breaking news
Visakhapatnam
-
వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన మేయర్..
సాక్షి, విశాఖ: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా విశాఖలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిరసనలకు దిగారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు.వివరాల ప్రకారం.. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల సమావేశానికి వచ్చారు. ఈ సందర్బంగా కౌన్సిల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేయర్ పోడియం ముందు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిరసనలకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కౌన్సిల్లో తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేశారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు సీపీఎం, సీపీఐ కార్పోరేటర్లు మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన మేయర్..వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల పోరాటానికి జీవీఎంసీ మేయర్ దిగి వచ్చారు. స్టీల్ ప్లాంట్పై జీవీఎంసీ కౌన్సిల్లో కీలక తీర్మానం జరిగింది. స్టీల్ ప్లాంట్లో తాజా పరిణామాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కౌన్సిల్. ప్లాంట్లో 44 విభాగాల ప్రైవేటీకరణ ప్రకటనను ఉపసంహరించాలి. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్కు ముడి ఇనుము కేటాయించాలి. ఆర్ కార్డులు కలిగిన నిర్వాసితులకు ఉక్కు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలనీ తీర్మానం చేశారు. ఈ తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం తీసుకుంది. -
అంగన్వాడీల బ్లాక్ డే
బీచ్రోడ్డు : అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి మానవహారం నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గాంధీ విగ్రహానికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి ఎం. వెంకటలక్ష్మి మాట్లాడుతూ, వేతనాలు పెంచడం, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించకుండా పనిభారం పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ సవరణ, సంక్షేమ పథకాల అమలు, యాప్ల సవరణ, వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోషణ ట్రాకర్, బాల సంజీవిని యాప్లలో ‘ఫేస్ రికగ్నిషన్ సిస్టం’ తప్పనిసరి చేయడం వల్ల అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. జూలై నెలలో యాప్ సమస్యలను వివరించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆగస్టు 4న మొబైల్స్ తిరిగి ఇచ్చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పి. శ్యామలాదేవి, ఏ. నూకరత్నం, పి. కృపారాణి, సుబ్బలక్ష్మి, రాధ, మంగ, విజయ, అన్నపూర్ణ, సంతోషి, భవాని, బీబీ రామాయమ్మ, దేవి, అరుణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పట్టించుకోని కూటమి ప్రభుత్వం మర్రిపాలెం: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ అంగన్వాడీలు గురువారం ఆర్అండ్బి జంక్షన్ వద్ద ఉన్న ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అంగన్వాడీలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నిరసన అనంతరం సీడీపీఓ నీలిమకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్లరిబ్బన్లతో అంగన్వాడీల నిరసన -
భారం
రైలులో లగేజీ మరింతలగేజీ పరిమితి ఇలా... క్లాస్ ఉచిత పరిమితి ఉచిత సడలింపు గరిష్టం ఫస్ట్ ఏసీ 70 కిలోలు 15 కిలోలు 150 కిలోలు సెకెండ్ ఏసీ 50 కిలోలు 10 కిలోలు 100 కిలోలు థర్డ్ ఏసీ 40 కిలోలు 10 కిలోలు 80 కిలోలు స్లీపర్ క్లాస్ 40 కిలోలు 10 కిలోలు 80 కిలోలు జనరల్/సెకెండ్ సిట్టింగ్ 35 కిలోలు 10 కిలోలు 70 కిలోలు సాక్షి, విశాఖపట్నం: రైలు ప్రయాణం..అన్నీ సర్దేసుకుని పట్టేసుకుందాం. సీటు కింద బ్యాగులు ఇష్టం వచ్చినట్లు పెట్టేసుకుందాం అంటే కుదరదిక. మీ లగేజీ.. మీకు మరింత భారమవ్వనుంది. ఇకపై రైలులో ప్రయాణికుల లగేజీకి విమాన ప్రయాణంలో మాదిరిగా బాదుడు షురూ చెయ్యనున్నారు. ఎప్పటి నుంచే ఈ నిబంధనలున్నా.. ఇకపై తూ.చా. తప్పకుండా అమలు చెయ్యాలని నిర్ణయించారు. నిర్దేశించిన బరువు కంటే ఎక్కువ లగేజీ ఉంటే ఒకటిన్నర రెట్లు ఫైన్ పడనుంది. సీటు కంటే బ్యాగ్ సైజ్ పెద్దదైనా బాదుడు తప్పదని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యతరగతి ప్రయాణికులపైనే అధిక భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లో 70 కిలోల వరకూ అనుమతి ఉండగా సెకెండ్ క్లాస్ ప్రయాణికులకు కేవలం 40 కిలోల పరిమితికి మాత్రమే అనుమతించనున్నారు. విమానం ఎక్కేందుకు వెళ్లే ప్రయాణికుల లగేజీ బరువు కొలిచే పద్ధతి అమల్లో ఉంది. ఇప్పుడు రైలు ప్రయాణికులకూ అదే విధానం అమల్లోకి రాబోతోంది. ఇకపై లగేజీ కొలిచే విధానం రైల్వే స్టేషన్లలో కూడా ప్రారంభం కానుంది. కొత్త నిబంధనల ప్రకారం, ప్యాసింజర్లు తమ లగేజీని రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్లలో తనిఖీ చేయించుకోవాలి. రైల్వే శాఖ ప్రతి కోచ్కు నిర్దిష్ట లగేజీ బరువు పరిమితులను నిర్ణయించింది. నిర్దేశించిన బరువు మించితే అదనపు చార్జీలు, జరిమానాలు చెల్లించాల్సిందేనంటూ ఇండియన్ రైల్వేస్ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు రైల్వే బోర్డు చెబుతున్నా.. ఈ నూతన నిబంధనలు.. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టబోతున్నాయి. మధ్యతరగతిపైనే అధిక భారం ఈ నిబంధనలు గతంలో ఉన్నవే అయినా.. ఇకపై కచ్చితంగా అమలు చెయ్యాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రతి ప్రయాణికుడి లగేజీ బరువు రైల్వే కోచ్ ప్రకారం నిర్ణయించారు. ఇందులో మధ్యతరగతి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే సెకెండ్క్లాస్, థర్డ్ ఏసీ పైనే భారం ఎక్కువగా ఉండనుంది. ప్రయాణికుల తరగతిని బట్టి ఉచిత లగేజీ పరిమితిని నిర్ణయించారు. దీని ప్రకారం, ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. సెకండ్ ఏసీ ప్రయాణికులు 50 కిలోలు, థర్డ్ ఏసీ ప్రయాణికులు 40 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు కూడా కేవలం 40 కిలోలు మాత్రమే పరిమితి విధించవచ్చు. జనరల్, సెకండ్ సిట్టింగ్ ప్రయాణికులకు కేవలం 35 కిలోల వరకు ఉచిత పరిమితి విధించారు. రైల్వే నిబంధనల ప్రకారం.. నిర్దేశించిన పరిమితి కంటే 10 నుంచి 15 కిలోల వరకు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడంలో సడలింపు ఉంటుంది. కానీ బరువు అంతకంటే ఎక్కువగా ఉంటే, ప్రయాణికులు స్టేషన్న్కు వెళ్లి లగేజీని బుక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రయాణికుల్లో 5 నుంచి 12 ఏళ్ల వయసున్న వారు ఉన్నట్లైతే అనుమతించిన దానిలో సగం లగేజీని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది. బ్యాగ్ సైజ్ పెరిగినా వాత పడుద్ది నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ తీసుకెళ్లినందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక ప్రయాణికుడు బుకింగ్ పరిమితి కంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్తున్నట్లు తేలితే.. సాధారణం కంటే 1.5 రెట్లు అధికంగా జరిమానా విధిస్తారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణ సమయంలో ప్రతి ప్రయాణికుడి లగేజీ బరువు మాత్రమే కాకుండా బ్యాగ్ పరిమాణంపైనా భారం పడనుంది. ప్రయాణికుల బ్యాగ్ చాలా పెద్దదిగా ఉండి, కోచ్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే, దానిపైనా జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అంటే బరువు తక్కువగా ఉన్నప్పటికీ, పెద్ద సైజు బ్యాగ్ పట్టుకెళ్లినా భారం తప్పదన్న విషయం ప్రయాణికులు గుర్తుపెట్టుకోవాలి. అంటే బుకింగ్ లేకుండా పరిమితి కంటే ఎక్కువ బరువు తీసుకెళ్లడం ఇక జేబుకు చిల్లు పడటమేనని ప్రయాణికులు వాపోతున్నారు. కొందరు ప్రయాణికులు పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తుండటం వల్ల తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇకపై ఈ సమస్య లేకుండా ఉండేందుకే నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. వృద్ధుల చేతి కర్రలు, హ్యాండ్ బ్యాగులు, టిఫిన్ బాక్సులపై ఈ లగేజీ పరిమితి వర్తించదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు తొలుత ప్రయాగ్రాజ్ డివిజన్నలోని ప్రధాన స్టేషన్లైన ప్రయాగ్రాజ్ జంక్షన్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్ జంక్షన్ మొదలైన జంక్షన్లలో అమలుకు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే మిగిలిన స్టేషన్లలో అమలు చేయనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. -
భారీ దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
అల్లిపురం: షీలానగర్లోని విజయ దుర్గ పాలిమర్స్ కంపెనీ యజమాని ఫ్లాట్లో ఈ ఏడాది జూలై 13న జరిగిన దొంగతనం కేసును నగర క్రైం పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 72 తులాల బంగారు ఆభరణాలు, రూ.9.04 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కె. లతామాధురి ఈ కేసు వివరాలను వెల్లడించారు. షీలానగర్లోని వేంకటేశ్వర కాలనీ, లక్ష్మి అపార్ట్మెంట్లో సప్ప నాగమణి కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆమె ఫ్లాట్లో పాలిషింగ్ పనులు జరుగుతుండటంతో.. జూలై 12న రాత్రి 10.30 గంటలకు తన భర్త, చిన్న కూతురుతో కలిసి కింద ఫ్లోర్లోని మరో ఫ్లాట్లో నిద్రపోయారు. జూలై 13న తెల్లవారుజామున 4.25 గంటలకు తిరిగి తమ ఫ్లాట్కు రాగా.. ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపల బీరువా లాకర్ కూడా పగలగొట్టి ఉండగా.. అందులో ఉన్న సుమారు 100 తులాల బంగారు ఆభరణాలు, రూ.13.5 లక్షల నగదు కనిపించలేదు. దీనిపై ఆమె గాజువాక క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన క్రైం పోలీసులు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అర్జున జ్ఞాన ప్రకాష్, లింగిబెడి రాంబాబులు ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. వీరు తెలంగాణ రాష్ట్రం మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక హత్య కేసులో నిందితులుగా చంచల్గూడ జైలులో ఉన్నారు. సౌత్ జోన్ క్రైం ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం మలక్పేట వెళ్లి నిందితులను విచారించింది. విచారణలో నర్సీపట్నం, అయ్యన్న కాలనీ, పీనరిపాలెం ప్రాంతానికి చెందిన చిటికల నాగేశ్వరరావు అలియాస్ నాగేష్ ఈ దొంగతనానికి సూత్రధారి అని తేలింది. సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు గాజువాక బి.సి.రోడ్డులోని మసీదు వద్ద నాగేష్ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు చంచల్గూడ జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చిన ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 72 తులాల బంగారం, రూ. 9.04 లక్షలు స్వాధీనం -
తల్లి నేత్రాలు దానం
పెద్ద మనసు చాటుకున్న రాకేష్ పెందుర్తి: అనారోగ్యంతో మరణించిన తల్లి నేత్రాలను దానం చేసి ఒక కుమారుడు మానవత్వాన్ని చాటుకున్నాడు. పెందుర్తిలోని రాచ్చెరువు ప్రాంతానికి చెందిన 46 ఏళ్ల బత్తుల వరలక్ష్మి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ గురువారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్.. వరలక్ష్మి నేత్రాలను దానం చేయాల్సిందిగా ఆమె కుమారుడు రాకేష్ను కోరారు. రాకేష్తో పాటు కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించారు. దీంతో మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధి మనోజ్ తన బృందంతో వచ్చి వరలక్ష్మి నేత్రాలను సేకరించారు. -
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి ఏర్పాట్లు
అల్లిపురం: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరగనుంది. ఏర్పాట్లను గురువారం కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు ఇది మొదటి కౌన్సిల్ సమావేశం. ఈ నేపథ్యంలో, కౌన్సిల్ హాల్లోని సభ్యులు కూర్చునే స్థలాలు, మైక్ సిస్టం, అధికారులు, మీడియా పాయింట్తోపాటు సమావేశం జరిగే విధానాన్ని కార్యదర్శి బి.వి. రమణను అడిగి తెలుసుకున్నారు. సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలతో పాటు సంబంధిత దస్త్రాలను కూడా సిద్ధం చేసుకోవాలని అధికారులకు తెలియజేయాలని కమిషనర్ కార్యదర్శికి సూచించారు.24న ఉమ్మడి జిల్లా సాఫ్ట్బాల్ జట్ల ఎంపిక మధురవాడ: ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సాఫ్ట్బాల్ సబ్ జూనియర్ బాల, బాలికలు, మహిళల జట్ల ఎంపిక ఈ నెల 24న జరగనుందని జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి రమణ, ఎస్.సూర్య తెలిపారు. బోయిపాలెం జంక్షన్ వద్ద ఉన్న ఈస్ట్రన్ విశాఖ ఇంగ్లిష్ మీడియం స్కూల్, కాలేజీ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు జరుగుతాయని చెప్పారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్, పుట్టిన తేదీ ధ్రువీకరణపత్రాలతో హాజరు కావాలని కోరారు. సబ్ జూనియర్స్ బాలురు, బాలికలు 2011 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని స్పష్టం చేశారు. అలాగే క్రీడాకారులు తమ సొంత కిట్లతో రావాలని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 98856 59016, 94900 73414 నంబర్లలో సంప్రదించవచ్చు. -
దేశ రక్షణలో తెలుగు బిడ్డ సాహసం
కీర్తి చక్ర గ్రహీత మేజర్ రామ్ గోపాల్ నాయుడుకు ఘన సన్మానం పీఎంపాలెం: దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన మేజర్ రామ్ గోపాల్ నాయుడు యువతకు ఆదర్శనీయుడని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కీర్తి చక్ర పురస్కారం అందుకున్న మేజర్ రామ్ గోపాల్ నాయుడు దంపతులకు ఫైర్ అండ్ సేఫ్టీ, శ్రీ వృక్ష, మాలతాంబ విద్యాసంస్థల ఆధ్వర్యంలో గురువారం కారుషెడ్లోని శ్రీవృక్ష జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఘన సన్మానం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ రామ్ గోపాల్ నాయుడు చేసిన సాహసానికి యావత్ దేశం ఫిదా అయిందని సీపీ కొనియాడారు. జమ్ముకశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నిర్వహించిన ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి నిజమైన హీరోగా నిలిచాడని ప్రశంసించారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కీర్తి చక్ర పురస్కారం అందుకున్న తొలి తెలుగు వ్యక్తి మేజర్ రామ్ గోపాల్ నాయుడు అని చెప్పారు. ఈ సందర్భంగా మేజర్ రామ్ గోపాల్ నాయుడు దంపతులను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి రామ్ గోపాల్ నాయుడు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పట్టుదల, నిలకడ, సహనం వంటి ఉత్తమ లక్షణాలను అలవర్చుకోవాలని హితవు పలికారు. దేశ రక్షణ బాధ్యతల్లో ఎన్నో కఠినమైన, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటామని, అయినప్పటికీ తమ లక్ష్యంపై పూర్తి దృష్టి పెడతామని చెప్పారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో తాము ఎదుర్కొన్న సాహస ఘట్టాలను ఉద్వేగభరితంగా వివరించారు. కార్యక్రమంలో ఎన్ఐఎఫ్ఎస్, మాలతాంబ విద్యాసంస్థల అధినేత సునీల్ మహంతి, శ్రీ వృక్ష విద్యాసంస్థల కరస్పాండెంట్ బి.వెంకటరమణ మూర్తి, విశ్రాంత ఎస్పీ దివాకర్, మాలతాంబ విద్యానికేతన్ జీఎం జి.పి.ఆర్.కృష్ణ, ప్రిన్సిపాల్ బి.శ్రీదేవి, మేజర్ రామ్ గోపాల్ నాయుడు కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణా కేసులో మరో ముగ్గురి అరెస్ట్
మర్రిపాలెం: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు, ఆ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ వెల్లడించారు. ఈ నెల 12న సుభాష్నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి వర్షిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్, తమిళనాడుకు చెందిన అర్జునన్ జెమినీ అధ్ముఘంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న మరో ముగ్గురు పరారయ్యారు. పోలీసులు ఈ నెల 16న సీజ్ చేసిన కారును తనిఖీ చేయగా.. అందులో 21 కిలోల గంజాయిని గుర్తించారు. విచారణలో భాగంగా పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో హైదరాబాద్లోని హాస్టల్లో ఉంటున్న గుంటూరుకు చెందిన 20 ఏళ్ల అక్షయ గౌతమి, ఒంగోలుకు చెందిన 25 ఏళ్ల పెర్లి విజయవర్ధన్ రాజు, గుంటూరుకు చెందిన 19 ఏళ్ల షేక్ మహమ్మద్ జాకీర్ ఉన్నారని సీఐ తెలిపారు. ఈ నలుగురు విజయవాడలో కారు అద్దెకు తీసుకుని అరకు వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేశారు. తిరిగి వస్తుండగా ఊర్వశి జంక్షన్ సమీపంలోని సుభాష్నగర్ వద్ద ప్రమాదం జరిగింది. నిందితుల్లో ఒకరైన పెర్లి విజయవర్ధన్ రాజుపై ఇప్పటికే ఒంగోలులో 11 కేసులు ఉన్నాయని, మరొక నిందితుడు మహమ్మద్ జాకీర్పై కూడా గంజాయి కేసు ఉందని పోలీసులు వెల్లడించారు. యువతికి తల్లిదండ్రులు లేరు. విజయవర్ధన్కు బంధువు కావడంతో అతనితో ఇలా వెళ్తూ ఉంటుంది. ఈ కేసులో ప్రతిభ చూపించిన ఎస్ఐలు షేక్ సమీర్, రవికుమార్లను సీఐ అభినందించారు. -
యువతి ఆత్మహత్య
గాజువాక: తల్లితో కలిసి అక్కిరెడ్డిపాలెంలో నివాసముంటున్న ఒక యువతి గురువారం ఆత్మహత్య చేసుకుంది. మృతిపై వివరాలు తెలియరాలేదు. తన కుమార్తె ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు తెలిసిందని, అందువల్ల ఈ మృతిపై తగిన దర్యాప్తు చేయాలని ఆమె తల్లి పోలీసులను కోరింది. వివరాలివి. అక్కిరెడ్డిపాలెంలో నివాసముంటున్న కోట్ని కనకమహాలక్ష్మి భర్త 15 కిందట మృతి చెందారు. అప్పటినుంచి కుమార్తె ప్రవల్లిక (23), కుమారుడు సాయి సంపత్తో కలిసి అక్కిరెడ్డిపాలెంలోని తమ తల్లిదండ్రులు ఉంటున్న వీధిలోనే నివాసముంటోంది. ప్రవల్లిక ఇటీవల ఎమ్మెస్సీ పూర్తి చేసి కాంపిటేటివ్ పరీక్షలకు సాధన చేస్తోంది. కనక మహాలక్ష్మి, ఆమె కుమారుడు టయోటా కార్ల షోరూమ్లో పని చేస్తున్నారు. వారిద్దరూ ఎప్పటి మాదిరిగానే డ్యూటీకి వెళ్లిపోయారు. అదే వీధిలో నివాసముంటున్న కనక మహాలక్ష్మి తల్లి ఉదయం 11 గంటల సమయంలో మనవరాలి వద్దకు వచ్చింది. తాను సచివాలయానికి వెళ్తానని మనవరాలు చెప్పడంతో ఆమె తన ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి ఒంటిగంట సమయంలో మళ్లీ మనవరాలి వద్దకు వచ్చి పిలవగా ఎంతసేపటికీ తలుపు తీయలేదు. దీంతో కిటికీలోంచి చూడగా బెడ్రూమ్లోని ఫ్యాన్ హుక్కు ప్రవల్లిక ఉరి వేసుకొని కనిపించింది. వెంటనే ఆమె తన భర్తకు విషయాన్ని చెప్పడంతో ఇంటి వెనుకభాగంలో గల తలుపును బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లి చూశారు. ఫ్యాన్కు వేలాడుతున్న ప్రవల్లికను కిందికి దించి దగ్గరలోగల ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కనక మహాలక్ష్మి హుటాహుటిన వచ్చి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె నిఖిల్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్టు తెలిసిందని, అందువల్ల ఈ మృతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరింది. -
నేషనల్ సిల్క్ ఎక్స్పోలో 50 శాతం తగ్గింపు
అల్లిపురం: రాబోయే పండగలు, వివాహ వేడుకల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అద్భుతమైన వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు గురువారం గ్రీన్ పార్క్ హోటల్లో ప్రారంభమయ్యాయి. ‘నేషనల్ సిల్క్ ఎక్స్పో’ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితి, దసరా, వివాహాది వేడుకలకు అవసరమైన సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్ల సమ్మేళనంతో విభిన్న వస్త్రాలను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. వేలాది రకాల పట్టు, కాటన్ డిజైన్ వస్త్రాలు, డిజైనర్ చీరలు, బ్లౌజులు, కుర్తీలు మొదలైన వాటిని 50 శాతం వరకు తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎక్స్పో సందర్శకులకు అందుబాటులో ఉంటుందని, ప్రవేశం ఉచితమన్నారు. అన్ని డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరిస్తామని వివరించారు. -
ఇటలీలో విశాఖ యువకుడి ప్రతిభ
కొమ్మాది: తనలోని సృజనాత్మకతకు పదును పెట్టి ప్రపంచ వేదికపై తన ప్రతిభను చాటాడు. జిల్లాకు చెందిన సాగి శ్రీహరివర్మ, ఇటలీలో జరిగిన ప్రతిష్టాత్మక ‘సిని మధమారే’ (ఇటాలియన్ ఫిల్మ్ మేకింగ్ ప్రోగ్రామ్)లో అద్భుతమైన ప్రదర్శనతో ఏకంగా ఏడు అవార్డులను గెలుచుకుని భారతదేశానికి గర్వకారణంగా నిలిచాడు. వివిధ దేశాల నుంచి 60 మంది యువకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారతదేశం తరఫున శ్రీహరివర్మ ఒక్కడే ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఇటలీలో జూలై 1 నుంచి 27వ తేదీ వరకు జరిగిన పోటీలు నిర్వహించగా..ఇటీవల విజేతలను ప్రకటించారు. శ్రీహరి నాలుగు లఘు చిత్రాలకు కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం, నిర్మాణం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. అతని ప్రతిభకు నిలువుటద్దంగా నిలిచిన ‘సిగ్నల్’, ‘గ్రాండ్ థెఫ్ట్ ఫియెట్’ లఘు చిత్రాలకు ఉత్తమ నిర్మాణ అవార్డులు దక్కాయి. అంతేకాకుండా ‘సిగ్నల్’ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు, ‘సిగ్నల్’, ‘టూరిస్ట్ ఫిలిగ్రిమేజ్’ చిత్రాలలో ఉత్తమ నటుడిగా అవార్డులను కై వసం చేసుకున్నాడు. అలాగే ‘సిగ్నల్’ చిత్రానికి ఉత్తమ సౌండ్, ‘గ్రాండ్ థెఫ్ట్ ఫియెట్’ చిత్రానికి ఉత్తమ ఎడిటింగ్ అవార్డులను కూడా సాధించాడు. చాలా ఆనందంగా ఉంది అంతర్జాతీయ వేదికపై ఏడు అవార్డులను గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఈ విజయంతో నా తల్లిదండ్రులు ఎస్వీఎస్ఎస్ రాజు, అనురాధ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ‘సిగ్నల్’ లఘు చిత్ర కథాంశంతో ఒక పూర్తిస్థాయి సినిమాను తీసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నా.. త్వరలో దానిని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాను. – శ్రీహరివర్మ, అవార్డు గ్రహీత -
సైబర్ సెక్యూరిటీతో బలమైన ఆంధ్రప్రదేశ్గా ఎదగాలి
గోపాలపట్నం : ఆంధ్రప్రదేశ్ను సైబర్ సెక్యూరిటీలో బలమైన రాష్ట్రంగా మార్చాలని ఎఫిసెన్స్ సిస్టమ్స్ ఫౌండర్, చైర్మన్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. సీఐఐ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన ‘డిజిటల్ బ్యాక్బోన్ భద్రత–ఏఐ, సైబర్ రిస్కుల నేపథ్యంలో నమ్మకాన్ని పెంచడం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 700కు పైగా సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని, అయితే ఈ డిజిటల్ యుగంలో సైబర్ భద్రత చాలా అవసరమని ఆయన అన్నారు. సైబర్ దాడుల వల్ల కలిగే నష్టాలను గురించి ఆయన వివరించారు. ఈ సదస్సులో ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి సంస్థల నిపుణులు సైబర్ భద్రత, ఏఐ ఆధారిత దాడులు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అంశాలపై ప్రసంగించారు. ఓటీపీ, ఈ–కేవైసీ మోసాలను నివారించడంపైనా చర్చించారు. కార్యక్రమంలో గుంటూరు శివకుమార్, కారణ్ సజ్నాని, ద్రిజేష్ బాలకృష్ణన్, అజయ్ కులకర్ణి, సంజయ్ చిట్టోరే, సీపీ శంఖబ్రత బాగ్చి పాల్గొన్నారు. -
భక్తులు సంతృప్తి చెందేలా సౌకర్యాలు
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ దేవస్థానం అధికారులకు సూచించారు. గురువారం సింహగిరిపై పర్యటించిన ఆయన భక్తులకు అందుతున్న సేవలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో భక్తులకు అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకునేందుకు కలెక్టర్ ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు అందుతున్న మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు, పారిశుధ్యం, ప్రసాదాల నాణ్యతను పరిశీలించారు. నిత్యాన్నదాన పథకంలో అందిస్తున్న భోజనం నాణ్యతపై పలువురు భక్తులను అడిగి తెలుసుకోగా, వారు సంతృప్తి వ్యక్తం చేశారు. మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సింహగిరిపై ఎండ వేడిమి తగ్గించేందుకు అవసరమైన చోట్ల తెలుపు రంగు పూత వేయాలన్నారు. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రసాదాల నాణ్యత విషయంలో రాజీ పడకుండా, ముడిసరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. స్వామివారి ఆభరణాలు, వస్తువులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ స్పందిస్తూ, దేవదాయ శాఖ ఆదేశాలతో ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ జరుపుతోందని, నివేదిక వచ్చాక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతకుముందు కలెక్టర్ స్వామివారిని దర్శించుకుని, కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన వెంట దేవస్థానం ఈఈ రమణ, ఏఈఓలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి తదితరులు ఉన్నారు. -
కేజీహెచ్లో వైద్యుల కొరత
మహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు వివిధ రాష్ట్రాల పేద రోగులకు వైద్య సేవలు అందిస్తున్న కింగ్ జార్జీ ఆస్పత్రి(కేజీహెచ్)లో వైద్యుల కొరత వెంటాడుతోంది. ఇటీవల వైద్యుల బదిలీల్లో కేజిహెచ్,ఆంధ్రా మెడికల్ కాలేజీ పరిధిలో పనిచేస్తున్న పలువురు వైద్యులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు బదిలీ చేశారు. ముందు చూపు లేకుండా వైద్యులను బదిలీలు చేయడం వల్ల కేజిహెచ్లో అనేక ప్రాఫెసర్లు,విభాగాధిపతులు,అసోసియేట్ ప్రొఫెసర్లు,అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యుల కొరత వల్ల అనేక అవుట్ పేషంట్(ఓపీ) విభాగాలు, శస్త్ర చికిత్సలు నిర్వహించే ఆపరేషన్ ఽథియేటర్లు(ఓటీ)లకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.కొంత మంది వైద్యులపై అదనపు భారం పడుతోంది.గత రెండు నెలల నుంచి జరుగుతున్న భాగోతంపై ప్రజా ప్రతినిధులు ఎవరు నోరు మోదపడం లేదు. ఉన్న వైద్యులు పని వత్తిడి కాని,ఇతర పనుల వల్ల గాని సకాలంలో విధులకు హాజరు కాలేకపోతున్నారు. కొంత మంది ఇతర పనుల వల్ల ఓపీలకు గాని, ఓటీలకు గాని సమయ పాలన పాటించడం లేదు.దీంతో వైద్య సేవల కోసం రోగులు గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. రోగులకు అత్యవసర సేవలు అందడం గగనంగా మారుతోంది. రోగులపై ప్రభావం ఈ వైద్యుల కొరత వల్ల రోజుకు 1,400 నుంచి 2,000 మంది రోగులు వచ్చే అవుట్పేషెంట్ (ఓపీ) విభాగాల్లో, అలాగే శస్త్రచికిత్సలు జరిగే ఆపరేషన్ థియేటర్లలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్న వైద్యులపై పనిభారం పెరగడంతో రోగులకు సకాలంలో సరైన వైద్యం అందడం లేదు. ముఖ్యంగా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, మెడికల్, సర్జికల్ ఆంకాలజీ వంటి కీలకమైన సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఒక్కొక్క ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉండటం రోగులకు మరింత సమస్యగా మారింది. ఈ పరిస్థితి గత రెండు నెలల నుంచి కొనసాగుతున్నా, కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు. కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీల్లో మొత్తం 44 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి వివరాలు.. ప్రొఫెసర్లు: 1,197 పడకలు ఉన్న ఈ ఆస్పత్రిలో, అనధికారికంగా సుమారు 2,000 మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే, ప్రొఫెసర్ల పోస్టులు 11 ఖాళీగా ఉన్నాయి. నాన్–క్లినికల్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, క్లినికల్ విభాగంలో 11 మంది, సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఐదుగురు ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్లు: ఈ పోస్టులు ఆరు ఖాళీగా ఉన్నాయి. నాన్–క్లినికల్ విభాగంలో ఒకరు, క్లినికల్ విభాగంలో ఐదుగురు, సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఇద్దరు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు: ఈ పోస్టులు 15 ఖాళీగా ఉన్నాయి. నాన్–క్లినికల్ విభాగంలో ఆరుగురు, క్లినికల్ విభాగంలో 15 మంది, సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఏడుగురు. -
అట్టహాసంగా ‘కళా ఉత్సవ్’
కంచరపాలెం: కేంద్రీయ విద్యాలయ–2 ప్రాంగణం.. విద్యార్థుల సందడితో పండగ వాతావరణం నెలకొంది. జాతీయ సమైక్యతను చాటే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘కళా ఉత్సవ్’ (జాతీయ ఐక్యత దివాస్) గురువారం వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలను మేనేజింగ్ కమిటీ చైర్మన్ కమాండర్ ధీరజ్ కన్న, చైర్మన్ నామినీ కమాండ్ సోనాల్ ద్రావిడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండర్ ధీరజ్ కన్న మాట్లాడుతూ ఇలాంటి ఉత్సవాలు విద్యార్థుల్లో కళలు, సాంస్కృతిక విలువలపై అవగాహన కల్పించడమే కాకుండా, వారిలో జాతీయ సమైక్యతా భావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని 8 క్లస్టర్లకు చెందిన 72 పాఠశాలల నుంచి సుమారు 420 మంది విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం విశేషం. వారు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వినూత్నంగా రూపొందించిన ప్రయోగాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సి.హెచ్.శ్రీనివాసులు, సిబ్బంది బాలాజీ, రామ్భూపాల్, జ్యోతిప్రకాష్, వినోద్, బాషా తదితరులు పాల్గొన్నారు. డ్యాన్స్ చేస్తున్న విద్యార్థినులు -
రేపు ‘వర్షాకాలం పరిశుభ్రత’
మహారాణిపేట: ఆగస్టు థీమ్ అయిన ‘వర్షాకాలం పరిశుభ్రత’పై దృష్టి సారించి కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో, ప్రజల్లో పారిశుధ్య విలువలను ప్రోత్సహించాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు ఈ కార్యక్రమాలను తప్పనిసరిగా పర్యవేక్షించాలని, ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించాలని, కమ్యూనిటీ టాయిలెట్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకుగాను, నీటి ద్వారా వచ్చే వ్యాధుల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
అభా‘షూ’పాలు
ఆరిలోవ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరూ సమానమని చెప్పేందుకు యూనిఫాంలు ప్రవేశపెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి, ఈసారి విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకువచ్చింది. కొంతమంది విద్యార్థులకు ఒకే సైజు బూట్లు పంపిణీ చేయగా, మరికొందరికి వేర్వేరు సైజుల్లో పంపింది. దీంతో జిల్లాలోని 11 మండలాల్లో చాలా పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సైజు బూట్లు అందలేదు. ఫలితంగా, విద్యార్థులు బూట్లు లేకుండానే పాఠశాలలకు వెళ్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో పంపిణీ కాకుండా ఉండిపోయిన దాదాపు 3,000 జతల బూట్లను గురువారం తోటగరువు హైస్కూల్లో ప్రదర్శనకు పెట్టారు. అన్ని మండలాల నుంచి వచ్చిన పాఠశాల ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు అవసరమైన సైజు బూట్లను ఎంచుకుని తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమాన్ని ఆర్జేడీ విజయభాస్కర్ సందర్శించి, ఎంఈవోలకు తగిన సూచనలిచ్చారు. అయితే ఈ మేళాలో కూడా కొందరికి సరిపడా సైజులు దొరకలేదు. వారికి కొద్ది రోజుల్లో బూట్లు పంపిణీ చేస్తామని ఆర్జేడీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీసీ చంద్రశేఖర్, సీఎంవో దేవుడు, ఎంఈవోలు రవీంద్రబాబు, అనురాధ, పలు మండలాల సీఆర్పీలు, పీటీలు పాల్గొన్నారు. -
పోక్సో కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు
సాక్షి,విశాఖ: పోక్సో కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి రూ. 3 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో 2024,సెప్టెంబర్ 24న కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు నిందితుడు చిత్తరంజన్ ఏడవ తరగతి చదువుతున్న బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇదే విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో బాలిక తన తోటి విద్యార్థులు తనపై జరుగుతున్న లైంగిక దాడికి గురించి చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. టీచర్ల సాయంతో బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజా కేసు విచారణలో విశాఖ కోర్టు నిందితుడు చిత్తరంజన్కు కఠిన శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. -
అడ్డగోలుగా జీవీఎంసీ లీగల్ సెల్
డాబాగార్డెన్స్ : జీవీఎంసీలో అనేక తప్పిదాలు జరుగుతున్నాయని సీనియర్ న్యాయవాది పాక సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టాండింగ్ కౌన్సిల్కు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 12న 9241/2007 పేరిట జీవీఎంసీ నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు. ఆ నోటిఫికేషన్లో గ్రాస్ పాయింట్ను ఎక్కడా చూపకుండా కేవలం ఓసీ, బీసీ – ఏ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ను మాత్రమే చూపిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని, ఎక్కడా ఎస్సీ కేటగిరీని చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ నెంబర్తోనే మరలా జారీ చేశారని, ఆ వివరాలు పరిశీలించాలన్నారు. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్కు, ప్రస్తుత నోటిఫికేషన్కు పొంతన లేదని, ఇలా ఎందుకు జరుగుతుందో అధికారులే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీలకు జీవించే అధికారం, హక్కులు లేవా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని హరించేలా జీవీఎంసీ వ్యవహరిస్తోందని, తనకు రిజర్వేషన్ ఉందని, కానీ అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితిలోనూ చెల్లదని స్పష్టం చేశారు. ఈ విషయమై తాను ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించానని, అవేవీ పట్టించుకోకుండా లీగల్ సెల్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడమంటే కోర్టును ఉల్లంఘించినట్టేనని చెప్పారు. నోటిఫికేషన్ సరిదిద్దకపోయినా, అదనపు అఫిడవిట్తో రద్దు చేయకపోయినా తాను మళ్లీ కోర్టుకు వెళ్తానని సత్యనారాయణ హెచ్చరించారు. ఓపెన్ కేటగిరీలో మహిళా రిజర్వేషన్ చూపించకపోవడమంటే మహిళలకు అన్యాయం చేస్తున్నట్టేనని, రాజ్యాంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉన్నా, దానిని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. 10 శాతం ఉన్న వీకర్ సెక్షన్కు స్టాండింగ్ కౌన్సిల్లో అవకాశం కల్పిస్తే, 15 శాతం ఉన్న ఎస్సీలకు ఎందుకు అవకాశం కల్పించలేదో చెప్పాలన్నారు. కమిషనర్ తక్షణమే దృష్టి సారించి, నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉంటుండగా, కౌన్సిల్ సమావేశంలో చర్చకు ఎలా పెడతారని ప్రశ్నించారు. -
ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లు
విశాఖ విద్య : డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ఎట్టకేలకు బుధవారం ప్రారంభమయ్యాయి. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ప్రకటించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కాలేజీలకు క్యూ కట్టారు. కాలేజీల్లో అందుబాటులో ఉన్న కోర్సులపై ఆరా తీసి, అనంతరం మీ సేవా కేంద్రాలు, నెట్ సెంటర్లకు వెళ్లి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఉన్నత విద్యా మండలి ఇచ్చిన షెడ్యూల్ మేరకు ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో చేరవచ్చు. ఉమ్మడి జిల్లాలో 196 డిగ్రీ కాలేజీలు ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్తో ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 196 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఏటా డిగ్రీ మొదటి సంవత్సరంలో 25 వేల మందికి పైగానే విద్యార్థులు చేరుతుంటారు. ఈ కాలేజీల నిర్వహణకు ఏటా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్ (గుర్తింపు) ఇస్తోంది. ఉన్నత విద్యామండలి ఆన్లైన్ ప్రవేశాల వెబ్సైట్లో వర్సిటీ అఫిలియేషన్ పొందిన కాలేజీల జాబితానే పెడతారు. తనిఖీలు లేకుండానే కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఏటా డిగ్రీ కాలేజీల్లో తనిఖీలు జరిగేవి. కాలేజీల నిర్వహణకు అనువైన భవనాలు, తరగతి గదులు, అర్హత గల అధ్యాపకులు, ఆట స్థలం, లైబ్రరీ, సైన్స్ ప్రయోగశాలలు, పార్కింగ్ ప్రదేశం ఉండాలి. పోలీసు, జీవీఎంసీ, అగ్నిమాపక శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందాలి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో సవ్యంగా ఉన్నాయా..? లేదా.? అనేది వర్సిటీ నుంచి వెళ్లే టీమ్ తనిఖీ చేసి, నిజనిర్థారణ నివేదిక ఇచ్చిన తర్వాతే అఫిలియేషన్ జారీ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వర్సిటీలోని కాలేజీ డెవలప్మెంట్ కమిటీ (సీడీసీ) పర్యవేక్షిస్తోంది. అయితే ఈ ఏడాది తనిఖీలు లేకుండానే ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చేసింది. ప్రైవేటు కాలేజీలకు మేలు చేకూర్చేలా కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. అనుమతుల్లేకున్నా దర్జాగా అడ్మిషన్లు విశాఖ జిల్లాలోని మధురవాడలో అకాడమీ పేరుతో విద్యాలయాన్ని నిర్వహిస్తున్న ఓ సంస్థ వర్సిటీ గుర్తింపు లేకున్నా, బీబీఏ, బీసీఏ, ఇతర డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు చేపడుతున్నారు. ఇక్కడ చేర్చుకునే విద్యార్థులను ద్వారాకా నగర్లోని ఓ కాలేజీలో పేర్లు నమోదు చేసి, మధురవాడలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇదేమీ తెలియకుండానే, అక్కడ చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఏయూ పరిధిలోని ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సరైన వసతులు లేవు. అర్హత గల ఫ్యాకల్టీ లేరు. ఇలాంటి కాలేజీల్లో చదువులు సవ్యంగా సాగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ పాలకులు ఇలాంటి వాటిపై తమకేమీ సంబంధం లేనట్లుగా చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేటులో అడ్మిషన్ల దందా ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించి ఇప్పటికే నాలుగు నెలలు అవుతుంది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల వారు ఇప్పటికే ఇంటర్ పాసైన విద్యార్థులకు గాలం వేసి, వారికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు సేకరించి, తమ కాలేజీలోనే చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే కాలేజీల నిర్వహణను ఉన్నత విద్యామండలి పర్యవేక్షిస్తుండగా ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా వాటికి అఫిలియేషన్ ఇవ్వడంతోపాటు, పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరి మధ్య సమన్వయ లోపంతో ప్రైవేటు కాలేజీలపై పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేశారు. దీంతో కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల దందా కొనసాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టెర్రస్ పైనుంచి జారిపడి విద్యార్థిని మృతి
తాటిచెట్లపాలెం: ఇంటి టెర్రస్ మీది నుంచి ప్రమాదవశాత్తు జారిపడి విద్యార్థిని మృతిచెందింది. ఫోర్త్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. రైల్వేన్యూకాలనీలోని శివసాయి ఎన్క్లేవ్లో రైల్వే లోకో పైలట్ వురిటి శ్రీనివాసరావు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఇతని పెద్ద కుమార్తె వర్షిత(19) గీతం కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కాలేజికి వెళ్లిన ఆమె, రికార్డుల కోసం ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం ఉతికిన బట్టలు తీసుకురావడానికి అపార్ట్మెంట్ టెర్రస్ పైకి వెళ్లింది. నేలపై నాచు ఉండడంతో బట్టలు తీస్తున్న సమయంలో దానిపై కాలు వేసిన వర్షిత జారిపోయి కిందికి పడిపోయింది. వాచ్మన్ ద్వారా విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు చికిత్స కోసం కేజీహెచ్కు తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి చెప్పిన వివరాల మేరకు ఫోర్త్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
చాంపియన్ సైనికుడు ఎర్రయ్యరెడ్డి మృతి
తగరపువలస: భీమిలి మండలం రేఖవానిపాలెం పంచాయతీ మరడపాలేనికి చెందిన చాంపియన్ సైనికుడు చిల్ల ఎర్రయ్యరెడ్డి(56) అలియాస్ ఆంబిరెడ్డి బుధవారం మృతి చెందారు. స్వతహాగా కబడ్డీ క్రీడాకారుడైన ఎర్రయ్యరెడ్డి ఆర్మీలో చేరిన తరువాత అదే క్రీడతో తాను విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్సీ గయ(బీహార్) యూనిట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి రెండు సార్లు జట్టును మొదటి స్థానంలో నిలిపారు. విధుల్లో ఉండగానే 2001లో ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి జారిపడి వెన్నుపూస విరిగింది. పూణెలోని ఆర్మీ పునరావాస కేంద్రంలో ఉంటూ కొత్త జీవితం ప్రారంభించాడు. మిలిటరీ ఆస్పత్రిలో రెండేళ్ల చికిత్స అనంతరం వీల్ చైర్లో ఉంటూనే షార్ట్పుట్, హ్యాండ్బాల్, జావలిన్ త్రో, బాస్కెట్బాల్, డిస్క్ త్రో వంటి తనకు అనువైన క్రీడల్లో సాధన చేసి వందలాది పతకాలు, లెక్కలేనన్ని సన్మానాలు పొందారు. దక్షిణ కొరియా, మలేషియా, రష్యా వంటి దేశాల్లో జరిగిన పారా సైనికుల క్రీడల్లో పాల్గొన్నారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గురువారం మరడపాలెంలో ఎర్రయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. -
గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
అల్లిపురం : ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ఈగల్ ఐసీపీ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ను ప్రారంభించిందని ఐసీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. హోటల్ నోవాటెల్లో జరిగిన పొగాకు నియంత్రణపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘గేట్వే సిద్ధాంతం’ ప్రకారం పొగాకు వంటి చిన్నపాటి అలవాట్లు డ్రగ్స్కు దారి తీస్తాయని ఆయన చెప్పారు. ఈ సమస్యను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60,000 విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ క్లబ్లలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు గంజాయి, డ్రగ్స్ వంటి వాటి గురించి సమాచారం ఉంటే టోల్–ఫ్రీ నంబర్ 1972కు తెలియజేస్తారు. అలాగే కోట్పా యాక్ట్ 2003 ప్రకారం విద్యాసంస్థల పరిసరాల్లో 100 గజాల వరకు పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు నిషేధించామని పేర్కొన్నారు. సమావేశంలో ఈగల్ ఎస్పీ కె.నాగేష్ బాబు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రజారోగ్య నిపుణులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
చోరీకి పాల్పడ్డ మహిళ అరెస్ట్
ఎంవీపీ కాలనీ: లాసన్స్ బే కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన పద్మ అనే మహిళను ఎంవీపీ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్లో క్రైమ్ సీఐ చక్రధరరావు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు. లాసన్స్బే కాలనీలో జి.వీరవెంకట సత్యనారాయణ వర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. వృద్ధురాలైన ఆయన తల్లి పైఅంతస్తులో ఒంటరిగా ఉంటోంది. గుర్తుతెలియని మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమె కంట్లో కారం కొట్టి చేతికి ఉన్న రెండు బంగారు గాజులను దొంగిలించింది. వృద్ధురాలు విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించడాన్ని గుర్తించారు. దాని ఆధారంగా విచారణ జరపగా గతంలో ఆ వృద్ధురాలికి కేర్ టేకర్గా ఓ పనిచేసిందని, ఆమెకు ఎరుపు రంగు స్కూటీ ఉందని తెలిసింది. దొంగతనానికి పాల్పడిన మహిళ కూడా ఎరుపురంగు స్కూటీలో వెళ్లినట్లు సీసీ ఫుటేజ్లో గమనించారు. ఆ దిశగా విచారణ చేయగా శివాజీపాలెం ప్రాంతానికి ఆమె వెళ్లినటు్ల్ గుర్తించి, ఆమె ఇంటికి వెళ్లి తమదైన శైలిలో విచారణ జరపగా ఆమె నేరాన్ని అంగీకరించింది. బంగారు గాజుల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ఫొటోగ్రఫీ గొప్పతనంపై ఆర్కే రోజా ప్రశంసలు
అల్లిపురం: వాస్తవ పరిస్థితులను ఎప్పటికీ గుర్తుచేసే శక్తి ఫొటోగ్రఫీకి ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకురాలు ఆర్కే రోజా అన్నారు. 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్ ఫొటో జర్నలిస్టుల ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని విశాఖ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను ఆమె సందర్శించారు. వైజాగ్ ఫొటో జర్నలిస్టులు తీసిన చిత్రాలు, అవార్డులు పొందిన ఫొటోలను ఆమె తిలకించి ప్రశంసించారు. ఒక ఫొటో ద్వారానే వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఏటా నిర్విరామంగా ఫొటో ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్న వైజాగ్ ఫొటో జర్నలిస్టులను అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తైనాల విజయకుమార్, గాజువాక వైఎస్సార్సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రాన్ని మొండిగా సమర్థిస్తున్న కూటమి
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీపీఎం ఆందోళన డాబాగార్డెన్స్ : విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసిందని, రాష్ట్ర కూటమి ప్రభుత్వం దీనికి సహకరించడం దారుణమని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు అన్నారు. విశాఖలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్ప్లాంట్ను 34 విభాగాలుగా విభజించి, వాటి నిర్వహణ, ఆపరేషన్ పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు కేంద్రం టెండర్లు పిలిచిందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల వేలాది మంది శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ప్రైవేటీకరణ వల్ల గాజువాక ప్రాంతం ఎడారిగా మారుతుందన్నారు. 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించడం అన్యాయమని ఆక్షేపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను నరసింగరావు ఖండించారు. విశాఖ స్టీల్ప్లాంట్లోని కార్మికులకు నైపుణ్యం లేదని శ్రీనివాసరావు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా తోసిపుచ్చారు. దేశంలోనే అత్యంత ఆధునీకరించబడిన ప్లాంట్ విశాఖ స్టీల్ అని, ఇక్కడ పనిచేసే కార్మికులు అత్యంత నైపుణ్యం కలవారని ఆయన సవాల్ చేశారు. దేశంలోని ఇతర స్టీల్ప్లాంట్లకు సొంత గనులు ఉన్నప్పుడు విశాఖ స్టీల్ప్లాంట్కు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కుట్ర వెనుక ఆర్సీలార్ మిట్టల్ వంటి సంస్థలకు ప్లాంట్ను అప్పగించే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలంతా ఏకమై స్టీల్ప్లాంట్ను కాపాడుకోవాలని నరసింగరావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు ఆర్కేఎస్వీ కుమార్, ఎస్. జ్యోతీశ్వరరావు, యు. రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఆహార నాణ్యతకు ‘క్షీ’ టీమ్స్
డాబాగార్డెన్స్ : నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జీవీఎంసీ (గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్) ‘క్షీ’ (శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్ఫోర్స్మెంట్) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు నగరంలోని అన్ని జోన్లలో ‘ఈట్ రైట్ క్యాంపెయిన్’ ద్వారా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. నగరంలోని ప్రతి జోన్లో రెండు చొప్పున మొత్తం 16 ‘క్షీ’ బృందాలు పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ బృందాలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, వీధి వ్యాపారుల వద్ద ఆహార నాణ్యత, పరిశుభ్రత, నిషేధిత ప్లాస్టిక్ వినియోగంపై నిఘా ఉంచుతాయి. ఇప్పటివరకు 8 జోన్లలో 76 చోట్ల తనిఖీలు నిర్వహించి, 71 ఆహార విక్రయ కేంద్రాలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే 50 చోట్ల నుంచి రూ.68,600 అపరాధ రుసుం వసూలు చేశామన్నారు. -
జీవీఎంసీ జోన్ల పునర్వ్యవస్థీకరణ
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ పరిపాలనలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న జోన్ వ్యవస్థ స్థానంలో నియోజకవర్గం యూనిట్గా కొత్త జోన్లు ఏర్పాటు కానున్నాయి. పరిపాలన సౌలభ్యం, పారదర్శకత కోసం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించడానికి ఈ అంశాన్ని అజెండాలో చేర్చారు. గత కౌన్సిల్ సమావేశంలో టేబుల్ అజెండా – 1గా సభ్యుల దృష్టికి వచ్చినప్పటికీ వాయిదా వేశారు. ఇప్పటి వరకు జీవీఎంసీ పరిధిలో 8 జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్ పరిధిలో 8 నుంచి 15 వరకు వార్డులు ఉన్నాయి. ఒక్కో జోన్ రెండు, మూడు నియోజకవర్గాల పరిధిలో ఉంది. దీంతో పరిపాలన సక్రమంగా జరగడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విధానాన్ని మార్పు చేయాలని దీర్ఘకాలంగా డిమాండ్ ఉంది. దీంతో ఒక్కో నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని జోన్లు ఏర్పాటు చేస్తే పరిపాలన సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న 8 జోన్లను 8 నియోజకవర్గాల జోనల్ కార్యాలయాలుగా మార్చనున్నారు. వార్డుల మార్పులు ఇలా... జోన్ – 2 పరిధిలో ఇప్పటి వరకు 9, 10, 11, 12, 13వ వార్డులు ఉన్నాయి. వాటిని విశాఖ తూర్పు జోన్లో విలీనం చేయనున్నారు. జోన్ – 3లోని 14వ వార్డును ఉత్తర జోన్లోని 15వ వార్డును తూర్పు జోన్లో, 27వ వార్డును దక్షిణ జోన్లో విలీనం చేయనున్నారు. జోన్ – 4 పరిధిలో ఉన్న 28వ వార్డును విశాఖ తూర్పులో, 41వ వార్డును దక్షిణంలో కలపనున్నారు. జోన్ – 8 పరిధిలోని 42వ వార్డును ఉత్తరంలో, 89, 90, 91, 92వ వార్డులను పశ్చిమలో, 93వ వార్డును పెందుర్తిలో, 98వ వార్డును భీమిలిలో కలపాలని ప్రతిపాదించారు. జోన్ – 6లో ఉన్న 72, 79, 88వ వార్డులను పెందుర్తిలో, 78, 85వ వార్డులను గాజువాకలో విలీనం చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా జోన్లు నియోజకవర్గాల వారీగా జోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు, పాలకవర్గం ప్రతినిధులు భావిస్తున్నారు. దీని ప్రకారం విశాఖలో 8 నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన జీవీఎంసీని 8 జోన్లుగా విభజించనున్నారు. ఇకపై ఒక నియోజకవర్గానికి ఒక జోనల్ కార్యాలయం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే జోనల్ కార్యాలయం పరిధిలో రెండు, మూడు నియోజకవర్గాల పరిధి ఉండే అవకాశం లేకుండా వార్డుల విలీన ప్రక్రియను చేపడుతున్నారు. భీమిలి జోన్లో 9 వార్డులు, తూర్పులో 15, ఉత్తరలో 17, దక్షిణలో 13, పశ్చిమలో 14, గాజువాకలో 17, అనకాపల్లిలో 5, పెందుర్తి జోన్లో 8 వార్డులు ఉండనున్నాయి. ఈ నూతన వ్యవస్థకు ఆమోద ముద్ర వేసేందుకు కౌన్సిల్లో చర్చించనున్నారు. కౌన్సిల్లో ఆమోదం తర్వాత తదనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు. కొత్త జోన్ల స్వరూపం ఇలా... భీమిలి జోన్ : జీవీఎంసీ 1 నుంచి 8 వరకు, 98వ వార్డు తూర్పు జోన్ : 9 నుంచి 13 వరకు, 15 నుంచి 23 వరకు, 28వ వార్డు నార్త్ జోన్ : 14, 24, 25, 26, 42 నుంచి 51 వరకు, 53, 54, 55వ వార్డు సౌత్ జోన్ : 27, 29 నుంచి 39 వరకు, 41వ వార్డు వెస్ట్ జోన్ : 40, 52, 56 నుంచి 63 వరకు, 89 నంచి 92 వరకు గాజువాక జోన్ : 64 నుంచి 76 వరకు, 78, 85, 86, 87వ వార్డు అనకాపల్లి జోన్ : 80 నుంచి 84 వరకు పెందుర్తి జోన్ : 77, 79, 88, 93 నుంచి 97 వరకు. -
జోనల్ క్రీడా పోటీలకు విశాఖ ఆతిథ్యం
ఈ నెల 22, 23 తేదీల్లో స్పోర్ట్స్ మీట్ మహారాణిపేట: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 22, 23 తేదీల్లో విశాఖ వేదికగా జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తెలిపారు. ‘అమరావతి ఛాంపియన్షిప్ కప్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీలలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లాల నుంచి 1,800 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. పురుషులు, మహిళలకు కలిపి మొత్తం 10 క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొమ్మాదిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, చంద్రపాలెం, రైల్వే ఇండోర్ స్టేడియంలలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. క్రీడాకారుల కోసం వసతి, తాగునీరు, వైద్య సేవలు, అంబులెన్స్ వంటి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పోటీలలో విజేతలు ఈ నెల 24 నుంచి 26 వరకు తిరుపతిలో జరిగే ఫైనల్స్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులకు రెవెన్యూ కాలనీలోనీ జీవీఎంసీ బాలుర హైస్కూల్లో, బక్కన్న పాలెం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో వసతి ఏర్పాటు చేయాలని డీఈవో/ఆర్ఐవోలకు సూచించారు. 30మంది పీఈటీలు/పీడీల ను కేటాయించాలని డీఈవోకు సూచించారు. సమావేశంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి ఎస్. వెంకటేశ్వరరావు, డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, జోనల్ కమిషనర్ కనకదుర్గ లక్ష్మి, జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ రాజశేఖరరెడ్డి, ఆర్ఐవో మురళీధరరావు పాల్గొన్నారు, -
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
మహారాణిపేట: నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో విశాఖలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభమైంది. మంగళగిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఈ హబ్ యువతకు, స్టార్టప్లకు ఒక వేదికగా నిలవనుంది. వీఎంఆర్డీఏ డెక్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ హబ్ను ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్గా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అభివర్ణించారు. ఈ హబ్కు సీఈఓగా రవి ఈశ్వరపు, కన్వీనర్గా జేసీ కె. మయూర్ అశోక్ వ్యవహరిస్తారని తెలిపారు. అలాగే ఎనిమిది ప్రముఖ సంస్థలు ఈ హబ్తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇందులో టీఐఈ వెజాగ్, ఐటీఏఏపీ వంటి సంస్థలు ఉన్నాయి. భవిష్యత్తులో స్టార్టప్లకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను ఈ హబ్ అందిస్తుంది. జీఎంఆర్ ప్రతినిధి టాటాతేజ, దివిస్ ల్యాబ్స్ నుంచి డాక్టర్ సురేష్, ఆర్సెలార్ మిట్టల్ నుంచి ఎం.రవీంద్రనాథ్, ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ధనుంజయరావు, గీతం నుంచి డాక్టర్ రాజాపప్పు, ఐఐపీఈ నుంచి డాక్టర్ విజయ్ జ్ఞాన, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
ఉక్కుకార్మికుల పోరాటానికి వైఎస్సార్సీపీ మద్దతు
పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మహారాణిపేట: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు హామీ ఇచ్చారు. ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరుతూ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బుధవారం మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కె.కె.రాజు, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డిలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణను అడ్డుకున్నారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 32 విభాగాలకు నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కార్మికులకు అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, కార్మిక సంఘాలతో కలిసి ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదంతో వైఎస్సార్ సీపీ తరఫున ఉద్యమిస్తామని కె.కె.రాజు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు కర్రినాయుడు, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ, వైఎస్సార్ స్టీల్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ యూనియన్ నాయకులు, ట్రేడ్ యూనియన్ జోనల్ విభాగ అధ్యక్షుడు పీవీ సురేష్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాయపురెడ్డి అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ చెన్నా జానకిరామ్, ప్రధాన కార్యదర్శి అల్లు శంకరరావు, ద్రోణం రాజు శ్రీవత్సవ పాల్గొన్నారు. -
‘విద్యా శక్తి’ బహిష్కరిస్తూ ఉపాధ్యాయ సంఘాల నిర్ణయం
ఆరిలోవ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన విద్యా శక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల(ఫ్యాప్టో) నాయకులు బుధవారం డీఈవో కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమం ప్రకారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా గంటపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ఫ్యాప్టో సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిరసనలో భాగంగా వారు డీఈవో కార్యాలయంలో అధికారులను కలిసి తమ వినతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో ప్రతినిధులు పాల్గొన్నారు. -
పల్లకీ మోత!
సైబర్ క్రైం దోషికిఅచ్యుతాపురం సైబర్ సెంటర్ దర్యాప్తులో పోలీస్ అధికారి పాత్రపై సీఐడీ అనుమానంఅచ్యుతాపురం సమీపంలోని భోగాపురం గ్రామంలో ఉన్న ఈ అపార్ట్మెంట్లోనే అంతర్జాతీయ స్థాయి సైబర్ క్రైం జరిగేది.. ఈ ఏడాది మే 20వ తేదీన దాడులు జరపడానికి వెళ్లిన పోలీసు వాహనాలను చిత్రంలో చూడవచ్చు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా బీపీవో పేరిట అంతర్జాతీయ సైబర్ క్రైం వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ నేరం బయటకు రావడానికి చాన్నాళ్ల ముందే ‘వినాయకుడి’లాంటి ఓ పోలీస్ అధికారి వీరి దందాను గమనించి, దండిగా పిండుకున్నాడు. సీఐడీ విచారణలో ఈ పోలీస్ అధికారి ముడుపులపై ప్రాథమిక ఆధారాలు కూడా లభించినట్లు తెలిసింది. అయితే దర్యాప్తు మరింత లోతుల్లోకి వెళ్లకుండా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అడ్డుపడటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పసిగట్టి.. రూ.కోట్లు పట్టి! అచ్యుతాపురంలో వంటి ప్రాంతంలో కాల్ సెంటర్(బీపీవో) ఏర్పాటుపై అంతా ఆహా ఓహో అనుకున్నారు. సదరు పోలీస్ అధికారి మాత్రం ఇలాంటి ప్రాంతంలో బీపీవో ఎలా? అన్న అనుమానంతో ఆరా తీయడం మొదలెట్టారు. ఏదో అడ్డగోలు వ్యవహారం నడుస్తుందనే కోణంలో నిర్వాహకుల్ని బెదిరించి మరీ నెలవారీ ముడుపులు, అప్పుడప్పుడూ భారీ మొత్తాలు కలిపి రూ.కోట్లలో వసూలు చేసినట్టు తెలిసింది. సైబర్ క్రైం బాధితులు పైస్థాయిలో ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక టీంతో విచారణ ప్రారంభించారు. అప్పటి వరకు ఇక్కడ జరుగుతున్న వ్యవహారం తెలిసినప్పటికీ ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరనీయకుండా సదరు పోలీస్ అధికారి చూసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఆధారాలు కూడా సీఐడీ విచారణలో లభించినట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే జోక్యంతో..! టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రంగంలోకి దిగడంతో సీఐడీకి చేతులు కట్టేసినట్టయింది. సదరు ఎమ్మెల్యే తన సామాజిక వర్గానికే చెందినవారు కావడంతో ఆ పోలీస్ అధికారి కులం కార్డు బయటకు తీశారు. దీంతో సదరు పోలీస్ అధికారి పేరు విచారణ నివేదికలో చేర్చకూడదంటూ సీనియర్ ఎమ్మెల్యే ఆదేశించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన నియోజకవర్గం కానప్పటికీ, ఆ ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంపై కూటమి నేతలు గుర్రుగా ఉన్నారు. పైగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోగొట్టిన సైబర్ క్రైం వ్యవహారంలో పాత్రధారిగా ఉన్న పోలీస్ అధికారిని ఎలా వెనుకేసుకొస్తారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సదరు ఎమ్మెల్యే కేవలం కులం కార్డు మాత్రమే కాకుండా భారీగా ముడుపులు కూడా తీసుకున్నట్లు పోలీస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.కాల్ సెంటర్ కథాకమామీషు! ముంబైకి చెందిన ఓ మహిళ అచ్యుతాపురంలో అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని బీపీవో పేరిట సైబర్ క్రైం సెంటర్ను ఏడాది కాలంగా నిర్వహిస్తోంది. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను ఇందులో ఉపయోగించుకున్నారు. పవన్ రెసిడెన్సీ వేదికగా సాగిన ఈ వ్యవహారంలో అవసరమైన స్టాఫ్ను హైదరాబాద్, గుజారాత్ల్లో రిక్రూట్ చేశారు. అమెరికన్ల ను వలవేసేందుకు ప్రత్యేకంగా అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లిష్లో మాట్లాడేలా వీరికి తర్ఫీదు ఇప్పించారు. అమెరికా ఈ–కామర్స్ పేరుతో ఫోన్లు చేసి కూపన్లు వస్తాయంటూ ఎరవేసి డబ్బులు లాగేసేవారు. ఎవరైనా చెల్లించకపోతే తమదైన శైలిలో ఫేక్ వీడియోలతో భయపెట్టి రూ.50 కోట్ల వరకూ కొల్లగొట్టినట్టు తేలింది. ఇతర రాష్ట్రాలతో లింకులు ఉండటంతో పాటు లోతుగా విచారణ చేయాల్సిన కేసు కావడంతో సీఐడీ రంగంలోకి దిగింది. సీఐడీ విచారణలో ఓ పోలీస్ అధికారి సైబర్ క్రైం గురించి పక్కాగా తెలియనప్పటికీ.. ఏదో వ్యవహారం నడుస్తోందన్న సమాచారంతో భారీ వసూళ్లకు పాల్పడినట్టు తేలింది. అయినప్పటికీ సదరు పోలీసు అధికారిపై కేసు నమోదు చేయకుండా టీడీపీ ఎమ్మెల్యే జోక్యంతో వ్యవహారం సద్దుమణిగినట్టు సమాచారం. -
కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం రూ.46.53 లక్షలు
డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి హండీ ఆదాయం బుధవారం లెక్కించారు. జూన్ 11 నుంచి ఈ నెల 20 వరకు హుండీల ద్వారా వచ్చిన నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీని లెక్కించారు. రూ.46,53,301 నగదు, 84.900 గ్రాముల బంగారం, 795 గ్రాముల వెండి వచ్చింది. యూఎస్ఏకి చెందిన 185 డాలర్లు, సింగపూర్కు చెందిన 10 డాలర్లు, యూఏఈకి చెందిన 10 దిర్హామ్స్, సౌదీ అరేబియాకు చెందిన 10 రియాల్, ఖతార్కు చెందిన 1 రియాల్, 110 న్యూజిలాండ్ దేశ డాలర్లు, ఉక్రెయ్ను దేవ 100 కరెన్సీ, శ్రీలంక దేశ రూ.20లు, థాయ్లాండ్ 70 బట్(కరెన్సీ) వచ్చింది. హుండీ ఆదాయం లెక్కింపులో ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి, దేవదాయ శాఖ అధికారి టి.అన్నపూర్ణ, దేవదాయ శాఖ తనిఖీదార్ ఎం.శ్రీధర్, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు ఎన్.ఆనంద్కుమార్, కె.రాజేంద్రకుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మధుసూదన్, వన్టౌన్ పోలీస్ సిబ్బంది, గోపాలపట్నం శ్రీహరి సేవ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అక్కడ రూ.147.. కానీ.. ఇక్కడ మాత్రం రూ.377
దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ బెడ్షీట్లను కాన్పూర్కి చెందిన సహకారి సమితి లిమిటెడ్ వద్ద కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దాదాపు రూ.7.86 కోట్లతో 2,54,657 బెడ్షీట్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈస్ట్కోస్ట్రైల్వే రూ.141.75కి కొనుగోలు చెయ్యగా.. ఈస్ట్రన్ రైల్వే జోన్ రూ.189 వెచ్చించారు. కానీ దక్షిణ మధ్య రైల్వే మాత్రం 2023లో ఏకంగా రూ.377 కి కొనుగోలు చేసింది. దీనిపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. కుంభకోణాన్ని బట్టబయలు చేశారు. అయినా అదే కుంభకోణం మరోసారి జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని రైల్వే జోన్లు అధిక ధరకు ఈ బెడ్షీట్లను కొనుగోలు చేసి భారీగానే లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెట్టింపు కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చెయ్యాల్సిన అవసరం ఏముందనే అంశంపై సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే అన్ని జోన్లలో గత ఐదేళ్ల కాలంలో బెడ్షీట్లను ఎంత ధరకు కొనుగోలు చేశారు..ఎందుకు కొనుగోలు చేశారనే ఫైళ్లని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రైల్వే జోన్లు దాదాపు 63 శాతం అధిక ధరను బెడ్షీట్ల కోసం వెచ్చించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతోందని తెలియడంతో ఈస్ట్కోస్ట్ రైల్వే జోన్లోనూ కలకలం మొదలైంది. మొత్తంగా ఈ బెడ్షీట్ల కుంభకోణం బట్టబయలైతే.. దాదాపు 10 జోన్లలో ఉన్నతాధికారులు ఇందులో చిక్కుకునే అవకాశం ఉందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. -
బెడ్ షీట్లలో భారీ అవినీతి
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల రైల్వే శాఖలో అవినీతి తారస్థాయికి చేరుకుంటోంది. డీఆర్ఎంలు, సీనియర్ ఇంజినీర్లు వరుసగా సీబీఐ దాడుల్లో పట్టుబడుతున్న నేపథ్యంలో మరో కుంభకోణం బట్టబయలైంది. కాదేదీ కుంభకోణానికి అనర్హం అన్నట్లుగా ఏసీ కోచ్లలో సరఫరా చేసే బెడ్షీట్ల కొనుగోళ్లలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో జోన్ పరిధిలో ఒక్కో ధరకు బెడ్షీట్లు కొనుగోలు చెయ్యడం చూస్తుంటే భారీగా ముడుపులు చేతులు మారుతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ ఈ విషయంలో ముందువరసలో ఉంది. సాధారణంగా కొన్ని జోన్లు ఒక్కో బెడ్షీట్ రూ.147కి కొనుగోలు చేస్తుండగా అనేక జోన్లు మాత్రం ఏకంగా రూ.300కి పైగా కొనుగోలు చెయ్యడం వెనుక భారీ అవినీతి దాగి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం సీబీఐ దర్యాప్తు చేపట్టినా మళ్లీ ఈ కుంభకోణం వ్యవహారం షురూ అయ్యింది. దీంతో మరోసారి సీబీఐ దీనిపై దృష్టిసారించడంతో అన్ని రైల్వే జోన్లలో ఈ బెడ్షీట్ల కుంభకోణం బట్టబయలయ్యే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. ఇండియన్ రైళ్లలో థర్డ్ ఏసీ, సెకెండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్లలో ప్రయాణికులకు బెడ్షీట్లు సరఫరా చేస్తుంటారు. ఈ బెడ్షీట్లను అన్ని జోన్లు దాదాపు ఒకే దగ్గర కొనుగోలు చేస్తుంటాయి. కొన్నాళ్ల క్రితం ఓ రైలులో బెడ్షీట్లు నాసిరకంవి సరఫరా చేసినట్లు ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆరాతీసిన రైల్వే బోర్డు ఉన్నతాధికారులకు దిమ్మతిరిగే షాక్ కలిగింది. ఈ బెడ్షీట్ల కొనుగోలు వెనుక భారీ కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. సుమారు అన్ని జోన్లలోనూ ఇదే తరహా వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నాసిరకం బెడ్షీట్లపై దర్యాప్తు చెయ్యగా దాని వెనుక ఉన్న బండారాన్ని బయటకు లాగే పనిలో సీబీఐ అధికారులు మరోసారి నిమగ్నమైనట్లు సమాచారం. 2023 నుంచి ఈ కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి రాజ్యమేలుతున్నట్లు గుర్తించారు. -
బాలుడి కడుపులో ఫుట్బాల్ సైజ్ కణితి
విశాఖపట్నం: హాయిగా ఆడిపాడుతూ, ఎంచక్కా చదువుకునే వయసు ఆ బాలుడిది. పదహారేళ్ల ప్రాయంలో ఉరకలెత్తే ఉత్సాహంతో ఉండాల్సిన ఆ బాలుడు కాస్తా దాదాపు నెల రోజుల నుంచి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతూ, తరచు జ్వరం వస్తుండడంతో నీరసించిపోయాడు. వేరే ఆస్పత్రులలో చూపించగా.. కాలేయంలో ఇన్ఫెక్షన్ ఉందని మందులు వాడారు.అయినా ఫలితం లేకపోవడంతో విశాఖపట్నంలోని కిమ్స్ సీతమ్మధార ఆస్పత్రికి తీసుకురాగా.. ఇక్కడ పరీక్షలు చేస్తే అది కేన్సర్ అని తేలింది. అతడికి అరుదైన, సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించిన సీనియర్ జీఐ, లివర్ సర్జన్ డాక్టర్ మురళీధర్ నంబాడ ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు.“ఆ బాలుడు ఇక్కడకు వచ్చేసరికే అతడికి పొట్ట బాగా ఉబ్బిపోయి ఉంది. దాంతో కాలేయంలో ఏదో ఇబ్బంది ఉందని గుర్తించాము. పరీక్షలు చేయగా అతడికి అత్యంత అరుదైన కాలేయ కేన్సర్ వచ్చిందని తెలిసింది. దాన్ని వైద్య పరిభాషలో మాలిగ్నెంట్ హెపాటిక్ యాంజియో మైలోలిపోమా అంటారు. ఇది కాలేయంలో కుడివైపు దాదాపు సగభాగాన్ని ఆక్రమించుకుని ఉంది. సీటీ స్కాన్, ఎంఆర్ఐ లాంటి పరీక్షలు కూడా చేసి, కణితి సరిగ్గా ఎక్కడినుంచి ఎక్కడివరకు ఉంది, ఏయే భాగాలను ఆక్రమించింది, ఎలాంటి పొజిషన్లో ఉందనే విషయాలను గుర్తించాం.అనంతరం వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. మొత్తం శస్త్రచికిత్సకు దాదాపు ఆరున్నర గంటల సమయం పట్టింది. 4.5 కిలోల బరువున్న ఆ కణితి.. దాదాపు ఫుట్బాల్ పరిమాణంలో ఉంది. ఇది చాలా పెద్ద కణితి. ఇలాంటి దాన్ని ఎలాంటి సమస్యలు లేకుండా తొలగించడం కూడా చాలా కష్టం. కణితి నుంచి ఏమాత్రం రక్తస్రావం కాకూడదు. అలాగే కణితి కూడా కాలేయంలో మిగలకుండా పూర్తిగా తొలగించాలి. అదే సమయంలో ఆరోగ్యవంతమైన భాగాన్ని యథాతథంగా కాపాడుకోవాలి.ఎందుకంటే, కాలేయం అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. రోగి వయసు 16 సంవత్సరాలే కాబట్టి, తర్వాత కాలేయం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల మిగిలిన కాలేయాన్ని కాపాడుకోవాలి. అయితే కణితి పరిమాణంతో పాటు అది ఉన్న ప్రదేశం కూడా చాలా సమస్యాత్మకం. దాంతో అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసి, పూర్తి స్థాయి కచ్చితత్వంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది” అని డాక్టర్ మురళీధర్ వివరించారు.శస్త్రచికిత్స అనంతరం బాలుడు వేగంగా కోలుకోవడంతో ఐదోరోజే డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం కీమోథెరపీ ఆరు సైకిల్స్ కూడా పూర్తిచేసుకుని అతడు తన రోజువారీ కార్యకలాపాలను సాధారణంగానే చేసుకోగలుగుతున్నాడు. అత్యంత సంక్లిష్టమైన ఇలాంటి శస్త్రచికిత్సలను కూడా సీతమ్మధారలోని కిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా చేసి, తమ కుమారుడి ప్రాణాలు కాపాడినందుకు బాలుడి తల్లిదండ్రులు ఆస్పత్రి వైద్యులకు, సిబ్బందికి, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. -
చెదిరిపోని స్మృతుల ప్రతిబింబాలే ఫొటోలు
బీచ్రోడ్డులో ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ ప్రారంభం ఏయూక్యాంపస్: ఛాయా చిత్రాలు అనేక అనుభూతులను గుర్తు చేస్తాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నగరానికి చెందిన ఫొటో జర్నలిస్టులు తీసిన పలు ఛాయాచిత్రాలను ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శన ఒకవైపు సుందర నగరాన్ని, మరో కోణంలో సమస్యలను చూపించే విధంగా ఉందన్నారు. గత ఏడాది కాలంలో జరిగిన అనేక సంఘటనలను గుర్తుచేసే విధంగా ఈ ప్రదర్శన ఉందని పేర్కొన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ఉత్తమ జర్నలిస్టులుగా అవార్డులు సాధించిన వారిని ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం అసోసియేషన్ తరపున కమిషనర్ను సన్మానించారు. విశాఖ మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ పాల్గుణరావు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనివాసరావు, జీవీఎంసీ పీఆర్వో నాగేశ్వర రావు, జెడ్సీ శివ ప్రసాద్, రాష్ట్ర ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎల్.మోహన రావు, వీపీజే అసోసియేషన్ అధ్యక్షులు వై.రామకృష్ణ, కార్యదర్శి ఎం.డి.నవాజ్, కోశాధికారి ఎ.శరత్ కుమార్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
సెల్పాయింట్లో వివో ‘వీ60’ ఆవిష్కరణ
డాబాగార్డెన్స్: వివో మొబైల్ కంపెనీ సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ‘వివో వీ60’ మొబైల్ను మేయర్ పీలా శ్రీనివాసరావు మంగళవారం డాబాగార్డెన్స్లోని సెల్పాయింట్ షోరూంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మొదటి వివో వీ60 ఫోన్ను సెల్పాయింట్ కస్టమర్కు అందజేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ భారత్లోనే రూపొందించిన వివో వీ60 ఫోన్ అధునాతన ఫీచర్లతో అన్ని సెల్పాయింట్ షోరూంలలో అందుబాటులో ఉందన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సెల్పాయింట్ యాజమాన్యం తమను తాము ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటూ.. ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొంటోందని కొనియాడారు. వివో కంపెనీ ఏజీఎం ఎస్బీబీ సతీష్ మాట్లాడుతూ కొత్త వివో వీ60 ఫోన్ అల్ట్రా సిమ్, క్వార్ట్జ్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుందని వివరించారు. సెల్పాయింట్ ఎండీ బాలాజీ పాండే, కార్పొరేటర్ శరగడం రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ పోతు సత్యనారాయణ, సంస్థ ఏఎస్ఎం గోవింద్, షోరూం మేనేజర్ కొండలరావు, కస్టమర్లు పాల్గొన్నారు. -
గల్లంతైన యువకుడు.. కరువైన ప్రభుత్వ సాయం
సొంత ఖర్చులతోనే సతీష్ ఆచూకీ కోసం గాలింపు ఎంవీపీకాలనీ: సముద్రంలో కొట్టుకుపోయిన అప్పుఘర్ ప్రాంతానికి చెందిన పిల్లా సతీష్ (24) అనే మత్స్యకార యువకుడి ఆచూకీ మూడు రోజులైనా లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం లాసన్స్ బే కాలనీ గెడ్డ వద్ద గేలంతో చేపలు పడుతుండగా, నీటి ప్రవాహం ఉధృతం కావడంతో ఆయన గెడ్డలోకి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. అనంతరం సముద్రంలోకి కొట్టుకుపోయాడు. ప్రమా దం జరిగిన నాటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి సహాయం చేయలేదని, తామే సొంత ఖర్చులతో గాలింపు చర్యలు చేపడుతున్నామని సతీష్ కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా తమ్ముడి మృతదేహం కోసమైనా.. అప్పులు చేసి నాలుగు పడవల్లో డీజిల్ కొట్టించుకుని వెతుకుతున్నాం’ అని సతీష్ అన్నయ్య పిల్లా ఎల్లాజీ కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనపై పోలీసులకు, మత్స్యకార శాఖకు సమాచారం ఇచ్చినా, వారు కేవలం కేసు నమోదుకే పరిమితమయ్యారని జాలరి ఎండాడకు చెందిన మత్స్యకారులు ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై సంఘటన జరిగిన స్థలంలో మంగళవారం నిరసన తెలిపారు. జిల్లా యంత్రాంగం గానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, ఈ ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉంటున్న హోం మంత్రి గానీ కనీసం సతీష్ కుటుంబాన్ని పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పేదవాడికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? ఇదే ఒక ధనిక వ్యక్తికి జరిగివుంటే ఇలాగే వ్యవహరించేవారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి.. తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
30న జనసేన బహిరంగ సభ
సీతంపేట: కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 30న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నుంచి పార్టీ శ్రేణులంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభ పర్యవేక్షణకు 1,400 మంది వలంటీర్లను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్బాబు, విజయకుమార్, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ పాల్గొన్నారు. -
దేవుడి పేరుతో వ్యాపారం చేయొద్దు
విశాఖ సిటీ: వినాయక మండపాల్లో దర్శనానికి టికెట్లు ఏర్పాటు చేయకూడదని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో పాటు వినాయక మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు దరఖాస్తు చేస్తే, అంతే వేగంగా అనుమతులు మంజూరు అవుతాయన్నారు. ఎంత ఖర్చు చేసినప్పటికీ.. దేవుడి పేరుతో వ్యాపారం చేయకూడదని స్పష్టం చేశారు. దర్శనాలకు టికెట్లు, పార్కింగ్ చార్జీలు, చీరలు, నగదు వసూలు చేయకూడదని తేల్చి చెప్పారు. ఈ ఏడాది నుంచి డ్రోన్లతో నిఘా పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భద్రతా చర్యలు–మార్గదర్శకాలు ● మండపాల నిర్వాహకులు విద్యుత్ పనులు ప్రారంభించే ముందు లోపల, బయట కరెంట్ తీగలను పరిశీలించాలి. కరెంట్ తీగలు మండపానికి తాకకుండా జాగ్రత్త పడాలి. ● షార్ట్ సర్క్యూట్ అవకుండా అధిక వేడి ఉత్పత్తి చేసే బల్బులు, కవర్ లేని హాలోజన్ ల్యాంప్స్ వాడకూడదు. ● ఊరేగింపులు, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో సరైన బారికేడింగ్, లైటింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సీసీ కెమెరాలు, జనరేటర్లు ఏర్పాటు చేయాలి. ● విగ్రహాల నిమజ్జనం అధికారికంగా గుర్తించిన ప్రదేశాల్లో మాత్రమే జరగాలి. ● మండపాల్లో పేలుడు పదార్థాలు ఉంచకూడదు. నూనె దీపాలు వెలిగించేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ● మండపాల సమీపంలో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే పదార్థాలను ఉంచకూడదు. నీరు, ఇసుక తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. ● నిమజ్జన ఊరేగింపుల్లో బాణసంచా వాడకూడదు. ● లౌడ్ స్పీకర్లు, మైకుల వినియోగంపై పరిమితులు ఉండాలి. కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించిన డెసిబెల్ పరిమితిని అతిక్రమించకూడదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు వినియోగించకూడదు. ● మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి. పీవోపీ విగ్రహాల వాడకాన్ని నిరోధించేందుకు పాఠశాలలు, కళాశాలల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ● నిమజ్జన ప్రాంతాల్లో తగినంత మంది ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలి. ● మండపాల్లో కనీసం ముగ్గురు వలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. వారి ఫోన్ నంబర్లు స్థానిక పోలీస్ స్టేషన్కు ఇవ్వాలి. ● అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. భక్తులు తెచ్చే పెద్ద బ్యాగులు, సూట్ కేసులు, పార్సిల్స్ను అనుమతించకూడదు. ● డీజే సిస్టమ్లు మండపాల్లోనూ, ఊరేగింపుల్లోనూ వినియోగించకూడదు. ● మండపాల్లో జూదం, మత్తు పదార్థాల వినియోగం పూర్తిగా నిషేధం. కమిటీ సభ్యులు దీనిపై బాధ్యత వహించాలి. ● మండపాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి, 24 గంటల ఫుటేజ్ రికార్డ్ చేసి పర్యవేక్షించాలి. ● సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా వచ్చే పుకార్లను నమ్మకూడదు, ఫార్వర్డ్ చేయకూడదు. ఇలాంటివి వస్తే వెంటనే వాట్సాప్ నంబర్ 7995 095799 లేదా 100/112కు కాల్ చేయాలి. ● బలవంతంగా విరాళాలు వసూలు చేయకూడదు. లక్కీ డిప్స్, లాటరీలు నిర్వహించకూడదు. -
తల్లి చెంతకు తప్పిపోయిన బాలికలు
మర్రిపాలెం: ఇంటి నుంచి అదృశ్యమైన ఇద్దరు బాలికలు కంచరపాలెం పోలీసులు, ఒక మహిళ సహకారంతో క్షేమంగా తమ తల్లి చెంతకు చేరుకున్నారు. వివరాలివి. గవర కంచరపాలెంలో నివసిస్తున్న గేదెల రేఖ, ఆమె భర్త రైల్వే స్టేషన్లో ఒక ఫుడ్కోర్టులో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి పని ముగించుకుని రేఖ ఇంటికి తిరిగి వచ్చేసరికి.. ఆమె ఇద్దరు కుమార్తెలు ఇంట్లో లేరు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో వెంటనే కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి, ఆ బాలికల వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఇదే సమయంలో ఆర్.పి.పేట ప్రాంతానికి చెందిన ఒక మహిళ రాత్రి సమయంలో ఆ ఇద్దరు బాలికలు రైల్వే ట్రాక్ సమీపంలోని ఒక జిమ్ ఆవరణలో సంచరించడాన్ని గమనించింది. ఇక్కడ ఎందుకు ఉన్నారని వారిని ప్రశ్నించగా.. ఇంట్లో ఫోన్ పోయిందని, తల్లిదండ్రులు తిడతారని భయంతో ఇంటి నుంచి బయటకు వచ్చామని వారు చెప్పారు. ఆ మహిళ వెంటనే స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు విషయం చెప్పింది. రాత్రి కావడంతో ఆ కార్యకర్త ఆ ఇద్దరు బాలికలను తమ ఇంట్లోనే ఉంచి, ఉదయం అంగన్వాడీ కేంద్రానికి తీసుకెళ్లి సచివాలయం ఎంఎస్కేకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని బాలికలను స్టేషన్కు తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం కంచరపాలెం సీఐ రవికుమార్ సమక్షంలో ఆ బాలికలను వారి తల్లి రేఖకు అప్పగించారు. దీంతో ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
108 డిఫెన్స్ మద్యం బాటిళ్ల స్వాధీనం
ఇద్దరి అరెస్ట్ పెదగంట్యాడ: గాజువాక పరిసర ప్రాంతాల్లో అక్రమంగా డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. పెదగంట్యాడ కూడలి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నరసింహారెడ్డి అనే వ్యక్తి నుంచి 15 డిఫెన్స్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నరసింహారెడ్డి గాజువాక బీసీ రోడ్డులోని వెంకటేశ్వర ఫర్నిచర్ దుకాణం యజమాని జీలకర్ర సుబ్బారావు నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు ఆ ఫర్నిచర్ దుకాణంలో సోదాలు చేయగా, మొత్తం 108 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. ఈ మద్యం ఎక్కడ నుంచి వస్తోందని సుబ్బారావును ప్రశ్నించారు. నేవల్ అధికారులు ఫర్నిచర్ కొనుగోలు చేసి, అందుకు బదులుగా మద్యం సీసాలు ఇస్తారని సుబ్బారావు చెప్పాడు. ఈ కేసులో నరసింహరెడ్డి, జీలకర్ర సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకుని గాజువాక ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు. -
పాలిటెక్నిక్ విద్యార్థులకు రష్యాలో ఉద్యోగావకాశాలు
మురళీనగర్: విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు రష్యాలో నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రష్యన్ ప్రతినిధుల బృందం తెలిపింది. భారత్–రష్యాల మధ్య సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధిపై కుదిరిన ఒప్పందంలో భాగంగా 12 మంది సభ్యుల రష్యన్ బృందం మంగళవారం కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించింది. ఈ బృందం మెటలర్జికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ప్రయోగశాలలను పరిశీలించింది. ఏపీలో డిప్లొమా స్థాయి విద్యలో అనుసరిస్తున్న పాఠ్యప్రణాళిక, బోధ నా పద్ధతులను వారు అధ్యయనం చేశారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నకుమార్ వారికి వివరించారు. రష్యాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు శిక్షణ, ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతినిధులు తెలిపారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య సాంకేతిక, విద్యా సంబంధాలు మరింత బలపడతాయని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జనరల్ సెక్షన్ హెడ్ డాక్టర్ పీఎం. బాషా, ఫార్మసీ హెడ్ జే. గోవర్ధన్ రావు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. -
వణికిస్తున్న జ్వరాలు
రూ.60 వేలు ఖర్చు చేశా..నా కుటుంబమంతా ప్రసాద్ గార్డెన్స్లో జీవీస్తున్నాం. నలుగురులో ఇద్దరికి జ్వరం వచ్చింది. నేను స్థానికంగా ఉన్న ప్రసాద్గార్డెన్స్ యూపీహెచ్సీలో వైద్యుడ్ని సంప్రదించాను. రక్త పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో డెంగ్యుగా నిర్థారణ అయింది. జ్వరం తగ్గకపోవడంతో నగరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరా. కొద్ది రోజుల తర్వాత జ్వరం అదుపులోకి వచ్చింది. కాని దాదాపు రూ.60 వేలు పైబడి బిల్లు వేశారు. పేద కుటుంబంలో జన్మించిన నాకు రూ.60 వేలు చెల్లించడం కష్టంగా మారింది. అప్పులు చేసి ఆస్పత్రి ఫీజు చెల్లించాల్సి వచ్చింది. – నాయిని లక్ష్మి, ప్రసాద్గార్డెన్స్,పూర్ణామార్కెట్ సాధారణంగా జూలై–అక్టోబర్ మధ్య జ్వరాలు ఎక్కువగా వస్తాయి. కానీ ఈసారి ఎండలు ఉన్నప్పటికీ వర్షాలు పడుతుండటంతో దోమల బెడద తీవ్రంగా ఉంది. నగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, మురికి కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, మరియు పొంగి ప్రవహిస్తున్న భూగర్భ డ్రైనేజీలు కనిపిస్తున్నాయి. మురుగు కాలువల్లో పూడికలు తీయకపోవడంతో దోమల సంఖ్య భారీగా పెరిగి, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. అయితే, దోమల నియంత్రణకు అవసరమైన ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరడం గమనార్హం. డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుదల దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జ్వరాలు ఇప్పుడు నగరవాసులను వెంటాడుతున్నాయి. డెంగ్యూ సాధారణంగా పగటిపూట కుట్టే దోమల వల్ల వ్యాపిస్తుంది. ఇది సాధారణ జ్వరంలా మొదలైనా, ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక గణాంకాల ప్రకారం, డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా నమోదయ్యాయి. జిల్లాలో 4,399 మందికి డెంగ్యూ రక్త పరీక్షలు చేయగా, 153 కేసులు నిర్ధారణ అయ్యాయి. మలేరియా కోసం 1,28,799 మందికి పరీక్షలు చేయగా, 89 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమేనని, అనధికారికంగా కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిట పెరుగుతున్న జ్వరాల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులైన కేజీహెచ్, విమ్స్, అలాగే ప్రైవేటు క్లినిక్లు, ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కేజీహెచ్లోని భావనగర్ వార్డులో డెంగ్యూ, మలేరియా బాధితులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. రోజుకు సుమారు 10 నుంచి 20 మంది జ్వర బాధితులు ఓపీకి వస్తున్నారు. విమ్స్లో రోజుకు 15 నుంచి 20 మంది ఓపీకి వస్తుండగా, వీరిలో 5 నుంచి 8 మంది డెంగ్యూ బాధితులే ఉన్నారు. డెంగ్యూ పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ప్రైవేటు ఆసుపత్రులు ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి. డెంగ్యూ బాధితుల నుంచి భారీగా బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘ప్లేట్లెట్స్ తగ్గితే ప్రాణానికే ప్రమాదం’ అంటూ రోగులను భయపెట్టి, ఒక్కో కేసు నుంచి రూ.60,000 నుంచి రూ.1 లక్ష వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. రక్తం ఎక్కించాల్సిన అవసరం వస్తే బిల్లులు ఇంకా పెరుగుతున్నాయి. నగరంలో అనూహ్యంగా పెరుగుతున్న జ్వరాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదివరకూ కేవలం గిరిజన ప్రాంతాలకే పరిమితమైన మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ఇప్పుడు నగర ప్రాంతాల్లోనూ విపరీతంగా వ్యాపిస్తున్నా యి. అడపాదడపా కురుస్తున్న వర్షాలు, పారిశుద్ధ్య లోపం, మరియు పేరుకుపోతున్న చెత్తాచెదారం కారణంగా దోమలు విపరీతంగా పెరిగి, ఈ జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. – మహారాణిపేట జ్వరంతో ఇబ్బంది పడుతున్నా.. నా కుటుంబం ఎగురరెల్లి వీధి,కొడిపందెల వీధిలో ఉంటున్నాం. నేను,నా భర్త చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ప్రతి రోజూ సాయంత్రం సమయంలో చలి జ్వరం వస్తోంది. రెండు రోజులు ఇంటి వద్దే ఉన్నాను. పనికి వెళ్లక పోతే కుటుంబ పోషణ జరగడం కష్టంగా ఉంది. జ్వరం అదుపులోకి రాలేదు. జబ్బరితోటలో ఉన్న యూపీహెచ్సీలో వైద్యున్ని సంప్రదించా.. చలి జ్వరం కావడంతో మలేరియా పరీక్షలు చేయగా.. మలేరియాగా నిర్థారణ అయింది. – దశమంతుల రామలక్ష్మి, ఎగువ రెల్లివీధి, కోడిపందెల వీధి, 30వ వార్డు -
దివ్యాంగుల పింఛన్లపై కక్ష
మహారాణిపేట: ఎన్టీఆర్ భరోసా దివ్యాంగుల పింఛనుదారులపై కూటమి సర్కార్ కక్ష కట్టింది. ఎలాగైనా దివ్యాంగుల పింఛన్లు తగ్గించడానికి ముమ్మరంగా ప్రయత్నలు చేస్తోంది. తాజాగా 40 శాతంలోపు ఉన్న దివ్యాంగ పింఛనుదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి వీరికి పింఛన్ నిలుపుదల చేస్తున్నారు. ఇప్పటికే పింఛన్లు తీసుకునే లబ్దిదారుల సంఖ్యను తగ్గించడానికి ర్యాండమ్ సర్వే చేశారు.ఆ తర్వాత మంచం మీద ఉండే దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి ఇళ్లకు వెళ్లి సదరం సర్టిఫికెట్స్ రీ వెరిఫికేషన్ చేశారు. అలాగే ఇతర ప్రాంతాల వైద్యుల చేత సదరం సర్టిఫికెట్లను ఆస్పత్రుల్లో రీ వెరిఫికేషన్ చేస్తున్నారు.ఇప్పటి వరకు కంటి దివ్యాంగుల,ఈఎన్టీ దివ్యాంగులు,మానసిక దివ్యాంగులు సదరం సర్టిఫికేట్స్ రీ వెరిఫికేషన్ జరిగింది. ఇప్పుడు అర్ధోపెడిక్ దివ్యాంగుల సదరం సర్టిఫికేట్స్ రీ వెరిఫికేషన్ జరుగుతోంది. దివ్యాంగుల ఆవేదన ఎన్నికల సమయంలో పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయడంపై దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల ఇబ్బందులతో బాధపడుతున్న తమకు, ఈ రీ–వెరిఫికేషన్ ప్రక్రియ మరింత భయాన్ని కలిగిస్తోందని వారు పేర్కొంటున్నారు. రీ–వెరిఫికేషన్లో సర్టిఫికెట్లు రద్దైతే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రూ.10,000 పింఛను పొందుతున్న దివ్యాంగులకు కూడా నోటీసులు జారీ చేయడంతో వారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 25న దివ్యాంగులతో ర్యాలీ జిల్లాలో 1178 మంది దివ్యాంగుల పింఛన్లు నిలిచిపోవడంతో ఈనెల 25న వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్టు అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు తెలిపారు. సమావేశం అనంతరం ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటామని,అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని అప్పారావు వివరించారు. దివ్యాంగులకు న్యాయం చేయాలని, పింఛన్లు రద్దు చేయడం అన్యాయని,దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని అప్పారావు కోరారు. జిల్లాలో మొత్తం దివ్యాంగుల పింఛనుదారులు : 21,306 రీ–వెరిఫికేషన్ పూర్తయినవారు : 16,187 రీ–వెరిఫికేషన్ చేయాల్సినవారు : 5,119 నోటీసులు అందుకున్నవారు : 1,178జిల్లాలో 1,178 మందికి నోటీసులు జిల్లాలో మొత్తం 21,306 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారు. వీరిలో ఇప్పటివరకు 16,187 మందికి రీ–వెరిఫికేషన్ పూర్తయింది. ఈ ప్రక్రియలో 1,178 మంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల ప్రకారం 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లు తేలింది. దీంతో వారికి పింఛన్లు నిలిపివేస్తున్నట్లు సచివాలయ ఉద్యోగుల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నారు. -
22న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఈ నెల 22న నిర్వహించనున్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశంలో 84 అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. వీటిలో పలు అభివృద్ధి పనులతో పాటు వివిధ విభాగాలకు సంబంధించి సర్వీస్ అంశాలు, రెవెన్యూ అంశాలు చర్చకు రానున్నాయి. జీవీంసీ పరిధిలో ఉన్న పలు బీచ్ల్లో 20 మంది అదనపు బీచ్ లైఫ్గార్డ్స్ నియామకం, 15వ ఆర్థిక సంఘం గ్రాంటులోని తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, శానిటేషన్ కోసం 2021–22 ఏడాదికి సవరించిన వార్షిక అభివృద్ధి ప్రణాళిక ఆమోదం, జోన్–1 పరిధి 2వ వార్డులో రూ.కోటి 70 లక్షలతో బీటీ రోడ్డు విస్తరణ, జోన్–2 పరిధి ఎండాడలో రూ.89 లక్షలతో బీటీ రోడ్డు, జోన్–4 పరిధి 32వ వార్డు సౌత్జైల్ రోడ్డు అంబేడ్కర్ సర్కిల్ నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఎదురుగా ఉన్న ఐల్యాండ్ వరకు రూ.కోటి 45 లక్షలతో బీటీ రోడ్డు పునరుద్దరణ, అలాగే భీమిలి, గాజువాక, జోన్–3, జోన్–4, జోన్–5 పరిధిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. -
రౌడీ షీటర్ల ఇళ్లల్లో మారణాయుధాలు
విశాఖ సిటీ: నగరంలో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వన్టౌన్ స్టేషన్ పరిధిలో నాటు తుపాకీ వ్యవహారం కలకలం రేపడంతో అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నగరంలో ఉన్న రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జోన్–1, జోన్–2, క్రైమ్ విభాగంతో కలిపి మొత్తం 525 మంది అధికారులు సిబ్బందితో 103 బృందాలు ఏర్పడ్డారు. ప్రతి టీమ్ బాడీ వార్న్, మొబైల్ కెమెరాలను వినియోగిస్తూ సుమారు 500 మంది రౌడీ/సస్పెక్ట్ షీటర్ల ఇళ్లను తనిఖీలు చేశారు. ఇందులో మహిళా కానిస్టేబుళ్లు, హోమ్గార్డులు కూడా పాల్గొని ఇళ్లను పరిశీలించారు. వాహనాల రికార్డులు, అనుమానాస్పద వ్యక్తులు, మారణాయుధాలను గుర్తించారు. జోన్–1 పరిధిలో భీమిలిలో రెండు కత్తులను, ఎంవీపీ పరిధిలో ఒక ఇంట్లో కత్తి, 2 కేజీల గంజాయి, మరో ఇంట్లో సరైన లెక్కలు లేని రూ.6 లక్షల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే జోన్–2లో కంచరపాలెం పరిధిలో 2.5 కేజీ గంజాయి, గోపాలపట్నం పరిధిలో 11 క్వార్టర్ మధ్యం బాటిళ్లు సీజ్ చేశారు. క్రైమ్ అధికారులు, సిబ్బంది సస్పెక్ట్ షీటర్ల ఇళ్లలో నిర్వహించిన తనిఖీల్లో మూడో పట్టణ పరిధిలో చోరికి గురైన 4 మొబైల్ ఫోన్లు, ఫోర్త్టౌన్ పరిధిలో రెండు హ్యాండ్ గ్లవ్స్, గోపాలపట్నం పరిధిలో ఒక సస్పెక్ట్ షీటర్ ఇంట్లో ఒక వ్యక్తి గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు. వీరిపై కేసులు నమోదు చేశారు. -
పెరిగిన మేహాద్రి నీటిమట్టం!
ప్రస్తుతం 55.3 అడుగులకు చేరిక పెందుర్తి: నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో మేహాద్రి రిజర్వాయర్ నిండుకుండలా మారింది. ఏజెన్సీ, మైదాన ప్రాంతాల నుంచి వర్షపు నీరు ఉధృతంగా వస్తుండటంతో గంటగంటకు మేహాద్రి నీటిమట్టం పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి అది 55.3/61 అడుగులకు చేరుకుంది. వారం రోజుల కిందట వరకు దాదాపుగా ఎండిపోయిన మేహాద్రి.. కేవలం నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో నిండిపోవడం గమనార్హం. మరో మూడు అడుగుల నీటిమట్టం పెరిగితే ఉన్నతాధికారుల సూచనల మేరకు ఒక గేటు ఎత్తే అవకాశాలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ వర్క్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు తెలిపారు. ఇప్పటికే మేహాద్రి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువతీ యువకుల దుర్మరణం
విశాఖపట్నం : బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో యువతీ యువకులు దుర్మరణం చెందారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో చంద్రంపాలెం జెడ్పీ హైసూ్కల్ ఎదురుగా హైవేపై చోటుచేసుకున్న ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు. నగర పరిధిలోని జోడుగుళ్లపాలేనికి చెందిన వాసుపల్లి దాసుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వాసుపల్లి సతీష్ (19) భవన నిర్మాణ సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అప్పుడప్పుడు చేపలుప్పాడ లో ఉంటున్న తాతగారి ఇంటికి వెళ్తుంటాడు. పలాస కు చెందిన ఉష(18)తో యువకుడికి పరిచయం ఉంది. తనను కలుసుకోవడానికి వచ్చిన ఆమెతో బైక్పై పలు ప్రాంతాల్లో తిరిగారు. ఈ క్రమంలో తాతగారి ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు వీరిద్దరూ బైక్పై పరదేశిపాలెం మీదుగా బయల్దేరారు. చంద్రంపాలెం హైసూ్కల్ ఎదురుగా హైవేపైకి వచ్చేసరికి ముందు వెళ్తున్న బస్సు, లారీలను తప్పించబోయి లారీకి బైక్ తగలడంతో కింద పడిపోయారు. ఇద్దరికీ తలకు బలమైన గాయాలై సంఘటనా స్థలిలోనే మరణించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ రాము తెలిపారు. -
టీడీపీ నేత ఆధ్వర్యంలో అశ్లీల నృత్యాలు
సాక్షి, అనకాపల్లి: కృష్ణాష్టమి వేడుకల ముసుగులో యలమంచిలి మండలం ఏటికొప్పాకలో టీడీపీ నేత ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. ముగ్గురు యువతులను బాడుగకు తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు వేయించారు. ఈ ప్రదర్శన వద్ద మద్యం మత్తులో ఉన్న యువకుల ఆగడాలు శ్రుతి మించి రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో అక్కడున్న యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్, హోం గార్డు ప్రేక్షక పాత్రకే పరిమితమవాల్సి వచ్చింది. హరే రామ హరే కృష్ణ, గీతా పారాయణంతో ఆధ్యాత్మికత ఉండాల్సిన ఆలయం పక్కనే అశ్లీల నృత్య ప్రదర్శన నిర్వహించడం గమనార్హం. వివరాలివి.ఏటికొప్పాక గ్రామంలో ప్రతి ఏటా కృష్ణాష్టమిని పురస్కరించుకుని రెండ్రోజులు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా ఆదివారం శ్రీకృష్ణుని ఆలయం వద్ద భారీ అన్నసంతర్పణ నిర్వహించారు. అనంతరం రాత్రి 9 గంటల సమయంలో అశ్లీల నృత్యాలకు తెరలేపారు. శివాలయం, శ్రీకృష్ణుని ఆలయాల మధ్య ట్రాక్టర్పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీపై ముగ్గురు యువతులు బూతు పాటలకు అశ్లీల నృత్యాలను ప్రదర్శించారు. స్టేజీపై ఉన్న యువకులు యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. మీడియా కంట పడకుండా ఉండేందుకు గ్రామానికి ప్రవేశించే అన్ని దారుల్లో సమాచారం అందించడానికి వీలుగా కొందరు యువకులను ఉంచారు. వీరు ఎవరైనా ద్విచక్ర వాహనాలపై గ్రామంలోకి వస్తే యువకులు నిర్వాహకులకు ఫోన్ చేసి సమాచారం అందజేశారు. రాత్రి 11.30 గంటల సమయంలో యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇద్దరు అక్కడకు చేరుకోవడంతో అశ్లీల ప్రదర్శన నిలిపివేశారు. అనంతరం అక్కడున్న కొందరు యువకులు రెండు వర్గాలుగా గొడవకు దిగారు. పోలీసులు వారిస్తున్నా యువకులు ఒకరిపై ఒకరు అరుపులు, కేకలతో దుర్భాషలాడుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. యువకుల మధ్య వివాదాన్ని అక్కడకు వచ్చిన పోలీసు సిబ్బంది తమ మొబైల్ ఫోన్లతో చిత్రీకరించారు. అయితే ఈ తతంగమంతా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి సమక్షంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. -
కృష్ణమ్మ ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, విశాఖపట్నం/విజయవాడ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయానికి తీరం దాటింది. గోపాల్పూర్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో.. ఏపీలో కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో.. గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది.కృష్ణానదికి ప్రవాహం పెరగడంతో.. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 4,01,087 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండడంతో.. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ‘‘కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు.. కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు’’ అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో గడచిన 24 గంటల్లో.. పాడేరులో 16 సెంమీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రమంతటా ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, అలాగే కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతాయని పేర్కొంది.చేపల వేటకు వెళ్ళి.. భారీ వర్షంలో.. చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. పెద్ద అల ఒక్కసారిగా రావడంతో యువకుడు తమ కళ్ల ముందే కొట్టుకుపోయాడని, రక్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని కొందరు మత్స్యకారులు తెలిపారు. సదరు యువకుడిని ఎంవీపీ కాలనీకి చెందిన సతీష్గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల
విశాఖ సిటీ: కూటమి ప్రభుత్వం కొత్త బార్ పాలసీ ప్రకారం జిల్లాకు మొత్తం 131 బార్లను కేటాయించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి తెలిపారు. సోమవారం వీఎంఆర్డీఏ భవనంలోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెలాఖరుతో ప్రస్తుతం నడుస్తున్న బార్ల లైసెన్సులు ముగుస్తాయని చెప్పారు. కొత్తగా కేటాయించిన 131 బార్లలో.. 121 సాధారణ కేటగిరీకి, 10 గీత కులాలకు కేటాయించినట్లు వివరించారు. కొత్త బార్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైందన్నారు. జనరల్ కేటగిరీ బార్లకు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆఫ్లైన్ దరఖాస్తులను వీఎంఆర్డీఏ భవనం (సిరిపురం)లోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని, ఈ నెల 28న వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ థియేటర్లో డ్రా ద్వారా బార్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తుతో పాటు తిరిగి చెల్లించని(నాన్–రిఫండబుల్) ధరావత్తు సొమ్ముగా రూ.5 లక్షలు, అప్లికేషన్ ఫీజు రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో బార్కు కనీసం 4 దరఖాస్తులు వస్తేనే డ్రా తీస్తామని, లేకపోతే ఆ బార్కు డ్రా ఉండదని స్పష్టం చేశారు. బార్ లైసెన్స్ కోసం 50 వేలు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, రూ.5 లక్షలు దాటితే రూ.75 లక్షలు చెల్లించాలని చెప్పారు. లైసెన్సు ఫీజును ఒకేసారి కాకుండా ఆరు విడతల్లో చెల్లించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు. గీత కార్మికులకు 50 శాతం రాయితీ: గీత కార్మికులకు 10 బార్లను కేటాయించినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు. ఇందులో శెట్టిబలిజలకు 6, యాతలకు 4 బార్లను లాటరీ ద్వారా కేటాయించినట్లు చెప్పారు. ఈ బార్లకు ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఈ నెల 29 సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 30న డ్రా తీస్తామన్నారు. గీత కార్మికులకు లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఉంటుందని, ఒకరు ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. కాగా.. కొత్త బార్ పాలసీ ప్రకారం కొత్త బార్లకు మాత్రం ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇచ్చారు. ఈ బార్లలో రూ.99 ధర కలిగిన చౌక మద్యం సరఫరా ఉండదని సూపరింటెండెంట్ తెలిపారు. గీత కులాలకు 10 బార్లు : గీత కులంలోని ఉపకులాలకు 10 మద్యం బార్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ లాటరీ తీశారు. -
ఫొటోగ్రాఫర్ అగర్వాల్కు అంతర్జాతీయ గౌరవ పురస్కారం
ఏయూక్యాంపస్: నగరానికి చెందిన ఫొటోగ్రాఫర్ బి.కె.అగర్వాల్కు అమెరికాకు చెందిన ఇమేజ్ కొలీగ్ సొసైటీ గౌరవ పురస్కారాన్ని ప్రకటించింది. ఫొటోగ్రఫీ రంగంలో చేస్తున్న కృషిని గుర్తిస్తూ అగర్వాల్ను ఎంపిక చేసింది. ఈ పురస్కారాన్ని డిసెంబర్ 1న విజయవాడలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో అగర్వాల్కు అందజేయనున్నారు. ఈ సందర్భంగా బి.కె.అగర్వాల్ మాట్లాడుతూ ఫొటోగ్రఫీలో తన ప్రతిభను గుర్తించడంపై, ఈ ప్రయాణంలో తనతోపాటు ప్రయాణించిన సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం మరింత ప్రేరణ అందిస్తుందన్నారు. -
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు వర్షం ఎఫెక్ట్
వచ్చిన అర్జీలు కేవలం 54 డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నాటి పీజీఆర్ఎస్కు వర్షం ఎఫెక్ట్ కనిపించింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్కు కేవలం 54 వినతులు మాత్రమే అందాయి. వీటిని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అన్ని జోనల్ కార్యాలయాల నుంచి వచ్చిన వినతుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానివే 33 అర్జీలున్నట్లు తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి ఒకటి, రెవెన్యూ విభాగానికి 6, ప్రజారోగ్య విభాగానికి 3, ఇంజినీరింగ్ సెక్షన్కు 9, మొక్కల విభాగానికి ఒక ఫిర్యాదు వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు వెంటనే వాటిని పరిశీలించి, అర్జీదారులతో సంప్రదించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రధాన ఇంజినీరు పల్లంరాజు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, సీసీపీ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ప్రత్యేక ఆకర్షణగా హెలికాప్టర్ మ్యూజియం
కై లాసగిరిపై త్రిశూలం ఏర్పాటుకు శంకుస్థాపన ఏయూ క్యాంపస్: విశాఖ నగరానికి వచ్చే సందర్శకులను మరింత అలరించేలా హెలికాప్టర్ మ్యూజియంను బీచ్రోడ్డులో అందుబాటులోకి తీసుకువచ్చారు. సోమవారం సాయంత్రం ఇన్చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో కలిసి ప్రారంభించారు. దాదాపు రూ.3.5 కోట్ల వ్యయంతో దీనిని ఏర్పాటు చేశారు. భారత నావికాదళంలో విశేష సేవలు అందించి, విధుల నుంచి విరమణ పొందిన యుహెచ్3హెచ్ హెలికాప్టర్ను మ్యూజియంగా మార్పుచేసి, ప్రజల సందర్శనకు ఉంచారు. కార్యక్రమంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్రాజు, వీఎంఆర్డీఏ కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజనీర్ వినయ్కుమార్, పర్యవేక్షక ఇంజినీర్లు భవానీశంకర్, మధుసూదనరావు, తదితరులు పాల్గొన్నారు. కై లాసగిరిపై 55 అడుగుల త్రిశూలం ఆరిలోవ: నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రం కై లాసగిరిపై డమరుకంతో కూడిన త్రిశూలం ఏర్పాటుకు జల్లా ఇన్చార్జి మంత్రి డోల శ్రీబాల వీరాంజనేయ, హోంమంత్రి అనితలు సోమ వారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగరంలో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా కై లాసగిరిపై రూ.1.55 కోట్లతో 55 అడుగుల ఎత్తైన త్రిశూలాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్రాజు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతమైతే అధికారులదే బాధ్యత
మహారాణిపేట: ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో రెవెన్యూ విభాగానికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ సోమవారం పీజీఆర్ఎస్కు తక్కువ ఫిర్యాదులు వస్తాయనుకున్నారు. వచ్చిన 173 ఫిర్యాదుల్లో 66 రెవెన్యూశాఖకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. పోలీస్ శాఖకు సంబంధించి 10, జీవీఎంసీవి 50 ఉన్నాయి. ఇతర విభాగాలకు సంబంధించి 47 వినతులు వచ్చాయి. 24 గంటల్లో వినతులు పరిష్కరించాలి పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను 24 గంటల్లోపు ఓపెన్ చేసి, పునరావృతం కాకుండా సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. అర్జీలు పునరావృతమైతే అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. తన కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యను తెలుసుకుని, పరిష్కారానికి భరోసానిచ్చారు. జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయరెడ్డి వినతులు స్వీకరించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
కూలిన శ్లాబ్.. ఒకరికి గాయం
అల్లిపురం: గత రాత్రి కురిసిన భారీ వర్షానికి జీవీఎంసీ 34వ వార్డు కొబ్బరితోట, ఎస్వీపీ నగర్లో ఒక ఇంటి పైకప్పు కూలిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఉమ్మిడి గురుమూర్తికి చెందిన ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. తాజాగా కురిసిన భారీ వర్షానికి ఇంటి శ్లాబ్ కూలిపోయింది. స్వామి అనే దివ్యాంగుడు గాయపడగా, 80 ఏళ్ల వృద్ధురాలు తప్పించుకుంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పాడయ్యాయి. ఎన్టీఆర్ ప్రభుత్వంలో జీ+1 కేటగిరీలో స్కీమ్ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరాయి. జోన్–4 జెడ్సీ సోమవారం వార్డులో పర్యటించి, ఇళ్లు ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం లేకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
కాగితాలపైనే వేగం
క్షేత్రస్థాయిలో శూన్యం..సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ‘అదిగో పులి..’ అన్న చందంగా తయారైంది కూటమి ప్రభుత్వ వైఖరి. పనులకు క్షేత్రస్థాయిలో అంకురార్పణ జరగకముందే అంతా సిద్ధమైనట్లుగా ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించకుండా.. నిధులపై స్పష్టత ఇవ్వకుండానే టెండర్లు ఆహ్వానించి, జనరల్ కన్సల్టెంట్ను కూడా నియమించేశారు. ప్రాజెక్టు డిజైన్, నిర్వహణ, నాణ్యత పర్యవేక్షణ కోసం ఒప్పందం కుదుర్చుకున్న ‘శిస్త్రా’సంస్థ ప్రతినిధులు ఇటీవల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. మెట్రో మార్గానికి సంబంధించిన వివరాలు, భూసేకరణ పురోగతిపై ఆరా తీయగా.. అధికారులు నీళ్లు నమలడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రాథమిక సమాచారం కూడా లేకుండా నిర్ణీత గడువులోగా నివేదికలు ఎలా సిద్ధం చేయగలమని.. ‘ఏమీ లేకుండా మేమేం చేయగలం?’అంటూ శిస్త్రా సంస్థ ప్రతినిధులు నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. విశాఖ మెట్రో ప్రాజెక్టు పనులు ‘మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి’ అన్నట్లు తయారైంది. ఆ మూడడుగులు కూడా కూటమి ప్రభుత్వ ప్రచార ఆర్భాటం తప్ప.. వాస్తవ పనుల్లో పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నెల రోజుల కిందట తొలి దశలో 46.23 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టుకు రూ.6,250 కోట్లతో(జీఎస్టీ అదనం) ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని అందులో పేర్కొంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును మొత్తం 140.13 కి.మీ మేర చేపట్టనుండగా.. తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర నిర్మించాలనుకుంటున్నారు. ఇందులో మొత్తం 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు రానున్నాయి. 20.16 కి.మీ డబుల్ డెక్కర్ తరహాలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ వరకు పై వంతెనల నిర్మాణం చేపడతారు. కొమ్మాది–స్టీల్ప్లాంట్, గురుద్వార–పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం–చినవాల్తేరు కారిడార్లలో తొలి దశ కింద మెట్రోకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొమ్మాది–స్టీల్ప్లాంట్ మధ్య ఏర్పాటు చేసే 34.40 కిలోమీటర్ల కారిడార్లో డబుల్ డెక్కర్ ట్రాక్ నిర్మించనున్నారు. అలాగే మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కిమీ మేర రెండో కారిడార్ను నిర్మిస్తారు. గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ మధ్య మరొక కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు డిజైన్భూసేకరణ పూర్తికాకుండానే పనులెలా? టెండర్లు ఖరారు చేశాక 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కాగా.. రెండు నెలల కిందట సాంకేతిక సహకారం, ప్రాజెక్టు పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన కోసం శిస్త్రా సంస్థతో ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇటీవల జిల్లా యంత్రాంగం, మెట్రో అధికారులతో శిస్త్రా సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ పనులు ఎంతవరకు వచ్చాయనే విషయంపై ఆరా తీశారు. అయితే ఇప్పటివరకు కేవలం ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే జరిగిందని తెలియడంతో శిస్త్రా ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేశారు. టెండర్లు ఖరారయ్యేలోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెప్పడంపై వారు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండు దశలకు కలిపి మొత్తం 99.75 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, అందులో 9.22 ఎకరాల ప్రైవేట్ భూమి ఉంది. కొద్ది సమయంలో ఇంత పెద్ద ప్రక్రియ పూర్తి చేయడం అసాధ్యమని, కనీస సమాచారం లేకుండా తాము నివేదికలు ఎలా ఇవ్వగలమని శిస్త్రా సంస్థ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒక కిలోమీటర్ ఫ్లైఓవర్ నిర్మాణానికే రెండేళ్లకు పైగా పడుతుంది. అలాంటిది.. 46 కి.మీ మార్గం, 42 స్టేషన్లతో కూడిన తొలి దశను రెండున్నరేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?’ అని వారు ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై పునరాలోచించుకోవాలని సలహా ఇచ్చినట్లు తెలిసింది. కేవలం ప్రచారం కోసమే.. క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేకుండా టెండర్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూటమి సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏమీ లేకుండా మేమేం చేయగలం? -
నవంబర్ 30న వైజాగ్ మారథాన్
ఏయూ క్యాంపస్: వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో సంధ్య మైరెన్స్ సహకారంతో వైజాగ్ మారథాన్ నాల్గవ ఎడిషన్ నవంబర్ 30న జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సోమవారం బీచ్రోడ్డులోని ఒక హోటల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 32 కి.మీ, 21 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ విభాగాల్లో పోటీలు ఉంటాయని, ఆసక్తి ఉన్నవారు వైజాగ్ మారథాన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సొసైటీ అధ్యక్షుడు బాలకృష్ణ రాయ్ మాట్లాడుతూ పోటీ లో పాల్గొనే వారందరికీ టీషర్ట్, మెడల్, ఎనర్జీ డ్రింక్, అల్పాహారం అందిస్తామన్నారు. సంధ్య మైరెన్స్ డైరెక్టర్ కె. ఆనంద్, వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిశోర్, అపోలో హాస్పిటల్స్ సీవోవో శ్రీరామచంద్ర, దుద్దుపూడి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వర్షం ఆగి.. వెతలు మిగిలి
సాక్షి, విశాఖపట్నం: భారీ వర్షంరెండు రోజుల పాటు మహా నగరాన్ని ముంచెత్తింది. విశాఖ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం అలజడి రేపింది. వాయుగుండంగా బలపడే అవకాశం ఉండటంతో.. రెడ్ అలెర్ట్ జారీ చేసినా.. చివరికి వరుణుడు కరుణించడంతో.. వర్షం తగ్గుముఖం పట్టింది. అల్పపీడనం క్రమంగా బలపడుతూ ఒడిశాలోని గోపాల్పూర్ వైపు కదలడంతో.. విశాఖ ఊపిరి పీల్చుకుంది. సోమవారం మధ్యాహ్నం వరకూ మోస్తరు వర్షం కురిసింది. పెందుర్తి మండలం అక్కిరెడ్డి పాలెంలో అత్యధికంగా 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, సీతమ్మధారలో 31, మహారాణిపేటలో 28.5, గాజువాకలో 25.25, పెదగంట్యాడలో 24.5, గురుద్వారలో 24.3, పెందుర్తిలో 23.5, హెచ్బీ కాలనీలో 23.25 మిమీ వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం తెరిపినివ్వడంతో ప్రజలు సాధారణ పనుల్లో నిమగ్నమైపోయారు. అయితే.. రెండు రోజుల పాటు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 12 చోట్ల 100 మిమీకి పైగా వర్షపాతం నమోదు కావ డం విశేషం. మరో రెండు రోజుల పాటు తేలికపాటి జల్లులు తప్ప భారీ వర్షాలకు అవకాశం లేదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. డాబాగార్డెన్స్: నగరంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా తలెత్తే సమస్యల పరిష్కారానికి జీవీఎంసీ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోందని కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తనతోపాటు మేయర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, అధికార యంత్రాంగం నిరంతరం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటోందన్నారు. రాపిడ్ యాక్షన్ రెస్పాన్స్ టీమ్స్ ద్వారా సమస్యల్ని సత్వరమే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన గెడ్డలు పరిశీలించి, వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాల్లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శిథిలావస్థ భవనాలు, కొండవాలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు రక్షణ కల్పించే దిశగా వారిని జీవీఎంసీ సామాజిక భవనాలు, పాఠశాలల్లో ఆశ్రయం కల్పించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బలమైన గాలులకు హోర్డింగ్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్యుత్ అంతరాయం సందర్భాల్లో తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ట్యాంకర్లను సిద్ధం చేశామన్నారు. వర్షాల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణకు సరిపడా క్లోరిన్ లిక్విడ్, ఆలం నిల్వ ఉంచినట్లు వెల్లడించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రధాన కార్యాలయంలో ఉన్న సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా సంబంధిత అధికారులకు చేరవేసి, చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా జీవీఎంసీ కంట్రోల్ రూమ్ టోల్ఫ్రీ నెం.1800 4250 0009ను సంప్రదించవచ్చన్నారు. ఇప్పటి వరకు జీవీఎంసీ కమాండ్ కంట్రోల్ నెంబర్కు 97 ఫిర్యాదులు రాగా, 94 ఫిర్యాదుల్ని పరిష్కరించినట్లు తెలిపారు. విద్యుత్ దీపాల సమస్యల పరిష్కారానికి 280 మంది ఎలక్ట్రికల్ సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. వాయు‘గండం’ గడిచింది! -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పాపం కూటమిదే..
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ పాపం కూటమి ప్రభుత్వానిదేనని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించనివ్వబోమని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ఆ హామీని విస్మరించి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది త్యాగ ఫలమే విశాఖ స్టీల్ ప్లాంట్ అని కేకే రాజు గుర్తుచేశారు. అలాంటి పరిశ్రమలోని 32 విభాగాలను ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలవడం ఉక్కు కార్మికులను మోసం చేయడమేనని అన్నారు. కూటమి పార్టీలకు ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయమని గతంలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను హెచ్చరించారని తెలిపారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు, ఉత్తరాంధ్ర ప్రజలు చేసిన పోరాటానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క కార్మికుడిని కూడా తొలగించలేదని, పైగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టీల్ ప్లాంట్ రుణాలను ఈక్విటీగా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాశారన్నారు. ఆనాడు పోరాటం చేసిన కార్మికులపై ఎలాంటి కేసులు పెట్టలేదని, ఉద్యోగులను తొలగించలేదని స్పష్టం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న 1,590 మందిని రెడ్మార్క్ చేసి, భవిష్యత్తులో ఉద్యమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. కూర్మన్నపాలెంలో 1,300 రోజులుగా కార్మికులకు దీక్షకు వేదికగా నిలిచిన టెంట్ను కూడా ప్రభుత్వం తొలగించిందని, ఆందోళనలకు ఆస్కారం లేకుండా అక్కడే పోలీసును కూడా ఏర్పాటు చేసిందని విమర్శించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, కార్మిక సంఘాలు, ప్రజలతో కలిసి వైఎస్సార్ సీపీ మరోసారి ఉద్యమిస్తుందని హెచ్చరించారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సీఎం, ప్రతిపక్ష నాయకుల దృష్టికి ఈవోఐ అంశం
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ యాజమాన్యం విస్తృతంగా విడుదల చేసిన ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ)లు, తద్వారా జరగబోయే నష్టాలను ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులను కలిసి వివరించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు నిర్ణయించారు. స్థానిక గుర్తింపు యూనియన్ కార్యాలయంలో సోమవారం జరిగిన పోరాట కమిటీ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ అమరావతికి వెళ్లి సీఎంను, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులను కలిసి సమస్యలను వివరించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర ఉక్కు మంత్రి, సహాయ మంత్రిని కలవాలని ప్రతిపాదించారు. ఈవోఐ అంశంపై నగరంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అవసరమైతే ఈ అంశంపై సమ్మెకు వెళ్లడానికి సమాయత్తం కావాలని కొంత మంది నాయకులు ప్రతిపాదించా రు. సమావేశంలో పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కె.ఎస్.ఎన్.రావు, జె.అయోధ్యరామ్, డి.వి.రమణారెడ్డి, జి.గణపతిరెడ్డి, జి.ఆర్.కె.నాయుడు, బి.డేవిడ్, వరసాల శ్రీనివాస్, నమ్మి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ హాస్టళ్లలో ఉన్నత ప్రమాణాలు
మంత్రి డోలా ఆదేశం కొమ్మాది: సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చేరుతున్న విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారం, విద్య అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాలని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. రుషికొండ దరి గీతం వర్సిటీలో ఉమ్మడి ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు, అధికారులతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. హాస్టళ్లలో సీట్ల భర్తీ, టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణత, హాస్టల్ భవనాల మరమ్మతులు, డైట్ బిల్లుల చెల్లింపు, పారిశుధ్య నిర్వహణ, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, వసతి తదితర అంశాలపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ లావణ్యవేణి, కార్యదర్శి ఎం.ఎం.నాయక్లతో కలసి జిల్లాల వారీగా సమీక్షించారు. గత ఏడాది నీట్లో స్వల్ప తేడాతో సీట్లు పొందలేకపోయిన ఎస్సీ విద్యార్థుల కోసం లాంగ్ టెర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. హాస్టల్లో విద్యార్థులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలు చేయించాలన్నారు. హాస్టళ్ల అభివృద్ధిలో భాగంగా రూ.100 కోట్లతో 29 నూతన భవనాలు, రూ.58 కోట్లతో మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. విశాఖ జిల్లా ఉపసంచాలకుడు కె.రామారావు, డీడీ లక్ష్మీసుధ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ తరగతులు పీఎంపాలెం: రాష్ట్ర ప్రభుత్వం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సోమవారం ప్రారంభించారు. పరదేశిపాలెం సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 8 నెలల పాటు ఈ ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి నెలకు రూ. 2.5లక్షల వేతనంతో జర్మనీలో నర్సింగ్ ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. మొదటి దశలో 75 మందికి అవకాశం ఉండగా, ప్రాథమికంగా ఆసక్తి చూపిన 29 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారని చెప్పారు.సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పాల్గొన్నారు. -
త్వరలో ఏబీజీ పరీక్షలు
మహారాణిపేట: కింగ్ జార్జి ఆస్పత్రి(కేజీహెచ్)లో ఆర్జీ రియల్ బ్లడ్గ్లాస్(ఏబీజీ) పరీక్షలు నిలిచిన వ్యవహారంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి స్పందించారు. సోమవారం సాక్షి దినపత్రికలో ‘రక్త ‘పరీక్ష’లే..!’శీర్షికన వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీంతో సూపరిండెంటెంట్ వాణి రేడియాలజీ, ల్యాబ్ టెస్టులు నిర్వహించే సిబ్బందితో సోమవారం సమావేశమయ్యారు. తక్షణం పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే స్థానికంగా కొనుగోలుచేసి ఏబీజీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. -
స్టీల్ప్లాంట్ డీజీఎం ఇంట్లో చోరీ
పెదగంట్యాడ: స్టీల్ప్లాంట్ డీజీఎం ఇంట్లో చోరీ చేసిన నిందితుడిని 24 గంటల్లో పట్టుకున్నామని డీసీపీ లతామాధురి చెప్పారు. గాజువాక పోలీస్స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్టీల్ప్లాంట్ సెక్టార్–6, క్వార్టర్ నెం.105–బిలో స్టీల్ప్లాంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ డీజీఎం నల్లి సుందరం కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఈ నెల 16న ఆయన తన భార్యతో కలసి మధ్యాహ్నం 12.15 గంటలకు ఒక ఫంక్షన్ వెళ్లారు. తిరిగి 1.50 గంటలకు ఇంటికి వచ్చారు. మెయిన్ డోర్, ఫస్ట్ ఫ్లోర్ డోర్ తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా లాకర్ కూడా విరగ్గొట్టి ఉండడంతో అందులో ఉన్న 24 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్టీల్ప్లాంట్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సవాల్గా తీసుకున్న నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, డీసీపీ కె.లతామాధురి ఆదేశాల మేరకు సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. ఈ బృందం సాంకేతిక ఆధారాలతో కేవలం 24 గంటల్లోనే నిందితుడు మాటూరి శ్రీను(30)ను అరెస్టు చేసింది. చోరీ సొత్తు రికవరీ : నిందితుడి నుంచి పోలీసులు బంగారు గాజులు పది, బ్రేస్లెట్లు నాలుగు, చెవులీలు 23 జతలు, ఒక చెయిన్, నాలుగు జతల చెవి దిద్దులు, ఆరు ఉంగరాలు, మూడు లాకెట్స్, నల్లపూసల దండ ఒకటి కలిపి మొత్తం 24 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. నిందితుడి నుంచి మోటర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మాటూరి శ్రీను పాత నేరస్తుడని డీసీపీ లతామాధురి తెలిపారు. అగనంపూడి ఉప్పర కాలనీకి చెందిన శ్రీనుపై 2021లో అచ్యుతాపురం పోలీస్స్టేషన్ పరిధిలో దొంగతనం కేసు ఉందన్నారు. ప్రస్తుతం నిందితుడు శ్రీకాకుళం జిల్లా బూర్జలోని అత్తారింట్లో ఉంటూ కొబ్బరికాయలు దింపే పని చేస్తున్నాడని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు బానిస కావడంతో చోరీలు చేస్తున్నట్లు తెలిపారు. 24 గంటల్లోనే నిందితుడి అరెస్టు -
ఆహార ప్రయోగం..ఇంకెప్పుడు?
బీచ్రోడ్డు: జీవనశైలి మార్పులతో పాటు కలుషితమైన ఆహారం నేటి తరంలో ఊబకాయం, క్యాన్సర్, షుగర్ వంటి వ్యాధులు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది. బయటి ఆహారంపై ప్రజలు ఆధారపడటంతో, ఆహార భద్రత పర్యవేక్షణ అత్యంత కీలకంగా మారింది. అయితే ప్రజారోగ్యానికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన స్టేట్ ఫుడ్ ల్యాబ్ ఇంకా అందుబాటులోకి రాకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. సొంత ల్యాబ్ ఎందుకు లేదు? రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి స్టేట్ ఫుడ్ ల్యాబ్ను మంజూరు చేసింది. విశాఖలోని పెదవాల్తేరు ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ ని ర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రూ.30 కోట్లు ఖర్చు చేశాయి. రెండేళ్ల కిందటే భవన నిర్మాణం పూర్తయింది. 2024 ఫిబ్రవరి 25న ప్రధాని మోదీ వర్చువల్గా ఈ ల్యాబ్ను ప్రారంభించారు. అయితే దాదాపు ఏడాదిన్నర కాలం గడిచినా ఈ ల్యాబ్ సేవలు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీంతో 11 ఏళ్లుగా సొంత ఆహార పరీక్ష కేంద్రం లేని ఏకై క రాష్ట్రంగా ఏపీ నిలిచింది. చిన్న రాష్ట్రాలకు సైతం సొంత ల్యాబ్లు ఉండగా, ఏపీ మాత్రం తెలంగాణపై ఆధారపడటం విమర్శలకు దారితీస్తోంది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన మంత్రి ప్రారంభించిన కొద్ది రోజులకే ఎన్నికల కోడ్ అమలుల్లోకి వచ్చింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ల్యాబ్పై దృష్టి పెట్టలేదు. ఈ నిర్లక్ష్యంపై కూటమిలో భాగమైన బీజేపీ నాయకులు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ సేవలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం, అత్యాధునిక పరికరాలు నిరుపయోగంగా మారతాయని హెచ్చరిస్తున్నారు. పరీక్షల కోసం కోట్ల వ్యయం ఆహార భద్రత ప్రమాణాల శాఖ అధికారులు తనిఖీల్లో సేకరించిన నమూనాలను హైదరాబాద్కు పంపిస్తున్నారు. దీని వల్ల ఒక్కో నమూనాకు రూ.20 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. నెలవారీగా ఈ ఖర్చు సుమారు రూ. 5 కోట్లకు చేరుతుందని అంచనా. ఇటీవల విశాఖలో 20 బృందాలు తనిఖీలు చేసి పంపిన 79 నమూనాలకు సుమారు రూ.కోటి వ్యయం అవుతుంది. నమూనాలను ఇతర రాష్ట్రాలకు పంపడం వల్ల కమీషన్లు వస్తున్నాయని, అందుకే ఉన్నతాధికారులు ల్యాబ్ ప్రారంభం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మూలకు చేరిన పరికరాలు : ల్యాబ్లో ఆయిల్స్, పప్పులు, పాలు, పాల ఉత్పత్తులు, చాక్లెట్స్, బిస్కెట్స్, సాఫ్ట్ డ్రింక్స్ వంటి 17 రకాల ఆహార పదార్థాలను పరీక్షించేందుకు అవసరమైన 30 రకాల అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని పూర్తిగా ఇన్స్టాల్ చేయలేదు. ఈ ల్యాబ్ నిర్వహణకు అవసరమైన 70 మంది సిబ్బంది నియామక ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. రూ.110 కోట్లు కేటాయించినా ప్రయోజనం శూన్యం గత వైస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఆహార భద్రత కోసం రూ. 110 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు ఆహార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా విశాఖలో ఈ కేంద్రాన్ని నిర్మించింది. భవన నిర్మాణంతో పాటు సుమారు రూ. 10 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయినా.. ల్యాబ్ సేవలు అందుబాటులోకి రాలేదు. అందని ఆహార ప్రయోగశాల సేవలు -
‘దేవుడా.. ఈ రోజు ప్రాణాలతో ఉంచు!’
సాక్షి, విశాఖపట్నం: ‘బ్రహ్మపుత్ర నదిలో రాఫ్టింగ్ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే ప్రవాహం పెరిగింది. పెద్ద అలలా నీరు రావడం, అదే సమయంలో రాళ్లు ఎక్కువగా ఉండటంతో రాఫ్ట్ అదుపు తప్పి కిందపడిపోయాను. బ్రహ్మపుత్ర ప్రయాణమే ఆఖరుదని అనుకున్నాను. ఆ క్షణంలో దేవుడ్ని, దేశాన్ని ప్రారి్థంచుకున్నాను. కష్టమ్మీద మళ్లీ రాఫ్ట్లోకి ఎక్కాను. ఇక అక్కడి నుంచి వెనుదిరగలేదు. ప్రపంచ రికార్డు సాధించే దిశగా సాగిన మా ప్రయాణం విజయవంతమైంది. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందాను’అని వెల్లడించారు ఆర్మీ మేజర్, వైద్యాధికారి వాసుపల్లి కవిత. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన మేజర్ కవిత.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. విశాఖలోని తూర్పు నౌకాదళానికి ఇటీవల వచ్చిన ఆమె తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. దేవుడికి, దేశానికి ప్రారి్థంచి.. 1,040 కిలోమీటర్ల బ్రహ్మపుత్ర నదిని 28 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇండో–టిబెటెన్ బోర్డర్ నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు వరకు మా ప్రయాణం సాగింది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం చేసి, దేవుడికి, దేశానికి ప్రారి్థంచి మా ప్రయాణం మొదలుపెట్టేవాళ్లం. 28 రోజుల్లో పూర్తి చేయాలంటే సమయం వృథా చేయకూడదు. అందుకే ఆహారం కూడా మితంగా, బోట్లోనే తీసుకునేవాళ్లం. ఒక్కోసారి 12 గంటలపాటు ఏకధాటిగా రాఫ్టింగ్ చేశాం. అనుకున్నది సాధించాం. సాహస క్రీడలకు స్వర్గధామం ‘అడ్వెంచర్ స్పోర్ట్స్లో భారత్ వెనుకబడి ఉంది.. మన దేశంలో వీటికి ప్రాధాన్యం లేదు’అని చాలా మంది అంటారు. మేం దానిపైనే దృష్టి సారించాం. ఈ రాఫ్టింగ్తో ఒక మెట్టు ఎక్కాం. ఇకపై బ్రహ్మపుత్ర రివర్ రాఫ్టింగ్ పేరు చెబితే మొదట మా పేరే వినిపిస్తుంది. ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి ఉన్న ప్రాధాన్యం సాహస పర్యాటకానికి లేదు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, జీవ వైవిధ్యంతో కూడిన సాహస పర్యాటకానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావాలన్నదే మా ప్రయత్నం. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు! వైద్యులకు మానసిక స్థైర్యం ఉంటుంది కానీ, శారీరకంగా దృఢంగా ఉండరని చాలా మంది అంటుంటారు. అది తప్పని నిరూపించాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. చిన్నప్పటి నుంచి నా ఆలోచనలు ఇలాగే ఉండేవి. పాఠశాల రోజుల్లో క్రీడలపై ఎక్కువ దృష్టి పెట్టాను. మగవాళ్లతో పోలిస్తే మహిళలు ఎందులోనూ తక్కువ కాదని చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఇప్పుడు దాన్ని నిరూపించాను. రాష్ట్రపతి మెడల్తో ఆత్మవిశ్వాసం అరుణాచల్ప్రదేశ్లో పని చేస్తున్నప్పుడు 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న గోరీచెన్ బేస్ క్యాంప్కు మెడికల్ ఆఫీసర్గా నాలుగైదుసార్లు వెళ్లాను. నన్ను గమనించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ డైరెక్టర్.. ‘మీరు కూడా ట్రెక్ చేయవచ్చు కదా’అని సలహా ఇచ్చారు. అప్పుడే రాఫ్టింగ్ కోర్సులో చేరాను. ఆ సమయంలోనే నేనెందుకు గోరీ చెన్ పర్వతాన్ని అధిరోహించకూడదు? అనిపించింది.నా మీద నాకు నమ్మకం వచ్చాక పర్వతారోహణకు సిద్ధమయ్యాను. ఒక రోజు ట్రెక్లో చాలా మంది ఉన్నారు. పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ వచ్చింది. వెంట్రుకవాసిలో తప్పించుకున్నాను. విజయవంతంగా శిఖరాన్ని చేరి దేశ పతాకాన్ని ఎగురవేశాను. అదే సమయంలో ట్రెక్ చేస్తున్న ఓ మహిళ ఊపిరాడక ఇబ్బంది పడుతోంది. వెంటనే స్పందించి ఆమె ప్రాణాలు కాపాడాను. ఎంబీబీఎస్ చేసినందుకు ఆ రోజు ఎంతో ఆనందం కలిగింది. ఈ సంఘటనకు గానూ రాష్ట్రపతి నుంచి విశిష్ట సేవా పతకం అందుకున్నాను. నాన్న భరోసా.. అమ్మ ఆత్మవిశ్వాసం! నాన్న రామారావు రైల్వే క్లర్క్. అమ్మ గృహిణి. నాకు ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చినా, నా చదువు పూర్తి చేయడానికి నాన్న ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంబీబీఎస్ అయ్యాక పీజీ చేస్తానని చెప్పాను. అప్పుడు నాన్న ఆర్థిక పరిస్థితిని వివరించారు. వైద్య వృత్తిలో స్థిరపడాలనుకుంటున్న సమయంలో, ఆర్మీలో కూడా మెడికల్ ఆఫీసర్గా పనిచేయవచ్చని తెలుసుకున్నాను. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పగా.. రక్షణ రంగం అనగానే వాళ్లు కొంచెం భయపడ్డారు. అక్కడ బాగుంటే కొనసాగుతాను, లేదంటే తిరిగి వచ్చి వైద్య వృత్తిలో స్థిరపడతానని వారికి నచ్చజెప్పాను. నాన్న భరోసా ఇచ్చారు. అమ్మ ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అందుకే కెపె్టన్గా మొదలై.. మేజర్ స్థాయికి చేరుకున్నాను. -
వణుకుతున్న ఉత్తరాంధ్ర
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో 7.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా గుళ్ల సీతారామపురంలో 6.6, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 6, అల్లూరి జిల్లా కొత్తూరులో 5.9 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో పాడేరులో 16.1 సెం.మీ. వర్షం అంతకుముందు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో అల్లూరి జిల్లా పాడేరులో అత్యధికంగా 16.1 సెం.మీ. వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలో 15.5, మాడుగుల, కె.కోటపాడులో 15 సెం.మీ. చొప్పున వర్షం పడింది. విశాఖ జిల్లావ్యాప్తంగా సగటున 24 గంటల వ్యవధిలో 12.5 సెం.మీ., అనకాపల్లి జిల్లాలో సగటున 10.7 సెం.మీ. వర్షం కురిసింది. విజయనగరం జిల్లాలో 5.8, అల్లూరి జిల్లాలో 5.1, శ్రీకాకుళం జిల్లాలో 4.4, కాకినాడ జిల్లాలో 4 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అల్లూరి జిల్లా అతలాకుతలం చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. అల్లూరి జిల్లాలో వాగులు పొంగుతుండటంతో పలుచోట్ల రహదారుల పైకి వరదనీరు చేరుతోంది. కూనవరం మండలంలో కొండ్రాజుపేట కాజ్వే పైకి నీరు చేరడంతో 7 గ్రామాలకు, వీఆర్పురం మండలంలో అన్నవరం వాగు కాజ్వే కూలిపోవడంతో 42 గ్రామాలకు, చింతరేగుపల్లి వద్ద వరదనీరు రహదారిపై ప్రవహిస్తుండడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.చింతూరు మండలంలో కుయిగూరువాగు పొంగి వరద నీరు ఆంధ్రా–ఒడిశా జాతీయ రహదారి–326పై ప్రవహిస్తుండడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు స్తంభించాయి. సోకిలేరు, జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటివాగులు సైతం పొంగడంతో చింతూరు మండలంలో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల చిన్న వంతెనలు కొట్టుకుపోయాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ పరిసరాలు భారీ వర్షంతో జలమయమయ్యాయి. 1.83 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎనీ్టఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరితో పాటు 14 జిల్లాల్లోని 828 గ్రామాల్లో 1.83 లక్షల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. 1.50 లక్షల ఎకరాల్లో వరి, 20 వేల ఎకరాల్లో పత్తి, 5 వేల ఎకరాల్లో మొక్కజొన్న, సజ్జలు, కందులు, వేరుశనగ, పెసలు, మినుము పంటలు ముంపుబారిన పడ్డాయి. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 72 వేల ఎకరాలు, బాపట్ల జిల్లా పరిధిలో 41 వేల ఎకరాలు, పశి్చమ గోదావరిలో 19 వేల ఎకరాలు, కృష్ణాలో 17 వేల ఎకరాలు, ఎనీ్టఆర్ జిల్లాలో 12 వేల ఎకరాలు ముంపునకు గురైనట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో 22 వేల ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లింది. కాగా, భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎస్ కె.విజయానంద్తో సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.నేడు తీరం దాటనున్న వాయుగుండం బంగాళాఖాతంలో విశాఖకు సమీపాన ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రం నుంచి దూరంగా కదిలి వెళ్లింది. ప్రస్తుతం ఒడిశాకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. దక్షిణ ఒడిశా సమీపంలో తీవ్ర అల్పపీడనంగా మారి.. ఒడిశాలోని గోపాల్పూర్కు ఆగ్నేయంగా 38 కి.మీ. దూరంలో, కళింగపటా్ననికి ఈశాన్యంగా 110 కి.మీ. దూరంలో కొనసాగుతోంది. మంగళవారం వేకువజామున మధ్యాహ్నం గోపాల్పూర్ వద్ద తీరం దాటే అవకాశాలున్నాయి. కాగా.. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం వరకూ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గాలుల తీవ్రత గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో ఉంటుందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. 24న మరో అల్పపీడనం! ప్రస్తుత తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 24వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తాంధ్ర తీరాలకు సమీపంలో ఇది ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆ సమయంలో మళ్లీ వర్షాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. -
అప్పారావు వయసు 56 ఏళ్లు... పుట్టింది మాత్రం 1800లో..!
విశాఖపట్నం: భారత ఎన్నికల సంఘం (ఈసీ) నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ‘ఇప్పటికింకా నా వయసు నిండి పదహారేళ్లే’ అన్నట్టుగా, 56 ఏళ్ల వయసున్న ఒక ఓటరు వయసును 225 సంవత్సరాలుగా నమోదు చేసింది. ఈ ఘటనపై సామాజిక కార్యకర్త పట్టా రామ అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం అగనంపూడి నిర్వాసిత కాలనీ కొండయ్యవలసకు చెందిన తన సోదరుడు 1969లో జన్మించారని, ఆయన వయసు 56 ఏళ్లు నిండిందని రామ అప్పారావు తెలిపారు. అయితే ఆయన ఓటరు కార్డులో మాత్రం పుట్టిన తేదీ 01.01.1800గా నమోదై ఉండడం చూసి విస్మయం వ్యక్తం చేశారు. ‘ఇంత గుడ్డిగా ఓటరు నమోదు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఎలా నమోదవుతున్నాయో కూడా అర్థం కావడం లేదని రామ అప్పారావు పేర్కొన్నారు. బ్యాంక్ లావాదేవీలకు ఆధార్ను అనుసంధానం చేసే ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఓటరు నమోదు విషయంలో ఎందుకు ఆధార్ను అనుసంధానం చేయలేకపోతున్నాయో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఈసీ నిర్లక్ష్యానికి, డొల్లతనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. -
ఆదివారం రాత్రి 8 గంటల వరకూ విశాఖ జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు.. ప్రాంతం వర్షపాతం (మి.మీ.ల్లో)
కాపులుప్పాడ 155.4 పరదేశీపాలెం 143.25 భీమునిపట్నం 134.5 ఆనందపురం 132.5 మధురవాడ 129.5 పీఎంపాలెం 118.5 పెదగంట్యాడ 114.7 పెందుర్తి 114.5 వేపగుంట 112.5 అక్కిరెడ్డిపాలెం(పెందుర్తి) 110.0 సుజాతనగర్ 105.0 ఎండాడ 104.8 పాలవలస(పెదగంట్యాడ) 102.0 గాజువాక 94.0 మేఘాద్రిగెడ్డ 93.0 మదీనాబాగ్ 92.5 ఇస్లాంపేట 92.5 శ్రీనగర్ 92.5 దారపాలెం 90.0 నాతయ్యపాలెం 89.0 అగనంపూడి 86.8 గోపాలపట్నం 86.0 షీలానగర్ 84.5 సీతమ్మధార 82.5 కొత్తపాలెం 82.5 మింది 81.5 ముడసర్లోవ 81.0 హెచ్బీ కాలనీ 78.7 కూర్మన్నపాలెం 76.5 ఎన్ఏడీ జంక్షన్ 76.2 -
ఎర్రిగెడ్డలో వ్యర్థాలు వెలికి తీయండి
డాబాగార్డెన్స్: నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యలపై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఆదివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సిటీ ఆపరేషన్స్ సెంటర్ను, అలాగే ఎర్రిగెడ్డ వద్ద వ్యర్థాల తొలగింపు పనులను స్వయంగా పరిశీలించారు. వర్షాల వల్ల చెట్లు కూలడం, కాలువల్లో నీరు నిలవడం వంటి సమస్యలపై ఇప్పటివరకు 41 ఫిర్యాదులు అందాయని, వాటిలో 37 ఫిర్యాదులను ఇప్పటికే పరిష్కరించామని అధికారులు కమిషనర్కు వివరించారు. ఎర్రిగెడ్డలో అధికంగా చేరుతున్న వ్యర్థాలను నిరంతరం తొలగించేందుకు జేసీబీ యంత్రాలను ఉపయోగించాలని కమిషనర్ ఆదేశించారు. -
చరిత్రను వక్రీకరించేందుకే పాఠ్యంశాల తొలగింపు
పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు డాబాగార్డెన్స్: విశాఖపట్నం: చరిత్రను వక్రీకరించే ఉద్దేశంతోనే పాఠ్యాంశాలను తొలగిస్తున్నారని పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. పాఠ్యాంశాలు మార్చినంత మాత్రాన సత్యం మారిపోదన్న అంశంపై ఆదివారం విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్సీఈఆర్టీ సంస్థ 10, 11వ తరగతుల పుస్తకాల్లోని అనేక పాఠ్యాంశాలను తొలగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాఠ్యాంశంలో మౌలానా అబ్దుల్ కలాంకు సంబంధించిన పేరాను, సైన్స్ విభాగంలో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని, జీవశాస్త్రంలో పీరియాడిక్ టేబుల్ను తొలగించారని ఆయన చెప్పారు. ముఖ్యంగా 8వ తరగతి చరిత్ర పుస్తకంలో మొఘల్ చక్రవర్తులైన అక్బర్, బాబర్, షాజహాన్ తదితరుల చరిత్రను పూర్తిగా తొలగించారని లక్ష్మణరావు తెలిపారు. వారిని కేవలం క్రూరులుగా, దుర్మార్గులుగా చూపించే పేరాలను మాత్రమే ఉంచారని విమర్శించారు. ఎర్రకోట, తాజ్మహల్ వంటి నిర్మాణాలు వారి హయాంలో నిర్మించినవేనని గుర్తు చేశారు. సదస్సులో పాల్గొన్న ఏయూ హిస్టరీ విభాగం విశ్రాంత ఆచార్యుడు కె. సూర్యనారాయణ మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ స్థాయిలో చరిత్రలో మార్పులు చేయలేదని అన్నారు. మొఘలులపై ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. భారతదేశం హిందూ దేశం కాదని, ఇక్కడ కోట్లాది మంది ముస్లింలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. చరిత్రలోని మంచి చెడులను యథాతథంగా పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. -
రేకుల షెడ్డు కూలి వృద్ధురాలి మృతి
నేడు పాఠశాలలకు సెలవుకొమ్మాది: కాపులుప్పాడలోని రెడ్డిల పాలెంలో రేకుల షెడ్డు కూలి పాల సింహాచలం (75) అనే వృద్ధురాలు మృతి చెందారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు షెడ్డు గోడలు తడిసిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఆమె కోళ్ల షెడ్డుకు వెళ్లగా ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనపై భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్, కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు, స్థానిక నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆరిలోవ: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు కారణంగా సోమవారం జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరిందిర ప్రసాద్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల రక్షణ, భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ ఆదేశాలు పాటించాలన్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు వర్షం అంతరాయం విశాఖ స్పోర్ట్స్ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో భాగంగా వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరగాల్సిన రెండు మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగించింది. రాయలసీమ రాయల్స్, కాకినాడ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ను ఐదు ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ 69 పరుగులు చేసింది. 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ రాయల్స్ 68 పరుగులే చేయగలిగింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా, ధృవ్ కుమార్ (32) ఒక పరుగు మాత్రమే చేసి రనౌట్ అయ్యాడు. దీంతో కాకినాడ కింగ్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అదేవిధంగా సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం బుల్స్ మధ్య జరగాల్సిన రెండో మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. -
ఐవీఎఫ్ కేంద్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు
మహారాణిపేట: నగరంలోని ‘సృష్టి’ ఐవీఎఫ్ సెంటర్లో అక్రమాలు బయటపడిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాలో ఉన్న ఐవీఎఫ్, సరోగసీ సెంటర్లపై తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. జగదీశ్వరరావు ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు 53 సెంటర్లలో 32 కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి. డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన డాక్టర్ ఉమావతి, డాక్టర్ సమత, డాక్టర్ లూసీ తదితరులు వేర్వేరు బృందాలుగా ఏర్పాటు ఈ సెంటర్లు తనిఖీలను ముమ్మరం చేశారు. చాలా కేంద్రాలు సేవలకు సంబంధించి సరైన రసీదులు ఇవ్వడం లేదని, నగదు లావాదేవీలను పుస్తకాల్లో నమోదు చేయడం లేదని అధికారులు గుర్తించారు.కొన్ని సెంటర్లు 100శాతం గ్యారెంటీ, ‘పిల్లలు పుట్టకపోతే డబ్బులు తిరిగి ఇస్తాం’ వంటి ప్రకటనలతో నిస్సహాయ మహిళలను ఆకర్షించి, వారి నుంచి రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వసూలు చేస్తున్నారని తనిఖీల్లో తేలింది. ఈ దారుణమైన దోపిడీని అరికట్టేందుకు, ప్రతి సెంటర్లో చార్జీల వివరాలను తప్పనిసరిగా బోర్డుపై ప్రదర్శించాలని డాక్టర్ జగదీశ్వరరావు ఆదేశించారు. మిగిలిన కేంద్రాలను కూడా త్వరలో తనిఖీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
రక్త ‘పరీక్ష’లే..!
మహారాణిపేట: ఉత్తరాంధ్రతో పాటు పలు రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో ముఖ్యమైన రక్త పరీక్షలు నిలిచిపోయాయి. దీనివల్ల పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కిడ్నీ, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులను నిర్ధారించే ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ (ఏబీజీ) పరీక్షలు గత కొన్ని రోజులుగా జరగడం లేదు. ఈ పరీక్షలకు అవసరమైన ‘రీజెంట్స్ లిక్విడ్’ సరఫరా లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. గతంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ నుంచి ఈ లిక్విడ్ సరఫరా అయ్యేది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. బయట నుంచి కొనుగోలు చేయడానికి కేజీహెచ్లోని కొంతమంది వైద్యాధికారులు ఇష్టపడకపోవడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందులు ఏబీజీ పరీక్షలో రక్తంలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ శాతాలను విశ్లేషిస్తారు. కిడ్నీ వైఫల్యం, గుండె లోపాలు, డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను నిర్ధారించడానికి ఈ పరీక్షలు అత్యంత కీలకం. గతంలో కేజీహెచ్లో రోజుకు 40 నుంచి 80 మంది రోగులకు ఈ పరీక్షలు చేసేవారు. బయట లేబోరేటరీలలో ఈ పరీక్షకు రూ. 900 నుంచి రూ. 1,300 వరకు ఖర్చవుతుంది. ఆర్థిక స్తోమత లేని పేద రోగులు ఈ పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. యంత్రాలకు మరమ్మతులే కారణం ఈ విషయంపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి మాట్లాడుతూ, ఏబీజీ పరీక్షలకు స్వల్ప అంతరాయం కలిగిందని తెలిపారు. యంత్రాలకు మరమ్మతులు జరుగుతున్నాయని, రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే ‘రీజెంట్స్ లిక్విడ్’ లేకపోవడం గురించి మాత్రం ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. -
హాఫ్ మారథాన్లో దాట్ల రామరాజు 3వ స్థానం
తాటిచెట్లపాలెం: బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో మౌంట్ అబూలో జరిగిన అంతర్జాతీయ హాఫ్ మారథాన్లో విశాఖకు చెందిన దాట్ల రామరాజు మూడో స్థానంలో నిలిచారు. వెటరన్ కేటగిరీలో 21 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 43 నిమిషాల్లో పూర్తిచేసి, విశాఖ కీర్తిని పెంచారు. విశ్వ సౌభ్రాతృత్వం సందేశాన్ని చాటడానికి నిర్వహించిన ఈ మారథాన్లో సుమారు 3,500 మంది జాతీయ, అంతర్జాతీయ రన్నర్లు పాల్గొన్నారు. ఈ విజయాన్ని సాధించినందుకు గాను రామరాజు రూ. 51,000 బహుమతి, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ విజయం పట్ల బ్రహ్మకుమారీస్ రైల్వే న్యూ కాలనీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. -
ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ప్రస్తుతం విశాఖ తీరానికి అతి సమీపంలో కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ సోమవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఇది మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.దీంతో విశాఖ, అనకాపల్లి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీచేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు 20 వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..అల్పపీడన ప్రభావంతో రానున్న రెండ్రోజులు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు.. సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి.కాపులుప్పాడలో అత్యధికంగా 154మి.మీ వర్షపాతం..గడిచిన 24 గంటల్లో విశాఖ జిల్లాలోని కాపులుప్పాడలో 154 మి.మీ, పరదేశీపాలెంలో 142.25, భీమిలిలో 134, పాడేరులో 133.75, ఆనందపురంలో 131.5, మధురవాడలో 129 మి.మీ వర్షపాతం నమోదైంది.కల్లోల తీరం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మత్స్యకారులు తమ వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో పర్యాటకుల్లేక సముద్ర తీరం బోసిపోయింది. – వాకాడు(తిరుపతి జిల్లా) -
ఉక్కురి బిక్కిరి
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిన విధంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వేగంగా అడుగులు వేస్తోంది. ఒక్కో విభాగానికి ఉక్కుసంకెళ్లు బిగిస్తోంది. దీనికి నిదర్శనంగా ఒకే రోజు 32 ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్టు(ఈవోఐ)లను విడుదల చేసింది. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని పదేపదే చెబుతున్న కూటమి నేతలు, ఇప్పుడు కేంద్రం చర్యలు వేగవంతం చేసినా పట్టించుకోకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో కేవలం మొత్తం నిర్వహణ (టోటల్ మెయింటెనెన్స్) పనులను మాత్రమే ప్రైవేటు వారికి అప్పగించగా, ఇప్పుడు ఏకంగా పలు విభాగాల నిర్వహణ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) విడుదల చేయడం ద్వారా కేంద్రం ప్రైవేటీకరణ వైపు దూకుడుగా వెళ్తోందని స్పష్టమవుతోంది. శనివారం ఒక్కరోజే ప్లాంట్లోని పలు విభాగాల నిర్వహణ, మెయింటెనెన్స్ కోసం 32 ఈవోఐలు విడుదల అయ్యాయి. ఇప్పటికే ఆర్ఎంహెచ్పీ, సింటర్ ప్లాంట్ మెయింటెనెన్స్కు ఈవోఐలు జారీ చేసిన కేంద్రం.. ఇప్పుడు «థర్మల్ పవర్ ప్లాంట్–1, థర్మల్ పవర్ ప్లాంట్–2, ఎస్ఎంఎస్ సీసీఎం–4, మాధారం మైన్స్, ఫౌండ్రీ, సెంట్రల్ మెషిన్ షాప్ వంటి అనేక ఇతర విభాగాలకు కూడా విడుదల చేసింది. ఎన్నికలకు ముందు స్టీల్ప్లాంట్ను కాపాడతామని వాగ్దానం చేసిన కూటమి నేతలు గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఒత్తిడి పెరగడంతో ’ప్యాకేజీ’ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని, ఆ ప్యాకేజీలో భాగంగా ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మూడు బ్లాస్ట్ఫర్నేస్లు నడపడం, శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులను గణనీయంగా తగ్గించడం వంటి చర్యలు ప్రారంభించారని వారు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను తగ్గించి, గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటికీ పూర్తి జీతాలు చెల్లించడం లేదని, 33 శాతం జీతం పెండింగ్లో పెట్టారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈవోఐలు అమల్లోకి వస్తే మరింత మంది శాశ్వత ఉద్యోగులను తొలగించే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని ద్వారా తక్కువ మంది శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులతో ప్లాంట్ను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటుందని కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవోఐలు ఉపసంహరించాలి ఈవోఐలు జారీ చేయడం అంటే ప్రైవేటీకరణకు మార్గం చేయడమే. ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చేది ప్రైవేటేజేషన్ చేయడానికి అన్నట్టు ఉంది. పర్మినెంట్ సిబ్బంది నియామకాలు చేపట్టి ప్లాంట్ను వారితో నడిపించాలి. యాజమాన్యం వెంటనే ఈఓఐలు ఉపసంహరించాలి. – కె.ఎస్.ఎన్.రావు, స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ అధ్యక్షుడు ప్రైవేటు వారికి అప్పగించే కుట్రలో భాగం గతంలో మెయింటెనెన్స్ పనులకు ప్రైవేటు టెండర్లు పిలిచేవారు. ఇప్పుడు ప్రధాన విభాగాల నిర్వహణ కూడా ప్రైవేటు వారికి అప్పగించే యత్నమే ఈవోఐలు విడుదల. ప్యాకేజీ ఇచ్చామన్న ప్రభుత్వం ప్లాంట్ను ప్రభుత్వరంగంగా పటిష్టం చేయడం పోయి ఇలాంటి చర్యలకు దిగడం దుర్మార్గం. – మంత్రి రాజశేఖర్, స్టీల్ ఐఎన్టీయూసీ నేతప్లాంట్ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకే..స్టీల్ ప్లాంట్ను వారికి నచ్చిన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకే ఈవోఐలు విడుదల చేశారు. ఇదే జరిగితే స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు తరాలకు ఈ రూపంలో ఉండదు. దీనిపై కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు స్పందించాలి. ఈ అంశంపై ఎటువంటి పోరాటానికైనా సీఐటీయూ సిద్ధంగా ఉంది. – జె.అయోధ్యరామ్, గౌరవాధ్యక్షులు, స్టీల్ సీఐటీయూ -
ఈసీ లీలలపై విస్మయం
వయసు 56 ఏళ్లు... పుట్టింది మాత్రం 1800 సంవత్సరంలో అని నమోదు అగనంపూడి : భారత ఎన్నికల సంఘం (ఈసీ) నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ‘ఇప్పటికింకా నా వయసు నిండి పదహారేళ్లే’ అన్నట్టుగా, 56 ఏళ్ల వయసున్న ఒక ఓటరు వయసును 225 సంవత్సరాలుగా నమోదు చేసింది. ఈ ఘటనపై సామాజిక కార్యకర్త పట్టా రామ అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం అగనంపూడి నిర్వాసిత కాలనీ కొండయ్యవలసకు చెందిన తన సోదరుడు 1969లో జన్మించారని, ఆయన వయసు 56 ఏళ్లు నిండిందని రామ అప్పారావు తెలిపారు. అయితే ఆయన ఓటరు కార్డులో మాత్రం పుట్టిన తేదీ 01.01.1800గా నమోదై ఉండడం చూసి విస్మయం వ్యక్తం చేశారు. ‘ఇంత గుడ్డిగా ఓటరు నమోదు ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఎలా నమోదవుతున్నాయో కూడా అర్థం కావడం లేదని రామ అప్పారావు పేర్కొన్నారు. బ్యాంక్ లావాదేవీలకు ఆధార్ను అనుసంధానం చేసే ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఓటరు నమోదు విషయంలో ఎందుకు ఆధార్ను అనుసంధానం చేయలేకపోతున్నాయో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఈసీ నిర్లక్ష్యానికి, డొల్లతనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. పుట్టిన తేదీ 1800గా నమోదైన పట్టా రమణ ఓటరు కార్డు -
తల్లిదండ్రులకు చిన్నారుల అప్పగింత
కొమ్మాది: పీఎంపాలేనికి చెందిన ఐదుగురు చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పకుండా ఆదివారం రుషికొండ బీచ్కు వచ్చారు. వర్షం పడుతున్నప్పటికీ ఐదుగురు చిన్నారులు ఆ ప్రాంతంలో తిరుగుతుండటం చూసి మైరెన్ పోలీసులు వారిని ప్రశ్నించారు. తాము పీఎంపాలెం నుంచి తల్లిదండ్రులకు చెప్పకుండా ఇక్కడకు వచ్చామని కె.హర్షిన్, ఎ.హశ్వంత్, పి.కల్యాణి, ఎ.హర్షిత, ఎ.వంశీ తెలిపారు. వెంటనే పోలీసులు వారి నుంచి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకుని.. వారికి సమాచారం అందించారు. రుషికొండకు చేరుకున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను సురక్షితంగా అప్పగించారు. -
ఉన్మాదుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, వారి వేధింపులకు భయపడి మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మరికొందరు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, దళిత మహిళా నేత మంచా నాగ మల్లేశ్వరి మండిపడ్డారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు లైంగికంగా వేధిస్తున్నారని, పనులు కావాలంటే పక్కన పడుకోవాలని మహిళలను వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక దళిత మహిళా ఉద్యోగినిని లైంగికంగా వేధించారని, అందరి ముందు అవమానించారని ఆమె అన్నారు. మరో టీడీపీ ఎమ్మెల్యే నజీర్ కారణంగా ఒక మహిళ ఆత్మహత్య చేసుకుందని, ఎమ్మెల్యే ఆదిమూలం వేధింపులకు భయపడి ఒక మహిళ రాష్ట్రం విడిచి వెళ్లిపోయిందని ఆమె పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం టీడీపీ ఎమ్మెల్యే రాజు తన పార్టీ నాయకుడు చెప్పిన వారికి సీటు ఇవ్వలేదనే కారణంతో ఒక మహిళా ఉద్యోగినిని అందరి ముందు బండ బూతులు తిట్టారని, దాంతో ఆమె స్పృహ కోల్పోయి పడిపోయారని తెలిపారు. ఇలా ప్రజా ప్రతినిధులే మహిళలను వేధిస్తుంటే, ఆ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు మరింతగా అఘాయిత్యాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దళిత మహిళలపై దాడులు, వేధింపులు జరుగుతున్నా దళిత హోంమంత్రి వంగలపూడి అనిత నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఆ కామ పిశాచులను అరెస్ట్ చేయడం లేదని ఆమె ఆరోపించారు. అనంతపురంలో 14 ఏళ్ల మైనర్ బాలికపై 14 మంది టీడీపీ కార్యకర్తలు లైంగికదాడికిపాల్పడి హత్య చేస్తే, వారిపై చర్యలు లేవని, కనీసం హోంమంత్రి బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. ఇలాంటి చేతగాని హోంమంత్రి అనిత ఆ పదవికి అనర్హురాలని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడిన టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై ఫిర్యాదులను సీరియస్గా తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా దళితులంతా ఉద్యమిస్తామని నాగమల్లేశ్వరి హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మంచా నాగ మల్లేశ్వరి ఆగ్రహం -
గంజాయి తరలిస్తున్న కారు డ్రైవర్కు రిమాండ్
ఏడాదిన్నర బాలుడి మృతికి ఇతనే కారణం మర్రిపాలెం: ఊర్వశి జంక్షన్ సమీపంలో ఈ నెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఏడాదిన్నర వయసున్న వర్షిత్ అనే బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నెల 16న కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు కారును తనిఖీ చేయగా.. అందులో 21 కిలోల గంజాయి లభించింది. దీంతో పోలీసులు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలివి. తమిళనాడుకు చెందిన అర్జునన్ జెమినీ అధ్ముఘం ఈ నెల 12న విజయవాడలో ఒక ప్రైవేట్ సంస్థ నుంచి ఆన్లైన్ ద్వారా కారును అద్దెకు తీసుకున్నాడు. ఆ కారులో అతను అరకు వెళ్లి సుమారు 21 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. గంజాయితో ఎన్ఏడీ కొత్తరోడ్డు మీదుగా విశాఖ రైల్వే స్టేషన్ వైపు వస్తున్న క్రమంలో.. ఊర్వశి జంక్షన్ బీఆర్టీఎస్ రహదారిపై రోడ్డు దాటుతున్న దంపతులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు వర్షిత్ గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కంచరపాలెం పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు కారు తాళాలు కనిపించకపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు డూప్లికేట్ తాళాలను తెప్పించి కారును తనిఖీ చేశారు. కారు వెనుక డిక్కీలో 21 కిలోల గంజాయిని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే కంచరపాలెం శాంతి భద్రతల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అర్జునన్ను విచారించి రిమాండ్కు తరలించారు. గంజాయి వ్యవహారంలో అతనికి ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
అన్నవరం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను కాకినాడ జిల్లా అన్నవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అన్నవరం పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆదివారం రాత్రి విలేకరులకు వివరాలు తెలిపారు. అన్నవరం, తుని పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల పలు దొంగతనాలు జరగడంతో, ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు పర్యవేక్షణలో అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు, అడిషనల్ ఎస్సై ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన అడపా జోగాఅమర్ గంగాధర్, అల్లూరి జిల్లా రంపచోడవరానికి చెందిన అడపా సూర్యచంద్రపై అనుమానంతో పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం ఉదయం వారిద్దరూ మండపాం సెంటర్లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసిన నేరాలను వారు అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసి, వారిచ్చిన సమాచారంతో రూ.9.80 లక్షల విలువైన 500 గ్రాముల వెండి వస్తువులు, అమ్మవారి గుడిలో అపహరించిన రోల్డ్గోల్డ్ హారం, మూడు బుల్లెట్లు, ఆరు మోటార్ బైకులు, నాలుగు స్కూటీలు, ఎల్ఈడీ టీవీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హైదరాబాద్ పోలీస్స్టేషన్లో రెండు, విశాఖపట్నం జిల్లా అరిలోవ పోలీస్స్టేషన్లో ఒకటి, అన్నవరం పోలీస్స్టేషన్లో ఎనిమిది, తుని రూరల్ పోలీస్స్టేషన్లో మూడు, ప్రత్తిపాడు, తుని టౌన్ పోలీస్స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదైనట్టు డీఎస్పీ వివరించారు. వీరిని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు చెప్పారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురికి గాయాలు
కూర్మన్నపాలెం: గాజువాకలో ఒక గ్యాస్ సిలిండర్ నుంచి మరొక సిలిండర్లోకి గ్యాస్ మార్చే క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొత్తగాజువాకకు చెందిన ఎం. కృష్ణ (56), పాతగాజువాకకు చెందిన ఎన్. లక్ష్మి (48), ఆమె మనుమరాలు శిరీష (8) ఉన్నారు. వీరందరికీ ముఖం, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణ అనధికారికంగా గ్యాస్ రీఫిల్లింగ్ వ్యాపారం చేస్తున్నాడు. లక్ష్మి తన మనుమరాలితో కలిసి గ్యాస్ నింపుకోవడానికి వచ్చినప్పుడు, చిన్నారి శిరీష పక్కనే ఉన్న లైటర్ వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈపీడీసీఎల్లో బదిలీల బంతాట!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గతంలో జరిగిన జిల్లాల విభజనకు అనుగుణంగా ఈపీడీసీఎల్లో సర్కిళ్లను విభజించారు. అయితే ఇప్పుడు ఆయా సర్కిళ్లకు అనుగుణంగా ఉద్యోగులను బదిలీ చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేయడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. ఈ బదిలీల ప్రక్రియలో జూనియర్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా బదిలీ అయిన సర్కిల్లోనే ఉద్యోగ విరమణ వరకు విధులు నిర్వర్తించాలన్న ప్రభుత్వ షరతుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. మరోవైపు కొత్తగా జిల్లాల పునర్విభజన జరగవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పుడే బదిలీలు చేపట్టవద్దని ఉద్యోగులు కోరుతున్నారు. అయినా అధికారులు ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. బదిలీ మార్గదర్శకాలపై అసంతృప్తి రెండేళ్ల కిందట జరిగిన సర్కిళ్ల పునర్విభజనకు అనుగుణంగా బదిలీలు చేసేందుకు ఈపీడీసీఎల్ అధికార యంత్రాంగం సిద్ధమైంది. గతంలో ఈపీడీసీఎల్ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరుతో కలిపి మొత్తం 5 సర్కిళ్లు ఉండేవి. జిల్లాల పునర్విభజన తర్వాత సర్కిళ్ల సంఖ్య 11కి పెరిగింది. అవి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సర్కిళ్లు. అయితే సర్కిళ్లు విభజించినప్పటికీ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బదిలీలు చేపట్టేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. జూనియర్లను బలిచేసేలా మార్గదర్శకాలు? సర్కిళ్ల ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నట్లు ఇటీవలే మార్గదర్శకాలు విడుదలయ్యాయి. కొత్తగా వచ్చిన సర్కిళ్లకు బదిలీపై వెళ్లాల్సి ఉంటుందని.. ఏ సర్కిల్కు వెళ్లాలో నిర్ణయించుకోవాలంటూ ఆప్షన్లు ఇచ్చింది. కొత్తగా ఏర్పాటైన ఆరు సర్కిళ్లకు బదిలీలుండనుండగా.. ఉద్యోగి నేస్తం పోర్టల్లో ఆప్షన్లు పెట్టుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో జూనియర్లనే ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం విధించిన షరతు జూనియర్లలో మరింత ఆందోళన రేపుతోంది. ఈ ప్రక్రియలో సీనియర్లకు మాత్రమే ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఇచ్చారు. దీంతో 90 శాతానికి పైగా సీనియర్లు బదిలీ నుంచి తప్పించుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. కొద్దిమంది సీనియర్లు మాత్రమే అనారోగ్యం వంటి కారణాలతో సొంత జిల్లాకు బదిలీ అయ్యేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జూనియర్లకే ఎక్కువగా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. బదిలీ అయిన ఉద్యోగి తన ఉద్యోగ విరమణ వరకు అదే సర్కిల్లో పనిచేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ షరతు వల్ల జూనియర్లు పదోన్నతులు పొంది ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో.. జూనియర్ అసిస్టెంట్లు 470 సీనియర్ అసిస్టెంట్లు 626 టైపిస్ట్/యూడీస్టెనో/ఎల్డీ స్టెనో 66 సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లు 107 పునర్విభజన జరిగితే మళ్లీ బదిలీలు చేస్తారా? వచ్చే వారం పది రోజుల్లో బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. జూనియర్లకు ఇబ్బందులకు గురి చేయకుండా.. పాత పద్ధతిలోనే బదిలీలు చేపట్టాలని, బదిలీలలో పారదర్శకత పాటించాలని కోరుతున్నాయి. మరోసారి జిల్లాల పునర్విభజన జరిగితే కొత్త సర్కిళ్లు ఏర్పడతాయని, అప్పుడు మళ్లీ బదిలీలు చేయాల్సి ఉంటుందని ఉద్యోగులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియను నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
అంతర్రాష్ట్ర బస్సులట.. ఫ్రీగా కుదరదట!
చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సింహాచలం (విశాఖ): టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలకు చెందిన మహిళలు నోచుకోవడంలేదు. ఇక్కడ తిరుగుతున్న బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులని.. వీటికి స్త్రీశక్తి పథకం వర్తించదంటూ వాటిపై స్టిక్కర్లు అతికించి, బోర్డులు పెట్టి మరీ సర్వీసులు నడుపుతున్నారు. విలీన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాకల్లో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాకు చెందిన పలు బస్సులు నిత్యం తిరుగుతుంటాయి. ఆంధ్రాలోని విజయవాడ, గన్నవరం, కాకినాడ, గోకవరం, రాజమహేంద్రవరం, రాజోలు డిపోలకు చెందిన బస్సులు ఆయా మండలాల మీదుగా తెలంగాణలోని భద్రాచలం వరకు ప్రతిరోజూ తిరుగుతాయి. అలాగే, వీఆర్పురం నుండి కూనవరం మీదుగా భద్రాచలానికి షటిల్ సర్వీసులుగా పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయి. నిన్నటివరకు విలీన మండలాల్లో మామూలుగానే తిరిగిన ఈ బస్సులు.. స్త్రీశక్తి పథకం ప్రారంభమైన వెంటనే ‘అంతర్రాష్ట్ర సర్వీసు.. స్త్రీశక్తి పథకం వర్తించదు’.. అంటూ బస్సులపై బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో ప్రభుత్వ తీరుపై ఇక్కడి మహిళలు మండిపడుతున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులంటూ తమకు ఉచిత ప్రయాణం లేకుండా చేస్తున్నారంటున్నారు. ఆంధ్రా సరిహద్దుల నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో వున్న తమకు ఈ పథకం నిలిపివేయడం దారుణమని వారు వాపోతున్నారు. మరోవైపు.. విజయవాడ, గన్నవరం డిపోలకు చెందిన బస్సులు భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్లోని కుంట, ఒడిశాలోని మోటు పేరుతో సర్వీసులు నడుస్తున్నాయి. ఇవి ఆయా రాష్ట్రాల్లోకి వెళ్లకుండా కేవలం సరిహద్దుల వరకు మాత్రమే నడుస్తున్నాయి. వీటిల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం వర్తింపచేయకుండా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులంటూ బోర్డులు పెడుతున్నారు. ఆంధ్రాలోనైనా వర్తింపచేయాలి.. ఇక భద్రాచలం నుండి విలీన మండలాలకు వచ్చే బస్సులకు సంబంధించి నెల్లిపాక వరకు టికెట్ తీసుకుని అక్కడి నుండి ఆంధ్రానే కనుక ఉచిత బస్సు ప్రయాణం అనుమతించాలని మహిళలు కోరుతున్నారు. అదేవిధంగా.. కాకినాడ, రాజమహేంద్రవరం, రాజోలు, గోకవరం డిపోల నుండి భద్రాచలం వెళ్లే సర్వీసులకు నెల్లిపాక వరకు ఉచిత ప్రయాణం అనుమతించి అక్కడి నుండి భద్రాచలానికి టికెట్ తీసుకోవాలని వారు కోరుతున్నారు. మా ప్రాంతం ఈ రాష్ట్రంలో లేదా? రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వర్తిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం మా ప్రాంతానికి ఎందుకు వర్తించదు? మా ప్రాంతం ఈ రాష్ట్రంలో లేకుండా పోయిందా అనేది ప్రభుత్వం చెప్పాలి. ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో జీవించడమే మేం చేసిన నేరమా.. అడ్డగోలు నిబంధనలతో ఈప్రాంత మహిళలకు అన్యాయం చేయడం సబబు కాదు. – ముచ్చిక లక్ష్మి, మామిళ్లగూడెం, చింతూరు మండలం సింహాచలంలో సరికొత్త సమస్య.. ఇదిలా ఉంటే.. సింహాచలం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో కొత్త సమస్య ఎదురైంది. కొండపైకి వెళ్లే ఒక్కో ప్రయాణికుడి టికెట్ ధర రూ.25 కాగా.. అందులో రూ.5 దేవస్థానానికి చెల్లించడం ఆనవాయితీ. ఇప్పుడు మహిళలకు జీరో టికెట్ ఇస్తుండటంతో, దేవస్థానానికి చెల్లించాల్సిన రూ.5 అంశంపై చర్చ జరుగుతోంది. ఈ మొత్తం చెల్లిస్తారా లేదా అనే దానిపై స్పష్టత కరువైంది. -
విశాఖ, అల్లూరి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
సాక్షి,విశాఖ: ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఫలితంగా వాతావరణ శాఖ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాబోయే మూడు రోజులు రాయలసీమలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురవునున్నాయి. ఈ క్రమంలో విశాఖ జిల్లాలోని ప్రైవేట్,ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు మంజూరు చేస్తూ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. -
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..ప్రైవేటీకరణ దిశగా స్టీల్ ప్లాంట్
సాక్షి,విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎన్నికల హామీని చంద్రబాబు ప్రభుత్వం నిలబెట్టు కోలేకపోతుంది. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ జరగకుండా కాపాడుతామని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా 32 విభాగాలను ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లను పిలిచిన స్టీల్ యాజమాన్యం.. సెప్టెంబర్ 9వ తేదీ టెండర్ల దాఖలకు ఆఖరి తేదీ విధించింది.ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) విధానంలో1)టీపీపీ, 2) ఎస్ ఎం ఎస్-1&2, 3)ఎంఎంఎస్ఎం, 4)ఎస్బిఎం, 5)డబ్ల్యూఆర్ఎం-1&2, 6) మాదారం మైన్స్, 7) రోల్షాప్అండ్ రిపేర్ షాప్ -1&2, 8) సిఎంఎస్, 9) ఫౌండ్రీ, 10)ఎస్టీఎం, 11)ఈఎన్ఎండి, 12) బ్లాస్ట్ ఫర్నిస్-1,2&3లను ప్రైవేట్ పరం చేసేందుకు టెండర్లను పిలిచింది. -
మూడురోజుల పాటు భారీ వర్షాలు.. ఏపీకి ‘రెడ్ అలర్ట్’
సాక్షి,విశాఖ: ఏపీకి మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఫలితంగా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. కర్నూల్, నెల్లూరు, తిరుపతి,చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బంగాఖాతంలో ఏర్పడిన వాయిగుండం కారణంగా మరో మూడు రోజులపాటు కొనసాగనున్న భారీ వర్షాలు కురియనున్నాయి. ప్రస్తుతం తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ సమయంలో మరో మూడు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ దక్షిణ ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. 19న కోస్తాంధ్ర అంతటా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ప్రఖర్ జైన్ సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కూటమి సర్కార్ మరో వెన్నుపోటు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కూటమి సర్కార్ వెన్నుపోటు పొడిచింది. ఉక్కు పరిశ్రమలో మరో కీలక విభాగం ప్రైవేటీకరణకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే పలు కీలక విభాగాలు ప్రైవేటుకు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో కార్మిక సంఘాలు భగ్గుమంటున్నారు. దశల వారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రైవేటీకరణ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.స్టీల్ప్లాంట్ ఆసక్తి వ్యక్తీకరణ జాబితాలోకి మరో విభాగం చేరింది. శనివారం విడుదల చేసిన నోటీసులో స్టీల్ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ (టీపీపీ)–1కు సంబంధించి యాజమాన్యం ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) జారీ చేసింది. ‘కాంప్రహెన్సివ్ టెక్నికల్ మేనేజ్ మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కేప్టివ్ పవర్ ప్లాంట్–1 అండ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్’ పనులకు సంబంధించి ఈవోఐ దాఖలుకు సెప్టెంబర్ 9న ఆఖరు తేదీగా నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం బిడ్లు తెరవనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వైజాగ్ స్టీల్ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. -
స్టీల్ప్లాంట్ టౌన్షిప్లో భారీ చోరీ
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ టౌన్షిప్లోని ఓ క్వార్టర్లో పట్టపగలు భారీ దొంగతనం జరిగింది. హెచ్ఆర్ అధికారి ఎన్. సుందరం కుటుంబం బయటకు వెళ్లిన గంటన్నరలోనే ఈ చోరీ జరిగినట్లు క్రైమ్ పోలీసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుందరం దంపతులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు తలుపు గడియ విరిగి ఉంది. లోపల బీరువా కూడా పగలగొట్టి ఉంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్రైమ్ పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దొంగలు బీరువాలో ఉన్న 24 తులాల బంగారు ఆభరణాలను తీసుకెళ్లగా, అదే బీరువాలో ఉన్న మరో 40 తులాల బంగారాన్ని వదిలేయడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. క్లూస్ టీం ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సీసీ కెమెరాలపై ఏర్పాటు చేసుకోండి చోరీల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నప్పటికీ, స్టీల్ప్లాంట్ టౌన్షిప్లో ఎవరూ వాటిని ఏర్పాటు చేసుకోవడం లేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనం జరిగిన తర్వాత బాధపడటం కన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని సీఐ శ్రీనివాసరావు అన్నారు. -
ఇల బృందావనం
సీతంపేట/ఎంవీపీకాలనీ/తరగపువలస/ కొమ్మాది: నగరంలో కృష్ణాష్టమి వేడుకలు శనివారం కనులపండువగా జరిగాయి. సంస్కారభారతి ఆధ్వర్యంలో ద్వారకానగర్ శ్రీకృష్ణ విద్యామందిర్ ప్రాంగణం గోకుల బృందావనాన్ని తలపించింది. ‘బాలగోకులం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముద్దులొలికే చిన్ని కృష్ణులు, రాధలు, గోపికల వేషధారణలో సుమారు 170 మంది చిన్నారులు పాల్గొన్నారు. నెలల పసికందుల నుంచి ఎనిమిదేళ్ల బాలల వరకు.. బుడి బుడి అడుగులతో, చిలిపి నవ్వులతో నడిచొచ్చిన ఆ బాలగోపాలురను చూసి ఆహూతులు మురిసిపోయారు. బలరామకృష్ణులుగా, రాధాకృష్ణులుగా చిన్నారులు చేసిన సందడితో ఆ ప్రాంగణమంతా నందనవనంగా మారింది. ఉట్టి కొట్టే ఉత్సవంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, శ్రీకృష్ణుని లీలలను స్మరణకు తెచ్చారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ విద్యా మందిర్ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణుని లీలలు’ఘట్టాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణుని జననం నుంచి కంసవధ వరకు సాగిన ముఖ్య ఘట్టాలను(రోలుకు కట్టడం, కుబేర పుత్రుల శాప విమోచనం, ఇంద్రోత్సవం, గోవర్ధన గిరి ధారణ, కాళీయ మర్దనం, కంసవధ) కళ్లకు కట్టినట్లు ప్రదర్శించి, వాటి అంతరార్థాలను, ఆధ్యాత్మిక విశేషాలను సందర్శకులకు వివరించారు. -
చాపరాయికి పోటెత్తారు
డుంబ్రిగుడ: వీకెండ్ కావడంతో సందర్శకులు పోటెత్తారు. చాపరాయి జలవిహారి సందర్శనకు శనివారం భారీగా తరలివచ్చారు. అయితే భారీ వర్షాలకు చాపరాయి గెడ్డ పొంగే అవకాశం ఉన్నందున కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు రెండు రోజులుగా సందర్శకులను నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో వారంతా నిరాశకు గురయ్యారు. చాపరాయి జలవిహారి ప్రాంతంలో ప్రకృతి అందాలను తిలకిస్తూ ఫొటోలు దిగారు. ముఖద్వారం వద్ద స్థానిక థింసా కళాకారులతో కలిసి సందడి చేశారు. కొంత మంది పర్యాటకులు గిరిజన వస్త్రధారణలో ముస్తాబై ఫొటోలు తీసుకున్నారు. -
‘దేవుడా.. ఈ రోజు ప్రాణాలతో ఉంచు!’
సాక్షి, విశాఖపట్నం: ‘బ్రహ్మపుత్ర నదిలో రాఫ్టింగ్ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే ప్రవాహం పెరిగింది. పెద్ద అలలా నీరు రావడం, అదే సమయంలో రాళ్లు ఎక్కువగా ఉండటంతో రాఫ్ట్ అదుపు తప్పి కిందపడిపోయాను. బ్రహ్మపుత్ర ప్రయాణమే ఆఖరుదని అనుకున్నాను. ఆ క్షణంలో దేవుడ్ని, దేశాన్ని ప్రార్థించుకున్నాను. కష్టమ్మీద మళ్లీ రాఫ్ట్లోకి ఎక్కాను. ఇక అక్కడి నుంచి వెనుదిరగలేదు. ప్రపంచ రికార్డు సాధించే దిశగా సాగిన మా ప్రయాణం విజయవంతమైంది. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందాను’అని వెల్లడించారు ఆర్మీ మేజర్, వైద్యాధికారి వాసుపల్లి కవిత. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన మేజర్ కవిత.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. విశాఖలోని తూర్పు నౌకాదళానికి ఇటీవల వచ్చిన ఆమె తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. దేవుడికి, దేశానికి ప్రార్థించి.. 1,040 కిలోమీటర్ల బ్రహ్మపుత్ర నదిని 28 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇండో–టిబెటెన్ బోర్డర్ నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు వరకు మా ప్రయాణం సాగింది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం చేసి, దేవుడికి, దేశానికి ప్రార్థించి మా ప్రయాణం మొదలుపెట్టేవాళ్లం. 28 రోజుల్లో పూర్తి చేయాలంటే సమయం వృథా చేయకూడదు. అందుకే ఆహారం కూడా మితంగా, బోట్లోనే తీసుకునేవాళ్లం. ఒక్కోసారి 12 గంటలపాటు ఏకధాటిగా రాఫ్టింగ్ చేశాం. అనుకున్నది సాధించాం. సాహస క్రీడలకు స్వర్గధామం ‘అడ్వెంచర్ స్పోర్ట్స్లో భారత్ వెనుకబడి ఉంది.. మన దేశంలో వీటికి ప్రాధాన్యం లేదు’అని చాలా మంది అంటారు. మేం దానిపైనే దృష్టి సారించాం. ఈ రాఫ్టింగ్తో ఒక మెట్టు ఎక్కాం. ఇకపై బ్రహ్మపుత్ర రివర్ రాఫ్టింగ్ పేరు చెబితే మొదట మా పేరే వినిపిస్తుంది. ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి ఉన్న ప్రాధాన్యం సాహస పర్యాటకానికి లేదు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, జీవ వైవిధ్యంతో కూడిన సాహస పర్యాటకానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావాలన్నదే మా ప్రయత్నం. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు! వైద్యులకు మానసిక స్థైర్యం ఉంటుంది కానీ, శారీరకంగా దృఢంగా ఉండరని చాలా మంది అంటుంటారు. అది తప్పని నిరూపించాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. చిన్నప్పటి నుంచి నా ఆలోచనలు ఇలాగే ఉండేవి. పాఠశాల రోజుల్లో క్రీడలపై ఎక్కువ దృష్టి పెట్టాను. మగవాళ్లతో పోలిస్తే మహిళలు ఎందులోనూ తక్కువ కాదని చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఇప్పుడు దాన్ని నిరూపించాను. రాష్ట్రపతి మెడల్తో ఆత్మవిశ్వాసం అరుణాచల్ప్రదేశ్లో పని చేస్తున్నప్పుడు 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న గోరీచెన్ బేస్ క్యాంప్కు మెడికల్ ఆఫీసర్గా నాలుగైదుసార్లు వెళ్లాను. నన్ను గమనించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ డైరెక్టర్.. ‘మీరు కూడా ట్రెక్ చేయవచ్చు కదా’అని సలహా ఇచ్చారు. అప్పుడే రాఫ్టింగ్ కోర్సులో చేరాను. ఆ సమయంలోనే నేనెందుకు గోరీ చెన్ పర్వతాన్ని అధిరోహించకూడదు? అనిపించింది. నా మీద నాకు నమ్మకం వచ్చాక పర్వతారోహణకు సిద్ధమయ్యాను. ఒక రోజు ట్రెక్లో చాలా మంది ఉన్నారు. పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ వచ్చింది. వెంట్రుకవాసిలో తప్పించుకున్నాను. విజయవంతంగా శిఖరాన్ని చేరి దేశ పతాకాన్ని ఎగురవేశాను. అదే సమయంలో ట్రెక్ చేస్తున్న ఓ మహిళ ఊపిరాడక ఇబ్బంది పడుతోంది. వెంటనే స్పందించి ఆమె ప్రాణాలు కాపాడాను. ఎంబీబీఎస్ చేసినందుకు ఆ రోజు ఎంతో ఆనందం కలిగింది. ఈ సంఘటనకు గానూ రాష్ట్రపతి నుంచి విశిష్ట సేవా పతకం అందుకున్నాను. నాన్న భరోసా.. అమ్మ ఆత్మవిశ్వాసం! నాన్న రామారావు రైల్వే క్లర్క్. అమ్మ గృహిణి. నాకు ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చినా, నా చదువు పూర్తి చేయడానికి నాన్న ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంబీబీఎస్ అయ్యాక పీజీ చేస్తానని చెప్పాను. అప్పుడు నాన్న ఆర్థిక పరిస్థితిని వివరించారు. వైద్య వృత్తిలో స్థిరపడాలనుకుంటున్న సమయంలో, ఆర్మీలో కూడా మెడికల్ ఆఫీసర్గా పనిచేయవచ్చని తెలుసుకున్నాను. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పగా.. రక్షణ రంగం అనగానే వాళ్లు కొంచెం భయపడ్డారు. అక్కడ బాగుంటే కొనసాగుతాను, లేదంటే తిరిగి వచ్చి వైద్య వృత్తిలో స్థిరపడతానని వారికి నచ్చజెప్పాను. నాన్న భరోసా ఇచ్చారు. అమ్మ ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అందుకే కెప్టెన్గా మొదలై.. మేజర్ స్థాయికి చేరుకున్నాను. ఎవరెస్ట్ ఎక్కుతా.. పీజీ చేస్తా! ఈ ప్రపంచ రికార్డు నన్ను మరిన్ని సాహస యాత్రల వైపు నడిపిస్తోంది. సింధు ఉపనది జస్కర్ నదిలో రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నాను. రాఫ్టింగ్ క్రీడకు పుట్టినిల్లు అయిన అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన కొలరాడో నదిలో రాఫ్టింగ్ చేయాలన్నది నా కోరిక. మకాలు పర్వతారోహణతో పాటు ప్రతిష్టాత్మకమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కూడా అడుగులు వేస్తున్నాను. వైద్య వృత్తిలో భాగంగా స్పోర్ట్స్ మెడిసిన్ లేదా ఆప్తమాలజీలో పీజీ కూడా చేస్తాను. మేజర్ కవితకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసలు(ఫైల్) సుడిగుండంలో చిక్కుకున్నా.. మొదటి రోజు ప్రయాణం చాలా సవాలుగా అనిపించింది. రాక్ సర్ఫింగ్ సమయంలో రాఫ్ట్ బోల్తాపడి రాళ్ల మధ్య ఇరుక్కుపోయాను. సేఫ్టీ కయాక్ను పట్టుకొని 200 మీటర్ల వరకు ప్రయాణించాను. రెస్క్యూ సిబ్బంది సాయంతో అతి కష్టం మీద మళ్లీ రాఫ్ట్లోకి వచ్చాను. కొద్ది దూరం వెళ్లాక, మరోసారి టీమ్ మొత్తం 6 అడుగుల లోతైన నీటిలో పడిపోయాం. అక్కడ ఏర్పడిన సుడిగుండంలో నేను చిక్కుకున్నప్పుడు ఇక నా పని అయిపోయిందని అనుకున్నాను. ‘ప్రతి నిమిషం నిన్ను నువ్వు రక్షించుకోవడానికి, నీ టీమ్ను నడిపించడానికి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కో’అని అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి.. బలంగా ప్రయత్నించి బయటపడ్డాను. ఇలా వారం రోజుల పాటు ప్రయాణం నరకప్రాయంగా సాగింది. అయినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. నిర్దేశించుకున్న 28 రోజుల్లో 1,040 కిలోమీటర్ల రివర్ రాఫ్టింగ్ను విజయవంతంగా పూర్తి చేశాం. -
రాయల్స్ విజయం
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారివిశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్లో భాగంగా వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్లో అమరావతి రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో సింహాద్రి వైజాగ్ లయన్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్ జట్టు తొమ్మిది వికెట్లకు 139 పరుగులే చేసింది. ఓపెనర్ అభిషేక్ ఒక పరుగుకే పెవిలియన్ చేరగా.. పవన్ కుమార్(30)తో మరో ఓపెనర్ హానీష్ వీరారెడ్డి కలిసి స్కోర్ను 51 పరుగులకు చేర్చారు. కెప్టెన్ రికీబుయ్ ఐదు పరుగులకే వెనుతిరగ్గా వీరారెడ్డి (41) 87 పరుగుల వద్ద ఔటయ్యాడు. సందీప్(10), దుర్గాకుమార్(14), అజయ్కుమార్(18) రెండంకెల స్కోర్లే చేయగలిగారు. సందీప్ మూడు వికెట్లు తీయగా హనుమ విహారి, అయ్యప్ప, సంతోష్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ప్రతిగా రాయల్స్ జట్టు 15 ఓవర్లలోనే ఆటను ముగించేసింది. కెప్టెన్ హనుమ విహారి 62, ప్రసాద్ 21, ప్రణీత్ 44 పరుగులతో రాణించారు. విజయ్ రెండు, దుర్గాకుమార్ ఒక వికెట్ తీశారు. వారియర్స్ గెలుపు ఫ్లడ్లైట్ల వెలుతురులో జరిగిన మరో మ్యాచ్లో తుంగభద్ర వారియర్స్ విజయం సాధించింది. టాస్ ఓడి కాకినాడ కింగ్స్ తొలుత బ్యాటింగ్కు దిగింది. 4.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసిన స్థితిలో వరుణుడు రాకతో మ్యాచ్ ఆగింది. ఆటను ఏడు ఓవర్లకు కుదించగా తిరిగి ఇన్నింగ్స్ కొనసాగించిన కింగ్స్ ఏడు వికెట్లు కోల్పోయి 37 పరుగులే చేసింది. మనీష్ 14 పరుగులు చేయగలిగాడు. స్టీఫెన్, తోషిత్ రెండేసి వికెట్లు తీశారు. ప్రతిగా వారియర్స్ ఓపెనర్లు జ్ఞానేశ్వర్(15), ప్రశాంత్(25) వికెట్ కోల్పోకుండానే 13 బంతుల్లోనే విజయాన్నందించారు. -
సర్దార్ గౌతు లచ్చన్నకు ఘన నివాళి
కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ డాబాగార్డెన్స్: భావితర పౌరులందరూ సర్దార్ గౌతు లచ్చన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, దేశాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా.. శనివారం నగరంలోని జడ్జి కోర్టు సమీపంలోని ఆయన విగ్రహానికి పలువురు బీసీ నేతలు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 35 ఏళ్ల పాటు లచ్చన్న శాసనసభ్యుడిగా పనిచేసి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ప్రజల కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. లచ్చన్న కుటుంబ సభ్యులు, యార్లగడ్డ వెంకన్న చౌదరి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు, ప్రొఫెసర్ వివేకానందమూర్తి, కేశాని వెంకటేశ్వరరావు, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు గుత్తుల మధుసూదనరావు, బమ్మిడి రమణ, పితాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అసలు దోషి ఎవరు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవినీతి కథలో అసలు దొంగలు తప్పించుకున్నారా? మొత్తంగా వసూలు చేసిన రెండు లక్షల్లో పట్టుకుంది రూ.50 వేలేనా..? మిగిలిన రూ.లక్షన్నర అప్పటికే వేరే వాళ్ల జేబులోకి వెళ్లిపోయిందా? అయితే ఎవరి జేబులోకి వెళ్లిందనే కోణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలివిగా ఎస్ఐను ఇరికించి తప్పించుకున్న అసలు దోషిని తేల్చే పనిలో ఏసీబీ అధికారులు పడినట్టు సమాచారం. వాస్తవానికి అనకాపల్లిలో ఒక కేసు విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ దాసరి ఈశ్వరరావును ఈ నెల 14వ తేదీన ఎస్ఐను ఏసీబీ అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో అసలు దోషి మాత్రం తెలివిగా దొరకకుండా తప్పించుకున్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. మొత్తంగా సదరు బాధితుడి నుంచి రూ. 2 లక్షల మేర వసూలు చేసినట్టు విచారణలో తేలినట్టు సమాచారం. అంతకు ముందు నేరుగా స్టేషన్లోనే రూ.లక్షన్నర తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రూ.లక్షన్నర ఎవరు తీసుకున్నారు? ఎవరికి అప్పగించారు అనే కోణంలో లోతుగా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం. ‘విజయ’వంతంగా చక్రం తిప్పిందెవరు...? వాస్తవానికి గత ఏడేనిమిదేళ్లుగా అనకాపల్లి ప్రాంతంలోనే ఎస్ఐ ఈశ్వరరావు విధులు నిర్వర్తిస్తున్నారు. కశింకోట, అనకాపల్లి రూరల్, సీసీఎస్ తదితర పోస్టింగులు నిర్వర్తించారు. గత ఏడాది కాలంగా అనకాపల్లి టౌన్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. ఆయనపై గతంలో ఎన్నడూ ఈ తరహా భారీ అవినీతి ఆరోపణలు లేవనే పేరు డిపార్టుమెంటులో ఉంది. ప్రధానంగా టౌన్ స్టేషన్కు వచ్చిన తర్వాత ఈ వసూళ్ల ఆరోపణలు మొదలైనట్టు తెలుస్తోంది. అన్ని వ్యవహారాల్లోనూ సదరు ఎస్ఐ ఈశ్వరరావును ముందుపెట్టి వసూళ్లకు దింపి.. ‘విజయ’వంతంగా వ్యవహారం నడిపింది ఎవరనేది తేలాల్సి ఉంది. ఏసీబీ అధికారులు కూడా ఈ కోణంలో ఇప్పటికే విచారణ చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇవేకాకుండా పలు వ్యవహారాల్లో కూడా ఎస్ఐ ద్వారా నడిపించిన వసూళ్ల కథలో అసలు సూత్రధారి కోసం అన్వేషణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. రూ.50 వేలు తీసుకుంటూ దొరికిన ఎస్ఐ నుంచి ఈ సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించినట్టు కూడా ప్రచారం గుప్పుమంటోంది. అంతేకాకుండా సదరు బాధితుడు కూడా గతంలో తాను రూ.లక్షన్నర ముట్టచెప్పినట్టు కూడా ముందుగానే ఏసీబీ అధికారులకు సమాచారం అందించారని కూడా పోలీసుశాఖలో ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఈ కోణంలో విచారణ జరిపి అసలు దోషిని పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ముందుకెళ్లకుండా అడ్డుతగులుతున్నారని కూడా పోలీసుశాఖలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఎస్ఐను పావుగా వాడుకుంటూ...! వాస్తవానికి సదరు స్టేషన్లో అసలు వ్యవహారాలు నడిపిస్తున్న వ్యక్తి కాస్తా ఎస్ఐను పావుగా వాడుకుంటున్నట్టు సమాచారం. ప్రిన్సిపల్ ఎస్ఐవి నువ్వేనంటూ వసూళ్లకు దింపినట్టు తెలుస్తోంది. గతంలో ఇదే ప్రాంతంలో పనిచేసిన సమయంలో ఒక భూమి వ్యవహారంలో తలదూర్చడంతో ఫిర్యాదులు ఎదుర్కొన్న సదరు వ్యక్తినే ఈ లంచాల అవతారంలో కూడా కీలక సూత్రధారిగా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. అంతేకాకుండా స్థానికంగా అక్రమ మైనింగ్ వ్యవహారంలో కూడా నెలవారీగా భారీగానే వసూళ్లకు దిగినట్టు తెలుస్తోంది. గతంలో పలు ఆరోపణలతో పోస్టింగుకు దూరంగా ఉన్న సదరు వ్యక్తి.. ప్రస్తుతం రెచ్చిపోతున్నట్టు సమాచారం. అందినకాడికి ప్రతీ ఒక్క వ్యవహారంలోనూ మాముళ్లకు తెగబడినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, అత్యంత తెలివిగా నేరుగా రంగంలోకి దిగకుండా ఎవరినో ఒకరిని ముందుకుపెట్టి కథ నడిపిస్తూ.. విజయవంతంగా ముందుకెళుతున్నారనే పేరు ఉంది. ఈ వ్యవహారంలో అదృశ్య శక్తులు ఇప్పటికే అడ్డుతగులుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఏ విధంగా ముందుకెళతారో? చూడాల్సి ఉంది. -
పునఃప్రారంభం
కేజీహెచ్లో గుండె శస్త్రచికిత్సలు డాబాగార్డెన్స్: ఎట్టకేలకు పేదోడి గుండెకు భరోసా లభించింది. ఉత్తరాంధ్రలోనే పెద్దాస్పత్రిగా పేరుపొందిన కేజీహెచ్లో గుండె శస్త్ర చికిత్సలు పునః ప్రారంభమయ్యాయి. ‘సాక్షి’ వరుస కథనాలతో కూటమి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కార్డియో విభాగంలో పరికరాలు మూలకు చేరి ఏడు నెలలుగా గుండె సంబంధిత సర్జరీలు నిలిచిపోయాయి. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. కేజీహెచ్పై కూటమి నిర్లక్ష్యం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల ఆరోగ్య భద్రతకు నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఆస్పత్రులను అభివృద్ధి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేద వాడి వైద్యాన్ని గాలికి వదిలేసింది. ఒకవైపు మందుల కొరత వెంటాడుతోంది. గతంలో నెల రోజులకు సరిపడా మందులు ఒకేసారి అందించారు. కానీ ఇపుడు వారం, పది రోజులకు మాత్రమే ఇస్తున్నారు. ప్రధానంగా కీలకమైన కార్డియాలజీ విభాగంగా అధునాతన పరికరాలు మూలకు చేరాయి. వీటిని మరమ్మతులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. దీంతో గత ఏడు నెలలుగా గుండె సంబంధిత సర్జరీలు నిలిచిపోయాయి. సాక్షి వరుస కథనాలతో.. కేజీహెచ్లో ఏడు నెలలుగా గుండె శస్త్ర చికిత్సలు నిలిచిపోవడంతో ‘సాక్షి’ పత్రిక వరుస కథనాలను ప్రచురించింది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ కేజీహెచ్కు సాయం చేయాలని కోరుతూ బిక్షాటన చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో ప్రభుత్వం కదలిక మొదలైంది. ఏడు నెలల తర్వాత సర్జరీ.. ఏడు నెలల తర్వాత కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో చేపట్టిన సర్జరీ విజయవంతమైంది. శనివారం బోడపాటి మావుళ్లు (70)కు అధునాతన హార్ట్–లంగ్ మెషిన్, టెంపరేచర్ కంట్రోల్ మెషిన్ సహాయంతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ మనిత, డాక్టర్ సతీష్, స్టాఫ్ నర్స్ భవాని, ఇతర పారా మెడికల్ సిబ్బందిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, సీఎస్ఆర్ఎంవో అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ యు.శ్రీహరి, అడ్మినిస్ట్రేటర్ బీవీ రమణ అభినందించారు. ఇకపై ఈ అధునాతన మెషిన్ ద్వారా గుండె శస్త్ర చికిత్సలు నిరంతరాయంగా కొనసాగుతాయని సూపరింటెండెంట్ తెలిపారు. -
అందరి వద్దా అప్పులే...!
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తివేసింది. ఈ స్థానంలో ప్రైవేటు దుకాణాలకు తెరలేపింది. దీంతో ఈయన వసూళ్లకు మంచి అవకాశం లభించింది. తన పరిధిలో ఏర్పాటైన ప్రతీ ప్రైవేటు మద్యం దుకాణం యజమాని నుంచి ఆయన అప్పులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా అప్పులు ఇచ్చేందుకు నిరాకరిస్తే... ఏదో ఒక సాకుతో ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా ప్రైవేటు మద్యం దుకాణదారుల నుంచి లక్షల్లో అప్పులు తీసుకున్నారు. అంతేకాకుండా బార్ల యజమానుల నుంచి కూడా అప్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. మొత్తంగా రూ.లక్షల్లో తీసుకున్న అప్పులను ఆయన ఎవరికీ తిరిగి చెల్లించలేదని సమాచారం. వీరందరూ కాస్తా ఉన్నతాధికారులకు సిఫారసు చేయడంతో సెలవులో వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. అయితే, తాను సెలవులో మాత్రమే వెళుతున్నానని, తిరిగి ఇక్కడకే వస్తానంటూ పరోక్షంగా బెదిరింపులకు దిగుతూ.. అప్పులిచ్చిన వారు తిరిగి అడగకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాకుండా నేరుగా చినబాబు పేరు కూడా చెబుతుండటంతో ఎవరూ నోరెత్తడం లేదని సమాచారం. -
ఎకై ్సజ్ శాఖలో అప్పుల అప్పారావు!
● సెలవులో పంపిన ఉన్నతాధికారులు ● అప్పులు అడగకుండా ఎత్తుగడలు ● చినబాబు అండ ఉందంటూ పరోక్ష బెదిరింపులు ● తిరిగి ఇక్కడికే వస్తానంటూ హెచ్చరికలు మద్యం దుకాణదారుల వద్ద రూ.లక్షల్లో వసూళ్లుసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం అప్పుల అప్పారావు... ఇది సినిమా పేరు కాదు. విశాఖలోని ఎకై ్సజ్ సీఐకు ఉన్న మరో మారుపేరు. గతంలోనే అనేక ఆరోపణలతో జైలుకు కూడా వెళ్లి వచ్చిన సీఐ తన అసలు బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. పైగా కీలకమైన శివారు ప్రాంతంలో పోస్టింగును పై నుంచి ఒత్తిడి తెచ్చి మరీ దక్కించుకున్న ఆయన యథావిధిగా వసూళ్లకు దిగారు. తనకు అవసరాలు ఉన్నాయి.. అప్పు ఇవ్వాలంటూ తెలిసిన అన్ని మద్యం షాపుల యాజమానులతో పాటు బార్ల యజమానుల నుంచి భారీగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. రూ.లక్షల్లో ఇలా వసూలు చేసిన నేపథ్యంలో సెలవులో వెళ్లాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. తద్వారా గత నెల రోజులుగా కార్యాలయం వైపునకు సదరు సీఐ రాలేదని సమాచారం. అప్పటివరకు పక్క స్టేషన్ ఎకై ్సజ్ సీఐకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో తిరిగి తానే ఇక్కడకు వస్తానంటూ చెబుతున్నారని.. చినబాబు సిఫార్సుతో మరోసారి ఇక్కడే రాజ్యమేలుతానని కూడా పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. తద్వారా తనకు అప్పులిచ్చిన వారు తిరిగి అడగకుండా ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్నట్టు ఎకై ్సజ్ శాఖలో ప్రచారం జరుగుతోంది. పోస్టింగుపైనా రచ్చ రచ్చే..! వాస్తవానికి సదరు సీఐ పోస్టింగు వ్యవహారంలోనూ ఎకై ్సజ్శాఖలో మొదట రచ్చ రచ్చ నడిచింది. మొదటగా మహారాణిపేట సీఐగా పోస్టింగు కోసం ఆయన ప్రయత్నించారు. అయితే, ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయనే పోస్టింగు ఇచ్చేందుకు వెలగపూడి ఒప్పుకోలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాకుండా విశాఖలో ఎక్కడా పోస్టింగు ఇచ్చేందుకు ఆయన అంగీకరించకపోవడంతో పాటు ఇతర ఎమ్మెల్యేలకు కూడా సూచించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే తనకున్న పలుకుబడితో నేరుగా చినబాబు ద్వారా సిఫారసు చేయించుకుని శివారు ప్రాంతంలో పోస్టింగును ఆయన దక్కించుకోవడం గమనార్హం. కీలకమైన ఆ స్టేషన్లో అప్పటికే ఓ సీఐను నియమించగా ఆయన్ని తప్పించి మరీ ఈయన పోస్టింగ్ పొందాడు. సీనియర్ ఎమ్మెల్యే కూడా పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఆయన పోస్టింగ్కు తలూపినట్టు ప్రచారం జరిగింది. నిజానికి ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. దొంగచలానాల కేసులో ఆయన కేసులను ఎదుర్కోవడంతో పాటు జైలుకు కూడా వెళ్లొచ్చారు. గతంలో నడిచిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వసూలైన మొత్తంలో వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటి అధికారిని మొదటగా ఇక్కడ నియమించేందుకు పోస్టింగు వ్యవహారాలన్నీ చూసిన వెలగపూడి ఒప్పుకోలేదు. అయినప్పటికీ పైన తనకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి సీనియర్ ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చి మరీ పోస్టింగును దక్కించుకున్నట్టు తెలుస్తోంది. -
ఇల బృందావనం
గంభీరంలోని హరేకృష్ణ వైకుంఠంలో పవిత్ర జలాలతో శ్రీరాధా మదన్మోహనులకు జలాభిషేకంఎంవీపీకాలనీలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో రాధాకృష్ణులకు పుష్పాభిషేకంధర్మ సంస్థాపనార్థం ద్వాపరయుగంలో అవతరించిన శ్రీకృష్ణ పరమాత్ముడు.. కలియుగంలో చిన్నారుల రూపంలో భూవికి దిగివచ్చాడా అన్నట్లు నగరంలో కృష్ణాష్టమి వేడుకలు కనులపండువగా జరిగాయి. జిల్లా పరిషత్ సమీపంలోని కృష్ణ చైతన్య మఠం, హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్, గంభీరం ఐఐఎం రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠం, సాగర్నగర్ ఇస్కాన్ మందిరంలో జరిగిన వేడుకలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లాయి.108 పవిత్ర జల కలశాలతో, ఫలరసాలు, పంచగవ్యాలు, సుగంధ పుష్పాలతో స్వామికి జరిగిన మహోన్నత మహాభిషేకం భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తింది. నగరమంతా హరే కృష్ణ నామస్మరణతో మార్మోగి.. భక్తి సాగరంలో ఓలలాడింది. -
ముంచెత్తిన వాన
జ్ఞానాపురం చావులమదుం వద్ద..సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నా.. నగరం వైపు మాత్రం వరుణుడు కన్నెత్తి చూడలేదు. విశాఖ చుట్టుపక్కలా వర్షాలు పడుతున్నా.. నగరంలో మాత్రం భారీ వర్షమే కరువైంది. ఎట్టకేలకు విశాఖవాసుల వర్షపు దాహాన్ని వరుణ దేవుడు తీర్చాడు. విశాఖకు సమీపంలో ఉన్న రుతుపవన ద్రోణి, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో శనివారం రాత్రి ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షం.. మహా నగరాన్ని ముంచెత్తింది. గెడ్డలు పొంగిపొర్లాయి. రహదారులు జలమయమైపోయాయి. లోతట్టుప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్థంగా మారడం, డ్రైన్లు శుభ్రం చెయ్యకపోవడంతో కాలువల్లో పూడిక పేరుకుపోయింది. దీంతో వరద నీరు పారే అవకాశం లేక.. నగరం జలమయమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో.. వాహనాలు కదిలే వీలు లేక ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అక్కయ్యపాలెంలో కురుస్తున్న వర్షం -
3 రోజుల పాటు కోస్తాలో అతి భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: దక్షిణ ఛత్తీస్గడ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీటి ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు, సీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.19న కోస్తాంధ్ర అంతటా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ప్రఖర్ జైన్ సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
మహిళలను మోసం చేయడం సూపర్ హిటా?: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: ఉచిత బస్సు పేరుతో మహిళా ఆశలను బస్ టైర్ల కింద తొక్కేశారంటూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళను మోసం చేశారంటూ చంద్రబాబు సర్కార్ని నిలదీశారు. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లోకేష్ మహిళను మోసం చేశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘16 రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఎన్నికలు ముందు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రయాణం చేయొచ్చంటూ హామీ ఇచ్చారు. శ్రావణ శుక్రవారం రోజున మహిళలను చీటింగ్ చేశారు. మహిళలను మోసం చేయడం సూపర్ హిట్ నా..?. చీఫ్ మినిస్టర్ అంటే చంద్రబాబు చీటింగ్ మాస్టర్గా మారారు. కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారింది’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.‘‘పదహారు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలకు అనుమతి ఇవ్వాలి. పది 15 బస్సులు మారితే గానీ తిరుపతి వెళ్లడం సాధ్యం కాదు. లగేజీతో మహిళలు 15 బస్సులు మారి తిరుపతి వెళ్లగలరా..?. తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం అన్నవరం, విజయవాడ నో ఫ్రీ బస్.. రెండున్నర కోట్ల మంది మహిళను మోసం చేశారు. చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల ఖర్చు తగ్గించుకుంటే మహిళలు అందరూ అన్ని బస్సల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు’’ అంటూ వరుదు కల్యాణి కళ్యాణి వ్యాఖ్యానించారు.‘‘లోకేష్ మీ మేనత్తలు ఏనాడైనా మీ నాన్నకు రాఖీలు కట్టారా?. మీ ఇంటి శుభకార్యాల్లో మీ మేనత్తలను మీ నాన్నా పిలిసారా?. హెరిటేజ్లో ఎంత వాటా మీ నాన్న మీ మేనత్తలకు ఇచ్చారు?. మహిళా గౌరవం గురించి మాట్లాడే అర్హత లోకేష్కు ఉందా?. పవన్ కళ్యాణ్ తల్లిని పది కోట్లు ఖర్చు చేసి లోకేష్ తిట్టించలేదా?’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు. -
ఎంత పని చేశావు సుశీల..!
విశాఖపట్నం జిల్లా: మండలంలోని చూచుకొండ గ్రామానికి చెందిన వివాహిత సుశీల (35)శుక్రవారం ఆత్యహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. చూచుకొండ గ్రామానికి చెందిన ఆడారి సూరి నాగేశ్వరరావు,సుశీల దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సుశీల మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు తరచూ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయిస్తున్నారు. కాగా తన కుమారుడితో కలిసి సుశీల పొలం పనులకు వెళ్లింది. పని పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం కొంతసేపటి తరువాత కుమారుడు ఇంటికి వెళ్లేసరికి సుశీల ఫ్యాన్కు ఉరివేసుకుని ఉంది. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దించిన కుమారుడు, మునగపాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని అనకాపల్లి వందపడకల ఆస్పత్రి తరలించారు.చదవండి: అల్లుడితో అత్త వివాహేతర సంబంధం..! -
దొంగతనం కేసులో ఇరికించారని యువకుడి ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లా: దొంగతనం కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్న మనస్తాపంతో గడ్డి మందు తాగిన అయితంపూడికి చెందిన ముచ్చకర్ల కృష్ణమూర్తి (22) పదకొండు రోజులపాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. ఆ అభాగ్యుడి మృతితో గుండె మండిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసేందుకు యత్నించగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వివరాలు.. మూడు నెలల కిందట బుచ్చెయ్యపేట మండలం అయితంపూడి గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో అనుమానితుడైన అయితరెడ్డి శివకుమార్తోపాటు మృతుడు ముచ్చకర్ల కృష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరిద్దరూ నేరం అంగీకరించినట్టు పోలీసుల కథనం. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని పోలీసులు శివకుమార్, కృష్ణమూర్తిని రిమాండ్కు తరలించారు. బెయిల్పై వచ్చిన కృష్ణమూర్తి ఈనెల 4వ తేదీన గడ్డి మందు తాగి విశాఖ కేజీహెచ్లో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. కేజీహెచ్లో చికిత్స పొందుతుండగానే.. తాను దొంగతనం చేయలేదని, అనవసరంగా తనను కేసులో ఇరికించారని, ఇందుకు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు బుచ్చెయ్యపేట పోలీసులే కారణమని నోట్ రాశాడు. యువకుడి మరణంతో ఉద్రిక్తత కృష్ణమూర్తి శుక్రవారం కేజీహెచ్లో మరణించడంతో.. తన కుమారుడి చావుకు కారణమైన పోలీసులపైన, దొంగతనం కేసులో ఇరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కృష్ణమూర్తి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బుచ్చెయ్యపేట పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేయడానికి యతి్నంచారు. పోలీసులు వీరిని మధ్యలోనే అడ్డుకున్నారు. కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్కు రాకుండా సుమారు 50 మంది పోలీసులు బారికేడ్లతో వీరిని అడ్డుకున్నారు. దీంతో కృష్ణమూర్తి తల్లిదండ్రులు ముచ్చకర్ల మహాలక్ష్మి, మంగమ్మ, అన్నయ్య సత్యనారాయణమూర్తి, ఇతర కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కృష్ణమూర్తి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదని నినాదాలు చేశారు. మృతదేహం అడ్డగింత కృష్ణమూర్తి భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విశాఖ కేజీహెచ్ నుంచి వ్యానులో బయలుదేరారు. కృష్ణమూర్తి మృతదేహాన్ని అయితంపూడి తీసుకురాకుండా బుచ్చెయ్యపేట పోలీస్స్టేషన్కు తరలించి న్యాయం జరిగే వరకు ఆందోళన చేయడానికి నిర్ణయించి రాత్రి 7 గంటలకే బుచ్చెయ్యపేటకు మృతుని కుటుంబ సభ్యులు చేరుకున్నారు. స్టేషన్కు వెళ్లకుండా వారిని బారికేడ్లతో పోలీసులు అడ్డుకోవడంతో మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం చెందారు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో బుచ్చెయ్యపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యాను బుచ్చెయ్యపేట రాకుండా రాజాం మీదుగా పెదమదీన నుంచి అయితంపూడి గ్రామానికి పంపించారు. అయితంపూడి గ్రామంలోకి రాకుండా పైడంపేట వద్దే కృష్ణమూర్తి మృతదేహం ఉన్న వ్యానును కుటుంబ సభ్యులు అడ్డుకుని బుచ్చెయ్యపేట తరలించడానికి ప్రయతి్నంచారు. పోలీసులు మాత్రం కృష్ణమూర్తి మృతదేహాన్ని బుచ్చెయ్యపేట వెళ్లకుండా అడ్డుకోవడంతో అర్ధరాత్రి కడపటి వార్తలు అందే వరకు ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. -
ప్రగతి పథంలో వాల్తేరు డివిజన్
తాటిచెట్లపాలెం: ఈస్ట్కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ పరిధిలోని రైల్వే ఫుట్బాల్ గ్రౌండ్స్లో 79వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. డీఆర్ఎం లలిత్బోహ్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఆర్పీఎఫ్, సివిల్ డిఫెన్స్ బృంద సభ్యుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన వాల్తేర్ డివిజన్ సాధించిన ప్రగతిని వివరిస్తూ.. ‘బ్లూచిప్ డివిజన్’గా ప్రకాశిస్తోందన్నారు. వాల్తేర్ డివిజన్ కల్చరల్ అసోసియేషన్, స్కౌట్స్ అండ్ గైడ్స్, రైల్వే ఉద్యోగులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. రైల్వే భద్రతా దళం ప్రదర్శించిన డేర్ డెవిల్స్ షో ఆహూతులను ఎంతగానో అలరించింది. అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఇన్ఫ్రా) ఈ.శాంతారం, ఈకార్వో ప్రెసిడెంట్ జ్యోత్స్న బోహ్రా, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఎ.పి.దూబే, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ యూసుఫ్ కబీర్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. -
సరుకు రవాణాలో ముందంజ
సీతంపేట: విశాఖపట్నం పోర్టు అథారిటీ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్లో విశాఖపట్నం పోర్టు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇందుకు సహకరించిన పోర్టు ఉద్యోగులను ఆయన ప్రశంసించారు. కాలుష్య నివారణ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో పోర్టు చరిత్రలోనే రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా దేశభక్తిని చాటేలా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మాక్డ్రిల్, స్నిఫర్ డాగ్ ప్రదర్శనలు అలరించాయి. పోర్టులో పనితీరులో విశేష ప్రతిభ కనబర్చిన ఉద్యోగులు, పోర్టు భాగస్వాములు, స్టేక్ హోల్డర్స్కు ప్రశంసాపత్రాలు అందజేశారు. పోర్టు కార్యదర్శి టి.వేణుగోపాల్, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నేవీ నిఘా వ్యవస్థలో ఏఐ వినియోగం
సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఏడాది ఫిబ్రవరి.. భారత నౌకాదళానికి పండగలా మారనుందని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ అన్నారు. తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్లాటూన్లు, నౌకాదళ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్స్, వివిధ నౌకల సిబ్బంది మార్చ్పాస్ట్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ నగరం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలన్–2026 విన్యాసాలు, ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియంకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన మిలన్ విన్యాసాల్లో ఇది అతి పెద్దదిగా నిలవనుందని.. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సముద్ర ప్రయోజనాలను కాపాడే దేశాల్లో భారత్ ముందుందని వెల్లడించారు. ఆత్మనిర్బర్ భారత్ లక్ష్యంలో భాగంగా.. దేశీయ షిప్యార్డుల్లో 60కి పైగా యుద్ధ నౌకలు, సబ్మైరెన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ నెల 26న విశాఖలో ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి యుద్ధ నౌకలను నేవీ అమ్ములపొదిలో చేరనున్నాయని వివరించారు. అలాగే ఈ ఏడాది చివరలో మరో రెండు యాంటీ సబ్మైరెన్ వార్షిప్లు జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు. ఐఎన్హెచ్ఎస్ కల్యాణి ఆసుపత్రిని పూర్తిస్థాయి కమాండ్ ఆసుపత్రిగా ఆధునికీకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సముద్ర భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి నిఘా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుతున్నామని ఈఎన్సీ చీఫ్ తెలిపారు. మానవరహిత ఉపరితల, నీటి అడుగున పోరాడే వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్, నేవీ అప్గ్రేడ్ అయిందన్నారు. ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా పాల్గొన్నారు. -
నగర పోలీస్కు ఇండియన్ ప్రెసిడెన్సీ మెడల్
డాబాగార్డెన్స్: సిటీ సెంట్రల్ క్రైం స్టేషన్ ఏఎస్ఐ పెదిరెడ్డి చంద్రశేఖర్ 2025 ఇండియన్ ప్రెసిడెన్సీ మెడల్కు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 20 మంది పోలీసు అధికారుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏకై క ఏఎస్ఐ ఈయనే. చంద్రశేఖర్కు ఈ మెడల్ రావడం పట్ల పలువురు అధికారులు హర్షం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఈ మెడల్ అందజేస్తారు. చంద్రశేఖర్ తన కెరీర్ను 1984లో కానిస్టేబుల్గా ప్రారంభించారు. అప్పటి నుంచి ట్రాఫిక్, క్రైం, శాంతిభద్రతల విభాగాల్లో పనిచేసి అందరి మన్ననలు పొందారు. అనేక కేసులను ఛేదించి అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆయన్ని సత్కరించారు. -
రూ.1,471 కోట్లతో షిప్యార్డ్ రికార్డు
సింథియా: హిందూస్థాన్ షిప్యార్డ్లో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా రూ.1,471 కోట్ల టర్నోవర్ను సాధించిందని వెల్లడించారు. సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే ప్రథమం అని తెలిపారు. ఐఎస్ఎస్ నిస్తార్, ఐఎన్ఎస్ సింధుకీర్తి వంటి నౌకలను నిర్మించి షిప్యార్డ్ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ పోటీల్లో విజేతలకు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. -
సమష్టి కృషితో విశాఖ నగరాభివృద్ధి
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ఆవరణలో మేయర్ పీలా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, పలువురు కార్పొరేటర్లతో కలిసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఆవిష్కరించారు. జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ అందరి సహకారంతో విశాఖ నగర అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం చెట్లు పెంచండి అనే నినాదంతో జీవీఎంసీ కె.కాలనీ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకం అలరించింది. జీవీఎంసీలో ప్రతిభ కనబరచిన పలువురు అధికారులు, ఉద్యోగులు, విశాఖ నగరాభివృద్ధికి సహకరిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు, నివాసిత సంక్షేమ సంఘాలు, బ్యాంకుల ప్రతినిధులకు కమిషనర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. -
375 మందికి ప్రతిభా పురస్కారాలు
ఉత్తమ సేవలందించిన అధికారులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, జేసీ కె.మయూర్ అశోక్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జీసీసీ ఎండీ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, డిప్యూటీ కలెక్టర్లు సంగీత్ మాధుర్, ఎస్.సుధాసాగర్, పి.శేషశైలజ, బి.వి.రమణ తదితరులు మంత్రి నుంచి పురస్కారాలు అందుకున్నారు. వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన 31 మంది జిల్లా స్థాయి అధికారులతో పాటు మొత్తంగా 375 మంది ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. – బీచ్రోడ్డు -
నాణ్యతతో నిరంతర విద్యుత్ సరఫరా
సీతంపేట: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ కార్పొరేట్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి జాతీయ జెండాను ఎగురవేశారు. సంస్థ పరిధిలో 73 లక్షల వినియోగదారులకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిరంతరాయ విద్యుత్ సేవలందిస్తూ.. ప్రసార పంపిణీ నష్టాలను 5.8 శాతం కంటే తక్కువకు తగ్గించినట్లు తెలిపారు. పీవీటీజీ గిరిజన ఆవాసాల్లో 23,024 ఇళ్లకు, డీఏ–జేజీయూఏ పథకంలో 1979 ఇళ్లకు, అలాగే 13 వేలు ఇళ్లకు నాన్ పీవీటీజీ విద్యుత్ సదుపాయం కల్పించామన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద 19,385 గృహాలపై 63,522 మెగావాట్ల సోలార్ రూఫ్టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగా 3004 కోట్లతో గ్రామీణ ప్రాంతాలకు నిరంతర త్రీ ఫేజ్ సరఫరా కోసం కొత్త ఫీడర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 97 మంది ఉద్యోగులకు సీఎండీ ప్రశంసాపత్రాలు అందజేశారు. సంస్థ డైరెక్టర్లు డి.చంద్రం, టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, సీజీఎంలు డి.సుమన్ కల్యాణి, వి. విజయలలిత, అచ్చి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
స్టీల్ప్లాంట్లో..
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్లోని త్రిష్ణా మైదానంలో జరిగిన వేడుకల్లో డైరెక్టర్ (పర్సనల్) డాక్టర్ ఎస్.సి. పాండే జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉద్యోగుల అంకితభావం, కృషి ఫలితంగా ఇటీవల ప్రారంభించిన బ్లాస్ట్ఫర్నేస్–3 ద్వారా స్టీల్ప్లాంట్ ఉత్పత్తిలో మంచి పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. దీని వల్ల భవిష్యత్లో స్టీల్ప్లాంట్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్టీల్ప్లాంట్ డైరెక్టర్లు జి.వి.ఎన్.ప్రసాద్, సలీమ్ జి.పురుషోత్తమన్, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ నగరంగా విశాఖ
విశాఖ సిటీ/బీచ్రోడ్డు: విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చిలతో కలిసి మంత్రి ఓపెన్ టాప్ వాహనంలో పరేడ్ మైదానాన్ని సందర్శించారు. పరేడ్ కమాండర్ విజయ్ కుమార్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు కవాతు నిర్వహించారు. జాతి సమైక్యతను చాటి చెబుతూ త్రివర్ణ పతాక రంగుల్లో ఉన్న బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ ప్రగతి గురించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టేలా చేశారని, ఈ ఏడాదిలోనే రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని మంత్రి వివరించారు. విశాఖను ఐటీ, డేటా హబ్గా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ క్రమంలో గూగుల్ సంస్థ ఆరు బిలియన్ డాలర్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని, టీసీఎస్ సంస్థ రూ.1,370 కోట్లతో 12,000 ఉద్యోగాలు కల్పించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. కాగ్నిజెంట్ సంస్థ కూడా రూ.1,583 కోట్లతో కొత్త క్యాంపస్ను నిర్మించనుందని, అలాగే ఏఎన్ఎస్ఆర్ గ్రూప్ రూ.1,000 కోట్లతో, సత్వా గ్రూప్ రూ.1,500 కోట్లతో తమ సంస్థలను ఏర్పాటు చేస్తాయని వెల్లడించారు. భూ పరిపాలన సంస్కరణలు భూ పరిపాలన అంశాల్లో సంస్కరణల కోసం తనతో పాటు మరో ఐదుగురు మంత్రులతో కూడిన జీవోఎంను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన నాలా చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ వ్యవహారంపై పరిశీలన చేసి, నిరుపేదలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లోని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించడానికి జీవో నంబర్ 30ని జారీ చేసినట్లు వివరించారు ప్రత్యేక స్టాళ్లు.. నగదు ప్రోత్సాహకాలు హర్ ఘర్ తిరంగా అనే అంశంపై సమాచార శాఖతో పాటు పలు శాఖలు సంక్షేమ పథకాలను వివరిస్తూ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. వీటిని కలెక్టర్, జేసీ ఇతర అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వివిధ సంక్షేమ పథకాల కింద రూ.214.99 కోట్ల నగదు ప్రోత్సాహకాలను లబ్ధిదారులకు అందజేశారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విష్టుకుమార్ రాజు, న్యాయ, పోలీస్, రెవెన్యూ అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్నాక్స్తో కడుపు నొప్పి వేడుకల సందర్భంగా మీడియా ప్రతినిధులు, అధికారులు, ప్రేక్షకులకు పంపిణీ చేసిన స్నాక్స్ అస్వస్థతకు కారణమయ్యాయి. పంపిణీ చేసిన ఒక్కో కచోరీ నాసిరకంగా ఉండటంతో వాటిని తిన్న చాలా మందికి కడుపునొప్పి వచ్చింది. ఈ విషయంపై జర్నలిస్టు సంఘం నాయకుడు నారాయణ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
ఆటోలే దిక్కు..
ఈ నెల 6న వెంకటలక్ష్మి అనే మహిళ డెలివరీ కోసం కేజీహెచ్ గైనిక్ వార్డులో చేరింది. ఈ నెల 7వ తేదీన పాప జన్మించింది. ఆమెను 11వ తేదీన డిశ్చార్జి చేశారు. ఆమె కుటుంబ సభ్యులు తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీసుకు ఫోన్ చేయగా.. వాహనాలు నడపడం లేదని.. డీజిల్ లేదని.. మరమ్మతులకు గురయ్యాయని డ్రైవర్లు సమాధానం ఇచ్చారు. దీంతో వెంకటలక్ష్మి పాపతో ఆటోలో గాజువాకలోని ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇటీవల ఇద్దరు బాలింతలు ఇదే విధంగా ఆటోలో ఇంటికి వెళ్లడం ఆస్పత్రిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈనెల 12వ తేదీన కూడా ఓ బాలింతకు ఇదే పరిస్థితి ఎదురైంది. -
స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని హరించేలా కూటమి పాలన
సాక్షి, విశాఖపట్నం: ఎంతోమంది మహనీయుల ప్రాణత్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. శుక్రవారం మద్దిలపాలెంలోనిపార్టీ కార్యాలయంలో జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షుడు పీలా ప్రేమకిరణ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. ముందుగా కేకే రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్రెడ్డితో కలిసి గాంధీ, అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. అలాంటి ఈ రాష్ట్రంలో ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు భంగం కలిగిస్తూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వం దేశం మొత్తం ఉలిక్కిపడే విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, పార్టీ కార్యాలయ ఇన్చార్జి రవిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, కార్పొరేటర్లు కె.అనిల్కుమార్ రాజు, చెన్నా జానికిరామ్, బిపిన్ కుమార్ జైన్, శశికళ, వావిలాల ప్రసాద్, ముఖ్యనేతలు రొంగలి జగన్నాథం, నడింపల్లి కృష్ణంరాజు, రవిరాజు, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, డాక్టర్ జహీర్ అహ్మద్, అల్లంపల్లి రాజుబాబు, ిపీలా వెంకటలక్ష్మి, రామన్న పాత్రుడు, మువ్వల సురేష్, శ్రీదేవి వర్మ, దేవరకొండ మార్కండేయులు, బి.రాధ, ఈశ్వరి, బి.హరికిరణ్ రెడ్డి, డా. మంచా నాగమల్లేశ్వరి, నూకరాజు, మక్సూద్ అహ్మద్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు తదితరలు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు -
దేశభక్తిని చాటిన ప్రదర్శనలు
వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జ్ఞానాపురం సేక్రెడ్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులు దేశమంటే.. దేశమంటే.. మతం కాదోయ్ అనే గేయ నృత్య ప్రదర్శనతో ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. భరతమాత బిడ్డలురా.. బోర్డర్లో ఒరిగెనురా అంటూ నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా అంటూ పద్మనాభం కేజీబీవీ విద్యార్థులు, భారతీయ సమరస భావన థీమ్తో తగరపువలస కేథరిన్ పాఠశాల విద్యార్థులు, వందేమాతర.. సుందర భారతం.. అంటూ పెందుర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఏతో.. కాశ్మీర్.. హై.. అంటూ విశాఖ వ్యాలీ విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. -
విశాఖ స్టీల్ప్లాంట్కు కేఐవోసీఎల్ పెల్లెట్లు
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్కు ఖుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్ (కేఐవోసీఎల్) నుంచి పెల్లెట్ల సరఫరా ప్రారంభమైంది. పరిశ్రమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులకు పెంచే లక్ష్యంతో, కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో స్టీల్ప్లాంట్, కేఐవోసీఎల్ మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కేఐవోసీఎల్ విశాఖ స్టీల్ప్లాంట్కు ఏడాదికి 2 మిలియన్ టన్నుల పెల్లెట్లను సరఫరా చేయనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఓడ ద్వారా మొదటి బ్యాచ్ను పంపించింది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ ‘ఎక్స్’లో వెల్లడించారు. -
‘సీ్త్ర శక్తి’ మహిళల స్వేచ్ఛా విహంగానికి దోహదం
రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ మద్దిలపాలెం : సీ్త్ర శక్తి పథకం మహిళల స్వేచ్ఛా విహంగానికి ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సీ్త్ర శక్తి పథకాన్ని ఆయన మద్దిలపాలెం ఆర్టీసీ డిపోలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో వివిధ ప్రాంతాలకు ప్రయాణించే పలువురు మహిళలకు జీరో ఫేర్ టికెట్లను అందజేశారు. అనంతరం ఎండాడ వరకు సిటీ బస్సులో ప్రయాణించారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి ఐదు రకాల సర్వీసుల్లో మహిళలు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళలకు నెలకు రూ.2000 నుంచి 3000 వరకు ఆర్థికభారం తగ్గుతుందన్నారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ జిల్లాలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీ అధికారులు 576 బస్సులు సిద్ధం చేశారని చెప్పారు. కలెక్టర్ ఎం.ఎం.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుక అందించిందన్నారు. పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ ఉచిత బస్సు మహిళల ఆర్థికాభివద్ధికి బాటలు వేస్తుందన్నారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పి.విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, పార్టీ నేతలు గండి బాబ్జీ, దువ్వారపు రామారావు, సీతంరాజు సుధాకర్, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అరిగిన చక్రాలు.. ఆగిన సేవలు
మహారాణిపేట: గర్భిణులు, బాలింతలు, శిశువులను ఆస్పత్రులు, ఇళ్లకు చేర్చిన తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు నేడు దయనీయంగా మారాయి. ఈ వాహనాల నిర్వహణ దారుణంగా ఉంది. బ్యాటరీలు పని చేయక, టైర్లు అరిగిపోయి కదలడం లేదు. సరిపడే ఆయిల్ ఇవ్వకపోవడంతో వాహనాలను నడిపేందుకు డ్రైవర్లు వెనుకంజ వేస్తున్నారు. గత మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వకపోవడంతో వాహనాల కెప్టెన్లు అవస్థలు పడుతున్నారు. వాహనాలు రాకపోవడంతో కేజీహెచ్ గైనిక్ వార్డులో డిశ్చార్జి అయిన బాలింతలు, వారి కుటుంబ సభ్యులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో బాలింతలను ఉచితంగా ఇళ్లకు క్షేమంగా పంపేవారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తల్లీబిడ్డ వాహనాలను గాలికి వదిలేశారు. వాహనాలు రిపేర్లు అయినా పట్టించుకోవడం లేదు. ఒకే వాహనంలో ఇద్దరు వాహనాల కృత్రిమ కొరత వల్ల ఇటీవల కేజీహెచ్ నుంచి ఒకే వాహనంలో ఇద్దరు బిడ్డలతో బాలింతలను తల్లీబిడ్డ వాహనాలు తరలించడంపై చర్చ సాగుతోంది. ఒకే వాహనంలో ఇలా తరలించడం వల్ల తల్లులు అవస్థలు పడుతున్నారు. ఒకే రూటు కనుక అలా తీసుకెళ్లామని డ్రైవర్లు చెప్పకొస్తున్నారు. గతంలో అయితే ఎప్పుడైనా బాలింతలను తరలించడానికి వాహనాలు సిద్ధంగా ఉండేవి. ఇప్పుడు వాహనాలు లేక.. డ్రైవర్లు కానరాక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డ్రైవర్లకు ఆంక్షలు : తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లపై గతంలో కన్నా ఆంక్షలు ఎక్కువగా విధించారు. గతంలో నెలకు రూ.30 వేలు ఆయిల్ కోసం ఇచ్చేవారు. ఇప్పుడు నెలకు రూ.8 వేలతో సరిపెట్టుకోవాలని సూచిస్తున్నారు. యాజమాన్యం వల్ల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది. ఆయిల్ ఇవ్వడం లేదని, ఇచ్చిన ఆయిల్తోనే పనిచేయాలని డ్రైవర్లపై ఒత్తిడి చేస్తున్నారు. పనిచేయకపోతే వేధింపులకు గురి చేస్తున్నారని పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. -
హరేకృష్ణ వైకుంఠంలో కృష్ణాష్టమి వేడుకలు
తగరపువలస: గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠం వద్ద హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం ప్రారంభించారు. హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్కించిన భక్తదాస ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు బాల గోపాలునికి ఉయ్యాలసేవతో ఉత్సవాలు నిర్వహించారు. శ్రీరాధాకృష్ణుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. శనివారం శ్రీకృష్ణ భగవానునికి మహాభిషేకాలు, మహా మంగళ హారతి ఇవ్వనున్నారు. మిగిలిన రెండు రోజుల పాటు యథావిధిగా ఉయ్యాల సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించనున్నారు. -
కూటమి శకటాల్లో వైఎస్సార్ సీపీ ముద్ర
జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలోని ప్రగతిని తెలియజేస్తూ ఎనిమిది శకటాల ప్రదర్శన నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర ఉద్దేశాలను తెలుపుతూ జీవీఎంసీ, భవిష్యత్తు విశాఖ కోసం సుస్థిరమైన మౌలిక వసతుల అభివృద్ధి అనే థీమ్తో వీఎంఆర్డీఏ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, తల్లికి వందనం పథకాన్ని వివరిస్తూ విద్యాశాఖ, నా ఆరోగ్యం–నా హక్కు అనే అంశంతో వైద్యారోగ్య శాఖ, ఎన్టీఆర్ పేదలందరికీ ఇళ్లు పథకంపై గృహ నిర్మాణ శాఖ, పేదరికం రహితం–పీ4 విధానం పేరుతో ప్రణాళికా విభాగం, పీఎం సూర్యఘర్ ఆవశ్యకతను తెలుపుతూ ఈపీడీసీఎల్ శకటాలను ప్రదర్శించాయి. వీటిలో గృహ నిర్మాణ శాఖ శకటానికి ప్రథమ స్థానం దక్కింది. రెండో స్థానంలో జీవీఎంసీ, మూడో స్థానంలో సమగ్ర శిక్ష, విద్యాశాఖలు సంయుక్తంగా నిలిచాయి. పీఎం సూర్యఘర్ అంశాన్ని వివరిస్తూ ఏపీడీసీఎల్ ఏర్పాటు చేసిన శకటానికి ప్రోత్సాహక బహుమతి లభించింది. ఆయా శాఖల అధికారులను అభినందిస్తూ రెవెన్యూ మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. కాగా.. ఈ శకటాల్లో ప్రదర్శించిన చాలా అభివృద్ధి పనులు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేపట్టినవే కావడం విశేషం. ముఖ్యంగా జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, గృహ నిర్మాణ శాఖ శకటాల్లో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి స్పష్టం కనిపించింది. -
మొరాయిస్తున్న వాహనాలు
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు జిల్లాలో 23 ఉండగా.. ఇందులో 8 వాహనాలు మూలకు చేరాయి. 5 వాహనాలు చిన్న చిన్న రిపేర్లతో నగరంలో ఒక ప్రైవేటు షోరూమ్లో ఉన్నాయి. కేజీహెచ్లో ఉన్న వాహనాలకు టైర్లు పేలిపోవడం, ఇంజిన్ మరమ్మతులు, ఇతర చిన్న చిన్న సమస్యలతో పక్కన పెట్టారు. రిపేర్లు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో వాహనానికి ఒకరు చొప్పున 56 మంది డ్రైవర్లు (కెప్లెన్లు) పనిచేస్తున్నారు. కేజీహెచ్లో 9 వాహనాలు ఉన్నాయి. 3 వాహనాలను మరమ్మతు పేరిట మూలన పెట్టారు. 2 వాహనాలు షోరూమ్లో ఉంచారు. ఇప్పుడు నాలుగు వాహనాలు మాత్రమే బాలింతలను తరలించడానికి అందుబాటులో ఉన్నాయి. ఇలా అరకొర వాహనాలే ఉండడంతో బాలింతలు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు వెళ్తున్నారు. -
మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీనికి అనుబంధంగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఈ నెల 18 వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కళింగపట్నం, భీమిలి, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడిచిన 24 గంటల్లో పెందుర్తిలో 87.5 మి.మీ, వేపగుంటలో 74 మి.మీ, జియ్యమ్మవలసలో 67మి.మీ, కురుపాంలో 60మి.మీ వర్షపాతం నమోదైంది. -
నగరంలో నకిలీ మద్యం
విశాఖ విద్య: నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఓ వ్యక్తిని ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారుల బృందం పట్టుకుంది. అతని వద్ద నుంచి 70 నకిలీ మద్యం సీసాలు, 1.5 లీటర్ల హోమియోపతిక్ స్పిరిట్, 225 వివిధ రకాల బ్రాండ్ల ఖాళీ మద్యం సీసాలు, ఏడు బ్రాండ్ల 76 లిక్కర్ ప్యాకేజ్ కవర్లు, 335 సీసా మూతలు, 99 లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు టెంపరేచర్ డ్యూయల్ గన్ను స్వాధీన పరచుకున్నారు. నగరంలోని సీతంపేటకు చెందిన కట్టమూరి రామకృష్ణ నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నాడనే సమాచారంతో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ ఆదేశాలతో టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం నిఘా పెట్టి, పట్టుకున్నారు. రామకృష్ణ వద్ద నుంచి భారీగా నకిలీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి విచారణ కోసం మహారాణిపేట స్టేషన్కు అతన్ని అప్పగించినట్లు సూపరింటెండెంట్ ప్రసాద్ తెలిపారు. ఈ దాడుల్లో ఈఎస్టీఎఫ్ సీఐ రవి కిరణ్, ఎస్ఐ ముసలి నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
యాచకులు లేని నగరంగా విశాఖ
అల్లిపురం: యాచకులు లేని నగరంగా విశాఖను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పది నెలల కిందట నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తలపెట్టిన ‘జ్యోతిర్గమయ’ కార్యక్రమానికి ఒక రూపు వచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని యాచకులకు తగిన ఆశ్రయం కల్పించి, వారిని గౌరవప్రదమైన జీవితం వైపు నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీపీ తెలిపారు. గురువారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటే చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణమని వివరించారు. రోడ్లపై భిక్షాటన చేసే నిరాశ్రయులను రోజూ చూసి బాధపడేవాడినని, ప్రతి మనిషి గౌరవంగా జీవించడానికి ప్రయత్నించాలన్నారు. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్, హార్బర్ సీఐ సింహాద్రి నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ తిరుపతిరావు, సీఐ చప్పా ప్రసాద్(వీఆర్), నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. గురువారం ఒక్క రోజే 243 మంది యాచకులను గుర్తించి, వారికి క్షవరం, స్నానం చేయించి, కొత్త దుస్తులు ఇచ్చి, టిఫిన్తో పాటు భోజనం కూడా అందించినట్లు తెలిపారు. 243 మందిలో 45 మంది బాగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులను పిలిపించి, అప్పగించినట్లు వివరించారు. మానసిక స్థితి సరిగా లేని 9 మందిని ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిలో చేర్పించామన్నారు. మిగిలిన 189 మందిని వివిధ పునరావాస కేంద్రాలకు పంపించినట్లు తెలిపారు. భవిష్యత్తులో వీరికి పనులు ఇప్పించడం, పని చేయలేని వారికి ఆశ్రయం కల్పిస్తామన్నారు. ట్రాన్స్జెండర్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నందున.. వారికి కూడా పని కల్పించడం లేదా ఆశ్రయం కల్పిస్తామన్నారు. జైలు నుంచి విడుదలైన వారికి కూడా జీవనాధారం కల్పించి గౌరవప్రదంగా బతకడానికి అవకాశం చూపిస్తామని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమం మొదటి అడుగు మాత్రమేనని.. నగరంలోని దాతలు ముందుకు వచ్చినట్లయితే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సీపీ కృతజ్ఞతలు తెలిపారు. -
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆరాధ్య
పరవాడ: భర్నికం శివారులోని బాపడుపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఒకటో తరగతి విద్యార్థిని ఆరాధ్య బెహ్ర .. తన అసాధారణ జ్ఞాపకశక్తితో అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయుడు కొరుపోలు గంగాధరరావు తెలిపారు. యాదృచ్ఛికంగా ఇచ్చిన ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాలను కేవలం 1 నిమిషం 30 సెకన్లలో సరైన క్రమంలో పేర్చడం ద్వారా ఆరాధ్య ఈ రికార్డును సాధించిందని ఆయన వివరించారు. ఎటువంటి సహాయం లేకుండా, కేవలం తన జ్ఞాపకశక్తిని ఉపయోగించి ఈ ఘనతను సాధించిందన్నారు. పాఠశాలలో జూలై 30న జరిగిన కార్యక్రమంలో ఆరాధ్య దీనిని ప్రదర్శించిందని.. ఆమె ప్రతిభను గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరును నమోదు చేసినట్లు తెలిపారు. పాఠశాలలో గురువారం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఎంఈవోలు ఎం.దివాకర్, జి. సాయిశైలజ విద్యార్థినితో పాటు ఉపాధ్యాయుడు గంగాధరరావును అభినందించారు. కార్యక్రమంలో సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్సార్ విభాగం సీనియర్ మేనేజర్ కె.ప్రకాశరావు, శివం తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక హంగులతో యాత్రి నివాస్
సాక్షి, విశాఖపట్నం: అందమైన విశాఖ జిల్లాకు మరిన్ని పర్యాటక హంగులు తీసుకొచ్చేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పుడు కొత్త ఫలాలను ఇస్తున్నాయి. దేశ విదేశీ పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా బీచ్రోడ్డులోని హరిత హోటల్ యాత్రి నివాస్ సుందరీకరణ పనులు పూర్తయి.. తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ఈ హోటల్ స్టార్ హోటళ్లకు దీటుగా ఉన్నా.. కూటమి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఏపీటీడీసీ వెబ్సైట్లో యాత్రి నివాస్ బుకింగ్స్ కోసం పాత ఫొటోనే కొనసాగిస్తోంది. పర్యాటకుల స్వర్గధామంగా విశాఖ విశాఖపట్నం ప్రకృతి సౌందర్యంతో పాటు అనేక పర్యాటక ఆకర్షణలను కలిగి ఉంది. ఇది దేశ, విదేశీ పర్యాటకులకు స్వర్గధామంగా మారింది. ఏటా విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో యాత్రి నివాస్ భవనాన్ని ఆధునికీకరించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం రూ.12.5 కోట్లతో యాత్రి నివాస్ను తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టింది. అప్పుఘర్లోని బీచ్వ్యూలో ఉండే ఈ హరిత హోటల్లో మొత్తం 4 అంతస్తుల్లో 46 గదులు, రెస్టారెంట్ ఉన్నాయి. అయితే.. 25 ఏళ్ల కిందట నిర్మించిన భవనం కావడంతో గదుల్లో లీకేజీలు, కొన్ని చోట్ల పెచ్చులూడటం వంటి సమస్యలు తలెత్తాయి. భవిష్యత్తులో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనిని సుందరీకరించింది. 2023 డిసెంబర్లో పనులు ప్రారంభం కాగా.. 2024 ఎన్నికల సమయానికి దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. పలు పరిణామాల అనంతరం పనులు ప్రారంభమై.. రెండు నెలల కిందట పూర్తయ్యాయి. ఆధునికీకరించిన యాత్రి నివాస్లో 42 ఏసీ గదులు ఉన్నాయి. వీటిని ఏసీ సూట్, ఏసీ డీలక్స్, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్లుగా విభజించారు. ఇద్దరు పర్యాటకులకు డిమాండ్ను బట్టి ఏసీ సూట్ రూమ్ ధర రూ.3,750 నుంచి రూ.4,200 వరకు, ఏసీ డీలక్స్ రూమ్ రూ.4,625 నుంచి రూ.5,180 వరకు, ఏసీ ఎగ్జిక్యూటివ్ రూమ్ ధర రూ.3,125 నుంచి రూ.3,500 వరకు నిర్ణయించారు. వీటికి పన్నులు అదనంగా ఉంటాయి. గదులతో పాటు అత్యాధునిక వసతులతో రెస్టారెంట్, బార్, వెయిటింగ్ హాల్, కాన్ఫరెన్స్ హాల్ మొదలైనవి అందుబాటులోకి వచ్చాయి. హరిత హోటల్లో ఎక్కువగా పశ్చిమ బెంగాల్, ఒడిశాతో పాటు ఉత్తర భారత్ నుంచి వచ్చే పర్యాటకులు బస చేస్తుంటారు. టూరిజం ప్యాకేజీలో వచ్చే వీరికి ఈ హోటల్ ముఖ్యమైన గమ్యస్థానం. అందుకే, అత్యాధునిక సౌకర్యాలతో పాటు ఆయా రాష్ట్రాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా కొత్త వంటకాలను అందించేలా రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. -
రోడ్డుప్రమాద బాధితుల కోసం సహాయ కేంద్రం ఏర్పాటు
విశాఖ లీగల్ : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించే విధంగా విశాఖ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సహాయం కోసం టోల్ ఫ్రీ నంబరు 7995095793లో సంప్రదించవచ్చన్నారు. ప్రమాదాలకు గురైన బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన ఎఫ్ఐఆర్, పోస్ట్మార్టం నివేదిక, శవ పంచనామా నివేదిక, వైద్య ధృవీకరణ పత్రాలు, వాహన బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు, ఇతర డాక్యుమెంట్లు, మెటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్(ఎంఏసిటి)లో నష్టపరిహారం కోసం కేసు వేయడానికి అవసరమైన సూచనలు, సలహాలు ఈ కేంద్రం నుంచి అందించడం జరుగుతుందన్నారు. ఇతర న్యాయపరమైన సేవల కోసం హెల్ప్లైన్ నంబరు 15100ను సంప్రదించవచ్చుని తెలిపారు. -
చీటీల పేరుతో మోసం.. నలుగురి అరెస్ట్
గోపాలపట్నం: చీటీల పేరుతో సుమారు 50 మంది వద్ద డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడిన నలుగురిని గోపాలపట్నం పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను సీఐ ఎన్.వి.ప్రభాకర్ గురువారం వెల్లడించారు. గోపాలపట్నం ఇందిరానగర్కు చెందిన అంబళ్ల సత్యవతి, ఆమె కుటుంబ సభ్యులు బంగారు నాయుడు, తేజస్విని, నాగలక్ష్మి కలిసి చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరు సుమారు 50 మంది వద్ద చీటీల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. చీటీలు పూర్తయిన తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వకుండా, బాధితులను బెదిరించి, మరో రెండు చీటీలు వేస్తేనే డబ్బులు ఇస్తామని వేధించేవారు. దీంతో కొద్ది నెలల కిందట బాధితులు పోలీసులను ఆశ్రయించగా, నిందితులు డబ్బులు ఇచ్చేస్తామని చెప్పడంతో బాధితులు కొంతకాలం వేచి చూశారు. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు ఇటీవల నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చిని ఆశ్రయించారు. కొందరు ఆరు లక్షల రూపాయల వరకు చీటీలు వేశారని ఆయనకు తెలిపారు. డబ్బులు అడిగితే దాటవేయడం, బెదిరించడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కాగా.. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు 22 మంది బాధితులు ఫిర్యాదు చేశారని, నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, బాధితుల వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడిస్తామన్నారు. -
కబ్జా కోరల్లో నగరంపాలెం చెరువు
మధురవాడ: ఒకవైపు నీటి కొరతతో నగరం అల్లాడుతుంటే.. మరోవైపు సహజ సిద్ధమైన జలవనరులను కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్యం కబ్జాదారులకు వరంగా మారుతోంది. మధురవాడలోని నగరంపాలెం చెరువును కొందరు బరితెగించి కబళిస్తున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా పూడ్చివేస్తున్నా.. జీవీఎంసీ, రెవెన్యూ యంత్రాంగాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. చెరువు ఉనికినే ప్రశ్నా ర్థకం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చినా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నగరంలో నీటి యుద్ధాలు సర్వసాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో సహజ జలవనరులైన చెరువులను పరిరక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ విశాఖలో స్వతంత్రనగర్, కొమ్మాది వంటి ప్రాంతాల్లో చెరువులు కనుమరుగై కాలనీలుగా మారిపోయిన చరిత్ర కళ్లముందే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలోకి నగరంపాలెం చెరువు కూడా చేరబోతోంది. సగానికి పైగా ఆక్రమణ విశాఖ రూరల్ మండలం, మధురవాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 65/10లో 2.90 ఎకరాల విస్తీర్ణంలో నగరంపాలెం చెరువు ఉంది. రెవెన్యూ రికార్డుల్లో ట్యాంక్ పోరంబోకుగా నమోదైంది. అయితే ఇప్పటికే కబ్జాదారుల పుణ్యమా అని చెరువు సగానికి పైగా ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం కేవలం 1.50 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. తాజాగా.. మిగిలిన భూమిలో నుంచి మరో అర ఎకరం భూమిని ‘సామాజిక అవసరాల’ పేరుతో కొందరు పూడ్చివేయడం ప్రారంభించారు. నిర్మాణాల కోసం ఇప్పటికే సరిహద్దులను మార్కింగ్ చేసి సున్నం వేశారు. ప్రైవేటు అవసరాలకు పెద్దపీట చెరువు భూమిలో ఇప్పటికే కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అంతేకాకుండా ఓ ప్రైవేటు లేఅవుట్కు దారి కూడా ఈ చెరువు భూమి నుంచే ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని ప్రైవేటు ప్రయోజనాలకు అనుకూలంగా మార్చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక చెరువుకు జీవనాధారమైన నీటి ప్రవాహ మార్గాలను(గెడ్డలను) సైతం కబ్జాదారులు వదల్లేదు. వర్షపు నీరు చెరువులోకి చేరే మార్గాలను, చెరువు నిండిన తర్వాత నీరు బయటకు ప్రవహించే మార్గాలను పూర్తిగా ఆక్రమించుకున్నారు. దీనివల్ల చెరువు సహజ సిద్ధమైన ఉనికిని కోల్పోయి, కేవలం నిలిచిన నీటి గుంతగా మారే ప్రమాదం ఏర్పడింది. ప్రకృతి ప్రేమికుల ఆవేదన మధురవాడలో ప్రభుత్వ భూములకు కొదవలేదు. అయినప్పటికీ కొందరి కళ్లు ఈ చెరువుపైనే పడటం దురదృష్టకరం. ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా జలవనరుగా ఉన్న భూమిని కొందరు స్వాహా చేస్తుంటే సంబంధిత జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ప్రకృతి, పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, చెరువును కబ్జాదారుల బారి నుంచి కాపాడి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
● పట్టుబడ్డ ఒడిశా బోటు ఇంజిన్లు మాయం ● అక్రమార్కుడితో చేతులు కలిపిన అధికారులు ● దొరికినవి 18.. లెక్క చూపింది మూడే.. ● జీఎస్టీ ఎగవేతతో ప్రభుత్వ ఖజానాకు గండి
సాక్షి, విశాఖపట్నం: వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేకూర్చడం కంటే.. తమ సొంత వాణిజ్యంపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తూ పట్టుబడితే చాలు.. సంబంధిత వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ కార్యాలయంలో పండగ వాతావరణం నెలకొంటోంది. ఇటీవల ఒడిశా నుంచి అనధికారికంగా తీసుకొచ్చిన బోటు ఇంజిన్ల వ్యవహారం కొందరు సిబ్బందికి కాసుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. రెండు వాహనాల్లో నిండుగా ఇంజిన్లు పట్టుబడగా.. కేవలం మూడు ఇంజిన్లు మాత్రమే దొరికినట్లు అధికారిక లెక్కల్లో చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. మిగిలిన వ్యవహారాన్ని అక్రమార్కులతో బేరసారాలు ఆడి చక్కదిద్దినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగిందంటే.? ఒడిశా ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి మత్స్యజీవి కల్యాణ యోజన(ఎంఎంకేవై)’పథకంలో భాగంగా మత్స్యకారులకు కొత్త బోట్లు, ఇంజిన్లు, వలల కొనుగోలుకు రాయితీ అందిస్తోంది. సుమారు రూ.1.50 లక్షల విలువైన ఒక్కో బోటు ఇంజిన్ను రూ.84 వేల రాయితీతో కేవలం రూ.66 వేలకే ఇస్తోంది. బహిరంగ మార్కెట్లో ఈ ఇంజిన్ కొనాలంటే అదనంగా జీఎస్టీ భరించాల్సి ఉంటుంది. ఇదే అదనుగా భావించిన విశాఖకు చెందిన ఓ వ్యాపారి ఒడిశాలో మత్స్యకారులకు రాయితీపై అందిన బోట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఎలాంటి జీఎస్టీ చెల్లించకుండా వాటిని ఇక్కడకు తీసుకొస్తున్నాడు. గత ఆరు నెలలుగా నెలలుగా ఈ దందా గుట్టుగా సాగుతోంది. విశాఖపట్నంతో పాటు పూడిమడక, నక్కపల్లి, అచ్యుతాపురం తదితర ప్రాంతాల మత్స్యకారులకు వీటిని అమ్ముతున్నట్లు సమాచారం. వ్యాపారితో బేరసారాలు : పట్టుబడిన ఒక వాహనంలో ఇతర సామగ్రితో పాటు 3 ఇంజిన్లు ఉండగా, మరో వాహనంలో 15 ఇంజిన్లు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న వ్యాపారి.. తన దుకాణం ఉన్న సర్కిల్ అధికారుల వద్దకు పరుగున వెళ్లాడు. అక్కడి నుంచి సిబ్బందితో కలిసి కమర్షియల్ ట్యాక్స్ డివిజనల్ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. పట్టుకున్న సిబ్బందితో వ్యాపారి బేరసారాలు ఆడినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రెండు వాహనాలను వదిలిపెట్టేందుకు భారీగా ముడుపులు ముట్టజెప్పుతానని వ్యాపారి ఆఫర్ చేసినట్లు తెలిసింది. అయితే రెండు వాహనాలనూ వదిలేస్తే తమకు సమాచారం ఇచ్చిన వ్యాపారులకు అనుమానం వస్తుందని భావించిన సిబ్బంది.. కేవలం 3 ఇంజిన్లు ఉన్న వాహనాన్ని మాత్రమే పట్టుకున్నట్లు చూపిస్తామని చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో వాణిజ్య పన్నుల శాఖ ఇంటెలిజెన్స్ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేసినట్లు ఆరోపణలున్నాయి. అనంతరం ఈ కేసును గుట్టుచప్పుడు కాకుండా మూసివేశారు. కేవలం 3 ఇంజిన్లు మాత్రమే పట్టుబడ్డాయని, అందులో ఒకదానికి బిల్లు ఉందని, మిగిలిన రెండు ఇంజిన్లకు బిల్లులు లేకపోవడంతో జరిమానా విధించి వదిలేశామని ఇంటెలిజెన్స్ సిబ్బంది కేసును ముగించారు. ఎక్కువ ఇంజిన్లు ఉన్న వాహనాన్ని రాత్రికి రాత్రే ఆ వ్యాపారి తన దుకాణానికి తరలించుకుపోయినట్లు తెలిసింది. చిన్న గార్మెంట్ బేల్స్ పట్టుకుంటేనే హడావిడి చేసే అధికారులు.. బోటు ఇంజిన్లు పట్టుబడ్డా, విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. మొత్తంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన లక్షల రూపాయల జీఎస్టీని కొందరు అధికారులు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పన్నుల శాఖలో సొంత వాణిజ్యంతోటి వ్యాపారుల సమాచారంతో.. పెద్ద సంఖ్యలో ఇంజిన్లు తెచ్చి తక్కువ ధరకు విక్రయిస్తున్న వ్యాపారి తీరుపై తోటి బోట్ ఇంజిన్ వ్యాపారులకు అనుమానం కలిగింది. పక్కా సమాచారం సేకరించి.. ఏ సమయంలో, ఎన్ని వాహనాల్లో ఇంజిన్లు వస్తున్నాయన్న వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందించారు. దీంతో కమర్షియల్ ట్యాక్స్ సిబ్బంది వలపన్ని జూలై 31న ఆరిలోవ సమీపంలో రెండు వాహనాలను పట్టుకున్నారు. వాస్తవానికి ఒడిశా నుంచి మూడు వాహనాల్లో ఇంజిన్లు రాగా.. ఒక వాహనాన్ని ఆ వ్యాపారి శ్రీకాకుళంలోని తన దుకాణానికి ముందే తరలించేశాడు. మిగిలిన రెండు వాహనాలను విశాఖ వాణిజ్య పన్నుల శాఖ బృందం పట్టుకుంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. -
స్వాతంత్య్ర దినోత్సవానికి సర్వం సిద్ధం
విద్యుత్ కాంతులతో కలెక్టరేట్బీచ్రోడ్డు: పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. వేడుకల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల లక్ష్యాలు, ఫలితాలను వివరిస్తూ 8 విభాగాల ఆధ్వర్యంలో స్టాళ్లు, ఏడు విభాగాల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించనున్నారు. పరేడ్ మైదానంలో పైలట్ వాహనానికి ట్రయల్ రన్ నిర్వహించి సిద్ధం చేశారు. గౌరవ వందనం సమర్పించడానికి, పరేడ్ నిర్వహించడానికి వీలుగా వివిధ రక్షణ బృందాల నుంచి మొత్తం 52 మందికి శిక్షణ ఇచ్చారు. ఎనిమిది పాఠశాలల విద్యార్థులు దేశభక్తిని చాటుతూ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద రూ. 214.99 కోట్ల నగదు ప్రోత్సాహకాలను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతిభ చూపిన 375 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేయనున్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగంలో నలుగురికి అవకాశం
విశాఖ సిటీ: వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగ కమిటీలో విశాఖ జిల్లా నుంచి ముగ్గురు చోటు కల్పించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు తెలిపింది. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులుగా చందక అప్పలస్వామి(భీమిలి), కంకల ఈశ్వరరావులను, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులుగా జగ్గుపల్లి నరేష్ (భీమిలి), కోరాడ చంద్రమౌళి(పెందుర్తి)ని నియమించారు. -
పాత ఫొటోతోనే బుకింగ్స్
యాత్రి నివాస్ను అధికారికంగా ఇంకా ప్రారంభించనప్పటికీ.. పర్యాటకులు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో రూమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్లో ఏపీటీడీసీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం యాత్రి నివాస్పై అక్కసు చూపిస్తూనే ఉంది. గత ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దినందున ఆ పేరు దానికి వస్తుందనే ఉద్దేశంతో పనులను ఆలస్యం చేసింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చినా.. పాత ఫొటోనే వెబ్సైట్లో ఉంచింది. ఈ ఫొటో చూసి పర్యాటకులు తమ పర్యటనను వాయిదా వేసుకునే అవకాశం ఉంది. పాత ఫొటో స్థానంలో కొత్తది ఉంచితే బుకింగ్స్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. -
ఓటు చోరీపై ప్రజలకు సమాధానం చెప్పాలి
ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసిన విదసం బీచ్రోడ్డు: ‘మా ఓటు భద్రం.. చోరీ కానివ్వకండి’.. ‘ఓటు చోరీపై ప్రజలకు సమాధానం చెప్పండి’, ‘బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ఆపండి’ అని విదసం నాయకులు డిమాండ్ చేశారు. విస్తృత దళిత సంఘాల (విదసం) ఐక్య వేదిక రాష్ట్ర సమితి కన్వీనర్ డా.బూసి వెంకట రావు ఆధ్వర్యంలో గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన భారత ఎన్నికల కమిషనర్ను ఉద్దేశించి మాట్లాడారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ప్రతి పౌరుడికి ఒకే ఓటు, ఒకే విలువ ఉండగా.. దేశంలో ఇటీవల జరుగుతున్న ఓట్ల చోరీపై ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. బీహార్లో ఎస్ఐఆర్, కర్ణాటకలోని మహాదేవపురలో జరిగిన ఓట్ల మాయాజాలంపై ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం.. ప్రశ్నించిన వారినే నిందిస్తోందని ఆయన విమర్శించారు. బీహార్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించడానికే ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతున్నారని, ఇది ఎన్నికల సంఘానికి రాజ్యాంగం కల్పించిన స్వయం నిర్ణయాధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆరోపించారు. భారతీయ ఓటరు హక్కులను ఎస్ఐఆర్ పేరుతో కాలరాయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. బీజేపీ ఎన్నికల కమిషన్ను నియంత్రిస్తోందన్నారు. మహాదేవపుర ఎంపీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో బయటపడ్డ వేలాది నకిలీ ఓటర్లపై సమగ్ర విచారణ జరిపి, ప్రజలకు సమాధానం చెప్పాలని ఎన్నికల సంఘానికి డిమాండ్ చేశారు. నిరసనలో పాల్గొన్న కార్యకర్తలు తమ ఓటరు కార్డులు చూపిస్తూ ‘ఎన్నికల సంఘమా, మా ఓటు భద్రం, చోరీ కానివొద్దు’అని నినాదాలు చేశారు. విదసం నేతలు సోడా దాసి సుధాకర్, గుడివాడ ప్రసాద్, బూల భాస్కరరావు, డి.నిర్మల, ఫ్రాన్సిస్, ఉత్తరాంధ్ర రాజ్యాంగ హక్కుల నేత బాగం గోపాల్, బనాస అధ్యక్షుడు టి.శ్రీరామ్ మూర్తి, పట్టా రామప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ సీఐపై రుబాబు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో ఓ బార్ యజమాని ఏకంగా ఎక్సైజ్ సీఐపై రుబాబుకు దిగినట్టు తెలుస్తోంది. తన బారులో తనిఖీలు ఎలా చేస్తారంటూ ఏకంగా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అంతేకాకుండా సదరు సీఐపై అరుపులు, కేకలతో విరుచుకుపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో అనధికారికంగా ఇతర దేశాల మద్యంతో పాటు డిఫెన్స్ మద్యం లభిస్తోంది. ఇటీవల ఎకై ్సజ్ అధికారుల తనిఖీల్లో కూడా మద్యం పట్టుబడింది. స్టీల్ప్లాంట్ సీజీఎం స్థాయి అధికారి ఇంట్లో పదుల సంఖ్యలో ఇతర రాష్ట్రాల మద్యం సీసాలు దొరికాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్శాఖ అధికారులు నగరంలోని బార్లు, మద్యం షాపుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలో ప్రధానమైన కూడలి వద్ద ఉన్న బారులో తనిఖీలకు వెళ్లిన ఎకై ్సజ్ సీఐపై సదరు బార్ యజమాని రుసరుసలాడటమే కాకుండా అరుపులు, కేకలతో నిలువరించే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో సదరు బారులో కొన్ని డిఫెన్స్ బాటిళ్లు కూడా అనధికారికంగా లభించినట్టు తెలుస్తోంది. దీనిపై ఎకై ్సజ్శాఖ ఉన్నతాధికారి ఒకరు రంగంలోకి దిగి సర్దుబాటు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో భారీగానే నగదు చేతులు మారినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఎకై ్సజ్ సీఐతో ఆ బారు యజమాని వ్యవహరించిన తీరును.. సీసీ కెమెరాలను పరిశీలిస్తే బట్టబయలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నా వద్దే తనిఖీలకు వస్తారా? వాస్తవానికి సదరు బారు యజమాని.. గతంలో వేరే వ్యాపారంలో అక్రమంగా భారీగా సంపాదించి లిక్కరు వ్యాపారంలోకి అడుగుపెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా కొద్ది మందితో జతకట్టి ఏకంగా 10 బార్లు, 10 వైన్ షాపులను దక్కించుకున్నారు. అంతేకాకుండా ప్రీమియం షాపును కూడా అధికార పార్టీకి బాగా దగ్గరి వారి మంటూ చెప్పుకుంటున్న వారితో కలిసి నెలకొల్పారు. వీరితో జతకలిసిన తర్వాత మరింతగా రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది. అధికారపార్టీకి బాగా దగ్గరని ఇంటి పేరుతో సహా చెప్పుకునే వారితో కలిసి వ్యాపార భాగస్వామ్యం ఉండటంతోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే బార్లలో తనిఖీలకు వెళ్లిన ఎకై ్సజ్ సీఐపై నోరుపారేసుకున్నట్టు తెలుస్తోంది. తన బారులోనే తనిఖీలు చేస్తారా? అంటూ రెచ్చిపోయినట్టు సమాచారం. అయితే, ఆయనకు చెందిన రెండు బారుల్లో కూడా కొన్ని ఇతర మద్యం బాటిళ్లు దొరికినట్టు తెలుస్తోంది. అయితే, ఎకై ్సజ్శాఖ ఉన్నతాధికారి ఒకరు రంగంలోకి దిగి సర్దుబాటు చేయడంతో పాటు తను కూడా చక్కబెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాధవధారలోని తన కార్యాలయానికి పిలుపించుకుని మరీ సర్దుబాటు చేసినట్టు విమర్శలున్నాయి. ఈ వ్యవహారంలో రూ.15 లక్షల మేర చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. మరో షాపు రాకుండా...! వాస్తవానికి విశాఖ నగరంలో రెండు ప్రీమియం షాపుల ఏర్పాటుకు అవకాశం కల్పించారు. అయితే, తాము ఏర్పాటు చేసిన తర్వాత సాధ్యమైనంత ఆలస్యంగా రెండో ప్రీమియం షాపు తెరిచేలా అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అసలు షాపు ఏర్పాటుకు అనువైన స్థలం దొరకకుండా అడ్డుకునే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. కాకినాడకు చెందిన వ్యక్తికి వచ్చిన షాపు ఏర్పాటు కాకుండా గత మూడు నెలలుగా అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. చివరకు తనకు దక్కిన ప్రీమియం షాపులో రాయలసీమకు చెందిన అధికారపార్టీ సామాజికవర్గానికే చెందిన వారికి భాగస్వామ్యం ఇవ్వడంతో చివరకు ఎలాగోలా నెలకొల్పేందుకు అవకాశం లభించినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ మరింత ఆలస్యం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. -
నేడు 9 జిల్లాల్లో ‘ఫ్లాష్ ఫ్లడ్’!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావం రాష్ట్రంపై భారీగానే ఉంటుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు ఆకస్మిక వరదలు(ఫ్లాష్ ఫ్లడ్స్) వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. శుక్రవారం మధ్యాహ్నంలోపు కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీనికనుగుణంగా ఆయా ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద నీరు ఉప్పొంగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొనసాగుతున్న అల్పపీడనం మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని, శుక్రవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని, అనంతరం పశి్చమ వాయవ్య దిశగా కదులుతుందని ఐఎండీ తెలిపింది. బిలాస్పూర్, కళింగపట్నం మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. శుక్రవారం, శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించింది. కాగా, 16 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పెరుగుతాయని తెలిపింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, కళింగపట్నం, భీమునిపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లొద్దు రానున్న మూడు రోజులు తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వరద పూర్తి స్థాయిలో తగ్గేవరకు కృష్ణానది పరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ప్రజలను అప్రమత్తం చేస్తూ విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు మెసేజ్లు పంపిస్తుందని ఆయన స్పస్టంచేశారు. తణుకులో 240 మి.మీ. వర్షపాతం గడిచిన 24గంటల్లో తణుకులో 240 మిల్లీ మీటర్ల భారీ వర్షపాతం నమోదుకాగా, నందిగామలో 190, తాడేపల్లిగూడెంలో 160, విజయవాడ, అమలాపురం, డెంకాడలో 130, పాలేరులో 120, భీమడోలులో 100, పూసపాటిరేగ, ఏలూరులో 90, తుని, విజయనగరం, పాలకోడూరులో 80 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
విశాఖ ఆర్కే బీచ్లో విషాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ఆర్కే బీచ్లో సరదాగా స్నానానికి దిగి ఒకరు మృతి చెందగా.. ఒకరు క్షేమంగా బయపడ్డారు. మరొకరు గల్లంతయ్యారు. మునిగిపోతున్న మహిళను కాపాడడానికి వెళ్లిన ఒడిశాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. అతని కోసం సహాయక బృందాలు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాయి.బీచ్ చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన దంపతులు రాగా.. సరదాగా బీచ్లోకి దిగగా.. కెరటాల ఉధృతికి మహిళ (50) కొట్టుకుపోయింది. భార్య మృతి చెందగా, భర్తను స్థానికులు కాపాడారు. దంపతులను కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి మృతి చెందాడు. -
వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముందీ?: బొత్స
సాక్షి, విశాఖపట్నం: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఎన్నిక జరిగిన 12వ తేదీ ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అక్కడ జరిగింది పోలింగ్ కాదు, రిగ్గింగ్ అన్నారు.ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించిన చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలిచిపోతాడని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంత అభద్రతాభావంతో ఉన్నాడని, అందుకే ఇలా దిగజారిపోతాడని అనుకోలేదని అన్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించేలా ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలకు అర్థాన్నే చంద్రబాబు మార్చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసులతో ప్రభుత్వం కుమ్మక్కై దొంగ ఓట్లతో గెలిచింది. ఎందుకు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇంత అభద్రతతో వ్యవహరించింది.? మాది మంచి పాలన అని చెప్పుకునే ప్రభుత్వం ఎందుకు ప్రజాతీర్పును కోరకుండా, వ్యవస్థలను భ్రష్టు పట్టించి, అడ్డదోవలో గెలుపొందేందుకు తెగించింది..? ఎన్నికలు అంటేనే నిస్పక్షపాతంగా ఉండాలి. స్థానిక ఎంపీని పోలీసులు ఉదయం నుంచే అదుపులోకి తీసుకుని ఆంక్షలు విధించారు.కానీ కూటమి ప్రభుత్వంలోని మంత్రి, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తమతో వందల కార్యక్తలను వెంట పెట్టుకుని సెగ్మెంట్లో తిరుగుతుంటే, వారికి పోలీసులు భద్రత కల్పించారు. ఓటు హక్కు కోసం పోలింగ్ కేంద్రాలకు వెళ్ళిన ఓటర్ల నుంచి స్లిప్లను లాక్కుని, పక్క నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. టీడీపీలో మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ వంటి పదవుల్లో ఉన్న నాయకులే దొంగ ఓటర్ల అవతారం ఎత్తితే, ఆ పక్కనే కలెక్టర్, డీఐజీ, డీఏస్పీ, సీఐ వంటి అధికారులు ఉండి వారితో ఓట్లు వేయించారు. పైగా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయంటూ వారే ప్రకటించుకుంటున్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి బ్లాక్డే. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు. మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పెట్టిన ఫోటోలోనే దొంగ ఓటరు చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. దీనినేమంటారు? కూటమి ప్రభుత్వానికి తమ పనితీరు మీదే నమ్మకం లేదు. తమ గెలుపు మీద అంతకంటే నమ్మకం లేదు. అందుకే దౌర్జన్యాన్ని, పోలీసులను నమ్ముకున్నారు. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ఒక చిన్న మండల స్థాయి ఎన్నికలకు ఇంతగా దిగజారిపోవాలా? దీనివల్ల ప్రభుత్వంకు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? వ్యవస్థలనే నష్టపరిచేలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తీరు అత్యంత ప్రమాదకరం. ఈ పరిణామాలనే మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ప్రశ్నించారు.ఇంత వయస్సు వచ్చిన సీఎం చంద్రబాబుకు బహుశా ఇవే చివరి ఎన్నికలు కూడా కావచ్చు, జనం మంచిగా చెప్పునే పనులు చేయాలే కానీ ఇలాంటి మచ్చ తెచ్చుకునేలా చేస్తారా అని ప్రశ్నిస్తే తెలుగుదేశం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వైయస్ జగన్ గారు మాట్లాడిన దానిలో తప్పేముందీ? చంద్రబాబు చేసిన ఇటువంటి అప్రజాస్వామిక విధానాల వల్ల ఆయన చరిత్రలో మచ్చపడిన నేతగా నిలిచిపోతాడు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు కనీసం పోటీ చేసిన అభ్యర్థికి కూడా అవకాశం ఇవ్వరా? పక్క నియోజకవర్గంకు చెందిన టీడీపీ నాయకులను తీసుకువచ్చి, క్యూలైన్లలో నిలబెట్టి వారితో ఓట్లు వేయించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. వీరంతా దొంగ ఓటర్లు అని మేం చెబితే వారిపై చర్యలు ఏవీ? పులివెందుల్లో జరిగింది రిగ్గింగ్.డీఐజీ కోయ ప్రవీణ్ తీరు దారుణం:కోయ ప్రవీణ్ డీఐజీ స్థాయి అధికారిగా వ్యవహరించిన తీరు దారుణం. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ఒక అధికారి ఏకపక్షంగా వ్యవహరించే తీరు ఇదేనా? కడప పార్లమెంట్ సభ్యుడిని ఉదయం నుంచి నిర్భందంలోకి తీసుకుంటారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రిని మాత్రం పోలీస్ బందోబస్త్ మద్య సెగ్మెంట్లో విచ్చలవిడిగా తిరిగేందుకు అనుమతిస్తారు. ఇటువంటి వారి వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. సీఎం చంద్రబాబుకు ఇంత అభద్రతాభావం ఉందని అనుకోలేదు.మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పందిస్తూ..పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడిన ఎంపీ రాహూల్ గాంధీ దేశంలో జరిగిన ఓట్ల అక్రమాలపై మాట్లాడారు. దీనిలో ఏపీలోనూ ఇదే తరహాలో అక్రమాలు జరిగాయి. దానిపై కూడా ఆయన ఎందుకు ప్రస్తావించలేదని వైయస్ జగన్ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందనే దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏపీలో జరిగిన అక్రమాలపై మాట్లాడకపోవడం వెనుక ఉద్దేశాలను వైయస్ జగన్ ప్రశ్నించారు. -
ఏపీకి భారత వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
విశాఖపట్నం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. పలు జిల్లాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లి రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో గురువారం భారత వాతావరణశాఖ ఏపీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద (ఫ్లాష్ ఫ్లడ్) ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కేంద్ర పాలిత ప్రాంతం యానాంకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశముందని తెలుస్తోంది.పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు కదిలే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు కోస్తాంధ్రలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణకేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు.ఏపీ వ్యాప్తంగా గురువారం పలుజిల్లాలో భారీ వర్షాలు కొనసాగాయి. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వరదలతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్యారేజీ వద్ద 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో ఏలూరులో 22, ముమ్మిడివరంలో 18, అమలాపురంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ప్రమాద సూచికను ఏగురవేశారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. -
ఫేస్బుక్లో స్నేహం.. పెట్టుబడి మోసం
విశాఖపట్నం: ఫేస్బుక్లో పరిచయం పెంచుకుని పెట్టుబడి పేరుతో రిటైర్డ్ ప్రొఫెసర్ నుంచి రూ.49.72 లక్షలు దోచుకున్న రిలేషన్షి ప్ మేనేజర్ సతీష్ కుమార్ను నగర సైబర్ క్రైం పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. డిజిటల్ మోసాలపై సైబర్ క్రైం పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంవీపీకాలనీ, సెక్టార్–6కి చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్తో నిందితుడు సతీష్ కుమార్ ఫేస్బుక్లో స్నేహం చేసి పెట్టుబడి పెట్టాలంటూ ఆశ చూపా డు. తద్వారా అతని నుంచి దశలవారీగా రూ.49.72 లక్షలు కాజేశాడు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని సెక్టార్–16కి చెందిన సతీష్ కుమార్గా గుర్తించారు. నిందితుడు నోయిడా వరల్డ్ ట్రేడ్ టవర్లో రిలేషన్íÙప్ మేనేజర్గా పని చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. విచారణలో భాగంగా సతీష్ కుమార్ తన ఐడీఎఫ్సీ బ్యాంక్ కరెంట్ అకౌంట్ను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి భారీ మోసాలకు సహకరించినట్లు తేలింది. ఈ అకౌంట్ ద్వారా వారు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై 111(2), 319(2), 318(4) రెడ్/విత్ 61(2) బీఎన్ఎస్, 66–సీ, 66–డీ ఐటీఏ–2000–2008 సెక్షన్ల కింద కేసు(నం. 112/2025) నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
అంతస్తుకో రేటు
అనుమతులు గోరంత.. అక్రమాలు అందనంతగాజువాక : నిబంధనలన్నీ పాటించి చిన్న భవనం నిర్మించుకుంటేనే భూతద్దంలో చూసి విరుచుకుపడిపోయే జీవీఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి షీలానగర్ దరి వెంకటేశ్వర కాలనీ 4ఎ లైన్లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనంపై అవ్యాజప్రేమ చూపించారు. నిబంధనలకు పాతరేసినా, భవన నిర్మాణంలో పాటించాల్సిన నియమాలను ఉల్లంఘించినా, జీవీఎంసీ నుంచి పొందిన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినా చూసీ చూడనట్టు వదిలేశారు. అంతేకాదు అసంపూర్తిగా ఉన్న భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ను కూడా జారీ చేసేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సామాజిక కార్యకర్తలు టౌన్ప్లానింగ్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గాజువాక మండలం తుంగ్లాం సర్వే నంబర్ 102/2డి1ఎ 700 గజాల విస్తీర్ణంలో రెండు స్థలాలున్నాయి. అందులో ఒకటి 300 చదరపు గజాలు కాగా, మరొకటి 400 చదరపు గజాల స్థలం. ఈ రెండు స్థలాల్లో భవన నిర్మాణం కోసం సదరు బిల్డర్ రెండు వేర్వేరుగా అనుమతులు పొందాడు. 20 అడుగుల రహదారిని ఆనుకొని చేపట్టిన భవన నిర్మాణం ప్లాన్ ప్రకారమైతే ఒక స్థలంలో స్టిల్ట్+గ్రౌండ్+రెండు అంతస్తులు, మరో స్థలంలో స్టిల్ట్+గ్రౌండ్+మూడు అంతస్తులు నిర్మించుకోవాలి. సెట్బ్యాక్లను పూర్తిస్థాయిలో మినహాయించాల్సి ఉంది. అయితే, సెట్బ్యాక్లకు ఉంచాల్సిన స్థలంలో ఇంచి కూడా వదలకుండా నిర్మాణం జరిగిపోతోంది. రుణాలకు బ్యాంకులు ససేమిరా! ఈ భవనంలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకొనేవారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించలేదని తెలుస్తోంది. ఇది ప్రణాళిక నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారన్న కోణంలో బ్యాంకులు విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. రెరా, జీవీఎంసీ బిల్డింగ్ బైలా, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం బిల్డర్తోపాటు సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దాటవేత ధోరణిలో అధికారులు ఈ విషయంపై గాజువాక జోన్ టౌన్ప్లానింగ్ ఏసీపీ వెంకటరావును సంప్రదించడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఫోన్లో మాట్లాడటానికి ఇష్టపడలేదు. టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ వరప్రసాద్ను సంప్రదించగా ఆయన భిన్న విషయాలు చెప్పారు. సదరు భవన నిర్మాణం పూర్తయిందని ఒకసారి, నిబంధనల ప్రకారమే ఆక్యుపెన్సీ ఇచ్చామని మరోసారి, అక్కడ ఉల్లంఘనలు లేవని ఇంకోసారి చెప్పుకొచ్చారు. భవనం ఫొటోలు చూపించగా పరిశీలిస్తామని పేర్కొన్నారు. ప్లాన్ ఒకలా, నిర్మాణం మరోలా.. ఉల్లంఘనలను పట్టించుకోని అధికారులు భవనం పూర్తి కాకుండానే ఆక్యుపెన్సీ జారీ టౌన్ప్లానింగ్ అధికారుల తీరుపై విస్మయం నిబంధనలు తెలియవా? బిల్డర్ ప్రాజెక్టు కోసం ఎటువంటి రెరా రిజిస్ట్రేషన్ లేకుండా 1020 చదరపు అడుగులు, 980 చదరపు అడుగులు, 1345 చదరపు అడుగులు, 1467 చదరపు అడుగుల చొప్పున ఫ్లాట్లను విక్రయానికి పెట్టాడు. ఇది రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం (రెరా)ను ఉల్లంఘించడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. అలా విక్రయించడం గృహ కొనుగోలుదారులను మోసం చేయడమేనని చెబుతున్నారు. భవన నిర్మాణం ఒకపక్క సాగుతోంది. మరోపక్క టౌన్ప్లానింగ్ అధికారులు ఆక్యుపెన్సీ జారీ చేసేశారు. నిర్మాణం పూర్తయిన తరువాత అన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ అనేక రకాలుగా అధికారులను సంతృప్తి చేస్తే తప్ప రాని ఆక్యుపెన్సీ అన్నీ ఉల్లంఘనలు.. నిర్మాణం కూడా పూర్తి కాని భవనానికి ఎలా ఇచ్చారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలుతోంది. నచ్చినట్లు నిర్మాణం ఈ రెండు భవనాలకు బిల్డర్ వ్యక్తిగత అనుమతులు తీసుకున్నాడు. ప్లాన్ ప్రకారం వ్యక్తిగత నివాస భవనాలు కాకుండా వాటిని బహుళ యూనిట్లుగా మార్చాడు. తొమ్మిది మీటర్ల కంటే తక్కువ రహదారి ఉన్న స్థలాల్లో నిర్మించే భవనాలకు వ్యక్తిగత నివాస భవనంగా మాత్రమే ప్లాన్ పొందే అవకాశం ఉంది. దీంతో వ్యక్తిగత నివాస భవనాలకు ప్లాన్ పొందిన బిల్డర్ రెండు భవనాలను చట్ట విరుద్ధంగా ఒకే బ్లాక్లో విలీనం చేశాడు. ప్లాన్కు విరుద్ధంగా స్టిల్ట్+గ్రౌండ్+మూడు అంతస్తుల నిర్మాణం చేపట్టాడు. అదనపు అంతస్తును, సెట్ బ్యాక్ల ఉల్లంఘనలను సమర్థించుకోవడానికి ఎటువంటి టీడీఆర్లు పొందలేదు. ఇంతవరకు బిల్డర్ కక్కుర్తి పడి ఉండొచ్చు అనుకున్నా భవన నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే టౌన్ప్లానింగ్ అధికారులు దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (15.07.2025న బీఏ నంబర్ 1086/1682/బి/జెడ్/వైటీఏ/2024) లు ఇచ్చేశారు. భవన నిర్మాణం పూర్తి కాకుండా, ఎలాంటి సౌకర్యాలు కల్పించకముందే ఉల్లంఘనల భవనాలకు టౌన్ప్లానింగ్ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
ఇదీ నేపథ్యం..!
పరవాడ మండలం దేశపాత్రునిపాలెం పరిధిలోని 360–1, 360–2, 360–3, 360–2 సర్వే నెంబర్లలో మొత్తం 13.25 ఎకరాల భూమిని నలుగురు మాజీ సైనికోద్యోగులకు (రమణమ్మ, ఎస్.వేణుగోపాల్ రెడ్డి, ఏఎస్ఆర్కే కుమార్, ఆర్.రామచంద్రరావు) కేటాయించారంటూ రికార్డుల్లో ఉంది. ఈ భూములను వారి నుంచి గతంలోనే కోరమాండల్ ఎస్టేట్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేసింది. అప్పట్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు భూ వివాదాలు నడుస్తున్నాయని.. భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ మంత్రి అయ్యన్న ఆరోపించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసి విచారణ కూడా నిర్వహించారు. దీంతో గతంలో జరిగిన భూలావాదేవీలపై నిషేధం విధించారు. ప్రధానంగా మాజీ సైనికోద్యోగులకు చెందిన భూములపై లావాదేవీలు జరగకుండా నిషేధం కొనసాగింది. ఈ నేపథ్యంలో దేశపాత్రునిపాలెం పరిధిలోని 13.25 ఎకరాల భూముల లావాదేవీలపై కూడా నిషేధం ఉంది. ఇప్పుడు హఠాత్తుగా సిట్లో 360–1, 360–2 సర్వే నెంబర్లు లేవని అపెక్స్ కమిటీ మెమోను చూపిస్తూ ప్రైవేటు సంస్థకు 6.26 ఎకరాల భూమిని కట్టబెట్టడం గమనార్హం. -
స్టీల్ మెల్ట్ షాప్–2లో 72 హీట్లతో కొత్త రికార్డు
ఉక్కునగరం: విశాఖ స్టీల్ప్లాంట్ మరో అద్భుతమైన ఘనతను సాధించింది. స్టీల్ మెల్ట్ షాప్– 2 (ఎస్ఎంఎస్–2) విభాగంలో మంగళవారం అత్యధికంగా 72 హీట్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో 2021 జనవరి 30న సాధించిన 68 హీట్ల రికార్డును ఇది అధిగమించింది. ఈ రికార్డు సాధనలో భాగంగా మూడు షిఫ్టుల్లోనూ 24 చొప్పున మొత్తం 72 హీట్లు ఉత్పత్తి అయ్యాయి. దీంతో రెండు స్టీల్ మెల్ట్ షాపులలో కలిపి మొత్తం 133 హీట్లు ఉత్పత్తి అయ్యాయి. అంతేకాకుండా మూడు బ్లాస్ట్ ఫర్నేస్లలో కలిపి 19,037 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి కావడం విశేషం. ఈ రికార్డు సాధనలో కృషి చేసిన ఉద్యోగులను స్టీల్ప్లాంట్ ఉన్నతాధికారులు అభినందించారు. వినాయక చవితి ఉత్సవాలకు సింగిల్ విండో క్లియరెన్స్ సెల్ డాబాగార్డెన్స్: వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు జీవీఎంసీలో సింగిల్ విండో క్లియరెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని నోడల్ అధికారులు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేషకుమార్ 9848308823, సిటీప్లానర్ వి.మీనాకుమారి 8374966777, కార్యనిర్వాహక ఇంజనీర్ డి.శ్రీధర్ 8187898427, అగ్నిమాపక అధికారి బి.కృపావరం 9912448555, అలాగే జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, కార్యనిర్వాహక ఇంజనీర్లను సంప్రదించాలని తెలిపారు. -
చంద్రబాబును గద్దె దించడమే దళితుల లక్ష్యం
● దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా సీఎం, మంత్రుల వ్యాఖ్యలు ● ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముఖ్యమంత్రి అయ్యేది జగనే.. ● వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్బాబువిశాఖ సిటీ: దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు నిద్రపోయేది లేదని.. అదే దళితుల లక్ష్యమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు తేల్చి చెప్పారు. మద్దిలపాలెంలోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చంద్రబాబు, మీకెందుకురా రాజకీయాలు, మేము చేసుకుంటాం.. అని ఆ పార్టీ విప్ చింతమనేని ప్రభాకర్, మంత్రులు సైతం దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పుట్టుకను, చదువును అవమానించిన టీడీపీని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయడం తథ్యమన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని పక్కనపెట్టి.. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం జగన్ రూ.2.75 లక్షల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. దళితుల ఆత్మాభిమానం పెరగాలంటే జగన్ సీఎం కావాలని తేల్చి చెప్పారు. జైబీమ్–జై జగన్ నినాదం రాష్ట్రంలో మార్మోగిపోవాలని పిలుపునిచ్చారు. పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలు వైఎస్సార్ సీపీకి, పోలీసులకు మధ్య జరిగాయన్నారు. ● ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే దళితులకు రాజ్యాధికారం దక్కిందని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎంలు, మంత్రులతో పాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు, వారి ఆస్తుల ఆక్రమణలు, గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ● మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. అంబేడ్కర్ ఆశయ సాధన కు అనుగుణంగా దళితుల సంక్షేమం, అభివృద్ధి కో సం జగన్ కృషి చేశారన్నారు. గత ఎన్నికల్లో దళితులు వైఎస్సార్ సీపీకి అధికంగా ఓటేశారని గుర్తు చేశారు. ● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రపంచంతో పో టీ పడేవిధంగా ఇంగ్లిష్ మీడియంతోపాటు సీబీఎస్ సీ సిలబస్ను ప్రవేశపెట్టిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ దళితులపై కక్షపూరితంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. మోసానికి ప్యాంటు, షర్టు వేస్తే చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా విజయవాడలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు తన టీడీపీ గూండాలతో రాళ్లు వేయించారని ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు చిత్తశుద్ధి, సమానత్వ దృక్పథంతో దళిత వర్గాన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించి దళితులపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఇంకా వెయ్యి రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, ఆ తర్వాత జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు. దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ జగన్ ఒక సింహం అని, సింహానికి పదవి, కిరీటం అవసరం లేదన్నారు. కార్యకర్తలకు చిన్న దెబ్బ తగిలినా 100 రెట్లు అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం జైళ్లను బాగు చేసుకోవాలని, ఏసీలు పెట్టుకోవాలని సూచించారు. తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చింది జగన్ మాత్రమే అన్నారు. డిప్యూటీ సీఎం నుంచి కార్పొరేటర్ల వరకు అన్నింట్లోను దళితులకు భాగస్వామ్యం కల్పించారని తెలిపారు. గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు సంక్షేమం అందకపోగా వారిపై దాడులు జరుగుతుండడం దారుణమన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తేనే బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. సమావేశంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్కుమార్, సిహెచ్ వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, పార్టీ కార్యాలయం ఇన్చార్జ్ రవిరెడ్డి, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్ వెస్లీ, పేర్ల విజయ్చంద్ర, పార్టీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్, రవిరాజు, జహీర్ అహ్మద్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బోని శివరామకష్ణ, జిల్లా పరిశీలకుడు వీరంశెట్టి పూర్ణ చంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెయ్యి వెంకటరమణ, జోనల్ విభాగం అధ్యక్షుడు అల్లంపల్లి రాజాబాబు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు చెన్నా జానకిరామ్, మార్కట్ కమిటీ మాజీ చైర్మన్ ఆల్ఫాకృష్ణ, కార్పొరేటర్లు కె.వి.శశికళ, బళ్ల లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గండి భాగ్యవతి, ఐ.డి.బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కోన వెంకట శంకర సన్యాసిరావు, ఎడ్ల సిద్ధార్ధ రాజు, ముంజేటి హనుమంతరావు నియోజకవర్గం అధ్యక్షులు మర్దపూడి పరదేశి, పూడి మల్లేశ్వరరావు, ఆకుల శ్యామ్కుమార్, దొండపర్తి లక్ష్మారావు, బంగారు భవా నీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.