Visakhapatnam
-
విశాఖ ప్రమాదం: పైడిరాజు కన్నుమూత
కంటతడి పెట్టిస్తున్న ఆ వీడియో ఇప్పుడు ఒక కుటుంబానికి మాత్రమే కాదు.. మొత్తం సమాజానికి గుండె బరువెక్కే జ్ఞాపకంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు పైడిరాజు, ప్రాణాల కోసం పోరాడుతూ తన కుటుంబానికి చివరిసారిగా చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. అయితే మృత్యువుతో జరిగిన పోరాటంలో చివరకు ఆయన ఓడారు.సాక్షి, విశాఖపట్నం: “వర్మా… తమ్ముడి మీద ఎప్పుడూ చిరాకు పడకే. తమ్ముడిని బాగా చదివించురా… నువ్వు కూడా బాగా చదువుకోమ్మా… అమ్మని బాగా చూసుకోండి… ఉంటాను డాడీ” అంటూ ఆయన చెప్పిన మాటలు వీడియో రూపంలో వైరల్ అయ్యాయి. ఆ మాటలతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒంటినిండా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ క్షణాల్లోనే, భవిష్యత్తుపై భయంతో ఆయన తన పిల్లలకు జాగ్రత్తలు చెప్పిన తీరు ఇటు మీడియాలో, అటు నెట్టింట వైరల్ అయ్యింది.అయితే బతుకుతారేమోనన్న ఆశలు ఎక్కువసేపు నిలవలేదు. సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పైడిరాజు మృతి చెందారు. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రాణాలతో పోరాడుతూనే, తన కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించిన ఆ తండ్రి మాటలు ఇప్పుడు అందరి గుండెల్లో నిలిచిపోయాయి.కూటమి రాజకీయం!విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనలో కూటమి సర్కార్ కుట్ర రాజకీయాలకు తెర తీసింది. కేజీహెచ్ నుంచి పైడి రాజు మృతదేహాన్ని ఆగమేఘాల మీద తరలించింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శకు వస్తున్నారని తెలిసి.. హడావిడిగా బంధవులకు అప్పగించారు అధికారులు. మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లాలని.. త్వరగా అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు ఒత్తిళ్లు చేసినట్లు సమాచారం. నిన్న మృతదేహాలకు 12గంటలకు పైగా సమయం తీసుకున్న పోలీసులు ఇవాళ గంటలోనే పైడి రాజు మృతదేహాన్ని తరలించడం గమనార్హం. -
మృతదేహాల మధ్య సేవలు.. గుర్తింపులేని యోధులు
విశాఖపట్నం: స్టీల్ప్లాంట్ ప్రమాదంలో మృతదేహాలకు శవపరీక్షలు (పోస్టుమార్టం) చేసే మార్చురీ సిబ్బంది పరిస్థితి దారుణంగా మారింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు సోమవారం అర్థరాత్రి 12 గంటల నుంచే మార్చురీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటనా స్థలం నుంచి ఒక్కొక్కటిగా వస్తున్న మృతదేహాలను స్వీకరిస్తూ.. వారు అలుపెరగకుండా సేవలందిస్తున్నారు. ప్రమాద తీవ్రత కారణంగా కుళ్ళిపోయే దశకు చేరిన మృతదేహాలకు సైతం పోస్టుమార్టం నిర్వహించడం, తిరిగి కుట్లు వేయడం వంటి విధులను సిబ్బంది ఎంతో శ్రమకోర్చి చేస్తున్నారు. ఆ దుర్వాసన, ఇన్ఫెక్షన్ల వల్ల తాము ఎక్కడ అనారోగ్యం బారిన పడతామోనన్న భయంతోనే విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు మృతుల కుటుంబాలు తీరని గుండెకోతతో బాధల్లో ఉంటే, మరోవైపు తెల్లవార్లూ శ్రమిస్తున్న ఈ కిందిస్థాయి సిబ్బంది బాగోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కనీసం ‘భోజనం చేశారా?’ అని అడిగేవారే లేకుండా పోయారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నన్ను వదిలి వెళ్లిపోయావా?
‘నువ్వు వస్తావని ఇంటి డోర్ వద్దే చూస్తున్నా.. ఇలా నన్ను వదిలేసి వెళ్లిపోయావా?’ అంటూ వేరొకరు.. నన్ను వదిలి వెళ్లిపోయావా? డ్యూటీకి వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న భార్యకు అంతలోనే విషాద వార్త వినాల్సి వచ్చింది. నువ్వు ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లి.. అక్కడి నుంచి అటుగానే నన్ను వదిలి వెళ్లిపోయావా? స్టీల్ప్లాంట్లో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఇలా అర్థాంతరంగా వదిలి వెళ్లిపోతారని ఏనాడూ అనుకోలేదు. మావి కూలి బతుకులు. ఇప్పుడు మాకు దిక్కెవరు. – నక్కా జోగమ్మ, మృతుడు రమణ భార్య‘12 ఏళ్ల క్రితం ఉక్కు ద్రవం పడి కాళ్లు గాయపడ్డాయి.. నేడు ఏకంగా ఆ ఉక్కు ద్రవమే నా భర్తను మింగేసింది!’ అని ఒకరు..అప్పుడు కాలు.. ఇప్పుడు శరీరమే మసైపోయింది.. 12 ఏళ్ల కిందట నా భర్త విధి నిర్వహణలో ఉంటుండగానే ఉక్కు ద్రవం పడి కాలు తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు ఏకంగా ఆ ఉక్కు ద్రవమే నా భర్తను పొట్టనబెట్టుకుంది. ఏంటి భగవంతుడా మాకీ కర్మ? జీవితంలో ఎన్ని కష్టాలు పడినా పిల్లలిద్దరినీ బీటెక్ చదివించారు. ఇప్పుడు అకస్మాత్తుగా నా భర్తను దూరం చేసి మమ్మల్ని ఇలా రోడ్డున పడేశావు. – గొట్టాపు రాధ, మృతుడు గోట్టాపు త్రినాథ్ భార్య అన్యోన్య దాంపత్యాన్ని చూసి దేవుడికే కన్ను కుట్టి.. ‘పిల్లల్ని బాగా చూసుకో’ అంటూ మధ్యాహ్నం పెట్టిన మెసేజే నా భర్త ఆఖరి మాట అవుతుందనుకోలేదు’ అని మరొకరు.. ‘మాది ప్రేమ వివాహం. 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. మాకు ఇద్దరు పిల్లలు ధను‹Ù, లోకేష్ 6, 7 తరగతులు చదువుతున్నారు. సోమవారం విధులకు వెళ్లిన నా భర్త, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఫోన్కు మెసేజ్ చేశారు. ‘పిల్లలకు ఒంట్లో బాగోలేదు, వారిని కనిపెట్టుకుని ఉండు’ అని చెప్పారు. ఇంతలోనే ఇంతటి ఘోరవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. ప్రేమ వివాహం చేసుకుని పిల్లలతో అన్యోన్యంగా ఉన్న తమ కుటుంబాన్ని చూసి భగవంతుడికి కన్ను కుట్టిందనుకుంటా. సాయంత్రం దేవుడి గదిలో దీపం పెడదామనుకుంటే.. ఏకంగా భర్త జీవితమే దీపంలా ఆరిపోతుందని ఊహించలేకపోయాను. –గొందేశి రాజమ్మ, మృతుడు వెంకటప్పారావు భార్య ఇలా మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా చేసిన ఆక్రందనలు.. కన్నీటి రోదనలతో కేజీహెచ్ మార్చురీ ప్రాంగణం శోకసంద్రంగా మారిపోయింది. విశాఖ స్టీల్ప్లాంట్లో సంభవించిన ఘోర ప్రమాదం ఎనిమిది మంది శ్రామికుల ప్రాణాలను బూడిద చేయడమే కాకుండా, వారిని నమ్ముకున్న కుటుంబాల జీవితాల్లో ఎప్పటికీ పూడ్చలేని చీకట్లను నింపింది. బతుకుదెరువు కోసం నిరంతరం స్వేదం చిందించే ఆ కార్మికులపై, సుమారు 1,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసల మరిగే ఉక్కు ద్రవం మృత్యువులా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది శ్రామికులు సజీవ దహనమై బొగ్గు ముద్దల్లా మారిపోయారు. కేజీహెచ్ మార్చురీ వద్ద మంగళవారం నిర్వహించిన పోస్టుమార్టం ప్రక్రియ, ఆపై తమ వారి మృతదేహాలను చూసి బంధువులు చేసిన ఆర్తనాదాలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించాయి. -
గుమ్మం దాటిన అడుగు.. తిరిగి రాలేదు
అతడికి ఆ రోజు మామూలే అనిపించింది. టిఫిన్ తిన్నాడు. చొక్కా వేసుకున్నాడు. చేతిలో లంచ్బాక్స్ పట్టుకున్నాడు. గుమ్మం దాటుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు..భార్య అక్కడే నిలబడి సాగనంపింది. అది తన చివరి చూపు అవుతుందని అతనికి తెలియదు. లోపలున్న ఆమెకూ తెలియదు. ఆ సాయంత్రం తిరిగి రాని ఆ చూపు, ఇప్పుడు ఆ ఇంటిలో శాశ్వత నిశ్శబ్దమైపోయింది. విశాఖ స్టీల్ప్లాంట్లో మెల్టింగ్ షాప్ అంటే సాధారణ పని స్థలం కాదు. అది 1,600 డిగ్రీల సెల్సియస్ వేడి రాజ్యం. రాయి కరిగి నీరయ్యే వేడి. ఉక్కు లావాలా ప్రవహించే వేడి. ఆ నిప్పుల కొలిమి పైన వేలాడుతున్న లాడెల్ క్రేన్ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా తెగిపడింది. కరిగిన ఉక్కు వెల్లువలా ముంచెత్తింది. మిగతా కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తారు. కానీ ఆ ఎనిమిది మంది మాత్రం తప్పించుకోలేకపోయారు. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా ముద్దలైపోయాయి.ఆ రాత్రి, ఆ ఎనిమిది ఇళ్లలో దీపాలు వెలిగాయి..కానీ వెలుతురు రాలేదు.గుమ్మం వైపే చూస్తూ నిద్రపోయిన పిల్లలుఒక ఇంట్లో పిల్లలు అమ్మను అడిగారు..‘నాన్న ఎప్పుడొస్తారు?’‘రాత్రికి వస్తారు’ అని ఆమె చెప్పింది. గుమ్మం వైపు చూస్తూ చూస్తూ వాళ్లు నిద్రపోయారు. తెల్లవారింది. నాన్న రాలేదు. ఆ పిల్లలకు ఇంకా అర్థం కాలేదు..నాన్న ఇక ఎప్పటికీ రారని.మరో ఇంట్లో ముసలి తల్లి కొడుకు కోసం అన్నం వడ్డించి కూర్చుంది. అన్నం చల్లారిపోయింది. ఆమె ఆశలూ ఆవిరైపోయాయి.వీళ్లేం సరిహద్దుల్లో తుపాకులు పట్టలేదు. ప్రాణాంతక వ్యాధితో పోరాడలేదు. కేవలం పొట్టకూటి కోసం పనికి వెళ్లారు. కానీ వారు నమ్ముకున్న పని స్థలం వారికి రక్షణ ఇవ్వలేకపోయింది.అరిగిపోయిన క్రేన్లు. కాలం చెల్లిన సాంకేతికత. లాభాల కోసం ప్రాణాలను పణంగా పెట్టే నిర్ణయాలు. ఎందుకంటే ప్లాంట్ ఆపితే ప్రొడక్షన్ ఆగుతుంది, లాభాలు తగ్గుతాయి, పై అధికారులు ప్రశ్నిస్తారు. ఆ కార్పొరేట్ భయాల మధ్య ఎనిమిది మంది నిరపరాధుల ప్రాణాలు బూడిదయ్యాయి.మూడేళ్లుగా పోరాడుతూనే నడిపిన ప్లాంట్విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటి నుంచి కార్మికులు దాదాపు మూడేళ్లుగా పోరాడుతున్నారు. వేతన కోతలు, వీఆర్ఎస్ పేరుతో సిబ్బంది తగ్గింపు, ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నా..‘కన్నతల్లిలాంటి’ ఈ ప్లాంట్ను గుండెల్లో పెట్టుకుని నడిపించారు. అదే ప్లాంట్లో ఇప్పుడు అడుగుపెట్టాలంటే భయంగా ఉందని కార్మికులే చెప్తున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం తర్వాత మంగళవారం ప్లాంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆవేదన గాలిలో తేలింది.ఒకే దశాబ్దంలో మూడు విషాదాలువిశాఖను ఒకే దశాబ్దంలో మూడు పెద్ద విషాదాలు వెంటాడాయి. ఎల్జీ పాలిమర్స్, హెచ్పీసీఎల్, ఇప్పుడు స్టీల్ప్లాంట్. ప్రతిసారీ ఒకే డ్రామా పునరావృతమవుతుంది. ప్రమాదం జరుగుతుంది, విచారణ కమిటీలు వేస్తారు, నివేదికలు వస్తాయి, కేసులు పెడతారు. కొన్ని నెలల తర్వాత అంతా మర్చిపోతారు. కానీ సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలు ఎలా మర్చిపోతాయి?అంకెలుగా మిగిలిపోకూడదురేపు వీరి పేర్లు పేపర్లలో వస్తాయి. టీవీల్లో చర్చలు జరుగుతాయి. రెండు రోజుల తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో కేవలం అంకెలుగా మిగిలిపోతారు. న్యాయం అంటే కొన్ని లక్షల పరిహారం విసిరేయడం కాదు. వ్యవస్థ మారాలి. పరిశ్రమల్లో లాభాల కంటే కార్మికుల ప్రాణాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. పని కోసం ఇల్లు దాటిన ప్రతి మనిషి, క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవడం వారి హక్కు. ఆ హక్కును కాపాడడం వ్యవస్థ బాధ్యత. రేపు మరో తల్లి కన్నీరు కార్చకుండా ఉండటమే.. వీరికి ఇచ్చే నిజమైన నివాళి.– సాక్షి, విశాఖపట్నం -
స్టీల్ప్లాంట్లో ప్రమాదం వెనుక కుట్ర కోణం
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్లో ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగుందని, సంస్థ ప్రైవేటీకరణ కుట్రలతోనే ఉక్కు కర్మాగారంలో ప్రమాదాలు జరుగుతున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ రీజినల్ కో– ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కార్మికుల ప్రాణాలతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. స్టీల్ప్లాంట్ నుంచి సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్లనే భారీ ప్రమాదం జరిగిందని, ఇకనైనా సంస్థలో ఉద్యోగుల తొలగింపును ఆపాలని కోరారు. విశాఖ కేజీహెచ్లో మృతుల కుటుంబ సభ్యులను మంగళవారం వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రమాదంలో దుర్మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ తరహాలో రూ.కోటి చొప్పున పరిహారమివ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలని డిమాండ్ చేశారు. ఆ పరిహారం కోసం వైఎస్సార్సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. స్టీల్ప్లాంట్ ప్రమాద బాధితులను ఓదార్చడానికి, వారికి అండగా నిలబడడానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖ వస్తున్నారని చెప్పారు.వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్ పరామర్శించి, అనంతరం ప్లాంట్ యూనియన్ నేతలతో మాట్లాడతారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్, పార్టీ నేత రవిరెడ్డి పాల్గొన్నారు. ప్రమాదం దురదృష్టకరం : బొత్స సత్యనారాయణ స్టీల్ప్లాంట్లో జరిగిన భారీ ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 8 మంది కార్మికులు దుర్మరణం చెందగా, సెవెన్¯హిల్స్ ఆస్పత్రిలో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిమ్స్ ఆస్పత్రిలో 40 శాతం గాయాలతో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారందరూ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్ప్లాంట్ను వారి తాబేదార్లకు కట్టబెట్టాలనే కుట్రతోనే వ్యవహరిస్తోంది. మిషనరీ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఇప్పటికే శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతా కలిపి దాదాపు 10 వేల మందిని అన్యాయంగా తొలగించారు. ఇకనైనా బలవంతపు వీఆర్ఎస్లను ఆపాలి. విశాఖ స్టీల్ప్లాంట్ కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు.. అది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక. కార్మికుల హక్కుల కోసం వైఎస్సార్సీపీ తరఫున రాజీలేని పోరాటం చేస్తాం.లోకేశ్ తీరు దారుణం: కురసాల కన్నబాబు మృతిచెందిన స్టీల్ప్లాంట్ కార్మికుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్... సమస్యలపై ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదు. రాజకీయం చేస్తున్నారా మీరు..? మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయారా..?అంటూ మంత్రి మాట్లాడడం దారుణం. తోటి కార్మికులు చనిపోయారనే బాధ, ఆవేదనతో కార్మికుల పక్షాన ప్రశ్నించినందుకు కార్మిక సంఘాల నాయకులతో లోకేశ్ మాట్లాడిన తీరు చాలా దారుణంగా ఉంది. అధికారంలో ఉన్న వారికి ఓపిక, సహనం, బాధ్యత ఉండాలి కదా..? నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న మేమంతా, సీఎస్తో సహా ఇక్కడే ఉండి బాధితులకు అండగా నిలబడ్డాం. నేడు అధికారంలో ఉన్నవారు కనీస ఓపిక, సహనం లేకుండా కార్మిక సంఘాల నేతలపై నోరు పారేసుకోవడం శోచనీయం. ఇంత పెద్ద ఘటన జరిగితే సీఎం చంద్రబాబు స్పందించకపోవడం, పరిహారం ప్రకటించకపోవడం మరింత బాధాకరం. శోకసంద్రంలోనూ అబద్ధాలే..లోకేశ్, పవన్ దిగజారుడు వ్యాఖ్యలువిశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్న వైఎస్సార్సీపీ ప్లాంట్ పరిరక్షణకు అసెంబ్లీలో తీర్మానం చేసిన అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చాక కార్మికుల తొలగింపు, ఆంక్షలు, వేతన కోతలు సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం 8 మంది కార్మికులను బలితీసుకుని.. యావత్ దేశాన్ని తీరని విషాదంలోకి నెట్టేసింది. ఇంతటి విషాదంలోనూ టీడీపీ కూటమి నేతలు రాజకీయ లబ్ధి కోసమే పాకులాడారు. పరామర్శల పేరుతో ప్లాంట్ వద్దకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ విషాద సమయంలోనూ అబద్ధాలతో రాజకీయం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో స్టీల్ప్లాంట్ని అమ్మేయాలని చూశారని.. తాము అధికారంలోకి వచ్చాకే విశాఖ ఉక్కును కాపాడామని నోటికొచ్చిన అబద్ధాలు ఆడారు. వారి మాటల్ని విన్న ఉక్కు కార్మికులు ‘చంద్రబాబు తరహాలో కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడం వీళ్లకూ అలవాటైనట్టు ఉంది’ అంటూ చర్చించుకోవడం కనిపించింది. అసెంబ్లీలో తీర్మానం చేసిన వైఎస్సార్సీపీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం చేసిన అలుపెరగని పోరాటం విశాఖ ఉక్కు కార్మికులందరికీ తెలిసిందే. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న వెంటనే.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చర్యల్ని వాయిదా వేసుకుంది. ప్లాంట్ను లాభాల బాట పట్టించేందుకు, సొంత గనులు (క్యాప్టివ్ మైన్స్) కేటాయిస్తే ప్లాంట్ దానంతట అదే నిలబడుతుందని ప్రధానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే లేఖలు రాశారు. తమ ఐదేళ్ల పాలనలో ప్రైవేటీకరణను ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉక్కు కవచంలా నిలబడింది. ఆ వాస్తవాలను కప్పిపుచ్చి, ఇప్పుడు ఉక్కు పరిరక్షణను తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు వచ్చాకే.. పతనం అంచుకు.. ‘మేం వచ్చి ప్లాంట్ను కాపాడాం’ అని గొప్పలు చెబుతున్నా.. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్ పతనం అంచుకు చేరుకుంది. బ్లాస్ట్ ఫర్నేస్లు, ఉత్పత్తి యూనిట్లను ఒక్కొక్కటిగా మూసివేస్తూ ప్లాంట్ను నిర్వీర్యం చేసే కుట్రలకు తెరతీశారు. దశాబ్దాలుగా ఉక్కు కర్మాగారాన్నే నమ్ముకుని బతుకుతున్న వేలాది మంది కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షిణ్యంగా వీధిన పడేశారు. ఉన్న కార్మికులపై తీవ్రమైన ఆంక్షలు విధించారు.నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా.. ఇచ్చినా 50 శాతం కోతలు విధిస్తూ ఉద్యోగులు, కార్మికుల పొట్టగొట్టారు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలంటూ నిపుణులైన ఉద్యోగుల్ని, అధికారుల్ని వేధింపులకు గురిచేశారు. ఇలా.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, కార్మికుల పట్ల ఉన్న చిన్నచూపు కారణంగానే స్టీల్ప్లాంట్ ఉద్యోగులు తీవ్ర ఆరి్థక, మానసిక సంఘర్షణ నడుమ విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి నెలకొంది. శోకసంద్రంలో ఉన్న బాధితుల వద్దకు వెళ్లిన కూటమి నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీపై బురద జల్లడాన్ని కార్మికులు తప్పు పడుతున్నారు.‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తే మేం రోడ్లపైకి వచ్చి కొట్లాడాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ ఆగింది’ – డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ‘విశాఖ ఉక్కు సంక్షోభంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరిపి కర్మాగారానికి ఊరట కల్పించేలా చర్యలు తీసుకుంది’ – మంత్రి నారా లోకేశ్ -
ఎటుచూసినా విషాదం
అగనంపూడి/గాజువాక/గోపాలపట్నం/అక్కిరెడ్డిపాలెం/ఉక్కునగరం/పెదగంట్యాడ: విశాఖపట్నం స్టీల్ప్లాంట్లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన ఎనిమిది మందిలో ఏడుగురి మృతదేహాలకు కుటుంబసభ్యులు, బంధువులు మంగళవారం అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మేనేజర్ గోల్డ్ కుమార్ మృతదేహం కేజీహెచ్ మార్చురీలోనే ఉంది. అతడి కుటుంబసభ్యులు వచ్చిన తర్వాత మృతదేహాన్ని అప్పగించనున్నారు.స్టీల్ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్–1 (ఎస్ఎంఎస్–1)లో సోమవారం 150 టన్నుల ద్రవపు ఉక్కు పేలిపోయి జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిదిమంది మరణించిన విషయం తెలిసిందే. కేజీహెచ్లో పోస్టుమార్టం తర్వాత వారి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రి వద్ద, మృతదేహాలను తీసుకెళ్లిన తరువాత వారి ఇళ్లు, ఆయా ప్రాంతాల్లో తీవ్ర విషాదకర వాతావరణం నెలకొంది. ప్రమాదంలో కాలిపోవడంతో మృతదేహాలను కడసారి చూసేందుకు కూడా అవకాశం లేకపోయిందంటూ వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కన్నీరుమున్నీరైన కృష్ణనాగు కుటుంబం ఈ ప్రమాదంలో ఎం.కృష్ణనాగు మృతిచెందడంతో కనకమహాలక్ష్మీనగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహాన్ని స్వగృహానికి తీసుకువచ్చారు. అతడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రమాదంలో శరీరం తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహానికి కప్పిన కవర్ను తొలగించలేదు. దీంతో చివరి చూపునకు కూడా నోచుకోలేదంటూ కుటుంబసభ్యులు విలపించడం అందరినీ కలచివేసింది. కృష్ణనాగు మృతదేహానికి బుచి్చరాజుపాలెం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 30 ఏళ్లు కాంట్రాక్టు కార్మికుడిగా.. ఈ ప్రమాదంలో మృతిచెందిన అప్పన్నకాలనీకి చెందిన గొట్టపు త్రినాథ్ (50) 30 ఏళ్ల కిందట స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా చేరారు. ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో కాలనీలో విషాదం నెలకొంది. మృతదేహం వద్ద కుటుంబసభ్యుల రోదన అందరికంట తడి పెట్టించింది. బొబ్బిలి సమీపంలోని గాదెలవలస గ్రామానికి చెందిన త్రినాథ్ ఉపాధి కోసం విశాఖకు వచ్చి అప్పన్నకాలనీలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య రాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు పవన్ ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా, చిన్న కుమారుడు భరత్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. స్థానిక శ్మశానవాటికలో త్రినాథ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పెదగంట్యాడ మండలంలో విషాదంఉక్కు కర్మాగారంలో జరిగిన ఘోర ప్రమాదం పెదగంట్యాడ మండలానికి చెందిన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 77వ వార్డు పరిధిలోని మదీనాబాగ్ సత్తర్ కాలనీకి చెందిన నక్క వెంకటరమణ (54), 75వ వార్డు పరిధిలోని నీలాపువీధికి చెందిన గొందేశి వెంకట అప్పారావు (41) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న నక్క వెంకటరమణకు భార్య జోగమ్మ, కుమారుడు దుర్గాప్రసాద్, కుమార్తె అప్పలకొండ ఉన్నారు. ప్రగతి మైదానం వద్ద వెంకటరమణ పార్థివదేహానికి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు నివాళులర్పించారు.మాకు దిక్కెవరు? నీలాపువీధికి చెందిన మృతుడు వెంకట అప్పారావుకు తల్లి దాలమ్మ, భార్య భారతి, కుమారులు ధనుష్, లోకేశ్ ఉన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో తపనపడే అప్పారావు మృతి ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఇప్పుడు మాకు దిక్కెవరు అంటూ ఆ కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. మార్చురీలోనే గోల్డ్కుమార్ మృతదేహం స్టీల్ప్లాంట్ ఎస్ఎంఎస్–1లో మేనేజర్గా పనిచేస్తూ ఈ ప్రమాదంలో మృతిచెందిన గోల్డ్ కుమార్ మృతదేహం కేజీహెచ్ మార్చురీలోనే ఉంది. స్టీల్ప్లాంట్ క్వార్టర్స్లో నివసిస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వేసవి సెలవులకు సొంత రాష్ట్రం బిహార్ వెళ్లిన వారు ఈ దుర్ఘటన విషయం తెలిసి వెంటనే బయల్దేరారు. వారు వచి్చన అనంతరం మృతదేహాన్ని అధికారులు అప్పగించనున్నారు. కాలిలో రాడ్డుతో మృతదేహం గుర్తింపు ఈ ప్రమాదంలో మరణించిన గాజువాక సీతారామ్నగర్ నివాసి కూన ప్రభాకరరావుకు భార్య అరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు ప్రసాద్ కాకినాడలో డాక్టర్గా పనిచేస్తుండగా మరో కుమారుడు లోకేశ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన ప్రభాకరరావు విశాఖ స్టీల్ప్లాంట్లో ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చారు. రెండేళ్ల కిందట రోడ్డు ప్రమాదానికి గురైన ఆయనకు వైద్యులు ఒక కాలిలో రాడ్డు వేశారు. స్టీల్ప్లాంట్ ప్రమాదంలో మృతులను గుర్తిస్తున్న వైద్యులు...ప్రభాకరరావును ఆ రాడ్డు ఆధారంగానే గుర్తించారు. తన భర్తకు కాలిలో రాడ్డు ఉంటుందని అరుణ చెప్పడంతో దాని ఆధారంగా వైద్యులు ఆయన పార్థివదేహాన్ని నిర్ధారించారు. తనదికాని షిఫ్ట్ డ్యూటీకి వెళ్లి.. ఈ ప్రమాదంలో అగనంపూడి ప్రాంతానికి చెందిన ఇద్దరు కార్మికులు మృత్యువాత పడడంతో స్థానిక నిర్వాసిత కాలనీలు శోకసంద్రంలో మునిగిపోయాయి. అగనంపూడి సెక్టార్–3 పరిధిలోని శనివాడ కాలనీకి చెందిన గొంతిన భానుకుమార్ (33), డొంకాడ కాలనీకి చెందిన నక్కా అప్పలరాజు మృతిచెందారు. ఎస్ఎంఎస్–1 విభాగంలో టెక్నీషియన్గా పనిచేస్తున్న భానుకుమార్ వాస్తవానికి ‘సీ’ షిఫ్ట్కు వెళ్లాల్సి ఉంది. ఒక మిత్రుడి కోరిక మేరకు ‘బీ’ షిఫ్ట్కు డ్యూటీకి వెళ్లారు. డ్యూటీకి వెళ్లిన కొద్దిసేపటికే జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. భానుకుమార్కు మూడేళ్ల కిందట శ్రీనగర్కు చెందిన లావణ్యతో వివాహం జరిగింది. వారికి మూడునెలల కుమారుడు ఉన్నాడు. భానుకుమార్ భౌతికకాయాన్ని అంతిమయాత్రగా తలారివానిపాలెం కైలాసభూమికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేశారు. భర్తను కడసారి చూసేందుకు శ్మశానవాటికకు వచి్చన లావణ్య కుప్పకూలిపోవడం అందరినీకంట తడిపెట్టించింది. ఆధారం కోల్పోయిన కుటుంబంఅగనంపూడి నిర్వాసిత కాలనీ డొంకాడకు చెందిన నక్కా అప్పలరాజు కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. అధికారుల నుంచి సమాచారం రావడంతో ‘బీ’ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య మణి, కుమారుడు వరప్రసాద్ (12), కుమార్తె హేమశ్రీ (10), వృద్ధ తల్లిదండ్రులు అప్పారావు, అప్పలనర్సమ్మ ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన అప్పలరాజు మరణంతో తమకు దిక్కెవరంటూ వృద్ధ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు బోరున విలపిస్తుండటం స్థానికులను కలచివేసింది. అప్పలరాజు మృతదేహానికి అగనంపూడి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
ఒక్కోసారి యాక్సిడెంట్లు జరుగుతుంటాయ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్లో నిపుణులను తొలగించడం, సిబ్బందిని తగ్గించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘‘నేను దీనికి సంబంధించి అనుభవం ఉన్న వ్యక్తిని కాదు. నేనేమి చేయగలను. లోటుపాట్లను అర్థం చేసుకోవడం నాలాంటి వాళ్ల వల్ల కాదు. ప్లాంట్ నిర్వహణ లోపాలపై విచారణ కమిటీ వచ్చాకే చెప్పగలను..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఒక్కోసారి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయన్నారు. స్టీల్ ప్లాంటు ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఇటువంటి సందర్భాల్లో అందరూ ఒకేసారి మీద పడిపోతే పరిష్కారం కాదన్నారు. యాజమాన్యాలు ఒకటికి పది సార్లు చూసుకోవాలని... ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రమాదాలపై నాలుగైదు గంటలు... అవసరమైతే ఒకరోజు తీసుకుని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానన్నారు. గతంలో తాను క్యాప్టివ్ మైన్స్ గురించి మాట్లాడేందుకు ఢిల్లీకి తీసుకెళతానంటే కార్మిక సంఘాల నేతలు ఒక్కరు కూడా రాలేదని వ్యాఖ్యానించారు. -
కూటమి ప్రభుత్వ హత్యలే
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, ప్లాంట్లో జరుగుతున్న ప్రమాదాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం కేజీహెచ్లో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే సుమారు 6 వేల మంది కాంట్రాక్టు కార్మికులను, 1,800 మంది రెగ్యులర్ ఉద్యోగులను ఇంటికి పంపించారని ధ్వజమెత్తారు. చివరికి ప్లాంట్ లోపల కార్మికుల ఆకలి తీర్చే క్యాంటీన్ సౌకర్యాన్ని కూడా నిలిపివేయడం దారుణమని, వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్ నిర్వీర్యం, యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోకేష్, పవన్ కల్యాణ్లపై తీవ్ర విమర్శలు కార్మికుల ప్రాణాలకు, ప్లాంట్ దుస్థితికి సమాధానం చెప్పలేక ఫ్రస్ట్రేషన్తో ఐటీ మంత్రి లోకేష్ కార్మిక సంఘాలపైనే తిరగబడుతున్నారని, ఆయన తీరు ఏమాత్రం సరికాదని మండిపడ్డారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్లాంట్ సంక్షోభంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
వీఆర్ఎస్ ఇచ్చి ఉంటే ఇలా జరిగేదా?
స్టీల్ప్లాంట్ పరిస్థితి దృష్ట్యా గతేడాది నా తండ్రి వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు తిరస్కరించారు. 1991 నుంచి స్టీల్ప్లాంట్ సెంట్రల్ మెకానిక్ మెయింట్నెన్స్లో పనిచేసిన నా తండ్రిని, ఏడాది కిందటే ఆ విభాగం నుంచి ఎస్ఎమ్ఎస్–2కి బదిలీ చేశారు. ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా, కనీస భద్రతా ప్రమాణాలు లేనిచోటుకి పంపించారు. కుటుంబానికి దికై ్కన తండ్రిని కోల్పోయిన తాము ఇప్పుడు ఏమైపోవాలి. అమ్మ సూర్యకుమారి గృహిణి. చెల్లి దీపిక ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. వారిని సముదాయించడం నా వల్ల కావడం లేదు. – హనీష్, మృతుడు కృష్ణ కుమారుడు -
‘ఉక్కు’ మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి
మహారాణిపేట: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు వెంటనే కోటి రూపాయల పరిహారం అందించాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర డిమాండ్ చేశారు. విశాఖలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు రూ.10 లక్షల పరిహారం అందించాలని కోరారు. స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు తీరని లోటు అన్నారు. మృతుల కుటుంబాల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే ఉచిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. -
హార్బర్లో గంగమ్మ జాతర
15 నుంచి మత్స్యవేట ప్రారంభంమహారాణిపేట: ప్రకృతి వైపరీత్యాల నుంచి మత్స్య పరిశ్రమ, మరపడవలు, మత్స్యకారులకు రక్షణ కల్పించాలని కోరుతూ విశాఖ ఫిషింగ్ హార్బర్లో మంగళవారం గంగమ్మ తల్లికి విశేష పూజలు నిర్వహించారు. బోటు యజమానులు, మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించారు. గంగమ్మ తల్లితో పాటు సముద్రుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర మరపడవల సంఘం నాయకులు మైలపల్లి లక్ష్మణరావు, పీ.సీ.అప్పారావు, మున్నం బాలాజీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవల చైర్మన్ సీతంరాజు సుధాకర్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 61 రోజుల విరామం అనంతరం ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి మత్స్యవేట పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మత్స్యకారులు అత్యంత భక్తిశ్రద్ధలతో గంగమ్మ జాతరను నిర్వహించారు. హార్బర్ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయి ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. -
నేడు విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్
స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖకు రానున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్ర గాయాలతో నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో పాటు, ప్రస్తుతం సెవెన్హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ జగన్ స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే.. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11:20కి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాంనగర్లో గల సెవెన్హిల్స్ ఆసుపత్రికి 11:40కి చేరుకుని, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తిరిగి మధ్యాహ్నం 1:10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1:50కి షీలానగర్లో ఉన్న కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 2:20 గంటలకు ఆసుపత్రి నుంచి బయలుదేరి 2:30కి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని తిరిగి గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రయాణమవుతారు. -
ప్రమాద తీవ్రతకు శిథిల సాక్ష్యాలుగా..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్ ఎస్ఎంఎస్–2 విభాగంలో సంభవించిన ఘోర ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్న అంతర్గత దృశ్యాలివి. లాడిల్ పేలి అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ద్రవరూప ఉక్కు ఒక్కసారిగా ఉప్పొంగి పడటంతో ప్లాంట్ లోపలి క్యాబిన్ల అద్దాలు, ఇనుప రేకులు పూర్తిగా ఛిన్నాభిన్నమయ్యాయి. పేలుడు ధాటికి భారీ కేబుళ్లు సైతం కాలిపోయి వేలాడుతుండగా, పరిసరాల్లోని యంత్రాలు, ఫ్యాన్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న యాజమాన్య ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, హెల్మెట్లు ధరించిన రక్షణ సిబ్బంది ధ్వంసమైన యంత్రాలను, కాలిపోయిన భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్లాంట్ అంతటా దట్టమైన బూడిద, కాలిపోయిన అవశేషాలు పేరుకుపోయి భీతావహ వాతావరణాన్ని తలపిస్తోంది. -
స్టీల్ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ ఎస్ఎంఎస్ విభాగంలో జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరమని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి బి. శ్రీనివాసవర్మ అన్నారు. స్టీల్ప్లాంట్ సీఎండీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డీ కుమారస్వామి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులకు భరోసా కల్పించారని తెలిపారు. బాధిత కుటుంబాలకు యాజమాన్యం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఉద్యోగులు అధైర్యపడవద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంపై నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ శ్రీభరత్, స్టీల్ప్లాంట్ సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్. ప్రభాకర్ పాల్గొన్నారు. -
మాజీ వీసీల ఫోరం ఆవిర్భావం
ఎంవీపీకాలనీ: రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో ‘విశాఖ ఫార్మర్ వైస్ చాన్స్లర్స్ ఫోరం’ ఆవిర్భవించింది. ఫోరం తొలి సమావేశాన్ని మంగళవారం ఎంవీపీ కాలనీలోని ఐఐఏఎం వేదికగా నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ వీసీలు ఆచార్య వి. బాలమోహన్దాస్, ఆచార్య సుంకరి రామకృష్ణ, ఆచార్య హెచ్. లజపతిరాయ్, ఆచార్య కె. నిరూపమారాణి, ఆచార్య వీఎస్ఆర్కే ప్రసాద్, ఆచార్య పి. శ్యాంప్రసాద్, ఆచార్య ఎస్.వి. సుధాకర్, ఆచార్య జేవీ ప్రభాకర్రావు తదితరులు హాజరయ్యారు. ఐఐఏఎం చైర్మన్ సుంకరి రవీంద్ర, రీడ్ గ్రూప్ డైరెక్టర్ జనరల్ ఆచార్య వి. కృష్ణమోహన్ వారికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాభివృద్ధికి ఫోరం మేధో వేదికగా నిలవాలని తీర్మానించారు. జాతీయ విద్యా విధానం–2020 అమలులో ఆంధ్రప్రదేశ్ చురుకై న పాత్ర పోషించేందుకు అవసరమైన సూచనలు చేయడం, విద్యార్థుల్లో నైపుణ్యాలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక ఆలోచనలను పెంపొందించడం, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సామాజిక బాధ్యతను పెంపొందించే కార్యక్రమాలకు సహకరించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆచార్య బాలమోహన్దాస్ మాట్లాడుతూ విశాఖతో పాటు ఉత్తరాంధ్రలోని మాజీ వీసీలంతా ఫోరంలో భాగస్వాములు కావాలని కోరారు. -
స్టీల్ప్లాంట్ క్షతగాత్రులను పరామర్శ
గాజువాక/అక్కిరెడ్డిపాలెం : స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన, చికిత్స ఖర్చులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తుందని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అలాగే కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా క్షతగాత్రులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, ఎంపీ భరత్, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
లాడెల్లో ఆర్గానిక్ గ్యాస్ మిక్స్ కాకపోవడం వల్లే ప్రమాదం
ఉక్కు ప్రమాదంపై రాష్ట్ర కార్మిక శాఖమంత్రి సుభాష్ గాజువాక : సుమారు 140 టన్నుల లాడెల్లోని లిక్విడ్ స్టీల్లో ఆర్గానిక్ గ్యాస్ మిక్స్ కాకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగి ఉండవచ్చని తాము భావిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. స్థానిక కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉక్కు ప్రమాద బాధితులను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లాడెల్లో ఎటువంటి సమస్య లేదని, అందులో సమస్య ఉండి ఈ ప్రమాదం జరిగితే అక్కడ ఎవరూ మిగలరన్నారు. లాడెల్లో ఆర్గానిక్ గ్యాస్ మిక్స్ అవకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఆర్గానిక్ గ్యాస్ పైప్లో చిన్న పొరపాటు వల్ల సెకండ్స్ వ్యవధిలో ఇది పేలిపోయిందని చెప్పారు. లాడెల్లో 150 టన్నుల వరకు లిక్విడ్ను నింపుతారని, అందులో ఆర్గానిక్ గ్యాస్ను మిక్స్ చేస్తారన్నారు. లాడెల్లో లిక్విడ్ స్టీల్ రియాక్ట్ కాకుండా కార్బన్ మోనాక్సయిడ్, కార్బన్ డయాక్సయిడ్లను ఆర్గానిక్ గ్యాస్ బ్యాలెన్స్ చేస్తుందన్నారు. ఆర్గానిక్ గ్యాస్ అందులో మిక్స్ కాకపోవడంతో 1500 డిగ్రీల వేడి ఉన్న లిక్విడ్ వర్షం మాదిరిగా మనుషులపై పడి ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. అయితే, ఈ విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. కార్మికుల సంఖ్య, యంత్రాల నిర్వహణ విషయంలో కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అవసరమైన సంఖ్యలోనే కార్మికులు విధుల్లో ఉన్నారన్నారు. ప్లాంట్లో భద్రతా ప్రమాణాలకనుగుణంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించామన్నారు. గత ఏడాది నవంబర్లో కూడా స్పెషల్ టీమ్తో తనిఖీ చేశామన్నారు. -
మంత్రి లోకేష్ వ్యాఖ్యలు అహంకారపూరితం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మహారాణిపేట: స్టీల్ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన సమయంలో కార్మిక సంఘాల నాయకులపై మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రంగా ఖండించారు. మంగళవారం కేజీహెచ్లో మృతుల కుటుంబాలను వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్లతో కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో 6 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి, పని భారాన్ని రెట్టింపు చేయడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ప్రమాదానికి గత ప్రభుత్వానికి ముడిపెడుతూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. నాడు సీఎం వైఎస్ జగన్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, ప్రధానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. కేంద్రంతో మాట్లాడి ప్రైవేటీకరణను ఆపలేని కూటమి నాయకులు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కార్మిక సంఘాలపై, వైఎస్ జగన్పై ఫ్రస్ట్రేషన్తో విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
మహారాణిపేట: స్టీల్ప్లాంట్లో జరిగిన దురదృష్టకర ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు ప్రమాదం నుంచి బయటపడ్డారని చెప్పారు. సెవెన్హి ల్స్ ఆసుపత్రిలో ఉన్న ముగ్గురిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు టెర్మినల్ బెనిఫిట్స్తో పాటు రూ.25 లక్షల పరిహారం, పిల్లలకు ఉచిత విద్య, నివాస సదుపాయం కొనసాగింపు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించే నిర్ణయాలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఘటనకు గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ ఇప్పటికే విచారణ ప్రారంభించిందన్నారు. జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ -
స్టీల్ప్లాంట్ ప్రమాద స్థలం పరిశీలన
ఉక్కునగరం: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం స్టీల్ప్లాంట్లోని స్టీల్ మెల్ట్ షాప్ను సందర్శించారు. ఇక్కడి సీసీడీ సెక్షన్కు వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అక్కడి అధికారులు ఆయనకు ప్రమాదం గురించి వివరించారు. గతంలో ఇటువంటి ప్రమాదాలు జరిగాయా? అంటూ వాకబు చేశారు. అక్కడి అధికారులు, కార్మికులతో మాట్లాడారు. అనంతరం మెయిన్ గేటు వద్ద మీడియాతో మాట్లాడుతూ ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, విశాఖ ఎంపీ శ్రీభరత్, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు, గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నర్సింగరావు పాల్గొన్నారు. -
కార్మికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం: బొత్స
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)లో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. వారిలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె రాజు, ఇతర ముఖ్య నాయకులతో కలిసి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ అక్కడే మీడియాతో మాట్లాడారు.ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమని బొత్స సత్యనారాయణ అన్నారు. పరిహారంపై బాధిత కుటుంబాలది గొంతెమ్మ కోరిక కాదని చెప్పారు. బాధితుల డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించాలని బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి సర్కారు కుట్రలు చేస్తోందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు. ప్రైవేటీకరణ కుట్రల వల్లే ప్రమాదాలు స్టీల్ ప్లాంట్ ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగుందని, సంస్థ ప్రైవేటీకరణ కుట్రల వల్లే స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరగుతున్నాయని, ఆ విధంగా కార్మికుల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని బొత్స ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్లనే భారీ ప్రమాదం చోటు చేసుకుందన్న ఆయన, ఇకనైనా సంస్థలో ఉద్యోగుల తొలగింపు ఆపాలని తేల్చి చెప్పారు. ప్రమాదంలో దుర్మరణ చెందిన కార్మికుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ తరహాలో కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ పరిహారం కోసం వైయస్సార్సీపీ రాజీ లేని పోరాటం చేస్తుందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తారని వెల్లడించారు.‘‘విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన భారీ ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 8 మంది కార్మికులు దుర్మరణం చెందగా, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కిమ్స్ ఆసుపత్రిలో 40 శాతం గాయాలతో మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారందరూ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు పార్టీ తరపున, అధినేత వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ను తమ తాబేదార్లకు కట్టబెట్టాలనే కుట్రతోనే వ్యవహరిస్తోంది. స్టీల్ ప్లాంట్లో సమర్థులైన అధికారులను దొడ్డిదారిన బదిలీ చేయడం వల్లే అనుభవజ్ఞుల కొరత ఏర్పడి, ఈ తరహా భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. మిషనరీ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారు. ఇప్పటికే శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులు అంతా కలిపి దాదాపు 10 వేల మందిని అన్యాయంగా తొలగించారు. ఇకనైనా బలవంతపు వీఆర్ఎస్ చర్యలను ఆపాలి’’ అన్నారు.మంత్రి లోకేశ్ తీరు దారుణం: కురసాల కన్నబాబు బాధితులను పరామర్శించడానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్.. సమస్యలపై ప్రశ్నించిన కార్మిక సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడం, రాజకీయం చేయడం దారుణమని మాజీ మంత్రి కురసాల కన్నాబాబు అన్నారు. ‘‘నాడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న మేమంతా, సీఎస్తో సహా ఇక్కడే ఉండి బాధితులకు అండగా నిలబడ్డాం. కానీ నేడు అధికారంలో ఉన్నవారు కనీస ఓపిక, సహనం లేకుండా కార్మిక నేతలపై నోరు పారేసుకోవడం శోచనీయం’’ అని చెప్పారు.కాగా, స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. భాను కుమార్, కృష్ణ నాగ్, ప్రభాకర్, జీవీ అప్పారావు, నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజుల మృతదేహాలను బంధువులకు అధికారులు అప్పగించారు. బిహార్కు చెందిన గోల్డ్ కుమార్ బంధువుల రాక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. మొత్తంగా 8 మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. -
‘కార్మిక సంఘాలను లోకేష్ అవమానించారు’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో రెడ్బుక్ అరాచకం నడుస్తోందని.. లోకేష్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కార్మిక సంఘాలను లోకేష్ అవమానించారని.. వారిని బెదిరించే ధోరణిలో మాట్లాడారంటూ ధ్వజమెత్తారు. స్టీల్ప్లాంట్ బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని కూటమి గాలికొదిలేసిందని అమర్నాథ్ ఆగ్రహవం వ్యక్తం చేశారు.స్టీల్ప్లాంట్ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని అరకు ఎంపీ తనూజ రాణి డిమాండ్ చేశారు. ప్రమాదానికి భద్రతా వైఫల్యాలే కారణమా..?. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలవాలి. మృతుల కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి. బాధిత కుటుంబాల పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తనూజ రాణి అన్నారు. -
స్టీల్ ప్లాంట్ ఘటన.. నారా లోకేశ్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మంత్రి నారా లోకేశ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల ఆగ్రహం, నిరసనల మధ్య ఆయన వ్యవహరించిన తీరు కాస్త అక్కడి వాతావరణాన్ని వేడెక్కించింది. హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి స్టీల్ప్లాంట్ వద్దకు చేరుకున్న లోకేశ్కు.. కార్మికుల మృతి, నిర్వహణ లోపంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఆయన సహనం కోల్పోయి.. కార్మిక సంఘాల నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్లో జరిగిన ప్రమాదాలు, కార్మికుల భద్రత అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు.. మంత్రి లోకేశ్ ఎదుటే నిరసనకు దిగాయి. నైపుణ్యం లేని కాంట్రాక్ట్ కార్మికులను ఎలా అనుమతించారన్న ప్రశ్నతో మంత్రిని నిలదీశాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో ఎంపీ భరత్, హోం మంత్రి అనితలు పరిస్థితిని చల్లార్చేందుకు ప్రయత్నించినా, కార్మికుల ఆగ్రహం తగ్గలేదు.ఈ క్రమంలో కార్మికుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయిన లోకేశ్, “స్టీల్ప్లాంట్ను మేమే కాపాడాము” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. “అందుకే ఇంతమంది చనిపోయారా?” అంటూ వారు తిరిగి ప్రశ్నించారు.పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో, కార్మికుల ఆవేదనను అర్థం చేసుకోకుండా మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎందుకు గొడవ పడుతున్నారు.. రాజకీయం చేయడానికి వచ్చారా?” అంటూ లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కార్మిక సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మరోసారి కలుగజేసుకున్న లోకేశ్.. “మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదు కదా?” అంటూ వ్యాఖ్యానించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారాయి. పరామర్శకు వచ్చి అవహేళనగా మాట్లాడారని.. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని లోకేశ్ను ఉద్దేశించి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనూ ఆయన ‘‘మరి మమ్మల్నెందుకు నిలదీశారు?’’ అంటూ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మొత్తానికి, పరామర్శగా మొదలైన నారా లోకేశ్ స్టీల్ప్లాంట్ పర్యటన కార్మికుల ఆగ్రహం, ప్రశ్నలు, ఎదురుదాడులతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.నియంతలా లోకేశ్ తీరుస్టీల్ ప్లాంట్ వద్ద పరామర్శ పేరుతో నారా లోకేశ్ చేసిన ఓవరాక్షన్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘‘కార్మికుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. అందుకే ఈ ఘోరం జరిగింది. పైగా కార్మిక సంఘాలను, కార్మికులను ఇప్పుడు నారా లోకేశ్ అవమానించారు. నియంతలా వ్యవహరిస్తూ.. ఎవరికీ సమాధానం చెప్పను అన్నట్లు ఉంది ఆయన తీరు. కార్మికులను బెదిరించే విధంగా లోకేశ్ మాట్లాడారు. కార్మిక సంఘాలకు, కార్మికులకు ఆయన క్షమాపణలు చెప్పాలి. బాధిత కుటుంబాలకు రూ కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేజీహెచ్ దగ్గరా.. కేజీహెచ్ వద్ద పరామర్శకు వెళ్లిన మంత్రి లోకేశ్కు.. అక్కడా చేదు అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులను పరామర్శించబోయే సమయంలో వామపక్ష నేతలు అడ్డుకున్నారు. పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలోనూ లోకేశ్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. డబ్బులిచ్చి చేతులు దులుపుకునేందుకు రాలేదు అనడంతో.. వామపక్ష నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
బిర్యానీ గొడవ.. దంపతుల ఆత్మహత్య
విశాఖపట్నం: రామాటాకీస్ వెనుక వైపున గల శ్రీనగర్లో నివాసముంటున్న దంపతులు బలరాం (33), ప్రియాంక (27) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ద్వారకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కళింగపటా్ననికి చెందిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని, బతుకుతెరువు కోసం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. వెల్డింగ్ పనులు చేసే బలరాం మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండటంతో ప్రియాంక గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బలరాం బిర్యానీ కావాలని పట్టుబట్టడంతో ప్రియాంక తల్లి బయటకు వెళ్లగా, ఆమె తిరిగి వచ్చేసరికి దంపతులిద్దరూ ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అయితే బలరామే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రియాంక బలవన్మరణానికి పాల్పడటంతో భయపడి బలరాం ఆత్మహత్యకు ఒడిగట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్లెదుటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ ప్రియాంక తల్లి రోదించడం స్థానికులను కలచివేసింది. -
నిన్నటివరకు సెలవులో.. నేడు మృత్యు ఒడికి..
విశాఖపట్నం : వారం రోజుల సెలవు తరువాత విధులకు వచ్చిన ఆ ఉద్యోగి మృత్యు ఒడికి చేరడంతో ఓ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది. అగనంపూడి దరి శనివాడకు చెందిన భాను కుమార్కు 2018లో ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల క్రితం వివాహమైంది. మూడు నెలల క్రితం ఒక కుమారుడు పుట్టాడు. ఈ నేపథ్యంలో భానుకుమార్ వారం రోజులపాటు పెటర్నిటీ సెలవు తీసుకున్నాడు. ఆదివారం వరకు సెలవులో ఉన్న అతడు సోమవారం మధ్యాహ్నం బీ షిఫ్ట్కు వచ్చాడు. డ్యూటీకి వచ్చిన రెండున్నర గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వాస్తవంగా అతడు సీ షిఫ్ట్కు రావాల్సి ఉంది. కొలీగ్ ఒకరు కోరడంతో తన డ్యూటీని బీ షిఫ్ట్కు మార్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతడి మృతి వార్తతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. -
ఏ దేవుడో కాపాడాడు..
గాజువాక: స్టీల్ప్లాంట్లో చోటుచేసుకున్న హృదయ విదారక ప్రమాదంలో ఒక ఉద్యోగి తృటిలో తప్పించుకొని స్వల్ప గాయంతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వడ్లపూడికి చెందిన గుడివాడ అర్జున అప్పారావు బీ షిఫ్ట్ విధులకు వెళ్లారు. డిపార్ట్మెంట్లో 20 అడుగుల ఎత్తులో పని చేస్తున్న ఆయన మూత్ర విసర్జనకని కిందకు దిగి వెళ్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ప్రమాదం చోటు చేసుకొని లాడిల్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన లిక్విడ్ ఐరన్ అతడి పిరుదులపై కొద్దిగా పడటంతో స్వల్ప గాయంతో బయటపడ్డాడు. తనను ఏ దేవుడో రక్షించాడంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, ఈ ప్రమాదంలో అతడు కూడా మృతి చెందాడని పుకారు రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే, అతనికి ఏమీ కాలేదని, స్వల్ప గాయం మాత్రమే అయిందనే విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
విశాఖ ఉక్కు విషాదం.. తప్పు ఎవరిది?
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన తాజా విషాదంపై మరోసారి హై లెవల్ కమిటీని ప్రభుత్వం నియమించింది. అయితే ప్రతి ప్రమాదం తర్వాత విచారణలు, కమిటీలు, నివేదికలతో హడావిడి చేయడం.. కొంతకాలానికి అంతా మరచిపోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వరుసగా ప్రమాదాలు పునరావృతమవుతుంటే అసలు బాధ్యులెవరు? తప్పంతా యాజమాన్యానిదేనా? లేక పర్యవేక్షణ బాధ్యత ఉన్న ప్రభుత్వాలకు అసలేం సంబంధం లేదా?? అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.విశాఖ ఉక్కు కర్మాగారంలో.. ద్రవ ఉక్కు ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఈ ఘటనతో మరోసారి ఒక కీలక ప్రశ్న తెరపైకి వచ్చింది. ప్రతి ప్రమాదం తర్వాత యాజమాన్యాన్ని తప్పుబట్టడం, విచారణ కమిటీలు వేయడం, పరిహారాలు ప్రకటించడం జరుగుతోంది. కానీ వరుసగా ప్రమాదాలు ఎందుకు పునరావృతమవుతున్నాయి? అసలు బాధ్యత ఎవరిపై ఉంది?..విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఉత్పత్తి, నిర్వహణ, భద్రతా ప్రమాణాల అమలు, యంత్రాల సంరక్షణ, సిబ్బంది నియామకాల బాధ్యత ప్రధానంగా యాజమాన్యానిదే. ఇది కాదనలేని విషయం. కానీ, కార్మిక సంఘాలు చాలా కాలంగా ఒకే విషయాన్ని చెబుతున్నాయి. అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని, వారి స్థానంలో కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడటం పెరిగిందని. దీంతో భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభావం పడుతోందని హెచ్చరిస్తున్నాయి.ఒకప్పుడు 18 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు ఉన్న ప్లాంట్లో ఇప్పుడు వారి సంఖ్య సగానికి పడిపోయింది. ఉత్పత్తి లక్ష్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగిందని, నిర్వహణ వ్యవస్థపై ఒత్తిడి అధికమైందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరిశ్రమల్లో భద్రత అనేది కేవలం యంత్రాల మీద ఆధారపడదు. అనుభవం ఉన్న సిబ్బంది, నిరంతర పర్యవేక్షణ, శిక్షణ, క్రమబద్ధమైన నిర్వహణ కూడా అంతే కీలకం. అయితే ఇక్కడితో కథ ముగియదు. తాజా ప్రమాదం తర్వాత.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మొత్తం బాధ్యతను యాజమాన్యంపైనే నెట్టేసి పక్కకు తప్పుకోవాలని చూస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. స్టీల్ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడం వాస్తవమే. కానీ రాష్ట్రంలో పనిచేస్తున్న అతిపెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన విశాఖ ఉక్కులో పదేపదే ప్రమాదాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత నుంచి తప్పించుకోగలదా? అనే ప్రశ్న కార్మిక వర్గాలు, పరిశ్రమల నిపుణుల నుంచి వస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా కూటమి నాయకులు పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు విశాఖ ఉక్కు పరిరక్షణపై పలుమార్లు మాట్లాడారు. కానీ ప్లాంట్లో భద్రతా ప్రమాణాలు, సిబ్బంది కొరత, యంత్రాల నిర్వహణ, ప్రమాదాల నివారణ చర్యలపై అదే స్థాయిలో పర్యవేక్షణ జరిగిందా? ఫ్యాక్టరీల శాఖ, కార్మిక శాఖ నిర్వహించిన తనిఖీల్లో ఏమి బయటపడింది? గత ప్రమాదాల తర్వాత ఇచ్చిన సూచనల అమలు ఎక్కడిదాకా వచ్చింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని విమర్శకులు అంటున్నారు.ప్రమాదం జరిగిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వ సంస్థ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పక్కకు తప్పుకోవచ్చా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఫ్యాక్టరీల భద్రతను పర్యవేక్షించే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరేట్, కార్మిక శాఖ, జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తాయి. ప్రమాదాలకు దారితీసే లోపాలను గుర్తించడం, భద్రతా తనిఖీలు నిర్వహించడం, హెచ్చరికలు జారీ చేయడం వంటి బాధ్యతలు కూడా వాటిపైనే ఉంటాయి.ముఖ్యంగా గత పదిహేనేళ్లలో స్టీల్ప్లాంట్లో వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2012లో జరిగిన ఘోర పేలుడులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా పలు ఘటనలు నమోదయ్యాయి. ఇన్ని ప్రమాదాలు జరిగినా భద్రతా వ్యవస్థలపై స్వతంత్ర సమీక్షలు జరిగాయా? గత విచారణల సిఫారసులు అమలయ్యాయా? వాటిని ఎవరు పర్యవేక్షించారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు కనిపించడం లేదు.ఇక మరో కోణం ప్రైవేటీకరణ వివాదం. విశాఖ ఉక్కును కాపాడతామని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయి. కానీ వాస్తవంగా ప్లాంట్ భవిష్యత్తు, ఆర్థిక పరిస్థితి, సిబ్బంది బలోపేతం, ఆధునీకరణ వంటి అంశాల్లో ఎంత మేర పురోగతి సాధించారన్న ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఉక్కు కర్మాగారం గురించి రాజకీయంగా పెద్ద ప్రకటనలు చేసినవారు, కార్మిక భద్రతపై అదే స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారా? అనే ప్రశ్న కూడా కార్మిక వర్గాల నుంచి వినిపిస్తోంది.అందుకే ఈ ప్రమాదాన్ని కేవలం ఒక సాంకేతిక లోపంగా చూడటం సరిపోదని పరిశ్రమల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది యాజమాన్య నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, సిబ్బంది విధానాలు, ప్రభుత్వాల నిరంతర పర్యవేక్షణ వైఫల్యం వంటి అనేక అంశాల కలయికగా చూడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.ఈ విషాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవడం అవసరమే. కానీ అంతకంటే ముఖ్యమైనది గత ప్రమాదాల మాదిరిగానే ఈ ఘటన కూడా మరో ఫైల్గా మిగిలిపోకుండా చూడటం. స్వతంత్ర విచారణ, భద్రతా ప్రమాణాల సమగ్ర ఆడిట్, సిబ్బంది కొరతపై సమీక్ష, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలపై స్పష్టమైన జవాబుదారీతనం తీసుకొస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి కొన్నేళ్లకోసారి ప్రాణాలు కోల్పోయేది కార్మికులే.. సంతాప ప్రకటనలు విడుదల చేసేది వ్యవస్థే. -
రక్తంతో రాసుకున్న చరిత్రే విశాఖ ఉక్కు కర్మాగారం
ఒకప్పుడు అది కేవలం కల.. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అంటూ లక్షల గొంతులు మార్మోగాయి. ఆ కలను నిజం చేసేందుకు 32 మంది అమరులయ్యారు. వారి రక్తంతో రాసుకున్న చరిత్రే విశాఖ ఉక్కు కర్మాగారం. ఆ తర్వాత వేలాది కుటుంబాలకు అన్నం పెట్టిన ఆ ఉక్కు కర్మాగారం, కాలక్రమంలో ఎన్నో విషాదాలకు కూడా సాక్షిగా నిలిచింది. 2012లో ఆక్సిజన్ ప్లాంట్లో జరిగిన ఘోర పేలుడులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదం దేశంలోని ఉక్కు పరిశ్రమ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే ఉక్కు కర్మాగారం రోదిస్తోంది. సోమవారం సాయంత్రం స్టీల్ మెల్టింగ్ షాప్లో సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే ఎనిమిది మంది కార్మికులు అగ్నిజ్వాలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆ ఆరుగురు కేవలం కార్మికులు కాదు.. ఎవరికో తండ్రి.. ఎవరికో భర్త.. ఎవరికో కొడుకు.. ఎవరికో అన్న.. ఉదయం ఇంటి నుంచి ‘సాయంత్రానికి వస్తా’ అని వెళ్లిన వారు, తిరిగి శవపేటికల్లో చేరుకోవడం ఎంతటి విషాదమో కదా.. ఉక్కు తయారవ్వాలంటే ఇనుము కరిగాలి. కానీ ప్రతిసారీ మనుషుల ప్రాణాలే కరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది అనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం గేట్లను చూస్తే ఇవాళ అవి ఇనుముతో చేసిన ద్వారాల్లా కాకుండా, కన్నీటి బిందువులతో తడిసిన చరిత్ర పుటల్లా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉద్యమ అమరుల త్యాగాలు, మరోవైపు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కారి్మకుల జ్ఞాపకాలు.. ఈ రెండింటి మధ్య నిలబడి ఉక్కు కర్మాగారం మౌనంగా విలపిస్తోంది. ‘నన్ను నిర్మించడానికి ప్రాణాలు ఇచ్చారు.. నన్ను నడపడానికి కూడా ప్రాణాలే పోతున్నాయి..’ అని ఉక్కే కన్నీరు కారుస్తోంది. నేడు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఎగసిపడుతున్న పొగల్లో కేవలం ద్రవ లోహం వేడి మాత్రమే కాదు.. ఎనిమిది కుటుంబాల కన్నీటి వేడి కూడా.. ఆ కన్నీరు ఆరిపోవచ్చు. కానీ ఈ విషాదం మిగిలి్చన గాయం మాత్రం చాలా కాలం వరకు మానదు. -
Vizag Steel Plant: కూడు పెట్టే ఉక్కు గూడు కూల్చిన నిప్పు
స్టీల్ప్లాంట్ దుర్ఘటనతో ఎనిమిది కుటుంబాల్లో తీరని విషాదంరెక్కలొచ్చిన ఆశలతో పొద్దునే కర్మాగారంలోకి అడుగుపెట్టిన పాదాలు.. సాయంత్రానికి కరిగిన ఉక్కులో కలిసిపోయాయి. దేశ ప్రగతికి ఇనుప కవచాన్ని నిర్మించే శ్రామికుడి రక్తం.. 1600 డిగ్రీల అగి్నప్రళయంలో ఆవిరైపోయింది. ఒక్కటంటే ఒక్క క్షణం.. విశాఖ ఉక్కునగరాన్ని శోకసముద్రంగా మార్చేసింది. నవ్వుతూ వెళ్లిన నాన్న నల్లటి ముద్దగా మారిన వేళ.. గుండెలు పగిలేలా రోదిస్తున్న కుటుంబాల ఆక్రందనలతో ఉక్కునగరం అట్టుడుకుతోంది.సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం/అక్కిరెడ్డిపాలెం: ఉదయం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు భార్యతో ‘సాయంత్రం త్వరగా వచ్చేస్తా’ అన్నారో కారి్మకుడు.. ‘నాన్న వచ్చేటప్పుడు స్వీట్లు తీసుకురావా’ అని అడిగిన కూతురి తల నిమిరి ముద్దాడి వెళ్లారో తండ్రి.. ‘జాగ్రత్త నాయనా’ అని వెన్నుతట్టిన ముసలి తల్లికి ధైర్యం చెప్పి డ్యూటీకి బయలుదేరాడో కొడుకు.. రక్తాన్ని చెమటగా మార్చి, దేశ ప్రగతికి ఇనుప కవచాన్ని నిర్మించేందుకు ఆ చేతులు విశాఖ ఉక్కు కర్మాగారంలోకి అడుగుపెట్టాయి. కానీ, కాలం ఇంత క్రూరంగా మారుతుందని.. తాము నమ్ముకున్న కర్మాగారమే తమకు అగ్ని సమాధి అవుతుందని ఆ కార్మికులు ఊహించలేకపోయారు. ఒక్కటంటే ఒక్క క్షణం.. కేవలం ఆ ఒక్క క్షణంలో సంభవించిన అగ్ని ప్రళయం ఎనిమిది మంది కార్మికులను మాంసపు ముద్దలుగా మార్చేసింది. కళ్లెదుటే ప్రాణాలు కరిగిపోతుంటే, కాపాడుకోలేక మిగిలిన శోకం.. ఉక్కునగరాన్ని కన్నీటి సముద్రంగా మార్చింది. 1600 డిగ్రీల అగి్నప్రళయం సోమవారం సాయంత్రం 4,15 గంటల సమయం.. ‘బీ’ షిఫ్ట్ విధులు సాఫీగా సాగిపోతున్నాయి. స్టీల్ మెల్ట్ షాప్ (ఎస్ఎంఎస్–1) విభాగంలో, నేలమట్టానికి దాదాపు 9 మీటర్ల ఎత్తున ఉన్న సీసీడీ సెక్షన్ అంతా కార్మికులు, అధికారుల అలికిడితో సందడిగా ఉంది. బ్లాస్ట్ఫర్నేస్లో ఎర్రగా కాగిన హాట్మెటల్ను భారీ లేడిల్లో ఎస్ఎంఎస్కు తరలించి, ద్రవపు ఉక్కుగా మార్చే కీలక ప్రక్రియ జరుగుతోంది. ఉత్పత్తి లక్ష్యాలను అందుకునే క్రమంలో సీసీడీ మిషన్–2 పై లేడల్ను ప్లేస్ చేసి, రొటేట్ చేయడం ప్రారంభించారు. అంతా సజావుగానే ఉందనుకున్న మరుక్షణమే.. ఊహకందని కాలసర్పంలా ఆ ఘోర విస్పోటనం సంభవించింది. ద్రవరూపంలో ఉన్న ఆ నిప్పుల నరకం షాప్ ఫ్లోర్పై సునామీలా దూసుకురావడంతో, చుట్టుపక్కల ఉన్న భారీ యంత్రాలు సైతం మంటల్లో చిక్కుకున్నాయి. క్షణాల వ్యవధిలో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. కనీసం కళ్లు తెరిచి చూడడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటు పరుగెత్తాలో కూడా తెలియని ఓ నరకప్రాయ వాతావరణం అక్కడ ఏర్పడింది. ఊహకే అందని నరకయాతన! 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరిగే నీరు తగిలితేనే చర్మం ఊడిపోతుంది. అలాంటిది 1600 డిగ్రీల సెల్సియస్ అంటే పటిష్టమైన ఇనుము, రాళ్లు సైతం నీరులా కరిగిపోతాయి. ఈ అగ్ని ద్రవం మనిషి శరీరంపై పడితే.. కనీసం రక్తం కారడానికి, లేదా చర్మం కాలడానికి కూడా సమయం ఉండదు. క్షణాల వ్యవధిలో మాంసము, ఎముకలు సైతం బూడిదగా మారిపోతాయి. ఆ వేడి నుంచి వెలువడే శ్వాస గొంతులోకి వెళ్తే ఊపిరితిత్తులు క్షణంలో మాడిపోతాయి. ప్రమాద స్థలంలో కార్మికులు అనుభవించిన ఆ క్షణ కాల నరకయాతన వర్ణనాతీతం, హృదయవిదారకం. కళ్లెదుటే కరిగిపోయిన మనుషులు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్లు, సహచర కార్మికులకు అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి కన్నీరు ఆగలేదు. నిలువెత్తు మనుషులు క్షణాల వ్యవధిలో బొగ్గు ముద్దలుగా మారిపోయారు. కనీసం వారు ధరించిన దుస్తులు గానీ, ముఖాలు గానీ ఆనవాళ్లు లేకుండా పోయిన స్థితి వర్ణనాతీతం. మరోవైపు శరీరమంతా కాలిన గాయాలతో, ప్రాణ రక్షణ కోసం క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు ఉక్కునగర వాతావరణాన్ని శోకసంద్రంగా మార్చాయి. వారిని వెంటనే ప్లాంట్ జనరల్ ఆసుపత్రికి, నగరంలోని కిమ్స్, సెవెన్ హిల్స్ ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్లాంట్ మెయిన్ గేట్ వద్దకు, ఆసుపత్రుల వద్దకు పరుగున చేరుకున్నారు. తమ వారు బతికే ఉన్నారో లేదో తెలియక, లోపలికి వెళ్లనివ్వక వారు ఆసుపత్రి కారిడార్లలో గుండెలు పగిలేలా ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని ద్రవింపజేసింది. బతుకులు.. బుగ్గయ్యాయి ఈ ఘోర ప్రమాద బాధితుల్లో మేనేజర్ స్థాయి అధికారి గోల్డ్ కుమార్ నుంచి.. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కాంట్రాక్ట్ కార్మికుల వరకు ఉన్నారు. నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజు వంటి కాంట్రాక్ట్ కార్మికుల ఇళ్లల్లో ఈ ప్రమాదం కోలుకోలేని చీకట్లను నింపింది. అరకొర జీతాలు, కనీస భద్రత లేని వాతావరణం.. అయినా సరే, కేవలం కుటుంబ పోషణ కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధుల్లో చేరిన ఆ పేద బతుకులు.. కరిగిన ఉక్కు సముద్రంలో కలిసిపోయాయి. మార్చురీ వద్ద ఉద్రిక్తత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్కు తరలించాలని అధికారులు ప్రయతి్నంచగా, క్షతగాత్రుల కుటుంబీకులు, తోటి కార్మికులు అడ్డుకున్నారు. ‘మా వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమేంటో చెప్పాలి.. మాకు ఏం న్యాయం చేస్తారో తేల్చాలి’ అంటూ మార్చురీ ముందే బైఠాయించారు. యాజమాన్యం నిర్లక్ష్యమేనా? ఈ ఘోర దుర్ఘటనపై ఉక్కు కారి్మక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్లో భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కీలకమైన విభాగాల్లో కాలానుగుణంగా యంత్రాల ఫిట్నెస్ పరీక్షించకపోవడం వల్లే లాడిల్ పేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించి, మృతుల కుటుంబాలకు భారీ పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కలి్పంచాలని డిమాండ్ చేశారు. అమ్మని బాగా చూసుకోరాకంటతడి పెట్టిస్తున్న క్షతగాత్రుడి వీడియో వర్మా.. తమ్ముడి మీద ఎప్పుడూ చిరాకు పడకే.. తమ్ముడిని బాగా చదివించురా...నువ్వు కూడా బాగా చదువుకోమ్మా... అమ్మని బాగా చూసుకోండి...ఉంటాను డాడీ...అంటూ స్టీల్ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైడిరాజు వీడియో అందర్నీ కన్నీటి సంద్రంలో ముంచేస్తోంది. ఒంటినిండా గాయాలతో చికిత్స పొందుతున్న ఆ బాధితుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో పిల్లలకు జాగ్రత్తలు చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. కన్నీరుమున్నీరు ‘నువ్వే పోతే మాకు దిక్కెవరు నాన్నా?‘ అని పిల్లలు, ‘పొద్దునే కదా కళ్లముందు తిరిగావు.. ఇంతలోనే శవమయ్యావా?‘ అంటూ మృతుల భార్యలు ఆసుపత్రి నేలపై పొర్లి ఏడుస్తుంటే.. అక్కడ ఉన్న పోలీసుల కళ్లు సైతం చెమర్చాయి. ఇప్పుడు ఆ అభాగ్య కుటుంబాలను ఆదుకునే నాథుడెవరు? తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి పిల్లల భవిష్యత్తు ఏంటి? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.ప్రమాదంపై సమగ్ర విచారణ జరగాలిగాజువాక : స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఉక్కు ప్రమాద మృతులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండేళ్లుగా వీఆర్ఎస్, రిటైర్మెంట్వాళ్లతో కలుపుకొని సుమారు 9,500 మంది కార్మికులను తొలగించారన్నారు. ఉన్న కార్మికులపై విపరీతమైన ఒత్తిడి పెంచారని, ఉత్పత్తి ఆధారితంగా జీతాలు చెల్లిస్తామని షరతు పెట్టారని అన్నారు. దీనివల్ల కార్మికులపై అదనపు భారం పడిందన్నారు. మొన్నటివరకు పది మంది చేయాల్సిన పనిని ఇప్పుడు ముగ్గురు చేస్తున్నారన్నారు. కార్మికులపై అంత భారం పడినప్పుడు వారికి కల్పించాల్సిన భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. భద్రతా ప్రమాణాలు తీసుకోకపోవడమే కాక, సీనియర్ ఉద్యోగులను బలవంతంగా వీఆర్ఎస్ పెట్టించేసి, ఉన్నవాళ్లపై ఒత్తిడి పెంచారన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు యాజమాన్యం ఆ బాధ్యత కూడా తీసుకోకుండా ఈరోజు ఇంతమంది కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు కనీసం కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాజమాన్య వైఫల్యమే.. : కేకే రాజు స్టీల్ప్లాంట్ యాజమాన్యం వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన స్టీల్ప్లాంట్ జనరల్ ఆస్పత్రివద్ద మృతదేహాలను పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ స్టీల్ప్లాంట్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదన్నారు. ముఖ్యంగా 30, 40 మంది పని చేయాల్సిన చోట పది, పదిహేను మందితో పని చేయిస్తున్నారన్నారు. సీనియర్ కార్మికులను ఒత్తిడి పెట్టి నయానో, భయానో వీఆర్ఎస్ తీసుకొనేలా చేశారన్నారు. దశాబ్దాలుగా పని చేసిన కాంట్రాక్టు కార్మికులను నిర్ద్వందంగా తొలగించారన్నారు. ఇలాంటి నిర్ణయాలవల్ల ఈరోజు భారీ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని, దీనికి స్టీల్ప్లాంట్ యాజమాన్యం బాధ్యత వహించాలని అన్నారు. కనకమహాలక్ష్మి నగర్లో విషాదం గోపాలపట్నం: స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో జీవీఎంసీ 90వ వార్డు కనకమహాలక్ష్మి నగర్కు చెందిన ఎం. కృష్ణ నాగు (55) మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇటీవలే సీఎంఎం విభాగం నుంచి ఎస్ఎంఎస్కు బదిలీ అయిన ఆయన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సరైన నిర్వహణ లేకే..డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని íసీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, అధ్యక్షుడు కేఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో ఆరోపించారు. కాలం చెల్లిన యంత్రాలు వాడడం, నాసిరకం ముడిసరుకు, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే లాడిల్ పేలి 8 మంది కారి్మకులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి మోదీ, బాబులదే బాధ్యత ఉక్కు ప్రమాదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం, ప్రైవేటీకరణ విధానాలే కారణమని సీపీఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు ఆరోపించారు. మృతి చెందిన కారి్మక కుటుంబాలకు రూ.కోటి,గాయపడిన వారికి రూ.50 లక్షల చొప్పున సాయం అందించాలన్నారు. -
స్టీల్ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా సర్కార్ నిర్లక్ష్యం
విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ నిమిత్తం నిపుణులపైన ముగ్గురు సభ్యులతో హైలెవల్ కమిటీ ఏర్పాటైంది. ప్రమాద స్థలిలో ఉన్నత స్థాయి కమిటీ విచారణ చేపట్టనుంది. విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ఉద్యోగులతో పాటు ముగ్గురు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాజా అప్డేట్స్.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారుమరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు22 మంది చేయాల్సిన పనిని కేవలం 11 మందితో చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారుఉత్పత్తి సామర్థ్యం పెరిగినా కార్మికుల సంఖ్యను భారీగా తగ్గించడం ప్రమాదాలకు కారణమైందిగత రెండేళ్లుగా వీఆర్ఎస్ పేరుతో అనుభవజ్ఞులైన కార్మికులను బలవంతంగా ఇంటికి పంపించారుఅనుభవం లేని వారితో, తక్కువ జీతాలకు పని చేయించడమే ఈ విషాదానికి కారణంయాజమాన్యం బాధ్యతారాహిత్యం, కక్కుర్తి వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారుకార్మిక సంఘాల డిమాండ్ ఇదేస్టీల్ ప్లాంట్ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలికాలం చెల్లిన యంత్రాలను తొలగించి కొత్త వాటిని నిర్మించాలికార్మికుల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలిమృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలిక్షతగాత్రులకు రూ. 50 లక్షల పరిహారం ప్రకటించాలిపవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలుస్టీల్ప్లాంట్ కార్మిక నేతలపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలుస్టీల్ప్లాంట్ ప్రమాదంపై మొదట కార్మిక సంఘాలను నిలదీయాలి అంటూ అనుచిత వ్యాఖ్యలుమృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తిస్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తిభాను కుమార్, కృష్ణ నాగ్, ప్రభాకర్, జీవీ అప్పారావునక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజుమృతదేహాలను బంధువులకు అప్పగించిన అధికారులుబిహార్కు చెందిన గోల్డ్ కుమార్ బంధువుల రాక కోసం అధికారులు ఎదురుచూపుబాధితులను ఓదార్చి ధైర్యం చెప్పిన వైఎస్సార్సీపీ నేతలువిశాఖ కేజీహెచ్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన బొత్స సత్యనారాయణ, కన్నబాబు, గుడివాడ అమర్న్నాథ్, కేకేప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరం: బొత్సకూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తోందిస్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి సర్కార్ కుట్రలుస్టీల్ప్లాంట్ ఉద్యోగులను తొలగించడం ముమ్మాటికీ తప్పేకార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా?విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ప్లాంట్ వచ్చింది అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యంవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా ప్రభుత్వం నిర్లక్ష్యంఘోర ప్రమాదం జరిగిన స్పందించని సీఎం చంద్రబాబు, మంత్రులునిన్న సాయంత్రం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది మృతివిజయవాడలోనే ఉన్నా విశాఖపట్నం వెళ్లని సీఎం చంద్రబాబుఈరోజు ఉదయం వరకు ఒక్కరు కూడా వెళ్లని రాష్ట్ర మంత్రులుకేంద్రమంత్రి కుమారస్వామి వచ్చాక వచ్చిన రాష్ట్ర మంత్రులుఈరోజు ఉదయం వెళ్లిన మంత్రి నారా లోకేష్లోకేష్ తర్వాత వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కేంద్రమంత్రి వచ్చేవరకు సంఘటన వైపు కన్నెత్తి చూడని హోంమంత్రి అనితకనీసం పట్టించుకోని జిల్లా మంత్రులు, ఇన్ ఛార్జ్ మంత్రులుఈరోజు కూడా విశాఖకు వెళ్లని సీఎం చంద్రబాబువిజయవాడలోనే సమీక్షలు చేసుకుంటున్న సీఎం చంద్రబాబురేపు విశాఖకు వైఎస్ జగన్స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించనున్న జగన్ఆసుపత్రులలో ఉన్న క్షతగాత్రులకు పరామర్శఏపీలో రెడ్బుక్ అరాచకం నడుస్తోంది: గుడివాడ అమర్నాథ్కార్మిక సంఘాలను లోకేష్ అవమానించాడులోకేష్ నియంతలా వ్యవహరిస్తున్నారుఎవరికీ సమాధానం చెప్పను అనే విధంగా లోకేష్ మాట్లాడారుకార్మికులను బెదిరించే ధోరణిలో లోకేష్ మాట్లాడారుబాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలికార్మికుల సంక్షేమాన్ని కూటమి గాలికొదిలేసిందిస్టీల్ ప్లాంట్ వద్ద లోకేశ్కు చేదు అనుభవంవిశాఖ స్టీల్ ప్లాంట్ వద్దకు మంత్రి నారా లోకేశ్హోం మంత్రి అనితతో ప్లాంట్ వద్దకు వెళ్లిన లోకేశ్లోకేశ్ ఎదుట నిరసనకు దిగిన కార్మిక సంఘాలులోకేశ్ను నిలదీసిన కార్మిక సంఘాలునైపుణ్యం లేని కార్మికులకు ఎలా అనుమతి లభించిందని ఆగ్రహంఎంపీ భరత్, అనితలు సర్దిచెప్పబోయినా.. వినని కార్మిక సంఘాలుకార్మికులకు సమాధానం ఇవ్వలేకపోయిన లోకేశ్వాళ్ల ఆవేదనను అర్థం చేసుకోని లోకేశ్ఎందుకు గొడవ పడుతున్నారంటూ ఆగ్రహంప్రశ్నించిన కార్మికులపై మంత్రి లోకేశ్ అసహనంలోకేశ్ తీరుపై మండిపడ్డ కార్మికులు👉విశాఖ స్టీల్ప్లాంట్ ఘటనాస్థలిని కేంద్రమంత్రి కుమారస్వామి పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించారు. విశాఖ స్టీల్ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.👉150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలితీసుకుంది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది.👉గత రెండు నెలలుగా లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్ నుంచి లీకవుతుందే గానీ పేలుడు ఎక్కడా జరగలేదు. దేశంలోని స్టీల్ ప్లాంట్లలో ఇలా లాడెల్లోని ఉక్కు ఎగసిపడటం ఇదే ప్రథమమని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రాసెసింగ్ కోసం వాడే రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ తరహా దుర్ఘటన జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
ప్రమాదాలతో ప్లాంట్కు భారీ ఆర్థిక నష్టాలు
ఉక్కునగరం(విశాఖ): విశాఖ స్టీల్ప్లాంట్ యాజమాన్యంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత యాజమాన్య ప్రతినిధులు స్పందించారని ధ్వజమెత్తారు. తీరుబడిగా ఆస్పత్రికి వచ్చి ప్రమాదం దురదృష్టకరమని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కార్మీకులపై యాజమాన్యం పెనుపనిభారం మోపుతోందని, కనీస రక్షణ చర్యలు చేపట్టడం లేదని దుయ్యబట్టారు. యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, నష్టపరిహారంపై ఇప్పటికీ పెదవి విప్పడం లేదని, సీఎండీ వచ్చి న తర్వాత ప్రకటిస్తామని, అధికారులు కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం కార్మీకులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు ఏమన్నారంటే.. ఏడాదిగా చెబుతూనే ఉన్నాం ఏడాదిగా ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తూనే ఉన్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీనివల్లే ఈ పెను ప్రమాదం సంభవించింది. 20 మంది ఉండాల్సిన పని ప్రదేశంలో కేవలం 12 మందితో పని చేయించడం దారుణం. పనికిరాని వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఉత్పత్తి చేయడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. – డి.ఆదినారాయణ, ప్రధానకార్యదర్శి, స్టీల్ ఏఐటీయూసీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే స్టీల్ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రతపై దృష్టి సారించకుండా కేవలం ఉత్పత్తి లక్ష్యంగా కార్మీకులపై ఒత్తిడి పెంచుతోంది. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తే మాత్రం పోయిన ప్రాణాలు తేగలం. తీవ్రమైన ఒత్తిడితో పని చేయించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. – మంత్రి రాజశేఖర్, జాతీయ కార్యదర్శి, ఐఎన్టీయూసీ నాణ్యత లేని రా మెటీరియల్ వాడడం వల్లే నాణ్యత లేని రా మెటీరియల్ వాడడంతో సరైన రసాయన చర్యలు జరగకపోవడం వల్లే ఈ బ్లాస్ట్ జరిగింది. 20 మంది ఉండాల్సిన ప్రదేశంలో 12 మంది పని చేస్తున్నారు. భద్రతను గాలికి వదిలేశారు. కార్మీకుల గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుతం గుర్తించలేని పరిస్థితిలో మృతదేహాలు ఉండటం ప్రమాదం తీవ్రతకు అద్దంపడుతోంది. ఇకనైనా యాజమాన్యం సరైన చర్యలు తీసుకోవాలి. – జె. అయోధ్యరామ్, ప్రధానకార్యదర్శి, స్టీల్ సీఐటీయూ -
ఉక్కులో.. ఉప ‘ద్రవం’!.. విశాఖ స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం / ఉక్కునగరం: బతుకుదెరువు కోసం స్వేదం చిందించిన కార్మికుల ప్రాణాలు ఉక్కు కొలిమిలో కాలి బూడిదయ్యాయి. సుమారు 1,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో సలసల కాగే ఉక్కుద్రవం మృత్యువులా వారిపై విరుచుకుపడింది. తప్పించుకునే అవకాశం కూడా లేకుండా ఎనిమిది మందిని సజీవ దహనం చేసింది. నల్లటి ముద్దల్లా మార్చేసింది. విశాఖ స్టీల్ప్లాంట్లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ఉద్యోగులతో పాటు ముగ్గురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో ఆరుగురు తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లాడెల్ నుంచి విరజిమ్మిన ద్రవపు ఉక్కు విశాఖ స్టీల్ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాప్ (ఎస్ఎంఎస్)–1లో సాయంత్రం 4.15 గంటలకు ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 150 టన్నుల ద్రవపు ఉక్కును మోసుకెళ్తున్న భారీ లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు ఒక్కసారిగా విస్ఫోటనం చెంది పైకి ఎగసిపడింది. దీంతో అందులో ఉన్న సలసల కాగే ఉక్కు ద్రవం నేలపై చెల్లాచెదురుగా పడటంతో పెను ప్రమాదం సంభవించింది. 8 మందిని బలితీసుకుంది. లాడెల్ నుంచి ద్రవం తుళ్లిన వేగానికి, ఉక్కు ద్రవం వేడికి అక్కడ ఉన్న భారీ క్రేన్ పూర్తిగా దగ్ధమైంది. ఆ ప్రాంతమంతా క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ప్లాంట్ అగ్నిగుండంగా మారింది. స్టీల్ ప్లాంట్ల చరిత్రలో తొలిసారిగా..! దేశంలోని ఏ స్టీల్ప్లాంట్లోనూ ఈ తరహా ప్రమాదం సంభవించలేదు. లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు లీకయి ప్రమాదాలు జరిగేవి. కానీ.. ఈసారి లాడెల్ నుంచి ద్రవపు ఉక్కు చిచ్చుబుడ్డిలా ఎగసిపడింది. బ్లాస్ట్ ఫర్నేస్ విభాగంలో తయారైన హాట్మెటల్ను లాడెల్లో ఎస్ఎంఎస్ విభాగానికి తరలించి వివిధ రకాల రసాయన చర్యల ద్వారా ద్రవపు ఉక్కును తయారు చేస్తారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం బీ షిఫ్ట్లో సీసీడీ మిషన్–2 పై లాడెల్ను సిద్ధం చేశారు. స్టీల్ప్లాంట్ ఎస్ఎంఎస్–1 విభాగంలో సుమారు 9 మీటర్ల ఎత్తులో ఉండే సీసీడీ సెక్షన్లో లాడెల్ను రొటేట్ చేస్తుండగా అందులో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా పెద్ద విస్ఫోటనంతో పైకి ఎగసింది.సుమారు 1,600 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ద్రవం నలువైపులా వేగంగా విరజిమ్మడంతో చుట్టుపక్కల ఉన్న యంత్రాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు దావానలంలా వ్యాపించాయి. వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ఆ మంటల్లో చిక్కుకు పోయారు. తీవ్ర గాయాలపాలై హాహాకారాలు చేస్తూ మంటల్లో నుంచి ఇద్దరు కార్మికులు అతి కష్టమ్మీద బయటకు వచ్చారు. అతి కష్టమ్మీద అదుపులోకి.. ఎక్కడ చూసినా సలసల కాగుతున్న ద్రవపు ఉక్కుతో ఎస్ఎంఎస్–1లోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగం మంటలను అతికష్టమ్మీద అదుపు చేయగలిగింది. మంటల్లో ముద్దగా కాలిపోయిన వారిని గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 32 అంబులెన్స్లు ఏర్పాటు చేసింది. క్షతగాత్రులను ఉక్కు జనరల్ ఆస్పత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్ప కోసం నగరంలోని పలు హాస్పిటల్స్కు తరలించారు.స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్ మార్చురీలో ఉంచిన మృతదేహాలను కేజిహెచ్కు తరలించకుండా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో వెల్లడించాలని, దుర్ఘటనపై యాజమాన్యం వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో మృతదేహాలను జనరల్ హాస్పిటల్ వద్దే ఉంచారు. క్షతగాత్రులను సెవెన్హిల్స్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించిన అధికారులు ఎమర్జెన్సీ గేట్ నుంచి కాకుండా వెనక వైపు నుంచి తీసుకెళ్లారు. ఫోటోలు, వీడియోలు తీయవద్దని కలెక్టర్ చెప్పారంటూ మీడియా ప్రతినిధులను ఆర్డీవో హెచ్చరించారు. రెండు నెలలుగా 27 సార్లు లీక్..! గత రెండు నెలలుగా లాడెల్స్ నుంచి ద్రవపు ఉక్కు 27 సార్లు లీక్ కాగా పలుమార్లు కార్మికులు పెను ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సాధారణంగా లాడెల్ నుంచి లీకవుతుందే గానీ పేలుడు ఎక్కడా జరగలేదు. దేశంలోని స్టీల్ ప్లాంట్లలో ఇలా లాడెల్లోని ఉక్కు ఎగసిపడటం ఇదే ప్రథమమని కార్మిక సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రాసెసింగ్ కోసం వాడే రసాయనాలు నాణ్యత లేనివి కావడం వల్లే కెమికల్ రియాక్షన్ జరిగి ఈ తరహా దుర్ఘటన జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రాణ నష్టాన్ని తగ్గించిన టీ విరామం.. సాయంత్రం సమయంలో టీ విరామం కోసం చాలా మంది కార్మికులు, ఉద్యోగులు బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల సాధారణంగా 60 నుంచి 70 మంది వరకూ ఉద్యోగులు, కార్మికులు ఉంటారు. కానీ ఆ సమయంలో టీ విరామానికి వెళ్లిపోవడంతో 15 నుంచి 18 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ప్రాణ నష్టం తగ్గిందని చెబుతున్నారు. విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఘటనా స్థలిని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎంపీ శ్రీ భరత్ పరిశీలించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆస్పత్రికి చేరుకుని మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన ఉద్యోగులు.. ⇒ గోల్డ్ కుమార్, మెకానిక్ ఇన్చార్జ్–2 ⇒ గొందిన భానుకుమార్, టెక్నీíÙయన్ ⇒ ఎం.కృష్ణ నాగ్, టెక్నీíÙయన్ ⇒ కె. ప్రభాకర్, టెక్నీíÙయన్ ⇒ జీవీ అప్పారావు కాంట్రాక్ట్ కార్మికులు.. ⇒ నక్క వెంకటరమణ ⇒ త్రినాథ్ ⇒ ఎన్.అప్పలరాజుతీవ్రంగా గాయపడిన కాంట్రాక్ట్ కార్మికులు... ⇒ సూరిబాబు(90 శాతం కాలిన గాయాలు), పైడిరాజు(30 శాతం కాలిన గాయాలు), పల్లెల శ్రీనివాసరావు (40 శాతం కాలిన గాయాలు)లను సెవెన్ హిల్స్కు తరలించారు. ⇒ రావూరి మల్లికార్జునరావు , జి.అర్జున్ అప్పారావు, సత్యానంద్ బాలువ (10 శాతం కాలిన గాయాలు)లను కిమ్స్లో చేర్పించారు. మృతుల కుటుంబాలవైపు కన్నెత్తి చూడని హోంమంత్రి పర్యటన ప్లాంట్కే పరిమితం సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదం గురించి తెలుసుకున్న హోం మంత్రి అనిత సోమవారం రాత్రి ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని పరిశీలించి ఎలా జరిగిందనే వివరాల్ని అడిగి తెలుసుకుని వెళ్లిపోయారు. కానీ సమీపంలో ఉన్న ఉక్కు జనరల్ హాస్పిటల్ వైపు వెళ్లలేదు. అక్కడ మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నా ఓదార్చేందుకు హోంమంత్రి గానీ, ఎంపీ భరత్ గానీ రాకపోవడంపై కార్మిక కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ప్లాంట్లో ప్రమాదం అత్యంత విషాదకరం: మాజీ సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ మెల్టింగ్ షాప్–2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పడటం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక సంస్థల్లో కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని వైఎస్ జగన్ పేర్కొన్నారు.భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాద బాధితులు, వారి కుటుంబాలకు అన్నివిధాలా అండగా నిలవాలని విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను వైఎస్ జగన్ ఆదేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బాధాకరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం అత్యంత బాధాకరం. మృతులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. మృతుల ఆత్మలకు శాంతి కలగాలి. – ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి తీవ్ర ఆవేదన చెందుతున్నా స్టీల్ ప్లాంట్ ప్రమాదం కలచివేసింది. పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. – సీపీ రాధాకృష్ణన్, ఉప రాష్ట్రపతి అత్యంత దిగ్భ్రాంతికరం విశాఖ స్టీల్ప్లాంట్ దుర్ఘటన అత్యంత దిగ్భ్రాంతికరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్గ్రేíÙయాను ప్రకటించాం. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి మాటలు రావడం లేదు వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతిని తెలిపేందుకు మాటలు రావడం లేదు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. – నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అత్యంత బాధాకరం దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. – జి.కిషన్రెడ్డి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి విషాదకరం స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరం. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి. మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. – డాక్టర్ తనూజరాణి, అరకు ఎంపీ ప్రభుత్వం ఆదుకోవాలి స్టీల్ ప్లాంట్ ప్రమాదం విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందించాలి. ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. బాధితులను ఆదుకోవాలి. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలి. – కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ దురదృష్టకరం స్టీల్ ప్లాంట్ ప్రమాదం దురదృష్టకరం. విషాద ఘటన గురించి తెలియగానే ప్లాంట్కు చేరుకున్నాం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాం. మృతుల కుటుంబాల వేదన వర్ణనాతీతం. ఆ కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, తిప్పల దేవన్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు స్టీల్ ప్లాంట్లో విషాద ఘటనలివీ..విశాఖ స్టీల్ప్లాంట్లో ఇప్పటివరకూ జరిగిన ప్రమాదాల్లో పదుల సంఖ్యలో కార్మికులు మృత్యువాత పడ్డారు. 2012 జూన్లో జరిగిన దుర్ఘటన ప్లాంట్ చరిత్రలో అత్యంత విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ప్లాంట్లో విషాద ఘటనల వివరాలివీ... ⇒ 2012 మే 1న కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్–3 లో పేలుడు కారణంగా ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ⇒ 2012 జూన్ 13న విశాఖ స్టీల్ప్లాంట్ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. స్టీల్ మెల్టింగ్ షాప్–2 వద్ద ఆక్సిజన్ ప్లాంట్లో ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అధిక పీడనం కారణంగా భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ దుర్ఘటనలో డీజీఎం స్థాయి అధికారులతో సహా మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ⇒ 2014 జూన్ 16న ఎస్ఎంఎస్–2 విస్తరణ పనుల్లో భాగంగా కంటైనర్ ల్యాబ్ని తనిఖీ చేస్తుండగా కార్బన్ మోనాక్సైడ్ లీకై ఇద్దరు ప్రైవేట్ కాంట్రాక్టు ఇంజనీర్లు మృతి చెందారు. ⇒ 2020 డిసెంబర్ 18న స్టీల్ మెల్టింగ్ షాప్–2(ఎస్ఎంఎస్–2)లో వేడి ద్రవపు ఉక్కుని తీసుకెళ్తున్న ల్యాడిల్ హుక్స్ ఊడిపోవడంతో ద్రవం కింద పడింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ప్రాణాపాయం తప్పింది. ⇒ 2021 నవంబర్ 16న బ్లాస్ట్ ఫర్నేస్–3లో పేరుకుపోయిన స్లాగ్(వ్యర్థం) తొలగిస్తుండగా వేడి ద్రవరూప లోహం ఒక్కసారిగా ఎర్త్ మూవర్ పైకి దూసుకొచి్చంది. ఈ ప్రమాదంలో ఆపరేటర్, సూపర్వైజర్, ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ⇒ 2026 మే 11న ప్లాంట్లోని థర్మల్ పవర్ ప్లాంట్ ఏరియాలో స్వల్ప స్థాయిలో బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్ (కార్బన్ మోనాక్సైడ్, ఇతర వాయువులు) లీకై నలుగురు కార్మికులు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ⇒ 2025 ఆగస్ట్–సెప్టెంబర్ మధ్య వివిధ ప్రమాదాల్లో దాదాపు ఆరుగురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదాల్లో చనిపోయారని యూనియన్ నాయకులు చెబుతున్నారు. ప్రమాదాలతో ప్లాంట్కు భారీ ఆర్థిక నష్టాలుస్టీల్ ప్లాంట్లో ద్రవపు ఉక్కు ప్రమాదాలే అత్యధికంగా జరుగుతున్నాయి. మెల్టింగ్ షాపులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఆధునికీకరించడం లేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. 2011 ఏప్రిల్– జూన్ మధ్య వరుసగా జరిగిన ప్రమాదాలు స్టీల్ ప్లాంట్కు భారీ ఆర్థిక నష్టం కలిగించాయి. ⇒ 2011 ఏప్రిల్ 10న ఎస్ఎంఎస్లో ల్యాడిల్ నుంచి సుమారు 140 టన్నుల ద్రవపు ఉక్కు కిందపడి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివల్ల ప్లాంట్కు రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది. ⇒ 2011 ఏప్రిల్ 14న ఎస్ఎంఎస్ కంటిన్యుయస్ కాస్టింగ్ విభాగంలో 140 టన్నుల హాట్మెటల్ లీకేజీ కావడంతో రూ.60 కోట్లు నష్టం సంభవించింది. రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. ⇒ 2011 ఏప్రిల్ 17న రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో అగ్నిప్రమాదం జరిగి మూడు కన్వేయర్ బెల్ట్లు తెగిపోయి 48 గంటల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. ⇒ 2012 ఫిబ్రవరి 6న ఎస్ఎంఎస్లో భారీ స్థాయిలో హాట్మెటల్ స్పిల్లేజ్ కారణంగా రూ.కోటి ఆస్తి నష్టం వాటిల్లింది. ⇒ 2012 మే 22న కొత్త బ్లాస్ట్ ఫర్నేస్కు ముడిసరుకు తీసుకెళ్తున్న కన్వేయర్ బెల్ట్ సింటర్ ప్లాంట్ వద్ద పూర్తిగా కాలిపోవడం వల్ల రూ.కోటి నష్టం వాటిల్లింది. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు స్థానిక అధికారులు సాధ్యమైనంత సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయలు అందజేస్తామని ప్రధానమంత్రి తెలిపారు.కాగా, ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు కాలిపోయాయి. బాధితులకు న్యాయం చయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన ఒక్కొక్కరికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని అంటున్నారు. అలాగే, కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు, క్షతగాత్రుల్లో ఆరుగురిని గుర్తించారు. వారి పేర్లు రావూరి మల్లికార్జున రావు, పల్లెల శ్రీనివాసరావు, అప్పారావు, సత్యానంద్ బొల్లా, హరిబాబు, రాజు.మృతుల వివరాలుఉద్యోగులుగొంతిన భాను కుమార్ (టెక్నీషియన్)జి.వి. అప్పారావుఎం. కృష్ణ నాగుకె. ప్రభాకర్ (జనరల్ ఫోర్మ్యాన్)గోల్డ్ కుమార్ (మేనేజర్, మెకానిక్-2 ఇన్చార్జ్)కాంట్రాక్ట్ కార్మికులురమణత్రినాథ్ఎన్. అప్పల రాజు -
మృత్యువలయంగా విశాఖ స్టీల్ ప్లాంట్..!
విశాఖ స్టీల్ ప్లాంట్లో తాజాగా జరిగిన ప్రమాదం మరోసారి భద్రతా ప్రమాణాలపై చర్చకు దారితీసింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని దశాబ్దాలుగా ప్లాంట్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ విభాగాల్లో జరిగిన ప్రమాదాల్లో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ప్రధానంగా గ్యాస్ లీకేజ్, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకరంగా మారింది.తాజాగా విశాఖ స్టీల్ప్టాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడగా, పలువురు లోపల చిక్కుకున్నట్లు సమాచారం. ఈ దారుణం వెనుక భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇంతటి దారుణం చోటు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. 2012లో ఘోర ప్రమాదం.. అయితే ఈ ఘటన 2012లో విశాఖ స్టీల్ ప్టాంట్లో జరిగిన ఘోర దుర్ఘటనకు గుర్తుకుతెచ్చింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే జూన్ నెలలో 13వ తారీఖున చోటు చేసుకున్న స్టీల్ప్లాంట్ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ ప్లాంట్ వద్ద పేలుడు సంభవించి 19 మంది దుర్మరణం చెందారు. ఆ సమయంలో పలువురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆక్సిజన్ పైప్లైన్లో ఒత్తిడి ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల పైప్లైన్ పేలిపోయి, భారీగా మంటలు వ్యాపించాయి. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య ఉండటంతో, అధికారులు మరియు కార్మికులు దానిని పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.దాంతో అక్కడే ఉన్న పలువురు ఈ ఘోరం బారిన పడ్డారు. మరణించిన 19 మందిలో ముగ్గురు డిప్యూటీ జనరల్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, కన్సల్టెంట్లు మరియు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు.తీవ్ర గాయాలు: ఎందరో ఉద్యోగులు తీవ్రమైన శాతంలో కాలిపోయి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అదే సంవత్సరం మే 1వ తేదీన కూడా స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నెస్-3 లో జరిగిన మరో పేలుడులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనమయ్యారు. .గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్లో షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీకై మంటలు చెలరేగాయి.ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈసారి ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన మరికొన్ని ప్రమాదాలు..మే 22, 2012: సింటర్ ప్లాంట్లో మంటలు చెలరేగడంతో, కొత్త బ్లాస్ట్ ఫర్నేస్కు ముడి పదార్థాన్ని తీసుకువెళ్తున్న కన్వేయర్ బెల్ట్ పూర్తిగా కరిగిపోయింది. రూ. 1 కోటి ఉత్పత్తి నష్టం.మే 1, 2012: కొత్తగా ప్రారంభించిన బ్లాస్ట్ ఫర్నేస్ IIIలో జరిగిన పేలుడులో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఫిబ్రవరి 6, 2012: స్టీల్ మెల్టింగ్ షాప్ లో భారీ పరిమాణంలో వేడి లోహం ఒలికిపోవడం, రూ. 1 కోటి నష్టంఏప్రిల్ 10, 2011: సుమారు 140 టన్నుల ద్రవ ఉక్కును తీసుకువెళ్తున్న లాడిల్ నుండి అది కిందపడటంతో ఎస్ఎంఎస్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, రూ. 60 కోట్ల నష్టం వాటిల్లింది.ఏప్రిల్ 14, 2011: ఎస్ఎంఎస్లోని కంటిన్యూయస్ కాస్టింగ్ విభాగంలో భారీ పరిమాణంలో వేడి లోహం కింద పడిపోయింది, 140 టన్నుల ద్రవ ఉక్కు నేలపై పడింది. ఏప్రిల్ 17, 2011: ముడి పదార్థాల నిర్వహణ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం, మూడు కన్వేయర్ బెల్టులకు నష్టం, రూ. 20 కోట్ల నష్టంమే 1, 2011: బ్లాస్ట్ ఫర్నేస్కు ముడి పదార్థాలను రవాణా చేసే కన్వేయర్ బెల్ట్ మెలితిరగడంతో 48 గంటల పాటు ఉత్పత్తికి అంతరాయంజూన్ 18, 2011: కోక్ డ్రైయింగ్ కూలింగ్ ప్లాంట్లోని రెండు కన్వేయర్ బెల్టులలో ఒకదానిపై వేడి కోక్ పడటంతో అగ్నిప్రమాదం సంభవించింది, రూ. 15 లక్షల నష్టం -
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. ఈ దారుణమైన ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. భవిష్యత్లో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. బాధితులకు విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు అండగా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు. క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.కాగా, ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం సాయంత్ర సమయంలో ఈ ఘెర ప్రమాదం సంభవించింది. ప్రధానంగా ప్లాంట్ ఎస్ఎంఎస్ -2లో హాట్మెంట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం..విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి -
మన అద్దాల రైలుకు అరుదైన గుర్తింపు
సాక్షి, విశాఖపట్నం: అద్దాల రైలులో అరుదైన పర్యాటక మార్గం.. సరికొత్త మైలురాయిని అందుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన నేషనల్ టూరిజం సర్వేలోని ‘ఇండియన్ రూట్స్’ ఎడిటర్స్ ఛాయిస్ విభాగంలో విశాఖ–అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే అత్యుత్తమ పర్యాటక రైలు మార్గంగా అగ్రస్థానంలో నిలిచింది. తూర్పు కనుమల ప్రకృతి సోయగాలు, సొరంగ మార్గాలు, పచ్చని లోయలు, జలపాతాల మధ్య ఆహ్లాదకరంగా సాగే ఈ రైలు ప్రయాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ అవార్డు దక్కింది. జూన్ 15న గోవాలో జరగనున్న ‘ఇండియా టుడే టూరిజం సమ్మిట్ అండ్ అవార్డ్స్–2026’ కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించనున్నారు. విశాఖ– అరకు మార్గంలో పర్యాటకుల కోసం మొట్టమొదటి విస్టాడోమ్ (అద్దాల బోగీ) కోచ్ను 2017 ఏప్రిల్ 16న అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు లాంఛనంగా ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి విస్టాడోమ్ కోచ్. ఆ తర్వాత పర్యాటకుల నుంచి వచ్చిన విశేష స్పందన, డిమాండ్ మేరకు ఈ మార్గంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విస్టాడోమ్ కోచ్ల సంఖ్యను పెంచుతూ వచ్చారు. అనంతరం, పూర్తిస్థాయి అత్యాధునిక ఎల్ హెచ్ బి విస్టాడోమ్ కోచ్లతో అప్గ్రేడ్ చేసిన రైలు (విశాఖ–కిరండూల్ ఎక్స్ప్రెస్)ని 2021 నవంబర్ 22న ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ రైలు మార్గానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి ప్రయాణంలో 100 శాతం ఆక్యుపెన్సీతో ఈ రైలు నడుస్తోందని విశాఖపట్నం డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. -
సామూహిక ధ్యానంతోనే మానసిక ప్రశాంతత
ఎంవీపీకాలనీ: సహజ యోగా ట్రస్ట్, బాలశక్తి టీమ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సహజ యోగ ధ్యాన పరిచయ కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష స్పందన లభించింది. ఎంవీపీ కాలనీలోని గాధిరాజు ప్యాలెస్ వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న ఈ శిక్షణా తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఇందులో వేల మంది నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ రామకృష్ణ మాట్లాడుతూ నిత్యజీవితంలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న ప్రజలు ధ్యానం ద్వారా వాటిని ఎలా అధిగమించవచ్చో వివరించారు. చిన్నారులకు బాలశక్తి టీమ్ ఆధ్వర్యంలో ధ్యానం, ఏకాగ్రత, సంస్కారవంతమైన జీవనం వంటి అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడు భల్లా, జాతీయ సభ్యుడు మధుసుదన్రావు, ఏపీ సమన్వయకర్త రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వేటసాగేదెలా?
మత్స్య పరిశ్రమపై నిర్లక్ష్యం వీడాలి రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. డీజిల్ ధరలు భరించలేని స్థాయిలో పెరిగిపోవడంతో మత్స్యకారులు, బోటు యజమానులు ఎలా బతకాలో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికై నా సర్కార్ నిర్లక్ష్యం వీడి, లీటర్ డీజిల్పై రూ.25 సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఆప్కాఫ్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలి. మత్స్యకారులను వలసల బాట పట్టించే విధానాలను ఆపాలి. ఈ సమస్యలపై హార్బర్లలోని సాంప్రదాయ మత్స్యకారులు, సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి మత్స్య పరిశ్రమను కాపాడాలి. – జానకిరామ్ వాసుపల్లి, ప్రెసిడెంట్, మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మహారాణిపేట: వేట నిషేధ కాలం ముగిసి, ఈ నెల 15 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వారి బతుకులను సంకటంలోకి నెట్టింది. వేట ప్రారంభానికి వారం రోజుల సమయం కూడా లేని ఈ సంధి కాలంలో, బోట్లను నడపడానికి అత్యంత కీలకమైన రాయితీ డీజిల్ ఆయిల్ను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడం తీర ప్రాంతంలో తీవ్ర ఆందోళన రేపుతోంది. అప్పులు తెచ్చి బోట్లను మరమ్మతులు చేయించుకున్న యజమానులు ఇప్పుడు సబ్సిడీ ఆయిల్ రాక, వేటకు వెళ్లలేక అగమ్యగోచర స్థితిలో పడ్డారు. ప్రస్తుతం డీజిల్ ధర లీటరుకు రూ.104.10 పైసలకు చేరినా, ప్రభుత్వం మాత్రం పాత తొమ్మిది రూపాయల సబ్సిడీనే కొనసాగించడం మత్స్యకారుల నడ్డి విరుస్తోంది. పెరుగుతున్న ధరల దృష్ట్యా డీజిల్ సబ్సిడీని లీటరుకు రూ.25కు పెంచాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదికి సంబంధించిన ‘మత్స్యకార భరోసా’ నిధులను ఎగ్గొట్టడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఇంకా ఎంతోమంది అర్హులకు ఈ సాయాన్ని అందకుండా నిలిపివేసింది. ప్రభుత్వ ఆర్థిక సాయం అందక, డీజిల్ కొరతతో ఇప్పటికే నష్టాలతో కునారిల్లుతున్న మత్స్య పరిశ్రమను కూటమి సర్కార్ మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోందని మత్స్యకార వర్గాలు మండిపడుతున్నాయి. 32 కి.మీ. మేర తీరప్రాంతం విశాఖ జిల్లా పరిధిలో 32 కిలోమీటర్ల తీరప్రాంతం, 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 667 మరపడవలు, 3,094 మోటారు పడవలు, 611 సంప్రదాయ ఇంజిన్ లేని తెప్పలు ఉన్నాయి. వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. డీజిల్ సబ్సిడీ పెంచాలి చంద్రబాబు ప్రభుత్వం లీటరు డీజిల్పై రూ.9 సబ్సిడీ అందిస్తోంది. అయితే గతంలో డీజిల్ ధర లీటరుకు రూ.70 ఉన్న సమయంలో కూడా ఇదే స్థాయిలో సబ్సిడీ అందించేవారని మత్స్యకారులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ధరలు రూ.100 దాటినా సబ్సిడీ మొత్తంలో ఎలాంటి పెంపు లేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారుల ఆందోళన అయితే ప్రస్తుతం సబ్సిడీ డీజిల్ సరఫరాపై స్పష్టత లేకపోవడంతో వేట ప్రారంభానికి ముందు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో సబ్సిడీ అందకపోతే నిర్వహణ వ్యయం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. అమ్మవారికి పూజలతో వేటకు శ్రీకారం ఈ నేపథ్యంలో ఈనెల 9వ తేదీ మంగళవారం విశాఖ ఫిషింగ్ హార్బర్లో శ్రీశ్రీశ్రీ గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంప్రదాయంగా గంగమ్మ తల్లి ఆశీస్సులతోనే వేట ప్రారంభించే మత్స్యకారులు, జాతర అనంతరం అధికారికంగా సముద్రంలోకి వెళ్లనున్నారు. ఇంకా అందని ఆయిల్ సబ్సిడీ మరో వారం రోజుల్లో వేట ప్రారంభం కానున్నప్పటికీ, మత్స్యకారులకు అందాల్సిన డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఇంకా విడుదల కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల ద్వారా ప్రతి నెల ఒక్కో బోటుకు 3 వేల లీటర్ల చొప్పున సబ్సిడీ డీజిల్ అందించేవారు. దీంతో బోటు యజమానులకు నెలకు రూ.27 వేల వరకు ఆదా అయ్యేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. -
సర్ ఫోకస్
ఓటరు జాబితాపైమహారాణిపేట: నిర్దిష్టమైన, పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్కు అనుగుణంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, ఓటర్ల నుంచి పూర్తి వివరాలను సేకరించనున్నారు. అలాగే ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్నవారు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నారా లేదా అనే అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జూన్ 5 నుంచి 14 వరకు క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్నారు. అనంతరం జూలై 14న పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేపట్టి, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోపు పరిష్కరించనున్నారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత 2002 ఓటర్ల జాబితాతో సరిపోలని వివరాలు ఉన్నవారికి ఓటరు నమోదు అధికారులు నోటీసులు జారీ చేస్తారు. ఈ జాబితాలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రకటిస్తారు. అయితే ముసాయిదా జాబితాలో ఉన్న ఏ ఓటరు పేరునూ విచారణ లేకుండా లేదా వివరణకు అవకాశం ఇవ్వకుండా తొలగించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన అనంతరం సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. కీలకంగా మారనున్న మ్యాపింగ్ ఈ సవరణలో ఓటర్ల వివరాల మ్యాపింగ్ కీలకంగా మారింది. మ్యాపింగ్ పూర్తికాని పక్షంలో ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకా మ్యాపింగ్ కాని వారు సంబంధిత బీఎల్వోలను సంప్రదించి వెంటనే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. అనంతరం బీఎల్వోలు అందజేసే ఫారాలను నింపి తిరిగి సమర్పించాల్సి ఉంటుంది. నిర్లక్ష్యానికి తావులేకుండా... ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. అందుకే 100 శాతం ఓటర్ల మ్యాపింగ్ లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ప్రతి కుటుంబంలోని అర్హులైన ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేయడం ద్వారా ఓటరు జాబితా మరింత పారదర్శకంగా రూపొందే అవకాశం ఉంది. ముఖ్యంగా నేవీ, స్టీల్ప్లాంట్, షిప్యార్డు, రైల్వే వంటి సంస్థల ఉద్యోగుల వివరాల కోసం ప్రత్యేక అధికారులను నియమించాం. ఈ ప్రక్రియలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి తావివ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఓటు హక్కు పరిరక్షణకు సంబంధించిన అంశం కావడంతో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. – ఎం.అభిషిక్త్ కిశోర్, కలెక్టర్ విశాఖ ప్రస్తుత జిల్లా ఓటర్లు 20,23,009 ప్రస్తుతం జిల్లాలో 20,23,009 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12,76,527 మందికి మ్యాపింగ్ పూర్తికాగా, ఇది మొత్తం ఓటర్లలో 63.10 శాతం. ఇంకా 7,46,482 మంది ఓటర్లకు మ్యాపింగ్ జరగాల్సి ఉంది. వీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
విశాఖ విమానాశ్రయ తరలింపును అడ్డుకుంటాం
గోపాలపట్నం: డబుల్ ఇంజిన్ సర్కార్ విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పి, ఇప్పుడు నగర విమానాశ్రయాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. జగ్గునాయుడు విమర్శించారు. విశాఖ విమానాశ్రయాన్ని దేశీయ విమానాశ్రయంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు ఆదివారం ఎయిర్పోర్టు జంక్షన్ జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ విమానాశ్రయాన్ని మూసివేసి, భోగాపురం విమానాశ్రయానికి ప్రాధా న్యం కల్పించేలా జీఎంఆర్తో ఒప్పందాలు చేసుకోవడాన్ని ప్రశ్నించారు. ఈ అంశాన్ని ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచారని ఆరోపించారు. గత ఏడాది విశాఖ విమానాశ్రయం ద్వారా సుమారు 29 లక్షల మంది ప్రయాణించారని, అందులో 28 లక్షల మంది దేశీయ ప్రయాణికులేనని, కేవలం లక్ష మంది మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలు చేశారని తెలిపారు. భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ సేవలకు ఉపయోగిస్తూ, విశాఖ విమానాశ్రయాన్ని డొమెస్టిక్ సేవలకు కొనసాగించాలని కోరారు. ప్రైవేట్ నిర్వహణలో విమానాశ్రయం ఉంటే ప్రయాణికులపై అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం యూజర్ చార్జీలు తక్కువగా ఉన్నప్పటికీ, భోగాపురం విమానాశ్రయంలో అవి గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. పార్కింగ్ తదితర సేవల చార్జీలు కూడా పెరిగి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తాయని చెప్పారు. జీఎంఆర్కు ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజనాలు కల్పించిందని, భూములు, నిధులు, ఇతర సౌకర్యాలు అందించిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. విశాఖ విమానాశ్రయాన్ని తరలించే ప్రయత్నాలు కొనసాగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం నాయకులు కె.ఎం. శ్రీనివాసరావు, బలివాడ వెంకటరావు, బి. పద్మ, వి. ప్రభావతి, జె. అయోధ్యారాం, పైడిరాజు, రాంబాబు పాల్గొన్నారు. -
పెరుగుతున్న జీర్ణాశయ, కాలేయ సమస్యలు
తాటిచెట్లపాలెం: మారుతున్న ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుత రోజుల్లో జీర్ణాశయ, కాలేయ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయని సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, సదస్సు నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ చలపతిరావు ఆచంట ఆందోళన వ్యక్తం చేశారు. కిమ్స్ హాస్పిటల్స్ (సీతమ్మధార) పరిధిలోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ గ్యాస్ట్రో సైన్సెస్’ ఆధ్వర్యంలో.. ఏపీఐ, ఐఎంఏ, వైజాగ్ గట్ క్లబ్ సంయుక్తంగా ‘గ్యాస్ట్రో అప్డేట్–4వ ఎడిషన్’ పేరిట జాతీయస్థాయి వైద్య విద్యా సదస్సును ఆదివారం ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చలపతిరావు మాట్లాడుతూ.. క్లిష్టమైన కేసులపై జరిగే ఇలాంటి అకడమిక్ చర్చలు వైద్యుల వ్యాధి నిర్ధారణ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ సదస్సులో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, భువనేశ్వర్, అహ్మదాబాద్ వంటి ప్రముఖ నగరాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు పలు క్లిష్టమైన ఆరోగ్య సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ అభినయ్, రీజనల్ సీఈఓ డాక్టర్ నాగేష్లు మాట్లాడుతూ.. సదస్సు విజయవంతానికి సహకరించిన అధ్యాపకులు, ప్రతినిధులు, భాగస్వామ్య సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
మన అద్దాల రైలుకు అరుదైన గుర్తింపు
సాక్షి, విశాఖపట్నం: అద్దాల రైలులో అరుదైన పర్యాటక మార్గం.. సరికొత్త మైలురాయిని అందుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన నేషనల్ టూరిజం సర్వేలోని ‘ఇండియన్ రూట్స్’ ఎడిటర్స్ ఛాయిస్ విభాగంలో విశాఖ–అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే అత్యుత్తమ పర్యాటక రైలు మార్గంగా అగ్రస్థానంలో నిలిచింది. తూర్పు కనుమల ప్రకృతి సోయగాలు, సొరంగ మార్గాలు, పచ్చని లోయలు, జలపాతాల మధ్య ఆహ్లాదకరంగా సాగే ఈ రైలు ప్రయాణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ అవార్డు దక్కింది. జూన్ 15న గోవాలో జరగనున్న ‘ఇండియా టుడే టూరిజం సమ్మిట్ అండ్ అవార్డ్స్–2026’ కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించనున్నారు. విశాఖ– అరకు మార్గంలో పర్యాటకుల కోసం మొట్టమొదటి విస్టాడోమ్ (అద్దాల బోగీ) కోచ్ను 2017 ఏప్రిల్ 16న అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు లాంఛనంగా ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి విస్టాడోమ్ కోచ్. ఆ తర్వాత పర్యాటకుల నుంచి వచ్చిన విశేష స్పందన, డిమాండ్ మేరకు ఈ మార్గంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విస్టాడోమ్ కోచ్ల సంఖ్యను పెంచుతూ వచ్చారు. అనంతరం, పూర్తి స్థాయి అత్యాధునిక ఎల్ హెచ్ బి విస్టాడోమ్ కోచ్లతో అప్గ్రేడ్ చేసిన రైలు (విశాఖ–కిరండూల్ ఎక్స్ప్రెస్)ని 2021 నవంబర్ 22న ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ రైలు మార్గానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి ప్రయాణంలో 100 శాతం ఆక్యుపెన్సీతో ఈ రైలు నడుస్తోందని విశాఖపట్నం డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. -
అప్పన్నను దర్శించుకున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విమల్కుమార్ యాదవ్ సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తర పూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాన్ని ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. నేడు లేబర్ ట్రిబ్యునల్కు కార్మిక నాయకులు ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ కార్మిక నాయకులు సోమవారం హైదర్బాద్లోని ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టుకు హాజరవుతున్నారు. ఉత్పత్తి ఆధారంగా వేతనాలు చెల్లిస్తామని గత ఏడాది నవంబర్ 15న నాటి ఉక్కు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను స్టీల్ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినప్పటికి యాజమాన్యం సంప్రదించక పోవడంతో విశాఖలోని రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ)కు ఫిర్యాదు చేశారు. ఆర్ఎల్సీ విచారణ అనంతరం ఉత్తర్వులు కార్మిక చట్టాలకు వ్యతిరేకమని, ఆ ఉత్తర్వులను రద్దు చేసి పూర్తి వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ఉక్కు యాజమాన్యం అంగీకరించక పోవడంతో ఆర్ఎల్సీ ఈ అంశాలన్ని ట్రిబ్యునల్కు రిఫర్ చేశారు. ఈ అంశంపై ఈ నెల 8న లేబర్ కోర్టుకు హాజరు కావాలని ట్రిబ్యునల్ కోర్టు కార్మిక సంఘాలకు నోటీసులు జారీ చేసింది. -
నూతన కమిటీ ఎన్నిక
డాబాగార్డెన్స్: యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ముందుగా యూనియన్ మహాసభను నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ నూతన కమిటీ అధ్యక్షురాలిగా ఎస్.సుభాషిణి, ప్రధాన కార్యదర్శిగా ఎన్.కృష్ణమోహన్, గౌరవ అధ్యక్షురాలిగా పి.మణి, వర్కింగ్ ప్రెసిడెంట్గా జి.రాము, ఎన్నికయ్యారు. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిట్టిబాబు, కోశాధికారిగా సుమలత, గౌరవ సలహాదారులుగా జీఎస్ రాజేశ్వరరావు, రమణారెడ్డి ఏకగ్రీవమయ్యారు. ఉపాధ్యక్షులుగా సుధాకర్, ప్రసాద్, కేవీ పద్మావతి, రామయ్యమ్మ, రమణ, జాయింట్ సెక్రటరీలుగా రాజ్యలక్ష్మి, భార్గవి, రాధా, బుల్లాకి, దేవకుమారి, శివలక్ష్మి, ఎర్రమ్మ ఎన్నిక, కార్యదర్శులుగా టి.కల్యాణమ్మ, ఈశ్వరరావు, శైలజ, భాగ్యలక్ష్మి, రమణ, వెంకటేష్ ఎన్నికయ్యారు. -
నిర్మాణ కార్మికులకు ఐదు సంక్షేమ పథకాలు
2.0 కోసం ఈ నెలలోనే కన్సల్టేషన్ ప్రక్రియ రాబోయే ఐదారేళ్లకు నిర్దేశించిన వృద్ధి రేటు విషయంలో పరిశ్రమల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. నిబంధనల సడలింపునకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. స్థానిక ముడిసరుకులకు విలువ జోడించడమే పీఎల్ఐ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. పీఎల్ఐ 1.0లోని సమస్యల్ని పరిష్కరిస్తూ 2.0 అమలు కోసం ఈ నెలలోనే పరిశ్రమల భాగస్వామ్యంతో కన్సల్టేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిపై పరిశ్రమలు సరైన ప్రణాళికతో రావాలని సూచించాం. – డి.ప్రవీణ్, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విలువ ఆధారిత ఉత్పత్తులదే భవిష్యత్తు చేపల ప్రాసెసింగ్ సమయంలో మిగిలిపోయే వ్యర్థాలను చెత్తగా చూడాల్సిన అవసరం లేదు. ఆధునిక సాంకేతికతతో ఈ వ్యర్థాలు అత్యంత విలువైన వనరుగా మారుతున్నాయి. ఈ విధానం పర్యావరణ సమస్యలను పరిష్కరిస్తోంది. సాధారణంగా పారేసే చేపల చర్మం నుంచి సేకరించే కొల్లాజెన్(పొలుసు)ను ప్రస్తుతం సౌందర్య సాధనాల తయారీకి వినియోగిస్తున్నాం. ఫిష్ స్కిన్తో బెల్ట్లు, షూలు తయారు చేయడం, బోన్స్ నుంచి వచ్చే ఉత్పత్తులకు మార్కెట్ అద్భుతంగా ఉంది. మీట్ కంటే వాల్యూ ఎడిషన్ కే భవిష్యత్తు ఉంది. పీఎల్ఐ 2.0 అమలైతే ఎంఎస్ఎంఈలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. – కేదార్నాథ్ రెడ్డి, షష్మి ఫుడ్స్ ఎండీ ఎంఎస్ఎంఈలకు ఊతమిచ్చేలా పీఎల్ఐ 2.0 ప్రస్తుత పీఎల్ఐ(ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్)లో లోపాలను సరిదిద్దుతూ, సముద్ర ఉత్పత్తులు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి వీలుగా ప్రత్యేకమైన కస్టమైజ్డ్ పీఎల్ఐను తీసుకురాబోతున్నారు. ఇందులో ఎంఎస్ఎంఈలకు అనుకూలంగా పెట్టుబడి, టర్నోవర్ నిబంధనలను సడలించనున్నారు. 2030 నాటికి వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల ఎగుమతుల వాటాను ప్రస్తుత 10 శాతం నుంచి 25 శాతానికి పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 659 ప్రాసెసింగ్ యూనిట్లలో కేవలం 127 మాత్రమే వాల్యూ ఎడిషన్ (వీఏపీ) యూనిట్లున్నాయి. ఈ యూనిట్లలో అత్యధికంగా ఏపీలో 42 యూనిట్లు, కేరళలో 25 యూనిట్లు ముందంజలో ఉన్నాయి. భవిష్యత్ కార్యాచరణ కోసం కేంద్ర వాణిజ్య శాఖ, ఎంపెడా, మత్స్య, ఫుడ్ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. కిలో 15 డాలర్లు పలికే సషిమి టూనా, 10–12 డాలర్లు పలికే సుషీ/బ్రెడెడ్ రొయ్యలు, 10 డాలర్లకు పైగా విలువైన సీవీడ్/న్యూట్రాస్యూటికల్స్ని అభివృద్ధి చేసేందుకు ముందుగా పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇలాంటి ప్రత్యేక ఉత్పత్తులకు 20 శాతం, హైరిస్క్ హైవాల్యూ ఉత్పత్తులకు 15 శాతం, ఇతర వీఏపీలకు 6 శాతం ప్రోత్సాహకాలు అందించాలని భావిస్తున్నారు. పీఎల్ఐ–2.0 ద్వారా అటు మౌలిక సదుపాయాలు మెరుగుపడటమే కాకుండా, ఎంఎస్ఎంఈలకు ఊతం లభించి గ్లోబల్ మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల వాటా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.హరిత వృద్ధిలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది గణాంకాలు.. ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉత్పత్తుల వాణిజ్యం 218.37 బిలియన్ డాలర్లు భారత్ వాటా – 3.87 శాతం(8.46 బిలియన్ డాలర్లు) భారత్ నుంచి ఎగుమతవుతున్న విలువ ఆధారిత ఉత్పత్తులు– 928.91 మిలియన్ డాలర్లు ఎక్కువగా ఎగమతవుతున్న కుక్డ్/బ్రెడెడ్/ మారినేటెడ్ రొయ్యల వాటా– 80.64 శాతం వాల్యూయాడెడ్ ఉత్పత్తుల ప్రపంచ మార్కెట్– 35 బిలియన్ డాలర్లు భారత్ వాటా – 0.84 బిలియన్ డార్లు వీఏపీ ఎగుమతుల్లో భారత్ స్థానం– 10వ స్థానంనిబంధనలే శరాఘాతం 2021–22 నుంచి 2026–27 వరకూ రూ.10,900 కోట్ల బడ్జెట్తో అమలవుతున్న ప్రస్తుత పీఎల్ఐ పథకంలో చిన్న పరిశ్రమలకు చోటు దక్కలేదు. దేశవ్యాప్తంగా ఉన్న 658 ప్రాసెసింగ్ యూనిట్లలో 524 (80 శాతం)ఎంఎస్ఎంఈలే ఉన్నాయి. కనీస టర్నోవర్ రూ.600 కోట్లు ఉండాలనే నిబంధన కారణంగా ఒక్క ఎంఎస్ఎంఈ కూడా పీఎల్ఐకి అర్హత సాధించలేకపోయింది. కేవలం 9 మంది మాత్రమే దీని ప్రయోజనాలు పొందారు. మరోవైపు దేశంలోని పరిశ్రమలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో కేవలం 40 శాతం మాత్రమే వినియోగిస్తుండగా, మిగిలిన 60 శాతం వృథా అవుతోందని గుర్తించారు. ఈ కారణంగా రూ.9,500 కోట్లు వరకూ నిధులు ప్రభుత్వ ఖాతాల్లోనే మురుగుతున్నాయి. నిబంధనలు సడలించాలని ఎంఎస్ఎంఈలు, సహకార సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాయి.దీంతో కేంద్రం నిబంధనల సడలింపుపై కసరత్తు ప్రారంభించింది. -
మళ్లీ షాక్..!
సామాన్యుడికిపెరిగిన వంట గ్యాస్ ధర సిలిండర్పై రూ.29 పెంపుమహారాణిపేట: ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు, ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. గృహ వినియోగ ఎల్పీజీ (వంట గ్యాస్) సిలిండర్ ధరను రూ.29 మేర పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెట్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఆదివారం నుంచే జిల్లాలో అమల్లోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్లపై ఈ వడ్డన వర్తించనుంది. తాజా పెంపుతో విశాఖలో ఇప్పటివరకు రూ.921 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.950కి చేరింది. దీనికి గ్యాస్ బాయ్ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా ప్రాంతాల వారీగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని అధికారులు తెలిపారు. మూడు నెలల్లో రెండోసారి గత మూడు నెలల వ్యవధిలో వంట గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చి నెలలో కూడా గ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, దిగుమతి వ్యయాల పెరుగుదల, చమురు సంస్థల ఆర్థిక పరిస్థితుల కారణంగానే ధరలను సవరించినట్లు కంపెనీలు చెబుతున్నప్పటికీ, వినియోగదారుల నుంచి మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే కూరగాయలు, సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ, విద్యా, వైద్య ఖర్చులు పెరిగి సామాన్యుడి జీవితం భారంగా మారిన తరుణంలో వంట గ్యాస్ ధర పెంచడం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను అతలాకుతలం చేయనుంది. రూ.కోట్లలో అదనపు భారం తాజా ధరల పెంపుతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.29 చొప్పున భారీగా అదనపు భారం పడనుంది. జిల్లాలోని మొత్తం 8,90,341 కనెక్షన్లను ప్రాతిపదికగా తీసుకుంటే, వినియోగదారులపై నెలకు రూ.2,58,19,889 చొప్పున.. ఏడాదికి సుమారు రూ.30,98,38,668 మేర అదనపు భారం పడనుంది. నిత్యం వంటింటి బడ్జెట్తో సతమతమయ్యే పేద, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచేలా ఉన్న ఈ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో గ్యాస్ కనెక్షన్ల వివరాలు.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 45 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో అర్బన్ పరిధిలో 42, రూరల్ పరిధిలో 3 ఏజెన్సీలు నడుస్తున్నాయి. జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 8,90,341 గా ఉంది. ఇందులో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 2,24,604, డబుల్ సిలిండర్ కనెక్షన్లు 5,33,988 కాగా, దీపం పథకం కనెక్షన్లు 1,31,749 ఉన్నాయి. కాగా, జిల్లాలో మొత్తం 5,12,619 మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. -
పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాల స్వీకరణ
మహారాణిపేట: భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన ముసాయిదా జాబితాను ప్రచురించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 1,980 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా, అవసరమైన చోట కొత్త కేంద్రాల ఏర్పాటు, ప్రస్తుత కేంద్రాల వివరాల్లో మార్పులు, స్థాన మార్పులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ముసాయిదా జాబితాను రూపొందించినట్లు వెల్లడించారు. సదరు జాబితాలను అన్ని ఎలక్టోరల్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల కార్యాలయాలతో పాటు జిల్లా కలెక్టరేట్లో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచామన్నారు. అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా జాబితాల ప్రతులను అందజేసినట్లు చెప్పారు. ఈ ముసాయిదా జాబితాలపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు లేదా మార్పుల ప్రతిపాదనలు ఉంటే.. సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఈ నెల 15వ తేదీలోగా లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. అందిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. -
ఆధారం దొరికేనా.. దశ తిరిగేనా!
సాక్షి, విశాఖపట్నం: సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను( ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించాలనే లక్ష్యంతో వేల కోట్ల బడ్జెట్తో కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్,(పీఎల్ఐ) పథకం ఎంఎస్ఎంఈల దరి చేరలేదు. కఠినమైన నిబంధనలు విధించడం వల్ల పీఎల్ఐ అందుకోలేదు సరికదా ఎంఎస్ఎంఈలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం ఈసారి ఎంఎస్ఎంఈలకు ‘ఆధారం’గా నిలిచేందుకు సిద్ధమవుతోంది. పరిశ్రమల్లో వృథాగా మిగిలిపోతున్న 60 శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగంలోకి తీసుకురావడంతో పాటు వాల్యూ యాడెడ్ సముద్ర ఉత్పత్తుల మార్కెట్లో భారత వాటాను పెంచేందుకు పీఎల్ఐ–2.0కి ప్రణాళికలు రూపొందించింది. స్పెషాలిటీ ఉత్పత్తులకు 20 శాతం ప్రోత్సాహకాలు అందిస్తూ.. గ్లోబల్ మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల వాటా పెంచేందుకు వీలుగా నూతన కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. నూతన పాలసీతోనైనా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అంది..దశ తిరిగేనా అని ఎంఎస్ఎంఈల నిర్వాహకులు ఆశలపల్లకిలో విహరిస్తున్నారు. మరో వైపు ఈ నిర్ణయాలు దేశీయఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి మహర్దశ పడుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో జరుగుతున్న జాతీయ సముద్ర ఉత్పత్తుల సదస్సులో ఈ అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎంఎస్ఎంఈలకు గుది బండగా ప్రస్తుత పీఎల్ఐ నిబంధనలు కేంద్రం భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించినా అందుకోలేని వైనం నిబంధనలు మార్చాలని ఎంఎస్ఎంఈల ప్రతినిధుల వేడుకోలు ఫలితంగా ఫుడ్ ప్రాసెసింగ్లో పీఎల్.2.0 దిశగా అడుగులు నిబంధనల సడలింపుతో కస్టమైజ్డ్ పీఎల్ఐలు తీసుకొస్తున్న కేంద్రం స్పెషాలిటీ ఉత్పత్తులకు అత్యధికంగా 20 శాతం ప్రోత్సాహకాలు గ్లోబల్ మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల వాటా 2030 నాటికి 25 శాతానికి పెంచడం లక్ష్యం ముడిసరకు దిగుమతికి ఊరట భౌగోళిక రాజకీయ పరిస్థితులు, టారిఫ్లు, నీటి సమస్యల కారణంగా 5 శాతం కనీస వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) సాధించలేని పరిశ్రమలు సంబంధిత డేటా సమర్పిస్తే, నిబంధనలు సడలించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించడానికి వీలుగా మైరెన్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన ముడిసరుకు దిగుమతులపై ఇటీవల కొంత వెసులుబాటు కల్పించింది. నాణ్యతను పెంచేందుకు 2024–25 బడ్జెట్లో 100 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పీఎంకేఎస్వై కింద ఒక్కో ల్యాబ్కు రూ.5 కోట్ల వరకు గ్రాంట్–ఇన్–ఎయిడ్ లభించనుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) నిబంధనల ప్రకారం ఎగుమతులపై నేరుగా ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అవకాశం లేకపోవడం వల్ల పరోక్ష మార్గాల ద్వారా లబ్ధి చేకూర్చే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. -
కార్మికులకు వివాహం నుంచి ప్రసూతి వరకు ఆర్థిక సాయం నిర్మాణ కార్మికులకు అండగా సంక్షేమ బోర్డు
సీతంపేట: భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పలు పథకాలను అమలు చేస్తోంది. ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచే ఈ నూతన సంక్షేమ పథకాల అమలు ప్రక్రియ ప్రారంభమైంది. బోర్డులో నమోదైన 18 నుంచి 60 ఏళ్ల వయస్సు గల అర్హులైన కార్మికులు ఈ లబ్ధిని పొందవచ్చు. వివాహ కానుక, ప్రసూతి సాయం కింద రూ. 20,000 చొప్పున, సహజ మరణ ఉపశమనంగా రూ. 60,000, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ. 20,000 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వీటితో పాటు కార్మికులకు ఉచిత భోజనం, స్టైపెండ్తో కూడిన 15 రోజుల వృత్తి నైపుణ్య శిక్షణను కూడా ఇస్తున్నారు. ఆయా పథకాలకు అర్హులైన కార్మికులు తమ ఆధార్, లేబర్ కార్డ్, బ్యాంకు వివరాలతో సమీప కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు. 1. వివాహ కానుక : రూ. 20,000 మహిళా కార్మికురాలి వివాహానికి, కార్మికుడు/కార్మికురాలి ఇద్దరి కుమార్తెల వివాహానికి ఆర్థిక సహాయం. కార్మికుడిగా రిజిష్టర్ అయిన ఏడాది తరువాత ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు భవన నిర్మాణ కార్మికుని / కార్మికురాలు, పెళ్లి కుమార్తె ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, వివాహా ధ్రువీకరణ పత్రం (ఏపీ సేవ పోర్టర్లో పొందినది తప్పని సరిగా ఉండాలి), బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు , అప్డేట్ రెన్యూవల్ రశీదులు జిరాక్సులు జతపర్చాలి. 2.ప్రసూతి సహాయం : రూ. 20,000 కార్మికుని భార్య , వారి కుమార్తెలకు, మహిళా కార్మికులకు ప్రసూతి ఆర్థిక సహాయం, కార్మికుడు రిజిష్టర్ అయిన ఏడాది తరువాత ఈ పథకం వర్తిస్తుంది. దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు భవన నిర్మాణ కార్మికుని, ప్రసూతి సహాయం పొందే మహిళ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, కాన్పు సర్టిఫికెట్, జనన ధ్రవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు, అప్డేట్ రెన్యూవల్ రశీదుల జిరాక్సు జతపర్చాలి. 3. సహజ మరణ ఉపశమన పథకం: రూ. 60,000 సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు మృతి చెందిన వ్యక్తి..నామిని, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు, ఆప్డేట్ రెన్యూవల్ రశీదులు జిరాక్సు, ఏపీ సేవా పోర్టర్ ద్వారా జారి చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, నామిని బ్యాంక్ పాస్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, రేషన్ కార్డు జిరాక్స్ జతచేయాలి. 4. అంత్యక్రియలకు వ్యయ సహాయ పథకం / మట్టి ఖర్చులకు సహాయం: రూ. 20,000 మరణించిన కార్మికుల అంతిమ సంస్కారాలకు ఆర్థిక సహాయం దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలు మరణించిన వ్యక్తికి సంబంధించిన నామిని ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, భవన నిర్మాణ కార్మికుని గుర్తింపు కార్డు, అప్డేట్ రెన్యూవల్ రశీదులు జిరాక్స్, ఏపీ సేవా పోర్టర్ ద్వారా జారి చేసిన మరణ ధ్రువీకరణ పత్రం, నామిని బ్యాంక్, పాన్ పుస్తకం మొదటి పేజి జిరాక్స్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, రేషన్ కార్డు జిరాక్స్, ఎఫ్వీఆర్, పంచనామా జిరాక్స్ కాపీ (ప్రమాద మరణానికి వర్తిస్తుంది), మెడికల్ సర్టిఫికెట్ (ప్రమాద మరణానికి వర్తిస్తుంది) జతపర్చాల్సి ఉంటుంది. 5. కార్మికులకు వృత్తి నైపుణ్య శిక్షణ రిజిస్టర్ అయిన భవన నిర్మాణ కార్మికులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు 15 రోజులు శిక్షణ, ఉచిత భోజన సౌకర్యాలతో పాటు రోజుకు రూ. 300 చొప్పున భృతి చెల్లింపు భవన నిర్మాణ కార్మికుడిగా నమోదు చేసుకునేందుకు కావలసిన పత్రాలు కార్మికుడు/ కార్మికురాలు వయస్సు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వారు నమోదుకు అర్హులు. అప్లికేషన్ ఫారం, స్వీయ ధ్రువీకరణ పత్రం, 2 పాస్ పోర్టు సైజు కలర్ ఫొటోలు, కార్మికుని ఆధార్ కార్డు జిరాక్స్,. నామిని, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్, కార్మికుని బ్యాంక్ అకౌంట్ మొదటి పేజి జిరాక్స్, రూ. 110లు చెల్లించిన యూనియన్ బ్యాంక్ చలానా అవసరం. -
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలి
సీతంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని పాఠశాల విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ బి. విజయ భాస్కర్ పిలుపునిచ్చారు. అక్కయ్యపాలెం ఎన్జీజీవోస్ కాలనీలోని జీవీఎంసీ హైస్కూల్లో నిర్వహిస్తున్న జిల్లా 1, 2 తరగతుల ఉపాధ్యాయుల ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ’ శిక్షణా కార్యక్రమాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ‘బడిపిలుస్తోంది కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లను పెంచేందుకు ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. జిల్లాలో వేసవి సెలవుల్లో సైతం అధికారులు, ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ బడుల ప్రాధాన్యతను వివరించడం వల్లే.. ప్రైవేటు పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు కొత్త విద్యాసంవత్సరానికి సంసిద్ధతగా ఎఫ్ఎల్ఎన్ శిక్షణకు హాజరవుతున్న ఉపాధ్యాయుల అంకితభావాన్ని ఆయన అభినందించారు. ఉపాధ్యాయులు ఇదే స్ఫూర్తితో పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. బడుల్లో నాణ్యమైన విద్యాబోధన ద్వారానే తల్లిదండ్రుల్లో, సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం, సానుకూల దృక్పథం పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఏఎంవో జి. లక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధాకుమారి, డైట్ అధ్యాపకులు, 9 మంది రిసోర్స్ పర్సన్లు, వివిధ పాఠశాలలకు చెందిన 100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విశాఖ తీరంపై 'బాబు' మార్క్ కుట్ర!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సాగర తీరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చేందుకు, పర్యాటకం–పరిశ్రమల ముసుగులో విలువైన భూములను కాజేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం తెరవెనుక శతవిధాలా ప్రయత్నిస్తోంది. మధురవాడ నుంచి భీమిలి వరకు విస్తరించిన సున్నితమైన తీర ప్రాంతాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్)–3 పరిధి నుంచి సీఆర్జెడ్–2కు మార్చాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మార్పు అమల్లోకి వస్తే ఇప్పటి వరకు నిర్మాణాలపై ఉన్న పరిమితులు గణనీయంగా సడలిపోతాయి. దీంతో తీరప్రాంత భూముల విలువలు ఒక్కసారిగా పెరగడంతో పాటు భారీ రియల్ ఎస్టేట్, రిసార్ట్ ప్రాజెక్టులకు మార్గం సుగమమవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రకృతి సంపదగా పేరుగాంచిన ఎర్రమట్టి దిబ్బల భవిష్యత్తుపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిబంధనలు అడ్డు.. ‘పట్టణీకరణ’ కథసీఆర్జెడ్–3 నుంచి సీఆర్జెడ్–2గా ఒక ప్రాంతాన్ని మార్చాలంటే అక్కడ కనీసం 50 శాతం మేరకు ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగి ఉండాలి. రహదారులు, మురుగునీటి వ్యవస్థ, పట్టణ మౌలిక వసతులు సమగ్రంగా అందుబాటులో ఉండాలి. అయితే మధురవాడ–భీమిలి తీర ప్రాంతంలో ఇంకా అనేక కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తికాలేదు. సమగ్ర మురుగునీటి వ్యవస్థ కూడా లేదు.అయినప్పటికీ ఈ ప్రాంతం ఇప్పటికే పట్టణీకరణ చెందిందన్న వాదనను ప్రభుత్వం ముందుకు తెస్తుండటం వివాదాస్పదంగా మారింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించిన నిబంధనలను సడలించేందుకు ముందుగా పట్టణీకరణ జరిగిందనే చిత్రాన్ని సృష్టించి, ఆ తర్వాత నిబంధనల మార్పు కోరుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీసీజెడ్ఎంఏ సమావేశంలో కీలక నిర్ణయం మే 5న విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్ఎంఏ) సమావేశంలో మధురవాడ నుంచి భీమిలి వరకు ఉన్న తీర ప్రాంతాన్ని సీఆర్జెడ్–2 పరిధిలోకి తీసుకురావాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని కూడా నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయానికి ఆధారంగా చూపిన ప్రజాభిప్రాయ సేకరణే ఇప్పుడు అనేక అనుమానాలకు కేంద్రబిందువుగా మారింది. పర్యావరణవేత్తలకు ‘నో ఎంట్రీ’ తీర ప్రాంత పరిరక్షణ, జీవవైవిధ్యం, భవిష్యత్ తరాల ప్రయోజనాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తల అభిప్రాయాలు మాత్రం ఈ ప్రక్రియలో కనిపించకపోవడం మరో కీలక అంశంగా మారింది. విశాఖ తీర ప్రాంతం కేవలం భూమి కాదని, అది ప్రకృతి కవచమని నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. ఇసుక తిన్నెలు, చిత్తడి నేలలు, సహజ వృక్ష సంపద తుఫాన్లు, సముద్రపు అలల ప్రభావాన్ని తగ్గించే సహజ రక్షణ వ్యవస్థగా పనిచేస్తాయని చెబుతున్నారు. అలాంటి అభిప్రాయాలకు చోటు కల్పించకుండా కేవలం సీఆర్జెడ్ మార్పును సమర్థించే అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఉద్దేశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఎర్రమట్టి దిబ్బలకు ముప్పు? 2019 సీఆర్జెడ్ నోటిఫికేషన్ ప్రకారం మధురవాడ–భీమిలి ప్రాంతం సీఆర్జెడ్–3 పరిధిలో ఉంది. ఈ నిబంధనల ప్రకారం సముద్ర తీరం నుంచి 200 మీటర్ల వరకు శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదు. దీంతో సహజసిద్ధంగా ఏర్పడిన ఇసుక దిబ్బలు, తీర ప్రాంత చిత్తడి నేలలు, జీవావరణ వ్యవస్థలు రక్షణ పొందుతున్నాయి. ఇదే కారణంగా ఈ ప్రాంతంలోని చారిత్రక, భౌగోళిక ప్రాధాన్యత కలిగిన ఎర్రమట్టి దిబ్బలు ఇప్పటివరకు పెద్దగా దెబ్బతినకుండా నిలిచాయి. కానీ సీఆర్జెడ్–2గా మారితే నిర్మాణాలకు మార్గం సుగమమవుతుంది. దాంతో ఎర్రమట్టి దిబ్బల చుట్టూ నిర్మాణాల ఒత్తిడి పెరిగి, వాటి సహజ స్వరూపం దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.లేఅవుట్ల యాజమాన్యాల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బల పరిసర ప్రాంతాల్లో లేఅవుట్లు వేసి ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు కూడా సీఆర్జెడ్–3ను సీఆర్జెడ్–2గా మార్చాలని కోరినట్టు తెలుస్తోంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అలాంటి అభిప్రాయాలను కూడా జిల్లా యంత్రాంగం ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పరిగణించినట్లు రికార్డుల్లో నమోదు కావడం. ప్రజా ప్రయోజనాల కంటే ప్రైవేటు ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం లభించిందన్న విమర్శలకు ఇది మరింత బలం చేకూరుస్తోంది.ప్రజాభిప్రాయమా.. కాపీ–పేస్ట్ అభిప్రాయాలా?సీఆర్జెడ్ మార్పు వంటి కీలక అంశంపై ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ఏపీసీజెడ్ఎంఏ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. కానీ ప్రజల స్పందన పేరుతో సమర్పించిన పత్రాల్లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల పేర్లతో నమోదైన అభిప్రాయాలన్నీ దాదాపు ఒకే భాషలో, ఒకే వాక్య నిర్మాణంతో, ఒకే పదజాలంతో ఉండటం చర్చనీయాంశంగా మారింది. పేర్లు మారాయి కానీ అభిప్రాయాలు మాత్రం అక్షరాలా ఒకేలా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పేర్లూ, అభిప్రాయాలు సేమ్ టూ సేమ్ కనీసం ఒక్క పదం కూడా మార్చకుండా ఒకే అభిప్రాయాన్ని పదుల సంఖ్యలో జతచేయడం వెనుక అసలు ప్రజల స్పందన ఉందా? లేక ముందుగానే తయారు చేసిన ముసాయిదాలను వివిధ పేర్లతో జోడించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ అభిప్రాయాలను సమర్పించిన వారి పూర్తి చిరునామాలు, సంప్రదింపు వివరాలు కూడా చాలాచోట్ల లేవు. దీంతో ఇవి నిజమైన ప్రజాభిప్రాయాలా? లేక అధికార పార్టీ అనుచరులు సమీకరించి సమర్పించిన పత్రాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
జాతీయ రహదారిపై 79 కిలోల గంజాయి పట్టివేత
సబ్బవరం: మండలంలోని అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై ఉన్న మర్రిపాలెం టోల్ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న ముఠాను సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 79 కిలోల గంజాయితో పాటు రెండు వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. వివరాలను పరవాడ డీఎస్పీ బి. మోహనరావు, సబ్బవరం సీఐ జి. రామచంద్రరావుతో కలిసి శనివారం సాయంత్రం సబ్బవరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్. సుదర్శన్, అబీబీ ఖాన్, హుస్సేన్ ఖాన్.. విశాఖ చేరుకుని, అప్పటికే విశాఖ చేరుకున్న మధ్యప్రదేశ్కు చెందిన లఖన్ బేరాగి, కమల్ ప్రజాపత్లతో కలిసి ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లా కుల్బాని ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కులాన్, కలియా అనే వ్యక్తుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి, రెండు వాహనాల్లో మధ్యప్రదేశ్లోని భోపాల్కు తరలించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో సబ్బవరం పోలీసులకు అందిన సమాచారంతో సీఐ జి. రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు మర్రిపాలెం టోల్ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిందితులను అదుపులోకి తీసుకుని, నాలుగు గోనె సంచుల్లో ఉన్న 79 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక టెంపో, ఒక కారును సీజ్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3.95 లక్షలు కాగా, వాహనాలతో కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ.7.75 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ సింహాచలం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐదుగురు అరెస్టు -
ఆర్డీవోగా సాదు దిలీప్ చక్రవర్తి బాధ్యతల స్వీకరణ
మహారాణిపేట: విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారిగా సాదు దిలీప్ చక్రవర్తి శనివారం బాధ్యతలు స్వీకరించారు. పార్వతీపురం ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. గతంలో డీఆర్వో భవానీ శంకర్పై పలు అవినీతి ఆరోపణలు రావడంతో పాటు ఆర్డీవో శ్రీలేఖ లేఖ రాసిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 21న అప్పటి డీఆర్వో భవానీ శంకర్తో పాటు అప్పటి ఆర్డీవో పి. శ్రీలేఖను బదిలీ చేసింది. నాటి నుంచి ఆర్డీవో పోస్టు ఇన్చార్జిలతోనే నడుస్తోంది. తదుపరి క్రమంలో కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్గా ఉన్న శేష శైలజను ఇన్చార్జి ఆర్డీవోగా నియమించారు. అయితే ఇటీవల కుమార్తె వివాహ కార ణంగా తనను రిలీవ్ చేయాలని ఆమె కలెక్టర్ అభిషిక్త్ కిషోర్కు లేఖ రాసిన విషయం తెలిసిందే. శనివారం బాధ్యతలు స్వీకరించిన దిలీప్..కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
ఉక్కునగరంలో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలివి. స్టీల్ప్లాంట్ ఎస్ఎంఎస్–1 టీపీ బేలో పనిచేస్తున్న సుదామ కాంత పట్నాయక్ (54) శనివారం మధ్యాహ్నం విధుల విరామం అనంతరం భోజనానికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. సహచరులు వెంటనే ఆయనను స్టీల్ప్లాంట్ ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై కార్మిక నాయకులు సంబంధిత కాంట్రాక్టర్తో చర్చించగా, మృతుడి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సహాయం అందించేందుకు ఆయన అంగీకరించినట్లు తెలిపారు. -
అర్ధంతరంగా ముగిసిన విచారణ
విశాఖ విద్య: ఏయూలో ఎస్సీ, ఎస్టీ నాన్ టీచింగ్ బ్యాక్లాగ్ పోస్టుల నియామకాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శనివారం ప్రారంభమైన విచారణకు బ్రేక్ పడింది. ఏయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్లో విచారణాధికారి, రిటైర్డ్ జడ్జి బమ్మిడి శ్రీనివాసరావు విచారణను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రధాన ఫిర్యాదుదారు, విదసం నేత బూసి వెంకటరావుతో ప్రమాణం చేయించిన అనంతరం ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని భావించారు. ఈ సందర్భంగా బూసి వెంకటరావు విచారణాధికారి వద్ద తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. బ్యాక్లాగ్ పోస్టుల నియామకాల అవకతవకలపై విచారణాధికారిగా ఒక సిట్టింగ్ జడ్జిని నియమించాలని తాము ఇప్పటికే కలెక్టర్ను కోరామని తెలిపారు. అలా కాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏయూ ఉన్నతాధికారులే స్వయంగా విచారణాధికారిని నియమించుకోవడం సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విచారణాధికారికి అందజేసినట్లు వెంకటరావు వెల్లడించారు. ఈ నియామక అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అర్హులకు పూర్తి న్యాయం జరుగుతుందని విదసం నేత వెంకటరావు పేర్కొన్నారు. ప్రస్తుత విచారణ అధికారిపై తమకు గౌరవం ఉందని, అయితే ఆయనను నియమించిన తీరుపైనే తమకు నమ్మకం లేదన్నారు. పోస్టుల భర్తీలో అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏయూ వీసీ, రిజిస్ట్రార్లే విచారణాధికారిని నియమిస్తే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్నారు. -
‘శోధన’ పరిశ్రమలో కార్మికుడి మృతి
పరవాడ: జేఎన్ ఫార్మాసిటీలోని ‘శోధన’ పరిశ్రమలో పనిచేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు రామ్బాలిరాయ్ (50) అస్వస్థతకు గురై శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితమే విధుల్లో చేరిన ఆయన.. శుక్రవారం సాయంత్రం షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో పరిశ్రమ క్యాంటిన్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు వెంటనే పరవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన అనారోగ్యంతోనే మృతి చెందినట్లు యాజమాన్యం చెబుతోంది. కాగా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టంలో తేలనున్నాయని, ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. -
ఏపీఎల్ రన్ రణరంగం
విశాఖ స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో సీజన్కు తెరలేవనుంది. కప్ను కై వసం చేసుకునేందుకు ఏడు జట్లు సిద్ధమవగా..మంగళవారం రాత్రి వైఎస్సార్ స్టేడియం ఫ్లడ్లైట్ల వెలుతురులో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈసారి తొలిసారిగా ఏపీఎల్ మ్యాచ్లను మూడు వేదికల్లో నిర్వహించేందుకు నిర్వాహక కమిటీ ఏర్పాట్లు చేసింది. మూడు వేదికల్లో మ్యాచ్లు లీగ్ దశలో మొదటి ఫేజ్ మ్యాచ్లు విశాఖ వేదికగా ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక్కడ మొత్తం 11 మ్యాచ్లు నిర్వహిస్తారు. ఆ తర్వాత తొలిసారిగా కడప స్టేడియంలో 9 మ్యాచ్లు, మంగళగిరి స్టేడియంలో 8 మ్యాచ్లు జరగనున్నాయి. మంగళగిరి వేదికగా నాకౌట్ పోటీలు నిర్వహించి, జూన్ 30న ఈ సీజన్కు ముగింపు పలకనున్నారు. రెండో టైటిల్ ఎవరిదో? ఏపీఎల్లో ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలోనూ ప్రతిసారీ కొత్త జట్టు విజేత నిలిచింది. కోస్టల్ రైడర్స్ మాత్రమే రెండుసార్లు ఫైనల్కు చేరి, 2022లో విజేతగా నిలిచింది. 2023లో రాయలసీమ కింగ్స్, 2024లో వైజాగ్ వారియర్స్ చాంపియన్లగా నిలవగా.. ప్రస్తుతం తుంగభద్ర వారియర్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. గత సీజన్లో వైజాగ్ వారియర్స్ను విజేతగా నిలిపిన స్థానిక స్టార్ క్రికెటర్ కేఎస్ భరత్ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడమే కాకుండా, ఈ సీజన్ ఏపీఎల్కు దూరం కావడం గమనార్హం. రూ.16.25 లక్షలతో శశికాంత్ టాప్: గత సీజన్లలో అశ్విన్ హెబ్బర్, హనుమ విహారి, నితీష్ కుమార్ రెడ్డి, అవినాష్లు అత్యధిక ధరకు అమ్ముడుపోగా.. ప్రస్తుత సీజన్లో స్థానిక ఆటగాడు కేవీ శశికాంత్ను రూ.16.25 లక్షల భారీ మొత్తానికి డిఫెండింగ్ చాంపియన్ తుంగభద్ర వారియర్స్ దక్కించుకుంది. గత సీజన్లలో గిరినాథ్, హేమంత్, అశ్విన్, హనుమ విహారి ‘మోస్ట్ వేల్యుబుల్ ప్లేయర్స్’గా నిలిచారు. గత సీజన్ రికార్డులు గత సీజన్లో అభినవ్ 269 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హనుమ విహారి, అశ్విన్ హెబ్బర్, మహీప్ కుమార్, రషీద్ (ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నందున అందుబాటులో లేడు) తర్వాత స్థానాల్లో నిలిచారు. సిక్సర్ల విషయానికొస్తే అశ్విన్ అత్యధికంగా 25 సిక్సర్లు, రోహిత్ 20 సిక్సర్లు బాదారు. బౌలింగ్లో సత్యనారాయణ, శశికాంత్లు చెరో 14 వికెట్లతో రాణించారు. ఈసారి వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్, ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్స్ వంటి 7 ఫ్రాంచైజీల మధ్య జరగబోయే ఈ పోరులో ఎవరు అత్యధిక పరుగులు, వికెట్లు సాధిస్తారో చూడాలి. -
విశాఖ రైల్వే జోన్కుపవర్ బూస్ట్
4 పోర్టులు, కీలక వర్క్షాప్లు, లోకోషెడ్లతో ఆదాయార్జనకు ఊతం ఏటా రూ.20 వేల కోట్ల వరకు రాబడికి అవకాశం రైళ్ల నిర్వహణ, మరమ్మతులకు స్వయం సమృద్ధి దిశగా అడుగులు జోనల్ హాస్పిటల్, టౌన్షిప్తో మౌలిక సదుపాయాల విస్తరణ రైళ్ల నిర్వహణలో ఎలాంటి లోటు లేకుండా జోన్కు 17 కీలక వర్క్షాప్లు, లోకోషెడ్లు, కోచింగ్ డిపోలు దక్కనున్నాయి. ● వాల్తేరు, విజయవాడ, గుంతకల్లులోని 3 ఎలక్ట్రిక్ లోకో షెడ్లు ● వాల్తేరు, గుత్తి, గుంతకల్లు, విజయవాడలోని 4 డీజిల్ లోకోషెడ్లు ● తిరుపతిలోని కోచ్ వర్క్షాప్, వడ్లపూడి,రాయనపాడులోని వ్యాగన్ వర్క్షాప్లు ● వాల్తేరు, విజయవాడ, గుత్తి, కాకినాడ పోర్టులోని 4 మేజర్ ఫ్రైట్ ఎగ్జామినేషన్ యార్డులు ● వాల్తేరు, తిరుపతి, విజయవాడ, కాకినాడ పోర్టు, నర్సాపూర్, మచిలీపట్నం, గుంటూరులోని 7 కోచింగ్ డిపోలు ● ట్రాక్ మెషీన్ వర్క్షాప్ కింద రాయనపాడులోని సెంట్రల్ పీవోహెచ్ వర్క్షాప్, జోనల్ ట్రాక్ మెషీన్ డిపో ● రాజమండ్రిలోని మెమూ కార్షెడ్ కూడా జోన్ పరిధిలోకే రానుంది. ● విజయవాడలోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ రన్నింగ్ స్టాఫ్(ఈటీటీసీ), గుంతకల్లులోని డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్(డీటీటీసీ) జోన్కు రానుంది. ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026జోన్ తాత్కాలిక కార్యాలయంగవర్నర్కు ఘన స్వాగతం మహారాణిపేట: సంగివలసలోని ఎన్ఆర్ఐ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్కు జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని పూర్తిచేసుకొని సాయంత్రం గవర్నర్ విశాఖ విమానాశ్రయం నుంచి విమానంలో విజయవాడకు బయలుదేరారు. సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కీలక శక్తిగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. సరుకు రవాణాకు జీవనాడిగా నిలిచే నాలుగు ప్రధాన పోర్టులు, రైళ్ల నిర్వహణకు వెన్నెముకలైన లోకోషెడ్లు–వర్క్షాప్లు, వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు జోన్ పరిధిలోకి రానుండటంతో విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న ఈ జోన్ ఆర్థికంగా, పరిపాలనా పరంగా మరింత బలోపేతం కానుంది. వార్షికంగా రూ.17,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లతో పాటు విశాఖ డివిజన్లోని కీలక ఆస్తులు, సదుపాయాలు జోన్లో విలీనం కానున్నాయి. రైళ్ల నిర్వహణ, మరమ్మతులు, సరుకు రవాణా, సాంకేతిక శిక్షణ తదితర అంశాల్లో ఇతర జోన్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధి సాధించేలా దక్షిణ కోస్తా రైల్వే జోన్ రూపుదిద్దుకుంటోంది. జోన్కు 4 పోర్టుల బలం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆదాయానికి ప్రధాన ఆధారంగా నిలిచే 4 కీలక ఓడరేవులు పూర్తిగా ఈ జోన్ పరిపాలనా నియంత్రణలోకి రానున్నాయి. విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ద్వా రా భారీ స్థాయిలో సరుకు రవాణా జరుగుతోంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం జోన్కు ఆర్థిక బలాన్ని చేకూర్చనుంది. గూడ్స్ రైళ్ల తనిఖీలు, నిర్వహణ కోసం వాల్తేరు, విజయవాడ, గుత్తి, కాకినాడ పోర్టుల వద్ద ఉన్న నాలుగు మేజర్ ఫ్రైట్ ఎగ్జామినేషన్ యార్డులు కూడా జోన్ పరిధిలోకి రానున్నాయి. వర్క్షాప్లు, లోకోషెడ్లతో స్వయం సమృద్ధిరోబోటిక్ సర్జరీతో మెరుగైన క్యాన్సర్ వైద్యం ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం విశాఖలో ఉన్న శాటిలైట్ డిపో ఫర్ ట్రాక్ మెషీన్స్ విశాఖ డివిజన్ పరిధిలోనే ఉంటుంది. రాయగడకు బదిలీ చేసినవి మినహాయిస్తే మిగిలిన 3 ఆపరేటింగ్ సెక్షన్ కంట్రోల్స్, ఒక టీపీసీ సెక్షన్ బోర్డు, ఇంజనీరింగ్, సీ అండ్ డబ్ల్యూ, సెక్యూరిటీ కంట్రోల్ విభాగాలు కూడా విశాఖ డివిజన్లోనే ఉంటాయి. ఇలా.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ తన సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా విస్తరింపజేసుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. పోర్టుల ద్వారా సరుకు రవాణా, నిర్వహణా కేంద్రాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల ద్వారా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు ఏటా రూ.17,550 కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేకే లైన్ కూడా జోన్లో విలీనం చేసి ఉంటే ఈ ఆదాయం రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల స్థాయికి చేరుకునేదని చెబుతున్నారు. 10న ఈఎస్ఐసీ ‘సువిధా సమాగమ్’ సీతంపేట: స్థానిక అక్కయ్యపాలెం నరసింహనగర్ రోడ్లోని ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్ఐసీ) ఉప ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 10వ తేదీన ‘సువిధా సమాగమ్’ పేరిట ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి నెల రెండో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. బీమా పొందిన కార్మికులు, యజమానులు, లబ్ధిదారులు తమ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్, చందాలు, క్లెయిమ్లు, మల్కాపురం ఈఎస్ఐ ఆసుపత్రి/డిస్పెన్సరీ వైద్య సేవలకు సంబంధించిన ఫిర్యాదులను ఇక్కడ నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. సమావేశానికి విశాఖపట్నం ఎస్ఆర్వో జాయింట్ డైరెక్టర్ ఇన్చార్జ్, మల్కాపురం ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్, విజయవాడ ఐఎంఎస్ జాయింట్ డైరెక్టర్ హాజరై సమస్యలను తక్షణమే పరిష్కరిస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు 0891–2733126, bfts& vizag@esic.gov.inలో సంప్రదించాలన్నారు. -
ఇంటికెళ్లకుండానే ఇంటి లెక్క
మహారాణిపేట: హలో.. నేను గృహ గణన సర్వే కోసం మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో రామారావు గారు ఉన్నారా అండీ? కొంచెం వివరాలు కావాలి. మరోకరికి ఫోన్: అమ్మో ఎండ మండిపోతోంది.. నేను మీ అపార్ట్మెంట్ కిందే ఉన్నాను, ఒక్కసారి కిందికి వస్తే ఆ వివరాలేంటో రాసుకుంటాను, మిగతావి నేనే పూర్తి చేసేస్తా... ఇదీ ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో సాగుతున్న ’గృహ గణన’ అసలు రంగు. ప్రభుత్వ ఆశయం గొప్పదే కావచ్చు.. కానీ క్షేత్రస్థాయిలో దాన్ని అమలు చేయాల్సిన యంత్రాంగం మాత్రం గడువు ముగిసిపోతుందనే తొందరలో సర్వేను తూతూమంత్రంగా ముగించేసింది. భవిష్యత్తు పదేళ్ల ప్రణాళికను నిర్దేశించాల్సిన అత్యంత కీలకమైన ఈ సర్వే, నగరంలో కేవలం ఒక ఫోన్ కాల్ ప్రహసనంగా మారిపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గణాంకాల గారడీ.. కాగితాల్లోనే వంద శాతం విశాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,29,000 గృహాలు ఉండగా, ఈ భారీ ప్రక్రియ కోసం ప్రభుత్వం 7,639 మంది సిబ్బందిని రంగంలోకి దించింది. ఇందులో జీవీఎంసీ పరిధిలోని 98 వార్డుల్లోనే 4,248 మంది ఎన్యూమరేటర్లు, 702 మంది సూపర్వైజర్లు బాధ్యతలు చేపట్టారు. ఇందుకోసం నగరాన్ని 4,249 బ్లాక్లుగా విభజించారు. మే 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపు ఈ సర్వే పూర్తి కావాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగడంతో అధికారులు మరో 5 రోజులు అదనపు గడువు ఇచ్చారు. ఈనెల 5వ తేదీతో సర్వే గడువు ముగిసింది. అధికారులు అధికారికంగా 100 శాతం సర్వే పూర్తయిందని గుండెల మీద చేతులేసుకుని చెబుతున్నారు కానీ, నగరంలో మెజారిటీ ఇళ్లకు కనీసం ఒక్క గణకుడు కూడా అడుగుపెట్టలేదన్నదే పచ్చి నిజం. ఎండల సాకు.. ‘సొంత’ సర్వే ఒక్కో ఇంటికి వెళ్లి ప్రభుత్వం నిర్దేశించిన 33 ప్రశ్నలు అడిగి, యాప్లో నమోదు చేయాలంటే కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. అయితే, నగరంలో మండుతున్న తీవ్రమైన ఎండలను సాకుగా చూపుతూ గణకులు తేలిక మార్గాన్ని ఎంచుకున్నారు. కూర్చున్న చోటు నుంచే కార్యకలాపాలు: అపార్ట్మెంట్ల కింద వాచ్మెన్ల దగ్గరో, సచివాలయాల్లోనో, లేదా చెట్ల కిందో కూర్చుని లీడర్ల ద్వారా నంబర్లు సేకరించి ఫోన్లలోనే కానిచ్చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా సమాధానాలు: కుటుంబ యజమాని పేరు కనుక్కుని, మిగిలిన తాగునీరు, మురుగు పారుదల, మరుగుదొడ్లు, గృహ నిర్మాణం వంటి మిగిలిన అత్యంత కీలకమైన ప్రశ్నలకు గణకులే తమకు నచ్చినట్లుగా టిక్కులు పెట్టేస్తున్నారు. భయాందోళనలో ప్రజలు: ఒకవేళ నిజాయితీగా వివ రాలు చెబితే ఎక్కడ ఉన్న పథకాలు ఊడిపోతాయోన న్న భయంతో కొందరు ప్రజలు సమాచారాన్ని దాటవేస్తుంటే, మరికొందరికి అసలు ఆ 33 ప్రశ్నల కరపత్రం ముఖమే చూపించకుండా సర్వే క్లోజ్ చేస్తున్నారు. పదేళ్ల భవిష్యత్తుపై ‘మొక్కుబడి’ దెబ్బ ఈ సర్వే ద్వారా సేకరించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, దీనివల్ల సంక్షేమ పథకాలకు ఎలాంటి ఢోకా ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తప్పుడు సమాచారం నమోదవుతోంది. ఈ సమాచారం ఆధారంగానే రాబోయే 10 ఏళ్ల నగర అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతుల కల్పన ఆధారపడి ఉంటాయి. ఇలాంటి శాసీ్త్రయత లేని, తప్పుల తడకల సర్వే వల్ల భవిష్యత్తులో ప్రజలకు అందాల్సిన వసతులు, ప్రభుత్వ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు నిద్ర మత్తు వదిలి, జీవీఎంసీ పరిధిలో జరిగిన ఈ మొక్కుబడి సర్వేపై క్షేత్రస్థాయిలో రీ–వెరిఫికేషన్ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. మా ఇంటికి ఎవరూ రాలేదు నేను లలితానగర్లోని శ్యామలమ్మ ఆలయం సమీపంలో కుటుంబంతో నివసిస్తున్నాను. మా ఇంటికి సర్వే కోసం ఎవరూ రాలేదు. ఎక్కడి నుంచో ఫోన్ చేసి వివరాలు అడిగారు. ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదు. నా భర్త పేరు, నా పేరు, కుటుంబ సభ్యుల సంఖ్య మాత్రమే అడిగి, సర్వే అయిపోయిందన్నారు. అసలు 33 ప్రశ్నలు ఉంటాయని మాకు తెలియదు. ఇంకా ఏమైనా అడుగుతారేమో, పథకాలు కట్ అవుతాయేమో అని భయపడ్డాను. – ఎ.రేష్మి, లలితానగర్ -
రోబోటిక్ సర్జరీతో మెరుగైన క్యాన్సర్ వైద్యం
ఎన్టీపీసీ సింహాద్రి హెడ్ అయస్కాంత్ జెనా అగనంపూడి: అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధనా సంస్థ 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ హెడ్ అయస్కాంత జెనా మాట్లాడుతూ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీపీసీ సహకరిస్తుందని తెలిపారు. ఆస్పత్రితో రోబోటిక్ సర్జరీ యూనిట్, 3 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి డైరెక్టర్ డా. ఉమేష్ మహంతశెట్టి మాట్లాడుతూ 12 ఏళ్లలో క్యాన్సర్ సంరక్షణలో సంస్థ విశేష పురోగతి సాధించిందన్నారు. ఆధునిక వైద్య సాంకేతికత, డయాగ్నస్టిక్ సదుపాయాలతో సమగ్ర చికిత్స అందిస్తున్నామని తెలిపారు. చికిత్సతో పాటు పునరావాసం, మానసిక మద్దతు కూడా సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘ప్రేరణ’ పేరుతో క్యాన్సర్ బాధితులు, రోగం నుంచి కోలుకున్న వారు, వైద్యులు, సహాయకులతో ఒక ప్రత్యేక గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది రోగుల్లో మానసిక ధైర్యం పెంపొందించేందుకు నెలవారీ సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు. అలాగే నాల్గవ వార్షిక క్యాన్సర్ కాంగ్రెస్ కూడా నిర్వహించారు. ఇందులో అంతర్జాతీయ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ శైలేష్ వి శ్రీఖండో, వైస్ అడ్మిరల్ ఆర్తి సారిన్ పాల్గొని ఆధునిక క్యాన్సర్ చికిత్స విధానాలు, రోబోటిక్ సర్జరీ, రేడియోథెరపీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి సుమారు 150 మంది వైద్య నిపుణులు, పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు హాజరయ్యారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
మహారాణిపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీలో రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీ, జిల్లా అనుబంధ విభాగ కమిటీ, నియోజకవర్గ అనుబంధ విభాగం కమిటీలో పలువురిని నియమించారు. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా మాటూరి చిన్నారావు (విశాఖ పశ్చిమ), రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ కార్యదర్శిగా డి.అప్పారావు (డేవిడ్రాజు) (గాజువాక), రాష్ట్ర వలంటీర్ విభాగం కార్యదర్శిగా కాళ్ల గౌరి (భీమిలి)ని నియమించారు. జిల్లా అనుబంధ విభాగం కమిటీ వైఎస్సార్సీపీ జిల్లా షేక్ విభాగం అధ్యక్షుడిగా మహమ్మద్ షరీఫుద్దీన్(విశాఖ సౌత్), జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా జామి కరుణ(విశాఖ నార్త్), జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా కాకినాడ పెంటారావు(గాజువాక), జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ముడుపు దామోదర్ రావు(గాజువాక), జిల్లా ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జల్లి బాబ్జి(గాజువాక), జిల్లా విద్యార్ధి విభాగం ప్రధాన కార్యదర్శిగా గార్లాంక మురళి(గాజువాక), జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా నీలకంటి సంతోష్కుమార్(భీమిలి), జిల్లా ఆర్టీఐ వింగ్ ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీవంశీ(గాజువాక), జిల్లా ఆర్టీఐ వింగ్ కార్యదర్శిగా సిరసపల్లి శ్రీనివాస్(గాజువాక), జిల్లా వలంటీర్స్ విభాగం కార్యదర్శిగా పేర్ల రాము(గాజువాక), జిల్లా రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా గొలజాన రవికుమార్(భీమిలి), జిల్లా గ్రీవెన్స్ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వాకాడ దుర్గా వెంకట ప్రసాద్ రెడ్డి(గాజువాక), జిల్లా పబ్లిక్ వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ధర్మాల దిలీప్ రెడ్డి(గాజువాక)ను నియమించారు. నియోజకవర్గ అనుబంధ విభాగం గాజువాక నియోజకవర్గ రజక విభాగం అధ్యక్షుడిగా నందవరపు సత్య భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ నూర్ భాష(దూదేకల) విభాగం అధ్యక్షుడిగా మహమ్మద్ సిరిరాజుద్ధిన్, విశాఖ దక్షిణ నియోజకవర్గ నాగవంశం విభాగం అధ్యక్షుడిగా కనకాల జగదీష్ కుమార్ను నియమించారు. -
చల్లటి కబురు.. ఏపీని తాకిన రుతుపవనాలు
సాక్షి, విశాఖ: ఏపీ ప్రజలకు చల్లటి కబురు అందింది. ఏపీని నైరుతి రుతుపవనాలు తాకినట్టు విశాఖ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. దీంతో, రాయలసీమలో రుతుపవనాలు వేగంగా విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుంది. కాగా, ఈనెల 15వ తేదీ నాటికి ఏపీ అంతట రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు ఎండల తీవ్రత మాత్రం కొనసాగుతోంది. -
ఆమె మాటే శాసనమా?
విశాఖపట్నం: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వ్యవహారశైలి, సిబ్బంది సమస్యల పట్ల నిర్లక్ష్యం, పోస్టుల కుదింపు చర్యలపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయటకు మాట్లాడితే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో సిబ్బంది మౌనంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. భక్తుల రద్దీ పెరిగినా... సిబ్బంది మాత్రం తగ్గింపు రోజురోజుకూ కనకమహాలక్ష్మి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. అదే స్థాయిలో ఆలయ ఆదాయం కూడా గణనీయంగా వృద్ధి చెందుతోంది. 2011లో సుమారు రూ.3 కోట్లుగా ఉన్న వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ.13 కోట్లకు చేరింది. అయితే పెరిగిన ఆదాయానికి, భక్తుల రద్దీకి అనుగుణంగా సిబ్బందిని పెంచాల్సిన పరిస్థితిలో, ఇప్పటికే ఉన్న పోస్టులను సైతం కుదించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉద్యోగుల్లో ఆగ్రహం రేకెత్తిస్తున్నాయి. కేడర్ స్ట్రెంగ్త్పై వివాదం గతంలో ఆలయ అవసరాలను గుర్తించిన దేవదాయ శాఖ అధికారులు కేడర్ స్ట్రెంగ్త్ను బలోపేతం చేసి ఉద్యోగులకు పదోన్నతులు కలి్పంచారు. అయితే ప్రస్తుతం సిబ్బంది సంఖ్య పెంపుపై ప్రతిపాదనలు పంపాల్సిన చోట, పోస్టుల తగ్గింపునకు సంబంధించి దేవదాయ శాఖ కమిషనర్కు లేఖ పంపినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఉద్యోగులు ఈవోతో పాటు ఏపీ ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య నాయకత్వానికి వినతిపత్రాలు సమరి్పంచినప్పటికీ స్పందన కనిపించలేదని వాపోతున్నారు. కీలక పోస్టుల రద్దు.. ప్రమోషన్లకు బ్రేక్ దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ఒక కార్యనిర్వాహక ఇంజనీర్, ఒక సహాయ కార్యనిర్వహణాధికారి పోస్టులను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో సీనియర్ ఉద్యోగుల పదోన్నతుల అవకాశాలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే డిప్యూటీ ఇంజనీర్ పోస్టు అప్గ్రేడ్ పేరుతో కనుమరుగైన పరిస్థితుల్లో, త్వరలో పదవీ విరమణ చేయనున్న ఈఈ పోస్టును కూడా రద్దు చేయనున్నారనే ప్రచారం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. ఆదాయం పెరిగితే ఉద్యోగాలు తగ్గాలా? ఆలయ ఆదాయం నాలుగు రెట్లు పెరిగినప్పటికీ, కేడర్ స్ట్రెంగ్త్ను కుదించాలనే ఆలోచన వెనుక కారణాలేమిటో ఉద్యోగులకు అర్థం కావడం లేదంటున్నారు. భక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ సేవల విస్తరణ అవసరం పెరిగిందని, కానీ సిబ్బంది పెంపు దిశగా చర్యలు కనిపించకపోవడం ఆశ్చర్యకరమని అభిప్రాయపడుతున్నారు. దత్తత ఆలయ భారం కూడా వీళ్లపైనే.. జగదాంబ జంక్షన్ సమీపంలోని అంబికాబాగ్ రామాలయాన్ని కనకమహాలక్ష్మి ఆలయం దత్తత తీసుకుని నిర్వహిస్తోంది. అయితే ఆ ఆలయ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించకుండా, కనకమహాలక్ష్మి ఆలయ ఉద్యోగులతోనే పనులు చేయిస్తున్నారు. దీంతో ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులపై అదనపు పనిభారం పడుతోంది. ముఖ్యంగా మార్గశిర ఉత్సవాల వంటి కీలక వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ట్రస్ట్ బోర్డు చైర్మన్కు ఉద్యోగుల వినతి ఇటీవల ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కందుల నాగరాజుకు ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. సిబ్బంది కొరత, పెరుగుతున్న పనిభారం, పోస్టుల కుదింపు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి, కేడర్ స్ట్రెంగ్త్ను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
గ్రీన్ డ్రామాకు గ్రాండ్ కాన్వాయ్ సైకిల్ షో
సాక్షి, విశాఖపట్నం : రెడీ.. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. విశాఖ తీరంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పర్యావరణాన్ని కాపాడేయాలనే తపనతో మన చంద్రబాబు గారు ఎలక్ట్రిక్ సైకిల్ ఎక్కారు. ఆయన సైకిల్ తొక్కుతుంటే.. చుట్టూ పది కెమెరాలు, ఆకాశంలో డ్రోన్లు, వెనుక భజన బృందాల హంగామా. ఆహా.. ఓహో అంటూ పొగడ్తలు. అయితే ఈ ‘గ్రీన్ రైడ్’ వల్ల పర్యావరణానికి ఎంత మేలు జరిగిందో పక్కన పెడితే.. ఆ ప్రాంతాన్ని మాత్రం కాలుష్యం కమ్మేసింది. ఆదేశాలు ఎన్నో... నిధులేవి? బాబు గారికి మాటలు ఎక్కువ.. నిధులు తక్కువనే విషయం మరోసారి ఫ్రూవ్ అయింది. తొలి నుంచి విశాఖ ఎకనమిక్ రీజియన్ అంటూ ప్రజల్ని మభ్యపెడుతున్న ఆయన.. విశాఖ వచ్చిన ప్రతిసారీ దానిపై ఓ సమావేశం పెడుతూ అధికారులకు ఆదేశాలు జారీ చేసేస్తున్నారు. ఈసారి కూడా 9 జిల్లాల కలెక్టర్లను విశాఖకు రప్పించుకొని అదే తరహా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కైలాసగిరి నుంచి భోగాపురం వరకూ బే సిటీ ప్రాజెక్టు అభివృద్ధి చేయాలంటూ అధికారుల్ని ఆదేశించారు. గ్రే హౌండ్స్కి చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ను నిర్మించాలన్నారు. వివిధ ప్రాజెక్టుల వద్ద పారిశ్రామిక ప్రాంతాల్ని ఆనుకొని ఏర్పాటు చేసే టౌన్íÙప్ల అభివృద్ధిపైనా దృష్టిసారించాలని ఆదేశించారు. ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాలి. కానీ.. ఒక్కపైనా విదల్చడం లేదు. గత ఏడాది యోగా డే నిర్వహించినందుకే రూ.30 కోట్లు ఇంకా బాకీ ఉంచారు, ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు డబ్బులెక్కడివి బాబూ? అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అవి ఉత్తుత్తి పెట్టుబడులా..? గతేడాది భాగస్వామ్య సదస్సులో బీచ్ రోడ్డులో రూ. వేల కోట్ల ప్రాజెక్టులు వచ్చేసాయంటూ ఊదరగొట్టారు. కట్ చేస్తే.. ఇప్పుడు మళ్లీ అదే బీచ్ రోడ్డులో వాటర్ స్పోర్ట్స్ కోసం ‘పెట్టుబడులను ఆహ్వానించండి’ అంటూ అధికారులకు ఆర్డర్స్ వేస్తున్నారు. అంటే.. ఆ రోజు చెప్పినవన్నీ ఉత్తుత్తి ముచ్చట్లేనా అనే అనుమానం ప్రజల్లో గట్టిగా వస్తోంది. మొత్తానికి, నేషనల్ సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్క్షాప్ను కూడా బాబు గారు తన పబ్లిసిటీ స్టంట్కే చక్కగా వాడుకున్నారన్నమాట!షో సరే.. విద్యార్థుల సంగతేంటి? ఈ సైకిల్ యాత్రకు మరింత హంగులు అద్దడానికి కొంతమంది విద్యార్థులను రంగంలోకి దించారు. బాబు గారు, ఆయన మంత్రులు హ్యాపీగా ఎలక్ట్రిక్ సైకిల్స్ ఎంజాయ్ చేస్తే.. విద్యార్థులకు మాత్రం తొక్కే కొద్దీ అలసట వచ్చే సాధారణ పెడల్ సైకిళ్లు ఇచ్చారు. నోవాటెల్ హోటల్ రాగానే బాబు గారి షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. అంతే, అధికారులు తక్షణమే విద్యార్థుల నుంచి సైకిళ్లను లాగేసుకుని.. ‘మీ పనైపోయింది, ఇక ఇంటికిపోండి’ అంటూ మండుటెండలో రోడ్డు మీద వదిలేశారు. వేడి తాపానికి ఆ పిల్లలు అల్లాడుతుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.సైకిల్ సవారీ.. భారీ కాన్వాయ్ బాబు గారు పర్యావరణాన్ని కాపాడటానికి సైకిల్ మీద వెళ్తుంటే.. ఆ సైకిల్ వెనుక మంత్రులు, అధికారులు, రక్షణ సిబ్బందికి చెందిన పదుల సంఖ్యలో భారీ కాన్వాయ్ వాహనాలు పొగలు కక్కుతూ నెమ్మదిగా కదిలాయి. ఏయూ గ్రౌండ్స్ నుంచి సిరిపురం మీదుగా నోవాటెల్కు కేవలం 15 నిమిషాల సమయం పడుతుంది. కానీ.. కాస్త రూట్ మార్చి పోలమాంబ టెంపుల్ నుంచి జీసీసీ మీదుగా బీచ్రోడ్డులో రావడం వల్ల దాదాపు గంట సమయం పట్టింది. దీంతో గంట పాటు విశాఖ దారుల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు ఇంజిన్లు ఆఫ్ చేయకుండా అలాగే ఉంచేయడంతో.. బాబు గారి పుణ్యమా అని వాయు కాలుష్యం నెక్ట్స్లెవెల్కి చేరింది. ప్రజలు ఎండలో మలమలమాడుతుంటే, బాబు గారు మాత్రం సైకిల్ పబ్లిసిటీ షూటింగ్లో బిజీగా ఉండిపోయారు. కొన్ని చోట్ల ప్రజలు చంద్రబాబును చూడకుండా ఉండేందుకు రోడ్డుకు ’పరదాలు’ కూడా కట్టేయడం విశేషం.సైకిల్పై నుంచి పడి విద్యార్థికి గాయాలు సైకిల్ సవారీలో అపశృతి చోటుచేసుకుంది. చంద్రబాబు, మంత్రులు, అధికారులు హ్యాపీగా ‘ఈవీ’ సైకిళ్లపై వెళ్లగా.. విద్యార్థులకు సాధారణ పెడల్ సైకిళ్లు ఇచ్చి వెనుక పరుగెత్తించారు. కరకచెట్టు పోలమాంబ దేవాలయం దాటిన తర్వాత డౌన్లో అజితేష్ అనే విద్యార్థి ఒక్కసారిగా తూలి కిందపడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి, ఆ విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తన వెనుక వస్తున్న విద్యార్థి కిందపడి గాయపడినా.. చంద్రబాబు కానీ, ఆయన వెంట ఉన్న మంత్రులు కానీ కనీసం ఆగి పరామర్శించకుండా, తమ ‘సైకిల్ షో’ పబ్లిసిటీయే ముఖ్యం అన్నట్టుగా ముందుకు సాగిపోవడం గమనార్హం. -
ఊపిరితిత్తుల క్యాన్సర్కు కేజీహెచ్లో క్లినికల్ ట్రయల్స్
మహారాణిపేట: ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న పేద రోగులకు కేజీహెచ్ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఊపిరితిత్తుల క్యాన్సర్పై జాతీయ స్థాయిలో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు కేజీహెచ్ ఎంపికై ంది. ఈ ట్రయల్స్కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా కేజీహెచ్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.శిల్పా వ్యవహరించనున్నారు. రోగులకు ఎంతో మేలు ఈ క్లినికల్ ట్రయల్స్ ద్వారా రోగులకు ఎంతో మేలు చేకూరనుందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. 18 నుంచి 65 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ఏ దశ (స్టేజ్)లోనైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన రోగులకు ఈ ట్రయల్స్ ద్వారా ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తారని వెల్లడించారు. సాధారణంగా ఇచ్చే కీమోథెరపితో పాటు, ఎంతో ఖరీదైన ‘ఇమ్యునోథెరపీ’ని కూడా క్లినికల్ ట్రయల్ ద్వారా ఏడాది పాటు ఉచితంగా అందజేయనున్నట్లు వివరించారు. ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్కు ఇంతటి అత్యాధునిక వైద్యం ఉచితంగా లభించడం ఇదే ప్రథమమన్నారు. ఒక్కో సైకిల్కు సుమారు రూ.4 లక్షల విలువ చేసే ఇమ్యునోథెరపీ మందును.. ప్రతి మూడు వారాలకు ఒకసారి చొప్పున, ఏడాదికి మొత్తం 17 సార్లు పూర్తిగా ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారు. బాధితులు సద్వినియోగం చేసుకోవాలి క్యాన్సర్ రోగులకు ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కేజీహెచ్లో ఉచితంగా అందిస్తున్నామని మెడికల్ ఆంకాలజీ హెచ్వోడీ డాక్టర్ కె.శిల్పా తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు, వారి కుటుంబ సభ్యులు అధైర్యపడకుండా కేజీహెచ్ ఆంకాలజీ విభాగాన్ని సంప్రదించి, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పర్యావరణ రక్షణ అందరి బాధ్యత
తాటిచెట్లపాలెం: సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముడసర్లోవలో రాబోయే సౌత్ కోస్ట్ రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయం వద్ద జోనల్ మేనేజర్ సందీప్ మాధుర్, సౌత్ కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చారు మాధుర్, ఇతర అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. వ్యర్థాలతో తయారు చేసిన ‘మేక్ ఇన్ ఇండియా లయన్’ను సందీప్ మాధుర్ ఆవిష్కరించారు. -
షో సరే.. విద్యార్థుల సంగతేంటి?
ఈ సైకిల్ యాత్రకు మరింత హంగులు అద్దడానికి కొంతమంది విద్యార్థులను రంగంలోకి దించారు. బాబు గారు, ఆయన మంత్రులు హ్యాపీగా ఎలక్ట్రిక్ సైకిల్స్ ఎంజాయ్ చేస్తే.. విద్యార్థులకు మాత్రం తొక్కే కొద్దీ అలసట వచ్చే సాధారణ పెడల్ సైకిళ్లు ఇచ్చారు. నోవాటెల్ హోటల్ రాగానే బాబు గారి షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. అంతే, అధికారులు తక్షణమే విద్యార్థుల నుంచి సైకిళ్లను లాగేసుకుని.. ‘మీ పనైపోయింది, ఇక ఇంటికిపోండి’ అంటూ మండుటెండలో రోడ్డు మీద వదిలేశారు. వేడి తాపానికి ఆ పిల్లలు అల్లాడుతుంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. -
యువకుడిని కాపాడిన లైఫ్గార్డులు
మహారాణిపేట: కెరటాల ఉధృతికి సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని పోలీసులు, స్విమ్మర్లు కాపాడారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం రాజపురం గ్రామానికి చెందిన ఎం.మణికంఠ మిలటరీ పరీక్షలు రాయడానికి ఇటీవల విశాఖకు వచ్చాడు. శుక్రవారం గోకుల్ పార్క్ వద్ద తీరంలో స్నానం చేస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన అలల ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు.ఇది గమనించిన డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ భాస్కరరావు, లైఫ్గార్డులు రవి వర్మ, కళ్యాణ్ వెంటనే అప్రమత్తమై మణికంఠను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం ఆ యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, అతని తమ్ముడు వరుణ్కు అప్పగించినట్లు మైరెన్ ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. -
ఆమె మాటే శాసనమా?
డాబాగార్డెన్స్: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వ్యవహారశైలి, సిబ్బంది సమస్యల పట్ల నిర్లక్ష్యం, పోస్టుల కుదింపు చర్యలపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయటకు మాట్లాడితే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో సిబ్బంది మౌనంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. భక్తుల రద్దీ పెరిగినా... సిబ్బంది మాత్రం తగ్గింపు రోజురోజుకూ కనకమహాలక్ష్మి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. అదే స్థాయిలో ఆలయ ఆదాయం కూడా గణనీయంగా వృద్ధి చెందుతోంది. 2011లో సుమారు రూ.3 కోట్లుగా ఉన్న వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ.13 కోట్లకు చేరింది. అయితే పెరిగిన ఆదాయానికి, భక్తుల రద్దీకి అనుగుణంగా సిబ్బందిని పెంచాల్సిన పరిస్థితిలో, ఇప్పటికే ఉన్న పోస్టులను సైతం కుదించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉద్యోగుల్లో ఆగ్రహం రేకెత్తిస్తున్నాయి. కేడర్ స్ట్రెంగ్త్పై వివాదం గతంలో ఆలయ అవసరాలను గుర్తించిన దేవదాయ శాఖ అధికారులు కేడర్ స్ట్రెంగ్త్ను బలోపేతం చేసి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. అయితే ప్రస్తుతం సిబ్బంది సంఖ్య పెంపుపై ప్రతిపాదనలు పంపాల్సిన చోట, పోస్టుల తగ్గింపునకు సంబంధించి దేవదాయ శాఖ కమిషనర్కు లేఖ పంపినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఉద్యోగులు ఈవోతో పాటు ఏపీ ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య నాయకత్వానికి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన కనిపించలేదని వాపోతున్నారు. కీలక పోస్టుల రద్దు.. ప్రమోషన్లకు బ్రేక్ దేవదాయ శాఖ ఆదేశాల మేరకు ఒక కార్యనిర్వాహక ఇంజనీర్, ఒక సహాయ కార్యనిర్వహణాధికారి పోస్టులను రద్దు చేసినట్లు సమాచారం. దీంతో సీనియర్ ఉద్యోగుల పదోన్నతుల అవకాశాలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఇప్పటికే డిప్యూటీ ఇంజనీర్ పోస్టు అప్గ్రేడ్ పేరుతో కనుమరుగైన పరిస్థితుల్లో, త్వరలో పదవీ విరమణ చేయనున్న ఈఈ పోస్టును కూడా రద్దు చేయనున్నారనే ప్రచారం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. ఆదాయం పెరిగితే ఉద్యోగాలు తగ్గాలా? ఆలయ ఆదాయం నాలుగు రెట్లు పెరిగినప్పటికీ, కేడర్ స్ట్రెంగ్త్ను కుదించాలనే ఆలోచన వెనుక కారణాలేమిటో ఉద్యోగులకు అర్థం కావడం లేదంటున్నారు. భక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ సేవల విస్తరణ అవసరం పెరిగిందని, కానీ సిబ్బంది పెంపు దిశగా చర్యలు కనిపించకపోవడం ఆశ్చర్యకరమని అభిప్రాయపడుతున్నారు. దత్తత ఆలయ భారం కూడా వీళ్లపైనే.. జగదాంబ జంక్షన్ సమీపంలోని అంబికాబాగ్ రామాలయాన్ని కనకమహాలక్ష్మి ఆలయం దత్తత తీసుకుని నిర్వహిస్తోంది. అయితే ఆ ఆలయ నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించకుండా, కనకమహాలక్ష్మి ఆలయ ఉద్యోగులతోనే పనులు చేయిస్తున్నారు. దీంతో ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులపై అదనపు పనిభారం పడుతోంది. ముఖ్యంగా మార్గశిర ఉత్సవాల వంటి కీలక వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ట్రస్ట్ బోర్డు చైర్మన్కు ఉద్యోగుల వినతి ఇటీవల ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కందుల నాగరాజుకు ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. సిబ్బంది కొరత, పెరుగుతున్న పనిభారం, పోస్టుల కుదింపు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి, కేడర్ స్ట్రెంగ్త్ను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలి
ప్రజాభిప్రాయమా.. కాపీ–పేస్ట్ అభిప్రాయాలా? సీఆర్జెడ్ మార్పు వంటి కీలక అంశంపై ప్రజల అభిప్రాయాలను సేకరించాలని ఏపీసీజెడ్ఎంఏ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. కానీ ప్రజల స్పందన పేరుతో సమర్పించిన పత్రాల్లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల పేర్లతో నమోదైన అభిప్రాయాలన్నీ దాదాపు ఒకే భాషలో, ఒకే వాక్య నిర్మాణంతో, ఒకే పదజాలంతో ఉండటం చర్చనీయాంశంగా మారింది. పేర్లు మారాయి కానీ అభిప్రాయాలు మాత్రం అక్షరాలా ఒకేలా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఒక్క పదం కూడా మార్చకుండా ఒకే అభిప్రాయాన్ని పదుల సంఖ్యలో జతచేయడం వెనుక అసలు ప్రజల స్పందన ఉందా? లేక ముందుగానే తయారు చేసిన ముసాయిదాలను వివిధ పేర్లతో జోడించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ అభిప్రాయాలను సమర్పించిన వారి పూర్తి చిరునామాలు, సంప్రదింపు వివరాలు కూడా చాలాచోట్ల లేవు. దీంతో ఇవి నిజమైన ప్రజాభిప్రాయాలా? లేక అధికార పార్టీ అనుచరులు సమీకరించి సమర్పించిన పత్రాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
విశాఖ ఎయిర్పోర్టును కొనసాగించండి
● వలస నేతల స్వార్థ రాజకీయాలకు విశాఖను బలి చేస్తే సహించం ● మహానగరాన్ని ఓల్డ్సిటీగా చేసే హక్కు మీకు లేదు ● ఎంపీ భరత్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుపై వైఎస్సార్సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి ఫైర్ డాబాగార్డెన్స్: విశాఖ నడిబొడ్డున ఉన్న ప్రస్తుత విమానాశ్రయాన్ని ఇక్కడే యథావిధిగా కొనసాగించాలని, అలాగే ప్రశాంతమైన వైజాగ్ బీచ్ రోడ్డులో మద్యం దుకాణాల ఏర్పాటు నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ డిమాండ్ చేశారు. ఆశీల్మెట్టలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వలస నాయకుల స్వార్థ రాజకీయాల వల్ల విశాఖ రిచ్ సిటీగా మారిపోతోందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్, గోవా, శ్రీనగర్, చండీఘర్, ఆగ్రా వంటి అనేక ప్రాంతాల్లో రక్షణ శాఖ అనుసంధానంతోనే విమానాశ్రయాలు విజయవంతంగా నడుస్తున్నప్పుడు, విశాఖకు వచ్చిన ఇబ్బంది ఏంటని ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఎంపీ భరత్, కేంద్ర విమానాయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు రావడం వల్ల విజయనగరం జిల్లా అభివృద్ధి చెందడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ ఆ పేరుతో విశాఖ గొంతు కోయడం సమంజసం కాదన్నారు. విశాఖ నుంచి భోగాపురం 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ప్రయాణికులు విమానం ఎక్కడానికి నాలుగు గంటల పైగా సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ హెల్త్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయన్నారు. 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్పోర్టును దూరం చేస్తే, గుండె గానీ, లివర్ గానీ లేదా ఇతర ఆర్గాన్లను నిర్దిష్ట సమయానికి ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు. బీచ్లో మద్యం విక్రయాల నిర్ణయంపై ఆగ్రహం విశాఖ బీచ్ను బార్ ప్రాంతంగా మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వాసుపల్లి గణేష్కుమార్ నిప్పులు చెరిగారు. పర్యాటకులను ఆకర్షించే పేరిట బీచ్లో షాక్స్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలకు అనుమతులు ఇవ్వడం అత్యంత ప్రమాదకరమన్నారు. గతంలోనూ విశాఖ బీచ్ను గోవాగా మార్చి రెడ్లైట్ ఏరియాగా చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్, డేవిడ్రాజు, అబ్బిరెడ్డి ఆదివిష్ణు, సనపల రవీంద్రభరత్, దసమంతుల చిన్ని, వాసుపల్లి బంగారమ్మ, రాము తదితరులు పాల్గొన్నారు. -
కేజీహెచ్ నిధులు, ఖాళీలపై ఆరా
మహారాణిపేట: కేజీహెచ్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ‘సీసీఆర్’ ఎన్జీవో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ కరోతు రాము శుక్రవారం సమాచార హక్కు చట్టం–2005 కింద దరఖాస్తు సమర్పించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణిని మర్యాదపూర్వకంగా కలిసి ఈ దరఖాస్తును అందజేశారు. ప్రజా ప్రయోజనాల కోసం ఎన్జీవో చేస్తున్న కృషిని ఈ సందర్భంగా సూపరింటెండెంట్ అభినందించారు. ఈ దరఖాస్తు ద్వారా కేజీహెచ్ పరిపాలన, హెచ్డీఎస్, సీఎస్ఆర్ నిధుల వినియోగం, గత రెండేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధుల వివరాలను కోరారు. అలాగే ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఖాళీలు, గత ఐదేళ్ల నియామకాలు, రోగుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, మందుల కొనుగోలు,పంపిణీ, ఓపీ, ఐపీ రోగుల గణాంకాలపై సమగ్ర సమాచారాన్ని అందించాలని అభ్యర్థించారు. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత పెంచడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని కరోతు రాము తెలిపారు. కార్యక్రమంలో ఎన్జీవో ప్రతినిధులు కె. అప్పలరాజు, బి. కన్నబాబు, ఎ. పైడిరాజు, ఎన్. రాజేష్ పాల్గొన్నారు. -
సైకిల్ తొక్కేస్తే సరిపోతుందా?
మధురవాడ: విశాఖ జిల్లాలో పర్యావరణాన్ని నిలువునా నాశనం చేస్తూ.. సీఎం చంద్రబాబు సైకిల్ తొక్కేసి పర్యావరణాన్ని కాపాడాననడం హాస్యాస్పదమని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మరుపిళ్ల పైడిరాజు విమర్శించారు. మధురవాడలో ఆయన మాట్లాడుతూ.. తుర్లువాడ, రాంబిల్లి, శ్రీకృష్ణాపురంలలో డేటా సెంటర్ల పేరుతో 660 ఎకరాల అత్యంత విలువైన భూములను ఎకరం కేవలం 99 పైసలకే ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను నామమాత్రపు ధరకు దోచిపెట్టి విశాఖ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందన్నారు. ఇంతటి విధ్వంసానికి కారణమవుతూ.. ఆంధ్రా యూనివర్సిటీలో ఒక మొక్క నాటి, నోవాటెల్ హోటల్ వరకు సీఎం చంద్రబాబు సైకిల్ తొక్కేస్తే పర్యావరణం కాపాడినట్టేనా? అని నిలదీశారు. ప్రైవేట్ సంస్థలకు భూములు కట్టబెట్టే పద్ధతిని తక్షణమే విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు. -
కారులో చెలరేగిన మంటలు
ఎంవీపీకాలనీ: అప్పుఘర్ కూడలి వద్ద ఓ కారులో మంటలు చెలరేగిన ఘటన శుక్రవారం జరిగింది. వివరాలిలా.. మహేంద్ర ఎక్స్యూవీ కార్ బీచ్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఎంవీపీ అప్పుఘర్ కూడలి వద్దకు చేరుకునే సరికి ఒక్కసారిగా కారు నుంచి పొగలు కమ్ముకున్నాయి. కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై వెంటనే దిగి బయటకు వచ్చేశారు. వారు బయటకొచ్చిన కొన్ని నిమిషాల్లో కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు ఎంవీపీ పోలీసులతోపాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సాయంతో వారు మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదని ఎంవీపీ పోలీసులు తెలిపారు. -
సైకిల్పై నుంచి పడి విద్యార్థికి గాయాలు
సైకిల్ సవారీలో అపశృతి చోటుచేసుకుంది. చంద్రబాబు, మంత్రులు, అధికారులు హ్యాపీగా ‘ఈవీ’ సైకిళ్లపై వెళ్లగా.. విద్యార్థులకు సాధారణ పెడల్ సైకిళ్లు ఇచ్చి వెనుక పరుగెత్తించారు. కరకచెట్టు పోలమాంబ దేవాలయం దాటిన తర్వాత డౌన్లో అజితేష్ అనే విద్యార్థి ఒక్కసారిగా తూలి కిందపడిపోగా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే స్పందించి, ఆ విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తన వెనుక వస్తున్న విద్యార్థి కిందపడి గాయపడినా.. చంద్రబాబు కానీ, ఆయన వెంట ఉన్న మంత్రులు కానీ కనీసం ఆగి పరామర్శించకుండా, తమ ‘సైకిల్ షో’ పబ్లిసిటీయే ముఖ్యం అన్నట్టుగా ముందుకు సాగిపోవడం గమనార్హం. -
గూగుల్ డేటా సెంటర్తో పర్యావరణానికి ముప్పు
పర్యావరణవేత్తలకు ‘నో ఎంట్రీ’ తీర ప్రాంత పరిరక్షణ, జీవవైవిధ్యం, భవిష్యత్ తరాల ప్రయోజనాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పర్యావరణవేత్తల అభిప్రాయాలు మాత్రం ఈ ప్రక్రియలో కనిపించకపోవడం మరో కీలక అంశంగా మారింది. విశాఖ తీర ప్రాంతం కేవలం భూమి కాదని, అది ప్రకృతి కవచమని నిపుణులు ఎన్నోసార్లు హెచ్చరించారు. ఇసుక తిన్నెలు, చిత్తడి నేలలు, సహజ వృక్ష సంపద తుఫాన్లు, సముద్రపు అలల ప్రభావాన్ని తగ్గించే సహజ రక్షణ వ్యవస్థగా పనిచేస్తాయని చెబుతున్నారు. అలాంటి అభిప్రాయాలకు చోటు కల్పించకుండా కేవలం సీఆర్జెడ్ మార్పును సమర్థించే అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇవ్వడం వెనుక ఉద్దేశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
విశాఖ ఎకనమిక్ రీజియన్ కార్యాలయం ప్రారంభం
మహారాణిపేట: వీఎంఆర్డీఏ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్’ (వీఈఆర్)కార్యాలయం శుక్రవారం నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ఇటీవల నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా ప్రకటించిన మూడు ఆర్థిక ప్రాంతాలలో విశాఖ ఒకటి కావడం గమనార్హం. వీఎంఆర్డీఏ చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ సమక్షంలో.. వీఈఆర్ సీఈవో డాక్టర్ ఎన్. యువరాజ్ చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వీఈఆర్ డిప్యూటీ సీఈవో, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, అదనపు కమిషనర్ దాట్ల కీర్తి, వోఎస్డీ కృష్ణా నాయక్, కార్యదర్శి మురళీ కృష్ణ, ముఖ్య ఇంజనీర్ వినయ్ కుమార్, ముఖ్య గణాంక అధికారి హరి ప్రసాద్, ముఖ్య ప్రణాళిక అధికారి దివ్య లతలతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గూగుల్ డేటా సెంటర్తో పర్యావరణానికి ముప్పు
ఆరిలోవ: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ముడసర్లోవ వద్ద సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల కొండ భూములను చంద్రబాబు ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్టీఎస్ రోడ్డులోని రామకృష్ణాపురం కూడలి నుంచి డేటా సెంటర్ గేటు వరకు ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దాన్ని నాశనం చేయడం దారుణమన్నారు. డేటా సెంటర్ల వల్ల వాతావరణం వేడెక్కి జీవరాశుల మనుగడకే ముప్పు వస్తుందని హెచ్చరించారు. అమెరికా, యూరప్ దేశాల్లో వీటి వల్ల జరిగే నష్టాలపై పర్యావరణ శాస్త్రవేత్తలు ఐక్యరాజ్యసమితికి నివేదికలు ఇచ్చారని, అందుకే అక్కడ వీటిని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. అలాంటి ప్రమాదకరమైన సంస్థలను అమరావతిలో కాకుండా, ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసి ఇక్కడి ప్రజల ఆరోగ్యంతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ చలగాటమాడుతున్నారని ఆరోపించారు. గతంలో సింహాద్రి అప్పన్న కొండ మధ్యలో సొరంగ మార్గం ఏర్పాటును అడ్డుకున్న ఆగమ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దీనిపై నోరు విప్పకుండా, ఇతర మంత్రులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో వాయు కాలుష్యం పెరిగిపోయిందని ప్రభుత్వ సంస్థలే చెబుతున్నాయని, ఈ తరుణంలో చెట్లను పెంచాల్సింది పోయి, ఉన్న అడవులను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే డేటా సెంటర్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు విమల, పైడిరాజు, రెహమాన్, నాగభూషణరావు, నాగరాజు, బీబీ, పుష్పలత, లక్ష్మణరావు, గోవింద్, శ్రీనివాసరావు, అప్పలరాజు పాల్గొన్నారు. -
ఏపీ నిర్మాణ అకాడమీకి జాతీయ గుర్తింపు
మహారాణిపేట: న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లోని స్టెయిన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఇంఫ్రాకాన్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ నిర్మాణ అకాడమీ రెండు ప్రతిష్టాత్మక పురస్కారాలను దక్కించుకుంది. ఈ అవార్డులను ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ చేతుల మీదుగా నాక్ అదనపు డైరెక్టర్ జనరల్ డి. మనోహర్ స్వీకరించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఏపీ జాతీయ నిర్మాణ అకాడమీ డైరెక్టర్ జనరల్ జి. గణేష్ కుమార్ ప్రభుత్వ సేవల్లో శ్రేష్టత విభాగంలో గోల్డ్ అవార్డును అందుకున్నారు. -
విశాఖ: 2 గంటల పాటు నిలిచిపోయిన రైళ్లు
సాక్షి, విశాఖపట్నం: దువ్వాడ రైల్వే స్టేషన్ సుమారు రెండు గంటల పాటు రైళ్లు నిలిచిపోయాయి. దువ్వాడలోని రెండో లైన్లో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో నాలుగో నెంబర్ ప్లాటుఫారంపై కాచిగూడ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. మరో ఐదు ట్రైన్లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6.15 నుంచి 8.15 వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సాంకేతికపరమైన ఇబ్బందులను తొలగించిన రైల్వే అధికారులు.. రైళ్లు రాకపోకలను పునరుద్ధరించారు.విశాఖ–ఇచ్ఛాపురం సెక్షన్లో జీఎం తనిఖీలుసౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ గురువారం విశాఖ– ఇచ్ఛాపురం సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. అమృత్ భారత్ పథకం కింద ఎంపికైన సింహాచలం రైల్వే స్టేషన్తో పాటు కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన ఆయన.. నిర్దేశిత సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఇచ్ఛాపురం– విశాఖ మధ్య విండో ట్రైలింగ్ ఇన్స్పెక్షన్ ద్వారా రైల్వే ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థ, బ్రిడ్జిలను పరిశీలించి, ప్రజా సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ పర్యటనలో ప్రిన్సిపాల్ చీఫ్ ఇంజనీర్ బి.ఎస్.కె. రాజ్కుమార్, పీసీఎస్టీఈ ఓబీ సురేష్కుమార్, పీసీవోఎం వినీత్కుమార్, సీఏవో అంకుష్ గుప్తా, డీఆర్ఎం లలిత్ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో బ్యాంకు దోపిడీకి యత్నం
మర్రిపాలెం: ఓ బ్యాంక్ ఉద్యోగి విశాఖలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో దోపిడీకి యత్నం చేశాడు. అడ్డు వచ్చిన మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్పై దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ మేనేజర్ (ఆపరేషన్స్) ఎల్లా రవికుమార్ విశాఖలోని తన మిత్రుడు మేనేజర్గా ఉన్న ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖకు బుధవారం బ్యాంక్ పనివేళలు ముగిసే సమయానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆ బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు క్లోజింగ్ ప్రక్రియలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బంగారు నగలను అపహరించేందుకు రవికుమార్ ప్రయత్నించాడు. దీన్ని గమనించిన బ్యాంకు మేనేజర్ శివరామరాజు, అసిస్టెంట్ మేనేజర్ రమేష్లు రవికుమార్ను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రవికుమార్ తనతో తెచ్చుకున్న సుత్తితో వారి తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లకు గాయాలవడంతో వారు కేకలు వేశారు. స్థానికులు వెంటనే వచ్చి నిందితుడిని పట్టుకుని క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కంచరపాలెం పోలీసులు ఘటనాస్థలికి వచ్చి నిందితుడిని అరెస్ట్ చేశారు. బ్యాంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను స్వాదీనం చేసుకున్నారు.విచారణలో నిందితుడిని అదే బ్యాంక్ యలమంచిలి శాఖలో మేనేజర్(ఆపరేషన్స్)గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. కాగా, నిందితుడు బెట్టింగ్లకు బానిసగా మారి అప్పుల్లో కూరుకుపోయాడని, వాటిని ఎలా అయినా తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఐటీఐ జంక్షన్ వద్ద ఉన్న ఈ బ్యాంక్ బ్రాంచ్లో గోల్డ్ లోన్లు ఎక్కువగా ప్రాసెస్ చేస్తుంటారని తెలుసుకుని ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. -
బీచ్లలో బీరు.. బారు
ఇన్నాళ్లూ.. బీచ్ అంటే షికార్లు.. సరదాలు.. పిల్లలు, కుటుంబంతో సేదతీరే ప్రాంతం! ఇకపై.. బీచ్లంటే బీరు, బారు.. మందూ, చిందూ.. ఆకతాయిలు, అసాంఘిక శక్తుల కోలాహలం!! రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న బీచ్లను అసాంఘిక శక్తుల అడ్డాగా మారుస్తూ ‘బీచ్ షాక్స్’ పేరుతో మద్యం ప్రవాహానికి చంద్రబాబు సర్కారు తలుపులు బార్లా తెరిచింది! గురువారం మంత్రి మండలి సమావేశంలో అందుకు ఆమోదముద్ర వేసింది. టీడీపీ మద్యం సిండికేట్ మరింత బరి తెగించి దోపిడీకి పాల్పడేలా పచ్చజెండా ఊపింది! కూటమి సర్కారు నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీచ్ షాక్స్ అంటే.. మినీ బార్లే బీచ్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు తాజాగా మంత్రి మండలి సమావేశంలో తీర్మానించింది. ఇంతకీ బీచ్ షాక్స్ ఏమిటంటే... బీచ్లలో చిన్న సైజు బార్లే. వెదురు గానీ చెక్కతోగానీ కుటీరం ఆకారంలో వాటిని ఏర్పాటు చేస్తారు. వాటిలో మద్యం, బీరు, ఇతర పానీయాలు, ఆహార పదార్ధాలు విక్రయిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి మినీ బార్లే. పర్యాటక రంగానికి ప్రోత్సాహం ముసుగులో బీచ్లలో మద్యం ప్రవాహానికి చంద్రబాబు ప్రభుత్వం గేట్లు ఎత్తింది. మొదటగా విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో బీచ్ షాక్స్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్ షాక్స్ నిర్వహించవచ్చని ప్రకటించింది. అంటే బీచ్లలో రోజంతా మద్యం ఏరులై పారనుందని స్పష్టం చేసింది. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా దశలవారీ మద్యం నియంత్రణ లక్ష్యంగా ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడమే కాకుండా మద్యం విక్రయ వేళలను కుదించింది. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన పరి్మట్ రూమ్లను రద్దు చేసింది. 48 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది.కానీ 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి పచ్చజెండా ఊపింది. మద్యం విధానం ముసుగులో దోపిడీకి తెరతీసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. విచ్చలవిడిగా ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతినిచి్చ.. మొత్తం 4,346 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్కు ఏకపక్షంగా కట్టబెట్టింది. ఎల్లో సిండికేట్ రాష్ట్రంలో ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలతో విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతోంది. తీరప్రాంతం ధారాదత్తం.. అయినా చంద్రబాబు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ కోసం రాష్ట్రంలో 974 కి.మీ. తీరప్రాంతాన్ని కూడా కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే బీచ్ షాక్స్ పేరుతో బీచ్లలో బార్లకు అనుమతినిచ్చింది. విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో పైలట్ ప్రాజెక్టుగా మినీ బార్ల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. అనంతరం రాష్ట్రంలోని ఇతర బీచ్లలో కూడా వాటిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీచ్లలో కూడా మినీ బార్లు ఏర్పాటుకు ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. త్వరలోనే వాటికి కూడా అనుమతి ఇవ్వనుందని ఎక్సైజ్శాఖ వర్గాలు తెలిపాయి. మినీ బార్లను కూడా టీడీపీ సిండికేట్కే ఏకపక్షంగా కట్టబెట్టనుందన్నది సుస్పష్టం.ఇక బీచ్కు వెళ్లాలంటే భయం భయం..!చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో రాష్ట్రంలో బీచ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బీచ్లకు ఉదయం, సాయంత్రం సమయంలో అధికంగా ప్రజలు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో రద్దీగా ఉంటాయి. ఆ సమయంలోనే బీచ్లలో మినీ బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాంతో ఆకతాయిలు, అసాంఘిక శక్తులకు మినీ బార్లు కేంద్ర బిందువుగా మారే అవకాశాలున్నాయి.ఆహ్లాదం, ప్రశాంతత కోసం బీచ్కు వచ్చే మహిళలు, బాలికలపై వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే గంజాయి బ్యాచ్లు రాష్ట్రంలో చెలరేగిపోతున్నాయి. ఇక బీచ్లలో కూడా మందు బాబులు, గంజాయి బ్యాచ్లు మహిళలపై విరుచుకుపడే ప్రమాదం ముంచుకొస్తోంది. రాష్ట్రంలో బీచ్లలో పోలీసు భద్రత కూడా లేదు. మరోవైపు విశాఖపట్నం, సూర్యలంక బీచ్లలో ఎందరో యువకులు ఈతకు వెళ్లి దుర్మరణం పాలవుతున్నారు. ఇప్పుడు బీచ్లలో మినీ బార్లు ఏర్పాటుతో మద్యం మత్తులో సముద్ర స్నానాలు, ఈతకు దిగి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.బికినీ ఫెస్టివల్ నుంచి బీచ్ షాక్స్ దాకా.. 2014–19 మధ్య టీడీపీ హయాంలో బీచ్లలో బార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం 2016లో జీవో నంబర్ 470 కూడా జారీ చేశారు. దాంతోపాటు బీచ్లలో బికినీ ఫెస్టివల్ నిర్వహించాలని కూడా సన్నాహాలు చేశారు. అప్పట్లో దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. ప్రధానంగా మహిళా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి. దాంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అనంతరం 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి బీచ్లలో బార్ల ఏర్పాటు దిశగా అడుగులు వేసింది. మినీ బార్ల ముసుగులో బీచ్లలో మద్యం ప్రవాహానికి తలుపులు తెరచింది. – సాక్షి, అమరావతి -
ఆపు నీ డాబు!
వెన్నుపోటు బాబూ..చంద్రబాబు అబద్ధపు పాలనపై విశాఖ వ్యాప్తంగా మిన్నంటిన నిరసన జ్వాలలు ’టీడీపీ మేనిఫెస్టో’ ప్రతులను అడుగడుగునా తగలబెట్టిన శ్రేణులు వైఎస్సార్సీపీ శ్రేణుల భారీ ర్యాలీలు, మానవహారాలతో హోరెత్తిన వీధులు సాక్షి, విశాఖపట్నం : మోసాన్నే పెట్టుబడిగా, అబద్ధాలనే ఆయుధంగా మలచుకుని అధికార పీఠమెక్కిన చంద్రబాబు నయవంచనపై విశాఖ ఉగ్రరూపం దాల్చింది. ‘వెన్నుపోటు బాబూ.. ఆపు నీ డాబు! ఇంకా ఎన్నాళ్లు ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని అనుభవిస్తావ్?’ అంటూ జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. చంద్రబాబు మార్క్ ‘వెన్నుపోటు రాజకీయాలకు’ రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్సార్సీపీ పిలుపుమేరకు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కదం తొక్కారు. అధికారంలోకి రావడానికి ప్రజల చెవుల్లో పెట్టిన బూటకపు హామీల చిట్టా ‘టీడీపీ మేనిఫెస్టో’ ప్రతులను అడుగడుగునా దహనం చేస్తూ చంద్రబాబు మోసపూరిత వైఖరిపై నిప్పులు చెరిగారు. భారీ ర్యాలీలు, మానవహారాలతో విశాఖ జిల్లా చంద్రబాబు అబద్ధపు పాలనకు వ్యతిరేకంగా ముక్తకంఠంతో గర్జించింది. భీమిలిలో.. తగరపువలస అంబేడ్కర్ కూడలి వద్ద, మధురవాడ జోన్లో పీఎం పాలెం క్రికెట్ స్టేడియం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, పరిశీలకుడు తైనాల విజయకుమార్ సహా వందలాది మంది నాయకులు కార్యకర్తలు రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులు దహనం చేస్తూ.. చంద్రబాబు రెండేళ్ల పాలనలో వైఫల్యాను ఎండగట్టారు.గాజువాకలో.. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి బీహెచ్పీవీ జంక్షన్, కూర్మన్నపాలెం జంక్షన్, పెదగంట్యాడ జంక్షన్లో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు నేతృత్వంలో కూర్మన్నపాలెం జంక్షన్లో పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
మత్స్యకారుల పొట్టకొట్టి ‘సమ్మిట్’లా?
మహారాణిపేట: రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో విశాఖలో ‘నేషనల్ ఫిషరీస్, ఆక్వా–మైరెన్ సమ్మిట్’ నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ వాసుపల్లి తెలిపారు. గురువారం విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంక్షోభం రాష్ట్రంలోని అన్ని హార్బర్లలోని మత్స్యకారుల ఉమ్మడి సమస్య అని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు ఆక్వా రైతులు సీడ్ కొరత, ఫీడ్ ధరలు, దళారీ వ్యవస్థతో నష్టపోతుంటే, మరోవైపు మైరెన్ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. 15 ఏళ్ల క్రితం నాటి రొయ్యలు, చేపల ధరలే ఇప్పటికీ ఉన్నాయని, కానీ డీజిల్, కార్మిక వ్యయాలు, నిర్వహణ ఖర్చులు అనేక రెట్లు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. లీటర్ డీజిల్ ధర రూ.104 దాటినా ప్రభుత్వం ఇచ్చే రూ.9 సబ్సిడీని పెంచకపోవడం మత్స్యకారుల నడ్డి విరుస్తోందన్నారు. మత్స్యకార భరోసా పథకంలో అర్హులైన వేలాది మంది సంప్రదాయ, మెకనైజ్డ్ బోట్ మత్స్యకారులను ఉద్దేశ్యపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. గతంలో మత్స్యకారుల సమస్యలపై అనేక సభల్లో గళమెత్తిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఇప్పుడు డీజిల్ సబ్సిడీ, భరోసా కోతలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని జానకీరామ్ ప్రశ్నించారు. రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ -
వెలగని దీపం
మహారాణిపేట: ఎన్నికల ముందు ఇచ్చిన ’ఉచిత గ్యాస్ సిలిండర్ల’ హామీ లబ్ధిదారులకు ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ’దీపం’ పథకం అమలులో రాయితీ సొమ్ము చెల్లింపులు నత్తనడకన సాగుతుండటంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకుని రోజులు గడుస్తున్నా సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమకాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు గడువు ముగుస్తున్నా ఇంకా 40 శాతానికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. దీంతో విసిగిపోయిన జనం.. సివిల్ సప్లయిస్ జిల్లా అధికారి (డీఎస్ఓ), సహాయ సరఫరా అధికారి (ఏఎస్ఓ)లకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. అధికారుల నుంచి కేవలం ‘ఈ రోజు వస్తుంది.. రేపు వస్తుంది‘ అనే పొడిపొడి సమాధానాలు తప్ప స్పష్టత కరువైంది. ఎన్నికల ముందు ఒకలా.. ఇప్పుడు ఇంకోలా.. అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక నిబంధనల మెలికలు పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో లేని ఆంక్షలను ఇప్పుడు తెరపైకి తేవడంతో సగం మంది దీపం వినియోగదారులకు కూడా లబ్ధి చేకూరడం లేదు. ఉచిత సిలిండర్ పొందాలంటే ’రైస్ కార్డు’ తప్పనిసరి అని నిబంధన పెట్టడంతో మధ్యతరగతి మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనికి తోడు ఈ–కేవైసీ, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా అనుసంధానంలో చిన్న తేడాలు వచ్చినా రాయితీ సొమ్ము నిలిచిపోతోంది. ‘ఎన్నికల ముందు ఒకలా చెప్పి, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారు‘ అంటూ మహిళలు కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. విడతల వారీగా అమలు ఈ పథకం కింద మొదటి విడత జనవరిలో పూర్తి కాగా, రెండో విడత ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఎల్పీజీ కనెక్షన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగా అర్హులను గుర్తించి పథకాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,71,481 మంది ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. అయితే వీరిలో ఎంతమందికి రాయితీ సొమ్ము పూర్తిగా జమ అయిందన్న అంశంపై స్పష్టత లేదు. మరోవైపు, తమ ఖాతాల్లో డబ్బులు పడలేదంటూ అనేక మంది లబ్ధిదారులు అధికారులను సంప్రదిస్తున్నారు. ప్రస్తుత ఐదో విడత గడువు ఈ నెల 30 వరకు ఉండగా, ఇంకా చాలామందికి సబ్సిడీ అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పది రోజులు దాటినా పైసా రాలేదు.. ఈ విడతలో వంట గ్యాస్ సిలిండర్ వచ్చింది. జేబులోంచి డబ్బులు కట్టి సిలిండర్ తీసుకున్నాను. పది రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పైసా కూడా ఖాతాలో పడలేదు. ఎవరిని అడిగినా వస్తాయి.. వస్తాయి అని కాలయాపన చేస్తున్నారు తప్ప కచ్చితంగా ఎప్పుడు వస్తాయో చెప్పడం లేదు. మధ్యతరగతి కుటుంబాలకు ఈ సొమ్ము ఎంతో అవసరం. ప్రభుత్వం స్పందించి మా డబ్బులు త్వరగా వచ్చేలా చూడాలి. – అవ్వా దేవి, చాకలివీధి, 27వ వార్డు, జీవీఎంసీ ఖాతాల్లో త్వరలోనే జమ అవుతుంది! అర్హులైన లబ్ధిదారులందరికీ డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి ఖాతాల్లోనే రాయితీ సొమ్ము జమ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోగా సిలిండర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రాయితీ సొమ్ము రాని వారు ఎవరైనా ఉంటే తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. – వి.భాస్కర్, సివిల్ సప్లయిస్ జిల్లా అధికారి -
పశ్చిమలో..
59వ వార్డు నెహ్రూ నగర్, 91వ వార్డులో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకుడు జహీర్ అహ్మద్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. దక్షిణలో.. నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ఆధ్వర్యంలో డైమండ్ పార్క్ జంక్షన్తో పాటు జగదాంబ జంక్షన్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద, అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్ వద్ద, టౌన్కొత్తరోడ్డు, జ్ఞానాపురం కాన్వెంట్ జంక్షన్లలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రతులను దహనం చేస్తూ నిరసన చేపట్టారు. -
నగల దుకాణంలో అగ్నిప్రమాదం
గోపాలపట్నం: స్థానిక ప్రధాన రహదారిలోని రామాలయం సమీపంలో ఉన్న ’హైదరాబాద్ పెరల్స్ అండ్ జ్యువెలర్స్’ దుకాణంలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలోని ఏసీ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు యజమాని బి.హేమ తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ, అప్పటికే మంటలు దుకాణమంతటా వేగంగా వ్యాపించాయి. అయితే, లోపల ఉన్న సిబ్బంది, వినియోగదారులు అప్రమత్తమై వెంటనే బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించగా, మర్రిపాలెం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గంటలపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణంలో ఉన్న వన్గ్రామ్ గోల్డ్ నగలు, ఇతర విలువైన వస్తువులు, నగదు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, సుమారు రూ. 50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పి.గణబాబు బాధితులను పరామర్శించి, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని ఆయన అధికారులను ఆదేశించారు. -
రేపు గవర్నర్ రాక
మహారాణిపేట: రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ శనివారం విశాఖ వస్తున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం 12.05 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా నోవాటెల్ హోటల్కు వెళ్తారు. అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని సాయంత్రం ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(సంగివలస)లో 6వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ నుంచి నేరుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7.20 గంటలకు ప్రత్యేక విమానంలో తిరిగి విజయవాడ వెళ్తారు. -
రేపటి నుంచి ‘గ్రీన్ ఎకానమీ’పై సదస్సు
సాక్షి, విశాఖపట్నం : వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ నెల 6, 7 తేదీల్లో ఐఐఎం విశాఖపట్నం ప్రాంగణంలో ఐడియల్ ల్యాబ్ ఆధ్వర్యంలో ‘ఇంటర్నేషనల్ కాంక్లేవ్ ఆన్ గ్రీన్ ఎకానమీ(ఐసీజీఈ)–2026 సదస్సు జరగనుంది. ‘ఆర్థిక, విధానపరమైన, సాంకేతిక మార్గాలు’ అనే అంశాలపై జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, విధానకర్తలు, పరిశ్రమల ప్రముఖులు, పరిశోధకులు హాజరుకానున్నారు. సియెర్రా లియోన్కి చెందిన భారత హై కమిషనర్ బైస్నాబ్ చరణ్ ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సు ప్రారంభించనున్నారు. వాతావరణ సంరక్షణ కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యాయబద్ధమైన గ్రీన్ ట్రాన్సిషన్ కోసం పబ్లిక్ పాలసీ, ఏఐ ఆధారిత సుస్థిర వ్యవస్థలు వంటి అంశాలపై ఈ సదస్సులో ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ, కోపెన్హాగన్ బిజినెస్ స్కూల్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ సదస్సు.. పర్యావరణ, సాంకేతిక మార్పుల కాలంలో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి, విధానపరమైన చర్చలకు కీలక వేదికగా నిలవనుందని ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
సిటీ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధే ధ్యేయం
డాబాగార్డెన్స్: సిటీ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధే ధ్యేయంగా నగర పరిధిలోని పలు ప్రాజెక్టులపై జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో జరిగిన ఈ సమావేశంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి అభిజిత్రేతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా కమిషనర్ కేతన్గార్గ్ జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద చేపట్టిన ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రతిపాదిత ప్రాజెక్ట్ల వివరాలను వారికి వివరించారు. విశాఖ ఎకనామిక్ రీజన్ అభివృద్ధిలో భాగంగా నగర భౌగోళిక పరిస్థితులు, అవసరాలపై వరల్డ్బ్యాంక్ ప్రతినిధుల బృందానికి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కమిషనర్ సమగ్రంగా వివరించారు. నగరంలో నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, రోడ్ల విస్తరణ, మొబిలిటీ కారిడార్స్, రోడ్డు కనెక్టివిటీ పెంపుదల, హౌసింగ్, మురికివాడల అభివృద్ధి తదితర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టుల రూపకల్పనపై ఈ ప్రజంటేషన్లో చర్చించారు. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనంలో భాగంగా శుక్రవారం వరల్డ్ బ్యాంకు ప్రతినిధుల బృందం నగరంలోని పలు ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటన చేసి పరిశీలించనుందని కమిషనర్ తెలిపారు. సమీక్షా సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ప్రధాన ఇంజినీరు పీవీవీ సత్యనారాయణరాజు, పర్యవేక్షక ఇంజినీరు ఏడుకొండలు, అడ్వైజర్ కేవీఎన్ రవి, స్మార్ట్సిటీ కార్పొరేషన్ మేనేజర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
బిల్డింగ్ ప్లాన్లు, ఎల్ఆర్ఎస్ మంజూరుపై ప్రత్యేక శ్రద్ధ
జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ ఆదేశం డాబాగార్డెన్స్ : నగర పరిధిలో భవన నిర్మాణ అనుమతులు, ఎల్ఆర్ఎస్, టీడీఆర్ల మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా.. నిర్ణీత గడువులోపు ప్రక్రియ పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పట్టణ ప్రణాళికా అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావుతో పాటు ఇతర టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర ప్రజలు భవన నిర్మాణ అనుమతుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిస్తున్నప్పటికీ వాటి పరిష్కారంలో అనవసర జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ఆర్ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన, మంజూరు ప్రక్రియలో కూడా నిర్లక్ష్యం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీ డీపీఎంఎస్ పోర్టల్లో నమోదైన భవన నిర్మాణ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, రెండు రోజుల కంటే ఎక్కువ ఆలస్యం చేయకుండా సంబంధిత ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విషయంలోనూ క్షేత్రస్థాయి పరిశీలన త్వరితగతిన పూర్తి చేసి, జాప్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ అనుమతుల నమోదు ప్రక్రియలోనూ లోపాలు, ఆలస్యాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో సిటీ ప్లానర్ ధనుంజయరెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్లు మధుసూధనరావు, రామ్మోహన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు తిరుపతిరావు, రామలింగేశ్వరరెడ్డి, ఝాన్సీ, లక్ష్మీ షబ్నం, శాస్త్రి, రామకృష్ణ, టీపీవోలు, టీపీబీవోలు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు
అల్లిపురం: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు విధులు నిర్వహించాలని నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి అధికారులను ఆదేశించారు. నగర పోలీసు కమిషనరేట్ సమావేశ మందిరంలో డీసీపీ–1, డీసీపీ–2, డీసీపీ క్రైమ్స్, ట్రాఫిక్ అధికారులు, ఏడీసీపీలు, ఏసీపీలు, సంబంధిత సీఐలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, ఇతర ప్రముఖులు పర్యటించే ప్రాంతాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి తాగునీరు, మజ్జిగ, భోజనం సమయానికి అందేలా చూడాలని ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నివారణ కోసం వోఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే ప్రతి శుక్రవారం నిర్వహించే ‘నో వెహికల్ డే’లో భాగంగా ముఖ్యమంత్రి ఏయూ హెలిప్యాడ్ నుంచి నోవాటెల్ వరకు సైకిల్పై ప్రయాణించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, డీసీపీ–1తో కలిసి ఏయూ హెలిప్యాడ్ నుంచి నోవాటెల్ వరకు సైకిల్పై వెళ్లి భద్రతా చర్యలను సమీక్షించారు. -
పొట్టలో 4.5 కిలోల కణితి తొలగింపు
మహారాణిపేట: కేజీహెచ్లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన టి.రజని గత ఏడాది కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ గత నెల 14న కేజీహెచ్ యూరాలజీ విభాగంలో చేరారు. పరీక్షల అనంతరం ఆమె కడుపులోని అడ్రినల్ గ్రంథిలో కుడివైపు 6 సెం.మీ, ఎడమవైపు 28 సెం.మీ మేర కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. లక్ష మందిలో నలుగురికి మాత్రమే వచ్చే ‘బైలాటరల్ అడ్రినల్ మైలోలిపోమా విత్ కంజెనిటల్ అడ్రినల్ హైపర్ప్లాసియా’ అనే అరుదైన వ్యాధిగా దీనిని నిర్ధారించారు. యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో, ఎండోక్రినాలజీ, అనస్తీషియా విభాగాల సహకారంతో గత నెల 19న రజనికి శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న 4.5 కిలోల భారీ కణితను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గురువారం డిశ్చార్జ్ చేసినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చంద్రశేఖర్, అనస్తీషియా వైద్యులు కె.శ్రీలక్ష్మి, శరత్ చంద్ర, అప్పలరాజు, వెంకటకృష్ణ, దత్తాత్రేయ బృందాన్ని సూపరింటిండెంట్ అభినందించారు. -
లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా
మహారాణిపేట: వినియోగదారులు బుకింగ్ చేసిన తర్వాత నిర్ణీత వ్యవధిలోనే ఓటీపీ ఆధారిత డెలివరీ ద్వారా గ్యాస్ సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్పీజీ డీలర్లు, హెచ్పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్ సేల్స్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. సిలిండర్ల డెలివరీలో ఎక్కడా జాప్యం జరగకూడదని, పెండింగ్ బుకింగ్లను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా ‘దీపం–2’ పథకం లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా సక్రమంగా సాగాలన్నారు. డెలివరీ సిబ్బంది ప్రవర్తన, వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులతో చర్చించారు. సమావేశంలో డీఎస్వో వి.భాస్కరరావు, ఏఎస్వోలు శ్రీహరి, రుక్మిణి కళ్యాణి, పలు కంపెనీల సేల్స్ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు. -
మరికొంత కాలం ప్రత్యేక రైళ్ల పొడిగింపు
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం నడుస్తున్న పలు వీక్లీ స్పెషల్ రైళ్ల సేవలను మరికొంత కాలం పొడిగించినట్లు సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ డివిజన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వై. బాలాజీ కిరణ్ తెలిపారు. సికింద్రాబాద్–నహర్లగున్ మధ్య నడిచే 07046 వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ను సెప్టెంబర్ 25 వరకు, తిరుగు ప్రయాణంలోని 07047 నహర్లగున్– సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ను సెప్టెంబర్ 28 వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్లో బయల్దేరి దువ్వాడ మీదుగా నహర్లగున్ చేరుకోగా, తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం నహర్లగున్ నుంచి బయల్దేరి గురువారం సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదేవిధంగా చర్లపల్లి–సంత్రగచ్చి మధ్య నడిచే 07221 వీక్లీ స్పెషల్ రైలును సెప్టెంబర్ 26 వరకు, తిరుగు ప్రయాణంలోని 07222 సంత్రగచ్చి–చర్లపల్లి వీక్లీ స్పెషల్ను సెప్టెంబర్ 27 వరకు కొనసాగించనున్నారు. ఈ రైళ్లు దువ్వాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ఇక గౌహతి–బెంగళూరు మధ్య ప్రత్యేక సమ్మర్ స్పెషల్ రైళ్లు కూడా నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 05642 గౌహతి–బెంగళూరు సమ్మర్ స్పెషల్ జూన్ 6న గౌహతి నుంచి బయల్దేరి జూన్ 8న బెంగళూరు చేరుకోనుండగా, 05641 బెంగళూరు–గౌహతి సమ్మర్ స్పెషల్ జూన్ 9న బెంగళూరు నుంచి బయల్దేరి జూన్ 11న గౌహతి చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. -
భలేభలే పాపకార్న్
ఎండలు మండిపోతుంటే జనాలు రకరకాల ఐడియాలతో రోడ్లపైకి వస్తున్నారు. కొందరు గొడుగులు పడితే, మరికొందరు స్కార్ఫ్లు కడుతున్నారు. కానీ.. ఈ బుజ్జాయి మాత్రం రూటే మార్చేసింది.. ‘హెల్మెట్ పెట్టుకుంటే నా అందం ఎవరికీ కనిపించదు.. అదే ఈ బకెట్ నెత్తిన పెడితే ఊరంతా నన్నే చూస్తుంది’ అన్నట్టుగా.. తలపై ఒక ఖాళీ ‘పాప్కార్న్ బకెట్’ బోర్లించి భలే గమ్మత్తుగా ప్రయాణించింది. దొండపర్తి రోడ్డులో వెళ్తున్న వాహనదారులను, పాదచారులను ఇట్టే ఆకట్టుకున్న ఈ చిన్నారి ఫన్నీ లుక్ను ‘సాక్షి’ తన కెమెరాలో క్లిక్ మనిపించింది. – అల్లిపురం -
డేటా సెంటర్లతో పర్యావరణానికి ముప్పు
తాటిచెట్లపాలెం: గూగుల్ డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచివుందని ఢిల్లీ సైన్స్ ఫోరం ఫౌండర్, ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జాతీయ నాయకులు డి.రఘునందన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు వీటిని వ్యతిరేకిస్తుంటే, మన దేశంలో ప్రభుత్వాలే ఆహ్వానించడం ప్రమాదకరమన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం దొండపర్తిలోని ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ సెమినార్ హాల్లో ‘డేటా సెంటర్లు –విశాఖ పర్యావరణంపై ప్రభావం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా విచ్చేసిన రఘునందన్ మాట్లాడుతూ.. అమెరికా, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల వ్యతిరేకత వల్లే ఇవి ఏర్పాటు కాలేదన్నారు. వీటి వల్ల భారీగా నీరు, విద్యుత్ వినియోగంతో పాటు రేడియేషన్ సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. అలాగే మన డేటాపై విదేశీ నియంత్రణ ఉండి, పారదర్శకత ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వాస్తవాలను మభ్యపెడుతూ 1 గిగాకు బదులు మూడు ప్రాంతాల్లో సుమారు 2.5 గిగా డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. విశాఖలోని సింహాచలం, ఆనందపురం వంటి నివాస ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. వీటిపై విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాల సహకారంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి జి.మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి జి.గిరిధర్, హెల్త్ సబ్ కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్ డాక్టర్ ఎం.రమేష్కుమార్, ఎన్.చంద్రశేఖర్, మానవ హక్కుల వేదిక అధ్యక్షులు వీఎస్ కృష్ణ, ప్రతినిధులు త్రినాథరావు, కామేశ్వర్రావు, జీవీ రమణ, పెద్ద సంఖ్యలో పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. ఢిల్లీ సైన్స్ ఫోరం ఫౌండర్ రఘునందన్ -
పచ్చగద్దలు!
పంచదార్ల కొండపైరాత్రింబవళ్లు యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలు నంబరు ప్లేట్లు లేని టిప్పర్లలో గ్రావెల్ తరలింపు ఎంపీ సీఎం రమేష్ ఆధ్వర్యంలోనే అక్రమ మైనింగ్ అంటూ ఆరోపణలు కన్నెత్తి చూడని రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఫిర్యాదు చేస్తే కేసులు పెడతామంటూ పోలీసుల బెదిరింపులు గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే పనులు కానిచ్చేస్తున్న వైనం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కనీసం గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే పంచదార్ల కొండపై జోరుగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో పారిశ్రామిక పార్కు అభివృద్ధి కోసమంటూ అధికారులు ఈ మైనింగ్ అనుమతులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ ఎలా చేపడతారంటూ స్థానిక గ్రామస్తులు ప్రశ్నిస్తుంటే.. రాంబిల్లి పోలీసులు వారిపై తిరగబడి కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అండదండలతోనే తాము మైనింగ్ చేపడుతున్నామని, ఎవరైనా అడ్డు వస్తే లారీలతో తొక్కించేస్తామని మైనింగ్ నిర్వాహకులు బెదిరిస్తున్నట్లు స్వయంగా కూటమికి చెందిన స్థానిక నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పంచదార్లలోని ప్రాచీన శైవక్షేత్రంతో పాటు, పురావస్తు శాఖ పరిధిలోని బౌద్ధారామాలకు కూడా ఈ అక్రమ మైనింగ్ వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాకుండా కొండ దిగువన ఉన్న చారిత్రక రిజర్వాయర్ సైతం ఎండిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు ‘పంచదార్ల కొండపై మైనింగ్ జరగనివ్వం’ అని హామీ ఇచ్చిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు దీనిపై ఏం సమాధానం చెప్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యేను నిలదీస్తే.. ‘తనకేమీ తెలియదు’ అంటూ దాటవేస్తున్నారని వారు వాపోతున్నారు. సీఎం రమేష్ పేరు చెప్పుకుంటూ ప్రాచీన బౌద్ధారామాలకు, శైవక్షేత్రానికి నష్టం కలిగిస్తున్న ఈ అక్రమ మైనింగ్ను వెంటనే నిలిపివేయాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. శైవ క్షేత్రానికి ముప్పు..! పంచదార్ల వద్ద పూర్వం స్వయంభూ లింగం ఉండేదని, కాలక్రమేణా అది మరుగున పడిపోవడంతో నారద మహర్షి సూచన మేరకు యమధర్మరాజు తన కుష్టు వ్యాధి నివారణ కోసం ఇక్కడ మరో లింగాన్ని ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ ఆలయానికి ‘ధర్మలింగేశ్వరాలయం’ అనే పేరు వచ్చింది. ఇక్కడి కోనేట్లోని లింగాల నుంచి నిరంతరం ప్రవహించే నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది నేటికీ ఒక రహస్యమే. ఈ పుణ్యతీర్థాన్ని సేవిస్తే అనారోగ్యాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి మొదటిసారిగా ఇక్కడే పాదాలు మోపారని కూడా ప్రతీతి. ఇక్కడి మండపంలో చప్పట్లు కొడితే ఆ శబ్దం తిరిగి ప్రతిధ్వనించడం మరో ప్రత్యేకత. ఇన్ని విశిష్టతలు ఉన్నందున, దీనిని పురాతన రక్షిత కట్టడంగా గుర్తిస్తూ పురావస్తు శాఖ ఇక్కడ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సాగుతున్న ఈ భారీ అక్రమ మైనింగ్ వల్ల ఈ శైవక్షేత్రం ఉనికికే ముప్పు వాటిల్లుతోంది. దీనికి తోడు ఈ కొండకు ఆనుకుని ఉన్న ఫణిగిరి కొండపై గల బౌద్ధారామాలు కూడా మైనింగ్ దెబ్బకు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని చరిత్రకారులు ఆందోళన చెందుతున్నారు. చారిత్రక జలధారకూ గండం..! కొండ నుంచి సహజసిద్ధంగా ప్రవహించే నీటితో కొండ కింద దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఒక రిజర్వాయర్ ఏర్పడింది. బ్రిటిష్ కాలం నాటి ఈ రిజర్వాయర్ను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశారు. 2023లో ’ఏషియన్ పెయింట్స్’ సీఎస్సార్ నిధులతో అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆధ్వర్యంలో ఈ రిజర్వాయర్ను ఆధునీకరించి, ఎక్కువ నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకున్నారు. గతంలో వెంకటాపురం రెవెన్యూ పరిధిలో ఉపాధి హామీ నిధులతో కొండ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు జరిగేవి. కానీ, ప్రస్తుత అక్రమ మైనింగ్ కారణంగా ఈ సహజ జలధారలు పూడుకుపోయి, రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి తోడు, కొండపై మైనింగ్ సాగుతుండటంతో ఉపాధి హామీ పనులు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ మైనింగ్ను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఫొటోలో ఉన్నది పంచదార్ల కొండ. అటు వెంకటాపురం నుంచి ఇటు పంచదార్ల వరకూ విస్తరించి ఉన్న ఈ కొండ రాష్ట్రంలోనే అతిపెద్ద కొండగా గుర్తింపు పొందింది. పచ్చదనంతో కళకళలాడే పంచదార్ల కొండపై పచ్చగద్దలు వాలి అడ్డంగా తొలిచేస్తున్నాయి. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
మహారాణిపేట: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, సహజ వనరుల సంరక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సూచించారు. పరిశుభ్రమైన, హరిత వాతావరణాన్ని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ)–విశాఖపట్నం విభాగం రూపొందించిన అవగాహన పోస్టర్ను కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ బుధవారం ఆవిష్కరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో రూపొందించిన ఈ పోస్టర్లో ఈ ఏడాది థీమ్(ప్రకృతి ప్రేరణతో–పర్యావరణ పరిరక్షణకై , మన భవిష్యత్తుకై )ను ప్రతిబింబిస్తూ కీలక అంశాలను పొందుపరిచారు. పరిశుభ్రమైన పర్యావరణం వల్ల ఆరోగ్యకరమైన జీవనం, హరిత సమాజాల నిర్మాణం, పునరుత్పాదక ఇంధన వినియోగం, స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతాయని పోస్టర్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీపీసీబీ అధికారులు ముకుందరావు, ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, డీసీపీలు లతామాధురి, మణికంఠ, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో శేషశైలజ తదితరులు పాల్గొన్నారు. -
మిస్ సౌత్ పసిఫిక్ ఆస్ట్రేలియాగా దేవి దివాకుల
ఎంవీపీకాలనీ: మిస్ సౌత్ పసిఫిక్ ఆస్ట్రేలియా అందాల పోటీల్లో విశాఖ యువతి దేవి దివాకుల సత్తా చాటారు. సౌత్ పసిఫిక్ దేశాల అందాల పోటీల్లో భాగంగా సౌత్ పసిఫిక్ ఆస్ట్రేలియా అందాల పోటీ–2026ను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా ఇటీవల నిర్వహించారు. 20 మంది యువతులు పోటీ పడ్డారు. తుది పోటీల్లో విశాఖ రైల్వే న్యూకాలనీకి చెందిన దేవి దివాకుల విన్నర్గా నిలిచి మిస్ సౌత్ పసిఫిక్ దేశాల అందాల పోటీకి ఎంపికయ్యారు. ఈ పోటీలు త్వరలో న్యూజిల్యాండ్ వేదికగా జరగనున్నాయి. 2023లో దేవి దివాకుల జీబీటీ మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచిన సత్తాచాటిన విషయం తెలిసిందే. ఇదే స్ఫూర్తితో ఆమె త్వరలో సౌత్ పసిఫిక్ దేశాల అందాల పోటీలో విజేతగా నిలవడంతో పాటు మిస్ వరల్డ్ పోటీల్లో సత్తా చాటాలని భావిస్తున్నట్లు ఆమె తల్లి జ్యోతి దివాకుల వెల్లడించారు. -
చేసేవన్నీ మోసాలు
చెప్పేవన్నీ అబద్ధాలు తూతూమంత్రంగా 4 పథకాలు అమలుచేసి చేతులు దులిపేసుకున్న చంద్రబాబు పడకేసిన విద్య, వైద్యం, సంక్షేమ రంగాలు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించకుండా దగా ఫ్రీబస్ తప్ప మహిళలకు ఒరిగింది శూన్యమే! బాబు దగా పాలనపై ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైఎస్సార్సీపీ నిరసన బాటసాక్షి, విశాఖపట్నం: అబద్ధాలనే పునాదిగా చేసుకుని.. మోసాలనే పూతగా పూసి.. నయవంచనకు మరో పేరుగా నిలిచింది చంద్రబాబు ప్రభుత్వం. ‘సూపర్–6’అంటూ ఊదరగొట్టి.. అధికార పీఠమెక్కిన కూటమి ప్రభుత్వంలో.. చంద్రబాబు తనకు అలవాటైన వెన్నుపోటు రాజకీయం ఈసారి ప్రజలపై ప్రదర్శించారు. ఈ 730 రోజుల్లో పలికిన ప్రతి మాటా ఓ అబద్ధం.. వేసిన ప్రతి అడుగూ ఓ ద్రోహం..! పేద, మధ్యతరగతి, యువత, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు.. ఇలా ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా అందరి జీవితాలపైనా బాబు మార్కు వెన్నుపోటు వాతలు పడ్డాయి. అడుగడుగునా సాగుతున్న ఈ దగాకోరు పాలనపై.. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ నయా వంచకుల ‘మోసాల సిక్సర్’తోపాటు, అసలు రంగును బట్టబయలు చేస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో మహా సంగ్రామానికి దిగింది. ప్రజల పక్షాన నిలబడి బాబు మోసాల చిట్టాను రచ్చబండకెక్కించి నిలదీస్తోంది..! యువతకు నిరుద్యోగ దగా నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ బుట్టదాఖలైంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత 2.05 లక్షల మంది ఉన్నారు. వీరికి 24 నెలల్లో ఒక్కొక్కరికీ రూ.72 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. కేవలం ఒక్క విశాఖ జిల్లా యువతకే సుమారు రూ.1,476 కోట్ల మేర చంద్రబాబు ఎగనామం పెట్టారు. ‘తల్లికి వందనం’లో కండిషన్ల వాత ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది రేషన్ కార్డులు, వయసు నిబంధనలు, హాజరు శాతం పేరిట కఠిన షరతులు విధించి, లబ్ధిదారుల సంఖ్యను సగానికి పైగా కోసేశారు. విశాఖ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 3,26,494 మంది మంది విద్యార్థులున్నారు. ప్రభుత్వం మాత్రం.. 1,90,907 మందికి మాత్రమే డబ్బులు జమ చేస్తోంది. అందులో కూడా రూ.2 వేలు, కొందరికి అంతకంటే ఎక్కువే కోత పెట్టారు. మహిళల ఖాతాల్లో ‘సున్నా’! 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని ఆశపెట్టారు. విశాఖ జిల్లా జనాభాలో 10,25,151 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో పింఛన్లు తీసుకుంటున్న వృద్ధ మహిళలు, ఉద్యోగుల్ని వదిలితే.. మిగిలిన వారిలో దాదాపు 8 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. రెండేళ్లలో ఒక్కో మహిళకు రూ.36 వేలు చొప్పున చెల్లించాల్సి ఉండగా.. రూపాయి కూడా విదల్చలేదు. రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు చేసిన మోసం విలువ రూ.2,880 కోట్లు. ఉచిత బస్సు ప్రయాణం మినహా విశాఖ మహిళలకు ఒరిగింది శూన్యమే. అంతా ‘గ్యాస్’కబుర్లే.. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. జిల్లాలో 5.17 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీరంతా ఈ పథకానికి అర్హులే. కానీ.. కేవలం 3.71 లక్షల గృహాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తోంది. రెండేళ్లలో ప్రతి ఇంటికీ 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా, కేవలం ఒకటి, రెండు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. వీరిలో 50 శాతం మందికి మాత్రమే రాయితీ డబ్బులు అందడం మరో విచిత్రం. వెన్నుపోటుకు రెండేళ్లు అడుగడుగునా ప్రజలను మోసం చేస్తూ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న చంద్రబాబు దగా పాలనపై వైఎస్సార్సీపీ ‘వెన్నుపోటుకు రెండేళ్లు’పేరుతో ప్రతి వీధిలో, ప్రతి వాడలో నిరసన గళం విప్పుతోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తోంది. గురువారం మండల కేంద్రాల్లో, వార్డుల్లో నిరసన ప్రదర్శనలు 8, 9 తేదీల్లో చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టౌన్ హాల్ సమావేశాలు 12న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన బాండ్ పేపర్ల దహనంపడకేసిన విద్య, వైద్యం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ స్థాయిలో వెలుగొందిన ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు.. చంద్రబాబు రెండేళ్ల పాలనలో పూర్తిగా మసకబారాయి. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, డాక్టర్లు, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో పడిపోవడంతో పేదలకు కార్పొరేట్ వైద్యం గగనంగా మారింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు వంటి పథకాల అమలులో తీవ్ర జాప్యం కారణంగా రైతులు, డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖకు అడుగడుగునా ద్రోహం అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా, పరిపాలనా రాజధానిగా ఎదుగుతున్న విశాఖ నగరాన్ని చంద్రబాబు సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, ఉత్తరాంధ్ర గుండెకాయపై కత్తి పెట్టింది. విశాఖ ఉక్కుని కాపాడుకుంటామంటూ బీరాలు పలికిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరవాత.. ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేందుకు పూర్తిగా కేంద్రానికి సహకారం అందిస్తున్నారు. ఏళ్ల తరబడి కార్మికులు రోడ్డెక్కి పోరాడుతున్నా, ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. -
ఏడాదికి రూ.100 కోట్లకు పైగానే దోపిడీ..!
ఎటువంటి పంచాయతీ తీర్మానాలు, అనుమతులు లేకుండా సాగుతున్న ఈ దోపిడీ ద్వారా కూటమి నేతలు ఏడాదికి ఏకంగా రూ.100 కోట్ల మేర అక్రమార్జనకు తెరలేపారు. ఈ వ్యవహారంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు రివర్స్ కేసులు పెడుతుండటంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలూ సాగుతున్న ఈ మైనింగ్ ద్వారా ప్రతిరోజూ 150 నుంచి 200 లోడ్ల మేర గ్రావెల్ తరలిపోతోంది. నంబర్ ప్లేట్లు లేని టిప్పర్లలో నిబంధనలకు విరుద్ధంగా 60 నుంచి 70 టన్నుల ఓవర్ లోడ్తో ఈ రవాణా సాగుతోంది. మార్కెట్లో ఒక్కో ట్రిప్పు గ్రావెల్ను రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. అంటే రోజుకు రూ.22.50 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.82 కోట్ల నుంచి రూ.109 కోట్ల మేర అక్రమ మైనింగ్ దోపిడీ జరుగుతోంది. మైనింగ్, రెవెన్యూ అధికారులు కళ్లుండీ కబోదుల్లా వ్యవహరిస్తుండటంతో స్థానిక యాదవ సామాజిక వర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఆవులు, మేకలు, గొర్రెలను మేపుకునేందుకు కొండపైకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ప్రశ్నిస్తే తమపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. -
రిప్ కరెంట్ల గుర్తింపునకు సమష్టి కృషి అవసరం
కోస్టల్ సేఫ్టీపై జాతీయ సదస్సులో ఐజీ గోపీనాథ్ జెట్టి మద్దిలపాలెం: సముద్ర తీరాల్లో ప్రమాదకర రిప్ కరెంట్లను గుర్తించడం, ప్రాణనష్ట నివారణకు పరిశోధన సంస్థ లు, ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జెట్టి పిలుపునిచ్చారు. బుధవారం ఏయూలో ‘స్ట్రేటజీస్ ఫర్ కోస్టల్ సేఫ్టీ, రిప్ కరెంట్ మేనేజ్మెంట్’ అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఐజీ మాట్లాడుతూ.. తీర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, నిఘా ఎంతో అవసరమన్నారు. గతేడాది రిప్ కరెంట్ల కారణంగా 69 మంది మృతి చెందగా, ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల 2024లో ఈ మరణాల సంఖ్య 39కి పరిమితమైందని వెల్లడించారు. రాష్ట్రంలో ఏటా సగటున 45 నుంచి 50 మంది రిప్ కరెంట్ల వల్ల మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్త ఎస్.వి.వి.అరుణ్కుమార్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి రిప్ కరెంట్లను ముందే గుర్తించి, ప్రాణనష్టం జరగకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ రిప్ కరెంట్ల నుంచి ఎలా సురక్షితంగా బయటపడాలో ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఏయూ విభాగాధిపతి ఆచార్య సి.వి.నాయుడు ఈ రంగంలో జరుగుతున్న పరిశోధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో కోస్టర్ సెక్యూరిటీ పోలీస్ ఎస్పీ కె.శ్రావణి, పలువురు రక్షణ రంగ నిపుణులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
మహారాణిపేట: ఈ నెల 5, 8వ తేదీల్లో జరిగే సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సీపీ శంఖబ్రత బాగ్చితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. 5న నోవాటెల్ వేదికగా సముద్ర ఆహార ఎగుమతులపై జరిగే సదస్సులో కేంద్ర మంత్రులతో కలిసి సీఎం పాల్గొంటారన్నారు. సాయంత్రం విశాఖ ఎకనామిక్ రీజియన్పై సమీక్షిస్తారని తెలిపారు. ఆ రోజు తాడేపల్లి నుంచి నేరుగా బీచ్రోడ్డులోని కోస్టల్ బ్యాటరీ వద్ద ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారన్నారు. షెడ్యూ ల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 8న తాడేపల్లి నుంచి రుషికొండ హెలీప్యాడ్కు చేరుకుంటారని, అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్ సమీపంలోని విద్యుత్ శాఖ సీవోఈఈటీ భవనానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్తారని తెలిపారు. ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. లంచ్ తర్వాత రుషికొండ హెలీప్యాడ్ నుంచి తర్లువాడ చేరుకుని అక్కడ గూగుల్ డేటా సెంటర్ సమీపంలో జరిగే ఎపిస్ టెక్నాలజీస్ సెమీకండక్టర్ యూనిట్ భూమి పూజ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతార ని వెల్లడించారు. అనంతరం తర్లువాడ నుంచి లేదా ఎయిర్పోర్టు నుంచి తాడేపల్లికి తిరుగుముఖం పడతారని పేర్కొన్నారు. సాయంత్రం వీరంతా కలిసి కార్యక్రమ వేదికలు, హెలీప్యాడ్లు, సంబంధిత ప్రాంతాలను పరిశీలించారు. సమావేశంలో ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృధ్వీతేజ్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, ఎన్ఎఫ్డీసీ సీఈవో విజయ్కుమార్, డీసీపీలు లతామాధురి, మణికంఠ, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవో శేషశైలజ, ఎపిస్ టెక్నాలజీ, ఎంపెడా, మత్స్యశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ -
విశాఖ తీరంపై చంద్రబాబు కన్ను
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ తీర ప్రాంతంలో అభివృద్ధి మాటున రియల్ ఎస్టేట్ సంస్థలకు, అనుయాయ కంపెనీలకు అడ్డగోలుగా భూకేటాయింపులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖ తీర ప్రాంతంలో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి.. కోస్తా తీర ప్రాంతానికి ముప్పు వాటిల్లజేసేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మధురవాడ నుంచి భీమిలి వరకూ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను సడలించాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను కోరాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ మొత్తం ప్రాంతాన్ని ప్రస్తుతం ఉన్న సీఆర్జెడ్–3 నుంచి సీఆర్జెడ్–2కు మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా మే నెల 5న జరిగిన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (ఏపీసీజెడ్ఎంఏ) సమావేశంలో మధురవాడ నుంచి భీమిలి వరకూ సీఆర్జెడ్–2 పరిధిలోకి తేవాలంటూ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న కాంతిలాల్ దండే ఏపీసీజెడ్ఎంఏకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు మెంబర్ సెక్రటరీగా ఉన్న శరవణన్ (ఐఎఫ్ఎస్), విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, పీసీబీ ఆర్వో తదితరులు హాజరయ్యారు. 2019లో జారీ చేసిన సీఆర్జెడ్ నోటిఫికేషన్లో ఈ మేరకు మార్పులు చేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణశాఖను కోరాలని సమావేశం అభిప్రాయపడింది. తద్వారా మధురవాడ నుంచి భీమిలి వరకు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతోంది. కోస్టల్ కారిడార్కు ముప్పు! వాస్తవానికి 2019లో ఇచ్చిన సీఆర్జెడ్ నోటిఫికేషన్ ప్రకారం మధురవాడ నుంచి భీమిలి వరకూ సీఆర్జెడ్–3 జోన్ పరిధిలో ఉంది. దీని ప్రకారం ఈ ప్రాంతంలో సముద్ర మట్టం నుంచి 200 మీటర్ల వరకూ ఎలాంటి శాశ్వత నిర్మాణాలూ చేపట్టకూడదు. ఇక్కడ సముద్ర తీరంలో ఉన్న సహజ ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు అలల తాకిడిని, తుపానులను అడ్డుకునే కవచాలుగా ఉపయోగపడుతున్నాయి. సీఆర్జెడ్–3 పరిధిలో ఉండటంతో ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అవకాశం లేదు. అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన నేతలు ఈ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. వీటిని ఇప్పుడు సీఆర్జెడ్–2 పరిధిలోకి తీసుకరావడం ద్వారా శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలకు అవకాశం ఏర్పడనుంది. తద్వారా ఇప్పటికే తాము చేపట్టిన నిర్మాణాలను శాశ్వతం చేసుకోవడంతో పాటు తమ అనుయాయులకు భూకేటాయింపులతో రానున్న రోజుల్లో విశాఖ తీరాన్ని కాంక్రీట్ జంగిల్గా మార్చేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమవుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ విధ్వంసం చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విశాఖలోని విలువైన భూములపై కన్నేసింది. మొదటగా తమ బంధువు ఆక్రమించుకున్న 5 వేల కోట్ల విలువైన ఎండాడలోని స్థలాన్ని గీతం పేరిట అక్రమాన్ని సక్రమం చేసేందుకు జీవీఎంసీలో తీర్మానం చేసింది. అం తేకాకుండా విశాఖలో ఉన్న పర్యావరణాన్ని రక్షిస్తున్న పచ్చని కొండలను ఎక్కడికక్కడ గుండు గీయిస్తోంది. ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు ఏకంగా సీఆర్జెడ్–3 నుంచి సీఆర్జెడ్–2లోకి మార్చడం ద్వారా సహజ రక్షణ కవచాలుగా ఉన్న పర్యావరణాన్ని ధ్వంసం చేసేందుకు సిద్ధమవుతోంది. టూరిజం పేరుతో పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది. దీనిపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. -
నైరుతి రుతుపవనాలపై కీలక ప్రకటన
సాక్షి, విశాఖపట్నం: రేపు(గురువారం) కేరళ తీరాన్ని నైరుతీ రుతుపవనాలు తాకుతాయని.. 5 తేదీన రాయలసీమలో ప్రవేశిస్తాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. పదో తేదీకి దక్షిణ కోస్తా అంతటా విస్తరిస్తాయని తావరణ శాఖ అధికారి జగన్నాథ్కుమార్ తెలిపారు. జూన్ 15వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం రుతుపవనాలు విస్తరించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.వారం రోజులపాటు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలే ఉంటాయని మరో ఐదు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏడాది ఎండలు బాగా కాశాయి కాబట్టి వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్పలేమని.. కాసిన ఎండలు, వర్షాలకు సంబంధం ఉండదని జగన్నాథ్కుమార్ వివరించారు.ఇప్పటికే కేరళంలో తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. కేరళం, తమిళనాడు మీదగా ఏపీలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. రాష్ట్రంలో ఎండలు తగ్గుముఖం పట్టాయి. కావలిలో 42.6 డిగ్రీలు అత్యధిక ఉష్ట్రోగ్రతలు నమోదైంది. తీరం వెంబడి బలమైన గాలులు, భీమిలిలో 2 సెం.మీ వర్షపాతం నమోదైంది. పిడుగుపాటు హెచ్చరికరాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. 50-60కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. చెట్లు, పోల్స్, హోర్డింగ్స్ క్రింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. -
ఘోర ప్రమాదం.. పండు మాస్టర్కి తీవ్ర గాయాలు
'ఢీ' ఫేమ్ పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ఇతడు ప్రమాదానికి గురయ్యారు. ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం విశాఖపట్నం వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.విశాఖపట్నంలో జరిగే ఒక ఈవెంట్లో పాల్గొనేందుకు పండు మాస్టర్ తన టీమ్తో ప్రయాణమవుతుండగా ఆనందపురం మండలం లొతగలవానిపాలెం హైవేపై అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆయనను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.ఆగి ఉన్న రెండు వాహనాలను బొలెరో కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న డాన్స్ మాస్టర్ పండుకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. -
సుత్రా ఇండియన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఏయూక్యాంపస్: బీచ్రోడ్డులోని నోవాటెల్ హోటల్లో ’సుత్రా ఇండియన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్’ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శన బుధవారం ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఎగ్జిబిషన్కు ప్రవేశం పూర్తిగా ఉచితమని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో దేశంలోని ప్రముఖ డిజైనర్లు, ఫ్యాషన్ బ్రాండ్లు తమ ప్రత్యేక కలెక్షన్లను అందుబాటులో ఉంచాయి. ముఖ్యంగా మహిళలు, యువత కోసం ట్రెండీ దుస్తులు, కౌట్యూర్ వేర్, కాస్ట్యూమ్స్, ఫ్యాషన్ ఆభరణాలు, హోమ్ డెకర్ ఉత్పత్తులు, ఫ్యాబ్రిక్స్, యాక్సెసరీస్, హైహీల్స్, ఫైన్ జ్యువెలరీ తదితర వస్తువులను ఒకేచోట ప్రదర్శిస్తున్నారు. వేసవి సీజన్కు అనుగుణంగా రూపొందించిన నూతన ఫ్యాషన్ కలెక్షన్లు, ప్రత్యేక ఆఫర్లు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. -
రెండేళ్ల పాలన మోసం, అరాచకం
టీడీపీ ప్రభుత్వ పాలనపై వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ ఆవిష్కరణలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో మోసం, దుర్మార్గం, అరాచకం, వెన్నుపోటు పాలనే నడుస్తోందని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కేకే రాజు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్, బుక్లెట్ను సమన్వయకర్తలు తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, పీఏసీ సభ్యుడు తిప్పల నాగిరెడ్డి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్కుమార్ తదితరులతో కలిసి ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఈ బుక్లెట్ను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అయ్యేదని, నేడు ఆ పథకాలు నిలిచిపోవడంతో డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం, విద్యా రంగాల్లో ప్రభుత్వ సాయం గణనీయంగా పడిపోయిందని మండిపడ్డారు. డ్వాక్రా మహిళల బ్యాంకు రుణాల పరిమాణాన్ని తగ్గించేశారని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో ఎంపికల తర్వాత నిబంధనలు మార్చి అభ్యర్థులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. దీనిపై వస్తున్న ప్రశ్నల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇసుక, బైజూస్ అంశాలను తెరపైకి తెస్తూ, వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రజలు, మేధావులు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జూన్ 4న జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, 8, 9 తేదీల్లో టౌన్హాల్ సమావేశాలు, 12న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి, అదేరోజున పవన్ కళ్యాణ్ ఇచ్చిన బాండ్ పేపర్ల దహనం కార్యక్రమం చేయాలని పార్టీ పిలుపునిచ్చిందన్నారు. సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి, డాక్టర్ జహీర్ అహ్మద్, జిల్లా పార్టీ పర్యవేక్షకులు గుడిమెట్ల రవిరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, పార్టీ ముఖ్యనాయకులు రొంగలి జగన్నాఽథం, మంచ నాగమల్లేశ్వరి, తాడి జగన్నాథరెడ్డి, కిరణ్రాజు, పల్లా దుర్గారావు, ప్రసాద్రాజు, వెంకటరమణి, కటారి అనిల్కుమార్రాజు, బొల్లవరపు జాన్వెస్లీ, ఎస్కే మహంతి, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, జీలకర్ర నాగేంద్ర, జీవీ రవిరాజు, సేనాపతి అప్పారావు, అంబటి శైలేష్, ముట్టి సునీల్ కుమార్, సనపల రవీంద్ర భరత్, బోని శివరామకృష్ణ, భర్కత్ అలీ, రాయపురెడ్డి అనిల్ కుమార్, కర్రి రామారెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, శ్రీదేవివర్మ, దేవరకొండ మార్కండేయులు, బొండా ఉమామహేశ్వరరావు, నీలి రవి, మనోజ్కుమార్, మారుతిప్రసాద్, కోడూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రగతి సాధనలో యంగ్ ప్రొఫెషనల్స్ కీలకం
మహారాణిపేట: జిల్లాలో ప్రభుత్వ సేవల్లో మెరుగుదల, ప్రజల సంతృప్తి స్థాయి పెంపొందించడం, 2026–27 సంవత్సర లక్ష్యాల సాధనకు సమర్థవంతమైన కార్యాచరణ రూపొందించడంలో యంగ్ ప్రొఫె షనల్స్ కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సూచించారు. కలెక్టరేట్లో నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ యంగ్ ప్రొఫెషనల్స్, అధికారులతో మంగళవారం సమగ్రంగా చర్చించారు. జిల్లాలో వివిధ శాఖల కీలక పనితీరు సూచికలు(కేపీఐ), ప్రజాభిప్రాయ సర్వేలు, సేవల అందజేత ప్రమాణాల ఆధారంగా సమీక్షించారు. జిల్లాలో అమలవుతున్న విజన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమాల పురోగతిని ఆరా తీశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించి, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చూడాలన్నారు. పీ–4లో భాగంగా సామాజిక బాధ్యత కార్యక్రమాల కింద సహాయ సహకారాలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. విజన్ యూనిట్లు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో కలిసి పని చేయాలన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. దీనికి అనుగుణంగా విజన్ యూనిట్లు పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, సీపీవో శ్రీనివాసరావు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి టి.గోవిందు, జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సభ్యులు, అధికారులతో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సమీక్ష -
లీలామహల్ సతీష్ బ్లాక్ మెయిలర్
డాబాగార్డెన్స్: మన శంకర వరప్రసాద్ సినిమా తొలి డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ(లీలామహల్ సతీష్) బ్లాక్ మెయిలర్ అని సినీ నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. నగరంలోని వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బత్తుల సత్యనారాయణ లీలామహల్ థియేటర్ లీజుకు తీసుకుని నడుపుతున్నారని తెలిపారు. సినిమా హక్కుల కోసం అఖండ–2 సినిమాకు రూ.2 కోట్లు ఇచ్చానని, సినిమా ఫ్లాప్ అయ్యిందని పేర్కొన్నారు. మన శంకర వరప్రసాద్ సినిమాకి తొలుత రూ.3.57 కోట్లు, తర్వాత ఇంకో రూ.2 కోట్లు.. మొత్తంగా రూ.5.57 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. కానీ సతీష్ మధ్యలో సినిమా వదిలేశారని, దీంతో మన శంకర వరప్రసాద్ సినిమా నిర్మాతలు సుష్మిత, సాహు గారపాటితో నేరుగా ఒప్పందం చేసుకుని 6 జిల్లాల్లో సినిమా విడుదల చేయడం జరిగిందన్నారు. దిల్ రాజుకు బకాయిలు ఉండి తనకు సొమ్ము ఎగ్గొట్టారని ఆరోపించారు. నిర్మాతలు బెల్లం కొండ సురేష్, అనిల్ సుంకరలపై 2024లో ఫిర్యాదులు చేసి అప్పుడు కూడా బాకీ ఎగ్గొంటేందుకు సతీష్ ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. తనకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలని లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సినీ నిర్మాత నట్టి కుమార్ ఆరోపణ -
జీవీఎంసీ ఆస్తులు ప్రైవేట్పరం చేస్తే సహించబోం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఆస్తులు, పౌరసేవల ప్రైవేటీకరణకు సంబంధించిన జీవో నం.673ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం విశాఖ జిల్లా కమిటీ మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు మాట్లాడుతూ పార్కు లు, కల్యాణ మండపాలు, మార్కెట్లు, స్థలాలు తదితర ప్రజా ఆస్తులను ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం పేరిట 90 ఏళ్ల లీజుకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. ప్రజల పన్నులతో నిర్మించిన ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే హక్కు ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఉచితంగా అందాల్సిన పౌరసేవలపై యూజర్ చార్జీలు, ఇతర రుసుములు విధించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బొడ్డు గంగారావు మాట్లాడుతూ వీధిలైట్లు, రహదారులు, మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, పారిశుద్ధ్య సేవల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, ఇండోర్ స్టేడియం, క్రీడా మైదానాలు, మార్కెట్లు, ఇతర ఆస్తులు ప్రైవేట్ నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పారు. స్థానిక సంస్థల ఆదాయ వనరులు బలహీనపడే అవకాశం ఉందన్నారు. జీవో 673ను వెంటనే ఉపసంహరించకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్కేఎస్వీ కుమార్, వి.కృష్ణారావు, బి.పద్మ, ఎం.సుబ్బారావు, బొట్టా ఈశ్వరమ్మ, నరేంద్ర, ఎల్జే నాయుడు, ఆర్ఎన్ మాధవి, వెంకట్రావు, కుమారి తదితరులు పాల్గొన్నారు. -
‘డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం’
సాక్షి,విశాఖ: యువత భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. విశాఖలో మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడారు.‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీలో అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. వ్యవస్థను కూటమి ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పదివేల ఉద్యోగాలు భర్తీ చేశామ’ని గుర్తు చేశారు. -
‘పీజీఆర్ఎస్’పై అసంతృప్తి
మహారాణిపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సమర్పిస్తున్న అనేక వినతులకు సకాలంలో పరిష్కారం లభించడం లేదంటూ పలువురు అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పేరుకే పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, కొన్ని సమస్యలు నెలల తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 116 వినతులను జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు, ఏడీసీ సత్యవేణి, ఆర్డీవో శేష శైలజ, ఆర్డీవోలు, తహశీల్దార్లు స్వీకరించారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో శ్రీ విశ్వ విజయభేరి
సీతంపేట: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ విశ్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తరాంధ్రలోనే అత్యధిక ర్యాంకులు సాధించి విజయభేరి మోగించారు. వివిధ కేటగిరీల్లో కళాశాలకు చెందిన మేడిశెట్టి తాతాజీ 30వ ర్యాంకు, కె.జాహ్నవి 74వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వీరితో పాటు జి.ఇషాంత్కుమార్ 318, డి.సాయిదేవి చంద్రిక 567, ఎ.వెంకట్ పుష్కర్ 971 ర్యాంకులతో జాతీయ స్థాయిలో మెరిశారు. అలాగే వి.నేహ 1127, డి.దేవమణికంఠ 1157, బి.కాళీచరణ్ 1264, బి.లక్షదీప్ 1560, జె.కీర్తి షర్మిల 1787, పి.అభినవ్ జయకర్ 1868 ర్యాంకులు కై వసం చేసుకున్నారు. ఈ ఫలితాల్లో శ్రీ విశ్వ విద్యా సంస్థల నుంచి వెయ్యిలోపు ఐదుగురు, 5 వేల లోపు 35 మంది, 10 వేల లోపు 52 మంది నిలిచారు. ఈ అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను శ్రీ విశ్వ విద్యాసంస్థల చైర్మన్ కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు. -
పట్టాలెక్కిన జోన్ ఆకాంక్ష
సాక్షి, విశాఖపట్నం: భారతీయ రైల్వే వ్యవస్థలో 18వ జోన్గా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. వీఎంఆర్డీఏ డెక్ భవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయంలో జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ కార్యకలాపాలను నిరాడంబరంగా ప్రారంభించారు. రైల్వే శాఖ రూపొందించిన జోన్ అధికారిక మ్యాప్(సిస్టమ్ మ్యాప్)ని విడుదల చేశారు. దేశ రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన నెట్వర్క్గా రూపుదిద్దుకున్న ఈ జోన్.. ఏకంగా నాలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించి తన భౌగోళిక, వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటుకుంది. మొత్తం 3,532 కిలోమీటర్ల సువిశాల విస్తీర్ణం(రూట్ నెట్వర్క్), 6,455 కిలోమీటర్ల భారీ రైల్వే ట్రాక్లైన్తో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక జోన్లలో ఒకటిగా అవతరించింది. పూర్తి స్థాయి జోనల్ కార్యకలాపాలు మొదలయ్యేసరికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. భద్రతకే ప్రథమ ప్రాధాన్యం : అనంతరం జీఎం ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, నాలుగు డివిజన్ల డీఆర్ఎంలతో కలిసి మొట్టమొదటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయా డివిజన్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులతో జీఎం సుదీర్ఘంగా చర్చించారు. కొత్త జోన్లో విలీనమవుతున్న తమ డివిజన్ల గురించి ఆయా డీఆర్ఎంలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆస్తుల నిర్వహణ, మానవ వనరుల నిర్వహణ, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఈ సమీక్షలో విశాఖపట్నం డీఆర్ఎం లలిత్ బోహ్రా, విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, గుంటూరు డీఆర్ఎం సుదేష్ణసేన్, గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాతో పాటు వివిధ శాఖల హెచ్వోడీలు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
సీఐలకు డీఎస్పీగా పదోన్నతి
అల్లిపురం: రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది సివిల్ పోలీస్ ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో 15 మంది విశాఖ రేంజ్కు చెందిన వారు కావటం విశేషం. పదోన్నతులు పొందిన వారిలో విశాఖకు చెందిన ఎం.శేషు, మహమ్మద్ సనావుల్లా, ఎం.చంద్రశేఖర్, పి.వి.వి.నరసింహారావు, వి.బాబ్జీరావు, ఆర్.నీలయ్య, జి.వెంకటరమణ, వి.చంద్రశేఖర్, టి.సీతారామ్, ఎం.బుచ్చిరాజు, ఎస్.రామకృష్ణ, చౌదరి ధనుంజయ నాయుడు, హెచ్.మల్లేశ్వర రావు, బి.వి.జగన్నాథ రాజు, చొల్లంగి తిరుపతిరావులు ఉన్నారు. ముగ్గురు ఎస్ఐలకు సీఐగా.. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఎస్ఐలకు సీఐలుగా పదోన్నతి లభించింది. షేక్ అబ్దుల్ మారఫ్ (కంచరపాలెం క్రైం), సీహెచ్ రామ్దాస్ (ఎంవీపీ క్రైం), జి.అప్పారావు (వన్టౌన్ ట్రాఫిక్) పదోన్నతి పొందగా.. వీరిని విశాఖ రేంజ్కు బదిలీ చేశారు. -
పోలీసులు అడ్డుకునే యత్నం
సోమవారం ఉదయం 10 గంటల నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండాలు, ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. తొలుత పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పందిస్తూ, ‘అరెస్టు చేసుకుంటే చేసుకోండి’ అంటూ పోలీసులకు సమాధానం ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద రెండు గంటల పాటు బైఠాయించి ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించిన కేకే రాజు, వాసుపల్లి గణేష్కుమార్లను పోలీసులు బలవంతంగా లాగేందుకు యత్నించారు. అంతకుముందు జెడ్పీ కార్యాలయం వద్ద కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిరసన కార్యక్రమం కొనసాగింది. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కలెక్టరేట్ బయట కేకే రాజు, వాసుపల్లి గణేష్కుమార్లను బలవంతంగా లాగుతున్న పోలీసులు -
దండయాత్ర
దగా డీఎస్సీపైవైఎస్సార్సీపీ యువజన విభాగం సమరభేరి సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ పోలీసుల ఆంక్షలు.. కలెక్టరేట్ వద్ద ధర్నా భారీగా తరలివచ్చిన యువత, వైఎస్సార్సీపీ శ్రేణులుసాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహంచిన ‘మెగా డీఎస్సీ’ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే ‘మెగా మోసం’గా మారిందని వైఎస్సార్సీపీ యువజన విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన తొలి సంతకంలోనే భారీ అక్రమాలు, దగా దాగి ఉన్నాయని ఆరోపించింది. ఈ దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, సమన్వయకర్త దేవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై సమరభేరి మోగించాయి. జిల్లా పరిషత్ కార్యాలయ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శనలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, వైఎస్సార్సీపీ మహిళా నేత సిరిసహస్ర, నియోజకవర్గ పరిశీలకులు వీసం రామకృష్ణ, జహీర్ అహ్మద్, పేడాడ రమణికుమారి, కోలా గురువులు, సతీష్వర్మ, మాజీ డిప్యూటీ మేయర్ కటామురి సతీష్, జిల్లా పార్టీ పర్యవేక్షకులు గుడిమెట్ల రవి రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్గాంధీ, ముఖ్యనాయకులు మంచ నాగ మల్లేశ్వరి, పల్లా దుర్గారావు, ప్రసాద్ రాజు, బొల్లవరపు జాన్ వెస్లీ, పోతిన శ్రీనివాసరావు, ద్రోణంరాజు శ్రీవత్సవ్, అంబటి శైలేష్, పీవీ సురేష్, ముట్టి సునీల్కుమార్, జిలకర్ర నాగేంద్ర, సేనాపతి అప్పారావు, సనపల రవీంద్రభరత్, బోని శివరామకృష్ణ, భర్కత్ అలీ, ప్రసాద్, ఆర్.అనిల్ కుమార్, రామారెడ్డి, పీలా ప్రేమ కిరణ్, శ్రీదేవి వర్మ, వంకాయల మారుతీ ప్రసాద్, వడ్డాది దీలిప్ కుమార్, సకలభక్తుల ప్రసాద్ రావు, దేవరకొండ మార్కండేయులు, బోండా ఉమా మహేశ్వర రావు, నీలి రవి, మనోజ్ కుమార్ గొడబా, కోడిగుడ్ల పూర్ణమి, మేరువు గణేష్, కోడూరు సత్యనారాయణ, తాలు సాయి మోహన్ రావు, రెయ్యి వెంకటరమణ, ముదుండి రాజేశ్వరి, ఈశ్వరరావు, కె. వెంకట నాగ శశికళ, పిల్లా సుజాత, బెందాళం పద్మావతి, మల్లా ధనలత, దొడ్డి కిరణ్, పులుగం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువతకు సమాధానం చెప్పాలి: వరుదు కల్యాణి ఎన్నికల సమయంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతను తీవ్రంగా నిరాశపరిచిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆరోపించారు. ‘మెగా డీఎస్సీ’ పేరుతో భారీ ప్రచారం చేసి, చివరకు అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుందని విమర్శించారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో ఆరోపణలు వస్తున్న అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజలకు, నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకే పవన్ కల్యాణ్ స్పందించడం లేదు: జక్కంపూడి రాజా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి సీబీఐ విచారణకు అంగీకరించాలని, మంత్రి పదవికి రాజీనామా చేయాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ కావడం వల్లే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ అంశంపై స్పందించడం లేదని విమర్శించారు. డీఎస్సీ, ఈఎస్ఐ వ్యవహారాలపై వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని, పోలీసుల లాఠీలకు తమ పార్టీ భయపడదని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కాపు సామాజికవర్గం గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్, ఇప్పుడు వారి సమస్యలపై మౌనం వహిస్తున్నారని విమర్శించారు. పవన్ను నమ్మి తప్పు చేశామన్న భావన కాపు సామాజికవర్గంలో ఉందన్నారు. నిరుద్యోగులను దగా చేశారు: కేకే రాజు గత వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను కేవలం రాజకీయ ప్రచారం కోసం రద్దు చేసిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను మోసం చేసిందని కేకే రాజు ఆరోపించారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి, రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు సిద్ధమైన నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. డీఎస్సీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 1.40 లక్షల సచివాలయ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశారని గుర్తుచేశారు. -
కనకమహాలక్ష్మి ఆలయంలో అపచారం
డాబాగార్డెన్స్ (విశాఖ): ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘోర అపచారం చోటుచేసుకుంది. ఆలయాల పవిత్రతను, సనాతన ధర్మ నియమాలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆలయ చైర్మనే నిబంధనలను తుంగలో తొక్కి పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించడం భక్తులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం నూతన ట్రస్ట్బోర్డు చైర్మన్గా జనసేనకు చెందిన కందుల నాగరాజు ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఆయన ఆలయంలో ఏకంగా చెప్పులు వేసుకుని తిరగడం తీవ్ర కలకలం రేపింది. ప్రతి దేవాలయానికి నిర్దిష్ట ఆగమ శాస్త్ర నియమాలు ఉంటాయని, వాటిని తూచా తప్పకుండా పాటించాల్సిన పాలకమండలి చైర్మనే ఇలా వ్యవహరించడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చైర్మన్పై చర్యలు తీసుకోవాలని భక్తులు, అర్చక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
పేద మహిళకు 964 ఇళ్లు!
మహారాణిపేట (విశాఖ): సాంకేతిక లోపాలు పేద ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. దీనికి విశాఖ జిల్లా గాజువాక పైడిమాంబ అమ్మవారి కాలనీకి చెందిన వేగి విజయలక్ష్మి ఉదంతమే నిదర్శనం. అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులతో బతికే ఈ పేద మహిళ పేరు మీద ప్రభుత్వ రికార్డుల్లో ఏకంగా 964 ఇళ్లు ఉన్నట్లు చూపిస్తోంది. ఆధార్ నమోదులో దొర్లిన తప్పిదం వల్ల ఆమె రేషన్ కార్డు పోయింది. ప్రభుత్వ పథకాలన్నీ నిలిచిపోయాయి. తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తెకు ‘తల్లికి వందనం’ కూడా రాలేదు. సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో ఐదుసార్లు దరఖాస్తు చేసినా అధికారుల్లో చలనం లేకపోవడం దారుణం. తమకు న్యాయం చేయాలని సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ అందించడానికి వచ్చిన విజయలక్ష్మి కుటుంబం తన ఆవేదనను ‘సాక్షి’తో వెలిబుచ్చింది. -
‘హెరిటేజ్ పాలు అమ్మినట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్మకం’
విశాఖ: ఏపీ ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబ్ వస్తుందనే మోసపూరిత హామీలతో ఓట్లు దండుకున్నారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. కూటమి ప్రభుత్వం.. మెగా డీఎస్సీ పేరిట దగా డీఎస్సీ నిర్వహించిందని ధ్వజమెత్తారు. హెరిటేజ్ పాలు అమ్ముకున్నట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆయన మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడిందని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘లక్షలు ఖర్చుచేసి రోజు 20 గంటలు చదువుకున్న నిరుద్యోగులకు అన్యాయం చేశారు. రాష్ట్రంలో లోకేష్ చేయని దోపిడి అవినీతి అంటూ ఏది లేదు. హెరిటేజ్లో పాలు అమ్ముకునట్లు డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు. నిరుద్యోగుల కన్నీళ్లు మీకు కనిపించడం లేదా?, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి డీఎస్సీ ఉద్యోగాలకు వేలం పాట పెట్టారు. లోకేష్ను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఈ మోసంలో లోకేష్ను ఏ-1గా అరెస్ట్ చేయాలి. సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. వైఎస్సార్సీపీ ధర్నాల్లో వేలాది మంది డీఎస్సీ బాధితులు హాజరయ్యారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’ అని హెచ్చరించారు. దీనిపై పవన్ కళ్యాణ్కు నిజాయితీ ఉంటే వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ ఉద్యోగాల భర్తీ.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే..డీఎస్సీ ఉద్యోగాల భర్తీ కార్యక్రమం . ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే జరిగిందన్నారు. ఒక్కొక్క పోస్ట్ను రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ అమ్ముకున్నారన్నారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా వైఎస్ జగన్ నియమించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ జిల్లాకు లక్ష ఉద్యోగాలు చొప్పున ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించడం లేదు’ అని స్పష్టం చేశారు. -
ఆర్సీబీ విజయం.. టీజీ, ఏపీలో అభిమానుల వీరంగం
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండో ఏడాది కూడా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేయడంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు నగరం అర్ధరాత్రి వేళ బాణసంచా వెలుగులు, టపాసుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది. తమ అభిమాన జట్టు వరుసగా రెండు టైటిళ్లు కొట్టడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు సంబురాలు చేసుకున్నాయి. కానీ, పలుచోట్ల అభిమానులు రచ్చ చేయడంతో పరిస్థితి అదుపు తప్పింది.విజయవాడ.. విజయవాడలో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా చేశారు. తమ అభిమాన జట్టు గెలవడంతో రోడ్లపైకి వచ్చి ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బైకులతో రోడ్లపై ప్రమాదకర ఫీట్స్ చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు యువకులను చెదరగొట్టారు.Em chillar gallu unnara 🤧🤧 #Rcbfans pic.twitter.com/IopXcuy6zu— 𝕩 SunRise Reddy ™ (@HarshaReddy_07) May 31, 2026 కర్నూలు..కర్నూలులో ఆర్బీబీ అభిమానులు వీరంగం సృష్టించారు. ఆర్బీసీ విజయం ఆనందంలో అభిమానులు అరాచకాలకు పాల్పడ్డారు. సంబురాలను శృతి మించే విధంగా నిర్వహించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కర్నూలు రాజ్ విహర్ సెంటర్ చేరుకొని ట్రాఫిక్ బ్యారికేడ్స్తో పాటు ప్రైవేటు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారిని చెదరగొట్టారు.After RCB won the IPL Final, fans were celebrating on the road.During the celebrations, 3 RCB fans climbed onto a Tata Safari and started dancing and jumping on it.The Tata Safari had a full-size panoramic sunroof, and all three fans were standing and dancing on top of it.… pic.twitter.com/QZGcbkrhGJ— Saffron Chargers (@SaffronChargers) June 1, 2026విశాఖ.. విశాఖపట్నంలోని బీచ్ రోడ్డుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటెత్తి గెలుపు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్ కారు ఎక్కి, జెండాలు ఊపుతూ రోడ్లపై రచ్చ రచ్చ చేశారు.హైదరాబాద్..హైదరాబాద్లోనూ ఆర్సీబీ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. ఆర్సీబీ విజయంతో ట్యాంక్ బండ్ వద్ద వందలాది మంది అభిమానులు గుమిగూడి ‘ఆర్సీబీ.. ఆర్సీబీ’ అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. అభిమానులు భారీ సంఖ్యలో ట్యాంక్ బండ్ వద్దకు తరలివచ్చారు. Celebrations at different places including near Secrtariat, SR Nagar, Kukatpally... in #Hyderabad, by RCB and Virat Kohli fans.As #RCB clinches a second consecutive IPL title, after being trophyless for 18 years.#ViratKohli #RCBvsGT #IPL2026final pic.twitter.com/7PLCLwLmjY— Surya Reddy (@jsuryareddy) May 31, 2026 -
గాజువాకలో ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
గాజువాక: విశాఖ జిల్లా గాజువాకలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఇద్దరు పిల్లలతో సహా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాజువాక పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం... తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో బొగ్గు లోడుతో గంగవరం పోర్టుకు వెళ్తున్న టిప్పరు లారీ గాజువాక శ్రీనగర్ జంక్షన్ దాటిన తర్వాత టైరు పేలిపోవడంతో జాతీయ రహదారిపై కుడివైపున ఆగిపోయింది. కొద్దిసేపటి తర్వాత రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఆ లారీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో సాలూరుకు చెందిన ఆర్టీసీ బస్సు కో డ్రైవర్ రాయిపల్లి రాంబాబు(50), రాజమండ్రి సీతంపేటకు చెందిన ఆర్.రాధామాధవి(35), విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జె.గుమడాం గ్రామానికి చెందిన లెంక ఈశ్వరమ్మ(55) ఘటనాస్థలంలోనే మృతిచెందారు. గాజువాక పోలీసులు వచ్చి బస్సు సీట్లలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్ ఎస్.జమ్మయ్య, ప్రయాణికులు ఎస్ఎస్ నాగేశ్వరరావు(41), ఎం.శ్రీనివాస్(45), కె.రాజు(61), కె.లలిత(55), ప్రశాంతి(31), కె.రామకృష్ణ(70), ఆర్.తన్విత(5), ఎం.నివేదిత(7)ను 108 అంబులెన్స్లో విశాఖ కేజీహెచ్కు తరలించారు. కొద్దిసేపు ఆగుదామని ప్రయాణికులు కోరినా... బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారు. బస్సు అతివేగంగా వెళుతుండటంతో సీట్లలో కూర్చోలేకపోతున్నామని, లగేజీ బాక్స్లో పెట్టిన వస్తువులు కిందపడిపోతున్నాయని, నెమ్మదిగా వెళ్లాలని డ్రైవర్కు సూచించామని తెలిపారు. అయినా పట్టించుకోకుండా వేగంగా వెళుతుండటంతో టీ తాగేందుకు బస్సును ఆపాలని కోరామని చెప్పారు. దీంతో అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం జంక్షన్లో బస్సును ఆపాడని వివరించారు.డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నట్టు గుర్తించి కొద్దిసేపు విరామం తీసుకొని బయలుదేరుదామని చెప్పినా వినిపించుకోలేదని, నిద్ర మత్తులోనే బస్సును వేగంగా నడుపుతూ లారీని ఢీకొట్టాడని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు లారీ డ్రైవర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. టైర్ పేలిపోయిన లారీని రహదారికి ఎడమవైపున కాకుండా కుడివైపున నిలిపివేశాడని, వెనుక కనీసం ఇండికేటర్ లైట్లు, రేడియం స్టిక్కర్లు లేకపోవడంతో బస్సు డ్రైవర్ గుర్తించలేక వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు అంచనాకు వచ్చారు.వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: విశాఖ నగరంలోని గాజువాక శ్రీనగర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. -
11 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి
పెందుర్తి: కంటిపాప కళ్ల ముందే కరిగిపోతుంటే ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోతున్నాయి. ఐదేళ్ల క్రితం వివాహమైన ఆ దంపతులకు నాలుగేళ్ల క్రితం పుట్టిన తొలి సంతానం పొత్తిళ్లలోనే కన్నుమూసింది. ఆ పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని.. ‘తమ ఇంటి వెలుగు’ అని మురిసిపోతూ 11 నెలల క్రితం మరో పాపాయికి జన్మనిచ్చారు. నిండు నూరేళ్లు చల్లగా బతకాలని ఆ చిన్నారికి ‘సహస్ర’ అని పేరు పెట్టుకున్నారు. ఆ బోసినవ్వులు చూసి మురిసిపోయేలోపే విధి మళ్లీ పగబట్టింది. అరుదైన రోగనిరోధక శక్తి లోపం రూపంలో ఆ పసిప్రాణాన్ని మహమ్మారి చుట్టుముట్టింది. ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా ముప్పే..! వేపగుంట బీసీ కాలనీకి చెందిన శానాతి సురేష్, సత్యవతి దంపతుల కుమార్తె సహస్ర (11 నెలలు). పుట్టిన రెండు నెలల తర్వాత రోజురోజుకూ బలహీనపడటం ప్రారంభమైంది. పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించగా.. పాప శరీరంలో వ్యాధి నిరోధక కణాలు పూర్తిగా క్షీణించిపోతున్నాయని, రక్షణ వ్యవస్థ పనిచేయడం మానేసిందని రిపోర్టులు తేల్చాయి. ప్రతి లక్ష మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే ఈ అరుదైన వ్యాధి వల్ల.. సహస్రకు ఏ చిన్నపాటి ఇన్ఫెక్షన్ సోకినా ప్రాణాలకే ముప్పు వస్తోంది. ఇప్పటివరకు పాప ప్రాణాలను నిలుపుకోవడం కోసమే తండ్రి సురేష్ తన సంపాదనతో పాటు, అప్పులు చేసి రూ.8 లక్షల వరకు ఖర్చు చేశాడు. దాతలు కనికరిస్తేనే పసిప్రాణం నిలుస్తుంది ప్రస్తుతం సహస్ర ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. పాపకు శాశ్వత చికిత్స అందించకపోతే ప్రాణాలకే ప్రమాదమని, అందుకు దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఒకవైపు కళ్లెదుటే కూతురు క్షీణించిపోతుంటే, మరోవైపు చికిత్సకు అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ‘మొదటి బిడ్డను పోగొట్టుకుని ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్నాం. ఇప్పుడు ఈ చిన్నారిని కూడా కోల్పోతే మేము బతకలేం. అంత స్థోమత మాకు లేదు. దాతలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చొరవ తీసుకుని మా పాపను కాపాడాలి’ అంటూ తండ్రి సురేష్, తల్లి సత్యవతి కన్నీళ్లతో వేడుకుంటున్నారు. దాతలు 8341114844, 9885503665 నంబర్లకు సంప్రదించాలని కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
కొమ్మాది: ఎండాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆదివారం తెల్లవారుజామున పీఎం పాలెం నుంచి పెనగంటి నరసింహమూర్తి తన ఆటోలో మంచాలను ఎండాడకు తీసుకు వెళ్తున్నారు. ఎండాడ సిగ్నల్ పాయింట్ దాటాక వెనుక నుంచి వస్తున్న ఓ లారీ ఆటోను బలంగా ఢీ కొట్టింది. నరసింహమూర్తి రోడ్డు మీద పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అదే సమయంలో ద్వారకా ట్రాఫిక్ సర్కిల్కు చెందిన ఎన్వీ ప్రభాకర్ విశాఖవ్యాలీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. ఓ ద్విచక్ర వాహనదారుడు అందించిన సమాచారం ఆధారంగా మద్దిలపాలెం వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ రామ్మూర్తికి సమాచారం అందించారు. అప్రమత్తమైన రామ్మూర్తి లారీ డ్రైవర్ను ఆపి, అదుపులోకి తీసుకున్నారు. మృతుడి బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హోంగార్డుపై దాడి కేసులో నలుగురికి రిమాండ్
పరవాడ: లంకెలపాలెం మరిడిమాంబ ఆలయం వద్ద మే 29న రాత్రి గస్తీ విధుల్లో ఉన్న హోంగార్డుపై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. రిమాండ్కు తరలించిన నిందితుల్లో రాజ్సింగ్(కాకినాడ), అనిల్సింగ్(పీఎం పాలెం), సిరసపల్లికి చెందిన రాజ్కుమార్సింగ్, జితేంద్రసింగ్లు ఉన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాడి ఘటన వివరాలను సీఐ వెల్లడించారు. ఆ రోజు రాత్రి 11.45 గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న కె.వెంకటరావు, కానిస్టేబుల్ జి.భాస్కరరావు ఇరువురూ కలిసి లంకెలపాలెం మరిడిమాంబ ఆలయం వద్ద పాన్షాపుల వద్ద రాత్రి గస్తీలో ఉన్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి అక్కడ ఆగారు. రోడ్డుపై ఆపిన కారు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తుందన్న ఉద్దేశంతో విధి నిర్వహణలో భాగంగా హోంగార్డు వెంకటరావు కారు ఫోటో తీసి వారిని అక్కడి నుంచి వెళ్లాలని కోరారు. నిందితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజ్సింగ్ తన కారులో ఉన్న కత్తితో హోంగార్డు వెంకటరావుపై దాడి చేసి తల, చేయిపై నరికాడు. ఈ దాడిలో హోంగార్డు తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. అగనంపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన నలుగురిని మే 30న లంకెలపాలెం ఐవోసీ పెట్రోల్ బంకు వద్ద అరెస్టు చేసి అనకాపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఏడు మ్యాచ్లు.. ఏడు విజయాలు.. నైనాకు చెస్ టైటిల్
విశాఖ స్పోర్ట్స్ : స్టేట్ ఓపెన్ చెస్ చాంపియన్షిప్లో ఏరీనా ఫిడే మాస్టర్ జి. నైనా విజేతగా నిలిచింది. ఏడు రౌండ్లపాటు జరిగిన టోర్నీలో నైనా అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించి ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.శ్రీరామ్, రామ్కుమార్ విజయకుమార్లు ఆరున్నర పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, మార్తాండ, ప్రేమ్సాయి, అర్జున్, రుత్విక్, ప్రవల్లు ఆరు పాయింట్లు సాధించి ప్రతిభ కనబరిచారు. ఆల్ విశాఖ చెస్ సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్ర చెస్ సంఘం సహకారంతో ఎస్3 స్పోర్ట్స్ ఎరీనాలో ఆదివారం నిర్వహించిన ఈ టోర్నీలో 305 మంది చదరంగం క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 92 మంది ఫిడే రేటింగ్ పొందిన క్రీడాకారులు ఉన్నారు.టోర్నీలో మొత్తం రూ.1 లక్ష ప్రైజ్మనీని వివిధ విభాగాల విజేతలకు అందజేశారు. చాంపియన్గా నిలిచిన నైనా రూ.9 వేల నగదు బహుమతిని అందుకుంది. -
ముగిసిన జిల్లా ఔత్సాహిక క్రికెటర్ల శిక్షణ
విశాఖ స్పోర్ట్స్ : జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రికెట్ శిక్షణా శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమం వైఎస్సార్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లాలోని వైఎస్సార్ స్టేడియం, స్టీల్ప్లాంట్ స్టేడియం, జింక్ గ్రౌండ్, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదికలుగా శిబిరాలు నిర్వహించారు. అండర్–10 నుంచి అండర్–16 వరకు బాలురతో పాటు 50 మంది బాలికలు శిక్షణ పొందారు. శిబిరాల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా కోచ్లు శిక్షణ అందించారు. ముగింపు సందర్భంగా శిక్షణార్థుల మధ్య పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన అండర్–14, అండర్–16 క్రీడాకారులను ‘ప్రాబబుల్స్’గా ఎంపిక చేసి, భవిష్యత్తులో జిల్లా జట్ల ఎంపికలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు జి.ఎస్. వర్మ, కార్యదర్శి పార్థసారథి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బైకును ఢీకొన్న కారు
మర్రిపాలెం: బిర్లా జంక్షన్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకకు చెందిన వై.నవీన్ కుమార్, ఉప్పాడకు చెందిన జి.అప్పలరాజు రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో వీరిద్దరూ ఊర్వశి జంక్షన్ నుంచి ఎన్ఏడీ వైపు బైక్పై వస్తున్నారు. బిర్లా జంక్షన్ వద్ద గ్రీన్సిగ్నల్ ఉండటంతో వీరు ముందుకు సాగగా, ఒక్కసారిగా హుండాయి షోరూం వైపు నుంచి ఓ కియా కారు అతివేగంగా దూసుకొచ్చి వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్ను బేఖాతరు చేస్తూ అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతి ఆదివారం చిన్నారులకే సొంతం
బీచ్రోడ్డు: బాలలు తమకు నచ్చిన రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దేందుకు బాల వికాస తరంగిణి పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ తెలిపారు. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో, వైజాగ్ వలంటీర్స్ సహకారంతో సిరిపురంలోని చిల్డ్రన్స్ ఎరీనాలో ఆదివారం ‘బాలల సందడి–సాంస్కృతిక కార్యక్రమాలు’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ బాలలను మేటి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఇకపై ప్రతి ఆదివారం చిల్డ్రన్స్ థియేటర్ను పూర్తిస్థాయిలో బాలల కోసమే కేటాయిస్తామని స్పష్టం చేశారు. పిల్లలకు వినోదం, విజ్ఞానంతో పాటు సరికొత్త నైపుణ్యాలు అందించేలా వీఎంఆర్డీఏ భవిత పేరిట విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని వెల్లడించారు. చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, భావ వ్యక్తీకరణతో పాటు ఏఐ సాంకేతికత వంటి ఆధునిక అంశాల్లో చిన్నారులు రాణించేలా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతి ఆదివారం కొత్తదనంతో కూడిన శిక్షణ ఇస్తామని వివరించారు. ఈ సందర్భంగా నగరంలోని ఆరాధన చిల్డ్రన్ హోం, సంకల్ప బాలల హోం, మనస్వి హోం, పాపా హోం, డాన్ బాస్కో తదితర సంస్థల చిన్నారులు పాల్గొని తమ ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ ముఖ్య గణాంక అధికారి హరి ప్రసాద్, కార్యదర్శి మురళీకృష్ణ, బాల వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నరవ ప్రకాశరావు, జిల్లా బాలల సంక్షేమ అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మణిరామ్కు జర్నలిస్టు సంఘాల సన్మానం
మహారాణిపేట: సమాచార, పౌర సంబంధాల శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)గా పదవీ విరమణ చేసిన వడలి మణిరామ్ను పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ఆదివారం సత్కరించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయనకు దుశ్శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ మాట్లాడుతూ మణిరామ్ జర్నలిస్టులకు ఎంతో సహకారం అందించారని తెలిపారు. ప్రెస్ అక్రిడేషన్ల జారీ, జర్నలిస్టులకు వైద్య పరీక్షలు, వైద్య బీమాకు కలెక్టర్ నుంచి సహకారం, చిన్న పత్రికలకు ఎంప్యానల్మెంట్ లాంటి విషయాల్లో ఆయన ఎంతో చొరవ చూపారని పేర్కొన్నారు. విశాఖ న్యూస్ పేపర్స్ పబ్లిషర్ సొసైటీ కోశాధికారి కె.పరశురాం మాట్లాడుతూ జర్నలిస్టులకు, స్థానిక పత్రికలకు ఏవైనా సాంకేతిక పరమైన సమస్యలు ఎదురైతే, వాటిపై తగిన సలహాలు సూచనలు ఇచ్చి మణిరామ్ ఎంతో సహకరించారన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు పూజారి సత్యనారాయణ, హరనాథ్, వీరాభిమన్యుడు, మొల్లి కమల్కుమార్, కె.సంతోష్కుమార్, ఎం.శ్రీహరి, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు రైల్వే జోన్ సాకారం
నాడు వైఎస్సార్సీపీ పోరాటం.. సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్ష విశాఖ రైల్వే జోన్.. అది కేవలం ఒక కార్యాలయం కాదు. ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రకు విభజన చట్టం కల్పించిన ఒకే ఒక్క ఊరట రైల్వే జోన్. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ప్యాకేజీ దాసోహం.. స్వార్థ రాజకీయాల మధ్య ఆ ఆశల దీపం కొడిగట్టిపోయిన వేళ.. పట్టువదలని విక్రమార్కుడిలా వైఎస్సార్సీపీ చేసిన రాజీలేని పోరాటమే ఇన్నాళ్లకు ఆ కలను సాకారం చేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఏ స్వలాభం కోసం ఢిల్లీ పెద్దల ముందు సాగిలపడితే.. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ మాత్రం ప్రజల పక్షాన నిలబడి అలుపెరగని ఉద్యమం చేసింది. లాఠీ దెబ్బలు తిన్నా, అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గకుండా కేంద్రం మెడలు వంచి ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ను సాధించిన ఆ పోరాట ప్రస్థానం ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ గర్జన అధికారంలో ఉన్న టీడీపీ.. జోన్ ఊసెత్తకపోయినా.. వైఎస్సార్సీపీ మాత్రం ప్రతిపక్ష హోదాలో ప్రజల గొంతుకగా మారింది. అప్పటి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జోన్ సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఊరు, వాడల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా 2016 మార్చిలో విశాఖలోని డీఆర్ఎం కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు దిగ్బంధించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వినతిపత్రాలు సమర్పించాయి. అయినా పాలకుల్లో చలనం లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. ఆమరణ దీక్షలు.. నిరసన ప్రదర్శనలు! జోన్ ఆవశ్యకతను ఢిల్లీకి వినిపించేలా 2016 ఏప్రిల్ 14న అప్పటి వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రజల నుంచి ఈ దీక్షకు అనూహ్య స్పందన లభించినా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం మాత్రం దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి.. అక్రమ కేసులు బనాయించింది. ఇటీవలే ఆ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అక్కడితో ఆగకుండా.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎప్పుడు కుదిరితే అప్పుడు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 2018 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశాఖ జోన్కు మొండిచేయి చూపడంతో వైఎస్సార్సీపీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడ్జెట్ ప్రసంగం ముగిసిన కొద్ది గంటల్లోనే విశాఖ వీధుల్లోకి వచ్చిన పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీలు, సభలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టాయి. ‘రైల్ రోకో’తో ఉద్యమం తీవ్రస్థాయికి.! ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టం 2018 ఏప్రిల్ 11 నాటి ‘రైల్ రోకో’. కేంద్రం హామీని తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఏకంగా విశాఖ రైల్వేస్టేషన్లోకి చొచ్చుకెళ్లి రైళ్ల రాకపోకలను స్తంభింపజేశారు. ట్రాక్ల మీద బైఠాయించి నిరసన తెలిపారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ శ్రేణుల పోరాటాల్ని అణిచివేసేందుకు పోలీసులను ప్రయోగించింది. లాఠీ చార్జీలు చేయించింది. ఆందోళనకారులపై అక్రమ కేసులు బనాయించింది. అయినప్పటికీ వైఎస్సార్సీపీ నేతలు వెనక్కి తగ్గలేదు. జోన్ సాధించే వరకు విశ్రమించబోమని మరింత గట్టిగా నినదించారు. ఈ రైల్ రోకో ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోరాటానికి తలొగ్గిన కేంద్రం..! రైల్వే జోన్ పోరాటాన్ని చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తున్నా.. కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నా.. వైఎస్సార్సీపీ, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వచ్చి చేసిన ఈ నిరంతర పోరాటం ఎట్టకేలకు ఫలించింది. విశాఖ వీధుల్లో రగిలిన ఈ ఉద్యమ సెగ ఢిల్లీకి చేరింది. ఎట్టకేలకు వైఎస్సార్సీపీ చేసిన ప్రజా పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం.. 2019 ఎన్నికల ముందు విశాఖ కేంద్రంగా ‘సౌత్ కోస్ట్ రైల్వే జోన్’ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పోరాటం చేయాల్సిన అధికార టీడీపీ రాజీపడినా.. స్వప్రయోజనాల కోసం మౌనం వహించినా.. ‘పవర్’లో లేకపోయినా.. అలుపెరగని పోరాటం చేస్తే.. దశాబ్దాల కలను కూడా ఎలా సాధించవచ్చో వైఎస్సార్సీపీ నిరూపించింది. ఈ రోజు విశాఖ రైల్వే జోన్ సాకారమైందంటే.. అది ప్రస్తుత పాలకుల వల్ల కాదు.. వైఎస్సార్సీపీ, వామపక్ష నాయకులు, కార్యకర్తలకు రోడ్ల మీద పడ్డ లాఠీ దెబ్బలు, ఎదుర్కొన్న కేసుల ఫలితమే అని దక్షిణ కోస్తా రైల్వే జోన్ చరిత్ర ఎప్పటికీ చెబుతూనే ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. -
సమాచార శాఖలో మణిరామ్ సేవలు ఆదర్శనీయం
మహారాణిపేట: సమాచార పౌర సంబంధాల శాఖలో వివిధ హోదాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన వడలి మణిరామ్ సేవలు ఆదర్శనీయమని విశాఖ డీడీ కె.సదారావు ప్రశంసించారు. 39 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించి ఆర్జేడీ హోదాలో పదవీ విరమణ చేసిన మణిరామ్కు ఆ శాఖ ఉత్తరాంధ్ర జిల్లాల ఉద్యోగులు, సిబ్బంది జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. దుశ్శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి మణిరామ్ దంపతులను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ మణిరామ్ అందరికీ తలలో నాలుకలా ఉంటూ ఉత్తమ సేవలందించారని, అనతి కాలంలోనే పెద్దపెద్ద పదవులను అధిరోహించారని గుర్తు చేశారు. అనంతరం పదవీ విరమణ చేసిన ఆర్జేడీ వి.మణిరామ్ మాట్లాడుతూ ఇన్నేళ్ల సర్వీసులో తనకు సహాయ, సహకారాలు అందించిన ఉన్నతాధికారులకు, సహోద్యోగులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం డీఐపీఆర్వోలు గోవిందరాజు, చెన్నకేశవరావు, ఆర్జేడీ కార్యాలయ సూపరింటెండెంట్ అన్నమ్మ, ఏఎస్సార్ జిల్లా ఇన్చార్జ్ డీఐపీఆర్వో వెంకటరావు, సమాచార పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆర్.త్యాగరాజు, ట్రెజరర్ పి.గోవిందరావు, కార్యదర్శి పి.వెంకటప్పారావు, ఉపాధ్యక్షుడు ఎ.బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
రూ. 2.5 కోట్లతో కొమ్మాది శాప్ స్టేడియం అభివృద్ధి
మంత్రి రాంప్రసాద్రెడ్డి మధురవాడ : కొమ్మాదిలోని 27 ఎకరాల విస్తీర్ణంలో విశాఖ శాప్ స్టేడియాన్ని రూ. 2.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన వ్యవహారాల మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. ఆదివారం ఇక్కడ రాష్ట్ర స్థాయి క్రీడా అకాడమీల ఎంపిక ప్రక్రియను ఆయన ప్రారంభించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు విశాఖ, కాకినాడ, తిరుపతిలో ప్రత్యేక అకాడమీల ద్వారా ఎంపికలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. విశాఖలో అథ్లెటిక్స్, సైక్లింగ్, వాటర్ స్పోర్ట్స్ అకాడమీలు, తిరుపతిలో జ్యూడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్ అకాడమీలు, కాకినాడలో బాలికల కోసం వెయిట్లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో అకాడమీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎంపికై న ప్రతిభావంతులైన క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ, వసతి, పోషకాహారం అందిస్తామన్నారు. విశాఖ నగరానికి కొత్తగా 200 ఎలక్ట్రికల్ బస్సులను కేటాయిస్తున్నామని, అందులో 50 బస్సులను భోగాపురం ఎయిర్పోర్టు సర్వీసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్రెడ్డి వెల్లడించారు. -
● కుళ్లిన కుప్పల్లోనే.. ఉల్లి బతుకు చిత్రం
వ్యాపారులకు అది కుళ్లిన నష్టం.. కానీ ఆకలితో అలమటించే పేదలకు అదే ఒక రోజు జీవనాధారం. కాన్వెంట్ జంక్షన్ హోల్సేల్ మార్కెట్కు పోటెత్తిన ఉల్లి లోడ్లలో కుల్లిపోయాయన్న కారణంతో వ్యాపారులు రోడ్డు పక్కన పారేసిన ఉల్లిపాయలు, కొందరు పేదల పొట్ట నింపుతున్నాయి. సమాజం చెత్తగా భావించి విసిరేసిన ఆ కుప్పలోనే తమ బతుకు దెరువును వెతుక్కుంటూ, పనికొచ్చే ఉల్లిపాయలను ఏరుకుంటూ.. వాటిని చిరు దుకాణాలకు అమ్మి జీవనం సాగిస్తున్న దీనగాథ ‘సాక్షి’ కంటికి చిక్కిందిలా.. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
మహారాణిపేట: గాజువాకలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మృతులను సాలూరుకు చెందిన రాయంపిల్లి రాంబాబు (50), రాజమండ్రి సమీపంలోని సీతంపేటకు చెందిన రాలి రాధా మాధవి (35), లెంకా ఈశ్వరమ్మ (55)గా గుర్తించారు. కేజీహెచ్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎం. శ్రీనివాసరావు, ఆర్. తన్విత, కనకం రాజు, ప్రశాంతి, శివసూర్య నాగేశ్వరరావు, కె. రామకృష్ణ, ఎస్. జమ్మయ్య (బస్సు డ్రైవర్) కేజీహెచ్లో చికిత్స పొందుతుండగా తీవ్రంగా గాయపడిన కె. లలితను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితులను పరామర్శించిన మంత్రులు ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ బాధితులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను, వైద్య సిబ్బందిని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.కలెక్టర్ వెంట డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణ, ఇన్చార్జ్ సీఎస్ఆర్ఎంవో డాక్టర్ కుమార్, ఆర్టీసీ అధికారులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా గాజువాక: గాజువాక శ్రీనగర్ జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి ప్రమాద స్థలాన్ని, దెబ్బతిన్న ఆర్టీసీ బస్సును పరిశీలించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు -
వేట లేదు.. భరోసా రాదు..!
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టింది. నిబంధనల పేరుతో ‘మత్స్యకార భరోసా’ లబ్ధిదారుల్లో కోత పెట్టింది. దీంతో సముద్రాన్ని నమ్ముకున్న గంగపుత్రులు కష్టాల్లో కూరుకుపోయారు. వేట సాగితేనే పూట గడవని మత్స్యకార కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. అండగా నిలవాల్సిన ప్రభుత్వం కొత్త నిబంధనల పేరిట లబ్ధిదారులకు ఎగనామం పెడుతోంది. డీజిల్ సబ్సిడీ వాడలేదనే సాకుతో భరోసాను పక్కన పెట్టడంతో మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చేతిలో పైసల్లేవు.. అప్పులే దిక్కు విశాఖ జిల్లాలోని 32 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఉన్న 15 మత్స్యకార గ్రామాలు, 30 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. 668 మరపడవలు, 1272 మోటారు, 428 సాంప్రదాయ బోట్ల కార్మికులు సముద్రాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. సముద్రంలో వేట నిలిపివేసి 40 రోజులు దాటిపోయింది. చేతిలో పైసలు లేక మత్స్యకార కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఆకలి తీర్చుకోడానికి అప్పుల కోసం తిరుగుతున్నారు. దొరికిన కాడికి చేబదుళ్లు తెచ్చుకుంటున్నారు. వీటికి భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సంధికాలపు భత్యం సకాలంలో అందితే ఈ కష్టాలు తప్పుతాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ కాలయాపన మత్స్య సంపద సంరక్షణ కోసం ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు అంటే 61 రోజుల పాటు సముద్రంలో వేటను నిషేధిస్తారు. ఈ సమయంలో మత్స్యకారులను ఆదుకోవడానికి గత ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసాను తెచ్చింది. ప్రతి లబ్ధిదారునికి రూ. 10 వేలు చొప్పున సాయం అందించేది. వేట నిషేధ కాలంలోనే ఈ నిధులు మత్స్యకారుల ఖాతాల్లో జమ అయ్యేవి. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మత్స్యకారులను ఘోరంగా వంచించింది. అధికారులు 13,597 మందితో లబ్ధిదారుల జాబితా తయారు చేసినా లాభం లేకుండా పోయింది. కేవలం 60 శాతం మందికే నిధులు ఇచ్చి, మిగిలిన 40 శాతం మందికి మొండిచేయి చూపింది. నిబంధనల పేరిట లబ్ధిదారుల కోత అర్హుల ఎంపికలో ప్రభుత్వం దారుణమైన నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఒకే ఇంట్లో ఎంతమంది మత్స్యకారులు ఉన్నా ఒక్కరికే పథకాన్ని పరిమితం చేసింది. ఉమ్మడి కుటుంబంలో తండ్రికి సాయం అందితే కొడుకులకు భరోసా కట్ చేసింది. మత్స్యశాఖలో రిజిస్ట్రేషన్ లేని బోట్లు, లైసెన్స్ లేని బోట్లలో పనిచేసే వారిని పక్కన పెట్టేసింది. వీటికి తోడు నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చినా లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తోంది. రకరకాల సాకులు చెబుతూ గంగపుత్రుల పొట్ట కొడుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆంక్షలన్నీ తొలగించాలని, అర్హులైన ప్రతి మత్స్యకారుడికి వెంటనే భరోసా నిధులు విడుదల చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. హార్బర్లో నిలిచిన బోట్లు -
డీఎస్సీ అక్రమాలపై నేడు వైఎస్సార్సీపీ నిరసన
పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు పిలుపు సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ నిరసన గళం విప్పింది. మెగా డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ జంక్షన్ వరకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్ను కలిసి డీఎస్సీ అక్రమాలపై వినతిపత్రం అందజేయనున్నారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరుకానున్నారని పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉరుకూటి చందు తెలిపారు. ప్రభుత్వం ‘దగా డీఎస్సీ’తో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. ర్యాలీలో డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు, నిరుద్యోగులతో పాటు పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని ఉరుకూటి చందు పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే కబ్జా
తగరపువలస: భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలోని చిన్నిపేట సర్వే నంబర్ 67లో ఉన్న సుమారు 18 సెంట్ల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.కోటి విలువైన ఈ స్థలాన్ని మూడు రోజులుగా జేసీబీతో చదును చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు వీఆర్వో దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, పైగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో ఇదే ప్రభుత్వ భూమిలో దళిత కుటుంబాలు నివాసాల కోసం పాకలు వేసుకునేందుకు ప్రయత్నించగా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైందని గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. అనంతరం అక్కడ సాయిబాబా ఆలయం, సామాజిక భవనాలు నిర్మించారని, ఆలయ పూజారి పేరుతో నిర్మించిన ఇంటిని ప్రస్తుతం ఇతరులకు అద్దెకు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన భూమిని వాటాలుగా పంచుకునేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇదే ప్రాంతంలో రజక సామాజిక వర్గానికి చెందిన ఓ పేద మహిళ ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ, ఆమెకు 60 గజాల స్థలం కేటాయించడంలో మాత్రం అధికారులు ముందుకు రావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై వీఆర్వో రిజ్వాన్ను వివరణ కోరగా.. ఫెన్సింగ్ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. వీఆర్ఏను పంపించి స్థలాన్ని పరిశీలించి, నివేదికను భీమిలి తహసీల్దార్కు అందజేస్తానని చెప్పారు. వీఆర్వోకు తెలియదట..! -
కొత్త జోన్ శకం..
డెక్లోని తాత్కాలిక కార్యాలయంలో జోన్ కార్యకలాపాలకు శ్రీకారం క్రమంగా నిర్వహణ, ఆస్తుల విభజన అంశాలు కొలిక్కి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేసిన రైల్వే బోర్డు అధికారులు తాత్కాలిక కార్యకలాపాలు ప్రారంభం కానున్న డెక్ భవనంనేడే ప్రారంభం!హాజరుకానున్న మూడు జోన్ల మేనేజర్లు, డీఆర్ఎంలు రైళ్ల రాకపోకలతో కార్యకలాపాలు ప్రారంభించనున్న అధికారులు నిరాడంబరంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉదయం 9 గంటల నుంచి లాంఛనంగా మొదలు సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దశాబ్దాల పోరాటాలు, కోట్లాది మంది ఆశల నడుమ సాధించుకున్న ‘కొత్త రైల్వే జోన్’ శకం సోమవారం లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. రైల్వే బోర్డు ఉన్నతాధికారుల మార్గనిర్దేశంతో.. నేటి నుంచి వీఎంఆర్డీ డెక్ భవనంలోని తాత్కాలిక కార్యాలయం వేదికగా జోనల్ కార్యకలాపాలకు ఉన్నతాధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సోమవారం ఉదయం 9 గంటలకు నిరాడంబరంగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుండగా.. రైల్వే ముఖచిత్రంలో విశాఖ కేంద్రంగా సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది. రైళ్ల రాకపోకలతో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. డిపార్ట్మెంట్ల వారీగా సంబరాలు చేసుకునేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలకు శ్రీకారం దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు డెక్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయం నుంచి సోమవారం నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా జరిగే ఈ కార్యక్రమానికి జోన్కు చెందిన జనరల్ మేనేజర్లు, డీఆర్ఎంలు హాజరుకానున్నారు. ఢిల్లీలోని రైల్వే బోర్డు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. రైళ్ల రాకపోకల పర్యవేక్షణతో పాటు పాలనాపరమైన కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. జోన్ అధికారులు వాల్తేరు డివిజన్ అధికారులతో, వివిధ విభాగాల అధిపతులతో సమీక్షలు నిర్వహించి శాఖల వారీ బాధ్యతలు, ఫైళ్ల బదిలీ ప్రక్రియ, మౌలిక వసతుల కల్పనపై కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే ఉద్యోగుల బదిలీలు, ఆప్షన్ల ప్రక్రియలో ఉన్న సమస్యలపై రైల్వే కార్మిక సంఘాలతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ నెలాఖరుకల్లా ఉద్యోగుల సర్దుబాటు పూర్తి : కొత్త జోన్ ఏర్పాటులో అత్యంత కీలకమైన మానవ వనరుల కేటాయింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ జోన్లో పనిచేసేందుకు ఇప్పటికే వివిధ విభాగాల నుంచి సుమారు 3,500 మందికి పైగా సిబ్బంది ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వీరిలో ఇప్పటి వరకూ 800 మందికి పైగా ఉద్యోగుల నియామక సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన సిబ్బంది బదిలీలు, సర్దుబాటు ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు బోర్డు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది. డిపార్ట్మెంట్ల వారీగా సంబరాలు కల సాకారం అవుతున్న నేపథ్యంలో రైల్వే ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ క్షణం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతుండటంతో, డిపార్ట్మెంట్ల వారీగా ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ నిర్వహించుకునేందుకు సిబ్బంది భారీ ఎత్తున సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒక పక్క విధులు నిర్వర్తిస్తూనే, తమ కలల జోన్ ఆవిర్భావాన్ని కేక్ కటింగ్ చేసి.. స్వీట్స్ పంచుకుంటూ పండుగలా చేసుకునేందుకు సిద్ధమయ్యారు.కొలిక్కి వస్తున్న ఆస్తుల విభజన వైజాగ్ జోన్ పరిధిలో నిర్వహణ, భౌగోళిక సరిహద్దులు, ఆస్తుల విభజన ప్రక్రియలు క్రమంగా ఓ కొలిక్కి వస్తున్నాయి. పరిపాలనాపరమైన చిక్కులు తలెత్తకుండా స్పష్టమైన కార్యాచరణతో పాత జోన్ల నుంచి ఫైళ్ల బదిలీ, ఆస్తుల పంపిణీకి సంబంధించిన సాంకేతిక అంశాలను ఉన్నతాధికారులు సామరస్యంగా పరిష్కరిస్తున్నారు. రానున్న రోజుల్లో విశాఖ కేంద్రంగా మౌలిక సదుపాయాల కల్పన, శాశ్వత భవన నిర్మాణం తదితర భారీ ప్రాజెక్టులకు ఈ పరిణామం మార్గం సుగమం చేయనుంది. రేపటి నుంచి పూర్తిస్థాయి సమన్వయం దక్షిణ కోస్తా జోన్ పాలనా యంత్రాంగం ఇకపై రోజువారీ విధుల్లో వేగం పెంచనుంది. 2వ తేదీ నుంచి వివిధ విభాగాల అధిపతులు (హెచ్వోడీలు) తమ తమ విభాగాల కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ఈ క్రమంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటి వరకూ ఈస్ట్కోస్ట్రైల్వే జోన్ పరిధిలో జరిగిన పాలనా వ్యవహారాలను, వైజాగ్ జోన్ విధానాలకు అనుగుణంగా మార్చే ప్రక్రియపై రేపు స్థానిక వాల్తేరు డివిజన్ అధికారులతో కీలక సమన్వయ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రైళ్ల నిర్వహణ, గూడ్స్ రవాణా ఆదాయం మళ్లింపు వంటి సాంకేతిక అంశాలపై ప్రాథమిక చర్చలు జరగనున్నాయి. ఇంకా సిద్ధం కాని జోన్ గైడ్ లైన్స్ దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి జనరల్ గైడ్ లైన్స్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. నూతన మార్గదర్శకాలు ఖరారయ్యే వరకు, ప్రస్తుతం ఆయా డివిజన్లలో అమలవుతున్న పాత గైడ్ లైన్స్ కొనసాగించాలని ఆదివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా, విశాఖపట్నం డివిజన్కు సంబంధించి తూర్పు కోస్తా రైల్వే నిబంధనలను యథాతథంగా అమలు చేయనున్నారు. అదేవిధంగా గుంతకల్లు, విజయవాడ, గుంటూరు డివిజన్లలో దక్షిణ మధ్య రైల్వే నిబంధనలు కొనసాగుతాయి. సిబ్బంది సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, ఇతర పరిపాలనా సంబంధిత వ్యవహారాలన్నీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాత విధానంలోనే జరుగుతాయని అధికారులు వివరించారు. కొత్త జోన్ మార్గదర్శకాలు వచ్చే వరకు ఏ నియమాలు పాటించాలనే దానిపై ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత విధానాలనే అనుసరిస్తారని జోన్ ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెదిరెడ్ల రాజశేఖర్ సూచించారు. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురి మృతి
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పలువురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో 34 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి కాకినాడకు బయలుదేరింది.చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోకి రాగానే బస్సులో కాలిన వాసన వస్తుండటంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిలుపుతుండగానే ఇంజన్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్ నాగరాజు బస్సులోని ప్రయాణికులందరినీ కిందకి దించాడు. ఆగ్నిమాపక వాహనం వచ్చేసరికి బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులను మరో బస్సులో పంపించారు.మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి బోల్తా పడిపోయిన సంగతి తెలిసిందే. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. -
గూగుల్ డేటా సెంటర్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు చక్రవర్తి బీచ్రోడ్డు: విశాఖలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా సెంటర్కు అవసరమైన నీరు, విద్యుత్ సరఫరాపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి డిమాండ్ చేశారు. ‘తెలుగు శక్తి’ ఆధ్వర్యంలో శనివారం హోటల్ మేఘాలయలో ఉత్తరాంధ్ర సమస్యలు, అభివృద్ధిపై మేధోమథన సమ్మేళనం నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చక్రవర్తి మాట్లాడుతూ.. నగరావసరాలకు వాడే విద్యుత్, నీటిని గుగుల్ సెంటర్కు మళ్లిస్తారా? లేక డిసాలినేషన్, సొంత విద్యుత్ పద్ధతులను వాడుతారా? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్ వల్ల కాలుష్య ముప్పు లేదని, ప్రత్యక్షంగా 1000 నుంచి 1500 మందికి, కేబుల్ నిర్మాణం ద్వారా పరోక్షంగానూ ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. అయితే భారీ సామర్థ్యం గల గూగుల్ సంస్థకు రూ. 20,000 కోట్ల రాయితీలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. గతంలో లులు సంస్థ తరహాలోనే, ఇప్పుడు ‘సత్వ’ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు 30 ఎకరాల భూమిని ఎకరా రూ. కోటిన్నర చొప్పున కారుచౌకగా కట్టబెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల భూములను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో తెలుగు శక్తి ప్రతినిధి బీవీ రామ్, డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్, పెద్దాడ రమణ, డాక్టర్ పప్పూరు నికుంజ్, పెంట త్రినాథరావు పాల్గొన్నారు. మాట్లాడుతున్న చక్రవర్తి -
బై బై వాల్తేరు
ఇక అంతా గతమే.. ఘన చరిత్రే.. ● 133 ఏళ్ల వాల్తేరు డివిజన్ అద్భుత ప్రస్థానానికి అధికారిక ముగింపు ● విశాఖపట్నం, రాయగడలుగా విడిపోయిన ’బంగారు బాతు’ ● నేటి అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం డివిజన్ యుగారంభం ● కొత్త విశాఖపట్నం డివిజన్ తొలి డీఆర్ఎంగా లలిత్ బోహ్రా వాల్తేరు డీఆర్ఎం కార్యాలయంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్గా పేరు మార్పుసాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ‘వాల్తేరు’ పేరు ఇక చరిత్ర పుటల్లోకి చేరబోతోంది. భారతీయ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మక డివిజన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన వాల్తేరు డివిజన్ ప్రస్థానం నేటి అర్థరాత్రితో ముగియనుంది. జూన్ 1 నుంచి ‘వాల్తేరు’ అనే పేరు అధికారికంగా రైల్వే మ్యాప్ నుంచి కనుమరుగై, దాని స్థానంలో కొత్తగా విశాఖపట్నం డివిజన్ ఆవిర్భవించనుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాల్తేరు డివిజన్ను విశాఖపట్నం, రాయగడ డివిజన్లుగా విభజించింది. మే 31 అర్ధరాత్రి నుంచి ఈ మార్పు అమల్లోకి రానుండగా, ప్రస్తుత వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోహ్రా నూతన విశాఖపట్నం డివిజన్కు తొలి డివిజనల్ రైల్వే మేనేజర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. 1893 నుంచి మొదలైన మహోజ్వల చరిత్ర వాల్తేరు డివిజన్ చరిత్ర మూలాలు 19వ శతాబ్దం చివరలో నిక్షిప్తమై ఉన్నాయి. మద్రాసు నుంచి కలకత్తాను కలిపే ‘తూర్పు తీర రైల్వే’ నిర్మాణంలో భాగంగా 1893లో వాల్తేరుకు తొలిసారిగా రైలు మార్గం ఏర్పడింది. అనంతరం 1896లో బెంగాల్–నాగ్పూర్ రైల్వే ఆధీనంలోకి వెళ్లిన ఈ ప్రాంతం.. ఆ తర్వాత కాలక్రమేణా వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖపట్నం పోర్టు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సరుకు రవాణాకు వాల్తేరు ఒక ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెంది దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించింది. భారతీయ రైల్వేకు ‘బంగారు బాతు’ రైల్వే ఆదాయ వనరుల్లో వాల్తేరు డివిజన్ ఒక బంగారు బాతు లాంటిది. తూర్పు కోస్తా రైల్వే జోన్లోనే అత్యధిక ప్యాసింజర్, సరుకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన రికార్డు ఈ డివిజన్ సొంతం. ముఖ్యంగా ఇనుప ఖనిజం, బొగ్గు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాలో వాల్తేరు ఎన్నో రికార్డులను సృష్టించింది. ఛత్తీస్గ్లోని బైలడిల్లా గనుల నుంచి విశాఖ పోర్టుకు ఇనుప ఖనిజాన్ని చేరవేసే కొత్తవలస–కిరండూల్ (కేకే లైన్) మార్గం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి సజీవ సాక్ష్యం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, క్లిష్టమైన మార్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ రూట్లో 56 సొరంగాలు, 87 భారీ వంతెనలు, 1236 చిన్న వంతెనలు ఉన్నాయి. ప్రకృతి అందాలు.. అవార్డుల పంట కేవలం సరుకు రవాణాకే పరిమితం కాకుండా, పర్యాటక రంగంలోనూ వాల్తేరు తనదైన ముద్ర వేసింది. బొర్రా గుహలు, అరకు లోయ వంటి ప్రకృతి సిద్ధమైన అద్భుత ప్రాంతాల మీదుగా సాగే రైలు ప్రయాణం పర్యాటకులకు మరుపురాని అనుభూతిని అందిస్తోంది. విశాలమైన అద్దాల పెట్టెలు కలిగిన ’విస్టాడోమ్’ రైలును ప్రవేశపెట్టి పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఈ డివిజన్ దేశంలోనే ముందు వరుసలో నిలిచింది. పర్యావరణ హితమైన రైల్వే నిర్వహణలో, స్వచ్ఛతలో అనేక జాతీయ పురస్కారాలను సైతం సొంతం చేసుకుంది. అయితే, విభజన కారణంగా ఈ ప్రకృతి రమణీయ మార్గంలో ఎక్కువ భాగం కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్లోకి వెళ్లిపోతోంది. గుండెల్లో పదిలంగా.. ‘వాల్తేరు’ జ్ఞాపకం వాల్తేర్ డివిజన్ గడిచిన దశాబ్ద కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ దేశంలోనే అత్యధిక ఆదాయం తీసుకొచ్చిన డివిజన్గా నిలిచింది. కలల జోన్ ఏర్పాటులో భాగంగా.. ఈ చారిత్రక డివిజన్ రూపాంతరం చెందడం ఒక విధంగా బాధాకరమే. స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు విశాఖలోనే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, లోకల్ రిక్రూట్మెంట్ సెల్తో పాటు అన్ని రకాల నైపుణ్య శిక్షణా కేంద్రాలను తక్షణమే విశాఖ డివిజన్ పరిధిలోనే ఏర్పాటు చేయాలి. దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్గా వాల్తేరు జ్ఞాపకం స్థానికుల గుండెల్లో ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. –పెదిరెడ్ల రాజశేఖర్, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు -
పొగ..ఆరోగ్యానికి పగ
● ఉత్తరాంధ్రలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు అవగాహన పెరగాలి పొగాకు వినియోగం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య, సామాజిక, ఆర్థిక, పర్యావరణ దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పొగాకు వినియోగం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణంగా మారుతుండగా, ఇతర రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి ఒక్క రూ పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. రాబోయే తరాలను పొగాకు, నికోటిన్ వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు సమాజం మొత్తం కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. –డాక్టర్ రవి శంకర్, మేనేజింగ్ డైరెక్టర్, ఓమేగా క్యాన్సర్ ఆస్పత్రి, విశాఖపట్నం మహారాణిపేట: పొగాకు వినియోగం కారణంగా ఉత్తరాంధ్రలో క్యాన్సర్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లు, బీడీలతో పాటు అడ్డపొగాకు, జర్దా, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల వాడకం నోటి, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు ప్రధాన కారణంగా మారుతోందని వారు పేర్కొంటున్నారు. విశాఖలోని ఆస్పత్రులకు ప్రతి నెలా వందల సంఖ్యలో పొగాకు సంబంధిత క్యాన్సర్ రోగులు చికిత్స కోసం వస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు, మత్స్యకారుల్లో అడ్డపొగాకు వినియోగం అధికంగా ఉందని, ఇది నోటి, నాలుక, గొంతు, ఆహారనాళం క్యాన్సర్లకు దారితీస్తోందని హెచ్చరించారు. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల్లో 80 నుంచి 85 శాతం వరకు పొగతాగడమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు పేర్కొన్నారు. పొగతాగేవారితో పాటు పరోక్షంగా పొగ పీల్చే పిల్లలు, మహిళల్లో కూడా శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోందని తెలిపారు. ఆదివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువత, విద్యార్థులు, గ్రామీణ ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. పొగాకు అలవాటును మానుకోవడం ద్వారా క్యాన్సర్, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. -
విశాఖ ఉక్కుకు మళ్లీ మంచి రోజులు: సీఎండీ
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ వచ్చే మార్చి చివరి నాటికి లాభాల్లోకి వస్తుందని స్టీల్ప్లాంట్ సీఎండీ ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మే నెలాఖరున పదవీ విరమణ పొందుతున్న 30 మంది అధికారులు, 79 మంది కార్మికులకు శనివారం ఉక్కు యాజమాన్యం ఆధ్వర్యంలో సామూహిక వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాంట్ అభివృద్ధి కోసం ఉద్యోగులు దాదాపు 37 ఏళ్ల పాటు ఎంతో కష్టపడ్డారని కొనియాడారు. విధుల నిర్వహణలో భాగంగా కుటుంబాలకు, పిల్లలకు తగిన సమయం కేటాయించలేకపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్లాంట్ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, వాటిని దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. తాను కూడా సాధారణ కుటుంబం నుంచే వచ్చిన వ్యక్తినని, ఉద్యోగుల సమస్యలు తనకు బాగా తెలుసని తెలిపారు. కొంత సమయం ఇస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్లాంట్ పురోగతికి ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో భాగంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులను సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఎ.కె. బాగ్చి, డైరెక్టర్ (కమర్షియల్) జీవీఎన్ ప్రసాద్, డైరెక్టర్ (ఫైనాన్స్) వినయ్కుమార్తో పాటు సీజీఎంలు, జీఎంలు, విభాగాధిపతులు, కార్మిక సంఘాలు, అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు. -
విశాఖకు రూ.1,500 కోట్ల ‘అర్బన్ చాలెంజ్’ నిధులు
మహారాణిపేట: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అర్బన్ చాలెంజ్ ఫండ్’ కింద విశాఖకు రూ.1,500 కోట్ల విలువైన మూడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మంజూరయ్యాయని ఎంపీ ఎం. శ్రీభరత్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ)సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ఈ నిధులతో మధురవాడ జోన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా, నగరవ్యాప్తంగా బల్క్ వాటర్ సప్లై వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలును అధికారులు వేగవంతం చేయాలని, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలను పారదర్శకంగా లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. అలాగే నగరంలో విక్రయించే చికెన్, మటన్ నాణ్యతను ప్రత్యేక బృందాలతో తనిఖీ చేయించి, నాణ్యతా ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ అచ్చెన్నాయుడులోవ వద్ద ఏర్పాటు చేయనున్న కొత్త టిడ్కో నివాస సముదాయంలో ముందస్తుగానే కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరారు. టిడ్కో, రాజీవ్ గృహకల్ప కింద కేటాయించిన అనేక ఇళ్లలో లబ్ధిదారులు ఉండకపోవడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. డీడీలు కట్టి, బ్యాంకు రుణాల ఈఎంఐలు చెల్లిస్తున్నా పేదలకు ఇంకా ఇళ్లు అందకపోవడం బాధాకరమని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే విశాఖకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. ఈ సమీక్షలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పాల్గొన్నారు. ‘దిశ’ సమావేశంలో ఎంపీ శ్రీభరత్ -
దక్షిణ కోస్తా రైల్వే సీపీఆర్వోగా బాలాజీ కిరణ్
తాటిచెట్లపాలెం: దక్షిణ కోస్తా రైల్వే నూతన ప్రధాన ప్రజాసంబంధాల అధికారి(సీపీఆర్వో)గా 2013 ఐఆర్టీఎస్ బ్యాచ్కు చెందిన వై.బాలాజీ కిరణ్ అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన సౌత్ కోస్ట్ రైల్వేలో డిప్యూటీ జనరల్ మేనేజర్–కమ్–సెక్రటరీ టు జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. రైల్వే సేవల్లో విశేష అనుభవం కలిగిన బాలాజీ కిరణ్ గతంలో గుంతకల్ డివిజన్లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్గా, అలాగే సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేటకు చెందిన బాలాజీ కిరణ్.. ‘ఆశయ’ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. -
మారింది
రూట్ప్లేట్సాక్షి, విశాఖపట్నం: సాగరతీరం ఇప్పుడు సరికొత్త ఆరోగ్య సూత్రాలను పాటిస్తోంది. నిన్నటివరకు రుచుల వేటలో మునిగితేలిన వైజాగ్వాసులు.. ఇప్పుడు ‘పోష కాల’ బాట పడుతున్నారు. తమ రోజువారీ ఆహారంలో ప్రోటీన్ (మాంసకృతులు) శాతాన్ని పెంచుకుంటూ సరికొత్త జీవనశైలికి తెరతీస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఫుడ్ మాత్రమే ఉండేలా ఆర్డర్లు చేసేసుకుంటున్నారు. ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ ‘ఇన్స్టామార్ట్’ తాజాగా విడుదల చేసిన ప్రోటీన్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం.. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రోటీన్ వినియోగ కేంద్రాల్లో వైజాగ్ ఒకటిగా నిలిచింది. ఫుడ్ బాస్కెట్లో బ్యాలెన్స్ : వైజాగ్ వాసులు తమ ఆహార ఎంపికల్లో అటు సంప్రదాయాన్ని.. ఇటు ఆధునిక అవసరాలను అద్భుతంగా మేళవిస్తున్నారు. నగరంలో ప్రోటీన్ కొనుగోళ్లలో శాకాహార, మాంసాహార ఎంపికల మధ్య చక్కని సమతుల్యత పాటిస్తున్నారు. నగరవాసుల ప్రోటీన్ ఫుడ్ బాస్కెట్లో ‘గుడ్లు, పనీర్’ మొదటి స్థానంలో ఉంటూ రాజ్యమేలుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో చికెన్, శనగలు నిలిచాయి. పూర్వీకుల ఆహారమైన ‘వేయించిన శనగలు’ వంటి సంప్రదాయ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వనరులపై వైజాగ్లో మళ్లీ ఆసక్తి విపరీతంగా పెరుగుతోందని సర్వేలో తేలింది. హెల్దీ బ్రేక్ఫాస్ట్లో.. యోగర్ట్కు జై : ఉరుకుల పరుగుల జీవితంలోనూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వైజాగ్ వాసులు నిర్ణయించుకున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. ఉదయాన్నే సులభంగా తయారయ్యేలా.. ప్రోటీన్ అధికంగా ఉండే ఓట్స్.. పోహా (అటుకులు) వంటి అల్పాహార ఎంపికలు నగరంలో ప్రతి ఇంటా రోజువారీ అలవాటుగా మారిపోతున్నాయి. ఫిట్నెస్, డైట్ మీద శ్రద్ధ చూపేవారు సాధారణ పెరుగు కంటే ‘గ్రీక్ యోగార్ట్’ వైపు మొగ్గు చూపుతున్నారు. ఉదయం 7 నుంచి 11 వరకు : ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రారంభించడానికి ఉద యం వేళను మించిన సమయం లేదంటున్నారు వైజాగ్వాసులు. ఇన్స్టామార్ట్ విశ్లేషణ ప్రకారం.. నగరంలో ప్రోటీన్ ఉత్పత్తుల ఆర్డర్లు ఎక్కువగా ఉదయం 7 గంట ల నుంచి 11 మధ్యే నమోదవుతున్నాయి. రోజు ప్రారంభంలోనే పోషకాలను నింపుకోవడానికి వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇది స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు ప్రోటీన్ అంటే కేవలం జిమ్కు వెళ్లే బాడీ బిల్డర్లకు మాత్రమే అవసరమన్న భావన నుంచి.. ప్రతి రోజూ తినే ఆహారంలో ప్రోటీన్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయిందని విశాఖ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. విశాఖ వాసుల ‘ఉదయ’ రాగం ఉదయాన్నే మారిన ఆహారపు అలవాట్లు ప్రోటీన్ ఫుడ్పైనే నగరవాసుల మోజు గుడ్లు, పన్నీర్, యోగర్ట్, ఓట్స్, పోహా, శనగలు, చికెన్.. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో ప్రోటీన్కే జై కొడుతున్న ప్రజలు రెండేళ్ల కాలంలో ప్రోటీన్ వినియోగం 200 శాతం వృద్ధి ఇన్స్టామార్ట్ సర్వేలో ఆసక్తికరమైన విశేషాలు -
సర్పై అప్రమత్తం అవసరం
డాబాగార్డెన్స్: రానున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటాలన్నా, 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’(సర్) కార్యక్రమం అత్యంత కీలకమని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ పేర్కొన్నారు. డాబాగార్డెన్స్లో శనివారం 29వ వార్డు అధ్యక్షుడు పీతల వాసు అధ్యక్షతన, వాసుపల్లి గణేష్కుమార్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గ బూత్ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ కార్యక్రమ ముఖ్యోద్దేశాన్ని, లక్ష్యాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బూత్ లెవెల్ ఏజెంట్లకు వివరించారు. సమావేశంలో పార్టీ దక్షిణ పరిశీలకుడు వీసం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ హర్షవర్ధన్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్ సర్వే పేరిట కొన్ని రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఓట్లను తొలగించారని, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనూ ఈ ప్రక్రియ ప్రారంభమవుతున్నందున పార్టీ బూత్ ఏజెంట్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఓటర్ల జాబితా సవరణలో జరిగే అవకతవకలపై ప్రతి బూత్ కమిటీ సభ్యుడు నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన బీఎల్ఏ ఫారాలు ఇప్పటికే సిద్ధం చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలుపు అనేది పూర్తిగా బూత్ స్థాయి నిర్వహణపైనే ఆధారపడి ఉంటుందని, పార్టీ విజయానికి కార్యకర్తలే వెన్నెముక అని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఓటరుతో మమేకమై పార్టీ సిద్ధాంతాలను, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని నాయకులు స్పష్టం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బీఎల్ఏల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న వాసుపల్లి గణేష్కుమార్ప్రతి బూత్కి సంబంధించి ఓటర్ల జాబితా చూపుతున్న బీఎల్ఏలు


