breaking news
Visakhapatnam
-
ఆటోడ్రైవర్లకు ‘బ్యాడ్జ్’ షరతు దారుణం
బీచ్రోడ్డు/మహారాణిపేట : తమకు ఆర్థిక సహాయం అందించే పథకంలో బ్యాడ్జ్ తప్పనిసరి అనే నిబంధన పెట్టడం సరికాదని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జగదాంబ సెంటర్ మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు గురువారం ఆటోలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం సభలో ప్రకటించిన రూ.15వేల ఆర్థిక సహాయం పథకానికి బ్యాడ్జ్ ఉండాలనే షరతు పెట్టడం దారుణమన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం డ్రైవర్ల బ్యాడ్జ్లను, నంబర్లను రద్దు చేసిందని గుర్తు చేశారు. వాహన మిత్ర పథకాన్ని అర్హత ఉన్న డ్రైవర్లందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బహుళజాతి కంపెనీల యాప్ ఆధారిత టూవీలర్ రవాణా సేవలు ఆటో డ్రైవర్ల ఉపాధికి ముప్పుగా మారాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ సేవలను రద్దు చేసినా.. మన రాష్ట్రంలో వాటిని కొనసాగించడం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే టూవీలర్ యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ‘సీ్త్ర శక్తి’ పథకంతో తగ్గిన ఆదాయం సీ్త్ర శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో మోటార్ కార్మికుల ఆదాయం 80 శాతం తగ్గిపోయిందని రమణ తెలిపారు. దీని వల్ల పిల్లల స్కూల్ ఫీజు లు, కరెంట్ బిల్లులు, ఇంటి అద్దెలు వంటివి కట్టలేని దీనస్థితిలో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 21, 31ల ద్వారా భారీ జరిమానాలు విధించడం కూడా ఆర్థిక భారాన్ని పెంచుతోందన్నారు. ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ మాట్లాడుతూ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వల్ల డ్రైవర్లు మరింత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్పై 50 శాతం రాయితీ ఇవ్వాలని, ఈ–చలానా కేసులను ఎత్తివేయాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రమాదంలో డ్రైవర్ చనిపోతే రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ నాయకులు ఎన్ మధురెడ్డి, అడ్డూరి శంకర్, లండ అప్పారావు, దల్లి నాని, లంకా గోవింద్ సూరిబాబు, కెల్లా రమణ, సింహాచలం, భాషా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు -
పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా?
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై వేధింపులకు పాల్పడుతుంది. ఒక రాజకీయ పార్టీ నేత ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలను రిపోర్టర్ వార్తగా రాస్తే ఎడిటర్పై కేసు పెడతారా? మీడియా గొంతును నులిమేస్తారా? రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..? అక్షరాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను నోటీసులు, అక్రమ కేసులతో నిరోధించలేరు. రాజకీయ కక్షలు కార్పణ్యాలతో పత్రికా ఎడిటర్పై కేసుల నమోదు ఏమాత్రం సరికాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి డబ్బా కొట్టే పచ్చ మీడియా మాత్రమే ఉండాలా? మీ అవినీతి, అక్రమాలను ఎత్తిచూపించే ఇంకే ఏ మీడియా ఉండకూడదా.. అయినా మీకెందుకంత ఉలికిపాటు. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి -
స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను సమైక్యంగా అడ్డుకుందాం
గాజువాక : విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ సమైక్యంగా అడ్డుకుందామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ పిలుపునిచ్చారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గాజువాకలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వంటిల్లు జంక్షన్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్టీల్ప్లాంట్ను ప్రధాని మోదీ అమ్మడానికి ప్రయత్నిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు మద్దతుగా ఉండటం దుర్మార్గమన్నారు. కేరళలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న హిందూస్తాన్ న్యూస్ ప్రింట్ను అమ్మడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నించిందని, దాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సమర్థవంతంగా అడ్డుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆ కంపెనీని నడపే సత్తా లేకపోతే తాము నడుపుతామని, దాన్ని తమ ప్రభుత్వానికే అమ్మాలని పినరయ్ విజయన్ స్పష్టం చేశారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే విశాఖ స్టీల్ప్లాంట్ విషయంలో అలాంటి ధైర్యం ప్రదర్శించాలని సవాల్ చేశారు. ఈ పాలకులు ప్రజల ఆస్తిని కాపాడకుండా అదానీ, అంబానీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక ఎమ్మెల్యే, విశాఖ ఎంపీ మాత్రం స్టీల్ప్లాంట్ను కాపాడేశామంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. వారికి నీతి, నిజాయితీ ఉంటే ఈ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని ప్రధానమంత్రి మోదీతో ప్రకటన చేయించాలన్నారు. ఇటీవల విశాఖ వచ్చిన ప్రధాని మోదీ స్టీల్ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మోదీకి మద్దతు ఇస్తూ టీడీపీ తన రాజకీయ పునాదిని లేపేసుకుంటోందని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని, ఈ నేపథ్యంలో ప్రజలంతా ఒక్కతాటిపైకి రావాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ టీడీపీది మొదటి నుంచీ రెండు నాల్కల ధోరణేనని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు స్టీల్ప్లాంట్ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలుపుతూ లేఖ రాశారని, అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభ పెట్టుకోవడానికి కూడా అనుమతి నిరాకరించడం దుర్మార్గమని అన్నారు. విశాఖ ఎంపీ తన పదవిని నిలబెట్టుకోవడం కోసం బీజేపీకి అమ్ముడుపోయారన్నారు. స్టీల్ప్లాంట్ను విస్మరించి ఆర్సీ మిట్టల్ కంపెనీకి గనులు అడగడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు ఎం.జగ్గునాయుడు, కె.లోకనాథం, ఎస్.పుణ్యవతి, రాజేశ్వరరావు, జగన్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి బేబీ -
ప్రెస్మీట్ కవర్ చేస్తే కేసులు పెడతారా?
రాజకీయ పార్టీల నాయకుల స్టేట్మెంట్లు పత్రికలో పబ్లిష్ చేస్తే రిపోర్టర్లు, ఎడిటర్పై కేసులు పెడతారా? రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)ఎ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంది. ప్రజల పక్షాన గళమెత్తుతున్న ’సాక్షి’ గొంతు నులిమే చర్య ఇది. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధానాలు ప్రభుత్వం మానుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి. రీజాయిండర్ ఇవ్వాలి. కానీ పత్రికలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఇలాంటి సంస్కృతికి బీజం నాట డం భవిష్యత్తులో నిజాన్ని అణగదొక్కినట్లే అవుతుంది. – బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం -
ట్రాఫిక్ కష్టాలకు ఏఐతో చెక్
డాబాగార్డెన్స్: నగరంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించి, శాంతిభద్రతలను మెరుగుపరిచే లక్ష్యంతో జీవీఎంసీ, నగర పోలీస్ శాఖ సంయుక్తంగా ప్రాజెక్టు సారథి అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేసే ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్) ద్వారా నగరంలో ట్రాఫిక్ నిర్వహణను సమూలంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రాజెక్టు సారథి పురోగతిని సమీక్షించారు. నగరంలోని ఐదు కీలక ప్రాంతాల్లో ఐదు వేర్వేరు సంస్థల ద్వారా పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించినట్లు కమిషనర్ వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్, రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ను ద్వారా డేటాను సేకరించినట్లు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టులో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు తాము సేకరించిన డేటాను, ఫలితాలను పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, శాంతిభద్రతల పరిరక్షణకు మరిన్ని అంశాలను జోడించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టులో నెల రోజుల పాటు నమోదైన ఫలితాలను సమీక్షించి, నగరం మొత్తం ఈ వ్యవస్థను విస్తరించేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పర్యవేక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ మరింత సులభతరం అవుతుందని సీపీ అన్నారు. -
విశాఖ చేరుకున్న నేపాల్ బాధితులు
భయం వేసింది నేను మా ఆవిడ, కోడలు, మా బఽంధువులు కలిపి మొత్తం మొత్తం 18 మంది ఈనెల 3న నేపాల్ బయలుదేరి వెళ్లాం. 5న అక్కడికి చేరుకున్నాం. ముక్తినాథ్, పశుపతినాఽథ్ తదితర ఆలయాలతో పాటు పలు ప్రాంతాలను సందర్శించాం. 9న ఖాట్మాండ్ వచ్చాం. అప్పటికే అక్కడ తీవ్రమైన అల్లర్లు చోటుచేసుకోవడంతో భయాందోళన చెందాం. అక్కడ మేము బస చేసిన హోటల్ యజమాని మమ్మల్లి లోపల ఉంచి గేట్లకు తాళాలు వేశారు. తిరిగి సింహాచలం వస్తామో లేదో అని భయం వేసింది. ఎట్టకేలకు అక్కడ ప్రత్యేక విమానం ఎక్కి గురువారం రాత్రికి విశాఖ చేరుకున్నాం. – సిరిపురపు రమణ, సింహాచలం గోపాలపట్నం : తీర్థయాత్రలకు వెళ్లి నేపాల్లో చిక్కుకున్న బాధితులు గురువారం విశాఖ చేరుకున్నారు. ఖట్మాండ్ నుంచి ప్రత్యేక విమానంలో మొత్తం 144 మంది విశాఖ వచ్చారు. ఇందులో 42 మంది విశాఖ ప్రాంతంవారు, 40 మంది రాయలసీమ, 34 మంది విజయనగరం, మిగిలిన వారంతా శ్రీకాకుళానికి చెందినవారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన 40 మందిని ఇక్కడి నుంచి తిరుపతికి వేరే విమానంలో పంపించారు. మిగతా 104 మందిని ప్రత్యేక వాహనాల ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. వారికి విమానాశ్రయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, తదితరులు స్వాగతం పలికారు. హోటల్లోనే ఉండిపోయాం.. తీర్థయాత్రలకు వెళ్లి అన్ని ప్రాంతాలు చూశాం.. నేపాల్ నుంచి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మేమంతా హోటల్లోనే ఉండిపోయాం. హోటల్ యజమాని మానవతా దృక్పథంతో మమ్మల్ని ఆదుకున్నాడు. ఫ్రీగా భోజనాలు పెట్టించాడు. అయితే మాతో వచ్చినవారు వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. అందరం మళ్లీ కలుస్తామా.. ఇంటికి వెళ్లగలమా.. అని ఆందోళన చెందాం. బిక్కుబిక్కుమంటూ గడిపాం. దేవుడు దయ వల్ల విశాఖ చేరుకున్నాం. – ఎయిర్పోర్టులో నేపాల్ బాధితులు -
ఉక్కుకు ఉచ్చు?
రూ.3లక్షల కోట్ల ఆస్తి భద్రత ప్రశ్నార్థకం ఉక్కుకు ఉచ్చు?సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న కుయుక్తులు ఉక్కు పరిశ్రమకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. సంవత్సరాలుగా ఉద్యోగ, కార్మిక సంఘాలు తమ కుటుంబాలతో కలిసి రోడ్లపై పోరాటాలు చేస్తున్నా.. కేంద్రం తన పని తాను చేసుకుపోతోంది. ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి చకచకా పావులు కదుపుతోంది. ఖర్చుల తగ్గింపులో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పేరుతో ఉద్యోగులను, వేలాది మంది కార్మికులను విడతలవారీగా విధుల నుంచి తొలగించేసింది. ఇదే విధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో భద్రతా సిబ్బందిపైనా వేటు పడింది. ఈ నేపథ్యంలో ప్లాంట్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. భారీగా తగ్గిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది దేశంలోని పార్లమెంట్, విమానాశ్రయాలు వంటి అత్యంత కీలకమైన సంస్థలకు రక్షణ కల్పించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) విశాఖ ఉక్కు కర్మాగారానికి 1983 ఆగస్టు నుంచి భద్రత కల్పిస్తోంది. రూ.3 లక్షల కోట్ల విలువైన ప్లాంట్ ఆస్తులు, యంత్రాలు, ముడి పదార్థాలను సుమారు 40 ఏళ్లుగా సుమారు 1,013 మంది సిబ్బంది కంటికి రెప్పలా కాపాడారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘డిప్లాయ్మెంట్ కాస్ట్ కటింగ్’పేరుతో యాజమాన్యం సీఐఎస్ఎఫ్ సిబ్బందిని భారీగా తగ్గించింది. మొత్తం 1013 మందిలో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు వంటి హోదాలో ఉన్న 438 మందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ప్రస్తుతం కేవలం 575 మంది సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. సిబ్బందిని తగ్గించిన తర్వాత ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేయడంలో యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. యాజమాన్య నిర్లక్ష్యం.. ప్రైవేటీకరణ కుట్ర కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ ప్రైవేటీకరణకు మొగ్గు చూపడం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందుకు వత్తాసు పలకడంతోనే యాజమాన్యం ప్లాంట్ భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఒక ఉద్యోగి ప్లాంట్లోకి వెళ్లి బయటకు రావాలంటే సీఐఎస్ఎఫ్ సిబ్బంది డేగ కళ్లతో పహారా కాసేవారు. లోపలకు వెళ్లి.. బయటకు వచ్చేటప్పుడు ఉద్యోగి చేతిలో అదనపు వస్తువు ఏదైనా కనిపించినా ఆరా తీసేవారు. ఇప్పుడు సిబ్బంది కొరత కారణంగా భద్రతా ప్రమాణాలు పడిపోయాయి. ఒక్కొక్కటి 1,400 కిలోల బరువున్న కాపర్ స్టేవ్స్ చోరీకి గురైనా గుర్తించలేకపోవడం, అత్యంత కీలకమైన ఆర్ఎంహెచ్సీ విభాగంలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని ఉద్యోగ, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ వరస ఘటనల వెనుక ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేసే కుట్ర దాగి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ భద్రతా వ్యవస్థను బలహీనం చేశారు స్టీల్ప్లాంట్ ఆస్తులను దొడ్డిదారిన దోచుకోవడానికి పెద్దస్థాయిలో కుట్ర జరుగుతోంది. భద్రతా వలయంలో ఉంటూ నిరంతరం రూ.వేల కోట్ల ఉత్పత్తులున్న చోట.. బయట వాహనాల్లో వచ్చి చోరీ చేస్తే.. ప్లాంట్లో ఏదో జరుగుతోందని అర్థమవుతోంది. కాపర్ స్టేవ్స్ ఒక్కో ప్లేట్ 1.4 టన్నుల బరువు ఉంటుంది. వాటిని ఎత్తాలంటే హైడ్రాలిక్ క్రేన్, లారీ అవసరం. అలాంటివి ఆరు కాపర్ స్టేవ్లు మాయమయ్యాయి. ఈ నేరానికి పాల్పడినవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని బదిలీ చేసి, సెక్యూరిటీని బలహీనపరిచారు. ప్రజల ఆస్తులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన చోట, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని బదిలీ చేసిన తర్వాత ఇంతవరకూ ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం గర్హనీయం. – అయోధ్యరామ్, కన్వీనర్, విశాఖ ఉక్కు పోరాట కమిటీ -
ఈపీడీసీఎల్ సీవోవోగా మరోసారి కింజరాపు
సాక్షి, విశాఖపట్నం : ఏపీఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ అధికారి(సీవీవో)గా రిటైర్డ్ ఎస్పీ కింజరాపు వెంకట రామకృష్ణప్రసాద్ను మరోసారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఆగస్ట్ నుంచి ఈ ఏడాది జూలై 31 వరకూ సీవీవోగా విధులు నిర్వర్తించారు. మరోసారి కాంట్రాక్టు పద్ధతిలో మరో ఏడాదిపాటు నియమిస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎండీ పృథ్వీతేజ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజిలెన్స్ విభాగంలో సీవీవోగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. 25న తపాలా అదాలత్ ఎంవీపీకాలనీ : తపాలా వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 25న ఎంవీపీకాలనీలోని రీజనల్ కార్యాలయంలో 119వ తపాలా అదాలత్ నిర్వహించనున్నట్లు రీజనల్ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ కేవీడీ సాగర్ తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన తపాలా వినియోగదారులు వారి సమస్యలను ఈ నెల 22లోపు అందజేయాలన్నారు. -
భారత అంధుల క్రికెట్ జట్టులో విశాఖ అమ్మాయి
విశాఖ స్పోర్ట్స్: విశాఖపట్నానికి చెందిన పొంగి కరుణకుమారి భారత్లో తొలిసారిగా జరగనున్న మహిళల టీ–20 ప్రపంచ అంధుల క్రికెట్ కప్లో ఆడనుంది. నవంబర్ 11 నుంచి 25 వరకు న్యూఢిల్లీ, బెంగళూరులలో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, అమెరికా దేశాలతో పాటు భారత్ కూడా పాల్గొంటోంది. టోర్నమెంట్ విజేతను నిర్ణయించడానికి లీగ్ దశలో 21 మ్యాచ్లు, ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్లు నిర్వహిస్తారు. భారత మహిళల అంధుల క్రికెట్ జట్టులో స్థానం సంపాదించిన కరుణకుమారి ప్రస్తుతం విశాఖలోని ప్రభుత్వ అంధుల బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. -
‘సెయింట్ జోసెఫ్’ ప్రపంచ రికార్డు
11.19 లక్షల సీడ్ బాల్స్ తయారీ కంచరపాలెం: పర్యావరణ పరిరక్షణలో సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. సెయింట్ జోసెఫ్ కాంగ్రిగేషన్ 375వ వార్షికోత్సవం సందర్భంగా 11.19 లక్షల సీడ్ బాల్స్ను తయారు చేసి ప్రపంచ రికార్డు సాధించారు. సెయింట్ జోసెఫ్ ఆఫ్ అన్నసీ సిస్టర్స్, విశాఖ ప్రావిన్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రపంచ రికార్డు సాధన లక్ష్యంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు జ్ఞానాపురంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల, సెయింట్ జోసెఫ్ బాలికల పాఠశాలలో సీడ్ బాల్స్ తయారీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 16 సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థలు పాల్గొని.. మొత్తం 11.19 లక్షల సీడ్ బాల్స్ను తయారు చేశాయి. ఒక్క జ్ఞానాపురం కళాశాల నుంచే 3,253 మంది విద్యార్థులు పాల్గొని 1,93,534 సీడ్ బాల్స్ను తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వరల్డ్ రికార్డ్స్ అధికారులు అన్ని విద్యా సంస్థల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించారు. పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధరణ, సుస్థిర భవిష్యత్తు కోసం ఇది ఒక గొప్ప ముందడుగు అని వారు అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల సిస్టర్ షైజీ మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాకుండా, చక్కని భవిష్యత్తు కోసం విత్తనాలను నాటనున్నట్లు తెలిపారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ అధికారి డాక్టర్ షరీఫా హనీఫ్ చేతుల మీదుగా అవార్డు, సర్టిఫికెట్ను అందుకున్నారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ హేమ, ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ రోజ్, ఆఫీస్ సిస్టర్స్ మేరీ, నాన్సీ, డైసీ, కళాశాల పీఆర్వో డాక్టర్ పి.కె.జయలక్ష్మి పాల్గొన్నారు. -
దుఃఖంలోనూ మానవత్వం
పెందుర్తి: బతుకుదెరువు కోసం ఊరికాని ఊరు వచ్చాడు. కొరియర్ సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేస్తూ భార్యాపిల్లలను పోషించుకుంటున్నాడు. అయితే ఓ బాలుడు ఆకతాయితనానికి రోడ్డు ప్రమాదానికి బలయ్యాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ విషాద సమయంలోనూ అతని కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. మృతి చెందిన వ్యక్తి నేత్రాలను దానం చేసి ఇద్దరికి చూపునిచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలివి.. కె.కోటపాడు మండలం ఎ.కోడూరుకు చెందిన చీపురపల్లి సతీష్ (44) ఉపాధి నిమిత్తం తన భార్య వరలక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి కొన్నేళ్ల కిందట విశాఖపట్నం వచ్చాడు. నాయుడుతోటలో నివాసం ఉంటున్న సతీష్ ఒక కొరియర్ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం డెలివరీలు ఇచ్చేందుకు పెందుర్తి–ఆనందపురం రోడ్డులో బైక్పై వెళ్తున్నాడు. అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో ఒక బాలుడు అతి వేగంగా నడుపుతున్న బైక్, సతీష్ బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద వార్త తెలుసుకున్న కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సతీష్ భార్య వరలక్ష్మి, పిల్లల రోదనలు అక్కడున్న వారిని కదిలించాయి. సీఐ కె.వి సతీష్కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కష్ట సమయంలో సతీష్ కుటుంబ సభ్యులను పెందుర్తి పోలీసులు, స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీను, మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధి మనోజ్ నేత్రదానం కోసం సంప్రదించారు. తమ బాధను దిగమింగుకుని సతీష్ కుటుంబం నేత్రదానానికి అంగీకరించింది. విషాదంలోనూ వారు చూపిన ఈ మానవత్వం అందరి ప్రశంసలు అందుకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కళ్లు దానం -
వ్యవసాయ డిప్లమో కోర్సులకు 15న స్పాట్ కౌన్సెలింగ్
చింతపల్లి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చేరేందుకు అసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 15న స్పాట్ కౌన్సెలింగ్కు హాజరు కావాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోగల పాలిటెక్నిక్ కళాశాలల్లో వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు చివరి అవకాశం కల్పిస్తూ రిజిస్ట్రార్ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. యూనివర్సిటీ వెబ్సైట్లో ఆన్లైన్ చేసుకున్న వారితో పాటు ఇప్పటి వరకూ రిజస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు కూడా ఈ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని ఆయన వివరించారు. తమ సేంద్రియ పాలిటెక్నిక్లో చేరేందుకు అల్లూరి, పరిసర జిల్లాల్లో ఆసక్తిగల విద్యార్థులు అన్ని ధ్రువపత్రాలతో ఈనెల 15వ తేదీన జరిగే స్పాట్ కౌన్సెలింగ్కు హాజరు కావాలని ఆయన సూచించారు. గుంటూరు లాం ఫాం వ్యవసాయ పరిశోధన స్థానం కృష్ణా ఆడిటోరియంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు వరకు స్పాట్ కౌన్సెలింగ్ జరుగుతుందని ఏడీఆర్ తెలిపారు. చింతపల్లి ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి -
సచివాలయ ఉద్యోగుల సమ్మె నోటీసు
జగదాంబ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు 15 రోజుల్లో పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు జోన్–4 కమిషనర్ మల్లయ్యనాయుడికి గురువారం నోటీసు అందజేసినట్లు జేఏసీ నాయకులు పీజే గణేష్కుమార్, పల్లా కిరణ్కుమార్ యాదవ్, చింతకాయల బంగార్రాజు తెలిపారు. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి విధులు నిర్వహించడం అవమానాలకు గురిచేయడంతో పాటు, ఉద్యోగులు ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని లేఖలో వివరించారు. ఉద్యోగుల సమస్యలు, హక్కులు, భద్రత, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీవీ అశోక్కుమార్, నాగేశ్వరరావు, శ్రీకాంత్, రమేష్బాబు, చంద్రశేఖర్, రమేష్, నాగరాజు, నళిని, సంతోష్కుమార్, త్రివేణిరాజు ఉన్నారు. పౌరుల సహకారంతో వీ–పుల్ బలోపేతం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ డాబాగార్డెన్స్: పట్టణ సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగొనేందుకు ప్రజలను భాగస్వాములను చేయాలని జీవీఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ‘వైజాగ్–ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్ మోడల్’(వీ–పుల్) వ్యవస్థను బలోపేతం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం ఉన్నత స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో సూచించారు. బ్లూమ్బర్గ్ మేయర్స్ చాలెంజ్ 2025లో ప్రపంచవ్యాప్తంగా ఎంపికై న 50 ఫైనలిస్ట్ నగరాల్లో విశాఖపట్నం ఒకటిగా నిలవడం ఈ వ్యవస్థకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు అని కమిషనర్ తెలిపారు. వీ–పుల్ వ్యవస్థను సంస్థాగతం చేయాలని నిర్ణయించామని, ఇది ప్రజలు, సంస్థలు, సాంకేతిక నిపుణులు ఒకే వేదికపైకి వచ్చి సహకారంతో పరిష్కారాలు కనుగొనేందుకు దోహదపడుతుందని వివరించారు. ప్రతి పౌరుడు ఈ వీ–పుల్ వేదిక ద్వారా తమ ఆలోచనలు, సూచనలు, సలహాలు పంచుకోవాలని కమిషనర్ కోరారు. సమష్టిగా పనిచేయడం ద్వారా బలమైన, సురక్షితమైన విశాఖను నిర్మించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్.ఎస్.వర్మ, ప్రధాన ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణరాజు, సీసీపీ ఎ.ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, యూసీడీ పీడీ పి.ఎం.సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. -
వామపక్షాల ఐక్యతే ఏచూరికి నిజమైన నివాళి
మద్దిలపాలెం: ఆర్ఎస్ఎస్, నయా ఫాసిస్టు శక్తులను ఎదుర్కోవడానికి వామపక్ష భావజాలంతో కూడిన శక్తులు ఏకం కావాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ పిలుపునిచ్చారు. ఇదే సీతారాం ఏచూరికి సరైన నివాళి అవుతుందని ఆయన పేర్కొన్నారు. పిఠాపురంకాలనీలో నూతనంగా నిర్మంచిన సీపీఎం విశాఖ జిల్లా కార్యాలయం(సీతారాం ఏచూరి భవనం)ను గురువారం ఆయన ప్రారంభించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు అధ్యక్షత వహించిన సభలో బేబీ మాట్లాడారు. ఏచూరితో తమ 45 ఏళ్ల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. దేశంలో పీడిత ప్రజలు, ఆదివాసీలు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఏచూరి దృక్పథం అగ్రగణ్యమైనదని కొనియాడారు. కులవివక్ష, కార్మిక పోరాటాలు ఉన్న ప్రతి చోటా ఎర్ర జెండా ఉండాలని బేబీ పిలుపునిచ్చారు. ఏచూరి పేరు మీద ఆధునికంగా జిల్లా కార్యాలయాన్ని నిర్మించిన పార్టీ శ్రేణులను అభినందించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ కార్యాలయం ఒక పోరాట కేంద్రమని, పీడిత ప్రజలు తమ కష్టాలను చెప్పుకోవడానికి, పోరాడడానికి శక్తిని పొందే నిలయమని పేర్కొన్నారు. ఏచూరి వర్ధంతి లోపు ఈ భవనాన్ని పూర్తిచేసి కమ్యూనిస్టు స్ఫూర్తిని చాటిచెప్పిన విశాఖ జిల్లా కమిటీని ఆయన అభినందించారు. కొత్త భవనంలో మీటింగ్ హాల్, గ్రంథాలయం, కుట్టుమిషన్ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, కాన్ఫరెన్స్ హాల్ను కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.పుణ్యవతి, కె.లోకనాథం, మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, పార్టీ సీనియర్ నాయకులు సి.హెచ్.నరసింగరావు, అజశర్మ, చంద్రశేఖర్, ఎం.వెంకటేశ్వర్లు, దేవా, ఆర్.కె.ఎస్.వి.కుమార్, బి.జగన్, బి.పద్మ, పి.మణి తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
మహారాణిపేట: వైఎస్సార్ సీపీలో విశాఖ జిల్లాలో వివిధ విభాగాల్లో నూతనంగా నియమితులైన పలువురు పార్టీ జిల్లా అధ్యక్షుడు కే.కే.రాజును కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరు సతీష్, జిల్లా పార్టీ ఆఫీస్ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి తాడి జగన్నాథ్ రెడ్డి, కిరణ్ రాజు, కార్పొరేటర్ అనిల్ కుమార్రాజు, కో ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, అనుబంధ విభాగ అధ్యక్షులు అంబటి శైలేష్, సనపల రవీంద్ర భరత్, బొండా ఉమామహేష్, నాయకులు పులగమ శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వరరావు, సూర్య, బంద్ శ్రీను, దుప్పల శ్రీనివాస్, మహ్దాస్ గోపి, గౌస్, కురప్ప, రాఘవలు తదితరులు పాల్గొన్నారు -
మద్యం అక్రమ కేసు.. కొనసాగుతున్న కూటమి కక్ష సాధింపు
సాక్షి, హైదరాబాద్: మద్యం అక్రమ కేసులో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసుతో సంబంధం లేని నర్రెడ్డి సునీల్ నివాసం, ఆఫీసుల్లొ సిట్ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, విశాఖపట్నంలో సిట్ సోదాలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి హోదాలోనూ కూడా సునీల్ పని చేయలేదు. మరో భేతాళ కథ సృష్టిస్తూ తప్పుడు మార్గంలో సిట్ సోదాలు నిర్వహిస్తోంది.కుట్రలు.. పన్నాగాలు.. బెదిరింపులు.. వేధింపుల మధ్య.. అబద్ధపు వాంగ్మూలాలు.. తప్పుడు సాక్ష్యాలతో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) మద్యం అక్రమ కేసును నడిపిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కక్ష సాధింపే లక్ష్యంగా.. దెబ్బతీయడమే ఉద్దేశంగా.. అబద్ధాల పునాదులపై అడ్డగోలుగా భేతాళ కథలు అల్లుతోంది.కాగా, మద్యం అక్రమ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు.. చంద్రబాబు సర్కార్కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సాగించిన ప్రయత్నాలను పటాపంచాలు చేసింది. ఈ ముగ్గురికీ బెయిల్ ఇచ్చింది. గత ప్రభుత్వ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ నిరుడు సెప్టెంబరు 23న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం ఈ అక్రమ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు నిమిత్తం సిట్ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపిన సిట్... రాజ్ కేసిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, దొడ్డా సత్యప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, వేణుంబాక విజయసాయిరెడ్డి, శ్రీధర్రెడ్డి, కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు మొత్తం 48 మందిని నిందితులుగా చేర్చింది. -
‘ఆ నిర్ణయాన్ని చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలి’
సాక్షి, నర్సీపట్నం: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలు పునర్విభజన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశ్యంతో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తీసుకువచ్చారన్నారు.‘‘8500 కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం ఖర్చు మొదలు పెట్టారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ప్రతి ఇంటి నుంచి ఒక డాక్టర్ను తయారు చేయాలన్నది వైఎస్ జగన్ ఆశయం’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన వరకు 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. 4500 మెడికల్ సీట్లు విద్యార్థులకు వస్తాయని ఆశించారు. కార్పొరేట్లకు కొమ్ము కాసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు’’ అని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.నర్సీపట్నం మెడికల్ కాలేజీలో హాస్పిటల్ భవనం మూడు అంతస్తులు పూర్తి అయింది. ఈ భవనం నిర్మాణం పూర్తి చేయడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?. చంద్రబాబు కామన్ మెన్ కాదు.. క్యాపలిస్ట్ మెన్. అప్పు చేసిన 2 లక్షల కోట్లలో ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే సరిపోతుంది. పులివెందుల మెడికల్ కాలేజీకు సీట్లు వద్దని లేఖ రాశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తున్న చంద్రబాబు, నేడు మెడికల్ కాలేజీలను నేనే తెచ్చానని మాట్లాడుతున్నారు. సైకో కంటే పెద్ద పేరు చంద్రబాబు అని గూగుల్ చూపిస్తుంది. కిమ్ ఉత్తర కొరియా నియంత అయితే లోకేష్ ఏపీ నియంత’’ అంటూ గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు.ప్రభుత్వ భూములు మీ ఇష్టం వచ్చిన వారికి ఇవ్వడానికి మీ అబ్బ జాగీరు కాదు. పేదవాడికి రాష్ట్రంలో చోటు లేదు. వైఎస్ జగన్ పథకాలను కాపీలను కొట్టిన ఘనత చంద్రబాబుది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ వాటిని ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. నర్సీపట్నంలో ఇప్పటికే 50 కోట్లకు పై మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం ఖర్చు చేశారు. స్పీకర్ అయ్యన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం బాధ్యత తీసుకోవాలి’’ అని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. -
విశాఖ స్టీల్ప్లాంట్లో తప్పిన పెను ప్రమాదం
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం తప్పింది. స్టీల్ ప్లాంట్లో కన్వేయర్ బెల్ట్ను (conveyor belts) ఆగంతకులు కట్ చేశారు. కన్వేయర్ బెల్ట్లు ఉక్కు తయారీకి అవసరమైన బొగ్గు, ఐరన్ ఓర్ వంటి ముడి సరకులను తరలించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కన్వేయర్ బెల్ట్ కట్ చేయడంతో ముడిసరుకు రవాణా నిలిచిపోయింది. కన్వేయర్ బెల్ట్ను ఉద్దేశపూర్వకంగా కట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. -
అనగనగా.. ఒక విశాఖ మెట్రో..
గత ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది. ఇంతలో జట్టు కట్టి జనాన్ని మాటలతో మభ్యపెట్టిన మాంత్రిక ప్రభుత్వం వచ్చింది. హాఠ్ ... మెట్రో మీరు కాదు మేమే కడతామంటూ పాత డీపీఆర్ని రద్దు చేసేసింది. అమరావతి మాదిరిగా డిజైన్లుండాలంటూ కేంద్రానికి కొత్తగా డీపీఆర్ పంపించింది. అదేమో.. అక్కడ ఆమోదించలేదాయే.. కూటమి సామ్రాజ్య నేతలు బతిమాలుతున్నా వాళ్లు పట్టించుకోలేదు. అసలే ‘సిక్స్’ కొట్టబోయి.. సూపర్ ఫ్లాప్ అయిన బాబు జట్టు.. మరోసారి జనాలకు మాయమాటలు చెప్పేందుకు సిద్ధమైంది. ఇదిగో మెట్రో అంటే.. అదిగో టెండర్లు అంటూ ఊదరగొట్టారు. ఆహా.. వైజాగ్కి మెట్రో వచ్చేసిందంటూ.. సోషల్ మీడియా సామంతరాజులంతా గ్రాఫిక్స్ జిమ్మికులతో అదరగొట్టేశారు. తీరా చూస్తే.. టెండర్లు గడువు ముగుస్తున్నా ఎవరూ ముందుకు రాలేదు. బాబ్బాబూ.. రండి.. వచ్చి టెండర్ పెట్టండి అని బతిమాలుతున్నా పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని.. ఈ ‘భారీ’ ప్రాజెక్టును భాగాలుగా చేసి.. వాటాల పేరుతో టెండర్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో వైజాగ్ మెట్రో కథ మళ్లీ మొదటికొచ్చింది. సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం చేసేది గోరంత.. చెప్పేది కొండంత. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండా.. కేంద్ర ప్రభుత్వం డీపీఆర్కు ఆమోదం చెప్పకుండానే గ్రాఫిక్ జిమ్మిక్కులు చూపించింది. ప్రజలను మభ్యపెట్టేందుకు జూలై 25న టెండర్లు పిలిచింది. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.6,250 కోట్లు(జీఎస్టీ అదనం)తో టెండర్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.11,498 కోట్లు కాగా.. మూడు కారిడార్లలో ఫేజ్–1 పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్సీ టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పనులను మూడేళ్ల కాలపరిమితితో పూర్తి చేయాలని టెండర్ షెడ్యూలులో చెప్పింది. టెండర్ సమర్పించిన 180 రోజుల వరకూ బిడ్ వ్యాలిడిటీ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 12వ తేదీతో టెండరు గడువు ముగియనుంది. ఒక్క సంస్థ కూడా టెండర్లలో పాల్గొనేందుకు సాహసించలేదు. దీంతో సర్కార్కి షాక్ తగిలినట్లయింది.సమయమిస్తాం.. రండి.. ప్లీజ్.! టెండర్లు వేసేందుకు ఎవరూ రాకపోవడంతో అసలు లోపం ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రభుత్వం.. కాంట్రాక్టు నిర్మాణ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ బిడ్డింగ్ సమావేశంలో కారణాలు చెప్పాలంటూ అధికారులు కోరారు. భారీ మొత్తంలో ప్రాజెక్టు టెండరు దక్కించుకున్నా.. లాభార్జన సాధ్యం కాదనీ.. పైగా టెండర్లో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడం అసాధ్యమని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 30 నెలల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలని షరతు విధించడంపై విమర్శలు వెల్లువెత్తినట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో పాలుపోక టెండరు గడువు పొడిగిస్తామనీ సలహాలు, సూచనలు చెప్పాలని ప్రభుత్వం అభ్యర్థించంది. ప్యాకేజీలుగా విభజిస్తే ఆలోచిస్తామని కొన్ని సంస్థలు బదులిచ్చాయనీ.. దీంతో కూటమి ప్రభుత్వం పరువు పోగొట్టుకోకుండా ఉండేందుకు టెండరు ప్రక్రియని సమూలంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. జాయింట్ వెంచర్ మోడల్లో పనులు చేసేందుకు అవకాశం కలిపంచాలి కొన్ని సంస్థలు కోరాయి. దానికి కూడా అంగీకరించినట్లు సమాచారం. ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించి.. టెండర్లు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో రైల్ పాలక మండలి సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్ని ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి ఫేజ్లోనూ టెండర్ల విభజన..! విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తం 140.13 కి.మీ మేర చేపట్టనున్నారు. తొలి దశలో 46.23 కి.మీ మేర చేపట్టనుండగా.. ఇందులో మొత్తం 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఇందులో 20.16 కి.మీ డబుల్ డెక్కర్ తరహాలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ వరకూ పై వంతెనలు నిర్మిస్తారు. కొమ్మాది– స్టీల్ప్లాంట్, గురుద్వారా–పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం–చినవాల్తేరు కారిడార్లలో తొలి దశ కింద మెట్రోకు ప్రణాళిక చేశారు. కొమ్మాది–స్టీల్ప్లాంట్ మధ్య కారిడార్లో 34.40 కి.మీ మేర డబుల్ డెక్కర్ ట్రాక్ నిర్మించనున్నారు. అలాగే మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కి.మీ మేర రెండో కారిడార్ను నిర్మిస్తారు. గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ మధ్య మరొక కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. ఇలా ప్రతి ఫేజ్ పనుల టెండర్లను కూడా ప్యాకేజీలుగా విభజించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏమీ లేకుండానే ఏదో చేసేస్తున్నామని డప్పులు కొట్టిన కూటమి ప్రభుత్వానికి మెట్రో షాక్ తగిలింది. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోయినా టెండర్ల పేరుతో అరచేతిలో మెట్రో చూపించేందుకు కూటమి సర్కారు సిద్ధమవడం సిగ్గు చేటని పలువురు విమర్శిస్తున్నారు. -
ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 6.1సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా పైడిమెట్టలో 4.9, అనకాపల్లి జిల్లా చోడవరంలో 4.8సెం.మీ. వర్షపాతం కురిసింది.గురువారం అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గురువారం అల్లూరి,ఏలూరు,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు జిల్లాల్లో pic.twitter.com/KZS1LMcGFf— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 10, 2025 -
సాక్షి ఎడిటర్పై వేధింపులు సరికాదు
సాక్షి కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడం, తాజాగా ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం కక్ష సాధింపులో ఓ భాగమే. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓ నేత మాట్లాడిన విషయాలను వార్తగా ప్రచురించడంపై కూడా కేసు పెట్టడం, నోటీసుల పేరిట వేధించడం సబబు కాదు. భారత రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం. అన్యాయాన్ని, అవినీతిని, ప్రజా సమస్యలను తన కలంతో వెలికితీయడమే జర్నలిస్టుల వృత్తి. అలాంటి పత్రికా స్వాతంత్య్రాన్ని, జర్నలిస్టుల కలాన్ని పోలీసు కేసులతో నియంత్రించాలని చూస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఏదైనా వార్త అవాస్తవమని భావిస్తే, దానికి ప్రభుత్వం వివరణ కోరాలి. కానీ కేసులు నమోదు చేయడం సరైంది కాదు. – సీహెచ్బీఎల్ స్వామి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి జిల్లా -
రాజమండ్రి, కాకినాడకు ఎక్స్ప్రెస్లు నడపాలి
డయల్ యువర్ ఆర్ఎంకు స్పందన అల్లిపురం : ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు బుధవారం నిర్వహించిన డయల్ యువర్ ఆర్ఎమ్ ప్రోగ్రామ్కు స్పందన లభించింది. ప్రయాణికులు ఆర్టీసీ సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని ఆర్ఎం తెలిపారు. విశాఖ నుంచి రాజమండ్రి, కాకినాడకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులు చాలా తక్కువ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని.. తగినన్ని బస్సులు నడపాలని పలువురు ప్రయాణికులు కోరారు. రాత్రి వేళలో సిటీ బస్సులు అదనపు ట్రిప్పులు నడపాలని కొందరు ప్రయాణికులు కోరారు. ద్వారకా బస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, రామాటాకీస్ వరకు ప్రైవేట్ బస్సులు ఆపకుండా అరికట్టడంపై పలువురు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 18 మంది ఫోన్ చేశారని.. వారి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. -
దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయొద్దు
జెడ్పీటీసీ సభ్యుల అసంతృప్తిమహారాణిపేట: దివ్యాంగుల పింఛన్ల రీ వెరిఫికేషన్ చేసినప్పటికీ.. అర్హులైన వారందరికీ పింఛన్లు కొనసాగించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఆమె అధ్యక్షతన పలు స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ 40 శాతం లోపు వైకల్యం ఉందంటూ దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి, సదరం సర్టిఫికెట్లను మళ్లీ వెరిఫికేషన్ చేస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దివ్యాంగుల పింఛన్ల విషయంలో పలు రకాలుగా వేధిస్తున్నారని, దీని వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్.. దివ్యాంగుల పింఛన్లను రద్దు చేయవద్దన్నారు. ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని, పంచాయతీల్లో ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా.. అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలోని పంచాయతీరాజ్ అధికారుల పనితీరుపై జెడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జేఈపై చర్యలు తీసుకోవాలి పరవాడలో ఇప్పటికే సీసీ రోడ్లు ఉన్న చోట మళ్లీ కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలు చేయడం, వాటికి ఆమోదం తెలిపిన తర్వాత పనులు నిలుపుదల చేయడంపై పరవాడ జెడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు అభ్యంతరం తెలిపారు. ఈ విధంగా తప్పుడు ప్రతిపాదనలు చేసిన జేఈపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ, కేజీహెచ్ సేవలపై చర్చ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణికి ఫోన్ చేస్తే స్పందించడం లేదని కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ ఆరోపించారు. తాము సొంత పనుల కోసం ఫోన్ చేయమని, పేద రోగులకు వైద్యం కోసమే ఫోన్ చేస్తామని, అయినా అధికారి స్పందించకపోవడం దారుణమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కావడం లేదని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేద రోగులకు వైద్య సేవలు అందేలా చూడాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు కోరారు. దీనిపై విశాఖ జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు స్పందిస్తూ.. ఆరోగ్యశ్రీ కింద 3,000కు పైగా ప్రొసీజర్లకు చికిత్స అందిస్తున్నామని, కార్డు ఉన్న వారందరికీ సేవలు అందుతున్నాయని తెలిపారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి మాట్లాడుతూ ఆసుపత్రిలో పూర్తి స్థాయి క్యాన్సర్ చికిత్స, గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయని, వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వసతి సమస్యలు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు గంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందని, వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు.. త్వరలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. పీఎం–సూర్య ఘర్పై అవగాహన విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912 నంబర్కు ఫోన్ చేస్తే.. 4 గంటల్లోపు సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పీఎం–సూర్య ఘర్ పథకం ద్వారా ప్రజలు విద్యుత్ బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. జెడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి, మూడు జిల్లాల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
గొర్రెల మందపైకి దూసుకొచ్చిన ట్రాలర్
35 గొర్రెలు, 5 పిల్లలు మృతి తగరపువలస : ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ మిందివానిపాలెం జాతీయ రహదారిపై గొర్రెల మందపైకి ట్రాలర్ దూసుకొచ్చిన సంఘటనలో 35 గొర్రెలు, 5 పిల్లలు మృతి చెందగా.. మరో 10 వరకు తీవ్రంగా గాయపడ్డాయి. ఇదే మండలం పేకేరు పంచాయతీకి చెందిన దివ్యాంగుడు చందక సూర్యనారాయణ, ఆయన సోదరుడు వీరుబాబు మూడు రోజుల కిందట గొర్రెల మందతో వచ్చి మిందివానిపాలెం వీతం కళాశాల ప్రాంతంలో ఉంటున్నారు. స్థానిక రైతుల వ్యవసాయ భూముల్లో మంద ఆయ వేస్తున్నారు. సర్వీస్రోడ్డు నుంచి గొర్రెలను జాతీయ రహదారి దాటిస్తుండగా పెందుర్తి వైపు నుంచి ఆనందపురం వైపు ద్విచక్రవాహనాల లోడుతో వేగంగా వస్తున్న ట్రాలర్ అదుపులోకి రాకపోవడంతో మందపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సూర్యనారాయణ రోడ్డుపై పడిపోయి స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం కారణంగా వారికి రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లింది. ఆనందపురం ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు, ఆర్ఎస్ మొబైల్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని గొర్రెల రైతులు కోరుతున్నారు. -
బాణసంచా దుకాణాలపై దాడులు
డాబాగార్డెన్స్: అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తున్న ముగ్గురు వ్యాపారులను టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.2.66 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సీటీఎఫ్ ఎస్ఐ భరత్కుమార్ తెలిపిన వివరాలివి. వన్టౌన్ కురుపాం మార్కెట్ ప్రాంతంలో లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం మూడు దుకాణాలపై దాడులు నిర్వహించారు. కురుపాం మార్కెట్కు చెందిన పాలూరి వరప్రసాద్ దుకాణం నుంచి రూ. 2.06లక్షల విలువైన బాణసంచా సామగ్రి, వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే బండారు అప్పలరాజు నుంచి రూ. 50వేలు, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన బొటాట భవానీశంకర్ నుంచి రూ.10 వేలు విలువ చేసే మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వ్యాపారంపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కోసం వారిని వన్టౌన్ పోలీసులకు అప్పగించినట్లు ఎస్ఐ భరత్ తెలిపారు. రూ.2.66 లక్షల సామగ్రి స్వాధీనం -
పత్రికా స్వేచ్ఛకు భంగం
జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు. పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు లేదా పరువు నష్టం దావా వేయవచ్చు. అంతేగానీ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా జర్నలిస్టులపై కేసులు నమోదు చేయలేదు. ఈ విధమైన వైఖరి వల్ల జర్నలిస్టులు సరైన వార్తలు పాఠకులకు అందించలేరు. వాస్తవాలను రాయడానికి, నిజానిజాలు వెల్లడించడానికి వెనుకంజ వేసే ప్రమాదం ఉంది. జర్నలిస్టుల స్వేచ్ఛకు ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా ఆలోచన చేయాలి. – గంట్ల శ్రీనుబాబు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి -
కరాసాలో దొంగల బీభత్సం
ఒకే రాత్రి 5 ఇళ్లలో చోరీ గోపాలపట్నం: కరాసాలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి ఐదు ఇళ్లలో చోరీకి పాల్పడి స్థానికులను భయాందోళనలకు గురి చేశారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వరుసగా దొంగతనాలు జరిగాయి. జీవీఎంసీ 52వ వార్డు కరాసాలో ప్రియాంక కాలనీలోని ఏసుబాబు, దేవి సప్లయర్స్ శ్రీను, రామాలయం వీధిలోని అభీష్, దుంపంవారి వీధిలోని పద్మ, బేరివారి వీధిలోని శ్రీను ఇళ్లలో చోరీ జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే నాలుగు ఇళ్లలో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నాలుగు ఇళ్లలో సుమారు 11 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.15వేల నగదు పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారంతో డీసీపీ లతా మాధురి, వెస్ట్ సబ్డివిజన్ సీఐ నిమ్మకాయల శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐలు కె.రామారావు, చంద్రశేఖర్, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాలను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ను రప్పించారు. క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ తెలిపారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై పోరు బాట
మురళీనగర్: కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఉపాధ్యాయుల సమస్యలపై ఎటువంటి స్పందన లేకపోవడంతో ఉపాధ్యాయులు పోరు బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం నుంచి 17వ తేదీ వరకు నిరసన వారంగా పాటించాలని నిర్ణయించారు. ఈ మేరకు మురళీనగర్లోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో పోరుబాట గోడ పత్రికను ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ కరుణాకర్, టి.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కొటా శ్రీను, వివిధ మండల శాఖల అధ్యక్ష, కార్యదర్శులతో కలిసి ఆవిష్కరించారు. 11న నల్లబాడ్జీలతో విధులకు హాజరు, 12న మండల కేంద్రాల్లో నిరసన, 13, 14 తేదీల్లో ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణ, 15న పాత తాలూకా కేంద్రాల్లో నిరసన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన, 17న ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీలకు వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా వినతులు పంపించడం చేస్తామన్నారు. -
విశాఖ వ్యాలీ స్కూల్కి సీఫోర్ అవార్డు
ఆరిలోవ: నగరంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ ఈ విధానంలో నడుస్తున్న పాఠశాలల్లో విశాఖ వ్యాలీ స్కూల్ సీఫోర్ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీకి చెందిన సీఫోర్ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి సర్వేలో భాగంగా నగరంలోని పాఠశాలల్లో ఈ స్కూల్ అగ్రస్థానంలో నిలిచింది. దీంతో న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఈశ్వరి ప్రభాకర్కు సీఫోర్ ప్రతినిధులు అవార్డుతో పాటు జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఫోర్ ప్రతినిధులు తమ పాఠశాలలో పిల్లలు, వారి తల్లిదండ్రులతో పాటు స్థానికులను కూడా సర్వే చేశారని తెలిపారు. కో–ఎడ్యుకేషన్ పాఠశాలలో అనుసరిస్తున్న విద్యా విధానం, బోధనా పద్ధతులు, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, పర్యావరణ పరిరక్షణ, పాఠశాల నిర్వహణ, క్రీడలు, విద్యార్థులకు అందిస్తున్న నైపుణ్యాలు, కల్పిస్తున్న సౌకర్యాలు, తల్లిదండ్రుల భాగస్వామ్యం వంటి అంశాలను సర్వే చేసి.. పాఠశాలలకు జాతీయ స్థాయిలో ర్యాంకింగ్ ఇస్తారన్నారు. ఈ అంశాల్లో తమ పాఠశాల ఉత్తమంగా నిలవడంతో నగరంలోనే మొదటి స్థానా న్ని సాధించినట్లు వివరించారు. 1,190 మార్కులతో జాతీయ స్థాయిలో టాప్–50 పాఠశాలల్లో ఒకటిగా నిలించిందని వెల్లడించారు. -
కేజీహెచ్ వార్డు బాయ్ సస్పెన్షన్
మహారాణిపేట: ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కేజీహెచ్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వైద్యురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై రోజుల తరబడి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికారులు.. ‘కేజీహెచ్లో కీచకులు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఉలిక్కిపడి.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వార్డు బాయ్ శంకరరావును సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 26న గ్యాస్ట్రో ఎంట్రాలజీ వార్డులో మహిళా వైద్యురాలి పట్ల వార్డు బాయ్ శంకరరావు రెండుసార్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అదే రోజు కేజీహెచ్ సూపరింటెండెంట్, ఏఎంసీ ప్రిన్సిపాల్, విభాగాధిపతులతో పాటు వన్టౌన్ పోలీసులకు సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయంపై ‘సాక్షి’దినపత్రికలో కథనం వెలువడింది. దీంతో కేజీహెచ్ యాజమాన్యం తర్జనభర్జనల అనంతరం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. వెంటనే సంబంధిత ఫైల్ను తయారు చేసి, శంకరరావును సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై నాల్గవ తరగతి ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు త్వరలో సమావేశం కానున్నట్లు తెలిసింది. కాగా.. సర్జరీ విభాగంలో బాలిక తల్లి పట్ల ఓ వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఫిర్యాదుపై కూడా ఆస్పత్రి ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ నుంచి కేజీహెచ్కు వచ్చిన రెండు ఈ–మెయిల్స్ను ఎవరు డిలీట్ చేశారన్న దానిపై కూడా అంతర్గత విచారణ మొదలైనట్లు సమాచారం. -
మెట్రో కథ మళ్లీ మొదటికి!
అనగనగా.. ఒక విశాఖ మెట్రో.. గత ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది. ఇంతలో జట్టు కట్టి జనాన్ని మాటలతో మభ్యపెట్టిన మాంత్రిక ప్రభుత్వం వచ్చింది. హాఠ్... మెట్రో మీరు కాదు మేమే కడతామంటూ పాత డీపీఆర్ని రద్దు చేసేసింది. అమరావతి మాదిరిగా డిజైన్లుండాలంటూ కేంద్రానికి కొత్తగా డీపీఆర్ పంపించింది. అదేమో.. అక్కడ ఆమోదించలేదాయే.. కూటమి సామ్రాజ్య నేతలు బతిమాలుతున్నా వాళ్లు పట్టించుకోలేదు. అసలే ‘సిక్స్’ కొట్టబోయి.. సూపర్ ఫ్లాప్ అయిన బాబు జట్టు.. మరోసారి జనాలకు మాయమాటలు చెప్పేందుకు సిద్ధమైంది. ఇదిగో మెట్రో అంటే.. అదిగో టెండర్లు అంటూ ఊదరగొట్టారు. ఆహా.. వైజాగ్కి మెట్రో వచ్చేసిందంటూ.. సోషల్ మీడియా సామంతరాజులంతా గ్రాఫిక్స్ జిమ్మికులతో అదరగొట్టేశారు. తీరా చూస్తే.. టెండర్లు గడువు ముగుస్తున్నా ఎవరూ ముందుకు రాలేదు. బాబ్బాబూ.. రండి.. వచ్చి టెండర్ పెట్టండి అని బతిమాలుతున్నా పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని.. ఈ ‘భారీ’ ప్రాజెక్టును భాగాలుగా చేసి.. వాటాల పేరుతో టెండర్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో వైజాగ్ మెట్రో కథ మళ్లీ మొదటికొచ్చింది.సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం చేసేది గోరంత.. చెప్పేది కొండంత. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియకుండా.. కేంద్ర ప్రభుత్వం డీపీఆర్కు ఆమోదం చెప్పకుండానే గ్రాఫిక్ జిమ్మిక్కులు చూపించింది. ప్రజలను మభ్యపెట్టేందుకు జూలై 25న టెండర్లు పిలిచింది. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.6,250 కోట్లు(జీఎస్టీ అదనం)తో టెండర్లను ఆహ్వానించింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.11,498 కోట్లు కాగా.. మూడు కారిడార్లలో ఫేజ్–1 పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్సీ టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పనులను మూడేళ్ల కాలపరిమితితో పూర్తి చేయాలని టెండర్ షెడ్యూలులో చెప్పింది. టెండర్ సమర్పించిన 180 రోజుల వరకూ బిడ్ వ్యాలిడిటీ ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నెల 12వ తేదీతో టెండరు గడువు ముగియనుంది. ఒక్క సంస్థ కూడా టెండర్లలో పాల్గొనేందుకు సాహసించలేదు. దీంతో సర్కార్కి షాక్ తగిలినట్లయింది.సమయమిస్తాం.. రండి.. ప్లీజ్.!టెండర్లు వేసేందుకు ఎవరూ రాకపోవడంతో అసలు లోపం ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రభుత్వం.. కాంట్రాక్టు నిర్మాణ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీ బిడ్డింగ్ సమావేశంలో కారణాలు చెప్పాలంటూ అధికారులు కోరారు. భారీ మొత్తంలో ప్రాజెక్టు టెండరు దక్కించుకున్నా.. లాభార్జన సాధ్యం కాదనీ.. పైగా టెండర్లో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడం అసాధ్యమని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 30 నెలల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలని షరతు విధించడంపై విమర్శలు వెల్లువెత్తినట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో పాలుపోక టెండరు గడువు పొడిగిస్తామనీ సలహాలు, సూచనలు చెప్పాలని ప్రభుత్వం అభ్యర్థించింది. ప్యాకేజీలుగా విభజిస్తే ఆలోచిస్తామని కొన్ని సంస్థలు బదులిచ్చాయనీ.. దీంతో కూటమి ప్రభుత్వం పరువు పోగొట్టుకోకుండా ఉండేందుకు టెండరు ప్రక్రియని సమూలంగా మార్చేందుకు సిద్ధమవుతోంది. జాయింట్ వెంచర్ మోడల్లో పనులు చేసేందుకు అవకాశం కల్పించాలని కొన్ని సంస్థలు కోరాయి. దానికి కూడా అంగీకరించినట్లు సమాచారం. ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించి.. టెండర్లు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మెట్రో రైల్ పాలక మండలి సమావేశంలో చర్చించిన అనంతరం ఎన్ని ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలో నిర్ణయం తీసుకోనున్నారు.ప్రతి ఫేజ్లోనూ టెండర్ల విభజన..!విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తం 140.13 కి.మీ మేర చేపట్టనున్నారు. తొలి దశలో 46.23 కి.మీ మేర చేపట్టనుండగా.. ఇందులో మొత్తం 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఇందులో 20.16 కి.మీ డబుల్ డెక్కర్ తరహాలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ వరకూ పై వంతెనలు నిర్మిస్తారు. కొమ్మాది– స్టీల్ప్లాంట్, గురుద్వారా–పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం–చినవాల్తేరు కారిడార్లలో తొలి దశ కింద మెట్రోకు ప్రణాళిక చేశారు. కొమ్మాది–స్టీల్ప్లాంట్ మధ్య కారిడార్లో 34.40 కి.మీ మేర డబుల్ డెక్కర్ ట్రాక్ నిర్మించనున్నారు. అలాగే మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కి.మీ మేర రెండో కారిడార్ను నిర్మిస్తారు. గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ మధ్య మరొక కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. ఇలా ప్రతి ఫేజ్ పనుల టెండర్లను కూడా ప్యాకేజీలుగా విభజించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏమీ లేకుండానే ఏదో చేసేస్తున్నామని డప్పులు కొట్టిన కూటమి ప్రభుత్వానికి మెట్రో షాక్ తగిలింది. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోయినా టెండర్ల పేరుతో అరచేతిలో మెట్రో చూపించేందుకు కూటమి సర్కారు సిద్ధమవడం సిగ్గు చేటని పలువురు విమర్శిస్తున్నారు. -
ఆదుకోవాలని ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల ర్యాలీ
బీచ్రోడ్డు: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సులు అందుబాటులోకి రావడం వల్ల తమ ఆదాయం 80 శాతం తగ్గిందని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ రెహ్మాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్.కాసుబాబు తెలిపారు. ఇంటి అవసరాలు, పిల్లల స్కూలు ఫీజులు, కరెంటు చార్జీలు, అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జీవీఎంసీ గాంధీ పార్కు నుంచి గురజాడ అప్పారావు బొమ్మ మీదుగా తిరిగి గాంధీ బొమ్మ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నంబర్ 21, 31 వల్ల భారీగా జరిమానాలు విధిస్తున్నారని, దీనికి తోడు సీ్త్ర శక్తి పథకం తమను ఆర్థికంగా దెబ్బతీసిందన్నారు. ఆదాయం లేక వాహనాలకు ఫైనాన్స్ సకాలంలో చెల్లించలేకపోతున్నామని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.5,000 తమ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్పై 50 శాతం రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ–చలాన్ కేసులను రద్దు చేయాలని, మోటార్ కార్మికుల భద్రత కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వాహనాలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలని, ప్రమాదంలో చనిపోయిన డ్రైవర్లకు రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సుమారు 60 వేల మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారని, వారి కుటుంబాలను ఆదుకునేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ర్యాలీలో ఫెడరేషన్ ప్రతినిధులు సాయికుమార్, నాగేశ్వరరావు, రాంబాబు, బుజ్జిబాబు, అప్పలరాజు, అన్నాజీ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రసాద్’ పనులు వేరొక కాంట్రాక్టర్కు అప్పగింత
సింహాచలం: సింహగిరిపై నిలిచిన ప్రసాద్ స్కీమ్ పనులను టూరిజం శాఖ వేరొక కాంట్రాక్టర్కి అప్పగించింది. దీంతో ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం సింహాచలం దేవస్థానానికి మంజూరు చేసిన రూ.54 కోట్ల ప్రసాద్ స్కీమ్ పనులను టూరిజంశాఖ రెండేళ్ల క్రిందట ప్రారంభించింది. ఆ పనుల్ని రెండుగా విభజించి సింహగిరిపై జరిగే కొన్ని పనుల్ని ఓ కాంట్రాక్టర్కి, కొండదిగువ మరికొన్ని పనుల్ని మరో కాంట్రాక్టర్కు అప్పగించింది. ఇందులో భాగంగానే నాసిరకం గోడ నిర్మించడంతో చందనోత్సవం రోజు ఆ గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందారు. దీంతో ఆ కాంట్రాక్టర్ను బ్లాక్లిస్టులో పెట్టి, టెండర్లు రద్దు చేశారు. అప్పటి నుంచి నిలిచిన పనుల్ని టెండర్ ద్వారా నగరానికి చెందిన చైతన్య కన్స్ట్రక్షన్స్కు అప్పగించారు. మొత్తం రూ.32 కోట్ల పనుల్లో 70 శాతం పాత కాంట్రాక్టరే పూర్తి చేశారు. కాగా.. సింహగిరికి బుధవారం వచ్చిన టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గోడకూలి భక్తులు మృతిచెందిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో దేవస్థానమే చేపట్టిన మెట్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రసాద్ పథకం పనుల్ని నాణ్యతగా, వేగంగా చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. -
23 నుంచి సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలు
సింహాచలం: ఈ నెల 23 నుంచి అక్టోబరు 1 వరకు సింహగిరిపై శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు బుధవారం తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఆలయంలో శ్రీ రామాయణ నవరాత్ర పారాయణం ఉంటుందన్నారు. రోజూ సాయంత్రం 5 గంటలకు చతుర్భుజ తాయారు, సువర్ణ అమ్మవార్లకు ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న సింహవల్లీ తాయారు సన్నిధిలో వీరలక్ష్మీ ఆరాధనం, 29న మూల నక్షత్రం పురస్కరించుకుని ఆయుధపూజ నిర్వహిస్తామన్నారు. అక్టోబరు 2 విజయదశమి నాడు కొండదిగువ పూలతోటలో సాయంత్రం నుంచి జమ్మివేట ఉత్సవం, శమీపూజ జరపనున్నట్లు తెలిపారు. ఆ రోజు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి శ్రీరామాలంకారం చేసి కొండపైనుంచి మెట్ల మార్గంలో కొండ దిగువ పూలతోటకు తీసుకెళ్తామన్నారు. విజయదశమి నాడు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సింహగిరిపై స్వామివారి దర్శనాలు లభిస్తాయన్నారు. -
అంగట్లో ఆశ పోస్టులు
మహారాణిపేట : ఆశ వర్కర్ల పోస్టులకు ధర భారీగా పలుకుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పోస్టులకు డిమాండ్ పెరిగింది. ఇటు కూటమి నాయకులు, అటు కార్పొరేటర్లు పైరవీలను ముమ్మరం చేశారు. మరోవైపు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సు లేఖలు రావడం, వాటిని ఆసరాగా తీసుకొని వైద్య ఆరోగ్యశాఖలో కొంతమంది సిబ్బంది తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీలో డీఎంహెచ్వో మీద ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. డీఎంహెచ్వోకి ఒక వైపు సిఫార్సులు లేఖలు, మరో వైపు ఎమ్మెల్యే పీఏల నుంచి ఫోన్లు వస్తున్నాయి. 68 పోస్టులకు 6వేలకు పైగా దరఖాస్తులు విశాఖ జిల్లాలో 68 ఆశ వర్కర్ల పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఆరు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు భారీగా పోటీ నెలకొంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. మెరిట్తోపాటు రోస్టర్ ప్రకారం పోస్టులను భర్తీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఈనెల 15వ తేదీలోగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టారు. కూటమి నేతల బేరసారాలు : ఆశ వర్కర్ల పోస్టుల కోసం కొంత మంది కూటమి నేతలు బేరసారాలకు దిగారు. అభ్యర్థులు స్థానిక నేతలను కలవగా వారు బేరం పెట్టేశారు. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతమంది కోసం స్థానిక కార్పొరేటర్లు సిఫార్సు చేస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ఎమ్మెల్యేను కలిసి సిఫార్సు లేఖలను తీసుకొని నేరుగా డీఎంహెచ్వో కార్యాలయంలో ఇస్తున్నట్లు సమాచారం. అయితే సిఫార్సు లేఖ ఇచ్చిన ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది బేరాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలు రావడంతోపాటు డబ్బులు వసూలు చేస్తుండడంపై కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కింద స్థాయి పోస్టులను కూడా ఎమ్మెల్యేల కార్యాలయం నుంచి బేరసారాలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మరోవైపు సిఫార్సు లేఖలతో వచ్చిన అభ్యర్థులతో వైద్య ఆరోగ్యశాఖలో కొంతమంది సిబ్బంది.. ఉద్యోగం వచ్చిన తరువాత డబ్బులు ఇవ్వండని మాట్లాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
విశాఖ అభివృద్ధికి బృహత్ ప్రణాళిక
డాబాగార్డెన్స్: విశాఖ నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఆపరేషన్ లంగ్స్ కింద ప్రభుత్వ స్థలాలు గుర్తించామని, వాటిలో పార్కులు అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. వార్డుకి ఒకటి చొప్పున వెండింగ్ జోన్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే 76 వార్డుల్లో స్థలాలను గుర్తించామని, గుర్తింపు కార్డులు త్వరలో జారీ చేస్తామన్నారు. బుధవారం తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నగరాభివృద్ధికి సంబంధించిన పలు ప్రణాళికలను వివరించారు. రోడ్ల విస్తరణే ప్రధాన ఎజెండా ‘జీవీఎంసీ పరిధిలో 114 ప్రధాన రహదారులను అభివృద్ధి చేయనున్నాం. ప్రతి వార్డులో ఒక ప్రధాన రహదారితో పాటు, ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన మరో 14 రోడ్లను విస్తరించనున్నాం. భూ సమీకరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జోనల్ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, వీఆర్వోలతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం. నగరంలో సీసీ, బీటీ రోడ్ల అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించగా, కొన్ని పనులు పూర్తయ్యాయి. మరికొన్ని టెండర్ల దశలో ఉన్నాయి.’ అని కమిషనర్ వివరించారు. చంద్రంపాలెం వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జికి జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. మురుగునీరు శుద్ధి అప్పుఘర్ నుంచి భీమిలి వరకు 13 డ్రెయిన్లను అనుసంధానిస్తూ.. అప్పుఘర్, సాగర్నగర్, భీమిలిలో మూడు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు(ఎస్టీపీలు) నిర్మిస్తామని కమిషనర్ తెలిపారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని నరవకు తరలించి, అక్కడి నుంచి పరిశ్రమలకు సరఫరా చేస్తామన్నారు. ఆపరేషన్ లంగ్స్లో భాగంగా నగరంలో గుర్తించిన 1,480 బహిరంగ స్థలాల్లో.. 385 స్థలాలను ఇప్పటికే పార్కులుగా అభివృద్ధి చేసినట్లు వివరించారు. మిగిలిన స్థలాలకు ఫెన్సింగ్ వేసి, ఆక్రమణల నుంచి కాపాడామని కమిషనర్ స్పష్టం చేశారు. భవన నిర్మాణాలపై కఠిన వైఖరి సర్వే సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఈ నెల 30 నాటికి ఆన్లైన్ పోర్టల్ తీసుకువస్తున్నట్లు కమిషనర్ కేతన్గార్గ్ తెలిపారు. సర్వే చేయించుకోవాలనుకునే వారు ఇకపై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణాలు పూర్తయ్యాక, ప్లాన్కు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నిరాకరించడంతో పాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ స్టాళ్లు, హోటళ్లపై తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. గత నెలలో 191 హోటళ్లలో తనిఖీలు నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలు పాటించని 170 హోటళ్ల యాజమాన్యాలకు రూ.2,71,900 జరిమానా విధించినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. ట్రాఫిక్ నియంత్రణకు నూతన వ్యవస్థ ‘నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఆటోమేటెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టంను త్వరలో ప్రవేశపెట్టనున్నాం. 14 ప్రధాన జంక్షన్లలో ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. సిగ్నలింగ్ వ్యవస్థను అనుసంధానించి, ఒక జంక్షన్ దాటిన వాహనాలకు తదుపరి జంక్షన్లో కూడా గ్రీన్ సిగ్నల్ పడేలా కొత్త విధానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇటీవల జరిగిన గిరి ప్రదక్షిణ రోజున పైలెట్ ప్రాజెక్ట్గా చేపట్టాం. నగరంలో మొత్తం 115 జంక్షన్లు ఉండగా.. పోలీసుల సహకారంతో తొలి దశలో 50 జంక్షన్లలో దీనిని అమలు చేయనున్నాం’అని కమిషన్ వివరించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ -
వైఎస్సార్ సీపీలో నియామకాలు
సీతంపేట : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లాకు చెందిన పలువురు నాయకులను అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర నియోజకవర్గానికి చెందిన పలివెల ఈశ్వరిని రాష్ట్ర వీవర్స్ వింగ్ అధికారి ప్రతినిధిగా, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన గంటా రాణిని రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా, ఎడ్ల సత్యంను రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా, గాజువాకకు చెందిన తుమ్మలూరు జగదీష్ రెడ్డిని రాష్ట్ర ఐటీ వింగ్ జోనల్ అధ్యక్షుడిగా, గంగుల రోజా రాణిని రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా, తూర్పు నియోజకవర్గానికి చెందిన వానపల్లి ఈశ్వరరావును రాష్ట్ర వీవర్స్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా, బెవర జగదీశ్వరరావును రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ సెక్రటరీగా నియమించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కిరణ్ రాజు సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జి.ఎస్.వి.వి.ఎ.ఎం.రాజు(కిరణ్రాజు) నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
నేపాల్లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర వాసులు.. ఆడియో వైరల్
సాక్షి, విశాఖపట్నం: నేపాల్లో చెలరేగిన అల్లర్లలో ఉత్తరాంధ్ర వాసులు చిక్కుకుపోయారు. ఈ నెల 3న విహారయాత్రకు 81 మంది బృందం బయలుదేరింది. అందులో 70 మంది విశాఖ వాసులు కాగా, మిగతా 11 మంది శ్రీకాకుళం, విజయనగరం వాసులు.ఖాట్మండులో రాయల్ కుసుమ్ హోటల్లో బిక్కుబిక్కుమంటూ యాత్రికులు కాలం గడుపుతూ తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా కర్ఫ్యూ విధించడంతో ఎటు కదలని లేని స్థితిలో యాత్రికులు చిక్కుకుపోయారు. కాగా, నేపాల్లో చిక్కుకున్న బాధిత మహిళ ఆడియో వైరల్గా మారింది. -
బైక్ కొనాలనుకుంటున్నారా? రెండు వారాలు ఆగండి
విశాఖ సిటీ : ద్విచక్ర వాహనాలు కొనాలనుకుంటున్నారా? రెండు వారాలు ఆగండి. జీఎస్టీ స్లాబుల సవరణతో బైక్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. దసరా, దీపావళి పండగకు ముందే డిస్కౌంట్ల ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. అన్ని ద్విచక్ర వాహనాలు రూ.10 వేలు నుంచి రూ.20 వేల వరకు తక్కువకు లభించనున్నాయి. జీఎస్టీ రేటు సవరణతో బైక్ మార్కెట్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ నెలాఖరు నుంచి భారీగా బైక్ విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని కంపెనీలు తగ్గింపు ధరలను సైతం ప్రకటించేశాయి.350 సీసీ లోపు బైక్లపై భారీగా తగ్గింపుకేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను సవరించింది. ఇందులో 350 సీసీ వరకు ఉన్న బైక్లపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. నవరాత్రి తొలి రాజు నుంచే ఈ కొత్త ధరలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో బైక్ల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. వినియోగదారులు వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. హీరో, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి కంపెనీలతో పాటు జావా, రాయల్ ఎన్ఫీల్డ్, యెజ్డీ బైకులు కూడా ప్రస్తుతం కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. 350 సీసీ ఇంజన్ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్ల ధరలు మాత్రం పెరగనున్నాయి. ఇప్పటి వరకు వీటిపై 28 శాతం జీఎస్టీ ఉండగా.. ఈ నెల 22వ తేదీ నుంచి 40 శాతానికి పెరగనుంది. దీంతో లగ్జరీ బైక్ల ధరలు మాత్రం షాక్ కొట్టనున్నాయి. ఇప్పటి కంటే రూ.20 వేల నుంచి రూ.45 వేల వరకు పెరగనున్నాయి.ధరలు తగ్గిస్తూ ప్రకటనలుప్రస్తుతం విశాఖ మార్కెట్లో 110, 125, 150 సీసీ ఇంజన్ బైక్ల వినియోగమే ఎక్కువగా ఉంది. వీటి కొనుగోలుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఆ తర్వాత 200, 250 సీసీ వరకు విక్రయాలు మధ్యస్తంగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే వీటి ధరలు తగ్గిస్తూ కంపెనీలు కొత్త ధరలను ప్రకటించాయి. హీరో కంపెనీ బైక్లపై మోడల్, వేరియంట్ను బట్టి రూ.6 వేల నుంచి, హోండా కంపెనీ బైక్లపై రూ.8,500 నుంచి, టీవీఎస్ బైక్లపై రూ.8,700 నుంచి, బజాజ్ బైక్లపై రూ.8,500 నుంచి అత్యధికంగా రూ.15 వేలు వరకు తక్కువకు రానున్నాయి. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ వరకు బైక్లపై రూ.19 వేలకు పైగా తక్కువకు లభించనున్నాయి.మార్కెట్ జోష్జీఎస్టీ రేట్లలో సవరణతో బైక్ మార్కెట్ జోష్ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా దసరా, దీపావళికి ముందు కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంటాయి. కానీ ఈసారి జీఎస్టీ రేటును తగ్గించి కేంద్రం కూడా కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది. దీనికి తగ్గట్టుగానే కంపెనీలు పోటాపోటీగా తగ్గింపు ధరలను ప్రకటించాయి. ఇప్పటికే కొనుగోలుదారులు ప్రస్తుతం బైక్లు కొనుగోలు చేయకుండా ప్రీ బుకింగ్లకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 22 తర్వాత కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. తద్వారా రూ.10 వేలు నుంచి రూ.20 వేల వరకు తగ్గింపు పొందాలని చూస్తున్నారు. ఈ కొత్త ధరలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బైక్ విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది బైక్ మార్కెట్కు శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. -
సింహాచలం అప్పన్న ఆభరణాలకు శఠగోపం.. బంగారం ఏమైంది?
సాక్షి, విశాఖ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో సింహాచలం అప్పన్న బంగారు ఆభరణాలకు శటగోపం పెట్టారు. భక్తులు ఇచ్చిన విలువైన బంగారు ఆభరణాల అపహరణకు గురైనట్టు సమాచారం. ఆభరణాల లెక్క తేలకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. సింహాచలం అప్పన్న ఆలయంలో లెక్కా పత్రం లేకుండా విరాళాల నిర్వహణ సేకరణ జరిగింది. దీనిపై కమిటీ వేసి విచారణ చేపట్టినా.. ఆభరణాల లెక్కను మాత్రం అధికారులు చెప్పలేదు. విచారణ కమిటీ ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా లెక్కలు చెప్పకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు ఆభరణాలు అపహరణకు గురైనట్టు భక్తులు చెబుతున్నారు. అప్పన్న ఆలయంలో బంగారం అపహరణపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అనుబంధ ఆలయాల్లో ఉన్న ఆభరణాలపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి.ఇదిలా ఉండగా.. అంతకుముందు సింహాచలం అప్పన్న ఆభరణాలపై వివాదం నెలకొంది. అప్పన్న ఆభరణాలు అపహారణకు గురయ్యాయంటూ గత ఏడాది విశాఖ జిల్లా కలెక్టర్కు ప్రభాకరాచారి ఫిర్యాదు చేశారు. ఆభరణాల విషయంలో వాస్తవాలు తేల్చేందుకు ఆలయ ఉన్నతాధికారులు కమిటీ వేశారు. కమిటీ ఎటువంటి విచారణ చేపట్టకపోవడంతో మరోసారి ప్రభాకరాచారి.. కలెక్టర్కు అర్జీ పెట్టారు. అనంతరం, కమిటీ విచారణ చేస్తుందని ఆలయ అధికారులు ప్రకటించారు. కానీ, కమిటీ సభ్యులు విచారణ చేయలేదు. భక్తులు ఇచ్చే బంగారు ఆభరణాల వివరాలు నమోదు చేసే రికార్డ్ కూడా మెయింటైన్ చేయడం లేదని ప్రభాకరాచారి ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా అప్పన్న భక్తుల్లో ఆందోళన నెలకొంది. -
బీవోబీ రూ.15 లక్షల బీమా క్లెయిమ్ చెల్లింపు
బీచ్రోడ్ : బ్యాంకు ఆఫ్ బరోడా–ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఏపీఎస్పీఎఫ్) మధ్య శాలరీ ప్యాకేజీ ఒప్పందంలో భాగంగా ఇటీవల సహజ మరణం పొందిన ఉద్యోగికి రూ.15 లక్షల బీమా రక్షణ కల్పించామని బ్యాంకు ఆఫ్ బరోడా విశాఖ రీజనల్ హెడ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ లీనా గోహైనా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒక ఘటనలో ఏపీఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కొణతాల పరమేశ్వరరావు మృతి చెందారు. ఆయనకు ద్వారకానగర్ బ్రాంచ్లో ఖాతా ఉంది. ఒప్పందం మేరకు బ్యాంక్ నుంచి బీమా క్లెయిమ్ ప్రాసెస్ చేసి రూ.15 లక్షల చెక్కును మంగళవారం ద్వారకానగర్ బ్రాంచ్లో బాధితుడి భార్య కొణతాల అన్నపూర్ణకు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.మహేష్ సమక్షంలో అందజేశామని ఆమె తెలిపారు. -
కాపర్ ప్లేట్లు దొంగిలించిన ముగ్గురి అరెస్టు
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ఫర్నేస్ విభాగంలో జరిగిన కాపర్ ప్లేట్ల దొంగతనం కేసును క్రైం పోలీసులు చేధించారు. పోయిన ఆరు ప్లేట్లులో రెండు ప్లేట్లుగా, మిగిలిన వాటిని దిమ్మలుగా స్వాధీనం చేసుకున్నారు. బీఎఫ్–3 విభాగం పునరుద్ధరణలో తీసి స్టోర్స్లో భద్రపరిచిన 45 ప్లేట్లలో ఆరు కాపర్ ప్లేట్లు కనిపించలేదు. సుమారు 1,200 కేజీల బరువు ఉండే విలువైన స్టేవ్స్ దొంగతనంపై విభాగం అధికారులు గత నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో అందిన సమాచారం మేరకు పోలీసులు వారం రోజుల క్రితం రెండు స్టేవ్స్ను సీఆర్ఎంపీ ఆర్ఈడీ స్టోర్స్ సమీపంలోని పొదల్లో గుర్తించారు. మిగిలిన నాలుగు కాపర్ ప్లేట్లు అప్పటికే గేటు దాటి బయటకు వెళ్లి చేతులు మారిపోయాయి. ఈ నాలుగు ప్లేట్లను 41 దిమ్మలుగా మార్చి వేశారు. నిందితులు రాజా (30), రామస్వామి (30)లతో పాటు స్క్రాప్ వ్యాపారి ప్రకాశ్లను అరెస్టు చేశారు. రాజా స్టీల్ప్లాంట్లో హైడ్రాలిక్ క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తుంటాడు. రామస్వామి, రాజాలు పక్కా ప్లాన్తో లోనికి ప్రవేశించి క్రేన్తో ప్లేట్లను బయటపెట్టారు. అందులో నాలుగు ప్లేట్లను స్లాగ్ లారీలో స్లాగ్ కింద పెట్టి బయటకు తరలించారు. మిగిలిన రెండింటిని సమీప పొదల్లో దాచారు. ఈలోగా పోలీసులు ఈ రెండింటిని స్వాధీనం చేసుకోవడంతో మిగిలిన నాలిగింటిని దిమ్మలుగా మార్చారని క్రైం సీఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. అంత బరువైన ప్లేట్లను తరలించాలంటే అవసరమైన భారీ యంత్రాలు సమకూర్చడంలో ఎవరి పాత్ర ఉందా? అనే అంశంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏజీపీగా న్యాయవాది సునీత
విశాఖ లీగల్: నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది పిల్ల సునీత నగరంలోని ప్రధాన సివిల్ జ్యుడీషియల్ కోర్ట్ అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ న్యాయ వ్యవహారాలు సామాజిక న్యాయం కార్యదర్శి గొట్టపు ప్రతిభా దేవి ఉత్తర్వులు జారీ చేశారు. సునీత ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. జూనియర్ జ్యుడీషియల్ సివిల్ జడ్జి కోర్టులో ఆమె ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా ప్రాతినిధ్యం వహిస్తారు. సునీతకు జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతి నాయుడు, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, ఇతర న్యాయవాదులు అభినందనలు తెలిపారు. -
మేహాద్రి నుంచి 530 క్యూసెక్కుల నీరు విడుదల
పెందుర్తి: మేహాద్రి గెడ్డ జలాశయానికి నీటి ఉధృతి పెరగడంతో ఔట్ఫ్లోను అధికారులు పెంచారు. ఇప్పటి వరకు రెండవ గేటును మూడు అంగుళాల మేర ఎత్తి 178 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు మంగళవారం సాయంత్రం గేటును మరో ఆరు అంగుళాలు(మొత్తం 9 అంగుళాలు) ఎత్తారు. దీని ద్వారా 530 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. మంగళవారం రాత్రికి రిజర్వాయర్ నీటిమట్టం 60/61 అడుగులు ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు తెలిపారు. మేహాద్రికి ప్రస్తుత ఇన్ఫ్లో కూడా దాదాపు 530 క్యూసెక్కులే ఉన్నట్లు పేర్కొన్నారు. -
చాగంటికి కొప్పరపు కవుల జాతీయ పురస్కారం
మద్దిలపాలెం: ప్రఖ్యాత ప్రవచనకారులు, ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం–2025 అందుకున్నారు. తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన ఆశుకవితా సార్వభౌములు కొప్పరపు సోదర కవుల స్మృతిలో నెలకొల్పిన కొప్పరపు కవుల కళాపీఠం 23వ వార్షికోత్సవం మంగళవారం కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సభాధ్యక్ష వహించగా.. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ గౌరవ అతిథిగా, అమెరికాలోని లిపి సంస్థ వ్యవస్థాపకులు సాగర్ అనిసింగరాజు, మా శర్మ ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. వీరి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ పంచభూతాల్లాగే తెలుగు భాష వెలుగొందాలని ఆకాంక్షించారు. తెలుగు వారికి ఆధ్యాత్మికత, సంస్కృతి, భాష, వారసత్వ సంపదలు గర్వించదగినవిగా ఉన్నాయని అన్నారు. విద్యార్థులకు కొప్పరపు కవుల పద్యాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని సూచించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. కొప్పరపు సోదర కవుల వంటి గొప్ప సరస్వతీ ఉపాసకుల పేరిట ఈ పురస్కారం లభించడం భగవత్ కృప అని అన్నారు. అవధానం అనేది కేవలం భాషపై పట్టుతో రాదని, సకల శాస్త్రాలు, పురాణాలపై పట్టు, సమయోచిత జ్ఞానం అవసరమని చెప్పారు. సంగీత సాహిత్య సమ్మేళనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్, గాయని ఆలమూరు రాధా కుమారి తమ కళలను ప్రదర్శించారు. భారతీభూషణ రాంభట్ల నృసింహశర్మ సభా వ్యాఖ్యానాలు చేశారు. పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయశర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విశేష సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. చాగంటి కోటేశ్వరరావుకు జాతీయ జర్నలిస్టుల సంఽఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సత్కరించి, అప్పన్న అంక్షితలు అందజేశారు. -
రాంగ్రూట్లో వెళ్లి.. మృతుఒడికి..
ఆరిలోవ: బీఆర్టీఎస్ రోడ్డులో ముడసర్లోవ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. శ్రీకృష్ణాపురంలో నివసిస్తున్న గుడ్ల గోవిందరెడ్డి (34), హరీష్ (28) ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలివి.. మద్దిలపాలేనికి చెందిన గోవిందరెడ్డికి భార్య, బాబు ఉన్నారు. మూడేళ్ల కిందట శ్రీకృష్ణాపురంలో అద్దె ఇంటికి వచ్చిన అతను.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఫైనాన్స్ బకాయిలు చెల్లించలేకపోవడంతో.. ఫైనాన్స్ ఇచ్చిన వాళ్లు ఆ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నాడు. దీంతో అతని భార్య ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనికి చేరి ఇంటిని నెట్టుకొస్తోంది. సరిగ్గా పది రోజుల క్రితం.. అదే ఇంటి పైఅంతస్తులోకి హరీష్ తన భార్యతో అద్దెకు దిగాడు. హరీష్ భార్య కూడా మరో ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. హరీష్ కూడా ఖాళీగానే ఉంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వీరిద్దరూ కలిసి స్కూటీపై ఆరిలోవ కాలనీకి వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న వారికి, బీఆర్టీఎస్ రోడ్డులో ఎంచుకున్న రాంగ్రూటే యమపాశమైంది. అదే రోడ్డులో సింహాచలం నుంచి హనుమంతవాక వైపు ఇటుకల లోడుతో వస్తున్న వ్యానును ముడసర్లోవ పార్కు గేటు వద్ద వీరు స్కూటీతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తలలకు తీవ్రమైన గాయాలై.. అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వ్యాన్ సైతం అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న ద్వారకా ట్రాఫిక్ సీఐ ప్రసాద్, లా అండ్ ఆర్డర్ సీఐ మల్లేశ్వరరావు, ఎస్ఐలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. వీరి అకాల మరణంపై శ్రీకృష్ణాపురం గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు.ఘటనా స్థలంలో బోల్తా పడ్డ వ్యానువ్యానును ఢీకొని ఇద్దరి మృతి -
● వైద్యురాలిపై వార్డు బాయ్, రోగి తల్లిపై వైద్యుడి వేధింపులు ● ఫిర్యాదు చేసినా.. పట్టించుకోని ఉన్నతాధికారులు ● మహిళా కమిషన్ దృష్టికెళ్లినా ఫలితం శూన్యం ● కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకం?
కేజీహెచ్లో కీచకులుమహారాణిపేట: కేజీహెచ్లో కీచకుల వ్యవహారం కలకలం రేపుతోంది. రోగులు, వారి బంధువులనే కాకుండా, మహిళా వైద్యులను సైతం కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. వార్డు బాయ్ల నుంచి వైద్యుల వరకు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. విధి నిర్వహణలో ఉన్న ఒక వైద్యురాలి పట్ల వార్డు బాయ్, చికిత్స కోసం వచ్చిన రోగి తల్లి పట్ల ఓ వైద్యుడు అసభ్యకరంగా ప్రవర్తించడం దుమారం రేపుతోంది. ఈ ఘటనలపై బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. విశేషమేమిటంటే.. ఇటు కేజీహెచ్కు, అటు ఆంధ్రా మెడికల్ కాలేజీకి మహిళలే సారథ్యం వహిస్తున్న తరుణంలో.. ఇలాంటి ఘటనలు జరగడం, వాటిపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. ఈ ఘటనలు కేజీహెచ్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. వైద్యురాలిపై వార్డు బాయ్ అసభ్య ప్రవర్తన అనస్థీషియా విభాగానికి చెందిన ఒక వైద్యురాలు.. వారానికి రెండు రోజులు (మంగళ, శుక్రవారాలు) అధికారుల ఆదేశాల మేరకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగా గత నెల 26న ఉదయం 11 గంటల సమయంలో ఆమె రోగులను చూస్తుండగా.. శంకరరావు అనే వార్డు బాయ్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒకసారి కాదు, రెండుసార్లు.. అందరి ముందు అలా ప్రవర్తించడంతో ఆ వైద్యురాలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, తమ విభాగాధిపతులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే రోజు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐకి కూడా ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు శూన్యం. రోగి తల్లిపై వైద్యుడి వేధింపులు పరవాడ ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. అనారోగ్యంతో ఉన్న తన కుమార్తెను తీసుకుని కేజీహెచ్కు వచ్చారు. సర్జరీ వార్డులో చికిత్స పొందుతున్న కుమార్తె వద్ద సహాయంగా ఉంటున్న ఆ తల్లి పట్ల ఓ వైద్యుడు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతను రోగితో కాకుండా ఆమె తల్లితో అనుచితంగా మాట్లాడటంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందికి గురైంది. ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగదనే అనుమానంతో.. బాధితురాలు నేరుగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని కోరుతూ మహిళా కమిషన్.. కేజీహెచ్ సూపరింటెండెంట్కు గత నెల 20న ఒకసారి, ఈ నెల 4న మరోసారి లేఖలు పంపింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని కమిషన్ చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీహెచ్లో కీచకుల్లా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో మరింత మంది ఇలాగే ప్రవర్తించే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి నియోజకవర్గంలో అరకు కాఫీ షాపులు
జీసీసీ ఉత్పత్తులపై మంత్రి సమీక్షఏయూక్యాంపస్: గిరిజన సహకార సంఘం (జీసీసీ) ఉత్పత్తుల బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. బీచ్రోడ్డులోని జీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆమె చైర్మన్, డైరెక్టర్లు, ఎండీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో అరకు కాఫీ షాపులు ఏర్పాటు చేయాలని, జీసీసీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సిబ్బంది కొరతను తాత్కాలికంగా సచివాలయ సిబ్బందితో సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. అరకు కాఫీని ప్రపంచవ్యాప్తం చేయడానికి 18 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. జీసీసీ ప్రాంగణంలో రూ. 84 కోట్లతో 12 అంతస్తుల భవనం నిర్మించే అవకాశాలపై కూడా సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించి గతంలోనే ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి అన్నారు. జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఎండీ కల్పనా కుమారి, డైరెక్టర్లు నాగరాజు, కనకరాజు, ఇబ్రహీం, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బాలల సంరక్షణ, పునరావాసం చాలా ముఖ్యం
విశాఖలీగల్: బాలల న్యాయ, రక్షణ చట్టాల అమలుపై అవగాహన ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు చిన్నంశెట్టి రాజు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. చట్టంతో విభేదిస్తున్న పిల్లలు–సంరక్షణ, రక్షణ అవసరమైన వారి సంరక్షణ, పునరావాసాన్ని మెరుగుపరచడం తదితర అంశాల గురించి వివరించారు. బాలల సంరక్షణ, పునరావాసం కోసం ఉన్న చట్టాలను, జువైనల్ జస్టిస్ యాక్ట్, పోక్సో చట్టం వంటి వాటిని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలన్న దానిపై చర్చించారు. కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి మంగాకుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, జువైనెల్ జస్టిస్ బోర్డు న్యాయమూర్తి వరలక్ష్మి, పలు శాఖల అధికారులు, న్యాయవాదులు, న్యాయ అధికారులు పాల్గొన్నారు. -
యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
విశాఖ సిటీ : దేశంలో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్ప్రెన్యూర్షిప్(గేమ్) పనిచేస్తోందని గేమ్ సహ వ్యవస్థాపకుడు పి.మదన్ పేర్కొన్నారు. మంగళవారం సిరిపురంలోని ది డెక్ భవనంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీఐహెచ్)లో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలో మాస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉద్యమాన్ని వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా 2030 నాటికి 50 మిలియన్ల కొత్త ఉద్యోగాల సృష్టే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఏ–హబ్ సీఈవో రవి ఈశ్వరపు మాట్లాడుతూ ఆర్టీఐహెచ్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. విశాఖలో ఈ కార్యక్రమాన్ని ఒక పైలెట్ ప్రాజెక్ట్గా చేపట్టగా.. భవిష్యత్తులో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. కన్ఫెడరేషన్ ఆఫ్ వుమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షురాలు యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ ఔత్సాహికులు ఎవరైనా ఒక ఐడియాతో గేమ్కు వస్తే.. ఒక పారిశ్రామికవేత్తగా బ్రాండింగ్తో వెళ్లేంత వరకు సహాయ సహకారాలు ఉచితంగానే అందిస్తుందని తెలిపారు. సమావేశంలో నేటివ్ అరకు కాఫీ అధినేత రామ్కుమార్ వర్మ, గేమ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కేతుల్ తదితరులు పాల్గొన్నారు. -
ధర్నా స్థలంలో మొక్కలు నాటిన స్టీల్ప్లాంట్
కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న ఆందోళనలను కట్టడి చేయడానికి యాజమాన్యం మరో ఎత్తుగడ వేసింది. కొన్ని రోజులుగా కార్మికులు నిరసనలు చేస్తున్న ఉక్కు పైలాన్ వద్ద మొక్కలు నాటించింది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు కూర్మన్నపాలెంలోని ఉక్కు పైలాన్ వద్ద దీక్షలు, ధర్నాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదేశంలో ఉన్న టెంట్ కొన్ని రోజుల కిందట వర్షాలకు తడిసి కూలిపోయింది. దీనిని ఆసరాగా తీసుకున్న యాజమాన్యం.. కార్మికులు ధర్నాలు నిర్వహించే స్థలం చుట్టూ కంచె వేసింది. దీంతో కార్మిక సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆందోళనల నిర్వహణకు అనుమతి పొందాయి. ఆ అనుమతితో ఇటీవల పైలాన్కు ఎదురుగా ఉన్న రోడ్డులో ధర్నాను నిర్వహించాయి. అయితే యాజమాన్యం మంగళవారం పైలాన్ ప్రాంతంలో మొక్కలు నాటించింది. దీని వల్ల భవిష్యత్తులో కార్మికులు ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి కూడా వీలు లేకుండా యాజమాన్యం అన్ని విధాలుగా కట్టడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ తాజా పరిణామంపై కార్మిక సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. -
కొండంత బకాయి.. గోరంత చెల్లింపు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ కాంట్రాక్టర్ల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. సుమారు 13 నెలలుగా పెండింగ్లో ఉన్న రూ.420 కోట్ల బిల్లులకు గాను, కేవలం గతేడాది జూలైకు సంబంధించిన రూ.40 కోట్లను మొక్కుబడిగా చెల్లించి చేతులు దులుపుకుంది. ఈ కంటితుడుపు చర్యతో తమ కష్టాలు ఏమాత్రం తీరవని పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా.. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. గత ప్రభుత్వ హయాంలో ఆరు నెలలకే బిల్లులు వచ్చేవని, ఇప్పుడు ఏడాది దాటినా నిరీక్షణ తప్పడం లేదని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నా రు. అప్పులు చేసి పనులు పూర్తి చేసి, నేడు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా చితికిపోతున్నామని కన్నీటిపర్యంతమవుతున్నారు. దసరా పండగ సమీపిస్తున్న వేళ.. తమ వద్ద పనిచేసిన కార్మికులకు జీతాలు కూడా ఇవ్వ లేని దయనీయ స్థితిలో ఉన్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘నిధి పోర్టర్’ సైతం పాత బిల్లుల విషయంలో నిరుపయోగంగా మారిందని, దాని వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. బకాయిల కోసం నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, ఎంఎస్ఎంఈ నేషనల్ బోర్డు సభ్యుడు విష్ణుకుమార్రాజు, ఏపీఎంఎస్ఎంఈడీసీ చైర్మన్ టి.శివశంకర్ను కలిసి మొర పెట్టుకున్నట్లు తెలిపారు. మొక్కుబడి చెల్లింపులు ప్రభుత్వం ఎట్టకేలకు గతేడాది జూలైకు సంబంధించిన రూ.40 కోట్లను మంగళవారం విడుదల చేసిందని జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీవీ నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎం.సంజీవరెడ్డి తెలిపారు. ఇంకా రూ.380 కోట్ల భారీ మొత్తం పెండింగ్లోనే ఉందని వారు వెల్లడించారు. దసరా సందర్భంగా త్వరలో మరిన్ని బిల్లులు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారని వెల్లడించారు. అయితే కాంట్రాక్టర్లలో పూర్తిస్థాయి భరోసా కనిపించడం లేదు. ‘ఈ మొక్కుబడి చెల్లింపులతో మా కష్టాలు తీరవు. కనీసం ఆరు నెలల బిల్లులైనా ఒకేసారి చెల్లిస్తేనే మేం ఆర్థికంగా గట్టెక్కగలం. లేకపోతే పనులు కొనసాగించే పరిస్థితిలో కూడా లేము.’ అని పలువురు కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు అన్యాయం
బీచ్రోడ్డు: రాష్ట్రంలోని 17 కొత్త వైద్య కళాశాలల్లో పదింటిని పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని పీడీఎస్వో విద్యార్థులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం వారు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్వో జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి మాట్లాడుతూ.. ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కళాశాలలను 33ఏళ్ల పాటు లీజుకు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల సుమారు 1,500 ఎంబీబీఎస్ సీట్లు ప్రభావితమవుతాయన్నారు. ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోటా 50శాతం తగ్గి, మిగిలిన 50శాతం సీట్లను మార్కెట్ రేట్లకు విక్రయించడం ద్వారా ఫీజులు విపరీతంగా పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నాబార్డ్ నిధులు రూ.8,500 కోట్లతో 17 కళాశాలల నిర్మాణానికి చర్యలు తీసుకోగా.. 2023లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలలో కళాశాలలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2024లో పులివెందుల కళాశాలను తిరస్కరించడంతో పాటు, 80శాతం నిర్మాణం పూర్తయిన పది కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను రద్దు చేయాల్సిందిగా ఎన్ఎంసీకి లేఖ రాసిందని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ.. జీవో 107, 108లను 100 రోజుల్లో రద్దు చేసి, 100 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామని చెప్పినప్పటికీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీలు నీటి బుడగలుగా మారాయని విమర్శించారు. ప్రభుత్వం పారదర్శకత లేకుండా, కన్సల్టెన్సీల ద్వారా ఈ కళాశాలలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. ఈ పీపీపీ మోడల్ విస్తరిస్తే, అన్ని ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆందోళనలో పీడీఎస్వో జిల్లా కమిటీ సభ్యులు జానకి, లక్ష్మణ్, లోకేష్, లైకోన్, తులసి, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. వైద్య విద్య ఖరీదుగా మారుతుందని పీడీఎస్వో ఆందోళన -
విశాఖలో కుండపోత వర్షం.. ఏపీలో మూడు రోజులు గట్టి వానలు..
సాక్షి, విశాఖ: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి విశాఖలో కుండపోత వర్షం కురుస్తోంది. నగర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొడుతోంది. అర్థరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రోడ్లపై భారీ వరద నీరు చేరుకుంది.ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణం కేంద్రం హెచ్చరించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. బుధ, గురువారాల్లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శుక్రవారం ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గురువారం తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీయొచ్చని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. 🔸ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపిలో మూడు రోజులు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు🔸అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు🔸మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం pic.twitter.com/NCNsiHxmKQ— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 9, 2025 -
విశాఖ స్టీల్ప్లాంట్లో అగ్ని ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్ఎంహెచ్పీ విభాగం వద్ద కోకింగ్ కోల్లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. పెద్ద పెద్ద కుప్పలుగా కోకింగ్ కోల్ ఉండటంతో ఎండ వేడికి మంటలు చెలరేగుతున్నాయి. -
అత్తను చంపిన అల్లుడికి జీవిత ఖైదు
విశాఖలీగల్ : అత్తపై దాడి చేసి చంపిన అల్లుడికి జీవిత ఖైదు విధిస్తూ నగరంలో మహిళా కోర్టు న్యాయమూర్తి వి.శ్రీనివాసరావు సోమవారం తీర్పునిచ్చారు. జైలు శిక్షతోపాటు రూ.1.2 లక్షలు జరిమానా చెల్లించాలని, అందులో రూ.లక్ష భార్యకు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. అదనపు పబ్లిక్ ప్రాసెక్యూటర్ వి.ఖజనారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆరిలోవలోని లక్ష్మీపార్వతి నగర్కి చెందిన వి.మహేష్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. మహేష్ అదే ప్రాంతానికి చెందిన ఎర్రంశెట్టి కుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. కాలక్రమంలో మహేష్ వ్యసనాలకు బానిసయ్యాడు. తరచూ పూర్తిగా మద్యం తాగి భార్య,పిల్లలను హింసించేవాడు. తాగుడికి డబ్బులు కావాలని భార్యను తీవ్రంగా వేధించేవాడు. భర్త వేధింపులను భరించలేక 2013 అక్టోబర్ 10వ తేదీకి ముందు కుమారి తన ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వచ్చేసింది. నిందితుడు అక్కడకు కూడా వచ్చి మద్యం కోసం డబ్బులు అడిగేవాడు. ఈ నేపథ్యంలో మహేష్కు కుమారికి మధ్య ఘర్షణ జరిగింది. తన భార్య దగ్గర వచ్చి తన పిల్లలకు బిస్కెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అందుకు భార్య అత్తమామలు అడ్డు చెప్పారు. అవమానం భరించలేక బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ అరగంట వ్యవధిలో ఇనుప రాడ్డుతో వచ్చి విచక్షణారహితంగా అడ్డువచ్చిన భార్య, అత్తమామలను గాయపరిచాడు. వారిని చుట్టుపక్కల వారు కేజీహెచ్లో చేర్చారు. చికిత్స పొందుతూ అత్త లక్ష్మి మృతి చెందింది. భార్య కుమారి ఫిర్యాదు మేరకు ఆరిలోవ పోలీసులు నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 302 కింద కేసు నమో చేసి నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తిపై విధంగా తీర్పునిచ్చారు. -
విజువల్ వండర్ 'మిరాయ్'
ఏయూక్యాంపస్ : సూపర్ హీరో తేజ సజ్జా నటించిన విజువల్ వండర్ ‘మిరాయ్’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సందర్భంగా మేకర్స్ నగరంలో గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ను సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ సెప్టెంబర్ 12 మిరాయ్ థియేటర్లోకి వస్తుంది. ఇది ఒక యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్. తప్పకుండా అందరూ థియేటర్స్ కి వచ్చి చూడండని కోరాడు. అలాగే మంచు మనోజ్, హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ సినిమా ఆదరించాలని కోరారు.జీవీఎంసీ అధ్యయన యాత్రకు దూరండాబాగార్డెన్స్: ఈ నెల 15 నుంచి 23 వరకు రాజస్థాన్, ఢిల్లీలలో జీవీఎంసీ చేపట్టనున్న అధ్యయన యాత్రలో తాను పాల్గొనడం లేదని జీవీఎంసీ సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి. గంగారావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన నగర మేయర్కు లేఖ పంపారు. ఈ తరహా అధ్యయన యాత్రల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని గంగారావు ఆరోపించారు. గతంలో చేసిన అధ్యయన యాత్రల నివేదికలపై ఇప్పటివరకు కౌన్సిల్లో చర్చ జరపలేదని, ప్రజలపై పన్నుల భారం పెరుగుతున్న తరుణంలో ఇలాంటి యాత్రలు చేయడం సరికాదని ఆయన అన్నారు. -
మూగబాలిక తల్లితండ్రులను పరామర్శించిన కేకే రాజు
తాటిచెట్లపాలెం: సీతమ్మధారలో లైంగికదాడిక గురైన మైనర్ మూగ బాలిక కుటుంబ సభ్యులను సోమవారం జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కేకే రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరగడం వల్ల నేరాలు, అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. బాధితురాలి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేకే రాజు భరోసా ఇచ్చారు. బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపి, దోషులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, రవీంద్ర భరత్ పాల్గొన్నారు. -
సినర్జీస్ కార్మికుల ఆందోళన ఉధృతం
అగనంపూడి : జీతాల బకాయిలు చెల్లించాలని నాలుగు రోజుల నుంచి నిరసన తెలుపుతున్నా యాజమాన్యంలో స్పందన లేకపోవడంతో కార్మికులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దువ్వాడ వీఎస్ఈజెడ్ ఆవరణలోని సినర్జీస్ క్యాస్టింగ్స్ లిమిటెడ్లో అల్లాయ్ వీల్స్ తయారు చేసి, ఎగుమతులు చేస్తుండడంతోపాటు దేశీయ మార్కెట్లో కూడా విక్రయాలు చేస్తుంది. అయితే సంస్థ గత కొన్నేళ్లుగా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి కార్మికుల జీతాలు సకాలంలో చెల్లించకుండా తాత్సారం చేస్తూ వస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కేవలం ఆరు మాసాల జీతాలు మాత్రమే చెల్లించారని, మిగిలిన ఆరు మాసాల జీతాలు చెల్లించాలని విన్నవించుకున్నా పట్టించుకోపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనకు దిగామని కార్మికుల ప్రతినిధులు దాస్, ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా యాజమాన్యం కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం, సోమవారం పోలీస్ బలగాలను దించడంతో కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా గేటు వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. గత కొన్నేళ్లుగా ఇంక్రిమెంట్లు, బోనస్లు లేవని అయినా సంస్థ పరిస్థితిని గమనించి మేం సర్దుకుపోతున్నా యాజమాన్యం జీతాలు కూడా చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీతాల నుంచి కోత విధిస్తున్న డబ్బులను పీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల్లో జమ చేయడం లేదని, దీంతో తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని ఆరోపించారు. ఆందోళనలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
మైనర్ అనుమానాస్పద మృతి
తగరపువలస: ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీలోని బొడ్డపాలెంలో ఒడిశాకు చెందిన 13 ఏళ్ల బాలిక అనుమా నాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఉరి వేసుకుని మృతి చెందినట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశాలోని రాయగడకు చెందిన ఈ బాలిక రెండు నెలల క్రితం బొడ్డపాలెంలోని ఎవర్గ్రీన్ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీలో పని కోసం వచ్చింది. మైనర్ కావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం ఆమెను పనిలో పెట్టుకోలేదు. ఆదివారం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ గుడ్ల భూలోకరెడ్డి తన కుటుంబం కోసమని శోభన్కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అయితే తాళం వేయకుండా బాలికను ఆ ఇంట్లోనే ఉంచాడు. సోమవారం ఉదయం భూలోకరెడ్డి వచ్చి చూడగా..తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాడు. అక్కడ బాలిక చున్నీతో సీలింగ్కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అంతుచిక్కని మిస్టరీ రెండు నెలల క్రితం వచ్చిన బాలిక ఇంతకాలం ఎక్కడ ఉంది. ఏం చేస్తోంది.. వంటి వివరాలు అంతుచిక్కడం లేదు. ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులతో బాలిక చనువుగా ఉండేదని, వీరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అసలు భూలోక రెడ్డికి ఈ బాలికకు సంబంధం ఏంటి? తను అద్దెకు తీసుకున్న ఇంట్లో బాలికను ఎందుకు ఉంచాడు? వంటి వివరాలు అంతుచిక్కడం లేదు. సంఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. -
పర్యాటకానికి వన్నెతెచ్చేందుకు వియత్నాంతో ఒప్పందం
మహారాణిపేట: పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వియత్నాంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, వియత్నాం టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ చైర్మన్ చౌ ట్రీ యంగ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం బౌద్ధమతానికి సంబంధించిన ప్రాంతాలైన అమరావతిలోని కాలచక్ర, ఉమ్మడి విశాఖలోని బొజ్జన్నకొండ, బావికొండ, తొట్లకొండలను సందర్శించేందుకు వియత్నాం పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకుంటారు. కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారులు జె. మాధవి, జగదీష్, ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
టౌన్ప్లానింగ్ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం
మహారాణిపేట: ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను హెచ్చరించారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశంలో, గత వారంలో వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను సమీక్షించి ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఫిర్యాదులను ఉన్నతాధికారులకు పంపించడం కాకుండా వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా పోలీసు శాఖ, జీవీఎంసీ, పట్టణ ప్రణాళికా విభాగాల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా సమాధానాలు రాసిన పట్టణ ప్రణాళికా విభాగం అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ తరహా నిర్లక్ష్యం పునరావృతమైతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. తన సహనాన్ని పరీక్షించవద్దన్నారు. 315 వినతుల స్వీకరణ : పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి మొత్తం 315 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూకు 119, జీవీఎంసీకి 85, పోలీసు శాఖకు 21, ఇతర శాఖలకు 90 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీలపై చిన్నచూపు
మహారాణిపేట: మైనారిటీ ముస్లింలకు ప్రభుత్వం భద్రత కల్పించాలని, వారికి రాజకీయంగా, ఆర్థికంగా అండగా ఉండాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజలను మోసం చేస్తోందని, ఇమామ్, మౌజమ్లకు 11 నెలలుగా బకాయిలపడ్డ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు, 53వ వార్డు కార్పొరేటర్ భర్కత్ అలీ ఆధ్వర్యంలో సోమవారం ముస్లింలు, పార్టీ నేతలతో కలిసి ఈ అంశంపై కలెక్టర్ హరేందిర ప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ మైనారిటీ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిదే అన్నారు. మైనారిటీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలన్న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింలకు ఉన్నత పదవుల్లో సముచిత స్థానం కల్పించారని తెలిపారు. ముస్లిం కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో మసీదులో పనిచేస్తున్న ఇమామ్లకు నెలకు రూ. 10,000, మౌజమ్లకు నెలకు రూ. 5,000 ప్రతి నెల ఇచ్చి వారికి ఆర్థిక భరోసా కల్పించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల సంక్షేమాన్ని విస్మరించి, వారికి కల్పించాల్సిన కనీస సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. మైనారిటీలకు అండగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మైనారిటీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, అలాగే 11 నెలలుగా బకాయిపడ్డ ఇమామ్లు, మౌజమ్ల జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజక వర్గ సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవి రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుడు పేర్ల విజయ చందర్, పార్టీ నాయకులు అల్లంపల్లి రాజుబాబు, డాక్టర్ జహీర్ అహ్మద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్ , దేవరకొండ మార్కెండేయులు, బోని శివరామకృష్ణ , కార్పొరేటర్లు మహ్మద్ ఇమ్రాన్, కో ఆప్షన్ సభ్యులు ఎం.డి షరీఫ్, మైనారిటీ నాయకులు కేవీ బాబా, షేక్ బాబ్జి, మక్బుల్, బిలాల్, మునీర్, సౌకత్ అలీ, మహ్మద్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కట్టకట
ఈ సమయంలో పొలాల గట్లపై నుంచి పచ్చని పైరును చూస్తూ ఆనందపడాల్సిన రైతన్న.. పంటను కాపాడుకోవడానికి అవసరమైన ఎరువుల కోసం రోడ్డెక్కాడు. యూరియా కోసం తిండితిప్పలు మానేసి.. ఎండనకా వాననకా పడిగాపులు కాస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటున్న రైతుకు.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విషమ పరీక్ష పెడుతోంది. ‘పంటలు ఉంటే ఏంటి.. పోతే ఏంటి.. వీలునప్పుడే యూరియా ఇస్తాం’ అన్నట్లుగా సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. ఏం చేయాలో పాలుపోక రోజూ రైతులు ఎదురుచూపు చూస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం/పద్మనాభం/సబ్బవరం/తగరపువలస : వర్షాలు పడిన తర్వాత పదును మీదే యూరియా చల్లితేనే పంట ఏపుగా పెరుగుతుంది. కానీ అన్నదాతకు యూరియా అందడం లేదు. జిల్లాలోని భీమిలి, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి వంటి గ్రామీణ ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ రైతులను మోసం చేస్తోంది. జిల్లాలో యూరియా, డీఏపీ అవసరాన్ని అంచనా వేసి వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినా.. ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెట్టింది. ఫలితంగా నెల రోజులుగా సహకార సంఘాల వద్దకు కాళ్లరిగేలా తిరుగుతున్నా రైతులకు పూర్తిస్థాయిలో ఎరువులు అందడం లేదు. అరకొరగా సరఫరా జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సుమారు 11,799 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగవుతాయి. కానీ ఈ ఏడాది కేవలం 10,200 హెక్టార్లలోనే సాగవుతున్నాయి. ఇందులో 3,777 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 6,423 హెక్టార్లలో ఉద్యాన పంటలు ఉన్నాయి. సెప్టెంబర్ వరకు వివిధ పంటలకు 3,354 టన్నుల ఎరువులు అవసరం. ఇందులో యూరియా 1,875 టన్నులు, డీఏపీ 690 టన్నులు, పొటాష్ 125 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 575 టన్నులు, ఇతర ఎరువులు 90 టన్నులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయినా ప్రభుత్వం అరకొరగా ఎరువులు సరఫరా చేసి చేతులు దులుపుకుంది. ఇప్పటివరకు జిల్లాకు కేవలం 1,557 టన్నుల యూరియా మాత్రమే అందింది. మిగిలిన ఎరువుల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండటంతో అన్నదాతలు అయోమయంలో పడ్డారు. పక్కదారి పడుతున్న యూరియా ఈఏడాది ఆలస్యంగా నాట్లు వేసిన రైతులు యూరియా కోసం రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల వెంట పరుగులు తీస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు యూరియా సరఫరా చేసే బాధ్యతను వదులుకున్నాయి. దీంతో ప్రైవేట్ దుకాణదారులు అధిక ధరలకు విక్రయించడంతో పాటు పక్క జిల్లాలకు తరలించారు. స్థానిక రైతులు అడిగితే గుళికలు కొనాలని మెలిక పెట్టి ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ క్రాప్ నమోదు ప్రకారం ఎంత పంట వేస్తే అందుకు సరిపడా యూరియా ఇవ్వకుండా ఆధార్ కార్డుకు ఒక బస్తా ఇవ్వడం ఎంతవరకు సమంజసమని రైతులు వాపోతున్నారు. గ్రామాల్లో ఆధార్ కార్డులను సేకరించిన కొందరు కూటమి నాయకులు ఇదే అదనుగా భావించి యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇవ్వలేదు.. ఇక్కడా లేదు! ఎకరన్నర పొలంలో వరిపంట వేశాను. కొన్ని రోజుల నుంచి యూరియా కోసం తిరిగి తిరిగి చెప్పులరిగిపోతున్నాయి. ఒక్క బస్తా కూడా దొరకడం లేదు. ఇప్పటికే ఆలస్యమైపోయింది. పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. – ఆర్.అప్పలరాజు, రైతు, పద్మనాభం మండలం ఏమి చేయాలో.. ఈ సారి 60 సెంట్లలో వరి సాగుచేశాను. ప్రస్తుతం కలుపు తీయాల్సి ఉండటంతో యూరియా వేయాలి. రైతు సేవా కేంద్రంలో యూరియా లేకపోవడంతో రెండు సార్లు సబ్బవరంలోని ఆగ్రో ఏజెన్సీ షాపులకు వెళ్లాను. అక్కడా లేదన్నారు. ఏమి చేయాలో తెలియడంలేదు. – సింగంపల్లి అమ్మతల్లినాయుడు, రాయపుర అగ్రహారం, సబ్బవరం మండలం బోనిలో యూరియా లేదు నేను 70 సెంట్లలో వరి పంట వేశాను. ఇప్పటి వరకు యూరియా తీసుకోలేదు. మా బోని గ్రామంలో యూరియా దొరకకపోవడంతో వేములవలస వచ్చాను. – గండ్రెడ్డి సంతోష్, బోని, ఆనందపురం ప్రైవేట్ దుకాణంలో కొన్నాను శిర్లపాలెంలో యూరియా దొరకడం లేదు. 50 సెంట్లలో వరి వేశాను. గొట్టిపల్లిలో అడిగితే స్టాక్ రావలసి ఉందన్నారు. దీంతో ప్రైవేట్ దుకాణంలో కొన్నాను. – శిర్ల పైడిశెట్టి, శిర్లపాలెం, ఆనందపురం మా జిల్లాలో దొరకడం లేదని... మాది విజయనగం జిల్లా జామి మండలం భీమసింగి గ్రామం. ఐదు ఎకరాల్లో పంట వేశాను. మా ఊరి ఆర్బీకేలో ఎప్పుడడిగినా యూరియా లేదు. వస్తాదనే చెబుతున్నారు. ఇక్కడికి వస్తే వేరే జిల్లాల వారికి ఎరువులు ఇవ్వమని చెబుతున్నారు. – జి.పైడిరాజు, రైతు, భీమసింగి, విజయనగరం జిల్లా -
దివ్యాంగుల ఆందోళన
మహారాణిపేట : సదరం సర్టిఫికెట్లలో దివ్యాంగుల శాతం తగ్గింపుపై వారంతతా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పర్సంటేజీనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తుల డేవిడ్ రాజు మాట్లాడుతూ 2010లో జారీ చేసిన సదరం సర్టిఫికెట్లలో ఉన్న పర్సంటేజీని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ పర్సంటేజీ తగ్గించడం వల్ల పింఛన్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఎస్. మల్లేశ్వరి మాట్లాడుతూ దివ్యాంగుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవద్దని కోరారు. దివ్యాంగులను ఇబ్బంది పెట్టొద్దు దివ్యాంగులను ఇబ్బంది పెట్టొద్దు. ఎంతో మంది పింఛన్లు మీద ఆధారపడి బతుకుతున్నారు. సదరం సర్టిఫికెట్లలో ఉన్న శాతాన్ని కూడా తగ్గించకూడదు. ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలి. నాకు 80 శాతం అంగవైకల్యం..పింఛన్తో జీవిస్తున్నాం. ఈనేపథ్యంలో అంగవైకల్యం శాతం తగ్గించి పింఛన్ రాకుండే చేస్తే మా కుటుంబం రోడ్డున పడతాం. – ఎస్.మల్లేశ్వరి, కంచరపాలెం -
మహిళలకు శాపంగా కూటమి పాలన
సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలన మహిళలకు శాపంగా మారిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆవేదన వ్యక్తం చేశారు. సీతమ్మధారలో మూగ మైనర్పై జరిగిన లైంగిక దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి పాలనలో మద్యం విచ్చలవిడిగా లభిస్తోందని, బెల్ట్ షాపులు పెరిగాయని ఆరోపించారు. మద్యం మత్తులో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. కూటమి 15 నెలల పాలనలో మహిళలపై సగటున గంటకు 70 అఘాయిత్యాలు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి అనిత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దిశ యాప్ను తొలగించి, శక్తి యాప్ను ప్రవేశపెట్టారని, అయితే దాని గురించి ప్రజలకు అవగాహన లేదని ఆమె పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు మహిళలకు ఎంతో రక్షణ కల్పించాయని గుర్తు చేశారు. హోంమంత్రి అనిత వెంటనే బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైఎస్సార్ సీపీ మహిళా విభాగం తరఫున న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీదేవి వర్మ, కార్పొరేటర్లు శశికళ, పార్టీ మహిళా నాయకులు యరబిల్లి వరలక్ష్మి, నమ్మి లక్ష్మి పాల్గొన్నారు. -
కూటమి నేతలకే బార్లూ !
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : కులాలకు కేటాయించిన బార్లపైనా కూటమి నేతలే వాలిపోతున్నారు. జిల్లాలో శెట్టి బలిజ, యాత కులాలకు మొత్తం 10 బార్లను కేటాయించారు. ఈ బార్లను కూడా కూటమి నేతలకు చెందిన మద్యం వ్యాపారులే తమ అనుచరులతో దరఖాస్తు చేసుకుని దక్కించుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 10 బార్లకుగాను 9 బార్లకు 4 చొప్పున దరఖాస్తులు రాగా.. మిగిలిన ఒక్క బారుకు మాత్రం 9 దరఖాస్తులు వచ్చాయి. 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ వేస్తామన్న నిబంధనల నేపథ్యంలోనే 9 బార్లకు పక్కాగా 4 చొప్పున దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ 9 బార్లను కూడా నిజమైన శెట్టి బలిజ, యాత కులాలకు చెందిన వ్యాపారులకు కాకుండా... కూటమి నేతలకు చెందిన యజమానుల వద్ద ఉండే వారి పేరుతోనే దరఖాస్తు చేసుకుని దక్కించుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో గతంలో మద్యం సిండికేట్లో కీలకంగా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యే చక్రం తిప్పినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ బార్లతో పోలిస్తే ఈ బార్లకు లైసెన్స్ ఫీజులో ఏకంగా 50 శాతం మినహాయింపు ఉండటంతోనే వీటిపై కూటమి నేతల కన్ను పడింది.రంగంలోకి రింగ్ మాస్టర్...!వాస్తవానికి గతంలో మద్యం సిండికేట్లో కీలకంగా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యే... మొన్నటి ప్రైవేటు మద్యం షాపుల వ్యవహారంలో దూరంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే బార్ల విషయానికి వచ్చేసరికి సాధారణ బార్లకు లైసెన్స్ ఫీజు ఏకంగా రూ.75 లక్షలతో పాటు తప్పనిసరిగా 4 దరఖాస్తులు చేయాలన్న నిబంధనను ప్రభుత్వం విధించింది. దీంతో బార్ల యాజమాన్యాల్లో వ్యతిరేకత వచ్చింది. అయితే, కులాలకు కేటాయించిన బార్లకు మాత్రం లైసెన్స్ ఫీజు కేవలం 37.5 లక్షలు మాత్రమే. అంటే ఏకంగా 50 శాతం రాయితీ లభిస్తోంది. దీంతో సగానికి సగం లైసెన్స్ ఫీజులో మినహాయింపు లభిస్తుండటంతో సదరు మద్యం సిండికేట్లో కీలకంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే చక్రం తిప్పారు. కూటమి నేతలకు చెందిన బార్ల యజమానుల వద్ద ఉండే వారితోనే మొత్తం వ్యవహారం నడిపించారు. తమ అనుయాయులతో దరఖాస్తులు చేయించి మొత్తం 9 బార్లను దక్కించుకున్నారు. ఈ వ్యవహారంలో సదరు టీడీపీ ఎమ్మెల్యేనే చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. తద్వారా శెట్టి బలిజ, యాత కులాల్లోని వ్యాపారస్తులకు దక్కాల్సిన బార్లు కాస్తా.. అధికారపార్టీకి చెందిన వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.మాజీ ఎకై ్సజ్ అధికారికి కూడా...!జిల్లాలో శెట్టి బలిజ, యాత కులాలకు కేటాయించిన బార్లలో 9 కూటమి నేతలకు దక్కాయి. ఇందులో విచిత్రంగా పదవీ విరమణ చేసిన ఎకై ్సజ్ అధికారి కూడా ఉండటం గమనార్హం. సదరు ఎకై ్సజ్ మాజీ అధికారికి మొదటి నుంచీ ఈ మద్యం సిండికేట్తో మంచి సంబంధాలు ఉన్నట్టు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఈ కులాల బార్లలో ఒకటి దక్కించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నగరంలో మంచి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం నడుస్తున్న రెండు బార్లకు చెందిన యాజమాన్యాలను కూడా దరఖాస్తు చేసుకోవొద్దంటూ కూటమి నేతల నుంచి బెదిరింపులు వచ్చినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. తద్వారా ఆయా ప్రాంతాల్లో తాము బార్లను ఏర్పాటు చేసుకునేందుకు కూటమి నేతల కనుసన్నల్లో ఉండే ఒక మద్యం సిండికేట్ యజమాని పక్కా ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది. -
ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపాలి
బీచ్రోడ్డు: ఉచిత బస్సు రవాణ సౌకర్యం వల్ల తీవ్ర నష్టపోయామని.. తమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. సోమవారం జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ఆటో డ్రైవర్లు నిరసన చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందించిన వాహన మిత్రం పథకాన్ని కొనసాగిస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం తక్షణమే పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సబ్సిడీతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా చేయాలన్నారు. డ్రైవర్లకు ఉరితాడు వంటి మోటారు సవరణ చట్టాన్ని, జీవో నెం 21ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గణేష్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బీచ్ శాండ్పై కూటమి కన్ను
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నదీ ఇసుక, నీటి వనరులను దోచుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు సాగర తీరంపై దృష్టి సారించింది. బీచ్ శాండ్ మైనింగ్ పేరుతో భీమిలి తీరంలో భారీగా ఖనిజాల అక్రమ రవాణాకు పాల్పడేందుకు కుట్ర పన్నుతోంది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలోని భీమిలి ప్రాంతంలో 90.15 హెక్టార్ల సముద్ర తీరాన్ని ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీని ద్వారా విలువైన ఖనిజాలు దోపిడీకి గురవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ జేబులు నింపుకోవడానికి ఇలాంటి విధ్వంసకర కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే మైనింగ్ కార్యకలాపాలకు టెండర్లు ఆహ్వానిస్తోంది. మద్రాస్లో మైనింగ్ పేరుతో విధ్వంసం గతంలో మద్రాసులో బీచ్ శాండ్ మైనింగ్ పేరుతో ప్రైవేటు సంస్థలు సముద్ర తీరాన్ని ధ్వంసం చేసి, దేశ భద్రతకు అవసరమైన ఖనిజాలను అక్రమంగా తరలించాయ. ఆ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు, మద్రాసు హైకోర్టు తక్షణమే మైనింగ్ను నిలిపివేయాలని ఆదేశించి, ప్రభుత్వాలకు పర్యావరణ పరిరక్షణపై హెచ్చరికలు జారీ చేసింది. ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా, ఏపీ ప్రభుత్వం తమ స్వలాభం కోసం పర్యావరణాన్ని పణంగా పెడుతోంది. మోనజైట్ పేరుతో దోపిడీకి కుట్ర ఈ ఖనిజాల్లో అణుధార్మిక శక్తి కలిగిన మోనజైట్ ముఖ్యమైనది. దీనిని అణు విద్యుత్ అభివృద్ధికి ఇంధన వనరుగా వినియోగిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన చట్ట సవరణల మేరకు, అణుధార్మికత పరిమితంగా ఉన్న ఖనిజాలను విక్రయించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకొని మోనజైట్ పేరుతో భారలోహాలను పెద్ద ఎత్తున అక్రమంగా తరలించేందుకు కుట్ర జరుగుతోందని, దీనికి ప్రభుత్వం సహకరిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మైనింగ్ వల్ల పర్యావరణానికి, దేశ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భీమిలి..ఖనిజాల నిక్షేపం రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో భీమిలిలోనే అరుదైన, అత్యంత విలువైన ఖనిజాలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలు వెల్లడించాయి. భీమునిపట్నం, పూడిమడక ప్రాంతాల్లో గార్నెట్, జిర్కోనియం, ఇలిమినెట్, సిలిమినైట్, రూటిల్, లికాక్సిన్, మోనజైట్ వంటి భారలోహాలు ఉన్నట్లు జీఎస్ఐ గుర్తించింది. భీమిలిలోని నిక్షేపాల విలువ దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ ఖనిజాలను ఏరోస్పేస్, వైద్య పరికరాలు, అణు రియాక్టర్ల వంటి వ్యూహాత్మక రంగాలలో ఉపయోగిస్తారు.ప్రైవేట్కు బీచ్ మైనింగ్ కట్టబెట్టడం దారుణంశ్రీకాకుళం, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని 19 ప్రాంతాల్లో బీచ్ శాండ్ మైనింగ్ కోసం ప్రైవేట్ సంస్థలకు లీజుకివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరం. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలి. తమిళనాడులో బీచ్ శాండ్ మైనింగ్ పేరుతో ప్రైవేట్ సంస్థలు మోనజైట్ వంటి విలువైన ఖనిజాలను అక్రమంగా తరలించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అణు అభివృద్ధిలో మూడో దశకు ఇంధన వనరుగా ఉపయోగపడే అత్యంత కీలకమైన మోనజైట్ను కోల్పోవడం దేశ భద్రతకు పెను ముప్పుగా పరిణమిస్తుంది. అటమిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ (డీఏఈ) ఇప్పటికే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వానికి బీచ్ శాండ్ మైనింగ్కు అనుమతులు ఇవ్వవద్దని లేఖ కూడా రాసింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై దృష్టి సారించాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి -
విశాఖలో దారుణం.. మూగ బాలికపై అత్యాచారం
విశాఖపట్నం: విశాఖలోని సీతమ్మధారలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి మతిస్థిమితం లేని 11 ఏళ్ల మూగ బాలికపై మద్యం మత్తులో మైనర్ మూగ బాలిక పై అత్యాచారంకి ఒడిగట్టిన ఇద్దరు నిందితులు. ఎస్ఆర్నగర్ ప్రాంతంలో పొదల్లోకి తీసుకొని వెళ్ళి మైనర్ మూగ బాలిక పై అత్యాచారం చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనను పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ సీరియస్గా తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి బిగ్బాస్ వరకు..
విశాఖపట్నం: దమ్ము శ్రీజ... ఈ పేరు ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టి, తన దూకుడుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన ప్రతిభతో బిగ్బాస్లో కచ్చితంగా రాణిస్తుందని ఈ ప్రాంతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి బిగ్బాస్ వరకు..శ్రీజ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. నెలకు రెండు లక్షలకు పైగా జీతం సంపాదిస్తున్నప్పటికీ, తన ప్రతిభను నిరూపించుకోవడానికి బిగ్బాస్ను ఒక వేదికగా ఎంచుకున్నారు. ఆడిషన్స్ అనే అగ్నిపరీక్షలో నెగ్గి, ఇప్పుడు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.తండ్రి నిజాయతీ, అంకితభావంశ్రీజ తండ్రి తండ్రి దమ్ము శ్రీను, జీవీఎంసీ 92వ వార్డులో పారిశుధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆయన ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు. వార్డులో ఏ సమస్య ఉన్నా, అది మురుగు కాల్వలైనా, చనిపోయిన వీధి కుక్కలైనా, వెంటనే అక్కడికి వెళ్లి పరిష్కరిస్తారు. ఒక సూపర్వైజర్గా కాకుండా, ఒక కార్మికుడిలా తన సిబ్బందితో కలిసి పనిచేసే గుణం ఆయనది. కొంతమంది దురభిమానం కారణంగా తోటి కార్మికుడు చేసిన దాడిలో ఒక కన్ను కోల్పోయారు.శ్రీజకు మద్దతివ్వండితమ కుమార్తె శ్రీజకు మద్దతివ్వాలని శ్రీను దంపతులు కోరుతున్నారు. ప్రతీ ఎపిసోడ్లో ఆమె ఆట తీరును గమనించి, పూర్తి మద్దతు తెలిపి, ఓట్లు వేయాలని ప్రేక్షకులందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఉత్కంఠ పోరు.. టైటాన్స్ జోరు
విశాఖ స్పోర్ట్స్: ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్ విశాఖ క్రీడాభిమానులకు అసలైన పండగ వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. పోర్ట్ ఇండోర్ స్టేడియం ఆదివారం అభిమానులతో కిక్కిరిసి.. వారి కేరింతలతో దద్దరిల్లింది. సొంతగడ్డపై ఆడుతున్న తెలుగు టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 44–34 తేడాతో ఘన విజయం సాధించి, స్థానిక అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. కెప్టెన్ విజయ్ మాలిక్ (11 పాయింట్లు), ఆల్రౌండర్ భరత్ (12 పాయింట్లు) అద్భుతమైన రైడింగ్తో జట్టుకు వెన్నుదన్నుగా నిలిచారు. ఆ తర్వాత జరిగిన మరో మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన పోరు ఆద్యంతం హోరాహోరీగా సాగింది. చివరి క్షణం వరకు విజయం ఎవరిదో తేలని ఈ మ్యాచ్లో.. కేవలం ఒక్క పాయింట్ (36–35) తేడాతో దబాంగ్ ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీని నమోదు చేసింది. ఢిల్లీ కెప్టెన్ అషుమాలిక్ ఏకంగా 21 పాయింట్లతో ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లతో విశాఖలో పీకేఎల్ ఫీవర్ తారస్థాయికి చేరింది. సోమవారం రాత్రి 8 గంటలకు హర్యానా స్టీలర్స్తో బెంగళూర్ బుల్స్ జట్టు తలపడనుండగా, రాత్రి 9 గంటలకు పునేరి పల్టన్తో పాట్నా పైరేట్స్ ఢీకొట్టనుంది. -
కేజీహెచ్కు జబ్బు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ సమస్యలకు నిలయంగా మారింది. వ్యాధి నయం చేసుకుందామని వచ్చే రోగులు.. ఇక్కడి అస్తవ్యస్త పరిస్థితులతో మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ఓపీ టికెట్ కోసం నిరీక్షణతో మొదలయ్యే ఈ నరకం.. వార్డులో చేరిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు పెంచకపోగా.. ఉన్నవి కూడా కనీస స్థాయిలో లేకపోవడంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఓపీ నుంచి వార్డు వరకు అవస్థలే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతిరోజూ 1,500 నుంచి 2,200 మంది వరకు ఓపీ నమోదవుతోంది. 300 నుంచి 600 మంది ఇన్ పేషెంట్లుగా చేరుతుంటారు. అయితే 1,187 పడకలున్న ఈ ఆస్పత్రిలో రోగుల ప్రవేశం నుంచే కష్టాలు మొదలవుతాయి. ఓపీ టికెట్ కోసం గంటలకొద్దీ క్యూలో నిలబడాలి. ఆ తర్వాత వైద్యుడిని కలవడానికి మరో గంటకు పైగా నిరీక్షించక తప్పదు. క్యాజువాలిటీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి, చిన్నపిల్లల వార్డులతో సహా ప్రతి విభాగంలోనూ రోగుల బారులు తీరిన దృశ్యాలు సర్వసాధారణం. వైద్యుల కొరత ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. మందుల కొరతతో మరో గండం గతంలో 30 రోజులకు సరిపడా మందులు ఇచ్చే చోట.. నేడు కేవలం వారానికి సరిపడా మందులతోనే సరిపెడుతున్నారు. దీంతో రోగులు ప్రతి వారం మందుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. ఫార్మసీ కౌంటర్లలో మొత్తం 600 రకాల మందులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 500 రకాలే అందుబాటులో ఉన్నాయి. వైద్యులు రాసిన చీటీలో ఆరు మందులుంటే.. మూడు మాత్రమే ఇచ్చి మిగతావి బయట కొనుక్కోవాలని సిబ్బంది చెబుతున్నారు. ఉచిత వైద్యం కోసం వచ్చే పేదలకు ఇది పెను భారంగా మారింది. కొరవడిన పర్యవేక్షణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్పత్రిలో పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని, వైద్య సేవలు క్షీణించాయని రోగులు ఆరోపిస్తున్నారు. గతంలో అందిన స్థాయిలో కూడా ఇప్పుడు సేవలు అందడం లేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని వాపోతున్నారు. ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వాల్సిన ఆస్పత్రే ఇలా రోగగ్రస్తంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కేజీహెచ్లో ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ట్యాప్లు లేని కుళాయిలు, తలుపుల్లేని మరుగుదొడ్లు పారిశుధ్యం అస్తవ్యస్తం ఆస్పత్రిలోని చాలా వార్డులు అపరిశుభ్రతకు అడ్డాగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన చెత్తతో దుర్గంధం వెదజల్లుతోంది. ఇక మరుగుదొడ్ల పరిస్థితి మరింత అధ్వానం. చాలా కుళాయిలకు ట్యాప్లు లేకపోవడంతో నీరు నిరంతరం వృధాగా పోతోంది. దీంతో రోగులు, వారి సహాయకులు వాటర్ బాటిళ్లతో వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కొన్నిచోట్ల రోగులు కుక్కలతో కలిసి ఉండాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. పర్యవేక్షణ లోపం కారణంగా పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది. పనిచేయని పరికరాలు కేజీహెచ్లో వైద్య పరికరాల లభ్యత కూడా పెద్ద సమస్యగా మారింది. రోగులను ల్యాబ్కు, సీటీ స్కాన్, ఎక్స్రే వంటి పరీక్షలకు తీసుకెళ్లడానికి వీల్చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో రోగుల బంధువులే వారిని మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఆస్పత్రిలోని 217 ఏసీలకు గాను 90 మరమ్మతులకు గురయ్యాయి. కీలకమైన ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ (ఏబీజీ) పరీక్షలకు అవసరమైన రీజెంట్స్ లిక్విడ్ లేకపోవడంతో గత కొద్ది రోజులుగా 16 మిషన్లు మూలనపడ్డాయి. దీంతో కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 26కిపైగా విభాగాలున్నాయి. పెరుగుతున్న రోగులు సంఖ్యకు అనుగుణంగా వార్డులు, పడకల సంఖ్య పెంచాల్సి ఉండగా ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. -
జూలో కూనల కనువిందు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల సంతానోత్పత్తి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మూడు నెలల కిందట పలు జంతువులు, పక్షులు పిల్లలకు జన్మనివ్వగా, తాజాగా మరికొన్ని వన్యప్రాణులకు పిల్లలు పుట్టాయి. ఇటీవల జూలో రెండు చౌసింగాలు (ఒక మగ, ఒక ఆడ), ఒక మగ కృష్ణ జింక పిల్ల, రెండు బ్లూ గోల్డ్ మకావ్ పక్షులు జన్మించాయని జూ క్యూరేటర్ జి. మంగమ్మ ఆదివారం తెలిపారు. తల్లీపిల్లలు అన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం చౌసింగా, కృష్ణ జింక పిల్లలు వాటి ఎన్క్లోజర్లలో తల్లుల చెంత ఉత్సాహంగా ఆడుకుంటూ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. కృష్ణ జింక పిల్ల -
వినాయక ఉత్సవాల పొడిగింపు
జగదాంబ: పూర్ణామార్కెట్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ దర్శనాలను నిర్వాహకులు మరో ఆరు రోజుల పాటు పొడిగించడం చర్చనీయాంశంగా మారింది. వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహాలను చంద్రగ్రహణం లోపే నిమజ్జనం చేయాలని పండితులు సూచించిన సంగతి తెలిసిందే. అయితే పూర్ణామార్కెట్లో ఉత్సవాలను పొడిగించడంపై భక్తులు, ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రగ్రహణం తర్వాత నిమజ్జనాన్ని చేయడం సంప్రదాయానికి విరుద్ధమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పొడిగింపు కారణంగా మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, రహదారి మధ్యలో భారీ వేదికలు, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వినియోగదారులు, వాహనచోదకులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నార ని పలువురు వాపోతున్నారు. పండగ సంప్రదాయాలను గౌరవిస్తూనే, ప్రజా సౌకర్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని.. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ముగిసిన ఫుడ్ ఫెస్టివల్
ఆరిలోవ: బీచ్రోడ్డులోని ఎంజీఎం గ్రౌండ్స్లో మూడు రోజుల పాటు జరిగిన ఫుడ్ ఫెస్టివల్ ఆదివారంతో ముగిసింది. ఏపీ టూరిజం, హెచ్ఆర్ఏఏపీ, టూరిజం అండ్ ట్రావెల్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ, వీహెచ్ఎంఏ, ఈఎంఏ, ఏపీ చాంబర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 5న ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఫెస్టివల్లో భాగంగా 45కు పైగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా, మూడు రోజుల్లో వేలాది మంది సందర్శించినట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చే ఏడాది 2026లో మరింత ఎక్కువ స్టాల్స్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, టూరిజం శాఖ అధికారులు జె.మాధవి, జగదీష్ పాల్గొన్నారు. -
● చంద్రగ్రహణం ఎఫెక్ట్ మూతపడిన ఆలయాలు
సింహాచలం/కొమ్మాది/డాబాగార్డెన్స్/మహారాణిపేట: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం నగరంలోని ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. భక్తులతో నిత్యం రద్దీగా ఉండే ఆలయ ప్రాంగణాలు నిర్మానుష్యంగా మారాయి. గ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ పూజలు నిర్వహించి, సోమవారం తిరిగి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. వెలవెలబోయిన సింహగిరి చంద్రగ్రహణం ప్రభావం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంపై స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఆదివారం భక్తులతో కిటకిటలాడే సింహగిరి పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. ఆదివారం ఉదయం 11.30 గంటల వరకే భక్తులకు అప్పన్న దర్శనాన్ని కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2.25 గంటలకు అర్చకులు ఆలయ కవాట బంధనం (తలుపులు మూసివేత) చేశారు. దీంతో మాడ వీధులు, దర్శన క్యూలు, ప్రసాదాల విక్రయశాలలు, కేశఖండనశాల, గంగధార మార్గం, ఘాట్ రోడ్డు, బస్టాండ్ వంటి ప్రాంతాలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. అంతకుముందు స్వామికి రాజభోగం, మధ్యాహ్నం నిర్వహించాల్సిన పవళింపుసేవ, పౌర్ణమి తిరువీధి, రాత్రి ఆరాధన, పవళింపు సేవలను వరసగా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి, గ్రహణ సంప్రోక్షణ పూజలు నిర్వహిస్తారు. అనంతరం స్వామికి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపి ఉదయం 8 గంటల నుంచి భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పిస్తామని ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు. మూతపడిన ఇతర ప్రధాన ఆలయాలు అలాగే బురుజుపేటలోని శ్రీ కనకమహాలక్ష్మి ఆలయాన్ని మధ్యాహ్నం 2 గంటలకు మూసివేశారు. సోమవారం ఉదయం 5 గంటలకు సంప్రోక్షణ పూజలు చేసి, ఉదయం 7 గంటల నుంచి దర్శనాలు పునఃప్రారంభిస్తామని ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. ఆశీలమెట్టలోని సంపత్ వినాయగర్ ఆయాన్ని ఉదయం 11 గంటలకే మూసివేశారు. సోమవారం ఉదయం 5 గంటలకు మహా సంప్రోక్షణ జరిపి, 7 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతిస్తామని ఈవో డి.వి.వి.ప్రసాదరావు తెలిపారు. రుషికొండలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి (టీటీడీ) ఆలయాన్ని మధ్యాహ్నం 1.20 గంటలకు మూసివేశారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు తెలిపారు. అన్నంరాజునగర్లోని శ్రీ అష్టలక్ష్మీ ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు సంప్రోక్షణ పూజల తర్వాత భక్తులను అనుమతిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు చామర్తి శ్రీధర స్వామి తెలిపారు. అలాగే అంబికాబాగ్లోని సీతారామచంద్రస్వామి ఆలయం, ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ఆలయం, జగన్నాథస్వామి ఆలయం, దుర్గాలమ్మ ఆలయం తదితర ఆలయాలన్నీ మూసివేసి, సోమవారం ఉదయం సంప్రోక్షణ కార్యక్రమాల తర్వాత తిరిగి తెరవనున్నట్లు అధికారులు వెల్లడించారు. -
మిత్రుల్ని మింగేసిన మేహాద్రి
పెందుర్తి: కళాశాలకు సెలవు కావడంతో కాలక్షేపం కోసం మేహాద్రిగెడ్డ రిజర్వాయర్కు ఆదివారం వెళ్లిన ఇద్దరు మిత్రులు ప్రమాదశాత్తు నీట మునిగి మృత్యువాత పడ్డారు. నీటిలో పడిన చెప్పును తీసుకునే క్రమంలో ఒకరిని కాపాడబోయి మరొకరు అశువులు బాసిన ఘటన పెందుర్తి, చినముషిడివాడ ప్రాంతాల్లో తీవ్ర విషాదం నిపింది. పెందుర్తి జేన్ఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి చెందిన బల్లంకి శేఖర్(18), చినముషిడివాడ కాంతినగర్ సమీపంలోని ఆక్సిజన్ కాలనీకి చెందిన చెందిన యాడాడ లక్ష్మణ్కుమార్(18)లు స్నేహితులు. ఆదివారం ఉదయం సోదరుడు బల్లంకి వాసుతో కలిసి శేఖర్, లక్ష్మణ్కుమార్ మేహాద్రిగెడ్డకు వెళ్లారు. లక్ష్మణ్ మేహాద్రి ఒడ్డున కూర్చుని చెప్పులు నీటిలోకి విసురుతూ ఆడుతున్నాడు. అది లోపలికి వెళ్లడంతో దాన్ని తీసేందుకు నీటిలోకి దిగిన శేఖర్ నాచు కారణంగా జారి, నీటిలో పడిపోయాడు. అతడ్ని కాపాడే ప్రయత్నంలో లక్ష్మణ్ కూడా జారిపోయాడు. అక్కడే ఉన్న శేఖర్ అన్నయ్య బల్లంకి వాసు వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ అతడు కూడా నీటిలో మునిగిపోయాడు. ఈ ఘటనను చూసిన సమీపంలోని ఓ వ్యక్తి వీరిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే వాసు చెయ్యి జారిపోవడంతో శేఖర్, లక్ష్మణ్ రిజర్వాయర్లో మునిగిపోయారు. వాసు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ కె.వి. సతీష్కుమార్ హుటాహుటిన తన బృందంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గాలించారు. గల్లంతైన శేఖర్, లక్ష్మణ్ల ఆచూకీ వెంటనే లభించినప్పటికీ అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. కుటుంబాల్లో తీరని విషాదం యాడాడ సూరిబాబు, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. సూరిబాబు ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా, పెద్దకుమారుడు మన్మధరావు బిగ్ బాస్కెట్లో పనిచేస్తూ, తమ్ముడు లక్ష్మణ్ను చదివిస్తున్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో నివాసం ఉంటున్న బల్లంకి మహాలక్ష్మి భర్త బంగార్రాజు మరణించాడు. ఇద్దరు కుమారుల(వాసు, శేఖర్)తో కలిసి స్థానికంగా చిన్న పాన్షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. చేతికి అంది వస్తారనుకున్న బిడ్డలు మరణించడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. అత్యంత ప్రమాదకరమైన మేహాద్రి రిజర్వాయర్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా, తగిన పర్యవేక్షణ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పెందుర్తి, చినముషిడివాడ ప్రాంతాల్లో విషాదం -
నంబరు ప్లేటు మార్చి కోళ్ల వ్యర్థాల తరలింపు
సింహాచలం: వాహనం నంబర్ ప్లేట్లను మార్చి కోళ్ల వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న ఐదు వాహనాలను జీవీఎంసీ అధికారులు ఆదివారం గుర్తించారు. పాత అడవివరంలో తనిఖీలు నిర్వహించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోళ్ల వ్యర్థాల రవాణాకు జీవీఎంసీ కొన్ని ప్రత్యేక వాహనాలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. అయితే అనుమతి పొందిన వాహనాల నంబర్ ప్లేట్లను అక్రమంగా ఇతర వాహనాలకు మార్చి రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో భాగంగా జీవీఎంసీ వెటర్నరీ అధికారి వాసు, జోన్–8 శానిటరీ ఇన్స్పెక్టర్ రమేష్, సిబ్బంది ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అసలు నంబర్ ప్లేటుపై మరో నంబర్ స్టిక్కర్ అతికించి ఉన్నట్లు కనుగొన్నారు. విచారణలో అసలు వాహనం రిపేరుకు రావడంతో దాని నంబర్ను మరో వాహనానికి అతికించినట్లు డ్రైవర్ తెలిపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు మొత్తం ఐదు వాహనాలను తనిఖీ చేశారు. వాటిలో రెండు వాహనాలకు మాత్రమే అనుమతులు ఉండగా, మిగిలిన మూడు వాహనాలపై అనుమానం రావడంతో వాటితో సహా మొత్తం ఐదు వాహనాలను ఆరిలోవలోని డంపింగ్ యార్డుకు తరలించి సీజ్ చేశారు. ఇంకా ఎన్ని అనధికారిక వాహనాలు తిరుగుతున్నాయో గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐదు వాహనాలను సీజ్ చేసిన జీవీఎంసీ అధికారులు -
కూటమి కన్ను
బీచ్ శాండ్పైసాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నదీ ఇసుక, నీటి వనరులను దోచుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు సాగర తీరంపై దృష్టి సారించింది. బీచ్ శాండ్ మైనింగ్ పేరుతో భీమిలి తీరంలో భారీగా ఖనిజాల అక్రమ రవాణాకు పాల్పడేందుకు కుట్ర పన్నుతోంది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో జిల్లాలోని భీమిలి ప్రాంతంలో 90.15 హెక్టార్ల సముద్ర తీరాన్ని ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీని ద్వారా విలువైన ఖనిజాలు దోపిడీకి గురవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ జేబులు నింపుకోవడానికి ఇలాంటి విధ్వంసకర కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే మైనింగ్ కార్యకలాపాలకు టెండర్లు ఆహ్వానిస్తోంది. మద్రాస్లో మైనింగ్ పేరుతో విధ్వంసం గతంలో మద్రాసులో బీచ్ శాండ్ మైనింగ్ పేరుతో ప్రైవేటు సంస్థలు సముద్ర తీరాన్ని ధ్వంసం చేసి, దేశ భద్రతకు అవసరమైన ఖనిజాలను అక్రమంగా తరలించాయ. ఆ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు, మద్రాసు హైకోర్టు తక్షణమే మైనింగ్ను నిలిపివేయాలని ఆదేశించి, ప్రభుత్వాలకు పర్యావరణ పరిరక్షణపై హెచ్చరికలు జారీ చేసింది. ఈ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా, ఏపీ ప్రభుత్వం తమ స్వలాభం కోసం పర్యావరణాన్ని పణంగా పెడుతోంది. మోనజైట్ పేరుతో దోపిడీకి కుట్ర ఈ ఖనిజాల్లో అణుధార్మిక శక్తి కలిగిన మోనజైట్ ముఖ్యమైనది. దీనిని అణు విద్యుత్ అభివృద్ధికి ఇంధన వనరుగా వినియోగిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన చట్ట సవరణల మేరకు, అణుధార్మికత పరిమితంగా ఉన్న ఖనిజాలను విక్రయించుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకొని మోనజైట్ పేరుతో భారలోహాలను పెద్ద ఎత్తున అక్రమంగా తరలించేందుకు కుట్ర జరుగుతోందని, దీనికి ప్రభుత్వం సహకరిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మైనింగ్ వల్ల పర్యావరణానికి, దేశ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్కు బీచ్ మైనింగ్ కట్టబెట్టడం దారుణం శ్రీకాకుళం, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని 19 ప్రాంతాల్లో బీచ్ శాండ్ మైనింగ్ కోసం ప్రైవేట్ సంస్థలకు లీజుకివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరం. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలి. తమిళనాడులో బీచ్ శాండ్ మైనింగ్ పేరుతో ప్రైవేట్ సంస్థలు మోనజైట్ వంటి విలువైన ఖనిజాలను అక్రమంగా తరలించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అణు అభివృద్ధిలో మూడో దశకు ఇంధన వనరుగా ఉపయోగపడే అత్యంత కీలకమైన మోనజైట్ను కోల్పోవడం దేశ భద్రతకు పెను ముప్పుగా పరిణమిస్తుంది. అటమిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ (డీఏఈ) ఇప్పటికే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వానికి బీచ్ శాండ్ మైనింగ్కు అనుమతులు ఇవ్వవద్దని లేఖ కూడా రాసింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై దృష్టి సారించాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి -
సంద్రంపై మెరుపుల నృత్యం
సముద్రపుటంచున నిలబడి చూస్తే, ఆకాశం తన మేఘపు మేలి ముసుగులో కళ్లు మూసుకుంది. అలల వెచ్చని స్పర్శకు పులకించిన సంద్రం... ఆకాశం కళ్లు తెరిచే క్షణం కోసం వేచి చూసింది. అంతలోనే ఉరుముల శబ్దాన్ని చీల్చుకుంటూ ఓ మెరుపు పుట్టింది. అది ఆకాశం నుంచి సంద్రం వైపు దూకింది. ఆ మెరపు స్పర్శకు సంద్రం మురిసిపోయింది. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనంతమైన మెరుపులు ఆకాశం నుంచి సముద్రంలో దూకాయి. అప్పుడు ఉరుముల సవ్వడికి భూమి పరవశించిపోయింది. సముద్రంలో తళతళ మెరిసిన మెరుపులు, వర్షపు చుక్కల జల్లుతో ఆకాశం సంద్రంపై ప్రేమను కురిపించింది. ఆ అద్భుత దృశ్యానికి విశాఖ ఆర్కే బీచ్ వేదికై ంది. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
సింహాచలంపై మెట్లమార్గం పునరుద్ధరణ పనుల ప్రారంభం
సింహాచలం: గత చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ప్రదేశంలో సింహాచలం దేవస్థానం అధికారులు మెట్లమార్గం పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్రసాద్ పథకం పనుల్లో భాగంగా నిర్మించిన గోడ కూలి ప్రమాదం జరగడంతో అప్పటి నుండి ఈ మెట్ల మార్గాన్ని మూసివేశారు. గతంలో ఉన్న ప్రణాళికకు విరుద్ధంగా మెట్ల మార్గాన్ని నిర్మించడంతోనే ప్రమాదం జరిగిందని వైదిక వర్గాలు అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న జరగనున్న విజయదశమి ఉత్సవంలో భాగంగా స్వామివారిని పల్లకిలో కొండ దిగువకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ మెట్ల నిర్మాణం అత్యవసరమని అధికారులు భావించారు. పర్యాటక శాఖ నుంచి స్పందన లేకపోవడంతో, దేవస్థానం సొంతంగా రూ.18 లక్షల వ్యయంతో పనులకు టెండర్ పిలిచి, గడిచిన రెండు రోజుల క్రితం పనులను ప్రారంభించారు. ప్రమాదం జరిగిన చోట గతంలో ఉన్న విధంగానే పకడ్బందీగా మెట్ల మార్గాన్ని నిర్మించి, విజయదశమి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని దేవస్థానం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. -
‘స్మార్ట్’లో తప్పుల తడక
మహారాణిపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకలతో నిండిపోయాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి పంపిణీ ప్రారంభమైన ఈ కార్డుల్లో చిరునామాలు, పేర్లలో అక్షర దోషాలు, వయస్సులో తేడాలు, పిల్లల పేర్లు నమోదు కాకపోవడం వంటి తప్పులు దొర్లాయి. లబ్ధిదారుల్లో ఆందోళన స్మార్ట్ రేషన్ కార్డులు కేవలం నిత్యావసరాలకే కాకుండా, ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ఆధారం కావడంతో, ఈ కార్డుల్లోని తప్పులు ప్రజలకు సమస్యగా మారాయి. లబ్ధిదారుల మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, రేషన్ కార్డుకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. వివరాలు సక్రమంగా లేకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కార్డుల్లోని తప్పులను ఎలా సరిదిద్దాలన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో కార్డుదారులు అయోమయంలో ఉన్నారు. కంచరపాలెం వారికి వేపగుంట, పెందుర్తి వంటి ప్రాంతాల పేర్లు నమోదవడం, పిల్లల పేర్లు లేకపోవడం వంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ తప్పులను వెంటనే సవరించాలని కార్డుదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లాలో 5,17,149 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధం జిల్లాలో మొత్తం 5,17,149 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని డీఎస్వో భాస్కరరావు తెలిపారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ జరుగుతోంది. కార్డులు అందుకోని వారు సంబంధిత రేషన్ డిపోలకు వెళ్లి వేలిముద్రలు వేసి కార్డులు పొందాలని ఆయన సూచించారు. వలస వెళ్లినవారు కూడా తమ నమోదిత రేషన్ షాపు వద్దే కార్డు తీసుకోవాలని, పోర్టబులిటీ సౌకర్యం ఇప్పటికే అందుబాటులో ఉందని వివరించారు. -
రజకులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు
బీచ్రోడ్డు : రజకులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు కూటమి ప్రభుత్వంలోనే కలుగుతాయని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్రలు పేర్కొన్నారు. ఆదివారం వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన రజకుల ఆకాంక్ష సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ, రజకుల సేవలు సమాజానికి ఎంతో ముఖ్యమని, అయితే వారి జీవన పరిస్థితులు ఇంకా మెరుగుపడాల్సి ఉందని అన్నారు. కుల వృత్తులను రిజర్వ్ చేయాలని, హోటళ్లు, టూరిస్ట్ రిసార్టులలో దోబీ పనిని హక్కుగా కల్పించడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని సూచించారు. రుణాల మంజూరులో ప్రత్యేక కోటా ఇవ్వాలని, అధికారులు వారికి సహకరించాలని కోరారు. త్వరలోనే బీసీ రక్షణ చట్టం తీసుకువస్తామని, గత ప్రభుత్వం తగ్గించిన 34 శాతం రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అంతకు ముందు సంత్ గాడ్గే, మావిడాల మాచయ్య, వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి అతిథులంతా గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, ఏపీ రజక సంక్షేమ కార్పొరేషన్ ఛైర్పర్సన్ సి. సావిత్రి, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు, ఏపీ గ్రోవర్స్ ఆయిల్స్ సీడ్స్ – కార్పొరేషన్ చైర్మన్ గండిబాబ్జీ, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు పార్థసారఽథి, సత్యకుమార్, కొల్లు రవీంద్ర -
అనకాపల్లి: ఖైదీల పరారీ కేసు.. వెలుగులోకి కీలక అంశాలు
సాక్షి, అనకాపల్లి: చోడవరం జైలు నుంచి రిమాండ్ ఖైదీలు పరారీ కేసులో కీలక అంశాలు వెలుగులోకి కీలక వస్తున్నాయి. జైలు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఖైదీలు పరారీ అయినట్టు అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా వెల్లడించారు. ఖైదీలు తప్పించుకోవడానికి సహాయం చేసిన మరో ఖైదీపై కేసు నమోదు చేశారు.చోడవరం సబ్ జైలు నుంచి పరారైన ఖైదీలను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు ఖైదీలను విశాఖలో గుర్తించిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరికి సహకరించిన రిమాండ్ ఖైదీ ఏకస్వామిపై కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. జైలు సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు విచారణ చేపట్టారు.సినీ ఫక్కీలో వార్డెన్పై దాడి చేసి.. సబ్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారైన సంగతి తెలిసిందే. ఐదుగురు జైలు వార్డర్లు, రక్షణ గేట్లు తప్పించుకుని వారు పారిపోయారు. పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో పంచాయతీ సెక్రటరీ నక్కా రవికుమార్, చోరీ కేసులో ఖైదీలుగా అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలులో ఉన్నారు. వీరిద్దర్నీ జైలులో ఖైదీలకు వంట చేయడానికి వినియోగిస్తున్నారు. రోజూలాగే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సబ్ జైలులో వంట చేసేందుకు వీరిని జైలు గదిలోంచి బయటకు తీసుకొచ్చారు. వంటకు ఉపక్రమించే సమయంలో ముగ్గురు వార్డర్లు లోపల, ఒక వార్డరు మెయిన్ గేటు వద్ద సబ్ జైలర్ తన గదిలో విధి నిర్వహణలో ఉన్నారు.ఆ సమయంలో నక్కా రవికుమార్ మెయిన్ గేటుకు లోపల గ్రిల్ గేటుకు మధ్య విధి నిర్వహణలో ఉన్న వార్డర్ వీర్రాజుపై సుత్తితో దాడి చేశాడు. అనంతరం ఆయన జేబులో ఉన్న తాళాలు లాక్కొని.. మెయిన్ గేటు తాళం తీసి పారిపోతుండటం చూసి, మరో ఖైదీ రాము కూడా పరారయ్యాడు. పారిపోతున్న వారిని పట్టుకునేందుకు జైలు వార్డర్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణ మీదుగా ఖైదీ లు మెయిన్ రోడ్డుకు చేరుకుని పరారయ్యారు. అనంతగిరి మండలం బోకూరు పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తూ ఈ ఏడాది ఏప్రిల్లో పింఛన్ డబ్బులు కాజేసిన కేసులో రవికుమార్ కు పాడేరు కోర్టు రిమాండ్ విధించించింది. బెజవాడ రాము ఈ ఏడాది జులై 23వ తేదీన మాడుగులలో దొంగతనం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. -
హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం.. పెట్రోలియం ట్యాంక్పై పిడుగు
సాక్షి, విశాఖపట్నం: హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం జరిగింది. పెట్రోలియం ట్యాంక్పై పడిన పిడుగు పడింది. 20 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంటలు అదుపు చేయడంతో పాటు మరొక ఈతనల్ ప్లాంట్కి మంటలు వ్యాపించకుండా అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
ఇదేనా పాలనంటే?.. చంద్రబాబు సర్కార్పై బొత్స ఫైర్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్పరం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దురదృష్టకరమంటూ బొత్స దుయ్యబట్టారు.పేద ప్రజల ఆరోగ్యం కోసం దివంగత మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారని.. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వైఎస్సార్పీ ప్రభుత్వం చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు సర్కార్ విరమించుకోవాలన్నారు.మెడికల్ కాలేజీలప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని బొత్స అన్నారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడదు. కూటమి పాలనలో పంటల సాగు తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఎప్పుడూ యూరియా సమస్య రాలేదు. కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలుపడుతున్నారు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.‘‘దోపిడీ కోసం ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటు వారికి కట్టబెట్టడం దుర్మార్గం. చంద్రబాబు ఎప్పుడూ ప్రైవేట్ మనిషే.. గతంలో కూడా ఇలాంటి నిర్ణయాలు చేశారు. కట్టిన కాలేజీలను కూడా ప్రైవేట్కు ఇవ్వడం.. మెడికల్ సీట్లు తిరస్కరించిన ప్రభుత్వం ఇదే. పేద ప్రజల కోసం కార్పొరేట్ వైద్యం ఉండాలని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్సార్.. ఈ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు...చంద్రబాబు ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. నిధులు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆసుప్రతుల్లో పేద వాడికి వైద్యం అందడం లేదు. రూ. 2 లక్షల కోట్లు అప్పు చేశారు. అందులో రూ. 6 వేల కోట్లు ప్రజా ఆరోగ్యానికి వెచ్చించలేరా?. యూరియా సమస్య కోసం మాట్లాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. యూరియా సమస్య ఎందుకు వచ్చిందని సీఎం ఆలోచన చేయాలి. అది మానేసి తిరిగి అడిగిన వారిపై చర్యలు తీసుంటారట. ఎవరి మీద చర్యలు తీసుకుంటావ్?..మంత్రులు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. యూరియా కోసం లైన్లో నిలబడితే బఫె భోజనంతో పోల్చుతున్నారు. మీ మాటలు ప్రజలు గమనిస్తున్నారు. యూరియా సమస్యకు పరిష్కారం చూపించండి. 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన తెలిపి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. ఇప్పటికే నెల రోజులుగా సమస్య చూస్తున్నాం. యూరియా వినియోగం, డిమాండ్, అందుబాటులో ఉన్న లెక్కలపై స్పష్టత ఇవ్వండి. రైతులకు భరోసా ఇవ్వండి. అది మానేసి ఎదురుదాడి చేయడం ఏంటి..?..అడిగితే జైల్లో పెడతాం అంటున్నారు.. రేపనే రోజు ఉండదా..?. తప్పు చేసిన వారిని క్షమించాల్సిన పనిలేదు. రుషికొండ భవనాల్లో నిజంగా పెచ్చులు ఊడిపోతే కాంట్రాక్టర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు. రుషికొండ కాంట్రాక్టర్కు డబ్బులు ఎవరు ఇచ్చారు?. సంపద సృష్టి అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడమా..?. ఏ కాలేజీ ఎవరికీ ఇవ్వాలని అనుకున్నారో పేర్లతో సహా త్వరలో చెప్తా. దేశంలోని బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా?. ఇక్కడే ఎందుకు వస్తుంది..?. ఏపీలో కూడా బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వమే కదా ఇక్కడి ప్రజలు ఏం పాపం చేశారు. ఎందుకు యూరియా అందుబాటులో లేదు....స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వం నిర్వాకం వలన పోరాటం తప్పడం లేదు. ప్లాంట్ రక్షణ కోసం గత్యంతరం లేక ప్రజా సంఘాలతో పోరాటం చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని ప్రధాని, లేదా ఉక్కు మంత్రితో చెప్పించండి. మీకు జై కొడతాం.. పార్లమెంట్లో అయినా చెప్పించండి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అందరి సమస్య. ఈనెల 12న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు.. నేను వెళ్తున్నా.. టీడీపీ వాళ్ళు అక్కడికి వచ్చి ప్రైవేటీకరణ జరగదని చెప్పాలి. ప్రభుత్వ నియంత నిర్ణయాలపై శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా’’ అని బొత్స చెప్పారు.అశోక్ గజపతి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ..రుషికొండ భవనాలపై అశోక్ గజపతి వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇస్తూ.. రుషికొండ భవనాలను మెంటల్ హాస్పిటల్ చేయాలని అన్నారంటే.. అశోక్ గజపతి రాజు మానసిక పరిస్థితి ఏమిటో అర్ధమవుతుందన్నారు. అలాంటి వాళ్లను మెంటల్ హాస్పటల్ లో పెట్టాలన్న బొత్స.. ఆయనకు అహంకారం పుట్టుకతో వచ్చిందన్నారు. -
ఈరోజు కాసేపు కనిపించను ‘మామా!’
హలో మామా.. నేను మీ చందమామను. ఎలా ఉన్నారు.. మీరు బాగానే ఉంటారు. నేనైతే కాస్తా డల్గా ఉన్నాను. ఎందుకో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రతి పౌర్ణమికీ వెలుగులు పంచే నేను ఈరోజు ఆ వెన్నెల అందివ్వలేననే బాధతో ఉన్నాను. ఈరోజు రాత్రికి మీకు కనిపించను. ఎందుకంటే చంద్రగ్రహణం. భానుడుకి నాకు మధ్యలో మీ భూ గ్రహం వస్తోంది కదా. అన్నట్లు ఇది అత్యంత అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం. అది చెబుదామనే వచ్చాను.చంద్రగ్రహణాలు మూడు రకాలుంటాయి. సంపూర్ణ , పాక్షిక, ఉపచ్ఛాయ చంద్రగ్రహణాలు. ఈ ఏడాదిలో రెండో సంపూర్ణ చంద్రగ్రహణం నేడు ఏర్పడుతోంది. ఈ గ్రహణం సుమారు 100 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మామా. చాలా చంద్ర గ్రహణాలు ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే పాక్షికంగా కనిపిస్తాయి. కానీ ఈసారి 7 బిలియన్లకు పైగా ప్రజలకు కనిపిస్తుందంట. ఈ తరహా ఖగోళ సంఘటన చాలా అరుదు అని శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు మామా. మళ్లీ ఎన్నో దశాబ్దాల తర్వాత కానీ ఇలాంటి అద్భుతం కనిపించదంటున్నారు. అందుకే మీరు కూడా ఓ లుక్కెయ్యండి మామా.అంతేకాదు.. ఈ సమయంలో నేను రుధిర వర్ణంలోకి మారుతానంట. నాకు తెలియదు. మీలాంటి సైంటిస్టులు చెబితే మీకు చెప్తున్నాను. ఎందుకంటే.. నేను అద్దం చూడలేను కదా. శాంపిల్గా ఈరోజు కూడా మీకు లైట్ బ్లడ్ కలర్లో కనిపిస్తున్నాను కదా. రేపు మరింత ఎరుపెక్కుతానంట. ఎందుకలా ఎరుపెక్కుతానో మీకు తెలుసా.. మామా..? చెప్తాను వినండి.గ్రహణం సమయంలో నేను భూమి నీడ(ఉంబ్రా)లో ఉంటాను. దీంతో నేరుగా సూర్యకాంతి నన్ను చేరుకోదు. సూర్యకాంతిలో తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న బ్లూ లైట్ చెల్లాచెదురైపోతుంది. కానీ ఎరుపు, ఆరెంజ్ రంగుల కాంతులు మాత్రం భూ వాతావరణంలోకి చొచ్చుకొని నా ఉపరితలానికి చేరుకుంటాయి. అందుకే బ్లడ్ మూన్లా కనిపిస్తానంట మామా.భారత కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 9.58 గంటలకు గ్రహణం ప్రారంభమై సెప్టెంబర్ 8 తెల్లవారుజామున 1.26 గంటలకు ముగుస్తుంది మామా. కానీ ఈ అరుదైన బ్లడ్ మూన్ దృశ్యం మాత్రం రాత్రి 11.00 నుంచి 12.22 గంటల మధ్య స్పష్టంగా కనిపిస్తుందంట. చూసి చెప్పండి.. నేను ఎలా ఉన్నానో..!మీ..మామా కాని మామ.. చందమామ.!–సాక్షి, విశాఖపట్నం -
కంబాలకొండలో నిలిచిపోయిన బోటింగ్
ఆరిలోవ: ప్రముఖ పర్యాటక కేంద్రం కంబాలకొండ ఎకోటూరిజం పార్కు ఇప్పుడు కళ తప్పింది. పర్యాటకులకు ఎంతో ఆనందాన్నిచ్చే బోటింగ్ సౌకర్యం నిలిచిపోవడంతో సందర్శకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సాధారణంగా దట్టమైన కొండల నుంచి వచ్చే వర్షపు నీటితో నిండి ఉండే డేగల గెడ్డగా పిలవబడే ఈ కొలను.. ఈ ఏడాది సరిపడినంత వర్షాలు లేకపోవడంతో పూర్తిగా అడుగంటిపోయింది. అడుగు భాగంలో అక్కడక్కడ మట్టి దిబ్బలు స్పష్టంగా కనిపిస్తుండటంతో బోటింగ్కు వీలుపడటం లేదు. దీంతో పార్కులో ఉన్న కయాక్స్, ఫ్యామిలీ బోట్లు, ఇతర బోట్లు అన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. దాదాపు మూడు నెలల నుంచి పర్యాటకులు ఇక్కడ బోటింగ్ చేసే అవకాశం కోల్పోయారు. గతంలో ఆగస్టు నెలలో ఈ కొలను నిండి ప్రవహించేది. అయితే ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కొలనులో నీరు చేరలేదు. -
‘కమిటీ కుర్రాడి’కి సైమా అవార్డు
బెస్ట్ డెబ్యూ హీరోగా సందీప్ సరోజ్ కొమ్మాది: నగరంలోని మాధవధారకు చెందిన యువ నటుడు పేడాడ సందీప్ సరోజ్ అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని పొందాడు. దుబాయ్లో అట్టహాసంగా జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా–2025) వేడుకలో.. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో కనబరిచిన అద్భుత నటనకు గానూ బెస్ట్ డెబ్యూ హీరో అవా ర్డును అందుకున్నాడు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం కమర్షియల్గా విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రంలో తన సహజమైన నటనతో సందీప్ ప్రేక్షకుల మన్ననలు పొందారు. ప్రతిష్టాత్మక సైమా అవార్డుల వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి ప్రముఖులు పాల్గొనగా, వారి సమక్షంలో సందీప్ ఈ అవార్డును స్వీకరించడం విశేషం. ఈ పురస్కారంపై సందీప్ సరోజ్ స్పందిస్తూ.. ‘తొలి సినిమాకే ఇంత పెద్ద గౌరవం దక్కడం నా బాధ్యతను మరింత పెంచింది. ఈ విజయం నా ఒక్కడిది కాదు. నాతో పాటు కష్టపడిన 11 మంది కుర్రాళ్లు, చిత్ర దర్శకుడు వంశీ, నిర్మాత నిహారిక, సాంకేతిక నిపుణులందరి కృషి ఫలితం ఇది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు. సందీప్కు అవార్డు రావడం పట్ల అతని తల్లిదండ్రులు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, నర్సింగరావు ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమారుడు సినీ రంగంలో తొలి అడుగులోనే విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. -
మళ్లీ జగన్ను సీఎం చేయడమే లక్ష్యం
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం 15 నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి పేర్కొన్నారు. శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జోన్–1 మహిళ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అలాగే మహిళా విభాగాన్ని సంస్థాగతంగా పటిష్టం చేయాలని, జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోడానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తీర్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలను, ముఖ్యంగా మహిళలను నిట్టనిలువుగా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని చెప్పారు. ఎన్నికలకు ముందు అప్పటి సీఎం జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తానని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఎప్పుడూ చూడని విధంగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. కేంద్రం పూర్తి స్థాయిలో యూరియాను సరఫరా చేసినప్పటికీ వాటిని టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ తరలించారని ఆరోపించారు. ప్రజలకు రూ.81 వేల కోట్ల బకాయిలు కూటమి ప్రభుత్వం రైతులకు మొదటి ఏడాది పెట్టుబడి సాయం ఎగ్గొట్టి వెన్నుపోటు పొడిచిందన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఇస్తానని చెప్పి ఒక్కో మహిళకు రూ.22,500 బాకీ పడిందని తెలిపారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు కింద ఇప్పటి వరకు రూ.45 వేలు బకాయి ఉందన్నారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వకపోగా కొత్తగా ఒక్కరికి పింఛను గానీ, రేషన్ కార్డు గానీ మంజూరు చేయలేదన్నారు. పైగా రాష్ట్రంలో 3 లక్షల మంది అర్హులైన వారి పెన్షన్ తొలగించిందని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి 16 రకాల బస్సులు ఉంటే.. కేవలం 5 రకాల బస్సుల్లో ప్రయాణికులకు అవకాశం కల్పించారన్నారు. అలాగే ఉచితంగా మూడు సిలిండర్లు అని చెప్పి ఒకటి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. మెడికల్ కాలేజీలను సైతం బినామీలకు కట్టబెట్టేందుకు ప్రైవేటుపరం చేయాలని చంద్రబాబు నిర్ణయించారని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేదు: రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడి చేసేసిందని విమర్శించారు. 80 వేల బెల్టుషాపులు పుట్టుకొచ్చాయని, పర్మిట్ రూమ్లకు కూడా అనుమతులు ఇచ్చేశారని తెలిపారు. మద్యం కారణంగానే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతోందని, గంజాయిని హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే పండిస్తున్నారని వివరించారు. వీటిని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం నుంచి ఎమ్మె ల్యేల వరకు అందరూ తమ స్వలాభం కోసం పనిచేస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్లీ దేవుడు రావాలని ప్రార్థిస్తున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. రానున్న మూడేళ్లు ప్రజల తరఫున పోరాటం చేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి, ఉత్తరాంధ్ర మహిళా విభాగం జోన్ ఇన్చార్జి ఈర్లె అనురాధ, కార్పొరేటర్లు, జోన్–1కు చెందిన మహిళా నాయకులు, రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
బోణీ కొట్టిన బుల్స్, జెయింట్స్
విశాఖ స్పోర్ట్స్: నగరంలోని పోర్టు స్టేడియం కబడ్డీ.. కబడ్డీ నామస్మరణతో మార్మోగిపోతోంది. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ స్థానిక క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. శనివారం జరిగిన హోరాహోరీ మ్యాచ్లు ప్రేక్షకులను అలరించాయి. బెంగళూరు బుల్స్, గుజరాత్ జెయింట్స్ అద్భుత విజయాలు సాధించి పాయింట్ల ఖాతా తెరిచాయి. తొలి మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 38–30 తేడాతో పాట్నా పైరేట్స్ను కంగుతినిపించింది. ఇరుజట్లు నువ్వానేనా అన్నట్టు తలపడటంతో మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బుల్స్ తరఫున అలీరెజా (10), ఆశిష్ (8) రైడింగ్లో అదరగొట్టగా, పాట్నా రైడర్ అయాన్ (10) పోరాడినా ఫలితం దక్కలేదు. మరో ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ జెయింట్స్ 37–28తో తమిళ్ తలైవాస్పై గెలుపొందింది. జెయింట్స్ ఆటగాళ్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నారు. ఆల్ రౌండర్ నితిన్ పన్వర్ (8), కెప్టెన్ షాదులు (6) కీలక పాయింట్లతో జట్టును విజయపథాన నడిపించారు. ఆదివారం బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. మరో మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. -
‘గ్రీన్ రైల్వే స్టేషన్’గా విశాఖకు ప్లాటినం సర్టిఫికెట్
తాటిచెట్లపాలెం: ఈస్ట్కోస్ట్ రైల్వే పరిధిలో ఉన్న విశాఖ రైల్వే స్టేషన్ మరో అరుదైన ఘనత సాధించింది. పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు గాను ఈ స్టేషన్కు ప్రతిష్టాత్మకమైన గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ (ప్లాటినం) లభించింది. గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఈ సర్టిఫికెట్ను విశాఖ రైల్వే స్టేషన్కు అందజేయనుంది.విశాఖ రైల్వే స్టేషన్లో అమలు చేస్తున్న వివిధ పర్యావరణహిత పద్ధతులను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించారు. ఇండియన్ రైల్వేస్లోని ఎన్విరాన్మెంట్ డైరెక్టరేట్, గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సహకారంతో ఈ రేటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ రేటింగ్లో భాగంగా ప్యాసింజర్ సౌకర్యాలు, నీటి వినియోగం, శాసీ్త్రయ పారిశుధ్య పద్ధతులు, విద్యుత్ ఆదా, హానికరమైన ఆయిల్స్ వినియోగం తగ్గించడం వంటి అంశాలను తనిఖీ చేసి, అంచనా వేశారు. ఈ సందర్భంగా వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మాట్లాడుతూ ఇది రైల్వే ఉద్యోగులందరి సమష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ , హౌస్కీపింగ్ మేనేజ్మెంట్ సిబ్బంది పనితీరు అద్భుతమని అభినందించారు. విశాఖ రైల్వే స్టేషన్ భవిష్యత్తులో కూడా పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
రైతులకు అండగా 9న వైఎస్సార్ సీపీ పోరు
పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ● ‘అన్నదాత పోరు’పోస్టర్ ఆవిష్కరణ విశాఖ సిటీ: రైతులకు మేలు చేయని కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. యూరియా కొరత, ఇతర రైతాంగ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9న ‘ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు’ పేరుతో నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడడం దారుణమన్నారు. టీడీపీ నేతలు రేషన్ బియ్యం, ఇసుక, మద్యాన్ని వ్యాపారంగా చేసుకున్నారని, యూరియాను కూడా కమీషన్ కోసం రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఆర్బీకేల ద్వారా యూరియాను అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్వెస్లీ, పేర్ల విజయచంద్ర, ఈర్ల అనూరాధ, పార్టీ నాయకులు జియ్యాని శ్రీధర్, అల్లంపల్లి రాజాబాబు, డాక్టర్ సి.ఎం.ఎ.జహీర్ అహ్మద్, ద్రోణంరాజు శ్రీ వత్సవ్, రామన్న పాత్రు డు, పల్లా చిన్నతల్లి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు అబంటి శైలేష్, పి.వి.సురేష్, పేడాడ రమణికుమారి, సనపల రవీంద్ర భరత్, కర్రి రామిరెడ్డి, రాయపురెడ్డి అనీల్కుమార్, వడ్డాది దిలీప్కుమార్, బోండా ఉమామహేశ్వరరావు, దేవరకొండ మార్కండేయులు, నీలి రవి, జిల్లా పార్టీ కమిటీ నేతలు మువ్వల సురేష్, ఆల్ఫా కృష్ణ, కార్పొరేటర్లు శశికళ, పద్మారెడ్డి, కో–ఆప్షన్ సభ్యులు ఎం.డి.షరీఫ్, రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ కమిటీ సభ్యులు బయ్యవరపు రాధ, బెందాళం పద్మావతి, శ్రీదేవి వర్మ, సూర్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
● గణపతి బప్పా మోరియా
అక్కయ్యపాలెంలో జోడుగుళ్లపాలెం వద్ద గణేష్ నవరాత్రులు ముగియడంతో శనివారం విశాఖలో గణనాథుని నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. నగరం నలుమూలల నుంచి వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు భారీ ఊరేగింపులతో గణపతి విగ్రహాలను తీరప్రాంతాలకు తరలించారు. ఈ ఊరేగింపుల్లో యువత ఉత్సాహంగా తీన్మార్ డ్యాన్స్లు చేస్తూ.. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి వీడ్కోలు పలికారు. నిమజ్జనం కోసం జోడుగుళ్లపాలెం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయగా.. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం గంగమ్మ ఒడికి గణనాథుడు -
విశాఖలో బహుజనగణమన ఆవిష్కరణ
అల్లిపురం: బీసీల హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి వివిధ వర్గాల నుంచి మద్దతు కోరుతూ పలువురు బీసీ ఉద్యమకారులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో జరిగిన కార్యక్రమాలలో కవి జూలూరు గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ దీర్ఘకావ్యాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే, సర్దార్ గౌతులచ్చన్న విగ్రహాల వద్ద , ఆర్.కే. బీచ్లోని జాలాది విగ్రహం వద్ద జరిగింది. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, తొలి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీశంకర్ రాసిన ఈ కావ్యాన్ని మాజీ వీసీ కే.ఎస్. చలం, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గోడి నరసింహాచారి, బీసీ స్టడీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేంకటేశ్వరరావు, రచయిత్రి జాలాది విజయ, అరసం నాయకులు ఉప్పల అప్పలరాజు, శ్యామసుందర్, స్ట్రగుల్ ఫర్ సోషల్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు సుబ్బారావు గౌడ్ తదితరులు ఆవిష్కరించారు. కవులారా మీరెటువైపు? నుంచి బహుజనగణమన వరకు ఈ సందర్భంగా మాజీ వీసీ కే.ఎస్. చలం మాట్లాడుతూ విశాఖ విద్యార్థులు శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా వేసిన ‘కవులారా మీరెటువైపు?’ కరపత్రం విప్లవ కవిత్వానికి ఎలా దారి తీసిందో గుర్తు చేశారు. ఇప్పుడు జూలూరు రాసిన ‘బహుజనగణమన’ కావ్యం బహుజన ఉద్యమానికి ఒక డిక్లరేషన్ లాంటిదని పేర్కొన్నారు. గోడి నరసింహాచారి మాట్లాడుతూ, 1970లలో దిగంబర కవులు తమ కవిత్వాన్ని రిక్షా కార్మికుడి చేత ఆవిష్కరింపజేసిన విధంగానే, ఇప్పుడు జూలూరు కావ్యాన్ని పలు చేతివృత్తుల వారి చేత ఆవిష్కరింపజేయడం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందన్నారు. కావ్యకర్త జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ తరతరాల అణిచివేతకు గురైన బీసీల హక్కులు, సామాజిక న్యాయం అనే అంశాలను ప్రధానంగా తీసుకుని ఈ కావ్యాన్ని రచించినట్లు తెలిపారు. కులవృత్తుల చేత పుస్తకావిష్కరణ జీవీఎంసీ 38వ వార్డులో పలు కులవృత్తులు, చేతివృత్తుల వారి చేత ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం వినూత్నంగా నిర్వహించారు. -
ఆరుగురిని కాపాడిన లైఫ్గార్డ్స్
కొమ్మాది: రుషికొండ బీచ్లో ఆరుగురు పర్యాటకులు సముద్ర అలల తాకిడికి కొట్టుకుపోతుండగా, అప్రమత్తమైన లైఫ్గార్డ్స్ వారిని సురక్షితంగా రక్షించారు. శనివారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ నుంచి ఎనిమిది మంది యువతీ యువకులు రుషికొండ బీచ్ను సందర్శించేందుకు వచ్చారు. సముద్రంలో స్నానానికి దిగినప్పుడు, అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో వారిలో గణేష్, మాన్సీ గోస్వామి, లోకేష్, ప్రియాంక, బాసు ప్రధాన్, అర్చల్ ప్రమాదంలో చిక్కుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న లైఫ్గార్డ్స్ ఈ విషయాన్ని గమనించారు. వేగంగా స్పందించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తరువాత, మైరెన్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా వారి ఇంటికి పంపించారు. పర్యాటకుల ప్రాణాలు కాపాడిన లైఫ్గార్డ్స్ను మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు. -
డీఆర్సీలో సమస్యల వెల్లువ
మహారాణిపేట: క్లీన్ సిటీ, స్మార్ట్ సిటీగా పేరున్న విశాఖ ఖ్యాతిని మరింత పెంచేలా అధికారులు పనిచేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పటిష్టమైన కార్యాచరణతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టరేట్లో శనివారం జరిగిన జిల్లా సమీక్ష మండలి(డీఆర్సీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర సుందరీకరణ, విద్యుదీకరణ, పట్టణీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగోలేవు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందడం లేదని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్రమణల క్రమబద్ధీకరణపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయి సిబ్బందికి మళ్లీ శిక్షణ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. జీవీఎంసీలో కొందరు విధులకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని ప్రస్తావించారు. డ్రైనేజీలు ఆక్రమణలకు గురయ్యాయని ఆరోపించారు. టీడీఆర్లు, ఆర్థిక నేరాల నియంత్రణ, బడ్స్ యాక్ట్ అమలు వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన ప్రధాన అంశాలు ● ఎంపీ శ్రీ భరత్: నగరంలో చాలా చోట్ల డ్రెయిన్లు ఆక్రమణకు గురయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చెత్త పేరుకుపోతోంది. దోమలు ప్రబలుతున్నాయి. జీవీఎంసీ కమిషనర్: నగరంలో 250 ఆక్రమణలు గుర్తించాం. నెల రోజుల్లో చర్యలు తీసుకుంటాం. ● ప్రభుత్వ విప్ గణబాబు: పోర్టు, రైల్వే, డిఫెన్స్ ప్రాంతాల నుంచి వస్తున్న మురుగునీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఒక కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలి. కన్వేయన్స్ డీడ్ పట్టాల రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి. ● ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు:పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా ఉంది. సచివాలయ సిబ్బందిపై పర్యవేక్షణ లేదు. ముడసర్లోవ రిజర్వాయర్ను విస్తరించి, నగర నీటి నిల్వ సామర్థ్యాలను పెంచాలి. ● ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు: జీవీఎంసీలో ఆప్కోస్ ద్వారా నియామకాలు చేపట్టాలి. భూ సర్వేలో పారదర్శకత పెంచి, స్కెచ్ రూపంలో రిపోర్టులు ఇవ్వాలి. దువ్వాడ–కూర్మన్నపాలెం రోడ్డు విస్తరణ బాధితులకు టీడీఆర్లు అందించాలి. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను బలోపేతం చేయాలి. ● ఎమ్మెల్యే వంశీకృష్ణ: జీవీఎంసీ జోన్–4లో కొందరు విధులకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారు. దీనిపై జోనల్ కమిషనర్కు నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. సచివాలయాలకు కంప్యూటర్లు వంటి మౌలిక వసతులు కల్పించాలి. పారిశుధ్య నిర్వహణ బాగోలేదు. ● ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్బాబు: ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పినగాడి రోడ్డు సమస్యను వీఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలి. నగరానికి సమీపంలోని కొన్ని గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయాలి. మంత్రి స్పందన: ఈ ప్రతిపాదనను సబ్–కమిటీకి నివేదిస్తాం. ● ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్ రాజు: టిడ్కో గృహాల బిల్లుల చెల్లింపులు, వసతుల కల్పన వేగవంతం చేయాలి. 26, 43, 46, 47 వార్డుల్లో ఉన్న ‘ఘోస్ట్ వర్కర్ల’పై చర్యలు తీసుకోవాలి. తాడిచెట్లపాలెం– కంచరపాలెం మెట్టు మార్గంలో ఇప్పటికీ వీధి దీపాలు లేవు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీసీపీ మేరీ ప్రశాంతి, డీఆర్వో భవానీ శంకర్, ఆర్డీవోలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నేత్రపర్వంగా అనంతుని జయంతి
పద్మనాభం: శ్రీ కుంతీ మాధవ స్వామి ఆలయంలో శనివారం అనంత పద్మనాభ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కుంతీ మాధవ స్వామి ఆలయంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు పల్లకీలో తీసుకువచ్చి అధిష్టింపజేశారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి చిన్న ఉత్సవ విగ్రహాలను పల్లకీలో కొండపైకి తీసుకువెళ్లారు. ఉదయం 7 గంటలు, 10.30 గంటలకు జరిగిన వ్రతాల్లో మొత్తం 160 మంది దంపతులు పాల్గొన్నారు. కొండపై ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పంచామృత అభిషేకాలు కూడా నిర్వహించారు. కొండ కింద ఉన్న కుంతీ మాధవ స్వామి, కొండపై ఉన్న అనంత పద్మనాభ స్వామి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, సర్పంచ్ తాలాడ పాప, పద్మనాభంతో పాటు విశాఖపట్నం, సింహాచలం, విజయనగరం వంటి దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. అనంత పద్మనాభ స్వామిని కనులారా వీక్షించారు. -
నిబద్ధతకు నిలువెత్తు రూపం సత్యప్రసాద్
హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు విశాఖ లీగల్: న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతిభావంతులైన న్యాయవాదులు ఎంతైనా అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. విశాఖలో నూతన న్యాయస్థాన సముదాయంలోని న్యాయవాదుల సంఘం భవనంలో శనివారం దివంగత సీనియర్ న్యాయవాది ఎస్వీ సత్యప్రసాద్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయమూర్తులు ప్రసంగించారు. ముందుగా సత్యప్రసాద్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు మాట్లాడుతూ సత్యప్రసాద్ నిబద్ధతకు నిలువెత్తు రూపమని కొనియాడారు. మరో న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ మాట్లాడుతూ సత్యప్రసాద్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జస్టిస్ చల్లా కోదండరామయ్య , జస్టిస్ చీమలపాటి రవి... సత్యప్రసాద్తో ఉన్న అనుబంధాలను పంచుకున్నారు. కార్యక్రమంలో పూర్వ న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్. కృష్ణమోహన్, విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కె. శ్రీనివాస్, లాలం పార్వతీనాయుడు, సీనియర్ న్యాయవాదులు నమ్మి సన్యాసిరావు, రామదాసు, శిష్ట్లా శ్రీనివాసమూర్తి, కె.వి.రామ్మూర్తి, శివరాం, మీనాక్షి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యప్రసాద్ కుటుంబ సభ్యులు విశాఖ న్యాయవాద సంఘం నూతన భవనానికి ఐదు లక్షల రూపాయల విలువ చేసే యంత్రాలను విరాళంగా అందించారు. -
అందుబాటులోకి డిజిటల్ న్యాయ సేవలు
విశాఖలో ఈ–సేవ కేంద్రం ప్రారంభం విశాఖ లీగల్: న్యాయ ఫలాలను అందరికీ అందుబాటులో ఉంచడమే ఈ–సేవ కేంద్రాల లక్ష్యమని హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో ప్రత్యేక ఈ–సేవ కేంద్రాన్ని న్యాయమూర్తి ప్రారంభించారు. న్యాయ సేవలను సత్వరమే కక్షిదారులకు అందించడమే ఈ కోర్టుల లక్ష్యమని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా దాపరికలేని సంపూర్ణ సమాచారాన్ని అందరూ పొందవచ్చని వివరించారు. న్యాయవ్యవస్థలో డిజిటల్ అంతరాన్ని తగ్గించి, న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చేయడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ చల్ల గుణరాజన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, జిల్లాలోని పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
బయో మైనింగ్లో నిజాలకు పాతర!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కాపులుప్పాడలోని బయో మైనింగ్లో జీవీఎంసీ అధికారులు నిజాలను పాతరేస్తున్నారు. ఇక్కడ బయో మైనింగ్ ప్రక్రియ చేపట్టామంటూ రూ.2 కోట్లు కాజేసేందుకు పాత తేదీలతో బిల్లులను కమిషనర్కు సమర్పించారు. సుమారు 8 నెలల క్రితం పని పూర్తయినట్టు చెబుతున్న అధికారులు.. ఇప్పుడు ఫైలును కదుపుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న కాపులుప్పాడలోని డంపింగ్ యార్డులో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బయో మైనింగ్ ప్రక్రియ చేపట్టారు. తద్వారా 25 ఎకరాల భూమిని తిరిగి వినియోగించుకునేందుకు అనుకూలంగా తయారుచేశారు. మిగిలిన భూమిలో కూడా బయో మైనింగ్ చేపట్టాలంటూ కూటమి ప్రభుత్వ హయాంలో రూ.2 కోట్లతో టెండర్ను పూర్తి చేశారు. ఈ టెండర్ను దక్కించుకునేందుకు సదరు సంస్థ సమర్పించిన అనుభవ పత్రంపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పని జరిగిందా? లేదా అనేది కూడా అధికారులు పరిశీలన చేయకుండానే ఏకంగా రూ.2 కోట్ల బిల్లుల చెల్లింపుల కోసం 8 నెలల తర్వాత పాత తేదీలతో కమిషనర్ అనుమతికి పంపించారు. బిల్లుల చెల్లింపుల ద్వారా కమిషనర్ను కూడా ఇందులో ఇరికించాలనే ఆలోచనలో కిందిస్థాయి జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెన్యూనిటీ చెక్ ఏదీ? వాస్తవానికి ఏదైనా సంస్థ ఫలానా వద్ద పనిచేశానంటూ టెండర్ దాఖలు చేసే సమయంలో అర్హత పత్రాన్ని జత చేయడం సహజం. ఇక్కడ బయో మైనింగ్ పేరుతో రూ.2 కోట్ల పనులకు కూడా సదరు సంస్థ త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా మునిసిపాలిటీలో పని చేసినట్టు అర్హత పత్రాన్ని సమర్పించింది. ఈ అర్హత పత్రంపై అగర్తలా కమిషనర్ సంతకం కూడా చేశారు. అయితే, సంతకం కింద ఎక్కడా స్టాంపింగ్ మాత్రం వేయలేదు. తమ వద్ద ఫలానా సంస్థ... ఫలానా పనిచేసిందని చెబుతూ ఇచ్చే సర్టిఫికెట్పై సహజంగా ఇంజనీర్ల సంతకాలు ఉంటాయి. ఇక్కడ ఇందుకు భిన్నంగా ఏకంగా ఐఏఎస్ అధికారి సంతకం ఉండటం అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా ఆయన ఇన్చార్జి కమిషనర్గా ఉన్న సమయంలో ఈ పత్రాన్ని జారీచేయడం కూడా మరిన్ని సందేహాలు తలెత్త విధంగా ఉన్నాయి. మన ఘనత వహించిన జీవీఎంసీ ఇంజనీర్లు మాత్రం కనీసం ఈ పత్రం నిజమైనదా? కాదా? ఇందులో ఉన్న జెన్యూనిటీ ఎంత అనేది కనీసం విచారణ కూడా చేయకపోవడంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సహజంగా టెండర్ను ఫైనల్ చేసే సమయంలో అక్కడి అధికారులతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మరీ తుది నిర్ణయం తీసుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. ఇక్కడ ఇటువంటిదేమీ జరగలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే జీవీఎంసీలో క్లాప్ వాహనాలను నిర్వహించే సాయి పావని కన్స్ట్రక్షన్స్ సంస్థ మొత్తం వ్యవహారం నడిపినట్టు తెలుస్తోంది. జీవీఎంసీలోని మెకానికల్ విభాగంతో.. క్లాప్ వాహనాల్లో పెనవేసుకున్న బంధం కాస్తా బయో మైనింగ్ వరకూ సాగిందని అర్థమవుతోంది. ఇందులో కమిషనర్ను కూడా ఇరికించేందుకు పాత తేదీలతో తాజాగా బిల్లులు పంపడం గమనార్హం. బయో మైనింగ్ అంటే...! డంపింగ్ యార్డులో పేరుకుపోయిన భారీ వస్తువులను తీసివేసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను బయో–స్టెబిలైజింగ్ ద్వారా కంపోస్ట్గా మారుస్తారు. తద్వారా 25 ఎకరాల భూమిని తిరిగి పొందవచ్చు, ఇది ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి జీవీఎంసీ పరిధిలోని కాపులుప్పాడ వద్ద 2007లో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. జీవీఎంసీ పరిధిలోని అన్ని వార్డుల నుంచి వచ్చే వ్యర్థాలను ఇక్కడే డంప్ చేస్తున్నారు. తద్వారా ఇప్పటికే 60 శాతానికిపైగా భూమి వ్యర్థాలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో బయో మైనింగ్ ద్వారా 25 ఎకరాల భూమిని తిరిగి పొందేందుకు వీలుగా గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రక్రియను చేపట్టారు. తద్వారా 25 ఎకరాల భూమిని తిరిగి పొందే అవకాశం ఏర్పడింది. యార్డులో ఇంకా వ్యర్థాలు ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వంలో మరోసారి రూ.2 కోట్లతో బయో మైనింగ్ను చేపట్టారు. ఈ కాంట్రాక్టును ఇప్పటికే జీవీఎంసీలో క్లాప్ వాహనాల కాంట్రాక్టును నిర్వహించే కాంట్రాక్టరే సాయి పవని సంస్థ పేరుతో చేపట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం బయో మైనింగ్ను అగర్తాలో మునిసిపాలిటీలో చేపట్టినట్టు తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పించి టెండరును దక్కించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నకిలీ సర్టిఫికెట్తో టెండర్ దక్కించుకున్నట్టు ఆరోపణలు అర్హత పత్రం సరైనదో కాదో కూడా నిర్ధారించుకోని జీవీఎంసీ నేరుగా రూ.2 కోట్ల బిల్లుల చెల్లింపులకు రంగం సిద్ధం పాత తేదీలతో కమిషనర్ ముందుకు ఫైలు కమిషనర్నూ ఇరికించేందుకు పన్నాగం! -
ఆకట్టుకుంటున్న వస్త్ర ప్రదర్శన
అల్లిపురం: దేశంలోని వివిధ రాష్ట్రాలలో పేరు గాంచిన చీరలు, వస్త్రాల అమ్మకాలు గ్రీన్ పార్కు హోటల్లో నేషనల్ సిల్క్ ఎక్స్ పో సంస్థ ప్రారంభించింది. ఈ ప్రదర్శన ఈ నెల 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దసరా, వివాహాది వేడుకలకు అవసరమైన అన్ని రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్లు కలబోసిన విభిన్న వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. నేషనల్ సిల్క్ ఎక్స్పో – ఎగ్జిబిషన్ కమ్ సేల్ సందర్శన షాపింగ్ చేయటంలోఒక అద్భుతమైన వస్త్రాల సంబరాన్ని చూసిన అనుభూతి పొందుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రవేశం ఉచితమని నిర్వాహకులు పేర్కొన్నారు. -
ఖాతా తెరవని బుల్స్.. స్టీలర్స్ థ్రిల్లింగ్ గెలుపు
విశాఖ స్పోర్ట్స్: పోర్టు ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్ల్లో బెంగళూరు బుల్స్ మరో ఓటమిని చవిచూడగా, హర్యానా స్టీలర్స్ ఉత్కంఠ పోరులో విజయం సాధించి అభిమానులకు మజాను అందించింది. యూ ముంబాతో జరిగిన ఏకపక్ష మ్యాచ్లో బెంగళూరు బుల్స్ ఘోర పరాజయం పాలైంది. మ్యాచ్లో మూడుసార్లు ఆలౌట్ అయిన బుల్స్.. తొలి అర్ధభాగంలోనే 12–29తో భారీగా వెనుకబడింది. రెండో అర్ధభాగంలో బుల్స్ కాస్త పుంజుకున్నా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సీజన్లో బుల్స్ ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేదు. మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్ 35–30 పాయింట్ల తేడాతో యూపీ యోథాస్పై విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో.. చివరి ఐదు నిమిషాల్లో దూకుడుగా ఆడిన స్టీలర్స్, యోథాస్ను రెండుసార్లు ఆలౌట్ చేసి విజయాన్ని కై వసం చేసుకుంది. శనివారం రాత్రి 8 గంటలకు పాట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్, రాత్రి 9 గంటలకు తమిళ్ తలైవాస్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. -
ఏయూ ఆచార్యులకు అవార్డులు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని పలువురు ఆచార్యులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరున బెస్ట్ అకాడమీషన్ ఆఫ్ ది ’ఇయర్ 2025 అవార్డులను అందించారు. సెనేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏయూ ఆచార్య జి.పి.రాజశేఖర్ అవార్డులను అందజేశారు. లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సీతామాణిక్యం, సైన్స్ కళాశాల కెమిస్ట్రీ విభాగం ఆచార్యురాలు డీవీవీ శైలజ, ఇంజినీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ ఆచార్యులు వెంకట్రావులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎ.నరసింహారావు, ఆచార్య ఎం. వి. ఆర్. రాజు, ఆచార్య జి. శంకర్, ఆచార్య కె. సీతామాణిక్యం, ఆచార్య ఆర్. పద్మశ్రీ, ఆచార్య డి. నాగరాజకుమారీ ,పపలువురు డీన్లు, డైరెక్టర్లు, అధికారులు, ఆచార్యులు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
మహారాణిపేట : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి శుక్రవారం ఉదయం విశాఖలో జిల్లాలో ఘనస్వాగతం లభించింది. రాడిసన్ బ్లూ హోటల్లో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీలు శ్రీ భరత్, సీఎం రమేష్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్లు గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. సదస్సు అనంతరం రుషికొండ హెలిప్యాడ్ నుంచి 11.50 గంటలకు ఉండవల్లికి తిరుగు పయనమయ్యారు. -
డీఎస్ఎన్ఎల్యూలో అకడమిక్ బ్లాక్ ప్రారంభం
సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్ఎన్ఎల్యూ)లో నూతనంగా నిర్మించిన అకడమిక్ బ్లాక్ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి, విశ్వవిద్యాలయ విజిటర్ జస్టిస్ పి.శ్రీనరసింహ శుక్రవారం ప్రారంభించారు. దీంతోపాటు వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహత్మాగాంఽధీ, రాజ్యాంగ పిత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, తొలి దళిత ముఖ్యమంత్రి, దామోదరం సంజీవయ్య విగ్రహాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వర్సిటీ సమావేశమందిరంలో వాతావరణ మార్పులు, చట్టాలు అనే అంశంపై జస్టిస్ ఇ.వెంకటేశం స్మారక ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డాక్టర్ సూర్యప్రకాశరావు, ఇన్చార్జ్ రిజిస్ట్రార్ విశ్వచంద్ర మదాసీ పాల్గొన్నారు. -
బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం
నరసాపురం జంక్షన్లో రోడ్డుపై ధర్నా పద్మనాభం: మండలంలోని తునివలస పంచాయతీ నరసాపురం జంక్షన్లో బస్సులు ఆపకపోవడంతో ఆ గ్రామ ప్రజలు, కళాశాల విద్యార్థులు శుక్రవారం జంక్షన్లో రోడ్డుపై ధర్నా చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు వీరు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టినప్పటి నుంచి విజయనగరం నుంచి వచ్చేటప్పుడు నరసాపురం జంక్షన్లో బస్సులు అపకుండా రెడ్డిపల్లిలో నిలుపుతున్నారు. ఉచితంగా మహిళలు ఎక్కువగా బస్సులు ఎక్కుతున్నారని డైవర్లు బస్సులను నరసాపురంలో ఆపడం లేదు. రాత్రి వేళల్లోనూ బస్సులు నరసాపురం జంక్షన్లో ఆపకుండా రెడ్డిపల్లిలో నిలపడంతో సుమారు రెండు కిలోమీటర్ల దూరం చీకట్లో నడిచి రావాల్సి వస్తుండటంతో ప్రజలు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. బస్సులకు అడ్డంగా రోడ్డు మీద వీరు నిలబడి పోయారు. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. బస్సులు, ఆటోలు రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో డ్రైవర్లు, ప్రయాణికులు విద్యార్థులు, ప్రజలతో వాగ్వాదానికి దిగారు. చివరకు బస్సు డ్రైవర్లు నరసాపురంలో బస్సులో నిలుపుతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
మరణించి నలుగురికి వెలుగునిచ్చి..
పెందుర్తి : బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందిన ఓ వ్యక్తి నేత్రాలను దానం చేసి ఓ కుటుంబం మానవత్వం చాటుకుంది. వివరాలివి.. పెందుర్తి ఆదిత్యనగర్లో నివాసం ఉంటున్న కోరుబిల్లి శ్రీను(40) క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం రాత్రి శ్రీను ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు వెంటనే కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ క్రమంలో శ్రీను సమీప బంధువు శరగడం రాము(కర్రల రాము) చొరవతో కుటుంబ సభ్యులు శ్రీను నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు. మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు శ్రీను నేత్రాలను సేకరించారు. ఇటీవల కాలంలో విస్తృతంగా నేత్రదానం చేయిస్తున్న పెందుర్తిలోని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ స్ఫూర్తిలో తాము ఈ నేత్రదానం చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్అల్లిపురం: ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఖాతా క్రియేట్ చేసి ఒక మహిళ ఫొటోలు మార్ఫ్ చేసి న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ ఆ ఫొటోలు పోస్ట్ చేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. సాంకేతికత సహాయంతో సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలివి.. నగరానికి చెందిన ఒక మహిళకు గుర్తు తెలియని ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన ఫేస్తో అశ్లీలంగా మార్ఫ్ చేసిన ఫొటోలు వచ్చాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే తన మార్ఫ్ చేసిన ఫొటోలు బాధితురాలి ఫాలోవర్స్ అందరికీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫార్వర్డ్ చేస్తానని బెదిరింపు మెసేజ్లు వచ్చాయి. దీంతో బాధితురాలు భయాందోళనకు గురై సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి సాధారణ ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీస్ నుంచి డౌన్లోడ్ చేసుకుని.. ఆన్లైన్ అప్లికేషన్ ఉపయోగించి అశ్లీలంగా మార్ఫ్ చేసి మళ్లీ ఆమెకు పంపించింది నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సాంకేతికత సహాయంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. -
కరెంట్ సమస్య.. క్షణాల్లో పసిగట్టేలా..
‘స్కాడా’ అనుసంధానం ఆటోమేటిక్ ఫీడర్ చేంజ్ రూమ్ సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, సమస్య ఎక్కడుందో కనుగొనడానికి సిబ్బంది క్షేత్రస్థాయిలో గంటల తరబడి శ్రమించాల్సి వచ్చేది. లోపం ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, సబ్స్టేషన్కు సమాచారమిచ్చి, విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత మరమ్మతులు చేసేవారు. ఈ ప్రక్రియకు గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కానీ, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో పరిస్థితులు మారాయి. ఇప్పుడు విద్యుత్ సరఫరాలో లోపం ఎక్కడ తలెత్తిందో క్షణాల్లోనే కంప్యూటర్ స్క్రీన్పై కనిపిస్తోంది. ఆ సమాచారంతో సంబంధిత సిబ్బంది కేవలం 5 నుంచి 30 నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఇది తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో అమలు చేస్తున్న సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) వ్యవస్థతో సాధ్యమవుతోంది. విశాఖపట్నం సర్కిల్ పరిధిలో ఇప్పటికే సగానికి పైగా సబ్స్టేషన్లు స్కాడాతో అనుసంధానం కావడంతో నగరవాసులకు విద్యుత్ సమస్యలు గణనీయంగా తగ్గాయి. స్కాడా అంటే.? విద్యుత్ సరఫరా వ్యవస్థను ఒకే కేంద్రం నుంచి పర్యవేక్షిస్తూ.. సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించి, సరఫరాను పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవస్థే స్కాడా. ఇది సెన్సార్లు, రిమోట్ టెర్మినల్ యూనిట్ల ద్వారా సబ్స్టేషన్లను కంట్రోల్ సెంటర్తో అనుసంధానిస్తుంది. ఆపరేషనల్ టెక్నాలజీ ద్వారా రియల్ టైమ్ డేటాను సేకరించి, వ్యవస్థను పూర్తిస్థాయిలో నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది. సాధారణంగా సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లు చేసే పనులను స్కాడా కంట్రోల్ సెంటర్ నుంచే ఆటోమేటిక్గా, రిమోట్ సెన్సార్ల సహాయంతో నిర్వహిస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో... విశాఖ నగరంలో స్కాడా ఏర్పాటుకు 2013లో ప్రతిపాదనలు రాగా, 2014లో రూ.13.16 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. 2015 నుంచి మొదలుపెడితే 28 సబ్స్టేషన్లను స్కాడా కంట్రోల్ స్టేషన్కు అనుసంధానం చేశారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత మరో 12 స్టేషన్లను అనుసంధానం చేయడంతో పాటు మరో 24 సబ్స్టేషన్లను స్కాడా పరిధిలోకి తీసుకొచ్చే పనులు ప్రారంభమై.. చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సబ్స్టేషన్లలోనూ స్కాడా అమలుకానుంది. విశాఖపట్నం సర్కిల్ పరిధిలో మొత్తం 130 విద్యుత్ సబ్ స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం 40 స్టేషన్లు ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా పనిచేస్తున్నాయి. మరో 24 స్టేషన్లలో త్వరలోనే సేవలు మొదలుకానున్నాయి. మిగిలిన కేంద్రాలను కూడా భవిష్యత్తులో అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కంట్రోల్ సెంటర్ ఎక్కడంటే..? స్కాడా పరిధిలోని అన్ని సబ్స్టేషన్లను పెదవాల్తేరులోని పోలమాంబ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. ఇది అత్యంత కీలకమైన, సాంకేతికతతో కూడిన కార్యాలయం కావడంతో దీనిని నియంత్రిత ప్రాంతంగా (నిషిద్ధ ప్రాంతం) పరిగణిస్తారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి నగర విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉన్నందున ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈపీడీసీఎల్ ప్రత్యేక నిపుణుల బృందం (ఈఈ, డీడీఈ, ఏఈ స్థాయి అధికారులతో పాటు 8 మంది షిఫ్ట్ ఇంజినీర్లు) ఈ కేంద్రాన్ని 24/7 పర్యవేక్షిస్తోంది. స్కాడాకు అనుసంధానించిన సబ్స్టేషన్ పరిధిలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో లోపం వస్తే, వెంటనే కంట్రోల్ రూమ్లో అలారమ్స్ మోగుతాయి. హై వోల్టేజ్, లో వోల్టేజ్ వంటి హెచ్చుతగ్గులను కూడా ఈ కేంద్రం నుంచే నియంత్రించవచ్చు. ఏ ప్రాంతానికి ఎంతసేపు విద్యుత్ సరఫరా చేశారు, ఎంతసేపు కోతలు విధించారు, లోడ్ ఎంత ఉంది వంటి సమాచారం మొత్తం రియల్ టైమ్ డేటా రూపంలో నిక్షిప్తమవుతుంది. ప్రమాదాలు తగ్గుముఖం స్కాడా కంట్రోల్ స్టేషన్ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉండటంతో.. ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి. విద్యుత్ సరఫరాలో నాణ్యత ఉంటోంది. స్కాడాకి అనుసంధానం చేయడం వల్ల సరఫరాలో అంతరాయాలు గుర్తించి, పునరుద్ధరించడంలో 56 శాతం వరకు సమయం ఆదా అవుతోంది. పవర్ ట్రిప్ అయితే రియల్ టైమ్లో తెలుస్తోంది. స్క్రీన్పై నుంచే వోల్టేజ్, ఇతర అంశాల్ని నిశితంగా పరిశీలించవచ్చు. ఏ చిన్న సమస్య తలెత్తినా.. పసిగట్టగలుగుతున్నాం. గతంలో ఫీడర్ మార్పు చేసేందుకు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 2 లేదా 3 నిమిషాల్లో ఫీడర్ని మార్పు చేయగలుగుతున్నాం. గ్రామస్థాయిలో ఫీడర్ల వరకూ స్కాడా అనుసంధానం చేసేందుకు కొంత సమయం పడుతుంది. –జి.శ్యామ్బాబు, విశాఖపట్నం సర్కిల్ ఎస్ఈ స్కాడా పరిధిలోని సబ్స్టేషన్లనుపర్యవేక్షిస్తున్న సిబ్బంది -
కమీషన్ల కక్కుర్తే కారణం
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాలను ప్రైవేటీకరిస్తోందని.. అదే విధంగా కమీషన్ల కోసమే రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించేందుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మండిపడ్డారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించాలని, పేదవాడికి అందని ద్రాక్షగా ఉన్న వైద్య విద్యను దగ్గర చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్రంలో సుమారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. కూట మి ప్రభుత్వం జగన్కి మంచి పేరు వస్తుందనే మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుందని విమర్శించారు. 2019కి ముందు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 1045 వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తే వైఎస్సార్సీపీ పాలనలో 3,275 వ్యాధులకు దానిని విస్తరించిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేవలం 1,000 ఆస్పత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తే జగన్ ఆధ్వర్యంలో సుమారు 2,350 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం అందించినట్లు తెలిపారు. కరోనాకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం అందించినట్లు చెప్పారు. జగన్ 45 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13 వేల కోట్లు వెచ్చించి వైద్యం, రూ. 1,500 కోట్ల ఆర్థిక ఆసరా అందించారన్నారు. బాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 5 లక్షల వరకు మాత్రమే లబ్ధి ఇచ్చేదని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ లబ్ధిని రూ. 25 లక్షలకు పెంచిందన్నారు. ఈ రోజు వైద్య విద్యను పేదలకు దూరం చేయాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని భావించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కె.కె. రాజు స్పష్టం చేశారు. -
కిక్కిరిసిన జనం.. ఏర్పాట్లలో వైఫల్యం
బీచ్రోడ్డు: సాగరతీరంలోని ఎంజీఎం గ్రాండ్స్లో శుక్రవారం విశాఖ ఫుడ్ ఫెస్టివల్ 2025 ప్రారంభమైంది. ఈ పండగకు ప్రజల నుంచి స్పందన లభించినప్పటికీ, నిర్వాహకుల వైఫల్యం కారణంగా ఫుడ్ లవర్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రజల రాకను అంచనా వేయడంలో అధికారులు విఫలమవడంతో, ప్రాంగణం వేలాది మందితో కిక్కిరిసిపోయింది. నిలబడటానికి కూడా స్థలం లేకపోవడం, ఒకే మార్గంలో రాకపోకలు సాగించాల్సి రావడంతో తోపులాట జరిగి, గాలి ఆడక ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆశించిన స్థాయిలో సాంస్కృతిక ప్రదర్శనలు లేకపోవడం కూడా వారిని నిరుత్సాహపరిచింది. అయితే, ఈ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన డిన్నర్ ఆన్ బోట్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యుత్ కాంతుల్లో, అలల సవ్వడి మధ్య బోట్లపై భోజనం చేసే అవకాశం సందర్శకులను ఆకట్టుకుంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్.. ఈ ఏడాది డిసెంబర్లో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామని ప్రకటించారు. విశాఖను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని మెగా ఈవెంట్లు నిర్వహిస్తామన్నారు. 2026 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, సిటీ పరేడ్ ఉంటుందన్నారు. అనంతరం స్టార్ చెఫ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అతిథులంతా ఫుడ్ స్టాళ్లను సందర్శించి వంటకాల రుచి చూశారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, కలెక్టర్ హరేందిర ప్రసాద్, టూరిజం శాఖ అధికారులు జె.మాధవి, జగదీష్, ఫోరమ్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గురువులదే గురుతర బాధ్యత
ఆరిలోవ: ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సూచించారు. విద్యార్థులను ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించే స్థాయికి తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గతేడాది 10వ తరగతి ఫలితాల్లో గురుకుల పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు 590 మార్కులు దాట గా, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం నలుగురైదుగురు మాత్రమే ఆ ఘనత సాధించడం ఆలోచించాల్సిన విషయమని ఉపాధ్యాయులకు చురకంటించారు. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏయూలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హాల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 90 మందిని ఘనంగా సత్కరించారు. జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం మంత్రి డోలా మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని, ఉత్తమ సమాజ నిర్మాణం కోసం విద్యార్థులను తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కొందరు విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, వారిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత గురువులదేనని సూచించారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, విద్యా వ్యవస్థలో రాజకీయ ప్రమేయం తగదన్నారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ దేశానికి అవసరమైన మానవ వనరులను తయారుచేసే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. డీఈవో ఎన్.ప్రేమకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
● చెరువు కాదు.. స్టేడియమే..
జనసేన నిర్లక్ష్యానికి నిదర్శనంజగదాంబ : అవునండీ నిజమే.. ఇది జీవీఎంసీ 35వ వార్డులో ఉన్న ఇందిరా మున్సిపల్ క్రికెట్ స్టేడియమే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోస్టేడియాన్ని రూ.5 కోట్ల మేర నిధులు వెచ్చించి మెరుగుపరిచారు. అయితే ఇటీవల జనసేన కార్యకర్తల సమావేశం కోసం మైదానాన్ని తవ్వేసి వదిలేశారు. దీంతో కురుస్తున్న వర్షాలకు స్టేడియం చెరువులా మారింది. ఆటలాడుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తల సమావేశానికి ముందు స్టేడియం -
నూతన విద్యావిధానంతోనే వికసిత భారత్
మద్దిలపాలెం: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘స్వర్ణాంధ్ర, వికసిత భారత్–2047 కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్’అనే అంశంపై సైన్స్ కాంక్లేవ్ను ఘనంగా నిర్వహించింది. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి, ఏయూ పూర్వ వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ గ్రహీత, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆచార్య సంఘమిత్ర బందోపాధ్యాయ ప్రసంగించారు. వికసిత భారత్–2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి నూతన విద్యావిధానం దోహదపడుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సవాలని, దానిపై పూర్తి అవగాహన లేకపోతే నష్టం తప్పదని హెచ్చరించారు. విద్యార్థులు టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా, బృంద చర్చల ద్వారా నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. ప్రత్యేక అతిథి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర.. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే విపత్తుల గురించి వివరించారు. టెక్నాలజీని ఉపయోగించి వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సదస్సులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్తో రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(హైదరాబాద్) డైరెక్టర్లు డాక్టర్ ప్రకాశ్ చౌహన్, డాక్టర్.వి.ఎం.చౌదరి, ఏపీటీసీ చైర్మన్ డాక్టర్ సిహెచ్ మోహన్రావు, ఐఐటీ హైదరాబాద్ పూర్వ సంచాలకుడు ఆచార్య జి.నరహరిశాస్త్ర, రెక్టార్ ఆచార్య కిశోర్బాబు, రిజిస్ట్రార్ కె.రాంబాబు, ప్రిన్సిపాళ్లు, డీన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఏయూలో ఘనంగా సైన్స్ కాంక్లేవ్ -
ఆనందం నిండుగ
పట్టాల పండగ.. విశాఖ సిటీ: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్ఎన్ఎల్యూ) పట్టభద్రుల కేరింతలతో బీచ్రోడ్డు మార్మోగిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచే దేశంలో పలు రాష్ట్రాల నుంచి విశాఖలో న్యాయ విద్యను పూర్తి చేసిన విద్యార్థులు నోవాటెల్ హోటల్లో సందడి చేశారు. శుక్రవారం హోటల్లో డీఎస్ఎన్ఎల్యూ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. గత ఐదేళ్లలో యూనివర్సిటీలో పలు కోర్సులో ఉత్తీర్ణులైన వారికి పట్టాల అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, అతిథులుగా జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ పి.నరసింహా, రాష్ట్ర హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హాజరయ్యారు. అతిథుల చేతుల మీదుగా విద్యార్థులను బంగారం, వెండి పతకాలతో పాటు పట్టాలను అందజేశారు. ఇందులో 397 మంది బీఏ ఎల్ఎల్బీ, 153 మందికి ఎల్ఎల్ఎం, నలుగురికి పీహెచ్డీ, ఇద్దరికి ఎల్ఎల్డీ పట్టాలు అందించారు. అలాగే 153 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. బ్యాచ్ల వారీగా విద్యార్థులు న్యాయమూర్తులతో ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు ప్రసంగించారు. వర్సిటీతోనే కాకుండా తమ జీవిత అనుభవాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సందడి : కోవిడ్, ఇతరత్రా కారణలతో గత ఐదేళ్లుగా డీఎస్ఎన్ఎల్యూ స్నాతకోత్సవం వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఐదేళ్లలో న్యాయ విద్యను పూర్తి చేసిన వారు ఇప్పటికే సుప్రీంకోర్టు, పలు రాష్ట్రాల్లో హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో ప్రాక్టీసులు ప్రారంభించారు. 8 నుంచి 12 బ్యాచ్లకు ఒకేసారి పట్టాలు అందించేందుకు డీఎస్ఎన్ఎల్యూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి.సూర్యప్రకాశరావు స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. దీనికి పలు రాష్ట్రాల్లో స్థిరపడిన న్యాయ విద్యార్థులు శుక్రవారం విశాఖకు వచ్చారు. తమ స్నేహితులను కలుసుకుని కేరింతలు కొడుతూ సందడి చేశారు. తమ ప్రొఫెసర్లతో ముచ్చటించారు. ఐదేళ్ల తర్వాత అందరూ స్నాతకోత్సవం ద్వారా కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది మాకు పండగే.. ఐదేళ్ల తర్వాత ఇంత ఘనంగా స్నాతకోత్సవం జరగడం నిజంగా మాకు పండుగలా ఉంది. కోవిడ్, ఇతర కారణాలతో కాన్వోకేషన్ ఆలస్యమైంది. 2021లో న్యాయ విద్యను పూర్తి చేశాను. ప్రస్తుతం హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్నాతక్సోతవానికి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరవడం గర్వంగా ఉంది. వారి అనుభవాలతో అందించిన ప్రసంగం స్ఫూర్తిదాయకం. – ఎం.మనోజ్, 2021 న్యాయ విద్యార్థి ఉత్సాహం నింపింది దేశంలో నల్సార్ వంటి యూనివర్సిటీలో ఈ తరహా వేడుకలు జరుగుతుంటాయి. ఇప్పుడు డీఎస్ఎన్ఎల్యూ నిర్వహించడం అద్భుతంగా ఉంది. దీనికి దేశ, రాష్ట్ర అతున్నత న్యాయస్థానాల జడ్జీలు రావడంతో సంతోషంగా ఉంది. ఇది మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. న్యాయమూర్తుల అనుభవాలు తమకు జీవితంలో ఉపకరిస్తాయి. ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన వైస్చాన్సలర్ సూర్యప్రకాష్కు కృతజ్ఞతలు. – సాయి దత్తా, న్యాయవిద్యార్థిఘనంగా డీఎస్ఎన్ఎల్యూ స్నాతకోత్సవం ఐదు బ్యాచ్ల విద్యార్థులకు పట్టాల ప్రదానం అతిథులుగా హాజరైన సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు పట్టాలతో కేరింతలు కొట్టిన విద్యార్థులు భార్గవశర్మకు 3 బంగారు పతకాలు విశాఖకు చెందిన భార్గవ శర్మ మూడు సబ్జెక్టుల్లో బంగారు పతకాలను అందుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్.నరసింహం వీటిని ప్రదానం చేశారు. భార్గవ శర్మ 2021లో డీఎస్ఎన్ఎల్యూ నుంచి న్యాయశాస్త్రంలో 5 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా 2021–22 బ్యాచ్కు చెందిన అడ్వకేట్ కుమార్ నిఖిల్ నాలుగు స్వర్ణపతకాలు అందుకున్నాడు. -
‘ఈజ్ ఆఫ్ జస్టిస్’తోనే సత్వర న్యాయం
సాక్షి, విశాఖపట్నం: న్యాయ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమిక పోషిస్తాయని, ప్రజలకు ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ‘సాంకేతికత, నైపుణ్యంతోపాటు వివిధ సంస్థల ద్వారా సరైన న్యాయం అందించే వారధి’ అనే అంశంపై శుక్రవారం విశాఖపట్నంలో అంతర్జాతీయ మీడియేషన్ సదస్సు–2025 ప్రారంభమైంది. ట్రైలీగల్, ఏషియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ (ఏసీఐఏఎం), భోపాల్లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ (ఎన్ఎల్ఐయూ) సంయుక్త ఆధ్వర్యంలో రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన సదస్సును సీఎం చంద్రబాబు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ (ఏడీఆర్) ద్వారా అందరికీ న్యాయం వేగంగా సమర్థవంతంగా ప్రజలకు చేరువ కానుందన్నారు. నిజానికి.. మీడియేషన్ అంశం భారత్కు కొత్తకాదనీ, పురాణాల్లో శ్రీకృష్ణుడు సమర్థవంతమైన మీడియేటర్గా వ్యవహరించారని గుర్తుచేశారు. భారతీయ న్యాయవ్యవస్థ రాజ్యాంగపరమైన హక్కుల్ని, చట్టాన్ని కాపాడే విషయంలో అత్యంత కీలకమైందన్నారు. ఒక్కోసారి కాస్త ఆలస్యమైనా న్యాయం దక్కుతుందనే నమ్మకం ప్రతీ పౌరుడికీ ఉందని తెలిపారు. వివాదాల పరిష్కారానికి మీడియేషన్ లాంటి ప్రత్యామ్నాయ న్యాయ వ్యవస్థలు అందుబాటులోకి రావాలన్నారు. విశాఖలో ఏడీఆర్ ఎకో సిస్టం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఇప్పటికీ చాలామంది పౌరులు కేసులు దాఖలు చేసి కోర్టులకు వెళ్లటం అవమానంగా భావిస్తారని, దీనికి మీడియేషన్ ప్రక్రియ చక్కని పరిష్కారమన్నారు. ఈజ్ ఆఫ్ జస్టిస్ ప్రక్రియలో భాగంగా వర్చువల్ హియరింగ్స్, ఈ–ఫైలింగ్, మొబైల్ అప్డేట్స్ లాంటి సాంకేతికతను అమలుచేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. న్యాయమూర్తుల కొరత ఉంది: సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయమూర్తుల కొరత ఉందని చెప్పారు. ఏపీలో ఇప్పుడు 650 మంది జడ్జీలు ఉన్నారని.. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మరో 800 మంది న్యాయమూర్తులు కావాలన్నారు. ప్రస్తుతం మీడియేషన్ ప్రక్రియ చాలా అవసరమన్నారు. ఇక మీడియేషన్ నిపుణులను తయారుచేసేందుకు 40 గంటల శిక్షణ అవసరమవుతుందని.. ఇది చేసేవారికి సర్టిఫికేషన్తో కూడిన నైపుణ్యం ఉండాలన్నారు. ఆర్బిట్రేషన్ రంగంలోకి విశ్రాంత న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు వస్తున్నారని, దీనికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగం ఉండాలని భావిస్తున్నట్లు జస్టిస్ ఠాకూర్ తెలిపారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహ, పలువురు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. -
ప్రతి నెలా మూడో శనివారం ప్రవేశం
విద్యార్థుల సందర్శనకు హెర్బేరియం, మ్యూజియం సిద్ధం మద్దిలపాలెం: ఏయూలోని వృక్షశాస్త్ర విభాగంలో ఉన్న మ్యూజియం, హెర్బేరియంలను ఇకపై విద్యార్థులు, పరిశోధకులు సందర్శించవచ్చు. గురువారం ఈ కార్యక్రమాన్ని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. ప్రతి నెల మూడో శనివారం విద్యార్థులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వృక్షశాస్త్రంలో ఆసక్తి ఉన్నవారు సందర్శించవచ్చని వీసీ చెప్పారు. అంతరించి పోతున్న, అరుదైన వృక్ష జాతుల సమాచారం తెలుసుకోవచ్చని, ఇది పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రయోగశాలగా ఉపయోగపడుతుం దన్నారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీసీ కోరారు. -
ప్రజారోగ్య మౌలిక వసతులకు పవర్ గ్రిడ్ ప్రాధాన్యత
అగనంపూడి: ప్రజారోగ్యానికి పవర్గ్రిడ్ సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగా అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రికి రూ. 32.50 కోట్ల విలువైన అధునాతన లినాక్ యంత్రాన్ని అందించినట్లు పవర్గ్రిడ్ డైరెక్టర్ (పర్సనల్) డాక్టర్ యతీంద్ర దివ్వేది తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగమని ఆయన పేర్కొన్నారు. హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ ఉమేష్ మహంతిశెట్టి మాట్లాడుతూ లినాక్ యంత్రం సహాయంతో స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ, టోటల్ బాడీ ఇరాడికేషన్, టోటల్ మారో ఇరాడికేషన్ వంటి అత్యాధునిక చికిత్సలను రోగులకు అందించవచ్చని తెలిపారు. దీనివల్ల రోగులపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సహకారానికి పవర్ గ్రిడ్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పవర్గ్రిడ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్) వంశీరామ్మోహన్ బుర్రా, స్వతంత్ర డైరెక్టర్లు శివతపస్వ పాశ్వాన్, రోహిత్ వాస్వానీ, సజల్ ఝా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
భక్తి ముసుగులో వ్యాపారానికి బ్రేక్
గాజువాక : భారీ విగ్రహం పేరుతో గాజువాకలో వినాయక ఉత్సవాలను ప్రారంభించిన నిర్వాహకులకు అధికారులు షాకిచ్చారు. భక్తి ముసుగులో వ్యాపారానికి తెరలేపారన్న ఫిర్యాదులపై స్పందించిన అధికారులు వినాయక ఉత్సవాన్ని ముగించాలని నిర్వాహకులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంబంధిత మండపానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి భక్తులను అక్కడ్నుంచి పంపించేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో పాతగాజువాకలోని లంకా మైదానంలో 111 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. లక్ష చీరలతో సుందర వస్త్ర మహాగణపతి పేరిట ఉత్సవాలను గత నెల 27న ప్రారంభించారు. 21 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించడం కోసం జీవీఎంసీ నుంచి సింగిల్ విండో ప్రాసెస్లో నిర్వాహకులు అనుమతి తీసుకున్నారు. అయితే భక్తి ముసుగులో వ్యాపారానికి తెరలేపారని, కమర్షియల్గా టికెట్లు అమ్మడం, పార్కింగ్కు ఫీజు వసూలు చేయడం, దుకాణాలు పెట్టించి డబ్బులు వసూలు చేశారంటూ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులపై స్పందించిన అధికారులు నిర్వాహకులకు నోటీసులను కూడా అందజేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఉత్సవాల నిర్వహణ కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తూ జీవీఎంసీ కమిషనర్ గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. పోలీసులు, విద్యుత్ సిబ్బంది సహకారంతో మండపానికి, అక్కడి దుకాణాలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. దర్శనాలను నిలిపివేసిన పోలీసులు మండపాన్ని మూసేసి భక్తులను అక్కడ్నుంచి పంపించేశారు. గాజువాక లంకా మైదానంలో వినాయక ఉత్సవాలు ముగిశాయని అధికారవర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి. కోటి లింగాల గణపతి మండపానికి కూడా.. గాజువాక ఆర్టీసీ డిపో సమీపాన కోటి శివలింగాలతో 108 అడుగుల ఎత్తయిన భారీ వినాయక విగ్రహ మండపానికి కూడా జీవీఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వాహకులు వ్యవహరించడంపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. -
టైటాన్స్కు తొలి విజయం
విశాఖ స్పోర్ట్స్ : పోర్ట్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. జైపూర్ పింక్ పాంథర్స్తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో 37–32 తేడాతో విజయం సాధించింది. టైటాన్స్ కెప్టెన్ విజయ్, ఆల్రౌండర్ భరత్ ఎనిమిది పాయింట్లతో రాణించగా, రైడర్లు చేతన్, అజిత్ ఐదేసి పాయింట్లు సాధించారు. గత రెండు మ్యాచ్లలో ఓటమి తర్వాత, ఈ విజయం టైటాన్స్కు పాయింట్ల ఖాతాను తెరిచింది. దబాంగ్ ఢిల్లీకి హ్యాట్రిక్ విజయం : మరో మ్యాచ్లో, దబాంగ్ ఢిల్లీ హోరాహోరీగా తలపడిన పునేరి పల్టన్ను గోల్డెన్ రైడ్లో ఓడించింది. మ్యాచ్ 28–28తో డ్రా కావడంతో, గోల్డెన్ రైడ్ ద్వారా విజేతను నిర్ణయించారు. స్టార్ రైడర్ ఆషు మాలిక్ సాధించిన రెండు పాయింట్లతో దబాంగ్ ఢిల్లీ 30–28 తేడాతో గెలిచి, ఈ సీజన్లో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. పునేరి పల్టన్ తరఫున ఆదిత్య ఏడు పాయింట్లు సాధించగా, దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ ఆషు సూపర్ టెన్ సాధించాడు. -
కొత్త లాండ్రీ సదుపాయం ప్రారంభం
తాటిచెట్లపాలెం : ఆటోనగర్లోని అల్ట్రావాష్ టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కొత్త సదుపాయాన్ని వాల్తేరు రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా గురువారం ప్రారంభించారు. రైల్వే బెడ్రోల్స్, లెనిన్లను శుభ్రం చేయడానికి అధునాతన మెషినరీతో కూడిన స్టీమ్ బాయిలర్ ను ఈ సంస్థలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డీఆర్ఎం యూనిట్లోని బెడ్షీట్ క్యాలెండరింగ్, ఫోల్డింగ్ మెషిన్, వాషర్ ఎక్స్ట్రాక్టర్స్ వంటి వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. అల్ట్రావాష్ టెక్స్ సంస్థ గత 14 ఏళ్లుగా విశాఖపట్నం ప్రాంతంలో రైల్వేలకు లాండ్రీ , డ్రై క్లీనింగ్ సేవలను అందిస్తోంది. ఈ యూనిట్ ఒక షిఫ్ట్లో 7.5 టన్నుల వస్త్రాలను శుభ్రపరిచే సామర్థ్యం కలిగి ఉంది. అల్ట్రా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎల్.జి. త్రినాథరావు, డైరెక్టర్ ఎల్. సాయి వందన అందించిన సేవలను డీఆర్ఎం ఈ సందర్భంగా ప్రశంసించారు. -
ఉత్తరాంధ్ర మైనార్టీ విద్యాభివృద్ధి డీడీగా ఖాజా రహమతుల్లా
మద్దిలపాలెం: ఉత్తరాంధ్ర ప్రాంతీయ మైనార్టీ విద్యాఅభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా డాక్టర్ ఖాజా రహమతుల్లా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాంధ్ర మైనార్టీల విద్య, ఉద్యోగ శిక్షణకు సంబంధించిన కార్యక్రమాలను ఈ సంస్థ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న డాక్టర్ ఖాజా, వినియోగదారుల సంరక్షణ కమిటీ సభ్యుడిగా, గతంలో ప్రధానమంత్రి 15 అంశాల జిల్లా కమిటీ సభ్యుడిగా కూడా సేవలందించారు. ఈ పదవికి అవకాశం కల్పించినందుకు ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు, పాఠశాల హెచ్ఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
11న స్టీల్ప్లాంట్ ఈవోఐ, ప్రైవేటీకరణ రద్దు కోసం సభ
డాబాగార్డెన్స్: ఈవోఐ పేరిట విశాఖ స్టీల్ప్లాంట్ అమ్మకాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం తక్షణం నిలిపేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు పాతగాజువాకలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరవుతారని చెప్పారు. విశాఖలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ విశాఖ కార్యదర్శివర్గ సభ్యులు ఆర్కేఎస్వీ కుమార్, పి.మణి, బి.జగన్, వి.కృష్ణారావులతో కలిసి బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి, చట్ట విరుద్ధంగా తొలగించిన 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. వారి స్థానంలో ఇతర రాష్ట్రాల కార్మికుల నియామకాన్ని ఆపాలన్నారు. ప్లాంట్లోని 6 వేల ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేసి, నిర్వాసితులకు పర్మినెంట్ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు, కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలన్నారు. సీఎం చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అవాస్తవ ప్రకటనలతో తమ ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్కు, రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని కప్పిపెట్టడం ఆపి, విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించి, పరిరక్షించేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవుపలికారు. -
స్టాక్స్లో పెట్టుబడి పేరుతో రూ.5.25 కోట్ల మోసం
విశాఖపట్నం: స్టాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకానగర్కు చెందిన ఒక వ్యక్తిని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.5.25 కోట్లు దోచుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.పోగొట్టుకున్న డబ్బులో రూ.27 లక్షలను బాధితుడు రాజస్థాన్లో ఉదయ్పూర్కి చెందిన వ్యక్తి ఐడీఎఫ్సీ బ్యాంక్ ఖాతాకు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేశారు. ఆ డబ్బు పలు ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. వీటిలో కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన పాసుల వేణు, మామిడిపల్లి విజయ్ ఖాతాలు ఉన్నట్లు తేల్చారు.దీనితో ఒక ప్రత్యేక పోలీసు బృందం కరీంనగర్కు వెళ్లి విచారణ చేపట్టింది. వేణు బ్యాంక్ ఖాతా ద్వారా జగిత్యాలకు చెందిన దుర్గం గోపీకృష్ణ సైబర్ నేరగాళ్లకు డబ్బు పంపుతున్నట్లు తేలింది. అక్రమ లావాదేవీల్లో అమెరికా డాలర్, క్రిప్టో కరెన్సీలను కూడా వినియోగించడం గమనార్హం. ఈ ఘటనలో వేణు, గోపీకృష్ణలతోపాటు నర్మెట్ట జీవ అనే మరో సైబర్ నేరస్తుడు అరెస్ట్ అయ్యాడు. -
విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత చంద్రబాబుదే
సీతంపేట: ‘విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే అధికారంలో ఉన్న పాలకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.’ అని అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల నేతలు స్పష్టంచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురువారం విశాఖపట్నం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో అఖిలపక్ష రాజకీయ, ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ ‘చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత ముఖ్యమంత్రిదే అని చెప్పారు. ఇప్పుడు ప్రైవేటీకరణను ఆపాల్సిన బాధ్యత చంద్రబాబుదే.ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒకేమాటపై నిలబడ్డాయి. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్కళ్యాణ్లు మోదీ ముందు సాగిలపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వారిపై ఆధారపడి ఉంది. కేంద్రాన్ని విశాఖ ఉక్కు విషయంలో గట్టిగా నిలదీసి తెలుగు ప్రజల సెంటిమెంట్ను గౌరవించాలి. ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులు, 1,400 మంది శాశ్వత ఉద్యోగులను తొలగించినా, 44 విభాగాల ప్రైవేటీకరణకు టెండర్లు పిలిచినా కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కాపాడామని పాలకులు చెప్పడం హాస్యాస్పదం.విశాఖ ఉక్కు కర్మాగారం గురించి దు్రష్పచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అనడం సరికాదు. ప్రధాని మోదీని ఒప్పించి ప్రైవేటీకణ ఆపే దమ్ము మాధవ్కు ఉందా?. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పోరాటానికి సిద్ధమవుతున్నాం. ఈ నెల 12న విజయవాడలో సమావేశం పెట్టాం. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు’ అని పేర్కొన్నారు. పవన్కళ్యాణ్ జవాబు చెప్పాలి ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉప్పు, కారం తినడం లేదా? అని పవణ్కళ్యాణ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఉప్పు కారం తింటున్నారో.. లేదో జవాబు చెప్పాలి. పవన్కళ్యాణ్ విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు. ఆయన రుషికొండ భవనంలో పెచ్చులు ఊడిపోతున్నాయని మీడియాను తీసుకెళ్లి డ్రామాలాడటం హాస్యాస్పదం. స్టీల్ప్లాంట్ కార్మికులను తొలగిస్తే అడ్డుకోవాల్సిన టీడీపీ ప్రజాప్రతినిధులు.. రూ.రెండు లక్షలు, రూ.మూడు లక్షలు డబ్బులిచ్చి చాలామంది ఉద్యోగాల్లోకి వచ్చారని చెప్పడం దుర్మార్గం’ అని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జీవీఎంసీలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర ప్రజాసంస్థ కన్వినర్ వీవీ రమణమూర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి రెహమాన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఏవీ వర్మరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్, సీపీఐ ఎంఎల్, ఏఐటీయూసీ, స్లీట్ ప్లాంట్ గుర్తింపు సంఘం, వివిధ ప్రజా, కార్మిక సంఘాల నాయకులు వై.కొండయ్య, గణేష్ పాండా, కె.దేవా, డి.ఆదినారాయణ, ఆర్.రవీంద్రనాథ్, ఏజే స్టాలిన్, ఎం.పైడిరాజు మాట్లాడారు. -
నేటి నుంచి వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్
మహారాణిపేట: బీచ్రోడ్లోని ఎంజీఎం మైదానంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. పర్యాటక శాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫెస్టివల్లో ప్రముఖ స్టార్ హోటళ్లు పాల్గొంటున్నాయి. దాదాపు 40 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రా రుచులు, ప్రపంచ వంటకాలు, సిగ్నేచర్ వంటకాలతో పాటు, గోదావరి జిల్లాల ప్రత్యేకతలు, ఆర్గానిక్ వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి. అన్నీ సరసమైన ధరలకే లభిస్తాయి. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టివల్కు ప్రవేశం ఉచితమని, ఈ మూడు రోజుల పండగలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. -
నేడు ‘సైన్స్ కాంక్లేవ్’
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ‘సైన్స్ కాంక్లేవ్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్టీసీ– హైదరాబాద్)తో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్ ఫర్ స్వర్ణాంధ్ర అండ్ వికసిత్ భారత్– 2047’ అనే అంశంపై ఈ కాంక్లేవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 10.30 గంటల నుంచి బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుందని, విద్యా పురస్కార గ్రహీత, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (కోల్కతా) డైరెక్టర్ ఆచార్య సంఘమిత్ర బందోపాధ్యాయ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. -
పదేళ్ల తర్వాత యుద్ధ నౌకల పండగ
సాక్షి, విశాఖపట్నం : విశాఖ మరోసారి అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కానుంది. 2026 ఫిబ్రవరిలో భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2026 విన్యాసాలను నిర్వహించనుంది. దాదాపు పదేళ్ల తర్వాత విశాఖలో జరుగుతున్న ఈ యుద్ధ నౌకల ప్రదర్శన కోసం దాదాపు 145 దేశాలను ఆహ్వానించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే చైనాను ఆహ్వానించాలా వద్దా అనే విషయంపై ప్రస్తుతం రక్షణ మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నాయి. తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ.. గతంలో 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించింది. అలాగే 2024లోనూ రికార్డు స్థాయిలో మిలాన్ విన్యాసాలు జరిగాయి. ఇప్పుడు ఈ అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనతో విశాఖ ప్రాముఖ్యత మరింత పెరగనుంది. ఏమిటీ ఫ్లీట్ రివ్యూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో ఎదురుదాడికి దిగగల సత్తా చాటేందుకు నావికాదళ విన్యాసాలు ప్రపంచదేశాలకు చాటేందుకు నిర్దేశించినవే ఫ్లీట్ రివ్యూలు. భారత సుప్రీం కమాండర్ అయిన దేశాధ్యక్షుని సమక్షంలో ఈ విన్యాసాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే భారత్ 2001లో ముంబైలోనూ 2016లో విశాఖలో ఐఎఫ్ఆర్ని నిర్వహించిన అనుభవం ఉంది. ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలకు వేదికగా విశాఖ నిలుస్తోంది. ప్రపంచానికే నాగరికత నేర్పిన దేశంలో తొలి టైడల్ డాక్ని భారత్ నిర్మించింది. చంద్రగుప్త కాలం నుంచే భారతీయులు సముద్రయానంపై మంచి పట్టు సాధించినట్లు చరిత్ర పేర్కొంటున్నది. నాటినుంచి నేటి అణుజలాంతర్గాముల నిర్మాణంలోనూ స్వయంచాలితంగా ఎదిగిన భారత్ ప్రపంచదేశాలను ఆకర్షిస్తూనే ఉంది. అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనతో మరోసారి ప్రపంచదేశాల దృష్టి విశాఖ తీరంవైపు సాగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 24 వరకూ ఐఎఫ్ఆర్తో పాటు మిలాన్–2026ని విశాఖలో నిర్వహించనున్నారు. తొలిసారి 25.. మూడోసారి 145 2001లో భారత్లో తొలిసారి ముంబైలో ఐఎఫ్ఆర్ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్ఆర్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో 145 దేశాలకు ఆహ్వానం పంపించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు ఇండియన్ నేవీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ టాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్, గ్రీన్టగ్స్ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి. చైనాని పిలవాలా.. వద్దా.? ఇటీవల చైనాతో చర్చలు జరిగిన నేపథ్యంలో..ఐఎఫ్ఆర్కు చైనాను ఆహ్వానించాలా వద్దా అనే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్చలు జరుపుతోంది. 2016లో నిర్వహించిన ఐఎఫ్ఆర్కు చైనాని ఆహ్వానించగా రెండు యుద్ధ నౌకలు, ఓ జలాంతర్గామి విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. ఈసారి ఆహ్వానం అందించాలా వద్దా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తోందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ భారత్లో జరిగే ఏ విన్యాసాలకు పాక్ని ఆహ్వానించలేదు. రాబోతున్న ఐఎఫ్ఆర్, మిలాన్–2026కి కూడా ఆహ్వానం లేదని రక్షణ వర్గాలు తెగేసి చెబుతున్నాయి. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలకు చెందిన దేశాలు ఐఎఫ్ఆర్లో భాగస్వామ్యం కాబోతున్నాయి. -
అన్నింటా మేటి
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో సత్తా చాటిన ఆంధ్ర విశ్వవిద్యాలయంవిశాఖ సిటీ : ఆంధ్రా యూనివర్సిటీ చరిత్ర సృష్టించింది. జాతీయ స్థాయిలో మరోసారి ఘనతను చాటుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)లో సత్తా చూపించింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కొత్త ఊపిరులందుకుంది. విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలతో నాలుగేళ్ల కాలంలో యూనివర్సిటీ ప్రపంచస్థాయి గుర్తింపు సంపాదించుకుంది. గత ప్రభుత్వ హయాంలో నాక్ డబుల్ ప్లస్ గ్రేడ్, ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్(ఐఐసీ) రేటింగ్స్లో 4 స్టార్ రేటింగ్ను సొంతం చేసుకుంది. తాజాగా 2023–2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో జాతీయ స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం 4వ స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో రాష్ట్రంలో నంబర్ వన్ స్థానాన్ని ఏయూ కై వసం చేసుకుంది. విశ్వవిద్యాలయాల విభాగంలో జాతీయ స్థాయిలో 23వ ర్యాంకును సొంతం చేసుకుంది. వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో సాధించిన ఏయూ ప్రగతికి కొలమానంగా మారింది. అనేక సంస్కరణలతో ఘనత వైఎస్సార్ సీపీ పాలనలో విద్యా రంగంలో అనేక సంస్కరణలకు నాంది పలికారు. ప్రతి విద్యా సంస్థ, వర్సిటీల్లో ఆలోచనలు.. ఆవిష్కరణలు.. అవకాశాలు అనే నినాదంతో విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. విద్యార్థి అభివృద్ధికి మార్గదర్శిగా.. పరిశోధనలకు నిలయంగా ఏయూలో అనేక కీలక విభాగాలను, ఆవిష్కరణ కేంద్రాలను ప్రారంభించారు. వివిధ దేశాలు, యూనివర్సిటీలు, సంస్థల ఒప్పందాలు చేసుకున్నారు. విద్యార్థులను ఆవిష్కర్తలుగా, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏయూ–నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను రూ.27 కోట్లతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గతంలో లేని విధంగా సొంతంగా ఒక స్టార్టప్, ఇంకుబేషన్ సెంటర్ ఆ–హబ్ని తీర్చిదిద్దారు. ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఏయూ సిబ్), ఆర్ఐఎన్ఎల్ సహకారంలో హ్యూమన్ జెనిటిక్స్ విభాగంలో బయో ఆర్బర్ ఇంకుబేషన్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతర్జాతీయంగా జియో ఇంజనీరింగ్ ప్రాధాన్యతను ముందుగానే గుర్తించి జియో ఇంజనీరింగ్ విభాగాన్ని పటిష్టపరిచారు. రూ.67.5 కోట్లతో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) సంయుక్తంగా ఏయూతో ఇంక్యుబేషన్, స్టార్టప్ సెంటర్ని ఏర్పాటు చేశాయి. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ కూడా సిద్ధమైంది. ఇలా అనేక నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 59.20 స్కోర్తో 23వ ర్యాంకు అత్యుత్తమ విద్యా విధానాలు, ఆవిష్కరణలు, సౌకర్యాలు, ఫలితాలు, అత్యుత్తమ ప్రమాణాలకు సాధించే విద్యా సంస్థలు, వర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం ఏటా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు కేటాయిస్తుంది. ఇన్స్టిట్యూషన్లకు ర్యాంక్స్ ఇవ్వడానికి ప్రధానంగా విద్యా భోధన, అభ్యాసం, వనరులు, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకు కేటాయిస్తారు. 2023 జూన్ నుంచి 2024 జూన్ విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ర్యాంకులు ప్రకటించింది. ఇందులో ఏయూ యూనివర్సిటీ కేటగిరీలో 59.20 స్కోర్తో 23వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఇంజనీరింగ్ కేటగిరీలో 47.37 స్కోర్తో 88వ ర్యాంకు, మేనేజ్మెంట్లో 59.95 స్కోర్తో 29వ ర్యాంకు, ఫార్మసీలో 58.19 స్కోర్తో 31వ ర్యాంకు, డాక్టర్ అంబేడ్కర్ లా యూనివర్సిటీ 63.12 స్కోర్తో 16వ ర్యాంకు సాధించింది. అలాగే రాష్ట్రంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఏయూ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. ఈ ర్యాంకు ద్వారా దేశం, రాష్ట్రంలో అత్యుత్తమ యూనివర్సిటీలను గుర్తించే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో పెరిగిన ప్రతిష్ట 2019 తర్వాత ఏయూ విశేష ప్రగతి సాధించింది. జాతీయ స్థాయిలో ప్రతిష్టను ఇనుమడింపచేసుకుంది. ప్రధానంగా ఏయూ నాక్ డబుల్ ప్లస్ గ్రేడ్ని, 3.74 సీజీపీఏతో సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ గుర్తింపు 2030 వరకు ఉంటుంది. ఆచార్యుల కొరత ఉన్న సమయంలో కూడా ఏయూ ఇంతటి విశిష్ట ర్యాంక్ని సాధించడంతోపాటు జాతీయ స్థాయిలో తొలి మూడు విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచింది. అలాగే స్టార్టప్ల ఆవిష్కరణలకు చేయూత అందించేందుకు ఏర్పాటు చేసిన ఆ–హబ్ ప్రారంభించిన కొద్ది కాలంలోనే దేశానికి దిక్సూచిగా మారింది. ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్(ఐఐసీ) ప్రకటించిన 4.0 స్టార్టప్ క్యాంపస్ విభాగంలో 4 స్టార్ రేటింగ్ సాధించింది. తాజాగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా సత్తా చాటింది. -
ఆచార్యులకు అవార్డులు
అరుణ్ కుమార్దుర్గ ప్రసాద్ రావువల్లీకుమారి జాలాది రవిమద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు ఆచార్యులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు లభించాయి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏయూ కామర్స్ మేనేజ్మెంట్ విభాగాధిపతి ఆచార్య జాలాది రవి, అణుభౌతిక శాస్త్ర విభాగం ఆచార్యులు దుర్గాప్రసాద్ రావు, కంప్యూటర్ సైన్స్ విభాగం ఆచార్యులు వి.వల్లీ కుమారిలను ఎంపిక చేసి, ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డులకు ఎంపికై న ఆచార్యులను ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ అభినందించారు. అలాగే డాక్టర్ వి.ఎస్. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వాణిజ్య విభాగంలో పని చేస్తున్న డాక్టర్ గెద్దాడ అరుణ్ కుమార్కు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.విజయబాబు, ఇతర అధ్యాపకులు ఆయన్ని అభినందించారు. -
ఐఎఫ్ఆర్ –2026 నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధం
మహారాణిపేట: వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ– 2026 నిర్వహణకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో సీపీ శంఖబ్రత బాగ్చి, డీసీపీ అజిత, కమాండర్ వై.కె. కిశోర్ తో పాటు వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులతో పలు అంశాలను చర్చించారు. ఐఎఫ్ఆర్తో పాటు, మిలాన్ వేడుకలు కూడా అదే సమయంలో జరుగుతాయని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులతో పాటు సుమారు 135 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ, గెయిల్, హెచ్పీసీఎల్ వంటి సంస్థలు చేపట్టిన అభివృద్ధి పనులను నవంబర్ రెండో వారంలోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రోడ్లు, డ్రెయిన్లు, కాలువల ఆధునికీకరణ, మారుతీ జంక్షన్ వద్ద జరుగుతున్న వంతెన పనులను వేగవంతం చేయాలని సూచించారు. -
అధ్యాపకురాలి సేవలకు గుర్తింపు
డాబాగార్డెన్స్: విశాఖ ప్రభుత్వ బాలికల కళాశాల అధ్యాపకురాలు ఎం.రాధకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఆమె చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించింది. 1996లో స్కూల్ అసిస్టెంట్గా వీరనాయణంలో తన వృత్తిని ప్రారంభించిన రాధ, 2001లో నక్కపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు జూనియర్ లెక్చరర్గా పదోన్నతి పొందారు. ఆ తర్వాత ఆమె పెందుర్తి, వడ్డాది, విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేశారు. అనంతరం దేవరాపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సేవలందించిన ఆమె ప్రస్తుతం విశాఖ ప్రభుత్వ బాలికల కళాశాలలో జూనియర్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎందరో విద్యార్థులు ఆమె మార్గదర్శకత్వంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. -
కూటమి హామీలు నిలబెట్టుకోవాలి
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ జేఏసీ (అమరావతి) డిమాండ్ చేసింది. గురువారం విశాఖలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో ఏపీ జేఏసీ రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టి.వి. ఫణి పేర్రాజు మాట్లాడుతూ వెంటనే ఐఆర్ ప్రకటించాలని, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే పెండింగ్లో ఉన్న డీఏ , 11వ పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిల వివరాలను సీఎఫ్ఎంఎస్, పే స్లిప్పుల్లో చూపించాలని, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలన్నారు.కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి., మహిళా ఉద్యోగులకు రెండేళ్లు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విశాఖ, భీమలి డివిజన్లకు కొత్త కమిటీలను కూడా ఎన్నుకున్నారు. -
ఉపాధ్యాయుల కుటుంబం
తగరపువలస: వారు చదువుకు దూరమయ్యారు., కూలి పనులకే పరిమితమయ్యారు..అయితే తమ పిల్లల చదువు కోసం చూపిన త్యాగం ఎప్పటికీ ఆదర్శనీయం. పద్మనాభం మండలం రెడ్డిపల్లికి చెందిన నిరక్షరాస్యులైన రెడ్డిపల్లి సన్యాసిరావు, ఆదిలక్ష్మి దంపతులు తమ కష్టంతో అలాంటి అద్భుతాన్నే సృష్టించారు. వ్యవసాయ కూలీలుగా మొదలైన వారి జీవితం, నేడు ఒకే కుటుంబంలో ఏడుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను, ఒక బ్యాంకు ఉద్యోగిని చూస్తుండడంతోనే ఎంతో ఆనందానికి లోనవుతున్నారు. 50 ఏళ్ల క్రితం వ్యవసాయ కూలీలుగా జీవితం ప్రారంభించిన ఈ దంపతులు, తమ అపారమైన కష్టంతో రెండు ఎకరాల భూమిని సంపాదించారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆ భూమిని కూడా కరిగించి వారి చదువుకు వెచ్చించారు. ఫలితంగా వారి ఐదుగురు కుమారులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా జీవితంలో స్థిరపడ్డారు. 1998 డీఎస్సీలో పెద్ద కుమారుడు శ్రీనివాసరావు మన్యం జిల్లా కొమరాడలో, రెండో కుమారుడు త్రినాథరావు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. 2008 డీఎస్సీలో మూడో కుమారుడు ప్రసాదరావు విజయనగరం జిల్లా మెరక ముడిదాంలో, నాలుగో కుమారుడు అప్పలరాజు జీవీఎంసీ భీమిలి జోన్లో, ఐదో కుమారుడు రమేష్ విజయనగరం జిల్లా జామిలో ఉద్యోగాలు సాధించారు. కోడళ్లు కూడా ఉద్యోగులే.. ఈ కుటుంబంలో వారి పిల్లలు మాత్రమే కాదు.. వారి కోడళ్లు కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. త్రినాథరావు భార్య సుజాత విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో ఉపాధ్యాయురాలిగా, అప్పలరాజు భార్య మద్దిరెడ్డి సంతోషికుమారి పద్మనాభం మండలంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే రమేష్ భార్య జి. నిర్మల గరివిడిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులే గురుబ్రహ్మలు సన్యాసిరావు, ఆదిలక్ష్మి చదువుకోకపోయినా తమ పిల్లలకు అక్షర జ్ఞానమే కాదు, జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో నేర్పించారు. వారి త్యాగం, కష్టం ఈ కుటుంబానికి మార్గదర్శమయ్యాయి. ఈ కుటుంబాన్ని చూసి ఉత్తరాంధ్రలోని యువత ఉద్యోగాల కోసం ప్రేరణ పొందుతున్నారు. ఒక నిరక్షరాస్యులైన దంపతులు తమ కష్టంతో చూపిన ఈ గొప్ప విజయం, ఈ త్యాగమూర్తులను గురుబ్రహ్మలుగా తీర్చిదిద్దింది. మా కుటుంబం చేసుకున్న పుణ్యమే ఒక ఇంట్లో ఒక ఉద్యోగమే గగనమైన రోజుల్లో 27 ఏళ్ల క్రితం ఇద్దరు, 17 ఏళ్ల క్రితం ముగ్గురికి సమాజాన్ని సరిదిద్దే ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడం ఇదంతా మా అత్తామామల పుణ్యమే. – సంతోషికుమారి, ఉపాధ్యాయురాలు, రౌతులపాలెం పద్మనాభం -
మేయర్పై గరం..గరం
డాబాగార్డెన్స్: నగర మేయర్ పీలా శ్రీనివాసరావు వ్యవహారశైలిపై సొంత పార్టీ కార్పొరేటర్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని, అధికారులతోనూ సమన్వయం పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. దీనికి నిదర్శనంగా గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని చూపుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం సెక్షన్ 97ఏ ప్రకారం కొత్తగా ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ తొలి సమావేశం కమిషనర్ నిర్ణయం ప్రకారం నిర్వహించాలి. కానీ మేయర్ కార్యాలయం ఈ నిబంధనను పక్కనపెట్టి, కార్యదర్శి సంతకంతో ఒకరోజు ముందు మాత్రమే అజెండాను సభ్యులకు పంపింది. దీనివల్ల అజెండాలోని అంశాలను పరిశీలించడానికి తగినంత సమయం దొరకలేదని సభ్యులు మండిపడుతున్నారు. మేయర్ ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని, ఇది నగర పాలనకు మంచిది కాదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కమిషనర్కు వినతి: పైన పేర్కొన్న విషయమై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్, జీవీఎంసీ స్థాయీ సంఘం సభ్యురాలు సాడి పద్మారెడ్డి మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్గార్గ్కు వినతి పత్రం అందజేశారు. సమావేశ నోటీసు రద్దు చేయాలని, స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిబంధనల ప్రకారం కచ్చితంగా నిర్వహించాలని ఆమె అభ్యర్థించారు. పలు అభివృద్ధి పనులకు ఆమోదం: స్థాయీ సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు. 198 అంశాలు అజెండాలో పొందుపరచగా, సభ్యులు చర్చించిన అనంతరం 194 అంశాలు ఆమోదించారు. 4 అంశాలు వాయిదా వేశారు. సమావేశంలో సభ్యులు కొణతాల నీలిమ, గంకల కవిత, దాడి వేంకటరామేశ్వరరావు, మొల్లి హేమలత, సేనాపతి వసంత, గేదెల లావణ్య, మాదంశెట్టి చిన్నతల్లి, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు, మొల్లి ముత్యాలు, సాడి పద్మారెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. నిర్వహణకే రూ.35 కోట్లా? తాగునీటి సరఫరా, నిర్వహణ అంశాలపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో అసంపూర్తిగా ఉన్న పనులు, వాటి నిర్వహణపై అధికారులను ప్రశ్నలతో నిలదీశారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడు రాపర్తి త్రివేణి వరప్రసాదరావు మాట్లాడు తూ నగరంలో టెలిఫోన్ వైర్ల కోసం రోడ్లపై తవ్విన గుంతలను సరిచేసే బాధ్యత ఎవరిదని అధికారులను ప్రశ్నించారు. గత ఆరు నెలల్లో కేబుల్ కంపెనీల నుంచి ఎంత నష్టపరిహారం వసూలు చేశారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మరమ్మతుల కోసం కొనుగోలు చేసిన మెటీరియల్ను ఎక్కడపడితే అక్కడ వదిలివేయడంతో అవి తుప్పు పట్టిపోతున్నాయని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తా రని నిలదీశారు. మరో సభ్యురాలు సాడి పద్మారెడ్డి మాట్లాడుతూ మోటార్లు ఆగిపోతే వాటికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ కూడా లేకపోవడంపై మండిపడ్డారు. ‘మోటార్ల నిర్వహణ కోసం రూ.35 కోట్లు కేటాయిస్తున్నారు, కానీ స్పేర్ పార్ట్స్ లేకపోతే ఆ నిధులు దేనికి?’ అని ప్రశ్నించారు. తాగునీటి సరఫరాలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని ఈ సందర్భంగా ఆమె అధికారులను కోరారు. ఇలా అయితే ర్యాంకు వెళ్లిపోవడం ఖాయం పారిశుధ్య నిర్వహణపై సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2025–26 సంవత్సరానికి 49.66 లక్షల అంచనా వ్యయంతో కొబ్బరి చీపుర్ల కొనుగోలు ప్రతిపాదన చర్చకు వచ్చినప్పుడు సభ్యులు అధికారులను నిలదీశారు. సభ్యురాలు సాడి పద్మారెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు చీపుర్లు వంటి ఉపకరణాలు అందజేసే ముందు స్థానిక కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో సభ్యుడు రాపర్తి త్రివేణి వరప్రసాదరావు మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. స్వచ్ఛభారత్ ర్యాంకింగ్లో జీవీఎంసీ 9వ ర్యాంకుకు పడిపోయిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది ర్యాంకు 90కి పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఈ అంశాన్ని దాట వేశారు.. ఏయూ ప్రాంగణాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ప్రైవేట్ కార్మికులకు చెల్లింపుల అంశంపై స్టాండింగ్ కమిటీలో చర్చ జరిగింది. ఈ అంశాన్ని సభ్యురాలు సాడి పద్మారెడ్డి లేవనెత్తారు. మే 12న ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ, ఏయూ గ్రౌండ్స్లో మూడు షిఫ్టుల్లో 900 మంది ప్రైవేట్ కార్మికులను రోజువారీ వేతనం రూ. 549 చొప్పున నియమించడంపై ఆమె ప్రశ్నించారు. అసలు ఏయూ ప్రాంగణాల్లో జీవీఎంసీ పారిశుధ్య పనులను ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, మేయర్ పీలా శ్రీనివాసరావు ‘తర్వాత చర్చిద్దాం’ అంటూ ఆ అంశాన్ని దాటవేశారు. దీంతో పద్మారెడ్డితో పాటు ఇతర సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం
మహారాణిపేట: జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పి.ఎస్.నరసింహ గురువారం సాయంత్రం విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. వీరికి జిల్లా సెషన్స్ జడ్జి చిన్నంశెట్టి రాజు, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి, పలువురు న్యాయమూర్తులు స్వాగతం పలికారు. వారంతా ఉదయం 09.30 గంటలకు రాడిసన్ బ్లూలో జరిగే ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్లోను, ఉదయం 11.30 గంటలకు నొవోటల్ హోటల్లో జరిగే దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు అక్కడ జరిగే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సమావేశంలో పాల్గొంటారు. -
మళ్లీ ఎండలు మొదలు!
సాక్షి, విశాఖపట్నం: రానున్న మూడు రోజులపాటు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎండలు తీవ్రం కానున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి తదితర జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. రుతుపవనాల అస్థిర పరిస్థితుల కారణంగానే వేసవిని తలపించేలా ఎండలు ఉండబోతున్నాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఈ నెల 9 వరకు పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. తర్వాత మరోసారి వర్షాలు పడే అవకాశాలున్నాయి.ఈ నెల 8న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో వర్షాలు జోరందుకోనున్నాయి. మరోవైపు.. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశి్చమ–వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఉత్తర ఛత్తీస్గఢ్, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
పదేళ్ల తర్వాత యుద్ధ నౌకల పండగ
సాక్షి, విశాఖపట్నం : అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే మహోజ్వల ఘట్టానికి విశాఖ నగరం మరోసారి వేదికగా మారుతోంది. నీలి కెరటాల్లో నౌకదళ పరాక్రమాన్ని చాటిచెప్పే విన్యాసాలకు తూర్పు నౌకాదళం ఆతిథ్యమివ్వబోతోంది. దాదాపు పదేళ్ల తర్వాత.. విశాఖ నగరంలో యుద్ధ నౌకల పండుగగా పిలిచే.. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2026 నిర్వహించేందుకు భారత నౌకాదళం ప్రణాళికలు రూపొందించింది. ఫిబ్రవరిలో ఐఎఫ్ఆర్తో పాటు మిలాన్–2026 కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 24 వరకూ ఐఎఫ్ఆర్తో పాటు మిలాన్–2026ని విశాఖలో నిర్వహించనున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా దాదాపు 145 దేశాలకు ఆహ్వానాలు పంపించేందుకు సమాయత్తమవుతుండగా.. చైనాని పిలవాలా వద్దా అనే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నాయి. నౌకాదళ పరాక్రమాన్ని చాటిచెప్పేలా 2026 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)కు విశాఖ మహా నగరం ఆహ్వానం పలకనుంది. తూర్పు నావికాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం.. అనేక ఆధునిక యుద్ధ వ్యవస్థలతో మన సైనిక సంపత్తిలో కీలక స్థానం సంపాదించింది. ఇప్పుడు అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శన పేరు చెప్తే వెంటనే విశాఖ గుర్తొచ్చే స్థాయికి ఎదిగింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో 2022లో ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ని విజయవంతంగా నిర్వహించింది. అదేవిధంగా.. 2024 ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో మిలాన్ విన్యాసాల్ని మరోసారి నిర్వహించింది. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎఫ్ఆర్కు ఆతిథ్యమిస్తోంది.ఏమిటీ ఫ్లీట్ రివ్యూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో ఎదురుదాడికి దిగగల తన సత్తాను ప్రపంచదేశాలకు చాటిచూపించేవే ఫ్లీట్ రివ్యూలు. త్రివిధ దళాల అధిపతి అయిన రాష్ట్రపతి ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. మనదేశంలో 2001లో ముంబైలోనూ 2016లో విశాఖలో ఐఎఫ్ఆర్ని నిర్వహించారు. ప్రస్తుతం మరోసారి అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలకు విశాఖ వేదికగా నిలవబోతోంది.చంద్రగుప్తుని కాలంనుంచే భారతీయులు సముద్రయానంపై మంచి పట్టు సాధించినట్లు చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి నేడు స్వయం శక్తితో అణుజలాంతర్గాములు నిర్మించే స్థాయికి చేరుకున్న భారత్ ప్రపంచదేశాలను ఆకర్షిస్తూ ఉంది. అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనతో ప్రపంచదేశాలు మరోసారి విశాఖతీరంవైపు దృష్టిసారించనున్నాయి. చైనాని పిలవాలా..వద్దా.? ఇటీవల చైనాతో చర్చలు జరిగిన నేపథ్యంలో.. ఐఎఫ్ఆర్కు చైనాని ఆహ్వానించాలా వద్దా అనే అంశంపై రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్చలు జరుపుతోంది. 2016లో నిర్వహించిన ఐఎఫ్ఆర్కు చైనాని ఆహ్వానించగా రెండు యుద్ధ నౌకలు, ఓ జలాంతర్గామి విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి. ఈసారి ఆహ్వానం అందించాలా వద్దా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తోందని నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకూ భారత్లో జరిగే ఏ విన్యాసాలకు పాక్ని ఆహ్వానించలేదు. రాబోతున్న ఐఎఫ్ఆర్, మిలాన్–2026కి కూడా ఆహ్వానం లేదని రక్షణ వర్గాలు తెగేసి చెబుతున్నాయి. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలకు చెందిన దేశాలు ఐఎఫ్ఆర్లో భాగస్వామ్యం కాబోతున్నాయి.తొలిసారి 25..మూడోసారి 1452001లో భారత్లో తొలిసారి ముంబైలో ఐఎఫ్ఆర్ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్ఆర్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో 145 దేశాలకు ఆహ్వానం పంపించాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు ఇండియన్ నేవీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.. ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్దనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ టాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్, గ్రీన్టగ్స్ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి. -
అభివృద్ధి పనులపై సమీక్ష
తాటిచెట్లపాలెం : ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎం) రీటా రాజ్ బుధవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్లో పర్యటించారు. రీటారాజ్ పీసీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖలో పర్యటించారు. ప్రయాణికుల సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా దొండపర్తిలో గల డివిజినల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో డీఆర్ఎం లలిత్ బోహ్ర, ఇతర ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. కమర్షియల్ విభాగానికి చెందిన పలు అంశాలు, నాన్ఫేర్ రెవెన్యూకు సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు. సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ డివిజన్ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. సమావేశంలో వాల్తేర్ డివిజన్ కమర్షియల్, ట్రాఫిక్ విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
ఈఎన్సీలో హిందీ పక్షోత్సవాలు ప్రారంభం
సింథియా: తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 2 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న హిందీ పక్షోత్సవాలను చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్టేషన్) అడ్మిరల్ మురళీమోహన్రాజు ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా హిందీ పోటీలు, వర్క్షాపులతో సహా పలు కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 17న సంస్థ హిందీ మ్యాగజైన్ పూర్వి వాణి 31వ ఎడిషన్ ఆవిష్కరణతో వేడుకలు ముగుస్తాయని పేర్కొంది. ప్రారంభ వేడుకల్లో తూర్పు నావికాదళ పరిధిలోని వివిధ నౌకల సిబ్బంది, పలు సంస్థల పౌర సిబ్బంది పాల్గొన్నారు. -
సుగాలి ప్రీతికి న్యాయం జరగాల్సిందే..
అల్లిపురం/ఎంవీపీకాలనీ: గిరిజన బాలిక సుగాలి ప్రీతి హత్య కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆమెను దారుణంగా హత్య చేసి ఎనిమిదేళ్లు గడిచినా నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. అల్లిపురంలో న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జైభీమ్ భారత్ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ నిందితులను తప్పించడానికే అభియోగ పత్రంలో అత్యాచారం, హత్య సెక్షన్లను తొలగించారని ఆరోపించారు. నిందితులకు శిక్ష పడితేనే అసలైన న్యాయం జరుగుతుందన్నారు. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచా నాగ మల్లేశ్వరి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఈ దారుణం జరిగిందన్నారు. ఇప్పు డు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉందని, రాజకీయ ఒత్తిడితోనే ఈ కేసును నీరుగారుస్తున్నారని విమర్శించారు. న్యాయవాది సలీం మాట్లాడుతూ దళిత, ఆదివాసీలకు అన్నివిధాలా అండగా నిలుస్తామన్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గవర్నర్, రాష్ట్రపతిని కలిసి వినతిపత్రాలు సమర్పించాలని తీర్మానించారు. సమావేశంలో జై భీమ్ భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు ఎస్.చొక్కారావు, పలు సంఘాల ప్రతినిధులు ఉమామహేశ్వరరావు, అప్పన్న, భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎంపీ కాలనీలోని గిరిజన భవన్లో జరిగిన సమావేశంలో జడ శ్రావణ్కుమార్ మాట్లాడారు. సుగాలి ప్రీతి హత్య కేసు విచారణలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు -
అప్పలరాజుకు రాంపాల్ సింగ్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
తగరపువలస: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య మాజీ అధ్యక్షుడు రాంపాల్ సింగ్ పేరుమీద నెలకొల్పిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు భీమిలి జోన్ ఒకటోవార్డు సంతపేట అంబేడ్కర్ జీవీఎంసీ హైస్కూల్కు చెందిన ఉపాధ్యాయుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ బందాలోని రాంపాల్సింగ్ ఉత్తమ ఉపాధ్యాయ సెలక్షన్ కమిటీ ఫౌండేషన్ ప్రధానకార్యదర్శి ప్రేమ్కుమార్ సింగ్ ఈ మేరకు సమాచారం అందించారు. అప్పలరాజుకు ఈ నెల 22న బందాలో మొమెంటో, సర్టిఫికెట్, నగదు బహుమతి అందించనున్నారు. సాయి సంహిత ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న అప్పలరాజును పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. -
ఉత్కంఠ పోరులో హర్యానా గెలుపు
విశాఖ స్పోర్ట్స్: నగరంలోని పోర్టు స్టేడియంలో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ స్థానిక క్రీడాభిమానులకు ఉత్కంఠతో పాటు ఉత్సాహం నింపుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లు అసలైన కబడ్డీ మజాను పంచాయి. ఒక మ్యాచ్లో పునేరి పల్టన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ ఊపిరి బిగపట్టి చూసేలా అద్భుత విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్లో పునేరి పల్టన్ జట్టు వరసగా మూడో విజయాన్ని నమోదు చేస్తూ తమ జైత్రయాత్రను కొనసాగించింది. బెంగాల్ వారియర్స్తో జరిగిన ఈ పోరులో పల్టన్ 45–36 పాయింట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. జట్టు కెప్టెన్ అస్లాం, ఆదిత్య చెరో 11 పాయింట్లతో రైడింగ్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. మరోవైపు బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంక్ ఒంటరి పోరాటం చేసి 17 పాయింట్లు సాధించినా, జట్టును గెలిపించలేకపోయాడు. రెండో మ్యాచ్ క్రీడాభిమానులకు అసలైన థ్రిల్లర్ను పరిచయం చేసింది. డిఫెండింగ్ చాంపియన్ హర్యానా స్టీలర్స్.. యూ ముంబాతో తలపడిన ఈ మ్యాచ్లో చివరి క్షణం వరకు విజయం దోబూచులాడింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 36–36తో సమంగా నిలిచాయి. దీంతో విజేతను తేల్చేందుకు టైబ్రేకర్ అనివార్యమైంది. టైబ్రేకర్లో రైడర్ శివమ్ పటారే ఒకే రైడ్లో మూడు పాయింట్లు సాధించి హర్యానాను గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ ఉత్కంఠభరిత విజయం స్టీలర్స్కు ఈ సీజన్లో తొలి గెలుపును అందించింది. అజిత్ కుమార్ 12 పాయింట్లతో యూ ముంబా తరఫున పోరాడినా ఫలితం లేకపోయింది. గురువారం జైపూర్ పింక్ పాంథర్స్, తెలుగు టైటాన్స్, పునేరి పల్టన్, దబాంగ్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. కొనసాగిన పునేరి జోరు -
శ్లాబ్ పెచ్చులూడి తల్లీబిడ్డకు గాయాలు
స్థానికుల సహాయంతో కేజీహెచ్కు తరలింపు జగదాంబ: జీవీఎంసీ 35వ వార్డు దుర్గమాంబ సమాజం వీధిలోని ఓ ఇంటి శ్లాబ్ పెచ్చులూడి పడటంతో తల్లీకూతురుకు గాయాలయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇల్లు బాగా తడిసిపోయింది. ఆ ఇంట్లో నివాసం ఉంటున్న ముద్దా భువనేశ్వరి తన 13 నెలల కుమార్తెతో కలిసి మంగళవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా శ్లాబ్ పెచ్చులు ఊడి వారి మీద పడ్డాయి. ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లిద్దరికీ కాలిపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని కేజీహెచ్కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ వార్డు అధ్యక్షుడు కనకరెడ్డి ప్రమాదానికి గురైన తల్లీబిడ్డలను పరామర్శించారు. ఏఎస్డబ్ల్యూవో నిర్లక్ష్యం200 మందికి వేతనాల చెల్లింపులో జాప్యంతగరపువలస: పాయకరావుపేట ఏఎస్డబ్ల్యూవో నిర్లక్ష్యం కారణంగా ఆగస్టు నెలకు సంబంధించి విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని సుమారు 200 మంది సాంఘిక సంక్షేమ వసతిగృహాల సిబ్బంది జీతాలు ఆలస్యం కానున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖలో ఏపీసీవోలుగా పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల డ్యూటీ సర్టిఫికెట్లు ప్రతి నెలా 25లోగా విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన భీమిలి, విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపేట ఏఎస్డబ్ల్యూవోలు విశాఖలోని సాంఘిక సంక్షేమశాఖకు పంపించాలి. గత నెలలో నలుగురు ఏఎస్డబ్ల్యూవోలు డ్యూటీ సర్టిఫికెట్లు పంపించగా, పాయకరావుపేట నుంచి ఏఎస్డబ్ల్యూవో పంపించలేదు. ఫలితంగా సాంఘిక సంక్షేమశాఖలోని ఏపీసీవోలు, వార్డెన్లు, డిప్యూటీ డైరెక్టర్లు, సూపరింటెండింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది కలిపి సుమారు 200 మందికి జీతాలు నిలిచిపోయాయి. వీరి కి ప్రతి నెలా ఒకటో తేదీకి జీతాలు అందవలసి ఉండగా, ఇప్పుడు 15రోజులు ఆలస్యమయ్యేలా ఉంది. ఏపీసీవోల డ్యూటీ సర్టిఫికెట్ల పంపించడంలో జాప్యం చేసిన ఏఎస్డబ్ల్యూవోకు గత నెల 30న డిప్యూటీ డైరెక్టర్ మెమో జారీ చేశారు. దీనిపై మూడు రోజులలోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. -
సీఐపీఈటీతో సింహాద్రి ఎన్టీపీసీ ఒప్పందం
పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల యువతకు నైపుణ్యాభివృద్ధిశిక్షణ ద్వారా ఉపాధి, ఆదాయ వనరులను కల్పించేందుకు సింహాద్రి ఎన్టీపీసీ కృషి చేస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రాజెక్టు హెడ్ సమీర్శర్మ అన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పించేందుకు వీలుగా విజయవాడలోని సీఐపీఈటీతో ఎన్టీపీసీ సింహాద్రి బుధవారం ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం సంస్థ ఈడీ సమీర్శర్మ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంస్థ సీఎస్సార్ విభాగం సౌజన్యంతో పరవాడ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి వీలుగా సీఐపీఈటీతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఒప్పందం మేరకు 2025–26లో మూడు బ్యాచ్లకు వసతులతో కూడిన శిక్షణ కల్పించనున్నారు. బ్యాచ్కు 30 మంది చొప్పున శిక్షణ పొందుతారు. మెషిన్ ఆపరేటర్–ఇంజెక్షన్ మోడలింగ్, మెషిన్ ఆపరేటర్–ప్లాస్టిక్ ప్రాసెసింగ్లో నాలుగు నెలల పాటు శిక్షణ కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సుగాలి ప్రీతి కేసుపై హైలెవల్ కమిటీ వేయాలి
సాక్షి, విశాఖపట్నం: సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసి, అందులో సీబీఐని భాగస్వామ్యం చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు డిమాండ్ చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కె.భాగ్యలక్ష్మి, జీసీసీ మాజీ చైర్పర్సన్ స్వాతిరాణితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన బాలిక సుగాలి ప్రీతి హత్య జరిగింది. అప్పటి ప్రభుత్వం ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేసింది. ప్రీతిని అత్యంత పాశవికంగా హత్య చేసినా, నిందితులను చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు, ఇప్పుడు కాపాడుతోంది. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఇదే చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఈ కేసు గురించి ఊగిపోయి మాట్లాడిన పవన్, అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు. సుగాలి ప్రీతి తల్లి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను ఆదుకున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరగడం లేదని మీడియా సాక్షిగా వాపోయారు. ఆదివాసీలంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే..’ అని రవిబాబు అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ కేసును వాడుకున్నారని ఆరోపించిన రవిబాబు.. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సుగాలి ప్రీతి కోసం ఎక్కడ పోరాటం జరిగినా.. వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, నంద్యాల ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి నాగసారి సుంకన్న, అల్లూరి జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు డాక్టర్ టి.సురేష్కుమార్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దండు మధు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ డిమాండ్ -
టీడీఆర్ బాండ్లు వద్దే వద్దు..
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణ బాధితులు కదంతొక్కారు. నష్టపరిహారాన్ని టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలోనే అందించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయం ఎదుట బుధవారం నిరసనకు దిగారు. ఇళ్లు, దుకాణాలు, భూములకు ఒకేసారి నష్టపరిహారం చెల్లించాలని నినదించారు. అనంతరం రోడ్డు విస్తరణ నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఆర్.రాము ఆధ్వర్యంలో నిర్వాసితులు వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్కు వినతిపత్రం అందజేశారు. గతంలో నిర్వహించిన గ్రామ సభల్లో టీడీఆర్ బాండ్లు వద్దని నిర్వాసితులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారని, అయినా టీడీఆర్ బాండ్లే ఇస్తామని అధికారులు పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వాపోయారు. మరోవైపు మూడు రోజుల క్రితం అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణ నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలంటూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేయడంపై మండిపడ్డారు. నిర్వాసితులంతా పేదవారని, వారికి టీడీఆర్ బాండ్లు ఏమాత్రం ఉపయోగపడవని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నగదు రూపంలో నష్ట పరిహారం అందించి, తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వమే ఉపాధి కల్పించాలన్నారు. 100 అడుగుల తర్వాత నిర్మించుకునే ఇళ్లకు ఎటువంటి నిబంధనలు విధించరాదన్నారు. మూడు నియోజకవర్గాలు.. 1225 మంది బాధితులు అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణ కోసం మూడు నియోజకవర్గాల పరిధిలో 125 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఈ భూముల్లో దాదాపుగా 1225 మంది నిర్వాసితులున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దేవుడి మాన్యంలో ఉన్న 12 మంది నిర్వాసితులకు, ఆర్అండ్బీ, పీడబ్ల్యూ స్థలాల్లో ఉన్న 62 మంది నిర్వాసితులకు బలవంతంగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. మిగిలిన నిర్వాసితులెవ్వరూ టీడీఆర్ బాండ్లు తీసుకోకుండా వ్యతిరేకించారు. కమిషనర్కు వినతి ఇస్తే.. సమాధానమే లేదు మాకు టీడీఆర్ బాండ్లు వద్దు.. నష్ట పరిహారంగా నగదు ఇవ్వాలి. 2023లో గ్రామాల వారీగా ధర నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నష్ట పరిహారం ఇవ్వడానికి అంతా సిద్ధం చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ జీవో రద్దు చేశారు. గత నెల 31న టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ జీవో ఇచ్చారు. వీఎంఆర్డీఏ కమిషనర్ను కలిసి టీడీఆర్ బాండ్లు వద్దు అని కోరాం. మాకు సంబంధం లేదని సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. – కర్రి అప్పారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, తిమ్మరాజు పేట, అచ్యుతాపురం మండలం -
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/వాకాడు: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఉత్తర ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. 24 గంటల్లో ఇది పశ్చిమ, వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు కదిలేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయంది. బుధవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 5. 4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లా గాజువాకలో 5.3, అనకాపల్లి జిల్లా వేంపాడులో 4.4, విశాఖ జిల్లా నాతయ్యపాలెంలో 4.4, విజయనగరం జిల్లా మెరకముడిదంలో 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అల్పపీడనం ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సముద్ర తీరంలో అలల ఉధృతి..అల్పపీడనం బలపడటంతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో అలల ఉధృతి అధికమైంది. ఒక్కో సమయంలో సముద్రం నిశ్చలంగా, ఒక్కోసారి అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. సాధారణంగా అల్పపీడనం సమయంలో సముద్రంలో అలలు ఎక్కువగా ఉండడంతోపాటు తీరం దాటే వరకు నిరంతరం కెరటాలు ఎగసి పడుతుంటాయి. ఈసారి అలా కాకుండా సముద్రం గంట గంటకు మార్పు చెందుతూ భయబ్రాంతులకు గురిచేస్తోంది. ప్రస్తుతం వినాయక విగ్రహ నిమజ్జనాల పర్వం తూపిలిపాళెం సముద్ర తీరంలో కొనసాగుతోంది. అలలు లేని సమయం కోసం భక్తులు ఎదురు చూసి నిమజ్జనం చేస్తున్నారు. వాకాడు పోలీసులతోపాటు దుగ్గరాజపట్నం మెరైన్ పోలీసులు భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు వేట నిలిపివేశారు. -
ఉత్తమ గురువులకు పురస్కారాలు
ఆరిలోవ: సమాజమనే సౌధానికి గురువులే పునాది రాళ్లు. తమ జ్ఞానమనే దీపంతో వేలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే నిస్వార్థ శిల్పులు ఉపాధ్యాయులు. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యా య పురస్కారాలకు జిల్లా నుంచి ముగ్గురు గురువులు ఎంపికయ్యారు. వారి అంకితభావానికి, కృషికి దక్కిన గౌరవమిది. ఆ రోజున అమరావతిలో ఈ పురస్కారాలను అందుకోనున్నారు. ఆంగ్ల బోధనలో మేటి గాజువాక: అక్కిరెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిమెట్ల కుమారస్వామి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారానికి ఎంపికయ్యారు. 35 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఆయన.. గత రెండేళ్లుగా అక్కిరెడ్డిపాలెం పాఠశాలలో సేవలందిస్తున్నారు. బోధనలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న ఆయన 2019 లోనే జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును అందుకున్నారు. 2021లో 7వ తరగతి విద్యార్థుల కోసం ఒక ఆంగ్ల పాఠ్యపుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2023 వరకు అధికారికంగా అమలులో ఉంచింది. ఆ తర్వాత సీబీఎస్ఈ సిలబస్ అమలు కావడంతో పుస్తకాలు మారాయి. బోధనాంశాల్లో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడంలో కుమారస్వామి దిట్ట అని తోటి ఉపాధ్యాయులు ప్రశంసిస్తున్నారు. సేవా నిరతికి నిలువుటద్దం పెదగంట్యాడ: యారాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న గడ్డం మేరీ సుజాత తన విశేష సేవలకు గాను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికయ్యారు. మచిలీపట్నంలో జన్మించిన ఆమె, 1997లో మాడుగులలో తన ఉపాధ్యాయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పలు పాఠశాలల్లో పనిచేసి, 2024లో యారాడ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చారు. కేవలం బోధనకే పరిమితం కాకుండా, పాఠశాల అభివృద్ధిని తన బాధ్యతగా స్వీకరించా రు. తన సొంత నిధులతో పాఠశాలకు అవసరమైన సామగ్రిని సమకూర్చారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, పాఠశాల ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాకుండా విద్యార్థులను సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ వారిలో బాధ్యతను పెంపొందిస్తున్నారు. ఆ మె నిస్వార్థ సేవకు ఈ పురస్కారం సరైన గుర్తింపు అని తోటి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.