Funday
-
ప్రేతాత్మ చెప్పిన కథ..!
ప్రపంచ సాహిత్యంలో ఆత్మకథలు చాలానే ఉన్నాయి. ఆత్మకథల సంగతి అటుంచితే, ప్రేతాత్మ కథ కూడా ఒకటి ఉంది. ‘సేత్ స్పీక్స్’ అనే పుస్తకం అచ్చంగా ప్రేతాత్మ చెప్పిన కథేనట! ఈ పుస్తకం రచయిత్రి జేన్ రాబర్ట్స్– పుస్తకం రాసినది తానే అయినా, తనతో రాయించినది మాత్రం సేత్ అనే వ్యక్తి ఆత్మ అని ప్రకటించడం విశేషం. జేన్ రాబర్ట్స్, ఆమె భర్త రాబర్ట్ బట్స్ 1963 డిసెంబర్ 2న రాత్రివేళ సరదాగా ‘ఊజా బోర్డు’తో ఆత్మలను ఆహ్వానించే ప్రయోగం చేశారు. ఊజా బోర్డు ప్రయోగం చేస్తున్నప్పుడు జేన్కు ఒక అశరీరవాణి వినిపించిందట! ఇదివరకే మరణించిన ఒక పురుషుడి ఆత్మ తనను తాను ‘సేత్’గా పరిచయం చేసుకుని, తన కథ చెప్పడం మొదలుపెట్టింది. సేత్ ఆత్మ చెప్పిన కథనే తాను పుస్తకంగా రాశానని జేన్ రాబర్ట్స్ అప్పట్లో ప్రకటించడం సాహితీ ప్రపంచంలో కలకలం రేపింది. సేత్ తనకు చెప్పిన కథలను జేన్ వరుసగా పుస్తకాలుగా తీసుకొచ్చారు. అవి ‘సేత్ మెటీరియల్’గా ప్రాచుర్యం పొందాయి. ఈ ప్రేతాత్మ కథకు సంబం«ధించిన పుస్తకాలు ఇప్పటికీ పునర్ముద్రణ పొందుతూనే ఉన్నాయి.బంగారు మ్యూజియంప్రపంచంలోనే అత్యంత అరుదైన బంగారు వస్తుప్రదర్శనశాల ఇది. ఇందులోకి అడుగుపెడితే, ఎటు చూసినా పురాతనమైన బంగారు వస్తువుల ధగధగలు కళ్లు చెదిరేలా చేస్తాయి. ఈ మ్యూజియం కొలంబియా రాజధాని బొగోటాలో ఉంది. కొలంబియా స్పానిష్ పాలకుల అధీనంలోకి చేరక మునుపటి కాలానికి చెందిన పురాతన బంగారు, బంగారు మిశ్రమ లోహాల కళాఖండాలను ఇందులో భద్రపరచారు. ఈ మ్యూజియం చూడటానికి ఏటా ఐదులక్షలకు పైగా సందర్శకులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. -
ప్లాస్టిక్న తైలంబు! ఎలా మారుస్తారంటే..
ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిని, సముద్రాలను విషపూరితం చేస్తూ పర్యావరణానికి పెద్ద శాపంగా మారాయి. మరోవైపు, రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యానికి ప్రధాన కారణమైన పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఒక ‘స్వచ్ఛమైన ఇంధనం’ కోసం శాస్త్ర పరిశోధనా రంగం వెతుకులాటలో ఉంది. ఒకవేళ మనల్ని వేధిస్తున్న ఈ ప్లాస్టిక్కే... స్వచ్ఛమైన ఇంధనంగా మారిపోతే? ఆహా, ఆ ఊహే ఎంత ఊరటగా ఉంది!ఇకపై అది ఊహ కాకపోవచ్చు. త్వరలోనే ఈ అద్భుతం జరగొచ్చు. ఎందుకంటే శాస్త్రవేత్తలు సౌరశక్తిని ఉపయోగించి, ప్లాస్టిక్ వ్యర్థాలను అత్యంత స్వచ్ఛమైన ‘హైడ్రోజన్ ఇంధనం’గా మార్చే ఒక కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. పర్యావరణాన్ని పాడుచేసే ఒక వ్యర్థ పదార్థాన్ని, దేశాన్ని నడిపించే ఇంధన వనరుగా మార్చే ఈ ప్రయోగం నిజంగానే సఫలం అవుతుందా?ఇందులో ఉన్న సవాళ్లు ఏమిటి? మైనస్ ఇంటూ మైనస్ = ప్లస్ ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న రెండు పెద్ద సమస్యలైన ప్లాస్టిక్ కాలుష్యం, పర్యావరణానికి హాని చేయని స్వచ్ఛమైన ఇంధనం (క్లీన్ ఎనర్జీ) కొరతలను ఒకేసారి పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు నడుం బిగించారు. అడిలైడ్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్డీ విద్యార్థిని జియావో లూ నేతృత్వంలో జరిగిన ఒక తాజా పరిశోధన దీని గురించి వివరించింది. పనికిరాని ప్లాస్టిక్ను సౌరశక్తితో.. హైడ్రోజన్, సింగ్యాస్, ఇతర పారిశ్రామిక రసాయనాలుగా ఎలా మార్చవచ్చో ఈ పరిశోధన చూపించింది. ప్లాస్టిక్ వస్తువులకు ఈ విధంగా మళ్లీ విలువ కల్పించడం ద్వారా, పర్యావరణానికి మేలు చేసే ఒక స్థిరమైన, ‘సర్క్యులర్ ఎకానమీ’ (వనరులను వృథా చేయకుండా వాటినే పదే పదే ఉపయోగించడం) వ్యవస్థను నిర్మించడానికి ఈ పద్ధతి ఎంతగానో సహాయపడుతుంది. సింగ్యాస్ అంటే.. ఒక రకమైన వాయువుల మిశ్రమం. ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ల కలయిక. దీనిని ఇంధనంగా వాడతారు. తివిరి ప్లాస్టిక్న తైలంబు..!ప్రపంచవ్యాప్తంగా యేటా 45 కోట్ల టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతోంది. ఆ ప్లాస్టిక్లో ఎక్కువ భాగం భూమిని, సముద్రాలను కలుషితం చేస్తోంది. అదే సమయంలో, పర్యావరణానికి హాని చేసే బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం పెరగడంతో.. ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన ఇంధనాల కోసం అన్వేషణ ముమ్మరమైంది. శిలాజ ఇంధనాలు అంటే తెలిసిందే. భూమి పొరల నుండి లభించే బొగ్గు, నూనె, గ్యాస్ వంటివి. వీటి వల్ల కాలుష్యం పెరుగుతుంది.‘కెమ్ క్యాటలిసిస్’ అనే సైన్స్ పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధన.. ప్లాస్టిక్లో కార్బన్, హైడ్రోజన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ప్లాస్టిక్ను కేవలం ఒక వ్యర్థ పదార్థంలా కాకుండా, ఒక ఉపయోగకరమైన వనరుగా చూడవచ్చని చెబుతోంది. కార్బన్, హైడ్రోజన్.. ప్లాస్టిక్ తయారీలో ఉండే ముఖ్యమైన రసాయన మూలకాలు. ఇవే ఇంధనంగా మారడానికి దోహదపడతాయి.ఆశాజనకమైన ఫలితాలుఅడిలైడ్ యూనివర్సిటీకి చెందిన ‘స్కూల్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్’ సీనియర్ ప్రొఫెసర్ జియావోగువాంగ్ డువాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల చేసిన ప్రయోగాలు చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఎలాంటి ఆటంకం లేకుండా 100 గంటలకు పైగా నిరంతరాయంగా ఈ సాంకేతికత ఎంత స్థిరంగా సమర్థంగా పనిచేయగలదో ఈ ప్రయోగాలు నిరూపించాయి. ఈ ప్రయోగాల ద్వారా పెద్ద మొత్తంలో హైడ్రోజన్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా, పరిశ్రమలలో వాడే ఎసిటిక్ యాసిడ్, డీజిల్ లాంటి హైడ్రోకార్బన్లు కూడా తయారైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఎసిటిక్ యాసిడ్ అనేది పరిశ్రమలలో రసాయనాల తయారీకి, నిత్యజీవితంలో వెనిగర్ రూపంలో వాడే ఒక ఆమ్లం. హైడ్రోకార్బన్లనేవి పరమాణువులతో తయారయ్యే సమ్మేళనాలు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలన్నీ హైడ్రోకార్బన్ల కిందికే వస్తాయి. సవాళ్లు కూడా ఉన్నాయిప్లాస్టిక్ వ్యర్థాలను ఇంధనంగా మార్చే ఈ పరిశోధనలో కొంత పురోగతి సాధించినప్పటికీ, ఈ సాంకేతికతను భారీస్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ముందు కొన్ని ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. ‘‘ఇందులో ఉన్న ఒక పెద్ద సమస్య ఏమిటంటే, ప్లాస్టిక్ వ్యర్థాల స్వభావం చాలా సంక్లిష్టంగా ఉండటం’’ అని ప్రొఫెసర్ డువాన్ అంటారు. ‘‘వేర్వేరు రకాల ప్లాస్టిక్లు ఇంధనంగా మారేటప్పుడు వేర్వేరుగా స్పందిస్తాయి. అంతేకాకుండా, ప్లాస్టిక్లలో ఉండే రంగులు, స్టెబిలైజర్లు (ప్లాస్టిక్ మన్నికను పెంచే రసాయనాలు) ఈ ప్రక్రియకు అడ్డుపడవచ్చు. అందువల్ల, మంచి ఫలితాలను, నాణ్యమైన ఇంధనాన్ని పొందాలంటే.. ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా వర్గీకరించడం, ముందుగా శుద్ధి చేయడం చాలా అవసరం’’ అని డువాన్ చెబుతున్నారు. భవిష్యత్తు ప్రణాళిక సిద్ధంఈ సాంకేతికతను ప్రయోగశాల నుండి పరిశ్రమల స్థాయికి ఎలా తీసుకువెళ్లాలో వివరించే కొన్ని ముఖ్యమైన దశలను పరిశోధకుల బృందం సిద్ధం చేసింది. రాబోయే దశాబ్దాలలో ఈ క్లీన్ హైడ్రోజన్ ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, పరిశ్రమలలో ఇది అంతరాయం లేకుండా పనిచేసేలా చేయడమే వారి ప్రధాన లక్ష్యాలు. ‘‘ఇది చాలా ఆసక్తికరమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం’’ అని పరిశోధకురాలు జియావో లూ గొప్ప ఉత్తేజంతో చెబుతున్నారు. ‘‘కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగితే.. సౌరశక్తితో ప్లాస్టిక్ను ఇంధనంగా మార్చే ఈ సాంకేతికతలు... భవిష్యత్తులో కాలుష్యం లేని, పర్యావరణహితమైన సమాజాన్ని నిర్మించడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని మేము నమ్ముతున్నాం’’ అని ఆమె అంటున్నారు.‘ఇంజినీరింగ్’ అడ్డంకులుఈ ప్రక్రియ ద్వారా చివరకు తయారయ్యే ఇంధనాలను, రసాయనాలను ఒకదానికొకటి వేరు చేయడం కూడా ఒక పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఈ రసాయన చర్యల వల్ల వాయువులు, ద్రవాల మిశ్రమం ఉత్పత్తి అవుతాయి. వీటిని విడివిడిగా వేరు చేయాలంటే భారీగా శక్తిని (విద్యుతు, లేదా వేడిని) ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల, పర్యావరణాన్ని కాపాడాలనే ఈ మొత్తం ప్రక్రియ అసలు ఉద్దేశానికే నష్టం చేకూరే అవకాశం ఉంది. ఈ సమస్యలను దాటేందుకు, పరిశోధకులు అన్ని విభాగాలను సమన్వయం చేసే ఒక సమీకృత వ్యూహం అవసరమని గట్టిగా చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను హైడ్రోజన్గా మార్చేందుకు వేటివేటిని మెరుగుపరచాలో వారు చెబుతున్నారు. అవి:క్యాటలిస్ట్ డిజైన్: కాంతి ఉత్ప్రేరకాల పనితీరును మరింత నాణ్యంగా మార్చటం.రియాక్టర్ ఇంజనీరింగ్: రసాయన చర్యలు జరిగే పాత్రలు లేదా యంత్రాలను మరింత సమర్థవంతంగా తయారు చేయడం.సిస్టమ్ ఆప్టిమైజేషన్: యంత్రాలు, రసాయనాలు, మానవ శ్రమతో కూడిన మొత్తం వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం.పాస్టిక్ను ఇంధనంగా ఎలా మారుస్తారు?సౌరశక్తితో ప్లాస్టిక్ను ఇంధనంగా మార్చే విధానాన్ని ‘సోలార్–డ్రివెన్ ఫొటోరిఫార్మింగ్’ అంటారు. ఇది సూర్యకాంతికి స్పందించే ‘కాంతి ఉత్ప్రేరకాలు’ (ఫొటోక్యాటలిస్ట్లు) అనే ప్రత్యేక పదార్థాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ ప్రధానంగా 4 దశల్లో జరుగుతుంది. ప్లాస్టిక్ను సిద్ధం చేయడం సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మొదట బాగా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఎందుకంటే పెద్ద ప్లాస్టిక్ వస్తువుల కంటే చిన్న ముక్కలపై రసాయన చర్య చాలా వేగంగా జరుగుతుంది.ఫోటోక్యాటలిస్ట్ను కలపడంఈ చిన్న ప్లాస్టిక్ ముక్కలను ఒక ప్రత్యేకమైన ద్రవంలో ముంచుతారు. అందులో ‘ఫొటోక్యాటలిస్ట్’ అనే ప్రత్యేక పదార్థాన్ని కలుపుతారు. ఫొటోక్యాటలిస్ట్ అనేది సూర్యకాంతిని తనపై పడగానే క్రియాశీలం అయి, రసాయన చర్యలను అత్యంత వేగంగా జరిగేలా చేసే ఒక ఉత్ప్రేరకం.సూర్యకాంతి ప్రయోగంఇప్పుడు ఈ మిశ్రమంపై సూర్యకాంతి పడేలా చేస్తారు. ఇక్కడే అసలైన అద్భుతం జరుగుతుంది. ప్లాస్టిక్ ముక్కల్లో కార్బన్, హైడ్రోజన్ పరమాణువులు ఒకదానికొకటి గట్టిగా అంటుకుని ఉంటాయి. సూర్యకాంతిలోని శక్తిని ఫొటోక్యాటలిస్ట్ గ్రహించి, ఆ శక్తితో ప్లాస్టిక్లో ఉన్న ఈ కార్బన్– హైడ్రోజన్ బంధాలను ముక్కలు ముక్కలుగా విడగొడుతుంది.ఇంధనం విడుదల అవటంబంధాలు విడిపోగానే, ప్లాస్టిక్ నుండి విడిపోయిన హైడ్రోజన్ పరమాణువులన్నీ ఒకదానితో ఒకటి కలిసి హైడ్రోజన్ వాయువుగా మారి పైకి విడుదలవుతాయి. దీనిని శాస్త్రవేత్తలు ప్రత్యేక గొట్టాల ద్వారా సిలిండర్లలో భద్రపరుస్తారు. మిగిలిన కార్బన్ భాగం పరిశ్రమలలో వాడే ఇతర ఉపయోగకరమైన రసాయనాలుగా (ఎసిటిక్ యాసిడ్ లేదా డీజిల్ వంటి హైడ్రోకార్బన్లు) మారుతుంది. సాక్షి స్పెషల్ డెస్క్ -
పిల్లలకు సమయం కేటాయించాలి
‘పిల్లలకు డబ్బు, ఆస్తులు ఇవ్వడం కాదు, రోజూ తగినంత సమయం కేటాయించడం ముఖ్యం’ అంటున్నారు సైకాలజిస్ట్ పి.జ్యోతిరాజ. ఇరవయ్యేళ్లుగా సైకాలజిస్టుగా చిల్డ్రన్, ఫ్యామిలీ కౌన్సెలర్గా ఉన్న జ్యోతిరాజ పిల్లల పెంపకంలో తాను తీసుకున్న జాగ్రత్తలను ఇలా తెలిపారు...‘‘నిన్నటి తరం పిల్లలు అమ్మనాన్నలు ఏం చెబితే అది విన్నారు. తర్వాతి తరం నిర్ణయాలలో పిల్లల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలు ఎంత చెబితే అంత అనే విధంగా ఉంది. ఆరవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని కౌన్సెలింగ్కు నా దగ్గరకు తీసుకువచ్చారు. ఇంట్లో ఆ అమ్మాయికి నచ్చినట్టే తల్లిదండ్రులు ఉండాలి. లేదంటే, ఇంట్లో పెద్ద గొడవ. రెండు విషయాల్లో మరీ సమస్య పెద్దదిగా కనిపిస్తోంది. ‘ఒకటి ఫోన్ వాడకం, రెండవది చదువుకోమని చెప్పడం.’ ఈ రెండింటిలోనూ పిల్లలు అతిగా స్పందిస్తున్నారు. పిల్లలకు ఇచ్చింది సమయాన్నే..!నాకు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు సంతానం. వారిని మూడో క్లాస్ నుంచి ఒంటరిగా పనులు చేసుకోవడం, బయటకు వెళ్లిరావడం, వారికి కావల్సినవి వారే కొని తెచ్చుకోవడం వంటివి అలవాటు చేస్తూ వచ్చాను. దీని వల్ల పై చదువుల సమయంలో మాకు దూరంగా ఉన్నా పిల్లలు ఇబ్బందులు పడలేదు. వారికి స్వేచ్ఛగా ఉండే అవకాశం ఇస్తూనే, క్రమశిక్షణనూ అలవాటు చేశాను. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఇంటి విషయాలలో కూడా వారి అభిప్రాయం తీసుకునేదానిని. అది నచ్చకపోయినా కొట్టిపడేసిన దాన్ని కాదు. వాళ్లు చెప్పినవన్నీ అనుకూలంగా, వాడదగినవిగా ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు వెంటనే ‘నో’ చెప్పకుండా ఎలా చేస్తే బాగుంటుందో కాస్త సమయం తీసుకునైనా చెప్పేదాన్ని. దీని వల్ల పిల్లలు అర్థం చేసుకునేవారు. అర్థం చేసుకోవడమే ముఖ్యంపిల్లలు చదువులో టాపర్స్గా ఉన్నారా, గ్రేడ్స్ వస్తున్నాయా అని చూసేదాన్ని కాదు. వారు ఆ చదువును ఎంతబాగా అర్థం చేసుకోగలుగుతున్నారు.. అనేదానిపై దృష్టి పెట్టమనేదాన్ని. స్కూల్ నుంచి వచ్చాక ‘టీచర్లు ఏం చెప్పారు, ఏం విన్నావు, ఏం నేర్చుకున్నావు, స్కూల్లో ఏం జరిగింది?’ అని అడిగేదాన్ని. వాళ్లు చెప్పేదంతా వినేదాన్ని. అంతేకానీ, హోమ్వర్క్, క్లాస్ వర్క్, మార్కుల గురించి అడిగేదాన్ని కాదు. మా పిల్లలు చదువుకునే టైమ్లో కంప్యూటర్స్ బూమ్లో ఉంది. కానీ, మా అమ్మాయి ఆర్కిటెక్చర్ చేస్తానంది. సరే అన్నాను. మంచి ర్యాంక్ తెచ్చుకుంది. మా అబ్బాయిని సైన్స్ వైపుగా వెళతావా అని అడిగాను. లేదు ఇంజనీరింగ్ అన్నాడు. వారి ఇష్టాలను కాదనలేదు. వాళ్ల మాటకు మేం విలువ ఇచ్చాం. వాళ్లూ మా మాటలకు విలువ ఇచ్చారు. లేట్ నైట్స్ బయట తిరగడం మాత్రం ఒప్పుకునేదాన్ని కాదు. రాత్రి సమయాల్లో బయట ఉంటే సమస్యలు ఏ విధంగా వస్తాయో వివరించేదాన్ని. నేను మీతో ఉన్నాను అనే భరోసా! మా బాబుకి బిట్స్లో సీట్ వచ్చేముందు కొంతకాలం హాస్టల్లో ఉండేవాడు. అక్కడ ఉన్నన్ని రోజులూ ఏదో తెలియని ఆందోళన ఫీలవుతున్నట్టు గమనించాను. దీంతో ఇంటికి తీసుకువచ్చేశాను. ఇంట్లోనే చదువు, టెస్ట్.. జరిగేలా ప్రతిరోజూ ప్లాన్ చేశాం ‘ఏం టెన్షన్ పడకు. ర్యాంకు రాకపోయినా పర్వాలేదు. ఇది కాకపోతే మిగతా చాయిస్లు కూడా ఉన్నాయి’ అని చెప్పదాన్ని. నీకు నేను ఉన్నాను అని మోరల్గా సపోర్ట్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ చూశాను. మా అమ్మాయి పెళ్లయ్యి, అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. వాళ్లకు ఒక బాబు. నాలుగేళ్ల వయసు. బోలెడన్ని ప్రశ్నలు వేస్తుంటాడు. పిల్లలు అడిగే సందేహాలకు ఓపికగా సమాధానాలు చెప్పకపోతే నిరుత్సాహపడిపోతారు. వారి ఆలోచనలు మరోవైపుకు మళ్లుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వదగిన ఆస్తి తగినంత సమయం వారితో గడపడమే. మా అబ్బాయి కూడా విదేశాలలోనే జాబ్ చేస్తున్నాడు. ఇద్దరూ వారి వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నారు.’’∙నిర్మలారెడ్డిమనం వింటే.. వాళ్లు వింటారు..! ఈ మధ్య ఒక పదమూడేళ్ల అబ్బాయిని వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్కు తీసుకువచ్చారు. ఆ అబ్బాయి ధోరణి ఎలా ఉందంటే, పేరెంట్స్ ఏది చెబితే అది రివర్స్ చేస్తాడు. మొదట ఆ అబ్బాయి అడిగిందల్లా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అబ్బాయితో తల్లిదండ్రులు గడపాల్సిన విధానం, సమయం,.. అన్నీ చెబుతూ కొన్ని సెషన్స్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చింది. పేరెంటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ప్రతిరోజూ వారితో కనెక్టివ్గా ఉండాలి.డబ్బులు ఉన్నాయని అడిగినవన్నీ కొనిస్తే అమ్మనాన్నలు డబ్బు మిషన్లలాగే కనిపిస్తారు. మా పిల్లలకు ఏది అవసరమో అదే కొనేదాన్ని. అవసరం లేనిదాని గురించి చెప్పేదాన్ని. డ్యూటీ టైమ్ అయిపోయి ఇంటికి వచ్చానంటే పిల్లలకే సమయం కేటాయించేదాన్ని. ఇప్పటికీ ప్రతిరోజూ ఫోన్ ద్వారా పిల్లలతో కమ్యూనికేషన్లో ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోవడం సులువు అవుతుంది.మనం వింటే.. వాళ్లు వింటారు..! ఈ మధ్య ఒక పదమూడేళ్ల అబ్బాయిని వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్కు తీసుకువచ్చారు. ఆ అబ్బాయి ధోరణి ఎలా ఉందంటే, పేరెంట్స్ ఏది చెబితే అది రివర్స్ చేస్తాడు. మొదట ఆ అబ్బాయి అడిగిందల్లా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో కఠినంగా ఉండేవారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఆ అబ్బాయితో తల్లిదండ్రులు గడపాల్సిన విధానం, సమయం,.. అన్నీ చెబుతూ కొన్ని సెషన్స్ ఇస్తే కొంతవరకు మార్పు వచ్చింది. పేరెంటింగ్ ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ప్రతిరోజూ వారితో కనెక్టివ్గా ఉండాలి. డబ్బులు ఉన్నాయని అడిగినవన్నీ కొనిస్తే అమ్మనాన్నలు డబ్బు మిషన్లలాగే కనిపిస్తారు. మా పిల్లలకు ఏది అవసరమో అదే కొనేదాన్ని. అవసరం లేనిదాని గురించి చెప్పేదాన్ని. డ్యూటీ టైమ్ అయిపోయి ఇంటికి వచ్చానంటే పిల్లలకే సమయం కేటాయించేదాన్ని. ఇప్పటికీ ప్రతిరోజూ ఫోన్ ద్వారా పిల్లలతో కమ్యూనికేషన్లో ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఓపెన్ కమ్యూనికేషన్ ఉంటే సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోవడం సులువు అవుతుంది. డా.పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్ నిర్మలారెడ్డి(చదవండి: తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు) -
న్యాయం దక్కలేదు.. చట్టం మారింది
లైంగిక హింసకు గురైన ఓ ఆదివాసీ మహిళకు అండగా నిలబడి, ఆమె గౌరవాన్ని రక్షించడంలో వ్యవస్థ విఫలమైంది. న్యాయవ్యవస్థ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే ఘటనల్లో ఇది ఒకటి.– సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ రక్షకభట నిలయంలోనే తనకు రక్షణ కరువైందని, న్యాయం చేయాలని, మృగాళ్లను శిక్షించాలని ఓ యువతి వేడుకుంది. అయితే, న్యాయస్థానాల్లో ఆమెకు చుక్కెదురైంది. వ్యక్తిగతంగా ఆమెకు న్యాయం దక్కలేదు. నిందితులకు శిక్షపడలేదు. కాని, భారత న్యాయవ్యవస్థలో పలు మార్పులకు, మహిళా రక్షణ చట్టాల బలోపేతానికి ఈ కేసు నాంది పలికింది. అదే తుకారాం వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు. ‘మథుర’ కేసుగా ఇది ప్రాచుర్యం పొందింది. ఇదీ విషాదంఅక్షరం ముక్క రాకపోయినా, తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెంది అనాథగా బతకాల్సి వచ్చినా, ఆమె వెరవలేదు. తన కాళ్లపై నిలబడింది. కూలి నాలి చేసుకుంటూ సోదరుడు గామాతో కలిసి జీవిస్తూ, తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అదే ఆమె పాలిట శాపమైంది. సోదరుడు పెట్టిన కేసు నిమిత్తం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆ యువతే మథుర. కూలి పనులతో పాటు స్థానికంగా ఒకరి ఇంట్లోనూ పని చేసేది. ఆ ఇంటి యజమానురాలి బంధువు అశోక్తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆమె సోదరుడు గామాకు నచ్చలేదు. దీంతో ఆమె యజమానురాలు నున్షి, ఆమె భర్త, అశోక్లు మథురను అపహరించారని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు నిమిత్తం ఆమెను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దేశాయ్గంజ్ పోలీస్స్టేషన్కు రాత్రి సమయంలో తీసుకువచ్చారు. ఆమె వయస్సు ధ్రువీకరణ పత్రం తీసుకుని మర్నాడు స్టేషన్కు రావాలని చెప్పి రైటర్ బయటకు వెళ్లాడు. తుకారాం, గణపత్ అక్కడే కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు.ఏం జరిగిందిమ«థుర వాంగ్మూలం ప్రకారం..‘అందరం బయటకు వెళుతున్న సమయంలో గణపత్ తనను ఆపాడని, మిగతా వాళ్లు వెళ్లిపోవాలని తుకారామ్ ఆదేశించాడు. పోలీస్ స్టేషన్ తలుపులు మూసేశారు. లైట్లు ఆర్పేశారు. ఒంటరిగా ఉన్న తనను భవనం వెనుక వైపు ఉన్న బాత్రూమ్లోకి లాక్కెళ్లి తుకారామ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడ్ని తప్పించుకుని బయటకు వస్తుండగా గణపత్ సైతం లైంగిక దాడికి యత్నించాడు. అతడు మద్యం మత్తులో ఉండడంతో తప్పించుకుని పోలీస్స్టేషన్ వెలుపలికి వచ్చాను’. ఈ ఘటనపై స్థానికుల నుంచి సైతం ఒత్తిడి రావడంతో కేసు నమోదైంది. కోర్టులో విచారణతొలుత చంద్రపూర్ సెషన్స్ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. లైంగిక నేరం జరిగిందనడానికి బలమైన కారణాలు లేవని, ఆమె ప్రైవేట్ పార్ట్స్ వద్ద ఎటువంటి గాయాలు, ప్రతిఘటనకు సంబంధించిన ఆనవాళ్లు లేవని తేల్చింది. ఆమె అంగీకార పూర్వకంగానే ఇది జరిగి ఉండొచ్చని పేర్కొంది. కానిస్టేబుళ్లను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో కేసు హైకోర్టుకు చేరింది. సెషన్స్ కోర్టు వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. భయం, నిస్సహాయత కారణంగా ఆమె ప్రతిఘటించకపోవడాన్ని ‘సమ్మతి’గా భావించలేమని తుకారామ్కు ఐదేళ్లు, గణపత్కి ఏడాది జైలు శిక్ష విధించింది.సుప్రీంకోర్టులోనూ..హైకోర్టు తీర్పుపై నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నిస్సహాయ లొంగుబాటును అత్యాచారంగా పరిగణించడానికి సరిపడా ఆధారాలు లేవని పేర్కొంది. నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. వెల్లువెత్తిన నిరసనలుకోర్టులో కేసు నిలబడలేదు. ఆమె కోరుకున్న న్యాయం దక్కలేదు. కాని, సమాజం నుంచి అనూహ్యంగా మద్దతు వెల్లువెత్తింది. సుప్రీం కోర్టు తీర్పుపై మేధావులు కలమెత్తారు. ఇది వాంఛనీయం కాదంటూ నలుగురు న్యాయ శాస్త్ర ప్రొఫెసర్లు అప్పటి చీఫ్ జస్టిస్కు బహిరంగ లేఖ రాశారు. చట్టం, రాజ్యాంగం ప్రకారం మహిళలకు సంక్రమించిన హక్కులను హరించేలా తీర్పు ఉందంటూ ఆక్షేపించారు. మథురకు జరిగిన అన్యాయాన్ని కోర్టు గుర్తించినప్పటికీ సాంకేతికపర అడ్డంకులు న్యాయానికి ప్రతిబంధకాలుగా, నిందితులకు అనుకూలంగా మారాయి. మథురకు న్యాయం జరగలేదంటూ పౌర సమాజం స్పందించింది. లైంగిక నేరాలకు వ్యతిరేకంగా మొదటిసారి గొంతెత్తి నినదించింది. ప్రభుత్వాన్ని కదిలించింది. చట్టాల్లో మార్పులకు ఈ కేసు నాంది పలికింది.మార్పులు ఇలా..అన్యాయానికి గురైన మహిళలకు రక్షణగా చట్టాల్లో మార్పులకు ఈ కేసు నాంది పలికింది. ఈ సవరణలు భారత న్యాయవ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చింది.‘కస్టోడియల్ రేప్’ అంటే నిర్దిష్టమైన నిబంధనలను నిర్వచించింది. పోలీసు అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ అధీనంలో ఉన్న, పని చేస్తున్న వారిపై లైంగిక దాడికి పాల్పడితే పదేళ్ల వరకు శిక్ష విధించేలా మార్పులు చేసింది. తన సమ్మతి లేకుండానే లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ ఫిర్యాదు చేస్తే, తాను నిర్దోషినని నిందితుడే నిరూపించుకునేలా భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో మార్పులు చేశారు.బాధితురాలి గౌరవాన్ని కాపాడేందుకు లైంగిక దాడి కేసులను బహిరంగ విచారణ కాకుండా, ఇన్ కెమెరా ట్రయల్స్ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు రూపొందించారు.బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసేలా మీడియాలో పేరు రాయడం, ఫొటోలు ప్రచురించడాన్ని నిషేధించారు. \భయం, బెదిరింపులు, నిస్సహాయత కారణంగా ప్రతిఘటించకపోవడాన్ని ‘సమ్మతి’గా, నిశబ్దాన్ని అనుమతిగా భావించరాదని గుర్తించారు. -దిలీప్ మాదిరెడ్డి -
అటు ప్రయోగం ఇటు ప్రయోజనం!
అందమైన పరిసరాల్లో పుట్టి పెరిగిన కళాకారుల రచనల్లో సౌందర్యం జాలువారుతుందని వర్డ్స్వర్త్, కీట్స్, కాలెరిజ్ తదితర ఇంగ్లిష్ భావకవులు– మూడువందల యేళ్ళ కిందట – ఓ సిద్ధాంతం చెప్పారు. విలియం గిల్పిన్ అనే విమర్శకుడు వారి సిద్ధాంతానికి ‘పిక్చరెస్క్ ఈస్థెటిక్స్‘ (రమణీయ సౌందర్యశాస్త్రం) అని పేరుపెట్టారు. అంతకు వెయ్యిన్నర సంవత్సరాల కిందట భామహుడు మొదలుకొని ఆనందవర్ధనుడి వరకు ఎందరో భారతీయ ఆలంకారికుల సిద్ధాంతాల్లోనూ అలాంటి భావాలున్నాయనే మాట నిజమే– అయితే అదలా వుంచండి! ఇరవయ్యొకటో శతాబ్దిలో ఈ భావనకు ఉదాహరణగా చెప్పదగిన రచయిత జ్షాన్ మారీ గుస్తావ్ లా క్లేజ్యో ఒకరు. లా క్లేజ్యోకు 2008లో నోబెల్ సాహిత్యపురస్కారం ప్రకటిస్తూ ‘ఆయన రచనలు సరికొత్త ప్రయోగాలూ, కవితాత్మక సాహసకృత్యాలూ, ఆనందానుభూతుల చిత్రణలతో నిండి వుంటాయ’ంది స్వీడిష్ ఎకాడెమీ. (నోబెల్ సాహిత్య పురస్కారం ఎవరికివ్వాలో నిర్ణయించేది ఈ ఎకాడెమీయే.) అంతేకాదు– ‘ప్రస్తుతం చెలామణీలో వున్న నాగరికతను మించినవారి కథలనూ, దాని పరిధిలోకి రానివారి కథలనూ కూడా చిత్రించిన రచయిత’గా లా క్లేజ్యోను ప్రశంసించింది స్వీడిష్ ఎకాడెమీ. నవలాకారుడిగానూ, కథానిక రచయితగానూ, వ్యాసకర్తగానూ, అనువాదకుడిగానూ సుప్రసిద్ధుడు లా క్లేజ్యో. ఇటలీ సరిహద్దుకు చేరువగా వుండే ఫ్రెంచ్ నగరం నీస్లో పుట్టారాయన. అది ఆయన తల్లి తరఫు బంధువుల స్వస్థలం. లా క్లేజ్యో తండ్రి తరఫు బంధువులు వందల సంవత్సరాల కిందటే తరలి వెళ్ళిపోయారు. అలా ఆయన పుడుతూనే ద్విజాతీయుడు. అందుకే లా క్లేజ్యో తనను తాను ఫ్రాంకో–మారిషియన్గా చెప్పుకుంటారు.ఇంగ్లండ్– ఫ్రాన్స్– మెక్సికో దేశాల్లో చదువుకుని డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు లా క్లేజ్యో. అండర్ గ్రాడ్యుయేట్ పట్టాకోసం ఆయన ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. మాస్టర్స్ కోసం, ఫ్రెంచ్ ప్రయోగాత్మక కవి– రచయిత– చిత్రకారుడు హెన్రీ మిషో రచనలను ఎంచుకున్నారు. తీరా డాక్టరేట్ విషయానికి వచ్చేసరికి ఆధునిక చరిత్ర ఆవిర్భవిస్తున్న దశను లా క్లేజ్యో ఎంపిక చేసుకున్నారు. సామాన్య శకం 1525 వరకూ, స్వతంత్రంగా జీవించిన పూరిపెచా ప్రజలు ఆ దశలో మశూచికం తదితర అంటువ్యాధుల పాలబడ్డారు. ఆ పరిస్థితిలో, వారి నాయకులు ప్రజల సంక్షేమం కోసం యుద్ధాన్ని నివారించాలని భావించారు. స్పెయిన్ రాజుకు సామంతరాజ్యంగా ఉంటామని స్వచ్ఛందంగా ప్రకటించారు. దాన్నే ‘పూరిపెచా జాతిపై దిగ్విజయం’గా వక్రీకరించారు స్పానిష్ చరిత్రకారులు. లా క్లేజ్యో తన సిద్ధాంత గ్రంథంలో ఈ వంచనను వెలికితీశారు! పదహారో శతాబ్ది నాటి రాతప్రతుల ఆధారంగా ఆయన ఈ గుట్టు రట్టు చేయగలిగారు. ఆయన అధ్యయన ప్రణాళిక ఇంత క్లిష్టంగా వున్నందువల్లనే అది పూర్తికావడానికి పాతికేళ్ళు పట్టింది.రచయితగా, ప్రయోగశీలతనూ – ప్రయోజన దృష్టినీ గొప్పగా సమ్మిళితం చేశారు లా క్లేజ్యో. రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, శాలింగర్, మిషో, హెమింగ్వే, ఫాక్నర్– లా క్లేజ్యోను ప్రభావితం చేసినవారు. అలాంటి రచయిత ప్రయోగం– ప్రయోజనం అనే రథచక్రాల మీద వీరవిహారం చెయ్యడంలో వింతేముంది? ఏడేళ్ళ పసితనంలోనే సముద్రం గురించి చిన్న పుస్తకం రాసేశాడు ఈ పిడుగు! నైజీరియాలో వున్న తండ్రిని మరుసటి సంవత్సరం –1948లో– కుటుంబ సమేతంగా కలవబోతున్నానన్న ఊహే, లా క్లేజ్యో చేత ఆ పుస్తకం రాయించింది. ఇదే ఊహ, 44 సంవత్సరాల తర్వాత ‘అనీత్సా’ అనే నవలగానూ రూపుదిద్దుకుంది. అదీ పూర్తిగా కల్పన కాదంటారు లా క్లేజ్యో సాహిత్య నిపుణులు. బహుశా అందుకేనేమో, వారెన్ మాటీ అనే విమర్శకుడు ఈ 44 యేళ్ళ కాలాన్ని లా క్లేజ్యో శిక్షణకాలంగా అభివర్ణించాడు! ఈ కథ 1848లో జరిగిందని రచయిత ప్రత్యేకంగా ప్రకటించడం విశేషం! ఫ్రాన్స్ దక్షిణ తీరం నుంచి ఓ పాత నావలో బయల్దేరిన తల్లీ కొడుకులు పశ్చిమ ఆఫ్రికా తీరం పొడుగునా సాగించే సుదీర్ఘ యాత్రే ఈ నవలకు ఇతివృత్తం. ఈ రెండు పుస్తకాలూ రాయడానికి మధ్య కాలంలో లా క్లేజ్యో ఎన్నో మెరుపులు మెరిపించారు. 1963లో వెలువడిన ‘లా ప్రాసెస్ వెర్బల్’ (విచారణ– ఇంటరాగేషన్) అనేది లా క్లేజ్యో తొలి నవల. దానికే ‘ప్రీ రెనాడో‘ పురస్కారం అందుకున్నాడాయన. ఇదే రచన మరో పోటీల్లో కూడా షార్ట్ లిస్ట్ కావడం విశేషమే మరి. లా క్లేజ్యో ప్రయోగాల్లో అత్యధిక పాఠకాదరణ పొందిన నవల ‘డెజెర్ట్.’ ఉత్తర ఆఫ్రికాలో కనిపించే సంచార ఆదివాసుల ప్రణయగాథ దానికి ఇతివృత్తం. ఈ నవల వేర్వేరు కాలాల్లో జరిగిన కథను వేర్వేరు వ్యక్తుల దృష్టికోణం నుంచి చూపిస్తాడు కథకుడు. ఇలాంటి శిల్పవిన్యాసం పాఠకులను రంజింప చెయ్యడంలో వింతేముంది?లా క్లేజ్యోతో పొల్చదగిన రచయితలు అతని సమకాలికుల్లో ఎవరూ లేరనే చెప్పొచ్చు. అయితే అతనికన్నా ముందుగా నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ఫ్రెంచ్ రచయితలు కూడా ఎవరికీ తీసిపోరు మరి! ఈ పురస్కారం మొదలైన యేడాదే, 1901లో, దాన్ని గెల్చుకున్నవాడు సూలీ ప్రూదాం. ఆయన రాసిన ప్రతీకాత్మక కవిత్వం సుప్రసిద్ధం. ముఖ్యంగా, ప్రూదాం రాసిన ‘ద బ్రోకెన్ వేజ్ – పగిలిన కలశం’ కవితను నెట్ లో చూడొచ్చు! ఇక 85 ఏళ్ళ తర్వాత ఈ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన క్లాడ్ సిమో కూడా తక్కువ వాడేం కాడు. శైలీ విన్యాసానికీ, ప్రయోగశీలతకూ సిమో సుప్రసిద్ధుడు. పోతే, 2000 సంవత్సరానికి గానూ నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న గావ్ షింజియాంగ్ ఫ్రెంచ్ జాతీయుడే కానీ ఫ్రెంచ్ రచయిత కారు! అయినా, పెద్దలతో పోలికలెందుకు మనకు? ఎవరంత వాళ్ళు వారనుకుంటే పోలా? -లిట్వరల్డ్ -
క్లూషియల్: ది రైటర్
ప్రముఖ క్రైమ్ నవలా రచయిత చక్రవర్తి మరణం రాష్ట్రాన్ని కుదిపేసింది. క్రైమ్ నవలా రచయితగా అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతని క్రైమ్ కథలు ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. ఈ కేసును పరిశోధించడానికి క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నచికేత రంగంలోకి దిగాడు.క్రైమ్ సీన్... టేబుల్ మీద అలాగే ఒరిగిపోయి ఉన్నాడు చక్రవర్తి. టెక్నాలజీ ఎంత పెరిగినా అతను పెన్తో కాగితం మీద కథలు రాయడానికి ఇష్టపడతాడు. కథ రాస్తూ అలాగే ఒరిగిపోయాడు. ఉదయానికే చక్రవర్తి ఊపిరి ఆడక ప్రాణాలు విడిచాడు. పైకి అది గుండెపోటులా కనిపించింది. కానీ అది అసహజ మరణంగా, హత్యగా అనిపించింది నచికేతకు.సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తుండగా చక్రవర్తి టేబుల్పై ఉన్న ఆ ఫౌంటెన్ పెన్ అతని కంటపడింది. ఆ పెన్ నిబ్ దగ్గర స్వల్పంగా నీలిరంగు మరక ఉండడం గమనించాడు. పేపర్ మీద రాసిన అక్షరాల ఇంక్ నలుపు రంగులో ఉంది. మరి ఆ నీలి రంగు ఏమిటి?నచికేత వెంటనే ఆ పెన్ ను ఫోరెన్సిక్ లాబ్కు పంపాడు.నచికేత విచారణ మొదలుపెట్టాడు. ఇంట్లో అందరినీ ప్రశ్నించాడు. చక్రవర్తి తమ్ముడు భార్గవతో సహా ఇల్లంతా సోదా చేశాడు. భార్గవ గదిని సోదా చేసినప్పుడు అక్కడ కొన్ని పాత సైన్స్ జర్నల్స్ కనిపించాయి.నచికేత చక్రవర్తి వాడిన ఫౌంటెన్ పెన్ను నిశితంగా పరిశీలించాడు. కానిస్టేబుల్ని పిలిచి ఆ నిబ్ పెన్ చూపించి ఏదో చెప్పాడు.సరిగ్గా అరగంట తర్వాత చక్రవర్తి తమ్ముడు భార్గవను గదిలోకి పిలిచాడు ఇన్స్పెక్టర్ నచికేత.‘మీ అన్నయ్య ఆత్మశాంతి కోసం ఒక సందేశాన్ని ఈ కాగితం మీద రాసి ఇవ్వండి. చక్రవర్తిగారు ప్రముఖ రచయిత కదా... మీ స్వదస్తూరితో ఆ సందేశాన్ని రాస్తే పత్రికల్లో సంతాప సందేశాన్ని ప్రకటనగా ఇద్దాం.’ అన్నాడు ఫౌంటెన్ పెన్ను భార్గవకు ఇస్తూ.. ఆ పెన్ వంక, నిబ్ వంక భయంగా చూశాడు భార్గవ.‘మీ అన్నయ్య రాత్రి వాడిన పెన్నే.. సెంటిమెంట్గా ఇచ్చాను.. వేలితో నిబ్ను సరిచేసుకో.’ అన్నాడు. అతని వంకే చూస్తూ...భార్గవ మొహంలో రంగులు మారాయి. పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎదురుగా పోలీసులు సంకెళ్లతో..మీడియా గుమికూడింది. ప్రముఖ క్రైమ్ నవలా రచయిత మరణం మిస్టరీని అరవై నిమిషాల్లో ఛేదించిన నచికేతను అభినందిస్తూ ‘హంతకుడిని ఎలా పట్టుకున్నారు?’ అని ప్రశ్నల వర్షం కురిపించింది.నచికేత చెప్పడం మొదలుపెట్టాడు.‘చక్రవర్తికి కథ రాస్తున్నప్పుడు వేలితో నిబ్ను సరిచేసుకునే అలవాటు ఉంది.ఆ పెన్ నిబ్ దగ్గర స్వల్పంగా నీలిరంగు మరక ఉండటం గమనించాను. అతను అప్పటి వరకు రాసి ఉన్న కాగితం మీద అక్షరాల ఇంక్ నలుపు రంగులో ఉంది. మరి ఆ నీలి రంగు ఏమిటి? వెంటనే ఆ పెన్ ను ఫోరెన్సిక్ లాబ్కు పంపాను. రిపోర్ట్లో అది ‘రిసిన్’ అనే విషం అని తేలింది.భార్గవ గదిని సోదా చేసినప్పుడు అక్కడ కొన్ని పాత సైన్స్ జర్నల్స్, ఆముదపు గింజల అవశేషాలు కనిపించాయి. భార్గవ ఇంటర్నెట్ హిస్టరీని చెక్ చేయించగా, అతను గత నెల రోజులుగా ‘విషప్రయోగం – ఎవరికీ దొరక్కుండా ఎలా చేయాలి?’ అనే అంశాలపై సెర్చ్ చేసినట్లు తేలింది.భార్గవకు ఆస్తిపై మోహం.. అన్న చక్రవర్తిపై ద్వేషం.. కోట్లాది రూపాయల విలువైన వారసత్వ ఆస్తి దక్కాలంటే అన్న అడ్డు తొలగాలి. భార్గవ తెలివైన క్రిమినల్ మైండ్ వున్నవాడు. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ వేశాడు. ఆముదపు గింజల నుండి తీసిన అత్యంత ప్రమాదకరమైన ‘రిసిన్’ అనే విషాన్ని సేకరించి, చక్రవర్తి రోజూ వాడే ఖరీదైన ఫౌంటెన్ పెన్ నిబ్కు అతి సూక్ష్మంగా పూశాడు.అందుకే చక్రవర్తి వాడిన ఫౌంటెన్ పెన్ లాంటిది ఇచ్చి దాని నిబ్ను టచ్ చేయమంటే భయపడిపోయాడు. దొరికిపోయాడు.నిజానికి ఈ పరిశోధన వెనుక చక్రవర్తి గారు రాసిన క్రైమ్ కథల ప్రేరణ వుంది. నేరస్థుల మైండ్ సెట్తో ఆయన రాసే కథల్లోని పరిశోధన నాకు ఉపయోగపడింది.వారి ఆత్మకు శాంతి చేకూరాలి. భార్గవ లాంటి నేరస్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.’ చెప్పి ముందుకు కదిలాడు నచికేత. -శ్రీసుధామయి -
ఈ వారం కథ: అసలు సంగతేంటంటే!
‘‘అమ్మా, అడిగావా నాన్నని. ఏమన్నారు? నువ్వు కాస్త గట్టిగా అడగవే ఒప్పుకుంటారేమో’’ వాట్సాప్ వీడియో కాల్లో తల్లి వనజని నిలదీస్తోంది సుప్రియ.అమెరికాకి ఎలాగైనా అమ్మతో పాటు నాన్నని కూడా రప్పించుకోవాలనే పట్టుదలా, మళ్ళీ ఓడిపోతానేమో అనే దిగులు కలగలసి వినిపిస్తోంది సుప్రియ గొంతులో.‘‘ఎన్ని విధాలుగా అడగను చెప్పు. మొదటి రెండుసార్లు ఏదో బెట్టు చేస్తున్నారేమో అనుకున్నాను కానీ, ఇంత మంకుపట్టు పడతారు అనుకోలేదే. ససేమిరా అంటున్నారు ఆయన. నా వల్ల కాదు ఈ విషయంలో నాన్నని ఒప్పించడం. ముందు రెండుసార్లు అంటే ఏదో నీ పురిటికి సాయంగా వచ్చాను కానీ ఇప్పుడు ఎలా చెప్పు మళ్ళీ ఆయన్ని వదిలేసి రావడం? నవ్విపోరా అంతా.’’గోడకి బిగించిన అద్దంలో చూసుకుంటూ గడ్డం గీసుకుంటున్న కృష్ణమూర్తికి తల్లీ కూతుళ్ళ సంభాషణ వినిపిస్తూనే ఉంది. ఈసారి కూతురు గట్టిగానే పట్టుపడుతోంది. ముందు రెండుసార్లు అంటే బ్యాంక్ ఉద్యోగం వంకతో పని ఒత్తిడి అని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడైతే రిటైర్ అయ్యి సొంత ఊరికి చేరుకున్నాడు. ఏ సాకూ దొరకడం లేదు కృష్ణమూర్తికి.‘పోనీ అసలు సంగతి చెప్పేద్దామా?’ అనుకున్నాడు ఒక్క క్షణం.‘‘ఎంతైనా నాన్నగారు ప్రత్యేకమైన మనిషమ్మా. అందరూ ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటే నాన్నగారు చూడు అసలు. ఆయన సిద్ధాంతాలు, పద్ధతులూ వేరు. ఒక మాట అనుకుంటే మార్చనేలేము. మావయ్యా వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళాక జిల్లా ఎడిషన్లో ‘విదేశీ పర్యటన చేసుకుని స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు శుభాకాంక్షలు’ అని పేపర్ యాడ్ కూడా ఇప్పించుకున్నారు తెలుసా. నాన్నగారిని చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా ఇలాంటి గొప్పలేమి పట్టవు ఆ మనిషికి. ముక్కు సూటి మనిషి అని, ఏ పని చేసినా పద్ధతిగా నిబద్ధతతో చేస్తారని మావయ్య వాళ్ళకి కూడా నాన్న అన్నా, ఆయన మాటన్నా అంత గురి మరి.’’ గర్వంగా చెప్తోంది సుప్రియ.‘‘మరేమనుకున్నావు. ఇన్నేళ్ళ బట్టి చూస్తున్నా కదా మనిషిని. మాటంటే మాటే. ఈరోజుల్లో ఉంటారా ఈయనలాంటి వాళ్ళు.’’ అంది వనజ భర్త గురించి మురిపెంగా.మొహం తుడుచుకుంటూ లోపలికి వచ్చిన కృష్ణమూర్తికి సుప్రియ మాటలు వినడంతోనే అసలు సంగతి కూతురుకి చెప్పేద్దాం అనుకున్న ఆలోచనని వెనక్కి తీసేసుకున్నాడు. చిన్నప్పుడు మా నాన్న ‘శక్తిమాన్’ కన్నా పవర్ఫుల్ తెలుసా, అని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేటప్పుడు ఎంత అబ్బురంగా చూసేదో ఇప్పటికీ తనని సూపర్ హీరోలానే చూస్తున్న కూతురికి ఎలా చెప్పగలడు ‘ఇదీ సంగతి’ అని.‘వద్దు వద్దు’ అని మనసులోనే అనుకున్నాడు కృష్ణమూర్తి.వనజ ఇచ్చిన కాఫీ తాగుతూ రోజూలాగే అక్కడ అమెరికాలో ‘టైం ఎంత’ అని మొదలుపెట్టి, వాతావరణ విశేషాలు అడిగి మనవరాలిని పలకరించి పెట్టేశాడు కాల్.హడావిడిగా చిన్ని హస్తం గరిటని చన్నీటి గ్లాసులో ముంచి వేడి వేడి ఇడ్లీలు దీక్షగా తీసి ప్లేట్లో వేసి ఇస్తున్న వనజ వైపు చూస్తూ , ‘పోనీ అసలు సంగతి వనజకి చెప్పేస్తే?’ అనుకున్నాడు కృష్ణమూర్తి.‘‘నీకో విషయం చెప్పాలోయ్’’ అనే మాట నోటి వెంట బయటికి రాక ముందే, ‘‘సారీ అండి. పాపతో మాట్లాడుతూ కాస్త ఆలస్యమైయింది. ఇదుగో ఇస్తున్నాను.’’ అంటూ కొబ్బరి చట్నీని ముద్దుగా తట్టి ప్లేటులో వేస్తూ చేతికి అందించింది వనజ.‘‘అది కాదు మాట’’ అని చెప్పబోయేంతలో పక్క ఊర్లో ఉండే వనజ వాళ్ళ తమ్ముడు రావడంతో కృష్ణమూర్తి మాట పూర్తవ్వకనే, ‘‘ఏరా ఇదేనా రావడం. రా రా వేడిగా టిఫిన్ చేద్దువు గానీ’’ అంటూ ఎదురెళ్ళింది.‘‘చేసే వచ్చాను. టిఫిన్ వద్దులే గానీ మంచి స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు.’’ అన్నాడు ఆ రోజు పేపర్ తీసుకుని కుర్చీలో కూర్చుంటూ వనజ తమ్ముడు బాలాజీ.టిఫిన్ కానిచ్చి వచ్చిన బావగారిని చూస్తూనే లేచి నిల్చున్నాడు బాలాజీ.‘‘ఏం బాలా, బాగున్నావా. కూర్చో కూర్చో. ఎట్లా ఉంది వ్యాపారం?’’ అంటూ కుశల ప్రశ్నలు వేశాడు కృష్ణమూర్తి.బావగారు కూర్చున్నాక కానీ కూర్చోలేదు బాలాజీ. తరవాత బిల్డర్గా పనిచేయడంలో ఉండే సాధక బాధకాలు చెప్తూ కూర్చున్నాడు.వనజ తమ్ముడికి కాఫీ తీసుకుని రావడంతో ‘‘మీరు మాట్లాడుకుంటూ ఉండండి,’’ అంటూ లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి. వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి అతనికి.‘‘మరి బావకేదే కాఫీ?’’‘‘ఆయన ఉదయం కాఫీ తాగేశారు కదా. మళ్ళీ ఇంకో రెండు గంటల తర్వాతే.’’‘‘ఎంతైనా బావంటే పద్ధతి. పద్ధతి అంటే బావకా. అవును మరి అమ్ములు అమెరికా రమ్మంటాంది అంట కదా ఇద్దర్నీ ఈసారి. బావేమన్నాడు?’’‘‘ససేమిరా అంటున్నారురా. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారుంటారా చెప్పు. రిటైర్ అయ్యాక కూడా వాళ్ళ కొలీగ్స్ అంతా సిటీల్లో గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటుంటే ఈయన చూశావా నా ఊరు నా మనుషులు అంటూ మళ్ళీ ఇక్కడికే తెచ్చేశారు. నేను చెప్పేశా అమ్ములుతో నాన్నని వదిలి రాను ఇక అని. ఆయన లేకుండా నాకు తోచదు అక్కడ. ఆయన్ని చూసైనా నేను నేర్చుకోవాలి కదా. పిల్లలే వచ్చి చూసి వెళ్తే సరి.’’ అంది వనజ.‘‘అంతేలే. ఎక్కడికెళ్ళినా కింగులా ఉంటాడు బావ. నలుగురు మనుషులు కావాలి ఎప్పుడూ. ఏం తోస్తుంది ఆయనకి అక్కడ. ‘‘సరేలే ఉమ నీకు ఇచ్చిరమ్మంది’’ అంటూ మరదలు పికో ఫాల్స్ చేసిన చీరల కవర్ అక్కడ పెడుతూ ‘‘నే వెళ్ళొస్తాక్కా, టైల్స్ సప్లయర్ వస్తానన్నాడు. బావకి చెప్పు. పిలవద్దులే మళ్ళీ’’ అంటూ బయల్దేరాడు బాలాజీ.‘ఎందుకో నేనంటే ఇంత గౌరవం వీళ్ళందరికీ!’ అంటూ విసుక్కున్నాడు లోపలి నుంచి కృష్ణమూర్తి.వనజ మీద ఎప్పుడూ లేంది పీకల దాకా కోపం వచ్చింది అతనికి. ‘ఎంతసేపూ నా చుట్టూరా తన జీవితం గడుస్తోంది అని చెప్పుకుంటుందెందుకు వనజ. అసలు వనజ లేకపోతే క్షణం జరగనిది నాకే కదా? ఏమీ తెలీదు ఏమీ తెలీదు అంటూనే కూతురి పురిటికి రెండుసార్లు ఒక్కర్తే చక్కగా ఝామ్మంటూ అమెరికా వెళ్ళొచ్చింది. నేనే ఇక్కడ బిక్కు బిక్కుమంటూ ఉన్నాను కానీ తనొక్కతే అన్నీ చక్కబెట్టుకొచ్చింది. ముప్పై ఐదేళ్ళ నుండి ఆ ఉద్యోగం కాస్తా వెలగబెట్టి ఇంత గడించి వనజ చేతిలో పోసి తాపీగా టింగురంగామని తిని తిరగడం తప్ప ఈ సంసారానికి నేనేం చేశానని.కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తనే మంచి చెడూ ఆలోచించి, చివరిగా ‘ఇదైతే బాగుంటుంది ఏమంటారు?’ అని నా ముందు ఉంచేది. అసిస్టెంట్ ఇచ్చిన ‘ఎన్ఓసీ’ సర్టిఫికెట్ మీద సంతకం పెట్టినట్టు నేను ‘సరే అలాగే’ అంటే చాలు పిల్లల చదువుల దగ్గరి నుండీ మంచి సంబంధాలు చూసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యడం వరకూ అంతా తన ఇష్టమే. ‘అప్రూవల్’ ఇవ్వడం వరకే నా పని కదా. అయినా కాని అన్నిటికీ నేనే కారణమన్నట్టు నేనేదో దైవాంశ సంభూతుడినైనట్టు ప్రవర్తిస్తుంది ఎందుకూ?’ అని ఆలోచనలో పడిపోయాడు కృష్ణమూర్తి.‘అన్నిటికీ ఈ రూపమే కారణం’ అనుకుంటూ అద్దంలోకి చూసుకుని సణుక్కుంటూ పల్చబడ్డ క్రాఫుని నైసుగా సర్దుకున్నాడు కృష్ణమూర్తి.కృష్ణమూర్తి మూడించీలు తక్కువగా ఆరడుగులు. అయినా కానీ వనజ నోట్లోపడి ‘ఆరడుగుల అందగాడు’ అయిపోయాడు. మంచి విగ్రహపుష్టి, దానికి తోడు ధీర గంభీర స్వరం కలవాడవటంతో అడక్కుండానే అందరి గౌరవ మర్యాదలకు పాత్రుడయ్యాడు. కట్టుకున్న భార్యకి కన్నుల దీపావళి అయ్యాడు. బావ బామ్మర్దులైతే కిట్ట పరమాత్ముడే మా ఆడబిడ్డని చేపట్టినాడు అని మురిసి మర్యాదలు చేసేవారు.ఇంట్లో వనజ ముదిగారంతో వేరే ఏ రకమైన డిస్ట్రాక్షన్లు లేక ఉద్యోగంలో మెట్టు మెట్టూ పైకెక్కి కింది వారి గులాములు అందుకున్నాడు. ఆఫీసరు భార్యగా తన దర్జాకి, మొగుడి దర్జాకి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా చూసుకునేది వనజ. ఈ గౌరవానికి కృష్ణమూర్తి కూడా అలవాటు పడిపోయాడు.చివరికి ఉద్యోగ విరమణ అయ్యాక తన కొలీగ్స్తో పాటు గేటెడ్ కమ్యూనిటీలో ఉందామనుకునే లోపు, ‘ఊరు పేరు లేని చోట్ల అనామకుడిలా ఉండలేరు ఆయన. నలుగురు మనుషులకి సాయంగా, అందరి తల్లో నాలుకలా ఉండడమే ఇష్టం ఆయనకి. పుట్టిన ఊరంటే ఎంత మమకారమో. ఈరోజుల్లో ఎవరుంటారమ్మా ఇలాగ!’ అంటూ అటు తన పుట్టింటికి కూడా కూత వేటు దూరంలో ఉండే సొంతూరికి చేరవేసింది కృష్ణమూర్తిని వనజ.వనజ మెల్లిగా ఇక్కడ కూడా మొగుడి పరపతి పెంచేసింది. మొగుడి దర్జాకి ఏ మాత్రం భంగం వాటిల్లకుండా ప్రతి చిన్న విషయంలోనూ ‘ఈరోజుల్లో ఉంటారా ఈయనలాంటి వాళ్ళు’ అని మొగుడి గురించి అందరికీ కథలు కథలుగా చెప్పి తన ప్రమేయం లేకుండానే అందరికీ ‘కిట్టప్ప’గా మాత్రమే పరిచయం ఉన్న మూర్తిని కాస్తా ‘కృష్ణమూర్తిగారు’గా ఊరిలోకే పెద్ద తలకాయలాగా చెలామణీలోకి తెచ్చేసింది వనజ.ఉద్యోగం ఉన్నంత వరకు ఫరవాలేదు కానీ ఇప్పుడు ఊరికొచ్చే సరికి కథ అడ్డం తిరిగింది. అందరూ కృష్ణమూర్తిని చూసి ఒక చేత్తో అర్ధ నమస్కారం చేసి తప్పుకునే వారే కానీ ఎవ్వరూ మనస్ఫూర్తిగా మాట్లాడేవారు కాదు. ఉత్సవ విగ్రహంలాగా ఊరంతా ఊరేగి, అందరి తలపంకింపులకు బదులు చెప్పి, వాళ్ళ ఈతి బాధలు విని తనకు తోచిన మాటేదో చెప్పి రావడంతోనే సరిపోతోంది. అతని ఇష్టాయిష్టాలు, సరదాలు వినడానికి ఎవ్వరూ లేక పిచ్చెక్కుతోంది మూర్తికి.దానికి తోడు కొత్తగా ఈ అమెరికా గోల ఒకటి తోడయ్యింది. ఇన్నిసార్లు ‘నేను అమెరికా రాను’ అంటుంటే, కాస్త మెల్లిగా ‘ఎందుకండి? ఏమిటి సంగతి?’ అని అడిగి తెలుసుకుందామనే ఆలోచనే లేని వనజని చూస్తుంటే ఎప్పుడూ లేనిది మొట్టబుద్ధేస్తోంది కృష్ణమూర్తికి.‘నేను అమెరికా రాను’ అని కృష్ణమూర్తి అనగానే, దానికి కూడా అదేదో గొప్ప సుగుణం అన్నట్టు ‘ఈరోజుల్లో కూడా ఇలాంటి వారుంటారా?’ అంటూ దేశ భక్తుల జాబితాలో కలిపేసింది మొగుడిని వనజ.హ అప్పటినుండి ఊర్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ ఈ మాటే.జెండామాను సెంటరు దగ్గరికి సాయంత్రాలు వెళ్ళగానే అరుగు మీద మధ్యాసనం ఇచ్చి ఒకటే ఎత్తేస్తున్నారు కృష్ణమూర్తిని అంతా.ఇట్లా దేశం మీద, పుట్టిన ఊరి మీద ఇంత అభిమానం ఉండడం మీకే చెల్లింది. మావాడు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం కూడా పాస్ అవ్వలేదు అప్పుడే అమెరికా, ఆస్ట్రేలియా అంటూ కలవరిస్తున్నాడు మూర్తి గారు.’‘మా బామ్మర్ది, కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళి వచ్చినప్పటినుండీ మమ్మల్ని మనుషులుగా చూస్తే ఒట్టు. మూణ్నెళ్ళకే వాడికి పుట్టిన ఊరు మాసిపోయినట్టు కనపడిందంట. తిరిగి వచ్చినప్పటి నుండీ పూటకి నాలుగుసార్లు ఇళ్ళు దులపను సరిపోతోంది వాడికి.’‘రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూసినట్టే...బ్బా’‘బా చెప్పావ్. పోయేకాలం బుద్ధులు. అందరూ కృష్ణమూర్తిగారిలా నిండుకుండలా ఉండగలరా? మనిషంటే ఇట్లా ఉండాలి.’‘మరే! అందుకే ఇంకా ఈ దేశంలో వానలు పడతాండేది.’ఇట్లా కృష్ణమూర్తిని మధ్యలో పెట్టుకుని అంతా ఆకాశానికి ఎత్తేస్తుంటే చిరాకు ఎక్కువైపోతోంది మూర్తికి. ‘వుండండెహే! ఎదవ గోల. ఏ నాకొడుకూ నా మాట వినరేమిరా!’ అని అరిచి పచ్చిబూతులు నాలుగు మాట్లాడి, అసలు సంగతి చెప్పేద్దామనుకున్నాడు మూర్తి.‘‘కానీ అసలు తను అమెరికా ఎందుకు వెళ్ళను అంటున్నాడో చెపితే వీళ్ళంతా నిచ్చలకపోరూ? ఈ గౌరవం ఈ మర్యాదా ఇంచుక పుల్లంత అన్నా మిగులుతుందా అని? అసలు సంగతి తెలిస్తే ఇక జెండామాను సెంటర్లో నాకు సెంటర్ సీటు ఉంటుందా? అంతా కలిసి నన్ను ఒక మూలకి తోసెయ్యరా. నా నోట్లోంచి మాటొచ్చేదే వేదంగా వినుకునే వాళ్ళు, ‘నువ్వలాగ ఉండరా కిట్టిగా, ఇవతల పెద్దాయన మాట్లాడుతున్నాడా.’ అని తీసిపారేస్తేనో?’’ ఆ ఊహకే ఒళ్ళు జలదరించింది కృష్ణమూర్తికి. సైలెంటయిపోయాడు.ఇక ‘‘వెంకాయి గాడి అంగడిలో నేను గోల్డ్ఫ్లేక్ తీస్కుంటే గుప్పిట్లో అగ్గిని పదిలంగా నా మూతికాడికి తీసుకువచ్చి నా సిగరెట్ వెలిగించి, ఆపైన నేను కదిలి వెళ్ళాకగాని తన బీడీ వెలిగించుకోని రమేషుగాడికి అసలు సంగతి తెలిస్తే నా సిగరెట్ వెలిగిస్తాడా ఎప్పటికైనా? ‘ఏంట్రా ఆ ఆగింతం కిష్టిగా, నా బీడీ వెలిగించుకునేదాకా ఆగలేవా అంట.’ అని విసుక్కుంటే నేను తట్టుకోగలనా?’’ అనుకుని ఆగిపోయాడు కృష్ణమూర్తి.బావ బామ్మర్దులకి చెప్పుకుందామంటే కొండపైన వేలుపులా చూసే వాళ్ళ కళ్ళలో హేళన చూసేకన్నా కట్ట కింద బావిలో దూకడం మేలనుకుని గమ్మునుండిపోయాడు.ఆపైన తమ ఇంట్లో సహాయం చేసే మునెమ్మ, ఇస్త్రీపెట్టి ఈశ్వరయ్య, నీళ్ళ క్యాను వేసే మధుసూదన్, అమెజాన్ డెలివరీకి ఉర్లోకొచ్చే సతీష్, గ్యాస్ కనెక్షన్ ఇచ్చే పైఊరి అబ్బాయి ఇట్లా ఎవరికి చెప్పుకుందామన్నా తన పేరుకే చేటు అని అనుకుని ఊరకుండిపోయాడు కృష్ణమూర్తి. ఆలోచించిన కొద్దీ ఎవరో ఒక్కరికైనా అసలు సంగతి చెప్పాలనే కోరిక బలంగా నాటుకోసాగింది. చెప్పుకుంటే ఊరంతా వెనకగా చేరి ఘొల్లుమని నవ్విపోతారేమో’’ అనే బెంగ తొలిచేస్తోంది.‘‘ఇంకా నయం వనజకి చెప్పలేదు. ‘ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు’ అన్నట్టు అంతెత్తున నిలబెట్టి చూస్తూంటుంది నన్ను ఎప్పుడూ. తీరా అసలు సంగతి తెలిస్తే? మయసభలో ద్రౌపదిలా తను నవ్వితే? ఇంత బతుకూ బతికి ఇంటిలోనే అవమానం పొందాలా? వద్దు వనజకి కూడా చెప్పకూడదు’’ అనుకున్నాడు కృష్ణమూర్తి.ఇలా ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేక తికమక పడుతున్న కృష్ణమూర్తికి ముందరి గదిలో అలికిడి వినపడడంతో ఆలోచనలని పక్కన పెట్టి లోపలి గదిలోంచి ఇవతలికి వచ్చాడు.మునెమ్మ వచ్చింది పని సాయానికి.‘‘నువ్వొస్తే వచ్చావు మళ్ళీ వీడిని ఎందుకు వెంటేసుకుని వచ్చావు. ఉప్పురాయి పని చెయ్యడు. దర్బారుకేమీ తక్కువ కాడు’’ అంటూ ఆక్షేపణగా అంటోంది వనజ మునెమ్మెతో పాటు వచ్చిన మునెమ్మ మనవడిని.వాడిని చూడగానే కళ్ళు తళతళ మెరిశాయి కృష్ణమూర్తికి. ‘అరె భలే మంచి టయానికి వచ్చాడే వీడు. వీడి గురించిన ఆలోచనే రాలేదే’ అనుకుని సైలెంటుగా పేపర్ తీసి చదువుతూ కూర్చున్నాడు. వనజ కృష్ణమూర్తికి కాఫీ, మునెమ్మ మనవడికి కాస్త టిఫిను పట్టుకొచ్చి ఇచ్చింది.మునెమ్మ, టౌనులో చదువుకుంటూ అప్పుడప్పుడు తన దగ్గరికి వచ్చే మనవడిని తీసుకుని వస్తుంది కృష్ణమూర్తి వాళ్ళింటికి. వాడంటే మంచి గురి కృష్ణమూర్తికి. ఊర్లో మిగతా వారిలా అతి వినయాలకి పోడనీ, సూటిగా కళ్ళల్లోకి చూస్తాడనీ, వనజని చూసి గౌరవంతో కూడిన భయభక్తుల ప్రదర్శన చేసి మెప్పు పొందాలనుకోడనీ కృష్ణమూర్తికి వాడంటే ఇష్టం. వనజకి వాడంటే అందుకే విసుగు. పైగా కృష్ణమూర్తిని ‘సారుగారు’ అని వాడి చేత పిలిపించాలని ప్రయత్నించి ఓడిపోయింది. అందుకని కూడా వాడంటే ప్రత్యేక అభిమానం కృష్ణమూర్తికి.ఒక్కోసారి తనతో పాటు వాకింగ్కి పాత బజారు తీస్కెళ్ళేవాడు వాడిని కూడా. ఇప్పుడు వనజ ‘చీపు టేస్టు’ అని విసుక్కునే చిన్నప్పుడు తనకి అమితంగా ఇష్టమైన జిలేబీ ఇప్పించి తిరిగి వస్తూ వస్తూ కొన్ని తనూ తినేవాడు కృష్ణమూర్తి గుంభనంగా.వనజ, మునెమ్మ లోపల పనుల్లో పడగానే కాఫీ తాగేసి పక్కన పెట్టేసి మునెమ్మ మనవడిని సైగ చేసి రమ్మని పిలిచి చడీ చప్పుడు కాకుండా బయటికి తీస్కెళ్ళాడు కృష్ణమూర్తి.అలా కాస్త దూరం నడిచి బస్టాండ్ షెల్టర్లో అరుగు మీద కూర్చున్నారు ఇద్దరూ.‘‘ఒరేయ్. నాకెందుకో నిన్ను చూస్తే భలే నమ్మకమైన మనిషిలా కనపడుతున్నావురా.’’ అన్నాడు కృష్ణమూర్తి మునెమ్మ మనవడితో.‘ఏంటి విషయం!’ అన్నట్టు చూశాడు వాడు.‘‘ఇప్పుడు నీకో సంగతి చెప్తాను. సత్య ప్రమాణంగా ఎవ్వరికీ చెప్పనని మాటివ్వాలి నాకు. ఇస్తావా మరి?’’ అని అడిగాడు కృష్ణమూర్తి ఆశగా వాడి వైపు చూస్తూ.అవును కాదూకి మధ్యస్థంగా తలూపి మెదలకుండా కూర్చున్నాడు వాడు.‘మరేమో నేను మాములు కోరికలకి అతీతుడినని, అందరిలాగా తుచ్ఛమైన గొప్పలకు పోనని, ఎంతో పద్ధతి గలవాడినని అంతా అనుకుంటున్నారు కదా.’’‘అయితే ఎవడికి గొప్ప!’ అన్నట్టు చూసి, చెట్టు మీద వాలిన కాకిపై దృష్టి పెట్టాడు వాడు.‘‘దేశం మీద ఊరి మీద వెర్రి అభిమానంతో విదేశీయాన అవకాశాన్ని కూడా చెత్త కాగితంలాగా ఉండచుట్టి విసిరేసిన పెద్దమనిషినని అనుకుంటున్నారు కదా? అవేమీ నిజం కాదురా. నేను అమెరికా వెళ్ళకుండా ఉండిపోడానికి అసలు కారణం ఏమిటో తెలుసా?’’వాడసలే కోపదారి మనిషేమో ‘ఏందీ పెద్దమనిషి, నానుస్తాడే గాని అసలు సంగతి చెప్పడేందేహే’ అని విసుగేసి అరుగు మీంచి దూకి పరుగందుకోబోయాడు.వాణ్ని లటుక్కున పట్టుకుని, బతిమాలి బామాలి అరుగుమీద కూర్చొనబెట్టి మళ్ళీ కొనసాగించాడు కృష్ణమూర్తి.‘‘నాకూ. నాకు..ఎస్కలేటర్లన్నా, విమానాలన్నా చచ్చేటంత భయంరా అయ్యా! ఎస్కలేటర్ ఎక్కాలంటే ప్యాంటులోనే ఒకటీ రెండూ అన్నీ అయిపోతాయి. విమానంలో అన్నేసి గంటలు ఉండాలన్న ఊహకే దడుపు వచ్చేస్తుందిరా. నాకు అదొక ఫోబియా. నాకుండదా అమెరికా చూడాలని! వనజ లేదూ వాట్సాప్లో అక్కడి ఫొటోలు అవీ పంపుతుంటే, నవ్వి ఊరుకునే వాడిని కానీ ‘తస్సాదియ్యా అన్నీ ఎక్కి దిగేసి చిన్నపిల్లలా తెగ ఎంజాయ్ చేసేస్తోంది ఇది’ అని తెగ ఉడుక్కునేవాడిని. అదిరా అసలు సంగతి. ఎవ్వరికీ చెప్పకేం. సరేనా.’’ అని చెప్పడం ఆపాడు కృష్ణమూర్తి.‘ఏంది ఇంతమాత్రానికే ఓ అని ఇదైపోతండావా పెద్దాయనా!’ అన్నట్టు నవ్వాడు వాడు పత్తిపువ్వులాగా.‘‘సరే మరి. ఈ విషయం చెప్దామనే తీసుకొచ్చాను నిన్ను. ఒట్టేశావు ఎవ్వరికీ చెప్పనని. గుర్తుంచుకోరా. సరేనా.’’ అని చెయ్యి చాపాడు కృష్ణమూర్తి.‘వొరె వొరె! పాపం పెద్దాయనకి ఎంత కష్టం ఒచ్చిందీ’ అనుకుని ఆ చేతిలో తన చెయ్యి వేశాడు వాడు.మనసులోని భారం తీరడంతో ఒక్కసారి చూట్టూ చూసి గంభీరంగా ‘రాజు వెడలె’ అన్నట్టు కదిలాడు ‘కృష్ణమూర్తిగారు.’ఆయన చెయ్యి పట్టుకుని జిలేబీ అంగడి వైపు దారి తీశాడు తను ఎంత పెద్ద సహాయం చేశాడో తెలీని మూడున్నరేళ్ళ మునెమ్మ మనవడు. - శ్రీనిధి యెల్లల -
కథాకళి: డిటెక్షన్
డిటెక్టివ్ పెద్దబ్బాయి శవాన్ని బదులు యాష్ట్రేని పరీక్షగా చూశాక చెప్పాడు.‘‘ఇది ఆత్మహత్య కాదు ఇన్ స్పెక్టర్.’’ ‘‘కాని పిస్టల్ కుడిచేతిలో ఉంది. గుండు కుడి కణతలోంచి వెళ్ళింది.’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి చెప్పాడు.‘‘హత్య చేసిన మర్డరర్ హతుడికి బాగా పరిచయం ఉన్నవారు కూడా.’’‘‘మీరు అంతా ఆశ్చర్యపోయేలా చేస్తూంటారు సర్. ఇది ఎలా చెప్పగలరు?’’ అసిస్టెంట్ చిన్నబ్బాయి ఆశ్చర్యంగా అడిగాడు.‘‘యాష్ట్రేని చూడు. నీకు ఏం కనిపిస్తోందో చెప్పు చిన్నబ్బాయ్.’’ ఆయన కోరాడు.‘‘సిగరెట్ పీక.’’‘‘సిగరెట్ నుసి?’’‘‘గమనించాను సర్. అది చివరిదాకా కాలి ఉంది.’’‘‘దాని అర్థం దాన్ని వెలిగించినా కాల్చలేదని. కాలిస్తే నుసి విరిగిపోకుండా అంత పొడుగ్గా ఉండేది కాదు.’’‘‘నిజమే సుమండీ. హతుడుగారు సిగరెట్ వెలిగించగానే హంతకుడు వచ్చి చంపాడన్నమాట.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘హత్యని ఎలా కనుక్కున్నావు?’’‘‘మీరు చెప్పారుగా సర్.’’‘‘నేను ఎలా చెప్పగలిగాను?’’‘‘అది మాకు ఎవరికీ తెలీదు కాబట్టి మీరే చెప్పాలి సర్.’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి నవ్వుతూ కోరాడు.‘‘సిగరెట్ పీక ఫిల్టర్ ఎటువైపు ఉంది?’’ పెద్దబ్బాయి అడిగాడు.వెంటనే అందరి కళ్ళు ఆ సిగరెట్ పీక మీదకి మళ్ళాయి.‘‘హతుడికి అవతలి వైపుంది.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘పీకవైపు కూర్చున్న మనిషి సిగరెట్ పీకని తనవైపు పెట్టుకుంటాడు.’’‘‘అర్థమైంది. హంతకుడే ఈ సిగరెట్ని వెలిగించి, ఓ దమ్ము పీల్చి ఏష్ ట్రే మీద ఉంచి పని పూర్తి చేసి, పిస్టల్ని హతుడి చేతిలో ఉంచి వెళ్ళిపోయాడు.’’ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘సిజర్స్ సిగరెట్ తాగే వాళ్ళు సామాన్యులు. అంటే ఆర్థికంగా హతుడికన్నా చిన్నస్థాయి వారి పనిది.’’ డిటెక్టివ్ పెద్దబ్బాయి చెప్పాడు.‘‘ఈయనగారి బంధుమిత్రుల్లో ఎవరు సిజర్స్ తాగుతారో కనిపెడితే హంతకుడు ఎవరో తెలిసిపోతుంది.’’ అసిస్టెంట్ చిన్నబ్బాయి ఉత్సాహంగా చెప్పాడు.‘‘సిజర్స్ తాగనివారే ఈ హత్య చేసింది.’’ పెద్దబ్బాయి చెప్పాడు.‘‘అదేమిటి సర్ మళ్ళీ?’’‘‘వాళ్ళ మీదకి అనుమానం మళ్ళించాలని చేసిన ప్రయత్నం ఇది.’’‘‘ఓ. మరి వాళ్ళు ఏ బ్రాండ్ సిగరెట్ తాగుతారు సార్?’’‘‘ఏదీ తాగరు. ఆడవాళ్ళు సిగరెట్ని తాగుతారా?’’‘‘ఆడవాళ్ళ పనా? హంతకి అని ఎలా తెలుసుకోగలిగారు?’’ ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి ఆసక్తిగా అడిగాడు.‘‘సిగరెట్ని వెలిగించడం తప్ప కాల్చకపోవడం వల్ల. సిజర్స్ ఎవరు తాగుతారో వారి నుంచి ఆ మహిళ దీన్ని కొట్టేసింది.’’‘‘ఎందుకని?’’‘‘తన భర్త మీదకి అనుమానం వెళ్ళాలని.’’‘‘భర్తా? మీరు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తూంటారు సర్. హంతకి అని, ఆమెకి పెళ్ళైందని ఎలా కనుక్కున్నారు?’’ చిన్నబ్బాయి అడిగాడు.‘‘ఇవాళ ఏం వారం?’’‘‘శుక్రవారం.’’‘‘శుక్రవారం నాడు ఇలాంటి సంప్రదాయ ఇంట్లోని ఇల్లాళ్ళు ఏం చేస్తారు?’’‘‘రోజులా నో ఫుడ్ ఆర్డర్ సర్. వంట చేస్తారు.’’‘‘కాళ్ళకి పసుపు రాసుకుంటారు. తెల్లటి ఫ్లోర్ కాబట్టి నేల మీద ఎండిన పసుపు తునకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హతుడి ముగ్గురి కోడళ్ళలో ఈ రోజు పాదాలకి పసుపు రాసుకున్నది రెండో కోడలు మాత్రమే.’’‘‘ఆమె ఇంతదాకా ఇక్కడికి రాలేదు. ఎలా కనుక్కున్నారు?’’ ఇన్ స్పెక్టర్ అడిగాడు.‘‘గోడ మీది ఫేమిలీ పిక్చర్ని చూడండి. ఒకామె మొహానికి బొట్టు లేదు. ఫొటోకి బొట్టు పెట్టుకోని ఆ వయసులోని హిందూ స్త్రీ ఉండదు. మరొక ఆమెకి బాబ్డ్ హెయిర్, పెదాలకి లిప్స్టిక్ ఉన్నాయి కాబట్టి ఆమె పసుపు రాసుకునే తరహా కాదు. హతుడి రెండో కొడుకు పక్కన నిలబడ్డ ఆమె తలలో పూలచెండు, నుదుట కుంకుమ బొట్టు ఉన్నాయి. మన పనైంది. ఇక పద.’’ పెద్దబ్బాయి చెప్పాడు.గంట తర్వాత డిటెక్టివ్ పెద్దబ్బాయి ఆఫీస్లో ఫోన్ మోగింది.‘‘అది ఇన్ స్పెక్టర్ బుల్లెబ్బాయి నించి. బహశా భర్తతో సఖ్యతలేని ఆమె, తన భర్త మీదకి హత్యా నేరం వెళ్ళి అతనికి శిక్ష పడితే, మామగారి ఆస్తిలోని అతని భాగాన్ని తనే అనుభవించచ్చని ఈ పథకం వేశానని ఒప్పుకుని ఉంటుంది.’’ డిటెక్టివ్ పెద్దబ్బాయి చెప్పాడు.ఆ ఫోన్ కాల్ ఎటెండ్ అయ్యాక అసిస్టెంట్ చిన్నబ్బాయి చెప్పాడు.‘‘మీరు ఎప్పుడూ అందర్నీ ఆశ్చర్యపరుస్తూంటారు. నిజమే సర్. హంతకి కాళ్ళకి పసుపు రాసుకుందిట. కొద్ది కాలంగా భర్తకి, ఆవిడకి పడటం లేదట.’’ -మల్లాది వెంకట కృష్ణమూర్తి -
తిరుపతిలో నా పెళ్లి!
అచ్చం తల్లి శ్రీదేవి పోలికలతో మెరిసిపోతూ, హోమ్లీ వైబ్స్తో ఉండే చిల్ గర్ల్ జాన్వీ కపూర్! గ్లామర్ సామ్రాజ్యానికి వారసురాలైనా, నటిగా తనదైన ముద్ర వేస్తున్న ఈ అందాల తార మనసులోని ముచ్చట్లు.. ఆమె మాటల్లోనే!నాన్నకు తెలియని వేగాస్ ట్రిప్అందరమ్మాయిల్లాగానే, టీనేజ్లో నేను కూడా చాలా సీక్రెట్స్ దాచాను. ఒకసారి మా నాన్నతో సినిమాకు వెళ్తున్నానని అబద్ధం చెప్పి, నేరుగా వేగాస్ ఫ్లైట్ ఎక్కేశాను! రాత్రంతా అక్కడ తిరిగి, ఉదయం వచ్చేశా, ఇది నాన్నకు అస్సలు తెలియదు. అలాగే, ఇండస్ట్రీలోకి వచ్చేముందు నా పాత ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని పోస్ట్లన్నింటినీ కంప్లీట్గా డిలీట్ చేసి, పబ్లిక్ కోసం కొత్తగా మరో అకౌంట్ స్టార్ట్ చేశాను.‘చుస్కీ’ నా బెస్ట్ ఫ్రెండ్!నా దగ్గర ఒక పింక్ వాటర్ బాటిల్ ఉంటుంది. దానికి ‘చుస్కీ’ అని పేరు పెట్టుకున్నా. ఎక్కడికి వెళ్లినా అది నా వెంట ఉండాల్సిందే. చాలామందికి అది ఫన్నీగా అనిపించినా, నాకు మాత్రం అది చిన్న కంఫర్ట్ జోన్ లా ఉంటుంది.కష్టపడతా!మా కుటుంబం వల్ల నాకు ప్రేమ దక్కింది అనేది నిజం. కానీ ఆ ప్రేమకు నేను అర్హురాలిని అని నిరూపించుకోవడం మాత్రం నా బాధ్యత. అందుకే ప్రతి సినిమాకు డబుల్గా కష్టపడతాను.సినిమా చూస్తూ ఏడ్చేశా!‘నేను సినిమాలు చూసేటప్పుడు చాలా హైపర్–ఎమోషనల్ అయిపోతాను. ఒకసారి ‘ఏ క్వైట్ ఫ్లేస్’ అనే హారర్ సినిమా చూస్తూ థియేటర్లో కంట్రోల్ లేకుండా ఏడ్చేశాను. అది దయ్యాల సినిమా అయినా, అందులోని క్యారెక్టర్స్ పడే బాధ నన్ను అంతలా కదిలించింది.అతన్ని ఫాలో అవుతుంటా...బాలీవుడ్ నటుల్లో కార్తీక్ ఆర్యన్ సోషల్ మీడియా పేజీని తప్పకుండా ఫాలో అవుతుంటాను. కార్తీక్ తన పేజీ ద్వారా చక్కని వినోదం పంచుతుంటాడు. సున్నితమైన హాస్యాన్ని పంచే పోస్టులు పెడుతుంటాడు. అతని పోస్టులకు నేను తరచు కామెంట్లు కూడా చేస్తుంటాను.ట్రోలింగ్స్కి నో టెన్షన్!ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చాలా హర్ట్ చేస్తాయి. ఆ సమయంలోనే ఒక విషయం నేర్చుకున్నా. కొందరు మనల్ని గొప్ప అంటారు, ఇంకొందరు పనికిరాని వాళ్లమంటారు. నిజం మాత్రం మనకు మనమే తెలుసుకోవాలి.డ్రీమ్ వెడ్డింగ్... ఇదే నా ప్లాన్!చిన్నప్పటి నుంచి అమ్మనాన్నల షూటింగ్స్ కోసం ప్రపంచమంతా తిరగడం వల్ల నా లైఫ్ ఒక ‘నొమాడ్’లా సాగింది. అందుకే నాకు బాలీవుడ్ తరహా ఆడంబరాల పెళ్లి వద్దు. తిరుపతిలోనే నా డ్రీమ్ వెడ్డింగ్ జరుగుతుంది. ప్యూర్ గోల్డ్ కంజీవరం శారీ కట్టుకుంటాను. పెళ్లి మెనూలో పక్కా సౌత్ ఇండియన్ వంటకాలే ఉంటాయి.అలా నా పేరు...మా నాన్న నిర్మించిన ‘జుదాయి’ సినిమాలో మా అమ్మతో పాటు ఊర్మిళా మటోండ్కర్ కూడా నటించింది. అందులో ఆమె పాత్ర పేరును అమ్మా, నాన్నా ఇద్దరూ ఇష్టపడ్డారు. మొదటి బిడ్డకు ఆ పేరే పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. అలా నాకు ఆ పేరు పెట్టారు.అవంటే చాలా ఇష్టంనటిగా ఫిట్నెస్ మీద జాగ్రత్తలు తీసుకుంటాను గాని, ఒక్కోసారి నాకు ఇష్టమైన ఫుడ్ లాగించేస్తూ ఉంటాను. స్ట్రీట్ ఫుడ్లో మోమోస్ను ఎక్కువగా ఇష్టపడతాను. రాజస్థానీ స్పెషల్ ‘జంగ్లీ మటన్’, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, పాయా ఎక్కడ కనిపించినా వాటిని వదులుకోను. స్వీట్లలో జిలేబీ, చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. రుచులను ఆస్వాదించడానికి ఇష్టపడతాను గాని, అలాగని ఎక్కువగా తినను. -
కీటకం.. ఆహారం.. వ్యాపారం
ఇళ్లల్లో ముచ్చటకొద్ది కుక్కలు, పిల్లలు వంటి జంతువులను, రామచిలుకలు, గోరువంకలు వంటి పక్షులను పెంచుకుంటారు. పాడి కోసం ఆవులు, గేదెలు వంటి పశువులను పెంచుకుంటారు. ఆహార అవసరాల కోసం కోళ్లు, మేకలు, గొర్రెలు, పందుల వంటి జీవాలను కూడా పెంచుకుంటారు. మనుషులు రకరకాల జీవాలను మచ్చిక చేసుకుని, వాటిని పెంచడం పురాతనకాలం నుంచి అలవాటే! కీటకాలలో తేనెటీగలను, పట్టుపురుగులను ప్రత్యేకంగా పెంచడం కూడా పురాతకాలం నుంచి సాగుతున్నదే! తేనెటీగల వల్ల తీయని తేనె, పట్టుపురుగుల నుంచి పట్టువస్త్రాలకు కావలసిన పట్టు దారాలు దొరుకుతాయి కాబట్టి వాటిని పెంచడం సరే! అసలు చూడగానే ఒళ్లు జలదరించేలా కనిపించే కీటకాలను కూడా ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఇలా పెంచుతున్న కీటకాలలో ఈగలు, దోమలు, చీమలు, బొద్దింకలు, కుమ్మరిపురుగులు, కందిరీగలు, మిడతలు, చిమ్మటలు, గొల్లభామలు, గొంగళిపురుగులు వంటివి కూడా ఉన్నాయి. అసలు వీటిని ప్రత్యేకంగా ఎందుకు పెంచుతున్నారు, వీటి వల్ల ఒరిగే ప్రయోజనాలు ఏముంటాయి అనే సందేహాలు చాలామందిలోనే ఉంటాయి. కీటకాల పెంపకం వల్ల చాలా ప్రయోజనాలే ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం...ఇళ్లల్లోకి ఈగలు, దోమలు, బొద్దింకలు, కందిరీగలు, గొంగళిపురుగులు వంటి కీటకాలు చేరితే వాటిని వెంటనే తరిమి కొట్టేందుకు ప్రయత్నిస్తాం. కీటకాల దాడి ముమ్మరంగా ఉంటే, వాటిని చంపేయడానికి నానా రకాల మందులు ప్రయోగిస్తాం. కాని, కీటకాల పెంపకం ఇప్పుడొక పరిశ్రమగా మారుతోంది. పలు దేశాల్లో కీటకాల పెంపకం క్రమంగా పుంజుకుంటోంది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రకరకాల అవసరాల కోసం సాగించే కీటకాల పెంపకం వ్యాపారం విలువ దాదాపు 30 బిలియన్ డాలర్ల వరకు ఉంది. కీటకాల పెంపకం వ్యాపారంలో దాదాపు 13 శాతం వార్షిక వృద్ధి నమోదవుతోంది. కీటకాల పెంపకంలో ఆసియా దేశాలు ముందంజలో ఉంటున్నాయి. కీటకాల పెంపకంలో ఆసియా దేశాల వాటా 40 శాతం వరకు ఉంటోంది. మనుషులు ఆహారంగా ఉపయోగించడానికి; మనుషులు తినే జలచరాలు, ఇతర జీవాలకు దాణాగా ఉపయోగించడానికి పలుచోట్ల కీటకాల పెంపకం సాగిస్తున్నారు. కొన్ని దేశాల్లోని రెస్టరెంట్లలో కీటకాలతో రకరకాల వంటకాలను వండి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. ఆకర్షణీయమైన సీసాలు, టిన్నులలో ప్యాక్ చేసి కూడా విక్రయిస్తున్నారు. మనుషులు వాడే ప్రొటీన్ పౌడర్లలోను; పశు పక్ష్యాదుల దాణాలోను కూడా కీటకాలను ఎండబెట్టి, పొడిచేసి ఉపయోగిస్తున్నారు.మనుషుల ఆహారంలో కీటకాలుమన దేశంలో కోళ్లు, మేకలు వంటి పశుపక్ష్యాదుల మాంసాన్ని; చేపలు, రొయ్యలు, పీతలు, ఎండ్రపీతలు వంటి జలచరాలను విరివిగా ఆహారంగా తీసుకునే జనాలు ఎక్కువగానే ఉన్నారు గాని, నేరుగా కీటకాలను ఆహారంగా తీసుకునే జనాలు చాలా తక్కువ. తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లో కీటకాలతో వంటకాలు చేసుకుని, తినే జనాలు ఎక్కువగానే కనిపిస్తారు. యూరోప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లోనూ కీటకాహారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది జనాభా కీటకాలను తింటున్నారు. అంటే, ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగోవంతు కీటకాహారులు ఉన్నారు.ఆసియా దేశాలలో ఎక్కువగా మిడతలు, గొల్లభామలు, పట్టుపురుగుల ప్యూపా, నీటి పురుగులు సహా రకరకాల కీటకాలను ఆహారంగా తీసుకునేవారు ఉన్నారు. దక్షిణ అమెరికాలో మిడతలు, చీమల గుడ్లు సహా అమెజాన్ అడవుల్లో దొరికే రకరకాల కీటకాలను తినేవారు ఉన్నారు. ఆఫ్రికాలో గొంగళిపురుగులు, చెదపురుగులు, తాటిముక్కు పురుగులు వంటి కీటకాలను తినేవారు ఉన్నారు. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) చెబుతున్న ప్రకారం దాదాపు రెండువేలకు పైగా జాతులకు చెందిన కీటకాలు మనుషులు నేరుగా ఆహారంగా వినియోగించడానికి అనువైనవి.ప్రపంచ జనాభా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో మనుషులు తమ ఆహారంలో కీటకాలను కూడా చేర్చుకోవాలని ఎఫ్ఏఓ 2013లో పిలుపునిచ్చింది. మనుషులు ఆహారంగా తీసుకోదగ్గ కీటకాలపై విస్తృత పరిశోధనలు జరిపి, ‘ఎడిబుల్ ఇన్సెక్ట్స్: ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ సెక్యూరిటీ’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. మనుషుల ఆహారం కోసం, పశుపక్ష్యాదుల దాణా కోసం కీటకాల పెంపకం 1990ల నుంచి పారిశ్రామిక పద్ధతుల్లో మొదలైనా, 2013లో ఎఫ్ఏఓ పిలుపు తర్వాత ఇది ఊపందుకుంది.కీటకాహారంలో ఆసియా దేశాల హవాకీటకాహారంలో ఆసియా దేశాల హవా నడుస్తోంది. మనుషులు తినడం కోసం కీటకాల పెంపకంలో తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలు ముందంజలో ఉంటున్నాయి. థాయ్లండ్ చిమ్మటల పెంపకంలో అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో దాదాపు పాతికవేల చిమ్మటల పెంపకం కేంద్రాలు ఉన్నాయి. వాటితో పాటు మిడతలు, గొల్లభామల పెంపకం కేంద్రాలు కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. పట్టుపరుగుల ప్యూపా, మీల్వార్మ్స్ పెంపకం కేంద్రాలలో చైనా అగ్రస్థానంలో ఉంది. వియత్నాంలో చిమ్మటలు, కీచురాళ్ల పెంపకం కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి.దక్షిణ కొరియాలో మీల్వార్మ్, పట్టుపురుగుల ప్యూపా, మిడతల పెంపంకం కేంద్రాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. జపాన్లో కందిరీగలు, మిడతల పెంపకం కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాలలోని పలు రెస్టరెంట్లలో కీటకాలతో తయారు చేసిన వంటకాలను కస్టమర్లకు వడ్డిస్తుండటం విశేషం. దక్షిణ అమెరికాలోని మెక్సికో, బ్రెజిల్; యూరోప్లోని నెదర్లాండ్స్, ఫ్రాన్స్ దేశాలు కూడా ఆహారంగా ఉపయోగించే కీటకాల పెంపకంలో ముందంజలో ఉన్నాయి.ఆహారంగా కీటకాలు... లాభాలు⇒ మనుషుల ఆహారంగా కీటకాలను ఉపయోగించడంలో చాలా లాభాలు ఉన్నట్లు ఎఫ్ఏఓ సహా పలు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఎండబెట్టిన కీటకాలలో ప్రొటీన్లు మిగిలిన ఆహారాల కంటే అత్యధికంగా ఉంటాయి.⇒ వీటిలో ఏకంగా దాదాపు 80 శాతం వరకు ప్రొటీన్లు ఉంటాయి. వీటిలో ఒమేగా–3, ఒమేగా–6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు; ఐరన్, జింక్ వంటి కీలకమైన ఖనిజాలు; విటమిన్–ఎ, విటమిన్–బి2, విటమిన్–బి12 వంటి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.⇒ మిడతలు, గొల్లభామలు వంటి కీటకాలలో ‘కీటిన్’ అనే పీచుపదార్థం ఉంటుంది. అందువల్ల కీటకాలు భేషైన పోషకాహారంగా తీసుకోదగినవని ఎఫ్ఏఓ చెబుతోంది.⇒ కీటకాల వల్ల పోషక ప్రయోజనాలు ఇలా ఉంటే, వీటిని పెంచడం చాలా తేలిక. ఆహారం కోసం ఇతర జీవాలను పెంచడం చాలా శ్రమతో కూడుకున్న పని. వాటికి విశాలమైన స్థలం, నీరు, గాలి, వెలుతురు వంటివి ఎక్కువగా అవసరమవుతాయి. వాటికి పెట్టే దాణా కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.⇒ కీటకాలను తక్కువ స ్థలంలోనే పెంచవచ్చు. వీటి పెంపకానికి నీరు చాలా తక్కువ ఖర్చవుతుంది. దాణా ఖర్చు దాదాపు నామమాత్రం. వీటి పెంపకం ప్రక్రియలో కర్బన ఉద్గారాలు చాలా తక్కువగా విడుదలవుతాయి. పోషకాహారంగానే కాకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం కూడా కీటకాల పెంపకాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.కీటకాల పెంపకం పరిశ్రమకీటకాల పెంపకం పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా కంపెనీలు ఉన్నాయి. ఇవి కీటకాల లార్వాలను సేకరించి, శాస్త్రీయమైన పద్ధతుల్లో కీటకాల పెంపకం సాగిస్తున్నాయి. దాదాపు నాలుగు వందల కంపెనీలు కీటకాలతో పశు పక్ష్యాదులకు, జలచరాలకు ఉపయోగించే దాణాను; మనుషులు తినదగ్గ కీటకాహారాన్ని తయారు చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్లో కీటకాల పెంపకం, కీటకాహార ఉత్పత్తిని భారీగా సాగిస్తున్న కంపెనీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. భారత్లో ప్రస్తుతానికి కొన్ని స్టార్టప్లతో కలుపుకొని సుమారు పాతిక కంపెనీలు ఈ రంగంలో పనిచేస్తున్నాయి.భారత్లో కీటకాలను ఆహారంలో తినేవారు దాదాపు పది రాష్ట్రాలలో ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోను, మధ్య భారత ప్రాంతంలోను, పడమటి కనుమల ప్రాంతంలోను, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాలకు చెందినవారు, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొందరు దాదాపు మూడువందల జాతులకు చెందిన కీటకాలను తింటారు. వీరు ఎర్రచీమలను, పట్టుపురుగుల ప్యూపాను, మిడతలు, గొల్లభామలను, తొలకరి వానలు మొదలయ్యే కాలంలో దొరికే ఊసిళ్లను తింటారు. భారత్లో కీటకాలను తినేవారు ఉన్నా, వాటి పెంపకం మాత్రం ఇప్పుడిప్పుడే పరిశ్రమగా రూపుదిద్దుకుంటోంది.ఎందుకు పెంచుతున్నారంటే?ప్రపంచవ్యాప్తంగా రకరకాల కీటకాలను పలు ప్రయోజనాల కోసం పెంచుతున్నారు. మనుషులకు, ఇతర జీవాలకు ఆహారంగా మాత్రమే కాకుండా, ఔషధాల తయారీ, వ్యర్థాల నియంత్రణ, రంగుల తయారీ, శాస్త్ర పరిశోధనలు తదితర అవసరాల కోసం కూడా కీటకాల పెంపకం చేపడుతున్నారు. కీటకాల్లో వేటిని ఎందుకు పెంచుతున్నారో తెలుసుకుందాం...ఆహార వ్యర్థాల నిర్వహణఆహార వ్యర్థాలను సురక్షితంగా, త్వరగా విచ్ఛిన్నం చేయడానికి; కోళ్లు, చేపలు, రొయ్యలు వంటి వాటి దాణా తయారీకి; సేంద్రియ ఎరువుల తయారీకి ఈగల్లో ఒకరకమైన ‘నల్ల సైనిక ఈగలు’ (బ్లాక్ సోల్జర్ ఫ్లై) పెంచుతున్నారు. వ్యర్థాల నిర్వహణ కోసం బొద్దింకలు, మీల్వార్మ్ వంటి కీటకాలను కూడా పెంచుతున్నారు.వైద్య పరిశోధనలుమలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధులపై పరిశోధనల కోసం నియంత్రిత పరిస్థితుల్లో కొన్నిచోట్ల దోమల పెంపకం కూడా చేపడుతున్నారు. జన్యుమార్పిడి చేసిన దోమలను పెద్దసంఖ్యలో బయటకు విడిచిపెట్టడం ద్వారా వ్యాధికారక దోమల నియంత్రణ కోసం ప్రయోగాలు జరుపుతున్నారు. ఈగలలో ఒకరకానికి చెందిన ఫ్రూట్ ఫ్లైని జీవశాస్త్ర పరిశోధనల కోసం పెంచుతున్నారు. మానవ జన్యవులతో బాగా పోలికలు ఉండటం వీటి ప్రత్యేకత. అందువల్ల వ్యాధుల నియంత్రణ కోసం జరిపే ప్రయోగాల కోసం ఫ్రూట్ ఫ్లై పెంపకం సాగిస్తున్నారు. గాయాల వల్ల ఏర్పడే మృతకణాలను తొలగించడానికి ఈగల లార్వా (మాగట్) పెంపకం చేపడుతున్నారు.ఆహార అవసరాలుమనుషుల ఆహార అవసరాల కోసం, పశువుల దాణా, మనుషులకు ఆహారంగా ఉపయోగపడే చేపలు, రొయ్యలు వంటి జలచరాల దాణా కోసం కూడా కీటకాల పెంపకం చేపడుతున్నారు. మిడతలు, గొల్లభామలు, బొద్దింకలు, మీల్వార్మ్ వంటి కీటకాలను ఆహార అవసరాల కోసం పెంచుతున్నారు. వీటితో ప్రొటీన్ పౌడర్లు వంటివి కూడా తయారు చేస్తున్నారు.ఇతర అవసరాలుమరికొన్ని ఇతర అవసరాల కోసం కూడా కీటకాలను పెంచుతున్నారు. ఫుడ్ కలర్స్, దుస్తులకు వేసే రంగులు, లిప్స్టిక్ వంటి వాటి తయారీలో ఉపయోగించడానికి ‘కోచినీల్’ పురుగులను పెంచుతున్నారు. వార్నిష్లు, పాలిష్లు, మేకప్ సామగ్రి తయారీ, ఔషధ పరిశ్రమ అవసరాల కోసం చెట్లను ఆశ్రయించుకుని పెరిగే లక్కపురుగులను ప్రత్యేకంగా పెంచుతున్నారు. పంటలను పాడుచేసే పురుగులను నియంత్రించడానికి ఆరుద్ర పురుగులను (లేడీబర్డ్ బీటిల్స్) పెంపకం సాగిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లో ఈగల పెంపకంఆంధ్రప్రదేశ్లో కూడా ఈగల పెంపకం సాగుతోంది. కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రాంతంలోని ఆక్వా సాగు ఎక్కువగా ఉండటంతో వక్కలగడ్డ గ్రామంలో ఈగల పెంపకం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ సుబ్రహ్మణ్యం సుందర్, నంద్యాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎ.వి.నాగేశ్వరరెడ్డి ఈ గ్రామంలో నిరుపయోగంగా ఉన్న కోళ్లఫారం షెడ్లను అద్దెకు తీసుకుని, అందులో ఈగల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీరితో పాటు డాక్టర్ శ్రావణి ఈ కేంద్రం నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు. ఇదేచోట విన్క్యులర్ ఆక్వా లాబ్ కూడా పెట్టారు.చేపలు, రొయ్యలకు వచ్చే వ్యాధులకు ప్రకృతి సిద్ధమైన చికిత్సలను ఎలా చేయాలో వీరు రైతులకు సలహాలు ఇస్తున్నారు. ఈగల పెంపకం కేంద్రంలో వెయ్యి గుడ్లతో ఉత్పాదన ప్రారంభిస్తే, పదిహేడు రోజుల్లోనే అవి మూడు లక్షలకు చేరుకుంటాయి. మరో పదిహేడు రోజులు ఆగితే, వాటి సంఖ్య తొంభై లక్షలకు పెరుగుతుంది. బియ్యం, కొవ్వు తీసేసిన పాలు కలిపి వండిన జావను ఈగలకు ఆహారంగా పెడతారు.ఈ షెడ్లలో ఈగలు సురక్షితంగా ఉండటానికి, వీటి నుంచి తప్పించుకుని బయటకు ఎగిరిపోకుండా ఉండటానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈగ గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలను వేరుశనగచెక్క పొడిలో వేస్తారు. పూర్తిస్థాయిలో లార్వాలు వేరుశనగచెక్క పొడిలోకి రాగానే, వాటిని విద్యుత్ డ్రైయర్లో ఉంచి, 95 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. ఆ వేడికి అవి వేరుశనగపొడిలో కలిసి పొడి పొడిగా మారిపోతాయి. ఈ పొడిని బయటకు తీసి, ఆరబెట్టి ప్యాక్చేసి, ఆక్వా రైతులకు ‘లార్వా ప్రొటీన్ ఫుడ్’ దాణాగా సరఫరా చేస్తారు. చేపలు, రొయ్యలకు ఈ పొడిని పెడితే, అవి ఎగబడి తింటాయి. ఈ పొడిలో ఉండే అత్యధిక ప్రొటీన్ వల్ల అవి బాగా పుష్టిగా ఎదుగుతాయి..ఇన్పుట్స్: ఆకుల సుధీర్కుమార్, సాక్షి, చల్లపల్లి -
దయ్యాల దీవి
అట్లాంటిక్ మహాసముద్రంలో కెనడాలోని న్యూఫౌండ్లాండ్ తీరానికి ఆవల ఉన్న ఈ దీవి పేరు ‘క్విర్పాన్ ఐలండ్’. అయితే, ఇది దయ్యాల దీవిగా పేరు మోసింది. దీనికి దయ్యాల దీవిగా పేరు రావడం వెనుక పదహారో శతాబ్దినాటి సంఘటన ఒకటి కారణమని చెబుతారు. ఫ్రెంచ్ నావికుడు కెప్టెన్ జ్హా ఫ్రాంకోయిస్ 1542లో మందీ మార్బలంతో నౌకాయాత్రకు బయలుదేరాడు. అదే నౌకలో ఫ్రాంకోయిస్ బంధువైన మార్గరిట్ అనే మహిళ మరో యువనావికుడితో సాన్నిహిత్యం పెంచుకుంది. ఫ్రాంకోయిస్ ఆమెను శిక్షించడం కోసం మార్గరిటేను, ఆమెకు సన్నిహితుడైన యువనావికుడిని, ఆమె సేవకుడిని ఈ నిర్జన దీవిలో విడిచి వెళ్లిపోయాడు. ఒంటరి దీవిలో వారు అగచాట్లు పడుతూ, కొన్నాళ్లకు మరణించారు. ఇప్పటికీ వారి ఆత్మలు ఈ దీవిలోనే సంచరిస్తుంటాయని చెబుతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో కొందరు ఔత్సాహిక పర్యాటకులు ఇక్కడకు రాకపోకలు జరుపుతున్నారు. -
వరికోతల వేడుక వివాహాల వేదిక
సంప్రదాయ పండుగ గవాయి దాయక్ వేడుకలకు తూర్పు మలేషియాలోని శరవాక్ రాష్ట్రంతో పాటు, బోర్నియో దీవులు ముస్తాబయ్యాయి. వరి కోతలు పూర్తయిన సందర్భంగా దాయక్ తెగ ప్రజలు ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే పండుగ ఇది. మే చివరి వారంలో మొదలైన ఈ వేడుకలు జూన్ చివరి వారంలో ముగుస్తాయి. దాయక్ తెగ భాషలో గవాయి అంటే పండుగ అని అర్థం. ఇది దాయక్ తెగకు నూతన సంవత్సరం వంటిది. పాత పంటకాలం ముగిసి, కొత్తగా వరి నాట్లు వేసే కాలం ప్రారంభమవడానికి ఇది సూచిక. ప్రాచీన కాలంలో గిరిజన యుద్ధాలు, కొత్త వ్యవసాయ భూముల గుర్తింపు, కొత్త ప్రాంతాలకు వలస వెళ్లే సమయంలో ఈ ఆచారాలు నిర్వహించేవారు. అయితే, ప్రస్తుత కాలంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, రక్షణ కలగాలని దాయక్ ప్రజలు ఈ పండుగను జరుపుకుంటున్నారు. దాయక్ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. వారు ఎక్కువగా వరి సాగు చేస్తారు. అన్నమే వారి ముఖ్య ఆహారం. పంట చేతికొచ్చి, ధాన్యపు రాశులు ఇళ్లకు చేరిన ఆనందంలో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. బ్రిటిష్ పాలన కాలంలో శరవాక్ దినోత్సవంగా ఉన్న ఈ రోజును, 1964 సెప్టెంబర్ 25న శరవాక్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పండుగగా ప్రకటించారు. తదనంతరం, 1965 జూన్ 1న మొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో గవాయి దాయక్ను ఘనంగా నిర్వహించారు.ఈ పండుగ కోసం మే నెల ప్రారంభం నుంచే సన్నాహాలు మొదలవుతాయి. పండుగకు కొన్ని రోజుల ముందు, లాంగ్హౌస్ (దాయక్ ప్రజలు నివసించే పొడవాటి ఉమ్మడి ఇళ్లు) నివాసితులంతా కలిసి ఇళ్లను శుభ్రం చేసి, అలంకరిస్తారు. తమ పూర్వీకుల ఆత్మలకు నివాళిగా శ్మశాన వాటికలను కూడా శుభ్రం చేయడం ఇక్కడి ఆనవాయితీ. గవాయి పండుగలో అత్యంత ముఖ్యమైనది ‘తువాక్’ అనే సంప్రదాయ పానీయం. మెత్తగా ఉడికించిన అన్నాన్ని ఈస్ట్తో కలిపి జాడీలలో నిల్వ చేసి, పులియబెట్టడం ద్వారా దీనిని తయారు చేస్తారు.ఈ పానీయం సేవించడాన్ని ధైర్యానికి, శక్తికి చిహ్నంగా భావిస్తారు. దాయక్ తెగలలో ఎక్కువ శాతం వివాహాలు ఈ పండుగ రోజుల్లోనే జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా లాంగ్హౌస్ కమిటీలు వివిధ పోటీలను నిర్వహిస్తాయి. యువతీ యువకుల ఊరేగింపులు, అందాల పోటీలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలతో పాటు, సంప్రదాయ నృత్యాలు వీక్షకులను ఆకట్టుకుంటాయి. నెల రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ వేడుకలు జూన్ చివరి వారంలో జరిగే ముగింపు వేడుకలో ‘చాపలు’ చుట్టేస్తారు. ‘చాపలు’ చుట్టేశారంటే, వేడుకలు ముగిసినట్లే!∙ రమా జంబుల -
పాల ఉత్పాదనలో మనమే టాప్!
సులువుగా దొరికే పోషకాహారంలో పాలను మించినవి లేవు. ఐదు దశాబ్దాల కిందట భారత్లో పాలకు లోటు ఉండేది. పాలను, పాలపొడిని దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఉండేవి. వర్ఘీస్ కురియన్ 1970లో చేపట్టిన ‘శ్వేత విప్లవం’ అనతికాలంలోనే సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. ఫలితంగా మన దేశం పాల ఉత్పాదనలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్య«ధికంగా పాల ఉత్పత్తి చేస్తున్న దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం.పాల ఉత్పాదనలో మన దేశం అగ్రస్థానంలో నిలుస్తున్నా, పాల తలసరి వినియోగంలో మాత్రం మొదటి పది స్థానాలలో లేకపోవడం గమనార్హం. అత్యధిక జనాభా, పేదరికం, పాలకు బదులుగా పెరుగు, మజ్జిగ వంటి ఉత్పాదనల వినియోగం పట్ల ప్రజల అభిరుచి తదితర కారణాల వల్ల తలసరి పాల వినియోగంలో భారత్ వెనుకబడి ఉంటోందని అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయి. పాల తలసరి వినియోగంలో మొదటి పది దేశాల వివరాలను గణాంకాల్లో తెలుసుకుందాం. -
వామనుడి త్రివిక్రమావతారం
‘జోసెఫ్ కాన్రాడ్, వ్లదిమీర్ నబాకఫ్, వి.ఎస్. నైపాల్ తదితరులు సొంత దేశాలూ– భాషలూ– ఖండాలూ– సంస్కృతులూ– ఒక్కమాటలో చెప్తే సొంత నాగరికతలను అధిగమించి, వేర్వేరు ప్రాంతాలకు తరలి వెళ్ళారు. ఆ వలసలు వారి ఊహాశక్తికి పదునుపెట్టి, పోషణనిచ్చాయి. అవి వలసల వల్ల సంక్రమించినవి. నా విషయంలో అలా చెప్పుకోడానికేమీ లేదు! ఒకే నగరం– ఒకే వీథి– ఒకే భవనంలో నా జీవితంలో అత్యధికభాగం గడిచిపోయింది. అక్కడి నుంచే, అదే దృశ్యాన్ని, అదే కోణంలోంచి చూస్తూ ఇన్నాళ్ళూ గడిపేశాను. నన్ను ‘నేను’గా మార్చిన నగరంతో నాకున్న ప్రగాఢ అనుబంధం అలాంటిది’ అన్నారు ఫెరీత్ (ఫరీద్) అర్హాన్ పముక్. 2006లో నోబెల్ సాహిత్య పురస్కారం అందుకునే నాటికే అర్హాన్ పముక్ సుప్రసిద్ధుడు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా వున్న అర్హాన్ పముక్, యాభయ్యేళ్ళకు పైగా సాహిత్యరంగంలోనూ కృషి కొనసాగిస్తూనే వున్నారు.దాదాపు డజను నవలలు రాసిన పముక్ కాల్పనికేతర సాహిత్యం కూడా బోలెడంత రాశారు. ‘ఇస్తాంబుల్– జ్ఞాపక నగరి’ అనే రచన అలాంటిదే! అది సగం జ్ఞాపకాల నెమరువేత ఐతే, మరికొంత ఇస్తాంబుల్ నగర జాతక చక్రం! ఆసియా–ఐరోపా ఖండాల మధ్య యుగయుగాలుగా విస్తరించి ఉన్న భూమార్గంలో చిట్టచివరి మజిలీ ఇస్తాంబుల్. ఈ చారిత్రక నగరం తూర్పు భాగం ఆసియాలో వుండగా, పడమటి భాగం యూరపులో చేరింది. తూర్పు ఇస్తాంబుల్లోని ‘పముక్ భవంతి’ పే...ద్ద అపార్టుమెంట్ సముదాయం. అర్హాన్ పముక్ బంధువులందరూ ఆ భవంతిలోని ఒక్కో అపార్టుమెంట్లో సకుటుంబంగా జీవిస్తూ వుంటారు. మధ్యలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వుండివచ్చినా, ఎక్కువ కాలం ఆ భవంతిలోనే వున్నానంటారు పముక్. వలస జీవన విధానం ఒకరకం శక్తినిస్తే, ఒకే చోట పాతుకుపోయి జీవించడం మరోరకం శక్తిని ఇస్తుందని పముక్ రుజువు చేశారు. ప్రపంచంలోని ప్రతి చెప్పుకోదగిన నగరంలోని జీవిత విధానం పైనా ఎవరో ఒకరు ఏదో ఓ రూపంలో రాస్తూనే వున్నారు. అంచేత పముక్ గొప్పతనం ఆయనొక్కడే వాళ్ళ నగరం గురించి రాయడంలో లేదు– అది రాసిన పద్ధతిలో ఉంది!సామాన్య శకం నాలుగో శతాబ్దిలో, తూర్పు రోమన్ సామ్రాజ్య రాజధానిగా నిర్మితమైన కాన్స్టాంటినోపుల్ నగరమే, ఆరేడు వందల సంవత్సరాల తర్వాత ఇస్తాంబుల్గా మారిందని యూరపియన్ చరిత్ర రచయితలు అంటారు. కానీ, అంతకు రెండువేల యేళ్ళకు ముందునుంచీ ఈ నగరం ఉన్న ప్రాంతం జనావాసంగా వుంటూనే వచ్చిందని ఆసియన్ చరిత్ర గ్రంథాల సమాచారం. బైజాంటియన్ సంస్కృతి ఇక్కడ వర్ధిల్లింది. మూడువేల సంవత్సరాల కిందట మతం– రాజకీయం రెండు స్వతంత్ర శాఖలుగా చీలక ముందటి మాట యిది. అసలు ‘బిజాంతీన్’ అంటేనే సంక్లిష్ట సమన్వయమని అర్థం! ఈ ప్రాంత చరిత్ర వరకూ ఇది అక్షరాలా సార్థకం!!‘ప్రాక్పశ్చిమ నాగరికతల మధ్య నిర్మించిన వారధులు’గా పముక్ రచనలను పేర్కొన్నారు నోబెల్ పురస్కారం ఎంపిక సంఘంలోని నిపుణులు! ‘రెండు నాగరికతల మేలికలయిక ఇస్తాంబుల్. దాని ‘వ్యాకులిత ఆత్మ’ను సరికొత్త ప్రతీకల సాయంతో శోధించిన వాడు పముక్. భిన్న సంస్కృతుల మధ్య తలెత్తే ఘర్షణలనూ– సమన్వయాన్నీ కూడా గొప్పగా చిత్రించినందుకు ఈ జ్యూరీ పముక్ను అభినందించింది. భిన్న భాషలూ, సంస్కృతులూ, మతాల మధ్య ఏర్పడే ఘర్షణలకు నూతన భాష్యాలు చెప్తూ, వాటికి ‘అనూహ్య సమన్వయాలను సూచించినందుకు’ పముక్ను జ్యూరీ కొనియాడింది. అంతటితో ఆగితే బావుండేది– ‘వర్తమాన సాహిత్య ప్రపంచంలో అత్యంత విశిష్టమైన వ్యక్తి పముక్’ అని జ్యూరీ ప్రకటించడంతో ఇంటా బయటా కూడా పెద్ద దుమారమే చెలరేగింది. కొందరు దాన్ని ‘కేవలం రాజకీయ ప్రకటన’గా చిత్రించి కొట్టిపారేశారు. మరికొందరు ఈ ప్రకటనను ‘టర్కిష్ సాహిత్యం సాధించిన ఘనవిజయం’గా జమకట్టారు. అయినా, మన సాహిత్య వేత్తల సుహృద్భావం మనకు తెలియనిదా? నక్కలెక్కడికెళ్ళినా ఊళలే వేస్తాయి–కోయిల ఏ దేశంలోనైనా తియ్యగానే పాడుతుంది! ఆ విషయం అలా వుంచండి!!‘ప్రతి మనిషీ జీవితంలో ఒకసారైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన పరిసరాలు అప్పుడెలా వుండేవో, ఇప్పుడెల వున్నయో పునఃపరిశీలించుకోడానికి అది వుపయోగపడుతుంది. ఈ విశ్వం ఎంతో విశాలమైంది. దానిలోని ఒకానొక మూలనే, ఒకానొక రోజునే, ఒకానొక కుటుంబంలోనే మనం పుట్టాలని జీవితమనే లాటరీ ఎందుకు నిర్ణయించింది? ఆ కుటుంబం మనల్ని ఎందుకంతగా ప్రేమిస్తుంది? మనమెందుకు వాళ్ళను అంతగా అభిమానిస్తాం? ఏమో– ఇంతకన్నా మెరుగైన జీవితానికి అర్హులమేమో మనం? వయసుడిగిన ఓ నగరంలో పుట్టడం నా దురదృష్టమేమో అనిపిస్తుంది ఒక్కోసారి’ అన్నారు పముక్ ‘ఇస్తాంబుల్ నగరం – కొన్ని జ్ఞాపక కథలు’ పుస్తకానికి రాసిన ముందు మాటలో. ఆ పుస్తకం చదువుతూ పోతుంటే అవి ఓ వ్యక్తి జ్ఞాపకాలో, ఒకానొక నగరం స్వగతమో మర్చిపోతూ వుంటాం. ఒక వ్యక్తి విరాట్ రూపంలో ఓ చారిత్రక మహానగరాన్ని ఆక్రమించుకుంటున్నట్లు అనిపిస్తుంది!! అదే పముక్ వేసిన మంత్రం. ఇది అందరికీ చేతనయ్యే ట్రిక్కు కాదు. కనుకనే, ఫెరీత్ అర్హాన్ పముక్కు నోబెల్ సాహిత్య పురస్కారం దక్కింది.-మందలపర్తి కిషోర్ -
పరిశోధనా రంగంలో నకీలల కలకలం
శాస్త్ర రంగంలో వాస్తవ పరిశోధనల కంటే నకిలీల ప్రాబల్యం పెరిగిపోతుండటం పట్ల అంతర్జాతీయ పరిశోధక సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. శాస్త్ర విజ్ఞాన రంగానికి సంబంధించి నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల వెల్లడించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు యావత్ సైన్స్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేశాయి.‘అమ్ముడుబోతున్న’ జర్నల్స్!ఎటువంటి క్షేత్రస్థాయి పరిశోధనలు లేదా ప్రయోగాలు లేకుండానే, ధనార్జనే ధ్యేయంగా కొన్ని ముఠాలు నకిలీ అధ్యయన పత్రాలను విక్రయిస్తున్నాయి. అంతకంటే ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, శాస్త్రీయ ప్రమాణాలను పాటించాల్సిన కొన్ని గుర్తింపు పొందిన జర్నల్స్ (సైన్స్ పత్రికలు) సైతం ఈ ముఠాలతో చేతులు కలపటం! భారీ మొత్తంలో డబ్బు, ఇతర ప్రయోజనాల కోసం ఆ పత్రికలు నాణ్యత లేని, అశాస్త్రీయమైన సమాచారాన్ని ప్రచురిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా రంగం విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి!నెట్వర్క్గా సాగుతోందినార్త్వెస్టర్న్ యూనివర్సిటీ నిర్వహించిన లోతైన సత్యాన్వేషణలో భాగంగా, లక్షలాది పాత రికార్డులను తనిఖీ చేసినప్పుడు ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మధ్యవర్తులు, నకిలీ పరిశోధకులు ఒక నెట్వర్క్గా ఏర్పడి, పరిశోధనా పత్రాలను విక్రయిస్తున్నట్లు బయటపడింది. దీంతో, నికార్సైన పరిశోధనా పత్రాన్ని కూడా అది నిజమైనదా కదా అని సూక్ష్మంగా పరిశీలించాల్సిన అగత్యం ఏర్పడింది.అబద్దపు నివేదికలు, ప్రసంశలుప్రచురణల రంగంలోని పెద్దల బలహీనతలను ఆసరాగా చేసుకుని, కొన్ని ముఠాలు ప్రధానంగా మూడు రూపాల్లో మోసానికి పాల్పడుతున్నట్లు నార్త్వెస్టర్న్ బృందం గుర్తించింది ఆ మూడూ : ఎటువంటి ప్రయోగాత్మక ఆధారాలు లేకుండానే, కేవలం ఊహాజనిత లెక్కలతో అబద్ధపు నివేదికలను కల్పిత డేటాతో సిద్ధం చేయడం; నిర్ణీత రుసుము చెల్లిస్తే చాలు, ఎవరి పేరునైనా సరే ‘ప్రధాన పరిశోధకుడి’ (ఫస్ట్ ఆథర్) గా నివేదికలో చేర్చటం; ఆ తప్పుడు పరిశోధనకు ప్రాధాన్యం కల్పించేందుకు కొన్ని పత్రికల్లో రివ్యూలు రాయించటం, అలాగే ‘గ్రంథ రచయిత’లుగా కొందరికి ప్రశంసాపత్రాలు అందచెయ్యటం! ‘‘ఈ ధోరణి పట్ల మనం ఉదాసీనంగా ఉండిపోతే, సైన్స్ ప్రామాణికతే ప్రశ్నార్థకంగా మారుతుంది’’ అని ప్రొఫెసర్ అమరల్ కలవరపడుతున్నారు. అమరల్ నార్త్వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన సోషల్ సిస్టమ్స్, ఇంజనీరింగ్ సైన్సెస్ నిపుణుడు. ఆయన తన సహ పరిశోధకుడు రీస్ రిచర్డ్సన్తో కలిసి కూపీ లాగినప్పుడు ఈ నకిలీ పరిశోధనల పత్రాల గుట్టలు బయటపడ్డాయి. వాటిపై వీరిచ్చిన సంచలన నివేదిక ప్రతిష్టాత్మకమైన పి.ఎన్.ఎ.ఎస్. (ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్) జర్నల్లో రావటంతో అంతర్జాతీయంగా నకిలీ పరిశోధనా పత్రాలపై చర్చ మొదలైంది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ‘నేషనల్ సైన్స్ ఫౌండేషన్’ మద్దతు కూడా వీరికి లభించింది. తవ్వి తీశారుఅమరల్ పరిశోధక బృందం కేవలం ప్రాథమిక పరిశీలనకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలోని అతి పెద్ద డేటాబేస్లను క్షుణ్ణంగా పరిశీలించి, ఈ అక్రమాలను వెలికి తీసింది. ఇందుకోసం వారు ‘వెబ్ ఆఫ్ సైన్స్’, ‘స్కోపస్’, ‘పబ్మెడ్’ వంటి పేరున్న డేటాబేస్ల నుండి లక్షలాది రికార్డులను సేకరించి తూర్పార పట్టారు. ఒకే రకం చిత్రాలను లేదా ఒకే రకం డేటాను వేర్వేరు పరిశోధనా పత్రాల్లో మళ్లీ మళ్లీ వాడటం వంటి మేధోచౌర్యాన్ని గుర్తించారు. నాణ్యత ప్రమాణాలు పాటించనందున డేటాబేస్ల నుండి తొలగింపునకు గురైన జర్నల్స్ జాబితాను నిశితంగా చెరిగి, వాటిలో వచ్చిన పరిశోధనా పత్రాల వెనుక ఉన్న ఉమ్మడి నెట్వర్క్లను వెలికితీశారు. ‘రిట్రాక్షన్ వాచ్’, ‘పబ్పీర్’ వంటి వాచ్డాగ్ ప్లాట్ఫామ్లలోని చర్చలను, ఎడిటర్ల నేపథ్యాలను, పరిశోధనా పత్రాల సమర్పణ తేదీలను బేరీజు వేసుకున్నారు. ఇంత నిశితంగా తవ్వుకుంటూ వెళ్లాక మాత్రమే, అశాస్త్రీయ పద్ధతుల్లో పత్రాలను ప్రచురిస్తున్న ముఠాల ఉనికిని తెలుసుకోగలిగారు.ఎంత డబ్బుకు అంత హోదా!శాస్త్ర పరిశోధన అనేది నిరంతర శ్రమతో కూడిన విషయం. అయితే, ఈ నేరపూరిత పగడ్బందీ నెట్వర్క్లు శ్రమ లేకుండా డబ్బు సంపాదించటం కోసం నకిలీ పరిశోధనా పత్రాలను సృష్టిస్తున్నాయి. ఈ పత్రాల్లో నిజాలు ఉండవు, వీటిలోని సమాచారానికి పొంతనలు కుదరవు. ఇదంతా కూడా మనీ లాండరింగ్లా సాగుతుంది. భారీ మొత్తంలో నిధులు చెల్లించే వారికి పరిశోధనతో సంబంధం లేకపోయినా ‘ప్రధాన రచయిత’ హోదాను కల్పిస్తారు. ఇచ్చే డబ్బును బట్టి రచయితల జాబితాలో నాలుగో స్థానం లేదా ఐదో స్థానం కేటాయిస్తారు. ఈ అశాస్త్రీయ పత్రాలపై ఎటువంటి సమీక్ష లేదా అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు, జర్నల్స్ యాజమాన్యాలకు కూడా భారీగా ముడుపులు అందిస్తున్నట్లు అమరల్ టీమ్ పసిగట్టింది.నివారించటం ఎలా?!ఈ వ్యవస్థీకృత ‘ఫేక్ రీసెర్చ్’ వైరస్ను అడ్డుకోవడానికి అమరల్, రిచర్డ్సన్ల బృందం అత్యంత కీలకమైన, ఆచరణాత్మక పరిష్కారాలను సూచిస్తోంది. అవి: పరిశోధన పత్రాలపై సంపాదకీయ పర్యవేక్షణ ఉండాలి. జర్నల్న్ పనితీరుపై నిరంతర నిఘా పెట్టాలి. ఎడిటర్లు అనుసరిస్తున్న సమీక్షా పద్ధతులు పారదర్శకంగా ఉన్నాయా లేదా అని నిశితంగా గమనించాలి. అనైతిక పద్ధతులకు పాల్పడే ఎడిటర్లను గుర్తించి, జర్నల్స్ విశ్వసనీయతను కాపాడాలి. అలాగే, కృత్రిమ మేధ, డేటా ఎనలిటిక్స్ ఆధారంగా సరికొత్త టూల్స్ను అభివృద్ధి చేయాలి. అబద్ధపు సమాచారాన్ని, మే«ధా చౌర్యాన్ని, కల్పిత డేటాను ప్రాథమిక దశలోనే గుర్తించగల సాంకేతికతను పబ్లిషింగ్ హౌస్లు తప్పనిసరిగా వాడాలి.ఏఐతో మరింత ముప్పు!శాస్త్ర పరిశోధనా రంగంలోప్రస్తుతం జరుగుతున్న ఈ మోసాలకు తోడు, ‘జనరేటివ్ ఏఐ’ ప్రవేశం కూడా పరిశోధనా రంగాన్ని మరింత ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని పరిశోధకుడు రిచర్డ్సన్ హెచ్చరించారు. అదెలా అంటే, ఏఐ సాయంతో అతి తక్కువ సమయంలో వేల సంఖ్యలో నకిలీ పరిశోధనా పత్రాలను సృష్టించే అవకాశం ఉంది. దీనివల్ల వాస్తవ పరిశోధనలు ఈ కృత్రిమ సమాచార ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇక నకిలీ పరిశోధనా పత్రాలలోని సమాచారాన్ని ఆధారంగా చేసుకుని భవిష్యత్తు ఏఐ మోడల్స్ శిక్షణ పొందితే, అవి మరింత తప్పుడు సమాచారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ఒక విషవలయంలా మారి, వాస్తవానికి, కల్పితానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూర్తిగా చెరిపివేస్తుంది. ఈ పరిణామం వల్ల అంతిమంగా శాస్త్రీయ విజ్ఞానం ప్రామాణికత దెబ్బతింటుంది. అబద్ధపు పునాదుల మీద నిర్మితమయ్యే మేధో సంపత్తి మానవాళికి ఎటువంటి ఉపయోగం లేకపోగా, తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ‘‘శాస్త్ర విజ్ఞానం మానవజాతి మనుగడకు అత్యంత కీలకం అని మనం విశ్వసిస్తే, దాని పవిత్రతను కాపాడటానికి ఈ అనైతిక శక్తులపై పోరాడక తప్పదు’’ అని అమరల్ తాజాగా పిలుపునిచ్చారు. శాస్త్ర విజ్ఞాన రంగంలో నైతికతను పునరుద్ధరించడమే నేటి తక్షణ కర్తవ్యం అని ఆయన అంటున్నారు. నిజమే. సత్యాన్వేషణే లక్ష్యంగా సాగే సైన్స్ రంగం, ఈ నకిలీ ప్రభావం నుండి బయటపడి తన పూర్వ వైభవాన్ని, విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన చారిత్రక అగత్యం నేడు ఏర్పడింది!∙ సాక్షి స్పెషల్ డెస్క్మేధా దోపిడీకి పరాకాష్ఠనకిలీ పరిశోధనా రంగంలోని ముఠాలు అనుసరిస్తున్న వ్యూహాలు, మాయోపాయాలను ప్రొఫెసర్ అమరల్ బృందం శాస్త్రీయంగా విశ్లేషించింది. దాని ప్రకారం, ఈ నెట్వర్క్లు ఒకే పరిశోధనా పత్రాన్ని ఏకకాలంలో పలు జర్నల్స్లో వచ్చేలా చేసి, త్వరగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తాయి. ఒకవేళ భవిష్యత్తులో ఆ పత్రం నకిలీదని తేలి, తొలగింపునకు గురైనప్పటికీ అప్పటికే వారు పొందాల్సిన లబ్ధిని వారు పొంది ఉంటారు. అలాగే ప్రచురణ నిలిచిపోయిన పాత పత్రికల వెబ్సైట్ డొమైన్లను ఈ ముఠాలు కొనుగోలు చేస్తాయి. ఉదాహరణకు, బ్రిటన్కు చెందిన ‘హెచ్.ఐ.వి. నర్సింగ్’ జర్నల్ మూత పడగానే దానిని కొని, దాని పేరును వాడుకుంటూ నర్సింగ్ రంగానికి ఏమాత్రం సంబంధంలేని వేలాది అశాస్త్రీయ పత్రాలను వారు ప్రచురించారు. మేధా దోపిడీకి ఇది పరాకాష్ఠ. ఇవి కాక, రచయితలకు, జర్నల్ ఎడిటర్లకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ; పరిశోధనా పత్రాల ప్రచురణకు ‘ప్యాకేజీ’ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పరిశోధనా పత్రం తయారీ నుండి ప్రచురణ వరకు కొనసాగుతున్న ఈ పకడ్బందీ కుంభకోణంపై అమరల్ బృందం అంతర్జాతీయ సమాజానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. శాస్త్ర రంగంలో తగిన భద్రతా ప్రమాణాలు, పారదర్శకతను పెంచకపోతే, భవిష్యత్తులో మేధో ప్రపంచం ఈ మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్నకిలీ పరిశోధనల వ్యవస్థ జాడలను ఛేదించేందుకు ప్రొఫెసర్ అమరల్ బృందం ఒక అధునాతన ‘ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్’ను అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక విధానం ప్రధానంగా మెటీరియల్ సైన్సెస్, ఇంజినీరింగ్ రంగాల్లోని పరిశోధనా పత్రాలను నిశితంగా విశ్లేషిస్తుంది. చాలామంది నకిలీ పరిశోధకులు పరిశోధన కోసం తాము అత్యాధునిక పరికరాలను ఉపయోగించినట్లు పత్రాల్లో పేర్కొంటారు. అయితే, వారు పేర్కొన్న పరికరాల సామర్థ్యానికి, వారు చూపిన ఫలితాలకు మధ్య ఎటువంటి శాస్త్రీయ సంబంధమూ ఉండదు. దానిని ఈ ‘ఆటోమేటిక్ స్కానింగ్ సిస్టమ్’ సాఫ్ట్వేర్ తక్షణమే గుర్తిస్తుంది. అలాగే క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రయోగాలు చేయకుండానే, కేవలం ఊహాజనిత పరికరాల పేర్లతో పేపర్లు సృష్టించే వారిని ఈ వ్యవస్థ సమర్థవంతంగా గుర్తించి, అడ్డుకుంటుంది. ఈ వినూత్న పరిష్కారాన్ని ప్రతిష్ఠాత్మకమైన ‘ప్లాస్ వన్’ జర్నల్ ప్రశంసించింది. శాస్త్రీయ పరిశోధనల నాణ్యతను కాపాడటంలో కీలక ముందడుగుగా దీనిని అభివర్ణించింది. -
కస్టమ్స్ చెప్పుకునేందుకే
మీ చెప్పుకు స్ట్రిప్ ఉందా?.. ఇదేంటి.. మీ పేస్టులో ఉప్పుందా అని యాడ్ చూశాం కానీ చెప్పు స్ట్రిప్ గురించి అడుగుతున్నారేంటి? అనుకుంటున్నారా? అంతే కాదండోయ్.. మీరు వేసుకుంది చెప్పులా? శాండిల్సా? ఇవేం ప్రశ్నలని ఆశ్చర్యపోతున్నారా? కానీ, ఇదే ప్రశ్న దేశ రాజధానిలో సుమారు 14 ఏళ్ల పాటు ఓ సంస్థను కార్యాలయాల చుట్టూ తిప్పింది. కోర్టు మెట్లు ఎక్కించింది. న్యాయపోరాటానికి కారణమైంది. చెప్పులు అని వేటిని అంటారు. శాండిల్స్కు ఉండాల్సిన అర్హత ఏంటనే దానిపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఏవి చెప్పులో.. ఏవి శాండిల్సో చివరికి ఢిల్లీ హైకోర్టు తేల్చింది. ఓ పరిష్కారం లభించింది.చెన్నైకి చెందిన విశాల్ ఇంటర్నేషనల్ సంస్థ 2003 మే 15న మహిళల పాదరక్షలను విదేశాలకు ఎగుమతి చేసింది. కంపెనీ వాటిని ‘లేడీస్ లెదర్ శాండిల్స్’గా పేర్కొంటూ, ఆ కేటగిరీకి వర్తించే 10 శాతం డ్రా బ్యాక్ రాయితీని కోరింది. అయితే ఇవి శాండిల్స్ కాదు చెప్పులు అని కస్టమ్స్ శాఖ సుంకం రాయితీని ఐదు శాతానికి తగ్గించింది. దీంతో అవి ఏ కేటగిరీ కిందకు వస్తాయనే చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘చప్పల్’ నిర్వచనాన్ని సంస్థ అంగీకరించలేదు. దీంతో న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఇది దేశవ్యాప్తంగా ఎగుమతిదారుల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు సంస్థలు.. విభిన్న నివేదికలుఎగుమతి వస్తువు ఏ కేటగిరీ కిందికి వస్తుందనేది నిర్ధారించేందుకు పాదరక్షల నమూనాను న్యూఢిల్లీలోని లెదర్ ఎక్స్పోర్టు కౌన్సిల్కు విశాల్ సంస్థ పంపింది. ఆ కౌన్సిల్లోని సభ్యులు వాటిని పరిశీలించి అవి లెదర్ శాండిల్స్గా నిర్ధారించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దీనిపై ఎస్ఐఐబీ ఆ నమూనాను కౌన్సిల్ ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సంస్థకు(ఎఫ్డీడీఐ) పంపించింది. ఆ ఎగుమతి వస్తువులు ‘చెప్పుల’ కేటగిరీకి చెందినవిగా పేర్కొంది. ఈ కేటగిరీకి 10% సుంకం రాయితీ రాదని, 5% మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. సంస్థకు షోకాజ్ నోటీసు జారీలెదర్ ఎక్స్పోర్టు కౌన్సిల్ లేఖ ఆధారంగా కస్టమ్స్ శాఖ విశాల్ ఇంటర్నేషనల్ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేటగిరీని తప్పుగా నమోదు చేసి చెల్లించిన వ్యత్యాస డ్యూటీ డ్రా బ్యాక్ మొత్తం రూ. 1,30,800 నెలకు 15% వడ్డీతో కలిపి ఎందుకు తిరిగి వసూలు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో కోరింది. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 114 ప్రకారం జరిమానా విధించే ప్రతిపాదన కూడా నోటీసులో పేర్కొంది. వ్యక్తిగత విచారణకు కూడా అవకాశం కల్పించింది.జరిమానా విధింపుఎఫ్డీడీఐ నిర్ణయంతో ఏకీభవించడం లేదంటూ విశాల్ సంస్థ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చింది. అనంతరం డ్రా బ్యాక్ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని, అదనంగా రూ. 1.25 లక్షల జరిమానా చెల్లించాలని కస్టమ్స్ అదనపు కమిషనర్ ఆర్డర్ జారీ చేశారు. దీనిపై సంస్థ కస్టమ్స్ కలెక్టర్ (అప్పీల్స్) వద్ద అప్పీలు దాఖలు చేసింది. ఆ అప్పీల్ను తిరస్కరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రివిజన్ దరఖాస్తు సమర్పించింది. ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ నైపుణ్యం కలిగిన సంస్థ కావున ఆ అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కేంద్రం తెలిపింది. జరిమానా మొత్తాన్ని రూ. 10,000కు తగ్గించింది. ఎన్నో ఏళ్లుగా వ్యాపారపరంగా ఆ పుట్వేర్ను ‘లెదర్ శాండల్స్’గానే వర్గీకరిస్తున్నారని విశాల్ సంస్థ పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్చివరకు సంస్థ 2013లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కస్టమ్స్ శాఖ వర్గీకరణ సరైంది కాదని, తాము ఎగుమతి చేసిన పుట్వేర్ను శాండిల్స్గా పరిగణించాలని, శాండిల్స్కు వర్తించే సుంకం రాయితీ వర్తింపజేయాలని, కస్టమ్స్ శాఖ ఆదేశాలను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించింది. ఏది చప్పల్? ఏది శాండల్?వెనుక భాగంలో స్ట్రిప్ లేకపోతే అది శాండిల్ కాదు చప్పల్గానే పరిగణించాలన్న కస్టమ్స్ శాఖ వాదనను కోర్టు అంగీకరించలేదు. ఒకే ఒక లక్షణం ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంది. వ్యాపారులు, వినియోగదారులు ఒక ఉత్పత్తిని ఎలా పిలుస్తారో అదే ప్రామాణికమని పేర్కొంది. టెక్నికల్గా అధికారులు ఏ పేరు పెట్టినా మార్కెట్లో అది లేడీస్ లెదర్ శాండిల్స్గానే గుర్తింపు పొందిందనే అంశాన్ని గుర్తించాలని పేర్కొంది. కోర్టు తీర్పు ఇలా..లెదర్ ఫుట్వేర్ వర్గీకరణపై దాదాపు 14 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఢిల్లీ హైకోర్టు 2017లో ముగింపు పలికింది. కస్టమ్స్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ఎగుమతి చేసిన ఉత్పత్తిని చప్పల్స్’గా వర్గీకరించిన విధానాన్ని తప్పు పట్టింది. మహిళల పుట్వేర్లో అనేక నమూనాలు ఉంటాయని, వాటన్నింటికీ ఒకే కొలమానం పెట్టలేమని స్పష్టం చేసింది. చెప్పులు, శాండిల్స్కు ఉన్న టెక్నికల్ తేడాలను పేర్కొంది. సంబంధిత శాఖ ఆదేశాల్ని కొట్టేస్తూ తుది తీర్పు ఇచ్చింది. సాధారణంగా చట్టంలో ఒక ఉత్పత్తికి స్పష్టమైన నిర్వచనం లేని సందర్భంలో ‘కమర్షియల్ పారాలెన్స్ టెస్ట్’ను కోర్టులు ప్రామాణికంగా భావిస్తాయి.. కానీ, కొన్ని కేసుల్లో మాత్రం కాంపోజిషన్, టెక్నికల్ స్టాండర్డ్స్ను కూడా చూడాలని న్యాయ స్థానాలు పలు కేసుల్లో స్పష్టం చేశాయి. ∙దిలీప్ మాదిరెడ్డి -
పిల్లల కథ: మృగరాజు పరివర్తన
అనగనగా ఒక అడవి. ఆ అడవికి సింహం రాజు. తోటి ప్రాణులను అది హీనంగా చూసేది. ఒకనాడు ఆ సింహం నీళ్లు తాగడానికి వాగు దగ్గరకు వెళ్ళింది. అదే సమయానికి అక్కడికి ఒక ఏనుగు వచ్చింది.సింహం ఏనుగును చూసి గర్జిస్తూ ఇలా అంది, ‘ఓయ్ ఏనుగు! ఈ రోజు పొట్ట నిండా అరటిపండ్లు తిన్నట్లు ఉన్నావు కదా?’ఏనుగు ప్రశాంతంగా, ‘అవును రాజా, నా ఆకలి తీర్చుకున్నాను’ అని బదులిచ్చింది.అప్పుడు సింహం అధికారాన్ని ప్రదర్శిస్తూ, ‘విను! రేపటి నుండి నువ్వు ఆహారం తినే ముందు రెండు గెలల అరటిపండ్లను నా గుహలో పెట్టాలి. ఆ తర్వాతే నువ్వు ముట్టాలి, అర్థమైందా?’ అని గర్జించింది.ఏనుగు ఏమాత్రం తడబడకుండా, ‘క్షమించు రాజా! నేను నీకు సేవకుడిని కాదు. నీ ఆజ్ఞలు పాటించడానికి నేను సిద్ధంగా లేను’ అని చెప్పింది.సింహం కోపంతో కళ్లెర్రజేసింది. ఏనుగు భయపడకుండా, ‘నీవు అడవికి రాజువు మాత్రమే, యజమానివి కాదు అని గుర్తుంచుకో! నీ అంత శక్తి నాకూ ఉంది.’ అంది.ఏనుగు అలా సమాధానం చెప్పేసరికి, సింహం అవమానంతో వెనుదిరిగింది. దారిలో ఒక ఎలుగుబంటి తేనె తాగుతూ కనిపించింది.సింహం ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి, ‘ఒరేయ్ ఎలుగుబంటి! రేపటి నుండి నువ్వు సంపాదించే తేనెలో రెండు పెద్ద పట్టులు నా గుహలో సమర్పించాలి’ అని ఆజ్ఞాపించింది.ఎలుగుబంటి నవ్వుతూ, ‘రాజా! తేనెటీగలతో కుట్టించుకుని, ప్రాణాలకు తెగించి తెచ్చుకునే నా కష్టార్జితాన్ని నీకు ఎందుకు ఇవ్వాలి?’ అని ప్రశ్నించింది.సింహం ఆశ్చర్యపోతూ ఉండగా, ఎలుగుబంటి మళ్ళీ ఇలా అంది: ‘కష్టపడి సంపాదించేది మేము, కూర్చుని తినేది నువ్వా? ఇది న్యాయం కాదు. నేను నీ సేవకుడిని కాను.’మరోసారి పరాభవం ఎదురవడంతో సింహం ముందుకు సాగింది. ఒక చెట్టు మీద మామిడి పండ్లు తింటున్న కోతి దానికి కనిపించింది.సింహం కోతిని చూసి, ‘ఓయ్ కోతి! రేపటి నుండి రెండు బుట్టల మామిడి పండ్లను నా గుహలో పెట్టాలి. నేను తిన్నాకే నువ్వు తినాలి’ అని çహూంకరించింది.కోతి కిచకిచ నవ్వుతూ, ‘రాజా! నీ గర్జనలకు భయపడే కాలం పోయింది. మేము గౌరవించేది నీ పదవిని మాత్రమే, నీ గర్వాన్ని కాదు’ అని చెప్పింది.కోతి ఇంకా ఇలా అంది: ‘మేము నిన్ను రాజుగా చూస్తున్నాము కాని, నీకు దాసోహం అనడం లేదు. కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని ఎవరికీ ఊరికే ఇచ్చే ప్రసక్తే లేదు.’సింహం తన గుహకు వెళ్లి దీర్ఘంగా ఆలోచించసాగింది.‘ఏనుగు ధిక్కారం, ఎలుగుబంటి నిజాయితీ, కోతి చెప్పిన హితవు అన్నీ నిజమే కదా!’ అని మనసులో అనుకుంది.తన గర్వం వల్లే అందరూ తనను వ్యతిరేకిస్తున్నారని గ్రహించింది. ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదని దానికి అర్థమైంది.మరుసటి రోజు నుండి సింహం ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అడవిలో ఏ ప్రాణి కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించడం మొదలుపెట్టింది.ఒక కుందేలును చూసి సింహం, ‘ఏమ్మా! బాగున్నావా? నీకు ఏమైనా సహాయం కావాలా?’ అని ప్రేమగా అడిగింది.సింహంలోని ఈ మార్పు చూసి అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. క్రమంగా అవి మళ్ళీ రాజు దగ్గరకు చేరడం ప్రారంభించాయి.ఏనుగు వచ్చి, ‘రాజా! నీలోని ఈ మార్పు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అని పొగిడింది.ఎలుగుబంటి కూడా వచ్చి, ‘నిజమైన రాజువంటే నువ్వే రాజా! ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాము’ అని అంది.అప్పటి నుండి సింహం ఎవరినీ ఆహారం అడగలేదు, ఎవరినీ తక్కువ చేసి చూడలేదు. అడవిలోని జీవులన్నీ సింహాన్ని నిజమైన మృగరాజుగా కీర్తించాయి.అల్పతోయశ్చలత్కుంభో అల్పదుగ్ధాశ్చ ధేనవఃఅల్పవిద్యో మహాగర్వీ కురూపీ బహుచేష్టితఃనీళ్లు తక్కువున్న కుండ తొణుకుతుంది. కొత్తగా ఈనిన ఆవు తక్కువ పాలిస్తుంది. చదువు తక్కువున్న వాడికి గర్వం ఎక్కువగా ఉంటుంది. కురూపికి అతిచేష్టలు ఎక్కువగా ఉంటాయి. -
క్లూషియల్: మంటల్లో సాక్ష్యం
చీకటి మాటున నీడలా అంటి పెట్టుకున్న నేరం... విజయవాడ – హైదరాబాద్ హైవే అది... ఒక్కసారిగా అక్కడ కలకలం. మంటల్లో కారు కాలిపోతోంది. అర్ధరాత్రి దాటాక రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక లగ్జరీ కారు సెగలు కక్కుతూ తగలబడిపోతోంది. అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోయాడు. ఫైరింజన్లు వచ్చాయి. మంటలు అదుపులోకి వచ్చాక లోపల సీటుకు కట్టేసినట్లుగా ఉన్న వ్యాపారవేత్త ఫణీంద్ర మృతదేహం పూర్తిగా కాలిపోయి కనిపించింది.పోలీసులు దీన్ని ఒక ఘోర రోడ్డు ప్రమాదంగా భావించి కేసు క్లోజ్ చేయబోయారు. కానీ ఫణీంద్ర భార్య సుమతి మాత్రం ఇది ప్రమాదం కాదని, తన భర్తను ఎవరో కావాలనే చంపారని క్రైమ్ బ్రాంచ్ను ఆశ్రయించింది. కేసు ఇన్ స్పెక్టర్ అభిమన్యు చేతికి వచ్చింది. అభిమన్యు క్రైమ్ సీన్కు వచ్చాడు. కారు శకలాలను, ఫణీంద్ర పోస్ట్మార్టం రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలించాడు.ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు ఉన్నాయేమోనని పరిశీలించాడు. దూరంగా ఒక పెట్రోల్ బంకు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అభిమన్యు ఫణీంద్ర భార్య సుమతిని విచారించాడు.‘కేసులో అనుమానాస్పద విషయాలు ఏమీ లేవు కదా? కేసు ఘోర అగ్ని ప్రమాదంగా భావించి కేసు క్లోజ్ చేద్దామా?’ అభిమన్యుని అడిగాడు కమిషనర్.‘అన్నీ అనుమానాస్పద విషయాలే...’ తన చేతిలో వున్న పోస్ట్మార్టం రిపోర్ట్ చూస్తూ అన్నాడు అభిమన్యు.‘ఏమిటవి?’ కమిషనర్ అడిగాడు.‘ఎవిడెన్ను ఫిజికల్గా తీసుకొస్తాను... మీరు హంతకుడిని అరెస్టు చేయడానికి రెడీగా ఉండండి సర్’ చెప్పి లేచాడు అభిమన్యు.‘నీపేరు?’ అతని వంకే చూస్తూ అడిగాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు..‘రవీంద్ర... విజయవాడ బ్రాంచ్ మేనేజర్గా ఏడు నెలల క్రితమే వచ్చాను.’ అన్నాడు అతడు.‘అంతలోనే ప్రమోషన్ వచ్చిందా?’ అడిగాడు అభిమన్యు.‘ప్రమోషనా?’ ఆశ్చర్యంగా అడిగాడు రవీంద్ర.‘హంతకుడిగా ప్రమోషన్...’‘నేను హంతకుడినా?’ కాస్త కోపంగా అన్నాడు రవీంద్ర.. ‘వెల్... చాలా తెలివిగా ప్లాన్ చేశావు... నిజం ఒప్పుకొని పోలీసులకు లొంగిపోతే, నేను త్వరగా ఈ కేసు క్లోజ్ చేసి మరో కేసు టేకప్ చేయాలి.’ అన్నాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. ‘మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. అయినా నేను విజయవాడలో ఉన్నా... నేను హత్య ఎలా చేస్తాను?’ దబాయించబోయాడు రవీంద్ర.‘విజయవాడ నుంచి నువ్వు కారులో బయలుదేరినట్టు సీసీ కెమెరాల సాక్ష్యం, టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ చెల్లింపుల రికార్డు వుంది. ప్రమాదం జరిగిన చోట పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో నువ్వు తగలబడుతున్న కారు దగ్గర ఉన్న విజువల్స్ ఉన్నాయి.ఫణీంద్ర శ్వాసకోశాల్లో పొగ లేదు. సాధారణంగా ఎవరైనా మంటల్లో చిక్కుకుని చనిపోతే, వారు ఊపిరి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి కార్బన్ (పొగ) వెళ్తుంది. కానీ ఫణీంద్ర ఊపిరితిత్తులు శుభ్రంగా ఉన్నాయి. అంటే నిప్పు అంటుకోక ముందే అతను ప్రాణాలు విడిచాడు.అత్యాధునిక ఫోరెన్సిక్ స్కానింగ్లో ఫణీంద్ర గొంతు వద్ద ఎవరో బలంగా నొక్కిన ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి. ఫణీంద్ర కారు డోర్ మీద ఉన్న వేలిముద్రలు ఫణీంద్ర గొంతు మీద ఉన్న వేలిముద్రలతో సరిపోయాయి.ఇది ప్రమాదం కాదు... పక్కా ప్లా¯Œ తో జరిగిన హత్య. ఫణీంద్రను మొదట గొంతు నొక్కి చంపి, ఆపై కారులో వేసి నిప్పు పెట్టావు. విజయవాడ బ్రాంచ్ ఆఫీసులో కోట్లలో గోల్మాల్ జరిగినట్లు ఫణింద్ర భార్య సుమతి ద్వారా తెలిసింది. ఆడిటింగ్ కోసం విజయవాడ వచ్చిన ఫణీంద్రకు నువ్వు చేస్తున్న మోసాలు తెలిశాయి. ఈ విషయం బయటపడితే ప్రమాదం అని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డావు...’ అభిమన్యు ఆధారాలతో సహా చెప్పాడు.రవీంద్రకు మరో ఆప్షన్ లేదు. పోలీసులు రవీంద్రను అరెస్ట్ చేశారు.మూడు గంటల్లో కేసును సాల్వ్ చేశాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. రచయిత శ్రీ సుధామయి -
బిహైండ్ ది బార్స్
ఆ కుర్రాడు లోపలకి వెళ్తూ బిల్డింగ్ బయట ‘సెంట్రల్ ప్రిజన్, సౌత్ని’ అని రాసుండటం గమనించాడు. వార్డెన్ ఆ కుర్రాడిని ఎగాదిగా చూసి అడిగాడు.‘‘పేరు?’’అతను చెప్పాడు.‘‘వయసు?’’‘‘పదహారు.’’పక్కనే ఉన్న జైల్ గార్డ్ అతని చెంప మీద కొట్టి అరిచాడు.‘‘సర్... ప్రతి జవాబుకి సర్ అనాలి.’’‘‘నీ జేబులు ఖాళీ చెయ్యి. వెళ్ళేప్పుడు తీసుకువెళ్ళు.’’ వార్డెన్ శాసించాడు.‘‘ఎస్ సర్.’’ఆ పని అయ్యాక గార్డ్ అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్ళి చెప్పాడు.‘‘బట్టలు విప్పు.’’‘‘దేనికి?’’ ఆ యువకుడు అదిరిపడి అడిగాడు.‘‘నువ్వు రహస్యంగా లోపలికి ఆయుధాలు, డ్రగ్స్ తీసుకెళ్ళడం లేదని తెలుసుకోడానికి.’’అతను అంతదాకా ఎవరి ముందూ నగ్నంగా నిలబడలేదు. గ్లవ్స్ తొడుక్కున్న చేతి వేళ్ళతో గార్డ్ అతని శరీరంలోని రహస్య ప్రదేశాలని వెదుకుతూంటే, అతను శాడిస్ట్ అని ఆ కుర్రాడు గ్రహించాడు. డాక్టర్ అతన్ని పరీక్షించాక గార్డ్ ప్రిజన్ యూనిఫాం ఇచ్చి చెప్పాడు.‘‘ఇవి తొడుక్కుని పద. ఇక నీ పేరుని మర్చిపోవచ్చు... నీ ఖైదీ నెంబర్ 237.’’గార్డ్ అతన్ని ఓ పెద్ద గదిలో నీళ్ళ టబ్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాడు.‘‘ఇవాళ నీ డ్యూటీ ఇక్కడ. ఇవన్నీ ఖైదీలవి. వీటిని ఉతుకు.’’‘‘ఛీ! అండర్వేర్లు. ఈ పని నేను చేయను.’’ అతను రోషంగా చెప్పాడు.వెంటనే గార్డ్ ఓ తాడుతో అతని వీపు మీద కొట్టాడు. ఆ యువకుడు కేక పెట్టాడు.‘‘ఆజ్ఞలని పాటించకపోతే ఇంతే. ఇది ఏభై పోగుల తాడు. వంద, నూట ఏభై, రెండు వందల పోగుల తాడుని ఉపయోగిస్తే నువ్వు తట్టుకోలేవు. ఒంటి మీద గాయాలు కూడా కనిపించవు. నేను వచ్చేసరికి పని పూర్తిచేయాలి.’’ఆ యువకుడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సబ్బునీళ్ళతో ఆ మురికి బట్టలని ఉతకసాగాడు. కాసేపటికి జైల్ గార్డ్ వచ్చి పక్క గదిలోకి తీసుకెళ్ళి ఖైదీలు తిన్న ప్లేట్లని చూపించి చెప్పాడు.‘‘వీటన్నిటిని తోమి శుభ్రం చేయి.’’‘‘ఛీ.’’‘‘అప్పుడే? దీని తర్వాత టాయ్లెట్లు కడగాలి.’’ గార్డ్ నవ్వుతూ చెప్పాడు.‘‘ఇలాంటి పనులు నేను ఎన్నడూ చేయలేదు.’’ ఆ యువకుడు ఏడుస్తూ చెప్పాడు.‘‘నేరస్థుడు కాకముందు సంగతి అది. నేరస్థుడు అయాక అన్ని పనులూ చేయాలి.’’టాయ్లెట్స్లోని నీళ్ళల్లోంచి దోమలు ఒక్కసారిగా పైకి లేచాయి. నీళ్ళల్లో దోమల గుడ్లు, పురుగులు చాలా ఉన్నాయి.లంచ్ బెల్ మోగింది. మెస్లో క్యూలో నిలబడ్డ ఖైదీలు ఒకరిని మరొకరు తోసుకుంటూ తిట్టుకుంటున్నారు. చాలామంది అతన్ని వెనక్కి తోసేశారు. అతని ప్లేట్లో రెండు గోధుమ రొట్టెలు, పెసరపప్పు, కప్పు అన్నం, నీళ్ళ సాంబారు, రెండు చిన్న మాంసం ్రౖఫై ముక్కలు వేశారు. అతను ఓ బల్ల ముందు కూర్చుంటే, అక్కడి ఖైదీ స్పూ¯Œ తో ఆ యువకుడి చేతి మీద కొట్టి అరిచాడు.‘‘వెళ్ళు. అడిగి కూర్చోవాలని తెలీదా?’’ఆ యువకుడు లేచి మరో బల్ల దగ్గరికి వెళ్ళి అడిగాడు.‘‘ఇక్కడ కూర్చోవచ్చా?’’ఎవరూ అనుమతించలేదు. ఓ వ్యక్తి లేచి అతని ప్లేట్లోని రెండు మాంసం ముక్కలు తీసుకున్నాడు. మరొకరు రోటీ లాక్కున్నారు. సింటెక్స్ టేంక్లోని తాగే నీళ్ళు చెడు వాసన వేస్తున్నాయి. దాని పక్కన సగం కోసిన వాటర్ బాటిల్స్ని కప్పులుగా వాడుతున్నారు.‘‘కొత్తా? ఇక్కడ బలహీనులు బలవంతుడి రక్షణలో ఉండాలి. లేకపోతే ఏమీ దక్కదు. అందుకు అతనికి కొంత సొమ్ము ఇవ్వాలి. ఉదయం ఐదున్నరకి టాయ్లెట్ల ముందు క్యూలో చోటు కావాలన్నా, స్నానానికి నీళ్ళు, తినడానికి రోటీ కావాలన్నా బలవంతుడు మనకి రక్షణగా ఉండాలి.’’ ఒకరు అతన్ని చూసి చెప్పారు.వెయ్యి చదరపు అడుగుల బేరక్స్లో నూట అరవైమంది ఖైదీలు ఉన్నారు. ఇందాకటి అతను ఆ యువకుడితో చెప్పాడు.‘‘రాత్రుళ్ళు ఇక్కడ జరిగేవి మాటల్లో చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. నిన్ను చూడటానికి నీ తల్లిదండ్రులు నెలకి ఒక్కసారే ములాఖాత్కి వస్తారు. కేవలం పదిహేను నిమిషాలే. ఇనప కడ్డీల వెనక ఉన్న నిన్ను చూసి వాళ్ళు తప్పకుండా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ ఏభై కిలోల గార్డ్, నూటపాతిక కిలోలున్న ఖైదీని కొడతాడు. నా చెవి మీద కొడితే గూబ పగిలి చెవుడు వచ్చింది. దాన్ని టెలిఫోనీ దెబ్బ అంటారు. ఇంకోచోట కొడితే ఆ బాధ భరించలేవు. మానసికంగా బలహీనులైన ఖైదీలు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటారు.’’ఎనిమిది గంటల తర్వాత ఆ యువకుడు సెంట్రల్ ప్రిజన్లోంచి బయటికి వచ్చి, ఆగి ఉన్న కారుని ఎక్కాడు. ఏడుస్తున్న ఆ యువకుడితో కారు నడుపుతున్న తండ్రి చెప్పాడు.‘‘చూశావుగా. నీ ఫ్రెండ్ తాగి కారు నడిపి ఇద్దర్ని చంపినప్పుడు నువ్వా కారులోనే ఉన్నావు. రేపు నువ్వేదైనా తప్పు చేస్తే ఐఏఎస్ ఆఫీసరైన నేను కాపాడగలను. కాని కాపాడను. అది నా స్వభావం కాదు. నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు.’’ఆ యువకుడు వెళ్ళాక వార్డెన్ గార్డ్తో చెప్పాడు.‘‘ఇండియాలో చాలామంది తమ కొడుకులని ఇలా జైలు విజిట్కి పంపడం దేశానికి ఎంతో మంచిది.’’ ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఈ వారం కథ: మూడు సమయాలు
జనవరి 10, 2026 – శనివారం ఉదయం 9:30 చలికాలం. చల్లని గాలి. పొగమంచు. రైలు దిగి అరవింద్ బ్యాగ్ను భుజాన వేసుకుని ఇంటివైపు నడిచాడు. జాకెట్ జిప్ పైకి లాగి, చేతులను జేబుల్లోకి దూర్చుకున్నాడు. దూరంగా టీ బండి నుంచి వచ్చే వేడి టీ వాసన గాలిలో కలిసింది. సూర్యుడికీ చలిగా ఉందేమో– మబ్బుల వెనుక దోబూచులాడుతున్నాడు. ఇంటి ముందు ఆగాడు. తలుపు తట్టబోయేలోపే– తాళం బయట వేలాడుతుండటం కనిపించింది.జేబులు వెతికాడు. రెండో తాళం చెవి ఇంట్లోనే వదిలేశాడని గుర్తొచ్చింది. చిరాకుతో వెంటనే కమలకు ఫోన్ చేశాడు. అమ్మకు ఒళ్లు బాగాలేదని తెలిసి ఉదయమే బస్సెక్కి వెళ్లానంది. ‘‘రెండో తాళం చెవి ఉందిగా,’’ అంది. ‘‘అది ఇంట్లోనే ఉంది,’’ అన్నాడు కాస్త గట్టిగా. ఆమె సారీ చెప్పింది. తొందరలో ఆలోచించలేకపోయానంది.ఉసూరుమన్నాడు. తలుపు బయటే నిలబడ్డాడు. చిరాకును దిగమింగి, ‘అత్తగారికి ఎలా ఉంద’ని అడిగాడు.‘‘ఇప్పుడు కాస్త బాగుంది. డాక్టర్ చూశాడు. బ్లడ్ ప్రెషర్ పెరిగింది. రెస్ట్ తీసుకోవాలన్నాడు.’’‘‘ఎప్పుడొస్తావు?’’‘‘రెండు రోజులు ఇక్కడే ఉండాలనుకున్నా. మీకు ఇబ్బంది కదా? మెల్లగా బయలుదేరతా. సాయంత్రం ఏడు లేదా ఎనిమిది అవుతుందేమో.’’ ఫోన్ కట్ అయింది.ఇంట్లోకి వెళ్లలేని పరిస్థితి. బయట ఉండాల్సిన నిర్బంధం. ఆ రెండింటి మధ్య నిలబడ్డట్టయ్యాడు.టీ బండి దగ్గరకు వెళ్ళాడు. వేడి టీ గొంతులోకి దిగుతుండగా కాస్త హుషారు వచ్చింది. ఫోన్ తీసి ఫేస్బుక్ తెరిచాడు. స్క్రోల్ చేశాడు. పాత స్నేహితుడు కుటుంబంతో దుబాయ్ ట్రిప్. ఇంకొకరు కొత్త కారులో. ఒక ఫొటో మీద కాసేపు ఆగి, మళ్లీ ముందుకు.కమల పంపిన ‘క్షేమంగా చేరాను’ అనే సందేశం కనిపించింది. స్క్రీన్ వెలుతురు అతని ముఖంపై పడి మళ్లీ ఆరిపోయింది.పొద్దున్నే అలారం ఆపి స్క్రోల్ చేయటం. క్యాబ్లో షార్ట్స్. ఆఫీస్ మీటింగ్లు. టార్గెట్లు. ఈ మెయిళ్ళు. అటూ ఇటూ పరుగులు. ఒకటే ఒత్తిడి. మధ్యాహ్నం జొమాటో. రాత్రి నెట్ఫ్లిక్స్. వారాంతాల్లో అప్పుడప్పుడు సాటి ఉద్యోగులతో విందులు. బయటికి చూస్తే నిండిన జీవితం. లోపల మాత్రం నెమ్మదిగా పెరుగుతున్న ఖాళీ. నిజమైన సంభాషణలా? లోతైన మాటలా? ఏమున్నాయి?సోషల్ మీడియా కనెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది– నిజానికి మరింత దూరం చేస్తుంది.సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లదామని కమల ఎన్నిసార్లు అడిగిందో గుర్తొచ్చింది. ప్రతిసారి ‘‘బిజీగా ఉన్నా’’ లేదా ‘‘అలసటగా ఉంది’’ అనే సమాధానమే. రోజులు నిండిపోతున్నట్టే కనిపించాయి. కానీ ఏదో ముఖ్యమైనది ఎప్పుడూ వాయిదా పడుతూనే వచ్చింది.ఇప్పుడు ఈ శనివారం ఉదయం అతని ముందుంది– మబ్బుల ఆకాశం. మూసిన తలుపు. చేతిలో టీ కప్పు. ఇప్పుడు ఎవరైనా స్నేహితుల ఇంటికి వెళితే? ఈ సమయంలో ఎవరి పనుల్లో వాళ్ళుంటారు.మొదటిసారి ఆ సమయం నిజంగానే ఖాళీగా అనిపించింది. దేనితో నింపాలి?జనవరి 10, 2026 శనివారం ఉదయం గం. 10:00ఏమీ తోచక, ఏం చేయాలో తెలియక అరవింద్ దారినపడి నడుస్తున్నాడు. ఇరవై నిమిషాలు గడిచేసరికి వెనక నుంచి చిన్న అడుగుల శబ్దం వినిపించింది. తిరిగి చూసేసరికి కిరణ్. మేనల్లుడు.పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘మామయ్యా!’’ అంటూ కాళ్లకు చుట్టుకున్నాడు. చిన్న చేతులతో గట్టిగా పట్టుకుని ముఖం పైకెత్తి చూశాడు– కళ్లలో ఆనందం, ఆశ్చర్యం కలిసి మెరిశాయి.అరవింద్ అలాగే నిలబడిపోయాడు. వాడి ముఖంలో తన చిన్ననాటి ప్రతిబింబం కనిపించినట్టైంది.అటూ ఇటూ చూశాడు. ఎవరి దారిని వాళ్లే. కాస్త దూరంలో పిన్ని ఇల్లు. గుండె ఒక్కసారిగా బరువెక్కింది. పాత అపార్థాలు, ఆస్తి విషయాలు, తండ్రి మాటలు– అన్నీ మనస్సులోకి దూరాయి.కిరణ్ అతని చేయి పట్టుకుని, ‘‘మామయ్యా, ఇంటికి రా!’’ అంటూ లాగాడు.అరవింద్ ఆగిపోయాడు. ఇన్నేళ్లకి వాళ్లింటికి వెళ్లటం? పిన్ని ఏమంటుంది? చెల్లెలు ప్రియఏమనుకుంటుంది?‘‘కిరణ్, ఇప్పుడు రాలేనులే తర్వాత వస్తా,’’ అన్నాడు మెల్లగా. గొంతు వణికింది.‘‘మళ్లీ కనపడవు నువ్వు. ఇప్పుడే రావాలి,’’ అంటూ మళ్లీ చేయి లాగాడు.ఆ చూపును కాదనలేక– ఒక్క క్షణం తడబడినా– ‘‘సరే, పద,’’ అన్నాడు. ఇద్దరూ కలిసి ఇంటి వైపు నడిచారు.ఇంటి గేటు దగ్గరకు రాగానే పిన్ని బయటికి వచ్చింది. ‘‘ఎక్కడికి పోయావ్ రా?’’ అని కిరణ్ను అడిగి, వెంటనే అరవింద్ వైపు చూసి ఆగిపోయింది. ‘‘అరవింద్... నువ్వు!’’అరవింద్ తడబడ్డాడు. ‘‘ఈ దారిని వెళ్తుంటే కిరణ్...’’ మాట మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకో మాటలు చిన్నవిగా, తాను చిన్నవాడిలా అనిపించాడు.పిన్ని తనను తానే సర్దుకుని, ‘‘లోపలికి రా,’’ అంది.హాల్లో నుంచి ప్రియ వచ్చింది. నవ్వుతూ, నవ్వుతూనే కొంచెం నిష్టూరంగా– ‘‘అన్నాయ్! ఇన్నాళ్లకి దారితప్పి వచ్చావన్నమాట,’’ అంది. ఆ మాటలో తప్పుపట్టటం లేదు– మళ్లీ దొరికిన ఆనందమే ఉంది.‘‘రాక రాక వస్తే అవేం మాటలే,’’ అంటూ పిన్ని వారించింది.లోపల అడుగుపెట్టగానే అదే పాత కలప వాసన, అగరువత్తి ధూపం, వంటింటి నుంచి తాలింపు. ఇల్లు మారలేదు; తానే మారిపోయాడన్న భావన కలిగింది.పదవ తరగతి రోజుల్లో పిన్ని డబ్బు కోసం వచ్చిన జ్ఞాపకం మెదిలింది. అప్పటికే బాబాయి చనిపోయాడు. తండ్రి సాయం చేయలేదు. అప్పటి నుంచే రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. భర్తను కోల్పోయినా తమను పట్టించుకోలేదన్న బాధ పిన్నిది. ఒంటరిగానే ఉండి ప్రియను చదివించింది. పెళ్లి ఖర్చుల కోసం తమ వాటా పొలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఆస్తి పేచీలు, మాటల తగాదాలు– బంధాల మధ్య మౌనంగా పెరిగిన గోడలు. నాలుగేళ్లుగా రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.కమల మాటలు గుర్తొచ్చాయి– ‘‘దూరాలు నిజంగా దూరాలు కావు. వెళ్లిరండి.’’కానీ అపార్థాలు అంత తేలిగ్గా కరుగుతాయా? తండ్రి ఏమనుకుంటాడోనన్న భయం ఎప్పుడూ ఆపేసింది. ఈ క్షణంలో మాత్రం ఆ పాత గాయాలన్నీ మెల్లగా మాసిపోతున్నట్టు అనిపించింది.ఇంటి ముందు జామచెట్టు అలాగే ఉంది. వయసు పెరిగినా కొమ్మల్లో ఇంకా పాత రోజుల నీడ. ఆ కొమ్మల మీదెక్కి దోరగాయలు కోసుకుని ఉప్పు, కారం రాసుకుని తిన్న రోజులు కళ్లముందు కదిలాయి. ‘‘పడిపోతావురా!’’ అంటూ పిన్ని వేసిన కేకలు వినిపించినట్టయ్యాయి. తనకు మగపిల్లలు లేరు; అరవింద్ను కొడుకులా చూసేది.పిన్ని కాఫీ తెచ్చింది. ‘‘నీకు ఇష్టమైనట్టు పంచదార ఎక్కువేశా,’’ అంది. అదే జ్ఞాపకం. అదే ప్రేమ.గోడల మీద పాత ఫోటోలు. జామచెట్టు మీద కూర్చుని నవ్వుతున్న చిన్న అరవింద్. పక్కనే రెండు జడలతో ప్రియ. ‘‘రోజంతా చెట్టుమీదే ఉండేవాడివి,’’ అంది పిన్ని.కిరణ్ తన స్కూల్ డ్రాయింగ్ చూపించాడు. ప్రియ పెళ్లి ఫొటోలు తీసుకొచ్చి చూపించింది. కబుర్లు, చిన్న నవ్వులు, మధ్య మధ్యలో మౌన విరామాలు. ఆపై భోజనం.చివరికి పిన్ని ఒక చిన్న డబ్బా తెచ్చింది. ‘‘అరిసెలు. నీకిష్టం గదా?’’ఇప్పటికీ తనమీద ఆ ప్రేమ అలాగే ఉందని అర్థమైంది.‘‘కమలని అడిగానని చెప్పు. అప్పుడప్పుడు రావాలి,’’ అంది పిన్ని.‘‘తప్పకుండా వస్తాను పిన్నీ,’’ అన్నాడు.‘‘వస్తాను కాదు– వస్తాము,’’ అంది ప్రియ మెల్లగా.అరవింద్ నవ్వాడు, తల ఊపుతూ. ‘మమ్మల్ని కూడా మీ ఇంటికి పిలవాలి మరి,’’ అంది మళ్ళీ.ప్రియ నెత్తిమీద చిన్న మొట్టికాయ వేసి, కిరణ్ను ముద్దు పెట్టుకున్నాడు. గుండెల్లో ఒక మృదువైన వెచ్చదనం నిండింది– పసితనం మళ్లీ తాకినట్టు.ఆ రోజు నడిచిన దారి అతన్ని ఇంటికి కాదు– తన బాల్యానికి తీసుకెళ్లింది. మౌన విభేదాలు పోయి, మనస్సులో గడ్డలా గట్టిపడ్డదేదో నెమ్మదిగా కరుగుతున్నట్టు అనిపించింది.ఉదయం మూసుకుపోయిన తలుపు– ఇక్కడ సులభంగా తెరుచుకుంది.జనవరి 10, 2026 శనివారం మధ్యాహ్నం గం. 03:30 చలిగాలి తగ్గింది. మే–ఫ్లవర్ అపార్ట్మెంట్ గేట్ ముందు అరవింద్ నిలబడ్డాడు. బయట చలి తగ్గినట్టే అనిపించినా, అతని గుండెల్లోని చలి మాత్రం అలాగే ఉంది. లోపలికి అడుగుపెట్టాలా లేక ఇక్కడితో తిరిగి వెళ్లిపోవాలా? నిర్ణయం తీసుకునేలోపే ఆమె ముఖం, చిరునవ్వు, మాటలు– అన్నీ ఒకేసారి మనస్సులోకి దూసుకొచ్చాయి.‘‘ప్రాక్టికల్గా ఆలోచించు.’’కాలేజీ రోజుల్లో తన హృదయాన్ని తాకి, చివరికి దూరమైన రజని మాటలు.‘‘అరవింద్! నిన్ను ప్రేమించానన్నది నిజం. కానీ ఇద్దరికీ ఉద్యోగం లేకుండా జీవితం ఎలా? కొన్నాళ్లు చూద్దాం,’’ అన్నది. ఆ ‘కొన్నాళ్లు’ ఎన్నాళ్లకీ ముగియలేదు. ముగిసేసరికి ఆమె ఒక ఉన్నతోద్యోగిని పెళ్లాడింది. పెళ్లికి పిలిచినా అతను వెళ్లలేదు. ఆమె తిరస్కారం అతనిలో లోతైన గాయంగా మిగిలింది.ఆ తర్వాత ఆమె సంతోషంగా ఉందని విని, నిర్వేదం కలిగింది. క్రమంగా మర్చిపోయాడు. లేక మర్చిపోయాననుకున్నాడు. కానీ ఈమధ్య ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని విన్న క్షణంలో పాత జ్ఞాపకాలు మళ్లీ మేల్కొన్నాయి. బాధ కలిగినా, ఎందుకో వెంటనే వెళ్లి పరామర్శించాలనిపించలేదు. నెమ్మదిగా ఆలోచిస్తే, ఆనాటి ఆమె నిర్ణయంలో తప్పేమీ లేదనిపించింది. తనలోని ఇరుకు తనకే అర్థమైంది.ఇప్పుడు ఆమె బాధలో ఉంది. తాను పలకరిస్తే? లేక ఇది పాత గాయాలను మళ్లీ రేపటమేనా?ఒక్కసారి కళ్లు మూసుకున్నాడు. ఫోన్ జేబులో పెట్టి లోపలికి నడిచాడు. లాబీలో వెచ్చదనం. లిఫ్ట్ అద్దంలో తన ముఖం చూసుకున్నాడు– పాలిపోయినట్టుంది. ఫ్లాట్ ముందు నిలబడి, ఒక్క క్షణం వెనక్కి తిరగాలనిపించినా, చెయ్యెత్తి తట్టాడు.తలుపు తెరిచింది రజని. కళ్లు ఎర్రగా, వాపుగా. సాదా చీర, అస్తవ్యస్తంగా జుట్టు. ముప్పై రెండేళ్ల వయసే అయినా, విషాదం ఆమెను మరింత పెద్దదిగా చూపిస్తోంది.‘‘అరవింద్! నువ్వా?’’ ఆ గొంతులో ఆశ్చర్యం, ఆనందం, బాధ– అన్నీ కలిసి ఉన్నాయి.‘‘ఇబ్బంది లేకపోతే కాసేపు మాట్లాడదామని,’’ అన్నాడు.ఆమె తప్పుకొని లోపలికి పిలిచింది. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. కాసేపు మౌనం.‘‘ఏదో సంకోచంతో ఇప్పటిదాకా రాలేకపోయాను. ఐ యామ్ సారీ.’’హాల్లో మసక చీకటి. గోడలపై ఆమె భర్తతో ఉన్న సంతోషకరమైన ఫోటోలు– ఇప్పుడు అవి మరింత నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి.‘‘ఫర్వాలేదు. ఇప్పుడైనా వచ్చావు. అదే చాలు,’’ అంది.అతను నెమ్మదిగా అడిగాడు– ‘‘ఎలా జరిగింది?’’కొత్త ప్రాజెక్ట్... తీరికలేని రోజులు. డ్రైవర్ సెలవు... కారు చెట్టుకు గుద్దుకోవడంం ఒక్క నిమిషంలో అంతా ముగిసిపోయింది. వీకెండ్ ట్రిప్స్, రాత్రి కబుర్లు, తన కెరీర్కి ఇచ్చిన ప్రోత్సాహం– అన్నీ ఒక్కసారిగా ఖాళీ అయ్యాయి.‘‘ఇప్పుడు రాత్రుళ్లు నిద్రపట్టదు,’’ అంది.‘‘అమ్మా నాన్నా? పాప?’’‘‘వాళ్లు మొన్నటిదాకా ఉండి వెళ్లారు. పాప హాస్టల్లో ఉంది.’’ఆమె గొంతులో విషాదం గడ్డకట్టింది.‘‘అప్పుడు నేనే దూరంగా జరిగాను. ఇప్పుడు నువ్వే అభిమానంగా వచ్చావు,’’ అంది నెమ్మదిగా.‘‘అవేవీ పట్టించుకోకూడదనిపించింది.’’ అన్నాడు.‘‘సుఖాల్లో అందరూ ఉంటారు. దుఃఖాన్ని పంచుకునేవాళ్లు అరుదు.’’ఆమె కళ్ళు తడిశాయి. అరవింద్ మాట్లాడలేదు. ఓదార్పుగా ఆమె చేతిని తాకాడు. ఆమె అడిగితే, తన జీవితాన్ని చెప్పాడు– ఒక్కడే పిల్లాడు. వేరే ఊరిలో కాలేజీ చదువు.కాసేపు కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నారు– ఒకరి పక్కన ఒకరు, హద్దు మీరకుండా కూర్చున్న రోజులు. ఎన్నో కలలు గన్న రోజులు. ఇప్పుడు అవి మాటల్లో మాత్రమే మిగిలాయి.‘‘ఆ రోజులు నీకింకా గుర్తున్నాయి,’’ అంది రజని. అవునన్నట్టు తల ఊపాడు.‘‘గతాన్ని దాటి చాలా దూరం వచ్చేశాం రజనీ. మన దారులు వేరయ్యాయి. అయినా పరాయివాళ్లుగా ఉండాల్సిన అవసరం లేదనిపించింది. ఏ సాయం కావాలన్నా కాల్ చెయ్యి. వస్తాను,’’ అన్నాడు.లేచి నిలబడ్డాడు.రజని కళ్లలో కృతజ్ఞత, ఆప్యాయత. భర్త జ్ఞాపకం ఒక వైపు గుండెను బరువెక్కిస్తుంటే, అరవింద్ రాక మరోవైపు ఓదార్పులా తాకింది‘‘ఇవాళ కాస్త ఉపశమనం కలిగింది. నువ్వు వచ్చినందుకు చాలా థాంక్స్,’’ అని అతని చెయ్యి పట్టుకుంది.అరవింద్ ఆప్యాయంగా ఆమె చేతిని నొక్కాడు.బయటికి వచ్చేసరికి, అతని మనసులో ఓ మౌన తృప్తి అలముకుంది. గుండెల్లోని చలి కొద్దిగా తగ్గినట్టనిపించింది.జనవరి 10, 2026 – శనివారం సాయంత్రం 5:30సూర్యుడు కొంచెం వాలిపోయాడు. ఆకాశం నారింజ కాంతిలో మసకబారుతోంది. చలిగాలి మళ్లీ తాకింది. ఇంకా మూడు గంటల సమయం.అదే క్షణంలో– ఆ రోజు కళాభవ లో పండిత్ హరిప్రసాద్ చౌరాసియా వేణు వాద్య కచేరీ ఉందని గుర్తొచ్చింది. ఆటోలో అరగంట ప్రయాణం. ఆలోచన ఆగింది. నిర్ణయం తీసుకున్నట్టయ్యింది. కొద్దిసేపటికి కిక్కిరిసిన కళాభవన్ హాల్లో, చివరి వరుసలో కూర్చున్నాడు.లోపల అడుగుపెట్టగానే బయట ప్రపంచం తలుపు మూసుకున్నట్టైంది. దీపాలు మసకబారాయి. ప్రేక్షకులు నిశ్శబ్దంగా– శ్వాసలు కూడా వినిపించని నిశ్శబ్దం. వేదికపై పండిత్జీ చేతిలో వెదురు వేణువు; కళ్లు అరమూసి, ముఖంలో ధ్యాన గంభీరత.ఆలాప్ ప్రారంభమైంది.మృదువైన, లోతైన స్వరాలు గాలిలో తేలుతున్నాయి. కోమల గాంధారం నుంచి శుద్ధ మధ్యమానికి సాగిన ఆ స్వర సంచారం అరవింద్ గుండెల్లో ఏదో కదిలించింది. తర్వాత కోమల దైవతం, కోమల నిషాదం– ప్రతి స్వరం నిశ్శబ్దాన్ని మరింత గాఢంగా చేస్తూ హృదయాన్ని తాకింది. మాల్కౌంస్ రాత్రి జనించిన రాగం. దాని గాంభీర్యం, అంతర్గత శక్తి, తీవ్రమైన శాంతి– వేణువులో నిండుగా పలికాయి. పండిత్ జీ శ్వాసల లోతు ప్రతి స్వరంలో వినిపించింది.ఆ తర్వాత జోడ్ (లయ ప్రారంభ దశ) మొదలైంది. వేణువు క్రమంగా వేగం అందుకుంది– కానీ ఆ వేగంలోనూ సౌమ్యత, నియంత్రణ స్పష్టంగా కనిపించాయి. తబలా లయతో కలిసిన క్షణం నుంచి అది సంగీతం మాత్రమే కాదు– ఒక అనుభూతి. అరవింద్ గుండెల్లోని భారం కరిగిపోతున్నట్టనిపించింది.ఝాలా (ఉత్కర్ష దశ) వచ్చేసరికి స్వరాలు వరదలా ప్రవహించాయి. కానీ ఆ ప్రవాహంలోనూ ఒక స్థిరత్వం ఉంది. వేణువు– మానవ శ్వాసతో ముడిపడిన వాద్యం– గాలి కదలికను, ప్రకృతి లయను హృదయస్పర్శిగా పలికించింది. ప్రతి మీండ్ (స్వర సంధి) గాంధారం నుంచి మధ్యమానికి, ధైవతం నుంచి నిషాదానికి సాగినప్పుడు, అతని అంతరంగంలో దాచుకున్న భావాలు మెల్లగా విప్పుతున్నట్టనిపించింది. అరవింద్ కళ్లు మూసుకున్నాడు. బయటి ప్రపంచం కరిగిపోయింది. స్వరాల్లో మునిగిపోయి, ఆ గాఢమైన శాంతిలో తానే తాను కలిసిపోయాడు.చప్పట్ల హోరుతో కచేరీ ముగిసింది.హాల్ బయటికి రాగానే ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. చలిగాలి మృదువుగా వీచుతోంది. అతని చెవుల్లో మాత్రం ఇంకా వేణు స్వరాలు తేలుతూనే ఉన్నాయి. వేణువు మానవ శ్వాసతో జీవించే వాద్యం. అందుకే దాని స్వరాల్లో భావాలే కాదు– గాలి అలజడి, నదుల కెరటాల మర్మరం, పక్షుల కిలకిలలు– ప్రకృతంతా మృదువుగా ప్రతిధ్వనిస్తుంది.‘‘వేణువే అంత/ ఆనందమై వేధిస్తుంది’’ అన్న కవి మాట ఆ క్షణంలో అరవింద్కు సంపూర్ణ సత్యంలా అనిపించింది.జనవరి 10, 2026 – శనివారం రాత్రి 8:30చలిగాలిలో అరవింద్ ఇంటికి చేరేసరికి కమల వంట ముగించేసింది. వంటింటి నుంచి వచ్చే వేడి వాసనతో పాటు ఆమె ఒంటి అలసట కూడా తెలుస్తుంది.‘‘అమ్మయ్య వచ్చావా? అమ్మ ఎలా ఉంది ఇప్పుడు?’’ అని అడిగాడు.కమల ఒక్క నిట్టూర్పు విడిచింది. ఆ నిట్టూర్పులో అలసటతో పాటు ఓ శాంతి కూడా మిళితమై ఉంది.‘‘ఫర్వాలేదు. అవసరమైతే మళ్లీ వెళ్లొచ్చులే– ఈసారి రెండో తాళం చెవి గుర్తు పెట్టుకో,’’ అంది చిలిపిగా. వెంటనే నవ్వుతూ, ‘‘రోజంతా ఒంటరిగా ఏం చేశావు? కొంపదీసి బార్కి వెళ్లావేమిటి?’’ అని అడిగింది.‘‘కొంప దీయలేదు,’’ అన్నాడు అరవింద్ మెల్లగా. ఆ నవ్వులోనే సమాధానం ఉంది. కమలకు తెలుసు– అతనికా అలవాటు లేదని. ఆ రోజు జరిగినదంతా అతని మాటల్లోకి జారిపోయింది. పిన్ని ఇంటి సందడి, పిల్లల నవ్వులు, రజని విషాదం– ఏదీ దాచలేదు. కమలకు రజని గురించి తెలుసు కాబట్టి అతను ఒక్క మాట కూడా ఆపలేదు. చివరికి కళాభవన్, హరిప్రసాద్ కచేరీ, మాల్కౌంస్ రాగం ఆ వేణు స్వరాలు ఎలా గుండెల్లోకి జారిపడి మెల్లగా శాంతిని నింపాయో చెప్పుకుంటూ పోయాడు. మాట్లాడుతుండగా అతని స్వరం క్రమంగా మృదువైంది. కమల ఏమీ అనలేదు. నిశ్శబ్దంగా అతని చేతులు పట్టుకుంది. దగ్గరికి లాగుకుంది. ఆమె ఊర్పులు అతని గుండెపై మృదువుగా తాకాయి– మరో వేణు శ్వాసలు.‘‘ఇవే గదా జీవించిన క్షణాలు,’’ అనుకున్నాడు అరవింద్.గుండెల్లోని ఖాళీ నెమ్మదిగా పూరితమైంది.బయట చలిగాలిలో రాత్రి మెల్లగా చిక్కబడుతోంది. రచయిత ∙పాపినేని శివశంకర్ -
పికా అంటే..? పిల్లలకు ఇది ప్రాణాంతకమా...?
మా బాబుకు మూడు నెలలు. ఊయల నుంచి కింద పడిపోయాడు. ఐదు నిమిషాల పాటు ఏడ్చి, ఒకసారి వాంతి చేసి తర్వాత పడుకున్నాడు. డాక్టర్కు చూపించాలా? అలాగే, పిల్లలు ఇలా పడిపోతే, మొదట ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– సునీత, విజయవాడచిన్న పిల్లలు మంచం నుంచి, ఊయల నుంచి తల్లిదండ్రుల చేతుల నుంచి జారి కింద పడటం సాధారణంగా జరుగుతుంటుంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ, నడక నేర్చుకునే సమయంలో సోఫాల మీద నుంచి పడటం, మెట్ల మీద నుంచి జారిపడటం వంటి ఘటనలు కూడా కనిపిస్తాయి. అయితే, తలకు తగిలిన గాయం తీవ్రతను బట్టి, భవిష్యత్తులో ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. గాయం తీవ్రమైతే పిల్లల ఎదుగుదల, గుర్తుపట్టడం, కంటి చూపు, మాట, నడక వంటి అంశాలపై ప్రభావం పడవచ్చు. చిన్న గాయం అయినా కూడా కొంతవరకు మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన లక్షణాలు గమనించాలి. పిల్లలు ఆపకుండా ఏడవడం ఫిట్స్ రావడం స్పృహ కోల్పోవడం చేతులు కాళ్లు సరిగా పనిచేయక పోవడం ముక్కు లేదా చెవి నుంచి రక్తం కారడం పదేపదే వాంతులు అవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.ఇలాంటి సందర్భాల్లో అవసరమైతే సీటీ స్కాన్ చేసి మెదడులో ఏమైనా రక్తస్రావం లేదా ఎముక సమస్యలు ఉన్నాయా అని చూస్తారు. పరిస్థితిని బట్టి న్యూరో సర్జన్ సలహా తీసుకుని చికిత్స చేస్తారు. అయితే తలకు గాయాలు చాలా వరకు నివారించవచ్చు. తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎత్తైన భవనాల్లో ఉంటే బాల్కనీలకు సేఫ్టీ నెట్స్ ఏర్పాటు చేయాలి. బాల్కనీలో కుర్చీలు లేదా స్టూల్స్ ఉంచకూడదు. చిన్నపిల్లలను మంచంపై ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తపడాలి. అవసరమైతే మంచం పక్కన కింద బెడ్ లేదా మృదువైన పరుపు వేసి పడుకోబెట్టడం మంచిది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను పూర్తిగా తగ్గించుకోవచ్చు. పిల్లల భద్రత కోసం ముందుగానే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మా బాబుకు రెండేళ్లు. ఈ మధ్య చాలా తెల్లగా కనిపిస్తున్నాడు, త్వరగా అలసిపోతున్నాడు, ఆకలి కూడా తగ్గింది. కొన్నిసార్లు మట్టి తినాలని చూస్తున్నాడు. ఇది ఏమైనా సమస్యా?– శైలజ, ఒంగోలుపిల్లల్లో సాధారణంగా తెల్లగా లేదా పాలిపోయినట్లు కనిపించడం, త్వరగా అలసిపోవడం, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమంది పిల్లలు మట్టి, సున్నం వంటి వాటిని తినాలని కూడా ప్రయత్నిస్తారు. దీన్ని పికా అంటారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి డాక్టర్ను చూపించి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా హిమోగ్లోబిన్ , ఐరన్ లెవల్స్ చెక్ చేస్తారు. పిల్లల్లో ఐరన్ లోపం అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారవ్వడానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ తగ్గిపోతే రక్తహీనత వస్తుంది. దీని వల్ల పిల్లల ఎదుగుదల, బరువు పెరుగుదల, మెదడు వికాసం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లల్లో చురుకుదనం తగ్గిపోవడం, చదువుపై దృష్టి తగ్గడం, చిరాకు ఎక్కువగా ఉండడం కూడా కనిపించవచ్చు. ఐరన్ లోపం రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. పిల్లలు తల్లి పాలు సరిగా తీసుకోకపోవడం, ఆరు నెలల తర్వాత ఇచ్చే అనుబంధ ఆహారంలో ఐరన్ తక్కువగా ఉండడం, ఒక సంవత్సరం దాటిన తర్వాత కూడా ఎక్కువగా ఆవు పాలు తాగించడం వల్ల ఈ సమస్య రావచ్చు. ఎక్కువ పాలు తాగడం వల్ల శరీరం ఐరన్ను సరిగా గ్రహించలేకపోతుంది. అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తరచూ ఇన్ఫెక్షన్లు రావడం వల్ల కూడా ఐరన్ లోపం కనిపించవచ్చు. ఐరన్ లోపం ఉంటే డాక్టర్ సలహా మేరకు ఐరన్ సిరప్స్ లేదా డ్రాప్స్ ఇస్తారు. ఈ మందులు కొంతకాలం రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు రెండు మూడు వారాల్లో పిల్లలు కాస్త బాగుపడగానే మందులు ఆపేస్తారు. కానీ డాక్టర్ చెప్పిన పూర్తి కాలం వరకు వాడటం చాలా ముఖ్యం. అప్పుడే శరీరంలో ఐరన్ నిల్వలు మళ్లీ సరిగ్గా పెరుగుతాయి. ఈ సమస్య నివారణ కోసం పిల్లలకు మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. ఆరు నెలల తర్వాత ఆకుకూరలు, బెల్లం, గుడ్డు, పప్పులు, రాగి జావ, మాంసం వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వడం చాలా మంచిది. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే నిమ్మరసం, కమలాపండు వంటి వాటితో పాటు ఐర పుష్కలంగా ఉన్న ఆహారం ఇస్తే శరీరానికి ఐరన్ ఇంకా బాగా అందుతుంది. మీ బాబుకి రెండేళ్లు కాబట్టి, సరైన ఆహారం, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా త్వరగా కోలుకుంటాడు. కాబట్టి ఆందోళన పడకుండా ఒకసారి పిల్లల వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. (చదవండి: హంటా రాలేదు..ఆందోళన వద్దు!) -
తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు
ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి పిల్లల పెంపకంలో ‘ఒత్తిడి, పోటీ, అతిగా పట్టుకోవడం అనే సమస్యను నేటి తరం ఎదుర్కొంటోంది’ అని చెబుతున్నారు. అధ్యాపకురాలిగా తన జీవితపు తొలినాళ్లలో ముగ్గురు కూతుళ్ల పెంపకం ఎలా సాగించారో చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే...‘‘నేడు పిల్లల పెంపకం కష్టంగా మారలేదు. కష్టం అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. తమ సుఖానికి, సంతోషానికి పిల్లలు అడ్డు వస్తారని కొందరు భావిస్తే, తాము ఎక్కువ డబ్బు కట్టి చదువులు చెప్పిస్తున్నామని గొప్పలు చెప్పుకోవాలని తాపత్రయపడుతున్నారు. నిజానికి ర్యాంకుల ఒత్తిడిలో తల్లిదండ్రులే పిల్లలను కష్టపెడుతున్నారు. సర్దుబాట్లు లేవుమా అమ్మనాన్నలు మమ్మల్ని, మేం మా పిల్లల్ని పెంచినప్పుడు కష్టం అనిపించలేదు. ఈ రోజుల్లో ‘అతి గారాబం’ చూస్తున్నాం. పెంచడం కష్టం అని ఒక్కరిని కనడంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఆ ఒక్కరికి అన్నీ అమర్చాలనే ఆదుర్దాలో ఎలా పెంచాలో మర్చిపోతున్నారు. దీంతో ఆ పిల్లలు కొద్దిగా కూడా సర్దుకుపోవడం లేదు. ఒకప్పుడు పిల్లలతో సమాజంలోని నలుగురితో ఎలా కలిసిమెలిసి ఉండాలో చెప్పేవాళ్లం. ఇప్పుడవి బాగా తగ్గిపోయాయి.సమాన బాధ్యతరైల్వే డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్గా చేసేదాన్ని. టైమ్ ప్రకారం ఉద్యోగం కాబట్టి పెద్ద సమస్య లేదు. మాది ఉమ్మడి కుటుంబం. అందరూ అందరి బాధ్యతే అన్నట్టుగా ఉండేవారు. అయినా ముగ్గురు కూతుళ్లు పుట్టాక ‘ఉద్యోగం చేయను. పిల్లలను చూసుకుంటూ ఇంటిపట్టునే ఉంటాను’ అని చెప్పాను. కానీ, మా అత్తగారు ‘పిల్లల్ని నేను చూసుకుంటానులే నువ్వు ఉద్యోగానికి వెళ్లమ్మా’ అనేది. అలాగని నా ఆదాయంతో కుటుంబం గడుస్తుందని కాదు. మావారు కూడా గవర్నమెంట్ ఉద్యోగి. కానీ, చదువుకున్న చదువుకు న్యాయం చేయమని చెప్పేవారు. కుటుంబం విషయంలో నేనూ, మావారు ఇద్దరం సమానంగా బాధ్యత తీసుకున్నాం. నా డ్యూటీ పూర్తయ్యేవరకు సాయంత్రం 5 అయ్యేది. పిల్లలు మూడు గంటలకు స్కూల్ అయిపోయేది. ఇలాంటప్పుడు మా వారు పిల్లలను తీసుకొచ్చి, వారికి స్నాక్స్ పెట్టి, నన్ను పికప్ చేసుకోవడానికి కాలేజీ దగ్గరకు వచ్చేవారు. లంచ్ బ్రేక్ తను అలా సెట్ చేసుకున్నారు. పొదుపుగా జీవనంమా చిన్నతనంలో పిల్లలకు డబ్బులు చేతికి ఇవ్వడం అనేది లేదు. ఏడాదికోసారి పుస్తకాలు కొనుక్కోమని పది రూపాయలు ఇస్తే అణాపైసలతో లెక్కరాసి చూపేవాళ్లం. మా పిల్లల విషయంలోనూ అదే నియమం పాటించాను. చదువులోనూ పెద్ద భారం అనిపించలేదు. ముగ్గురివీ గవర్నమెంట్ బడి చదువులే. ప్రొఫెషనల్ కోర్సులు కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే చేశారు. పిల్లలు ఎవరైనా ‘మెడిసిన్ చేయాలనుంది, కానీ, మా అమ్మనాన్నలు డొనేషన్ కట్టలేక చదవలేకపోయాం’ అనుకోకూడదని జాగ్రత్తపడ్డాం. అందుకు తగినట్టు డబ్బు పొదుపు చేసేవాళ్లం. పిల్లల ఇష్టప్రకారం ఏది చదువుతారో దాని వరకు మా పొదుపు మొత్తాలు ఉండేలా జాగ్రత్తపడ్డాం. అయితే, ఆ డబ్బును వాడే అవసరం రాలేదు. బంధాలు పదిలం ‘మమ్మల్ని ఎలా భరించావు అమ్మా’ అని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అడుగు తుంటారు నా కూతుళ్లు. ‘ఎలా భరించాం అనేది తర్వాత విషయం. మీరు హ్యాపీగా ఉన్నారా..’ అని అడుగుతాను. ‘నువ్వు సూపర్విజన్ చేసి, మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చావు. చాలా హ్యాపీగా ఉన్నాం’ అంటారు. మానవ సంబంధాలలో ఎన్నో చికాకులు వస్తుంటాయి. కానీ, అందరితో కలుపుగోలుగా ఎలా ఉండాలో పిల్లలకు చెబుతుండాలి. తల్లిని కాబట్టి నేను ఎలా ఉన్నా మీరు నా దగ్గరకు వస్తారు. కానీ, మీ బంధువులు, చుట్టుపక్కల వాళ్లతోనూ రిలేషన్స్ను పదిలపరచుకోవాలి అని చెబుతాను. బంధాలను ముందుగానే కాపాడుకోవాలి. పెద్దలు బంధాల గురించి బాధ్యతగా ఉంటే పిల్లలూ నేర్చుకుంటారు. పిల్లల చిన్నప్పుడు మా మాట వినేలాగా పెంచాలనుకున్నాం. కానీ, పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వారి ఆలోచనలూ పంచుకుంటూ ముందుకు వెళ్లాం’’ అని వివరించారు ఈ ఆధ్యాత్మికవేత్త.పిల్లలతో కలిసి చదువుపిల్లలతో పాటు చదువుకుంటూ నేనూ పీహెచ్డీ చేశాను. సాహిత్యం గురించి చర్చించుకునేవాళ్లం. మావారు ఇంగ్లిష్ లిటరేచర్ చదివేవారు. అలా పిల్లలు కూడా సాహిత్యాభిలాషులు అయ్యారు. కాలేజీ టీమ్స్లో పాటలు పాడేవాళ్లు. థియేటర్ ఆర్ట్లో నంది అవార్డ్స్ తెచ్చుకున్నారు. ముగ్గురూ మంచి చదువులు చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తూనే, కుటుంబ జీవనాన్ని గడుపుతున్నారు. మా పెద్దమ్మాయి మైత్రేయి, రెండో అమ్మాయి రాధాకృష్ణవేణి, మూడో అమ్మాయి గార్గి కనకదుర్గ. రెండో అమ్మాయి స్పీచ్ పాథాలజీ అండ్ ఆడియాలజీ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మూడో అమ్మాయి వరంగల్ ఎన్ఐటీలో చదువుకుంది. కాలేజీలో ఎన్సీసీ తరపున ఢిల్లీ పెరేడ్లో పాల్గొంది. ఆర్మీలో రిక్రూట్మెంట్కు వెళ్లి, మేజర్ స్థాయికి చేరుకుంది. నిర్మలారెడ్డి(చదవండి: చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి..!) -
అదే నా సూపర్ పవర్!
జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తూ, అపజయాలను కూడా విజయాలుగా మార్చుకోవడమే అసలైన జీవితం అంటోంది నటి భాగ్యశ్రీ బోర్సే. అలుపు లేని ఉత్సాహంతో, అభిమానుల ప్రేమే తన ఇంధనంగా ముందుకు సాగుతూ, తన మనసులోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇలా పంచుకుంది...సెన్సిటివ్ గర్ల్నినేను చాలా సెన్సిటివ్. చిన్న విషయానికే వెంటనే ఎమోషనల్ అయిపోతాను. అయితే, నటిగా అదే నా సూపర్ పవర్. అందుకే, ఏ ఎమోషన్స్ ని అయినా లోతుగా అర్థం చేసుకొని, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలుగుతాను.బాడీ పాజిటివిటీప్రతి అమ్మాయీ తన సహజమైన అందాన్ని ప్రేమించాలి. నేను బాడీ పాజిటివిటీని బలంగా నమ్ముతాను. ఇతరుల కోసం మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు.ఫ్యామిలీ ఫస్ట్ఎంత బిజీగా ఉన్నా, పండుగల టైమ్లో మాత్రం ఇంటికి వెళ్లాల్సిందే. ముఖ్యంగా వినాయక చవితి అంటే మా ఇంట్లో చాలా సందడి ఉంటుంది. ఆ టైమ్లో షూటింగ్స్కి బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ, నా పెట్ డాగ్ ‘జియో’తో గడుపుతాను. ప్రస్తుతం కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే పాత్రలు చేయాలని ఉంది.గ్లోబల్ చైల్డ్హుడ్నేను పుట్టింది మహారాష్ట్రలో అయినా, స్కూలింగ్ అంతా నైజీరియాలో గడిచింది. బిజినెస్ మేనేజ్మెంట్ చదవడానికి ముంబైకి వచ్చాను. అప్పుడే మోడలింగ్ వైపు వెళ్లమని అందరూ ఎంకరేజ్ చేశారు. ‘అయ్యో, వచ్చిన అవకాశాలను వదులుకున్నానే’ అని బాధపడకూడదనే సినిమాల్లోకి వచ్చాను. అలా నా ప్రయాణం విధి రాసిపెట్టినట్టు సాగుతోంది.రిజెక్షన్ నుంచే సక్సెస్!కెరీర్ మొదట్లో నేను ఒక పెద్ద రిజెక్షన్ ని ఎదుర్కొన్నాను. అయినా తగ్గలేదు. ఆడిషన్ నుంచి బయటకు వచ్చి, డ్రెస్ మార్చుకుని, మళ్లీ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. జీవితంలో రబ్బర్ బాల్లా ఎంత గట్టిగా కింద పడితే అంతకంటే వేగంగా పైకి ఎగరాలి.డ్యాన్స్ రాదు!మా అమ్మ డ్యాన్స్ టీచర్ అయినా, చిన్నప్పుడు నాకు డ్యాన్స్ సరిగ్గా రాకపోయేది. అందరూ నన్ను ఏడిపించేవారు. కానీ పట్టుదలతో నేర్చుకున్నాను. అలాగే ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాలని పట్టుబట్టాను.రింగ్ మిస్టరీనా వేలికి ఉన్న రింగ్ గురించి చాలామంది రిలేషన్షిప్లో ఉన్నావా? ఎవరిచ్చారు? అని ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. అది నాకు నేను కొనుకున్న గిఫ్ట్. -
ఈ బీచ్ మహిళలకు మాత్రమే!
దుబాయ్ మునిసిపాలిటీ ఇటీవల మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన బీచ్ను ప్రారంభించింది. ‘ఖోర్ అల్ మమ్జర్’ పేరుతో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బీచ్లో స్థానిక మహిళలతో పాటు మహిళా పర్యాటకులు కాలక్షేపం చేయడానికి కావలసిన వసతులను ఏర్పాటు చేశారు. దుబాయ్–2040 అర్బన్ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఈ బీచ్ను 27.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దడం విశేషం.ఇక్కడ మహిళలు రాత్రివేళ కూడా నిరాటంకంగా ఈతకొట్టడానికి, వినోద కాలక్షేపాలు చేయడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఈతకొట్టే మహిళల భద్రత కోసం లైఫ్గార్డులను కూడా ఏర్పాటు చేశారు. దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దీనిని ప్రారంభించారు. ఈ బీచ్లో ఫ్లోటింగ్ వాక్వే, జిమ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ బీచ్ నిర్మాణం కోసం దుబాయ్ ప్రభుత్వం 500 మిలియన్ దీనార్లు ఖర్చు చేసింది.ఎడారిలో లైట్హౌస్లైట్హౌస్లు సాధారణంగా సముద్ర తీరాల్లో ఉంటాయి. రాత్రివేళల్లో నావికులకు దారి చూపడానికి ఇవి పనికొస్తాయి. సముద్ర తీరాలు లేని ప్రాంతాల్లో లైట్హౌస్లు కనిపించవు. కనుచూపు మేరలో సముద్ర తీరంలేని ఎడారి నడిబొడ్డున లైట్హౌస్ ఉండటం విడ్డూరమే! ఈ ఇరవై అంతస్తుల లైట్హౌస్ రష్యాలోని అస్త్రాఖాన్ ప్రాంతంలోని ఎడారిలో ఉంది. ‘పెత్రోవ్స్కీ లైట్హౌస్’ పేరిట దీనిని 1741లో నిర్మించారు. తొలుత దీనిని కలపతో నిర్మించారు. గాలి దుమారానికి కూలిపోవడంతో తిరిగి 1876లో దీనిని ఇటుకలతో నిర్మించారు. ఈ లైట్హౌస్ తొలుత నిర్మించే నాటికి కాస్పియన్ సముద్రం దీనికి చేరువలోనే ఉండేది. తర్వాతి కాలంలో కాస్పియన్ సముద్రం వెనక్కు మళ్లడంతో ఈ ప్రాంతం ఎడారిగా మారింది. -
మొబైల్ మాస్టారు
గోడల మధ్య బంధించిన చదువు, ఇప్పుడు స్క్రీన్ ల వెలుగుల్లో విహరిస్తోంది. చాక్పీస్ రాతలతో నిండిన బ్లాక్బోర్డ్ స్థానంలో, వేలి స్పర్శకే తెరుచుకునే డిజిటల్ నోట్స్ నిలుస్తోంది. స్కూల్ బస్ హారన్ లతో మొదలయ్యే విద్యార్థుల ఉదయాలు, నేడు మొబైల్ నోటిఫికేషన్స్తో స్టార్ట్ అవుతున్నాయి. ‘హోంవర్క్ చేశావా?’ అని గట్టిగా అడిగే టీచర్ స్వరం, ‘నెట్ వస్తుందా? లేదా?’ అనే ఆందోళనతో పెద్దదైపోతోంది. ఇప్పుడు చదువుకోవాలంటే, ఫీజులతో కొనాల్సిన అవసరం లేదు. ఒక చేతిలో మొబైల్, మరో చేతిలో చార్జర్, మనసులో తపన ఉంటే సరిపోతుంది. అప్పుడు, ఐఐటీ సార్ కూడా మీ చిన్న స్క్రీన్ పై ‘గుడ్మార్నింగ్ స్టూడెంట్స్’ అంటూ చిరునవ్వు చిందిస్తారు. ఈ స్క్రీన్ స్కూల్లో పుస్తకాల బరువు తగ్గిపోయింది. కానీ కలల ఎత్తు పెరిగిపోయింది. చిన్న డేటా ప్యాక్ దూరంలోనే నిలుస్తున్న ఈ డిగ్రీలు నిజంగా లాభామా? నష్టమా?ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విద్య ఇప్పుడు రాకెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం, 2024 నాటికి దేశంలో 88.6 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. పట్టణాల్లో అయితే పరిస్థితి హై లెవెల్! ప్రతి 100 మందికి 116 కనెక్షన్లు ఉన్నాయి. అంటే ఒక మనిషికి రెండు సిమ్లు, మూడు ఓటీపీలు, నాలుగు వైఫై పాస్వర్డులు కామన్ అయిపోయాయి! కానీ గ్రామాల్లో అది 47.6 శాతం మాత్రమే. అయినా మొత్తం యూజర్లలో 57 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారే ఉంటున్నారు. మరో ట్విస్ట్ ఏమిటంటే, 86 శాతం ఇళ్లలో ఇంటర్నెట్ ఉంది, కానీ కంప్యూటర్లు మాత్రం 10 శాతం కూడా లేవు! అంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కాదు, చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్సే అసలైన కాలేజ్, క్లాస్రూమ్, లైబ్రరీ, ఎగ్జామ్ హాల్ అన్నీ మొబైలే అయిపోయింది! అందుకే, ఆడుతూ, పాడుతూ విద్యార్థులు చదువు సాగించేలా డిజిటల్ స్కూల్ కూడా గేమ్ బేస్డ్ లర్నింగ్ టెక్నిక్స్ ఫాలో అవుతున్నాయి.డిజిటల్ గురువులుటీచర్ చెప్పింది అర్థం కాకపోతే, అడిగే ధైర్యం లేనివారందరూ, డౌట్ను కూడా నోట్బుక్లో మడిచేసుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. మరికొంతమంది తోటి విద్యార్థి సాయంతో తీర్చుకునేవారు. ఇప్పుడు, పరిస్థితి పూర్తిగా రివర్స్! అర్థం కాలేదా? వీడియోని పాజ్ చేసి, రివైండ్ చేసి ఇంకోసారి చూడొచ్చు? ఇంకా క్లియర్గా కావాలంటే, 0.5 స్పీడ్లో స్లో మోషన్ లో కూడా చూడొచ్చు. చదువు యూట్యూబ్ వీడియోలాగే చాలా ఈజీగా మారిపోయింది. ఇలా యాప్లో కనిపించే ప్రతి వీడియో, ప్రతి యానిమేషన్ , ప్రతి నోటిఫికేషన్ కూడా ఒక చిన్న డిజిటల్ గురువుగా మారిపోయింది.గేమ్లో గెలుపు, చదువు కోసమే!ఒకప్పుడు ‘మొబైల్ గేమ్స్ ఆడొద్దు, చదువు పాడవుతుంది!’ అని పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు, అదే గేమ్స్ పిల్లలకు మ్యాథ్స్, కోడింగ్, సైన్స్ కూడా నేర్పిస్తున్నాయి! అంటూ మొబైల్స్ చేతికి ఇస్తున్నారు. అవును చదువు ఇప్పుడు బోరింగ్ బ్లాక్బోర్డ్ నుంచి బయటికి వచ్చి, ‘నెక్ట్స్ లెవెల్ అన్ లాక్’ చేసే గేమ్లా మారిపోయింది. ఒక ప్రశ్నకు సరైన సమాధానం చెబితే పాయింట్లు, మరో లెసన్ పూర్తి చేస్తే బ్యాడ్జీలు, రోజూ లాగిన్ అయితే స్టికర్స్ ఇలా చదువు కూడా ఇప్పుడు వీడియో గేమ్ ఫీల్ ఇస్తోంది. అందుకే పిల్లలు ‘ఇంకో ఐదు నిమిషాలు’ అంటూ గేమ్ ఆడినట్టే, ఇప్పుడు ‘ఇంకో క్విజ్’ అంటూ చదువులో కూడా మునిగిపోతున్నారు! ముఖ్యంగా మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులు ఇప్పుడు భయం కాదు, మొబైల్లో ఫన్ చాలెంజెస్లా మారిపోయాయి. ఒకప్పుడు మార్కుల కోసం చదివిన పిల్లలు, ఇప్పుడు లీడర్బోర్డ్లో టాప్ రావడానికి చదువుతున్నారు!ఫ్రీగా ఇంత చదువా?ఒక్క మొబైల్లో డేటా ఆన్ చేస్తే చాలు– ఇంజినీరింగ్ నుంచి మెడిసి న్ వరకు, కోడింగ్ నుంచి విదేశీ భాషల వరకు, మాక్ టెస్టుల నుంచి మాస్టర్ క్లాస్ల వరకు అన్నీ స్క్రీన్ పై క్యూలో నిల్చుంటున్నాయి. అంతేకాదు, ఐఐటీ ప్రొఫెసర్ కూడా ‘సబ్స్క్రైబ్’ బటన్ దూరంలోనే ఉంటున్నారు. ‘ఇంత ఖరీదైన నాలెడ్జ్ని నిజంగానే ఫ్రీగా ఇస్తారా?!’ అని స్టూడెంట్స్ షాక్ అవుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన చాలా విద్యాసంస్థలు, ఇదే విధానాన్ని ఫాలో అయ్యి, క్యాష్ చేసుకుంటున్నాయి. ఇక్కడే మోసాలు కూడా మొదలయ్యాయి.క్లిక్ చేస్తే క్లాస్.. తర్వాత షాక్ !ప్రతి ‘బై నౌ’ బటన్ వెనుక నిజంగా నాలెడ్జ్ ఉంటుందా? అనేదే ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. కొన్నిసార్లు ‘లైవ్ క్లాసులు’ అని చెప్పి పాత వీడియోలు చూపిస్తారు. ‘ఫ్రీ ట్రయల్’ అంటూ మొదలై, తర్వాత సైలెంట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. ఇలా చదువు పేరుతో స్క్రీన్ వెనుక ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు సిలబస్ చదవడం కంటే, ముందు స్క్రీన్ మీద కనిపించే ప్రతి ‘క్లిక్’ను జాగ్రత్తగా చదవాల్సిన పరిస్థితి.ప్రభుత్వ డిజిటల్ దిగ్గజాల దూకుడు! ⇒ ప్రైవేట్ సంస్థలకంటే, ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ విద్యా ప్లాట్ఫారమ్లు ఇప్పుడు మరింత ఉపయోగకరంగా దూసుకు పోతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా..దీక్ష: ఇప్పటికే 2 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. 36 భారతీయ భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉండటం దీని అతిపెద్ద బలం.స్వయం: 4,400కిపైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 5.8 కోట్లకు పైగా ఎన్రోల్మెంట్లు నమోదయ్యాయి. అలాగే, 52 లక్షల మందికి పైగా ఈ ప్లాట్ఫారమ్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేశారు.ఎన్ పీటీఈఎల్: ఐఐటీలు, ఐఐఎంల కోర్సులు ఇప్పుడు మొబైల్ స్క్రీన్ పైనే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఇందులో 3.79 కోట్లకు పైగా కోర్స్ ఎన్రోల్మెంట్లు నమోదయ్యాయి. చాలామంది దీన్ని ‘ఎడ్యుకేషన్ నెట్ఫ్లిక్స్’గా కూడా చూస్తున్నారు.స్వయం ప్రభ: ఇంటర్నెట్ లేకున్నా చదువు ఆగకూడదనే ఉద్దేశంతో, 48 ప్రత్యేక టీవీ చానెల్స్ ద్వారా విద్యా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ఇక్కడ టీవీ కూడా టీచర్ అయ్యింది.డిజిటల్ స్కూల్ vs రియాల్టీ స్కూల్.. డిజిటల్ స్కూల్, రియాల్టీ స్కూల్ అనే ఈ రెండు ప్రపంచాల్లో స్టూడెంట్స్కి అసలు ఏది బెస్ట్? ఏది ఈజీ? ఏది నిజంగా ప్రభావం చూపుతోంది? అసలు ఈ రెండింటి మధ్య తేడాలను ఇక్కడ చూద్దాం.. స్క్రీన్ క్లాస్రూమ్⇒ వీడియోలను పాజ్, రివైండ్, స్లో మోషన్ లో కూడా చూడొచ్చు.⇒ ఇంట్లో నుంచే ఐఐటీ, టాప్ ఫ్యాకల్టీ క్లాసులు అటెండ్ కావచ్చు.⇒ టైమ్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ.⇒ ప్రెజెంటేషన్స్ , క్విజ్లు, డిజిటల్ నోట్స్ ఈజీగా అందుబాటులో ఉంటాయి.⇒ సిగ్గు పడే స్టూడెంట్స్ కూడా చాట్బాక్స్లో యాక్టివ్గా పాల్గొంటారు.⇒ స్మార్ట్ఫోన్ ఇప్పుడు చిన్న యూనివర్సిటీలా మారిపోయింది.⇒ ఈజీ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, ఆన్లైన్ మోసాలకు బలయ్యే అవకాశాలు ఎక్కువ.⇒ క్లాస్తో పాటు రీల్స్, నోటిఫికేషన్స్ కూడా పోటీ పడుతుంటాయి.⇒ ‘మైక్ ఆఫ్.. కెమెరా ఆఫ్.. అటెన్షన్ కూడా ఆఫ్!’ అనే సీన్ కామన్ .నిజమైన క్లాస్రూమ్⇒ టీచర్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది.⇒ డౌట్స్ వెంటనే క్లియర్ చేసుకోవచ్చు.⇒ కాన్సెప్ట్లు మరింత బాగా అర్థమవుతాయి.⇒ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి.⇒ ఫిజికల్ యాక్టివిటీ, ఫ్రెండ్స్తో డిస్కషన్స్ , గ్రూప్ లెర్నింగ్ ఎక్కువ.⇒ టీచర్లు స్టూడెంట్స్ అటెన్షన్ ను సులభంగా గమనించగలరు.⇒ చదువుతో పాటు క్లాస్రూమ్ మెమరీస్ కూడా క్రియేట్ అవుతాయి.⇒ బెంచ్ ఫ్రెండ్స్, చిన్న నవ్వులు, హోంవర్క్ టెన్షన్స్ ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తాయి.⇒ టైమ్, ట్రావెల్, ఫీజుల ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు.ఎగ్జామ్కి డెమో వెర్షన్ !పోటీ పరీక్షలు అంటే ఒకప్పుడు టెన్షన్ , భయం, రాత్రంతా నిద్రలేని ప్రిపరేషన్ . కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది! అసలు పరీక్షకు వెళ్లే ముందే, స్టూడెంట్స్కి ‘ట్రైలర్ షో’ చూసే చాన్స్ వచ్చేసింది. ఫ్రీ మాక్ టెస్టులు, ప్రాక్టీస్ పేపర్లు, టైమ్బేస్డ్ ఎగ్జామ్లు అన్నీ ఇప్పుడు ఒక క్లిక్ దూరంలోనే ఉన్నాయి. అంటే అసలు పరీక్ష హాల్లో కూర్చోకముందే, ‘ఎగ్జామ్ ఎలా ఉంటుంది?’ అన్న ఫీలింగ్ను ముందుగానే అనుభవించొచ్చు. దీంతో ఇప్పుడు స్టూడెంట్స్కి టెన్షన్ కంటే, ‘ర్యాంక్ స్క్రీన్ షాట్ను స్టేటస్లో ఎప్పుడు పెట్టాలి?’ అన్న ఆసక్తే ఎక్కువైపోతోంది!బిలియన్ డాలర్ల బిజినెస్!గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ మార్కెట్⇒ ఈ–లెర్నింగ్ సర్వీసుల మార్కెట్ విలువ 2024లో సుమారు 300 బిలియన్ డాలర్లకు చేరింది.⇒ ఇది 2030 నాటికి 840 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశముందని విశ్లేషకుల అంచనా.ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్ మార్కెట్ ఇప్పుడు భారీ బిజినెస్గా మారిపోయింది. మార్కెట్ రిపోర్టుల ప్రకారం, మొత్తం ఈ–లెర్నింగ్ సర్వీసుల మార్కెట్ విలువ 2024లో సుమారు 300 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది 2030 నాటికి 840 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశముందని విశ్లేషకుల అంచనా. అంటే, ఒక్కో యూజర్ నుంచి సగటున 69 డాలర్లకు పైగా ఆదాయం వస్తోంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా 86 శాతం మంది విద్యార్థులు ఇప్పుడు చదువులో ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నారని ఈ సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇండియాలో స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం, చౌకైన డేటా అందుబాటులోకి రావడం, ప్రభుత్వ డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కంపెనీలు భారీగా క్యాష్ చేసుకుంటున్నాయి.చదువు కూడా కన్జ్యూమర్ ప్రొడక్టే! చదువు ‘కొనడం’ కూడా ఇప్పుడు ఒక అధికారిక కొనుగోలు! అంటే మీరు డిజిటల్ లెర్నింగ్ యాప్, ఎగ్జామ్ సబ్స్క్రిప్షన్ , కోడింగ్ కోర్స్ లేదా ఆన్ లైన్ క్లాస్ కోసం డబ్బులు చెల్లిస్తే, ఆ ప్లాట్ఫారమ్లు కూడా వినియోగదారుల చట్టాల పరిధిలోకి వస్తాయి. భారతదేశంలోని వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్లు కూడా జవాబుదారులే. అందుకే సీసీపీఏ (సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ) ఎడ్టెక్ కంపెనీలపై ప్రత్యేక గైడ్లైన్స్ తీసుకొచ్చింది. అంతేకాదు, స్టూడెంట్స్కి కూడా కొన్ని ముఖ్యమైన హక్కులు ఉన్నాయి.డిజిటల్ మోసాలకు చెక్ పెట్టే స్మార్ట్ స్టెప్స్!డిజిటల్ ప్రపంచంలో బటన్ నొక్కే ముందు ఒక్కసారి బ్రెయిన్ ను కూడా రిఫ్రెష్ చేయాలి. ఆన్ లైన్ మోసాల నుంచి సేఫ్గా ఉండేందుకు ఈ చిన్న సర్వైవల్ గైడ్ను తప్పకుండా ఫాలో అవ్వాలి. ఒకవేళ మోసపోతే, అందులో నుంచి ఇలా బయటపడోచ్చు.కస్టమర్ కేర్కు కాల్ చేయండిముందుగా యాప్, వెబ్సైట్ లేదా కోచింగ్ సంస్థకు సమస్యను క్లియర్గా చెప్పండి. ఆర్డర్ నంబర్, ఇన్వాయిస్ పంపండి. చాలాసార్లు ఒక స్ట్రాంగ్ మెయిల్కే రీఫండ్ వచ్చేస్తుంది!ముందుగా ప్రూఫ్ సేవ్ చేయండిడిజిటల్ ప్రపంచంలో స్క్రీన్ షాట్ కూడా ఒక ఆయుధమే! బిల్లులు, మెయిల్స్, చాట్లు, స్క్రీన్ షాట్లు అన్నీ వెంటనే సేవ్ చేసుకోండి. ‘ప్రూఫ్’ ఉంటేనే మీ ఫిర్యాదుకు పవర్ వస్తుంది.ట్రయల్ ట్రాప్ను చెక్ చేయండి‘ఫ్రీ’ అని మొదలై, తర్వాత సైలెంట్గా డబ్బులు కట్ అవ్వడం కామన్ ! ఆటో రెన్యూవల్ ఆన్ లో ఉందో లేదో ముందే చూసుకోండి.టైమర్ చూసి టెన్షన్ పడకండి‘ఇంకా 2 సీట్లు మాత్రమే!’, ‘ఆఫర్ ఇంకో 5 నిమిషాలే!’ ఇవి చాలాసార్లు మార్కెటింగ్ డ్రామాలే! వెంటనే క్లిక్ చేయకుండా, రెండు నిమిషాలు ఆలోచించండి.చిన్న అక్షరాలు కూడా చదవండిషరతులు వర్తిస్తాయి అని కనిపించనంత చిన్నగా చివర్లో రాసిన వాటిని కూడా క్షుణ్ణంగా చూడాలి. లేకుంటే, రూ.99 అని కనిపించే కోర్స్, చివరికి రూ.499 బిల్లుగా మారొచ్చు! ట్యాక్స్లు, ప్లాట్ఫామ్ ఫీజులు ముందే చెక్ చేయండి.స్పందన లేకపోతే.. 1915కంపెనీ స్పందించకపోతే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ 1915కు ఫిర్యాదు చేయండి. డిజిటల్ మోసాల్లో ఇది మీ బ్యాకప్ బటన్ లాంటిది!మారుతున్న కాలంతో పాటు మనం మారడంలో తప్పు లేదు. కాని, అతిగా అందుబాటులో ఉందని ‘రేపటి నుంచి చదువుతా’ అనే అలసత్వాన్ని మాత్రం ఆఫ్ చేయాలి! అప్పుడు చదువు ఎలా చదివినా చదువే అవుతోంది. స్క్రీన్ ఇప్పుడు గురువు అయినప్పటికీ, చదవాలా? స్క్రోల్ చేయాలా? అన్న నిర్ణయం మాత్రం ఇంకా విద్యార్థి చేతిలోనే ఉంది.కొండి దీపిక -
ఈ తరం పిల్లల ఆటలు
ఒకప్పుడు పిల్లలు ఆరుబయట గిల్లీదండా, బొంగరాలు, గోలీలు వంటి ఆటలాడుతూ కనిపించేవారు. ఇప్పుడు గల్లీల్లో క్రికెట్ తప్ప వేరే ఆటలాడే పిల్లలు కనిపించడం బాగా అరుదుగా మారిపోయింది. స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చాక పిల్లల ఆటల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. స్మార్ట్ఫోన్ పిల్లలకు క్రీడావేదికగా మారిపోయింది. మన దేశ జనాభాలో పంతొమ్మిదేళ్ల లోపు పిల్లలు దాదాపు 40% వరకు ఉంటారు. స్మార్ట్ఫోన్లలో పిల్లలు ఇష్టంగా ఆడుకుంటున్న ఆటల గురించి గణాంకాలు...పిల్లలు స్మార్ట్ఫోన్లలో ఆడే ఆటలు గేమింగ్ పరిశ్రమకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో మన దేశంలో స్మార్ట్ఫోన్లో ఆటలాడే పిల్లల సంఖ్యతో పాటు గేమింగ్ ఇండస్ట్రీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. ఈ పెరుగుదల ఏ స్థాయిలో ఉందో గణాంకాల్లో చూద్దాందేశంలో స్మార్ట్ఫోన్ వాడకం అందుబాటులోకి వచ్చిన కొత్తలో పిల్లలు వీటిలోని ఆటలతో వారానికి మూడు నాలుగు గంటల వరకు మాత్రమే గడిపేవారు. ఇప్పుడు స్మార్ట్ఫోన్ల వాడకం మరింత పెరగడమే కాకుండా, వీటిలో గేమ్స్తో పిల్లలు గడిపే సమయం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం మన దేశంలోని పిల్లలు వారానికి సగటున 14 గంటల వరకు మొబైల్గేమ్స్తో గడుపుతున్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. మొబైల్ గేమ్స్లో పిల్లలు గడిపే సమయం పెరుగుతూ వస్తోందనేందుకు పై గణాంకాలే నిదర్శనం. -
మాను సంపంగి... మా అబ్బాయి
తెలుగు డిటెక్టివ్ సాహిత్యంలో మధుబాబు కొన్ని దశాబ్దాలు పాఠకులను ఉర్రూతలూగించిన రచయిత. ఆయన సృష్టించిన ‘షాడో’ ఒక సంచలనం. మధుబాబు అసలు పేరు వల్లూరు మధుసూదనరావు. తన కుమారుడు ఉదయ్ పెంపకం గురించి ఆయన పంచుకున్న అనుభవాలు... ‘‘చాలాకాలం క్రితం మేము ఇల్లు నిర్మించుకుంటున్న సమయంలో నా శ్రీమతి ఆదిలక్ష్మి తనకు సంపంగి చెట్టు కావాలని అడిగింది. నూజివీడులో వున్న నర్సరీ నుంచి తీసుకువచ్చాను. మంచి సంపంగి కాదది, మాను సంపంగి. చాలా ఎత్తుకు ఎదుగుతుంది. చిన్న చిన్న ఆకులు కాస్తా వెడల్పు అవుతాయి. నర్సరీ వాడు నన్ను ఏమార్చాడు. ఆ మొక్క నాటినప్పటి నుంచి మొదలయ్యాయి మా కష్టాలు. పెరిగి పెద్దదవుతున్న క్రమంలో ప్రతిరోజూ బండెడు బండెడు ఆకులు రాల్చేది. వాటిని ఎత్తి అవతల పడేయటానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.పన్నెండు అడుగుల ఎత్తుకు ఎదిగింది చెట్టు. ఒక్క పువ్వు కూడా పూయలేదు. మాతో చాకిరీ చేయించుకోవటానికే అది మా ఇంటికి వచ్చిందని అనుకుంటున్న సమయంలో ఒకరోజు సడన్గా ప్రత్యక్షం అయ్యాయి మొగ్గలు. రెండే రెండు రోజుల్లో వికసించాయి. మా ఇల్లేకాదు, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కూడా గుబాళించిపోయాయి సువాసనతో. మా అబ్బాయికి ఆ మాను సంపెంగకి తేడా ఏమీలేదని నాకు అనిపిస్తోంది ఇప్పుడు తరచి చూసుకుంటుంటే.పసిబిడ్డడిగా ఉన్నప్పుడు పగలంతా నిద్రపోయి, రాత్రిళ్ళు లేచి కూర్చునేవాడు. నా శ్రీమతిని నిద్రపోనిచ్చేవాడు కాదు. నన్ను నా రాతలు రాసుకోనిచ్చేవాడు కాదు. బెడ్ మీద నేను కనిపించకపోతే పాము మాదిరి పాకుతూ నా రైటింగ్ రూములోకి వచ్చి నా టేబుల్ కింద దూరేవాడు. భుజం మీద వేసుకుని వేమన శతకం, దాశరథీ శతకంలో నాకు వచ్చిన పద్యాలన్నిటినీ చెబుతూ రెండు గంటలు తిప్పితే తప్ప ఊరుకునేవాడు కాదు. స్కూల్కి టైమ్కి వెళ్ళేవాడు కాదు. అక్కడ టీచర్లను చెండుకు తినేవాడు. చూసి చూసి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మేడమ్ నాకు కబురుపెట్టింది. డిజాస్టర్ ఏదో జరిగిందనే అనుమానంతో నేను నా ఉద్యోగానికి ఒకరోజు సెలవు పెట్టి నా శ్రీమతిని తోడు తీసుకుని వెళ్ళాను. ప్రిన్సిపాల్ మేడమ్ చేసిన కంప్లైంట్ వినేసరికి నాకు మతిపోయింది. టీచర్లు చెపుతున్న పాఠాన్ని ఒకసారి విని అప్పటికప్పుడు అప్పగించేస్తున్నాడట. ఏదైనా వర్క్ ఇస్తే క్షణాల మీద పూర్తిచేసి, మిగిలిన పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నాడట. ‘ఈ తలనొప్పిని మేము భరించలేము, మీ అబ్బాయిని డబల్ ప్రమోషన్ చేస్తున్నాము’ అన్నది ఆమె. అంటే సంవత్సరం మధ్యలో పై తరగతికి కాకుండా ఆపై తరగతికి పంపటం.అలా అలా తన చుట్టూ వున్న వారిని, మమ్మల్ని టెన్షన్ మీద టెన్షన్ పెడుతూ టెన్త్, ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. రెండో సంవత్సరంలో బండి కావాలన్నాడు. ఒక సంవత్సరం తాత్సారం చేసి థర్డ్ ఇయర్లో కొనిపెట్టాను. మూడోరోజున తన ఫ్రెండ్ని ఎక్కించుకుని ఎనభై స్పీడ్లో తీసుకుపోయి కొట్లాడుకుంటున్న కుక్కల మధ్యలోకి పోయి బోర్లాపడ్డాడు. కుక్కలు పారిపోయాయిట. కానీ వీడికీ వీడి దోస్తుకీ మోకాళ్ళు మోచేతులూ చెక్కుకుపోయాయి.ఆ దెబ్బకి బండిని వదిలేస్తాడని ఆశించిన నాకు ఇంకో షాకు. నాలుగు రోజులు గడవకముందే, తగిలిన దెబ్బలు ఆరకముందే అదే దోస్తుతో అదే బండిమీద అదే స్పీడుతో నేషనల్ హైవే మీద కాలేజీకి పోయివచ్చాడు. దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు మాదిరి తయారైంది పరిస్థితి. మా అదృష్టం బాగున్నది కాబోలు– ఫర్దర్ టెన్షన్లు లేకుండా ఇంజనీరింగ్ పూర్తి అయింది. మాకు తెలియకుండానే మేము పెంచిన మాను సంపెంగ మొగ్గలు వేసి పూలు పూసినట్టు ఒక్కసారిగా మార్పు వచ్చింది వాడిలో.బిట్స్ పిలానీలో పోస్ట్గ్రాడ్యుయేషన్ చేశాడు. పెద్ద ప్యాకేజీతో బెంగళూర్లో ఉద్యోగం తెచ్చుకున్నాడు. వేదం నేర్చుకున్నాడు. వయొలిన్ వాయించటం అభ్యాసం చేశాడు. రెండుసార్లు సోమయాగం చేసి సోమయాజిగా అనిపించుకున్న పెద్దమనిషి కూతుర్ని– ఆయుర్వేద వైద్యవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమ్మాయిని భార్యగా పొందాడు. మొక్కల్ని పెంచాలన్నా, పిల్లలని పెంచాలన్నా ఓపిక అవసరమని మాకు అర్థం అయింది. మంచిని మెచ్చుకోవాలి. ఇబ్బందుల్ని సరిదిద్ది సరైన దారికి మరలించాలి. నా సతీమణి ఆదిలక్ష్మి ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఉండివుంటే తను పెంచిన మానుసంపంగి పువ్వుల్ని చూసి ఎంత మురిసిపోయిందో, అంతకు లక్షరెట్లు తన బిడ్డ అభ్యున్నతిని చూసి మురుసుకునేది. తన పెంపకమే ఇది. తన కష్టం. తన కడుపు పంట. మొక్కల్ని పెంచాలన్నా, పిల్లలని పెంచాలన్నా ఓపిక అవసరమని మాకు అర్ధం అయింది. మంచిని మెచ్చుకోవాలి. ఇబ్బందుల్ని సరిదిద్ది సరైన దారికి మరలించాలి. షాడో మధుబాబు, రచయిత -
దాంపత్యం
కారులో కూర్చున్న అరవై రెండేళ్ళ ఆయన చేతి గడియారం వంక చూసుకుని, అసహనంగా ఇంటి గుమ్మంవైపు చూశాడు. ఆయన భార్య చేతిలో హేండ్ బేగ్తో వచ్చి ఆయన పక్కన కూర్చుంది. ‘‘ఆలస్యమైందే?’’ ఆయన కారు స్టార్ట్ చేస్తూ కోపంగా అడిగాడు. ‘‘హేండ్ బేగ్ కనపడలేదు.’’ ‘‘అందుకే తీసిన వస్తువు తీసిన చోటే ఉంచాలని చెప్పేది.’’ ‘‘మొదలెట్టారూ గ్రామఫోన్ రికార్డు?’’ ‘‘నేను చెప్పేవన్నీ జీవితానికి ఉపయోగించేవి. గిఫ్ట్ పేక్ తీసుకున్నావా?’’‘‘అరే. మర్చిపోయానండి. మీరైనా గుర్తు చేయాల్సింది.’’ ‘‘ఎన్నిసార్లు చెప్పినా నీకు తలకెక్కదు. పైగా గ్రామఫోన్ రికార్డ్ అంటావు. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాలి. దాన్ని నీ చెప్పుల పక్కన ఉంచమని నిన్న రాత్రి చెప్పానా? అప్పుడు మర్చిపోవని.’’ ఆయన ఆగ్రహాన్ని అణచుకుంటూ చెప్పాడు. ‘‘మన పెళ్ళై ఎన్నేళ్ళైందంటారు?’’ ఆవిడ తన భర్త వంక చూస్తూ అడిగింది. ‘‘తెలీదా?’’ ‘‘మీకు తెలిస్తే చెప్పమంటున్నాను.’’‘‘ముప్ఫై ఆరేళ్ళు. ఐతే?’’‘‘అంతకాలం నించి మీరు నన్ను సాధిస్తున్నారు. అత్తలేని సంబంధం అని మా వాళ్ళు మీకిచ్చి చేశారు. కాని మీరు డబల్ అత్తగారని వాళ్ళకి తెలీదు.’’ ‘‘ఆపుతావా?’’ ఆయన అరిచాడు. ‘‘మీరు కారుని ఆపేదాకా ఆపను. ఏం? మీరు సాధించగా లేనిది నేను సాధించకూడదా? కొత్తల్లో భయపడేదాన్ని. ఇప్పుడు ఆ భయం లేదు. మీరు గెట్ అవుట్ అంటే పెద్దాడి ఇంటికి వెళ్ళిపోతాను.’’‘‘స్టీరింగ్ వీల్ ముందు కూర్చున్న వాడికి కోపం తెప్పించకూడదు, అది ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పాలి?’’ ఆయన కోపంగా అడిగాడు. ‘‘మీరు నాకు దొరికేది ఇక్కడేగా. లేదా కేసుల ఫైల్స్ చదువుతూ, స్టెనోకి జడ్జిమెంట్ డిక్టేట్ చేస్తూ మీరు ఎప్పుడూ బిజీనే. దారిలో పూలషాప్ వస్తుంది. ఆపండి. ఓ బొకే కొనుక్కెళ్దాం.’’‘‘ఎందుకు? మర్నాడు మన డబ్బు చెత్తబుట్టలో చేరడానికా? పళ్ళబుట్టని కొనుక్కెళ్దాం.’’‘‘పూల బొకే రెండు వందల ఏభైతో పోతుంది. పళ్ళబుట్టలో అరడజను పళ్ళు. దానికి ఆరు వందలు తీసుకుంటారు. ఆ మేదర బుట్ట ఖరీదే రెండు వందలు ఉంటుంది.’’ ‘‘ఎడ్డెం అంటే తెడ్డెం అంటావు.’’‘‘కాదు. మీరు డబ్బుని వృథా చేస్తున్నారు అంటాను.’’ ‘‘ఎక్కడ ఆదా చేయాలో, ఎక్కడ ఖర్చు చేయాలో ఇంతకాలం నాతో కాపురం చేశాక కూడా నీకు బోధపడలేదు.’’ ఆయన గొణిగాడు. ‘‘ఏమిటి? గట్టిగా వినేలా తిట్టొచ్చుగా.’’ ఆయన మాట్లాడలేదు.‘‘ఇల్లు తాళం వేశానంటారా?’’ ఆవిడ కొద్దిసేపు ఆగి అడిగింది. ‘‘కారులో కూర్చున్నవాడికి ఎలా తెలుస్తుంది? అది ఇంట్లోంచి బయటికి వచ్చిన వాళ్ళకి తెలియాలి.’’ ‘‘నేను కారులోకి తాళంచెవుల గుత్తితోనే వచ్చానా అని అడుగుతున్నాను.’’ ‘‘నా దగ్గర బైనాక్యులర్స్ లేవు.’’‘‘వెనక్కి తిప్పండి.’’ ‘‘ముహూర్తం టైంకి వెళ్ళాలి.’’ ‘‘తాళం వేయకపోతే ఏ డెలివరీ బాయో ఉన్నదంతా చక్కబెట్టుకుపోతాడు. వెనక్కి తిప్పండి.’’‘‘మనం పెళ్ళి ముహూర్తానికి వెళ్ళి తీరాలి.’’ ఆయన కోపంగా అరిచాడు. ‘‘ఇంటికి తిరిగి వెళ్ళేదాకా నాకు ఆందోళనగా ఉంటుంది.’’ ‘‘ఉండనీ.’’ ‘‘మీ వల్లే నాకు బీపీ’’ ‘‘అది మీ ఇంటి పేరు. మీ నాన్నకి, అమ్మకి, అక్కయ్యకి, ఆఖరికి మీ పనిమనిషికి, పెంపుడు కుక్కకీ కూడా బీపీ. నాకు లేదు.’’ ‘‘మీలాంటి వాళ్ళ వల్లే నాకు మాకు బీపీ’’ ఆవిడ కోపంగా అరిచింది. ‘‘అరవక. నీకు బీపీ వచ్చింది.’’ ‘‘నాకేం? హైకోర్ట్ జస్టిస్ ఇంట్లో దొంగలు పడ్డారని పేపర్లో రానీండి.’’‘‘విడాకుల గురించి ఏం ఆలోచించావు?’’ ఆయన అకస్మాత్తుగా అడిగాడు. ‘‘పెద్దాడు వద్దన్నాడు. భరణం ఎంత వస్తుందో ముందు కనుక్కోమన్నాడు.’’ ‘‘ఆ ఆలోచన కూడా చేశారన్నమాట. మీ కడుపులో ఎన్ని ఆలోచనలు దాచుకున్నారు!’’ ‘‘ఆలోచనలు కడుపులో దాచరు. మెదడులో దాస్తారు. అందుకే మీ జడ్జిమెంట్లని సుప్రీం కోర్ట్ కొట్టేస్తూంటుంది.’’ ‘‘షటప్. ఎకసెక్కెమా?’’ఆయన బ్రేక్ వేయడంతో ఆ కుదుపుకి ఆవిడ తల డేష్ బోర్డుకి కొట్టుకుంది. వెనక సీట్లో కూర్చున్న దర్శకుడు చెప్పాడు. ‘‘నైస్. ‘దాంపత్యం’ సరైన టైటిల్. మీతరం వాళ్ళల్లోని గొప్పతనం ఇదే. రిహార్సల్స్ కావాలంటారు. డైలాగ్స్ కంఠతా పడతారు. బయట మీ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారని ప్రేక్షకులకి తెలుసు. స్క్రీన్ మీద ఇలా పోట్లాడుకుంటుంటే ఎంజాయ్ చేస్తారు. టేక్ చేద్దామా?’’ మీరు నాకు దొరికేది ఇక్కడేగా. లేదా కేసుల ఫైల్స్ చదువుతూ, స్టెనోకి జడ్జిమెంట్ డిక్టేట్ చేస్తూ మీరు ఎప్పుడూ బిజీనే. దారిలో పూలషాప్ వస్తుంది. ఆపండి. ఓ బొకే కొనుక్కెళ్దాం. మల్లాది వెంకట కృష్ణమూర్తి -
బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !
స్టయిలిష్గా కనిపించాలంటే, బ్రాండ్స్ కాదు బాస్.. సరైన కలర్స్తో కంట్రోల్ చేసి గేమ్ చేంజర్గా మారొచ్చు.. ఈ చిన్న ట్రిక్ని మిస్ అయితే, బడ్జెట్ ఎంత పెట్టినా లుక్ డల్గానే ఉంటుంది. మరి ఆ సీక్రెట్స్ ఏంటో చూద్దాం!త్రీ కలర్స్ రూల్: ఒక అవుట్ఫిట్లో కేవలం మూడు రంగుల్లో మాత్రమే ఉండాలి. అంతకంటే, మించిన రంగులు అసలు వద్దు. ఎందుకంటే, ఒకేసారి చాలా కలర్స్ వేసుకుంటే, మీరు స్టయిలిష్గా కాకుండా కలర్ ఎగ్జిబిషన్లా మారేలా చాన్స్ ఉంది.న్యూట్రల్స్గా బేస్: ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, ఔట్ఫిట్కి కూడా బేస్ అంతే ముఖ్యం. బ్లాక్, వైట్, నేవీ, గ్రే, బీజ్, ఆలివ్ ఇవి మీ స్టయిల్కి బలమైన బేస్. ఇవి దేనితో అయినా ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇవి ఉంటే, మీ వాడ్రోబ్ ఎప్పుడూ ‘నో టెన్షన్ జోన్’లో ఉంటుంది.సింపుల్ స్టయిల్ ఫార్ములా: ఒక న్యూట్రల్ కలర్, ఒక మెయిన్ కలర్, ఒక చిన్న హైలైట్ అంతే, ఉదాహరణకు: నేవీ ప్యాంట్ + వైట్ టీషర్ట్ + లైట్ గ్రీన్ షర్ట్. అంతా న్యూట్రల్ కలర్స్ అయితే కాస్త బోరింగ్గా అనిపించొచ్చు. అందుకే, కాస్త బర్గండీ, లైట్ బ్లూ, రస్ట్, సాఫ్ట్ పింక్ లాంటి కలర్స్ జోడిస్తే లుక్కి లైఫ్ వస్తుంది.టెక్చ్సర్ కూడా మ్యాటర్: ఒకే కలర్ అయినా, మెటీరియల్ మారితే లుక్ మారిపోతుంది. ఉదాహరణకు: గ్రే టీషర్ట్ గ్రే స్వెటర్ రెండూ గ్రే కలర్సే కానీ ఫీల్ వేరు! కాట¯Œ , లినె¯Œ , వూల్ వంటి టెక్స్చర్స్ మిక్స్ చేస్తే మీ స్టయిల్ మరింత రిచ్గా కనిపిస్తుంది.రెడీగా ఉన్న సూపర్ కాంబినేషన్స్ఈ కాంబినేషన్స్ సేవ్ చేసుకోండి! ఎందుకంటే, ఇవి ట్రై చేస్తే స్టయిల్ ఎప్పుడూ మిస్ అవ్వరు1. వైట్ షర్ట్ + నేవీ ప్యాంట్ 2. లైట్ బ్లూ షర్ట్ + టాన్స్ప్యాంట్ 3. బ్లాక్ టీషర్ట్ + ఖాకీ ప్యాంట్ 4. బర్గండీ షర్ట్ + డెనిమ్ జీన్స్మీ స్కి టోన్కి సరిపడే కలర్స్అందరికీ అన్ని కలర్స్ సెట్ కావు. అందుకే, ఒక్కసారి మీకు సెట్ అయ్యే కలర్స్ తెలుసుకున్నారంటే, స్టయిల్ గేమ్లో మీరు అప్పుడే హాఫ్ విన్ అయిపోయినట్టే. ఎక్కువగా ఫెయిర్ స్కిన్కి లైట్, సాఫ్ట్ కలర్స్, మీడియం స్కిన్ ఉంటే ఆలివ్, నేవీ, రస్ట్. డార్క్ స్కిన్ వారికైతే బోల్డ్, బ్రైట్ కలర్స్ సూపర్గా కనిపిస్తాయి. -
డిజిటల్ క్రైమ్: కత్తితో పొడిస్తేనే హత్య కాదు..!
డాక్టర్ కృపాకర్ తన గదిలోనే నిర్జీవంగా పడి ఉండటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తన ఫోరెన్సిక్ తెలివితేటలతో ఎన్నో క్లిష్టమైన కేసులను పరిష్కరించిన అతడు అనుమానాస్పదంగా మరణించడం పోలీస్ డిపార్ట్మెంట్ను షాక్కు గురిచేసింది. కృపాకర్ బ్రహ్మచారి. రాత్రి వంటమనిషి వంట చేసి వెళ్తుంది. పొద్దున్నే సర్వెంట్ డూప్లికేట్ కీతో లోపలికి వచ్చి పనులు పూర్తి చేసుకుని కాఫీతో డాక్టర్ను నిద్ర లేపుతుంది. ఎంత పిలిచినా డాక్టర్ లేవకపోవడం, తన గది తలుపు తీయకపోవడంతో అనుమానంతో పోలీసులకు ఫోన్ చేసింది.∙∙ డిటెక్టివ్ సిద్ధార్థ డాక్టర్ కృపాకర్ బెడ్రూమ్ను పరిశీలిస్తున్నాడు. మృతదేహం ప్రశాంతంగా ఉంది. ఎక్కడా పెనుగులాట ఆనవాళ్లు లేవు. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం ఆయన గుండె ఆగి మరణించారు. దానికి కారణం తీవ్రమైన ‘షాక్’. కానీ గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగిన దాఖలాలు లేవు. అంతగా షాక్కు గురి చేసే సంఘటనలు జరిగిన ఆనవాళ్లు కూడా లేవు. డిటెక్టివ్ సిద్ధార్థకి ఒక విషయం ఆశ్చర్యం కలిగించింది. కృపాకర్ టేబుల్ మీద ఉన్న ఒక ఖరీదైన ‘స్మార్ట్ ఆడియో స్పీకర్’ వైర్ కట్ అయి ఉంది. అలాగే, కృపాకర్ చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ మరణానికి కొన్ని నిమిషాల ముందు అసాధారణమైన హార్ట్ రేట్ రికార్డ్ చేసింది. అతనికి శత్రువులు ఎవరూ లేరు... ఫోరెన్సిక్ ల్యాబ్కు వెళ్లి విచారించాడు. కృపాకర్ మెడికల్ హిస్టరీ పరిశీలించాడు. కృపాకర్ స్టాఫ్ను ఒక్కొక్కరినీ విడివిడిగా విచారించాడు. కృపాకర్ చావుకు కారణం తెలిసింది.∙∙ కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతూ ఉండటంతో నిద్రమత్తులోనే వచ్చి తలుపు తీశాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ భార్గవ్. ఎదురుగా డిటెక్టివ్ సిద్ధార్థ. ‘మీరా ఇంత రాత్రి వేళ?’ గోడ గడియారం వంక చూస్తూ అన్నాడు భార్గవ. రాత్రి పదకొండు...‘మీ డాక్టర్ చనిపోయిన బాధలో మీరు నిద్రపోయి ఉండరని ఈ టైంలో డిస్ట్రబ్ చేయాల్సి వచ్చింది.’ భార్గవ వంకే చూస్తూ అన్నాడు. ‘యస్... యస్...’ అన్నాడు భార్గవ.. ‘మరి ఇక వెళదామా?’ అన్నాడు డిటెక్టివ్ సిద్దార్థ. ‘ఎక్కడికి?’ ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ. ‘పోలీస్ స్టేషన్కు.. డాక్టర్ కృపాకర్ను డిజిటల్ టెక్నాలజీ అనే ఆయుధంతో హత్య చేసినందుకు...’ తాపీగా అన్నాడు డిటెక్టివ్ సిద్దార్థ.‘హత్య? నేనా?’ ఆశ్చర్యం నటించాడు భార్గవ.‘నీ కాల్ హిస్టరీలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ని మా శైలిలో విచారించాం. మిస్టర్ భార్గవ్, కృపాకర్ ఎదుగుదలను చూసి ఓర్వలేక పోయారు. ప్రొఫెషనల్ జెలసీ. కృపాకర్కు బలహీనమైన గుండె ఉందని తెలుసుకున్నారు. మీరు కృపాకర్ ఫ్యామిలీ డాక్టర్ను కలిశారు. డాక్టర్ కృపాకర్కు ‘ఫోనోఫోబియా’ (అకస్మాత్తుగా వచ్చే శబ్దాలంటే భయం) ఉందని తెలుసుకున్నారు.ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ సహాయంతో కృపాకర్ ఇంట్లోని స్మార్ట్ హోమ్ సిస్టమ్ను హ్యాక్ చేశారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు, గదిలోని స్పీకర్ల ద్వారా అత్యంత భయంకరమైన, అధిక డెసిబుల్స్ ఉన్న శబ్దాన్ని (అల్ట్రాసోనిక్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్) ఒక్కసారిగా ప్లే చేశారు. ఆ నిశ్శబ్ద రాత్రి ఊహించని ఆ భీకర శబ్దానికి కృపాకర్ గుండె తట్టుకోలేకపోయింది. షాక్తో ఆయన ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. ఆ తర్వాత రిమోట్ ద్వారా ఆ ఆడియో ఫైల్ను డిలీట్ చేశారు.మీ ల్యాప్టాప్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే సెర్చ్ హిస్టరీలో ‘హౌ టు ట్రిగ్గర్ కార్డియాక్ అరెస్ట్ యూజింగ్ సౌండ్ వేవ్స్’ అనే అంశం కనిపించింది. అంతేకాకుండా, కృపాకర్ చనిపోయిన సమయానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు మీ ఫోన్ నుండి కృపాకర్ ఇంటి వైఫై నెట్వర్క్కు కనెక్షన్ వెళ్ళినట్లు ఐటీ నిపుణులు గుర్తించారు.’ డిటెక్టివ్ సిద్ధార్థ లేస్తూ అన్నాడు.‘కత్తితో పొడిస్తేనే హత్య కాదు భార్గవ్, ఒకరి భయాన్ని ఆయుధంగా మార్చుకుని చంపడం కూడా ముమ్మాటికీ హత్యే!’ ‘టెక్నికల్ మర్డర్’ డిజిటల్ క్రైమ్. ఒక్క విషయం గుర్తుంచుకోండి. నేరస్థుల కన్నా తెలివైన వాళ్ళు పోలీసులు, డిటెక్టివ్లు. మీ తెలివితేటలు మీరు ఎదగడంపైన చూపించాల్సింది. మీ జెలసీ మిమ్మల్ని నేరస్థుడిని చేసింది.’ సిద్దార్థ భార్గవ్ను చూస్తూ చెప్పాడు. శ్రీ సుధామయి(చదవండి: ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!) -
అపకారికి గుణపాఠం
అనగనగా ఒక ఆడవి. గుహలో సింహం పెద్దగా నోరు తెరిచి శబ్దం చేస్తోంది తప్ప మాట్లాడలేకపోతోంది. దాని ఎదురుగా కొన్ని జంతువులు కూర్చుని విచారంగా చూస్తున్నాయి. జరిగిన విషయం ఏంటంటే ఆ ఉదయం మృగరాజు ఒక జింకను వేటాడి తింటున్నప్పుడు ఒక ఎముక దవడలో గుచ్చుకుంది. దాంతో విపరీతమైన నొప్పి... తినడం కాదు కదా నోరు మూయలేని స్థితి. అంతలో ఆగమేఘాల మీద మంత్రి నక్కగారు వచ్చారు. పరిస్థితి అర్థం చేసుకుని, ‘మరేం భయం లేదు. ఇప్పుడే మన కొంగను పిలిపిస్తాను అది చిటికెలో మీ సమస్యను పరిష్కరిస్తుంది’ అని చెప్పి మిగిలిన జంతువులన్నింటినీ పంపేసింది. సింహం నిస్సహాయంగా తలూపింది. అరగంటలో అక్కడికి కొంగగారు రానే వచ్చారు. సింహం నోట్లోకి పరికించి చూసి ‘అవును మహారాజా! మీ నోట్లో ఒక ఎముక గుచ్చుకోనుంది దాన్ని తొలగిస్తాను. కానీ మీరు నాకు మూల్యం చెల్లించాలి’ అంది. సింహం, నక్క కోపంగా చూశాయి. ‘మూల్యమంటే కేవలం పది ఎండు చేపలు ఇస్తే చాలు మహారాజా!’ అంది కొంగ వినయంగా. నక్క ఏదో అనబోతుండగా సింహం వారించి సరే అలాగే అన్నట్లు తలాడించింది. పది నిమిషాల్లో సింహం నోట్లో తలపెట్టి ఆ ఎముక ఎక్కడుందో వెతికి బయటకి లాగి పడేసింది కొంగ. హమ్మయ్య అనుకుంది సింహం.‘ఏంటి ఇప్పుడు చెప్పు నీకు మూల్యం కావాలా? నా నోట్లో నీ తల ఉన్నప్పుడు కొరకకపోవడమే నీకు నేనిచ్చే మూల్యం...’ అంది సింహం వికటంగా. ‘ఇది మోసం మహారాజా...’ అనబోతున్న కొంగపైకి దూకింది నక్క. అంతేకాదు, అప్పటికప్పుడే గుహ తలుపులు మూయించేసింది. కొంగకు భయం వేసింది. గుహ కప్పు అంత ఎత్తుగా లేదు. ఒకవైపు నుంచి నక్క మరోవైపు నుంచి సింహం దాని మీద దాడికి చూస్తున్నాయి. కొంగకు ఏం పాలు పోలేదు. అక్కడక్కడే ఎగురుతూ తప్పించుకోవడానికి చూస్తోంది. పైకప్పులో బండల మధ్య ఉన్న ఒక రంధ్రాన్ని గమనించి తుర్రున దాంట్లో నుంచి ఎగిరిపోయి, ‘బతుకు జీవుడా’ అనుకుంది కొంగ.అప్పుడు సింహం విస్తుపోతూ, ‘ఆ బండల మధ్య సందును వెంటనే మూయించు’ అని నక్కను ఆదేశించింది. ప్రాణభయంతో ఎగిరిపోయిన కొంగ దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద అలసట తీర్చడానికి వాలింది. ఆ చెట్టు మీద ఒక ఎలుగుబంటు మత్తుగా కునికిపాట్లు పడుతోంది. ‘ఏంట్రా అలా భయంతో గజగజ వణుకుతున్నావు? ఏమిటి సంగతి?’ అంది ఎలుగు దాన్ని చూస్తూ. సింహం, నక్క తనకు చేసిన అన్యాయం గురించి కొంగ చెప్పి వాపోయింది. ‘వాళ్లంతే! నీచులు’ అంది ఎలుగు.అంతలోనే నక్క అటుగా రావటం చూసి కొంగ ఎగిరిపోయింది. నక్క చెట్టుకు దగ్గరకు వచ్చి ‘మామా! మన రాజుగారి గుహపైన ఒక కంత ఉంది. పెద్ద బండతో దాన్ని నువ్వు పూడ్చాలి. వెంటనే రమ్మని రాజాజ్ఞ’ అంది నక్క దర్పంగా. ‘అలాగే అల్లుడు... పద వస్తాను’ అంటూ చెట్టు దిగింది ఎలుగు. రెండూ గుహ దగ్గరకు వచ్చాయి. నక్క దర్జాగా గుహలోకి వెళ్ళి, సింహంతో ముచ్చట్లు పెట్టింది. ఎలుగు గుహ పైకి ఎక్కి కంత ఎక్కడ ఉందో చూసింది. ఈ రెంటికి బుద్ధి చెప్పాలని అనుకున్న ఎలుగు– కంతకు సరిపడ బండ కాక కొద్దిగా చిన్న సైజు బండతో దాన్ని కప్పబోయింది. అంతే! ఆ బండ దడేల్న లోపల ముచ్చట్లు చెప్పుకుంటున్న నక్క తలను పచ్చడి చేసి, పక్కనే ఉన్న సింహం పైకి దొర్లింది. దాని ముందు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. సింహం బాధతో, భయంతో అరవడం మొదలు పెట్టింది. గుహ తలుపులు మూసి ఉండడం వల్ల ఆ అరుపులు బయట ఎవరికీ వినపడలేదు. ఎలుగు నవ్వుకుంటూ, కంతకంటే పెద్దదైన బండతో ఆ ఖాళీని అప్పుడు మూసేసింది. రాజు, మంత్రి అనే గర్వంతో సింహం, నక్క చేస్తున్న అరాచకాలకు అలా అడ్డుకట్ట వేసింది ఎలుగు. సింహం ఆహారం, నీళ్లు లేక గొంతు ఎండుకు పోయేలా అరిచి అరిచి కొన్నాళ్లకు ప్రాణాలు విడిచింది. చంద్ర ప్రతాప్ కంతేటి (చదవండి: పుణ్యశీలుడి వృత్తాంతం: అందుకోసమే వైశాఖ ధర్మాలు..) -
పుణ్యశీలుడి వృత్తాంతం: అందుకోసమే వైశాఖ ధర్మాలు..
పూర్వం పాంచాల రాజ్యాన్ని పురుయశుడు అనే రాజు పాలించేవాడు. అతడి కొడుకు పుణ్యశీలుడు. బాల్యంలోనే పుణ్యశీలుడు సదాచారాలను పాటించేవాడు. గురుకులంలో చేరి, అస్త్రశస్త్ర విద్యలు సహా రాజోచితమైన విద్యలన్నీ నేర్చుకున్నాడు. తండ్రి పురుయశుడు గతించాక పుణ్యశీలుడు రాజ్యపాలన చేపట్టాడు. ధర్మం తప్పక ప్రజలను పాలించసాగాడు. కొన్నేళ్లు సజావుగానే గడిచినా, కొంతకాలానికి పుణ్యశీలుడి రాజ్యంలో దారుణ దుర్భిక్షం సంభవించింది. రోగాలు సోకి ఏనుగులు, గుర్రాలు మరణించాయి. ధనాగారంలోని ధనమంతా నశించింది. రాజ్య నిర్వహణ కష్టతరంగా మారింది. గజబలం, అశ్వబలం నశించడంతో పుణ్యశీలుడు బలహీనంగా మిగిలాడు. శత్రురాజులు ఈ సంగతి తెలుసుకుని, పుణ్యశీలుడి మీదకు దండెత్తి వచ్చారు. యుద్ధంలో పుణ్యశీలుడు ఓటమిపాలయ్యాడు. భార్య శిఖినితో కలసి అడవులకు చేరుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఒక కొండగుహలో తలదాచుకోసాగాడు. రాజ్యాన్ని పోగొట్టుకుని, అడవులపాలైన పుణ్యశీలుడు తనలోనే తాను కుమిలిపోసాగాడు. ‘ఇంతటి దుస్థితి నాకెందుకు వచ్చింది? తల్లిదండ్రులను భక్తితో సేవించుకున్నాను. గురువుల పట్ల వినయ విధేయతలతో నడుచుకున్నాను. దైవభక్తి గలవాడిని. భూతదయాపరుడిని. సదా సదాచారపరాయణుడనైన నాకెందుకు ఇంతటి కష్టం కలిగింది’ అని నిత్యం బాధపడసాగాడు.పుణ్యశీలుడు అడవులపాలై యాభైమూడేళ్లు గడచిపోయాయి. అతడి దుఃఖం అంతకంతకు పెరగసాగింది. ఒకనాడు అతడు తన గురువులైన యాజ ఉపయాజకులను స్మరించుకున్నాడు. అతడు మనసులో తలచినదే తడవుగా యాజ ఉపయాజకులు అతడి ముందు ప్రత్యక్షమయ్యారు. పుణ్యశీలుడు ఎదుట నిలిచిన గురువులకు సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజలాంఛనాలు లేకుండా, సామాన్యుడిలా ఉన్న పుణ్యశీలుడు గురువులను చూసి, కన్నీరు కార్చసాగాడు. వారు అతడిని లేవదీశారు. పుణ్యశీలుడు ఫలపుష్పాదులతో గురువులను పూజించాడు. ‘‘గురువులైన విప్రులారా! నేను రాజును. జన్మ కర్మల చేత పవిత్రుడను. పితృదేవతా భక్తుడను. పాపభీతి గలవాడను. నాకు ఇంతటి కష్టం సంభవించడానికి కారణమేమిటి? శత్రువుల చేతిలో ఓటమి పాలై, రాజ్యాన్ని, ధనాన్ని పోగొట్టుకుని, ఏళ్ల తరబడి ఎవరికీ తెలియకుండా, ఇలా అడవుల్లో గడపవలసిన దుస్థితి ఏర్పడటానికి కారణమేమిటి? అసలు నా రాజ్యంలో దుర్భిక్షం వాటిల్లడానికి కారణమేమిటి?’’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు.‘‘రాజా! నీ దుఃఖానికి, దుస్థితికి కారణాన్ని చెబుతున్నాం, విను. పూర్వం పదిజన్మలలో నువ్వు కిరాతుడివై ఉండేవాడివి. హింసాత్మకుడివై, కఠినాత్ముడివై జనాలను పీడించేవాడివి. ఏనాడూ ధర్మ కార్యాచరణ చేయలేదు. ఇంద్రియ నిగ్రహాది సుగుణాలు లేక యథేచ్ఛగా సంచరించేవాడివి. పొరపాటునైనా శ్రీహరి నామాన్ని ఉచ్చరించలేదు. తొమ్మిది జన్మలు ఇలాగే గడిచిపోయాయి. పదో జన్మలో సహ్యాద్రి ప్రాంతంలో కిరాతుడివై జన్మించావు. గడచిన తొమ్మిది జన్మల మాదిరిగానే పదో జన్మలో కూడా మనుషులను హింసించేవాడివి. నరమాంసభక్షణ చేసేవాడివి. నమ్మినవారిని హింసించడం వల్ల సోదరులు లేకుండాపోయారు. నీకు గత జన్మలో సంతానం కూడా లేకపోయింది. పరపీడన పాపం వల్ల నీకు ఈ జన్మలో వనవాసక్లేశం సంభవించింది. నరమాంసభక్షణ వల్ల నీకు తిండికి కరవైన పరిస్థితి ఏర్పడింది. మనుషులకు అప్రియమైన పనులు అనేకం చేయడం వల్ల నానా కష్టాలు నిన్ను చుట్టుముట్టాయి. సజ్జనులను హింసించడం వల్ల శత్రువుల చేతిలో ఓటమి ఎదురైంది. ఇదివరకటి జన్మలలో ఎవరికీ దానం చేయకపోవడం వల్ల దారిద్య్రబాధ సంభవించింది.’’ అని చెప్పారు. ‘‘మరి ఈ జన్మలో రాజవంశంలో ఎలా జన్మించాను?’’ అడిగాడు పుణ్యశీలుడు.‘‘ఆ కారణం కూడా చెబుతాం విను. నువ్వు కిరాతుడిగా ఉన్నప్పుడు ఒక వేసవిలో ఇద్దరు ధనిక వైశ్యులు, కర్షణుడు అనే విప్రుడు తారసపడ్డారు. నువ్వు ఆ ముగ్గురినీ అటకాయించావు. వారిలో ఒక వైశ్యుడిని చంపి, అతడి వద్దనున్న ధనం లాక్కున్నావు. రెండో వైశ్యుడు తన డబ్బు మూటను పొదల్లో పారవేసి పారిపోయాడు. విప్రుడు కూడా పరుగు లంకించుకున్నాడు. కొంత దూరం పరుగెత్తాక విప్రుడు సొమ్మసిల్లి పడిపోయాడు. రెండో వైశ్యుడు డబ్బును ఎటువైపు పారవేశాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నువ్వా విప్రుడికి శైత్యోపచారాలు చేసి, అతడి దప్పిక తీర్చావు. నీ పట్ల భయంతో అతడు రెండో వైశ్యుడు డబ్బు మూట ఎటువైపు పారవేశాడో చెప్పాడు. నువ్వు ఆ విప్రుడిని ప్రాణాలతో విడిచిపెట్టావు. నీ స్వలాభం కోసమైనా, వైశాఖమాసంలో విప్రుడికి ఉపచారాలు చేసి, దప్పిక తీర్చిన ఫలితంగా నువ్వు ఈ జన్మలో రాజవంశంలో జన్మించావు. అందువల్ల వైశాఖ ధర్మాలను నిర్వర్తిస్తే నువ్వు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందగలవు’’ అని చెప్పారు. గురువులైన యాజోపయాజకులు చెప్పిన ప్రకారం పుణ్యశీలుడు వైశాఖ ధర్మాలను ఆచరిస్తూ, శ్రీహరిని పూజించసాగాడు. కొన్నాళ్లకు అతడు తన బంధువులను కలుసుకోగలిగాడు. వారి సాయంతో శత్రువులు ఆక్రమించుకున్న తన రాజ్యానికి వెళ్లి, శత్రువులతో యుద్ధంచేసి, వారిని తుదముట్టించి, తిరిగి తన రాజ్యాన్ని దక్కించుకున్నాడు.సాంఖ్యాయన -
గాంధార నవ్వు
‘‘నాన్నా! నీకు ఫోన్ వచ్చింది.’’ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమవుతూ, వరండాలో బూట్లు పాలిష్ చేసుకుంటున్న ఆనంద్కు వినిపించింది కూతురి అరుపు.‘‘ఎవరమ్మా, పేరు చూడు.’’ అన్నాడు తన పని ఆపకుండా. ‘‘ప్రవల్లిక అమెరికా... అంట నాన్నా.’’ కూతురి మాట ఇంకా పూర్తవకముందే, పాలిష్ మధ్యలోనే ఆపేసి ‘‘లిఫ్ట్ చేయొద్దూ...’’ అని అంటూ చటుక్కున పైకి లేచాడు. కూతురు ఎక్కడ కాల్ లిఫ్ట్ చేస్తుందో అని హడావిడిగా ఇంట్లోకి కదిలాడు. ఈ తొందరలో అప్పటికే పాలిష్ పూర్తయిన ఒక షూ కాలికి తగులుకొని దూరంగా పడింది.ఈలోగానే ‘‘సరే నాన్నా..’’ అంటూ కూతురి మాటతో పాటు ఫోన్ మోగుతున్న శబ్దం ఆగిపోవడంతో కాస్త నెమ్మదించాడు.కూతురి చేతుల్లోంచి మొబైల్ తీసుకుని, మళ్లీ కాల్ వస్తుందేమో అని కాసేపు వేచి చూశాడు. రాకపోవడంతో తిరిగి చార్జింగ్ పెట్టబోయి, ఎందుకైనా మంచిదని ఆ ప్రయత్నం మానుకున్నాడు. మొబైల్ను ప్యాంట్ జేబులోకి తోశాడు. ఇదంతా వంటింట్లోంచి గమనిస్తోంది మీనాక్షి. ‘‘మాట్లాడడం ఇష్టం లేకపోతే బ్లాక్ చేయమని చాలాసార్లు చెప్పాను...’’ భర్తకు వినపడేలా గట్టిగా అంది.ఏమీ పలకలేదు ఆనంద్. ఆఫీస్కు రెడీ అవడంలో మునిగిపోయాడు. ‘‘.. అయినా, తను ఏం అడుగుతోంది? ఒకసారి కలసి మాట్లాడాలనే కదా? కలిపిస్తాననో కలిపించననో చెప్పొచ్చు కదా? ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా, మాట్లాడకుండా ఉండడం మంచి పద్ధతేనా?..’’ ఈసారి మరింత గట్టిగా వినిపించింది వంటగది నుంచి.‘‘ఏం నేనే చెప్పాలా?..నువ్వు చెప్పకూడదా? నీకూ ఫ్రెండే కదా?..’’నోరు తెరవొద్దనే నియమం మరచిపోయి అసంకల్పితంగా అనేశాడు. ఆ మాటతో విసురుగా హాల్లోకి వచ్చేసింది. ‘‘ఆ విషయం దానికి తెలియదా? అయినా నన్ను కాకుండా మిమ్మల్నే ఎందుకు అడుగుతోంది? మీ ఇద్దరూ జాన్ జిగిరీలు... నువ్వు చెబితే ఏమైనా చేస్తాడు. ఏదైనా వింటాడనే కదా? లేకపోతే తనే నేరుగా వెళ్లలేదా?.’’ దగ్గరికి రావడం వల్ల కాబోలు అరుస్తున్నట్లు వినబడింది. ఈసారి మాత్రం నోరు తెరవలేదు ఆనంద్. తెరిస్తే పెద్ద యుద్ధమే! అంతేకాదు, మరో నిమిషంలోనో అర నిమిషంలోనో అదే నెంబరు నుంచి మీనాక్షికి కాల్ వస్తుందనీ తెలుసు. అందుకే తిరిగి తన పనిలో తాను లీనమయ్యాడు. ఊహించినట్లే కాసేపటికి మీనాక్షి ఫోన్ మోగింది. భర్తను కొరకొరా చూస్తూ ఫోన్ తీసింది. కాసేపు మాట్లాడాక స్పీకర్ ఆన్ చేసింది. అటువైపు నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ‘‘అన్నయ్యా... మీరు నాతో ఎందుకు మాట్లాడరో నాకు తెలుసు. నన్ను తన దగ్గరికి తీసుకెళ్లమని మిమ్మల్ని ఇకపైన అడగను. ఎందుకంటే, నేనే వెళ్లి కలుస్తాను. రెండ్రోజుల్లో ఇండియాకు వస్తున్నాను. కానీ, మిమ్మల్ని, మీనాక్షిని, పాపను చూసే అవకాశం మాత్రం ఇవ్వన్నయ్యా!’’ అంటూ అభ్యర్థనగా పలికింది ప్రవల్లిక గొంతు. సమాధానం కోసం అటువైపు నుంచి ఎదురు చూస్తున్నట్లు భార్యాభర్తలిద్దరికీ అర్థమవుతోంది. ఏం జవాబు చెప్తాడో అని ఆనంద్ వైపే చూస్తోంది మీనాక్షి. అది గమనించి ‘సరే’ అని అంగీకరిస్తున్నట్లు తలూపి, హడావిడిగా ఇంటి నుంచి బయటపడ్డాడు. ఈ తొందరలో క్యారియర్ తీసుకోవడం మర్చిపోయి వెళుతున్న భర్తనే చూస్తూ ప్రవల్లికతో మాట్లాడుతోంది మీనాక్షి. ∙∙ ఆఫీస్కు వచ్చాడే గాని, పనేమీ చేయాలనిపించడం లేదు. కాసేపు అన్నీ మర్చిపోయి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. కుదరలేదు. తలనొప్పి ప్రారంభమైనట్లు అనిపించడంతో క్యాంటీన్ బాట పట్టాడు. ఎవరూ లేని టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని, కాస్త కాఫీ తాగాక ఆనంద్ ఆలోచనలు గతం వైపు పరుగు తీశాయి. ఆనంద్, రామకృష్ణ ఇద్దరూ ఇంటర్ నుంచి ఫ్రెండ్స్. ఒకే ఊరు, ఒకే గ్రూప్ కాకపోయినప్పటికీ అనుకోకుండా అయిన పరిచయం వాళ్లిద్దర్నీ మంచి స్నేహితులుగా మార్చింది. ఆ బంధం డిగ్రీలోనూ కొనసాగింది. అయితే, అక్కడా ఇద్దరివీ వేర్వేరు గ్రూపులే. ఒకరు బీఎస్సీ, మరొకరు బీకామ్. వీరి స్నేహం కాలేజీలో చాలామందికి విచిత్రంగా అనిపించేది. ఎందుకంటే ఆనంద్ నెమ్మదస్తుడు. తక్కువ మాట్లాడతాడు. బాగా దగ్గరైతే తప్ప ఎక్కువగా నోరు విప్పడు. అయితే, చదువులో మాత్రం ఎప్పుడూ ఫస్టే. రామకృష్ణ చదువులో మరీ ఫస్ట్ ర్యాంక్ స్థాయి కాకపోయినా, మెరిట్ స్టూడెంటే. అయితే, ఆటల్లో, కాలేజీల్లో నిర్వహించే కార్యక్రమాల్లో మాత్రం అందరికంటే ముందుంటాడు. చలాకీగా, జోష్గా ఉండే రామకృష్ణ తీరు కాలేజీలో అమ్మాయిలకు ఎంతో నచ్చేది. దానికి తోడు కాస్త అందగాడు కూడా కావడంతో మొదటి ఏడాదిలోనే లవర్బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఎంతలా అంటే, అందరూ అతని పేరులోని రాముణ్ణి వదిలేసి కృష్ణుణ్ణి మాత్రమే గుర్తుచేసేలా.. ‘క్రిష్’ అని పిలుచుకునేంతగా.ఆ కాలేజీలోనే వీళ్లకు ప్రవల్లిక, మీనాక్షి పరిచయం. వీళ్లది ఒకే ఊరు. కానీ, కాలేజీలో మాత్రం ప్రవల్లిక బీకామ్, మీనాక్షి బీఏ. అందువల్ల మధ్యాహ్నం లంచ్ సమయంలోనో, క్యాంటీన్లోనో, తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడో తప్ప మీనాక్షి ఎక్కువగా వీళ్లతో కలిసేది కాదు. మరీ అంత నల్లగా కాకుండా, చామన ఛాయతో, కొంచెం బొద్దుగా కనిపించే ప్రవల్లిక మొహంలో కళ బాగుండేది. మొదటి ఏడాదిలోనే ఆనంద్కు, రామకృష్ణకు మంచి స్నేహితురాలైంది. ఆ ప్రయాణంలోనే రామకృష్ణ మీద ఏర్పడిన ఇష్టం ప్రేమగా మారింది. చివరి ఏడాది హాఫ్ ఇయర్లీ పరీక్షలు ముగిసిన రోజు తన మనసులోని మాటల్ని అక్షరాలుగా చేసిన ప్రేమలేఖను రామకృష్ణకు ఇచ్చింది.కానీ, వారం రోజులు ఎదురు చూసినా రామకృష్ణ నుంచి సమాధానం లేదు. రోజూ కాలేజీలో, క్లాసులో మాట్లాడడం, కలసి లంచ్ చేయడం అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. కానీ, రామకృష్ణ అభిప్రాయం మాత్రం చెప్పలేదు. రెండు మూడుసార్లు అడిగి చూసింది. అయినా జవాబు చెప్పకుండా తప్పించుకున్నాడు. ఉండబట్టలేక విషయాన్ని ఆనంద్కు చెప్పింది. అప్పటికే తనకు ఇద్దరు లవ్ ప్రపోజ్ చేశారని, లెటర్లు ఇచ్చారని చెప్పిన రామకృష్ణ– ప్రవల్లిక గురించి తన దగ్గర దాచడం ఆనంద్కు ఆశ్చర్యమనిపించింది. అదే విషయం గురించి సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరాక మిత్రుడిని కదిపాడు. ఆరోజు రామకృష్ణ చెప్పిన సమాధానం విన్నాక, ఆ తర్వాత ఆనంద్ కూడా ప్రవల్లికను తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. ప్రవల్లిక అడిగినా మాట దాటవేసేవాడు. మరో ఆర్నెల్లు గడిచి, డిగ్రీ పూర్తవగానే ఈసారి చదువు వాళ్లను విడదీసింది. ఎంసీఏ చేయడానికి ఆనంద్ హైదరాబాద్కు, సీఏ చేయడానికి రామకృష్ణ విజయవాడకు, పీజీ చేయడానికి ప్రవల్లిక తిరుపతికి వెళ్లాల్సొచ్చింది. ఆ తర్వాత చదువులు పూర్తవడం, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు అన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ఆనంద్కు సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొని, మీనాక్షి ఇంట్లో వాళ్లతో మాట్లాడి వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించింది ప్రవల్లికే. ‘‘సార్.. మేనేజర్గారు పిలుస్తున్నారు..’’ అనే పిలుపుతో ఆనంద్ ఆలోచనలు చెదిరిపోయాయి. వెంటనే వాష్రూమ్కు వెళ్లి మొహం కడుక్కొని, క్యాబిన్కు వెళ్లి మేనేజర్ను కలిశాడు. సాయంత్రం వరకు ఆఫీసులో అన్యమనస్కంగానే గడిపి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో అడుగుపెట్టగానే పొద్దున్నుంచి పరిస్థితిలో ఏమీ మార్పు లేదని గ్రహించాడు.మీనాక్షి ఏమీ మాట్లాడకుండా, తన పని తాను చేసుకుపోతోంది. మధ్య మధ్యలో విసిగిస్తున్న కూతుర్ని కోప్పడుతోంది. అదంతా తన మీద కోపమే అని ఆనంద్కు తెలుసు. భోజనాలు అయిపోయి, కూతుర్ని బెడ్రూమ్లో నిద్రపుచ్చిన తర్వాత హాల్లో టీవీ ఆన్చేసి కూర్చుంది మీనాక్షి. ‘ఇక తప్పదు ఈరోజు చెప్పాల్సి వచ్చేలా ఉంది’ అని మనుసులో అనుకుంటూ తాను కూడా వెళ్లి సోఫాలో కూర్చున్నాడు. ‘‘ఇంతకీ ఏమంటోంది మీ ఫ్రెండ్..’’ అంటూ నోరుతెరిచాడు. భర్తను సీరియస్గా చూసింది మీనాక్షి. ‘‘ఏమంటుందో మీకు తెలియదా?’’ ఎదురు ప్రశ్నించింది. ‘‘తెలుసు... కానీ...’’ అని ఏదో చెప్పేలోపే అందుకుంది. ‘‘అయినా... అది రెండేళ్ల నుంచి మిమ్మల్ని ఏమడుగుతోంది? తనను రామకృష్ణ దగ్గరికి తీసుకెళ్లి ఒక్కసారి మాట్లాడనివ్వమనే కదా? తీసుకెళ్లడానికి మీకేంటి బాధ? తనేమైనా చిన్నపిల్లా... పన్నెండేళ్ల తర్వాత భర్తను, పిల్లల్ని వదిలేసి ఇండియాకు వచ్చి రామకృష్ణను పెళ్లి చేసుకోవడానికి? అయినా, తను అనుకుంటే సరిపోతుందా? భార్య, పిల్లల్ని వదిలేసి రామకృష్ణ అయినా ఎలా చేసుకుంటాడు దీన్ని?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. మౌనంగా వింటున్నాడు. ‘‘రామకృష్ణ ఎందుకు వద్దనుకున్నాడు? ఏ విషయం చెప్పకుండా ఎందుకు తప్పించుకు తిరిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసమే కదా తనని కలుస్తానంటోంది? మరి మీరెందుకు కలపడానికి ప్రయత్నించడం లేదు? అసలు మీ ఫ్రెండ్ ఆరోజు ఏమన్నాడో కనీసం నాకైనా చెప్పొచ్చుకదా?’’ అంటూ ఆగింది. ఇక తప్పదనుకొని నోరు విప్పాడు ఆనంద్. కాలేజీలో ప్రవల్లిక రాసిన ప్రేమలేఖ గురించి అడిగిన రోజు తనతోపాటు మిత్రుణ్ణి వాళ్ల ఊరికి తీసుకెళ్లాడు రామకృష్ణ. ఊరికి అరకిలోమీటరు దూరంలో ఒక పొలంలో ఉన్న ఆ ఇంట్లో రాత్రి భోజనాలయ్యాక, మిద్దె మీద పడుకొని ఉండగా మళ్లీ విషయం కదిపాడు ఆనంద్. సమాధానం చెప్పకుండా, దూరంగా ఊళ్లో కనిపిస్తున్న కొన్ని ఇళ్లను చూపించాడు రామకృష్ణ. ‘‘ఆ పెద్ద పెద్ద ఇళ్లు మా దాయాదులవి. ఇంకా చెప్పాలంటే... మా పెద నాన్న, చిన్నాన్న వాళ్లవి. వాళ్ల కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు కలిపి అందరూ నలభైమంది వరకు ఉంటారు. కానీ, వాళ్లెవరూ మాతో మాట్లాడరు. ఎందుకో తెలుసా?..’’ అంటూ ఆనంద్ వైపు చూశాడు. తెలియదన్నట్లు ఆనంద్ ప్రశ్నార్థకంగా మొహంపెట్టాడు.‘‘మా నాన్న పెళ్లి... తాతయ్యకు, అమ్మమ్మకు... ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకుండా చేసుకున్న ప్రేమ పెళ్లి. తనను ఇష్టపడిందని మా అమ్మను చేసుకున్నాడు. మా అమ్మ తరఫు వాళ్లు ఏమీలేనోళ్లు. అయినా, కట్నం కూడా లేకుండా చేసుకున్నాడు. ఇంట్లోవాళ్లెవరూ ఈ పెళ్లిని ఒప్పుకోకపోవడంతో తన వాటాకు వచ్చిన భూమిలో ఈ ఇల్లు కట్టుకొని వాళ్లందరికీ దూరంగా ఉంటున్నాడు. ముగ్గురు కూతుళ్లు, తర్వాత నేను పుట్టాక అమ్మ అనారోగ్యం పాలైంది. పంటలు కలిసి రాలేదు. అక్కలకు పెళ్లి చేసేసరికి మాకు మిగిలింది రెండెకరాల ఈ పొలం... అందులోని ఈ ఇల్లు...’’ అంటూ ఆగాడు. తన మాటల్లోని భావం కొంచెం కొంచెం అర్థమవసాగింది ఆనంద్కు. ‘‘ఓహో మీ నాన్నకు జరిగినట్లే నీకూ జరుగుతుందని ప్రేమ పెళ్లి వద్దనుకుంటున్నావా? అలాగయితే మరి ఈ విషయం నేరుగా ప్రవల్లికకే చెప్పొచ్చు కదా? అసలు ప్రవల్లిక అంటే ఇష్టం ఉందా లేదా?’’ అన్నాడు ఆనంద్.వెంటనే రామకృష్ణ. ఇంట్లోకి వెళ్లి రెండు లెటర్లు తీసుకొచ్చాడు. అవి అదే క్లాస్లో ఉండే మరో ఇద్దరు అమ్మాయిలు రాసిన ప్రేమలేఖలు. ‘‘ప్రవల్లికే కాదు... వీళ్లన్నా నాకు ఇష్టమే. కానీ, వీళ్లెవరికీ నేను కోరుకునేంత ఆస్తి లేదు. ఇంకా చెప్పాలంటే వీళ్లదీ మాలాంటి బతుకే...’’ స్నేహితుని నోటి నుంచి వస్తున్న మాటలు వింటూ తన నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. ‘అయితే, ఆస్తి కోసమా ప్రవల్లికను వద్దనుకుంటున్నది?!’ ఆనంద్ మనసులోని మాటను చదివేసినట్లు చెప్పసాగాడు రామకృష్ణ. ‘‘అవును. ఆస్తి కోసమే వద్దనుకున్నాను. ఆస్తే కాదు వీళ్లెవరూ అంత అందంగానూ లేరు. మిగిలిన ఇద్దరూ కొంచెం తెల్లగా అయినా ఉన్నారు. ప్రవల్లిక అయితే నలుపు. పైగా లావు. అయినా, పెళ్లి, జీవితం విషయంలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకోసమే నన్ను నేను మలచుకున్నాను. అమ్మాయిలు ఇష్టపడేలా తీర్చిదిద్దుకున్నాను. అలాగని ఎవరిని పడితే వాళ్లను చేసుకోవడానికి కాదు. చదువు అయిపోయాక, ఉద్యోగంలో ఎంత సంపాదిస్తామో తెలియదు. కానీ, కట్నం దండిగా తెచ్చే అందమైన అమ్మాయి భార్యగా రావాలని, మమ్మల్ని దూరం పెట్టిన మా వాళ్లందరూ కుళ్లుకునే స్థాయికి మేము ఎదగాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా? ’’ అంటూ ఆగాడు. ఏమీ మాట్లాడలేదు ఆనంద్. అన్ని రోజులూ స్నేహితునిలో తాను గమనించలేకపోయిన మరో కోణం బయటపడేసరికి ఆ రాత్రంతా ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ..‘‘అదీ జరిగిన విషయం..’’ అంటూ చెప్పడం ముగించి మీనాక్షి వైపు చూశాడు ఆనంద్. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. ‘‘ప్రవల్లికకు వాడంటే చాలా ఇష్టం. ఎంతిష్టం అంటే.. నువ్వన్నట్లు వాడు ఓకే చెబితే భర్త, పిల్లల్ని వదిలేసి అమెరికా నుంచి వచ్చేసేంత ఇష్టం. కానీ, తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి ఏ కారణంతో తనను వద్దనుకున్నాడో తెలిస్తే తట్టుకోలేదు. అంతేకాదు, రామకృష్ణ ఆలోచనలు ఇలాంటివని తెలిస్తేనే భరించలేదు. అందుకే చెప్పలేదు. తనని కలవనివ్వలేదు. ‘తనను ఎందుకు ఇష్టపడలేదు?’ అనే ఆలోచన కన్నా ఇలాంటి కారణంతో తనను వద్దనుకున్నాడని జీవితాంతం గుర్తుచేసుకుంటూ బతకడం చాలా కష్టం’’ అంటూ ముగించాడు. మీనాక్షి ఏమీ మాట్లాడకపోయేసరికి లేచి బెడ్రూమ్లోకి వెళ్లిపోయాడు.∙∙ చెప్పినట్లుగానే రెండ్రోజుల తర్వాత హైదరాబాద్కు వచ్చింది ప్రవల్లిక. నేరుగా శ్రీనగర్ కాలనీలోని ఆనంద్ ఇంటికి చేరింది. బాగా సన్నబడి, కాస్త తెల్లగా కూడా మారిపోయి, తమ కంటే చిన్నదానిలా కనిపిస్తున్న ప్రవల్లికను చూసి వాళ్లు ఆశ్చర్యపోయారు. కుశలప్రశ్నలు, కుటుంబాల సంగతులు, కాలేజీ కబుర్లు అన్నీ చెప్పుకున్నాక రామకృష్ణను కలిసే విషయం ప్రస్తావించింది. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ఆనంద్ ‘మరుసటి రోజు కూకట్పల్లి హౌసింగ్బోర్డులో పెళ్లి రిసెప్షన్కు రామకృష్ణ వస్తున్నాడని, ఆరోజు వెళ్లి కలుద్దామ’ని చెప్పాడు. ‘సరే’ అంది ప్రవల్లిక. అయితే, అదే రోజు రాత్రి తొమ్మిది గంటలకు తాను తిరిగి అమెరికా వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకున్నానని, రామకృష్ణను కలిశాక గచ్చిబౌలిలోని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అట్నుంచటే ఎయిర్పోర్టుకు వెళతానని చెప్పింది. తర్వాతి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి రిసెప్షన్ జరిగే చోటుకు కారులో చేరుకున్నారు. అప్పటికే అక్కడ ప్రవల్లిక స్నేహితురాలు కారుతో సిద్ధంగా ఉంది. ప్రవల్లిక కారులోంచి దిగుతుండగా... ‘‘అదిగో అక్కడ తన ఫ్యామిలీతో ఉన్నాడు చూడు’’ అంటూ వేలును ఒక వైపు చూపించాడు ఆనంద్. అటువైపు చూసింది ప్రవల్లిక.‘‘ఎవరూ... అతనేనా? ’’ ‘‘అవును... అతనే ’’‘‘ఆ పక్కనున్నది?’’ ‘‘వాళ్లు తన భార్య, పిల్లలు. అన్నట్లు మీనాక్షి చెప్పే ఉంటుంది... రామకృష్ణ చేసుకున్నది తన కంపెనీ ఓనర్ కూతుర్నే... సరే, అవన్నీ వాళ్లను కలిశాక తీరిగ్గా మీరే అన్ని విషయాలూ మాట్లాడుకుందురు గానీ... రండి’’ అంటూ ముందుకు కదిలాడు. ప్రవల్లిక ఏమీ మాట్లాడలేదు. కారు దిగి, అక్కడే నిలబడి చూస్తోంది. ఉన్నట్లుండి నవ్వడం మొదలుపెట్టింది. తెరలు తెరలుగా... ఆపకుండా... ఆపుకోలేనంతగా... కళ్లలోంచి నీళ్లొచ్చేంతగా నవ్వుతోంది. ఆమె నవ్వుతున్నా చూపు మాత్రం రామకృష్ణ ఫ్యామిలీ వైపే ఉంది. దూరంగా బట్టతలతో, బాన పొట్టతో రామకృష్ణ... పక్కనే నిండుగా నగలు వేసుకొని, నల్లగా... భారీ ఆకారంతో భార్య... వాళ్లిద్దరి పక్కనే అమ్మ పోలికలతో నల్లని రంగులో మెరుస్తున్న ముగ్గురు కూతుళ్లు...కాసేపటి తర్వాత కాస్త తమాయించుకొని ‘‘వెళ్లొస్తా అన్నయ్యా... బై మీనాక్షి’’ అంటూ వెనకే ఆగి ఉన్న తన ఫ్రెండ్ కారులో కూర్చుంది. ఆనంద్కు ఏమీ అర్థంకావడంలేదు. ‘కలుస్తాను... కలుస్తాను అని రెండేళ్లుగా అడుగుతూ ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్లిపోవడం ఏంటి?’అదే విషయం అడిగాడు. ‘‘కలవాలని ఇంత దూరం వచ్చి కలవకుండా వెళ్లిపోతున్నావేంటమ్మా?!... నువ్వేంటి మాట్లాడకుండా నిల్చున్నావ్?! నువ్వైనా చెప్పు’’ అంటూ మీనాక్షి వైపు చూశాడు. భార్య మొహంలో కనిపిస్తున్న ప్రశాంతత, ఆమె మౌనం చూశాక... రామకృష్ణ గురించి తాను చెప్పిందంతా శ్రీమతి ముందే చేరవేసిందని అర్థమవసాగింది.కలవకుండా వెళ్లిపోవడం వరకు ఓకే... కానీ, ఆ నవ్వు ఎందుకో అతనికే కాదు మీనాక్షికీ అర్థం కావడం లేదు. రామకృష్ణ రూపం, నిజస్వరూపం ప్రత్యక్షంగా చూశాక... తనను వద్దనుకోవడానికి చెప్పిన కారణాలు ఇప్పుడు అతని చుట్టూనే ఉండడం గమనించాక... ఏళ్లుగా తాను పడుతున్న బాధ ఎంత అసంబద్ధమో తెలిశాక... ప్రవల్లిక అంతరాల్లోంచి నవ్వు అలా తన్నుకొని స్వేచ్ఛగా బయటికొస్తోందని వాళ్లకు తెలియదు. వెళుతున్న కారువైపే చూస్తున్నారు. ప్రవల్లిక పగలబడి నవ్వడం కారు అద్దంలోంచి వాళ్లకు కనిపిస్తోంది. అది... అడవి కాచిన వెన్నెల లాంటి నవ్వు... అది గాంధార నవ్వు. అది తనకు మాత్రమే సొంతమైన, తన కోసమే కురుస్తున్న చక్కటి, చిక్కటి, చల్లని నవ్వు. గౌకనపల్లె మహేశ్వరరెడ్డి (చదవండి: ఈ వారం కథ: కొత్త రంగుల పొద్దు -
గర్భధారణలో రెండుసార్లు అలా..ఇది బిడ్డకు ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దాంతో రక్తంలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదకరమా? నేను ఇకపై డయాబెటిక్గా ఉండాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరు.గర్భధారణ సమయంలో కొంతమంది మహిళల్లో రక్తంలో షుగర్ స్థాయి పెరగవచ్చు. దీనిని ‘జెస్టేషనల్ డయాబెటిస్’ అంటారు. ఇది గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల ప్రభావం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం కారణంగా వస్తుంది. ఇది సాధారణంగా 24 నుంచి 28 వారాల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ప్రతి గర్భిణీకి ఓజీటీటీ అనే పరీక్ష చేయించుకోవాలని సూచిస్తారు. కొంతమంది మహిళల్లో ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గత గర్భధారణలో జెస్టేషనల్ డయాబెటిస్ ఉండటం, కుటుంబంలో డయాబెటిస్ చరిత్ర ఉండటం, 35 ఏళ్లకు పైబడిన వయస్సు, అధిక బరువు వంటి కారణాలు ఉంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నప్పుడు తల్లి, బిడ్డకు కొన్ని సమస్యలు రావచ్చు. బిడ్డ బరువు ఎక్కువగా పెరగడం, ఉమ్మనీరు ఎక్కువ కావడం, డెలివరీ సమయంలో ఇబ్బందులు, డెలివరీ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత బిడ్డకు శ్వాస సమస్యలు లేదా తక్కువ షుగర్ లెవల్స్ రావచ్చు, కానీ ఇవి సాధారణంగా చికిత్సతో నియంత్రించవచ్చు. ఇది నిర్ధారణ అయిన తర్వాత మీరు డైట్ పై ఎక్కువగా దృష్టి పెట్టాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో షుగర్ స్థాయిలను తరచూ చెక్ చేసుకోవాలి. డైట్తో నియంత్రణలో లేకపోతే సురక్షితమైన మందులు లేదా ఇన్సులిన్ ఇవ్వవచ్చు. ఇవి తల్లికి, బిడ్డకు సేఫ్గా ఉంటాయి. చాలా సందర్భాల్లో డెలివరీ అయిన తర్వాత ఈ జెస్టేషనల్ డయాబెటిస్ తగ్గిపోతుంది. అయితే భవిష్యత్తులో టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. నేను ఇప్పుడు ఎనిమిది వారాల గర్భవతిని. గతంలో ఏడు వారాలలో మిస్క్యారేజ్ అయింది. ఈ గర్భధారణలో ఇప్పటివరకు నాకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. – రూప, కర్నూలు.గర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశ చాలా కీలకం, ఎందుకంటే ఈ సమయంలో శిశువు ముఖ్యమైన అవయవ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. అయితే ఇదే సమయంలో మిస్క్యారేజ్ ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో ప్రతి గర్భిణీ గమనించాల్సిన రెండు ముఖ్యమైన లక్షణాలు బ్లీడింగ్, కడుపు నొప్పి. ఫస్ట్ ట్రైమెస్టర్లో బ్లీడింగ్కు అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో చాలా సందర్భాల్లో ఇది తల్లి లేదా శిశువుకు హానికరం కాకపోవచ్చు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్లు, సెక్స్ తర్వాత రక్తస్రావం, హార్మోన్ల మార్పులు వంటి కారణాలు ఉండవచ్చు. అయితే ముందుగా తప్పకుండా రూల్ అవుట్ చేయాల్సిన రెండు ముఖ్యమైన పరిస్థితులు మిస్క్యారేజ్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. మీరు డాక్టర్ను కలిసినప్పుడు పూర్తి వైద్య చరిత్ర తీసుకుంటారు, శరీర పరీక్ష చేస్తారు, అలాగే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా శిశువు పరిస్థితిని చెక్ చేస్తారు. ఈ పరీక్షలతో బ్లీడింగ్కు గల అసలు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. మీ ఆరోగ్యం స్థిరంగా ఉండి, స్కాన్లో బిడ్డ బాగానే కనిపిస్తే, బ్లీడింగ్ పరిమాణం, కారణాన్ని బట్టి చికిత్స ఇస్తారు. ఇందులో ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, మనశ్శాంతిగా ఉండడం చాలా ముఖ్యం. అవసరమైతే ప్రొజెస్టెరాన్ మందులు కూడా ఇస్తారు, ఇవి గర్భధారణకు మద్దతు ఇస్తాయి. గతంలో మిస్క్యారేజ్ జరిగినందుకు ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భధారణ వేరు. చాలాసార్లు సరైన పర్యవేక్షణతో ఆరోగ్యంగా గర్భధారణ కొనసాగుతుంది. బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ఆసుపత్రిలో అబ్జర్వేషన్ కోసం ఉంచవచ్చు. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం, డాక్టర్ సూచనలు పాటించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చాలా మంది మహిళలు ఆరోగ్యంగా బిడ్డలను ప్రసవిస్తున్నారు.డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: బీపీని నియంత్రణలో ఉంచే ‘3-3-3’ రూల్ అంటే..? వైద్యులు ఏమంటున్నారంటే..) -
నిర్దోషని కోర్టు చెప్పినా..14 ఏళ్లు నిర్బంధంలోనే..
హత్య కేసులో ఓ వ్యకి జైలు కెళ్లాడు. సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. ఆ వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయినా ఆ వ్యక్తికి స్వేచ్ఛ లభించలేదు. జైలు గోడలు దాటి బయటకు రాలేదు. రోజులు నెలలయ్యాయి.. నెలలు సంవత్సరాలయ్యాయి.. అలా 14 సంవత్సరాలు గడిచాయి. విడుదల ఊసు లేదు. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. తనను విడుదల చేయాలని బాధితుడే చివరికి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. ఫైలు కదిలింది..ఆ వ్యక్తికి విడుదల లభించింది. తీర్పుకు ముందే ఇదంతా జరిగింది. అయితే అధికారుల తీరును, వ్యవస్థలోని లోపాలను కోర్టు తప్పుబట్టింది. ఓ వ్యక్తి జీవించే హక్కును కాలరాశారంటూ మండిపడింది. పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఒక చారిత్రక ముందడుగుకు ఈ కేసు మార్గం చూపింది.బిహార్కు చెందిన రుదుల్ సాహ్ ఓ హత్య కేసులో అరెస్టయి జైలు కెళ్లాడు. ముజఫర్పూర్ సెషన్స్ కోర్టు అతనిపై నమోదైన అభియోగాలను కొట్టేసింది. 1968లో నిర్దోషిగా ప్రకటించింది. అయినా అతడ్ని విడుదల చేయలేదు. దాంతో 1982 వరకు అంటే 14 సంవత్సరాల పాటు నిర్బంధంలోనే ఉన్నాడు. ‘సుప్రీం’లో పిటిషన్తన నిర్బంధం చట్టవిరుద్ధమని, నిర్దోషిగా ప్రకటించినా కారాగారంలోనే ఉంచారని, వెంటనే విడుదల చేయాలని రుదుల్ సాహ్ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు.. పునరావాసం, అక్రమ నిర్బంధానికి పరిహారం ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే బాధితుడు పిటిషన్ వేసిన తర్వాత అధికారులు అతడ్ని జైలు నుంచి విడుదల చేశారు. ఈ పిటిషన్ 1982 నవంబర్ 22న విచారణకు వచ్చింది. పిటిషనర్ ఇప్పటికే విడుదలైనందున ‘విడుదల’ అభ్యర్థన అర్థం లేనిదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నాడు. విడుదలే పరిష్కారం కాదుపిటిషనర్ విడుదలతో ఈ కేసు ముగిసినట్టు కాదని విచారణ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ను 14 సంవత్సరాలు జైల్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు జైలులో ఉంచాలని సెషన్స్ కోర్టు పేర్కొంది..అతని మానసిక స్థితి కూడా సరిగా లేకపోవడంతో విడుదలలో జాప్యం జరిగింది’ అని ముజఫర్పూర్ జైలు అధికారి అఫిడవిట్ సమర్పించాడు. సరైన ఆధారాలేవీ?అఫిడవిట్పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ మానసిక స్థితి సరిగా లేదని నిరూపించే మెడికల్ సర్టిఫికెట్లు, చికిత్స వివరాలు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. 1977లో సాధారణ స్థితికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత అయినా ఎందుకు విడుదల చేయలేదని ధర్మాసనం నిలదీసింది. ఒకవేళ పిటిషనర్ మానసిక స్థితి సరిగా లేకపోతే చట్టం అతడికి కల్పించిన హక్కుల ప్రకారం విచారణ కూడా చేయకూడదు కదా? అని ప్రశ్నించింది.‘ పిచ్చి వాడనే’వాదన తర్వాత తయారు చేసినట్టుగా కనిపిస్తోందని ఆక్షేపించింది. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం చెల్లింపునకు ఆదేశంప్రాథమిక హక్కు ఉల్లంఘిస్తే, ఆ ఉల్లంఘనకు పరిహారం చెల్లించాలని ఆదేశించడం కూడా కోర్టు పరిధిలోకి వస్తుందని ‘సుప్రీం’ స్పష్టం చేసింది. అక్రమంగా 14 ఏళ్లపాటు జైలులో ఉన్నాడు. కాబట్టి కావున అతనికి పరిహారం ఇవ్వడం తప్పని సరి అని కోర్టు పేర్కొంది. తాత్కాలిక ఉపశమనంగా చెల్లించిన ఐదువేల రూపాయలకి అదనంగా మరో రూ. 30,000 చెల్లించాలని ఆదేశించింది. మరింత నష్టపరిహారం కోసం సివిల్ కోర్టును ఆశ్రయించడానికి ఇది అడ్డంకి కాదని పేర్కొంది. వ్యక్తిగత హక్కుల రక్షణే ప్రజాస్వామ్యానికి మూలాధారం. ప్రభుత్వ అధికారులు చేసిన తప్పుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని, ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిందే అని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసుకు ముందు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే కేవలం విడుదల ఆదేశాలకు మాత్రమే కోర్టు పరిమితమయ్యేది. కానీ, ఒక వ్యక్తి ప్రాథమిక హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తే .. నేరుగా జోక్యం చేసుకుని పరిహారం ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వగలదని ఈ కేసులో స్పష్టం అయింది. కేసులో ప్రధానంగా ఆర్టికల్ 21, ఆర్టికల్ 32 గురించి ధర్మాసనం ప్రస్తావించింది..ఆర్టికల్ 21: చట్టబద్ధమైన కారణం లేకుండా ప్రభుత్వం ఎవరినీ నిర్బంధించకూడదు. ఏ వ్యక్తి జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదని ఈ ఆర్టికల్ చెబుతోంది. ఆర్టికల్ 32: రాజ్యాంగ పరిహారాల హక్కుకు హామీ ఇస్తుంది . ఇది ప్రాథమిక హక్కుల అమలు కోసం నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించే అధికారాన్ని పౌరులకు కల్పిస్తుంది. -
కోడిగుడ్డంత పుచ్చకాయలు
పుచ్చకాయలు భారీగా ఉంటాయి. రెండు చేతులు పట్టనంత పరిమాణంలో ఉంటాయి. ఒక్కో పుచ్చకాయ బరువు సగటున ఏడు నుంచి తొమ్మిది కిలోల వరకు ఉంటుంది. మామూలు పుచ్చకాయలకు భిన్నంగా అమెరికాలోని నార్త్ వర్జీనియాకు చెందిన ఔత్సాహిక ఉద్యానవేత్తలయిన తల్లీకూతుళ్లు కోడిగుడ్డంత పుచ్చకాయలను పండిస్తుండటం ఇటీవల అంతర్జాతీయ మీడియాలో వైరల్గా మారింది. కేవలం రెండంగుళాల వ్యాసంలో ఉండే ఈ పుచ్చకాయలు ఒక్కొక్కటి ఎనభై నుంచి వంద గ్రాముల బరువు మాత్రమే ఉండటం విశేషం. పరిమాణం, బరువు తక్కువగానే ఉన్నా; రుచిలో మాత్రం ఇవి ఏమాత్రం తీసిపోవని వీటిని పండిస్తున్న డిలానీ రాప్టిస్, ఆమె తల్లి చెబుతున్నారు. చిన్నసైజు పుచ్చకాయలను పండించడానికి ఐదేళ్లుగా ప్రయత్నాలు సాగించి, విజయం సాధించామని వారు తెలిపారు. జన్యుమార్పిడి పద్ధతులేవీ లేకుండానే, సహజమైన పద్ధతుల్లోనే వీటిని పండిస్తుండటంపై అమెరికాకు చెందిన ‘హార్టి డైలీ మ్యాగజైన్’ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది.దుర్వాసన వెదజల్లే పుష్పం ఫ్రెండ్స్.. ప్రపంచంలోనే అతి పెద్ద పుష్పం ఏంటో తెలుసా? రఫ్లేషియా. ఇది సుమారు 3 అడుగుల వెడల్పు, 10 కిలోల బరువు ఉంటుంది. సాధారణంగా మనం చూసే మొక్కలన్నింటికీ ఆకులు, కొమ్మలు, వేర్లు ఉంటాయి. కానీ ఈ రఫ్లేషియా పుష్పానికి కాండం, ఆకులు, కనీసం వేర్లు కూడా ఉండవు. ఇది అడవిలో దొరికే వేరే మొక్కల తీగలపై ఆధారపడి, వాటి నుంచి ఆహారాన్ని తీసుకుంటూ జీవిస్తుంది. అందుకే దీన్ని పరాన్నజీవి అంటారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఈ పువ్వు నుంచి వచ్చే వాసనను మనం అస్సలు తట్టుకోలేము. ఇది కుళ్ళిపోయిన మాంసం వంటి ఘోరమైన దుర్వాసనను వెదజల్లుతుంది. అందుకే దీనిని శవ పుష్పం అని కూడా పిలుస్తారు. ఈ అరుదైన పుష్పాలు ఆగ్నేయాసియాలోని ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల దట్టమైన వర్షారణ్యాలలో మాత్రమే కనిపిస్తాయి. ఈ పువ్వు పూర్తిగా విచ్చుకోవడానికి దాదాపు 9 నెలల సమయం పడుతుంది.(చదవండి: అపురూపమైన అడవి మామిడి పండ్ల జాతులు) -
నిద్ర నా ప్రాణం
చూడగానే, ‘వావ్’ అనిపించే అందం, మాట్లాడగానే, ‘హా.. హా..’ అని నవ్వించే అల్లరి నటి కయాదు లోహార్ సొంతం. ఇలా ఒక్కో క్యారెక్టర్, ఒక్కో స్టయిల్తో ఎప్పుడూ ఫుల్ ఎనర్జీ అండ్ ఫుల్ ఫన్ ప్యాకేజీలా మెరిసే కయాదు అల్లరి కోణాన్ని, ఫన్నీ జ్ఞాపకాలను ఆమె మాటల్లోనే విందాం..నా పేరు కష్టాలునా పేరు ’కయాదు’ అని పిలవడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. షూటింగ్ సెట్లో కొందరైతే నన్ను ‘కాయ్–దూ’, ‘క్యా–దూ’ అని పిలిచేవారు. ఒకసారి ఒకరైతే పొరపాటున ‘కావాలా?’ అని పిలిచారు! నేను వెంటనే ‘ఏం కావాలి?’ అని అడిగాను. ఇప్పుడు అందరికీ నా పేరు నోరు తిరుగుతోంది, అందుకు సంతోషం!గొడవ పడకుండా ఉండలేనునేను పుణెలోని ఒక మధ్యతరగతి వ్యాపార కుటుంబం నుంచి వచ్చాను. నాన్న బిజినెస్ చేస్తారు, అమ్మ గృహిణి. నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ‘నీకు నచ్చిన రంగంలో నిరూపించుకో’ అని నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. ఇక మా తమ్ముడు నా అతిపెద్ద విమర్శకుడు, వాడితో గొడవ పడకుండా నాకు రోజే గడవదు.తెలుగు డైలాగ్స్.. ఒక పెద్ద సాహసం!కన్నడ సినిమా ‘ముగిల్ పేటె’తో మొదలై, తెలుగులో ‘అల్లూరి’ సినిమాతో మీ ముందుకు వచ్చాను. మొదట్లో తెలుగు నేర్చుకోవడం కష్టంగా ఉండేది. ఒకసారి సీరియస్ సీన్ లో కన్ఫ్యూజ్ అయి ‘దోశ కావాలా?’ అన్నట్టు ఏదో అనేశాను. సెట్లో అందరూ పడి పడి నవ్వారు. అప్పటి నుండి నేను డైలాగ్ పేపర్ కనిపిస్తే చాలు. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్లా భయపడిపోతుంటాను!నా నిద్ర.. నా సామ్రాజ్యం!నాకు నిద్ర అంటే ప్రాణం. ఎవరైనా నన్ను నిద్రలో ఉన్నప్పుడు లేపితే, నాకు విపరీతమైన కోపం వస్తుంది. అందుకే సెట్లో అందరూ నన్ను నిద్రలేపేటప్పుడు చాలా జాగ్రత్తగా, భయం భయంగా ఉంటారు.డైట్ అంతా భోజనం ముందు వరకే!నేను డైట్ చేస్తాను.. కానీ అది కేవలం భోజనం వడ్డించే వరకే! ముఖ్యంగా పప్పు నెయ్యి కాంబినేషన్ చూస్తే ఆగలేను. ఒక్కోసారి నా ఫిట్నెస్ ట్రైనర్ నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూసి ‘కయాదు.. రేపు జిమ్లో నీకు చుక్కలే’ అని మెసేజ్ పెడుతుంటారు!పుష్ప స్టెప్పులకి పడిపోయానుఅల్లు అర్జున్ గారి డ్యాన్స్ చూస్తుంటే నా కాళ్లు కూడా తెలియకుండానే స్టెప్పులు వేస్తుంటాయి. కానీ ఆయన పక్కన డ్యాన్స్ చేయాల్సి వస్తే.. నేను బహుశా టెన్షన్ తో స్టేజ్ మీద పడిపోతానేమో! నిజం చెప్పాలంటే, ‘పుష్ప’ స్టెప్పులు ట్రై చేస్తూ ఇంట్లో రెండు మూడుసార్లు కింద పడ్డాను కూడా! -
హనీ!బీ అలెర్ట్
ప్రకృతిలో ఎన్నో కీటకాలు ఉన్నా, వాటిలో తేనెటీగల పాత్ర అత్యంత కీలకం. ప్రకృతిలోని జీవవైవిధ్యం కాపాడటానికి తేనెటీగలు అహరహం శ్రమిస్తుంటాయి. మొక్కల్లోని పరాగసంపర్కం తొంభైశాతం తేనెటీగల ద్వారానే జరుగుతుంది. తేనెటీగలే లేకుంటే, చాలారకాల వృక్షజాతుల మనుగడకు ముప్పు కలుగుతుంది. ఒకవేళ తేనెటీగలే అంతరించిపోతే, భూమ్మీద మానవాళి అంతరించిపోవడానికి ఎంతోకాలం పట్టదని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి తేనెటీగలు అంతరించిపోయే పరిస్థితి లేదు గాని, వాటి మనుగడ మాత్రం కష్టాల్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, తేనెటీగల మరణాలు ఆందోళనకరమైన స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్కోచోట తేనెటీగల మరణాలు దాదాపు నలభై శాతం వరకు ఉంటున్నాయి. మరోవైపు తేనెటీగల సహజ ఆవాసాలు కనుమరుగైపోతున్నాయి. ప్రకృతిలో తేనెటీగల పాత్ర, వాటి ప్రస్తుత స్థితిగతుల గురించి మే 20న ‘ప్రపంచ తేనెటీగల దినోత్సవం’ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం...తేనెటీగలు ప్రకృతిలోని అత్యంత కీలకమైన కీటకాలు. తేనెటీగల ద్వారానే దాదాపు డెబ్బయి శాతం పంటలు పండుతున్నాయి. తేనెటీగలు పూల నుంచి మకరందాన్ని సేకరిస్తాయి. ఈ క్రమంలో పూల పుప్పొడిని ఒకదాని నుంచి మరొకదానికి చేరవేయడం ద్వారా పరాగ సంపర్కానికి దోహదపడతాయి. తేనెటీగల వల్ల జరిగే పరాగ సంపర్కం కారణంగానే దాదాపు డెబ్బయి శాతం ఆహార ధాన్యాలు, పండ్లు పండుతున్నాయి. తేనెటీగలు మైనంలాంటి కొవ్వు పదార్థంతో షడ్భుజాకారంలో అద్భుతమైన గూళ్లు నిర్మించుకుంటాయి. ఇలాంటి గూళ్ల వరుసతో తేనెపట్టులు ఏర్పాటు చేసుకుంటాయి. రకరకాల పూల నుంచి సేకరించిన మకరందాన్ని వీటిలో భద్రపరచుకుంటాయి. తేనెటీగల సంఖ్య తగ్గిపోతే, ఆహార చక్రం అస్తవ్యస్తం అవుతుంది. పంటల దిగుబడి తగ్గిపోయి, ఆహార కొరత ఏర్పడుతుంది. తేనెటీగలు అంతరించిపోతే, మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటంతో తేనెటీగలను కృత్రిమంగా పెంచే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయినా కూడా పలుచోట్ల తేనెటీగల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది.తేనెటీగలకు ముప్పు వీటి వల్లనే...⇒ తేనెటీగల మనుగడకు ముప్పు కలిగిస్తున్న వాటిలో ప్రధానమైనవి రసాయనిక పురుగు మందులు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో రసాయనిక పురుగు మందుల వాడకం పెరిగింది. పురుగు మందుల్లోని ‘నియోనికోటినాయిడ్స్’ వంటివి పెద్దసంఖ్యలో తేనెటీగల ఉసురు తీస్తున్నాయి.⇒ అడవుల నరికివేత వల్ల చెట్లు తగ్గిపోతున్నాయి. తేనెటీగలు గూళ్లు కట్టుకోవడానికి అనువైన చెట్లు తగ్గిపోతుండటంతో అవి తమ సహజమైన ఆవాసాలను కోల్పోతున్నాయి. చెట్లు తగ్గడం వల్ల పూలు కూడా తగ్గిపోయి, తేనెటీగలు తమ ఆహారాన్ని కూడా కోల్పోతున్నాయి. ఆహారం, ఆవాసం కరవైన పరిస్థితుల్లో తేనెటీగలు నశించిపోతున్నాయి.⇒ వాయు కాలుష్యం తేనెటీగల మీద కూడా దుష్ప్రభావాన్ని చూపుతోంది. వాయుకాలుష్యం వల్ల తేనెటీగలు పూల సువాసనను గుర్తించలేక, తమ సహజమైన ఆహారాన్ని సేకరించుకోలేక నశిస్తున్నాయి.⇒ రకరకాల పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్ల వల్ల కూడా తేనెటీగలకు ముప్పు కలుగుతోంది. వ్యా«ధికారకమైన పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్లు సోకినప్పుడు తేనెటీగలు పెద్దసంఖ్యలో నశించిపోతుంటాయి.⇒ కొన్ని ప్రాంతాల్లో ఏకపంట సాగు కొనసాగిస్తుండటం కూడా తేనెటీగల మనుగడకు చేటు తెస్తోంది. ఏకపంట సాగు వల్ల తేనెటీగలు ఆహార వైవిధ్యాన్ని కోల్పోయి, క్రమంగా క్షీణిస్తున్నాయి.⇒ తేనె సేకరించడంలో మనుషులు అనుసరించే అనియంత్రిత విధానాల వల్ల కూడా తేనెటీగలు పెద్దసంఖ్యలో నశిస్తున్నాయి. తేనె సేకరణ కోసం తేనెపట్టులకు పొగబెట్టి, తేనెపట్టులను చెట్ల నుంచి తొలగించడం వంటి పనుల వల్ల తేనెటీగల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది.ప్రపంచవ్యాప్త సమస్యతేనెటీగలు తగ్గిపోతుండటం ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదు, ఇది ప్రపంచవ్యాప్త సమస్య. ఒక్కో దేశంలో ఈ పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంటోంది. అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం..తేనెటీగలు తగ్గితే...⇒ పంటల దిగుబడి తగ్గి, ఆహార కొరత ఏర్పడుతుంది⇒ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది.⇒ పర్యావరణం సమతుల్యత కోల్పోతుంది.⇒ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.⇒ చివరికి మానవజాతి మనుగడకు ముప్పు ఏర్పడుతుంది.తేనెటీగలకు ప్లాస్టిక్ బెడదతేనెటీగలకు నానా రకాల కాలుష్యాలతో పాటు ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ బెడద కూడా పెరుగుతోంది. తేనెటీగలు సహజంగా రకరకాల చెట్ల నుంచి వెలువడే జిగురుతో గూళ్లు నిర్మించుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్ల జిగురు తగినంత దొరకక తేనెటీగలు తమ గూళ్ల నిర్మాణానికి చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలను కూడా ఉపయోగించుకుంటున్నాయి. తేనెటీగలు తమ గూళ్ల నిర్మాణానికి ప్లాస్టిక్ వినియోగించుకుంటున్న విషయం తొలిసారిగా 2013లో కెనడాలో వెలుగులోకి వచ్చింది. టొరంటోలోని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేనెగూళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు బయటపడ్డాయి.తర్వాత ఇదే పరిస్థితిని బ్రిటన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ తదితర దేశాల్లోనూ గుర్తించారు. నగర ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాల్లోని తేనెగూళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు ఎక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదిలా ఉంటే, కొన్నిచోట్ల పారిశ్రామికంగా తేనెటీగల పెంపకం సాగిస్తున్నవారు తేనెగూళ్ల కోసం చెక్క ఫ్రేముల బదులుగా ప్లాస్టిక్ ఫ్రేములు వాడుతున్నారు. వీటి వల్ల కూడా తేనెటీగలకు మైక్రోప్లాస్టిక్స్ బెడద తప్పడం లేదు. తేనెగూళ్లలో ప్లాస్టిక్ కారణంగా రకరకాల దుష్పరిణామాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం తేనెగూళ్లలోకి ప్లాస్టిక్ చేరడం వల్ల తలెత్తే అనర్థాలు ఇవీ:తేనెపట్టులకు మహమ్మారిఅడవుల నరికివేత, రసాయనిక పురుగు మందులు, చిన్నా చితకా పరాన్నజీవులు, బ్యాక్టీరియా, వైరస్లు వంటివి తేనెటీగల మనుగడకు ముప్పు కలిగిస్తున్న సంగతి తెలిసిందే! వీటికి మించిన పెనుముప్పు ‘కాలనీ కొల్లాప్స్ డిజార్డర్’ (సీసీడీ) రూపంలో తేనెపట్టులను నామరూపాలు లేకుండా నాశనం చేస్తోంది. సీసీడీని పర్యావరణవేత్తలు ‘మహమ్మారి’గా అభివర్ణిస్తున్నారు. తేనెపట్టులను అకస్మాత్తుగా నాశనం చేసే ఈ పరిణామాన్ని తొలిసారిగా ఇరవై ఏళ్ల కిందట గుర్తించారు. అమెరికాలో 2006–07లో సీసీడీ కారణంగా కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 60% తేనెపట్టులు తుడిచిపెట్టుకుపోయాయి. తేనెపట్టుల్లో సీసీడీ పరిస్థితి ఏర్పడినప్పుడు తేనెను సేకరించే కార్మిక తేనెటీగలు అకస్మాత్తుగా కనిపించకుండాపోతాయి.తేనెపట్టులో రాణి ఈగ, ఇంకా రెక్కలురాని పిల్లలు మాత్రమే మిగిలి ఉంటాయి. చనిపోయిన తేనెటీగలు గూటి దగ్గర ఎక్కువగా కనిపించవు. కొద్దికాలంలోనే తేనపెట్టులోని తేనెటీగలేవీ మిగలవు. బ్రిటన్లోను, ఇతర యూరోప్ దేశాల్లోనూ సీసీడీ కారణంగా దాదాపు 30% వరకు తేనెపట్టులు నాశనమయ్యాయి. భారత్లో సీసీడీ ప్రభావం కొంత తక్కువగా ఉంది. భారత్లో సీసీడీ వల్ల 10%–20% మేరకు నష్టం వాటిల్లింది.సీసీడీ కేవలం ఒక కారణం వల్ల కాకుండా, అనేక కారణాల సమ్మేళనం వల్ల ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులు, పూల వైవిధ్యం తగ్గడం, మితిమీరిన రసాయనాలు, కాలుష్యం, అడవుల నరికివేత, పరాన్నజీవులు, సూక్ష్మజీవుల తాకిడి– ఇవన్నీ ఒకేసారి మితిమీరినప్పుడు సీసీడీ పరిస్థితి ఏర్పడుతుందని వివరిస్తున్నారు. సీసీడీ కేవలం తేనెటీగల సమస్య మాత్రమే కాదు, ఇది మానవుల ఆహారచక్రం సమస్య కూడా! ఈ పరిస్థితి సుదీర్ఘకాలం కొనసాగితే, వాటిల్లబోయే నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే!తేనె చరిత్రతేనె వినియోగం పదివేల ఏళ్ల కిందటే మొదలైంది. తేనె కోసం కృత్రిమ పద్ధతుల్లో మట్టితో తేనెగూళ్లను నిర్మించే తొలి పద్ధతులు క్రీస్తూపూర్వం 3000 నాటికే వాడుకలో ఉండేవని పలు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రాచీన ఈజిప్టులో మానవులు తొలినాళ్లలో కృత్రిమంగా మట్టితో ఏర్పాటు చేసిన తేనెగూళ్ల అవశేషాలు బయటపడ్డాయి. స్పెయిన్లో బయటపడ్డ గుహాచిత్రాల ఆధారంగా మనుషులకు క్రీస్తుపూర్వం 8000 నాటికే తేనె వినియోగం తెలుసునని చరిత్రకారులు చెబుతున్నారు. పురాతన వైద్య పద్ధతుల్లో తేనెను ప్రధానంగా ఉపయోగించేవారు.వివిధ ఔషధాలను తేనెతో కలిపి సేవించడం ఇప్పటికీ మన ఆయుర్వేదం సహా అనేక సంప్రదాయ వైద్యపద్ధతుల్లో ఆచరణలో ఉంది. తేనె పోషకాల గని. ఎన్నాళు గడిచినా తేనెకు కాలం చెల్లదు. స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ చెడిపోదు. అందుకే పదార్థాలను దీర్ఘకాలం నిల్వ ఉంచడానికి తేనెను ఉపయోగిస్తారు. తేనెను తక్షణ శక్తినిచ్చే పదార్థంగా, ఔషధంగా, సౌందర్య సాధనంగా, సంప్రదాయ క్రతువుల్లో పవిత్ర పదార్థంగా ఉపయోగిస్తారు. తేనెను వంటకాల్లో చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు.తేనె గురించి కొన్ని వాస్తవాలు⇒ ఒక టీ స్పూన్ తేనెను మనం అవలీలగా చప్పరించేస్తాం. నిజానికి టీ స్పూన్ పరిమాణంలోని తేనె దాదాపు డజను తేనెటీగల జీవితకాల శ్రమ.⇒ ప్రాంతాన్ని బట్టి, అక్కడ పూచే పూలను బట్టి తేనె రంగు, రుచి మారుతూ ఉంటుంది. తేనె సహజంగా పారదర్శకమైన లేత పసుపు నుంచి ముదురు గోధుమ రంగు వరకు రకరకాల రంగుల్లో ఉంటుంది. లేత రంగు తేనె కంటే ముదురు రంగు తేనె ఎక్కువ రుచిగా ఉంటుంది.⇒ తేనెలో నీటిశాతం తక్కువగా ఉండటం, ఆమ్లత్వం ఎక్కువగా ఉండటం వల్ల తేనెలో బ్యాక్టీరియా పెరగడం దాదాపు అసాధ్యం. తేనెను సరైన పద్ధతిలో నిల్వచేస్తే వేల ఏళ్లు గడిచినా చెడిపోదు. ఈజిప్టు సమాధుల్లో దొరికిన వేల ఏళ్ల నాటి తేనె ఈనాటికీ ఉపయోగించడానికి అనువుగా ఉంది.⇒ గాలిలోని తేమ సోకితే ఆహార పానీయాలు ఏవైనా త్వరగా చెడిపోతాయి. తేనె మాత్రం వాటికి పూర్తిగా భిన్నం. గాలిలోని తేమ సోకినా తేనె చెడిపోదు.⇒ తేనెను వేడిచేస్తే నాణ్యత కోల్పోతుంది. వేడి చేయడం వల్ల తేనెలోని కీలకమైన ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి.తేనెటీగల పెంపకంఆధునిక యుగంలో పంతొమ్మిదో శతాబ్దం నుంచి కృత్రిమంగా తేనెటీగల పెంపకం మొదలైంది. అమెరికన్ శాస్త్రవేత్త లోరెండో లాంగ్స్ట్రోత్ 1851లో ఎక్కడికైనా సులువుగా తీసుకుపోయేందుకు అనువైన తేనెగూడును కృత్రిమంగా నిర్మించాడు. అప్పటి నుంచి తేనెటీగల పెంపకం (ఎపికల్చర్) వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా ఎదగడం మొదలైంది. ఇప్పుడు చాలా చోట్ల తేనె కోసమే కాకుండా, పంటల పరాగసంపర్కం కోసం కూడా తేనెటీగల పెంపకం సాగిస్తున్నారు.చైనా, టర్కీ, భారత్, అర్జెంటీనా వంటి దేశాల్లో కృత్రిమంగా తేనెటీగల పెంపకం పెద్దస్థాయిలోనే జరుగుతోంది. గడచిన దశాబ్ద కాలంలో చూసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా తేనె ఉత్పాదనలో నెమ్మదిగా పెరుగుదల నమోదవుతోంది. చైనా, భారత్, టర్కీ, అర్జెంటీనా వంటి దేశాల్లో పెరుగుదల బాగానే ఉన్నా, అమెరికా, యూరోపియన్ దేశాలలో తగ్గుదల నమోదవుతోంది. కేంద్ర ప్రభుత్వం 2017లో ‘మిషన్ హనీ’ కార్యక్రమం ప్రారంభించాక భారత్లో తేనె ఉత్పాదన క్రమంగా పుంజుకుంటోంది. ఒకవైపు ఉత్పాదన పెరిగినా, ప్లాస్టిక్ బెడద వల్ల తేనె నాణ్యత తగ్గుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.తేనె నాణ్యతకు విఘాతంప్రపంచవ్యాప్తంగా ఒకవైపు తేనె ఉత్పాదన నిలకడగా పెరుగుతూనే ఉన్నా, మరోవైపు తేనె నాణ్యత తగ్గుతోంది. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల నుంచి సేకరించిన తేనె నమూనాల్లో రకరకాల ప్రమాదకర పదార్థాలు ఉంటున్నట్లు పరీక్షల్లో బయటపడుతున్నాయి. నగరాలకు, పారిశ్రామిక ప్రాంతాలకు చేరువలో ఉన్న తేనెగూళ్ల నుంచి సేకరించే తేనెలో మైక్రోప్లాస్టిక్స్, పురుగుమందులు, యాంటీబయోటిక్స్, భారలోహాల అవశేషాలు చేరి ఉంటున్నట్లు పలు పరీక్షల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. తేనె నాణ్యతపై పలు దేశాలు కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి.నిబంధనల అమలులో లోపాలు ఉన్న దేశాల్లో దొరికే తేనెలో ప్రమాదకర పదార్థాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. తేనెగూళ్లు ఉండే తావుల్లో రసాయనిక కాలుష్యాలను అరికట్టడం, సేకరించిన తేనెను మార్కెట్లోకి పంపేముందు కట్టుదిట్టమైన నాణ్యత పరీక్షలు జరపడం వంటి చర్యలు చేపట్టకుంటే, ఆరోగ్యం కోసం తేనె తీసుకునేవారికి చేదు ఫలితాలే మిగులుతాయి. -
దీర్ఘాయుర్దాయ దేశాలు
ఆధునిక జీవితంలో ఆరోగ్యమే ఐశ్వర్యం. ఆరోగ్యం బాగుంటేనే దీర్ఘాయుర్దాయం ఉంటుంది. వార్ధక్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవే అయినా, కొన్ని దేశాల్లో మాత్రం ఏడుపదుల వయసు దాటే వరకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఆ వయసు తర్వాత చిన్నా చితకా సమస్యలు ఉన్నా, దీర్ఘాయుష్కులుగా మనుగడ సాగించగలుగుతున్నారు.ఆరోగ్యకరమైన జీవనశైలి, తగిన వ్యాయామం, మెరుగైన వైద్య సౌకర్యాల కారణంగా ఆయుర్దాయంలోను, ఆరోగ్యకరమైన జీవన ప్రమాణంలోను (హెల్తీ లైఫ్ ఎక్స్పెక్టన్సీ) ముందంజలో ఉంటున్న దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం.⇒ భారతదేశంలో ఆరోగ్యకరమైన జీవనప్రమాణం సగటున 61 ఏళ్ల వరకు ఉంటోంది. సగటు ఆయుర్దాయం 70 ఏళ్ల వరకు ఉంటోంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే, ఇది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. మన దేశంలో నగరాలలో ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు ఇప్పటికీ లేవు. అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి కారణాలు ఆయుర్దాయాన్ని హరించేస్తున్నాయి.⇒ కరవు కాటకాలు, ఆధునిక వైద్య సౌకర్యాల లోటు, తరచు ఘర్షణలు వంటి కారణాల వల్ల ఆఫ్రికన్ దేశాలలో ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు, సగటు ఆయుర్దాయం ఇప్పటికీ తక్కువగానే ఉంటున్నాయి.⇒ వైద్య ఆరోగ్య రంగాల్లో ప్రపంచం ముందంజ వేస్తున్నా, ఇప్పటికీ కొన్ని దేశాలు ఆరోగ్యకరమైన జీవన ప్రమాణంలోను, ఆయుర్దాయంలోను ఇంకా వెనుకబడి ఉన్నాయి. అత్యల్పాయుర్దాయ దేశాలన్నీ ఆఫ్రికా ఖండంలోనే ఉండటం గమనార్హం. వీటి వివరాలు కూడా గణాంకాల్లో తెలుసుకుందాం... -
వేడుకగా విక్టోరియా డే!
చరిత్రతో ముడిపడిన సందర్భమే అయినా, కెనడియన్లు ఈ సమయాన్ని పూర్తిగా ఒక సమ్మర్ కిక్–ఆఫ్ ఈవెంట్గా భావిస్తారు. నెలల తరబడి మంచుతో, చలితో ఇబ్బంది పడే కెనడియన్లకు, చెట్లు పచ్చబడటం, వెచ్చని గాలులు వీచడం ఒక సంతోషకరమైన సమయం. అందుకే ఈ రోజున క్రీడా పోటీలు నిర్వహిస్తారు. రుచికరమైన వంటకాలతో విందులు చేసుకుంటారు. పలుచోట్ల కెనడా జాతీయ జెండాతో పాటుగా, యూనియన్ జాక్ జెండాను ఎగురవేస్తారు. రాజధాని నగరాల్లో తుపాకులతో ఘనంగా వందన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో కెనడా అంతటా ఒక నూతనోత్సాహం ఉట్టిపడుతుంది.కెనడాలో దేశవ్యాప్తంగా విక్టోరియా డే వేడుకలు మే 18 నుంచి మొదలవుతున్నాయి. మంచుతెరలు వీడి, ప్రకృతి పచ్చదనాన్ని పులుముకుంటున్న వేళ దేశమంతా సంబరాల్లో మునిగి తేలుతోంది. ఈ వేడుకలను విక్టోరియా రాణి పుట్టినరోజు సందర్భంగానే కాకుండా, సుదీర్ఘ శీతకాలం తర్వాత వచ్చే వెచ్చని వేసవికి స్వాగతం పలకడానికి జరుపుకొంటారు. బాణసంచా కాల్పులతో, విందు వినోదాలతో సరదాగా గడుపుతారు.విక్టోరియా మహారాణి పుట్టినరోజును అంటే మే 24న వేడుకగా జరుపుకోవడం 1845 నుంచి ఆచారంగా వస్తోంది. అప్పటి కెనడా ప్రావిన్స్ లెజిస్లేచర్ ఈ రోజును అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. 1901లో రాణి విక్టోరియా మరణానంతరం, ఈ పండుగ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆమె జ్ఞాపకార్థం కెనడా పార్లమెంట్ 1952లో ప్రతి సంవత్సరం మే 25కు ముందు వచ్చే సోమవారం రోజున ‘విక్టోరియా డే’ వేడుకలు నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించింది. దాని ప్రకారం ఈ ఏడాది మే 18న నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేసింది.కెనడియన్ల దృష్టిలో క్వీన్ విక్టోరియా అత్యంత గౌరవనీయురాలు. ఆమె హయాంలోనే కెనడాకు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. అంతేకాకుండా, ప్రస్తుత రాజధాని ఒటావాను దేశ రాజధానిగా ఎంపిక చేసింది కూడా ఆమెనే! 1956 వరకు, తదుపరి రాజుల పుట్టినరోజులను కూడా క్వీన్ విక్టోరియా పుట్టినరోజు అయిన మే 24నే నిర్వహించేవారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, క్వీన్ ఎలిజబెత్ బాధ్యతలు చేపట్టినపుడు, ఆమె అసలు పుట్టినరోజు ఏప్రిల్ 21 అయినప్పటికీ, ఆమె అధికారిక జన్మదిన వేడుకలను విక్టోరియా డే రోజున నిర్వహిస్తుండటం విశేషం. ∙ రమా జంబుల -
చాప కింద నీరులా... కరుగుతున్న అంటార్కిటికా!
ఎండ తగిలితేనే కదా ఐస్ ముక్క కరుగుతుంది! కానీ అంటార్కిటికా ఖండంలోని మంచు పలకలు వాటి అడుగు భాగం నుంచి కూడా కరుగుతున్నాయట! అదీ త్వరత్వరగా!! అలా కరిగిన నీరు సముద్ర మట్టాలను పెంచితే, వాతావరణ సమస్థితి దెబ్బతిని, భూప్రపంచం అల్లకల్లోలం కావచ్చునని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఫ్రాన్సులోని యూనివర్సిటీ ఆఫ్ బోర్డియక్స్ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. సముద్ర ప్రవాహాలలో తీవ్రమైన మార్పులు రావటమే ఈ ‘అసాధారణ’ స్థితికి కారణం.పైన భూతాపం... కింద ఉష్ణ ప్రతాపం‘అంటార్కిటికా’ అనేది భూమికి చిట్టచివరన, దక్షిణ ధ్రువం దగ్గర ఉన్న ఒక భారీ మంచు ఖండం. అక్కడ దాదాపు 98 శాతం మంచు ఉంటుంది. మిగతా 2 శాతంలో పర్వత శిఖరాలు, పొడి లోయలు, తీర ప్రాంతాలు, ద్వీపాలు, ఆ ద్వీపాల్లో పెంగ్విన్లు ఉంటాయి. శాస్త్రవేత్తలు తప్ప సాధారణ మనుషులు ఉండరు. ఇక ఆ 98 శాతం మంచుపొర సగటున 1.9 కిలోమీటర్ల మందంలో ఉంటుంది! భూతాపం వల్ల కొన్నేళ్లుగా ఈ మంచు కరుగుతూ వస్తోందనీ, ఒకవేళ అంటార్కిటికాలోని మంచు మొత్తం కరిగిపోతే, సప్త సముద్రాల నీటి మట్టాలు దాదాపు 200 అడుగుల వరకు పెరిగి తీర ప్రాంత నగరాలన్నీ మునిగిపోతాయనీ మనం ఎప్పటి నుండో వింటున్న సంగతే. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టింది ఏమిటంటే, పైనుంచి భూతాపం వల్లనే కాదు, అడుగు నుంచి వేడెక్కుతున్న నీటి ప్రవాహాల వల్ల కూడా అంటార్కిటికా కరుగుతోందని! అంటే, భూమికి మరింత త్వరగా ప్రమాదం ముంచుకు రాబోతోందని!అడుగున ఎలా వేడెక్కుతున్నాయి?!అంటార్కిటికా మంచు పలకల అడుగున సర్కమ్పోలార్ డీప్ వాటర్ (సి.డి.డబ్లు్య.) అని పిలిచే వేడి నీటి ప్రవాహాలను శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా గమనిస్తున్నారు. ఈ వేడి నీరు సముద్ర ఉపరితలం నుండి సుమారు 500 మీటర్ల (1,600 అడుగులు) దిగువకు, మంచు పలకలకు దూరంగా ఉంటుంది. అయితే మారుతున్న గాలి దిశలు, అంటార్కిటికాను చుట్టి ఉన్న ‘దక్షిణ మహాసముద్రం’లో వీస్తున్న బలమైన గాలుల వల్ల, ఈ లోతైన వేడి నీరు నెమ్మదిగా సముద్ర ఉపరితలం పైకి, మంచు పలకల వైపు కదులుతూ వస్తోంది. ఈ వేడి నీటి ఉష్ణోగ్రత కేవలం 2 సెల్సియస్ డిగ్రీలు (35.6 ఫారెన్హీట్ డిగ్రీలు) మాత్రమే అయినప్పటికీ, అతి శీతలంగా ఉండే అంటార్కిటికా మంచును బలహీనపరచడానికి అది చాలు! ‘‘గతంలో ఈ మంచు పలకల చుట్టూ చల్లటి నీరు ఉండేది, అది వాటిని కరగకుండా కాపాడేది. కానీ ఇప్పుడు సముద్ర ప్రవాహాల్లో మార్పు రావడం వల్ల, ఎవరో వేడి నీటి ట్యాప్ తిప్పినట్లుగా అక్కడి నీరు వేడెక్కుతోంది’’ అని ప్రొఫెసర్ సారా పుర్కీ అంటున్నారు. చల్లటి ఉప్పు నీరు – వేడి తీపి నీరు!ధ్రువ ప్రాంతాల దగ్గర మంచు గడ్డకట్టినప్పుడు, మిగిలిన నీరు అత్యంత చల్లగా, ఉప్పగా, సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ నీరు బరువుగా ఉండి సముద్రం అడుగు భాగంలోకి చేరుతుంది. ఇలా నీరు కిందకు వెళ్లేటప్పుడు, తనతో పాటు ఉష్ణాన్ని, కార్బన్ను, పోషకాలను లోపలికి తీసుకెళ్తుంది. అలా వెళ్లటం అనేది ప్రపంచవ్యాప్తంగా సముద్రపు నీటిని ఒక క్రమ పద్ధతిలో, ఒక బెల్ట్ లాగా కదిలిస్తుంది. దానినే ‘ఓషన్ కన్వేయర్ బెల్ట్’ అంటారు. అయితే ఇప్పుడు అడుగు నుంచీ కరుగుతూ ఉన్న మంచు పలకలు తీపి వేడి నీరుగా (ఉప్పు లేని నీరుగా) సముద్రంలో కలిసినప్పుడు ఆ నీరు అంత త్వరగా కిందకు మునగదు. దీనివల్ల సముద్ర ప్రవాహాల వేగం మందగించి, సముద్రాల్లోని జీవజాలానికి అందే పోషకాలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రవాహాలకు అడ్డుగా ‘తీపి’ నీరుకొత్త డేటా ప్రకారం, అంటార్కిటికా దిగువకు వెళ్లే (మునిగిపోయే) చల్లటి, ఉప్పటి నీటి శాతం తగ్గుతోంది. దానిని భర్తీ చెయ్యటానికి బయట నుండి మరింత వేడి నీరు (ఉప్పు లేని నీరు) మంచు పలకల వైపుకు వస్తోంది. ఆ క్రమంలో మంచును ఇంకా వేగంగా కరిగిస్తోంది. ఇందువల్ల సముద్రాల నీటి మట్టం పెరగడమే కాకుండా మరికొన్ని సమస్యలు కూడా వస్తాయి. సాధారణంగా సముద్రాలు వాతావరణంలోని అధిక వేడిని, కార్బన్ను సంగ్రహిస్తాయి. ప్రవాహాలు ఆగిపోతే, సముద్రం ఈ పనిని సరిగ్గా చేయలేదు. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ మరింత వేగంగా పెరుగుతుంది. తాజా అధ్యయనానికి నాయకత్వం వహించిన డాక్టర్ జోషువా లాన్హామ్ చెప్పినట్లుగా, ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే కాదు, ఇప్పుడు మన కళ్లముందు నిజంగా జరుగుతున్న మార్పులు!అడుగు నుంచైనా, పై నుంచైనా..... అంటార్కిటికా కరగడం అనేది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు, ఇది భూతాప భీకర రూపానికి ఒక సంకేతం. సముద్ర ప్రవాహాల వ్యవస్థ బలహీనపడితే, అది వాతావరణాన్ని అతలాకుతలం చేసి, రాబోయే తరాలకు మంచు యుగం వంటి కఠిన పరిస్థితులను కల్పించవచ్చు. ప్రకృతి మనకు ఇస్తున్న ఈ సంకేతాలను గమనించి, పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవడం అవసరం. బరువు తగ్గుతున్న మంచు పలకలుభూమి పై నుండి సముద్రం వైపు విస్తరించి, నీటిపై తేలుతూ ఉండే మంచు నదులనే మంచు పలకలు (గ్లేషియర్లు) అంటారు. అవి అంటార్కిటికా తీర ప్రాంతంలో దాదాపు 75 శాతం మేర విస్తరించి ఉన్నాయి. వీటి మందం 50 నుండి 600 మీటర్ల వరకు ఉంటుంది. వెనుక ఉన్న గ్లేసియర్ల నుండి మంచు ముందుకు నెట్టుకుని రావటం వల్ల, పైన కురిసే మంచు గట్టిపడటం వల్ల ఈ పలకలు పెరిగి, అంటార్కిటికాకు ఒక అడ్డుగోడలా లేదా ‘బ్రేక్’ లా పనిచేస్తాయి. దీనినే ‘బట్రెసింగ్’ అంటారు. భూమి మీద ఉన్న భారీ గ్లేషియర్లు వేగంగా సముద్రంలోకి జారిపోకుండా ఈ మంచు పలకలు అడ్డుకుంటాయి. ఒకవేళ ఈ పలకలు విచ్ఛిన్నమైతే, వెనుక ఉన్న గ్లేషియర్లు వేగంగా సముద్రంలోకి పడిపోతాయి, దీనివల్ల సముద్ర మట్టాలు ఒక్కసారిగా పెరుగుతాయి. గత 25 ఏళ్లలో 48 మంచు పలకలు వాటి బరువులో 30 శాతాన్ని కోల్పోయాయి. అంటే, అంటార్కిటికాను కాపాడుతున్న ‘అడ్డుగోడలు’ బలహీనపడుతున్నాయని అర్థం. ఇది ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత నగరాలకు పెద్ద హెచ్చరిక.ఐరోపాకు అట్లాంటిక్ ‘బెల్టు’ దెబ్బఈ శతాబ్దం పూర్తయ్యేసరికి ఎ.ఎం.ఓ.సి. (అట్లాంటిక్ మెరీడియనల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్) ప్రవాహం 50 శాతం వరకు దెబ్బతినే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ బోర్డియక్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత అంచనాల్లో ఇది కేవలం 32 శాతంగా మాత్రమే ఉండేది. ఎ.ఎం.ఓ.సి. అంటే అట్లాంటిక్ మహా సముద్రంలో నిరంతరం ప్రవహించే ఒక భారీ నీటి కన్వేయర్ బెల్ట్ వంటిది. అంటార్కిటికా ఖండానికి సరిహద్దుగా ఉన్న మూడు ప్రధాన సముద్రాలలో అట్లాంటిక్ మహా సముద్రం ఒకటి.మిగతా రెండూ.. పసిఫిక్ మహా సముద్రం, హిందూ మహా సముద్రం. ఈ మూడు భారీ జల రాశులు దక్షిణ దిశగా ప్రవహించి, దక్షిణ మహా సముద్రంలో విలీనం అవుతాయి. ఒకవేళ ఎ.ఎం.ఓ.సి. పూర్తిగా ఆగిపోతే, అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రవహించే ‘గల్ఫ్ స్ట్రీమ్’ ప్రయాణించే దిశ పూర్తిగా మారిపోతుంది. దాని వల్ల ఉత్తర ఐరోపా, బ్రిటన్ తీవ్రమైన చలి కాలంలోకి వెళ్లిపోతాయి. ఇది ఒక రకంగా కొత్త ‘మంచు యుగం’లా ఉంటుంది. అంటే ఐరోపాకు ప్రాణాంతకమైన మంచు యుగం వచ్చేస్తుంది.మంద గమనం పెరిగింది!1950 నుండి గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్ల అట్లాంటిక్ మెరిడియనల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్ (ఎ.ఎం.ఓ.సి.) వ్యవస్థ కదలిక మునుపటి కంటే చాలా వేగంగా బలహీనపడుతోందని పరిశోధకులు గుర్తించారు. గ్రౌండింగ్ లైన్: ఒక గ్లేషియర్ (మంచు పలక) సముద్ర అడుగుభాగంలోని రాతిని తాకే ప్రదేశాన్ని ‘గ్రౌండింగ్ లైన్’ అంటారు. వేడి నీరు ఈ పాయింట్ను వెనక్కి నెట్టివేస్తుంది. గ్రౌండింగ్ లైన్ వెనక్కి వెళ్లే కొద్దీ, అంతవరకు రక్షణగా ఉన్న మంచు అడుగు భాగం కూడా వేడినీటిలో మునిగిపోయి కరగడం మొదలవుతుంది. పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్: ఇది ఒక విషవలయం లాంటిది. మంచు కరిగే కొద్దీ, ఆ మేర మరింత వేడి నీరు లోపలికి చేరుతుంది, ఆ వేడి నీరు మంచును ఇంకా వేగంగా కరిగిస్తుంది. ఇలా ఒకదాని వల్ల మరొకటి ప్రభావితమై మంచు కరగడం అనేది ఊహించనంత వేగంగా మారుతుంది. దీనినే ‘పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్’ అంటారు.నీటి వేడిని ఎలా కనిపెడతారు?అంటార్కిటికా ఖండం అడుగున నీటి ప్రవాహాల ఉష్ణోగ్రతల్ని కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు ‘ఆర్గో ఫ్లోట్స్’ అనే పరికరాలను ప్రయోగిస్తారు. ఇవి సముద్రంలో తేలుతూ, నిరంతరం నీటి ఉష్ణోగ్రత, ఇతర వివరాలను సేకరిస్తుంటాయి. తాజాగా శాస్త్రవేత్తలు ఓడల ద్వారా సేకరించిన పాత డేటాను, ఈ కొత్త ఆర్గో ఫ్లోట్స్ డేటాతో కలిపి గత 40 ఏళ్ల రికార్డును విశ్లేషించారు. దాంతో లోతులో ఉన్న నీటి వేడికి అంటార్కిటికా పైకి చొచ్చుకు వస్తోందని మొదటిసారి నిరూపణ అయింది. -
సమ్మర్లో కడుపు చల్లగా ఉంచే వంటకాలు చేసేయండిలా
ఎండలు మండే వేసవి కాలంలో కడుపు చల్లగా ఉంటేనే ఆరోగ్యం. వేసవి ప్రత్యేకంగా పిల్లా పెద్దా అందరికీ కడుపు చల్లగా ఉంచే వంటకాలు మీ కోసం... స్వీట్కార్న్ స్టూ (6 నెలల పైబడిన పిల్లలకు)కావలసినవి: స్వీట్కార్న్: 1 టిన్ (160 గ్రాములు) వెల్లుల్లి: 1 చిన్న రెబ్బ, నూనె: 1 టీస్పూన్ ఉల్లిపాయ: పావు వంతు (చిన్న ముక్కలుగా కోసినది), పాలు: 200 మి.లీ మిక్స్డ్ హెర్బ్స్: పావు టీస్పూన్ (ఆప్షనల్)తయారీ: ఒక పాన్లో నూనె వేసి వేడి చేయండి. అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి 1 నుంచి 2 నిమిషాల పాటు అవి మెత్తబడే వరకు వేయించాలి. తర్వాత అందులో స్వీట్కార్న్, పాలు పోయాలి. పాలు మరిగిన తర్వాత, మంటను తగ్గించి సుమారు 15 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనిచ్చి, ఆ తర్వాత దీనిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి. దీనిని ఆరు నెలల పైబడిన పిల్లలకు రోజుకు 40 గ్రాముల వరకు తినిపించవచ్చు. దీనిని నిల్వ పెట్టుకోవాలనుకుంటే ఒక గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రీజర్లో పెట్టాలి. దీనికి తోడుగా ఉడికించిన కూరగాయలు, హోల్మీల్ బ్రెడ్ ముక్కలను కూడా కలిపి తినిపించవచ్చు. జల్ జీరాకావలసినవి: తాజా పుదీనా ఆకులు: 1/2 కప్పు జీలకర్ర పొడి: టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు: టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు: టీస్పూన్, నిమ్మరసం: టేబుల్ స్పూన్ బెల్లం పొడి: టేబుల్ స్పూన్, నీళ్లు: 4 కప్పులు నిమ్మకాయ ముక్కలు: అలంకరణ కోసంతయారీ: ఒక బ్లెండర్లో పుదీనా ఆకులు, జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు, నల్ల ఉప్పు, నిమ్మరసం, బెల్లం పొడి వేయండి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక జగ్గులోకి వడకట్టండి. ఇప్పుడు మిగిలిన నీటిని పోసి బాగా కలపండి. ఈ జల్ జీరాను కొన్ని గంటల పాటు రిఫ్రిజిరేటర్లో బాగా చల్లబడే వరకు ఉంచాలి. ఈ చల్లబడిన జల్ జీరాను గ్లాసుల్లో పోసి, ఐస్ ముక్కలు, నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేయండి. మీ రుచికి తగినట్లుగా పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు. జల్ జీరా వేసవికి చాలా మంచిది. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.చికూ పెకాన్ కుల్ఫీ కావలసినవి: పెకాన్ గింజలు (సిమ్లా అక్రోట్): 30 నుంచి 40 సపోటాలు: 5 నుంచి 6 (గింజలు తీసి, తొక్కతో సహా ముక్కలుగా కోసినవి) చక్కెర: 1/4 కప్పు పాల పొడి: 3 టేబుల్ స్పూన్లు ఏలకుల పొడి: 1/2 టీస్పూన్ మరిగించి చిక్కబరిచిన పాలు: 3 కప్పులు గార్నిష్ కోసం: సపోటా ముక్కలు, పెకాన్ గింజలు. తయారీ: 15 నుంచి 20 పెకాన్ గింజలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగిలిన పెకాన్ గింజలను మిక్సీ జార్లో వేసి రఫ్గా గ్రైండ్ చేయాలి. అందులోనే సపోటా ముక్కలు, చక్కెర, పాల పొడి, ఏలకుల పొడి వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో సగం కోసిన పెకాన్ ముక్కలు, చిక్కబరిచిన పాలు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మోల్డ్స్లో పోసి, మూతలు పెట్టి 6 నుంచి 8 గంటల పాటు ఫ్రీజర్లో ఉంచాలి. కుల్ఫీ గడ్డకట్టిన తర్వాత బయటకు తీసి, మిగిలిన పెకాన్ ముక్కలపై దొర్లించాలి. ప్రతి కుల్ఫీని మధ్యలోకి కట్ చేసి, సపోటా ముక్కలు, పెకాన్ గింజలతో అలంకరించి చల్లగా వడ్డించాలి.(చదవండి: ఐస్క్రీం షాపే పెళ్లి వేదికగా..ఒక్కటైన జంట!) -
కాంతివంతమైన మెరిసే ముఖం కోసం..!
పెదవుల ఆకృతిని మార్చుకోవడానికి ఫిల్లర్ చికిత్సలపై ఆధారపడే మహిళలకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ బ్యూటీ టెక్నాలజీ సంస్థ సిల్కెన్ పెదవుల సంరక్షణ, అందం కోసం ‘లూమిలిప్స్ ఎల్ఈడీ లిప్ మాస్క్’ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.ఫేస్ మాస్క్లు సాధారణంగా ముఖం అంతటికీ కాంతిని అందిస్తాయి. కానీ, ఈ లూమిలిప్స్ మాస్క్ ప్రత్యేకంగా పెదవులు, వాటి చుట్టూ ఉండే చర్మంపై దృష్టి పెడుతుంది. ఇది కాంతి కిరణాల సహాయంతో పెదవులలోని కొవ్వు పొరను లక్ష్యంగా చేసుకుని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పెదవులు సహజంగానే మృదువుగా, నిండుగా కనిపిస్తాయి. ఈ పరికరం రెండు మోడ్లలో పనిచేస్తుంది. ఒకటి: వాల్యూమ్ యాంటీ ఏజింగ్ మోడ్. ఇది పెదవుల చుట్టూ ఉండే ముడతలు, స్మైల్ లైన్స్, వయసురీత్యా వచ్చే మార్పులను తగ్గిస్తుంది. మరొకటి: గ్లో అండ్ సూతింగ్ మోడ్. ఇది చర్మ ఛాయను మెరుగుపరచడమే కాకుండా, పెదవులకు సహజమైన మెరుపును ఇస్తుంది. ఈ మాస్క్ని రోజుకు 3 నుంచి 5 నిమిషాలు ఉపయోగిస్తే చాలు. కేవలం రెండు వారాల్లోనే స్పష్టమైన మార్పును గమనించవచ్చు. దీనిని ఉపయోగించినప్పుడు ఎలాంటి నొప్పి ఉండదు.వైనో థెరపీ..వైన్ తాగడం పురాతన కాలం నుంచి మామూలే! కానీ పురాతన కాలంలో వైన్ను ఒక సౌందర్య సాధనంగా కూడా ఉయోగించేవారు. రోమన్ మహిళలు ద్రాక్ష గింజలు, తొక్కలతో చేసిన మాస్క్లను ముడతలు పోగొట్టుకోవడానికి వాడేవారు. అలాగే ద్రాక్ష గుజ్జును బుగ్గలకు మంచి రంగు రావడం కోసం వాడేవారట! తరువాత 17వ శతాబ్దంలో ఫ్రాన్స్లోని ఉన్నత వర్గాల మహిళలు చర్మం కాంతిమంతంగా మెరవడానికి రెడ్ వైన్తో ముఖం కడుక్కునేవారట! ముఖ్యంగా ఈ ప్రక్రియకే ఆధునికులు ‘వైనోథెరపీ’గా పేరుపెట్టారు. వైనోథెరపీ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం 1990లో. ఫ్రాన్స్కి చెందిన మథిల్డే థామస్, ఆమె భర్త బెర్ర్టాండ్ థామస్ ఈ ఆధునిక వైనోథెరపీకి మూలకారకులు. ఫ్రాన్స్లో మొదలైన ఈ వైనోథెరపీ ఇప్పుడు జపాన్, అర్జెంటీనా, అమెరికా, భారత్ వరకు విస్తరించింది.అతి జాగ్రత్తలే అసలు సమస్య!జుట్టు ఆరోగ్యంగా ఉండాలని ఒక్కోసారి మనం అతి జాగ్రత్తలతో చేసే పనులు సమస్యను తగ్గించడానికి బదులుగా మరింత పెంచుతాయి. జుట్టు జిడ్డుగా మారుతుందని తరచు షాంపూలతో తలస్నానాలు చేస్తుంటారు. దీనివల్ల తలలో సహజంగా ఉండే నూనెలు పోతాయి. చర్మం మరింత పొడిబారి, ఇంకా ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల మైల్డ్ షాంపూలను మాత్రమే ఉపయోగించాలి. అలాగే వేసవిలో చాలామంది జుట్టును బిగుతుగా ముడి వేస్తుంటారు. దీనివల్ల తలలో చెమట, వేడి పెరిగి జుట్టు కుదుళ్లు బలహీన పడతాయి. అలాగే డ్రై షాంపూలు, స్ప్రేలు వాడినప్పుడు అవి చెమటతో కలిసి తల మీద ఒక పొరలా పేరుకుపోతాయి. ఇవి చర్మరంధ్రాలను మూసివేసి ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. అందువల్ల తలపై పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడానికి సున్నితమైన స్క్రబ్ను వాడాలి. ఎండలో వెళ్లేటప్పుడు హ్యాట్, లేదా స్కార్ఫ్ ధరించాలి. సూర్యరశ్మి వల్ల తల చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. మన ముఖ చర్మం లాగే, తల చర్మం కూడా చాలా ముఖ్యం. అందువల్ల తలపై దురద పెడుతున్నా, జుట్టు పల్చబడుతున్నా, జిడ్డుగా ఉంటున్నా– అది మీ సహాయం కోరుతోందని అర్థం. అందువల్ల సమస్య చిన్నగా ఉన్నప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. -
వరుణుడు కోసం అగ్నిబాణాలు
వానలు సమృద్ధిగా కురవాలి; పంటలు పుష్కలంగా పండాలి. ఇంటికి సిరిసంపదలు తేవాలి– ప్రతి దేశంలోనూ రైతులందరి ఆశ ఇది. ఇదే ఆకాంక్షతో థాయ్లాండ్, లావోస్ ప్రజలు ప్రతి ఏటా ‘బున్ బాంగ్ ఫై’ అనే రాకెట్ ఫెస్టివల్ను అత్యంత ఉత్సాహభరితంగా, అంగరంగ వైభవోపేతంగా జరుపుకొంటారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ అద్భుత వేడుక యసోథోన్ ప్రావిన్స్లో మే 8న ప్రారంభమై మే 10తో ముగుస్తుంది.తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. లావోస్ వానదేవుడైన ‘పయా థేన్’ ఒక నాగ సర్పం కారణంగా ఆగ్రహించడంతో వర్షాలు కురవక కరవు వాటిల్లింది. దీంతో ప్రజలు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి వెదురుతో తయారు చేసిన భారీ రాకెట్లను ఆకాశంలోకి ఎగురవేశారట! ఈ పురాణం ఆధారంగా వానదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి వెదురు రాకెట్లను ఎగురవేసే సంప్రదాయం మొదలైంది. వీరు ఎగురవేసే రాకెట్లు నేరుగా స్వర్గానికి చేరుకుని, ప్రజల అవసరాలను వానదేవుడికి విన్నవిస్తాయని, ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. థాయ్లాండ్ ఈశాన్య ప్రాంతంలోని మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. కాబట్టి వారికి వర్షాలు చాలా కీలకం. రుతుపవనాలు సకాలంలో రావడం వారికి చాలా ముఖ్యం. ఈ ప్రకృతి పండుగను థాయ్లాండ్లోని ఈశాన్య ప్రాంతాలైన యసోథోన్, రోయి ఎట్, కలసిన్, ఉడాన్ థాని, నోంగ్ ఖై, మహా సారఖామ్, సిసాకెట్, నోంగ్ బువా లాంఫు, లోయి, అమ్నాత్ చారోయెన్ ప్రావిన్స్లతో పాటు ఉత్తర ప్రాంతంలోని కొన్ని ప్రావిన్స్లలో విస్తృతంగా జరుపుకొంటారు. మూడు రోజుల పాటు నిర్వహించుకునే ఈ ఉత్సవం రంగురంగుల ఊరేగింపులతో, జానపద నృత్యాలతో కోలాహలంగా సాగుతుంది. సుమారు 20 నుంచి 25 కిలోల గన్పౌడర్తో నింపిన ఈ రాకెట్లను బౌద్ధ పురాణాల్లోని ‘నాగ’ అనే పౌరాణిక సర్పం బొమ్మతో అలంకరిస్తారు. రాకెట్లను ప్రయోగించే ముందు బౌద్ధ సన్యాసులు వీటికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదిస్తారు. రాకెట్లను తయారు చేసిన బృందాలకు బహుమతులు అందజేస్తారు. అయితే, ఒకవేళ ఏదైనా రాకెట్ ప్రయోగం విఫలమైతే, ఆ రాకెట్ తయారుచేసిన వాళ్లని సరదాగా బురదలో ముంచి శిక్షిస్తారు. ఇది దేవుడికి ఆగ్రహం కలిగించిందని భావించి చేసే ఒక వినోదాత్మక ఆచారం. పురుషులు, స్త్రీల వేషధారణలో కనిపిస్తూ, హాస్యభరితమైన ప్రదర్శనలతో పర్యాటకులను అలరిస్తారు. వ్యవసాయ ఇతివృత్తాలతో కూడిన జానపద నృత్యాలు ఇక్కడ ప్రధానం. ముఖ్యంగా ‘లామ్ వాంగ్’ అనే నృత్యంలో పాల్గొనేవారు వృత్తాకారంలో లయబద్ధంగా నర్తిస్తారు. వేడుక సందర్భంగా బంధుమిత్రులతో కలిసి విందులు చేసుకుంటారు. ఈ బున్ బాంగ్ ఫై కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా, ఒక అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణగానూ మారింది. టూరిజం అథారిటీ ఆఫ్ థాయ్లాండ్ 1974 నుంచి ఈ వేడుకలకు అండగా నిలుస్తోంది. ఈ మూడురోజుల పండుగ కాలాన్ని ఈశాన్య ప్రాంతంలో సెలవుదినంగా గుర్తిస్తారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమవ్వడానికి ముందు రైతులు జరుపుకునే ఈ వినోదభరిత ఉత్సవం ప్రకృతికి, మానవ సంకల్పానికి మధ్య ఉన్న విడదీయలేని బంధానికి నిదర్శనంగా నిలుస్తోంది. రమా జంబుల(చదవండి: -
ఆవకాయదే అగ్రస్థానం!
వేసవి అంటే ఊరగాయల సీజన్ కూడా! మామిడికాయలతో తయారు చేసే ఆవకాయ, నిమ్మకాయ ఊరగాయ, మిర్చి ఊరగాయ– ఇలా ఎన్ని రకాలు ఉన్నా, ఊరగాయల మార్కెట్లో అగ్రస్థానం మామిడి ఆవకాయకే దక్కుతుంది. మన దేశంలో తయారయ్యే ఊరగాయల్లో దాదాపు మూడోవంతు వాటా ఆవకాయదే! ఉత్పాదన ప్రకారం ఊరగాయల వివరాలు గణాంకాల్లో చూద్దాం...దేశవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న రకరకాల ఊరగాయల ఉత్పాదనలో దాదాపు 70% కుటీర పరిశ్రమల్లా ఇళ్ల వద్ద తయారు చేసిన ఊరగాయలే ఉంటాయి. ఊరగాయల మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తుల వాటా సుమారు 30% మాత్రమే! ఊరగాయల ఉత్పాదనలో రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా ఊరగాయల ఉత్పాదనలో మొదటి పది స్థానాల్లో ఉన్న రాష్ట్రాల వివరాలు ఇవీ:చేపలు, రొయ్యలు, చికెన్, మటన్ ఊరగాయల ఉత్పత్తి కేరళలలోను, ఈశాన్య రాష్ట్రాల్లోను అత్యధికంగా ఉంటోంది. ఈశాన్య రాష్ట్రాల్లోను, తూర్పు రాష్ట్రాల్లోను వెదురు మొలకలు, తామరతూళ్ల ఊరగాయలు, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో యాపిల్ ఊరగాయ వంటివి ప్రత్యేకంగా తయారు చేస్తారు. (చదవండి: కడుపు ఉబ్బరం దేనికి సంకేతమో తెలుసా..!) -
సూపర్ ఎల్ నినో భయం వద్దు.. సిద్ధం కండి!
ప్రపంచానికి ప్రళయ ఘంటికలు వినిపిస్తున్నాయి. ఈ మే నెల నుంచి భూగోళం నిప్పుల కొలిమిలా మారబోతోంది! పసిఫిక్ మహా సముద్రం నుంచి అప్పుడే సంకేతాల అలజడి కూడా మొదలైంది! చరిత్రలోనే ఇది అత్యంత ‘మండే ఎండల’ ఏడాది అవబోతోంది. ఇప్పటి వరకు మనం విన్నది ‘ఎల్ నినో’ అనే మాట మాత్రమే. ఇప్పుడు వింటున్నది ‘సూపర్’ ఎల్ నినో! ఏమైనా కానివ్వండి. భయం వద్దు. సిద్ధం కండి. భద్రంగా ఉండండి.ఈ ఏడాది మే, లేదా జూన్ నెలల నాటికే బలమైన సూపర్ ‘ఎల్ నినో’ పరిస్థితులు ఏర్పడవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించింది . ఈ శతాబ్దంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత వేగంగా పసిఫిక్ మహాసముద్రపు నీరు వేడెక్కుతోందట! పర్యవసానమే సూపర్ ఎల్ నినో అంటున్నారు. అంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరబోతున్నాయి. ‘‘గత వందేళ్లలోనే ఇది అత్యంత బలమైన ఎల్ నినో కావచ్చు. సముద్ర ఉష్ణోగ్రతలు సగటు కంటే 1.5 సెల్సియస్ డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది’’ అని బ్రిటన్ వాతావరణ సంస్థ ‘మెట్ ఆఫీస్’ ప్రకటించింది. ‘‘ఉష్ణోగ్రతలు 2 సెల్సియస్ డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగి, ‘అత్యంత బలమైన’ ఎల్ నినో వచ్చే అవకాశం 25 శాతం వరకూ ఉంది’’ అని అమెరికా సముద్ర వాతావరణ సంస్థ ‘నేషనల్ ఓషియానిక్ అండ్ ఎట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్’ (ఎన్.ఓ.ఎ.ఎ.) హెచ్చరించింది.వ్యక్తిగతంగా శాస్త్రవేత్తలు కూడా ‘భద్రం బీ కేర్ ఫుల్’ అంటున్నారు. ‘‘చాలా వాతావరణ నమూనాలు (క్లైమేట్ మోడల్స్) ఉష్ణోగ్రత పెరుగుదల 2 సెల్సియస్ డిగ్రీల లోపే ఉంటుందని చెబుతున్నప్పటికీ, అది 2 సెల్సియస్ డిగ్రీలను దాటే అవకాశం కూడా ఉండటం అన్నది ఆందోళన కలిగిస్తోంది’’ అని ‘యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్’ సంస్థ సభ్యులు డాక్టర్ మార్క్ అలెస్సీ కలవర పడుతున్నారు. ‘‘గత 140 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైన ‘ఎల్ నినో’ వచ్చే అవకాశం ఈ ఏడాది మే నెలలో ఉంది’’ అని న్యూయార్క్ స్టేట్ యూనివర్శిటీ వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ పాల్ రౌండీ అంటున్నారు. ‘ఎల్ నినో’ అంటే తెలిసిందేప్రకృతిలో సహజంగా జరిగే మార్పుల్లో ‘ఎల్ నినో’ ఒకటి. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంలోని నీరు సాధారణం కంటే ఎక్కువ వేడెక్కినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో పెద్ద మార్పులు వస్తాయి. కానీ ఇప్పుడొస్తున్నది సూపర్ ఎలన్ నినో అంటున్నారు. అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 2 సెల్సియస్ డిగ్రీల కంటే ఎక్కువ పెరిగినప్పుడు సంభవించే పరిణామం. అయితే శాస్త్రవేత్తలు అధికారికంగా ‘సూపర్’ అనే ఈ పదాన్ని పెద్దగా వాడరు. వాతావరణ నమూనాలన్నీ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ‘ఎల్ నినో’ మరింత తీవ్రం కానుంది. అంటే ఈ మే నెల నుంచి రాబోయే రోజుల్లో ప్రపంచం భారీ ఎండలను, ఎండలతో పాటుగా అసాధారణ వాతావరణ మార్పులను, అకాల భారీ వర్షాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎల్ నినో అన్నది లక్షల ఏళ్లుగా ఉన్నదే అయినా, ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తున్న సంకేతాల ప్రకారం ఈ ఏడాది, చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన ఎల్ నినోలలో ఒకటిగా నమోదయ్యే అవకాశం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.వేడి ఎలా పెరుగుతుంది?ఎల్ నినో సమయంలో, పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కిన నీరు అంతటా విస్తరిస్తుంది. దీనివల్ల భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. సముద్రంలోని ఈ వేడి, వాతావరణంలోకి విడుదలయ్యి, కొన్ని నెలల పాటు భూమిని వేడెక్కిస్తుంది. ఈ ఏడాది ఎల్ నినో, సూపర్ ఎల్ నినో అవొచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. పసిఫిక్ మహాసముద్రంలో సాధారణంగా ఏప్రిల్ నెలలో ఉండే వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తును అంచనా వేయడం కష్టం. ఈ అడ్డంకిని శాస్త్రవేత్తలు ‘ఏప్రిల్ అడ్డంకి’ అంటారు. వాళ్ల పరిభాషలో అది ‘స్ప్రింగ్ ప్రిడిక్టబిలిటీ బారియర్’. అయినప్పటికీ, ఈసారి సూపర్ ఎల్ నినో వస్తుందని శాస్త్ర నిపుణులు గట్టిగానే చెబుతున్నారు.ఎల్ నినో చరిత్రలో 2024వాతావరణ మార్పు, ఎల్ నినో అనేవి రెండు వేర్వేరు అంశాలు. ఎల్ నినో అనేది వాతావరణ మార్పుల వల్ల ఏర్పడేది కాదు. ఇది ప్రకృతిలో సహజంగా జరిగే ప్రక్రియ. అలాగే గ్రీన్హౌస్ ప్రభావం వల్ల ఎల్ నినో మరింత తీవ్రమవుతుందని చెప్పడానికి కూడా ఇప్పటి వరకు శాస్త్రవేత్తల దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవు. వాతావరణ మార్పుల వల్ల భూమి వేడెక్కుతోంది. దీనికి బలమైన ఎల్ నినో కూడా తోడైతే, ఆ అదనపు వేడి కారణంగా ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరిగిపోతాయి. గ్రీన్హౌస్ వాయువులు, బలమైన ఎల్ నినో కలవడం వల్లే 2024 చరిత్రలోనే అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచింది. ఇక ఇప్పుడు ‘సూపర్’ ఎల్ నినో వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో, ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ వర్షాలు, లేదా కరువు కాటకాలు సంభవించ వచ్చు. ఈ ఏడాదే ఎందుకని?!ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం, ఈ ఏడాది మే, జూన్ నెలల్లో భూమిపై దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, కరీబియన్ దీవులు, యూరప్, ఉత్తర ఆఫ్రికాలో ఈ ప్రభావం కనిపించవచ్చు. దీనివల్ల దక్షిణమెరికా, తూర్పు ఆఫ్రికా ప్రాంతం, మధ్య ఆసియాలో విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉంది; ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో తీవ్రమైన కరవు ఏర్పడవచ్చు. ఆగ్నేయ ఆసియా దేశాలలో అడవులు అంటుకుని మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి, నీటి లభ్యత, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. ‘సూపర్’ అనే మాట కొత్తది!పసిఫిక్ మహాసముద్రంలో క్రమబద్ధంగా మారే వాతావరణ మార్పులను ‘ఎల్ నినో సదరన్ ఆసిలేషన్’(ఇ.ఎన్.ఎస్.ఓ.) అని పిలుస్తారు. ఇందులో ప్రధానంగా రెండు దశలు ఉంటాయి. ఒకటి: ‘ఎల్ నినో’ (వేడి దశ), రెండు : ‘లా నినా’ (చల్లని దశ). ఈ దశలు ప్రతి రెండు నుండి ఏడు సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, గాలులు వర్షపాతంలో ఊహించని మార్పులను కలిగిస్తాయి. ఇక, ఇ.ఎన్.ఎస్.ఓ.లోని మూడో దశ ‘తటస్థ స్థితి’. ఎల్ నినో ఈ ఏడాది తీవ్రంగా ఉంటుందని చెప్పటానికే దీనిని ‘సూపర్ ఎల్ నినో’ అని అభివర్ణిస్తున్నారు.ఎల్ నినో : ఈ దశలో పసిఫిక్ మహాసముద్రం; మధ్య, తూర్పు ప్రాంతాల్లో నీటి ఉపరితలం సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కుతుంది. భూమధ్యరేఖ వెంబడి తూర్పు నుండి పడమరకు వీచే గాలులు బలహీనపడతాయి. కొన్నిసార్లు ఇవి అందుకు భిన్నంగా పడమర నుండి తూర్పుకు వీస్తాయి. ఈ ప్రభావంతో ఇండోనేషియా వంటి ప్రాంతాల్లో వర్షాలు తగ్గిపోతాయి. కానీ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో వర్షాలు పెరుగుతాయి!లా నినా : ఈ దశలో పసిఫిక్ మహాసముద్రం; మధ్య, తూర్పు ప్రాంతాల్లో నీరు సాధారణం కంటే ఎక్కువగా చల్లబడుతుంది. తూర్పు నుండి వీచే గాలులు మరింత బలంగా మారుతాయి. ఆ ప్రభావంతో ఇండోనేషియాలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, కానీ పసిఫిక్ మహాసముద్ర మధ్య ప్రాంతంలో వర్షాలు తగ్గుతాయి.తటస్థ స్థితి : ఇది ఎల్ నినో గానీ, లా నినా గానీ ఉండని సమయం. ఈ స్థితిలో పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు సాధారణంగా సగటు స్థాయిలోనే ఉంటాయి. ్చపసిఫిక్ మహా సముద్రంలోనే ఎందుకు?నిజానికి ఇతర మహాసముద్రాల్లో కూడా చిన్నపాటి వాతావరణ మార్పులు జరుగుతుంటాయి, కానీ ‘ఎల్ నినో’ అంతటి శక్తిమంతమైన మార్పులు కేవలం పసిఫిక్ మహాసముద్రంలోనే రావడానికి ముఖ్య కారణం ఆ సముద్ర పరిమాణం. ఉదా : అట్లాంటిక్ మహాసముద్రం ఒక నీళ్ల టబ్ లాంటిదైతే, పసిఫిక్ మహాసముద్రం ఒక పెద్ద చెరువు లాంటిది. టబ్లో నీటిని కదిలిస్తే చిన్న అలలు మాత్రమే వస్తాయి, కానీ పెద్ద చెరువులో నీరు కదిలితే అది చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. ఇక్కడా అంతే. పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ఎంత వెడల్పుగా ఉంటుందంటే, భూమధ్యరేఖ వద్ద ఇది భూమి చుట్టుకొలతలో దాదాపు సగానికి పైగా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం చాలా విశాలంగా ఉండటం వల్ల, దాని తూర్పు ప్రాంతానికి (దక్షిణమెరికా), పశ్చిమ ప్రాంతానికి (ఇండోనేషియా) మధ్య ఉష్ణోగ్రతల్లో భారీ తేడా ఉంటుంది. ఈ భారీ తేడానే ప్రపంచవ్యాప్త గాలులను శాసిస్తుంది. చిన్న సముద్రాల్లో ఉష్ణోగ్రత తేడాలు తక్కువగా ఉంటాయి, కాబట్టి అవి వాతావరణాన్ని అంతగా ప్రభావితం చేయలేవు.‘క్లైమేట్ మోడల్స్’ అంటే?భూమి, సముద్రాలు, భూతలం పైన వాతావరణాలు ఎలా మారుతాయో అంచనా వేసే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్ ప్రోగ్రాములే ‘క్లైమేట్ మోడల్స్. ఇవి గాలి వేగం, ఉష్ణోగ్రత, గ్రీన్హౌస్ వాయువుల వంటి గణిత సమీకరణాలను ఉపయోగించి భవిష్యత్తులో వాతావరణం ఎలా ఉండబోతుందో ముందే చెబుతాయి. శాస్త్రవేత్తలు వీటిని ఉపయోగించి ఎల్ నినో వంటి మార్పులను లెక్కిస్తారు.‘బాల యేసు’ అని అర్థం!‘ఎల్ నినో’ అనే పదం స్పానిష్ భాష నుండి వచ్చింది, దీని అర్థం ‘బాలుడు‘ లేదా ‘బాల యేసు’ (బేబీ జీసస్). పసిఫిక్ మహాసముద్రంలో ఈ వేడి నీటి ప్రవాహం సాధారణంగా డిసెంబర్ (క్రిస్మస్) సమయంలో కనిపిస్తుంది కాబట్టి, దక్షిణ అమెరికా జాలర్లు దీనికి ఆ పేరు పెట్టారు. దక్షిణ అమెరికాలోని పెరూ దేశపు జాలర్లు వందల ఏళ్ల క్రితమే ఎల్ నినో ఉనికిని కనిపెట్టారు. -
హేమకాంతుడి వైశాఖధర్మం
కృతయుగంలో వంగదేశాన్ని కుశకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతడి కుమారుడు హేమకాంతుడు. ఒకనాడు హేమకాంతుడు కొందరు భటులను వెంటబెట్టుకుని, వేట కోసం అడవికి వెళ్లాడు. అది వైశాఖమాసం. హేమకాంతుడు అడవిలో అనేక మృగాలను వేటాడాడు. మధ్యాహ్నవేళ ఎండ నడినెత్తికి వచ్చేసరికి అతడు బాగా అలసిపోయాడు. విశ్రాంతికి తగిన చోటు కోసం వెదుకులాడుతూ, అడవిలోనే ఉన్న మునుల ఆశ్రమ ప్రదేశానికి చేరుకున్నాడు.అక్కడ ఉండేవారు శతర్చినులు అనే మునులు. వారు అతిథి సత్కారాల వంటి విప్రకృత్యాలను ఎరుగరు. వారెరిగిన కర్మ తపశ్చర్య మాత్రమే! హేమకాంతుడు ఆ ఆశ్రమ ప్రదేశంలో అడుగుపెట్టే వేళకు శతర్చినులు తపస్సమాధిలో ఉన్నారు. బాహ్యస్పృహను మరచి సమాధి స్థితిలో ఉన్న వారికి హేమకాంతుడి ఆగమనం తెలియలేదు. హేమకాంతుడు సమీపానికి వచ్చినా, వారు అతడి రాకను గుర్తించలేదు. రాజైన తనను మునులు పట్టించుకోనందున హేమకాంతుడు ఆగ్రహం చెందాడు. వారిని చంపాలని నిశ్చయించుకుని, వారిపైకి కత్తి దూశాడు. హేమకాంతుడి దూకుడు గమనించిన శతర్చినుల శిష్యులు అక్కడకు పరుగు పరుగున వచ్చారు. ‘‘ఓరీ దురాత్ముడా! మా గురువులైన శతర్చినులు తపస్సమాధిలో ఉన్నారు. బాహ్యస్పృహలో లేని వారిపైకి కత్తి దూయడం తగని పని. మునులను వధించబూనడం మహాపాతకం, పాపాత్ముడా!’’ అని పలికారు.ముని శిష్యుల మాటలకు హేమకాంతుడు ‘‘విప్రులారా! నేను వేట కోసం ఈ అడవిలోకి వచ్చాను. వేటలో అలసిపోయి, ఇక్కడకు చేరుకున్నాను. మీ గురువులకు వీలు లేకపోతే, మీరైనా నాకు భోజనం పెట్టండి’’ అన్నాడు.‘‘రాజా! మేము గురువులు పెట్టిన భిక్ష తిని బతుకుతున్నాము. వారి అనుమతి లేకుండా ఏ పనీ చేయలేము. వారి ఆజ్ఞ లేనిదే నీకు అతిథి సత్కారాలు చేయడం మాకు కుదరని పని’’ అని పలికారు ముని శిష్యులు. వారి మాటలకు హేమకాంతుడు మండిపడ్డాడు. వారి చంపడానికి విల్లు సంధించాడు. ‘‘దుర్మార్గమైన దొంగలు, క్రూరమృగాలు లేకుండా ఈ అరణ్యాన్ని చక్కదిద్దాను. మీకు భయం లేకుండా చేశాను. మీరు మా వలన అగ్రహారాది సత్కారాలను, ఉపకారాలను పొందారు. ఈ మునులు చేసిన మేలు మరచి, నేను ఇక్కడకు వచ్చినా, నా వంక చూడటం లేదు. ఆకలి దప్పులతో అలసి సొలసి వచ్చిన నాకు అన్నం పెట్టడానికి మీరు వెనుకాడుతున్నారు. మీలాంటి క్రూరులను సంహరించినా పాపం ఉండదు’’ అని పలికి, బాణం విడిచాడు.హేమకాంతుడు ఆగ్రహంతో బాణం సంధించేసరికే ముని శిష్యులు భయభ్రాంతులై అడవిలోకి పారిపోయారు. కోపం చల్లారని హేమకాంతుడు వారిని వెంబడించి, వారిపై బాణ ప్రయోగం చేశాడు. అతడి బాణాలకు మూడువందల మంది శిష్యులు మరణించారు. మిగిలిన వారు పారిపోయారు.ఈ కలకలం సద్దుమణిగాక, హేమకాంతుడి ఆజ్ఞపై రాజభటులు ఆశ్రమాల్లోకి చొరబడి, దొరికిన వంట పదార్థాలను తీసుకొచ్చారు. అందరూ వాటిని ఆరగించాక, కాసేపు విశ్రమించి, సాయంత్రం ఇంటికి బయలుదేరారు.అడవిలో తన కొడుకు హేమకాంతుడు చేసిన దుష్కార్యం తెలుసుకుని, కుశకేతుడు దుఃఖించాడు. కొడుకును నిందించాడు. ‘‘నీవంటి దుర్మార్గుడు రాజ్యపాలనకు తగడు’’ అని పలికి అతడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు.తండ్రి ఆజ్ఞతో హేమకాంతుడు ఇల్లు వదిలి, కీకారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ అతడు బ్రహ్మహత్యా పాతకంతో బాధపడుతూ కిరాతునిలా దొరికిన పక్షులను, జంతువులను వేటాడుతూ, వాటి మాంసం తింటూ జీవించసాగాడు. హేమకాంతుడు అలా ఇరవై ఎనిమిదేళ్లు ఆ అరణ్యంలోనే గడిపాడు. ఒక వైశాఖ దినాన త్రితుడు అనే ముని తీర్థయాత్రలకు బయలుదేరి ఆ అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ, మధ్యాహ్న వేళ ఎండ వేడికి తాళలేక మూర్ఛపోయాడు. అదృష్టవశాత్తు హేమకాంతుడు మూర్ఛిల్లిన మునిని గమనించి, అతడికి మోదుగు ఆకుల గొడుగు నీడ కల్పించి, శైత్యోపచారాలు చేశాడు. ముని స్పృహలోకి వచ్చాక అతడికి సొరకాయ బుర్రలో ఉన్న నీరు ఇచ్చి, దప్పిక తీర్చాడు. మార్గాయాసంతో మూర్ఛిల్లిన మునికి శైత్యోపచారాలు చేయడం వల్ల హేమకాంతుడి బ్రహ్మహత్యా పాతకం నశించింది. అతడి మనసు నిర్మలమైంది. అప్పటి నుంచి అతడు సదా శ్రీహరిని స్మరించసాగాడు. కొంతకాలానికి హేమకాంతుడు వ్యాధిగ్రస్థుడై మరణించాడు. అతడిని తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. అదే సమయంలో విష్ణుదూతలు వచ్చి, యమదూతలను అడ్డుకున్నారు. హేమకాంతుడు వైశాఖ ధర్మాలను నెరవేర్చాడని, అందువల్ల అతడి పాపాలన్నీ నశించాయని, అతడిని వైకుంఠానికి తీసుకు రమ్మని శ్రీహరి ఆజ్ఞ అని చెప్పి, యమదూతలను తరిమేశారు. విష్ణుదూతలతో కలసి హేమకాంతుడు వైకుంఠానికి చేరుకున్నాడు.∙సాంఖ్యాయన -
క్లూషియల్: అతడే హంతకుడు
ఒక్కసారిగా ఆ ప్రాంతం పోలీస్ సైరన్లతో నిండిపోయింది.కరుడుగట్టిన నేరస్థుడు, రెండు రోజుల క్రితమే బెయిల్ మీద బయటకు వచ్చిన రాకీ సెవెన్హిల్స్ బస్టాప్ దగ్గర హత్యకు గురయ్యాడు. అతడి గొంతు నులిమి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది కూడా అదే! ఇన్స్పెక్టర్ అభిమన్యు దర్యాప్తులో ముందుగా రాకీ క్రిమినల్ హిస్టరీ చూశాడు. అతను చేయని నేరం లేదు, పాల్పడని ఘోరం లేదు. గంజాయి అమ్మకం నుంచి ఆడపిల్లల్ని వేధించడం వరకు అతని మీద చాలా కేసులు ఉన్నాయి.రాకీ చనిపోవడానికి మూడు గంటల ముందు ఒక అమ్మాయిని వెంటపడి ఏడిపించాడు. ఆమె చెప్పు తీసి అతడిని బెదిరించింది. ఇద్దరి మధ్య జరిగిన గొడవ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. రాత్రి తొమ్మిది గంటలకు ఈ గొడవ జరిగింది. అప్పుడే పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ రావడం చూసి, రాకీ అక్కడి నుంచి తప్పుకున్నాడు.ఇది జరిగిన మూడు గంటల తర్వాత పోలీస్ స్టేషన్కు ఫోన్ వచ్చింది. సెవన్హిల్స్ బస్టాప్ దగ్గర రాకీ శవం పడి ఉందని ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్లో చెప్పాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు.ఇన్స్పెక్టర్ అభిమన్యు అక్కడ గుమిగూడిన జనాన్ని జరిగిన హత్య గురించి అడిగాడు. వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. ఒక వ్యక్తి మాత్రం ముందుకు వచ్చాడు. రాకీని రాజీవి అనే అమ్మాయి బెదిరించిందని, తాను అప్పుడు అక్కడే ఉన్నానని చెప్పాడు. ఆ సంఘటనను తన ఫోన్లో చిత్రించినట్టు చెప్పి, తన ఫోన్ ఇచ్చాడు. అందులో రాజీవి అనే అమ్మాయి ‘నిన్ను చంపేస్తాను’ అని రాకీని బెదిరించడం స్పష్టంగా ఉంది. మరో గంటలో రాజీవి ఇంటి ముందున్నాడు అభిమన్యు. తాను కోపంతో అతడిని చంపేస్తానని బెదిరించిన మాట నిజమే అని, ఆ తర్వాత భయంతో ఇంటికి వచ్చేశానని రాజీవి చెప్పింది.ఒక మామూలు అమ్మాయి ఒక్కతే అంత దృఢంగా ఉండే రాకీని చంపగలదా?రాకీ ఒంటిపై ఉన్న గాయాలు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ చేసినట్లుగా ఉన్నాయి.అభిమన్యు రాకీ ఫోన్ రికార్డులను పరిశీలించాడు. చనిపోవడానికి ముందు రాకీకి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించాడు.‘‘నీ పేరేంటి?’’ అడిగాడు అభిమన్యు అతడిని.రాకీని రాజీవి బెదిరించిన వీడియో తీసింది అతనే!‘‘రాజు...’’ తడబడుతూ చెప్పాడు అతడు.‘‘నీ అసలు పేరు చెప్పు వేలాయుధం’’ అన్నాడు అభిమన్యు. ఉలిక్కిపడిన ఆ వ్యక్తి కంగారుగా లేవబోయాడు.‘‘ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. నువ్వూ రాకీ తోడు దొంగలు. చెన్నైలో మీ పరిచయం. అతడు ఇక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. నువ్వు తప్పించుకున్నావు. మీ ఇద్దరి మధ్య డబ్బు గొడవలు ఉన్నాయి. బెయిల్ మీద విడుదలైన రాకీని చంపాలని నీ ప్లాన్. రాజీవితో రాకీకి జరిగిన గొడవ నీకు కలిసొచ్చింది. రాజీవిని దోషిగా నిలబెట్టి నువ్వు ఎస్కేప్ అవ్వాలనుకున్నావు. ఆ ప్రయత్నంలో నీ రెండో సిమ్తో పోలీసులకు ఫోన్ చేశావు. మొదటి సిమ్తో వీడియో తీశావు.రాకీకి ఫోన్ చేసి సెవెన్ హిల్స్ బస్టాప్ వెనుక వైపు రమ్మన్నావు. అక్కడ సీసీ కెమెరాలు లేవన్నది నిజమే. కానీ కాస్త దూరంలో నిర్మాణంలో వున్న ఒక భవన యజమాని సీసీ కెమెరాలు పెట్టించాడు. ఆ సీసీ కెమెరాల్లో నిర్మాణంలో వున్న భవనంలోకి నువ్వెళ్ళడం రికార్డు అయ్యింది. నీ క్రిమినల్ రికార్డు బయట పడింది. నువ్వు ఇందాక ఫోన్ ఇచ్చినప్పుడు ఫోన్ మీద నీ ఫింగర్ ప్రింట్స్, రాకీ ఒంటి మీద వున్న గుర్తులతో మ్యాచ్ అయ్యాయి. శిక్షకు సిద్ధంగా వుండు...’’ అన్నాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు.వేలాయుధాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.‘‘థాంక్యూ సర్! నన్ను సేవ్ చేశారు...’’ రాజీవి కృతజ్ఞతగా అంది.‘‘నేను న్యాయం చేశాను. నీ ధైర్యమే కరెక్ట్. కానీ వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఈ ఇబ్బంది ఉండేది కాదు’’ అంటూ ముందుకు కదిలాడు ఇన్స్పెక్టర్ అభిమన్యు. - శ్రీసుధామయి -
లిట్వరల్డ్: పేరు ‘జింకపిల్ల’, బెబ్బులి కూనయా...
సంగీత సారస్వతాలను చదువులతల్లి స్తన్యంతో పోల్చాడు మహాకవి కాళిదాసు. సంగీతం ఆపాతమధురంగానూ, సాహిత్యం ఆలోచనామృతంగానూ వుంటాయని కూడా ‘కవికులగురువు’ అన్నాడట. సంస్కృతం చదువుకోకపోయినా ఆ విషయం తెలిసిన ఇరవయ్యొకటో శతాబ్ది రచయిత్రి ఒకరున్నారు– ఆమె పేరు ఎల్ఫ్రైడ్ జెలెనిక్. ఆమె సాహిత్యం చదువుతుంటే శ్రావ్యంగా వుంటుందనేది అందరి అనుభవం; దాని గురించి ఆలోచించే కొద్దీ, మన సామాజిక జీవనం గురించిన ఆలోచన పదునెక్కుతూ పోతుందనేది మాత్రం కొందరి అనుభవమే! నవలా రచన– రూపక ప్రక్రియల్లో అందెవేసిన చెయ్యి అనిపించుకున్న ఎల్ఫ్రైడ్ జెలెనిక్ది ఆస్ట్రియా. 2004 నోబెల్ సాహిత్య పురస్కారం ఎల్ఫ్రైడ్ గెల్చుకున్నట్టు ప్రకటిస్తూ ఎంపిక సంఘం చేసిన ‘అధికారిక ప్రకటన’లో రచయిత్రి శైలికి జేజేలు పలుకుతూ ఇలా అన్నారు: ‘ఆమె నవలలూ, రూపకాల్లో సంగీతబద్ధమైన స్వరాలూ, అనుస్వరాలూ అసాధారణమైన భాషాభినివేశంతో జాలువారతాయి. జనం నెత్తిన లోకం రుద్దిన అరిగిపోయిన మూసకట్టు పదబంధాల అసంబద్ధతనూ, వాటి పెత్తందారీ పోకడలనూ ఎల్ఫ్రైడ్ శైలి బట్టబయలు చేస్తుంది!’– ఓ మూసకట్టు పదబంధాన్నే ఉపయోగించదలిస్తే, ‘ఈ మాటల్లో ఆవగింజంతైనా అతిశయోక్తి లేదూ’ అనొచ్చు. బాల్యం నుంచే, అరడజను సంగీతవాద్యాల్లో సుశిక్షితురాలైనందువల్లనే ఎల్ఫ్రైడ్ శైలి అంత శ్రావ్యతను ఆపాదించుకున్న దేమో! వియెన్నా సంగీత విశ్వవిద్యాలయం నుంచి –పిన్న వయసులోనే– ఆర్గనిస్టుగా పట్టా పొందారామె. ఆర్గన్తో పాటు పియానో, వయోలిన్, వయోలా, గిటార్, రికార్డర్ తదితర వాద్యాల్లో కూడా ఆమె ప్రవీణురాలు. పట్టా పొందిన కొద్ది రోజులకే, కుటుంబసంబంధాల కారణంగా ఎల్ఫ్రైడ్ తీవ్రమైన మానసిక ఆందోళన పాలబడ్డారు. చిత్తశాంతి కోసం తడుముకునే క్రమంలోనే ఆమె ఇరవయ్యేళ్ళ ప్రాయంలో కలంపట్టారు. మరుసటి సంవత్సరమే, తన తొలి కవితా సంకలనం ‘లిజా నీడ’తోనే ఎల్ఫ్రైడ్ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. నాటినుంచి నేటివరకూ, ఆమె సాహిత్యప్రస్థానం ఎదురులేకుండా సాగుతూనేవుంది.ఎల్ఫ్రైడ్ అంటే, చెక్ భాషలో ‘ప్రశాంతపాలిక’ అని అర్థమట! ఇక జెలెనిక్ అంటే, ‘జింకపిల్ల’ అని అర్థమట! బహుశా అందుకే కొందరు విమర్శకులు ఆమెని ‘ప్రశాంత హరిణం’ అనడం కద్దు. కానీ తొలి రచన మొదలుకొని నోబెల్ పురస్కారం అందుకున్న ఇరవయ్యేళ్ళకు –2024లో– రాసిన ఆత్మకథాత్మక నవల ‘వ్యక్తిగత వివరాలు’ వరకూ ఎక్కడా ఆమె ప్రశాంత హరిణంలా కనిపించదు. (ఈ రచనకు ప్రామాణిక ఇంగ్లిష్ అనువాదం ఇంతవరకూ వెలువడనే లేదు!) ‘అది ఓ కృతో, ఓ కీర్తనో కావచ్చు– లేదా, ఓ కథో కథానికో కావచ్చు అనునిత్యం ఓ కళాఖండం జీవం కోల్పోతూనే వుంటుంది. చరిత్రలో దాని చెలామణీ చెల్లిపోవడం వల్లనే అలా జరుగుతూ వుంటుంది. ఒకప్పుడు మరణమెరుగని కళాఖండాలుగా భావించిన రచనలే కాలక్రమంలో కనుమరుగైపోవచ్చు. వాటి గురించి భవిష్యత్ తరాలవారికి ఏమీ తెలియకుండానూ పోవచ్చు. అయినప్పటికీ, ప్రతి ఒక్క కళాఖండానికీ నాలుగు కాలాల పాటు బతికిబట్టకట్టే హక్కు ఉంది!’ అని ఎరికా కోహుట్తో అనిపిస్తారు ఎల్ఫ్రైడ్ ‘ద పియానో టీచర్’ నవలలో. (ఆ నవలకు ప్రధాన పాత్ర ఎరికాయే. 28 సంవత్సరాల తర్వాత మైకేల్ హానెక్ ఈ నవలను సినిమాగా తీశారు!) వియెన్నా సంగీత విశ్వవిద్యాలయంలో పియానో శిక్షణ విభాగంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకున్న ప్రొఫెసర్ ఎరికా. ఆమె అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న కళాకారిణి; మంచి శిక్షకురాలు కూడా! అయితే చండశాసనురాలి లాంటి తల్లి పెంపకంలో ఆమె ప్రతిభ రెక్కలు ముడుచుకుని బతుకీడుస్తూ వుంటుంది. వృత్తిజీవితం విషయానికివస్తే ఎరికా విద్యార్థులతో కటువుగా వ్యవహరించే శిక్షకురాలన్నట్లు రచయిత్రి చిత్రించారు. తన విద్యార్థులు అత్యున్నత ప్రమాణాలు సాధించాలనే ఆమె అలా ప్రవర్తిస్తూ వుంటుంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం, తల్లి పెట్టే ఆరళ్ళ కారణంగా ఎరికా చిత్తక్షోభకు గురవుతూ వుంటుంది. ఈ వైరుధ్యాన్ని ఎరికా ఎలా పరిష్కరించుకున్నదనేదే ఈ నవల్లో కథాంశం. ప్రొఫెసర్ ఎరికాకూ, యువ విద్యార్థి వాల్టర్ క్లెమర్కూ మధ్య అల్లుకున్న అనుబంధం ఆసరాతోనే ఆమె తన జీవన వైరుధ్యం పరిష్కరించుకున్నట్లు రాశారు ఎల్ఫ్రైడ్.ఈ వైరుధ్యం ఎరికాకే పరిమితమైంది కాదు– ఎల్ఫ్రైడ్ జీవితంలోనూ ఆమె ఇలాంటి వైరుధ్యం ఎదుర్కొన్న విషయం రచయిత్రే వెల్లడించారు. ఎరికా పాత్రకు రక్తమాంసాలతో పాటు ఆత్మను సైతం సమకూర్చడానికి ఈ ‘ఆత్మానుభవం’ రచయిత్రికి ఎంతో తోడ్పడి వుంటుంది. పైపైన చూస్తే ఇది చవకబారు ‘శృంగార నవల’గా అనిపించవచ్చు. సాహిత్యం ఆలోచనామృతమనే వాస్తవాన్ని మనసులో పెట్టుకుని చూసేవారికే, ఎల్ఫ్రైడ్ జెలెనిక్ దృష్టికోణంలోని విశిష్టత కనిపిస్తుంది.- మందలపర్తి కిషోర్ -
దేనినీ అతి చేయవద్దు
‘ఈ రోజుల్లో పిల్లలను అన్ని విషయాల్లోనూ అదే పనిగా పట్టుకొని ఉండటం వల్ల వారి ఎదుగుదలలో సమస్యలు వస్తున్నాయి’ అంటున్నారు సినీ దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్. ‘‘అమ్మను భూమాతతో పోల్చుతాం. భూమి ఎక్కడా ఆగిపోకుండా, తిరుగుతూనే ఉంటుంది. కానీ, పిల్లలమైన మనల్ని పడిపోకుండా నిలబెడుతుంది. అమ్మ కూడా అంతే. పిల్లలు వారి జీవితంలో నిలదొక్కుకోవడానికి తిరుగుతూనే ఉండాలి. కానీ, అతిగా పట్టుకోకూడదనేది నా ఆలోచన.ఆ(హా)ర్ట్ ఫుల్గా!నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా వారు నన్ను ఆర్ట్స్ నేర్చుకోమని ప్రోత్సహించారు. ఆ సమయంలోనే పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్ నేర్చుకున్నాను. ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ బుక్స్ చదివేదాన్ని. వేవిళ్లతో ఉన్నప్పుడు అవి నేర్చుకోవడం కష్టమనిపించేది. కానీ, తప్పేది కాదు. బాబు పుట్టాక వాడి కోసం మా ఆయన కేరింగ్ మరింత ఎక్కువయ్యింది. ‘ఇంత పొసెసివ్గా ఉండటం ఎందుకు?’ అనేదానిని. మా బంధువుల్లో కూడా చాలా మంది అంటుండేవారు. కానీ, ఆయన పట్టించుకునేవారు కాదు. నేను అది పొసెసివ్నెస్ అనుకున్నాను. అలాంటిది 6వ తరగతిలో ఉన్న బాబును స్టేట్ ఆర్ట్ కాంపిటీషన్కు మైసూరుకు ఒక్కణ్ణే పంపించారు. ఆ సమయంలో నేను భయపడ్డాను చిన్నపిల్లాడు కదా అని. కానీ, తను వినలేదు. తరుణ్ ఆ కాంపిటిషన్లో పాల్గొన్నాడు, ప్రైజ్ కూడా తీసుకొచ్చాడు. బాబు కోసం ఫుల్టైమ్ జాబ్ వద్దనుకున్నాను. దీనికి కూడా మావారే కారణం. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లినే ముందుగా వెతుక్కుంటారు. వారు ఒక దశకు వచ్చేవరకు తల్లితో ఉన్న అటాచ్మెంట్ దూరం అవకూడదు అనేవారు. దీంతో ఆర్ట్ టీచర్గా ఫుల్టైమ్ జాబ్ చేసే నేను పార్ట్ టైమ్కి షిఫ్ట్ అయ్యాను.ఈజీ ఫీలింగ్ వద్దుడబ్బులు పొదుపు, సంపాదన గురించి ఎప్పుడూ చెప్పలేదు. అలాగని, ఎప్పుడూ కండిషన్స్ పెట్టలేదు. ప్రతి తల్లీతండ్రీ సాధ్యమైనంత వరకు పిల్లల అవసరాలు తీర్చడానికే ప్రయత్నం చేస్తారు. మేం ఆర్థికంగా కష్టపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ, అవేవీ బాబుకు చెప్పలేదు. కానీ, నన్ను డబ్బులు అడిగితే మాత్రం నేరుగా ఇచ్చేదాన్ని కాదు. మావారికి డబ్బులు ఇచ్చి, ఆయననే ఇవ్వమనేదానిని. ‘అమ్మ సంపాదిస్తుంది. నేను అడిగితే ఈజీగా ఇచ్చేస్తుంది’ అనే ఫీలింగ్ బాబులో రాకూడదనుకున్నాను. డబ్బు గురించి కాదు ఆనందించే సందర్భాలు కోల్పోకూడదు అని తాపత్రయపడేదాన్ని. ఎందుకంటే మళ్లీ ఆ రోజులు, ఆ సందర్భాలు తిరిగి రావు.కథలా చెప్పాలినాకు ప్రతీదానితో కనెక్ట్ చేసి కథలు చెప్పడం అలవాటు. అలాగే సోలార్ ఎనర్జీతో మనకున్న బంధం, మన శరీరంలో ఉన్న అవయవాలతో బంధం ఎలా ఉంటుందో చెప్పేదాన్ని. నాన్న దేవాలయం, అమ్మ అందులో దేవత, బ్రదర్ పూజారి, ప్రసాదం అందరం కలిసి తినేది.. ఇలా ఒక కథలా చెబితే పిల్లలు ఆనందంగా వింటారు, ఆలోచిస్తారు. ఆ కుటుంబ బంధం కూడా బాగుంటుంది. పిల్లల ముందు బంధువుల్లో ఎవరి గురించీ చెడుగా చెప్పకూడదు.సరి చేయాలనుకోకూడదుపిల్లల మెదళ్లలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. పెయింటింగ్లో అయినా, ఏ సృజనాత్మక పనులు అయినా వారు చేసింది మనం సరిచేయవద్దు అనేది నా ఆలోచన. వారి మైండ్లో ఏముందో అది మన ముందు పెడతారు. దానిలో మనం కల్పించుకోవద్దు. మా అబ్బాయి ఎక్కడా పెయింటింగ్ నేర్చుకోలేదు. కానీ, పోర్ట్రయిట్స్ చాలా బాగా వేస్తాడు. తబలా వాయిస్తాడు. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లో కాలేజీ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి. నేను ఆర్ట్ టీచర్ని. కానీ, ఏదీ బాబు చేయిపట్టి నేర్పలేదు. కాలేజీ రోజుల్లోనే షార్ట్ ఫిల్మ్లు ప్లాన్ చేస్తుండేవాడు. అందుకు వాడి స్నేహితులు కూడా ఇంటికి వచ్చేవారు. వారందరికీ కావల్సినవి అమర్చిపెట్టేదాన్ని. తరుణ్ స్నేహితులు నాకు కూడా పిల్లలైపోయారు. ఇప్పటికీ వారందరితో స్నేహబంధం బాగుంటుంది.ఏ కాలానికి ఆ కాలంలో పిల్లల పెంపకంలో వివక్ష ఉంది. ఒత్తిడి ఉంది. ‘ఎక్కడికి వెళ్లావు, ఏం చేస్తున్నావు, అదెందుకు చేస్తున్నావు, ఇలా ఎందుకు ఉన్నావు... ’ అంటూ పదే పదే అంటూనే ఉంటారు. అయితే, పిల్లలకు కూడా బాధ్యత తెలుసు. ఎలా ఉండాలో తెలుసు. మనం ఒక ఫ్రెండ్లా గైడ్ చేయాలి. అంతవరకే మన విధి. అంతకు మించి ఎక్కువ పట్టుకోకూడదు’’ అని తెలిపారు. ∙నిర్మలారెడ్డి -
పీఛే చల్! ఇలా నడిచి చూశారా?
వాకింగ్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. కానీ అదే వాకింగ్ను వెనక్కి చేస్తే డబుల్ ఆరోగ్యం లభిస్తుందంటే నమ్మగలరా? నిజమే! ఫిట్నెస్ ప్రపంచంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ – ‘రెట్రో వాకింగ్’ బాగా పాపులర్ అవుతోంది. నిపుణుల ప్రకారం, ఇది సాధారణ వాకింగ్ కంటే మరింత ప్రయోజనాలు ఇచ్చే వ్యాయామం. ఇలా వెనక్కి నడిస్తే మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ముందుకు నడిచేటప్పుడు ఎక్కువగా పని చేయని కాళ్ల కండరాలు కూడా వెనక్కి నడిచేటప్పుడు యాక్షన్లోకి దిగుతాయి. సాధారణ వేగంతో నడిచినా దాదాపు ‘నలభై శాతం ఎక్కువ క్యాలరీలు’ కరిగిపోతాయి. అంటే తక్కువ టైమ్లో ఎక్కువ పని చేసినట్టే! ఇంకా మెదడు సంగతి చెప్పాలంటే, వెనక్కి నడవడం కొత్త పని కాబట్టి అది ఫుల్ అలర్ట్లోకి వెళ్లి బ్యాలెన్స్, ఫోకస్, జ్ఞాపకశక్తి అన్నింటినీ మరింత పదును పెడుతుంది. కొందరికి వెన్నునొప్పి, కాళ్లు బిగపట్టడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అయితే ఒక విషయం మాత్రం తప్పక గుర్తుంచుకోండి. మొదట రెండు నుంచి మూడు నిమిషాలు నెమ్మదిగా, ఖాళీ ప్రదేశంలో మాత్రమే ప్రయత్నించండి. లేదంటే వ్యాయామం కంటే ముందు యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది! ∙ -
ఈ వారం కథ: కొత్త రంగుల పొద్దు
‘‘ఆహా... జిల్లా అయిపోవడంకాదు గాని, ఏందసి పట్టింది ఈ ఏరియాకి! ఒకప్పుడు దెయ్యాలు తిరిగే సోటిది. నా సిన్నపుడు సేపలు పడ్డానికి కూడా ఇటైపు రావడానికే బయమేస్సీది..’’ నిర్మానుష్యంగా కంకరరోడ్లతో అక్కడక్కడా వేసిన కరెంటు స్తంభాల్ని, కట్టిన భవంతుల్ని చూస్తూ అన్నాడు మరియదాసు.‘‘ఎద్దెప్పుడు ఒకేపక్క తొంగోదు. ఊరెప్పుడూ ఒకేలాగ ఉండిపోదు సిన్నాన్న. ఆటో వచ్చీసింది. పద... పద... సామాన్లు దించిద్దుము.’’ దూరంగా నిల్చున్న ఇద్దరిలో ఒకడైన కృపారావు నడుస్తూ అన్నాడు. రంగులు వేయని భారీ మట్టివిగ్రహంలా బూడిద రంగులో వారివెనుకే అంతెత్తున కనిపిస్తోంది కొత్త ఇల్లు.ఆటోలో నుంచి బకెట్లు, బ్లేడ్లు, పుట్టిబస్తాలు, కేరేజీలు కిందకి దించి; లోపల వాటిని జాగ్రత్తగా భద్రపరచారు. విశాలమైన రూములు, కిచెన్, వెయిటింగ్ హాల్, ఔటర్ బాత్రూమ్, లావెట్రీలతో చుట్టూ కాంపౌండ్ వాల్తో ఇల్లు ముచ్చటగా వుంది. నడివేసవి. ఉదయం పదిగంటల సమయం. బహిరంగప్రదేశం అయినప్పటికీ వాతావరణంలో ఉక్కపోత. ముందు రూమ్లో ముగ్గురూ వరసలో నిలబడి అర్ధనిమీలిత నేత్రాలతో, భక్తిప్రపత్తులతో చేతులు జోడించి నోరు విప్పారు.‘‘ఆదియునూ అంతమునూ అయిన యేసయ్యా... లోకంలో సర్వశక్తిమంతుడైన ప్రభువా... మేము ఈరోజు నుంచి తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమగునటుల...’’ దైవప్రార్ధన ముగిసింది. ఒంటిమీద షర్టుల్ని, ఫాంటుల్ని విప్పి ఒక దగ్గర ఒబ్బిడిగా ఉంచి, షార్ట్లు, బనియన్లు వేసుకున్నారు.పెద్దబ్లేడ్లతో గోడల్ని గీకే పనిని కృపారావు, ఎర్రయ్య మొదలుపెట్టారు. బకెట్లో మెషిన్ ఆన్ చేసి పుట్టి పౌడర్ను నీటితో కలియబెట్టే పనిలో పడ్డాడు దాసు.‘‘సిన్నాన్న... మనలో మన మాట. ఇల్లు సూస్తే పెద్దది. పని చేస్తే ఎక్కువే. ఓనరు ఇచ్చిన లచ్చాఏభైవేల వర్కులో మన కూల్లు పోగా మనకేటైనా మిగుల్తాదా?’’ తొలి ప్రశ్న వేసేడు పాతికేళ్ల కృపారావు.‘‘నీకా డవుటేల? అందిన కూల్లే మనకు గట్టి.’’ బ్లేడ్లకు సర్దిన పుట్టిముద్దను గోడకు రాస్తూ అన్నాడు దాసు.‘‘మరి ఇంతోటి పనిని కాంట్రక్టుకి సెయ్యడమేల?’’‘‘సెయ్యక ఏటి సేస్తామురా? మనుషులెట్టి, లచ్చలకు లచ్చలు మదుపులెట్టి కాంట్రాక్టు పనులు సేస్తూ బొక్లీసుగా తిరగడానికి మనకాడ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులున్నాయేటి? కూలాడితేనే గదా కుండాడతాది...’’‘‘అవునులే సిన్నన్నా.’’‘‘అందికే అన్నీ మూసుకొని మన పని మనం కామ్గా సేసుకోవాల. ఇలాంటి పనులు సెయ్యమని నిగడదీసి తొంగుంటే నష్టం మనకే, ఆలకి కాదు. కూడు జల్లితే కాకులు కరువా! ఇరవైరోజుల్లోన ఈ వర్క్ అయిపోవాలట. అద్దమైందా...’’ దాసు మాటకి బుద్ధిగా తలూపేడు కృపారావు‘‘షాపు ఓనర్ల పనే బాగుందన్నా. ఒక పక్క ఏపారాలు, మరోపక్క లాభాలు...’’ నవ్వాడు ఎర్రయ్య.‘‘షాపు ఓనరుకి మనతోన అగ్రిమెంట్ లక్షాఏభై. ఇంటి ఓనరుతో ఎంతకి వప్పన్నమో మనకి తెలీదు. అయినా అతనెంత తింటే మనకెందుకు? మన పని మనం సూస్కోవాలి గానీ...’’మొదటి రూమ్ పుట్టిపని పూర్తయ్యింది. రెండో రూమ్ కోసం సిద్ధమవుతున్నాడు దాసు.ఇంతలో టీలు వచ్చాయి. ముగ్గురూ టీలు తాగి విశ్రాంతిగా కూర్చున్నారు. నోట్లో ఒంపుకున్న ఖైనీలు పళ్లకింద నలుగుతున్నాయి.మధ్యాహ్నం రెండింటికి అన్నాలు తిని పని ముగించేసరికి చీకటి పడింది. ఇరవైయ్యో రోజున ఇంటి ఓనరు వచ్చాడు. మార్పు చేర్పులేవో చెప్పాడు. దానికో రోజు పట్టింది. తర్వాత రోజు సాయంత్రం.., గంగరాజు షాపు దగ్గరికి ముగ్గురూ చేరేరు. అంతవరకూ ఇచ్చిన మెటీరియల్ మొదలుకొని ఆటోచార్జీలు, నిచ్చెనల అద్దె వరకూ అయిన ఖర్చులన్నీ లెక్కలేసి చివరకు లక్షాఏభై మూడువేలుకు బిల్లు తేల్చాడు షాపు ఓనరు. అదనంగా తనకు మూడు వేలు ఖర్చయ్యిందని కనుక చివరిరోజు కూలీ రాదని దాసుతో చావుకబురు చివరికి చల్లగా చెప్పాడు. అవాక్కయ్యాడు దాసు. కృపారావుకి ఒళ్ళు మండింది.‘‘ఇదన్నేయం... కూలీ ఇవ్వననడం మీకు దరమ్ము కాదు.’’ బతిమాలుతున్న ధోరణిలో ఆక్రోశించాడు దాసు. పక్కనున్న గొడౌన్లోకి వెళ్లేందుకుగాను కిందకు దిగిన గంగరాజు సన్నగా నవ్వి అన్నాడు..‘‘చివరిరోజు కూలీ నీక్కావాలి. మంచిదే. కాదనను. కానీ అనుకున్న దానికంటే మూడు వేలు ఎక్కువయ్యింది. మరి దాని మాటేటి? ఇరవై రోజుల్లో పనవ్వాలని కండిషను. అయ్యిందేటి? ముందే కంప్లీట్ చేసేస్తే కాదంటానా? మిగిల్తే తీసుకోవడానికి రడీగా ఉన్నప్పుడు తగిలినప్పుడు కూడా భరించాలోయ్.రోజంతా పన్చేసి వట్టిసేతుల్తో ఇంటికి తిరిగి ఎలాగెల్లమంటారు సర్..’’ అన్నాడు కృపారావు.‘‘సరే. మీ కూలీ మీకిచ్చేస్తాను. కానీ నాకో పని చెయ్యాలి.’’‘‘ఏటి సార్ అది?’’‘‘పుట్టిబస్తాలు, రంగుడబ్బాల లోడు రేపొస్తది. మనషాపు ముందే వేను ఆపుతాడు. మీ ముగ్గురూ ఉదయం ఏడింటికల్లా వచ్చి పెరిగీయండి. చాలు... ఎంత... రెండు గంటల పని. మీ డబ్బులు మీకిచ్చేస్తాను. ఇంకో పనికి కూడా మీరు వెళ్లిపోవచ్చు.’’ తను చెప్పాల్సింది చెప్పి గోడౌన్లోకి దూరిపోయాడు ఓనరు.ముఖాలు వేలాడేసుకొని ముగ్గురూ ఇళ్లకు తిరిగొచ్చేశారు. నీళ్లలో ఉడుకుతోన్న గవ్వసున్నం మాదిరిగా దారిపొడవునా కృపారావు కుతకుతలాడుతూనే ఉన్నాడు. జేవురించిన ముఖంతో ముద్దగా ఉండిపోయాడు దాసు.రాత్రి పదకొండయ్యింది. కృపారావుకి చాలాసేపు నిద్ర పట్టలేదు. చివాల్న లేచి బయటకి వచ్చాడు. ఆరుబయట వేసుకున్న మంచాలపై పగలంతా పడ్డ కష్టాన్ని మరిచి మత్తుగా నిద్రపోతోంది ఇందిరా కాలనీ. ఎక్కడో వీధికుక్కొకటి అరుస్తూ ఉంది. ఎదురింట్లోకి వెళ్లి నిద్రపోతున్న దాసుని తట్టి లేపాడు.కృపారావుని అలా చూసేసరికి దాసుకి నిద్రమత్తంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది.‘‘ఎక్కడా సూడనేదు ఇంత అన్నేయం... అన్ని కర్సులు మన మీద పడీసి అనవసర కండీషన్లు పెట్టీసి, సివరికి ఒకపూట కూలీ ఎగ్గొట్టీసి మల్లీ రేపు పనికొస్తే డబ్బులు ఇస్తానంటాడా... ఏటి ఆడికంత సోస. మనకేటి సేతకాదన... సెయ్యలేమన... అసలు తప్పు ఆడిది కాదు, నీది. ఎంటనే కాలరు పట్టుకొని నలుగుర్లో కడిగీసి ఉంటే దెబ్బకి అటో ఇటో తేలిపోను. ఇప్పుడు సూడు... సచ్చినట్టుగా ఎల్లాలి.’’పిచ్చెక్కినవాడిలా అరిచాడు కృపారావు. గ్లాసుతో అతనికి నీళ్లిచ్చి, తాగమని చెప్పి తాపీగా బీడీ వెలిగించి గట్టిగా దమ్ము లాగాడు దాసు.‘‘ఒరేయి ఎర్రినాయాల... నువ్వీ మజ్జిన వచ్చినావు. నీకివి కొత్త. నువ్వే కాదు, నేను కూడా నీకంటే గట్టిగా అరవగల్ను. దానివలన లాభమేటి? అక్కడితో కట్... ఇంకో పనికి మనల్ని పిలరు. పిలనియ్యరు. బ్లాక్ లిస్ట్ అంటారే, అలాగ... ఓనర్లంతా ఇక్కడ సిండికేటురా నాయన.’’ అన్నాడు దాసు.‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము?’’‘‘పలాన ఇన్ని రోజులని ఇంకనుకోలేదురా. అనుకున్న ఎంటనే చెప్తాన్లే..’’ పకాలున నవ్వాడు దాసు.‘‘ఇదిగో... అలాటి కుయ్యోత్తులాడితేనే నాకు సిరాకు..’’‘‘లేకపోతే యేట్రా? పెశ్నించడం సులువే... జవాబు సెప్పడమే కష్టం. అందులోని నువ్వడిగిన పెశ్నకు జవాబు తెలిస్తే మనమెందుకిలాగ ఉంటాము. మన బతుకులెందుకిలాగుంటాయి.?’’ నిదానంగా అన్నాడు దాసు.‘‘మా గొప్పగా సెలవిచ్చెవులే... నిన్నడగడం నాదే బుద్ది తక్కువ.’’ చిరాగ్గా వెళ్ళిపోయాడు కృపారావు.మంచంపై పడుకున్నాడేగానీ దాసుకి కూడా ఎంతకూ నిద్ర పట్టడం లేదు. అటూ ఇటూ దొర్లుతున్నాడు.‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము?’’తన యవ్వనారంభ దశలో తండ్రికి వేసిన అదే ప్రశ్న. ఈసారి కృపారావు నుంచి మరోసారి... నిద్ర రానివ్వని ప్రశ్న.. జవాబు దొరకని ప్రశ్న... మనసులో సుళ్ళు తిరుగుతూ... సుమారు పాతికేళ్ల నాటి పరిస్థితి. పేరుకే ఆ ఊరు మున్సిపాలిటీ. పల్లె కంటే కొంచెం ఎక్కువగానూ పట్నం కంటే చాలా తక్కువగానూ ఉంటుందా ఊరు. ఊరి చివరన ప్రధాన రహదారికి ఒక పక్కన చాకలి వీధి, గొడగలవీధి, మొండివీధి, దిగువ రాజ్యం... ఇలా అనేక వీధుల సముదాయంలో ఇందిరాకాలనీ ఇంకొంచెం ముందుంటుంది. ముందుగా ఎండియ్య టీకొట్టు,దానిపక్కనే కొత్తపట్నం షావుకారి కిరాణా దుకాణం, ఇంకొంచెం దూరంలో పొంగడాలు, బూరెలు, దుంపలు అమ్మే నీలవేణి బడ్డీ, అంతా కలిపి వంద గడపతో కనిపిస్తుంది. కంపు గొడుతూ పందులు తాగే కుడితి తొట్టెలు అన్ని చోట్లా... ప్రభుత్వ రుణాలతో అగ్గిపెట్టెల్లా లేచిన స్లాబ్ ఇళ్ళు కొన్ని చోట్ల కనిపిస్తాయి.‘‘నాలుగైపోతంది... మాట గాసేస్తానేటో... దాసుగాడేడి?’’చివికిన రెల్లుగడ్డితో పొగచూరిన పైకప్పును చూస్తూ మట్టి అరుగుపై ఉన్న బొంతపై అటూ ఇటూ దొర్లుతున్న ఆదెయ్య, నర్సమ్మను అలా అడగడం నాలుగోసారి.‘‘అడివి నుంచి ఇప్పుడే వొచ్చినాను గదా. నాకేటి తెల్సు?’’రెండురూపాయలిచ్చి ఎండియ్య టీకొట్టు నుంచి దోసకాయచెంబు నిండా టీ తీసుకువచ్చిన నరసమ్మ అంది. రెండు గ్లాసుల నిండా సర్ది భర్తకొకటి ఇచ్చి తనొకటి తీసుకొని తాగడం మొదలుపెట్టిందామె.పొద్దున్ననగా గంజన్నం, పిండొడెంతో కారేజీ సర్దుకొని, దగ్గర్లో ఉన్న అడవికి వెళ్తుందామె. మారేడు, ఉసిరిక పత్రీ, బంగాళాకుల్ని తెంపి, పెద్ద గోనె సంచిలోకి మూటకట్టి ఇంటికి తీసుకువస్తుంది. పత్రిని చిన్న కట్టలుగా కట్టి రోజూ గుడికి వెళ్లే శ్రీమంతుల ఇళ్లకూ, బంగాళాకుల్ని పెద్ద కట్టలుగా కట్టి హోటళ్లకూ, కిరాణా షాపులకు సరఫరా చేస్తూ నెలకింతని సంపాదిస్తుందామె. అందుకని ఆమెకు ఆకుల నర్సమ్మ అని మరోపేరు. ‘‘అదిగో... మాటల్లోనే వస్తన్నాడు బాబు.’’ తువ్వాలు మూటను చేత్తో పట్టుకుని వస్తోన్న దాసుని చూసి అంది నరసమ్మ. గడపలోకి రాగానే మూటను విప్పి దాసు గచ్చు మీద విదిల్చాడు.‘‘ఎక్కడ పట్టేర్రా ఇవి.?’’ కిందామీదా పడుతూ కొట్టుకుంటోన్న మిట్టల్ని చూస్తూ అంది నరసమ్మ.‘‘పెట్రోలుబంకు ఎనకాతల మళ్లల్లో గుమ్ములు నేవా... అక్కడ. నానూ, పిట్టడు, సొట్టరాజుగాడు ముగ్గురము కలిసి పట్టేము.’’ అన్నాడు దాసు.సంబరంగా తపేలాలో వాటిని సర్ది లోపలకు వెళ్ళిపోయిందామె.‘‘దాసు... టైము నాలుగైంది. పిల్లల్ని తీసుకురాడానికి ఎల్లవేటి?’’ అన్నాడు ఆదెయ్య.‘‘ఆ... ఇదిగిదిగో... ఎల్తన్నాను.’’ఇంటి పక్కనున్న రిక్షాను రోడ్ మీదకు ఎక్కించి రయ్మని తొక్కుకుంటూ వెళ్లిపోయాడు దాసు.మూడిళ్లల్లోని పిల్లల్ని రోజూ స్కూలుకు రిక్షామీద తిప్పే ఆదెయ్యకు గత వారం నుంచి బాగోలేదు.అందుకని డాక్టర్ సలహా మేరకు కొడుక్కి ఆ పనిని ఒప్పజెప్పాడు ఆదెయ్య. కొడుకు తెచ్చిన చేపలకి తోడు నెయ్యిల సీతమ్మ దగ్గర పదిరూపాయిలకు పిత్తపరిగెల వాటాను తీసుకుంది నరసమ్మ. పరిగెల్ని పులుసుగానూ, మిట్టల్ని ఇగురుగానూ వండింది. భార్యచేత తిట్లు తినడం ఇష్టంలేని ఆదెయ్య మందెయ్యకుండానే తొలిసారి నీసుకూరతో ఆ రాత్రికి భోజనం కానిచ్చాడు.దాసుకి ఆటలంటే ఇష్టం. ఇంటరు పోవడానికి అతని ఆటలే సగం కారణం. పగలంతా పక్కనున్న రామయ్యబందలో రోజూ మిత్రులతో కలిసి వాలీబాల్ ఆడతాడు. శుక్రవారం రాత్రయితే చాలు ఉత్సాహంగా రోడ్లపై తిరుగుతాడు. షాపులు కట్టే వేళల్లో దిష్టికని వాటిముందు కొట్టే కొబ్బరి చిప్పల్ని వరసగా ఏరతాడు. కొత్తపట్నం షావుకారి దగ్గర కొన్న పది రూపాయల పంచదార పొట్లాన్నీ, తన వాటాగా వచ్చిన కొబ్బరిచిప్పల్నీ తల్లికిస్తాడు. వాటితో కొబ్బరి చక్కీల్ని పొయ్యడమో, ఒక్కోసారి అంబలితో కారంగా నంజుకునే కొబ్బరిపచ్చడి చెయ్యడమో చేసేదామె. రోజులో రెండు తడవలు పిల్లల్ని స్కూల్లో దింపాక బయట బేరాలకని నెయ్యిల వీధి సెంటర్లో రిక్షాను ఉంచుతాడు ఆదెయ్య. పాసెంజర్లకు మొదట బేరమెంతో చెప్పి ఆనక వాళ్ళెంత ఇస్తే అంత అందుకుని ‘సాలదు బాబూ’ అని గొణుక్కుంటూ వెళ్లిపోవడం అతనికలవాటు. అందుచేత అతని వ్యవహారం చూసి అసలుబేరం కంటే తక్కువ ఇచ్చేవాళ్లే ఎక్కువ. ఆదివారంనాడు శుభ్రంగా తయారై బైబిల్ చేత పట్టుకొని కుటుంబంతో సహా చర్చికి వెళ్లి దైవవాక్యం వినడం అతనికిష్టం.అదేరోజు సాయంత్రం కలిగినవారి కుటుంబాల్ని సినిమా థియేటర్లకు దిగబెట్టి వాళ్ళెంత ఇస్తే అంత తీసుకొని తిరిగొచ్చేయడం అతని బలహీనత. ఇక్కడే దాసుకీ, ఆదెయ్యకి నప్పేది కాదు. శ్రమకి తగిన డబ్బుని అడగడంలో తప్పేముందని తండ్రిని ప్రశ్నించేవాడు. గొడవ పడేవాడు.‘‘అలాగడిగిన మనిషికి ఇలువుండదురా. ఆలంతా పెద్దోలు. అవకాశాలున్నోలు. మనం ఆమాత్రం మురాబు వుంచుకుంటే ఎవరైన సాయపడరేటి..?’’ అనేవాడు తండ్రి.‘‘అది నీ బ్రెమ... ఎవరైనా ఎందుకు చేస్తారు?’’‘‘అలగనీకరా... ఏమో... ఎవరితో ఏ అవసరముంతాదో!’’‘‘అలాగని ఎన్నాల్లిలా భరిస్తాము? ’’జవాబు చెప్పలేక మౌనంగా ఉండే ఆదెయ్యను మరిక రెట్టించేవాడు కాదు దాసు. కాని ఆ ప్రశ్నమాత్రం అతనిలో బలంగా పాతుకుపోయింది. కొన్నాళ్లకి తల్లిదండ్రులు గతించడంతో గానుగెద్దులా కష్టపడటమే తప్ప అతనికి మరొకటి తెలియకుండా పోయింది.కాలక్రమేణా టౌన్ రూపురేఖలతోపాటు, వీధి రూపురేఖలు కూడా మారిపోయాయి. రిక్షాలు మాయమై ఆటోలు, తోపుడు బళ్ళు ప్రవేశించాయి. రిక్షా కార్మికులు, సిమెంట్, ఐరన్ షాపుల్లో కళాసీలుగానూ, తాపీ మేస్త్రీలుగానూ, కాయగూరలు అమ్మే చిల్లర వర్తకులుగాను మారేరు. పది పాసైన కుర్రాళ్లంతా ఆర్మీలోకి వెళ్ళిపోతే, పోయిన వాళ్లంతా నగరాల్లో సెక్యూరిటీ గార్డులయ్యారు. కొద్దిమంది మాత్రమే ఉద్యోగస్తులయ్యేరు. ఎటూ వెళ్లలేని దాసులాంటి వారు పెయింటర్లయ్యారు. కానీ అతనితో పాటు అతనిలో ఏళ్ల తరబడి అంటుకట్టుకొని పోయిన ఒకప్పటి అతనిప్రశ్న మాత్రం సలపరించే గాయమై బాధిస్తూనే ఉంది. కొన్ని తరాల నుంచి తమ కుటుంబం సమాజం పట్ల ప్రదర్శించిన విధేయత, మంచితనం వలన ఒరిగిందేంటి? తండ్రి ఆశించిన మేలేదైనా జరిగిందా? లేదే! అలాంటప్పుడు ఎందుకీ అనవసరపు తాపత్రయం. స్వతంత్రంగా బతకలేమా... సగౌరవంగా బతికి చూపించలేమా... సగం రాత్రి వరకు దాసులో సాగిన ఆలోచనలెన్నో! మూత్రం పోయడానికని బయటకు వచ్చి, ఆ పని కానిచ్చి యథాలాపంగా బయట నిల్చున్నాడు దాసు. నిర్మానుష్యంగా... నిశ్శబ్దంగా ఉన్న రోడ్డుపై ఒక చేత్తో వెలుగు దారి చూపిస్తూ, మరొక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని నిల్చుని ఉన్న నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం వీధి లైటు వెలుతురులో దూరంగా, మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. వెలుగు రేఖలేవో ప్రసరించినట్టయ్యింది.‘లోడు దించడానికి ఉదయాన్నే గభీల్న ఎల్లాల... ఏటయితే అదవ్వనీ... తర్వాత సూద్దుము.’ మంచంపై పడుకుంటూ మనసులో అనుకున్నాడు దాసు. తెల్లవారి మూడు దాటాక అతనికి మాగన్నుగా నిద్ర పట్టింది.∙∙ తర్వాత రోజు ఉదయం పదిగంటలకు షాపు తెరవడానికి వచ్చిన గంగరాజు అక్కడి దృశ్యం చూసి కోపోద్రిక్తుడయ్యాడు. పట్టరాని ఆవేశంతో సెల్ తీసి దాసుకి ఫోన్ చేశాడు. నిమిషాల్లో ఎర్రయ్య, కృపారావులతో పాటు మరికొంతమందిని వెంటబెట్టుకొని వచ్చాడు దాసు..‘‘దాసూ... నేను చెయ్యమన్నదేంటి... నువ్వు చేసిందేంటి? ‘‘షాపుముందు వరసగా పేర్చి ఉన్న పుట్టి బ్యాగుల్ని, రంగు డబ్బాల్ని చూస్తూ అన్నాడు గంగరాజు.‘‘మీరు సెప్పిందే గదేటి... ఇంకేటి సేశాను?.’’ అన్నాడు దాసు.‘‘ఏం చెప్పాను..?’’‘‘లోడుని పెరిగీమన్నారు... పెరిగీసాం గదా..’’‘‘పెరిగీడమంటే గౌడౌన్ లోపలకి పెట్టాలని తెలీదా?’’ విరుచుకుపడ్డాడు గంగరాజు.‘‘ఆ మాట నిన్న మీరనలేదు గదా.’’‘‘అలాగని రోడ్ మీద దించేస్తారా ..’’‘‘టైమెక్కడిది సారూ? మీరే గదా రెండు గంటల్లో దించేసి ఇంకో పనికి ఎళ్లిపొమ్మన్నారు?’’‘‘ఏటివోయ్ దాసు... కొత్తగా మాట్లాడుతున్నావు. ఏటి సంగతి...’’‘‘మేమేటి కొత్తగా అనడంలేదు. మీరన్నదే... మా కూల్లు మాకిచ్చేస్తే మేమింకో పనికి ఎళ్ళిపోతాం.’’‘‘గోడౌన్ తాళాల కోసం ఇంటికి రాకపోతే లోడు రాలేదేటోననుకున్నాను. ఇలాంటి మడతపేచీ ఉందనుకోలేదు. సరే, తగువెందుకులే గానీ ముందు లోపలకి సామాన్లు పెరిగీయండి. డబ్బులిచ్చేస్తాను.’’ కొంచెం మెత్తబడి అన్నాడు గంగరాజు.‘‘కుదరదు.’’‘‘ఏం... ఎందుకని? ‘‘‘‘నిన్నటిది ఇయ్యాల్టిది... కలిపి రెండు రోజులు కూలవుద్ది... పెరిగీమంటారా?’’‘‘కూలీ ఒక్కరోజుదే కదా... రెండు రోజులేటి?’’‘‘అదంతే... ఇష్టం నేకపోతే సెప్పండి. లోడు ఇక్కడే ఇక్కడే వుంటాది... మా దారిన మేము పోతాము. ఎవులుతో పెరిగిస్తావో చూస్తాము. అంతేకాదు ముందు డబ్బిస్తేనే పని. నేదంటే నేదు...’’ఆ మాటకి గంగరాజు కోపం నషాళానికి అంటింది. అయినా తమాయించుకున్నాడు. చేసేదేంలేక నాలుగువేల ఎనిమిది వందల రూపాయలు జేబులోనుంచి చిరాగ్గా తీసి దాసుకి అందించాడు. లోడు గోడౌన్లోకి చేరింది. ఊపిరి పీల్చుకున్నాడు గంగరాజు. జేబులోనుంచి పన్నెండు వందలు తీసి అతని చేతిలో పెట్టాడు దాసు. ప్రశ్నార్థకంగా చూశాడతను.‘‘నిన్నటిది పూర్తి కూలీ. ఈ రోజుది సగం కూలీ. పోను మిగతాది ఈ డబ్బు... మీరే దాసుకోండి. కోట్లు గడించీయండి. మాకేటి ఎంగిలి కూడు అక్కర్లేదు మీలాగ...’’అన్నాడు దాసు. చేతిలో నలిగిన నోట్లనీ... నిశ్చలంగా ఉన్న దాసు ముఖాన్నీ చూస్తూ ఏదో మాట్లాడబోయాడు గంగరాజు. కానీ దాసు అవేవీ వినిపించుకోలేదు. నింగికెగసిన పక్షుల గుంపులో తానొక పక్షిలా స్వేఛ్ఛగా తనవారితో కలిసి వడివడిగా రోడ్డు దాటి వెళ్ళిపోయాడు.- పాలకొల్లు రామలింగస్వామి -
ఆరోగ్యవంతమైన సోడా..!
రంగు రంగుల చల్లని సోడా పానీయాలకు వేసవిలో గిరాకీ విపరీతంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతుంటారు. కృత్రిమ రంగులు, మితిమీరిన మోతాదులో చక్కెర కలిపి తయారుచేసే సోడా పానీయాలు ఆరోగ్యానికి హానికరమే అనడంలో ఎలాంటి సందేహాం లేదు. అయితే, జపాన్లో దొరికే ఈ సోడా పానీయం మాత్రం చాలా ఆరోగ్యకరమైనది. ఎందుకంటే, ఇది మజ్జిగతో తయారు చేసే సోడా.‘కాల్పికో సోడా’ పేరుతో 1919 నుంచి ఇది జపాన్లో అమ్ముడవుతోంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఇందులోనూ చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇది పొట్టకు మేలు చేస్తుంది. ఇందులో ఎలాంటి హానికర రసాయనాలు, కృత్రిమ రంగులు ఉండవు. ఒకరకంగా ఇది ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన సోడా పానీయం అని చెప్పవచ్చు. (చదవండి: ఈ ఐస్క్రీమ్... చాలా హాట్ గురూ!) -
కథాకళి: ఓ వర్షం రాత్రి
జిగ్నేష్కి అతని క్లాస్మేట్ కావ్యమణి ఐదేళ్ళ తర్వాత అకస్మాత్తుగా మెట్రోలో తారసపడింది. ఇద్దరూ ఒకే స్టేషన్ లో దిగాక జిగ్నేష్ ఆమెని ఎదురుగా ఉన్న కాఫీ షాప్కి ఆహ్వానించాడు. మోమోస్ తిని, కాఫీ తాగుతూ ఒకరి గురించి మరొకరు చెప్పుకున్నారు. కావ్యమణికి పెళ్ళై విడాకులు కూడా అయ్యాయని తెలిశాక అతను ఆహ్వానించాడు.‘‘మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. ఈ రాత్రికి మా ఇంటికి రారాదు? నువ్వు వర్కింగ్ ఉమెన్ ్స హాస్టల్లో ఉంటున్నావు కాబట్టి ఎవరి అనుమతి అవసరం లేదు.’’‘‘ఆలోచిస్తాను. ఇందుకు మెంటల్గా నేను ప్రిపేర్ అవడానికి కొంత సమయం పడుతుంది. సాయంత్రం ఐదు తర్వాత ఫోన్ చేస్తాను.’’ కావ్యమణి జవాబు చెప్పింది. ‘‘నేను వంట కూడా బాగా చేస్తాను.’’ జిగ్నేష్ ‘వంట’ పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పాడు. ఆరున్నర దాకా అతను ఆమె ఫోన్ చేస్తుందా, లేదా అనే ఆదుర్దాకి గురయ్యాడు. ఆరు ముప్ఫై ఐదుకి కావ్యమణి నుంచి ఫోన్ వచ్చింది. ‘‘మీ ఇంటికి ఎలా రావాలో లొకేషన్ పంపు. నేను ఎనిమిదిన్నరకి రావచ్చా?’’‘‘ష్యూర్ అండ్ థాంక్స్.’’ విప్పారిన మొహంతో చెప్పాడు.అతను ఎనిమిదింటికి బియ్యం నానపెట్టాడు. ఫ్రిజ్ తెరచి కూరగాయలు తరిగి సిద్ధం చేశాడు. ఎనిమిదింపావుకి ఆకాశంలో మబ్బులు కనిపించాయి. మెరుపులని చూసి వర్షం వస్తుందని అనిపించాక కావ్యమణి రావటం విరమించుకుంటుందా అని భయపడ్డాడు.వంటపనిలో ఉండగా డోర్ బెల్ మోగితే తలుపు తెరిచాడు. మంచి పెర్ఫ్యూమ్ వాసన. కావ్యమణి వచ్చింది. ఆమె తన హెల్మెట్ని సోఫా మీద ఉంచి అడిగింది.‘‘నా స్కూటీని కార్ పార్క్లో నీ కారు వెనక పార్క్ చేశాను. ఓకే కదా?’’‘‘ఓకే.’’ఆమె ఫ్రెంచ్ డోర్ని తెరిచి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోకి కొద్ది క్షణాలు చూసి మళ్ళీ లోపలకి వచ్చి అడిగింది.‘‘స్నాక్స్ ఏమైనా ఉన్నాయా? ఆకలిగా ఉంది.’’‘‘కూర్చో. నాలుగైదు నిమిషాల్లో బర్గర్ చేస్తాను.’’అతను బర్గర్ పేటీని డీప్ఫ్రీజర్లోంచి తీసి, రెండువైపులా నెయ్యి స్ప్రే చేసి, ఏర్ ఫ్రైయర్లో ఉంచి, మూడు నిమిషాల తర్వాత వెనక్కి తిప్పాడు. ఈలోగా టొమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర కోసి, బర్గర్ బన్ మధ్యకి కోసి పెనం మీద కాల్చాడు. బర్గర్లో అన్నిటినీ పెట్టేముందు టొమాటో, మస్టర్డ్, చిల్లీ సాస్లు వేశాడు.‘‘బావుంది. బావుంది కాదు. ఎక్సలెంట్.’’ చెప్పి ఆమె జీరో కోక్ తాగింది.జిగ్నేష్ భార్య పుట్టింటికి కానుపుకి వెళ్ళి నాలుగు నెలలైంది. అతనికి అప్పటి నించి స్త్రీ సంపర్కం లేదు. తొందరగా ఉంది.‘‘వాతావరణం బావుంది కదా?’’ బాల్కనీలోంచి ఫ్రెంచ్ డోర్ ద్వారా చల్లటి గాలి వీస్తూండటంతో అడిగాడు.‘‘అవును. మనకి చక్కటి మూడ్ ఇచ్చే వాతావరణం.’’ కావ్యమణి చెప్పింది.ఆమెకి తన భార్య నైటీ ఇచ్చాడు. అతని ఎదురుగానే దాన్ని మార్చుకుంది. ఆమెని కౌగిలించుకుని చుంబించబోయాడు. అకస్మాత్తుగా ఫ్రెంచ్ డోర్ లోంచి తూనీగలు, రెక్కల పురుగులు, వందల సంఖ్యలో లోపలికి రాసాగాయి. అతను ఆమెని వదిలి ఫ్రెంచ్ డోర్ మూయబోయాడు.‘‘ఒద్దు.’’ కావ్యమణి అతన్ని ఆపి చెప్పింది.‘‘ఒద్దేమిటి? దీపం పురుగులు.’’ ఆశ్చర్యంగా చెప్పాడు.కావ్యమణి నేలరాలిన ఓ పురుగుని తీసి పరిశీలించి చూసి ఆనందంగా చెప్పింది.‘‘ఉసుళ్ళు.’’‘‘ఉసుళ్ళా?’’‘‘అవును. వీటిని ఉసుళ్ళు అంటాం. మీ ఇంటి దగ్గరలో చెదల పుట్టలు ఉండి ఉండాలి. వాటికి ఎండాకాలం వానకి రెక్కలు వచ్చి, మూకుమ్మడిగా పుట్టలోంచి బయటికి వస్తాయని, వీటి ఆయుష్షు నాలుగైదు గంటలు మాత్రమేనని చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పింది. ఇవి ప్రొటీన్ ఫుడ్ అని తెలుసా? వీటిని వేయించుకుని తింటాం. చాలా రుచిగా ఉంటాయి. చాలా కాలానికి భలే దొరికాయి.’’కావ్యమణి ఓ బేసిన్ లో నేలరాలిన ఉసుళ్ళని ఏరి, వాటి ట్రాన్స్పరెంట్ రెక్కలను తుంచి, పురుగులను బేసిన్ లో వేయడాన్ని జిగ్నేష్ అసహ్యంగా చూశాడు. ఆమె ఆ పనిని అరగంటకి పైగా పూర్తి చేశాక స్టవ్ వెలిగించి, ఆ పురుగులను నూనెలో వేయించి ఉప్పు కారం కలిపి రెండు ప్లేట్లలో పెట్టి తెచ్చింది.‘‘తిను. చాలా టేస్టీ.’’‘‘నో. థేంక్స్. నువ్వే తిను.’’ఆమె వాటిని తింటూంటే చెప్పాడు.‘‘నేను బయటికి వెళ్ళొస్తాను.’’అతను ఆ రాత్రి తిరిగి రాలేదు. మర్నాడు ఉదయం అతను వచ్చేసరికి కావ్యమణి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమై, అతని కోసం ఎదురుచూస్తోంది.‘‘రాత్రి నువ్వు రానని టెక్స్ట్ మెసేజ్ ఇచ్చావు. ఏమైంది?’’ అడిగింది.‘‘అర్జంట్గా ఆఫీస్ పని చేయాల్సివచ్చింది.’’ఆమె వెళ్ళాక అతను బేసిన్ ను, బాణలిని చెత్త డబ్బాలో పడేసి, ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతూ అనుకున్నాడు.‘ఇంకా నయం. త్వరపడి కావ్యమణి పెదాలని ముద్దు పెట్టుకోలేదు’ ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
మెల్లగా కరిగే నైస్..ఐస్
నిశ్శబ్దంగా గ్లాసు అంచున చేరి, చల్లని స్పర్శతో పరిచయం అవుతుంది. ఆయుష్షు రెండు నిమిషాలే అయినా, వచ్చిన క్షణం నుంచే చిరునవ్వులు కురిపిస్తుంది. ఉన్నంత సేపూ ‘చిల్’ చేస్తూ, రోజంతటి అలసటను కరిగించేస్తుంది.మాయమైయ్యే ఆఖరి క్షణం కూడా మనసు నిండా ప్రశాంతతను నింపి, మీకొక ‘కూల్ క్యారెక్టర్’నిస్తుంది. ఇంతకీ ఎవరీ కూల్ ఫ్రెండ్ అనుకుంటున్నారా? ఇంకెవరు.. మన పానీయాల ప్రథమ బంధువు, ‘ఐస్’! అవును, నిన్నటి దాకా ఒక తెల్లటి మొండి మంచు గడ్డగా మాత్రమే కనిపించే ఇది. నేడు, ఒక అపురూపమైన వజ్రంలా ‘క్రాఫ్ట్ ఐస్’గా రూపు మార్చుకుని, విలాసానికి చిరునామాగా మార్కెట్లో మెరిసే ఐస్వర్యంగా మారిపోయింది! ఒక రాతిని మలిస్తే ఎలా శిల్పంగా మారుతుందో, అచ్చం అలాగే ఐస్ కూడా వివిధ రూపాల్లో క్రాఫ్ట్ ఐస్గా మారి, ప్రత్యేకమైన గౌరవం, హోదా, అందాన్ని సొంతం చేసుకుంటోంది. ఎందుకంటే, ఈ క్రాఫ్ట్ ఐస్, సాధారణ ఐస్ క్యూబ్ కంటే చాలా స్పష్టంగా అందంగా మెరుస్తూ, నెమ్మదిగా కరుగుతుంది. ఇది డ్రింక్ రుచిని కూడా మెరుగ్గా చేస్తుంది. అందుకే, ఇప్పటి ప్రపంచంలో డ్రింక్కి మొదటి హీరో క్రాఫ్ట్ ఐస్గామారింది. ఇదివరకు అది గ్లాస్లో నిశ్శబ్దంగా కూర్చునే ఒక ‘ఎక్స్ట్రా ప్లేయర్’. కాని ఇప్పుడు ఒక డ్రింక్ రుచి, లుక్ను మార్చేసే పవర్ సొంతం చేసుకొని స్టేజ్పై స్పాట్లైట్ దక్కించుకున్న ‘స్టార్’. ఎందుకంటే అది సాధారణ ఐస్ నుంచి క్రాఫ్ట్ ఐస్గా రూపాంతరం చెందింది. డ్రింక్ ఆర్డర్ చేసినప్పుడు చాలామంది అడిగేది ‘చల్లగా ఉందా?’ అని, కాని, గ్లాస్లో పడే ఐస్ ముక్క గురించి ఎవరూ ఆలోచించరు. దాని క్వాలిటీ, సైజ్, డిజైన్ వంటివన్నీ అసలు పట్టించుకునే వారే కారు. కాని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.మబ్బుల్లేని మంచు! ఇంట్లో తయారు చేసే ఐస్ క్యూబ్స్ను గమనించారా? మధ్యలో తెల్లగా, మబ్బు పట్టినట్టు కనిపిస్తాయి. సైన్స్ పరంగా, ఆ తెల్లటి మసక వివిధ గాలి బుడగలు, నీటిలోని చిన్న మలినాలు కలిసి గడ్డకట్టిన గుర్తు. కానీ క్రాఫ్ట్ ఐస్ మాత్రం అలా ఉండదు. ఇది ప్రత్యేక పద్ధతిలో నెమ్మదిగా, ఒకే దిశలో గడ్డకట్టేలా తయారవుతుంది. దాంతో గాలి బుడగలు బయటకు వెళ్లిపోతాయి, మిగిలేది మాత్రం పూర్తిగా పారదర్శకమైన స్వచ్ఛమైన మంచు. అందుకే దీనిని మబ్బుల్లేని మంచు అని కూడా అంటారు. ఇది అచ్చం పటిక బెల్లంలా, లేదా ఒక ఖరీదైన వజ్రంలా గ్లాస్లో మెరిసిపోతూ, చూడటానికి అందంగా ఉండటమే కాదు. నెమ్మదిగా కరిగి డ్రింక్ అసలు రుచిని అలాగే కాపాడుతుంది. చిన్న తేడా మాత్రమే అనిపించినా, ఇదే స్పష్టత ఒక సాధారణ పానీయానికి ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.ఎందుకు ముఖ్యం?సాధారణ ఐస్కి, క్రాఫ్ట్ ఐస్కి మధ్య ఉన్నది చిన్న తేడాలే అయినా, వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దవి. ఉదాహరణకు, ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుని ఊహించండి. అందులో వేసిన ఐస్ మసకగా, బుడగలతో నిండిపోయి ఉంటే అది కొంచెం అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. అదే గ్లాస్లో క్రిస్టల్లా మెరిసే క్రాఫ్ట్ ఐస్ ముక్క పడితే? ఆ గ్లాస్ ఒక్కసారిగా ప్రొఫెషనల్ లుక్లో స్టార్ హోటల్ రేంజ్ను సొంతం చేసుకుంటుంది. కేవలం చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, రుచి కూడా మెరుగ్గా అనిపిస్తుంది.ఐ స్ డిజైనర్స్! ఐస్ కూడా ఇప్పుడు ఒక డిజైనర్ ప్రాడక్ట్గా మారింది. బ్రాండెడ్ వాచీలు, ఖరీదైన ఫర్నిచర్ తరహాలోనే ఐస్ కూడా ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్. అందుకే మార్కెట్లో ‘ఐస్ డిజైనర్స్’ హడావుడి కూడా మొదలైంది. వీరు సృష్టించే మంచు ముక్కలు వజ్రంలా మెరిసే డైమండ్ షేప్లో, పర్ఫెక్ట్ ట్రైయాంగిల్, ఒక అందమైన పూల ఆకారాల్లో దర్శనమిస్తూ గ్లాసులో పడగానే ‘ఇది డ్రింక్ కాదు, ఒక అద్భుతమైన కళాఖండం’ అనే భావనను కలిగిస్తాయి. ఇందుకోసం, మార్కెట్లో కూడా ఈ ఐస్ తయారీకి ప్రత్యేకమైన టూల్స్, ట్రేలు, పిల్లలకు నచ్చేలా జంతువుల, మౌల్డ్స్, బాక్స్లు, టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో ఇంట్లో కూడా ఈ కొత్త ట్రెండ్ జోరుగా కనిపిస్తోంది.కామన్ ఐస్∙మసకగా, మబ్బుగా కనిపిస్తుంది. ∙త్వరగా కరిగిపోతుంది.∙త్వరగా కరిగిపోతే డ్రింక్ నీరుగా మారుతుంది.∙రుచి తగ్గిపోతుంది.క్రాఫ్ట్ ఐస్∙క్రిస్టల్లా స్పష్టంగా, పారదర్శకంగా కనిపిస్తుంది.∙నెమ్మదిగా కరుగుతుంది.డ్రింక్ రుచిని అలాగే ఉంచుతుంది. గ్లాస్ లుక్ కూడా మెరుగ్గా, మరింత స్టయిలిష్గా కనిపిస్తుంది.∙అంటే చిన్న ఐస్ ముక్కే పెద్ద డిఫరెన్స్ చేస్తుంది!చిన్న ట్విస్ట్!ప్రత్యేకమైన ఈ క్రాఫ్ట్ ఐస్ తయారీ విధానం వలన, ఈ ఐస్ తయారయ్యేందుకు సాధారణ ఐస్తో పోలిస్తే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈ నెమ్మదిగా గడ్డకట్టే ప్రక్రియ వలనే దీనికి ఆ స్పష్టత, బలం, అందం కూడా వస్తుంది. అంటే త్వరగా తయారయ్యే ఐస్ ఒక ‘ఫాస్ట్ ఫుడ్’ అయితే, క్రాఫ్ట్ ఐస్ మాత్రం నిజంగా ఒక ‘ఫైన్ డైనింగ్’ అనుభవం లాంటిదే! అందుకే దీని డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.సీక్రెట్ సైన్స్!క్రాఫ్ట్ ఐస్ ఇలా అద్దంలా మెరుస్తుందంటే, దానికి వెనుక ఒక చిన్న మాయ కాదు. ఒక పెద్ద సైన్స్ ఉంది. దీనికోసం ‘డైరెక్షనల్ ఫ్రీజింగ్’ అనే ప్రత్యేక టెక్నిక్ వాడతారు. పేరు వినగానే కొంచెం కష్టంగా అనిపించినా, కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్. అంటే నీరు అన్ని వైపులా కాకుండా, ఒకే ఒక వైపు నుంచి నెమ్మదిగా గడ్డకట్టేలా’ చేస్తారు. ఇలా చేస్తే, నీటిలో ఉన్న గాలి బుడగలు, చిన్న మలినాలు అన్నీ కింద భాగంలోకి వెళ్లిపోతాయి. పై భాగంలో మాత్రం అచ్చం అద్దంలా, వజ్రంలా మెరిసే స్వచ్ఛమైన మంచు మిగులుతుంది. అందుకే క్రాఫ్ట్ ఐస్ చూడగానే, ‘గ్లాస్ డైమెండ్గా’లా అనిపిస్తుంది.లక్షల ఏళ్ల నాటి చల్లదనం!కథ ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు దుబాయ్ లాంటి నగరాల్లో కొన్ని లగ్జరీ బార్లు మరింత స్పెషల్గా ఆలోచిస్తున్నాయి. ప్రత్యేకమైన అతిథుల కోసం సాధారణ క్రాఫ్ట్ ఐస్ కాదు. గ్రీ¯Œ లాండ్ గ్లేషియర్ల నుంచి తెప్పించిన లక్ష ఏళ్ల నాటి మంచు గడ్డలు వాడుతున్నారు. అవును, నిజంగానే! మనం రోజూ ఫ్రీజర్లో తయారు చేసే ఐస్ కొన్ని గంటల వయసు మాత్రమే ఉంటుంది. కానీ ఈ గ్లేషియర్ ఐస్ మాత్రం లక్ష ఏళ్ల చరిత్రను తనలో దాచుకుని ఉంటుంది. అందుకే ఇప్పుడు లగ్జరీ ప్రపంచంలో ఒక కొత్త జోక్ కూడా వినిపిస్తోంది. ‘డ్రింక్ ఎంత పాతదో కాదు, ఐస్ కూడా ఎంత పాతదో చెప్పాలి!’. అలా ఇప్పుడు లగ్జరీని గ్లాస్లో పడే ఐస్ ముక్కతో కూడా కొలుస్తున్నారు.ఇదొక పెద్ద బిజినెస్.. అప్పట్లో ప్రపంచంలో కాలుష్యం అనే మాటే లేదు! అందుకే ఆ కాలంలో ఏర్పడిన ఈ మంచు గడ్డలు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనవిగా భావిస్తారు. ఈ అరుదైన మంచును ‘ఆర్కిటిక్ ఐస్’ అనే స్టార్టప్ సేకరించి, ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ఇలా మీరు తాగుతున్నది కేవలం ఒక కాక్టెయిల్ మాత్రమే కాదు, హిమయుగం నాటి స్వచ్ఛతతో కూడిన చల్లదనం అంటూ, ఇదే విధంగా మరికొన్ని సంస్థలు కూడా వివిధ రకాల క్రాఫ్ట్ ఐస్ బిజినెస్ చేస్తున్నాయి. అంతేకాదు, ప్రపంచ మార్కెట్ లెక్కల ప్రకారం, క్రాఫ్ట్ ఐస్ మార్కెట్ 2031 నాటికి భారీగా పెరిగి, సుమారు 138.9 బిలియ¯Œ డాలర్లకు చేరుకోనుందని అంచనా. అంటే చిన్నగా కనిపించే ఈ ఐస్ ముక్క వెనుక ఇప్పుడొక పెద్ద బిజినెస్, పెద్ద ట్రెండ్, పెద్ద స్టేటస్ సింబల్ దాగి ఉన్నాయి.ప్రయోగాలన్నీ రుచికోసమే! ఆకలి తీర్చుకోవడం కోసం మాత్రమే కాకుండా, ప్రతి ముద్దలోనూ, ప్రతి గుటకలోనూ ఒక సరికొత్త అనుభూతిని వెతకడమే అసలైన భోజన ప్రియుల లక్షణం. అందుకే, జ్యూస్ గ్లాస్లో పడే ఐస్ ముక్క నుంచి కూరలో చివరగా చల్లే కొత్తిమీర వరకు మనం చేసే ప్రతి ప్రయోగం వెనుక ఒక అద్భుతమైన ‘రుచి రహస్యం’ దాగి ఉంటుంది. ఇలాంటి వారికోసమే, క్రాఫ్ట్ ఐస్ జ్యూస్కు ప్రాణం పోసే చిన్న చిన్న ప్రయోగాలు, రుచిని రెట్టింపు చేసే ఆ చిట్కాలు పాటిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం కొన్ని ‘ఇన్ఫ్యూజ్డ్ ఐస్’ పేరుతో వివిధ రకాల రుచికరమైన క్రాఫ్ట్ ఐస్ అందుబాటులో ఉన్నాయి.టీ ఫ్లేవర్డ్ ఐస్ఎడారిలో కూడా టీ తాగేటటువంటి చాయ్ లవర్స్కి ఇదొక కూల్ సొల్యూషన్. ఐస్డ్ టీలు లేదా కాక్టెయిల్స్ తాగేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఐస్ కరుగుతున్న కొద్దీ టీ ఫ్లేవర్ తగ్గకుండా, మరింత పెరుగుతుంది. ఇందుకోసం, ముందుగా మాచా టీ, గ్రీన్ టీ లేదా మీకు నచ్చిన ఏదైనా ఫ్లేవర్డ్ టీని డికాక్షన్లా మరిగించి చల్లార్చాలి. ఆ నీటిని ఐస్ ట్రేలలో పోసి గడ్డకట్టించాలి. కేవలం ఇంట్లో ఉండే టీ పొడి లేదా టీ బ్యాగులతో కేవలం రూ. 5 నుంచి రూ. 10లతో వీటిని తయారు చేసుకోవచ్చు.సిట్రస్ ఐస్డ్రింక్కి ఒక తాజాదనాన్ని ఇచ్చేందుకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇది కేవలం రుచినే కాదు, గ్లాసుకి మంచి సువాసనను కూడా ఇస్తుంది. సిట్రస్ రకాలకు చెందిన నిమ్మకాయ లేదా నారింజ పండు పై తొక్కల సన్నని తురుము ఇందుకోసం చాలా అవసరం. ఒక ఐస్ ట్రేలో నీళ్లు పోసి, అందులో ఈ తురుమును లేదా చిన్న నిమ్మ చెక్కలను వేసి ఫ్రీజ్ చేయాలి. దీనికి అయ్యే ఖర్చు దాదాపు సున్నా. కేవలం మనం వాడేసి పారేసే నిమ్మ తొక్కలతోనే వీటిని సిద్ధం చేసుకోవచ్చు.ఫ్రూట్ ఐస్పిల్లలకి ఇచ్చే జ్యూస్ల నుంచి పెద్దలు తాగే పానీయాల వరకు ఇది ఒక విజువల్ అండ్ టేస్టీ ట్రీట్. పుచ్చకాయ, దానిమ్మ , దాక్ష రసాన్ని తీసి, వడకట్టి నేరుగా ఐస్ ట్రేలలో పోయాలి. మరింత అందంగా కనిపించాలంటే రసంతో పాటు చిన్న పండ్ల ముక్కలను కూడా అందులో వేయవచ్చు. సాధారణంగా ఒక ట్రే ఐస్ కోసం రూ.20 నుంచి రూ. 50 వరకు ఖర్చు అవ్వచ్చు.డిఫరెంట్ షేప్డ్ ఐస్ఆకారమే ఇక్కడ ప్రధాన ఆకర్షణ. గుండ్రంగా, స్టార్ ఆకారంలో, హార్ట్ షేప్లో ఇలా ఎన్నో ప్రత్యేక ఆకారాల్లో ఐస్ తయారు చేస్తున్నారు. ఇవి గ్లాస్లో పడిన క్షణం నుంచే డ్రింక్ను ఒక స్టయిలిష్ ప్రెజెంటేష¯Œ గా మార్చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మార్కెట్లో లభించే సిలికా¯Œ ట్రేలు లేదా మోల్డ్లు ఉపయోగిస్తారు. ఒకసారి కొనుగోలు చేస్తే చాలా రోజుల పాటు వాడుకోవచ్చు. సాధారణంగా ఈ ట్రేలు రూ. 100 నుంచి రూ. 300 వరకు ఉంటాయి.ఎడిబుల్ గోల్డ్ – ఫ్లవర్ ఐస్ఇది అల్టిమేట్ రాయల్ లుక్ ఇచ్చే పద్ధతి. లగ్జరీ ఈవెంట్లలో దీనికి భలే క్రేజ్ ఉంటుంది. విజువల్ ట్రీట్ కోసం ఈ ఐస్ క్యూబ్స్ మధ్యలో అందమైన పువ్వులు, బంగారు రేకులను ఉంచుతూ గ్లాసును ఒక చిన్న సర్ర్పైజ్ బాక్స్లా తయారు చేస్తారు. ఇది కాస్త ఖరీదైన వ్యవహారం. రూ. 500 నుంచి పదివేలు అంతకు మించి కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది.రంగు రంగుల ఐస్గ్లాస్లో రంగులు మెరిస్తే, మనసు కూడా ఫ్రెష్ అయిపోతుంది కదా! అందుకే ఇప్పుడు రంగురంగుల ఐస్ కొత్త ట్రెండ్గా మారింది. ఇది ముఖ్యంగా పిల్లల పార్టీలు, బర్త్డే సెలబ్రేషన్లు లేదా సమ్మర్ డ్రింక్లకు స్పెషల్ అట్రాక్ష¯Œ గా ఉంటుంది. ఇందుకోసం నీటిలో సహజ రంగులు ఇచ్చే పండ్ల రసం లేదా ఫుడ్ కలర్ కొద్దిగా కలిపి ఐస్ ట్రేలలో పోసి గడ్డకట్టించాలి. ఖర్చు కూడా రూ. 10 నుంచి రూ. 30ల మధ్యలోనే సిద్ధం చేసుకోవచ్చు.ఫ్లేవర్డ్ ఐస్ఇది నిజంగా ఒక చిన్న సర్ప్రైజ్ లాంటిది. ఐస్ కరుగుతున్న కొద్ది కొత్త రుచి మెల్లగా డ్రింక్లో కలుస్తుంది. పుదీనా, తులసి, అల్లం, లేదా బెర్రీ పండ్లతో తయారు చేసే ఫ్లేవర్డ్ ఐస్ ఇప్పుడు చాలా పాపులర్. ఇందుకోసం మీకు నచ్చిన ఫ్లేవర్ పదార్థాలను చిన్నగా కట్ చేసి నీటిలో కలిపి ఐస్ ట్రేలో పోసి గడ్డకట్టించాలి. ఇది కేవలం చల్లదనం మాత్రమే కాదు, ఒక కొత్త రుచి ఇస్తుంది. దీని ఖర్చు రూ. 15 నుంచి రూ. 40 మధ్యలో ఉంటుంది.చల్లని సత్యం! కరిగిపోయే లోపే కంటికి విందును, మనసుకి హాయిని ఇచ్చే ఈ క్రాఫ్ట్ ఐస్– అచ్చం మన జీవితం లాగే షార్ట్ అండ్ స్వీట్! అందుకే, మీరు కూడా ఈ ‘కూల్ ఫ్రెండ్’తో ఒక్క రెండు నిమిషాలు చిల్ అవ్వండి, రోజంతటి అలసటను ఇట్టే మర్చిపోండి!-కొండి దీపిక -
ఈ ఐస్క్రీమ్... చాలా హాట్ గురూ!
ఐస్క్రీమ్ అంటే చల్లచల్లగా తియ్యతియ్యగా ఉంటుందనేగా మీ అంచనా! ఈ ఐస్క్రీమ్ను గనుక ఒక్కసారి రుచి చూస్తే మీ అంచనాలన్నీ పటాపంచలైపోతాయి. దీని రుచి నాలుకను తాకిన తక్షణమే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఒళ్లంతా ముచ్చెమటలు పడతాయి. ఇదెక్కడి ఐస్క్రీమ్ బాబోయ్! అని నోరెళ్లబెట్టి, గుడ్లు తేలేస్తారు. ఇది అలాంటిలాంటి ఐస్క్రీమ్ కాదు, దీని పేరు ‘కోల్డ్ స్వెట్’. అన్ని ఐస్క్రీమ్ల మాదిరిగానే చాలా చల్లగా ఉంటుంది. రుచి చూస్తేనే దీని అసలు తడాఖా తెలిసొస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన రకాల మిరపకాయలు, మిర్చి సాస్ వంటి వాటితో తయారు చేయడం వల్లనే ఇది ప్రపంచంలోనే ఘాటైన ఐస్క్రీమ్గా పేరుపొందింది. అమెరికాలో నార్త్ కరోలినా రాష్ట్రం ఏంజియర్ పట్టణానికి చెందిన ‘సన్నీ స్కై హోమ్మేడ్ ఐస్క్రీమ్స్’ సంస్థ ఈ ఐస్క్రీమ్ను ఇరవై ఏళ్ల కిందట ప్రారంభించింది. విచిత్రమైన రుచులను ఆస్వాదించాలనుకునేవారు దీని కోసం ఇక్కడకు వస్తుంటారు. (చదవండి: జ్ఞాన శంఖం 'పూరి'ద్దాం!) -
బేబీ బ్లూస్..! డెలివరీ తర్వాత ఇలా ఎందుకనిపిస్తోంది..
నాకు వారం రోజుల క్రితం సిజేరియన్ ద్వారా డెలివరీ అయింది. బేబీ కూడా బాగానే ఉంది, నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను. కానీ గత కొన్ని రోజులుగా నాకు చాలా సాడ్ ఫీలింగ్ వస్తోంది. మాటిమాటికి కళ్లలో నీళ్లు వస్తున్నాయి, బేబీతో ఆడుకోవాలని కూడా అనిపించడం లేదు. ఒంట్లో బలహీనంగా అనిపిస్తోంది. ఇది సాధారణమేనా?– లావణ్య, కడప.డెలివరీ తర్వాత కొంతమంది మహిళల్లో ఇలా సడెన్గా సాడ్ ఫీలింగ్ రావడం, ఏడుపు రావడం, బలహీనంగా అనిపించడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీన్ని సాధారణంగా ‘పోస్ట్పార్టమ్ బ్లూస్’ అంటారు. డెలివరీ అయిన తర్వాత మొదటి రెండు నుంచి మూడు వారాల వరకు సుమారు 70 నుంచి 80 శాతం మహిళల్లో ఈ మార్పులు కనిపించడం సాధారణమే. ఇది ఎక్కువగా జీవనశైలిలో ఒక్కసారిగా వచ్చే మార్పుల వల్ల జరుగుతుంది. డెలివరీ తర్వాత తల్లి పూర్తిగా కోలుకోకముందే ప్రతి రెండు గంటలకు లేచి బిడ్డను చూసుకోవడం, పాలివ్వడం వంటి బాధ్యతలు పెరుగుతాయి. అలాగే శరీరంలో హార్మోన్ మార్పులు కూడా ఈ భావోద్వేగ మార్పులకు కారణం అవుతాయి. సాధారణంగా ఈ బేబీ బ్లూస్ రెండు వారాల లోపే తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల సహాయం, కొద్దిగా ప్రోత్సాహం, సరైన విశ్రాంతి, సపోర్ట్ ఉంటే ఎక్కువగా ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే సమస్య సద్దుమణుగుతుంది. అయితే కొంతమందిలో ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే దాన్ని ‘పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ అంటారు. ఇది భారతదేశంలో దాదాపు 10 నుంచి 25 శాతం మహిళల్లో కనిపించే సమస్య. దీనికి ప్రధాన కారణాలు హార్మోన్ మార్పులు, ముందుగా ఉన్న ఆందోళన లేదా డిప్రెషన్ సమస్యలు, డెలివరీ సమయంలో ఎదురైన ఒత్తిడి లేదా కుటుంబంలో సరైన సపోర్ట్ లేకపోవడం వంటి అంశాలు కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి చాలా లో మూడ్లో ఉండటం, బిడ్డపై ఆసక్తి తగ్గడం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, చిరాకు ఎక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులు తల్లి ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పులను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. డాక్టర్ను సంప్రదిస్తే కొన్ని ప్రత్యేక ప్రశ్నల ద్వారా ఈ సమస్యను సులభంగా గుర్తించవచ్చు. అవసరమైతే కౌన్సెలింగ్, సైకాలజికల్ థెరపీ వంటి చికిత్సలు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా మందులు కూడా ఇవ్వవచ్చు. ఈ మందులు సాధారణంగా తల్లి పాలిచ్చే సమయంలో కూడా సురక్షితంగా వాడేలా ఉంటాయి. సరైన చికిత్స, కుటుంబ సభ్యుల ప్రేమ, సహాయం, ప్రోత్సాహం ఉంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. డా. కప్పగంతుల అపర్ణ , సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ ∙(చదవండి: ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే.. -
మారిన పేరు..ఏడేళ్లు జైలు శిక్ష
పేరు మనిషికి గుర్తింపునిస్తుంది. అదే పేరు తారుమారై, తప్పుగా నమోదైతే? గుర్తింపు సరిగా లేకపోతే ఏమౌతుంది? జీవితం నాశనమై, కుటుంబం కకావికలం అవుతుంది. మహారాష్ట్రలో ఓ వ్యక్తికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఏడేళ్ల జైలు శిక్షకు కారణమైంది. కుటుంబానికి దూరం చేసింది. ‘పదిమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. కాని, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు’ అనేది ప్రాథమిక న్యాయసూత్రం. అయితే కొన్ని సందర్భాల్లో విచారణలో పొరపాట్లు జరిగి నిర్దోషులు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. అలాంటి సంఘటనలు అరుదు. వాటి ప్రభావం బాధితుల జీవితాలపై తీవ్రంగా ఉంటుంది. ఈ తరహా ఘటనలో ఓ వ్యక్తి అత్యాచారం కేసులో నిందితుడిగా సంవత్సరాల పాటు జైలుశిక్ష అనుభవించాడు. తరువాత అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. తనకు జరిగిన అన్యాయానికి రూ. 200 కోట్లు పరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. కేసు నమోదు..శిక్ష ఖరారుమహారాష్ట్రలోని ఘట్కోపర్ రైల్వే స్టేషన్ వంతెనపై ఓ మహిళ నిద్రిస్తోంది. తెల్లవారుజామున ఓ వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేసిన వ్యక్తి పేరు ‘గోపి’ అని పేర్కొంది. పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించారు. కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. న్యాయమూర్తి దోషిగా తేల్చారు. ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 400 జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో నెల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని 2010లో తుది తీర్పు వెలువరించారు.నిర్దోషి అని తేలింది.. కానీబాధితురాలు చెప్పిన వ్యక్తి, పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ఒకరేనా? నిందితుడి గుర్తింపులో పొరపాటు జరిగిందా? అనే సందేహాలు హైకోర్టు విచారణ సందర్భంగా వెల్లువెత్తాయి. బాధిత మహిళ తనపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి పేరు‘గోపి’ అని చెప్పింది. కానీ పోలీసులు అరెస్ట్ చేసింది గోపాల్ని. ‘ఈ కేసుకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, గుర్తింపులో పొరపాటు జరిగిందని’ గోపాల్ పేర్కొన్నాడు. ట్రయల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాడు. అది పెండింగ్లో ఉండగా, బెయిల్ కోసం అభ్యర్థించాడు. కోర్టు తిరస్కరించింది. దీంతో జైలులోనే గడపాల్సి వచ్చింది. చివరికి హైకోర్టులో అప్పీలు పిటిషన్ విచారణకు వచ్చింది. నిందితుడి గుర్తింపును ప్రాసిక్యూషన్ సరైన విధంగా చేయలేదని హైకోర్టు తెలిపింది. ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద ట్రయల్ కోర్టు విధించిన శిక్షను రద్దు చేసి, గోపాల్ను నిర్దోషిగా ప్రకటించింది. తప్పు చేయలేదని తేలినా, అప్పటికే కాలం కరిగిపోయింది. ఏడేళ్లు గడిచిపోయింది. శిక్షా కాలం పూర్తయిపోయింది. పరిహారం కోసం పోరాటం‘నాపై తప్పుగా కేసు నమోదు చేశారు. ఏడేళ్లపాటు అన్యాయంగా కారాగారంలో బంధించారు. నా జీవితం నాశనం అయింది. నేను జైలుకు వెళ్లడంతో నా భార్య నన్ను వదిలి వెళ్లిపోయింది. మనోవేదనతో నా తండ్రి చనిపోయాడు. పిల్లలు అనాథశ్రమంలో చేరాల్సి వచ్చింది. నా ఉద్యోగాన్నీ కోల్పోయాను. కావున నాకు రూ. 200 కోట్లు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అని గోపాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పెండింగ్లో ఉన్న సమయంలో తాత్కాలిక పరిహారంగా రూ. 100 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించాడు. తనను అన్యాయంగా కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ వ్యవహారంపై సీబీఐతో పునర్విచారణ జరిపించాలని పేర్కొన్నాడు. అతడ్ని అన్యాయంగా నిర్బంధించిన కారణంగా స్వేచ్ఛను కోల్పోయాడని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుకు ఇది విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ను హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడం వాస్తవమే కానీ, పరిహారం ఇవ్వాల్సిన పరిస్థితులు లేవని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. కేసు నమోదు చేయడంలో పిటిషనర్పై దర్యాప్తు అధికారులకు ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. కోర్టు తీర్పు ఇలా..తనను ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులో ఇరికించారని పిటిషనర్ ఆరోపించారు. కానీ దురుద్దేశం ఉందని ఎక్కడా నిరూపించ లేకపోయారని కోర్టు పేర్కొంది. అతడ్ని కేసులో ఇరికించడానికి దర్యాప్తు అధికారులు, ఇతర సాక్షులు ప్రయత్నించారని అనడానికి కారణాలు కనిపించలేదు. కేవలం నిర్దోషిగా విడుదలయ్యాడనే కారణంతో పరిహారం కోరడం సరైంది కాదు’ అని కోర్టు అభిప్రాయపడింది. పబ్లిక్ లా కింద పరిహారం ఇవ్వడానికి తగిన ఆధారాలు లేవని తేల్చింది. ఈ కేసులో నిందితుడి విడుదల ‘తప్పు నిరూపించ లేకపోవడం వల్ల మాత్రమే జరిగింది. తప్పుడు కేసులో కావాలనే ఇరికించారని నిరూపణ కాలేదని పేర్కొంది. పిటిషనర్ కోరిన అభ్యర్థనకు చట్టపరంగా ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఏడేళ్ల జైలు జీవితం గడిపిన తర్వాత నిర్దోషిగా విడుదలైన వ్యక్తి పట్ల కోర్టుకు సానుభూతి ఉన్నా, చట్టపరంగా పరిశీలిస్తే అతని ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టు ఎక్కడా నిరూపించుకోలేకపోయాడని కోర్టు పేర్కొంది. పరిహారం చెల్లించాలని ప్రతీ కేసులో చెప్పలేమని, అది పూర్తిగా కేసు పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఈ కేసులో స్పష్టంగా తేల్చింది. పిటిషనర్కు ఎలాంటి పరిహారం లేదా ఉపశమనం ఇవ్వకుండా పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. దిలీప్ మాదిరెడ్డి(చదవండి: బొమ్మజెముడు పొద మీద నెత్తుటి మరక!) (చదవండి: ఇదేం వినికిడి సమస్య..? కేవలం పురుషుల గొంతు మాత్రమే..) -
విశ్వానికి ఏడు డైమెన్షన్లు!
బయటికి బయల్దేరారు. మీ కారు ‘కీ’స్ కనిపించలేదు! లేదా, టీవీ ఆన్ చే శారు. రిమోట్ కనిపించలేదు! ‘కీ’స్ కోసం, రిమోట్ కోసం ఇంట్లో అవి ఉండే చోటంతా వెతికారు. కానీ కనిపించలేదు! ఇల్లంతా గాలించారు, అయినా కనిపించలేదు! కీస్ కానీ, టీవీ రిమోట్ గానీ అంతలా ఎలా మాయం అయినట్లు?! సరే.. ఇంట్లోంచే కాదు, ఈ విశ్వంలోనే మీ కారు తాళాలు, టీవీ రిమోట్ అదృశ్యం అయ్యాయనే అనుకుందాం. అప్పుడు అవి ఏ జగత్తులలోకి వెళ్లిపోయినట్లు?ఈ ప్రశ్నకు భౌతికశాస్త్రం (సాధారణ ఫిజిక్స్) ఏమంటుందంటే – ఇక అవి పోయినట్లేనని! అదే క్వాంటమ్ ఫిజిక్స్ అయితే, ‘‘ఎక్కడికీ పోవు. ఎక్కడికి పోయాయో ఆ సమాచారాన్ని కనిపెడితే అవి ఎక్కడున్నాయో తెలుస్తుంది’’ అంటుంది! ‘‘లేనివి ఎలా ఉంటాయి?’’ అని సాధారణ ఫిజిక్స్ అంటే.. ‘‘లేకుండా ఎలా పోతాయి?’’ అని క్వాంటమ్ ఫిజిక్స్ అంటుంది! గత యాభై ఏళ్లుగా రెండిటి మధ్యా ఇదే ఘర్షణ. అయితే ఇప్పుడా మహా శాస్త్ర యుద్ధం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లే ఉంది. తాజాగా శాస్త్రవేత్తలు ఈ విశ్వానికి మరో మూడు కొత్త డైమెన్షన్లు ఉన్నట్లు కనిపెట్టటమే అందుకు కారణం. ఏ థియరీ కరెక్ట్?! క్వాంటమ్ ఫిజిక్స్ థియరీనే కరెక్ట్ అంటున్నారు ‘స్లోవాక్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్’ సీనియర్ శాస్త్ర పరిశోధకులు రిచర్డ్ పిన్కాక్! ‘‘ఆ విషయం మీరెలా చెబుతారు?’’ అని ఆయన్ని అడిగితే, ఈ విశ్వంలో ఉన్నవి ఇప్పటి వరకు మనమంతా అనుకుంటున్నట్లు 4 డైమెన్షన్లు మాత్రమే కాదు, మరో మూడు డైమెన్షన్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా కలుపుకుని చూస్తే, అదృశ్యమైపోయిన వస్తువును కూడా, అంజనం వేయకుండానే అది ఎక్కడుందో కనిపెట్టవచ్చు’’ అని పిన్కాక్ చెబుతున్నారు!ఆ నాలుగు.. ఈ మూడుభారత జాతీయ చిహ్నంలో మూడు సింహాలు కనిపిస్తూ ఉంటాయి. వాటితో పాటుగా, ‘కనిపించని నాలుగో సింహం’ కూడా, ఆ వెనుక వైపు ఉంటుంది. అదే విధంగా ఈ విశ్వానికి నాలుగు డైమెన్షన్లు ఉన్నాయి. అంటే నాలుగు కొలమానాలు. అవి : పొడవు, వెడల్పు, ఎత్తు/లోతు, సమయం. అయితే ఈ నాలుగే కాకుండా, కనిపించని మరో మూడు కొలమానాలు కూడా ఉన్నాయని తాజాగా పిన్కాక్ ప్రకటించారు! ఆ మూడు కొలమానాలు ఇచ్చే సమాచారాన్ని బట్టి వస్తువు ఎక్కడ ఉండి ఉంటుందో కనిపెట్టొచ్చని చెబుతున్నారు. అంటే, సాధారణ ఫిజిక్స్ భావిస్తున్నట్లు ‘సమాచారం’ అన్నది లుప్తమైపోదు. క్వాంటమ్ ఫిజిక్స్ భావిస్తున్నట్లు ‘సమాచారం’ నిగూఢంగా ఉండిపోతుంది’!మెలిక, ముడి, బాహ్య బలంకొత్తగా శాస్త్ర పరిశోధకులు కనిపెట్టిన అదనపు డైమెన్షన్లు ఈ మూడూ! ఇవి పొరలుగా మడత పడి ఉంటాయి కనుక పైకి కనిపించవని, వాటి లోపలికి వెళ్లి చూడగలిగితే అదృశ్యమైపోయిన వస్తువు తాలూకూ సమాచారం (అద్కెడుందో, ఎలా ఉందో..) తెలుస్తుందని పిన్కాక్ బృందం భావిస్తోంది. సైన్స్ చరిత్రలో ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న ‘ఇన్ఫర్మేషన్ పారడాక్స్’ అనే పెద్ద చిక్కుముడిని విప్పడానికి ఈ ఏడు (ఇప్పటికే ఉన్న 4, కొత్తగా కనిపెట్టిన 3) డైమెన్షన్ల తాజా సిద్ధాంతం ఉపయోగపడుతుందని వారు విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా, బ్లాక్ హోల్స్ (కృష్ణ్ల బిలాలు) అంతమైపోయేటప్పుడు ఏం జరుగుతుందో ఈ థియరీ వివరిస్తుందట! మనమున్నది త్రీడీ ప్రపంచంసాధారణంగా మనం దేనినైనా త్రీ–డైమెన్షనల్ (త్రీడీ) లోనే చూడగలం. అసలు మనం నివసిస్తున్న ప్రపంచమే త్రీడీ ప్రపంచం. ఒక వస్తువు స్థానాన్ని, రూపాన్ని చెప్పటానికి ఉపయోగించే 1. పొడవు, 2. వెడల్పు, 3. ఎత్తు లేదా లోతుల కొలమానాలు అవి. అల్బర్ట్ ఐన్స్టీన్ ఈ మూడు కొలమానాలకు ‘సమయం’ అనే కొలతను జోడించటంతో త్రీడీ కాస్తా 4డీ అయింది. ‘‘మీరు ఒక స్నేహితుడిని కలవాలనుకున్నప్పుడు అతడి ఉనికి (స్థలం)తో పాటుగా అతడిని ఏ సమయంలో కలవాలనుకుంటున్నదీ ముఖ్యం అవుతుంది. అంటే స్థలం, కాలం విడదీయలేవి..’’ అంటారు ఐన్స్టీన్. అందుకే ఇది త్రీడీ కాదు, 4డీ ప్రపంచం అని ఆయన సిద్ధాంతం.హాకింగ్ వల్లే ‘ఫిజిక్స్ వార్’గతంలో శాస్త్రవేత్తలు, బ్లాక్ హోల్స్ అంటే అన్నీ మింగేసే శూన్య ప్రదేశాలని, వాటిలో పడిపోయినదేదీ ఇక బయటకు రాలేదని అనుకునేవారు. ఆ భావనను సమర్థించే విధంగా 1970లో స్టీఫెన్ హాకింగ్, బ్లాక్ హోల్స్ నుండి రేడియేషన్ వస్తుందని, ఆ ప్రభావంతో కాలక్రమేణా ఆ బ్లాక్హోల్స్ ఉనికే లేకుండా (సమాచారం లేకుండా) ఆవిరైపోతాయని ప్రతిపాదించారు. అయితే క్వాంటమ్ ఫిజిక్స్ నియమాల ప్రకారం ఏ సమాచారం కూడా పూర్తిగా నాశనం కాకూడదు. మరి బ్లాక్ హోల్ ఆవిరైపోతే అందులోని సమాచారం ఏమవుతుంది? దానికి సమాధానమే ఈ ఏడు డైమెన్షన్ల థియరీ అంటున్నారు పిన్కాక్. ‘మంటల్లో పుస్తకం’.. మంచి ఉదాహరణ క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఏ సమాచారమూ పూర్తిగా నశించదు అనేందుకు పరిశోధకుడు రిచర్డ్ పిన్కాక్ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. మీరు ఒక పుస్తకాన్ని మంటల్లో వేశారనుకోండి. ఆ పుస్తకం కాలిపోతుంది. కానీ సిద్ధాంతపరంగా, ఆ మంటల నుండి వచ్చిన పొగ, బూడిద, వేడిని పరిశీలిస్తే.. ఆ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరాన్ని మనం తిరిగి సేకరించవచ్చు అంటారు పిన్కాక్! పుస్తకాన్ని పునర్నిర్మించటానికి అగ్ని నుండి వెలువడిన ప్రతి కాంతి రేణువును, గాలిలోని ప్రతి కంపనాన్ని (వేడిని), మసిలోని ప్రతి రేణువు కచ్చితమైన స్థానాన్ని గుర్తించగలిగితే అది సాధ్యమేనంటారు పిన్కాక్. దానర్థం, సమాచారం రూపు మారుతుంది తప్ప, పూర్తిగా నిర్మూలన జరగదని. ఎలా నిరూపించగలం?ఒకవేళ ఈ ఏడు కొలతల సిద్ధాంతం నిజమే అయితే, మనం ‘కాలుజా–క్లీన్ పార్టికల్స్’ అనే ప్రత్యేక కణాలను గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఇవి మనకు తెలిసిన భారీ కణాల కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. ప్రస్తుతం మన దగ్గర ఉన్న అతిపెద్ద యంత్రం ‘లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్’ సామర్థ్యం కూడా వీటిని కనిపెట్టడానికి సరిపోదు. అయితే విశ్వం పుట్టినప్పుడు వెలువడిన కిరణాల (కాస్మిక్ మైక్రోవేవ్ రేడియేషన్) ద్వారా లేదా స్పేస్టైమ్లోని ఆదిమ గురుత్వాకర్షణ తరంగాల ద్వారా వీటి జాడను కనుగొనే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సాంకేతికత ఇందుకు సరిపోదు. కాబట్టి, ఈ సిద్ధాంతం ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఇది ఒక పరిశోధన స్థాయిలోనే ఉంది. దీనిని నిరూపించాలంటే మనం మరికొంత కాలం వేచి చూడాలి.∙ సాక్షి స్పెషల్ డెస్క్బ్లాక్హోల్ ‘మెమరీ చిప్’తాజా పరిశోధకుల సిద్ధాంతం ప్రకారం, ఒక బ్లాక్ హోల్ సాధ్యమైనంత సూక్ష్మ పరిమాణాలకు ఆవిరైపోతున్నప్పుడు, దాని ఏడు డైమెన్షన్లు ప్రాథమికంగా ఒక ముడిలా చిక్కువడిపోతాయి. ఆ ముడి తగినంత చిన్నదిగా మారినప్పుడు, ఈ దాగి ఉన్న డైమెన్షన్లు ముడుచుకోవటం వల్ల ఒక బాహ్య బలం (బయటి నుంచి లోపలికి నెట్టే శక్తి) ఏర్పడి అది బ్లాక్హోల్ పూర్తిగా కూలిపోకుండా నిరోధిస్తుంది. చివరికి అక్కడ ఒక అతి సూక్ష్మమైన పదార్థం మిగిలిపోతుంది. ఇది ఒక ఎలక్ట్రాన్ కన్నా 1000 కోట్ల రెట్లు చిన్నది. ఇది చూడడానికి ఏమీ లేనట్టు అనిపించినా, ఆ ‘మెలిక పడిన ముడి’ లోపల బ్లాక్ హోల్ మింగేసిన సమాచారం అంతా భద్రంగా ఉంటుంది. అంటే, సమాచారం ఎక్కడికీ పోలేదు! ఒక చిన్న జ్ఞాపకంలా ఆ ఏడు కొలతల ‘మెమరీ చిప్’ ముడిలో దాగి ఉంటుందన్నమాట.విశ్వానికి ‘టార్షన్ ఫీల్డ్’ మెలిక మూడు అదనపు కొలమానాలైన మెలిక, ముడి, బాహ్య బలాల ఉనికిని నిరూపించటానికి రిచర్డ్ పిన్ కాక్ ‘స్పేస్టైమ్’ (స్థలం–సమయం) నిర్మాణాన్ని కొత్త కోణంలో చూశారు. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం స్పేస్టైమ్ అనేది ఒక నాలుగు కొలతల షీట్ (చాప) లాంటిది. అది వంగగలదు, సాగగలదు. అయితే తాజా సిద్ధాంతం ప్రకారం, ఈ స్పేస్టైమ్లో ఏడు కొలతలు ఉన్నాయి. మనకు కనిపించని ఆ మూడు అదనపు కొలతల్ని పట్టుకోగలిగితే బ్లాక్ హోల్స్లో సమాచారం ఎలా దాగి ఉంటుందో వివరించడం సాధ్యమవుతుంది అంటారు పిన్కాక్! ఈ సిద్ధాంతం ప్రకారం ఏం జరుగుతుందో చూడండి. ‘స్పేస్టైమ్’ (నాలుగు కొలతల ఏకీకృత నిర్మాణం) వల్ల ఈ విశ్వం వంగే గుణాన్ని, సాగే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ మూడు అదనపు కొలమానాలలో ఒకదాని వల్ల అది ‘మెలిక’ కూడా పడుతుంది. దీనినే శాస్త్రవేత్తలు ‘టార్షన్ ఫీల్డ్’ అని పిలుస్తున్నారు. బ్లాక్హోల్స్ అదృశ్యమైనట్లు కనిపించినప్పుడు అక్కడేం జరుగుతుందో అర్థం చేసుకోవటానికి ఈ టార్షన్ ఫీల్డ్ ఉపయోగపడుతుంది. కృష్ణబిలాలు అదృశ్యం కాకుండా, ఎంతగానో కుంచించుకుపోతాయి. వాటి అంతర్గత డైమెన్షన్లు ముడివడి, మెలిక తిరిగి ఒక ఆకారాన్ని ఏర్పరుస్తాయి. దాంతో సమాచారం అంతా ఒక చిన్న శాశ్వత చిహ్నంలా ఎప్పటికీ దానిని పట్టుకునే ఉంటుంది. విశ్వానికి ఏడు డైమెన్షన్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు! ఇప్పటికే ఉన్న పొడువు, వెడల్పు, ఎత్తు / లోతు, కాలం అనే నాలుగు డైమెన్షన్లతో పాటుగా, ‘దాగి ఉన్న’ పొరల్లాంటి డైమెన్షన్లు మరో మూడు కూడా ఉన్నాయని, అవి ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయని వారు భావిస్తున్నారు. -
ఇరవై రూపాయలు.. నిండు జీవితం
ఇరవై రూపాయలు... మనం చేసే రోజువారీ ఖర్చులో తెలియకుండానే ఖర్చయిపోతుంది. కానీ, అదే ఇరవై రూపాయలు ఓ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టింది. కోర్టుల చుట్టూ తిప్పింది. అవినీతిపరుడని ముద్ర వేసింది. ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసింది. అయినా తట్టుకున్నాడు. న్యాయం కోసం కళ్లు కాయలు కాసేలా చూశాడు. ఏడాదో, రెండేళ్లో కాదు– ఏకంగా 30 ఏళ్లు. చివరికి ఫలితం వచ్చింది. ‘నేను ఏ తప్పు చేయలేదు’ అని మొదటి నుంచి అతడు చెబుతున్నదే నిజమైంది. నిర్దోషిగా బయటపడాలనే అతని కోరిక తీరింది. కానీ∙ఆ సంతోషం, సంబరం ఎక్కువ సేపు నిలవలేదు. తీర్పు వచ్చిన తెల్లారే అతని గుండె ఆగిపోయింది. అదే అతడికి చివరి రోజు అయింది. ఓ కానిస్టేబుల్ న్యాయపోరాటం కన్నీటి గాథగా మిగిలింది. బాబూభాయ్ ప్రజాపతి అహ్మదాబాద్లోని వేజల్పూర్కు చెందిన ఓ కానిస్టేబుల్. రూ.20 లంచం తీసుకున్నాడని అతనిపై ఆరోపణ. సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ తీర్పుపై ప్రజాపతి హైకోర్టుకు అప్పీలుకు వెళ్లాడు. సుమారు 22 ఏళ్ల పాటు అక్కడ కేసు నడిచింది. చివరికి తీర్పు వెలువడింది. హైకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అసలేం జరిగింది?1996లో ఓ ట్రక్కు డ్రైవర్ ఫిర్యాదుతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్నారు. ట్రక్కు డ్రైవర్కు ఫినాల్ఫ్తేలీన్ పౌడర్ పూసిన నోట్లను ఇచ్చారు. ఆ నోట్లు ప్రజాపతి చేతిలో ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం తీసుకున్నాడని కేసు నమోదు చేశారు. నాలుగేళ్లు జైలు శిక్షఅహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో 1997లో చార్జిషీట్ దాఖలైంది. కోర్టులో కేసు విచారణ జరిగింది. తనకేమీ తెలియదని, కేసులో అన్యాయంగా ఇరికించారని, బలవంతంగా తన చేతులో డబ్బులు పెట్టారని ప్రజాపతి వాపోయాడు. తనను నిర్దోషిగా ప్రకటించాలని కోర్టుకు విన్నవించాడు. వాదోపవాదాల తర్వాత ప్రజాపతిని కోర్టు దోషిగా నిర్ధారించింది. నాలుగేళ్లు కఠిన కారాగార శిక్ష, మూడువేలు జరిమానా విధించింది. హైకోర్టుకు అప్పీలుసెషన్స్ కోర్టు తీర్పుపై ప్రజాపతి హైకోర్టులో అదే ఏడాది అప్పీలు చేశాడు. ఏళ్ల తరబడి పెండింగ్ తర్వాత కేసు విచారణ మొదలైంది. అప్పీలుదారు తరపు న్యాయవాది నితిన్ గాం«ధీ కేసు విశ్వసనీయత, సాక్షుల వాంగ్మూలాల్లో వైరుధ్యాలపై పలు ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తారు. నిర్దోషిగా తీర్పువిచారణ సందర్భంగా కేసులోని పలు లోపాలను హైకోర్టు గుర్తించింది. డబ్బులు డిమాండ్ చేశారనే దానికి ఆధారాలు చూపలేదని పేర్కొంది. అభి యోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించ లేదని ప్రజాపతిని నిర్దోషిగా ప్రకటిస్తూ కేసు కొట్టేసింది. సంతోషం..విషాదంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ప్రజాపతి తన న్యాయవాది నితిన్ గాంధీని ఆయన కార్యాలయంలో కలుసుకున్నాడు. నిర్దోషిగా బయటపడినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ‘నాపై పడిన మచ్చ తొలగింది. ఇక ఆ దేవుడు పిలిచినా సంతోషంగా వెళతాను’ అన్నాడు. ఆ రోజు గడిచింది. కానీ ప్రజాపతికి అదే ఆఖరి రోజైంది. నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని, అది సహజ మరణ మని అతని న్యాయవాది వెల్లడించాడు. న్యాయం కోసం జీవితమంతా పోరాడాడు. గెలిచిన సంతోషం ఒక్కరోజే మిగిలింది. మరికొన్ని రోజులైనా జీవిస్తే బాగుండేది. లేదా న్యాయం అయినా ముందే దక్కి ఉండాల్సిందని బంధువులు వ్యాఖ్యానించారు.-దిలీప్ మాదిరెడ్డి -
ప్రెగ్నెన్సీ 7వ నెలలో వైట్ డిశ్చార్జ్.. సమస్యేనా?
నాకు ఇరవై ఐదు సంవత్సరాలు. నాకిది రెండో ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఏడవ నెల. గత కొన్ని రోజులుగా యోనిలో ఎక్కువగా తెల్లటి డిశ్చార్జ్ కనిపిస్తోంది. కొన్నిసార్లు దురద కూడా ఉంది. ఇది పెద్ద సమస్యేనా? – రమ్య, నెల్లూరు.గర్భధారణ సమయంలో యోనిలో తెల్లటి డిశ్చార్జ్ కనిపించడం చాలా సాధారణం. గర్భధారణలో శరీరంలో హార్మోన్ మార్పులు ఎక్కువగా జరుగుతాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి పెరగడం వల్ల యోని స్రావం కూడా కొంచెం ఎక్కువగా కనిపించవచ్చు. ఇది సాధారణ ప్రక్రియ. ఈ డిశ్చార్జ్ యోని ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచడంలో, హానికరమైన ఇన్ఫెక్షన్లు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఆరోగ్యకరమైన డిశ్చార్జ్ తెలుపు లేదా పారదర్శకమైన రంగులో ఉంటుంది. పలుచగా లేదా కొద్దిగా జిగురుగా ఉంటుంది. తేలికపాటి వాసన లేదా వాసన లేకుండా ఉంటుంది. దురద, మంట లేదా అసౌకర్యం లేకుండా ఉంటుంది. గర్భధారణ ముందుకు సాగేకొద్దీ ఇది కొంచెం ఎక్కువగా కనిపించడం సహజమే. అయితే మీరు చెప్పినట్లుగా డిశ్చార్జ్తో పాటు దురద కూడా ఉంటే, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియా అసమతౌల్యం వంటి చిన్న సమస్యల సంకేతం కావచ్చు. సాధారణంగా ఇవి సులభంగా చికిత్సతో తగ్గిపోతాయి. బలమైన దుర్వాసన రావడం, చేప వాసనలాగా ఉండటం. పసుపు, ఆకుపచ్చ లేదా బూడిద రంగులో మారడం. ముద్దలాగా గట్టిగా ఉండటం. తీవ్రమైన దురద, మంట లేదా ఎర్రదనం ఉండటం. ఒక్కసారిగా ఎక్కువగా నీళ్లలాగా కారడం. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు చేసి, అవసరమైతే సరైన మందులు ఇస్తారు. గర్భధారణలో స్వయంగా మందులు వాడటం మంచిది కాదు. డాక్టర్ సలహాతో మాత్రమే చికిత్స తీసుకోవాలి. గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్లు నివారించడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. యోని బయట భాగాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి. లూజుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఆ ప్రాంతంలో ఎక్కువగా సబ్బులు, వాష్లు లేదా పౌడర్లు వాడకూడదు. డాక్టర్ సలహా లేకుండా క్రీములు లేదా మందులు కూడా వాడకూడదు. సాధారణంగా ఇది చిన్న సమస్యే అయినా, మీరు 7 నెలల గర్భంతో ఉన్నందున ఒకసారి డాక్టర్ను కలసి చెక్ చేయించుకుంటే మరింత మంచిది.ప్రసవ నొప్పులేనా? నేను 36 వారాల గర్భిణిని. ఇది నా మొదటి గర్భం. కొన్నిసార్లు పొత్తికడుపు గట్టిగా పట్టేయటం, పీరియడ్స్లా నొప్పులు వస్తున్నాయి. కొన్ని నిమిషాల్లో అవి మామూలుగా మారిపోతాయి. ఇవి ప్రసవ నొప్పులేనా? – స్వాతి, విజయనగరం.మీరు 36 వారాల గర్భంతో ఉన్నప్పుడు పొత్తికడుపు కొన్నిసార్లు గట్టిపడటం లేదా పీరియడ్స్లా నొప్పులు రావడం చాలా సాధారణం. కొన్ని నిమిషాల్లో తగ్గిపోతే అవి నిజమైన ప్రసవ నొప్పులు కావు. నిజమైన ప్రసవానికి ముఖ్యమైన లక్షణం గర్భాశయ సంకోచాలు క్రమంగా రావడం. ఇవి తప్పుడు నొప్పుల కంటే భిన్నంగా ఉంటాయి. మొదట కొద్దిగా ప్రారంభమై, తర్వాత సమయం గడిచేకొద్దీ మరింత బలంగా, ఎక్కువసేపు కొనసాగుతాయి. విశ్రాంతి తీసుకున్నా తగ్గవు. ఒక సులభమైన నియమం ఏమిటంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి నొప్పి రావడం, ప్రతి నొప్పి కనీసం ఒక నిమిషం పాటు కొనసాగడం, ఈ పరిస్థితి దాదాపు ఒక గంట పాటు ఉండటం. ఇలా జరిగితే మీరు ఆసుపత్రికి వెళ్లాలి. మరొక ముఖ్యమైన సంకేతం నీరు కారడం. అంటే ఒక్కసారిగా ఎక్కువగా ద్రవం రావడం లేదా నెమ్మదిగా నిరంతరం కారడం అనిపించవచ్చు. ఆ ద్రవం సాధారణంగా పారదర్శకంగా ఉంటుంది. ఒకసారి నీరు కారితే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. కొన్నిసార్లు గులాబీ రంగులో లేదా కొద్దిగా రక్తం కలిసిన మ్యూకస్లా డిశ్చార్జ్ కనిపిస్తే ప్రసవం త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అలాగని వెంటనే డెలివరీ జరుగుతుందని చెప్పలేం.ఈ పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి: ∙ఎక్కువగా రక్తస్రావం కావడం ∙తీవ్రమైన పొత్తికడుపు నొప్పి ఉండటం ∙బిడ్డ కదలికలు తగ్గిపోవడం లేదా ఆగిపోవడం. ∙ఎక్కువ జ్వరం రావడం ∙తీవ్రమైన తలనొప్పి లేదా చూపు మసకబారడం ∙ముఖం లేదా చేతులు ఒక్కసారిగా ఉబ్బడం ∙మొదటిసారి గర్భిణులలో ప్రసవం కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కానీ నొప్పులు క్రమంగా, దగ్గర దగ్గరగా వస్తూ బలంగా మారితే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లడం మంచిది. ∙ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండటం మంచిది. మీకు ఏదైనా కొత్త లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం సురక్షితం. -
మాయమైన హారం
పెళ్లి పందిరంతా పూల వాసనలు, బాజాభజంత్రీలతో సందడిగా ఉంది. కానీ పెళ్లి కూతురు దివ్య ముఖంలో మాత్రం కళ లేదు. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, పెళ్లి కొడుకు మదన్ ప్రవర్తన ఏదో తేడాగా ఉందని తన స్నేహితురాలు, లేడీ డిటెక్టివ్ సుగాత్రికి ముందే చెప్పింది.‘కట్నం అక్కర్లేదు. అబ్బాయికి పెద్ద బిజినెస్ వుంది. అందగాడు’... మధ్యతరగతి తండ్రి ఆలోచన... అందుకే కూతురిని బలవంతంగా పెళ్లికి ఒప్పించాడు.పెళ్లి ముహూర్తానికి సరిగ్గా గంట ముందు ఒక్కసారిగా పెళ్లి మండపంలో కలకలం మొదలైంది.పెళ్ళికి వచ్చిన కనకం మెడలోని కోటి రూపాయల విలువైన వజ్రాలహారం మాయమైంది. పెళ్లి పెద్దలు కంగారు పడుతుంటే, సుగాత్రి లోపలికి అడుగు పెట్టింది.దివ్య తండ్రిలో ఆందోళన. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఈ అపశకునం ఏమిటని...?పోలీసులు పెళ్లి మండపాన్ని చుట్టుముట్టారు. అన్ని గదులూ వెతికారు.పెళ్ళికొడుకు రూమ్ మిగిలి వుంది. దివ్య తండ్రి అడ్డు చెప్పబోయాడు. ‘కాబోయే అల్లుడిని సోదా చేస్తే బాగుండద’ని...సుగాత్రి నచ్చచెప్పింది. పెళ్ళికొడుకు గది సోదా చేస్తే తను క్లీన్ చిట్తో బయటకు వస్తాడని చెప్పింది.మదన్ రూమ్ అణువణువూ వెతికారు. ఎక్కడా హారం దొరకలేదు.పెళ్ళికొడుకు మదన్ సీరియస్ అయ్యాడు. ‘అసలు హారం పోయిందో నాటకం ఆడుతున్నారో’ అంటూ అరిచాడు.‘‘నిజమే హారం పోలేదు కానీ, దొంగ దొరికాడు.’’ అంది సుగాత్రి. ‘‘అదెలా?’’ ఆశ్చర్యంగా అడిగాడు మదన్.‘‘హారం పోతే రికవరీ చేసుకోవచ్చు.. కానీ జీవితం పోతేనో?’’... అంటూ సుగాత్రి మదన్ సూట్కేస్ తెరిచి, అందులో ఉన్న రహస్య అరను పగులగొట్టింది. అందులో వేర్వేరు దేశాల పాస్పోర్టులు, వివిధ పేర్లతో ఉన్న ఐడీ కార్డులు బయటపడ్డాయి.‘‘ఇప్పుడేమంటావ్ మిస్టర్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ మదన్?’’ అంటూ పెళ్లికి వచ్చిన అందరి వైపు, దివ్య తండ్రి వైపు చూసి, ‘‘ఇతడు అంతర్జాతీయ స్థాయిలో పెళ్లిళ్ల పేరుతో మోసాలు చేసే మ్యారేజ్ ఫ్రాడ్. గతంలో ముగ్గురు అమ్మాయిలను ఇలాగే పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిలను అమ్మేసి పరారయ్యాడు. చాలా చోట్ల ఇతని మీద కేసులు వున్నాయి. మధ్యతరగతి అమ్మాయిలే ఇతడి టార్గెట్. కూతురు పెళ్ళైతే చాలు, అనుకునే మధ్యతరగతి తల్లిదండ్రుల బలహీనతలను, ఆశలను క్యాష్ చేసుకునే ఘరానా మోసగాడు ఇతను. నిజానికి హారం పోలేదు. కానిస్టేబుల్ కనకంతో నేను ఆడించిన నాటకం.దివ్య పెళ్ళికొడుకు మీద అనుమానం వ్యక్తం చేయడంతో మదన్ ఫోటోను డేటాబేస్లో చెక్ చేశాను. ఇతని నేరాలు ఒక్కొక్కటిగా బయట పడ్డాయి. ఒక్కోచోట ఒక్కో పేరుతో మోసాలు చేస్తాడు.’’ చెప్పింది లేడీ డిటెక్టివ్ సుగాత్రి.మదన్ను పోలీసులు అరెస్టు చేశారు.‘‘నాలాంటి మధ్య తరగతి తల్లిదండ్రుల కళ్ళు తెరిపించావు తల్లీ! బిడ్డ పెళ్ళైతే చాలు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి’... చేతులు జోడించి చెప్పాడు దివ్య తండ్రి.‘‘థాంక్యూ మై ఫ్రెండ్ లేని హారాన్ని పోయిందని చెప్పి ఆధారాలు దొరక్కుండా తప్పించుకుంటున్న నేరస్తుడిని పట్టుకుని... నా జీవితాన్ని నాలాంటి అమ్మాయిల జీవితాలను కాపాడావు’’ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది దివ్య.‘‘మ్యాట్రిమోనీలలో సంబంధాలు చూసేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి. అబ్బాయిల ఆస్తిపాస్తులు, అర్హతల కన్నా వ్యక్తిత్వం, అసలు స్వరూపం తెలుసుకోవాలి.’’ చెప్పింది లేడీ డిటెక్టివ్ సుగాత్రి. -
తల్లిదండ్రులే రోల్ మోడల్స్
పిల్లల మనస్సుల్లో మీ కలలను రుద్దకండి. ప్రతి శిశువు తన స్వంత ఆశయాలతో జన్మిస్తుంది అని చెబుతారు ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి. పేరెంటింగ్పై ఆమె మాటలు ఎందరికో స్ఫూర్తిదాయకం. పిల్లల పెంపకంపై ఆమె పలు పుస్తకాలను కూడా రాశారు. పిల్లలను మంచి దారిలో నడిపించేందుకు ఆమె చెప్పిన కొన్ని మాటలు...పిల్లలకు తల్లిదండ్రులే మొదటి రోల్ మోడల్స్. పిల్లలు మనం చెప్పే మాటల కంటే, మనం చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు, అనుకరిస్తారు. కాబట్టి మంచి ప్రవర్తనను ఆచరించి చూపడం చాలా ముఖ్యం. మనం ఒక మంచి ఉదాహరణగా నిలిచినప్పుడు, పిల్లలకు ప్రత్యేకంగా క్రమశిక్షణ నేర్పాల్సిన అవసరం ఉండదు.తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అతిపెద్ద బహుమతి విద్య. అయితే, చదువు అంటే కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదు, అందులో జీవన నైపుణ్యాలు, జిజ్ఞాస, సాంస్కృతిక అవగాహన కూడా ఉండేలా నేర్పించాలి. అంతేకాకుండా తల్లిదండ్రుల జీవితాల్లో అసంపూర్తిగా మిగిలిపోయిన లక్ష్యాలను పిల్లలతో పూర్తిచేయించాలనుకోవడం పొరపాటు. పిల్లలు వారి సొంత ఆశలు, ఆశయాలతో వస్తారు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు చేయగలిగిన ఉత్తమమైన పని– పిల్లలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించడంలో సహాయపడటం.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. డబ్బు ఉందని అహం చూపిస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని పేరెంట్స్ ఫాలో అయితే పిల్లలు కూడా ఆ లక్షణం నేర్చుకుంటారు. అలాగే పిల్లలకు ఉన్నదానితో తృప్తి చెందడం, కృతజ్ఞతా భావంతో ఉండటం నేర్పించాలి. వస్తువుల కంటే సంబంధాలే ముఖ్యమని నేర్పాలి. కుటుంబంతో కలిసి భోజనం చేయడం వంటి చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కోవడం వల్ల పిల్లల్లో వినయం, సానుభూతి పెరుగుతాయి. ఖరీదైన బహుమతుల కంటే అర్థవంతమైన అనుభవాలను పంచుకోవడం ద్వారా తల్లిదండ్రులు ఈ విలువలను పిల్లలకు నేర్పవచ్చు. చాలామంది జీవితంలో మనం కష్టపడ్డాం కదా, మన పిల్లలకు ఆ కష్టం తెలియకూడదు అని వారికి అన్నీ అడగకముందే సమకూరుస్తుంటారు. కానీ పిల్లలకు కూడా కష్టం విలువ తెలిసేలా చేయాలి. పిల్లలకు చిన్న చిన్న పనులు నేర్పడం, ఇంటి పనుల్లో వారిని భాగస్వాములను చేయడం ద్వారా వారు తాము కూడా కుటుంబంలో ఒక భాగమని, తాము కూడా సహకరించాలని అర్థం చేసుకుంటారు. పిల్లల్లో దయ, సానుభూతిని పెంపొందించాలి. పిల్లల పెంపకంలో ఇది ప్రధానమైనది. పిల్లల్లో కరుణను నింపడం వల్ల సమాజానికి మేలు జరగడమే కాకుండా, వారు అర్థవంతమైన సంబంధాలను నిర్మించుకుంటారు. పిల్లలను ఇతరులతో పోల్చకండి. ప్రతి బిడ్డకు వారి స్వంత బలాలు, బలహీనతలు ఉంటాయి. వారిలోని ప్రత్యేకతను గుర్తించకుండా ఇతరులతో పోల్చడం వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ.పిల్లలు ఏదైనా అడిగినప్పుడు, వెంటనే ఇచ్చేయకండి. అది నిజంగా అవసరమో కాదో తెలుసుకోండి. పిల్లలు అడిగే వస్తువు ప్రాముఖ్యతను తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అడిగిన వెంటనే పిల్లలకు అందించడం వల్ల వారికి ఆ వస్తువు విలువ తెలియదు. అలాగే ప్రస్తుతం పిల్లలకు పాకెట్ మనీ అని డబ్బులు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. దానివల్ల వారికి డబ్బు విలువ తెలియదు. పిల్లలతో నిత్యం మాట్లాడుతూ, సమయం గడపండి. ప్రతి విషయం గురించి వారితో చర్చించండి. మీ పిల్లల మనస్సులో ఏముందో తెలుసుకోవాలంటే వారితో సంభాషించడం, వారు చెప్పేది వినడం ద్వారా వారి సంతోషాలు, ఆసక్తులు, ప్రపంచం పట్ల వారి దృక్పథం అర్థమవుతుంది. ఎదుటివారి హోదాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం నేర్పించాలి. పెద్దల మాదిరిగానే పిల్లలకు కూడా ఏకాంతంగా, స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను అతిగా పర్యవేక్షించడం, ప్రతి చిన్న విషయంపై ప్రశ్నించడం వంటివి చేసినప్పుడు, పిల్లలు తాము నమ్మకాన్ని కోల్పోతున్నామని భావిస్తారు. దాంతో విషయాలను దాచడం లేదా అబద్ధాలు చెప్పడం మొదలుపెడతారు. అలాకాకుండా పిల్లలు స్నేహపూర్వకంగా మెలగాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యతలలో ఒకటి. ఇది పిల్లలు తమను తాము నమ్ముకోవడానికి, సవాళ్లను అధిగమించడానికి, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడటానికి సహాయపడుతుంది. ‘నువ్వు ఏదైనా సాధించగలవు’, ‘నీ ప్రయత్నం నాకు చాలా గర్వంగా ఉంది’ వంటి సానుకూలమైన మాటలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. -
కృషి ఏకోన్ముఖం ప్రతిభ బహుముఖం!
నోబెల్ సాహిత్య పురస్కారం అందుకున్న ఆఫ్రికన్ రచయితలు– పంచపాండవుల్లా– అయిదుగురే! ఇవాళ మనం ఎవరి గురించి చర్చించుకోబోతున్నామో ఆ పెద్దమనిషి కూడా వారిలో ఒకరు. అతని తండ్రి తరఫు పూర్వికులు, నాలుగైదు వందల సంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాకు తరలి వెళ్ళిపోయిన డచ్ (నెదర్లండ్స్) జాతీయులు. తల్లి తరఫు వాళ్ళు డచ్–జెర్మన్–పోలిష్ జాతీయులు. 1940లో పుట్టిన ఈ బహుళజాతి రచయిత బాల్య కౌమార ప్రథమ యవ్వన దశలు గడిపింది దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నగరంలో. ఇరవైరెండో యేట బ్రిటన్ చేరి, ఐబీఎం సంస్థలో కంప్యూటర్ ప్రోగ్రామర్గా జీవనం మొదలుపెట్టాడు. అతని పేరు జాన్ మ్యాక్స్వెల్ కూట్సీ. 2003లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న విశిష్ట రచయిత! కూట్సీ సిద్ధాంత పత్రానికి 1963లో కేప్ టౌన్ యూనివర్సిటీ మాస్టర్స్ పట్టా ప్రసాదించింది. మరో ఆరేళ్ళకు, శామ్యూయెల్ బెకెట్ వచనంలో వాక్యనిర్మాణరీతి– పదప్రయోగ శైలి– ధ్వని తదితర విశేషాల గురించి కూట్సీ సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ డాక్టరేట్ ప్రసాదించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ పెద్దమనిషి సృజనాత్మక సాహిత్యాన్నీ, భాషా సాహిత్యాలపై పరిశోధనను రెండు చక్రాలుగా చేసుకుని బండి నడిపిస్తూనే వున్నాడు! అలాంటి మనిషికి ఇంగ్లిష్, ఆఫ్రికాన్స్, డచ్, నామా, మలయ్ తదితర భాషలు తెలిసివుండడంలో వింతేముంది? సామాన్య శకం 450 సంవత్సరం నుంచి 1150 వరకూ వాడుకలో వుండి అంతరించిన ‘ఓల్డ్ ఇంగ్లిష్‘ అనే యాంగ్లో శాక్సన్ భాషలో కూడా నిష్ణాతుడు కావడం కూట్సీ సాధించిన ఘనవిజయాల్లో ఒకటి! టూకీగా చెప్పుకుంటేనే కూట్సీ కథ ఇంతవచ్చింది!కూట్సీ పుట్టి పెరిగిన దేశం దక్షిణాఫ్రికాలో 1994 వరకూ, రంగువెలి (అపార్థీడ్) అనే జాతి వివక్ష విధానం అమల్లో వుంది. గాంధీజీ ఆ దేశంలో అవమానాల పాలబడిన కథ చిన్నప్పుడు చదువుకున్నాంగా. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు నిర్బంధం అనుభవించాల్సి రావడానికి ఇదే విధానం కారణం. కూట్సీ మొదటి నుంచి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూనే రావడం నిజంగానే విశేషం! పాతికేళ్ళకు ముందే యూరపియన్– అమెరికన్ దేశాల్లో విస్తృతంగా తిరిగే అవకాశం కూట్సీకి దక్కడం వల్లే, ఈ విశాల దృష్టి ఏర్పడి వుంటుంది. అలా జాతిపరమైన అస్తిత్వ రేఖలను చెరిపేసుకుని, అక్షరాలా అంతర్జాతీయ స్వభావం సంతరించుకున్న రచయితల్లో కూట్సీ మొదటివాడూ కాడు– బహుశా చివరివాడు కూడా కాడేమో! ‘ఇంట గెలిచి, రచ్చ గెలవ’మనే నానుడి కూట్సీ మాతృభాష ఆఫ్రికాన్లో కూడా వున్నట్లుంది! అందుకే, అతగాడు 1977లో దక్షిణాఫ్రికాలోని ప్రతిష్ఠాత్మక పురస్కారం సీఎన్ఏ (సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ) సాహిత్య పురస్కారంతోనే తన విజయ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఇదే పురస్కారాన్ని 1980లో మరోసారి, ’84లో ఇంకోసారి కూడా గెల్చుకున్నాడు కూట్సీ. బుకర్ ప్రైజును రెండుసార్లు గెల్చుకున్న రచయిత తొలిరచయిత కూడా కూట్సీయే!‘ఇన్ ద హార్ట్ ఆఫ్ ద కంట్రీ’ నవలలో అధ్యాయాల విభజన లాంటిది కనిపించదు. రచయిత దీన్ని 266 పేరాగ్రాఫులుగా విభజించారు. సినిమా స్క్రిప్టులో కనిపించే సీన్ పేపర్ల కట్టలా వుంటుంది ఈ నవల. 1985లో మేరియన్ హ్యాన్సల్ ఈ దృశ్యమాన నవలను ‘డస్ట్’ అనే సినిమాగా తీశాడంటే తీయడూ మరి? ఈ నవల వెలువడ్డానికి మూడేళ్ళు ముందే, కూట్సీ రెండు నవలికలను కలిపి ‘డస్క్ ల్యాండ్స్’ అనే ఒకే నవలగా రాశాడు. వియెత్నాంలో మనోవైజ్ఞానిక యుద్ధానికి వ్యూహ రచన చేసిన యూజిన్ డాన్ క్రమంగా ఉన్మాదంలోకి దిగజారి కన్నకొడుకునే పొడిచి చంపేసిన కథనే ‘ద వియెత్నాం ప్రాజెక్ట్’ అనే నవలిక రాశాడు కూట్సీ. ‘ద నెరేటివ్ ఆఫ్ జాకబస్ కూట్సీ’ అనే మలి నవలిక, వాస్తవానికి కాలక్రమంలో ముందు రావాలి. వలసవాదులూ, సామ్రాజ్యవాదుల మానసికతలో అంతర్నిహితంగా వుండే హింసాత్మకత ఇతివృత్తంగా రాసిన నవలికలివి. ఆ రెండింటికీ అదే సామాన్య గుణం! ఇది కూడా గొప్పగా విజయవంతమైన ప్రయోగం. కాగా, నిత్యాధునికవాదం అనే పోస్ట్ మాడర్నిస్టు నవలా రచనకు ఇదే ఆదిగ్రంథమంటారు విమర్శకులు.1999లో, కూట్సీకి రెండోసారి బుకర్ ప్రైజ్ సంపాదించిపెట్టిన నవల ‘డిస్గ్రేస్.’ దక్షిణాఫ్రికాలో ఒకప్పుడు తెల్లదొరలు పాటించిన వివక్ష విధానాలు తర్వాతి రోజుల్లో ఎలాంటి విషఫలితాలు ఏర్పడడానికి దారితీశాయో చూపించిన రచన ఇది. ల్యూరీ అనే కీచకోపాధ్యాయుడు అప్రతిష్ఠాకరమైన జీవనం తర్వాతి కాలంలో పెత్తనం చెలాయించిన ‘నల్లదొరలు’ అనుకరిస్తే ఏమవుతుందనేదే ఈ నవలకు ఇతివృత్తం. 2019లో బీబీసీ ఎంపిక చేసిన ‘నూరు స్ఫూర్తిదాయకమైన నవలల జాబితా’లో స్థానం సంపాదించుకున్న నవల ఇది!డేనియల్ డీఫో సుప్రసిద్ధ రచన– ఇంగ్లిష్ భాషలో తొలి నవల– ‘రాబిన్సన్ క్రూసో’ సామాన్యశకం 1719లో తొలిముద్రణగా వెలువడింది. 1986లో, ఈ కథను దేశకాలమాన పరిస్థితులకు తగిన రీతిలో పునరూహ చేస్తూ, పునః రచించాడు కూట్సీ. దానికి ఆయన పెట్టిన పేరు ‘ఫో.’ నాలుగేళ్ళ తర్వాత, కూట్సీ తిరిగి దక్షిణాఫ్రికా ఇతివృత్తం వైపు దృష్టి మళ్ళించి, ‘ద ఐరన్ ఏజ్’ అనే నవల రాశారు. కూట్సీ రచనలన్నింట్లోనూ, ‘ఆశ్చర్యకరమైన రీతిలో పరాయివ్యక్తి జోక్యం జరుగుతూ ఉంటుంద’ని నోబెల్ పురస్కార ఎంపిక సంఘం పేర్కొంది. ఈ సామాన్య గుణంతో కూడివుండే కూట్సీ రచనలన్నింటికీ కలిపి నోబెల్ సాహిత్య పురస్కారాన్ని 2003లో అందించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారం పొందిన రచయితల్లో, ఈ ఆఫ్రికన్–ఆస్ట్రేలియన్ రచయితతో పోల్చదగిన వ్యక్తి మరొక్కరు కూడా కనిపించరని కూట్సీ అభిమానుల అభిప్రాయం! -మందలపర్తి కిషోర్ -
ఈ వారం కథ: ప్రశ్న
‘‘వల్లీ! మా డాడీ ఫోన్ చేశారు. పదో తారీఖున మనందర్నీ ఊరికి రమ్మన్నారు...’’ హబ్బీ వాసు మాటలకు ఆశ్చర్యంగా చూశాను. ‘‘ఎనీథింగ్ ఇంపార్టెంట్?’’‘‘అహ. వీలునామా రాస్తారట. తమ్ముళ్ళనీ చెల్లినీ కూడా పిలుస్తున్నారు ’’‘‘బావుంది. చాలామంది కరోనా తర్వాత రాశారు. మామగారు ఇప్పుడు రాస్తున్నారన్నమాట. మంచిదే! ఏమైనా ఆయనకు ముందు చూపు ఎక్కువే. కాని, అందరికీ ముందే చెబితే లేనిపోని గొడవలు రావూ!’’‘‘వస్తాయి. వాటిని మొదట్లోనే పరిష్కరించేయొచ్చు అన్నారు’’ బ్రేక్ఫాస్ట్ చేస్తూంటే వాసు చిన్న తమ్ముడు రఘు ఫోన్ చేశాడు.‘‘అన్నయ్యా, నాన్న వీలునామా రాస్తారట. నా సంగతి నీకు తెలుసుగా. నాది పెన్షన్ లేని ప్రైవేటు జాబు. ఎప్పుడు వూడుద్దో తెలీదు. మీ పిల్లలు బాగా సెటిలయ్యారు. నా పిల్లలింకా కాలేజీలోనే వున్నారు. అంచేత నాక్కొంచెం అదనంగా...!’’‘‘ఫేవర్ చేయించమంటావు? డాడీకి అందరి, అన్ని సంగతులూ తెలుసు. ఒకరితో చెప్పించుకోరు. నీకెలా న్యాయం చేయాలో అలా చేస్తారు గాని వూరికే భయపడకు’’వాసు ఫోన్ పక్కన పెడుతోంటే మళ్ళీ ఫోన్ మోగింది. డిస్ప్లే చూసి,‘‘పెద్ద తమ్ముడు శేషు’’ నాకు చెప్పి, ‘‘చెప్పరా. వీలునామా గురించేనా!’’ అడిగాడు.‘‘ఆ మాట విన్నప్పట్నుంచీ యమ టెన్షన్ గా వుందన్నయ్యా...’’‘‘ఎందుకురా!’’‘‘డాడీ సంగతి నీకు తెలుసుగా. అందరూ సమానమేనంటూ సమానంగా పంచుతారు. నేను నిండా మునిగిపోతాను!’’‘‘ఏం?’’‘‘నాకు ముగ్గురూ ఆడపిల్లలే. వాళ్ళ దుస్తులకూ, చదువులకూ చాలా ఖర్చయ్యింది. ఇక అసలు ఖర్చంతా ముందుంది. వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, పురుళ్ళూ పుణ్యాలూ...!’’‘‘శేషూ! ఉద్యోగం చేస్తున్నావు. మొన్ననే రెండో ప్రమోషన్ తీసుకున్నావు. నువ్వు బీదార్పులు అరవడం ఏం బాగోలేదు. పిల్లలకు పెళ్లి చేయాల్సిన బాధ్యత మనది కానీ డాడీది కాదు. అయినా నాన్నను అడక్కుండా నాకు చెబుతావేంటి!’’‘‘నువ్వు చెబితే నాన్న వింటారు...!’’‘‘అంతా ఓపెన్ గా చెప్పే చేస్తానన్నారు. అందరం అక్కడే వుంటాం గనుక అప్పుడే మాట్లాడదాం...!’’ ‘‘నన్ను సపోర్టు చేస్తావనుకున్నాను అన్నయ్యా!’’‘‘నాకు నువ్వెంతో రఘూ అంతే. ఏం చేసేదీ, ఎలా చేసేదీ అంతా డాడీ ఇష్టం. ఆయన ఏం చేస్తారో వినకుండా ముందే ఆందోళన పడటం అనవసరం’’ ఫోన్ పెట్టేసి, ‘‘నా సపోర్టు కోసం చేశాడు’’ చెప్పాడు వాసు. ‘‘అన్న గారిగా మీకూ బాధ్యత వుందిగా, చెయ్యండి’’ ఆఫీసుకు రెడీ అవుతుంటే అడబడుచు రమ కాల్ చేసింది. ‘‘నాకు చేశావేంటి రమా. మీ తమ్ముళ్ళిద్దరూ ఇంతక్రితమే మీ అన్నయ్యకు చేశారు’’ ‘‘వాళ్ళు చేయడమే కాదు బుడిబుడి దీర్ఘాలు తీస్తారనీ నాకు తెలుసు. అందుకే నీకు చేశాను. నువ్వేం చెప్పినా డాడీ వింటారు. బాగా చదువుకున్న దానివి, లాజిక్తో మాట్లాడతావని నువ్వంటే ఎంతో గౌరవం!’’‘‘సరి సరే. ఆఫీసుకు టైమయ్యింది. త్వరగా చెప్పు రమా’’‘‘నీ తమ్ముడి గురించి తెలుసుగా వదినా. మంచి ఉద్యోగం చేస్తున్నారని నన్నిచ్చి పెళ్లి చేశారు. అయిదేళ్ళు గడవకుండానే ఉద్యోగానికి రాజీనామా చేసి మిత్రుడితో కలిసి వ్యాపారం మొదలెట్టారు. అందులో ఎంత నష్టపోయామో నీకు తెలుసుగా. తర్వాత రియల్ ఎస్టేట్ అన్నారు. లక్షలొచ్చి పడతాయన్నారు. కొన్న భూమి కోర్టు గొడవల్లో ఇరుక్కుంది. ఈలోగా రొయ్యల చెరువుల్లో కోట్లు మిగుల్తాయని అందులోకి దూకారు. రొయ్యల సాగు గురించి చెప్పేదేముంది. ఎప్పుడే వైరస్ వచ్చి అవి తేలి, మమ్మల్ని ముంచేస్తాయో తెలీదు. కంటి నిండా నిద్రపోలేకుండా ఉన్నామంటే నమ్ము!’’ ‘‘ఇవన్నీ మీ నాన్నతోనో అన్నయ్యతోనో చెబితే లాభం వుంటుంది. నాతో ఏమవుతుంది చెప్పు!’’ ‘‘నీ వల్ల కానిది వుండదు వదినా. చెప్పేనుగా నువ్వన్నా నీ మాటలన్నా మా డాడీకెంతో గురి!’’‘‘సరే. ఆయన నీకు అన్యాయం చేసినట్టు అనిపిస్తే అప్పుడు కల్పించుకుంటాన్లే’’‘‘నువ్వు మాటిస్తే నా పని అయిపోయినట్టే’’ పొంగిపోయింది. కార్లో ఆఫీసుకు వెళుతూ, ‘‘రమ నాకు ఫోన్ చేసింది’’ చెప్పాను.‘‘ఏవిటో అనవసరంగా డాడీ తేనెతుట్టె కదిలిస్తున్నారు!’’‘‘మామయ్యగారికి ఇవన్నీ తెలీవనుకోను . ఈపాటికి ఏదో ఒక నిర్ణయానికొచ్చేసే వుంటారు. మనం వెళ్ళి శంఖంలో పోయడమే!’’ ‘‘చూద్దాం. నువ్వు సెలవు పెట్టడం మర్చిపోకు సుమా...’’ ఒకరోజు ముందే అత్తవారి వూరుకెళ్ళాం. అప్పటికే మిగతా మూడు కుటుంబాలూ వచ్చేశాయి. ‘‘పెద్ద పండుగ మళ్ళీ వచ్చినట్టుగా వుంది’’ అత్తయ్య ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ‘‘వంటా వడ్డనా మాకు అప్పగించి మీరు హాయిగా రెస్టు తీసుకోండి అత్తయ్యా’’ అన్నారు శేషు భార్య ప్రియదర్శిని, రఘు భార్య లలితకుమారి. ‘‘మేమిక్కడ వున్నంతకాలం మేమే వంటింటి మహారాణులం అత్తయ్యా !’’ అంటూ జత కలిశాను. మురిసిపోయిందావిడ. ‘‘ఆ మాటన్నారు అదే పదివేలు. నా బిడ్డలకు నేను వండిపెడితేనే నాకు తృప్తిగా వుంటుంది. మీరెళ్ళి కబుర్లు చెప్పుకోండి’’‘‘మీ బిడ్డలకే గాని మాకు వండిపెట్టరా!’’ నవ్వుతూ చురక వేశాను.‘‘అయ్యో, ఎంత మాట శ్రీవల్లీ. మీ ముగ్గురూ ఈ ఇంటి మహాలక్షు్మలు!’’ ‘‘నగలు అలంకరించుకుని కూర్చోడానికే గాని, మీ వంటింటి సామ్రాజ్యంలో అడుగు పెట్టకూడదన్నమాట!’’ నిష్ఠూరంగా అంది ప్రియదర్శిని. ‘‘అంతేనా లేక మేం మీలాగా వండలేమని వద్దంటున్నారా!’’ లలిత కుమారి ఆరా తీసింది. ‘‘అదేం కాదర్రా. మీరు మా బంగారాలు. రోజూ మీ వంటే తింటున్నారుగా. ఈ మూడు నాలుగు రోజులూ నా చేతి వంట తిననివ్వండి’’ ‘‘అయితే ఒక షరతు. మాకూ కొన్ని పనులు పురమాయించాలి. మా సాయమూ తీసుకోవాలి’’ మరి కాదన్లేక పోయారు. అవాళంతా కబుర్లతో ఛలోక్తులతో ప్రశంసలతో సరదాగా గడిచింది. ‘‘మీరెప్పుడూ ఇలాగే కలిసిమెలిసి వుండాలి. సంతోషంగా వుండాలి. ఒకరికొకరు సాయసంపదలు అందించుకోవాలి...’’ చెమ్మగిల్లిన కళ్ళతో అన్నారు మామయ్య. వెంటనే కొడుకులూ కూతురూ, ‘‘ఓ అలాగే డాడీ’’ అనేశారు.మర్నాడు ఎలాంటి తుపాను వస్తుందోనని వారి గుండెల్లో గుబులుగానే వుందన్న సంగతి వారి ముఖాలే చెబుతున్నాయి! పదకొండింటికి మామయ్యగారు అందర్నీ హాల్లోకి పిలిచారు. అందరం వెళ్ళి ఆయన వంక ఆసక్తిగా చూశాం. మామయ్యగారు కొన్ని పేపర్లు బయటికి తీశారు. ‘‘ఈమధ్య నా ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు. రేపు లేనిపోని తేడాలు, గొడవలు రాకుండా ఇప్పుడే మీతో ఒక మాట చెప్పి వీలునామా రాసేయాలనుకున్నాను’’ ఆగి అందరి వంకా చూశారు. అంతా మౌనంగా ఉండిపోయేసరికి తిరిగి తనే అన్నారు ‘‘మేం ఒకర్ని ఎక్కువగా ఒకర్ని తక్కువగా చూడలేదు. అందర్నీ సమానంగా చూశాం, పెంచాం, చదివించాం. మీమీ శక్తియుక్తుల్ని బట్టి చదువుకున్నారు. ఉద్యోగాలో, వ్యాపారమో చేసుకుంటూ బాగానే సంపాదించుకుంటున్నారు. సంతోషం.మనకిప్పుడు పదెకరాల పొలం, రెండెకరాల మామిడితోట, టౌన్లో ఇళ్ళ స్థలాలు, ఇక్కడో ఇల్లు ఉన్నాయి. వీటన్నిట్నీ ఇవాళ్టి విలువని బట్టి లెక్కగట్టి ఆరు వాటాలు వేశాను...’’ఉలిక్కిపడ్డామంతా. ‘‘మేం నలుగురమే కదా డాడీ’’ వెంటనే శేషు అడిగాడు. ‘‘నాకూ మీ అమ్మకూ విడిగా వాటాలు వేశాను. ఇవాళ రేపు ఆసుపత్రులకు ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసుగా. ఏమంటావమ్మా శ్రీవల్లీ’’ నన్నడిగారు. ఆసరికే నా ముఖం ఎర్రబడింది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. లోలోపల మండుతూ మౌనంగా వుండిపోయాను. ‘‘మీ ఆస్తి ఎలా పంచుతారో మీ ఇష్టం. మధ్యలో ఎవరి పెత్తనం అక్కర్లేదు’’ విసురుగా అన్నాడు వాసు. ‘‘అక్కకి పెళ్లిలోనే ఇంత మూట ఇచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు వాటా పంచడమంటే డబుల్ షేర్ ఇవ్వడమే!’’ రఘు ముఖాన గంటు పెట్టుకున్నాడు.‘‘అది కట్నం. ఇచ్చింది నాకు కాదు మా అత్తవారికి! ఇది నా హక్కు. నా వాటా నాకివ్వాల్సిందే!’’ రమ గొంతు పెంచింది. ‘‘ఆడబడచుకు ఒక రూపాయి పెట్టాలిగాని దానికి పెట్టిన దాని గురించి లెక్కలేయకూడదురా చిన్నోడా!’’ అన్నారు అత్తయ్య. ‘‘ఏం అన్నయ్యా మాట్లాడవేం!’’‘‘డాడీ ఆస్తి. తన ఇష్టానుసారం పంచే హక్కు అధికారం డాడీకి వున్నాయి. కాదనడానికి మనమెవరంరా!’’ అన్నాడు వాసు. తను ఎప్పుడూ అంతే. అందరితో మంచివాడు అనిపించుకోవాలని చూస్తారు తప్ప ఎటూ తేల్చి చెప్పరు! ‘‘డాడీ సంపాదించిందే కాదు, ఆ తాత, ఈ తాత ఇచ్చిందీ వుంది. వాటి మీద మనవలుగా మనకే పూర్తి హక్కు వుంటుందని ప్లీడరు చెప్పాడు’’ అన్నాడు శేషు. అంతా అదిరిపడి చూశారు.‘‘ఇది మన కుటుంబ వ్యవహారం. మనలో మనం తెముల్చుకోవాలి. కిందా మీదా పడినా ఫరవాలేదు గాని గొడవలు పడకూడదు. రేపు ఎవరూ కోర్టు గడప తొక్కకూడదనేగా ఇప్పుడు వీలునామా తలపెట్టింది!’’ అన్నారు మామయ్య. ‘’ఆస్తి పంచుతున్నప్పుడు ఇంకా వీలునామా ఎందుకు అంకుల్, ఏకంగా వాటాలు పంచి ఇచ్చేయండి. ఎవరి వాటా వాళ్ళు ఇప్పట్నుంచే అనుభవిస్తారు’’ ప్రియదర్శిని కల్పించుకుంది. ‘‘ప్రియదర్శిని చెప్పింది సబబుగా వుంది. ఆలోచించండి మామయ్యా!’’ అన్నాను. ‘‘శ్రీవల్లి బలపరుస్తోంది గనుక అందరికీ సమ్మతమైతే అలాగే చేద్దాం. ఏమంటారు’’‘‘పంచడమే కాదు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఎవరి కాగితాలు వారికి ఇచ్చేయ్యండి అంకుల్’’ అన్నాడు ఇంటల్లుడు అనిల్.‘‘అలాగే చెయ్యండి గాని సమాన వాటాలంటే మాత్రం నేనొప్పుకోను. అన్ని చేతి వేళ్ళూ ఒకేలా వుండవు. అందరి బరువు బాధ్యతలూ ఒకే రకంగా లేవు. అన్నయ్యలకు ఖర్చు పెట్టినంత నాకు ఖర్చు పెట్టలేదు..!’’రఘు మాటలకు, ‘‘వాళ్ళుపై చదువులకు వెళ్ళారు. నువ్వెళ్ళలేదు. అది నీ తప్పు. దాని పర్యవసానాలకు నువ్వే బాధ్యుడివి గాని, నేను కాదు కదురా!’’ అన్నారు మామయ్య.‘‘మేం కాదనటం లేదు. అన్నయ్య పిల్లలు త్వరగా ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. మా ఇద్దరి పిల్లలు ఆ స్థాయికి రావడానికి చాలా టైము పడుతుంది..’’ అని రఘు అంటే, ‘‘నాకు ముగ్గురూ ఆడపిల్లలే. నేను అందరి కన్నా ఎక్కువ బరువులు మోయాలి. దాన్ని లెక్కలోకి తీసుకోరా?!’’ సూటిగా బాధగా ప్రశ్నించాడు శేషు.‘‘ఆగండాగండి. మీ వదిన కరెక్టుగా చెబుతుంది. ఏమమ్మా, శ్రీవల్లీ, నీ అభిప్రాయం ఏమిటి?’’ నన్ను అడిగారు మామయ్య.నోరు తెరవక తప్పలేదు. ‘‘మాకు ఈ వ్యవహారంలో సంబంధం వుందా మామయ్యా!’’ సూటిగా అడిగాను.దెబ్బతిన్నట్టు చూశారు. ‘‘అలా మాట్లాడతావేంటమ్మా. ఇది మన కుటుంబ వ్యవహారం. పెద్ద కోడలిగా నీకెక్కువ బాధ్యత వుందమ్మా!’’‘‘మేం బరువు బాధ్యతలు మోయటానికే నన్నమాట!’’‘‘చిత్రంగా మాట్లాడతావేంటి వల్లీ. అసలు నీకివాళేమైంది’’ వాసు ముఖం చిట్లించాడు.‘‘జ్ఞానోదయం అయింది!’’‘‘ఇప్పుడు జరక్కూడనిదేం జరగిందమ్మా. నీ మాటెవరూ కాదన్లేదుగా!’’ అత్తయ్య అన్నారు.‘‘ఆస్తి పంపకాల్లో కోడళ్ళనీ సంప్రదించాలన్న ఆలోచనే మీకు రాకపోవడం చాలా దారుణం మామయ్యా!’’‘‘లోకతీరుని బట్టే చేస్తారు తప్ప నీకేదో స్పెషల్ సింహాసనం వెయ్యరు’’ కోప్పడ్డాడు వాసు.‘‘ఇంకా పంపకాలవ్వలేదు శ్రీవల్లీ. నీ అభిప్రాయం నిర్మొహమాటంగా చెప్పు ’’ అన్నారు మామయ్య.‘‘ఎన్ని వాటాలు వేస్తున్నారో ముందే చెప్పేశారుగా!’’‘‘కొడుకులకూ, కూతురికీ వాటాలేశాను. మా తనువులు వెళ్ళాలి గనుక మా ఇద్దరికీ చెరో వాటా వేసుకున్నాం. అది తప్పంటావా?’’‘‘అనను. కాని ఆ కుటుంబ సభ్యుల్లోకి కోడళ్ళు ఎందుకు రాలేదన్నది నా ప్రశ్న!’’‘‘కొడుకులకే కాదు కోడళ్ళకూ వాటా ఇమ్మంటోంది డాడీ!’’ రమ హేళనగా నవ్వింది.‘‘అప్పుడింక మా చేతికొచ్చేది ఆస్తి కాదు, ఖాళీ చిప్ప!’’ శ్రుతి కలిపాడు రఘు.‘‘కొడుకులకిస్తే మీకిచ్చినట్టు కాదా?’’ మామయ్య ప్రశ్నించారు.‘‘కానే కాదు. ఎవరిది వారిదే!’’‘‘ఆ మాట బాగోలేదమ్మా శ్రీవల్లీ. మొగుడూ పెళ్ళాలు ఎప్పుడూ ఒకటే’’ నొచ్చుకున్నారు అత్తయ్య.‘‘నీ ఉద్దేశమేంటి అక్కయ్యా’’ ప్రియదర్శిని అడిగింది.‘‘పెళ్ళవుతూనే ఈ ఇంటికొచ్చాం. ఈ ఇంటి సభ్యులం అయ్యాం. పెళ్లితో వీరి గోత్రమే మనదైంది. ఈ ఇంటి పేరే మనదైంది!...’’‘‘ ఇప్పుడు కాదని ఎవరన్నారు?’’ మామయ్య అడిగారు.‘‘ మా పెళ్లి అవుతూనే ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మీరే మన్నారో గుర్తుందా మామయ్యా. ‘నువ్వు ఇంటి పెద్ద కోడలివి గనుక కుటుంబ పరువు ప్రతిష్ఠలు, మర్యాదలు, సంప్రదాయాలు అన్నీ నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. అన్నయ్య అంటే తండ్రి తర్వాత తండ్రి అన్నారు. వదిన అంటే తల్లే. అంచేత మరుదుల్ని, ఆడపడుచుని చక్కగా చూసే బాధ్యత కూడా నీదే!’ అన్నారు’’‘‘అవును. అవే మాటలన్నాను. నువ్వు, నీ తోడికోడళ్లు అవి చక్కగా పాటించిన మాటా నిజమే. అయితే ఇప్పుడు ఏంటి!’’‘‘పూర్వం పెద్దకొడుకు అంటే పెద్ద పాలేరు అని అదనంగా ఏదో ముట్టచెప్పేవారు. ఇప్పుడు అన్నయ్యకి కాకపోయినా వదినకి ఇవ్వమనేమో!’’ వంకరగా నవ్వాడు శేషు .నా వంక కొరకొరా చూశాడు వాసు.‘‘మేము ఈ ఇంటి సభ్యులుగా కుటుంబ పరువు మర్యాద కాపాడాలి. కుటుంబ బరువు బాధ్యతలు పంచుకోవాలి. మేం ఈ కుటుంబ సభ్యులమే అయినప్పటికీ మాకు బాధ్యతలు తప్ప ఇంటి మీద గాని, కుటుంబ ఆస్తి మీద గాని ఎలాంటి హక్కూ అధికారం ఎందుకు లేవన్నది నా ప్రశ్న! ఈ ఇంట్లో కోడళ్ళు ఉత్త సభ్యులే అంటే మాత్రం నేను అంగీకరించను!’’‘‘అలా ఆలోచిస్తే అక్క అన్నది సమంజసమే’’ ప్రియదర్శిని అంది.‘‘ఇదేమీ వ్యాపార భాగస్వామ్యం కాదు, కుటుంబస్వామ్యం!’’ వాసు కసురుకున్నాడు.‘‘తెలుసు. నేనడిగేది కుటుంబ ఆస్తిలోని భాగమే!’’‘‘వదిన అతి తెలివిగా మాట్లాడుతోంది. అప్పుడు తను పుట్టింటి నుంచి తెచ్చుకున్నదీ ఉమ్మడి ఆస్తే అవుతుందిగా!’’ రఘు అన్నాడు.‘‘అవ్వదు. అది నాది. కూతురు గనుక రమకీ వాటా ఇస్తున్నాంగా. అలాగే మేమూ పుట్టిళ్ళ నుంచి తెచ్చుకున్నాం. మరి మాకు అత్తింటి నుంచి ఎందుకని ఏమీ ఇవ్వరు ?’’‘‘నువ్విలా అడ్డంగా మాట్లాడటం నాకు నచ్చలేదు’’ ముఖం మాడ్చుకున్నారు మామయ్య.‘‘పితృస్వామ్య ఆలోచనా దృక్పథంలోంచి బయటికొచ్చి చూస్తే నా మాటలెంత న్యాయమో అర్థమవుతాయి మామయ్యా. అత్తయ్యగారు తెచ్చుకున్నది రమకి కట్నంగా ఇచ్చారు. ఆవిడకేం మిగల్లేదు గనుకే వాటా ఇస్తున్నారు. రఘూ వాళ్ళది లవ్ మ్యారేజ్. లలిత ఏమీ తెచ్చుకోలేదు. ఇలాగే ఒక్కో కోడలి ఆర్థిక స్థితి ఒక్కో రకంగా వుంటుంది. వారికి కుటుంబ ఆస్తిలో భాగం ఇవ్వకపోవడమంటే తోటి కుటుంబ సభ్యులకు ముమ్మాటికీ అన్యాయం చేస్తున్నట్టే!’’ నా స్వరం మరింత పెరిగింది.‘‘మొగుడూ పెళ్లాల్ని వేరు వేరుగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావటం లేదు’’ బాధగా అన్నారు మామయ్య.‘‘ఒకటే ఎలా అవుతారు? నిజంగా మీరా సంగతి మనస్ఫూర్తిగా నమ్మితే, ఆస్తి కొడుకులకు కాక కోడళ్లకు రాయండి. రాయగలరా? కచ్చితంగా రాయలేరు! ఆయన ఆస్తే నా ఆస్తి, ఆయన ఇల్లే నా ఇల్లు, ఆయన సంపాదనే నా సంపాదన అనుకోమంటారు? నాకు విడిగా ఎలాంటి గుర్తింపూ లేదంటారు? ఆయన నీడలా ఉంటూ ఆయన దయాదాక్షిణ్యాల మీద ఎప్పటికీ ఆధారపడే ఉండాలంటారు? ఇదేనా కుటుంబ వ్యవస్థ ఇంటి కోడళ్లకు ఇచ్చే గౌరవం? నేను ఉద్యోగం చేస్తున్నాను గనుక ఓకే, లేకపోతే నా పరిస్థితి ఏమిటి? ప్రతిదానికీ మొగుడి మీద ఆధారపడాలి. అంటే గాలిలో వేలాడాలి !’’‘వేరు వేరు అనుకుంటే తేడాగానే ఉంటుంది. అంతా ఒకటే అనుకుంటే ఏమీ ఉండదు!’’ అన్నారు అత్తయ్య.‘‘రేపేం జరుగుతుందో ఎవరు ఊహించగలరు అత్తయ్యా? ఏమైనా జరగొచ్చు. మేం విడిపోవచ్చు. వేరే మోజులోపడి నాకూ పిల్లలకూ అన్యాయం చేయొచ్చు. వ్యసనాలకు తగలేయొచ్చు. ‘ఇది నా ఇల్లు’ అంటూ ఇంట్లోంచి తన్ని తరిమేయొచ్చు. అటువంటప్పుడు కుటుంబం ఆయా సభ్యులకు అండగా నిలబడాలిగా! మరప్పుడు విడిగా ఆస్తిహక్కు ఎందుకివ్వరు? మిమ్మల్నొక్కర్నే కాదు, మొత్తం ఈ పితృస్వామ్య సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను!’’ఎవరూ మాట్లాడలేదు. మధ్యలో శవం వున్నట్టు మౌనంగా వుండిపోయారు.‘‘అవసరం రానంతవరకూ ఉమ్మడిగానే వుంటుంది. అవసరమైనప్పుడు ఎవరిది వారికే అవుతుంది’’ గొణుక్కున్నారు మామయ్య.‘‘అది నా ప్రశ్నకు సమాధానం కాదు మామాయ్యా!’’‘‘నీ ప్రశ్న చాలా చిత్రంగా ఉంది. ఏ ఇంట్లోనూ లేనిది మన ఇంట్లోనే ఎందుకు?’’‘‘దానర్థం నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని స్థితిలో కుటుంబం వుంది. అంటే నేనీ ఇంట్లో ఒక డమ్మీని! అది తెలిసి కూడా నేనిక్కడ బొమ్మలా కూర్చుని మీ రేడియో సంభాషణ వినడంలో అర్థం లేదు!’’ విసురుగా లేచి వచ్చేశాను.నా వెనుకే ప్రియదర్శిని, కాస్సేపటికి లలిత కుమారి వచ్చేశారు. ‘‘మీ నిర్ణయానికి నిరసనగా మీ కోడళ్ళు వాకౌట్ చేశారు డాడీ!’’ మా వెనుక ఎవరో అన్నారు.అవును, మాది వాకౌటే. కుటుంబంలోంచి వాకౌటే! ‘‘శ్రీవల్లీ!’’ పిలుస్తూ అత్తయ్య వచ్చారు. ‘‘ఇంట్లో మీకు లేని హక్కులు నాకూ ఉండవు గాని లోపలికి పదండి’’‘‘అది కాదు అత్తయ్యా!’’‘‘లోపలికి రండి. నేనున్నాగా!’’ మౌనంగా అనుసరించాం. ‘‘వీళ్లు నాలాగానే ఈ కుటుంబంలోకి వచ్చారు. కుటుంబ సభ్యులయ్యారు. కోడళ్ళకు ఆర్థిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీదా వుంది. ఉమ్మడి ఆస్తిలో వారికీ వాటా వేయాల్సిందే!’’మేం చప్పట్లు కొట్టాం! -సింహప్రసాద్ -
ప్లాస్టిక్ అడ్రెస్
ప్లాస్టిక్ లేకుండా మన రోజువారీ జీవితం సాగని పరిస్థితి వచ్చేసింది. ఈ ప్లాస్టిక్ మన ఇంట్లోకే కాదు ఇప్పుడు ఒంటి మీదకు వచ్చేసింది. సౌకర్యం కోసం ఎంచుకున్న దుస్తులు– అనారోగ్య సమస్యలను ‘కొని’ తెస్తున్నాయి. ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ఇవి త్వరగా చెడిపోక వ్యర్థాలుగా పేరుకుపోయి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.మీ పిల్లల్ని కొత్త స్కూల్లో చేర్చారా? మీ పిల్లలు వాడుతున్న యూనిఫామ్లు సరిపోవడం లేదా? అయితే ఈ ఏడాది మరో యూనిఫామ్ కొనాల్సిందే! కొనడం సరే, అసలు పిల్లలు వాడుతున్న యూనిఫామ్లు ఆరోగ్యకరమేనా? పర్యావరణ హితమేనా? పాత యూనిఫామ్స్ సంగతేంటి? వాటిని ఏం చేస్తున్నాం? వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఈ ప్రశ్నలు సాధారణంగా మనం వేసుకోం. ఎందుకంటే యూనిఫామ్ తప్పనిసరి అవసరం. ఏడాదికో జత మార్చేదే కదా? అది అందుబాటు ధరలో లభిస్తే సరిపోతుంది అని భావిస్తాం కాని, ఈ యూనిఫామ్ వెనుక అనేక వాస్తవాలు దాగి ఉన్నాయి.మన దేశంలో సుమారు 24 కోట్లకు పైగా విద్యార్థులు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ ఏడాదికి తమ యూనిఫామ్లోని ఒక షర్టు వాడకుండా పక్కన పడేస్తే, దాదాపు 32,000 టన్నుల వ్యర్థాలు పోగుపడతాయి. యూనిఫామ్ షర్టులు ఎక్కువగా పాలిస్టర్తో తయారవుతాయి. ఒక కిలో పాలిస్టర్ తయారీకి సుమారుగా 62 లీటర్ల నీరు అవసరం. 1.53 కిలోల పెట్రోలియం. 217 మెగా జూల్స్ శక్తి అవసరం అవుతుంది. పాలిస్టర్ తయారీ ప్రక్రియలో 21 కిలోగ్రామల కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది.పాలిస్టర్ను ఎక్కువగా ఎందుకు వినియోగిస్తారు?మన దేశంలో పాలిస్టర్ను ఎక్కువగా వాడడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ బట్ట ముడతలు పడదు. దీంతో ఇస్త్రీ అవసరం ఉండదు. ఉతికిన తర్వాత త్వరగా ఆరుతుంది. ఇది వినియోగదారులకు అదనపు సౌలభ్యం.ఏటా 70 లక్షల టన్నులకు పైగా వస్త్ర వ్యర్థాలుమన దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై జరుగుతున్నంత చర్చ వస్త్ర వ్యర్థాలపై జరగడం లేదు. పేరుకుపోతున్న వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నా, పర్యావరణానికి ముప్పుగానే పరిణమిస్తోంది. కేంద్ర జౌళిశాఖ లెక్కల ప్రకారం దేశంలో ఏటా 70.73 లక్షల టన్నుల వస్త్ర వ్యర్థం ఉత్పత్తి అవుతోంది. దీంట్లో 42% ఫ్యాక్టరీల్లో తయారీ సమయంలో వస్తుండగా, 58% వినియోగం తర్వాత వచ్చే వ్యర్థం. ఇందులో 70% వ్యర్థాల్ని రీసైక్లింగ్, పునర్వియోగం చేస్తున్నారు. ప్రపంచంలోని వస్త్ర వ్యర్థాల్లో భారతదేశం సుమారు 8% వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది.విద్యార్థులపై ప్రభావంపాలిస్టర్ వస్త్రాన్ని పాలిథిలిన్ టెరెఫ్లాలెట్ (పెట్) అనే రసాయనంతో తయారు చేస్తారు. పెట్రోలియం ఆధారిత రసాయనాలను వేడిచేసి, వాటిని ప్లాస్టిక్ చిప్స్గా మార్చి ఆపై సన్నని దారాలుగా మారుస్తారు. పెట్ బాటిల్స్ అనే మాట మనం తరచుగా వింటూ ఉంటాం– వాటిని కూడా ఈ మెటీరియల్తోనే తయారు చేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇదే వాస్తవం. విద్యార్థులు ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం యూనిఫామ్ వేసుకుంటారు. ఈ దుస్తులు చెమట పీల్చుకోవు. చర్మంపై ఎక్కువ సేపు తడి ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి కొంతమందిలో అలర్జీలు, చర్మ సమస్యలు వస్తాయి.ఇది మరిన్ని అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఈ దుస్తులు ఉతికిన ప్రతిసారీ కంటికి కనిపించనంత చిన్న పరిమాణంలో ప్లాస్టిక్ రేణువులుగా విడిపోయి నీటిలో కలుస్తాయి. నీటిశుద్ధి కేంద్రాలు సైతం వీటిని పూర్తిగా వడపోయలేవు. ఇవి నదుల్లోకి, సముద్రాల్లోకి చేరుతాయి. చేపలు, ఇతర జీవులు వీటిని ఆహారంగా తీసుకుంటాయి. ఆ జీవులను మనం తింటే ఆ ప్లాస్టిక్ రేణువులు మన శరీరంలోకి చేరుతాయి. ఇవి కేవలం నీటిలోనే కాదు గాలిలోనూ కలుస్తాయి. ఇవి శ్వాస ద్వారా మన శరీరంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది.పర్యావరణానికి ముప్పు కొంతమంది దుస్తులను కాలువలు, నదులు, నీటి కుంటల్లో పడేస్తారు. కొన్ని డంపింగ్ యార్డుకు చేరుతాయి. ప్రధానంగా పాలిస్టర్ వస్త్రాలు మట్టిలో కలిసిపోవు. ఏళ్ల తరబడి అలానే ఉంటాయి. మరికొన్ని పీలికలుగా అయిపోతాయి కానీ నేలలో పూర్తిగా కలిసిపోవు. కొన్నిచోట్ల దుస్తులను బహిరంగంగా కాలుస్తారు. ఇది తక్షణ పరిష్కారంగా కనిపించినా, సింథటిక్ వస్త్రాలు కాల్చినప్పుడు విషపూరిత వాయువులు విడుదల అవుతాయి. ఇవి గాలిలో చే రి మనం పీల్చే గాలిని కలుషితం చేసి, మన శరీరంలోకి ప్రవేశిస్తాయి.రీ సైక్లింగ్ పరిష్కారమా? తాత్కాలిక ఉపశమనమా?వస్త్ర వ్యర్థాలు భారీగా పెరిగిపోతున్నాయి. కొండల్లా పేరుకుపోతున్నాయి. ఈ దశలో సహజంగా వచ్చే ఆలోచన రీ సైక్లింగ్. ఈ వ్యర్థాలను మళ్లీ ఉపయోగించగలమా? వీటితో కొత్త ఉత్పత్తులు తయారు చేయగలమా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. భారతదేశంలో వస్త్రాల రీ సైక్లింగ్ కొత్త వ్యవస్థేమీ కాదు. ఏళ్ల తరబడి అనధికారికంగా, కుటీర పరిశ్రమల స్థాయిలో నిరంతరాయంగా ఈ వ్యవస్థ పనిచేస్తోంది.దేశంలోని కొన్ని ప్రాంతాలు రీసైక్లింగ్ హబ్లుగా మారాయి. వాడిన దుస్తులు, ఫ్యాబ్రిక్ ముక్కలు, పరిశ్రమ వ్యర్థాల నుంచి సేకరించిన వాటిని ఈ హబ్లలో వర్గీకరిస్తారు. పునర్వినియోగానికి అనుగుణంగా మారుస్తారు. అయితే ఇదంత సులభమైన ప్రక్రియ కాదు. సేకరించిన వాటిలో ఉపయోగపడేవి, ఉపయోగపడని వాటిని ముందుగా వర్గీకరించాలి. పనికొచ్చే వాటిని ప్రాసెస్ చేసి దుప్పట్లు, దిండ్లు, ఫిల్లింగ్ మెటీరియల్స్, తక్కువ నాణ్యత గల దుస్తులు తయారు చేస్తారు.రీసైక్లింగ్కు పలు పరిమితులురీసైక్లింగ్ ఒక పాక్షిక పరిష్కార మార్గం మాత్రమే. మొత్తం వ్యర్థాల నిర్మూలన కు ఇది పూర్తి పరిష్కారాన్ని చూపడం లేదు. ముఖ్యంగా పాలిస్టర్ వ్యర్థం పూర్తి స్థాయి వినియోగానికి పనికి రాదు– ఇది మొదటి సమస్య. సేకరించడం, వర్గీకరించడం, శుద్ధి చేయడం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి– ఇది రెండో సమస్య. ఇక మూడో సమస్య సాంకేతికత. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో సంప్రదాయ పద్ధతులనే వినియోగిస్తున్నారు.ఫలితంగా పాలిస్టర్ మిక్స్డ్ కాటన్ వంటి వస్త్రాల్లో వ్యర్థాలు ఎక్కువగా మిగిలిపోతున్నాయి. కెమికల్ రీసైక్లింగ్ పద్ధతులు అందుబాటులో ఉన్నా, అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. వీటికి ఖర్చు ఎక్కువ. సాంకేతికత విస్తృతంగా అందుబాటులో లేదు. మారుతున్న ఫ్యాషన్లకు అనుగుణంగా ఉత్పత్తి పెరుగుతోంది. వినియోగమూ అదే స్థాయిలో ఉంది. దుస్తులను తక్కువ కాలం వాడి పారేస్తున్నాం. ఈ విధానంలో మార్పు రాకపోతే పునర్వినియోగం మాత్రమే సమస్యను పరిష్కరించలేదు.అటకామా ఎడారిలో వ్యర్థవస్త్రాలుచిలీలోని అటకామా ఎడారి వ్యర్థవస్త్రాల చెత్తకుప్పలా మారుతోంది. అమెరికా, యూరోప్ దేశాలు పనికిరాని దుస్తులను తీసుకొచ్చి, అటకామా ఎడారిలో అక్రమంగా పడేస్తున్నారు. ఈ తతంగం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. చిలీకి వివిధ దేశాల నుంచి ఏటా వాడేసిన దుస్తులు దాదాపు 1.23 లక్షల టన్నుల వరకు వస్తుంటాయి. వీటిలో సెకండ్ హ్యాండ్ మార్కెట్కు కూడా పనికిరాని దుస్తులు 39 వేల టన్నుల వరకు ఉంటాయి. వీటినే అటకామా ఎడారిలో పడేస్తున్నారు. వీటిలో ఎక్కువగా సింథటిక్ దుస్తులే ఉండటం వల్ల ఇవి పర్యావరణానికి సమస్యగా మారుతున్నాయి.ఇతర పరిష్కారాలు⇒ వస్త్ర వ్యర్థాల సమస్య పరిష్కారం కావాలంటే ఉత్పత్తి నుంచి వినియోగం వరకు వ్యవస్థలో మార్పు రావాలని పరిశోధకులు, పర్యావరణవేత్తలు చెబుతున్నారు.⇒ ఒకే తరహా వస్త్రాలను ఎక్కువగా వినియోగించే యూనిఫామ్ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అత్యంత అవసరం. ఇది సులభతరం కూడా!⇒ ఈ వస్త్రాల తయారీలో పర్యావరణానికి అనుకూలమైన పదార్థాలను ఉపయోగించాలి. సహజసిద్ధమైన దారాల వినియోగాన్ని ప్రోత్సహించాలి. దుస్తుల్లో పాలిస్టర్ శాతాన్ని పరిమితం చేయాలి. పర్యావరణ అనుకూల ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలి.⇒ విద్యార్థులు సుమారు ఎనిమిది నుంచి పది గంటల సేపు యూనిఫామ్ వేసుకుని ఉంటారు. కాటన్ దుస్తులు శరీరానికి అనుకూలంగా ఉంటాయి. చెమటను పీల్చుకుంటాయి. ఆరోగ్యపరంగాను మేలు చేస్తాయి. వీటి వాడకం పెరిగితే నేత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. కునారిల్లుతున్న నేత పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుంది.⇒ పాఠశాలల నిర్వాహకులు, తల్లిదండ్రులు ముందుగా ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. యూనిఫామ్ ధర ఆధారంగా కాకుండా పిల్లల ఆరోగ్యం, పర్యావరణహితం ఆధారంగా ఎంపిక చేసుకోవాలనే అవగాహన పెరగాలి. ⇒ మన ఎంపిక పిల్లల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.⇒ పత్తి మంచిది పాలిస్టర్ చెడు అనేది సమస్య కాదు. పత్తి సాగులో కూడా అత్యధికంగా నీటి, రసాయనాల వినియోగం, కాలుష్యం వంటి సమస్యలు ఉన్నాయి. పర్యావరణానికి అనుకూలమైన సాగు పద్ధతులు, వస్త్రాల తయారీ కీలకం. ఆ దిశగా పరిశ్రమలు ముందడుగు వేయాలి.⇒ వస్త్ర వ్యర్థాల తగ్గింపులో అతి ముఖ్యమైన పాత్ర తయారీదారులది. ఒక వస్త్రం తయారు చేసిన తర్వాత అది వ్యర్థంగా మారినపుడు కూడా ఆ కంపెనీ బాధ్యత వహించాలి. ఈ విధానాన్ని అమలు చేస్తే ఉత్పత్తి దశలోనే పలు మార్పులు వస్తాయి. వ్యర్థాల శాతం తగ్గేలా పరిశ్రమలు జాగ్రత్తలు తీసుకుంటాయి.⇒ సమాజపరంగా చూస్తే దుస్తుల వినియోగపు అలవాట్లలో మార్పు కీలకం. ఎన్ని దుస్తులు కొనుగోలు చేస్తున్నాం? ఎంత కాలం వాడుతున్నాం? ఈ రెండు ప్రశ్నలు అత్యంత ముఖ్యమైనవి. ఒక దుస్తు విలువ దాని ధరలో కాదు, ఎన్నాళ్లు వాడుతున్నామనే దానిలో ఉందనే అవగాహన పెరగాలి.యూనిఫామ్ మార్కెట్ వృద్ధి⇒ 1980ల నాటికి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు అన్ని విద్యాసంస్థలు యూనిఫామ్ తప్పనిసరి చేశాయి. ∙గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా సంస్థల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. దీంతో యూనిఫామ్ వినియోగం, వ్యాపారం రెండూ పెరిగాయి.ప్రపంచవ్యాప్తంగా యూనిఫామ్ మార్కెట్⇒ 2024 18.9బిలియన్ డాలర్లు⇒ 2034(అంచనా) 33.1 బిలియన్ డాలర్లువస్త్రాల వ్యర్థం – ప్రపంచస్థాయి సమస్య⇒ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ గతేడాది ఆగస్టులో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 మిలియన్ టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. ⇒ వీటితో 200కి పైగా ఒలింపిక్ స్టేడియాలను నింపవచ్చని పేర్కొంది. 2030 నాటికి ఈ వ్యర్థం 150 మిలియన్ టన్నులకు చేరవచ్చని అంచనా.⇒ ప్రపంచవ్యాప్తంగా దుస్తుల ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ డంప్యార్డులకు చేరే వాటి సంఖ్యా పెరుగుతోంది. ⇒ కాల్చివేసే లేదా విదేశాలకు ఎగుమతి చేస్తే బట్టల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటోంది.⇒ అమెరికా, యూరప్ నుంచి పెద్ద మొత్తంలో వస్త్ర వ్యర్థాలు మన దేశంలోని హరియాణాలో ఉన్న పానిపట్కి పెద్ద ఎత్తున దిగుమతి అవుతున్నాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద టెక్స్టైల్ రీసైక్లింగ్ కేంద్రంగా గుర్తింపు పొందింది. ∙దిగుమతి అయిన పాత బట్టలను రీసైకిల్ చేసి కొత్త దుస్తులు లేదా దుప్పట్లు తయారు చేస్తారు.ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం⇒ వస్త్రాల వ్యర్థాలు ఆరోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపుతున్నాయి. వస్త్ర వ్యర్థాల నుంచి వచ్చే విషపూరిత రసాయనాలు, రంగులు, సూక్ష్మ ప్లాస్టిక్ నేలలోకి, నీటిలోకి చేరి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. ⇒ డంపింగ్ యార్డుకు చేరిన వ్యర్థాలు క్రమంగా కుళ్లే సమయంలో ప్రమాదకర విషవాయువులు విడుదలై వాతావరణ మార్పులకు కారణం అవుతాయి.⇒ ఏటా సుమారు 5లక్షల టన్నుల మైక్రోఫైబర్లు సముద్రంలో కలుస్తున్నాయి.నీటి వినియోగం ఎంత?⇒ ఒక కాటన్ షర్ట్ తయారీకి సుమారు 2,649 లీటర్ల నీరు అవసరం. ఒక వ్యక్తి రోజుకు 8 గ్లాసుల చొప్పున తాగితే సుమారు మూడు నుండి నాలుగు సంవత్సరాలకు ఆ నీరు సరిపోతుందని అంచనా.⇒ పాలిస్టర్తో పోలిస్తే కాటన్ షర్ట్ తయారీకి నీటి వినియోగం చాలా ఎక్కువ. అయితే పాలిస్టర్లో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువ.సహజ సిద్ధ వస్త్రాలకు ప్రాధాన్యం⇒ పర్యావరణానికి హాని తక్కువ.⇒ గాలి, నేల కాలుష్యం తగ్గుతుంది.⇒ నీటి వినియోగాన్ని తగ్గిస్తాయి⇒ రైతులు, కార్మికులకు ఆరోగ్యకరం.ప్రపంచవ్యాప్తంగా ఏటా 92 మిలియన్ టన్నుల వ్యర్థవస్త్రాలు పోగవుతున్నాయి. ప్రతి సెకనుకు ఒక చెత్తలారీ లోడుకు సమానమైన వ్యర్థవస్త్రాలు తగులబడుతున్నాయి. వీటిలో ఎక్కువగా ఉంటున్న సింథటిక్ వస్త్రాలు నేలలో పూర్తిగా కలిసిపోవడానికి కనీసం రెండువందల ఏళ్లు పడుతుంది. వీటి వల్ల భూసారం దెబ్బతింటోంది. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. వీటిని తగులబెట్టడం వల్ల పర్యావరణంలోకి విషవాయువులు వెలువడుతూ, జీవజాలం మనుగడకు ముప్పుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న దుస్తుల్లో దాదాపు 57 శాతం వరకు ఏడాదిలోగానే వ్యర్థంగా మారుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు ఈ పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చుతున్నా, ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకు ఎవరూ సరైన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేకపోవడమే విచారకరం. టైక్స్టైల్, రీ సైక్లింగ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నట్టు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. విషపూరిత రసాయనాలు, దుమ్ము, సూక్ష్మఫైబర్ కణాల విడుదల కారణంగా వారు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఎక్కువగా గురవుతున్నారు. మహిళలు కూడా ఈ రంగంపై ఎక్కువగా ఆధారపడ్డారు. వారికి తగిన భద్రత, రక్షణ సదుపాయాలు లేవు. కంటి సంబంధిత సమస్యలను సైతం ఎదుర్కొంటున్నారు. సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాలు సాధించాలంటే పని పరిస్థితులను మెరుగుపర్చి, భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ∙దిలీప్ మాదిరెడ్డి -
నేను క్లాస్ తను మాస్!
రహస్య గోరఖ్ నటనతోనే కాదు, తన నిజాయితీ మాటలతో కూడా అందరినీ ఆకట్టుకునే తెలుగింటి అమ్మాయి. జీవిత భాగస్వామిగా కిరణ్ అబ్బవరంను ఎంచుకున్న ఈ సుందరి, తన మనసులోని భావాలను మనతో పంచుకుంది. ఆ విషయాలే మీకోసం..నాది సినిమా ప్రేమకథనా అసలు పేరు ఐశ్వర్య గోరఖ్. సినిమా ప్రపంచమే నాకు రహస్య అనే పేరు పెట్టింది. అదే ప్రపంచం నా మొదటి సినిమా ‘రాజా వారు రాణి గారు’తో జీవిత భాగస్వామిని కూడా ఇచ్చింది. మా ప్రేమకథ ఒక చిన్న రహస్యంలా మొదలై, ఇప్పుడు అందరి ఆశీస్సులతో పెళ్లి వరకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.చదువుకే ప్రాధాన్యంచదువు విషయంలో నేను చాలా శ్రద్ధ చూపించాను. బీబీఏ పూర్తి చేసిన తర్వాత, అమెరికాలోని లాస్ ఏంజెలెస్లో అడ్వరై్టజింగ్ అండ్ మార్కెటింగ్ కోర్సు చేశాను. ఆ సమయంలోనే నటనపై ఆసక్తి పెరిగింది. అయినా చదువును మధ్యలో వదిలిపెట్టకుండా, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాకే పూర్తిస్థాయిలో కెమెరా ముందుకు వచ్చాను.ఫొటోగ్రఫీ నా ప్రశాంత ప్రపంచంషూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా అందమైన ప్రదేశాలను కెమెరాలో బంధించడం నాకు ఎంతో ఇష్టం. ఆ పని నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.ఊరోడిని పెళ్లి చేసుకున్నా!నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్లోనే, కాని, కిరణ్ మాత్రం పక్కా పల్లెటూరోడు. షూటింగ్ సెట్లో మొదలైన మా పరిచయం ఎప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలియదు. ఐదేళ్ల పాటు సాగిన మా ప్రయాణాన్ని మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో గౌరవంగా అంగీకరించారు.వంట చేయడం నా ప్రత్యేక హాబీకొత్త కొత్త వంటకాలు చేయడం నాకు హాబీ. ముఖ్యంగా స్వీట్లు తయారు చేయడంలో నాకు మంచి నైపుణ్యం ఉంది. పెళ్లి తర్వాత కిరణ్ కోసం మరిన్ని ఆంధ్ర శైలి వంటకాలు కూడా నేర్చుకున్నాను.బిర్యానీ అంటే ఒక ఎమోషన్హైదరాబాదీస్కు బిర్యానీ అంటే ఒక ఎమోషన్. నా ఫేవరెట్ ఫుడ్ కూడా బిర్యానీనే. అయితే ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహారంపై కొంత శ్రద్ధ పెడుతున్నాను. అయినా అప్పుడప్పుడు బిర్యానీ రుచిని ఆస్వాదిస్తున్నాను.భవిష్యత్తు కుటుంబం, కెరీర్ రెండూ కలిసిభవిష్యత్తులో నటిగా కొనసాగుతూనే, కిరణ్తో కలిసి ఒక అందమైన కుటుంబ జీవితం గడపడం నా లక్ష్యం. అభిమానులు చూపిస్తున్న ప్రేమే నాకు అతిపెద్ద విజయం. ప్రస్తుతం ‘కిరణ్ అబ్బవరం’ నిర్మాణ సంస్థ పనులతో బిజీగా ఉన్నాను. -
కళ్లకు జోడు... స్టయిల్కు తోడు!
కళ్లద్దాలు అంటే కేవలం చూపు కోసం మాత్రమే అనుకుంటే, అది పెద్ద పొరపాటు! ఒక చిన్న యాక్సెసరీగా మీ పర్సనాలిటీని స్టయిల్గా చూపించే పవర్ ఈ కళ్లజోడుకే ఉంది. అందుకే, ఈ చిన్న సీక్రెట్స్ ఫాలో అయితే, మీ లుక్ ఆటోమేటిక్గా లెవల్ అప్ అవుతుంది!ఫేస్ షేప్కు సరిపోయే ఫ్రేమ్ప్రతి ఒక్కరి ముఖం ఒకేలా ఉండదు. అందుకే, ఫేస్ షేప్కు తగ్గ ఫ్రేమ్ ఎంచుకుంటేనే లుక్ సూపర్గా కనిపిస్తుంది. రౌండ్ ఫేస్ ఉన్నవారికి స్క్వేర్ లేదా రెక్టాంగిల్ ఫ్రేమ్స్ బాగా సెట్ అవుతాయి. ఓవల్ ఫేస్ ఉన్నవారు దాదాపు అన్ని స్టయిల్స్ ట్రై చేయొచ్చు. షార్ప్ జా లైన్ ఉన్నవారికి రౌండ్ ఫ్రేమ్స్ ఒక క్లాసీ టచ్ ఇస్తాయి.కలర్ కూడా క్యారెక్టర్ చెప్పేస్తుందిబ్లాక్, బ్రౌన్ , గ్రే లాంటి కలర్స్ ఎప్పటికీ క్లాసిక్. ఇవి ఏ డ్రెస్కైనా సెట్ అవుతాయి. అదే రెడ్, బ్లూ, గ్రీన్ లాంటి బ్రైట్ కలర్స్ అయితే మీరు కాస్త బోల్డ్, ఫన్ లవింగ్ పర్సన్ అన్న ఫీలింగ్ ఇస్తాయి. సన్ గ్లాసెస్లో డార్క్ షేడ్స్ కూల్ లుక్ ఇస్తే, లైట్ టింట్స్ ఒక ట్రెండీ వైబ్ ఇస్తాయి.సందర్భానికి తగ్గట్టుగాఆఫీస్కి వెళ్తే సింపుల్, స్లిమ్ ఫ్రేమ్ స్పెక్ట్స్ ఒక ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి. బీచ్ ఔటింగ్ లేదా ట్రిప్కి వెళ్తే, పెద్ద ఫ్రేమ్ సన్గ్లాసెస్. పార్టీలు లేదా ఫొటో షూట్స్కి అయితే, ట్రెండీ షేప్ ఉన్న గ్లాసెస్ మీ లుక్ను హైలైట్ చేస్తాయి.చిన్న ఫ్రేమ్తో పెద్ద ఇంపాక్ట్కొన్నిసార్లు చిన్న సైజ్ ఫ్రేమ్స్ కూడా పెద్ద స్టేట్మెంట్ పీస్ అవుతాయి. ముఖానికి సరిగ్గా ఫిట్ అయ్యే ఫ్రేమ్ ఉంటే, అది మీ ఫీచర్స్ను మరింత హైలైట్ చేస్తుంది.సన్ గ్లాసెస్ అంటే ప్రొటెక్షన్ మాత్రమే కాదుసన్ గ్లాసెస్ మీ కళ్లను సూర్యకిరణాల నుంచి కాపాడడమే కాదు, మీ స్టయిల్ను కూడా షీల్డ్ చేస్తాయి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ట్రావెలింగ్లో లేదా ఔట్డోర్ యాక్టివిటీస్లో ఒక మంచి సన్ గ్లాసెస్ ఉంటే, మీరు కంఫర్ట్గా, కూల్గా కనిపిస్తారు.జాగ్రత్తలు!⇒ స్పెక్ట్స్ లేదా సన్ గ్లాసెస్ ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.⇒ చీప్గా కనిపించే ఫ్రేమ్లను తీసుకోవద్దు. మంచి క్వాలిటీ ఫ్రేమ్ అయితేనే లుక్ క్లాసీగా ఉంటుంది.⇒ ఫేస్కు సరిపోని సైజ్ తీసుకుంటే, ఎంత ఖరీదైన గ్లాసెస్ అయినా అందంగా ఉండదు.⇒ గ్లాసెస్ను తరచుగా క్లీన్ చేయండి. మసకగా ఉంటే లుక్ కూడా డల్గా కనిపిస్తుంది. ⇒ గుర్తుంచుకోండి.. స్పెక్ట్స్ కళ్లకు మాత్రమే కాదు, మీ స్టయిల్కు కూడా ఫ్రేమ్ వేస్తాయి!∙ దీపిక కొండి -
బొమ్మజెముడు పొద మీద నెత్తుటి మరక!
హంగేరియన్ భాషలో ‘కెర్తేజ్’ అంటే తోటమాలి అని అర్థం. 2002లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని పొందిన హంగేరియన్ రచయిత ఇమ్రా కెర్తేజ్ పేరులోని ఆ మాటకూ అదే అర్థం! యూరప్లోని హరిత దేశాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న హంగరీ అక్షర ఉద్యానంలో తొలి నోబెల్ పురస్కారాన్ని పూయించిన తోటమాలి ఇమ్రా కెర్తేజ్. అతని సాహిత్యం బొమ్మజెముడు పొద మీద నెత్తురు ముద్ద! తన సాహిత్యమంతటా, కెర్తేజ్ అనుభవించి పలవరించింది ఒకేఒక్క పీడకల. దాన్నే ‘హోలోకాస్ట్ నైట్మేర్’ అన్నారు తర్వాతి తరాలవారు. ఇది యూదులకూ, లౌకికవాదులకూ, ప్రగతిశీల రాజకీయపక్షాలకూ మరపురాని పీడకల. ఆ పీడకలలో కనిపించేవన్నీ తెగిన గాలిపటాలే! సంసార వృక్షం తాలూకు విరిగిపడిన కొమ్మలకు వేలాడుతూ కనిపిస్తాయవి. గాలివాటుగా కొట్టుకుపోయే ఆ గాలిపటాలు తరచు ముళ్ళకంపల్లో చిక్కుకుపోతుంటాయి. ఒకరో యిద్దరో ఈ స్థితి నుంచి బతికి బయటపడుతుంటారు. వారిలో ఒకరో యిద్దరో మాత్రమే ఎలాంటి ఉద్వేగం లేకుండా తమ కలతలూ కలవరాలను మనతో పంచుకుంటారు. కెర్తేజ్ అలాంటి ఒకరిద్దర్లో ఒకరు. అందుకే ఆయన రచనలు తేనుపొచ్చిన సలపరింతల్లా సాగుతుంటాయి! అలాంటి రచనలతో సామాన్య పాఠకులు తాదాత్మ్యం చెందలేరు. పరిణతి చెందిన కొద్దిమంది పాఠకులు మాత్రమే వాటితో అభేదావస్థ అనుభవించగలరు. అలాంటివాళ్ళలో కొందరు ‘నోబెల్ సాహిత్యపురస్కారం ఎంపిక సంఘం’లో సభ్యులుగా వున్నందువల్లనే కెర్తేజ్కు, 2002లో ఆ పురస్కారం దక్కింది!రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంగా చరిత్రను పరిశీలిస్తే, భయంకరమైన వైరుధ్యాలెన్నో కనిపిస్తాయి. వలసవాదం కాడిబరువు వదిలించుకుని ఎన్నో దేశాలు– మన దేశంతో సహా– విముక్త వాయువులు పీల్చుకున్న సందర్భమది. వైజ్ఞానిక, తాత్త్విక, కళాత్మక రంగాలన్నింటా సౌమ్య, సౌహార్ద వీచికలు ప్రసరించిన యుగమది. మానవాళి చిరకాలంగా కంటూవచ్చిన జంటకలలు–స్వేచ్ఛా సమానత్వాలుగా– విశ్వకేదారంలో మొలకలెత్తిన ఘడియలవి. అయితే, ఆ యుద్ధ నేపథ్యంలోనే, ‘పుట్టుక ప్రాతిపదికగా జాతిమత వివక్ష’ పడగవిప్పి బుసకొట్టిన దుర్ముహూర్తమూ అదే! ఈ అమానుష వికారం తాలూకు అత్యంత వికృతరూపాన్ని ప్రదర్శించినవారిగా నాజీలు చరిత్రలో పాతుకుపోయారు. నాజీలు ఎదురులేకుండా పాలించిన జర్మనీకి పొరుగుదేశం కావడమనే ఏకైక పాపానికి గానూ, హంగరీకి కూడా వివక్ష జ్వాలలు పాకిపోయాయి. అప్పట్లో నాజీల చేతికి చిక్కిన పద్నాలుగేళ్ళ కుర్రాడు ఇమ్రా కెర్తేజ్. పుట్టుకతో యూదు మతస్థుడు కావడమే అతని నేరం. దానికే అతన్ని ఆష్విట్జ్, బుషెన్వాల్ట్›్జ నిర్బంధ శిబిరాల్లోకి తోసి చిదిమి పారేయాలనుకున్నారు నాజీలు. కానీ, అంతలోనే ప్రపంచ యుద్ధం ముగిసిపోవడం– దానితోనే నాజీజం సహగమనం చెయ్యడం చకచకా జరిగిపోయాయి! అలా మృత్యువు నీడల్లోంచి వెంట్రుకవాసిలో తప్పించుకోగలిగాడు కెర్తేజ్. అయితే బతికి బయటపడినందుకు అతను సంతసించిన దాఖలాలు ఆయన సాహిత్యంలో ఎక్కడా కానరావు! ∙∙ నాజీ నిర్బంధ శిబిరాలన్నింట్లోకీ పెద్దది ఆష్విట్జ్. ఇది దక్షిణ పోలెండ్లో వుంది. పదకొండు లక్షల మంది అమాయకులైన పెద్దలూ పిన్నల ప్రాణాలను బలితీసుకున్న నరకకూపమిది. ప్రపంచ యుద్ధం ముగిసిన రెండేళ్ళకు, 1947లో ఆష్విట్జ్ను మ్యూజియంగా మార్చారు.నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత ఇమ్రా కెర్తేజ్, ఆష్విట్జ్ గురించి ఓ చోట ఇలా రాశారు:‘ఆష్విట్జ్ నిర్బంధ శిబిరంలో నేను అనుభవించిన నరకయాతనల గురించి తల్చుకున్నప్పుడల్లా, దాన్నుంచి బతికి బయటపడిన వాళ్ళ శక్తి సామర్థ్యాల గురించిన ఆలోచనల్లో మునిగిపోతాను. ఆష్విట్జ్ గురించి ఆలోచన తలెత్తినప్పుడల్లా నేను గతం గురించి కన్నా భవిష్యత్తు గురించే ఎక్కువ ఆందోళన చెందుతాను!‘ పద్నాలుగేళ్ళ వయసులో తన పాలబడిన నిర్బంధ శిబిరాల జీవితానుభవాన్ని ‘దిక్కుమాలినతనం‘ (ఫేట్లెస్నెస్) అనే నవలగా రాయడానికి మరో పద్నాలుగేళ్ళు తీసుకున్నాడు కెర్తేజ్. అయితే, 1975లో గానీ ఆ నవల అచ్చుకాలేదు. అందులోని ప్రధాన పాత్ర గ్యోర్గియ్–‘గ్యూరీ‘– కోవ్స్ కూడా పద్నాలుగేళ్ళ యూదు బాలుడే. రచయిత ఆ కుర్రాడి పేరు మార్చాడంతే– మిగతా కథ అంతా, అటూయిటూగా, ఒక్కటే! ఈ నవల వెలువడిన పదమూడేళ్ళకు ‘వైఫల్యం‘ (ఫియాస్కో) అనే మరో నవల వెలువరించాడు కెర్తేజ్. ఇది జరిగిన పుష్కరానికి ‘పుట్టని బిడ్డ కోసం ప్రార్థన’ (కాదిష్ ఫర్ యాన్ అన్ బోర్న్ చైల్డ్) అనే ఇంకో నవల రాశాడు. ఈ మూడు నవలలనూ కలిపి ‘హొలోకాస్ట్ ట్రైలజీ‘ అంటారు. ముఖ్యంగా, మూడో నవల రచనా సంవిధానం, విశిష్టంగా వుందని విమర్శకులు అంటారు.వాస్తవానికి కెర్తేజ్ ఆలోచనావరణం అంతటా నాజీ విలయమే ఆవరించుకుని ఉందని ఆయనకూ తెలుసు– పాఠకులకూ తెలుసు– విమర్శకులకు మరింత బాగా తెలుసు!‘నేను ఓ కొత్త నవలకు ఇతివృత్తం గురించి– ఆ మాటకొస్తే, ఏది రాసే విషయం పైనైనా– ఆలోచించడం మొదలుపెట్టగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది నిర్బంధ శిబిరాల జీవితానుభవమే! దానితో సంబంధం లేని విషయం గురించి మాటాడాలనుకున్నా, నాకు తెలియకుండానే ఆ విషయం గురించే మాటాడతా! ఆష్విట్జ్ ప్రేతాత్మ నా మీద సవారీ చేస్తోంది– అదే నా మాటల్లో పలుకుతోంది. దానితో పోలిస్తే మిగతా విషయాలన్నీ అర్థం లేనివని అనిపిస్తుంది నాకు!’ అన్నాడందుకే కెర్తేజ్ తన రచన ‘గ్యాలీ డయరీ’లో. 1961–91 మధ్యకాలంలో తాను రాసిన సర్వరచనల సంకలనంగా ‘గ్యాలీ డయరీ’ని 1993లో వెలువరించారాయన. ఆ తర్వాత పదేళ్ళకు విడుదలైన ‘ముగింపు’ (లిక్విడేషన్) ఇతివృత్తం సైతం హొలోకాస్ట్ పీడకలే కావడంలో వింతేముంది? మందలపర్తి కిషోర్ -
ఓవర్నైట్ చాంపియన్లు కారు
వరల్డ్ టేబుల్ టెన్నిస్ సింగిల్ టైటిల్స్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు ఆకుల శ్రీజ. ఆమె అర్జున అవార్డు సహా ఎన్నో పతకాలు గెలుచుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తోంది. ‘పిల్లలకు చదువు ఒక్కటే కాదు, క్రీడారంగాన్నీ పరిచయం చేసినట్లయితే అన్ని వైపులా అభివృద్ధి చెందుతారు’ అంటారు శ్రీజ తల్లిదండ్రులు ఆకుల ప్రవీణ్కుమార్, సాయిసుధ. పిల్లల పెంపకంలో తమ పాత్ర గురించి ప్రవీణ్కుమార్ తెలిపిన సంగతులు...‘‘నేను టేబుల్ టెన్నిస్ ప్లేయర్ని. రోజూ ప్రాక్టీస్కి వెళ్లేవాడిని. పిల్లల చిన్నప్పుడు వారిని రెండు, మూడు స్పోర్ట్స్ మీట్స్కు తీసుకెళ్లాను. అక్కడ మ్యాచ్లో గెలుపొందినవారికి ప్రైజులు ఇవ్వడం, అందరూ చప్పట్లు కొట్టడం చూసి, మా పెద్దమ్మాయి చాలా ఇంప్రెస్ అయ్యింది. ‘డాడీ నాకు కూడా ట్రైనింగ్ ఇప్పిస్తారా’ అని అడిగింది. అంతేకాదు, స్కూల్ నుంచి వస్తూనే స్పోర్ట్స్ డ్రెస్ వేసుకొని గ్రౌండ్కు వెళదామని రెడీ అయిపోయేది. ‘నేను కూడా చాంపియన్ని అవుతాను’ అనేది. రోజూ నాతో పాటు ప్రాక్టీస్కు రావడం చూసి, అకాడమీకి తీసుకెళ్లాను. అక్కడ తను బాగా ఆడటం చూసినవాళ్లు మెచ్చుకోవడంతో మరింతగా ప్రాక్టీస్ చేసేది. అక్కను చూసి చెల్లెలు..రవళి మెడల్స్ తీసుకోవడం చూసి, చిన్నమ్మాయి శ్రీజ ‘నేను కూడా టేబుల్ టెన్నిస్ ఆడతాను’ అంది. శ్రీజను కూడా టేబుల్ టెన్నిస్లో చేర్పించాను. ఇద్దరూ స్పోర్ట్స్లో మంచి ప్రతిభ చూపించేవారు. దీంతో ప్రతి కాంపిటిషన్లో వాళ్లు పాల్గొనేలా చూసేవాడిని. గేమ్ పూర్తయ్యేంతవరకు ఉండి, తీసుకొచ్చేవాడిని. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ప్రైవేట్గా..!పిల్లల చిన్నప్పుడు నాకు ఓరియంటల్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ ఉద్యోగం. నా భార్య ఎల్ఐసీలో జాబ్. ప్రభుత్వ ఉద్యోగాలే అయినా జీతాలు తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉండేవి. దీంతో, ఆ జాబ్ మానేసి, జనరల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా చేరాను. అప్పుడు ‘మా అమ్మనాన్నలు, బంధువులు గవర్నమెంట్ జాబ్ వదులుకోవద్దు’ అని చెప్పారు. కానీ, వాళ్ల మాటలను పట్టించుకోలేదు. నా భార్య సపోర్ట్ చేసింది. నెల జీతం పెరగడం వల్ల ఇద్దరమ్మాయిలను అకాడమీలో చేర్పించడం, వారు కాంపిటిషన్స్లో పాల్గొనేలా చూడటం సులువైంది. రాత్రికి రాత్రి చాంపియన్లు అవరుమనమేవో త్యాగాలు చేస్తున్నాం కాబట్టి పిల్లలు రాత్రికి రాత్రి చాంపియన్లు కావాలనుకోకూడదు. ‘గెలుపు ఓటములు పట్టించుకోకుండా, మీ కృషి మీరు చేయండి. ప్రతీసారీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి’ అని పిల్లలకు చెబుతుండేవాళ్లం. పిల్లలు ఓడిపోయినప్పుడు మా బంధువులు ‘అయ్యో, మీరు గవర్నమెంట్ జాబ్ వదలుకున్నారు, కానీ వాళ్లు ఓడిపోయారు’ అన్నట్టుగా మాట్లాడేవారు. ‘పిల్లలను బెస్ట్గా ప్రయత్నంచమని చెప్పండి. అంతేకాని, వారు చిన్నబుచ్చుకునేలా మాట్లాడకూడదు’ అని మా పేరెంట్స్కి, బంధువులకు గట్టిగా చెప్పాం. బంగారు పతకాలుపెద్దమ్మాయి టెన్త్ పూర్తయ్యాక ఒక కాన్సెప్ట్ కాలేజీలో జాయిన్ చేశాం. వాళ్లు ముందుగా స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తాం అన్నారు. తర్వాత మూడు నెలలకు ‘మీ అమ్మాయి బాగా చదువుతోంది – గ్రేడ్స్ ముఖ్యం’ అన్నారు. దీంతో రవళి స్పోర్ట్స్ ప్రాక్టీస్ ఆపేసింది. చిన్నమ్మాయి విషయంలో అలా జరగకూడదని తనని బద్రుకా కాలేజీలో చేర్పించాం. ముందుగానే కాలేజీ యాజమాన్యంతో ‘స్పోర్ట్స్కు ప్రాముఖ్యం ఇస్తేనే చేర్పిస్తాం’ అని చెప్పాం. కాలేజీ వాళ్లు సపోర్ట్ చేశారు. శ్రీజ ఇంటర్మీడియట్లో కాలేజీ టాపర్గా గోల్డ్ మెడల్ సాధించింది. దానికి కారణం మా ఆవిడ సాయిసుధ. శ్రీజతో పాటు తనూ టోర్నమెంట్స్కు వెళ్లేది. ట్రెయిన్లో, రూములో, మ్యాచ్ మధ్యలో వీలు దొరికనప్పుడల్లా చదివించేది. ఇద్దరి కృషి...పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులిద్దరి కృషి ఉండాలి. స్పోర్ట్స్లో నేను కేర్ తీసుకుంటే, చదువు విషయంలో సాయిసుధ శ్రద్ధ తీసుకుంది. పిల్లల కెరీర్ గురించి ఆలోచించి మా ఆవిడ జాబ్లో ప్రమోషన్లు కూడా తీసుకోలేదు. ప్రమోషన్ తీసుకుంటే ట్రాన్స్ఫర్లు అవుతాయని ఆలోచించి అధికారి హోదాను కూడా వద్దనుకుని, వీలైనంత టైమ్ పిల్లలకు కేటాయించేది. పిల్లలిద్దరూ స్పోర్ట్స్లో రాణిస్తూ, చదువులోనూ గోల్డ్ మెడల్స్ సాధించారు. స్పోర్ట్స్.. జాబ్..పెద్దమ్మాయి ఇంటర్మీడియట్లో ఆపేసిన స్పోర్ట్స్ సీబీఐటీలో చేరాక స్టార్ట్ చేసింది. ఇంటర్ కాలేజీ టోర్నమెంట్స్ లీడ్ చేసేది. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసింది. ఇప్పుడు అమెరికాలో సెటిలైంది. చిన్నమ్మాయి శ్రీజకి పద్దెనిమిదేళ్లకు ఆర్బీఐలో జాబ్ వచ్చింది. ప్రాక్టీస్కు, టోర్నమెంట్స్లో పాల్గొనడానికి వీలుంటుంది. డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగం చేస్తూనే ఫిజికల్ ఫిట్నెస్, ప్రాక్టీస్, టైమ్ ప్లానింగ్ గురించి చాలా క్రమశిక్షణగా ఉంటుంది. తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాం. వారికోసం ఏమైనా చేస్తాం. దానిని పిల్లలు అర్ధం చేసుకొని, వారి భవిష్యత్తును బాగా మలచుకుంటే పెద్దలుగా మనకూ ఆనందం. నేటి తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. దాంతో పిల్లలకు ఒకవైపు మాత్రమే అవకాశాలు ఉంటున్నాయి. స్పోర్ట్స్లో అన్నివైపులా వృద్ధి ఉంటుంది. -
కథాకళి: డర్టీ మెటల్
ఐదేళ్ళుగా మేం ఐదుగురం మిత్రబృందం ప్రతి ఆదివారం రమ్మీ ఆడటం అలవాటు. అలా రోజు సిట్టింగ్లో... ‘‘మనిషి ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాడు?’’ ఆ ఆదివారం వశిష్ట అడిగాడు.‘‘చాలావాటిని.’’ ఒకరు చెప్పారు.‘‘ఆ చాలావాటిలో దేన్ని అధికంగా ప్రేమి్తాడన్నది నా ప్రశ్న.’’‘‘అది మనిషికి మనిషికి మారుతూంటుంది.’’ చెప్పాను.‘‘నీకేం ఇష్టం? ఎన్నటికీ పోగొట్టుకోడానికి ఇష్టపడనిది.’’ వశిష్ట నన్ను అడిగాడు.‘‘మా నాయనమ్మ నా చిన్నప్పుడు ఇచ్చిన రూపాయి కాసు. దాన్ని ఖర్చు చేయకుండా దాచుకున్నాను.’’ చెప్పాను.‘‘నాకు ఉప్మా ఇష్టం. నేను చేసుకునే వెజిటబుల్ ఉప్మా.’’ మాలోని హాస్యప్రియుడైన లాయర్ చెప్పాడు.‘‘నువ్వు ఉప్మాని మించి ఇష్టపడేది ఏం లేదా?’’‘‘ఇష్టం అనేది కాలాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి మారుతూంటుంది. నాకు ఉదయం కాఫీ ఇష్టం. సాయంత్రం టీ ఇష్టం. రాత్రికి బీర్ ఇష్టం. నేను పోయే టైమ్ని బట్టి ఆ సమయంలో కాఫీ లేదా టీ తాగుతూ లేదా ఉప్మా తింటూ పోవాలనుకుంటున్నాను.’’‘‘నాకు నా ఇంట్లో, నా పక్కలో, నిద్రలో మరణించడం ఇష్టం. ఓసారి ఓ బంధువుని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూశాను. స్ట్రెచర్ మీద తీసుకెళ్ళే ఓ వ్యక్తి, వెనకే ఆక్సిజన్ సిలిండర్ని తోసుకెళ్ళే ఓ అటెండర్. ఆయన కళ్ళల్లో భయాన్ని చూశాక అనిపించింది, రోగం రొష్టు రాకుండా, ఇంట్లోనే మరణించడానికి మించిన యోగం లేదని. ఇంట్లో మరణం నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైంది.’’ మరొకరు చెప్పారు.‘‘ఫిలసాఫికల్.’’ నేను చెప్పాను.‘‘చిన్న సవరణ. ఉప్మా కాదు. ఉప్మాలోని ఉప్పు. సరిపడ ఉప్పు. ఓసారి నేను ఎక్కువ ఉప్పు వేసి తినలేకపోయాను. సరిపడ ఉప్పు వేసిన ఉప్మా.’’ లాయర్ వృత్తిలోని అతను నవ్వుతూ సవరించాడు.‘‘నీకు?’’ నాలుగోవాడిని అడిగాను.‘‘మన జెండా.’’ వాడు చేతిలోని ముక్కలని చూసి, ఓ ముక్కని వేశాక చెప్పాడు.కొద్దిసేపు ఆగి నేను అడిగాను.‘‘వశిష్టా. తమరికి ఏమి ఇష్టమో సెలవివ్వనా? మీ ఆవిడ ముక్కంటే కదా?’’అంతా నవ్వారు.‘‘వశిష్ట తన భార్య ముక్కు మీద కవిత్వం రాశాడు.’’ చెప్పాను.‘‘కాని మీ ఆవిడకి బంగారం అంటే ఇష్టం. కాబట్టి నువ్వు కూడా బంగారాన్ని ఇష్టపడుతున్నావేమో?’’ ఒకరు అడిగారు.వశిష్ట ప్రతీ మేరేజ్ ఏనివర్సరీకి, తన భార్య పుట్టినరోజుకి, ఉమెన్స్ డేకి భార్యకి ఏదైనా బంగారు ఆభరణాన్ని బహుకరిస్తుంటాడని మాకు మా భార్యల ద్వారా తెలుసు. ‘మీరూ ఉన్నారు ఎందుకు? మీ ఫ్రెండ్ వశిష్ట వాళ్ళ ఆవిడకి ఏం కొనిచ్చాడో తెలుసా?’ అనే డైలాగ్ మేము చాలాసార్లు విన్నాం. ఇలాంటి ఆడవాళ్ళ ముచ్చట్లకి ఆ ఐదుగురికి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ‘‘ప్రపంచంలోని పద్దెనిమిది శాతం బంగారం ఇండియన్ భార్యల దగ్గరే ఉందని చదివాను. అది పాతికవేల టన్నుల బంగారమట. అందులో చాలా భాగం వశిష్ట భార్య దగ్గరే ఉంది.’’ ఒకరు నవ్వుతూ చెప్పారు.‘‘మా ఆవిడకి బంగారం ఇష్టం కాబట్టి ఆమెని సంతోషపెట్టడానికి కొనిస్తూంటాను. నాకు నా భార్యంటే ఇష్టం. నా భార్య మీద ఇష్టాన్ని నేను అలా ప్రదర్శిస్తూ ఉంటాను.’’ వశిష్ట చెప్పాడు.ఈ చర్చ జరిగిన కొంత కాలానికి వశిష్ట భార్య మరణించింది. ఈ కాలంలో అకాల మరణానికి కారణమైంది కేన్సర్. అది ఫోర్త్ స్టేజ్లో కాని బయటపడలేదు. బయటపడ్డ రెండు నెలలు తిరగకుండానే ఆమె గతించింది.వశిష్ట దుఃఖాన్ని పట్టలేకపోయాం. ఆ పదిహేను రోజులు మేము నలుగురం అతని వెన్నంటే ఉన్నాం. ఆ తర్వాత చాలా ఆదివారాలు మేము నలుగురమే రమ్మీ ఆడాం. తన భార్య పోయిన ఎనిమిదో ఆదివారం వశిష్ట వచ్చాడు. ఐదారు నిమిషాల తర్వాత వశిష్ట చెప్పాడు. ‘‘ఓసారి ‘మనిషి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు?’ అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను అధికంగా ప్రేమించేది మా ఆవిడని చెప్పాను. గుర్తుందా?’’‘‘అవును. అందులో మాకు ఎలాంటి సందేహం లేదు.’’ చెప్పాను.‘‘కాదు. మా ఆవిడ మరణించాక నాకు తెలిసింది. నేను ప్రేమించేది మా ఆవిడని కానే కాదు. ఆవిడ ప్రేమించే డర్టీ మెటల్ని. బంగారాన్ని.’’ నెమ్మదిగా చెప్పాడు.‘‘అంటే నువ్వు ఇంతకాలం మీ ఆవిడ ఇష్టపడుతుందని బంగారం కొనలేదా?’’ అడిగాను.‘‘ఆవిడ మరణించకపోతే అసలు నాకీ సంగతే తెలిసేది కాదు. ఆవిడ శవాన్ని వైకుంఠ రథంలో తరలించేటప్పుడు నేను ఆవిడ నోట్లోని రెండు బంగారు కట్టుడు దంతాలని కటింగ్ ప్లయర్తో పెకలించి తీసుకున్నాను. భార్యని ప్రేమించే ఎవరైనా, జీవం లేనంత మాత్రాన చేసే పనేనా అది?’’ వశిష్ట ప్రశ్నించాడు.అతని మెళ్ళోని బంగారు గొలుసుకి ఆవిడ రెండు దంతాలు మెరుస్తూ కనిపించాయి. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
కిరాయి సైన్యాలు!
అదృశ్య సైన్యాలు అంటే కిరాయి సైనికులు. వాళ్లు ఏ దేశానికీ, ఏ జెండాకూ కట్టుబడి ఉండరు. కేవలం వృత్తిపరమైన సైనికులు. ఎవరు డబ్బు ఇస్తే వారి తరపున ప్రాణాలకు తెగించి పోరాడతారు. రష్యాకు చెందిన ‘వాగ్నర్ గ్రూప్’ మొదలు, కొలంబియాకు చెందిన భయంకరమైన ‘డెజర్ట్ ఉల్వ్స్’ వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సైన్యాలు చాలానే ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులు, కాంగో అడవులు, ఇరాక్ ఎడారులు.. ఇలా యుద్ధం ఎక్కడ మొదలైతే అక్కడికి వాళ్లు కిరాయికి వెళ్లిపోతారు.ఔట్సోర్సింగ్ ‘యుద్ధం’!సాధారణ సైన్యానికి కొన్ని అంతర్జాతీయ యుద్ధ నియమాలు ఉంటాయి. కిరాయి సైన్యాలకు అవేమీ పట్టవు. అందుకే ప్రభుత్వాలు తాము నేరుగా చేయలేని పనులను వీరితో చేయిస్తుంటాయి. యుద్ధ క్షేత్రంలో శత్రువులను దెబ్బతీయడం, యుద్ధం వెలుపల తిరుగుబాట్లను అణచివేయడం, విదేశాల్లో ఉగ్రదాడులు చేయడం వీరి పని. వీరు ప్రభుత్వాల నీడలో పని చేస్తారు. ప్రస్తుతం ఇరాన్ తన శత్రువులను దెబ్బతీయడానికి ఈ కిరాయి ఏజెంట్లను వాడుకుంటోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇరాన్ చేస్తున్న ఈ ‘ఔట్సోర్సింగ్’ యుద్ధంపై, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఎం15’ (సెక్యూరిటీ సర్వీస్కు సంబంధించినది) చీఫ్ కెన్ మెకల్లమ్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. కేవలం గత ఏడాదిలోనే బ్రిటన్ లో ఇరాన్ మద్దతుతో జరిగిన 20కి పైగా ప్రాణాంతక కుట్రలను తమ ఏజెంట్లు అడ్డుకున్నారని ఆయన వెల్లడించారు!రెండు రకాల ‘కిరాయి’లు కిరాయి సైన్యంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి: ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు. ఇవి ప్రభుత్వాల అవసరాలకు, ఆదేశాలకు లోబడి పనిచేస్తాయి. రెండు: అక్రమ ముఠాలు. డబ్బు కోసం ఆ ముఠాలు ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాయి. 1960లలో ఆఫ్రికా దేశాల్లో జరిగిన దాడుల్లో తొలిసారి వీరి గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ‘డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో’లో జరిగిన యుద్ధం– కిరాయి సైనికుల ఉనికికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. కాంగోలోని ‘కటంగా’ అనే ప్రాంతంలో అపారమైన రాగి నిక్షేపాలు ఉండేవి. బెల్జియంకు చెందిన స్థానిక మైనింగ్ కంపెనీలు ఆ వనరులను కొల్లగొట్టటానికి బ్రిటన్, అమెరికాల మద్దతుతో కిరాయి సైనికులను అక్కడ దింపాయి. దేశాన్ని అస్థిరపరచి, ఆ ఖనిజ సంపదను దోచుకోవడమే లక్ష్యంగా కిరాయి మూకలు కటంగాలో బీభత్సాన్ని సృష్టించాయి.పెంచిన కుక్కే కరిచే ప్రమాదంప్రభుత్వాలు తమ పనుల కోసం కిరాయి ముఠాలకు ఆయుధాలు, డబ్బు ఇస్తాయి. ప్రభుత్వానికి, కిరాయి ముఠాకు మధ్య సయోధ్య ఉన్నంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ, ఎప్పుడైతే కాస్త తేడా వస్తుందో అప్పుడు ఆ ముఠా, ప్రభుత్వం మీదకే తిరగబడుతుంది! దీనికి ఒక ఉదాహరణ అఫ్ఘానిస్తాన్ లోని ముజాహిదీన్లు. రష్యాతో పోరాడటానికి అమెరికా ముజాహిదీన్లకు ‘స్టింగర్’ క్షిపణులను అందించింది. ఆ తర్వాత అవే ఆయుధాలు అమెరికాకు తలనొప్పిగా మారాయి. ఒకసారి కనుక కిరాయి సైన్యానికి భారీగా ఆయుధాలు, సాంకేతిక నైపుణ్యం ఇస్తే.. వారు ప్రభుత్వ నియంత్రణలో ఉండరు. సొంతంగా ఒక శక్తిగా ఎదిగి ఆ దేశానికే ముప్పుగా మారుతారు.కిరాయి సైన్యాల అవసరం ఏంటి? ప్రభుత్వాలు ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లను ఎంచుకోటానికి అనేక కారణాలు ఉన్నా, ప్రధానమైన కారణం మాత్రం సొంత సైనికుల రోటేషన్ సమస్య. ఏ దేశమైనా ఒక బెటాలియన్ సైన్యాన్ని యుద్ధంలో ఉంచాలంటే, మూడు బెటాలియన్లు అవసరం! మూడు ఎందుకంటే.. ఒకటి యుద్ధంలో ఉంటే, రెండోది సెలవులో ఉండాలి, మూడోది శిక్షణలో ఉండాలి. ప్రైవేటు కంపెనీలకైతే, కేవలం పని జరిగినన్ని రోజులు మాత్రమే డబ్బు ఇస్తారు. వారికి పెన్షన్లు ఇవ్వక్కర్లేదు, యుద్ధం అయిపోయాక వారి బాధ్యత ఉండదు. దీనినే మిలిటరీ భాషలో ‘ఫోర్స్ మల్టిప్లయర్’ అంటారు. అంటే సంఖ్యను పెంచకుండా, సామర్థ్యాన్ని పెంచుకోవటం. ఉక్రెయిన్పై యుద్ధానికి ఆఫ్రికా డబ్బు!2022లో మార్చి 27 నుంచి 31 వరకు మాలి దేశంలోని మౌరా పట్టణంలో ఊచకోత జరిగింది. దాదాపు 500 మంది అమాయకులను స్థానిక సైనికులు, ‘తెల్లటి చర్మం కలిగిన అపరిచిత భాష మాట్లాడే వ్యక్తులు’ (రష్యాకు చెందిన వాగ్నర్ సైనికులు) కలిసి చంపేశారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. రష్యా మాత్రం ఆ ఊచకోతను ‘ఉగ్రవాదంపై విజయం’గా అభివర్ణించింది. రష్యా పెంచి పోషిస్తున్న వాగ్నర్ గ్రూప్ ఆఫ్రికాలోని అవినీతి నియంతలకు లేదా మిలిటరీ పాలకులకు కూడా భద్రత కల్పిస్తోంది. దాని వెనుక పెద్ద ఆర్థిక ప్రయోజనమే ఉంది. డబ్బుకు బదులుగా ఆ దేశాల్లోని బంగారం, యురేనియం వంటి విలువైన ఖనిజాల తవ్వకం హక్కులను రష్యా పొందుతుంది. గత రెండేళ్లలోనే ఆఫ్రికా నుండి రష్యా çరూ. 20,000 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని రాబట్టుకుంది. ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధానికి ఈ డబ్బునే రష్యా వాడుతోంది.వాట్సాప్లో రిక్రూట్మెంట్ కిరాయి సైనికుల నియామకం ఒక పద్ధతిలో సాగుతుంది! మాజీ సైనికులను వాట్సాప్ ద్వారా సంప్రదించి, వారికి దుబాయ్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఒక కిరాయి సైనికుడికి నెలకు సుమారుగా రూ. 3.3 లక్షల జీతం ఉంటుంది! అది వారు సైన్యంలో పొందే పెన్షన్ కంటే ఆరు రెట్లు ఎక్కువ! కొన్ని దేశాలు నేరుగా మద్దతు ఇచ్చే ‘మిలీషియా’ (తీవ్రవాద సైనిక దళాల) గ్రూపులు కూడా యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఇరాన్, మిలీషియాను పెంచి పోషిస్తోంది. తన సొంత సైన్యాన్ని నేరుగా రంగంలోకి దించకుండా, ఇతర దేశాల్లో ఉన్న కొన్ని గ్రూపులకు డబ్బు, ఆయుధాలు ఇచ్చి యుద్ధం చేయిస్తోంది. ఇరాన్ కనుసన్నలలో పనిచేసే హిజ్బుల్లా (లెబనాన్), హమాస్ (గాజా), హౌతీలు (యెమెన్) ఇలాంటి మిలీషియాలే. యుద్ధం ముగిశాక...?యుద్ధం ముగిశాక, శాంతిని కాపాడటానికి ప్రైవేట్ సైన్యాలు అవసరమవుతాయి. అవి కిరాయి సైన్యానికి భిన్నమైనవీ, చట్టపరిధిలో పని చేసేవీ. ఇలా – డబ్బు కోసం పోరాడే సైన్యం ఒకవైపు విధ్వంసాన్ని సృష్టిస్తుంటే, చట్టబద్ధమైన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు యుద్ధం తర్వాత పరిస్థితులను చక్కదిద్దడంలో సహాయపడుతుంటాయి. డెసర్ట్ వుల్వ్స్ రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూపులాగే, కొలంబియాకు చెందిన మాజీ సైనికులు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో పాల్గొంటున్నారు. వారిని ‘డెసర్ట్ వుల్వ్స్’ అని పిలుస్తారు. ప్రస్తుతం సూడాన్ లో జరుగుతున్న భీకర యుద్ధంలో, ‘రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్’ (ఆర్.ఎస్.ఎఫ్.) అనే గ్రూపు తరపున ఈ కొలంబియన్ కిరాయి సైనికులు పోరాడుతున్నారు. ఆర్.ఎస్.ఎఫ్. జాతి నిర్మూలన, సామూహిక అత్యాచారాలు, పసిపిల్లలను చంపడం వంటి ఘోరమైన యుద్ధ నేరాలకు పాల్పడుతోంది! అధికారం కోసం ఆర్.ఎస్.ఎఫ్., సూడాన్ అధికారిక సైన్యం మధ్య ఈ పోరు జరుగుతోంది. గత అక్టోబర్లో ఆర్.ఎస్.ఎఫ్. ‘ఎల్ ఫాషర్’ అనే నగరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దాదాపు 60,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. విషాదం ఏమిటంటే, కొలంబియాకు చెందిన టీనేజర్లు కూడా కిరాయి సైనికులుగా పోరాడాల్సి రావటం. వాగ్నర్ గ్రూప్ అమెరికా లేదా బ్రిటన్ దేశాల ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలు కేవలం దేశ రక్షణ విధులను మాత్రమే చేపడతాయి. కానీ రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ కథే వేరు! ఇది రష్యా ప్రభుత్వం (క్రెమ్లిన్) నిధులు ఇచ్చి నడిపే ఒక రహస్య సైన్యం. 2023లో వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ పైనే తిరుగుబాటు చేసి సంచలనం సృష్టించటం మీకు గుర్తుండే ఉంటుంది. అయితే అంతా ఊహించిన విధంగానే వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ కథ విషాదాంతమైంది. పుతిన్ ను బాహాటంగా విమర్శించి, తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్, ఒక ప్రైవేట్ జెట్ ‘ప్రమాదంలో’ ప్రాణాలు కోల్పోయాడు. ప్రిగోజిన్ మరణం తర్వాత, వాగ్నర్ గ్రూప్ ఇప్పుడు పేరు మార్చుకుని ‘ఆఫ్రికా కోర్స్’ గా చలామణి అవుతోంది. ∙ సాక్షి స్పెషల్ డెస్క్ -
రైవతుడి జననం
పూర్వం ఋతవాక్కు అనే మునికుమారుడు విద్యాభ్యాసం తర్వాత బ్రహ్మచర్యం వీడి, తగిన కన్యను వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. చాలాకాలమైనా సంతానం కలగకపోవడంతో సూర్యుడి కోసం తపస్సు చేశాడు. సూర్యుడి వర ప్రసాదం వల్ల ఋతవాక్కుకు కొడుకు పుట్టాడు. అతడు రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించాడు.ఋతవాక్కు ఆ బాలుడికి యథావిధిగా జాతకర్మాదులు జరిపించాడు. అయితే, ఆ బాలుడు పెరిగేకొద్ది బుద్ధివికాసం పొందకపోగా, వెర్రివాడిలా తిరగసాగాడు. కొడుకు పరిస్థితికి ఋతవాక్కు, అతడి భార్య తీవ్రంగా కలత చెందారు. మనోవ్యధతో వారు వ్యాధిగ్రస్థులయ్యారు. కొడుకు పరిస్థితిని చక్కదిద్దడానికి తరుణోపాయం కోసం ఋతవాక్కు ఒకనాడు గర్గముని ఆశ్రమానికి వెళ్లాడు. గర్గమునిని దర్శించుకుని, తన కొడుకు పరిస్థితిని వివరించి, తరుణోపాయం చెప్పమని కోరాడు.‘‘మునిపుంగవా! నీ కొడుకు రేవతీ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టాడు. నక్షత్రదోషం కారణంగానే అతడు మూర్ఖుడయ్యాడు’’ అని పలికాడు గర్గుడు. ఋతవాక్కు ఆ మాటలకు కోపించి, ‘‘రేవతీ నక్షత్రం ఆకాశం నుంచి నేల రాలిపోవు గాక!’’ అని శపించాడు.వెంటనే రేవతీ నక్షత్రం ఆకాశం నుంచి రాలిపోయి, కుముద పర్వతంమీద ఉన్న ఒక కొలనులో పడింది. ఆ కొలనులో అనేక పద్మాలు ఉండేవి. వాటిలోని ఒక పద్మం నుంచి రేవతీ నక్షత్రం ఒక కన్యక రూపంలో పుట్టింది. ప్రముచుడు అనే ముని ఆ కన్యకను చూసి, తన ఆశ్రమానికి తీసుకువెళ్లి, పెంచుకోసాగాడు. ఆమెకు రేవతి అని పేరు పెట్టాడు. కొన్నాళ్లకు రేవతి యుక్తవయస్కురాలైంది. ప్రముచుడు ఆమె కోసం వరాన్వేషణ ప్రారంభించాడు.ప్రముచుడు ఒకనాడు అగ్నిదేవుడిని ‘‘దేవా! నా కుమార్తెకు యోగ్యుడైన వరుడు ఎక్కడ దొరుకుతాడో నువ్వే చెప్పు’’ అని అభ్యర్థించాడు.‘‘మునీశ్వరా! కొద్దిరోజుల్లోనే దుద్ధముడు అనే రాజు నీ ఆశ్రమానికి వచ్చి, నీ కుమార్తెను చూస్తాడు. అతడే ఆమెకు తగిన వరుడు. నీ కుమార్తె రేవతిని అతడికిచ్చి వివాహం జరిపించు’’ అని పలికాడు అగ్నిదేవుడు.కొన్నాళ్లకు ప్రియంవద వంశీయుడైన దుద్ధముడు అడవిలో సంచరిస్తూ, ప్రముచుడి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడే, ఆశ్రమంలోంచి ప్రముచుడు బయటకు వచ్చాడు. ‘‘ప్రియంవద వంశోద్భవా! నిన్ను చూసి చాలాకాలమైంది. నువ్వు నాకు అల్లుడివి’’ అని పలికి, అతడికి అర్ఘ్యమిచ్చి, లోనికి స్వాగతించాడు.‘‘మహర్షీ! మీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. నేను మీకెలా అల్లుడినయ్యాను?’’ అడిగాడు దుద్ధముడు.‘‘రాజా! నా కుమార్తె రేవతిని నీకిచ్చి పెళ్లి చేయదలచాను. నువ్వు నా ఆశ్రమానికి వస్తావని, నా కుమార్తెకు తగిన వరుడివి నువ్వేనని అగ్నిదేవుడు చెప్పాడు’’ అన్నాడు ప్రముచుడు.తండ్రి మాటలు విన్న రేవతి, ‘‘తండ్రీ! నాకు ఈ రాజుతో వివాహం చేయదలిస్తే, రేవతీ నక్షత్ర ముహూర్త సమయంలోనే చేయాలి’’ అని చెప్పింది.ప్రముచుడు తన తపోమహిమతో రేవతీ నక్షత్రాన్ని ఆకాశంలో నిలిపి, అదే ముహూర్తంలో అగ్ని సమక్షంలో రేవతీ, దుద్ధముల వివాహం వేదోక్తంగా జరిపించాడు. వివాహం ముగిశాక, ‘‘జామాతా! నీకే వరం కావాలో కోరుకో’’ అని అడిగాడు ప్రముచుడు.‘‘మునివర్యా! నేను స్వాయంభువ మనువు వంశంలో పుట్టాను. నాకు నీ కుమార్తె రేవతి ద్వారా జన్మించే కుమారుడు ఈ మన్వంతరానికి అధిపతి అయ్యేలా వరం అనుగ్రహించండి’’ అని కోరాడు.‘‘తథాస్తు’’ అని ఆశీర్వదించాడు ప్రముచుడు.కొన్నాళ్లకు రేవతికి పండంటి కొడుకు పుట్టాడు. దుద్ధముడు అతడికి జాతకర్మాదులు జరిపించి, రైవతుడు అని నామకరణం చేశాడు.రైవతుడు సకల శాస్త్రాలను, అస్త్రశస్త్ర విద్యలను క్షుణ్ణంగా అభ్యసించాడు. కొన్నాళ్లకు దుద్ధముడు ఒక సుదినాన రైవతుడికి పట్టాభిషేకం జరిపించి, భార్యలతో కలసి వానప్రస్థానికి వెళ్లిపోయాడు.రైవతుడు సమస్త భూమండలాన్ని జయించి, రైవత మనువుగా ప్రఖ్యాతి పొందాడు.∙సాంఖ్యాయన -
క్లూషియల్: పాంట్రీ కారులో శవం
సమయం ఉదయం 10 గంటలు.. హైదరాబాద్లోని నాంపల్లి స్టేషన్ కు చెన్నై ఎక్స్ప్రెస్ చేరుకుంది. రైలు పాంట్రీకారులో సినిమా ప్రొడ్యూసర్ తంగవేలు శవమై కనిపించడం పెను సంచలనం సృష్టించింది. ఈ మిస్టరీని చేధించడానికి డిటెక్టివ్ సిద్ధార్థ రంగంలోకి దిగాడు.తంగవేలు మృతదేహం పాంట్రీకారులోని స్టోరేజ్ క్యాబిన్ దగ్గర పడి ఉంది. అతని గొంతుపై లోతైన గాయం ఉంది, కాని, ఆశ్చర్యకరంగా రక్తపు మరకలు చాలా తక్కువగా ఉన్నాయి.సిద్ధార్థ తన విచారణను పాంట్రీ సిబ్బంది నుంచి ప్రారంభించాడు.మొదటి అనుమానితుడిగా వంటవాడిని ప్రశ్నించాడు. అతడు ‘‘నేను రాత్రంతా బిజీగా ఉన్నాను, నాకేం తెలియదు’’ అని చెప్పాడు.రెండవ అనుమానితుడైన మేనేజర్ను ప్రశ్నించాడు సిద్దార్థ. తంగవేలు తనను డబ్బుల కోసం వేధించాడని ఒప్పుకున్నాడు కాని, తాను చంపలేదని వాదించాడు.సిద్ధార్థ పాంట్రీకారులోని డీప్ ఫ్రీజర్ని పరిశీలించాడు. అక్కడ గడ్డకట్టిన రక్తపు చుక్కలను గుర్తించాడు. అలాగే తంగవేలు చేతి గడియారం 11:30 గంటలకు ఆగిపోయి ఉంది. కానీ రైలు సిబ్బంది ఆయన 1:00 గంటకు కూడా సజీవంగా ఉన్నాడని సాక్ష్యం చెప్పారు.అదే సమయంలో రాత్రి ఒంటి గంటకు తంగవేలు బోగీలో నడుచుకుంటూ వెళ్లడం చూశానని అదే బోగీలో ప్రయాణిస్తున్న సంతోష్ అనే కుర్రాడు చెప్పాడు. తన తాతకు మూలికా వైద్యం కోసం చెన్నైలో ఉంటున్న ఆయుర్వేద వైద్యుడు సుబ్బారాయుడు దగరికి వెళ్లి అదే ట్రైన్లో అదే బోగీలో ప్రయాణించినట్టు సాక్ష్యం చెప్పాడు.‘రాత్రి 11:30 గంటలకు చనిపోయిన వ్యక్తి ఒంటి గంటకు నడుస్తూ కనిపించడం ఎలా సాధ్యం?’ అక్కడే సిద్దార్థ డిటెక్టివ్ బుర్ర వేగంగా పని చేసింది.రైలు నాంపల్లి స్టేషన్ కు చేరుకున్నాక, రైల్వే క్లీనింగ్ సిబ్బంది పాంట్రీకారులోని స్టోరేజ్ క్యాబిన్ (సామాన్లు ఉంచే గది) తలుపు తీసినప్పుడు అక్కడ తంగవేలు మృతదేహం బయటపడింది.అసలు ఏం జరిగింది? సిద్ధార్థ పరిశోధన మొదలుపెట్టాడు.రాత్రి 11:30 గంటలకే తంగవేలును పాంట్రీకారులోని సీక్రెట్ స్టోరేజ్ ఏరియాలో ఎవరో చంపేశారు.సిద్ధార్థ తంగవేలు చేతి గడియారాన్ని గమనించాడు. అది రాత్రి 11:30 గంటలకే ఆగిపోయి ఉంది. గొడవ జరిగిన సమయంలో గడియారం కింద పడి ఆగిపోయిందని గ్రహించాడు.శవాన్ని రైలు నుంచి బయట పడేయడం సాధ్యం కాదు కాబట్టి, హంతకుడు ఎవరికీ అనుమానం రాకుండా కూరగాయలు, ఖాళీ డబ్బాలు ఉంచే పెద్ద డీప్ ఫ్రీజర్ అడుగున శవాన్ని దాచిపెట్టి, పైన సామాన్లు సర్దేశారు.రాత్రి ఒంటి గంట సమయంలో తంగవేలులాగే డ్రెస్ వేసుకున్న ఒక సిబ్బంది, తల వంచుకుని పాంట్రీ నుంచి బయటకు వెళ్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.రైలు నాంపల్లి స్టేషన్ ప్లాట్ఫారమ్ మీద ఆగడానికి సరిగ్గా 5 నిమిషాల ముందు, అందరూ సామాన్లు సర్దుకోవడంలో బిజీగా ఉన్నప్పుడు మేనేజర్ తెలివిగా శవాన్ని ఫ్రీజర్ నుండి తీసి, పాంట్రీకారులోని ఒక మూలగా ఉన్న సర్వీస్ డోర్ దగ్గర పడేశాడు. రైలు ఆగగానే అందరూ దిగిపోతుంటే, తను కూడా ఏమీ తెలియనట్టు పక్కకు తప్పుకున్నాడు.సిద్ధార్థ ఆ స్టోరేజ్ క్యాబిన్ తలుపుల దగ్గర రక్తపు మరకలు నేల మీద కాకుండా, పైభాగంలో ఉండటం గమనించాడు. అంటే శవాన్ని ఎక్కడి నుంచో తీసి ఇక్కడ పడేశారని గ్రహించాడు. ఫ్రీజర్ తెరిచి చూస్తే, అక్కడ తంగవేలు కోటు బటన్ దొరికింది. దాంతో అసలు రహస్యం బయటపడింది.మేనేజర్ గురించి ఎంక్వయిరీ చేస్తే అసలు విషయం బయటపడింది.తరచూ సినిమా పనుల మీద పెద్దమొత్తం డబ్బుతో తిరిగే తంగవేలుతో పరిచయం పెంచుకుని, అతని దగ్గర పెద్దమొత్తం డబ్బు ఉండటం గమనించి, అదంతా బ్లాక్ మనీ అని తెలుసుకుని దొంగిలించే ప్రయత్నం చేశాడు. కుదరకపోవడంతో పెనుగులాటలో చంపేశాడు.ఆ హత్యను కప్పి పుచ్చుకోవడానికి ఈ డ్రామా ఆడాడు. వ్యక్తిగతమైన విషయాలు అపరిచితులతో పంచుకోవడం తంగవేలు చేసిన తప్పయితే, అత్యాశతో నేరం చేసి కటకటాల్లోకి వెళ్లడం మేనేజర్ స్వయంకృతాపరాధం. నేరానికి శిక్ష తప్పదు. ∙శ్రీసుధామయి -
అలాంటి వ్యక్తి దొరకాలి!
చూడగానే పక్కింటి అమ్మాయిలా స్క్రీన్ మీద మెరిసిన ‘సీతామహాలక్ష్మి’ మన మృణాల్ ఠాకూర్. తన మనసులో ఏమున్నా దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆమె స్టయిల్. బాడీ ఇమేజ్ పోరాటాల నుంచి, తనపై వచ్చే గాసిప్స్ వరకు ప్రతి విషయాన్ని ధైర్యంగా పంచుకున్న ముచ్చట్లు ఇప్పుడు మీకోసం..గాసిప్స్? నవ్వేసి ముందుకెళ్తాను!నా పెళ్లి గురించి వచ్చే వార్తలు చూస్తే నాకే నవ్వొస్తుంది. ముఖ్యంగా ఒక తమిళ హీరోతో వచ్చిన పెళ్లి వార్తల్లో అస్సలు నిజం లేదు. అలాంటి వార్తలు చదివితే, ‘ఫిబ్రవరి 14 ఒక్కసారిగా ఏప్రిల్ 1 అయిపోయిందేమో’ అని అనిపిస్తుంది.ట్రోల్ చేసినా.. నిలబడ్డాను!బాడీ షేమింగ్ గురించి చాలా బాధపడ్డాను. నన్ను ‘మట్కా’ అని పిలిచినప్పుడు చాలా కుంగిపోయాను. కానీ ఇప్పుడు నా శరీరంపై నాకు గౌరవం ఉంది. ఎవరో నన్ను నిర్వచించడం కాదు. నేను నన్ను ఎలా చూసుకుంటున్నాననేదే ముఖ్యం.బ్రేకప్ ఇచ్చిన బలంప్రస్తుతం నేను సింగిల్గానే ఉన్నాను. నా కోసం ఎవరినీ వెతకడం లేదు. ఎందుకంటే, నాకు కియానూ రీవ్స్ లాంటి వ్యక్తి దొరికితే బాగుంటుంది అని అనిపిస్తుంది. గతంలో ఒక రిలేషన్ ఉంది. అయితే, నేను నటిని అనే నిజాన్ని అతను అంగీకరించలేక పోయాడు. ఆ బ్రేకప్ నన్ను మరింత బలంగా మార్చింది.అమ్మకు ఇచ్చిన మాట!చిన్నప్పుడొక బాధాకరమైన జ్ఞాపకం ఉంది. మా ఆర్థిక పరిస్థితి బాగోలేని రోజుల్లో, మా అమ్మను చుట్టాలు తమ కార్లలో కూర్చోనివ్వని సందర్భాలు చూశాను. అప్పుడే నేను ఒక మాట ఇచ్చాను. ‘ఒకరోజు నువ్వు ఊహించని కారు కొనిస్తాను’ అని. ఈ రోజు ఆ మాటను నిలబెట్టుకున్నాను.చీకటి దశ నుంచి వెలుగులోకి!నా జీవితంలో ఒకప్పుడు చాలా కష్టమైన దశ వచ్చింది. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ ఆలోచించేటప్పుడు చాలాసార్లు నిరాశగా అనిపించేది. ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం, నా పోరాటానికి నిదర్శనం. ప్రస్తుతం గ్లామర్ పాత్రలు చేసినా, టెలివిజన్ నుంచి వచ్చిన అమ్మాయి అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోను. అదే నా పునాది.నేను సిద్ధంగా లేనప్పుడు నో వే!నా కెరీర్ మొదట్లో చాలా పెద్ద అవకాశాలు వచ్చాయి. కాని, ఆ పాత్రలకు నేను మానసికంగా సిద్ధంగా లేనప్పుడు వాటిని వదిలేశాను. ఒకవేళ అప్పుడు బలవంతంగా చేసి ఉంటే, నన్ను నేను కోల్పోయేదాన్ని. అలాగే, కెరీర్ మొదట్లో కొన్ని సన్నివేశాలు చేయాల్సి వస్తుందని తెలిసి, చాలా పెద్ద సినిమాలు వదిలేశాను. అవకాశాలు కోల్పోయినా, నా విలువల విషయంలో మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అదే నా అసలైన విజయం. -
ఈ వారం కథ: గడ్డి మందు
అర్ధరాత్రి దాటింది. వీధుల్లో భోగి మంటలు ఇంకా ఉన్నాయి. పండగ రోజులు కావడంతో ఆసుపత్రి ప్రాంగణంలో పెద్ద హడావుడి లేదు. లోపల రోగులు మందుల మత్తులో నిద్రిస్తున్నారు. వాళ్ల అటెండర్లు మాత్రం బెంగతోనో, భయంతోనో బయట తచ్చాడుతున్నారు నాలాగ. నైట్ డ్యూటీలో ఉన్న స్టాఫ్ భోగి మంట చుట్టూ చేరి జోకులేసుకుంటున్నారు. తెల్లారితే సంక్రాంతి. ఎవరికి సెలవు కావాలి, ఎవరు కొత్త అల్లుళ్లు, పోయిన పండక్కి ఎవరు ఎవరికోసం త్యాగాలు చేశారు, పెద్ద డాక్టర్తో పండగపూటా తిట్లు తిన్నదెవరులాంటి విషయాలు వాళ్ల మధ్య చర్చకొస్తున్నాయి. ఇంతలోనే ఆసుపత్రి ముందుకి దూసుకొచ్చిన ఒక షేర్ ఆటో– అప్పటిదాకా భోగి మంట చుట్టూ అలముకున్న సరదాలతో పాటు అప్పుడప్పుడే కుదురుకుంటున్న ఆ రాత్రి నిశ్శబ్దాన్ని కూడా పటాపంచలు చేసింది. ఆటో పూర్తిగా ఆగేలోపే గబగబా నలుగురు దిగారు. ‘పట్టండి పట్టండి’ అంటూ ఆటో లోపలినుంచి మాటలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ పరుగున వచ్చి ఆ నలుగురితో కలిశాడు. వాళ్లంతా కలిసి ఆటోలోంచి ఒక కుర్రాడ్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఏమైందో చూద్దామని మునివేళ్లపై నిలబడి వాళ్ల మధ్యలోకి చూపు సారించాను. స్పృహలో లేని ఒక కుర్రాడు. అతడి నూనూగు మీసాల కంటే ముందు చెంపలకంటిన తెల్లటి నురుగు కనిపించింది. నిండా ఇరవై కూడా ఉండవు. కాళ్లూ చేతులూ పట్టుకుని నలుగురు మోసుకెళ్లడం చూసి నా మనసంతా అదోలా అయిపోయింది. దాదాపు ఆటోలో వచ్చినవాళ్లంతా లోపలికి పరుగు తీశారు. ఒక్క వ్యక్తి మాత్రం మెట్ల పక్కనే ఉన్న అరుగుమీద కూలబడి అలా గోడకు జారబడిపోయాడు. మోకాళ్ల పైకి కట్టిన గళ్ల పంచె అక్కడక్కడా తెల్లటి తడి మరకలు. చొక్కా మధ్యగుండీ, చివరిదీ వదిలేసి ఉన్నాయి. కాళ్లకు చెప్పులు లేవు. కాస్త పరిశీలించి చూస్తే మన్ను, పేడ కలిసి అంటుకుని ఆరిపోయినట్టుగా ఉన్నాయి పాదాలు. ముఖం చూస్తే రైతు అని అర్థమవుతుంది. చుట్టూ ఏమున్నా అతను చీకట్లో ఉన్నట్టే ఉన్నాడు. ఇంతలో ముగ్గురు మనుషులతో ఒక టూ వీలర్ వచ్చి ఆగింది. అందులో వెనక కూర్చున్న ఇద్దరూ బండి దిగుతూనే లోపలికి పరిగెడుతూ, పార్కింగ్ చేస్తున్న మూడో మనిషితో ‘‘ఒరేయ్ వెంకన్నా! చతురుడు ఇక్కడున్నాడు చూస్కో’’ అంటూ అరుగుమీద ఉన్న అతన్ని చూపిస్తూ వెళ్లిపోయారు. ‘చతురుడా..!’ అని నేను ఒక్కక్షణం ఆ పేరు దగ్గరే ఆగేలోపే వెంకన్న అతని దగ్గరగా వచ్చి పక్కనే కూర్చున్నాడు. అతని చెయ్యి భుజం మీద భరోసాగా పడేసరికి చతురుడు దుఃఖంతో వణికిపోయాడు. చేతిలో తుండు గుప్పెట నిండా పట్టుకుని నోట్లో కుక్కుకున్నాడు. గుండెల్లోని బాధ కళ్ల వెంట జలజలా జారుతున్నా అడ్డుకోలేకపోతున్నాడు. వెంకన్న తన చేతిని భుజం మార్చి సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు కాని, అతని ముఖంవైపు చూడలేకపోతున్నాడు. అప్పటికే వెంకన్న కళ్లు కూడా చెరువయ్యాయి. ఇంతలో లోపలినుంచి వచ్చిన ఒక వ్యక్తి గుమ్మం దగ్గర ఉన్న ఇద్దరినీ చూసి,‘‘ఒరేయ్! ఏంట్రా ఇది. వెంకన్నా నువ్వు కూడా ఏంటెహె, పక్కనే ఉండి దైర్నం సెప్తావంటే.’’ఆ మాటలు విన్న వెంకన్న కళ్లు తుడుచుకుంటూ నువ్వు చూసుకో అన్నట్టుగా అతనికి సైగ చేసి పక్కకు వెళ్లిపోయాడు. చతురుడి దుఃఖం పోటెత్తిన గోదారిలా ఉంది. అది గమనించి పక్కనే కూర్చున్నాడు ఆ వ్యక్తి. ‘‘ఊరుకోరా చతురూ... భయమేం లేదు. డాట్రగారు వచ్చేసేడు. ఆడికేం కాదురా. కుర్రోడు, ఉడుకురత్తం. గెంటుకొచ్చేత్తాడులే. బయటడిపోతాడు నువ్వు కంగారడక,’’ అంటూ నోటికి అడ్డంగా పెట్టుకున్న ఆ తువ్వాలు నెమ్మదిగా కళ్లమీదకు జరిపి చతురుడి కన్నీటిధారలు కట్టే ప్రయత్నం చేశాడు. హోరు వానలో పిల్లలగూడు చెదిరిన పక్షిలా వణుకుతున్నాడు చతురుడు. ఇప్పుడు అతన్ని తండ్రి స్థానంలో స్పష్టంగా చూస్తున్నాను నేను. తెలియకుండానే గుండె ఇంకాస్త బరువెక్కినట్టు అనిపించింది. అసలేం జరిగిందో? లోపలి నుంచి ఒక నర్సు పేపరు తీసుకొని వచ్చింది. కూడా వచ్చిన మనిషి చతురుడ్ని చూపించేసరికి, ఆ కాగితం మీద అతని వేలిముద్ర తీసుకొని వెళ్లిపోయింది.పక్కనే బైక్ను ఆనుకుని కూర్చున్న వెంకన్న వైపు మళ్లాయి నా చూపులు. పాదాలు కూడా అప్రయత్నంగానే అటు కదిలాయి. ఇంతలో అతని చొక్కా జేబులో ఉన్న ఫోన్ మోగడంతో పక్కకు తిరిగి రెండడుగుల దూరంలోనే ఆగాను. ఫోన్ ఎత్తి ‘హలో’... అనేలోగానే అవతలి గొంతు బయటకు వినిపిస్తోంది నాకు. ‘‘ఎంకన్నా... ఏవన్నారు, డాట్రగారు ఉన్నారా, పర్లేదు కదా! కళ్లు తెరిసి సూత్తన్నాడా..?’’ ఏం సమాధానం వినాల్సి వస్తుందో అనే భయంతో సాగుతున్న ప్రశ్నల వర్షంలా అనిపించింది నాకు. ‘‘డాట్రగారు వచ్చేరు, సూత్తన్నారు. మీరేం కంగారడకండి,’’ వెంకన్న సమాధానం నిశ్శబ్దంగా విన్నారు. ఆ వెంటనే...‘‘నువ్వు లోపలే ఉన్నావా, ఎలా ఉందిపుడు?’’ మళ్లీ అదే ప్రశ్న అవతలి నుంచి.‘‘లేదు, అందరూ లోపలికెలిపోతే డాట్రగారు దెబ్బలెడతారని బయటున్నాను. ఆడికేం అవదు. వదిన జాగ్రత్త!’’చతురుడు, వెంకన్న అన్నదమ్ములనే విషయం స్పష్టం చేసింది ఆ మాట. చెవులు ఫోన్ మీద పెట్టి ఒకసారి ఎందుకో చతురుడి వంక చూశాను. కళ్లు పొడిబారి ముఖమంతా బెంగటిల్లి ఉన్నాడు. ఇంతలో ఫోన్లో మాటలు నా దృష్టిని మరల్చాయి.‘‘ఏం జాగర్తరా బాబూ, ఎవరూ ఆపలేకపోతన్నారు. తల బాదేసుకుంటంది, నా కొడుకో... నా కొడుకో... అంటా నేలంతా పొర్లాడిపోతంది. నీళ్ల చుక్క ఇచ్చినా గిరాటేసి కొట్టేత్తంది. నన్ను తీసుకెళ్లండి ఆస్పటల్కి, నేను నా కొడుకును చూడాలంటంది. దాని బాధ సూళ్లాపోతన్నాంరా!’’ మాటలు విన్న వెంకన్న దుఃఖాన్ని ఆపుకుంటూనే, ‘‘అస్సలా... మీరెవరూ ఇటుకేసి రాకండి. మావున్నాం కదా!, ఏదైనా అవసరమైతే కవురెడతాం. బానేవుంది కళ్లు తెరిసాడని సెప్పండి వదినికి. ఇక్కడకి మాత్రం బయల్దేరొద్దు. కుసేపాగి నేనే పోన్ సేత్తాన్లే,’’ అంటూ కళ్లు తుడుచుకున్నాడు వెంకన్న. అవతలి నుంచి ’అలాగే అలాగే సెయ్యి ఎంకన్నా’ అనే మాట వినిపించింది. వెంకన్న ఫోన్ కట్ చేశాడు. ఇదంతా వింటున్నాడో లేదోగాని, గండిపడ్డ చెరువు ముందరి పంటచేనులా ఉన్నాడు చతురుడు. అన్నయ్య వైపు చూస్తే ఏమైనా అడుగుతాడేమో, ఏమైనా చెప్పాల్సి వస్తుందేమో అన్నట్టుగా అటుపక్కగా తిరిగిపోయాడు. దగ్గరకు వెళదాం అనిపించినా, అతను కాస్త కుదురుకున్నాక మాట కలుపుదామని ఆగిపోయాను. ఇంతలో లోపలి నుంచి ఇంకో వ్యక్తి బయటకు వచ్చాడు. వాళ్ల మనిషే, ఇంతకు ముందు ఆటోలోనుంచి దిగేటప్పుడు చూసిన గుర్తుంది. నేను ఉన్నవైపే నడుస్తూ వచ్చి,‘‘ఎంకన్నా, ఇంటికాడ ఎలావుందో, పోన్ సెయలాకపోయావా ఓసారి?’’ తోడొచ్చిన మనిషి కాబట్టి కాస్త నిబ్బరంగా ఉంది మాట.‘‘ఉప్పుడే ఇంటికాణ్ణుంచి సేసారు మాయా, డాట్రగారు సూత్తన్నారు కంగారడద్దొని సెప్పాను.’’ వెంకన్న కాస్త భయం భయంగానే,‘‘ఏవంటన్నారు మాయా?’’ ‘‘కాస్త కూస్తయితే పర్లేదుగానీ, ఈడమ్మ మొత్తం పట్టించేసాడ్రా కుర్రెదవ. మా సెడ్డా యాతన తెచ్చేడు. ఆయనగారు ప్రయత్నం సేత్తన్నాడు. చూద్దాం, భగమంతుడే ఉన్నాడు,’’ అంటూ వెంకన్న దగ్గర అగ్గిపెట్టె తీసుకొని జేబులో చుట్ట బయటకు తీసి దాని కొస కొరికి బయటకు ఊస్తూ, ఇప్పుడే వస్తా అన్నట్టుగా పక్కకు కదిలాడు ఆ వ్యక్తి. వయసు యాభై దాటి ఉంటుంది. జుట్టు నెరిసింది. ఇలాంటి మంచి చెడ్డా బాగా చూసి, నలుగురి కోసం తిరిగి నలిగినవాడిలా ఉన్నాడు. వెంకన్నను కదిపి బాధ పెంచడం కంటే ఇతనితో మాట కలపడం కరెక్ట్ అనిపించింది. ఆటో అవతల కాస్త దూరంగా పొగ వదులుతున్న ఆ పెద్దాయన్ను చూసి అటువైపు కదిలాను. ఆస్పత్రి ఆవరణం కదా, అందరూ ఏదో ఒక బాధ మోస్తూనే ఇక్కడ నిలబడతారని తెలిసిన మనిషిలా నన్ను పలకరింపుగా చూశాడు. అది చూసి నేను ఇంకాస్త దగ్గరకు అడుగులేశాను.‘‘ఏ ఊరండీ?’’ మాట కలిపాను.‘‘మన్యంవారిపాలెం, మీది?’’ ‘‘గండేపల్లి. మా అమ్మకు బాగోకపోతే తీసుకొచ్చాం. సడన్ గా మనుషుల్ని గుర్తుపట్టలేకపోతుంది. సోడియం తగ్గిందట. మందులిచ్చారు, రాత్రికి ఇక్కడే ఉంచమన్నారు. పొద్దున్నే రాజమండ్రి తీసుకెళ్లాలి స్కానింగ్ కోసం.’’ నేను అడగాల్సిన సంగతి ఎక్కడ ఆలస్యం అయిపోతుందో అని, ఆయన అడక్క ముందే నా వివరం మొత్తం పూర్తి చేసేశా. నా మాటలు విన్న ఆ పెద్దమనిషి నిట్టూర్పుగా,‘‘ఏంటో యింత యింత రోగాలు. ఒక వయసు దాటాక ఏది ఎలా ముంచుకొత్తందో చెప్పలాకపోతన్నాం. హాయిగా బతకాల్సిన కుర్రెదవలేమో ఇలా చేత్తన్నారు.’’ ప్రాణం మీదకు తెచ్చుకున్న ఆ కుర్రాడిపై బాధతో నిండిన కోపంతో అన్నాడు. ‘‘ఏమైంది..?’’ నా ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం విన్నాక మళ్లీ చతురుడి వైపు చూడటానికి ధైర్యం సరిపోలేదు. నిజానికి అతని అసలు పేరు చతురుడు కాదు. ఎప్పుడూ చుట్టూ ఉన్న వాళ్లతో చతుర్లాడుతూ, నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడని ఊళ్లో అలా పిలుచుకుంటారు. అసలు పేరు వీరన్న. బయట ఊరోళ్లకు, ఇంట్లోవాళ్లకు, చుట్టాలకు తప్ప ఆ పేరు ఊళ్లో పెద్దగా తెలియదు. అతని నైజానికి పూర్తి విరుద్ధమైన స్థితిలో ఇప్పుడు వున్నాడనిపించింది. ఎప్పటిలాగే పొలం పని చూసుకొని కాస్త పెందరాడే ఇంటికి బయలుదేరిన చతురుడు, ఇంటికి దగ్గరలో ఉన్న గొడ్ల సావిడి దగ్గర ఆగాడు. అక్కడ అంతా శుభ్రం చేసుకుని పాలు పితుకుతున్నాడు. ఇంతలోనే ఇంటినుంచి కబురు. కుర్రాడు మందు తాగేశాడు అర్జంటుగా రమ్మని. కాళ్ల మధ్యలో ఉన్న పాలక్యానుతో పాటు అతని గుండె జారిపోక ఏమవుతుంది? ఉన్న మనిషి ఉన్నట్టే పరిగెత్తాడు. అక్కడ నుంచి నేరుగా ఆటో ఎక్కి ఆస్పత్రికి వచ్చి ఇక్కడ కూలబడిపోయాడు. ఒక్కడే కొడుకు. పేరు శ్యామ్సుందర్. పెద్దాయన ఆ పేరు చెప్పగానే నోటి వెంట తెల్లటి నురుగు కారుతూ ఉన్న ఆ పిల్లాడి ముఖం గుర్తొచ్చింది. పదవతరగతి మంచి మార్కులతో పాసయ్యాడు. తాను పెట్టిన కండిషన్ ప్రకారం స్మార్ట్ఫోన్ బహుమతిగా కొనిపించుకున్నాడు. ఇప్పుడు ఇంటర్ సెకండియర్. నెలరోజుల్లో పరీక్షలున్నాయి. ఇంతలోనే బలవంతపు చావుకి సిద్ధపడి కన్నవాళ్లకు ఇంత పెద్ద పరీక్ష పెట్టాడు. ‘‘ఏదైనా అనండి, ఇయ్యాలా రేపు పిల్లలకు అదుపు లేకుండా పోయిందండీ. ఏదడిగితే అది కొనేయడం, కొనకపోతే కొనేదాకా ఆళ్లు అమ్మాబాబుని తినేయడం,’’ ఆలోచనగా వింటున్న నన్ను చూసి ఇంకాస్త గట్టిగా తనే, ‘‘కాలేజీకి పోయే కుర్రగాళ్ల చేతికి పోనెందుకు సెప్పండి? ఆళ్లు పాటాలింటారా, పోనే సూత్తారా? గట్టిగా ఏవన్నా అంటే ఆ మేస్టర్ల మీదకి కూడా మనమే యుద్ధానికి పోతన్నాం. ఇదంతా ఎవరిని ఉద్దరించడానికి?’’ నిలదీసినట్టుగా అడిగేసరికి నేను తలూపాను. శ్యామ్సుందర్ ఎందుకిలా చేశాడో చెప్పేసరికి అతని ఆవేదన నాలోనూ అనేక ప్రశ్నల్ని రేపింది.స్మార్ట్ ఫోన్ చేతికొచ్చేసరికి చాలామంది కుర్రాళ్ల మాదిరే శ్యామ్సుందర్ లోకం కూడా మారిపోయింది. తెల్లారగానే చూసేది ఆ ఫోన్ ముఖమే, రాత్రి నిద్రపోయేది కూడా దాని ముఖం చూస్తూనే. ’ఎప్పుడూ ఆ పోన్లోనే తలకాయ పెట్టుకుని ఉంటావ్, ఏం చూత్తావ్రా గంటల గంటలు’ అనే మాట చాలామంది తల్లిదండ్రుల్లాగే చాలాసార్లు అన్నాడు చతురుడు. చదువుకు సంబంధించింది ఏదో చూస్తున్నామనో, ఫ్రెండు నోట్స్ పంపుతానన్నాడనో ఏదో ఒక కథ చెప్పి వాళ్లను ఏమార్చడం తప్ప మాట వినిందే లేదు సుందర్. అంతకు మించి పట్టించుకునే తీరిక ఆ కష్టజీవికి లేదు. ఆ అలవాటు నెమ్మదిగా సుందర్ను బెట్టింగ్ యాప్స్ వైపు ఆకర్షితుడయ్యేలా చేసింది. డబ్బులు రాగానే ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చేయడం, సినిమాలకు వెళ్లిపోవడం, డబ్బు పోతే ఎవర్నో అప్పు అడగటం, ఇంట్లో అయితే ఆ ఫీజులని, ఈ ఫీజులనీ అబద్ధం చెప్పి తీసుకోవడం అలవాటుగా మారిపోయింది. మొత్తానికి కొన్ని నెలలుగా ఆ మాయావలయంలో చిక్కుకు పోయాడు. ఇంట్లో డబ్బు దొంగతనంగా తియ్యడం నుంచి బీరువాలో అమ్మ నగలు కూడా చాటుగా తీసుకెళ్లి పట్నంలో తాకట్టు పెట్టేయడం వరకు అయిపోయింది. తెల్లారితే పెద్దపండగ. పెద్దలకు దండం పెట్టుకొని, మూలన పెట్టుకున్న కొత్త బట్టలు కట్టుకోవడం ఇంట్లో ప్రతి యేటా జరిగే తంతు. అమ్మ బీరువాలో నగలు కచ్చితంగా తీసుకొని వేసుకునే రోజు. ఎలాగైనా బెట్టింగ్ గెలిచి ఆ ముందు రోజే నగలు తెచ్చి బీరువాలో పెట్టేద్దాం అనుకున్నాడు సుందర్. కానీ... అతనికి అప్పటికీ తెలియంది ఏంటంటే, అది పోయే డబ్బు తప్ప వచ్చే డబ్బు కాదని; అదంతా పచ్చి మోసం అని. అమ్మ నగల కోసం అప్పు తెచ్చి పెట్టిన డబ్బు కూడా పోయింది. దిక్కుతోచక, ఇంట్లో అమ్మానాన్నకు నిజం చెప్పలేక, తెల్లారితే నిజం తెలిసిపోతుందనే భయంతో ఈ దారుణానికి ఒడికట్టాడు. చదువురాని తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాసిపెట్టి, పొలంలో కొట్టడానికి తెచ్చిన గడ్డిమందు గడగడా తాగేశాడు. ‘‘ఆడి పిచ్చిగానీ... ఇలా ఎదవ పని చేశానని ఇంట్లో అమ్మాబాబుకి సెప్పడానికి జడిసినోడు, చావడానికి ఎందుకు భయపడలేదని!? సచ్చి సెప్పాలనుకున్నది కూడా అదే కదండీ? ఇది కూడా అర్థమై ఏడ్వకపోతే ఇంకేం సదువులు సంకనాకడానికి. ఉప్పుడేదైనా ఐతే ఈడేవైపోను, ఆయమ్మి ఏమైపోను. ఉన్నదొక్కడే ఒంటిగాడు. ఈడ్ని సూసుకునే కదా ఆళ్లు బతుకుతుంటా!’’ పెద్దాయన ఆసుపత్రి లోపలికెళ్లి చాలాసేపైనా నాకు మాత్రం ఆయన ప్రశ్నలే లోపల తిరుగుతున్నాయి. ఎందుకోగాని కాళ్లు నిలవడం లేదు, ఒక్కసారి లోపలికెళ్లి సుందర్ని చూడాలనిపించింది. వీలైతే డాక్టరుతో మాట్లాడి ఆ భరోసాను బయటకొచ్చి చతురుడికి చెప్పాలనిపించింది. అమ్మని చూసి కూడా చాలాసేపయింది. చెల్లి నిద్రపోయిందో, మెలకువగా ఉందో కనపడినట్టు కూడా ఉంటుందని అనుకున్నాను. ఎమెర్జెన్సీ రూము బయట అంతా గడబిడగా ఉంది. సుందర్ను తీసుకొచ్చినవాళ్లు, ఆ తర్వాత చూద్దామని వచ్చిన వాళ్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు తప్ప ఎవరి కళ్లలోనూ ఆశ కనిపించడం లేదు. నిర్లిప్తంగా తచ్చాడుతున్నారే కానీ ఏం జరుగుతుందో అనే ఆందోళన కూడా లేదు. నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. మనసు కీడు శంకిస్తోంది. వాళ్లను తప్పించుకుని లోపలికి వెళ్లబోతుంటే ఒక ఏడుపు వినిపించింది. నన్ను నెట్టుకుంటూనే కట్టలు తెంచుకున్న దుఃఖంతో బయటకు వెళ్లిపోతున్నాడు వెంకన్న. తడిసిన కళ్లు తుడుచుకొని సుందర్ను చూసే ధైర్యం చేశాను. తెల్లటి గుడ్డ అతని ముఖం మీద నుంచి కప్పుతుండగా చూశాను చివరిసారి. తొలిసారి చూసినప్పటి కంటే బాగున్నాడు. నూనూగు మీసాలను కప్పేసిన నురుగు ఇప్పుడు లేదు. కాకపోతే ఇప్పుడు సుందర్ కూడా లేడు. గుండె బరువెక్కిపోయింది. ఊపిరి సలపనట్టుగా దేహం బిగుసుకుపోతున్నట్టుగా ఏదోలా ఉంది. వెంటనే అమ్మను చూడాలనిపించింది. నాలుగడుగులు వేసి పేషెంట్లు ఉన్న రూముల దగ్గరకు వెళ్లాను. బెంగగా అమ్మ బెడ్వైపు చూశాను. సెలైన్ బాటిల్ ఎక్కుతోంది. చెల్లెలు అక్కడే బెంచిమీద కూర్చుని అదే బెడ్ మీద అమ్మ కాళ్ల దగ్గర తలవాల్చి కునుకు తీస్తుంది. నెమ్మదిగా వెళ్లి అమ్మ పాదాలను ఒకసారి తాకి ముఖంవైపు చూశాను. సుందర్ తల్లి గర్తుకొచ్చింది. గబగబా నడుచుకుంటూ బయటకొచ్చాను. చతురుడ్ని చూడాలి అర్జంటుగా అన్నట్టు. తిరిగి వస్తుంటే ఎమెర్జెన్సీ రూమ్ దగ్గర అంతా ఇంకా గోలగానే ఉంది. కాగితాలు, సంతకాలు, అంబులెన్ ్స గొడవేదో నడుస్తుందక్కడ. వాళ్లందరినీ తప్పించుకుని బయటపడ్డాను. అరుగుమీద అటూ ఇటూ పొర్లుతున్న చతురుడ్ని చూసి గుండె చెరువైపోయింది. ఇందాక లోపలికి వెళ్లేటప్పుడైనా నాలుగు మాటలు మాట్లాడాల్సింది. పక్కనే వెంకన్న పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్నకు ధైర్యం చెప్పే దారిలేక, వదినకు ఫోన్ చేసే ధైర్యం లేక, కాలి మునివేళ్లు నేలకు గుచ్చుతూ కన్నీళ్లు ఒంపుతున్నాడు.ఫార్మాలిటీస్ అయిపోయాయి. లోపలనుంచి ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారు. అంబులెన్ వెనకపక్కకు వెళ్లడం చూస్తూ ఒక్కసారిగా గొల్లుమన్నారు చతురుడు, వెంకన్న. ‘‘ఇంటికెవరూ పోన్ గట్టా చెయ్యకండిరా, ఆయమ్మిని కాయలేరు,’’ అంటూ జరగాల్సినవి చక్కబెడుతున్నాడు పెద్దాయన. ముందు చతురుడ్ని, వెంకన్నను ఆటో ఎక్కించమన్నాడు. వాళ్లు కాదన్నాసరే వినలేదు. ‘‘ఆ కుర్రోడి ముఖం సూత్తూ అంబులెన్సులో కూసోలేరు, ముందు ఆటో తీసేయండి, మీరు కదలండ్రా... వెనకాల అంబులెన్సు ఎంతసేపొత్తాది! నడండి,’’ అనేసరికి నలుగురూ కలిసి చతురుడ్ని లేవదీయ బోయారు. ఎక్కడా మనిషి నేలను అంటి పెట్టుకుని కదలడం లేదు. అది చూసిన పెద్దాయన కాస్త దగ్గరకెళ్లి, ‘‘రేయ్ చతురా! ఇంక లేదు మనకి, అంతే రుణం. నువ్వు ఎంత బాదుకున్నా ఎనక్కి తీసుకురాగలవా? ఇంటికాడ ఆడమనిషి పరిస్థితి ఏంటో ఆలోసించు కాస్త,’’ అంటుండగా నలుగురు మనుషులు అతన్ని పట్టుకుని బలవంతంగా ఆటో ఎక్కించారు. ‘‘ఇంత బాధ నా అన్న ఎలా తట్టుకుంటాడని ఎల్లిపోయావ్రా సుందరా,’’ అంటూ బోరున విలపిస్తున్న వెంకన్నను పెద్దాయన జబ్బ పట్టుకుని లేపి ఓదారుస్తూ,‘‘బాధే మరి, బాధ కాదేటి. కొరివెడతాడు అనుకున్నోడు మనకంటే ముందే కాటికెల్లిపోతే బాధ కాదా! ఏం చేత్తాం, రాతలు కనలేం,’’ అంటూ ఆటోలో కూర్చోబెట్టి పోనీమన్నాడు.ఇప్పుడు ఆటో వెళుతుంటే రాత్రి వచ్చినప్పుడు ఉన్నంత శబ్దం అనిపించలేదు నాకు. కానీ, అప్పటికంటే బరువుగా కదిలినట్టుంది. ఇంతలోనే హారన్ మోగింది. ఆస్పత్రి వెనకనుంచి వచ్చిన అంబులెన్సు ఆటో వెనకాలే వెళ్లిపోయింది తేలిగ్గా! సుందర్ని మోసుకుంటూ!మళ్లీ అక్కడంతా నిశ్శబ్దంగా అనిపించింది. అయితే అది మునుపటి నిశ్శబ్దం కాదు. సమయం తెల్లవారి నాలుగు కావొచ్చింది. అప్పుడప్పుడే లేచిన పేషెంట్ల అటెండర్లు, అంతవరకు జరిగిన విషయం గురించి ఆరా తీస్తున్నారు. ‘‘చిన్న వయసంటమ్మా... ఒక్కడే కొడుకంట... గడ్డి మందు తాగేశాడంట. చానా తంటాలు పడ్డారంట డాట్రగారు. అప్పుడుకే రక్తంలో పట్టేసిందంట. బతకలేదు, కన్నపేగు ఏమైపోద్దో,’’ అవే మాటలు నాకు చెవుల చుట్టూ తిరుగుతున్నాయి. లోపలికి వెళ్లబోయి మళ్లీ వెనక్కి వచ్చి అరుగుమీద కూర్చుని గోడకు తల ఆన్చాను.చతురుడు పొలంలో గడ్డి మందు కొడుతున్నాడు. బెట్టింగ్ యాప్లు అన్నీ పురుగుల్లా రాలిపోతున్నాయి. వాడిపోయి మాడిపోతున్న కలుపులో యావజ్జీవ ఖైదీల్లా వికారంగా కనిపిస్తున్నారు యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు. ఇంతలో ఎవరో గట్టుమీద నిలబడి చతురుడ్ని ‘వీరన్నా!’ అని పిలవడంతో ఉలిక్కిపడి లేచాను. ఎప్పుడు పట్టిందో చిన్న మాగన్ను పట్టేసినట్టుంది. కలత కల పడింది. నిజమైతే ఎంత బాగుండో! పూడి శ్రీనివాసరావు -
రణభారం
యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరెవరి మధ్య జరిగినా, యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. జరిగే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇరాన్కు, అమెరికా, ఇజ్రాయెల్లకు జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఉభయ పక్షాల సైనికులు సహా దాదాపు పదివేల మంది ఇప్పటికే మరణించారచమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు సహా భారీ ఆస్తినష్టం కూడా జరిగింది. అయినా, ఇది ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధంలో వినియోగిస్తున్న అధునాతన విధ్వంసక ఆయుధాలు విపరీతమైన ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా అంతులేని చేటు తెచ్చిపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల తలెత్తే విపరిణామాల గురించి ఒక విహంగ వీక్షణం...భారత్కు భారీ ఆర్థిక నష్టంప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అమెరికా–ఇరాన్ యుద్ధంతో భారత్కు ఎలాంటి సంబంధం లేదు. అయినా, ఈ యుద్ధం భారత్లో ఆర్థిక భూకంపాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్లో మదుపరుల సొమ్ము ఏకంగా రూ. 41 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు రూ.89 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 93.30 మేరకు పడిపోయింది. రూపాయి విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిల్వల నుంచి దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇక ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు పైబడటంతో భారత్ ప్రతినెలా దిగుమతి బిల్లు వేలాది కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ‘ఇంధన’ సెగ భారత్నూ తాకుతోంది. దీనివల్ల వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి పర్యవసానంగా నిత్యావసరాల ధరలూ పెరిగి, సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.భారత్పై యుద్ధ ప్రభావం⇒ డాలర్తో రూపాయి విలువ పతనం రూ. 93.30⇒ రిజర్వ్ బ్యాంకు నిల్వల నుంచి ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లు⇒ స్టాక్ మార్కెట్ నష్టాలు రూ. 41.00 లక్షల కోట్లుఅమెరికా, ఇజ్రాయెల్ల సైనిక ఖర్చుయుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా ఏకంగా రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు చేసింది. యుద్ధం ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు పడిన భారం దాదాపు రూ.17.4 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాన్పై దాడుల కోసం ఇజ్రాయెల్ వారానికి సగటున రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున రూ. 7,500 కోట్లు, ఇజ్రాయెల్ రోజువారీగా సగటున రూ. 2,700 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచానికి ఆర్థిక విఘాతంప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఆర్థిక విఘాతం తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా ఈ ఏడాది పలు దేశాల స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) గణనీయమైన నష్టం వాటిల్లనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా అంచనాల ప్రకారం యుద్ధం వల్ల ఇరాన్ జీడీపీకి అత్య«ధికంగా సుమారు 20%–25% మేరకు నష్టం వాటిల్లనుంది. ఇజ్రాయెల్ జీడీపీకి సుమారు 5%, అమెరికా జీడీపీకి 1.2% నష్టం కలగనుంది. యుద్ధంతో సంబంధం లేకున్నా, దీని ప్రభావం భారత్ జీడీపీని 1.1% మేరకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.‘నాటో’ దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్నా, చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా ‘నాటో’ దేశాల జీడీపీ 0.5% నుంచి 2% మేరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల యూరోపియన్ యూనియన్ సహా ‘నాటో’ దేశాలు రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి. రష్యాతో తెగతెంపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇంధన ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగేటట్లయితే, యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేని దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. యుద్ధం ఫలితంగా పలు దేశాలలో వృద్ధి గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ధరల పెరుగుదల ఎక్కువై ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితుల్లో ఉత్పాదకత, ఉపాధి కుంటుపడతాయి. ఫలితంగా చాలా దేశాల్లో సామాన్యులపై పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయి.విధ్వంసకరమైన ఆయుధాలుఅమెరికా–ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఈ యుద్ధంలో విధ్వంసకరమైన ఆయుధాలతో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు వినియోగించిన ఆయుధాలు అత్యంత ఖరీదైనవి, అధునాతనమైనవి. ఈ ఆయుధాలు ఎంత ఖరీదైనవో, ఇవి సృష్టించే విధ్వంసం వల్ల సంభవించే నష్టం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉభయ పక్షాలూ ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్న ప్రధానమైన ఆయుధాల వివరాలుఎఫ్ 35 లైటెనింగ్–2 విమానంరాడార్లకు చిక్కకుండా లక్ష్యాలపై బాంబులను జారవిడవగల యుద్ధవిమానం ఇది. ఈ విమానాలను అమెరికా పదుల సంఖ్యలోనే ఇరాన్పై దాడుల కోసం రంగంలోకి దించింది. ఇరాన్ క్షిపణుల దెబ్బకు ఇప్పటి వరకు ఎఫ్35 లైటెనింగ్ విమానాలు రెండు నేలకూలాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.960 కోట్లు.లూకాస్ డ్రోన్లుశత్రు స్థావరాల మీద దాడుల కోసం రూపొందించిన డ్రోన్ ఇది. తక్కువ ఖరీదు చేసే ఈ డ్రోన్లను అమెరికా బలగాలు ఇరాన్పై దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.32 లక్షలు.టొమాహాక్ క్రూజ్ మిసైల్స్దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగిన క్షిపణి ఇది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అమెరికా బలగాలు దాదాపు 850 టొమాహాక్ క్షిపణులను ఉపయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.23 కోట్లు.ఎస్ఎం3 ఇంటర్సెప్టర్ క్షిపణులుశత్రువుల క్షిపణులను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయడానికి రూపొందించిన శక్తిమంతమైన ఆయుధం ఇది. ఇరాన్పై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు అమెరికా బలగాలు దాదాపు వంద వరకు ఈ క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ. 116 కోట్లు.యారో–3ఇది శక్తిమంతమైన ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 100 కిలోమీటర్ల ఎత్తులోనే నాశనం చేయగల సామర్థ్యం గల అధునాతన ఆయుధం ఇది. ఇరాన్పై జరుగుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు 35 వరకు యారో–3 క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.33 కోట్లు.ఐరన్ డోమ్ఇది కూడా ఇంటర్సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 70 కిలోమీటర్ల దూరంలోనే పడగొట్టగల సామర్థ్యం గల ఆయుధం ఇది. ఇరాన్పై దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఐరన్ డోమ్ క్షిపణులను ఇప్పటి వరకు వందల సంఖ్యలోనే ప్రయోగించినట్లు సమాచారం. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.42 లక్షలు.ఫతా–2ధ్వని వేగాన్ని మించిన వేగంతో దూసుకుపోయి, సుమారు 1500 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. దీని ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.93 లక్షలు.ఖైబర్ షెకాన్ఇది దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. అమెరికా బలగాలు ‘ఆపరేషన్ ఫ్యూరీ’ మొదలుపెట్టిన తర్వాత ఇరాన్ బలగాలు దాదాపు 180 వరకు ఖైబర్ షెకాన్ క్షిపణులను ప్రయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.35 కోట్లు.షాహెద్–136 డ్రోన్లుశత్రు స్థావరాలపై దాడుల కోసం తక్కువ ఖరీదుతో రూపొందించిన డ్రోన్లు ఇవి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు రెండువేల వరకు ఈ డ్రోన్లను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.27 లక్షలు.ప్రపంచ దేశాలకు ఇక్కట్లుఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాలకు అనేక ప్రతికూల ఫలితాలు తప్పవని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి దొరికితే చాలా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ముడి చమురు ధరలు మరో ముప్పయి శాతం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంతర్జాతీయ నిపుణుల అంచనా. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు గడ్డు పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పలు దేశాల జీడీపీ వృద్ధి తిరోగమనం చెందవచ్చని కూడా చెబుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్తో పాటు పశ్చిమాసియా దేశాలకు తీవ్ర నష్టం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పర దాడుల్లో ఇరాన్ సరిహద్దుల్లోని సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలలో భారీ నిర్మాణాలకు ముప్పుతో పాటు, తీవ్ర జననష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయి.చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడి పశ్చిమాసియా దేశాలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పశ్చిమాసియాలో ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. పశ్చిమాసియాకు వెలుపల చమురు ఉత్పాదనలో కీలకమైన రష్యా తనతో సానుకూల సంబంధాలు కలిగిన దేశాల చమురు లోటు తీర్చడానికి ముందుకు వచ్చి, బలమైన కూటమిని ఏర్పాటు చేసుకునే సూచనలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే! -
మల్లెల్లో మనమే టాప్!
వేసవి వచ్చేసింది. వేసవిలో ఎండల ధాటి ఎలా ఉన్నా, మల్లెల పరిమళాలు మనసుకు ఊరటనిస్తాయి. మల్లెల పరిమళాలే లేకుంటే, వేసవి తాపాన్ని భరించడం మానవమాత్రుల వల్ల అయ్యే పని కాదు. వసంతారంభం నుంచి గ్రీష్మం ముగిసే వరకు మల్లెలు విరివిగా పూస్తాయి. బొండు మల్లెలు, కాడ మల్లెలు సహా మల్లెల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మల్లెలు అత్యధికంగా పూసే దేశాలలో మన దేశం అగ్రగామిగా ఉంటుంది. మల్లెలు విరివిగా పూసే దేశాల గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...మల్లెల ఉత్పాదనలో మన దేశం మొదటి స్థానంలోనే ఉన్నా, ఎగుమతుల్లో మాత్రం రెండో స్థానంలో ఉంది. మన దేశంలో మల్లెల ఉత్పాదన స్థాయిలోనే స్థానిక వినియోగం కూడా భారీగానే జరుగుతుండటం దీనికి కారణం. -
చొక్కాకు పూలకళ
పూల డిజైన్లు కేవలం అమ్మాయిల దుస్తులపై మెరవడానికే అనుకుంటే, మీరు చెవిలో పూలు పెట్టుకున్నట్టే! ఎందుకంటే, ఒక అబ్బాయి సరైన స్టయిల్లో పూల చొక్కా వేసుకుంటే, ఆ లుక్ ముందు ఎవరైనా సరే కాస్త సైడ్ అవ్వాల్సిందే! అది ఎలాగో మీరే చూడండి!సందర్భాన్ని బట్టి పూల సైజ్ ఎంచుకోండిపెద్ద పూల ప్రింట్స్ క్యాజువల్ ఔటింగ్స్, బీచ్ డేస్కు బెస్ట్. చిన్న పూల ప్రింట్స్ పార్టీలు లేదా సెమీ ఫార్మల్ ఈవెంట్స్కి క్లాసీ లుక్ ఇస్తాయి. ఎక్కువ మందికి పెద్ద పూల కంటే చిన్న లేదా మధ్యస్థ పరిమాణంలో ఉన్న పూల డిజైన్లు అందంగా కనిపిస్తాయి. ఒక సిక్స్ ఫీట్ కటౌట్ ఉన్న అబ్బాయి రంగురంగుల పూల ప్రింట్స్ ధరిస్తే అది అతనిలోని ‘సాఫ్ట్ పవర్’ చెప్పకనే చెప్తుంది.లైట్ అప్ ది కలర్స్ఫేవరెట్ కలర్స్ కంటే ఎప్పుడూ సూట్ అయ్యే కలర్స్ మీ లుక్ను లైట్ అప్ చేస్తాయి. అందుకే, ఎలిగెంట్ లుక్ కోసం బ్లూ, బీజ్, బ్లాక్ లాంటి కలర్స్ బాగా సెట్ అవుతాయి. యెల్లో, పింక్, మింట్ గ్రీన్ కలర్స్ ఎనర్జీ, ఫన్ వైబ్ ఇస్తాయి. డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్పై లైట్ పూల డిజైన్ ఉంటే లుక్ మరింత షార్ప్గా కనిపిస్తుంది.బాటమ్స్తో పర్ఫెక్ట్ బ్యాలెన్స్పూల చొక్కాతో పాటు ప్లెయిన్ ప్యాంట్ లేదా జీన్స్ వేసుకుంటే లుక్ ఎక్కువ గందరగోళంగా కాకుండా నీట్గా కనిపిస్తుంది. ప్యాటర్న్ ఎక్కువైతే, మిగతా డ్రెస్ సింపుల్గా ఉంచండి. అలాగే, కూల్ లుక్ కోసం షార్ట్లు, బీచ్ వైబ్స్ కోసం లినెన్ షార్ట్లు, లోఫర్స్ ఫ్లోరల్ షర్ట్స్కు పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్తాయి.రఫ్డ్ గేమ్అమ్మాయిలు పూల డ్రెస్సులు వేస్తే అది అలవాటు, అదే అబ్బాయిలు వేస్తే అది ఒక అడ్వెంచర్! ఆ అడ్వెంచర్ను మరింత రియలిస్టిక్గా చూపించడానికి, రఫ్గా ఉండే గడ్డం, హెయిర్కట్కు జతగా ఒక వైబ్రంట్ ఫ్లోరల్ షర్ట్ ఇచ్చే కిక్ వేరే లెవెల్!డిజైనర్ షర్ట్పూల చొక్కా వేసుకున్నప్పుడు మీరు గమనించాల్సింది, మీరు వేసుకున్నది డిజైనర్ షర్ట్లా హై క్వాలిటీతో ఉండాలి. కానీ, పొరపాటున అది మీ చెల్లెలి దుపట్టానో లేదా అమ్మ చీరనో కుట్టించుకున్నట్టుగా కనిపించకూడదు.బటన్ల మ్యాజిక్ప్లెయిన్ ప్యాంట్, స్లీవ్లెస్ బనియన్ పై ఓపెన్ ఫ్లోరల్ షర్ట్ లుక్కు ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది. అలాగే, షర్ట్ పై బటన్లు రెండు వదిలేసి, చేతులు మడతపెట్టి పూల చొక్కాలో నడుస్తుంటే ఎవ్వరైనా మీపై నుంచి కళ్లు తిప్పుకోలేరు. అప్పుడు మీరు ‘నేనే వరల్డ్ హ్యాండ్సమ్, ఏమైనా సందేహమా?’ అన్నట్టుగా ఇచ్చే ఫొటో పోజులు కూడా అదిరిపోతాయి.దీపిక కొండి -
42 ఏళ్ల న్యాయపోరాటం... 100 ఏళ్ల వయసులో ముగింపు
‘న్యాయంలో జాప్యం న్యాయ నిరాకరణతో సమానం’ అని న్యాయ కోవిదులు చెబుతుంటారు... న్యాయం ఆలస్యం అయినా.. సుదీర్ఘకాలం ఎదురుచూసినా.. చివరకు తమకు న్యాయం దక్కింది.. అదే చాలని ఓ కుటుంబం సంతోషపడుతోంది.. కానీ ఆ సంతోషం వెనుక 42 ఏళ్ల నిరీక్షణ ఉంది.. కాలం మాటున కరిగిపోయిన ఓ వ్యక్తి జీవితం దాగుంది. మధ్య వయసులో నిందితుడిగా ఆ వ్యక్తిపై ముద్ర పడింది. కోర్టు జీవితఖైదు విధించింది. బెయిల్ వచ్చినా ‘పంజరం’ బతుకైంది. కాటికి కాళ్లు చాపిన వయసులో ఉన్నత న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. స్వేచ్ఛ లభించింది. కానీ, జీవితాన్ని అనుభవించడానికి వయసు, ఒంట్లో సత్తువ రెండూ మిగల్లేదు. కాలం వెనక్కి రాదు. అంతే కాదు, మరో విషాదమూ ఉంది.. ‘నేను ఏ నేరమూ చేయలేదు. నా కేసు కొట్టేశారు. నేను నిరపరాధిని’ అని సంతోషించేందుకు ఆ వ్యక్తికి జ్ఞాపకశక్తి లేదు.. ఎవరైనా చెబితే వినేందుకు వినికిడి శక్తీ మిగల్లేదు. 42 ఏళ్ల నిరీక్షణకు... 100 ఏళ్ల వయసులో కోర్టు ముగింపు పలికింది. ఆలస్యంగానైనా న్యాయం దక్కింది. నిందితుడనే మచ్చ తొలగింది. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా భువ్సీ గ్రామంలో భూ వివాదం ఓ వ్యక్తికి హత్యకు దారి తీసింది. పోలీసులు ముగ్గుర్ని నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు పత్తా లేకుండా పోయాడు. మరో నిందితుడు అప్పీలు విచారణలో ఉండగానే చనిపోయాడు. సజీవంగా ఉన్న వ్యక్తి న్యాయం కోసం సుదీర్ఘకాలం ఎదురు చూశాడు. జీవిత చరమాంకంలో నిర్దోషిగా కేసు నుంచి బయటపడ్డాడు. హత్యకు దారి తీసిన భూ వివాదం1982 ఆగస్టు 9న రాజుభయ్యా, అతని సోదరుడు గునువా చెరువు నుంచి నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన మైకు, సత్తి్తదిన్, ధనీరామ్ ఎదురుపడ్డారు. గతంలో తన తుపాకీని లాక్కున్నాడని, తన భూమిని ఆక్రమించాడనే కోపం మైకులో ఉంది. ఇదే అదనుగా భావించి అతడిపై కాల్పులు జరిపాడు. తుపాకీ గుండు శరీరంలోకి దూసుకెళ్లింది. గునువా నేలకొరిగాడు. సత్తి్తదిన్, ధనీరామ్ చేతుల్లోనూ ఈటె, గొడ్డలి ఉన్నాయి. కాల్పుల శబ్దానికి చుట్టుపక్కల వారు రావడంతో ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు–శిక్ష ఖరారుమైకు, సత్తిదిన్, ధనీరామ్లపై కేసు నమోదైంది. మైకు పరారయ్యాడు. ధనీరామ్ కోర్టులో లొంగిపోయాడు. 1984 జూన్లో హమీర్పూర్ అదనపు సెషన్స్ కోర్టు ఐపీసీ సెక్షన్ 302, సెక్షన్ 34 కింద దోషులుగా తేల్చి సత్తిదిన్, ధనీరామ్లకు జీవిత ఖైదు విధించింది. అదే ఏడాది ధనీరామ్కు బెయిల్ మంజూరైంది. అలహాబాద్ కోర్టులో అప్పీలులోయర్ కోర్టు విధించిన శిక్షపై ఇద్దరు నిందితులు హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. అప్పీలు దశలోనే సత్తిదిన్ మృతి చెందాడు. ధనీరామ్ ఒక్కడే మిగిలాడు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఈ కేసు నడిచింది. ఇద్దరు సాక్షులను కోర్టు మరోసారి విచారించింది. కేసు పత్రాలన్నీ పరిశీలించింది. సాక్ష్యాలు.. ఎఫ్ఐఆర్లో తేడాలు కేసులో ప్రధాన సాక్షి రాజుభాయ్, మరో సాక్షి రామా కింది కోర్టులో చెప్పిన సాక్ష్యానికి, హైకోర్టులో చెప్పిన వివరాలకు తేడాలను గుర్తించింది.. వారు చెప్పిన దానికి భిన్నంగా వైద్య నివేదిక ఉంది. వారి వాంగ్మూలాలు నమ్మదగినట్టుగా లేవని కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఎఫ్ఐఆర్లోనూ పలు లోపాలు విచారణలో బయటపడ్డాయి. ధనిరామ్ చేతిలో గొడ్డలి ఉంది తప్ప మృతుడిపై ఆ మారణాయుధం తాలూకు గాయాలు లేవని వైద్యుడి నివేదిక స్పష్టం చేసింది.కింది కోర్టు తీర్పు కొట్టివేతసాక్ష్యాధారాలను సహేతుకమైన సందేహాలతో కింది కోర్టు విశ్లేషించలేదని హైకోర్టు ధర్మాసనం భావించింది. ప్రాసిక్యూషన్ నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను చూపించలేకపోయిందని పేర్కొంది. కేసు సుదీర్ఘకాలం నడవడం, నిందితుడి వయస్సు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పింది. గతంలో ఈ తరహా కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను ఉటంకిస్తూ ‘సాక్ష్యాల’ పరిశీలనపై ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవితఖైదును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పీలుదారుకి విముక్తి కల్పించింది. ‘నాతండ్రి నిర్దోషి అని తేలడం మాకు ఆనందం. చాలా ఆలస్యమైనా మాకు న్యాయం జరిగింది’ అని ధనీరామ్ కుమారుడు లల్లూరామ్ భావోద్వేగంతో స్పందించాడు. -
లిట్వరల్డ్: కథబంధ ప్రహేళిక!
ఇరవై ఒకటో శతాబ్దిలో నోబెల్ పురస్కారాలు అందుకున్న పాతికమంది రచయితల్లో ప్రథముడు సర్ విదియాధర్ సూరజ్ పర్సాద్ నైపాల్. ఇక ఈ వరసలో ఇరవైఆరో రచయిత పేరు ఈ అక్టోబర్లో వెల్లడవుతుంది– అందాకా వేచిచూద్దాం! 1932లో కరీబియన్ దేశం ట్రినిడాడ్లో పుట్టి– పదిహేడోయేట బ్రిటన్ కు మెట్టి– 2018లో కన్నుమూసిన నైపాల్ను వ్యక్తిగా గానీ, రచయితగా గానీ ఓ చట్రంలో బిగించడం దాదాపు అసాధ్యం! ఐనా అలాంటి మెట్ట వడ్రంగానికి మనమెందుకు పూనుకోవాలి? నైపాల్ను మనవాళ్ళు ‘నోబెల్ పురస్కారం పొందిన రెండో భారతీయుడు’గా చెప్పుకుని జబ్బలు చరుచుకుంటూ ఉంటారు. కానీ సర్ విదియా తనను తాను భారతీయ రచయితగా ఎన్నడూ చెప్పుకోనూలేదు– గర్వించింది అసలే లేదు! నైపాల్ తనను ట్రినిడాడియన్–బ్రిటిష్ రచయితననే భావించుకున్నాడు, అలాగే సంభావించుకున్నాడు! అందుకాయన్ని తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు!!అంచేత, సాహిత్యానికి నోబెల్ ప్రైజ్ పొందిన ఏకైక భారతీయుడు రబీంద్రనాథ్ టాగోర్. ‘గీతాంజలి’ కావ్యానికి ఆయనకా బహుమతి 1913లో దక్కింది. 88 యేళ్ళ తర్వాత నైపాల్ రాసిన ‘ద ఎనిగ్మా ఆఫ్ అరైవల్’ అనే ఆత్మకథాత్మక నవలకు సైతం నోబెల్ పురస్కారం దక్కింది. సదరు పురస్కారం అందుకుంటూ, నైపాల్ చేసిన ప్రసంగానికి ఆయన ఇచ్చిన శీర్షిక ‘రెండు ప్రపంచాలు.’ అవి ప్రాచ్య– పాశ్చాత్య ప్రపంచాలు కావు. అమెరికన్– బ్రిటిష్ ప్రపంచాలు మాత్రమే!ట్రినిడాడ్ లోని ‘హిందువుల’ జీవన సరళి నైపాల్కు కొట్టిన పిండి. అందుకే ఆయన ‘కాల్పనిక’ సాహిత్యంలో ప్రముఖంగా ప్రతిఫలించేది అదే. ఐతే, 1961లో అచ్చయిన ‘ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిశ్వాస్’తోనే నైపాల్కు నవలా రచయితగా చెప్పుకోదగిన గుర్తింపు దక్కింది. 1998 నాటి మోడర్న్ లైబ్రరీ ‘20వ శతాబ్దిలో వచ్చిన నూరు ఉత్తమ నవలల’ జాబితాలో ఈ నవలకు 72వ స్థానం దక్కింది. టైమ్ మ్యాగజీన్ రూపొందించిన ‘1928–2005 మధ్యకాలంలో ఇంగ్లిష్లో వచ్చిన నూరు ఉత్తమ నవలల’ జాబితాలో కూడా ఈ నవలకు చోటు దక్కింది. 1971లో ఆంద్రె డాయిష్చ్ ప్రచురణ సంస్థ వెలువరించిన ‘ఇన్ ఎ ఫ్రీ స్టేట్’ అనే నవల అదే యేడాది బుకర్ ప్రైజ్ గెల్చుకుంది. నిజానికిది మూడు గొలుసు కథల సంకలనం. ఈ శిల్పం మరీ అపూర్వమేమీ కాదు– బృహత్కథ, పంచతంత్రం, వెయ్యిన్నొక్క రాత్రులు, క్యాంటర్బరీ టేల్స్ నుంచి మన కాశీ మజిలీ కథల వరకూ అన్నీ ఇలాంటి గొలుసుకట్టు చట్రంలో బిగించిన కథలే! 1983లో నైపాల్కు ‘జెరూసలేం పురస్కారం’, 1990లో ట్రినిడాడ్ టొబాగో అత్యున్నత జాతీయ పురస్కారం ‘ద ట్రినిటీ క్రాస్’ బహుమతి దక్కాయి. అదే సంవత్సరం బ్రిటిష్ రాజరికం ఈ ట్రినిడాడియన్– బ్రిటిష్ రచయితకు నైట్హుడ్ ప్రసాదించింది. ఈ బహుమతులన్నిటికీ తలమానికంగా, సర్ విదియాకు 2001లో నోబెల్ సాహిత్య పురస్కారమూ దక్కింది! అది కూడా ఓ నవలకే దక్కడం గమనార్హం. అర్ధశతాబ్దికి పైగా విస్తరించి వున్న తన సాహిత్య జీవితంలో నైపాల్ 11 నవలలు ఎందుకు రాశాడో ఈ నేపథ్యం వివరిస్తోంది!కాలుగాలిన పిల్లిలా ప్రపంచమంతా కలతిరిగిన నైపాల్ తొమ్మిది పది యాత్రా చరిత్రలు రాసివుండడంలో వింతేముంది? తన– తన కుటుంబ సభ్యుల పౌరసత్వ–వారసత్వాల గురించి ఆలోచించడానికే జీవితమంతా ఖర్చు పెట్టిన నైపాల్ తన పూర్వికుల పురిటిగడ్డ భారతదేశం గురించి మూడు పుస్తకాలు రాశాడు. ‘యాన్ ఏరియా ఆఫ్ డార్క్నెస్’, ‘ఇండియా–ఎ వూండెడ్ సివిలిజేషన్’, ‘ఇండియా– ఎ మిలియన్ మ్యూటినీస్ నౌ’ అనే ఈ పుస్తకాలు మూడూ నైపాల్ యాత్రా చరిత్రల్లో ముఖ్యమైనవి. వాటిని రాజకీయ– చారిత్రక యాత్రా చరిత్రలనవచ్చు. వాటిల్లో ఏ కోశాన్నా భారతదేశమన్నా, దాని చరిత్రన్నా ప్రేమాదరాలు వ్యక్తమైనట్టు నాకెక్కడా కనిపించలేదు!అయితే, ఈ వరసలోని మూడో పుస్తకంలో భారతదేశంలోని పీడిత తాడిత వర్గాల పట్ల ఒకింత సహానుభూతి వ్యక్తమైందని ‘నైపాల్ నిపుణులు’ కొందరు అంటారు.నైపాల్ పూర్వికులు ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్గా పిల్చుకునే ప్రాంతంలో తూర్పు భాగానికి చెందినవాళ్ళు. ఒకప్పుడు దాన్ని యునైటెడ్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు. అలా, అది అప్పుడూ యూపీయే, ఇప్పుడూ యూపీయే! ఆనాటి మరో బ్రిటిష్ వలస ట్రినిడాడ్–టొబాగోకు నైపాల్ పూర్వికులు వలస వెళ్ళారు. 1837–’38లో, యూపీ డెల్టా అనే ‘గంగా జమునా దోఅబ్’ ప్రాంతాల్లో ఘోరమైన కరువు వచ్చింది. దాని ధాటికి తట్టుకోలేక విదేశాలు పట్టిపోయిన వాళ్ళలో నైపాల్ పితామహుడు పండిత దూబే, మాతామహుడు పండిత కపిల్ దేవ్ కూడా వున్నారు. ఈ పండితులు ఇద్దరూ, గత్యంతరం లేక, ఇండెంచర్డ్ లేబర్ (ఇప్పటి వాడుక ప్రకారం కాంట్రాక్టు కూలీలు అనాలేమో!)గా మారవలసివచ్చింది. ట్రినిడాడ్ చెరుకు తోటల్లో కూలిపని చేసుకుంటూనే పిల్లల్ని చదివించుకున్నారు; వృత్తివ్యాపారాల్లో రాణించేలా తీర్చిదిద్దుకున్నారు. నైపాల్ పితామహుడి పేరు కూడా నాకెక్కడా తగల్లేదు కానీ, అతగాడు తన కుమారుడు ‘శీకుమార్ నైపాల్’ను ఇంగ్లిష్ జర్నలిస్టుగానూ, రచయితగానూ స్థిరపడే రీతిలో పెంచుకోగలిగాడు. ఇంగ్లిష్ సాహిత్యమన్నా, రచయితలన్నా అభిమానించే శీకుమార్ పెంపకంలో విదియాధర్ సూరజ్ పర్సాద్ నైపాల్ నోబెల్ లారియెట్ కావడంలో విడ్డూరమేముంది? ∙ _ - మందలపర్తి కిషోర్ -
తామస మనువు జననం
పూర్వం సురాష్ట్రుడు అనే రాజు ఉండేవాడు. వీరాధి వీరుడిగా విఖ్యాతి పొందిన సురాష్ట్రుడి సుపరిపాలనలో అతడి రాజ్యం సుభిక్షంగా ఉండేది. అతడి మంత్రి నరసింహ శర్మ. అమిత రాజభక్తి కలిగినవాడు. రాజుకు అన్ని వ్యవహారాల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేవాడు.రాజుకు మరింత మేలు చేయాలనే తలంపుతో నరసింహ శర్మ సూర్యుడి కోసం తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన సూర్యుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. ‘సూర్య భగవంతుడా! మా మహారాజుకు అమితమైన ఆయుర్దాయాన్ని అనుగ్రహించు. అది చాలు నాకు’ అన్నాడు నరసింహ శర్మ. ‘తథాస్తు’ అని వరాన్ని అనుగ్రహించి, సూర్యుడు అదృశ్యుడయ్యాడు.వెంటనే మంత్రి నరసింహ శర్మ రాజు వద్దకు వెళ్లి, జరిగినదంతా చెప్పాడు.తన గురించి మంత్రి పొందిన వరం తెలుసుకున్న రాజు సురాష్ట్రుడు ధర్మబద్ధంగా ప్రజాపాలన చేయసాగాడు.రాజుకు అమితాయుర్దాయం కలిగినా, అతడి భార్యలకు అంత ఆయుర్దాయం లేనందున, వారు ఒక్కొక్కరు గతించిపోయారు. భార్యలు ఒక్కొక్కరుగా గతించిపోవడంతో సురాష్ట్రుడికి విరక్తి కలిగింది. రాజ్యాన్ని మంత్రికి అప్పగించి, తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లిపోయాడు.అతడు తపస్సు చేసుకుంటూ ఉండగా, కొంతకాలానికి వర్షాకాలం వచ్చింది. ఒకసారి విపరీతమైన వర్షం కురిసింది. వరదనీటితో అడవి జలమయమైంది. సురాష్ట్రుడు ఆ వరదనీటిలో కొట్టుకుపోసాగాడు. అదే నీటిలో కొట్టుకు వస్తున్న ఒక లేడి అతడికి ఆధారంగా దొరికింది. లేడిని పట్టుకుని ఎలాగోలా సురాష్ట్రుడు కాసేపటికి ఒడ్డుకు చేరుకున్నాడు.ఒడ్డుకు చేరుకున్నాక సురాష్ట్రుడు కృతజ్ఞతతో ఆ లేడిని దువ్వుతూ, దాని మీద మోహంలో పడ్డాడు. లేడి మీద తనకు మోహం కలగడం అతడికి ఆశ్చర్యం అనిపించింది. ఇది మామూలు లేడి కాదనుకున్నాడు.‘ఓ హరిణమా! నువ్వెవరివి? నిన్ను తాకగానే నాకు నీ మీద మోహం మొదలైంది. దీనికి కారణమేంటి?’ అని అడిగాడు.‘మహారాజా! గతజన్మలో నేను దృఢధన్వుడు అనే రాజు కుమార్తెను. నీ గతించిన భార్యలలో నేను మొదటిదానిని. నా పేరు ఉత్పలమాల’ అని పలికింది. సురాష్ట్ర మహారాజు సంభ్రమాశ్చర్యాలు చెందాడు. ‘మరి నీకు ఈ లేడి జన్మ ఎందుకు కలిగింది?’ అని అడిగాడు.‘నేను దృఢధన్వుని కుమార్తెగా ఉన్నప్పుడు ఒకసారి చెలికత్తెలతో వనవిహారం చేస్తుంటే, ఒక ముని కుమారుడు ఎదురయ్యాడు. అతడు నన్ను మోహించి, వివాహం చేసుకోమని అడిగాడు. నేను క్షత్రియ కన్యను. నిన్ను వివాహమాడలేను. యోగ్యురాలైన బ్రాహ్మణ కన్యను చూసుకుని వివాహం చేసుకోమని అతడికి నచ్చజెప్పాను. అతడు కినుక వహించి, వచ్చే జన్మలో హరిణమవుతావని శపించాడు. శాప విముక్తి చెప్పవలసిందిగా ప్రార్థిస్తే, నీ పూర్వజన్మ భర్త అయిన రాజు ప్రవాహంలో కొట్టుకువస్తూ, నిన్ను ఆధారంగా పట్టుకుని ఒడ్డుకు వస్తాడు. అతడు నీ కంఠాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు నీకు పూర్వరూపం వస్తుంది అని చెప్పాడు. మహారాజా నా కంఠాన్ని ఆలింగనం చేసుకోండి’ అంది లేడి రూపులోనున్న ఉత్పలమాల. సురాష్ట్రుడు ఆ లేడి మెడను ఆలింగనం చేసుకున్నాడు. లేడికి పూర్వరూపం వచ్చింది. ఆమెను వెంటతీసుకుని, సురాష్ట్రుడు రాజధానికి చేరుకున్నాడు. మంత్రికి, పరివారానికి జరిగినదంతా చెప్పాడు. వారంతా సంతోషించారు.కొన్నాళ్లకు ఉత్పలమాల గర్భందాల్చింది. నెలలు నిండాక ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. సురాష్ట్ర మహారాజు పుత్రుడికి జాతకర్మ జరిపించి, తామసుడు అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా చూసుకోసాగాడు. ఇలా రోజులు సాగుతుండగా, ఒకనాడు ఆకాశవాణి ‘రాజా! నీ కుమారుడు తామసుడు మనువుగా ప్రఖ్యాతి పొందుతాడు’ అని పలికింది. తామసుడు సూర్యోపాసన చేసి, సకల విద్యలూ నేర్చుకున్నాడు. సమస్త భూమండలాన్నీ జయించి, పాలించాడు. అతడి పాలనాకాలం తామస మన్వంతరంగా ప్రసిద్ధి పొందింది.∙సాంఖ్యాయన -
భర్తను భయపెట్టి చంపే ప్లాన్.. చివరికి జైలుకెళ్లిన భార్య!
‘‘నన్నెవరో చంపడానికి వెంట పడుతున్నారు’’ అంటూ దివాకర్ అనే వ్యక్తి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. స్టేషన్లో వణుకుతూ కూర్చున్న దివాకర్ను చూసి ఇన్స్పెక్టర్ సూర్యకు మొదట జాలి కలిగింది. తాగడానికి నీళ్లు ఇచ్చి, ‘‘ఏం జరిగిందో ధైర్యంగా చెప్పు’’ అన్నాడు.‘‘ఈ మధ్య నా మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి... సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కూడా ఒక వ్యక్తి నన్ను వెంబడించాడు’’ భయం భయంగా చెప్పాడు దివాకర్. వెంటనే ఇన్స్పెక్టర్ సూర్య – దివాకర్ ఆఫీస్ నుంచి వచ్చే దారిలో సీసీటీవీ ఫుటేజ్ తెప్పించాడు. అందులో దివాకర్ ఒక్కడే పరిగెత్తుకుంటూ రావడం చూశాడు. అంత రాత్రివేళ ఒక్కడినే ఇంటికి బలవంతంగా పంపడం సేఫ్ కాదని ఇన్స్పెక్టర్ సూర్య స్వయంగా అతడిని ఇంటి దగ్గర దింపాడు. దివాకర్ భార్య అప్పటికే భర్త కోసం ఎదురు చూస్తోంది. ఇన్స్పెక్టర్ విషయం చెప్పాడు. దివాకర్ భార్య రవళి మౌనంగా లోపలికి వెళ్లి, కొన్ని కాగితాలు తెచ్చి ఇన్స్పెక్టర్కు ఇచ్చింది. అవి డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్...దివాకర్కి ‘పారనాయిడ్ స్కిజోఫ్రీనియా’ అనే సైకలాజికల్ డిజార్డర్ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అవి.ఇన్స్పెక్టర్ సూర్య– దివాకర్ వైపు జాలిగా చూసి ఒక నిట్టూర్పు విడిచి బయటకు వచ్చాడు.ఇన్స్పెక్టర్ బయటకు వస్తుంటే, దివాకర్ తనని కాపాడమని తనను ఎవరో చంపేస్తారని అరవడం గుర్తొచ్చింది. జీపులో స్టేషన్కు బయల్దేరిన సూర్య రెడ్ సిగ్నల్ దగ్గర ఆగిపోయాడు. అది దివాకర్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే రోడ్డు. కుడి వైపు పోలీస్ స్టేషన్కు వెళ్లే రోడ్డు వస్తుంది. సూర్యకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఆ సిగ్నల్ దగ్గర సీసీ కెమెరాలు బిగించి ఉన్నాయి. వెంటనే దివాకర్ ఇంటికి వెళ్లే రోడ్డుకు ఉన్న సీసీ ఫుటేజ్ చూశాడు. అందులో దివాకర్ను ఒక వ్యక్తి బైక్ మీద వెంబడిస్తున్నాడు. అప్పుడు దివాకర్ వెనక్కి వచ్చి పోలీస్ స్టేషన్ వైపు పరుగెత్తాడు.అతడిని బైక్ మీద వెంబడించిన వ్యక్తి అక్కడే ఆగిపోయాడు. అందుకే ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్కు వచ్చే రూట్లో సీసీ ఫుటేజ్లో అతను కనిపించలేదు. అప్పుడు గుర్తొచ్చింది సూర్యకు– తను దివాకర్ను ఇంటి దగ్గర దింపినప్పుడు దివాకర్ ఇంటికి దూరంలో ఉన్న బైక్... దివాకర్ను వెంబడించిన అదే బైక్...వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జీపు వెనక్కి తిప్పాడు. దివాకర్ ఇంటి వైపు...దివాకర్ అపరిచిత వ్యక్తి వైపు భయంగా చూస్తున్నాడు. ముఖానికి మాస్క్ వుంది. అతని చేతిలో చీర వుంది. ఈ చీరతో ఉరేసుకో... నిన్ను నేను చంపను... నువ్వే హాయిగా చచ్చిపోవచ్చు...దివాకర్ పారిపోవాలని చూస్తున్నాడు. ఎదురుగా ఉన్నది ప్రాణంగా ప్రేమించిన భార్య రవళి.‘‘చచ్చిపో దివాకర్... నిన్ను చంపి నేను జైలుకు వెళ్లడానికా ఇంత ప్లాన్ చేసింది. నువ్వు చచ్చిపోతే, పారనాయిడ్ స్కిజోఫ్రీనియాతో చచ్చిపోయావని నమ్మించొచ్చు. దానికి ఇన్స్పెక్టర్ కూడా సాక్ష్యం. రవళి నవ్వుతోంది వికృతంగా... అదంతా చూస్తున్న ఇన్స్పెక్టర్ సూర్య లోపలికి అడుగు పెట్టాడు.‘‘ఇప్పుడు సాక్ష్యంతోనే వచ్చాను మిసెస్ రవళి. నీ భర్తకు ఉన్న పారనాయిడ్ స్కిజోఫ్రీనియాను అడ్డం పెట్టుకుని నీ ప్రియుడితో నాటకం ఆడి నువ్వు చేసిన ప్లాన్ ఇప్పుడు నీకే బెడిసికొట్టింది. నీ భర్తను పోలీస్ స్టేషన్కు వెళ్లేలా భయపెట్టి సాక్ష్యాన్ని సృష్టించుకోవాలనుకున్నావు. కాని, ఇలా చట్టం చేతికి చిక్కావు. ఆస్తి కోసం, అక్రమ సంబంధం కోసం భర్తను వదిలించుకోవాలని వేసే ఇలాంటి క్రిమినల్ ప్లాన్స్ ఎప్పటికైనా పోలీసుల చేతికి చిక్కాల్సిందే!’’ అని రవళిని చూసి చెప్పాడు. ‘‘ఒక సీసీ ఫుటేజ్ నీ ప్రాణాన్ని కాపాడింది. నీ భార్య ప్రియుడితో కలిసి ఆడిన నాటకానికి చెక్ పెట్టింది’’ దివాకర్కు ధైర్యం చెబుతూ అన్నాడు. రవళిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఈ వారం కథ: ప్రాణదాత
‘‘లే నాయనా! మరేమీ భయం లేదు’’ అన్నారు శాస్త్రిగారు. రామచంద్ర వినయంగా లేచి నిలబడ్డాడు. జేబులోంచి ఓ కాగితం తీసి ఆయన చేతిలో పెట్టాడు. మడతవిప్పి చదువుతుండగానే, ఆ ఉత్తరంలో తన తండ్రి శాస్త్రిగారికి వ్రాసిన సందేశాన్ని క్లుప్తంగా వినిపించాడు.‘‘రుణాలు దారుణంగా ఉన్నాయి స్వామీ! తొందరలో తీర్చకపోతే ఇల్లు అప్పులవాళ్ల పరమైపోతుంది. నాకేమో శిల్పాలు చెక్కడం తప్ప మరే పనీ చేతకాదు. ఈ మధ్యన చేతినిండా పని దొరకడం లేదు. డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది. డబ్బుకోసం, పని కోసం పట్టకూడని వాళ్ల కాళ్లు కూడా పట్టాను. ఈ కష్టాలకు అంతూదరీ చిక్కడం లేదు. దీనికి పరిష్కారం మీరే చూపించగలరని మా నాన్న చెప్పాడు. అన్యథా శరణం నాస్తి’’ అంటూ మళ్లీ శాస్త్రిగారి కాళ్లమీద పడ్డాడు రామచంద్ర.‘‘ఇలా మాటిమాటికీ ఇబ్బంది పెట్టకు నాయనా! ఏదీ జాతకం కాగితాలు తెచ్చావా?’’ అని అడిగారు శాస్త్రిగారు అంతకుముందు అతడిచ్చిన కాగితాన్ని పక్కన పెడుతూ... మరో కాగితాల దొంతర తీసి ఆయనకు అందించాడు రామచంద్ర. శాస్త్రిగారు పరీక్ష చేస్తున్నారు. ద్వితీయాధిపతి దశ నడుస్తోంది. అష్టమ వ్యయాధిపతులు అంతర ప్రత్యంతర దశల్లో ఉన్నారు. గోచార రీత్యా క్రూరగ్రహమైన వ్యయాధిపతి ధన స్థానంలోకి చేరబోతున్నాడు. అన్నీ అపశకునాలే కనిపిస్తుండగా శాస్త్రిగారి మనస్సు కలవరపడింది. రామచంద్ర దీనంగా ముఖంపెట్టుకుని శాస్త్రిగారినే చూస్తున్నాడు. ఆయన ఒక్కక్షణం కళ్లుమూసుకుని తన ఉపాస్యదేవతను స్మరించారు. ఆయన భృకుటియందు ఒక దృశ్యం ఆవిష్కృతమైంది.మహాకాలసర్పం ఒకటి సూర్యుణ్ణి మింగబోతుండగా, ఒకానొక త్రిశూలం దాన్ని ఎత్తి గిరవాటేసింది. శివుని జటాజూటంలో జారిపడ్డ ఆ పాము గంగలో ఈదులాడుతోంది... ఈ దృశ్యాన్ని చూసిన తరువాత నెమ్మదిగా కళ్లు తెరిచారు శాస్త్రిగారు.ప్రసన్న వదనంతో చిరునవ్వు నవ్వుతూ, ‘‘నాయనా! నీకు తళుకేశ్వరం తెలుసా?’’ అని అడిగారు. ‘‘తెలియదండి.’’‘‘ఇప్పుడు దాన్నే తడికలపూడి అంటున్నారు. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే దారిలో ఉంది. అక్కడ గాంగేశ్వరస్వామి ఆలయం ఉంది. గంగాపుత్రుడైన భీష్మపితామహుడు ప్రతిష్ఠించిన శివలింగం...’’శాస్త్రిగారు చెబుతున్నారు. రామచంద్ర వింటున్నాడు.‘‘వచ్చే అమావాస్య... సోమవారం. సోమావతీ అమావాస్య అంటారు. పవిత్రమైన రోజు. ఆ రోజు ఉదయం ఆ స్వామికి శక్తివంచన లేకుండా అభిషేకం చేయించుకో.’’‘‘స్వామీ! నా ఆర్థిక పరిస్థితి చెప్పాను కదా’’ ఆదుర్దాగా మాటకడ్డం వచ్చాడు రామచంద్ర.‘‘మరేం పరవాలేదు. శక్తివంచన లేకుండా అంటే భక్తిలోపం లేకుండా మనసు తీరా చేయమని కానీ, డబ్బు ఖర్చుపెట్టమని కాదు.’’ వివరించారు శాస్త్రిగారు. ‘‘అలాగే స్వామీ!’’‘‘ఆనాటి ఉదయం అక్కడ అభిషేకం చెయ్యి. అక్కడి నుంచి తూర్పుకు ఐదుమైళ్ల దూరంలో కుడివైపున తోటల మధ్యలో అష్టభైరవ నిర్మితమైన శివాలయం ఉంటుంది. ఆ రాత్రికి నీవు ఆ ఆలయంలో జాగారం చేయాలి. జాగ్రత్త సుమా! అసలే నిర్జన ప్రదేశం. తగిన ఏర్పాట్లతో వెళ్లు. మెలకువతో రాత్రంతా ఉండి, తెల్లవారిన తరువాత నా వద్దకు నేరుగా రా’’ అంటూ కొంత డబ్బుతీసి రామచంద్ర ముందు పెట్టారు శాస్త్రిగారు.‘‘అయ్యో! నేనివ్వాల్సింది పోయి మీరే ఎదురిస్తున్నారా?’’ మొహమాట పడ్డాడు రామచంద్ర.‘‘ఇన్నేళ్లుగా నా మొగమైనా తెలీని నిన్ను, మీ నాన్న ఇప్పుడే నా దగ్గరకు పంపాడంటే దానికేదో కారణం ఉంటుందని గ్రహించు. ఈ డబ్బు మీ నాన్న ఇచ్చిందే అనుకో’’ లాలనగా చెప్పారు శాస్త్రిగారు.రామచంద్ర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయటపడ్డాడు. అది 1966వ సంవత్సరం, ఫాల్గుణమాసం. అమాసోమవారం తెల్లవారింది. ఆ వేళ ఉదయం ఎనిమిది కావస్తుండగా రామచంద్ర తడికలపూడికి చేరుకున్నాడు. ప్రధాన రహదారి నుంచి ఎడమ పక్క సందులోకి ప్రవేశించాడు. అల్లంత దూరాన వేంగీ చాళుక్యుల కాలంనాటి ఆలయ శిఖరం నీరెండ ఛాయలో మెరుస్తూ కనిపిస్తోంది. నడుచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. జనావాసాల మధ్యలోనే ఉన్న మల్లెతోటల నుంచి సువాసనలు దారంతా విరజిమ్ముతున్నాయి. జనాలంతా నీళ్లకావిళ్లతో ఎదురొస్తున్నారు. చెరువు దూరంగా ఉన్నట్లుంది. రామచంద్ర ఆలయాన్ని సమీపించాడు. ఆలయ ప్రాకారాన్ని చుట్టిరావడానికి వీలులేదు. రెండుపక్కల ఇళ్లు. అయిమూలగా దక్షిణదిక్కున ఒక రోడ్డుంది. గుడిలోకి ప్రవేశించాడు రామచంద్ర. తువ్వాలు చుట్టుకున్న ఆలయ పూజారి బలిపీఠం దగ్గర శుభ్రం చేసుకుంటున్నాడు. కుడివైపు బావి వుంది. ‘‘అయ్యా! ఆ బావిలో నీళ్లు స్నానానికి పనికొస్తాయా?’’ అడిగాడు రామచంద్ర.ఒక్కక్షణం అతణ్ణి పరకాయించి చూసి, ‘‘ఆ బావిలో నీళ్లు తోడటం నీవల్ల కాదు. స్నానానికైతే చెరువుంది’’ చెప్పాడు పూజారి.నిజమే. బావి చాలా లోతుగా ఉంది. నీళ్లు అట్టడుగున ఉన్నాయి.‘‘పేరుకి గాంగేశ్వర స్వామి వెలసిన క్షేత్రం. ఊళ్లో నీటిచుక్క ఉండదు. వేసవికాలం వస్తే ఉన్న ఒక్క చెరువూ ఎండిపోతుంది. జీవుడికి తాగునీటికి కరవు. గుళ్లో అయ్యవారి స్నానానికి కరవు’’ పూజారి తనలో తానే గొణుక్కుంటున్నాడు.రామచంద్ర ఎడమభుజం మీద సంచీని ఎగదోసుకుని ముందుకి కదిలాడు. ‘‘బాబూ! వచ్చేటప్పుడు ఆ కావిడితో నీళ్లు తెచ్చిపెట్టగలవా?’’ అడిగాడు పూజారి. ‘‘మహద్భాగ్యం’’ అంటూ కావిడిని కుడిభుజం మీదకు ఎత్తుకున్నాడు రామచంద్ర. చెరువులో స్నానం చేసి, నీళ్లు తీసుకుని వచ్చాడు. అప్పటికే అభిషేకం మొదలైనట్లుంది. పూజారితో గొంతు కలుపుతూ గాంగేశ్వరస్వామిని నమక చమకాలతో అర్చించాడు రామచంద్ర. అనంతరం కొంత దక్షిణ ఆయనకు సమర్పించాడు. ‘‘లేచిన వేళ బాగుంది’’ అనుకుంటూ దానిని అందుకున్నాడు పూజారి. ‘‘బాబూ! చాలాదూరం నుంచి వచ్చినట్లున్నావు’’ రామచంద్రని అడిగాడు ఆప్యాయంగా.‘‘అవునండీ. ఒక పని మీద వచ్చాను. ఈవేళ ఇక్కడే ఉంటాను’’ చెప్పాడు రామచంద్ర.‘‘అయితే ఈ పూటకి మా ఇంటిలో చేయి కడుక్కోవచ్చు’’ ఆదరంగా చెప్పాడు పూజారి.కృతజ్ఞతగా నమస్కరించాడు రామచంద్ర. భోజనం తరువాత, కాసేపు ఆలయ శిల్పాలను గమనిస్తూ గడిపాడు. కొద్దిసేపటికి దూరంగా ఆకాశంలో ఉరుముల సవ్వడులు వినిపించసాగాయి. ఎండ పూర్తిగా తగ్గలేదు కానీ వాతావరణం చల్లబడింది. శాస్త్రిగారు చెప్పిన గుర్తుల ప్రకారం ఆలయానికి తూర్పుముఖంగా సాగిపోయాడు రామచంద్ర. ఒక గంటన్నర వ్యవధిలో జీడిమామిడి తోటల మధ్యలో ఉన్న ఒక శిథిలాలయాన్ని కనుగొన్నాడు. మహా అయితే నాలుగడుగుల ఎత్తుంటుంది. అయిదడుగుల పొడవు, మూడడుగుల వెడల్పు ఉంటుంది. ఆ కాస్తచోటులోనే ఎనిమిదివైపులా భైరవశిల్పాలున్నాయి. ఆ శిల్పసౌందర్యం అమోఘంగా ఉంది. రామచంద్ర గుడిచుట్టూ పరికిస్తుండగా, తోట రైతు కాబోలు వచ్చాడు. ‘‘ఎవురు బాబూ! ఈయేళప్పుడు వచ్చారు? బేగ ఎల్లిపోండి. వాన పడేనాగుంది’’ అని సలహా ఇచ్చాడు. రామచంద్ర చిరునవ్వు నవ్వి, ‘‘లేదు. ఈరాత్రికి ఇక్కడే ఉండాలని వచ్చాను’’ అన్నాడు.రైతు అతడిని అయోమయంగా చూశాడు. ‘‘సూడు బాబూ! ఈడ రాత్రైతే మావే ఉండలేం. కట్టం. ఏడనుంచొస్తాయో... ఎందుకొస్తాయో తెలవదు గానీ, చీకటి పడగానే ఈడకి కుక్కలొస్తాయి. మనుషుల్ని చెండాడేస్తాయి. ఆటితో నువ్వు పడలేవు బాబూ! నా మాటిని ఎల్లిపో’’ బుజ్జగింపుగా చెప్పాడు.‘‘ఈ గుడిలో నిద్ర చేస్తానని మొక్కుకున్నాను. అంచేత ఈ రాత్రికి ఉండాల్సిందే’’ చెప్పాడు రామచంద్ర.‘‘ఈ గుడికి ఇట్టాంటి మొక్కులతో కూడా జనాలొత్తన్నారా? ఇడ్డూరంగా ఉందే. సరే బాబూ! జాగ్రత్త’’ అంటూ రైతు అక్కడినుంచి వెళ్లిపోయాడు.ఇంకా సంధ్యాసమయం కాలేదు. కానీ ఆకాశం మేఘావృతం కావడం వల్ల చీకట్లు కమ్ముకుంటున్నాయి. కనుచీకటి ఉండగానే రామచంద్ర గుళ్లో ప్రవేశించాడు. అడుగున్నర ఎత్తున్న ద్వారానికి తలుపులేమీ లేవు. వంగి పాక్కుంటూ లోపలికి వెళ్లి చూస్తే గుడికి మధ్యలో పానపట్ట రహితంగా నేలలో పాతేసినట్లుగా శివలింగం ఉంది.ఇంకు సీసా మూతకి కన్నంపెట్టి ఒత్తిని దూర్చి, లోపల కిరసనాయిల్ పోసి మూతపెడితే ఇల్లాయిబుడ్డి తయారవుతుంది. ఆ బుడ్డిలో కిరసనాయిల్ బదులుగా ఆవునెయ్యి పోసి తెచ్చాడు రామచంద్ర. దేవుడిముందు వెలిగించాడు. ఆ వెలుగులో రాత్రంతా అక్కడ కాలక్షేపం చెయ్యాలి. అందుకోసం కూడా తగిన ఏర్పాట్లు ముందే చేసుకున్నాడు. ఏవైనా బొమ్మలు గీసుకోవచ్చని కొన్ని కాయితాలు తెచ్చుకున్నాడు. ఆ గుడిని చూసేవరకు ఏం గీయాలో అనుకోలేదు. కానీ అక్కడికి వచ్చిన తరువాత, ఇదే గుడి అర ఎకరం నేలలో విశాలమైన గుడిగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించి, బొమ్మ గీయాలనిపించింది. ఆ పనే మొదలుపెట్టాడు. బయట ఉరుముల శబ్దం అంతకంతకూ ఎక్కువవుతోంది. సన్నగా చినుకు కూడా ప్రారంభమైనట్లుంది. ఇంతలో ఉన్నట్లుండి అక్కడికో కుక్క వచ్చింది. ఆ గూడులో రెండు జీవులు తలదాచుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆ కుక్క ముందరికాళ్లను బాగా ముందుకు జాపి, విశ్రాంతిగా ద్వారానికి అడ్డంగా కూచుంది.రామచంద్ర కొద్దిసేపు ఆ కుక్కని గమనించి, తన పనిలో మునిగిపోయాడు. ఆలయం బయటి దృశ్యాన్ని మొదటిబొమ్మగా గీయడం పూర్తయ్యేసరికి సుమారుగా మూడుగంటల సమయం పట్టింది. లోపలి ఆలయాన్ని గీయాలని రెండో బొమ్మ మొదలుపెట్టాడు.ఇంతలో వర్షం పూర్తిగా పెద్దదయింది. గాలి తాకిడి కూడా ఉద్ధృతంగా ఉంది. తానున్నది చిన్న గూడు కనుక గాలి లోపలికి పెద్దగా రావడం లేదు. అందువల్లనే దీపం నిలబడింది కానీ లేకపోతే కష్టమయ్యేది. మరో గంట గడిచింది. రామచంద్ర కూర్చుని ఉన్నచోట నేల చెమ్మతేరడం మొదలయ్యింది. వెంటనే పక్కన పెట్టిన సంచీని తీసి ఒళ్లో పెట్టుకున్నాడు. వర్షం ఇంకా పెద్దదయితే, నీళ్లు లోపలికి వచ్చేస్తాయి కాబోలు... అప్పుడెలా అని మథన పడసాగాడు.అతను ఊహించిందే నిజమైంది. రెండో బొమ్మ ఇంకా పూర్తి కాకుండానే గుళ్లోకి నీళ్లు రాసాగాయి. అప్పటికే రామచంద్ర కట్టుకున్న పంచె పూర్తిగా తడిసిపోయింది. గొంతుకు కూర్చుంటే చీలమండల వరకు నీళ్లు వచ్చేశాయి. ఇక అక్కడ ఉంటే క్షేమం కాదనిపించింది. లోపలినుంచి బయటికి వెళ్దామంటే కుక్క అడ్డంగా ఉంది. దానికి బయటికి పోవడం ఇష్టం లేదు కాబోలు, చేత్తో ముందుకు తోసినా కదలలేదు. కొద్దిసేపటికి రామచంద్రకు బయటకు వెళ్లడానికి తోవ ఇచ్చింది. అతడితోపాటు తాను కూడా బయటకు నడిచింది. యట అంతా గాఢాంధకారంగా ఉంది. నేలమీద పిక్కలవరకు నీళ్లున్నాయి. ‘ఇంతలోనే ఎంత వర్షం పడింది?’ అని ఆశ్చర్యపోతూనే, ఒక్క ఉదుటన ఆలయంపైకి ఎక్కి కూచున్నాడు. ఎలా ఎక్కిందో తెలియదు కానీ ఆ కుక్క కూడా ఆలయంపైకి చేరింది. అక్కడ కూచునేందుకు బాగుంది. ఎటొచ్చీ పైనుంచి కుండపోత వాన. చప్పగా తడిసిపోయాడు. కొద్దిగా ఒణుకు కూడా వస్తోంది. ఆకాశం చిల్లుపడినట్లుగా ఆ రాత్రంతా వాన పడుతూనే ఉంది. గాలి విసిరి కొడుతూనే ఉంది. మెరుపు వెలుగు పడినప్పుడల్లా నీటిమట్టం పెరుగుతున్నట్లుగా తెలుస్తూనే ఉంది. కొద్దిసేపటి తరువాత ఉన్నట్లుండి కుక్క మొరగడం ప్రారంభించింది. అది ఎందుకు మొరుగుతోందో ముందు అర్థం కాలేదు. అప్పుడే ఆకాశంలో మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో... గుడిపైకి ఒక నల్లత్రాచు వచ్చి పడగ విప్పి వుండడం రామచంద్ర కంటపడింది. గుండె గుభేలుమంది. ఆ త్రాచు కాటువేసేందుకు సన్నద్ధంగా ఉంది. రామచంద్రకి కిందికి దూకి తప్పించుకుపోయే అవకాశం లేదు. కుక్క కూడా అక్కడే ఉండి నిస్సహాయంగా చూస్తోంది. పామును నేర్పుగా పట్టుకుని విసిరేయగలిగితే బాగానే ఉంటుంది కానీ, ధైర్యం చాలలేదు. కొద్దిగా వెనక్కి జరిగాడు. వీపుకి భైరవశిల్పం తగిలింది. దాని చేతికి త్రిశూలం ఉందనే సంగతి స్ఫురణకు వచ్చింది. చేతులు రెండూ వెనక్కి పెట్టి ఆ త్రిశూలాన్ని ఊడబెరికాడు. త్రాచుపామును త్రిశూలంతో ఎత్తిపట్టి, దూరంగా విసిరేశాడు. అదికాస్తా నీళ్లలో పడి, ఎటో కొట్టుకుపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే తెల్లవారింది. కానీ గుడిమీద నుంచి కిందికి దిగే అవకాశం మాత్రం లేదు. నేలమట్టానికి నాలుగడుగుల ఎత్తులో ఉన్న ఆ ఆలయానికి దాదాపు సమానంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లలో కిందికి దిగితే తాను బయటపడగలనో లేదో తెలియని పరిస్థితి. ఎందుకైనా మంచిదని మరో భైరవశిల్పం చేతిలోని శూలాన్ని ఊడబెరికి పట్టుకున్నాడు.రాత్రి నుంచి తనతోపాటు ఉన్న కుక్క తప్ప మరో తోడు లేదు. ఇప్పట్లో ఎవరైనా వచ్చే అవకాశమూ కనిపించడం లేదు. ఆ కుక్కకి పాపం ఆకలి వేస్తున్నట్టుంది. కానీ చేసేదిలేక దిక్కులు చూస్తూ కూచుండిపోయింది. ఆ పూట సూర్యుడు ఉదయించలేదు. మధ్యాహ్నం కావస్తుండగా వర్షం తగ్గుముఖం పట్టింది. రామచంద్రకు తాను కూచున్న ప్రదేశం నుంచి కిందికి దిగడానికి ధైర్యం చాలలేదు. అంతలోతు నీళ్లలో దిగి నడవడం కానీ, ఈదుకుంటూ వెళ్లడం కానీ మహాప్రమాదంగా తోచింది.ఇంతలో, ‘‘ఒహోయ్ పెద్దమడిసీ! మెల్లిగా దిగిరా’’ అని అల్లంత దూరంలో ఎత్తయిన గట్టుమీద నుంచి ఎవరిదో తోట రైతు అరుస్తున్నాడు.‘నువ్వే దగ్గరకు రా!’ అన్నట్లు సైగ చేశాడు రామచంద్ర. రైతు నవ్వుకుంటూ, ‘‘బయపడమాకు. అవకాడ సెరువుకి గండి కొడతన్నాం. ఓ గంటలో నీళ్లన్నీ తీసేస్తాయి. ఆనక వద్దువు గానిలే’’ అని చెప్పి వెళ్లిపోయాడు.రైతు చెప్పింది నిజమయ్యేందుకు సుమారుగా రెండుగంటల సమయం పట్టింది. సాయంత్రం నాలుగు కావస్తుండగా తోటలో నీళ్లు తగ్గి, బురదనేల బయటపడింది. రామచంద్రతో పాటు పక్కనే ఉన్న కుక్క కూడా నేలకు దిగింది. గబగబా అడుగులు వేస్తూ గట్టుమీదికి వెళ్లిపోయింది. రామచంద్ర భయంభయంగా అడుగులు వేస్తున్నాడు. చీలమండల వరకు బురద నిలిచి ఉంది కానీ, మరేమీ ప్రమాదం లేదు. ఒక్కోచోట కాలు దిగబడి పిక్కల వరకు బురద వస్తోంది. నిన్నరాత్రి నుంచి తన చేతిలోని శూలాన్ని అలాగే ఉంచుకున్నాడు. ఆ శూలాన్ని నేలలో గుచ్చుతూ, ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తరువాతే అడుగు వేస్తున్నాడు. పాతిక అడుగులు వేసేసరికి ఒకచోట శూలం బొరియలో దిగబడినట్లుగా లోపలికి పోయింది. కొద్దిగా పక్కకు జరిగి అదే చోట మళ్లీ నేలలో బలంగా గుచ్చాడు రామచంద్ర. సందేహం లేదు... అక్కడ రాళ్లున్నాయి. అందుకే శూలం కంగున మోగుతోంది.‘‘జాగర్తయ్యోవ్’’ అన్నాడు గట్టుమీదనుంచి రైతు. రామచంద్ర అదేమీ పట్టించుకునే స్థితిలో లేడు. శూలంతో చుట్టూ గీస్తూ ఏదో పరీక్షిస్తున్నాడు. చివరకు అతడు తాను గతరాత్రి ఊహించినది నిజమే అయినందుకు సంబరపడ్డాడు. ఈ ఆలయం కిందనే పూర్వం అతిపెద్ద ఆలయమేదో ఉండేది. అది శిథిలం కాగా, ఎవరో దానిపై చిన్న ఆలయాన్ని నిర్మింప చేశారు అనే నిర్ధారణకు వచ్చాడు. ఆ లోపలి ఆలయం ఇప్పుడు ఉండి ఉంటే ఎలా ఉండేదన్న ఊహతో రాత్రి తాను గీసిన నమూనా కాయితాలన్నీ వానలో నానిపోయి, ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రామచంద్రకు మనసులో కష్టం వేసింది. కానీ ఇప్పుడు స్థిమిత పడ్డాడు. గట్టుకు వస్తూనే, ‘‘చూడు బాబూ! ఈ ప్రాంతంలో ఇదివరకు ఏదైనా పెద్దగుడి ఉండేదా?’’ అడిగాడు రైతుని రామచంద్ర.‘‘అదేమో తెలవదు. నాకు ఊహ తెలిసినప్పటినుంచి అదే గుడి’’ చెప్పాడు రైతు.‘‘కాదు. నాకు అర్థమైనంత వరకు ఇక్కడ ఓ పెద్ద గుడి ఉండేది. ఉండేది ఏమిటి ఉంది. నేను చూశాను. నువ్వొప్పుకుంటే నేను దాన్ని వెలికి తీస్తాను’’ ఉత్సాహంగా చెప్పాడు రామచంద్ర.‘‘సూడయ్యా! మమ్మల్నిలా బతకనియ్యి. ఈ తోటంతా మాదే అయినా ఆ గుడి వున్నంతమేరా సెట్టు పెట్టకుండా వదిలేసి మా పొట్ట మేం పోషించుకుంటున్నాం. ఇప్పుడు గుడీ అదీ అంటూ అల్లరి మొదలెట్టావంటే... గవర్నమెంటోళ్లతో, బత్తులతో నానా తలనొప్పులూ పడాల్సొస్తుంది. ఆనక మా తోట ఏటవుద్దో నువ్వు గేరంటీ సెప్పగలవా?! అంచేత సూసిందంతా మర్సిపో. దీనికింద పెద్దగుడి వుందని నాకూ తెలుసు. కానీ చెప్పాను కదా, ఇక్కడ పలుగు పడితే భైరవసామి ఊరుకోడు. కుక్కలొచ్చి కండలు పీకేస్తాయి. ఇగ తొవ్వడం మొదలెడితే ఇంకేం వత్తాయో సెప్పలేం. వచ్చిన పని పూర్తయింది కాబట్టి, జాయిగా ఇల్లు జేరుకో’’ అని చెప్పేసి వెళ్లిపోయాడు రైతు.రామచంద్ర అక్కడినుంచి మళ్లీ తడికలపూడి గాంగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాడు. స్వామికి నమస్కరించి బయలుదేరాడు. ఆ రాత్రికి రాత్రి నడుచుకుంటూ వెళ్లి తెల్లవారేసరికి శాస్త్రిగారి ఇంటిముందు నిలబడ్డాడు.‘‘నిన్నంతా ఏమైపోయావు? తుపానులో చిక్కుకుపోయావేమో అని కంగారు పడ్డాను’’ అడిగారు శాస్త్రిగారు అతడిని చూస్తూనే.‘‘నిజమేనండీ. మీ ఆశీస్సులు ఉండబట్టి బతికిపోయాను. లేకపోతే ఈపాటికి చనిపోయే వాడిని’’ అంటూ ముందురోజు రాత్రి తనకు ఎదురైన అనుభవాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు రామచంద్ర.‘‘హమ్మయ్య. గండం గడిచింది. ఇంక నీకేమీ భయం లేదు. నీ వృత్తిలో కూడా పైకొస్తావు. ఇదిగో ఈ ఉత్తరం తీసుకో. హైదరాబాదులో ఉన్న మా స్నేహితుడికి నీ గురించి రాశాను. అక్కడేదో గుడి కడుతున్నారట. నీకేదైనా పని దొరకచ్చు. కానీ రాతి శిల్పాలే చెక్కుతా... సిమెంటు తాపీ పట్టుకోను అంటూ పిచ్చి సిద్ధాంతాలు వల్లెవేయకు. దొరికిన పనిలో దూరిపో. రోజులు బాగుపడితే మనసుకు నచ్చిన పని దొరకచ్చు’’ అని బోధించారు శాస్త్రిగారు.ఆయనకు మరోసారి నమస్కరించి వచ్చేశాడు రామచంద్ర. ...ఇదంతా నా కథ. ఇందులోని రామచంద్రను నేనే. ఆనాడు శాస్త్రిగారి వద్దనుంచి వచ్చిన తరువాత ఎంతో జీవితాన్ని చవిచూశాను. ఎన్నెన్నో అనుభవాలను పొందాను. నాకొచ్చిన కళను నా పిల్లలకు నేర్పించాను. కానీ వారికి రాతిశిల్పాలతో పనిచేసే అవకాశం రాలేదు. ఇప్పుడు నా మనుమళ్లు రాతిశిల్పాలను కంప్యూటర్ల సాయంతో చెక్కుతున్నారని తెలిసి ఆనందంగా ఉంది. స్థాపత్య కళలో వారు సాధిస్తున్న విజయాలు చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మళ్లీ మన ఆలయాలకు పూర్వవైభవం వస్తోంది కదా అని చాలా సంతోషంగా ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ప్రాణదానం చేసిన ఆ అష్టభైరవ నిర్మిత ఆలయాన్ని మరిచిపోలేదు నేను. ఇప్పటివరకు ఆ ఆలయాన్ని మూడుసార్లు సందర్శించాను. అక్కడికి వెళ్లిన ప్రతిసారీ ఏవేవో కొత్త అనుభూతులు కలిగేవి. ప్రతిసారీ ఆ రైతును కలిసేవాడిని. పెద్దగుడిని బయటికి తీయడానికి కానీ, తోటను అమ్మడానికి కానీ అతడెప్పుడూ ఒప్పుకోలేదు. ఇప్పుడు నాకు వయసు మీరింది. బహుశా ఈపాటికి ఆ తోట రైతు మనవళ్ల పరమై ఉంటుంది. వాళ్లయినా అక్కడ తవ్వకాలకు ఒప్పుకుంటారని నేను అనుకోవడం లేదు. ఇటీవలే గాంగేశ్వర స్వామి ఆలయానికి పునరుద్ధరణ జరిగిందని తెలిసి సంతోషించాను. ఇక ఆ గుడి కూడా జీర్ణోద్ధరణ పొందితే... అది కూడా నా వంశం వారివల్ల జరిగితే నాకు కావాల్సింది అంతకంటే ఏమీ లేదు.ఇట్లురామచంద్ర అని రాసివున్న డైరీని మూడోసారి చదివి, మూసి పక్కన పెట్టాడు కిషోర్. తన తాతయ్య ప్రాణం కాపాడిన ఆ మందిరాన్ని ఒక్కసారి చూసి రావాలనిపించింది అతనికి.నేల నాలుగుచెరగులా ఎక్కడ తడిమి చూసినా శిథిలాల కింద చరిత్ర మూలుగుతూ ఉంటుంది. కొన్నింటికి మహర్దశ పడుతుంది. బయటికి వస్తాయి. రాజ్యమేలతాయి. మరికొన్నింటి భవిష్యత్తు కాలాలమీద కానీ తేలదు. ఏ స్వార్థమూ లేకుండా ఒకనాటి జ్ఞాపకాలను తవ్వితీసి మళ్లీ అందరిముందు ఠీవిగా నిలబెట్టాలని తపించేవారు నూటికో కోటికో ఒక్కరుంటారు. కొన్నిసార్లు వాళ్లు తమ ప్రయత్నంలో విజయం సాధిస్తారు కూడా. -
కథాకళి: ఫటాఫట్
అతని శ్రావ్యమైన కంఠం, మెత్తని నడవడిక అతనిలోని దుర్మార్గానికి తెరలని ఆమె ఆలస్యంగా తెలుసుకుంది.ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుజీవ్ ఆమెని ఇంటర్వ్యూ చేశాడు. ఆమె అందం అతన్ని ఆకర్షించింది. పౌడర్ తప్ప మరే మేకప్ లేని, కనుబొమలని కట్ చేసుకుని దిద్దుకోని ఆమె సహజమైన అందం, ఆమె చురుకుదనం అతన్ని ఆకర్షించాయి.సుజీవ్ తండ్రి ఉద్యోగరీత్యా తూర్పు గోదావరి జిల్లాకి పోలీస్ సూపరింటెండెంట్. ఆయన అన్యాయార్జితంతో తన పేర స్థాపించిన ఫైనా¯Œ ్స కంపెనీని సుజీవ్ మేనేజ్ చేస్తున్నాడు. హైద్రాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఇరవై ఆరు అంతస్తుల భవంతిలో, టాప్ ఫ్లోర్లో ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణం గల అపార్ట్మెంట్లో సుజీవ్ ఒంటరిగా ఉంటాడు. అది సుజీవ్ తండ్రి అక్రమసంపాదనతో తన భార్య పేర కొన్న ఆస్తి.ఓరోజు ఆఫీస్లో లంచ్ చేస్తూ సుజీవ్ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించి తెలుసుకున్నాడు. ‘‘నా భార్యకి పబ్ కల్చర్ అంటే ఇష్టం. వద్దన్నానని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళి బతిమాలి తెస్తానని ఎదురుచూసింది. కాని విడాకులు తీసుకుంటానని ఆమె ఊహించలేదు. నువ్వు అన్నీ ఫటాఫట్ చేసేస్తూంటావు. మన వ్యాపారానికి అది ముఖ్యం. నీకు అభ్యంతరం లేకపోతే మన పెళ్ళి గురించి మీ పెద్దలతో మాట్లాడతాను.’’ఆమె దిమ్మెరపోయింది. తను ఎక్కడ? అతను ఎక్కడ? ఆమె గాల్లో తేలుతూ ఇంటికి వెళ్ళింది. వారం తర్వాత ఆమె అర్జెంట్ కాగితాల మీద సంతకాలు తీసుకోడానికి అతని అపార్ట్మెంట్కి వచ్చింది. అతను చొరవ తీసుకుంటే ఆమె సిగ్గుగా అభ్యంతరం చెప్పింది తప్ప ఎదురు తిరగలేదు.మూడు వారాల తర్వాత ఓరోజు ఆమెకి సుజీవ్ నించి ‘నువ్వు అర్జెంట్గా నా ఇంటికి వస్తావా?’ అనే మెసేజ్ వచ్చింది. ‘మా నాన్నగారికి వడదెబ్బ కొట్టి ఇప్పుడే తేరుకుంటున్నారు. అందుకే సెలవు పెట్టాను సర్. ఆయన్ని చూసుకోవాలి’ సమాధానం పంపింది.‘‘పర్సనల్గా మాట్లాడాలి. ఓ అరగంట వచ్చి వెళ్ళలేవా?’’ ఫోన్ చేసి అడిగాడు.‘‘సరే సర్.’’ అతని కంఠంలోని అభ్యర్థనని గుర్తించి చెప్పింది.‘‘జాగ్రత్తమ్మా. నగరంలో హీట్ వేవ్తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయని టీవీలో చూపిస్తున్నారు.’’ తల్లి హెచ్చరించింది. ఆమెని చూడగానే సుజీవ్ చెప్పాడు.‘‘మా నాన్నగారు చిక్కుల్లో పడ్డారు. బయటపడటానికి ఒకరిని మంచి చేసుకోవాలి. లేదా ఆయన ఉద్యోగం ఊడొచ్చు.’’‘‘అయ్యో.’’‘‘అందుకు నువ్వో మనిషిని సంతోషపెట్టాలి.’’‘‘నాకు అర్థం కాలేదు సర్.’’ అయోమయంగా చూస్తూ చెప్పింది.‘‘అర్థం కాకపోడానికి ఏంలేదు. నన్ను సంతోషపెట్టినట్లే. అతన్ని వచ్చే బుధవారం మన ఆఫీస్ గెస్ట్ హౌస్లో కలుసుకోవచ్చు.’’ఆమె తను విన్నది నమ్మలేకపోయింది. తనని పెళ్ళి చేసుకుంటానని అడిగిన ఇతనేనా ఈ మాట అన్నది? అతను తనని పెళ్ళి చేసుకోడని ఆమెకి వెంటనే తట్టింది. ఆమె దుఃఖం కోపంగా మారడంతో కంఠం పెంచి చెప్పింది.‘‘సారీ! నేను అలాంటిదాన్ని కాదు. నేను ఇప్పుడే రాజీనామా చేస్తున్నాను.’’‘‘నీకా అవకాశం లేదు. ఆ ఏíసీబీ డైరెక్టర్ని నువ్వు తృప్తి పరచాలి.’’అతను లేప్టాప్లో వాళ్ళిద్దరి రతికేళి వీడియోని ప్లే చేసాడు.‘‘ఏమిటిది? ఏమిటీ మోసం?’’ ఆమె మరోసారి నిర్ఘాంతపోతూ గట్టిగా అరిచింది.‘‘దీన్ని మీ తల్లిదండ్రులు చూడకూడదనుకుంటే, బుధవారం ఎక్కడ పికప్ చేయటం నీకు సౌకర్యమో చెప్పు.’’తను బ్లాక్మెయిల్లో చిక్కుకుందని ఆమెకి అర్థమైంది. ఆమె కన్నీళ్ళు ఆపుకుంటూ లేచి మెట్లెక్కి టెర్రేస్లోకి వెళ్ళింది.ఆమె ఏకాంతంగా ఏడవడం కోసం పైకెళ్ళిందని సుజీవ్కి అర్థమైంది. పది నిమిషాలు గడిచినా ఆమె రాకపోవడంతో అతను టెర్రేస్లోకి వెళ్ళాడు. తలుపు వెనక పొంచి ఉన్న ఆమె చటుక్కున మెట్లమీదకి వెళ్ళి టెర్రేస్ తలుపు మూసి గడియ పెట్టింది.‘‘తలుపు తీయి. ఏమిటిది?’’ సుజీవ్ తలుపు బాదుతూ అరిచాడు.తలుపు తెరచుకోలేదు. పావుగంట తర్వాత ఇక ఆమె తలుపు తెరవదని బోధపడింది. పిట్టగోడ మీంచి దూకడానికి వీలులేకుండా లోపలివైపు ఆరడుగుల ఎత్తున గ్లాస్ వాల్ ఉండటంతో, అతను కింద రోడ్ మీద వారిని సహాయం కోరే అవకాశం లేకపోయింది. ఎక్కడా నీడ కనిపించలేదు. ఎండకి చెమటతో అతని షార్ట్స్, టీషర్ట్ తడిసిపోయాయి. టీషర్ట్ విప్పి తల మీద కప్పుకున్నాడు. అతని ఒంట్లోని నీరు చెమట రూపంలో కారిపోతూ దాహంతో నాలుక పిడచకట్టుకు పోయింది. లేప్టాప్లోని తమ వీడియోని డిలీట్ చేశాక, టీవీ చూస్తూ కాలక్షేపం చేసిన ఆమె సూర్యాస్తమయ సమయంలో పైకెళ్ళి టెర్రేస్ తలుపు తెరిచింది. ఆమె ఆశించినట్లుగా నేల మీద మగతగా పడున్న సుజీవ్కి వడదెబ్బ కొట్టింది. చక్కెర, ఉప్పు నీళ్ళు తాగించి, సెలైన్ ఎక్కిస్తే అతను జీవిస్తాడని ఆమెకి తెలుసు. అతన్ని కిందకి మోసుకెళ్ళి పక్క మీద పడుకోబెట్టింది. అతను ఏం జరుగుతోందో కూడా అర్థం కానంత అపస్మారకంలో ఉన్నాడు. ఆమెని వంచించడానికి సుజీవ్ ఏ మంచాన్ని ఆయుధంగా చేసుకున్నాడో ఆ మంచం మీదే ఆ రాత్రి ఆమె ఫటాఫట్ నిర్ణయంతో ప్రాణం వదిలాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ఇవ్వాల్సింది ధైర్యమే!
భవిష్యత్తులో పిల్లలు ఇబ్బందులు పడకూడదని, అందుకు ఆస్తులు సంపాదించి పెట్టాలని చాలావరకు తల్లిదండ్రులు అనుకుంటుంటారు. ‘కానీ, పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, ధైర్యమే!’ అంటారు నీలిమ. కోర్టు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన శ్రీదేవి అప్పల్ల నీలిమ కూతురు.సింగిల్ పేరెంట్గా ఇద్దరు కూతుళ్ల పెంపకంలో తను తీసుకున్న జాగ్రత్తలు, జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమించిన విధానాలను ఇలా మన ముందుంచారు..‘‘నేను రియల్ఎస్టేట్ వ్యాపారం చేసేదాన్ని. చాలా పనుల్లో ఆడ మగ అనే తేడా చూపుతారు. నేను చిన్నప్పటి నుంచి అలా చూసేదాన్నికాదు. అందుకే, ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఇద్దరు అమ్మాయిలను పెంచాను. మాది కాకినాడ. మాకు కొద్దిపాటి ఆస్తి ఉంటే, దాన్ని అమ్మి, తిరిగి మరో ఆస్తి కొని, అమ్మి... అలా వచ్చిన డబ్బులతో పిల్లలిద్దరినీ సాకాను. నా పిల్లలు కూడా నాలాగా ధైర్యంగా ఉండాలనుకుంటాను. నా పెద్ద కూతురు దివ్యజ్యోతి బీఎస్సీ పూర్తయ్యాక, జాబ్ చేస్తుంది. చిన్నమ్మాయి శ్రీదేవి సినిమాలలో తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. సినిమా స్టార్ కావాలనుకున్నాను...మా అక్క తమిళ, మలయాళ సినిమాలలో నటించేది. ఆ సమయంలో నేను నాకు కూతురు పుడితే, సినిమాల్లోకి తీసుకురావాలని ఆ రోజుల్లోనే అనుకునేదాన్ని. కానీ, ఆ విషయాన్ని కాలక్రమంలో మర్చిపోయాను. ఆ తర్వాత మా అక్క సినిమాలు మానేసి, కుటుంబ వాతావరణంలోకి వచ్చేసింది. నాకూ కుటుంబ పరిస్థితుల వల్ల చిన్న వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు కూతుళ్లు పుట్టాక, ఒంటరిగా జీవితాన్ని మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దివ్యకు బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలని ఉండేది. శ్రీదేవికి టీచర్ అవ్వాలని ఉండేది. ఇద్దరినీ చదువుకోమనే ప్రోత్సహించాను. అయితే, ఇంట్లో శ్రీదేవి టీచర్లా యాక్ట్ చేస్తుండేది. అది చూసి, ఈ అమ్మాయి చేత రీల్స్ చేయిస్తే బాగుంటుందనుకున్నాను. తను స్కూల్ నుంచి రాగానే ఓ గంట రెస్ట్ ఇచ్చి, గ్రీనరీ ప్లేస్ల్లోకి తీసుకెళ్లి రీల్స్ చేసేవాళ్లం. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో శ్రీదేవికి మంచి పేరు రావడంతో పాటు, సినిమా అవకాశాలూ వచ్చాయి. మంచి – చెడు చూసే విధానంలోనే..!ఒకప్పటి రోజులకు ఇప్పటి రోజులకు అన్ని చోట్లా చాలా మార్పులు వచ్చాయి. అవకాశాలూ పెరిగాయి. అమ్మాయిలు ఒంటరిగానే ప్రతి సమస్యను సాల్వ్ చేసుకుంటున్నారు. ‘ఎవరినో తప్పు పట్టడం కాదు, మనం మన జాగ్రత్తలో ఉండాలి’ అని చెబుతుంటాను. దానిని శ్రీదేవి కూడా బాగా అర్థం చేసుకుంటుంది. ఏ పని చేసినా డబ్బు సంపాదించడానికే. కానీ, చదువు మాత్రం ఉండాలి. శ్రీదేవి జూనియర్ ఇంటర్ పూర్తి చేసింది. పై చదువుల కోసం డిస్టెన్స్లో ప్లాన్ చేస్తున్నాం. నేను చెప్పేవి ఇద్దరూ బాగా వింటారు. వారేం అనుకున్నారో అవి కూడా స్పష్టంగా చెబుతారు. వాటిలో మంచి చెడులు చెబుతాను. సంతోషంగా ఉండటానికి ఏం చేయాలో కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కలిసే టూర్లు..బయటి స్నేహాలను ఎంకరేజ్ చేయడం లేదు. ఫ్రెండ్స్తో టూర్స్కి వెళ్లచ్చు కదా అంటారు. కానీ, ‘నో’ అనే చెబుతాను. నాకూ ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి మేం ముగ్గురం కలిసి టూర్స్కి వెళుతుంటాం. దివ్యకు సినిమా డైరెక్షన్ అంటే ఇష్టం అని చెబుతుంటుంది. కానీ, చదువుకు న్యాయం చేసే జాబ్ కొన్నాళ్లు తప్పక చేయమని చెబుతాను. శ్రీదేవికి సావిత్రి, సౌందర్యలాగా పేరు తెచ్చుకోవాలని కోరిక. వారిలాగే ట్రెడిషనల్గా ఉండటం, అలాంటి పాత్రలతో మెప్పించడం ఇష్టం. నేను కూడా అలాంటి ఇష్టాలను ఎంకరేజ్ చేస్తుంటాను. నాటి నటీనటుల సినిమాలు కలిసి చూస్తాం.కష్టం విలువ తెలుసుకున్నారు.. సింగిల్ పేరెంట్గా పిల్లల పెంపకంలో కష్టపడ్డాను అని చెప్పలేను. ఎందుకంటే, నా కష్టాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు. నా మాట విన్నారు. నా వరకు చూసుకుంటే తండ్రి ఉంటేనే పిల్లల్ని బాగా పెంచగలుగుతారు అనుకోవడం తప్పు అనిపిస్తుంది. నా భర్త సపోర్ట్ లేకపోయినా పిల్లల్ని పెంచాను. అయితే, పిల్లలిద్దరూ నా మాట విన్నారు కాబట్టి వారి పెంపకం సులువై ఉంటుంది. అందరి పిల్లలు అలా వినాలని ఏమీ లేదు. నేను ఏదైనా విషయంలో బాధపడితే పిల్లలిద్దరికీ విషయం వెంటనే అర్థమైపోతుంది. వాళ్లు అర్థం చేసుకుని, నన్ను కష్టపెట్టకూడదని సెట్ అయిపోతారు. సాయం చేసే గుణం..నేను ఒక్కదాన్నే పిల్లల్ని కష్టపడి పెంచుకుంటున్నప్పుడు ఎవరూ సాయం చేయలేదు. కానీ, పిల్లలకు ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చి, డబ్బు సంపాదిస్తున్నారని.. కొందరు దగ్గరవుతుంటారు. అలాంటప్పుడు పిల్లలు వాళ్లను దూరం పెట్టమని చెప్పరు. ‘కష్టంలో ఉన్నారు కదా! హెల్ప్ చేయమ్మా!’ అని నాకే చెబుతారు. ఎదుటివారికి సాయపడే గుణం ఇద్దరికి వచ్చిందని సంతోషిస్తాను.. ‘మీకు భవిష్యత్తులో పెళ్లిళ్లు అయ్యి, మీ కుటుంబాలు మీకు ఉన్నా.. నేను నాలాగే, మీకు తల్లిలా, ఓ స్నేహితురాలిగా ఉంటాను’ అని చెబుతాను. ‘నువ్వు కోల్పోయిందంతా మేం తిరిగి తీసుకొస్తాం అమ్మా!’ అని పిల్లలు అంటుంటారు. వాళ్లు జీవితంలో మంచిగా స్థిరపడితే అంతే చాలు అనుకుంటాను. నేను, నా ఇద్దరు కూతుళ్లు ఫ్రెండ్స్లా ఉంటాం. మా ఇద్దరి కూతుళ్లతో పాటు మైకి అని ఓ పెట్ ఉంది. అది కూడా మా కుటుంబంలో ఓ సభ్యురాలే. నలుగురం ఒకదగ్గర ఉంటే మా సందడి అంతా ఇంతా కాదు. మా ఆనందం ఇలా మాతో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను’’ అని వివరించారు తల్లిగా నీలిమ.∙నిర్మలారెడ్డి -
బిడ్డ బాగానే ఉందా?
నాకు 26 సంవత్సరాలు. మా పెళ్లై ఆరు నెలలు మాత్రమే అయ్యింది. ఇప్పుడు నాకు రెండు నెలల గర్భం ఉంది. ఇది నా మొదటి గర్భధారణ. ఎలాంటి ఆరోగ్య సమస్యలు నాకు గతంలో లేవు. కాని, నా కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉందా, ఎదుగుదల సరిగ్గా జరుగుతుందా అని కొంచెం ఆందోళనగా ఉంది. ఇలాంటి సమయంలో ఏయే పరీక్షలు చేయించుకోవాలి? – స్వప్న, తిరుపతి.ఒక ప్రైమీ పేషెంట్, అంటే మొదటిసారి గర్భం దాల్చిన మహిళ, మీకు మొదటగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత సాధారణంగా ఐదు నుంచి ఆరు వారాల సమయంలో ఒక స్కాన్ చేస్తాము. ఈ స్కాన్ ద్వారా గర్భసంచిలో జెస్టేషనల్ సాక్ సరైన స్థానంలో ఉందా లేదా అన్నది చెక్ చేస్తాము. అంటే గర్భం గర్భసంచిలోనే సరిగ్గా ఉందా లేదా అన్నది నిర్ధారించుకుంటాము. దాని తర్వాత సుమారు ఏడు నుంచి ఎనిమిది వారాల సమయంలో మళ్లీ ఒకసారి స్కాన్ చేస్తాము. దీనిని వయబిలిటీ స్కాన్ అంటారు. ఇందులో బిడ్డ హార్ట్బీట్ సరిగ్గా ఉందా, ఎదుగుదల ఎలా జరుగుతోంది అన్నది చెక్ చేస్తాము. హార్ట్బీట్, ఎదుగుదల సరిగ్గా ఉంటే తగిన ఫోలిక్ యాసిడ్ వంటి మందులు ఇచ్చి గర్భధారణను కొనసాగిస్తాము. తర్వాత 11 నుంచి 14 వారాల మధ్య, అంటే దాదాపు మూడు నెలల సమయంలో ఒక ప్రత్యేక స్కాన్, రక్తపరీక్ష చేస్తాము. దీనిని మొదటి త్రైమాసిక స్క్రీనింగ్ అంటారు. ఇందులో బిడ్డలో ముఖ్యమైన అవయవాల నిర్మాణం ఎలా ఉందో స్కాన్ ద్వారా పరిశీలించి, రక్తపరీక్ష ఫలితాలతో కలిపి కొన్ని జన్యు సమస్యల ప్రమాదం ఎంత ఉందో అంచనా వేస్తాము. ఉదాహరణకు డౌన్ సిండ్రోమ్ వంటి సాధారణ జన్యు సమస్యల రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల్లో రిస్క్ తక్కువగా ఉంటే గర్భధారణను సాధారణంగా కొనసాగిస్తాము. తర్వాత ఐదో నెలలో ఒక ముఖ్యమైన స్కాన్ చేస్తాము. దీనిని టిఫా స్కాన్ అంటారు. ఇందులో బిడ్డ అన్ని అవయవాలు సరిగ్గా ఏర్పడ్డాయా లేదా అన్నది పూర్తిగా పరిశీలిస్తాము. టిఫా స్కాన్ లో కూడా ఎలాంటి సమస్యలు కనిపించకపోతే ఎక్కువగా ఇది ఆరోగ్యకరమైన గర్భధారణగా భావిస్తాము. కానీ మొదటి త్రైమాసిక పరీక్షల్లో రిస్క్ కొంచెం ఎక్కువగా లేదా మధ్యస్థంగా కనిపిస్తే, తదుపరి కొన్ని ప్రత్యేక పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఉదాహరణకు మరింత కచ్చితమైన రక్తపరీక్షలు లేదా అవసరమైతే ఉమ్మనీరు పరీక్ష చేసి బిడ్డలో జన్యు సమస్యలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవచ్చు. అలాగే టిఫా స్కాన్ లో ఏదైనా మార్పులు కనిపిస్తే, ఉదాహరణకు మెదడు లేదా గుండె అభివృద్ధిలో ఏదైనా తేడా ఉంటే, దానికి అనుగుణంగా ప్రత్యేక పరీక్షలు చేయవచ్చు. ఉదాహరణకు బిడ్డ గుండె పనితీరును తెలుసుకోవడానికి ప్రత్యేక హార్ట్ స్కాన్ లేదా మెదడు అభివృద్ధిని చూడటానికి మరింత వివరమైన స్కాన్ చేయవచ్చు. ఇంకా కుటుంబంలో ఎవరికైనా జన్యు సమస్యలు ఉన్నాయా లేదా దగ్గరి బంధువుల మధ్య వివాహం జరిగిందా అన్నది కూడా తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా రిస్క్ ఎంత ఉందో అంచనా వేసి, అవసరమైన పరీక్షలు చేయవచ్చు. సాధారణంగా ఈ అన్ని పరీక్షలు క్రమంగా చేయించుకుంటూ వెళ్తే గర్భధారణ సురక్షితంగా కొనసాగుతుందా లేదా అన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు. అన్ని పరీక్షలు సాధారణంగా ఉంటే ఎక్కువగా గర్భధారణ ఆరోగ్యకరంగానే కొనసాగుతుంది. డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ -
నా లోపల రెబెల్
సౌమ్యమైన చూపులు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాళవిక నాయర్, జీవితంలోని ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే...నా బాల్యమే నా బలం!నేను ఢిల్లీలో ఒక మలయాళీ కుటుంబంలో పుట్టాను. నా బాల్యం నాన్నగారి వృత్తిరీత్యా కొన్నిసార్లు ఢిల్లీ హడావుడి, మరికొన్నిసార్లు కేరళ ప్రశాంతత మధ్య సాగింది. ఒకసారి మా కుటుంబంలో జరిగిన బైక్ ప్రమాదం నాపై చాలా ప్రభావం చూపింది. అప్పటి నుంచి నేను స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.నాన్న నా పెద్ద సపోర్టర్!‘అమ్మాయివి, బైక్ ఎందుకు?’ అని చాలామంది చెప్పినా, మా నాన్న వినలేదు. నాకు బైక్ నేర్పించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నన్ను నేనే కాపాడుకోగలగాలి అని ఆయన కోరుకున్నారు.కెమెరా బయట నా ప్రపంచం!షూటింగ్ లేకపోతే నేను ఎక్కువగా పుస్తకాల్లో మునిగిపోతుంటాను లేదా స్కెచింగ్ చేస్తుంటాను. నేను ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో తత్త్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశాను. ఆ చదువు నాకు పాత్రలను కొత్త కోణంలో అర్థం చేసుకునే దృష్టిని ఇచ్చింది.నేను కేవలం నటించను!నా ప్రయాణం చిన్నప్పుడే మలయాళం సినిమా ‘కరుత్త పక్షికల్’లో మొదలైంది. కానీ, ‘కుక్కూ’ నాకు అసలైన గుర్తింపు ఇచ్చింది. అంధురాలైన పాత్రలో కళ్లతో కాదు, మనసుతో ప్రపంచాన్ని చూడటం నేర్చుకున్న అనుభవం. అందుకే, పాత్రలోని భావాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.చిన్న సీక్రెట్స్!ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. కానీ నా లోపల ఒక చిన్న రెబెల్ ఉంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నాకు కొన్ని టాటూలు ఉన్నాయి. ఒక చిన్న నిమ్మకాయ ముక్క ఆకారంలో ఒక టాటూ ఉంది. అలాగే పోలినేషియన్ స్టయిల్లో ట్రయాంగిల్స్, ట్రైబల్ డిజైన్స్ తో మరో టాటూ కూడా ఉంది. అవి నా జీవితంలో ప్రత్యేకమైన గుర్తుల్లాంటివి.వ్యక్తిత్వం ముఖ్యం!మొదట్లో ‘గ్లామర్’ అనే భావన నాకు పెద్దగా నచ్చేది కాదు. ఇండస్ట్రీలో ప్రెజెంటబుల్గా ఉండాలి కానీ, వ్యక్తిత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు అని నేను నమ్ముతాను.అరుదైన గుర్తింపు!చిన్నప్పుడే ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్నందుకు, కొందరు నన్ను ప్రముఖ నటి శారదతో పోలుస్తుంటారు. ఆ గుర్తింపు కాపాడుకోవడానికే పారితోషికం కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను.ఫుడ్ అంటే ఫుల్ లవ్!నేను పక్కా ఫూడీని. ఢిల్లీలో పెరిగాను కాబట్టి అక్కడి స్ట్రీట్ ఫుడ్, మసాలా చాట్ ఎప్పటికీ నా ఫేవరెట్. అలాగే మా ఇంట్లో చేసే మటన్ రసం కలిపిన అన్నం. నెమ్మదిగా ఉడికిన ఆ మాంసం నోట్లో కరిగిపోతుంది. అది నా ఆల్టైమ్ కంఫర్ట్ ఫుడ్. ఇప్పుడు షూటింగ్లు ఎక్కువగా ఉండటంతో, శక్తి కోసం ఆర్గానిక్, హెల్తీ ఫుడ్ కూడా నా మెనూలో చేరింది.ఇష్టమైన స్టార్!చిన్నప్పటి నుంచే నేను మోహన్ లాల్ సర్కి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పని చేసిన రోజు నాకు ఒక కలలా అనిపించింది. అలాగే జ్యోతిక నటనలోని శక్తి, ఒక సినిమాను తన భుజాలపై మోసే ధైర్యం నాకు పెద్ద ఇన్ స్పిరేషన్ . -
తలకట్టు... కనికట్టు
అబ్బాయిలకు ఏం స్టయిల్ ఉంటుందిలే అని చాలామంది అనుకుంటారు. కాని, బార్బర్ కుర్చీలో కూర్చునే పది నిమిషాలు చాలు, మామూలు అబ్బాయి కూడా సినిమా హీరోలా మారిపోవడానికి. సరైన హెయిర్ కట్ ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవల్! చక్కని తలకట్టుతో రూపం కనికట్టు చేసినంతగా మారిపోతుంది. అందుకే ఈ సమ్మర్లో కంఫర్ట్తో పాటు కూల్గా కనిపించే కొన్ని ట్రెండీ హెయిర్ స్టయిల్స్ చూద్దాం...జెంటిల్మన్ ఫ్యాడ్ – క్లాసీ స్టయిల్! జెంటిల్మన్ ఫ్యాడ్ అనేది ఇప్పటికీ ఎవర్గ్రీన్ స్టయిల్! చెవుల దగ్గర జుట్టు క్రమంగా తగ్గుతూ, పైన మాత్రం సెట్ చేసుకునేలా ఉండటం. ఈ కట్ వేసుకుంటే ముఖం మరింత షార్ప్గా, సన్నగా కనిపిస్తుంది. ఆఫీస్కు వెళ్లినా, ఫంక్షన్ కు వెళ్లినా సూట్ అయ్యే సేఫ్ అండ్ స్మార్ట్ స్టయిల్ ఇదే! అండర్కట్ – యూత్ ఫేవరెట్అండర్కట్ అనేది కొంచెం బోల్డ్గా, ట్రెండీగా కనిపించాలనుకునే వాళ్లకు బెస్ట్. సైడ్స్ షార్ట్గా, పైన కొంచెం లెంగ్త్ ఉంచడం వల్ల మీరు స్టయిల్ను మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. ఫార్మల్గా నీట్గా దువ్వుకోవచ్చు, లేదా క్యాజువల్గా మెస్సీగా వదిలేయొచ్చు. ఒకే కట్తో రెండు వేర్వేరు లుక్స్ రావడం దీని కున్న ప్లస్ పాయింట్. టాప్ నాట్ – డిఫరెంట్ టచ్జుట్టు కొంచెం పొడవుగా ఉంటే, టాప్ నాట్ వేసుకోవడం ఒక స్మార్ట్ ఐడియా. జుట్టు మొత్తాన్ని పైకి తీసుకుని చిన్న ముడి వేయడం వల్ల కూల్గా, కంఫర్ట్గా ఉంటుంది. ఈ స్టయిల్ మీకు కొంచెం ఆర్టిస్ట్ లుక్ లేదా ట్రావెలర్ వైబ్ ఇస్తుంది. ముఖ్యంగా వేసవిలో జుట్టు ముఖంపై పడకుండా క్లీన్ గా ఉంచుతుంది. బజ్ కట్ – కంఫర్టబుల్ చాయిస్వేసవిలో చాలామంది ఇష్టపడే సింపుల్ స్టయిల్ ఈ బజ్ కట్. జుట్టు చిన్నగా ఉండటం వల్ల చెమట తక్కువగా ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ, పైగా షాంపూ, నూనె ఖర్చును ఆదా చేస్తుంది. ఉదయం లేట్గా లేచినా, దువ్వుకోవాల్సిన టెన్షన్ ఉండదు. టైమ్ కూడా సేవ్ చేస్తుంది. కట్ చిన్నదే అయినా, కంఫర్ట్ మాత్రం పెద్దది.టెక్చ్సర్డ్ క్రాప్ – మెస్సీగా.. మోడ్రన్ గా..నేచురల్గా, కొంచెం మెస్సీగా కనిపించే స్టయిల్ కావాలనుకుంటే టెక్స్చర్డ్ క్రాప్ మంచి ఎంపిక. ఈ కట్ వల్ల జుట్టు మరింత వాల్యూమ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా థిన్ హెయిర్ ఉన్నవాళ్లకు ఇది మంచి సొల్యూషన్ . ఎక్కువగా సెట్ చేయకపోయినా, స్టయిల్గా కనిపిస్తారు. ఇలా స్టయిలిష్గా కనిపించడానికి పెద్ద ఖర్చు అవసరం లేదు. మీ ఫేస్ షేప్కు సరిపోయే చిన్న హెయిర్ కట్ చాలు, మీ లుక్కి వెంటనే కొత్త చార్మ్ వస్తుంది. -
ఈ ఆభరణాలూ సువర్ణాలే!
ప్రపంచం ఏమైనా సరే, యుద్ధాలు వచ్చినా, ఆర్థిక మాంద్యం తలుపు తట్టినా మన మధ్యతరగతిని వణికించేవి రెండు మాత్రమే! మొదటిది ఇంధన ధరలు, రెండోది బంగారం ధరలు. ఇప్పుడు బంగారం ధర ఆకాశానికెక్కి, అందని నక్షత్రంలా మెరుస్తోంది. బంగారం కేవలం లోహం మాత్రమే కాదు, తరతరాల సంప్రదాయం కూడా! నేటి ట్రెండ్, రేపటి భద్రత. ‘ఏమైనా సరే, నగలు కొనాల్సిందే!’ అనుకునే వారికి రంగు రంగుల్లో దొరికే బంగారు మిశ్రమ లోహాలు సహా పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా బడ్జెట్లోనే మెరిపించే బంగారు మార్గాల గురించిన ప్రత్యేక కథనం...బంగారానికి ప్రత్యామ్నాయ లోహాలు...బంగారం అంటే భారతీయులకు తగని మోజు. ముఖ్యంగా భారతీయులకు బంగారం చూసినప్పుడల్లా దాని మెరుపు మాయలో పడిపోవటం అలవాటు. కాని ఇప్పుడు దానిని తాకగానే, బడ్జెట్ ఒక్కసారిగా సీరియస్ అయి ఇబ్బంది పెడుతుంది. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త కథ మొదలైంది. ‘బంగారం మాత్రమే కాదు, మేమూ ఉన్నాం’ అని చెప్పే లోహాలు ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టాయి. పెరుగుతున్న ధరలు, రోజురోజుకీ మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్, తేలికగా ఉండే డిజైన్లపై పెరుగుతున్న ఆసక్తి, ఇలా ఇవన్నీ కలిసి బంగారానికి ప్రత్యామ్నాయ ఆభరణాలుగా మారి చిన్న చిన్న తారల్లా తళుక్కుమంటున్నాయి.పైగా ఇవి సరసమైన ధరల్లో దొరుకుతుండటమే కాకుండా, స్టయిల్లో కూడా తగ్గేదే లేదంటూ సూపర్ మోడల్స్లా మెరిసిపోతున్నాయి. దీంతో అన్ని వయసుల వారూ వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు బంగారం మాత్రమే వివాహాది శుభకార్యాలకు తప్పనిసరి ఎంపికగా ఉండేది. ఇప్పుడు ఆ ఎంపికల ప్రపంచం పెద్దదైంది. అందుకే ఇప్పుడు ఈ ‘న్యూ హీరోస్’ గురించి తెలుసుకోవడం కూడా ఒక చిన్న ఫ్యాషన్ అడ్వెంచర్లాంటిదే!ప్లాటినమ్ – లగ్జరీ లెజెండ్ జ్యూలరీ ప్రపంచంలో ఒక సైలెంట్ కింగ్ ప్లాటినమ్. ఎక్కువ హడావిడి చేయకుండా, తన క్లాస్తోనే అందరినీ ఆకట్టుకుంటుంది. సహజంగా వెండిలాంటి తెల్లటి మెరుపుతో కనిపించే ఈ లోహం చాలా బలమైంది. కాలం గడిచినా తన అందాన్ని కోల్పోదు. అందుకే ‘ఒకసారి కొనిస్తే, సంవత్సరాలు గడిచినా కొత్తదానిలానే మెరిసిపోతుంది’ అంటారు. చరిత్రలో కూడా ప్లాటినమ్ రాజరికపు కథలతో నిండిపోయింది. ఒకప్పుడు ఇది చాలా అరుదుగా దొరికే లోహం కావడం వల్ల రాజులు, ధనవంతులు మాత్రమే దీనితో నగలు చేయించుకునేవారు.ఆ కాలంలో ప్లాటినమ్ ధర కేవలం డబ్బుతో కాదు, ప్రతిష్ఠతో కూడా కొలిచేవారు. ఇప్పటికీ పెళ్లి ఉంగరాలు, ఎంగేజ్మెంట్ రింగ్స్, ప్రీమియం జ్యూలరీలో ప్లాటినమ్ను ఒక శాశ్వత బం«ధానికి గుర్తుగా భావిస్తారు. స్క్రాచ్లు వచ్చినా, వేడి, చెమట, నీరు ఏదైనా సరే తన మెరుపును అలాగే నిలబెట్టుకుంటుంది. అందుకే మెడికల్ పరికరాలు, ఆధునిక సాంకేతిక పరికరాల తయారీ రంగాల్లో కూడా ప్లాటినమ్ కీలక పాత్ర పోషిస్తోంది. ధరలో సాధారణంగా బంగారంతో సమానంగా, కొన్నిసార్లు కొంచెం ఎక్కువ ధరలో లభిస్తుంది. వెండి – బంగారానికి దగ్గరి బంధువుప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా లభించే విలువైన లోహం వెండి. ఇది బంగారానికి దగ్గరి బంధువు లాంటిది. మెరుపులో ఏమాత్రం తగ్గదు, కానీ ఖర్చులో మాత్రం మనసుకు కాస్త హాయినిస్తుంది. బంగారం కంటే ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల వెండి తక్కువ ధరలో సులభంగా దొరుకుతుంది. అయితే వెండి కథ కేవలం ఫ్యాషన్ తోనే మొదలైపోలేదు; దానికి గొప్ప చరిత్ర, సంప్రదాయం కూడా ఉన్నాయి.పురాతన కాలంలో రాజులు, సంపన్నులు వెండి పాత్రల్లోనే భోజనం చేసేవారు. ఆరోగ్యానికి మంచిదని, నీటిని శుభ్రంగా ఉంచుతుందని నమ్మకం ఉండేది. అందుకే ఇప్పటికీ చాలా ఇళ్లలో చిన్నపిల్లలకు వెండి గ్లాస్, వెండి చెంచా వాడే సంప్రదాయం కొనసాగుతోంది. అంతేకాదు, వెండి సహజంగా బ్యాక్టీరియాను తగ్గించే లక్షణం కలిగి ఉంటుంది. అందుకే పాతకాలంలో చిన్న గాయాలకు కూడా వెండి పూత వాడేవారు. అలాగే పండుగల సమయంలో, ముఖ్యంగా శుభకార్యాల్లో వెండి నాణేలను కానుకగా ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. ఇక పరిశ్రమల ప్రపంచంలో కూడా వెండి ఒక ట్రెండీ హీరోనే. ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ అడుగుపెట్టి రోజువారీ నగలు, స్టయిలిష్ అండ్ సింపుల్ గొలుసులు, మోడ్రన్ జ్యూలరీ డిజైన్ల రూపంలో అందరి చేతుల్లో మెరిసిపోతోంది. సింపుల్గా చెప్పాలంటే సంప్రదాయం, ఆరోగ్యం, స్టయిల్, అందుబాటు ఈ నాలుగు కలిసి వెండిని ఒక స్మార్ట్ చాయిస్గా నిలబెడుతున్నాయి.పలేడియమ్ – సైలెంట్ స్టార్పలేడియమ్ ప్లాటినమ్ కుటుంబానికి చెందిన అరుదైన లోహం. అందుబాటు కొంచెం తక్కువే, కానీ స్టయిల్లో మాత్రం ఫుల్ మార్కులు కొట్టేస్తుంది. మొదట్లో ఇది పెద్దగా ఫ్యాషన్ లో కనిపించలేదు. కాని, ఇప్పుడు వెడ్డింగ్ రింగ్స్, ప్రీమియం డైలీ వేర్ జ్యూలరీలో ఇది సైలెంట్గా ట్రెండ్ సెట్ చేస్తోంది. సహజంగా తెల్లటి మెరుపుతో ఉండటం వల్ల ప్రత్యేక కోటింగ్ అవసరం లేకుండా సింపుల్గా మెరిసిపోతుంది. మెయింటెనెన్స్ తక్కువ, బరువు తక్కువ, లుక్ మాత్రం హై–ఎండ్. ఇదే దీని అసలు స్టయిల్ సీక్రెట్. 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు.ఆ తర్వాత కాలక్రమేణా జ్యూలరీ ప్రపంచం దాని ప్రత్యేకతను గుర్తించింది. ముఖ్యంగా వైట్ గోల్డ్కు ఒక సులువైన ప్రత్యామ్నాయంగా దీనిని భావిస్తున్నారు. ధర విషయానికి వస్తే, పలేడియమ్కు కూడా కొంచెం మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. కొన్ని రోజులు బంగారంతో పోలిస్తే తక్కువ ధరలో ఉంటుంది, మరికొన్ని రోజులు ‘నేను కూడా లగ్జరీనే!’ అని అంటుంది. బడ్జెట్కి పెద్ద షాక్ ఇవ్వకుండా లగ్జరీ ఫీలింగ్ ఇచ్చే స్మార్ట్ ఎంపికగా పలేడియమ్ నిలుస్తోంది.టైటానియమ్ – ఫ్యూచర్ మెటల్ టైటానియమ్ అంటే మోడర్న్ జ్యూలరీ ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్. బరువు తక్కువ, బలం ఎక్కువ. ఇదే దీని అసలైన స్టయిల్. చేతిలో పెట్టుకున్నప్పుడు లైట్గా అనిపించినా, మన్నికలో మాత్రం స్టీల్కే చాలెంజ్ చేస్తుంది. అందుకే స్పోర్టీ లుక్ కోరుకునే వారికి టైటానియమ్ బెస్ట్ చాయిస్. అయితే, టైటానియమ్ మొదట విమానాలు, రాకెట్ల తయారీలో ఉపయోగించారు.అక్కడ తన దారుఢ్యాన్ని నిరూపించుకున్న తర్వాతే ఇది ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మెన్స్ జ్యూలరీ, స్మార్ట్ వాచ్ స్ట్రాప్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్లో ఇది ఫుల్ స్పీడ్తో ట్రెండ్ అవుతోంది. ఇది తుప్పు పట్టదు, స్క్రాచ్లు తక్కువగా పడతాయి, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. పైగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి కూడా సేఫ్. దీంతో, అలెర్జీ సమస్యలు తక్కువగా ఉంటాయి. అందుకే రోజువారీ వాడకానికి చక్కగా సరిపోతుంది. ఇది బంగారంతో పోలిస్తే చాలా తక్కువ ధరలో లభిస్తుంది.బంగారం రంగుల రహస్యం.. బంగారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దాని పసుపు రంగు మెరుపు. అయితే, బంగారం కేవలం ఒక రంగు కథ మాత్రమే కాదు, అది ఒక రంగుల పండుగ. శతాబ్దాలుగా మనుషులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ విలువైన లోహం, కాలంతో పాటు కొత్త కొత్త అవతారాలు తీసుకుంటూ ఫ్యాషన్ లో కొత్త ట్రెండ్స్ను సృష్టిస్తోంది. పసుపు నుంచి తెలుపు, గులాబీ, ఆకుపచ్చ, ఇంకా నీలం, నలుపు వరకు ఇలా ప్రతి రంగు వెనుక ఒక ప్రత్యేక కథ, ప్రత్యేక మిశ్రమం, ప్రత్యేక స్టయిల్ దాగి ఉంది.యెల్లో గోల్డ్ – సంప్రదాయానికి చిరునామా..బంగారం అసలైన రూపం యెల్లో గోల్డ్. ఇది శతాబ్దాలుగా సంపద, రాజసం, శుభం అనే భావాలకు ప్రతీకగా నిలిచింది. 24 క్యారెట్ల బంగారం అత్యంత శుద్ధమైన రూపం. దాదాపు 99.9 శాతం బంగారం ఉంటుంది. కానీ అది చాలా మృదువుగా ఉండటం వల్ల ఆభరణాల తయారీలో 22 క్యారెట్లు, 18 క్యారెట్లు లాంటి మిశ్రమాలను ఎక్కువగా వాడుతారు. పెళ్లి నగలు, గొలుసులు, సంప్రదాయ ఆభరణాలు తదితరమైన వాటన్నింటికీ ఇప్పటికీ ఇది మొదటి ఎంపిక. అలెర్జీ సమస్యలు తక్కువగా ఉండటం, మెరుపు ఎక్కువ కాలం నిలవడం, సింపుల్గా మెయింటైన్ చేయగలగడం దీని ప్రధాన ప్లస్ పాయింట్స్. అయితే ఎక్కువ క్యారెట్ల బంగారం కొంచెం సాఫ్ట్గా ఉండటం వల్ల సులభంగా గీతలు పడే అవకాశం ఉంటుంది. అయినా కూడా ‘క్లాసిక్ లుక్’ అంటే ఇప్పటికీ యెల్లో గోల్డ్నే.వైట్ గోల్డ్ – స్టయిల్కు సిల్వర్ టచ్ వైట్ గోల్డ్ అంటే మోడ్రన్ ఫ్యాషన్ కు సింబల్. సాధారణ పసుపు బంగారానికి భిన్నంగా, బంగారంలో నికెల్, పలేడియమ్ లేదా వెండిలాంటి ఇతర తెల్లటి లోహాలను కలిపి ఈ ప్రత్యేక రంగు బంగారాన్ని తయారు చేస్తారు. తర్వాత దీనిపై రోడియమ్ అనే మెటల్తో కోటింగ్ వేయడం వల్ల ఇది మరింత ప్రకాశవంతంగా, ప్లాటినమ్లా మెరిసే లుక్ను ఇస్తుంది. చరిత్రలో చూస్తే, 1920ల కాలంలో ప్లాటినమ్ చాలా ఖరీదుగా ఉండటంతో, తక్కువ ఖర్చులో అందించడానికి వైట్ గోల్డ్ ప్రాచుర్యం పొందింది.అప్పటి నుంచి ఇప్పటివరకు ఇది మోడ్రన్ జ్యూలరీలో ఒక ముఖ్యమైన ట్రెండ్గా కొనసాగుతోంది. ఇది స్ట్రాంగ్గా ఉండటం, స్క్రాచ్లు తక్కువగా కనిపించడం దీని ప్రత్యేకత. అయితే రోడియం కోటింగ్ కొంతకాలానికి తగ్గిపోవచ్చు కాబట్టి అప్పుడప్పుడు మళ్లీ కోటింగ్ చేయాల్సి ఉంటుంది. అయినా కూడా స్లీక్, స్మార్ట్, మోడ్రన్ లుక్ కోసం వైట్ గోల్డ్ బెస్ట్ చాయిస్.గ్రీన్ గోల్డ్ – అందాల ఆకుపచ్చ మెరుపుగ్రీన్ గోల్డ్ కొంచెం డిఫరెంట్ అండ్ రేర్. బంగారంలో ఎక్కువ శాతం వెండి కలిపితే ఆకుపచ్చ రంగు వస్తుంది. పాత కాలంలో దీనిని ‘ఎలెక్ట్రం’ అని పిలిచేవారు. ఇది మార్కెట్లో ఎక్కువగా కనిపించదు. కాని, ఫ్యాషన్లో చాలా పాత ట్రెండ్. ప్రాచీన రాజులు, కళాకారులు ప్రత్యేక ఆభరణాల కోసం ఈ మిశ్రమాన్ని వాడేవారు, ఎందుకంటే ఇది బంగారంతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపించేది.కొన్నిసార్లు రాగిలాంటి లోహాలను కూడా బంగారంలో కొద్దిగా కలిపి మరింత స్ట్రెంగ్త్ ఇస్తారు. ఇది కాస్త నేచురల్ గ్రీన్ టచ్లా సాఫ్ట్గా కనిపిస్తుంది. కాలక్రమేణా ఇందులో ఉన్న వెండి కారణంగా రంగు కొంచెం డార్క్ కావచ్చు, అదే దానికి ఒక యూనిక్ క్యారెక్టర్ను ఇస్తుంది. భారతీయ దుస్తులైనా, వెస్ట్రన్ ఔట్ఫిట్లైనా ఏ స్టయిల్కైనా ఇది మ్యాచ్ అవుతుంది. కొంచెం డిఫరెంట్, క్లాసీ లుక్ కావాలని అనుకునే వారికి గ్రీన్ గోల్డ్ ఒక బెస్ట్ చాయిస్.రోజ్ గోల్డ్ – ప్రేమకు గులాబీ మెరుపు స్టయిల్లో సాఫ్ట్నెస్ ఇచ్చేదే ఈ రోజ్ గోల్డ్. దీని రంగు కాస్త రొమాంటిక్ లుక్ ఇస్తుంది. బంగారంలో రాగి ఎక్కువగా కలిపితే ఈ అందమైన గులాబీ టోన్ వస్తుంది. అందుకే దీనిని ‘పింక్ గోల్డ్’ అని, పాతకాలంలో ‘రష్యన్ గోల్డ్’ అని పిలిచేవారు, ఎందుకంటే 19వ శతాబ్దంలో రష్యాలో ఇది మొదట ప్రాచుర్యం పొందింది. చరిత్రలో రాజ కుటుంబాలు, ప్రత్యేక సందర్భాల ఆభరణాల్లో ఈ రంగును ఉపయోగించేవారు.ఇది సాఫ్ట్గా కనిపించినా, రాగి కారణంగా ఇతర గోల్డ్ రకాల కంటే కొంచెం బలంగా ఉంటుంది. పైగా దీని రంగు కాలక్రమేణా తగ్గిపోకుండా స్థిరంగా ఉంటుంది. అన్నిరకాల చర్మానికి ఈ రంగు సూట్ అవ్వడం వల్ల యువతలో ఇది ఒక ఫ్యాషన్ ట్రెండ్గా మారింది. ముఖ్యంగా ఎంగేజ్మెంట్ రింగ్స్, గిఫ్ట్ జ్యూలరీ, డైలీ వేర్ ఆభరణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. రొమాంటిక్గా, ట్రెండీగా కనిపించాలనుకునే వారు రోజ్ గోల్డ్ ఎంచుకోవటం మంచిది.బ్లూ గోల్డ్ – అరుదైన నీలి మెరుపుజ్యూలరీలో రేర్ స్టార్ బ్లూ గోల్డ్. బంగారంలో ఇండియమ్ లేదా ఐరన్ వంటి లోహాలను కలిపి, నియంత్రిత ప్రక్రియలో ఆక్సిడేషన్ చేయడం వల్ల దీనికి నీలి రంగు వస్తుంది. ఈ షేడ్ గాఢంగా కాకుండా, మెటాలిక్ టచ్తో సాఫ్ట్గా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ రకం బంగారం ఎక్కువగా ఆధునిక కాలంలోనే అభివృద్ధి చెందింది, ముఖ్యంగా ప్రత్యేక డిజైన్లు, ఆర్టిస్టిక్ జ్యూలరీ కోసం దీనిని ఉపయోగించేవారు. ఇది మార్కెట్లో అసలు కనిపించదు; ఎక్కువగా స్టేట్మెంట్ జ్యూలరీ, కలెక్షన్ పీసెస్, ప్రత్యేక ఆర్డర్ డిజైన్లలో మాత్రమే కనిపిస్తుంది. తయారీ ప్రక్రియ క్లిష్టంగా ఉండటం, నైపుణ్యం అవసరం కావడం వల్ల దీని ధర కూడా ఎక్కువే. బ్లూ గోల్డ్ ఎక్కువగా కలెక్షన్ ఐటమ్స్ లేదా ప్రత్యేక సందర్భాల కోసం మాత్రమే తయారు చేస్తారు, అందుకే బ్లూ గోల్డ్ ఒక లగ్జరీ స్టేటస్గా నిలుస్తోంది.బ్లాక్ గోల్డ్ –బోల్డ్ స్టయిల్ బ్లాక్ గోల్డ్ అంటే బోల్డ్ స్టేట్మెంట్. ఇది సహజంగా ఏర్పడే రంగు కాదు. ప్రత్యేక టెక్నాలజీ, కోటింగ్ లేదా ట్రీట్మెంట్ ద్వారా తయారు చేసే మిశ్రమం. రోడియం ప్లేటింగ్, ఆక్సిడేషన్ లేదా లేజర్ ట్రీట్మెంట్ వంటి ఆధునిక పద్ధతులతో బంగారానికి ఈ నలుపు రంగు అందిస్తారు. ముఖ్యంగా మోడ్రన్ జ్యూలరీ ట్రెండ్స్ పెరిగిన తర్వాత ఎక్కువగా పురుషుల జ్యూలరీ, హై ఫ్యాషన్ డిజైన్లు, స్టేట్మెంట్ రింగ్స్, బ్రేస్లెట్స్లో ఇది కనిపిస్తుంది. జ్యూలరీతో అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే బ్లాక్ గోల్డ్ ఒక ట్రెండీ ఆప్షన్.కొత్త డిజైన్లు..బంగారం ధరలు రోజు రోజుకీ పైకి ఎగబాకుతున్నాయని, స్టయిల్లో తగ్గాల్సిన అవసరం లేదు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం స్మార్ట్గా డిజైన్స్ ఎంపిక చేసుకుంటే, తక్కువ ఖర్చులోనే అందమైన నగలను పొందుతూ అందం, ఆనందం రెండింటినీ ఆస్వాదించవచ్చు.అవతారాలు ఎత్తే ఆభరణంఒకే నగను మూడు విధాలుగా మార్చుకునే డిజైన్లు ఇప్పుడు చాలా పాపులర్. పెద్ద హారం నుంచి చిన్న చైన్గా, లేదా లాంగ్ నెక్లెస్ను రెండు చిన్న నెక్లెస్లుగా మార్చుకోవచ్చు. ఒకసారి కొనుగోలు చేసి, మూడు సందర్భాల్లో వివిధ విధాలుగా వాడుకోవచ్చు.పాతకు కొత్త రూపం పాతకాలపు ఆభరణాలను కొత్తగా మార్చి, ఆధునిక డిజైన్స్ తో కలిపి తయారు చేయడం ఇప్పుడు ట్రెండ్గా మారుతోంది. దీంతో పాత బంగారం అమ్మి కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా, వాటినే కొత్తగా మార్చుకోవచ్చు. పెళ్లి కూతురి నగలలో కూడా కొత్త ఆకృతులు, కొత్త కలయికలు కనిపిస్తున్నాయి. అందుకే, ఇప్పుడు బంగారం కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, సృజనాత్మకతకు కొత్త వేదిక.హాలో టెక్నిక్ ఈ టెక్నిక్ ఒక చిన్న మ్యాజిక్లాంటిది. నగ లోపల ఖాళీగా ఉండేలా తయారు చేస్తారు. బయట నుంచి చూస్తే మాత్రం పెద్దగా, ఘనంగా కనిపిస్తుంది. 40 గ్రాముల్లా కనిపించే నెక్లెస్ అసలు బరువు 20 నుంచి 25 గ్రాములే ఉండొచ్చు. పాతకాలపు భారీ టెంపుల్ జ్యూలరీ కూడా ఇప్పుడు ఈ కొత్త వెర్షన్ లో వస్తోంది. అంటే స్టయిల్ డబుల్, ఖర్చు హాఫ్.రెండు మెరుపులు బంగారాన్ని ఇతర లోహాలతో కలిపి తయారు చేసే మిక్స్డ్ మెటల్ డిజైన్స్ ఇప్పుడు ఫ్యాషన్ లో టాప్లో ఉన్నాయి. ఒకే నగలో రెండు రంగుల మెరుపు కనిపించడం వల్ల అది కొత్తగా, మోడర్న్గా కనిపిస్తుంది. ఖర్చు తగ్గుతుంది, డిజైనర్ లుక్ కూడా వస్తుంది.పూత పరి^è యాలుఈ టెక్నిక్లో నగ పూర్తిగా బంగారంతో కాకుండా, పైపైన మాత్రమే బంగారం పొర వేస్తారు. దీంతో అది గోల్డ్లా మెరిసిపోతుంది, కానీ ధర మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వన్ గ్రాము గోల్డ్ లాంటివే కనిపిస్తాయి, కానీ అసలు బంగారం కాదు. పార్టీలు, ఫంక్షన్ లలో గ్రేస్ చూపించడానికి ఇది సూపర్ చాయిస్.తక్కువలో ఎక్కువ అందం. ఇప్పటి యువత ఎక్కువ నగలు ధరించడం కన్నా, ఒకే నగతో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటున్నారు. ఒక చిన్న గొలుసు, ఒక అందమైన ఉంగరం, ఒక జత చెవిపోగులు. ఇవే ఇప్పుడు పూర్తి అలంకరణగా మారుతున్నాయి. సాదాసీదాగా, కానీ ఆకర్షణీయంగా కనిపించడం – అందానికి ఇదే నేటి కొత్త మంత్రం.సంప్రదాయం చిన్న ప్యాక్లో జ్యూలరీలో ‘లైట్ ఈజ్ రైట్’ అనే ట్రెండ్ సూపర్ హిట్గా మారింది. పెద్దగా కనిపించే హారం అయినా, చెవి రింగులు అయినా లోపల స్మార్ట్గా తక్కువ బంగారంతో డిజైన్ చేసి, బయటకు మాత్రం బీడ్స్, రంగురంగుల స్టోన్స్ , మెరిసే ముత్యాలు జోడించి ఫుల్ రిచ్ లుక్ తీసుకొస్తున్నారు. చేతిలో పెట్టుకుంటే బరువు తక్కువగా ఉంటుంది, కానీ చూసినవారికి మాత్రం ‘ఇది ఎంత గ్రాండ్గా ఉంది!’ అనిపించేలా మెరుస్తుంది.కాలం మారుతోంది, ఖర్చులు పెరుగుతున్నాయి, బంగారం ధర రోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయినా మన ఇంట్లో ఒక మాట మాత్రం మారదు. ‘బంగారం కొంటేనే భద్రత’ అనే నమ్మకం. అందుకే, బంగారం ఎప్పటికీ ప్రత్యేకమే! ∙ దీపిక కొండి -
లివర్ షివర్
భారత దేశంలో లివర్ జబ్బులు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. లివర్ జబ్బుల కారణంగా సంభవించే మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. లివర్ జబ్బులకు మద్యపానం ప్రధాన కారణంగా ఉంటోంది. హెపటైటిస్–ఏ, బీ, సీ, డీ, ఈ; నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్డీ); కొన్ని రకాల ఔషధాల వాడకం, రసాయనాల కాలుష్యం; జన్యు కారణాలు, ఆటో ఇమ్యూన్ పరిస్థితులు కూడా లివర్ జబ్బులకు కారణం అవుతుంటాయి.మన దేశంలోని పరిస్థితులు చూసుకుంటే, గడచిన దశాబ్ద కాలంలో లివర్ జబ్బులతో మరణాల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగినట్లు జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ రకాల లివర్ జబ్బులు, వాటి వల్ల సంభవిస్తున్న మరణాల వివరాలను గణాంకాల్లో తెలుసుకుందాం... -
డ్రైవింగ్ లైసెన్స్ కోసం... 139 విఫలయత్నాలు
సాధారణంగా మనం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే థియరీ, ప్రాక్టికల్ టెస్ట్లలో ఒకటి రెండుసార్లు ప్రయత్నం చేస్తాం. అలా సాధ్యం కాకపోతే ‘ఇక మనకు డ్రైవింగ్ సెట్ కాదులే’ అని అనుకుని ఏ ఓలానో, ఊబర్నో ఆశ్రయిస్తాం. కానీ పోలండ్లోని టార్నోకి చెందిన ఓ వ్యక్తి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అలా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు అనుకుంటున్నారా... ఏకంగా 139 సార్లు, తొమ్మిదేళ్ల పాటు విసుగు చెందకుండా విఫల యత్నాలు చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ థియరీ టెస్ట్లో పాస్ కావడం కోసం ఏకంగా రూ. 1,90,000 కూడా ఖర్చు చేశాడు.చివరికి అంటే 140వ ప్రయత్నంలో ఎట్టకేలకు థియరీ టెస్ట్లో పాసయ్యాడు. అయితే, అసలైన మరో ట్విస్ట్ మరొకటి ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే థియరీ పాస్ అయిపోతే సరిపోదు. ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ కూడా పాసై పోవాలి. కారు నడపడంలో తడబడినా, రివర్స్ సరిగ్గా తీయకపోయినా.. రూల్స్ ప్రకారం మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. మరోవిషయం.. 140 సార్లే ఎక్కువ అనుకుంటే, పోలండ్లోనే ఇతడిని మించిన ఇంకో ఘనుడు కూడా ఉన్నాడు. అతను డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏకంగా 163 ప్రయత్నాలు చేశాడట. అది కూడా 17 ఏళ్ల పాటు! -
ఈ కోర్టే నకిలీది!
నకిలీ డాక్టర్ల గురించి విన్నాం. నకిలీ లాయరు. నకిలీ జడ్జి గురించి చదివాం. ఫేక్ ఆఫీసర్లు.. డూప్లికేట్ ప్రొడక్టులు.. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే, గుజరాత్లో ఓ వ్యక్తి ఓ కొత్త మోసానికి తెరలేపాడు. ఏకంగా నకిలీ కోర్టే ఏర్పాటు చేశాడు.. ఏంటీ కోర్టా? అని ఆశ్చపోతున్నారా.. కోర్టే కాదు.. లాయర్లు, ఉద్యోగులు, తీర్పులు అన్నీ నకిలీనే...సివిల్ కేసులు.. ఓ పట్టాన పరిష్కారం కావు. తరాలు మారినా ఎటూ తెగవు. ఏళ్లతరబడి ఎదురుచూపులు. కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు తప్పవు. ఇలా తిరిగి. విసిగి వేసారిన వారినే లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రభుత్వం నియమించిన ఆర్బిట్రేటర్ని అని చెప్పాడు.. కోర్టు సెటప్ వేసి నమ్మించాడు. కేసులు పరిష్కరించినట్టు, తీర్పులు చెప్పినట్టు నటించాడు. లక్షల్లో ఫీజులు గుంజాడు. ఐదేళ్ల పాటు ఈ దందా సాగించాడు.ఓ కేసు వ్యవహారంలో ‘అసలు’ కోర్టుకు అనుమానం వచ్చి, ఆరా తీసింది. మోసం బట్టబయలైంది. ‘నకిలీ’ని కటకటాల్లోకి పంపింది. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ ఉత్తుత్తి కోర్టు వెలిసింది. మోరిస్ శామ్యూల్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డాడు. ఓ గదిలో కోర్టు సెటప్ ఏర్పాటు చేసి, జడ్జిగా గెటప్ వేశాడు. కొంతమంది నకిలీ లాయర్లు, ఉద్యోగులను నియమించుకున్నాడు. భూమి వివాద బాధితులే లక్ష్యంభూ సంబంధిత కేసుల్లో బాధితులను టార్గెట్ చేసేవాడు. అమాయకులను గుర్తించి, బుట్టలో వేసుకునేవాడు. ప్రభుత్వం తనను ‘అధికారిక మధ్యవర్తి’గా నియమించిందని నమ్మించేవాడు. కోర్టుల్లో కేసుల పరిష్కారానికి ఎక్కువ కాలం పడుతుందని, తాను త్వరగా పరిష్కారం చూపుతామని నమ్మించి..‘ఉత్తుత్తి’ కోర్టుకు రప్పించేవాడు. ఐదేళ్ల పాటు కొనసాగిన మోసంఈ ఉత్తుత్తి కోర్టు కార్యకలాపాలు 2019 నుంచి 2024 వరకు కొనసాగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శామ్యూల్కు ఆర్బిట్రేటర్గా ఎటువంటి అధికారిక హోదా లేదని, ఐదేళ్లలో అనేక కేసుల్లో నకిలీ ఆదేశాలు జారీ చేశాడని గుర్తించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై మార్చేలా కలెక్టర్లకు సైతం ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ ఆర్బిట్రేటర్ కోర్టులో తన క్లయింట్లకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసేవాడు. ఆ తర్వాత ఆ నకిలీ క్లెయిమ్లను కోర్టులో సమర్పించి తన క్లయింట్లకు అక్రమ లాభం కలిగించేవాడు. ఎలా బయటపడిందిఈ ‘నకిలీ’ వ్యవహారం ఒక కేసు ద్వారా వెలుగులోకి వచ్చింది. శామ్యూల్ ఇచ్చిన తీర్పు కాపీని ఓ కేసులో అహ్మదాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో సమర్పించగా, ఆ పత్రాలను పరిశీలించిన కోర్టు అధికారి అనుమానాస్పద అంశాలను గుర్తించారు. వాస్తవాలను పరిశీలించి, విచారణలో ఆ తీర్పు నకిలీదిగా తేల్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్ట్.. కేసుల నమోదుపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతని కార్యాలయంలో నకిలీ పత్రాలు, కోర్ట్ ఏర్పాటుకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. మోరిస్ శామ్యూల్ను అరెస్టు చేశారు. మోసం చేయడం, నకిలీ పత్రాలు తయారు చేయడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. ఆ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని శామ్యూల్ మోసానికి పాల్పడ్డాడు. ‘జాప్యాన్ని’ సాకుగా చూపి బాధితుల నిస్సహాయతను తనకు అనుకూలంగా మలచుకున్నాడు. చట్టపరమైన వ్యవహారాల్లో సరైన అధికారిక మార్గాలనే ఎంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన రుజువు చేస్తోంది. అరుదైన మోసమే కాదు, అనేక ప్రశ్నలు లేవనెత్తే ఉదంతంగానూ దీన్ని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.దిలీప్ మాదిరెడ్డి -
యముడితో కీర్తిమంతుడి యుద్ధం
పూర్వం కాశీక్షేత్రాన్ని రాజధానిగా చేసుకుని, ఇక్ష్వాకు వంశానికి చెందిన కీర్తిమంతుడు పాలించేవాడు. ఒకనాడు కీర్తిమంతుడికి వేట మీద కోరిక పుట్టి, అడవిలో వసిష్ఠాశ్రమ పరిసరాలకు వెళ్లాడు. అప్పుడది వైశాఖమాసం. వసిష్ఠ మహర్షి శిష్యులందరూ వైశాఖమాస ధర్మాలను ఆచరిస్తూ సందడిగా కనిపించారు. వైశాఖమాస ధర్మకార్యాలను అప్రతిహితంగా కొనసాగించడానికి వసిష్ఠ మహర్షి అప్పటికే ఆశ్రమానికి చేరువలో బాటసారుల దప్పిక తీర్చడానికి చలివేంద్రం, వారు సేదదీరడానికి అనువుగా చలువ పందిరితో ఒక విడిది మంటపం ఏర్పాటు చేశాడు. వసిష్ఠుడి శిష్యుల్లో కొందరు చలివేంద్రం వద్ద నిలబడి బాటసారుల దప్పిక తీరుస్తున్నారు. ఇంకొందరు విడిది మంటపంలో ఉన్నవారికి రసభరితమైన పండ్లు అందిస్తున్నారు. మరికొందరు సేదదీరుతున్న బాటసారులకు విసనకర్రలతో గాలి విసురుతూ సపర్యలు చేస్తున్నారు. ఇదంతా చూసిన కీర్తిమంతుడు ఆశ్చర్యపోయాడు. వసిష్ఠుడి శిష్యులను సమీపించి, ‘మునికుమారులారా! మీరంతా ఎవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.‘రాజా! మేమంతా వసిష్ఠ మహర్షి శిష్యులం. ఆయన ఆదేశం మేరకు వైశాఖ ధర్మాలను నెరవేరుస్తున్నాం’ అని బదులిచ్చారు.‘ఏదైనా క్రతువులో భాగంగా ఈ పనులన్నీ చేస్తున్నారా? ఏ దేవత ప్రీతి కోసం ఇదంతా చేస్తున్నారు? దీనివల్ల ఫలితమేమిటి?’ అడిగాడు కీర్తిమంతుడు.‘రాజా! గురువు ఆజ్ఞ మేరకు ఈ పనులన్నీ చేస్తున్నాం. వివరాలేవీ మాకు తెలియవు. ఆయనను కలుసుకుని, నేరుగా అడిగితే, ఆయనే చెప్పగలరు’ అని చెప్పారు శిష్యులు.కీర్తిమంతుడు వసిష్ఠాశ్రమంలోకి ప్రవేశించి, వసిష్ఠ మహర్షికి నమస్కరించాడు. ‘మహర్షీ! నేను ఇటువైపుగా వస్తుంటే, మీ శిష్యులందరూ బాటసారులకు కని విని ఎరుగని సపర్యలు చేస్తూ కనిపించారు. ఇది ఏమైనా ప్రత్యేకమైన క్రతువా? దీని వల్ల ఫలితమేమిటి? మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది’ అని అభ్యర్థించాడు.వసిష్ఠుడు కీర్తిమంతుడి జిజ్ఞాసకు సంతోషించాడు.‘రాజా! నా శిష్యులు చేస్తున్నవన్నీ వైశాఖమాస ధర్మాలు. వైశాఖమాసంలో మానవులందరూ తప్పనిసరిగా ఆచరించాల్సినవి– స్నానం, దానం. ఎన్ని ధర్మాలను ఆచరించినా, స్నాన దానాలను ఆచరించని మానవులు శ్రీహరికి ప్రీతిపాత్రులు కాలేరు. వైశాఖధర్మాలు సులభసాధ్యాలు. దప్పిగొన్న వారికి నీరు ఇవ్వడం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, అలసిన వారికి విశ్రాంతి పొందడానికి ఏర్పాట్లు చేయడం వంటి సామాన్య చర్యలే వైశాఖధర్మాలు. వీటిని ఆచరించిన మానవులకు శ్రీహరి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది’ అని చెప్పాడు.కీర్తిమంతుడు సంతోషంతో వసిష్ఠుడికి కృతజ్ఞతలు తెలుపుకొని, తన రాజధానికి చేరుకున్నాడు. మరునాడే తన భటులతో రాజ్యమంతటా ఇలా చాటింపు వేయించాడు: ‘నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఎనిమిదేళ్ల పైబడిన బాలలు మొదలుకొని వృద్ధుల వరకు వైశాఖమాసంలో అనుదినం స్నానం చేయాలి. సంపన్నులు చలివేంద్రాలను, బాటసారులకు భోజనశాలలను, విడిది మందిరాలను ఏర్పాటు చేయాలి. స్నాన దానాలు చేయనివారికి కఠిన శిక్షలు తప్పవు’. కీర్తిమంతుడి రాజ్యంలో ప్రజలందరూ రాజాజ్ఞను తు.చ. తప్పకుండా పాటించసాగారు. రాజ్యంలో ఎవరూ ధర్మం తప్పనందున కాలంతీరి ఎవరు మరణించినా, వారందరూ నేరుగా విష్ణులోకానికి పోతున్నారు. యమలోకానికి వెళ్లేవారు ఎవరూ లేకపోయారు.ఇదే పరిస్థితి కొనసాగితే తన ఉనికికే ముప్పు వస్తుందని తలచిన యముడు తన పరివారంతో బయలుదేరి, కీర్తమంతుడి రాజ్యాన్ని ముట్టడించాడు. యుద్ధానికి పిలుపుగా భీకర శంఖారావం చేశాడు.కీర్తిమంతుడు సైన్య సమేతంగా యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు. ఉభయ సైన్యాలకు భీకర పోరు సాగింది. కీర్తిమంతుడు తన శక్తిమంతమైన బాణాలతో యమదూతలను రణరంగం నుంచి తరిమికొట్టాడు. యముడు నేరుగా కీర్తిమంతుడితో తలపడ్డాడు. తీక్షణమైన బాణాలతో కీర్తిమంతుడిని నొప్పించి, సింహనాదం చేశాడు. కీర్తిమంతుడు మూడు బాణాలతో యముడి ధనుస్సును విరిచేశాడు.ఆగ్రహించిన యముడు కాలదండాన్ని తీసుకుని, కీర్తిమంతుడిపైకి విసిరాడు.తన భక్తుడైన కీర్తిమంతుడి రక్షణ కోసం శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని సంధించాడు. ఆ చక్రం శరవేగంతో దూసుకొచ్చి, కాలదండాన్ని విసిరికొట్టింది. అది యముడి మీదకొచ్చింది. ఈ పరిణామానికి దేవతలంతా హాహాకారాలు చేసి, యముడిని క్షమించమని ప్రార్థించడంతో విష్ణువు తన చక్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కీర్తిమంతుడి చేతిలో ఎదురైన ఓటమికి తలవంచుకుని, యముడు తిరిగి తన లోకానికి బయలుదేరాడు. ∙సాంఖ్యాయన -
గర్భం దాలుస్తున్నాను... కానీ...
నాకు 30 సంవత్సరాలు. మా పెళ్లై ఐదు సంవత్సరాలు అయ్యింది. ప్రతిసారి నేను గర్భం దాల్చుతున్నాను, కానీ రెండు నుంచి మూడు నెలల్లోనే మిస్క్యారేజ్ అవుతోంది. ఇది మూడుసార్లకు పైగా జరిగింది. మాకు ఒక హెల్దీ బేబీ కావాలి. దీనికి కారణం ఏమిటి? ఎలా ట్రీట్ చేయాలి?– సుజాత, విజయవాడ.మూడుసార్లకు పైగా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతుంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. అంటే ప్రతిసారి ఎందుకు మిస్క్యారేజ్ అవుతోంది అన్నది తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేసి కారణాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఈ పరిశీలనలో ముందుగా డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవాలి. అసలు స్కాన్ చేయించారా లేదా, ఎన్ని రోజులకు లేదా ఎన్ని వారాలకు మిస్క్యారేజ్ అవుతోంది అన్నది తెలుసుకోవాలి. రెండు నెలలు పూరై్తన తర్వాత జరుగుతుందా, లేక ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయిన వెంటనే జరుగుతుందా అన్నది కూడా అడగాలి. అలాగే స్కాన్ లో బేబీ హార్ట్బీట్ ఫార్మేషన్ ఉందా లేదా, ఒకసారి హార్ట్బీట్ వచ్చి పోయాక మిస్క్యారేజ్ అవుతోందా అన్నది కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది పూర్తిగా పరిశీలించాలి. సాధారణంగా మొదటి మూడు నెలల్లో, అంటే 12 వారాల లోపల రిపీటెడ్గా మిస్క్యారేజ్ కావడానికి కారణాలు; అలాగే మూడు నెలల తర్వాత మిస్క్యారేజ్ కావడానికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ పేషెంట్కు మొదటి మూడు నెలల్లోనే జరుగుతోంది కాబట్టి ముఖ్యమైన కారణాలు ఏమిటంటే, ముందుగా తల్లికి, తండ్రికి జెనెటిక్ పరీక్షలు చేసి, జెనెటిక్ సమస్యలు ఉన్నాయా అని చెక్ చేయాలి. అలాగే మిస్క్యారేజ్ అయినప్పుడు బయటికి వచ్చిన టిష్యూ ఉంటే దానికి కూడా జెనెటిక్ పరీక్షలు చేసి, ఏదైనా జెనెటిక్ సమస్య ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలా ఉంటే జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా సరైన మార్గదర్శకాలు తీసుకోవచ్చు. వయస్సు కూడా చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా తల్లి వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం లేదా తండ్రి వయస్సు 40 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం వల్ల మిస్క్యారేజ్ వచ్చే ప్రమాదం కొంచెం పెరుగుతుంది. అలాగే మధుమేహం ఉందా, థైరాయిడ్ సమస్య ఉందా, లేదా ఇతర వ్యాధులు ఉన్నాయా అన్నది కూడా పరిశీలించాలి. ముఖ్యంగా రక్త సంబంధిత లేదా ఇతర శరీర వ్యవస్థల సమస్యలు ఉన్నా కూడా మిస్క్యారేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఒక స్కాన్ ద్వారా గర్భసంచి ఆకారం ఎలా ఉంది అన్నది చూడాలి. గర్భసంచిలో ఏదైనా నిర్మాణ లోపం ఉందా లేదా గర్భసంచి ఆకారం సాధారణంగా ఉందా అన్నది చెక్ చేయాలి. మంచి స్కాన్ ద్వారా గర్భసంచిలో ఏదైనా పొర లాంటిది ఉండి, దాని వల్ల బ్లడ్ సప్లై సరిగ్గా అందకపోతుందా అన్నది తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉంటే కొన్ని సందర్భాల్లో చిన్న ప్రొసీజర్ ద్వారా దాన్ని సరిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన కారణం రక్తం గడ్డకట్టే సమస్యలు. వీటిని థ్రాంబోఫీలియాస్ అని అంటారు. అంటే రక్తంలో ఉండే గడ్డకట్టే లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల గర్భానికి సరైన రక్తప్రసరణ జరగక మిస్క్యారేజ్ కావచ్చు. ఇందులో కొన్ని ప్రత్యేక పరీక్షలు చేసి, ఏదైనా తేడా ఉంటే దానికి సరైన మందులు ఇవ్వవచ్చు. కొన్నిసార్లు అన్ని పరీక్షలు చేసినా కూడా కారణం స్పష్టంగా కనిపించకపోవచ్చు. అలాంటి సందర్భాలను అనెక్స్ప్లెయిన్ మిస్క్యారేజ్ అంటారు. అయినప్పటికీ, చిన్న చిన్న కారణాలు గుర్తించినా వాటిని ట్రీట్ చేయడానికి ప్రయత్నించి, భవిష్యత్తులో ఒక హెల్దీ బేబీ కోసం తల్లిదండ్రులు డాక్టర్ కలిసి ప్రయత్నించవచ్చు. ∙మేని మాటశరీరం ‘తనను తానే శుభ్రం’ చేసుకుంటుంది!రోజూ స్నానం చేస్తూ శరీరాన్ని మీరు శుభ్రంగా ఉంచుకుంటున్నారని అనుకుంటున్నారా? కానీ, అసలు క్లీనింగ్ మాత్రం లోపలే జరుగుతోంది! మన శరీరంలో ‘అటో ఫాగీ’ ప్రక్రియ నిరంతరాయంగా పనిచేస్తూ, పాడైన కణాలను తొలగించి కొత్త కణాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా మనం నిద్రపోతున్నప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ ‘ఇన్నర్ క్లీనింగ్’ స్పీడ్ మరింత పెరుగుతుంది. డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ -
క్లూషియల్: బిలియనీర్ అనుమానాస్పద మృతి
‘శ్రీవాత్సవ బిజినెస్ ఎంపైర్ టవర్స్..‘ప్రముఖ వ్యాపారవేత్త శ్రీవాత్సవ అనుమానాస్పదంగా మరణించాడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన వందమందిలో ఒకరైన అతని మరణం సంచలనమైంది. పరిశోధన మొదలైంది.ఢిల్లీ నుంచి వచ్చిన వైద్యబృందం తీవ్రమైన ఒత్తిడి వల్ల మరణించి ఉండవచ్చని అభిప్రాయపడింది. ఎన్ఐఏ– స్పెషల్ ఏజెంట్ అభిమన్యుని రంగంలోకి దించింది. హైదరాబాద్ చేరుకున్నాడు అభిమన్యు. టైమ్ అర్ధరాత్రి రెండు గంటలు. ఆ చాంబర్లో కమిషనర్ ప్రద్యుమ్న, శ్రీవాత్సవ భార్య, అభిమన్యు ఉన్నారు.‘‘సారీ మిసెస్ శ్రీవాత్సవ గారు! ఈ టైమ్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు. శ్రీవాత్సవగారు ఏ విషయంలోనైనా టెన్షన్ ఫీలవ్వడం గమనించారా?’’ అడిగాడు అభిమన్యు.‘‘లేదు, తను స్ట్రెస్ ఫీలవ్వడం ఎప్పుడూ చూడలేదు. కోవిడ్ టైమ్లో అయిదు వందల కోట్ల నష్టం ఎదురైనప్పుడే తేలిగ్గా తీసుకున్నారు’’ చెప్పింది మిసెస్ శ్రీవాత్సవ. తనకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా? ‘‘బెదిరింపులకు భయపడడు. చాలా మొండి మనిషి.’’ మిసెస్ శ్రీవాత్సవ చెప్పింది.అభిమన్యు ఆలోచనలో పడ్డాడు. ‘శ్రీవాత్సవను ఒత్తిడికి గురిచేసిన విషయం ఏమై ఉంటుంది?’శ్రీవాత్సవ ఫోన్ను అన్లాక్ చేసి; ఫోన్ డేటాను పరిశీలించాడు. అనుమానించదగినది ఏదీ కనిపించలేదు. చాంబర్లో అనుమానం కలిగించేవేవీ కనిపించలేదు. స్టాఫ్ను విచారించాడు. అభిమన్యు దృష్టి ‘కీ చైన్’ మీద పడింది. శ్రీవాత్సవ పిడికిట్లో వుంది. సిక్స్ నైన్ అనే అంకెలు ఉన్న కీ చైన్. ఎలాంటి కీ లేదు.ఆ కీ చైన్ మిసెస్ శ్రీవాత్సవకి చూపించి, ‘‘దీని గురించి చెప్పగలరా?’’ అని అడిగాడు.‘‘లాస్ట్ వీక్ స్విట్జర్లండ్ వెళ్లినప్పుడు తెచ్చుకున్నాడు. అంతకు మించి విశేషమేమీ లేదు’’ చెప్పింది మిసెస్ శ్రీవాత్సవ.‘‘కేసు క్లోజ్ చేయాల్సిందేనా?’’ కమిషనర్ అడిగాడు.‘‘కేసు ఇప్పుడే మొదలైంది’’ అంటూ అభిమన్యు కీ ఎక్కడ కొన్నదో చెక్ చేశాడు. ఆ చైన్ శ్రీవాత్సవ క్యాష్ పే చేసి కొన్నట్టు తేలింది. అవి ప్రత్యేకంగా ఆర్డర్ చేసి, తమ లక్కీ నంబర్లు కలిసొచ్చేలా ఆర్డర్ చేస్తారు. ఈ అంకెల్లో ఏదో ఉంది!అభిమన్యు ఆలోచిస్తూనే నేమ్ ప్లేట్ వైపు చూసి వెంటనే మిసెస్ శ్రీవాత్సవకు ఫోన్చేసి, ‘‘క్షమించండి. ఈ టైమ్లో డిస్టర్బ్ చేసినందుకు. మీ వారికి న్యూమరాలజీ మీద నమ్మకం ఉందా?’’ అడిగాడు.‘‘ఉంది. తన పేరును శ్రీవాత్సవ్ గా మార్చుకోవడానికి కారణం అదే...’ అని ఇంకేదో చెప్పబోతుండగా, ‘‘థాంక్యూ’’ అని ఫోన్ పెట్టేసి, కమిషనర్ వైపు తిరిగి ‘‘అర్జెంట్ గా స్విట్జర్లాండ్ వెళ్ళాలి... ఈ సిక్స్ నైన్ కీ చైన్కు, స్విట్జర్లండ్కు సంబంధం ఉంది.. నైన్ అంకె శ్రీవాత్సవ పేరు.. సిక్స్ అంకె...’’ అని ఆగి, వెంటనే ‘‘గాటిట్...’’ అని కమిషనర్ వైపు తిరిగాడు.‘‘శ్రీవాత్సవ ఒక్కడే స్విట్జర్లండ్ వెళ్లాడు. బిజినెస్ పనిమీద కాదు. స్విస్ బ్యాంకులు శ్రీవాత్సవలాంటి బిలియనీర్లకి కామధేనువులు. శ్రీవాత్సవ తెలివైన వ్యాపారవేత్త. సిక్స్ అంకె ‘లాకర్’ను సూచిస్తుంది. ఏదో క్లూ కీ చైన్లో ఉంది.’’ అన్నాడు.స్విట్జర్లండ్...మిసెస్ శ్రీవాస్తవ తరఫున లీగల్ డాక్యమెంట్లు సమర్పించడంతో స్విస్ బ్యాంకు లాకర్ను ఓపెన్ చేశారు.లాకర్లో విదేశాల్లో కొన్న ఖరీదైన ఫోన్. అందులో ఒకే కాంటాక్ట్– సెక్రటరీ మాయ నంబర్. శ్రీవాత్సవ రికార్డ్ చేసిన వాయిస్.‘‘మీరు నా వాయిస్ వినేసరికి నేను ఈ లోకంలో ఉండకపోవచ్చు. నేను నా అంతరాత్మకు తప్ప ఎవరికీ భయపడను. ఒక బలహీన క్షణంలో సెక్రటరీతో నా సంబంధం నన్ను ట్రాప్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్తగా నాకున్న పరిచయాలు వాడుకోవాలని చూసింది. మేము సన్నిహితంగా ఉన్న వీడియోలు పంపి బ్లాక్ మెయిల్ చేసింది. హోంమంత్రిని, రక్షణ శాఖ అధికారులను పరిచయం చేయమంది. లేకపోతే వీడియోలు బహిర్గతం చేస్తానని బెదిరించింది. వీడియోలు బయటకు వస్తే నా కంపెనీ షేర్లు పడిపోతాయి. నా సంస్థల మీద ఆధారపడ్డ వేలాది కుటుంబాలు వీధిన పడతాయి. అలా అని దేశ రక్షణను పణంగా పెట్టను. నా మరణాన్ని పరిశోధించడానికి మీరొస్తారని తెలుసు...’’ ఒకవిధంగా శ్రీవాత్సవ మరణవాంగ్మూలం.శ్రీవాత్సవ స్విట్జర్లండ్కు రావడానికి కారణం తెలిసిపోయింది. అప్పటికే పారిపోయే ప్రయత్నంలో ఉన్న మాయను అరెస్ట్ చేశారు. అభిమన్యు సూచన మేరకు శ్రీవాత్సవ సెక్రటరీ మాయ– అతడు మరణించిన విషయం తెలుసుకుని, అతని కోటు జేబులో ఉన్న డబ్బు దొంగిలించి పారిపోతూ సీసీ కెమెరాలకు చిక్కింది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు’’ అన్న వార్త మీడియాలో ఫ్లాష్ అయ్యింది.ఎన్ఐఏ కార్యాలయం..మాయ ఎదురుగా అభిమన్యు.‘‘చాలా సిల్లీ పెట్టీ కేసు కదూ! నువ్వు బయట కనబడితే జనం, పోలీసులు వదలరు. నీ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. రికార్డుల్లో లేని ఖైదీవి. నీ కోసం మీ వాళ్ళు కూడా గాలిస్తారు. లైఫ్లో హనీ ట్రాప్ చేయకుండా, శ్రీవాత్సవ ఆత్మ శాంతించేలా నీకు ఈ శిక్ష ...’’అభిమన్యు ఇంటరాగేషన్ సెల్ నుంచి బయటకు నడిచాడు. -
ఈ వారం కథ: పోడుస్తున్న పోద్దు
‘‘నువ్వెప్పుడైనా నిలువుటద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకుంటావా?’’ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పార్కుకి తీసుకువచ్చి, అవీ ఇవీ చెపుతూ వున్నట్టుండి ఇలా వ్యక్తిగతమైన ప్రశ్న వేసిన తులసి కేసి ఆశ్చర్యంగా చూసింది ప్రగతి.‘‘అద్దంలో చూసుకోవడం రోజూ అందరూ చేసే పనే కదా? నా గురించి ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావ్?’’‘‘నువ్వు ప్రత్యేకం కాబట్టి. నిన్ను చూసుకుని నువ్వే మోహించేటంత, ముట్టుకొంటే డాగు పడేటంత అపురూపమైన అందాన్ని నీకు భగవంతుడిచ్చాడు. సినిమాతారలకు మించిన సహజ సౌందర్యం నీది. కానీ ఏం లాభం? దాన్ని అడవికాసిన వెన్నెల చేస్తున్నావ్. ఈ వయసులో ఓ బాయ్ఫ్రెండు, బాడీగార్డు, ప్రేమ – దోమ ఎఫైరూ –ఎంజాయ్మెంటూ, థ్రిల్లూ – గిల్లూ... ఇలాంటివేం లేకుండా జీవితాన్ని చప్పగా గడిపేస్తున్న నిన్ను చూస్తుంటే ఆశ్చర్యమే కాదు – జాలేస్తోంది కూడా...’’‘‘తులసీ, ఇలా క్లాస్ పీకడానికా నన్నిక్కడికి తీసుకొచ్చింది?’’ ప్రగతి అసహనంగా చూసింది.‘‘సారీ, నీ మంచి కోరి చెబుతున్న నన్నర్థం చేసుకో. ‘ఓ ప్రేమ లేఖ – ప్రపోజలూ, అచ్చటా – ముచ్చటా దేనికీ నోచుకోని దరిద్రగొట్టు బతుకుల్ని మాకెందుకిచ్చావు దేవుడా!’ అని ఏడ్చే నాలాంటి అమ్మాయిలు ఎందరున్నారో నీకు తెలియదు. ఎందుకంటే కొమ్ములు తిరిగిన కుర్ర హీరోలు వెర్రివాళ్ళలా వెంటపడుతున్న అదృష్ట జాతకురాలివి నువ్వు. కానీ దేవుడు నీకు యిచ్చిన వరానికి ఏమాత్రం గర్వపడక ఇంత రిజర్వ్డ్గా మడిగట్టుకుని ఉండడానికి కారణం తెలుసుకుందామని, ఇలా వసంతంలాంటి వయసును వ్యర్థం చేసుకుంటే, ఆ తర్వాత పోగొట్టుకున్న దానికోసం ఎంత పరితపించినా ప్రయోజనం ఉండదని చెప్పడానికే...’’‘‘చెప్పింది చాలు. నా బుర్ర తినకు. నేనే పొరపాటూ చేయడం లేదు. నా తీరు, నా దారి చాలా తృప్తికరంగానూ. ప్రశాంతంగానూ వున్నాయి.’’ ‘‘కాదు. నువ్వు ఆత్మవంచన చేసుకుంటూ అబద్ధాలు చెబుతున్నావ్. నీ మనస్సాక్షిగా నిజం చెప్పు. నీకు ఎప్పుడూ శృంగారపరమైన ఊహలూ, కవ్వించే కలలూ రావడం లేదూ? ఒంటరిగా ఉన్నప్పుడు వయస్సు పోరుతో మానసికంగా పులకింతలూ, గిలిగింతలూ కలగడం లేదూ? అబ్బాయిలు నీకేసి అదే పనిగా ఆరాధనాపూర్వకంగా చూస్తూంటే నీకే ‘ఫీలింగ్స్’ కలగడం లేదంటే నేను చస్తే నమ్మను...’’‘‘నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కొచ్చిన నష్టం లేదు. అనవసరమైన విషయాలు ప్రస్తావించి నన్ను విసిగించకు’’‘‘పిచ్చి పిల్లా, నేను చెప్పేవన్నీ వయోధర్మాలు, మర్మాలూ! కాని, సర్వసామాన్యమైన పచ్చినిజాల్ని ఒప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావ్. ఈ కాలంలో హైస్కూల్ దశలోనే ఆడపిల్లలు ప్రేమపిచ్చితో రెచ్చిపోతూ మొబైల్స్ని వదలడం లేదంటే – ఇంజనీరింగ్ ఫైనల్కొచ్చి నువ్వింత బుద్ధిగా వుండడం సాధ్యమా? నువ్వు మరోలా అనుకోకపోతే నిన్నో ప్రశ్న సూటిగా అడుగుతున్నాను – ఇంతవరకు ఏ మగధీరుణ్ని చూసినా నీ మనస్సు చలించలేదా? నా మీద ఒట్టేసి చెప్పు’’లేదన్నట్టు ప్రగతి అడ్డంగా తల ఆడించింది.‘‘యూ ఆర్ రియల్లీ గ్రేట్. అయితే నువ్వెంతగా పట్టించుకోకపోయినా నీ లాంటి అందాలరాశికి నిన్ను వెంటాడే మృగాళ్ల వల్ల ముప్పు రావచ్చు. మనం తరచుగా వార్తల్లో చూస్తున్నాం కదా! ప్రేమను అంగీకరించని నేరానికి ఎంతమంది అమాయక యువతులు యాసిడ్ దాడులకు, కత్తిపోట్లకు, అఘాయిత్యాలకు బలి అవుతున్నారో! అందుచేత నీలాంటి బుద్ధిమంతురాలికి భద్రత అవసరం. ప్రేమరొంపిలో దిగమనను కాని, నువ్వంటే పడిచచ్చే బకరాల్లో ఒకణ్ణి ఎంచుకొని ఊరిస్తుంటే చాలు నీ రక్షణ సంగతి వాడు చూసుకుంటాడు...’’‘‘తులసీ, నాకిలాంటి చెత్త సలహాలివ్వకు ఏకపక్షంగా నా జోలికి ఎవరొచ్చినా. ఆ పోకిరీగాళ్లకు బుద్ధి చెప్పగలననే ధైర్యం నాకుంది...’’ ప్రగతి మాటల్లో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోంది.‘‘సెభాష్. నువ్వు నాకు నచ్చావ్. అలాగే మా అన్నకూ తెగ నచ్చేశావ్..’’‘‘మీ అన్నెవడు? అతగాడికి నాకూ ఏం సంబంధం?’’ ప్రగతి ప్రశ్నల్లో కరకుదనానికి తులసి తుళ్లిపడింది.‘‘కోప్పడకుండా పూర్తిగా విను. మా అన్నంటే నా కజిన్. పేరు భూపతి. నా కోసం కాలేజీకి వచ్చినప్పుడెప్పుడైనా చూసుంటావ్. అచ్చం సినిమా హీరోలా వుంటాడు. ఆపైన కోటీశ్వరుడు. ఈ నెక్లెస్ మొన్న రాఖీ కట్టిన సందర్భంగా వాడిచ్చిందే...’’‘‘అయితే ఏమిటి? సూటిగా చెప్పు’’ ప్రగతి మొహం ఎర్రబడ్డం తులసి గమనించింది.‘‘కూల్ డౌన్ ప్రగతీ. ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడైన మా అన్న మీద పడుతున్న వాళ్లందరినీ కాదని నువ్వంటే ఇష్టపడుతున్నాడు.వాడెంత మర్యాదస్తుడంటే – నీ ఎదుటపడి ‘ఐ లవ్ యు’ అని చెప్పలేక నిన్ను పరిచయం చేస్తే చాలని నన్ను చంపుకొని తింటున్నాడు...’’‘‘అర్థమైంది. ఇదన్నమాట అసలు సంగతి. ఈ విషయం చెప్పడానికా ఇంత ‘బిల్డప్’ ఇచ్చావ్? మీ అన్నకు నిర్మొహమాటంగా చెప్పు. నా మీద ఎలాంటి పిచ్చి భ్రమలూ పెట్టుకోవద్దని!, అతను అపర కుబేరుడైనా, నలకూబరుడైనా నా మనసు చలించదనీ, ప్రేమ నాకు ఆమడ దూరమనీ! పాపం మీ అన్నకు దూతికగా నువ్వు చాలా శ్రమపడ్డావు చాలు. ఇక పద క్లాసుకు టైమవుతోంది...’’ అంటూ విసుగ్గా విసురుగా పైకి లేచింది ప్రగతి. ఆమె నిగ్రహానికి, మనోబలానికి విస్తుపోయిన తులసి ఇంకేం చెప్పినా వినదని మౌనంగా ప్రగతి వెంట కాలేజ్ వైపు నడిచింది...ఎంత నచ్చజెప్పినా, బతిమాలినా కనీసం భూపతి ఎదుటపడ్డానికి కూడా అంగీకరించని ప్రగతి దృఢవైఖరి తులసి అహాన్ని దెబ్బతీసింది. భూపతి మెప్పు కోసం అతణ్ణి ప్రగతిని నీడలా వెంటాడమని, అందుకు తాను సహకరిస్తానని తులసి అతనికి మాటిచ్చి ప్రోత్సహించింది. తులసి కోసమనే వంకతో తరచుగా కాలేజీకి వస్తూ భూపతి ప్రగతి పెడమొహం పెట్టినా పరిచయం చేసుకున్నాడు. ఎన్నోసార్లు తన కారులో ‘లిఫ్ట్’ ఇచ్చే భాగ్యాన్ని ఇమ్మని ప్రాధేయపడ్డాడు, బలవంతపెట్టాడు కూడా. పిక్నిక్కనీ, కార్తిక వనసమారాధనకనీ, పుట్టిన రోజనీ... ఇలా వివిధ సందర్భాలకు తులసితో కలిసి ఆహ్వానించినా, అన్నిటినీ ప్రగతి తిరస్కరించింది. ప్రగతి సినిమాకో, షాపింగ్ కో, ఏదైనా సభకో... ఎక్కడికెళ్లినా ఆ సమాచారం ముందుగా తెలుసుకొని అక్కడ ప్రత్యక్షమై అతి మర్యాదలు చెయ్యబోయే భూపతిని ఆమె కటువుగా హెచ్చరించింది. తులసి పుట్టినరోజు వేడుకకు మాత్రం స్నేహితురాళ్ల బలవంతం మీద వాళ్లతో కలిసి వెళ్లిన ప్రగతికి అక్కడ కూడా భూపతి పీడ తప్పలేదు. ప్రగతికి అతి ప్రాధాన్యమిచ్చి, పాడడం రాదన్నా పాటలు పాడమని వేధించి, వద్దంటుంటే చనువుగా కేకు తినిపించి, ఆమెకు ప్రత్యేకంగా వీడియో ఏర్పాటు చేసి, అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న భూపతి హింసను భరించలేక – తలనొప్పి సాకుతో మధ్యలోనే ప్రగతి అక్కణ్ణుంచి వెళ్లిపోయింది. కారులో డ్రాప్ చేస్తానని భూపతి వెంటబడితే ఆమె అందరిముందు చీదరించుకోవడంతో ఆ పురుష పుంగవుడికి తల కొట్టేసినట్టయింది. ఆ సంఘటనతో అతను తోక తొక్కిన త్రాచులా రెచ్చిపోయాడు. కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఆమెను ఫ్రెండ్స్ ముందు అసభ్య పదజాలంతో వేధించడమే గాక ఆమె శీలం మీద బురద చల్లే పుకార్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేయించాడు.భూపతి ఆవూళ్లో రెండు థియేటర్లు, జిల్లా అంతటా పెట్రోలు బంకులూ, మద్యం దుకాణాలూ వగైరావున్న సంపన్నవ్యాపారి శ్రీపతి ఏకైక పుత్రరత్నమనీ, పోలీసులను కూడా శాసించే యువ రాజకీయవేత్తనీ, అతనికి లేని వ్యసనం లేదనీ తెలిసిన ప్రగతి అతని వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడి, అతని సంగతి తనను పెంచి పెద్దచేసిన అమ్మమ్మ అనసూయమ్మ చెవిన వేసింది. ఆవిడ కంగారుపడి ఎప్పటి నుంచో అనుకుంటున్న దగ్గర సంబంధం – సాఫ్ట్ వేర్ ఇంజినీరు, అన్ని విధాలా యోగ్యుడు అయిన వివేక్తో పెళ్లి నిశ్చయించి, ముహూర్తం కూడా పెట్టించింది.తులసి ద్వారా ప్రగతి పెళ్లి వార్త తెలిసిన భూపతి తనకు దక్కని ప్రగతిని ఎవరికీ దక్కనివ్వనన్నాడు. దారికాసి ప్రగతిని అటకాయించి మంచిగా తనతో పెళ్లికి అంగీకరిస్తే కళ్లలో పెట్టుకొని చూసుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఆమె ‘ఛీ’ కొట్టి తిరస్కరించడంతో ఇరవై నాలుగు గంటలలోగా ఆమె వివేక్తో పెళ్లి రద్దు చేసుకొని తనకు ఓకే చెప్పకపోతే ఆమె అంతు చూస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులను లెక్కచెయ్యకుండా గడువులోగా ఎటువంటి సమాధానమూ చెప్పని ప్రగతి ముందు అతను ప్రత్యక్షమై కొన్ని ఫోటోలు ఆమె చేతికిచ్చి, ఆ కాపీలు వివేక్కి పంపిస్తానని బ్లాక్ మెయిలింగ్ ఆయుధాన్ని ప్రయోగించాడు. అవి మార్ఫింగ్ చేసిన కొన్ని ప్రగతి అర్ధనగ్న చిత్రాలు, మరికొన్ని ఆమె భూపతి కౌగిలిలో ఉన్నవీ! ఆ ఫోటోలు చూసిన ప్రగతి అగ్నిహోత్రమైంది. ఆమె మనోనేత్రాల ముందు అలాంటి బెదింపులకు బలయిన తల్లి ప్రతిమ దీనగాథ కదలాడింది...ప్రతిమ గోదావరి జిల్లాకు చెందిన సంప్రదాయ కుటుంబం నుంచి పీజీ చెయ్యడానికి వాల్తేరు వెళ్లింది. ఆమె పేరుకు తగ్గ బంగారు బొమ్మ. ఇంట్లో వాళ్లకిచ్చిన హామీకి తలవొగ్గి ఎవరితోనూ ఎటువంటి పరిచయాలు పెంచుకోని ప్రతిమ మంచిగాయని అనే విషయం లేడీస్ హాస్టల్ అంతటికీ తెలిసింది. ఫ్రెండ్స్ బలవంతం మీద యూనివర్సిటీ సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండు మూడుసార్లు పాల్గొన్న ఆమె సమ్మోహన గానం ఆమెను అభినందించడానికి వచ్చిన మోహన్ని పరిచయం చేసింది. అతను ఇంజినీరింగ్ విద్యార్థి. పాటలు రాయడమే కాకుండా మధురంగా స్వరకల్పన చేయగల సంగీతజ్ఞుడుగా అప్పటికే అతనికి కేంపస్లో మంచిపేరుంది. క్రమంగా అతని పాటల్ని ఆమె పాడ్డం, పరస్పర ప్రశంసలు – వాళ్ల ప్రేమకు దారి తీశాయి. వలపు చిగురించి, ప్రేమలేఖలు పుష్పించి, వాళ్ల అనుబంధం మధుమాసమై పరిమళించింది. ఇటు భీమిలి బీచ్ నుంచి అటు సింహాచలం వరకు ఎందరో ప్రేమికుల్ని చూసిన సంకేత స్థలాలన్నీ వాళ్ల ప్రణయానికి విహారవేదికలయ్యాయి. ‘మరో చరిత్ర’లో బాలు–స్వప్నల్లా రాళ్ల మీద కాకపోయినా ఆ ప్రేమ జంట ఇసుకలో తమ పేర్లను ఎన్నోసార్లు రాసుకొన్నారు...ప్రతిమ మోహన్ల ప్రేమాయణానికి అసూయపడిన ప్రతిమ రూమ్మేట్ రజని ఆ సంగతిని ప్రతిమ తల్లిదండ్రులకు తెలియపరచింది. అప్పటికే గాలివార్తను విన్నా, ప్రతిమ మీద నమ్మకంతో దానిని పట్టించుకోని వాళ్లు రజని ఇచ్చిన సమాచారంతో ఆ పొగ వెనక నిప్పు వుందని నిర్ధారించుకొని ఆగమేఘాల మీద వాల్తేరు వెళ్లి, ఉన్నపళంగా ప్రతిమను ఇంటికి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా కూతురు గోడు వినకుండా ఆమెను ప్రభాకర్ అనే ఇంజినీరుకిచ్చి ఆ మూడు ముళ్లూ వేయించి, ఊపిరి పీల్చుకున్నారు. క్రమంగా ప్రభాకర్ సాహచర్యంలో సంసార పర్వంలో ఏ లోటు లేని ప్రతిమ గతాన్ని, మోహన్ని పూర్తిగా మర్చిపోయింది. ఓ ఆడపిల్లకు తల్లయింది.నాలుగేళ్లు ఆనందంగా గడిచిన తర్వాత అనూహ్యంగా ఆ ఇంటిలో మోహన్ ప్రత్యక్షమయ్యాడు. ప్రభాకర్ పనిచేస్తున్న ఆఫీసుకు కొత్తగా వచ్చిన అతణ్ని ఆయన లంచ్కి పిలిచాడట! తనెవరో ఎరగనట్టున్న ప్రతిమను చూసి మోహన్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ప్రభాకర్ లేని సమయంలో వచ్చి గతాన్ని గుర్తుచేశాడు. ప్రతిమకేమైందో తెలియక ఆమె కోసం ఎదురు చూసి చూసి చివరకు కల్లబొల్లి కబుర్లతో తనకు చేరబడిన రజనినే పెళ్లిచేసుకున్నాననీ, కాని ఆమె నరకాన్ని చూపిస్తోందనీ ఆమెకు విడాకులిచ్చి తిరిగి ప్రతిమను చేసుకుంటాననీ ప్రపోజ్ చేశాడు. చేజారిన పెన్నిధి అదృష్టం కొద్దీ తిరిగి ఇలా కంటపడిందనీ, తను చెయ్యని తప్పును అర్ధం చేసుకొని తమ ప్రేమకు ప్రాణం పొయ్యమనీ అర్థించాడు. అతని రాకకూ కోరికకూ అప్రతిభురాలైన ప్రతిమ అతనికి చేతులెత్తి దణ్ణంపెట్టి పచ్చని తమ సంసారంలో చిచ్చు పెట్టవద్దనీ, తనను మరచిపొమ్మనీ వేడుకొంది. కాని అతను పట్టువిడిచి పెట్టకుండా ఆమె తనతో రావడానికి అంగీకరించకపోతే తను భద్రంగా దాచివుంచిన ఆమె ప్రేమలేఖల్ని ప్రభాకర్కి చూపిస్తానని బెదిరించాడు. మోహన్తో ఎప్పుడూ హద్దు మీరకపోయినా అతని బ్లాక్ మెయిలింగ్కి భయపడిపోయిన ప్రతిమ పసిగుడ్డును తల్లి చేతుల్లో పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది!తనకు యుక్తవయసు వచ్చిన తర్వాత తల్లి మరణ రహస్యాన్ని చెప్పిన అమ్మమ్మ ఆ అనుభవం నేర్పిన పాఠంతో ఎన్నడూ ప్రేమవ్యవహారంలో చిక్కుకోనని తన చేత ఒట్టేయించుకొంది. నాన్న స్పందన తెలుసుకోకుండానే ‘అమ్మ అనవసరంగా ఉద్రేకపడింది. అప్పటి కథ పునరావృతం కాకూడదు. నేను అమ్మలా చేయని తప్పుకు బేలనై బెదిరిపోక, ఈ తరం స్త్రీ అబల కాదనీ చీకటిని చీల్చుకొని వచ్చే పొడుస్తున్న పొద్దు లాంటిదనీ నిరూపిస్తాను. భూపతి ఆట కట్టిస్తాను..’ అని దృఢమైన నిర్ణయాన్ని తీసుకొని ధైర్యంగా నేరుగా కాబోయే భర్త వివేక్ దగ్గరకు వెళ్లింది. భూపతి బ్లాక్ మెయిలింగ్ గురించి చెప్పి ఆ ఫోటోలను సిగ్గుపడకుండా అతనికి చూపించింది. నిజానిజాలను తెలసుకొని తన నిజాయితీ పట్ల నమ్మకముంటే మాత్రమే తనను పెళ్లి చేసుకోమని, నిర్ణయాన్ని అతనికే విడిచి పెడుతున్నాననీ నిర్భయంగా చెప్పింది. ప్రగతి సాహసోపేతమైన చర్యకు ఆశ్చర్యపోయిన వివేక్ ఆమెకేసి ప్రశంసాపూర్వకంగా చూస్తూ – ‘‘డార్లింగ్, నీ ధైర్యాన్నిఅభినందిస్తున్నాను. నీలాంటి సాహసి అయిన ప్రేయసి తోడుంటే జీవితంలో నాకు అసాధ్యాలుండవు. నిన్ను నిస్సందేహంగా నా దానిని చేసుకుంటాను. పద, ఈ ఫొటోలు స్టేషన్లో చూపించి ఈ దారుణానికి కారకుడైన భూపతిని నిర్భయ కేసు కింద అరెష్టు చేయిద్దాం...’’ అంటూ ఆమెకు చేయి అందించాడు. ప్రగతి ఆనందంగా అతని చేతినందుకొని ముందుకు నడిచింది...! -
కథాకళి: కొత్త పొరుగు
మా పై ఫ్లాట్లోకి ఎవరో కొత్తగా అద్దెకి వచ్చారు. పైనుంచి చప్పుళ్ళు వినిపించసాగాయి. ‘‘నిన్న రాత్రి ఆ చప్పుళ్ళకి నాకు నిద్రపడితే ఒట్టు.’’ మర్నాడు మావారికి చెప్పాను.చక్రాల కుర్చీని తోసుకుంటూ బ్రేక్ఫాస్ట్ బల్ల దగ్గరికి వెళ్ళాను. పై ఫ్లాట్ నుంచి వచ్చిన ఆమ్లెట్, చికెన్ సేండ్విచ్లు చూపించి మావారు చెప్పారు. ‘‘అదృష్టం. ఫ్రెండ్లీ పీపుల్.’’రెండు రాత్రుల తర్వాత పై ఫ్లాట్లోంచి మళ్ళీ అరుపులు వినిపించాయి.‘‘భార్యాభర్తల పోట్లాట.’’ మావారు చెప్పారు.‘‘వాళ్ళకి ఫర్నిచర్ సర్దిన అలసట తీరినట్లుంది.’’ నవ్వుతూ చెప్పాను.మరో రెండు రోజుల తర్వాత బ్రేక్ఫాస్ట్ అయ్యాక మావారితో కబుర్లు చెప్తూ కాఫీ తాగసాగాను. డోర్ బెల్ మోగడంతో మావారు వెళ్ళి తలుపు తెరిస్తే ఓ ముప్ఫై ఏళ్ళ యువతి బయట నించుని కనిపించింది. ఆమె చేతుల్లో ఓ పసిబిడ్డ ఉంది.‘‘హలో. గుడ్ మార్నింగ్. మేము మీ పై అపార్ట్మెంట్కి అద్దెకి వచ్చాం. ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉండటంతో ప్రైవసీ బావుందని దీన్ని తీసుకున్నాం.’’ నవ్వుతూ చెప్పింది.‘‘రండి. పాప పేరేమిటి?’’ నవ్వుతూ ఆహ్వానించాను.ఆమె చెప్పాక మావారు నన్ను పరిచయం చేసి చెప్పారు.‘‘థాంక్స్. సేండ్విచెస్ చాలా రుచిగా ఉన్నాయి.’’‘‘మీకు బాగా శబ్దాలు వినిపించి ఉంటాయి. అపాలజీగా వాటిని పంపాను.’’‘‘మీ పిల్లల్ని మా ఆవిడ దగ్గర వదిలి మీరు షాపింగ్కి కాని, ఎక్కడికైనా వెళ్ళచ్చు.’’ మావారు సూచించారు.‘‘ఓ. థాంక్స్. అత్యంత అవసరమైతే తప్ప మీకా శ్రమ ఇవ్వను. మీ కాలికి ఏమైంది?’’ ఆమె నా కాలికి ఉన్న కట్టుని చూసి అడిగింది.‘‘పడ్డాను. సూపర్ బజార్లో పిల్లలు అరటిపళ్ళని నేలమీద పడేశారు. చితికిన అరటిపళ్ళు రోడ్ మీద ఒలికిన ఆయిల్ కన్నా ప్రమాదం. వాటి మీద కాలు వేసి జారిపడడంతో కుడికాలు విరిగింది. ఇంకో మూడు వారాల దాకా అది అతుక్కోదని డాక్టర్ చెప్పాడు.’’ జవాబు చెప్పాను.‘‘అందులో మన అపార్ట్మెంట్కి లిఫ్ట్ కూడా లేదు. ఐయాం సారీ. ప్లీజ్ గెట్వెల్ సూన్.’’ ఆమె చెప్పింది.‘‘తలకి తగలకపోవడం అదృష్టం.’’ మావారు చెప్పారు.∙∙∙ఆ రాత్రి మావారికి పై ఫ్లాట్నుంచి వినిపించే ఏడుపుకి మెలకువ వచ్చి నన్ను లేపారు. అది ఆమె ఏడుపుగా గుర్తించాను. ఆమె భర్త అరుపులు వినిపించాయి. ఆ ఏడుపు కొద్దిసేపు విని ఆయన విసుగ్గా అరిచారు.‘‘ఈ కొత్త పొరుగు న్యూసెన్స్ ఏమిటి? మన సెక్రటరీతో చెప్పి వాళ్ళని ఖాళీ చేయించాలి. నాకు రేపు ప్రజంటేషన్ కూడా ఉంది.’’ కోపంగా చెప్పారు.మర్నాడు ఉదయం మావారు వెళ్ళాక ఇంటర్నల్ ఇంటర్కమ్ మోగింది. ఆమె నుంచి ఆ కాల్. ఇద్దరం ఒకరినొకరం పలకరించుకున్నాక ఆమె అడిగింది.‘‘నేను ఈ సందు చివర కార్నర్ స్టోర్కి వెళ్ళిరావాలి. నేను వచ్చేదాకా మా అమ్మాయిని మీ దగ్గర ఉంచుకుంటారా? సరిగ్గా ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను.’’‘‘తప్పకుండా. తీసుకురండి.’’‘‘నిద్రపోతోంది. లేస్తే ఎవరూ కనపడకపోతే ఏడుస్తుందని.’’వెంటనే చక్రాల కుర్చీలో తలుపు దగ్గరకి వెళ్ళి దాన్ని తెరిచాను. నాలుగైదు నిమిషాల్లో భుజం మీద చిన్నపాపతో ఆమె వచ్చింది. రబ్బర్ షీట్ కూడా తెచ్చింది. గెస్ట్ రూమ్లోని మంచాన్ని చూపించాను.‘‘థాంక్స్ ఎలాట్.’’ పాపని పడుకోబెట్టి వెళ్ళిపోయింది.ఆమె చెప్పినట్లుగా ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది.‘‘మా అమ్మాయి లేవలేదుగా?’’‘‘లేదు.’’‘‘లేవదని తెలుసు. థాంక్స్ అగైన్.’’ కేరీ బేగ్తో పైకి వెళ్తూ చెప్పింది.∙∙∙ఆ రాత్రి పైనుంచి మళ్ళీ మాకు పోట్లాటతో మొదలై కొట్టిన చప్పుళ్ళు, తాగుబోతు మగ గొంతు వినిపించాయి. దాంతోపాటు ఆమె ఏడుపు కూడా.‘‘రేపు ఆ ఇంటాయనకి ఫోన్ చేసి ఈ న్యూసెన్స్ ఏమిటని అడుగుతాను.’’ మావారు కోపంగా అరిచారు.మర్నాడు ఉదయం డోర్ బెల్ మోగింది. చక్రాల కుర్చీని తోసుకుంటూ వెళ్ళి తలుపు తెరిస్తే ఎదురుగా వాచ్మేన్. భయంగా మెట్లవైపు చూపించాడు. లుంగీలోని ఓ ముప్ఫై ఐదేళ్ళ వ్యక్తి ఆఖరు మెట్టు మీద పడున్నాడు. అతని మెడ అసహజ రీతిలో తిరిగి ఉండడంతో అతను జీవించిలేడని గ్రహించాను.‘‘సెక్రటరీని పిలుచుకురా.’’ భయంగా అరిచాను.సెక్రటరీ డాక్టర్కి, పోలీసులకి ఫోన్ చేశాడు. వాళ్ళు వచ్చేలోగా కింది మెట్టు మీద పడున్న అతన్ని పరిశీలనగా చూశాను.అతని అరిపాదాలకి చితికిన అరటిపళ్ళ గుజ్జు అంటుకుని కనిపించింది.చూస్తే పై మెట్ల మీద చాలా చోట్ల ఆ గుజ్జు కనిపించింది!క్రితం రోజు ఆమె నా దగ్గర తన కూతుర్ని ఉంచి షాప్కి వెళ్ళి తెచ్చిన కేరీ బేగ్లో అరటి పళ్ళు చూశానని గుర్తొచ్చింది! -మల్లాది వెంకట కృష్ణమూర్తి -
నా పెంపకంలో ఈ స్థాయికి ఎదిగింది
విజయవాడ దుర్గమ్మపై ‘కనకదుర్గా మహా ప్రభావిత మదనజనక సోదరీ..’ అంటూ గాయని శ్రీలలిత పాడిన పాటను ప్రధాని నరేంద్ర మోదీ ట్యాగ్ చేయడంతో వైరల్గా మారింది. శ్రీలలిత తల్లి భమిడిపాటి సత్యవాణి ఈ సంతోషాన్ని పంచుకుంటూ, శ్రీలలిత చిన్ననాటి నుంచి తను తీసుకున్న జాగ్రత్తలను వివరించారు.‘‘పాప పుట్టినప్పుడు తను ఏ స్థాయికి వెళ్లాలి అనుకున్నానో, ఆమె ఈ రోజు ఆ స్థాయికి చేరుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. బాబు శ్రీనికేత్, తర్వాత శ్రీలలిత. మావారు భమిడిపాటి రాజశేఖర్ బ్యాంకు ఉద్యోగి. ఆయన ఉద్యోగరీత్యా కొన్నాళ్లు బిహార్లో ఉన్నాం. నాకు మా పిల్లల నెలల వయసు నుంచే వారిని సంగీతంలో తీర్చిదిద్దాలనే ఆలోచన ఉండేది. మా పుట్టిల్లు, మెట్టిల్లు వైపు పాతికమంది వరకు సంగీత విద్వాంసులు ఉన్నారు. నేనూ సంగీతం క్లాసులు తీసుకుంటాను. పిల్లలు స్టేజీపైన ప్రదర్శన ఇవ్వడానికి వారిలో భయం ఉండకూడదు. అందుకని, చిన్నప్పుడే బేబీ షోలలో పాల్గొనేలా చేసేదాన్ని. లలితకు ఎనిమిది నెలల వయసులో చీరకట్టి, పెళ్లికూతురులా రెడీ చేసి, బేబీ షోలో స్టేజీపైన నిలబెట్టాను. ఆ వయసులోనే తనకు ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది. కూరగాయలతోనూ డ్రెస్సులు కుట్టి, వేసి, షోలకు తీసుకెళ్లేదాన్ని. నాకు మిషన్ కుట్టడం వచ్చు కాబట్టి పాప డ్రెస్సులన్నీ నేనే కుట్టేదాన్ని. బొమ్మలను తయారుచేసి ఇచ్చేదాన్ని. పాప రెండేళ్ల వయసులో తణుకు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఉద్యోగరీత్యా ఎటు మారినా, ఎక్కడ పిల్లల ప్రదర్శన జరిగినా, అక్కడకు శ్రీలలితను తీసుకెళ్లేదాన్ని. View this post on Instagram A post shared by Srilalitha Gudipati (@srilalithagudipati) ఒడిలో కూర్చోబెట్టుకొని...పాప మూడేళ్ల వయసులో ఓ షోలో పాల్గొనడానికి ఇంగ్లిష్ రైమ్ నేర్పించాను. కాని, అక్కడకు వెళ్లాక లింగాష్టకం పాడింది. ‘మూడేళ్ల వయసులో ఎలా పాడింది’ అంటూ అందరితో సహా నేనూ ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు అనిపించింది. ఉదయాన్నే పూజ చేసేటప్పుడు పాప అటూ ఇటూ వెళ్లకుండా ఒడిలో కూర్చోబెట్టుకొని, శ్లోకాలు, స్తోత్రాలు చదువుతుండేదాన్ని. తను కూడా వాటిని వింటూ, పాడుతూ అమ్మవారికి పూలు పెడుతూ అలాగే కూర్చొనేది. ఒడిలో కూర్చోబెట్టుకొని రోజూ స్తోత్రాలు చదవడం వల్ల, అవన్నీ గుర్తుపెట్టుకుని, అలవోకగా పాడేసిందని అర్థమైంది. ఇక ఆ రోజు నుంచి ‘పాట’ తన చెవిన పడాలి అని తపించేదాన్ని. మూడేళ్ల వయసులోనే...మూడేళ్ల వయసులో నేను తీసుకునే మ్యూజిక్ క్లాస్ తను తీసుకుంటాననేది. నా పని ముగించుకొని, క్లాస్కు వచ్చేసరికి పిల్లలందరినీ కూర్చోబెట్టి, పాడుతుండేది. ఒక సిరీస్ అంతా ఘంటసాల పాటలు పాడించాం. ఇంట్లో ఓ మైకు ఏర్పాటు చేసుకున్నాం. సాయంత్రం అయ్యిందంటే మా అందరి ప్రోగ్రామ్ పాటలే! View this post on Instagram A post shared by Srilalitha Gudipati (@srilalithagudipati)దీక్ష తీసుకునేవాళ్లం..మా బంధువుల్లో చాలా మంది నన్ను కొంచెం విసుక్కునేవారు ‘ఏంటో నువ్వు, పిల్లకు పాత తరంలోలాగా లంగా జాకెట్టు, పెద్ద బొట్టు.. అమ్మాయిని ట్రెండ్కు తగినట్టుగా పెంచడం లేదు..’ అనేవారు. వాటిని పట్టించుకునేదాన్ని కాదు. లలిత అంటే నాకు అమ్మవారు. అలాగే ఉండాలనుకునేదాన్ని. బాలసుబ్రహ్మణ్యం, కోటిగారు ‘లలిత పాడుతుంటే అమ్మవారే పాడుతున్నట్టు’ ఉంది అనేవారు. ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నా, అక్కడకు నేను, మావారు వెళ్లిపోయి, ఓ పక్కన కాళ్లు లాగేస్తున్నా నిల్చుండేవాళ్లం. తను ఎక్కడెక్కడ పాడింది, ఎవరితో పాడింది, ఎవరెవరు తనను ప్రోత్సహించారు– అవన్నీ ఫొటో ఆల్బమ్గా చేసి, తనతో పాటు తీసుకెళ్లి, అక్కడున్నవారికి చూపించేవాళ్లం. సంగీతంలో లలిత ఉన్నత దశకు చేరుకోవాలనే తపన తప్ప మరింకేమీ లేదు. ఇన్నేళ్లలో మేం ఒక్క సినిమాకి వెళ్లింది లేదు, టీవీ చూసింది లేదు, ఒక యాత్రకు వెళ్లింది లేదు. సాధన మానకూడదు..ఏ రియాల్టి షో అయినా నేను, లలితనే వెళ్లేవాళ్లం. షో ముగించుకొని బయల్దేరేసరికి చాలాసార్లు అర్ధరాత్రి దాటిపోయేది. విదేశాలకు, ఏ ఊరు వెళ్లాలన్నా మా వారు వెంట వెళ్లేవారు. ఇంటి దగ్గరే ఉండి, టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి, 90 శాతం మార్కులు తెచ్చుకుంది. సంగీతంలో డిప్లొమా చేసింది. లలిత పుట్టకముందు మా ప్రపంచం సంగీతం. పుట్టాక మా ప్రపంచం అంతా లలితనే అయిపోయింది. తను ఎక్కడా డల్ అవకుండా చూసేవాళ్లం. ఎవరో ప్రోత్సహించడం లేదనో, ప్రైజు రాలేదనో ఆలోచన పెట్టుకోవద్దని, ప్రాక్టీస్ ఎప్పుడూ మానద్దని చెప్పేవాళ్లం. ఆరేళ్లపాటు యూ ట్యూబ్లో..దసరా రోజుల్లో అమ్మవారి దీక్ష తీసుకుంటాను. నాతో పాటు శ్రీలలిత కూడా దీక్ష తీసుకుంటుంది. కరోనా సమయంలో మా అబ్బాయి చెల్లెలి కోసం యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేశాడు. ఆరేళ్లపాటు వరుసగా శ్రీలలితతో సాంగ్స్ చేయించాం. దుర్గా నవరాత్రుల సందర్భంగా చేసిన పాటలకు మంచి పేరొచ్చింది. కాంతారా పాటకు అన్నాచెల్లెళ్లిద్దరూ చాలా కష్టపడ్డారు. View this post on Instagram A post shared by Srilalitha Gudipati (@srilalithagudipati) మా అబ్బాయి మంగళూరులో ధార్మిక పాఠశాలను ప్రారంభించాడు. అమ్మాయి పెళ్లి చేసి, అత్తగారింటికి పంపించాక ఇప్పుడు మా జర్నీని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాం. పిల్లలకు సంగీతం క్లాసులు చెబుతుంటాను. బొమ్మలు చేస్తుంటాను.’’ అని చెప్పారు సత్యవాణి.∙ నిర్మలారెడ్డి -
హెయిర్ కట్.. 2కోట్లు!
జుట్టు ఉన్న ఆమె ఎన్ని ముడులైనా వేస్తుందట....అలానే ఓ యువతి తన కురులను మరింత అందంగా.. ఆకట్టుకునేలా మార్చుకోవాలనుకుంది..దీనికోసం స్టార్ హోటల్లోని ఓ బ్యూటీ సెలూన్కి వెళ్లింది. ఎలా చేయాలో హెయిర్ డ్రెస్సర్కు చెప్పింది. ఇక్కడే కథ అడ్డం తిరిగింది..అందం మాట అటుంచి..ఉన్న జుట్టును కోల్పోయింది. దీంతో తనకు న్యాయం చేయాలని, పరిహారం అందించాలని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. పెద్ద మొత్తంలో పరిహారాన్ని కోరింది..ఏడేళ్ల పాటు ఈ కేసు సాగింది. ఓ హెయిర్ కట్ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు చేరింది..చివరకు పరిహారం విషయంలో కీలక తీర్పుతో కేసు ముగిసింది.ఢిల్లీకి చెందిన ఆశ్నా రాయ్ ఓ కార్పొరేట్ ఉద్యోగి. ఓ ప్రముఖ హోటల్లోని బ్యూటీ సెలూన్కి వెళ్లి...తన జుట్టును చివరి నుంచి నాలుగు అంగుళాలు కత్తిరించాలని చెప్పింది. అయితే, ఆమె చెప్పిన దానికి భిన్నంగా జరిగింది. పైనుంచి కిందికి నాలుగు అంగు ళాలు మాత్రమే జుట్టు మిగిలింది. దీనిపై నిర్వాహకులను నిలదీసింది..‘సర్లే ఎన్నెన్నో అనుకుంటాం..’ అని ఆమె అంతటితో సరిపెట్టుకోలేదు. న్యాయపోరాటం ప్రారంభంఆశ్నారాయ్ 2018లో జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ని ఆశ్రయించింది. సేవల్లో లోపంపై ఫిర్యాదు చేసింది. మానసికంగా తాను పడిన ఆవేదనను వెళ్లగక్కింది. మోడలింగ్, సినిమా రంగాల్లోకి అడుగు పెట్టాలనుకున్నానని..తన జుట్టు కారణంగా ఉన్న ఉపాధి అవకాశాలు పోయాయని, కొత్తవి చేజారాయని ఫిర్యాదులో పేర్కొంది. విచారణ అనంతరం ఆమెకు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని ఎన్సీడీఆర్సీ ఆదేశించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుఆ తీర్పును సవాల్ చేస్తూ హోటల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సేవల లోపంపై కమిషన్ నిర్ధారణను ‘సుప్రీం’ సమర్థించింది..కానీ ‘పరిహారాన్ని కేవలం డిమాండ్ ఆధారంగా కాకుండా, సరైన ఆధారాలతో నిర్ణయించాలని స్పష్టం చేసింది. కేసును తిరిగి కమిషన్కు పంపింది. మరోసారి విచారించి రూ. 2 కోట్ల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని కమిషన్ తీర్పు ఇచ్చింది. సాక్ష్యాలపై సందేహాలుబాధితురాలి వాదనతో యాజమాన్యం ఏకీభవించ లేదు. సమర్పించిన పత్రాలన్నీ ఫొటోకాపీలేనని, వాటికి విశ్వసనీయత లేదని వాదించింది. తనకు జరిగిన నష్టం, మానసిక వేదనకు పరిహారం చెల్లింపులో సాంకేతిక అంశాలు అడ్డంకి కాకూడదని బాధితురాలు వేడుకుంది. తన పత్రాల్లో లోపాలు లేవని పేర్కొంది. తుది తీర్పు.. కీలక సందేశంరూ.కోట్లలో నష్ట పరిహారం కోరినా విశ్వసనీయ ఆధారాలు సమర్పించలేదని ఆశ్నా రాయ్ను ‘సుప్రీం’ తప్పుబట్టింది. ఆమె సమర్పించిన పత్రాల్లోని లోపాలను ఎత్తి చూపింది. ‘‘కేవలం ఊహాగానాలు లేదా వ్యక్తిగత భావాల ఆధారంగా భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించలేం, నష్టం జరిగినట్టు స్పష్టమైన, నమ్మదగిన సాక్ష్యాలు ఉండాలి’’ అని బెంచ్ స్పష్టం చేసింది. రూ. 2 కోట్ల పరిహారం ఆర్డర్ను రద్దు చే సింది. రూ. 25 లక్షలు తుది పరిహారంగా ప్రకటించింది. సేవల్లో లోపం ఉంటే పరిహారం కోరే హక్కు ఉంది..అయితే తగిన, బలమైన సాక్ష్యాలు అవసరమని ఈ తీర్పు స్పష్టం చేసింది. ‘న్యాయం భావోద్వేగాలపై కాదు, ఆధారాలపై నిలబడాలి’ అనే సూత్రాన్ని ఈ కేసు మరోసారి బలంగా తెలియజేసింది. మరోవైపు, ఈ తీర్పు పరిహారం నిర్ణయంలో మార్గదర్శకంగా నిలవనుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అమెరికాకు చెందిన జోనథాన్ లీ రిచెస్ ప్రపంచంలోనే అత్యధిక వ్యాజ్యాలు దాఖలు చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఇతను సుమారుగా 2,600 పై చిలుకు కేసులు వేసినట్టు సమాచారం. ప్రముఖ వ్యక్తులు, సంస్థలపై కూడా కేసులు దాఖలు చేశాడు..అతను బిల్గేట్స్, జార్జ్బుష్ వంటి ప్రముఖులే కాదు.. ఈఫిల్టవర్, చివరికి ఫ్లూటో గ్రహం తనపై ప్రభావం చూపిందని ఆ గ్రహంపై కూడా కేసు వేశాడు. ఇలా నిత్యం ఏదో ఒక కేసు దాఖలు చేసి వార్తల్లో నిలవడంతో గిన్నిస్ బుక్ సైతం ఇతని పేరును రికార్డుల్లోకెక్కించింది.తన ప్రమేయం లేకుండా పేరు నమోదు చేశారంటూ గిన్నిస్ బుక్ నిర్వాహకులపై సైతం రిచెస్ కేసు వేయడం విశేషం. ఎక్కువ కేసులు సరైన ఆధారాలు లేవని, అసంబద్ధంగా ఉన్నాయని కోర్టులు కొట్టేశాయి. అర్థం,పర్థం లేని అంశాలపై కేసులు వేసి కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని తీవ్రమైన హెచ్చరికలు సైతం జారీ చేశాయి. ఓ కేసులో ఇతను శిక్షను సైతం అనుభవించాడు. అతడి మానసిక స్థితి సరిగా లేని కారణంగానే ఈ విధంగా ప్రవరిస్తున్నాడని పలువురు విమర్శించారు. దిలీప్ మాదిరెడ్డి -
పుష్పవిలాసం... ఉద్యాన వినోదం
ప్రకృతి ప్రేమికులకు పండుగ సమయం వచ్చేసింది. టులిప్పూల నేల నెదర్లాండ్స్లోని క్యూకెన్ హాఫ్ గార్డెన్ సందర్శకుల కోసం ముస్తాబయింది. మార్చి 19న ప్రారంభమైన ఈ పూలతోట వేడుకను మే 10 వరకు వీక్షించవచ్చు. పెరటితోట స్థాయి నుంచి ప్రపంచ వేదికగా మారిన ఈ అందమైన పూలవనం చరిత్ర చాలా పురాతనమైంది. ఈ తోట 1949లో చిన్నగా మొదలై, నేటికి 34 హెక్టార్లకు చేరుకుని భూతల స్వర్గాన్ని తలపిస్తోంది.డచ్ భాషలో ‘క్యూకెన్ హాఫ్’ అంటే వంటింటి తోట అని అర్థం. పదిహేనో శతాబ్దంలో కౌంటెస్ జాకోబా వాన్ బీరెన్ తన వంటింటి ఉపయోగం కోసం ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలను పండించేవారు. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు స్థిరపడిపోయింది. ఆమె 1417 నుంచి 1433 వరకు బావేరియా–స్ట్రాబింగ్, హాలండ్, జీలండ్ కౌంటెస్, హైనాట్ కౌంటెస్గా ఉన్నారు. డచ్ ఈస్టిండియా కంపెనీలో కెప్టెన్గా పనిచేసి, 1627లో పదవీ విరమణ చేసిన తర్వాత, ఆడ్రియన్ మార్టెన్ బ్లాక్ క్యూకెన్ హాఫ్ కోటలోకి మారారు. ఆయన విధుల్లో ఉన్నప్పుడే ఈ కోట నిర్మాణానికి పునాది వేశారు. అనంతరం ఎన్నో ఏళ్ల తరువాత 1857లో ప్రసిద్ధ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్లు జాన్ డేవిడ్ జోచర్, అతని కుమారుడు లూయిస్ పాల్ జోచర్ కోట చుట్టూ పార్కును రూపొందించారు. వీరు డిజైన్ చేసిన ఇంగ్లీష్ ల్యాండ్స్కేప్ శైలే నేటి ఆధునిక క్యూకెన్హాఫ్ తోటలకు పునాది.ఈ ఆధునిక క్యూకెన్ హాఫ్ చరిత్ర 1949లో మొదలైంది. అప్పటి లిస్సే మేయర్ నేతృత్వంలో 20 మంది డచ్ పూల పెంపకందారులు ఏకమై, నెదర్లాండ్స్ పూల ఎగుమతులను ప్రోత్సహించేందుకు దీనిని ఒక ప్రదర్శన కేంద్రంగా మార్చారు. మొదటిసారిగా 1950లో ఈ తోటలోకి పర్యాటకులను అనుమతించగా, తొలి ఏడాదిలోనే 2.36 లక్షల మంది సందర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రతి శరదృతువులో 32 హెక్టార్ల విస్తీర్ణంలో, తోటమాలులు 70 లక్షల టులిప్ పూల మొక్కలను ఒక ప్రత్యేకమైన డిజైన్ లో చేతులతో నాటుతారు. ఇందులో సుమారుగా 800 రకాల విభిన్నమైన టులిప్ మొక్కలు ఉంటాయి. వీటిని నాటడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుంది.టులిప్ తోటలతో పాటు క్యూకెన్ హాఫ్లో ఇంగ్లీష్ ల్యాండ్స్కేప్ గార్డెన్, జాపనీస్ ల్యాండ్స్కేప్ గార్డెన్, స్ప్రింగ్ మెడో, నేచురల్ గార్డెన్, చారిత్రక వనాలు, గార్డెన్ మేజ్ వంటి ప్రతి ఏడాది ప్రత్యేకంగా నాటే అనేక అందమైన తోటలు ఉన్నాయి. ప్రకృతి ఒడిలో రంగురంగుల పూల మధ్య ఆహ్లాదంగా గడపాలనుకునే వారికి, చరిత్రను ఆస్వాదించాలనుకునే వారికి క్యూకెన్ హాఫ్ ఒక మరపురాని అనుభూతిని మిగులుస్తుంది. అంతేకాదు నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించే పూల పరిశ్రమకు ఒక సజీవ ప్రదర్శనశాల ఈ ఫ్లవర్ గార్డెన్స్. -
మండుటెండల్లో... అనారోగ్య సమస్యల బారిన పడకూడదంటే..!
వేసవి వచ్చేసింది. ఎండలు చండప్రచండంగా నిప్పులు చెరుగుతున్నాయి. భూతాపం పెరుగుతుండటం వల్ల ఇటీవలి ఏడాదుల్లో వేసవులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. భూతాపం పెరుగుదల ఫలితంగా సముద్రాలు వేడెక్కుతున్నాయి. ఆ ప్రభావం భూమ్మీద ప్రతిచోటా పడుతోంది. నడి వేసవిలో దేశవ్యాప్తంగా పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తాకిడి పెరుగుతున్నాయి. వేసవిలో ఎండల బాధ ఒకవైపు అయితే, మరోవైపు ఎండలతో పాటు ఇబ్బంది పెట్టే రకరకాల ఆరోగ్య సమస్యలు జనాలను సతమతం చేస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే, వేసవి తాపం నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పగటి వేళల్లో ఆరుబయటకు వెళ్లడం క్షేమంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎండల ధాటి ఎలా ఉన్నా, అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగులు, కార్మికులు సహా రకరకాల వృత్తుల్లోని వారు నడివేసవి మధ్యాహ్న వేళల్లో కూడా ఆరుబయటకు వెళ్లక తప్పని పరిస్థితులు ఉంటున్నాయి. వేసవి తీవ్రత నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వేసవిలో వడదెబ్బ బారినపడటం; దాహార్తి తట్టుకోలేక వీథుల్లో అపరిశుభ్ర పరిసరాల్లో దొరికే చెరకు రసం, పండ్లరసాలు వంటివి తాగడం వల్ల జీర్ణకోశ సమస్యల బారినపడటం; ఎండ ధాటికి చర్మం కమిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. వేసవిలో ఎండల ధాటికి తోడు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా జనాలను బాధిస్తాయి.వేసవిలో ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ సోకడం; శరీరమంతా చెమటకాయలు పుట్టుకొచ్చి చర్మం మంటపెట్టడం; విపరీతమైన చెమటల వల్ల ఒంట్లోని నీరంతా బయటకు పోయి డీహైడ్రేషన్ ఏర్పడటం; వేడి వాతావరణంగా అలసట, నీరసం; చర్మంపై ర్యాష్, దురదలు, ఇన్ఫెక్షన్లు పెరగడం; కళ్లు పొడిబారి ఎర్రబడటం, కళ్లకు ఇన్ఫెక్షన్లు ఏర్పడటం; ఎండ వేడి నుంచి సేదదీరడానికి ఈతకొలనుల్లోకి దిగితే, వాటిలోని నీటి కాలుష్యం వల్ల చెవులకు, ఇన్ఫెక్షన్లు సోకడం; ఉబ్బసం రోగులకు సమస్య తీవ్రం కావడం; రకరకాల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావడం; నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం వల్ల రకరకాల జీర్ణకోశ సమస్యలు కలగడం వంటి సమస్యలు బాధిస్తాయి. తగిన ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యలను చాలా వరకు నివారించుకోవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒకవేళ ఈ సమస్యలు తలెత్తినట్లయితే, వెంటనే ప్రాథమిక చికిత్స చేయడం, అవసరమైతే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.వడదెబ్బ బారిన పడొద్దు...వేసవిలో ఎండ వేడి వల్ల తలెత్తే సమస్యల్లో తీవ్రమైనది వడదెబ్బ. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ప్రాంతాల్లో వడదెబ్బ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, ఒక్కోసారి వడదెబ్బ ప్రాణాంతకంగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉండటం, తగినంత నీరు తాగకపోవడం, ధారాళంగా గాలి సోకని ప్రదేశాల్లో ఉండటం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మితిమీరిన శారీరక శ్రమ చేయడం వల్ల వడదెబ్బ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ సోకినప్పుడు తీవ్రమైన జ్వరం రావచ్చు. తలనొప్పి, తలతిరగడం, విపరీతమైన నిస్సత్తువ, అలసట, చర్మం పొడిబారిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం లేదా మలబద్ధకం ఏర్పడటం, గందరగోళానికి లోనవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి రోజూ తగినంత నీరు తాగడం, కొబ్బరినీరు, మజ్జిగ, తాజా పండ్లరసాలు తాగడం మంచిది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ ధరించడం, చలవ కళ్లద్దాలు పెట్టుకోవడం, వదులైన కాటన్ దుస్తులు ధరించడం వల్ల కొంత ఉపశమనంగా ఉంటుంది. వడదెబ్బ ముప్పు తగ్గాలంటే, కెఫీన్ పానీయాలు, మద్యపానం బాగా తగ్గించుకోవాలి.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి వడదెబ్బ సోకవచ్చు. అలాంటప్పుడు వడదెబ్బ సోకిన బాధితులను వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకువెళ్లాలి. ఫ్యాన్ లేదా ఏసీ కింద ఉంచాలి. శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి. చల్లని నీళ్లు లేదా ఓఆర్ఎస్ ఇవ్వాలి. పరిస్థితి తీవ్రమై, స్పృహకోల్పోయే పరిస్థితులు ఉంటే, వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి.జీర్ణకోశ సమస్యలు...వేసవిలోని వేడి వాతావరణంలో వండిన ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండదు. పగలు వండిన ఆహారం సాయంత్రానికే పాడైపోతుంది. అపరిశుభ్ర పరిసరాల్లో ఆహారం వండే టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది. అలాగే, అపరిశుభ్ర పరిసరాల్లోని పండ్లరసాలు, చెరకురసం బండ్ల వద్ద పానీయాలు తాగకుండా ఉండటం మంచిది. అపరిశుభ్ర పరిసరాల్లో పాడైన ఆహారం తీసుకున్నా, పానీయాలు తీసుకున్నా వేసవిలో జీర్ణకోశ సమస్యల ముప్పు ఎక్కువవుతుంది. కలుషిత ఆహార పానీయాల కారణంగా వేసవిలో టైఫాయిడ్, అతిసార వ్యాధులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, ఇంట్లో తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారమైనా ఎక్కువసేపు నిల్వ ఉన్నది తినకపోవడమే మంచిది. తాగే నీరు, తినే ఆహారం స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండేటట్లు చూసుకుంటే వేసవిలో జీర్ణకోశ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఒకవేళ వాంతులు, విరోచనాలు, జ్వరం, తలతిరగడం, నిస్సత్తువ వంటి సమస్యలు తలెత్తితే, డీహైడ్రేషన్ వల్ల నీరసించిపోకుండా ఉండటానికి ఓఆర్ఎస్ తీసుకోవాలి. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు మందులు వాడుకోవడం తప్పనిసరి.వేసవిలో దోమల బెడదవేసవిలో కూడా కొన్నిచోట్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే చోట్ల, పరిసరాల్లో మురుగునీటి గుంతలు ఉండే పరిసరాల్లో దోమలు విజృంభిస్తాయి. వేసవి రాత్రుళ్లలో గాలి సోకడం కోసం చాలామంది ఇళ్ల కిటికీలను తెరిచి ఉంచుతారు. ఇవి దోమలకు రాచమార్గంగా ఉంటాయి. కిటికీలు తెరిచినా, దోమల బెడద లేకుండా ఉండాలంటే, కిటికీలకు దోమలు చొరబడని రీతిలో తెరలను అమర్చుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమ తెరలు వాడాలి. దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరానికి క్రీమ్స్ రాసుకోవాలి. దోమల బారిన పడితే డెంగీ, మలేరియా, చికున్ గున్యాలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యా«ధులు సోకితే జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి.వేసవిలో కంటి సమస్యలువేసవిలో ఎండ తీవ్రతకు రకరకాల కంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండలోని అతినీలలోహిత కిరణాల ప్రభావంతో పాటు దుమ్ము« దూళి కాలుష్యం వల్ల కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, కళ్ల నుంచి నీరు కారడం, తరచుగా పుసులు రావడం, కళ్లు మంటపెట్టడం, కళ్ల వాపు, వెలుతురు చూసినప్పుడు ఇబ్బంది కలగడం, కనుపాపపై పుండుç ఏర్పడం వంటి సమస్యలు కలుగుతాయి. వీటిలో కొన్ని అలెర్జీల వల్ల, ఇంకొన్ని ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు పదేపదే చేతితో కళ్లు రుద్దకుండా ఉండాలి.కళ్లు తుడుచుకోవడానికి శుభ్రమైన పొడి రుమాలు లేదా న్యాప్కిన్ వాడుకోవాలి. కళ్లు బాగా ఎర్రబడటం, పుసులు రావడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కంటివైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవడం మంచిది. వేసవిలో కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అతినీలలోహిత కిరణాలను వడగట్టగలిగే చలవ కళ్లద్దాలను ధరించడం మంచిది. అలాగే, నేరుగా ఎండ కళ్ల మీద పడకుండా ఉండటానికి గొడుగు లేదా టోపీ వాడుకోవడం మంచిది.ఎండల ధాటిని మనం ఎలాగూ తగ్గించలేం. కాబట్టి, ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే చేయగలం. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికి తగినట్లుగా వారికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి ఇంట్లో ఎవరో ఒకరు వడదెబ్బ బారినపడి, తీవ్ర అనారోగ్యానికి లోను కావచ్చు. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఎండల తీవ్రత పెరిగే కొద్ది ఎవరికి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే, ఎండల వేడి వల్ల వచ్చే ఇబ్బందులను పూర్తిగా అధిగమించి, సురక్షితంగా ఉండవచ్చు. చర్మ సమస్యలువేసవిలో ఎండలోని అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మం కందిపోవడం, చెమటలు ఎక్కువై చెమటకాయలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చెమటకాయలను నివారించుకోవాలంటే రోజుకు రెండు మూడుసార్లు శుభ్రంగా స్నానం చేయాలి. శరీరాన్ని పూర్తిగా పొడిగా తుడుచుకున్న తర్వాత వదులుగా ఉండేలా చెమటను తేలికగా పీల్చుకునే కాటన్ దుస్తులు ధరించాలి. ఉక్కపోత ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. ఫ్యాన్, కూలర్ లేదా ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది. అప్పటికీ చెమటకాయలు ఉంటే, ఉపశమనానికి ప్రిక్లీహీట్ పౌడర్ లేదా కేలమైన్ లోషన్ వాడటం మంచిది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా సన్స్క్రీన్ వాడాలి. సన్స్క్రీన్ వల్ల చర్మం కందిపోకుండా ఉంటుంది.రోజూ తగినంత మంచినీరు, కొబ్బరినీరు, పానకం, తాజా పండ్ల రసాలు వంటివి తీసుకోవడం, తేలికగా జీర్ణమయ్యేలా తాజాగా వండిన ఆహారం తీసుకోవడం మంచిది. వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం వల్ల చెమటకాయలే కాకుండా, చర్మానికి రకరకాల ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా ఉంటుంది. రోజూ శుభ్రంగా స్నానం చేయడం, చర్మం పొడిగా ఉండేట్లు చూసుకోవడం, గాలిసోకి చెమటను పీల్చుకునేలా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా చర్మానికి ఇన్ఫెక్షన్లు సోకినట్లయితే, వారు వాడే తువ్వాళ్లు, దుస్తులు వేరుగా ఉంచి, ఉతకడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనలపై తగిన చికిత్స తీసుకోవాలి.వృద్ధులకు జాగ్రత్తలువేసవిలో వృద్ధులు మరింతగా ఇబ్బంది పడతారు. ఎండల ధాటికి వృద్ధులు త్వరగా అలసట చెంది, నీరసించిపోతారు. ఇక డయాబెటిస్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారి పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. వేసవిలో వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్కగలుగుతారు.⇒ వేసవిలో వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్కు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల తరచు మంచినీళ్లు, గ్లూకోజ్, మజ్జిగ, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగడం మంచిది.⇒ చక్కగా గాలి వచ్చే గదుల్లో ఉండాలి. ఫ్యాన్, కూలర్, ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది.⇒ ఎండ తీవ్రత ఉన్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి.⇒ బీపీ, సుగర్ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సూచనపై వేళకు మందులు వేసుకోవాలి.⇒ ఉప్పు, నూనెలు తక్కువగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవాలి.⇒ తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి.⇒ విపరీతంగా చెమటలు పోయడం, తలతిరగడం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి.పిల్లలకు జాగ్రత్తలువేసవి తీవ్రత ఆరోగ్యవంతులైన పెద్దలకే దుర్భరంగా ఉంటుంది. అలాంటప్పుడు వేసవిలో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే, వేసవి తాపం నుంచి పిల్లలకు రక్షణ కల్పించవచ్చు.⇒ పిల్లలు ఆటల్లో పడితే ఆకలి దప్పులను మరచిపోతారు. వేసవిలో దాహంగా ఉన్నా, లేకపోయినా పిల్లల చేత మంచినీళ్లు, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగిస్తూ ఉండాలి.⇒ పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయట ఆటలు ఆడనివ్వకండి.⇒ ఎండ ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీ లేదా గొడుగు వాడాలి.⇒ పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి. ఇంట్లో తాజాగా వండిన ఆహారంతో పాటు పుచ్చకాయలు, కీరదోసకాయలు, పెరుగు వంటివి ఇవ్వడం మంచిది.⇒ పిల్లలకు వేసవిలో తేలికపాటి వదులైన కాటన్ దుస్తులు వేయడం మంచిది.⇒ చెమటకాయల నివారణ కోసం తరచు స్నానం చేయించాలి. స్నానం తర్వాత శరీరం పూర్తిగా పొడిగా ఉండేలా తుడిచాక దుస్తులు తొడగాలి.⇒ పిల్లల్లో అలసట, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఎండ తీవ్రత ఎప్పుడు ప్రమాదకరం?వేసవిలో ఎండ తీవ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినప్పటి నుంచి సమస్యలు పెరుగుతాయి. వేసవి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉన్నప్పుడు బయట ఎక్కువసేపు తిరిగే వారిలో డీహైడ్రేషన్, తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎండల ధాటి 40–45 డిగ్రీలకు చేరుకుంటే, ప్రమాద స్థాయి మరింతగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరినప్పుడు బయట ఎక్కువసేపు ఉంటే త్వరగా అలసట, నీరసం ముంచుకొచ్చి, డీహైడ్రేషన్కు లోనవడం, వాంతులు, తలతిరగడం, వడదెబ్బకు లోనవడం వంటి ప్రమాదాలు తలెత్తవచ్చు.ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లయితే, వడదెబ్బ సోకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. గడచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వేసవి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.5–42.5 డిగ్రీల వరకు; తెలంగాణలో 41.5 నుంచి 43.5 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. విజయవాడ, కర్నూలు, రామగుండం, భద్రాచలం వంటి కొన్ని ప్రాంతాల్లో వేసవి సగటు గరిష్ఠ ఉస్ణోగ్రతలు 45–47 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. అందువల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకినప్పటి నుంచి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. -
ఎనర్జిటిక్ కలర్స్ అవీ!
ట్రెడిషనల్ నుంచి ట్రెండీ మోడ్రన్ లుక్స్ వరకు, ప్రతి స్టయిల్ను తన స్మైల్తో స్పెషల్గా మార్చేసే నటి శ్రీలీల. ఇందుకోసం ఆమె ఫాలో అయ్యే ఆ సింపుల్, స్టయిలింగ్ టిప్స్ ఇప్పుడు మీకోసం!‘డల్ కలర్స్ కంటే వైబ్రెంట్ కలర్స్ నన్ను మరింత ఎనర్జిటిక్గా ఉంచుతాయి. ఒకవైపు ట్రెడిషనల్ లంగా ఓణీ, మరోవైపు మోడ్రన్ కోఆర్డ్ సెట్స్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఇష్టం. కాని, నేను వేసుకునేది ఏదైనా, అది నా డ్యాన్స్ కి అడ్డురాకూడదు. అంత కంఫర్టబుల్గా ఉండాలి. ఇక షూటింగ్స్ వల్ల ఎంత బిజీగా ఉన్నా నా స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండటానికి విటమిన్–సి సీరమ్స్, ఫ్రూట్ జ్యూసెస్ని అస్సలు మిస్ చేయను. అదే నా గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్! – శ్రీలీలజ్యూలరీ బ్రాండ్: కశ్నీవాచీ ధర రూ. 2,999, హ్యాండ్ పీస్ ధర రూ. 2,299, నెక్ పీస్ ధర రూ. 1,299డ్రెస్.. బ్రాండ్: ఛవీ అగర్వాల్ ధర రూ. 40,500స్టయిల్కు సమయం వచ్చింది!చేతిపై ఈ వాచ్ పడితే, అది టైమ్ చెప్పడమే కాదు, స్టయిల్ కూడా చూపిస్తుంది! సాధారణంగా వాచ్ అంటే టైమ్ చూడటానికే అనుకుంటాం, కాని, ఇది ‘ నేను జ్యూలరీ కూడా!’ అని గర్వంగా చెప్తుంది. చిన్న డయల్ చుట్టూ మెరిసే రాళ్లు, నాజూకైన చైన్ డిజైన్ తో చేతికి తొడుక్కున్న క్షణంలోనే లుక్కి స్పెషల్ గ్లామ్ టచ్ వచ్చేస్తుంది. టైమ్ చూసే ముందు, అందరూ మీ చేతినే చూసేలా చేసే చిన్న మాయ ఇదే.ట్రెడిషినల్, వెస్ట్రన్ వేర్, ఆఫీస్ వేర్, పార్టీ వేర్తో ఇలా ఏ సందర్భానికైనా ఇది ఈజీగా సెట్ అవుతుంది. అయితే, జ్యూలరీ వాచ్ వేసుకున్నప్పుడు చేతికి బ్యాంగిల్స్ వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే, ఈ వాచే షో స్టాపర్ కదా! అలాగే, స్లీవ్ కొంచెం పైకి ఉండే డ్రెస్సులు లేదా తక్కువ స్లీవ్ ఉంటే, ఇది మరింత హైలైట్ అవుతుంది. అలా మొత్తానికి, ఈ జ్యూలరీ వాచ్ స్టయిల్కు టైమ్ స్టార్ట్ అయింది! మార్కెట్లోనూ, ఆన్ లైన్ లోనూ ఆక్సిడైజ్డ్, మోడర్న్, ఫంకీ ఏ డిజైన్స్ కావాలన్నా ఇవి సులభంగా లభిస్తాయి. -
అందమైన సైలెంట్ లైఫ్!
గ్లామర్ కంటే నటనకే పెద్దపీట వేస్తూ, రంగుల ప్రపంచంలో తన ప్రయాణాన్ని ఎంతో హుందాగా కొనసాగిస్తున్న తెలుగమ్మాయి నటి ఆనంది. ఆ విశేషాలన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే..నా పేరు అది కాదు..నా అసలు పేరు రక్షిత. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక ‘ఆనంది’గా మారాను. నేను పుట్టి పెరిగింది వరంగల్లో. పక్కా తెలంగాణ అమ్మాయినే అయినా, చెన్నై వెళ్లాక తమిళ సంస్కృతికి కూడా బాగా కనెక్ట్ అయిపోయాను.బాల్యం ఇచ్చిన బలం!చిన్నప్పుడు స్కూల్ ఫంక్షన్లలో స్టేజ్పైకి వెళ్లాలంటే కాళ్లు వణికేవి. అలాంటిది, ఈ రోజు వేలమంది చూసే వెండితెరపై కనిపిస్తున్నానంటే అది కేవలం నాపై నాకు ఉన్న నమ్మకమే. హాస్టల్ లైఫ్లో ఫ్రెండ్స్తో కలిసి చేసిన అల్లరి, రాత్రిపూట దొంగచాటుగా తినడం వంటి చిన్న చిన్న సాహసాలు కూడా నన్ను మానసికంగాస్ట్రాంగ్గా చేశాయి.నా చాయిస్ సైలెంట్ లైఫ్!సినిమాల్లో నేను ఎంత సైలెంట్గా కనిపిస్తానో, నిజ జీవితంలో కూడా అంతే. పార్టీలకు వెళ్లడం కంటే షూటింగ్ అయిపోగానే నా గదిలో ప్రశాంతంగా ఉండటానికే ఇష్టపడతాను. నా ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా చిన్నదే. సోక్రటీస్తో నా వివాహం 2021లో చాలా సింపుల్గా జరిగింది. నా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ లో ప్రొఫైల్లోనే ఉండాలని నేను కోరుకుంటాను.ఒక్క సినిమా, జీవితాన్ని మార్చింది!‘బస్టాప్’ సినిమాతో నా ప్రయాణం మొదలైంది. కానీ ‘కాయల్’ సినిమా నా కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా తర్వాత అందరూ నన్ను ‘కాయల్ ఆనంది’ అని పిలవడం మొదలుపెట్టారు. అది నాకు లభించిన అతిపెద్ద గుర్తింపు.పుస్తకాలే నా ప్రపంచం!నేను ఒక పక్కా బుక్వర్మ్. నా బ్యాగ్లో ఎప్పుడూ ఒక పుస్తకం తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా హారర్, సస్పె¯Œ ్స, థ్రిల్లర్ నవలలంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం.నో డైట్!ఫుడ్లో తెలంగాణ వంటకాలు, ముఖ్యంగా పప్పుచారు అంటే నాకు చాలా ఇష్టం. డైట్ పేరుతో నన్ను నేను కష్టపెట్టుకోను. మితంగా తినడం, సింపుల్గా జీవించడం నా స్టైల్.పవర్ఫుల్ పాత్రలు!సినిమాల్లో ‘విలేజ్ గర్ల్’ పాత్రలే ఎక్కువగా వచ్చినా, ‘జాంబీ రెడ్డి’లాంటి సినిమాలతో నాలోని మరో కోణాన్ని చూపించగలిగాను. నటిగా ఏ ఒక్క ఇమేజ్కో పరిమితం కాకుండా, భవిష్యత్తులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు లేదా ఒక పవర్ఫుల్ పీరియడ్ డ్రామాలో నటించాలన్నదే నా ఆశ. -
ఒక హత్య.. ముగ్గురు హంతకులు
సమయం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు... హైదరాబాద్ శివార్లలోని ఒక విలాసవంతమైన విల్లాలో ప్రముఖ వ్యాపారవేత్త ముఖర్జీ దారుణ హత్యకు గురయ్యాడు. గది లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి, ముఖర్జీ సోఫాలో ప్రాణాలు లేకుండా పడి ఉన్నాడు. అతని మెడపై గట్టిగా నొక్కిన గుర్తులు ఉన్నాయి. హత్యకు గురైంది ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో కమిషనర్ కూడా వచ్చాడు. క్లూస్ టీమ్ తన పని తాను చేసుకుపోతోంది.క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ వైపు చూసి అన్నాడు కమిషనర్... ‘‘మీరు ఎంత త్వరగా కేసు క్లోజ్ చేస్తే అంత మంచిది. ఈ కేసులో అనుమానితులు ముగ్గురు...ముఖర్జీ మేనల్లుడు అజయ్ భారీ అప్పుల్లో వున్నాడు.సెక్రటరీ స్నేహ– ముఖర్జీ తనను ఉద్యోగంలోంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. మరో వ్యక్తి ముఖర్జీ బిజినెస్ పార్టనర్ వినాయక్... ఈ ముగ్గురిలో అసలు హంతకుడు ఎవరో కనిపెట్టాలి.’’ఇన్స్పెక్టర్ విక్రమ్ క్రైమ్ స్పాట్ను నిశితంగా గమనిస్తున్నాడు. టేబుల్ మీద మూడు కాఫీ కప్పులు ఉన్నాయి. కాని, గదిలో ఇద్దరు మాత్రమే ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఏసీ ఇంకా ఆన్లోనే వుంది. గదిలో ఏసీ 16 డిగ్రీల వద్ద ఉంది. ‘‘సర్ ... వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తాగితే ఈ కూల్లో వెచ్చగా ఉంటుంది’’ పనిమనిషి ఏసీ ఆఫ్ చేయబోతుంటే వారిస్తూ అన్నాడు. ఇన్స్పెక్టర్ విక్రమ్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ తెలిసిన కమిషనర్ కాఫీ తీసుకురమ్మని వంటమనిషికి పురమాయించాడు. ముఖర్జీ మేనల్లుడు అజయ్ని గదిలోకి పిలిచాడు. ‘‘మీ మేనమామను చంపాలనే బ్రిలియంట్ థాట్ ఎలా వచ్చింది?’’ సూటిగా చూస్తూ అడిగాడు.‘‘నేను చంపడం ఏంటి సర్! మా మామయ్య చనిపోతే నాకేంటి లాభం? బతికుంటే ఎంతోకొంత చిల్లర అయినా వస్తుంది’’ అని చెప్పాడు. అజయ్ని బయటకు పంపించి సెక్రటరీ స్నేహను పిలిచాడు. ‘‘పనిలో నుంచి తీసేస్తానని వార్నింగ్ ఇచ్చినందుకు లైఫ్లో నుంచే మీ బాస్ను తీసేశావా?’’ ఆమె వైపే చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రమ్.‘‘సర్! నేను ఒక మాములు ఉద్యోగిని. నేనెలా చంపగలను? చంపితే నాకు ఒరిగేది ఏముంది?’’ సెక్రటరీ స్నేహ అంది.‘‘గుడ్ ఆన్సర్... యు మే గో...’’ అన్నాడు.స్నేహ బయటకు వెళ్ళగానే, ఆ గది మొత్తం మరోసారి పరిశీలించాడు. ఏసీ ఆఫ్ చేయడానికి వెళ్లి రిమోట్ తీసుకుని, ఒకసారి ఏసీ వంక చూశాడు. వంటమనిషి కాఫీ తెచ్చింది. కాఫీ తాగి వంటమనిషిని బయటకు పంపించి, మంచం ఎక్కి ఏసీని పరిశీలనగా చూశాడు.ఒక చిక్కుముడి వీడిపోయింది. ఇన్స్పెక్టర్ విక్రమ్ కిందకి దిగి ముఖర్జీ బిజినెస్ పార్టనర్ను పిలిపించాడు.‘‘మిస్టర్ వినాయక్! మీ లాయర్కు ఫోన్ చేస్తే మనం బయల్దేరుదాం’’ అన్నాడు.‘‘ఎందుకు ఎక్కడికి?’’ అయోమయంగా అడిగాడు వినాయక్.‘‘మీ బిజినెస్ పార్టనర్ను హత్య చేసినందుకు’’ అన్నాడు.‘‘ముఖర్జీ మేనల్లుడు అజయ్, సెక్రటరీ స్నేహ అంతా ఒప్పుకున్నారు’’ వినాయక్ వంక చూస్తూ చెప్పాడు.‘‘వాళ్ళ మాటలు విని నన్ను అరెస్టు చేస్తారా? సాక్ష్యం లేకుండా’’ వినాయక్ కోపంగా అన్నాడు.‘‘ఈ సాక్ష్యం సరిపోతుందా? నువ్వూ... అజయ్... స్నేహ కలిసి ముఖర్జీని చంపడం... ఎలాంటి ఎడిటింగులు లేకుండా ఉన్న ఆధారం ఓకేనా?’’ వినాయక్ను అడిగాడు.కమిషనర్ అలానే చూస్తుండిపోయాడు. ‘‘మీరు అన్నంత మాత్రాన అది నిజం అవుతుందా?’’ వినాయక్ అన్నాడు.‘‘అవుతుంది... ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్ ఏసీకి మోషన్ సెన్సార్ కెమెరా ఉంది. అందులో మీ ముగ్గురి ముఖాలు స్పష్టంగా పడ్డాయి. నువ్వు అజయ్ని, స్నేహను ఇరికించాలనుకున్నావు. అజయ్ అప్పులను తీరుస్తానని ప్రామిస్ చేశావు. స్నేహను మంచి జీతంతో నీ దగ్గర సెక్రెటరీగా పెట్టుకుంటానన్నావు.స్నేహ నిద్రమాత్రలు ఇచ్చింది. అజయ్ నువ్వు రహస్యంగా ఇంట్లోకి రావడానికి సహకరించాడు.’’ముఖర్జీ చనిపోతే అతడి అన్ని వ్యాపారాలనూ తన వ్యాపారంలోకి కలిపేసుకోవచ్చని వినాయక్ అనుకున్నాడు.‘‘ముగ్గురూ కలిసి హత్య చేశాక గది లోపల గడియ పెట్టి కిటికీ గుండా బయటకు వెళ్లారు. కాని, వినాయక్ గమనించని విషయం ఏంటంటే, ముఖర్జీ గదిలో ఉన్న స్మార్ట్ ఏసీకి మోషన్ సెన్సర్ కెమెరా! అందులో రికార్డు అయిన వాళ్ళ మొహాలు...’’ అంటూ కమిషనర్ వైపు తిరిగి.‘‘ఇదిగోండి ఎవిడెన్స్ ఒక హత్య... ముగ్గురు హంతకులు.’’హత్య చేసినందుకు వినాయక్ను; డబ్బు మీద ఆశతో సహకరించినందుకు అజయ్ను, క్షణకాలం ఆవేశంతో, స్వార్థంతో చేతులు కలిపినందుకు స్నేహను అరెస్ట్ చేశారు.‘‘థాంక్యూ విక్రమ్! కేవలం గంట వ్యవధిలోనే కేసును మైండ్ గేమ్తో సాల్వ్ చేశావు’’ అభినందిస్తూ అన్నాడు కమిషనర్. -
ఈ వారం కథ: మరణం కంటే భయంకరం ఏమిటో తెలుసా?
దబ్బుమని చప్పుడు వచ్చింది. కొంచెం పెద్దదే. అందరికీ వినపడగలిగేంత పెద్దది. దాని వెంబడి ఒక మూలుగు, ఆర్తనాదం వంటిది. అది కొందరికైనా వినపడే అవకాశం తక్కువ. పద్దెనిమిది ఫ్లోర్ల వంతునున్న రెండు టవర్లు. ఫ్లోరుకు రెండు వంతున మూడు పడగ్గదుల ఇళ్లు. పైచివరి అంతస్తులో పొందికైన పెంట్ హవుసులు చెరొకటి. వెంటిలేషన్ కోసం అన్నట్టుగా రెండు టవర్ల మధ్య ఖాళీ సందు. చుట్టూతా వాహనం తిరగగలిగేపాటి బాట. ఓపాటి గార్డెన్ లాంటి ఏర్పాటు. లోపలకు బయటకు కూడా చూడగలిగేలా సీసీ కెమెరాలను పొదువుకున్న ఎత్తయిన ప్రహరీగోడ. దాని నెత్తిన శిరోభూషణంలాగా ఎలక్ట్రిక్ కంచె. మూడు షిఫ్టుల్లో అప్రమత్తంగా కాపలా ఉండే గార్డుల ఏర్పాటుతో ప్రధాన గేటు. అది ఒక చిన్న కమ్యూనిటీ.మొత్తానికి అక్కడే ఎక్కడో వచ్చింది చప్పుడు.పక్కనున్న ఖాళీ నేలలో బోరు డ్రిల్లింగ్ జరగడం లేదు. ఆకాశం ఉరమడం లేదు. జోరు వాన హోరు లేదు. ఆలయాలూ ప్రార్థనస్థలాల మైకుసెట్లు గొంతెత్తిన పాటలూ పిలుపులూ గాలిసవారీ చేయడం లేదు. పంచభూతాతీతమైన ఎటువంటి శబ్దోపద్రవాలూ ఆ సమయానికి అక్కడ లేవు. అలాగని, ఆ ప్రాంతమంతా నిర్జనంగా ఉందని కాదు– కిక్కిరించని జనసందోహం చెదురుమదురుగా ఒంటరి ఒంటరిగా పరచుకుని ఉన్నారు. పరివేష్టించిన జాగా ట్రాకుగా మార్నింగ్ వాకులు చేస్తున్నారు, పచ్చిక మేటలే మ్యాటుగా దేహాన్ని వంగదీస్తూ, సాగదీస్తూ యోగాది కసరత్తుల్లో మునిగి ఉన్నారు, ఒకరో ఇద్దరో సిమెంటు బెంచీలమీద ప్రాణాల్ని కుదేసి మాటలాడుకుంటున్నారు. కానీ ఆ చప్పుడు ఎవరికీ వినపడలేదు. అలాగని, బధిరులు కాదు, చెవులు దిబ్బెడలు వేయలేదు– అయినా ఎవరూ ఆ చప్పుడు వినలేదు. మరేం చేస్తున్నారు? మెజారిటీ చెవులు వాంఛిత కర్ణభూషణాలతో అలరారుతున్నాయి. ఫోను సంభాషణాలూ, సంగీతమూ, పాటలూ ఆ చెవుల్లోకి ప్రవహిస్తున్నాయి. కొందరి చెవుల్లోకి పక్కనున్నవాడి నోర్లు ప్రవహిస్తున్నాయి. ఆ నోర్లలోకి, ఆ ఇద్దరి సమక్షంలో లేని ఇంకొకరి ప్రెవేటు వ్యవహారాలన్నీ జలలాగా ఊరుతున్నాయి. ఏ ప్రవాహాలూ లేని చెవులు, నిష్క్రియగా పరధ్యానంలో ఉన్నాయి. ఎ..వ్వ..రూ ఆ చప్పుడు వినలేదు. క్షణాలూ నిమిషాలు కాదు, అరగంట గడిచిపోయింది. మైలో: నేను నిద్రలేచినంత మాత్రాన నా దినచర్య మొదలు కాదు. నా యజమాని కూడా లేవాల్సిందే. విశ్వాసం అనే పదాన్ని ముద్దర కొట్టి వదిలేసిన పరాధీన బతుకు. నా పేరు మైలో. కుక్కని. రాట్వీలర్ జాతి నాది. పేరును బట్టి నేను సోల్జర్ని. నన్ను పెంచుకునే అదృష్టాన్ని పొందిన వాడి పేరు రాజేంద్ర. అవును మరి.. అదృష్టం వాడిదే. వాడి మిత్రుల్ని, చుట్టాల్ని పోగేసినప్పుడెల్లా.. నన్ను వాడి హోదాకు ఒక చిహ్నంలాగా ప్రదర్శిస్తాడు. ‘మీ కుక్క భలే ఉంది గురూ’ అంటారు. నా జాతిలో ఏ కుక్కయినా ఒకలాగే ఉంటుంది. నా జాతికుక్కలు మాత్రమే ఎరిగిన వాడికి, బహుశా ఇక్కడి వీధుల్లో ఊరకుక్క ‘భలే’ అనే ఫీలింగిస్తుందేమో. ‘నువ్వు సూపర్ గురూ’ అంటారు రాజేంద్రని.నాలాగా నేను ఉండడంలో, వాడి సూపర్ ఏమిటో నాకు అర్థం కాదు! సరే, విషయానికి వస్తాను. నేను లేచి అరగంటైంది. వాడింకా లేవలేదు. బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాలి. నేను వెళ్లి, రాగలను. కానీ వాడు నన్ను ఒంటరిగా వెళ్లనివ్వడు. తలుపుకు గొళ్లెమే అయితే తీసుకుని వెళ్లేదాన్నేమో.. తాళమూ వేస్తాడు. అందమైన గొలుసు చేతిలో పట్టుకుని నా వెంట నడవడం వాడికి మజా. ఏసీ పడగ్గదిలో సుఖంగానే ఉన్నదిగానీ, దేహం తొందరపెడుతోంది. వాడి పడకమీదికి చేరి, ప్రేమగా చేత్తో నిమిరాను, మెలకువలోకి వచ్చి నన్ను వాటేసుకుని గిలిగింతలు పెట్టాడు. నేను గారాలు పోయాను! మొత్తానికి ట్రాక్ సూటు తొడిగి తయారై నా వెంట వచ్చాడు. ముందు బయటకు తీసుకెళ్లాడు. అవసరం తీర్చుకున్నాను. తిరిగొచ్చాక, రెండు టవర్లను ప్రదక్షిణం చేసినట్టుగా నాలుగు రౌండ్లు తిరిగాం. ఇంకో రౌండు తిరిగితే ఇంట్లోకి తీసుకెళ్లిపోతాడు. కానీ నా కుక్క బుద్ధికి ఏదో తేడా కొడుతోంది. కొంచెం గింజుకున్నాను. నడవకుండా మొరాయించాను. అటుకేసి గొలుసును ఈడ్వడానికి ప్రయత్నించాను. రాజేంద్రకు ఏదో అనిపించింది. అటువైపు ఆడకుక్క ఉందేమో అనుకున్నాడు. ‘యూ నాటీ బోయ్’ అంటూ చిలిపితనం ప్రదర్శిస్తూ వంగి నా మెడపట్టీ దగ్గరున్న క్లిప్ వదిలేశాడు. ఉరికాను. రెండు టవర్ల మధ్య, సన్నని ఇరుకైన చీకటి గుయ్యారం వంటి ఆ సందులోకి. ఫ్లాట్లలో వెంటిలేషన్ కోసం అని ఆ ఖాళీ వదిలారు గానీ, గ్రౌండ్ లెవెల్లో మసగ్గానే ఉంటుందక్కడ.అనుకున్నదానికంటె ఘోరంగా ఉంది. అరమీటరు మందాన కాస్త కుంకుమరంగు ఎరుపుతో పరచుకుని ఉంది. దగ్గరికెళ్లి చూద్దునుకదా.. తల పగిలే ఉంది. మొహానికి దగ్గరగా నా తల నిక్కించి వాసన చూశాను, శ్వాస లేదు. ఎడమకాలిని చాచి చిక్కబడుతున్న ఎరుపుని తడిమాను. జిగటగా తగిలింది. ఇంకా ఎక్కువసేపు స్టడీ చేయాల్సిందేమీ లేదు. కన్ఫర్మ్. ఒక్క పరుగున తిరిగి వెళ్లేసరికి.. ‘అప్పుడే వచ్చేశావా మైబోయ్’ అంటూ రాజేంద్ర గొలుసు క్లిప్ అందుకున్నాడు. తగిలించబోతే వెనక్కు తగ్గి రుంజుకున్నాను. అరుస్తూ, ఆ సందుకేసి గెంతి, ఆగి, రెండుసార్లు అరచి, మళ్లీ రాజేంద్ర కాళ్ల దగ్గరకు వచ్చి, సందు దిక్కుగా తిరిగి తోకాడిస్తూ నిల్చున్నాను. వాడు గ్రహించాడు. గొలుసు తగిలించకుండానే, నా వెనుక వచ్చాడు. చూసిన వాడికి విషయం అర్థమైంది. నేను అరవకుండా తోకాడిస్తూ వాడినే చూస్తున్నాను. నిజంగానే భయపడ్డాడు. పెద్దగా కేక పెట్టాడు.‘‘సె..క్యూ..రి..టీ..’’ఆ చప్పుడుకు– ఈ అరుపుకు మధ్య గంట గడిచింది!సెక్యూరిటీ పోస్టు:‘‘పతా హై.. యే హై కౌన్’’‘‘నహీ సాబ్’’నన్ను ఆశ్రయించి జీవిస్తున్న వాడు.. కనీసం ఆ శవం దగ్గరికెళ్లి మొహం చూసే ప్రయత్నాన్ని, మొహమాటానికైనా చేయకుండానే, జవాబిచ్చాడు. వాణ్ణి తప్పుబట్టలేం. నిజమే చెప్పాడు. వాడికి ఎవ్వరూ తెలియదు. చివరికి ‘పతా హై’ అంటూ అడిగిన వాడితో సహా! జాలిపడ్డాను. మావాడి మీద కాదు. చుట్టుముట్టిన వాళ్లందరి మీద! తమకు రక్షణగా ఎవరుంటున్నారో, వారికి తామెవ్వరో తెలియకపోవడమంత దౌర్బల్యం ఇంకేం ఉంటుంది. నా పేరు సెక్యూరిటీ పోస్టు. నా ఒంటి మీద ‘సెక్యూరిటీ’ అని రాయిస్తే సరిపోయేది. కానీ ‘పోస్టు’ అని కూడా జోడించారు. అదేదో నా కులం తోకలాగా! అందువల్ల నేను పోస్టు డబ్బా కంటె కొంచెం పెద్దదిగా ఉంటాను. ఫోర్ బై ఫోర్ స్క్వేర్ కట్టడం అనుకోండి. ఒకవైపు ద్వారం ఓకే. రెండు వైపుల నిలువెత్తు గవాక్షాలు! ప్రహరీ గేటు వైపుండే గవాక్షానికి వెలుపల ఓ పాత కుర్చీ, బల్ల. దాని మీద విజిటర్సు రిజిస్టరూ, దానికి ప్లాస్టికు దారంతో కట్టిన పేనా, పక్కనే ఇంటర్ కమ్ ఫోనూ. లోపల కిటికీ లేని వైపు యూనిఫాంలు తగిలించే కొక్కేలు. íసీసీ కెమెరాల ఫుటేజీ చూసే టీవీ, వాటిని రికార్డు చేసే హార్డ్ డిస్కు. నెత్తిన నెలవంక లాగా ఒక కెమెరా. ఇదీ నా స్వరూపం. కేక వినపడగానే నా చెంత ఉన్న ఇద్దరిలో ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్లాడు. తర్వాత రెండోవాడిని కూడా పిలిచారు. వాడు కూడా తెలియదనే చెప్పాడు. ఎలా తెలుస్తుంది వాళ్లకసలు? మాది పోష్ డీలక్స్ అపార్టుమెంట్స్ అనే చెప్పాలి. వాచ్మెన్ ఫ్యామిలీకి ఓ చిన్న ఇల్లు వేసి ఇక్కడే కాపురం ఉంచడం, వాడికో ఇస్త్రీ బండి పెట్టివ్వడం వీళ్లకు నచ్చదు. సెక్యూరిటీని ఏజన్సీకి అప్పగించారు. ఆ ఏజన్సీ రోజూ తమ మనుషుల్ని పంపుతుంది. ఒక్కొక్కడికీ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ. రోజుకు నలుగురు వస్తారు. ఒకసారి వచ్చినవాడు మరురోజు వస్తాడని గ్యారంటీ లేదు. వాళ్ల డ్యూటీ గేట్ సెక్యూరిటీ మాత్రమే. పైగా వీళ్లంతా పైనున్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు. మన భాషారాదు, ఇంగ్లీషూ రాదు. ఎవడైనా లోపలకు రావాలనుకుంటే ‘నామ్’ అంటారు.. ‘ఫ్లాట్’ అంటారు.. చెబితే ఆ ఫ్లాట్కు ఇంటర్ కమ్లో కాల్ చేసి చెప్తారు. పంపమంటే, సంతకం చేయించుకుని పంపుతారు.. లేదంటే లేదు అంతే!వాకింగులోని వాళ్లూ, యోగ ముద్రాంకితులూ, ఉదయపు ఎండకోసం వచ్చి తీరిగ్గా కూచుని కబుర్లు చెప్పుకుంటున్నవాళ్లూ.. ఓ యాభైమందికి పైగా ఆ చిన్న ఇరుకు సందులో.. అప్పటికే చుట్టూ చేరారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ చేరినవాళ్లు మొబైళ్లలో పైన తమ ఫ్లాట్స్లోని వాళ్లకు కాల్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరూ వస్తున్నారు. అందరిలోకి కాస్త చొరవగా ఉన్న ఒక మనిషి.. ‘డిడ్ ఎనీ బడీ నో హిమ్.. ఇతనెవరో ఎవరికైనా తెలుసా.. ఇవన్ యారో..’ అని భాషలు మార్చి మార్చి పదేపదే అడుగుతున్నాడు. జవాబు రావడం లేదు. గుమికూడిన జనంలో.. ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నట్టే లేదు.. చాలా వరకు!నా దగ్గరినుంచి వెళ్లిన రెండో సెక్యూరిటీ వాడు కొంచెం నయం.. ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి చూసిన తర్వాత.. ‘‘ఫ్లాట్ తో మాలూమ్ నై సాబ్. యే తో అందర్వాలా హీ హై.. కన్ఫర్మ్’’ అన్నాడు. మహా అయితే అంతా డెబ్భయి ఇళ్లు. అందరూ మహా సంపన్నులు. పెద్దపెద్ద వాళ్లు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా టైం లేని వాళ్లు. ఇక పోయిన ప్రాణాన్ని, జిగటగా గడ్డకట్టిన ఒక చిన్న ఎర్రటి మడుగులో సగం మునిగిన మొహాన్ని ఎలా గుర్తుపడతారు. ఎవరనేది తెలియలేదు. ఎవరో అన్నారు.. ‘కాల్ ది పోలీస్ ఫస్ట్’.చొరవైన వాడే.. మొబైల్ అందుకుని 100 నొక్కాడు.ఆ చప్పుడుకు– ఈ నొక్కడానికి మధ్య గంటన్నర గడిచింది.రక్షక్:నా పేరు రక్షక్. సెక్టార్ వెహికల్ అంటుంటారు నన్ను. 100 నుంచి మా మాధాపూర్ స్టేషన్కు కాల్ వచ్చింది. అక్కడ నుంచి రౌండ్స్లో ఉన్న సెక్టార్ వెహికల్లోకి సెట్లో సమాచారం వచ్చింది. నన్ను అధిరోహించి ఒక హెడ్ కానిస్టేబులు, ఇంకో కానిస్టేబులు మాత్రమే ఉన్నారు. అయినా వాళ్లకు జంకేమిటి? ఎంచక్కా ఇక్కడకు వచ్చేసాం. ఇలాంటివి ఎన్ని చూసి ఉంటారని? ఏమీ జడుసుకోలేదు. ఆశ్చర్యపోలేదు. కాకపోతే, అక్కడ ఏడుపులూ పెడబొబ్బలు లేకపోవడం, అనుభవం కొద్దీ, గమనించి ‘‘ఇంకా ఎవరిదో గుర్తుపట్టలేదా’’ అని మాత్రం అన్నారు. ఆ మాటకు, గుమికూడిన వాళ్లలో ఎవరైనా సిగ్గుపడ్డారో లేదో నేను గమనించలేదు. ‘‘లైబ్రరీలో చూశాను.. ఫ్లాట్ తెలీదు గానీ..’’ అని ఒకే పెద్దాయన అన్నాడు. ఇప్పుడైనా వాళ్లు సిగ్గుపడ్డారో లేదో!మరో అరగంటలో మోటారు సైకిల్పై ఎస్సై కూడా వచ్చేశాడు. అనుభవమే వారికి పనిలో వేగం అందిస్తుందనుకుంటా. ఆయన వచ్చాక టైం వేస్ట్ జరగలేదు. ఆ ఇరుకు సందువైపు ఫేస్ చేస్తూ ఉన్న రెండు టవర్లలోని ఫ్లాట్స్ నంబర్లన్నింటినీ రెండు కాగితాలపై వరుసగా రాశాడు మొత్తం 36 తేలాయి. ఆ ఫ్లాట్స్ వాళ్ళు ఎవరైనా అక్కడ గుమికూడిన జనంలో ఉన్నారేమో అని ఒక్కొక్క నంబరూ ఎలుగెత్తి అరుస్తూ అటెండెన్స్ పిలిచినట్లుగా పిలవసాగాడు. 20 మంది దాకా అక్కడే ఉన్నారు. ఆ నంబర్లు అన్నింటినీ స్ట్రైక్ ఆఫ్ చేసిన కాగితాలను చెరో కానిస్టేబుల్ చేతికిచ్చి రెండు బ్లాకుల్లోని మిగిలిన ఫ్లాట్ల వద్దకు వెళ్లి ఇంట్లో ఎవరైనా కనిపించడం లేదేమో అడిగి రమ్మని పురమాయించాడు.ఆ చప్పుడుకు– ఈ పురమాయింపుకు మధ్య మూడు గంటలు గడిచాయి.కాఫీ కప్పు: ఏ13బీ. కాలింగ్ బెల్ మోగింది. ముందుగదిలోనే కూర్చుని కాఫీ తాగుతున్న అనిల్.. ‘‘అమ్మా వాకింగు నుంచి నాన్నొచ్చినట్టున్నాడు చూడూ’’ అని కేకేశాడు. వంటింట్లోంచి ఆమె వచ్చి తలుపుతీసింది. ఎదురుగా కానిస్టేబులు. విషయం తెలిశాక, ‘కిందికి వెళ్లి చూసొస్తా’నంటూ అనిల్ శాండల్స్లో కాళ్లు పెట్టాడు. ‘వాకింగుకు వెళ్లిన మీ నాన్న కూడా అక్కడే ఉంటాడేమో.. తొందరగా రమ్మను.. ఆయన టిఫినుకు లేటైంది’ వెనుకనుంచి అమ్మణ్ణమ్మ కేకేసింది. ఆ జనంలో ఆయన లేడని ఆమెకు తెలీదు. నా పేరు కాఫీ కప్పు. ఫిల్టర్ కాఫీ నా ప్రత్యేకత. ‘ఆయన’కు శ్రీమతి అందించే ప్రతి ఉదయపు జీవనోత్సాహాన్ని నేనే! ఆయన నాకు కొన్నేళ్లుగా చాలా బాగా తెలుసు. తెల్లారిందని పల్లెకు చెప్పడానికి తాము కూస్తున్నామని కోళ్లు అనుకుంటాయి. ఆకలేసిందని తనకు చెప్పడానికి అవి కూస్తున్నాయని ఆయన అనుకుంటాడు. వాటి కూత పూర్తికాక ముందే లేచి, మేతతో తయారవుతాడు. ఒక్కో గంపను ఎత్తి, కోళ్లను వదులుతూ గింజలు నేలపై చల్లుతూ తన రోజును మొదలెడతాడు. వేసిన గింజలన్నీ తిన్న కోళ్లు తమ స్వప్రయత్నం ప్రారంభిస్తూ పెరటి బాట పట్టేసరికి ఆరుగంటలవుతుంది. గంట కొట్టినట్టుగా అమ్మణ్ణి కాఫీ గ్లాసుతో వాకిట్లోకి వస్తుంది. (అది కూడా నేనే. పల్లెలో నా రూపం గ్లాసే) ఇద్దరూ కలిసి మట్టి అరుగు మీద కూర్చుని కాఫీ తాగుతారు. ఆ తర్వాతే మిగిలిన దినచర్య. అలా బతకడం అలవాటైన ఈశ్వరయ్యని తెచ్చి ఇక్కడ నాలుగు గోడల మధ్య బందీ చేశారు. తారసిల్లిన ప్రతిప్రాణినీ పలకరించుకుంటూ ఊరంతా తిరగడం, గుడికో పొలానికో వెళ్లి రావడం మాత్రమే తెలిసిన ఈశ్వరయ్య కొత్తగా వాకింగ్ నేర్వలేకపోయాడు. ప్రయత్నించాడు గానీ పలకరింపు కూడా ఉండని, మౌన శవయాత్ర లాంటి ఆ నడకలు రుచించక మానుకున్నాడు. ఎప్పుడైనా లైబ్రరీ దాకా వెళ్లి వచ్చేవాడు. ఇంతకుముందు ఎవరో ‘చూసినట్టుగా ఉన్న’దని అనడం అందువల్లే. ఇవాళ కూడా అమ్మణ్ణి ఆరు గంటలకే ఆయన చేతికి నన్ను అందించింది. అనిల్, అతడి భార్య అప్పటికి నిద్ర లేవలేదు. అప్పుడే లేవరు. నన్ను అందించి, ఆమె వంటగది శుభ్రం చేసే పనిలో పడింది. ఆయన నాతో సహా బాల్కనీలోకి చేరాడు. చివరి చుక్క వరకు, నాలోని ఉత్తేజాన్ని ప్రతిసారీ తనలోకి వంపుకునే ఈశ్వరయ్య.. కనీసం నన్ను ఒక్కసారైనా చుంబించకుండా.. పొగలు కక్కుతూ ఆశ్చర్యపోతున్న నన్ను రెయిలింగ్ గోడపై ఒక చివర్న ఉంచాడు. లోపల సుడిగుండాలు. ఎన్నో, ఏవేవో, ఎందుకు, ఎలా తిరుగుతున్నాయో ఎవరికి తెలుసు? నానుంచి కాస్త దూరం జరిగి రెయిలింగ్ మీదుగా ముందుకు వంగాడు. ‘రెయిలింగ్ యోగా’ భంగిమేమో అని నవ్వుకున్నాను, పొగలు కక్కుతూనే. ఇంకొంచెం వంగాడు. ఇంకా వంగాడు. ఇంకా.. వంగాడు! అసలు అది వంగడమేనా? నేను కంగారు పడేలోగానే అది జరిగింది.ఈశ్వరయ్య పైనుంచి కిందికి జారిపోయాడు. నేను నిశ్చేష్టనైపోయాను. పొగలూ చల్లారిపోయి, కాఫీ పొక్కు కట్టింది.కొన్ని క్షణాలకు దబ్బున చప్పుడు వినిపించింది. కొన్ని నిమిషాలకు, ఇప్పుడు, అనిల్ కిందకు వెళ్లిన తర్వాత, ఏడుపు వినిపించింది. నా అంతఃకర్ణాలను గ్రౌండ్ ఫ్లోర్ దాకా రిక్కించాను. వెక్కుతూ వెక్కుతూ ‘‘మా.. నాన్న’’ అంటున్నాడు. నా అంతఃచక్షువులను కూడా కిందికి సారించాను. నాన్న పక్కనే మోకాళ్లపై కూలబడ్డాడు. చుట్టూ ఉన్న గుంపు మొత్తం కాస్త స్థిమితపడ్డారు. అప్పటిదాకా ఉన్న సస్పెన్స్ తీరిపోయినందుకు! ‘‘ఏ ఫ్లాట్?’’ ఎవరిని ఉద్దేశించామనే స్పష్టత లేకుండా అనేక సిగ్గులేని గొంతుకలు గునగున గొణుగుతున్నాయి. కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరకెళ్లి ‘‘ఏ13బీ సార్’’ అనడంలో అందరికీ జవాబు దొరికింది. సస్పెన్స్ తీరిపోయింది గనుక.. ఒకరిద్దరు తమ ఇళ్లకు మళ్లుతున్నారు. ఒకరిద్దరు మళ్లీ చెవులకు తగిలించుకుంటున్నారు. ఈలోగా అంబులెన్సు సైరన్ కూడా వినిపించింది.ఆ చప్పుడుకు– ఈ సైరన్ చప్పుడుకు మధ్య మూడున్నర గంటలు గడిచాయి.గీతామందిరం: నా పేరు గీతామందిరం. ఈ గేటెడ్ ప్రపంచానికి నేనే కమ్యూనిటీ హాలును. నాలుగు అల్మరాలను ఓ మూలగా పేర్చిన లైబ్రరీ అనే పదార్థం కూడా యిక్కడే. పదిరోజుల కిందట తొలుత ఉస్మానియా అంబులెన్సు మీద, తర్వాత వైకుంఠరథం మీద సవారీ వెళ్లిన పెద్దాయన నాకు తెలుసు. ఇవాళ ఆయనకు పెద్దకర్మట. ఇక్కడ నా సమక్షంలో ప్రవచనం ఏర్పాటుచేశారు. ఆత్మానంద స్వామి వచ్చాడు. నీట్గా ట్రిమ్ చేసిన బెత్తెడు గడ్డం, పొందికైన బట్టతలతో ఉన్నాడు. కాషాయాంబరాలు, మెడలో రంగురంగుల పూసలు. దణ్ణం పెట్టించుకోడానికి తగిన గెటప్పులోనే ఉన్నాడు. స్వామీజీ వస్తున్నారని వాట్సాప్ గ్రూపులో బాగా ప్రచారం జరగడం వలన.. చాలా ఫ్లాట్స్ నుంచి మనుషులొచ్చారు. అనిల్ కుటుంబం ఎటూ ఉంది. ఆయన ప్రారంభించాడు.‘‘ఈశ్వరయ్య పరమేశ్వరుడిలో లీనమయ్యాడు. మీరందరూ ఇక్కడ ఉండేవాళ్లే.. కానీ, ఈశ్వరయ్య శివైక్యం చెందిన మూడున్నర గంటల దాకా ఆయన ఎవరో మీలో ఎవ్వరూ గుర్తుపట్టలేదంటే ఎంత సిగ్గు?’’ ఆత్మానంద పాజ్ ఇచ్చాడు.‘అలా గడ్డిపెట్టు వెధవలకి. ముదనష్టపు ప్రపంచం. ఇరుగు పొరుగు ఎవ్వరో తెలియకుండా ఇనుప తెరలు కట్టేసుకున్న ప్రపంచం. హృదయాల్ని హిడెన్ ఫోల్డర్లలో దాచేసి.. కృతకమైన బంధాల్ని, ఉద్వేగాల్ని వెలుపలినుంచి తమపైకి వెల్లువెత్తించుకునే ప్రపంచం! అమానవీయత తమ తరం లక్షణంగా మారుతోందనే స్పృహ కూడా లేని దౌర్భాగ్యపు ప్రపంచం!’ ఆత్మానందకు జేజేలు అనుకుంటూ మిగిలినోళ్లను ఈసడించుకున్నాను నేను. ఆయన కొనసాగించాడు. ‘‘ఇది తప్పు. మనుషుల మధ్య బంధాలు ఉండాలి. సత్సంగాలు జరుగుతూ ఉండాలి. కలుస్తూ ఉండాలి. మీలో మీరు కలవడం కాదు, గురువుల్ని పిలిచి, సద్బోధలు గ్రహిస్తూ ఉండాలి..’’ వీడి పాసుగూల. పెద్దదినాన్ని కూడా మార్కెటింగుకు వాడుకుంటున్నాడే! ‘‘ఈశ్వరయ్య మరణం లాంటిది మరొకటి జరగకూడదు. మంత్రంలాంటి మాట చెబుతాను పాటించండి’’‘నీ మార్కెటింగ్ ఎలా తగలడ్డా పర్లేదుగానీ, మంచి మంత్రం చెప్పు స్వామీ..’ ఆశగా ఎదురుచూస్తున్నాను. ‘‘తమ ఇళ్లలో పెద్దవాళ్లను, ముసలివాళ్లను ‘మెయింటైన్’ చేస్తున్న ప్రతి ఒక్కరూ..’’భళా.. ఇలాంటి పాఠాలే స్వాములనుంచి ప్రపంచానికి అందాలి. నా ఉత్సుకత పెరిగిపోయింది. ‘‘తమ బాల్కనీలకు గట్టి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసుకోండి..’’ ఆత్మానంద ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు. గంట ప్రవచనానికి మాట్లాడుకున్నారంట. అప్పుడే ఎందుకు ఆపుతాడు?చివరగా నేను: నా పేరు ఈశ్వరయ్య. ఆ రోజున నేను, నా విముక్తిని, బలవంతంగా, ఈశ్వరేచ్ఛతో నిమిత్తం లేకుండా, పుచ్చుకున్నాను. ఇవాళ్టిదాకా నేను ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండాలని అందరూ అనుకుంటుండబట్టి.. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని వేచిచూశాను. ఇక చాలు. «పరమేశ్వరుడి లీలలో లీనమయ్యే ముందు.. ఈ నాటకం చాలించేముందు, ఎవడో స్వామిట కదా, నాకోసమే వస్తున్నాడుట కదా.. విందామని ఆగాను. ఆ అమృతోపదేశాన్ని విన్నాను. రాయజాలని భాషలో, ఎవరికీ వినపడదని తెలిసినా, గట్టిగా తిట్టుకుని, నా దారిన చక్కాపోయాను. -
కథాకళి: మంచివాడు
చిత్రాంక్ని రెండు రోజుల నుంచి ఓ సమస్య బాధిస్తోంది. అతనికి ఎదురు చూడని డబ్బు వచ్చింది. అదీ పెద్ద మొత్తంలో. అతను పనిచేసే కంపెనీలోని ఓ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేస్తూండగా, ఆఖరి దశలో ఓ గడ్డు సమస్య వచ్చి ఆ ప్రాజెక్ట్ ముందుకి కదలడం లేదు. ఆ కంపెనీ సీఈవో ఆందోళనగా ఉన్నాడు. చిత్రాంక్ దాన్ని ఆవిష్కరించటంతో సీఈవో అతనికి పదిలక్షల రూపాయల నగదు బహుమతిని ఇచ్చాడు. సెకండ్ హ్యాండ్ కారుని అమ్మేసి ఆ పదిలక్షలతో కొత్త కారుని కొనాలని అనుకున్నాడు. కాని అందుకు అతనికి మరో ఆలోచన అడ్డం వస్తోంది. చిత్రాంక్కి చిన్నప్పటి నుంచి తన తండ్రివైపు బంధువులని ఆదుకోవాలని కోరిక. వారంతా పేదవారు. తన బీద అత్తయ్యకి అప్పుడప్పుడు చిన్న మొత్తాలు సహాయం చేస్తుండేవాడు. ఈ మధ్య చిత్రాంక్ని అతని అత్తయ్య తన ఇద్దరు పిల్లల కోసం పెద్ద మొత్తం అడిగింది. డబ్బు లేక ఆ కోరిక తీర్చలేకపోయాడు. తనకి ఆ పదిలక్షలు లేకపోయినా ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేదు. అన్ని అవసరాలకి ఇప్పుడున్న కారు చాలు. కాబట్టి ఆ పదిలక్షలని తన అత్తయ్య పిల్లలకి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. కొద్దిరోజుల క్రితమే అత్తయ్య రెండో కొడుకు తనకి నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ షాప్ పెట్టుకోవాలని ఉందని మాటల్లో చెప్పాడు. అతనికి నాలుగు లక్షలు, మిగిలింది వాడి అక్క పెళ్ళికి ఇవ్వాలనే ఆలోచన వచ్చింది.ఆ ఆలోచన వచ్చినంత త్వరగా దాన్ని ఆచరించడానికి అతనికి మనసు రాలేదు. తక్కువ డబ్బు ఉన్నవాళ్ళు దాన్ని తేలిగ్గా దానం చేయగలుగుతారని, ఎక్కువ మొత్తం డబ్బున్న వాళ్ళు చేయలేరన్న నిజం అతనికి అనుభవపూర్వకంగా తెలిసింది. అతనికి ఆ సొమ్ముని అత్తయ్య కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలని ఉంది. అదే సమయంలో చూస్తూ చూస్తూ అంత మొత్తం ఇవ్వడానికి మనస్కరించడం లేదు. గత రెండు రోజులుగా చిత్రాంక్ మనసులో ఈ విషయం మీద తర్జనభర్జనలు, తర్కవితర్కాలు సాగుతున్నాయి. చిత్రాంక్ బ్రహ్మచారి. కాబట్టి సలహా తీసుకోడానికి భార్య కాని, తల్లితండ్రులు కాని లేరు.అతను ఆ ఆదివారం సాయంత్రం తను చాలాకాలంగా వెళ్ళాలనుకునే చెరువుకి చేరుకున్నాడు. చుట్టూ కొబ్బరి చెట్లు. దూరంగా కొండల వరుస. అతనికి అక్కడి ప్రశాంతత నచ్చుతుంది. కారుని పార్క్ చేసి నడిచి, చెరువు ఒడ్డున ఉన్న సిమెంట్ బెంచ్ దగ్గరికి చేరుకుని జేబురుమాలుతో దాని మీద దులిపి కూర్చున్నాడు. ఎదురుగా దాదాపు వంద ఎకరాలకి పైగా విస్తీర్ణం ఉన్న ఆ చెరువు మీంచి చల్లటి గాలి వీస్తోంది. అవతల ఓ చిన్న గ్రామం ఉంది. నీళ్ళ వంకే చూస్తూంటే అందులో కొన్ని బాతులు కనిపించాయి.కొద్దిసేపటికి ఒకాయన చెరువు దగ్గరికి వచ్చాడు. ఆయన ఒంటి మీద మాసిన ఖాకీ రంగు నిక్కర్, బనీన్ ఉన్నాయి. ఆయనకి అరవై ఏళ్ళ దాకా ఉండచ్చని తెల్ల జుట్టుని, మొహాన్నిబట్టి అంచనా వేశాడు. ఆయన బెంచ్ మీద కాక ఒడ్డున కూర్చున్నాడు. కొద్దిసేపాగి తనతో తెచ్చిన మూట తీసి అందులోంచి ఏదో తీసి నీళ్ళలోకి చల్లాడు. తర్వాత ఆయన వెల్లకిలా పడుకుని కూనిరాగం తీస్తూ ఆకాశంలోకి చూడసాగాడు. ఆయన లోకంలో ఎలాంటి దుఃఖం లేనివాడుగా చిత్రాంక్కి తోచింది. బాతులు దూరం నుంచి బిలబిలా ఆయనవైపు ఈదుకుంటూ వచ్చాయి. ఆయన నీళ్ళల్లో చల్లిన, నీటి మీద తేలే మరమరాలని అవి తినసాగాయి. చిత్రాంక్కి ఆశ్చర్యం వేసింది. ఆయన దరిద్రుడిలా ఉన్నాడు. ఆ బాతులు ఆయనవి కావు. అయినా ఆయన వాటికి మేత తెచ్చి వేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి అడిగాడు.‘‘ఏం చేస్తున్నావు?’’‘‘ఆకాశంలోకి చూస్తున్నాను.’’‘‘వాటికి ఏదో వేస్తున్నట్లున్నావు?’’‘‘అవును. మరమరాలు.’’‘‘అవి నీ పెంపుడు బాతులా?’’‘‘కావు.’’‘‘నువ్వు ఉండేది ఎక్కడ?’’దూరంగా ఉన్న గ్రామం వంక చేత్తో చూపించాడు.‘‘రోజూ వాటికి మరమరాలు తెచ్చి వేస్తుంటావా?’’‘‘మూడు నాలుగు రోజులకోసారి.’’తనకేమీ కాని బాతులని ఆయన ఆదుకుంటున్నాడు. తన తండ్రి మేనల్లుడిని, మేనకోడల్ని ఆదుకోవాలని చాలాకాలంగా అనుకుంటున్నా, అవకాశం వచ్చేసరికి తను వెనక్కి వెళ్ళడం సబబు కాదనే గట్టి నిర్ణయాన్ని ఆయన్ని చూసి చేసుకోగలిగాడు. ఆయన నిశ్శబ్దంగా మూటలోంచి గుప్పెడు మరమరాలు తీసి చిత్రాంక్ చేతిలో పోశాడు. చిత్రాంక్ వాటిని నీళ్ళలోకి చల్లగానే బాతులు వాటి మీదకి ఎగబడ్డాయి. తను మనిషి. స్వార్థం ఆవరించుకున్న మనిషి అనుకున్నాడు. తన సమస్యకి ఇంత తేలిగ్గా జవాబు దొరుకుతుందని ఎదురుచూడని చిత్రాంక్ ఆయనతో చెప్పాడు.‘‘నువ్వు చాలా మంచివాడివి.’’ఆయన జవాబు చెప్పలేదు. చిత్రాంక్ తన కారు దగ్గరికి నడిచి తాళం తీసి, లోపలకి ఎక్కి కూర్చుని తేలికపడ్డ మనసుతో ఇంటి దారి పట్టాడు. కారు శబ్దం బాగా దూరం అయ్యేదాకా ఆగి ఆ వ్యక్తి లేచి ఓసారి చుట్టూ చూశాడు. తర్వాత సంచీలోంచి మరమరాలని తీసి ఒడ్డున పోసి సంచీని ఖాళీ చేశాడు. కొన్ని బాతులు నీళ్ళల్లోంచి నేల మీదకి వచ్చి వాటిని తినసాగాయి. ఆయన ఓ బాతుని అందుకుని దాని మెడ విరిచాడు. అది రెక్కలు కొట్టుకుంటూంటే దాన్ని ఆ సంచీలో వేసుకుని లేచాడు. కొద్దిసేపట్లో ఎర్రబడ్డ సంచీ నిశ్చలమైంది. ఆ వ్యక్తి చెరువు వెనక ఉన్న తన గ్రామానికి బయలుదేరాడు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
క్లాసిక్స్ అంటే ఏమిటి
‘ప్రపంచంలోని పుస్తకాలన్నీ రెండే రకాలు! కొన్ని క్షణకాలం నిలిచేవి – మరికొన్ని కలకాలం నిలిచేవి’ అన్నాడు పందొమ్మిదవ శతాబ్దపు బహుముఖ ప్రజ్ఞావంతుడు జాన్ రస్కిన్. అలా కలకాలం నిలిచే పుస్తకాలనే ‘క్లాసిక్స్’ అంటూవుంటారు. సాహిత్య విమర్శలో ఏ మాట చెప్పినా, ఆలంకారికంగానే చెప్తారు; అంచేత ‘కలకాలం’ అంటే సుదీర్ఘకాలమనే మనం అర్థంచేసుకోవాలి. ‘ఎంత కాలంగా నిలువనున్న సరుకైతే అది అంత ప్రశస్తమైనది’ అనే ప్రమాణం చింతకాయ పచ్చడికీ ఉసిరిపచ్చడికీ వర్తించినంతగా క్లాసిక్స్కు వర్తించదు. ‘పురాతన కళాఖండాలు మనకు శ్రేష్ఠమైనవిగా అనిపించడానికి వాటి ప్రాచీనత కారణం కాదు! అలాంటి క్లాసిక్స్ ఎప్పుడు చదివినా ఎంతో తాజాగానూ, శక్తిమంతంగానూ, ఆరోగ్యదాయకంగానూ అనిపించడం వల్లనే అవి క్లాసిక్స్ అయ్యాయి‘ అన్నాడు గోథే. ప్రతి విషయాన్ని చమత్కారంగా చెప్పే అమెరికన్ మహారచయిత మార్క్ ట్వైన్ మాత్రం క్లాసిక్స్నూ వదలలేదు! ‘ప్రతిఒక్కరూ చదవాలని అనుకున్నప్పటికీ, ఏ ఒక్కరూ చదవని ఉద్గ్రంథాలే క్లాసిక్స్’ అన్నాడట ఆ మహానుభావుడు. అది తప్పని ఆయన విషయంలోనే రుజువైంది. హెమింగ్వేలాంటి వాళ్లు, ట్వైన్ రాసిన ‘హక్ల్ బెరీ ఫిన్’ నవలను క్లాసిక్గా పరిగణించిన మాట – దాన్ని చదవాలని ఒకప్పుడు మనమంతా ఉవ్విళ్లూరిన మాట నిజమే కదా! అంచేత, ఈ మాట అంటున్నప్పుడు మార్క్ ట్వైన్ తన గుబురు మీసాల మాటున నవ్వుకునే వుంటాడని గ్రహించాలి!! ఏతావాతా, దీర్ఘకాలం మనగలగడం ఒక్కటే క్లాసిక్స్ లక్షణం కాదు – కనీసం అది వాటి ప్రధాన లక్షణం కూడా కాదని తేలిపోయింది! జనజీవనంలో అనంతంగానూ, స్థిరంగానూ కొనసాగే కొన్ని ప్రమాణాలు క్లాసిక్స్లో ప్రముఖంగా కనిపించి తీరాలి. మానవమేధను మరింత రసవంతం చేసే లక్షణం దాంట్లో ఉండి తీరాలి. భూగోళమంతా విస్తరించుకుని వున్న మానవాళిలో ప్రతి నిత్యం దర్శనమిచ్చే భావావేశం క్లాసిక్స్లో పెల్లుబుకుతూ ఉండాలి. ఒక్కమాటలో చెప్పుకుంటే, క్లాసిక్స్లో – ఏదో ఒక రూపంలో– మౌలికమైన, విస్తృతమైన, లోతైన ఆలోచన – అనుశీలన – ఆవిష్కరణ వ్యక్తమై ఉండాలి. టీయస్ ఇలియట్ లాంటి నవ్య సంప్రదాయవాదుల లెక్క ప్రకారం, క్లాసిక్స్లో అంతర్నిహితంగా నిర్దిష్ట నైతికబోధన ఉండాలి. పాశ్చాత్య సాహిత్య ప్రపంచంలో, ఈ ప్రతిపాదనను సమర్థించేవాళ్లకన్నా, పట్టించుకోనివాళ్లే ఎక్కువ! విషయమేమిటంటే, కొన్ని తరాలపాటు పాఠక లోకాన్ని ప్రభావితం చేసే లక్షణాలున్న గొప్ప పుస్తకాలన్నీ క్లాసిక్సే. ఉదాహరణకి గురజాడ ‘కన్యాశుల్కం’, చలం ‘మైదానం’, విశ్వనాథ ‘కిన్నెరసాని పాటలు’, దేవులపల్లి ‘కృష్ణపక్షం’, సురవరం ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, బుచ్చిబాబు ‘చివరికి మిగిలేది!’, దాశరథి ‘అగ్నిధార’, నవీన్ ‘అంపశయ్య’ – ఇవన్నీ క్లాసిక్సే. నాలాంటి వాడికి మల్లారెడ్డి, రాంభట్ల, సినారె అనువదించిన ‘మఖ్దూం కవిత’, సదాశివ ‘యాది’ కూడా క్లాసిక్స్ గానే కనిపిస్తాయి! అవి ఫలానా దేశంలో, ఫలానా భాషలో, ఫలానా కాలంలో వెలువడి వుండాలనేం లేదు. మనం ఈ విషయం గురించి ఇక్కడ చర్చించుకుంటూ ఉండగానే, ఏదో గొప్ప క్లాసిక్కు శ్రీకారం చుట్టడం జరిగివున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మాటకొస్తే, ప్రతి క్లాసిక్ అలా వేర్వేరు కాలాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో, వేర్వేరు భాషల్లో పుడుతూ వచ్చిందే! నోబెల్ బహుమతో – లేదా పులిట్జర్ పురస్కారమో – లేదా బుకర్ ప్రైజో పొందిన రచనలే క్లాసిక్స్ అని ఎవరూ అనరు – అనలేరు! సామాన్యయుగానికి పూర్వం ఏడో శతాబ్దిలో హోమర్ గానం చేసిన ‘ఇలియడ్’, ‘ఒడిస్సీ’లకు ఏ నోబెల్ ప్రైజ్ వచ్చిందని అవి క్లాసిక్స్ కాగలిగాయి? దానికి ఒక రెండువేల సంవత్సరాల తర్వాత వెలువడిన వాల్మీకి ‘రామాయణ’ కావ్యానికి ఏ పులిట్జర్ ప్రైజ్ వచ్చిందని అది క్లాసిక్ కాగలిగింది? దానికి ఒక రెండువేల సంవత్సరాల తర్వాత వెలువడిన వ్యాస ‘మహాభారత’ ఇతిహాసానికి ఏ బుకర్ ప్రైజ్ వచ్చిందని అది క్లాసిక్ కాగలిగింది? అంతెందుకు – టాల్ స్టాయ్ రాసిన ‘ఆనా కెరినినా’ గానీ, ‘యుద్ధం–శాంతి’ గానీ ఏ పురస్కారానికీ నోచుకోలేదు. అవి క్లాసిక్స్ కాదనడానికి ఎవరికైనా గుండెలున్నాయా? ఇక, జేమ్స్ జాయిస్ రాసిన ‘యులిసెస్’కు ఏ బహుమతీ దక్కకపోగా తీవ్రమైన ఆంక్షల పోటులూ, సెన్సార్ కత్తెర వేటులూ మాత్రమే ప్రాప్తమయ్యాయి. అది మేలిరకం క్లాసిక్ సుమా! అని పనిగట్టుకుని చెప్పాలా? హోర్హే లూయీ బోర్హే రాసిన ‘ఫిక్షన్’కు నోబెల్ పురస్కారం దక్కకపోవడానికి, ఆయన రాజకీయ అభిప్రాయాలే కారణం కావడం అందరికీ తెలిసిందే! అంతమాత్రాన అది క్లాసిక్ కాకపోతుందా? ఈ జాబితా సుదీర్ఘమైంది. జార్జ్ ఆర్వెల్, వర్జీనియా వూల్ఫ్, చినువా అచెబే, స్కాట్ ఫిట్జెరాల్డ్ లాంటి మహా రచయితల రచనలెన్నో ఉన్నాయి అందులో! క్లాసిక్స్ అంటే ఏమిటో – స్థూలంగా – అర్థం చేసుకోవడానికి ఈ చర్చ సరిపోతుందనుకుంటా. -
సాహిత్య దీపాన్ని అందించే ప్రయత్నం చేశా!
‘పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రుల గుండెల్లో వారి స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే! భవిష్యత్తుకు భరోసాగా నిలిచే ఈ తరం పిల్లల పెంపకంలో ఎప్పుడూ అశ్రద్ధగా ఉండకూడదు.’ అంటారు సినీ గీతరచయిత సుద్దాల అశోక్తేజ. పిల్లల పెంపంకంలో ఎదురయ్యే సాధకబాధకాల గురించి ఆయన పంచుకున్న ముచ్చట్లు...‘జోలాలి జోలాలి జోలాలి.. జోల పాడుతా బజ్జో నా తల్లి / నిదుర తల్లిని బతిమలాడని .. నీలి కళ్లలో నిదురపొమ్మని/ రా రమ్మని ఇమ్మని తీపికలలు ఎన్నో..’ ఇది నేను రాసిన సినిమా పాట. నిజానికి రాత్రివేళల్లో పిల్లలను జోకొడుతూ నిద్రపుచ్చితే, పిల్లలు చెప్పే విషయాలు వింటే.. వారు ఎంతో భరోసాగా ఫీలవుతారు. ఎన్ని పనులున్నా తల్లిదండ్రులు చేయాల్సిన పని రోజులో కొంతసేపు పిల్లలతో గడపడం. నాకు ఓ కూతురు, ఇద్దరు కొడుకులు. వారు పుట్టే సమయానికి మేం కడు పేదరికంలో ఉన్నాం. నాకు ఉద్యోగం లేదు. నా భార్య నిర్మల మిషన్ కుట్టేది, బీడీలు చుట్టేది. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా మేడిపల్లిలో అతికష్టమ్మీద ప్రైవేట్స్కూల్ ప్రారంభించాను. అప్పుడు మా జీవనం కొంత మెరుగైంది. మా నాన్న హయాంలో కూడా ఆయనకు వచ్చేది కొద్దిపాటి ఆదాయమే. అయినా అంతా అందులోనే బతికాం. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా పిల్లల పెంపకంలో మా అమ్మనాన్నలు ఏం చేశారో, నేనూ అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాను. మా అమ్మనాన్నలు మా దోసిట్లో పెట్టిన సాహిత్య దీపాన్ని మా పిల్లల చేతుల్లో పెట్టి, వెలిగించే ప్రయత్నం చేశాను. వాళ్లూ నా అంచనా మేరకు జీవితంలో చక్కగా స్థిరపడ్డారు. చలం ‘బిడ్డల శిక్షణ’..స్కూల్ నడుపుతున్న సమయంలో గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం వచ్చింది. అక్కణ్ణుంచి మా జీవనం మరికాస్త మెరుగైంది. ఇంటి పనులు, పిల్లల పనులు మా ఆవిడతో పాటు నేనూ కలిసి చేసేవాడిని. మా ఆవిడకు నేను చేసే పనులను చూసి, పిల్లలు కూడా ఇంటి పనుల్లో సాయం చేసేవారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చలం ‘బిడ్డల శిక్షణ’ పుస్తకం చదివింది. అది మా ఇంటి వాతావరణాన్నే మార్చేసింది. పిల్లలు ఎంత అల్లరి చేసినా, ఎంత చిరాకు సృష్టించినా ఒక్కనాడు కూడా వారి మీద చిన్న దెబ్బ కూడా వేయకుండా పెంచింది. మా ఇంట్లో పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం అలవాటుండేది కాబట్టి, మా తమ్ముడు, చెల్లెలికి కథలు చెబుతుంటే మా పిల్లలు కూడా వినేవాళ్లు. ఇప్పుడు మా మనవలు, మనవరాళ్లకు మహాభారతం, భాగవతం చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. అప్పట్లో సెల్ఫోన్లు, టీవీలు లేకపోవడం వల్ల సామాజిక పరిస్థితులు కూడా నాకు సహకరించాయి. ఇప్పుడు నా పిల్లల పిల్లలు వచ్చేసరికి పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పటి పిల్లలకు ‘చందమామ రావే.. ’ పాటలు, ‘చందమామ కథలు’ లేవు. యాంత్రికంగా పరుగులు వద్దుఈ రోజుల్లో భార్యభర్తలు ఉద్యోగం చేస్తే తప్ప కుటుంబం నడవని పరిస్థితులు వచ్చాయి. అందుకు ఇంట్లో అవసరానికి మించిన ఆడంబర వస్తువులూ వచ్చి చేరాయి. వాటి కోసం సంపాదన తప్పనిసరి అయ్యింది. కెరీర్ పరుగు పందెంలో జీవితాలు యాంత్రికం అయ్యాయి. స్మార్ట్ ఫోన్లకు, టీవీలకు, గూగుల్కు పిల్లలను అప్పజెబుతున్నారు. డిజటల్లో ఏం చూసి నేర్చుకుంటున్నారో, అదే నేటి పిల్లలు.పిల్లలతో ఆటలు మేలుపిల్లల చిన్నప్పుడు వారితో ఆటలాడేవాడిని. ఉదయం వాకింగ్కు తీసుకెళ్లేవాడిని.. వారితో మాట్లాడే ఆ కాసేపు ‘నా తండ్రి నా వెనకాల ఉన్నాడు’ అనే ఫీలింగ్ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇలా రోజూ కొంత సమయం గడిపితే పిల్లలు తప్పక మంచి స్థానంలో ఉంటారు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చు. వంద పుస్తకాలు చదివినంత జ్ఞానం..సెలవుల్లో మా అమ్మ దగ్గరకు పిల్లలను తీసుకొని వెళ్లేవాళ్లం. ఇంట్లో పెద్ద తినుబండారాలేమీ లేకపోయినా వేడి అన్నంలో చింతకాయ పచ్చడి కలిపి, పిల్లలందరికీ తనే గోరుముద్దలు పెట్టేది. ఆ సమయంలో సహస్ర శిరచ్ఛేద అపూర్వచింతామణి వంటి కథలన్నీ చెప్పేది. ఇప్పుడు చిన్నకుటుంబాలు పెరిగాయి. అలాగే, పెంపకంలో చింతనలు కూడా పెరిగాయి. ఇప్పటి పిల్లలు ‘బియ్యం చెట్లు ఎలా ఉంటాయి?’, ‘ప్యాకెట్ల నుంచే కదా పాలు వచ్చేవి’ అని అడుగుతుంటారు. వాస్తవానికి దూరంగా పిల్లలు పెరుగుతున్నారు. పండుగల జీవన విధానం...మన పండగలన్నీ మానవసంబంధాలను కాపాడే క్రమంలో ఏర్పాటు చేసినవే. పెసర గారెలు, బూరెలు, భక్ష్యాలు, నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు... ఇలా పండగలను బట్టి చేసే వంటలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇప్పుడు డబ్బు ఉంటుంది, అందుకు తగిన జంక్ ఫుడ్ సులభంగా లభిస్తుంది. ఫలితంగా పిల్లలకు సరిగ్గా విరేచనాలు కావు, రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోరు. పిల్లల ఆరోగ్యం, లోకజ్ఞానం, పరిసరాల జ్ఞానం తప్పనిసరి. వీటిని ఈ రోజుల్లో సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి.నిర్మలారెడ్డి -
రూ.500 లంచం.. 36 ఏళ్ళు పోరాటం... ఏడాది జైలు
అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తిమింగలాలతో పోలుస్తారు. తాజాగా అనకొండలను చేర్చారు. ఏ జంతువుతో పోల్చినా, కేసులు నమోదు చేస్తున్నా, కొన్ని ప్రభుత్వ శాఖల్లో ‘పైసా వసూల్’ కానిదే ఫైలు కదలదు, పని జరగదు. లంచం తీసుకోవడం తమ ప్రాథమిక విధుల్లో భాగమని, ఇవ్వడం ప్రజల బాధ్యతని కొంతమంది ఉద్యోగులు భావిస్తుంటారు. అంటే, ‘డ్యూటీకి వచ్చినందుకు జీతం... పనిచేయాలంటే లంచం’ మెజార్టీ ఉద్యోగులు ఇలానే ఉన్నారు. అడిగింది ఇచ్చేదాకా వేధిస్తుంటారు. అడ్డంకులు సృష్టిస్తుంటారు. అయితే, అందరూ వీటిని భరించరు. హక్కుగా పొందాల్సిన సేవలకు లంచం ఇవ్వరు. అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తారు. లంచగొండులను పట్టిస్తారు. ఇలా ఓ ఉద్యోగి దొరికాడు. కేసులో ఇరుక్కున్నాడు. చిన్న మొత్తమే కదా బయట పడతాననుకున్నాడు. కోర్టుల చుట్టూ తిరిగాడు. కాళ్లరిగాయి, ఏళ్లు గడిచాయి. చివరికి న్యాయం గెలిచింది. అవినీతికి శిక్ష ఖరారైంది. కానీ చాలా ఆలస్యమైంది.అది 1990... ఉత్తరాఖండ్లోని ఉద్ధమ్సింగ్ నగర్కి చెందిన రాజ్బహుదూర్ సింగ్ ఎక్సైజ్ కానిస్టేబుల్. ఓ గ్రామంలో తనిఖీలకు వెళ్లాడు. అక్రమ మద్యం ఉందంటూ ఓ వ్యక్తితో బలవంతంగా కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. లంచంగా రూ. 500 డిమాండ్ చేశాడు. అడిగింది ఇవ్వకపోతే కేసు కోర్టుకు పంపుతానని బెదిరించాడు. వేధింపులు భరించలేక వ్యాపారి విజిలెన్స్ శాఖ ఎస్పీని కలిశాడు. జరిగింది చెప్పాడు. దీంతో వలపన్నారు. కానిస్టేబుల్ను రెస్టారెంట్కు రప్పించారు. డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. మూడు కోర్టులు... ముప్పయ్యారేళ్లుతొలుత ట్రయల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కోర్టు ఇద్దరు ప్రధాన సాక్షులను విచారించింది. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 7, సెక్షన్ 13(2) కింద మార్చి 2006లో శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్లు జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించింది. ఈ కోర్టులో కేసు 16 ఏళ్లు నడిచింది. ఈ తీర్పుపై నిందితుడు ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు కొట్టేయాలని అభ్యర్థించాడు. ఆరేళ్లు కేసు నడిచింది. ఏప్రిల్ 2012లో హైకోర్టు ఆ అప్పీల్ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుహైకోర్టులో చుక్కెదురవడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. కేసు కొట్టేయాలని వేడుకున్నాడు .వాయిదాలతో 14 సంవత్సరాలు కేసు కొనసాగింది. 2012 ఆగస్టులో మొదటిసారి విచారణ జరిగింది. 21 సార్లు వివిధ బెంచ్ల ముందు విచారణకు వచ్చింది. ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. ‘సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన ట్రయల్ కోర్టు, హైకోర్టులు నిందితుణ్ణి దోషిగా తేల్చడంలో ఎటువంటి పొరపాటు చేయలేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, దాన్ని హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తన తీర్పులో స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూనే ‘నిందితుడికి ప్రస్తుతం 75 ఏళ్లు. అతడి వయస్సును దృష్టిలో పెట్టుకుని శిక్షను కనీస స్థాయికి తగ్గించవచ్చని మేం భావిస్తున్నాం’ అని తన ఆదేశంలో పేర్కొంటూ శిక్షను ఏడాదికి పరిమితం చేసింది. గతంలో కొంత కాలం జైలులో ఉండడంతో మిగిలిన కాలానికి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసులో తీర్పు ఆలస్యం అయింది. కానీ, న్యాయం గెలిచింది. తప్పుకు శిక్ష తప్పదని వెల్లడైంది. అయితే నాణేనికి ఇది ఒక వైపే! మరోపైపు చూస్తే, 40 ఏళ్ల వయసులో చేసిన నేరానికి 75 ఏళ్ల వయసులో శిక్ష పడింది. రూ. 500 లంచం తీసుకున్నందుకు చట్ట ప్రకారం శిక్ష ఖరారైంది. అవినీతి పరులను శిక్షించాల్సిందే కానీ, 36 ఏళ్ల కాలానికి విలువ కట్టేదెవరు? -
ఆర్డర్ పెడితే చాలు.. అర్ధరాత్రి కూడా ఎండ!
అర్ధరాత్రి బిర్యానీని ఆర్డర్ చేసినట్టు, ఇకపై రాత్రి పన్నెండు గంటల సమయంలోనైనా సరే, ‘కాస్త ఎండను పంపండి బాబూ.. బట్టలు ఆరేసుకోవాలి’ అని మనం ఆర్డర్ పెట్టుకునే కాలం.. దాదాపుగా దగ్గరకు వచ్చేసినట్లే! ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ అనే ఒక అమెరికన్ స్టార్టప్ కంపెనీ, అంతరిక్షంలోకి ఏకంగా 50,000 అద్దాలను పంపి, ఎవరికి కావలిస్తే వారికి రాత్రి పూట కూడా భూమి మీదకు ఎండను డెలివరీ చేసేందుకు త్వరలోనే ఒక ప్రయోగాన్ని చేపట్టబోతోంది.రిఫ్లెక్ట్ ఆర్బిటల్ ప్రయోగాత్మకంగా ఈ వేసవిలోనే సుమారు 60 అడుగుల (18.3 మీటర్లు) వెడల్పు ఉన్న ఒక మోడల్ అద్దాన్ని అంతరిక్షంలో అమర్చనుంది. అది భూమికి 640 కిలోమీటర్ల ఎత్తులో ఉండి, భూమి మీద ఉన్న సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలోని చీకటి ప్రదేశాన్ని వెలుగుతో నింపేస్తుంది. ఇందుకు అమెరికా ప్రభుత్వం కనుక అనుమతి ఇస్తే ఇకపై రాత్రిపూట వెన్నెలతో పాటు కృత్రిమ సూర్యకాంతి కూడా భూమికి అందుబాటులోకి వస్తుంది. 30 ఏళ్ల క్రితమే రష్యా ప్రయోగం!నిజానికి ఇలాంటి ఆలోచన రావడం మానవ మేధావులకు ఇదే మొదటిసారి కాదు. 1993లో రష్యా వారు ‘జ్ఞామ్యా’ అనే ఒక ఉపగ్రహం ద్వారా 65 అడుగుల వ్యాసం కలిగలిన అద్దాన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేసి, రెండు మూడు నిండు చంద్రుళ్లులు ఇచ్చేంత వెలుగును భూమి మీదకు పంపగలిగారు. సైబీరియా వంటి మంచు ప్రాంతాల్లో పగలు తక్కువగా ఉంటుంది కాబట్టి, అక్కడ పగటి సమయాన్ని పెంచాలని అలా చేశారు. కానీ అది అప్పట్లో అంతగా ఫలించలేదు. ఇప్పుడు ఈ ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ కంపెనీ అదే ఆలోచనను భారీ ఎత్తున ముందుకు తీసుకెళుతోంది. అందుకోసం దాదాపు 28 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 235 కోట్లు) పెట్టుబడులు కూడా సమకూర్చుకుంది.ఎండకు ‘సబ్స్క్రిప్షన్’ ‘‘మేము శిలాజ ఇంధనాల (పెట్రోల్, బొగ్గు) స్థానంలో ప్రపంచం మొత్తానికి ఈ అద్దాల కాంతితో విద్యుత్తును ఇస్తాం చూడండి..’’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాస్ బెన్ నోవాక్ ధీమాగా చెబుతున్నారు. ఆయన చెబుతున్న దానిని బట్టి 2027 నాటికి మరో రెండు మోడల్ అద్దాలు పైకి పంపిస్తారు. 2028 నాటికి ఏకంగా 1,000 పెద్ద సైజు అద్దాల ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపాలని చూస్తున్నారు. మొత్తం మీద ఆకాశంలో అద్దాలు అనే కొత్త నక్షత్రాలను మనం చూడబోతాం అన్నమాట. ఈ కంపెనీ ఉత్సాహం చూస్తుంటే భవిష్యత్తులో ఓటీటీ రీచార్జ్ లానే ఎండను కూడా చందా కట్టి కొనుక్కునే అవకాశం కల్పించేలా ఉంది. ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ కంపెనీ 2030 నాటికి 5,000 అద్దాలు, 2035 నాటికి ఏకంగా 50,000 అద్దాలను అంతరిక్షంలో పరచాలన్న కృత నిశ్చయంతో ఉంది. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ ప్రస్తుత అంచనాల ప్రకారం, రాత్రిపూట మనకు ఒక గంటసేపు సూర్యకాంతి కావాలంటే సుమారు 5,000 డాలర్లు (రూ. 4,62,000) చెల్లించాలి. అది కూడా కనీసం 1,000 గంటల ఒప్పందం చేసుకుంటేనే అంత తక్కువ ధర అట! ఇక, సోలార్ ప్లాంట్ యజమానులతో కూడా – ‘‘మేము రాత్రి పూట మీకు వెలుగు ఇస్తాం. దాని ద్వారా మీరు తయారు చేసే కరెంటు లాభాల్లో మాకు వాటా ఇవ్వండి’’ అని డీల్ కుదుర్చుకోబోతున్నారు.‘పొద్దు కుదరని’ ప్రమాదం!ఎన్ని ప్రయోజనాలున్నా, తక్కిన శాస్త్రవేత్తలు మాత్రం ఈ ప్రయోగాన్ని ‘సర్కాడియన్ రిథమ్’ (నిద్ర, మెలకువల లయ)పాలిట శాపంగా చూస్తున్నారు. మన శరీరంలో ఒక జీవ గడియారం ఉంటుంది. చీకటి పడగానే నిద్రపోవాలని, వెలుగు రాగానే లేవాలని అది చెప్తుంది. రాత్రి పూట అద్దాల వెలుగు వస్తే ఆ గడియారం దెబ్బతింటుంది. మన ఆరోగ్యాన్నీ దెబ్బ తీస్తుంది. ఇది అక్కడితో ఆగదు. జంతువులు ఆహారం దొరకని సమయంలో పిల్లల్ని కనడం, శీతకాలంలో నిద్రావస్థలోకి వెళ్లే జంతువులు మధ్యలోనే మేల్కొనడం వంటి ప్రకృతి విరుద్ధమైన పరిణామాలు సంభవిస్తాయి. ఎక్కడెక్కడికో వలస వెళ్లే పక్షులు ఈ కృత్రిమ వెలుగును చూసి ‘వేసవి కాలం వచ్చేసింది’ అని పొరబడి, చలి తీవ్రంగా ఉన్న చోట్లకు వెళ్లి ప్రాణాలు వదిలే ప్రమాదం ఉంది.. తేనెటీగలకు, పూలకు ‘పొద్దు’ కుదరక, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది.పైలట్లు తికమక పడొచ్చుమనుషుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఆకాశంలో హఠాత్తుగా మెరిసే ఈ అద్దాల వెలుగు విమాన పైలట్లను అయోమయానికి గురి చేయవచ్చు. టెలిస్కోపుల ద్వారా అంతరిక్షాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఈ అద్దాలు పెద్ద అడ్డంకిగా మారవచ్చు. ఆరోగ్యం విషయానికొస్తే, రాత్రి పూట కూడా వెలుగు ఉంటే మన శరీరంలో నిద్రకు కారణమయ్యే హార్మోన్లు విడుదల కావు. ఫలితంగా ఇన్సోమ్నియా (నిద్రలేమి) వంటి రోగాలు దరి చేరవచ్చు. ఇవన్నీ అలా ఉంచి, ఈ ప్రయోగం వల్ల మొత్తంగా చీకటి మాయమైపోయే ప్రమాదం ఉందని ‘డార్క్ స్కై’ అనే సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.ఖగోళ శాస్త్రవేత్తల కలవరం!ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశంలో వేల సంఖ్యలో పరిభ్రమిస్తు్తన్న ఉపగ్రహాల వల్ల నక్షత్రాలను, గ్రహాలను సరిగ్గా చూడటం వారికి కష్టమవుతోంది. ఒక పక్క స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు తమ శాటిలైట్లు తక్కువ వెలుగును ప్రతిబింబించేలా (వీటిని డార్కర్ శాటిలైట్స్ అంటారు) ప్రయత్నిస్తుంటే, ఈ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ వాళ్లు మాత్రం తమ శాటిలైట్లను వీలైనంత ఎక్కువ మెరిసేలా అమర్చబోతున్నారు. మరోవైపు, టెలిస్కోపులతో తీసే అంతరిక్ష ఫోటోల్లో ఈ అద్దాల వెలుగు ఒక తెల్లటి గీతలా పడి, అసలైన నక్షత్రాల సమాచారాన్ని మింగేసే ప్రమాదం ఉందని కూడా శాస్త్రవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆకాశం నుండి కాంతి కాలుష్యంప్రిన్స్ టన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ గ్యాస్పర్ బాకోస్ ఈ అద్దాల ఆలోచనపై నిప్పులు చెరుగుతున్నారు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ వాళ్లు.. ‘‘మేము కేవలం ఒక చిన్న ప్రదేశంలోనే (సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణం) వెలుగు వచ్చేలా చూస్తాం, పక్కన ఉన్న టెలిస్కోపుల జోలికి వెళ్లము’’ అని నమ్మకంగా చెబుతున్నప్పటికీ, ‘‘ఆకాశం నుండి వచ్చే కృత్రిమ అద్దాల కాంతి.. వాతావరణంలోని మేఘాలు, గాలి కణాల వల్ల అటు ఇటు చెల్లాచెదురు అవుతుంది. దీనివల్ల ఆ ప్రాంతం చుట్టూ ఒక పెద్ద ‘లైట్ పొల్యూషన్’ ఏర్పడుతుంది. ఇది ఖగోళ పరిశోధనలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది’’ అని ప్రొఫెసర్ గ్యాస్పర్ అంటున్నారు. ‘‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్ లాంటి కంపెనీలను అంతరిక్షంలో అద్దాలు పెట్టకుండా ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఇది మన పర్యావరణానికి చాలా రకాలుగా హాని కలిగిస్తుందని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. ఏమైనా, ఈ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీకి అమెరికా ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతుందా, లేక శాస్త్రవేత్తల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.ఉపయోగాలు అనేకం!అంతరిక్షంలో అద్దాలు బిగించి, సూర్యకాంతిని భూమి పైన ఉన్న వారికి డెలివరీ చేయటం అనే ఈ ఐడియా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా సన్నివేశంలా ఉన్నప్పటికీ, ఇది కనుక నిజంగా కార్యాచరణలోకి వస్తే, దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని రిఫ్లెక్ట్ ఆర్బిటర్ చెబుతోంది. రాత్రి పూటాసౌర శక్తి ఉత్పత్తిసోలార్ ప్యానెల్స్ రాత్రిపూట కరెంట్ తయారు చేయలేవన్నది తెలిసిందే. కానీ ఈ అద్దాలు ఉంటే, రాత్రి కూడా సూర్యకాంతిని ప్యానెల్స్ మీద వేసి 24 గంటలూ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. అంటే సోలాన్ విద్యుత్తును నిల్వ ఉంచే బ్యాటరీల అవసరం తగ్గుతుంది.విపత్తు సమయాల్లో వెలుగుభూకంపాలు, వరదలు, దుర్ఘటనలు రాత్రివేళ సంభవించినప్పుడు కరెంట్ పోయి అంతా చీకటిగా ఉంటుంది. అలాంటి సమయాల్లో గాలింపు చర్యల బృందాలకు ఆకాశం నుండే వెలుగు అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు.వేగంగా ప్రాజెక్టు పనులుమారుమూల ప్రాంతాల్లో మైనింగ్ లేదా నిర్మాణ పనులు జరిగేటప్పుడు, రాత్రి పూట కూడా పగలు మాదిరిగానే పని చేసుకోవడానికి ఈ అద్దాల వెలుగు ఉపయోగపడుతుంది. పని గంటలు పెరుగుతాయి, ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి.సైన్యానికి బాసటగా..!మిలిటరీ ఆపరేషన్లు జరిగేటప్పుడు నిరంతరాయంగా సోలార్ పవర్ అందించడానికి, చీకటిలో శత్రువుల కదలికలను కనిపెట్టడానికి ఈ అద్దాల వెలుగును వాడుకోవచ్చు.వ్యవసాయానికీ పండగేమొక్కల ఎదుగుదలకు సూర్యరశ్మి ముఖ్యం. కాబట్టి పంట కాలాల వ్యవధిని పెంచడానికి, మొక్కలకు కావాల్సినంత వెలుగును అందించి దిగుబడిని పెంచడానికి దర్పణకాంతిని వాడుకోవచ్చు.నగర వీధులు కళకళరోడ్ల మీద వేల సంఖ్యలో స్ట్రీట్ లైట్లు పెట్టే బదులు, నేరుగా పై నుండే వెలుగును వాడుకోవచ్చు. అంతేకాదు, దీనివల్ల భూమి మీద ‘లైట్ పొల్యూషన్’ తగ్గుతుందని కూడా ఈ కంపెనీ అంటోంది.కాంతులీనే వేడుకలుపెద్ద పెద్ద ఈవెంట్లు, బహిరంగ కార్యక్రమాలు, పర్యాటక క్షేత్రాలలో రాత్రి పూట ఒక వింతైన అనుభూతిని కలిగించడానికి ఈ ఆర్టిఫిషియల్ సన్ లైట్ ను వాడుకోవచ్చు. -సాక్షి స్పెషల్ డెస్క్ -
ఐశ్వర్య పయనం!
యాక్షన్ కింగ్ అర్జున్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి ఐశ్వర్య అర్జున్. అతికొద్ది రోజుల్లోనే తన నటనతో మెప్పించి ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది. ఇప్పుడు తెలుగు తెరపై ‘సీతా పయనం’ మొదలుపెట్టింది. ఆ ప్రయాణంలోని విశేషాలు ఆమె మాటల్లోనే మీకోసం...క్రమశిక్షణ నా బలంక్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరగడం వల్ల కావచ్చు, క్రమశిక్షణ అనేది నా రక్తంలోనే ఉంది. ఫిట్నెస్ విషయంలో కూడా నేను చాలా కట్టుదిట్టంగా ఉంటాను. యోగా చేయకుండా నా రోజు గడవదు.విమర్శలే ఇష్టంసోషల్ మీడియాలో నా గురించి వచ్చే వార్తల కంటే, నా పని గురించి వచ్చే విమర్శలనే నేను ఎక్కువగా ఇష్టపడతాను. అవే మనల్ని మంచి నటిగా మారుస్తాయని నమ్ముతాను.నాన్న చాలా స్ట్రిక్ట్బెంగళూరులో పుట్టాను. కాని, నా విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది. సేక్రెడ్ హార్ట్ స్కూల్, తర్వాత స్టెల్లా మేరీస్ కాలేజీలో బీకామ్ పూర్తి చేశాను. ఫ్యామిలీ మొత్తం సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నా, చదువు విషయంలో నాన్న చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు.వెనుక పెద్ద పేరు ఉన్నా...వెనుక ‘అర్జున్ సర్’ అనే పెద్ద పేరు ఉండొచ్చు. కాని, సెట్స్లోకి వెళ్లినప్పుడు నేను కేవలం ఒక నటిని మాత్రమే. ‘పట్టాతు యానై’తో నా ప్రయాణం మొదలైనప్పుడు నాన్న చెప్పిన ఒకే మాట ఇప్పటికీ గుర్తుంది ‘‘నువ్వు చేసే పనికి వంద శాతం న్యాయం చెయ్, మిగిలింది ప్రేక్షకులు చూసుకుంటారు.’’ ఆ మాటలను ఇప్పటికీ పాటిస్తాను.ఫ్యాషన్ పై ఆసక్తియూకేలోని బర్మింగ్హామ్ సిటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. గ్లామర్ ప్రపంచంలోకి రాకపోయి ఉంటే, నేను కచ్చితంగా ఒక ఫ్యాషన్ డిజైనర్గా స్థిరపడేదాన్ని. అందుకే నా దుస్తుల ఎంపికలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.ఇంటి వంటలంటే ఇష్టంఎన్నో రకాల ఇంటర్నేషనల్ వంటకాలు తిన్నా, ఇంట్లో చేసే వేడి వేడి అన్నం, పప్పు రుచే వేరు. వీకెండ్స్లో నా చెల్లెలు అంజనతో కలిసి కొత్త కొత్త వంటలు ట్రై చేస్తుంటాను. అలాగే నాన్నతో కలిసి అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటాను.నటిగా మరింత ముందుకుపవర్ఫుల్, ఎమోషనల్ పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటిగా నన్ను నేను నిరూపించుకునే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నాను. -
అదే గ్లామర్ డిసైడర్!
సహజమైన అందం, కంఫర్ట్ ఫ్యాషన్ తోనే గ్లామర్కి కొత్త నిర్వచనం ఇస్తూ, తనదైన గ్రేస్తో ప్రతి లుక్ను ప్రత్యేకంగా మలుస్తోంది నటి రుక్మిణి వసంత్. ఇందుకోసం ఆమె పాటించే ఫ్యాషన్ టిప్స్ ఇప్పుడు మీకోసం...లెహంగా.. స్టయిలింగ్: రుతుజ స్టయిల్స్జ్యూలరీ బ్రాండ్: కుందన్కలీ జ్యూలరీ ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.సింప్లిసిటీనే నా సూపర్పవర్. హెవీ మేకప్ కంటే కాన్ఫిడెన్స్ ఇచ్చే మెరుపు అసలైన గ్లామర్ని డిసైడ్ చేస్తుంది. ఇక ఫ్యాషన్లో నాకు హెరిటేజ్ టచ్ను మోడ్రన్ గా క్యారీ చేయడం ఇష్టం. – రుక్మిణి వసంత్.రంగురంగుల హారం!ఏ డ్రెస్లోకైనా ఇట్టే మ్యాచ్ అయ్యే ఆల్–ఇన్ –వన్ హారం కావాలా? అయితే ఈ మల్టీ కలర్డ్ నెక్పీస్ మీ వార్డ్రోబ్లో ఉండాల్సిందే! మెడపై ఒక్కసారి రంగుల హరివిల్లు విరిసినట్టే అనిపిస్తుంది. ఒక్క రంగులోనే కాదు, ఎన్నో రంగులు కలిసిన ఈ హారం ఏ ఔట్ఫిట్కైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది. అయితే, ఈ హారం వేసుకుంటే ఇయర్రింగ్స్ సింపుల్గా ఉండాలి. లేకపోతే మీ లుక్ కంటే జ్యూలరీ మీపై ఓవర్టేక్ చేస్తుంది! అలాగే, నెక్లైన్ సింపుల్గా ఉంటేనే ఈ హారం ఫుల్గా షైన్ అవుతుంది. హై నెక్తో అయితే అది కొంచెం ‘హైడ్ అండ్ సీక్’ ఆడేస్తుంది, కాబట్టి అప్పుడు దీనిని అవాయిడ్ చేయడం మంచిది.హెయిర్ ఓపెన్ గా కంటే, బన్ లేదా జడగా కట్టుకుంటే ఈ హారం క్లియర్గా హైలైట్ అవుతుంది. అప్పుడు ఫొటోలలో కూడా ఫుల్ మెరుపే మీదే! చేతిలో పెద్దగా ఆభరణాలు పెట్టకపోయినా పర్లేదు; ఒక్క ఈ రంగురంగుల హారం చాలు మీ మొత్తం లుక్ని హైలైట్ చేసేస్తుంది. మార్కెట్లో సింపుల్ నుంచి గ్రాండ్ వరకు ఎన్నో డిజైన్లలో అందుబాటులో ఉండటంతో, ప్రతి స్టయిల్ ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ దొరుకుతుంది. -
మృత్యువుపై ఘనవిజయం... క్రీస్తు పునరుత్థానం
ఈస్టర్ ఓ జయధ్వని; ఈస్టర్ ఓ ఆశల హారం; ప్రతి హృదయంలో వికసించిన ప్రేమ పరిమళం. సమాధి తలుపులు తెరిచి దివ్యవర్చస్సుతో క్రీస్తు నిలిచిన రోజు. ప్రతి హృదయంలో ప్రేమ సందేశం మార్మోగుతున్న సమయం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మనిషిని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది.యేసుక్రీస్తు జీవితం ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తెచ్చింది. ప్రేమ, దయ, వినయం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా; పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి; కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా; పరమాత్ముని బాటలో నడవాలని బైబిల్ ప్రబోధిస్తు్తంది. మొదటి శతాబ్దకాలంలో ఇశ్రాయేలు దేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో పౌలు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు యూదుజాతిలో పేరెన్నికగలవాడు. తార్సు ప్రాంతంలో జన్మించి ధర్మశాస్త్రంలో అమితాసక్తిని కలిగియుండి గమలియేలు అనే వ్యక్తి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. శరీరాకారంలో దేవుడు ఈ లోకానికి వచ్చాడన్న సత్యంతో పౌలు మొదట్లో ఏకీభవించలేదు. క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్న వారిపై అపరిమితమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. యేసు ‘క్రీస్తు’ కాదని వాదించుటే గాక, యేసుక్రీస్తును విశ్వసించినవారిని హింసించుటకు, దూషించుటకు ఇష్టపడ్డాడు.సిరియా దేశంలోని దమస్కు ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారని తెలిసి వారిని నాశనం చేయడానికి బయలుదేరాడు. దానికి యెరూషలేములోని క్రీస్తును ద్వేషించే మతపెద్దలు అంగీకరించారు. సరిగ్గా దమస్కు పొలిమేరకు చేరుకొనేసరికి మతగర్వంతో, ద్వేషంతో రగిలిపోతున్న పౌలుకు క్రీస్తు ప్రత్యక్షత దొరికింది. సమున్నతమైన క్రీస్తు రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. తల్లిఒడిలో పరవశించే బిడ్డవలే దేవుని దివ్యరూపాన్ని చూసి పరవశించిపోయాడు. తన గత జీవిత దౌర్భాగాన్ని తలచుకొని కన్నీళ్ళు విడిచి నూతన వ్యక్తిగా మార్పు చెందాడు.ఈ విశిష్ట సంఘటనలను పౌలు స్వయంగా రోమన్ గవర్నర్ ఫేస్తు ముందు, రాజు అగ్రిప్ప ముందు వివరించాడు.ఒకానొక సందర్భంలో రోమా పట్టణంలో ఉన్న దేవుని ప్రజలకు ఓ పత్రిక వ్రాస్తూ యేసుక్రీస్తు మరణాన్ని గురించి ఇలా అన్నాడు: ‘మనుష్యులమైన మనమంతా బలహీనులముగా ఉన్నప్పుడే క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మంచివాని కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును గాని, మనమింకను పాపులమై యుండగానే యేసు మన కొరకు చనిపోయెను, సర్వశక్తుడైన దేవునితో సమాధానాన్ని గలిగి రక్షించబడు నిమిత్తం క్రీస్తు సిలువమీద మరణించాడు’. దేవుడు ప్రేమాస్వరూపి అనే బైబిల్ బోధకు ఋజువు క్రీస్తు సిలువ మరణమే. పౌలు మూడు సువార్తయాత్రలు చేశాడు. వాటిలో ప్రతిచోటా తాను ఎక్కువగా మాట్లాడింది, తన వ్రాతల్లో వ్రాసింది క్రీస్తు మరణ పునరుత్థానాలను గురించే!‘యేసుప్రభువు సిలువపై చనిపోయారా? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారా?’ అని ప్రశ్నించే చాలామందికి ఇటలీ దేశంలోని ట్యురిన్ నగరంలో ఉన్న ట్యురిన్ వస్త్రం నిలువెత్తు నిదర్శనంగా ఉంది. యేసు చనిపోయిన తర్వాత ఆయన మీద ఒక విలువైన వస్త్రాన్ని కప్పారు. యూదుల ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్ట చుడతారు. యేసు చనిపోయిన తరువాత ఆయనకు చుట్టబడిన వస్త్రం నేటికి ఉందని పండితులు నిర్థారించారు. ఒక మనిషి ఆకారం దానిలో కనబడుతుంది. అతని చేతుల్లో మేకులు గాయాలు ఉన్నాయి. అతని దేహమంతా కూడా తూట్లు తూట్లుగా ఎవరో విభజించినట్లు విపరీతమైన గాయాలు కనబడుతున్నాయి.శాస్త్రవేత్తలు ఈ వస్త్రాన్ని చాలా సంవత్సరాల తర్వాత కనుగొని, దానిమీద పరిశోధనలు చేశారు. ఈరోజుకు కూడా ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ వస్త్రాన్ని మనం చూడవచ్చు. క్రీస్తు మరణ పునరుత్థానములకు సాక్ష్యం ఆ వస్త్రం. చరిత్రలో చాలామంది ఆ వస్త్రాన్ని దొంగిలించాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు కాని, వారి వల్ల కాలేదు. అయితే ఆ వస్త్రం యేసుకు సంబంధించినది కాదు, 12 లేదా 13వ శతాబ్దికి చెందిన వస్త్రమని వాదించేవారు లేకపోలేదు. వాస్తవమేమంటే క్రీస్తు ప్రభువు మీద కప్పబడిన వస్త్రం ఆ తర్వాత కాలంలో చాలామంది చేతులు మారడం వలన అక్కడక్కడ పాడైంది. కొంతమంది మఠకన్యలు క్రీ.శ . 1534లో పాడైపోయిన వస్త్రానికి ఎక్కడెక్కడ అయితే రంధ్రాలు పడ్డాయో అక్కడ బాగు చేశారు. ఆ కారణాన్ని బట్టి ఆ వస్త్రం అనేది 13వ శతాబ్దానికి చెందినదని చాలామంది భావించడానికి అవకాశం దొరికింది. ఇటలీలో ఉన్న ట్యురిన్ వస్త్రాన్ని కొందరు ‘ద ఫిఫ్త్ గాస్పెల్’ అని కూడా పిలుస్తారు. యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందు రోజు కొన్ని సంఘటనలు జరిగాయి. గెత్సేమనే తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. నేటికీ యెరూషలేములో గెత్సేమనే తోట ఉంది. దానిలోని కొన్ని ఒలీవ చెట్లు యేసుక్రీస్తు కాలానికి సంబంధించినవే. అక్కడ ఆయన ప్రార్థించిన రాయి కూడా ఉంది. దానిమీద ఓ గొప్ప దేవాలయం నిర్మించబడింది. దానిని ‘చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్’ అని పిలుస్తారు. ఇశ్రాయేలును సందర్శించే వారందరూ కచ్చితంగా వాటిని చూస్తారు. ఆ తోటలో శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను.అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తబిందువులుగా మారింది. వైద్య పరిభాషలో దానిని హెమటోహైడ్రోసిస్ అంటారు. ఒక వ్యక్తి అత్యంత తీవ్రమైన ఒత్తిడికి లోనైనపుడు అతని స్వేద రంధ్రాలనుండి రక్తం స్రవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు దేహం నుండి కూడా రక్తం స్రవించడానికి కారణం ఇదే. పొందబోయే ఆ భయంకర శిక్ష తీవ్రత గ్రహించినవాడై వేదనతో ప్రార్థించాడు. పండిత పురుషోత్తమ చౌదరి అనే కవి క్రీస్తు గెత్సేమనే అనుభవాన్ని ఓ అద్భుతమైన పాటలో ఇలా వర్ణించాడు. ‘శ్రమచేత తన దీన శరీరము నుండి దిగజార చెమట రక్తపు బొట్లుగా నమితమౌ లోకపాపము చూచి నిట్టూర్పులప్పటప్పటికి బుచ్చి క్రమముగా దూత తన కడకరుగుదెంచి శాంతము బల్కి చనిన పిదపం తమ మనంబుల బోలు తమసమున యూద సైన్యము లేగుదెంచెనపుడు గెత్సేమనే వనికి’. ‘అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను’ (యెష 53:8). జగద్రక్షకుడైన యేసుక్రీస్తు సిలువ మరణాన్ని గూర్చిన ప్రవచనాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో స్పష్టంగా చూడగలము. ఏడువందల సంవత్సరాలకు పూర్వమే రక్షకుని గూర్చిన సిలువ మరణంతో పాటుగా ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడతాడు అని తెలియచెప్పబడింది. కఠినమైన సిలువ మరణానికి ముందు ఆయన ఎందుకు తీర్పు తీర్చబడ్డాడు? ప్రభువు తీర్చబడిన తీర్పు అన్యాయమైనదిగా ఎందుకు ఎంచబడింది? ఇస్కరియోతు యూదా ద్వారా అప్పగింపబడిన యేసుక్రీస్తు ప్రభువు నేరుగా అన్న, కయపల యొద్దకు తీసుకొని రాబడ్డారు. వాస్తవానికి మొదట అన్న యొద్దకు ఆ తదుపరి కయప యొద్దకు కొనిపోబడ్డారు. ఈ విషయం లేఖనాల్లో రెండు చోట్ల ప్రస్తావించబడింది.(యోహాను 18:1224, మత్తయి 26:57) వీరిద్దరూ యేసును అవమానించారు, హేళన చేశారు. ఆయన మీద ఉన్న అక్కసును వెళ్ళగక్కారు. అక్కడ నుండి రోమన్ గవర్నర్ అయిన పొంతి పిలాతు నొద్దకు తీసుకొని వెళ్ళారు. క్రీస్తు ప్రభువు గలలియ ప్రాంతంలో పెరిగినవాడు గనుక హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని గ్రహించి పిలాతు హేరోదు నొద్దకు పంపెను.హేరోదు మొదట యేసును చూచి మిగుల సంతోషించాడు. ఎన్నో ప్రశ్నలు అడిగినప్పటికి యేసు అతనికి బదులియ్యలేదు. కాసేపటి తరువాత హేరోదు యేసు ప్రభువును తృణీకరించి అపహసించి పిలాతు నొద్దకు తిరిగి పంపివేశాడు. చివరగా పొంతి పిలాతు అన్యాయపు తీర్పు తీర్చి యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించాడు. యేసుక్రీస్తు అన్యాయపు తీర్పు ఎలా తీర్చబడ్డాడు?మానవ చరిత్రలో ఏ వ్యక్తిని పన్నెండు గంటలు వ్యవధిలో ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టలేదు. కాని, యేసుక్రీస్తును నిలువబెట్టారు. సిలువ మరణానికి ముందు యేసుక్రీస్తును యూదా మతపెద్దల ముందు మూడుసార్లు, రాజుల ముందు మూడుసార్లు నిలువబెట్టారు. అప్పటి కాలపు ప్రధాన యాజకుడైన కయప, అతని మామయైన మాజీ ప్రధాన యాజకుడు అన్న, యూదుల ఆలోచన సభయైన ‘సన్హెడ్రీన్’ ముందు యేసును దోషిగా నిలువబెట్టారు. యేసు తాను దేవుడనని, దేవుని కుమారుడనని ప్రకటించుకున్నాడు, మోషే ధర్మశాస్త్రమునకు విరుద్ధంగా ప్రవర్తించాడన్నది వారు చేసిన నేరారోపణ. ఆ తదుపరి మూడుసార్లు రోమన్ న్యాయస్థానం ముందు నిలువబెట్టారు.రోమన్ కైసరుకు పన్నులు కట్టవద్దన్నాడని, ప్రజలను రోమన్ చక్రవర్తులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడని, తాను రాజునని చెప్పుకొనుచున్నాడని యేసుక్రీస్తు మీద నేరారోపణ చేశారు. అయితే పిలాతు ఏ నేరమును కనుగొనలేకపోయాడు. ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టించాడు. చివరగా పస్కాపండుగ సమయంలో ఒక నేరస్థుని విడుదల చేయగలిగే అధికారాన్ని వినియోగించాలని చూచినా, ప్రజల ఒత్తిడికి లోనై సిలువ మరణాన్ని అమలు చేయడానికి ఒప్పుకున్నాడు. తన తీర్పులో న్యాయంలేదని తెలిసినా ‘ప్రజల’ కోసం అన్యాయ తీర్పును అమలుపరచాడు. ధర్మశాస్త్ర ప్రకారం పస్కా పండుగ సమయంలో ఎవరినీ తీర్పు తీర్చకూడదు, శిక్ష విధించకూడదు. అయితే జరిగిందేమిటి? యేసుక్రీస్తు విషయంలో తీర్పు తీర్చారు. మరణశిక్షను అమలు పరిచారు. అపొ.కా 12:4 ప్రకారం పేతురును చెరసాలలో పెట్టింది పస్కా పండుగ సమయంలోనే. అంతకుముందు యాకోబును ఖడ్గంతో చంపేశారు. పేతురును కూడా పట్టుకున్నారు. అయితే పస్కా సమయంలో శిక్ష అమలు చేయకూడదు కాబట్టి పేతురును చెరసాలలో పెట్టారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు, యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. అయితే అసలు వాస్తవం ధర్మశాస్త్రోపదేశకులు అని చెప్పుకొనేవారే ధర్మాన్ని అతిక్రమించారు. యూదుల ఆలోచన సభ లేదా న్యాయస్థానమైన సన్హెడ్రీన్లో గాని, రోమన్ కోర్టులో గాని నిబంధన ప్రకారం ఒక వ్యక్తి నేరస్థుడు అని తీర్పు వెలువడాలంటే ఆ న్యాయస్థానంలోని ప్రతి సభ్యుడు వారి వారి అభిప్రాయాలు తెలిపాక అందరి సమ్మతి, అంగీకారంతో శిక్ష అమలు చేయాలి. కాని యేసుక్రీస్తు ప్రభువు విషయంలో ప్రజల కేకలే గెలిచాయి.ఒక వేళ నేరం ఋజువై మరణశిక్ష విధించబడితే, అలా శిక్ష విధింపబడిన వ్యక్తికి కనీసం ఒక రోజు లేదా ఒక రాత్రి గడువును ఇవ్వాలి. ఆ వ్యక్తి మానసికంగా మరణానికి సిద్ధపడడానికి ఆ సమయం అవసరం. అయితే యేసుక్రీస్తు విషయంలో అలా కూడా జరగలేదు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే అత్యంత క్రూరమైన మరణాన్ని అమలుపరచారు. ఈ మానవ ప్రపంచ చరిత్రలో ఎంత భయంకర నేరస్థుడినైనా కూడా రాత్రివేళ న్యాయస్థానాల్లో నిలువబెట్టలేదు. నిబంధనల ప్రకారం చీకటి పడేలోపు తీర్పు వెలువరించాలి లేదా వాయిదా వేయాలి. అయితే యేసుక్రీస్తును ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టింది రాత్రివేళలోనే! ఇది అన్యాయం కాకపోతే మరేమిటి?ఏ దేశంలోనైనా ఏ న్యాయస్థానంలోనైనా నేరారోపణ ఎదుర్కొను వ్యక్తి తరుపున కనీసం మరొక వ్యక్తి వాదిస్తాడు. అటువంటి వ్యక్తి కోసం వాదించడానికి ఎవరూ లేకపోయినా, ఒకవేళ అడ్వొకేటుకు డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోయినా ప్రభుత్వం గాని, కోర్టువారు గాని ఆ వ్యక్తి కోసం వాదించడానికి ఒక ఉత్తరవాదిని నియమిస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు కోసం వాదించేవారు ఒక్కడు కూడా లేడు. ఎన్నిసార్లు ప్రశ్నలు అడిగినా కొన్నింటికి సమాధానాలు చెప్పారు; కొన్ని సార్లు ఆయన నోరు తెరవలేదు. ఆయన పక్షాన వాదించే వ్యక్తి లేకపోయినా తీర్పు తీర్చేశారు. ఇదికూడా అన్యాయమే!న్యాయవంతుడైన దేవునికి ఈ లోకం అన్యాయపు తీర్పు తీర్చింది. దేవున్ని విడిచి, మరచి బతుకుతున్న కర్కశ సమాజం ఆఖరకు సృష్టికర్తనే అన్యాయానికి గురిచేసింది. కొన్నిసార్లు నాకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నావు కదూ! నీ ప్రభువునే విడిచిపెట్టలేదు ఈ లోకం. నీవు నేను ఓ లెక్కా ఈ పాషాణ సమాజానికి? అయితే యేసుక్రీస్తు అన్యాయపు తీర్పును ఎందుకు సహించాడు? నిలదీసి అడుగుతున్న వ్యక్తులకు సమాధానం చెప్పలేక యేసు మౌనంగా ఉండిపోలేదు, ఆయన ఓ అద్భుత కార్యం నెరవేర్చబోతున్నాడు కాబట్టే అన్యాయాన్ని సహించాడు. ఆయన సహించింది కేవలం నీకోసం, నాకోసం. తప్పు చేసినపుడు శిక్షను భరించడం సమంజసమే కాని, ఏ నేరం లేని నిర్దోషియైన ప్రభువు ఘోర శిక్షను భరించాడంటే ఏదో బలమైన కారణం ఉంది. అదే అవధులు లేని ఆయన ప్రేమ! శుభ శుక్రవారం రోజున యెరూషలేములోని కల్వరి కొండపై యేసు తన ప్రాణాన్ని సకలలోక పాప పరిహారార్థమై అర్పించారు. అమూల్యమైన ఏడు మాటలు సిలువలో పలికి తన ప్రాణాన్ని అర్పించారు. ‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’ అని క్షమాపణ ప్రాముఖ్యతను తెలిపాడు. ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు’ అని తన పక్కన వేలాడుచున్న దొంగతో మాట్లాడి నిత్యత్యపు పరమార్థాన్ని తెలిపాడు. ‘అమ్మా! ఇదిగో నీ కుమారుడు’ అని మరియమ్మతో పలికి తల్లి బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. ‘ఏలీ ఏలీ లామా సక్తాని’ అని పలికి దేవునితో ఎడబాటు తీవ్రతను తెలిపాడు.‘దప్పిగొనుచున్నాను’ అని పలికి తాను మానవునిగా శ్రమను అనుభవిస్తున్నానని తెలిపాడు. ‘సమాప్తమైనది’ అని పలికి తాను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో దాని అర్థాన్ని నెరవేర్చాడు. ‘తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’ అని పలికి రక్షింపబడిన వ్యక్తి గమ్యస్థానము దేవున్ని చేరుకొని శాశ్వత ఆనందాన్ని పొందడమే అనే సత్యాన్ని తెలిపాడు. క్రీస్తు సిలువలో పలికిన ప్రతి మాట సర్వలోకానికి ఓ అద్భుత సందేశమే! క్రీస్తు మరణం శాస్త్రీయంగా ధ్రువీకరించబడింది. వందలాదిమంది రోమన్ సైనికులు క్రీస్తును సిలువ వేసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. యేసు విచారించి అన్యాయపు తీర్పు తీర్చిన పిలాతు గురించిన చారిత్రక విషయాలు ఈ మధ్య కాలంలో కైసరయలో బయటపడ్డాయి. ఆకాలంలో ప్రధాన యాజకుడైన కయపకు సంబంధించిన విషయాలను కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. యేసుప్రభువును బల్లెపుపోటు పొడిచినప్పుడు ఆయన దేహంలో నుండి రక్తం, నీళ్లు బయటకు వచ్చిన అంశాన్ని అనేకమంది శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఒక వ్యక్తి పూర్తిగా చనిపోయినప్పుడే ఆ వ్యక్తి దేహంలో నుంచి ఆ నీరులాంటి ద్రవం బయటకు వస్తుందని వారు కూడా ధ్రువీకరించారు.క్రీస్తు సిలువపై మరణించినప్పుడు అనేక అద్భుత సంఘటనలు చోటుచేసుకున్నాయి. అన్నింటిలోనూ ముఖ్యమైనది దేవాలయపు తెర చినిగిపోవుట. పాతనిబంధన కాలంలో నిర్మించబడిన దేవాలయంలో పరిశుద్ధ స్థలాన్ని అతిపరిశుద్ధ స్థలాన్ని వేరుచేయడానికి మూడు వందలమంది యాజకులచే తయారుచేయబడిన తెర ఉండేది. దాని మందం నాలుగు అంగుళాలు. మనుష్యులెవ్వరూ దానిని చింపలేనంత బలంగా ఉండేది. క్రీస్తు ప్రభువు మరణించగానే, ఆ తెర పైనుండి కిందకు చిరిగిపోయిందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దాని అర్థం ‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. విశ్వాసంతో ఆయన్ను అంగీకరించే ప్రతి ఒక్కరూ ఆయన దివ్య సన్నిధిని ధారాళంగా అనుభవించవచ్చును. యేసుక్రీస్తు మరణించిన సిలువపై ‘ఐఎన్ఆర్ఐ’ అనే మాటలు ఒక పత్రంపై వ్రాయబడ్డాయి. సిలువ వేయబడిన వ్యక్తి చేసిన నేరమేంటో బాహాటంగా అందరికీ తెలిసేటట్లు ఒక పత్రంపై అలా వ్రాసి దానిని అతని తలకుపైగా సిలువమీద పెట్టేవారు. కాబట్టి క్రీస్తుకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు ‘నజరేయుడైన యేసు యూదులకు రాజు’ అనే పై విలాసాన్ని వ్రాయించి సిలువమీద పెట్టించాడు. అది హెబ్రీ, గ్రీకు, రోమా(లాటిన్) భాషలలో వ్రాయబడింది. పిలాతు పై విలాసాన్ని ఆ విధంగా వ్రాయించడం ప్రధాన యాజకులకు నచ్చలేదు. యూదులరాజు అనికాక, యూదుల రాజునని తాను చెప్పుకున్నాడు అని వ్రాయమని కోరారు. వ్రాయబడిన పైవిలాసాన్ని మార్చడానికి పిలాతు నిరాకరించాడు. కొన్ని విషయాలను మార్చడం ఎవరివల్లా కాదు అని ఋజువైంది.అలెగ్జాండర్ అనే వ్యక్తి ఈ విషయాలన్ని ఇలా వ్యాఖ్యానించాడు. ‘హెబ్రీ, గ్రీకు, లాటిన్ ఈ మూడు భాషలూ మూడు జాతులను, వారి భావాలైన ప్రత్యక్షత, కళ, సాహిత్యం, అభివృద్ధి, యుద్ధం, ధర్మశాస్త్రం అనువాటిని తెలియచేస్తున్నాయి. ఎక్కడయితే మానవజాతికి గల ఈ మూడు కోరికలు ఉనికిలో ఉంటాయో, ఎక్కడయితే మానవ భాషలో ప్రాచుర్యం సాధ్యపడుతుందో, ఎక్కడయితే పాపం చేయడానికి ఒక హృదయం ఉంటుందో, మాట్లాడడానికి నాలుక ఉంటుందో, చదవడానికి కన్ను ఉంటుందో అక్కడ సిలువ ఒక సందేశాన్ని కలిగి యుంటుంది. శుభశుక్రవారం రోజున క్రీస్తు సిలువపై మరణించిన తరువాత ఆ సాయంత్రం ఆయన్ను సిలువమీద నుండి క్రిందకు దించి అరిమతమయి యోసేపు అనే ధనికుని సమాధిలో ఉంచారు. వాస్తవానికి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. యోసేపు ప్రఖ్యాతిగాంచిన సన్హెడ్రీన్ సభ్యుడు గనుక పిలాతు అతని విన్నపాన్ని మన్నించి క్రీస్తు దేహాన్ని అప్పగించాడు. వాస్తవానికి యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తు ప్రభువుకు ఇచ్చివేశాడు. ఆ దినాల్లో ధనికులు తన మరణానికి ముందే తమ సమాధిని సిద్ధపరచుకొనేవారు. క్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడవరోజున సజీవుడై తిరిగిలేచాడు. బైబిల్ ప్రబోధించే అనేక దివ్యసత్యాల్లో ఒకటి క్రీస్తు పునరుత్థానము. మానవ చరిత్రలోనే ఓ అపూర్వ సంఘటన.వాస్తవానికి క్రీస్తు పునరుత్ధానం గూర్చి పాతనిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు, పోలికలు పుష్కలంగా ఉన్నాయి. ఆదికాండం మొదలుకొని మిగతా లేఖనాల్లో కూడా పునరుత్థానం గురించి తెలియపరచబడింది. లేవీయకాండం పదునాలుగవ అధ్యాయంలో రెండు పక్షులు కనబడతాయి. యేసులోని రెండు ప్రాముఖ్యమైన క్షణాలు ఆ పక్షులలో మనకు తారసపడతాయి. ఒక వ్యక్తికి కుష్ఠు వ్యాధి గనుక వస్తే ఆ వ్యాధి తగ్గేంతవరకు పాళెమునకు వెలుపల జీవించాలి. తన్ను తాను ప్రత్యేకించుకుని ప్రజలకు దూరంగా నివసించాలి. కనీసం తమ ఇంటివారితో కూడా కలవకూడదనే నిబంధన ఉండేది.కొంతకాలానికి ఆ వ్యక్తికి కుష్ఠు తగ్గినట్లు అతడు భావిస్తే దానిని నిర్ధారించడానికి ఆ కాలంలో ఉండే ప్రధాన యాజకునికి తన్నుతాను కనుపరచుకోవాలి. ఒకవేళ రోగి యొక్క దేహమును పరిశీలించి రోగము నుండి అతని దేహము బాగుపడిందని ప్రధాన యాజకుడు నిర్ధారిస్తే ఆ వ్యక్తి పవిత్రుడుగా కొనసాగేవాడు. తిరిగి సమాజంలో కలిసేందుకు ముందు ఆ వ్యక్తి రోగము నుండి విడుదల పొందాక ప్రధాన యాజకుడు నియమించిన ధర్మశాస్త్ర కట్టడి ప్రకారం అతడు రెండు పక్షులు తీసుకురావాలి. అవి సజీవమైన పక్షులై ఉండాలి. సదరు వ్యక్తి వాటిని యాజకుని యొద్దకు తీసుకువచ్చిన తర్వాత ఒక పక్షిని మట్టి పాత్రలో పెట్టి చంపాలి. చంపిన తర్వాత ఆ పాత్రలోని రక్తాన్ని ఎవరైతే పవిత్రత పొందాలి అని అనుకుంటున్నారో అతని మీద ఏడుసార్లు ప్రోక్షించాలి.అలా చేసిన తర్వాత ఆ మిగిలిన రెండో పక్షిని ఆ రక్తంలో ముంచి ఆ రక్తపు ముద్రలు దానిమీద ఉండగానే దానిని విడిచి పెట్టాలి. ప్రస్తావించబడిన ఆ రెండు పక్షులు యేసుప్రభువు జీవితంలోని రెండు ప్రధానమైన అనుభవాలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఒక పక్షి మట్టి పాత్రలో చంపబడింది. మట్టి పాత్ర యేసయ్య మంటి దేహాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చాడు అని సూచిస్తుంది. మట్టి పాత్రలో చంపబడిన ఆ పక్షి యేసుక్రీస్తు ప్రభువు మరణించాడు అనేదానికి ఒక సూచనగా కనబడుతుంది. ఆయన మరణించడం ద్వారా పాపంలో పుట్టి పాపంలో జీవిస్తున్న ఒక మనిషికి ఆయన రక్తాన్ని ఆ మనిషి మీద ప్రోక్షించడం ద్వారా ఆయన మరణం ద్వారా విడుదల అనేది కలిగిందని ఆ రెండో పక్షి సూచిస్తుంది. విడిచిపెట్టబడిన రెండవ పక్షి క్రీస్తు పునరుత్థానమును సూచిస్తుంది.‘‘మరియు క్రీస్తు లేపబడియుండిన యెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే’’ (1 కొరింథీ 15:14). యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచాడా? అన్నది ఈ రోజుల్లో అనేకుల మదిలో మెదలుతున్న ప్రశ్న! అసత్యానికి, సత్యానికి మధ్య ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరు వాదించే అంశాలు చాలా విడ్డూరంగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. వాస్తవాన్ని దాచిపెట్టి, అసత్యాన్ని ప్రతిబింబించేలా అపవాది వారిని ప్రోత్సహిస్తున్నాడు అనుటలో ఏ సందేహం లేదు. యేసుక్రీస్తు సిలువపై మరణించలేదని, సుగంధ ద్రవ్యాలు పూసి, ఔషధాలు ఇచ్చి, స్పృహ కోల్పోయిన వ్యక్తిని బ్రతికించారని; ఆ తదుపరి ఆయన మగ్దలేనే మరియను పెండ్లి చేసుకొన్నాడని; కొందరైతే ఆయన కాశ్మీర్ వచ్చాడని రకరకాల కథలు చెబుతూవున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పటివేమీ కాదు. మొదటి శతాబ్దం నుండి ఉన్నవే. శిష్యులు ఆయన దేహమును ఎత్తుకొనిపోయి దాచిపెట్టి మృత్యుంజయుడైనాడని ప్రకటించారని వారి వాదన. పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యేసు సమాధి దగ్గర ఉంచినంత కావలివారిని బహుశా ఎవరి సమాధి దగ్గర పెట్టలేదేమో! ఆ తరువాతి కాలంలో ఒక్క యోహాను తప్ప క్రీస్తు శిష్యులందరూ పునరుత్థానాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ ప్రపంచం నలుమూలల హతసాక్షులయ్యారు. ఈస్టర్ శుభదినాన అనేక క్రైస్తవ సంఘాల్లో మిక్కిలి సమూయేలు వ్రాసిన ఈ భక్తిగీతాన్ని ఆలపిస్తారు. క్రీస్తు పునరుత్థాన సత్యాన్ని కీర్తిస్తారు. ‘యేసు పునరుత్థానమాయెను... చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలన్బరవాసులుగ దాజేయు నిప్పుడు’. యేసుక్రీస్తు జీవితాన్ని అద్భుతంగా వివరించే నాలుగు సువార్తలు బైబిల్లో ఉంటాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ నాలుగు సువార్తలలో క్రీస్తు పునరుత్థానం గూర్చి చాలా స్పష్టంగా వివరించబడింది. శిష్యులైన మత్తయి, యోహానులు క్రీస్తు పునరుత్థానానికి ప్రత్యక్ష సాక్షులు. వైద్యుడైన లూకా రెండు గ్రంథాలను వ్రాశాడు. యేసుక్రీస్తును సమాధిలో పెట్టిన తరువాత విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లియైన మరియయు, సలోమేయు సుగంధ ద్రవ్యములను కొని తమ దగ్గర ఉంచుకున్నారు. ఆదివారం పెందలకడ లేచి సూర్యోదయమైనప్పుడు సమాధి దగ్గరకు వస్తూ సమాధి ద్వారము నుండి మనకొరకు ఎవరు ఆ రాయిని పొర్లించును అని మాట్లాడుకున్నారు. ఆ రాతికి రోమా వారు ముద్రవేసి సైనికులను కావలి ఉంచారని కూడా వారికి తెలుసు. అయితే వారు వచ్చి చూసేసరికి అప్పటికే రాయి దొర్లించి ఉంది. రాయి దొర్లింపబడకుండా కూడా పునరుత్థానుడైన క్రీస్తు బయటకు వచ్చుండేవాడే కానీ మనుష్యులు లోపలికి వెళ్ళి పునరుత్థానం గూర్చి సాక్ష్యమిచ్చునట్లుగా రాయి దొర్లించబడింది.వారు సమాధిలో ప్రవేశించి నిలువుటంగీ ధరించిన ఒక పడుచువానిగా కనిపిస్తున్న ఒక దేవదూతను చూశారు. ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచాడని చెప్పి వారిలో ఉన్న భయాన్ని పోగొట్టి అద్భుతమైన కొన్ని విషయాలను వారికి తెలియచేశాడు. యోహాను భక్తుడు తాను వ్రాసిన సువార్తలో క్రీస్తు పునరుత్థాన ప్రత్యక్షలను చాలా స్పష్టంగా వివరించాడు. మగ్దలేనే మరియ క్రీస్తు పునరుత్థానుడయ్యాడన్న సత్యాన్ని పేతురు, యోహానులకు తెలిపింది. వారు పరుగెత్తుకుంటూ సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి ఖాళీగా ఉంది. సమాధి లోపల నారబట్టలు పడియుండడం చూశారు.ఇక్కడ ఓ ప్రత్యేకమైన విషయాన్ని యోహాను ప్రస్తావించాడు. క్రీస్తు ప్రభువు తలకు చుట్టబడిన రుమాలు నారబట్టల యొద్ద ఉండకుండా వేరుగా ఒకచోట చుట్టిపెట్టి యుండడం చూశారు. యేసుక్రీస్తు సమాధి నుండి ఏదో తొందరపాటుతో వెళ్ళిపోలేదని, అక్కడ జరిగిన సంఘటనలన్నియు ఒక పద్దతి ప్రకారం జరిగాయని చూపడానికి ఈ వివరణ అందించబడింది. ఒకవేళ క్రీస్తు దేహాన్ని ఎవరైనా ఎత్తుకుపోయినా, వారు తల రుమాలును ఇంత జాగ్రత్తగా చుట్టిపెట్టి ఉంచరు. పునరుత్థానం జరిగిన ఆదివారం సాయంత్రం శిష్యులందరూ సమావేశమయ్యారు. వారిలో ఏదో తెలియని కలవరం, భయం ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. భయం వలన వారు కూడియున్న గది తలుపులు గట్టిగా బిగించుకొనియున్నారు. అకస్మాత్తుగా క్రీస్తు వారి మధ్య నిలిచి ‘‘మీకు సమాధానం కలుగును గాక’’ అని ప్రకటించాడు. వారికి ఏది అవసరమో ఆయనకు తెలుసు కదా. తలుపులు తెరవకుండానే లోపలికి ప్రవేశించడం క్రీస్తు మహిమ. దేహాన్ని కలిగియుండుట వలన అది సాధ్యమయింది. యేసు చేసిన ప్రతి పనిలోనూ మనిషికి సమాధానం అనుగ్రహించడం చూస్తాం. ప్రస్తుత రోజులో మనిషికి అన్నీ ఉన్నాయి గాని, నిజమైన సమాధానం లేదు. వ్యక్తిగతంగా మనశ్శాంతి లేకపోవడం, కుటుంబంలో కలహాలు, సమాజంలో గొడవలు, రాజ్యం మీదకి రాజ్యాలు లేవడం సర్వసాధారణంగా కనబడుతూనే ఉన్నాయి. నిజమైన శాంతి సమాధానాలు మనిషికి ఎక్కడ లభిస్తాయి? దేవుడు సమాధానకర్త గనుక ఆయన్ను ఎవరైతే తమ హృదయాలలోనికి ఆహ్వానిస్తారో వారికి సమాధానం, పాపక్షమాపణ, ఆత్మరక్షణ, మోక్షరాజ్యం లభిస్తాయని బైబిల్ ప్రబోధిస్తుంది. పాప పశ్చాత్తాపంతో నూతన జీవితాన్ని ఆకాంక్షిస్తూ క్రీస్తు సిలువ చెంతకు చేరి ఆయన దివ్య చరణాలను ఆశ్రయించి ఆయన రక్తం ద్వారా తమ పాపములను కడుగుకొని, క్రీస్తు అనుగ్రహించు పునరుత్థాన శక్తితో జీవితయాత్రలో ఒక గమ్యాన్ని కలిగి విశ్వాసంతో సాగిపోవడం ద్వారా సర్వశక్తుడైన దేవుని మహిమపరచగలము అని క్రైస్తవులు విశ్వసిస్తారు. యేసు వారిని ఎదుర్కొని వారికి శుభమని చెప్పెను అని వ్రాయబడినట్లుగా ఈ మాటలు చదువుచున్న ప్రతి ఒక్కరికి ప్రేమమయుడైన క్రీస్తు ప్రభువు కృపాసింహాసనం నుండి అన్ని విషయాల్లో శుభం కలుగును గాక. ఈస్టర్ శుభాకాంక్షలు.‘దేవుడు రక్షణను మనిషికి అనుగ్రహించడం ద్వారా పరిశుద్ధ స్థలాన్ని ప్రతి ఒక్కరి కోసం తెరిచాడు’. విశ్వాసంతో ఆయన్ను అంగీకరించే ప్రతి ఒక్కరూ ఆయన దివ్య సన్నిధిని ధారాళంగా అనుభవించవచ్చును.మానవ చరిత్రలో ఏ వ్యక్తిని పన్నెండు గంటలు వ్యవధిలో ఆరు సార్లు న్యాయస్థానం ముందు నిలువబెట్టలేదు. కాని, యేసుక్రీస్తును నిలువబెట్టారు. శుభశుక్రవారం రోజున క్రీస్తు సిలువపై మరణించిన తరువాత ఆ సాయంత్రం ఆయన్ను సిలువమీద నుండి క్రిందకు దించి అరిమతయయి యోసేపు అనే ధనికుని సమాధిలో ఉంచారు. వాస్తవానికి యోసేపు పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకిమ్మని అడిగాడు. యోసేపు ప్రఖ్యాతిగాంచిన సన్హెడ్రీన్ సభ్యుడు గనుక పిలాతు అతని విన్నపాన్ని మన్నించి క్రీస్తు దేహాన్ని అప్పగించాడు. వాస్తవానికి యోసేపు తన కొరకు తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తు ప్రభువుకు ఇచ్చివేశాడు.యేసు పునరుత్థానమాయెను... చావునొంది క్రీస్తేసు పునరుత్థానమాయెను దాసులెల్ల నుతింప వింతగ భాసురంబుగ భక్తలన్బరవాసులుగ దాజేయు నిప్పుడు. డా. జాన్ వెస్లీ క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమహేంద్రవరం -
హోమియోలో మనమే టాప్
ప్రపంచంలోని ప్రధాన వైద్యవిధానాల్లో ఒకటైన హోమియోపతికి పుట్టినిల్లు జర్మనీ. పద్దెనిమిదో శతాబ్ది చివరినాళ్లలో జర్మన్ వైద్యుడు శామ్యూల్ హానిమన్ ఈ వైద్యవిధానాన్ని రూపొందించాడు. తొలినాళ్లలో ఆనాటి వైద్యుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నా, హానిమన్ తన ప్రాక్టీసు కొనసాగించాడు. ఆయన వద్దకు రోగులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేవారు. వార్ధక్యంలో జర్మనీని విడిచిపెట్టి 1835లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్కు వలసవెళ్లిపోయి, అక్కడే తాను 1843లో మరణించేంత వరకు విజయవంతంగా ప్రాక్టీసు కొనసాగించాడు. జర్మనీలో పుట్టిన హోమియో వైద్య విధానం యూరోపియన్ మిషనరీల ద్వారా పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో భారత్లోకి అడుగుపెట్టింది. గడచిన రెండు శతాబ్దాల కాలంలో భారత్ హోమియో వైద్యానికి ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా హోమియో వైద్యులు, రోగుల సంఖ్యలో టాప్–5 దేశాలను ఒకసారి పరిశీలిద్దాం... -
రూ.500 లంచం... 36 ఏళ్లు పోరాటం... ఏడాది జైలు
అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తిమింగలాలతో పోలుస్తారు. తాజాగా అనకొండలను చేర్చారు. ఏ జంతువుతో పోల్చినా, కేసులు నమోదు చేస్తున్నా, కొన్ని ప్రభుత్వ శాఖల్లో ‘పైసా వసూల్’ కానిదే ఫైలు కదలదు, పని జరగదు. లంచం తీసుకోవడం తమ ప్రాథమిక విధుల్లో భాగమని, ఇవ్వడం ప్రజల బాధ్యతని కొంతమంది ఉద్యోగులు భావిస్తుంటారు. అంటే, ‘డ్యూటీకి వచ్చినందుకు జీతం... పనిచేయాలంటే లంచం’ మెజార్టీ ఉద్యోగులు ఇలానే ఉన్నారు. అడిగింది ఇచ్చేదాకా వేధిస్తుంటారు. అడ్డంకులు సృష్టిస్తుంటారు. అయితే, అందరూ వీటిని భరించరు. హక్కుగా పొందాల్సిన సేవలకు లంచం ఇవ్వరు. అవినీతి నిరోధక శాఖను ఆశ్రయిస్తారు. లంచగొండులను పట్టిస్తారు. ఇలా ఓ ఉద్యోగి దొరికాడు. కేసులో ఇరుక్కున్నాడు. చిన్న మొత్తమే కదా బయట పడతాననుకున్నాడు. కోర్టుల చుట్టూ తిరిగాడు. కాళ్లరిగాయి, ఏళ్లు గడిచాయి. చివరికి న్యాయం గెలిచింది. అవినీతికి శిక్ష ఖరారైంది. కానీ చాలా ఆలస్యమైంది.అది 1990... ఉత్తరాఖండ్లోని ఉద్ధమ్సింగ్ నగర్కి చెందిన రాజ్బహుదూర్ సింగ్ ఎక్సైజ్ కానిస్టేబుల్. ఓ గ్రామంలో తనిఖీలకు వెళ్లాడు. అక్రమ మద్యం ఉందంటూ ఓ వ్యక్తితో బలవంతంగా కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. లంచంగా రూ. 500 డిమాండ్ చేశాడు. అడిగింది ఇవ్వకపోతే కేసు కోర్టుకు పంపుతానని బెదిరించాడు. వేధింపులు భరించలేక వ్యాపారి విజిలెన్స్ శాఖ ఎస్పీని కలిశాడు. జరిగింది చెప్పాడు. దీంతో వలపన్నారు. కానిస్టేబుల్ను రెస్టారెంట్కు రప్పించారు. డబ్బు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. మూడు కోర్టులు... ముప్పయ్యారేళ్లుతొలుత ట్రయల్ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. కోర్టు ఇద్దరు ప్రధాన సాక్షులను విచారించింది. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 7, సెక్షన్ 13(2) కింద మార్చి 2006లో శిక్ష ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. రెండేళ్లు జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించింది. ఈ కోర్టులో కేసు 16 ఏళ్లు నడిచింది. ఈ తీర్పుపై నిందితుడు ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. కేసు కొట్టేయాలని అభ్యర్థించాడు. ఆరేళ్లు కేసు నడిచింది. ఏప్రిల్ 2012లో హైకోర్టు ఆ అప్పీల్ను తిరస్కరించింది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. ‘సుప్రీం’కు చేరిన కేసుహైకోర్టులో చుక్కెదురవడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. కేసు కొట్టేయాలని వేడుకున్నాడు. వాయిదాలతో 14 సంవత్సరాలు కేసు కొనసాగింది. 2012 ఆగస్టులో మొదటిసారి విచారణ జరిగింది. 21 సార్లు వివిధ బెంచ్ల ముందు విచారణకు వచ్చింది. ఎట్టకేలకు తుది తీర్పు వెలువడింది. ‘సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన ట్రయల్ కోర్టు, హైకోర్టులు నిందితుణ్ణి దోషిగా తేల్చడంలో ఎటువంటి పొరపాటు చేయలేదు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.అందువల్ల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, దాన్ని హైకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తన తీర్పులో స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పును సమర్థిస్తూనే ‘నిందితుడికి ప్రస్తుతం 75 ఏళ్లు. అతడి వయస్సును దృష్టిలో పెట్టుకుని శిక్షను కనీస స్థాయికి తగ్గించవచ్చని మేం భావిస్తున్నాం’ అని తన ఆదేశంలో పేర్కొంటూ శిక్షను ఏడాదికి పరిమితం చేసింది.గతంలో కొంత కాలం జైలులో ఉండడంతో మిగిలిన కాలానికి శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసులో తీర్పు ఆలస్యం అయింది. కానీ, న్యాయం గెలిచింది. తప్పుకు శిక్ష తప్పదని వెల్లడైంది. అయితే నాణేనికి ఇది ఒక వైపే! మరోపైపు చూస్తే, 40 ఏళ్ల వయసులో చేసిన నేరానికి 75 ఏళ్ల వయసులో శిక్ష పడింది. రూ. 500 లంచం తీసుకున్నందుకు చట్ట ప్రకారం శిక్ష ఖరారైంది. అవినీతి పరులను శిక్షించాల్సిందే కానీ, 36 ఏళ్ల కాలానికి విలువ కట్టేదెవరు?దిలీప్ మాదిరెడ్డి -
కథాకళి: ఉపదేశం
భవిష్యత్తులో ఓ రోజు. ఓ తప్పనిసరి రోజు. ఆ రోజు టోక్యోలోని యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్లో సభ్య దేశాల రాయబారులు సమావేశమయ్యారు. బీద దేశాల్లోని ఖనిజాలు, ఇతర ప్రకృతి సంపదని తమదిగా చేసుకోడానికి కొన్ని దేశాలు, తమ మతాన్ని రక్షించుకోవడానికి కొన్ని దేశాలు, తమ మతవ్యాప్తికి మరికొన్ని దేశాలు, సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఆయుధ సంపత్తి గల కొన్ని దేశాలు చాలాకాలంగా యుద్ధాలు చేస్తున్నాయి. సైనికులతోపాటు కోట్లాదిమంది పౌరులు మరణిస్తున్నారు. ఆ యుద్ధాల నివారణకి, ప్రపంచశాంతికి సంప్రదింపులు జరుగుతున్నాయి.సెక్రటరీ జనరల్ ఆ సమావేశాన్ని ఆరంభిస్తూ చెప్పాడు.‘‘మిత్రులారా! మన చర్చలు ప్రతిష్టంభనతో ముగిశాయి. దాంతో ఐదవ ప్రపంచ యుద్ధం కూడా జరిగి మానవాళి పూర్తిగా నాశనం అవచ్చు. ఇప్పటికే అణ్వస్త్రాలకి తోడు లేజర్ ఆయుధాల వల్ల భూమిలో సారం తగ్గి, అంతరిక్షంలోని ఉపగ్రహం మీద పండించుకుని తింటున్నాం. మానవాళి ప్రమాదం అంచున ఉంది. కాబట్టి కృత్రిమ మేధస్సుని ఉపయోగించాలని నిర్ణయించాను. నూటముప్ఫై ఏడు దేశాల సాంకేతిక నిపుణుల సహాయం తీసుకుని, ఎలాంటి సమస్యకైనా పరిష్కారాన్ని సూచించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సూపర్ బ్రెయి¯Œ ని తయారు చేయించాను.’’ఆ గది మధ్యలో మనిషి మెదడు ఆకారంలో, దానికన్నా పాతిక రెట్లు పెద్దదిగా ఉన్న ఆ యంత్రాన్ని అంతా చూశారు. ప్రపంచాన్ని ముప్ఫైసార్లు నాశనం చేయగల ఆయుధ సంపత్తి గల, నియంత అధికారంలోని, అంతా భయపడే నార్త్ కొరియా రాయబారి చెప్పాడు.‘‘మన సమస్యకి ఓ యంత్రం పరిష్కారం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.’’‘‘కావచ్చు. కాని ‘సరైన పరిష్కారం మూర్ఖుడి నించి వచ్చినా స్వీకరించదగ్గదే’ అని మా దేశ సామెత.’’ ఉత్తరప్రదేశ్ రాయబారి చెప్పాడు.‘‘విందాం. ఈ యంత్రం ఏం చెప్తుందో, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించగలదేమో విందాం. మనం ఇప్పటికే చాలా పరిష్కారాలని విన్నాం. తిరస్కరించాము. కాబట్టి దీన్ని వినడంలో అవమానం లేదు.’’ సెక్రటరీ జనరల్ చెప్పాడు.‘‘అవును. అందులో విజ్ఞత ఉంది.’’ టెక్సస్ రాయబారి చెప్పాడు.అన్ని దేశాల్లా అమెరికా కూడా చాలా చిన్న దేశాలుగా విడిపోయింది. పదవుల కోసం చాలా రాష్ట్రాలని, దేశాలని రాజకీయ నాయకులు విడగొట్టారు. అవి రక్షణకి వివిధ మిలటరీ కూటములను ఏర్పాటు చేసుకుని అందులో సభ్యులయ్యాయి.‘‘మనకన్నా దీనికున్న క్వాలిఫికేషన్ ఏమిటి?’’ రాజస్థాన్ రాయబారి ప్రశ్నించాడు.‘‘భౌగోళిక, రాజకీయ, చరిత్ర, మతపరమైన, ఇంకా ఎన్నో అంశాలకి చెందిన అంశాలని శాస్త్రజ్ఞులు ఈ మెదడులో నమోదు చేశారు. వాటన్నిటిని క్రోడీకరించి, ఆలోచించి పక్షపాతం లేకుండా పరిష్కారాన్ని సూచించగలదు. మనిషి మెదడుకి ఈ శక్తి లేదు. కాబట్టి ఈ సూపర్ మైండ్ని సృష్టించాము.’’దాన్ని ఉపయోగించటం అవమానంగా భావించిన కొన్ని దేశాలు ఓటింగ్ కోరాయి. ప్రపంచంలోని 1862 దేశాల్లోని 73% మంది దాన్ని ఉపయోగించాలనే ఓటు వేశారు.‘‘లేడీస్ అండ్ జెంటిల్మెన్. థేంక్యూ. మన ముందున్న ఈ అద్వితీయ మెదడు వంద శాతం తృప్తికరంగా పనిచేస్తోంది. ప్రపంచ దేశాల చరిత్ర, వివాదాలు దీనికి తెలుసు. ఈ మీటని నొక్కగానే శాంతికి పరిష్కారాన్ని ఇది చెప్తుంది. మీ అంగీకారంతో దీన్ని నొక్కుతున్నాను. ఒన్... టు... త్రీ...’’ఆయన మీట నొక్కగానే అందులోని కోట్లాది న్యూరా¯Œ ్స ఒకదానితో మరొకటి కలిసి సమాచారాన్ని మార్పిడి చేసుకోవడాన్ని, మెరుపు తీగల్లా ప్రయాణించిన ఆలోచనా తరంగాలని అంతా విస్మయంగా చూశారు. క్షణం కన్నా తక్కువ కాలంలో అలా సాగాక, అది మానవ గొంతుతో గంభీరంగా పలికింది. ‘‘నన్ను పరిష్కారాన్ని కోరినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. మీరు నాకు మూడు సమస్యలని ఇచ్చారు. కొరియన్ భాషని ప్రపంచ భాషగా చేయాలనే సమస్య; ప్రజల మధ్య, దేశాల మధ్య శాంతి నెలకొల్పడం మిగిలిన రెండు. వీటి పరిష్కారం మీకు అనాదిగా తెలిసి ఉండి కూడా ఎందుకు ఆచరించడం లేదని నాకు ఆశ్చర్యంగా ఉంది.’’అంతా ఆ పరిష్కారం ఏమిటా అని ఆసక్తిగా వినసాగారు.‘‘సమస్యని చూస్తున్న మీరు, పరిష్కారాన్ని ఎందుకు చూడటం లేదు? దీన్ని ఏనాడో మీ పూర్వీకులు, అంటే ముత్తాతల ముత్తాతల ముత్తాతలు మీ క్షేమం కోసం ఉపదేశించారు. ఆ ఉపదేశాన్ని విస్మరించడమే మీరు నష్టపోవడానికి ప్రధాన కారణం. ఒక్క ఆ ఉపదేశంలోనే అన్ని మతాల వందలకొద్దీ బోధనలు నిబిడీకృతమై ఉన్నాయి. ఈ ఒక్క ఉపదేశాన్ని పాటిస్తే మనిషికి, మనిషికి మధ్య ఎలాంటి సంఘర్షణా ఉండక ప్రపంచ శాంతి నెలకొంటుంది.’’‘ఆ ఒక్క ఉపదేశం ఏమిటి?’ అని కొందరు గుసగుసలాడుకున్నారు. ఆ కంఠం గంభీరంగా పలికింది.‘‘ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్ ఏషధర్మః సనాతనః... అంటే, ‘నీకు ఏది చేస్తే బాధ కలుగుతుందో దాన్ని ఇతరులకి చేయకు. ఇది శాశ్వత ధర్మం’ కురుక్షేత్ర యుద్ధం తర్వాత, అనుశాసనపర్వంలో భీష్మ పితామహుడు అంపశయ్య మీద నుంచి ధర్మరాజుకి బోధించిన ఈ సూత్రం మానవాళి శాంతికి కిరీటం లాంటిది. తల మీద కిరీటాన్ని విస్మరించి పాదాలవైపు చూడటం ఆపండి.’’కొన్ని దేశాలవారు కరతాళ ధ్వనులు చేస్తే, మరికొందరు మొహాన్ని మొటమొటలాడించారు. -మల్లాది వెంకట కృష్ణమూర్తి -
గౌరముఖుడి వృత్తాంతం
పూర్వం కృతయుగంలో సుప్రతీకుడు అనే రాజు ఉండేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. ఎన్నేళ్లు గడిచినా వారికి సంతానం కలగలేదు. ఆ కాలంలో మహాతపస్వి అయిన ఆత్రేయ మహర్షి చిత్రకూట పర్వతం మీద ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉండేవాడు. సంతానాపేక్షతో సుప్రతీకుడు ఒకనాడు తన భార్యలిద్దరితో కలసి వెళ్లి ఆత్రేయ మహర్షిని దర్శించుకున్నాడు. ఆత్రేయుడి అనుగ్రహంతో కొన్నాళ్లకు సుప్రతీకుడికి దుర్జయుడనే కొడుకు పుట్టాడు.దుర్జయుడు అమిత శక్తిమంతుడిగా ఎదిగాడు. సుప్రతీకుడు కొడుకుకు రాజ్య పాలనను అప్పగించి, తపస్సు చేసుకోవడానికి వానప్రస్థానానికి వెళ్లిపోయాడు. దుర్జయుడు అపార సైన్యసంపత్తిని సమకూర్చుకుని, దండయాత్రకు బయలు దేరాడు. ఎక్కడా అపజయం ఎరుగకుండా, సమస్త భూమండలాన్ని అవలీలగా జయించాడు. ఆ తర్వాత అష్టదిక్పాలకులనూ ఓడించి, తన దారికి తెచ్చుకున్నాడు. విజయగర్వంతో తన రాజ్యానికి తిరుగు ప్రయాణం అవుతుండగా, తోవలో గౌరముఖుడు అనే మహర్షి ఆశ్రమం కనిపించింది. దుర్జయుడు తన సైనిక పటాలాన్ని బయటనే నిలిపి ఉంచి, తానొక్కడే మహర్షి ఆశ్రమంలోకి వెళ్లి, ఆశీస్సులు కోరాడు. గౌరముఖుడు మహారాజైన దుర్జయుడిని సాదరంగా ఆహ్వానించి, గౌరవించాడు. ‘మహారాజా! ఘనవిజయాలు సాధించి నా ఆశ్రమానికి వచ్చావు. నీకు, నీ పరివారానికి ఆతిథ్యమిస్తాను’ అన్నాడు.ఒంటరిగా ఆశ్రమంలో ఉంటున్న మహర్షి తనకు, తన వెంట వచ్చిన లక్షలాదిమంది సైనికులకు ఆతిథ్యం ఎలా ఇస్తాడా అని దుర్జయుడు ఆశ్చర్యపోయాడు.అంతలోనే గౌరముఖుడు స్నాన సంధ్యలు ఆచరించి వస్తానని చెప్పి, సమీపంలోనే ఉన్న గంగానదికి వెళ్లాడు. గంగలో నిలిచి, భక్తిగా నారాయణుడిని స్తుతించాడు.గౌరముఖుడి స్తుతికి ప్రసన్నుడైన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు.‘స్వామీ! దుర్జయ మహారాజు సైన్యసమేతంగా నా ఆశ్రమానికి వచ్చాడు. అతడికి, అతడి పరివారానికి ఆతిథ్యం ఇస్తానని చెప్పాను. వారందరికీ ఆతిథ్యమిచ్చే శక్తినివ్వు’ అని ప్రార్థించాడు. నారాయణుడు ఒక దివ్యమణిని గౌరముఖుడికి ఇచ్చి, ‘ఈ మణి నువ్వు కోరినవన్నీ తక్షణమే ఇవ్వగలదు’ అని చెప్పి అదృశ్యమయ్యాడు.గౌరముఖుడు ఆ మణి మహిమతో దుర్జయుడు, అతడి పరివారం విడిది కోసం అప్పటికప్పుడే చలువరాతి సౌధాలు, దాస దాసీ జనాలు, ఉద్యాన వనాలతో కూడిన ఒక సువిశాల సుందర నగరాన్ని సృష్టించాడు. దుర్జయుడికి, అతడి పరివారానికి కోరిన పదార్థాలన్నింటినీ సుష్టుగా వడ్డించాడు. భోజనానంతరం వారంతా అక్కడే హాయిగా విశ్రమించారు. మరునాటి ఉదయం దుర్జయుడు, అతడి పరివారం కాలకృత్యాలు, స్నాన సంధ్యల కోసం నదికి వెళ్లారు. వారు తిరిగి వచ్చే సరికి ముందురోజు తాము బస చేసిన నగరం కనిపించలేదు. గౌరముఖుడి శక్తికి దుర్జయుడు, అతడి పరివారం చకితులయ్యారు. గౌరముఖుడి వద్ద సెలవు తీసుకుని రాజధాని వైపు ప్రయాణం మొదలుపెట్టారు.మార్గమధ్యంలో ఉండగా, దుర్జయుడికి ఒక దురాలోచన వచ్చింది. గౌరముఖుడు తమందరికీ ఎలా ఆతిథ్యం ఇచ్చాడో, ఆ రహస్యమేమిటో కనుక్కుని రమ్మని చారులను పంపాడు. నారాయణుడి వరం వల్ల పొందిన మణి మహిమతో అతడు తమకు ఆతిథ్యం ఇవ్వగలిగాడని చారులు చెప్పారు. ఆ మణిని అడిగి తెమ్మని దుర్జయుడు భటులను పంపాడు.గౌరముఖుడి వద్దకు వెళ్లిన భటులు మణిని ఇవ్వమని తమ రాజు ఆదేశించినట్లుగా చెప్పారు. నారాయణ వరప్రసాదమైన మణిని తాను ఇచ్చేది లేదని గౌరముఖుడు నిర్మొహమాటంగా చెప్పాడు. వారు దుర్జయుడి వద్దకు వెళ్లి మణిని ఇవ్వడానికి గౌరముఖుడు తిరస్కరించిన సంగతి చెప్పారు.దుర్జయుడు సైన్యసమేతంగా గౌరముఖుడిపైకి దండెత్తి వచ్చాడు. గౌరముఖుడు మణి మహిమతో సైన్యాన్ని సృష్టించాడు. ఆ సైన్యం చేతిలో దుర్జయుడి సైన్యం తుడిచిపెట్టుకుపోయింది. దుర్జయుడు కరవాలం దూసి గౌరముఖుడిపైకి దూసుకు వస్తుండగా, గౌరముఖుడు నారాయణుడిని ప్రార్థించాడు. నారాయణుడు చక్రం సంధించి, దుర్జయుడి కంఠాన్ని ఉత్తరించాడు.∙సాంఖ్యాయన -
క్లూషియల్: క్రైమ్ సీన్..
రాత్రి పది గంటలు . క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు అప్పుడే అక్కడకు చేరుకున్నాడు.వెంటనే క్లూస్ టీమ్ అతని దగ్గరికి వచ్చి చెప్పింది. ‘ఫుడ్ పాయిజనింగ్.., ఒక విధంగా విషప్రయోగం... పూర్తి రిపోర్ట్స్ వెంటనే అందేలా ఏర్పాటు చేస్తాం’,,, ఆ మాట వింటూనే మరణించిన తన పదహారేళ్ళ కూతురు లీల శవం దగ్గర నుంచి లేచి వచ్చి, ‘నాకు తెలుసు ఇన్స్పెక్టర్ ఇదంతా నా రెండో భార్యే చేసింది. సవతి తల్లి కదా’... తన కూతురి దగ్గర ఏడుస్తూ కూర్చున్న రెండో భార్య నీలవేణి వైపు కోపంగా చూస్తూ అన్నాడు దివాకర్. రెండు గంటల్లో పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఆర్సెనిక్ మూలకాన్ని ఎక్కువ మోతాదులో కలిసిన నూడుల్స్ తినడం వల్ల లీల చనిపోయినట్టు తేలింది. రోజూ నూడుల్స్ తినిపించే నీలవేణి ని చూస్తూ, ‘నా కూతురికి ఇష్టమని నూడుల్స్ తెస్తే, అందులోనే విషం కలిపి నా కూతురిని చంపిన ఈ రాక్షసిని ఉరి తీయాలి’ దివాకర్ అరుస్తున్నాడు.ప్రతిఘటన లేకుండా, ఎలాంటి సమాధానం చెప్పకుండా పోలీసులకు సరెండర్ అయ్యింది నీలవేణి. ‘కేసును ఇంత త్వరగా క్లోజ్ చేస్తారనుకోలేదు. కూతురులాంటి బిడ్డను సవతితల్లి చంపుకుంది?’ కటకటాల్లో ఉన్న నీలవేణి వైపు చూస్తూ అన్నాడు డీసీపీ.ఇన్స్పెక్టర్ అభిమన్యు కస్టడీలో వున్న నీలవేణి దగ్గరికి వెళ్లి, ‘ఎందుకు చేశావీ పని?’ అడిగాడు. తలెత్తింది నీలవేణి.‘సవతితల్లిని కదా... నాకు పిల్లలు వద్దనుకున్నానుగా... వున్న బిడ్డను చంపుకుని హాయిగా బ్రతకాలని’ ఏడుస్తూ తల దించుకుంది... కన్నీళ్లు కనిపించకుండా...కారులో వెళ్తున్న ఇన్స్పెక్టర్ అభిమన్యు నీలవేణి మాటలను రీకలెక్ట్ చేసుకుంటున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారు ఆగింది. యథాలాపంగా ఎడమ వైపు చూస్తుంటే హాస్పిటల్ కనిపించింది. కారును లెఫ్ట్ వైపు పోనించాడు. న్యాయాన్ని బతికించడానికి.బార్ ముందు ఇన్స్పెక్టర్ కారు ఆగింది. లోపలకి వెళ్లేసరికి ఒక టేబుల్ దగ్గర మందు కొడుతూ కనిపించాడు దివాకర్.అక్కడికి వెళ్లి అతను ముందు కూర్చుని, ‘నాకూ ఆర్డర్ చేయండి?’ అన్నాడు. దివాకర్ ఇన్స్పెక్టర్ను చూసి కంగారుపడ్డాడు. అంతలోనే సర్దుకుని, ‘నా కూతురి మరణాన్ని తట్టుకోలేక’... ‘మందు కొడుతున్నావా? ఆ మందులో ఆర్సెనిక్ విషాన్ని కలిపితే బాగుంటుంది. జైల్లో కూర్చుని’... ‘మీరేమంటున్నారు?’‘నీ కూతురు ఇష్టంగా తినే నూడుల్స్లో ఆర్సెనిక్ విషాన్ని కలిపావు. నీ రెండో భార్య నీ కూతురికి నూడుల్స్ తినిపిస్తుందని తెలిసి... నీ రెండో భార్య పెళ్లి కాగానే తనకు ఇక బిడ్డలు వద్దని, లీలే తన కూతురు అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది... ఆ విషయాన్ని మీ ఫ్యామిలీ డాక్టర్ ద్వారా తెలుసుకున్నాను. ఆర్సెనిక్ విషం గురించి నువ్వు గూగుల్లో సెర్చ్ చేసి మరీ క్రైమ్ చేసినట్టు నీ మెయిల్ ద్వారా తెలిసింది. నువ్వు పనిచేస్తున్న కంపెనీలో పనిచేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు చేసిన వరస్ట్ క్రైమ్’ చెప్పాడు. అప్పటికే పోలీసులు అక్కడికి వచ్చి, దివాకర్ను అరెస్టు చేశారు. దివాకర్ కటకటాల్లోకి వెళ్ళాడు.కటకటాల నుంచి బయటకు వచ్చింది నీలవేణి.‘థాంక్యూ ఇన్స్పెక్టర్. నన్ను శిక్ష నుంచి బయట పడేసినందుకు కాదు, నా కూతురి ఆత్మ శాంతించేలా చేసినందుకు’... కన్నీళ్లతో చెప్పింది, అభిమన్యు ముందు నిలబడి చేతులు జోడించి.‘చట్టాన్ని మాత్రమే కాదు. అమ్మ మనసునూ కాపాడటం నా బాధ్యత.’ చెప్పి ముందుకు కదిలాడు ఇన్సె్పక్టర్ అభిమన్యు .∙శ్రీసుధామయి -
ఈ వారం కథ: కావిడి పెట్టె
ప్రముఖ రచయిత, ఉత్తమ అవార్డు గ్రహీత భయ్యా కన్నుమూత.. హుష్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.అదేమిటి మొన్న సాయంత్రం వరకు బాగానే ఉన్నారు కదా... విజయవాడ పుస్తక మహోత్సవంలో వేదికపై నేను రాసిన ‘బతుకు బస్టాండు’ పుస్తకం ఆవిష్కరించి నాతో చాలాసేపు మాట్లాడారు. ఇంతలోనే ఏమైంది?.. నాలో ఆదుర్దా మొదలైంది.రిమోట్ అందుకుని వేరే చానల్ మార్చా. అందులోనూ ఇదే వార్త స్క్రోలవుతోంది. మనసాగక మరో చానల్కు వెళ్లా.. ఇదే సమాచారం ఫ్లాష్ న్యూస్గా వేస్తూ ఆయన ఫొటోలు చూపుతున్నారు. లైవ్ దృశ్యాలు ఇంకా ఏ చానల్లోనూ ప్రసారం కావడం లేదు. వెంటనే ఆయన అభిమాన సంఘం ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసి వార్తను నిర్ధారించుకున్నాను.భయ్యాగారు నాకంటే ఇరవై రెండేళ్లు పెద్ద. రచనాపరంగా ఆయన శైలి, భాష, ముక్కుసూటిగా చెప్పే తత్వం బాగా నచ్చి ఆయనకు వీరాభిమానినయ్యా. ఇంటర్లో ఉన్నప్పుడు ఆయన మా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారు. కళాశాల సావనీరులో నేను రాసిన కథ చదివి అభినందించారు. ఆయనకు వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి పిలిపించి కథలు రాయడంలో మెలకువలు నేర్పారు. అందుకే ఆయన్ను రచనా వ్యాసంగానికి తొలి గురువుగా స్వీకరించాను. అత్యంత నిరాడంబరంగా ఉండే రచయితల్లో భయ్యా ఒకరు. నేను పుస్తకాలు చదవడం ప్రారంభించిన రోజుల్లో ఏ దినపత్రిక, వారపత్రిక, మాసపత్రిక చూసినా ఆయన రచనలే కనిపించేవి. ప్రతి కథనూ, వ్యాసాన్ని మొదటి నుంచి చివరి వరకూ పొల్లు పోకుండా చదివేవాడిని. ఆయనంటే నాకెంతటి అభిమానమో.. ఆయనకూ నేనంటే అంతే ఇష్టం. ఆయనతో సన్నిహితంగా మెలిగిన క్షణాలు, ఆయన చెప్పిన మాటలు నా కళ్ల ముందు సినిమా రీల్లా తిరుగుతుంటే ఫోన్ రింగయింది. మా ఇద్దరితో పరిచయం ఉన్న మిత్రుడు సారథి చేశాడు.. ‘భయ్యాగారు ఎలా పోయారు?’ అని.ఆ...ఆ.. ఇప్పుడే తెలిసింది. రాత్రి టిఫిన్ తిని ‘ఖ్యాతిముత్యం’ సీరియల్ రాస్తున్నారట. అలా రాస్తుండగా గుండెపోటు వచ్చింది. ఒంటరిగా ఉంటారేమో ఉదయం పేపర్ బోయ్ వచ్చేవరకు ఎవరూ చూడలేదు. ఆ కుర్రోడు అంబులెన్స్కు కాల్ చేస్తే వాళ్లొచ్చి చూసి రాత్రే చనిపోయారని నిర్ధారించారు..మిత్రుడితో మాట్లాడుతూనే ఆషామాషీ టీవీ చానల్ మార్చాను.భయ్యా ఆకస్మిక మృతిని మేజర్ వార్తగా కవరేజి ఇస్తున్నారు.భయ్యా అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. అసలు పేరు భగవంతం బలరామయ్య. మొదటి అక్షరం ‘భ’, చివరి అక్షరం ‘య్య’ను కలిపి ‘భయ్యా’గా కలం పేరు పెట్టుకుని అమూల్యమైన, స్ఫూర్తిదాయకమైన రచనలు చేశారు. యువత వికాసానికి చాలా పుస్తకాలు వెలువరించారు.. నాటకాలు, సినిమాలకు కథలు సమకూర్చారు. వందలకొద్దీ అవార్డులు, రివార్డులు అందుకున్న ఘనత భయ్యా సొంతం. ఆయన వయసు 77 ఏళ్లు. రచనా వ్యాసంగానికి అడ్డుకాకూడదనుకుని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయారు.. అంటూ న్యూస్ రీడర్ గుక్కతిప్పుకోకుండా చెబుతోంది. ఆయన పాత ఫొటోలు, పుస్తకాల కవర్ పేజీ క్లిప్పింగులు, సాహితీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటి వీడియోలు చూపిస్తూ అక్షర నివాళి అర్పిస్తున్నారు. పార్థివ దేహాన్ని విజయవాడలోని స్వగృహానికి తరలించినట్లు చెబుతూ.. అంత్యక్రియలు ఎప్పుడు జరిగేదీ ఇంకా స్పష్టత రాలేదన్నారు.నాకేమో ఎప్పుడెప్పుడు వెళ్లి ఆయన పార్థివదేహాన్ని చూద్దామా అని మనసు పీకుతోంది. అనుకోకుండా ఆరోజు విజయవాడలో ఆటోవాలాలు సమ్మె చేస్తున్నారు. నాకైతే యాక్టివా ఉంది.. భుజం నొప్పితో బాధపడుతూ డాక్టర్ సలహా మేరకు నెల రోజులుగా బండి నడపడం లేదు.వెంటనే మిత్రుడు సారథికి ఫోన్ చేస్తే మంగళగిరి నుంచి హడావుడిగా వచ్చాడు. ఇద్దరం కలిసి వాడి కారులో లబ్బీపేటలోని భయ్యాగారింటికి బయలుదేరాం. దగ్గరలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ఇందిరాగాంధీ స్టేడియం వద్ద కారు నిలిపి నడుచుకుంటూ వెళ్లాం. ఆ ఇల్లు వారి తాతల నుంచి వచ్చిన వారసత్వపు ఆస్తి. నాలుగు గదుల డబుల్ పోర్షన్ డాబా ఇల్లు. దాదాపు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుత మార్కెట్ ధరను బట్టి మూడు కోట్లకు పైనే పలుకుతుంది.అప్పటికే నగరంలోని సాహితీ మిత్రులందరూ భయ్యా పార్ధివదేహం వద్ద పూలు జల్లి నివాళులర్పిస్తున్నారు. నేను తీసుకెళ్లిన ఆయన ఫొటోను, రాసిన కొన్ని ప్రముఖ పుస్తకాలనూ అక్కడున్న చెక్క కుర్చీమీద పెట్టి నమస్కరించాను. టీవీ చానల్స్వారు లైవ్ కవరేజి కోసం హడావుడి చేస్తున్నారు. బందరు రోడ్డుపై ఓబీ వ్యాన్లన్నీ కవాతు చేస్తున్న సైనికుల్లా వరుసగా నిలిపి ఉన్నాయి. ఒక యాంకరమ్మ వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తోంది. నన్ను చూడగానే ఇంకో చానల్ యాంకర్ నా వద్దకు వచ్చి ఆయన గురించి నాలుగు ముక్కలు చెప్పాలని గొట్టం నా ముఖం మీద పెట్టింది.రెండు మూడు గంటల్లో సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ వీధిలోని వారంతా వలంటీర్లుగా మారిపోయారు. వచ్చినవారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. మరికొంతసేపటికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేశారు.నిజానికి భయ్యాగారు ఒంటరి. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు లేరు. పెద్దమ్మ పిల్లలు, బాబాయి పిల్లలు ఉన్నప్పటికీ వారంతా అమెరికాలో సెటిలయ్యారు. పాతికేళ్లుగా ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు లేవు. కనీసం ఫోను సంభాషణలు కూడా శూన్యం. భయ్యా తదనంతరం ఆస్తిపాస్తుల్ని, సంపాదించిన డబ్బును కొట్టేయాలన్న కాంక్షతో బందరు, నూజివీడు, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఉన్న బీరకాయ పీచు చుట్టాలు టీవీలో వార్తలు చూసి మధ్యాహ్నానికల్లా కార్లలో వాలిపోయారు. ఎవరికి వారే ఖరీదైన పూలదండలు మోసుకొచ్చారు. తమకు భయ్యాతో ఉన్న అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకుంటూ ఆరున్నొక్క రాగం ఆలపించారు. ‘ఆస్తి మూరెడు..ఆశ బారెడు’ నవల్లో రాసినట్లు వాళ్లంతా తమలోని నటులను వెలికితీశారు. ఒక పెద్దాయనైతే ‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందాన్ని మరిపించాడు.మధ్యాహ్నం 2 గంటలు. ఆగస్టు నెలలోనూ ఎండ ప్రచండంగా మండిపోతోంది. సందర్శకులు ఆకలి దప్పులను సయితం మరిచి ఉదయం నుంచి షామియానాల కింద ఉసూరుమంటూ కూర్చుని సెల్ఫోన్లో వీడియోలు చూసుకుంటున్నారు. ఇంకొందరేమో ఆయన పార్థివదేహం వద్ద నిలబడి సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాను పిచ్చపిచ్చగా వాడేసుకుంటున్నారు.యూట్యూబర్లయితే ఎవరిని పడితే వారిని, ఏది పడితే అది మాట్లాడించి రికార్డు చేస్తున్నారు. తమ చానల్ను సబ్స్క్రైబ్ చేయించాలని బతిమలాడుతున్నారు.భయ్యా అభిమానులు అందరికీ పెరుగన్నం పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు.ఓ బీరకాయ పీచు చుట్టం వాలంటీర్ను పిలిచి ‘వీటన్నింటికీ డబ్బులెక్కడివి? మీరే పెట్టుకుంటున్నారా? లేక మా బాబాయి ఖాతాకు కన్నం పెడుతున్నారా?’ చెవిలో గొణిగాడు.ఆ కుర్రాడు ఆయన్ను ఎగాదిగా చూసి ‘మీ బాబాయెవరు?’ అంటూ అయోమయంగా ప్రశ్నించాడు.‘అదేనయ్యా! మెడనిండా పూలదండలేసుకుని శాశ్వత నిద్ర పోతున్న ఆ పెద్దాయన’ అంటూ భయ్యా గారి శవపేటిక వైపు వేలు చూపెట్టాడు.వాలంటీర్ ఆయన్ను కూరలో కరివేపాకులా తీసిపారేసి ముందుకు సాగాడు.బీరకాయ పీచులు మెల్లగా జారుకుని బందరు రోడ్డెక్కారు. పీకల్దాకా బిర్యానీలు మెక్కి తిరిగొచ్చారు.ఒక తెలివైన ప్రచురణకర్త భయ్యాగారు రాసిన పుస్తకాలను ఆటోలో తీసుకొచ్చి విక్రయాలు ప్రారంభించాడు. తెచ్చిన గంటసేపట్లోనే సరుకంతా అయిపోగా, మళ్లీ తేవడానికి నిష్క్రమించాడు.భయ్యాగారి అభిమానులను, వాడకట్టు నివాసితులను చూసి ఆనందపడాలో.. ధనార్జనే ధ్యేయంగా శవం ముందు డబ్బులేరుకుంటున్న ప్రచురణకర్తను చూసి బాధపడాలో అర్థం కాక మిన్నకుండిపోయాను.∙∙ మధ్యాహ్నం 3 గంటలు. కర్మకాండలు నిర్వహించేందుకు ఇద్దరు పురోహితులు, సహాయకుడు ఇల్లు వెతుక్కుంటూ చేరుకున్నారు. అందుకు కావాల్సిన సరంజామా వెనకాలే ఆటోలో వచ్చింది.అంత్యక్రియలు ఎన్ని గంటలకు చేస్తారండి అని ఒకరు, ఎవరు చేస్తారండి అని మరొకరు నా వద్దకొచ్చి అడిగారు.ఇంకా ఏమీ అనుకోలేదండి.. ఆయనకు కావాల్సినవాళ్లమంతా కూర్చుని మాట్లాడాక నిర్ణయిస్తాం.. చెప్పాను.‘మేం కావాల్సినవాళ్లం కాదా?’ అని ఓ బీరకాయ పీచు మైండ్ వాయిస్ బయటికి వినిపించింది.భయ్యాగారికి అంత్యక్రియలు ఎవరు చేయాలనే విషయమై అంతా తర్జనభర్జన పడుతున్నారు. ఆయన అభిమాన సంఘం అధ్యక్షుడు ముందుకొచ్చి ‘మా సంస్థ తరఫున నేనే తలకొరివి పెడతా’నని చెప్పాడు.నగరంలోని రచయితల సంఘాలన్నీ కలిసి ఈ తంతు పూర్తిచేస్తే బాగుంటుందని నా అభిప్రాయం కుండబద్దలు కొట్టాను.‘బంధువుని నేనుంటే.. మీరెలా పెడతారు?’ ఆవేశంగా అడిగాడు గుంటూరు గురునాథం.‘భయ్యా బాబాయికి తలకొరివి నన్నే పెట్టమని పైలోకంలో ఉన్న అమ్మ నాకు పదేళ్ల కిందటే చెప్పింది’ బందరు బాబు లైన్లోకి వచ్చాడు. ‘గతంలో అమ్మ బెజవాడ వచ్చినప్పుడల్లా బందరు లడ్డూలు, నల్ల హల్వా తెచ్చిస్తే బాబాయి ఇష్టంగా తినేవాడురా.. నేను పోయాక ఆయనకు ఏ కష్టం రాకుండా చూసుకోరా.. అని చాలాసార్లు నాతో అంది’.. అంటూ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లిపోయాడు.‘మీకు మీరే నిర్ణయాలు తీసేసుకునే లెక్కయితే ఇక మేమొచ్చిందెందుకు? నలుగురం కూర్చొని మన శంకర వరప్రసాదుగారిలా టీమ్ మీటింగు పెట్టుకుని ఒక అంగీకారానికి వద్దాం’ నూజివీడు, ఒంగోలు నుంచి వచ్చిన నీలాంబరం, రామ్మూర్తి ముక్తకంఠంతో పలికారు. అప్పటివరకు నాకు వాళ్లేమిటో, వారి వైఖరేమిటో పూర్తిగా అర్థం కాలేదు. వాళ్లొచ్చింది ఆయనపై ప్రేమతో కాదు, ఆస్తిమీద ఆశతోనని నిర్ధారించుకోవడానికి అట్టే సమయం పట్టలేదు.పట్టరాని కోపంతో నీలాంబరం, రామ్మూర్తి జుత్తు పట్టుకుని పక్కకు ఈడ్చేద్దామనుకున్నాను. ఇద్దరిదీ బట్టతలే కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేనా ప్రయత్నం విరమించుకోవాల్సి వచ్చింది.చర్చోపచర్చలు, వాదోపవాదాలు సీరియస్గా సీరియల్గా నడుస్తూనే ఉన్నాయి శిఖరాగ్ర సమావేశాలకు దీటుగా.‘ఏదో ఒకటి త్వరగా తేల్చండి.. ఆవతల సూర్యాస్తమయం కావస్తోంది’ పొరుగింట్లో ఉండే వృద్ధమనిషి తొందరపెట్టారు.ఇంతలో అక్కడికి నల్లకోటు వేసుకున్న వ్యక్తి జనాలను తోసుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. వస్తూనే అందరికీ నమస్కరించాడు. ఆయన వాలకం చూస్తే లాయర్ అని గ్రహించడానికి నాకెంతో సమయం పట్టలేదు.నా పేరు విశ్వనాథ్. పాతికేళ్లుగా భయ్యాగారితో పరిచయం ఉంది. కోవిడ్ సోకి దాదాపు చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆయన కోలుకున్న తర్వాత వీలునామా రాశారు. దాన్ని ఇంతకాలం నావద్ద భద్రంగా ఉంచారు. తాను మరణించాక దాన్ని బహిర్గతం చేయాలని నాతో చెప్పి మాట తీసుకున్నారు. ఆ ప్రకారం ఇప్పుడు నేనొచ్చా అంటూ బ్యాగ్లోంచి వీలునామా బయటికి తీశాడు.అందరి కళ్లూ ఆ వీలునామాపైనే కేంద్రీకృతమయ్యాయి. మరీ ముఖ్యంగా బీరకాయ పీచులు గోతికాడ నక్కల్లా అందులో ఏం రాశారోనని ఆబగా ఎదురుచూస్తున్నారు.ఎవరికీ నోట మాట రావడం లేదు. నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. ముఖంపై చెమటను కర్చీఫ్తో ఒకటికి పదిసార్లు అద్దుకుంటున్నారు. టాంటాం టీవీ చానల్ కెమెరామేన్ రాంబాబు కెమెరా జూమ్ చేశాడు. రిపోర్టర్ గంగ జింకపిల్లలా చెంగు చెంగున గెంతుతూ జనాలను తోసుకుని ముందుకొచ్చింది.ఏదో అయిపోతుందని హడావుడిగా మరో రెండు మూడు చానల్స్ కెమెరామెన్, కొంతమంది యూట్యూబర్లు అనుసరించారు.ఈ హడావుడి చూసి ప్రతి ఒక్కరూ జేబులోంచి ఫోన్ తీసి ఫొటోలు తీయసాగారు.ఈ తంతు నిశితంగా గమనిస్తున్న బీరకాయ పీచు చుట్టాలు... ముసలోడు గట్టిగానే సంపాదించి ఉంటాడనుకున్నారు. ఆమధ్య చెన్నయ్లో లావుపాటి గండపెండేరం తొడిగినప్పుడు టీవీలో చూసిన సన్నివేశం వారి మదిలో మెదిలింది. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఎవరికి వారు ఆశ పడుతున్నారు.ఈ ఆలోచనల నుంచి వారు పూర్తిగా తేరుకోకముందే లాయర్ అందులో ఏముందో చదివి వినిపించారు. భయ్యాగారు రాసినట్లు డాబా ఇంటిని జిల్లా గ్రంథాలయ సంస్థకు అప్పజెప్పాలి. తనకు ఎవరైతే అంత్యక్రియలు నిర్వహిస్తారో వారికి తన కావిడిపెట్టె కానుకగా అందజేయాలని పేర్కొన్నారు. అది కూడా దశ దిన కర్మ రోజు వారికి స్వాధీనపరచాలని స్పష్టంగా రాశారు.నేనూ ఆయన అభిమానులూ అందరం పెద్దగా చప్పట్లు చరిచాం.‘భయ్యాజీ అమర్ రహే’ అని కొందరు, ‘కలం సలాం’ అని ఇంకొందరు జేబుల్లోంచి పెన్నులు తీసి పైకెత్తి పట్టుకుని నినదించారు.అంతా పెద్దాయన దొడ్డ మనసుకు జోహార్లర్పించి అభినందిస్తుంటే ఆ నలుగురు బంధువుల ముఖాలు ఫిల్మంటు తెగిన బల్బుల్లా మాడిపోయాయి. ‘ఇంతకీ విల్లు రిజిస్ట్రీ గట్రా చేశారా?’ ఒకాయన అడిగాడు..‘రిజిస్టర్ చేశారండి.. ఇవిగో చూడండి’.. అంటూ స్టాంపు పేపర్లు అందరికీ చూపించాడు విశ్వనాథ్. పనిలో పనిగా జిరాక్సు కాపీ సెట్టొకటి ఇచ్చాడు. ఆలస్యం చేయకుండా వారంతా టీమ్ మీటింగు పెట్టుకున్నారు. రహస్య మంతనాలు జరిపి తామంతా ఉమ్మడిగా అంత్యక్రియలు నిర్వహిస్తాం.. ఆ కావిడిపెట్టెను తమకివ్వాలని లాయర్ను అభ్యర్థించారు... డబ్బూదస్కం, గండపెండేరాల్లాంటి బంగారు వస్తువులు అందులో ఉంటాయని భావించి!ముందుచూపంటే అదే మరి... వెనకాల ఎవరో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.‘ఏం ముందుచూపో ఏమో... ముసలాడు ఘటికుడే. గట్టిగానే మెలికపెట్టాడు. ఎంతైనా రచయిత కదా! ఇంకొక డైలాగు గుంపులోంచి వినిపించింది.లాయర్ ఏం చెబుతారా అని అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సరే.. ఏం చేద్దాం.. చెప్పండి సార్.. నలుగురు బంధువులు లాయర్ వంక తేరిపార చూశారు.‘భయ్యాగారికి దూరపు బంధువులాయె.. మీరు దహనక్రియలు నిర్వహిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది’ అని చెప్పగానే ఆనందంతో ఎగిరి గంతేయాలనుకున్నారు. మరీ అతి చేసినట్లవుతుందని భావించి ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అభిమానులంతా కార్యకర్తల్లా ముందుకొచ్చి ఏర్పాట్లు చకచకా చేసేశారు. అంతిమయాత్ర శకటాన్ని పచ్చిపూలతో అందంగా అలంకరించారు. ఆయన పుస్తకాల తాలూకు కవర్ పేజీ ఫొటోలతో ఫ్లెక్సీలు ముద్రించి వ్యాన్ చుట్టూ తోరణాల్లా కట్టారు. నగరంలోని ప్రముఖులతోపాటు పాటు పొరుగూళ్ల నుంచి వచ్చిన కవులు, రచయితలు కొంత దూరం భయ్యా పాడె మోశారు. ఆ తర్వాత భౌతికకాయాన్ని వ్యానెక్కించారు. పెళ్లికొడుకును ఊరేగించినట్లు ఊరేగించగా... సాహితీ లోకమంతా ఆయన వెంట కృష్ణలంకలోని మరుభూమి వరకు నడిచింది.ఆ విధంగా భయ్యాగారి అంతిమ సంస్కారం అంగరంగ వైభవంగా ముగిసింది. మరుసటి రోజు అన్ని పత్రికల్లోనూ ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. ఆరోజు భయ్యాగారి పెద్దకర్మ. ఇంటి వద్దే ఏర్పాటుచేశారు. బీరకాయ పీచు చుట్టాలు కర్మకాండలకు కావాల్సినవన్నీ సమకూర్చారు. అన్ని రకాల దానాలు ఘనంగా జరిపించారు. వచ్చిన వారందరికీ పెన్నులూ, పుస్తకాలు పంచిపెట్టారు. నభూతో నభవిష్యతి అన్నట్లు పసందైన విందు భోజనం పెట్టారు.జనం తిరునాళ్లలా వచ్చి పోతున్నారు. సాయంత్రం నాలుగింటి వరకు తింటూనే ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు లాయర్ విశ్వనాథ్ ప్రెస్మీట్ పెడుతున్నట్లు అన్ని చానళ్లలో స్క్రోలింగ్ వస్తోంది. ఆ వీలునామాలో ఏముందోనని అందరూ టీవీలకు అతుక్కుపోయారు. భయ్యా ఇంటి వద్దా అదే పరిస్థితి. అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఆ నలుగురిలో ఇద్దరు చేతి గడియారం వంక పదేపదే చూసుకుంటున్నారు. మరో ఇద్దరికి వాచీ లేదేమో సెల్ఫోన్లో టైం చూసుకుంటూ గోళ్లు కొరుక్కుంటున్నారు. సాయంత్రం ఐదు గంటలు... లాయర్ విశ్వనాథ్ మీడియా సమావేశం ప్రారంభించారు. గుండుసూది కిందపడినా వినిపించేంత నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. భయ్యా గురించి నాలుగు మంచి మాటలు చెప్పి.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకుని నివాళులర్పించారు. అనంతరం పెద్దాయన కోరిక మేరకు కావిడి పెట్టె తాళం చెవిని మీడియా సమక్షంలో ఆ నలుగురు బంధువులకూ అప్పచెప్పడంతో అప్పగింతల తంతు ముగిసింది.లోపల ఏముందో చూడాలని తెగ ఆరాటపడిపోతున్నారంతా. చానల్స్ కెమెరాలన్నీ కావిడిపెట్టె వైపే చూస్తున్నాయి. గురునాథం తాళం తెరిచాడు. కెమెరాలు ముందుకొచ్చాయి .. మూత పైకి లేవనెత్తాడు. కెమెరాలు జూమ్ చేసేశారు. అందరూ ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. లోపల భయ్యాగారు ప్రచురించిన పుస్తకాలు, శాలువాల దొంతర, మరికొన్ని జ్ఞాపికలు, సర్టిఫికెట్లు బూజుపట్టి దర్శనమిచ్చాయి. అతి కష్టం మీద అన్నింటినీ వెలికితీసి దుమ్ము దులిపారు. అందరూ ఊహించిన డబ్బుగాని, నిధిగాని అందులో లేదు. నలుగురూ కంగుతిన్నారు. ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోక స్థాణువుల్లా నిలబడిపోయారు. ఒకటికి రెండుసార్లు కార్లేసుకుని బెజవాడ వచ్చినందుకు అయిన పెట్రోలు ఖర్చు, హోటల్ ఖర్చు, పెద్దకర్మ ఖర్చులు.. అన్నీ ఒక్కొక్కటిగా మదిలో మెలిగాయి. అబ్బో చేతిచమురు గట్టిగానే వదిలింది.. అని తెగ బాధపడిపోయారు.ఏదో లప్ప వస్తుందని ఆశపడి ఇంత దూరం వచ్చి ఇన్ని పాట్లు పడితే .. ఇత్తడి తాళం కప్ప దక్కిందని బావురుమన్నారు. సమయమూ డబ్బూ రెండు వృథా చేసుకుని ప్రయాస పడ్డామని ఎవరికి వారే ఘొల్లుమన్నారు.టీవీ యాంకర్లు నలుగురి ముఖాల ముందు గొట్టాలు పెట్టి స్పందన తెలియజేయాలని అడుగుతుంటే.. ఎవరి ముఖంలోనూ నెత్తుటి చుక్క లేదు. ఏడుపొక్కటే తక్కువ! ∙చెన్నాప్రగడ శర్మ -
26 కేసులు గెలిచిన 'నకిలీ' లాయర్
ఎవరైనా కాస్త గడుసుగా మాట్లాడినా.. తర్కంతో ప్రశ్నించినా..‘పట్టా’ లేని ప్లీడరు అంటారు. బయట ప్రశ్నించడానికి, అవతలి వాళ్లను నిలదీయడానికి ‘పట్టా’ అక్కర్లేదు. కానీ కోర్టులో అలా కాదు, కోటుంటే సరిపోదు.. న్యాయవిద్య చదివుండాలి.. సెక్షన్లూ తెలిసుండాలి. ఓ వ్యక్తి పట్టా లేకపోయినా కోర్టులో వాదించాడు. కేసులూ గెలిచాడు. చివరికి అతని బండారం బయటపడింది. గుట్టు రట్టయ్యింది. జీవితం జైలు పాలైంది. అయినా ‘తగ్గేదేలే ’ అంటూ కోర్టును అభ్యర్థించాడు. తన కేసును తనే వాదించు కున్నాడు. షరతులతో కూడిన బెయిల్ పొందాడు. అలాగని ఇది విజయ గాథ కాదు, తీసేయదగ్గదీ కాదు. ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తెలుసుకోదగ్గ అంశంగా మారింది. కెన్యాలో ఈ ఉదంతం జరిగింది.న్యాయవాదిగా కోర్టులో వాదించాలంటే ఏ దేశంలో అయినా న్యాయ విద్యను అభ్యసించాలి. సంబంధిత కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకోవాలి..అప్పుడే అర్హత వస్తోంది. కెన్యాలో కూడా అంతే. న్యాయవాదుల నమోదును ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’ పర్యవేక్షిస్తోంది. ఇందులో పేర్లు నమోదు అయిన వారు మాత్రమే ప్లీడరుగా ప్రాక్టీసు చేయాలి. బ్రియాన్ మ్వెండా న్త్విగా అనే వ్యక్తి ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’లో అడ్వకేట్గా రిజిస్టర్ అయ్యాడు.మోసానికి బీజం పడిందిక్కడేబ్రియాన్ న్త్విగా వివరాలను బ్రియాన్ మ్వెండా న్జాగీ అనే వ్యక్తి టాంపర్ చేసి అక్కడ తన ఈమెయిల్ నమోదు చేశాడు, ఫొటో మార్చాడు. ఇలా పట్టా లేకుండానే ప్లీడర్ అయ్యాడు. లోయర్ కోర్టు నుంచి హయ్యర్ కోర్టుల వరకు కేసులు వాదించాడు. సుమారుగా 26 కేసుల్లో విజయం కూడా సాధించాడు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. ప్రాక్టీసు కొనసాగించాడు.ఎలా బయటపడిందిబ్రియాన్ మ్వెండా న్త్విగా ‘లా సొసైటీ ఆఫ్ కెన్యా’లో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా ఓపెన్ కాలేదు. తన వివరాలు మారిపోయినట్టు గుర్తించి, లా సొసైటీ ఆఫ్ కెన్యాకు ఫిర్యాదు చేశాడు. అధికారులు దర్యాప్తు చేశారు. ఓ వ్యక్తి అక్రమంగా తన పేరును బ్రియాన్ న్త్విగా వివరాల్లో నమోదు చేసినట్టు గుర్తించారు. కేసు నమోదుఅధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. న కిలీ లాయరు జైలు కెళ్లాడు. కేసు విచారణ మొదలైంది. కోర్టును అభ్యర్థించి తన కేసు తనే వాదించుకోవడం సంచలనంగా మారింది. తన ‘నకిలీ’ అనుభవం అక్కరకు వచ్చింది. షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భిన్నాభిప్రాయాలునకిలీ లాయర్కు కొందరు బాసటగా నిలిచారు. అతని తెలివితేటల్ని మెచ్చుకున్నారు. న్యాయ విద్య చదివితే మరింతగా రాణిస్తావని సలహా ఇచ్చారు. మరికొందరు.. ఇది ప్రమాదరకరమైందన్నారు. లాయర్ల రిజిస్ట్రేషన్లోని డొల్లతనాన్ని బయటపెట్టిందని విమర్శించారు. ఈ ఘటన కెన్యాలో న్యాయవ్యవస్థపై చర్చకు దారి తీసింది.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపింది. గతంలో అతడు విజయం సాధించిన 26 కేసుల్లోనూ సాక్ష్యాలు బలంగా ఉండడంతో కోర్టులు వాటి పునఃసమీక్షకు అంగీకరించకపోవడం కొసమెరుపు.-దిలీప్ మాదిరెడ్డి -
కుటుంబమే కీలకం
ప్రముఖ మనస్తత్వవేత్త ఎరిక్ ఎరిక్సన్ తన ఎనిమిది దశల వికాస సిద్ధాంతంలో మొదటి దశను ‘ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్’ అని పిలిచారు. శిశువు జన్మించిన మొదటి ఏడాదిలో తల్లిదండ్రులు ఇచ్చే ఆదరణ, రక్షణ ఆ బిడ్డలో ‘ఈ ప్రపంచం సురక్షితమైనది’ అనే నమ్మకాన్ని కలిగిస్తాయి. ఒకవేళ ఆ దశలో నిర్లక్ష్యానికి గురైతే, ఆ బిడ్డ పెద్దయ్యాక ఎవరినీ నమ్మలేని వ్యక్తిత్వాన్ని అలవరచుకుంటాడు. మానవ పరిణామ క్రమంలో మనిషిని ఒక సామాజిక జీవిగా తీర్చిదిద్దే మొదటి పాఠశాల ‘కుటుంబం’. ఒక వ్యక్తి సమాజంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడు, ఇతరులతో బంధాలను ఎలా కొనసాగిస్తాడు అనే అంశాలన్నీ ఆ వ్యక్తి పెరిగిన కుటుంబ వాతావరణంపైనే ఆధారపడి ఉంటాయి. సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే, వ్యక్తిత్వం అనేది కేవలం జన్యువుల కలయిక మాత్రమే కాదు, అది అనుభవాల సమాహారం. ఆ అనుభవాలకు కేంద్ర బిందువు కుటుంబం.ఒక కుమ్మరి మట్టిని ఎలాగైతే తన చేతులతో నొక్కుతూ, సరిచేస్తూ ఒక అందమైన పాత్రగా మలుస్తాడో, తల్లిదండ్రులు కూడా తమ ప్రవర్తనతో పిల్లల మనసులను అలాగే మలుస్తారు. బాల్యంలో కుటుంబం ఇచ్చే సంస్కారం, క్రమశిక్షణ వ్యక్తిత్వానికి శాశ్వత ముద్ర వేస్తాయి.మాటల కంటే చేతలు మిన్నకుటుంబం అనేది ఒక అద్దం లాంటిది. తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకుంటే, పిల్లలు ‘గౌరవం’ అనే విలువను సహజంగానే నేర్చుకుంటారు. వారు విన్న దానికంటే, కళ్లారా చూసిన దాన్నే ఎక్కువగా నమ్ముతారు. పెద్దలను గమనించడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారని అల్బర్ట్ బండూరా తన ‘సోషల్ లెర్నింగ్ థియరీ’లో నిరూపించారు. ఇంట్లో తండ్రి కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడు? తల్లి సమస్యలను ఎలా ఎదుర్కొంటోంది? తాతయ్య ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాడు? ఇవన్నీ బిడ్డ మెదడులో నిక్షిప్తమైపోతాయి.ఉదాహరణకు, ఒక ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి, బయట చాలా సౌమ్యంగా ఉంటూ ఇంట్లో మాత్రం భార్యపై అరుస్తూ ఉంటాడు. అతని కుమారుడు అది చూస్తూ పెరిగాడు. ఆ అబ్బాయి పెద్దయ్యాక తన భాగస్వామితో కూడా అదే ‘అగ్రెసివ్’ ప్రవర్తనను ప్రదర్శిస్తాడు. ఎందుకంటే, అతని దృష్టిలో మగతనం అంటే అధికారం చలాయించడం అనే తప్పుడు భావన నాటుకుపోయింది. దీనినే ‘ఇంటర్జెనరేషనల్ ట్రాన్స్మిషన్ ఆఫ్ బిహేవియర్’ అంటారు.ఫ్యామిలీ డైనమిక్స్ – ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వ్యక్తిత్వ వికాసంలో ఐక్యూ (తెలివితేటలు) కంటే ఈక్యూ (భావోద్వేగ పరిణతి) ముఖ్యం. కుటుంబంలో భావోద్వేగాలను పంచుకునే స్వేచ్ఛ ఉంటేనే బిడ్డలో ఈక్యూ పెరుగుతుంది. ‘మగపిల్లలు ఏడవకూడదు‘ అని అణచివేయడం వల్ల, వారు పెద్దయ్యాక తమ భావాలను వ్యక్తపరచలేని ‘ఎమోషనల్లీ స్టంటెడ్’ వ్యక్తులుగా మారుతారు. కుటుంబం అనేది ఒక సురక్షిత ్రపదేశంగా ఉండాలి, అక్కడ తప్పులు చేసినా క్షమించబడతామనే ధైర్యం ఉండాలి.మనం ఇంటికి వేసే రంగులు (బయట ప్రపంచానికి కనిపించే మన నడవడిక) అందంగా ఉండవచ్చు. కాని, వర్షం వచ్చినా, భూకంపం వచ్చినా ఇల్లు నిలబడాలంటే పునాది (కుటుంబం ఇచ్చిన మానసిక స్థైర్యం) బలంగా ఉండాలి. పునాదిలో పగుళ్లు ఉంటే, పైన ఎన్ని రంగులు వేసినా ప్రయోజనం లేదు. అలాగే, వ్యక్తిత్వంలో లోపాలు ఉంటే, అవి కుటుంబ వాతావరణం నుండి వచ్చినవే అయి ఉంటాయి.మార్పు మన నుండే...కుటుంబం వ్యక్తిత్వానికి పునాది అనగానే, మనలోని లోపాలకు తల్లిదండ్రులను నిందించడం పరిష్కారం కాదు. కార్ల్ జంగ్ అన్నట్లు, ‘నేను నా గతాన్ని మార్చలేను కాని, నా భవిష్యత్తును నేను నిర్మించుకోగలను.’ మన కుటుంబం నుంచి మనకు వచ్చిన నెగటివ్ పాటర్న్స్ను గుర్తించడం మొదటి అడుగు. ఆ తర్వాత వాటిని మార్చుకుంటూ, మన తర్వాతి తరానికి ఒక ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణాన్ని అందించడం మన బాధ్యత.నేటి కాలంలో కుటుంబ సభ్యులంతా ఒకే గదిలో ఉన్నా, ఎవరి మొబైల్స్లో వారు నిమగ్నమై ఉంటున్నారు. దీనిని ‘ఫబ్బింగ్’ అంటారు. ఇది పిల్లల్లో ‘నిర్లక్ష్యానికి లోనవుతున్నాం’ అనే భావనను కలిగిస్తుంది. నాణ్యమైన సమయం గడపకపోవడం వల్ల పిల్లలు తమ వ్యక్తిత్వానికి కావాల్సిన సామాజిక నైపుణ్యాలను కోల్పోతున్నారు. ముఖాముఖి సంభాషణలు లేకపోవడం వల్ల సహానుభూతి తగ్గుతోంది.-సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com -
ఇదేమైనా సీరియస్ సమస్యా?
నాకు ఇరవై ఐదు సంవత్సరాలు. తరచు బ్రెస్ట్లో నొప్పి అనిపిస్తోంది. ఇది ఎందుకు వస్తుంది? ఇది ఏమైనా సీరియస్ సమస్యా? – లత, గుంటూరుబ్రెస్ట్ నొప్పి అనేది చాలా కామన్ గా కనిపించే సమస్య. ఎక్కువగా ఇది ఎలాంటి ప్రమాదకర వ్యాధి లక్షణం కాదు. ముఖ్యంగా హార్మోన్ల మార్పుల వల్లే ఎక్కువగా వస్తుంది. ఈస్ట్రోజెన్ , ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు నెలసరి చక్రంలో మార్పులు చూపుతాయి. ఈ మార్పుల కారణంగా కొంతమందికి నెలసరి ముందు లేదా తర్వాత బ్రెస్ట్ నొప్పి అనిపిస్తుంది. కొందరికి ఇది ప్రతి నెలా కూడా రావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఇతర కారణాల వల్ల కూడా బ్రెస్ట్ నొప్పి ఉండొచ్చు. ఉదాహరణకు బ్రెస్ట్ ఇన్ ఫెక్షన్ (మాస్టిటిస్), ఫైబ్రోసిస్టిక్ మార్పులు, చిన్న సిస్టులు వంటి సమస్యలు. చాలా అరుదుగా మాత్రమే బ్రెస్ట్ క్యాన్సర్తో కూడా నొప్పి ఉంటుంది. బ్రెస్ట్ నొప్పితో పాటు జ్వరం, చర్మం ఎర్రబడటం, గట్టిపడటం, నిపుల్ నుంచి స్రావం రావడం, గడ్డలు ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ పరీక్ష చేసి అవసరమైతే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ వంటి పరీక్షలు సూచిస్తారు. కొన్నిసార్లు బయాప్సీ కూడా అవసరం కావచ్చు. సాధారణంగా నొప్పి తేలికగా ఉంటే పారాసిటమాల్, ఐబుప్రొఫెన్ వంటి మందులు ఉపశమనం ఇస్తాయి. వేడి లేదా చల్లని కంప్రెస్ కూడా ఉపయోగపడుతుంది. విటమిన్–ఈ సప్లిమెంట్స్ కొందరికి బాగా పనిచేస్తాయి. జీవనశైలిలో కొన్ని మార్పులు కూడా సహాయపడతాయి. సరైన సైజ్ బ్రా ధరించడం, కెఫీన్ తగ్గించడం, ఒత్తిడి తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, తగినంత నీరు తాగడం మంచిది. కుటుంబంలో బ్రెస్ట్ లేదా ఒవేరియన్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా బ్రెస్ట్ నొప్పి పెద్ద సమస్య కాకపోయినా, సందేహం ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించడం ఉత్తమం. నాకు యాభై ఐదు సంవత్సరాలు. దాదాపు పదిహేనేళ్ల క్రితం గర్భసంచి తీసే ఆపరేషన్ (హిస్టరెక్టమీ) చేయించుకున్నాను. ఇప్పుడు యోని భాగంలో ఏదో బయటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. దగ్గినా, తుమ్మినా అది బయటికి ఉబ్బినట్లుగా కనిపిస్తోంది. మూత్రం నియంత్రణలో కూడా కొంత ఇబ్బంది ఉంది. ఇది ఏ సమస్య? ఏమి చేయాలి? – రమణమ్మ, అనంతపురం. మీరు చెప్పిన లక్షణాలు పోస్ట్ హిస్టరెక్టమీ ప్రోలాప్స్ అనే సమస్యకు సూచనలు. అంటే గర్భసంచి తీసిన తర్వాత, యోని పైభాగం (వాల్ట్), మూత్రాశయం (బ్లాడర్), లేదా రెక్టమ్ కిందికి జారిపోవడం. హిస్టరెక్టమీ చేసిన తర్వాత పెల్విక్ ఫ్లోర్ కండరాలు, లిగమెంట్లు బలహీనపడితే ఈ సమస్య వస్తుంది. వయసు పెరగడం, ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల టిష్యూలు సడలిపోవడం కూడా దీనికి ఒక కారణం. అలాగే అధిక బరువు, దీర్ఘకాలిక దగ్గు, మలబద్ధకం, బరువైన వస్తువులు ఎత్తడం వంటి కారణాలు సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా తీవ్రత పెరిగి మూత్రం అదుపు లేకపోవడం, మల విసర్జనలో ఇబ్బందులు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించడం అవసరం. డాక్టర్ పూర్తి శరీర పరీక్ష చేసి, సమస్య స్థాయిని అంచనా వేస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్, యూరోడైనమిక్ స్టడీస్ వంటి పరీక్షలు కూడా సూచించవచ్చు. సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఇలా ఉంటుంది. ప్రారంభ దశలో అయితే, పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు (కెగెల్ ఎక్సర్సైజ్లు), సపోర్టివ్ డివైజ్లు (పెస్సరీ) వినియోగం సరిపోతుంది. అదే తీవ్రంగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరం. ప్రస్తుతం ల్యాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలు కూడా అందుబాటులో ఉన్నాయి, ఇవి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. అదనంగా, బరువు నియంత్రణ, మలబద్ధకం నివారణ, బరువైన వస్తువులు ఎత్తకుండా ఉండటం, నియమిత వ్యాయామాలు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్యను నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా, తొందరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. -డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ ,హైదరాబాద్ -
పిల్లలకి ఇవ్వాల్సింది ధైర్యమే!
‘నా విజయంలో అమ్మదే ప్రధాన పాత్ర’ అంటారు అరుంధతీరెడ్డి. భారత మహిళా క్రికెట్ టీమ్లో ఆమె సాధించిన విజయాలు తెలిసినవే! ‘పిల్లల ఇష్టాలను గమనించి, గైడ్ చేయడమే మనం చేయగలిగేది’ అంటారు అరుంధతీరెడ్డి తల్లి భాగ్య. ఆమెకు కొడుకు, కూతురు. ఇద్దరు పిల్లల తల్లిగా ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.‘‘ఈ రోజుల్లో తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంటోందంటే... ‘డబ్బులు ఎన్నయినా పెడతాం, ఏదైనా చేయండి’ అనేట్టుగా ఉంటున్నారు. పిల్లలేమో ‘మీరే అన్నీ చూసుకోవాలి. మాకేం సంబంధం లేదు’ అనేలా ఉన్నారు. కష్టపడితేనే డబ్బు వస్తుందనే విషయాన్ని పిల్లలకు నేర్పించడం లేదు. ఏది అడిగినా పెద్దలు ఇచ్చేస్తారు అనే ధోరణి బాగా పెరిగింది. మా పిల్లలు స్కూల్ టైమ్లో నన్ను డబ్బులు అడిగినప్పుడు నిజంగా ఏది అవసరమో తెలుసుకొని, దానికే ఇచ్చేదాన్ని. మిగతావి ఎందుకు అనవసరమో కూడా చెప్పేదాన్ని.పాకెట్ మనీ కావాలంటే కొన్ని పనులు తప్పనిసరిగా కేటాయించేదాన్ని. అవి పూర్తి చేస్తేనే డబ్బులు ఇచ్చేదాన్ని. దీని వల్ల డబ్బు విలువ తెలియజెప్పేదాన్ని. మేముండేది సికింద్రాబాద్లోని సైనిక్పురిలో. ప్రవైట్ స్కూల్ టీచర్ని. ఇద్దరు పిల్లల పెంపకం, పెద్ద టాస్క్. విజయవంతంగా పూర్తి చేయాలంటే అన్నింటిలో క్రమశిక్షణ అవసరం.ఎమోషన్స్ ముఖ్యంభావోద్వేగాలు బ్యాలెన్స్ చేసుకోవడం ఈ రోజుల్లో తగ్గిపోయిందనే చెప్పాలి. పిల్లలు స్నేహితులకు ఇచ్చే విలువ తల్లిదండ్రులకు ఇవ్వడం లేదు. ముందు అమ్మనాన్న, తర్వాతనే మిగతావి అనేది క్లియర్గా చెప్పాలి. ఇప్పటికీ మా పిల్లలకు ‘మీరు పెద్దయ్యారు. అన్నీ తెలుసుకుంటున్నారు. కాని, ఏ విషయంలోనైనా స్టెప్ తీసుకునేముందు సెల్ఫ్గానూ, కుటుంబానికి ఎంత వరకు మంచిదో నిర్ణయించుకోండి’ అని చెబుతుంటాను. ఈ రోజుల్లో మగపిల్లలకన్నా ఆడపిల్లలు చాలా బెస్ట్గా ఉన్నారు. కాని, సమాజం ఎంత ఆధునికంగా మారినా అబ్బాయి–అమ్మాయి అనే వివక్ష మాత్రం ఉంది. ఈ వ్యత్యాసం ఇంట్లో పిల్లల మీద చూపకూడదు. చదువుతో పాటు సంస్కారంవిలువలు చాలా ముఖ్యం. సంస్కారం, క్రమశిక్షణ లేకుండా చదువు ఎంత ఉన్నా అది వృథానే. ఇప్పుడు పిల్లల్లో చదువు స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రుల్లోనూ ‘ఫీజులు లక్షల్లో కడుతున్నాం, చదువు రావడం లేదు’ అనే ఒత్తిడి పెరిగింది. పిల్లల గురించి టీచర్స్ ఏదైనా రిమార్క్ చెబితే స్కూల్లో అందరి ముందే వారిని తిట్టేస్తుంటారు. లేదంటే, ‘ఇక వీళ్లింతే...’ అని వదిలేస్తున్నారు. ఇలాంటి భావన ఈ రోజుల్లో చాలా ప్రమాదంగా మారుతోంది. మా షమ్మూ (ముద్దు పేరు) చదువులోనూ ముందుండేది.చిన్నప్పుడు తన అన్న రోహిత్, ఇతర కజిన్ పిల్లలతో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేది. టీవీలో క్రికెట్ తెగ చూసేది. స్పోర్ట్స్లో చాలా చురుకుగా ఉండేది. ‘నేను వాలీబాల్ స్టేట్ ప్లేయర్ని. స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నా, కుటుంబ పరిస్థితుల కారణంగా నా కలలను నెరవేర్చుకోలేకపోయాను. నా కూతురి ఇష్టాన్ని కాదనకూడదు అనుకున్నాను. పన్నెండేళ్ల వయసు నుంచి తన ఇష్టం వైపుగా సపోర్ట్ చేశాను. ఈ రోజు ఫలితాన్ని చూస్తున్నాం. అందుకని, చదువు ఒక్కటే కాదు, పిల్లల ఇష్టాలు ఎటుగా సాగుతున్నాయో, వారి అభిరుచులు ఏంటో కూడా తెలుసుకోవడం, సూచనలు ఇవ్వడం ముఖ్యం.త్యాగాలు ఎన్నో!పెంపకంలో ఎన్నో త్యాగాలు ఉంటాయి, కష్టం ఉంటుంది. పిల్లలు ఏ మార్గం ఎంచుకున్నారు, వారు ఎందుకు దానిని వదలుకుంటున్నారు.. ఆ సమయంలో వారి ఆలోచన ఏ విధంగా ఉంటోంది అని కూడా కనిపెట్టాలి. 2017లో మా అమ్మాయి రైల్వేలో ఉద్యోగంలో చేరింది. అక్కడ ఉంటూనే చాలా విషయాల పట్ల అవగాహన ఎర్పరచుకుంది. అండర్ 23 జోనల్ టోర్నమెంట్లో రాణించింది. మళ్లీ ఒక దశలో క్రికెట్– జాబ్ .. దేనిని ఎంచుకోవాలనే నిర్ణయం వచ్చింది. ఓ రోజు తన నిర్ణయం క్రికెట్ మాత్రమే అని చెప్పింది. నేనూ ‘సరే’ అన్నాను. నిజానికి.. జాబ్ చేసుకుంటూ సాధారణ జీవితం గడపవచ్చు. కాని, కష్టపడటానికే సిద్ధపడింది. మేమూ తన ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఆసక్తులను ప్రోత్సహించాలి... అరుంధతికి క్రికెట్తో పాటు పాటలు పాడటం చాలా ఇష్టం. కాస్త సమయం దొరికితే మెలోడీస్ను చాలా ఇష్టంగా పాడుతుంది. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా వారి జీవితాన్ని వారు ఎంచుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. పెద్దలుగా మనం కనిపెడుతూ ఉండాలి. పిల్లల ఆసక్తితో ఎంచుకున్న మార్గంవైపు మనకు తెలిస్తే ఏవైనా సూచనలు ఇవ్వాలి. లేదంటే, ధైర్యంగా వెళ్లు అని చెప్పాలి. ‘ఈ ఏడాది పిల్లలను స్పోర్ట్స్ అకాడమీలో చేర్చాం. వచ్చే ఏడాదికి పెద్ద ప్లేయర్ అయిపోవాల’ని వారిపై ఒత్తిడి తీసుకురావద్దు. అది సాధ్యం కాదు కూడా. ఎంచుకున్న దానిపైన అంకితభావం, క్రమశిక్షణ, సాధన ఉండాలి. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా కెనడాలో స్ధిరపడ్డాడు. కూతురు దేశం గర్వించే స్థాయిలో ఉంది. నా కలలను పిల్లల ద్వారా తీర్చుకోవాలి అనుకోలేదు. నా జీవితంలో ఎదురైన స్ట్రగుల్స్ ఎప్పుడూ పిల్లల ముందు చెప్పలేదు. నా ప్రయాణంలో మా అమ్మ నాకు సపోర్ట్గా నిలిచింది. మా పిల్లల ఎదుగుదలలో నేనూ అంతే. ఎంచుకున్న మార్గం వైపు రిస్క్ ఎంత ఉన్నా ధైర్యంగా వెళ్లమనే చెబుతుంటాను’’ అని వివరించారు భాగ్య.పిల్లల పెంపకం గురించి ప్రముఖుల అభిప్రాయాలు, అనుభవాలు, సూచనలు ఇదే శీర్షికలో ప్రతివారం...∙ నిర్మలారెడ్డి -
మానస మనసులో మాటలు
హైదరాబాద్ మట్టిలో మొదలైన నటి మానస వారణాసి అడుగు ప్రపంచ వేదికపై నడిచే వరకు చేరుకుంది. అలా కోడింగ్ నుంచి మిస్ ఇండియా కిరీటం వరకూ సాగిన ప్రయాణంలోని మెరుపు వెనుక ఉన్న విశేషాలు ఆమె మాటల్లోనే...నా ప్రపంచం రెండు దేశాల మధ్యనేను హైదరాబాద్ అమ్మాయినే. అయితే నా బాల్యం అంతా మలేషియాలో గడిచింది. కౌలాలంపూర్లో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాను. నేనొక యావరేజ్ స్టూడెంట్నే కాని, ఫ్రెంచ్లో మాత్రం ఎప్పుడూ టాప్.కోడింగ్ నుంచి కిరీటంఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత నేను ఫైనాన్షియల్ అనలిస్ట్గా పని చేశాను. ఒకవైపు సాఫ్ట్వేర్ కోడింగ్, మరోవైపు మోడలింగ్ అలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే అందాల పోటీలో విజయం సాధించాను.కళ్లతో వింటానుసైన్ లాంగ్వేజ్ అంటే నాకు ఆసక్తి. అలా నేనే ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ‘వినడం’ అంటే కేవలం చెవులతోనే కాదు, కళ్లతో కూడా వినొచ్చని అప్పుడు అర్థమైంది. అలాగే, లాక్డౌన్ లో నేర్చుకున్న ఎంబ్రాయిడరీ నాకు ఓపికను నేర్పింది.నా బలం నా కుటుంబంమా అమ్మ, నాయనమ్మ, నా చెల్లి మేఘనా ఈ ముగ్గురు మహిళలే నా బలం. వాళ్లే నాకు నిజమైన ప్రేరణ. సినిమాల్లో అయితే హాలీవుడ్లో ఎమ్మా స్టోన్, ప్రియాంక చోప్రా నాకు ఇన్ స్పిరేషన్ .అభిరుచులు! రోజులో ఒక్క పూటైనా అన్నం లేకపోతే నాకు కడుపు నిండదు. స్వీట్స్లో తిరామిసు, ఫ్రూట్ పుడ్డింగ్ అంటే ఇష్టం. దుస్తుల్లో ఫైరీ రెడ్ రంగు నాకు బాగా నప్పుతుంది. సెంట్స్లో చెర్రీ బ్లోసమ్, పెస్టో వాసనలు నన్ను రిఫ్రెష్ చేస్తాయి.సెల్ఫ్ బిలీఫ్మిస్ ఇండియా 2020 సమయంలో పాండమిక్ కారణంగా చాలా భాగం ఆన్లైన్ లో జరిగింది. అప్పుడు నాకు నేనే మేకప్ ఆర్టిస్ట్, కెమెరాపర్సన్ , కోచ్. నాపై నాకు ఉన్న నమ్మకంతో ఆ సమయంలో నా సేవింగ్స్ అంతా ఖర్చు చేశాను. అదే నన్ను సినిమాల్లోకి తీసుకువచ్చింది.సంగీతం నా మరో స్వరంఫ్రీ టైమ్ దొరికితే నేను సంగీతంలో మునిగిపోతాను. కాలేజీలో ‘నైన్ డేస్’ అనే మ్యూజిక్ బ్యాండ్లో మెంబర్ని. స్టేజ్పై పాడడం నాకు మరో ఎనర్జీ ఇస్తుంది. అలాగే, యోగా, మ్యూజిక్, పేజెంట్స్ ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ నా భయాలను నేనే ఓడించాను.‘మీన్ గర్ల్’ మోడ్లోకి మారుతున్నాఇప్పుడిప్పుడే కొంచెం ‘మీన్ గర్ల్’లా ఉండడం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే ‘నో’ అనడం కూడా జీవితంలో చాలా అవసరం. -
నేటికీ పీడిస్తున్న పోషకాహార లోపం
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక శక్తులలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. అయినా, పోషకాహార లోపం మన దేశాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. ఎక్కువగా పిల్లలు, మహిళలు పోషకాహార లోపంతో రకరకాల సమస్యలకు లోనవుతున్నారు. ఈ విషయాన్ని పలు జాతీయ సంస్థల సర్వేలతో పాటు ‘పోషణ్ ట్రాకర్’–2024–25 గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి.పోషకాహార లోపం వల్ల ఆరేళ్ల లోపు వయసు గల పిల్లల్లో పలువురు ఎదుగుదల లోపాలతో, వయసుకు తగిన బరువు పెరగక బాధపడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నా, దేశంలో దాదాపు 2.10 కోట్ల మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బక్కచిక్కిపోతున్నారు. -
సదా మీ సేవలో... ఆతిథ్య రంగంలో రోబోలు
‘రండి రండి రండి... దయచేయండి... తమరి రాక మాకెంతో సంతోషం సుమండి’ అంటూ అతిథులకు స్వాగతం పలుకుతుంది ఒక రోబో ‘డిన్నర్కి ఏం కావాలో ఆర్డర్ చెప్పండి బాస్’... అంటూ వినయంగా అడుగుతుంది ఇంకో రోబో మరో రోబో ముందుకొచ్చి మీ లగేజీని అందుకుంటుంది మీకు కేటాయించిన గదిలో చక్కగా సర్దిపెట్టేస్తుంది... పర్యటనలో భాగంగా మీరు హోటల్లో అడుగుపెట్టినది మొదలుకొని, తిరుగు ప్రయాణానికి బయలుదేరే వరకు సదా మీ సేవల్లో రోబోలు అడుగడుగునా ముందుంటాయి. ఆతిథ్యరంగం ఏఐ సాంకేతికతతో నానాటికీ స్మార్ట్గా మారుతోంది. రోబోలను సేవల్లోకి దించి అతిథి సేవలకు హైటెక్ హంగులద్దుతోంది.మన దేశంలో రోబోల వాడకం అంతగా పెరగలేదు గాని, అగ్రరాజ్యాల్లో రోబోలు ఆతిథ్యరంగ సేవలను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. హోటళ్లు, రెస్టరెంట్లు, బార్లలో రిసెప్షన్ నుంచి రూమ్ సర్వీస్ వరకు; కిచెన్ నుంచి ఫుడ్ డెలివరీ వరకు రోబోలు సేవలందిస్తున్నాయి. అమెరికా, జపాన్ వంటి దేశాలలో గత పదేళ్లుగా రోబోల సేవలు విస్తృతం కావడం మొదలైంది. ‘కోవిడ్–19’ తర్వాత ఆతిథ్య రంగంలో రోబోల సేవలు మరింతగా వేగం పుంజుకున్నాయి. తొలితరం రోబోలు వెయిటర్లుగా సేవలందించడం ప్రారంభిస్తే, ఏఐ సాంకేతికతతో పనిచేస్తున్న ఇప్పటి రోబోలు ఆతిథ్య రంగానికి చెందిన దాదాపు అన్నిరకాల సేవలనూ నిరంతరాయంగా అందించగలుగుతున్నాయి.మనుషులు అందించే సేవల్లో తేడాలు ఉండవచ్చేమో గాని, రోబోలు అందించే సేవల్లో ఎలాంటి తేడాలూ ఉండవని వీటి సేవలు అందుకుంటున్న అతిథులు కితాబునిస్తున్నారు. మనుషులు చేసే పనులను రోబోలు సునాయాసంగా చేసేస్తుండటంతో హోటళ్ల యాజమాన్యాలకు కూడా లాభసాటిగా ఉంటోంది. రోబోలను రంగంలోకి దించిన హోటళ్లకు కాసులపంట పండుతోంది. ఇటీవలి కాలంలో రోబోలు హోటళ్లలో ఎలాంటి సేవలను అందిస్తున్నాయో తెలుసుకుందాం...రోబో రిసెప్షనిస్ట్పలు దేశాల్లోని స్టార్ హోటళ్లు ఇప్పుడు రిసెప్షనిస్టులుగా రోబోలను వినియోగించు కుంటున్నాయి. మొదటగా జపాన్లోని నాగసాకి నగరానికి చెందిన ‘హెన్ నా హోటల్’ దాదాపు పదేళ్ల కిందట రిసెప్షనిస్టు స్థానంలో హ్యూమనాయిడ్ రోబోను రంగంలోకి దించింది. తొలినాళ్లలో జనాలు దీనిని విచిత్రంగా చూసేవారు. క్రమంగా అలవాటైపోయారు. కాలం గడిచే కొద్ది సాంకేతికతలో అనేక మార్పులు వచ్చాయి. అచ్చంగా మనుషులను పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఏఐ సాంకేతికత తోడైంది.ఇటీవలి కాలంలోని హ్యూమనాయిడ్ రోబోలు మనుషుల కంటే మిన్నగా పనిచేస్తుండటంతో అగ్రదేశాల్లోని పలు హోటళ్లు అమ్మాయిల రూపంలో ఉండే హ్యూమనాయిడ్ రోబోలను రిసెప్షనిస్టులుగా ఉపయోగిస్తున్నాయి. ఇవి కస్టమర్లను సాదరంగా స్వాగతించి, పలకరించడం, వారి అవసరాలను కనుక్కుని, వారికి కావలసిన సమాచారాన్ని అందించడంలోను, ఎల్లవేళలా అతిథులకు అందుబాటులో ఉండటంలోను విజయవంతంగా పనిచేస్తున్నాయి.రోబో రిసెప్షనిస్టులు ప్రత్యేక ఆకర్షణగా ఉండటంతో, వీటిని ఏర్పాటు చేసుకున్న హోటళ్లకు అతిథుల రాక కూడా మిగిలిన వాటి కంటే ఎక్కువగా ఉంటోంది. రోబో రిసెప్షనిస్టులు లాభసాటిగా ఉండటంతో పలు అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు వీటిని తమ ప్రధాన శాఖలన్నింటికీ విస్తరించుకుంటూ వస్తున్నాయి.కేర్ టేకర్ రోబోలుహోటల్లో అడుగుపెట్టే అతిథులకు అవసరమైన సమాచారం అందించడం మొదలుకొని అన్ని రకాలుగా సహాయపడే రోబోలు ఇవి. ఈ కేర్ టేకర్ రోబోలను ‘కోనీ’రోబోలు అని కూడా అంటున్నారు. ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎం పదేళ్ల కిందట తొలి కోనీ రోబోను రూపొందించింది. తర్వాత మరిన్ని టెక్ సంస్థలు వీటి రూపకల్పనకు రంగంలోకి దిగాయి. ఇటీవలి కాలంలో ఏఐ సాంకేతికతతో కోనీ రోబోలను మరింతగా అభివృద్ధి చేశాయి.ఇవి హోటల్కు వచ్చే అతిథులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతాయి. స్థానిక సందర్శనీయ స్థలాలు, తదితర అంశాలపై సమాచారం అందిస్తాయి. లోకల్ టూర్ బుకింగ్స్కు, తిరుగు ప్రయాణాల టికెట్ బుకింగ్స్కు సులువైన మార్గాలు చెబుతాయి. ప్రస్తుతం హోటళ్లు వినియోగించే పలు కేర్ టేకర్ రోబోలు బహు భాషా సామర్థ్యాలతో పనిచేస్తున్నాయి.రిలే డెలివరీ రోబోలుఅంతర్జాతీయ హోటళ్లు కొన్ని రోబోలను రిసెప్షన్ సేవలకు మాత్రమే పరిమితం చేసుకోవడం లేదు. పలు ఇతర సేవలకూ వినియోగించుకుంటున్నాయి. బహుళ అంతస్తుల స్టార్ హోటళ్లలో కొన్ని రిలే డెలివరీ రోబోలను ఉపయోగించుకుంటున్నాయి. ఇవి రూమ్ నుంచి ఆర్డర్ ఇచ్చే అతిథులకు కావలసిన ఆహార పానీయాలను అందించడం; రూమ్ సర్వీస్ వస్తువులను అవసరమైన గదుల వద్దకు మోసుకెళ్లడం; హోటల్కు వచ్చే అతిథులను వారి గది వరకు తోడ్కొని వెళ్లడం; వారి లగేజీని మోసుకెళ్లడం వంటి పనులు సమర్థంగా చేయగలుగుతున్నాయి. వీటిని ‘బట్లర్బో’ అని కూడా అంటున్నారు.ఆతిథ్య రంగంలో రోబోల తొలి అడుగుఆతిథ్యరంగంలో రోబోల వాడకం ఇటీవలి కాలంలో పెరిగింది కాని, నిజానికి వీటి ప్రస్థానం 1983 నుంచే మొదలైంది. తొలిసారిగా అమెరికాలో ఒక రెస్టరెంట్ జపాన్లో తయారైన ‘టాన్బో ఆర్–1’, ‘టాన్బో ఆర్–2’ అనే రెండు రోబోలను అప్పట్లోనే 20 వేల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. వీటిని బేరర్ల స్థానంలో అతిథులకు పదార్థాలతో నిండిన ప్లేట్లు, పానీయాలతో నిండిన గ్లాసులు వంటివి అందించడానికి ఉపయోగించింది. ఇటీవలి కాలంలో డైనర్ రోబోలుగా పిలిచే రోబో బేరర్లు చాలా దేశాలకు విస్తరించాయి. మన దేశంలో కూడా ‘ది యెల్లో హౌస్’ హోటల్ చెయిన్ ఉత్తరాదిలోని కొన్ని నగరాల్లో ఉన్న తన రెస్టరెంట్లలో రోబో బేరర్లను ఉపయోగించుకుంటోంది. అంతర్జాతీయ నిపుణుల అంచనాల ప్రకారం 2030 నాటికి ఆతిథ్యరంగంలో 25 శాతం ఉద్యోగుల స్థానాలను రోబోలే పూర్తిగా భర్తీ చేస్తాయి.లగేజ్ హ్యాండ్లింగ్ రోబోలుహోటల్లో దిగేటప్పుడు కొందరు అతిథులు భారీ లగేజీలతో వస్తుంటారు. వారు తీసుకొచ్చే భారీ లగేజీని వాహనం నుంచి దించి, హోటల్లో వారికి కేటాయించిన గది వరకు మోసుకొచ్చే పని ఇదివరకు రూమ్ సర్వీస్ సిబ్బంది చేసేవారు. లగేజీ మరీ ఎక్కువగా ఉంటే, ఒకరికిద్దరు మనుషులు అవసరమయ్యేది. అంత లగేజీని రూమ్ వరకు మోసుకొచ్చినందుకు వారికి టిప్పు ముట్టజెప్పాల్సి వచ్చేది. కొన్ని అంతర్జాతీయ హోటళ్లు ఇప్పుడు ఈ పనికోసం లగేజ్ హ్యాండ్లింగ్ రోబోలను ఉపయోగిస్తున్నాయి. ఎంత లగేజీనైనా ఇవి అవలీలగా మోసుకొచ్చి, జాగ్రత్తగా సర్దిపెట్టేస్తాయి. మనుషులు శక్తికి మించిన లగేజీ మోసేటప్పుడు ఏదో ఒకటి జారిపోవడం, లోపలి వస్తువులు దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. లగేజ్ హ్యాండ్లింగ్ రోబోలతో అలాంటి సమస్యలేవీ ఉండవు. వాటికి టిప్పులివ్వాల్సిన అవసరం కూడా లేదు. తొలిసారిగా న్యూయార్క్లోని ఒక హోటల్ పదిహేనేళ్ల కిందటే ‘యోబో’ పేరుతో లగేజ్ హ్యాండ్లింగ్ రోబోను ప్రవేశపెట్టింది. ఇటీవలి కాలంలో లగేజ్ హ్యాండ్లింగ్ రోబోలు మరింతగా అభివృద్ధి చెందాయి. హోటళ్లతో పాటు పలుచోట్ల విమానాశ్రయాలు, కర్మాగారాలలో కూడా వీటి వినియోగం నెమ్మదిగా పెరుగుతోంది.రూమ్ సర్వీస్ రోబోలుహోటళ్లలో గదులు, బాత్రూమ్లు శుభ్రం చేయడం వంటి రూమ్ సర్వీస్ పనులను సాధారణంగా హౌస్కీపింగ్ సిబ్బంది చేస్తుంటారు. ఇటీవలి కాలంలో కొన్ని అంతర్జాతీయ స్టార్ హోటళ్లు ఈ పనుల కోసం రూమ్ సర్వీస్ రోబోలను ఉపయోగించుకుంటు న్నాయి. ఒక అమెరికన్ హోటల్ తన శాఖలు కొన్నింటిలో రూమ్ సర్వీస్ రోబోలను తొలిసారిగా పన్నెండేళ్ల కిందటే ప్రవేశపెట్టింది. ఇటీవలి కాలంలో మరిన్ని హోటళ్లు ఇదే దారిని అనుసరిస్తున్నాయి. వీటిలో అమర్చిన కెమెరాలు, సెన్సర్ల ఆధారంగా ఇవి గదుల మూలల్లో ఉన్న దుమ్ము ధూళిని కూడా చిటికెలో తొలగించేస్తాయి.హోటళ్ల కారిడార్లు, లాబీలు వంటి ప్రదేశాలలోని చెత్తను, దుమ్ము ధూళిని వాక్యూమ్తో తొలగిస్తాయి. హోటళ్లతో పాటు వీటిని పలుచోట్ల కార్యాలయాలు, ఆస్పత్రులు వంటి చోట్ల కూడా ఉపయోగిస్తున్నారు. రూమ్ సర్వీస్, క్లీనింగ్ రోబోలలో పలు రకాల వాటిని అంతర్జాతీయ హోటళ్లు ఉపయోగిస్తున్నాయి. వీటిలో కొన్ని వాక్యూమ్ క్లీనింగ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ వంటి పనులు మాత్రమే చేస్తుంటే, మరింత అధునాతనమైనవి సర్ఫేస్ స్క్రబ్బింగ్, మాపింగ్, వాటర్ ట్యాంక్ క్లీనింగ్ వంటి పనులు కూడా చేయగలుగుతున్నాయి. సెక్యూరిటీ రోబోలుహోటళ్లు, రెస్టరెంట్లు, ఆస్పత్రులు, కార్యాలయాలు– ఇలా ఎక్కడ చూసినా సెక్యూరిటీ గార్డులు కనిపిస్తారు. సెక్యూరిటీ గార్డులు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని అంతర్జాతీయ హోటళ్లు, కార్యాలయాలు సెక్యూరిటీ గార్డులకు బదులుగా సెక్యూరిటీ రోబోలను ఉపయోగించు కుంటున్నాయి. ఇవి నిరంతరాయంగా పనిచేస్తాయి. జపాన్లో సెక్యూరిటీ రోబోలను పదిహేనేళ్ల కిందట ప్రయోగాత్మకంగా రంగంలోకి దించారు.తర్వాతి కాలంలో వీటిని మరింతగా అభివృద్ధి చేశారు. ‘కోవిడ్–19’కాలంలో పలు అభివృద్ధి చెందిన దేశాలలో సెక్యూరిటీ రోబోల వినియోగం పెరిగింది. వీటిలో అమర్చే థర్మల్ కెమెరాల సాయంతో ఇవి నిరంతరం పరిసరాలను గమనిస్తూ ఉంటాయి. హోటల్ పరిసరాల్లోను, పార్కింగ్ ప్రదేశాల్లోను, లాబీల్లోను కలియదిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను, వస్తువులను గుర్తించి నిర్వాహకులను అప్రమత్తం చేస్తాయి. ఫుడ్ డెలివరీ రోబోలు‘కోవిడ్–19’ దరిమిలా ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. చాలా చోట్ల ఇప్పటికీ మనుషులే ఫుడ్ డెలివరీ సేవలను అందిస్తున్నారు. హోటళ్లు, రెస్టరెంట్లకు అనుసంధానమై పనిచేసే యాప్స్ ద్వారా వినియోగదారులు తమకు కావలసిన ఆహార పదార్థాలను ఇళ్ల వద్దకు తెప్పించుకుంటున్నారు. యాప్స్కు చెందిన సంస్థల్లో పనిచేసే ఫుడ్ డెలివరీ బాయ్స్ వీటిని ఇళ్లకు తెచ్చి అందిస్తున్నారు. కొన్ని సంపన్న దేశాల్లోని హోటళ్లు, రెస్టరెంట్లు ఈ సేవల కోసం ఫుడ్ డెలివరీ రోబోలను ఉపయోగించుకుం టున్నాయి.చిన్నసైజు వాహనాల్లా కనిపించే ఈ రోబోలు కోరుకున్న చోటుకు ఆహార పదార్థాలను అందిస్తున్నాయి. మనుషులు నడిపే వాహనాల కంటే ఇవి చిన్నగా ఉండటంతో కిక్కిరిసిన ట్రాఫిక్లో కూడా ఇవి వేగంగా ముందుకు పోగలుగుతున్నాయి. అధునాతనమైన కెమెరాలు, సెన్సర్లు అమర్చి తయారు చేసిన ఫుడ్ డెలివరీ రోబోలు డ్రైవర్తో పనిలేకుండానే ఎలాంటి దారుల్లోనైనా సులువుగా ప్రయాణించగలవు. అగ్రరాజ్యాల్లో ఫుడ్ డెలివరీ రోబోలకు ఆదరణ బాగా పెరుగుతోంది. త్వరలోనే ఇవి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా అందుబాటులోకి రాగలవని అంచనాలు ఉన్నాయి.డైనర్ రోబోలుటిఫిన్ చేయడానికో, భోజనం చేయడానికో హోటల్ లేదా రెస్టరెంట్లోకి అడుగుపెడితే, మనం కూర్చున్న టేబుల్ వద్దకు సర్వర్లు వచ్చి ఆర్డర్లు తీసుకుంటారు. కొద్దిసేపు నిరీక్షణ తర్వాత మనం ఆర్డర్ చేసిన పదార్థాలను తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు. మనం వెళ్లే చోట రద్దీ ఎక్కువగా ఉంటే, మనం ఆర్డర్ చేసిన పదార్థాల రాక కోసం ఎదురుచూడాల్సిన సమయం సహజంగానే పెరుగుతుంది. సర్వర్లు రెండు చేతులతోనూ వీలైనన్ని ప్లేట్లను బ్యాలెన్స్ చేస్తూ వచ్చినా, ఒక్కోసారి సర్వీస్లో ఆలస్యం జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితికి పరిష్కారంగానే డైనర్ రోబోలు అందుబాటులోకి వచ్చాయి.దాదాపు నాలుగు అడుగుల ఎత్తుండే ఈ రోబోలు చక్రాల మీద వేగంగా తిరుగుతూ సేవలు అందించగలవు. అంతేకాదు, వీటికి రెండువైపులా అరడజను చొప్పున ట్రేలు అమర్చడం వల్ల ఏకకాలంలో దాదాపు నలభై కిలోల బరువు ఉండే ఆహార పదార్థాలను టేబుళ్ల వద్ద ఆగుతూ కస్టమర్లకు అందించగలవు. కీనన్ రోబోటిక్ సంస్థ పదేళ్ల కిందట తొలిసారిగా డైనర్ రోబోను రూపొందించింది. ఇది విజయవంతం కావడంతో మరికొన్ని కంపెనీలు కూడా ఇలాంటివి రూపొందిస్తున్నాయి. పలు దేశాల్లోని హోటళ్లు, రెస్టరెంట్ల నుంచి వీటికి ఆదరణ కూడా నానాటికీ పెరుగుతూ వస్తోంది. రోబో బార్టెండర్లుపలు స్టార్ హోటళ్లలోను, బార్లలోను బార్టెండర్లు పనిచేస్తుంటారు. రకరకాల మద్యాలను అతిథుల అభిరుచులకు అనుగుణంగా అందించడం బార్టెండర్ల పని. రకరకాల ద్రవాల సమ్మేళనంతో, వాటికి తగిన అలంకరణతో అతిథులకు అందించే పనికి చాలా నైపుణ్యం కావాలి. బార్టెండర్లు ఒక పానీయాన్ని సిద్ధం చేయడానికి దాని సంక్లిష్టతను బట్టి కొద్ది నిమిషాల సమయం తీసుకుంటారు. ఇటీవలి కాలంలో వచ్చిన రోబో బార్టెండర్లు నిమిషంలోనే ఎలాంటి పానీయాన్నైనా ఇట్టే సిద్ధం చేయగలుగుతున్నాయి.ఏఐ సాంకేతికతతో రూపొందించిన రోబో బార్టెండర్లు అతి సంక్లిష్ట పానీయ సమ్మేళనాలను సైతం ఏమాత్రం రుచి తగ్గకుండా శరవేగంగా చేయగలుగుతున్నాయి. తొలితరం రోబో బార్టెండర్లు రంగప్రవేశం చేసి, పుష్కరం పైనే గడిచింది. తొలినాళ్లలో వచ్చిన ‘టోనీ’ వంటి రోబో బార్టెండర్లు పానీయాలు తయారు చేసేటప్పుడు ఒక్కోసారి ఐస్ ముక్కలు, పానీయాలు కొంత నేల మీద చిందేవి. వీటిని మరింతగా అభివృద్ధి చేశాక ఇప్పుడు ఈ సమస్యలేవీ లేకుండా సమర్థంగా పనిచేయగలుగుతున్నాయి.రోబో కిచెన్ అసిస్టెంట్లురోబోలు ఇటీవలి కాలంలో వంటింటి పనులనూ చక్కబెడుతున్నాయి. చేయితిరిగిన షెఫ్లలా వంటకాలు వండేస్తున్నాయి. అంతేకాకుండా, వంటింటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, ఎక్కడి వస్తువులను అక్కడ క్రమపద్ధతిలో సర్దిపెట్టేస్తున్నాయి. కూరలు, సూప్లు కలపడం, కూరగాయలు తరగడం, వంటకానికి తగిన ఉష్ణోగ్రతను నియంత్రించడం, రొట్టెలు కాల్చడం వంటి పనులు చేయగలుగుతున్నాయి. వీటిలో కొన్ని ‘రోబో ఆర్మ్స్’గా దొరుకుతున్నాయి. ఇవి మనిషి చేతి ఆకారంలో ఉండి, మనిషి చేతితో చేయగలిగే వంటింటి పనులన్నీ సునాయాసంగా చేయగలుగుతాయి.ఇంకొన్ని పూర్తిస్థాయిలో మనిషిని పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోలు. ఇవి షెఫ్లతోనే పోటీపడే స్థాయిలో వంటకాలను సిద్ధం చేయగలవు. వీటిలోని మరో సౌలభ్యం ఏమిటంటే, వీటిలో చాలా రోబోలు ‘సెల్ఫ్ క్లీనింగ్’. పని ముగిశాక ఇవి తమను తాము శుభ్రం చేసేసుకుంటాయి. అధునాతనమైన కెమెరాలు, సెన్సర్లతో తయారైన ఈ రోబో కిచెన్ అసిస్టెంట్లు ఏఐ సాయంతో నలభీముల్లాంటి షెఫ్లకు దీటుగా హోటళ్లు, రెస్టరెంట్ల వంట పనిని సులభతరం చేస్తున్నాయి.∙ పన్యాల జగన్నాథదాసు -
మానవాళి కోసం సిలువనెక్కిన క్రీస్తు
మన అతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది... ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడు ఆయెను.అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసేను – యెషయా 53:4,5,12.పైన ఉటంకించిన ప్రవచనాలన్నీ క్రీస్తు మరణం ద్వారా నెరవేరాయి. యేసు మాంసయుక్త దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరుస్తున్నాడు అనునది పౌలు యొక్క క్రీస్తు మరణ సువార్త సందేశం. ‘క్రీస్తు యేసు– మరణమును నిరర్థకం చేశాడు’ అన్న పౌలు బోధలు ఉజ్జీవం కలిగించుటలో ప్రసిద్ధికెక్కాయి.ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించునట్లు యేసు మరణం పొందాడు.దీని భావం ఏమంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. ఆత్మకు మరణం లేకున్నా పాపం వలన క్షమాపణ పొందని పాప జీవితం వలన నిత్య మరణం అనే స్థితి సంభవిస్తుంది. అది అడ్డుకొని తన మీద వారి మరణం వేసుకొని ఇలా పాపం వలన ప్రతి ఒక్కరికి ప్రాప్తించే పాప శిక్షను తాను భరించాడు.సర్వమానవాళి అనబడే దేవుని పిల్లలు రక్తమాంసములు గలవారు. దేవుడు వీరిని రక్షించమని వీరిని క్రీస్తు వశం చేశాడు. మరణం యొక్క బలం గలవాడు సాతాను. విధేయ మార్గం మినహా మరో మార్గం లేదు. ఆ అపవాదిని మరణం ద్వారానే నశింపచేయాలి. జీవిత కాలమంతా మరణ భయం చేత దాస్యానికి లోబడిన మానవాళిని విడిపించుటకు యేసు కూడా రక్త మాంసాలలో పాలి భాగస్థుడు కావలసివచ్చింది. యేసు చేసిన ఒక గొప్ప అసాధారణ బోధ ఏమంటే, ‘నేను మీతో చెప్పునది ఏమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము’ ఇలాంటి స్వభావం గల వ్యక్తి, అతడి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు.‘నేను దేవుని కుమారుడను’ అన్న విషయం మరచి తన్ను తాను రిక్తునిగా చేసికొని శ్రమలను ఆహ్వానిస్తూ శ్రమలకు ఎదురువెళ్ళాడు. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనుటకు ఎల్లవేళలా సంసిద్ధుడయ్యాడు. అలాంటి ఆయన ఆకారంలో మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడు. దేవుని సంకల్పానికి విధేయంగా లోబడిన క్రీస్తు వంటి విధేయుడు ఈ భూమ్మీద మరొకడు లేడు.‘ఎందుకనగా మనము ఆయనయందు దేవుని నీతి ఆగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను’ ( 2కొరిం«థీ 5:21 ). ‘క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మ శాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది’ (గలతీ 3:13,14, 1కొరింథీ 12:3 ).పరిశుద్ధుడైన ఆ మహాదేవునితో పాపముగా చేయబడి సిలువ మ్రానున వ్రేలాడే శాపగ్రస్తుడిగా ఉన్న యేసుకు ఆ దేవ దేవుని ఎడబాటును ఇలా చూస్తాము. ‘ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు –‘ఏలీ, ఏలీ, లామా సబక్తానీ’ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం... యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను’ (మత్తయి 27 : 45–50).‘దేవుడు తన సొంతకుమారుని పాప శరీరాకరముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను’ (రోమా 8:3,4 ). లోక పాపములను మోసికొనిపోయే దేవుని గొర్రెపిల్లయైన క్రీస్తు విధేయతా బలియాగం నిత్యం గుర్తుంచుకొంటూ ఆయన వచ్చువరకు ఆ ప్రభువు మరణమును ప్రచురించవలసిన విధేయులమై ఉంటున్నాము.‘అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును’ (హెబ్రీ 9:28 )ఈ వచన భావం దేవుని యెడల తిరుగుబాటు చేసే అవిధేయుల పాపములను తన మీద వేసుకొని క్రీస్తు మరణించాడు అనునదే. పాపము లేకుండా రెండోసారి రావడం అంటే మొదటిసారి పాపముతో వచ్చాడు అని కాదుగాని, మానవాళి పాపమును తనమీద వేసుకున్నాడు. ఇందువలననే క్రీస్తు మరణం అనేకుల జీవితాలను కదిలిస్తూ వారిని విధేయులుగా మారుస్తూ ఉంది.‘నేను దేవుని కుమారుడను’ అన్న విషయం మరచి తన్ను తాను రిక్తునిగా చేసికొని శ్రమలను ఆహ్వానిస్తూ శ్రమలకు ఎదురువెళ్ళాడు.∙ జేతమ్ -
నా ఒరిజినాలిటీ..!
సింప్లిసిటీకి స్టయిలిష్ టచ్ ఇస్తూ ప్రత్యేకంగా నిలిచే పేరు ప్రీతి ముకుందన్ . మినిమల్ స్టయిలింగ్తో, ప్రతి లుక్ను కంఫర్ట్తో కలిపి క్లాసీగా మలచడం ఆమె ప్రత్యేకత. ఆ సైలెంట్ స్టయిల్ సీక్రెట్స్ ఇప్పుడు మీకోసం!చీర.. బ్రాండ్: సమీనాస్జ్యూలరీ బ్రాండ్: అరణ్య జ్యూలరీధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.‘‘నా ఫ్యాషన్ సీక్రెట్? కంఫర్ట్. అలాగే ‘లెస్ ఈజ్ మోర్’ అనే మేకప్ రూల్ను పాటిస్తాను. సంప్రదాయ దుస్తులు, ఆభరణాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే జడగంటలు, ముక్కుపుడకలు లాంటి ట్రెడిషనల్ టచ్ను మోడ్రన్ గా క్యారీ చేయడం నా స్పెషాలిటీ. ట్రెండ్స్ కోసం కాదు, నా ఒరిజినాలిటీ కోసం డ్రెస్ అవుతాను.’’ – ప్రీతి ముకుందన్ .చేతికి చిన్న మెరుపు వేసుకుంటే లుక్ పెద్దగా మారిపోతుందా? అంటే అవుననే చెప్తోంది ఈ బాజుబంద్. భుజం కింద భాగంలో కూర్చుని సున్నితంగా మెరిసే ఈ హ్యాండ్ జువెలరీ, మీ మొత్తం ఔట్ఫిట్కే రాయల్ అప్గ్రేడ్ లుక్ ఇస్తుంది. ఒకప్పుడు రాజకుటుంబాల స్టయిల్ సీక్రెట్గా ఉన్న ఇది, ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కమ్బ్యాక్ కొట్టి ట్రెండింగ్లో టాప్ ర్యాంక్ సాధించింది. చిన్న రాళ్లు, ముత్యాలు, గోల్డ్ ఫినిష్ డిజైన్లతో రూపొందిన బాజుబంద్లు చేతి ఆకృతిని, జిమ్ అవసరం లేకుండానే! చిన్నగా చూపించడంలో సాయం చేస్తాయి.లెహెంగా, చీర, ఫ్యూజన్ వేర్ ఏది వేసుకున్నా ఇది సరిపోతుంది. హెవీ జ్యూలరీ పెట్టుకోకపోయినా, ఒక్క బాజుబంద్ చాలు మిగతావన్నీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్లిపోతాయి. స్లీవ్లెస్ లేదా హాఫ్ స్లీవ్ డ్రెస్సులతో అయితే ఇది ఫుల్గా షో ఆఫ్ అయ్యి, చూపుల్ని కట్టిపడేస్తుంది. మార్కెట్లో సింపుల్ నుంచి గ్రాండ్ వరకు అనేక డిజైన్లలో లభిస్తున్నాయి. -
ఈ సండే సరదాగా 'కేసర్ పిస్తా దోసె' ట్రై చేయండిలా..!
కేసర్ పిస్తా దోసెకావలసినవి: బియ్యం–ఒక కప్పు, మినపప్పు–పావు కప్పు , శనగపప్పు–ఒక టేబుల్ స్పూన్ , మెంతులు–ఒక టీ స్పూన్ , ఉప్పు– రుచికి సరిపడా, కుంకుమ పువ్వు–15, వేడి పాలు–2 టేబుల్ స్పూన్లు, నెయ్యి– 2 టేబుల్ స్పూన్లు, ఏలకులు–3 (పొడి చేయాలి)పిస్తా చట్నీ కోసం: పిస్తా–100 గ్రాములు, పచ్చి మిరకాయలు–2, తురిమిన కొబ్బరి–2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం–ఒక టీ స్పూన్ , జీలకర్ర పొడి–అర టీ స్పూన్, ఉప్పు –రుచికి సరిపడా. తయారీ: ముందుగా బియ్యం, మినప్పప్పు, శనగపప్పులను కలిపి ఆరు గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని వడకట్టి కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఎనిమిది గంటల సేపు పులియబెట్టండి. తర్వాత పాలను వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పావుగంట ఉంచండి. ఈ పాలను పులిసిన దోసెపిండిలో వేసి, బాగా కలపండి. అదే సమయంలో ఏలకుల పొడి కూడా కలపండి. అంతే దోసెపిండి రెడీ. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యితో దోసెలు వేసుకోవాలి.పిస్తా చట్నీ తయారీ: పిస్తా, పచ్చి మిరపకాయలు, కొబ్బరి తురుము, నిమ్మరసం, జీలకర్ర, ఉప్పుని అన్నింటినీ కలిపి మిక్సీ పట్టండి. రుచికి సరిపడా ఉప్పు కలపండి. అంతే టేస్టీ పిస్తా చట్నీ రెడీ. ఈ వేడి వేడి దోసెలను ఈ చట్నీతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.రష్యన్ మష్రూమ్ జూలియన్ కావలసినవి: పుట్టగొడుగు ముక్కలు–250 గ్రాములు ఉల్లిపాయ–1, వెల్లుల్లి రెబ్బలు–2, వెన్న–ఒకటిన్నర టేబుల్ స్పూ¯Œ హెవీ క్రీమ్–ముప్పావు కప్పు, మోజరెల్లా చీజ్– ఒక కప్పు (తురిమినది), మిరియాల పొడి–ఒక టీ స్పూన్, ఉప్పు– రుచికి సరిపడా. తయారీ: ముందుగా ఒక కడాయిలో టీ స్పూన్ వెన్న వేసి కరిగించండి. అందులో పుట్టగొడుగు ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయండి. కాసేపు వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలపాలి. పుట్టగొడుగుల్లోని నీరు ఆవిరయ్యేంత వరకు వేయించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బయటకు తీసి చిన్న సిరామిక్స్ బౌల్స్లో వేయాలి. అదే పాన్లో అర టీస్పూన్ వెన్న వేసి కరిగించండి. అందులో హెవీ క్రీమ్ వేసి మిక్స్ చేయండి. ఇందులో మిరియాల పొడి, ఉప్పు వేసి సాస్లా బాగా కలపండి. ఈ సాస్ను ముందుగా రెడీ చేసిన పుట్టగొడుగుల మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత మోజరెల్లా చీజ్ కూడా వేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని 375 ఫారన్హీట్ డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసిన మైక్రోవేవ్ ఒవెన్లో 10 నుంచి 15 నిమిషాల పాటు బేక్ చేయండి. అంతే టేస్టీ రష్యన్ మష్రూమ్ జూలియన్ రెడీ.ఛత్తీస్గఢీ ఫరా కావలసినవి: అన్నం–ఒక కప్పు, బియ్యప్పిండి–2 కప్పులు, ఎండు మిరపకాయలు–2, నువ్వులు–ఒక టేబుల్ స్పూన్ , జీలకర్ర– ఒక టేబుల్ స్పూన్, ఆవాలు–ఒక టీ స్పూన్ , కరివేపాకు–రెండు రెమ్మలు, పచ్చిమిర్చి–3 (ముక్కలుగా చేసుకోవాలి), కొత్తిమీర–కొద్దిగా, నూనె–తాలింపు కోసం, ఉప్పు–రుచికి సరిపడా.తయారీ: ముందుగా వండిన అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులో బియ్యప్పిండి, ఉప్పు, తురిమిన అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా బాగా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు వేసి చపాతీ ముద్దలా తయారు చేసి కాసేపు ఉంచండి. ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నిలువుగా చిత్రంలో చూపిన ఆకారంలో చుట్టుకోవాలి. వీటిని స్టీమర్ సాయంతో 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. మరోవైపు పాన్ లో కొద్దిగా నూనె వేసి 2 ఎండు మిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, నువ్వులు వేసి వేయించండి. ఇందులో ముందుగా తయారు చేసిన అన్నం మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాలు వేయించండి. అంతే టేస్టీ ఫరా రెడీ. వీటిని పుదీనా చట్నీతో తింటే బాగుంటాయి. -
సహజ మెరుపుని అందించే 'ఐస్ కంప్రెస్ ఫేస్ మసాజర్'
ఎండ వేడి, కాలుష్యం, ఒత్తిడి వంటి వివిధ కారణాలతో చాలామందిలో నల్లటి మచ్చలు, ముఖం మీద సన్నని రంధ్రాలు వంటి సమస్యలు వస్తుంటాయి. వీటితో ముఖం నిస్తేజంగా మారుతుంది. ఇటువంటి సమయంలో ముఖంలోని సహజ మెరుపును తిరిగి పొందేందుకు చాలా మంది పార్లర్లకు వెళుతుంటారు. అయితే చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మార్చుకునేందుకు ఈ ఐస్ కంప్రెస్ ఫేస్ మసాజర్ సాయపడుతుంది. ఇది చర్మాన్ని చల్లగా మార్చి తాజాగా ఉంచుతుంది. దీని సాయంతో ఎటువంటి రసాయనాలు లేకుండానే ఇంట్లోనే సహజమైన నిగారింపు పొందవచ్చు.ఐస్ క్యూబ్లను నేరుగా ముఖానికి రాసుకుంటే చర్మం ఎర్రగా మారడం, మంట, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఈ ఐస్ కంప్రెస్ ఫేస్ మసాజర్ ఉపయోగిస్తే చల్లని స్పర్శ ముఖం అంతటికి సమానంగా అందుతుంది. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం సహజంగా కాంతిమంతంగా మారుతుంది. చర్మం ఎర్రబారడం వంటి సమస్యలు రావు. ఈ పరికరంతో సున్నితంగా మసాజ్ చేస్తే చర్మంపై ఏర్పడిన సన్నని రంధ్రాలు తగ్గి, చర్మం నునుపుదేరుతుంది. కళ్ల కింద వాపు, ముఖంపై అలసట మటుమాయం అవుతాయి. ఎండ ధాటికి చర్మం వడలిపోయే పరిస్థితి నుంచి రక్షణ పొందేందుకు కూడా ఈ మసాజర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మసాజర్ను ఉపయోగించడం చాలా తేలిక. మసాజర్లో నీటిని నింపి ఫ్రీజర్లో ఉంచాలి. నీరు గడ్డకట్టిన తర్వాత ముఖంపై మసాజ్ చేస్తే చాలు, మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. ఈ మసాజర్ కేవలం అందాన్ని పెంచడమే కాకుండా, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది పోర్టబుల్ సైజులో ఉండటంతో ఉపయోగించడం చాలా సులభం. తక్కువ ఖర్చుతో, ఎలాంటి రసాయనాలు లేకుండా ముఖాన్ని మెరిపించుకునేందుకు ఈ ఐస్ కంప్రెస్ ఫేస్ మసాజర్ మంచి ఎంపికనే చెప్పుకోవాలి. ఆన్లైన్లో లభిస్తున్న ఈ పరికరం ధర కేవలం రూ. 2,299 మాత్రమే.(చదవండి: పక్షవాతానికి వార్నింగ్ బెల్..!) -
పట్టులాంటి జాలువారే కురులు కోసం..
పట్టులా జాలువారే జుట్టు కోసం చాలామంది బ్యూటీ పార్లర్లకు వెళుతుంటారు. పార్లర్లలో క్రీములు వాడి, ఆవిరి పట్టించి జుట్టుకు సత్వరమే మెరుపును, మృదుత్వాన్ని అందిస్తారు. అయితే ఆ మెరుపు ఎక్కువ కాలం ఉండదు. ఇక్కడ చెప్పిన చిన్న ట్రిక్తో ఇంట్లో ఉండే వస్తువులతోనే జుట్టును మెరిసేలా, సిల్కీగా మార్చుకోవచ్చు. ఇందుకోసం బియ్యం కడిగిన నీటిని ఒక గ్లాసులో తీసుకోండి. ఈ నీటిలో మూడు స్పూన్ల కలబంద గుజ్జు కలిపి బాగా గిలకొట్టండి. తల స్నానం చేసిన వెంటనే తల తడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకోవాలి. తర్వాత నీటిలో ముంచిన మెత్తని కాటన్ గుడ్డను తలకు చుట్టుకోవాలి. కాసేపటికి ఫ్యాన్ గాలి తగిలేలా కూర్చోవాలి. పది నిమిషాల తర్వాత తలస్నానం చేసుకుంటే చాలు మెరిసే, పట్టుకుంటే జారిపోయే కురులు మీ సొంతమవుతాయి. -
ప్రెగ్నెన్సీ టైంలో శరీరమంతా దురదలు వస్తాయా..?
నేను ఎనిమిదో నెల గర్భిణిని. రెండు రోజులుగా శరీరం అంతా కొద్దిగా దురదగా ఉంటోంది. ఇది ఏమైనా సమస్యా? ఏమి చేయాలి?– రమ్య, గుంటూరు.సాధారణంగా 30 నుంచి 32 వారాల గర్భధారణలో, ముఖ్యంగా మొదటి గర్భం సమయంలో, కొంతమందికి శరీరం మీద దురదలు రావచ్చు. ఇలాంటి సమయంలో ముందుగా కొన్ని వివరాలు తెలుసుకోవడం అవసరం. దురదలు శరీరం అంతా ఉన్నాయా లేక అరికాళ్లు, అరిచేతుల్లో మాత్రమే ఉన్నాయా అని తెలుసుకోవాలి. అలాగే పగలు ఎక్కువగా ఉంటాయా, రాత్రి ఎక్కువగా ఉంటాయా అన్నది చూడాలి. కొంతమందికి దురదలు ఎక్కువగా ఉండి నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇవి మైల్డ్గా ఉన్నాయా లేక తీవ్రమైనవా అన్నది అంచనా వేయాలి. ఇలాంటి సందర్భంలో తల్లి ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షిస్తారు. రక్తపోటు వంటి ముఖ్యమైన అంశాలను పరీక్షిస్తారు. అలాగే బిడ్డ బాగున్నాడా లేదా అన్నది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి, డాప్లర్ పరీక్ష ద్వారా బిడ్డ బరువు, గర్భంలో ఉన్న ఉమ్మనీరు పరిమాణం, బిడ్డకు రక్తప్రవాహం ఎలా ఉందో పరీక్షిస్తారు. దురదలు తేలికగా ఉంటే సాధారణంగా యాంటీహిస్టమిన్ మందు, చర్మానికి రాసుకునే లోషన్ లేదా మాయిశ్చరైజర్ ఇచ్చి రెండు రోజులు పరిశీలిస్తారు. చాలాసార్లు ఇవి తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది. అయితే దురదలు ఎక్కువగా ఉన్నా లేదా మందులతో రెండు రోజులలో తగ్గకపోవడం జరిగినా పరీక్షలు చేయాలి. ముఖ్యంగా సీరమ్ బైల్ యాసిడ్స్, లివర్ ఫంక్షన్ టెస్టులు చేసి ఆబ్స్టెట్రిక్ కొలెస్టాసిస్ అనే సమస్య ఉందా లేదా చూడాలి. ఈ పరిస్థితిలో బైల్ యాసిడ్స్ పెరగడం వల్ల గర్భిణికి ఎక్కువగా దురదలు రావచ్చు. అలా ఉంటే దానికి ప్రత్యేకమైన మందులు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స తీసుకుంటే దురదలు తగ్గి బిడ్డ ఎదుగుదల కూడా సాధారణంగా కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భధారణ కాలంలో, ముఖ్యంగా 38 వారాల వరకు లివర్ ఫంక్షన్ టెస్టులు, బైల్ యాసిడ్స్ పరీక్షలు తరచూ చేయించు కోవాలి. సాధారణంగా 38 వారాలు వచ్చిన తర్వాత డెలివరీ చేయడం సురక్షితంగా భావిస్తారు. ఎందుకంటే ఆబ్స్టెట్రిక్ కొలెస్టాసిస్ ఉన్నప్పుడు 38 వారాల కల్లా డెలివరీ చేస్తే తల్లీబిడ్డలు ఇద్దరికీ మంచిది.నాకు నలభై నాలుగు సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు కాకుండా శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను. అయితే, గత నాలుగు నుంచి ఆరు నెలలుగా నెలసరిలో చాలా ఎక్కువగా రక్తస్రావం అవుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది? ఏమి చేయాలి?– లక్ష్మీ దేవి, కర్నూలు.ఇలాంటి సమస్యతో వచ్చినప్పుడు ముందుగా రోగి డీటెయిల్డ్ హిస్టరీ తెలుసుకోవాలి. సైకిల్ రెగ్యులర్గా ఉన్నా రక్తస్రావం మూడు నుంచి నాలుగు రోజులు మాత్రమే ఉందా, లేక ఏడు రోజులు లేదా పది రోజులకంటే ఎక్కువ కొనసాగుతుందా అన్నది తెలుసుకోవాలి. అలాగే రోజుకు ఎన్ని ప్యాడ్లు మార్చాల్సి వస్తోంది, రాత్రిపూట కూడా లేచి మార్చాల్సి వస్తుందా, గడ్డలు పడుతున్నాయా, కడుపునొప్పి ఉందా వంటి వివరాలు కూడా తెలుసుకోవాలి. నలభై నాలుగు ఏళ్ల వయసు పెరిమెనోపాజ్ దశకు దగ్గరగా ఉండే వయసు కాబట్టి ఇలాంటి బ్లీడింగ్ ఎందుకు అవుతోంది అన్నది పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. అందుకోసం హిమోగ్లోబిన్ , సీబీపీ, థైరాయిడ్ హార్మోన్ పరీక్షలు, అలాగే మధుమేహానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేస్తారు. అదనంగా అల్ట్రాసౌండ్ స్కాన్ తప్పనిసరిగా చేస్తారు. స్కాన్లో గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయా, ఒవేరియన్ సిస్టులు ఉన్నాయా, లేదా ఎడినోమయోసిస్ వంటి సమస్యలు ఉన్నాయా అన్నది పరిశీలిస్తారు. ఇవి లేకపోయినా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే గర్భసంచి పొర మందం, అంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎంత ఉందో చూస్తారు. ప్రాథమికంగా రక్తస్రావం తగ్గించడానికి నాన్ హార్మోనల్ మందులు ఇస్తారు. హార్మోనల్ చికిత్స ప్రారంభించే ముందు బ్లీడింగ్కి కారణమేమిటో కచ్చితంగా తెలుసుకోవాలి. ఫైబ్రాయిడ్లు లేదా ఇతర సమస్యలు లేకపోయినా బ్లీడింగ్ ఎక్కువగా ఉంటే హిస్ట్రోస్కోపీ గైడెడ్ ఎండోమెట్రియల్ బయోప్సీ చేస్తారు. హిస్ట్రోస్కోపీ ద్వారా గర్భసంచి లోపల పరిస్థితిని నేరుగా చూసి, అక్కడి నుంచి చిన్న టిష్యూ నమూనా తీసి పరీక్షకు పంపడం. దీనివల్ల హార్మోన్ మార్పులు ఉన్నాయా లేదా కేన్సర్కు సంబంధించిన మార్పులు ఉన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత, నాన్ హార్మోనల్ మందులతో సమస్య తగ్గకపోతే హార్మోనల్ చికిత్స ఇవ్వచ్చు. ఇది మాత్రల రూపంలో ఇవ్వొచ్చు. మరో విధానం గర్భసంచి లోపల పెట్టే ప్రత్యేక పరికరం. ఇది కాపర్ టీ లాంటిదే కానీ ఇందులో హార్మో నెమ్మదిగా విడుదల అవుతుంది. దీనిని పెట్టిన తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల వరకు పనిచేస్తుంది. దీని వల్ల నెలసరి క్రమంగా రావడం, రక్తస్రావం తగ్గడం, రోజువారీ జీవన నాణ్యత మెరుగుపడడం సాధ్యమవుతుంది. ∙డా. కె. అపర్ణ సీనియర్ గైనకాలజిస్ట్, అబ్స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్ (చదవండి: పక్షవాతానికి వార్నింగ్ బెల్..!) -
వైరల్ వీడియో వెనుక భయంకర నిజం
హర్ష ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వయసు ఇరవై ఏడేళ్లు. మంచి జీతం. అతనికి పెళ్లి కుదిరింది. ఇక పెళ్లిపనులు మొదలుపెడదాం అనుకున్న అతనికి ఆరోజు జరిగిన సంఘటన అతని జీవితాన్ని కుదిపేసింది. ఒకరోజు ఉదయం అతని ఫోన్ మోగింది. అటు పక్కనుంచి అతడి స్నేహితుడు ఆదిత్య.‘‘హర్షా .. నువ్వేంటి ఇలాంటి దందా పనులు చేయడం ఎప్పటినుండి మొదలుపెట్టావు?’’ ఆశ్చర్యంగా అడిగాడు. ‘‘ఏంట్రా నేనేం దందా పనులు చేస్తున్నాను?’’ ఆందోళనగా అడిగాడు హర్ష. ‘‘నువ్వు చేస్తున్న పనులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నువ్వు చేసే పనులు వీడియోలు ఉన్నాయి... ఆ వీడియోలు నీకు కాబోయే భార్య చూసిందంటే... నీ పెళ్లి క్యాన్సిల్ కావచ్చు... జాగ్రత్త!’’ అని చెప్పి ఆదిత్య ఫోన్ పెట్టేశాడు. హర్ష ఆందోళనగా ఆదిత్య పంపిన వీడియో చూడసాగాడు. అందులో హర్ష చేతిలో తుపాకీ పట్టుకుని, కర్కశమైన గొంతుతో మాట్లాడుతూ ఒక ప్రముఖ వ్యాపారవేత్తను బెదిరిస్తున్నాడు. ఆ వ్యాపారవేత్త భయంభయంగా వదిలేయమన్నట్టుగా హర్షను వేడుకుంటున్నాడు. ఆ వీడియో చూడగానే అతని గుండె ఒక్కసారిగా బరువైంది. ‘ఇది... ఇదెలా సాధ్యం?’ హర్షకు ఒక్కసారిగా భయంతో మెదడు మొద్దుబారింది. ఇది అసలు తాను కాదు. మరి ఇదెలా సాధ్యం? ఆలోచనలు... ఆందోళన కమ్ముకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.కొద్ది నిమిషాల తరువాత...హర్ష ఫోన్ ఆగకుండా అలా మోగుతూనే ఉంది. తేరుకున్న అతను ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ పేరు చూడగానే, తన జీవితం ఇక ముగిసింది అనుకున్నాడు హర్ష. కారణం ఫోన్ చేసింది తన కాబోయే భార్య స్నేహ...తాను కూడా ఆ వీడియోస్ తప్పకుండా చూసే ఉంటుంది. తనతో తెగతెంపులు చేసుకోవడానికి ఫోన్ చేస్తోంది అని అర్థం అయింది అతడికి. చివరిసారిగా ఆమెతో మాట్లాడాలని వణుకుతున్న చేతులతో ఫోన్ తీసాడు హర్ష.‘‘హలో...’’ కంపిస్తున్న స్వరంతో అన్నాడు హర్ష. ‘‘నేను ఆ వీడియోస్ చూశాను’’ అన్నది స్నేహ. కొన్ని నిముషాలు అలా మౌనంగా ఉండిపోయాడు హర్ష.‘‘ఆ వీడియోలో ఉన్నది నేను కాదు’’ మెల్లగా అన్నాడు హర్ష. తన కళ్ళముందే తన కలలసౌధం కూలిపోతున్నట్టు అనిపిస్తోంది అతడికి.‘‘ఆ వీడియోస్లో ఉన్నది మీరు కాదని నాకు తెలుసు’’... ప్రశాంతంగా చెప్పింది స్నేహ‘‘ఇది బహుశా సైబర్ మోసం కావచ్చు. డీప్ ఫేక్ తో ఇలా ఒకరి మొహాన్ని, స్వరాన్ని అనుకరించి అనుసరించి మోసాలు చేస్తారని తెలుసు. మీరు వెంటనే ఆ వీడియో గురించి సైబర్ కంప్లయింట్ ఇవ్వండి.’’ చెప్పింది.స్నేహ మాటలు హర్షకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి.వెంటనే సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదు అయింది. సైబర్ క్రైమ్ అధికారి సాగర్ కేసు విచారణ మొదలుపెట్టాడు.ఆ వీడియోని జాగ్రతగా పరిశీలిస్తున్నాడు సాగర్. వీడియోలోని ముఖం, స్వరం అన్నీ హర్షవే...‘‘ఇది కచ్చితంగా డీప్ ఫేక్ వీడియో.’’ అన్నాడు సాగర్. హర్ష కొద్దిగా కుదుటపడ్డాడు.‘‘డీప్ ఫేక్ అంటే?’’ అడిగాడు.‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎవరి ముఖాన్నైనా, స్వరాన్నైనా ఉపయోగించి నకిలీ వీడియోలు తయారు చేయడం.’’ వివరించాడు. ఆ వీడియోను సాగర్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాడు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ విశ్లేషణ జరిగింది. కళ్ల కదలికల్లో స్వల్ప అసమానత. లైట్ రిఫ్లెక్షన్లో చిన్న తప్పులు. చివరకు నిర్ధారణ అయ్యింది– అది డీప్ ఫేక్.కాని, ఎవరు చేశారని అసలు విచారణ ఇప్పుడు మొదలైంది.అసలు నేరస్థుడు హర్ష కంపెనీలో పని చేసిన మాజీ ఉద్యోగి రాహుల్. అతను చేసిన ఒక మోసం వల్ల కంపెనీలో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. హర్ష అతని ప్రాజెక్ట్ లీడర్.రాహుల్ సోషల్ మీడియాలో హర్ష ఫోటోలు, వీడియోలు సేకరించాడు. ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్ ఉపయోగించి అతని ముఖం, స్వరం కాపీ చేశాడు. ఆ వీడియోతో వ్యాపారవేత్తను బ్లాక్ మెయిల్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ వీడియో ముందుగానే లీక్ అయింది.సైబర్ ట్రేసింగ్ ద్వారా రాహుల్ ల్యాప్టాప్లో ఆ సాఫ్ట్వేర్, డ్రాఫ్ట్ ఫైళ్లు దొరికాయి.అతను అరెస్ట్ అయ్యాడు.హర్ష నిర్దోషిగా బయటపడ్డాడు. కాని, అతని మనసులో ఒక ప్రశ్న మాత్రం మిగిలింది.‘‘ఇప్పటి ప్రపంచంలో మన ముఖం కూడా మనదేనా?’’∙∙ ‘థాంక్యూ స్నేహా..పెళ్ళికి ముందే కాబోయే భర్త నిర్దోషి అని నమ్మావు. మోరల్ సపోర్ట్ ఇచ్చావు’’ స్నేహని చుట్టేస్తూ అన్నాడు హర్ష.‘‘టెక్నాలజీ చాలా శక్తిమంతమైనది. కాని, బాధ్యత లేకుండా వాడితే అది ఆయుధం అవుతుంది.’’ ముఖ్యంగా డీప్ ఫేక్ గురించి అవగాహన, సైబర్ నేరాల పట్ల ఎవేర్నెస్ లేకపోతె ప్రమాదం. భయపడటం మానేస్తే నేరాలను ఎదుర్కోవడం కష్టమేమీ కాదు’’ చెప్పింది స్నేహ. గమనిక:ఇన్నాళ్లూ కొనసాగించిన ‘క్రైమ్ రిపోర్టర్’ కాలమ్ను పాఠకులు ఆదరించారు. పాఠకుల్లో చాలామంది ఉత్కంఠ రేకెత్తించే క్రైమ్ఫిక్షన్ కోరుకుంటున్నందున ఈవారం నుంచి ‘క్రైమ్ రిపోర్టర్’ స్థానంలో కొత్తగా ‘క్లూషియల్’ శీర్షికను ప్రవేశ పెడుతున్నాం. ఇందులో వారం వారం క్రైమ్ కథలు అందించనున్నాం.∙శ్రీసుధామయి -
పిల్లలకు కష్టం విలువ చెప్పాలి
చదువు, ఉద్యోగం, వివాహం– ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలోనూ కొనసాగే దశలే! కాని, ఇప్పుడు ప్రతిదీ అపసవ్యంగా జరుగుతోంది. దానికి కారణం పెంపకం లోపాలే! జీవితంలో ఏదీ సులువుగా రాదు, కష్టపడాల్సిందే అని పిల్లలకు నేర్పాలి. ‘మా చిన్నతనంలో మేం కష్టపడ్డాం. పిల్లలు ఇప్పుడు సుఖంగా పెరగాలి’ అనే ఆలోచనతో వారి అవసరానికి మించి ఖర్చుపెట్టే వాళ్లున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి. మనం ఎంత సామాన్యంగా జీవిస్తామో పిల్లలు అంత ఉన్నతంగా ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఉచితంగా ఇచ్చేదానికి విలువ ఉండదు. ఏదైనా ఒక వస్తువు కొనాలంటే నా చిన్నతనంలో ఎంత కష్టపడ్డానో, అవసరానికి ఎవరి ముందు చేయి చాపకుండా ఎలా జీవించాలో, దాని వల్ల జీవితం ఎంత బాగుంటుందో చెప్పేదాన్ని. దీని వల్ల పిల్లల్లో అవగాహన పెరుగుతుంది. ఈ రోజుల్లో పేరెంట్స్ ఎలా ఉన్నారంటే పిల్లలు ఏదైనా కళ నేర్చుకుంటే వాళ్లు నెల రోజుల్లో దానిని స్టేజీపైన ప్రదర్శించాలి. త్వరగా ఫేమస్ అయిపోవాలి. అంతా షార్ట్ టర్మ్లో జరిగిపోవాలనే ధోరణి బాగా పెరిగింది.నా చిన్నతనంలో ఆర్థిక సంక్షోభంలో ఉండే కుటుంబాలు ఎక్కువ. ఎక్కువ సంతానం, తక్కువ సంపాదన. చాలా కష్టపడి పిల్లల్ని పెంచేవారు. ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటిగా భావించేవారు. అలాంటి స్థితిలో నేను పెరిగాను. మాది చేనేత కుటుంబం. ఆడపిల్లలను చదివించి, పెళ్ళిళ్లు చేయాలంటే మరీ భారంగా ఉండేది. నాకు చదువు మీద ఇష్టం ఉండటంతో కాలేజీ వరకు వెళ్లగలిగాను. బీఎస్సీ చదువుతున్నప్పుడు పెళ్లయ్యింది. పెళ్లయ్యాక ఉమ్మడి కుటుంబం. అయినా ఎమ్మెస్సీ చేయగలిగాను. టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా నాకు నేను నిలదొక్కుకోగలిగాను. మా అక్క, అన్నయ్యలు సాహిత్యం అంటే ఇష్టం చూపేవారు. మా వారు సాహితీవేత్త. సాహిత్యాభిలాషతో నేనూ రచనలు చేస్తుండేదానిని. నాకు ఒక్కగానొక్క కూతురు పల్లవి. నా కూతురు బాగా చదువుకోవాలని ఉండేది. అలాగని నా ఇష్టాలను తనమీద రుద్దలేదు. నేను చదువుకుంటూ, రాసుకుంటూ ఉండేదాన్ని. బహుమతి రూపంలో పుస్తకమే ఇచ్చేదాన్ని. దీని వల్ల తనకూ సాహిత్యం అంటే ఇష్టం ఏర్పడింది. సంగీతం, చిత్రలేఖం నేర్చుకుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసింది. పెళ్లయిన తర్వాత అమెరికా వెళ్లి, అక్కడా ఉద్యోగం చేసింది. తిరిగి హైదరాబాద్ వచ్చాక కూడా ఉద్యోగం కొనసాగించింది. టెక్నాలజీని చెడుగా ఉపయోగిస్తున్నారు...నా చిన్నతనంలో వినోద కార్యక్రమాలు పెద్దగా లేవు. ఖాళీ సమయం ఎక్కువ ఉండేది. దీని వల్ల పుస్తకాలు, సంగీతం, సాహిత్యం పట్ల ఆసక్తి చూపేవాళ్లం. ఈ రోజుల్లో టీవీ చానెళ్లు, స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా పిల్లల ఆలోచనలను త్వరగా డైవర్ట్ చేస్తున్నాయి. టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవడం లేదు. తల్లిదండ్రులు టెక్నాలజీ గురించి మంచి చెడులు చెప్పగలిగి, ఫోకస్డ్గా ఉంటే పెంపకం బాగుంటుంది. కాని, వాళ్లే చేతిలో సెల్ఫోన్ పెట్టి అన్నం తినిపిస్తున్నారు. ఇక వారేం మంచి చెప్పగలుగుతారు. మా ఇంట్లో ఇప్పటికీ ఎవరమూ సీరియళ్లు చూడం. జాగ్రఫిక్ చానెల్స్, పాత సినిమాలు చూస్తాం. దీని వల్ల సమయం ఉంటుంది. మా అమ్మాయి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంది. ట్రాన్స్లేషన్స్ చేస్తుంటుంది. మా మనవరాలు ఆశ్లేష ఇంగ్లిష్ సాహిత్యం చదవడం, రాయడం చేస్తుంది. మేం ముగ్గురం కలిసి పుస్తకాల గురించి చర్చించుకుంటాం. పుస్తకాలు చదవడం వల్ల జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఎలా పరిష్కరించుకోవచ్చో కూడా తెలుస్తుంది. ఇస్కూలు కథలునేను మ్యాథ్స్ టీచర్గా ఉద్యోగం చేశాను. అయినా పిల్లల కల్చరల్ యాక్టివిటీస్ చూసేదాన్ని. పిల్లల చేత పాటలు పాడించడం, డ్యాన్సులు, నాటకాలు వేయించడం చేసేదాన్ని. నా ఉద్యోగ అనుభవాలతో ‘ఇస్కూలు కథలు’ పేరుతో 30 కథలతో బుక్ తీసుకువచ్చాను. మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ పుస్తకంలోని ‘ఒకే తాను ముక్కలం’ అనే కథ వారి స్కూల్ పాఠ్య పుస్తకాలలో ఒక పాఠంగా చేర్చింది. ఆ బుక్ హిందీలోకి కూడా అనువాదమైంది.మా దగ్గరున్న పుస్తకాలతో మా అమ్మాయి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసింది. వాటిలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అన్ని రకాల పుస్తకాలు ఉంచాం. ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు, చదువుకోవచ్చు అని మా చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలియజేశాం. కాని, రిటైర్ అయిన ఒకరిద్దరు తప్ప మిగతా ఎవ్వరూ రావడం లేదు. పిల్లలు స్కూల్ బుక్స్, ట్యూషన్స్తో, పెద్దలు సీరియల్స్తో టైమ్ గడిపేస్తున్నారు. ఈ విధానం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఎవరూ ఊహించడం లేదు. హాస్టల్లో ఉంటున్నవారి శాతమూ పెరిగింది. వాళ్లు పెరిగి, పెళ్లయ్యాక కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేకపోతున్నారు. దీంతో త్వరగా విడాకులవైపుగా వెళ్లడమూ పెరిగింది. పేద–ధనిక అనే తేడా లేదు పిల్లల పెంపకంలో అందరిలోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి. ఆ ప్రభావాలు పిల్లల మీద నెగటివ్గా పడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సింది తల్లిదండ్రులే!కేరెంటింగ్- శీలా సుభద్రాదేవి శీలా సుభద్రాదేవి ప్రముఖ రచయిత్రి, కవయిత్రి. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవంతో ఇస్కూలు కథలు సంపుటి వెలువరించారు. దీనితో పాటు తొమ్మిది కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు, ఒక నవలను అందించారు. ∙ నిర్మలారెడ్డి -
ఈ వారం కథ: అమ్మ పుట్టినరోజు
భాద్రపద మాసం, ఋషి పంచమి. నిండా పూలతో మందారం చెట్టు ఆకుపచ్చ చీరలో అప్పుడే కుంకుమ పూజ చేయించుకున్న అమ్మవారిలా ఉంది. ఇంటిముందు విరజాజి మొక్క రోజూ ఫోన్లో పలకరించే కూతురిలా పరిమళం వెదజల్లుతోంది.అటూ ఇటూ ఉన్న మామిడి, పనస సీజనల్ చెట్లు అప్పుడప్పుడూ వచ్చిపోయే కొడుకుల్లా గంభీరంగా ఉన్నాయి.‘‘అమ్మా రావాలి కేక్ కరిగిపోతోంది’’ చిన్నోడు తొందరపెట్టాడు.‘‘అయిపోయిందిరా వచ్చేస్తున్నాం’’ గదిలోంచి అమ్మకి పట్టుచీర కట్టి తీసుకొచ్చింది కూతురు. పెద్ద కొడుకు కవర్లోంచి శాలువా తీసి ట్యాగ్ చింపి పట్టుకుని రెడీగా ఉన్నాడు. జయంతి సోఫాలో కూర్చుంది. ఎదురుగా టీపాయ్ మీద ‘బిస్కఫ్’ కేక్ ఆమె వయసు డెబ్బై ఐదుగా ప్రకటిస్తోంది. కొడుకులిద్దరూ, కోడళ్ళు, కూతురు ఆమె చుట్టూ కూర్చున్నారు. అదే వీధిలో ఉంటున్న చిన్ననాటి స్నేహితురాలు శాంతమ్మ కూడా వచ్చింది. అల్లుడు కొంచెం దూరంగా కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. అతనికీ అత్తగారంటే అభిమానమే కాని, ఇలాంటి ఆర్భాటాలు అంతగా నచ్చవు. ఎక్కడెక్కడో ఉన్న మనవలు వీడియో కాల్లో చూస్తుండగా కేక్ కట్ చేసింది. పెద్దకొడుకు శాలువా కప్పాడు. పెద్దకోడలు అక్షింతలు కలిపి తెచ్చింది. ఒక్కొక్క జంటా కాళ్ళకి నమస్కారం పెడితే, బట్టలమూటతో వీధి వీధి తిరిగే బంగారయ్య దగ్గర కొన్న లుంగీ, తువ్వాలు, డజను జేబురుమాళ్ళు, ఆడవాళ్ళకి చీర జాకెట్టుతోబాటు పసుపు కుంకుమ, కవర్లో కొంత డబ్బు సర్ది ఉంచి కూతురిచేత అందరికీ ఇప్పించి, తనని కూడా తీసుకోమంది. వాళ్ళు సంతోషంగా తీసుకున్నారు. చిన్నోడు అక్క చేసిన మామిడికాయ పులిహోర క్యాన్తో తీసుకెళ్లి పక్కవీధిలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఇచ్చి వచ్చాడు. జయంతి ఆరోజు ఉపవాసం ఉండటంతో మిగిలిన వాళ్లంతా కలిసి భోంచేస్తూ కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం టీ తాగి రాత్రికి ఇంత పులిహోర బాక్స్ కట్టుకుని ఎవరి ట్రైన్కి వాళ్ళు వెళ్లిపోయారు. దగ్గరే కాబట్టి కూతురు అల్లుడు కార్లో బయలుదేరారు. అలా ఆ ఏడు కూడా జయంతి పుట్టినరోజు వినాయకచవితి మర్నాడు ఘనంగా జరిగింది. జయంతి, ఆమె పెంచుకున్న వనం, పనమ్మాయి మిగిలారు. ∙∙ ‘‘ఏవండీ అత్తయ్యగారి ఫోను. చాలాసార్లు చేశారు’’ అంది రాధ ఫోన్ చిన్నోడి చేతికిస్తూ.‘‘టైం లేదు, దార్లో మాట్లాడతాలే’’ అన్నాడు టక్ సరిచేసుకుంటూ.‘‘చాలాసార్లు చేశారు. ఏం అర్జెంటో? ఒకసారి మాట్లాడొచ్చు కదా’’ అంది రాధ కొంచెం ఆందోళనగా ‘పోనీ నేనెత్తనా’ అన్నట్టు సైగ చేస్తూ.‘‘అదేం లేదు. సెప్టెంబర్ లో ఆవిడ పుట్టినరోజు కదా. మళ్ళీ టిక్కెట్లు దొరకలేదంటామని అరవైరోజుల ముందే చెప్పటాని కయ్యుంటుంది’’ అన్నాడతను లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ.‘‘అవును కదూ. అయితే మనం ఊరెళ్తున్నామోచ్’’ అంది రాధ చిన్నపిల్లలా. ‘‘లేదు, లేదు. ఈసారి వెళ్ళటానికి కుదరదు’’ అన్నాడతను విసుగ్గా.‘‘అదేంటండీ, ప్రతీ ఏడూ వెళ్తున్నాం. పేరుకి ఆవిడ పుట్టినరోజైనా ఎంజాయ్ చేసేది మనమే కదా. ఓ వేడుకలా జరుగుతుంది. నాకెంతో ఇష్టం అలా గడపటం’’ అందామె గుర్తుచేసుకుంటూ.‘‘నీకేం, చక్కగా ఆవిడిచ్చిన చీర కట్టుకుని డబ్బులు తీసుకుంటావు’’ అంటూ ఉండగానే రాధ అడ్డుపడి, ‘‘పాపం పెద్దావిడ అంత అభిమానంగా పిలిస్తే అలా అంటారేంటి’’ అంది.దానికతను సోఫాలో కూర్చుని షూ వేసుకుంటూ, ‘‘నిజమే. ఆవిడదేం పోయింది? అందరూ రావాలంటుంది. మన నలుగురూ ఫ్లైట్లో వెళ్ళొస్తే కనీసం ఏభైవేలవుతుంది. పిల్లలతో రైల్లో రోజున్నర కూర్చోగలమా. పోనీ వాళ్ళని వదిలేసి వెళదామా అంటే మనం ఎదురుగా ఉంటేనే చదవట్లేదు. ఇంక వదిలి వెళితే ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి గందరగోళం చేస్తారు. పైగా చవితి మర్నాడు వర్కింగ్ డే. అమ్మ పుట్టినరోజుకి ఆఫీస్లో వారం సెలవంటే నవ్వుతారు. వెళ్లినంతకాలం వెళ్ళాం. ఇక చాల్లే. నువ్వు కూడా ఓ రెండు రోజులు ఫోనెత్తకు. తర్వాత ఫోన్ చేసి టికెట్స్ అయిపోయాయి అని చెబుదాం. పండక్కి ఎలానూ వెళతాం కదా.’’ అన్నాడు.‘‘పోనీ ఇప్పుడెళ్ళి పండక్కి మానేయొచ్చుగా?’’ అందామె.‘‘పండక్కి నా ఫ్రెండ్స్ అంతా వస్తారు. వాళ్ళని కూడా కలవొచ్చు’’ అన్నాడతను కార్ కీస్ తీసుకుని బయల్దేరుతూ. ఆమె చేతిలో ఫోన్ మోగుతూనే ఉంది. భర్త వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయింది రాధ.∙ ‘‘చెప్పమ్మా’’ అంది పద్మ భర్తకి ఇడ్లీలోకి రెండో పచ్చడి మిక్సీ చేస్తూ. ‘‘అదేనే ఈ ఏడు చవితి సెప్టెంబర్ ఆరున పడింది. ఆ మర్నాడే నా పుట్టిన రోజు. ఓ నాలుగు రోజులు ముందుగా వస్తే, జంతికలు, మిఠాయి చేసుకుందాం. మీరు చవితి ఇక్కడే చేసుకోవచ్చు’’ అంది జయంతి.‘‘అమ్మా ఆయనతో ఈ టాపిక్ ఎత్తాలంటేనే భయంగా ఉంది. ‘అస్తమానూ మీ ఇంటికి నన్ను రమ్మనకు, కావాలంటే నువ్వెళ్లిరా’ అని తిడుతున్నారమ్మా’’ అంది పద్మ మిక్సీ జార్లోని పచ్చడి బాక్స్లోకి ఒంపుతూ.‘‘అదేంటే, పెళ్ళై నలభై ఏళ్లయినా ఇంకా అత్తవారింటికి వెళ్లే అదృష్టం ఎంతమందికి ఉంటుంది. ఉన్న వారం రోజులూ ఎంత మర్యాదగా చూస్తాం. అక్కడైనా అతను ఇంట్లో కూర్చోవటమేగా. అదేదో ఇక్కడే కూర్చోమను. అల్లుడుగారికి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతా’’ అనగానే టిఫిన్ ప్లేట్తో బాటు ఫోన్ కూడా భర్తకిచ్చింది పద్మ. దగ్గరి బంధువే కావటంతో జయంతికి అల్లుడంటే అభిమానంతో బాటు చనువెక్కువ. ‘‘నమస్తే అత్తయ్యా. మీ ఆరోగ్యం బావుందా?’’ అన్నాడతను.‘‘బావున్నాను అల్లుడుగారూ. అదే.. వినాయకచవితికి మీరు అమ్మాయిని తీసుకుని రావాలి, ఆ మర్నాడు నా పుట్టినరోజుకి కూడా ఉండి వెళ్ళాలి’’ అంది జయంతి అభిమానంగా. ‘‘శుభం అత్తయ్యా. మీరు ఇలా నిండు నూరేళ్లు పుట్టినరోజులు జరుపుకోవాలి’’ ‘‘అది సరే, అల్లుడూ మీరు రావాలి’’దానికతను ‘‘అత్తయ్యా, నేనూ పెద్దవాడినైపోయాను. ఎక్కడివాళ్ళు అక్కడ ఇంత తిని రెస్ట్ తీసుకుంటే మంచిది. మీ జనరేషన్ వాళ్లకి ఇమ్యూనిటీ ఎక్కువ. మా దినచర్యలో చిన్న మార్పు వచ్చినా దగ్గో, జలుబో వచ్చేస్తోంది. ఈ తిరుగుళ్లు వల్ల, నీరు మార్పిడి వల్ల ఏమైనా వస్తే మీ పిల్లలు దేశంలోనే ఉన్నారు, వస్తారు. నా పిల్లలు విదేశాల్లో ఉన్నారు, రాలేరు, అక్కడ స్థిమితంగా ఉండలేరు. అంచేత మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీ అమ్మాయికి నచ్చచెప్పండి. మీరు పెద్దవారు, నొప్పిస్తే క్షమించండి’’ అన్నాడు అనునయంగా. జయంతి మరేం మాట్లాడలేకపోయింది. జయంతి పెద్దకొడుకు ఇల్లు. ‘‘ప్రశాంతీ’’ పిలిచాడు సాగర్.‘‘మీకు రెండోసారి కాఫీ ఇచ్చేసినట్టు గుర్తు. కావాలంటే మళ్ళీ ఇస్తాను’’ అంది ప్రశాంతి పూజకి ఏర్పాటు చేసుకుంటూ. ‘‘అదికాదు నీతో ఓ విషయం మాట్లాడాలి’’‘‘నేను దేవుళ్ళని తోముకోవాలి. ఓ గంట పడుతుంది. అంతవరకూ టిఫిన్ చెయ్యను. టాబ్లెట్ కూడా వేసుకోటానికి లేదు. ఈ మూడ్లో మీరు చెప్పే విషయం నాకు నచ్చినదైతే పరవాలేదు, నచ్చనిదైతే కొంచెం నెగటివిటీ పెరుగుతుంది. అదే టిఫిన్ చేసి మాత్ర వేసుకున్నాక ప్రశాంతంగా వింటే ఒకవేళ నచ్చకపోయినా మనం శాంతంగా పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి ఏమిటి విషయం’’ అంది ప్రశాంతి దగ్గరకొచ్చి. ‘‘అర్జెంటేమీ లేదులే. నీ పని చూడు. తర్వాత మాట్లాడుదాం’’ అన్నాడతను పేపర్ తిరగేస్తూ. ఓ గంట పోయాక అతనికి టిఫిన్ ఇచ్చి, తనూ తెచ్చుకుని ఎదురుగా కూర్చుని ‘‘ఇప్పుడు చెప్పండి’’ అంది ప్రశాంతి. ‘‘అదే అమ్మ ఫోన్ చేసింది’’‘‘అవునా! ఏమిటట? బావున్నారా?’’ ‘‘హా! బావుంది. అదే భాద్రపద మాసంలో ఆవిడ పుట్టినరోజు కదా. ఎప్పటిలానే రమ్మంటోంది’’ అన్నాడు నసుగుతూ. ‘‘మీరేమన్నారు?’’ అడిగింది ‘‘నిన్నడిగి చెబుతానన్నాను’’ ‘‘దానికి ఆవిడేమన్నారు?’’ అతనేం మాట్లాడలేదు. ‘‘పర్లేదు చెప్పండి’’ ‘‘భార్యకి సమాన విలువ ఇవ్వటం, ఏదైనా నిర్ణయం కలిపి తీసుకోవటం, ఇవన్నీ నేనూ సమర్థిస్తానురా. కానీ ఇంత చిన్న విషయం కూడా ఆవిడని కనుక్కుని చెబుతాను అనటం అన్యాయంరా’’ తల్లి అన్న మాటలు గుర్తు చేసుకుని తలదించుకున్నాడు. ‘‘అర్థమైంది’’ అంది ప్రశాంతి నెమ్మదిగా ఎరుపెక్కుతూ. ‘‘అలా అని కాదు శాంతీ, ఆవిడ అన్నది కూడా నిజమేగా, ఇది చాలా చిన్న విషయం’’ అన్నాడతను నెమ్మదిగా.‘‘నిజమే. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. మామూలుగా అయితే వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు. రాత్రి స్వామి పవళింపు సేవ అనంతరం ఎక్కితే సుప్రభాత సేవ టైంకి దిగిపోతాం. చక్కగా మీకూ నాకూ బట్టలు పెడతారు, మనం కూడా ఓ చీర, స్వీట్స్ కొని పట్టికెళతాం, ఓ పూట అందరం కలుస్తాం. కానీ ఆ ముందురోజు వినాయక చవితి. ఇంట్లో వినాయకుణ్ణి పెట్టుకుని దీపం, నైవేద్యం పెట్టకుండా ఇల్లు తాళం పెట్టటం మంచిది కాదు. అలా అని మీరొక్కరూ వెళితే ఇప్పటికే గడుసుదానిగా పడిన ముద్ర మరింత బలపడుతుంది. పోనీ మీరు నా తరఫున బలంగా చెబుతారా అంటే ఏమీ మాట్లాడరు. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం’’ అని, ఇలా కొనసాగించింది. ‘‘ఈ వయసులో ఆవిడకి ఈ సరదాలు అవసరమా అని నేననను. చెప్పానుగా ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం?’’ సాగర్ ఏమీ మాట్లాడలేదు. ∙∙ మరో నాలుగు సంవత్సరాల తర్వాత భాద్రపద మాసం, ఋషి పంచమి.పనమ్మాయి సాయంతో జయంతి తలస్నానం చేసింది. పెద్దకోడలు కేక్ ఆర్డర్ పెట్టింది. చిన్న కొడుకు ఫ్లవర్స్ పంపాడు. కూతురు ఆన్లైన్లో చీర పంపింది. అందరూ వీడియో కాల్లోకి వచ్చారు. జయంతి కేక్ కట్ చేసింది, ఆమె ఎడం కన్ను అదే పనిగా నీరు కారుతోంది. మొహం పొంగి ఉండటం గమనించి కాళ్ళ వాపు చూసి, తనకున్న సోషల్ మీడియా పరిజ్ఞానంతో డై యూరెటిక్ టాబ్లెట్ వేసుకోమన్నాడు చిన్నోడు. పండక్కి వచ్చినప్పుడు టోటల్ బాడీ చెకప్ చేయిద్దామన్నాడు పెద్దోడు. అంతా ఫోన్ పెట్టేసారు. మూణ్నెల్లు ముందే ఎవరి కవర్లలో వాళ్ళకి సర్ది ఉంచిన బట్టలు, పసుపు కుంకుమ ఎదురింటి అబ్బాయికిచ్చి కొరియర్ చేయించింది. డబ్బులు కూడా అతనికే ఇచ్చి యాప్ ద్వారా పంపమంది. కేక్ని వీధిలో పిల్లలందరికీ పంచింది పనమ్మాయి. ∙∙ ధనుర్మాసం.జయంతికి వొంట్లో బాగోలేకపోవటంతో అందరూ పండక్కొచ్చారు. అంతకుముందు హాల్లోనే కూర్చుని హడావిడి చేసే జయంతి గదిలో మంచానికి పరిమితమైంది. పెద్దగా తిండి సహించటం లేదు. హాస్పిటల్కి తీసుకెళ్లారు, వార్ధక్యం మినహా పెద్దగా జబ్బులేవీ బయటపడలేదు. ఆకలి పెరగటానికి టానిక్ రాసి పంపేశారు. ‘పుట్టినరోజు జరుపుకోకపోతే ఇంతలా బెంగ పడిపోవాలా’ అని పిల్లలు బాధపడ్డారు. ‘బర్త్డే బ్లూస్’ గురించి, ‘నార్సిజం’ గురించి కాసేపు మాట్లాడుకున్నారు. అంతలో శాంతమ్మ మనవడి సాయంతో వచ్చింది. జయంతిని పలకరించి హాల్లోకొచ్చింది. జయంతి పిల్లలు ముగ్గురూ ఆవిడని బాగా ఎరుగుదురు. ఆవిడకి కాఫీ ఇచ్చి కూర్చున్నారు. ‘‘అదే పిన్నీ, టెస్ట్లు చేయిస్తే అంతా నార్మల్గానే ఉంది అన్నారు. ఎనభై వచ్చాయి, ఇంకా ఒంటరిగా ఉండొద్దు, వచ్చెయ్యమంటే వినదు. ఈమధ్య ఏవో కారణాలవల్ల ముగ్గురం రాలేక పోయాం. అప్పటి నుంచి ఇలా మంచం పట్టింది. మా చిన్నప్పుడెప్పుడూ అమ్మ తన పుట్టినరోజు జరుపుకున్నట్టు గుర్తులేదు. అదేంటో మేమంతా వేరే ఊళ్ళల్లో స్థిరపడ్డాకే మొదలెట్టిందీ అలవాటు’’ అని విసుక్కున్నారు. శాంతమ్మ అంతా విని, నెమ్మదిగా చెప్పటం మొదలు పెట్టింది. ‘‘మనుషుల మధ్య ఇప్పటికీ గోడలుగా ఉన్న కులం అప్పట్లో కోటలుగా ఉండేది. ఒకర్నొకరు ఇష్టపడ్డ కారణానికి రెండు కుటుంబాలనీ వదులుకోవలసి వచ్చింది. అప్పుడు మీరు చిన్నపిల్లలు. మీ నాన్న పుట్టినరోజున శాంతి ఆశ్రమానికి వెళ్లొస్తూ ఉండగా ఓ కారు గతితప్పి దూసుకొచ్చింది. మీ అమ్మని తప్పించబోయే ప్రయత్నంలో మీ నాన్న ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రిలో రెండు నెలలు ట్రీట్మెంట్ జరిగినా లాభం లేకపోయింది. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు దూరమైన బాధ ఆ క్షణం అతనిలో స్పష్టంగా తెలిసింది. చివర్లో వాళ్ళు వచ్చినా ఐసీయూలో ఒకరి తర్వాత ఒకరిని, అదీ కొన్ని నిమిషాలపాటు మాత్రమే చూడగలిగారు. అప్పుడే ఆయన తన చివరి కోరికగా మీరంతా పెద్దయ్యాక ఎక్కడెక్కడ స్థిరపడినా కనీసం ఏడాదికోసారైనా కలిసి సంతోషంగా గడిపేలా చూడమని మీ అమ్మకి చెప్పాడు. పండక్కి కలుద్దామంటే ఆడపిల్ల వాళ్ళ అత్తవారింటికి వెళుతుంది. పెద్దోడిని అతని భార్య తన పుట్టింటికి తీసుకువెళ్తుంది. చిన్నోడు వచ్చినా వాడి స్నేహితులతో గడపటానికే సరిపోతుంది’’ అనగానే ముగ్గురూ తలదించుకున్నారు. ఆమె కొనసాగించింది. ‘‘మీ నాన్న పుట్టినరోజు వేడుకంటే ఎవరైనా ఆక్షేపిస్తారేమోనని అదే రోజు మీ అమ్మ తన పుట్టినరోజుగా మిమ్మలందర్నీ రప్పిస్తోంది. ఆ రోజు మీరంతా కలిస్తే మీ నాన్న ఆత్మకి శాంతి కలుగుతుందని తన నమ్మకం. ఈమధ్య మీరు రావటం మానేశారు. బహుశా అదే ఆమె బెంగకి కారణం కావొచ్చు. ఈ విషయాలేవీ మీ అమ్మెప్పుడూ మీకు చెప్పాలనుకోలేదు. నేను చెప్పినట్టు తనకి తెలియనివ్వకండి’’ అని, కాసేపాగి ఆయాసం తగ్గాక పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కొద్దిగా తాగింది.ఇదంతా విని అందరి కళ్ళూ చెమర్చాయి. తండ్రి మరణం, తల్లి కారుణ్య నియామకంలో ఉద్యోగంలో చేరి తమని పెంచి ప్రయోజకులని చెయ్యటం, ఇదంతా తెలుసు. కానీ ఈ పుట్టినరోజు వేడుకలు అమ్మ సరదా అనే అనుకున్నారు ఇంతకాలం. వయసు, బాధ్యతలూ, పెరుగుతున్నకొద్దీ పుట్టినరోజుకి తను చేసే ఆర్భాటాన్ని చూసి విసుక్కుని రాకుండా తప్పించుకుంటున్న మాట వాస్తవం. ఈ విషయం శాంతమ్మ ద్వారా తెలిశాక అంతా ఓ నిర్ణయానికొచ్చారు. ముందుగా చిన్నవాడు మొదలుపెట్టాడు. ‘‘మనకి అమ్మే నాన్న. రాబోయే పుట్టినరోజు అమ్మకి ఎనభై నిండుతాయి. ఘనంగా చేద్దాం.’’ అన్నాడు. ‘‘వీలైంతమందికి అన్నదానం చేద్దాం’’ అంది కూతురు. ‘‘వస్త్రదానం కూడా చేస్తే మంచిది. అది కూడా ప్లాన్ చేద్దాం’’ అంది పెద్ద కోడలు.అందరూ సంతోషంగా లేచి వెళ్లి తల్లికి ఈ విషయం చెప్పారు. జయంతి సంతోషించింది. లేచి కొంత అన్నం తింది. తమతో రమ్మని ఎంత బతిమిలాడినా జయంతి రాలేనంది. ‘ముక్కనుమ’ అవగానే అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరారు. భాద్రపద మాసం – ఋషి పంచమి.ముందురోజు చవితి కావటంతో ‘పత్రి’ కోసం కొమ్మల్ని అర్పించుకోవటం వల్లో, మరో కారణం చేతో, చెట్లన్నీ బోసిపోయినట్లున్నాయి. అనుకున్నట్టుగానే అందరూ వచ్చారు. పేదలకీ, పనివాళ్ళకీ భోజనాలు పెట్టి, బట్టలు పంచారు. ప్రతీ ఏటా అందరూ ఇలా కలవాలని మాట్లాడుకున్నారు. కానీ ఇవేవీ చూడ్డానికి జయంతి లేదు. పిల్లలు ఏడాదికొకసారైనా కలవాలనే భర్త కోరిక తీర్చలేకపోయాననే లోటు తప్ప ఆమెదేమీ అకాలమరణం కాదు. తన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి, సంపూర్ణమైన జీవితం గడిపాకే శివైక్యం పొందింది. జగమంత పందిరేసినా ‘జయంతి’ జన్మదినం కాబోదు. జన్మంత ప్రేమ ఒలకపోసినా పోయినవాళ్ళు తిరిగిరారు. ఏదైనా ఉన్నప్పుడే! ∙ఉమా మహేష్ ఆచాళ్ళ -
కథాకళి: అమ్మ భయపడ్డ మనిషి
రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. సమయం తెల్లవారుజాము. ఆ దేశాల సరిహద్దులోని అతి ముఖ్యమైన పోస్ట్ దగ్గర ఇద్దరు సెంట్రీ డ్యూటీలో ఉన్నారు. ట్రెంచ్లో ముప్ఫై రెండేళ్ళ వయసుగల సెంట్రీకి కొన్ని గజాల దూరంలో నలభై మూడేళ్ళ మరో సెంట్రీ కూడా డ్యూటీలో ఉన్నాడు. ఇద్దరి రైఫిల్స్లో చెరో ఆరు గుళ్ళు ఉన్నాయి. వారిద్దరూ మేలుకుని బైనాక్యులర్స్లోంచి ఎదురుగా ఉన్న చెట్లవైపు చూస్తున్నారు. ఆ చెట్ల వెనక శత్రుసైన్యం ఉందన్న సమాచారం వారికి అందింది. ఒకరి తర్వాత మరొకరు బైనాక్యులర్స్లో ఆ చెట్లవంక వంతులు ప్రకారం చూస్తున్నారు. శత్రుసైనికుల కదలికలని ఎంత త్వరగా గుర్తిస్తే అంత భద్రత కాబట్టి, వారు అప్రమత్తంగా ఉన్నారు.‘‘రేపు మధ్యాహ్నం మా ఆవిడతో మాట్లాడబోతున్నాను.’’ నలభై మూడేళ్ళ సైనికుడు ఉత్సాహంగా చెప్పాడు.‘‘ఫ్రంట్లో ఉన్నావు కదా. నీ గొంతు వింటే వాళ్ళకి ఎంతో తృప్తి.’’బైనాక్యులర్స్లోంచి చూసే మొదటి సైనికుడికి కొద్దిసేపటికి ఎదురుగా చెట్లు వెనక నుంచి ఎవరో రావడం కనపడింది.‘‘చూడు.’’ అతను రెండో సైనికుడ్ని అప్రమత్తం చేశాడు.‘‘అవును.’’ రెండో సైనికుడు కూడా బైనాక్యులర్స్లోంచి వెంటనే చూసి చెప్పాడు.నలుగురు శత్రుసైనికులని చూశాక ఇద్దరూ బైనాక్యులర్స్ పక్కనపెట్టి, రైఫిల్స్ అందుకుని దాని నైట్ విజన్ టెలిస్కోప్లోంచి చూడసాగారు.‘‘వంద మీటర్ల దూరంలో ఉన్నారు. వాళ్ళు రేంజ్ లోకి రావాలి.’’ మొదటి సైనికుడు లెన్స్ అడ్జస్ట్ చేసి చూసి చెప్పాడు.నక్కి వస్తున్న ఆ నలుగురు శత్రుసైనికుల చేతుల్లోని రైఫిల్స్ పేలడానికి సిద్ధంగా ఉన్నాయి.‘‘కుడివైపు ఇద్దరు నా టార్గెట్స్. ఎడమవైపు ఇద్దరు నీ టార్గెట్స్.’’ మొదటి సైనికుడు చెప్పాడు.శత సైనికులు రేంజ్లోకి వచ్చాక, మొదటి సైనికుడు గుసగుసగా చెప్పాడు.‘‘ఇప్పుడు.’’ఇద్దరూ రైఫిల్స్ని ఏకకాలంలో కాల్చారు. రెండో సైనికుడి గురి తప్పలేదు. ఎడమవైపున్న మొదటివాడు నేలకూలాడు. కుడివైపు చివరివాడు అదే సమయంలో రెండు అడుగులు పక్కకి వేయటంతో, మొదటి సైనికుడి గురి తప్పింది. అతను తక్షణం మళ్ళీ కాల్చాడు. ఈసారి అతను నేలకూలాడు.‘‘టు డౌన్.’’ రెండో సైనికుడు ఉత్సాహంగా చెప్పాడు.వెంటనే మిగిలిన ఇద్దరు శత్రు సైనికులు నేలమీద బోర్లా పడుకున్నారు. అవతలి నుంచి కూడా రైఫిల్స్ పేలసాగాయి. రెండో సైనికుడు చూడటానికి ట్రెంచ్లోంచి కొద్దిగా పైకి లేవగానే, శత్రుసైనికుడు కాల్చిన గుండు నుదుటిలోంచి లోపలకి వెళ్ళడంతో వెనక ట్రెంచ్ గోడకి గుద్దుకున్నాడు. మొదటి సైనికుడు అతని దగ్గరకి పాక్కుంటూ వెళ్ళి చూసి, అతను మరణించాడని గుర్తించాడు. అతను కోపంగా కాల్చిన నాలుగు గుళ్ళల్లో ఒకటి తాకి మరో శత్రుసైనికుడు నేలకూలాడు. ముగ్గురు మరణించాక మిగిలిన ఒక్క శత్రుసైనికుడు రైఫిల్ని పేలుస్తూ ముందుకి పాకసాగాడు.ట్రెంచ్లోంచి కొద్దిగా పైకి లేచిన మొదటి సైనికుడికి, దాని ముందు పాకుతూ వచ్చే శత్రుసైనికుడు మూడు అడుగుల దూరంలో కనిపించాడు. అతని రైఫిల్ తనకి గురిపెట్టి ఉంది. అదే సమయంలో మొదటి సైనికుడి రైఫిల్ కూడా శత్రుసైనికుడి మొహానికి గురిపెట్టి ఉంది. ఒకరికి మరొకరు గురిపెట్టిన రైఫిల్స్తో చలనరహితంగా, నిశ్శబ్దంగా ఉండిపోయారు. అలా కొద్ది క్షణాలు గడిచాయి. ఎవరు పేల్చినా రెండోవారు కూడా పేలుస్తారనే భయంతో వాళ్ళ చూపుడువేలు ట్రిగర్ని నొక్కలేదు. పది క్షణాల తర్వాత శత్రు సైనికుడు సందేహించలేదు. తను కాల్చిన మరుక్షణం తనని శత్రువు కాలుస్తాడని తెలిసీ ట్రిగర్ నొక్కాడు. దురదృష్టం. అది క్లిక్మంది తప్ప పేలలేదు. అందులోని గుళ్ళు అయిపోయాయి. అతనికి బెల్ట్లోంచి గుండుని తీసి మళ్ళీ లోడ్ చేసే వ్యవధి లేదు. అతను భయంగా ట్రెంచ్లోని సైనికుడి వంక చూశాడు. తర్వాత నెమ్మదిగా తన రైఫిల్ని కిందపడేసి, మోకాళ్ళ మీద కూర్చుని, రెండు చేతులనీ తల వెనక ఆనించి లొంగిపోయి భయంగా చూడసాగాడు. లొంగిపోయినవాడిని, నిరాయుధుడిని చంపకూడదు అన్నది అంతర్జాతీయ యుద్ధ నియమం. అయినా, అతను దాన్ని అతిక్రమించినా, అది ప్రపంచానికి తెలీదని శత్రుసైనికుడికి తెలుసు. అతిక్రమించి తనని కాల్చి చంపుతాడా? మొదటి సైనికుడు ట్రైంచ్లోంచి పైకి వచ్చి, అతని వెనక్కి వెళ్ళి రైఫిల్ గొట్టాన్ని అతని వీపుకి ఆనించి నెమ్మదిగా చెప్పాడు.‘‘నడు.’’‘‘మా అమ్మ భయపడ్డ మనిషివి– నా ప్రాణాలు తీసే శత్రువువి నువ్వే.’’ శత్రు సైనికుడు నెమ్మదిగా చెప్పాడు. ఇద్దరూ కొద్ది నిమిషాల దూరంలోని గుడారాల దగ్గరికి చేరుకున్నారు. మొదటి సైనికుడు తను తెచ్చిన శత్రుసైనికుడి ఎదురుగా నిలబడి, రైఫిల్ బేరల్ని అతనికి ఛాతీకి నొక్కిపెట్టాడు. అతను కాల్చబోతున్నాడని గ్రహించిన శత్రుసైనికుడు భయంతో కళ్ళు మూసుకుని చావుకోసం ఎదురు చూశాడు. మొదటి సైనికుడు ట్రిగర్ని నొక్కాడు.అది క్లిక్మంది తప్ప, దాంట్లోంచి గుండు బయటికి రాలేదు.‘‘నేను నా రైఫిల్లోని గుళ్ళని లెక్కపెట్టుకుంటూ పేల్చాను. నీలా నాకూ రీలోడ్ చేసే సమయం లేకపోయింది. నువ్వు ఇప్పుడు యుద్ధ ఖైదీవి.’’ మొదటి సైనికుడు నవ్వుతూ చెప్పాడు. మిగిలిన సైనికులు పగలబడి నవ్వసాగారు.∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
జల కాలుష్యం... జబ్బులు ప్రాణాంతకం
సురక్షితమైన మంచినీరు ఇప్పటికీ సమస్యగానే ఉంటోంది. ‘జల జీవన్ మిషన్’ వంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నా, దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడితో అల్లాడుతూనే ఉన్నారు. సురక్షితమైన మంచినీరు దొరకక తరచుగా వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు.మన దేశంలో 2020–25 మధ్యకాలంలో నమోదైన లెక్కలు చూసుకుంటే, జల కాలుష్యం వల్ల రోగాల బారిన పడుతున్నవారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. నీటి కాలుష్యం వల్ల తలెత్తే జబ్బులు, వాటి బారిన పడున్నది సుమారుగా ఎందరో ఒకసారి పరిశీలిద్దాం... -
5 పైసలు..5 లక్షల ఖర్చు
సంస్థ సొమ్మును కాజేయాలని చూసిన ఉద్యోగికి శిక్ష పడాల్సిందేనని కార్పొరేషన్, ‘నేను ఏ తప్పు చేయలేదు.. నాకు న్యాయం చేయండని’ ఆ ఉద్యోగి... 40 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. కేసు కోసం లక్షలు ఖర్చు చేశారు.. సంస్థ ఏళ్ల తరబడి పోరాడిందంటే ఆ ఉద్యోగి భారీగానే ‘ నొక్కేసుంటాడు’, అవినీతి సొమ్ము ‘మెక్కేసుంటాడని’ అనుకుంటున్నారా.. అయితే మీరు ‘చిల్లర’లో కాలేసినట్టే... ఎందుకంటే ఆ ఉద్యోగి సంస్థకు చెందాల్సిన ‘5పైసలు’ తన జేబులో వేసుకున్నాడని సంస్థ ఆరోపణ. అవును మీరు చదివింది నిజమే ‘5 పైసలే’. భారత న్యాయవ్యవస్థలో ‘5 పైసల కేసు’గా గుర్తింపు పొందింది. అసలేం జరిగింది.. చివరికి ఎవరికి న్యాయం దక్కిందో తెలుసుకుందాం..ఇప్పుడంటే యూపీఐ పేమెంట్లు, కార్డులతో చెల్లింపులు వచ్చాయి.. కానీ ఒకప్పుడు బస్సుల్లో ‘చిల్లర పోరాటాలు’ సర్వసాధారణం. ‘టికెట్కు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్కు సహకరించండి’ అని బస్సుల్లో రాసేవారు. చిల్లర ఇవ్వకుండా కండక్టర్ ‘నొక్కేశాడని’ ప్రయాణికుల నుంచి ఆరోపణలు వినిపించేవి. ఢిల్లీకి చెందిన రణవీర్ సింగ్ యాదవ్ ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్(డీటీసీ)లో కండక్టర్గా పనిచేసేవాడు. 1973లో ఆయన డ్యూటీలో ఉండగా స్క్వాడ్ బస్సును ఆపి తనిఖీ చేసింది. ఓ ప్రయాణికురాలి దగ్గర నుంచి 15 పైసలు తీసుకుని, ఆమెకు పది పైసల టికెట్ ఇచ్చాడు. మిగిలిన 5 పైసలు అతను జేబులో వేసుకున్నాడని స్క్వాడ్ ఆరోపణ. విచారణ జరిపి డీటీసీ 1976లో అతడ్ని విధుల నుంచి తొలగించింది. కోర్టులో పోరాటంతనను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ రణవీర్సింగ్ లేబర్ కోర్టును ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. కేవలం ‘5 పైసల’ విషయంలో ఒక ఉద్యోగిని విధుల నుంచి తొలగించడం చాలా కఠినమైన శిక్ష అని కోర్టు పేర్కొంది. గతంలోనూ అతను విధుల్లో నిర్లక్ష్యం వహించాడన్న డీటీసీ వాదనల్ని కోర్టు తోసి పుచ్చింది. అతడికి తిరిగి ఉద్యోగం ఇవ్వాలని 1990లో తీర్పు ఇచ్చింది. హైకోర్టులో అప్పీలులేబర్ కోర్టు తీర్పును డీటీసీ ఢిల్లీ హైకోర్టులో 1991లో సవాలు చేసింది. అప్పటి నుంచి ఏళ్ల పాటు ఈ కేసు కొనసాగింది. చివరికి ఢిల్లీ హైకోర్టు డీటీసీ పిటిషన్ను కొట్టేసింది. అతనికి రావాల్సిన గ్రాట్యూటీ, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ చెల్లించాలని ఆదేశించింది. ‘ 5 పైసల’ కోసం ఇన్నేళ్లు కేసు నడపడానికి ఎంత ఖర్చు చేశారని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించగా, ఇరు పక్షాలు కలిపి సుమారుగా రూ. 5 లక్షల వరకు ఖర్చు చేసినట్టు వెల్లడైంది. కేసు గెలవాలి.. తను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బాధితుడు తన ఆస్తిని అమ్మేశాడు. కష్టపడి కూడగట్టుకున్న పొదుపు సొమ్మును ఖర్చు చేశాడు..డీటీసీ ‘5పైసల’ కోసం సుమారుగా రూ. 47,000 కోర్టు ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టింది. ఒక చిన్న వివాదం కోర్టుల్లో ఏళ్ల తరబడి ఎలా సాగుతోంది..ఓ వ్యక్తి న్యాయపోరాటం అతని జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.. ఈ తరహా చిన్న ఘటనలు కోర్టు విలువైన సమయాన్ని వృథా చేస్తాయనే దానికి ఈ కేసు ఓ ఉదాహరణ. ‘నేను మోసం చేశానా అని నా పిల్లలు కూడా అడిగేవారు. నేను తప్పు చేయలేదని వారికి చెప్పడం చాలా బాధగా ఉండేది’.. నేను తప్పుచేయలేదని నిరూపించుకోవడానికి నా జీవిత కాలం చేసిన పొదుపు మొత్తం ఖర్చు చేయాల్సి వచ్చింది.‘ నా వయస్సు వారు తీర్థయాత్రలకు వెళ్లేవారు... నేను మాత్రం ఏళ్ల తరబడి కోర్టుల యాత్ర’ చేశాను. – రణవీర్సింగ్ యాదవ్, బాధితుడు -
నా సీక్రెట్ వరల్డ్
తెలుగు తెరపై ఎనర్జీ, అల్లరి, గ్లామర్ ఈ మూడు పదాలు కలిస్తే గుర్తొచ్చే పేరు నభా నటేశ్. స్క్రీన్ పై చిలిపి నవ్వుతో మెరిసే ఆమె, నిజజీవితంలో ఎలా ఉంటారో? అమె మాటల్లోనే మీకోసం..చిన్నప్పటి కల! సినిమాల్లోకి రావాలనే కల చిన్నప్పటి నుంచే ఉంది. ఉడుపిలో ఇంజినీరింగ్ చే సి, మోడలింగ్ వైపు వెళ్లాను. మొదట్లో చాలా కష్టపడ్డాను. చాలాసార్లు అన్నీ వదిలేసి ఏదైనా జాబ్ చేద్దామని కూడా అనుకున్నాను. అందుకే, నాకు వచ్చిన ప్రతి అవకాశం వెనుక ఒక దీర్ఘమైన ఆలోచన, భయం, ఎగై్జట్మెంట్ అన్నీ ఉన్నాయి.‘ఇస్మార్ట్’ ఇమేజ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత నా జీవితం మారిపోయింది. ఒక్కసారిగా ప్రజలు నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఆ మాస్ క్యారెక్టర్ నాకో పెద్ద చాలెంజ్. కాని, తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చేవి. నాకు ప్రతి సినిమాలో కొత్తగా కనిపించాలనే ఉంటుంది. టైప్కాస్ట్ అవ్వడం అసలు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు ’స్వయంభూ’, ’నాగబంధం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో మీ ముందుకు వస్తున్నాను.రెస్ట్ కావాలి! స్క్రీన్ పై ఎంత గ్లామర్గా కనిపించినా, ఇంట్లోనైతే ఓవర్సైజ్ టీషర్ట్, జీన్స్, నూట్ వేర్స్తో నేను పూర్తిగా చిల్ మోడ్లోనే ఉంటాను. షూటింగ్ లేని రోజుల్లో మేకప్ అస్సలు వాడను. నా స్కిన్ కి రెస్ట్ ఇస్తాను. నా అందం వెనుక రహస్యం ఖరీదైన క్రీములు కాదు; సరైన నిద్రపోవడం, ఎక్కువ నీరు తాగడమే!సింపుల్ గర్ల్చాలామంది నన్ను ఔట్గోయింగ్ అనుకుంటారు కాని, నేను చాలా రిజర్వ్డ్ పర్సన్. నా ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నది. ఇండస్ట్రీలో కూడా నమ్మిన వాళ్లతోనే ఎక్కువగా మెలుగుతాను. నా పర్సనల్ స్పేస్ నాకు చాలా విలువైనది.మల్టీ టాలెంటెడ్ చిన్నప్పుడు భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నాను. అలాగే ఖాళీ సమయం దొరికితే కాన్వాస్పై పెయింటింగ్స్ వేస్తుంటాను. 2013లో ఫెమినా మిస్ ఇండియా బెంగళూరులో ‘మిస్ ఇంటెలెక్చువల్’ టైటిల్ గెలుచుకున్నాను.మిస్టరీ మంచిదే! గాసిప్స్ వస్తుంటాయి, పోతుంటాయి. వాటిపై ఫోకస్ పెట్టను. నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడాలని అనిపించదు. కొంచెం మిస్టరీ ఉండటం కూడా మంచిదే కదా!నా సీక్రెట్ వరల్డ్కొత్త ప్రదేశాలు, కొత్త కల్చర్స్ చూసేటప్పుడు, ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు కలిగే చిన్న చిన్న ఆనందాలతోనే నేను పూర్తిగా రీచార్జ్ అవుతాను. ఫ్యాన్ ్స పంపిన చిన్న చిన్న గిఫ్ట్స్,నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. అవే నా అసలు అవార్డ్స్.కష్టకాలం నేర్పిన పాఠంఒక ప్రమాదం తర్వాత కొంతకాలం సినిమాలకు దూరమయ్యాను. అది నా లైఫ్లో టఫ్ ఫేజ్. భుజానికి సర్జరీ జరిగి బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా కుంగిపోయాను. ఆ బ్రేక్ నాకు సహనాన్ని, మళ్ళీ పోరాడే శక్తిని రెండింటినీ ఇచ్చింది.ఇష్టాయిష్టాలు⇒ నాకు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. వారి సినిమాలను మిస్ అవ్వను. హీరోయిన్లలో దీపికా పదుకొణే స్టయిల్, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా నచ్చుతుంది. ⇒ నేను సౌత్ ఇండియన్ ఫుడ్ లవర్ని, బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, లంచ్లో సాంబార్ రైస్ ఉంటే చాలు. ⇒ రంగుల్లో బ్లాక్ అండ్ వైట్ నా ఫేవరెట్. గ్లామరస్ డ్రెస్సులు వేసినా, చీరలు కట్టుకోవడం అంటే ఇష్టం. ఎనిమిదేళ్ల వయసులోనే సొంతంగా చీర కట్టుకోవడం నేర్చుకున్నాను. -
అందాల పోటీల్లో ఒంటెలపై అనర్హత
ఒమన్లో ఇటీవల ఒంటెలకు అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పెద్దసంఖ్యలో ఒంటెలు క్యామెల్ వాక్ చేస్తూ వయ్యారాలు ఒలకబోశాయి. వేలాది మంది జనాలు ఈ పోటీలను అబ్బురంగా తిలకించారు. న్యాయ నిర్ణేతలు ఒక్కొక్క ఒంటెనూ నిశితంగా పరిశీలించారు.పోటీల్లో పాల్గొన్నవాటిలో ఇరవై ఒంటెలపై అనర్హత వేటు వేశారు. ఎందుకంటారా? తమ ఒంటెలు అందంగా కనిపించడానికి యజమానులు వాటికి బోటాక్స్ ఇంజెక్షన్లు ఇప్పించారు. బోటాక్స్ ఇంజెక్షన్లతో వాటి పెదవులు, చెక్కిళ్లు ప్రస్ఫుటంగా కనిపించేలా తీర్చిదిద్దించి మరీ పోటీకి తీసుకొచ్చారు. ఈ సంగతి కనిపెట్టిన న్యాయనిర్ణేతలు, అందాల పోటీల్లో కృత్రిమ సౌందర్యానికి చోటులేదని కరాఖండిగా తేల్చి చెప్పి, ఇరవై ఒంటెలను పోటీ బరి నుంచి తప్పించారు. -
డాక్టర్లకూ రేటింగ్ తంటాలు పేషెంట్లు జాగ్రత్త!
ఒకప్పుడు డాక్టర్ అంటే దైవంతో సమానం. ఇప్పుడు ఒక ‘ప్రోడక్ట్’తో సమానం!అమెజాన్ లో మిక్సీ కొనేటప్పుడు ముందు రేటింగ్, తర్వాత రివ్యూలు చూస్తాం. ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ చేసేటప్పుడూ ఇదే స్టోరీ ‘రేటింగ్ తక్కువగా ఉందంటే వద్దు!’ఇప్పుడు ఇదే అలవాటు ఆరోగ్య రంగంలోకి కూడా వచ్చేసింది. ఫోన్ లో డాక్టర్ పేరు టైప్ చేస్తే చాలు, పక్కనే మెరుస్తున్న ఐదు స్టార్లు. అంతే, మన మెదడు వెంటనే ‘ఈ డాక్టర్ బాగుంటారు!’ అనే తీర్పు చెప్పేస్తుంది. ఇలా వైద్యుడి నైపుణ్యం కంటే, వెబ్సైట్లో కనిపించే స్టార్లకే ప్రాధాన్యత! అయితే ఆన్ లైన్ లో జరుగుతున్న ఈ స్టార్ వార్స్లో, ప్రాణం విలువ నిజంగా ఆ ఐదు స్టార్లేనా?డిజిటల్ యుగం పుణ్యమా అని, ఒకప్పుడు ఆసుపత్రి క్యూల్లో గంటల తరబడి తపస్సు చేయాల్సిన పేషెంట్లు ఇప్పుడు సోఫాలో కూర్చునే స్మార్ట్ఫోన్ స్క్రీన్ పై డాక్టర్ల ‘జాతకాలు’ చూసేస్తున్నారు. అపాయింట్మెంట్ బుక్ చేయడం ఇప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసినంత ఈజీ అయిపోయింది! ముందు ఆసుపత్రి నాలుగు గోడల మధ్య గుట్టుగా సాగిపోయే వైద్యం ఇప్పుడు రివ్యూలు, రేటింగ్స్తో పారదర్శకంగా మారింది. రోగుల చేతిలోకి ఒక డిజిటల్ మైక్ వచ్చినట్టే. తమ అనుభవాన్ని ప్రపంచానికి చెప్పే అవకాశం దొరికింది. కాని, ఇక్కడే అసలు కామెడీ మొదలైంది. కొన్ని రివ్యూలు చదివితే నవ్వాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కాదు. ‘డాక్టర్ ప్రాణాలు కాపాడారు. కాని, క్లినిక్ బయట పార్కింగ్ లేదు. అందుకే ఒక స్టార్!’ అని ఒకరు.ఇంకొకరు, ‘నా సర్జరీ సక్సెస్ అయింది. హాస్పిటల్లో వైఫై సిగ్నల్ సరిగ్గా లేదు’ అని, మరొకరు, ‘డాక్టర్ గారు రాసిన మందులు వాడాక జ్వరం తగ్గింది. కాని, ఆయన చెప్పిన డైట్ పాటించడం చాలా కష్టంగా ఉంది.’ అంటూ కొన్ని కొన్ని విచిత్రమైన కారణాలతో సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చే బ్యాచ్ తయారైంది. ఇలాంటి బ్యాచ్తో వైబ్సైట్లో వైద్యుడి హస్తవాసితో పనిలేకుండానే, ఆయన స్టార్ పవర్ తగ్గుతూ పోతుంటే, ఇంకొంతమంది ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్యాకేజీలు, పేషెంట్లను ప్రత్యేకంగా రివ్యూలు పెట్టమని అడగడం, సోషల్ మీడియా క్యాంపెయిన్లు నిర్వహించడం, లేదా డిజిటల్ మార్కెటింగ్ సహాయంతో మంచి రేటింగ్స్ను పెంచుకోవడం జరుగుతోంది.ఇలా నిజమైన వైద్య నైపుణ్యంతో సంబంధం లేకుండానే, కొందరి ప్రొఫైల్లు ఆన్ లైన్ లో ఎక్కువ ‘స్టార్స్’తో మెరిసి పోతుంటాయి. దీంతో, కొత్తగా డాక్టర్ను వెతుకుతున్న పేషెంట్లకు, ఎవరి నైపుణ్యం నిజంగా ఎంత ఉందో అర్థం చేసుకోవడం కష్టంగా మారుతోంది. మరి ఇది నిజంగా పెరిగిన జవాబుదారీతనమా లేక డిజిటల్ లోకం తెచ్చిన కొత్త రకం రేటింగ్ వెర్రా అనే ఈ వింత పరిస్థితిని చూస్తుంటే, ఈ ‘స్టార్ల’ వెనుక ఉన్న అసలు కథను కాస్త లోతుగా తవ్వి చూడాల్సిందే! ఒకప్పుడు డాక్టర్ ఎంపిక ఎలా ఉండేది?కొన్ని సంవత్సరాల క్రితం వరకు డాక్టర్ను ఎంచుకోవడం ఒక చిన్న సామాజిక ప్రక్రియలా ఉండేది. మంచి డాక్టర్ పేరును గూగుల్ కంటే ముందు పక్కింటి వాళ్లే చెప్పేవారు. అందుకే, ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే, మొదట ఫోన్ తిప్పేది పక్కింటి వారికే. ‘ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతారు’ అనే ఒక మాటే సిఫారసుగా సరిపోయేది. ఇలా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సహచరుల మాటలతోనే నమ్మకం పంచుకునేది. ఆ నమ్మకం ఒక్కరోజులో ఏర్పడేది కాదు. అనుభవాల నుంచి, కాలంతో పెరిగిన విశ్వాసం నుంచి అది వస్తుంది. కాని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైద్యం కూడా ఒక కొత్త స్టార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రపంచంలో ఏళ్ల తరబడి చదువు, అనుభవం, వేలాది రోగులకు చేసిన చికిత్స ఇవన్నీ ఐదు చిన్న స్టార్లలోనే సరిపెట్టేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ ఆన్ లైన్ డాక్టర్ రేటింగ్స్ను నిజంగా విశ్వసించాలా? లేక కొంచెం ఆలోచించాలా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు కొన్ని విషయాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. రేటింగ్స్ చెప్పేది ఏమిటి? ఆన్ లైన్ రివ్యూలు ఎక్కువగా ఒక రోగి అనుభవాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి. అందుకే, ఆ రివ్యూలు చదువుతుంటే మనకు డాక్టర్ ‘సర్జరీ’ కంటే, అక్కడ దొరికే ‘లగ్జరీ’ గురించే ఎక్కువ సమాచారం ఉంటుంది. డాక్టర్ ఎలా మాట్లాడారు? ఎంతసేపు వేచి చూడాల్సి వచ్చింది? సిబ్బంది ఎలా వ్యవహరించారు? హాస్పిటల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఇలాంటి అంశాలపై ఆధారపడి ఎక్కువగా రివ్యూలు వస్తాయి. ఇవి ఆరోగ్య సేవలో ముఖ్యమైన భాగమే అయినా, ఇక్కడే, డాక్టర్ అసలు నైపుణ్యం ఈ స్టార్ల మధ్యలో నలిగిపోతోంది. వైద్యం అంటే కేవలం తీపి మాటలు, మెరిసే టైల్స్ కాదు. అది ఏళ్ల తరబడి చేసిన తపస్సు, క్లిష్ట పరిస్థితుల్లో సెకన్ల వ్యవధిలో తీసుకునే ప్రాణసంకట నిర్ణయాల సమ్మేళనం! అందుకే, ఒకే చికిత్స ఇద్దరు వేర్వేరు పేషెంట్స్కు చేసినా ఫలితం ఒకేలా ఉండదు. ఒకరు వారం రోజుల్లో జిమ్కి వెళ్తే, మరొకరు నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి రావచ్చు.వయసు, వ్యాధి తీవ్రత, ఆ వ్యక్తి శరీర తత్త్వం వంటి బోలెడు ట్విస్టులు ఈ చికిత్స వెనుక ఉంటాయి. కాని, ఆన్ లైన్ రివ్యూ ఇచ్చే పేషెంట్ మాత్రం, ‘పక్కింటి పుల్లయ్యకి మూడు రోజుల్లో తగ్గింది, నాకు ఐదు రోజులైనా తగ్గలేదు.. సో వన్ స్టార్!‘ అని తీర్పు ఇచ్చేస్తుంటారు. పాపం, మెడికల్ సైన్ ్స లోని లోతుపాతులను పక్కన పెట్టి, కేవలం ఆ క్షణం కలిగిన ‘అనుభవం’ ఆధారంగానే మార్కులు వేసేస్తున్నారు. అందుకే గుర్తుంచుకోండి– ఆ స్టార్ రేటింగ్స్ అవి ఒక అనుభవాన్ని మాత్రమే నమోదు చేస్తాయి. కాని, అది డాక్టర్ మేధస్సుకు సర్టిఫికెట్ కాదు! అసంతృప్తి గళం ఎక్కువగా వినిపిస్తుంది! మనిషి సాధారణ నైజం, అన్నీ బాగానే ఉన్నప్పుడు హాయిగా నిశ్శబ్దంగా ఉండిపోతాడు. అదే ‘మౌనం అర్ధాంగీకారం’ అన్నట్టే. చికిత్స అద్భుతంగా జరిగి ప్రాణాలు నిలబడినా, ‘అబ్బా, డాక్టర్ గారు దేవుడండీ!’ అని మనసులో అనుకుని ఇంటికెళ్లి ప్రశాంతంగా పడుకుంటాడు. కాని, ఫోన్ తీసుకుని రివ్యూ రాయాలని మాత్రం ఎక్కువగా అనిపించదు. అదే, ఆసుపత్రి వాతావరణంలో కాని, డాక్టర్ నిర్లక్ష్యం, మరేదైనా చిన్న అసంతృప్తి వచ్చినా సరే, వెంటనే, తనలోని ‘సోషల్ మీడియా సింహం’ గర్జిస్తుంది! ఎవరూ అడగకపోయినా పేజీల కొద్దీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తారు. సాఫ్ట్వేర్ అడ్వైజ్ సంస్థ నివేదిక ప్రకారం, కొత్త వైద్యుడిని ఎంచుకునే ముందు దాదాపు 94 శాతం రోగులు ఆన్ లైన్ రివ్యూలను పరిశీలిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ రివ్యూలలో చాలా భాగం అసంతృప్తి చెందిన రోగుల నుంచే వస్తున్నాయి. సుమారు 70 శాతం మంది రోగులు తమకు కోపం వచ్చినప్పుడు మాత్రమే రివ్యూ రాస్తారని ఈ సర్వే చెబుతోంది. దాంతో చికిత్సతో సంతృప్తి చెందిన చాలామంది రోగుల అభిప్రాయాలు ఆ వెబ్సైట్లలో కనిపించకుండా పోతున్నాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా వందమందికి ప్రాణం పోసిన డాక్టర్కు వచ్చిన ప్రశంసలు నిశ్శబ్దంగా ఉండిపోతే, పార్కింగ్ దొరకలేదని ఒక పేషెంట్ ఇచ్చే ఆ ఒక్క ‘స్టార్’ మాత్రం పెద్దగా కనిపిస్తుంది. ఆ ఒక్క రేటింగ్ వెనుక వందలమంది సంతృప్తి చెందిన రోగుల మౌనం దాగి ఉందని చాలామంది గుర్తించరు. అందుకే ఆన్ లైన్ స్టార్లను చూసి డాక్టర్ను అంచనా వేయడం అంటే, సినిమా ట్రైలర్లో ఒక సీన్ చూసి, సినిమా మొత్తం ఎలా ఉందో తీర్పు చెప్పేసినట్టే! ఒక నక్షత్రం, ఒక ప్రతిష్ఠ! నెగటివ్ రివ్యూల ప్రభావం ఇప్పుడు ఒక సైలెంట్ వైరస్లా మారుతోంది. ఒక్క నెగటివ్ రివ్యూ కూడా కొన్ని సందర్భాల్లో ఒక డాక్టర్ ప్రతిష్ఠను తీవ్రంగా ప్రభావితం చేయగలదు. వందమంది రోగుల వ్యాధులను నయం చేస్తే వచ్చే కాస్తో కూస్తో గుర్తింపు, అసంతృప్తి చెందిన ఒక్క రోగి రాసే ఘాటైన రివ్యూతో ఆ డాక్టర్ ప్రతిష్ఠ డిజిటల్ నడిబజారులో మంటగలసిపోతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ నెగటివ్ వ్యాఖ్యలు నిమిషాల్లో వేలాది మందికి చేరిపోతాయి. నిజం బయటపడేలోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చినట్టే, ఆ డాక్టర్ నైపుణ్యంపై ఒక వ్యతిరేక ముద్ర పడిపోతుంది.ఇక్కడ అసలు చిక్కు ఏమిటంటే, డాక్టర్లు తమ వృత్తి గోప్యత, నైతిక విలువల కారణంగా ఈ రివ్యూలకు బహిరంగంగా స్పందించలేరు. పేషెంట్ తన అనుభవాన్ని బహిరంగంగా చెబుతాడు. కాని, ‘ఆపరేషన్ థియేటర్లో నిజంగా ఏమైంది?’ అనే విషయాన్ని డాక్టర్ డిజిటల్ వేదికలపై వివరించలేడు. దాంతో ఆయన మౌనంగా ఉండాల్సిందే. ఈ ఏకపక్ష పరిస్థితి వల్ల డాక్టర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినడమే కాకుండా, కొత్తగా వచ్చే పేషెంట్లు కూడా ఆ స్టార్ రేటింగ్స్ చూసి భయపడి మంచి వైద్యులను దూరం చేసుకునే ప్రమాదం ఉంది. ఇంకో వైపు, సరుకు లేని డబ్బా ఎక్కువ చప్పుడు చేసినట్లు, కొన్ని ఆసుపత్రుల్లో జరిగే హడావిడి ప్రచారం, ఆకర్షణీయమైన ప్రదర్శనలతో మెరిసే రేటింగ్స్ చూసి మోసపోయే పేషెంట్ల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే ఉంది.వైద్యులపై ఆన్ లైన్ రేటింగ్స్ విశ్లేషణ1 చెప్పటం లేదు?సుమారు 88 శాతం సంతృప్తి చెందిన రోగులు రివ్యూ రాయడానికి ముందుకు రారు.2 అసంతృప్తి అసంతృప్తి చెందిన రోగులు సుమారు 21 శాతం ఎక్కువగా ఆన్ లైన్ లో రివ్యూ రాస్తున్నారు.3 సౌకర్యాలు దాదాపు 70 శాతం రివ్యూలు వెయిటింగ్ టైమ్, సిబ్బంది ప్రవర్తన, పార్కింగ్ వంటి సౌకర్యాలు, బిల్లింగ్ వెసులుబాట్లు, ఆఫర్లు, ప్యాకేజీల గురించే ఉంటాయి.4 నైపుణ్యం కేవలం 30 శాతం రివ్యూలు మాత్రమే డాక్టర్ నైపుణ్యం, చికిత్స నాణ్యత ఆధారంగా ఉంటున్నాయి.5 నకిలీ రివ్యూలు కొన్ని సందర్భాల్లో సంస్థలు తమ ప్రతిష్ట పెంచుకోవడానికి సుమారు 10 శాతం వరకు రివ్యూలను స్వయంగా జోడించే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.ఆన్ లైన్ వైద్య రేటింగ్స్పై పరిశోధనలు – గణాంకాలు...హార్వర్డ్ వైద్య పాఠశాల అధ్యయనం ప్రకారం, ఆన్ లైన్ రేటింగ్స్ వైద్య రంగంపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. సుమారు 800 మంది వైద్యులు, 400 మందికి పైగా రోగులు పాల్గొన్న వివిధ పరిశోధనల విశ్లేషణ ప్రకారం, దాదాపు 78 శాతం వైద్యులు ఆన్ లైన్ లో వచ్చే నెగటివ్ వ్యాఖ్యలు తమపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సుమారు 46 శాతం వైద్యులు ఈ రేటింగ్స్ వల్ల వైద్యుడు, రోగి మధ్య ఉండాల్సిన నమ్మకం, సంబంధం దెబ్బతింటున్నాయని అభిప్రాయపడ్డారు.డిజిటల్ ప్రపంచంలో స్టార్లు మెరుస్తున్నాయంటే, నిజం చీకటిలో దాగుందని అర్థం. అందుకే డాక్టర్ను ఎంచుకునేటప్పుడు స్టార్స్ కంటే, అనుభవం, సామర్థ్యాన్ని నమ్ముకోవడం ఉత్తమం. చివరికి జీవితాన్ని కాపాడేది వెబ్సైట్లో మెరిసే స్టార్లు కాదు, వైద్యుడి చేతిలోని నిజమైన నైపుణ్యమే.డాక్టర్లకు స్మార్ట్ టిప్స్ఈ డిజిటల్ ప్రపంచంలో స్టెతస్కోప్ పక్కనే ఇప్పుడు మరో శక్తిమంతమైన సాధనం ఉంది. అదే స్టార్ రేటింగ్. అందుకే ఇప్పుడు వైద్యరంగంలో పేషెంట్ను మాత్రమే కాదు, రివ్యూను కూడా కేర్ చేయాలి! దాదాపు 94 శాతం మంది పేషెంట్లు ఒక డాక్టర్ను ఎంచుకునే ముందు ఆన్ లైన్ రివ్యూలు చదువుతారు. దాదాపు 77 శాతం మంది కొత్త డాక్టర్ కోసం వెతకడం కూడా గూగుల్తోనే మొదలుపెడతారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే, నాలుగు స్టార్లకంటే తక్కువ రేటింగ్ ఉంటే 84 శాతం మంది సిఫారసు చేసిన డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లరు! అంటే ఇప్పుడు వైద్య నైపుణ్యం ఎంత ముఖ్యమో, డిజిటల్ స్టార్ పవర్ కూడా అంతే ముఖ్యమైపోయింది.మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సెర్చ్ రిజల్ట్స్లో ర్యాంకింగ్లో దాదాపు 13 శాతం ప్రభావం ఆన్ లైన్ రివ్యూలదే. ఎందుకంటే 92 శాతం మంది గూగుల్లో మొదటి పేజీ కూడా దాటరు. అంటే మొదటి పేజీలో కనిపించకపోతే, మీరు ఉన్నా లేనట్టే! అందుకే, ఆన్ లైన్ లో డాక్టర్ లేదా ఆసుపత్రి యాజమాన్యం తమ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి నిపుణులు సూచించిన కొన్ని సింపుల్, స్మార్ట్ టిప్స్ ఇవి. ముందుగా వినండి, తర్వాత స్పందించండి.సోషల్ మీడియా, గూగుల్ రివ్యూలు, కామెంట్లు ఇవన్నీ ఇప్పుడు పేషెంట్ల డిజిటల్ ఫీడ్బ్యాక్ బాక్స్ లాంటివి. అక్కడ ఏమి జరుగుతోంది అన్నది తరచు గమనించాలి. ఎక్కడైనా పేషెంట్ ప్రశంసిస్తే వెంటనే స్పందించాలి. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే మరింత త్వరగా స్పందించాలి. హ్యాష్ట్యాగ్లు, కామెంట్లు, ఫొటోలు, వీడియోలు ఏదైనా మీ హాస్పిటల్ గురించి వస్తే అది మీకు ఒక ముఖ్యమైన సూచనగా తీసుకోవాలి.స్పందనకు ఒక ప్లాన్ ఉండాలి.ఎవరైనా రివ్యూ పెట్టగానే ఎలా స్పందించాలి? ఎవరు స్పందించాలి? ఏ టోన్ లో మాట్లాడాలి? ఇవన్నీ ముందుగానే నిర్ణయించుకోవాలి. మీ హాస్పిటల్ వ్యక్తిత్వానికి తగ్గట్లుగా ఒక ‘వాయిస్’ ఉండాలి. సున్నితంగా, మానవీయంగా, నిజాయితీగా. ముఖ్యంగా పేషెంట్ సమాచారాన్ని ఎప్పుడూ పబ్లిక్గా చెప్పకూడదు. అవసరమైతే ప్రైవేట్గా మాట్లాడి సమస్యను పరిష్కరించాలి.రోజువారీ అలవాటుగా మార్చండి.రివ్యూలను ఒకసారి చూసి వదిలేయడం కాదు. ప్రతిరోజూ గమనించడం, స్పందించడం అలవాటుగా మారాలి. టీమ్లో ఎవరికైనా ఈ బాధ్యత అప్పగించాలి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఎక్కువగా వస్తోంది? ఎక్కడ మెరుగుపరచాలి? అన్నది అనలిటిక్స్ ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆన్ లైన్ సెర్చ్ ద్వారా హాస్పిటల్లకు వచ్చే పేషెంట్లు ఆఫ్లైన్ పద్ధతుల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.∙ దీపిక కొండి -
వసంత పుష్పవిలాసం
చలికాలం గాఢనిద్ర వీడి, వసంతంలోకి నెమ్మదిగా అడుగుపెడుతున్న వేళ.. జపాన్ వీథులన్నీ గులాబి రంగుతో మెరిసిపోతూ అందాల పందిళ్ళలా కనువిందు చేస్తాయి. ఇప్పటి వరకు మంచు ముసుగులో నిశ్శబ్దంగా ఉన్న కొమ్మలన్నీ చెర్రీ పూల విరబూతతో కళకళలాడుతాయి. నింగి నుంచి గులాబి మబ్బులు నేలకు దిగివచ్చాయా అన్నట్లుగా ఈ పూలు సందర్శకులను ఒక మాయలోకంలోకి తీసుకువెళతాయి. గాలికి రాలిపడే పూల రేకులు దారి పొడవునా మెత్తని తివాచీలా మారి నడిచే ప్రతి అడుగును మధుర స్వప్నంలా మారుస్తాయి. చెర్రీ బ్లోసమ్ ప్రకృతి పలకరింపు మాత్రమే కాదు. తరతరాల సంప్రదాయాన్ని, నేటి ఆధునిక జీవన వేగాన్ని ఏకం చేసే భావోద్వేగాల వేడుక.ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ చెర్రీ బ్లోసమ్ పండుగ జరుగుతుంది. ఈ కాలంలో గులాబి రంగు చెర్రీపూలను చూస్తూ జపనీయులు ఆనందిస్తారు. దీన్ని ‘హనామి’ అని పిలుస్తారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ, జపనీయులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆరుబయట చెర్రీ చెట్ల నీడలో వనభోజనాలు చేస్తారు. ఆటపాటలతో సరదాగా గడుపుతారు. ఈ ఏడాది మార్చి 21 నుంచి పూలు వికసిస్తాయని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది. పగటి పూట కనువిందు చేసే లేత గులాబీ వర్ణపు సొగసులు, రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగుల్లో మరింత శోభాయమానంగా కనిపిస్తాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని ‘యోజాకురా’ అంటారు.ఈ పూల సందడితో టోక్యోలోని యునో పార్క్, క్యోటోలోని ఫిలాసఫర్స్ పాత్, ఒసాకా కోట పరిసరాలు గులాబీ రంగులో కళకళలాడతాయి. చెర్రీ పూలు వికసించిన వారం పది రోజుల్లోనే రాలిపోతాయి. వికసించిన కొద్దిరోజుల్లోనే రాలిపోయే ఈ పూలు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతాయి. జీవితం చిన్నది. ఉన్నంతలో పరిమళించాలి, ప్రతి క్షణాన్నీ ప్రేమగా ఆస్వాదించాలి అనే జీవన సందేశాన్ని అందిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు, ఫొటోగ్రాఫర్లకు ఈ సీజన్ ఒక మధుర జ్ఞాపకంగా నిలుస్తుంది. ఈ పండుగ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది పర్యాటకులతో జపాన్ లోని ఊరూరా వీథులు కళకళలాడతాయి. ఈ సమయంలో సంప్రదాయ వాయిద్యాలైన కోటో, వెదురు వేణువులతో కళాకారులు సంగీత ప్రదర్శనలిస్తారు. గాలికి ఊగిసలాడే పూల మధ్యలో వేణుగానం పర్యాటకులను పరవశింపజేస్తుంది. స్థానిక కళాకారుల చేతి వృత్తుల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. పండగ సమయంలో చెర్రీ పూల పరిమళంతో తయారు చేసే మొచి, టీ, స్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంహిత నిమ్మన -
రాముడికి జాబాలి ఉద్బోధ
పితృవాక్య పరిపాలన కోసం రాముడు అడవులకు బయలుదేరాడు. భర్త తోడిదే లోకం అనుకుని సీత, అన్నకు తోడుగా లక్ష్మణుడు కూడా రాముడిని అనుసరించారు. రాముడు అడవులకు వెళ్లిపోయాడనే దుఃఖంతో దశరథుడు కన్నుమూశాడు. భరతుడు దశరథుడికి అంత్యక్రియలు చేశాడు. రాముడిని తిరిగి అయోధ్యకు తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో సపరివారంగా రాముడి వద్దకు వెళ్లాడు. అయోధ్యకు తిరిగి రావాలని, రాజ్యాన్ని చేపట్టాలని పలురకాలుగా బతిమాలుకున్నాడు. భరతుడి కోరికను రాముడు అంగీకరించలేదు. ‘తమ్ముడా! దుఃఖించకు. అయోధ్యకు వెళ్లి పరిపాలన సాగించు. మన తండ్రి ఆదేశాన్ని పాటించు. వనవాసం చేయడం ద్వారా నేను ఆయన మాటను నెరవేరుస్తాను. మహారాజైన మన తండ్రికి ఇచ్చిన మాటను ఉల్లంఘించరాదు. నువ్వు కూడా ఆయన ఆజ్ఞను పాలించు. పరలోకంలో సుఖాలను కోరే మానవుడు క్రూరత్వం లేకుండా గురు శుశ్రూష చేయాలి. తండ్రి మాటను పాటించాలి’ అని పలికాడు. భరతుడికి రాముడు ఇలా నచ్చజెప్పి, అయోధ్యకు తిరిగి వెళ్లి పరిపాలించమని ఆదేశించాడు. అంతలోనే రాముడి మాటలు విన్న జాబాలి కలగజేసుకున్నాడు.‘రామా! బాగు బాగు! ఉత్తమ బుద్ధిమంతుడవు, ఆత్మాభిమానవంతుడవు అయిన నీకు, సామాన్య మూఢుని వంటి నిష్ప్రయోజనమైన ఆలోచనలు రాకూడదు. లోకంలో ఎవడైనా ఒక్కడే పుడుతున్నాడు. ఒక్కడే మరణిస్తున్నాడు. అలాంటప్పుడు ఎవడికి ఎవడు బంధువు? ఎవడి నుంచి ఎవడు పొందగలిగేది ఏమిటి? తల్లి అని, తండ్రి అని అనుకుంటూ వారిపై అధికానురాగం పెంచుకునేవాడు ఉన్మత్తుడితో సమానుడు. ఎవరికి ఎవరు ఏమవుతారు? గ్రామాంతరానికి వెళ్లినవాడు ఒకచోట బస చేసి, మర్నాడు ఆ బసను విడిచిపెట్టి ప్రయాణం కొనసాగిస్తాడు. మనుషులకు తల్లి, తండ్రి, ఇల్లు, ధనం అనేవి కూడా తాత్కాలిక బసలాంటివి మాత్రమే! సజ్జనులకు వాటిపై వ్యామోహం ఉండరాదు. తండ్రి వల్ల సంక్రమించిన రాజ్యాన్ని విడిచి, అనేక ప్రమాదాలకు నెలవైన, దుఃఖాలకు దారితీసే ఈ అడవి మార్గాన్ని అవలంబించడం నీకు తగదు. అందువల్ల సర్వసమృద్ధమైన అయోధ్య నగరానికి తిరిగి చేరుకుని, పట్టాభిషేకం చేసుకుని, రాజ్యపాలన స్వీకరించు. పరదేశానికేగిన భర్త రాక కోసం ఎదురుచూసే పతివ్రతలా అయోధ్య నగరం నీకోసం ఎదురు చూస్తోంది. నువ్వు రాజభోగాలను అనుభవిస్తూ, దేవేంద్రుడు స్వర్గంలో విహరించేలా అయోధ్యలో విహరించు. నీకు దశరథుడు ఏమీ కాడు. నువ్వు దశరథుడికి ఏమీ కావు. ఆ రాజెవరో, నువ్వెవరో! అందువల్ల నా మాట విని, నేను చెప్పినట్లు చేయి. ఆ దశరథ మహారాజు తాను ఎక్కడికి వెళ్లాలో, అక్కడకు వెళ్లిపోయాడు. నువ్వు మాత్రం అనవసరంగా కష్టాలను కొనితెచ్చుకుంటున్నావు. కేవలం అర్థం కోసం, ధర్మం కోసం పాటుపడే వారిని చూస్తే నాకు జాలి కలుగుతుంది. అర్థధర్మపరులు బతికినంత కాలం కష్టాలను అనుభవిస్తూ, మరణానంతరం కూడా నాశనం చెందుతారు. పరం అనేది ఏదీ లేదని నిశ్చయించుకుని, ప్రత్యక్షమైన దానినే ఆచరించు. పరోక్షమైన దానిని లెక్కచేయకు. పాపం, నీ సోదరుడు భరతుడు కూడా నిన్ను బతిమాలుకుంటున్నాడు. నా మాటలు ఆలకించి, రాజ్యాన్ని స్వీకరించు’ అని పలికాడు.‘నీ మాటలు పైకి హితవచనాల్లా కనబడినా, నిజానికి అవి అహితమైనవి. పాపాచారవంతుడై, సద్బుద్ధికి దూరమై, మంచికి విరుద్ధంగా సంచరించే మానవుడు ఎవడైనా, అతడు సత్పురుషుల గౌరవం పొందలేడు. అధర్మాన్ని ధర్మవేషంతో ఆచరిస్తూ, దుష్టమార్గాన్ని అనుసరిస్తే, లోకంలో ఎవడైనా గౌరవిస్తాడా? నేను ప్రతిజ్ఞను విడిచి, రాజ్యాన్ని చేపడితే ఎవరికి హితవును ఉపదేశించగలను? అప్పుడు నా మాట వినేవారు ఎవరైనా ఉంటారా? నేనే మార్గం తప్పితే, జనాలు స్వైరసంచారులు అయిపోరా? అతి పురాతనం, శాశ్వతం అయిన రాజధర్మం సత్యస్వరూపమైనది. ఇందులో క్రూరత్వానికి తావులేదు. రాజ్యం సత్యప్రధానం. దేవతలు, ఋషులు కూడా సత్యమే పరమధర్మమని అంగీకరించారు. సత్యమే స్వర్గానికి మూలకారణమని అంటారు. నేను సత్యప్రతిజ్ఞ కలవాడిని. తండ్రి ఎదుట నేను చేసిన శపథం సత్యమైనప్పుడు, ఆ ప్రతిజ్ఞను ఎలా వదిలేయగలను? నువ్వు నాస్తికుడివి. ధర్మచ్యుతుడివి. నీలాంటి వాణ్ణి చేరదీసినందుకు మా తండ్రిని నిందించాలి’ అని రాముడు కోపావేశంతో బదులిచ్చాడు.రాముడి కోపాన్ని గమనించిన వసిష్ఠుడు, ‘రామా! మరణానంతరం మనుషులు కర్మానుసారం స్వర్గ నరకాలకు పోతారని, తిరిగి జన్మిస్తారని జాబాలికి కూడా తెలుసు. నిన్ను తిరిగి అయోధ్యకు రప్పించి, పట్టాభిషిక్తుడిని చేయాలనే ఉద్దేశంతో అలా అన్నాడు’ అని నచ్చజెప్పి, ‘ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడే రాజ్యాధికారం స్వీకరించడం తర తరాల ఆచారం. జ్యేష్ఠుడు ఉండగా, కనిష్ఠుడు రాజు కాడు. కాబట్టి, ఇక్ష్వాకు వంశాచారాన్ని మంటగలపకు. అయోధ్యకు బయలుదేరి, రాజ్యాన్ని స్వీకరించు’ అని చెప్పాడు.రాజగురువు అయిన వసిష్ఠుడు స్వయంగా నచ్చజెప్పినా, రాముడు తన ప్రతిజ్ఞను పక్కనపెట్టి, రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించలేదు. ఇక చేసేదేమీ భరతుడు పరివారంతో కలసి అయోధ్యకు మరలక తప్పని పరిస్థితి ఏర్పడింది.సీతమ్మవారి కోవెలశ్రీలంకలో సీతమ్మవారికి ప్రత్యేక ఆలయం ఉంది. వనవాసంలో ఉండగా సీతను అపహరించిన రావణుడు ఆమెను ఇదేచోట అశోకవనంలో బంధించినట్లు స్థలపురాణ కథనం. ఈ ఆలయ ప్రాంగణంలో పురాతన అశోకవృక్షం కూడా ఉంది. ఆ చెట్టు కిందనే సీతమ్మవారు కూర్చుని ఉండేదని చెబుతారు. ‘సీతా అమ్మన్ కోవిల్’ అనే ఈ ఆలయం శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్లోని నువారా జిల్లా కేంద్రానికి చేరువలో ఉంది.→ సాంఖ్యాయన -
ది న్యూ అడిక్షన్ ఎకానమీ.. మీ మెదడుపై అదృశ్య యుద్ధం!
ప్రపంచం మొత్తం మీ అరచేతిలో ఉందని మీరు సంబరపడుతున్నారా? కానీ వాస్తవానికి ఆ అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోనే మిమ్మల్ని బందీని చేస్తోందని మీకు తెలుసా? సిలికాన్ వ్యాలీలోని టెక్ కంపెనీలు కేవలం సాఫ్ట్వేర్ను మాత్రమే తయారుచేయడం లేదు; అవి మన ప్రమేయం లేకుండానే మనల్ని బానిసలుగా మార్చే ‘డిజిటల్ డ్రగ్స్’ను డిజైన్ చేస్తున్నాయి. దీనినే నిపుణులు ‘అడిక్షన్ ఎకానమీ’ అని పిలుస్తున్నారు. మీ సమయమే వారి పెట్టుబడి!సాధారణంగా ఏదైనా వస్తువు కొనాలంటే మనం డబ్బులు చెల్లిస్తాం. కాని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్స్ మనకు ఉచితంగా సేవలు అందిస్తున్నాయని మనం భ్రమపడుతుంటాం. ఒక వస్తువుకు మీరు డబ్బు చెల్లించడం లేదంటే, అక్కడ మీరే ఒక వస్తువు అని అర్థం. మీ సమయం, శ్రద్ధ, వ్యక్తిగత సమాచారమే వారి పెట్టుబడి. మీరు ఫోన్ చూస్తూ గడుపుతున్న ప్రతి అదనపు నిమిషం ఈ కంపెనీల పాలిట ఒక బంగారు గుడ్డు. మీరు ఎంత ఎక్కువ సమయం స్క్రీన్కు అతుక్కుపోతే, ఆ కంపెనీల షేర్ల విలువ అంతగా పెరుగుతుంది. 2026 ముగిసే నాటికి సోషల్ మీడియా యాడ్ మార్కెట్ సుమారు రూ.26 లక్షల కోట్లకు చేరుకోనుందంటే, మన ఏకాగ్రతను వారు ఎంత ఖరీదైన వస్తువుగా మార్చారో అర్థం చేసుకోవచ్చు. మెటా, గూగుల్ వంటి సంస్థలు రోజుకు వేల కోట్లు సంపాదిస్తున్నాయంటే, దానికి ఇంధనం మన మెదడులోని డోపమైన్, మన చేతిలోని సమయమే!దిగ్భ్రాంతికర గణాంకాలు 2025–26 నివేదికల ప్రకారం ఇటీవలి గణాంకాలు చూస్తుంటే మనం ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉన్నామో అర్థమవుతుంది.→ సగటు భారతీయుడు రోజుకు దాదాపు 6.5 గంటల సమయాన్ని ఇంటర్నెట్పై గడుపుతున్నాడు. ఇందులో మూడు గంటల కంటే ఎక్కువ సమయం కేవలం వినోదం, సోషల్ మీడియాకే పరిమితం. → ఒకప్పుడు మనుషుల్లో పన్నెండు సెకన్లుగా ఉన్న అటెన్షన్ స్పాన్, ఇప్పుడు ఎనిమిది సెకన్లకు పడిపోయింది. ఒక గోల్డెన్ ఫిష్ అటెన్షన్ స్పాన్ తొమ్మిది సెకన్లు. అంటే మనం దానికంటే ఘోరంగా ఉన్నామన్నమాట! → రోజుకు ఐదుగంటల కన్నా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న టీనేజర్లలో ఆత్మహత్య ఆలోచనలు లేదా తీవ్రమైన ఒత్తిడి వచ్చే అవకాశం 35 శాతం పెరిగినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ నివేదిక చెబుతోంది. → ఆన్లైన్ గేమింగ్ అడిక్షన్ వల్ల 2025లో భారతీయ కుటుంబాలు దాదాపు 50 వేల కోట్ల రూపాయలకుపైగా నష్టపోయినట్లు అంచనా.బయటపడటం ఇలా... ఈ ‘అడిక్షన్ ఎకానమీ‘లో మీ విలువైన జీవితాన్ని, సమయాన్ని తాకట్టు పెట్టకండి. ఈ రోజే మీ డిజిటల్ ప్రయాణాన్ని నియంత్రించుకోండి. స్మార్ట్ఫోన్ కంటే మీ స్మార్ట్నెస్ గొప్పదని నిరూపించండి! → మీ ఫోన్ స్క్రీన్ను రంగులు లేకుండా ‘బ్లాక్ అండ్ వైట్’లో మార్చండి. రంగులు లేకపోతే మెదడుకు ఆ దృశ్యాలు ఆకర్షణీయంగా అనిపించవు, తద్వారా ఫోన్ వాడకం 30 శాతం తగ్గుతుంది. → ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. ఇది కంటి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, మెదడుకు చిన్న విరామాన్ని ఇస్తుంది. → డైనింగ్ టేబుల్, బెడ్రూమ్లో ఫోన్ను అనుమతించకండి. ముఖ్యంగా నిద్రపోయే గంట ముందు ఫోన్ను పక్కన పెట్టడం వల్ల ’మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి గాఢ నిద్ర పడుతుంది. → మీ ఫోన్లోని సెట్టింగ్స్లో ’డిజిటల్ వెల్–బీయింగ్’ ఆప్షన్ ద్వారా ప్రతి యాప్కు సమయాన్ని కేటాయించుకోండి. సమయం ముగియగానే యాప్ లాక్ అయ్యేలా చూసుకోండి. → ఖాళీ సమయం దొరకగానే ఫోన్ తీయకండి. ఆ ఖాళీ సమయాన్ని ఆలోచనల కోసం, ప్రకృతిని గమనించడం కోసం కేటాయించండి. సృజనాత్మకత ఎప్పుడూ ఖాళీ మెదడులోనే పుడుతుంది.మెదడును హ్యాక్ చేస్తున్న సైకాలజీటెక్ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు వందల సంఖ్యలో సైకాలజిస్టులను నియమించుకుంటాయి. ఎందుకో తెలుసా? మన మెదడులోని బలహీనతలను కనిపెట్టడానికి. జూదం ఒక వ్యసనం. ఒక లాటరీలో ఎప్పుడు జాక్పాట్ తగులుతుందో తెలియదు. సైకాలజిస్టుల సహాయంతో అలాంటి వ్యసనాన్ని సోషల్ మీడియాలో ‘నోటిఫికేషన్స్’ ద్వారా సృష్టించారు. అలాగే మెదడులోని రివార్డ్ సిస్టమ్ను ప్రేరేపించే డోపమైన్ను రిలీజ్ చేసేలా లైక్స్, కామెంట్స్ పనిచేస్తాయి.నెవెర్ మైండ్ స్మార్ట్ఫోన్ మోసుకొచ్చిన మాయ రోగాల్లో ‘డూమ్ స్క్రోలింగ్’ ఒకటి. ‘డూమ్ స్క్రోలింగ్’ బారినపడిన వారు అదేపనిగా స్మార్ట్ఫోన్లో కలత రేపే వార్తలను స్క్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి వార్తలను చూస్తూ ఆందోళనకు, దిగులుకు లోనవుతారు. అయినా, వారు ‘డూమ్ స్క్రోలింగ్’ను నియంత్రించుకోలేరు.సైకాలజిస్ట్ విశేష్ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ -
ఆనందమే అందం!
ఇంట్లో ఉన్నా, స్టేజ్ మీద ఉన్నా, స్క్రీన్ మీదనైనా ఎప్పుడూ అందంగా కనిపించే నటì నేహా శెట్టి. ఇందుకోసం ఆమె పాటించే ఫ్యాషన్ టిప్స్, బ్యూటీ సీక్రెట్స్ ఇప్పుడు మీ కోసం..లెహంగా.. బ్రాండ్: సితారా కుడిగా ధర రూ. 22,000జడగంటలు.. బ్రాండ్: వైదాన్ జ్యూలరీ ధర రూ. 7,200కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా సరదాగా గడపటం మాత్రం మానేయకూడదు. ఆనందంగా ఉంటేనే అందంగా ఉంటాం. ఇక ఫ్యాషన్లో ప్రయోగాలు చేయటం అంటే ఇష్టం. సడన్గా ఏదైనా ఈవెంట్కు వెళ్లాల్సి వచ్చినా కూడా, త్వరగా స్టయిలింగ్ చేసుకొని, అందంగా కనిపిస్తా. నా దగ్గర ఎప్పుడూ వివిధ రకాల దుస్తులు, జ్యూయల్స్ కలక్షన్స్ ఉంటాయి. – నేహా శెట్టి. -
పంచాంగము (2026–2027)
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, వసంతఋతువు, చైత్రమాసంతేది/మాసం శుభసమయం 19/03 సా.05:00 ∙బ.అమావాస్య గురు ఘ.02:14, ఉ.గం.7:04, చైత్ర శుద్ధ పాడ్యమి ఘ.57:12, తె.గం.5:56. ఉత్తరాభాద్ర రా.తె.గం.5:11. శుక్లం రా.గం.2:20. నాగవం ఉ.గం.7:04. కింస్తుఘ్నం సా.గం.6:30. అహస్సు ఘ.29:52. వర్జ్యం ప.గం.3:09ల 4:43వ. అమృ రా.గం.12:30ల 2:04వ. భు.ఘ.0:32:55. మ.దు.2:56ల 3:44వ. ఉగాది.20/03 ఉ.10:35 శు.విదియ శుక్ర ఘ.55:29, తె.గం.4:21, రేవతి రా.గం.4:19. బ్రహ్మం రా.గం.12:00. బాల సా.గం.5:35. అహస్సు ఘ.29:54. వర్జ్యం ప.గం.4:43ల 6:16వ. అమృ రా.గం.2:00ల 3:30వ. భు.ఘ.00:40:54. ఉ.దు.8:42ల 9:30వ. మ.దు.12:32ల 1:20వ.21/03 ఉ.10:35 శు.తదియ శని ఘ.50:35, రా.గం.2:22, అశ్విని రా.తె.గం.3:03. ఐంద్రం రా.గం.9:15. తైతుల ప.గం.3:21. అహస్సు ఘ.29:56. వర్జ్యం రా.గం.11:15ల 12:45వ. అమృ రా.గం.8:13ల 9:44వ. భు.ఘ.00:48:54. ఉ.దు.6:08ల 7:44వ. సౌభాగ్య గౌరీవ్రతం, శివడోలోత్సవం22/03 ఉ.07:30 శు.చవితి ఆది ఘ.45:12, రా.గం.12:12, భరణి రా.గం.1:37. వైధృతి సా.గం.6:24. వనిక్ ప.గం.1:18. అహస్సు ఘ.29:59. వర్జ్యం ప.గం.12:04ల 1:34వ. అమృ రా.గం.9:07ల 10:37వ. భు.ఘ.00:48:53. సా.దు.4:31ల 5:19వ. గణేశచతుర్థీ (గణేశపూజ)23/03 ప.08:30 శు.పంచమి సోమ ఘ.39:23, రా.గం.9:52, కృత్తిక రా.గం.12:00. విష్కంభం ప.గం.3:23. బవ ప.గం.11:12. అహస్సు ఘ.30:02. వర్జ్యం ప.గం.12:49ల 2:18వ. అమృ రా.తె.గం.9:46ల 11:16వ. భు.ఘ.1:4:51. ప.దు.12:08ల 12:56వ. పునః ప.2:56ల 3:44వ. నాగపూజ, శ్వేతవరాహకల్పం, శ్రీపంచమీ(లక్ష్మీపూజ)24/03 సా.05:50 శు.షష్ఠి మంగళ ఘ.33:24, రా.గం.7:28 రోహిణి రా.గం.10:19. ప్రీతి ప.గం.12:17. కౌలవ ఉ.గం.8:39. అహస్సు ఘ.30:04. వర్జ్యం ప.గం.2:52ల 4:21వ. పునః రా.గం.3:31ల 5:00వ. అమృ రా.గం.7:20ల 8:50. భు.ఘ.1:12:50. ఉ.దు.8:28ల 9:16వ. రా.దు.10:53ల 11:42వ.25/03 ఉ.09:30 శు.సప్తమి బుధ ఘ.27:13, సా.గం.4:59, మృగశిర రా.గం.8:36. ఆయుష్మాన్ ఉ.గం.9:07. సౌభాగ్యం రా.తె.గం.6:00. వనిక్ సా.గం.4:59. అహస్సు ఘ.30:06. వర్జ్యం రా.తె.గం.4:28ల 5:58వ. అమృ ప.గం.12:26ల 1:56వ. భు.ఘ.1:20:49. మ.దు.11:48ల 12:37వ. 26/03 ప.12:10 శు.అష్టమి గురు ఘ.21:37, ప.గం.2:44, ఆర్ద్ర రా.గం.7:05. శోభ రా.గం.3:04. బవ ప.గం.2:44. అహస్సు ఘ.30:08. వర్జ్యం లేదు. అమ ఉ.గం.9:43ల 11:13వ. భు.ఘ.1:28:48. ఉ.దు.10:07ల 10:56వ. మ.దు.2:58ల 3:47వ. భవానీయాత్ర, అశోకరుద్రపూజ27/03 ప.02:30 శు.నవమి శుక్ర ఘ.16:13, ప.గం.12:33, పునర్వసు సా.గం.5:41. అతిగండ రా.గం.12:16. కౌలవ ప.గం.12:33. అహస్సు ఘ.30:10. వర్జ్యం ఉ.గం.6:22ల 7:52వ. పునః రా.1:18ల 2:49వ. అమృ ప.గం.3:26ల 4:56వ. భు.ఘ.1:36:47. ఉ.దు.8:30ల 9:19వ. మ.దు.12:32ల 1:21వ. శ్రీరామనవమి28/03 ప.01:15 శు.దశమి శని ఘ.11:26, ప.గం.10:37, పుష్యమి సా.గం.4:33. సుకర్మ రా.గం.9:41. గరజి ప.గం.10:37. అహస్సు ఘ.30:12. వర్జ్యం తె.గం.4:55ల 6:02వ. అమృ ప.గం.10:27ల 11:58వ. భు.ఘ.1:44:46. ఉ.దు.6:03ల 7:30వ.29/03 సా.06:20 శు.ఏకాదశి ఆది ఘ.7:21, ఉ.గం.8:58, ఆశ్లేష ప.గం.3:43. ధతి రా.గం.7:22. భద్ర ఉ.గం.8:58. అహస్సు ఘ.30:15. శేష వర్జ్యం ఉ.గం.6:02ల 6:28వ. పునః రా.గం.3:30ల 5:04వ. అమృ ప.గం.2:10ల 3:43వ. భు.ఘ.1:52:45. సా.దు.4:30ల 5:18వ. 30/03 సా.06:15 శు.ద్వాదశి సోమ ఘ.4:18, ఉ.గం.7:44, మఘ ప.గం.3:17. శూల రా.గం.5:43. బాలవ ఉ.గం.7:44. అహస్సు ఘ.30:18. వర్జ్యం రా.గం.11:17ల 12:53. అమృ ప.గం.12:55ల 2:29వ. భు.ఘ.2:00:44. ప.దు.12:29ల 1:18వ. పునః ప.2:55ల 3:44వ.31/03 ప.12:00 శు.త్రయోదశి మంగళ ఘ.2:12, ఉ.గం.6:53, పుబ్బ ప.గం.3:17. గండ ప.గం.3:46. తైతుల ఉ.గం.6:53. అహస్సు ఘ.30:20. వర్జ్యం రా.గం.10:38ల 12:16వ. అమృ ఉ.గం.8:52ల 10:28వ. భు.ఘ.2:8:43. ఉ.దు.8:25ల 9:14వ. రా.దు.10:53ల 11:32వ. 01/04 ఉ.07:10 శు.చతుర్దశి బుధ ఘ.1:23, ఉ.గం.6:33, ఉత్తర సా.గం.3:47. వృద్ధి ప.గం.2:55. వనిక్ ఉ.గం.6:33. అహస్సు ఘ.30:22. వర్జ్యం రా.గం.12:56ల 2:36వ. అమృ ఉ.గం.8:26ల 10:04వ. భు.ఘ.2:16:42. మ.దు.11:39ల 12:28. 02/04 ఉ.09:15 ఝ శు.పౌర్ణమి గురు ఘ.2:14, ఉ.గం.6:53, హస్త సా.గం.4:46. ధ్రువం ప.గం.1:41. బవ ఉ.గం.6:53. అహస్సు ఘ.30:24. వర్జ్యం రా.గం.1:15ల 2:57వ. అమృ ఉ.గం.10:31ల 12:11వ. భు.ఘ.2:24:41. ఉ.దు.10:01ల 10:50వ. మ.దు.2:54ల 3:43వ. 03/04 ప.03:00 బహుళ పాడ్యమి శుక్ర ఘ.3:32, ఉ.గం.7:24. చిత్త సా.గం.6:15. వ్యాఘాతం ప.గం.1:17. కౌలవ ఉ.గం.7:24. అహస్సు ఘ.30:27. వర్జ్యం రా.గం.12:18ల 2:02వ. అమృ ప.గం.11:27ల 1:09. భు.ఘ.2:32:40. ఉ.దు.8:23ల 9:12వ. మ.దు.12:27ల 1:16వ.04/04 ఉ.11:00 బ.విదియ శని ఘ.6:45, ఉ.గం.8:40. స్వాతి రా.గం.8:10. హర్షణం ప.గం.1:11. గరజి ఉ.గం.8:40. అహస్సు ఘ.30:30. వర్జ్యం రా.గం.2:18ల 4:03వ. అమృ ఉ.గం.10:40ల 12:24వ. భు.ఘ.2:40:39. ఉ.దు.5:58ల 7:36వ.05/04 ఉ.9:30 బ.తదియ ఆది ఘ.10:24, ప.గం.10:07. విశాఖ రా.గం.10:26. వజ్రం ప.గం.1:25. విష్టి ప.గం.10:07. అహస్సు ఘ.30:32. వర్జ్యం రా.గం.2:52ల 4:38వ. అమృ ప.గం.12:48ల 2:33వ. భు.ఘ.2:48:38. సా.దు.4:32ల 5:21వ. సంకటహర చతుర్థి06/04 సా.07:00 బ.చవితి సోమ ఘ.15:12, ప.గం.12:01. అనురాధ రా.గం.12:58. సిద్ధి ప.గం.1:51. బాలవ ప.గం.12:01. అహస్సు ఘ.30:34. వర్జ్యం లేదు. అమృ ప.గం.1:28ల 3:14వ. భు.ఘ.2:56:37. ప.దు.12:26ల 1:16వ. పునః 2:54ల 3:44వ.07/04 సా.05:15 బ.పంచమి మంగళ ఘ.20:24, ప.గం.2:05. జ్యేష్ఠ రా.గం.3:37. వ్యతీపాత ప.గం.2:27. తైతుల ప.గం.2:05. అహస్సు ఘ.30:37. వర్జ్యం ఉ.గం.7:11ల 8:57వ. అమృ సా.గం.5:50ల 7:36వ. భు.ఘ.3:4:36. ఉ.దు.8:21ల 9:11వ. రా.దు.10:51ల 11:41వ. మత్స్యజయంతీ08/04 ఉ.07:00 బ.షష్ఠి బుధ ఘ.25:37, ప.గం.4:09. మూల పూర్తి. వరీయాన్ ప.గం.3:03. వనిక్ ప.గం.4:09. అహస్సు ఘ.30:40. వర్జ్యం ప.గం.12:26ల 2:12వ. పునః తె.గం.5:20ల 5:53వ. అమృ రా.గం.11:03ల 12:49. భు.ఘ.3:12:35. మ.దు.11:37ల 12:27వ. 09/04 సా.05:00 బ.సప్తమి గురు ఘ.30:23, సా.గం.6:02. మూల ఉ.గం.6:06. పరిఘ ప.గం.3:30. బవ సా.గం.6:02. అహస్సు ఘ.30:42. వర్జ్యం శేషం ఉ.గం.5:53ల 6:06వ. పునః సా.3:38ల 5:23వ. అమృ రా.తె.గం.3:09ల 4:54వ. భు.ఘ.3:20:34. ఉ.దు.9:57ల 10:47వ. మ.దు.2:53ల 3:43వ.10/04 రా.08:30 బ.అష్టమి శుక్ర ఘ.34:28, రా.గం.7:39. పూర్వాషాఢ ఉ.గం.8:24. శివం ప.గం.3:44. బాలవ ఉ.గం.6:50. అహస్సు ఘ.30:45. వర్జ్యం సా.గం.5:03ల 6:47వ. అమృ రా.తె.గం.3:25ల 5:09వ. భు.ఘ.3:28:33. ఉ.దు.8:18ల 9:08వ. మ.దు.12:25ల 1:15వ.11/04 ప.11:15 బ.నవమి శని ఘ.37:22, రా.గం.8:48. ఉత్తరాషాఢ ఉ.గం.10:19. సిద్ధం సా.గం.3:43. తైతుల ఉ.గం.8:13. అహస్సు ఘ.30:48. వర్జ్యం ప.గం.2:34ల 3:16వ. అమృ రా.గం.12:46ల 2:28వ. భు.ఘ.3:36:32. ఉ.దు.5:50ల 7:30వ.12/04 ప.11:15 బ.దశమి ఆది ఘ.39:04, రా.గం.9:28. శ్రవణం ప.గం.11:48. సాధ్యం ప.గం.3:14. వనిక్ ఉ.గం.9:07. అహస్సు ఘ.30:51. వర్జ్యం ప.గం.3:58ల 5:38వ. అమృ రా.గం.1:59ల 3:39వ. భు.ఘ.3:44:31. సా.దు.4:31ల 5:21వ.13/04 సా.07:00 బ.ఏకాదశి సోమ ఘ.39:35, రా.గం.9:39. ధనిష్ఠ ప.గం.12:49. శుభం ప.గం.2:26. విష్టి ఉ.గం.9:33. అహస్సు ఘ.30:54. వర్జ్యం రా.గం.8:09ల 9:47వ. భు.ఘ.3:52:30. ప.దు.12:25ల 1:15వ. పునః 12:53ల 3:43వ. 14/04 సా.05:15 బ.ద్వాదశి మంగళ ఘ.38:49, రా.గం.9:21. శతభిషం ప.గం.1:19. శుక్లం ప.గం.1:13. కౌలవ ఉ.గం.9:30. అహస్సు ఘ.30:56. వర్జ్యం రా.గం.7:43ల 9:19వ. అమృ ఉ.గం.5:58ల 7:36వ. భు.ఘ.4:0:29. పు.భు.4:2. ఉ.దు.8:18ల 9:07వ. రా.దు.10:49ల 11:39వ. అశ్వి 1 రవిః ప.11:49 మేష సంక్రమణం15/04 సా.04:30 బ.త్రయోదశి బుధ ఘ.36:41, రా.గం.8:28. పూర్వాభాద్ర ప.గం.1:19. బ్రహ్మం ప.గం.11:35. గరజి ఉ.గం.8:54. అహస్సు ఘ.30:58. వర్జ్యం రా.గం.10:46ల 12:20వ. అమృ ఉ.గం.5:48ల 7:20వ. భు.ఘ.00:6:22. మ.దు.11:35ల 12:25వ. వరాహజయంతీ, మాసశివరాత్రి నిశీధి వారికి16/04 సా.05:10 బ.చతుర్దశి గురు ఘ.33:37, రా.గం.7:14. ఉత్తరాభాద్ర ప.గం.12:55. ఐంద్రం ప.గం.11:37. విష్టి ఉ.గం.7:51. అహస్సు ఘ.31:00. వర్జ్యం రా.గం.12:30ల 2:02వ. అమృ ఉ.గం. 8:11ల 9:45వ. భు.ఘ.0:14:52. ఉ.దు.9:55ల 10:45వ. మ.దు.2:53ల 3:43వ. మాస శివరాత్రి (ధర్మశాం) ప్రదోషం వారికి, శివసన్నిధిస్నానం17/04 రా.08:30 ∙బ.అమావాస్య శుక్ర ఘ.28:28, సా.గం.5:21. రేవతి ప.గం.12:05. వైధతి ఉ.7:19. విష్కంభం తె.గం.4:49. నాగవం సా.గం.5:21. అహస్సు ఘ.31:3. వర్జ్యం లేదు. ఉ.గం.9:46ల 11:19. పునః అమృ తె.గం.4:06ల 5:38వ. భు.ఘ.000:23:22. ఉ.దు.8:15ల 9:05వ. మ.దు.12:24ల 1:14వ. కూర్మకల్పం, తర్పణాలకు అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, వసంతఋతువు, వైశాఖమాసం18/04 ప.11:00 శుద్ధ పాడ్యమి శని ఘ.24:39, సా.గం.3:38. అశ్విని ప.గం.10:58. ప్రీతి రా.గం.2:01. బవ సా.గం.3:38. అహస్సు ఘ.31:06. వర్జ్యం ఉ.గం.7:09ల 8:40. పునః రా.7:56ల 9:26వ. అమృ తె.గం.4:55ల 5:46వ. భు.ఘ.00:31:52. ఉ.దు.5:46ల 7:26వ. చంద్రదర్శనం (నెలపొడుపు), ధర్మఘటాదిదానం19/04 ఉ.09:30 శు.విదియ ఆది ఘ.19:15, ప.గం.1:27. భరణి ఉ.గం.9:23. ఆయుష్మాన్ రా.గం.11:01. కౌలవ ప.గం.1:27. అహస్సు ఘ.31:8. వర్జ్యం రా.గం.8:43ల 10:13వ. అమృ శేషం ఉ.గం.5:45ల 6:25వ. భు.ఘ.00:40:22. సా.దు.4:35ల 5:25వ.20/04 సా.07:00 శు.తదియ సోమ ఘ.13:25, ప.గం.11:06. కృత్తిక ఉ.గం.8:00. సౌభాగ్యం రా.గం.7:57. గరజి ప.గం.11:06. అహస్సు ఘ.31:10. వర్జ్యం రా.గం.10:53ల 12:22. అమృ ఉ.గం.5:51ల 7:21వ. పునరమ రా.తె.3:21ల 4:50వ. భు.ఘ.00:48:52. ప.దు.12:24ల 1:14వ. పునః ప.2:53ల 3:43వ. అక్షయతృతీయ, గౌరీపూజ21/04 ఉ.10:30 శు.చవితి మంగళ ఘ.7:22, ఉ.గం.8:41. రోహిణి ఉ.గం.6:22. మృగశిర తె.గం.4:40. శోభ సా.గం.4:52. భద్ర ఉ.గం.8:41. అహస్సు ఘ.31:12. వర్జ్యం ప.గం.11:34ల 1:03వ. అమృ రా.గం.8:29ల 9:58వ. భు.ఘ.00:57:22. ఉ.దు.8:13ల 9:03వ. రా.దు.10:49ల 11:39వ. శంకర జయంతి, నాగచతుర్థీ22/04 ఉ.09:45 శు.పంచమి బుధ ఘ.01:17, ఉ.గం.6:14. షష్ఠి ఘ.54:00, తె.గం.3:50. ఆర్ద్ర రా.తె.గం.3:02. అతిగండ ప.గం.1:47. బాలవ ఉ.గం.6:14. కౌలవ సా.గం.5:02. అహస్సు ఘ.31:14. వర్జ్యం ప.గం.12:29ల 1:58వ. అమృ సా.గం.5:42ల 7:11వ. భు.ఘ.1:5:52. మ.దు.11:43ల 12:33వ.23/04 సా.05:00 శు.సప్తమి గురు ఘ.49:50, రా.గం.1:39. పునర్వసు రా.గం.1:37. సుకర్మ ప.గం.10:50. గరజి సా.గం.4:38. అహస్సు ఘ.31:16. వర్జ్యం ప.గం.2:20ల 3:50వ. అమృ రా.గం.11:22ల 12:52వ. భు.ఘ.1:14:22. ఉ.దు.9:52ల 10:42వ. మ.దు.2:53ల 3:43వ. విద్యారణ్య జయంతి, గంగోత్పత్తి 24/04 ప.02:15 శు.అష్టమి శుక్ర ఘ.44:56, రా.గం.11:41. పుష్యమి రా.గం.12:23. ధృతి ఉ.గం.7:59. శూల తె.గం.5:15. విష్టి ప.గం.12:39. అహస్సు ఘ.31:18. వర్జ్యం ప.గం.9:12ల 10:42వ. అమృ రా.గం.6:19ల 7:49వ. భు.ఘ.1:22:52. ఉ.దు.8:12ల 9:02వ. మ.దు.12:23ల 1:13వ. అపరాజితాదేవీపూజ25/04 ప.11:00 శు.నవమి శని ఘ.40:56, రా.గం.10:03. ఆశ్లేష రా.గం.11:30. గండ రా.గం.2:55. బాలవ ప.గం.10:51. అహస్సు ఘ.31:20. వర్జ్యం ప.గం.12:43ల 2:16వ. అమృ రా.గం.9:58ల 11:30వ. భు.ఘ.1:31:22. ఉ.దు.5:41ల 7:31వ. 26/04 ప.11:30 శు.దశమి ఆది ఘ.37:39, రా.గం.8:45. మఘ రా.గం.10:57. వృద్ధి రా.గం.1:14. తైతుల ఉ.గం.9:24. అహస్సు ఘ.31:22. వర్జ్యం ప.గం.11:14ల 12:48వ. అమృ రా.గం.8:36ల 10:10వ. భు.ఘ.1:39:52. సా.దు.4:34ల 5:24వ. 27/04 సా.07:00 శు.ఏకాదశి సోమ ఘ.35:37, రా.గం.7:55. పుబ్బ రా.గం.10:53. ధ్రువం రా.గం.11:23. వనిక్ ఉ.గం.8:19. అహస్సు ఘ.31:25. వర్జ్యం ఉ.గం.6:56ల 8:32వ. అమృ సా.గం.4:32ల 6:08వ. భు.ఘ.1:48:22. ప.దు.12:23ల 1:13వ. పునః ప.2:54ల 3:44వ. అన్నవరం సత్యదేవ కళ్యాణం, మతత్రయ (మోహినీ) ఏకాదశి28/04 సా.05:10 శు.ద్వాదశి మంగళ ఘ.34:37, రా.గం.7:31. ఉత్తర రా.గం.11:14. వ్యాఘాతం రా.గం.9:45. బవ ఉ.గం.7:43. అహస్సు ఘ.31:28. వర్జ్యం ఉ.గం.6:11ల 7:48వ. అమృ ప.గం.3:56ల 5:33వ. భు.ఘ.1:56:52. ఉ.దు.8:10ల 09:00వ. రా.దు.10:49ల 11:30వ. పరశురామద్వాదశీ29/04 సా.04:20 శు.త్రయోదశి బుధ ఘ.35:02, రా.గం.7:40. హస్త రా.గం.12:08. హర్షణం రా.గం.9:01. కౌలవ ఉ.గం.7:35. అహస్సు ఘ.31:30. వర్జ్యం ఉ.గం.7:56ల 9:36వ. అమృ సా.గం.5:54ల 7:34వ. భు.ఘ.2:5:22. మ.దు.11:31ల 12:21వ.30/04 సా.05:00 శు.చతుర్దశి గురు ఘ.36:35, రా.గం.8:16. చిత్త రా.గం.1:28. వజ్రం రా.గం.8:30. గరజి ఉ.గం.8:03. అహస్సు ఘ.31:32. వర్జ్యం ఉ.గం.8:34ల 10:15వ. అమృ సా.గం.6:42ల 8:23వ. భు.ఘ.2:13:52. ఉ.దు.9:51ల 10:41వ. మ.దు.2:54ల 3:44వ. 01/05 ప.02:15 ఝ శు.పౌర్ణమి శుక్ర ఘ.39:28, రా.గం.9:25. స్వాతి రా.గం.3:20. సిద్ధి రా.గం.8:25. విష్టి ఉ.గం.8:50. అహస్సు ఘ.31:34. వర్జ్యం ఉ.గం.7:30ల 9:14వ. అమృ సా.గం.5:51ల 7:35వ. భు.ఘ.2:22:22. ఉ.దు.8:10ల 9:00వ. మ.దు.12:23ల 1:13వ. 02/05 సా.06:30 బహుళ పాడ్యమి శని ఘ.43:18, రా.గం.10:56. విశాఖ రా.తె.గం.5:32. వ్యతీపాత రా.గం.8:47. బాలవ ఉ.గం.10:10. అహస్సు ఘ.31:36. వర్జ్యం ప.గం.9:26ల 11:11వ. అమృ రా.గం.7:55ల 9:40వ. భు.ఘ.2:30:52. ఉ.దు.5:37ల 7:18వ.03/05 రా.07:00 బ.విదియ ఆది ఘ.48:01, రా.గం.12:49. అనురాధ పూర్తి. వరీయాన్ రా.గం.9:04. తైతుల ప.గం.11:53. అహస్సు ఘ.31:38. వర్జ్యం ఉ.గం.9:57ల 11:43వ. అమృ రా.గం.8:34ల 10:20వ. భు.ఘ.2:39:22. సా.దు.4:35ల 5:25వ.04/05 రా.07:00 బ.తదియ సోమ ఘ.53:06, రా.గం.2:50. అనురాధ ఉ.గం.8:04. పరిఘ రా.గం.9:38. వనిక్ ప.గం.8:17. అహస్సు ఘ.31:40. వర్జ్యం ప.గం.2:16ల 4:02వ. అమృ రా.గం.12:55ల 2:41వ. భు.ఘ.2:47:52. ప.దు.12:22ల 1:12వ. పునః 2:54ల 3:44వ. 05/05 ఉ.10:30 బ.చవితి మంగళ ఘ.58:17, తె.గం.4:55. జ్యేష్ఠ ప.గం.10:41. శివం రా.గం.10:24. బవ ప.గం.3:52. అహస్సు ఘ.31:42. వర్జ్యం రా.గం.7:33ల 9:19వ. భు.ఘ.2:56:22. ఉ.దు.8:08ల 8:58వ. రా.దు.10:49ల 11:39వ. సంకటహర చతుర్థి06/05 ఉ.09:30 బ.పంచమి బుధ పూర్తి. మూల ప.గం.1:15. సిద్ధం రా.గం.10:51. కౌలవ రా.గం.6:31. అహస్సు ఘ.31:44. వర్జ్యం ప.గం.11:29ల 1:15వ. పునః రా.గం.11:48ల 1:34వ. అమృ ఉ.గం.6:10ల 7:56వ. భు.ఘ.3:4:52. మ.దు.11:32ల 12:22వ.07/05 సా.05:00 బ.పంచమి గురు ఘ.2:55, ఉ.గం.6:45. పూర్వాషాఢ ప.గం.3:37. సాధ్యం రా.గం.11:11. తైతుల ఉ.గం.6:45. అహస్సు ఘ.31:46. వర్జ్యం రా.గం.12:18ల 2:02వ. అమృ ఉ.గం.10:21ల 12:07వ. భు.ఘ.3:13:22. ఉ.దు.9:49ల 10:39వ. మ.దు.2:55ల 3:45వ.08/05 సా.05:40 బ.షష్ఠి శుక్ర ఘ.6:49, ఉ.గం.8:18. ఉత్తరాషాఢ సా.గం.5:39. శుభం రా.గం.11:15. వనిక్ ఉ.గం.8:18. అహస్సు ఘ.31:48. వర్జ్యం రా.గం.9:55ల 11:37వ. అమృ ప.గం.10:42ల 12:26వ. భు.ఘ.3:21:52. ఉ.దు.8:07ల 8:57వ. మ.దు.12:21ల 1:11వ.09/05 ప.11:30 బ.సప్తమి శని ఘ.9:43, ఉ.గం.9:27. శ్రవణం రా.గం.7:16. శుక్లం రా.గం.10:56. బవ ఉ.గం.9:27. అహస్సు ఘ.31:50. వర్జ్యం రా.గం.11:27ల 1:08వ. అమృ ఉ.గం.8:11ల 9:53వ. భు.ఘ.3:30:22. ఉ.దు.5:34ల 7:15వ.10/05 ప.03:00 బ.అష్టమి ఆది ఘ.11:22, ఉ.గం.10:07. ధనిష్ఠ రా.గం.8:24. బ్రహ్మం రా.గం.10:16. కౌలవ ఉ.గం.10:07. అహస్సు ఘ.31:52. వర్జ్యం రా.తె.గం.3:45ల 5:23వ. అమృ ఉ.గం.9:30ల 11:11వ. భు.ఘ.3:38:52. దు.4:36ల 5:26వ. 11/05 రా.07:00 బ.నవమి సోమ ఘ.11:48, ఉ.గం.10:14. శతభిషం రా.గం.9:00. ఐంద్రం రా.గం.9:08. గరజి ఉ.గం.10:14. అహస్సు ఘ.31:54. వర్జ్యం రా.గం.3:26ల 5:03వ. అమృ ప.గం.1:37ల 3:15వ. భు.ఘ.3:47:22. ప.దు.12:22ల 1:13వ. పునః 2:55ల 3:46. చణ్డికాదేవీపూజ, హనుమజ్జయంతీ మధ్యాహ్న వ్యాప్తి ప్రధానం12/05 ప.12:00 బ.దశమి మంగళ ఘ.11:16, ప.గం.10:03. పూర్వాభాద్ర రా.గం.9:09. వైధృతి రా.గం.7:39. విష్టి ఉ.గం.10:03. అహస్సు ఘ.31:56. వర్జ్యం లేదు. అమృ ప.గం.1:06ల 2:43వ. భు.ఘ.3:55:52. ఉ.దు.8:06ల 8:57వ. రా.దు.10:49ల 11:40వ.13/05 ప.04:15 బ.ఏకాదశి బుధ ఘ.8:52, ఉ.గం.9:05. ఉత్తరాభాద్ర రా.గం.8:48. విష్కంభం సా.గం.5:45. బాలవ ఉ.గం.9:05. అహస్సు ఘ.31:58. వర్జ్యం ఉ.గం.6:36ల 8:11వ. అమృ సా.గం.4:04ల 5:39వ. భు.ఘ.4:4:22. మ.దు.11:31ల 12:22వ. 14/05 సా.06:00 బ.ద్వాదశి గురు ఘ.5:40, ఉ.గం.7:48. రేవతి రా.గం.8:05. ప్రీతి సా.గ.3:34. తైతుల ఉ.గం.7:48. అహస్సు ఘ.32:00. వర్జ్యం ఉ.గం.8:26ల 9:59వ. అమృ సా.గం.5:48ల 7:18వ. భు.ఘ.4:12:52. ఉ.దు.09:48ల 10:39వ. మ.దు.2:55ల 3:46వ.15/05 రా.09:00 బ.త్రయోదశి శుక్ర ఘ.1:32, ఉ.గం.6:09, చతుర్దశి ఘ.55:28, తె.గం.4:21. అశ్విని రా.గం.7:03. ఆయుష్మాన్ ప.గం.1:06. వనిక్ ఉ.గం.6:09. విష్టి సా.గం.5:15. అహస్సు ఘ.32:00. వర్జ్యం ప.గం.2:51ల 4:23వ. పునః తె.గం.4:06ల 5:36వ. అమృ ప.గం.12:09ల 1:41వ. భు.ఘ.4:21:22. పు.భు.4:23. ఉ.దు..9:05ల 8:56వ. మ.దు.12:21ల 1:12వ. కత్తి 2 వషభే రవిః ఉ.9:59 మాసశివరాత్రి, వృషభ సంక్రమణం16/05 ప.02:15 ∙బ.అమావాస్య శని ఘ.51:53, రా.గం.2:17. భరణి సా.గం.5:41. సౌభాగ్యం ప.గం.10:24. చతుష్పాత్ సా.గం.3:19. అహస్సు ఘ.32:02. వర్జ్యం రా.తె.గం.4:56ల 5:32వ. అమృ ప.గం.1:09ల 2:39వ. భు.ఘ.00:07:50. ఉ.దు.5:32ల 7:14వ. తర్పణాలకు అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం,17/05 సా.03:00 శుద్ధ పాడ్యమి ఆది ఘ.45:22, రా.గం.11:41. కృత్తిక సా.గం.4:10. శోభ ఉ.గం.7:30. అతిగండ తె.గం.4:31. కింస్తుఘ్నం ప.గం.12:59. అహస్సు ఘ.32:04. వర్జ్యం శేషం ఉ.గం.5:32ల 6:26వ. అమృ ప.గం.1:56ల 3:26వ. భు.ఘ.00:17:27. సా.దు.4:39ల 5:30వ. యాగకాలం18/05 రా.07:00 శు.విదియ సోమ ఘ.39:13, రా.గం.9:12. రోహిణి ప.గం.2:31. సుకర్మ రా.గం.1:25. బాలవ ప.గం.10:26. అహస్సు ఘ.32:6. వర్జ్యం ఉ.గం.7:04ల 8:34వ. పునః రా.7:45ల 9:14వ. అమృ ప.గం.11:33ల 1:02వ. పునరమ తె.గం.4:41ల 5:31వ. భు.ఘ.0:28:04. ప.దు.12:21ల 1:12వ. పునః ప.2:56ల 3:47వ. చంద్రదర్శనం 19/05 సా.05:15 శు.తదియ మంగళ ఘ.33:04, రా.గం.6:45. మృగశిర ప.12:51. ధృతి రా.గం.10:20. తైతుల ఉ.గం.7:58. అహస్సు ఘ.32:08. వర్జ్యం రా.గం.8:41ల 10:10వ. అమృ శేషం ఉ.గం.5:31ల 6:10వ. పునరమ రా.1:55ల 3:25వ. భు.ఘ.0:37:41. దు.8:04ల 8:55వ. రా.దు.10:49ల 11:44వ.20/05 సా.04:20 శు.చవితి బుధ ఘ.27:10, సా.గం.4:22. ఆర్ద్ర ప.గం.11:14. శూల రా.గం.7:21. భద్ర సా.గం.4:22. అహస్సు ఘ.32:10. వర్జ్యం రా.గం.10:30ల 12:00వ. భు.ఘ.0:47:18. మ.దు.11:31ల 12:22వ.21/05 రా.08:30 శు.పంచమి గురు ఘ.21:36, ప.గం.2:08. పునర్వసు ఉ.గం.9:45. గండ సా.గం.4:30. బాలవ ప.గం.2:08. అహస్సు ఘ.32:10. వర్జ్యం సా.గం.5:20ల 6:50వ. అమృ ఉ.గం.7:30ల 9:00వ. పునరమ రా.2:27ల 3:57వ. భు.ఘ.0:56:55. ఉ.దు.9:48ల 10:39వ. మ.దు.2:57ల 3:48వ.22/05 ఉ.07:15 శు.షష్ఠి శుక్ర ఘ.16:42, ప.గం.12:11. పుష్యమి ఉ.గం.8:31. వృద్ధి ప.గం.1:53. తైతుల ప.గం.12:11. అహస్సు ఘ.32:12. వర్జ్యం రా.గం.8:48ల 10:20వ. భు.ఘ.1:6:32. ఉ.దు.8:05ల 8:56వ. మ.దు.12:22ల 1:13వ.23/05 ప.11:15 శు.సప్తమి శని ఘ.12:28, ప.గం.10:29. ఆశ్లేష ఉ.గం.7:32. ధ్రువం ప.గం.11:18. వనిక్ ప.గం.10:29. అహస్సు ఘ.32:14. వర్జ్యం రా.గం.7:14ల 8:48వ. అమృ ఉ.గం.6:00ల 7:32వ. పునరమ తె.4:34ల 5:30వ. భు.ఘ.1:16:9. ఉ.దు.5:30ల 7:13వ.24/05 ప.11:15 శు.అష్టమి ఆది ఘ.9:09, ఉ.గం.9:10. మఘ ఉ.గం.6:55. వ్యాఘాతం ఉ.గం.9:42. బవ ప.గం.9:10. అహస్సు ఘ.32:14. వర్జ్యం ప.గం.2:51ల 4:26వ. అమృ శేషం ఉ.గం.5:30ల 6:08వ. పునరమ రా.గం.12:22ల 1:57వ. భు.ఘ.1:25:46. సా.దు.4:41ల 5:32వ. 25/05 ప.11:15 శు.నవమి సోమ ఘ.6:56, ఉ.గం.8:16. పుబ్బ ఉ.గం.6:44. హర్షణం ఉ.గం.7:38. కౌలవ ఉ.గం.8:16. అహస్సు ఘ.32:16. వర్జ్యం ప.గం.2:00ల 3:37వ. అమృ రా.గం.11:43ల 1:20వ. భు.ఘ.1:35:23. ప.దు.12:22ల 1:14వ. పునః 2:57ల 3:49వ.26/05 సా.06:00 శు.దశమి మంగళ ఘ.5:53, ఉ.గం.7:50. ఉత్తర ఉ.గం.6:59. వజ్రం ఉ.గం.5:36. సిద్ధం తె.గం.4:34. గరజి ఉ.గం.7:50. అహస్సు ఘ.32:18. వర్జ్యం ప.గం.10:37ల 12:16వ. అమృ రా.గం.1:31ల 3:10వ. భు.ఘ.1:45:00. ఉ.దు.8:04ల 8:56వ. రా.దు.10:50ల 11:42వ.27/05 ఉ.07:00 శు.ఏకాదశి బుధ ఘ.5:54, ఉ.గం.7:51. హస్త ఉ.గం.7:41. వ్యతీపాత తె.గం.4:31. భద్ర ఉ.గం.7:51. అహస్సు ఘ.32:18. వర్జ్యం సా.గం.4:08ల 5:49వ. అమృ రా.గం.2:13ల 3:54. భు.ఘ.1:54:37. మ.దు.11:31ల 12:43వ. 28/05 సా.06:00 శు.ద్వాదశి గురు ఘ.7:35, ఉ.గం.8:31. చిత్త ఉ.గం.9:02. వరీయాన్ తె.గం.4:29. బాలవ ఉ.గం.8:31. అహస్సు ఘ.32:20. వర్జ్యం ప.గం.3:02ల 4:45వ. అమృ రా.గం.1:20ల 3:03వ. భు.ఘ.2:4:14. ఉ.దు.9:48ల 10:40వ. మ.దు.2:59ల 3:51వ.29/05 ప.02:30 శు.త్రయోదశి శుక్ర ఘ.10:17, ఉ.గం.9:36. స్వాతి ఉ.గం.10:46. పరిఘ తె.గం.4:37. తైతుల ఉ.గం.9:36. అహస్సు ఘ.32:22. వర్జ్యం సా.గం.4:52ల 6:36. అమృ రా.గం.3:18ల 5:02. భు.ఘ.2:13:51. ఉ.దు.8:04ల 8:56వ. మ.దు.12:23ల 1:15వ.30/05 రా.08:00 శు.చతుర్దశి శని ఘ.14:02, ప.గం.11:06. విశాఖ ప.గం.12:55. శివం తె.గం.5:07. వనిక్ ప.గం.11:06. అహస్సు ఘ.32:22. వర్జ్యం సా.గం.5:19ల 7:05వ. అమృ తె.గం.3:53ల 5:28వ. భు.ఘ.2:23:28. ఉ.దు.5:29ల 7:13వ. 31/05 రా.06:15 ఝ శు.పౌర్ణమి ఆది ఘ.18:31, ప.గం.12:52. అనురాధ ప.గం.3:19. సిద్ధం పూర్తి. బవ ప.గం.12:52. అహస్సు ఘ.32:24. వర్జ్యం రా.గం.9:32ల 11:18వ. అమృ శేషం ఉ.గం.5:28ల 5:39వ. భు.ఘ.2:33:5. సా.దు.4:43ల 5:35వ.01/06 సా.07:00 బహుళ పాడ్యమి సోమ ఘ.23:31, ప.గం.2:52. జ్యేష్ఠ సా.గం.5:56. సిద్ధం ఉ.గం.5:45. కౌలవ ప.గం.2:52. అహస్సు ఘ.32:24. వర్జ్యం రా.గం.2:48ల 4:34. అమృ ఉ.గం.8:10ల 9:51. భు.ఘ.2:42:42. ప.దు.12:27ల 1:15వ. పునః 2:59ల 3:51వ. యాగకాలం02/06 సా.06:00 బ.విదియ మంగళ ఘ.28:39, సా.గం.4:56. మూల రా.గం.8:33. సాధ్యం ఉ.గం.6:24. గరజి సా.గం.4:56. అహస్సు ఘ.32:26. వర్జ్యం రా.గం.6:47ల 8:33వ. పునః రా.తె.3:08ల 4:54వ. అమృ ప.గం.1:27ల 3:13వ. భు.ఘ.2:52:19. ఉ.దు.8:04ల 8:56వ. రా.దు.10:51ల 11:43వ.03/06 సా.04:00 బ.తదియ బుధ ఘ.33:14, రా.గం.6:46. పూర్వాషాఢ రా.గం.10:59. శుభం ఉ.గం.7:00. వనిక్ ఉ.గం.5:50. అహస్సు ఘ.32:26. వర్జ్యం లేదు. అమృ ప.గం.11:42ల 1:28వ. భు.ఘ.3:1:56. మ.దు.11:32ల 12:24వ.04/06 సా.06:00 బ.చవితి గురు ఘ.37:08, రా.గం.8:19. ఉత్తరాషాఢ రా.గం.1:07. శుక్లం ఉ.గం.7:26. బాలవ ఉ.గం.7:32. అహస్సు ఘ.32:28. వర్జ్యం ఉ.గం.7:42ల 9:26వ. అమృ సా.గం.6:09ల 7:55వ. భు.ఘ.3:11:33. ఉ.దు.9:48ల 10:40వ. మ.దు.2:59ల 3:51వ. సంకటహర చతుర్థి05/06 సా.05:30 బ.పంచమి శుక్ర ఘ.40:01, రా.గం.9:28. శ్రవణం రా.గం.2:51. బ్రహ్మం ఉ.గం.7:34. కౌలవ ఉ.గం.8:54. అహస్సు ఘ.32:28. వర్జ్యం ఉ.గం.5:24ల 7:07వ. అమృ ప.గం.3:42ల 5:25వ. భు.ఘ.3:21:10. ఉ.దు.8:04ల 8:56వ. మ.దు.12:24ల 1:16వ.06/06 సా.06:00 బ.షష్ఠి శని ఘ.41:46, రా.గం.10:10. ధనిష్ఠ రా.తె.గం.4:09. ఐంద్రం ఉ.గం.7:22. గరజి ఉ.గం.9:49. అహస్సు ఘ.32:30. వర్జ్యం ఉ.గం.7:04ల 8:45వ. అమృ సా.గం.5:11ల 6:52వ. భు.ఘ.3:30:47. ఉ.దు.5:28ల 7:12వ.07/06 సా.06:00 బ.సప్తమి ఆది ఘ.42:06, రా.గం.10:18. శతభిషం రా.తె.గం.4:51. వైధృతి ఉ.గం.6:48. విష్టి ఉ.గం.10:14. అహస్సు ఘ.32:30. వర్జ్యం ప.గం.11:34ల 1:12వ. అమృ రా.గం.9:26ల 11:05వ. భు.ఘ.3:40:24. సా.దు.4:44ల 5:36వ.08/06 సా.06:00 బ.అష్టమి సోమ ఘ.41:17, రా.గం.9:59. పూర్వాభాద్ర తె.గం.5:08. విష్కంభం ఉ.గం.5:48. ప్రీతి తె.గం.4:41. బాలవ ఉ.గం.10:09. అహస్సు ఘ.32:30. వర్జ్యం ప.గం.11:08ల 12:45వ. అమృ రా.గం.9:02ల 10:39వ. భు.ఘ.3:50:1. ప.దు.12:24ల 1:16వ. పునః 3:01ల 3:53వ.09/06 సా.05:00 బ.నవమి మంగళ ఘ.39:8, రా.గం.9:07. ఉత్తరాభాద్ర తె.గం.4:51. ఆయుష్మాన్ రా.గం.2:41. తైతుల ఉ.గం.9:33. అహస్సు ఘ.32:32. వర్జ్యం ప.గం.2:37ల 4:12వ. అమృ రా.గం.12:06ల 1:41వ. భు.ఘ.3:59:38. ఉ.దు.8:04ల 8:56వ. రా.దు.10:53ల 11:45వ.10/06 సా.07:00 బ.దశమి బుధ ఘ.36:00, రా.గం.7:52. రేవతి తె.గం.4:14. సౌభాగ్యం రా.గం.12:34. వనిక్ ఉ.గం.8:30. అహస్సు ఘ.32:32. వర్జ్యం సా.గం.4:33ల 6:07వ. అమృ రా.గం.1:53ల 3:28వ. భు.ఘ.4:9:15. మ.దు.11:33ల 12:25వ.11/06 రా.06:00 బ.ఏకాదశి గురు ఘ.31:51, సా.గం.6:12. అశ్విని రా.తె.గం.3:12. శోభ రా.గం.10:06. బాలవ సా.గం.6:12. అహస్సు ఘ.32:34. వర్జ్యం రా.గం.11:22ల 12:54వ. అమృ రా.గం.8:18ల 10:50వ. భు.ఘ.4:18:52. ఋ ఉ.దు.9:49ల 10:41వ. మ.దు.3:01ల 3:53వ. మతత్రయ (పురుషోత్తమ) ఏకాదశి12/06 సా.05:40 బ.ద్వాదశి శుక్ర ఘ.26:59, ప.గం.4:16. భరణి రా.గం.1:56. అతిగండ రా.గం.7:28. తైతుల ప.గం.4:16. అహస్సు ఘ.32:34. వర్జ్యం ప.గం.12:09ల 1:39వ. అమృ రా.గం.9:07ల 10:36వ. భు.ఘ.4:28:29. ఉ.దు.8:04ల 8:56వ. మ.దు.12:25ల 1:17వ.13/06 సా.06:00 బ.త్రయోదశి శని ఘ.21:29, ప.గం.2:04. కృత్తిక రా.గం.12:24. సుకర్మ సా.గం.4:36. వనిక్ ప.గం.2:04. అహస్సు ఘ.32:34. వర్జ్యం ప.గం.1:10ల 2:39వ. అమృ రా.గం.10:10ల 11:40వ. భు.ఘ.4:38:6. ఉ.దు.5:28ల 7:12వ. మాసశివరాత్రి14/06 సా.06:00 బ.చతుర్దశి ఆది ఘ.15:42, ప.గం.11:46. రోహిణి ప.గం.10:49. ధృతి ప.గం.1:39. శుభం ప.గం.11:46. అహస్సు ఘ.32:34. వర్జ్యం సా.గం.3:21ల 4:50వ. పునః తె.4:01ల 5:30వ. అమృ రా.గం.7:50ల 9:19వ. భు.ఘ.4:47:43. సా.దు.4:46ల 5:38వ. తర్పణాలకు అమావాస్య15/06 ప.11:00 ∙బ.అమావాస్య సోమ ఘ.9:30, ఉ.గం.9:17. మృగశిర రా.9:09. శూల ఉ.గం.10:37. నాగవం ఉ.గం.9:17. అహస్సు ఘ.32:36. వర్జ్యం తె.గం.4:58ల 5:29వ. అమృ ప.గం.12:57ల 2:26వ. భు.ఘ.4:57:20. పు.భు.5:02. ప.దు.12:26ల 1:18వ. పునః 3:03ల 3:55వ. మృగ 3 రవిః రా.8:00 ప్రవేశాత్ పూర్వతః మిథున సంక్రమణం ప.దు.12:27ల 1:19వ. పునః ప.3:04ల 3:56వ. శుక్లాదేవీపూజ23/06 సా.05:00 శు.నవమి మంగళ ఘ.35:10, రా.గం.7:34. హస్త సా.గం.3:27. వరీయాన్ ప.గం.2:10. బాలవ ఉ.గం.7:35. అహస్సు ఘ.32:38. వర్జ్యం రా.గం.11:50ల 1:31వ. అమృ ఉ.గం.9:18ల 10:56వ. భు.ఘ.1:17:20. ఉ.దు.8:07ల 8:59వ. రా.దు.10:56ల 11:48వ. బ్రాహ్మణీదేవీపూజ24/06 సా.05:00 శు.దశమి బుధ ఘ.36:41, రా.గం.8:10. చిత్త సా.గం.4:37. పరిఘ ప.గం.1:33. తైతుల ఉ.గం.7:52. అహస్సు ఘ.32:38. వర్జ్యం రా.గం.10:36ల 12:18వ. అమృ ఉ.గం.9:54ల 11:35వ. భు.ఘ.1:27:46. మ.దు.11:35ల 12:27వ.25/06 సా.06:00 శు.ఏకాదశి గురు ఘ.39:17, రా.గం.9:14. స్వాతి సా.గం.6:15. శివం ప.గం.1:19. వనిక్ ఉ.గం.8:43. అహస్సు ఘ.32:38. వర్జ్యం రా.గం.12:19ల 2:03వ. అమృ ఉ.గం.8:51ల 10:33వ. భు.ఘ.1:38:12. ఉ.దు.9:52ల 10:44వ. మ.దు.3:05ల 3:57వ. మతత్రయ (నిర్జల) ఏకాదశి26/06 రా.09:00 శు.ద్వాదశి శుక్ర ఘ.42:46, రా.గం.10:38. విశాఖ రా.గం.8:18. సిద్ధం ప.గం.1:27. బవ ఉ.గం.9:57. అహస్సు ఘ.32:36. వర్జ్యం రా.గం.12:42ల 2:28వ. అమృ ఉ.గం.10:45ల 12:28వ. భు.ఘ.1:48:38. ఉ.దు.8:09ల 9:01వ. మ.దు.12:29ల 1:21వ. రామలక్ష్మణద్వాదశీ27/06 ప.02:00 శు.త్రయోదశి శని ఘ.47:17, రా.గం.12:27. అనురాధ రా.గం.10:42. సాధ్యం ప.గం.1:50. కౌలవ ప.గం.11:33. అహస్సు ఘ.32:36. వర్జ్యం తె.గం.4:37ల 5:32వ. అమృ ప.గం.12:15ల 2:01వ. భు.ఘ.1:59:4. ఉ.దు.5:32ల 7:16వ.28/06 ప.02:00 శు.చతుర్దశి ఆది ఘ.52:18, రా.గం.2:27. జ్యేష్ఠ రా.గం.1:17. శుభం ప.గం.2:26. గరజి ప.గం.1:27. అహస్సు ఘ.32:36. వర్జ్యం శేషం గం.5:32ల 6:19వ. అమృ ప.గం.2:46ల 4:28వ. భు.ఘ.2:9:30. సా.దు.4:49ల 5:41వ.29/06 ప.11:00 ఝ శు.పౌర్ణమి సోమ ఘ.57:23, రా.గం.4:29. మూల రా.గం.3:56. శుక్లం ప.గం.3:07. విష్టి సా.గం.3:28. అహస్సు ఘ.32:36. వర్జ్యం ఉ.గం.10:10ల 11:56వ. పునః రా.తె.2:10ల 3:56వ. అమృ రా.గం.8:50ల 10:36వ. భు.ఘ.2:19:56. ప.దు.12:29ల 1:21వ. పునః 3:06ల 3:58వ. 30/06 ప.12:00 బహుళ పాడ్యమి మంగళ పూర్తి. పూర్వాషాఢ పూర్తి. బ్రహ్మం ప.గం.3:46. బాలవ సా.గం.5:23. అహస్సు ఘ.32:36. వర్జ్యం ప.గం.2:31ల 4:17వ. అమృ రా.గం.1:05ల 2:51వ. భు.ఘ.2:30:22. ఉ.దు.8:09ల 9:01వ. రా.దు.10:57ల 11:49వ.01/07 ఉ.09:00 బ.పాడ్యమి బుధ ఘ.1:54, ఉ.గం.6:18. పూర్వాషాఢ ఉ.గం.6:22. ఐంద్రం ప.గం.4:14. కౌలవ ఉ.గం.6:18. అహస్సు ఘ.32:36. వర్జ్యం ప.గం.3:08ల 4:53వ. అమృ రా.గం.1:39ల 3:25వ. భు.ఘ.2:40:48. మ.దు.11:37ల 12:29వ.02/07 ఉ.10:45 బ.విదియ గురు ఘ.5:51, ఉ.గం.7:52. ఉత్తరాషాఢ ఉ.గం.8:39. వైధృతి ప.గం.4:26. గరజి ఉ.గం.7:52. అహస్సు ఘ.32:34. వర్జ్యం ప.గం.12:56ల 2:39వ. అమృ రా.గం.11:14ల 12:57వ. భు.ఘ.2:51:14. ఉ.దు.9:54ల 10:46వ. మ.దు.3:06ల 3:58వ.03/07 ప.02:00 బ.తదియ శుక్ర ఘ.8:44, ఉ.గం.9:02. శ్రవణం ప.గం.10:22. విష్కంభం ప.గం.4:18. భద్ర ఉ.గం.9:02. అహస్సు ఘ.32:34. వర్జ్యం ప.గం.2:36ల 4:17వ. అమృ రా.గం.12:44ల 2:25వ. భు.ఘ.3:1:40. ఉ.దు.8:09ల 9:01వ. మ.దు.12:30ల 1:22వ. సంకటహర చతుర్థి04/07 ప.02:00 బ.చవితి శని ఘ.10:30, ఉ.గం.9:45. ధనిష్ఠ ప.గం.11:45. ప్రీతి ప.గం.3:48. బాలవ ఉ.గం.9:45. అహస్సు ఘ.32:34. వర్జ్యం రా.గం.7:12ల 8:51వ. అమృ తె.గం.5:08ల 5:33వ. భు.ఘ.3:12:6. ఉ.దు.5:38ల 7:11వ. 05/07 ప.11:00 బ.పంచమి ఆది ఘ.10:55, ఉ.గం.9:55. శతభిషం ప.గం.12:35. ఆయుష్మాన్ ప.గం.2:53. తైతుల ఉ.గం.9:55. అహస్సు ఘ.32:34. వర్జ్యం సా.గం.7:05ల 8:42వ. అమృ ఉ.గం.5:33ల 6:47వ. పునరమ తె.గం.4:49ల 5:33వ. భు.ఘ.3:22:32. సా.దు.4:50ల 5:42వ.06/07 సా.06:00 బ.షష్ఠి సోమ ఘ.10:08, ఉ.గం.9:37. పూర్వాభాద్ర ప.గం.12:57. సౌభాగ్యం ప.గం.1:27. వనిక్ ఉ.గం.9:37. అహస్సు ఘ.32:32. వర్జ్యం రా.గం.10:29ల 12:04వ. అమృ ఉ.గం.5:33ల 6:26వ. భు.ఘ.3:32:58. ప.దు.12:30ల 1:22వ. పునః 3:07ల 3:59వ.07/07 సా.05:00 బ.సప్తమి మంగళ ఘ.7:59, ఉ.గం.8:46. ఉత్తరాభాద్ర ప.గం.12:46. శోభ ప.గం.11:50. బవ ఉ.గం.8:46. అహస్సు ఘ.32:32. వర్జ్యం రా.గం.12:31ల 2:05వ. అమృ ఉ.గం.8:01ల 9:36వ. భు.ఘ.3:43:24. ఉ.దు.8:10ల 9:02వ. రా.దు.10:59ల 11:51వ. 08/07 సా.04:00 బ.అష్టమి బుధ ఘ.5:03, ఉ.గం.7:35. రేవతి ప.గం.12:16. అతిగండ ప.గం.9:50. కౌలవ ఉ.గం.7:35. అహస్సు ఘ.32:32. వర్జ్యం లేదు. అమృ ఉ.గం.9:55ల 11:29. పునః తె.గం.4:26ల 5:39వ. భు.ఘ.3:53:50. మ.దు.11:38ల 12:30వ.09/07 సా.06:00 బ.నవమి గురు ఘ.1:00, ఉ.గం.5:59. బ.దశమి ఘ.55:17, తె.గం.4:06. అశ్విని ప.గం.11:23. సుకర్మ ఉ.గం.7:30. ధృతి తె.గం.4:58. గరజి ఉ.గం.5:59. వనిక్ సా.గం.5:02. అహస్సు ఘ.32:30. వర్జ్యం ఉ.గం.7:32ల 9:04వ. పునః రా.8:29ల 10:00వ. అమృ శేషం ఉ.గం.5:35ల 5:58వ. భు.ఘ.4:4:16. ఉ.దు.9:55ల 10:47వ. మ.దు.3:07ల 3:59వ.10/07 ఉ.07:30 బ.ఏకాదశి శుక్ర ఘ.50:38, రా.గం.1:50. భరణి ప.గం.10:10. శూల రా.గం.2:06. బవ ప.గం.2:58. అహస్సు 32:30. వర్జ్యం రా.గం.9:26ల 10:56వ. అమృ ఉ.గం.5:36ల 7:06వ. భు.ఘ.4:14:42. ఉ.దు.8:11ల 9:03వ. మ.దు.12:31ల 1:23వ. మతత్రయ యోగినీ ఏకాదశి11/07 సా.06:00 బ.ద్వాదశి శని ఘ.44:45, రా.గం.11:30. కృత్తిక ఉ.గం.8:44. గండ రా.గం.11:08. బాలవ ప.గం.12:40. అహస్సు ఘ.32:28. వర్జ్యం రా.గం.11:42ల 1:12వ. అమృ ఉ.గం.6:24ల 7:54వ. పునరమ తె.4:14ల 5:36వ. భు.ఘ.4:25:8. సా.దు.5:36ల 7:20వ. కూర్మజయంతీ12/07 సా.06:00 బ.త్రయోదశి ఆది ఘ.38:32, రా.గం.9:01. రోహిణి ఉ.గం.7:12. మృగశిర తె.5:32. వృద్ధి రా.గం.8:06. గరజి ఉ.గం.10:15. అహస్సు ఘ.32:28. వర్జ్యం ప.గం.12:24ల 1:53వ. అమృ శేషం ఉ.గం.5:36ల 5:44వ. పునరమ రా.గం.9:20ల 10:49వ. భు.ఘ.4:35:44. సా.దు.4:50ల 5:32వ. మాసశివరాత్రి నిశీధి వారికి13/07 ఉ.07:00 బ.చతుర్దశి సోమ ఘ.32:20, సా.గం.6:32. ఆర్ద్ర రా.తె.గం.3:47. ధవం సా.గం.5:02. శకుని ఉ.గం.7:46. అహస్సు ఘ.32:28. వర్జ్యం ప.గం.1:19ల 2:48వ. అమృ సా.గం.6:31ల 8:01వ. భు.ఘ.4:46:10. ప.దు.12:31ల 1:23వ. పునః 3:07ల 3:59వ. మాసశివరాత్రి ప్రదోషం వారికి14/07 ఉ.10:00 ∙బ.అమావాస్య మంగళ ఘ.25:39, ప.గం.3:52. పునర్వసు రా.గం.2:14. వ్యాఘాతం ప.గం.2:02. నాగవం ప.గం.3:52. అహస్సు ఘ.32:26. వర్జ్యం ప.గం.3:00ల 4:30వ. అమృ రా.గం.11:59ల 1:29వ. భు.ఘ.4:56:36. ఉ.దు.8:12ల 9:04వ. రా.దు.10:59ల 11:51వ. వటసావిత్రీవ్రతం, తర్పణాలకు అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, 17/07 నుండి దక్షిణాయనం గ్రీష్మఋతువు, ఆషాఢ మాసం15/07 ఉ.07:00 శుద్ధ పాడ్యమి బుధ ఘ.20:39, ప.గం.1:52. పుష్యమి రా.గం.12:50. హర్షణం ప.గం.11:09. బవ ప.గం.1:52. అహస్సు ఘ.32:26. వర్జ్యం ప.గం.9:46ల 11:16. అమృ రా.గం.6:48ల 8:18వ. భు.ఘ.5:7:2. మ.దు.11:39ల 12:31వ.16/07 ఉ.06:00 శు.విదియ గురు ఘ.15:33, ప.గం.11:49. ఆశ్లేష రా.గం.11:42. వజ్రం ఉ.గం.8:26. కౌలవ ప.గం.11:49. అహస్సు ఘ.32:24. వర్జ్యం ప.గం.1:02ల 2:34వ. అమృ రా.గం.10:11ల 11:43వ. భు.ఘ.5:17:28. ఉ.దు.9:55ల 10:47వ. మ.దు.3:06ల 3:58వ. రథోత్సవం17/07 ప.03:00 శు.తదియ శుక్ర ఘ.11:09, ఉ.గం.10:05. మఘ రా.గం.10:57. సిద్ధి ఉ.గం.5:57. వ్యతీపాత తె.గం.3:40. గరజి ఉ.గం.10:05. అహస్సు ఘ.32:22. వర్జ్యం ప.గం.11:20ల 12:53వ. అమృ రా.గం.8:38ల 10:11వ. భు.ఘ.5:27:54. పు.భు.5:30. ఉ.దు.8:12ల 9:04వ. మ.దు.12:31ల 1:23వ. పున 4 రవిః ప.11:53. ప్రవేశాత్ పూర్వతః దక్షిణాయన పుణ్యకాల. కర్కాటక సంక్రమణం18/07 సా.06:00 శు.చవితి శని ఘ.7:39, ఉ.గం.8:41. పుబ్బ రా.గం.10:31. వరీయాన్ రా.గం.1:45. భద్ర ఉ.గం.8:41. అహస్సు ఘ.32:22. వర్జ్యం ఉ.గం.6:49ల 8:23వ. అమృ సా.గం.4:14ల 5:48వ. భు.ఘ.00:7:51. ఉ.దు.5:38ల 7:22వ.19/07 సా.06:00 శు.పంచమి ఆది ఘ.5:12, ఉ.గం.7:43. ఉత్తర రా.గం.10:38. పరిఘ రా.గం.12:19. బాలవ ఉ.గం.7:43. అహస్సు ఘ.32:20. వర్జ్యం ఉ.గం.5:46ల 7:22వ. అమృ సా.గం.3:24ల 5:00వ. భు.ఘ.00:18:22. సా.దు.4:51ల 5:43వ. 20/07 ప.11:10 శు.షష్ఠి సోమ ఘ.3:55, ఉ.గం.7:13. హస్త రా.గం.11:08. శివం రా.గం.11:11. తైతుల ఉ.గం.7:13. అహస్సు ఘ.32:18. వర్జ్యం ఉ.గం.7:13ల 8:51వ. అమృ సా.గం.5:01ల 6:39వ. భు.ఘ.00:28:53. ప.దు.12:32ల 1:24వ. పునః ప.2:59ల 3:51వ. కుమారషష్ఠీ21/07 ప.12:10 శు.సప్తమి మంగళ ఘ.3:49, ఉ.గం.7:11. చిత్త రా.గం.12:11. సిద్ధం రా.గం.10:32. వనిక్ ఉ.గం.7:11. అహస్సు ఘ.32:18. వర్జ్యం ఉ.గం.7:29ల 9:09వ. అమృ సా.గం.5:29ల 7:09వ. భు.ఘ.00:39:24. ఉ.దు.8:14ల 9:06. రా.దు.10:59ల 11:51వ. వివస్వత్సప్తమీ22/07 సా.04:15 శు.అష్టమి బుధ ఘ.5:10, ఉ.గం.7:43. స్వాతి రా.గం.1:42. సాధ్యం రా.గం.10:12. బవ ఉ.గం.7:43. అహస్సు ఘ.32:16. వర్జ్యం ఉ.గం.6:09ల 7:51వ. అమృ సా.గం.5:09ల 6:51వ. భు.ఘ.00:49:55. మ.దు.11:40ల 12:32వ. 23/07 సా.05:00 శు.నవమి గురు ఘ.7:36, ఉ.గం.8:41. విశాఖ రా.తె.గం.3:41. శుభం రా.గం.10:16. కౌలవ ఉ.గం.8:41. అహస్సు ఘ.32:16. వర్జ్యం ఉ.గం.7:41ల 9:25వ. అమృ సా.గం.6:09ల 7:53వ. భు.ఘ.1:00:26. ఉ.దు.9:47ల 10:38వ. మ.దు.3:06ల 3:57వ. ఐంద్రీపూజ, చాక్షుషమన్వాది24/07 ఉ.07:30 శు.దశమి శుక్ర ఘ.11:34, ప.గం.10:17, అనురాధ పూర్తి. శుక్లం రా.గం.10:36. గరజి ప.గం.10:17. అహస్సు ఘ.32:14. వర్జ్యం ఉ.గం.8:04ల 9:50వ. అమృ రా.గం.7:37ల 9:23వ. భు.ఘ.1:10:57. ఉ.దు.8:15ల 9:07వ. మ.దు.12:32ల 1:24వ. మహాలకీ‡్ష్మవ్రతారంభం25/07 ప.10:30 శు.ఏకాదశి శని ఘ.15:36, ప.గం.11:54. అనురాధ ఉ.గం.6:03. బ్రహ్మం రా.గం.11:23. భద్ర ప.గం.11:54. అహస్సు ఘ.32:12. వర్జ్యం ప.గం.12:14ల 2:00వ. అమృ రా.గం.10:51ల 12:37వ. భు.ఘ.1:21:28. ఉ.దు.5:40ల 7:32వ. తొలిఏకాదశీ, మతత్రయ శయన ఏకాదశి, గోపద్మవ్రతారంభ26/07 ప.02:00 శు.ద్వాదశి ఆది ఘ.20:06, ప.గం.1:42. జ్యేష్ఠ ఉ.గం.8:35. ఐంద్రం రా.గం.11:51. బాలవ ప.గం.1:42. అహస్సు ఘ.32:10. వర్జ్యం సా.గం.5:28ల 7:14వ. అమృ రా.తె.గం.4:03ల 5:49వ. భు.ఘ.1:31:59. సా.దు.4:49ల 5:41వ. 27/07 సా.07:00 శు.త్రయోదశి సోమ ఘ.25:30, సా.గం.3:52. మూల ప.గం.11:13. వైధృతి రా.గం.12:30. తైతుల సా.గం.3:52. అహస్సు ఘ.32:10. వర్జ్యం ప.గం.9:27ల 11:13వ. పునః రా.గం.9:49ల 11:35వ. భు.ఘ.1:42:30. ప.దు.12:31ల 1:22వ. పునః3:06ల 3:57వ.28/07 సా.07:00 శు.చతుర్దశి మంగళ ఘ.30:13, సా.గం.5:45. పూర్వాషాఢ ప.గం.1:48. విష్కంభం రా.గం.1:01. వనిక్ సా.గం.5:45. అహస్సు ఘ.32:08. వర్జ్యం రా.గం.10:30ల 12:15వ. అమృ ప.గం.10:02ల 11:48వ. భు.ఘ.1:53:1. ఉ.దు.8:15ల 9:06వ. రా.దు.10:59ల 11:50వ. పవిత్రార్చనం, నోములకు పౌర్ణమి29/07 రా.07:00 ఝ శు.పౌర్ణమి బుధ ఘ.34:13, రా.గం.7:22. ఉత్తరాషాఢ సా.గం.4:01. ప్రీతి రా.గం.1:18. విష్టి ఉ.గం.6:33. అహస్సు ఘ.32:6. వర్జ్యం రా.గం.8:21ల 10:05వ. అమృ ఉ.గం.9:01ల 10:46వ. భు.ఘ.2:3:32. మ.దు.11:40ల 12:31వ. 30/07 రా.08:00 బహుళ పాడ్యమి గురు ఘ.37:18, రా.గం.8:36. శ్రవణం సా.గం.5:56. ఆయుష్మాన్ రా.గం.1:15. బాలవ ఉ.గం.7:59. అహస్సు ఘ.32:4. వర్జ్యం రా.గం.10:11ల 11:53. అమృ ఉ.గం.6:43ల 8:27వ. భు.ఘ.2:14:3. ఉ.దు.9:58ల 10:41వ. మ.దు.3:06ల 3:57వ.31/07 ఉ.07:30 బ.విదియ శుక్ర ఘ.39:05, రా.గం.9:20. ధనిష్ఠ రా.గం.7:24. సౌభాగ్యం రా.గం.1:48. తైతుల ఉ.గం.8:58. అహస్సు ఘ.32:02. వర్జ్యం రా.తె.గం.2:54ల 4:34వ. అమృ ఉ.గం.8:22ల 10:04వ. భు.ఘ.2:24:34. ఉ.దు.8:16ల 9:07వ. మ.దు.12:32ల 1:23వ. చాతుర్మాస్యద్వితీయ01/08 సా.06:00 బ.తదియ శని ఘ.39:44, రా.గం.9:36. శతభిషం రా.గం.8:23. శోభ రా.గం.11:59. వనిక్ ఉ.గం.9:28. అహస్సు ఘ.32:02. వర్జ్యం రా.గం.2:06ల 3:44వ. అమృ ప.గం.12:53ల 2:33వ. భు.ఘ.2:35:5. ఉ.దు.5:42ల 7:24వ.02/08 సా.06:00 బ.చవితి ఆది ఘ.38:55, రా.గం.9:16. పూర్వాభాద్ర రా.గం.8:48. అతిగండ రా.గం.11:40. బవ ఉ.గం.2:06. అహస్సు ఘ.32:00. వర్జ్యం లేదు. అమృ ప.గం.11:52ల 1:30వ. భు.ఘ.2:45:36. సా.దు.4:48ల 5:39వ. సంకటహర చతుర్థి03/08 ప.11:00 బ.పంచమి సోమ ఘ.37:2, రా.గం.8:29. ఉత్తరాభాద్ర రా.గం.8:48. సుకర్మ రా.గం.9:02. కౌలవ ఉ.గం.8:54. అహస్సు ఘ.31:58. వర్జ్యం ఉ.గం.6:24ల 8:00వ. అమృ సా.గం.4:00ల 5:36వ. భు.ఘ.2:56:7. ప.దు.12:31ల 1:22వ. పునః 3:04ల 3:55వ.04/08 ఉ.10:15 బ.షష్ఠి మంగళ ఘ.33:58, రా.గం.7:17. రేవతి రా.గం.8:19. ధృతి రా.గం.7:01. గరజి ఉ.గం.7:54. అహస్సు ఘ.31:56. వర్జ్యం ఉ.గం.8:33ల 10:07వ. అమృ సా.గం.5:58ల 7:32వ. భు.ఘ.3:6:38. ఉ.దు.8:16ల 9:07వ. రా.దు.10:58ల 11:49వ.05/08 ఉ.09:00 బ.సప్తమి బుధ ఘ.30:00, సా.గం.5:42. అశ్విని రా.గం.7:29. శూల ప.గం.5:00. బవ సా.గం.5:42. అహస్సు ఘ.31:54. వర్జ్యం ప.గం.3:37ల 5:10వ. పునః తె.4:36ల 6:07వ. అమృ ప.గం.12:32ల 2:05వ. భు.ఘ.3:17:9. మ.దు.11:40ల 12:31వ.06/08 ఉ.10:45 బ.అష్టమి గురు ఘ.25:11, సా.గం.3:47. భరణి సా.గం.6:19. గండ ప.గం.2:08. కౌలవ సా.గం.3:47. అహస్సు ఘ.31:52. వర్జ్యం తె.గం.5:33ల 5:43వ. అమృ ప.గం.1:45ల 3:16వ. భు.ఘ.3:27:40. ఉ.దు.9:58ల 10:49వ. మ.దు.3:03ల 3:54వ. ధర్మసావర్ణిమన్వాది07/08 రా.08:40 బ.నవమి శుక్ర ఘ.19:47, ప.గం.1:38. కృత్తిక సా.గం.4:47. వృద్ధి ప.గం.11:20. గరజి ప.గం.1:38. అహస్సు ఘ.31:50. వర్జ్యం శేషం ఉ.గం.5:43ల 7:03వ. అమృ ప.గం.2:33ల 4:03వ. భు.ఘ.3:38:11. ఉ.దు.8:16ల 9:07వ. మ.దు.12:30ల 1:21వ.08/08 ప.02:00 బ.దశమి శని ఘ.14:04, ప.గం.11:22. రోహిణి సా.గం.3:21. ధ్రువం ఉ.గం.8:25. వ్యాఘాతం తె.గం.5:19. విష్టి ప.గం.11:22. అహస్సు ఘ.31:48. వర్జ్యం ఉ.గం.7:50ల 9:20వ. పునః రా.8:34ల 10:04వ. అమృ ప.గం.12:21ల 1:51వ. పునరమ తె.5:30ల 5:44వ. భు.ఘ.3:48:42. ఉ.దు.5:44ల 7:26వ.09/08 ప.03:00 బ.ఏకాదశి ఆది ఘ.7:37, ఉ.గం.8:47. మృగశిర ప.గం.1:41. హర్షణం రా.గం.2:20. బాలవ ఉ.గం.8:47. అహస్సు ఘ.31:46. వర్జ్యం రా.గం.9:30ల 11:00వ. అమృ శేషం ఉ.గం.5:44ల 6:59వ. పునరమ రా.2:43ల 4:12వ. భు.ఘ.3:59:13. సా.దు.4:44ల 5:35వ. మతత్రయ కామిక ఏకాదశి10/08 సా.06:00 బ.ద్వాదశి సోమ ఘ.1:36, ఉ.గం.6:22. త్రయోదశి ఘ.53:55. తె.గం.3:56. ఆర్ద్ర ప.గం.12:01. వజ్రం రా.గం.11:15. తైతుల ఉ.గం.6:22. గరజి సా.గం.5:09. అహస్సు ఘ.31:44. వర్జ్యం రా.గం.11:04ల12:34వ. భు.ఘ.4:9:44. ప.దు.12:31ల 1:21వ. పునః 3:02ల 3:52వ.11/08 ఉ.10:30 బ.చతుర్దశి మంగళ ఘ.49:45, రా.గం.1:39. పునర్వసు ప.గం.10:28. సిద్ధి రా.గం.8:19. విష్టి ప.గం.2:48. అహస్సు ఘ.31:42. వర్జ్యం సా.గం.5:59ల 7:29వ. అమృ ఉ.గం.8:13ల 9:43వ. పునరమ రా.తె.3:00ల 4:30వ. భు.ఘ.4:20:15. ఉ.దు.8:17ల 9:07వ. రా.దు.10:57ల 11:47వ. మాసశివరాత్రి12/08 ఉ.09:30 ∙బ.అమావాస్య బుధ ఘ.44:39, రా.గం.11:37. పుష్యమి ఉ.గం.9:01. వ్యతీపాత సా.గం.5:34. చతుష్పాత్ ప.గం.12:38. అహస్సు ఘ.31:40. వర్జ్యం రా.గం.9:12ల 10:43వ. భు.ఘ.4:30:46. మ.దు.11:40ల 12:30వ.స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షఋతువు, శ్రావణమాసం13/08 ఉ.11:15 శుద్ధ పాడ్యమి గురు ఘ.40:15, రా.గం.9:51. ఆశ్లేష ఉ.గం.7:51. వరీయాన్ ప.గం.3:01. కింస్తుఘ్నం ప.గం.10:44. అహస్సు ఘ.31:38. వర్జ్యం రా.గం.7:24ల 8:56వ. అమృ ఉ.గం.6:20ల 7:51వ. పునరమ తె.4:38ల 5:46వ. భు.ఘ.4:41:17. ఉ.దు.9:59ల 10:49వ. మ.దు.3:02ల 3:52వ. యాగకాలం14/08 ప.02:00 శు.విదియ శుక్ర ఘ.36:45, రా.గం.8:28. మఘ ఉ.గం.6:58. పరిఘ ప.గం.12:45. బాలవ ఉ.గం.9:10. అహస్సు ఘ.31:36. వర్జ్యం ప.గం.2:48ల 4:22వ. అమృ శేషం ఉ.గం.5:46ల 6:10వ. పునరమ రా.12:16ల 1:50వ. భు.ఘ.4:51:48. ఉ.దు.8:17ల 9:07వ. మ.దు.12:30ల 1:20వ. చంద్రదర్శనం (నెలపొడుపు)15/08 సా.06:00 శు.తదియ శని ఘ.34:25, రా.గం.7:32. పుబ్బ ఉ.గం.6:33. శివం ఉ.గం.10:51. తైతుల ఉ.గం.8:00. అహస్సు ఘ.31:34. వర్జ్యం ప.గం.1:43ల 3:19వ. అమృ రా.గం.11:16ల 12:52వ. భు.ఘ.5:2:19. ఉ.దు.5:46ల 7:27వ. 16/08 సా.06:30 శు.చవితి ఆది ఘ.32:54, రా.గం.6:56. ఉత్తర ఉ.గం.6:26. సిద్ధి ఉ.గం.9:11. వనిక్ ఉ.గం.7:14. అహస్సు ఘ.31:32. వర్జ్యం ప.గం.2:50ల 4:26వ. అమృ రా.గం.12:26ల 2:02వ. భు.ఘ.5:12:50. సా.దు.4:42ల 5:32వ. 17/08 సా.07:00 శు.పంచమి సోమ ఘ.32:53, రా.గం.6:55. హస్త ఉ.గం.6:50. సాధ్యం ఉ.గం.7:58. బవ ఉ.గం.6:55. అహస్సు ఘ.31:30. వర్జ్యం సా.గం.3:09ల 4:49వ. అమృ రా.గం.1:07ల 2:47వ. భు.ఘ.5:23:11. పు.భు.5:31. ప.దు.12:29ల 1:19వ. పునః ప.3:00ల 3:50వ. మఘ 1 రవిః రా.11:08 ప్రవేశదినే సింహ సంక్రమణం18/08 సా.05:00 శు.షష్ఠి మంగళ ఘ.34:2, రా.గం.7:23. చిత్త ఉ.గం.7:46. శుభం ఉ.గం.6:45. కౌలవ ఉ.గం.7:09. అహస్సు ఘ.31:28. వర్జ్యం ప.గం.1:41ల 3:23వ. అమృ రా.గం.11:51ల 1:33వ. భు.ఘ.00:02:50. ఉ.దు.8:18ల 9:08వ. రా.దు.10:55ల 11:45వ. సూర్యపూజ 19/08 రా.07:30 శు.సప్తమి బుధ ఘ.36:32, రా.గం.8:24. స్వాతి ఉ.గం.9:11. శుక్లం ఉ.గం.6:45. గరజి ఉ.గం.7:54. అహస్సు ఘ.31:26. వర్జ్యం ప.గం.3:13ల 4:57వ. అమృ రా.గం.1:34ల 3:18వ. భు.ఘ.00:13:03. మ.దు.11:39ల 12:29వ.20/08 సా.06:00 శు.అష్టమి గురు ఘ.40:01, రా.గం.9:47. విశాఖ ప.గం.11:07. బ్రహ్మం ఉ.గం.6:43. విష్టి ఉ.గం.9:05.అహస్సు ఘ.31:24. వర్జ్యం ప.గం.3:26ల 5:11వ. అమృ రా.గం.1:55ల 3:40వ. భు.ఘ.00:23:16. ఉ.దు.9:58ల 10:48వ. మ.దు.3:00ల 3:50వ.21/08 ప.02:15 శు.నవమి శుక్ర ఘ.44:29, రా.గం.11:35. అనురాధ ప.గం.1:18. ఐంద్రం ఉ.గం.6:58. బాలవ ఉ.గం.10:41. అహస్సు ఘ.31:22. వర్జ్యం రా.గం.7:28ల 9:14వ. భు.ఘ.00:33:29. ఉ.దు.8:18ల 9:08వ. మ.దు.12:29ల 1:19వ. వరలకీ‡్ష్మవ్రతం, కౌమారీదేవీపూజ22/08 సా.06:00 శు.దశమి శని ఘ.49:26, రా.గం.1:34. జ్యేష్ఠ సా.గం.3:48. వైధృతి ఉ.గం.7:29. తైతుల ప.గం.12:35. అహస్సు ఘ.31:20. వర్జ్యం రా.గం.12:41ల 2:27వ. అమృ ఉ.గం.6:05ల 7:51వ. భు.ఘ.00:43:42. ఉ.దు.5:48ల 7:28వ. 23/08 ప.03:00 శు.ఏకాదశి ఆది ఘ.54:39, రా.గం.3:40. మూల సా.గం.6:26. విష్కంభం ఉ.గం.8:07. వనిక్ ప.గం.2:39. అహస్సు ఘ.31:18. వర్జ్యం సా.గం.4:40ల 6:26వ. పునః తె.5:04ల 5:48వ. అమృ ప.గం.11:20ల 1:06వ. భు.ఘ.00:53:55. సా.దు.4:36ల 5:26వ. 24/08 రా.07:00 శు.ద్వాదశి సోమ ఘ.59:30, రా.తె.గం.5:36. పూర్వాషాఢ రా.గం.9:00. ప్రీతి ఉ.గం.8:44. బవ సా.గం.4:38. అహస్సు ఘ.31:15. వర్జ్యం శేషం ఉ.గం.5:48ల 6:50వ. అమృ సా.గం.3:41ల 5:27వ. భు.ఘ.1:4:8. ప.దు.12:27ల 1:17వ. పునః ప.2:57ల 3:47వ. దామోదరద్వాదశీ, వాసుదేవ పవిత్రారోపణం25/08 రా.07:00 శు.త్రయోదశి మంగళ పూర్తి. ఉత్తరాషాఢ రా.గం.11:19. ఆయుష్మాన్ ఉ.గం.9:14. కౌలవ సా.గం.6:22. అహస్సు ఘ.31:12. వర్జ్యం ఉ.గం.5:46ల 7:31వ. పునః రా.3:40ల 5:24వ. అమృ సా.గం.4:18ల 6:04వ. భు.ఘ.1:14:21. ఉ.దు.8:18ల 9:08వ. రా.దు.10:53ల 11:43వ.26/08 సా.04:00 శు.త్రయోదశి బుధ ఘ.3:22, ఉ.గం.7:09. శ్రవణం రా.గం.1:21. సౌభాగ్యం ఉ.గం.9:32. తైతుల ఉ.గం.7:09. అహస్సు ఘ.31:10. వర్జ్యం తె.గం.5:37ల 5:48వ. అమృ ప.గం.2:04ల 3:48వ. భు.ఘ.1:24:34. మ.దు.11:37ల 12:27వ. 27/08 సా.06:00 శు.చతుర్దశి గురు ఘ.6:32, ఉ.గం.8:25. ధనిష్ఠ రా.గం.2:54. శోభ ఉ.గం.9:30. వనిక్ ఉ.గం.8:25. అహస్సు ఘ.31:8. వర్జ్యం శేషం ఉ.గం.5:48ల 7:19వ. అమృ ప.గం.3:50ల 5:32వ. భు.ఘ.1:34:47. ఉ.దు.9:57ల 10:47వ. మ.దు.2:55ల 3:45వ. నోములకు పౌర్ణమి28/08 ప.02:15 ఝశు.పౌర్ణమి శుక్ర ఘ.8:29, ఉ.గం.9:12. శతభిషం తె.గం.4:04. అతిగండ ఉ.గం.9:07. బవ ఉ.గం.9:12. అహస్సు ఘ.31:6. వర్జ్యం ఉ.గం.10:27ల 12:07వ. అమృ రా.గం.8:33ల 10:15వ. భు.ఘ.1:45:00. ఉ.దు.8:17 9:07వ. మ.దు.12:26ల 1:16వ. యాగకాలం, హయగ్రీవోత్పత్తి, యజుర్వేద ఉపాకర్మ, విఖనసజయంతీ29/08 సా.07:00 బహుళ పాడ్యమి శని ఘ.9:07, ఉ.గం.9:27. పూర్వాభాద్ర తె.గం.4:34. సుకర్మ ఉ.గం.8:18. కౌలవ ఉ.గం.9:27. అహస్సు ఘ.31:4. వర్జ్యం ప.గం.10:36ల 12:14వ. అమృ రా.గం.8:24ల 10:2వ. భు.ఘ.1:55:13. ఉ.దు.5:48ల 7:27వ.30/08 సా.06:00 బ.విదియ ఆది ఘ.8:36, ఉ.గం.9:14. ఉత్తరాభాద్ర తె.గం.4:41. ధృతి ఉ.7:08. శూల తె.గం.5:42. గరజి ఉ.గం.9:14. అహస్సు ఘ.31:2. వర్జ్యం ప.గం.2:12ల 3:48వ. అమృ రా.గం.11:50ల 1:26వ. భు.ఘ.2:5:26. సా.దు.4:33ల 5:23వ. బహత్తల్ప ద్వితీయ31/08 ప.11:00 బ.తదియ సోమ ఘ.6:57, ఉ.గం.8:35. రేవతి తె.గం.4:18. గండ తె.గం.3:42. భద్ర ఉ.గం.8:35. అహస్సు ఘ.31:00. వర్జ్యం ప.గం.4:30ల 6:05వ. అమృ రా.గం.1:46ల 3:20వ. భు.ఘ.2:15:39. ప.దు.12:25ల 1:14వ. పునః ప.2:54ల 3:43వ. సంకటహర చతుర్థి01/09 సా.04:30 బ.చవితి మంగళ ఘ.3:54, ఉ.గం.7:23. అశ్విని రా.తె.గం.3:32. వృద్ధి రా.గం.1:25. బాలవ ఉ.గం.7:23. అహస్సు ఘ.30:58. వర్జ్యం రా.గం.11:40ల 1:13వ. అమృ రా.గం.8:34ల 10:07వ. భు.ఘ.2:25:52. ఉ.దు.8:18ల 9:07వ. రా.దు.10:50ల 11:39వ.02/09 సా.04:00 బ.పంచమి బుధ ఘ.00:04, ఉ.గం.5:51. బ.షష్ఠి ఘ.55:23, రా.తె.గం.4:00. భరణి రా.2:22. ధ్రువం రా.గం.10:50. తైతుల ఉ.గం.5:51. గరజి సా.గం.4:55. అహస్సు ఘ.30:56. వర్జ్యం ప.గం.12:40ల 2:11వ. అమృ రా.గం.9:48ల 11:19వ. భు.ఘ.2:36:5. మ.దు.11:36ల 12:25వ. 03/09 సా.05:00 బ.సప్తమి గురు ఘ.50:05, రా.గం.1:52. కృత్తిక రా.గం.1:02. వ్యాఘాతం రా.8:04. విష్టి ప.గం.2:56. అహస్సు ఘ.30:53. వర్జ్యం ప.గం.1:43ల 3:13వ. అమృ రా.గం.10:46ల 12:16వ. భు.ఘ.2:46:18. ఉ.దు.9:57ల 10:46వ. మ.దు.2:53ల 3:42వ.04/09 ఉ.07:50 బ.అష్టమి శుక్ర ఘ.44:12, రా.గం.11:31. రోహిణి రా.గం.11:28. హర్షణం సా.గం.5:07. బాలవ ప.గం.12:41. అహస్సు ఘ.30:50. వర్జ్యం ప.గం.3:59ల 5:29వ. పునః తె.గం.4:40ల 5:50వ. అమృ రా.గం.8:28ల 9:58వ. భు.ఘ.2:56:31. ఉ.దు.8:18ల 9:07వ. మ.దు.12:24ల 1:13వ. శ్రీకష్ణ జన్మాష్టమీ, శ్రీకష్ణజయంతీ05/09 సా.06:00 బ.నవమి శని ఘ.38:08, రా.గం.9:05. మృగశిర రా.గం.9:48. వజ్రం ప.గం.2:04. తైతుల ప.గం.10:38. అహస్సు ఘ.30:48. వర్జ్యం శేషం ఉ.గం.5:50ల 6:09వ. పునః తె.గం.5:37ల 5:50వ. అమృ ప.గం.1:36ల 3:05వ. భు.ఘ.3:6:44. ఉ.దు.5:50ల 7:28వ. కౌమారీదేవీపూజ06/09 సా.06:00 బ.దశమి ఆది ఘ.31:57, రా.గం.6:37. ఆర్ద్ర రా.గం.8:07. సిద్ధి ప.గం.10:59. వనిక్ ఉ.గం.7:51. అహస్సు ఘ.30:46. వర్జ్యం శేషం ఉ.గం.5:50ల 7:06వ. అమృ ఉ.గం.10:49ల 12:18వ. భు.ఘ.3:16:57. సా.దు.4:29ల 5:18వ.07/09 ప.11:00 బ.ఏకాదశి సోమ ఘ.25:59, సా.గం.4:14. పునర్వసు సా.గం.6:30. వ్యతీపాత ఉ.గం.7:55. వరీయాన్ తె.గం.4:52. బాలవ సా.గం.4:14వ. అహస్సు ఘ.30:44. వర్జ్యం ఉ.గం.7:20ల 8:50వ. పునః రా.2:01ల 3:31వ. భు.ఘ.3:27:10. ప.దు.12:24ల 1:13వ. పునః ప.2:51ల 3:40వ. మతత్రయ అజా ఏకాదశి08/09 సా.04:30 బ.ద్వాదశి మంగళ ఘ.20:21, ప.గం.1:59. పుష్యమి సా.గం.5:03, పరిఘ రా.గం.2:04. తైతుల ప.గం.1:59. అహస్సు ఘ.30:41. వర్జ్యం తె.గం.5:11ల 5:51వ. అమృ ప.గం.11:03ల 12:33వ. భు.ఘ.3:37:23. ఉ.దు.8:18ల 9:07వ. రా.దు.10:48ల 11:36వ.09/09 సా.04:00 బ.త్రయోదశి బుధ ఘ.15:20, ప.గం.11:59. ఆశ్లేష ప.గం.3:48. శివం రా.గం.11:24. వనిక్ ప.గం.11:59. అహస్సు ఘ.30:38. వర్జ్యం శేషం ఉ.గం.5:51ల 6:51. పునః రా.3:20ల 4:52వ. అమృ ప.గం.2:17ల 3:47వ. భు.ఘ.3:47:36. మ.దు.11:33ల 12:22వ. మాసశివరాత్రి10/09 ఉ.06:30 బ.చతుర్దశి గురు ఘ.10:51, ఉ.గం.10:11. మఘ ప.గం.2:52. సిద్ధం రా.గం.9:06. శకుని ఉ.గం.10:11. అహస్సు ఘ.30:36. వర్జ్యం రా.గం.10:40ల 12:14వ. అమృ ప.గం.12:33ల 2:05వ. భు.ఘ.3:57:49. ఉ.దు.9:56ల 10:45వ. మ.దు.2:49ల 3:38వ. రుద్రసావర్ణిమన్వాది, తర్పణాలకు అమావాస్య11/09 రా.08:30 ∙బ.అమావాస్య శుక్ర ఘ.7:20, ఉ.గం.8:47. పుబ్బ ప.గం.2:17. సాధ్యం రా.గం.7:02. నాగవం ఉ.గం.8:47. అహస్సు ఘ.30:34. వర్జ్యం రా.గం.9:25ల 11:00వ. అమృ ఉ.గం.8:02ల 9:34వ. భు.ఘ.4:8:02. ఉ.దు.8:19ల 9:08వ. మ.దు.12:29ల 1:18వ. యాగకాలం కుశగ్రహణం, పోలాల అమావాస్య, శైవమౌనవ్రతము, అగస్త్యార్ఘ్యంస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షఋతువు, భాద్రపద మాసం12/09 సా.06:00 శుద్ధ పాడ్యమి శని ఘ.4:49, ఉ.గం.7:48. ఉత్తర ప.గం.2:08. శుభం సా.గం.5:43. బవ ఉ.గం.7:48. అహస్సు ఘ.30:32. వర్జ్యం రా.గం.10:38ల 12:15వ. అమృ ఉ.గం.6:58ల 8:33వ. భు.ఘ.4:18:15. ఉ.దు.5:52ల 7:30వ. చంద్రదర్శనం (నెలపొడుపు), మహత్తమవ్రతం13/09 సా.06:00 శు.విదియ ఆది ఘ.3:33, ఉ.గం.7:17. హస్త ప.గం.2:25. శుక్లం ప.గం.4:01. కౌలవ ఉ.గం.7:17. అహస్సు ఘ.30:29. వర్జ్యం రా.గం.10:41ల 12:20వ. అమృ ఉ.గం.8:21ల 9:58వ. భు.ఘ.4:28:28. సా.దు.4:27ల 5:16వ. 14/09 సా.06:30 శు.తదియ సోమ ఘ.3:27, ఉ.గం.7:15. చిత్త ప.గం.3:14. బ్రహ్మం ప.గం.3:06. గరజి ఉ.గం.7:15. అహస్సు ఘ.30:26. వర్జ్యం రా.గం.9:06ల 10:47వ. అమృ ఉ.గం.8:37ల 10:16వ. భు.ఘ.4:38:41. ప.దు.12:11ల 12:59వ. పునః ప.2:37ల 1:25వ. సువర్ణగౌరీవ్రతం, వినాయకచతుర్థీ, గణపతినవరాత్రి ప్రారంభం, గౌరీపూజ15/09 సా.05:30 శు.చవితి మంగళ ఘ.4:45, ఉ.గం.7:46. స్వాతి సా.గం.4:32. ఐంద్రం ప.గం.2:34. భద్ర ఉ.గం.7:46. అహస్సు ఘ.30:24. వర్జ్యం రా.గం.10:32ల 12:15వ. అమృ ఉ.గం.9:39ల 11:20వ. భు.ఘ.4:48:54. ఉ.దు.08:08ల 8:56వ. రా.దు.10:46ల 11:34వ. ఋషిపంచమీ16/09 సా.04:00 శు.పంచమి బుధ ఘ.7:19, ఉ.గం.8:48. విశాఖ సా.గం.6:16. వైధృతి ప.గం.2:24. బాలవ ఉ.గం.8:48. అహస్సు ఘ.30:22. వర్జ్యం రా.గం.10:38ల 12:23వ. అమృ ఉ.గం.8:50ల 10:33వ. భు.ఘ.4:59:7. మ.దు.11:32ల 12:20వ.17/09 సా.05:00 శు.షష్ఠి గురు ఘ.10:47, ప.గం.10:11. అనురాధ రా.గం.8:26. విష్కంభం ప.గం.2:35. తైతుల ఉ.గం.10:11. అహస్సు ఘ.30:20. వర్జ్యం రా.గం.2:36ల 4:22వ. అమృ ఉ.గం.9:06ల 10:51వ. భు.ఘ.5:9:20. పు.భు.5:17. ఉ.దు.9:54ల 10:42వ. మ.దు.2:45ల 3:33వ. కన్యా రవిః రా.11:29 ప్రవేశాత్ కన్యా సంక్రమణం18/09 ఉ.07:50 శు.సప్తమి శుక్ర ఘ.15:15, ప.గం.11:58. జ్యేష్ఠ రా.గం.10:52. ప్రీతి ప.గం.3:00. వనిక్ ప.గం.11:58. అహస్సు ఘ.30:17. వర్జ్యం లేదు. అమ ప.గం.1:10ల 2:56వ. భు.ఘ.00:02:45. ఉ.దు.8:17ల 9:05వ. మ.దు.12:17ల 1:08వ.19/09 ప.12:10 శు.అష్టమి శని ఘ.20:16, ప.గం.1:58. మూల రా.గం.1:30. ఆయుష్మాన్ ప.గం.3:34. బవ ప.గం.1:58. అహస్సు ఘ.30:14. వర్జ్యం ఉ.గం.7:44ల 9:30. పునః రా.11:44ల 1:30వ. అమృ రా.గం.6:24ల 8:10వ. భు.ఘ.00:13:00. ఉ.దు.5:52ల 7:29వ.20/09 సా.06:30 శు.నవమి ఆది ఘ.25:28, సా.గం.4:03. పూర్వాషాఢ రా.గం.4:06. సౌభాగ్యం ప.గం.4:11. కౌలవ సా.గం.4:03. అహస్సు ఘ.30:12. వర్జ్యం ప.గం.12:08ల 1:44వ. అమృ రా.గం.10:47ల 12:33వ. భు.ఘ.00:23:15. సా.దు.4:19ల 5:07వ. నందాదేవీపూజ, కేదారవ్రతం21/09 ప.11:00 శు.దశమి సోమ ఘ.30:23, సా.గం.6:01. ఉత్తరాషాఢ పూర్తి. శోభ సా.గం.4:42. గరజి సా.గం.6:01. అహస్సు ఘ.30:10. వర్జ్యం ప.గం.12:53ల 2:39వ. అమృ రా.గం.11:26ల 1:12వ. భు.ఘ.00:33:30. ప.దు.12:17ల 1:05వ. పునః ప.2:42ల 3:30వ. క్షీరవ్రతారంభ22/09 ప.12:00 శు.ఏకాదశి మంగళ ఘ.34:38, రా.గం.7:43. ఉత్తరాషాఢ ఉ.గం.6:27. అతిగండ సా.గం.5:02. వనిక్ ఉ.గం.6:52. అహస్సు ఘ.30:07. వర్జ్యం ప.గం.10:48ల 12:32వ. అమృ రా.గం.9:14ల 10:58వ. భు.ఘ.00:43:45. ఉ.దు.8:16ల 9:04వ. రా.దు.10:41ల 11:29వ. మతత్రయ పరివర్తన ఏకాదశి23/09 ఉ.09:00 శు.ద్వాదశి బుధ ఘ.37:50, రా.గం.9:01. శ్రవణం ఉ.గం.8:33. సుకర్మ సా.గం.5:04. బవ ఉ.గం.8:23. అహస్సు ఘ.30:04. వర్జ్యం ప.గం.12:49ల 2:31వ. అమృ రా.గం.11:05ల 12:48వ. భు.ఘ.00:54:00. మ.దు.11:29ల 12:15వ. కటదానం(దర్భాసనం), శక్రద్వాదశీ, కల్కిద్వాదశీ, వామన జయంతీ, శ్రవణద్వాదశీ24/09 సా.05:00 శు.త్రయోదశి గురు ఘ.40:01, రా.గం.9:53. ధనిష్ఠ ప.గం.10:12. ధృతి సా.గం.4:45. కౌలవ ఉ.గం.9:27. అహస్సు ఘ.30:02. వర్జ్యం సా.గం.5:45ల 7:26వ. అమృ రా.తె.గం.3:50ల 5:31వ. భు.ఘ.1:4:15. ఉ.దు.9:53ల 10:41వ. మ.దు.2:41ల 3:29వ.25/09 ఉ.07:45 శు.చతుర్దశి శుక్ర ఘ.40:45, రా.గం.10:11. శతభిషం ప.గం.11:23. శూల సా.గం.4:00. గరజి ఉ.గం.10:02. అహస్సు ఘ.30:00. వర్జ్యం సా.గం.5:58ల 7:36వ. అమృ తె.గం.3:50ల 5:29వ. భు.ఘ.1:14:30. ఉ.దు.8:17ల 9:05వ. మ.దు.12:17ల 1:05వ. అనంతవ్రతం (అనంత పద్మనాభచతుర్దశీ)26/09 ప.12:15 ఝ శు.పౌర్ణమి శని ఘ.40:21, రా.గం.10:01. పూర్వాభాద్ర ప.గం.12:06. గండ ప.గం.2:53. విష్టి ఉ.గం.10:06. అహస్సు ఘ.29:58. వర్జ్యం రా.గం.9:44ల 11:21వ. భు.ఘ.1:24:45. ఉ.దు.5:53ల 7:29వ. నోములకు పౌర్ణమి, ఉమా మహేశ్వరవ్రతం27/09 ప.02:30 బహుళ పాడ్యమి ఆది ఘ.38:31, రా.గం.9:17. ఉత్తరాభాద్ర ప.గం.12:15. వృద్ధి ప.గం.1:21. బాలవ ఉ.గం.9:39. అహస్సు ఘ.29:55. వర్జ్యం రా.గం.12:07ల 1:42వ. అమృ ఉ.గం.7:25ల 9:02వ. భు.ఘ.1:35:00. సా.దు.4:15ల 05:03వ. యాగకాలం, మహాలయపక్షప్రారంభః28/09 ప.11:00 బ.విదియ సోమ ఘ.35:50, రా.గం.8:14. రేవతి ప.గం.12:00. ధవం ప.గం.11:29. తైతుల గం.8:47. అహస్సు ఘ.29:52. వర్జ్యం లేదు. అమృ ఉ.గం.9:38ల 11:13వ. పునః అమృ తె.గం.4:19ల 5:52వ. భు.ఘ.1:45:15. ప.దు.12:16ల 1:03వ. పునః ప.2:39ల 3:26వ.29/09 సా.05:30 బ.తదియ మంగళ ఘ.31:52, సా.గం.6:39. అశ్విని ప.గం.11:19. వ్యాఘాతం ఉ.గం.9:16. వనిక్ ఉ.గం.7:26. అహస్సు ఘ.29:50. వర్జ్యం ఉ.గం.7:26ల 8:59వ. పునః రా.8:30ల 10:02వ. అమృ తె.గం.5:41ల 5:54వ. భు.ఘ.1:55:30. ఉ.దు.8:17ల 9:04వ. రా.దు.10:39ల 11:26వ. సంకటహర చతుర్థి, ఉండ్రాళ్ళతద్ది30/09 సా.04:30 బ.చవితి బుధ ఘ.27:14, సా.గం.4:48. భరణి ఉ.గం.10:17. హర్షణం ఉ.గం.6:45. వజ్రం తె.గం.4:05. బాలవ సా.గం.4:48. అహస్సు ఘ.29:48. వర్జ్యం రా.గం.9:38ల 11:09వ. అమృ శేషం ఉ.గం.5:54ల 7:12వ. భు.ఘ.2:5:45. మ.దు.11:27ల 12:14వ.01/10 సా.06:00 బ.పంచమి గురు ఘ.22:1, ప.గం.2:42. కృత్తిక ఉ.గం.8:59. సిద్ధి రా.గం.1:05. తైతుల ప.గం.2:42. అహస్సు ఘ.29:45. వర్జ్యం రా.గం.11:58ల 1:28వ. అమృ ఉ.గం.6:42ల 8:12వ. పునః రా.తె.4:28ల 5:58వ. భు.ఘ.2:16:00. ఉ.దు.9:51ల 10:38వ. మ.దు.2:36ల 3:14వ. 02/10 రా.08:00 బ.షష్ఠి శుక్ర ఘ.16:14, ప.గం.12:24. రోహిణి ఉ.గం.7:28, మృగశిర తె.5:52. వ్యతీపాత రా.గం.10:02. వనిక్ ప.గం.12:24. అహస్సు ఘ.29:42. వర్జ్యం ప.గం.12:42ల 2:11వ. అమృ రా.గం.9:39ల 11:09వ. భు.ఘ.2:26:15 ఉ.దు.8:16ల 9:03వ. మ.దు.12:14ల 1:01వ. వ్యతీపాత మహాలయం03/10 ఉ.08:45 బ.సప్తమి శని ఘ.10:14, ఉ.గం.10:00. ఆర్ద్ర రా.తె.గం.4:08. వరీయాన్ సా.గం.6:55. బవ ఉ.గం.10:00. అహస్సు ఘ.29:40. వర్జ్యం ప.గం.1:38ల 3:07వ. అమృ సా.గం.6:49ల 8:18వ. భు.ఘ.2:36:30. ఉ.దు.5:54ల 7:29వ. 04/10 ప.11:30 బ.అష్టమి ఆది ఘ.4:10, ఉ.గం.7:34. నవమి ఘ.53:57. తె.గం.5:09. పునర్వసు రా.గం.2:29. పరిఘ సా.గం.3:48. కౌలవ ఉ.గం.7:34. తైతుల సా.గం.6:21. అహస్సు ఘ.29:38. వర్జ్యం ప.గం.3:18ల 4:47వ. అమృ రా.గం.12:15ల 1:44వ. భు.ఘ.2:46:45. సా.దు.4:10ల 4:57వ. ఉమామహేశ్వరపూజ, మహాలకీ‡్ష్మ వ్రతోద్వాసనం, 05/10 రా.07:00 బ.దశమి సోమ ఘ.52:33, రా.గం.2:55. పుష్యమి రా.గం.12:58. శివం ప.గం.12:46. వనిక్ గం.4:06. అహస్సు ఘ.29:35. వర్జ్యం ప.గం.9:58ల 11:28వ. అమృ రా.గం.6:58ల 8:28వ. భు.ఘ.2:57:00. ప.దు.12:12ల 12:59వ. పునః ప.2:34ల 3:21వ.06/10 సా.05:15 బ.ఏకాదశి మంగళ ఘ.47:27, రా.గం.12:53. ఆశ్లేష రా.గం.11:39. సిద్ధం ప.గం.9:53. బవ ప.గం.1:54. అహస్సు ఘ.29:32. వర్జ్యం ప.గం.1:04ల 2:34వ. అమృ రా.గం.10:08ల 11:38వ. భు.ఘ.3:7:15. ఉ.దు.8:16ల 9:03వ. రా.దు.10:35ల 11:22వ.07/10 సా.04:10 బ.ద్వాదశి బుధ ఘ.43:11, రా.గం.11:10. మఘ రా.గం.10:39. సాధ్యం ఉ.గం.7:10. శుభం రా.తె.గం.4:38. కౌలవ ప.గం.12:02. అహస్సు ఘ.29:30. వర్జ్యం ప.గం.11:09ల 12:41వ. అమృ రా.గం.8:21ల 9:53వ. భు.ఘ.3:17:30. మ.దు.11:25ల 12:12వ. యతిమహాలయం08/10 సా.5:15 బ.త్రయోదశి గురు ఘ.39:43, రా.గం.9:48. పుబ్బ రా.గం.9:58. శుక్లం రా.గం.2:27. గరజి ఉ.గం.10:30. అహస్సు ఘ.29:28. వర్జ్యం ఉ.గం.6:27ల 8:00వ. పునః రా.తె.గం.5:05ల 5:55వ. అమృ ప.గం.3:45ల 5:18వ.భు.ఘ.3:27:45. ఉ.దు.9:20ల 10:07వ. మ.దు.2:33ల 3:20వ. కలియుగాది, మాసశివరాత్రి నిశీధి వారికి09/10 ప.02:30 బ.చతుర్దశి శుక్ర ఘ.37:21, రా.గం.8:51. ఉత్తర రా.గం.9:43. బ్రహ్మం రా.గం.12:41. విష్టి ఉ.గం.9:20. అహస్సు ఘ.29:26. వర్జ్యం శేషం గం.5:55ల 6:40వ. అమృ ప.గం.2:36ల 4:11వ. భు.ఘ.3:38:00. ఉ.దు.8:16ల 9:03వ. మ.దు.12:11ల 12:58వ. మాసశివరాత్రి ప్రదోషం వారికి, శహతమహాలయం10/10 ప.11:00 ∙బ.అమావాస్య శని ఘ.35:57, రా.గం.8:15. హస్త రా.గం.9:49. ఐంద్రం రా.గం.11:09. చతుష్పాత్ ఉ.గం.8:35. అహస్సు ఘ.29:24. వర్జ్యం ఉ.గం.6:09ల 7:45వ. అమృ ప.గం.3:48ల 5:24వ. శ్రాద్ధతిథి అమావాస్య. భు.ఘ.3:48:15. ఉ.దు.5:55ల 7:31వ. మహాలయ అమావాస్య స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదతువు, ఆశ్వయుజ మాసం. 11/10 ప.02:30 శుద్ధ పాడ్యమి ఆది ఘ.36:13, రా.గం.8:25. చిత్త రా.గం.10:37. వైధృతి రా.గం.10:11. కింస్తుఘ్నం ఉ.గం.8:22. అహస్సు ఘ.29:21. వర్జ్యం ఉ.గం.6:06ల 7:45వ. పునః తె.గం.4:29ల 5:56వ. అమృ ప.గం.4:00ల 5:39వ. భు.ఘ.3:58:30. సా.దు.4:06ల 4:53వ. యాగకాలం, శారదానవరాత్రి ప్రారంభం 12/10 సా.06:00 శు.విదియ సోమ ఘ.37:16, రా.గం.8:50. స్వాతి రా.గం.11:46. విష్కంభం రా.గం.9:34. బాలవ ఉ.గం.8:38. అహస్సు ఘ.29:18. వర్జ్యం శేషం ఉ.గం.5:56ల 6:09వ. పునః తె.గం.5:45ల 5:56వ. అమృ ప.గం.2:34ల 4:15వ. భు.ఘ.4:8:45. ప.దు.12:10ల 12:56వ. పునః ప.2:31ల 3:17వ. చంద్రదర్శనం (నెలపొడుపు)13/10 రా.07:00 శు.తదియ మంగళ ఘ.40:8, రా.గం.9:59. విశాఖ రా.గం.1:26. ప్రీతి రా.గం.9:16. తైతుల ఉ.గం.9:25. అహస్సు ఘ.29:16. వర్జ్యం శేషం ఉ.గం.5:56ల 7:27వ. పునః తె.గం.5:47ల 5:56వ. అమృ సా.గం.4:02ల 5:45వ. భు.ఘ.4:19:00. ఉ.దు.8:16ల 9:02వ. రా.దు.10:33ల 11:19వ.14/10 ఉ.09:00 శు.చవితి బుధ ఘ.43:25, రా.గం.11:18. అనురాధ రా.తె.గం.3:30. ఆయుష్మాన్ రా.గం.9:18. వనిక్ ఉ.గం.10:38. అహస్సు ఘ.29:14. వర్జ్యం శేషం గం.5:56ల 7:31వ. అమృ సా.గం.4:12ల 5:56వ. భు.ఘ.4:29:15. మ.దు.11:24ల 12:10వ.15/10 ప.12:00 శు.పంచమి గురు ఘ.48:21, రా.గం.1:17. జ్యేష్ఠ రా.తె.గం.5:56. సౌభాగ్యం రా.గం.9:39. బవ ప.గం.12:18. అహస్సు ఘ.29:11. వర్జ్యం ఉ.గం.9:41ల 11:26వ. అమృ రా.గం.8:15ల 10:01వ. భు.ఘ.4:39:30. ఉ.దు.9:50ల 10:36వ. మ.దు.2:30ల 3:16వ. 16/10 రా.08:15 శు.షష్ఠి శుక్ర ఘ.53:28, రా.గం.3:20. మూల పూర్తి. శోభ రా.గం.10:10. కౌలవ ప.గం.2:19. అహస్సు ఘ.29:08. వర్జ్యం ప.గం.2:48ల 4:34వ. అమృ రా.గం.1:26ల 3:12వ. భు.ఘ.4:49:45. ఉ.దు.8:17ల 9:03వ. మ.దు.12:10ల 12:56వ. సరస్వతీపూజా ప్రారంభం 17/10 ప.02:00 శు.సప్తమి శని ఘ.58:48, రా.తె.గం.5:28. మూల ఉ.గం.8:33. అతిగండ రా.గం.10:46. గరజి సా.గం.4:24. అహస్సు ఘ.29:6. వర్జ్యం ఉ.గం.6:47ల 8:33. పునః రా.7:10ల 8:46వ. అమృ తె.గం.5:49ల 5:57వ. భు.ఘ.5:00:00. ఉ.దు.5:57ల 7:30వ. దేవీత్రిరాత్రవ్రతం18/10 ప.02:00 శు.అష్టమి ఆది పూర్తి. పూర్వాషాఢ ప.గం.11:8. సుకర్మ రా.గం.11:19. విష్టి సా.గం.6:29. అహస్సు ఘ.29:04. వర్జ్యం రా.గం.7:58ల 9:44వ. అమృ శేషం ఉ.గం.5:57ల 7:35వ. భు.ఘ.5:10:15. పు.భు.5:12. సా.దు.4:02ల 4:48వ. చిత్త 2 రవిః ఉ.9:54 ప్రవేశదినే మహాష్టమీ, దుర్గాష్టమీ, తులా సంక్రమణం19/10 రా.08:30 శు.అష్టమి సోమ ఘ.3:51, ఉ.గం.7:30. ఉత్తరాషాఢ ప.గం.1:40. ధృతి రా.గం.12:06. బవ ఉ.గం.7:30. అహస్సు ఘ.29:02. వర్జ్యం రా.గం.6:00ల 7:44వ. అమృ ఉ.గం.6:35ల 8:21వ. పునరమ తె.గం.4:27ల. భు.ఘ.00:09:00. ప.దు.12:09ల 12:55వ. పునః ప.2:28ల 3:14వ. మహానవమీ 20/10 సా.05:30 శు.నవమి మంగళ ఘ.8:00, ఉ.గం.9:10. శ్రవణం ప.గం.3:45. శూల రా.గం.11:46. కౌలవ ఉ.గం.9:10. అహస్సు ఘ.28:59. వర్జ్యం రా.గం.8:08ల 9:51వ. అమృ శేషం ఉ.గం.5:58ల 6:11వ. భు.ఘ.00:19:50. ఉ.దు.8:18ల 9:04వ. రా.దు.10:31ల 11:17వ. విజయదశమీ, శమీపూజ, అపరాజితాదేవీపూజ21/10 సా.04:15 శు.దశమి బుధ ఘ.11:05, ప.గం.10:25. ధనిష్ఠ సా.గం.5:28. గండ రా.గం.11:29. గరజి ప.గం.10:25. అహస్సు ఘ.28:56. వర్జ్యం రా.గం.1:05ల 2:46వ. అమృ ఉ.గం.6:15ల 7:58వ. భు.ఘ.00:29:40. మ.దు.11:22ల 12:08వ.22/10 ప.11:30 శు.ఏకాదశి గురు ఘ.13:24, ప.గం.11:21. శతభిషం సా.గం.6:49. వృద్ధి రా.గం.10:53. భద్ర ప.గం.11:21. అహస్సు ఘ.28:54. వర్జ్యం రా.గం.1:26ల 3:05వ. అమృ ప.గం.11:13ల 12:54వ. భు.ఘ.00:39:30. ఉ.దు.9:50ల 10:36వ. మ.దు.2:27ల 3:13వ.23/10 రా.08:10 శు.ద్వాదశి శుక్ర ఘ.14:19, ప.గం.11:39. పూర్వాభాద్ర రా.గం.7:39. ధ్రువం రా.గం.9:52. బాలవ ప.గం.11:33. అహస్సు ఘ.28:52. వర్జ్యం రా.తె.గం.5:23ల 5:59వ. అమృ ఉ.గం.11:23ల 1:02వ. భు.ఘ.0:49:20. ఉ.దు.8:17ల 9:03వ. మ.దు.12:08ల 12:54వ. 24/10 సా.06:00 శు.త్రయోదశి శని ఘ.13:53, ప.గం.11:32. ఉత్తరాభాద్ర రా.గం.7:59. వ్యాఘాతం రా.గం.8:23. తైతుల ప.గం.11:32. అహస్సు ఘ.28:50. వర్జ్యం శేషం ఉ.గం.5:59ల 7:00వ. అమృ ప.గం.3:07ల 4:44వ. భు.ఘ.1:00:10. ఉ.దు.5:59ల 7:31వ.25/10 సా.06:30 శు.చతుర్దశి ఆది ఘ.12:16, ప.గం.10:53. రేవతి రా.గం.7:47. హర్షణం సా.గం.6:35. వనిక్ ప.గం.10:53. అహస్సు ఘ.28:48. వర్జ్యం ఉ.గం.7:53ల 9:28వ. అమృ సా.గం.5:24ల 6:59వ. భు.ఘ.1:11:00. సా.దు.3:58ల 4:44వ.26/10 ప.11:30 ఝ శు.పౌర్ణమి సోమ ఘ.9:28, ప.గం.9:46. అశ్విని రా.గం.7:11. వజ్రం ప.గం.4:24. బవ ఉ.గం.9:46. అహస్సు ఘ.28:45. వర్జ్యం ప.గం.3:16ల 4:50వ. పునః రా.తె.గం.4:24ల 5:56వ. అమృ ప.గం.12:10ల 1:44వ. భు.ఘ.1:21:50. ప.దు.12:07ల 12:52వ. పునః ప.2:25ల 3:10వ. యాగకాలం27/10 ప.12:30 బహుళ పాడ్యమి మంగళ ఘ.5:44, ఉ.గం.8:18. భరణి సా.గం.6:13. సిద్ధి ప.గం.1:56. కౌలవ ఉ.గం.8:18. అహస్సు ఘ.28:42. వర్జ్యం తె.గం.5:35ల 6:00వ. అమృ ప.గం.1:37ల 3:09వ. భు.ఘ.1:32:40. ఉ.దు.8:18ల 9:03వ. రా.దు.10:29ల 11:14వ.28/10 ఉ.07:30 బ.విదియ బుధ ఘ.1:12, ఉ.గం.6:29. బ.తదియ ఘ.54:52, తె.గం.4:26. కృత్తిక సా.గం.4:57. వ్యతీపాత ప.గం.11:13. గరజి ఉ.గం.6:29. వనిక్ సా.గం.5:28. అహస్సు ఘ.28:40. వర్జ్యం శేషం ఉ.గం.6:00ల 7:05వ. అమృ ప.గం.2:41ల 4:11వ. భు.ఘ.1:43:30. మ.దు.11:22ల 12:07వ. అట్లతద్దె, లలితాదేవీయాత్ర29/10 ఉ.11:15 బ.చవితి గురు ఘ.50:21, రా.గం.2:09. రోహిణి ప.గం.3:30, వరీయాన్ ఉ.గం.8:20. పరిఘ తె.గం.5:20. బవ సా.గం.3:24. అహస్సు ఘ.28:38. వర్జ్యం ఉ.గం.7:59ల 9:29వ. పునః రా.8:43ల 10:12వ. అమృ ప.గం.12:29ల 1:59వ. పునరమ తె.గం.5:41ల 6:01వ. భు.ఘ.1:54:20. ఉ.దు.9:50ల 10:35వ. మ.దు.2:24ల 3:09వ. సంకటహర చతుర్థి30/10 రా.08:15 బ.పంచమి శుక్ర ఘ.44:22, రా.గం.11:43. మృగశిర ప.గం.1:53. శివం రా.గం.2:06. కౌలవ ప.గం.12:57. అహస్సు ఘ.28:36. వర్జ్యం రా.గం.9:41ల 11:10వ. అమృ శేషం ఉ.గం.6:01ల 7:11వ. పునరమ రా.గం.2:54ల 4:24వ. భు.ఘ.2:5:10. ఉ.దు.8:18ల 9:03వ. మ.దు.12:07ల 12:52వ.31/10 సా.06:00 బ.షష్ఠి శని ఘ.38:19, రా.గం.9:21. ఆర్ద్ర ప.గం.12:12. సిద్ధం రా.గం.11:01. గరజి ఉ.గం.10:33. అహస్సు ఘ.28:34. వర్జ్యం రా.గం.11:22ల 12:51వ. భు.ఘ.2:16:00. ఉ.దు.6:01ల 7:34వ.01/11 ప.11:00 బ.సప్తమి ఆది ఘ.32:29, రా.గం.7:02. పునర్వసు ప.గం.10:34 సాధ్యం రా.గం.7:57. విష్టి ఉ.గం.7:12. అహస్సు ఘ.28:32. వర్జ్యం సా.గం.6:03ల 7:33వ. అమృ ఉ.గం.8:20ల 9:49వ. పునరమ రా.తె.గం.3:02ల 4:32వ. భు.ఘ.2:26:50. సా.దు.3:55ల 4:40వ.02/11 సా.06:30 బ.అష్టమి సోమ ఘ.27:00, సా.గం.4:50. పుష్యమి ఉ.గం.9:02. శుభం సా.గం.4:58. కౌలవ సా.గం.4:50. అహస్సు ఘ.28:30. వర్జ్యం రా.గం.9:06ల 10:36వ. భు.ఘ.2:37:40. ప.దు.12:07ల 12:52వ. పునః ప.2:24ల 3:09వ.03/11 ప.12:30 బ.నవమి మంగళ ఘ.22:01, ప.గం.2:51. ఆశ్లేష ఉ.గం.7:40. శుక్లం ప.గం.2:12. గరజి ప.గం.2:51. అహస్సు ఘ.28:27. వర్జ్యం రా.గం.7:07ల 8:39వ. అమ ఉ.6:09ల 7:39వ. పునరమ తె.గం.4:17ల 5:41వ. భు.ఘ.2:48:30. ఉ.దు.8:19ల 9:04వ. రా.దు.10:28ల 11:13వ.04/11 ఉ.07:30 బ.దశమి బుధ ఘ.17:48, ప.గం.1:10. మఘ ఉ.గం.6:34. పుబ్బ రా.తె.గం.5:41. బ్రహ్మం ప.గం.11:38. భద్ర ప.గం.1:10. అహస్సు ఘ.28:24. వర్జ్యం ప.గం.2:17ల 3:49వ. అమృ రా.గం.11:31ల 1:03వ. దశమి తిథి ప్రాంతీయంగా మారును. భు.ఘ.2:59:20. మ.దు.11:21ల 12:06వ.05/11 ఉ.11:15 బ.ఏకాదశి గురు ఘ.14:28, ప.గం.11:51. ఉత్తర రా.తె.గం.5:22. ఐంద్రం ఉ.గం.9:22. బాలవ ప.గం.11:51. అహస్సు ఘ.28:22. వర్జ్యం ప.గం.3:30ల 5:05వ. అమృ రా.గం.10:16ల 11:50వ. భు.ఘ.3:10:10. ఉ.దు.9:51ల 10:36వ. మ.దు.2:23ల 3:08వ.06/11 రా.08:15 బ.ద్వాదశి శుక్ర ఘ.12:11, ప.గం.10:56. హస్త రా.తె.గం.5:24. వైధృతి ఉ.7:25. విష్కంభం తె.గం.5:40. తైతుల ప.గం.10:56. అహస్సు ఘ.28:20. వర్జ్యం ప.గం.01:48ల 3:24వ. అమృ రా.గం.11:28ల 12:59వ. భు.ఘ.03:21:00. ఉ.దు.8:20ల 9:05వ. మ.దు.12:06ల 12:51వ.07/11 సా.06:30 బ.త్రయోదశి శని ఘ.11:05, ప.గం.10:30. చిత్త రా.తె.గం.5:58. ప్రీతి తె.గం.4:29. వనిక్ ఉ.గం.10:30. అహస్సు ఘ.28:18. వర్జ్యం ప.గం.01:35ల 3:13వ. అమృ రా.గం.11:24ల 1:12వ. భు.ఘ.03:31:50. ఉ.దు.6:04ల 7:54వ. మాసశివరాత్రి08/11 ప.03:00 బ.చతుర్దశి ఆది ఘ.11:09, ప.గం.10:33. స్వాతి పూర్తి. ఆయుష్మాన్ రా.తె.గం.3:43. శకుని ఉ.గం.10:33. అహస్సు ఘ.28:16. వర్జ్యం ప.గం.11:51ల 1:32వ. అమృ రా.గం.9:56ల 11:37వ. భు.ఘ.03:42:40. సా.దు.3:53ల 4:38వ. స్వాత్యభ్యంగస్నానం, దీపావళీ, లకీ‡్ష్మపూజ, తర్పణాలకు అమావాస్య09/11 ఉ.07:30 ∙బ.అమావాస్య సోమ ఘ.12:40, ప.గం.11:09. స్వాతి ఉ.గం.7:10. సౌభాగ్యం రా.తె.గం.3:21. నాగవం ప.గం.11:09. అహస్సు ఘ.28:14. వర్జ్యం ప.గం.1:08ల 2:50వ. అమృ రా.గం.11:22ల 1:04వ. భు.ఘ.3:53:30. ప.దు.12:06ల 12:51వ. పునః ప.2:22ల 3:07వ. కేదారవ్రతం, ఆకాశదీపప్రారంభం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదతువు, కార్తీక మాసం10/11 ప.12:30 శుద్ధ పాడ్యమి మంగళ ఘ.15:25, ప.గం.12:15. విశాఖ ఉ.గం.8:45. శోభ రా.తె.గం.3:17. బవ ప.గం.12:15. అహస్సు ఘ.28:14. వర్జ్యం ప.గం.1:05ల 2:49వ. అమృ రా.గం.11:28ల 1:17వ. భు.ఘ.4:4:20. ఉ.దు.8:21ల 9:06వ. రా.దు.10:27ల 11:12వ. యాగకాలం, బలిచక్రవర్తి పూజ, చంద్రదర్శనం (నెలపొడుపు)11/11 ప.04:20 శు.విదియ బుధ ఘ.19:14, ప.గం.1:48. అనురాధ ఉ.గం.10:44. అతిగండ రా.తె.గం.3:33. కౌలవ ప.గం.1:48. అహస్సు ఘ.28:11. వర్జ్యం సా.గం.4:54ల 6:40వ. అమృ రా.తె.గం.3:25ల 5:11వ. భు.ఘ.4:15:10. మ.దు.11:23ల 12:08వ. యమద్వితీయ, భగినీహస్తభోజనం12/11 సా.06:00 శు.తదియ గురు ఘ.23:55, ప.గం.3:41. జ్యేష్ఠ ప.గం.1:06. సుకర్మ రా.తె.గం.4:01. గరజి ప.గం.3:41. అహస్సు ఘ.28:8. వర్జ్యం రా.గం.9:57ల 11:43వ. భు.ఘ.4:26:00. ఉ.దు.9:52ల 10:37వ. మ.దు.2:22ల 3:07వ. 13/11 ఉ.07:15 శు.చవితి శుక్ర ఘ.29:07, సా.గం.5:46. మూల ప.గం.3:38. ధృతి రా.తె.గం.4:35. భద్ర సా.గం.5:46. అహస్సు ఘ.28:06. వర్జ్యం ప.గం.1:52ల 3:38వ. పునః రా.గం.2:17ల 4:03వ. అమృ ఉ.గం.8:33ల 10:19వ. భు.ఘ.4:36:50. ఉ.దు.8:22ల 9:07వ. మ.దు.12:07ల 12:52వ. నాగచతుర్థీ14/11 ఉ.11:00 శు.పంచమి శని ఘ.34:31, రా.గం.7:55. పూర్వాషాఢ సా.గం.6:15. శూల తె.గం.5:08. బవ ఉ.గం.6:51. అహస్సు ఘ.28:04. వర్జ్యం రా.గం.3:05ల 4:51వ. అమృ ప.గం.12:56ల 2:42వ. భు.ఘ.4:47:40. ఉ.దు.6:07ల 7:37వ. నాగపంచమీ15/11 సా.06:15 శు.షష్ఠి ఆది ఘ.39:35, రా.గం.9:58. ఉత్తరాషాఢ రా.గం.8:46. గండ తె.గం.5:33. కౌలవ ఉ.గం.8:59. అహస్సు ఘ.28:02. వర్జ్యం రా.గం.1:09ల 2:54వ. అమృ సా.గం.5:54ల 7:40వ. భు.ఘ.4:58:30. సా.దు.3:53ల 4:38వ.16/11 ప.11:20 శు.సప్తమి సోమ ఘ.44:00, రా.గం.11:44. శ్రవణం రా.గం.11:01. వృద్ధి తె.గం.5:44. గరజి ఉ.గం.10:47. అహస్సు ఘ.28:00. వర్జ్యం రా.గం.3:22ల 5:06వ. అమృ ప.గం.11:40ల 1:25వ. భు.ఘ.5:09:20. ప.దు.12:06ల 12:51వ. పునః ప.2:21ల 3:06వ.17/11 ప.12:15 శు.అష్టమి మంగళ ఘ.47:31, రా.గం.1:08. ధనిష్ఠ రా.గం.12:58. ధ్రువం తె.గం.5:38. విష్టి ప.గం.12:26. అహస్సు ఘ.28:00. వర్జ్యం లేదు. అమృ ప.గం.1:44ల 3:28వ. భు.ఘ.5:20:10. పు.భు.5:24. ఉ.దు.8:23ల 9:08వ. రా.దు.10:27ల 11:12వ. విశాఖ 4 రవిః ఉ.7:15. ప్రవేశాత్పరతః గోష్ఠాష్టమీ, వృశ్చిక సంక్రమణం18/11 ప.04:45 శు.నవమి బుధ ఘ.49:40, రా.గం.1:01. శతభిషం రా.గం.2:23. వ్యాఘాతం తె.గం.5:05. బాలవ ప.గం.1:35. అహస్సు ఘ.27:58. వర్జ్యం ఉ.గం.8:36ల 10:18వ. అమృ సా.గం.6:46ల 8:28వ. భు.ఘ.00:10:48. íమ.దు.11:23ల 12:08వ. 19/11 సా.04:45 శు.దశమి గురు ఘ.50:36, రా.గం.2:24. పూర్వాభాద్ర తె.గం.5:20. హర్షణం తె.గం.4:10. తైతుల ప.గం.2:13. అహస్సు ఘ.27:56. వర్జ్యం ఉ.గం.9:03ల 10:43వ. అమృ సా.గం.7:02ల 8:42వ. భు.ఘ.00:22:8. ఉ.దు.9:53ల10:38వ. మ.దు.2:21ల 3:06వ.20/11 ప.03:40 శు.ఏకాదశి శుక్ర ఘ.50:05, రా.గం.2:12. ఉత్తరాభాద్ర తె.గం.3:43. వజ్రం రా.గం.2:46. వనిక్ ప.గం.2:18. అహస్సు ఘ.27:54. వర్జ్యం ప.గం.1:05ల 2:42వ. అమృ రా.గం.10:50ల 12:28వ. భు.ఘ.00:33:28. ఉ.దు.8:25ల 9:10వ. మ.దు.12:08ల 12:53వ. 21/11 ప.02:25 శు.ద్వాదశి శని ఘ.48:22, రా.గం.1:34. రేవతి తె.గం.3:43. సిద్ధి రా.గం.1:04. బవ ప.గం.1:53. అహస్సు ఘ.27:52. వర్జ్యం ప.గం.3:43ల 5:19వ. అమృ రా.గం.1:19ల 2:55వ. భు.ఘ.00:44:48. ఉ.దు.6:11ల 7:42వ. క్షీరాబ్ధిద్వాదశీ 22/11 ఉ.08:00 శు.త్రయోదశి ఆది ఘ.45:34, రా.గం.12:26. అశ్విని రా.తె.గం.3:10. వ్యతీపాత రా.గం.10:06. కౌలవ ప.గం.1:00. అహస్సు ఘ.27:50. వర్జ్యం రా.గం.11:16ల 12:50వ. అమృ రా.గం.8:08ల 9:42వ. భు.ఘ.00:56:8. సా.దు.3:51ల 4:36వ.23/11 ఉ.06:30 శు.చతుర్దశి సోమ ఘ.41:52, రా.గం.10:58. భరణి రా.గం.2:19. వరీయాన్ రా.గం.8:34. గరజి ప.గం.11:42. అహస్సు ఘ.27:48. వర్జ్యం ప.గం.12:14ల 1:46వ. అమృ రా.గం.9:41ల 11:13వ. భు.ఘ.1:7:28. ప.దు.12:09ల 12:53వ. పునః ప.2:23ల 3:07వ.24/11 ప.12:15 ఝ శు.పౌర్ణమి మంగళ ఘ.37:11, రా.గం.9:06. కృత్తిక రా.గం.1:05. పరిఘ సా.గం.5:53. విష్టి ఉ.గం.10:02. అహస్సు ఘ.27:46. వర్జ్యం ప.గం.1:42ల 3:12వ. అమృ రా.గం.10:59ల 12:29వ. భు.ఘ.1:18:48. ఉ.దు.8:27ల 9:11వ. రా.దు.10:29ల 11:13వ. కార్తీకవ్రతోద్యాపనం, కేశబంధనగౌరీవ్రతం, జ్వాలాతోరణం, కుమారస్వామి దర్శనం25/11 సా.04:30 బహుళ పాడ్యమి బుధ ఘ.32:01, రా.గం.7:02. రోహిణి రా.గం.11:41. శివం ప.గం.3:02. బాలవ ఉ.గం.8:04. అహస్సు ఘ.27:46. వర్జ్యం ప.గం.4:09ల 5:39వ. పునః తె.గం.4:54ల 6:14వ. అమృ రా.గం.8:40ల 10:10వ. భు.ఘ.1:30:8. మ.దు.11:25ల 12:09వ. యాగకాలం26/11 సా.04:30 బ.విదియ గురు ఘ.25:28, సా.గం.4:25. మృగశిర రా.గం.10:04. సిద్ధం ప.గం.12:01. గరజి సా.గం.4:25. అహస్సు ఘ.27:44. వర్జ్యం శేషం గం.6:14ల 6:23వ. పునః తె.5:52ల 6:15వ. అమృ ప.గం.1:51ల 3:20వ. భు.ఘ.1:41:28. ఉ.దు.09:57ల 10:41వ. మ.దు.2:22ల 3:16వ. చాతుర్మాస్యద్వితీయ, అశూన్యశయనవ్రతం27/11 రా.08:15 బ.తదియ శుక్ర ఘ.19:59, ప.గం.2:15. ఆర్ద్ర రా.గం.8:24. సాధ్యం ఉ.8:54. శుభం తె.గం.5:46. భద్ర ప.గం.2:15. అహస్సు ఘ.27:42. వర్జ్యం శేషం ఉ.గం.6:15ల 7:21వ. అమృ ప.గం.11:06ల 12:35వ. భు.ఘ.1:52:48. ఉ.దు.8:28ల 9:12వ. మ.దు.12:10ల 12:54వ. సంకటహర చతుర్థి28/11 సా.06:30 బ.చవితి శని ఘ.14:18, ప.గం.11:58. పునర్వసు సా.గం.6:39. శుక్లం రా.గం.2:28. బాలవ ప.గం.11:58. అహస్సు ఘ.27:42. వర్జ్యం ఉ.గం.7:32ల 9:01వ. పునః రా.గం.2:09ల 3:39వ. అమృ ప.గం.4:26ల 5:55వ. భు.ఘ.2:4:8. ఉ.దు.6:15ల 7:45వ. 29/11 ఉ.09:00 బ.పంచమి ఆది ఘ.8:45, ఉ.గం.9:46. పుష్యమి సా.గం.5:10. బ్రహ్మం రా.గం.11:34. తైతుల ఉ.గం.9:46. అహస్సు ఘ.27:40. వర్జ్యం రా.తె.గం.5:13ల 6:43వ. అమృ ప.గం.11:10ల 12:40వ. భు.ఘ.2:15:28. సా.దు.3:52ల 4:36వ.30/11 సా.06:30 బ.షష్ఠి సోమ ఘ.3:25, ఉ.గం.7:39. బ.సప్తమి ఘ.54:45, తె.గం.5:37. ఆశ్లేష ప.3:47. ఐంద్రం రా.గం.8:44. వనిక్ ఉ.గం.7:39. విష్టి సా.గం.6:36. అహస్సు ఘ.27:38. వర్జ్యం శేషం ఉ.గం.6:17ల 6:43. పునః రా.తె.గం.3:12ల 4:43వ. అమృ ప.గం.2:16ల 4:43వ. భు.ఘ.2:26:48. ప.దు.12:10ల 12:54వ. పునః ప.2:23ల 3:07వ. 01/12 సా.06:30 బ.అష్టమి మంగళ ఘ.54:03, రా.గం.3:54. మఘ ప.గం.2:37. వైధృతి సా.గం.6:01. బాలవ సా.గం.4:45. అహస్సు ఘ.27:36.వర్జ్యం రా.గం.10:20ల 11:53వ. అమృ ప.గం.12:20ల 1:51వ. భు.ఘ.2:38:8. ఉ.దు.8:31ల 9:15వ. రా.దు.10:31ల 11:15వ.02/12 సా.04:30 బ.నవమి బుధ ఘ.50:54, రా.గం.2:40. పుబ్బ ప.గం.1:46. విష్కంభం ప.గం.3:42. తైతుల ప.గం.3:17. అహస్సు ఘ.27:34. వర్జ్యం రా.గం.8:50ల 10:24వ. అమృ ఉ.గం.7:36ల 9:09వ. భు.ఘ.2:49:28. మ.దు.11:28ల 12:12వ.03/12 సా.05:00 బ.దశమి గురు ఘ.48:43, రా.గం.1:47. ఉత్తర ప.గం.1:19. ప్రీతి ప.గం.1:37. వనిక్ ప.గం.2:13. అహస్సు ఘ.27:34. వర్జ్యం రా.గం.9:43ల 11:19వ. అమృ ఉ.గం.6:15ల 7:49. భు.ఘ.3:00:48. మ.దు.11:28ల 12:12వ.04/12 ఉ.07:00 బ.ఏకాదశి శుక్ర ఘ.47:53, రా.గం.1:29. హస్త ప.గం.1:18. ఆయుష్మాన్ ప.గం.11:53. బవ ప.గం.1:37. అహస్సు ఘ.27:34. వర్జ్యం రా.గం.9:27ల 11:05వ. అమృ ఉ.గం.7:18ల 8:54వ. భు.ఘ.3:12:8. ఉ.దు.8:31ల 9:15వ. మ.దు.12:11ల 12:55వ.05/12 సా.06:30 బ.ద్వాదశి శని ఘ.48:06, రా.గం.1:33. చిత్త ప.గం.1:46. సౌభాగ్యం ఉ.గం.10:33. కౌలవ ప.గం.1:31. అహస్సు ఘ.27:32. వర్జ్యం రా.గం.7:36ల 9:16వ. అమృ ఉ.గం.7:15ల 8:53వ. పునరమ తె.గం.5:35ల 6:19వ. భు.ఘ.3:23:28. ఉ.దు.6:19ల 7:49వ.06/12 ప.02:30 బ.త్రయోదశి ఆది ఘ.49:50, రా.గం.2:15. స్వాతి ప.గం.2:44. శోభ ఉ.గం.9:35. గరజి ప.గం.1:44. అహస్సు ఘ.27:32. వర్జ్యం రా.గం.8:40ల 10:22వ. అమృ ఉ.గం.6:19ల 7:15వ. భు.ఘ.3:34:48. సా.దు.3:54ల 4:38వ.07/12 ఉ.06:50 బ.చతుర్దశి సోమ ఘ.52:35, రా.గం.3:22. విశాఖ ప.గం.4:12. అతిగండ 9:04. విష్టి ప.గం.2:49. అహస్సు ఘ.27:30. వర్జ్యం రా.గం.8:30ల 10:14వ. అమృ ఉ.గం.6:52ల 8:34వ. భు.ఘ.3:46:8. ప.దు.12:13ల 12:57వ. పునః ప.2:25ల 3:09వ. మాసశివరాత్రి08/12 ఉ.10:15 ∙బ.అమావాస్య మంగళ ఘ.56:38, రా.తె.గం.5:00. అనురాధ సా.గం.6:06. సుకర్మ ఉ.గం.8:51. చతుష్పాత్ సా.గం.4:11. అహస్సు ఘ.27:30. వర్జ్యం రా.గం.12:13ల 1:58వ. అమృ ఉ.గం.6:53ల 8:37వ. భు.ఘ.3:57:28. ఉ.దు.8:33ల 9:17వ. రా.దు.10:33ల 11:17వ. కౌముద్యుత్సవం, తర్పణాలకు అమావాస్యస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం09/12 ఉ.09:30 శుద్ధ పాడ్యమి బుధ పూర్తి. జ్యేష్ఠ రా.గం.8:21. ధృతి ఉ.గం.8:59. కింస్తుఘ్నం సా.గం.5:59. అహస్సు ఘ.27:28. వర్జ్యం రా.తె.గం.5:13ల 6:22వ. అమృ ఉ.గం.10:43ల 12:28వ. భు.ఘ.4:8:48. మ.దు.11:30ల 12:14వ. 10/12 సా.05:00 శు.పాడ్యమి గురు ఘ.1:32, ఉ.గం.6:59. మూల రా.గం.10:54. శూల ఉ.గం.9:21. బవ ఉ.గం.6:59. అహస్సు ఘ.27:28. వర్జ్యం శేషం ఉ.గం.6:22ల 6:59వ. పునః రా.గం.9:08ల 10:54వ. అమృ ప.గం.2:50ల 4:36వ. భు.ఘ.4:20:8. ఉ.దు.10:03ల 10:47వ. మ.దు.2:26ల 3:10వ. చంద్రదర్శనం (నెలపొడుపు)11/12 ప.03:30 శు.విదియ శుక్ర ఘ.6:54, ఉ.గం.9:09. పూర్వాషాఢ రా.గం.1:33. గండ ఉ.గం.9:53. కౌలవ ఉ.గం.9:09. అహస్సు ఘ.27:28. వర్జ్యం ఉ.గం.9:46ల 11:32వ. అమృ రా.గం.8:13ల 9:59వ. భు.ఘ.4:31:28. ఉ.దు.8:36ల 9:20వ. మ.దు.12:15ల 12:59వ. రంభావ్రతం12/12 సా.05:40 శు.తదియ శని ఘ.12:18, ప.గం.11:19. ఉత్తరాషాఢ రా.తె.గం.4:07. వృద్ధి ఉ.గం.10:26. గరజి ప.గం.11:19. అహస్సు ఘ.27:26. వర్జ్యం ఉ.గం.10:25ల 12:11వ. అమృ రా.గం.9:20ల 10:48వ. భు.ఘ.4:42:48. ఉ.దు.6:24ల 7:52వ.13/12 ప.11:40 శు.చవితి ఆది ఘ.17:3, ప.గం.1:14. శ్రవణం పూర్తి. ధ్రువం ఉ.గం.10:52. భద్ర ప.గం.10:14. అహస్సు ఘ.27:26. వర్జ్యం ఉ.గం.8:35ల 10:21వ. అమృ రా.గం.7:15ల 9:01వ. భు.ఘ.4:54:8. సా.దు.3:56ల 4:40వ.14/12 సా.06:30 శు.పంచమి సోమ ఘ.21:44, ప.గం.3:07. ధనిష్ఠ పూర్తి. వ్యాఘాతం ఉ.11:05. బాలవ ప.గం.3:07. అహస్సు ఘ.27:26. వర్జ్యం ఉ.గం.10:45ల 12:29వ. అమృ రా.గం.9:07ల 10:49వ. భు.ఘ.5:5:28. ప.దు.12:17ల 1:01వ. పునః ప.2:28ల 3:12వ. నాగపంచమీ15/12 రా.07:30 శు.షష్ఠి మంగళ ఘ.25:05, ప.గం.4:28. ధనిష్ఠ ఉ.గం.8:23. హర్షణం ప.గం.11:01. తైతుల ప.గం.4:28. అహస్సు ఘ.27:24. వర్జ్యం ప.గం.4:01ల 5:41వ. అమృ రా.గం.2:12ల 3:54వ. భు.ఘ.5:16:48. ఉ.దు.8:37ల 9:23వ. రా.దు.10:37ల 11:21వ. 16/12 ఉ.09:30 శు.సప్తమి బుధ ఘ.27:10, సా.గం.5:18. శతభిషం ఉ.గం.9:51. వజ్రం ఉ.గం.10:35. వనిక్ సా.గం.5:18. అహస్సు ఘ.27:24. వర్జ్యం ప.గం.4:32ల 6:12వ. అమృ రా.గం.2:34ల 4:14వ. భు.ఘ.5:28:8. పు.భు.5:34. మ.దు.11:34ల 12:18వ. మూల 1 రవిః 07:13. ప్రవేశదినే ధనుస్సంక్రమణం మిత్రసప్తమీ, నందాసప్తమీ17/12 ప.11:15 శు.అష్టమి గురు ఘ.28:01, సా.గం.5:39. పూర్వాభాద్ర ఉ.గం.10:56. సిద్ధి ఉ.గం.9:48. బవ సా.గం.5:39. అహస్సు ఘ.27:24. వర్జ్యం రా.గం.8:45ల 10:23వ. భు.ఘ.00:5:4. ఉ.దు.10:06ల 10:50వ. మ.దు.2:29ల 3:13వ. కాలభైరవాష్టమీ18/12 రా.08:30 శు.నవమి శుక్ర ఘ.27:39, ప.గం.5:31. ఉత్తరాభాద్ర ప.గం.11:29. వ్యతీపాత ఉ.గం.8:35. కౌలవ ప.గం.5:31. అహస్సు 27:24. వర్జ్యం రా.గం.11:30ల 1:06వ. అమృ ఉ.గం.6:34ల 8:12వ. భు.ఘ.00:15:5. ఉ.దు.8:39ల 9:23వ. మ.దు.12:19ల 1:13వ.19/12 ప.02:30 శు.దశమి శని ఘ.25:53, సా.గం.4:49. రేవతి ప.గం.11:32. వరీయాన్ ఉ.7:00. పరిఘ తె.గం.5:18. గరజి సా.గం.4:49. అహస్సు ఘ.27:24. వర్జ్యం లేదు. అమృ ఉ.గం.9:09ల 7:15వ. పునః రా.తె.గం.4:04ల 5:38వ. భు.ఘ.00:25:26. ఉ.దు.6:28ల 7:56వ.20/12 ప.11:25 శు.ఏకాదశి ఆది ఘ.23:08, ప.గం.3:43. అశ్విని ప.గం.11:09. శివం రా.గం.2:50. భద్ర ప.గం.3:43. అహస్సు ఘ.27:24. వర్జ్యం ఉ.గం.7:13ల 8:47వ. పునః రా.8:26ల 9:59వ. అమృ తె.గం.5:43ల 7:16వ. భు.ఘ.00:36:47. సా.దు.3:58ల 4:42వ. ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి21/12 సా.06:45 శు.ద్వాదశి సోమ ఘ.19:20, ప.గం.2:12. భరణి ఉ.గం.10:22. సిద్ధం రా.గం.12:12. బాలవ ప.గం.2:12. అహస్సు ఘ.27:24. వర్జ్యం రా.గం.9:48ల 11:20వ. అమృ ఉ.గం.7:16ల 8:46వ. భు.ఘ.00:47:38. ప.దు.12:19ల 1:03వ. పునః ప.2:31ల 3:15వ.22/12 సా.05:00 శు.త్రయోదశి మంగళ ఘ.14:45, ప.గం.12:23. కృత్తిక ఉ.గం.9:15. సాధ్యం రా.గం.9:22. తైతుల ప.గం.12:23. అహస్సు ఘ.27:22. వర్జ్యం రా.గం.12:21ల 1:51వ. అమృ ఉ.గం.6:58ల 8:30వ. పునరమ తె.గం.4:53ల 6:23వ. భు.ఘ.00:58:29. ఉ.దు.8:40ల 9:24వ. రా.దు.10:39ల 11:23వ. హనుమద్వ్రతం23/12 సా.04:40 శు.చతుర్దశి బుధ ఘ.9:36, ఉ.గం.10:19. రోహిణి ఉ.7:54. మృగశిర తె.గం.6:22. శుభం సా.6:22. వనిక్ ఉ.గం.10:09. అహస్సు ఘ.27:22. వర్జ్యం ప.గం.1:08ల 2:37వ. రా.గం.10:07ల 11:37వ. భు.ఘ.1:9:20. మ.దు.11:37ల 12:21వ. దత్తజయంతీ, పాషాణచతుర్దశీ, నోములకు పౌర్ణమి24/12 సా.06:00 ఝ శు.పౌర్ణమి గురు ఘ.3:57, ఉ.గం.8:05.బహుళ పాడ్యమి ఘ.54:11, తె.గం.5:45. ఆర్ద్ర రా.గం.4:42. శుక్లం ప.గం.3:17. బవ ఉ.గం.8:05. బాలవ సా.గం.6:55. అహస్సు ఘ.27:22. వర్జ్యం ప.గం.2:12ల 3:41వ. అమృ రా.గం.7:15ల 9:44వ. భు.ఘ.1:20:11. ఉ.దు.10:09ల 11:53వ. మ.దు.2:32ల 3:16వ. యాగకాలం25/12 సా.05:45 బ.విదియ శుక్ర ఘ.52:07, రా.గం.3:21. పునర్వసు రా.గం.3:00. బ్రహ్మం ప.గం.12:07. తైతుల సా.గం.4:33. అహస్సు ఘ.27:22. వర్జ్యం ప.గం.3:51ల 5:20వ. అమృ రా.గం.12:46ల 2:15వ. భు.ఘ.1:31:2. ఉ.దు.8:41ల 9:25వ. మ.దు.12:20ల 1:04వ.26/12 సా.06:30 బ.తదియ శని ఘ.46:26, రా.గం.1:05. పుష్యమి రా.గం.1:24. ఐంద్రం ఉ.9:00. వైధృతి తె.గం.6:00. వనిక్ ప.గం.2:13. అహస్సు ఘ.27:24. వర్జ్యం ప.గం.10:29ల 11:58వ. అమృ సా.గం.7:26ల 8:55వ. భు.ఘ.1:41:53. ఉ.దు.6:31ల 7:59వ.27/12 సా.06:30 బ.చవితి ఆది ఘ.41:6, రా.గం.10:57. ఆశ్లేష రా.గం.11:58. విష్కంభం రా.గం.2:56. బవ ప.గం.12:00. అహస్సు ఘ.27:24. వర్జ్యం ప.గం.1:26ల 2:56వ. అమృ రా.గం.10:27ల 11:57వ. భు.ఘ.1:52:44. సా.దు.4:02ల 4:46వ. సంకటహర చతుర్థి28/12 సా.06:00 బ.పంచమి సోమ ఘ.36:18, రా.గం.9:03. మఘ రా.గం.10:44. ప్రీతి రా.గం.12:12. కౌలవ ప.గం.10:01. అహస్సు ఘ.27:14. వర్జ్యం ప.గం.11:22ల 12:52వ. అమృ రా.గం.8:08ల 9:38వ. భు.ఘ.2:3:35. ప.దు.12:23ల 1:07వ. పునః ప.2:34ల 3:18వ.29/12 సా.06:00 బ.షష్ఠి మంగళ ఘ.32:21, సా.గం.7:28. పుబ్బ రా.గం.9:50. ఆయుష్మాన్ రా.గం.9:43. గరజి ఉ.గం.8:16. అహస్సు ఘ.27:24. వర్జ్యం ఉ.గం.6:26ల 7:58వ. పునః తె.గం.4:52ల 6:26వ. అమృ రా.తె.గం.3:40ల 5:12వ. భు.ఘ.2:14:26. ఉ.దు.8:44ల 9:28వ. రా.దు.10:44ల 11:28వ.30/12 సా.05:00 బ.సప్తమి బుధ ఘ.29:13, సా.గం.6:14. ఉత్తర రా.గం.9:16. సౌభాగ్యం రా.గం.7:32. విష్టి ఉ.గం.6:50. అహస్సు ఘ.27:24. వర్జ్యం తె.గం.5:38ల 6:34వ. అమృ ప.గం.2:14ల 3:48వ. భు.ఘ.2:25:17. మ.దు.11:41ల 12:25వ. 31/12 సా.06:00 బ.అష్టమి గురు ఘ.27:17, సా.గం.5:29. హస్త రా.గం.9:12. శోభ సా.గం.5:45. కౌలవ సా.గం.5:21. అహస్సు ఘ.27:24. వర్జ్యం ఉ.గం.6:34ల 7:14వ. పునః తె.గం.5:18ల 6:35వ. అమృ ప.గం.3:13ల 4:49వ. భు.ఘ.2:36:8. ఉ.దు.10:14ల 10:58వ. మ.దు.2:37ల 3:21వ.01/01 సా.03:30 బ.నవమి శుక్ర ఘ.25:26, సా.గం.4:45. చిత్త రా.గం.9:32. అతిగండ సా.గం.4:14. గరజి సా.గం.4:45. అహస్సు ఘ.27:26. వర్జ్యం ఉ.గం.6:35ల 6:55వ. పునః రా.తె.3:20ల 5:00వ. అమృ ప.గం.3:03ల 4:40వ. భు.ఘ.2:46:59. ఉ.దు.8:47ల 9:31వ. మ.దు.12:26ల 1:10వ.02/01 సా.06:00 బ.దశమి శని ఘ.26:56, సా.గం.5:21. స్వాతి రా.గం.10:23. సుకర్మ ప.గం.3:08. భద్ర సా.గం.5:21. అహస్సు ఘ.27:26. వర్జ్యం రా.తె.గం.4:17ల 5:58వ. అమృ ప.గం.1:17ల 2:56వ. భు.ఘ.2:57:50. ఉ.దు.6:35ల 8:03వ.03/01 సా.07:00 బ.ఏకాదశి ఆది ఘ.28:41, సా.గం.6:03. విశాఖ రా.గం.11:39. ధతి ప.గం.2:27. బాలవ సా.గం.6:03. అహస్సు ఘ.27:26. వర్జ్యం రా.తె.గం.3:57ల 5:41వ. అమృ ప.గం.2:23ల 4:04వ. భు.ఘ.3:8:41. సా.దు.4:07ల 4:51వ. 04/01 సా.07:00 బ.ద్వాదశి సోమ ఘ.31:43, రా.గం.7:17. అనురాధ రా.గం.1:34. శూల ప.గం.2:09. కౌలవ ఉ.గం.6:39. అహస్సు ఘ.27:26. వర్జ్యం లేదు. అమృ ప.గం.2:20ల 4:04వ. భు.ఘ.3:19:32. ప.దు.12:28ల 1:12వ. పునః ప.2:39ల 3:23వ.05/01 సా.06:00 బ.త్రయోదశి మంగళ ఘ.35:48, రా.గం.8:55. జ్యేష్ఠ రా.గం.3:44. గండ ప.గం.2:10. గరజి ఉ.గం.8:06. అహస్సు ఘ.27:28. వర్జ్యం ఉ.గం.7:40ల 9:25వ. అమృ సా.గం.6:08ల 7:53వ. భు.ఘ.3:30:23. ఉ.దు.8:48ల 9:32వ. రా.దు.10:47ల 11:31వ.06/01 సా.04:50 బ.చతుర్దశి బుధ ఘ.40:41, రా.గం.10:52. మూల రా.తె.గం.6:13. వృద్ధి ప.గం.2:27. విష్టి ఉ.గం.9:54. అహస్సు ఘ.27:28. వర్జ్యం ప.గం.12:34ల 2:20వ. పునః రా.తె.4:27ల 6:13వ. అమృ రా.గం.11:09ల 12:55వ. భు.ఘ.3:41:14. మ.దు.11:44ల 12:28వ.07/01 సా.06:00 ∙బ.అమావాస్య గురు ఘ.46:6, రా.గం.1:02. పూర్వాషాఢ పూర్తి. ధ్రువం ప.గం.2:55. చతుష్పాత్ ప.గం.11:57. అహస్సు ఘ.27:30. వర్జ్యం సా.గం.4:52ల 6:38వ. అమృ రా.తె.గం.3:32ల 5:18వ. భు.ఘ.3:52:5. ఉ.దు.10:17ల 11:01వ. మ.దు.2:41ల 3:25వ. తర్పణాలకు అమావాస్యస్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, జనవరి 15 నుండి ఉత్తరాయనం హేమంతఋతువు, పుష్య మాసం08/01 రా.08:45 శుద్ధ పాడ్యమి శుక్ర ఘ.51:36, రా.గం.1:15. పూర్వాషాఢ ఉ.గం.8:53. వ్యాఘాతం ప.గం.3:28. కింస్తుఘ్నం ప.గం.2:09. అహస్సు ఘ.27:30. వర్జ్యం సా.గం.5:44ల 7:30వ. అమృ రా.తె.గం.4:22ల 6:08వ. భు.ఘ.4:2:53. ఉ.దు.8:49ల 9:33వ. మ.దు.12:29ల 1:13వ. యాగకాలం.09/01 ఉ.11:15 శు.విదియ శని ఘ.56:31, రా.తె.గం.5:13. ఉత్తరాషాఢ ఉ.గం.11:27. హర్షణం ప.గం.3:57. బవ ప.గం.4:14. అహస్సు ఘ.27:32. వర్జ్యం ప.గం.3:51ల 5:37వ. అమృ రా.గం.2:24ల 4:10వ. భు.ఘ.4:13:44. ఉ.దు.6:37ల 8:05వ. చంద్రదర్శనం.10/01 ఉ.08:00 శు.తదియ ఆది పూర్తి. శ్రవణం ప.గం.1:50. వజ్రం ప.గం.4:14. తైతుల సా.గం.6:05. అహస్సు ఘ.27:32. వర్జ్యం సా.గం.6:10ల 7:54వ. అమృ రా.గం.4:35ల 6:19వ. భు.ఘ.4:24:35. సా.దు.4:10ల 4:54వ.11/01 ఉ.07:00 శు.తదియ సోమ ఘ.00:49, ఉ.గం.6:57. ధనిష్ఠ ప.గం.3:53. సిద్ధి ప.గం.4:16. గరజి ఉ.గం.6:57. అహస్సు ఘ.27:32. వర్జ్యం రా.గం.11:35ల 1:17వ. భు.ఘ.4:35:26. ప.దు.12:30ల 1:14వ. పునః ప.2:42ల 3:26వ.12/01 ఉ.10:30 శు.చవితి మంగళ ఘ.4:04, ఉ.గం.7:15. శతభిషం సా.గం.5:31. వ్యతీపాత ప.గం.3:57. భద్ర ఉ.గం.7:15. అహస్సు ఘ.27:34. వర్జ్యం రా.గం.12:14ల 1:55వ. అమృ ప.గం.9:49ల 11:31వ. భు.ఘ.4:46:17. సిజేరియన్ ప.12:00. ఉ.దు.8:50ల 9:34వ. రా.దు.10:50ల 11:34వ.13/01 ఉ.07:00 శు.పంచమి బుధ ఘ.6:06, ఉ.గం.8:03. పూర్వాభాద్ర సా.గం.6:41. వరీయాన్ ప.గం.3:18. బాలవ ఉ.గం.8:03. అహస్సు ఘ.27:36. వర్జ్యం రా.తె.గం.4:33ల 6:11వ. అమృ ప.గం.10:18ల 11:59వ. భు.ఘ.4:57:8. మ.దు.11:47ల 12:31వ.14/01 ప.11:00 శు.షష్ఠి గురు ఘ.6:53, ఉ.గం.9:23. ఉత్తరాభాద్ర సా.గం.7:20. పరిఘ ప.గం.2:14. తైతుల ఉ.గం.9:23. అహస్సు ఘ.27:36. వర్జ్యం లేదు. అమృ ప.గం.2:25ల 4:03వ. భు.ఘ.5:7:59. పు.భు.5:18. ఉ.దు.10:19ల 11:03వ. మ.దు.2:44ల 3:28వ. మకరే రవిః రా.తె.3:06. ప్రవేశాత్ మకర సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాలః భోగి, మకర సంక్రమణం15/01 ఉ.07:00 శు.సప్తమి శుక్ర ఘ.6:18, ఉ.గం.9:09. రేవతీ రా.గం.7:32. శివం ప.గం.12:46. వనిక్ ఉ.గం.9:09. అహస్సు ఘ.27:38. వర్జ్యం ఉ.గం.7:26ల 9:03వ. అమృ ప.గం.1:06ల 2:43వ. భు.ఘ.00:01:24. ఉ.దు.8:51ల 9:35వ. మ.దు.12:36ల 1:16వ. ఉత్తరాషాఢ 2 రవిః రా.తె.3:06. సంక్రాంతి. తర్పణాలకు ప.3:06 వరకు పుణ్యకాలం.16/01 ప.12:00 శు.అష్టమి శని ఘ.4:35, ఉ.గం.8:28. అశ్విని రా.గం.7:13. సిద్ధం ఉ.గం.10:56. బవ ఉ.గం.8:28. అహస్సు ఘ.27:40. వర్జ్యం ప.గం.3:16ల 4:51వ. పునః తె.గం.4:32ల 6:05వ. అమృ ప.గం.12:07ల 1:42వ. భు.ఘ.00:10:54. ఉ.దు.6:38ల 8:06వ. కనుమ17/01 ఉ.09:00 శు.నవమి ఆది ఘ.1:40, ఉ.గం.7:18. శు.దశమి ఘ.56:24, తె.గం.5:52. భరణి సా.గం.6:31. సాధ్యం ఉ.గం.8:44. శుభం తె.గం.6:19. కౌలవ ఉ.గం.7:18. తైతుల సా.గం.6:35. అహస్సు ఘ.27:40. వర్జ్యం రా.తె.గం.6:00ల 6:38వ. అమ ప.గం.1:52ల 3:25వ. భు.ఘ.00:20:24. సా.దు.4:14ల 4:58వ.18/01 సా.07:00 శు.ఏకాదశి సోమ ఘ.53:33, రా.తె.గం.4:03. కృత్తిక సా.గం.5:30. శుక్లం రా.తె.గం.4:37. వనిక్ సా.గం.4:58. అహస్సు ఘ.27:42. వర్జ్యం శేషం ఉ.గం.6:38ల 7:32వ. అమృ ప.గం.3:12ల 4:44వ. భు.ఘ.0:29:44. ప.దు.12:33ల 1:18వ. పునః ప.2:46ల 3:31వ. మతత్రయ పుత్రదా ఏకాదశి, రైవతమన్వాది19/01 రా.07:50 శు.ద్వాదశి మంగళ ఘ.48:04, రా.గం.1:52. రోహిణి ప.గం.4:10. బ్రహ్మం రా.గం.12:38. బవ ప.గం.2:57. అహస్సు ఘ.27:44. వర్జ్యం ఉ.గం.8:37ల 10:07వ. పునః రా.గం.9:22ల 10:51వ. అమృ ప.గం.1:09ల 2:39వ. పునఃతె.గం.6:16ల 6:38వ. భు.ఘ.0:39:24. ఉ.దు.8:51ల 9:36వ. రా.దు.10:54ల 11:39వ. కూర్మద్వాదశీ20/01 రా.08:00 శు.త్రయోదశి బుధ ఘ.41:53, రా.గం.11:23. మృగశిర ప.గం.2:27. ఐంద్రం రా.గం.9:33. కౌలవ ప.గం.12:37. అహస్సు ఘ.27:44. వర్జ్యం రా.గం.10:21ల 11:51వ. అమృ ఉ.గం.6:38ల 7:45వ. పునః తె.గం.3:36ల 5:06వ. భు.ఘ.0:48:54. మ.దు.11:49ల 12:34వ.21/01 రా.06:45 శు.చతుర్దశి గురు ఘ.36:29, రా.గం.9:14. ఆర్ద్ర ప.గం.1:01. వైధతి సా.గం.6:24. గరజి ఉ.గం.10:18. అహస్సు ఘ.27:46. వర్జ్యం రా.గం.12:11ల 1:40వ. భు.ఘ.0:58:24. ఉ.దు.10:120ల 11:05వ. మ.దు.2:47ల 3:32వ.22/01 ఉ.08:00 ఝ శు.పౌర్ణమి శుక్ర ఘ.30:34, రా.గం.6:52. పునర్వసు ప.గం.11:21. విష్కంభం ప.గం.3:15. విష్టి ఉ.గం.8:02. అహస్సు ఘ.27:48. వర్జ్యం రా.గం.6:52ల 8:21వ. అమృ ఉ.గం.9:07ల 10:36వ. పునరమ తె.గం.3:46ల 5:16వ. భు.ఘ.1:7:54. ఉ.దు.8:52ల 9:37వ. మ.దు.12:34ల 1:19వ. 23/01 సా.06:00 బహుళ పాడ్యమి శని ఘ.24:54, ప.గం.4:36. పుష్యమి ఉ.గం.9:44. ప్రీతి ప.గం.12:10. కౌలవ ప.గం.4:36. అహస్సు ఘ.27:50. వర్జ్యం రా.గం.9:44ల 11:14వ. శ్రాద్ధతిథి పాడ్యమి. భు.ఘ.1:17:24. ఉ.దు.6:38ల 8:07వ. 24/01 సా.06:50 బ.విదియ ఆది ఘ.19:36, ప.గం.2:28. ఆశ్లేష ఉ.గం.8:15. ఆయుష్మాన్ ఉ.గం.9:11. సౌభాగ్యం తె.గం.6:15. గరజి ప.గం.2:28. అహస్సు ఘ.27:52. వర్జ్యం రా.గం.7:36ల 9:06వ. అమృ ఉ.గం.6:45ల 8:15వ. పునరమ తె.గం.4:47ల 6:17. భు.ఘ.1:26:54. సా.దు.4:18ల 5:03వ.25/01 ప.12:00 బ.తదియ సోమ ఘ.14:51, ప.గం.12:36. మఘ ఉ.గం.6:58. పుబ్బ రా.తె.గం.5:52. శోభ రా.తె.గం.3:42. భద్ర ప.గం.12:36. అహస్సు ఘ.27:52. వర్జ్యం ప.గం.2:36ల 4:08వ. అమృ రా.గం.11:47ల 11:19వ. భు.ఘ.1:36:24. ప.దు.12:35ల 1:20వ. పునః ప.2:49ల 3:34వ. సంకటహర చతుర్థి26/01 ప.11:00 బ.చవితి మంగళ ఘ.10:57, ప.గం.11:01, ఉత్తర తె.గం.5:10. అతిగండ రా.గం.1:23. బాలవ ప.గం.11:01. అహస్సు ఘ.27:54. వర్జ్యం ప.గం.12:51ల 2:24వ. అమృ రా.గం.10:13ల 11:46వ. భు.ఘ.1:45:54. ఉ.దు.8:52ల 9:36వ. రా.దు.10:56ల 11:41వ.27/01 ప.09:50 బ.పంచమి బుధ ఘ.7:57, ఉ.గం.9:49. హస్త తె.గం.5:00. సుకర్మ రా.గం.11:28. తైతుల ఉ.గం.9:49. అహస్సు ఘ.27:56. వర్జ్యం ప.గం.1:31ల 3:06వ. అమృ రా.గం.11:02ల 12:37వ. భు.ఘ.1:55:24. మ.దు.11:51ల 12:36వ.28/01 సా.07:15 బ.షష్ఠి గురు ఘ.6:04, ఉ.గం.9:04. చిత్త తె.గం.5:11. ధతి రా.గం.9:50. వనిక్ ఉ.గం.9:04. అహస్సు ఘ.27:58. వర్జ్యం ప.గం.1:04ల 2:41వ. అమృ రా.గం.10:44ల 12:21వ. భు.ఘ.2:4:54. ఉ.దు.10:21ల 11:06వ. మ.దు.2:50ల 3:35వ.29/01 సా.04:00 బ.సప్తమి శుక్ర ఘ.5:19, ఉ.గం.8:45. స్వాతి తె.గం.5:57. శూల రా.గం.8:38. బవ ఉ.గం.8:45. అహస్సు ఘ.28:00. వర్జ్యం ప.గం.10:57ల 12:36వ. అమృ రా.గం.9:52ల 11:31వ. భు.ఘ.2:14:24. ఉ.దు.8:52ల 9:37వ. మ.దు.12:36ల 1:21వ.30/01 సా.06:00 బ.అష్టమి శని ఘ.5:55, ఉ.గం.8:59. విశాఖ పూర్తి. గండ రా.గం.7:48. కౌలవ ఉ.గం.8:59. అహస్సు ఘ.28:02. వర్జ్యం ప.గం.11:52ల 1:33వ. అమృ రా.గం.9:59ల 11:40వ. భు.ఘ.2:23:54. ఉ.దు.6:37ల 8:07వ.31/01 సా.07:00 బ.నవమి ఆది ఘ.7:52, ఉ.గం.9:46. విశాఖ ఉ.గం.7:17. వృద్ధి రా.గం.7:24. గరజి ఉ.గం.9:46. అహస్సు ఘ.28:04. వర్జ్యం ప.గం.11:34ల 1:17వ. అమృ రా.గం.9:50ల 11:33వ. భు.ఘ.2:33:24. సా.దు.4:22ల 5:07వ.01/02 సా.06:50 బ.దశమి సోమ ఘ.10:52, ఉ.గం.10:58. అనురాధ ఉ.గం.9:00. ధ్రువం రా.గం.7:18. భద్ర ఉ.గం.10:58. అహస్సు ఘ.28:6వర్జ్యం ప.గం.3:05ల 4:49వ. అమృ రా.గం.11:32ల 11:16వ. భు.ఘ.2:42:54. ప.దు.12:36ల 1:21వ. పునః ప.2:51ల 3:36వ.02/02 సా.05:40 బ.ఏకాదశి మంగళ ఘ.15:00, ప.గం.12:37. జ్యేష్ఠ ప.గం.11:06. వ్యాఘాతం రా.గం.7:33. బాలవ ప.గం.12:37. అహస్సు ఘ.28:08. వర్జ్యం రా.గం.7:55ల 9:41వ. అమృ తె.గం.6:29ల 6:36వ. భు.ఘ.2:52:24. ఉ.దు.8:51ల 9:36వ. రా.దు.10:58ల 11:43వ.03/02 ప.09:50 బ.ద్వాదశి బుధ ఘ.19:55, ప.గం.2:34. మూల ప.గం.1:30. హర్షణం రా.గం.7:56. తైతుల ప.గం.2:24. అహస్సు ఘ.28:10. వర్జ్యం ప.గం.11:46ల 1:30వ. పునః రా.గం.12:08ల 1:54వ. అమృ శేషం ఉ.గం.6:36ల 8:15వ. భు.ఘ.3:1:54. మ.దు.11:52ల 12:37వ.04/02 సా.04:30 బ.త్రయోదశి గురు ఘ.25:14, ప.గం.4:42. పూర్వాషాఢ ప.గం.4:06. వజ్రం రా.గం.8:30. వనిక్ సా.గం.4:42. అహస్సు ఘ.28:12. వర్జ్యం రా.గం.12:59ల 2:45వ. అమృ ఉ.గం.10:47ల 12:33వ. భు.ఘ.3:11:24. ఉ.దు.10:26ల 11:11వ. మ.దు.2:52ల 3:37వ. మాసశివరాత్రి05/02 సా.06:00 బ.చతుర్దశి శుక్ర ఘ.30:46, సా.గం.6:53. ఉత్తరాషాఢ సా.గం.6:42. సిద్ధి రా.గం.8:36. శకుని సా.గం.6:93. అహస్సు ఘ.28:14. వర్జ్యం రా.గం.11:07ల 12:53వ. అమృ ప.గం.10:09ల 11:55వ. భు.ఘ.3:20:54. ఉ.దు.8:51ల 9:36వ. మ.దు.12:37ల 1:22వ.06/02 సా.06:00 ∙బ.అమావాస్య శని ఘ.35:42, రా.గం.8:52. శ్రవణం రా.గం.9:09. వ్యతీపాత రా.గం.9:24. చతుష్పాత్ ఉ.గం.7:52. అహస్సు ఘ.28:16. వర్జ్యం రా.గం.1:31ల 3:15వ. అమృ ప.గం.9:42ల 11:28వ. భు.ఘ.3:30:24. ఉ.దు.6:34ల 8:04వ.స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయనం, శశిరఋతువు, మాఘ మాసం07/02 ప.11:45 శుద్ధ పాడ్యమి ఆది ఘ.40:24, రా.గం.10:44. ధనిష్ఠ రా.గం.11:17. వరీయాన్ రా.గం.9:32. కింస్తుఘ్నం ఉ.గం.9:47. అహస్సు ఘ.28:18. వర్జ్యం లేదు. అమృ ప.గం.11:57ల 1:41వ. భు.ఘ.3:39:54. సా.దు.4:23ల 5:08వ. యాగకాలం, శ్యామలా నవరాత్రి ప్రారంభం08/02 రా.1:30 శు.విదియ సోమ ఘ.43:02, రా.గం.11:47. శతభిషం రా.గం.1:03. పరిఘ రా.గం.9:23. బాలవ ప.గం.11:15. అహస్సు ఘ.28:20. వర్జ్యం ఉ.గం.7:01ల 8:44వ. అమృ సా.గం.5:19ల 7:02వ. భు.ఘ.3:49:24. ప.దు.12:37ల 1:22వ. పునః ప.2:53ల 3:38వ. చంద్రదర్శనం09/02 సా.06:00 శు.తదియ మంగళ ఘ.45:00, రా.గం.12:34. పూర్వాభాద్ర రా.గం.2:31. శివం రా.గం.8:52. తైతుల ప.గం.12:10. అహస్సు ఘ.28:22. వర్జ్యం ఉ.గం.7:48ల 9:29వ. అమృ సా.గం.5:56ల 7:37వ. భు.ఘ.3:58:54. ఉ.దు.8:50ల 9:35వ. రా.దు.10:57ల 11:42వ. 10/02 సా.05:00 శు.చవితి బుధ ఘ.45:33, రా.గం.12:47. ఉత్తరాభాద్ర రా.గం.3:07. సిద్ధం రా.గం.7:54. వనిక్ ప.గం.12:40. అహస్సు ఘ.28:24. వర్జ్యం ప.గం.12:16ల 1:55వ. అమృ రా.గం.10:10ల 11:48వ. భు.ఘ.4:8:24. మ.దు.11:52ల 12:37వ. 11/02 సా.06:00 శు.పంచమి గురు ఘ.44:56, రా.గం.12:32. రేవతి రా.తె.గం.3:26. సాధ్యం సా.గం.6:35. బవ ప.గం.12:40. అహస్సు ఘ.28:26. వర్జ్యం ప.గం.3:16ల 4:53వ. అమృ రా.గం.1:00ల 2:37వ. భు.ఘ.4:17:54. ఉ.దు.10:22ల 11:07వ. మ.దు.2:55ల 3:40వ. శ్రీపంచమీ, వసంతోత్సవం12/02 రా.06:45 శు.షష్ఠి శుక్ర ఘ.42:58, రా.గం.11:45. అశ్విని రా.గం.3:11. శుభం సా.గం.4:52. కౌలవ ప.గం.12:09. అహస్సు ఘ.28:28. వర్జ్యం రా.గం.11:14ల 12:49వ. అమృ రా.గం.8:04ల 9:39వ. భు.ఘ.4:27:24. ఉ.దు.8:51ల 9:36వ. మ.దు.12:39ల 1:24వ.13/02 ప.12:00 శు.సప్తమి శని ఘ.39:59, రా.గం.10:33. భరణి రా.గం.2:35. శుక్లం ప.గం.2:49. గరజి ప.గం.11:09. అహస్సు ఘ.28:30. వర్జ్యం ప.గం.1:01ల 2:35వ. అమృ రా.గం.10:51ల 12:25వ. భు.ఘ.4:46:54. పు.భు.4:40. ఉ.దు.6:33ల 8:04వ. ధని 3 రవిః ప.1:55 ప్రవేశదినే కుంభ సంక్రమణం, రథసప్తమీ, సూర్యజయంతీ14/02 ప.11:45 శు.అష్టమి ఆది ఘ.35:54, రా.గం.8:55. కృత్తిక రా.గం.1:34. బ్రహ్మం ప.గం.12:26. విష్టి ఉ.గం.9:43. అహస్సు ఘ.28:32. వర్జ్యం ప.గం.2:05ల 3:37వ. అమృ రా.గం.11:18ల 12:50వ. భు.ఘ.00:5:46. సా.దు.4:27ల 5:12వ. భీష్మాష్టమీ15/02 రా.08:00 శు.నవమి సోమ ఘ.31:17, రా.గం.7:03. రోహిణి రా.గం.12:19. ఐంద్రం ఉ.గం.9:51. బాలవ ఉ.గం.7:58. అహస్సు ఘ.28:34. వర్జ్యం సా.గం.4:45ల 6:15వ. పునః తె.5:30ల 6:31వ. అమృ రా.గం.9:17ల 10:47వ. భు.ఘ.00:14:5. ప.దు.12:38ల 1:24వ. పునః ప.2:55ల 1:24వ. 16/02 రా.08:00 శు.దశమి మంగళ ఘ.25:58, ప.గం.4:54. మృగశిర రా.గం.10:49. వై«ధృతి ఉ.గం.6:56. విష్కంభం తె.గం.3:56. గరజి ప.గం.4:54. అహస్సు ఘ.28:37. వర్జ్యం శేషం ఉ.గం.6:31ల 7:00వ. అమృ ప.గం.2:34ల 4:04వ. భు.ఘ.00:22:24. ఉ.దు.8:47ల 9:33వ. రా.దు.10:59ల 11:45వ.17/02 ఉ.09:50 శు.ఏకాదశి బుధ ఘ.20:17, ప.గం.2:37. ఆర్ద్ర రా.గం.9:11. ప్రీతి రా.గం.12:35. భద్ర ప.గం.2:37. అహస్సు ఘ.28:40. వర్జ్యం ఉ.గం.6:38ల 8:07వ. అమృ ప.గం.11:52ల 1:21వ. భు.ఘ.00:30:43. మ.దు.11:51ల 12:37వ. మతత్రయ భీష్మ ఏకాదశి.18/02 ప.04:40 శు.ద్వాదశి గురు ఘ.14:51, ప.గం.12:26. పునర్వసు రా.గం.7:31. ఆయుష్మాన్ రా.గం.9:40. బాలవ ప.గం.12:26. అహస్సు ఘ.28:42. వర్జ్యం ఉ.గం.8:21ల 9:50వ. పునః వర్జ్యం రా.2:58ల 4:27వ. అమృ సా.గం.4:17ల 5:46వ. భు.ఘ.00:39:02. ఉ.దు.10:20ల 11:06వ. మ.దు.2:56ల 3:42వ. 19/02 సా.04:00 శు.త్రయోదశి శుక్ర ఘ.8:30, ఉ.గం.9:54. పుష్యమి సా.గం.5:53. సౌభాగ్యం సా.గం.6:33. తైతుల ఉ.9:54. అహస్సు ఘ.28:44. వర్జ్యం రా.తె.గం.5:52ల 6:30వ. అమృ ప.గం.11:55ల 1:24వ. భు.ఘ.00:47:21.ఉ.దు.8:48ల 9:34వ. మ.దు.12:38ల 1:24వ. వరాహకల్పం20/02 ప.02:40 శు.చతుర్దశి శని ఘ.2:45, ఉ.గం.7:36. శు.పౌర్ణమి ఘ.54:87, తె.గం.5:23. ఆశ్లేష ప.గం.4:20. శోభ ప.గం.3:32. వనిక్ ఉ.గం.7:36. విష్టి సా.గం.6:30. అహస్సు ఘ.28:46. వర్జ్యం శేషం ఉ.గం.6:30ల 7:22వ. పునః తె.గం.3:41ల 5:11వ. అమృ రా.గం.2:50ల 4:20వ. భు.ఘ.00:55:40. ఉ.దు.6:30ల 8:02వ. 21/02 ప.03:00 బహుళ పాడ్యమి ఆది ఘ.52:33, రా.గం.3:30. మఘ ప.గం.3:00. అతిగండ ప.గం.12:40. బాలవ సా.గం.5:04. అహస్సు ఘ.28:48. వర్జ్యం రా.గం.10:39ల 12:10వ. అమృ ప.గం.12:44ల 2:14వ. భు.ఘ.1:3:59. సా.దు.4:28ల 5:14వ.22/02 సా.07:00 బ.విదియ సోమ ఘ.48:32, రా.గం.1:53. పుబ్బ ప.గం.1:55. సుకర్మ ఉ.గం.8:48. తైతుల ప.గం.2:43. అహస్సు ఘ.28:50. వర్జ్యం రా.గం.8:54ల 10:27వ. అమృ ఉ.గం.7:48ల 8:20వ. పునరమ తె.గం.6:13ల 6:27వ. భు.ఘ.1:12:18. ప.దు.12:36ల 1:22వ. పునః ప.2:55ల 3:41వ.23/02 సా.05:00 బ.తదియ మంగళ ఘ.45:42, రా.గం.12:44. ఉత్తర ప.గం.1:11. «ధృతి ఉ.గం.7:36. శూల తె.గం.5:25. వనిక్ ప.గం.1:18. అహస్సు ఘ.28:52. వర్జ్యం రా.గం.9:28ల 11:03వ. అమృ శేషం ఉ.గం.6:27ల 7:46వ. భు.ఘ.1:20:37. ఉ.దు.8:45ల 9:31వ. రా.దు.10:58ల 11:44వ. యాగకాలం, వసంతోత్సవం, చూతకుసుమభక్షణం 24/03 సా.04:30 బ.విదియ బుధ ఘ.20:10, ప.గం.2:09. చిత్త రా.గం.8:30. గరజి ప.గం.2:09. ధ్రువం ఉ.గం.10:41. అహస్సు ఘ.30:04. వర్జ్యం రా.గం.1:01ల 2:39వ. అమృ ప.గం.2:05ల 3:41వ. భు.ఘ.1:10:34. మ.దు.11:37ల 12:25వ.25/03 ప.11:15 బ.తదియ గురు ఘ.20:33, ప.గం.2:18. స్వాతి రా.గం.8:58. వ్యాఘాతం ఉ.గం.8:52. భద్ర ప.గం.2:18. అహస్సు ఘ.30:06. వర్జ్యం రా.గం.8:49ల 10:29వ. అమృ ప.గం.12:00ల 1:38వ. భు.ఘ.1:18:32. ఉ.దు.10:07ల 10:55వ. మ.దు.2:55ల 3:43వ. సంకటహర చతుర్థి26/03 ఉ.07:00 బ.చవితి శుక్ర ఘ.20:03, ప.గం.2:05. విశాఖ రా.గం.9:59. హర్షణం ఉ.గం.8:13. బాలవ ప.గం.2:05. అహస్సు ఘ.30:08. వర్జ్యం రా.గం.2:14ల 3:57వ. అమృ ప.గం.12:48ల 1:28వ. భు.ఘ.1:26:30. ఉ.దు.8:29ల 9:17వ. మ.దు.12:30ల 1:18వ.27/03 ఉ.11:00 బ.పంచమి శని ఘ.21:53, ప.గం.2:49. అనురాధ రా.గం.11:27. వజ్రం ఉ.గం.7:12. తైతుల ప.గం.2:49. అహస్సు ఘ.30:10. వర్జ్యం రా.తె.గం.5:31ల 6:03వ. అమృ ప.గం.12:25ల 2:07వ. భు.ఘ.1:34:28. ఉ.దు.6:04ల 7:40వ.28/03 ఉ.08:30 బ.షష్ఠి ఆది ఘ.24:58, సా.గం.4:02. జ్యేష్ఠ రా.గం.1:24. సిద్ధి ఉ.గం.6:57. వనిక్ సా.గం.4:42. అహస్సు ఘ.30:12. వర్జ్యం శేషం ఉ.గం.6:03ల 7:15వ. అమృ సా.గం.3:53ల 5:37వ. భు.ఘ.1:42:26. సా.దు.4:31ల 5:19వ.29/03 ఉ.07:20 బ.సప్తమి సోమ ఘ.28:59, సా.గం.5:38. మూల రా.గం.3:39. వ్యతీపాత ఉ.గం.7:02. బవ సా.గం.5:38. అహస్సు ఘ.30:14. వర్జ్యం ప.గం.10:08ల 11:53. పునః రా.1:54ల 3:39వ. అమృ రా.గం.8:39ల 10:24వ. భు.ఘ.1:50:24. ప.దు.12:30ల 1:19వ. పునః ప.2:55ల 3:44వ. 30/03 ఉ.09:50 బ.అష్టమి మంగళ ఘ.33:52, రా.గం.7:34. పూర్వాషాఢ పూర్తి. వరీయాన్ ఉ.గం.7:22. బాలవ ఉ.గం.6:36. అహస్సు ఘ.30:17. వర్జ్యం ప.గం.2:17ల 4:03వ. అమృ రా.గం.12:55ల 2:41వ. భు.ఘ.1:58:16. ఉ.దు.8:28ల 9:17వ. రా.దు.10:54ల 11:43వ.31/03 ఉ.07:00 బ.నవమి బుధ ఘ.39:07, రా.గం.9:40. పూర్వాషాఢ ఉ.గం.6:14. పరిఘ ఉ.గం.7:55. తైతుల ఉ.గం.8:37. అహస్సు ఘ.30:20. వర్జ్యం ప.గం.3:06ల 4:52వ. అమృ రా.గం.1:45ల 3:31వ. భు.ఘ.2:6:14. మ.దు.11:47ల 12:36వ.01/04 ఉ.11:30 బ.దశమి గురు ఘ.44:19, రా.గం.11:44. ఉత్తరాషాఢ ఉ.గం.8:50. శివం ఉ.గం.8:30. వనిక్ ఉ.గం.10:41. అహస్సు ఘ.30:22. వర్జ్యం ప.గం.1:16ల 3:02వ. అమృ రా.గం.11:53ల 1:39వ. భు.ఘ.2:14:12. ఉ.దు.10:02ల 10:51వ. మ.దు.2:53ల 3:42వ.02/04 ప.02:00 బ.ఏకాదశి శుక్ర ఘ.49:09, రా.గం.1:19. శ్రవణం ప.గం.11:22. సిద్ధం ఉ.గం.8:53. విష్టి ప.గం.12:41. అహస్సు ఘ.30:24. వర్జ్యం ప.గం.3:45ల 5:30వ. అమృ రా.గం.2:17ల 4:02వ. శ్రాద్ధతిథి ఏకాదశి. భు.ఘ.2:22:10. ఉ.దు.8:25ల 9:14వ. మ.దు.12:27ల 1:18వ. మతత్రయ పాపమోచనీ ఏకాదశి03/04 సా.06:30 బ.ద్వాదశి శని ఘ.53:7, రా.గం.3:13. ధనిష్ఠ ప.గం.1:40. సాధ్యం ఉ.గం.9:24. కౌలవ ప.గం.2:25. అహస్సు ఘ.30:27. వర్జ్యం రా.గం.9:27ల 11:11వ. భు.ఘ.2:30:8. ఉ.దు.5:58ల 7:35వ.04/04 సా.06:30 బ.త్రయోదశి ఆది ఘ.56:7, రా.తె.గం.4:24. శతభిషం ప.గం.3:36. శుభం ఉ.గం.9:28. గరజి ప.గం.3:48. అహస్సు ఘ.30:30. వర్జ్యం రా.గం.10:24ల 12:06వ. అమృ ఉ.గం.7:49ల 9:33వ. భు.ఘ.2:38:6. సా.దు.4:30ల 5:19వ.05/04 సా.07:00 బ.చతుర్దశి సోమ ఘ.57:40, రా.తె.గం.5:00. పూర్వాభాద్ర సా.5:04. శుక్లం ఉ.గం.9:12. విష్టి సా.గం.3:41. అహస్సు 30:33. వర్జ్యం తె.3:05ల 4:45వ. అమృ ఉ.గం.8:35ల 10:17వ. భు.2:46:4. ప.దు.12:28ల 1:17వ. పునః దు.2:54ల 3:43వ. మాసశివరాత్రి06/04 ప.12:30 ∙బ.అమావాస్య మంగళ ఘ.58:14, రా.తె.గం.5:13. ఉత్తరాభాద్ర సా.గం.6:05. బ్రహ్మం ఉ.గం.8:33. చతుష్పాత్ సా.గం.5:06. అహస్సు 30:35. వర్జ్యం లేదు. అమృ ప.గం.1:05ల 2:45వ. భు.2:54:2. ఉ.దు.8:23ల 9:12వ. రా.దు.10:52ల 11:41వ.పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336Email: kappagantusomayajulu@gmail.com -
నవనాయక ఫలితాలు (2026– 2027)
రాజు గురువు: ద్విజులు సత్కర్మ నిరతులై ఉందురు. రాజులు, ప్రజలు న్యాయముగా సంచరించెదరు. రాజనీతి బాగుంటుంది. సుభిక్ష క్షేమ ఆరోగ్యములతో ప్రజలు సుఖించెదరు. సస్యానుకూల వృష్టిచే సస్యములు ఫలించును. అందరూ స్వధర్మ ఆచరణలో మంచి బుద్ధి ప్రదర్శించెదరు.మంత్రి కుజుడు: కలహములు, యుద్ధ, చోర, అగ్ని, రోగ భయములు పెరుగును. వాయుపీడ అధికము. వర్షము మధ్యమముగా ఉండును. పంటలకు తెగుళ్ళు రాగలవు. ధాన్యాదుల ధరలు పెరుగును. సేనాధిపతి చంద్రుడు: ఆహార ధాన్యములు, వెండి, బంగారం, బియ్యం, నూనెలు, నెయ్యి, పంచదార, నూలు ధరలు పెరుగును. మంచి వర్షములు ఉండును. సస్యములు బాగుగా ఫలించును. పశువులు క్షీరసమృద్ధి కలిగి ఉండును.సస్యాధిపతి శుక్రుడు: పంటలు బాగుగా పండును. తెల్లని ధాన్యము, తెల్లని భూమి బాగా ఫలించును. దేశమంతటను సుభిక్ష క్షేమారోగ్య సంపదలు ఉండును. సమస్త ధాన్యములు, వస్తువులకు ధరలు సరసమై ఉండును.ధాన్యాధిపతి బుధుడు: మధ్యస్థాయి వర్షములు పంటలు మధ్యస్థాయిగా ఫలించును. జనులకు భయము కలుగును. సూక్ష్మధాన్యములు బాగా ఫలించును.అర్ఘాధిపతి రవి: సువృష్టి సస్యాభివద్ధి కలుగును. ధరలు అధికం అవుతాయి. రాజులు సుఖించెదరు. ప్రజలకు అభివృద్ధి ఉంటుంది. నిత్యావసర సరుకులు ధరలు పెరుగును.మేఘాధిపతి చంద్రుడు: సర్వదేశములందు సువృష్టి. ధాన్యజాతులు అన్నియు ఫలించును. గోవులు విశేషంగా పాలిచ్చును.రసాధిపతి రవి: నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె మొదలగు రస జాతుల ధరలు లేనట్లుండును. ‘‘కార్పాస తైలేక్షు గుడాదికానాః’’ అని పాఠాంతరం ఉన్నది.నీరసాధిపతి శుక్రుడు: కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు అధిక ధరలకే లభించును.-పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
శ్రీ పరాభవ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం
∙డొల్లు కర్తరీ ప్రారంభం: ది.04–05–2026 రా.12:59లకు స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ బహుళ తదియ సోమవారం రోజు డొల్లుకర్తరీ ప్రారంభం. ∙పెద్ద కర్తరీ ప్రారంభం: ది.11–05–2026 రా.11:00లకు వైశాఖ బహుళ నవమి తత్కాల దశమి సోమవారం నిజకర్తరీ (పెద్ద కర్తరీ) ప్రారంభం. ∙కర్తరీ త్యాగం: 29–05–2026 ఉ.7:57 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశీ శుక్రవారం రోజు కర్తరీ త్యాగం అవుతుంది. మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మల ప్రారంభానికి కర్తరీ కాలంలో చేయరాదు. దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట, పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, పైకప్పు పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. ∙రాబోవు ప్లవంగ నామ సంవత్సరం (2027–28) కర్తరీ నిర్ణయము ∙ది.05–05–2027 ప్లవంగ చైత్ర బహుళ చతుర్దశీ బుధవారం డొల్లు కర్తరీ ప్రారంభం. ∙ది.12–05–2027 వైశాఖ శుద్ధ సప్తమీ మంగళ/బుధ నిజ కర్తరీ ప్రారంభం.∙ది.29–05– 2027 వైశాఖ బహుళ నవమీ శనివారం కర్తరీ త్యాగం. (సౌరమానం, చాంద్రమానం బార్హస్పత్య మానం అన్ని పంచాంగాలలోనూ కేవలం మాసం యొక్క ఆరంభం మార్పు తీసుకుంటుంది. చాంద్రమానం వారికి అమావాస్య వెళ్ళిన మరునాడు మాసం ప్రారంభం అవుతుంది. సౌరమానం వారికి రవి సంక్రమణం మరునాటి నుండి మాసం ప్రారంభం అవుతుంది. మిగతా అన్ని అంశాలలోనూ తిథి, వార నక్షత్రాలు ఒక్కటే ఉంటాయి.)-పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27
శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27చైత్ర మాసం మార్చి19 ఉగాది, తెలుగు సంవత్సరాది వసంతనవరాత్రి ప్రా.21 సౌభాగ్యశయినవ్రతం సౌభాగ్య గౌరీవ్రతం శివడోలోత్సవం27 శ్రీరామనవమీ29 ధర్మరాజదశమీ విష్ణుడోలోత్సవం, రుక్మిణీపూజ మతత్రయ (కామద) ఏకాదశి30 వామనద్వాదశీ31 అనంగత్రయోదశీ ఏప్రిల్01 నోములకు పౌర్ణమి02 సావిత్రీవ్రతం, ఇంద్రపూజ05 సంకటహర చతుర్థి07 మత్స్యజయంతీ13 మతత్రయ (వరూధినీ) ఏకాదశి14 మేష సంక్రమణం15 వరాహజయంతీవైశాఖ మాసం18 చంద్రదర్శనం (నెలపొడుపు)20 అక్షయతృతీయ, బలరామజయంతీ21 శంకర జయంతి, నాగచతుర్థీ23 విద్యారణ్య జయంతి, 24 అపరాజితాదేవీపూజ25 చండికాదేవీపూజ26 వాసవి జయంతి27 అన్నవరం సత్యదేవ కళ్యాణం, మోహినీ ఏకాదశి28 పరశురామద్వాదశీ30 నృసింహజయన్తీమే01 మహావైశాఖీ, సంపద్గౌరీవ్రతం11 హనుమజ్జయంతీ 15 వృషభ సంక్రమణంఅధిక జ్యేష్ఠ మాసం18 చంద్రదర్శనం జూన్15 మిథున సంక్రమణంనిజజ్యేష్ఠ మాసం16 చంద్రదర్శనం 25 మతత్రయ నిర్జల ఏకాదశి29 సావిత్రీవ్రతం, వృషభపూజజులై10 మతత్రయ యోగినీ ఏకాదశి11 కూర్మజయంతీ14 వటసావిత్రీవ్రతంఆషాఢ మాసం15 చంద్రదర్శనం 16 జగన్నాథ రథయాత్ర17 కర్కాటక సంక్రమణం20 కుమారషష్ఠీ25 తొలిఏకాదశీఆగస్టు09 మతత్రయ కామిక ఏకాదశిశ్రావణ మాసం14 చంద్రదర్శనం 16 నాగపూజ (నాగచతుర్థీ)21 వరలక్ష్మీవ్రతం, సెప్టెంబర్04 శ్రీకృ ష్ణ జన్మాష్టమీ 11 పోలాల అమావాస్య భాద్రపద మాసం12 చంద్రదర్శనం 14 వినాయకచతుర్థీ గణపతినవరాత్రి ప్రారంభం15 ఋషిపంచమీ17 కన్య సంక్రమణం27 మహాలయపక్ష ప్రారంభః29 ఉండ్రాళ్ళతద్ది, మహాభరణీ (పితృతిథి)అక్టోబర్10 మహాలయ అమావాస్యఆశ్వీయుజ మాసం12 చంద్రదర్శనం 16 సరస్వతీపూజా ప్రారంభం17 దేవీత్రిరాత్రవ్రతం18 మహాష్టమీ, దుర్గాష్టమీ తుల సంక్రమణం19 మహానవమీ20 విజయదశమీ, శమీపూజ28 అట్లతద్దె, లలితాదేవీయాత్రనవంబర్08 దీపావళీ, లక్ష్మీపూజ09 కేదారవ్రతం, ఆకాశదీప ప్రారంభంకార్తీక మాసం10 అఖండదీప ప్రారంభం చంద్రదర్శనం 13 నాగచతుర్థీ17 వృశ్చిక సంక్రమణం21 క్షీరాబ్ధిద్వాదశీ, 24 కార్తీక వ్రతోద్యాపనం తులస్యుద్వాసనండిసెంబర్04 మతత్రయ (ఉత్పన్నా) ఏకాదశి05 గోవత్సద్వాదశీమార్గశిర మాసం15 స్కందషష్ఠీ16 ధనుస్సు సంక్రమణం20 ముక్కోటి ఏకాదశి గీతా జయంతి22 హనుమద్వత్రం23 దత్తజయంతి జనవరిపుష్యమాసం09 చంద్రదర్శనం 14 భోగి, మకర సంక్రమణం15 సంక్రాంతి16 కనుమఫిబ్రవరిమాఘ మాసం11 శ్రీపంచమీ వసంతోత్సవం13 రథసప్తమీ కుంభ సంక్రమణం14 భీష్మాష్టమీ17 భీష్మ ఏకాదశీమార్చి06 మహాశివరాత్రి, మాసశివరాత్రిఫాల్గుణ మాసం09 చంద్రదర్శనం 15 మీన సంక్రమణం20 కామదహనం22 హోలికాపూర్ణిమ, హోలీ23 వసంతోత్సవంఏప్రిల్06 తర్పణాలకు అమావాస్య -పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336


