Visakhapatnam
-
నిధుల సంకటం
ఎమ్మెల్సీ ఎన్నికకు● ఎన్నికల నిర్వహణకు రూ.3 కోట్ల వరకు ఖర్చు? ● పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా విడుదల కాని నిధులు ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఎన్నికల కమిషన్ గానీ పైసా కూడా విదల్చలేదు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని మాత్రం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుండడం గమనార్హం. దీంతో జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ నిధులను ఎన్నికల నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు. ఈ నెల 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ముగియనుంది. 27వ తేదీన పోలింగ్, వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ముద్రణ శాలలో పోలింగ్కు అవసరమైన బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తవడంతో అవి విశాఖకు చేరుకున్నాయి. వాటిని ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపించారు. వాస్తవానికి ఈ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిధులు విడుదల చేయలేదు. దీంతో జిల్లా అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ఫండ్స్ నుంచి నిధులను మళ్లించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు రాని పక్షంలో మళ్లీ వాటిని సర్దుబాటు చేయడం అధికారులకు తలనొప్పిగా మారే అవకాశముంది. 21,555 మంది ఓటర్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 21, 555 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 12,948 మంది పురుషులు, 8,607 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4,829 మంది, విజయనగరంలో 4,937, మన్యం పార్వతీపురం మన్యంలో 2,262, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,448, విశాఖలో 5,277, అనకాపల్లి జిల్లాలో 2802 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్ల కోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల సామగ్రి కొనుగోలు, ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. తొలి విడతగా ఎన్నికల నిర్వహణపై మంగళవారం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఈ నెల 24న మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 3న ఆంధ్రా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి కూడా నిధులు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఎన్నికల ఖర్చు రూ.3 కోట్లు! ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం రూ.3 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 123 పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లకు నిధులు అవసరం. పోలింగ్ సిబ్బంది భోజనాలు, పోలింగ్ తర్వాత టీఏ, డీఏలు కూడా చెల్లించాల్సి ఉంది. -
66 కేసుల్లో 74 మంది అరెస్ట్
● జనవరిలో 106 చోరీ కేసుల నమోదు ● వీటిలో 66 కేసులను ఛేదించిన పోలీసులు ● రూ.92.04 లక్షలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం ● బాధితులకు సీపీ చేతుల మీదుగా సొత్తు అందజేత క్రికెట్ బెట్టింగ్పై ఫిర్యాదు ఇవ్వండి క్రికెట్ బెట్టింగ్ కారణంగా మోసపోయిన వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ పిలుపునిచ్చారు. నేరుగా పోలీస్స్టేషన్లో అయినా 7995095799 నెంబర్కు అయినా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ఎవరు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినా కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. సోమవారం స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో కూడా ఈ క్రికెట్ బెట్టింగ్పై ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఈ బెట్టింగ్ కార్యకలాపాలపై నగర టాస్క్ఫోర్స్ ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. విశాఖ సిటీ : నగరంలో నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జనవరి నెలలో 106 చోరీ కేసులు నమోదయ్యాయని, ఇందులో 66 కేసులను ఛేదించి 74 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.92,04,095 చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇందులో 310.13 గ్రాముల బంగారం, 536.6 గ్రాముల వెండి, రూ.4,56,495 నగదు, 7 బైక్లు, ఒక బస్, ఒక కారు, 2 ఆటోలు, 313 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్టాప్లు, 2 టీవీలు, 10 లారీ బ్యాటరీలు ఉన్నాయని వివరించారు. నగరంలో నేర నియంత్రణకు, అలాగే నిందితులను గుర్తించేందుకు గత జనవరి నెలలో 864 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే నేరాలు జరుగుతున్న తీరుపై 251 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ ద్వారా నిఘా పెట్టామన్నారు. అనంతరం బాధితులకు సొత్తు అందజేశారు. రౌడీలు జైల్లో ఉండాలి రౌడీలు, అసాంఘిక శక్తులు నగరంలో కాదు.. జైల్లో ఉండాలని సీపీ తేల్చి చెప్పారు. ఇప్పటికే విశాఖలో ఏడుగురిపై పీడీ యాక్ట్, ఐదుగురిపై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం అమలు చేసినట్లు తెలిపారు. ఇంకా చాలా మందిపై ఈ చట్టాలను అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రౌడీలను నగరంలో లేకుండా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీచ్ రోడ్డుపై ప్రత్యేక శ్రద్ధ బీచ్ రోడ్డులో కొంత మంది ఆకతాయిలు రేసులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదు వచ్చినట్లు సీపీ తెలిపారు. నగరంలో పలువురు వాహనదారులు నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. నోవోటెల్ హోటల్ డౌన్లో జరిగిన లారీ ప్రమాదం విషయంపై సీపీ స్పందిస్తూ.. ఈ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించామని, గతంలో జరిగిన ప్రమాదంలో ఒక ఎస్పీ అధికారి తండ్రి మరణించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ తరహా ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై డీసీపీ–1, ఏడీసీపీ ట్రాఫిక్, ఇతర అధికారులు దృష్టి పెట్టారని వెల్లడించారు. డ్రగ్స్ కేసులో నిందితులను గుర్తించాం ఇటీవల విశాలాక్షినగర్ ప్రాంతంలో దొరికిన డ్రగ్స్ కేసులో నిందితులను గుర్తించామని సీపీ తెలిపారు. త్వరలో అందరిని అరెస్టు చేస్తామని చెప్పారు. ఒడిశా నుంచి కొంత మంది గంజాయిని విశాఖ మీదుగా రవాణా చేస్తున్నారని, వారిపై నిఘా పెట్టామన్నారు. గోవా, బెంగళూరు నుంచి కొంత మంది సింథటిక్ డ్రగ్స్ నగరానికి తీసుకువస్తున్నట్లు గుర్తించామన్నారు. నగరంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణాను పూర్తిగా నియంత్రించే విషయంపై దృష్టి పెట్టామన్నారు. -
ఆట పాటలతో బోధన అవసరం
విశాఖ విద్య: ప్రీ ప్రైమరీ స్థాయిలో చిన్నారులకు ఆటపాటలతో విద్యనందించేలా అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ జోగ చంద్రశేఖర్ రావు అన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో 776 మంది అంగన్వాడీ కార్యకర్తలకు సమగ్ర శిక్ష ద్వారా మంగళవారం నుంచి ఆరురోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మండలాల్లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయగా, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో ఆయన పర్యటించి, శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారులు పాల్గొన్నారు. -
ఆర్గనైజ్డ్ క్రైం కేసులో ఇద్దరు తైవాన్ వాసుల అరెస్ట్
అల్లిపురం: వ్యవస్థీకృత(ఆర్గనైజ్డ్) క్రైం కేసులో ఇద్దరు తైవాన్ వాసులను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మంగళవారం మీడియాకు తెలిపిన వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 16న ఇల్లీగల్ పేమెంట్ గేట్ వే కేసు విచారణలో భాగంగా తైవాన్ జాతీయులైన ము–చి కోనియన్ సేంగ్ అలియాస్ సంగ్ ము–చి అలియాస్ మార్క్, హా–యున్ చాంగ్ అలియాస్ చాంగ్ హోవో–యున్ అలియాస్ మార్కోలు నగరంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్, సేన్ప్రా బే వ్యూ హోటల్లో బసచేసి అమాయకులను ఆకర్షించి, వారికి సైబర్ నేరాల్లో శిక్షణ అందించేవారు. దేశంలోని వివిధ వ్యక్తుల సాయంతో పేద, వ్యసనాలకు బానిసలైన వ్యక్తులకు డబ్బు ఆశ చూపి వివిధ బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్ ఖాతాలను తెరిచేవారు. వివిధ రకాల మొబైల్ నెట్వర్కులకు సంబంధించిన సిమ్కార్డులను తీసుకుని, దేశంలో వివిధ ప్రాంతాలలో మకాం వేసి రూ.కోట్ల లావాదేవీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ అజిత వేజెండ్ల సహకారంతో మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు ఇద్దరు విదేశీ నిందితులు, ఒక అంతర్ జిల్లా ముద్దాయితోపాటు 26 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ వెల్లడించారు. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
మహారాణిపేట: ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉంటూ, చాకచక్యంగా వ్యవహరించాలని పీవో, ఏపీవో, సెక్టోరల్ అధికారులనుద్దేశించి రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి విడత శిక్షణ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిసార్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నా.. నిర్లిప్తతకు తావులేకుండా, ఎన్నికల కమిషన్ ఆదేశాలు తుచ తప్పక పాటించాలన్నారు. సొంత నిర్ణయాలు పనికిరావని హెచ్చరించారు. ఏఆర్వో, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సుధాసాగర్, పీవో, ఏపీవో, సెక్టోరల్ అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తరువాత చేయాల్సిన విధులను పీపీటీ ద్వారా వివరించారు. ఎన్నికల సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వీసీ పీఠంపై ఐఐటీ ప్రొఫెసర్
ఉద్యోగ ప్రస్థానం ● 1997లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం.. ● 1998 నుంచి 2000 డిసెంబర్ వరకు జపాన్లోని టోక్యో యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేశారు. ● 2000 డిసెంబర్ నుంచి 2002 జూన్ వరకు ఐఐటీ ఖరగ్పూర్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా సేవలందించారు. ● 2002 జూన్ నుంచి 2007 ఏప్రిల్ వరకు అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు. ● అనంతరం సెలవులో ఉండి వివిధ అంశాలపై పరిశోధనలు చేశారు. ● 2011 నుంచి 2019 వరకు ఖరగ్పూర్ ఐఐటీలోనే ప్రొఫెసర్గా పనిచేశారు. ● 2019 ఆగస్టు నుంచి హెచ్ఏజీ స్కేల్తో అదే చోట ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. ● అలాగే ప్రొఫెసర్ రాజశేఖర్ ఖరగ్పూర్ ఐఐటీ డీన్గా, జేఈఈ మెయిన్స్ను ఐఐటీ ఖరగ్పూర్ నిర్వహించినప్పుడు చైర్మన్గా వ్యవహరించారు. ● స్థానికుడికే దక్కిన అవకాశం ● ఏయూ ఉపకులపతిగా ఆచార్య రాజశేఖర్ నియామకం విశాఖ విద్య/సింహాచలం: ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతిగా ఆచార్య గంగవంశం పైడి రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోన శశిధర్ సంయుక్తంగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య రాజశేఖర్ ప్రస్తుతం ఖరగ్పూర్ ఐఐటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా.. ఆచార్య రాజశేఖర్ది సింహాచలం. తమ ప్రాంతీయుడు ఏయూ వీసీగా నియామకం కావడం ఎంతో గర్వకారణమని రాజశేఖర్ స్నేహితులు, సన్నిహితులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర్ అడవివరం ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నారు. గ్రీన్పార్క్ సమీపంలోని సెయింట్ ఆంథోనీ స్కూల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియడ్(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ) పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఎస్సీ, ఎంఫిల్ పూర్తి చేసి అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. గణితంలో ఆచార్య రాజశేఖర్ చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కుటుంబ నేపథ్యం ప్రొఫెసర్ రాజశేఖర్ తండ్రి బలరామకృష్ణ అడవివరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తల్లి సావిత్రి గృహిణి. రాజశేఖర్ సోదరుడు గిరిధర్ విశాఖ స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్నారు. రాజశేఖర్ కుమార్తె కూడా ఖరగ్పూర్ ఐఐటీలో విద్యనభ్యసిస్తున్నారు. 2017లో అడవివరంలో జరిగిన గ్రంథాలయ వారోత్సవాల్లో స్థానికులు రాజశేఖర్ను ఘనంగా సత్కరించారు. రాజశేఖర్ ఏయూ వీసీగా నియామకం కావడంతో అతని స్నేహితులు పాశర్ల ప్రసాద్, టి.వి.కృష్ణంరాజు, రాజనాల సత్యారావు, వై.డి.వి ప్రసాద్, గ్రామస్తులు కర్రి అప్పలస్వామి, కొలుసు ఈశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. వీసీ రిలీవ్ ఏయూ ఇన్చార్జి వీసీ బాధ్యతల నుంచి ఆచార్య జి.శశిభూషణరావు మంగళవారం రిలీవ్ అయ్యారు. వర్సిటీకి నూతన వీసీని నియమించిన ప్రభుత్వం.. ప్రస్తుత వీసీ వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు శశిభూషణరావు వీసీ బాధ్యతల నుంచి వైదొలగి.. తన మాతృస్థానమైన ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా వెళ్లారు. ఇదిలా ఉండగా ఆచార్య శశిభూషణరావుకు ఏయూ పూర్తిస్థాయి వీసీగా అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరిగింది. మరో పక్క వీసీ పోస్ట్ కోసమని ప్రస్తుత రిజిస్ట్రార్ ఎన్.ధనుంజయరావు, రెక్టార్ కిశోర్బాబు తమ స్థాయిలో లాబీయింగ్ చేశారు. కానీ వీరికి అవకాశం దక్కలేదు. వర్సిటీలో కీలక పోస్టుల్లో ఉన్న వీరిని ఇక్కడ కాకుంటే, రాష్ట్రంలోని ఇతర వర్సిటీలకై నా పరిగణలోకి తీసుకుంటారని అంతా భావించారు. కూటమికి చెందిన కీలక నేతలు వీరి కి అభయం కూడా ఇచ్చారనే ప్రచారం సాగింది. కానీ ప్రభుత్వం నుంచి వీరికి ఆశాభంగం తప్పలేదు. కాగా.. వీసీగా నియమితులైన రాజశేఖర్ ఎప్పుడు విధుల్లో చేరుతారనేది స్పష్టత లేదు. దీనిపై వర్సిటీ వర్గాలకు కూడా సమాచారం లేనట్లుగా తెలుస్తోంది. దీంతో రిజిస్ట్రార్ ధనుంజయరావు పూర్తి స్థాయిలో వర్సిటీ కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇద్దరు ఆచార్యులకు వీసీలుగా అవకాశం ఆంధ్ర యూనివర్సిటీలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఆచార్యులను రాష్ట్రంలోని వేర్వేరు వర్సిటీలకు వైస్ చాన్సలర్లుగా ప్రభుత్వం నియమించింది. వర్సిటీ విద్యా విభాగంలో పనిచేస్తున్న ఆచార్య కూన రాంజీని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణా యూనివర్సిటీకి, ఇంగ్లిష్ విభాగంలో ప్రొఫెసర్గా పని చేస్తున్న ప్రసన్నశ్రీను రాజమండ్రిలోని నన్నయ యూనివర్సిటీకి వీసీలుగా నియమించింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచే ఇద్దరు ఆచార్యులకు వీసీలుగా అవకాశం దక్కడం విశేషం. -
ఇసుక లారీ బీభత్సం
అల్లిపురం: మంగళవారం ఉదయం 6.50 గంటలు.. ప్రభాత వేళ సముద్రపు అలలు తీరాన్ని తాకుతుండగా, అంతటా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇంతలో ఒక్కసారి పెద్ద శబ్దం. ఇసుక లారీ సృష్టించిన బీభత్సం. నోవాటెల్ హోటల్ రోడ్డులో పైనుంచి వస్తున్న లారీ బ్రేకులు ఫెయిలై బీచ్రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఆ సమయంలో బీచ్రోడ్డులో వాహనాల నిషేధం అమలులో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. మరో పది నిమిషాల తర్వాత ఈ ఘటన జరిగి ఉంటే, ఊహించని ఘోరం జరిగిపోయేది. ఈ ఘటనలో ఒక పాదచారికి గాయాలు కాగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు క్రేన్ సాయంతో లారీని తొలగించారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలివీ..శ్రీకాకుళం నుంచి ఫిషింగ్ హార్బర్కు 40 టన్నుల ఇసుకతో ఓ లారీ బీచ్రోడ్డు మీదుగా వస్తోంది. బీచ్రోడ్డులో నగర ప్రజలు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా వేకువజాము 4.30 నుంచి ఉదయం 7 గంటల వరకు, వీఎంఆర్డీఏ పార్కు నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ వాహనాల నిషేధం ఉంటుంది. వీఎంఆర్డీఏ పార్కు వద్ద రోడ్డు మూసివేసి ఉండటంతో లారీ డ్రైవర్ ఏయూ మీదుగా పందిమెట్ట పైనుంచి నోవాటెల్ డౌన్కు దిగాడు. ఆ సమయంలో లారీకి బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి, బీచ్ వైపు దూసుకుపోయింది. ప్రమాదాల నివారణకు రోడ్డుపై పోలీసులు ఏర్పాటు చేసిన పెద్ద ప్లాస్టిక్ ఇసుక డబ్బాలను ఢీకొట్టింది. ఫుట్పాత్ మీదుగా గోడను ఢీకొట్టి, అవతలి వైపు సర్వీసు రోడ్లోకి ఎగిరిపడి.. పార్కులోకి చొచ్చుకెళ్లింది. ఆ సమయంలో వాహనాలు, ప్రజల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెల్లివీధికి చెందిన తుపాకుల వెంకట రవికుమార్ నేవల్ కోస్టల్ బ్యాటరీ నుంచి ఆర్.కె.బీచ్కు వాకింగ్కు వెళ్తుండగా, ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. పార్కు గోడ దెబ్బతింది. ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న మహారాణిపేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, క్రేన్ సాయంతో లారీని అక్కడి నుంచి తొలగించారు. రవికుమార్ను కేజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.గతంలో ఇక్కడే రెండు ప్రమాదాలుగతంలో ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. స్కూల్ బస్సు ప్రమాదానికి గురి కాగా.. బస్సులో పిల్లలు లేక పోవడంతో ప్రాణనష్టం తప్పింది. మరో ప్రమాదంలో ఓ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో రక్షణ గోడను ఢీకొట్టి అవతలి వైపు గల సర్వీ సు రోడ్డులోకి వెళ్లింది. ఆ సమయంలో ఐపీఎస్ అధికారి తన కుటుంబంతో సహా అక్కడ సేదతీరుతున్నారు. ఈ ప్రమాదంలో అతని తండ్రి చనిపోగా, అధికారికి కాళ్లు విరిగిపోయాయి. ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు, పాదచారులు కోరుతున్నారు. -
నేటి నుంచి ఎగ్జిబిషన్
ఏయూక్యాంపస్: ప్రధానమంత్రి విశ్వకర్మ పథ కం మొదటి వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి 21 వరకు విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఎగ్జిబిషన్, ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. చేతివృత్తుల వారు తమ ఉత్పత్తులను 65 స్టాళ్లలో ప్రదర్శించనున్నారు. అర్మకొండను అధిరోహించారు సింథియా: తూర్పు నావికాదళ పరిధిలోని మెటీరియల్ ఆర్గనైజేషన్ విభాగ సిబ్బంది రాష్ట్రంలోని ఎత్తైన శిఖరమైన అర్మ కొండను మంగళవారం అధిరోహించారు. అడ్వెంచర్ యాక్టివిటీస్లో భాగంగా అర్మ కొండ ట్రెక్కింగ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. -
ట్రాలర్ ఢీకొని యువకుడి దుర్మరణం
అక్కిరెడ్డిపాలెం: ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని ట్రాలర్ రూపంలో మృత్యువు కబళించింది. షీలానగర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివీ.. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకయ్యపాలేనికి చెందిన మైలపల్లి మనోహర్ (24) మెరినో సంస్థలో సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా మంగళవారం నగరం నుంచి గాజువాక వైపు బైక్పై వెళ్తున్నాడు. షీలానగర్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వెనుకనే వేగంగా వస్తున్న ట్రాలర్ బైక్ను ఢీకొట్టింది. బైక్ అదుపు తప్పడంతో మనోహర్ తూలి లారీ చక్రాల కిందకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో మనోహర్ హెల్మెట్ ధరించినా.. లారీ చక్రాల కింద నలిగి హెల్మెట్ ఊడిపోయింది. తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రుడిని షీలానగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే మనోహర్ మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మనోహర్కు తండ్రి మైలపల్లి దేముడు, తల్లి దేముడమ్మ, ఒక సోదరి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పోలీస్ స్టేషన్కు చేరిన ‘ఆయుష్’ పంచాయితీ
పీఎం పాలెం: ఆయుష్ మధురవాడ జోన్ ప్రాంతీయ కార్యాలయ ఉప సంచాలకురాలు(ఆర్డీడీ) ఝాన్సీ లక్ష్మీబాయి, అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దళిత వర్గానికి చెందిన జె.సుష్మ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో మంగళవారం పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. గత ఏడాది నవంబర్లో మధురవాడ జోన్ ఆయుష్ ఆర్డీడీగా ఝాన్సీ లక్ష్మీబాయి బాధ్యతలు చేపట్టారు. కొంతకాలంగా సిబ్బందితో ఆమెకు పొసగట్లేదు. ఉన్నతాధికారిగా తనకు గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదన్న అక్కసుతో దిగువ సిబ్బందిపై రుసరుస లాడుతున్నారని, జూనియర్ అసిస్టెంట్ సుష్మను వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మంగళవారం లంచ్ సమయంలో అనీజీగా ఉందని, భోజనం చేసేందుకు ఆర్డీడీ గదిలోకి వెళ్లగా, తనపై లక్ష్మీబాయి చేయి చేసుకుని, విపరీతంగా దూషించినట్లు సుష్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పై అధికారినన్న కనీస జ్ఞానం లేకుండా తన పట్ల అనుచితంగా ప్రవర్తించి, దాడిచేసి తన దుస్తులు చింపివేసినట్లు ఆరోపిస్తూ ఆర్డీడీ ఝాన్సీ లక్ష్మీబాయి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. ఆయుష్ ఆర్డీడీ, జూనియర్ అసిస్టెంట్ పరస్పర ఫిర్యాదులు -
24న సర్టిఫికెట్ కోర్సులకు ఇంటర్వ్యూ
మురళీనగర్: కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ (గైస్)లో నిర్వహిస్తున్న స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024–25 సంవత్సరానికి ఏడాది వ్యవధి కలిగిన పారిశ్రామిక భద్రత కోర్సులో 60 సీట్లు, 6 నెలల వ్యవధితో ఫైర్ సేఫ్టీ కోర్సులో 30 సీట్లు, 4 నెలల వ్యవధితో ఆఫీస్ ఆటోమేషన్ కోర్సులో 20 సీట్లు, 3 నెలల వ్యవధితో కెమికల్ సూపర్వైజరీ ప్రొగ్రామ్లో 20 సీట్లు ఉన్నాయన్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు టెన్త్ పాస్/డిప్లొమా/ఇంటర్/డిగ్రీ సరిఙ్టఫికెట్, ఆధార్, రెండేళ్ల పారిశ్రామిక అనుభవ ధ్రువీకరణపత్రం ఒరిజినల్తో పాటు ఒక సెట్ జెరాక్స్తో ఆ రోజు ఉదయం 10గంటలకు నేరుగా గైస్ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా కోరారు. -
బహుళ పంటల విధానంపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: లాభదాయక సాగు విధానాలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ యాక్షన్ ప్లాన్పై కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతు వారీగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని, స్థానిక అవకాశాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రకృతి సేద్యానికి, మిల్లెట్లు, బహుళ పంటల సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ దిశగా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద కంపోస్ట్ పిట్ ఏర్పాటు, కిచెన్ గార్డెన్ల పెంపకం చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రత్యేక గ్రూప్లను ఏర్పాటు చేయాలని, వారికి అన్ని విధాలుగా సహకారం అందించాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సమూహాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజేయాలన్నారు. రైతు సేవా కేంద్రాలు, ఇతర మార్గాల ద్వారా రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు అధికారి మోహన్ రావు, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, సాగునీటి పారుదల శాఖ అధికారులు, ఇతర అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఏయూలో పేలవంగా వజ్రోత్సవాలు
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ జియో ఫిజిక్స్ విభాగం వజ్రోత్సవాలు పేలవంగా సాగుతున్నాయి. వర్సిటీలో జియో ఫిజిక్స్ విభాగం ఏర్పాటై 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో మూడు రోజుల పాటు ప్లాటినం జూబ్లీ ఉత్సవాల నిర్వహ ణకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మొదటి రోజు ప్రారంభ వేడుక డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగింది. రెండో రోజు మంగళవారం ఈ కార్యక్రమాన్ని వర్సిటీలోని జియో ఫిజిక్స్ బ్లాక్కు మార్చారు. రెండు హాళ్లలో సెమినార్లు కొనసాగేలా షెడ్యూల్ ఇచ్చారు. ఉపన్యాసాలు ఇచ్చే వారికి, ఆహూతులకు తగిన ఏర్పాట్లు చేశారు. అయితే ఒక హాల్లో మాత్రమే సెమినార్ నిర్వహించగా, రెండో హాల్ నిరుపయోగంగా వదిలేశారు. రెండో హాల్లో సెమినార్ ఇవ్వాల్సిన పలువురు విద్యావేత్తలు, విషయం తెలియక అక్కడే చాలా సేపు కూర్చున్నారు. మధ్యాహ్నం వరకు ఒకే హాల్లో సెమినార్ కొనసాగగా, దానికి కూడా పూర్తి స్థాయిలో ఆహూతులు లేక కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. సబ్జెక్టు పరంగా ఎంతో నిష్ణాతులైన వారు తమ అభిప్రాయాలు, అనుభవాలను పంచుకునే సమయంలో, వీటిని సద్వినియోగం చేసుకునే రీతిలో విద్యార్థులనైనా భాగ స్వాములను చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. విభాగం భవనం ముందు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను మధ్యాహ్నం వరకు 58 మంది మాత్రమే సందర్శించారు. మధ్యాహ్నం తరువాత ఏవీఎన్ కాలేజీ విద్యార్థులు తిలకించేందుకు వచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు త్వరలోనే జరగనున్నాయి. ఓ విభాగం నిర్వహించే వజ్రోత్సవాలే ఇలా ఉంటే.. వర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ఇంకెలా చేస్తారోనని ఆచార్యులు సైతం పెదవి విరుస్తున్నారు. -
ఎగిరే పావురమా..
ఏయూక్యాంపస్ : విశాఖ సాగర తీరం ఉదయాన్నే కపోతాల రాకతో సందడిగా మారుతోంది. సూర్యుడు రాకముందే వందలాది కపోతాలు ఆకాశంలో విహరిస్తూ నగరవాసులను కనువిందు చేస్తున్నాయి. అలల సవ్వడికి తోడు కపోతాల రెక్కల చప్పుడు ఈ ప్రాంతాన్ని ప్రత్యేక అనుభూతితో నింపుతోంది. కొంతమంది పక్షి ప్రేమికులు వేసే గింజలు, మురీలు లాంటి ఆహారాన్ని అందుకొని.. అవి నోట కరుచుకుని గాల్లోకి ఎగురుతుంటే ఆ దృశ్యం అద్భుతంగా ఉంటోంది. ఉదయాన్నే బీచ్కు వచ్చే పర్యాటకులు, నగరవాసులు ఈ కపోతాలతో కలిసి ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతున్నారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
సీజీఆర్ఎఫ్తో ‘విద్యుత్’ సమస్యల పరిష్కారం
సీతంపేట: విద్యుత్ సర్వీస్ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా, డబ్బులు డిమాండ్ చేసినా, బిల్లింగ్ లోపాలు, విద్యుత్ మీటర్లలో సమస్యలున్నా విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్)కు ఫిర్యాదు చేయాల్సిందిగా సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్, విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ బి.సత్యనారాయణ తెలిపారు. అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్లోని గౌరీ కల్యాణ మండపంలో తాటిచెట్లపాలెం పరిధి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీటర్లు కాలిపోవడం, విద్యుత్ వోల్టేజి హెచ్చు తగ్గులు, విద్యుత్ మీటర్లలో లోపాలు, అదనపు లోడు మంజూరు, యజమాని పేరు మార్పు, కొత్త విద్యుత్ సర్వీసులు వంటి ఏ సమస్య అయినా ీసీతమ్మధార ఈపీడీసీఎల్ కార్యాలయంలోని సీజీఆర్ఎఫ్కు నేరుగా రాత పూర్వకంగా గాని, ఆన్లైన్, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమస్యపై విచారణ చేపట్టి వినియోగదారునికి న్యాయం చేస్తామన్నారు. సీజీఆర్ఎఫ్కు 2004 నుంచి ఇప్పటి వరకు 8442 ఫిర్యాదులు రాగా వాటిలో 8367 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. తాటిచెట్లపాలెం సెక్షన్ పరిధిలో పలువురు వినియోగదారులు తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సీజీఆర్ఎఫ్ సభ్యులు షేక్ బాబర్, సులేఖ రాణి, మురళీకృష్ణ, ఈఈ టెక్నికల్ ధర్మరాజు, డీఈఈ విద్యాసాగర్, ఏఈ అప్పలరాజు, లైన్మన్లు, జేఎల్ఎంలు పాల్గొన్నారు. -
రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక
ఎంవీపీకాలనీ: జాతీయ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ పురుషుల కబడ్డీ జట్టు ఎంపికై ంది. ఈ మేరకు విశాఖ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాదరెడ్డి తెలిపారు. గత కొన్ని రోజులుగా 19 మంది క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించగా సెలక్షన్ కమిటీ సభ్యులు మంగళవారం 12 మందితో కూడిన తుదిజట్టును ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఎంపికై న రాష్ట్ర కబడ్డీ పురుషుల జట్టు ఒడిశాలోని కటక్ వేదికగా జరగనున్న 71వ జాతీయ కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కటక్లో ఈ పోటీలు జరగనున్నట్లు తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా కబడ్డీ నేషనల్ మెడలిస్ట్, విశాఖ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదరెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు సీహెచ్ పద్మరాజు, వైవీ శ్రీనివాస్లు వ్యవహరించారు. ఎంపికై న రాష్ట్ర జట్టును జి.రామకృష్ణ చౌదరి, లాలం రమేష్, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వై.శ్రీకాంత్, సీనియర్ జాతీయ క్రీడాకారుడు వీవీ రమణ, సీహెచ్ పద్మరాజు తదితర క్రీడా ప్రముఖులు అభినందించారు. -
బాలిక ఆత్మహత్య
సీతమ్మధార: నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీ, విష్ణు విల్లా అపార్ట్మెంట్లో పాల్ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయన రామాటాకీస్ దరి ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అతని భార్య పద్మావతి రైల్వే ఉద్యోగి. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంటర్ చదువుతుండగా, రెండో కుమార్తె కె.సాస(15) పదో తరగతి మధ్యలో ఆపేసింది. సాస ఎవరితో పెద్దగా కలిసేది కాదు. తల్లిదండ్రులతో కూడా ముభావంగా ఉండేది. గత ఏడాది సెప్టెంబర్లో స్కూల్ నుంచి టీసీ తీసుకున్న తర్వాత ఇంట్లోనే ఉంటోంది. ఇదిలా ఉండగా మంగళవారం మధ్యాహ్నం తన చిన్ననాటి స్నేహితురాలికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. కానీ ఆమె తన ఇంటికి రావాలని ఆహ్వానించింది. తనకు కడుపునొప్పి వస్తోందని, నువ్వే రావాలని సాస ఆమెను కోరింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కుమార్తెకు తల్లి నిమ్మరసం ఇచ్చింది. ఆ తర్వాత తల్లి, నాన్నమ్మ ఇంట్లో ఉన్న సమయంలో బాలిక నాలుగో అంతస్తుకు చేరుకుంది. వాటర్ ట్యాంక్పై కళ్లద్దాలు, మొబైల్ ఫోన్ పెట్టి.. అక్కడి నుంచి కిందకు దూకేసింది. ఆమె స్నేహితురాలు ఇంటికి వచ్చి సాస కోసం అడగ్గా బయటకు వెళ్లిందని వారు చెప్పారు. అంతలోనే అందరూ బయటకు వెళ్లి చూడగా సాస నిర్జీవంగా కనిపించింది. వెంటనే బాలికను రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇన్చార్జి సీఐ దాలిబాబు పర్యవేక్షణలో ఎస్ఐ చిన్నంనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్కేబీచ్ రోడ్డులో లారీ బీభత్సం
సాక్షి,విశాఖపట్నం:విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో మంగళవారం(ఫిబ్రవరి 18) ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. నోవాటెల్కు ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్ లోకి ఇసుకలారీ దూసుకుపోయింది. ఈ సమయంలో అక్కడ వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్,మరొకరికి గాయాలయ్యాయి.బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.గతంలో ఇదే ప్రాంతంలో రెండుసార్లు ప్రమాదాలు జరగడం గమనార్హం. -
‘మండే’ కాలం.!
సాక్షి, విశాఖపట్నం: సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరగడం.. ఎల్నినో ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఈసారి వేసవికాలం ముందుగానే వచ్చేస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మండేకాలం ముందుందని హెచ్చరిస్తున్నారు.నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంపై నైరుతి, ఆగ్నేయ దిశగా పొడిగాలులు వీస్తున్నాయి. దీనితోడు... సూర్యుడు నేటి నుంచి ఉత్తరార్థగోళం వైపు వస్తున్నాడనీ, ఈ రెండింటి ప్రభావంతో ముందస్తు వేసవి వచ్చేసినట్లేనని అంచనా వేస్తున్నారు.విజయనగరం, అనకాపల్లి, విశాఖ శివారు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. అన్ని చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీలు గరిష్టంగా నమోదవుతాయన్నారు. -
జిల్లాకు చేరుకున్న బ్యాలెట్ పత్రాలు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానం ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్యర్థుల ఫొటోలు, ఇతర వివరాలను ఇక్కడి నుంచి అధికారులు పంపించగా, సంబంధిత బ్యాలెట్ పత్రాలను కర్నూలులో ప్రింటింగ్ చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో సోమవారం కలెక్టరేట్కు తీసుకొచ్చారు. 10 శాతం రిజర్వ్తో కలిపి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్యకు సరిపడా పత్రాలను అధికారులు సేకరించి భద్రపరిచారు. ఏఆర్వో, జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం సంబంధిత వాహనానికి పోలీసులు, ఇతర లైజనింగ్ అధికారుల సమక్షంలో సీలు వేసి ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపించారు. స్పెషల్ పర్పస్ వెహికల్ కమిటీ ఏర్పాటు అల్లిపురం: గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో భాగంగా స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) కమిటీని ఏర్పాటు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్గా మున్సిప ల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్గా కలెక్టర్, డైరెక్టర్గా వీఎంఆర్డీఏ కమిషనర్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జీవీఎంసీ కమిషనర్, డైరెక్టర్లుగా జీవీఎంసీ అడిషనల్ కమిషనర్, చీఫ్ ఇంజినీర్తో పాటు మరో ఇద్దరు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. -
విజ్ఞాన్ కళాశాలలో విద్యార్థుల కోట్లాట
● యువతరంగం వేడుకలో ఘర్షణ ● ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కూర్మన్నపాలెం: విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు రెచ్చిపోయారు. యుద్ధాన్ని తలపించేలా ఒకరినొకరు కొట్టుకుని బీభత్సం సృష్టించారు. ఈ కొట్లాటలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీఐ కె.మల్లేశ్వరరావు అందించిన సమాచారం మేరకు.. కళాశాలలో ఏటా యువతరంగ్ పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి, ఆవిష్కరిస్తున్న సమయంలో విద్యార్థులు డ్యాన్సులు చేశారు. ఆ సమయంలో ఒక విద్యార్థికి మరో విద్యార్థి కాలు తగిలింది. ఆ విద్యార్థి క్షమాపణ చెప్పినప్పటికీ శాంతించని కాలు తగిలిన విద్యార్థి ఘర్షణకు దిగాడు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి.. ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీంతో కళాశాల ఆవరణ అంతా గందరగోళంగా మారిపోయింది. ఈ ఘర్షణలో ఈశ్వర్ అనే తృతీయ సంవత్సరం విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై ఈశ్వర్ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మల్లేశ్వరావు కేసు నమోదు చేశారు. ఇందుకు బాధ్యులైన బీటెక్ చదువుతున్న సూర్యకిరణ్, జయసూర్య, మరికొంతమంది విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పూర్తి వివరాలు సేకరించి బాధ్యులందరిపైనా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేస్తామన్నారు. ప్రస్తుతం కాలేజీలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్లు తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రిజర్వ్ బ్యాంక్ పేరుతో మోసాలు
● ముగ్గురు ముఠా సభ్యుల అరెస్టు ● పరారీలో ప్రధాన నిందితుడు గోపాలపట్నం: రిజర్వ్ బ్యాంక్ ద్వారా కోట్లాది రూపాయలు, విల్లాలు ఇప్పిస్తామని.. రూ.5 వేలు కడితే కోటి వరకు నజరానా వస్తుందని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను సోమవారం టాస్క్ఫోర్స్, ఎయిర్పోర్టు పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. రెండు రాష్ట్రాల్లో ఓ ముఠా రైస్ పుల్లింగ్, రిజర్వ్ బ్యాంక్ సర్టిఫికెట్లు వంటి పలు రకాల మోసాలకు పాల్పడుతోంది. ఇందులో కొందరు ముఠా సభ్యులు విశాఖలో ఉన్నట్లు సమాచారం రావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు మర్రిపాలెం వుడా లేఅవుట్ పార్క్ సమీపంలో ఒక ఇంటిపై దాడి చేశారు. విశాఖకు చెందిన లక్ష్మీ ప్రసన్న, కోటేశ్వరరావు, కాకినాడకు చెందిన శ్రీనివాస్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రధాన నిందితుడైన యడ్లపల్లి నారాయణ మూర్తి పరారయ్యాడు. వీరు గతంలో పలు చోట్ల దొంగ నోట్లు చలామణి చేయడం, రూ.5 వేలు, రూ.10 వేలు కడితే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. వీరు విశాఖ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలను అడ్డాగా మార్చుకుని ప్రజలను ఏమార్చుతున్నారు. కాగా.. టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులను ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎయిర్పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. -
20 నుంచి ఎల్టీటీ ఎక్స్ప్రెస్ పునరుద్ధరణ
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–లోకమాన్య తిలక్ టెర్మినస్– విశాఖపట్నం మధ్య నడిచే లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. విశాఖపట్నం–లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఈ నెల 20 నుంచి, లోకమాన్య తిలక్ టెర్మినస్–విశాఖపట్నం(18520) ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఈ నెల 22 నుంచి యథావిధిగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం రోడ్–చర్లపల్లి మధ్య స్పెషల్ రైలు చర్లపల్లి–శ్రీకాకుళంరోడ్–చర్లపల్లి మధ్య స్పెషల్ రైలు నడుపుతున్నట్లు సీనియర్ డీసీఎం తెలిపారు. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్(07025) స్పెషల్ ఈ నెల 21న చర్లపల్లిలో రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.45 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.47 గంటలకు బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం రోడ్ వెళ్తుంది. శ్రీకాకుళం రోడ్–చర్లపల్లి(07026) స్పెషల్ ఈ నెల 22న మధ్యాహ్నం 2.15 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయలుదేరి సాయంత్రం 4.45గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 4.47 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లి వెళ్తుంది. పలు రైళ్లు రద్దు... ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 19న విశాఖపట్నం–షాలిమర్(22854) ఎక్స్ప్రెస్, 21న సంత్రగచ్చి–ఎంీజీఆర్ చైన్నె సెంట్రల్ (22807) ఎక్స్ప్రెస్, 23న ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి(22808) ఎక్స్ప్రెస్లను రద్దు చేశారు. -
ఎన్నికల కోడ్ ధిక్కరించిన గంటా
● సింహగిరిపై ఆలయ మరమ్మతుపనులను ప్రారంభించిన గంటా ● హాజరవ్వని ఈవో, ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ వైదిక పెద్దలు సింహాచలం: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను ధిక్కరించి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ పైకప్పు మరమ్మతు పనులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. వర్షాలు పడినప్పుడు స్వామి ఆలయం పైకప్పు నుంచి వర్షం నీరు లోపలకి చేరుతోంది. దీంతో రూ.4 కోట్ల వ్యయంతో మరమ్మతులు చేపట్టేందుకు పుణేకు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలిజియస్ ట్రస్ట్ ఇటీవల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎప్పుడు పనులు ప్రారంభించేదీ అధికారులు ప్రకటించలేదు. సింహగిరికి సోమవారం వచ్చిన గంటా శ్రీనివాసరావు సంబంధిత పనులను ప్రారంభించారు. అయితే దేవస్థానం ఈవో, ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ అధికారులు, ప్రముఖ వైదికవర్గం ఎవరూ పాల్గొనలేదు. వారంతా ఎన్నికల కోడ్ ఉండడంతోనే పాల్గొనలేదని తెలుస్తోంది. ఆలయ నిబంధనలు, ఆగమశాస్త్ర పద్ధతులు తెలిసిన ఆలయ వైదిక పెద్దలతో పాటు, ఇంజినీరింగ్ అధికారులు లేకుండా గంటా ఎలా శంకుస్థాపన చేస్తారన్న ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆది నుంచి ఆలయ మరమ్మతు పనులను గంటా తన ఖాతాలో వేసుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలకు ఆయన చర్యలు బలాన్ని చేకూర్చాయి. -
కాల్మనీ ఒత్తిళ్లతో వ్యక్తి ఆత్మహత్య
● రూ.5 వేలు అప్పుచేసిన శంకరావు ● డబ్బులు చెల్లించాలని వడ్డీ వ్యాపారుల వేధింపులు మధురవాడ: మారికవలస రాజీవ్ గృహకల్పలో విషాదం చోటుచేసుకుంది. కాల్ మనీ వ్యాపారుల ఒత్తిళ్లు తాళలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజీవ్ గృహకల్పలో ఉంటున్న దాసరి శంకరరావు (40)కు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అతడు గతంలో సొంత అవసరాల నిమిత్తం వడ్డీ వ్యాపారుల వద్ద రూ.5 వేలు ఫైనాన్స్ తీసుకున్నాడు. వారం రోజుల నుంచి ఫైనాన్స్ కట్టకపోవడంతో వడ్డీ వ్యాపారులు.. శంకరరావు ఇంటికి వచ్చి దుర్భాషలాడారు. వెంటనే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. మనస్తాపం చెందిన శంకరరావు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యాన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని భార్య పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
బ్యూటీ బార్ ముసుగులో వ్యభిచారం
● నలుగురు అరెస్టు కూర్మన్నపాలెం: అందం మెరుగుదిద్దే ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న బ్యూటీ బార్పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో విటుడు, మహిళ, బార్ నిర్వాహకుడు, ఆయన సహాయకుడిని అరెస్టు చేసినట్లు దువ్వాడ సీఐ కె.మల్లేశ్వరావు తెలిపారు. కూర్మన్నపాలెం ప్రధాన రహదారిపై ఎస్ఎస్ బ్యూటీ బార్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పట్టుబడిన నలుగురిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ఈ కేసు విచారణ జరుగుతోందని, పూర్తి వివరాలు సేకరించి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల అందజేత -
వేతనాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్ల ధర్నా
సీతమ్మధార: అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారించాలని కోరుతూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెరగలేదన్నారు. వేతనాల పెంపు, తదితర సమస్యల పరిష్కారం కోసం 42 రోజు సమ్మె చేశామని గుర్తు చేశారు. ఈ క్రమంలో 2024 జూలైలో వేతనాలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిందన్నారు. అయినప్పటికీ నేటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసినట్లు చెప్పారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి కార్యకర్తలు, ఆయాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని, సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని కోరారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చులకు రూ. 20 వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకటలక్ష్మి, ఎల్.దేవి, అర్బన్ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు నూకరత్నం, జిల్లా కోశాధికారి పద్మ, ఉపాధ్యక్షులు శోభారాణి, నాగేశ్వరి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, కార్యదర్శి జి.అప్పలరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
స్టీల్ప్లాంట్ ఆవిర్భావ వేడుకలు లేనట్టే?
ఉద్యోగుల్లో అసంతృప్తి నేడు నిరసన ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఆవిర్భావ వేడుకలు ఈ ఏడాది లేనట్టే.! ఉద్యోగులకు ఇచ్చే జవహర్లాల్ నెహ్రూ అవార్డుల ప్రదానం కూడా వాయిదా పడింది. దీంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖ స్టీల్ప్లాంట్ 1982లో ఏర్పాటైంది. ప్లాంట్ ఏర్పాటై మంగళవారానికి 43 ఏళ్లు పూర్తవుతున్నాయి. గత 42 ఏళ్లుగా ఏటా ఫిబ్రవరి 18న ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీ, ప్రత్యేక నడక, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించేవారు. అదే విధంగా ఉక్కు త్రిష్ణా మైదానంలో ఉద్యోగుల కుటుంబ సభ్యుల సమక్షంలో క్రమశిక్షణ, అంకితభావంతో పని చేసే అధికారులు, కార్మికులకు జవహర్లాల్ నెహ్రూ అవార్డుల ప్రదానం జరిగేది. అయితే 2023–24 సంవత్సరానికి అధికారులకు చెందిన ఏసీఆర్లు సిద్ధం కాలేదన్న కారణంతో.. యాజమాన్యం వేడుకలు నిర్వహించడం లేదనే సమాచారంతో ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం స్టీల్ప్లాంట్ ఉత్పత్తి, ఉత్పాదకతలు గణనీయంగా పెరగడంతో పాటు మంచి స్థితికి చేరింది. త్వరలో మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించే తరుణంలో ఉద్యోగులను ప్రోత్సహించాల్సిన యాజమాన్యం తీసుకున్న తాజా నిర్ణయంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్ణయానికి నిరసనగా మంగళవారం ఉదయం కార్మిక సంఘాలు ఉక్కు స్మృత్యంజలి కూడలి వద్ద నిరసన తెలపనున్నట్లు గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు, పోరాట కమిటీ కన్వీనర్ కె.ఎస్.ఎన్.రావు తెలిపారు. -
రెండు ఇళ్లలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు
సొత్తు స్వాధీనం ఆరిలోవ : ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల కిందట చోరీకి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతోపాటు అతడి వద్ద నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు క్రైం విభాగం డీసీపీ లతా మాధురి తెలిపారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఆమె విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 14న పాతడెయిరీఫారం సమీపం జాతీయరహదారిని ఆనుకొని రాజీవ్నగర్లోని వసంత విహార్లో ఈరాకి సత్యనారాయణ ప్లాట్లో దొంగలు పడి సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, దానికి సమీపంలో సాయి రెసిడెన్సీలో చుక్కా వంశీకృష్ణ ఇంట్లో 28 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు, రూ.లక్ష నగదు, ల్యాండ్ డాక్యుమెంట్లు దోచుకుపోయారని తెలిపారు. దీనిపై బాధితులు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఆరిలోవ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి 24 గంటల్లో దొంగను పట్టుకున్నట్లు తెలిపారు. మల్కాపురం ప్రాంతం గొల్లవీధికి చెందిన నూనెల కృష్ణ ఈ దొంగతనాలు చేసినట్లు చెప్పారు. అతని నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.73,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కృష్ణ పాత నేరస్తుడని, అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 20 కేసులు ఉన్నట్లు తెలిపారు. పలుమార్లు జైలుకు వెళ్లినట్లు వివరించారు. ఈ కేసు ఛేదించిన క్రైం విభాగం అధికారులను ఆమె అభినందించారు. -
కేర్ ఆస్పత్రిలో రోగి మృతిపై ఆందోళన
ఆరిలోవ: హెల్త్సిటీలోని కేర్ ఆస్పత్రిలో ఒక రోగి మృతి చెందడం ఆందోళనకు దారి తీసింది. ఆస్పత్రి యాజమాన్యం మృతదేహాన్ని అప్పగించడానికి రూ.5లక్షలు డిమాండ్ చేయడంతో మృతుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలివి.. చోడవరానికి చెందిన బండి శ్రీధర్ (55) గుండెనొప్పితో బాధపడుతుండగా, ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కుటుంబ సభ్యులు హెల్త్సిటీలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. ముందుగా ఆస్పత్రికి రూ.60 వేలు చెల్లించారు. అర్ధరాత్రి 12.30 నుంచి ఒంటి గంట మధ్య సమయంలో ఐసీయూలో ఉన్న శ్రీధర్ను చూడటానికి కుటుంబ సభ్యులు వెళ్లగా.. అతను మృతి చెందినట్లు గుర్తించారు. వైద్యులను సంప్రదించగా వారు పరిశీలించి శ్రీధర్ మరణించినట్లు నిర్ధారించారు. శ్రీధర్కు రెండు శస్త్రచికిత్సలు చేశామని, వాటికి సంబంధించిన ఫీజు చెల్లించాలని వైద్యులు సూచించారు. మృతదేహాన్ని అప్పగించడానికి రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన శ్రీధర్ కుమారులు ‘గుండె జబ్బు నయం చేస్తామని చెప్పి మా నాన్నను చంపేశారు’ అంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం బంధువులకు తెలియడంతో చోడవరం నుంచి సోమవారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. మృతదేహం కోసం డబ్బులు చెల్లించమని, వెంటనే మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐ కృష్ణ సిబ్బందితో కలిసి కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితులు, ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ముందు చెల్లించిన రూ.60వేలతో పాటు అదనంగా రూ.1.10 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి బంధువులు అంగీకరించారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. శస్త్రచికిత్స చేసే సమయంలో అంగీకార పత్రంపై సంతకాలు తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహం ఇచ్చేందుకు రూ.5 లక్షల డిమాండ్ -
ఆధునిక సాంకేతికతపై అవగాహన అవసరం
విశాఖ విద్య : యువతరం నూతన సాంకేతికతలపై మెరుగైన అవగాహన కలిగి ఉండాలని ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు అన్నారు. సోమవారం వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో జియో ఫిజిక్స్ విభాగం ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘అడ్వాన్సెస్ ఇన్ జియో ఫిజిక్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్, అండ్ నేచురల్ రిసోర్సెస్’ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇటువంటి సదస్సులు నూతన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఎంతో ఉపయోగంగా నిలుస్తాయని చెప్పారు. జియో ఫిజిక్స్ రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని, సాంకేతికతలను పరస్పరం పంచుకోవడానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని చెప్పారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ మాట్లాడుతూ దేశానికి అవసరమైన విలువైన మానవ వనరులను ఏయూ జియో ఫిజిక్స్ విభాగం అందించిందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై అన్వేషణలు జరగాలని సూచించారు. జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డీడీ జి.సుజిత్ కుమార్ త్రిపాఠి మాట్లాడుతూ గ్రీన్ హౌస్ గ్యాస్ విడుదల పెరగడం వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. సుస్థిరమైన భవిష్యత్కు, పర్యావరణ సమస్యలకు పరిష్కారాల చూపే విధంగా యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, విభాగాధిపతి ఆచార్య సి.వి.నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. -
ఫిర్యాదులపై లోతైన విశ్లేషణ
● పీజీఆర్ఎస్ పెండింగ్ ఫిర్యాదులసమీక్షలో అధికారులతో కలెక్టర్ హరేందిర ప్రసాద్ ● 18 నుంచి 28 వరకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు మహారాణిపేట: ఒకే సమస్యపై ప్రజల నుంచి పదే పదే వచ్చే వినతులపై లోతైన విశ్లేషణ అవసరమని, వాటికి నాణ్యమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వస్తున్న ఫిర్యాదులు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. అధికారులకు పలు అంశాలపై అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డ తర్వాతే.. వాటి పరిష్కారం కోసం అధికారుల వద్దకు వస్తారని, అలా వచ్చే వారికి సాంత్వన చేకూర్చేలా అధికారులు నడుచుకోవాలని, వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించి భరోసా కల్పించాలని పేర్కొన్నారు. పదే పదే ప్రజలను కార్యాలయాలు చుట్టూ తిప్పించుకోవడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని హితవు పలికారు. అర్జీదారులతో ఫోన్లో మాట్లాడాలి ఫిర్యాదు చేసే అర్జీదారులతో సంబంధిత అధికారులు నేరుగా ఫోన్ చేసి మాట్లాడాలని, వారి సమస్య పూర్వాపరాలను తెలుసుకుని వాటికి సరైన పరిష్కారం చూపాలని కలెక్టర్ చెప్పారు. సమస్య క్లిష్టమైనది అయితే క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదు రీ–ఓపెన్ కావడానికి వీల్లేదన్నారు. అలా జరిగితే సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పీజీఆర్ఎస్ నోడల్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఒక శాఖకు వచ్చిన ఫిర్యాదు మరొక శాఖకు చెందినదైతే చాలా మంది రిఫర్ చేసి ఊరుకుంటున్నారని, అలా కాకుండా అర్జీదారుతో నేరుగా మాట్లాడి సమస్య ఏ శాఖ పరిధిలోదో తెలియజేసి, సహకారం అందించాలని సూచించారు. 18 నుంచి 28 ప్రత్యేక ఆధార్ క్యాంపులు సమావేశంలో భాగంగా ఈ నెల 18 నుంచి 28 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు ప్రణాళికలు చేసుకున్నామని సచివాలయాల కో ఆర్డినేటర్ ఉషారాణి తెలుపగా.. పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అధికారులంతా ఇంటింటా సర్వేలో భాగంగా జియో ట్యాగింగ్ చేయించుకోవాలన్నారు. స్వర్ణాంధ్ర–2047లో భాగంగా అన్ని విభాగాల అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, ప్రత్యేక ఉప కలెక్టర్లు శేషశైలజ, సీతారామారావు, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
● కొత్త మీటర్ కావాలంటే విద్యుత్ అధికారుల చేయి తడపాల్సిందే.. ● కూటమి నేతలతో కలిసి బరితెగిస్తున్న ఈపీడీసీఎల్ సిబ్బంది ● కొత్త కనెక్షన్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు ● అపార్ట్మెంట్ కనెక్షన్కు రూ.50 వేలు, వ్యక్తిగత కనెక్షన్కు రూ.5 వేలు వసూలు
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ప్రస్తుతం 18,42,691 మంది ఎల్టీ కేటగిరీ వినియోగదారులు, 1858 హెచ్టీ కేటగిరీ వినియోగదారులున్నారు. గత ఐదేళ్ల కాలంలో కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే సులువుగా దొరికేది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.. స్థానిక ఏఈ కార్యాలయంలో సంప్రదించినా.. కేటగిరీల వారీగా ఫీజులు చెల్లించేవారు. నిర్ణీత గడువులో కొత్త కనెక్షన్ మంజూరయ్యేది. 2022 నుంచి 2024 ఏప్రిల్ మధ్య కాలంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో దాదాపు 80 వేల కొత్త కనెక్షన్లు పెరిగాయి. కానీ.. ఎక్కడా లంచాలకు తావులేకుండా మంజూరు చేసేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈపీడీసీఎల్ సర్కిల్ అధికారులు కమర్షియల్గా మారిపోయారు. కనెక్షన్ కావాలంటే చేయి తడపాల్సిందేనని భీష్మించుకు కూర్చుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక లైన్మెన్లు, ఏఈలు దరఖాస్తులను ప్రాసెసింగ్ చేస్తున్నా.. వాటిని ఆపాలంటూ కూటమి నేతలు హుకుం జారీ చేస్తున్నారని తెలుస్తోంది. తమ ఆదేశాలు వచ్చేంత వరకూ కొత్త దరఖాస్తుల జోలికి వెళ్లొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. అందుకే విశాఖ సర్కిల్ పరిధిలో వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కూటమి నేతలతో కుమ్మక్కు! విద్యుత్ కనెక్షన్లు ఏమైనా కొత్తవి మంజూరు చేయాలంటే కచ్చితంగా తమను సంప్రదించేలా చూడాలంటూ కూటమి నేతలు విశాఖపట్నం సర్కిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏ దరఖాస్తు వచ్చినా దానిపై దృష్టి సారించడం లేదు. దరఖాస్తుదారులు వచ్చి తమ కొత్త కనెక్షన్ గురించి అడిగితే... కూటమి నేతలతో కుమ్మకై ్క అందినకాడికి దోచుకుంటూ పంచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. వ్యక్తిగత కనెక్షన్కు కేటగిరీ బట్టి రూ.5 వేలు నుంచి రూ.10 వేలు.. అపార్ట్మెంట్స్, విల్లాలు, గ్రూప్హౌస్లకు విస్తీర్ణం, ఫ్లాట్లను బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష కుపైగా రేటు ఫిక్స్ చేశారని తెలుస్తోంది. దీంతో ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికీ విద్యుత్ కచ్చితంగా అవసరం కాబట్టి.. ఎంత డిమాండ్ చేస్తే అంత చెల్లింపులు చేసి కనెక్షన్ తీసుకుంటున్నామని వినియోగదారులు వాపోతున్నారు. -
మాపై ఎందుకీ కక్ష?
విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఏయూలో పీహెచ్డీ ప్రవేశాలు పొందిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 60 మందికి పైగా పరిశోధక విద్యార్థులు వీసీ కార్యాలయం ముందు గాంధీజీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద సోమవారం నిరసనకు దిగారు. వైవా, ప్రీ–పీహెచ్డీ పరీక్షలు వెంటనే నిర్వహించాలని ప్లకార్డులు, ఫ్లెక్సీలు చేత పట్టుకుని ‘వుయ్ వాంట్ జస్టిస్’అంటూ నినాదాలు చేశారు. 2019 నుంచి 2023 వరకు ఏపీఆర్సెట్ ద్వారా చేరిన వారికి అకారణంగా పరీక్షలు నిలిపివేయడం పట్ల పరిశోధక విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవా, ప్రీ–పీహెచ్డీ పరీక్షలు వెంటనే నిర్వహించాలని, ప్రీ–టాక్ పూర్తి చేసుకున్న వారికి వెంటనే అవార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. తమ మనోభావాలతో వర్సిటీ అధికారులు ఆటలాడుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశోధక విద్యార్థులతో చర్చించారు. ఆందోళన విరమించాలని కోరారు. అయితే, తమకు వర్సిటీ అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. దీంతో పోలీసులు విద్యార్థుల డిమాండ్లను వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షల నిర్వహణకు వీసీ హామీ టీడీఆర్–హబ్ డీన్ ఆచార్య మల్లికార్జునరావు నిరసనకు దిగిన విద్యార్థుల వద్దకు వచ్చి చర్చించారు. పీహెచ్డీ స్కాలర్స్కు త్వరలోనే పరీక్షలు నిర్వహించి, అవార్డులు ప్రదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇదే విషయాన్ని వైస్ చాన్సలర్ చెప్పాలని పీహెచ్డీ స్కాలర్స్ పట్టుబట్టారు. దీంతో ఆయన పీహెచ్డీ స్కాలర్స్ జేఏసీ ప్రతినిధులను వీసీ జి.శశిభూషణరావు వద్దకు తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయిలో సమీక్ష జరిగిందని, త్వరలోనే తగిన ఏర్పాట్లు చేస్తామని వీసీ హామీ ఇచ్చినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. వర్సిటీ అధికారుల తీరు మారాల్సిందే.. టీడీఆర్–హబ్ ద్వారా జరిగిన పీహెచ్డీ ప్రవేశాలపై ఏమైనా అనుమానాలు ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని.. కానీ తమపై కక్ష గట్టినట్లుగా పరీక్షలు నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని పరిశోధక విద్యార్థులు అన్నారు. నిరసన విరమించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వర్సిటీ అధికారుల తీరు మారాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీఆర్ సెట్ రాసి, మెరుగైన ర్యాంకులు సాధించి వర్సిటీలో పీహెచ్డీ చేద్దామని ఇక్కడికి వస్తే.. అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు తమను బాధపెట్టాయన్నారు. తక్షణమే ప్రీ–పీహెచ్డీ, వైవా పరీక్షలు నిర్వహించాలని, ప్రీ–టాక్ పూర్తయిన వారికి అవార్డులు ప్రదానం చేయాలని డిమాండ్ చేశారు. ఏయూలో పీహెచ్డీ స్కాలర్స్ నిరసన గళం వైస్ చాన్సలర్ కార్యాలయం ముందు ఆందోళన పరీక్షలు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని పట్టు -
శిర్లపాలెం వాసి హైదరాబాద్లో ఆత్మహత్య
తగరపువలస: ఆనందపురం మండలం శిర్లపాలెం పంచాయతీకి చెందిన కె.సూర్యనారాయణ(45) అనే లారీ డ్రైవర్ ఆదివారం హైదరాబాద్లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఇటీవల సూర్యనారాయణ హైదరాబాద్ వెళ్లాడు. తనకు పరిచయం ఉన్న వరలక్ష్మి అనే వివాహిత ఇంటికి శనివారం వెళ్లి ఆమె భర్త దుర్గాప్రసాద్తో కలిసి మద్యం సేవించాడు. తర్వాత ఇద్దరి మధ్య వివాదం కారణంగా సూర్యనారాయణను దుర్గాప్రసాద్ గాయపరిచి ఆస్పత్రిలో చేర్పించాడు. ఆదివారం ఉదయం దుర్గాప్రసాద్ ఇంటి ముందు సూర్యనారాయణ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు, పోలీసులు కలిసి సూర్య నారాయణను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సూర్యనారాయణ మృతదేహాన్ని మంగళవారం శిర్లపాలెం తీసుకొస్తున్నట్లు తెలిసింది. -
మొదటి మెట్టు.. ప్రత్యేక పట్టు
చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ఇంగ్లిష్ మీడియం) ప్రభుత్వ విద్యా రంగంలో ఒక ప్రత్యేక అధ్యాయం. రాష్ట్రంలోనే అతి పెద్ద పాఠశాలగా గుర్తింపు పొందిన ఇక్కడ సుమారు 3,235 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 799 మంది సిద్ధమవుతున్నారు. వంద మందికి పైగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం ఈ పాఠశాలకు పెద్ద ఆస్తి. పదో తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక మైలురాయి వంటివి. ఈ పరీక్షల ఫలితాలే వారి భవిష్యత్ను నిర్ణయిస్తాయి. ఈ విషయాన్ని గుర్తెరిగిన ఉపాధ్యాయులు, విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో టీచర్లు మరింత నిబద్ధతతో పనిచేస్తున్నా రు. తరగతి గదిలో పాఠాలు బోధించడంతో పాటు, వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి వారిపై దృష్టి సారిస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఫలితాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. 100 రోజుల ప్రణాళికను విజయవంతంగా అమలు చేసేందుకు ఆర్జేడీ విజయభాస్కర్, డీఈవో ప్రేమ్కుమార్, సర్వశిక్ష ఏసీపీ డాక్టర్ చంద్రశేఖరరావు తదితరులు సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రణాళిక అమలు ఇలా.. జిల్లాలో మార్చి 17 నుంచి రోజు విడిచి రోజు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ విద్యార్థులను ఏ నుంచి ఓ వరకు 12 సెక్షన్లుగా విభజించారు. ఇందులో ప్రతి సెక్షన్, ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించారు. శత శాతం ఉత్తీర్ణతకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నారు. తరగతిలో బోధనతో పాటు ప్రతి రోజూ ఉదయం 8 గంటలు నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత సామర్థ్యాలపై దృష్టి పెట్టి, అందుకు అనుగుణంగా బోధన చేస్తున్నారు. మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక టిప్స్, శిక్షణ ఇస్తున్నారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన వారిని గుర్తించి.. వారి సామర్థ్యాలు పెంపునకు కృషి చేస్తున్నారు. -
విశాఖలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థులపై కేసు నమోదు
సాక్షి, విశాఖ: విశాఖలో మరోసారి ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీంతో, ర్యాగింగ్ విషయం పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది.వివరాల ప్రకారం.. విశాఖలోని దువ్వాడలో ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. ర్యాగింగ్లో భాగంగా సీనయర్లు, జూనియర్లు తన్నుకున్నారు. ఈ క్రమంలో పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో, ర్యాగింగ్ వ్యవహారం కాస్తా పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. పలువురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ విషయమై బీఎన్ఎస్ 324 సెక్షన్ కింద కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
Visakhapatnam: ఓటమిని అంగీకరించని ఫర్జానా బేగం
ఎన్ని మేఘాలొచ్చినా..ఆకాశం కదలదు..ఎన్ని తుఫానులైనా..సముద్రం నిలిచిపోదు.. ఎదురయ్యే బాధలన్నీ..ఎగసి పడే తరంగాలే..ఆపదల గాలి ఎంత వేగంగా వీచినా, దృఢమైన మనసు చలించదు. కోల్పోయినవేమీ కన్నీటి కథలవ్వవు..ఎలాంటి కష్టాలు ఎదురొచ్చినా ధైర్యం చేతిలో తలవంచక తప్పదు..నీ ధైర్యమే నీ గెలుపు పతాకం..తట్టుకొనే శక్తి ముందు, ఏ గెలుపైనా తక్కువే. వాడిపోయిన పువ్వుల్లా రాలిపోతాయి..కష్టానికి పూచే పూలే నిజమైన..విజయాలై వికసిస్తాయి. అచ్చం ఫర్జానా బేగంలా..క్యాన్సర్ వచ్చిందని ఆమె కుంగిపోలేదు. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసింది. ఆమె సంకల్పం ముందు క్యాన్సర్ ఓడిపోయింది. ఆనందంగా..ఆరోగ్యకరంగా సాగుతున్న జీవితం. శారీరక వ్యాయామ, పోషకాహార నిపుణురాలిగా అందరికీ సూచనలిచ్చే వ్యక్తి. ఇద్దరు కుమార్తెలతో సంతోషంగా సాగుతున్న కుటుంబం. ఒక్కసారిగా ఆమె శరీరంలోకి క్యాన్సర్ మహమ్మారి ప్రవేశించింది. భయపడిన ఆమె వైద్యులు చెప్పిన మాట విని అంతలోనే తేరుకుంది. మనోధైర్యాన్ని సడలనివ్వలేదు. క్యాన్సర్ను ధైర్యంగా ఎదుర్కొంది. వైద్యుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగింది. కాన్సర్ బారిన పడి దానిని అధిగమించి నూతన జీవితాన్ని పొందాలనేవారికి స్ఫూర్తిగా నిలిచారు..నగరానికి చెందిన ఫిట్నెస్ ట్రైనర్ ఫర్జానా బేగం.ఆనందంగా సాగుతున్న జీవితంలో.. గృహిణిగా తన కుటుంబాన్ని, సొంత ఫిట్నెస్ సెంటర్ను నిర్వహిస్తూ ఆనందంగా సాగుతున్న బేగం జీవితంలో 2017 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. షోల్డర్ పెయిన్తో వైద్యుల వద్దకు వెళ్లిన ఆమె ఎంఆర్ఐ లో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ఆ ట్యూమర్ రిబ్స్లోని వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. వైద్యులు సర్జరీ చేశారు. అనంతరం 2019లో తిరిగి తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆమె ఛాతీ పక్కటెముకలు రెండూ ట్యూమర్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులుగుర్తించారు. వైద్యులు బయాప్సీ చేసి క్యాన్సర్గా నిర్ధారించారు.కష్టం వచ్చినప్పుడు పోరాడాలి ఇద్దరు కుమార్తెలకు తాను ఒక ఉదాహరణగా నిలవాలని ఫర్జానా నిర్ణయించుకున్నారు. కష్టం వచ్చినపుడు పోరాడాలని, ఎప్పుడూ వెనకడుగు వెయ్యకూడదని భావించి, ఆచరణలో చూపారు. సమస్యలు జీవితంలో నిత్యం వస్తుంటాయని, పోరాటం మానకూడదంటారు ఫర్జానా. నేను గెలవాలి అనే బలమైన ఆకాంక్ష సంపూర్ణ ఆరోగ్యంతో తయారయ్యేలా చేసిందన్నారు. నేడు ఎందరో క్యాన్సర్ బాధితులకు ఆమె జీవితం ఒక స్ఫూర్తిదాయక పాఠం. ఇటీవల ఆమె బాలకృష్ణ నిర్వహించే అన్స్టాపబుల్ షోలో కూడా పాల్గొని తన జీవిత ప్రయాణాన్ని, క్యాన్సర్ను జయించిన విధానాన్ని ప్రజలతో పంచుకున్నారు.ధైర్యం కోల్పోలేదుతొలుత కాస్త భయపడినా కొద్దిరోజుల్లోనే ఆత్మస్థైర్యంతో ధైర్యంగా చికిత్సకు వెళ్లారు. కిమో థెరపీ తీసుకున్నారు. కిమో థెరపీ పర్యవసనాలు ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలను చవిచూశారు. వాటన్నింటినీ భరిస్తూ, అధిగమిస్తూ పూర్తిస్థాయిలో చికిత్స తీసుకున్నారు. మనసునిండా మనోబలం, దైవంపై నమ్మకంతో చికిత్సకు సానుకూల ఆలోచనలతో వెళ్లారు. అదే సమయంలో తనకు సంబంధించిన ఫిట్నెస్ జిమ్లో తన వృత్తిని యథావిధిగా కొనసాగించారు. వారే నా ధైర్యం క్యాన్సర్ వచ్చిందని తెలిసిన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తన వద్ద శిక్షణ తీసుకున్న ఫిట్నెస్ ట్రైనర్లు అందించిన మానసిక స్థైర్యం వ్యాధి నుంచి త్వరగా కోలుకొనేలా చేసింది. మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా, మనోధైర్యం కోల్పోకుండా ముందుకు సాగడం వలనే త్వరగా కోలుకోవడం సాధ్యపడింది. అదే సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది అందించిన స్థైర్యం మరవలేనిదని ఆమె చెప్పారు. చికిత్స సమయంలో రోజుకో విధంగా శరీరం స్పందించడం, అనేక సందేహాలు రావడం జరిగేది. వీటిని వైద్యులకు వివరిస్తూ వారి సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగారు. -
వైజాగ్పై చంద్రబాబు సర్కారు శీతకన్ను!
సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక రాజధానిగా భాసిల్లుతూ.. నిన్నటిరవకు కార్యనిర్వాహక రాజధానిగా ఎదిగిన విశాఖపట్నం నగరాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఓ పక్క విశాఖపై చాలా ప్రేమ ఉందని చెబుతూనే, మరోపక్క ఈ మహా నగరం అభివృద్ధిని అడ్డుకుంటోంది. అన్ని రకాల సౌకర్యాలను విశాఖపట్నం ప్రజల నుంచి దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఆర్బీఐ రీజనల్ కార్యాలయం ఏర్పాటవుతుందన్న తరుణంలో దాన్ని విజయవాడకు పట్టుకుపోయిన చంద్రబాబు సర్కారు.. చివరకు విమాన సర్వీసులనూ తరలించేస్తోంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు ఎయిర్లైన్స్ సంస్థలు ముందుకొస్తుంటే.. ఆ సర్వీసులను విజయవాడ నుంచి నడపాలంటూ ఒత్తిడి తెస్తోంది. దీంతో ఎటూ తేల్చుకోలేక విమానయాన సంస్థలు అసలు ఏపీ నుంచి సర్వీసులు నడపాలా వద్దా అన్న సందిగ్ధంలో పడుతున్నాయి. స్లాట్లపై నౌకాదళం ఆంక్షలతో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వివక్షతో విశాఖ విమానాశ్రయం అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రయాణికులతో పాటు కార్గోలోనూ అపారమైన వృద్ధి సామర్థ్యం ఉన్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం మానేసి.. కొత్త సర్వీసుల్ని కూడా విజయవాడకు మళ్లిస్తోంది. ఎమిరేట్స్పై ఒత్తిడి? మిడిల్ ఈస్ట్ దేశాలకు సర్వీసులు నడిపేందుకు విశాఖ ఉత్తమ ప్రాంతంగా విమానయాన సంస్థలు భావిస్తుంటాయి. వివిధ దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ అవకాశాలు కూడా వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఎమిరేట్స్ కూడా ఏపీ నుంచి దుబాయ్కు సర్వీసు నడిపేందుకు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఎయిర్పోర్టులను అధ్యయనం చేసింది. విశాఖే అనుకూలంగా ఉందని భావించింది.అయితే.. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నుంచి కాకుండా విజయవాడ (గన్నవరం ఎయిర్పోర్టు) నుంచి దుబాయ్కి సర్వీసు నడపాలంటూ ఈ ఎయిర్లైన్స్పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి షార్జాకు ఓ సర్వీసు నడుపుతోంది. అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు రెండో సర్వీసు నడిపినా ఆక్యుపెన్సీకి అవకాశం లేదు. అయినా విశాఖపై కక్ష సాధింపుతో చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ నుంచే నడపాలని అంటుండటంతో ఎమిరేట్స్ సంస్థ సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం ఇలాగే ఒత్తిడి చేస్తే పూర్తిగా సర్వీసు రద్దు చేసే అవకాశం కూడా ఉందని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమిరేట్స్ సంస్థ పరిస్థితిని చూసిన ఇతర సంస్థలు ఏపీ నుంచి సర్వీసులు నడపడానికి వెనక్కు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో దుబాయ్కి విజయవంతంగా సర్వీసుకోవిడ్–19కి ముందు విశాఖ నుంచి ఎయిర్ ఇండియా సంస్థ దుబాయ్కు ఏడేళ్ల పాటు సర్వీసుని నడిపింది. 80 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో ఈ సర్వీసు నడిచింది. ఇప్పుడూ ఇదే విధమైన డిమాండ్ ఉన్నప్పటికీ, దుబాయ్ సర్వీసును ప్రభుత్వం అడ్డుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 180 సీటర్ ప్యాసింజర్ విమానానికి 2 టన్నుల కార్గోని కూడా తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఈ సర్వీసు విశాఖ నుంచి నడిస్తే 100 శాతం ఆక్యుపెన్సీతో పాటు రొయ్యలు, ఔషధాలు, దుస్తులు, ఇతర కార్గో ఎగుమతులకు కూడా అవకాశం ఎక్కువ ఉంది. ఎయిర్లైన్స్ ఆపరేటర్లకు కార్గో అదనపు ఆదాయాన్నిస్తుంది. అందువల్ల విదేశీ సర్వీసులకు వైజాగ్ పూర్తి అనుకూలమని విమానయాన సంస్థలు భావిస్తున్నా, ప్రభుత్వం మోకాలడ్డడంపై విమర్శలు వస్తున్నాయి. -
విశాఖ నుంచి చౌకగా విమానయానం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి విదేశాలకు చౌకగా విమానాల్లో ప్రయాణించేలా ఎయిర్ ఏసియా విమానయాన సంస్థ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. జీరో బేస్ ఫేర్ పేరుతో విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్లకు ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి 2026 జూన్ 15 వరకూ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే, ఇందుకోసం ఈ నెల 23వ తేదీలోపు టికెట్ బుక్ చేసుకోవాలని ఎయిర్ ఏసియా సూచించింది. సాధారణంగా వైజాగ్ నుంచి బ్యాంకాక్ లేదా కౌలాలంపూర్కు రూ.7,500 నుంచి రూ.12 వేల వరకు టికెట్ ధర ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా రూ.4,400 నుంచి రూ.5వేల లోపే టికెట్ ధర ఉంటుందని ఎయిర్ ఏసియా తెలిపింది. అన్ని వర్గాల ప్రయాణికులకు విమానయాన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్లు వెల్లడించింది. -
నేడు రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక
ఎంవీపీకాలనీ: విశాఖ వేదికగా రాష్ట్ర పురుషుల కబడ్డీ జట్టును సోమవారం ఎంపిక చేస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జేఎస్వీ ప్రసాదరెడ్డి తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర కబడ్డీ సంఘం సెలక్షన్ కమిటీని నియమించిందని ఓ ప్రకటనలో వెల్లడించారు. కమిటీ సభ్యులుగా కబడ్డీ నేషనల్ మెడలిస్ట్ ప్రసాదరెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు సీహెచ్ పద్మరాజు, వైవీ శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం 19 మంది క్రీడాకారులకు నగరంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 12 మందిని కమిటీ తుది జట్టుకు ఎంపిక చేస్తుంది. ఈ జట్టు కటక్ వేదికగా జరగనున్న 71వ జాతీయ కబడ్డీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. -
ప్రతి రోజూ బ్లూఫ్లాగ్లోనే తిష్ట
బ్లూఫ్లాగ్ పరిశీలించే బాధ్యత జిల్లా పర్యాటక అధికారులకు అప్పగించారు. నోడల్ అధికారిగా సదరు అధికారే వ్యవహరించాలి. కానీ ఏపీటీడీసీలోని ఓ ఇన్చార్జ్ అధికారి.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రతి రోజూ బీచ్కు వెళ్లి సాయంత్రం వరకూ అక్కడే తిష్టవేసేస్తున్నారు. కారణమేంటని ఆరాతీస్తే.. పనులు, నిర్వహణ పేరుతో ప్రతి నెలా రూ.10 లక్షల వరకూ మాయం చేసేస్తున్న అక్రమాలు బయటకు రాకుండా మేనేజ్ చేసుకోడానికని తెలుస్తోంది. ఈ అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు స్థానిక సిబ్బందిపై చర్యలు, పనులు చెయ్యడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు నటిస్తున్నారు. కానీ కొందరు టూరిజం సిబ్బంది మాత్రం.. ఇన్చార్జి ఆగడాలని ఆధారాలతో సహా ఏపీటీడీసీ ఉన్నతాధికారులకు లేఖల ద్వారా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీన్ని దృష్టిలో ఉంచుకొని బీచ్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వకుండా కక్ష కట్టారు. ఫలితంగా వారంతా రోడ్డెక్కారు. మొత్తంగా తన సొంత ఖజానా నింపేసుకోడానికి రుషికొండ బీచ్ని బ్లూఫ్లాగ్తో కాకుండా అవినీతి కెరటాలతో నింపేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లూఫ్లాగ్కు సంబంధించి.. మొత్తం వివరాలు సేకరించాలని టూరిజం వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వాచ్టవర్ దుస్థితి -
స్టీల్ప్లాంట్ జేఎన్ అవార్డుల ప్రదానం వాయిదా?
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ ఉద్యోగులకు ఫిబ్రవరి 18న ఇచ్చే జవహర్లాల్ నెహ్రూ(జేఎన్) అవార్డుల ప్రదానం వాయిదా పడినట్టు తెలుస్తోంది. స్టీల్ప్లాంట్ కోసం అంకితభావంతో కృషి చేసే అధికారులు, కార్మికులకు ఏటా ఫిబ్రవరి 18న ఉక్కు అవిర్భావ దినోత్సవం సందర్భంగా అవార్డులిస్తారు. ఆ రోజు ఉద్యోగుల కుటుంబీకులు, ఉన్నతాధికారుల సమక్షంలో సీఎండీ చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం ఆనవాయితీ. ఉక్కు అధికారులు, కార్మికులకు చెందిన గత మూడేళ్ల వార్షిక ప్రావీణ్యత రేటింగ్(ఏసీఆర్), అటెండెన్స్ తదితర ప్రమాణాలను బట్టి ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. 2023–24కు చెందిన అధికారుల ఏసీఆర్ సిద్ధం కాకపోవడమే జాప్యానికి కారణమని తెలుస్తోంది. -
చోదకులంతా హెల్మెట్ ధరించాల్సిందే..
గోపాలపట్నం: భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం భారీ బైక్ ర్యాలీ జరిగింది. మద్దిలపాలెం కూడలి వద్ద ఈ ర్యాలీ ని కలెక్టర్ హరేందిర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్రవాహనచోదకులు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రాణాంతకమన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇన్చార్జి డీటీవో ఆర్సీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నాణ్యమైన హెల్మెట్లు ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు అందరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. మోటారు వాహన తనిఖీ అధికారులు, అసిస్టెంట్ మోటార్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫార్మాసిటీలో ఇద్దరు కార్మికులకు అస్వస్థత
పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని టొరెంటో పరిశ్రమలో ఆదివారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికులు పి.రామకృష్ణ, జె.బసవేశ్వరరావులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు అందించిన వివరాలు. పరిశ్రమలో నిద్ర మాత్రల తయారీకి ఉపయోగించే జోల్పిడమ్ పౌడర్ను ప్యాకింగ్ చేస్తుండగా, ఆ పౌడర్ను పీల్చడంతో స్పృహ తప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న యాజమాన్యం ఇరువురిని విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కొలుకుంటున్నారని సీఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. నిద్ర మాత్రల పౌడర్ ప్యాకింగ్లో ఘటన -
ఢమాల్
కోడిభారీగా పడిపోయిన చికెన్ అమ్మకాలు ● చేపలు, మటన్కు డిమాండ్ సాధారణ రోజుల్లోఉత్తరాంధ్రలో కోళ్ల అమ్మకాలు 40 లక్షలుఆదివారం జరిగిన అమ్మకాలు 20 లక్షలుఫిషింగ్ హార్బర్లో... అల్లిపురం: రాష్ట్రవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎవ్వరు చికెన్ తినేందుకు ఇష్టపడటం లేదు. దీంతో కోళ్ల గిరాకీ భారీగా తగ్గింది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్ల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆదివారం మటన్, చేపల విక్రయాలు భారీగా జరిగాయి. ఫిషింగ్ హార్బర్కు, ఆర్టీసీ కాంప్లెక్స్ దరి సండే ఫిష్ మార్కట్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, రామకృష్ణ జంక్షన్, నెహ్రుబజార్, పెదవాల్తేరు బజారు తదితర ప్రాంతాలలో చేపల మార్కెట్లకు జనాలు పోటెత్తారు. దీంతో చేపల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఒక్కసారిగా పడిపోయిన కోళ్ల అమ్మకాలు.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పౌల్ట్రీ వ్యాపారం ఎక్కువుగా జరుగుతోంది. అక్కడ వైరస్ సోకిందనే విషయం బయటకి రాగానే చికెన్, కోడిగుడ్లు తినడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఒకప్పుడు కేజీ చికెన్ రూ.400 అయినా ఎగబడి మరి కొనుక్కునేవారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కేజీ రూ.150 అమ్మినా కొనడానికి మందుకు రావట్లేదు. దీంతో వ్యాపారులు తలలు బాదుకుంటున్నారు. బ్యాగ్ అధ్యక్షుడు కొట్యాడ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఫారం నుంచి బ్రాయిలర్ కోళ్లు 2లక్షల టన్నులు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు తరలి వెళ్లినట్లు తెలిపారు. రిటైల్ దుఖాణ దారులు మాత్రం అమ్మకాలు యాభై శాతం పడిపోయాయని వాపోతు న్నారు. కేజీ చికెన్ డ్రస్డ్ రూ.190, స్కిల్ లెస్ రూ.200కి అమ్మకాలు జరిపారు. మామూలు రోజుల్లో రూ.40లక్షలు అమ్మకాలు జరిగితే ప్రస్తుతం రూ.15 నుంచి 20 లక్షలు మేర అమ్మకాలు జరిగాయని బ్యాగ్ ప్రతినిధులు తెలిపారు. వైరస్ఫారం కోళ్లకు మాత్రమే.. బర్డ్ ఫ్లూ వైరస్ కేవలం ఫారం కోళ్లకు మాత్రమే వ్యాపించింది. బ్రాయిలర్ కోళ్లకు ఎటువంటి వైరస్ లేదు. మాంసం కోసం ఎక్కువుగా బ్రాయిలర్ కోడి మాంసం మాత్రమే వినియోగిస్తారు. చికెన్ బాగా వేడిపై ఉడికించి తింటే ప్రమాదం ఉండదు. బ్రాయిలర్ చికిన్ తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. –కొట్యాడ శ్రీనివాసరావు, బ్యాగ్ ప్రెసిడెంట్ -
కూరగాయల రైతులకు శుభవార్త
మహారాణిపేట: రైతులు పండించిన కూరగాయల పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోతే వాటిని రైతు బజార్లలో విక్రయించేందుకు తమను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. గ్రామాల్లో తగినంత ధర రాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా కూరగాయాలను రైతు బజార్లలో అమ్ముకునేలా సహకారం అందిస్తామన్నారు. రైతులు స్థానిక ఉద్యానవన శాఖ అధికారులను/వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సంప్రదించవచ్చన్నారు. మరిన్ని వివరాలను 9959592474 నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. -
తాటి కల్లు సీజన్ షురూ..
ఏయూక్యాంపస్: సహజసిద్ధంగా చెట్ల నుంచి లభించే కల్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి! తీపి, ఒగరు, పులుపు కలగలిసిన రుచి కలిగిన కల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా మన ప్రాంతంలో కల్లు అనగానే ముందుగా గుర్తొచ్చేది తాటి చెట్టే. తాటిచెట్టు నిజంగా ఒక కల్పవృక్షం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది గీత కార్మికులకు జీవనోపాధినిచ్చే మార్గం. వేసవి కాలం వచ్చిందంటే చాలు తాటి ముంజలు, తాటి కల్లు విరివిగా లభిస్తాయి. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు తాటి కల్లు లభించే కాలం. ఈ ఐదు నెలలు కల్లుగీత కార్మికులకు చేతినిండా పని దొరుకుతుంది. తిమ్మాపురం ప్రాంతంలో ఓ కల్లుగీత కార్మికుడు చెట్టు పైనుంచి కల్లు సేకరిస్తుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్ చేసింది. -
● మరమ్మతుల పేరుతో పర్యాటక శాఖ అధికారుల కక్కుర్తి ● రుషికొండ బీచ్లో అస్తవ్యస్తంగా మరమ్మతులు ● ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన టూరిజం సిబ్బంది
పరిశుభ్రంగా, సర్వాంగ సుందరంగా ఉండే బీచ్లకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ను రాష్ట్రంలో దక్కించుకున్న మొట్టమొదటి బీచ్ రుషికొండ. బ్లూఫ్లాగ్ బీచ్గా గుర్తింపు వచ్చిన తర్వాత.. ప్రతిఏటా రెన్యువల్ చేసుకుంటేనే సర్టిఫికేషన్ కొనసాగుతుంది. రెన్యువల్ సర్టిఫికెట్ రావాలంటే 500 మీటర్ల మేర నిత్యం పరిశుభ్రంగా ఉండాలి, పర్యాటకులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఇదే తమ పాలిట కల్పతరువుగా భావిస్తున్నారు ఏపీటీడీసీ అధికారులు. బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ వస్తే రానీ.. పోతే పోనీ.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఏపీటీడీసీలో ఇన్చార్జి బాధ్యతల్లో ఉన్న ఓ ఇంజినీరింగ్ అధికారి.. తను చెప్పిందే వేదం అన్నట్లుగా పనుల్లో తన మాయోపాయాలు చూపించారు. ఇటీవల రూ.15 లక్షలతో బ్లూఫ్లాగ్ సాగరతీరంలో వివిధ మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయ్యాయని చెప్పారు. కానీ ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా బీచ్ అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. ఏదో ఒకటి రెండు లక్షలతో పనులు కానిచ్చేసి.. సదరు అధికారి తన బలగంతో కలిసి నిధులు బొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తోందని కొందరు ఉద్యోగులు ఆరాతీస్తే.. సదరు ఇంజినీరింగ్ విభాగ అధికారులు మాయం చేసేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్వహణ పేరుతో పనులకు టెండర్లు పిలిచి.. కాంట్రాక్టరుతో మిలాఖత్ అయి.. డబ్బులు వాటాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీటీడీసీ కార్యాలయంలో స్కెచ్లు ఏయే పనులకు ఎంత మేర వాటాలు తీసుకోవాలి.. ఎవరికి కాంట్రాక్టు ఇవ్వాలి.. ఎలా ఇవ్వాలనే విషయాలన్నీ వీఎంఆర్డీఏ ఉద్యోగభవన్లో ఉన్న ఏపీటీడీసీ రీజనల్ కార్యాలయంలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీచ్ నిర్వహణ ఎలా ఉన్నా కాంట్రాక్టర్ను ప్రశ్నించకుండానే.. బిల్లులు మంజూరు చేసేస్తున్నారు. ఏపీటీడీసీ హయాంలో ఉన్న సమయంలో 50 మంది వరకూ బీచ్ మెయింటెనెన్స్ చేపట్టేవారు. కాంట్రాక్టు సంస్థకు బాధ్యతలు అప్పగించిన తర్వాత నెలకు రూ.12 లక్షలు చెల్లిస్తున్నా.. కేవలం రూ.2 లక్షల పనులు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలిన మొత్తం.. అధికారులు గుటకాయస్వాహా చేసేస్తున్నారు. -
అప్పన్నకు రెండు శఠగోపాల బహూకరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం హరేకృష్ణ మూవ్మెంట్ సుమారు రూ.10 లక్షలు విలువ చేసే రెండు బంగారు శఠగోపాలు(వెండిపై బంగారు పూత) బహూకరించింది. గ్లోబల్ హరేకృష్ణ మూవ్మెంట్ చైర్మన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మధుపండితదాస సింహగిరికి వచ్చి శఠగోపాలను ఆలయ ఏఈవో ఆనంద్కుమార్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులకు అందజేశారు. సంస్థ సభ్యులతో కలిసి స్వామి ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం తరపున అధికారులు మధుపండిత దాసకు, ఆయనతో వచ్చిన సంస్థ సభ్యులకు స్వామి దర్శనం కల్పించి ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
● 27 జరిగే ఎన్నికలకు సిబ్బంది నియామకం ● 18న తొలి విడత శిక్షణ తరగతులు ● 25 వేల బ్యాలెట్ పత్రాల తయారీ మహారాణిపేట: ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సారథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్ ఏర్పాట్లు చేస్తున్నారు. పది మంది అభ్యర్థులు తుది ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థుల పేరుతో తెలుగులో బ్యాలెట్ పత్రం రూపొందించి, ప్రింటింగ్ కోసం కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయానికి పంపారు. అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం అభ్యర్థులు నామినేషన్లో పేర్కొన్న మేరకు తొలి అక్షరం ఆధారంగా తెలుగు అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం నమూనాను తయారు చేశారు. తుది జాబితా మేరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మొత్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి అదనంగా మరో పది శాతం కలిపి సుమారు 25 వేల బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. ఇవి ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఎన్నికల తేదీకి రెండు రోజులు ముందు వాటిని బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. 18 నుంచి తొలి విడత శిక్షణ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 18 నుంచి సిబ్బందికి, ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడత శిక్షణ 24న ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 123 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరపనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి(పీవో)తోపాటు ముగ్గురు సిబ్బంది అవసరం. మొత్తం 492 మంది సిబ్బందితోపాటు అదనంగా మరో పది శాతం మందిని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. -
విశాఖలో ఐపీఎల్ పండగ
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ మ్యాచ్లకు విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియం మరోసారి వేదిక కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి హోమ్ పిచ్గా వైఎస్సార్ స్టేడియాన్ని ఎంచుకోవడంతో ఆధునికీకరణ పనులు వేగవంతమయ్యాయి. మొత్తంగా స్టేడియం ఎలివేషన్ మారిపోనుండగా, కార్పొరేట్ బాక్సులు, ఆటగాళ్ల గ్రీన్ రూంల్లోనూ ఆధునిక వసతుల కల్పన చకచకా సాగిపోతోంది. స్టేడియంలోని స్టాండ్స్లో కుర్చీలను కూడా ఏసీఏ మారుస్తోంది. దీంతో వైఎస్సార్ స్టేడియం సరికొత్త రూపుతో ఈసారి ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుందని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి సానా సతీష్ బాబు తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో హోమ్ పిచ్గా విశాఖ స్టేడియాన్ని ఎంచుకుందని, ఈ సీజన్లోనూ రెండు మ్యాచ్లకు వైఎస్సార్ స్టేడియం వేదిక కానుందన్నారు. అందుకు తగిన విధంగా స్టేడియంలో వసతులను సమకూరుస్తున్నట్లు చెప్పారు. మార్చి 24న డీసీతో ఎల్ఎస్జీ ఢీ ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తలపడనుంది. రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మార్చి 30న మరో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గత సీజన్ రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. హైదరాబాద్ జట్టు తరఫున స్థానిక ఆటగాడు నితీష్కుమార్ బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్ ప్రత్యేకత సంతరించుకోనుంది. మార్చి 24, 30న రెండు టీ–20 మ్యాచ్లు ఊపందుకున్న స్టేడియం ఆధునికీకరణ పనులు -
తీరంలో చేపల కలకలం
భీమునిపట్నం: చనిపోయిన చేపలు ఒడ్డుకు కొట్టుకు రావడం కలకలం రేపింది. రెండు రోజులుగా గోస్తని నది తీరానికి పెద్ద ఎత్తున చేపలు కొట్టుకొస్తున్నాయి. నీటి కాలుష్యం కారణంగా ఇవి చనిపోయి తీరానికి కొట్టుకొస్తున్నాయని చాలా మంది భావించారు. అయితే అందులో నిజం లేదని మత్స్యకారులు తెలి పారు. రోజూ మత్స్యకారులు పడవలు, తెప్పల ద్వా రా గోస్తని నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి.. తిరిగి అదే మార్గంలో తీరానికి చేరుకుంటారు. కొద్ది రోజులుగా కారలు అనే చేపలు పెద్ద ఎత్తున వలలకు పడుతున్నాయి. అయితే వీటికి డిమాండ్ లేకపోవడంతో వాటిని మధ్యలోనే నీటిలో పడేస్తున్నారు. అవే తీరానికి కొట్టుకొస్తున్నాయని మత్స్యకార సంఘ నాయకుడు అల్లిపిల్లి నర్శింగరావు తెలిపారు. -
జనారణ్యంలోకి జింక
కొమ్మాది: ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఆహార కొరత.. దీనికి తోడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల బోరవానిపాలెం, ఎండాడ ప్రాంతాలకు వచ్చిన రెండు జింకలు మృతి చెందగా, 10 రోజుల కిందట ఎండాడలో కుక్కల దాడిలో మరో జింక మృతి చెందింది. ఆదివారం ఓ జింక ఎండాడలోని ఓ అపార్ట్మెంట్లోకి వచ్చేసింది. గాయాలతో కదల్లేని స్థితిలో ఉన్న జింకను స్థానికులు ప్రథమ చికిత్స అందించి.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకుని.. వైద్య చికిత్స నిమిత్తం జింకను కంబాలకొండకు తరలించారు. కాగా.. కంబాల కొండలో సరైన రక్ష ణ లేకపోవడం వల్ల జింకలు ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయి. జింకలు వరసగా మరణిస్తున్నప్పటికీ అటవీ శాఖ, జూ సిబ్బంది పట్టించుకోవడం లేదని జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
క్యాన్సర్ను జయిద్దాం
ఏయూక్యాంపస్ : క్యాన్సర్పై అవగాహన పెంచుకోండి... ఆరోగ్యంగా జీవించండి అంటూ సినీనటి, లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి తాడిమల్ల నగరవాసుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆదివారం బీచ్రోడ్డులో రోహిత్ మోమోరియల్ ట్రస్ట్, రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ సంయుక్తంగా నిర్వహించిన పింక్ సఖి శారీ వాక్లో ఆమె ప్రసంగించారు. క్యాన్సర్ వస్తే జీవితం అక్కడితో ఆగిపోతుందనే అపోహ నుంచి ముందుగా బయటపడాలన్నారు. సరైన చికిత్స తీసుకుంటే ఎంతకాలమైనా జీవించవచ్చు అనడానికి ప్రతక్ష ఉదాహరణగా తానేనని పేర్కొన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడం ఎంత అవసరమో గుర్తించాలని ప్రజలకు సూచించారు. మీపై ఒక కుటుంబం ఆధారపడి ఉందనే విషయం మరువకూడదన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి మహిళలకు ఉందన్నారు. క్యాన్సర్ ఎటువైపు నుంచైనా, ఎవరికై నా వచ్చే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవడం, సరైన చికిత్స తీసుకోవడం, నిండైన జీవితాన్ని అనుభవించడం ఎంతో అవసరమన్నారు. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ ప్రతి ఏడాది వేలాది మంది క్యాన్సర్తో మరణిస్తున్నారన్నారు. మహిళలు అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని, ప్రజల్లో మరింత చైతన్యం, అవగాహన పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయుక్తంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా విశాఖ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ప్రాథమిక దశల్లో క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స అందించడం, ప్రాణాలను రక్షించడం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ జి.అనంత రామ్ మాట్లాడుతూ మరింత విస్తృత అవగాహన ప్రజల్లో కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. తాము చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి సంపూర్ణ సహాయం అందిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో పీసీవోడీపై వైజాగ్ వలంటీర్లతో కలిసి అవగాహన కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమానికి ముందుగా సినీనటి శిల్పా చక్రవర్తి వ్యాఖ్యానంతో సాగిన జుంబా డాన్స్, ఫ్యాషన్ షో ఆకట్టుకున్నాయి. పెద్దసంఖ్యలో మహిళలు, యువత, చిన్నారులు పింక్ సఖి సారీ వాక్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు పాఠశాల చిన్నారులు ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలు, క్యాన్సర్ను జయించిన వారిని వేదికపై సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, డీఎంహెచ్వో డాక్టర్ జగదీశ్వరరావు, రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఉపాద్యక్షురాలు డాక్టర్ మీనాక్షి అనంతరామ్, డైరెక్టర్ ప్రాజెక్ట్ (ఆర్ఎంటి) గుర్మీత్ కోహ్లి, శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఎం.డి డాక్టర్ జి.సాంబశివ రావు, గురుద్వార సాఽథ్ సంగత్ అధ్యక్షుడు డాక్టర్ డి.ఎస్ ఆనంద్, ఏజ్ కేర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎన్.ఎస్ రాజు, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్, అభిజ్ఞ, హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్ వైద్యులు డాక్టర్ ఆదిత్య, మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఎండీ వి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పింక్ శారీ వాక్లో భాగంగా జుంబా డ్యాన్స్ చేస్తున్న మహిళలు -
చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ మృతి
మహారాణిపేట: ఓ హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న భూసరి రాజబాబు కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. గతేడాది నవంబర్లో ఏజెన్సీలోని కొయ్యూరు మండలం, బకులూరు సమీపంలో జరిగిన హత్య కేసులో రాజబాబు రెండో నిందితుడిగా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని ఆరోగ్యం విషమించడంతో కేజీహెచ్కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. రాజబాబు మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి, మృతదేహాన్ని జైలు అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కేజీహెచ్ ఆర్ఎంవో మెహర్కుమార్ తెలిపారు. వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డెక్కిన చిరుద్యోగులు
● ఆందోళన కొనసాగించిన రుషికొండ బీచ్ ఉద్యోగులు ● విధుల బహిష్కరణతో దిగొచ్చిన టూరిజం అధికారి ● నేడు జీతాలు చెల్లిస్తానని ఆర్డీ హామీ కొమ్మాది: అంతర్జాతీయ గుర్తింపు పొందిన రుషికొండ బీచ్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులు రెండో రోజూ విధులు బహిష్కరించారు. మూడున్నర నెలల నుంచి వీరికి జీతాలు విడుదల చేయకపోవడంతో శనివారం ఆందోళనకు దిగి, విధులు బహిష్కరించిన సంగతి తెలిసిందే. అధికారులు స్పందించకపోవడంతో ఉద్యోగులు ఆదివారం రుషికొండ బీచ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తమకు వెంటనే జీతాలు విడుదల చేయాలని నినదిస్తూ రెండు గంటల పాటు రోడ్డుపైనే నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. వాస్తవానికి ఈ నెల 7న వీరికి సంబంధించిన మూడు నెలల జీతం మొత్తం రూ.14,72,268 విడుదలైంది. అయితే రీజనల్ డైరెక్టర్ రమణారావు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు తమకు ఎటువంటి జీతం అందలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆర్డీని నిలదీసిన ఉద్యోగులు రుషికొండ బీచ్లో రోడ్డుపై ఉద్యోగులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆర్డీ రమణారావు.. అక్కడకు చేరుకోగా ఆయన్ని చుట్టిముట్టి నిలదీశారు. మూడు నెలల నుంచి జీతాలు లేక ఆకలితో అలమటిస్తుంటే మీరెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జీతాలు ఇస్తే తప్ప విధులకు హాజరుకామని ఉద్యోగులు స్పష్టం చేశారు. సంక్రాంతి నుంచి జీతాలు ఇస్తామని చెబుతున్నప్పటికీ.. ఎందుకు ఇవ్వడం లేదన్నారు. సోమవారం తప్పనిసరిగా జీతాలు ఇస్తామని చెప్పడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. కానీ జీతం ఇచ్చేంత వరకు విధులకు హాజరుకామని తేల్చి చెప్పారు. అందరినీ పీకేస్తా.. చిరు ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో ఆర్డీ రమణారావు వారిపై రుసరుసలాడారు. జీతాలు ఇస్తానని చెప్పినా ఆందోళన చేయడం ఏమిటని మండిపడ్డారు. జీతాలు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ఉద్యోగాల నుంచి పీకేస్తానని వారిని హెచ్చరించినట్లు సమాచారం. మూడున్నర నెలల నుంచి జీతాలు లేక ఆవేదనతో ఆందోళన చేస్తే.. సహకరించాల్సింది పోయి ఆర్డీ తమపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని ఉద్యోగులు అన్నారు. ఒక్కొక్కరిగా ఇంటికి పంపించేస్తానని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు ఇచ్చిన తర్వాత ఉద్యోగాల నుంచి తొలగిస్తే ఇదే బీచ్లో ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. కాగా.. 7వ తేదీ జీతాలు వచ్చినా ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదని ఆర్డీని విలేకరుల ప్రశ్నించగా.. కలెక్టర్ అనుమతితో జీతాలు ఇస్తామని కొత్త భాష్యం చెప్పారు. ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంతో బీచ్ ప్రాంతమంతా అధ్వానంగా తయారైంది. ఎక్కడ చెత్త అక్కడ ఉండిపోవడం, దుర్వాసనతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
హరేకృష్ణ వైకుంఠంలో ఆధ్యాత్మిక శోభ
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠం వద్ద శ్రీ రాధాకృష్ణుల విగ్రహ ప్రాణప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల సమక్షంలో వివిధ రకాల పండ్లను రాధాకృష్ణుల విగ్రహాలపై ఉంచి ఫలాధివాసం, పట్టు వస్త్రాలతో వస్త్రాధివాసం నిర్వహించారు. అనంతరం రకరకాల పుష్పాలను, హారాలను ఉంచి సయ్యనాధివాసం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రాణప్రతిష్ట, ఆరాధన గురించి పద్మ శ్రీ అవార్డు గ్రహీత మధు పండితదాస వివరించారు. హరేకృష్ణ మూవ్మెంట్ ఆంధ్ర, తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస, ఇస్కాన్ బెంగళూర్ వైస్ ప్రెసిడెంట్ వాసుదేవ కేశవ ప్రభు, ఉత్తరప్రదేశ్లోని బృందావన్ చంద్రోదయ మందిరం ఉపాధ్యక్షుడు యధిష్టిర కృష్ణదాస, అహ్మదాబాద్ హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు జగన్ మోహన కృష్ణదాస, విజయవాడ అధ్యక్షుడు వంశీధర దాస, విశాఖ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస ప్రవచించారు. అంబరీష దాస, యధురాజ దాస తదితరులు సహాయ సహకారాలు అందించారు. -
తల్లి చెంతన దర్శకుడు పూరీ జగన్నాథ్
నర్సీపట్నం: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోదరుడు, ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తల్లి సత్యవతి అలియాస్ అమ్మాజీ వద్దకు వచ్చారు. ఇటీవల ప్రమాదానికి గురికావడంతో ఆమె చేతికి ఆపరేషన్ జరిగింది. విషయం తెలియడంతో సోదరుడు, సినీ హీరో సాయిరామ్ శంకర్తో కలిసి పూరీ జగన్నాథ్ తల్లిని చూసేందుకు ఆదివారం గణేష్ ఇంటికి చేరుకున్నారు. తల్లిని అక్కున చేర్చుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చాలా కాలం తర్వాత కుమారుడిని చూసిన తల్లి అమ్మాజీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సోదరులు గణేష్, సాయిరామ్, మరదళ్లు, పిల్లలు, తల్లితో జగన్నాథ్ సరదాగా గడిపారు. పూరీ రాకతో గణేష్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. పూరీ జగన్నాథ్ అభిమానులు, బంధువులు ఆయన్ని కలిసేందుకు తరలివచ్చారు. -
టీడీపీ నాయకులకు జనసేన తీర్థం
కంచరపాలెం: జీవీఎంసీ 56వ వార్డులోని గవర కంచరపాలెం ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు పెంటకోట శివకుమార్ నేతృత్వంలో 450 మంది కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన కార్యాలయంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదివారం వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్డు టీడీపీ కార్పొరేటర్, జీవీఎంసీ స్డాండింగ్ కమిటీ సభ్యుడు శరగడం రాజశేఖర్పై అసంతృప్తితో వీరంతా జనసేనలో చేరినట్లు చెబుతున్నారు. ఆయన నాలుగేళ్ల పాలనలో వార్డు అభివృద్ధి చెందనలేదని, నాయకులు, కార్యకర్తలను సరిగా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. -
‘ప్రభుత్వ భూములను పరిరక్షించండి’
మధురవాడ: విశాఖ రూరల్ మండల పరిధిలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడి ప్రభుత్వ, ప్రజా అవసరాలకు ఉపయోగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ అభియోగాలపై 7 గురు అధికారులకు జేసీ నోటీసులిచ్చి, ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు చెప్పారు. తాము పదేళ్లుగా వినతిపత్రాలు ఇస్తున్నా ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ఇప్పటికై నా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి.. భూకబ్జాదారులు, వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఏయూలో రాజకీయ క్రీడ
విశాఖ విద్య: ఖ్యాతిగడించిన ఆంధ్ర యూనివర్సిటీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ చెదలు పడుతున్నాయా..?. పీహెచ్డీ స్కాలర్స్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో వర్సిటీ వర్గాలతో పాటు, విద్యావేత్తల్లోనూ ఇదే చర్చసాగుతోంది. వర్సిటీ పురోభివృద్ధి కోసమని గత వీసీ ప్రసాద్ రెడ్డి టీడీఆర్ హబ్ ఏర్పాటు చేయగా, దీన్ని నిర్యీర్యం చేయడమే లక్ష్యమన్నట్లుగా ప్రస్తుత పాలకులు తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్కు ప్రశ్నార్థకమౌతున్నాయి. పీహెచ్డీ స్కాలర్స్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో కొంతమంది అవినీతి ఆచార్యులు తమ స్వలాభం కోసం వేస్తున్న ఎత్తుగడలకు పరిశోధక విద్యార్థులు బలిపశువులవుతున్నారు. టీడీఆర్ హబ్ ద్వారా ప్రవేశాలు పొందిన పరిశోధక విద్యార్థులకు పరీక్షలను నిలిపివేస్తూ, వర్సిటీ అధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నుంచి 2023 వరకు ఏయూ టీడీఆర్ హబ్ ద్వారా సుమారుగా 680 మంది పరిశోధక విద్యార్థులు ప్రవేశం పొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సిఫార్సుతో చేరిన కొద్దిమంది మిగతా వారంతా ఉన్నత విద్యామండలి నిర్వహించే ఏపీఆర్–సెట్ ద్వారా మెరిట్ ప్రాతిపదికన ఆంధ్ర యూనివర్సిటీలో చేరారు. వీరికి ఇప్పటికే ప్రీ పీహెచ్డీ, వైవా నిర్వహించాలి. వాటిని పూర్తి చేసిన వారికి అవార్డు ప్రదానం చేయాలి. కానీ, గత వీసీ ప్రసాద్ రెడ్డిపై రాజకీయ కక్షతో పరిశోధక విద్యార్థులకు పరీక్షలను సైతం నిలిపివేశారు. అవినీతి ఆచార్యులతో అపఖ్యాతి పీహెచ్డీ స్కాలర్స్ నుంచి పరీక్షల పేరిట డబ్బులు వసూలు చేసే ఆనవాయితీకి నాటి వీసీ ప్రసాదరెడ్డి బ్రేక్ వేశారు. దీన్ని జీర్ణించుకోలేని వర్సిటీలోని ఓ వర్గం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పనిగట్టుకొని ఫిర్యాదులు చేయడంతో, ఆ ప్రభావం పరిశోధక విద్యార్థులపై పడింది. టీడీఆర్ హబ్ ద్వారా జరిగిన ప్రవేశాలపై వర్సిటీ ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరిపి, 40 మంది పరిశోధకుల ప్రవేశాల విషయంలో లోపాలను ఎత్తి చూపినట్లు తెలిసింది. మిగతా వారంతా యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే ప్రవేశాలు పొందారని తేల్చినా, పరీక్షలు జరగనివ్వకుండా వర్సిటీలోని కొంతమంది అవినీతి ఆచార్యులు అడ్డుపుల్లలు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పరిశోధక విద్యార్థుల్లో పెరుగుతున్న అసంతృప్తి ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్న క్రేజ్తో పీహెచ్డీ కోసమని చేరితే, అధికారులు ఇబ్బందులు గురి చేస్తుండటంపై వారిలో అసంతృప్తి పెరుగుతోంది. పరీక్షలు ఎందుకు నిలిపివేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరిశోధక విద్యార్థులతో ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటైంది. పరీక్షలను వెంటనే నిర్వహించాలని కోరుతూ సోమవారం ఉదయం 10 గంటల నుంచి వర్సిటీ వైస్ చాన్సలర్ భవనం ముందు శాంతియుత నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆందోళనలో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పరిశోధక విద్యార్థులు ఇప్పటికే నగరానికి చేరుకున్నట్టు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. పీహెచ్డీ స్కాలర్స్పై ఎందుకీ కక్ష పరీక్షల నిర్వహణకు చొరవ చూపని అధికారులు పరిశోధకులను ఇబ్బంది పెడుతున్న ఓ వర్గం వర్సిటీ అధికారుల తీరుపై పెరుగుతున్న అసంతృప్తి నేడు శాంతియుత ఆందోళన -
పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం
సాక్షి, అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మాసిటీలో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. విష వాయువు లీక్ కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తోరెంట్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ ఘటన చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం కార్మికులను యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది.గత నెల జనవరి 25న విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో శనివారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడొకరు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్లో పడి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడిగా గుర్తించారు.జనవరి 21వ తేదీన ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.కాగా, గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఆర్గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. -
మహిళతో వరుస మరిచి టీడీపీ నేత అకృత్యాలు.. ఎట్టకేలకు అరెస్ట్!
సాక్షి, విశాఖ: టీడీపీ నేత కీచకపర్వం చూసి స్థానికులు, కుటుంబ సభ్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. సదరు నేతకు వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భం దాల్చడం తర్వాత రెండో వివాహం చేయడం.. బంధువులను సైతం షాక్కు గురిచేసింది. ఇక, బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి.. మంత్రి అచ్చెన్నాయుడికి అనుచరుడు కావడం గమనార్హం.వివరాల ప్రకారం.. విశాఖలో దళిత మహిళపై టీడీపీ నేత పెబ్బలి రవి కుమార్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. వరసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో చేరదీసిన పిన్ని, బాబాయ్ రవి కుమార్.. ఆమెను చేరదీశారు. అనంతరం, శ్రీకాకుళానికి చెందిన వ్యక్తితో బాధిత మహిళకు వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించి ఇద్దరిని విడదీసిన రవికుమార్. ఇక, ఒంటరిగా ఉన్న బాధిత మహిళపై రవికుమార్.. వరుసగా లైంగిక దాడికి తెగబడ్డాడు.లైంగిక దాడి విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో, సదరు మహిళ గర్భం దాల్చడంతో కిడ్నాప్ చేసి మలేషియాకు తరలించాడు. అనంతరం, బాధిత మహిళ కనపడటం లేదని బంధువులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు విషయం బయటకు వస్తుందేమోనని భయపడిన రవికుమార్.. మళ్లీ ఆమెను విజయవాడకు తీసుకొచ్చి రహస్యంగా ప్రసవం చేయించాడు. ఆసుపత్రి ధ్రువపత్రాలపై తానే తండ్రిని అని రవి కుమార్ సంతకం చేశాడు.ఆ తరువాత దగ్గరుండి బాధితురాలికి రెండో వివాహం జరిపించాడు. ఈ సమయంలో బాధితురాలి నుంచి డబ్బు, నగలు.. ఆమెకు ఉన్న ఆస్తిని కాజేసి ఆమెను మరింత క్షోభకు గురి చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో రవికుమార్ కీచకపర్వం మొత్తం వెలుగులోకి వచ్చింది. అయితే, తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించుకు తిరుగుతున్నందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఇసుక.. ఎవరూ కొనట్లే.!
ముడసర్లోవ స్టాక్ పాయింట్లో 2,840 టన్నుల ఇసుక నిల్వలు ఆరిలోవ: ముడసర్లోవ వద్ద ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్కు వినియోగదారుల నుంచి స్పందన కరువైంది. ఇక్కడ నుంచి ఇసుక కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక గత ఏడాది డిసెంబర్ 12న ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా గార ఇసుక రీచ్ నుంచి లారీలతో ఇక్కడకు 3,480 టన్నుల ఇసుక తీసుకు వచ్చి నిల్వ ఉంచారు. అయితే ఇక్కడ ఇసుక విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇంతవరకు కేవలం 640 టన్నుల ఇసుక మాత్రమే ఇక్కడ విక్రయించారు. ఈ లెక్క ప్రకారం రోజుకు సుమారు 11 టన్నుల ఇసుక చొప్పున వినియోగదారులు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ 2,840 టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులు ఇక్కడ ఇసుక కొనుగోలు చేయకుండా ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. కారణం ధరలో వ్యత్యాసమే.! ఇసుక స్టాక్ పాయింట్లో టన్ను రూ.700కు విక్రయిస్తుండగా, ప్రైవేట్ వ్యాపారుల వద్ద టన్ను రూ.650కే లభిస్తోంది. అందుకే ఇటు వైపు రావడం లేదు. బిల్లుతో పాటు కొలతలో ఎటువంటి తేడా లేకుండా విక్రయిస్తామని చెబుతున్నా.. ఈ స్టాక్ పాయింట్ వైపు రాకపోవడం గమనార్హం. -
ఆనందంగా
సాగుతున్న జీవితంలో.. గృహిణిగా తన కుటుంబాన్ని, సొంత ఫిట్నెస్ సెంటర్ను నిర్వహిస్తూ ఆనందంగా సాగుతున్న బేగం జీవితంలో 2017 నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. షోల్డర్ పెయిన్తో వైద్యుల వద్దకు వెళ్లిన ఆమె ఎంఆర్ఐ లో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ఆ ట్యూమర్ రిబ్స్లోని వెళ్లినట్లు వైద్యులు గుర్తించారు. వైద్యులు సర్జరీ చేశారు. అనంతరం 2019లో తిరిగి తీవ్రమైన ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆమె ఛాతీ పక్కటెముకలు రెండూ ట్యూమర్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులుగుర్తించారు. వైద్యులు బయాప్సీ చేసి క్యాన్సర్గా నిర్ధారించారు. -
నిర్ణీత గడువులోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం
విశాఖ సిటీ: నిర్ణీత కాలపరిమితిలోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. శనివారం వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్టీపీ)లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనధికార లేఅవుట్లు, స్థలాల క్రమబద్ధీకరణ–2020 పథకానికి సంబంధించి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్చి 31వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చినట్లు చెప్పారు. వివిధ శాఖల వద్ద పెండింగ్లో ఉన్న అప్రోచ్ రహదారులు, కల్వర్టులకు సంబంధించిన నిరభ్యంతర పత్రాలను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని చెప్పారు. అలాగే ఎల్టీపీల వ్యక్తిగత లాగిన్లో అధిక సంఖ్యలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. షార్ట్ఫాల్ ఉన్న దరఖాస్తుల విషయంలో కూడా అవసరమైన సంబంధిత దస్త్రాలను వీఎంఆర్డీఏకు అందించి దరఖాస్తులను వేగంగా క్లియర్ చేసే విధంగా సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో సీయూపీ శిల్ప, ప్లానింగ్ అధికారులు చామంతి, అరుణవళ్లి, మౌనిక, కిషోర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రుషికొండ బీచ్ ఉద్యోగులకు జీతాల్లేవ్..
● మూడు నెలలుగా అందని జీతాలు ● విధులు బహిష్కరించిన 38 మంది ఉద్యోగులు ● ఉద్యోగాలు తొలగిస్తామని అధికారుల హెచ్చరికలు కొమ్మాది: బ్లూఫ్లాగ్ బీచ్గా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రుషికొండ బీచ్లో పనిచేస్తున్న చిరుద్యోగులు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలలు గడుస్తున్నా వేతనాలు చెల్లించకపోవడంతో శనివారం నిరసన బాట పట్టారు. మూడున్నర నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, జీతాల కోసం ఎదురుచూస్తూ విసిగిపోయామని వాపోతున్నారు. జీతాలు కోసం అధికారులను అడిగితే.. ‘జీతాల్లేవ్.. ఉప్పర మీటింగ్లు పెట్టి జీతాలు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగించేస్తాం.’అంటూ తమపై చిందులు తొక్కుతున్నారని ఆరోపించారు. రుషికొండ బీచ్లో 38 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 8 మంది టికెట్ కలెక్టర్లు, 9 మంది సెక్యూరిటీ గార్డులు, 13 మంది బీచ్ క్లీనర్లు, నలుగురు లైఫ్ గార్డ్స్, ఇద్దరు సూపర్వైజర్లు, ఎలక్ట్రీషియన్, ఫస్ట్ ఎయిడ్ ఉద్యోగి ఉన్నారు. వీరే లేకపోతే బీచ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుంది. పర్యాటకుల భద్రత ప్రమాదంలో పడుతుంది. తక్కువ జీతాలతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తున్నప్పటికీ, నెలల తరబడి జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను టూరిజం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో శనివారం విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. విధులకు హాజరు కాకుండా ఆందోళన చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సంబంధిత అధికారులు వారిని హెచ్చరించారు. అయినప్పటికీ ఉద్యోగులు వెనక్కి తగ్గకుండా నిరసన కొనసాగించారు. ‘మా జీతాలు చెల్లించి.. ఆ తర్వాత ఉద్యోగాలు తీసేయండి’అని ఉద్యోగులు స్పష్టం చేశారు. జీతాలు చెల్లించే వరకు విధులకు హాజరుకాబోమని తేల్చి చెప్పారు. ఆర్డీ అత్యుత్సాహం రుషికొండ బీచ్లో గతంలో ప్రవేశ టికెట్ కలెక్టర్లుగా 8 మంది విధుల్లో చేరారు. అయితే రీజినల్ డైరెక్టర్ రమణారావు అత్యుత్సాహంతో వీరిని బీచ్ క్లీనర్లుగా మార్చారు. కాస్తోకూస్తో చదువుకున్న వీరిని బీచ్ క్లీనర్లుగా మార్చడంపై విమర్శలు వచ్చాయి. ఇదేంటని ప్రశ్నించిన వారిని ‘నచ్చితే ఉద్యోగంలో కొనసాగండి.. లేకుంటే మానేయండి’అంటూ ఆర్డీ హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక మనసు చంపుకుని బీచ్ క్లీనింగ్ పనులు చేస్తున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెలలు గడుస్తున్నా.. జీతం అందకపోవడంతో తమ గోడు ఎవరికి వెళ్లబోసుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు ఖాళీ చేసేశాం మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం. మూడు నెలల నుంచి జీతం అందక అద్దె ఇవ్వకపోవడంతో.. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమన్నారు. చేసేదేమీ లేక ఇల్లు ఖాళీ చేసేశాం. మా బతుకులు రోడ్డెక్కాయి. జీతాలు అడిగితే ఉద్యోగం మానేమంటున్నారు. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి. – జి.రత్న, ఉద్యోగి పిల్లల చదువు మాన్పించేశాం మూడు నెలల నుంచి జీతాలు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. జీతం ఎప్పుడిస్తారని అడిగితే రేపు, ఎల్లుండి అంటూ దాటవేస్తున్నారు. దీంతో అప్పులు చేసి మరీ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. పిల్లల బడి ఫీజులు కట్టలేక చదువు మాన్పించేశాం. – కల్యాణి, ఉద్యోగి -
‘సంకల్ప’లో క్రీడా వేడుక
సింథియా : తూర్పు నావికాదళ పరిధిలోని ప్రత్యేక విద్య, సలహా కేంద్రం విశాఖపట్నంలోని సంకల్ప వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి లాబోనీ సక్సేనా, వైస్ ప్రెసిడెంట్ ఎన్డబ్ల్యూడబ్ల్యూఏ (ఈఆర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శక్తివంతమైన ఎనర్జిటిక్ ఏరోబిక్ డిస్ప్లేలు, రిలే రేసులు, ఆటలు పలువుర్ని ఆకర్షించాయి. ఈ విధంగా విద్యార్థుల సామర్థ్యాలను ప్రదర్శించే విధంగా శిక్షణ ఇచ్చిన సిబ్బందిని, విద్యార్థుల తల్లిదండ్రులను పలువురు అభినందించారు. -
నగర శుభ్రతే లక్ష్యం
‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’లో కలెక్టర్ హరేందిర ప్రసాద్మహారాణిపేట: పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందామని, ఆరోగ్యకర, ఆహ్లాదకర వాతావరణంలో పని చేద్దామని స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. నగర శుభ్రతే లక్ష్యంగా అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ఇతర సంస్థల పరిధిలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా పరిసరాల పరిశుభ్రతా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా శనివారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని కలెక్టరేట్ పరిసరాలను శుభ్రం చేశారు. గార్డెన్లోని పిచ్చి మొక్కలను తొలగించారు. తడి– పొడి చెత్తను వేర్వేరు చేస్తూ డస్ట్ బిన్లలో వేశారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ ఆవశ్యకతను తెలుపుతూ పోస్టర్ను ప్రదర్శించారు. ప్రమాదకర వ్యర్థాలను, తడి–పొడిచెత్తను ఎలా వేరు చేయాలి, ఎలా తరలించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేకరించిన వ్యర్థాలను వేర్వేరు డబ్బాల్లో వేసి తరలించాలని పేర్కొన్నారు. అనంతరం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, ప్రత్యేక ఉప కలెక్టర్ శేష శైలజ, కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, ఇతర సెక్షన్ల సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనలో రాజీ పడొద్దు
జీవీఎంసీ అధికారులను ఆదేశించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్ డాబాగార్డెన్స్: నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో జీవీఎంసీ అధికారులు సమష్టిగా పనిచేయాలని కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ డాక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం తన చాంబర్లో జీవీఎంసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పక్కాగా వ్యర్థాల సేకరణ జరగాలని, డ్రైనేజీలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. బహరింగ ప్రదేశాల్లో, డ్రైనేజీల్లో వ్యర్థాలు వేసే వారిని గమనించి అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జీవీఎంసీ ప్రజారోగ్య అధికారులను చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ప్లానింగ్ కార్యదర్శులు, వీఆర్వోలు, జోనల్ కమిషనర్లు సంయుక్తంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే సంబంధిత ప్లానింగ్ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీచ్రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల ఖాళీ స్థలాన్ని డెబ్రిస్తో కప్పి, విస్తరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రణాళికా అధికారులను ఆదేశించారు.మురుగు కాలువ గూండా వెళ్లే తాగునీటి పైపులైన్లు గుర్తించి, తాగునీరు కలుషితం కాకుండా చూడాలని సూచించారు. నగరంలో వీధి దీపాలు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టాలని జోనల్ కమిషనర్లకు కలెక్టర్ ఆదేశించారు. మార్చి 31 నాటికి రావాల్సిన రూ.100 కోట్ల పన్నులు వసూలు చేయాలని డీసీఆర్ శ్రీనివాస్ను ఆదేశించారు. -
మంత్రి నారా లోకేష్కు స్వాగతం
మహారాణిపేట: విజయనగరం జిల్లా భోగాపురం మండలం సన్ రే విలేజ్ రిసార్ట్స్లో శనివారం జరిగిన జస్టిస్ డి.రమేష్ కుమార్తె వివాహానికి రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఇదిలా ఉండగా ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి విమానంలో వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో మంత్రి జి.సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ ఎం.శ్రీభరత్ తదితరులు స్వాగతం పలికారు. కార్యక్రమాలు ముగించుకుని తిరిగి మధ్యాహ్నం 12.55 గంటలకు విమానంలో నారా లోకేష్ విజయవాడ వెళ్లారు. -
ఘనంగా రాధాకృష్ణ మహోత్సవాలు
తగరపువలస: ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులో జరుగుతున్న శ్రీరాధాకృష్ణ మహోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం అధివాసాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ వైకుంఠం ప్రతినిధులు అంబరీష దాస, యదురాజ దాస మాట్లాడుతూ ప్రాణప్రతిష్ట అంటే దేవతా మూర్తి పవిత్ర స్వరూపంలో ప్రాణశక్తిని స్థాపించే ఆచారమన్నారు. ప్రతిష్ట అంటే పవిత్రం చేయడం, స్థాపన చేయడం, శాశ్వత స్థానంలో ఉంచడం అని వివరించారు. ఉత్సవాల్లో ముందుగా వేద పండితులు శాస్త్రాల ప్రకారం గోపూజ నిర్వహించారు. సాయంత్రం ధాన్యాధివాసం, జలాధివాసం, ఛాయాధివాసం, క్షీరాధివాసం వంటి కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో హరేకృష్ణ మూవ్మెంట్ ఆంధ్ర, తెలంగాణ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస, బెంగళూరు ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ వాసుదేవ కేశవ ప్రభు, విశాఖ శాఖ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస, దాదాపు 400 మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు. -
గాజువాక పీహెచ్సీని సందర్శించిన కేంద్ర బృందం
గాజువాక : మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగానికి చెందిన పాపులేషన్ రీసెర్చ్ కమిటీ (కేంద్ర బృందం) గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ను సందర్శించింది. డాక్టర్ వై.రమణ, డాక్టర్ సీహెచ్.పాదాలు నేతృత్వంలో పీహెచ్సీకి వచ్చిన బృందం.. ఓపీ రిజిస్టర్, డిస్పెన్సరీ, స్టోర్ రూమ్, ల్యాబ్లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్న విధానం, డెలివరీ రూమ్తోపాటు ఇన్పేషెంట్ విభాగంలో ఫీమేల్, మేల్ వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మందులను నిల్వ ఉంచిన గదిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మందులను ఎప్పటికప్పుడు సరి చూసుకోవడంతోపాటు ఇండెంట్ చేసుకోవాలని సూచించారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ రికార్డులను పరిశీలించారు. బడ్జెట్, బడ్జెట్ రిలీజ్, ఖర్చుల స్టేట్మెంట్లను పరిశీలించారు. డీఎం అండ్ హెచ్వో కార్యాలయానికి చెందిన అధికారులు శశిభూషణ్, మురళీకృష్ణ, పీహెచ్సీ వైద్యాధికారులు ఎం.సుధాకర్, డాక్టర్ బద్రి నారాయణమూర్తి, సీహెచ్వో పి.నాగ అప్పారావు ఇక్కడి కార్యక్రమాలను బృందానికి వివరించారు. ఈ సందర్భంగా వైద్య బృందం పీహెచ్సీ ఆవరణలో మొక్కలు నాటారు. -
‘నోటీసులు వెనక్కి తీసుకోండి’
సీతంపేట: వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియాను బెదిరిస్తారా అని దళిత, ప్రజా, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. ఓ పత్రికా సంపాదకుడికి విశాఖ ఆర్డీవో శ్రీలేఖ నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే అని మండిపడ్డారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వాక్ స్వాతంత్య్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను హరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, న్యాయవాది కె.పద్మ, ప్రజా సంఘాల నాయకులు డెంకాడ ఆనంద్, రాజేంద్రప్రసాద్, కిశోర్, లలిత, జె.శ్యామల, వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సీఏల పాత్ర కీలకం
కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్ మద్దిలపాలెం: భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ పాత్ర కీలకమని చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్ అన్నారు. మద్దిలపాలెంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం బ్రాంచ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 4.30 లక్షల మంది చార్టర్డ్ అకౌంటెంట్స్, 8 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కార్యవర్గంలో 40 మంది ఎన్నికవ్వగా.. అందులో 8 మందిని కేంద్ర ప్రభుత్వం కౌన్సిల్ సభ్యులుగా నియమించిందని వెల్లడించారు. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీపై చాలా మందికి అపోహలు ఉండగా, వాటన్నింటినీ చార్టర్డ్ అకౌంటెంట్స్ నివృత్తి చేశారని గుర్తు చేశారు. తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సీఏలు దోహదపడ్డారన్నారు. వికసిత్ భారత్ 2047 బృహత్తర కార్యక్రమానికి చార్టర్డ్ అకౌంటెంట్స్ కీలక భూమిక పోషిస్తున్నట్లు తెలిపారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1949లో ఏర్పాటైందని, విశాఖపట్నంలో 1977లో బ్రాంచ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఆదాయపు పన్ను బిల్లుకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి చార్టర్డ్ అకౌంటెంట్స్ సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల చార్టర్డ్ అకౌంటెంట్లు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. -
మత్తులో పడితే జీవితాలు చిత్తు
విద్యార్థులకు సీపీ బాగ్చి హెచ్చరిక పీఎంపాలెం: ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎంతో నష్టం కలిగించే మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. జీవీఎంసీ 6వ వార్డులోని బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో శనివారం జరిగిన ‘యాంటీ డ్రగ్ ఎడిక్షన్ అవేర్నెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ను టార్గెట్గా చేసుకుని పట్టుదలగా చదవాలని సూచించారు. దేశమంతటా డ్రగ్స్ మహమ్మారి వ్యాపించిందని, ఒకసారి డ్రగ్స్ తీసుకుంటే.. దానికి బానిసలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే అటువైపు కన్నెత్తి కూడా చూడరాదన్నారు. మత్తు పదార్థాలు తీసుకుంటే శ్వాస కోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందన్నారు. సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణించడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని మానసిక వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందన్నారు. మత్తు పదార్థాలు అమ్మడం, కలిగి ఉండటం నేరమన్నారు. అటువంటి వారు పోలీసులకు పట్టుబడితే 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష నుంచి 2 లక్షల జరిమానాను న్యాయస్థానం విధిస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్కు సంబంధించి వివరాలు తెలిస్తే 79950 95799/1972 నంబర్లకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
గాజువాకలో మధ్యప్రదేశ్ వ్యక్తి ఆత్మహత్య
అక్కిరెడ్డిపాలెం: గాజువాకలోని ఓ అపార్ట్మెంట్లో మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గాజువాక ఎస్ఐ నజీర్ తెలిపిన వివరాలివీ.. భెల్(హెచ్పీవీపీ)లో సబ్ జెట్ కాంట్రాక్ట్ విభాగంలో సిబ్బందికి మధ్యప్రదేశ్కు చెందిన చైన్ పాల్సింగ్(32) ఆహారం అందజేసే పనులు నిర్వహిస్తున్నాడు. తన మేనేజర్, మరో ముగ్గురితో కలిసి గాజువాకలోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నా డు. పాల్సింగ్కు తన భార్యతో గొడవలు ఉన్నాయని, మధ్యప్రదేశ్లోని పోలీస్స్టేషన్లో కేసు కూడా నడు స్తోందని సహోద్యోగులు తెలిపారు. కాగా.. శనివారం మధ్యాహ్న సమయంలో చైన్ పాల్సింగ్కు ఆహారం ఇవ్వడానికి డ్రైవర్ శ్రీధర్ ఫ్లాట్కు వెళ్లాడు. ఫ్లాట్ తలుపులు కొట్టి పాల్సింగ్ను పిలవగా, ఎంతకీ తలుపులు తెరవలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలోంచి తలుపును తోసి లోపల చూశాడు. పాల్సింగ్ లుంగీతో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించడంతో వెంటనే సహోద్యోగులకు విషయం తెలిపాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలా నికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. డ్రైవర్ శ్రీధర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
మెరుగైన జీవనశైలితో క్యాన్సర్కు చెక్
● వ్యాధిపై విస్తృత అవగాహన అవసరం ● సినీ నటి, లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి ● నేడు బీచ్రోడ్డులో పింక్ సఖి శారీ వాక్ ఏయూక్యాంపస్ : క్యాన్సర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సినీ నటి, లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి తాడిమల్ల అన్నారు. బీచ్రోడ్డులోని ఓ హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరోగ్యంగా జీవించడం అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా క్యాన్సర్ అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్తో పోరాడి గెలిచిన వారికి చూసి స్ఫూర్తిని పొందాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం బీచ్రోడ్డులో నిర్వహించే పింక్ సఖి శారీ వాక్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ, ప్రాథమిక దశలో గుర్తించడం, సరైన చికిత్స పొందడం, భయాన్ని విడిచిపెట్టడం ఎంతో అవసరమన్నారు. మంచి ఆరోగ్య అలవాట్లను కలిగి ఉండాలన్నారు. ప్రజల్లో క్యాన్సర్ పట్ల చైతన్యం పెంచాలన్నారు. తన కుటుంబంలో సైతం క్యాన్సర్ బారిన పడిన వారు ఉన్నారన్నారు. క్యాన్సర్ వ్యాధికి ఆన్సర్ (సమాధానం) ఉందన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థంగా ఉండే స్థలాల్లో క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. యాంకర్, సినీ నటి శిల్పా చక్రవర్తి మాట్లాడుతూ తన తల్లికి క్యాన్సర్ సోకిన సందర్భాన్ని వివరిస్తూ, విద్యావంతుల్లో సైతం వ్యాధి పట్ల అవగాహన తక్కువగా ఉంటోందన్నారు. ఇటువంటి సమాజ ఉపయుక్త కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్నిస్తోందన్నారు. కాగా.. ఈ కార్యక్రమాన్ని రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నా యి. ఉదయం 6 గంటలకు బీచ్రోడ్డు విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి శారీ వాక్ ప్రారంభమవుతుంది. కార్యక్రమంలో డీఎంహెచ్వో జగదీశ్వరరావు, రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ జి.అనంత రామ్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ మీనాక్షి అనంతరామ్, డైరెక్టర్ ప్రాజెక్ట్ (ఆర్ఎంటీ) గుర్మీత్ కోహ్లీ, శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ జి.సాంబశివ రావు, గురుద్వార సాథ్ సంగత్ అధ్యక్షుడు డాక్టర్ డీఎస్ ఆనంద్, ఏజ్ కేర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎన్.ఎస్ రాజు, ఆళ్వార్దాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎస్పీ రవీంద్ర, డాక్టర్ సీత కల్యాణి, డాక్టర్ ఎ.సుగంధి తదితరులు ప్రసంగించారు. -
‘ప్రతి ఇంటా శ్రీ మహాగణపతి లక్ష మోదక యజ్ఞం జరగాలి’
ఎంవీపీకాలనీ: శ్రీ మహా గణపతి వైభవంపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. రుషిపీఠం సత్సంగం శాఖ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీ సెక్టార్–6లోని భద్రం పార్క్లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రవచిస్తూ.. లోక కల్యాణం కోసం ప్రతి ఇంటా శ్రీ మహాగణపతి లక్ష మోదక యజ్ఞం జరగాలన్నారు. ఆ యజ్ఞం విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం వివిధ గణపతులకు ప్రత్యేక పూజలు ఎలా చేయాలో వివరించడంతో పాటు వేద, పురాణ, మంత్ర శాస్త్రాల సహిత శ్రీ మహా గణపతి వైభవాన్ని తన ప్రవచనాల ద్వారా తెలియజేశారు. నిర్వాహకులు కె.వి.ఎస్ శ్యామ్, కందాళ అరుణ గాయత్రి, డి.శ్రీనివాస్, వి.వి.ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు.