డ బాగానే కనిపిస్తే, బ్లీడింగ్ పరిమాణం, కారణాన్ని బట్టి చికిత్స ఇస్తారు. ఇందులో ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, మనశ్శాంతిగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైతే ప్రొజెస్టెరాన్ మందులు కూడా ఇస్తారు, ఇవి గర్భధారణకు మద్దతు ఇస్తాయి. గతంలో మిస్క్యారేజ్ జరిగినందుకు ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భధారణ వేరు. చాలాసార్లు సరైన పర్యవేక్షణతో ఆరోగ్యంగా గర్భధారణ కొనసాగుతుంది. బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ఆసుపత్రిలో అబ్జర్వేషన్ కోసం ఉంచవచ్చు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం, డాక్టర్ సూచనలు పాటించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా మంది మహిళలు ఆరోగ్యంగా బిడ్డలను ప్రసవిస్తున్నారు.డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: బీపీని నియంత్రణలో ఉంచే ‘3-3-3’ రూల్ అంటే..? వైద్యులు ఏమంటున్నారంటే..) -
నిర్దోషని కోర్టు చెప్పినా..14 ఏళ్లు నిర్బంధంలోనే..
హత్య కేసులో ఓ వ్యకి జైలు కెళ్లాడు. సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. ఆ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయినా ఆ వ్యక్తికి స్వేచ్ఛ లభించలేదు. జైలు గోడలు దాటి బయటకు రాలేదు. రోజులు నెలలయ్యాయి.. నెలలు సంవత్సరాలయ్యాయి.. అలా 14 సంవత్సరాలు గడిచాయి. విడుదల ఊసు లేదు. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. తనను విడుదల చేయాలని బాధితుడే చివరికి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. ఫైలు కదిలింది..ఆ వ్యక్తికి విడుదల లభించింది. తీర్పుకు ముందే ఇదంతా జరిగింది. అయితే అధికారుల తీరును, వ్యవస్థలోని లోపాలను కోర్టు తప్పుబట్టింది. ఓ వ్యక్తి జీవించే హక్కును కాలరాశారంటూ మండిపడింది. పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒక చారిత్రక ముందడుగుకు ఈ కేసు మార్గం చూపింది.బిహార్కు చెందిన రుదుల్ సాహ్ ఓ హత్య కేసులో అరెస్టయి జైలు కెళ్లాడు. ముజఫర్పూర్ సెషన్స్ కోర్టు అతనిపై నమోదైన అభియోగాలను కొట్టేసింది. 1968లో నిర్దోషిగా ప్రకటించింది. అయినా అతడ్ని విడుదల చేయలేదు. దాంతో 1982 వరకు అంటే 14 సంవత్సరాల పాటు నిర్బంధంలోనే ఉన్నాడు. ‘సుప్రీం’లో పిటిషన్తన నిర్బంధం చట్టవిరుద్ధమని, నిర్దోషిగా ప్రకటించినా కారాగారంలోనే ఉంచారని, వెంటనే విడుదల చేయాలని రుదుల్ సాహ్ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.. పునరావాసం, అక్రమ నిర్బంధానికి పరిహారం ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే బాధితుడు పిటిషన్ వేసిన తర్వాత అధికారులు అతడ్ని జైలు నుంచి విడుదల చేశారు. ఈ పిటిషన్ 1982 నవంబర్ 22న విచారణకు వచ్చింది. పిటిషనర్ ఇప్పటికే విడుదలైనందున ‘విడుదల’ అభ్యర్థన అర్థం లేనిదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నాడు. విడుదలే పరిష్కారం కాదుపిటిషనర్ విడుదలతో ఈ కేసు ముగిసినట్టు కాదని విచారణ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ను 14 సంవత్సరాలు జైల్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు జైలులో ఉంచాలని సెషన్స్ కోర్టు పేర్కొంది..అతని మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడంతో విడుదలలో జాప్యం జరిగింది’ అని ముజఫర్పూర్ జైలు అధికారి అఫిడవిట్ సమర్పించాడు. సరైన ఆధారాలేవీ?అఫిడవిట్పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ మానసిక స్థితి సరిగా లేదని నిరూపించే మెడికల్ సర్టిఫికెట్లు, చికిత్స వివరాలు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. 1977లో సాధారణ స్థితికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత అయినా ఎందుకు విడుదల చేయలేదని ధర్మాసనం నిలదీసింది. ఒకవేళ పిటిషనర్ మానసిక స్థితి సరిగా లేకపోతే చట్టం అతడికి కల్పించిన హక్కుల ప్రకారం విచారణ కూడా చేయకూడదు కదా? అని ప్రశ్నించింది.‘ పిచ్చి వాడనే’వాదన తర్వాత తయారు చేసినట్టుగా కనిపిస్తోందని ఆక్షేపించింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లింపునకు ఆదేశంప్రాథమిక హక్కు ఉల్లంఘిస్తే, ఆ ఉల్లంఘనకు పరిహారం చెల్లించాలని ఆదేశించడం కూడా కోర్టు పరిధిలోకి వస్తుందని ‘సుప్రీం’ స్పష్టం చేసింది. అక్రమంగా 14 ఏళ్లపాటు జైలులో ఉన్నాడు. కాబట్టి కావున అతనికి పరిహారం ఇవ్వడం తప్పని సరి అని కోర్టు పేర్కొంది. తాత్కాలిక ఉపశమనంగా చెల్లించిన ఐదువేల రూపాయలకి అదనంగా మరో రూ. 30,000 చెల్లించాలని ఆదేశించింది. మరింత నష్టపరిహారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించడానికి ఇది అడ్డంకి కాదని పేర్కొంది. వ్యక్తిగత హక్కుల రక్షణే ప్రజాస్వామ్యానికి మూలాధారం. ప్రభుత్వ అధికారులు చేసిన తప్పుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని, ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిందే అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసుకు ముందు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే కేవలం విడుదల ఆదేశాలకు మాత్రమే కోర్టు పరిమితమయ్యేది. కానీ, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తే .. నేరుగా జోక్యం చేసుకుని పరిహారం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వగలదని ఈ కేసులో స్పష్టం అయింది. కేసులో ప్రధానంగా ఆర్టికల్ 21, ఆర్టికల్ 32 గురించి ధర్మాసనం ప్రస్తావించింది..ఆర్టికల్ 21: చట్టబద్ధమైన కారణం లేకుండా ప్రభుత్వం ఎవరినీ నిర్బంధించకూడదు. ఏ వ్యక్తి జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదని ఈ ఆర్టికల్ చెబుతోంది. ఆర్టికల్ 32: రాజ్యాంగ పరిహారాల హక్కుకు హామీ ఇస్తుంది . ఇది ప్రాథమిక హక్కుల అమలు కోసం నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించే అధికారాన్ని పౌరులకు కల్పిస్తుంది. -
కోడిగుడ్డంత పుచ్చకాయలు
పుచ్చకాయలు భారీగా ఉంటాయి. రెండు చేతులు పట్టనంత పరిమాణంలో ఉంటాయి. ఒక్కో పుచ్చకాయ బరువు సగటున ఏడు నుంచి తొమ్మిది కిలోల వరకు ఉంటుంది. మామూలు పుచ్చకాయలకు భిన్నంగా అమెరికాలోని నార్త్ వర్జీనియాకు చెందిన ఔత్సాహిక ఉద్యానవేత్తలయిన తల్లీకూతుళ్లు కోడిగుడ్డంత పుచ్చకాయలను పండిస్తుండటం ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వైరల్గా మారింది. కేవలం రెండంగుళాల వ్యాసంలో ఉండే ఈ పుచ్చకాయలు ఒక్కొక్కటి ఎనభై నుంచి వంద గ్రాముల బరువు మాత్రమే ఉండటం విశేషం. పరిమాణం, బరువు తక్కువగానే ఉన్నా; రుచిలో మాత్రం ఇవి ఏమాత్రం తీసిపోవని వీటిని పండిస్తున్న డిలానీ రాప్టిస్, ఆమె తల్లి చెబుతున్నారు. చిన్నసైజు పుచ్చకాయలను పండించడానికి ఐదేళ్లుగా ప్రయత్నాలు సాగించి, విజయం సాధించామని వారు తెలిపారు. జన్యుమార్పిడి పద్ధతులేవీ లేకుండానే, సహజమైన పద్ధతుల్లోనే వీటిని పండిస్తుండటంపై అమెరికాకు చెందిన ‘హార్టి డైలీ మ్యాగజైన్’ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది.దుర్వాసన వెదజల్లే పుష్పం ఫ్రెండ్స్.. ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం ఏంటో తెలుసా? రఫ్లేషియా. ఇది సుమారు 3 అడుగుల వెడల్పు, 10 కిలోల బరువు ఉంటుంది. సాధారణంగా మనం చూసే మొక్కలన్నింటికీ ఆకులు, కొమ్మలు, వేర్లు ఉంటాయి. కానీ ఈ రఫ్లేషియా పుష్పానికి కాండం, ఆకులు, కనీసం వేర్లు కూడా ఉండవు. ఇది అడవిలో దొరికే వేరే మొక్కల తీగలపై ఆధారపడి, వాటి నుంచి ఆహారాన్ని తీసుకుంటూ జీవిస్తుంది. అందుకే దీన్ని పరాన్నజీవి అంటారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఈ పువ్వు నుంచి వచ్చే వాసనను మనం అస్సలు తట్టుకోలేము. ఇది కుళ్ళిపోయిన మాంసం వంటి ఘోరమైన దుర్వాసనను వెదజల్లుతుంది. అందుకే దీనిని శవ పుష్పం అని కూడా పిలుస్తారు. ఈ అరుదైన పుష్పాలు ఆగ్నేయాసియాలోని ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల దట్టమైన వర్షారణ్యాలలో మాత్రమే కనిపిస్తాయి. ఈ పువ్వు పూర్తిగా విచ్చుకోవడానికి దాదాపు 9 నెలల సమయం పడుతుంది.(చదవండి: అపురూపమైన అడవి మామిడి పండ్ల జాతులు) -
నిద్ర నా ప్రాణం
చూడగానే, ‘వావ్’ అనిపించే అందం, మాట్లాడగానే, ‘హా.. హా..’ అని నవ్వించే అల్లరి నటి కయాదు లోహార్ సొంతం. ఇలా ఒక్కో క్యారెక్టర్, ఒక్కో స్టయిల్తో ఎప్పుడూ ఫుల్ ఎనర్జీ అండ్ ఫుల్ ఫన్ ప్యాకేజీలా మెరిసే కయాదు అల్లరి కోణాన్ని, ఫన్నీ జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే విందాం..నా పేరు కష్టాలునా పేరు ’కయాదు’ అని పిలవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. షూటింగ్ సెట్లో కొందరైతే నన్ను ‘కాయ్–దూ’, ‘క్యా–దూ’ అని పిలిచేవారు. ఒకసారి ఒకరైతే పొరపాటున ‘కావాలా?’ అని పిలిచారు! నేను వెంటనే ‘ఏం కావాలి?’ అని అడిగాను. ఇప్పుడు అందరికీ నా పేరు నోరు తిరుగుతోంది, అందుకు సంతోషం!గొడవ పడకుండా ఉండలేనునేను పుణెలోని ఒక మధ్యతరగతి వ్యాపార కుటుంబం నుంచి వచ్చాను. నాన్న బిజినెస్ చేస్తారు, అమ్మ గృహిణి. నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ‘నీకు నచ్చిన రంగంలో నిరూపించుకో’ అని నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. ఇక మా తమ్ముడు నా అతిపెద్ద విమర్శకుడు, వాడితో గొడవ పడకుండా నాకు రోజే గడవదు.తెలుగు డైలాగ్స్.. ఒక పెద్ద సాహసం!కన్నడ సినిమా ‘ముగిల్ పేటె’తో మొదలై, తెలుగులో ‘అల్లూరి’ సినిమాతో మీ ముందుకు వచ్చాను. మొదట్లో తెలుగు నేర్చుకోవడం కష్టంగా ఉండేది. ఒకసారి సీరియస్ సీన్ లో కన్ఫ్యూజ్ అయి ‘దోశ కావాలా?’ అన్నట్టు ఏదో అనేశాను. సెట్లో అందరూ పడి పడి నవ్వారు. అప్పటి నుండి నేను డైలాగ్ పేపర్ కనిపిస్తే చాలు. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్లా భయపడిపోతుంటాను!నా నిద్ర.. నా సామ్రాజ్యం!నాకు నిద్ర అంటే ప్రాణం. ఎవరైనా నన్ను నిద్రలో ఉన్నప్పుడు లేపితే, నాకు విపరీతమైన కోపం వస్తుంది. అందుకే సెట్లో అందరూ నన్ను నిద్రలేపేటప్పుడు చాలా జాగ్రత్తగా, భయం భయంగా ఉంటారు.డైట్ అంతా భోజనం ముందు వరకే!నేను డైట్ చేస్తాను.. కానీ అది కేవలం భోజనం వడ్డించే వరకే! ముఖ్యంగా పప్పు నెయ్యి కాంబినేషన్ చూస్తే ఆగలేను. ఒక్కోసారి నా ఫిట్నెస్ ట్రైనర్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసి ‘కయాదు.. రేపు జిమ్లో నీకు చుక్కలే’ అని మెసేజ్ పెడుతుంటారు!పుష్ప స్టెప్పులకి పడిపోయానుఅల్లు అర్జున్ గారి డ్యాన్స్ చూస్తుంటే నా కాళ్లు కూడా తెలియకుండానే స్టెప్పులు వేస్తుంటాయి. కానీ ఆయన పక్కన డ్యాన్స్ చేయాల్సి వస్తే.. నేను బహుశా టెన్షన్ తో స్టేజ్ మీద పడిపోతానేమో! నిజం చెప్పాలంటే, ‘పుష్ప’ స్టెప్పులు ట్రై చేస్తూ ఇంట్లో రెండు మూడుసార్లు కింద పడ్డాను కూడా! -
హనీ!బీ అలెర్ట్
ప్రకృతిలో ఎన్నో కీటకాలు ఉన్నా, వాటిలో తేనెటీగల పాత్ర అత్యంత కీలకం. ప్రకృతిలోని జీవవైవిధ్యం కాపాడటానికి తేనెటీగలు అహరహం శ్రమిస్తుంటాయి. మొక్కల్లోని పరాగసంపర్కం తొంభైశాతం తేనెటీగల ద్వారానే జరుగుతుంది. తేనెటీగలే లేకుంటే, చాలారకాల వృక్షజాతుల మనుగడకు ముప్పు కలుగుతుంది. ఒకవేళ తేనెటీగలే అంతరించిపోతే, భూమ్మీద మానవాళి అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి తేనెటీగలు అంతరించిపోయే పరిస్థితి లేదు గాని, వాటి మనుగడ మాత్రం కష్టాల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, తేనెటీగల మరణాలు ఆందోళనకరమైన స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్కోచోట తేనెటీగల మరణాలు దాదాపు నలభై శాతం వరకు ఉంటున్నాయి. మరోవైపు తేనెటీగల సహజ ఆవాసాలు కనుమరుగైపోతున్నాయి. ప్రకృతిలో తేనెటీగల పాత్ర, వాటి ప్రస్తుత స్థితిగతుల గురించి మే 20న ‘ప్రపంచ తేనెటీగల దినోత్సవం’ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం...తేనెటీగలు ప్రకృతిలోని అత్యంత కీలకమైన కీటకాలు. తేనెటీగల ద్వారానే దాదాపు డెబ్బయి శాతం పంటలు పండుతున్నాయి. తేనెటీగలు పూల నుంచి మకరందాన్ని సేకరిస్తాయి. ఈ క్రమంలో పూల పుప్పొడిని ఒకదాని నుంచి మరొకదానికి చేరవేయడం ద్వారా పరాగ సంపర్కానికి దోహదపడతాయి. తేనెటీగల వల్ల జరిగే పరాగ సంపర్కం కారణంగానే దాదాపు డెబ్బయి శాతం ఆహార ధాన్యాలు, పండ్లు పండుతున్నాయి. తేనెటీగలు మైనంలాంటి కొవ్వు పదార్థంతో షడ్భుజాకారంలో అద్భుతమైన గూళ్లు నిర్మించుకుంటాయి. ఇలాంటి గూళ్ల వరుసతో తేనెపట్టులు ఏర్పాటు చేసుకుంటాయి. రకరకాల పూల నుంచి సేకరించిన మకరందాన్ని వీటిలో భద్రపరచుకుంటాయి. తేనెటీగల సంఖ్య తగ్గిపోతే, ఆహార చక్రం అస్తవ్యస్తం అవుతుంది. పంటల దిగుబడి తగ్గిపోయి, ఆహార కొరత ఏర్పడుతుంది. తేనెటీగలు అంతరించిపోతే, మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటంతో తేనెటీగలను కృత్రిమంగా పెంచే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినా కూడా పలుచోట్ల తేనెటీగల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది.తేనెటీగలకు ముప్పు వీటి వల్లనే...⇒ తేనెటీగల మనుగడకు ముప్పు కలిగిస్తున్న వాటిలో ప్రధానమైనవి రసాయనిక పురుగు మందులు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో రసాయనిక పురుగు మందుల వాడకం పెరిగింది. పురుగు మందుల్లోని ‘నియోనికోటినాయిడ్స్’ వంటివి పెద్దసంఖ్యలో తేనెటీగల ఉసురు తీస్తున్నాయి.⇒ అడవుల నరికివేత వల్ల చెట్లు తగ్గిపోతున్నాయి. తేనెటీగలు గూళ్లు కట్టుకోవడానికి అనువైన చెట్లు తగ్గిపోతుండటంతో అవి తమ సహజమైన ఆవాసాలను కోల్పోతున్నాయి. చెట్లు తగ్గడం వల్ల పూలు కూడా తగ్గిపోయి, తేనెటీగలు తమ ఆహారాన్ని కూడా కోల్పోతున్నాయి. ఆహారం, ఆవాసం కరవైన పరిస్థితుల్లో తేనెటీగలు నశించిపోతున్నాయి.⇒ వాయు కాలుష్యం తేనెటీగల మీద కూడా దుష్ప్రభావాన్ని చూపుతోంది. వాయుకాలుష్యం వల్ల తేనెటీగలు పూల సువాసనను గుర్తించలేక, తమ సహజమైన ఆహారాన్ని సేకరించుకోలేక నశిస్తున్నాయి.⇒ రకరకాల పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్ల వల్ల కూడా తేనెటీగలకు ముప్పు కలుగుతోంది. వ్యా«ధికారకమైన పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్లు సోకినప్పుడు తేనెటీగలు పెద్దసంఖ్యలో నశించిపోతుంటాయి.⇒ కొన్ని ప్రాంతాల్లో ఏకపంట సాగు కొనసాగిస్తుండటం కూడా తేనెటీగల మనుగడకు చేటు తెస్తోంది. ఏకపంట సాగు వల్ల తేనెటీగలు ఆహార వైవిధ్యాన్ని కోల్పోయి, క్రమంగా క్షీణిస్తున్నాయి.⇒ తేనె సేకరించడంలో మనుషులు అనుసరించే అనియంత్రిత విధానాల వల్ల కూడా తేనెటీగలు పెద్దసంఖ్యలో నశిస్తున్నాయి. తేనె సేకరణ కోసం తేనెపట్టులకు పొగబెట్టి, తేనెపట్టులను చెట్ల నుంచి తొలగించడం వంటి పనుల వల్ల తేనెటీగల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.ప్రపంచవ్యాప్త సమస్యతేనెటీగలు తగ్గిపోతుండటం ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదు, ఇది ప్రపంచవ్యాప్త సమస్య. ఒక్కో దేశంలో ఈ పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంటోంది. అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం..తేనెటీగలు తగ్గితే...⇒ పంటల దిగుబడి తగ్గి, ఆహార కొరత ఏర్పడుతుంది⇒ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది.⇒ పర్యావరణం సమతుల్యత కోల్పోతుంది.⇒ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.⇒ చివరికి మానవజాతి మనుగడకు ముప్పు ఏర్పడుతుంది.తేనెటీగలకు ప్లాస్టిక్ బెడదతేనెటీగలకు నానా రకాల కాలుష్యాలతో పాటు ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ బెడద కూడా పెరుగుతోంది. తేనెటీగలు సహజంగా రకరకాల చెట్ల నుంచి వెలువడే జిగురుతో గూళ్లు నిర్మించుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్ల జిగురు తగినంత దొరకక తేనెటీగలు తమ గూళ్ల నిర్మాణానికి చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలను కూడా ఉపయోగించుకుంటున్నాయి. తేనెటీగలు తమ గూళ్ల నిర్మాణానికి ప్లాస్టిక్ వినియోగించుకుంటున్న విషయం తొలిసారిగా 2013లో కెనడాలో వెలుగులోకి వచ్చింది. టొరంటోలోని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేనెగూళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు బయటపడ్డాయి.తర్వాత ఇదే పరిస్థితిని బ్రిటన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ తదితర దేశాల్లోనూ గుర్తించారు. నగర ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లోని తేనెగూళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు ఎక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదిలా ఉంటే, కొన్నిచోట్ల పారిశ్రామికంగా తేనెటీగల పెంపకం సాగిస్తున్నవారు తేనెగూళ్ల కోసం చెక్క ఫ్రేముల బదులుగా ప్లాస్టిక్ ఫ్రేములు వాడుతున్నారు. వీటి వల్ల కూడా తేనెటీగలకు మైక్రోప్లాస్టిక్స్ బెడద తప్పడం లేదు. తేనెగూళ్లలో ప్లాస్టిక్ కారణంగా రకరకాల దుష్పరిణామాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం తేనెగూళ్లలోకి ప్లాస్టిక్ చేరడం వల్ల తలెత్తే అనర్థాలు ఇవీ:తేనెపట్టులకు మహమ్మారిఅడవుల నరికివేత, రసాయనిక పురుగు మందులు, చిన్నా చితకా పరాన్నజీవులు, బ్యాక్టీరియా, వైరస్లు వంటివి తేనెటీగల మనుగడకు ముప్పు కలిగిస్తున్న సంగతి తెలిసిందే! వీటికి మించిన పెనుముప్పు ‘కాలనీ కొల్లాప్స్ డిజార్డర్’ (సీసీడీ) రూపంలో తేనెపట్టులను నామరూపాలు లేకుండా నాశనం చేస్తోంది. సీసీడీని పర్యావరణవేత్తలు ‘మహమ్మారి’గా అభివర్ణిస్తున్నారు. తేనెపట్టులను అకస్మాత్తుగా నాశనం చేసే ఈ పరిణామాన్ని తొలిసారిగా ఇరవై ఏళ్ల కిందట గుర్తించారు. అమెరికాలో 2006–07లో సీసీడీ కారణంగా కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 60% తేనెపట్టులు తుడిచిపెట్టుకుపోయాయి. తేనెపట్టుల్లో సీసీడీ పరిస్థితి ఏర్పడినప్పుడు తేనెను సేకరించే కార్మిక తేనెటీగలు అకస్మాత్తుగా కనిపించకుండాపోతాయి.తేనెపట్టులో రాణి ఈగ, ఇంకా రెక్కలురాని పిల్లలు మాత్రమే మిగిలి ఉంటాయి. చనిపోయిన తేనెటీగలు గూటి దగ్గర ఎక్కువగా కనిపించవు. కొద్దికాలంలోనే తేనపెట్టులోని తేనెటీగలేవీ మిగలవు. బ్రిటన్లోను, ఇతర యూరోప్ దేశాల్లోనూ సీసీడీ కారణంగా దాదాపు 30% వరకు తేనెపట్టులు నాశనమయ్యాయి. భారత్లో సీసీడీ ప్రభావం కొంత తక్కువగా ఉంది. భారత్లో సీసీడీ వల్ల 10%–20% మేరకు నష్టం వాటిల్లింది.సీసీడీ కేవలం ఒక కారణం వల్ల కాకుండా, అనేక కారణాల సమ్మేళనం వల్ల ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, పూల వైవిధ్యం తగ్గడం, మితిమీరిన రసాయనాలు, కాలుష్యం, అడవుల నరికివేత, పరాన్నజీవులు, సూక్ష్మజీవుల తాకిడి– ఇవన్నీ ఒకేసారి మితిమీరినప్పుడు సీసీడీ పరిస్థితి ఏర్పడుతుందని వివరిస్తున్నారు. సీసీడీ కేవలం తేనెటీగల సమస్య మాత్రమే కాదు, ఇది మానవుల ఆహారచక్రం సమస్య కూడా! ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగితే, వాటిల్లబోయే నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే!తేనె చరిత్రతేనె వినియోగం పదివేల ఏళ్ల కిందటే మొదలైంది. తేనె కోసం కృత్రిమ పద్ధతుల్లో మట్టితో తేనెగూళ్లను నిర్మించే తొలి పద్ధతులు క్రీస్తూపూర్వం 3000 నాటికే వాడుకలో ఉండేవని పలు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రాచీన ఈజిప్టులో మానవులు తొలినాళ్లలో కృత్రిమంగా మట్టితో ఏర్పాటు చేసిన తేనెగూళ్ల అవశేషాలు బయటపడ్డాయి. స్పెయిన్లో బయటపడ్డ గుహాచిత్రాల ఆధారంగా మనుషులకు క్రీస్తుపూర్వం 8000 నాటికే తేనె వినియోగం తెలుసునని చరిత్రకారులు చెబుతున్నారు. పురాతన వైద్య పద్ధతుల్లో తేనెను ప్రధానంగా ఉపయోగించేవారు.వివిధ ఔషధాలను తేనెతో కలిపి సేవించడం ఇప్పటికీ మన ఆయుర్వేదం సహా అనేక సంప్రదాయ వైద్యపద్ధతుల్లో ఆచరణలో ఉంది. తేనె పోషకాల గని. ఎన్నాళు గడిచినా తేనెకు కాలం చెల్లదు. స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ చెడిపోదు. అందుకే పదార్థాలను దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి తేనెను ఉపయోగిస్తారు. తేనెను తక్షణ శక్తినిచ్చే పదార్థంగా, ఔషధంగా, సౌందర్య సాధనంగా, సంప్రదాయ క్రతువుల్లో పవిత్ర పదార్థంగా ఉపయోగిస్తారు. తేనెను వంటకాల్లో చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు.తేనె గురించి కొన్ని వాస్తవాలు⇒ ఒక టీ స్పూన్ తేనెను మనం అవలీలగా చప్పరించేస్తాం. నిజానికి టీ స్పూన్ పరిమాణంలోని తేనె దాదాపు డజను తేనెటీగల జీవితకాల శ్రమ.⇒ ప్రాంతాన్ని బట్టి, అక్కడ పూచే పూలను బట్టి తేనె రంగు, రుచి మారుతూ ఉంటుంది. తేనె సహజంగా పారదర్శకమైన లేత పసుపు నుంచి ముదురు గోధుమ రంగు వరకు రకరకాల రంగుల్లో ఉంటుంది. లేత రంగు తేనె కంటే ముదురు రంగు తేనె ఎక్కువ రుచిగా ఉంటుంది.⇒ తేనెలో నీటిశాతం తక్కువగా ఉండటం, ఆమ్లత్వం ఎక్కువగా ఉండటం వల్ల తేనెలో బ్యాక్టీరియా పెరగడం దాదాపు అసాధ్యం. తేనెను సరైన పద్ధతిలో నిల్వచేస్తే వేల ఏళ్లు గడిచినా చెడిపోదు. ఈజిప్టు సమాధుల్లో దొరికిన వేల ఏళ్ల నాటి తేనె ఈనాటికీ ఉపయోగించడానికి అనువుగా ఉంది.⇒ గాలిలోని తేమ సోకితే ఆహార పానీయాలు ఏవైనా త్వరగా చెడిపోతాయి. తేనె మాత్రం వాటికి పూర్తిగా భిన్నం. గాలిలోని తేమ సోకినా తేనె చెడిపోదు.⇒ తేనెను వేడిచేస్తే నాణ్యత కోల్పోతుంది. వేడి చేయడం వల్ల తేనెలోని కీలకమైన ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి.తేనెటీగల పెంపకంఆధునిక యుగంలో పంతొమ్మిదో శతాబ్దం నుంచి కృత్రిమంగా తేనెటీగల పెంపకం మొదలైంది. అమెరికన్ శాస్త్రవేత్త లోరెండో లాంగ్స్ట్రోత్ 1851లో ఎక్కడికైనా సులువుగా తీసుకుపోయేందుకు అనువైన తేనెగూడును కృత్రిమంగా నిర్మించాడు. అప్పటి నుంచి తేనెటీగల పెంపకం (ఎపికల్చర్) వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా ఎదగడం మొదలైంది. ఇప్పుడు చాలా చోట్ల తేనె కోసమే కాకుండా, పంటల పరాగసంపర్కం కోసం కూడా తేనెటీగల పెంపకం సాగిస్తున్నారు.చైనా, టర్కీ, భారత్, అర్జెంటీనా వంటి దేశాల్లో కృత్రిమంగా తేనెటీగల పెంపకం పెద్దస్థాయిలోనే జరుగుతోంది. గడచిన దశాబ్ద కాలంలో చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా తేనె ఉత్పాదనలో నెమ్మదిగా పెరుగుదల నమోదవుతోంది. చైనా, భారత్, టర్కీ, అర్జెంటీనా వంటి దేశాల్లో పెరుగుదల బాగానే ఉన్నా, అమెరికా, యూరోపియన్ దేశాలలో తగ్గుదల నమోదవుతోంది. కేంద్ర ప్రభుత్వం 2017లో ‘మిషన్ హనీ’ కార్యక్రమం ప్రారంభించాక భారత్లో తేనె ఉత్పాదన క్రమంగా పుంజుకుంటోంది. ఒకవైపు ఉత్పాదన పెరిగినా, ప్లాస్టిక్ బెడద వల్ల తేనె నాణ్యత తగ్గుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.తేనె నాణ్యతకు విఘాతంప్రపంచవ్యాప్తంగా ఒకవైపు తేనె ఉత్పాదన నిలకడగా పెరుగుతూనే ఉన్నా, మరోవైపు తేనె నాణ్యత తగ్గుతోంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల నుంచి సేకరించిన తేనె నమూనాల్లో రకరకాల ప్రమాదకర పదార్థాలు ఉంటున్నట్లు పరీక్షల్లో బయటపడుతున్నాయి. నగరాలకు, పారిశ్రామిక ప్రాంతాలకు చేరువలో ఉన్న తేనెగూళ్ల నుంచి సేకరించే తేనెలో మైక్రోప్లాస్టిక్స్, పురుగుమందులు, యాంటీబయోటిక్స్, భారలోహాల అవశేషాలు చేరి ఉంటున్నట్లు పలు పరీక్షల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. తేనె నాణ్యతపై పలు దేశాలు కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి.నిబంధనల అమలులో లోపాలు ఉన్న దేశాల్లో దొరికే తేనెలో ప్రమాదకర పదార్థాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. తేనెగూళ్లు ఉండే తావుల్లో రసాయనిక కాలుష్యాలను అరికట్టడం, సేకరించిన తేనెను మార్కెట్లోకి పంపేముందు కట్టుదిట్టమైన నాణ్యత పరీక్షలు జరపడం వంటి చర్యలు చేపట్టకుంటే, ఆరోగ్యం కోసం తేనె తీసుకునేవారికి చేదు ఫలితాలే మిగులుతాయి. -
దీర్ఘాయుర్దాయ దేశాలు
ఆధునిక జీవితంలో ఆరోగ్యమే ఐశ్వర్యం. ఆరోగ్యం బాగుంటేనే దీర్ఘాయుర్దాయం ఉంటుంది. వార్ధక్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవే అయినా, కొన్ని దేశాల్లో మాత్రం ఏడుపదుల వయసు దాటే వరకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఆ వయసు తర్వాత చిన్నా చితకా సమస్యలు ఉన్నా, దీర్ఘాయుష్కులుగా మనుగడ సాగించగలుగుతున్నారు.ఆరోగ్యకరమైన జీవనశైలి, తగిన వ్యాయామం, మెరుగైన వైద్య సౌకర్యాల కారణంగా ఆయుర్దాయంలోను, ఆరోగ్యకరమైన జీవన ప్రమాణంలోను (హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టన్సీ) ముందంజలో ఉంటున్న దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం.⇒ భారతదేశంలో ఆరోగ్యకరమైన జీవనప్రమాణం సగటున 61 ఏళ్ల వరకు ఉంటోంది. సగటు ఆయుర్దాయం 70 ఏళ్ల వరకు ఉంటోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే, ఇది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. మన దేశంలో నగరాలలో ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు ఇప్పటికీ లేవు. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి కారణాలు ఆయుర్దాయాన్ని హరించేస్తున్నాయి.⇒ కరవు కాటకాలు, ఆధునిక వైద్య సౌకర్యాల లోటు, తరచు ఘర్షణలు వంటి కారణాల వల్ల ఆఫ్రికన్ దేశాలలో ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు, సగటు ఆయుర్దాయం ఇప్పటికీ తక్కువగానే ఉంటున్నాయి.⇒ వైద్య ఆరోగ్య రంగాల్లో ప్రపంచం ముందంజ వేస్తున్నా, ఇప్పటికీ కొన్ని దేశాలు ఆరోగ్యకరమైన జీవన ప్రమాణంలోను, ఆయుర్దాయంలోను ఇంకా వెనుకబడి ఉన్నాయి. అత్యల్పాయుర్దాయ దేశాలన్నీ ఆఫ్రికా ఖండంలోనే ఉండటం గమనార్హం. వీటి వివరాలు కూడా గణాంకాల్లో తెలుసుకుందాం... -
వేడుకగా విక్టోరియా డే!
చరిత్రతో ముడిపడిన సందర్భమే అయినా, కెనడియన్లు ఈ సమయాన్ని పూర్తిగా ఒక సమ్మర్ కిక్–ఆఫ్ ఈవెంట్గా భావిస్తారు. నెలల తరబడి మంచుతో, చలితో ఇబ్బంది పడే కెనడియన్లకు, చెట్లు పచ్చబడటం, వెచ్చని గాలులు వీచడం ఒక సంతోషకరమైన సమయం. అందుకే ఈ రోజున క్రీడా పోటీలు నిర్వహిస్తారు. రుచికరమైన వంటకాలతో విందులు చేసుకుంటారు. పలుచోట్ల కెనడా జాతీయ జెండాతో పాటుగా, యూనియన్ జాక్ జెండాను ఎగురవేస్తారు. రాజధాని నగరాల్లో తుపాకులతో ఘనంగా వందన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో కెనడా అంతటా ఒక నూతనోత్సాహం ఉట్టిపడుతుంది.కెనడాలో దేశవ్యాప్తంగా విక్టోరియా డే వేడుకలు మే 18 నుంచి మొదలవుతున్నాయి. మంచుతెరలు వీడి, ప్రకృతి పచ్చదనాన్ని పులుముకుంటున్న వేళ దేశమంతా సంబరాల్లో మునిగి తేలుతోంది. ఈ వేడుకలను విక్టోరియా రాణి పుట్టినరోజు సందర్భంగానే కాకుండా, సుదీర్ఘ శీతకాలం తర్వాత వచ్చే వెచ్చని వేసవికి స్వాగతం పలకడానికి జరుపుకొంటారు. బాణసంచా కాల్పులతో, విందు వినోదాలతో సరదాగా గడుపుతారు.విక్టోరియా మహారాణి పుట్టినరోజును అంటే మే 24న వేడుకగా జరుపుకోవడం 1845 నుంచి ఆచారంగా వస్తోంది. అప్పటి కెనడా ప్రావిన్స్ లెజిస్లేచర్ ఈ రోజును అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. 1901లో రాణి విక్టోరియా మరణానంతరం, ఈ పండుగ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆమె జ్ఞాపకార్థం కెనడా పార్లమెంట్ 1952లో ప్రతి సంవత్సరం మే 25కు ముందు వచ్చే సోమవారం రోజున ‘విక్టోరియా డే’ వేడుకలు నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించింది. దాని ప్రకారం ఈ ఏడాది మే 18న నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేసింది.కెనడియన్ల దృష్టిలో క్వీన్ విక్టోరియా అత్యంత గౌరవనీయురాలు. ఆమె హయాంలోనే కెనడాకు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. అంతేకాకుండా, ప్రస్తుత రాజధాని ఒటావాను దేశ రాజధానిగా ఎంపిక చేసింది కూడా ఆమెనే! 1956 వరకు, తదుపరి రాజుల పుట్టినరోజులను కూడా క్వీన్ విక్టోరియా పుట్టినరోజు అయిన మే 24నే నిర్వహించేవారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, క్వీన్ ఎలిజబెత్ బాధ్యతలు చేపట్టినపుడు, ఆమె అసలు పుట్టినరోజు ఏప్రిల్ 21 అయినప్పటికీ, ఆమె అధికారిక జన్మదిన వేడుకలను విక్టోరియా డే రోజున నిర్వహిస్తుండటం విశేషం. ∙ రమా జంబుల -
చాప కింద నీరులా... కరుగుతున్న అంటార్కిటికా!
ఎండ తగిలితేనే కదా ఐస్ ముక్క కరుగుతుంది! కానీ అంటార్కిటికా ఖండంలోని మంచు పలకలు వాటి అడుగు భాగం నుంచి కూడా కరుగుతున్నాయట! అదీ త్వరత్వరగా!! అలా కరిగిన నీరు సముద్ర మట్టాలను పెంచితే, వాతావరణ సమస్థితి దెబ్బతిని, భూప్రపంచం అల్లకల్లోలం కావచ్చునని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఫ్రాన్సులోని యూనివర్సిటీ ఆఫ్ బోర్డియక్స్ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. సముద్ర ప్రవాహాలలో తీవ్రమైన మార్పులు రావటమే ఈ ‘అసాధారణ’ స్థితికి కారణం.పైన భూతాపం... కింద ఉష్ణ ప్రతాపం‘అంటార్కిటికా’ అనేది భూమికి చిట్టచివరన, దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న ఒక భారీ మంచు ఖండం. అక్కడ దాదాపు 98 శాతం మంచు ఉంటుంది. మిగతా 2 శాతంలో పర్వత శిఖరాలు, పొడి లోయలు, తీర ప్రాంతాలు, ద్వీపాలు, ఆ ద్వీపాల్లో పెంగ్విన్లు ఉంటాయి. శాస్త్రవేత్తలు తప్ప సాధారణ మనుషులు ఉండరు. ఇక ఆ 98 శాతం మంచుపొర సగటున 1.9 కిలోమీటర్ల మందంలో ఉంటుంది! భూతాపం వల్ల కొన్నేళ్లుగా ఈ మంచు కరుగుతూ వస్తోందనీ, ఒకవేళ అంటార్కిటికాలోని మంచు మొత్తం కరిగిపోతే, సప్త సముద్రాల నీటి మట్టాలు దాదాపు 200 అడుగుల వరకు పెరిగి తీర ప్రాంత నగరాలన్నీ మునిగిపోతాయనీ మనం ఎప్పటి నుండో వింటున్న సంగతే. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టింది ఏమిటంటే, పైనుంచి భూతాపం వల్లనే కాదు, అడుగు నుంచి వేడెక్కుతున్న నీటి ప్రవాహాల వల్ల కూడా అంటార్కిటికా కరుగుతోందని! అంటే, భూమికి మరింత త్వరగా ప్రమాదం ముంచుకు రాబోతోందని!అడుగున ఎలా వేడెక్కుతున్నాయి?!అంటార్కిటికా మంచు పలకల అడుగున సర్కమ్పోలార్ డీప్ వాటర్ (సి.డి.డబ్లు్య.) అని పిలిచే వేడి నీటి ప్రవాహాలను శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా గమనిస్తున్నారు. ఈ వేడి నీరు సముద్ర ఉపరితలం నుండి సుమారు 500 మీటర్ల (1,600 అడుగులు) దిగువకు, మంచు పలకలకు దూరంగా ఉంటుంది. అయితే మారుతున్న గాలి దిశలు, అంటార్కిటికాను చుట్టి ఉన్న ‘దక్షిణ మహాసముద్రం’లో వీస్తున్న బలమైన గాలుల వల్ల, ఈ లోతైన వేడి నీరు నెమ్మదిగా సముద్ర ఉపరితలం పైకి, మంచు పలకల వైపు కదులుతూ వస్తోంది. ఈ వేడి నీటి ఉష్ణోగ్రత కేవలం 2 సెల్సియస్ డిగ్రీలు (35.6 ఫారెన్హీట్ డిగ్రీలు) మాత్రమే అయినప్పటికీ, అతి శీతలంగా ఉండే అంటార్కిటికా మంచును బలహీనపరచడానికి అది చాలు! ‘‘గతంలో ఈ మంచు పలకల చుట్టూ చల్లటి నీరు ఉండేది, అది వాటిని కరగకుండా కాపాడేది. కానీ ఇప్పుడు సముద్ర ప్రవాహాల్లో మార్పు రావడం వల్ల, ఎవరో వేడి నీటి ట్యాప్ తిప్పినట్లుగా అక్కడి నీరు వేడెక్కుతోంది’’ అని ప్రొఫెసర్ సారా పుర్కీ అంటున్నారు. చల్లటి ఉప్పు నీరు – వేడి తీపి నీరు!ధ్రువ ప్రాంతాల దగ్గర మంచు గడ్డకట్టినప్పుడు, మిగిలిన నీరు అత్యంత చల్లగా, ఉప్పగా, సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నీరు బరువుగా ఉండి సముద్రం అడుగు భాగంలోకి చేరుతుంది. ఇలా నీరు కిందకు వెళ్లేటప్పుడు, తనతో పాటు ఉష్ణాన్ని, కార్బన్ను, పోషకాలను లోపలికి తీసుకెళ్తుంది. అలా వెళ్లటం అనేది ప్రపంచవ్యాప్తంగా సముద్రపు నీటిని ఒక క్రమ పద్ధతిలో, ఒక బెల్ట్ లాగా కదిలిస్తుంది. దానినే ‘ఓషన్ కన్వేయర్ బెల్ట్’ అంటారు. అయితే ఇప్పుడు అడుగు నుంచీ కరుగుతూ ఉన్న మంచు పలకలు తీపి వేడి నీరుగా (ఉప్పు లేని నీరుగా) సముద్రంలో కలిసినప్పుడు ఆ నీరు అంత త్వరగా కిందకు మునగదు. దీనివల్ల సముద్ర ప్రవాహాల వేగం మందగించి, సముద్రాల్లోని జీవజాలానికి అందే పోషకాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రవాహాలకు అడ్డుగా ‘తీపి’ నీరుకొత్త డేటా ప్రకారం, అంటార్కిటికా దిగువకు వెళ్లే (మునిగిపోయే) చల్లటి, ఉప్పటి నీటి శాతం తగ్గుతోంది. దానిని భర్తీ చెయ్యటానికి బయట నుండి మరింత వేడి నీరు (ఉప్పు లేని నీరు) మంచు పలకల వైపుకు వస్తోంది. ఆ క్రమంలో మంచును ఇంకా వేగంగా కరిగిస్తోంది. ఇందువల్ల సముద్రాల నీటి మట్టం పెరగడమే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా వస్తాయి. సాధారణంగా సముద్రాలు వాతావరణంలోని అధిక వేడిని, కార్బన్ను సంగ్రహిస్తాయి. ప్రవాహాలు ఆగిపోతే, సముద్రం ఈ పనిని సరిగ్గా చేయలేదు. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ మరింత వేగంగా పెరుగుతుంది. తాజా అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ జోషువా లాన్హామ్ చెప్పినట్లుగా, ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే కాదు, ఇప్పుడు మన కళ్లముందు నిజంగా జరుగుతున్న మార్పులు!అడుగు నుంచైనా, పై నుంచైనా..... అంటార్కిటికా కరగడం అనేది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది భూతాప భీకర రూపానికి ఒక సంకేతం. సముద్ర ప్రవాహాల వ్యవస్థ బలహీనపడితే, అది వాతావరణాన్ని అతలాకుతలం చేసి, రాబోయే తరాలకు మంచు యుగం వంటి కఠిన పరిస్థితులను కల్పించవచ్చు. ప్రకృతి మనకు ఇస్తున్న ఈ సంకేతాలను గమనించి, పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవడం అవసరం. బరువు తగ్గుతున్న మంచు పలకలుభూమి పై నుండి సముద్రం వైపు విస్తరించి, నీటిపై తేలుతూ ఉండే మంచు నదులనే మంచు పలకలు (గ్లేషియర్లు) అంటారు. అవి అంటార్కిటికా తీర ప్రాంతంలో దాదాపు 75 శాతం మేర విస్తరించి ఉన్నాయి. వీటి మందం 50 నుండి 600 మీటర్ల వరకు ఉంటుంది. వెనుక ఉన్న గ్లేసియర్ల నుండి మంచు ముందుకు నెట్టుకుని రావటం వల్ల, పైన కురిసే మంచు గట్టిపడటం వల్ల ఈ పలకలు పెరిగి, అంటార్కిటికాకు ఒక అడ్డుగోడలా లేదా ‘బ్రేక్’ లా పనిచేస్తాయి. దీనినే ‘బట్రెసింగ్’ అంటారు. భూమి మీద ఉన్న భారీ గ్లేషియర్లు వేగంగా సముద్రంలోకి జారిపోకుండా ఈ మంచు పలకలు అడ్డుకుంటాయి. ఒకవేళ ఈ పలకలు విచ్ఛిన్నమైతే, వెనుక ఉన్న గ్లేషియర్లు వేగంగా సముద్రంలోకి పడిపోతాయి, దీనివల్ల సముద్ర మట్టాలు ఒక్కసారిగా పెరుగుతాయి. గత 25 ఏళ్లలో 48 మంచు పలకలు వాటి బరువులో 30 శాతాన్ని కోల్పోయాయి. అంటే, అంటార్కిటికాను కాపాడుతున్న ‘అడ్డుగోడలు’ బలహీనపడుతున్నాయని అర్థం. ఇది ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత నగరాలకు పెద్ద హెచ్చరిక.ఐరోపాకు అట్లాంటిక్ ‘బెల్టు’ దెబ్బఈ శతాబ్దం పూర్తయ్యేసరికి ఎ.ఎం.ఓ.సి. (అట్లాంటిక్ మెరీడియనల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్) ప్రవాహం 50 శాతం వరకు దెబ్బతినే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ బోర్డియక్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత అంచనాల్లో ఇది కేవలం 32 శాతంగా మాత్రమే ఉండేది. ఎ.ఎం.ఓ.సి. అంటే అట్లాంటిక్ మహా సముద్రంలో నిరంతరం ప్రవహించే ఒక భారీ నీటి కన్వేయర్ బెల్ట్ వంటిది. అంటార్కిటికా ఖండానికి సరిహద్దుగా ఉన్న మూడు ప్రధాన సముద్రాలలో అట్లాంటిక్ మహా సముద్రం ఒకటి.మిగతా రెండూ.. పసిఫిక్ మహా సముద్రం, హిందూ మహా సముద్రం. ఈ మూడు భారీ జల రాశులు దక్షిణ దిశగా ప్రవహించి, దక్షిణ మహా సముద్రంలో విలీనం అవుతాయి. ఒకవేళ ఎ.ఎం.ఓ.సి. పూర్తిగా ఆగిపోతే, అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రవహించే ‘గల్ఫ్ స్ట్రీమ్’ ప్రయాణించే దిశ పూర్తిగా మారిపోతుంది. దాని వల్ల ఉత్తర ఐరోపా, బ్రిటన్ తీవ్రమైన చలి కాలంలోకి వెళ్లిపోతాయి. ఇది ఒక రకంగా కొత్త ‘మంచు యుగం’లా ఉంటుంది. అంటే ఐరోపాకు ప్రాణాంతకమైన మంచు యుగం వచ్చేస్తుంది.మంద గమనం పెరిగింది!1950 నుండి గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల అట్లాంటిక్ మెరిడియనల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్ (ఎ.ఎం.ఓ.సి.) వ్యవస్థ కదలిక మునుపటి కంటే చాలా వేగంగా బలహీనపడుతోందని పరిశోధకులు గుర్తించారు. గ్రౌండింగ్ లైన్: ఒక గ్లేషియర్ (మంచు పలక) సముద్ర అడుగుభాగంలోని రాతిని తాకే ప్రదేశాన్ని ‘గ్రౌండింగ్ లైన్’ అంటారు. వేడి నీరు ఈ పాయింట్ను వెనక్కి నెట్టివేస్తుంది. గ్రౌండింగ్ లైన్ వెనక్కి వెళ్లే కొద్దీ, అంతవరకు రక్షణగా ఉన్న మంచు అడుగు భాగం కూడా వేడినీటిలో మునిగిపోయి కరగడం మొదలవుతుంది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్: ఇది ఒక విషవలయం లాంటిది. మంచు కరిగే కొద్దీ, ఆ మేర మరింత వేడి నీరు లోపలికి చేరుతుంది, ఆ వేడి నీరు మంచును ఇంకా వేగంగా కరిగిస్తుంది. ఇలా ఒకదాని వల్ల మరొకటి ప్రభావితమై మంచు కరగడం అనేది ఊహించనంత వేగంగా మారుతుంది. దీనినే ‘పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్’ అంటారు.నీటి వేడిని ఎలా కనిపెడతారు?అంటార్కిటికా ఖండం అడుగున నీటి ప్రవాహాల ఉష్ణోగ్రతల్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ‘ఆర్గో ఫ్లోట్స్’ అనే పరికరాలను ప్రయోగిస్తారు. ఇవి సముద్రంలో తేలుతూ, నిరంతరం నీటి ఉష్ణోగ్రత, ఇతర వివరాలను సేకరిస్తుంటాయి. తాజాగా శాస్త్రవేత్తలు ఓడల ద్వారా సేకరించిన పాత డేటాను, ఈ కొత్త ఆర్గో ఫ్లోట్స్ డేటాతో కలిపి గత 40 ఏళ్ల రికార్డును విశ్లేషించారు. దాంతో లోతులో ఉన్న నీటి వేడికి అంటార్కిటికా పైకి చొచ్చుకు వస్తోందని మొదటిసారి నిరూపణ అయింది. -
సమ్మర్లో కడుపు చల్లగా ఉంచే వంటకాలు చేసేయండిలా
ఎండలు మండే వేసవి కాలంలో కడుపు చల్లగా ఉంటేనే ఆరోగ్యం. వేసవి ప్రత్యేకంగా పిల్లా పెద్దా అందరికీ కడుపు చల్లగా ఉంచే వంటకాలు మీ కోసం... స్వీట్కార్న్ స్టూ (6 నెలల పైబడిన పిల్లలకు)కావలసినవి: స్వీట్కార్న్: 1 టిన్ (160 గ్రాములు) వెల్లుల్లి: 1 చిన్న రెబ్బ, నూనె: 1 టీస్పూన్ ఉల్లిపాయ: పావు వంతు (చిన్న ముక్కలుగా కోసినది), పాలు: 200 మి.లీ మిక్స్డ్ హెర్బ్స్: పావు టీస్పూన్ (ఆప్షనల్)తయారీ: ఒక పాన్లో నూనె వేసి వేడి చేయండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి 1 నుంచి 2 నిమిషాల పాటు అవి మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత అందులో స్వీట్కార్న్, పాలు పోయాలి. పాలు మరిగిన తర్వాత, మంటను తగ్గించి సుమారు 15 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనిచ్చి, ఆ తర్వాత దీనిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి. దీనిని ఆరు నెలల పైబడిన పిల్లలకు రోజుకు 40 గ్రాముల వరకు తినిపించవచ్చు. దీనిని నిల్వ పెట్టుకోవాలనుకుంటే ఒక గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రీజర్లో పెట్టాలి. దీనికి తోడుగా ఉడికించిన కూరగాయలు, హోల్మీల్ బ్రెడ్ ముక్కలను కూడా కలిపి తినిపించవచ్చు. జల్ జీరాకావలసినవి: తాజా పుదీనా ఆకులు: 1/2 కప్పు జీలకర్ర పొడి: టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు: టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు: టీస్పూన్, నిమ్మరసం: టేబుల్ స్పూన్ బెల్లం పొడి: టేబుల్ స్పూన్, నీళ్లు: 4 కప్పులు నిమ్మకాయ ముక్కలు: అలంకరణ కోసంతయారీ: ఒక బ్లెండర్లో పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు, నల్ల ఉప్పు, నిమ్మరసం, బెల్లం పొడి వేయండి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక జగ్గులోకి వడకట్టండి. ఇప్పుడు మిగిలిన నీటిని పోసి బాగా కలపండి. ఈ జల్ జీరాను కొన్ని గంటల పాటు రిఫ్రిజిరేటర్లో బాగా చల్లబడే వరకు ఉంచాలి. ఈ చల్లబడిన జల్ జీరాను గ్లాసుల్లో పోసి, ఐస్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేయండి. మీ రుచికి తగినట్లుగా పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు. జల్ జీరా వేసవికి చాలా మంచిది. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.చికూ పెకాన్ కుల్ఫీ కావలసినవి: పెకాన్ గింజలు (సిమ్లా అక్రోట్): 30 నుంచి 40 సపోటాలు: 5 నుంచి 6 (గింజలు తీసి, తొక్కతో సహా ముక్కలుగా కోసినవి) చక్కెర: 1/4 కప్పు పాల పొడి: 3 టేబుల్ స్పూన్లు ఏలకుల పొడి: 1/2 టీస్పూన్ మరిగించి చిక్కబరిచిన పాలు: 3 కప్పులు గార్నిష్ కోసం: సపోటా ముక్కలు, పెకాన్ గింజలు. తయారీ: 15 నుంచి 20 పెకాన్ గింజలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన పెకాన్ గింజలను మిక్సీ జార్లో వేసి రఫ్గా గ్రైండ్ చేయాలి. అందులోనే సపోటా ముక్కలు, చక్కెర, పాల పొడి, ఏలకుల పొడి వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో సగం కోసిన పెకాన్ ముక్కలు, చిక్కబరిచిన పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మోల్డ్స్లో పోసి, మూతలు పెట్టి 6 నుంచి 8 గంటల పాటు ఫ్రీజర్లో ఉంచాలి. కుల్ఫీ గడ్డకట్టిన తర్వాత బయటకు తీసి, మిగిలిన పెకాన్ ముక్కలపై దొర్లించాలి. ప్రతి కుల్ఫీని మధ్యలోకి కట్ చేసి, సపోటా ముక్కలు, పెకాన్ గింజలతో అలంకరించి చల్లగా వడ్డించాలి.(చదవండి: ఐస్క్రీం షాపే పెళ్లి వేదికగా..ఒక్కటైన జంట!) -
కాంతివంతమైన మెరిసే ముఖం కోసం..!
పెదవుల ఆకృతిని మార్చుకోవడానికి ఫిల్లర్ చికిత్సలపై ఆధారపడే మహిళలకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ బ్యూటీ టెక్నాలజీ సంస్థ సిల్కెన్ పెదవుల సంరక్షణ, అందం కోసం ‘లూమిలిప్స్ ఎల్ఈడీ లిప్ మాస్క్’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.ఫేస్ మాస్క్లు సాధారణంగా ముఖం అంతటికీ కాంతిని అందిస్తాయి. కానీ, ఈ లూమిలిప్స్ మాస్క్ ప్రత్యేకంగా పెదవులు, వాటి చుట్టూ ఉండే చర్మంపై దృష్టి పెడుతుంది. ఇది కాంతి కిరణాల సహాయంతో పెదవులలోని కొవ్వు పొరను లక్ష్యంగా చేసుకుని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పెదవులు సహజంగానే మృదువుగా, నిండుగా కనిపిస్తాయి. ఈ పరికరం రెండు మోడ్లలో పనిచేస్తుంది. ఒకటి: వాల్యూమ్ యాంటీ ఏజింగ్ మోడ్. ఇది పెదవుల చుట్టూ ఉండే ముడతలు, స్మైల్ లైన్స్, వయసురీత్యా వచ్చే మార్పులను తగ్గిస్తుంది. మరొకటి: గ్లో అండ్ సూతింగ్ మోడ్. ఇది చర్మ ఛాయను మెరుగుపరచడమే కాకుండా, పెదవులకు సహజమైన మెరుపును ఇస్తుంది. ఈ మాస్క్ని రోజుకు 3 నుంచి 5 నిమిషాలు ఉపయోగిస్తే చాలు. కేవలం రెండు వారాల్లోనే స్పష్టమైన మార్పును గమనించవచ్చు. దీనిని ఉపయోగించినప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు.వైనో థెరపీ..వైన్ తాగడం పురాతన కాలం నుంచి మామూలే! కానీ పురాతన కాలంలో వైన్ను ఒక సౌందర్య సాధనంగా కూడా ఉయోగించేవారు. రోమన్ మహిళలు ద్రాక్ష గింజలు, తొక్కలతో చేసిన మాస్క్లను ముడతలు పోగొట్టుకోవడానికి వాడేవారు. అలాగే ద్రాక్ష గుజ్జును బుగ్గలకు మంచి రంగు రావడం కోసం వాడేవారట! తరువాత 17వ శతాబ్దంలో ఫ్రాన్స్లోని ఉన్నత వర్గాల మహిళలు చర్మం కాంతిమంతంగా మెరవడానికి రెడ్ వైన్తో ముఖం కడుక్కునేవారట! ముఖ్యంగా ఈ ప్రక్రియకే ఆధునికులు ‘వైనోథెరపీ’గా పేరుపెట్టారు. వైనోథెరపీ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం 1990లో. ఫ్రాన్స్కి చెందిన మథిల్డే థామస్, ఆమె భర్త బెర్ర్టాండ్ థామస్ ఈ ఆధునిక వైనోథెరపీకి మూలకారకులు. ఫ్రాన్స్లో మొదలైన ఈ వైనోథెరపీ ఇప్పుడు జపాన్, అర్జెంటీనా, అమెరికా, భారత్ వరకు విస్తరించింది.అతి జాగ్రత్తలే అసలు సమస్య!జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ఒక్కోసారి మనం అతి జాగ్రత్తలతో చేసే పనులు సమస్యను తగ్గించడానికి బదులుగా మరింత పెంచుతాయి. జుట్టు జిడ్డుగా మారుతుందని తరచు షాంపూలతో తలస్నానాలు చేస్తుంటారు. దీనివల్ల తలలో సహజంగా ఉండే నూనెలు పోతాయి. చర్మం మరింత పొడిబారి, ఇంకా ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల మైల్డ్ షాంపూలను మాత్రమే ఉపయోగించాలి. అలాగే వేసవిలో చాలామంది జుట్టును బిగుతుగా ముడి వేస్తుంటారు. దీనివల్ల తలలో చెమట, వేడి పెరిగి జుట్టు కుదుళ్లు బలహీన పడతాయి. అలాగే డ్రై షాంపూలు, స్ప్రేలు వాడినప్పుడు అవి చెమటతో కలిసి తల మీద ఒక పొరలా పేరుకుపోతాయి. ఇవి చర్మరంధ్రాలను మూసివేసి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అందువల్ల తలపై పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి సున్నితమైన స్క్రబ్ను వాడాలి. ఎండలో వెళ్లేటప్పుడు హ్యాట్, లేదా స్కార్ఫ్ ధరించాలి. సూర్యరశ్మి వల్ల తల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. మన ముఖ చర్మం లాగే, తల చర్మం కూడా చాలా ముఖ్యం. అందువల్ల తలపై దురద పెడుతున్నా, జుట్టు పల్చబడుతున్నా, జిడ్డుగా ఉంటున్నా– అది మీ సహాయం కోరుతోందని అర్థం. అందువల్ల సమస్య చిన్నగా ఉన్నప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. -
వరుణుడు కోసం అగ్నిబాణాలు
వానలు సమృద్ధిగా కురవాలి; పంటలు పుష్కలంగా పండాలి. ఇంటికి సిరిసంపదలు తేవాలి– ప్రతి దేశంలోనూ రైతులందరి ఆశ ఇది. ఇదే ఆకాంక్షతో థాయ్లాండ్, లావోస్ ప్రజలు ప్రతి ఏటా ‘బున్ బాంగ్ ఫై’ అనే రాకెట్ ఫెస్టివల్ను అత్యంత ఉత్సాహభరితంగా, అంగరంగ వైభవోపేతంగా జరుపుకొంటారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ అద్భుత వేడుక యసోథోన్ ప్రావిన్స్లో మే 8న ప్రారంభమై మే 10తో ముగుస్తుంది.తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. లావోస్ వానదేవుడైన ‘పయా థేన్’ ఒక నాగ సర్పం కారణంగా ఆగ్రహించడంతో వర్షాలు కురవక కరవు వాటిల్లింది. దీంతో ప్రజలు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి వెదురుతో తయారు చేసిన భారీ రాకెట్లను ఆకాశంలోకి ఎగురవేశారట! ఈ పురాణం ఆధారంగా వానదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వెదురు రాకెట్లను ఎగురవేసే సంప్రదాయం మొదలైంది. వీరు ఎగురవేసే రాకెట్లు నేరుగా స్వర్గానికి చేరుకుని, ప్రజల అవసరాలను వానదేవుడికి విన్నవిస్తాయని, ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. థాయ్లాండ్ ఈశాన్య ప్రాంతంలోని మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. కాబట్టి వారికి వర్షాలు చాలా కీలకం. రుతుపవనాలు సకాలంలో రావడం వారికి చాలా ముఖ్యం. ఈ ప్రకృతి పండుగను థాయ్లాండ్లోని ఈశాన్య ప్రాంతాలైన యసోథోన్, రోయి ఎట్, కలసిన్, ఉడాన్ థాని, నోంగ్ ఖై, మహా సారఖామ్, సిసాకెట్, నోంగ్ బువా లాంఫు, లోయి, అమ్నాత్ చారోయెన్ ప్రావిన్స్లతో పాటు ఉత్తర ప్రాంతంలోని కొన్ని ప్రావిన్స్లలో విస్తృతంగా జరుపుకొంటారు. మూడు రోజుల పాటు నిర్వహించుకునే ఈ ఉత్సవం రంగురంగుల ఊరేగింపులతో, జానపద నృత్యాలతో కోలాహలంగా సాగుతుంది. సుమారు 20 నుంచి 25 కిలోల గన్పౌడర్తో నింపిన ఈ రాకెట్లను బౌద్ధ పురాణాల్లోని ‘నాగ’ అనే పౌరాణిక సర్పం బొమ్మతో అలంకరిస్తారు. రాకెట్లను ప్రయోగించే ముందు బౌద్ధ సన్యాసులు వీటికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదిస్తారు. రాకెట్లను తయారు చేసిన బృందాలకు బహుమతులు అందజేస్తారు. అయితే, ఒకవేళ ఏదైనా రాకెట్ ప్రయోగం విఫలమైతే, ఆ రాకెట్ తయారుచేసిన వాళ్లని సరదాగా బురదలో ముంచి శిక్షిస్తారు. ఇది దేవుడికి ఆగ్రహం కలిగించిందని భావించి చేసే ఒక వినోదాత్మక ఆచారం. పురుషులు, స్త్రీల వేషధారణలో కనిపిస్తూ, హాస్యభరితమైన ప్రదర్శనలతో పర్యాటకులను అలరిస్తారు. వ్యవసాయ ఇతివృత్తాలతో కూడిన జానపద నృత్యాలు ఇక్కడ ప్రధానం. ముఖ్యంగా ‘లామ్ వాంగ్’ అనే నృత్యంలో పాల్గొనేవారు వృత్తాకారంలో లయబద్ధంగా నర్తిస్తారు. వేడుక సందర్భంగా బంధుమిత్రులతో కలిసి విందులు చేసుకుంటారు. ఈ బున్ బాంగ్ ఫై కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా, ఒక అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణగానూ మారింది. టూరిజం అథారిటీ ఆఫ్ థాయ్లాండ్ 1974 నుంచి ఈ వేడుకలకు అండగా నిలుస్తోంది. ఈ మూడురోజుల పండుగ కాలాన్ని ఈశాన్య ప్రాంతంలో సెలవుదినంగా గుర్తిస్తారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమవ్వడానికి ముందు రైతులు జరుపుకునే ఈ వినోదభరిత ఉత్సవం ప్రకృతికి, మానవ సంకల్పానికి మధ్య ఉన్న విడదీయలేని బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. రమా జంబుల(చదవండి: -
ఆవకాయదే అగ్రస్థానం!
వేసవి అంటే ఊరగాయల సీజన్ కూడా! మామిడికాయలతో తయారు చేసే ఆవకాయ, నిమ్మకాయ ఊరగాయ, మిర్చి ఊరగాయ– ఇలా ఎన్ని రకాలు ఉన్నా, ఊరగాయల మార్కెట్లో అగ్రస్థానం మామిడి ఆవకాయకే దక్కుతుంది. మన దేశంలో తయారయ్యే ఊరగాయల్లో దాదాపు మూడోవంతు వాటా ఆవకాయదే! ఉత్పాదన ప్రకారం ఊరగాయల వివరాలు గణాంకాల్లో చూద్దాం...దేశవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న రకరకాల ఊరగాయల ఉత్పాదనలో దాదాపు 70% కుటీర పరిశ్రమల్లా ఇళ్ల వద్ద తయారు చేసిన ఊరగాయలే ఉంటాయి. ఊరగాయల మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తుల వాటా సుమారు 30% మాత్రమే! ఊరగాయల ఉత్పాదనలో రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఊరగాయల ఉత్పాదనలో మొదటి పది స్థానాల్లో ఉన్న రాష్ట్రాల వివరాలు ఇవీ:చేపలు, రొయ్యలు, చికెన్, మటన్ ఊరగాయల ఉత్పత్తి కేరళలలోను, ఈశాన్య రాష్ట్రాల్లోను అత్యధికంగా ఉంటోంది. ఈశాన్య రాష్ట్రాల్లోను, తూర్పు రాష్ట్రాల్లోను వెదురు మొలకలు, తామరతూళ్ల ఊరగాయలు, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో యాపిల్ ఊరగాయ వంటివి ప్రత్యేకంగా తయారు చేస్తారు. (చదవండి: కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!) -
సూపర్ ఎల్ నినో భయం వద్దు.. సిద్ధం కండి!
ప్రపంచానికి ప్రళయ ఘంటికలు వినిపిస్తున్నాయి. ఈ మే నెల నుంచి భూగోళం నిప్పుల కొలిమిలా మారబోతోంది! పసిఫిక్ మహా సముద్రం నుంచి అప్పుడే సంకేతాల అలజడి కూడా మొదలైంది! చరిత్రలోనే ఇది అత్యంత ‘మండే ఎండల’ ఏడాది అవబోతోంది. ఇప్పటి వరకు మనం విన్నది ‘ఎల్ నినో’ అనే మాట మాత్రమే. ఇప్పుడు వింటున్నది ‘సూపర్’ ఎల్ నినో! ఏమైనా కానివ్వండి. భయం వద్దు. సిద్ధం కండి. భద్రంగా ఉండండి.ఈ ఏడాది మే, లేదా జూన్ నెలల నాటికే బలమైన సూపర్ ‘ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించింది . ఈ శతాబ్దంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత వేగంగా పసిఫిక్ మహాసముద్రపు నీరు వేడెక్కుతోందట! పర్యవసానమే సూపర్ ఎల్ నినో అంటున్నారు. అంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరబోతున్నాయి. ‘‘గత వందేళ్లలోనే ఇది అత్యంత బలమైన ఎల్ నినో కావచ్చు. సముద్ర ఉష్ణోగ్రతలు సగటు కంటే 1.5 సెల్సియస్ డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది’’ అని బ్రిటన్ వాతావరణ సంస్థ ‘మెట్ ఆఫీస్’ ప్రకటించింది. ‘‘ఉష్ణోగ్రతలు 2 సెల్సియస్ డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగి, ‘అత్యంత బలమైన’ ఎల్ నినో వచ్చే అవకాశం 25 శాతం వరకూ ఉంది’’ అని అమెరికా సముద్ర వాతావరణ సంస్థ ‘నేషనల్ ఓషియానిక్ అండ్ ఎట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్’ (ఎన్.ఓ.ఎ.ఎ.) హెచ్చరించింది.వ్యక్తిగతంగా శాస్త్రవేత్తలు కూడా ‘భద్రం బీ కేర్ ఫుల్’ అంటున్నారు. ‘‘చాలా వాతావరణ నమూనాలు (క్లైమేట్ మోడల్స్) ఉష్ణోగ్రత పెరుగుదల 2 సెల్సియస్ డిగ్రీల లోపే ఉంటుందని చెబుతున్నప్పటికీ, అది 2 సెల్సియస్ డిగ్రీలను దాటే అవకాశం కూడా ఉండటం అన్నది ఆందోళన కలిగిస్తోంది’’ అని ‘యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్’ సంస్థ సభ్యులు డాక్టర్ మార్క్ అలెస్సీ కలవర పడుతున్నారు. ‘‘గత 140 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైన ‘ఎల్ నినో’ వచ్చే అవకాశం ఈ ఏడాది మే నెలలో ఉంది’’ అని న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ పాల్ రౌండీ అంటున్నారు. ‘ఎల్ నినో’ అంటే తెలిసిందేప్రకృతిలో సహజంగా జరిగే మార్పుల్లో ‘ఎల్ నినో’ ఒకటి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలోని నీరు సాధారణం కంటే ఎక్కువ వేడెక్కినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెద్ద మార్పులు వస్తాయి. కానీ ఇప్పుడొస్తున్నది సూపర్ ఎలన్ నినో అంటున్నారు. అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 2 సెల్సియస్ డిగ్రీల కంటే ఎక్కువ పెరిగినప్పుడు సంభవించే పరిణామం. అయితే శాస్త్రవేత్తలు అధికారికంగా ‘సూపర్’ అనే ఈ పదాన్ని పెద్దగా వాడరు. వాతావరణ నమూనాలన్నీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ‘ఎల్ నినో’ మరింత తీవ్రం కానుంది. అంటే ఈ మే నెల నుంచి రాబోయే రోజుల్లో ప్రపంచం భారీ ఎండలను, ఎండలతో పాటుగా అసాధారణ వాతావరణ మార్పులను, అకాల భారీ వర్షాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎల్ నినో అన్నది లక్షల ఏళ్లుగా ఉన్నదే అయినా, ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తున్న సంకేతాల ప్రకారం ఈ ఏడాది, చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోలలో ఒకటిగా నమోదయ్యే అవకాశం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.వేడి ఎలా పెరుగుతుంది?ఎల్ నినో సమయంలో, పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కిన నీరు అంతటా విస్తరిస్తుంది. దీనివల్ల భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. సముద్రంలోని ఈ వేడి, వాతావరణంలోకి విడుదలయ్యి, కొన్ని నెలల పాటు భూమిని వేడెక్కిస్తుంది. ఈ ఏడాది ఎల్ నినో, సూపర్ ఎల్ నినో అవొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా ఏప్రిల్ నెలలో ఉండే వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తును అంచనా వేయడం కష్టం. ఈ అడ్డంకిని శాస్త్రవేత్తలు ‘ఏప్రిల్ అడ్డంకి’ అంటారు. వాళ్ల పరిభాషలో అది ‘స్ప్రింగ్ ప్రిడిక్టబిలిటీ బారియర్’. అయినప్పటికీ, ఈసారి సూపర్ ఎల్ నినో వస్తుందని శాస్త్ర నిపుణులు గట్టిగానే చెబుతున్నారు.ఎల్ నినో చరిత్రలో 2024వాతావరణ మార్పు, ఎల్ నినో అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఎల్ నినో అనేది వాతావరణ మార్పుల వల్ల ఏర్పడేది కాదు. ఇది ప్రకృతిలో సహజంగా జరిగే ప్రక్రియ. అలాగే గ్రీన్హౌస్ ప్రభావం వల్ల ఎల్ నినో మరింత తీవ్రమవుతుందని చెప్పడానికి కూడా ఇప్పటి వరకు శాస్త్రవేత్తల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవు. వాతావరణ మార్పుల వల్ల భూమి వేడెక్కుతోంది. దీనికి బలమైన ఎల్ నినో కూడా తోడైతే, ఆ అదనపు వేడి కారణంగా ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగిపోతాయి. గ్రీన్హౌస్ వాయువులు, బలమైన ఎల్ నినో కలవడం వల్లే 2024 చరిత్రలోనే అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచింది. ఇక ఇప్పుడు ‘సూపర్’ ఎల్ నినో వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో, ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ వర్షాలు, లేదా కరువు కాటకాలు సంభవించ వచ్చు. ఈ ఏడాదే ఎందుకని?!ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం, ఈ ఏడాది మే, జూన్ నెలల్లో భూమిపై దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, కరీబియన్ దీవులు, యూరప్, ఉత్తర ఆఫ్రికాలో ఈ ప్రభావం కనిపించవచ్చు. దీనివల్ల దక్షిణమెరికా, తూర్పు ఆఫ్రికా ప్రాంతం, మధ్య ఆసియాలో విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంది; ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో తీవ్రమైన కరవు ఏర్పడవచ్చు. ఆగ్నేయ ఆసియా దేశాలలో అడవులు అంటుకుని మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి, నీటి లభ్యత, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. ‘సూపర్’ అనే మాట కొత్తది!పసిఫిక్ మహాసముద్రంలో క్రమబద్ధంగా మారే వాతావరణ మార్పులను ‘ఎల్ నినో సదరన్ ఆసిలేషన్’(ఇ.ఎన్.ఎస్.ఓ.) అని పిలుస్తారు. ఇందులో ప్రధానంగా రెండు దశలు ఉంటాయి. ఒకటి: ‘ఎల్ నినో’ (వేడి దశ), రెండు : ‘లా నినా’ (చల్లని దశ). ఈ దశలు ప్రతి రెండు నుండి ఏడు సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, గాలులు వర్షపాతంలో ఊహించని మార్పులను కలిగిస్తాయి. ఇక, ఇ.ఎన్.ఎస్.ఓ.లోని మూడో దశ ‘తటస్థ స్థితి’. ఎల్ నినో ఈ ఏడాది తీవ్రంగా ఉంటుందని చెప్పటానికే దీనిని ‘సూపర్ ఎల్ నినో’ అని అభివర్ణిస్తున్నారు.ఎల్ నినో : ఈ దశలో పసిఫిక్ మహాసముద్రం; మధ్య, తూర్పు ప్రాంతాల్లో నీటి ఉపరితలం సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతుంది. భూమధ్యరేఖ వెంబడి తూర్పు నుండి పడమరకు వీచే గాలులు బలహీనపడతాయి. కొన్నిసార్లు ఇవి అందుకు భిన్నంగా పడమర నుండి తూర్పుకు వీస్తాయి. ఈ ప్రభావంతో ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోతాయి. కానీ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో వర్షాలు పెరుగుతాయి!లా నినా : ఈ దశలో పసిఫిక్ మహాసముద్రం; మధ్య, తూర్పు ప్రాంతాల్లో నీరు సాధారణం కంటే ఎక్కువగా చల్లబడుతుంది. తూర్పు నుండి వీచే గాలులు మరింత బలంగా మారుతాయి. ఆ ప్రభావంతో ఇండోనేషియాలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, కానీ పసిఫిక్ మహాసముద్ర మధ్య ప్రాంతంలో వర్షాలు తగ్గుతాయి.తటస్థ స్థితి : ఇది ఎల్ నినో గానీ, లా నినా గానీ ఉండని సమయం. ఈ స్థితిలో పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు సాధారణంగా సగటు స్థాయిలోనే ఉంటాయి. ్చపసిఫిక్ మహా సముద్రంలోనే ఎందుకు?నిజానికి ఇతర మహాసముద్రాల్లో కూడా చిన్నపాటి వాతావరణ మార్పులు జరుగుతుంటాయి, కానీ ‘ఎల్ నినో’ అంతటి శక్తిమంతమైన మార్పులు కేవలం పసిఫిక్ మహాసముద్రంలోనే రావడానికి ముఖ్య కారణం ఆ సముద్ర పరిమాణం. ఉదా : అట్లాంటిక్ మహాసముద్రం ఒక నీళ్ల టబ్ లాంటిదైతే, పసిఫిక్ మహాసముద్రం ఒక పెద్ద చెరువు లాంటిది. టబ్లో నీటిని కదిలిస్తే చిన్న అలలు మాత్రమే వస్తాయి, కానీ పెద్ద చెరువులో నీరు కదిలితే అది చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఇక్కడా అంతే. పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ఎంత వెడల్పుగా ఉంటుందంటే, భూమధ్యరేఖ వద్ద ఇది భూమి చుట్టుకొలతలో దాదాపు సగానికి పైగా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం చాలా విశాలంగా ఉండటం వల్ల, దాని తూర్పు ప్రాంతానికి (దక్షిణమెరికా), పశ్చిమ ప్రాంతానికి (ఇండోనేషియా) మధ్య ఉష్ణోగ్రతల్లో భారీ తేడా ఉంటుంది. ఈ భారీ తేడానే ప్రపంచవ్యాప్త గాలులను శాసిస్తుంది. చిన్న సముద్రాల్లో ఉష్ణోగ్రత తేడాలు తక్కువగా ఉంటాయి, కాబట్టి అవి వాతావరణాన్ని అంతగా ప్రభావితం చేయలేవు.‘క్లైమేట్ మోడల్స్’ అంటే?భూమి, సముద్రాలు, భూతలం పైన వాతావరణాలు ఎలా మారుతాయో అంచనా వేసే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్ ప్రోగ్రాములే ‘క్లైమేట్ మోడల్స్. ఇవి గాలి వేగం, ఉష్ణోగ్రత, గ్రీన్హౌస్ వాయువుల వంటి గణిత సమీకరణాలను ఉపయోగించి భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉండబోతుందో ముందే చెబుతాయి. శాస్త్రవేత్తలు వీటిని ఉపయోగించి ఎల్ నినో వంటి మార్పులను లెక్కిస్తారు.‘బాల యేసు’ అని అర్థం!‘ఎల్ నినో’ అనే పదం స్పానిష్ భాష నుండి వచ్చింది, దీని అర్థం ‘బాలుడు‘ లేదా ‘బాల యేసు’ (బేబీ జీసస్). పసిఫిక్ మహాసముద్రంలో ఈ వేడి నీటి ప్రవాహం సాధారణంగా డిసెంబర్ (క్రిస్మస్) సమయంలో కనిపిస్తుంది కాబట్టి, దక్షిణ అమెరికా జాలర్లు దీనికి ఆ పేరు పెట్టారు. దక్షిణ అమెరికాలోని పెరూ దేశపు జాలర్లు వందల ఏళ్ల క్రితమే ఎల్ నినో ఉనికిని కనిపెట్టారు. -
హేమకాంతుడి వైశాఖధర్మం
కృతయుగంలో వంగదేశాన్ని కుశకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడి కుమారుడు హేమకాంతుడు. ఒకనాడు హేమకాంతుడు కొందరు భటులను వెంటబెట్టుకుని, వేట కోసం అడవికి వెళ్లాడు. అది వైశాఖమాసం. హేమకాంతుడు అడవిలో అనేక మృగాలను వేటాడాడు. మధ్యాహ్నవేళ ఎండ నడినెత్తికి వచ్చేసరికి అతడు బాగా అలసిపోయాడు. విశ్రాంతికి తగిన చోటు కోసం వెదుకులాడుతూ, అడవిలోనే ఉన్న మునుల ఆశ్రమ ప్రదేశానికి చేరుకున్నాడు.అక్కడ ఉండేవారు శతర్చినులు అనే మునులు. వారు అతిథి సత్కారాల వంటి విప్రకృత్యాలను ఎరుగరు. వారెరిగిన కర్మ తపశ్చర్య మాత్రమే! హేమకాంతుడు ఆ ఆశ్రమ ప్రదేశంలో అడుగుపెట్టే వేళకు శతర్చినులు తపస్సమాధిలో ఉన్నారు. బాహ్యస్పృహను మరచి సమాధి స్థితిలో ఉన్న వారికి హేమకాంతుడి ఆగమనం తెలియలేదు. హేమకాంతుడు సమీపానికి వచ్చినా, వారు అతడి రాకను గుర్తించలేదు. రాజైన తనను మునులు పట్టించుకోనందున హేమకాంతుడు ఆగ్రహం చెందాడు. వారిని చంపాలని నిశ్చయించుకుని, వారిపైకి కత్తి దూశాడు. హేమకాంతుడి దూకుడు గమనించిన శతర్చినుల శిష్యులు అక్కడకు పరుగు పరుగున వచ్చారు. ‘‘ఓరీ దురాత్ముడా! మా గురువులైన శతర్చినులు తపస్సమాధిలో ఉన్నారు. బాహ్యస్పృహలో లేని వారిపైకి కత్తి దూయడం తగని పని. మునులను వధించబూనడం మహాపాతకం, పాపాత్ముడా!’’ అని పలికారు.ముని శిష్యుల మాటలకు హేమకాంతుడు ‘‘విప్రులారా! నేను వేట కోసం ఈ అడవిలోకి వచ్చాను. వేటలో అలసిపోయి, ఇక్కడకు చేరుకున్నాను. మీ గురువులకు వీలు లేకపోతే, మీరైనా నాకు భోజనం పెట్టండి’’ అన్నాడు.‘‘రాజా! మేము గురువులు పెట్టిన భిక్ష తిని బతుకుతున్నాము. వారి అనుమతి లేకుండా ఏ పనీ చేయలేము. వారి ఆజ్ఞ లేనిదే నీకు అతిథి సత్కారాలు చేయడం మాకు కుదరని పని’’ అని పలికారు ముని శిష్యులు. వారి మాటలకు హేమకాంతుడు మండిపడ్డాడు. వారి చంపడానికి విల్లు సంధించాడు. ‘‘దుర్మార్గమైన దొంగలు, క్రూరమృగాలు లేకుండా ఈ అరణ్యాన్ని చక్కదిద్దాను. మీకు భయం లేకుండా చేశాను. మీరు మా వలన అగ్రహారాది సత్కారాలను, ఉపకారాలను పొందారు. ఈ మునులు చేసిన మేలు మరచి, నేను ఇక్కడకు వచ్చినా, నా వంక చూడటం లేదు. ఆకలి దప్పులతో అలసి సొలసి వచ్చిన నాకు అన్నం పెట్టడానికి మీరు వెనుకాడుతున్నారు. మీలాంటి క్రూరులను సంహరించినా పాపం ఉండదు’’ అని పలికి, బాణం విడిచాడు.హేమకాంతుడు ఆగ్రహంతో బాణం సంధించేసరికే ముని శిష్యులు భయభ్రాంతులై అడవిలోకి పారిపోయారు. కోపం చల్లారని హేమకాంతుడు వారిని వెంబడించి, వారిపై బాణ ప్రయోగం చేశాడు. అతడి బాణాలకు మూడువందల మంది శిష్యులు మరణించారు. మిగిలిన వారు పారిపోయారు.ఈ కలకలం సద్దుమణిగాక, హేమకాంతుడి ఆజ్ఞపై రాజభటులు ఆశ్రమాల్లోకి చొరబడి, దొరికిన వంట పదార్థాలను తీసుకొచ్చారు. అందరూ వాటిని ఆరగించాక, కాసేపు విశ్రమించి, సాయంత్రం ఇంటికి బయలుదేరారు.అడవిలో తన కొడుకు హేమకాంతుడు చేసిన దుష్కార్యం తెలుసుకుని, కుశకేతుడు దుఃఖించాడు. కొడుకును నిందించాడు. ‘‘నీవంటి దుర్మార్గుడు రాజ్యపాలనకు తగడు’’ అని పలికి అతడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు.తండ్రి ఆజ్ఞతో హేమకాంతుడు ఇల్లు వదిలి, కీకారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ అతడు బ్రహ్మహత్యా పాతకంతో బాధపడుతూ కిరాతునిలా దొరికిన పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసం తింటూ జీవించసాగాడు. హేమకాంతుడు అలా ఇరవై ఎనిమిదేళ్లు ఆ అరణ్యంలోనే గడిపాడు. ఒక వైశాఖ దినాన త్రితుడు అనే ముని తీర్థయాత్రలకు బయలుదేరి ఆ అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ, మధ్యాహ్న వేళ ఎండ వేడికి తాళలేక మూర్ఛపోయాడు. అదృష్టవశాత్తు హేమకాంతుడు మూర్ఛిల్లిన మునిని గమనించి, అతడికి మోదుగు ఆకుల గొడుగు నీడ కల్పించి, శైత్యోపచారాలు చేశాడు. ముని స్పృహలోకి వచ్చాక అతడికి సొరకాయ బుర్రలో ఉన్న నీరు ఇచ్చి, దప్పిక తీర్చాడు. మార్గాయాసంతో మూర్ఛిల్లిన మునికి శైత్యోపచారాలు చేయడం వల్ల హేమకాంతుడి బ్రహ్మహత్యా పాతకం నశించింది. అతడి మనసు నిర్మలమైంది. అప్పటి నుంచి అతడు సదా శ్రీహరిని స్మరించసాగాడు. కొంతకాలానికి హేమకాంతుడు వ్యాధిగ్రస్థుడై మరణించాడు. అతడిని తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. అదే సమయంలో విష్ణుదూతలు వచ్చి, యమదూతలను అడ్డుకున్నారు. హేమకాంతుడు వైశాఖ ధర్మాలను నెరవేర్చాడని, అందువల్ల అతడి పాపాలన్నీ నశించాయని, అతడిని వైకుంఠానికి తీసుకు రమ్మని శ్రీహరి ఆజ్ఞ అని చెప్పి, యమదూతలను తరిమేశారు. విష్ణుదూతలతో కలసి హేమకాంతుడు వైకుంఠానికి చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
క్లూషియల్: అతడే హంతకుడు
ఒక్కసారిగా ఆ ప్రాంతం పోలీస్ సైరన్లతో నిండిపోయింది.కరుడుగట్టిన నేరస్థుడు, రెండు రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చిన రాకీ సెవెన్హిల్స్ బస్టాప్ దగ్గర హత్యకు గురయ్యాడు. అతడి గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది కూడా అదే! ఇన్స్పెక్టర్ అభిమన్యు దర్యాప్తులో ముందుగా రాకీ క్రిమినల్ హిస్టరీ చూశాడు. అతను చేయని నేరం లేదు, పాల్పడని ఘోరం లేదు. గంజాయి అమ్మకం నుంచి ఆడపిల్లల్ని వేధించడం వరకు అతని మీద చాలా కేసులు ఉన్నాయి.రాకీ చనిపోవడానికి మూడు గంటల ముందు ఒక అమ్మాయిని వెంటపడి ఏడిపించాడు. ఆమె చెప్పు తీసి అతడిని బెదిరించింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రాత్రి తొమ్మిది గంటలకు ఈ గొడవ జరిగింది. అప్పుడే పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ రావడం చూసి, రాకీ అక్కడి నుంచి తప్పుకున్నాడు.ఇది జరిగిన మూడు గంటల తర్వాత పోలీస్ స్టేషన్కు ఫోన్ వచ్చింది. సెవన్హిల్స్ బస్టాప్ దగ్గర రాకీ శవం పడి ఉందని ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్లో చెప్పాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.ఇన్స్పెక్టర్ అభిమన్యు అక్కడ గుమిగూడిన జనాన్ని జరిగిన హత్య గురించి అడిగాడు. వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. ఒక వ్యక్తి మాత్రం ముందుకు వచ్చాడు. రాకీని రాజీవి అనే అమ్మాయి బెదిరించిందని, తాను అప్పుడు అక్కడే ఉన్నానని చెప్పాడు. ఆ సంఘటనను తన ఫోన్లో చిత్రించినట్టు చెప్పి, తన ఫోన్ ఇచ్చాడు. అందులో రాజీవి అనే అమ్మాయి ‘నిన్ను చంపేస్తాను’ అని రాకీని బెదిరించడం స్పష్టంగా ఉంది. మరో గంటలో రాజీవి ఇంటి ముందున్నాడు అభిమన్యు. తాను కోపంతో అతడిని చంపేస్తానని బెదిరించిన మాట నిజమే అని, ఆ తర్వాత భయంతో ఇంటికి వచ్చేశానని రాజీవి చెప్పింది.ఒక మామూలు అమ్మాయి ఒక్కతే అంత దృఢంగా ఉండే రాకీని చంపగలదా?రాకీ ఒంటిపై ఉన్న గాయాలు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చేసినట్లుగా ఉన్నాయి.అభిమన్యు రాకీ ఫోన్ రికార్డులను పరిశీలించాడు. చనిపోవడానికి ముందు రాకీకి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించాడు.‘‘నీ పేరేంటి?’’ అడిగాడు అభిమన్యు అతడిని.రాకీని రాజీవి బెదిరించిన వీడియో తీసింది అతనే!‘‘రాజు...’’ తడబడుతూ చెప్పాడు అతడు.‘‘నీ అసలు పేరు చెప్పు వేలాయుధం’’ అన్నాడు అభిమన్యు. ఉలిక్కిపడిన ఆ వ్యక్తి కంగారుగా లేవబోయాడు.‘‘ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. నువ్వూ రాకీ తోడు దొంగలు. చెన్నైలో మీ పరిచయం. అతడు ఇక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. నువ్వు తప్పించుకున్నావు. మీ ఇద్దరి మధ్య డబ్బు గొడవలు ఉన్నాయి. బెయిల్ మీద విడుదలైన రాకీని చంపాలని నీ ప్లాన్. రాజీవితో రాకీకి జరిగిన గొడవ నీకు కలిసొచ్చింది. రాజీవిని దోషిగా నిలబెట్టి నువ్వు ఎస్కేప్ అవ్వాలనుకున్నావు. ఆ ప్రయత్నంలో నీ రెండో సిమ్తో పోలీసులకు ఫోన్ చేశావు. మొదటి సిమ్తో వీడియో తీశావు.రాకీకి ఫోన్ చేసి సెవెన్ హిల్స్ బస్టాప్ వెనుక వైపు రమ్మన్నావు. అక్కడ సీసీ కెమెరాలు లేవన్నది నిజమే. కానీ కాస్త దూరంలో నిర్మాణంలో వున్న ఒక భవన యజమాని సీసీ కెమెరాలు పెట్టించాడు. ఆ సీసీ కెమెరాల్లో నిర్మాణంలో వున్న భవనంలోకి నువ్వెళ్ళడం రికార్డు అయ్యింది. నీ క్రిమినల్ రికార్డు బయట పడింది. నువ్వు ఇందాక ఫోన్ ఇచ్చినప్పుడు ఫోన్ మీద నీ ఫింగర్ ప్రింట్స్, రాకీ ఒంటి మీద వున్న గుర్తులతో మ్యాచ్ అయ్యాయి. శిక్షకు సిద్ధంగా వుండు...’’ అన్నాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.వేలాయుధాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.‘‘థాంక్యూ సర్! నన్ను సేవ్ చేశారు...’’ రాజీవి కృతజ్ఞతగా అంది.‘‘నేను న్యాయం చేశాను. నీ ధైర్యమే కరెక్ట్. కానీ వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఈ ఇబ్బంది ఉండేది కాదు’’ అంటూ ముందుకు కదిలాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. - శ్రీసుధామయి -
లిట్వరల్డ్: పేరు ‘జింకపిల్ల’, బెబ్బులి కూనయా...
సంగీత సారస్వతాలను చదువులతల్లి స్తన్యంతో పోల్చాడు మహాకవి కాళిదాసు. సంగీతం ఆపాతమధురంగానూ, సాహిత్యం ఆలోచనామృతంగానూ వుంటాయని కూడా ‘కవికులగురువు’ అన్నాడట. సంస్కృతం చదువుకోకపోయినా ఆ విషయం తెలిసిన ఇరవయ్యొకటో శతాబ్ది రచయిత్రి ఒకరున్నారు– ఆమె పేరు ఎల్ఫ్రైడ్ జెలెనిక్. ఆమె సాహిత్యం చదువుతుంటే శ్రావ్యంగా వుంటుందనేది అందరి అనుభవం; దాని గురించి ఆలోచించే కొద్దీ, మన సామాజిక జీవనం గురించిన ఆలోచన పదునెక్కుతూ పోతుందనేది మాత్రం కొందరి అనుభవమే! నవలా రచన– రూపక ప్రక్రియల్లో అందెవేసిన చెయ్యి అనిపించుకున్న ఎల్ఫ్రైడ్ జెలెనిక్ది ఆస్ట్రియా. 2004 నోబెల్ సాహిత్య పురస్కారం ఎల్ఫ్రైడ్ గెల్చుకున్నట్టు ప్రకటిస్తూ ఎంపిక సంఘం చేసిన ‘అధికారిక ప్రకటన’లో రచయిత్రి శైలికి జేజేలు పలుకుతూ ఇలా అన్నారు: ‘ఆమె నవలలూ, రూపకాల్లో సంగీతబద్ధమైన స్వరాలూ, అనుస్వరాలూ అసాధారణమైన భాషాభినివేశంతో జాలువారతాయి. జనం నెత్తిన లోకం రుద్దిన అరిగిపోయిన మూసకట్టు పదబంధాల అసంబద్ధతనూ, వాటి పెత్తందారీ పోకడలనూ ఎల్ఫ్రైడ్ శైలి బట్టబయలు చేస్తుంది!’– ఓ మూసకట్టు పదబంధాన్నే ఉపయోగించదలిస్తే, ‘ఈ మాటల్లో ఆవగింజంతైనా అతిశయోక్తి లేదూ’ అనొచ్చు. బాల్యం నుంచే, అరడజను సంగీతవాద్యాల్లో సుశిక్షితురాలైనందువల్లనే ఎల్ఫ్రైడ్ శైలి అంత శ్రావ్యతను ఆపాదించుకున్న దేమో! వియెన్నా సంగీత విశ్వవిద్యాలయం నుంచి –పిన్న వయసులోనే– ఆర్గనిస్టుగా పట్టా పొందారామె. ఆర్గన్తో పాటు పియానో, వయోలిన్, వయోలా, గిటార్, రికార్డర్ తదితర వాద్యాల్లో కూడా ఆమె ప్రవీణురాలు. పట్టా పొందిన కొద్ది రోజులకే, కుటుంబసంబంధాల కారణంగా ఎల్ఫ్రైడ్ తీవ్రమైన మానసిక ఆందోళన పాలబడ్డారు. చిత్తశాంతి కోసం తడుముకునే క్రమంలోనే ఆమె ఇరవయ్యేళ్ళ ప్రాయంలో కలంపట్టారు. మరుసటి సంవత్సరమే, తన తొలి కవితా సంకలనం ‘లిజా నీడ’తోనే ఎల్ఫ్రైడ్ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. నాటినుంచి నేటివరకూ, ఆమె సాహిత్యప్రస్థానం ఎదురులేకుండా సాగుతూనేవుంది.ఎల్ఫ్రైడ్ అంటే, చెక్ భాషలో ‘ప్రశాంతపాలిక’ అని అర్థమట! ఇక జెలెనిక్ అంటే, ‘జింకపిల్ల’ అని అర్థమట! బహుశా అందుకే కొందరు విమర్శకులు ఆమెని ‘ప్రశాంత హరిణం’ అనడం కద్దు. కానీ తొలి రచన మొదలుకొని నోబెల్ పురస్కారం అందుకున్న ఇరవయ్యేళ్ళకు –2024లో– రాసిన ఆత్మకథాత్మక నవల ‘వ్యక్తిగత వివరాలు’ వరకూ ఎక్కడా ఆమె ప్రశాంత హరిణంలా కనిపించదు. (ఈ రచనకు ప్రామాణిక ఇంగ్లిష్ అనువాదం ఇంతవరకూ వెలువడనే లేదు!) ‘అది ఓ కృతో, ఓ కీర్తనో కావచ్చు– లేదా, ఓ కథో కథానికో కావచ్చు అనునిత్యం ఓ కళాఖండం జీవం కోల్పోతూనే వుంటుంది. చరిత్రలో దాని చెలామణీ చెల్లిపోవడం వల్లనే అలా జరుగుతూ వుంటుంది. ఒకప్పుడు మరణమెరుగని కళాఖండాలుగా భావించిన రచనలే కాలక్రమంలో కనుమరుగైపోవచ్చు. వాటి గురించి భవిష్యత్ తరాలవారికి ఏమీ తెలియకుండానూ పోవచ్చు. అయినప్పటికీ, ప్రతి ఒక్క కళాఖండానికీ నాలుగు కాలాల పాటు బతికిబట్టకట్టే హక్కు ఉంది!’ అని ఎరికా కోహుట్తో అనిపిస్తారు ఎల్ఫ్రైడ్ ‘ద పియానో టీచర్’ నవలలో. (ఆ నవలకు ప్రధాన పాత్ర ఎరికాయే. 28 సంవత్సరాల తర్వాత మైకేల్ హానెక్ ఈ నవలను సినిమాగా తీశారు!) వియెన్నా సంగీత విశ్వవిద్యాలయంలో పియానో శిక్షణ విభాగంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకున్న ప్రొఫెసర్ ఎరికా. ఆమె అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న కళాకారిణి; మంచి శిక్షకురాలు కూడా! అయితే చండశాసనురాలి లాంటి తల్లి పెంపకంలో ఆమె ప్రతిభ రెక్కలు ముడుచుకుని బతుకీడుస్తూ వుంటుంది. వృత్తిజీవితం విషయానికివస్తే ఎరికా విద్యార్థులతో కటువుగా వ్యవహరించే శిక్షకురాలన్నట్లు రచయిత్రి చిత్రించారు. తన విద్యార్థులు అత్యున్నత ప్రమాణాలు సాధించాలనే ఆమె అలా ప్రవర్తిస్తూ వుంటుంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం, తల్లి పెట్టే ఆరళ్ళ కారణంగా ఎరికా చిత్తక్షోభకు గురవుతూ వుంటుంది. ఈ వైరుధ్యాన్ని ఎరికా ఎలా పరిష్కరించుకున్నదనేదే ఈ నవల్లో కథాంశం. ప్రొఫెసర్ ఎరికాకూ, యువ విద్యార్థి వాల్టర్ క్లెమర్కూ మధ్య అల్లుకున్న అనుబంధం ఆసరాతోనే ఆమె తన జీవన వైరుధ్యం పరిష్కరించుకున్నట్లు రాశారు ఎల్ఫ్రైడ్.ఈ వైరుధ్యం ఎరికాకే పరిమితమైంది కాదు– ఎల్ఫ్రైడ్ జీవితంలోనూ ఆమె ఇలాంటి వైరుధ్యం ఎదుర్కొన్న విషయం రచయిత్రే వెల్లడించారు. ఎరికా పాత్రకు రక్తమాంసాలతో పాటు ఆత్మను సైతం సమకూర్చడానికి ఈ ‘ఆత్మానుభవం’ రచయిత్రికి ఎంతో తోడ్పడి వుంటుంది. పైపైన చూస్తే ఇది చవకబారు ‘శృంగార నవల’గా అనిపించవచ్చు. సాహిత్యం ఆలోచనామృతమనే వాస్తవాన్ని మనసులో పెట్టుకుని చూసేవారికే, ఎల్ఫ్రైడ్ జెలెనిక్ దృష్టికోణంలోని విశిష్టత కనిపిస్తుంది.- మందలపర్తి కిషోర్ -
దేనినీ అతి చేయవద్దు
‘ఈ రోజుల్లో పిల్లలను అన్ని విషయాల్లోనూ అదే పనిగా పట్టుకొని ఉండటం వల్ల వారి ఎదుగుదలలో సమస్యలు వస్తున్నాయి’ అంటున్నారు సినీ దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్. ‘‘అమ్మను భూమాతతో పోల్చుతాం. భూమి ఎక్కడా ఆగిపోకుండా, తిరుగుతూనే ఉంటుంది. కానీ, పిల్లలమైన మనల్ని పడిపోకుండా నిలబెడుతుంది. అమ్మ కూడా అంతే. పిల్లలు వారి జీవితంలో నిలదొక్కుకోవడానికి తిరుగుతూనే ఉండాలి. కానీ, అతిగా పట్టుకోకూడదనేది నా ఆలోచన.ఆ(హా)ర్ట్ ఫుల్గా!నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారు నన్ను ఆర్ట్స్ నేర్చుకోమని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్ నేర్చుకున్నాను. ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ బుక్స్ చదివేదాన్ని. వేవిళ్లతో ఉన్నప్పుడు అవి నేర్చుకోవడం కష్టమనిపించేది. కానీ, తప్పేది కాదు. బాబు పుట్టాక వాడి కోసం మా ఆయన కేరింగ్ మరింత ఎక్కువయ్యింది. ‘ఇంత పొసెసివ్గా ఉండటం ఎందుకు?’ అనేదానిని. మా బంధువుల్లో కూడా చాలా మంది అంటుండేవారు. కానీ, ఆయన పట్టించుకునేవారు కాదు. నేను అది పొసెసివ్నెస్ అనుకున్నాను. అలాంటిది 6వ తరగతిలో ఉన్న బాబును స్టేట్ ఆర్ట్ కాంపిటీషన్కు మైసూరుకు ఒక్కణ్ణే పంపించారు. ఆ సమయంలో నేను భయపడ్డాను చిన్నపిల్లాడు కదా అని. కానీ, తను వినలేదు. తరుణ్ ఆ కాంపిటిషన్లో పాల్గొన్నాడు, ప్రైజ్ కూడా తీసుకొచ్చాడు. బాబు కోసం ఫుల్టైమ్ జాబ్ వద్దనుకున్నాను. దీనికి కూడా మావారే కారణం. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లినే ముందుగా వెతుక్కుంటారు. వారు ఒక దశకు వచ్చేవరకు తల్లితో ఉన్న అటాచ్మెంట్ దూరం అవకూడదు అనేవారు. దీంతో ఆర్ట్ టీచర్గా ఫుల్టైమ్ జాబ్ చేసే నేను పార్ట్ టైమ్కి షిఫ్ట్ అయ్యాను.ఈజీ ఫీలింగ్ వద్దుడబ్బులు పొదుపు, సంపాదన గురించి ఎప్పుడూ చెప్పలేదు. అలాగని, ఎప్పుడూ కండిషన్స్ పెట్టలేదు. ప్రతి తల్లీతండ్రీ సాధ్యమైనంత వరకు పిల్లల అవసరాలు తీర్చడానికే ప్రయత్నం చేస్తారు. మేం ఆర్థికంగా కష్టపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ, అవేవీ బాబుకు చెప్పలేదు. కానీ, నన్ను డబ్బులు అడిగితే మాత్రం నేరుగా ఇచ్చేదాన్ని కాదు. మావారికి డబ్బులు ఇచ్చి, ఆయననే ఇవ్వమనేదానిని. ‘అమ్మ సంపాదిస్తుంది. నేను అడిగితే ఈజీగా ఇచ్చేస్తుంది’ అనే ఫీలింగ్ బాబులో రాకూడదనుకున్నాను. డబ్బు గురించి కాదు ఆనందించే సందర్భాలు కోల్పోకూడదు అని తాపత్రయపడేదాన్ని. ఎందుకంటే మళ్లీ ఆ రోజులు, ఆ సందర్భాలు తిరిగి రావు.కథలా చెప్పాలినాకు ప్రతీదానితో కనెక్ట్ చేసి కథలు చెప్పడం అలవాటు. అలాగే సోలార్ ఎనర్జీతో మనకున్న బంధం, మన శరీరంలో ఉన్న అవయవాలతో బంధం ఎలా ఉంటుందో చెప్పేదాన్ని. నాన్న దేవాలయం, అమ్మ అందులో దేవత, బ్రదర్ పూజారి, ప్రసాదం అందరం కలిసి తినేది.. ఇలా ఒక కథలా చెబితే పిల్లలు ఆనందంగా వింటారు, ఆలోచిస్తారు. ఆ కుటుంబ బంధం కూడా బాగుంటుంది. పిల్లల ముందు బంధువుల్లో ఎవరి గురించీ చెడుగా చెప్పకూడదు.సరి చేయాలనుకోకూడదుపిల్లల మెదళ్లలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. పెయింటింగ్లో అయినా, ఏ సృజనాత్మక పనులు అయినా వారు చేసింది మనం సరిచేయవద్దు అనేది నా ఆలోచన. వారి మైండ్లో ఏముందో అది మన ముందు పెడతారు. దానిలో మనం కల్పించుకోవద్దు. మా అబ్బాయి ఎక్కడా పెయింటింగ్ నేర్చుకోలేదు. కానీ, పోర్ట్రయిట్స్ చాలా బాగా వేస్తాడు. తబలా వాయిస్తాడు. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లో కాలేజీ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి. నేను ఆర్ట్ టీచర్ని. కానీ, ఏదీ బాబు చేయిపట్టి నేర్పలేదు. కాలేజీ రోజుల్లోనే షార్ట్ ఫిల్మ్లు ప్లాన్ చేస్తుండేవాడు. అందుకు వాడి స్నేహితులు కూడా ఇంటికి వచ్చేవారు. వారందరికీ కావల్సినవి అమర్చిపెట్టేదాన్ని. తరుణ్ స్నేహితులు నాకు కూడా పిల్లలైపోయారు. ఇప్పటికీ వారందరితో స్నేహబంధం బాగుంటుంది.ఏ కాలానికి ఆ కాలంలో పిల్లల పెంపకంలో వివక్ష ఉంది. ఒత్తిడి ఉంది. ‘ఎక్కడికి వెళ్లావు, ఏం చేస్తున్నావు, అదెందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు ఉన్నావు... ’ అంటూ పదే పదే అంటూనే ఉంటారు. అయితే, పిల్లలకు కూడా బాధ్యత తెలుసు. ఎలా ఉండాలో తెలుసు. మనం ఒక ఫ్రెండ్లా గైడ్ చేయాలి. అంతవరకే మన విధి. అంతకు మించి ఎక్కువ పట్టుకోకూడదు’’ అని తెలిపారు. ∙నిర్మలారెడ్డి -
పీఛే చల్! ఇలా నడిచి చూశారా?
వాకింగ్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. కానీ అదే వాకింగ్ను వెనక్కి చేస్తే డబుల్ ఆరోగ్యం లభిస్తుందంటే నమ్మగలరా? నిజమే! ఫిట్నెస్ ప్రపంచంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ – ‘రెట్రో వాకింగ్’ బాగా పాపులర్ అవుతోంది. నిపుణుల ప్రకారం, ఇది సాధారణ వాకింగ్ కంటే మరింత ప్రయోజనాలు ఇచ్చే వ్యాయామం. ఇలా వెనక్కి నడిస్తే మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ముందుకు నడిచేటప్పుడు ఎక్కువగా పని చేయని కాళ్ల కండరాలు కూడా వెనక్కి నడిచేటప్పుడు యాక్షన్లోకి దిగుతాయి. సాధారణ వేగంతో నడిచినా దాదాపు ‘నలభై శాతం ఎక్కువ క్యాలరీలు’ కరిగిపోతాయి. అంటే తక్కువ టైమ్లో ఎక్కువ పని చేసినట్టే! ఇంకా మెదడు సంగతి చెప్పాలంటే, వెనక్కి నడవడం కొత్త పని కాబట్టి అది ఫుల్ అలర్ట్లోకి వెళ్లి బ్యాలెన్స్, ఫోకస్, జ్ఞాపకశక్తి అన్నింటినీ మరింత పదును పెడుతుంది. కొందరికి వెన్నునొప్పి, కాళ్లు బిగపట్టడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఒక విషయం మాత్రం తప్పక గుర్తుంచుకోండి. మొదట రెండు నుంచి మూడు నిమిషాలు నెమ్మదిగా, ఖాళీ ప్రదేశంలో మాత్రమే ప్రయత్నించండి. లేదంటే వ్యాయామం కంటే ముందు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది! ∙ -
ఈ వారం కథ: కొత్త రంగుల పొద్దు
‘‘ఆహా... జిల్లా అయిపోవడంకాదు గాని, ఏందసి పట్టింది ఈ ఏరియాకి! ఒకప్పుడు దెయ్యాలు తిరిగే సోటిది. నా సిన్నపుడు సేపలు పడ్డానికి కూడా ఇటైపు రావడానికే బయమేస్సీది..’’ నిర్మానుష్యంగా కంకరరోడ్లతో అక్కడక్కడా వేసిన కరెంటు స్తంభాల్ని, కట్టిన భవంతుల్ని చూస్తూ అన్నాడు మరియదాసు.‘‘ఎద్దెప్పుడు ఒకేపక్క తొంగోదు. ఊరెప్పుడూ ఒకేలాగ ఉండిపోదు సిన్నాన్న. ఆటో వచ్చీసింది. పద... పద... సామాన్లు దించిద్దుము.’’ దూరంగా నిల్చున్న ఇద్దరిలో ఒకడైన కృపారావు నడుస్తూ అన్నాడు. రంగులు వేయని భారీ మట్టివిగ్రహంలా బూడిద రంగులో వారివెనుకే అంతెత్తున కనిపిస్తోంది కొత్త ఇల్లు.ఆటోలో నుంచి బకెట్లు, బ్లేడ్లు, పుట్టిబస్తాలు, కేరేజీలు కిందకి దించి; లోపల వాటిని జాగ్రత్తగా భద్రపరచారు. విశాలమైన రూములు, కిచెన్, వెయిటింగ్ హాల్, ఔటర్ బాత్రూమ్, లావెట్రీలతో చుట్టూ కాంపౌండ్ వాల్తో ఇల్లు ముచ్చటగా వుంది. నడివేసవి. ఉదయం పదిగంటల సమయం. బహిరంగప్రదేశం అయినప్పటికీ వాతావరణంలో ఉక్కపోత. ముందు రూమ్లో ముగ్గురూ వరసలో నిలబడి అర్ధనిమీలిత నేత్రాలతో, భక్తిప్రపత్తులతో చేతులు జోడించి నోరు విప్పారు.‘‘ఆదియునూ అంతమునూ అయిన యేసయ్యా... లోకంలో సర్వశక్తిమంతుడైన ప్రభువా... మేము ఈరోజు నుంచి తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమగునటుల...’’ దైవప్రార్ధన ముగిసింది. ఒంటిమీద షర్టుల్ని, ఫాంటుల్ని విప్పి ఒక దగ్గర ఒబ్బిడిగా ఉంచి, షార్ట్లు, బనియన్లు వేసుకున్నారు.పెద్దబ్లేడ్లతో గోడల్ని గీకే పనిని కృపారావు, ఎర్రయ్య మొదలుపెట్టారు. బకెట్లో మెషిన్ ఆన్ చేసి పుట్టి పౌడర్ను నీటితో కలియబెట్టే పనిలో పడ్డాడు దాసు.‘‘సిన్నాన్న... మనలో మన మాట. ఇల్లు సూస్తే పెద్దది. పని చేస్తే ఎక్కువే. ఓనరు ఇచ్చిన లచ్చాఏభైవేల వర్కులో మన కూల్లు పోగా మనకేటైనా మిగుల్తాదా?’’ తొలి ప్రశ్న వేసేడు పాతికేళ్ల కృపారావు.‘‘నీకా డవుటేల? అందిన కూల్లే మనకు గట్టి.’’ బ్లేడ్లకు సర్దిన పుట్టిముద్దను గోడకు రాస్తూ అన్నాడు దాసు.‘‘మరి ఇంతోటి పనిని కాంట్రక్టుకి సెయ్యడమేల?’’‘‘సెయ్యక ఏటి సేస్తామురా? మనుషులెట్టి, లచ్చలకు లచ్చలు మదుపులెట్టి కాంట్రాక్టు పనులు సేస్తూ బొక్లీసుగా తిరగడానికి మనకాడ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులున్నాయేటి? కూలాడితేనే గదా కుండాడతాది...’’‘‘అవునులే సిన్నన్నా.’’‘‘అందికే అన్నీ మూసుకొని మన పని మనం కామ్గా సేసుకోవాల. ఇలాంటి పనులు సెయ్యమని నిగడదీసి తొంగుంటే నష్టం మనకే, ఆలకి కాదు. కూడు జల్లితే కాకులు కరువా! ఇరవైరోజుల్లోన ఈ వర్క్ అయిపోవాలట. అద్దమైందా...’’ దాసు మాటకి బుద్ధిగా తలూపేడు కృపారావు‘‘షాపు ఓనర్ల పనే బాగుందన్నా. ఒక పక్క ఏపారాలు, మరోపక్క లాభాలు...’’ నవ్వాడు ఎర్రయ్య.‘‘షాపు ఓనరుకి మనతోన అగ్రిమెంట్ లక్షాఏభై. ఇంటి ఓనరుతో ఎంతకి వప్పన్నమో మనకి తెలీదు. అయినా అతనెంత తింటే మనకెందుకు? మన పని మనం సూస్కోవాలి గానీ...’’మొదటి రూమ్ పుట్టిపని పూర్తయ్యింది. రెండో రూమ్ కోసం సిద్ధమవుతున్నాడు దాసు.ఇంతలో టీలు వచ్చాయి. ముగ్గురూ టీలు తాగి విశ్రాంతిగా కూర్చున్నారు. నోట్లో ఒంపుకున్న ఖైనీలు పళ్లకింద నలుగుతున్నాయి.మధ్యాహ్నం రెండింటికి అన్నాలు తిని పని ముగించేసరికి చీకటి పడింది. ఇరవైయ్యో రోజున ఇంటి ఓనరు వచ్చాడు. మార్పు చేర్పులేవో చెప్పాడు. దానికో రోజు పట్టింది. తర్వాత రోజు సాయంత్రం.., గంగరాజు షాపు దగ్గరికి ముగ్గురూ చేరేరు. అంతవరకూ ఇచ్చిన మెటీరియల్ మొదలుకొని ఆటోచార్జీలు, నిచ్చెనల అద్దె వరకూ అయిన ఖర్చులన్నీ లెక్కలేసి చివరకు లక్షాఏభై మూడువేలుకు బిల్లు తేల్చాడు షాపు ఓనరు. అదనంగా తనకు మూడు వేలు ఖర్చయ్యిందని కనుక చివరిరోజు కూలీ రాదని దాసుతో చావుకబురు చివరికి చల్లగా చెప్పాడు. అవాక్కయ్యాడు దాసు. కృపారావుకి ఒళ్ళు మండింది.‘‘ఇదన్నేయం... కూలీ ఇవ్వననడం మీకు దరమ్ము కాదు.’’ బతిమాలుతున్న ధోరణిలో ఆక్రోశించాడు దాసు. పక్కనున్న గొడౌన్లోకి వెళ్లేందుకుగాను కిందకు దిగిన గంగరాజు సన్నగా నవ్వి అన్నాడు..‘‘చివరిరోజు కూలీ నీక్కావాలి. మంచిదే. కాదనను. కానీ అనుకున్న దానికంటే మూడు వేలు ఎక్కువయ్యింది. మరి దాని మాటేటి? ఇరవై రోజుల్లో పనవ్వాలని కండిషను. అయ్యిందేటి? ముందే కంప్లీట్ చేసేస్తే కాదంటానా? మిగిల్తే తీసుకోవడానికి రడీగా ఉన్నప్పుడు తగిలినప్పుడు కూడా భరించాలోయ్.రోజంతా పన్చేసి వట్టిసేతుల్తో ఇంటికి తిరిగి ఎలాగెల్లమంటారు సర్..’’ అన్నాడు కృపారావు.‘‘సరే. మీ కూలీ మీకిచ్చేస్తాను. కానీ నాకో పని చెయ్యాలి.’’‘‘ఏటి సార్ అది?’’‘‘పుట్టిబస్తాలు, రంగుడబ్బాల లోడు రేపొస్తది. మనషాపు ముందే వేను ఆపుతాడు. మీ ముగ్గురూ ఉదయం ఏడింటికల్లా వచ్చి పెరిగీయండి. చాలు... ఎంత... రెండు గంటల పని. మీ డబ్బులు మీకిచ్చేస్తాను. ఇంకో పనికి కూడా మీరు వెళ్లిపోవచ్చు.’’ తను చెప్పాల్సింది చెప్పి గోడౌన్లోకి దూరిపోయాడు ఓనరు.ముఖాలు వేలాడేసుకొని ముగ్గురూ ఇళ్లకు తిరిగొచ్చేశారు. నీళ్లలో ఉడుకుతోన్న గవ్వసున్నం మాదిరిగా దారిపొడవునా కృపారావు కుతకుతలాడుతూనే ఉన్నాడు. జేవురించిన ముఖంతో ముద్దగా ఉండిపోయాడు దాసు.రాత్రి పదకొండయ్యింది. కృపారావుకి చాలాసేపు నిద్ర పట్టలేదు. చివాల్న లేచి బయటకి వచ్చాడు. ఆరుబయట వేసుకున్న మంచాలపై పగలంతా పడ్డ కష్టాన్ని మరిచి మత్తుగా నిద్రపోతోంది ఇందిరా కాలనీ. ఎక్కడో వీధికుక్కొకటి అరుస్తూ ఉంది. ఎదురింట్లోకి వెళ్లి నిద్రపోతున్న దాసుని తట్టి లేపాడు.కృపారావుని అలా చూసేసరికి దాసుకి నిద్రమత్తంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది.‘‘ఎక్కడా సూడనేదు ఇంత అన్నేయం... అన్ని కర్సులు మన మీద పడీసి అనవసర కండీషన్లు పెట్టీసి, సివరికి ఒకపూట కూలీ ఎగ్గొట్టీసి మల్లీ రేపు పనికొస్తే డబ్బులు ఇస్తానంటాడా... ఏటి ఆడికంత సోస. మనకేటి సేతకాదన... సెయ్యలేమన... అసలు తప్పు ఆడిది కాదు, నీది. ఎంటనే కాలరు పట్టుకొని నలుగుర్లో కడిగీసి ఉంటే దెబ్బకి అటో ఇటో తేలిపోను. ఇప్పుడు సూడు... సచ్చినట్టుగా ఎల్లాలి.’’పిచ్చెక్కినవాడిలా అరిచాడు కృపారావు. గ్లాసుతో అతనికి నీళ్లిచ్చి, తాగమని చెప్పి తాపీగా బీడీ వెలిగించి గట్టిగా దమ్ము లాగాడు దాసు.‘‘ఒరేయి ఎర్రినాయాల... నువ్వీ మజ్జిన వచ్చినావు. నీకివి కొత్త. నువ్వే కాదు, నేను కూడా నీకంటే గట్టిగా అరవగల్ను. దానివలన లాభమేటి? అక్కడితో కట్... ఇంకో పనికి మనల్ని పిలరు. పిలనియ్యరు. బ్లాక్ లిస్ట్ అంటారే, అలాగ... ఓనర్లంతా ఇక్కడ సిండికేటురా నాయన.’’ అన్నాడు దాసు.‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము?’’‘‘పలాన ఇన్ని రోజులని ఇంకనుకోలేదురా. అనుకున్న ఎంటనే చెప్తాన్లే..’’ పకాలున నవ్వాడు దాసు.‘‘ఇదిగో... అలాటి కుయ్యోత్తులాడితేనే నాకు సిరాకు..’’‘‘లేకపోతే యేట్రా? పెశ్నించడం సులువే... జవాబు సెప్పడమే కష్టం. అందులోని నువ్వడిగిన పెశ్నకు జవాబు తెలిస్తే మనమెందుకిలాగ ఉంటాము. మన బతుకులెందుకిలాగుంటాయి.?’’ నిదానంగా అన్నాడు దాసు.‘‘మా గొప్పగా సెలవిచ్చెవులే... నిన్నడగడం నాదే బుద్ది తక్కువ.’’ చిరాగ్గా వెళ్ళిపోయాడు కృపారావు.మంచంపై పడుకున్నాడేగానీ దాసుకి కూడా ఎంతకూ నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ దొర్లుతున్నాడు.‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము?’’తన యవ్వనారంభ దశలో తండ్రికి వేసిన అదే ప్రశ్న. ఈసారి కృపారావు నుంచి మరోసారి... నిద్ర రానివ్వని ప్రశ్న.. జవాబు దొరకని ప్రశ్న... మనసులో సుళ్ళు తిరుగుతూ... సుమారు పాతికేళ్ల నాటి పరిస్థితి. పేరుకే ఆ ఊరు మున్సిపాలిటీ. పల్లె కంటే కొంచెం ఎక్కువగానూ పట్నం కంటే చాలా తక్కువగానూ ఉంటుందా ఊరు. ఊరి చివరన ప్రధాన రహదారికి ఒక పక్కన చాకలి వీధి, గొడగలవీధి, మొండివీధి, దిగువ రాజ్యం... ఇలా అనేక వీధుల సముదాయంలో ఇందిరాకాలనీ ఇంకొంచెం ముందుంటుంది. ముందుగా ఎండియ్య టీకొట్టు,దానిపక్కనే కొత్తపట్నం షావుకారి కిరాణా దుకాణం, ఇంకొంచెం దూరంలో పొంగడాలు, బూరెలు, దుంపలు అమ్మే నీలవేణి బడ్డీ, అంతా కలిపి వంద గడపతో కనిపిస్తుంది. కంపు గొడుతూ పందులు తాగే కుడితి తొట్టెలు అన్ని చోట్లా... ప్రభుత్వ రుణాలతో అగ్గిపెట్టెల్లా లేచిన స్లాబ్ ఇళ్ళు కొన్ని చోట్ల కనిపిస్తాయి.‘‘నాలుగైపోతంది... మాట గాసేస్తానేటో... దాసుగాడేడి?’’చివికిన రెల్లుగడ్డితో పొగచూరిన పైకప్పును చూస్తూ మట్టి అరుగుపై ఉన్న బొంతపై అటూ ఇటూ దొర్లుతున్న ఆదెయ్య, నర్సమ్మను అలా అడగడం నాలుగోసారి.‘‘అడివి నుంచి ఇప్పుడే వొచ్చినాను గదా. నాకేటి తెల్సు?’’రెండురూపాయలిచ్చి ఎండియ్య టీకొట్టు నుంచి దోసకాయచెంబు నిండా టీ తీసుకువచ్చిన నరసమ్మ అంది. రెండు గ్లాసుల నిండా సర్ది భర్తకొకటి ఇచ్చి తనొకటి తీసుకొని తాగడం మొదలుపెట్టిందామె.పొద్దున్ననగా గంజన్నం, పిండొడెంతో కారేజీ సర్దుకొని, దగ్గర్లో ఉన్న అడవికి వెళ్తుందామె. మారేడు, ఉసిరిక పత్రీ, బంగాళాకుల్ని తెంపి, పెద్ద గోనె సంచిలోకి మూటకట్టి ఇంటికి తీసుకువస్తుంది. పత్రిని చిన్న కట్టలుగా కట్టి రోజూ గుడికి వెళ్లే శ్రీమంతుల ఇళ్లకూ, బంగాళాకుల్ని పెద్ద కట్టలుగా కట్టి హోటళ్లకూ, కిరాణా షాపులకు సరఫరా చేస్తూ నెలకింతని సంపాదిస్తుందామె. అందుకని ఆమెకు ఆకుల నర్సమ్మ అని మరోపేరు. ‘‘అదిగో... మాటల్లోనే వస్తన్నాడు బాబు.’’ తువ్వాలు మూటను చేత్తో పట్టుకుని వస్తోన్న దాసుని చూసి అంది నరసమ్మ. గడపలోకి రాగానే మూటను విప్పి దాసు గచ్చు మీద విదిల్చాడు.‘‘ఎక్కడ పట్టేర్రా ఇవి.?’’ కిందామీదా పడుతూ కొట్టుకుంటోన్న మిట్టల్ని చూస్తూ అంది నరసమ్మ.‘‘పెట్రోలుబంకు ఎనకాతల మళ్లల్లో గుమ్ములు నేవా... అక్కడ. నానూ, పిట్టడు, సొట్టరాజుగాడు ముగ్గురము కలిసి పట్టేము.’’ అన్నాడు దాసు.సంబరంగా తపేలాలో వాటిని సర్ది లోపలకు వెళ్ళిపోయిందామె.‘‘దాసు... టైము నాలుగైంది. పిల్లల్ని తీసుకురాడానికి ఎల్లవేటి?’’ అన్నాడు ఆదెయ్య.‘‘ఆ... ఇదిగిదిగో... ఎల్తన్నాను.’’ఇంటి పక్కనున్న రిక్షాను రోడ్ మీదకు ఎక్కించి రయ్మని తొక్కుకుంటూ వెళ్లిపోయాడు దాసు.మూడిళ్లల్లోని పిల్లల్ని రోజూ స్కూలుకు రిక్షామీద తిప్పే ఆదెయ్యకు గత వారం నుంచి బాగోలేదు.అందుకని డాక్టర్ సలహా మేరకు కొడుక్కి ఆ పనిని ఒప్పజెప్పాడు ఆదెయ్య. కొడుకు తెచ్చిన చేపలకి తోడు నెయ్యిల సీతమ్మ దగ్గర పదిరూపాయిలకు పిత్తపరిగెల వాటాను తీసుకుంది నరసమ్మ. పరిగెల్ని పులుసుగానూ, మిట్టల్ని ఇగురుగానూ వండింది. భార్యచేత తిట్లు తినడం ఇష్టంలేని ఆదెయ్య మందెయ్యకుండానే తొలిసారి నీసుకూరతో ఆ రాత్రికి భోజనం కానిచ్చాడు.దాసుకి ఆటలంటే ఇష్టం. ఇంటరు పోవడానికి అతని ఆటలే సగం కారణం. పగలంతా పక్కనున్న రామయ్యబందలో రోజూ మిత్రులతో కలిసి వాలీబాల్ ఆడతాడు. శుక్రవారం రాత్రయితే చాలు ఉత్సాహంగా రోడ్లపై తిరుగుతాడు. షాపులు కట్టే వేళల్లో దిష్టికని వాటిముందు కొట్టే కొబ్బరి చిప్పల్ని వరసగా ఏరతాడు. కొత్తపట్నం షావుకారి దగ్గర కొన్న పది రూపాయల పంచదార పొట్లాన్నీ, తన వాటాగా వచ్చిన కొబ్బరిచిప్పల్నీ తల్లికిస్తాడు. వాటితో కొబ్బరి చక్కీల్ని పొయ్యడమో, ఒక్కోసారి అంబలితో కారంగా నంజుకునే కొబ్బరిపచ్చడి చెయ్యడమో చేసేదామె. రోజులో రెండు తడవలు పిల్లల్ని స్కూల్లో దింపాక బయట బేరాలకని నెయ్యిల వీధి సెంటర్లో రిక్షాను ఉంచుతాడు ఆదెయ్య. పాసెంజర్లకు మొదట బేరమెంతో చెప్పి ఆనక వాళ్ళెంత ఇస్తే అంత అందుకుని ‘సాలదు బాబూ’ అని గొణుక్కుంటూ వెళ్లిపోవడం అతనికలవాటు. అందుచేత అతని వ్యవహారం చూసి అసలుబేరం కంటే తక్కువ ఇచ్చేవాళ్లే ఎక్కువ. ఆదివారంనాడు శుభ్రంగా తయారై బైబిల్ చేత పట్టుకొని కుటుంబంతో సహా చర్చికి వెళ్లి దైవవాక్యం వినడం అతనికిష్టం.అదేరోజు సాయంత్రం కలిగినవారి కుటుంబాల్ని సినిమా థియేటర్లకు దిగబెట్టి వాళ్ళెంత ఇస్తే అంత తీసుకొని తిరిగొచ్చేయడం అతని బలహీనత. ఇక్కడే దాసుకీ, ఆదెయ్యకి నప్పేది కాదు. శ్రమకి తగిన డబ్బుని అడగడంలో తప్పేముందని తండ్రిని ప్రశ్నించేవాడు. గొడవ పడేవాడు.‘‘అలాగడిగిన మనిషికి ఇలువుండదురా. ఆలంతా పెద్దోలు. అవకాశాలున్నోలు. మనం ఆమాత్రం మురాబు వుంచుకుంటే ఎవరైన సాయపడరేటి..?’’ అనేవాడు తండ్రి.‘‘అది నీ బ్రెమ... ఎవరైనా ఎందుకు చేస్తారు?’’‘‘అలగనీకరా... ఏమో... ఎవరితో ఏ అవసరముంతాదో!’’‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము? ’’జవాబు చెప్పలేక మౌనంగా ఉండే ఆదెయ్యను మరిక రెట్టించేవాడు కాదు దాసు. కాని ఆ ప్రశ్నమాత్రం అతనిలో బలంగా పాతుకుపోయింది. కొన్నాళ్లకి తల్లిదండ్రులు గతించడంతో గానుగెద్దులా కష్టపడటమే తప్ప అతనికి మరొకటి తెలియకుండా పోయింది.కాలక్రమేణా టౌన్ రూపురేఖలతోపాటు, వీధి రూపురేఖలు కూడా మారిపోయాయి. రిక్షాలు మాయమై ఆటోలు, తోపుడు బళ్ళు ప్రవేశించాయి. రిక్షా కార్మికులు, సిమెంట్, ఐరన్ షాపుల్లో కళాసీలుగానూ, తాపీ మేస్త్రీలుగానూ, కాయగూరలు అమ్మే చిల్లర వర్తకులుగాను మారేరు. పది పాసైన కుర్రాళ్లంతా ఆర్మీలోకి వెళ్ళిపోతే, పోయిన వాళ్లంతా నగరాల్లో సెక్యూరిటీ గార్డులయ్యారు. కొద్దిమంది మాత్రమే ఉద్యోగస్తులయ్యేరు. ఎటూ వెళ్లలేని దాసులాంటి వారు పెయింటర్లయ్యారు. కానీ అతనితో పాటు అతనిలో ఏళ్ల తరబడి అంటుకట్టుకొని పోయిన ఒకప్పటి అతనిప్రశ్న మాత్రం సలపరించే గాయమై బాధిస్తూనే ఉంది. కొన్ని తరాల నుంచి తమ కుటుంబం సమాజం పట్ల ప్రదర్శించిన విధేయత, మంచితనం వలన ఒరిగిందేంటి? తండ్రి ఆశించిన మేలేదైనా జరిగిందా? లేదే! అలాంటప్పుడు ఎందుకీ అనవసరపు తాపత్రయం. స్వతంత్రంగా బతకలేమా... సగౌరవంగా బతికి చూపించలేమా... సగం రాత్రి వరకు దాసులో సాగిన ఆలోచనలెన్నో! మూత్రం పోయడానికని బయటకు వచ్చి, ఆ పని కానిచ్చి యథాలాపంగా బయట నిల్చున్నాడు దాసు. నిర్మానుష్యంగా... నిశ్శబ్దంగా ఉన్న రోడ్డుపై ఒక చేత్తో వెలుగు దారి చూపిస్తూ, మరొక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని నిల్చుని ఉన్న నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం వీధి లైటు వెలుతురులో దూరంగా, మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. వెలుగు రేఖలేవో ప్రసరించినట్టయ్యింది.‘లోడు దించడానికి ఉదయాన్నే గభీల్న ఎల్లాల... ఏటయితే అదవ్వనీ... తర్వాత సూద్దుము.’ మంచంపై పడుకుంటూ మనసులో అనుకున్నాడు దాసు. తెల్లవారి మూడు దాటాక అతనికి మాగన్నుగా నిద్ర పట్టింది.∙∙ తర్వాత రోజు ఉదయం పదిగంటలకు షాపు తెరవడానికి వచ్చిన గంగరాజు అక్కడి దృశ్యం చూసి కోపోద్రిక్తుడయ్యాడు. పట్టరాని ఆవేశంతో సెల్ తీసి దాసుకి ఫోన్ చేశాడు. నిమిషాల్లో ఎర్రయ్య, కృపారావులతో పాటు మరికొంతమందిని వెంటబెట్టుకొని వచ్చాడు దాసు..‘‘దాసూ... నేను చెయ్యమన్నదేంటి... నువ్వు చేసిందేంటి? ‘‘షాపుముందు వరసగా పేర్చి ఉన్న పుట్టి బ్యాగుల్ని, రంగు డబ్బాల్ని చూస్తూ అన్నాడు గంగరాజు.‘‘మీరు సెప్పిందే గదేటి... ఇంకేటి సేశాను?.’’ అన్నాడు దాసు.‘‘ఏం చెప్పాను..?’’‘‘లోడుని పెరిగీమన్నారు... పెరిగీసాం గదా..’’‘‘పెరిగీడమంటే గౌడౌన్ లోపలకి పెట్టాలని తెలీదా?’’ విరుచుకుపడ్డాడు గంగరాజు.‘‘ఆ మాట నిన్న మీరనలేదు గదా.’’‘‘అలాగని రోడ్ మీద దించేస్తారా ..’’‘‘టైమెక్కడిది సారూ? మీరే గదా రెండు గంటల్లో దించేసి ఇంకో పనికి ఎళ్లిపొమ్మన్నారు?’’‘‘ఏటివోయ్ దాసు... కొత్తగా మాట్లాడుతున్నావు. ఏటి సంగతి...’’‘‘మేమేటి కొత్తగా అనడంలేదు. మీరన్నదే... మా కూల్లు మాకిచ్చేస్తే మేమింకో పనికి ఎళ్ళిపోతాం.’’‘‘గోడౌన్ తాళాల కోసం ఇంటికి రాకపోతే లోడు రాలేదేటోననుకున్నాను. ఇలాంటి మడతపేచీ ఉందనుకోలేదు. సరే, తగువెందుకులే గానీ ముందు లోపలకి సామాన్లు పెరిగీయండి. డబ్బులిచ్చేస్తాను.’’ కొంచెం మెత్తబడి అన్నాడు గంగరాజు.‘‘కుదరదు.’’‘‘ఏం... ఎందుకని? ‘‘‘‘నిన్నటిది ఇయ్యాల్టిది... కలిపి రెండు రోజులు కూలవుద్ది... పెరిగీమంటారా?’’‘‘కూలీ ఒక్కరోజుదే కదా... రెండు రోజులేటి?’’‘‘అదంతే... ఇష్టం నేకపోతే సెప్పండి. లోడు ఇక్కడే ఇక్కడే వుంటాది... మా దారిన మేము పోతాము. ఎవులుతో పెరిగిస్తావో చూస్తాము. అంతేకాదు ముందు డబ్బిస్తేనే పని. నేదంటే నేదు...’’ఆ మాటకి గంగరాజు కోపం నషాళానికి అంటింది. అయినా తమాయించుకున్నాడు. చేసేదేంలేక నాలుగువేల ఎనిమిది వందల రూపాయలు జేబులోనుంచి చిరాగ్గా తీసి దాసుకి అందించాడు. లోడు గోడౌన్లోకి చేరింది. ఊపిరి పీల్చుకున్నాడు గంగరాజు. జేబులోనుంచి పన్నెండు వందలు తీసి అతని చేతిలో పెట్టాడు దాసు. ప్రశ్నార్థకంగా చూశాడతను.‘‘నిన్నటిది పూర్తి కూలీ. ఈ రోజుది సగం కూలీ. పోను మిగతాది ఈ డబ్బు... మీరే దాసుకోండి. కోట్లు గడించీయండి. మాకేటి ఎంగిలి కూడు అక్కర్లేదు మీలాగ...’’అన్నాడు దాసు. చేతిలో నలిగిన నోట్లనీ... నిశ్చలంగా ఉన్న దాసు ముఖాన్నీ చూస్తూ ఏదో మాట్లాడబోయాడు గంగరాజు. కానీ దాసు అవేవీ వినిపించుకోలేదు. నింగికెగసిన పక్షుల గుంపులో తానొక పక్షిలా స్వేఛ్ఛగా తనవారితో కలిసి వడివడిగా రోడ్డు దాటి వెళ్ళిపోయాడు.- పాలకొల్లు రామలింగస్వామి -
ఆరోగ్యవంతమైన సోడా..!
రంగు రంగుల చల్లని సోడా పానీయాలకు వేసవిలో గిరాకీ విపరీతంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతుంటారు. కృత్రిమ రంగులు, మితిమీరిన మోతాదులో చక్కెర కలిపి తయారుచేసే సోడా పానీయాలు ఆరోగ్యానికి హానికరమే అనడంలో ఎలాంటి సందేహాం లేదు. అయితే, జపాన్లో దొరికే ఈ సోడా పానీయం మాత్రం చాలా ఆరోగ్యకరమైనది. ఎందుకంటే, ఇది మజ్జిగతో తయారు చేసే సోడా.‘కాల్పికో సోడా’ పేరుతో 1919 నుంచి ఇది జపాన్లో అమ్ముడవుతోంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఇందులోనూ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇది పొట్టకు మేలు చేస్తుంది. ఇందులో ఎలాంటి హానికర రసాయనాలు, కృత్రిమ రంగులు ఉండవు. ఒకరకంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన సోడా పానీయం అని చెప్పవచ్చు. (చదవండి: ఈ ఐస్క్రీమ్... చాలా హాట్ గురూ!) -
కథాకళి: ఓ వర్షం రాత్రి
జిగ్నేష్కి అతని క్లాస్మేట్ కావ్యమణి ఐదేళ్ళ తర్వాత అకస్మాత్తుగా మెట్రోలో తారసపడింది. ఇద్దరూ ఒకే స్టేషన్ లో దిగాక జిగ్నేష్ ఆమెని ఎదురుగా ఉన్న కాఫీ షాప్కి ఆహ్వానించాడు. మోమోస్ తిని, కాఫీ తాగుతూ ఒకరి గురించి మరొకరు చెప్పుకున్నారు. కావ్యమణికి పెళ్ళై విడాకులు కూడా అయ్యాయని తెలిశాక అతను ఆహ్వానించాడు.‘‘మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఈ రాత్రికి మా ఇంటికి రారాదు? నువ్వు వర్కింగ్ ఉమెన్ ్స హాస్టల్లో ఉంటున్నావు కాబట్టి ఎవరి అనుమతి అవసరం లేదు.’’‘‘ఆలోచిస్తాను. ఇందుకు మెంటల్గా నేను ప్రిపేర్ అవడానికి కొంత సమయం పడుతుంది. సాయంత్రం ఐదు తర్వాత ఫోన్ చేస్తాను.’’ కావ్యమణి జవాబు చెప్పింది. ‘‘నేను వంట కూడా బాగా చేస్తాను.’’ జిగ్నేష్ ‘వంట’ పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పాడు. ఆరున్నర దాకా అతను ఆమె ఫోన్ చేస్తుందా, లేదా అనే ఆదుర్దాకి గురయ్యాడు. ఆరు ముప్ఫై ఐదుకి కావ్యమణి నుంచి ఫోన్ వచ్చింది. ‘‘మీ ఇంటికి ఎలా రావాలో లొకేషన్ పంపు. నేను ఎనిమిదిన్నరకి రావచ్చా?’’‘‘ష్యూర్ అండ్ థాంక్స్.’’ విప్పారిన మొహంతో చెప్పాడు.అతను ఎనిమిదింటికి బియ్యం నానపెట్టాడు. ఫ్రిజ్ తెరచి కూరగాయలు తరిగి సిద్ధం చేశాడు. ఎనిమిదింపావుకి ఆకాశంలో మబ్బులు కనిపించాయి. మెరుపులని చూసి వర్షం వస్తుందని అనిపించాక కావ్యమణి రావటం విరమించుకుంటుందా అని భయపడ్డాడు.వంటపనిలో ఉండగా డోర్ బెల్ మోగితే తలుపు తెరిచాడు. మంచి పెర్ఫ్యూమ్ వాసన. కావ్యమణి వచ్చింది. ఆమె తన హెల్మెట్ని సోఫా మీద ఉంచి అడిగింది.‘‘నా స్కూటీని కార్ పార్క్లో నీ కారు వెనక పార్క్ చేశాను. ఓకే కదా?’’‘‘ఓకే.’’ఆమె ఫ్రెంచ్ డోర్ని తెరిచి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోకి కొద్ది క్షణాలు చూసి మళ్ళీ లోపలకి వచ్చి అడిగింది.‘‘స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? ఆకలిగా ఉంది.’’‘‘కూర్చో. నాలుగైదు నిమిషాల్లో బర్గర్ చేస్తాను.’’అతను బర్గర్ పేటీని డీప్ఫ్రీజర్లోంచి తీసి, రెండువైపులా నెయ్యి స్ప్రే చేసి, ఏర్ ఫ్రైయర్లో ఉంచి, మూడు నిమిషాల తర్వాత వెనక్కి తిప్పాడు. ఈలోగా టొమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర కోసి, బర్గర్ బన్ మధ్యకి కోసి పెనం మీద కాల్చాడు. బర్గర్లో అన్నిటినీ పెట్టేముందు టొమాటో, మస్టర్డ్, చిల్లీ సాస్లు వేశాడు.‘‘బావుంది. బావుంది కాదు. ఎక్సలెంట్.’’ చెప్పి ఆమె జీరో కోక్ తాగింది.జిగ్నేష్ భార్య పుట్టింటికి కానుపుకి వెళ్ళి నాలుగు నెలలైంది. అతనికి అప్పటి నించి స్త్రీ సంపర్కం లేదు. తొందరగా ఉంది.‘‘వాతావరణం బావుంది కదా?’’ బాల్కనీలోంచి ఫ్రెంచ్ డోర్ ద్వారా చల్లటి గాలి వీస్తూండటంతో అడిగాడు.‘‘అవును. మనకి చక్కటి మూడ్ ఇచ్చే వాతావరణం.’’ కావ్యమణి చెప్పింది.ఆమెకి తన భార్య నైటీ ఇచ్చాడు. అతని ఎదురుగానే దాన్ని మార్చుకుంది. ఆమెని కౌగిలించుకుని చుంబించబోయాడు. అకస్మాత్తుగా ఫ్రెంచ్ డోర్ లోంచి తూనీగలు, రెక్కల పురుగులు, వందల సంఖ్యలో లోపలికి రాసాగాయి. అతను ఆమెని వదిలి ఫ్రెంచ్ డోర్ మూయబోయాడు.‘‘ఒద్దు.’’ కావ్యమణి అతన్ని ఆపి చెప్పింది.‘‘ఒద్దేమిటి? దీపం పురుగులు.’’ ఆశ్చర్యంగా చెప్పాడు.కావ్యమణి నేలరాలిన ఓ పురుగుని తీసి పరిశీలించి చూసి ఆనందంగా చెప్పింది.‘‘ఉసుళ్ళు.’’‘‘ఉసుళ్ళా?’’‘‘అవును. వీటిని ఉసుళ్ళు అంటాం. మీ ఇంటి దగ్గరలో చెదల పుట్టలు ఉండి ఉండాలి. వాటికి ఎండాకాలం వానకి రెక్కలు వచ్చి, మూకుమ్మడిగా పుట్టలోంచి బయటికి వస్తాయని, వీటి ఆయుష్షు నాలుగైదు గంటలు మాత్రమేనని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది. ఇవి ప్రొటీన్ ఫుడ్ అని తెలుసా? వీటిని వేయించుకుని తింటాం. చాలా రుచిగా ఉంటాయి. చాలా కాలానికి భలే దొరికాయి.’’కావ్యమణి ఓ బేసిన్ లో నేలరాలిన ఉసుళ్ళని ఏరి, వాటి ట్రాన్స్పరెంట్ రెక్కలను తుంచి, పురుగులను బేసిన్ లో వేయడాన్ని జిగ్నేష్ అసహ్యంగా చూశాడు. ఆమె ఆ పనిని అరగంటకి పైగా పూర్తి చేశాక స్టవ్ వెలిగించి, ఆ పురుగులను నూనెలో వేయించి ఉప్పు కారం కలిపి రెండు ప్లేట్లలో పెట్టి తెచ్చింది.‘‘తిను. చాలా టేస్టీ.’’‘‘నో. థేంక్స్. నువ్వే తిను.’’ఆమె వాటిని తింటూంటే చెప్పాడు.‘‘నేను బయటికి వెళ్ళొస్తాను.’’అతను ఆ రాత్రి తిరిగి రాలేదు. మర్నాడు ఉదయం అతను వచ్చేసరికి కావ్యమణి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమై, అతని కోసం ఎదురుచూస్తోంది.‘‘రాత్రి నువ్వు రానని టెక్స్ట్ మెసేజ్ ఇచ్చావు. ఏమైంది?’’ అడిగింది.‘‘అర్జంట్గా ఆఫీస్ పని చేయాల్సివచ్చింది.’’ఆమె వెళ్ళాక అతను బేసిన్ ను, బాణలిని చెత్త డబ్బాలో పడేసి, ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ అనుకున్నాడు.‘ఇంకా నయం. త్వరపడి కావ్యమణి పెదాలని ముద్దు పెట్టుకోలేదు’ ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
మెల్లగా కరిగే నైస్..ఐస్
నిశ్శబ్దంగా గ్లాసు అంచున చేరి, చల్లని స్పర్శతో పరిచయం అవుతుంది. ఆయుష్షు రెండు నిమిషాలే అయినా, వచ్చిన క్షణం నుంచే చిరునవ్వులు కురిపిస్తుంది. ఉన్నంత సేపూ ‘చిల్’ చేస్తూ, రోజంతటి అలసటను కరిగించేస్తుంది.మాయమైయ్యే ఆఖరి క్షణం కూడా మనసు నిండా ప్రశాంతతను నింపి, మీకొక ‘కూల్ క్యారెక్టర్’నిస్తుంది. ఇంతకీ ఎవరీ కూల్ ఫ్రెండ్ అనుకుంటున్నారా? ఇంకెవరు.. మన పానీయాల ప్రథమ బంధువు, ‘ఐస్’! అవును, నిన్నటి దాకా ఒక తెల్లటి మొండి మంచు గడ్డగా మాత్రమే కనిపించే ఇది. నేడు, ఒక అపురూపమైన వజ్రంలా ‘క్రాఫ్ట్ ఐస్’గా రూపు మార్చుకుని, విలాసానికి చిరునామాగా మార్కెట్లో మెరిసే ఐస్వర్యంగా మారిపోయింది! ఒక రాతిని మలిస్తే ఎలా శిల్పంగా మారుతుందో, అచ్చం అలాగే ఐస్ కూడా వివిధ రూపాల్లో క్రాఫ్ట్ ఐస్గా మారి, ప్రత్యేకమైన గౌరవం, హోదా, అందాన్ని సొంతం చేసుకుంటోంది. ఎందుకంటే, ఈ క్రాఫ్ట్ ఐస్, సాధారణ ఐస్ క్యూబ్ కంటే చాలా స్పష్టంగా అందంగా మెరుస్తూ, నెమ్మదిగా కరుగుతుంది. ఇది డ్రింక్ రుచిని కూడా మెరుగ్గా చేస్తుంది. అందుకే, ఇప్పటి ప్రపంచంలో డ్రింక్కి మొదటి హీరో క్రాఫ్ట్ ఐస్గామారింది. ఇదివరకు అది గ్లాస్లో నిశ్శబ్దంగా కూర్చునే ఒక ‘ఎక్స్ట్రా ప్లేయర్’. కాని ఇప్పుడు ఒక డ్రింక్ రుచి, లుక్ను మార్చేసే పవర్ సొంతం చేసుకొని స్టేజ్పై స్పాట్లైట్ దక్కించుకున్న ‘స్టార్’. ఎందుకంటే అది సాధారణ ఐస్ నుంచి క్రాఫ్ట్ ఐస్గా రూపాంతరం చెందింది. డ్రింక్ ఆర్డర్ చేసినప్పుడు చాలామంది అడిగేది ‘చల్లగా ఉందా?’ అని, కాని, గ్లాస్లో పడే ఐస్ ముక్క గురించి ఎవరూ ఆలోచించరు. దాని క్వాలిటీ, సైజ్, డిజైన్ వంటివన్నీ అసలు పట్టించుకునే వారే కారు. కాని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మబ్బుల్లేని మంచు! ఇంట్లో తయారు చేసే ఐస్ క్యూబ్స్ను గమనించారా? మధ్యలో తెల్లగా, మబ్బు పట్టినట్టు కనిపిస్తాయి. సైన్స్ పరంగా, ఆ తెల్లటి మసక వివిధ గాలి బుడగలు, నీటిలోని చిన్న మలినాలు కలిసి గడ్డకట్టిన గుర్తు. కానీ క్రాఫ్ట్ ఐస్ మాత్రం అలా ఉండదు. ఇది ప్రత్యేక పద్ధతిలో నెమ్మదిగా, ఒకే దిశలో గడ్డకట్టేలా తయారవుతుంది. దాంతో గాలి బుడగలు బయటకు వెళ్లిపోతాయి, మిగిలేది మాత్రం పూర్తిగా పారదర్శకమైన స్వచ్ఛమైన మంచు. అందుకే దీనిని మబ్బుల్లేని మంచు అని కూడా అంటారు. ఇది అచ్చం పటిక బెల్లంలా, లేదా ఒక ఖరీదైన వజ్రంలా గ్లాస్లో మెరిసిపోతూ, చూడటానికి అందంగా ఉండటమే కాదు. నెమ్మదిగా కరిగి డ్రింక్ అసలు రుచిని అలాగే కాపాడుతుంది. చిన్న తేడా మాత్రమే అనిపించినా, ఇదే స్పష్టత ఒక సాధారణ పానీయానికి ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.ఎందుకు ముఖ్యం?సాధారణ ఐస్కి, క్రాఫ్ట్ ఐస్కి మధ్య ఉన్నది చిన్న తేడాలే అయినా, వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దవి. ఉదాహరణకు, ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుని ఊహించండి. అందులో వేసిన ఐస్ మసకగా, బుడగలతో నిండిపోయి ఉంటే అది కొంచెం అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. అదే గ్లాస్లో క్రిస్టల్లా మెరిసే క్రాఫ్ట్ ఐస్ ముక్క పడితే? ఆ గ్లాస్ ఒక్కసారిగా ప్రొఫెషనల్ లుక్లో స్టార్ హోటల్ రేంజ్ను సొంతం చేసుకుంటుంది. కేవలం చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, రుచి కూడా మెరుగ్గా అనిపిస్తుంది.ఐ స్ డిజైనర్స్! ఐస్ కూడా ఇప్పుడు ఒక డిజైనర్ ప్రాడక్ట్గా మారింది. బ్రాండెడ్ వాచీలు, ఖరీదైన ఫర్నిచర్ తరహాలోనే ఐస్ కూడా ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్. అందుకే మార్కెట్లో ‘ఐస్ డిజైనర్స్’ హడావుడి కూడా మొదలైంది. వీరు సృష్టించే మంచు ముక్కలు వజ్రంలా మెరిసే డైమండ్ షేప్లో, పర్ఫెక్ట్ ట్రైయాంగిల్, ఒక అందమైన పూల ఆకారాల్లో దర్శనమిస్తూ గ్లాసులో పడగానే ‘ఇది డ్రింక్ కాదు, ఒక అద్భుతమైన కళాఖండం’ అనే భావనను కలిగిస్తాయి. ఇందుకోసం, మార్కెట్లో కూడా ఈ ఐస్ తయారీకి ప్రత్యేకమైన టూల్స్, ట్రేలు, పిల్లలకు నచ్చేలా జంతువుల, మౌల్డ్స్, బాక్స్లు, టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో ఇంట్లో కూడా ఈ కొత్త ట్రెండ్ జోరుగా కనిపిస్తోంది.కామన్ ఐస్∙మసకగా, మబ్బుగా కనిపిస్తుంది. ∙త్వరగా కరిగిపోతుంది.∙త్వరగా కరిగిపోతే డ్రింక్ నీరుగా మారుతుంది.∙రుచి తగ్గిపోతుంది.క్రాఫ్ట్ ఐస్∙క్రిస్టల్లా స్పష్టంగా, పారదర్శకంగా కనిపిస్తుంది.∙నెమ్మదిగా కరుగుతుంది.డ్రింక్ రుచిని అలాగే ఉంచుతుంది. గ్లాస్ లుక్ కూడా మెరుగ్గా, మరింత స్టయిలిష్గా కనిపిస్తుంది.∙అంటే చిన్న ఐస్ ముక్కే పెద్ద డిఫరెన్స్ చేస్తుంది!చిన్న ట్విస్ట్!ప్రత్యేకమైన ఈ క్రాఫ్ట్ ఐస్ తయారీ విధానం వలన, ఈ ఐస్ తయారయ్యేందుకు సాధారణ ఐస్తో పోలిస్తే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈ నెమ్మదిగా గడ్డకట్టే ప్రక్రియ వలనే దీనికి ఆ స్పష్టత, బలం, అందం కూడా వస్తుంది. అంటే త్వరగా తయారయ్యే ఐస్ ఒక ‘ఫాస్ట్ ఫుడ్’ అయితే, క్రాఫ్ట్ ఐస్ మాత్రం నిజంగా ఒక ‘ఫైన్ డైనింగ్’ అనుభవం లాంటిదే! అందుకే దీని డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.సీక్రెట్ సైన్స్!క్రాఫ్ట్ ఐస్ ఇలా అద్దంలా మెరుస్తుందంటే, దానికి వెనుక ఒక చిన్న మాయ కాదు. ఒక పెద్ద సైన్స్ ఉంది. దీనికోసం ‘డైరెక్షనల్ ఫ్రీజింగ్’ అనే ప్రత్యేక టెక్నిక్ వాడతారు. పేరు వినగానే కొంచెం కష్టంగా అనిపించినా, కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్. అంటే నీరు అన్ని వైపులా కాకుండా, ఒకే ఒక వైపు నుంచి నెమ్మదిగా గడ్డకట్టేలా’ చేస్తారు. ఇలా చేస్తే, నీటిలో ఉన్న గాలి బుడగలు, చిన్న మలినాలు అన్నీ కింద భాగంలోకి వెళ్లిపోతాయి. పై భాగంలో మాత్రం అచ్చం అద్దంలా, వజ్రంలా మెరిసే స్వచ్ఛమైన మంచు మిగులుతుంది. అందుకే క్రాఫ్ట్ ఐస్ చూడగానే, ‘గ్లాస్ డైమెండ్గా’లా అనిపిస్తుంది.లక్షల ఏళ్ల నాటి చల్లదనం!కథ ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు దుబాయ్ లాంటి నగరాల్లో కొన్ని లగ్జరీ బార్లు మరింత స్పెషల్గా ఆలోచిస్తున్నాయి. ప్రత్యేకమైన అతిథుల కోసం సాధారణ క్రాఫ్ట్ ఐస్ కాదు. గ్రీ¯Œ లాండ్ గ్లేషియర్ల నుంచి తెప్పించిన లక్ష ఏళ్ల నాటి మంచు గడ్డలు వాడుతున్నారు. అవును, నిజంగానే! మనం రోజూ ఫ్రీజర్లో తయారు చేసే ఐస్ కొన్ని గంటల వయసు మాత్రమే ఉంటుంది. కానీ ఈ గ్లేషియర్ ఐస్ మాత్రం లక్ష ఏళ్ల చరిత్రను తనలో దాచుకుని ఉంటుంది. అందుకే ఇప్పుడు లగ్జరీ ప్రపంచంలో ఒక కొత్త జోక్ కూడా వినిపిస్తోంది. ‘డ్రింక్ ఎంత పాతదో కాదు, ఐస్ కూడా ఎంత పాతదో చెప్పాలి!’. అలా ఇప్పుడు లగ్జరీని గ్లాస్లో పడే ఐస్ ముక్కతో కూడా కొలుస్తున్నారు.ఇదొక పెద్ద బిజినెస్.. అప్పట్లో ప్రపంచంలో కాలుష్యం అనే మాటే లేదు! అందుకే ఆ కాలంలో ఏర్పడిన ఈ మంచు గడ్డలు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనవిగా భావిస్తారు. ఈ అరుదైన మంచును ‘ఆర్కిటిక్ ఐస్’ అనే స్టార్టప్ సేకరించి, ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ఇలా మీరు తాగుతున్నది కేవలం ఒక కాక్టెయిల్ మాత్రమే కాదు, హిమయుగం నాటి స్వచ్ఛతతో కూడిన చల్లదనం అంటూ, ఇదే విధంగా మరికొన్ని సంస్థలు కూడా వివిధ రకాల క్రాఫ్ట్ ఐస్ బిజినెస్ చేస్తున్నాయి. అంతేకాదు, ప్రపంచ మార్కెట్ లెక్కల ప్రకారం, క్రాఫ్ట్ ఐస్ మార్కెట్ 2031 నాటికి భారీగా పెరిగి, సుమారు 138.9 బిలియ¯Œ డాలర్లకు చేరుకోనుందని అంచనా. అంటే చిన్నగా కనిపించే ఈ ఐస్ ముక్క వెనుక ఇప్పుడొక పెద్ద బిజినెస్, పెద్ద ట్రెండ్, పెద్ద స్టేటస్ సింబల్ దాగి ఉన్నాయి.ప్రయోగాలన్నీ రుచికోసమే! ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే కాకుండా, ప్రతి ముద్దలోనూ, ప్రతి గుటకలోనూ ఒక సరికొత్త అనుభూతిని వెతకడమే అసలైన భోజన ప్రియుల లక్షణం. అందుకే, జ్యూస్ గ్లాస్లో పడే ఐస్ ముక్క నుంచి కూరలో చివరగా చల్లే కొత్తిమీర వరకు మనం చేసే ప్రతి ప్రయోగం వెనుక ఒక అద్భుతమైన ‘రుచి రహస్యం’ దాగి ఉంటుంది. ఇలాంటి వారికోసమే, క్రాఫ్ట్ ఐస్ జ్యూస్కు ప్రాణం పోసే చిన్న చిన్న ప్రయోగాలు, రుచిని రెట్టింపు చేసే ఆ చిట్కాలు పాటిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం కొన్ని ‘ఇన్ఫ్యూజ్డ్ ఐస్’ పేరుతో వివిధ రకాల రుచికరమైన క్రాఫ్ట్ ఐస్ అందుబాటులో ఉన్నాయి.టీ ఫ్లేవర్డ్ ఐస్ఎడారిలో కూడా టీ తాగేటటువంటి చాయ్ లవర్స్కి ఇదొక కూల్ సొల్యూషన్. ఐస్డ్ టీలు లేదా కాక్టెయిల్స్ తాగేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఐస్ కరుగుతున్న కొద్దీ టీ ఫ్లేవర్ తగ్గకుండా, మరింత పెరుగుతుంది. ఇందుకోసం, ముందుగా మాచా టీ, గ్రీన్ టీ లేదా మీకు నచ్చిన ఏదైనా ఫ్లేవర్డ్ టీని డికాక్షన్లా మరిగించి చల్లార్చాలి. ఆ నీటిని ఐస్ ట్రేలలో పోసి గడ్డకట్టించాలి. కేవలం ఇంట్లో ఉండే టీ పొడి లేదా టీ బ్యాగులతో కేవలం రూ. 5 నుంచి రూ. 10లతో వీటిని తయారు చేసుకోవచ్చు.సిట్రస్ ఐస్డ్రింక్కి ఒక తాజాదనాన్ని ఇచ్చేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం రుచినే కాదు, గ్లాసుకి మంచి సువాసనను కూడా ఇస్తుంది. సిట్రస్ రకాలకు చెందిన నిమ్మకాయ లేదా నారింజ పండు పై తొక్కల సన్నని తురుము ఇందుకోసం చాలా అవసరం. ఒక ఐస్ ట్రేలో నీళ్లు పోసి, అందులో ఈ తురుమును లేదా చిన్న నిమ్మ చెక్కలను వేసి ఫ్రీజ్ చేయాలి. దీనికి అయ్యే ఖర్చు దాదాపు సున్నా. కేవలం మనం వాడేసి పారేసే నిమ్మ తొక్కలతోనే వీటిని సిద్ధం చేసుకోవచ్చు.ఫ్రూట్ ఐస్పిల్లలకి ఇచ్చే జ్యూస్ల నుంచి పెద్దలు తాగే పానీయాల వరకు ఇది ఒక విజువల్ అండ్ టేస్టీ ట్రీట్. పుచ్చకాయ, దానిమ్మ , దాక్ష రసాన్ని తీసి, వడకట్టి నేరుగా ఐస్ ట్రేలలో పోయాలి. మరింత అందంగా కనిపించాలంటే రసంతో పాటు చిన్న పండ్ల ముక్కలను కూడా అందులో వేయవచ్చు. సాధారణంగా ఒక ట్రే ఐస్ కోసం రూ.20 నుంచి రూ. 50 వరకు ఖర్చు అవ్వచ్చు.డిఫరెంట్ షేప్డ్ ఐస్ఆకారమే ఇక్కడ ప్రధాన ఆకర్షణ. గుండ్రంగా, స్టార్ ఆకారంలో, హార్ట్ షేప్లో ఇలా ఎన్నో ప్రత్యేక ఆకారాల్లో ఐస్ తయారు చేస్తున్నారు. ఇవి గ్లాస్లో పడిన క్షణం నుంచే డ్రింక్ను ఒక స్టయిలిష్ ప్రెజెంటేష¯Œ గా మార్చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మార్కెట్లో లభించే సిలికా¯Œ ట్రేలు లేదా మోల్డ్లు ఉపయోగిస్తారు. ఒకసారి కొనుగోలు చేస్తే చాలా రోజుల పాటు వాడుకోవచ్చు. సాధారణంగా ఈ ట్రేలు రూ. 100 నుంచి రూ. 300 వరకు ఉంటాయి.ఎడిబుల్ గోల్డ్ – ఫ్లవర్ ఐస్ఇది అల్టిమేట్ రాయల్ లుక్ ఇచ్చే పద్ధతి. లగ్జరీ ఈవెంట్లలో దీనికి భలే క్రేజ్ ఉంటుంది. విజువల్ ట్రీట్ కోసం ఈ ఐస్ క్యూబ్స్ మధ్యలో అందమైన పువ్వులు, బంగారు రేకులను ఉంచుతూ గ్లాసును ఒక చిన్న సర్ర్పైజ్ బాక్స్లా తయారు చేస్తారు. ఇది కాస్త ఖరీదైన వ్యవహారం. రూ. 500 నుంచి పదివేలు అంతకు మించి కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది.రంగు రంగుల ఐస్గ్లాస్లో రంగులు మెరిస్తే, మనసు కూడా ఫ్రెష్ అయిపోతుంది కదా! అందుకే ఇప్పుడు రంగురంగుల ఐస్ కొత్త ట్రెండ్గా మారింది. ఇది ముఖ్యంగా పిల్లల పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్లు లేదా సమ్మర్ డ్రింక్లకు స్పెషల్ అట్రాక్ష¯Œ గా ఉంటుంది. ఇందుకోసం నీటిలో సహజ రంగులు ఇచ్చే పండ్ల రసం లేదా ఫుడ్ కలర్ కొద్దిగా కలిపి ఐస్ ట్రేలలో పోసి గడ్డకట్టించాలి. ఖర్చు కూడా రూ. 10 నుంచి రూ. 30ల మధ్యలోనే సిద్ధం చేసుకోవచ్చు.ఫ్లేవర్డ్ ఐస్ఇది నిజంగా ఒక చిన్న సర్ప్రైజ్ లాంటిది. ఐస్ కరుగుతున్న కొద్ది కొత్త రుచి మెల్లగా డ్రింక్లో కలుస్తుంది. పుదీనా, తులసి, అల్లం, లేదా బెర్రీ పండ్లతో తయారు చేసే ఫ్లేవర్డ్ ఐస్ ఇప్పుడు చాలా పాపులర్. ఇందుకోసం మీకు నచ్చిన ఫ్లేవర్ పదార్థాలను చిన్నగా కట్ చేసి నీటిలో కలిపి ఐస్ ట్రేలో పోసి గడ్డకట్టించాలి. ఇది కేవలం చల్లదనం మాత్రమే కాదు, ఒక కొత్త రుచి ఇస్తుంది. దీని ఖర్చు రూ. 15 నుంచి రూ. 40 మధ్యలో ఉంటుంది.చల్లని సత్యం! కరిగిపోయే లోపే కంటికి విందును, మనసుకి హాయిని ఇచ్చే ఈ క్రాఫ్ట్ ఐస్– అచ్చం మన జీవితం లాగే షార్ట్ అండ్ స్వీట్! అందుకే, మీరు కూడా ఈ ‘కూల్ ఫ్రెండ్’తో ఒక్క రెండు నిమిషాలు చిల్ అవ్వండి, రోజంతటి అలసటను ఇట్టే మర్చిపోండి!-కొండి దీపిక -
ఈ ఐస్క్రీమ్... చాలా హాట్ గురూ!
ఐస్క్రీమ్ అంటే చల్లచల్లగా తియ్యతియ్యగా ఉంటుందనేగా మీ అంచనా! ఈ ఐస్క్రీమ్ను గనుక ఒక్కసారి రుచి చూస్తే మీ అంచనాలన్నీ పటాపంచలైపోతాయి. దీని రుచి నాలుకను తాకిన తక్షణమే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఒళ్లంతా ముచ్చెమటలు పడతాయి. ఇదెక్కడి ఐస్క్రీమ్ బాబోయ్! అని నోరెళ్లబెట్టి, గుడ్లు తేలేస్తారు. ఇది అలాంటిలాంటి ఐస్క్రీమ్ కాదు, దీని పేరు ‘కోల్డ్ స్వెట్’. అన్ని ఐస్క్రీమ్ల మాదిరిగానే చాలా చల్లగా ఉంటుంది. రుచి చూస్తేనే దీని అసలు తడాఖా తెలిసొస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన రకాల మిరపకాయలు, మిర్చి సాస్ వంటి వాటితో తయారు చేయడం వల్లనే ఇది ప్రపంచంలోనే ఘాటైన ఐస్క్రీమ్గా పేరుపొందింది. అమెరికాలో నార్త్ కరోలినా రాష్ట్రం ఏంజియర్ పట్టణానికి చెందిన ‘సన్నీ స్కై హోమ్మేడ్ ఐస్క్రీమ్స్’ సంస్థ ఈ ఐస్క్రీమ్ను ఇరవై ఏళ్ల కిందట ప్రారంభించింది. విచిత్రమైన రుచులను ఆస్వాదించాలనుకునేవారు దీని కోసం ఇక్కడకు వస్తుంటారు. (చదవండి: జ్ఞాన శంఖం 'పూరి'ద్దాం!) -
బేబీ బ్లూస్..! డెలివరీ తర్వాత ఇలా ఎందుకనిపిస్తోంది..
నాకు వారం రోజుల క్రితం సిజేరియన్ ద్వారా డెలివరీ అయింది. బేబీ కూడా బాగానే ఉంది, నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను. కానీ గత కొన్ని రోజులుగా నాకు చాలా సాడ్ ఫీలింగ్ వస్తోంది. మాటిమాటికి కళ్లలో నీళ్లు వస్తున్నాయి, బేబీతో ఆడుకోవాలని కూడా అనిపించడం లేదు. ఒంట్లో బలహీనంగా అనిపిస్తోంది. ఇది సాధారణమేనా?– లావణ్య, కడప.డెలివరీ తర్వాత కొంతమంది మహిళల్లో ఇలా సడెన్గా సాడ్ ఫీలింగ్ రావడం, ఏడుపు రావడం, బలహీనంగా అనిపించడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సాధారణంగా ‘పోస్ట్పార్టమ్ బ్లూస్’ అంటారు. డెలివరీ అయిన తర్వాత మొదటి రెండు నుంచి మూడు వారాల వరకు సుమారు 70 నుంచి 80 శాతం మహిళల్లో ఈ మార్పులు కనిపించడం సాధారణమే. ఇది ఎక్కువగా జీవనశైలిలో ఒక్కసారిగా వచ్చే మార్పుల వల్ల జరుగుతుంది. డెలివరీ తర్వాత తల్లి పూర్తిగా కోలుకోకముందే ప్రతి రెండు గంటలకు లేచి బిడ్డను చూసుకోవడం, పాలివ్వడం వంటి బాధ్యతలు పెరుగుతాయి. అలాగే శరీరంలో హార్మోన్ మార్పులు కూడా ఈ భావోద్వేగ మార్పులకు కారణం అవుతాయి. సాధారణంగా ఈ బేబీ బ్లూస్ రెండు వారాల లోపే తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయం, కొద్దిగా ప్రోత్సాహం, సరైన విశ్రాంతి, సపోర్ట్ ఉంటే ఎక్కువగా ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే సమస్య సద్దుమణుగుతుంది. అయితే కొంతమందిలో ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే దాన్ని ‘పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ అంటారు. ఇది భారతదేశంలో దాదాపు 10 నుంచి 25 శాతం మహిళల్లో కనిపించే సమస్య. దీనికి ప్రధాన కారణాలు హార్మోన్ మార్పులు, ముందుగా ఉన్న ఆందోళన లేదా డిప్రెషన్ సమస్యలు, డెలివరీ సమయంలో ఎదురైన ఒత్తిడి లేదా కుటుంబంలో సరైన సపోర్ట్ లేకపోవడం వంటి అంశాలు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి చాలా లో మూడ్లో ఉండటం, బిడ్డపై ఆసక్తి తగ్గడం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, చిరాకు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులు తల్లి ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పులను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. డాక్టర్ను సంప్రదిస్తే కొన్ని ప్రత్యేక ప్రశ్నల ద్వారా ఈ సమస్యను సులభంగా గుర్తించవచ్చు. అవసరమైతే కౌన్సెలింగ్, సైకాలజికల్ థెరపీ వంటి చికిత్సలు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా మందులు కూడా ఇవ్వవచ్చు. ఈ మందులు సాధారణంగా తల్లి పాలిచ్చే సమయంలో కూడా సురక్షితంగా వాడేలా ఉంటాయి. సరైన చికిత్స, కుటుంబ సభ్యుల ప్రేమ, సహాయం, ప్రోత్సాహం ఉంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. డా. కప్పగంతుల అపర్ణ , సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ ∙(చదవండి: ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే.. -
మారిన పేరు..ఏడేళ్లు జైలు శిక్ష
పేరు మనిషికి గుర్తింపునిస్తుంది. అదే పేరు తారుమారై, తప్పుగా నమోదైతే? గుర్తింపు సరిగా లేకపోతే ఏమౌతుంది? జీవితం నాశనమై, కుటుంబం కకావికలం అవుతుంది. మహారాష్ట్రలో ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఏడేళ్ల జైలు శిక్షకు కారణమైంది. కుటుంబానికి దూరం చేసింది. ‘పదిమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. కాని, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’ అనేది ప్రాథమిక న్యాయసూత్రం. అయితే కొన్ని సందర్భాల్లో విచారణలో పొరపాట్లు జరిగి నిర్దోషులు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. అలాంటి సంఘటనలు అరుదు. వాటి ప్రభావం బాధితుల జీవితాలపై తీవ్రంగా ఉంటుంది. ఈ తరహా ఘటనలో ఓ వ్యక్తి అత్యాచారం కేసులో నిందితుడిగా సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించాడు. తరువాత అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. తనకు జరిగిన అన్యాయానికి రూ. 200 కోట్లు పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. కేసు నమోదు..శిక్ష ఖరారుమహారాష్ట్రలోని ఘట్కోపర్ రైల్వే స్టేషన్ వంతెనపై ఓ మహిళ నిద్రిస్తోంది. తెల్లవారుజామున ఓ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేసిన వ్యక్తి పేరు ‘గోపి’ అని పేర్కొంది. పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించారు. కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. న్యాయమూర్తి దోషిగా తేల్చారు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 400 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో నెల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని 2010లో తుది తీర్పు వెలువరించారు.నిర్దోషి అని తేలింది.. కానీబాధితురాలు చెప్పిన వ్యక్తి, పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ఒకరేనా? నిందితుడి గుర్తింపులో పొరపాటు జరిగిందా? అనే సందేహాలు హైకోర్టు విచారణ సందర్భంగా వెల్లువెత్తాయి. బాధిత మహిళ తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి పేరు‘గోపి’ అని చెప్పింది. కానీ పోలీసులు అరెస్ట్ చేసింది గోపాల్ని. ‘ఈ కేసుకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, గుర్తింపులో పొరపాటు జరిగిందని’ గోపాల్ పేర్కొన్నాడు. ట్రయల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాడు. అది పెండింగ్లో ఉండగా, బెయిల్ కోసం అభ్యర్థించాడు. కోర్టు తిరస్కరించింది. దీంతో జైలులోనే గడపాల్సి వచ్చింది. చివరికి హైకోర్టులో అప్పీలు పిటిషన్ విచారణకు వచ్చింది. నిందితుడి గుర్తింపును ప్రాసిక్యూషన్ సరైన విధంగా చేయలేదని హైకోర్టు తెలిపింది. ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసి, గోపాల్ను నిర్దోషిగా ప్రకటించింది. తప్పు చేయలేదని తేలినా, అప్పటికే కాలం కరిగిపోయింది. ఏడేళ్లు గడిచిపోయింది. శిక్షా కాలం పూర్తయిపోయింది. పరిహారం కోసం పోరాటం‘నాపై తప్పుగా కేసు నమోదు చేశారు. ఏడేళ్లపాటు అన్యాయంగా కారాగారంలో బంధించారు. నా జీవితం నాశనం అయింది. నేను జైలుకు వెళ్లడంతో నా భార్య నన్ను వదిలి వెళ్లిపోయింది. మనోవేదనతో నా తండ్రి చనిపోయాడు. పిల్లలు అనాథశ్రమంలో చేరాల్సి వచ్చింది. నా ఉద్యోగాన్నీ కోల్పోయాను. కావున నాకు రూ. 200 కోట్లు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని గోపాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో తాత్కాలిక పరిహారంగా రూ. 100 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించాడు. తనను అన్యాయంగా కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ వ్యవహారంపై సీబీఐతో పునర్విచారణ జరిపించాలని పేర్కొన్నాడు. అతడ్ని అన్యాయంగా నిర్బంధించిన కారణంగా స్వేచ్ఛను కోల్పోయాడని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుకు ఇది విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ను హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడం వాస్తవమే కానీ, పరిహారం ఇవ్వాల్సిన పరిస్థితులు లేవని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కేసు నమోదు చేయడంలో పిటిషనర్పై దర్యాప్తు అధికారులకు ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. కోర్టు తీర్పు ఇలా..తనను ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులో ఇరికించారని పిటిషనర్ ఆరోపించారు. కానీ దురుద్దేశం ఉందని ఎక్కడా నిరూపించ లేకపోయారని కోర్టు పేర్కొంది. అతడ్ని కేసులో ఇరికించడానికి దర్యాప్తు అధికారులు, ఇతర సాక్షులు ప్రయత్నించారని అనడానికి కారణాలు కనిపించలేదు. కేవలం నిర్దోషిగా విడుదలయ్యాడనే కారణంతో పరిహారం కోరడం సరైంది కాదు’ అని కోర్టు అభిప్రాయపడింది. పబ్లిక్ లా కింద పరిహారం ఇవ్వడానికి తగిన ఆధారాలు లేవని తేల్చింది. ఈ కేసులో నిందితుడి విడుదల ‘తప్పు నిరూపించ లేకపోవడం వల్ల మాత్రమే జరిగింది. తప్పుడు కేసులో కావాలనే ఇరికించారని నిరూపణ కాలేదని పేర్కొంది. పిటిషనర్ కోరిన అభ్యర్థనకు చట్టపరంగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏడేళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదలైన వ్యక్తి పట్ల కోర్టుకు సానుభూతి ఉన్నా, చట్టపరంగా పరిశీలిస్తే అతని ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టు ఎక్కడా నిరూపించుకోలేకపోయాడని కోర్టు పేర్కొంది. పరిహారం చెల్లించాలని ప్రతీ కేసులో చెప్పలేమని, అది పూర్తిగా కేసు పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఈ కేసులో స్పష్టంగా తేల్చింది. పిటిషనర్కు ఎలాంటి పరిహారం లేదా ఉపశమనం ఇవ్వకుండా పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. దిలీప్ మాదిరెడ్డి(చదవండి: బొమ్మజెముడు పొద మీద నెత్తుటి మరక!) (చదవండి: ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే..) -
విశ్వానికి ఏడు డైమెన్షన్లు!
బయటికి బయల్దేరారు. మీ కారు ‘కీ’స్ కనిపించలేదు! లేదా, టీవీ ఆన్ చే శారు. రిమోట్ కనిపించలేదు! ‘కీ’స్ కోసం, రిమోట్ కోసం ఇంట్లో అవి ఉండే చోటంతా వెతికారు. కానీ కనిపించలేదు! ఇల్లంతా గాలించారు, అయినా కనిపించలేదు! కీస్ కానీ, టీవీ రిమోట్ గానీ అంతలా ఎలా మాయం అయినట్లు?! సరే.. ఇంట్లోంచే కాదు, ఈ విశ్వంలోనే మీ కారు తాళాలు, టీవీ రిమోట్ అదృశ్యం అయ్యాయనే అనుకుందాం. అప్పుడు అవి ఏ జగత్తులలోకి వెళ్లిపోయినట్లు?ఈ ప్రశ్నకు భౌతికశాస్త్రం (సాధారణ ఫిజిక్స్) ఏమంటుందంటే – ఇక అవి పోయినట్లేనని! అదే క్వాంటమ్ ఫిజిక్స్ అయితే, ‘‘ఎక్కడికీ పోవు. ఎక్కడికి పోయాయో ఆ సమాచారాన్ని కనిపెడితే అవి ఎక్కడున్నాయో తెలుస్తుంది’’ అంటుంది! ‘‘లేనివి ఎలా ఉంటాయి?’’ అని సాధారణ ఫిజిక్స్ అంటే.. ‘‘లేకుండా ఎలా పోతాయి?’’ అని క్వాంటమ్ ఫిజిక్స్ అంటుంది! గత యాభై ఏళ్లుగా రెండిటి మధ్యా ఇదే ఘర్షణ. అయితే ఇప్పుడా మహా శాస్త్ర యుద్ధం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లే ఉంది. తాజాగా శాస్త్రవేత్తలు ఈ విశ్వానికి మరో మూడు కొత్త డైమెన్షన్లు ఉన్నట్లు కనిపెట్టటమే అందుకు కారణం. ఏ థియరీ కరెక్ట్?! క్వాంటమ్ ఫిజిక్స్ థియరీనే కరెక్ట్ అంటున్నారు ‘స్లోవాక్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్’ సీనియర్ శాస్త్ర పరిశోధకులు రిచర్డ్ పిన్కాక్! ‘‘ఆ విషయం మీరెలా చెబుతారు?’’ అని ఆయన్ని అడిగితే, ఈ విశ్వంలో ఉన్నవి ఇప్పటి వరకు మనమంతా అనుకుంటున్నట్లు 4 డైమెన్షన్లు మాత్రమే కాదు, మరో మూడు డైమెన్షన్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా కలుపుకుని చూస్తే, అదృశ్యమైపోయిన వస్తువును కూడా, అంజనం వేయకుండానే అది ఎక్కడుందో కనిపెట్టవచ్చు’’ అని పిన్కాక్ చెబుతున్నారు!ఆ నాలుగు.. ఈ మూడుభారత జాతీయ చిహ్నంలో మూడు సింహాలు కనిపిస్తూ ఉంటాయి. వాటితో పాటుగా, ‘కనిపించని నాలుగో సింహం’ కూడా, ఆ వెనుక వైపు ఉంటుంది. అదే విధంగా ఈ విశ్వానికి నాలుగు డైమెన్షన్లు ఉన్నాయి. అంటే నాలుగు కొలమానాలు. అవి : పొడవు, వెడల్పు, ఎత్తు/లోతు, సమయం. అయితే ఈ నాలుగే కాకుండా, కనిపించని మరో మూడు కొలమానాలు కూడా ఉన్నాయని తాజాగా పిన్కాక్ ప్రకటించారు! ఆ మూడు కొలమానాలు ఇచ్చే సమాచారాన్ని బట్టి వస్తువు ఎక్కడ ఉండి ఉంటుందో కనిపెట్టొచ్చని చెబుతున్నారు. అంటే, సాధారణ ఫిజిక్స్ భావిస్తున్నట్లు ‘సమాచారం’ అన్నది లుప్తమైపోదు. క్వాంటమ్ ఫిజిక్స్ భావిస్తున్నట్లు ‘సమాచారం’ నిగూఢంగా ఉండిపోతుంది’!మెలిక, ముడి, బాహ్య బలంకొత్తగా శాస్త్ర పరిశోధకులు కనిపెట్టిన అదనపు డైమెన్షన్లు ఈ మూడూ! ఇవి పొరలుగా మడత పడి ఉంటాయి కనుక పైకి కనిపించవని, వాటి లోపలికి వెళ్లి చూడగలిగితే అదృశ్యమైపోయిన వస్తువు తాలూకూ సమాచారం (అద్కెడుందో, ఎలా ఉందో..) తెలుస్తుందని పిన్కాక్ బృందం భావిస్తోంది. సైన్స్ చరిత్రలో ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న ‘ఇన్ఫర్మేషన్ పారడాక్స్’ అనే పెద్ద చిక్కుముడిని విప్పడానికి ఈ ఏడు (ఇప్పటికే ఉన్న 4, కొత్తగా కనిపెట్టిన 3) డైమెన్షన్ల తాజా సిద్ధాంతం ఉపయోగపడుతుందని వారు విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా, బ్లాక్ హోల్స్ (కృష్ణ్ల బిలాలు) అంతమైపోయేటప్పుడు ఏం జరుగుతుందో ఈ థియరీ వివరిస్తుందట! మనమున్నది త్రీడీ ప్రపంచంసాధారణంగా మనం దేనినైనా త్రీ–డైమెన్షనల్ (త్రీడీ) లోనే చూడగలం. అసలు మనం నివసిస్తున్న ప్రపంచమే త్రీడీ ప్రపంచం. ఒక వస్తువు స్థానాన్ని, రూపాన్ని చెప్పటానికి ఉపయోగించే 1. పొడవు, 2. వెడల్పు, 3. ఎత్తు లేదా లోతుల కొలమానాలు అవి. అల్బర్ట్ ఐన్స్టీన్ ఈ మూడు కొలమానాలకు ‘సమయం’ అనే కొలతను జోడించటంతో త్రీడీ కాస్తా 4డీ అయింది. ‘‘మీరు ఒక స్నేహితుడిని కలవాలనుకున్నప్పుడు అతడి ఉనికి (స్థలం)తో పాటుగా అతడిని ఏ సమయంలో కలవాలనుకుంటున్నదీ ముఖ్యం అవుతుంది. అంటే స్థలం, కాలం విడదీయలేవి..’’ అంటారు ఐన్స్టీన్. అందుకే ఇది త్రీడీ కాదు, 4డీ ప్రపంచం అని ఆయన సిద్ధాంతం.హాకింగ్ వల్లే ‘ఫిజిక్స్ వార్’గతంలో శాస్త్రవేత్తలు, బ్లాక్ హోల్స్ అంటే అన్నీ మింగేసే శూన్య ప్రదేశాలని, వాటిలో పడిపోయినదేదీ ఇక బయటకు రాలేదని అనుకునేవారు. ఆ భావనను సమర్థించే విధంగా 1970లో స్టీఫెన్ హాకింగ్, బ్లాక్ హోల్స్ నుండి రేడియేషన్ వస్తుందని, ఆ ప్రభావంతో కాలక్రమేణా ఆ బ్లాక్హోల్స్ ఉనికే లేకుండా (సమాచారం లేకుండా) ఆవిరైపోతాయని ప్రతిపాదించారు. అయితే క్వాంటమ్ ఫిజిక్స్ నియమాల ప్రకారం ఏ సమాచారం కూడా పూర్తిగా నాశనం కాకూడదు. మరి బ్లాక్ హోల్ ఆవిరైపోతే అందులోని సమాచారం ఏమవుతుంది? దానికి సమాధానమే ఈ ఏడు డైమెన్షన్ల థియరీ అంటున్నారు పిన్కాక్. ‘మంటల్లో పుస్తకం’.. మంచి ఉదాహరణ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఏ సమాచారమూ పూర్తిగా నశించదు అనేందుకు పరిశోధకుడు రిచర్డ్ పిన్కాక్ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. మీరు ఒక పుస్తకాన్ని మంటల్లో వేశారనుకోండి. ఆ పుస్తకం కాలిపోతుంది. కానీ సిద్ధాంతపరంగా, ఆ మంటల నుండి వచ్చిన పొగ, బూడిద, వేడిని పరిశీలిస్తే.. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరాన్ని మనం తిరిగి సేకరించవచ్చు అంటారు పిన్కాక్! పుస్తకాన్ని పునర్నిర్మించటానికి అగ్ని నుండి వెలువడిన ప్రతి కాంతి రేణువును, గాలిలోని ప్రతి కంపనాన్ని (వేడిని), మసిలోని ప్రతి రేణువు కచ్చితమైన స్థానాన్ని గుర్తించగలిగితే అది సాధ్యమేనంటారు పిన్కాక్. దానర్థం, సమాచారం రూపు మారుతుంది తప్ప, పూర్తిగా నిర్మూలన జరగదని. ఎలా నిరూపించగలం?ఒకవేళ ఈ ఏడు కొలతల సిద్ధాంతం నిజమే అయితే, మనం ‘కాలుజా–క్లీన్ పార్టికల్స్’ అనే ప్రత్యేక కణాలను గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఇవి మనకు తెలిసిన భారీ కణాల కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అతిపెద్ద యంత్రం ‘లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్’ సామర్థ్యం కూడా వీటిని కనిపెట్టడానికి సరిపోదు. అయితే విశ్వం పుట్టినప్పుడు వెలువడిన కిరణాల (కాస్మిక్ మైక్రోవేవ్ రేడియేషన్) ద్వారా లేదా స్పేస్టైమ్లోని ఆదిమ గురుత్వాకర్షణ తరంగాల ద్వారా వీటి జాడను కనుగొనే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సాంకేతికత ఇందుకు సరిపోదు. కాబట్టి, ఈ సిద్ధాంతం ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఇది ఒక పరిశోధన స్థాయిలోనే ఉంది. దీనిని నిరూపించాలంటే మనం మరికొంత కాలం వేచి చూడాలి.∙ సాక్షి స్పెషల్ డెస్క్బ్లాక్హోల్ ‘మెమరీ చిప్’తాజా పరిశోధకుల సిద్ధాంతం ప్రకారం, ఒక బ్లాక్ హోల్ సాధ్యమైనంత సూక్ష్మ పరిమాణాలకు ఆవిరైపోతున్నప్పుడు, దాని ఏడు డైమెన్షన్లు ప్రాథమికంగా ఒక ముడిలా చిక్కువడిపోతాయి. ఆ ముడి తగినంత చిన్నదిగా మారినప్పుడు, ఈ దాగి ఉన్న డైమెన్షన్లు ముడుచుకోవటం వల్ల ఒక బాహ్య బలం (బయటి నుంచి లోపలికి నెట్టే శక్తి) ఏర్పడి అది బ్లాక్హోల్ పూర్తిగా కూలిపోకుండా నిరోధిస్తుంది. చివరికి అక్కడ ఒక అతి సూక్ష్మమైన పదార్థం మిగిలిపోతుంది. ఇది ఒక ఎలక్ట్రాన్ కన్నా 1000 కోట్ల రెట్లు చిన్నది. ఇది చూడడానికి ఏమీ లేనట్టు అనిపించినా, ఆ ‘మెలిక పడిన ముడి’ లోపల బ్లాక్ హోల్ మింగేసిన సమాచారం అంతా భద్రంగా ఉంటుంది. అంటే, సమాచారం ఎక్కడికీ పోలేదు! ఒక చిన్న జ్ఞాపకంలా ఆ ఏడు కొలతల ‘మెమరీ చిప్’ ముడిలో దాగి ఉంటుందన్నమాట.విశ్వానికి ‘టార్షన్ ఫీల్డ్’ మెలిక మూడు అదనపు కొలమానాలైన మెలిక, ముడి, బాహ్య బలాల ఉనికిని నిరూపించటానికి రిచర్డ్ పిన్ కాక్ ‘స్పేస్టైమ్’ (స్థలం–సమయం) నిర్మాణాన్ని కొత్త కోణంలో చూశారు. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం స్పేస్టైమ్ అనేది ఒక నాలుగు కొలతల షీట్ (చాప) లాంటిది. అది వంగగలదు, సాగగలదు. అయితే తాజా సిద్ధాంతం ప్రకారం, ఈ స్పేస్టైమ్లో ఏడు కొలతలు ఉన్నాయి. మనకు కనిపించని ఆ మూడు అదనపు కొలతల్ని పట్టుకోగలిగితే బ్లాక్ హోల్స్లో సమాచారం ఎలా దాగి ఉంటుందో వివరించడం సాధ్యమవుతుంది అంటారు పిన్కాక్! ఈ సిద్ధాంతం ప్రకారం ఏం జరుగుతుందో చూడండి. ‘స్పేస్టైమ్’ (నాలుగు కొలతల ఏకీకృత నిర్మాణం) వల్ల ఈ విశ్వం వంగే గుణాన్ని, సాగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ మూడు అదనపు కొలమానాలలో ఒకదాని వల్ల అది ‘మెలిక’ కూడా పడుతుంది. దీనినే శాస్త్రవేత్తలు ‘టార్షన్ ఫీల్డ్’ అని పిలుస్తున్నారు. బ్లాక్హోల్స్ అదృశ్యమైనట్లు కనిపించినప్పుడు అక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవటానికి ఈ టార్షన్ ఫీల్డ్ ఉపయోగపడుతుంది. కృష్ణబిలాలు అదృశ్యం కాకుండా, ఎంతగానో కుంచించుకుపోతాయి. వాటి అంతర్గత డైమెన్షన్లు ముడివడి, మెలిక తిరిగి ఒక ఆకారాన్ని ఏర్పరుస్తాయి. దాంతో సమాచారం అంతా ఒక చిన్న శాశ్వత చిహ్నంలా ఎప్పటికీ దానిని పట్టుకునే ఉంటుంది. విశ్వానికి ఏడు డైమెన్షన్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు! ఇప్పటికే ఉన్న పొడువు, వెడల్పు, ఎత్తు / లోతు, కాలం అనే నాలుగు డైమెన్షన్లతో పాటుగా, ‘దాగి ఉన్న’ పొరల్లాంటి డైమెన్షన్లు మరో మూడు కూడా ఉన్నాయని, అవి ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయని వారు భావిస్తున్నారు. -
ఇరవై రూపాయలు.. నిండు జీవితం
ఇరవై రూపాయలు... మనం చేసే రోజువారీ ఖర్చులో తెలియకుండానే ఖర్చయిపోతుంది. కానీ, అదే ఇరవై రూపాయలు ఓ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టింది. కోర్టుల చుట్టూ తిప్పింది. అవినీతిపరుడని ముద్ర వేసింది. ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసింది. అయినా తట్టుకున్నాడు. న్యాయం కోసం కళ్లు కాయలు కాసేలా చూశాడు. ఏడాదో, రెండేళ్లో కాదు– ఏకంగా 30 ఏళ్లు. చివరికి ఫలితం వచ్చింది. ‘నేను ఏ తప్పు చేయలేదు’ అని మొదటి నుంచి అతడు చెబుతున్నదే నిజమైంది. నిర్దోషిగా బయటపడాలనే అతని కోరిక తీరింది. కానీ∙ఆ సంతోషం, సంబరం ఎక్కువ సేపు నిలవలేదు. తీర్పు వచ్చిన తెల్లారే అతని గుండె ఆగిపోయింది. అదే అతడికి చివరి రోజు అయింది. ఓ కానిస్టేబుల్ న్యాయపోరాటం కన్నీటి గాథగా మిగిలింది. బాబూభాయ్ ప్రజాపతి అహ్మదాబాద్లోని వేజల్పూర్కు చెందిన ఓ కానిస్టేబుల్. రూ.20 లంచం తీసుకున్నాడని అతనిపై ఆరోపణ. సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ తీర్పుపై ప్రజాపతి హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాడు. సుమారు 22 ఏళ్ల పాటు అక్కడ కేసు నడిచింది. చివరికి తీర్పు వెలువడింది. హైకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అసలేం జరిగింది?1996లో ఓ ట్రక్కు డ్రైవర్ ఫిర్యాదుతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్నారు. ట్రక్కు డ్రైవర్కు ఫినాల్ఫ్తేలీన్ పౌడర్ పూసిన నోట్లను ఇచ్చారు. ఆ నోట్లు ప్రజాపతి చేతిలో ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం తీసుకున్నాడని కేసు నమోదు చేశారు. నాలుగేళ్లు జైలు శిక్షఅహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో 1997లో చార్జిషీట్ దాఖలైంది. కోర్టులో కేసు విచారణ జరిగింది. తనకేమీ తెలియదని, కేసులో అన్యాయంగా ఇరికించారని, బలవంతంగా తన చేతులో డబ్బులు పెట్టారని ప్రజాపతి వాపోయాడు. తనను నిర్దోషిగా ప్రకటించాలని కోర్టుకు విన్నవించాడు. వాదోపవాదాల తర్వాత ప్రజాపతిని కోర్టు దోషిగా నిర్ధారించింది. నాలుగేళ్లు కఠిన కారాగార శిక్ష, మూడువేలు జరిమానా విధించింది. హైకోర్టుకు అప్పీలుసెషన్స్ కోర్టు తీర్పుపై ప్రజాపతి హైకోర్టులో అదే ఏడాది అప్పీలు చేశాడు. ఏళ్ల తరబడి పెండింగ్ తర్వాత కేసు విచారణ మొదలైంది. అప్పీలుదారు తరపు న్యాయవాది నితిన్ గాం«ధీ కేసు విశ్వసనీయత, సాక్షుల వాంగ్మూలాల్లో వైరుధ్యాలపై పలు ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తారు. నిర్దోషిగా తీర్పువిచారణ సందర్భంగా కేసులోని పలు లోపాలను హైకోర్టు గుర్తించింది. డబ్బులు డిమాండ్ చేశారనే దానికి ఆధారాలు చూపలేదని పేర్కొంది. అభి యోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించ లేదని ప్రజాపతిని నిర్దోషిగా ప్రకటిస్తూ కేసు కొట్టేసింది. సంతోషం..విషాదంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ప్రజాపతి తన న్యాయవాది నితిన్ గాంధీని ఆయన కార్యాలయంలో కలుసుకున్నాడు. నిర్దోషిగా బయటపడినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ‘నాపై పడిన మచ్చ తొలగింది. ఇక ఆ దేవుడు పిలిచినా సంతోషంగా వెళతాను’ అన్నాడు. ఆ రోజు గడిచింది. కానీ ప్రజాపతికి అదే ఆఖరి రోజైంది. నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని, అది సహజ మరణ మని అతని న్యాయవాది వెల్లడించాడు. న్యాయం కోసం జీవితమంతా పోరాడాడు. గెలిచిన సంతోషం ఒక్కరోజే మిగిలింది. మరికొన్ని రోజులైనా జీవిస్తే బాగుండేది. లేదా న్యాయం అయినా ముందే దక్కి ఉండాల్సిందని బంధువులు వ్యాఖ్యానించారు.-దిలీప్ మాదిరెడ్డి -
ప్రెగ్నెన్సీ 7వ నెలలో వైట్ డిశ్చార్జ్.. సమస్యేనా?
నాకు ఇరవై ఐదు సంవత్సరాలు. నాకిది రెండో ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఏడవ నెల. గత కొన్ని రోజులుగా యోనిలో ఎక్కువగా తెల్లటి డిశ్చార్జ్ కనిపిస్తోంది. కొన్నిసార్లు దురద కూడా ఉంది. ఇది పెద్ద సమస్యేనా? – రమ్య, నెల్లూరు.గర్భధారణ సమయంలో యోనిలో తెల్లటి డిశ్చార్జ్ కనిపించడం చాలా సాధారణం. గర్భధారణలో శరీరంలో హార్మోన్ మార్పులు ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి పెరగడం వల్ల యోని స్రావం కూడా కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. ఇది సాధారణ ప్రక్రియ. ఈ డిశ్చార్జ్ యోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడంలో, హానికరమైన ఇన్ఫెక్షన్లు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఆరోగ్యకరమైన డిశ్చార్జ్ తెలుపు లేదా పారదర్శకమైన రంగులో ఉంటుంది. పలుచగా లేదా కొద్దిగా జిగురుగా ఉంటుంది. తేలికపాటి వాసన లేదా వాసన లేకుండా ఉంటుంది. దురద, మంట లేదా అసౌకర్యం లేకుండా ఉంటుంది. గర్భధారణ ముందుకు సాగేకొద్దీ ఇది కొంచెం ఎక్కువగా కనిపించడం సహజమే. అయితే మీరు చెప్పినట్లుగా డిశ్చార్జ్తో పాటు దురద కూడా ఉంటే, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియా అసమతౌల్యం వంటి చిన్న సమస్యల సంకేతం కావచ్చు. సాధారణంగా ఇవి సులభంగా చికిత్సతో తగ్గిపోతాయి. బలమైన దుర్వాసన రావడం, చేప వాసనలాగా ఉండటం. పసుపు, ఆకుపచ్చ లేదా బూడిద రంగులో మారడం. ముద్దలాగా గట్టిగా ఉండటం. తీవ్రమైన దురద, మంట లేదా ఎర్రదనం ఉండటం. ఒక్కసారిగా ఎక్కువగా నీళ్లలాగా కారడం. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు చేసి, అవసరమైతే సరైన మందులు ఇస్తారు. గర్భధారణలో స్వయంగా మందులు వాడటం మంచిది కాదు. డాక్టర్ సలహాతో మాత్రమే చికిత్స తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్లు నివారించడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. యోని బయట భాగాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి. లూజుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఆ ప్రాంతంలో ఎక్కువగా సబ్బులు, వాష్లు లేదా పౌడర్లు వాడకూడదు. డాక్టర్ సలహా లేకుండా క్రీములు లేదా మందులు కూడా వాడకూడదు. సాధారణంగా ఇది చిన్న సమస్యే అయినా, మీరు 7 నెలల గర్భంతో ఉన్నందున ఒకసారి డాక్టర్ను కలసి చెక్ చేయించుకుంటే మరింత మంచిది.ప్రసవ నొప్పులేనా? నేను 36 వారాల గర్భిణిని. ఇది నా మొదటి గర్భం. కొన్నిసార్లు పొత్తికడుపు గట్టిగా పట్టేయటం, పీరియడ్స్లా నొప్పులు వస్తున్నాయి. కొన్ని నిమిషాల్లో అవి మామూలుగా మారిపోతాయి. ఇవి ప్రసవ నొప్పులేనా? – స్వాతి, విజయనగరం.మీరు 36 వారాల గర్భంతో ఉన్నప్పుడు పొత్తికడుపు కొన్నిసార్లు గట్టిపడటం లేదా పీరియడ్స్లా నొప్పులు రావడం చాలా సాధారణం. కొన్ని నిమిషాల్లో తగ్గిపోతే అవి నిజమైన ప్రసవ నొప్పులు కావు. నిజమైన ప్రసవానికి ముఖ్యమైన లక్షణం గర్భాశయ సంకోచాలు క్రమంగా రావడం. ఇవి తప్పుడు నొప్పుల కంటే భిన్నంగా ఉంటాయి. మొదట కొద్దిగా ప్రారంభమై, తర్వాత సమయం గడిచేకొద్దీ మరింత బలంగా, ఎక్కువసేపు కొనసాగుతాయి. విశ్రాంతి తీసుకున్నా తగ్గవు. ఒక సులభమైన నియమం ఏమిటంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి నొప్పి రావడం, ప్రతి నొప్పి కనీసం ఒక నిమిషం పాటు కొనసాగడం, ఈ పరిస్థితి దాదాపు ఒక గంట పాటు ఉండటం. ఇలా జరిగితే మీరు ఆసుపత్రికి వెళ్లాలి. మరొక ముఖ్యమైన సంకేతం నీరు కారడం. అంటే ఒక్కసారిగా ఎక్కువగా ద్రవం రావడం లేదా నెమ్మదిగా నిరంతరం కారడం అనిపించవచ్చు. ఆ ద్రవం సాధారణంగా పారదర్శకంగా ఉంటుంది. ఒకసారి నీరు కారితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. కొన్నిసార్లు గులాబీ రంగులో లేదా కొద్దిగా రక్తం కలిసిన మ్యూకస్లా డిశ్చార్జ్ కనిపిస్తే ప్రసవం త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అలాగని వెంటనే డెలివరీ జరుగుతుందని చెప్పలేం.ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి: ∙ఎక్కువగా రక్తస్రావం కావడం ∙తీవ్రమైన పొత్తికడుపు నొప్పి ఉండటం ∙బిడ్డ కదలికలు తగ్గిపోవడం లేదా ఆగిపోవడం. ∙ఎక్కువ జ్వరం రావడం ∙తీవ్రమైన తలనొప్పి లేదా చూపు మసకబారడం ∙ముఖం లేదా చేతులు ఒక్కసారిగా ఉబ్బడం ∙మొదటిసారి గర్భిణులలో ప్రసవం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కానీ నొప్పులు క్రమంగా, దగ్గర దగ్గరగా వస్తూ బలంగా మారితే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లడం మంచిది. ∙ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండటం మంచిది. మీకు ఏదైనా కొత్త లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం సురక్షితం. -
మాయమైన హారం
పెళ్లి పందిరంతా పూల వాసనలు, బాజాభజంత్రీలతో సందడిగా ఉంది. కానీ పెళ్లి కూతురు దివ్య ముఖంలో మాత్రం కళ లేదు. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, పెళ్లి కొడుకు మదన్ ప్రవర్తన ఏదో తేడాగా ఉందని తన స్నేహితురాలు, లేడీ డిటెక్టివ్ సుగాత్రికి ముందే చెప్పింది.‘కట్నం అక్కర్లేదు. అబ్బాయికి పెద్ద బిజినెస్ వుంది. అందగాడు’... మధ్యతరగతి తండ్రి ఆలోచన... అందుకే కూతురిని బలవంతంగా పెళ్లికి ఒప్పించాడు.పెళ్లి ముహూర్తానికి సరిగ్గా గంట ముందు ఒక్కసారిగా పెళ్లి మండపంలో కలకలం మొదలైంది.పెళ్ళికి వచ్చిన కనకం మెడలోని కోటి రూపాయల విలువైన వజ్రాలహారం మాయమైంది. పెళ్లి పెద్దలు కంగారు పడుతుంటే, సుగాత్రి లోపలికి అడుగు పెట్టింది.దివ్య తండ్రిలో ఆందోళన. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఈ అపశకునం ఏమిటని...?పోలీసులు పెళ్లి మండపాన్ని చుట్టుముట్టారు. అన్ని గదులూ వెతికారు.పెళ్ళికొడుకు రూమ్ మిగిలి వుంది. దివ్య తండ్రి అడ్డు చెప్పబోయాడు. ‘కాబోయే అల్లుడిని సోదా చేస్తే బాగుండద’ని...సుగాత్రి నచ్చచెప్పింది. పెళ్ళికొడుకు గది సోదా చేస్తే తను క్లీన్ చిట్తో బయటకు వస్తాడని చెప్పింది.మదన్ రూమ్ అణువణువూ వెతికారు. ఎక్కడా హారం దొరకలేదు.పెళ్ళికొడుకు మదన్ సీరియస్ అయ్యాడు. ‘అసలు హారం పోయిందో నాటకం ఆడుతున్నారో’ అంటూ అరిచాడు.‘‘నిజమే హారం పోలేదు కానీ, దొంగ దొరికాడు.’’ అంది సుగాత్రి. ‘‘అదెలా?’’ ఆశ్చర్యంగా అడిగాడు మదన్.‘‘హారం పోతే రికవరీ చేసుకోవచ్చు.. కానీ జీవితం పోతేనో?’’... అంటూ సుగాత్రి మదన్ సూట్కేస్ తెరిచి, అందులో ఉన్న రహస్య అరను పగులగొట్టింది. అందులో వేర్వేరు దేశాల పాస్పోర్టులు, వివిధ పేర్లతో ఉన్న ఐడీ కార్డులు బయటపడ్డాయి.‘‘ఇప్పుడేమంటావ్ మిస్టర్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ మదన్?’’ అంటూ పెళ్లికి వచ్చిన అందరి వైపు, దివ్య తండ్రి వైపు చూసి, ‘‘ఇతడు అంతర్జాతీయ స్థాయిలో పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేసే మ్యారేజ్ ఫ్రాడ్. గతంలో ముగ్గురు అమ్మాయిలను ఇలాగే పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిలను అమ్మేసి పరారయ్యాడు. చాలా చోట్ల ఇతని మీద కేసులు వున్నాయి. మధ్యతరగతి అమ్మాయిలే ఇతడి టార్గెట్. కూతురు పెళ్ళైతే చాలు, అనుకునే మధ్యతరగతి తల్లిదండ్రుల బలహీనతలను, ఆశలను క్యాష్ చేసుకునే ఘరానా మోసగాడు ఇతను. నిజానికి హారం పోలేదు. కానిస్టేబుల్ కనకంతో నేను ఆడించిన నాటకం.దివ్య పెళ్ళికొడుకు మీద అనుమానం వ్యక్తం చేయడంతో మదన్ ఫోటోను డేటాబేస్లో చెక్ చేశాను. ఇతని నేరాలు ఒక్కొక్కటిగా బయట పడ్డాయి. ఒక్కోచోట ఒక్కో పేరుతో మోసాలు చేస్తాడు.’’ చెప్పింది లేడీ డిటెక్టివ్ సుగాత్రి.మదన్ను పోలీసులు అరెస్టు చేశారు.‘‘నాలాంటి మధ్య తరగతి తల్లిదండ్రుల కళ్ళు తెరిపించావు తల్లీ! బిడ్డ పెళ్ళైతే చాలు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి’... చేతులు జోడించి చెప్పాడు దివ్య తండ్రి.‘‘థాంక్యూ మై ఫ్రెండ్ లేని హారాన్ని పోయిందని చెప్పి ఆధారాలు దొరక్కుండా తప్పించుకుంటున్న నేరస్తుడిని పట్టుకుని... నా జీవితాన్ని నాలాంటి అమ్మాయిల జీవితాలను కాపాడావు’’ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది దివ్య.‘‘మ్యాట్రిమోనీలలో సంబంధాలు చూసేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి. అబ్బాయిల ఆస్తిపాస్తులు, అర్హతల కన్నా వ్యక్తిత్వం, అసలు స్వరూపం తెలుసుకోవాలి.’’ చెప్పింది లేడీ డిటెక్టివ్ సుగాత్రి. -
తల్లిదండ్రులే రోల్ మోడల్స్
పిల్లల మనస్సుల్లో మీ కలలను రుద్దకండి. ప్రతి శిశువు తన స్వంత ఆశయాలతో జన్మిస్తుంది అని చెబుతారు ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి. పేరెంటింగ్పై ఆమె మాటలు ఎందరికో స్ఫూర్తిదాయకం. పిల్లల పెంపకంపై ఆమె పలు పుస్తకాలను కూడా రాశారు. పిల్లలను మంచి దారిలో నడిపించేందుకు ఆమె చెప్పిన కొన్ని మాటలు...పిల్లలకు తల్లిదండ్రులే మొదటి రోల్ మోడల్స్. పిల్లలు మనం చెప్పే మాటల కంటే, మనం చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు, అనుకరిస్తారు. కాబట్టి మంచి ప్రవర్తనను ఆచరించి చూపడం చాలా ముఖ్యం. మనం ఒక మంచి ఉదాహరణగా నిలిచినప్పుడు, పిల్లలకు ప్రత్యేకంగా క్రమశిక్షణ నేర్పాల్సిన అవసరం ఉండదు.తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అతిపెద్ద బహుమతి విద్య. అయితే, చదువు అంటే కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదు, అందులో జీవన నైపుణ్యాలు, జిజ్ఞాస, సాంస్కృతిక అవగాహన కూడా ఉండేలా నేర్పించాలి. అంతేకాకుండా తల్లిదండ్రుల జీవితాల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన లక్ష్యాలను పిల్లలతో పూర్తిచేయించాలనుకోవడం పొరపాటు. పిల్లలు వారి సొంత ఆశలు, ఆశయాలతో వస్తారు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు చేయగలిగిన ఉత్తమమైన పని– పిల్లలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించడంలో సహాయపడటం.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. డబ్బు ఉందని అహం చూపిస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని పేరెంట్స్ ఫాలో అయితే పిల్లలు కూడా ఆ లక్షణం నేర్చుకుంటారు. అలాగే పిల్లలకు ఉన్నదానితో తృప్తి చెందడం, కృతజ్ఞతా భావంతో ఉండటం నేర్పించాలి. వస్తువుల కంటే సంబంధాలే ముఖ్యమని నేర్పాలి. కుటుంబంతో కలిసి భోజనం చేయడం వంటి చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం వల్ల పిల్లల్లో వినయం, సానుభూతి పెరుగుతాయి. ఖరీదైన బహుమతుల కంటే అర్థవంతమైన అనుభవాలను పంచుకోవడం ద్వారా తల్లిదండ్రులు ఈ విలువలను పిల్లలకు నేర్పవచ్చు. చాలామంది జీవితంలో మనం కష్టపడ్డాం కదా, మన పిల్లలకు ఆ కష్టం తెలియకూడదు అని వారికి అన్నీ అడగకముందే సమకూరుస్తుంటారు. కానీ పిల్లలకు కూడా కష్టం విలువ తెలిసేలా చేయాలి. పిల్లలకు చిన్న చిన్న పనులు నేర్పడం, ఇంటి పనుల్లో వారిని భాగస్వాములను చేయడం ద్వారా వారు తాము కూడా కుటుంబంలో ఒక భాగమని, తాము కూడా సహకరించాలని అర్థం చేసుకుంటారు. పిల్లల్లో దయ, సానుభూతిని పెంపొందించాలి. పిల్లల పెంపకంలో ఇది ప్రధానమైనది. పిల్లల్లో కరుణను నింపడం వల్ల సమాజానికి మేలు జరగడమే కాకుండా, వారు అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకుంటారు. పిల్లలను ఇతరులతో పోల్చకండి. ప్రతి బిడ్డకు వారి స్వంత బలాలు, బలహీనతలు ఉంటాయి. వారిలోని ప్రత్యేకతను గుర్తించకుండా ఇతరులతో పోల్చడం వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ.పిల్లలు ఏదైనా అడిగినప్పుడు, వెంటనే ఇచ్చేయకండి. అది నిజంగా అవసరమో కాదో తెలుసుకోండి. పిల్లలు అడిగే వస్తువు ప్రాముఖ్యతను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అడిగిన వెంటనే పిల్లలకు అందించడం వల్ల వారికి ఆ వస్తువు విలువ తెలియదు. అలాగే ప్రస్తుతం పిల్లలకు పాకెట్ మనీ అని డబ్బులు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. దానివల్ల వారికి డబ్బు విలువ తెలియదు. పిల్లలతో నిత్యం మాట్లాడుతూ, సమయం గడపండి. ప్రతి విషయం గురించి వారితో చర్చించండి. మీ పిల్లల మనస్సులో ఏముందో తెలుసుకోవాలంటే వారితో సంభాషించడం, వారు చెప్పేది వినడం ద్వారా వారి సంతోషాలు, ఆసక్తులు, ప్రపంచం పట్ల వారి దృక్పథం అర్థమవుతుంది. ఎదుటివారి హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం నేర్పించాలి. పెద్దల మాదిరిగానే పిల్లలకు కూడా ఏకాంతంగా, స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను అతిగా పర్యవేక్షించడం, ప్రతి చిన్న విషయంపై ప్రశ్నించడం వంటివి చేసినప్పుడు, పిల్లలు తాము నమ్మకాన్ని కోల్పోతున్నామని భావిస్తారు. దాంతో విషయాలను దాచడం లేదా అబద్ధాలు చెప్పడం మొదలుపెడతారు. అలాకాకుండా పిల్లలు స్నేహపూర్వకంగా మెలగాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. ఇది పిల్లలు తమను తాము నమ్ముకోవడానికి, సవాళ్లను అధిగమించడానికి, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడటానికి సహాయపడుతుంది. ‘నువ్వు ఏదైనా సాధించగలవు’, ‘నీ ప్రయత్నం నాకు చాలా గర్వంగా ఉంది’ వంటి సానుకూలమైన మాటలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. -
కృషి ఏకోన్ముఖం ప్రతిభ బహుముఖం!
నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ఆఫ్రికన్ రచయితలు– పంచపాండవుల్లా– అయిదుగురే! ఇవాళ మనం ఎవరి గురించి చర్చించుకోబోతున్నామో ఆ పెద్దమనిషి కూడా వారిలో ఒకరు. అతని తండ్రి తరఫు పూర్వికులు, నాలుగైదు వందల సంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాకు తరలి వెళ్ళిపోయిన డచ్ (నెదర్లండ్స్) జాతీయులు. తల్లి తరఫు వాళ్ళు డచ్–జెర్మన్–పోలిష్ జాతీయులు. 1940లో పుట్టిన ఈ బహుళజాతి రచయిత బాల్య కౌమార ప్రథమ యవ్వన దశలు గడిపింది దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నగరంలో. ఇరవైరెండో యేట బ్రిటన్ చేరి, ఐబీఎం సంస్థలో కంప్యూటర్ ప్రోగ్రామర్గా జీవనం మొదలుపెట్టాడు. అతని పేరు జాన్ మ్యాక్స్వెల్ కూట్సీ. 2003లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న విశిష్ట రచయిత! కూట్సీ సిద్ధాంత పత్రానికి 1963లో కేప్ టౌన్ యూనివర్సిటీ మాస్టర్స్ పట్టా ప్రసాదించింది. మరో ఆరేళ్ళకు, శామ్యూయెల్ బెకెట్ వచనంలో వాక్యనిర్మాణరీతి– పదప్రయోగ శైలి– ధ్వని తదితర విశేషాల గురించి కూట్సీ సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ డాక్టరేట్ ప్రసాదించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ పెద్దమనిషి సృజనాత్మక సాహిత్యాన్నీ, భాషా సాహిత్యాలపై పరిశోధనను రెండు చక్రాలుగా చేసుకుని బండి నడిపిస్తూనే వున్నాడు! అలాంటి మనిషికి ఇంగ్లిష్, ఆఫ్రికాన్స్, డచ్, నామా, మలయ్ తదితర భాషలు తెలిసివుండడంలో వింతేముంది? సామాన్య శకం 450 సంవత్సరం నుంచి 1150 వరకూ వాడుకలో వుండి అంతరించిన ‘ఓల్డ్ ఇంగ్లిష్‘ అనే యాంగ్లో శాక్సన్ భాషలో కూడా నిష్ణాతుడు కావడం కూట్సీ సాధించిన ఘనవిజయాల్లో ఒకటి! టూకీగా చెప్పుకుంటేనే కూట్సీ కథ ఇంతవచ్చింది!కూట్సీ పుట్టి పెరిగిన దేశం దక్షిణాఫ్రికాలో 1994 వరకూ, రంగువెలి (అపార్థీడ్) అనే జాతి వివక్ష విధానం అమల్లో వుంది. గాంధీజీ ఆ దేశంలో అవమానాల పాలబడిన కథ చిన్నప్పుడు చదువుకున్నాంగా. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు నిర్బంధం అనుభవించాల్సి రావడానికి ఇదే విధానం కారణం. కూట్సీ మొదటి నుంచి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూనే రావడం నిజంగానే విశేషం! పాతికేళ్ళకు ముందే యూరపియన్– అమెరికన్ దేశాల్లో విస్తృతంగా తిరిగే అవకాశం కూట్సీకి దక్కడం వల్లే, ఈ విశాల దృష్టి ఏర్పడి వుంటుంది. అలా జాతిపరమైన అస్తిత్వ రేఖలను చెరిపేసుకుని, అక్షరాలా అంతర్జాతీయ స్వభావం సంతరించుకున్న రచయితల్లో కూట్సీ మొదటివాడూ కాడు– బహుశా చివరివాడు కూడా కాడేమో! ‘ఇంట గెలిచి, రచ్చ గెలవ’మనే నానుడి కూట్సీ మాతృభాష ఆఫ్రికాన్లో కూడా వున్నట్లుంది! అందుకే, అతగాడు 1977లో దక్షిణాఫ్రికాలోని ప్రతిష్ఠాత్మక పురస్కారం సీఎన్ఏ (సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ) సాహిత్య పురస్కారంతోనే తన విజయ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇదే పురస్కారాన్ని 1980లో మరోసారి, ’84లో ఇంకోసారి కూడా గెల్చుకున్నాడు కూట్సీ. బుకర్ ప్రైజును రెండుసార్లు గెల్చుకున్న రచయిత తొలిరచయిత కూడా కూట్సీయే!‘ఇన్ ద హార్ట్ ఆఫ్ ద కంట్రీ’ నవలలో అధ్యాయాల విభజన లాంటిది కనిపించదు. రచయిత దీన్ని 266 పేరాగ్రాఫులుగా విభజించారు. సినిమా స్క్రిప్టులో కనిపించే సీన్ పేపర్ల కట్టలా వుంటుంది ఈ నవల. 1985లో మేరియన్ హ్యాన్సల్ ఈ దృశ్యమాన నవలను ‘డస్ట్’ అనే సినిమాగా తీశాడంటే తీయడూ మరి? ఈ నవల వెలువడ్డానికి మూడేళ్ళు ముందే, కూట్సీ రెండు నవలికలను కలిపి ‘డస్క్ ల్యాండ్స్’ అనే ఒకే నవలగా రాశాడు. వియెత్నాంలో మనోవైజ్ఞానిక యుద్ధానికి వ్యూహ రచన చేసిన యూజిన్ డాన్ క్రమంగా ఉన్మాదంలోకి దిగజారి కన్నకొడుకునే పొడిచి చంపేసిన కథనే ‘ద వియెత్నాం ప్రాజెక్ట్’ అనే నవలిక రాశాడు కూట్సీ. ‘ద నెరేటివ్ ఆఫ్ జాకబస్ కూట్సీ’ అనే మలి నవలిక, వాస్తవానికి కాలక్రమంలో ముందు రావాలి. వలసవాదులూ, సామ్రాజ్యవాదుల మానసికతలో అంతర్నిహితంగా వుండే హింసాత్మకత ఇతివృత్తంగా రాసిన నవలికలివి. ఆ రెండింటికీ అదే సామాన్య గుణం! ఇది కూడా గొప్పగా విజయవంతమైన ప్రయోగం. కాగా, నిత్యాధునికవాదం అనే పోస్ట్ మాడర్నిస్టు నవలా రచనకు ఇదే ఆదిగ్రంథమంటారు విమర్శకులు.1999లో, కూట్సీకి రెండోసారి బుకర్ ప్రైజ్ సంపాదించిపెట్టిన నవల ‘డిస్గ్రేస్.’ దక్షిణాఫ్రికాలో ఒకప్పుడు తెల్లదొరలు పాటించిన వివక్ష విధానాలు తర్వాతి రోజుల్లో ఎలాంటి విషఫలితాలు ఏర్పడడానికి దారితీశాయో చూపించిన రచన ఇది. ల్యూరీ అనే కీచకోపాధ్యాయుడు అప్రతిష్ఠాకరమైన జీవనం తర్వాతి కాలంలో పెత్తనం చెలాయించిన ‘నల్లదొరలు’ అనుకరిస్తే ఏమవుతుందనేదే ఈ నవలకు ఇతివృత్తం. 2019లో బీబీసీ ఎంపిక చేసిన ‘నూరు స్ఫూర్తిదాయకమైన నవలల జాబితా’లో స్థానం సంపాదించుకున్న నవల ఇది!డేనియల్ డీఫో సుప్రసిద్ధ రచన– ఇంగ్లిష్ భాషలో తొలి నవల– ‘రాబిన్సన్ క్రూసో’ సామాన్యశకం 1719లో తొలిముద్రణగా వెలువడింది. 1986లో, ఈ కథను దేశకాలమాన పరిస్థితులకు తగిన రీతిలో పునరూహ చేస్తూ, పునః రచించాడు కూట్సీ. దానికి ఆయన పెట్టిన పేరు ‘ఫో.’ నాలుగేళ్ళ తర్వాత, కూట్సీ తిరిగి దక్షిణాఫ్రికా ఇతివృత్తం వైపు దృష్టి మళ్ళించి, ‘ద ఐరన్ ఏజ్’ అనే నవల రాశారు. కూట్సీ రచనలన్నింట్లోనూ, ‘ఆశ్చర్యకరమైన రీతిలో పరాయివ్యక్తి జోక్యం జరుగుతూ ఉంటుంద’ని నోబెల్ పురస్కార ఎంపిక సంఘం పేర్కొంది. ఈ సామాన్య గుణంతో కూడివుండే కూట్సీ రచనలన్నింటికీ కలిపి నోబెల్ సాహిత్య పురస్కారాన్ని 2003లో అందించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారం పొందిన రచయితల్లో, ఈ ఆఫ్రికన్–ఆస్ట్రేలియన్ రచయితతో పోల్చదగిన వ్యక్తి మరొక్కరు కూడా కనిపించరని కూట్సీ అభిమానుల అభిప్రాయం! -మందలపర్తి కిషోర్ -
ఈ వారం కథ: ప్రశ్న
‘‘వల్లీ! మా డాడీ ఫోన్ చేశారు. పదో తారీఖున మనందర్నీ ఊరికి రమ్మన్నారు...’’ హబ్బీ వాసు మాటలకు ఆశ్చర్యంగా చూశాను. ‘‘ఎనీథింగ్ ఇంపార్టెంట్?’’‘‘అహ. వీలునామా రాస్తారట. తమ్ముళ్ళనీ చెల్లినీ కూడా పిలుస్తున్నారు ’’‘‘బావుంది. చాలామంది కరోనా తర్వాత రాశారు. మామగారు ఇప్పుడు రాస్తున్నారన్నమాట. మంచిదే! ఏమైనా ఆయనకు ముందు చూపు ఎక్కువే. కాని, అందరికీ ముందే చెబితే లేనిపోని గొడవలు రావూ!’’‘‘వస్తాయి. వాటిని మొదట్లోనే పరిష్కరించేయొచ్చు అన్నారు’’ బ్రేక్ఫాస్ట్ చేస్తూంటే వాసు చిన్న తమ్ముడు రఘు ఫోన్ చేశాడు.‘‘అన్నయ్యా, నాన్న వీలునామా రాస్తారట. నా సంగతి నీకు తెలుసుగా. నాది పెన్షన్ లేని ప్రైవేటు జాబు. ఎప్పుడు వూడుద్దో తెలీదు. మీ పిల్లలు బాగా సెటిలయ్యారు. నా పిల్లలింకా కాలేజీలోనే వున్నారు. అంచేత నాక్కొంచెం అదనంగా...!’’‘‘ఫేవర్ చేయించమంటావు? డాడీకి అందరి, అన్ని సంగతులూ తెలుసు. ఒకరితో చెప్పించుకోరు. నీకెలా న్యాయం చేయాలో అలా చేస్తారు గాని వూరికే భయపడకు’’వాసు ఫోన్ పక్కన పెడుతోంటే మళ్ళీ ఫోన్ మోగింది. డిస్ప్లే చూసి,‘‘పెద్ద తమ్ముడు శేషు’’ నాకు చెప్పి, ‘‘చెప్పరా. వీలునామా గురించేనా!’’ అడిగాడు.‘‘ఆ మాట విన్నప్పట్నుంచీ యమ టెన్షన్ గా వుందన్నయ్యా...’’‘‘ఎందుకురా!’’‘‘డాడీ సంగతి నీకు తెలుసుగా. అందరూ సమానమేనంటూ సమానంగా పంచుతారు. నేను నిండా మునిగిపోతాను!’’‘‘ఏం?’’‘‘నాకు ముగ్గురూ ఆడపిల్లలే. వాళ్ళ దుస్తులకూ, చదువులకూ చాలా ఖర్చయ్యింది. ఇక అసలు ఖర్చంతా ముందుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, పురుళ్ళూ పుణ్యాలూ...!’’‘‘శేషూ! ఉద్యోగం చేస్తున్నావు. మొన్ననే రెండో ప్రమోషన్ తీసుకున్నావు. నువ్వు బీదార్పులు అరవడం ఏం బాగోలేదు. పిల్లలకు పెళ్లి చేయాల్సిన బాధ్యత మనది కానీ డాడీది కాదు. అయినా నాన్నను అడక్కుండా నాకు చెబుతావేంటి!’’‘‘నువ్వు చెబితే నాన్న వింటారు...!’’‘‘అంతా ఓపెన్ గా చెప్పే చేస్తానన్నారు. అందరం అక్కడే వుంటాం గనుక అప్పుడే మాట్లాడదాం...!’’ ‘‘నన్ను సపోర్టు చేస్తావనుకున్నాను అన్నయ్యా!’’‘‘నాకు నువ్వెంతో రఘూ అంతే. ఏం చేసేదీ, ఎలా చేసేదీ అంతా డాడీ ఇష్టం. ఆయన ఏం చేస్తారో వినకుండా ముందే ఆందోళన పడటం అనవసరం’’ ఫోన్ పెట్టేసి, ‘‘నా సపోర్టు కోసం చేశాడు’’ చెప్పాడు వాసు. ‘‘అన్న గారిగా మీకూ బాధ్యత వుందిగా, చెయ్యండి’’ ఆఫీసుకు రెడీ అవుతుంటే అడబడుచు రమ కాల్ చేసింది. ‘‘నాకు చేశావేంటి రమా. మీ తమ్ముళ్ళిద్దరూ ఇంతక్రితమే మీ అన్నయ్యకు చేశారు’’ ‘‘వాళ్ళు చేయడమే కాదు బుడిబుడి దీర్ఘాలు తీస్తారనీ నాకు తెలుసు. అందుకే నీకు చేశాను. నువ్వేం చెప్పినా డాడీ వింటారు. బాగా చదువుకున్న దానివి, లాజిక్తో మాట్లాడతావని నువ్వంటే ఎంతో గౌరవం!’’‘‘సరి సరే. ఆఫీసుకు టైమయ్యింది. త్వరగా చెప్పు రమా’’‘‘నీ తమ్ముడి గురించి తెలుసుగా వదినా. మంచి ఉద్యోగం చేస్తున్నారని నన్నిచ్చి పెళ్లి చేశారు. అయిదేళ్ళు గడవకుండానే ఉద్యోగానికి రాజీనామా చేసి మిత్రుడితో కలిసి వ్యాపారం మొదలెట్టారు. అందులో ఎంత నష్టపోయామో నీకు తెలుసుగా. తర్వాత రియల్ ఎస్టేట్ అన్నారు. లక్షలొచ్చి పడతాయన్నారు. కొన్న భూమి కోర్టు గొడవల్లో ఇరుక్కుంది. ఈలోగా రొయ్యల చెరువుల్లో కోట్లు మిగుల్తాయని అందులోకి దూకారు. రొయ్యల సాగు గురించి చెప్పేదేముంది. ఎప్పుడే వైరస్ వచ్చి అవి తేలి, మమ్మల్ని ముంచేస్తాయో తెలీదు. కంటి నిండా నిద్రపోలేకుండా ఉన్నామంటే నమ్ము!’’ ‘‘ఇవన్నీ మీ నాన్నతోనో అన్నయ్యతోనో చెబితే లాభం వుంటుంది. నాతో ఏమవుతుంది చెప్పు!’’ ‘‘నీ వల్ల కానిది వుండదు వదినా. చెప్పేనుగా నువ్వన్నా నీ మాటలన్నా మా డాడీకెంతో గురి!’’‘‘సరే. ఆయన నీకు అన్యాయం చేసినట్టు అనిపిస్తే అప్పుడు కల్పించుకుంటాన్లే’’‘‘నువ్వు మాటిస్తే నా పని అయిపోయినట్టే’’ పొంగిపోయింది. కార్లో ఆఫీసుకు వెళుతూ, ‘‘రమ నాకు ఫోన్ చేసింది’’ చెప్పాను.‘‘ఏవిటో అనవసరంగా డాడీ తేనెతుట్టె కదిలిస్తున్నారు!’’‘‘మామయ్యగారికి ఇవన్నీ తెలీవనుకోను . ఈపాటికి ఏదో ఒక నిర్ణయానికొచ్చేసే వుంటారు. మనం వెళ్ళి శంఖంలో పోయడమే!’’ ‘‘చూద్దాం. నువ్వు సెలవు పెట్టడం మర్చిపోకు సుమా...’’ ఒకరోజు ముందే అత్తవారి వూరుకెళ్ళాం. అప్పటికే మిగతా మూడు కుటుంబాలూ వచ్చేశాయి. ‘‘పెద్ద పండుగ మళ్ళీ వచ్చినట్టుగా వుంది’’ అత్తయ్య ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ‘‘వంటా వడ్డనా మాకు అప్పగించి మీరు హాయిగా రెస్టు తీసుకోండి అత్తయ్యా’’ అన్నారు శేషు భార్య ప్రియదర్శిని, రఘు భార్య లలితకుమారి. ‘‘మేమిక్కడ వున్నంతకాలం మేమే వంటింటి మహారాణులం అత్తయ్యా !’’ అంటూ జత కలిశాను. మురిసిపోయిందావిడ. ‘‘ఆ మాటన్నారు అదే పదివేలు. నా బిడ్డలకు నేను వండిపెడితేనే నాకు తృప్తిగా వుంటుంది. మీరెళ్ళి కబుర్లు చెప్పుకోండి’’‘‘మీ బిడ్డలకే గాని మాకు వండిపెట్టరా!’’ నవ్వుతూ చురక వేశాను.‘‘అయ్యో, ఎంత మాట శ్రీవల్లీ. మీ ముగ్గురూ ఈ ఇంటి మహాలక్షు్మలు!’’ ‘‘నగలు అలంకరించుకుని కూర్చోడానికే గాని, మీ వంటింటి సామ్రాజ్యంలో అడుగు పెట్టకూడదన్నమాట!’’ నిష్ఠూరంగా అంది ప్రియదర్శిని. ‘‘అంతేనా లేక మేం మీలాగా వండలేమని వద్దంటున్నారా!’’ లలిత కుమారి ఆరా తీసింది. ‘‘అదేం కాదర్రా. మీరు మా బంగారాలు. రోజూ మీ వంటే తింటున్నారుగా. ఈ మూడు నాలుగు రోజులూ నా చేతి వంట తిననివ్వండి’’ ‘‘అయితే ఒక షరతు. మాకూ కొన్ని పనులు పురమాయించాలి. మా సాయమూ తీసుకోవాలి’’ మరి కాదన్లేక పోయారు. అవాళంతా కబుర్లతో ఛలోక్తులతో ప్రశంసలతో సరదాగా గడిచింది. ‘‘మీరెప్పుడూ ఇలాగే కలిసిమెలిసి వుండాలి. సంతోషంగా వుండాలి. ఒకరికొకరు సాయసంపదలు అందించుకోవాలి...’’ చెమ్మగిల్లిన కళ్ళతో అన్నారు మామయ్య. వెంటనే కొడుకులూ కూతురూ, ‘‘ఓ అలాగే డాడీ’’ అనేశారు.మర్నాడు ఎలాంటి తుపాను వస్తుందోనని వారి గుండెల్లో గుబులుగానే వుందన్న సంగతి వారి ముఖాలే చెబుతున్నాయి! పదకొండింటికి మామయ్యగారు అందర్నీ హాల్లోకి పిలిచారు. అందరం వెళ్ళి ఆయన వంక ఆసక్తిగా చూశాం. మామయ్యగారు కొన్ని పేపర్లు బయటికి తీశారు. ‘‘ఈమధ్య నా ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. రేపు లేనిపోని తేడాలు, గొడవలు రాకుండా ఇప్పుడే మీతో ఒక మాట చెప్పి వీలునామా రాసేయాలనుకున్నాను’’ ఆగి అందరి వంకా చూశారు. అంతా మౌనంగా ఉండిపోయేసరికి తిరిగి తనే అన్నారు ‘‘మేం ఒకర్ని ఎక్కువగా ఒకర్ని తక్కువగా చూడలేదు. అందర్నీ సమానంగా చూశాం, పెంచాం, చదివించాం. మీమీ శక్తియుక్తుల్ని బట్టి చదువుకున్నారు. ఉద్యోగాలో, వ్యాపారమో చేసుకుంటూ బాగానే సంపాదించుకుంటున్నారు. సంతోషం.మనకిప్పుడు పదెకరాల పొలం, రెండెకరాల మామిడితోట, టౌన్లో ఇళ్ళ స్థలాలు, ఇక్కడో ఇల్లు ఉన్నాయి. వీటన్నిట్నీ ఇవాళ్టి విలువని బట్టి లెక్కగట్టి ఆరు వాటాలు వేశాను...’’ఉలిక్కిపడ్డామంతా. ‘‘మేం నలుగురమే కదా డాడీ’’ వెంటనే శేషు అడిగాడు. ‘‘నాకూ మీ అమ్మకూ విడిగా వాటాలు వేశాను. ఇవాళ రేపు ఆసుపత్రులకు ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసుగా. ఏమంటావమ్మా శ్రీవల్లీ’’ నన్నడిగారు. ఆసరికే నా ముఖం ఎర్రబడింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. లోలోపల మండుతూ మౌనంగా వుండిపోయాను. ‘‘మీ ఆస్తి ఎలా పంచుతారో మీ ఇష్టం. మధ్యలో ఎవరి పెత్తనం అక్కర్లేదు’’ విసురుగా అన్నాడు వాసు. ‘‘అక్కకి పెళ్లిలోనే ఇంత మూట ఇచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు వాటా పంచడమంటే డబుల్ షేర్ ఇవ్వడమే!’’ రఘు ముఖాన గంటు పెట్టుకున్నాడు.‘‘అది కట్నం. ఇచ్చింది నాకు కాదు మా అత్తవారికి! ఇది నా హక్కు. నా వాటా నాకివ్వాల్సిందే!’’ రమ గొంతు పెంచింది. ‘‘ఆడబడచుకు ఒక రూపాయి పెట్టాలిగాని దానికి పెట్టిన దాని గురించి లెక్కలేయకూడదురా చిన్నోడా!’’ అన్నారు అత్తయ్య. ‘‘ఏం అన్నయ్యా మాట్లాడవేం!’’‘‘డాడీ ఆస్తి. తన ఇష్టానుసారం పంచే హక్కు అధికారం డాడీకి వున్నాయి. కాదనడానికి మనమెవరంరా!’’ అన్నాడు వాసు. తను ఎప్పుడూ అంతే. అందరితో మంచివాడు అనిపించుకోవాలని చూస్తారు తప్ప ఎటూ తేల్చి చెప్పరు! ‘‘డాడీ సంపాదించిందే కాదు, ఆ తాత, ఈ తాత ఇచ్చిందీ వుంది. వాటి మీద మనవలుగా మనకే పూర్తి హక్కు వుంటుందని ప్లీడరు చెప్పాడు’’ అన్నాడు శేషు. అంతా అదిరిపడి చూశారు.‘‘ఇది మన కుటుంబ వ్యవహారం. మనలో మనం తెముల్చుకోవాలి. కిందా మీదా పడినా ఫరవాలేదు గాని గొడవలు పడకూడదు. రేపు ఎవరూ కోర్టు గడప తొక్కకూడదనేగా ఇప్పుడు వీలునామా తలపెట్టింది!’’ అన్నారు మామయ్య. ‘’ఆస్తి పంచుతున్నప్పుడు ఇంకా వీలునామా ఎందుకు అంకుల్, ఏకంగా వాటాలు పంచి ఇచ్చేయండి. ఎవరి వాటా వాళ్ళు ఇప్పట్నుంచే అనుభవిస్తారు’’ ప్రియదర్శిని కల్పించుకుంది. ‘‘ప్రియదర్శిని చెప్పింది సబబుగా వుంది. ఆలోచించండి మామయ్యా!’’ అన్నాను. ‘‘శ్రీవల్లి బలపరుస్తోంది గనుక అందరికీ సమ్మతమైతే అలాగే చేద్దాం. ఏమంటారు’’‘‘పంచడమే కాదు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఎవరి కాగితాలు వారికి ఇచ్చేయ్యండి అంకుల్’’ అన్నాడు ఇంటల్లుడు అనిల్.‘‘అలాగే చెయ్యండి గాని సమాన వాటాలంటే మాత్రం నేనొప్పుకోను. అన్ని చేతి వేళ్ళూ ఒకేలా వుండవు. అందరి బరువు బాధ్యతలూ ఒకే రకంగా లేవు. అన్నయ్యలకు ఖర్చు పెట్టినంత నాకు ఖర్చు పెట్టలేదు..!’’రఘు మాటలకు, ‘‘వాళ్ళుపై చదువులకు వెళ్ళారు. నువ్వెళ్ళలేదు. అది నీ తప్పు. దాని పర్యవసానాలకు నువ్వే బాధ్యుడివి గాని, నేను కాదు కదురా!’’ అన్నారు మామయ్య.‘‘మేం కాదనటం లేదు. అన్నయ్య పిల్లలు త్వరగా ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. మా ఇద్దరి పిల్లలు ఆ స్థాయికి రావడానికి చాలా టైము పడుతుంది..’’ అని రఘు అంటే, ‘‘నాకు ముగ్గురూ ఆడపిల్లలే. నేను అందరి కన్నా ఎక్కువ బరువులు మోయాలి. దాన్ని లెక్కలోకి తీసుకోరా?!’’ సూటిగా బాధగా ప్రశ్నించాడు శేషు.‘‘ఆగండాగండి. మీ వదిన కరెక్టుగా చెబుతుంది. ఏమమ్మా, శ్రీవల్లీ, నీ అభిప్రాయం ఏమిటి?’’ నన్ను అడిగారు మామయ్య.నోరు తెరవక తప్పలేదు. ‘‘మాకు ఈ వ్యవహారంలో సంబంధం వుందా మామయ్యా!’’ సూటిగా అడిగాను.దెబ్బతిన్నట్టు చూశారు. ‘‘అలా మాట్లాడతావేంటమ్మా. ఇది మన కుటుంబ వ్యవహారం. పెద్ద కోడలిగా నీకెక్కువ బాధ్యత వుందమ్మా!’’‘‘మేం బరువు బాధ్యతలు మోయటానికే నన్నమాట!’’‘‘చిత్రంగా మాట్లాడతావేంటి వల్లీ. అసలు నీకివాళేమైంది’’ వాసు ముఖం చిట్లించాడు.‘‘జ్ఞానోదయం అయింది!’’‘‘ఇప్పుడు జరక్కూడనిదేం జరగిందమ్మా. నీ మాటెవరూ కాదన్లేదుగా!’’ అత్తయ్య అన్నారు.‘‘ఆస్తి పంపకాల్లో కోడళ్ళనీ సంప్రదించాలన్న ఆలోచనే మీకు రాకపోవడం చాలా దారుణం మామయ్యా!’’‘‘లోకతీరుని బట్టే చేస్తారు తప్ప నీకేదో స్పెషల్ సింహాసనం వెయ్యరు’’ కోప్పడ్డాడు వాసు.‘‘ఇంకా పంపకాలవ్వలేదు శ్రీవల్లీ. నీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పు ’’ అన్నారు మామయ్య.‘‘ఎన్ని వాటాలు వేస్తున్నారో ముందే చెప్పేశారుగా!’’‘‘కొడుకులకూ, కూతురికీ వాటాలేశాను. మా తనువులు వెళ్ళాలి గనుక మా ఇద్దరికీ చెరో వాటా వేసుకున్నాం. అది తప్పంటావా?’’‘‘అనను. కాని ఆ కుటుంబ సభ్యుల్లోకి కోడళ్ళు ఎందుకు రాలేదన్నది నా ప్రశ్న!’’‘‘కొడుకులకే కాదు కోడళ్ళకూ వాటా ఇమ్మంటోంది డాడీ!’’ రమ హేళనగా నవ్వింది.‘‘అప్పుడింక మా చేతికొచ్చేది ఆస్తి కాదు, ఖాళీ చిప్ప!’’ శ్రుతి కలిపాడు రఘు.‘‘కొడుకులకిస్తే మీకిచ్చినట్టు కాదా?’’ మామయ్య ప్రశ్నించారు.‘‘కానే కాదు. ఎవరిది వారిదే!’’‘‘ఆ మాట బాగోలేదమ్మా శ్రీవల్లీ. మొగుడూ పెళ్ళాలు ఎప్పుడూ ఒకటే’’ నొచ్చుకున్నారు అత్తయ్య.‘‘నీ ఉద్దేశమేంటి అక్కయ్యా’’ ప్రియదర్శిని అడిగింది.‘‘పెళ్ళవుతూనే ఈ ఇంటికొచ్చాం. ఈ ఇంటి సభ్యులం అయ్యాం. పెళ్లితో వీరి గోత్రమే మనదైంది. ఈ ఇంటి పేరే మనదైంది!...’’‘‘ ఇప్పుడు కాదని ఎవరన్నారు?’’ మామయ్య అడిగారు.‘‘ మా పెళ్లి అవుతూనే ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మీరే మన్నారో గుర్తుందా మామయ్యా. ‘నువ్వు ఇంటి పెద్ద కోడలివి గనుక కుటుంబ పరువు ప్రతిష్ఠలు, మర్యాదలు, సంప్రదాయాలు అన్నీ నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి అన్నారు. వదిన అంటే తల్లే. అంచేత మరుదుల్ని, ఆడపడుచుని చక్కగా చూసే బాధ్యత కూడా నీదే!’ అన్నారు’’‘‘అవును. అవే మాటలన్నాను. నువ్వు, నీ తోడికోడళ్లు అవి చక్కగా పాటించిన మాటా నిజమే. అయితే ఇప్పుడు ఏంటి!’’‘‘పూర్వం పెద్దకొడుకు అంటే పెద్ద పాలేరు అని అదనంగా ఏదో ముట్టచెప్పేవారు. ఇప్పుడు అన్నయ్యకి కాకపోయినా వదినకి ఇవ్వమనేమో!’’ వంకరగా నవ్వాడు శేషు .నా వంక కొరకొరా చూశాడు వాసు.‘‘మేము ఈ ఇంటి సభ్యులుగా కుటుంబ పరువు మర్యాద కాపాడాలి. కుటుంబ బరువు బాధ్యతలు పంచుకోవాలి. మేం ఈ కుటుంబ సభ్యులమే అయినప్పటికీ మాకు బాధ్యతలు తప్ప ఇంటి మీద గాని, కుటుంబ ఆస్తి మీద గాని ఎలాంటి హక్కూ అధికారం ఎందుకు లేవన్నది నా ప్రశ్న! ఈ ఇంట్లో కోడళ్ళు ఉత్త సభ్యులే అంటే మాత్రం నేను అంగీకరించను!’’‘‘అలా ఆలోచిస్తే అక్క అన్నది సమంజసమే’’ ప్రియదర్శిని అంది.‘‘ఇదేమీ వ్యాపార భాగస్వామ్యం కాదు, కుటుంబస్వామ్యం!’’ వాసు కసురుకున్నాడు.‘‘తెలుసు. నేనడిగేది కుటుంబ ఆస్తిలోని భాగమే!’’‘‘వదిన అతి తెలివిగా మాట్లాడుతోంది. అప్పుడు తను పుట్టింటి నుంచి తెచ్చుకున్నదీ ఉమ్మడి ఆస్తే అవుతుందిగా!’’ రఘు అన్నాడు.‘‘అవ్వదు. అది నాది. కూతురు గనుక రమకీ వాటా ఇస్తున్నాంగా. అలాగే మేమూ పుట్టిళ్ళ నుంచి తెచ్చుకున్నాం. మరి మాకు అత్తింటి నుంచి ఎందుకని ఏమీ ఇవ్వరు ?’’‘‘నువ్విలా అడ్డంగా మాట్లాడటం నాకు నచ్చలేదు’’ ముఖం మాడ్చుకున్నారు మామయ్య.‘‘పితృస్వామ్య ఆలోచనా దృక్పథంలోంచి బయటికొచ్చి చూస్తే నా మాటలెంత న్యాయమో అర్థమవుతాయి మామయ్యా. అత్తయ్యగారు తెచ్చుకున్నది రమకి కట్నంగా ఇచ్చారు. ఆవిడకేం మిగల్లేదు గనుకే వాటా ఇస్తున్నారు. రఘూ వాళ్ళది లవ్ మ్యారేజ్. లలిత ఏమీ తెచ్చుకోలేదు. ఇలాగే ఒక్కో కోడలి ఆర్థిక స్థితి ఒక్కో రకంగా వుంటుంది. వారికి కుటుంబ ఆస్తిలో భాగం ఇవ్వకపోవడమంటే తోటి కుటుంబ సభ్యులకు ముమ్మాటికీ అన్యాయం చేస్తున్నట్టే!’’ నా స్వరం మరింత పెరిగింది.‘‘మొగుడూ పెళ్లాల్ని వేరు వేరుగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావటం లేదు’’ బాధగా అన్నారు మామయ్య.‘‘ఒకటే ఎలా అవుతారు? నిజంగా మీరా సంగతి మనస్ఫూర్తిగా నమ్మితే, ఆస్తి కొడుకులకు కాక కోడళ్లకు రాయండి. రాయగలరా? కచ్చితంగా రాయలేరు! ఆయన ఆస్తే నా ఆస్తి, ఆయన ఇల్లే నా ఇల్లు, ఆయన సంపాదనే నా సంపాదన అనుకోమంటారు? నాకు విడిగా ఎలాంటి గుర్తింపూ లేదంటారు? ఆయన నీడలా ఉంటూ ఆయన దయాదాక్షిణ్యాల మీద ఎప్పటికీ ఆధారపడే ఉండాలంటారు? ఇదేనా కుటుంబ వ్యవస్థ ఇంటి కోడళ్లకు ఇచ్చే గౌరవం? నేను ఉద్యోగం చేస్తున్నాను గనుక ఓకే, లేకపోతే నా పరిస్థితి ఏమిటి? ప్రతిదానికీ మొగుడి మీద ఆధారపడాలి. అంటే గాలిలో వేలాడాలి !’’‘వేరు వేరు అనుకుంటే తేడాగానే ఉంటుంది. అంతా ఒకటే అనుకుంటే ఏమీ ఉండదు!’’ అన్నారు అత్తయ్య.‘‘రేపేం జరుగుతుందో ఎవరు ఊహించగలరు అత్తయ్యా? ఏమైనా జరగొచ్చు. మేం విడిపోవచ్చు. వేరే మోజులోపడి నాకూ పిల్లలకూ అన్యాయం చేయొచ్చు. వ్యసనాలకు తగలేయొచ్చు. ‘ఇది నా ఇల్లు’ అంటూ ఇంట్లోంచి తన్ని తరిమేయొచ్చు. అటువంటప్పుడు కుటుంబం ఆయా సభ్యులకు అండగా నిలబడాలిగా! మరప్పుడు విడిగా ఆస్తిహక్కు ఎందుకివ్వరు? మిమ్మల్నొక్కర్నే కాదు, మొత్తం ఈ పితృస్వామ్య సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను!’’ఎవరూ మాట్లాడలేదు. మధ్యలో శవం వున్నట్టు మౌనంగా వుండిపోయారు.‘‘అవసరం రానంతవరకూ ఉమ్మడిగానే వుంటుంది. అవసరమైనప్పుడు ఎవరిది వారికే అవుతుంది’’ గొణుక్కున్నారు మామయ్య.‘‘అది నా ప్రశ్నకు సమాధానం కాదు మామాయ్యా!’’‘‘నీ ప్రశ్న చాలా చిత్రంగా ఉంది. ఏ ఇంట్లోనూ లేనిది మన ఇంట్లోనే ఎందుకు?’’‘‘దానర్థం నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని స్థితిలో కుటుంబం వుంది. అంటే నేనీ ఇంట్లో ఒక డమ్మీని! అది తెలిసి కూడా నేనిక్కడ బొమ్మలా కూర్చుని మీ రేడియో సంభాషణ వినడంలో అర్థం లేదు!’’ విసురుగా లేచి వచ్చేశాను.నా వెనుకే ప్రియదర్శిని, కాస్సేపటికి లలిత కుమారి వచ్చేశారు. ‘‘మీ నిర్ణయానికి నిరసనగా మీ కోడళ్ళు వాకౌట్ చేశారు డాడీ!’’ మా వెనుక ఎవరో అన్నారు.అవును, మాది వాకౌటే. కుటుంబంలోంచి వాకౌటే! ‘‘శ్రీవల్లీ!’’ పిలుస్తూ అత్తయ్య వచ్చారు. ‘‘ఇంట్లో మీకు లేని హక్కులు నాకూ ఉండవు గాని లోపలికి పదండి’’‘‘అది కాదు అత్తయ్యా!’’‘‘లోపలికి రండి. నేనున్నాగా!’’ మౌనంగా అనుసరించాం. ‘‘వీళ్లు నాలాగానే ఈ కుటుంబంలోకి వచ్చారు. కుటుంబ సభ్యులయ్యారు. కోడళ్ళకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీదా వుంది. ఉమ్మడి ఆస్తిలో వారికీ వాటా వేయాల్సిందే!’’మేం చప్పట్లు కొట్టాం! -సింహప్రసాద్ -
ప్లాస్టిక్ అడ్రెస్
ప్లాస్టిక్ లేకుండా మన రోజువారీ జీవితం సాగని పరిస్థితి వచ్చేసింది. ఈ ప్లాస్టిక్ మన ఇంట్లోకే కాదు ఇప్పుడు ఒంటి మీదకు వచ్చేసింది. సౌకర్యం కోసం ఎంచుకున్న దుస్తులు– అనారోగ్య సమస్యలను ‘కొని’ తెస్తున్నాయి. ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ఇవి త్వరగా చెడిపోక వ్యర్థాలుగా పేరుకుపోయి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.మీ పిల్లల్ని కొత్త స్కూల్లో చేర్చారా? మీ పిల్లలు వాడుతున్న యూనిఫామ్లు సరిపోవడం లేదా? అయితే ఈ ఏడాది మరో యూనిఫామ్ కొనాల్సిందే! కొనడం సరే, అసలు పిల్లలు వాడుతున్న యూనిఫామ్లు ఆరోగ్యకరమేనా? పర్యావరణ హితమేనా? పాత యూనిఫామ్స్ సంగతేంటి? వాటిని ఏం చేస్తున్నాం? వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఈ ప్రశ్నలు సాధారణంగా మనం వేసుకోం. ఎందుకంటే యూనిఫామ్ తప్పనిసరి అవసరం. ఏడాదికో జత మార్చేదే కదా? అది అందుబాటు ధరలో లభిస్తే సరిపోతుంది అని భావిస్తాం కాని, ఈ యూనిఫామ్ వెనుక అనేక వాస్తవాలు దాగి ఉన్నాయి.మన దేశంలో సుమారు 24 కోట్లకు పైగా విద్యార్థులు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ ఏడాదికి తమ యూనిఫామ్లోని ఒక షర్టు వాడకుండా పక్కన పడేస్తే, దాదాపు 32,000 టన్నుల వ్యర్థాలు పోగుపడతాయి. యూనిఫామ్ షర్టులు ఎక్కువగా పాలిస్టర్తో తయారవుతాయి. ఒక కిలో పాలిస్టర్ తయారీకి సుమారుగా 62 లీటర్ల నీరు అవసరం. 1.53 కిలోల పెట్రోలియం. 217 మెగా జూల్స్ శక్తి అవసరం అవుతుంది. పాలిస్టర్ తయారీ ప్రక్రియలో 21 కిలోగ్రామల కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది.పాలిస్టర్ను ఎక్కువగా ఎందుకు వినియోగిస్తారు?మన దేశంలో పాలిస్టర్ను ఎక్కువగా వాడడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ బట్ట ముడతలు పడదు. దీంతో ఇస్త్రీ అవసరం ఉండదు. ఉతికిన తర్వాత త్వరగా ఆరుతుంది. ఇది వినియోగదారులకు అదనపు సౌలభ్యం.ఏటా 70 లక్షల టన్నులకు పైగా వస్త్ర వ్యర్థాలుమన దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై జరుగుతున్నంత చర్చ వస్త్ర వ్యర్థాలపై జరగడం లేదు. పేరుకుపోతున్న వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నా, పర్యావరణానికి ముప్పుగానే పరిణమిస్తోంది. కేంద్ర జౌళిశాఖ లెక్కల ప్రకారం దేశంలో ఏటా 70.73 లక్షల టన్నుల వస్త్ర వ్యర్థం ఉత్పత్తి అవుతోంది. దీంట్లో 42% ఫ్యాక్టరీల్లో తయారీ సమయంలో వస్తుండగా, 58% వినియోగం తర్వాత వచ్చే వ్యర్థం. ఇందులో 70% వ్యర్థాల్ని రీసైక్లింగ్, పునర్వియోగం చేస్తున్నారు. ప్రపంచంలోని వస్త్ర వ్యర్థాల్లో భారతదేశం సుమారు 8% వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది.విద్యార్థులపై ప్రభావంపాలిస్టర్ వస్త్రాన్ని పాలిథిలిన్ టెరెఫ్లాలెట్ (పెట్) అనే రసాయనంతో తయారు చేస్తారు. పెట్రోలియం ఆధారిత రసాయనాలను వేడిచేసి, వాటిని ప్లాస్టిక్ చిప్స్గా మార్చి ఆపై సన్నని దారాలుగా మారుస్తారు. పెట్ బాటిల్స్ అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం– వాటిని కూడా ఈ మెటీరియల్తోనే తయారు చేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇదే వాస్తవం. విద్యార్థులు ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం యూనిఫామ్ వేసుకుంటారు. ఈ దుస్తులు చెమట పీల్చుకోవు. చర్మంపై ఎక్కువ సేపు తడి ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి కొంతమందిలో అలర్జీలు, చర్మ సమస్యలు వస్తాయి.ఇది మరిన్ని అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఈ దుస్తులు ఉతికిన ప్రతిసారీ కంటికి కనిపించనంత చిన్న పరిమాణంలో ప్లాస్టిక్ రేణువులుగా విడిపోయి నీటిలో కలుస్తాయి. నీటిశుద్ధి కేంద్రాలు సైతం వీటిని పూర్తిగా వడపోయలేవు. ఇవి నదుల్లోకి, సముద్రాల్లోకి చేరుతాయి. చేపలు, ఇతర జీవులు వీటిని ఆహారంగా తీసుకుంటాయి. ఆ జీవులను మనం తింటే ఆ ప్లాస్టిక్ రేణువులు మన శరీరంలోకి చేరుతాయి. ఇవి కేవలం నీటిలోనే కాదు గాలిలోనూ కలుస్తాయి. ఇవి శ్వాస ద్వారా మన శరీరంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది.పర్యావరణానికి ముప్పు కొంతమంది దుస్తులను కాలువలు, నదులు, నీటి కుంటల్లో పడేస్తారు. కొన్ని డంపింగ్ యార్డుకు చేరుతాయి. ప్రధానంగా పాలిస్టర్ వస్త్రాలు మట్టిలో కలిసిపోవు. ఏళ్ల తరబడి అలానే ఉంటాయి. మరికొన్ని పీలికలుగా అయిపోతాయి కానీ నేలలో పూర్తిగా కలిసిపోవు. కొన్నిచోట్ల దుస్తులను బహిరంగంగా కాలుస్తారు. ఇది తక్షణ పరిష్కారంగా కనిపించినా, సింథటిక్ వస్త్రాలు కాల్చినప్పుడు విషపూరిత వాయువులు విడుదల అవుతాయి. ఇవి గాలిలో చే రి మనం పీల్చే గాలిని కలుషితం చేసి, మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.రీ సైక్లింగ్ పరిష్కారమా? తాత్కాలిక ఉపశమనమా?వస్త్ర వ్యర్థాలు భారీగా పెరిగిపోతున్నాయి. కొండల్లా పేరుకుపోతున్నాయి. ఈ దశలో సహజంగా వచ్చే ఆలోచన రీ సైక్లింగ్. ఈ వ్యర్థాలను మళ్లీ ఉపయోగించగలమా? వీటితో కొత్త ఉత్పత్తులు తయారు చేయగలమా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. భారతదేశంలో వస్త్రాల రీ సైక్లింగ్ కొత్త వ్యవస్థేమీ కాదు. ఏళ్ల తరబడి అనధికారికంగా, కుటీర పరిశ్రమల స్థాయిలో నిరంతరాయంగా ఈ వ్యవస్థ పనిచేస్తోంది.దేశంలోని కొన్ని ప్రాంతాలు రీసైక్లింగ్ హబ్లుగా మారాయి. వాడిన దుస్తులు, ఫ్యాబ్రిక్ ముక్కలు, పరిశ్రమ వ్యర్థాల నుంచి సేకరించిన వాటిని ఈ హబ్లలో వర్గీకరిస్తారు. పునర్వినియోగానికి అనుగుణంగా మారుస్తారు. అయితే ఇదంత సులభమైన ప్రక్రియ కాదు. సేకరించిన వాటిలో ఉపయోగపడేవి, ఉపయోగపడని వాటిని ముందుగా వర్గీకరించాలి. పనికొచ్చే వాటిని ప్రాసెస్ చేసి దుప్పట్లు, దిండ్లు, ఫిల్లింగ్ మెటీరియల్స్, తక్కువ నాణ్యత గల దుస్తులు తయారు చేస్తారు.రీసైక్లింగ్కు పలు పరిమితులురీసైక్లింగ్ ఒక పాక్షిక పరిష్కార మార్గం మాత్రమే. మొత్తం వ్యర్థాల నిర్మూలన కు ఇది పూర్తి పరిష్కారాన్ని చూపడం లేదు. ముఖ్యంగా పాలిస్టర్ వ్యర్థం పూర్తి స్థాయి వినియోగానికి పనికి రాదు– ఇది మొదటి సమస్య. సేకరించడం, వర్గీకరించడం, శుద్ధి చేయడం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి– ఇది రెండో సమస్య. ఇక మూడో సమస్య సాంకేతికత. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతులనే వినియోగిస్తున్నారు.ఫలితంగా పాలిస్టర్ మిక్స్డ్ కాటన్ వంటి వస్త్రాల్లో వ్యర్థాలు ఎక్కువగా మిగిలిపోతున్నాయి. కెమికల్ రీసైక్లింగ్ పద్ధతులు అందుబాటులో ఉన్నా, అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. వీటికి ఖర్చు ఎక్కువ. సాంకేతికత విస్తృతంగా అందుబాటులో లేదు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా ఉత్పత్తి పెరుగుతోంది. వినియోగమూ అదే స్థాయిలో ఉంది. దుస్తులను తక్కువ కాలం వాడి పారేస్తున్నాం. ఈ విధానంలో మార్పు రాకపోతే పునర్వినియోగం మాత్రమే సమస్యను పరిష్కరించలేదు.అటకామా ఎడారిలో వ్యర్థవస్త్రాలుచిలీలోని అటకామా ఎడారి వ్యర్థవస్త్రాల చెత్తకుప్పలా మారుతోంది. అమెరికా, యూరోప్ దేశాలు పనికిరాని దుస్తులను తీసుకొచ్చి, అటకామా ఎడారిలో అక్రమంగా పడేస్తున్నారు. ఈ తతంగం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. చిలీకి వివిధ దేశాల నుంచి ఏటా వాడేసిన దుస్తులు దాదాపు 1.23 లక్షల టన్నుల వరకు వస్తుంటాయి. వీటిలో సెకండ్ హ్యాండ్ మార్కెట్కు కూడా పనికిరాని దుస్తులు 39 వేల టన్నుల వరకు ఉంటాయి. వీటినే అటకామా ఎడారిలో పడేస్తున్నారు. వీటిలో ఎక్కువగా సింథటిక్ దుస్తులే ఉండటం వల్ల ఇవి పర్యావరణానికి సమస్యగా మారుతున్నాయి.ఇతర పరిష్కారాలు⇒ వస్త్ర వ్యర్థాల సమస్య పరిష్కారం కావాలంటే ఉత్పత్తి నుంచి వినియోగం వరకు వ్యవస్థలో మార్పు రావాలని పరిశోధకులు, పర్యావరణవేత్తలు చెబుతున్నారు.⇒ ఒకే తరహా వస్త్రాలను ఎక్కువగా వినియోగించే యూనిఫామ్ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అత్యంత అవసరం. ఇది సులభతరం కూడా!⇒ ఈ వస్త్రాల తయారీలో పర్యావరణానికి అనుకూలమైన పదార్థాలను ఉపయోగించాలి. సహజసిద్ధమైన దారాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. దుస్తుల్లో పాలిస్టర్ శాతాన్ని పరిమితం చేయాలి. పర్యావరణ అనుకూల ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలి.⇒ విద్యార్థులు సుమారు ఎనిమిది నుంచి పది గంటల సేపు యూనిఫామ్ వేసుకుని ఉంటారు. కాటన్ దుస్తులు శరీరానికి అనుకూలంగా ఉంటాయి. చెమటను పీల్చుకుంటాయి. ఆరోగ్యపరంగాను మేలు చేస్తాయి. వీటి వాడకం పెరిగితే నేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. కునారిల్లుతున్న నేత పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుంది.⇒ పాఠశాలల నిర్వాహకులు, తల్లిదండ్రులు ముందుగా ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. యూనిఫామ్ ధర ఆధారంగా కాకుండా పిల్లల ఆరోగ్యం, పర్యావరణహితం ఆధారంగా ఎంపిక చేసుకోవాలనే అవగాహన పెరగాలి. ⇒ మన ఎంపిక పిల్లల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.⇒ పత్తి మంచిది పాలిస్టర్ చెడు అనేది సమస్య కాదు. పత్తి సాగులో కూడా అత్యధికంగా నీటి, రసాయనాల వినియోగం, కాలుష్యం వంటి సమస్యలు ఉన్నాయి. పర్యావరణానికి అనుకూలమైన సాగు పద్ధతులు, వస్త్రాల తయారీ కీలకం. ఆ దిశగా పరిశ్రమలు ముందడుగు వేయాలి.⇒ వస్త్ర వ్యర్థాల తగ్గింపులో అతి ముఖ్యమైన పాత్ర తయారీదారులది. ఒక వస్త్రం తయారు చేసిన తర్వాత అది వ్యర్థంగా మారినపుడు కూడా ఆ కంపెనీ బాధ్యత వహించాలి. ఈ విధానాన్ని అమలు చేస్తే ఉత్పత్తి దశలోనే పలు మార్పులు వస్తాయి. వ్యర్థాల శాతం తగ్గేలా పరిశ్రమలు జాగ్రత్తలు తీసుకుంటాయి.⇒ సమాజపరంగా చూస్తే దుస్తుల వినియోగపు అలవాట్లలో మార్పు కీలకం. ఎన్ని దుస్తులు కొనుగోలు చేస్తున్నాం? ఎంత కాలం వాడుతున్నాం? ఈ రెండు ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనవి. ఒక దుస్తు విలువ దాని ధరలో కాదు, ఎన్నాళ్లు వాడుతున్నామనే దానిలో ఉందనే అవగాహన పెరగాలి.యూనిఫామ్ మార్కెట్ వృద్ధి⇒ 1980ల నాటికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు అన్ని విద్యాసంస్థలు యూనిఫామ్ తప్పనిసరి చేశాయి. ∙గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా సంస్థల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. దీంతో యూనిఫామ్ వినియోగం, వ్యాపారం రెండూ పెరిగాయి.ప్రపంచవ్యాప్తంగా యూనిఫామ్ మార్కెట్⇒ 2024 18.9బిలియన్ డాలర్లు⇒ 2034(అంచనా) 33.1 బిలియన్ డాలర్లువస్త్రాల వ్యర్థం – ప్రపంచస్థాయి సమస్య⇒ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ గతేడాది ఆగస్టులో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 మిలియన్ టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. ⇒ వీటితో 200కి పైగా ఒలింపిక్ స్టేడియాలను నింపవచ్చని పేర్కొంది. 2030 నాటికి ఈ వ్యర్థం 150 మిలియన్ టన్నులకు చేరవచ్చని అంచనా.⇒ ప్రపంచవ్యాప్తంగా దుస్తుల ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ డంప్యార్డులకు చేరే వాటి సంఖ్యా పెరుగుతోంది. ⇒ కాల్చివేసే లేదా విదేశాలకు ఎగుమతి చేస్తే బట్టల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటోంది.⇒ అమెరికా, యూరప్ నుంచి పెద్ద మొత్తంలో వస్త్ర వ్యర్థాలు మన దేశంలోని హరియాణాలో ఉన్న పానిపట్కి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద టెక్స్టైల్ రీసైక్లింగ్ కేంద్రంగా గుర్తింపు పొందింది. ∙దిగుమతి అయిన పాత బట్టలను రీసైకిల్ చేసి కొత్త దుస్తులు లేదా దుప్పట్లు తయారు చేస్తారు.ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం⇒ వస్త్రాల వ్యర్థాలు ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపుతున్నాయి. వస్త్ర వ్యర్థాల నుంచి వచ్చే విషపూరిత రసాయనాలు, రంగులు, సూక్ష్మ ప్లాస్టిక్ నేలలోకి, నీటిలోకి చేరి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. ⇒ డంపింగ్ యార్డుకు చేరిన వ్యర్థాలు క్రమంగా కుళ్లే సమయంలో ప్రమాదకర విషవాయువులు విడుదలై వాతావరణ మార్పులకు కారణం అవుతాయి.⇒ ఏటా సుమారు 5లక్షల టన్నుల మైక్రోఫైబర్లు సముద్రంలో కలుస్తున్నాయి.నీటి వినియోగం ఎంత?⇒ ఒక కాటన్ షర్ట్ తయారీకి సుమారు 2,649 లీటర్ల నీరు అవసరం. ఒక వ్యక్తి రోజుకు 8 గ్లాసుల చొప్పున తాగితే సుమారు మూడు నుండి నాలుగు సంవత్సరాలకు ఆ నీరు సరిపోతుందని అంచనా.⇒ పాలిస్టర్తో పోలిస్తే కాటన్ షర్ట్ తయారీకి నీటి వినియోగం చాలా ఎక్కువ. అయితే పాలిస్టర్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువ.సహజ సిద్ధ వస్త్రాలకు ప్రాధాన్యం⇒ పర్యావరణానికి హాని తక్కువ.⇒ గాలి, నేల కాలుష్యం తగ్గుతుంది.⇒ నీటి వినియోగాన్ని తగ్గిస్తాయి⇒ రైతులు, కార్మికులకు ఆరోగ్యకరం.ప్రపంచవ్యాప్తంగా ఏటా 92 మిలియన్ టన్నుల వ్యర్థవస్త్రాలు పోగవుతున్నాయి. ప్రతి సెకనుకు ఒక చెత్తలారీ లోడుకు సమానమైన వ్యర్థవస్త్రాలు తగులబడుతున్నాయి. వీటిలో ఎక్కువగా ఉంటున్న సింథటిక్ వస్త్రాలు నేలలో పూర్తిగా కలిసిపోవడానికి కనీసం రెండువందల ఏళ్లు పడుతుంది. వీటి వల్ల భూసారం దెబ్బతింటోంది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. వీటిని తగులబెట్టడం వల్ల పర్యావరణంలోకి విషవాయువులు వెలువడుతూ, జీవజాలం మనుగడకు ముప్పుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న దుస్తుల్లో దాదాపు 57 శాతం వరకు ఏడాదిలోగానే వ్యర్థంగా మారుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఈ పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చుతున్నా, ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకు ఎవరూ సరైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేకపోవడమే విచారకరం. టైక్స్టైల్, రీ సైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. విషపూరిత రసాయనాలు, దుమ్ము, సూక్ష్మఫైబర్ కణాల విడుదల కారణంగా వారు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారు. మహిళలు కూడా ఈ రంగంపై ఎక్కువగా ఆధారపడ్డారు. వారికి తగిన భద్రత, రక్షణ సదుపాయాలు లేవు. కంటి సంబంధిత సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలు సాధించాలంటే పని పరిస్థితులను మెరుగుపర్చి, భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ∙దిలీప్ మాదిరెడ్డి -
నేను క్లాస్ తను మాస్!
రహస్య గోరఖ్ నటనతోనే కాదు, తన నిజాయితీ మాటలతో కూడా అందరినీ ఆకట్టుకునే తెలుగింటి అమ్మాయి. జీవిత భాగస్వామిగా కిరణ్ అబ్బవరంను ఎంచుకున్న ఈ సుందరి, తన మనసులోని భావాలను మనతో పంచుకుంది. ఆ విషయాలే మీకోసం..నాది సినిమా ప్రేమకథనా అసలు పేరు ఐశ్వర్య గోరఖ్. సినిమా ప్రపంచమే నాకు రహస్య అనే పేరు పెట్టింది. అదే ప్రపంచం నా మొదటి సినిమా ‘రాజా వారు రాణి గారు’తో జీవిత భాగస్వామిని కూడా ఇచ్చింది. మా ప్రేమకథ ఒక చిన్న రహస్యంలా మొదలై, ఇప్పుడు అందరి ఆశీస్సులతో పెళ్లి వరకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.చదువుకే ప్రాధాన్యంచదువు విషయంలో నేను చాలా శ్రద్ధ చూపించాను. బీబీఏ పూర్తి చేసిన తర్వాత, అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో అడ్వరై్టజింగ్ అండ్ మార్కెటింగ్ కోర్సు చేశాను. ఆ సమయంలోనే నటనపై ఆసక్తి పెరిగింది. అయినా చదువును మధ్యలో వదిలిపెట్టకుండా, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాకే పూర్తిస్థాయిలో కెమెరా ముందుకు వచ్చాను.ఫొటోగ్రఫీ నా ప్రశాంత ప్రపంచంషూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా అందమైన ప్రదేశాలను కెమెరాలో బంధించడం నాకు ఎంతో ఇష్టం. ఆ పని నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.ఊరోడిని పెళ్లి చేసుకున్నా!నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్లోనే, కాని, కిరణ్ మాత్రం పక్కా పల్లెటూరోడు. షూటింగ్ సెట్లో మొదలైన మా పరిచయం ఎప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలియదు. ఐదేళ్ల పాటు సాగిన మా ప్రయాణాన్ని మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో గౌరవంగా అంగీకరించారు.వంట చేయడం నా ప్రత్యేక హాబీకొత్త కొత్త వంటకాలు చేయడం నాకు హాబీ. ముఖ్యంగా స్వీట్లు తయారు చేయడంలో నాకు మంచి నైపుణ్యం ఉంది. పెళ్లి తర్వాత కిరణ్ కోసం మరిన్ని ఆంధ్ర శైలి వంటకాలు కూడా నేర్చుకున్నాను.బిర్యానీ అంటే ఒక ఎమోషన్హైదరాబాదీస్కు బిర్యానీ అంటే ఒక ఎమోషన్. నా ఫేవరెట్ ఫుడ్ కూడా బిర్యానీనే. అయితే ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహారంపై కొంత శ్రద్ధ పెడుతున్నాను. అయినా అప్పుడప్పుడు బిర్యానీ రుచిని ఆస్వాదిస్తున్నాను.భవిష్యత్తు కుటుంబం, కెరీర్ రెండూ కలిసిభవిష్యత్తులో నటిగా కొనసాగుతూనే, కిరణ్తో కలిసి ఒక అందమైన కుటుంబ జీవితం గడపడం నా లక్ష్యం. అభిమానులు చూపిస్తున్న ప్రేమే నాకు అతిపెద్ద విజయం. ప్రస్తుతం ‘కిరణ్ అబ్బవరం’ నిర్మాణ సంస్థ పనులతో బిజీగా ఉన్నాను. -
కళ్లకు జోడు... స్టయిల్కు తోడు!
కళ్లద్దాలు అంటే కేవలం చూపు కోసం మాత్రమే అనుకుంటే, అది పెద్ద పొరపాటు! ఒక చిన్న యాక్సెసరీగా మీ పర్సనాలిటీని స్టయిల్గా చూపించే పవర్ ఈ కళ్లజోడుకే ఉంది. అందుకే, ఈ చిన్న సీక్రెట్స్ ఫాలో అయితే, మీ లుక్ ఆటోమేటిక్గా లెవల్ అప్ అవుతుంది!ఫేస్ షేప్కు సరిపోయే ఫ్రేమ్ప్రతి ఒక్కరి ముఖం ఒకేలా ఉండదు. అందుకే, ఫేస్ షేప్కు తగ్గ ఫ్రేమ్ ఎంచుకుంటేనే లుక్ సూపర్గా కనిపిస్తుంది. రౌండ్ ఫేస్ ఉన్నవారికి స్క్వేర్ లేదా రెక్టాంగిల్ ఫ్రేమ్స్ బాగా సెట్ అవుతాయి. ఓవల్ ఫేస్ ఉన్నవారు దాదాపు అన్ని స్టయిల్స్ ట్రై చేయొచ్చు. షార్ప్ జా లైన్ ఉన్నవారికి రౌండ్ ఫ్రేమ్స్ ఒక క్లాసీ టచ్ ఇస్తాయి.కలర్ కూడా క్యారెక్టర్ చెప్పేస్తుందిబ్లాక్, బ్రౌన్ , గ్రే లాంటి కలర్స్ ఎప్పటికీ క్లాసిక్. ఇవి ఏ డ్రెస్కైనా సెట్ అవుతాయి. అదే రెడ్, బ్లూ, గ్రీన్ లాంటి బ్రైట్ కలర్స్ అయితే మీరు కాస్త బోల్డ్, ఫన్ లవింగ్ పర్సన్ అన్న ఫీలింగ్ ఇస్తాయి. సన్ గ్లాసెస్లో డార్క్ షేడ్స్ కూల్ లుక్ ఇస్తే, లైట్ టింట్స్ ఒక ట్రెండీ వైబ్ ఇస్తాయి.సందర్భానికి తగ్గట్టుగాఆఫీస్కి వెళ్తే సింపుల్, స్లిమ్ ఫ్రేమ్ స్పెక్ట్స్ ఒక ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి. బీచ్ ఔటింగ్ లేదా ట్రిప్కి వెళ్తే, పెద్ద ఫ్రేమ్ సన్గ్లాసెస్. పార్టీలు లేదా ఫొటో షూట్స్కి అయితే, ట్రెండీ షేప్ ఉన్న గ్లాసెస్ మీ లుక్ను హైలైట్ చేస్తాయి.చిన్న ఫ్రేమ్తో పెద్ద ఇంపాక్ట్కొన్నిసార్లు చిన్న సైజ్ ఫ్రేమ్స్ కూడా పెద్ద స్టేట్మెంట్ పీస్ అవుతాయి. ముఖానికి సరిగ్గా ఫిట్ అయ్యే ఫ్రేమ్ ఉంటే, అది మీ ఫీచర్స్ను మరింత హైలైట్ చేస్తుంది.సన్ గ్లాసెస్ అంటే ప్రొటెక్షన్ మాత్రమే కాదుసన్ గ్లాసెస్ మీ కళ్లను సూర్యకిరణాల నుంచి కాపాడడమే కాదు, మీ స్టయిల్ను కూడా షీల్డ్ చేస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ట్రావెలింగ్లో లేదా ఔట్డోర్ యాక్టివిటీస్లో ఒక మంచి సన్ గ్లాసెస్ ఉంటే, మీరు కంఫర్ట్గా, కూల్గా కనిపిస్తారు.జాగ్రత్తలు!⇒ స్పెక్ట్స్ లేదా సన్ గ్లాసెస్ ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.⇒ చీప్గా కనిపించే ఫ్రేమ్లను తీసుకోవద్దు. మంచి క్వాలిటీ ఫ్రేమ్ అయితేనే లుక్ క్లాసీగా ఉంటుంది.⇒ ఫేస్కు సరిపోని సైజ్ తీసుకుంటే, ఎంత ఖరీదైన గ్లాసెస్ అయినా అందంగా ఉండదు.⇒ గ్లాసెస్ను తరచుగా క్లీన్ చేయండి. మసకగా ఉంటే లుక్ కూడా డల్గా కనిపిస్తుంది. ⇒ గుర్తుంచుకోండి.. స్పెక్ట్స్ కళ్లకు మాత్రమే కాదు, మీ స్టయిల్కు కూడా ఫ్రేమ్ వేస్తాయి!∙ దీపిక కొండి -
బొమ్మజెముడు పొద మీద నెత్తుటి మరక!
హంగేరియన్ భాషలో ‘కెర్తేజ్’ అంటే తోటమాలి అని అర్థం. 2002లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని పొందిన హంగేరియన్ రచయిత ఇమ్రా కెర్తేజ్ పేరులోని ఆ మాటకూ అదే అర్థం! యూరప్లోని హరిత దేశాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న హంగరీ అక్షర ఉద్యానంలో తొలి నోబెల్ పురస్కారాన్ని పూయించిన తోటమాలి ఇమ్రా కెర్తేజ్. అతని సాహిత్యం బొమ్మజెముడు పొద మీద నెత్తురు ముద్ద! తన సాహిత్యమంతటా, కెర్తేజ్ అనుభవించి పలవరించింది ఒకేఒక్క పీడకల. దాన్నే ‘హోలోకాస్ట్ నైట్మేర్’ అన్నారు తర్వాతి తరాలవారు. ఇది యూదులకూ, లౌకికవాదులకూ, ప్రగతిశీల రాజకీయపక్షాలకూ మరపురాని పీడకల. ఆ పీడకలలో కనిపించేవన్నీ తెగిన గాలిపటాలే! సంసార వృక్షం తాలూకు విరిగిపడిన కొమ్మలకు వేలాడుతూ కనిపిస్తాయవి. గాలివాటుగా కొట్టుకుపోయే ఆ గాలిపటాలు తరచు ముళ్ళకంపల్లో చిక్కుకుపోతుంటాయి. ఒకరో యిద్దరో ఈ స్థితి నుంచి బతికి బయటపడుతుంటారు. వారిలో ఒకరో యిద్దరో మాత్రమే ఎలాంటి ఉద్వేగం లేకుండా తమ కలతలూ కలవరాలను మనతో పంచుకుంటారు. కెర్తేజ్ అలాంటి ఒకరిద్దర్లో ఒకరు. అందుకే ఆయన రచనలు తేనుపొచ్చిన సలపరింతల్లా సాగుతుంటాయి! అలాంటి రచనలతో సామాన్య పాఠకులు తాదాత్మ్యం చెందలేరు. పరిణతి చెందిన కొద్దిమంది పాఠకులు మాత్రమే వాటితో అభేదావస్థ అనుభవించగలరు. అలాంటివాళ్ళలో కొందరు ‘నోబెల్ సాహిత్యపురస్కారం ఎంపిక సంఘం’లో సభ్యులుగా వున్నందువల్లనే కెర్తేజ్కు, 2002లో ఆ పురస్కారం దక్కింది!రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంగా చరిత్రను పరిశీలిస్తే, భయంకరమైన వైరుధ్యాలెన్నో కనిపిస్తాయి. వలసవాదం కాడిబరువు వదిలించుకుని ఎన్నో దేశాలు– మన దేశంతో సహా– విముక్త వాయువులు పీల్చుకున్న సందర్భమది. వైజ్ఞానిక, తాత్త్విక, కళాత్మక రంగాలన్నింటా సౌమ్య, సౌహార్ద వీచికలు ప్రసరించిన యుగమది. మానవాళి చిరకాలంగా కంటూవచ్చిన జంటకలలు–స్వేచ్ఛా సమానత్వాలుగా– విశ్వకేదారంలో మొలకలెత్తిన ఘడియలవి. అయితే, ఆ యుద్ధ నేపథ్యంలోనే, ‘పుట్టుక ప్రాతిపదికగా జాతిమత వివక్ష’ పడగవిప్పి బుసకొట్టిన దుర్ముహూర్తమూ అదే! ఈ అమానుష వికారం తాలూకు అత్యంత వికృతరూపాన్ని ప్రదర్శించినవారిగా నాజీలు చరిత్రలో పాతుకుపోయారు. నాజీలు ఎదురులేకుండా పాలించిన జర్మనీకి పొరుగుదేశం కావడమనే ఏకైక పాపానికి గానూ, హంగరీకి కూడా వివక్ష జ్వాలలు పాకిపోయాయి. అప్పట్లో నాజీల చేతికి చిక్కిన పద్నాలుగేళ్ళ కుర్రాడు ఇమ్రా కెర్తేజ్. పుట్టుకతో యూదు మతస్థుడు కావడమే అతని నేరం. దానికే అతన్ని ఆష్విట్జ్, బుషెన్వాల్ట్›్జ నిర్బంధ శిబిరాల్లోకి తోసి చిదిమి పారేయాలనుకున్నారు నాజీలు. కానీ, అంతలోనే ప్రపంచ యుద్ధం ముగిసిపోవడం– దానితోనే నాజీజం సహగమనం చెయ్యడం చకచకా జరిగిపోయాయి! అలా మృత్యువు నీడల్లోంచి వెంట్రుకవాసిలో తప్పించుకోగలిగాడు కెర్తేజ్. అయితే బతికి బయటపడినందుకు అతను సంతసించిన దాఖలాలు ఆయన సాహిత్యంలో ఎక్కడా కానరావు! ∙∙ నాజీ నిర్బంధ శిబిరాలన్నింట్లోకీ పెద్దది ఆష్విట్జ్. ఇది దక్షిణ పోలెండ్లో వుంది. పదకొండు లక్షల మంది అమాయకులైన పెద్దలూ పిన్నల ప్రాణాలను బలితీసుకున్న నరకకూపమిది. ప్రపంచ యుద్ధం ముగిసిన రెండేళ్ళకు, 1947లో ఆష్విట్జ్ను మ్యూజియంగా మార్చారు.నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత ఇమ్రా కెర్తేజ్, ఆష్విట్జ్ గురించి ఓ చోట ఇలా రాశారు:‘ఆష్విట్జ్ నిర్బంధ శిబిరంలో నేను అనుభవించిన నరకయాతనల గురించి తల్చుకున్నప్పుడల్లా, దాన్నుంచి బతికి బయటపడిన వాళ్ళ శక్తి సామర్థ్యాల గురించిన ఆలోచనల్లో మునిగిపోతాను. ఆష్విట్జ్ గురించి ఆలోచన తలెత్తినప్పుడల్లా నేను గతం గురించి కన్నా భవిష్యత్తు గురించే ఎక్కువ ఆందోళన చెందుతాను!‘ పద్నాలుగేళ్ళ వయసులో తన పాలబడిన నిర్బంధ శిబిరాల జీవితానుభవాన్ని ‘దిక్కుమాలినతనం‘ (ఫేట్లెస్నెస్) అనే నవలగా రాయడానికి మరో పద్నాలుగేళ్ళు తీసుకున్నాడు కెర్తేజ్. అయితే, 1975లో గానీ ఆ నవల అచ్చుకాలేదు. అందులోని ప్రధాన పాత్ర గ్యోర్గియ్–‘గ్యూరీ‘– కోవ్స్ కూడా పద్నాలుగేళ్ళ యూదు బాలుడే. రచయిత ఆ కుర్రాడి పేరు మార్చాడంతే– మిగతా కథ అంతా, అటూయిటూగా, ఒక్కటే! ఈ నవల వెలువడిన పదమూడేళ్ళకు ‘వైఫల్యం‘ (ఫియాస్కో) అనే మరో నవల వెలువరించాడు కెర్తేజ్. ఇది జరిగిన పుష్కరానికి ‘పుట్టని బిడ్డ కోసం ప్రార్థన’ (కాదిష్ ఫర్ యాన్ అన్ బోర్న్ చైల్డ్) అనే ఇంకో నవల రాశాడు. ఈ మూడు నవలలనూ కలిపి ‘హొలోకాస్ట్ ట్రైలజీ‘ అంటారు. ముఖ్యంగా, మూడో నవల రచనా సంవిధానం, విశిష్టంగా వుందని విమర్శకులు అంటారు.వాస్తవానికి కెర్తేజ్ ఆలోచనావరణం అంతటా నాజీ విలయమే ఆవరించుకుని ఉందని ఆయనకూ తెలుసు– పాఠకులకూ తెలుసు– విమర్శకులకు మరింత బాగా తెలుసు!‘నేను ఓ కొత్త నవలకు ఇతివృత్తం గురించి– ఆ మాటకొస్తే, ఏది రాసే విషయం పైనైనా– ఆలోచించడం మొదలుపెట్టగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది నిర్బంధ శిబిరాల జీవితానుభవమే! దానితో సంబంధం లేని విషయం గురించి మాటాడాలనుకున్నా, నాకు తెలియకుండానే ఆ విషయం గురించే మాటాడతా! ఆష్విట్జ్ ప్రేతాత్మ నా మీద సవారీ చేస్తోంది– అదే నా మాటల్లో పలుకుతోంది. దానితో పోలిస్తే మిగతా విషయాలన్నీ అర్థం లేనివని అనిపిస్తుంది నాకు!’ అన్నాడందుకే కెర్తేజ్ తన రచన ‘గ్యాలీ డయరీ’లో. 1961–91 మధ్యకాలంలో తాను రాసిన సర్వరచనల సంకలనంగా ‘గ్యాలీ డయరీ’ని 1993లో వెలువరించారాయన. ఆ తర్వాత పదేళ్ళకు విడుదలైన ‘ముగింపు’ (లిక్విడేషన్) ఇతివృత్తం సైతం హొలోకాస్ట్ పీడకలే కావడంలో వింతేముంది? మందలపర్తి కిషోర్ -
ఓవర్నైట్ చాంపియన్లు కారు
వరల్డ్ టేబుల్ టెన్నిస్ సింగిల్ టైటిల్స్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఆకుల శ్రీజ. ఆమె అర్జున అవార్డు సహా ఎన్నో పతకాలు గెలుచుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తోంది. ‘పిల్లలకు చదువు ఒక్కటే కాదు, క్రీడారంగాన్నీ పరిచయం చేసినట్లయితే అన్ని వైపులా అభివృద్ధి చెందుతారు’ అంటారు శ్రీజ తల్లిదండ్రులు ఆకుల ప్రవీణ్కుమార్, సాయిసుధ. పిల్లల పెంపకంలో తమ పాత్ర గురించి ప్రవీణ్కుమార్ తెలిపిన సంగతులు...‘‘నేను టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని. రోజూ ప్రాక్టీస్కి వెళ్లేవాడిని. పిల్లల చిన్నప్పుడు వారిని రెండు, మూడు స్పోర్ట్స్ మీట్స్కు తీసుకెళ్లాను. అక్కడ మ్యాచ్లో గెలుపొందినవారికి ప్రైజులు ఇవ్వడం, అందరూ చప్పట్లు కొట్టడం చూసి, మా పెద్దమ్మాయి చాలా ఇంప్రెస్ అయ్యింది. ‘డాడీ నాకు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారా’ అని అడిగింది. అంతేకాదు, స్కూల్ నుంచి వస్తూనే స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని గ్రౌండ్కు వెళదామని రెడీ అయిపోయేది. ‘నేను కూడా చాంపియన్ని అవుతాను’ అనేది. రోజూ నాతో పాటు ప్రాక్టీస్కు రావడం చూసి, అకాడమీకి తీసుకెళ్లాను. అక్కడ తను బాగా ఆడటం చూసినవాళ్లు మెచ్చుకోవడంతో మరింతగా ప్రాక్టీస్ చేసేది. అక్కను చూసి చెల్లెలు..రవళి మెడల్స్ తీసుకోవడం చూసి, చిన్నమ్మాయి శ్రీజ ‘నేను కూడా టేబుల్ టెన్నిస్ ఆడతాను’ అంది. శ్రీజను కూడా టేబుల్ టెన్నిస్లో చేర్పించాను. ఇద్దరూ స్పోర్ట్స్లో మంచి ప్రతిభ చూపించేవారు. దీంతో ప్రతి కాంపిటిషన్లో వాళ్లు పాల్గొనేలా చూసేవాడిని. గేమ్ పూర్తయ్యేంతవరకు ఉండి, తీసుకొచ్చేవాడిని. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ప్రైవేట్గా..!పిల్లల చిన్నప్పుడు నాకు ఓరియంటల్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ ఉద్యోగం. నా భార్య ఎల్ఐసీలో జాబ్. ప్రభుత్వ ఉద్యోగాలే అయినా జీతాలు తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉండేవి. దీంతో, ఆ జాబ్ మానేసి, జనరల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేరాను. అప్పుడు ‘మా అమ్మనాన్నలు, బంధువులు గవర్నమెంట్ జాబ్ వదులుకోవద్దు’ అని చెప్పారు. కానీ, వాళ్ల మాటలను పట్టించుకోలేదు. నా భార్య సపోర్ట్ చేసింది. నెల జీతం పెరగడం వల్ల ఇద్దరమ్మాయిలను అకాడమీలో చేర్పించడం, వారు కాంపిటిషన్స్లో పాల్గొనేలా చూడటం సులువైంది. రాత్రికి రాత్రి చాంపియన్లు అవరుమనమేవో త్యాగాలు చేస్తున్నాం కాబట్టి పిల్లలు రాత్రికి రాత్రి చాంపియన్లు కావాలనుకోకూడదు. ‘గెలుపు ఓటములు పట్టించుకోకుండా, మీ కృషి మీరు చేయండి. ప్రతీసారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి’ అని పిల్లలకు చెబుతుండేవాళ్లం. పిల్లలు ఓడిపోయినప్పుడు మా బంధువులు ‘అయ్యో, మీరు గవర్నమెంట్ జాబ్ వదలుకున్నారు, కానీ వాళ్లు ఓడిపోయారు’ అన్నట్టుగా మాట్లాడేవారు. ‘పిల్లలను బెస్ట్గా ప్రయత్నంచమని చెప్పండి. అంతేకాని, వారు చిన్నబుచ్చుకునేలా మాట్లాడకూడదు’ అని మా పేరెంట్స్కి, బంధువులకు గట్టిగా చెప్పాం. బంగారు పతకాలుపెద్దమ్మాయి టెన్త్ పూర్తయ్యాక ఒక కాన్సెప్ట్ కాలేజీలో జాయిన్ చేశాం. వాళ్లు ముందుగా స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తాం అన్నారు. తర్వాత మూడు నెలలకు ‘మీ అమ్మాయి బాగా చదువుతోంది – గ్రేడ్స్ ముఖ్యం’ అన్నారు. దీంతో రవళి స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఆపేసింది. చిన్నమ్మాయి విషయంలో అలా జరగకూడదని తనని బద్రుకా కాలేజీలో చేర్పించాం. ముందుగానే కాలేజీ యాజమాన్యంతో ‘స్పోర్ట్స్కు ప్రాముఖ్యం ఇస్తేనే చేర్పిస్తాం’ అని చెప్పాం. కాలేజీ వాళ్లు సపోర్ట్ చేశారు. శ్రీజ ఇంటర్మీడియట్లో కాలేజీ టాపర్గా గోల్డ్ మెడల్ సాధించింది. దానికి కారణం మా ఆవిడ సాయిసుధ. శ్రీజతో పాటు తనూ టోర్నమెంట్స్కు వెళ్లేది. ట్రెయిన్లో, రూములో, మ్యాచ్ మధ్యలో వీలు దొరికనప్పుడల్లా చదివించేది. ఇద్దరి కృషి...పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులిద్దరి కృషి ఉండాలి. స్పోర్ట్స్లో నేను కేర్ తీసుకుంటే, చదువు విషయంలో సాయిసుధ శ్రద్ధ తీసుకుంది. పిల్లల కెరీర్ గురించి ఆలోచించి మా ఆవిడ జాబ్లో ప్రమోషన్లు కూడా తీసుకోలేదు. ప్రమోషన్ తీసుకుంటే ట్రాన్స్ఫర్లు అవుతాయని ఆలోచించి అధికారి హోదాను కూడా వద్దనుకుని, వీలైనంత టైమ్ పిల్లలకు కేటాయించేది. పిల్లలిద్దరూ స్పోర్ట్స్లో రాణిస్తూ, చదువులోనూ గోల్డ్ మెడల్స్ సాధించారు. స్పోర్ట్స్.. జాబ్..పెద్దమ్మాయి ఇంటర్మీడియట్లో ఆపేసిన స్పోర్ట్స్ సీబీఐటీలో చేరాక స్టార్ట్ చేసింది. ఇంటర్ కాలేజీ టోర్నమెంట్స్ లీడ్ చేసేది. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసింది. ఇప్పుడు అమెరికాలో సెటిలైంది. చిన్నమ్మాయి శ్రీజకి పద్దెనిమిదేళ్లకు ఆర్బీఐలో జాబ్ వచ్చింది. ప్రాక్టీస్కు, టోర్నమెంట్స్లో పాల్గొనడానికి వీలుంటుంది. డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూనే ఫిజికల్ ఫిట్నెస్, ప్రాక్టీస్, టైమ్ ప్లానింగ్ గురించి చాలా క్రమశిక్షణగా ఉంటుంది. తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాం. వారికోసం ఏమైనా చేస్తాం. దానిని పిల్లలు అర్ధం చేసుకొని, వారి భవిష్యత్తును బాగా మలచుకుంటే పెద్దలుగా మనకూ ఆనందం. నేటి తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. దాంతో పిల్లలకు ఒకవైపు మాత్రమే అవకాశాలు ఉంటున్నాయి. స్పోర్ట్స్లో అన్నివైపులా వృద్ధి ఉంటుంది. -
కథాకళి: డర్టీ మెటల్
ఐదేళ్ళుగా మేం ఐదుగురం మిత్రబృందం ప్రతి ఆదివారం రమ్మీ ఆడటం అలవాటు. అలా రోజు సిట్టింగ్లో... ‘‘మనిషి ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాడు?’’ ఆ ఆదివారం వశిష్ట అడిగాడు.‘‘చాలావాటిని.’’ ఒకరు చెప్పారు.‘‘ఆ చాలావాటిలో దేన్ని అధికంగా ప్రేమి్తాడన్నది నా ప్రశ్న.’’‘‘అది మనిషికి మనిషికి మారుతూంటుంది.’’ చెప్పాను.‘‘నీకేం ఇష్టం? ఎన్నటికీ పోగొట్టుకోడానికి ఇష్టపడనిది.’’ వశిష్ట నన్ను అడిగాడు.‘‘మా నాయనమ్మ నా చిన్నప్పుడు ఇచ్చిన రూపాయి కాసు. దాన్ని ఖర్చు చేయకుండా దాచుకున్నాను.’’ చెప్పాను.‘‘నాకు ఉప్మా ఇష్టం. నేను చేసుకునే వెజిటబుల్ ఉప్మా.’’ మాలోని హాస్యప్రియుడైన లాయర్ చెప్పాడు.‘‘నువ్వు ఉప్మాని మించి ఇష్టపడేది ఏం లేదా?’’‘‘ఇష్టం అనేది కాలాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి మారుతూంటుంది. నాకు ఉదయం కాఫీ ఇష్టం. సాయంత్రం టీ ఇష్టం. రాత్రికి బీర్ ఇష్టం. నేను పోయే టైమ్ని బట్టి ఆ సమయంలో కాఫీ లేదా టీ తాగుతూ లేదా ఉప్మా తింటూ పోవాలనుకుంటున్నాను.’’‘‘నాకు నా ఇంట్లో, నా పక్కలో, నిద్రలో మరణించడం ఇష్టం. ఓసారి ఓ బంధువుని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశాను. స్ట్రెచర్ మీద తీసుకెళ్ళే ఓ వ్యక్తి, వెనకే ఆక్సిజన్ సిలిండర్ని తోసుకెళ్ళే ఓ అటెండర్. ఆయన కళ్ళల్లో భయాన్ని చూశాక అనిపించింది, రోగం రొష్టు రాకుండా, ఇంట్లోనే మరణించడానికి మించిన యోగం లేదని. ఇంట్లో మరణం నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైంది.’’ మరొకరు చెప్పారు.‘‘ఫిలసాఫికల్.’’ నేను చెప్పాను.‘‘చిన్న సవరణ. ఉప్మా కాదు. ఉప్మాలోని ఉప్పు. సరిపడ ఉప్పు. ఓసారి నేను ఎక్కువ ఉప్పు వేసి తినలేకపోయాను. సరిపడ ఉప్పు వేసిన ఉప్మా.’’ లాయర్ వృత్తిలోని అతను నవ్వుతూ సవరించాడు.‘‘నీకు?’’ నాలుగోవాడిని అడిగాను.‘‘మన జెండా.’’ వాడు చేతిలోని ముక్కలని చూసి, ఓ ముక్కని వేశాక చెప్పాడు.కొద్దిసేపు ఆగి నేను అడిగాను.‘‘వశిష్టా. తమరికి ఏమి ఇష్టమో సెలవివ్వనా? మీ ఆవిడ ముక్కంటే కదా?’’అంతా నవ్వారు.‘‘వశిష్ట తన భార్య ముక్కు మీద కవిత్వం రాశాడు.’’ చెప్పాను.‘‘కాని మీ ఆవిడకి బంగారం అంటే ఇష్టం. కాబట్టి నువ్వు కూడా బంగారాన్ని ఇష్టపడుతున్నావేమో?’’ ఒకరు అడిగారు.వశిష్ట ప్రతీ మేరేజ్ ఏనివర్సరీకి, తన భార్య పుట్టినరోజుకి, ఉమెన్స్ డేకి భార్యకి ఏదైనా బంగారు ఆభరణాన్ని బహుకరిస్తుంటాడని మాకు మా భార్యల ద్వారా తెలుసు. ‘మీరూ ఉన్నారు ఎందుకు? మీ ఫ్రెండ్ వశిష్ట వాళ్ళ ఆవిడకి ఏం కొనిచ్చాడో తెలుసా?’ అనే డైలాగ్ మేము చాలాసార్లు విన్నాం. ఇలాంటి ఆడవాళ్ళ ముచ్చట్లకి ఆ ఐదుగురికి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ‘‘ప్రపంచంలోని పద్దెనిమిది శాతం బంగారం ఇండియన్ భార్యల దగ్గరే ఉందని చదివాను. అది పాతికవేల టన్నుల బంగారమట. అందులో చాలా భాగం వశిష్ట భార్య దగ్గరే ఉంది.’’ ఒకరు నవ్వుతూ చెప్పారు.‘‘మా ఆవిడకి బంగారం ఇష్టం కాబట్టి ఆమెని సంతోషపెట్టడానికి కొనిస్తూంటాను. నాకు నా భార్యంటే ఇష్టం. నా భార్య మీద ఇష్టాన్ని నేను అలా ప్రదర్శిస్తూ ఉంటాను.’’ వశిష్ట చెప్పాడు.ఈ చర్చ జరిగిన కొంత కాలానికి వశిష్ట భార్య మరణించింది. ఈ కాలంలో అకాల మరణానికి కారణమైంది కేన్సర్. అది ఫోర్త్ స్టేజ్లో కాని బయటపడలేదు. బయటపడ్డ రెండు నెలలు తిరగకుండానే ఆమె గతించింది.వశిష్ట దుఃఖాన్ని పట్టలేకపోయాం. ఆ పదిహేను రోజులు మేము నలుగురం అతని వెన్నంటే ఉన్నాం. ఆ తర్వాత చాలా ఆదివారాలు మేము నలుగురమే రమ్మీ ఆడాం. తన భార్య పోయిన ఎనిమిదో ఆదివారం వశిష్ట వచ్చాడు. ఐదారు నిమిషాల తర్వాత వశిష్ట చెప్పాడు. ‘‘ఓసారి ‘మనిషి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు?’ అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను అధికంగా ప్రేమించేది మా ఆవిడని చెప్పాను. గుర్తుందా?’’‘‘అవును. అందులో మాకు ఎలాంటి సందేహం లేదు.’’ చెప్పాను.‘‘కాదు. మా ఆవిడ మరణించాక నాకు తెలిసింది. నేను ప్రేమించేది మా ఆవిడని కానే కాదు. ఆవిడ ప్రేమించే డర్టీ మెటల్ని. బంగారాన్ని.’’ నెమ్మదిగా చెప్పాడు.‘‘అంటే నువ్వు ఇంతకాలం మీ ఆవిడ ఇష్టపడుతుందని బంగారం కొనలేదా?’’ అడిగాను.‘‘ఆవిడ మరణించకపోతే అసలు నాకీ సంగతే తెలిసేది కాదు. ఆవిడ శవాన్ని వైకుంఠ రథంలో తరలించేటప్పుడు నేను ఆవిడ నోట్లోని రెండు బంగారు కట్టుడు దంతాలని కటింగ్ ప్లయర్తో పెకలించి తీసుకున్నాను. భార్యని ప్రేమించే ఎవరైనా, జీవం లేనంత మాత్రాన చేసే పనేనా అది?’’ వశిష్ట ప్రశ్నించాడు.అతని మెళ్ళోని బంగారు గొలుసుకి ఆవిడ రెండు దంతాలు మెరుస్తూ కనిపించాయి. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
కిరాయి సైన్యాలు!
అదృశ్య సైన్యాలు అంటే కిరాయి సైనికులు. వాళ్లు ఏ దేశానికీ, ఏ జెండాకూ కట్టుబడి ఉండరు. కేవలం వృత్తిపరమైన సైనికులు. ఎవరు డబ్బు ఇస్తే వారి తరపున ప్రాణాలకు తెగించి పోరాడతారు. రష్యాకు చెందిన ‘వాగ్నర్ గ్రూప్’ మొదలు, కొలంబియాకు చెందిన భయంకరమైన ‘డెజర్ట్ ఉల్వ్స్’ వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సైన్యాలు చాలానే ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులు, కాంగో అడవులు, ఇరాక్ ఎడారులు.. ఇలా యుద్ధం ఎక్కడ మొదలైతే అక్కడికి వాళ్లు కిరాయికి వెళ్లిపోతారు.ఔట్సోర్సింగ్ ‘యుద్ధం’!సాధారణ సైన్యానికి కొన్ని అంతర్జాతీయ యుద్ధ నియమాలు ఉంటాయి. కిరాయి సైన్యాలకు అవేమీ పట్టవు. అందుకే ప్రభుత్వాలు తాము నేరుగా చేయలేని పనులను వీరితో చేయిస్తుంటాయి. యుద్ధ క్షేత్రంలో శత్రువులను దెబ్బతీయడం, యుద్ధం వెలుపల తిరుగుబాట్లను అణచివేయడం, విదేశాల్లో ఉగ్రదాడులు చేయడం వీరి పని. వీరు ప్రభుత్వాల నీడలో పని చేస్తారు. ప్రస్తుతం ఇరాన్ తన శత్రువులను దెబ్బతీయడానికి ఈ కిరాయి ఏజెంట్లను వాడుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇరాన్ చేస్తున్న ఈ ‘ఔట్సోర్సింగ్’ యుద్ధంపై, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఎం15’ (సెక్యూరిటీ సర్వీస్కు సంబంధించినది) చీఫ్ కెన్ మెకల్లమ్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. కేవలం గత ఏడాదిలోనే బ్రిటన్ లో ఇరాన్ మద్దతుతో జరిగిన 20కి పైగా ప్రాణాంతక కుట్రలను తమ ఏజెంట్లు అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు!రెండు రకాల ‘కిరాయి’లు కిరాయి సైన్యంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి: ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు. ఇవి ప్రభుత్వాల అవసరాలకు, ఆదేశాలకు లోబడి పనిచేస్తాయి. రెండు: అక్రమ ముఠాలు. డబ్బు కోసం ఆ ముఠాలు ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాయి. 1960లలో ఆఫ్రికా దేశాల్లో జరిగిన దాడుల్లో తొలిసారి వీరి గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ‘డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’లో జరిగిన యుద్ధం– కిరాయి సైనికుల ఉనికికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. కాంగోలోని ‘కటంగా’ అనే ప్రాంతంలో అపారమైన రాగి నిక్షేపాలు ఉండేవి. బెల్జియంకు చెందిన స్థానిక మైనింగ్ కంపెనీలు ఆ వనరులను కొల్లగొట్టటానికి బ్రిటన్, అమెరికాల మద్దతుతో కిరాయి సైనికులను అక్కడ దింపాయి. దేశాన్ని అస్థిరపరచి, ఆ ఖనిజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా కిరాయి మూకలు కటంగాలో బీభత్సాన్ని సృష్టించాయి.పెంచిన కుక్కే కరిచే ప్రమాదంప్రభుత్వాలు తమ పనుల కోసం కిరాయి ముఠాలకు ఆయుధాలు, డబ్బు ఇస్తాయి. ప్రభుత్వానికి, కిరాయి ముఠాకు మధ్య సయోధ్య ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ, ఎప్పుడైతే కాస్త తేడా వస్తుందో అప్పుడు ఆ ముఠా, ప్రభుత్వం మీదకే తిరగబడుతుంది! దీనికి ఒక ఉదాహరణ అఫ్ఘానిస్తాన్ లోని ముజాహిదీన్లు. రష్యాతో పోరాడటానికి అమెరికా ముజాహిదీన్లకు ‘స్టింగర్’ క్షిపణులను అందించింది. ఆ తర్వాత అవే ఆయుధాలు అమెరికాకు తలనొప్పిగా మారాయి. ఒకసారి కనుక కిరాయి సైన్యానికి భారీగా ఆయుధాలు, సాంకేతిక నైపుణ్యం ఇస్తే.. వారు ప్రభుత్వ నియంత్రణలో ఉండరు. సొంతంగా ఒక శక్తిగా ఎదిగి ఆ దేశానికే ముప్పుగా మారుతారు.కిరాయి సైన్యాల అవసరం ఏంటి? ప్రభుత్వాలు ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లను ఎంచుకోటానికి అనేక కారణాలు ఉన్నా, ప్రధానమైన కారణం మాత్రం సొంత సైనికుల రోటేషన్ సమస్య. ఏ దేశమైనా ఒక బెటాలియన్ సైన్యాన్ని యుద్ధంలో ఉంచాలంటే, మూడు బెటాలియన్లు అవసరం! మూడు ఎందుకంటే.. ఒకటి యుద్ధంలో ఉంటే, రెండోది సెలవులో ఉండాలి, మూడోది శిక్షణలో ఉండాలి. ప్రైవేటు కంపెనీలకైతే, కేవలం పని జరిగినన్ని రోజులు మాత్రమే డబ్బు ఇస్తారు. వారికి పెన్షన్లు ఇవ్వక్కర్లేదు, యుద్ధం అయిపోయాక వారి బాధ్యత ఉండదు. దీనినే మిలిటరీ భాషలో ‘ఫోర్స్ మల్టిప్లయర్’ అంటారు. అంటే సంఖ్యను పెంచకుండా, సామర్థ్యాన్ని పెంచుకోవటం. ఉక్రెయిన్పై యుద్ధానికి ఆఫ్రికా డబ్బు!2022లో మార్చి 27 నుంచి 31 వరకు మాలి దేశంలోని మౌరా పట్టణంలో ఊచకోత జరిగింది. దాదాపు 500 మంది అమాయకులను స్థానిక సైనికులు, ‘తెల్లటి చర్మం కలిగిన అపరిచిత భాష మాట్లాడే వ్యక్తులు’ (రష్యాకు చెందిన వాగ్నర్ సైనికులు) కలిసి చంపేశారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. రష్యా మాత్రం ఆ ఊచకోతను ‘ఉగ్రవాదంపై విజయం’గా అభివర్ణించింది. రష్యా పెంచి పోషిస్తున్న వాగ్నర్ గ్రూప్ ఆఫ్రికాలోని అవినీతి నియంతలకు లేదా మిలిటరీ పాలకులకు కూడా భద్రత కల్పిస్తోంది. దాని వెనుక పెద్ద ఆర్థిక ప్రయోజనమే ఉంది. డబ్బుకు బదులుగా ఆ దేశాల్లోని బంగారం, యురేనియం వంటి విలువైన ఖనిజాల తవ్వకం హక్కులను రష్యా పొందుతుంది. గత రెండేళ్లలోనే ఆఫ్రికా నుండి రష్యా çరూ. 20,000 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని రాబట్టుకుంది. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధానికి ఈ డబ్బునే రష్యా వాడుతోంది.వాట్సాప్లో రిక్రూట్మెంట్ కిరాయి సైనికుల నియామకం ఒక పద్ధతిలో సాగుతుంది! మాజీ సైనికులను వాట్సాప్ ద్వారా సంప్రదించి, వారికి దుబాయ్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఒక కిరాయి సైనికుడికి నెలకు సుమారుగా రూ. 3.3 లక్షల జీతం ఉంటుంది! అది వారు సైన్యంలో పొందే పెన్షన్ కంటే ఆరు రెట్లు ఎక్కువ! కొన్ని దేశాలు నేరుగా మద్దతు ఇచ్చే ‘మిలీషియా’ (తీవ్రవాద సైనిక దళాల) గ్రూపులు కూడా యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇరాన్, మిలీషియాను పెంచి పోషిస్తోంది. తన సొంత సైన్యాన్ని నేరుగా రంగంలోకి దించకుండా, ఇతర దేశాల్లో ఉన్న కొన్ని గ్రూపులకు డబ్బు, ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయిస్తోంది. ఇరాన్ కనుసన్నలలో పనిచేసే హిజ్బుల్లా (లెబనాన్), హమాస్ (గాజా), హౌతీలు (యెమెన్) ఇలాంటి మిలీషియాలే. యుద్ధం ముగిశాక...?యుద్ధం ముగిశాక, శాంతిని కాపాడటానికి ప్రైవేట్ సైన్యాలు అవసరమవుతాయి. అవి కిరాయి సైన్యానికి భిన్నమైనవీ, చట్టపరిధిలో పని చేసేవీ. ఇలా – డబ్బు కోసం పోరాడే సైన్యం ఒకవైపు విధ్వంసాన్ని సృష్టిస్తుంటే, చట్టబద్ధమైన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు యుద్ధం తర్వాత పరిస్థితులను చక్కదిద్దడంలో సహాయపడుతుంటాయి. డెసర్ట్ వుల్వ్స్ రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూపులాగే, కొలంబియాకు చెందిన మాజీ సైనికులు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో పాల్గొంటున్నారు. వారిని ‘డెసర్ట్ వుల్వ్స్’ అని పిలుస్తారు. ప్రస్తుతం సూడాన్ లో జరుగుతున్న భీకర యుద్ధంలో, ‘రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్’ (ఆర్.ఎస్.ఎఫ్.) అనే గ్రూపు తరపున ఈ కొలంబియన్ కిరాయి సైనికులు పోరాడుతున్నారు. ఆర్.ఎస్.ఎఫ్. జాతి నిర్మూలన, సామూహిక అత్యాచారాలు, పసిపిల్లలను చంపడం వంటి ఘోరమైన యుద్ధ నేరాలకు పాల్పడుతోంది! అధికారం కోసం ఆర్.ఎస్.ఎఫ్., సూడాన్ అధికారిక సైన్యం మధ్య ఈ పోరు జరుగుతోంది. గత అక్టోబర్లో ఆర్.ఎస్.ఎఫ్. ‘ఎల్ ఫాషర్’ అనే నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దాదాపు 60,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. విషాదం ఏమిటంటే, కొలంబియాకు చెందిన టీనేజర్లు కూడా కిరాయి సైనికులుగా పోరాడాల్సి రావటం. వాగ్నర్ గ్రూప్ అమెరికా లేదా బ్రిటన్ దేశాల ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు కేవలం దేశ రక్షణ విధులను మాత్రమే చేపడతాయి. కానీ రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ కథే వేరు! ఇది రష్యా ప్రభుత్వం (క్రెమ్లిన్) నిధులు ఇచ్చి నడిపే ఒక రహస్య సైన్యం. 2023లో వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పైనే తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించటం మీకు గుర్తుండే ఉంటుంది. అయితే అంతా ఊహించిన విధంగానే వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ కథ విషాదాంతమైంది. పుతిన్ ను బాహాటంగా విమర్శించి, తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్, ఒక ప్రైవేట్ జెట్ ‘ప్రమాదంలో’ ప్రాణాలు కోల్పోయాడు. ప్రిగోజిన్ మరణం తర్వాత, వాగ్నర్ గ్రూప్ ఇప్పుడు పేరు మార్చుకుని ‘ఆఫ్రికా కోర్స్’ గా చలామణి అవుతోంది. ∙ సాక్షి స్పెషల్ డెస్క్ -
రైవతుడి జననం
పూర్వం ఋతవాక్కు అనే మునికుమారుడు విద్యాభ్యాసం తర్వాత బ్రహ్మచర్యం వీడి, తగిన కన్యను వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. చాలాకాలమైనా సంతానం కలగకపోవడంతో సూర్యుడి కోసం తపస్సు చేశాడు. సూర్యుడి వర ప్రసాదం వల్ల ఋతవాక్కుకు కొడుకు పుట్టాడు. అతడు రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించాడు.ఋతవాక్కు ఆ బాలుడికి యథావిధిగా జాతకర్మాదులు జరిపించాడు. అయితే, ఆ బాలుడు పెరిగేకొద్ది బుద్ధివికాసం పొందకపోగా, వెర్రివాడిలా తిరగసాగాడు. కొడుకు పరిస్థితికి ఋతవాక్కు, అతడి భార్య తీవ్రంగా కలత చెందారు. మనోవ్యధతో వారు వ్యాధిగ్రస్థులయ్యారు. కొడుకు పరిస్థితిని చక్కదిద్దడానికి తరుణోపాయం కోసం ఋతవాక్కు ఒకనాడు గర్గముని ఆశ్రమానికి వెళ్లాడు. గర్గమునిని దర్శించుకుని, తన కొడుకు పరిస్థితిని వివరించి, తరుణోపాయం చెప్పమని కోరాడు.‘‘మునిపుంగవా! నీ కొడుకు రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టాడు. నక్షత్రదోషం కారణంగానే అతడు మూర్ఖుడయ్యాడు’’ అని పలికాడు గర్గుడు. ఋతవాక్కు ఆ మాటలకు కోపించి, ‘‘రేవతీ నక్షత్రం ఆకాశం నుంచి నేల రాలిపోవు గాక!’’ అని శపించాడు.వెంటనే రేవతీ నక్షత్రం ఆకాశం నుంచి రాలిపోయి, కుముద పర్వతంమీద ఉన్న ఒక కొలనులో పడింది. ఆ కొలనులో అనేక పద్మాలు ఉండేవి. వాటిలోని ఒక పద్మం నుంచి రేవతీ నక్షత్రం ఒక కన్యక రూపంలో పుట్టింది. ప్రముచుడు అనే ముని ఆ కన్యకను చూసి, తన ఆశ్రమానికి తీసుకువెళ్లి, పెంచుకోసాగాడు. ఆమెకు రేవతి అని పేరు పెట్టాడు. కొన్నాళ్లకు రేవతి యుక్తవయస్కురాలైంది. ప్రముచుడు ఆమె కోసం వరాన్వేషణ ప్రారంభించాడు.ప్రముచుడు ఒకనాడు అగ్నిదేవుడిని ‘‘దేవా! నా కుమార్తెకు యోగ్యుడైన వరుడు ఎక్కడ దొరుకుతాడో నువ్వే చెప్పు’’ అని అభ్యర్థించాడు.‘‘మునీశ్వరా! కొద్దిరోజుల్లోనే దుద్ధముడు అనే రాజు నీ ఆశ్రమానికి వచ్చి, నీ కుమార్తెను చూస్తాడు. అతడే ఆమెకు తగిన వరుడు. నీ కుమార్తె రేవతిని అతడికిచ్చి వివాహం జరిపించు’’ అని పలికాడు అగ్నిదేవుడు.కొన్నాళ్లకు ప్రియంవద వంశీయుడైన దుద్ధముడు అడవిలో సంచరిస్తూ, ప్రముచుడి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడే, ఆశ్రమంలోంచి ప్రముచుడు బయటకు వచ్చాడు. ‘‘ప్రియంవద వంశోద్భవా! నిన్ను చూసి చాలాకాలమైంది. నువ్వు నాకు అల్లుడివి’’ అని పలికి, అతడికి అర్ఘ్యమిచ్చి, లోనికి స్వాగతించాడు.‘‘మహర్షీ! మీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. నేను మీకెలా అల్లుడినయ్యాను?’’ అడిగాడు దుద్ధముడు.‘‘రాజా! నా కుమార్తె రేవతిని నీకిచ్చి పెళ్లి చేయదలచాను. నువ్వు నా ఆశ్రమానికి వస్తావని, నా కుమార్తెకు తగిన వరుడివి నువ్వేనని అగ్నిదేవుడు చెప్పాడు’’ అన్నాడు ప్రముచుడు.తండ్రి మాటలు విన్న రేవతి, ‘‘తండ్రీ! నాకు ఈ రాజుతో వివాహం చేయదలిస్తే, రేవతీ నక్షత్ర ముహూర్త సమయంలోనే చేయాలి’’ అని చెప్పింది.ప్రముచుడు తన తపోమహిమతో రేవతీ నక్షత్రాన్ని ఆకాశంలో నిలిపి, అదే ముహూర్తంలో అగ్ని సమక్షంలో రేవతీ, దుద్ధముల వివాహం వేదోక్తంగా జరిపించాడు. వివాహం ముగిశాక, ‘‘జామాతా! నీకే వరం కావాలో కోరుకో’’ అని అడిగాడు ప్రముచుడు.‘‘మునివర్యా! నేను స్వాయంభువ మనువు వంశంలో పుట్టాను. నాకు నీ కుమార్తె రేవతి ద్వారా జన్మించే కుమారుడు ఈ మన్వంతరానికి అధిపతి అయ్యేలా వరం అనుగ్రహించండి’’ అని కోరాడు.‘‘తథాస్తు’’ అని ఆశీర్వదించాడు ప్రముచుడు.కొన్నాళ్లకు రేవతికి పండంటి కొడుకు పుట్టాడు. దుద్ధముడు అతడికి జాతకర్మాదులు జరిపించి, రైవతుడు అని నామకరణం చేశాడు.రైవతుడు సకల శాస్త్రాలను, అస్త్రశస్త్ర విద్యలను క్షుణ్ణంగా అభ్యసించాడు. కొన్నాళ్లకు దుద్ధముడు ఒక సుదినాన రైవతుడికి పట్టాభిషేకం జరిపించి, భార్యలతో కలసి వానప్రస్థానికి వెళ్లిపోయాడు.రైవతుడు సమస్త భూమండలాన్ని జయించి, రైవత మనువుగా ప్రఖ్యాతి పొందాడు.∙సాంఖ్యాయన -
క్లూషియల్: పాంట్రీ కారులో శవం
సమయం ఉదయం 10 గంటలు.. హైదరాబాద్లోని నాంపల్లి స్టేషన్ కు చెన్నై ఎక్స్ప్రెస్ చేరుకుంది. రైలు పాంట్రీకారులో సినిమా ప్రొడ్యూసర్ తంగవేలు శవమై కనిపించడం పెను సంచలనం సృష్టించింది. ఈ మిస్టరీని చేధించడానికి డిటెక్టివ్ సిద్ధార్థ రంగంలోకి దిగాడు.తంగవేలు మృతదేహం పాంట్రీకారులోని స్టోరేజ్ క్యాబిన్ దగ్గర పడి ఉంది. అతని గొంతుపై లోతైన గాయం ఉంది, కాని, ఆశ్చర్యకరంగా రక్తపు మరకలు చాలా తక్కువగా ఉన్నాయి.సిద్ధార్థ తన విచారణను పాంట్రీ సిబ్బంది నుంచి ప్రారంభించాడు.మొదటి అనుమానితుడిగా వంటవాడిని ప్రశ్నించాడు. అతడు ‘‘నేను రాత్రంతా బిజీగా ఉన్నాను, నాకేం తెలియదు’’ అని చెప్పాడు.రెండవ అనుమానితుడైన మేనేజర్ను ప్రశ్నించాడు సిద్దార్థ. తంగవేలు తనను డబ్బుల కోసం వేధించాడని ఒప్పుకున్నాడు కాని, తాను చంపలేదని వాదించాడు.సిద్ధార్థ పాంట్రీకారులోని డీప్ ఫ్రీజర్ని పరిశీలించాడు. అక్కడ గడ్డకట్టిన రక్తపు చుక్కలను గుర్తించాడు. అలాగే తంగవేలు చేతి గడియారం 11:30 గంటలకు ఆగిపోయి ఉంది. కానీ రైలు సిబ్బంది ఆయన 1:00 గంటకు కూడా సజీవంగా ఉన్నాడని సాక్ష్యం చెప్పారు.అదే సమయంలో రాత్రి ఒంటి గంటకు తంగవేలు బోగీలో నడుచుకుంటూ వెళ్లడం చూశానని అదే బోగీలో ప్రయాణిస్తున్న సంతోష్ అనే కుర్రాడు చెప్పాడు. తన తాతకు మూలికా వైద్యం కోసం చెన్నైలో ఉంటున్న ఆయుర్వేద వైద్యుడు సుబ్బారాయుడు దగరికి వెళ్లి అదే ట్రైన్లో అదే బోగీలో ప్రయాణించినట్టు సాక్ష్యం చెప్పాడు.‘రాత్రి 11:30 గంటలకు చనిపోయిన వ్యక్తి ఒంటి గంటకు నడుస్తూ కనిపించడం ఎలా సాధ్యం?’ అక్కడే సిద్దార్థ డిటెక్టివ్ బుర్ర వేగంగా పని చేసింది.రైలు నాంపల్లి స్టేషన్ కు చేరుకున్నాక, రైల్వే క్లీనింగ్ సిబ్బంది పాంట్రీకారులోని స్టోరేజ్ క్యాబిన్ (సామాన్లు ఉంచే గది) తలుపు తీసినప్పుడు అక్కడ తంగవేలు మృతదేహం బయటపడింది.అసలు ఏం జరిగింది? సిద్ధార్థ పరిశోధన మొదలుపెట్టాడు.రాత్రి 11:30 గంటలకే తంగవేలును పాంట్రీకారులోని సీక్రెట్ స్టోరేజ్ ఏరియాలో ఎవరో చంపేశారు.సిద్ధార్థ తంగవేలు చేతి గడియారాన్ని గమనించాడు. అది రాత్రి 11:30 గంటలకే ఆగిపోయి ఉంది. గొడవ జరిగిన సమయంలో గడియారం కింద పడి ఆగిపోయిందని గ్రహించాడు.శవాన్ని రైలు నుంచి బయట పడేయడం సాధ్యం కాదు కాబట్టి, హంతకుడు ఎవరికీ అనుమానం రాకుండా కూరగాయలు, ఖాళీ డబ్బాలు ఉంచే పెద్ద డీప్ ఫ్రీజర్ అడుగున శవాన్ని దాచిపెట్టి, పైన సామాన్లు సర్దేశారు.రాత్రి ఒంటి గంట సమయంలో తంగవేలులాగే డ్రెస్ వేసుకున్న ఒక సిబ్బంది, తల వంచుకుని పాంట్రీ నుంచి బయటకు వెళ్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.రైలు నాంపల్లి స్టేషన్ ప్లాట్ఫారమ్ మీద ఆగడానికి సరిగ్గా 5 నిమిషాల ముందు, అందరూ సామాన్లు సర్దుకోవడంలో బిజీగా ఉన్నప్పుడు మేనేజర్ తెలివిగా శవాన్ని ఫ్రీజర్ నుండి తీసి, పాంట్రీకారులోని ఒక మూలగా ఉన్న సర్వీస్ డోర్ దగ్గర పడేశాడు. రైలు ఆగగానే అందరూ దిగిపోతుంటే, తను కూడా ఏమీ తెలియనట్టు పక్కకు తప్పుకున్నాడు.సిద్ధార్థ ఆ స్టోరేజ్ క్యాబిన్ తలుపుల దగ్గర రక్తపు మరకలు నేల మీద కాకుండా, పైభాగంలో ఉండటం గమనించాడు. అంటే శవాన్ని ఎక్కడి నుంచో తీసి ఇక్కడ పడేశారని గ్రహించాడు. ఫ్రీజర్ తెరిచి చూస్తే, అక్కడ తంగవేలు కోటు బటన్ దొరికింది. దాంతో అసలు రహస్యం బయటపడింది.మేనేజర్ గురించి ఎంక్వయిరీ చేస్తే అసలు విషయం బయటపడింది.తరచూ సినిమా పనుల మీద పెద్దమొత్తం డబ్బుతో తిరిగే తంగవేలుతో పరిచయం పెంచుకుని, అతని దగ్గర పెద్దమొత్తం డబ్బు ఉండటం గమనించి, అదంతా బ్లాక్ మనీ అని తెలుసుకుని దొంగిలించే ప్రయత్నం చేశాడు. కుదరకపోవడంతో పెనుగులాటలో చంపేశాడు.ఆ హత్యను కప్పి పుచ్చుకోవడానికి ఈ డ్రామా ఆడాడు. వ్యక్తిగతమైన విషయాలు అపరిచితులతో పంచుకోవడం తంగవేలు చేసిన తప్పయితే, అత్యాశతో నేరం చేసి కటకటాల్లోకి వెళ్లడం మేనేజర్ స్వయంకృతాపరాధం. నేరానికి శిక్ష తప్పదు. ∙శ్రీసుధామయి -
అలాంటి వ్యక్తి దొరకాలి!
చూడగానే పక్కింటి అమ్మాయిలా స్క్రీన్ మీద మెరిసిన ‘సీతామహాలక్ష్మి’ మన మృణాల్ ఠాకూర్. తన మనసులో ఏమున్నా దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆమె స్టయిల్. బాడీ ఇమేజ్ పోరాటాల నుంచి, తనపై వచ్చే గాసిప్స్ వరకు ప్రతి విషయాన్ని ధైర్యంగా పంచుకున్న ముచ్చట్లు ఇప్పుడు మీకోసం..గాసిప్స్? నవ్వేసి ముందుకెళ్తాను!నా పెళ్లి గురించి వచ్చే వార్తలు చూస్తే నాకే నవ్వొస్తుంది. ముఖ్యంగా ఒక తమిళ హీరోతో వచ్చిన పెళ్లి వార్తల్లో అస్సలు నిజం లేదు. అలాంటి వార్తలు చదివితే, ‘ఫిబ్రవరి 14 ఒక్కసారిగా ఏప్రిల్ 1 అయిపోయిందేమో’ అని అనిపిస్తుంది.ట్రోల్ చేసినా.. నిలబడ్డాను!బాడీ షేమింగ్ గురించి చాలా బాధపడ్డాను. నన్ను ‘మట్కా’ అని పిలిచినప్పుడు చాలా కుంగిపోయాను. కానీ ఇప్పుడు నా శరీరంపై నాకు గౌరవం ఉంది. ఎవరో నన్ను నిర్వచించడం కాదు. నేను నన్ను ఎలా చూసుకుంటున్నాననేదే ముఖ్యం.బ్రేకప్ ఇచ్చిన బలంప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నాను. నా కోసం ఎవరినీ వెతకడం లేదు. ఎందుకంటే, నాకు కియానూ రీవ్స్ లాంటి వ్యక్తి దొరికితే బాగుంటుంది అని అనిపిస్తుంది. గతంలో ఒక రిలేషన్ ఉంది. అయితే, నేను నటిని అనే నిజాన్ని అతను అంగీకరించలేక పోయాడు. ఆ బ్రేకప్ నన్ను మరింత బలంగా మార్చింది.అమ్మకు ఇచ్చిన మాట!చిన్నప్పుడొక బాధాకరమైన జ్ఞాపకం ఉంది. మా ఆర్థిక పరిస్థితి బాగోలేని రోజుల్లో, మా అమ్మను చుట్టాలు తమ కార్లలో కూర్చోనివ్వని సందర్భాలు చూశాను. అప్పుడే నేను ఒక మాట ఇచ్చాను. ‘ఒకరోజు నువ్వు ఊహించని కారు కొనిస్తాను’ అని. ఈ రోజు ఆ మాటను నిలబెట్టుకున్నాను.చీకటి దశ నుంచి వెలుగులోకి!నా జీవితంలో ఒకప్పుడు చాలా కష్టమైన దశ వచ్చింది. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ ఆలోచించేటప్పుడు చాలాసార్లు నిరాశగా అనిపించేది. ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం, నా పోరాటానికి నిదర్శనం. ప్రస్తుతం గ్లామర్ పాత్రలు చేసినా, టెలివిజన్ నుంచి వచ్చిన అమ్మాయి అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను. అదే నా పునాది.నేను సిద్ధంగా లేనప్పుడు నో వే!నా కెరీర్ మొదట్లో చాలా పెద్ద అవకాశాలు వచ్చాయి. కాని, ఆ పాత్రలకు నేను మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వాటిని వదిలేశాను. ఒకవేళ అప్పుడు బలవంతంగా చేసి ఉంటే, నన్ను నేను కోల్పోయేదాన్ని. అలాగే, కెరీర్ మొదట్లో కొన్ని సన్నివేశాలు చేయాల్సి వస్తుందని తెలిసి, చాలా పెద్ద సినిమాలు వదిలేశాను. అవకాశాలు కోల్పోయినా, నా విలువల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అదే నా అసలైన విజయం. -
ఈ వారం కథ: గడ్డి మందు
అర్ధరాత్రి దాటింది. వీధుల్లో భోగి మంటలు ఇంకా ఉన్నాయి. పండగ రోజులు కావడంతో ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద హడావుడి లేదు. లోపల రోగులు మందుల మత్తులో నిద్రిస్తున్నారు. వాళ్ల అటెండర్లు మాత్రం బెంగతోనో, భయంతోనో బయట తచ్చాడుతున్నారు నాలాగ. నైట్ డ్యూటీలో ఉన్న స్టాఫ్ భోగి మంట చుట్టూ చేరి జోకులేసుకుంటున్నారు. తెల్లారితే సంక్రాంతి. ఎవరికి సెలవు కావాలి, ఎవరు కొత్త అల్లుళ్లు, పోయిన పండక్కి ఎవరు ఎవరికోసం త్యాగాలు చేశారు, పెద్ద డాక్టర్తో పండగపూటా తిట్లు తిన్నదెవరులాంటి విషయాలు వాళ్ల మధ్య చర్చకొస్తున్నాయి. ఇంతలోనే ఆసుపత్రి ముందుకి దూసుకొచ్చిన ఒక షేర్ ఆటో– అప్పటిదాకా భోగి మంట చుట్టూ అలముకున్న సరదాలతో పాటు అప్పుడప్పుడే కుదురుకుంటున్న ఆ రాత్రి నిశ్శబ్దాన్ని కూడా పటాపంచలు చేసింది. ఆటో పూర్తిగా ఆగేలోపే గబగబా నలుగురు దిగారు. ‘పట్టండి పట్టండి’ అంటూ ఆటో లోపలినుంచి మాటలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ పరుగున వచ్చి ఆ నలుగురితో కలిశాడు. వాళ్లంతా కలిసి ఆటోలోంచి ఒక కుర్రాడ్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఏమైందో చూద్దామని మునివేళ్లపై నిలబడి వాళ్ల మధ్యలోకి చూపు సారించాను. స్పృహలో లేని ఒక కుర్రాడు. అతడి నూనూగు మీసాల కంటే ముందు చెంపలకంటిన తెల్లటి నురుగు కనిపించింది. నిండా ఇరవై కూడా ఉండవు. కాళ్లూ చేతులూ పట్టుకుని నలుగురు మోసుకెళ్లడం చూసి నా మనసంతా అదోలా అయిపోయింది. దాదాపు ఆటోలో వచ్చినవాళ్లంతా లోపలికి పరుగు తీశారు. ఒక్క వ్యక్తి మాత్రం మెట్ల పక్కనే ఉన్న అరుగుమీద కూలబడి అలా గోడకు జారబడిపోయాడు. మోకాళ్ల పైకి కట్టిన గళ్ల పంచె అక్కడక్కడా తెల్లటి తడి మరకలు. చొక్కా మధ్యగుండీ, చివరిదీ వదిలేసి ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేవు. కాస్త పరిశీలించి చూస్తే మన్ను, పేడ కలిసి అంటుకుని ఆరిపోయినట్టుగా ఉన్నాయి పాదాలు. ముఖం చూస్తే రైతు అని అర్థమవుతుంది. చుట్టూ ఏమున్నా అతను చీకట్లో ఉన్నట్టే ఉన్నాడు. ఇంతలో ముగ్గురు మనుషులతో ఒక టూ వీలర్ వచ్చి ఆగింది. అందులో వెనక కూర్చున్న ఇద్దరూ బండి దిగుతూనే లోపలికి పరిగెడుతూ, పార్కింగ్ చేస్తున్న మూడో మనిషితో ‘‘ఒరేయ్ వెంకన్నా! చతురుడు ఇక్కడున్నాడు చూస్కో’’ అంటూ అరుగుమీద ఉన్న అతన్ని చూపిస్తూ వెళ్లిపోయారు. ‘చతురుడా..!’ అని నేను ఒక్కక్షణం ఆ పేరు దగ్గరే ఆగేలోపే వెంకన్న అతని దగ్గరగా వచ్చి పక్కనే కూర్చున్నాడు. అతని చెయ్యి భుజం మీద భరోసాగా పడేసరికి చతురుడు దుఃఖంతో వణికిపోయాడు. చేతిలో తుండు గుప్పెట నిండా పట్టుకుని నోట్లో కుక్కుకున్నాడు. గుండెల్లోని బాధ కళ్ల వెంట జలజలా జారుతున్నా అడ్డుకోలేకపోతున్నాడు. వెంకన్న తన చేతిని భుజం మార్చి సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు కాని, అతని ముఖంవైపు చూడలేకపోతున్నాడు. అప్పటికే వెంకన్న కళ్లు కూడా చెరువయ్యాయి. ఇంతలో లోపలినుంచి వచ్చిన ఒక వ్యక్తి గుమ్మం దగ్గర ఉన్న ఇద్దరినీ చూసి,‘‘ఒరేయ్! ఏంట్రా ఇది. వెంకన్నా నువ్వు కూడా ఏంటెహె, పక్కనే ఉండి దైర్నం సెప్తావంటే.’’ఆ మాటలు విన్న వెంకన్న కళ్లు తుడుచుకుంటూ నువ్వు చూసుకో అన్నట్టుగా అతనికి సైగ చేసి పక్కకు వెళ్లిపోయాడు. చతురుడి దుఃఖం పోటెత్తిన గోదారిలా ఉంది. అది గమనించి పక్కనే కూర్చున్నాడు ఆ వ్యక్తి. ‘‘ఊరుకోరా చతురూ... భయమేం లేదు. డాట్రగారు వచ్చేసేడు. ఆడికేం కాదురా. కుర్రోడు, ఉడుకురత్తం. గెంటుకొచ్చేత్తాడులే. బయటడిపోతాడు నువ్వు కంగారడక,’’ అంటూ నోటికి అడ్డంగా పెట్టుకున్న ఆ తువ్వాలు నెమ్మదిగా కళ్లమీదకు జరిపి చతురుడి కన్నీటిధారలు కట్టే ప్రయత్నం చేశాడు. హోరు వానలో పిల్లలగూడు చెదిరిన పక్షిలా వణుకుతున్నాడు చతురుడు. ఇప్పుడు అతన్ని తండ్రి స్థానంలో స్పష్టంగా చూస్తున్నాను నేను. తెలియకుండానే గుండె ఇంకాస్త బరువెక్కినట్టు అనిపించింది. అసలేం జరిగిందో? లోపలి నుంచి ఒక నర్సు పేపరు తీసుకొని వచ్చింది. కూడా వచ్చిన మనిషి చతురుడ్ని చూపించేసరికి, ఆ కాగితం మీద అతని వేలిముద్ర తీసుకొని వెళ్లిపోయింది.పక్కనే బైక్ను ఆనుకుని కూర్చున్న వెంకన్న వైపు మళ్లాయి నా చూపులు. పాదాలు కూడా అప్రయత్నంగానే అటు కదిలాయి. ఇంతలో అతని చొక్కా జేబులో ఉన్న ఫోన్ మోగడంతో పక్కకు తిరిగి రెండడుగుల దూరంలోనే ఆగాను. ఫోన్ ఎత్తి ‘హలో’... అనేలోగానే అవతలి గొంతు బయటకు వినిపిస్తోంది నాకు. ‘‘ఎంకన్నా... ఏవన్నారు, డాట్రగారు ఉన్నారా, పర్లేదు కదా! కళ్లు తెరిసి సూత్తన్నాడా..?’’ ఏం సమాధానం వినాల్సి వస్తుందో అనే భయంతో సాగుతున్న ప్రశ్నల వర్షంలా అనిపించింది నాకు. ‘‘డాట్రగారు వచ్చేరు, సూత్తన్నారు. మీరేం కంగారడకండి,’’ వెంకన్న సమాధానం నిశ్శబ్దంగా విన్నారు. ఆ వెంటనే...‘‘నువ్వు లోపలే ఉన్నావా, ఎలా ఉందిపుడు?’’ మళ్లీ అదే ప్రశ్న అవతలి నుంచి.‘‘లేదు, అందరూ లోపలికెలిపోతే డాట్రగారు దెబ్బలెడతారని బయటున్నాను. ఆడికేం అవదు. వదిన జాగ్రత్త!’’చతురుడు, వెంకన్న అన్నదమ్ములనే విషయం స్పష్టం చేసింది ఆ మాట. చెవులు ఫోన్ మీద పెట్టి ఒకసారి ఎందుకో చతురుడి వంక చూశాను. కళ్లు పొడిబారి ముఖమంతా బెంగటిల్లి ఉన్నాడు. ఇంతలో ఫోన్లో మాటలు నా దృష్టిని మరల్చాయి.‘‘ఏం జాగర్తరా బాబూ, ఎవరూ ఆపలేకపోతన్నారు. తల బాదేసుకుంటంది, నా కొడుకో... నా కొడుకో... అంటా నేలంతా పొర్లాడిపోతంది. నీళ్ల చుక్క ఇచ్చినా గిరాటేసి కొట్టేత్తంది. నన్ను తీసుకెళ్లండి ఆస్పటల్కి, నేను నా కొడుకును చూడాలంటంది. దాని బాధ సూళ్లాపోతన్నాంరా!’’ మాటలు విన్న వెంకన్న దుఃఖాన్ని ఆపుకుంటూనే, ‘‘అస్సలా... మీరెవరూ ఇటుకేసి రాకండి. మావున్నాం కదా!, ఏదైనా అవసరమైతే కవురెడతాం. బానేవుంది కళ్లు తెరిసాడని సెప్పండి వదినికి. ఇక్కడకి మాత్రం బయల్దేరొద్దు. కుసేపాగి నేనే పోన్ సేత్తాన్లే,’’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు వెంకన్న. అవతలి నుంచి ’అలాగే అలాగే సెయ్యి ఎంకన్నా’ అనే మాట వినిపించింది. వెంకన్న ఫోన్ కట్ చేశాడు. ఇదంతా వింటున్నాడో లేదోగాని, గండిపడ్డ చెరువు ముందరి పంటచేనులా ఉన్నాడు చతురుడు. అన్నయ్య వైపు చూస్తే ఏమైనా అడుగుతాడేమో, ఏమైనా చెప్పాల్సి వస్తుందేమో అన్నట్టుగా అటుపక్కగా తిరిగిపోయాడు. దగ్గరకు వెళదాం అనిపించినా, అతను కాస్త కుదురుకున్నాక మాట కలుపుదామని ఆగిపోయాను. ఇంతలో లోపలి నుంచి ఇంకో వ్యక్తి బయటకు వచ్చాడు. వాళ్ల మనిషే, ఇంతకు ముందు ఆటోలోనుంచి దిగేటప్పుడు చూసిన గుర్తుంది. నేను ఉన్నవైపే నడుస్తూ వచ్చి,‘‘ఎంకన్నా, ఇంటికాడ ఎలావుందో, పోన్ సెయలాకపోయావా ఓసారి?’’ తోడొచ్చిన మనిషి కాబట్టి కాస్త నిబ్బరంగా ఉంది మాట.‘‘ఉప్పుడే ఇంటికాణ్ణుంచి సేసారు మాయా, డాట్రగారు సూత్తన్నారు కంగారడద్దొని సెప్పాను.’’ వెంకన్న కాస్త భయం భయంగానే,‘‘ఏవంటన్నారు మాయా?’’ ‘‘కాస్త కూస్తయితే పర్లేదుగానీ, ఈడమ్మ మొత్తం పట్టించేసాడ్రా కుర్రెదవ. మా సెడ్డా యాతన తెచ్చేడు. ఆయనగారు ప్రయత్నం సేత్తన్నాడు. చూద్దాం, భగమంతుడే ఉన్నాడు,’’ అంటూ వెంకన్న దగ్గర అగ్గిపెట్టె తీసుకొని జేబులో చుట్ట బయటకు తీసి దాని కొస కొరికి బయటకు ఊస్తూ, ఇప్పుడే వస్తా అన్నట్టుగా పక్కకు కదిలాడు ఆ వ్యక్తి. వయసు యాభై దాటి ఉంటుంది. జుట్టు నెరిసింది. ఇలాంటి మంచి చెడ్డా బాగా చూసి, నలుగురి కోసం తిరిగి నలిగినవాడిలా ఉన్నాడు. వెంకన్నను కదిపి బాధ పెంచడం కంటే ఇతనితో మాట కలపడం కరెక్ట్ అనిపించింది. ఆటో అవతల కాస్త దూరంగా పొగ వదులుతున్న ఆ పెద్దాయన్ను చూసి అటువైపు కదిలాను. ఆస్పత్రి ఆవరణం కదా, అందరూ ఏదో ఒక బాధ మోస్తూనే ఇక్కడ నిలబడతారని తెలిసిన మనిషిలా నన్ను పలకరింపుగా చూశాడు. అది చూసి నేను ఇంకాస్త దగ్గరకు అడుగులేశాను.‘‘ఏ ఊరండీ?’’ మాట కలిపాను.‘‘మన్యంవారిపాలెం, మీది?’’ ‘‘గండేపల్లి. మా అమ్మకు బాగోకపోతే తీసుకొచ్చాం. సడన్ గా మనుషుల్ని గుర్తుపట్టలేకపోతుంది. సోడియం తగ్గిందట. మందులిచ్చారు, రాత్రికి ఇక్కడే ఉంచమన్నారు. పొద్దున్నే రాజమండ్రి తీసుకెళ్లాలి స్కానింగ్ కోసం.’’ నేను అడగాల్సిన సంగతి ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అని, ఆయన అడక్క ముందే నా వివరం మొత్తం పూర్తి చేసేశా. నా మాటలు విన్న ఆ పెద్దమనిషి నిట్టూర్పుగా,‘‘ఏంటో యింత యింత రోగాలు. ఒక వయసు దాటాక ఏది ఎలా ముంచుకొత్తందో చెప్పలాకపోతన్నాం. హాయిగా బతకాల్సిన కుర్రెదవలేమో ఇలా చేత్తన్నారు.’’ ప్రాణం మీదకు తెచ్చుకున్న ఆ కుర్రాడిపై బాధతో నిండిన కోపంతో అన్నాడు. ‘‘ఏమైంది..?’’ నా ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం విన్నాక మళ్లీ చతురుడి వైపు చూడటానికి ధైర్యం సరిపోలేదు. నిజానికి అతని అసలు పేరు చతురుడు కాదు. ఎప్పుడూ చుట్టూ ఉన్న వాళ్లతో చతుర్లాడుతూ, నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడని ఊళ్లో అలా పిలుచుకుంటారు. అసలు పేరు వీరన్న. బయట ఊరోళ్లకు, ఇంట్లోవాళ్లకు, చుట్టాలకు తప్ప ఆ పేరు ఊళ్లో పెద్దగా తెలియదు. అతని నైజానికి పూర్తి విరుద్ధమైన స్థితిలో ఇప్పుడు వున్నాడనిపించింది. ఎప్పటిలాగే పొలం పని చూసుకొని కాస్త పెందరాడే ఇంటికి బయలుదేరిన చతురుడు, ఇంటికి దగ్గరలో ఉన్న గొడ్ల సావిడి దగ్గర ఆగాడు. అక్కడ అంతా శుభ్రం చేసుకుని పాలు పితుకుతున్నాడు. ఇంతలోనే ఇంటినుంచి కబురు. కుర్రాడు మందు తాగేశాడు అర్జంటుగా రమ్మని. కాళ్ల మధ్యలో ఉన్న పాలక్యానుతో పాటు అతని గుండె జారిపోక ఏమవుతుంది? ఉన్న మనిషి ఉన్నట్టే పరిగెత్తాడు. అక్కడ నుంచి నేరుగా ఆటో ఎక్కి ఆస్పత్రికి వచ్చి ఇక్కడ కూలబడిపోయాడు. ఒక్కడే కొడుకు. పేరు శ్యామ్సుందర్. పెద్దాయన ఆ పేరు చెప్పగానే నోటి వెంట తెల్లటి నురుగు కారుతూ ఉన్న ఆ పిల్లాడి ముఖం గుర్తొచ్చింది. పదవతరగతి మంచి మార్కులతో పాసయ్యాడు. తాను పెట్టిన కండిషన్ ప్రకారం స్మార్ట్ఫోన్ బహుమతిగా కొనిపించుకున్నాడు. ఇప్పుడు ఇంటర్ సెకండియర్. నెలరోజుల్లో పరీక్షలున్నాయి. ఇంతలోనే బలవంతపు చావుకి సిద్ధపడి కన్నవాళ్లకు ఇంత పెద్ద పరీక్ష పెట్టాడు. ‘‘ఏదైనా అనండి, ఇయ్యాలా రేపు పిల్లలకు అదుపు లేకుండా పోయిందండీ. ఏదడిగితే అది కొనేయడం, కొనకపోతే కొనేదాకా ఆళ్లు అమ్మాబాబుని తినేయడం,’’ ఆలోచనగా వింటున్న నన్ను చూసి ఇంకాస్త గట్టిగా తనే, ‘‘కాలేజీకి పోయే కుర్రగాళ్ల చేతికి పోనెందుకు సెప్పండి? ఆళ్లు పాటాలింటారా, పోనే సూత్తారా? గట్టిగా ఏవన్నా అంటే ఆ మేస్టర్ల మీదకి కూడా మనమే యుద్ధానికి పోతన్నాం. ఇదంతా ఎవరిని ఉద్దరించడానికి?’’ నిలదీసినట్టుగా అడిగేసరికి నేను తలూపాను. శ్యామ్సుందర్ ఎందుకిలా చేశాడో చెప్పేసరికి అతని ఆవేదన నాలోనూ అనేక ప్రశ్నల్ని రేపింది.స్మార్ట్ ఫోన్ చేతికొచ్చేసరికి చాలామంది కుర్రాళ్ల మాదిరే శ్యామ్సుందర్ లోకం కూడా మారిపోయింది. తెల్లారగానే చూసేది ఆ ఫోన్ ముఖమే, రాత్రి నిద్రపోయేది కూడా దాని ముఖం చూస్తూనే. ’ఎప్పుడూ ఆ పోన్లోనే తలకాయ పెట్టుకుని ఉంటావ్, ఏం చూత్తావ్రా గంటల గంటలు’ అనే మాట చాలామంది తల్లిదండ్రుల్లాగే చాలాసార్లు అన్నాడు చతురుడు. చదువుకు సంబంధించింది ఏదో చూస్తున్నామనో, ఫ్రెండు నోట్స్ పంపుతానన్నాడనో ఏదో ఒక కథ చెప్పి వాళ్లను ఏమార్చడం తప్ప మాట వినిందే లేదు సుందర్. అంతకు మించి పట్టించుకునే తీరిక ఆ కష్టజీవికి లేదు. ఆ అలవాటు నెమ్మదిగా సుందర్ను బెట్టింగ్ యాప్స్ వైపు ఆకర్షితుడయ్యేలా చేసింది. డబ్బులు రాగానే ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చేయడం, సినిమాలకు వెళ్లిపోవడం, డబ్బు పోతే ఎవర్నో అప్పు అడగటం, ఇంట్లో అయితే ఆ ఫీజులని, ఈ ఫీజులనీ అబద్ధం చెప్పి తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. మొత్తానికి కొన్ని నెలలుగా ఆ మాయావలయంలో చిక్కుకు పోయాడు. ఇంట్లో డబ్బు దొంగతనంగా తియ్యడం నుంచి బీరువాలో అమ్మ నగలు కూడా చాటుగా తీసుకెళ్లి పట్నంలో తాకట్టు పెట్టేయడం వరకు అయిపోయింది. తెల్లారితే పెద్దపండగ. పెద్దలకు దండం పెట్టుకొని, మూలన పెట్టుకున్న కొత్త బట్టలు కట్టుకోవడం ఇంట్లో ప్రతి యేటా జరిగే తంతు. అమ్మ బీరువాలో నగలు కచ్చితంగా తీసుకొని వేసుకునే రోజు. ఎలాగైనా బెట్టింగ్ గెలిచి ఆ ముందు రోజే నగలు తెచ్చి బీరువాలో పెట్టేద్దాం అనుకున్నాడు సుందర్. కానీ... అతనికి అప్పటికీ తెలియంది ఏంటంటే, అది పోయే డబ్బు తప్ప వచ్చే డబ్బు కాదని; అదంతా పచ్చి మోసం అని. అమ్మ నగల కోసం అప్పు తెచ్చి పెట్టిన డబ్బు కూడా పోయింది. దిక్కుతోచక, ఇంట్లో అమ్మానాన్నకు నిజం చెప్పలేక, తెల్లారితే నిజం తెలిసిపోతుందనే భయంతో ఈ దారుణానికి ఒడికట్టాడు. చదువురాని తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాసిపెట్టి, పొలంలో కొట్టడానికి తెచ్చిన గడ్డిమందు గడగడా తాగేశాడు. ‘‘ఆడి పిచ్చిగానీ... ఇలా ఎదవ పని చేశానని ఇంట్లో అమ్మాబాబుకి సెప్పడానికి జడిసినోడు, చావడానికి ఎందుకు భయపడలేదని!? సచ్చి సెప్పాలనుకున్నది కూడా అదే కదండీ? ఇది కూడా అర్థమై ఏడ్వకపోతే ఇంకేం సదువులు సంకనాకడానికి. ఉప్పుడేదైనా ఐతే ఈడేవైపోను, ఆయమ్మి ఏమైపోను. ఉన్నదొక్కడే ఒంటిగాడు. ఈడ్ని సూసుకునే కదా ఆళ్లు బతుకుతుంటా!’’ పెద్దాయన ఆసుపత్రి లోపలికెళ్లి చాలాసేపైనా నాకు మాత్రం ఆయన ప్రశ్నలే లోపల తిరుగుతున్నాయి. ఎందుకోగాని కాళ్లు నిలవడం లేదు, ఒక్కసారి లోపలికెళ్లి సుందర్ని చూడాలనిపించింది. వీలైతే డాక్టరుతో మాట్లాడి ఆ భరోసాను బయటకొచ్చి చతురుడికి చెప్పాలనిపించింది. అమ్మని చూసి కూడా చాలాసేపయింది. చెల్లి నిద్రపోయిందో, మెలకువగా ఉందో కనపడినట్టు కూడా ఉంటుందని అనుకున్నాను. ఎమెర్జెన్సీ రూము బయట అంతా గడబిడగా ఉంది. సుందర్ను తీసుకొచ్చినవాళ్లు, ఆ తర్వాత చూద్దామని వచ్చిన వాళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు తప్ప ఎవరి కళ్లలోనూ ఆశ కనిపించడం లేదు. నిర్లిప్తంగా తచ్చాడుతున్నారే కానీ ఏం జరుగుతుందో అనే ఆందోళన కూడా లేదు. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. మనసు కీడు శంకిస్తోంది. వాళ్లను తప్పించుకుని లోపలికి వెళ్లబోతుంటే ఒక ఏడుపు వినిపించింది. నన్ను నెట్టుకుంటూనే కట్టలు తెంచుకున్న దుఃఖంతో బయటకు వెళ్లిపోతున్నాడు వెంకన్న. తడిసిన కళ్లు తుడుచుకొని సుందర్ను చూసే ధైర్యం చేశాను. తెల్లటి గుడ్డ అతని ముఖం మీద నుంచి కప్పుతుండగా చూశాను చివరిసారి. తొలిసారి చూసినప్పటి కంటే బాగున్నాడు. నూనూగు మీసాలను కప్పేసిన నురుగు ఇప్పుడు లేదు. కాకపోతే ఇప్పుడు సుందర్ కూడా లేడు. గుండె బరువెక్కిపోయింది. ఊపిరి సలపనట్టుగా దేహం బిగుసుకుపోతున్నట్టుగా ఏదోలా ఉంది. వెంటనే అమ్మను చూడాలనిపించింది. నాలుగడుగులు వేసి పేషెంట్లు ఉన్న రూముల దగ్గరకు వెళ్లాను. బెంగగా అమ్మ బెడ్వైపు చూశాను. సెలైన్ బాటిల్ ఎక్కుతోంది. చెల్లెలు అక్కడే బెంచిమీద కూర్చుని అదే బెడ్ మీద అమ్మ కాళ్ల దగ్గర తలవాల్చి కునుకు తీస్తుంది. నెమ్మదిగా వెళ్లి అమ్మ పాదాలను ఒకసారి తాకి ముఖంవైపు చూశాను. సుందర్ తల్లి గర్తుకొచ్చింది. గబగబా నడుచుకుంటూ బయటకొచ్చాను. చతురుడ్ని చూడాలి అర్జంటుగా అన్నట్టు. తిరిగి వస్తుంటే ఎమెర్జెన్సీ రూమ్ దగ్గర అంతా ఇంకా గోలగానే ఉంది. కాగితాలు, సంతకాలు, అంబులెన్ ్స గొడవేదో నడుస్తుందక్కడ. వాళ్లందరినీ తప్పించుకుని బయటపడ్డాను. అరుగుమీద అటూ ఇటూ పొర్లుతున్న చతురుడ్ని చూసి గుండె చెరువైపోయింది. ఇందాక లోపలికి వెళ్లేటప్పుడైనా నాలుగు మాటలు మాట్లాడాల్సింది. పక్కనే వెంకన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్నకు ధైర్యం చెప్పే దారిలేక, వదినకు ఫోన్ చేసే ధైర్యం లేక, కాలి మునివేళ్లు నేలకు గుచ్చుతూ కన్నీళ్లు ఒంపుతున్నాడు.ఫార్మాలిటీస్ అయిపోయాయి. లోపలనుంచి ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. అంబులెన్ వెనకపక్కకు వెళ్లడం చూస్తూ ఒక్కసారిగా గొల్లుమన్నారు చతురుడు, వెంకన్న. ‘‘ఇంటికెవరూ పోన్ గట్టా చెయ్యకండిరా, ఆయమ్మిని కాయలేరు,’’ అంటూ జరగాల్సినవి చక్కబెడుతున్నాడు పెద్దాయన. ముందు చతురుడ్ని, వెంకన్నను ఆటో ఎక్కించమన్నాడు. వాళ్లు కాదన్నాసరే వినలేదు. ‘‘ఆ కుర్రోడి ముఖం సూత్తూ అంబులెన్సులో కూసోలేరు, ముందు ఆటో తీసేయండి, మీరు కదలండ్రా... వెనకాల అంబులెన్సు ఎంతసేపొత్తాది! నడండి,’’ అనేసరికి నలుగురూ కలిసి చతురుడ్ని లేవదీయ బోయారు. ఎక్కడా మనిషి నేలను అంటి పెట్టుకుని కదలడం లేదు. అది చూసిన పెద్దాయన కాస్త దగ్గరకెళ్లి, ‘‘రేయ్ చతురా! ఇంక లేదు మనకి, అంతే రుణం. నువ్వు ఎంత బాదుకున్నా ఎనక్కి తీసుకురాగలవా? ఇంటికాడ ఆడమనిషి పరిస్థితి ఏంటో ఆలోసించు కాస్త,’’ అంటుండగా నలుగురు మనుషులు అతన్ని పట్టుకుని బలవంతంగా ఆటో ఎక్కించారు. ‘‘ఇంత బాధ నా అన్న ఎలా తట్టుకుంటాడని ఎల్లిపోయావ్రా సుందరా,’’ అంటూ బోరున విలపిస్తున్న వెంకన్నను పెద్దాయన జబ్బ పట్టుకుని లేపి ఓదారుస్తూ,‘‘బాధే మరి, బాధ కాదేటి. కొరివెడతాడు అనుకున్నోడు మనకంటే ముందే కాటికెల్లిపోతే బాధ కాదా! ఏం చేత్తాం, రాతలు కనలేం,’’ అంటూ ఆటోలో కూర్చోబెట్టి పోనీమన్నాడు.ఇప్పుడు ఆటో వెళుతుంటే రాత్రి వచ్చినప్పుడు ఉన్నంత శబ్దం అనిపించలేదు నాకు. కానీ, అప్పటికంటే బరువుగా కదిలినట్టుంది. ఇంతలోనే హారన్ మోగింది. ఆస్పత్రి వెనకనుంచి వచ్చిన అంబులెన్సు ఆటో వెనకాలే వెళ్లిపోయింది తేలిగ్గా! సుందర్ని మోసుకుంటూ!మళ్లీ అక్కడంతా నిశ్శబ్దంగా అనిపించింది. అయితే అది మునుపటి నిశ్శబ్దం కాదు. సమయం తెల్లవారి నాలుగు కావొచ్చింది. అప్పుడప్పుడే లేచిన పేషెంట్ల అటెండర్లు, అంతవరకు జరిగిన విషయం గురించి ఆరా తీస్తున్నారు. ‘‘చిన్న వయసంటమ్మా... ఒక్కడే కొడుకంట... గడ్డి మందు తాగేశాడంట. చానా తంటాలు పడ్డారంట డాట్రగారు. అప్పుడుకే రక్తంలో పట్టేసిందంట. బతకలేదు, కన్నపేగు ఏమైపోద్దో,’’ అవే మాటలు నాకు చెవుల చుట్టూ తిరుగుతున్నాయి. లోపలికి వెళ్లబోయి మళ్లీ వెనక్కి వచ్చి అరుగుమీద కూర్చుని గోడకు తల ఆన్చాను.చతురుడు పొలంలో గడ్డి మందు కొడుతున్నాడు. బెట్టింగ్ యాప్లు అన్నీ పురుగుల్లా రాలిపోతున్నాయి. వాడిపోయి మాడిపోతున్న కలుపులో యావజ్జీవ ఖైదీల్లా వికారంగా కనిపిస్తున్నారు యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు. ఇంతలో ఎవరో గట్టుమీద నిలబడి చతురుడ్ని ‘వీరన్నా!’ అని పిలవడంతో ఉలిక్కిపడి లేచాను. ఎప్పుడు పట్టిందో చిన్న మాగన్ను పట్టేసినట్టుంది. కలత కల పడింది. నిజమైతే ఎంత బాగుండో! పూడి శ్రీనివాసరావు -
రణభారం
యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరెవరి మధ్య జరిగినా, యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. జరిగే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇరాన్కు, అమెరికా, ఇజ్రాయెల్లకు జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఉభయ పక్షాల సైనికులు సహా దాదాపు పదివేల మంది ఇప్పటికే మరణించారచమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు సహా భారీ ఆస్తినష్టం కూడా జరిగింది. అయినా, ఇది ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధంలో వినియోగిస్తున్న అధునాతన విధ్వంసక ఆయుధాలు విపరీతమైన ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా అంతులేని చేటు తెచ్చిపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల తలెత్తే విపరిణామాల గురించి ఒక విహంగ వీక్షణం...భారత్కు భారీ ఆర్థిక నష్టంప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అమెరికా–ఇరాన్ యుద్ధంతో భారత్కు ఎలాంటి సంబంధం లేదు. అయినా, ఈ యుద్ధం భారత్లో ఆర్థిక భూకంపాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్లో మదుపరుల సొమ్ము ఏకంగా రూ. 41 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు రూ.89 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 93.30 మేరకు పడిపోయింది. రూపాయి విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిల్వల నుంచి దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇక ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు పైబడటంతో భారత్ ప్రతినెలా దిగుమతి బిల్లు వేలాది కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ‘ఇంధన’ సెగ భారత్నూ తాకుతోంది. దీనివల్ల వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి పర్యవసానంగా నిత్యావసరాల ధరలూ పెరిగి, సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.భారత్పై యుద్ధ ప్రభావం⇒ డాలర్తో రూపాయి విలువ పతనం రూ. 93.30⇒ రిజర్వ్ బ్యాంకు నిల్వల నుంచి ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లు⇒ స్టాక్ మార్కెట్ నష్టాలు రూ. 41.00 లక్షల కోట్లుఅమెరికా, ఇజ్రాయెల్ల సైనిక ఖర్చుయుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా ఏకంగా రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు చేసింది. యుద్ధం ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు పడిన భారం దాదాపు రూ.17.4 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాన్పై దాడుల కోసం ఇజ్రాయెల్ వారానికి సగటున రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున రూ. 7,500 కోట్లు, ఇజ్రాయెల్ రోజువారీగా సగటున రూ. 2,700 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచానికి ఆర్థిక విఘాతంప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఆర్థిక విఘాతం తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా ఈ ఏడాది పలు దేశాల స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) గణనీయమైన నష్టం వాటిల్లనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా అంచనాల ప్రకారం యుద్ధం వల్ల ఇరాన్ జీడీపీకి అత్య«ధికంగా సుమారు 20%–25% మేరకు నష్టం వాటిల్లనుంది. ఇజ్రాయెల్ జీడీపీకి సుమారు 5%, అమెరికా జీడీపీకి 1.2% నష్టం కలగనుంది. యుద్ధంతో సంబంధం లేకున్నా, దీని ప్రభావం భారత్ జీడీపీని 1.1% మేరకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.‘నాటో’ దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్నా, చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా ‘నాటో’ దేశాల జీడీపీ 0.5% నుంచి 2% మేరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల యూరోపియన్ యూనియన్ సహా ‘నాటో’ దేశాలు రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి. రష్యాతో తెగతెంపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇంధన ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగేటట్లయితే, యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేని దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. యుద్ధం ఫలితంగా పలు దేశాలలో వృద్ధి గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ధరల పెరుగుదల ఎక్కువై ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితుల్లో ఉత్పాదకత, ఉపాధి కుంటుపడతాయి. ఫలితంగా చాలా దేశాల్లో సామాన్యులపై పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయి.విధ్వంసకరమైన ఆయుధాలుఅమెరికా–ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఈ యుద్ధంలో విధ్వంసకరమైన ఆయుధాలతో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు వినియోగించిన ఆయుధాలు అత్యంత ఖరీదైనవి, అధునాతనమైనవి. ఈ ఆయుధాలు ఎంత ఖరీదైనవో, ఇవి సృష్టించే విధ్వంసం వల్ల సంభవించే నష్టం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉభయ పక్షాలూ ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్న ప్రధానమైన ఆయుధాల వివరాలుఎఫ్ 35 లైటెనింగ్–2 విమానంరాడార్లకు చిక్కకుండా లక్ష్యాలపై బాంబులను జారవిడవగల యుద్ధవిమానం ఇది. ఈ విమానాలను అమెరికా పదుల సంఖ్యలోనే ఇరాన్పై దాడుల కోసం రంగంలోకి దించింది. ఇరాన్ క్షిపణుల దెబ్బకు ఇప్పటి వరకు ఎఫ్35 లైటెనింగ్ విమానాలు రెండు నేలకూలాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.960 కోట్లు.లూకాస్ డ్రోన్లుశత్రు స్థావరాల మీద దాడుల కోసం రూపొందించిన డ్రోన్ ఇది. తక్కువ ఖరీదు చేసే ఈ డ్రోన్లను అమెరికా బలగాలు ఇరాన్పై దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.32 లక్షలు.టొమాహాక్ క్రూజ్ మిసైల్స్దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగిన క్షిపణి ఇది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అమెరికా బలగాలు దాదాపు 850 టొమాహాక్ క్షిపణులను ఉపయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.23 కోట్లు.ఎస్ఎం3 ఇంటర్సెప్టర్ క్షిపణులుశత్రువుల క్షిపణులను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయడానికి రూపొందించిన శక్తిమంతమైన ఆయుధం ఇది. ఇరాన్పై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు అమెరికా బలగాలు దాదాపు వంద వరకు ఈ క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ. 116 కోట్లు.యారో–3ఇది శక్తిమంతమైన ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 100 కిలోమీటర్ల ఎత్తులోనే నాశనం చేయగల సామర్థ్యం గల అధునాతన ఆయుధం ఇది. ఇరాన్పై జరుగుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు 35 వరకు యారో–3 క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.33 కోట్లు.ఐరన్ డోమ్ఇది కూడా ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 70 కిలోమీటర్ల దూరంలోనే పడగొట్టగల సామర్థ్యం గల ఆయుధం ఇది. ఇరాన్పై దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఐరన్ డోమ్ క్షిపణులను ఇప్పటి వరకు వందల సంఖ్యలోనే ప్రయోగించినట్లు సమాచారం. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.42 లక్షలు.ఫతా–2ధ్వని వేగాన్ని మించిన వేగంతో దూసుకుపోయి, సుమారు 1500 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. దీని ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.93 లక్షలు.ఖైబర్ షెకాన్ఇది దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. అమెరికా బలగాలు ‘ఆపరేషన్ ఫ్యూరీ’ మొదలుపెట్టిన తర్వాత ఇరాన్ బలగాలు దాదాపు 180 వరకు ఖైబర్ షెకాన్ క్షిపణులను ప్రయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.35 కోట్లు.షాహెద్–136 డ్రోన్లుశత్రు స్థావరాలపై దాడుల కోసం తక్కువ ఖరీదుతో రూపొందించిన డ్రోన్లు ఇవి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు రెండువేల వరకు ఈ డ్రోన్లను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.27 లక్షలు.ప్రపంచ దేశాలకు ఇక్కట్లుఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాలకు అనేక ప్రతికూల ఫలితాలు తప్పవని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి దొరికితే చాలా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ముడి చమురు ధరలు మరో ముప్పయి శాతం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంతర్జాతీయ నిపుణుల అంచనా. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు గడ్డు పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పలు దేశాల జీడీపీ వృద్ధి తిరోగమనం చెందవచ్చని కూడా చెబుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్తో పాటు పశ్చిమాసియా దేశాలకు తీవ్ర నష్టం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పర దాడుల్లో ఇరాన్ సరిహద్దుల్లోని సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలలో భారీ నిర్మాణాలకు ముప్పుతో పాటు, తీవ్ర జననష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయి.చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడి పశ్చిమాసియా దేశాలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పశ్చిమాసియాలో ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. పశ్చిమాసియాకు వెలుపల చమురు ఉత్పాదనలో కీలకమైన రష్యా తనతో సానుకూల సంబంధాలు కలిగిన దేశాల చమురు లోటు తీర్చడానికి ముందుకు వచ్చి, బలమైన కూటమిని ఏర్పాటు చేసుకునే సూచనలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే! -
మల్లెల్లో మనమే టాప్!
వేసవి వచ్చేసింది. వేసవిలో ఎండల ధాటి ఎలా ఉన్నా, మల్లెల పరిమళాలు మనసుకు ఊరటనిస్తాయి. మల్లెల పరిమళాలే లేకుంటే, వేసవి తాపాన్ని భరించడం మానవమాత్రుల వల్ల అయ్యే పని కాదు. వసంతారంభం నుంచి గ్రీష్మం ముగిసే వరకు మల్లెలు విరివిగా పూస్తాయి. బొండు మల్లెలు, కాడ మల్లెలు సహా మల్లెల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మల్లెలు అత్యధికంగా పూసే దేశాలలో మన దేశం అగ్రగామిగా ఉంటుంది. మల్లెలు విరివిగా పూసే దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...మల్లెల ఉత్పాదనలో మన దేశం మొదటి స్థానంలోనే ఉన్నా, ఎగుమతుల్లో మాత్రం రెండో స్థానంలో ఉంది. మన దేశంలో మల్లెల ఉత్పాదన స్థాయిలోనే స్థానిక వినియోగం కూడా భారీగానే జరుగుతుండటం దీనికి కారణం. -
చొక్కాకు పూలకళ
పూల డిజైన్లు కేవలం అమ్మాయిల దుస్తులపై మెరవడానికే అనుకుంటే, మీరు చెవిలో పూలు పెట్టుకున్నట్టే! ఎందుకంటే, ఒక అబ్బాయి సరైన స్టయిల్లో పూల చొక్కా వేసుకుంటే, ఆ లుక్ ముందు ఎవరైనా సరే కాస్త సైడ్ అవ్వాల్సిందే! అది ఎలాగో మీరే చూడండి!సందర్భాన్ని బట్టి పూల సైజ్ ఎంచుకోండిపెద్ద పూల ప్రింట్స్ క్యాజువల్ ఔటింగ్స్, బీచ్ డేస్కు బెస్ట్. చిన్న పూల ప్రింట్స్ పార్టీలు లేదా సెమీ ఫార్మల్ ఈవెంట్స్కి క్లాసీ లుక్ ఇస్తాయి. ఎక్కువ మందికి పెద్ద పూల కంటే చిన్న లేదా మధ్యస్థ పరిమాణంలో ఉన్న పూల డిజైన్లు అందంగా కనిపిస్తాయి. ఒక సిక్స్ ఫీట్ కటౌట్ ఉన్న అబ్బాయి రంగురంగుల పూల ప్రింట్స్ ధరిస్తే అది అతనిలోని ‘సాఫ్ట్ పవర్’ చెప్పకనే చెప్తుంది.లైట్ అప్ ది కలర్స్ఫేవరెట్ కలర్స్ కంటే ఎప్పుడూ సూట్ అయ్యే కలర్స్ మీ లుక్ను లైట్ అప్ చేస్తాయి. అందుకే, ఎలిగెంట్ లుక్ కోసం బ్లూ, బీజ్, బ్లాక్ లాంటి కలర్స్ బాగా సెట్ అవుతాయి. యెల్లో, పింక్, మింట్ గ్రీన్ కలర్స్ ఎనర్జీ, ఫన్ వైబ్ ఇస్తాయి. డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్పై లైట్ పూల డిజైన్ ఉంటే లుక్ మరింత షార్ప్గా కనిపిస్తుంది.బాటమ్స్తో పర్ఫెక్ట్ బ్యాలెన్స్పూల చొక్కాతో పాటు ప్లెయిన్ ప్యాంట్ లేదా జీన్స్ వేసుకుంటే లుక్ ఎక్కువ గందరగోళంగా కాకుండా నీట్గా కనిపిస్తుంది. ప్యాటర్న్ ఎక్కువైతే, మిగతా డ్రెస్ సింపుల్గా ఉంచండి. అలాగే, కూల్ లుక్ కోసం షార్ట్లు, బీచ్ వైబ్స్ కోసం లినెన్ షార్ట్లు, లోఫర్స్ ఫ్లోరల్ షర్ట్స్కు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్తాయి.రఫ్డ్ గేమ్అమ్మాయిలు పూల డ్రెస్సులు వేస్తే అది అలవాటు, అదే అబ్బాయిలు వేస్తే అది ఒక అడ్వెంచర్! ఆ అడ్వెంచర్ను మరింత రియలిస్టిక్గా చూపించడానికి, రఫ్గా ఉండే గడ్డం, హెయిర్కట్కు జతగా ఒక వైబ్రంట్ ఫ్లోరల్ షర్ట్ ఇచ్చే కిక్ వేరే లెవెల్!డిజైనర్ షర్ట్పూల చొక్కా వేసుకున్నప్పుడు మీరు గమనించాల్సింది, మీరు వేసుకున్నది డిజైనర్ షర్ట్లా హై క్వాలిటీతో ఉండాలి. కానీ, పొరపాటున అది మీ చెల్లెలి దుపట్టానో లేదా అమ్మ చీరనో కుట్టించుకున్నట్టుగా కనిపించకూడదు.బటన్ల మ్యాజిక్ప్లెయిన్ ప్యాంట్, స్లీవ్లెస్ బనియన్ పై ఓపెన్ ఫ్లోరల్ షర్ట్ లుక్కు ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది. అలాగే, షర్ట్ పై బటన్లు రెండు వదిలేసి, చేతులు మడతపెట్టి పూల చొక్కాలో నడుస్తుంటే ఎవ్వరైనా మీపై నుంచి కళ్లు తిప్పుకోలేరు. అప్పుడు మీరు ‘నేనే వరల్డ్ హ్యాండ్సమ్, ఏమైనా సందేహమా?’ అన్నట్టుగా ఇచ్చే ఫొటో పోజులు కూడా అదిరిపోతాయి.దీపిక కొండి -
42 ఏళ్ల న్యాయపోరాటం... 100 ఏళ్ల వయసులో ముగింపు
‘న్యాయంలో జాప్యం న్యాయ నిరాకరణతో సమానం’ అని న్యాయ కోవిదులు చెబుతుంటారు... న్యాయం ఆలస్యం అయినా.. సుదీర్ఘకాలం ఎదురుచూసినా.. చివరకు తమకు న్యాయం దక్కింది.. అదే చాలని ఓ కుటుంబం సంతోషపడుతోంది.. కానీ ఆ సంతోషం వెనుక 42 ఏళ్ల నిరీక్షణ ఉంది.. కాలం మాటున కరిగిపోయిన ఓ వ్యక్తి జీవితం దాగుంది. మధ్య వయసులో నిందితుడిగా ఆ వ్యక్తిపై ముద్ర పడింది. కోర్టు జీవితఖైదు విధించింది. బెయిల్ వచ్చినా ‘పంజరం’ బతుకైంది. కాటికి కాళ్లు చాపిన వయసులో ఉన్నత న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. స్వేచ్ఛ లభించింది. కానీ, జీవితాన్ని అనుభవించడానికి వయసు, ఒంట్లో సత్తువ రెండూ మిగల్లేదు. కాలం వెనక్కి రాదు. అంతే కాదు, మరో విషాదమూ ఉంది.. ‘నేను ఏ నేరమూ చేయలేదు. నా కేసు కొట్టేశారు. నేను నిరపరాధిని’ అని సంతోషించేందుకు ఆ వ్యక్తికి జ్ఞాపకశక్తి లేదు.. ఎవరైనా చెబితే వినేందుకు వినికిడి శక్తీ మిగల్లేదు. 42 ఏళ్ల నిరీక్షణకు... 100 ఏళ్ల వయసులో కోర్టు ముగింపు పలికింది. ఆలస్యంగానైనా న్యాయం దక్కింది. నిందితుడనే మచ్చ తొలగింది. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా భువ్సీ గ్రామంలో భూ వివాదం ఓ వ్యక్తికి హత్యకు దారి తీసింది. పోలీసులు ముగ్గుర్ని నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు పత్తా లేకుండా పోయాడు. మరో నిందితుడు అప్పీలు విచారణలో ఉండగానే చనిపోయాడు. సజీవంగా ఉన్న వ్యక్తి న్యాయం కోసం సుదీర్ఘకాలం ఎదురు చూశాడు. జీవిత చరమాంకంలో నిర్దోషిగా కేసు నుంచి బయటపడ్డాడు. హత్యకు దారి తీసిన భూ వివాదం1982 ఆగస్టు 9న రాజుభయ్యా, అతని సోదరుడు గునువా చెరువు నుంచి నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన మైకు, సత్తి్తదిన్, ధనీరామ్ ఎదురుపడ్డారు. గతంలో తన తుపాకీని లాక్కున్నాడని, తన భూమిని ఆక్రమించాడనే కోపం మైకులో ఉంది. ఇదే అదనుగా భావించి అతడిపై కాల్పులు జరిపాడు. తుపాకీ గుండు శరీరంలోకి దూసుకెళ్లింది. గునువా నేలకొరిగాడు. సత్తి్తదిన్, ధనీరామ్ చేతుల్లోనూ ఈటె, గొడ్డలి ఉన్నాయి. కాల్పుల శబ్దానికి చుట్టుపక్కల వారు రావడంతో ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు–శిక్ష ఖరారుమైకు, సత్తిదిన్, ధనీరామ్లపై కేసు నమోదైంది. మైకు పరారయ్యాడు. ధనీరామ్ కోర్టులో లొంగిపోయాడు. 1984 జూన్లో హమీర్పూర్ అదనపు సెషన్స్ కోర్టు ఐపీసీ సెక్షన్ 302, సెక్షన్ 34 కింద దోషులుగా తేల్చి సత్తిదిన్, ధనీరామ్లకు జీవిత ఖైదు విధించింది. అదే ఏడాది ధనీరామ్కు బెయిల్ మంజూరైంది. అలహాబాద్ కోర్టులో అప్పీలులోయర్ కోర్టు విధించిన శిక్షపై ఇద్దరు నిందితులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. అప్పీలు దశలోనే సత్తిదిన్ మృతి చెందాడు. ధనీరామ్ ఒక్కడే మిగిలాడు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఈ కేసు నడిచింది. ఇద్దరు సాక్షులను కోర్టు మరోసారి విచారించింది. కేసు పత్రాలన్నీ పరిశీలించింది. సాక్ష్యాలు.. ఎఫ్ఐఆర్లో తేడాలు కేసులో ప్రధాన సాక్షి రాజుభాయ్, మరో సాక్షి రామా కింది కోర్టులో చెప్పిన సాక్ష్యానికి, హైకోర్టులో చెప్పిన వివరాలకు తేడాలను గుర్తించింది.. వారు చెప్పిన దానికి భిన్నంగా వైద్య నివేదిక ఉంది. వారి వాంగ్మూలాలు నమ్మదగినట్టుగా లేవని కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఎఫ్ఐఆర్లోనూ పలు లోపాలు విచారణలో బయటపడ్డాయి. ధనిరామ్ చేతిలో గొడ్డలి ఉంది తప్ప మృతుడిపై ఆ మారణాయుధం తాలూకు గాయాలు లేవని వైద్యుడి నివేదిక స్పష్టం చేసింది.కింది కోర్టు తీర్పు కొట్టివేతసాక్ష్యాధారాలను సహేతుకమైన సందేహాలతో కింది కోర్టు విశ్లేషించలేదని హైకోర్టు ధర్మాసనం భావించింది. ప్రాసిక్యూషన్ నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను చూపించలేకపోయిందని పేర్కొంది. కేసు సుదీర్ఘకాలం నడవడం, నిందితుడి వయస్సు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పింది. గతంలో ఈ తరహా కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ ‘సాక్ష్యాల’ పరిశీలనపై ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవితఖైదును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పీలుదారుకి విముక్తి కల్పించింది. ‘నాతండ్రి నిర్దోషి అని తేలడం మాకు ఆనందం. చాలా ఆలస్యమైనా మాకు న్యాయం జరిగింది’ అని ధనీరామ్ కుమారుడు లల్లూరామ్ భావోద్వేగంతో స్పందించాడు. -
లిట్వరల్డ్: కథబంధ ప్రహేళిక!
ఇరవై ఒకటో శతాబ్దిలో నోబెల్ పురస్కారాలు అందుకున్న పాతికమంది రచయితల్లో ప్రథముడు సర్ విదియాధర్ సూరజ్ పర్సాద్ నైపాల్. ఇక ఈ వరసలో ఇరవైఆరో రచయిత పేరు ఈ అక్టోబర్లో వెల్లడవుతుంది– అందాకా వేచిచూద్దాం! 1932లో కరీబియన్ దేశం ట్రినిడాడ్లో పుట్టి– పదిహేడోయేట బ్రిటన్ కు మెట్టి– 2018లో కన్నుమూసిన నైపాల్ను వ్యక్తిగా గానీ, రచయితగా గానీ ఓ చట్రంలో బిగించడం దాదాపు అసాధ్యం! ఐనా అలాంటి మెట్ట వడ్రంగానికి మనమెందుకు పూనుకోవాలి? నైపాల్ను మనవాళ్ళు ‘నోబెల్ పురస్కారం పొందిన రెండో భారతీయుడు’గా చెప్పుకుని జబ్బలు చరుచుకుంటూ ఉంటారు. కానీ సర్ విదియా తనను తాను భారతీయ రచయితగా ఎన్నడూ చెప్పుకోనూలేదు– గర్వించింది అసలే లేదు! నైపాల్ తనను ట్రినిడాడియన్–బ్రిటిష్ రచయితననే భావించుకున్నాడు, అలాగే సంభావించుకున్నాడు! అందుకాయన్ని తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు!!అంచేత, సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక భారతీయుడు రబీంద్రనాథ్ టాగోర్. ‘గీతాంజలి’ కావ్యానికి ఆయనకా బహుమతి 1913లో దక్కింది. 88 యేళ్ళ తర్వాత నైపాల్ రాసిన ‘ద ఎనిగ్మా ఆఫ్ అరైవల్’ అనే ఆత్మకథాత్మక నవలకు సైతం నోబెల్ పురస్కారం దక్కింది. సదరు పురస్కారం అందుకుంటూ, నైపాల్ చేసిన ప్రసంగానికి ఆయన ఇచ్చిన శీర్షిక ‘రెండు ప్రపంచాలు.’ అవి ప్రాచ్య– పాశ్చాత్య ప్రపంచాలు కావు. అమెరికన్– బ్రిటిష్ ప్రపంచాలు మాత్రమే!ట్రినిడాడ్ లోని ‘హిందువుల’ జీవన సరళి నైపాల్కు కొట్టిన పిండి. అందుకే ఆయన ‘కాల్పనిక’ సాహిత్యంలో ప్రముఖంగా ప్రతిఫలించేది అదే. ఐతే, 1961లో అచ్చయిన ‘ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్’తోనే నైపాల్కు నవలా రచయితగా చెప్పుకోదగిన గుర్తింపు దక్కింది. 1998 నాటి మోడర్న్ లైబ్రరీ ‘20వ శతాబ్దిలో వచ్చిన నూరు ఉత్తమ నవలల’ జాబితాలో ఈ నవలకు 72వ స్థానం దక్కింది. టైమ్ మ్యాగజీన్ రూపొందించిన ‘1928–2005 మధ్యకాలంలో ఇంగ్లిష్లో వచ్చిన నూరు ఉత్తమ నవలల’ జాబితాలో కూడా ఈ నవలకు చోటు దక్కింది. 1971లో ఆంద్రె డాయిష్చ్ ప్రచురణ సంస్థ వెలువరించిన ‘ఇన్ ఎ ఫ్రీ స్టేట్’ అనే నవల అదే యేడాది బుకర్ ప్రైజ్ గెల్చుకుంది. నిజానికిది మూడు గొలుసు కథల సంకలనం. ఈ శిల్పం మరీ అపూర్వమేమీ కాదు– బృహత్కథ, పంచతంత్రం, వెయ్యిన్నొక్క రాత్రులు, క్యాంటర్బరీ టేల్స్ నుంచి మన కాశీ మజిలీ కథల వరకూ అన్నీ ఇలాంటి గొలుసుకట్టు చట్రంలో బిగించిన కథలే! 1983లో నైపాల్కు ‘జెరూసలేం పురస్కారం’, 1990లో ట్రినిడాడ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం ‘ద ట్రినిటీ క్రాస్’ బహుమతి దక్కాయి. అదే సంవత్సరం బ్రిటిష్ రాజరికం ఈ ట్రినిడాడియన్– బ్రిటిష్ రచయితకు నైట్హుడ్ ప్రసాదించింది. ఈ బహుమతులన్నిటికీ తలమానికంగా, సర్ విదియాకు 2001లో నోబెల్ సాహిత్య పురస్కారమూ దక్కింది! అది కూడా ఓ నవలకే దక్కడం గమనార్హం. అర్ధశతాబ్దికి పైగా విస్తరించి వున్న తన సాహిత్య జీవితంలో నైపాల్ 11 నవలలు ఎందుకు రాశాడో ఈ నేపథ్యం వివరిస్తోంది!కాలుగాలిన పిల్లిలా ప్రపంచమంతా కలతిరిగిన నైపాల్ తొమ్మిది పది యాత్రా చరిత్రలు రాసివుండడంలో వింతేముంది? తన– తన కుటుంబ సభ్యుల పౌరసత్వ–వారసత్వాల గురించి ఆలోచించడానికే జీవితమంతా ఖర్చు పెట్టిన నైపాల్ తన పూర్వికుల పురిటిగడ్డ భారతదేశం గురించి మూడు పుస్తకాలు రాశాడు. ‘యాన్ ఏరియా ఆఫ్ డార్క్నెస్’, ‘ఇండియా–ఎ వూండెడ్ సివిలిజేషన్’, ‘ఇండియా– ఎ మిలియన్ మ్యూటినీస్ నౌ’ అనే ఈ పుస్తకాలు మూడూ నైపాల్ యాత్రా చరిత్రల్లో ముఖ్యమైనవి. వాటిని రాజకీయ– చారిత్రక యాత్రా చరిత్రలనవచ్చు. వాటిల్లో ఏ కోశాన్నా భారతదేశమన్నా, దాని చరిత్రన్నా ప్రేమాదరాలు వ్యక్తమైనట్టు నాకెక్కడా కనిపించలేదు!అయితే, ఈ వరసలోని మూడో పుస్తకంలో భారతదేశంలోని పీడిత తాడిత వర్గాల పట్ల ఒకింత సహానుభూతి వ్యక్తమైందని ‘నైపాల్ నిపుణులు’ కొందరు అంటారు.నైపాల్ పూర్వికులు ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్గా పిల్చుకునే ప్రాంతంలో తూర్పు భాగానికి చెందినవాళ్ళు. ఒకప్పుడు దాన్ని యునైటెడ్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు. అలా, అది అప్పుడూ యూపీయే, ఇప్పుడూ యూపీయే! ఆనాటి మరో బ్రిటిష్ వలస ట్రినిడాడ్–టొబాగోకు నైపాల్ పూర్వికులు వలస వెళ్ళారు. 1837–’38లో, యూపీ డెల్టా అనే ‘గంగా జమునా దోఅబ్’ ప్రాంతాల్లో ఘోరమైన కరువు వచ్చింది. దాని ధాటికి తట్టుకోలేక విదేశాలు పట్టిపోయిన వాళ్ళలో నైపాల్ పితామహుడు పండిత దూబే, మాతామహుడు పండిత కపిల్ దేవ్ కూడా వున్నారు. ఈ పండితులు ఇద్దరూ, గత్యంతరం లేక, ఇండెంచర్డ్ లేబర్ (ఇప్పటి వాడుక ప్రకారం కాంట్రాక్టు కూలీలు అనాలేమో!)గా మారవలసివచ్చింది. ట్రినిడాడ్ చెరుకు తోటల్లో కూలిపని చేసుకుంటూనే పిల్లల్ని చదివించుకున్నారు; వృత్తివ్యాపారాల్లో రాణించేలా తీర్చిదిద్దుకున్నారు. నైపాల్ పితామహుడి పేరు కూడా నాకెక్కడా తగల్లేదు కానీ, అతగాడు తన కుమారుడు ‘శీకుమార్ నైపాల్’ను ఇంగ్లిష్ జర్నలిస్టుగానూ, రచయితగానూ స్థిరపడే రీతిలో పెంచుకోగలిగాడు. ఇంగ్లిష్ సాహిత్యమన్నా, రచయితలన్నా అభిమానించే శీకుమార్ పెంపకంలో విదియాధర్ సూరజ్ పర్సాద్ నైపాల్ నోబెల్ లారియెట్ కావడంలో విడ్డూరమేముంది? ∙ _ - మందలపర్తి కిషోర్ -
తామస మనువు జననం
పూర్వం సురాష్ట్రుడు అనే రాజు ఉండేవాడు. వీరాధి వీరుడిగా విఖ్యాతి పొందిన సురాష్ట్రుడి సుపరిపాలనలో అతడి రాజ్యం సుభిక్షంగా ఉండేది. అతడి మంత్రి నరసింహ శర్మ. అమిత రాజభక్తి కలిగినవాడు. రాజుకు అన్ని వ్యవహారాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేవాడు.రాజుకు మరింత మేలు చేయాలనే తలంపుతో నరసింహ శర్మ సూర్యుడి కోసం తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన సూర్యుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. ‘సూర్య భగవంతుడా! మా మహారాజుకు అమితమైన ఆయుర్దాయాన్ని అనుగ్రహించు. అది చాలు నాకు’ అన్నాడు నరసింహ శర్మ. ‘తథాస్తు’ అని వరాన్ని అనుగ్రహించి, సూర్యుడు అదృశ్యుడయ్యాడు.వెంటనే మంత్రి నరసింహ శర్మ రాజు వద్దకు వెళ్లి, జరిగినదంతా చెప్పాడు.తన గురించి మంత్రి పొందిన వరం తెలుసుకున్న రాజు సురాష్ట్రుడు ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయసాగాడు.రాజుకు అమితాయుర్దాయం కలిగినా, అతడి భార్యలకు అంత ఆయుర్దాయం లేనందున, వారు ఒక్కొక్కరు గతించిపోయారు. భార్యలు ఒక్కొక్కరుగా గతించిపోవడంతో సురాష్ట్రుడికి విరక్తి కలిగింది. రాజ్యాన్ని మంత్రికి అప్పగించి, తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లిపోయాడు.అతడు తపస్సు చేసుకుంటూ ఉండగా, కొంతకాలానికి వర్షాకాలం వచ్చింది. ఒకసారి విపరీతమైన వర్షం కురిసింది. వరదనీటితో అడవి జలమయమైంది. సురాష్ట్రుడు ఆ వరదనీటిలో కొట్టుకుపోసాగాడు. అదే నీటిలో కొట్టుకు వస్తున్న ఒక లేడి అతడికి ఆధారంగా దొరికింది. లేడిని పట్టుకుని ఎలాగోలా సురాష్ట్రుడు కాసేపటికి ఒడ్డుకు చేరుకున్నాడు.ఒడ్డుకు చేరుకున్నాక సురాష్ట్రుడు కృతజ్ఞతతో ఆ లేడిని దువ్వుతూ, దాని మీద మోహంలో పడ్డాడు. లేడి మీద తనకు మోహం కలగడం అతడికి ఆశ్చర్యం అనిపించింది. ఇది మామూలు లేడి కాదనుకున్నాడు.‘ఓ హరిణమా! నువ్వెవరివి? నిన్ను తాకగానే నాకు నీ మీద మోహం మొదలైంది. దీనికి కారణమేంటి?’ అని అడిగాడు.‘మహారాజా! గతజన్మలో నేను దృఢధన్వుడు అనే రాజు కుమార్తెను. నీ గతించిన భార్యలలో నేను మొదటిదానిని. నా పేరు ఉత్పలమాల’ అని పలికింది. సురాష్ట్ర మహారాజు సంభ్రమాశ్చర్యాలు చెందాడు. ‘మరి నీకు ఈ లేడి జన్మ ఎందుకు కలిగింది?’ అని అడిగాడు.‘నేను దృఢధన్వుని కుమార్తెగా ఉన్నప్పుడు ఒకసారి చెలికత్తెలతో వనవిహారం చేస్తుంటే, ఒక ముని కుమారుడు ఎదురయ్యాడు. అతడు నన్ను మోహించి, వివాహం చేసుకోమని అడిగాడు. నేను క్షత్రియ కన్యను. నిన్ను వివాహమాడలేను. యోగ్యురాలైన బ్రాహ్మణ కన్యను చూసుకుని వివాహం చేసుకోమని అతడికి నచ్చజెప్పాను. అతడు కినుక వహించి, వచ్చే జన్మలో హరిణమవుతావని శపించాడు. శాప విముక్తి చెప్పవలసిందిగా ప్రార్థిస్తే, నీ పూర్వజన్మ భర్త అయిన రాజు ప్రవాహంలో కొట్టుకువస్తూ, నిన్ను ఆధారంగా పట్టుకుని ఒడ్డుకు వస్తాడు. అతడు నీ కంఠాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు నీకు పూర్వరూపం వస్తుంది అని చెప్పాడు. మహారాజా నా కంఠాన్ని ఆలింగనం చేసుకోండి’ అంది లేడి రూపులోనున్న ఉత్పలమాల. సురాష్ట్రుడు ఆ లేడి మెడను ఆలింగనం చేసుకున్నాడు. లేడికి పూర్వరూపం వచ్చింది. ఆమెను వెంటతీసుకుని, సురాష్ట్రుడు రాజధానికి చేరుకున్నాడు. మంత్రికి, పరివారానికి జరిగినదంతా చెప్పాడు. వారంతా సంతోషించారు.కొన్నాళ్లకు ఉత్పలమాల గర్భందాల్చింది. నెలలు నిండాక ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. సురాష్ట్ర మహారాజు పుత్రుడికి జాతకర్మ జరిపించి, తామసుడు అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా చూసుకోసాగాడు. ఇలా రోజులు సాగుతుండగా, ఒకనాడు ఆకాశవాణి ‘రాజా! నీ కుమారుడు తామసుడు మనువుగా ప్రఖ్యాతి పొందుతాడు’ అని పలికింది. తామసుడు సూర్యోపాసన చేసి, సకల విద్యలూ నేర్చుకున్నాడు. సమస్త భూమండలాన్నీ జయించి, పాలించాడు. అతడి పాలనాకాలం తామస మన్వంతరంగా ప్రసిద్ధి పొందింది.∙సాంఖ్యాయన -
భర్తను భయపెట్టి చంపే ప్లాన్.. చివరికి జైలుకెళ్లిన భార్య!
‘‘నన్నెవరో చంపడానికి వెంట పడుతున్నారు’’ అంటూ దివాకర్ అనే వ్యక్తి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. స్టేషన్లో వణుకుతూ కూర్చున్న దివాకర్ను చూసి ఇన్స్పెక్టర్ సూర్యకు మొదట జాలి కలిగింది. తాగడానికి నీళ్లు ఇచ్చి, ‘‘ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు’’ అన్నాడు.‘‘ఈ మధ్య నా మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి... సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కూడా ఒక వ్యక్తి నన్ను వెంబడించాడు’’ భయం భయంగా చెప్పాడు దివాకర్. వెంటనే ఇన్స్పెక్టర్ సూర్య – దివాకర్ ఆఫీస్ నుంచి వచ్చే దారిలో సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాడు. అందులో దివాకర్ ఒక్కడే పరిగెత్తుకుంటూ రావడం చూశాడు. అంత రాత్రివేళ ఒక్కడినే ఇంటికి బలవంతంగా పంపడం సేఫ్ కాదని ఇన్స్పెక్టర్ సూర్య స్వయంగా అతడిని ఇంటి దగ్గర దింపాడు. దివాకర్ భార్య అప్పటికే భర్త కోసం ఎదురు చూస్తోంది. ఇన్స్పెక్టర్ విషయం చెప్పాడు. దివాకర్ భార్య రవళి మౌనంగా లోపలికి వెళ్లి, కొన్ని కాగితాలు తెచ్చి ఇన్స్పెక్టర్కు ఇచ్చింది. అవి డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్...దివాకర్కి ‘పారనాయిడ్ స్కిజోఫ్రీనియా’ అనే సైకలాజికల్ డిజార్డర్ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అవి.ఇన్స్పెక్టర్ సూర్య– దివాకర్ వైపు జాలిగా చూసి ఒక నిట్టూర్పు విడిచి బయటకు వచ్చాడు.ఇన్స్పెక్టర్ బయటకు వస్తుంటే, దివాకర్ తనని కాపాడమని తనను ఎవరో చంపేస్తారని అరవడం గుర్తొచ్చింది. జీపులో స్టేషన్కు బయల్దేరిన సూర్య రెడ్ సిగ్నల్ దగ్గర ఆగిపోయాడు. అది దివాకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే రోడ్డు. కుడి వైపు పోలీస్ స్టేషన్కు వెళ్లే రోడ్డు వస్తుంది. సూర్యకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఆ సిగ్నల్ దగ్గర సీసీ కెమెరాలు బిగించి ఉన్నాయి. వెంటనే దివాకర్ ఇంటికి వెళ్లే రోడ్డుకు ఉన్న సీసీ ఫుటేజ్ చూశాడు. అందులో దివాకర్ను ఒక వ్యక్తి బైక్ మీద వెంబడిస్తున్నాడు. అప్పుడు దివాకర్ వెనక్కి వచ్చి పోలీస్ స్టేషన్ వైపు పరుగెత్తాడు.అతడిని బైక్ మీద వెంబడించిన వ్యక్తి అక్కడే ఆగిపోయాడు. అందుకే ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్కు వచ్చే రూట్లో సీసీ ఫుటేజ్లో అతను కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది సూర్యకు– తను దివాకర్ను ఇంటి దగ్గర దింపినప్పుడు దివాకర్ ఇంటికి దూరంలో ఉన్న బైక్... దివాకర్ను వెంబడించిన అదే బైక్...వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జీపు వెనక్కి తిప్పాడు. దివాకర్ ఇంటి వైపు...దివాకర్ అపరిచిత వ్యక్తి వైపు భయంగా చూస్తున్నాడు. ముఖానికి మాస్క్ వుంది. అతని చేతిలో చీర వుంది. ఈ చీరతో ఉరేసుకో... నిన్ను నేను చంపను... నువ్వే హాయిగా చచ్చిపోవచ్చు...దివాకర్ పారిపోవాలని చూస్తున్నాడు. ఎదురుగా ఉన్నది ప్రాణంగా ప్రేమించిన భార్య రవళి.‘‘చచ్చిపో దివాకర్... నిన్ను చంపి నేను జైలుకు వెళ్లడానికా ఇంత ప్లాన్ చేసింది. నువ్వు చచ్చిపోతే, పారనాయిడ్ స్కిజోఫ్రీనియాతో చచ్చిపోయావని నమ్మించొచ్చు. దానికి ఇన్స్పెక్టర్ కూడా సాక్ష్యం. రవళి నవ్వుతోంది వికృతంగా... అదంతా చూస్తున్న ఇన్స్పెక్టర్ సూర్య లోపలికి అడుగు పెట్టాడు.‘‘ఇప్పుడు సాక్ష్యంతోనే వచ్చాను మిసెస్ రవళి. నీ భర్తకు ఉన్న పారనాయిడ్ స్కిజోఫ్రీనియాను అడ్డం పెట్టుకుని నీ ప్రియుడితో నాటకం ఆడి నువ్వు చేసిన ప్లాన్ ఇప్పుడు నీకే బెడిసికొట్టింది. నీ భర్తను పోలీస్ స్టేషన్కు వెళ్లేలా భయపెట్టి సాక్ష్యాన్ని సృష్టించుకోవాలనుకున్నావు. కాని, ఇలా చట్టం చేతికి చిక్కావు. ఆస్తి కోసం, అక్రమ సంబంధం కోసం భర్తను వదిలించుకోవాలని వేసే ఇలాంటి క్రిమినల్ ప్లాన్స్ ఎప్పటికైనా పోలీసుల చేతికి చిక్కాల్సిందే!’’ అని రవళిని చూసి చెప్పాడు. ‘‘ఒక సీసీ ఫుటేజ్ నీ ప్రాణాన్ని కాపాడింది. నీ భార్య ప్రియుడితో కలిసి ఆడిన నాటకానికి చెక్ పెట్టింది’’ దివాకర్కు ధైర్యం చెబుతూ అన్నాడు. రవళిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఈ వారం కథ: ప్రాణదాత
‘‘లే నాయనా! మరేమీ భయం లేదు’’ అన్నారు శాస్త్రిగారు. రామచంద్ర వినయంగా లేచి నిలబడ్డాడు. జేబులోంచి ఓ కాగితం తీసి ఆయన చేతిలో పెట్టాడు. మడతవిప్పి చదువుతుండగానే, ఆ ఉత్తరంలో తన తండ్రి శాస్త్రిగారికి వ్రాసిన సందేశాన్ని క్లుప్తంగా వినిపించాడు.‘‘రుణాలు దారుణంగా ఉన్నాయి స్వామీ! తొందరలో తీర్చకపోతే ఇల్లు అప్పులవాళ్ల పరమైపోతుంది. నాకేమో శిల్పాలు చెక్కడం తప్ప మరే పనీ చేతకాదు. ఈ మధ్యన చేతినిండా పని దొరకడం లేదు. డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది. డబ్బుకోసం, పని కోసం పట్టకూడని వాళ్ల కాళ్లు కూడా పట్టాను. ఈ కష్టాలకు అంతూదరీ చిక్కడం లేదు. దీనికి పరిష్కారం మీరే చూపించగలరని మా నాన్న చెప్పాడు. అన్యథా శరణం నాస్తి’’ అంటూ మళ్లీ శాస్త్రిగారి కాళ్లమీద పడ్డాడు రామచంద్ర.‘‘ఇలా మాటిమాటికీ ఇబ్బంది పెట్టకు నాయనా! ఏదీ జాతకం కాగితాలు తెచ్చావా?’’ అని అడిగారు శాస్త్రిగారు అంతకుముందు అతడిచ్చిన కాగితాన్ని పక్కన పెడుతూ... మరో కాగితాల దొంతర తీసి ఆయనకు అందించాడు రామచంద్ర. శాస్త్రిగారు పరీక్ష చేస్తున్నారు. ద్వితీయాధిపతి దశ నడుస్తోంది. అష్టమ వ్యయాధిపతులు అంతర ప్రత్యంతర దశల్లో ఉన్నారు. గోచార రీత్యా క్రూరగ్రహమైన వ్యయాధిపతి ధన స్థానంలోకి చేరబోతున్నాడు. అన్నీ అపశకునాలే కనిపిస్తుండగా శాస్త్రిగారి మనస్సు కలవరపడింది. రామచంద్ర దీనంగా ముఖంపెట్టుకుని శాస్త్రిగారినే చూస్తున్నాడు. ఆయన ఒక్కక్షణం కళ్లుమూసుకుని తన ఉపాస్యదేవతను స్మరించారు. ఆయన భృకుటియందు ఒక దృశ్యం ఆవిష్కృతమైంది.మహాకాలసర్పం ఒకటి సూర్యుణ్ణి మింగబోతుండగా, ఒకానొక త్రిశూలం దాన్ని ఎత్తి గిరవాటేసింది. శివుని జటాజూటంలో జారిపడ్డ ఆ పాము గంగలో ఈదులాడుతోంది... ఈ దృశ్యాన్ని చూసిన తరువాత నెమ్మదిగా కళ్లు తెరిచారు శాస్త్రిగారు.ప్రసన్న వదనంతో చిరునవ్వు నవ్వుతూ, ‘‘నాయనా! నీకు తళుకేశ్వరం తెలుసా?’’ అని అడిగారు. ‘‘తెలియదండి.’’‘‘ఇప్పుడు దాన్నే తడికలపూడి అంటున్నారు. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే దారిలో ఉంది. అక్కడ గాంగేశ్వరస్వామి ఆలయం ఉంది. గంగాపుత్రుడైన భీష్మపితామహుడు ప్రతిష్ఠించిన శివలింగం...’’శాస్త్రిగారు చెబుతున్నారు. రామచంద్ర వింటున్నాడు.‘‘వచ్చే అమావాస్య... సోమవారం. సోమావతీ అమావాస్య అంటారు. పవిత్రమైన రోజు. ఆ రోజు ఉదయం ఆ స్వామికి శక్తివంచన లేకుండా అభిషేకం చేయించుకో.’’‘‘స్వామీ! నా ఆర్థిక పరిస్థితి చెప్పాను కదా’’ ఆదుర్దాగా మాటకడ్డం వచ్చాడు రామచంద్ర.‘‘మరేం పరవాలేదు. శక్తివంచన లేకుండా అంటే భక్తిలోపం లేకుండా మనసు తీరా చేయమని కానీ, డబ్బు ఖర్చుపెట్టమని కాదు.’’ వివరించారు శాస్త్రిగారు. ‘‘అలాగే స్వామీ!’’‘‘ఆనాటి ఉదయం అక్కడ అభిషేకం చెయ్యి. అక్కడి నుంచి తూర్పుకు ఐదుమైళ్ల దూరంలో కుడివైపున తోటల మధ్యలో అష్టభైరవ నిర్మితమైన శివాలయం ఉంటుంది. ఆ రాత్రికి నీవు ఆ ఆలయంలో జాగారం చేయాలి. జాగ్రత్త సుమా! అసలే నిర్జన ప్రదేశం. తగిన ఏర్పాట్లతో వెళ్లు. మెలకువతో రాత్రంతా ఉండి, తెల్లవారిన తరువాత నా వద్దకు నేరుగా రా’’ అంటూ కొంత డబ్బుతీసి రామచంద్ర ముందు పెట్టారు శాస్త్రిగారు.‘‘అయ్యో! నేనివ్వాల్సింది పోయి మీరే ఎదురిస్తున్నారా?’’ మొహమాట పడ్డాడు రామచంద్ర.‘‘ఇన్నేళ్లుగా నా మొగమైనా తెలీని నిన్ను, మీ నాన్న ఇప్పుడే నా దగ్గరకు పంపాడంటే దానికేదో కారణం ఉంటుందని గ్రహించు. ఈ డబ్బు మీ నాన్న ఇచ్చిందే అనుకో’’ లాలనగా చెప్పారు శాస్త్రిగారు.రామచంద్ర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. అది 1966వ సంవత్సరం, ఫాల్గుణమాసం. అమాసోమవారం తెల్లవారింది. ఆ వేళ ఉదయం ఎనిమిది కావస్తుండగా రామచంద్ర తడికలపూడికి చేరుకున్నాడు. ప్రధాన రహదారి నుంచి ఎడమ పక్క సందులోకి ప్రవేశించాడు. అల్లంత దూరాన వేంగీ చాళుక్యుల కాలంనాటి ఆలయ శిఖరం నీరెండ ఛాయలో మెరుస్తూ కనిపిస్తోంది. నడుచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. జనావాసాల మధ్యలోనే ఉన్న మల్లెతోటల నుంచి సువాసనలు దారంతా విరజిమ్ముతున్నాయి. జనాలంతా నీళ్లకావిళ్లతో ఎదురొస్తున్నారు. చెరువు దూరంగా ఉన్నట్లుంది. రామచంద్ర ఆలయాన్ని సమీపించాడు. ఆలయ ప్రాకారాన్ని చుట్టిరావడానికి వీలులేదు. రెండుపక్కల ఇళ్లు. అయిమూలగా దక్షిణదిక్కున ఒక రోడ్డుంది. గుడిలోకి ప్రవేశించాడు రామచంద్ర. తువ్వాలు చుట్టుకున్న ఆలయ పూజారి బలిపీఠం దగ్గర శుభ్రం చేసుకుంటున్నాడు. కుడివైపు బావి వుంది. ‘‘అయ్యా! ఆ బావిలో నీళ్లు స్నానానికి పనికొస్తాయా?’’ అడిగాడు రామచంద్ర.ఒక్కక్షణం అతణ్ణి పరకాయించి చూసి, ‘‘ఆ బావిలో నీళ్లు తోడటం నీవల్ల కాదు. స్నానానికైతే చెరువుంది’’ చెప్పాడు పూజారి.నిజమే. బావి చాలా లోతుగా ఉంది. నీళ్లు అట్టడుగున ఉన్నాయి.‘‘పేరుకి గాంగేశ్వర స్వామి వెలసిన క్షేత్రం. ఊళ్లో నీటిచుక్క ఉండదు. వేసవికాలం వస్తే ఉన్న ఒక్క చెరువూ ఎండిపోతుంది. జీవుడికి తాగునీటికి కరవు. గుళ్లో అయ్యవారి స్నానానికి కరవు’’ పూజారి తనలో తానే గొణుక్కుంటున్నాడు.రామచంద్ర ఎడమభుజం మీద సంచీని ఎగదోసుకుని ముందుకి కదిలాడు. ‘‘బాబూ! వచ్చేటప్పుడు ఆ కావిడితో నీళ్లు తెచ్చిపెట్టగలవా?’’ అడిగాడు పూజారి. ‘‘మహద్భాగ్యం’’ అంటూ కావిడిని కుడిభుజం మీదకు ఎత్తుకున్నాడు రామచంద్ర. చెరువులో స్నానం చేసి, నీళ్లు తీసుకుని వచ్చాడు. అప్పటికే అభిషేకం మొదలైనట్లుంది. పూజారితో గొంతు కలుపుతూ గాంగేశ్వరస్వామిని నమక చమకాలతో అర్చించాడు రామచంద్ర. అనంతరం కొంత దక్షిణ ఆయనకు సమర్పించాడు. ‘‘లేచిన వేళ బాగుంది’’ అనుకుంటూ దానిని అందుకున్నాడు పూజారి. ‘‘బాబూ! చాలాదూరం నుంచి వచ్చినట్లున్నావు’’ రామచంద్రని అడిగాడు ఆప్యాయంగా.‘‘అవునండీ. ఒక పని మీద వచ్చాను. ఈవేళ ఇక్కడే ఉంటాను’’ చెప్పాడు రామచంద్ర.‘‘అయితే ఈ పూటకి మా ఇంటిలో చేయి కడుక్కోవచ్చు’’ ఆదరంగా చెప్పాడు పూజారి.కృతజ్ఞతగా నమస్కరించాడు రామచంద్ర. భోజనం తరువాత, కాసేపు ఆలయ శిల్పాలను గమనిస్తూ గడిపాడు. కొద్దిసేపటికి దూరంగా ఆకాశంలో ఉరుముల సవ్వడులు వినిపించసాగాయి. ఎండ పూర్తిగా తగ్గలేదు కానీ వాతావరణం చల్లబడింది. శాస్త్రిగారు చెప్పిన గుర్తుల ప్రకారం ఆలయానికి తూర్పుముఖంగా సాగిపోయాడు రామచంద్ర. ఒక గంటన్నర వ్యవధిలో జీడిమామిడి తోటల మధ్యలో ఉన్న ఒక శిథిలాలయాన్ని కనుగొన్నాడు. మహా అయితే నాలుగడుగుల ఎత్తుంటుంది. అయిదడుగుల పొడవు, మూడడుగుల వెడల్పు ఉంటుంది. ఆ కాస్తచోటులోనే ఎనిమిదివైపులా భైరవశిల్పాలున్నాయి. ఆ శిల్పసౌందర్యం అమోఘంగా ఉంది. రామచంద్ర గుడిచుట్టూ పరికిస్తుండగా, తోట రైతు కాబోలు వచ్చాడు. ‘‘ఎవురు బాబూ! ఈయేళప్పుడు వచ్చారు? బేగ ఎల్లిపోండి. వాన పడేనాగుంది’’ అని సలహా ఇచ్చాడు. రామచంద్ర చిరునవ్వు నవ్వి, ‘‘లేదు. ఈరాత్రికి ఇక్కడే ఉండాలని వచ్చాను’’ అన్నాడు.రైతు అతడిని అయోమయంగా చూశాడు. ‘‘సూడు బాబూ! ఈడ రాత్రైతే మావే ఉండలేం. కట్టం. ఏడనుంచొస్తాయో... ఎందుకొస్తాయో తెలవదు గానీ, చీకటి పడగానే ఈడకి కుక్కలొస్తాయి. మనుషుల్ని చెండాడేస్తాయి. ఆటితో నువ్వు పడలేవు బాబూ! నా మాటిని ఎల్లిపో’’ బుజ్జగింపుగా చెప్పాడు.‘‘ఈ గుడిలో నిద్ర చేస్తానని మొక్కుకున్నాను. అంచేత ఈ రాత్రికి ఉండాల్సిందే’’ చెప్పాడు రామచంద్ర.‘‘ఈ గుడికి ఇట్టాంటి మొక్కులతో కూడా జనాలొత్తన్నారా? ఇడ్డూరంగా ఉందే. సరే బాబూ! జాగ్రత్త’’ అంటూ రైతు అక్కడినుంచి వెళ్లిపోయాడు.ఇంకా సంధ్యాసమయం కాలేదు. కానీ ఆకాశం మేఘావృతం కావడం వల్ల చీకట్లు కమ్ముకుంటున్నాయి. కనుచీకటి ఉండగానే రామచంద్ర గుళ్లో ప్రవేశించాడు. అడుగున్నర ఎత్తున్న ద్వారానికి తలుపులేమీ లేవు. వంగి పాక్కుంటూ లోపలికి వెళ్లి చూస్తే గుడికి మధ్యలో పానపట్ట రహితంగా నేలలో పాతేసినట్లుగా శివలింగం ఉంది.ఇంకు సీసా మూతకి కన్నంపెట్టి ఒత్తిని దూర్చి, లోపల కిరసనాయిల్ పోసి మూతపెడితే ఇల్లాయిబుడ్డి తయారవుతుంది. ఆ బుడ్డిలో కిరసనాయిల్ బదులుగా ఆవునెయ్యి పోసి తెచ్చాడు రామచంద్ర. దేవుడిముందు వెలిగించాడు. ఆ వెలుగులో రాత్రంతా అక్కడ కాలక్షేపం చెయ్యాలి. అందుకోసం కూడా తగిన ఏర్పాట్లు ముందే చేసుకున్నాడు. ఏవైనా బొమ్మలు గీసుకోవచ్చని కొన్ని కాయితాలు తెచ్చుకున్నాడు. ఆ గుడిని చూసేవరకు ఏం గీయాలో అనుకోలేదు. కానీ అక్కడికి వచ్చిన తరువాత, ఇదే గుడి అర ఎకరం నేలలో విశాలమైన గుడిగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించి, బొమ్మ గీయాలనిపించింది. ఆ పనే మొదలుపెట్టాడు. బయట ఉరుముల శబ్దం అంతకంతకూ ఎక్కువవుతోంది. సన్నగా చినుకు కూడా ప్రారంభమైనట్లుంది. ఇంతలో ఉన్నట్లుండి అక్కడికో కుక్క వచ్చింది. ఆ గూడులో రెండు జీవులు తలదాచుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆ కుక్క ముందరికాళ్లను బాగా ముందుకు జాపి, విశ్రాంతిగా ద్వారానికి అడ్డంగా కూచుంది.రామచంద్ర కొద్దిసేపు ఆ కుక్కని గమనించి, తన పనిలో మునిగిపోయాడు. ఆలయం బయటి దృశ్యాన్ని మొదటిబొమ్మగా గీయడం పూర్తయ్యేసరికి సుమారుగా మూడుగంటల సమయం పట్టింది. లోపలి ఆలయాన్ని గీయాలని రెండో బొమ్మ మొదలుపెట్టాడు.ఇంతలో వర్షం పూర్తిగా పెద్దదయింది. గాలి తాకిడి కూడా ఉద్ధృతంగా ఉంది. తానున్నది చిన్న గూడు కనుక గాలి లోపలికి పెద్దగా రావడం లేదు. అందువల్లనే దీపం నిలబడింది కానీ లేకపోతే కష్టమయ్యేది. మరో గంట గడిచింది. రామచంద్ర కూర్చుని ఉన్నచోట నేల చెమ్మతేరడం మొదలయ్యింది. వెంటనే పక్కన పెట్టిన సంచీని తీసి ఒళ్లో పెట్టుకున్నాడు. వర్షం ఇంకా పెద్దదయితే, నీళ్లు లోపలికి వచ్చేస్తాయి కాబోలు... అప్పుడెలా అని మథన పడసాగాడు.అతను ఊహించిందే నిజమైంది. రెండో బొమ్మ ఇంకా పూర్తి కాకుండానే గుళ్లోకి నీళ్లు రాసాగాయి. అప్పటికే రామచంద్ర కట్టుకున్న పంచె పూర్తిగా తడిసిపోయింది. గొంతుకు కూర్చుంటే చీలమండల వరకు నీళ్లు వచ్చేశాయి. ఇక అక్కడ ఉంటే క్షేమం కాదనిపించింది. లోపలినుంచి బయటికి వెళ్దామంటే కుక్క అడ్డంగా ఉంది. దానికి బయటికి పోవడం ఇష్టం లేదు కాబోలు, చేత్తో ముందుకు తోసినా కదలలేదు. కొద్దిసేపటికి రామచంద్రకు బయటకు వెళ్లడానికి తోవ ఇచ్చింది. అతడితోపాటు తాను కూడా బయటకు నడిచింది. యట అంతా గాఢాంధకారంగా ఉంది. నేలమీద పిక్కలవరకు నీళ్లున్నాయి. ‘ఇంతలోనే ఎంత వర్షం పడింది?’ అని ఆశ్చర్యపోతూనే, ఒక్క ఉదుటన ఆలయంపైకి ఎక్కి కూచున్నాడు. ఎలా ఎక్కిందో తెలియదు కానీ ఆ కుక్క కూడా ఆలయంపైకి చేరింది. అక్కడ కూచునేందుకు బాగుంది. ఎటొచ్చీ పైనుంచి కుండపోత వాన. చప్పగా తడిసిపోయాడు. కొద్దిగా ఒణుకు కూడా వస్తోంది. ఆకాశం చిల్లుపడినట్లుగా ఆ రాత్రంతా వాన పడుతూనే ఉంది. గాలి విసిరి కొడుతూనే ఉంది. మెరుపు వెలుగు పడినప్పుడల్లా నీటిమట్టం పెరుగుతున్నట్లుగా తెలుస్తూనే ఉంది. కొద్దిసేపటి తరువాత ఉన్నట్లుండి కుక్క మొరగడం ప్రారంభించింది. అది ఎందుకు మొరుగుతోందో ముందు అర్థం కాలేదు. అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో... గుడిపైకి ఒక నల్లత్రాచు వచ్చి పడగ విప్పి వుండడం రామచంద్ర కంటపడింది. గుండె గుభేలుమంది. ఆ త్రాచు కాటువేసేందుకు సన్నద్ధంగా ఉంది. రామచంద్రకి కిందికి దూకి తప్పించుకుపోయే అవకాశం లేదు. కుక్క కూడా అక్కడే ఉండి నిస్సహాయంగా చూస్తోంది. పామును నేర్పుగా పట్టుకుని విసిరేయగలిగితే బాగానే ఉంటుంది కానీ, ధైర్యం చాలలేదు. కొద్దిగా వెనక్కి జరిగాడు. వీపుకి భైరవశిల్పం తగిలింది. దాని చేతికి త్రిశూలం ఉందనే సంగతి స్ఫురణకు వచ్చింది. చేతులు రెండూ వెనక్కి పెట్టి ఆ త్రిశూలాన్ని ఊడబెరికాడు. త్రాచుపామును త్రిశూలంతో ఎత్తిపట్టి, దూరంగా విసిరేశాడు. అదికాస్తా నీళ్లలో పడి, ఎటో కొట్టుకుపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే తెల్లవారింది. కానీ గుడిమీద నుంచి కిందికి దిగే అవకాశం మాత్రం లేదు. నేలమట్టానికి నాలుగడుగుల ఎత్తులో ఉన్న ఆ ఆలయానికి దాదాపు సమానంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లలో కిందికి దిగితే తాను బయటపడగలనో లేదో తెలియని పరిస్థితి. ఎందుకైనా మంచిదని మరో భైరవశిల్పం చేతిలోని శూలాన్ని ఊడబెరికి పట్టుకున్నాడు.రాత్రి నుంచి తనతోపాటు ఉన్న కుక్క తప్ప మరో తోడు లేదు. ఇప్పట్లో ఎవరైనా వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. ఆ కుక్కకి పాపం ఆకలి వేస్తున్నట్టుంది. కానీ చేసేదిలేక దిక్కులు చూస్తూ కూచుండిపోయింది. ఆ పూట సూర్యుడు ఉదయించలేదు. మధ్యాహ్నం కావస్తుండగా వర్షం తగ్గుముఖం పట్టింది. రామచంద్రకు తాను కూచున్న ప్రదేశం నుంచి కిందికి దిగడానికి ధైర్యం చాలలేదు. అంతలోతు నీళ్లలో దిగి నడవడం కానీ, ఈదుకుంటూ వెళ్లడం కానీ మహాప్రమాదంగా తోచింది.ఇంతలో, ‘‘ఒహోయ్ పెద్దమడిసీ! మెల్లిగా దిగిరా’’ అని అల్లంత దూరంలో ఎత్తయిన గట్టుమీద నుంచి ఎవరిదో తోట రైతు అరుస్తున్నాడు.‘నువ్వే దగ్గరకు రా!’ అన్నట్లు సైగ చేశాడు రామచంద్ర. రైతు నవ్వుకుంటూ, ‘‘బయపడమాకు. అవకాడ సెరువుకి గండి కొడతన్నాం. ఓ గంటలో నీళ్లన్నీ తీసేస్తాయి. ఆనక వద్దువు గానిలే’’ అని చెప్పి వెళ్లిపోయాడు.రైతు చెప్పింది నిజమయ్యేందుకు సుమారుగా రెండుగంటల సమయం పట్టింది. సాయంత్రం నాలుగు కావస్తుండగా తోటలో నీళ్లు తగ్గి, బురదనేల బయటపడింది. రామచంద్రతో పాటు పక్కనే ఉన్న కుక్క కూడా నేలకు దిగింది. గబగబా అడుగులు వేస్తూ గట్టుమీదికి వెళ్లిపోయింది. రామచంద్ర భయంభయంగా అడుగులు వేస్తున్నాడు. చీలమండల వరకు బురద నిలిచి ఉంది కానీ, మరేమీ ప్రమాదం లేదు. ఒక్కోచోట కాలు దిగబడి పిక్కల వరకు బురద వస్తోంది. నిన్నరాత్రి నుంచి తన చేతిలోని శూలాన్ని అలాగే ఉంచుకున్నాడు. ఆ శూలాన్ని నేలలో గుచ్చుతూ, ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తరువాతే అడుగు వేస్తున్నాడు. పాతిక అడుగులు వేసేసరికి ఒకచోట శూలం బొరియలో దిగబడినట్లుగా లోపలికి పోయింది. కొద్దిగా పక్కకు జరిగి అదే చోట మళ్లీ నేలలో బలంగా గుచ్చాడు రామచంద్ర. సందేహం లేదు... అక్కడ రాళ్లున్నాయి. అందుకే శూలం కంగున మోగుతోంది.‘‘జాగర్తయ్యోవ్’’ అన్నాడు గట్టుమీదనుంచి రైతు. రామచంద్ర అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. శూలంతో చుట్టూ గీస్తూ ఏదో పరీక్షిస్తున్నాడు. చివరకు అతడు తాను గతరాత్రి ఊహించినది నిజమే అయినందుకు సంబరపడ్డాడు. ఈ ఆలయం కిందనే పూర్వం అతిపెద్ద ఆలయమేదో ఉండేది. అది శిథిలం కాగా, ఎవరో దానిపై చిన్న ఆలయాన్ని నిర్మింప చేశారు అనే నిర్ధారణకు వచ్చాడు. ఆ లోపలి ఆలయం ఇప్పుడు ఉండి ఉంటే ఎలా ఉండేదన్న ఊహతో రాత్రి తాను గీసిన నమూనా కాయితాలన్నీ వానలో నానిపోయి, ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రామచంద్రకు మనసులో కష్టం వేసింది. కానీ ఇప్పుడు స్థిమిత పడ్డాడు. గట్టుకు వస్తూనే, ‘‘చూడు బాబూ! ఈ ప్రాంతంలో ఇదివరకు ఏదైనా పెద్దగుడి ఉండేదా?’’ అడిగాడు రైతుని రామచంద్ర.‘‘అదేమో తెలవదు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి అదే గుడి’’ చెప్పాడు రైతు.‘‘కాదు. నాకు అర్థమైనంత వరకు ఇక్కడ ఓ పెద్ద గుడి ఉండేది. ఉండేది ఏమిటి ఉంది. నేను చూశాను. నువ్వొప్పుకుంటే నేను దాన్ని వెలికి తీస్తాను’’ ఉత్సాహంగా చెప్పాడు రామచంద్ర.‘‘సూడయ్యా! మమ్మల్నిలా బతకనియ్యి. ఈ తోటంతా మాదే అయినా ఆ గుడి వున్నంతమేరా సెట్టు పెట్టకుండా వదిలేసి మా పొట్ట మేం పోషించుకుంటున్నాం. ఇప్పుడు గుడీ అదీ అంటూ అల్లరి మొదలెట్టావంటే... గవర్నమెంటోళ్లతో, బత్తులతో నానా తలనొప్పులూ పడాల్సొస్తుంది. ఆనక మా తోట ఏటవుద్దో నువ్వు గేరంటీ సెప్పగలవా?! అంచేత సూసిందంతా మర్సిపో. దీనికింద పెద్దగుడి వుందని నాకూ తెలుసు. కానీ చెప్పాను కదా, ఇక్కడ పలుగు పడితే భైరవసామి ఊరుకోడు. కుక్కలొచ్చి కండలు పీకేస్తాయి. ఇగ తొవ్వడం మొదలెడితే ఇంకేం వత్తాయో సెప్పలేం. వచ్చిన పని పూర్తయింది కాబట్టి, జాయిగా ఇల్లు జేరుకో’’ అని చెప్పేసి వెళ్లిపోయాడు రైతు.రామచంద్ర అక్కడినుంచి మళ్లీ తడికలపూడి గాంగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాడు. స్వామికి నమస్కరించి బయలుదేరాడు. ఆ రాత్రికి రాత్రి నడుచుకుంటూ వెళ్లి తెల్లవారేసరికి శాస్త్రిగారి ఇంటిముందు నిలబడ్డాడు.‘‘నిన్నంతా ఏమైపోయావు? తుపానులో చిక్కుకుపోయావేమో అని కంగారు పడ్డాను’’ అడిగారు శాస్త్రిగారు అతడిని చూస్తూనే.‘‘నిజమేనండీ. మీ ఆశీస్సులు ఉండబట్టి బతికిపోయాను. లేకపోతే ఈపాటికి చనిపోయే వాడిని’’ అంటూ ముందురోజు రాత్రి తనకు ఎదురైన అనుభవాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు రామచంద్ర.‘‘హమ్మయ్య. గండం గడిచింది. ఇంక నీకేమీ భయం లేదు. నీ వృత్తిలో కూడా పైకొస్తావు. ఇదిగో ఈ ఉత్తరం తీసుకో. హైదరాబాదులో ఉన్న మా స్నేహితుడికి నీ గురించి రాశాను. అక్కడేదో గుడి కడుతున్నారట. నీకేదైనా పని దొరకచ్చు. కానీ రాతి శిల్పాలే చెక్కుతా... సిమెంటు తాపీ పట్టుకోను అంటూ పిచ్చి సిద్ధాంతాలు వల్లెవేయకు. దొరికిన పనిలో దూరిపో. రోజులు బాగుపడితే మనసుకు నచ్చిన పని దొరకచ్చు’’ అని బోధించారు శాస్త్రిగారు.ఆయనకు మరోసారి నమస్కరించి వచ్చేశాడు రామచంద్ర. ...ఇదంతా నా కథ. ఇందులోని రామచంద్రను నేనే. ఆనాడు శాస్త్రిగారి వద్దనుంచి వచ్చిన తరువాత ఎంతో జీవితాన్ని చవిచూశాను. ఎన్నెన్నో అనుభవాలను పొందాను. నాకొచ్చిన కళను నా పిల్లలకు నేర్పించాను. కానీ వారికి రాతిశిల్పాలతో పనిచేసే అవకాశం రాలేదు. ఇప్పుడు నా మనుమళ్లు రాతిశిల్పాలను కంప్యూటర్ల సాయంతో చెక్కుతున్నారని తెలిసి ఆనందంగా ఉంది. స్థాపత్య కళలో వారు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మళ్లీ మన ఆలయాలకు పూర్వవైభవం వస్తోంది కదా అని చాలా సంతోషంగా ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ప్రాణదానం చేసిన ఆ అష్టభైరవ నిర్మిత ఆలయాన్ని మరిచిపోలేదు నేను. ఇప్పటివరకు ఆ ఆలయాన్ని మూడుసార్లు సందర్శించాను. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ ఏవేవో కొత్త అనుభూతులు కలిగేవి. ప్రతిసారీ ఆ రైతును కలిసేవాడిని. పెద్దగుడిని బయటికి తీయడానికి కానీ, తోటను అమ్మడానికి కానీ అతడెప్పుడూ ఒప్పుకోలేదు. ఇప్పుడు నాకు వయసు మీరింది. బహుశా ఈపాటికి ఆ తోట రైతు మనవళ్ల పరమై ఉంటుంది. వాళ్లయినా అక్కడ తవ్వకాలకు ఒప్పుకుంటారని నేను అనుకోవడం లేదు. ఇటీవలే గాంగేశ్వర స్వామి ఆలయానికి పునరుద్ధరణ జరిగిందని తెలిసి సంతోషించాను. ఇక ఆ గుడి కూడా జీర్ణోద్ధరణ పొందితే... అది కూడా నా వంశం వారివల్ల జరిగితే నాకు కావాల్సింది అంతకంటే ఏమీ లేదు.ఇట్లురామచంద్ర అని రాసివున్న డైరీని మూడోసారి చదివి, మూసి పక్కన పెట్టాడు కిషోర్. తన తాతయ్య ప్రాణం కాపాడిన ఆ మందిరాన్ని ఒక్కసారి చూసి రావాలనిపించింది అతనికి.నేల నాలుగుచెరగులా ఎక్కడ తడిమి చూసినా శిథిలాల కింద చరిత్ర మూలుగుతూ ఉంటుంది. కొన్నింటికి మహర్దశ పడుతుంది. బయటికి వస్తాయి. రాజ్యమేలతాయి. మరికొన్నింటి భవిష్యత్తు కాలాలమీద కానీ తేలదు. ఏ స్వార్థమూ లేకుండా ఒకనాటి జ్ఞాపకాలను తవ్వితీసి మళ్లీ అందరిముందు ఠీవిగా నిలబెట్టాలని తపించేవారు నూటికో కోటికో ఒక్కరుంటారు. కొన్నిసార్లు వాళ్లు తమ ప్రయత్నంలో విజయం సాధిస్తారు కూడా. -
కథాకళి: ఫటాఫట్
అతని శ్రావ్యమైన కంఠం, మెత్తని నడవడిక అతనిలోని దుర్మార్గానికి తెరలని ఆమె ఆలస్యంగా తెలుసుకుంది.ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుజీవ్ ఆమెని ఇంటర్వ్యూ చేశాడు. ఆమె అందం అతన్ని ఆకర్షించింది. పౌడర్ తప్ప మరే మేకప్ లేని, కనుబొమలని కట్ చేసుకుని దిద్దుకోని ఆమె సహజమైన అందం, ఆమె చురుకుదనం అతన్ని ఆకర్షించాయి.సుజీవ్ తండ్రి ఉద్యోగరీత్యా తూర్పు గోదావరి జిల్లాకి పోలీస్ సూపరింటెండెంట్. ఆయన అన్యాయార్జితంతో తన పేర స్థాపించిన ఫైనా¯Œ ్స కంపెనీని సుజీవ్ మేనేజ్ చేస్తున్నాడు. హైద్రాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఇరవై ఆరు అంతస్తుల భవంతిలో, టాప్ ఫ్లోర్లో ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణం గల అపార్ట్మెంట్లో సుజీవ్ ఒంటరిగా ఉంటాడు. అది సుజీవ్ తండ్రి అక్రమసంపాదనతో తన భార్య పేర కొన్న ఆస్తి.ఓరోజు ఆఫీస్లో లంచ్ చేస్తూ సుజీవ్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించి తెలుసుకున్నాడు. ‘‘నా భార్యకి పబ్ కల్చర్ అంటే ఇష్టం. వద్దన్నానని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి బతిమాలి తెస్తానని ఎదురుచూసింది. కాని విడాకులు తీసుకుంటానని ఆమె ఊహించలేదు. నువ్వు అన్నీ ఫటాఫట్ చేసేస్తూంటావు. మన వ్యాపారానికి అది ముఖ్యం. నీకు అభ్యంతరం లేకపోతే మన పెళ్ళి గురించి మీ పెద్దలతో మాట్లాడతాను.’’ఆమె దిమ్మెరపోయింది. తను ఎక్కడ? అతను ఎక్కడ? ఆమె గాల్లో తేలుతూ ఇంటికి వెళ్ళింది. వారం తర్వాత ఆమె అర్జెంట్ కాగితాల మీద సంతకాలు తీసుకోడానికి అతని అపార్ట్మెంట్కి వచ్చింది. అతను చొరవ తీసుకుంటే ఆమె సిగ్గుగా అభ్యంతరం చెప్పింది తప్ప ఎదురు తిరగలేదు.మూడు వారాల తర్వాత ఓరోజు ఆమెకి సుజీవ్ నించి ‘నువ్వు అర్జెంట్గా నా ఇంటికి వస్తావా?’ అనే మెసేజ్ వచ్చింది. ‘మా నాన్నగారికి వడదెబ్బ కొట్టి ఇప్పుడే తేరుకుంటున్నారు. అందుకే సెలవు పెట్టాను సర్. ఆయన్ని చూసుకోవాలి’ సమాధానం పంపింది.‘‘పర్సనల్గా మాట్లాడాలి. ఓ అరగంట వచ్చి వెళ్ళలేవా?’’ ఫోన్ చేసి అడిగాడు.‘‘సరే సర్.’’ అతని కంఠంలోని అభ్యర్థనని గుర్తించి చెప్పింది.‘‘జాగ్రత్తమ్మా. నగరంలో హీట్ వేవ్తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని టీవీలో చూపిస్తున్నారు.’’ తల్లి హెచ్చరించింది. ఆమెని చూడగానే సుజీవ్ చెప్పాడు.‘‘మా నాన్నగారు చిక్కుల్లో పడ్డారు. బయటపడటానికి ఒకరిని మంచి చేసుకోవాలి. లేదా ఆయన ఉద్యోగం ఊడొచ్చు.’’‘‘అయ్యో.’’‘‘అందుకు నువ్వో మనిషిని సంతోషపెట్టాలి.’’‘‘నాకు అర్థం కాలేదు సర్.’’ అయోమయంగా చూస్తూ చెప్పింది.‘‘అర్థం కాకపోడానికి ఏంలేదు. నన్ను సంతోషపెట్టినట్లే. అతన్ని వచ్చే బుధవారం మన ఆఫీస్ గెస్ట్ హౌస్లో కలుసుకోవచ్చు.’’ఆమె తను విన్నది నమ్మలేకపోయింది. తనని పెళ్ళి చేసుకుంటానని అడిగిన ఇతనేనా ఈ మాట అన్నది? అతను తనని పెళ్ళి చేసుకోడని ఆమెకి వెంటనే తట్టింది. ఆమె దుఃఖం కోపంగా మారడంతో కంఠం పెంచి చెప్పింది.‘‘సారీ! నేను అలాంటిదాన్ని కాదు. నేను ఇప్పుడే రాజీనామా చేస్తున్నాను.’’‘‘నీకా అవకాశం లేదు. ఆ ఏíసీబీ డైరెక్టర్ని నువ్వు తృప్తి పరచాలి.’’అతను లేప్టాప్లో వాళ్ళిద్దరి రతికేళి వీడియోని ప్లే చేసాడు.‘‘ఏమిటిది? ఏమిటీ మోసం?’’ ఆమె మరోసారి నిర్ఘాంతపోతూ గట్టిగా అరిచింది.‘‘దీన్ని మీ తల్లిదండ్రులు చూడకూడదనుకుంటే, బుధవారం ఎక్కడ పికప్ చేయటం నీకు సౌకర్యమో చెప్పు.’’తను బ్లాక్మెయిల్లో చిక్కుకుందని ఆమెకి అర్థమైంది. ఆమె కన్నీళ్ళు ఆపుకుంటూ లేచి మెట్లెక్కి టెర్రేస్లోకి వెళ్ళింది.ఆమె ఏకాంతంగా ఏడవడం కోసం పైకెళ్ళిందని సుజీవ్కి అర్థమైంది. పది నిమిషాలు గడిచినా ఆమె రాకపోవడంతో అతను టెర్రేస్లోకి వెళ్ళాడు. తలుపు వెనక పొంచి ఉన్న ఆమె చటుక్కున మెట్లమీదకి వెళ్ళి టెర్రేస్ తలుపు మూసి గడియ పెట్టింది.‘‘తలుపు తీయి. ఏమిటిది?’’ సుజీవ్ తలుపు బాదుతూ అరిచాడు.తలుపు తెరచుకోలేదు. పావుగంట తర్వాత ఇక ఆమె తలుపు తెరవదని బోధపడింది. పిట్టగోడ మీంచి దూకడానికి వీలులేకుండా లోపలివైపు ఆరడుగుల ఎత్తున గ్లాస్ వాల్ ఉండటంతో, అతను కింద రోడ్ మీద వారిని సహాయం కోరే అవకాశం లేకపోయింది. ఎక్కడా నీడ కనిపించలేదు. ఎండకి చెమటతో అతని షార్ట్స్, టీషర్ట్ తడిసిపోయాయి. టీషర్ట్ విప్పి తల మీద కప్పుకున్నాడు. అతని ఒంట్లోని నీరు చెమట రూపంలో కారిపోతూ దాహంతో నాలుక పిడచకట్టుకు పోయింది. లేప్టాప్లోని తమ వీడియోని డిలీట్ చేశాక, టీవీ చూస్తూ కాలక్షేపం చేసిన ఆమె సూర్యాస్తమయ సమయంలో పైకెళ్ళి టెర్రేస్ తలుపు తెరిచింది. ఆమె ఆశించినట్లుగా నేల మీద మగతగా పడున్న సుజీవ్కి వడదెబ్బ కొట్టింది. చక్కెర, ఉప్పు నీళ్ళు తాగించి, సెలైన్ ఎక్కిస్తే అతను జీవిస్తాడని ఆమెకి తెలుసు. అతన్ని కిందకి మోసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టింది. అతను ఏం జరుగుతోందో కూడా అర్థం కానంత అపస్మారకంలో ఉన్నాడు. ఆమెని వంచించడానికి సుజీవ్ ఏ మంచాన్ని ఆయుధంగా చేసుకున్నాడో ఆ మంచం మీదే ఆ రాత్రి ఆమె ఫటాఫట్ నిర్ణయంతో ప్రాణం వదిలాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఇవ్వాల్సింది ధైర్యమే!
భవిష్యత్తులో పిల్లలు ఇబ్బందులు పడకూడదని, అందుకు ఆస్తులు సంపాదించి పెట్టాలని చాలావరకు తల్లిదండ్రులు అనుకుంటుంటారు. ‘కానీ, పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, ధైర్యమే!’ అంటారు నీలిమ. కోర్టు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన శ్రీదేవి అప్పల్ల నీలిమ కూతురు.సింగిల్ పేరెంట్గా ఇద్దరు కూతుళ్ల పెంపకంలో తను తీసుకున్న జాగ్రత్తలు, జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమించిన విధానాలను ఇలా మన ముందుంచారు..‘‘నేను రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేదాన్ని. చాలా పనుల్లో ఆడ మగ అనే తేడా చూపుతారు. నేను చిన్నప్పటి నుంచి అలా చూసేదాన్నికాదు. అందుకే, ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇద్దరు అమ్మాయిలను పెంచాను. మాది కాకినాడ. మాకు కొద్దిపాటి ఆస్తి ఉంటే, దాన్ని అమ్మి, తిరిగి మరో ఆస్తి కొని, అమ్మి... అలా వచ్చిన డబ్బులతో పిల్లలిద్దరినీ సాకాను. నా పిల్లలు కూడా నాలాగా ధైర్యంగా ఉండాలనుకుంటాను. నా పెద్ద కూతురు దివ్యజ్యోతి బీఎస్సీ పూర్తయ్యాక, జాబ్ చేస్తుంది. చిన్నమ్మాయి శ్రీదేవి సినిమాలలో తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. సినిమా స్టార్ కావాలనుకున్నాను...మా అక్క తమిళ, మలయాళ సినిమాలలో నటించేది. ఆ సమయంలో నేను నాకు కూతురు పుడితే, సినిమాల్లోకి తీసుకురావాలని ఆ రోజుల్లోనే అనుకునేదాన్ని. కానీ, ఆ విషయాన్ని కాలక్రమంలో మర్చిపోయాను. ఆ తర్వాత మా అక్క సినిమాలు మానేసి, కుటుంబ వాతావరణంలోకి వచ్చేసింది. నాకూ కుటుంబ పరిస్థితుల వల్ల చిన్న వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు కూతుళ్లు పుట్టాక, ఒంటరిగా జీవితాన్ని మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దివ్యకు బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలని ఉండేది. శ్రీదేవికి టీచర్ అవ్వాలని ఉండేది. ఇద్దరినీ చదువుకోమనే ప్రోత్సహించాను. అయితే, ఇంట్లో శ్రీదేవి టీచర్లా యాక్ట్ చేస్తుండేది. అది చూసి, ఈ అమ్మాయి చేత రీల్స్ చేయిస్తే బాగుంటుందనుకున్నాను. తను స్కూల్ నుంచి రాగానే ఓ గంట రెస్ట్ ఇచ్చి, గ్రీనరీ ప్లేస్ల్లోకి తీసుకెళ్లి రీల్స్ చేసేవాళ్లం. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో శ్రీదేవికి మంచి పేరు రావడంతో పాటు, సినిమా అవకాశాలూ వచ్చాయి. మంచి – చెడు చూసే విధానంలోనే..!ఒకప్పటి రోజులకు ఇప్పటి రోజులకు అన్ని చోట్లా చాలా మార్పులు వచ్చాయి. అవకాశాలూ పెరిగాయి. అమ్మాయిలు ఒంటరిగానే ప్రతి సమస్యను సాల్వ్ చేసుకుంటున్నారు. ‘ఎవరినో తప్పు పట్టడం కాదు, మనం మన జాగ్రత్తలో ఉండాలి’ అని చెబుతుంటాను. దానిని శ్రీదేవి కూడా బాగా అర్థం చేసుకుంటుంది. ఏ పని చేసినా డబ్బు సంపాదించడానికే. కానీ, చదువు మాత్రం ఉండాలి. శ్రీదేవి జూనియర్ ఇంటర్ పూర్తి చేసింది. పై చదువుల కోసం డిస్టెన్స్లో ప్లాన్ చేస్తున్నాం. నేను చెప్పేవి ఇద్దరూ బాగా వింటారు. వారేం అనుకున్నారో అవి కూడా స్పష్టంగా చెబుతారు. వాటిలో మంచి చెడులు చెబుతాను. సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కలిసే టూర్లు..బయటి స్నేహాలను ఎంకరేజ్ చేయడం లేదు. ఫ్రెండ్స్తో టూర్స్కి వెళ్లచ్చు కదా అంటారు. కానీ, ‘నో’ అనే చెబుతాను. నాకూ ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి మేం ముగ్గురం కలిసి టూర్స్కి వెళుతుంటాం. దివ్యకు సినిమా డైరెక్షన్ అంటే ఇష్టం అని చెబుతుంటుంది. కానీ, చదువుకు న్యాయం చేసే జాబ్ కొన్నాళ్లు తప్పక చేయమని చెబుతాను. శ్రీదేవికి సావిత్రి, సౌందర్యలాగా పేరు తెచ్చుకోవాలని కోరిక. వారిలాగే ట్రెడిషనల్గా ఉండటం, అలాంటి పాత్రలతో మెప్పించడం ఇష్టం. నేను కూడా అలాంటి ఇష్టాలను ఎంకరేజ్ చేస్తుంటాను. నాటి నటీనటుల సినిమాలు కలిసి చూస్తాం.కష్టం విలువ తెలుసుకున్నారు.. సింగిల్ పేరెంట్గా పిల్లల పెంపకంలో కష్టపడ్డాను అని చెప్పలేను. ఎందుకంటే, నా కష్టాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు. నా మాట విన్నారు. నా వరకు చూసుకుంటే తండ్రి ఉంటేనే పిల్లల్ని బాగా పెంచగలుగుతారు అనుకోవడం తప్పు అనిపిస్తుంది. నా భర్త సపోర్ట్ లేకపోయినా పిల్లల్ని పెంచాను. అయితే, పిల్లలిద్దరూ నా మాట విన్నారు కాబట్టి వారి పెంపకం సులువై ఉంటుంది. అందరి పిల్లలు అలా వినాలని ఏమీ లేదు. నేను ఏదైనా విషయంలో బాధపడితే పిల్లలిద్దరికీ విషయం వెంటనే అర్థమైపోతుంది. వాళ్లు అర్థం చేసుకుని, నన్ను కష్టపెట్టకూడదని సెట్ అయిపోతారు. సాయం చేసే గుణం..నేను ఒక్కదాన్నే పిల్లల్ని కష్టపడి పెంచుకుంటున్నప్పుడు ఎవరూ సాయం చేయలేదు. కానీ, పిల్లలకు ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చి, డబ్బు సంపాదిస్తున్నారని.. కొందరు దగ్గరవుతుంటారు. అలాంటప్పుడు పిల్లలు వాళ్లను దూరం పెట్టమని చెప్పరు. ‘కష్టంలో ఉన్నారు కదా! హెల్ప్ చేయమ్మా!’ అని నాకే చెబుతారు. ఎదుటివారికి సాయపడే గుణం ఇద్దరికి వచ్చిందని సంతోషిస్తాను.. ‘మీకు భవిష్యత్తులో పెళ్లిళ్లు అయ్యి, మీ కుటుంబాలు మీకు ఉన్నా.. నేను నాలాగే, మీకు తల్లిలా, ఓ స్నేహితురాలిగా ఉంటాను’ అని చెబుతాను. ‘నువ్వు కోల్పోయిందంతా మేం తిరిగి తీసుకొస్తాం అమ్మా!’ అని పిల్లలు అంటుంటారు. వాళ్లు జీవితంలో మంచిగా స్థిరపడితే అంతే చాలు అనుకుంటాను. నేను, నా ఇద్దరు కూతుళ్లు ఫ్రెండ్స్లా ఉంటాం. మా ఇద్దరి కూతుళ్లతో పాటు మైకి అని ఓ పెట్ ఉంది. అది కూడా మా కుటుంబంలో ఓ సభ్యురాలే. నలుగురం ఒకదగ్గర ఉంటే మా సందడి అంతా ఇంతా కాదు. మా ఆనందం ఇలా మాతో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను’’ అని వివరించారు తల్లిగా నీలిమ.∙నిర్మలారెడ్డి -
బిడ్డ బాగానే ఉందా?
నాకు 26 సంవత్సరాలు. మా పెళ్లై ఆరు నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పుడు నాకు రెండు నెలల గర్భం ఉంది. ఇది నా మొదటి గర్భధారణ. ఎలాంటి ఆరోగ్య సమస్యలు నాకు గతంలో లేవు. కాని, నా కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉందా, ఎదుగుదల సరిగ్గా జరుగుతుందా అని కొంచెం ఆందోళనగా ఉంది. ఇలాంటి సమయంలో ఏయే పరీక్షలు చేయించుకోవాలి? – స్వప్న, తిరుపతి.ఒక ప్రైమీ పేషెంట్, అంటే మొదటిసారి గర్భం దాల్చిన మహిళ, మీకు మొదటగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత సాధారణంగా ఐదు నుంచి ఆరు వారాల సమయంలో ఒక స్కాన్ చేస్తాము. ఈ స్కాన్ ద్వారా గర్భసంచిలో జెస్టేషనల్ సాక్ సరైన స్థానంలో ఉందా లేదా అన్నది చెక్ చేస్తాము. అంటే గర్భం గర్భసంచిలోనే సరిగ్గా ఉందా లేదా అన్నది నిర్ధారించుకుంటాము. దాని తర్వాత సుమారు ఏడు నుంచి ఎనిమిది వారాల సమయంలో మళ్లీ ఒకసారి స్కాన్ చేస్తాము. దీనిని వయబిలిటీ స్కాన్ అంటారు. ఇందులో బిడ్డ హార్ట్బీట్ సరిగ్గా ఉందా, ఎదుగుదల ఎలా జరుగుతోంది అన్నది చెక్ చేస్తాము. హార్ట్బీట్, ఎదుగుదల సరిగ్గా ఉంటే తగిన ఫోలిక్ యాసిడ్ వంటి మందులు ఇచ్చి గర్భధారణను కొనసాగిస్తాము. తర్వాత 11 నుంచి 14 వారాల మధ్య, అంటే దాదాపు మూడు నెలల సమయంలో ఒక ప్రత్యేక స్కాన్, రక్తపరీక్ష చేస్తాము. దీనిని మొదటి త్రైమాసిక స్క్రీనింగ్ అంటారు. ఇందులో బిడ్డలో ముఖ్యమైన అవయవాల నిర్మాణం ఎలా ఉందో స్కాన్ ద్వారా పరిశీలించి, రక్తపరీక్ష ఫలితాలతో కలిపి కొన్ని జన్యు సమస్యల ప్రమాదం ఎంత ఉందో అంచనా వేస్తాము. ఉదాహరణకు డౌన్ సిండ్రోమ్ వంటి సాధారణ జన్యు సమస్యల రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల్లో రిస్క్ తక్కువగా ఉంటే గర్భధారణను సాధారణంగా కొనసాగిస్తాము. తర్వాత ఐదో నెలలో ఒక ముఖ్యమైన స్కాన్ చేస్తాము. దీనిని టిఫా స్కాన్ అంటారు. ఇందులో బిడ్డ అన్ని అవయవాలు సరిగ్గా ఏర్పడ్డాయా లేదా అన్నది పూర్తిగా పరిశీలిస్తాము. టిఫా స్కాన్ లో కూడా ఎలాంటి సమస్యలు కనిపించకపోతే ఎక్కువగా ఇది ఆరోగ్యకరమైన గర్భధారణగా భావిస్తాము. కానీ మొదటి త్రైమాసిక పరీక్షల్లో రిస్క్ కొంచెం ఎక్కువగా లేదా మధ్యస్థంగా కనిపిస్తే, తదుపరి కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు మరింత కచ్చితమైన రక్తపరీక్షలు లేదా అవసరమైతే ఉమ్మనీరు పరీక్ష చేసి బిడ్డలో జన్యు సమస్యలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవచ్చు. అలాగే టిఫా స్కాన్ లో ఏదైనా మార్పులు కనిపిస్తే, ఉదాహరణకు మెదడు లేదా గుండె అభివృద్ధిలో ఏదైనా తేడా ఉంటే, దానికి అనుగుణంగా ప్రత్యేక పరీక్షలు చేయవచ్చు. ఉదాహరణకు బిడ్డ గుండె పనితీరును తెలుసుకోవడానికి ప్రత్యేక హార్ట్ స్కాన్ లేదా మెదడు అభివృద్ధిని చూడటానికి మరింత వివరమైన స్కాన్ చేయవచ్చు. ఇంకా కుటుంబంలో ఎవరికైనా జన్యు సమస్యలు ఉన్నాయా లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహం జరిగిందా అన్నది కూడా తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా రిస్క్ ఎంత ఉందో అంచనా వేసి, అవసరమైన పరీక్షలు చేయవచ్చు. సాధారణంగా ఈ అన్ని పరీక్షలు క్రమంగా చేయించుకుంటూ వెళ్తే గర్భధారణ సురక్షితంగా కొనసాగుతుందా లేదా అన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు. అన్ని పరీక్షలు సాధారణంగా ఉంటే ఎక్కువగా గర్భధారణ ఆరోగ్యకరంగానే కొనసాగుతుంది. డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ -
నా లోపల రెబెల్
సౌమ్యమైన చూపులు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాళవిక నాయర్, జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే...నా బాల్యమే నా బలం!నేను ఢిల్లీలో ఒక మలయాళీ కుటుంబంలో పుట్టాను. నా బాల్యం నాన్నగారి వృత్తిరీత్యా కొన్నిసార్లు ఢిల్లీ హడావుడి, మరికొన్నిసార్లు కేరళ ప్రశాంతత మధ్య సాగింది. ఒకసారి మా కుటుంబంలో జరిగిన బైక్ ప్రమాదం నాపై చాలా ప్రభావం చూపింది. అప్పటి నుంచి నేను స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.నాన్న నా పెద్ద సపోర్టర్!‘అమ్మాయివి, బైక్ ఎందుకు?’ అని చాలామంది చెప్పినా, మా నాన్న వినలేదు. నాకు బైక్ నేర్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను నేనే కాపాడుకోగలగాలి అని ఆయన కోరుకున్నారు.కెమెరా బయట నా ప్రపంచం!షూటింగ్ లేకపోతే నేను ఎక్కువగా పుస్తకాల్లో మునిగిపోతుంటాను లేదా స్కెచింగ్ చేస్తుంటాను. నేను ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో తత్త్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశాను. ఆ చదువు నాకు పాత్రలను కొత్త కోణంలో అర్థం చేసుకునే దృష్టిని ఇచ్చింది.నేను కేవలం నటించను!నా ప్రయాణం చిన్నప్పుడే మలయాళం సినిమా ‘కరుత్త పక్షికల్’లో మొదలైంది. కానీ, ‘కుక్కూ’ నాకు అసలైన గుర్తింపు ఇచ్చింది. అంధురాలైన పాత్రలో కళ్లతో కాదు, మనసుతో ప్రపంచాన్ని చూడటం నేర్చుకున్న అనుభవం. అందుకే, పాత్రలోని భావాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.చిన్న సీక్రెట్స్!ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. కానీ నా లోపల ఒక చిన్న రెబెల్ ఉంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నాకు కొన్ని టాటూలు ఉన్నాయి. ఒక చిన్న నిమ్మకాయ ముక్క ఆకారంలో ఒక టాటూ ఉంది. అలాగే పోలినేషియన్ స్టయిల్లో ట్రయాంగిల్స్, ట్రైబల్ డిజైన్స్ తో మరో టాటూ కూడా ఉంది. అవి నా జీవితంలో ప్రత్యేకమైన గుర్తుల్లాంటివి.వ్యక్తిత్వం ముఖ్యం!మొదట్లో ‘గ్లామర్’ అనే భావన నాకు పెద్దగా నచ్చేది కాదు. ఇండస్ట్రీలో ప్రెజెంటబుల్గా ఉండాలి కానీ, వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు అని నేను నమ్ముతాను.అరుదైన గుర్తింపు!చిన్నప్పుడే ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్నందుకు, కొందరు నన్ను ప్రముఖ నటి శారదతో పోలుస్తుంటారు. ఆ గుర్తింపు కాపాడుకోవడానికే పారితోషికం కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను.ఫుడ్ అంటే ఫుల్ లవ్!నేను పక్కా ఫూడీని. ఢిల్లీలో పెరిగాను కాబట్టి అక్కడి స్ట్రీట్ ఫుడ్, మసాలా చాట్ ఎప్పటికీ నా ఫేవరెట్. అలాగే మా ఇంట్లో చేసే మటన్ రసం కలిపిన అన్నం. నెమ్మదిగా ఉడికిన ఆ మాంసం నోట్లో కరిగిపోతుంది. అది నా ఆల్టైమ్ కంఫర్ట్ ఫుడ్. ఇప్పుడు షూటింగ్లు ఎక్కువగా ఉండటంతో, శక్తి కోసం ఆర్గానిక్, హెల్తీ ఫుడ్ కూడా నా మెనూలో చేరింది.ఇష్టమైన స్టార్!చిన్నప్పటి నుంచే నేను మోహన్ లాల్ సర్కి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పని చేసిన రోజు నాకు ఒక కలలా అనిపించింది. అలాగే జ్యోతిక నటనలోని శక్తి, ఒక సినిమాను తన భుజాలపై మోసే ధైర్యం నాకు పెద్ద ఇన్ స్పిరేషన్ . -
తలకట్టు... కనికట్టు
అబ్బాయిలకు ఏం స్టయిల్ ఉంటుందిలే అని చాలామంది అనుకుంటారు. కాని, బార్బర్ కుర్చీలో కూర్చునే పది నిమిషాలు చాలు, మామూలు అబ్బాయి కూడా సినిమా హీరోలా మారిపోవడానికి. సరైన హెయిర్ కట్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవల్! చక్కని తలకట్టుతో రూపం కనికట్టు చేసినంతగా మారిపోతుంది. అందుకే ఈ సమ్మర్లో కంఫర్ట్తో పాటు కూల్గా కనిపించే కొన్ని ట్రెండీ హెయిర్ స్టయిల్స్ చూద్దాం...జెంటిల్మన్ ఫ్యాడ్ – క్లాసీ స్టయిల్! జెంటిల్మన్ ఫ్యాడ్ అనేది ఇప్పటికీ ఎవర్గ్రీన్ స్టయిల్! చెవుల దగ్గర జుట్టు క్రమంగా తగ్గుతూ, పైన మాత్రం సెట్ చేసుకునేలా ఉండటం. ఈ కట్ వేసుకుంటే ముఖం మరింత షార్ప్గా, సన్నగా కనిపిస్తుంది. ఆఫీస్కు వెళ్లినా, ఫంక్షన్ కు వెళ్లినా సూట్ అయ్యే సేఫ్ అండ్ స్మార్ట్ స్టయిల్ ఇదే! అండర్కట్ – యూత్ ఫేవరెట్అండర్కట్ అనేది కొంచెం బోల్డ్గా, ట్రెండీగా కనిపించాలనుకునే వాళ్లకు బెస్ట్. సైడ్స్ షార్ట్గా, పైన కొంచెం లెంగ్త్ ఉంచడం వల్ల మీరు స్టయిల్ను మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఫార్మల్గా నీట్గా దువ్వుకోవచ్చు, లేదా క్యాజువల్గా మెస్సీగా వదిలేయొచ్చు. ఒకే కట్తో రెండు వేర్వేరు లుక్స్ రావడం దీని కున్న ప్లస్ పాయింట్. టాప్ నాట్ – డిఫరెంట్ టచ్జుట్టు కొంచెం పొడవుగా ఉంటే, టాప్ నాట్ వేసుకోవడం ఒక స్మార్ట్ ఐడియా. జుట్టు మొత్తాన్ని పైకి తీసుకుని చిన్న ముడి వేయడం వల్ల కూల్గా, కంఫర్ట్గా ఉంటుంది. ఈ స్టయిల్ మీకు కొంచెం ఆర్టిస్ట్ లుక్ లేదా ట్రావెలర్ వైబ్ ఇస్తుంది. ముఖ్యంగా వేసవిలో జుట్టు ముఖంపై పడకుండా క్లీన్ గా ఉంచుతుంది. బజ్ కట్ – కంఫర్టబుల్ చాయిస్వేసవిలో చాలామంది ఇష్టపడే సింపుల్ స్టయిల్ ఈ బజ్ కట్. జుట్టు చిన్నగా ఉండటం వల్ల చెమట తక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ, పైగా షాంపూ, నూనె ఖర్చును ఆదా చేస్తుంది. ఉదయం లేట్గా లేచినా, దువ్వుకోవాల్సిన టెన్షన్ ఉండదు. టైమ్ కూడా సేవ్ చేస్తుంది. కట్ చిన్నదే అయినా, కంఫర్ట్ మాత్రం పెద్దది.టెక్చ్సర్డ్ క్రాప్ – మెస్సీగా.. మోడ్రన్ గా..నేచురల్గా, కొంచెం మెస్సీగా కనిపించే స్టయిల్ కావాలనుకుంటే టెక్స్చర్డ్ క్రాప్ మంచి ఎంపిక. ఈ కట్ వల్ల జుట్టు మరింత వాల్యూమ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా థిన్ హెయిర్ ఉన్నవాళ్లకు ఇది మంచి సొల్యూషన్ . ఎక్కువగా సెట్ చేయకపోయినా, స్టయిల్గా కనిపిస్తారు. ఇలా స్టయిలిష్గా కనిపించడానికి పెద్ద ఖర్చు అవసరం లేదు. మీ ఫేస్ షేప్కు సరిపోయే చిన్న హెయిర్ కట్ చాలు, మీ లుక్కి వెంటనే కొత్త చార్మ్ వస్తుంది. -
ఈ ఆభరణాలూ సువర్ణాలే!
ప్రపంచం ఏమైనా సరే, యుద్ధాలు వచ్చినా, ఆర్థిక మాంద్యం తలుపు తట్టినా మన మధ్యతరగతిని వణికించేవి రెండు మాత్రమే! మొదటిది ఇంధన ధరలు, రెండోది బంగారం ధరలు. ఇప్పుడు బంగారం ధర ఆకాశానికెక్కి, అందని నక్షత్రంలా మెరుస్తోంది. బంగారం కేవలం లోహం మాత్రమే కాదు, తరతరాల సంప్రదాయం కూడా! నేటి ట్రెండ్, రేపటి భద్రత. ‘ఏమైనా సరే, నగలు కొనాల్సిందే!’ అనుకునే వారికి రంగు రంగుల్లో దొరికే బంగారు మిశ్రమ లోహాలు సహా పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా బడ్జెట్లోనే మెరిపించే బంగారు మార్గాల గురించిన ప్రత్యేక కథనం...బంగారానికి ప్రత్యామ్నాయ లోహాలు...బంగారం అంటే భారతీయులకు తగని మోజు. ముఖ్యంగా భారతీయులకు బంగారం చూసినప్పుడల్లా దాని మెరుపు మాయలో పడిపోవటం అలవాటు. కాని ఇప్పుడు దానిని తాకగానే, బడ్జెట్ ఒక్కసారిగా సీరియస్ అయి ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త కథ మొదలైంది. ‘బంగారం మాత్రమే కాదు, మేమూ ఉన్నాం’ అని చెప్పే లోహాలు ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టాయి. పెరుగుతున్న ధరలు, రోజురోజుకీ మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్, తేలికగా ఉండే డిజైన్లపై పెరుగుతున్న ఆసక్తి, ఇలా ఇవన్నీ కలిసి బంగారానికి ప్రత్యామ్నాయ ఆభరణాలుగా మారి చిన్న చిన్న తారల్లా తళుక్కుమంటున్నాయి.పైగా ఇవి సరసమైన ధరల్లో దొరుకుతుండటమే కాకుండా, స్టయిల్లో కూడా తగ్గేదే లేదంటూ సూపర్ మోడల్స్లా మెరిసిపోతున్నాయి. దీంతో అన్ని వయసుల వారూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు బంగారం మాత్రమే వివాహాది శుభకార్యాలకు తప్పనిసరి ఎంపికగా ఉండేది. ఇప్పుడు ఆ ఎంపికల ప్రపంచం పెద్దదైంది. అందుకే ఇప్పుడు ఈ ‘న్యూ హీరోస్’ గురించి తెలుసుకోవడం కూడా ఒక చిన్న ఫ్యాషన్ అడ్వెంచర్లాంటిదే!ప్లాటినమ్ – లగ్జరీ లెజెండ్ జ్యూలరీ ప్రపంచంలో ఒక సైలెంట్ కింగ్ ప్లాటినమ్. ఎక్కువ హడావిడి చేయకుండా, తన క్లాస్తోనే అందరినీ ఆకట్టుకుంటుంది. సహజంగా వెండిలాంటి తెల్లటి మెరుపుతో కనిపించే ఈ లోహం చాలా బలమైంది. కాలం గడిచినా తన అందాన్ని కోల్పోదు. అందుకే ‘ఒకసారి కొనిస్తే, సంవత్సరాలు గడిచినా కొత్తదానిలానే మెరిసిపోతుంది’ అంటారు. చరిత్రలో కూడా ప్లాటినమ్ రాజరికపు కథలతో నిండిపోయింది. ఒకప్పుడు ఇది చాలా అరుదుగా దొరికే లోహం కావడం వల్ల రాజులు, ధనవంతులు మాత్రమే దీనితో నగలు చేయించుకునేవారు.ఆ కాలంలో ప్లాటినమ్ ధర కేవలం డబ్బుతో కాదు, ప్రతిష్ఠతో కూడా కొలిచేవారు. ఇప్పటికీ పెళ్లి ఉంగరాలు, ఎంగేజ్మెంట్ రింగ్స్, ప్రీమియం జ్యూలరీలో ప్లాటినమ్ను ఒక శాశ్వత బం«ధానికి గుర్తుగా భావిస్తారు. స్క్రాచ్లు వచ్చినా, వేడి, చెమట, నీరు ఏదైనా సరే తన మెరుపును అలాగే నిలబెట్టుకుంటుంది. అందుకే మెడికల్ పరికరాలు, ఆధునిక సాంకేతిక పరికరాల తయారీ రంగాల్లో కూడా ప్లాటినమ్ కీలక పాత్ర పోషిస్తోంది. ధరలో సాధారణంగా బంగారంతో సమానంగా, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ ధరలో లభిస్తుంది. వెండి – బంగారానికి దగ్గరి బంధువుప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా లభించే విలువైన లోహం వెండి. ఇది బంగారానికి దగ్గరి బంధువు లాంటిది. మెరుపులో ఏమాత్రం తగ్గదు, కానీ ఖర్చులో మాత్రం మనసుకు కాస్త హాయినిస్తుంది. బంగారం కంటే ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల వెండి తక్కువ ధరలో సులభంగా దొరుకుతుంది. అయితే వెండి కథ కేవలం ఫ్యాషన్ తోనే మొదలైపోలేదు; దానికి గొప్ప చరిత్ర, సంప్రదాయం కూడా ఉన్నాయి.పురాతన కాలంలో రాజులు, సంపన్నులు వెండి పాత్రల్లోనే భోజనం చేసేవారు. ఆరోగ్యానికి మంచిదని, నీటిని శుభ్రంగా ఉంచుతుందని నమ్మకం ఉండేది. అందుకే ఇప్పటికీ చాలా ఇళ్లలో చిన్నపిల్లలకు వెండి గ్లాస్, వెండి చెంచా వాడే సంప్రదాయం కొనసాగుతోంది. అంతేకాదు, వెండి సహజంగా బ్యాక్టీరియాను తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. అందుకే పాతకాలంలో చిన్న గాయాలకు కూడా వెండి పూత వాడేవారు. అలాగే పండుగల సమయంలో, ముఖ్యంగా శుభకార్యాల్లో వెండి నాణేలను కానుకగా ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. ఇక పరిశ్రమల ప్రపంచంలో కూడా వెండి ఒక ట్రెండీ హీరోనే. ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ అడుగుపెట్టి రోజువారీ నగలు, స్టయిలిష్ అండ్ సింపుల్ గొలుసులు, మోడ్రన్ జ్యూలరీ డిజైన్ల రూపంలో అందరి చేతుల్లో మెరిసిపోతోంది. సింపుల్గా చెప్పాలంటే సంప్రదాయం, ఆరోగ్యం, స్టయిల్, అందుబాటు ఈ నాలుగు కలిసి వెండిని ఒక స్మార్ట్ చాయిస్గా నిలబెడుతున్నాయి.పలేడియమ్ – సైలెంట్ స్టార్పలేడియమ్ ప్లాటినమ్ కుటుంబానికి చెందిన అరుదైన లోహం. అందుబాటు కొంచెం తక్కువే, కానీ స్టయిల్లో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేస్తుంది. మొదట్లో ఇది పెద్దగా ఫ్యాషన్ లో కనిపించలేదు. కాని, ఇప్పుడు వెడ్డింగ్ రింగ్స్, ప్రీమియం డైలీ వేర్ జ్యూలరీలో ఇది సైలెంట్గా ట్రెండ్ సెట్ చేస్తోంది. సహజంగా తెల్లటి మెరుపుతో ఉండటం వల్ల ప్రత్యేక కోటింగ్ అవసరం లేకుండా సింపుల్గా మెరిసిపోతుంది. మెయింటెనెన్స్ తక్కువ, బరువు తక్కువ, లుక్ మాత్రం హై–ఎండ్. ఇదే దీని అసలు స్టయిల్ సీక్రెట్. 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు.ఆ తర్వాత కాలక్రమేణా జ్యూలరీ ప్రపంచం దాని ప్రత్యేకతను గుర్తించింది. ముఖ్యంగా వైట్ గోల్డ్కు ఒక సులువైన ప్రత్యామ్నాయంగా దీనిని భావిస్తున్నారు. ధర విషయానికి వస్తే, పలేడియమ్కు కూడా కొంచెం మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. కొన్ని రోజులు బంగారంతో పోలిస్తే తక్కువ ధరలో ఉంటుంది, మరికొన్ని రోజులు ‘నేను కూడా లగ్జరీనే!’ అని అంటుంది. బడ్జెట్కి పెద్ద షాక్ ఇవ్వకుండా లగ్జరీ ఫీలింగ్ ఇచ్చే స్మార్ట్ ఎంపికగా పలేడియమ్ నిలుస్తోంది.టైటానియమ్ – ఫ్యూచర్ మెటల్ టైటానియమ్ అంటే మోడర్న్ జ్యూలరీ ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్. బరువు తక్కువ, బలం ఎక్కువ. ఇదే దీని అసలైన స్టయిల్. చేతిలో పెట్టుకున్నప్పుడు లైట్గా అనిపించినా, మన్నికలో మాత్రం స్టీల్కే చాలెంజ్ చేస్తుంది. అందుకే స్పోర్టీ లుక్ కోరుకునే వారికి టైటానియమ్ బెస్ట్ చాయిస్. అయితే, టైటానియమ్ మొదట విమానాలు, రాకెట్ల తయారీలో ఉపయోగించారు.అక్కడ తన దారుఢ్యాన్ని నిరూపించుకున్న తర్వాతే ఇది ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మెన్స్ జ్యూలరీ, స్మార్ట్ వాచ్ స్ట్రాప్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్లో ఇది ఫుల్ స్పీడ్తో ట్రెండ్ అవుతోంది. ఇది తుప్పు పట్టదు, స్క్రాచ్లు తక్కువగా పడతాయి, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. పైగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి కూడా సేఫ్. దీంతో, అలెర్జీ సమస్యలు తక్కువగా ఉంటాయి. అందుకే రోజువారీ వాడకానికి చక్కగా సరిపోతుంది. ఇది బంగారంతో పోలిస్తే చాలా తక్కువ ధరలో లభిస్తుంది.బంగారం రంగుల రహస్యం.. బంగారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దాని పసుపు రంగు మెరుపు. అయితే, బంగారం కేవలం ఒక రంగు కథ మాత్రమే కాదు, అది ఒక రంగుల పండుగ. శతాబ్దాలుగా మనుషులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ విలువైన లోహం, కాలంతో పాటు కొత్త కొత్త అవతారాలు తీసుకుంటూ ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్స్ను సృష్టిస్తోంది. పసుపు నుంచి తెలుపు, గులాబీ, ఆకుపచ్చ, ఇంకా నీలం, నలుపు వరకు ఇలా ప్రతి రంగు వెనుక ఒక ప్రత్యేక కథ, ప్రత్యేక మిశ్రమం, ప్రత్యేక స్టయిల్ దాగి ఉంది.యెల్లో గోల్డ్ – సంప్రదాయానికి చిరునామా..బంగారం అసలైన రూపం యెల్లో గోల్డ్. ఇది శతాబ్దాలుగా సంపద, రాజసం, శుభం అనే భావాలకు ప్రతీకగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారం అత్యంత శుద్ధమైన రూపం. దాదాపు 99.9 శాతం బంగారం ఉంటుంది. కానీ అది చాలా మృదువుగా ఉండటం వల్ల ఆభరణాల తయారీలో 22 క్యారెట్లు, 18 క్యారెట్లు లాంటి మిశ్రమాలను ఎక్కువగా వాడుతారు. పెళ్లి నగలు, గొలుసులు, సంప్రదాయ ఆభరణాలు తదితరమైన వాటన్నింటికీ ఇప్పటికీ ఇది మొదటి ఎంపిక. అలెర్జీ సమస్యలు తక్కువగా ఉండటం, మెరుపు ఎక్కువ కాలం నిలవడం, సింపుల్గా మెయింటైన్ చేయగలగడం దీని ప్రధాన ప్లస్ పాయింట్స్. అయితే ఎక్కువ క్యారెట్ల బంగారం కొంచెం సాఫ్ట్గా ఉండటం వల్ల సులభంగా గీతలు పడే అవకాశం ఉంటుంది. అయినా కూడా ‘క్లాసిక్ లుక్’ అంటే ఇప్పటికీ యెల్లో గోల్డ్నే.వైట్ గోల్డ్ – స్టయిల్కు సిల్వర్ టచ్ వైట్ గోల్డ్ అంటే మోడ్రన్ ఫ్యాషన్ కు సింబల్. సాధారణ పసుపు బంగారానికి భిన్నంగా, బంగారంలో నికెల్, పలేడియమ్ లేదా వెండిలాంటి ఇతర తెల్లటి లోహాలను కలిపి ఈ ప్రత్యేక రంగు బంగారాన్ని తయారు చేస్తారు. తర్వాత దీనిపై రోడియమ్ అనే మెటల్తో కోటింగ్ వేయడం వల్ల ఇది మరింత ప్రకాశవంతంగా, ప్లాటినమ్లా మెరిసే లుక్ను ఇస్తుంది. చరిత్రలో చూస్తే, 1920ల కాలంలో ప్లాటినమ్ చాలా ఖరీదుగా ఉండటంతో, తక్కువ ఖర్చులో అందించడానికి వైట్ గోల్డ్ ప్రాచుర్యం పొందింది.అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది మోడ్రన్ జ్యూలరీలో ఒక ముఖ్యమైన ట్రెండ్గా కొనసాగుతోంది. ఇది స్ట్రాంగ్గా ఉండటం, స్క్రాచ్లు తక్కువగా కనిపించడం దీని ప్రత్యేకత. అయితే రోడియం కోటింగ్ కొంతకాలానికి తగ్గిపోవచ్చు కాబట్టి అప్పుడప్పుడు మళ్లీ కోటింగ్ చేయాల్సి ఉంటుంది. అయినా కూడా స్లీక్, స్మార్ట్, మోడ్రన్ లుక్ కోసం వైట్ గోల్డ్ బెస్ట్ చాయిస్.గ్రీన్ గోల్డ్ – అందాల ఆకుపచ్చ మెరుపుగ్రీన్ గోల్డ్ కొంచెం డిఫరెంట్ అండ్ రేర్. బంగారంలో ఎక్కువ శాతం వెండి కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది. పాత కాలంలో దీనిని ‘ఎలెక్ట్రం’ అని పిలిచేవారు. ఇది మార్కెట్లో ఎక్కువగా కనిపించదు. కాని, ఫ్యాషన్లో చాలా పాత ట్రెండ్. ప్రాచీన రాజులు, కళాకారులు ప్రత్యేక ఆభరణాల కోసం ఈ మిశ్రమాన్ని వాడేవారు, ఎందుకంటే ఇది బంగారంతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపించేది.కొన్నిసార్లు రాగిలాంటి లోహాలను కూడా బంగారంలో కొద్దిగా కలిపి మరింత స్ట్రెంగ్త్ ఇస్తారు. ఇది కాస్త నేచురల్ గ్రీన్ టచ్లా సాఫ్ట్గా కనిపిస్తుంది. కాలక్రమేణా ఇందులో ఉన్న వెండి కారణంగా రంగు కొంచెం డార్క్ కావచ్చు, అదే దానికి ఒక యూనిక్ క్యారెక్టర్ను ఇస్తుంది. భారతీయ దుస్తులైనా, వెస్ట్రన్ ఔట్ఫిట్లైనా ఏ స్టయిల్కైనా ఇది మ్యాచ్ అవుతుంది. కొంచెం డిఫరెంట్, క్లాసీ లుక్ కావాలని అనుకునే వారికి గ్రీన్ గోల్డ్ ఒక బెస్ట్ చాయిస్.రోజ్ గోల్డ్ – ప్రేమకు గులాబీ మెరుపు స్టయిల్లో సాఫ్ట్నెస్ ఇచ్చేదే ఈ రోజ్ గోల్డ్. దీని రంగు కాస్త రొమాంటిక్ లుక్ ఇస్తుంది. బంగారంలో రాగి ఎక్కువగా కలిపితే ఈ అందమైన గులాబీ టోన్ వస్తుంది. అందుకే దీనిని ‘పింక్ గోల్డ్’ అని, పాతకాలంలో ‘రష్యన్ గోల్డ్’ అని పిలిచేవారు, ఎందుకంటే 19వ శతాబ్దంలో రష్యాలో ఇది మొదట ప్రాచుర్యం పొందింది. చరిత్రలో రాజ కుటుంబాలు, ప్రత్యేక సందర్భాల ఆభరణాల్లో ఈ రంగును ఉపయోగించేవారు.ఇది సాఫ్ట్గా కనిపించినా, రాగి కారణంగా ఇతర గోల్డ్ రకాల కంటే కొంచెం బలంగా ఉంటుంది. పైగా దీని రంగు కాలక్రమేణా తగ్గిపోకుండా స్థిరంగా ఉంటుంది. అన్నిరకాల చర్మానికి ఈ రంగు సూట్ అవ్వడం వల్ల యువతలో ఇది ఒక ఫ్యాషన్ ట్రెండ్గా మారింది. ముఖ్యంగా ఎంగేజ్మెంట్ రింగ్స్, గిఫ్ట్ జ్యూలరీ, డైలీ వేర్ ఆభరణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రొమాంటిక్గా, ట్రెండీగా కనిపించాలనుకునే వారు రోజ్ గోల్డ్ ఎంచుకోవటం మంచిది.బ్లూ గోల్డ్ – అరుదైన నీలి మెరుపుజ్యూలరీలో రేర్ స్టార్ బ్లూ గోల్డ్. బంగారంలో ఇండియమ్ లేదా ఐరన్ వంటి లోహాలను కలిపి, నియంత్రిత ప్రక్రియలో ఆక్సిడేషన్ చేయడం వల్ల దీనికి నీలి రంగు వస్తుంది. ఈ షేడ్ గాఢంగా కాకుండా, మెటాలిక్ టచ్తో సాఫ్ట్గా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ రకం బంగారం ఎక్కువగా ఆధునిక కాలంలోనే అభివృద్ధి చెందింది, ముఖ్యంగా ప్రత్యేక డిజైన్లు, ఆర్టిస్టిక్ జ్యూలరీ కోసం దీనిని ఉపయోగించేవారు. ఇది మార్కెట్లో అసలు కనిపించదు; ఎక్కువగా స్టేట్మెంట్ జ్యూలరీ, కలెక్షన్ పీసెస్, ప్రత్యేక ఆర్డర్ డిజైన్లలో మాత్రమే కనిపిస్తుంది. తయారీ ప్రక్రియ క్లిష్టంగా ఉండటం, నైపుణ్యం అవసరం కావడం వల్ల దీని ధర కూడా ఎక్కువే. బ్లూ గోల్డ్ ఎక్కువగా కలెక్షన్ ఐటమ్స్ లేదా ప్రత్యేక సందర్భాల కోసం మాత్రమే తయారు చేస్తారు, అందుకే బ్లూ గోల్డ్ ఒక లగ్జరీ స్టేటస్గా నిలుస్తోంది.బ్లాక్ గోల్డ్ –బోల్డ్ స్టయిల్ బ్లాక్ గోల్డ్ అంటే బోల్డ్ స్టేట్మెంట్. ఇది సహజంగా ఏర్పడే రంగు కాదు. ప్రత్యేక టెక్నాలజీ, కోటింగ్ లేదా ట్రీట్మెంట్ ద్వారా తయారు చేసే మిశ్రమం. రోడియం ప్లేటింగ్, ఆక్సిడేషన్ లేదా లేజర్ ట్రీట్మెంట్ వంటి ఆధునిక పద్ధతులతో బంగారానికి ఈ నలుపు రంగు అందిస్తారు. ముఖ్యంగా మోడ్రన్ జ్యూలరీ ట్రెండ్స్ పెరిగిన తర్వాత ఎక్కువగా పురుషుల జ్యూలరీ, హై ఫ్యాషన్ డిజైన్లు, స్టేట్మెంట్ రింగ్స్, బ్రేస్లెట్స్లో ఇది కనిపిస్తుంది. జ్యూలరీతో అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే బ్లాక్ గోల్డ్ ఒక ట్రెండీ ఆప్షన్.కొత్త డిజైన్లు..బంగారం ధరలు రోజు రోజుకీ పైకి ఎగబాకుతున్నాయని, స్టయిల్లో తగ్గాల్సిన అవసరం లేదు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం స్మార్ట్గా డిజైన్స్ ఎంపిక చేసుకుంటే, తక్కువ ఖర్చులోనే అందమైన నగలను పొందుతూ అందం, ఆనందం రెండింటినీ ఆస్వాదించవచ్చు.అవతారాలు ఎత్తే ఆభరణంఒకే నగను మూడు విధాలుగా మార్చుకునే డిజైన్లు ఇప్పుడు చాలా పాపులర్. పెద్ద హారం నుంచి చిన్న చైన్గా, లేదా లాంగ్ నెక్లెస్ను రెండు చిన్న నెక్లెస్లుగా మార్చుకోవచ్చు. ఒకసారి కొనుగోలు చేసి, మూడు సందర్భాల్లో వివిధ విధాలుగా వాడుకోవచ్చు.పాతకు కొత్త రూపం పాతకాలపు ఆభరణాలను కొత్తగా మార్చి, ఆధునిక డిజైన్స్ తో కలిపి తయారు చేయడం ఇప్పుడు ట్రెండ్గా మారుతోంది. దీంతో పాత బంగారం అమ్మి కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా, వాటినే కొత్తగా మార్చుకోవచ్చు. పెళ్లి కూతురి నగలలో కూడా కొత్త ఆకృతులు, కొత్త కలయికలు కనిపిస్తున్నాయి. అందుకే, ఇప్పుడు బంగారం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, సృజనాత్మకతకు కొత్త వేదిక.హాలో టెక్నిక్ ఈ టెక్నిక్ ఒక చిన్న మ్యాజిక్లాంటిది. నగ లోపల ఖాళీగా ఉండేలా తయారు చేస్తారు. బయట నుంచి చూస్తే మాత్రం పెద్దగా, ఘనంగా కనిపిస్తుంది. 40 గ్రాముల్లా కనిపించే నెక్లెస్ అసలు బరువు 20 నుంచి 25 గ్రాములే ఉండొచ్చు. పాతకాలపు భారీ టెంపుల్ జ్యూలరీ కూడా ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ లో వస్తోంది. అంటే స్టయిల్ డబుల్, ఖర్చు హాఫ్.రెండు మెరుపులు బంగారాన్ని ఇతర లోహాలతో కలిపి తయారు చేసే మిక్స్డ్ మెటల్ డిజైన్స్ ఇప్పుడు ఫ్యాషన్ లో టాప్లో ఉన్నాయి. ఒకే నగలో రెండు రంగుల మెరుపు కనిపించడం వల్ల అది కొత్తగా, మోడర్న్గా కనిపిస్తుంది. ఖర్చు తగ్గుతుంది, డిజైనర్ లుక్ కూడా వస్తుంది.పూత పరి^è యాలుఈ టెక్నిక్లో నగ పూర్తిగా బంగారంతో కాకుండా, పైపైన మాత్రమే బంగారం పొర వేస్తారు. దీంతో అది గోల్డ్లా మెరిసిపోతుంది, కానీ ధర మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వన్ గ్రాము గోల్డ్ లాంటివే కనిపిస్తాయి, కానీ అసలు బంగారం కాదు. పార్టీలు, ఫంక్షన్ లలో గ్రేస్ చూపించడానికి ఇది సూపర్ చాయిస్.తక్కువలో ఎక్కువ అందం. ఇప్పటి యువత ఎక్కువ నగలు ధరించడం కన్నా, ఒకే నగతో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఒక చిన్న గొలుసు, ఒక అందమైన ఉంగరం, ఒక జత చెవిపోగులు. ఇవే ఇప్పుడు పూర్తి అలంకరణగా మారుతున్నాయి. సాదాసీదాగా, కానీ ఆకర్షణీయంగా కనిపించడం – అందానికి ఇదే నేటి కొత్త మంత్రం.సంప్రదాయం చిన్న ప్యాక్లో జ్యూలరీలో ‘లైట్ ఈజ్ రైట్’ అనే ట్రెండ్ సూపర్ హిట్గా మారింది. పెద్దగా కనిపించే హారం అయినా, చెవి రింగులు అయినా లోపల స్మార్ట్గా తక్కువ బంగారంతో డిజైన్ చేసి, బయటకు మాత్రం బీడ్స్, రంగురంగుల స్టోన్స్ , మెరిసే ముత్యాలు జోడించి ఫుల్ రిచ్ లుక్ తీసుకొస్తున్నారు. చేతిలో పెట్టుకుంటే బరువు తక్కువగా ఉంటుంది, కానీ చూసినవారికి మాత్రం ‘ఇది ఎంత గ్రాండ్గా ఉంది!’ అనిపించేలా మెరుస్తుంది.కాలం మారుతోంది, ఖర్చులు పెరుగుతున్నాయి, బంగారం ధర రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయినా మన ఇంట్లో ఒక మాట మాత్రం మారదు. ‘బంగారం కొంటేనే భద్రత’ అనే నమ్మకం. అందుకే, బంగారం ఎప్పటికీ ప్రత్యేకమే! ∙ దీపిక కొండి -
లివర్ షివర్
భారత దేశంలో లివర్ జబ్బులు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. లివర్ జబ్బుల కారణంగా సంభవించే మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. లివర్ జబ్బులకు మద్యపానం ప్రధాన కారణంగా ఉంటోంది. హెపటైటిస్–ఏ, బీ, సీ, డీ, ఈ; నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ); కొన్ని రకాల ఔషధాల వాడకం, రసాయనాల కాలుష్యం; జన్యు కారణాలు, ఆటో ఇమ్యూన్ పరిస్థితులు కూడా లివర్ జబ్బులకు కారణం అవుతుంటాయి.మన దేశంలోని పరిస్థితులు చూసుకుంటే, గడచిన దశాబ్ద కాలంలో లివర్ జబ్బులతో మరణాల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగినట్లు జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ రకాల లివర్ జబ్బులు, వాటి వల్ల సంభవిస్తున్న మరణాల వివరాలను గణాంకాల్లో తెలుసుకుందాం... -
డ్రైవింగ్ లైసెన్స్ కోసం... 139 విఫలయత్నాలు
సాధారణంగా మనం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే థియరీ, ప్రాక్టికల్ టెస్ట్లలో ఒకటి రెండుసార్లు ప్రయత్నం చేస్తాం. అలా సాధ్యం కాకపోతే ‘ఇక మనకు డ్రైవింగ్ సెట్ కాదులే’ అని అనుకుని ఏ ఓలానో, ఊబర్నో ఆశ్రయిస్తాం. కానీ పోలండ్లోని టార్నోకి చెందిన ఓ వ్యక్తి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అలా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు అనుకుంటున్నారా... ఏకంగా 139 సార్లు, తొమ్మిదేళ్ల పాటు విసుగు చెందకుండా విఫల యత్నాలు చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ థియరీ టెస్ట్లో పాస్ కావడం కోసం ఏకంగా రూ. 1,90,000 కూడా ఖర్చు చేశాడు.చివరికి అంటే 140వ ప్రయత్నంలో ఎట్టకేలకు థియరీ టెస్ట్లో పాసయ్యాడు. అయితే, అసలైన మరో ట్విస్ట్ మరొకటి ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే థియరీ పాస్ అయిపోతే సరిపోదు. ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ కూడా పాసై పోవాలి. కారు నడపడంలో తడబడినా, రివర్స్ సరిగ్గా తీయకపోయినా.. రూల్స్ ప్రకారం మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. మరోవిషయం.. 140 సార్లే ఎక్కువ అనుకుంటే, పోలండ్లోనే ఇతడిని మించిన ఇంకో ఘనుడు కూడా ఉన్నాడు. అతను డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏకంగా 163 ప్రయత్నాలు చేశాడట. అది కూడా 17 ఏళ్ల పాటు! -
ఈ కోర్టే నకిలీది!
నకిలీ డాక్టర్ల గురించి విన్నాం. నకిలీ లాయరు. నకిలీ జడ్జి గురించి చదివాం. ఫేక్ ఆఫీసర్లు.. డూప్లికేట్ ప్రొడక్టులు.. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే, గుజరాత్లో ఓ వ్యక్తి ఓ కొత్త మోసానికి తెరలేపాడు. ఏకంగా నకిలీ కోర్టే ఏర్పాటు చేశాడు.. ఏంటీ కోర్టా? అని ఆశ్చపోతున్నారా.. కోర్టే కాదు.. లాయర్లు, ఉద్యోగులు, తీర్పులు అన్నీ నకిలీనే...సివిల్ కేసులు.. ఓ పట్టాన పరిష్కారం కావు. తరాలు మారినా ఎటూ తెగవు. ఏళ్లతరబడి ఎదురుచూపులు. కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు తప్పవు. ఇలా తిరిగి. విసిగి వేసారిన వారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రభుత్వం నియమించిన ఆర్బిట్రేటర్ని అని చెప్పాడు.. కోర్టు సెటప్ వేసి నమ్మించాడు. కేసులు పరిష్కరించినట్టు, తీర్పులు చెప్పినట్టు నటించాడు. లక్షల్లో ఫీజులు గుంజాడు. ఐదేళ్ల పాటు ఈ దందా సాగించాడు.ఓ కేసు వ్యవహారంలో ‘అసలు’ కోర్టుకు అనుమానం వచ్చి, ఆరా తీసింది. మోసం బట్టబయలైంది. ‘నకిలీ’ని కటకటాల్లోకి పంపింది. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ ఉత్తుత్తి కోర్టు వెలిసింది. మోరిస్ శామ్యూల్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. ఓ గదిలో కోర్టు సెటప్ ఏర్పాటు చేసి, జడ్జిగా గెటప్ వేశాడు. కొంతమంది నకిలీ లాయర్లు, ఉద్యోగులను నియమించుకున్నాడు. భూమి వివాద బాధితులే లక్ష్యంభూ సంబంధిత కేసుల్లో బాధితులను టార్గెట్ చేసేవాడు. అమాయకులను గుర్తించి, బుట్టలో వేసుకునేవాడు. ప్రభుత్వం తనను ‘అధికారిక మధ్యవర్తి’గా నియమించిందని నమ్మించేవాడు. కోర్టుల్లో కేసుల పరిష్కారానికి ఎక్కువ కాలం పడుతుందని, తాను త్వరగా పరిష్కారం చూపుతామని నమ్మించి..‘ఉత్తుత్తి’ కోర్టుకు రప్పించేవాడు. ఐదేళ్ల పాటు కొనసాగిన మోసంఈ ఉత్తుత్తి కోర్టు కార్యకలాపాలు 2019 నుంచి 2024 వరకు కొనసాగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శామ్యూల్కు ఆర్బిట్రేటర్గా ఎటువంటి అధికారిక హోదా లేదని, ఐదేళ్లలో అనేక కేసుల్లో నకిలీ ఆదేశాలు జారీ చేశాడని గుర్తించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై మార్చేలా కలెక్టర్లకు సైతం ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ ఆర్బిట్రేటర్ కోర్టులో తన క్లయింట్లకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసేవాడు. ఆ తర్వాత ఆ నకిలీ క్లెయిమ్లను కోర్టులో సమర్పించి తన క్లయింట్లకు అక్రమ లాభం కలిగించేవాడు. ఎలా బయటపడిందిఈ ‘నకిలీ’ వ్యవహారం ఒక కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది. శామ్యూల్ ఇచ్చిన తీర్పు కాపీని ఓ కేసులో అహ్మదాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో సమర్పించగా, ఆ పత్రాలను పరిశీలించిన కోర్టు అధికారి అనుమానాస్పద అంశాలను గుర్తించారు. వాస్తవాలను పరిశీలించి, విచారణలో ఆ తీర్పు నకిలీదిగా తేల్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్ట్.. కేసుల నమోదుపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతని కార్యాలయంలో నకిలీ పత్రాలు, కోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మోరిస్ శామ్యూల్ను అరెస్టు చేశారు. మోసం చేయడం, నకిలీ పత్రాలు తయారు చేయడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. ఆ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని శామ్యూల్ మోసానికి పాల్పడ్డాడు. ‘జాప్యాన్ని’ సాకుగా చూపి బాధితుల నిస్సహాయతను తనకు అనుకూలంగా మలచుకున్నాడు. చట్టపరమైన వ్యవహారాల్లో సరైన అధికారిక మార్గాలనే ఎంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన రుజువు చేస్తోంది. అరుదైన మోసమే కాదు, అనేక ప్రశ్నలు లేవనెత్తే ఉదంతంగానూ దీన్ని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.దిలీప్ మాదిరెడ్డి -
యముడితో కీర్తిమంతుడి యుద్ధం
పూర్వం కాశీక్షేత్రాన్ని రాజధానిగా చేసుకుని, ఇక్ష్వాకు వంశానికి చెందిన కీర్తిమంతుడు పాలించేవాడు. ఒకనాడు కీర్తిమంతుడికి వేట మీద కోరిక పుట్టి, అడవిలో వసిష్ఠాశ్రమ పరిసరాలకు వెళ్లాడు. అప్పుడది వైశాఖమాసం. వసిష్ఠ మహర్షి శిష్యులందరూ వైశాఖమాస ధర్మాలను ఆచరిస్తూ సందడిగా కనిపించారు. వైశాఖమాస ధర్మకార్యాలను అప్రతిహితంగా కొనసాగించడానికి వసిష్ఠ మహర్షి అప్పటికే ఆశ్రమానికి చేరువలో బాటసారుల దప్పిక తీర్చడానికి చలివేంద్రం, వారు సేదదీరడానికి అనువుగా చలువ పందిరితో ఒక విడిది మంటపం ఏర్పాటు చేశాడు. వసిష్ఠుడి శిష్యుల్లో కొందరు చలివేంద్రం వద్ద నిలబడి బాటసారుల దప్పిక తీరుస్తున్నారు. ఇంకొందరు విడిది మంటపంలో ఉన్నవారికి రసభరితమైన పండ్లు అందిస్తున్నారు. మరికొందరు సేదదీరుతున్న బాటసారులకు విసనకర్రలతో గాలి విసురుతూ సపర్యలు చేస్తున్నారు. ఇదంతా చూసిన కీర్తిమంతుడు ఆశ్చర్యపోయాడు. వసిష్ఠుడి శిష్యులను సమీపించి, ‘మునికుమారులారా! మీరంతా ఎవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.‘రాజా! మేమంతా వసిష్ఠ మహర్షి శిష్యులం. ఆయన ఆదేశం మేరకు వైశాఖ ధర్మాలను నెరవేరుస్తున్నాం’ అని బదులిచ్చారు.‘ఏదైనా క్రతువులో భాగంగా ఈ పనులన్నీ చేస్తున్నారా? ఏ దేవత ప్రీతి కోసం ఇదంతా చేస్తున్నారు? దీనివల్ల ఫలితమేమిటి?’ అడిగాడు కీర్తిమంతుడు.‘రాజా! గురువు ఆజ్ఞ మేరకు ఈ పనులన్నీ చేస్తున్నాం. వివరాలేవీ మాకు తెలియవు. ఆయనను కలుసుకుని, నేరుగా అడిగితే, ఆయనే చెప్పగలరు’ అని చెప్పారు శిష్యులు.కీర్తిమంతుడు వసిష్ఠాశ్రమంలోకి ప్రవేశించి, వసిష్ఠ మహర్షికి నమస్కరించాడు. ‘మహర్షీ! నేను ఇటువైపుగా వస్తుంటే, మీ శిష్యులందరూ బాటసారులకు కని విని ఎరుగని సపర్యలు చేస్తూ కనిపించారు. ఇది ఏమైనా ప్రత్యేకమైన క్రతువా? దీని వల్ల ఫలితమేమిటి? మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది’ అని అభ్యర్థించాడు.వసిష్ఠుడు కీర్తిమంతుడి జిజ్ఞాసకు సంతోషించాడు.‘రాజా! నా శిష్యులు చేస్తున్నవన్నీ వైశాఖమాస ధర్మాలు. వైశాఖమాసంలో మానవులందరూ తప్పనిసరిగా ఆచరించాల్సినవి– స్నానం, దానం. ఎన్ని ధర్మాలను ఆచరించినా, స్నాన దానాలను ఆచరించని మానవులు శ్రీహరికి ప్రీతిపాత్రులు కాలేరు. వైశాఖధర్మాలు సులభసాధ్యాలు. దప్పిగొన్న వారికి నీరు ఇవ్వడం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, అలసిన వారికి విశ్రాంతి పొందడానికి ఏర్పాట్లు చేయడం వంటి సామాన్య చర్యలే వైశాఖధర్మాలు. వీటిని ఆచరించిన మానవులకు శ్రీహరి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది’ అని చెప్పాడు.కీర్తిమంతుడు సంతోషంతో వసిష్ఠుడికి కృతజ్ఞతలు తెలుపుకొని, తన రాజధానికి చేరుకున్నాడు. మరునాడే తన భటులతో రాజ్యమంతటా ఇలా చాటింపు వేయించాడు: ‘నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎనిమిదేళ్ల పైబడిన బాలలు మొదలుకొని వృద్ధుల వరకు వైశాఖమాసంలో అనుదినం స్నానం చేయాలి. సంపన్నులు చలివేంద్రాలను, బాటసారులకు భోజనశాలలను, విడిది మందిరాలను ఏర్పాటు చేయాలి. స్నాన దానాలు చేయనివారికి కఠిన శిక్షలు తప్పవు’. కీర్తిమంతుడి రాజ్యంలో ప్రజలందరూ రాజాజ్ఞను తు.చ. తప్పకుండా పాటించసాగారు. రాజ్యంలో ఎవరూ ధర్మం తప్పనందున కాలంతీరి ఎవరు మరణించినా, వారందరూ నేరుగా విష్ణులోకానికి పోతున్నారు. యమలోకానికి వెళ్లేవారు ఎవరూ లేకపోయారు.ఇదే పరిస్థితి కొనసాగితే తన ఉనికికే ముప్పు వస్తుందని తలచిన యముడు తన పరివారంతో బయలుదేరి, కీర్తమంతుడి రాజ్యాన్ని ముట్టడించాడు. యుద్ధానికి పిలుపుగా భీకర శంఖారావం చేశాడు.కీర్తిమంతుడు సైన్య సమేతంగా యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు. ఉభయ సైన్యాలకు భీకర పోరు సాగింది. కీర్తిమంతుడు తన శక్తిమంతమైన బాణాలతో యమదూతలను రణరంగం నుంచి తరిమికొట్టాడు. యముడు నేరుగా కీర్తిమంతుడితో తలపడ్డాడు. తీక్షణమైన బాణాలతో కీర్తిమంతుడిని నొప్పించి, సింహనాదం చేశాడు. కీర్తిమంతుడు మూడు బాణాలతో యముడి ధనుస్సును విరిచేశాడు.ఆగ్రహించిన యముడు కాలదండాన్ని తీసుకుని, కీర్తిమంతుడిపైకి విసిరాడు.తన భక్తుడైన కీర్తిమంతుడి రక్షణ కోసం శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని సంధించాడు. ఆ చక్రం శరవేగంతో దూసుకొచ్చి, కాలదండాన్ని విసిరికొట్టింది. అది యముడి మీదకొచ్చింది. ఈ పరిణామానికి దేవతలంతా హాహాకారాలు చేసి, యముడిని క్షమించమని ప్రార్థించడంతో విష్ణువు తన చక్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కీర్తిమంతుడి చేతిలో ఎదురైన ఓటమికి తలవంచుకుని, యముడు తిరిగి తన లోకానికి బయలుదేరాడు. ∙సాంఖ్యాయన -
గర్భం దాలుస్తున్నాను... కానీ...
నాకు 30 సంవత్సరాలు. మా పెళ్లై ఐదు సంవత్సరాలు అయ్యింది. ప్రతిసారి నేను గర్భం దాల్చుతున్నాను, కానీ రెండు నుంచి మూడు నెలల్లోనే మిస్క్యారేజ్ అవుతోంది. ఇది మూడుసార్లకు పైగా జరిగింది. మాకు ఒక హెల్దీ బేబీ కావాలి. దీనికి కారణం ఏమిటి? ఎలా ట్రీట్ చేయాలి?– సుజాత, విజయవాడ.మూడుసార్లకు పైగా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతుంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. అంటే ప్రతిసారి ఎందుకు మిస్క్యారేజ్ అవుతోంది అన్నది తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేసి కారణాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ పరిశీలనలో ముందుగా డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవాలి. అసలు స్కాన్ చేయించారా లేదా, ఎన్ని రోజులకు లేదా ఎన్ని వారాలకు మిస్క్యారేజ్ అవుతోంది అన్నది తెలుసుకోవాలి. రెండు నెలలు పూరై్తన తర్వాత జరుగుతుందా, లేక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయిన వెంటనే జరుగుతుందా అన్నది కూడా అడగాలి. అలాగే స్కాన్ లో బేబీ హార్ట్బీట్ ఫార్మేషన్ ఉందా లేదా, ఒకసారి హార్ట్బీట్ వచ్చి పోయాక మిస్క్యారేజ్ అవుతోందా అన్నది కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది పూర్తిగా పరిశీలించాలి. సాధారణంగా మొదటి మూడు నెలల్లో, అంటే 12 వారాల లోపల రిపీటెడ్గా మిస్క్యారేజ్ కావడానికి కారణాలు; అలాగే మూడు నెలల తర్వాత మిస్క్యారేజ్ కావడానికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ పేషెంట్కు మొదటి మూడు నెలల్లోనే జరుగుతోంది కాబట్టి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే, ముందుగా తల్లికి, తండ్రికి జెనెటిక్ పరీక్షలు చేసి, జెనెటిక్ సమస్యలు ఉన్నాయా అని చెక్ చేయాలి. అలాగే మిస్క్యారేజ్ అయినప్పుడు బయటికి వచ్చిన టిష్యూ ఉంటే దానికి కూడా జెనెటిక్ పరీక్షలు చేసి, ఏదైనా జెనెటిక్ సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలా ఉంటే జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా సరైన మార్గదర్శకాలు తీసుకోవచ్చు. వయస్సు కూడా చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా తల్లి వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం లేదా తండ్రి వయస్సు 40 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం వల్ల మిస్క్యారేజ్ వచ్చే ప్రమాదం కొంచెం పెరుగుతుంది. అలాగే మధుమేహం ఉందా, థైరాయిడ్ సమస్య ఉందా, లేదా ఇతర వ్యాధులు ఉన్నాయా అన్నది కూడా పరిశీలించాలి. ముఖ్యంగా రక్త సంబంధిత లేదా ఇతర శరీర వ్యవస్థల సమస్యలు ఉన్నా కూడా మిస్క్యారేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒక స్కాన్ ద్వారా గర్భసంచి ఆకారం ఎలా ఉంది అన్నది చూడాలి. గర్భసంచిలో ఏదైనా నిర్మాణ లోపం ఉందా లేదా గర్భసంచి ఆకారం సాధారణంగా ఉందా అన్నది చెక్ చేయాలి. మంచి స్కాన్ ద్వారా గర్భసంచిలో ఏదైనా పొర లాంటిది ఉండి, దాని వల్ల బ్లడ్ సప్లై సరిగ్గా అందకపోతుందా అన్నది తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉంటే కొన్ని సందర్భాల్లో చిన్న ప్రొసీజర్ ద్వారా దాన్ని సరిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన కారణం రక్తం గడ్డకట్టే సమస్యలు. వీటిని థ్రాంబోఫీలియాస్ అని అంటారు. అంటే రక్తంలో ఉండే గడ్డకట్టే లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భానికి సరైన రక్తప్రసరణ జరగక మిస్క్యారేజ్ కావచ్చు. ఇందులో కొన్ని ప్రత్యేక పరీక్షలు చేసి, ఏదైనా తేడా ఉంటే దానికి సరైన మందులు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు అన్ని పరీక్షలు చేసినా కూడా కారణం స్పష్టంగా కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాలను అనెక్స్ప్లెయిన్ మిస్క్యారేజ్ అంటారు. అయినప్పటికీ, చిన్న చిన్న కారణాలు గుర్తించినా వాటిని ట్రీట్ చేయడానికి ప్రయత్నించి, భవిష్యత్తులో ఒక హెల్దీ బేబీ కోసం తల్లిదండ్రులు డాక్టర్ కలిసి ప్రయత్నించవచ్చు. ∙మేని మాటశరీరం ‘తనను తానే శుభ్రం’ చేసుకుంటుంది!రోజూ స్నానం చేస్తూ శరీరాన్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటున్నారని అనుకుంటున్నారా? కానీ, అసలు క్లీనింగ్ మాత్రం లోపలే జరుగుతోంది! మన శరీరంలో ‘అటో ఫాగీ’ ప్రక్రియ నిరంతరాయంగా పనిచేస్తూ, పాడైన కణాలను తొలగించి కొత్త కణాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా మనం నిద్రపోతున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ ‘ఇన్నర్ క్లీనింగ్’ స్పీడ్ మరింత పెరుగుతుంది. డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ -
క్లూషియల్: బిలియనీర్ అనుమానాస్పద మృతి
‘శ్రీవాత్సవ బిజినెస్ ఎంపైర్ టవర్స్..‘ప్రముఖ వ్యాపారవేత్త శ్రీవాత్సవ అనుమానాస్పదంగా మరణించాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన వందమందిలో ఒకరైన అతని మరణం సంచలనమైంది. పరిశోధన మొదలైంది.ఢిల్లీ నుంచి వచ్చిన వైద్యబృందం తీవ్రమైన ఒత్తిడి వల్ల మరణించి ఉండవచ్చని అభిప్రాయపడింది. ఎన్ఐఏ– స్పెషల్ ఏజెంట్ అభిమన్యుని రంగంలోకి దించింది. హైదరాబాద్ చేరుకున్నాడు అభిమన్యు. టైమ్ అర్ధరాత్రి రెండు గంటలు. ఆ చాంబర్లో కమిషనర్ ప్రద్యుమ్న, శ్రీవాత్సవ భార్య, అభిమన్యు ఉన్నారు.‘‘సారీ మిసెస్ శ్రీవాత్సవ గారు! ఈ టైమ్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు. శ్రీవాత్సవగారు ఏ విషయంలోనైనా టెన్షన్ ఫీలవ్వడం గమనించారా?’’ అడిగాడు అభిమన్యు.‘‘లేదు, తను స్ట్రెస్ ఫీలవ్వడం ఎప్పుడూ చూడలేదు. కోవిడ్ టైమ్లో అయిదు వందల కోట్ల నష్టం ఎదురైనప్పుడే తేలిగ్గా తీసుకున్నారు’’ చెప్పింది మిసెస్ శ్రీవాత్సవ. తనకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? ‘‘బెదిరింపులకు భయపడడు. చాలా మొండి మనిషి.’’ మిసెస్ శ్రీవాత్సవ చెప్పింది.అభిమన్యు ఆలోచనలో పడ్డాడు. ‘శ్రీవాత్సవను ఒత్తిడికి గురిచేసిన విషయం ఏమై ఉంటుంది?’శ్రీవాత్సవ ఫోన్ను అన్లాక్ చేసి; ఫోన్ డేటాను పరిశీలించాడు. అనుమానించదగినది ఏదీ కనిపించలేదు. చాంబర్లో అనుమానం కలిగించేవేవీ కనిపించలేదు. స్టాఫ్ను విచారించాడు. అభిమన్యు దృష్టి ‘కీ చైన్’ మీద పడింది. శ్రీవాత్సవ పిడికిట్లో వుంది. సిక్స్ నైన్ అనే అంకెలు ఉన్న కీ చైన్. ఎలాంటి కీ లేదు.ఆ కీ చైన్ మిసెస్ శ్రీవాత్సవకి చూపించి, ‘‘దీని గురించి చెప్పగలరా?’’ అని అడిగాడు.‘‘లాస్ట్ వీక్ స్విట్జర్లండ్ వెళ్లినప్పుడు తెచ్చుకున్నాడు. అంతకు మించి విశేషమేమీ లేదు’’ చెప్పింది మిసెస్ శ్రీవాత్సవ.‘‘కేసు క్లోజ్ చేయాల్సిందేనా?’’ కమిషనర్ అడిగాడు.‘‘కేసు ఇప్పుడే మొదలైంది’’ అంటూ అభిమన్యు కీ ఎక్కడ కొన్నదో చెక్ చేశాడు. ఆ చైన్ శ్రీవాత్సవ క్యాష్ పే చేసి కొన్నట్టు తేలింది. అవి ప్రత్యేకంగా ఆర్డర్ చేసి, తమ లక్కీ నంబర్లు కలిసొచ్చేలా ఆర్డర్ చేస్తారు. ఈ అంకెల్లో ఏదో ఉంది!అభిమన్యు ఆలోచిస్తూనే నేమ్ ప్లేట్ వైపు చూసి వెంటనే మిసెస్ శ్రీవాత్సవకు ఫోన్చేసి, ‘‘క్షమించండి. ఈ టైమ్లో డిస్టర్బ్ చేసినందుకు. మీ వారికి న్యూమరాలజీ మీద నమ్మకం ఉందా?’’ అడిగాడు.‘‘ఉంది. తన పేరును శ్రీవాత్సవ్ గా మార్చుకోవడానికి కారణం అదే...’ అని ఇంకేదో చెప్పబోతుండగా, ‘‘థాంక్యూ’’ అని ఫోన్ పెట్టేసి, కమిషనర్ వైపు తిరిగి ‘‘అర్జెంట్ గా స్విట్జర్లాండ్ వెళ్ళాలి... ఈ సిక్స్ నైన్ కీ చైన్కు, స్విట్జర్లండ్కు సంబంధం ఉంది.. నైన్ అంకె శ్రీవాత్సవ పేరు.. సిక్స్ అంకె...’’ అని ఆగి, వెంటనే ‘‘గాటిట్...’’ అని కమిషనర్ వైపు తిరిగాడు.‘‘శ్రీవాత్సవ ఒక్కడే స్విట్జర్లండ్ వెళ్లాడు. బిజినెస్ పనిమీద కాదు. స్విస్ బ్యాంకులు శ్రీవాత్సవలాంటి బిలియనీర్లకి కామధేనువులు. శ్రీవాత్సవ తెలివైన వ్యాపారవేత్త. సిక్స్ అంకె ‘లాకర్’ను సూచిస్తుంది. ఏదో క్లూ కీ చైన్లో ఉంది.’’ అన్నాడు.స్విట్జర్లండ్...మిసెస్ శ్రీవాస్తవ తరఫున లీగల్ డాక్యమెంట్లు సమర్పించడంతో స్విస్ బ్యాంకు లాకర్ను ఓపెన్ చేశారు.లాకర్లో విదేశాల్లో కొన్న ఖరీదైన ఫోన్. అందులో ఒకే కాంటాక్ట్– సెక్రటరీ మాయ నంబర్. శ్రీవాత్సవ రికార్డ్ చేసిన వాయిస్.‘‘మీరు నా వాయిస్ వినేసరికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. నేను నా అంతరాత్మకు తప్ప ఎవరికీ భయపడను. ఒక బలహీన క్షణంలో సెక్రటరీతో నా సంబంధం నన్ను ట్రాప్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్తగా నాకున్న పరిచయాలు వాడుకోవాలని చూసింది. మేము సన్నిహితంగా ఉన్న వీడియోలు పంపి బ్లాక్ మెయిల్ చేసింది. హోంమంత్రిని, రక్షణ శాఖ అధికారులను పరిచయం చేయమంది. లేకపోతే వీడియోలు బహిర్గతం చేస్తానని బెదిరించింది. వీడియోలు బయటకు వస్తే నా కంపెనీ షేర్లు పడిపోతాయి. నా సంస్థల మీద ఆధారపడ్డ వేలాది కుటుంబాలు వీధిన పడతాయి. అలా అని దేశ రక్షణను పణంగా పెట్టను. నా మరణాన్ని పరిశోధించడానికి మీరొస్తారని తెలుసు...’’ ఒకవిధంగా శ్రీవాత్సవ మరణవాంగ్మూలం.శ్రీవాత్సవ స్విట్జర్లండ్కు రావడానికి కారణం తెలిసిపోయింది. అప్పటికే పారిపోయే ప్రయత్నంలో ఉన్న మాయను అరెస్ట్ చేశారు. అభిమన్యు సూచన మేరకు శ్రీవాత్సవ సెక్రటరీ మాయ– అతడు మరణించిన విషయం తెలుసుకుని, అతని కోటు జేబులో ఉన్న డబ్బు దొంగిలించి పారిపోతూ సీసీ కెమెరాలకు చిక్కింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు’’ అన్న వార్త మీడియాలో ఫ్లాష్ అయ్యింది.ఎన్ఐఏ కార్యాలయం..మాయ ఎదురుగా అభిమన్యు.‘‘చాలా సిల్లీ పెట్టీ కేసు కదూ! నువ్వు బయట కనబడితే జనం, పోలీసులు వదలరు. నీ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. రికార్డుల్లో లేని ఖైదీవి. నీ కోసం మీ వాళ్ళు కూడా గాలిస్తారు. లైఫ్లో హనీ ట్రాప్ చేయకుండా, శ్రీవాత్సవ ఆత్మ శాంతించేలా నీకు ఈ శిక్ష ...’’అభిమన్యు ఇంటరాగేషన్ సెల్ నుంచి బయటకు నడిచాడు. -
ఈ వారం కథ: పోడుస్తున్న పోద్దు
‘‘నువ్వెప్పుడైనా నిలువుటద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకుంటావా?’’ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పార్కుకి తీసుకువచ్చి, అవీ ఇవీ చెపుతూ వున్నట్టుండి ఇలా వ్యక్తిగతమైన ప్రశ్న వేసిన తులసి కేసి ఆశ్చర్యంగా చూసింది ప్రగతి.‘‘అద్దంలో చూసుకోవడం రోజూ అందరూ చేసే పనే కదా? నా గురించి ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావ్?’’‘‘నువ్వు ప్రత్యేకం కాబట్టి. నిన్ను చూసుకుని నువ్వే మోహించేటంత, ముట్టుకొంటే డాగు పడేటంత అపురూపమైన అందాన్ని నీకు భగవంతుడిచ్చాడు. సినిమాతారలకు మించిన సహజ సౌందర్యం నీది. కానీ ఏం లాభం? దాన్ని అడవికాసిన వెన్నెల చేస్తున్నావ్. ఈ వయసులో ఓ బాయ్ఫ్రెండు, బాడీగార్డు, ప్రేమ – దోమ ఎఫైరూ –ఎంజాయ్మెంటూ, థ్రిల్లూ – గిల్లూ... ఇలాంటివేం లేకుండా జీవితాన్ని చప్పగా గడిపేస్తున్న నిన్ను చూస్తుంటే ఆశ్చర్యమే కాదు – జాలేస్తోంది కూడా...’’‘‘తులసీ, ఇలా క్లాస్ పీకడానికా నన్నిక్కడికి తీసుకొచ్చింది?’’ ప్రగతి అసహనంగా చూసింది.‘‘సారీ, నీ మంచి కోరి చెబుతున్న నన్నర్థం చేసుకో. ‘ఓ ప్రేమ లేఖ – ప్రపోజలూ, అచ్చటా – ముచ్చటా దేనికీ నోచుకోని దరిద్రగొట్టు బతుకుల్ని మాకెందుకిచ్చావు దేవుడా!’ అని ఏడ్చే నాలాంటి అమ్మాయిలు ఎందరున్నారో నీకు తెలియదు. ఎందుకంటే కొమ్ములు తిరిగిన కుర్ర హీరోలు వెర్రివాళ్ళలా వెంటపడుతున్న అదృష్ట జాతకురాలివి నువ్వు. కానీ దేవుడు నీకు యిచ్చిన వరానికి ఏమాత్రం గర్వపడక ఇంత రిజర్వ్డ్గా మడిగట్టుకుని ఉండడానికి కారణం తెలుసుకుందామని, ఇలా వసంతంలాంటి వయసును వ్యర్థం చేసుకుంటే, ఆ తర్వాత పోగొట్టుకున్న దానికోసం ఎంత పరితపించినా ప్రయోజనం ఉండదని చెప్పడానికే...’’‘‘చెప్పింది చాలు. నా బుర్ర తినకు. నేనే పొరపాటూ చేయడం లేదు. నా తీరు, నా దారి చాలా తృప్తికరంగానూ. ప్రశాంతంగానూ వున్నాయి.’’ ‘‘కాదు. నువ్వు ఆత్మవంచన చేసుకుంటూ అబద్ధాలు చెబుతున్నావ్. నీ మనస్సాక్షిగా నిజం చెప్పు. నీకు ఎప్పుడూ శృంగారపరమైన ఊహలూ, కవ్వించే కలలూ రావడం లేదూ? ఒంటరిగా ఉన్నప్పుడు వయస్సు పోరుతో మానసికంగా పులకింతలూ, గిలిగింతలూ కలగడం లేదూ? అబ్బాయిలు నీకేసి అదే పనిగా ఆరాధనాపూర్వకంగా చూస్తూంటే నీకే ‘ఫీలింగ్స్’ కలగడం లేదంటే నేను చస్తే నమ్మను...’’‘‘నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కొచ్చిన నష్టం లేదు. అనవసరమైన విషయాలు ప్రస్తావించి నన్ను విసిగించకు’’‘‘పిచ్చి పిల్లా, నేను చెప్పేవన్నీ వయోధర్మాలు, మర్మాలూ! కాని, సర్వసామాన్యమైన పచ్చినిజాల్ని ఒప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావ్. ఈ కాలంలో హైస్కూల్ దశలోనే ఆడపిల్లలు ప్రేమపిచ్చితో రెచ్చిపోతూ మొబైల్స్ని వదలడం లేదంటే – ఇంజనీరింగ్ ఫైనల్కొచ్చి నువ్వింత బుద్ధిగా వుండడం సాధ్యమా? నువ్వు మరోలా అనుకోకపోతే నిన్నో ప్రశ్న సూటిగా అడుగుతున్నాను – ఇంతవరకు ఏ మగధీరుణ్ని చూసినా నీ మనస్సు చలించలేదా? నా మీద ఒట్టేసి చెప్పు’’లేదన్నట్టు ప్రగతి అడ్డంగా తల ఆడించింది.‘‘యూ ఆర్ రియల్లీ గ్రేట్. అయితే నువ్వెంతగా పట్టించుకోకపోయినా నీ లాంటి అందాలరాశికి నిన్ను వెంటాడే మృగాళ్ల వల్ల ముప్పు రావచ్చు. మనం తరచుగా వార్తల్లో చూస్తున్నాం కదా! ప్రేమను అంగీకరించని నేరానికి ఎంతమంది అమాయక యువతులు యాసిడ్ దాడులకు, కత్తిపోట్లకు, అఘాయిత్యాలకు బలి అవుతున్నారో! అందుచేత నీలాంటి బుద్ధిమంతురాలికి భద్రత అవసరం. ప్రేమరొంపిలో దిగమనను కాని, నువ్వంటే పడిచచ్చే బకరాల్లో ఒకణ్ణి ఎంచుకొని ఊరిస్తుంటే చాలు నీ రక్షణ సంగతి వాడు చూసుకుంటాడు...’’‘‘తులసీ, నాకిలాంటి చెత్త సలహాలివ్వకు ఏకపక్షంగా నా జోలికి ఎవరొచ్చినా. ఆ పోకిరీగాళ్లకు బుద్ధి చెప్పగలననే ధైర్యం నాకుంది...’’ ప్రగతి మాటల్లో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోంది.‘‘సెభాష్. నువ్వు నాకు నచ్చావ్. అలాగే మా అన్నకూ తెగ నచ్చేశావ్..’’‘‘మీ అన్నెవడు? అతగాడికి నాకూ ఏం సంబంధం?’’ ప్రగతి ప్రశ్నల్లో కరకుదనానికి తులసి తుళ్లిపడింది.‘‘కోప్పడకుండా పూర్తిగా విను. మా అన్నంటే నా కజిన్. పేరు భూపతి. నా కోసం కాలేజీకి వచ్చినప్పుడెప్పుడైనా చూసుంటావ్. అచ్చం సినిమా హీరోలా వుంటాడు. ఆపైన కోటీశ్వరుడు. ఈ నెక్లెస్ మొన్న రాఖీ కట్టిన సందర్భంగా వాడిచ్చిందే...’’‘‘అయితే ఏమిటి? సూటిగా చెప్పు’’ ప్రగతి మొహం ఎర్రబడ్డం తులసి గమనించింది.‘‘కూల్ డౌన్ ప్రగతీ. ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడైన మా అన్న మీద పడుతున్న వాళ్లందరినీ కాదని నువ్వంటే ఇష్టపడుతున్నాడు.వాడెంత మర్యాదస్తుడంటే – నీ ఎదుటపడి ‘ఐ లవ్ యు’ అని చెప్పలేక నిన్ను పరిచయం చేస్తే చాలని నన్ను చంపుకొని తింటున్నాడు...’’‘‘అర్థమైంది. ఇదన్నమాట అసలు సంగతి. ఈ విషయం చెప్పడానికా ఇంత ‘బిల్డప్’ ఇచ్చావ్? మీ అన్నకు నిర్మొహమాటంగా చెప్పు. నా మీద ఎలాంటి పిచ్చి భ్రమలూ పెట్టుకోవద్దని!, అతను అపర కుబేరుడైనా, నలకూబరుడైనా నా మనసు చలించదనీ, ప్రేమ నాకు ఆమడ దూరమనీ! పాపం మీ అన్నకు దూతికగా నువ్వు చాలా శ్రమపడ్డావు చాలు. ఇక పద క్లాసుకు టైమవుతోంది...’’ అంటూ విసుగ్గా విసురుగా పైకి లేచింది ప్రగతి. ఆమె నిగ్రహానికి, మనోబలానికి విస్తుపోయిన తులసి ఇంకేం చెప్పినా వినదని మౌనంగా ప్రగతి వెంట కాలేజ్ వైపు నడిచింది...ఎంత నచ్చజెప్పినా, బతిమాలినా కనీసం భూపతి ఎదుటపడ్డానికి కూడా అంగీకరించని ప్రగతి దృఢవైఖరి తులసి అహాన్ని దెబ్బతీసింది. భూపతి మెప్పు కోసం అతణ్ణి ప్రగతిని నీడలా వెంటాడమని, అందుకు తాను సహకరిస్తానని తులసి అతనికి మాటిచ్చి ప్రోత్సహించింది. తులసి కోసమనే వంకతో తరచుగా కాలేజీకి వస్తూ భూపతి ప్రగతి పెడమొహం పెట్టినా పరిచయం చేసుకున్నాడు. ఎన్నోసార్లు తన కారులో ‘లిఫ్ట్’ ఇచ్చే భాగ్యాన్ని ఇమ్మని ప్రాధేయపడ్డాడు, బలవంతపెట్టాడు కూడా. పిక్నిక్కనీ, కార్తిక వనసమారాధనకనీ, పుట్టిన రోజనీ... ఇలా వివిధ సందర్భాలకు తులసితో కలిసి ఆహ్వానించినా, అన్నిటినీ ప్రగతి తిరస్కరించింది. ప్రగతి సినిమాకో, షాపింగ్ కో, ఏదైనా సభకో... ఎక్కడికెళ్లినా ఆ సమాచారం ముందుగా తెలుసుకొని అక్కడ ప్రత్యక్షమై అతి మర్యాదలు చెయ్యబోయే భూపతిని ఆమె కటువుగా హెచ్చరించింది. తులసి పుట్టినరోజు వేడుకకు మాత్రం స్నేహితురాళ్ల బలవంతం మీద వాళ్లతో కలిసి వెళ్లిన ప్రగతికి అక్కడ కూడా భూపతి పీడ తప్పలేదు. ప్రగతికి అతి ప్రాధాన్యమిచ్చి, పాడడం రాదన్నా పాటలు పాడమని వేధించి, వద్దంటుంటే చనువుగా కేకు తినిపించి, ఆమెకు ప్రత్యేకంగా వీడియో ఏర్పాటు చేసి, అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న భూపతి హింసను భరించలేక – తలనొప్పి సాకుతో మధ్యలోనే ప్రగతి అక్కణ్ణుంచి వెళ్లిపోయింది. కారులో డ్రాప్ చేస్తానని భూపతి వెంటబడితే ఆమె అందరిముందు చీదరించుకోవడంతో ఆ పురుష పుంగవుడికి తల కొట్టేసినట్టయింది. ఆ సంఘటనతో అతను తోక తొక్కిన త్రాచులా రెచ్చిపోయాడు. కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఆమెను ఫ్రెండ్స్ ముందు అసభ్య పదజాలంతో వేధించడమే గాక ఆమె శీలం మీద బురద చల్లే పుకార్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించాడు.భూపతి ఆవూళ్లో రెండు థియేటర్లు, జిల్లా అంతటా పెట్రోలు బంకులూ, మద్యం దుకాణాలూ వగైరావున్న సంపన్నవ్యాపారి శ్రీపతి ఏకైక పుత్రరత్నమనీ, పోలీసులను కూడా శాసించే యువ రాజకీయవేత్తనీ, అతనికి లేని వ్యసనం లేదనీ తెలిసిన ప్రగతి అతని వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడి, అతని సంగతి తనను పెంచి పెద్దచేసిన అమ్మమ్మ అనసూయమ్మ చెవిన వేసింది. ఆవిడ కంగారుపడి ఎప్పటి నుంచో అనుకుంటున్న దగ్గర సంబంధం – సాఫ్ట్ వేర్ ఇంజినీరు, అన్ని విధాలా యోగ్యుడు అయిన వివేక్తో పెళ్లి నిశ్చయించి, ముహూర్తం కూడా పెట్టించింది.తులసి ద్వారా ప్రగతి పెళ్లి వార్త తెలిసిన భూపతి తనకు దక్కని ప్రగతిని ఎవరికీ దక్కనివ్వనన్నాడు. దారికాసి ప్రగతిని అటకాయించి మంచిగా తనతో పెళ్లికి అంగీకరిస్తే కళ్లలో పెట్టుకొని చూసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఆమె ‘ఛీ’ కొట్టి తిరస్కరించడంతో ఇరవై నాలుగు గంటలలోగా ఆమె వివేక్తో పెళ్లి రద్దు చేసుకొని తనకు ఓకే చెప్పకపోతే ఆమె అంతు చూస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులను లెక్కచెయ్యకుండా గడువులోగా ఎటువంటి సమాధానమూ చెప్పని ప్రగతి ముందు అతను ప్రత్యక్షమై కొన్ని ఫోటోలు ఆమె చేతికిచ్చి, ఆ కాపీలు వివేక్కి పంపిస్తానని బ్లాక్ మెయిలింగ్ ఆయుధాన్ని ప్రయోగించాడు. అవి మార్ఫింగ్ చేసిన కొన్ని ప్రగతి అర్ధనగ్న చిత్రాలు, మరికొన్ని ఆమె భూపతి కౌగిలిలో ఉన్నవీ! ఆ ఫోటోలు చూసిన ప్రగతి అగ్నిహోత్రమైంది. ఆమె మనోనేత్రాల ముందు అలాంటి బెదింపులకు బలయిన తల్లి ప్రతిమ దీనగాథ కదలాడింది...ప్రతిమ గోదావరి జిల్లాకు చెందిన సంప్రదాయ కుటుంబం నుంచి పీజీ చెయ్యడానికి వాల్తేరు వెళ్లింది. ఆమె పేరుకు తగ్గ బంగారు బొమ్మ. ఇంట్లో వాళ్లకిచ్చిన హామీకి తలవొగ్గి ఎవరితోనూ ఎటువంటి పరిచయాలు పెంచుకోని ప్రతిమ మంచిగాయని అనే విషయం లేడీస్ హాస్టల్ అంతటికీ తెలిసింది. ఫ్రెండ్స్ బలవంతం మీద యూనివర్సిటీ సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండు మూడుసార్లు పాల్గొన్న ఆమె సమ్మోహన గానం ఆమెను అభినందించడానికి వచ్చిన మోహన్ని పరిచయం చేసింది. అతను ఇంజినీరింగ్ విద్యార్థి. పాటలు రాయడమే కాకుండా మధురంగా స్వరకల్పన చేయగల సంగీతజ్ఞుడుగా అప్పటికే అతనికి కేంపస్లో మంచిపేరుంది. క్రమంగా అతని పాటల్ని ఆమె పాడ్డం, పరస్పర ప్రశంసలు – వాళ్ల ప్రేమకు దారి తీశాయి. వలపు చిగురించి, ప్రేమలేఖలు పుష్పించి, వాళ్ల అనుబంధం మధుమాసమై పరిమళించింది. ఇటు భీమిలి బీచ్ నుంచి అటు సింహాచలం వరకు ఎందరో ప్రేమికుల్ని చూసిన సంకేత స్థలాలన్నీ వాళ్ల ప్రణయానికి విహారవేదికలయ్యాయి. ‘మరో చరిత్ర’లో బాలు–స్వప్నల్లా రాళ్ల మీద కాకపోయినా ఆ ప్రేమ జంట ఇసుకలో తమ పేర్లను ఎన్నోసార్లు రాసుకొన్నారు...ప్రతిమ మోహన్ల ప్రేమాయణానికి అసూయపడిన ప్రతిమ రూమ్మేట్ రజని ఆ సంగతిని ప్రతిమ తల్లిదండ్రులకు తెలియపరచింది. అప్పటికే గాలివార్తను విన్నా, ప్రతిమ మీద నమ్మకంతో దానిని పట్టించుకోని వాళ్లు రజని ఇచ్చిన సమాచారంతో ఆ పొగ వెనక నిప్పు వుందని నిర్ధారించుకొని ఆగమేఘాల మీద వాల్తేరు వెళ్లి, ఉన్నపళంగా ప్రతిమను ఇంటికి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా కూతురు గోడు వినకుండా ఆమెను ప్రభాకర్ అనే ఇంజినీరుకిచ్చి ఆ మూడు ముళ్లూ వేయించి, ఊపిరి పీల్చుకున్నారు. క్రమంగా ప్రభాకర్ సాహచర్యంలో సంసార పర్వంలో ఏ లోటు లేని ప్రతిమ గతాన్ని, మోహన్ని పూర్తిగా మర్చిపోయింది. ఓ ఆడపిల్లకు తల్లయింది.నాలుగేళ్లు ఆనందంగా గడిచిన తర్వాత అనూహ్యంగా ఆ ఇంటిలో మోహన్ ప్రత్యక్షమయ్యాడు. ప్రభాకర్ పనిచేస్తున్న ఆఫీసుకు కొత్తగా వచ్చిన అతణ్ని ఆయన లంచ్కి పిలిచాడట! తనెవరో ఎరగనట్టున్న ప్రతిమను చూసి మోహన్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ప్రభాకర్ లేని సమయంలో వచ్చి గతాన్ని గుర్తుచేశాడు. ప్రతిమకేమైందో తెలియక ఆమె కోసం ఎదురు చూసి చూసి చివరకు కల్లబొల్లి కబుర్లతో తనకు చేరబడిన రజనినే పెళ్లిచేసుకున్నాననీ, కాని ఆమె నరకాన్ని చూపిస్తోందనీ ఆమెకు విడాకులిచ్చి తిరిగి ప్రతిమను చేసుకుంటాననీ ప్రపోజ్ చేశాడు. చేజారిన పెన్నిధి అదృష్టం కొద్దీ తిరిగి ఇలా కంటపడిందనీ, తను చెయ్యని తప్పును అర్ధం చేసుకొని తమ ప్రేమకు ప్రాణం పొయ్యమనీ అర్థించాడు. అతని రాకకూ కోరికకూ అప్రతిభురాలైన ప్రతిమ అతనికి చేతులెత్తి దణ్ణంపెట్టి పచ్చని తమ సంసారంలో చిచ్చు పెట్టవద్దనీ, తనను మరచిపొమ్మనీ వేడుకొంది. కాని అతను పట్టువిడిచి పెట్టకుండా ఆమె తనతో రావడానికి అంగీకరించకపోతే తను భద్రంగా దాచివుంచిన ఆమె ప్రేమలేఖల్ని ప్రభాకర్కి చూపిస్తానని బెదిరించాడు. మోహన్తో ఎప్పుడూ హద్దు మీరకపోయినా అతని బ్లాక్ మెయిలింగ్కి భయపడిపోయిన ప్రతిమ పసిగుడ్డును తల్లి చేతుల్లో పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది!తనకు యుక్తవయసు వచ్చిన తర్వాత తల్లి మరణ రహస్యాన్ని చెప్పిన అమ్మమ్మ ఆ అనుభవం నేర్పిన పాఠంతో ఎన్నడూ ప్రేమవ్యవహారంలో చిక్కుకోనని తన చేత ఒట్టేయించుకొంది. నాన్న స్పందన తెలుసుకోకుండానే ‘అమ్మ అనవసరంగా ఉద్రేకపడింది. అప్పటి కథ పునరావృతం కాకూడదు. నేను అమ్మలా చేయని తప్పుకు బేలనై బెదిరిపోక, ఈ తరం స్త్రీ అబల కాదనీ చీకటిని చీల్చుకొని వచ్చే పొడుస్తున్న పొద్దు లాంటిదనీ నిరూపిస్తాను. భూపతి ఆట కట్టిస్తాను..’ అని దృఢమైన నిర్ణయాన్ని తీసుకొని ధైర్యంగా నేరుగా కాబోయే భర్త వివేక్ దగ్గరకు వెళ్లింది. భూపతి బ్లాక్ మెయిలింగ్ గురించి చెప్పి ఆ ఫోటోలను సిగ్గుపడకుండా అతనికి చూపించింది. నిజానిజాలను తెలసుకొని తన నిజాయితీ పట్ల నమ్మకముంటే మాత్రమే తనను పెళ్లి చేసుకోమని, నిర్ణయాన్ని అతనికే విడిచి పెడుతున్నాననీ నిర్భయంగా చెప్పింది. ప్రగతి సాహసోపేతమైన చర్యకు ఆశ్చర్యపోయిన వివేక్ ఆమెకేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ – ‘‘డార్లింగ్, నీ ధైర్యాన్నిఅభినందిస్తున్నాను. నీలాంటి సాహసి అయిన ప్రేయసి తోడుంటే జీవితంలో నాకు అసాధ్యాలుండవు. నిన్ను నిస్సందేహంగా నా దానిని చేసుకుంటాను. పద, ఈ ఫొటోలు స్టేషన్లో చూపించి ఈ దారుణానికి కారకుడైన భూపతిని నిర్భయ కేసు కింద అరెష్టు చేయిద్దాం...’’ అంటూ ఆమెకు చేయి అందించాడు. ప్రగతి ఆనందంగా అతని చేతినందుకొని ముందుకు నడిచింది...! -
కథాకళి: కొత్త పొరుగు
మా పై ఫ్లాట్లోకి ఎవరో కొత్తగా అద్దెకి వచ్చారు. పైనుంచి చప్పుళ్ళు వినిపించసాగాయి. ‘‘నిన్న రాత్రి ఆ చప్పుళ్ళకి నాకు నిద్రపడితే ఒట్టు.’’ మర్నాడు మావారికి చెప్పాను.చక్రాల కుర్చీని తోసుకుంటూ బ్రేక్ఫాస్ట్ బల్ల దగ్గరికి వెళ్ళాను. పై ఫ్లాట్ నుంచి వచ్చిన ఆమ్లెట్, చికెన్ సేండ్విచ్లు చూపించి మావారు చెప్పారు. ‘‘అదృష్టం. ఫ్రెండ్లీ పీపుల్.’’రెండు రాత్రుల తర్వాత పై ఫ్లాట్లోంచి మళ్ళీ అరుపులు వినిపించాయి.‘‘భార్యాభర్తల పోట్లాట.’’ మావారు చెప్పారు.‘‘వాళ్ళకి ఫర్నిచర్ సర్దిన అలసట తీరినట్లుంది.’’ నవ్వుతూ చెప్పాను.మరో రెండు రోజుల తర్వాత బ్రేక్ఫాస్ట్ అయ్యాక మావారితో కబుర్లు చెప్తూ కాఫీ తాగసాగాను. డోర్ బెల్ మోగడంతో మావారు వెళ్ళి తలుపు తెరిస్తే ఓ ముప్ఫై ఏళ్ళ యువతి బయట నించుని కనిపించింది. ఆమె చేతుల్లో ఓ పసిబిడ్డ ఉంది.‘‘హలో. గుడ్ మార్నింగ్. మేము మీ పై అపార్ట్మెంట్కి అద్దెకి వచ్చాం. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉండటంతో ప్రైవసీ బావుందని దీన్ని తీసుకున్నాం.’’ నవ్వుతూ చెప్పింది.‘‘రండి. పాప పేరేమిటి?’’ నవ్వుతూ ఆహ్వానించాను.ఆమె చెప్పాక మావారు నన్ను పరిచయం చేసి చెప్పారు.‘‘థాంక్స్. సేండ్విచెస్ చాలా రుచిగా ఉన్నాయి.’’‘‘మీకు బాగా శబ్దాలు వినిపించి ఉంటాయి. అపాలజీగా వాటిని పంపాను.’’‘‘మీ పిల్లల్ని మా ఆవిడ దగ్గర వదిలి మీరు షాపింగ్కి కాని, ఎక్కడికైనా వెళ్ళచ్చు.’’ మావారు సూచించారు.‘‘ఓ. థాంక్స్. అత్యంత అవసరమైతే తప్ప మీకా శ్రమ ఇవ్వను. మీ కాలికి ఏమైంది?’’ ఆమె నా కాలికి ఉన్న కట్టుని చూసి అడిగింది.‘‘పడ్డాను. సూపర్ బజార్లో పిల్లలు అరటిపళ్ళని నేలమీద పడేశారు. చితికిన అరటిపళ్ళు రోడ్ మీద ఒలికిన ఆయిల్ కన్నా ప్రమాదం. వాటి మీద కాలు వేసి జారిపడడంతో కుడికాలు విరిగింది. ఇంకో మూడు వారాల దాకా అది అతుక్కోదని డాక్టర్ చెప్పాడు.’’ జవాబు చెప్పాను.‘‘అందులో మన అపార్ట్మెంట్కి లిఫ్ట్ కూడా లేదు. ఐయాం సారీ. ప్లీజ్ గెట్వెల్ సూన్.’’ ఆమె చెప్పింది.‘‘తలకి తగలకపోవడం అదృష్టం.’’ మావారు చెప్పారు.∙∙∙ఆ రాత్రి మావారికి పై ఫ్లాట్నుంచి వినిపించే ఏడుపుకి మెలకువ వచ్చి నన్ను లేపారు. అది ఆమె ఏడుపుగా గుర్తించాను. ఆమె భర్త అరుపులు వినిపించాయి. ఆ ఏడుపు కొద్దిసేపు విని ఆయన విసుగ్గా అరిచారు.‘‘ఈ కొత్త పొరుగు న్యూసెన్స్ ఏమిటి? మన సెక్రటరీతో చెప్పి వాళ్ళని ఖాళీ చేయించాలి. నాకు రేపు ప్రజంటేషన్ కూడా ఉంది.’’ కోపంగా చెప్పారు.మర్నాడు ఉదయం మావారు వెళ్ళాక ఇంటర్నల్ ఇంటర్కమ్ మోగింది. ఆమె నుంచి ఆ కాల్. ఇద్దరం ఒకరినొకరం పలకరించుకున్నాక ఆమె అడిగింది.‘‘నేను ఈ సందు చివర కార్నర్ స్టోర్కి వెళ్ళిరావాలి. నేను వచ్చేదాకా మా అమ్మాయిని మీ దగ్గర ఉంచుకుంటారా? సరిగ్గా ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను.’’‘‘తప్పకుండా. తీసుకురండి.’’‘‘నిద్రపోతోంది. లేస్తే ఎవరూ కనపడకపోతే ఏడుస్తుందని.’’వెంటనే చక్రాల కుర్చీలో తలుపు దగ్గరకి వెళ్ళి దాన్ని తెరిచాను. నాలుగైదు నిమిషాల్లో భుజం మీద చిన్నపాపతో ఆమె వచ్చింది. రబ్బర్ షీట్ కూడా తెచ్చింది. గెస్ట్ రూమ్లోని మంచాన్ని చూపించాను.‘‘థాంక్స్ ఎలాట్.’’ పాపని పడుకోబెట్టి వెళ్ళిపోయింది.ఆమె చెప్పినట్లుగా ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది.‘‘మా అమ్మాయి లేవలేదుగా?’’‘‘లేదు.’’‘‘లేవదని తెలుసు. థాంక్స్ అగైన్.’’ కేరీ బేగ్తో పైకి వెళ్తూ చెప్పింది.∙∙∙ఆ రాత్రి పైనుంచి మళ్ళీ మాకు పోట్లాటతో మొదలై కొట్టిన చప్పుళ్ళు, తాగుబోతు మగ గొంతు వినిపించాయి. దాంతోపాటు ఆమె ఏడుపు కూడా.‘‘రేపు ఆ ఇంటాయనకి ఫోన్ చేసి ఈ న్యూసెన్స్ ఏమిటని అడుగుతాను.’’ మావారు కోపంగా అరిచారు.మర్నాడు ఉదయం డోర్ బెల్ మోగింది. చక్రాల కుర్చీని తోసుకుంటూ వెళ్ళి తలుపు తెరిస్తే ఎదురుగా వాచ్మేన్. భయంగా మెట్లవైపు చూపించాడు. లుంగీలోని ఓ ముప్ఫై ఐదేళ్ళ వ్యక్తి ఆఖరు మెట్టు మీద పడున్నాడు. అతని మెడ అసహజ రీతిలో తిరిగి ఉండడంతో అతను జీవించిలేడని గ్రహించాను.‘‘సెక్రటరీని పిలుచుకురా.’’ భయంగా అరిచాను.సెక్రటరీ డాక్టర్కి, పోలీసులకి ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చేలోగా కింది మెట్టు మీద పడున్న అతన్ని పరిశీలనగా చూశాను.అతని అరిపాదాలకి చితికిన అరటిపళ్ళ గుజ్జు అంటుకుని కనిపించింది.చూస్తే పై మెట్ల మీద చాలా చోట్ల ఆ గుజ్జు కనిపించింది!క్రితం రోజు ఆమె నా దగ్గర తన కూతుర్ని ఉంచి షాప్కి వెళ్ళి తెచ్చిన కేరీ బేగ్లో అరటి పళ్ళు చూశానని గుర్తొచ్చింది! -మల్లాది వెంకట కృష్ణమూర్తి


