Technology
-
కొత్త ఫీచర్తో వాట్సప్ గ్రూప్ కంటెంట్కు మరింత భద్రత
వినియోగదారులు తమ సందేశాలు, మీడియా ఫైల్స్పై మరింత నియంత్రణను కల్పించేందుకు ప్రముఖ ఆన్లైన్ చాటింగ్ యాప్ వాట్సాప్ అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఇతరులు తమ చాట్లోని సందేశాలను, మీడియా ఫైల్స్ను ఎక్స్పోర్ట్ చేయకుండా, ఆటో డౌన్ లోడ్ చేయకుండా, ఏఐ సంబంధిత సాధనాల కోసం సందేశాలను ఉపయోగించకుండా నిరోధిస్తుంది.ఇదీ చదవండి: బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!గోప్యతకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ వినియోగదారుల అవసరాల కోసం ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. గ్రూప్ మేసేజ్లకు మరింత భద్రత కల్పించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది. చాట్ సెట్టింగ్స్లో ‘అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ’ ఆప్షన్ ద్వారా దీన్ని మాన్యువల్గా ఎనేబుల్ చేయవచ్చు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత చాట్లో పాల్గొనే వారందరికీ పరిమితులు వర్తిస్తాయి. గ్రూప్లోని కంటెంట్ వాట్సాప్లోనే ఉండేలా చూసుకుంటుంది. -
టెక్ దిగ్గజంలో తొలగింపులు.. 20 వేల మందికిపైనే!
టెక్ పరిశ్రమలో అనిశ్చితులు ఇప్పట్లో కుదటపడేలా కనిపించడం లేదు. టాప్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం.. తమ వర్క్ ఫోర్స్లో 20 శాతానికి పైగా తొలగించాలని యోచిస్తోన్న ఇంటెల్ ఈ వారంలోనే లేఆఫ్లను ప్రకటించబోతోంది.గత మార్చిలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన లిప్-బు తాన్ నాయకత్వంలో ఇంటెల్ కంపెనీ ఈ వారం 20,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను ప్రకటించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. 2024లో 19 బిలియన్ డాలర్ల నష్టంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇంటెల్, ఈ కోతలతో అధికారిక వ్యవస్థను తగ్గించి, నిర్వహణను సరళీకరించి, ఇంజనీరింగ్-ఆధారిత సంస్కృతిని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదే మొదటిసారి కాదు...ఇంటెల్ తన పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు ఉద్యోగాల కోతలను చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో కంపెనీ మొత్తం సంఖ్య 1,08,900కు చేరింది. అంతకుముందు సంవత్సరం 2023లో ఇంటెల్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 124,800 ఉండేది.రోజుకు 450 మంది తొలగింపు2025లో 257 టెక్ కంపెనీలు రోజుకు సగటున 450 మంది చొప్పున 50,372 మంది ఉద్యోగులను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్వైఐ తెలిపింది. 2024లో 1,115 కంపెనీల్లో 2,38,461 మంది ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారు. ఇంటెల్ మాత్రమే కాకుండా గూగుల్ 2025 ఏప్రిల్లో తన ప్లాట్ఫామ్స్ అండ్ డివైజెస్ యూనిట్ (ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్)లో వందలాది మందిని తొలగించింది. అంతకు ముందు క్లౌడ్, హెచ్ఆర్ విభాగాల ఉద్యోగుల సంఖ్యలో కోత విధించింది.మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా వచ్చే మే నెలలో తొలగింపులకు సిద్ధమవుతోంది. ఇంజనీర్-టు-మేనేజర్ నిష్పత్తులను పెంచడానికి మిడిల్ మేనేజర్లు, తక్కువ పనితీరు కనబరిచేవారిని లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా దాని భద్రతా విభాగంలో ఈ తొలగింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 2025 ఫిబ్రవరిలో 3,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి పనితీరు ఆధారిత తొలగింపులపై దృష్టి సారించింది. -
అదానీ నుంచి ఎయిర్టెల్కు స్పెక్ట్రమ్
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్తో కలిసి అదానీ డేటా నెట్వర్క్స్(ఏడీఎన్ఎల్) నుంచి 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వినియోగ హక్కులను కొనుగోలు చేయనున్నట్లు మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. 2022లో నిర్వహించిన వేలం ద్వారా 26 గిగాహెట్జ్ బ్యాండ్లో 400 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ను డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ ఏడీఎన్ఎల్ సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 212 కోట్లు వెచ్చించింది.కాగా.. ఈ స్పెక్ట్రమ్ను వినియోగించుకునేందుకు వీలుగా ఏడీఎన్ఎల్తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఎయిర్టెల్ పేర్కొంది. దీనిలో భాగంగా గుజరాత్(100 ఎంహెచ్జెడ్), ముంబై(100 ఎంహెచ్జెడ్), ఆంధ్రప్రదేశ్(50 ఎంహెచ్జెడ్), రాజస్తాన్(50 ఎంహెచ్జెడ్), కర్ణాటక(50 ఎంహెచ్జెడ్), తమిళనాడు(100 ఎంహెచ్జెడ్)లో స్పెక్ట్రమ్ను వినియోగించుకోనున్నట్లు తెలియజేసింది. -
కొత్త కస్టమర్లు ఎయిర్టెల్కే ఎక్కువ!
దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జనవరిలో స్వల్పంగా పెరిగి 119 కోట్లకు చేరింది. వైర్లైన్, మొబైల్ సెగ్మెంట్లలో కొత్త సబ్స్క్రయిబర్స్ను దక్కించుకోవడంలో ఎయిర్టెల్ అగ్రస్థానంలో నిల్చింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.వీటి ప్రకారం గతేడాది డిసెంబర్లో 118.99 కోట్లుగా ఉన్న టెలికాం సబ్స్క్రయిబర్స్ సంఖ్య జనవరిలో 119.20 కోట్లకు పెరిగింది. మొబైల్, వైర్లైన్ సెగ్మెంట్లో ఎయిర్టెల్ యూజర్లు వరుసగా 16.53 లక్షలు, 1.17 లక్షల మేర పెరిగారు. 5జీ ఫిక్సిడ్ వైర్లెస్ యాక్సెస్ను వైర్లెస్ సర్వీసుగా ట్రాయ్ వర్గీకరించింది. ప్రస్తుతం ఈ విభాగంలో 48.44 లక్షల యూజర్లతో రిలయన్స్ జియో అగ్రస్థానంలో, 8.72 లక్షల సబ్స్క్రయిబర్స్తో ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉన్నాయి.మరిన్ని ముఖ్యంశాలు.. » మొబైల్ సెగ్మెంట్లో జియో 46.5 కోట్ల యూజర్లతో నంబర్వన్గా, 38.69 కోట్ల మందితో ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా 13 లక్షల కనెక్షన్లను, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ 3.69 లక్షలు, ఎంటీఎన్ఎల్ 2,617 మంది కస్టమర్లను కోల్పోయాయి.» వైర్లైన్ విభాగంలో బీఎస్ఎన్ఎల్ 39,953, ఎంటీఎన్ఎల్ 9,904, క్వాడ్రాంట్ 4,741, వొడాఫోన్ ఐడియా 3,447 మంది కస్టమర్లను పోగొట్టుకున్నాయి. » జియో, ఎయిర్టెల్ నిర్దేశిత ఫార్మాట్లో డిసెంబర్, జనవరి డేటాను సమర్పించకపోవడంతో ట్రాయ్ బ్రాడ్బ్యాండ్ యూజర్ల వివరాలను అప్డేట్ చేయలేదు. -
స్మార్ట్ఫోన్లు, పీసీల తయారీ కేంద్రంగా భారత్
ముంబై: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం భారత్కు అనూకూలంగా మారుతోంది. అంతర్జాతీయ స్మార్ట్ఫోన్లు, ల్యాప్ట్యాబ్లు/వ్యక్తిగత కంప్యూటర్ (పీసీలు) సంస్థలు తమ ఉత్పత్తి కర్మాగారాలను చైనా నుంచి భారత్కు తరలించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి. కౌంటర్పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం అగ్రరాజ్యల మధ్య సుంకాల విధింపులు, ప్రతీకార టారిఫ్ల ఉద్రికత్తలు కొనసాగితే.., అంతర్జాతీయ స్మార్ట్ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో డ్రాగన్ దేశపు వాటా 2026 నాటికి 55 శాతానికి పడిపోయే వీలుంది. గత సంవత్సరం(2024) ఈ వాటా 64 శాతంగా ఉంది. ఇదే సమయంలో భారత్ నుంచి ముఖ్యంగా అమెరికాకు యాపిల్, శాంసంగ్ ఎగుమతులు జోరందుకోనున్నాయి. అంతర్జాతీయ స్మార్ట్ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో భారత్ వాటా 2026 నాటికి 25–28 శాతానికి చేరొవచ్చు. కాగా గత సంవత్సరంలో ఈ వాటా 18 శాతంగా ఉంది. → అంతర్జాతీయంగా ఐఫోన్ల ఉత్పత్తి విలువలో భారత్ ఎగుమతుల వాటా ప్రస్తుతం 20 శాతంగా ఉంది. ఇది 2025–26 కల్లా 25 శాతానికి, 2026–27 నాటికి 35 శాతానికి చేరుతుందని కౌంటర్పాయింట్ అంచనా వేస్తోంది. → ల్యాప్ట్యాబ్లు/ పీసీల మొత్తం తయారీలో చైనా వాటా 2026 నాటికి 68–70 శాతానికి దిగివచ్చే అవకాశం ఉంది. 2024లో ఈ వాటా 75 శాతంగా ఉంది. అంతర్జాతీయ ల్యాప్ట్యాబ్ల ఉత్పత్తిలో భారత్ వాటా 2026 నాటికి ఏడు శాతానికి చేరుకోవచ్చు. 2024లో భారత్ వాటా కేవలం నాలుగు శాతంగా ఉంది. ‘‘ల్యాప్ట్యాబ్లు, పీపీలు చైనా నుంచే అధికంగా దిగుమతి అవుతున్నాయి. వాణిజ్య వార్ నేపథ్యంలో హెచ్పీ, డెల్ ఇతర సంస్థలు తమ ఉత్పత్తి స్థావరాలు చైనా నుంచి భారత్కు మారిస్తే అంతర్జాతీయంగా దేశీయ మార్కెట్ వాటా పెరగడమే కాకుండా ఎగుమతులు సైతం గణనీయంగా పెరుగుతాయి. భారత్ సైతం ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఐటీ హార్డ్వేర్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం ‘మేక్ ఇన్ ఇండియా’ ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం’ వంటి పథకాలు ప్రవేశపెట్టింది’’ అని ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) సభ్యుడొకరు తెలిపారు. అంత సులువేం కాదు: చైనా నుంచి తయారీ కర్మాగారాలను భారత్కు తరలించడం అంత సులువు కాదని కాన్లేస్ నివేదిక చెబుతోంది. డెల్ సంస్థ ల్యాప్ట్యాబ్ల ఉత్పత్తి 79% చైనాలో ఉండగా, మిగిలినదంతా వియత్నాంలో ఉంది. కాన్లేస్ రిపోర్ట్ ప్రకారం 2026 నాటికి డెల్ తన తయారీ సామర్థ్యాన్ని సగానికిపైగా వియత్నాంకు తరలించనుంది. లెనివో సైతం వియత్నాంను ప్రత్యమ్నాయ దేశంగా చూస్తోంది. చైనాలో 85% తయారీ సామర్థ్యం ఉన్న హెచ్పీ.. 2026 కల్లా మెక్సికో, తైవాన్ దేశాలకు 45% మార్చనుంది. -
ఒప్పో కొత్త ఫోన్.. గంటలోపే ఫుల్ చార్జింగ్
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తన సరికొత్త ఒప్పో కే13 5G (Oppo K13 5G) స్మార్ట్ఫోన్ను భారత్లో లాంచ్ చేసింది. రూ. 20,000 సెగ్మెంట్లోనే స్నాప్డ్రాగన్ 6 జెన్ 4 చిప్సెట్, భారీ 7000mAh బ్యాటరీ ఫీచర్లతో ఈ స్మార్ట్ వచ్చింది. దీని ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇక్కడ చూద్దాం.ఉన్నాయి.ధర.. 8GB RAM + 128GB స్టోరేజ్: రూ.17,9998GB RAM + 256GB స్టోరేజ్: రూ.19,999లాంచ్ ఆఫర్: లాంచ్ రోజున, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్లతో రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లేదా రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. ఫలితంగా ధరలు రూ.16,999, రూ.18,999కి తగ్గుతాయి. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.లభ్యత: 2025 ఏప్రిల్ 25 నుండి ఫ్లిప్కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్, ఆఫ్లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఐసీ పర్పుల్, ప్రిజం బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యమవుతాయి.స్పెసిఫికేషన్లు, ఫీచర్లుడిస్ప్లే: 6.67-ఇంచ్ ఫుల్ HD+ (2400x1080 పిక్సెల్స్) AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ప్రాసెసర్: 4nm క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 4 ఆక్టా-కోర్ (2.3GHz వరకు), అడ్రినో 810 GPUతో, స్నాప్డ్రాగన్ ఎలైట్ గేమింగ్ ఫీచర్లుఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15, 2 సంవత్సరాల OS అప్డేట్స్. 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్.కెమెరా: వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా.బ్యాటరీ: 7000mAh గ్రాఫైట్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ (30 నిమిషాల్లో 62%, గంటలోపే పూర్తి ఛార్జ్) -
కొత్త ఏటీఎమ్.. ఇలా బంగారం వేస్తే అలా డబ్బులొస్తాయ్..
ఏటీఎం గురించి తెలుసా? అని ఎవరినైనా అడిగితే.. అదెందుకు తెలియదు మాకు తెలుసు అనే చాలామంది చెబుతారు. అయితే గోల్డ్ ఏటీఎం గురించి తెలుసా? అని అడిగితే.. అడిగిన వాళ్లనే అనుమానంగా చూస్తారు. బహుశా మీ అనుమానం కరెక్టే కావచ్చు, కానీ అలాంటి ఏటీఎం కూడా ఒకటి వచ్చేసింది. దాని గురించి తెలుసుకోవాలంటే, ఈ కథనం చదివేయాల్సిందే..చైనాలోని షాంఘైలో బంగారాన్ని కరిగించి, దానికి తగిన డబ్బును అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసే ఏటీఎం మెషిన్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో గోల్డ్ వేస్తే.. దాని బరువును, నాణ్యతను బట్టి.. ఆ రోజు మార్కెట్ విలువను బట్టి వినియోగదారుడి బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేస్తుంది. ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఈ మెషిన్ బంగారాన్ని 1,200 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగిస్తుంది తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇదీ చదవండి: దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం.. మారిన ఏటీఎం ఛార్జీలువీడియోలో గమనించినట్లయితే.. ఒక మహిళ బంగారాన్ని ఏటీఎం మెషిన్లో వేసిన తరువాత, ఆ రోజు ధరలను లెక్కగట్టి, బంగారంకు విలువకు తగిన డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదే ప్రపంచంలోని మొట్ట మొదటి గోల్డ్ ఏటీఎం మెషిన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. టెక్నాలజీకి ఫిదా అయిపోతున్నారు.This gold ATM in China melts your gold and transfers the money to your bank accountpic.twitter.com/vCmS09eRYG— Learn Something (@cooltechtipz) April 20, 2025 -
మూడ్కు తగ్గట్టు మ్యూజిక్ వినిపించే స్మార్ట్ లైట్
ఈ ఫొటోలో కనిపిస్తున్న సీలింగ్ లైట్ కేవలం ప్రకాశవంతమైన వెలుగు కోసం మాత్రమే పరిమితమైన లైట్ కాదు. ఎప్పటికప్పుడు మీ మూడ్కు తగ్గట్టు సంగీతంతోపాటు, రంగు రంగుల లైట్లతో ఇంటిని పార్టీ థీమ్లోకి తీసుకొని వెళ్లగలిగే స్మార్ట్ లైట్.రీచార్జబుల్ బ్యాటరీతోనూ పనిచేస్తుంది. కాబట్టి, మధ్యలో కరెంట్ పోయినా కూడా పార్టీకి అంతరాయం ఏర్పడదు. మొబైల్ యాప్, గూగుల్ హోమ్, అమెజాన్ అలెక్సాతో అనుసంధానం చేసుకొని వాడుకోవచ్చు. ధర 139 డాలర్లు (రూ. 11,995). -
కొత్తరకం ఫ్యాన్లు: ధరలు ఎలా ఉన్నాయంటే?
టెక్నాలజీ పెరుగుతోంది. మనం రోజూ చూస్తున్న వస్తువుల్లో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇస్మార్ట్ క్రిస్టల్ షాండ్లియర్ ఫ్యాన్, కేబుల్ ఫ్యాన్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..షాండ్లియర్ అందించే చల్లగాలిఇంటి సీలింగ్కు షాండ్లియర్తో అలంకరిస్తే చూడటానికి భలే బాగుంటుంది. కాని, షాండ్లియర్ను తగిలిస్తే, ఆ చుట్టు పక్కల ఫ్యాన్ అమర్చుకోలేం. ఇప్పుడు ఈ సమస్యను దూరం చేస్తోంది ఈ ‘ఇస్మార్ట్ క్రిస్టల్ షాండ్లియర్ ఫ్యాన్’. ఇది ఒకవైపు వెలుగులు వెదజల్లుతూనే, మరోవైపు నిశ్శబ్దంగా చల్లని గాలిని కూడా వీస్తుంది. రిమోట్ కంట్రోల్ ద్వారా లైట్, ఫ్యాన్ స్పీడ్ను కంట్రోల్ చేయొచ్చు. ధర 299 డాలర్లు (రూ. 25,664).ఇదీ చదవండి: ఒక ఫ్యాన్స్ మూడు లాభాలుకేబుల్ ఫ్యాన్ఇది అచ్చం డేటా కేబుల్లాంటి ఫ్యాన్. ఎక్కడికైనా సరే తీసుకెళ్లడానికి చాలా అనువుగా ఉంటుంది. యూఎస్బీ పోర్ట్ సాయంతో మొబైల్, అడాప్టర్, కంప్యూటర్ కేస్, ల్యాప్టాప్ ఇలా దేనికైనా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఫ్యాన్ తిరిగేటప్పుడు చల్లటి గాలితో పాటు, సమయం, ఉష్ణోగ్రతలను తెలిపే డిజిటల్ క్లాక్ను కూడా ఇది డిస్ప్లే చేస్తుంది. ధర కంపెనీ, క్వాలిటీ లపై ఆధారపడి ఉంటుంది. వివిధ కంపెనీల పేర్లతో ఆన్లైన్లో లభిస్తోంది. -
ఒకేసారి మూడు లాభాలు
సీలింగ్ ఫ్యాన్ను కూడా ఇప్పుడు బయటకు తీసుకెళ్లి వాడుకోవచ్చు. ఇది ఒక స్మార్ట్ పోర్టబుల్ ఫ్యాన్. పేరు ‘క్రోబాట్ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్’. దీనికున్న ఈజీ డిటాచబుల్ రెక్కల సాయంతో ఎక్కడకు కావాలనుకుంటే అక్కడకు ఇట్టే తీసుకెళ్లవచ్చు.ఏదైనా ఎత్తైన హుక్కు తగిలించి.. సీలింగ్ ఫ్యాన్లా స్టాండ్కు బిగించి టేబుల్ ఫ్యాన్లా వాడుకోవచ్చు. అంతేకాదు, ఇందులో లైటింగ్ సిస్టమ్ ఉండటంతో ఇది ల్యాంప్గానూ పనిచేస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ధర రూ. 1,649 మాత్రమే! -
భూకంపం వస్తే ఏం చేయాలి?: చాట్జీపీటీ సమాధానం
చాట్జీపీటీ.. అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది వివిధ రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఏ ప్రశ్నకైనా తనదైన రీతిలో సమాధానాలు ఇస్తూ.. యూజర్లను అబ్బురపరుస్తున్న ఏఐ చాట్బాట్, ఇప్పుడు భకంపం వస్తే ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఎలాంటి సమాధానం ఇచ్చిందో.. ఈ కథనంలో చూసేద్దాం.ఇంట్లో ఉన్నప్పుడు భూకంపం వస్తే..➤భూకంపం వచ్చినప్పుడు మీరు ఇంట్లోనే ఉంటే.. మోకాళ్లపై వంగి కూర్చున్న విధంగా ఉండండి. ఈ భంగిమలో ఉంటే.. మీరు కిందకు పడిపోకుండా ఉంటారు.➤తల, మెడ మాత్రమే కాకుండా.. వీలైనంత వరకు మీ శరీరాన్ని మొత్తం ఒక దృఢమైన టేబుల్ లేదా డెస్క్ కింద ఉండేలా చూసుకోండి. భూమి కంపించడం ఆగేవరకు అలాగే ఉండండి.➤కిటికీలు, గోడలకు దూరంగా ఉండండి. భయంతో పరుగులు పెట్టడం మంచిది కాదు.➤లిఫ్ట్ వంటి వాటిని ఉపయోగించవద్దు.బయట ఉన్నపుడు భూకంపం వస్తే..➤మీరు బయట ఉన్నప్పుడు భూకంపం వస్తే.. భవనాలు, యుటిలిటీ వైర్లు, సింక్ హోల్స్, ఫ్యూయెల్ స్టేషన్స్, గ్యాస్ లైన్స్ వంటి వాటికి దూరంగా ఉండండి.➤చెట్లు, టెలిఫోన్ స్తంభాలకు దగ్గరగా ఉండటం మంచిది కాదు.➤ఒకవేళా కారులో ప్రయాణిస్తుంటే.. వెంటనే ఒక సేఫ్ పార్కింగ్ ప్రదేశంలో కారును పార్క్ చేయండి.➤బ్రిడ్జ్, ఫ్లైఓవర్స్, సొంరంగాలు వంటి వాటికి దూరంగా ఉండండి.➤భూమి కంపించడం ఆగే వరకు.. పరుగులు పెట్టడం వంటివి చేయడం మంచిది కాదు.ఇదీ చదవండి: ఎండలో కారు చల్లగా ఉండాలంటే: ఇదిగో టాప్ 5 టిప్స్.. -
మనుషులతో.. మరమనుషుల రన్నింగ్ - వీడియో
టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతోంది.. దాదాపు అన్ని రంగాల్లోనూ రోబోల హవా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో చైనా మనుషులతో పోటీగా మారథాన్లో పరుగులు పెట్టే రోబోట్లను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింలో వైరల్ అవుతోంది.శనివారం (ఏప్రిల్ 19) చైనాలో నిర్వహించిన మారథాన్లో.. మనుషులతో పాటు రోబోలు పరుగులు పెట్టాయి. మనుషులతో.. మరమనుషులు పరుగులు పెట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మారథాన్లో పాల్గొన్న రోబోట్లను 20 కంటే ఎక్కువ కంపెనీలు అభివృద్ధి చేశాయి. రోబోట్లు మనుషులు మాదిరిగా కనిపించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది.ఏప్రిల్లో జరగనున్న మారథాన్ బీజింగ్లోని డాక్సింగ్ జిల్లాలో నిర్వహించనున్నట్లు, 21 కిమీ మేర డజన్ల కొద్దీ హ్యూమనాయిడ్ రోబోలు 12,000 మంది మానవ అథ్లెట్లతో పోటీపడతాయని.. ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ వార్త వెల్లడైంది. ఆ విధంగానే మారథాన్ నిర్వహించారు.చైనా హ్యూమనాయిడ్ రోబోలను ఎందుకు అభివృద్ధి చేస్తోందిచైనాలో వృద్ధాప్య జనాభా పెరిగిపోవడంతో.. శ్రామిక శక్తి తగ్గుముఖం పట్టింది. దీంతో దేశం జనాభాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఇతర దేశాలతో పోటీపడాలన్న.. ఆర్ధిక వృద్ధిని పెంచాలన్నా శ్రామిక శక్తి అవసరం. దీనిని భర్తీ చేయడానికి చైనా హ్యూమనాయిడ్ రోబోలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ ప్రకారం.. చైనీస్ క్లయింట్లు 2023లో 2,76,288 రోబోట్లను ఇన్స్టాల్ చేసారు. దీన్ని బట్టి చూస్తే.. ప్రపంచంలో ఉన్న మొత్తం రోబోట్లలో చైనాలో ఉన్న రోబోట్లు 51 శాతం అని సమాచారం.The #Humanoid #Robot half-marathon in #Beijing kicked off an hour ago. #China is accelerating its dominance in the robotics and #AI race with unmatched strategic investments. While the world watches in awe, it’s clear that others including India have significant ground to cover.… pic.twitter.com/sgp42JEtGA— Rana. (@bladeit) April 19, 2025 -
ఫోన్ రీచార్జ్లకు జేబులు ఖాళీ!
ఫోన్ రీచార్జ్లకు వినియోగదారుల జేబులు ఖాళీ అయ్యే పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి. దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు అయిన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా (విఐ) రానున్న డిసెంబర్ నాటికి తమ టారిఫ్లను 10-20% పెంచే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.ఇది ఆరు సంవత్సరాలలో నాలుగో అతిపెద్ద టారిఫ్ పెంపు కానుంది. టెలికాం కంపెనీలు చివరిసారిగా 2024 జులైలో టారిఫ్లను పెంచాయి. 4G, 5G మౌలిక సదుపాయాలపై పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు 25 శాతం వరకూ టెలికాం సంస్థలు టారిఫ్లను పెంచాయి.గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ బెర్న్స్టీన్ విశ్లేషకుల ప్రకారం.. భారత్లో టెలికాం టారిఫ్లలో సుమారు 15% పెంపు ఉండే అవకాశం ఉంది. టెలికాం కంపెనీలు 10% టారిఫ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించడానికి టారిఫ్ల పెంపు దోహదపడనున్నది. ఇండియన్ టెలికాం మార్కెట్లో పోటీ తీవ్రత కారణంగా టారిఫ్లు గత కొన్ని సంవత్సరాలుగా తక్కువగా ఉన్నాయని, దీనిని సరిదిద్దేందుకు ఈ చర్య తీసుకోవాలని ఆపరేటర్లు భావిస్తున్నారు. అయితే టారఫ్ల పెంపు కారణంగా వినియోగదారులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని, దీని ప్రభావం వినియోగ శక్తి, మార్కెట్ డైనమిక్స్పైనా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.టెలికాం రంగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, భవిష్యత్ సాంకేతిక అవసరాల కోసం పెట్టుబడులను సమర్థించేందుకు టారిఫ్ల పెంపు అవసరమని టెలికాం ఆపరేటర్లు పేర్కొంటున్నారు. అయితే, ఈ నిర్ణయం ఖరారు కాకపోయినా, ఇది వినియోగదారుల మధ్య చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం రానున్న నెలల్లో టెలికాం ఆపరేటర్ల నుండి వెల్లడవుతుందని భావిస్తున్నారు. -
కోపైలట్ సలహాలు: తల్లిదండ్రులకు ఎన్నో ఉపయోగాలు!
టెక్నాలజీ వేగంగా పెరుగుతోంది. ప్రతి రంగంలోనూ ఊహకందని అద్భుతాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏఐ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్ 'కోపైలట్' (Copilot) తీసుకొచ్చింది. ఇది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సృజనాత్మకమైన సూచనలను అందించడం, కోడింగ్ చేయడం, ఫోటోలను క్రియేట్ చేయడం వంటివెన్నో చేస్తోంది. మొత్తం మీద ప్రశ్న మీది.. సమాధానం నాది అన్నట్టుగా ఈ కోపైలట్ యూజర్లకు ఉపయోగపడుతోంది.ప్రతి ప్రశ్నకు సమాధానం అందించే.. కోపైలట్ ఈ వేసవిలో తల్లిదండ్రులకు ఎలా సహాయం చేస్తుంది. పిల్లలకు సంబంధించిన విషయాల్లో వాళ్లు తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి తోడ్పాటును అందిస్తుందనే విషయాలను వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.➢బడికి సెలవులు వస్తున్నాయంటే.. తల్లిదండ్రులకు ఓ టెన్షన్ మొదలైపోతుంది. ఎందుకంటే.. పిల్లలు ఇల్లు పీకి పందిరేస్తారు. వారిని అదుపులో పెట్టడం కొంత కష్టమైన పనే. కానీ కొంత తెలివిగా ఆలోచిస్తే.. వారు బుద్ధిమంతుల్లా చెప్పినమాట వింటారు. మొబైల్ ఎక్కువగా చూడకుండా ఉండాలంటే.. పిల్లలకు ప్రత్యమ్నాయం ఉండాలి. కాబట్టి పిల్లలకు ఇష్టమైన, సులభమైన బొమ్మలు తయారు చేయడానికి, మంచి స్టోరీస్ కోసం 'కోపైలట్'ను ఉపయోగించుకోవచ్చు.➢పిల్లలు స్కూలుకు వెళ్ళిపోతే.. వారి షెడ్యూల్ అక్కడ వేరుగా ఉంటుంది. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు రోజంతా ఏం చేయాలో వారికి పాలుపోదు. తల్లిదండ్రులకు కూడా ఇదొక చిక్కు ప్రశ్నే. దీనికి కూడా కోపైలట్ సహాయం చేస్తుంది. రోజులో ఎంత సేపు ఆదుకోవాలి, ఎంతసేపు చదువుకోవాలి వంటి వాటికి తగ్గట్టు ఒక షెడ్యూల్ చేసి ఇవ్వడానికి కోపైలట్ హెల్ప్ తీసుకోవచ్చు.➢వేసవి సెలవుల్లో ఆటల్లో మునిగిపోయి.. పిల్లలు బడిలో నేర్చుకున్న విషయాలను మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి రీడింగ్ లిస్ట్, క్విజ్, కథలు చెప్పే థీమ్స్ వంటివి రూపొందించడంలో కోపైలట్ ఉపయోగపడుతుంది. వచ్చే విద్యాసంవత్సరానికి వెళ్లే విద్యార్థులను కూడా ఎలా సిద్ధం చేయాలనే బేసిక్స్ కూడా ముందుగానే కోపైలట్ ద్వారా తెలుసుకుని ఫాలో అవ్వొచ్చు.ఇదీ చదవండి: వాట్సప్ స్టేటస్కు పాట జోడింపు: ఎలాగో తెలుసా?➢సమ్మర్ అంటేనే.. చాలామంది అకేషన్స్ లేదా వెకేషన్లకు వెళ్లిపోతుంటారు. దాదాపు చాలామంది లాంగ్ ట్రిప్ వెళ్లాలని ముందుగానే ప్లాన్ వేసుకుంటారు. ఇలాంటి సమయంలో కూడా పిల్లలకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయడంలో, ప్యాకింగ్ చెక్లిస్ట్లు, విహారయాత్రకు ప్లాన్ చేయడానికి కోపైలట్ ఓ సలహాదారుడిగా ఉపయోగపడుతుంది. మీ ప్రశ్నకు తగిన విధంగా సమాధానాలు ఉంటాయి.కోపైలట్ అనేది టెక్నాలజీలో ఒక అద్భుతం. కాబట్టి అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇందులో మంచి, చెడు రెండూ ఉండవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని అది ఇచ్చే సూచనలలో ఉపయోగకరమైన ఎంచుకోవాలి. ఇది మొత్తం యూజర్ మీదనే ఆధారపడి ఉంటుంది. -
వాట్సాప్లో రెండు కొత్త ఫీచర్స్
స్మార్ట్ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ.. దాదాపు వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. ఈ యాప్ ఉచిత మెసేజింగ్ & వీడియో కాలింగ్ వంటి వాటికి అనుమతిస్తుంది. సంస్థ యూజర్ల భద్రత, సౌలబ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు రెండు కొత్త ఫీచర్స్ పరిచయం చేసింది.వాట్సాప్లో అందుబాటులోకి వచ్చిన కొత్త ఫీచర్స్ సాయంతో.. మీ స్టేటస్, లాస్ట్సీన్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవడం వల్ల.. మీ వాట్సాప్ స్టేటస్, లాస్ట్సీన్ ఎవరికి కనిపించకూడదనుకుంటారో.. వారు చూడలేరు.ఈ ఫీచర్ ఎలా సెట్ చేసుకోవాలంటే..➤వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి.➤సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తరువాత.. ప్రైవసీ అనే ఆప్షన్స్ కనిపిస్తుంది.➤ప్రైవసీ మీద క్లిక్ చేసిన తరువాత.. మొదట్లోనే లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి.➤ఆలా చేసిన తరువాత.. నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి.➤ఆ తరువాత మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ స్టేటస్, లాస్ట్సీన్ ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అనేది సెలక్ట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: రూ.46.89 లక్షల స్కోడా కారు లాంచ్: పూర్తి వివరాలు -
రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లు
ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒకరినొకరు కమ్యునికేట్ అవ్వడానికి, సమర్థవంతంగా పనిచేయడానికి, వినోదాన్ని ఆస్వాదించడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి స్మార్ట్ఫోన్లు చాలా అవసరం. అయితే ఈ రంగంలో నిత్యం కొత్త కంపెనీలు విభిన్న మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన ఫోన్ను ఎంచుకోవడం కష్టంగా మారింది. కొన్ని సంస్థలు అందించిన వివరాల ప్రకారం రూ.10,000లోపు ధర ఉన్న టాప్ 10 మొబైళ్ల వివరాలు కింది తెలియజేశాం.ఇదీ చదవండి: ఫెడ్ ఛైర్మన్ను తొలగిస్తామని ట్రంప్ హెచ్చరికఐటెల్ కలర్ ప్రో 5జీ: 6.6 అంగుళాల డిస్ప్లే, మీడియాటెక్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్(ఎంపీ కెమెరా).ఇన్ఫినిక్స్ హాట్ 50 5జీ: 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (ఆక్టాకోర్, 2.4గిగాహెర్ట్జ్) ప్రాసెసర్.పోకో సీ 71: 6.88 అంగుళాల డిస్ప్లే, 32 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9 హెచ్డీ: 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.పోకో ఎం7 5జీ: స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ రియర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ.మోటో జీ35 5జీ: 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, యూనిసోక్ టీ760 చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.రెడ్ మీ ఏ4 5జీ: స్నాప్ డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 50 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 5160 ఎంఏహెచ్ బ్యాటరీ.వివో వై18టీ: యూనిసోక్ టీ612 చిప్సెట్, 50 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.ఒప్పో ఏ3ఎక్స్ 4జీ: స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 1 ప్రాసెసర్, 8 ఎంపీ రియర్ కెమెరా, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ.టెక్నో స్పార్క్ 30సీ 5జీ: మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 48 ఎంపీ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. -
40+ ఉద్యోగులను టీసీఎస్ టార్గెట్ చేసిందా?
లేఆఫ్లలో అమెరికన్ ఉద్యోగుల పట్ల వివిక్ష చూపుతోందంటూ వచ్చిన ఆరోపణలను భారత్కు చెందిన ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఖండించింది. ఈ ఆరోపణలు సంస్థ "నిరాధారమైనవి, తప్పుడు అభిప్రాయాలు" అని పేర్కొంది. తమది అందరికీ సమాన అవకాశాలు కల్పించే సంస్థ అని, సమగ్రతలో గొప్ప రికార్డ్ను కలిగి ఉందని టీసీఎస్ వివరించింది.40 ఏళ్లకు పైబడిన, దక్షిణ ఆసియన్లు కాని తమను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల నుంచి టీసీఎస్ తొలగించిందని, కానీ H-1B వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగులను మాత్రం కొనసాగించిందని కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. 2023 చివర నుండి ఇలాంటి ఆరోపణలు వస్తుండటంతో యూఎస్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ (EEOC) దీనిపై విచారణ చేపట్టింది. యుకేలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ, టీసీఎస్ దానిని కూడా ఖండించింది.టీసీఎస్పై వచ్చిన ఆరోపణలు ఇతర ఐటీ సంస్థల ఉద్యోగ విధానాలపైనా ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీసీఎస్పై వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నా నేటి కార్పొరేట్ వాతావరణంలో నలభైలలో ఉన్న ఉద్యోగులే తొలగింపులకు తొలి లక్ష్యంగా మారుతున్నారని బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్ పాండే కూడా ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు, ఇంటి కోసం చేసిన అప్పుల ఈఎంఐలు ఇలా సవా లక్ష ఆర్థిక భారాలను నలభైలలోకి అడుగుపెట్టిన ఉద్యోగులు మోస్తున్నారని దేశ్పాండే ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. ఇంతటి సమస్యలతో నెట్టుకొస్తున్న వీరినే కంపెనీలు టార్గెట్ చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది కుదింపు సందర్భాల్లో మొదట నలభైలలోని ఉద్యోగులనే తొలగించి ఇంటికి పంపిస్తున్నాయని అప్రమత్తం చేశారు.ఈ వయస్సులో ఉద్యోగం కోల్పోవడం ఆర్థికంగా, మానసికంగా తీవ్ర అస్థిరతకు గురిచేస్తుందని దేశ్ పాండే హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు మూడు కీలకమైన మనుగడ వ్యూహాలను ఆయన అందించారు. కృత్రిమ మేధపై నైపుణ్యాన్ని పెంచుకోవాలని, పొదుపు ఎక్కువగా చేయాలని, వ్యవస్థాపక మనస్తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. -
గ్రిడ్ స్థిరీకరణకు స్టోరేజ్ సిస్టమ్
దేశరాజధాని ఢిల్లీలోని కిలోక్రీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇండిగ్రిడ్, బీఎస్ఈఎస్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ స్టాండలోన్ యుటిలిటీ స్కేల్ సిస్టమ్ పవర్ గ్రిడ్ను స్థిరీకరించేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణ ఢిల్లీలోని దాదాపు లక్ష మంది నివాసితులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.బీఈఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను 20 మెగావాట్లు/40 మెగావాట్హవర్ స్టోరేజీ సామర్థ్యం కలిగిన అత్యాధునిక వ్యవస్థ కోసం రూపొందించారు. ఇది భారీ ఇన్వర్టర్ మాదిరిగా పని చేస్తుంది. విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఆఫ్-పీక్ అవర్స్లో ఛార్జ్ అవుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు తిరిగి గ్రిడ్కు విద్యుత్ సరఫరా అందిస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగంలో హెచ్చుతగ్గులు లేకుండా ఉండేందుకు వీలవుతుంది. ఇది విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలపై ప్రభావం, తద్వారా అంతరాయాలను తగ్గిస్తుంది.ప్రయోజనాలుబీఈఎస్ఎస్ విధానం స్థిరమైన విద్యుత్ సరఫరాను నిర్వహించడానికి సహాయపడుతుంది. సప్లైలో హెచ్చుతగ్గులను నిర్వహిస్తుంది. పీక్ అవర్స్లో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడటాన్ని నియంత్రిస్తుంది. పునరుత్పాదక సౌర, పవన విద్యుత్ నిర్వహణకు వీలు కల్పించడం ద్వారా ఈ వ్యవస్థ క్లీన్ ఎనర్జీ పరిష్కారాలకు మద్దతు ఇస్తుంది. వేలాది మంది నివాసితులకు నిరంతర విద్యుత్ను అందిస్తుంది. విద్యుత్ సరఫరాలో బ్లాక్అవుట్లను నివారిస్తుంది.ఇదీ చదవండి: రైతన్నపై ప్రకృతి ప్రకోపందక్షిణాసియాలో అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్పంపిణీ స్థాయిలో దక్షిణాసియాలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ ఇదేనని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పులకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలు, స్థిరమైన విద్యుత్ పరిష్కారాలు అవసరం అవుతుండడంతో బీఈఎస్ఎస్ వంటి బ్యాటరీ స్టోరేజ్ విధానాలు ఆధునిక నగరాలకు కీలకమైన సాధనాలుగా మారుతున్నాయని చెప్పారు. -
హిమాలయాల్లో భారత్ ఘనత: ప్రపంచంలోనే ఎత్తైన 3D ప్రింటెడ్ నిర్మాణం
భారత రక్షణ, నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ (Simpliforge Creations), ఐఐటీ హైదరాబాద్ సంయుక్తంగా లేహ్లో సముద్రమట్టానికి 11 వేల అడుగుల ఎత్తులో దేశ తొలి 3డీ ప్రింటెడ్ రక్షణాత్మక సైనిక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.భారత సైన్యం తరపున ప్రాజెక్ట్ ప్రబల్లో(Project PRABAL) భాగంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఐఐటీ పీహెచ్డీ విద్యార్థి అరుణ్ కృష్ణన్ దీనికి సహకారం అందించారు. అత్యంత ఎత్తైన ప్రదేశాలు, తక్కువ ఆక్సిజన్ (HALO) ఉన్న ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 3డీ నిర్మాణంగా ఇది గుర్తింపు పొందింది.ఐఐటీ హైదరాబాద్లోని ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రమణ్యం మార్గదర్శకంలో.. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్, ఐఐటీ హైదరాబాద్ బృందాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే ప్రత్యేక 3డీ ప్రింటింగ్ సాంకేతికతను అభివృద్ధి చేశాయి. ఇందులో భాగంగా స్థానికంగా లభించే పరికరాలను ఉపయోగించి అనుకూలమైన రక్షణాత్మక బంకర్ను నిర్మించారు. ఈ నిర్మాణానికి 14 గంటల సమయం పట్టింది. ప్రబల్ కార్యక్రమం స్వదేశీ సాంకేతికత, విద్యా-పరిశ్రమ సహకారం ద్వారా నిర్మాణ శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లింది.ఈ 3డీ బంకర్ భారతదేశంలో తొలిసారి కాగా, సవాళ్లు ఎదురయ్యే ప్రాంతాల్లో వేగవంతమైన నిర్మాణాలకు మార్గం సుగమం చేసి, రక్షణ సన్నద్ధతను బలోపేతం చేస్తుంది. ఈ అద్భుత ప్రాజెక్ట్.. ఇంజినీరింగ్ నూతనత్వం, సైనిక ఉపయోగం, మేక్-ఇన్-ఇండియా సంకల్పాన్ని కలగలిపి భవిష్యత్ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తుంది.ఈ సందర్భంగా సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సీఈఓ 'ధ్రువ్ గాంధీ' మాట్లాడుతూ.. "లడఖ్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ విజయవంతం కావడం మా బృందానికి, యంత్రాలకు పెద్ద సవాలనే చెప్పలి. అయినా.. రోబోటిక్ ప్రింటర్ వ్యవస్థను 24 గంటల్లో సిద్ధం చేసి, 5 రోజుల రికార్డు సమయంలో అందించి విజయం సాధించాం" అని పేర్కొన్నారు.ఐఐటీ హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ కేవీఎల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. “ఈ ప్రాజెక్ట్లో అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి తీవ్రమైన పర్యావరణ పరిస్థితుల్లో పనిచేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పరికరాల అభివృద్ధి. ఎత్తైన ప్రాంతాల్లో తక్కువ ఆక్సిజన్, తక్కువ ఆర్ద్రత, ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కేవలం నిర్మాణాత్మక వినూత్నత మాత్రమే కాకుండా, అత్యుత్తమ విజ్ఞానం అవసరమైంది. ఐఐటీ హైదరాబాద్ బృందం, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ కలిసి, మెరుగైన యంత్రాలను, మన్నిక కలిగిన కాంక్రీట్ మిశ్రమాన్ని తయారు చేసింది. అలా ఆ ప్రదేశంలోనే 3డీ ప్రింటింగ్ ద్వారా నిర్మించగలిగారు” అని వెల్లడించారు.ఐఐటీ పీహెచ్డీ స్టూడెంట్ అరుణ్ కృష్ణన్ మాట్లాడుతూ.. "ఐఐటీ హైదరాబాద్లో నేను ఎంటెక్ చేస్తున్న సమయంలో ప్రబల్ ప్రాజెక్ట్ను ప్రారంభించాం. లేహ్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో 3డీ ప్రింటింగ్ నిర్మాణాన్ని తీసుకురావడానికి అనేక బృందాలు, కంపెనీలు ప్రయత్నించాయి. అయితే లడాఖ్లోని తీవ్ర వాతావరణ పరిస్థితులు వారికి పెను సవాలును విసిరాయి" అని తెలిపారు.సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి మాట్లాడుతూ.. “2022 నుంచి మేము అడిటివ్ కన్స్ట్రక్షన్లో సవాళ్లను అధిగమించుకుంటూ వస్తున్నాం. భారతదేశపు తొలి 3డీ ముద్రిత వంతెనను, ప్రపంచంలోనే మొదటి 3డీ ముద్రిత ప్రార్థనా మందిరాన్ని మేమే నిర్మించాం. భారత సైన్యం కోసం, స్థానికంగా దొరికే పరికరాలను ఉపయోగించి, తొలిసారిగా ఒక 3డీ ముద్రిత వైద్య సదుపాయాన్ని, ఇన్-సిటు(in-situ) పద్ధతిలో నిర్మించాం" అని వివరించారు. -
మార్చిలో అధికంగా అమ్ముడైన టాప్ 5 మొబైళ్లు
నిత్యం మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ రంగంలో మార్పులొస్తున్నాయి. దాంతో ఇప్పటికే మొబైల్ ఫోన్లు ఉన్నా చాలామంది కొత్త సాంకేతికతకు అప్డేట్ అవుతున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. మార్చి 2025లో ఇండియాలో అధికంగా అమ్ముడైన టాప్-5 పాపులర్ మొబైల్ మోడళ్ల వివరాలను కొన్ని సంస్థలు వెల్లడించాయి. ఆయా వివరాలు కింది విధంగా ఉన్నాయి.శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 ఆల్ట్రా: స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్: యాపిల్ ఏ 18 ప్రో చిప్సెట్, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 6.9 అంగుళాల ఎల్టీపీఓ సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లే.ఇదీ చదవండి: ఐపీఎల్ టీమ్లతో మాస్టర్ కార్డ్ జట్టుగూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్: ఏఐ ఆధారిత కెమెరా, టెన్సర్ జీ 4 చిప్సెట్, 6.8 అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లే.షియోమీ 15 అల్ట్రా: 50 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 5410 ఎంఏహెచ్ బ్యాటరీ.వన్ప్లస్ 13: స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. -
ఫ్రెషర్స్ జీతం ఎందుకు పెరగదు? ఐటీ కంపెనీ సమాధానం
దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన విప్రోలో గత దశాబ్ద కాలంగా ఫ్రెషర్ల వార్షిక వేతనం రూ. 3-4 లక్షలుగానే ఉంటోంది. ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఫ్రెషర్లకు ఇచ్చే వేతనాలు అలాగే తక్కువ స్థాయిలోనే ఉండటంపై చాలా కాలంగా కంపెనీ విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే ఫ్రెషర్ల వేతన స్థాయి తక్కువగా ఉండటంపై కంపెనీ యాజమాన్యం తాజాగా వివరణ ఇచ్చింది.ఇది విప్రో సమస్య మాత్రమే కాదుఇటీవలి ఆదాయ ప్రకటన అనంతర పత్రికా సమావేశంలో కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఈ సమస్యపై మాట్లాడారు. జీతాలు స్థిరంగా ఉండటానికి మార్కెట్ ఆధారిత డిమాండ్-సప్లై డైనమిక్స్ కారణమని పేర్కొన్నారు. “ఇది విప్రోకు సంబంధించిన సమస్య కాదు. ఇది మార్కెట్, పరిశ్రమ ఆధారిత సమస్య” అని గోవిల్ తెలిపారు. విప్రో అన్ని స్థాయిల ఉద్యోగులకు పోటీతత్వ వేతనాలను అందిస్తుందని, మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు జీతాలను సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లుభారత ఐటీ సెక్టార్ ఏటా 15 లక్షలకు పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలకు అధిక సరఫరా ఏర్పడుతోంది. ఈ అధిక సరఫరా, అధిక ఆరంభ జీతాలకు పరిమిత డిమాండ్తో కలిసి, పరిశ్రమ వ్యాప్తంగా ఫ్రెషర్ జీతాలను మార్పులేనివిగా ఉంచింది. విప్రో తన పోటీదారులతో సమానంగా, ఆర్థిక అనిశ్చితులు, క్లయింట్ డిమాండ్ హెచ్చుతగ్గుల మధ్య ఖర్చులను నియంత్రించే వ్యూహాన్ని అనుసరిస్తుంది. అయితే, 2023లో కొందరు అభ్యర్థులకు రూ. 6.5 లక్షల నుంచి రూ. 3.5 లక్షలకు వేతన ఆఫర్లను తగ్గించడం వంటి చర్యలకు సంస్థ విమర్శలను ఎదుర్కొంది. దీనికి వ్యాపార అవసరాల మార్పు కారణమని పేర్కొంది.ద్రవ్యోల్బణం, జీవన వ్యయాల పెరుగుతున్న నేపథ్యంలో వేతనాలు ఇలాగే ఉంటే ఉత్తమ ప్రతిభను ఆకర్షించడంలో ఇబ్బందులు ఏర్పడతాయని విమర్శకులు వాదిస్తున్నారు. అయితే విప్రో మాత్రం తాము ఇస్తున్న వేతనాలు పోటీతత్వంగానే ఉన్నాయని, దీంతోపాటు శిక్షణ కార్యక్రమాలు, కెరీర్ వృద్ధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొంది. భారత ఐటీ పరిశ్రమ గ్లోబల్ ఆర్థిక సవాళ్లను, అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఫ్రెషర్ జీతాలపై చర్చ ప్రతిభ నిర్వహణ, మార్కెట్ డైనమిక్స్కు సంబంధించిన విస్తృత సమస్యలను హైలైట్ చేస్తోంది.పెంచుతాంలే..ఫ్రెషర్ల వేతన స్థాయిని పెంచే విషయంలో ప్రస్తుతానికి, విప్రో మేనేజ్మెంట్ ఆశాజనకంగానే ఉంది. భవిష్యత్ మార్కెట్ మార్పులకు అనుగుణంగా వేతనాలను సర్దుబాటు చేస్తామని హామీ ఇస్తోంది. పెరుగుతున్న పోటీ, సాంకేతిక పురోగతులు దగ్గర భవిష్యత్తులో ఎంట్రీ-లెవల్ వేతనాల పునఃపరిశీలనకు దారితీస్తాయా అన్నదానిపై పరిశ్రమ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్తో సైడ్ జాబ్.. ఏఐతో పట్టుకున్న సీఈవో
వర్క్ ఫ్రమ్ హోమ్ను దుర్వినియోగం చేస్తున్న ఓ ఉద్యోగిని ఆ సంస్థ సీఈవో ఏఐ సాయంతో పట్టుకున్నారు. ఆ ఉద్యోగి తమ కంపెనీలో పనిచేస్తూనే మరో కంపెనీలోనూ పనిచేస్తున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణను ఉపయోగించి కనుగొన్నట్లు ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ సీఈవో వెల్లడించారు.లా సికో సంస్థ అధిపతి అయిన రామానుజ్ ముఖర్జీ గత రెండు నెలల్లో ఉద్యోగి తన పని లక్ష్యాలలో 70% మిస్ అయినట్లు గమనించారు. జవాబుదారీతనం కోసం టైమ్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవాలని అడిగినప్పుడు, ఆమె అకస్మాత్తుగా ఉద్యోగం మానేసిందని, తరువాత లింక్డ్ఇన్లో కంపెనీ పని సంస్కృతిని విమర్శిస్తూ పోస్ట్ పెట్టిందని ఆయన తెలిపారు.ఆ ఉద్యోగిని రోజూ పని చేయాల్సిన ఆశించిన గంటలలో 40% మాత్రమే పనిచేస్తోందని రోజుకు ఐదు గంటలు పనిని పక్కన పెట్టినట్లు ఏఐ విశ్లేషణలో తేలింది. అంతేకాకుండా తదుపరి దర్యాప్తులో ఆమె నకిలీ ఆఫర్ లెటర్లు, వేతన స్లిప్పులు, అనుభవ ధృవీకరణ పత్రాలు బయటపడ్డాయి.కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. దీన్ని అలుసుగా తీసుకుని కొంత మంది ఉద్యోగులు దుర్వినియోగం చేస్తూ ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువకంపెనీలకు పనిచేస్తున్నారు. ఈ సంఘటన రిమోట్ వర్క్ ఎథిక్స్ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు కంపెనీలు కఠినమైన పర్యవేక్షణను అమలు చేయాల్సిన అవసరంపై సోషల్ మీడియాలో చర్చలను రేకెత్తించింది. -
హెచ్పీ కొత్త ల్యాప్టాప్ లాంచ్..
హెచ్పీ తన ఫ్లాగ్షిప్ గేమింగ్ ల్యాప్టాప్ ‘ఓమెన్ మాక్స్ 16’ని భారత్లో లాంచ్ చేసింది. ఇది కంపెనీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్టాప్. అత్యాధునిక ఏఐ-ఆధారిత ఫీచర్లు, బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్తో కూడిన సరికొత్త ఎన్విడియా జిఫోర్స్ ఆర్టీఎక్స్ 5000 సిరీస్ జీపీయూ కలిగిన ఈ ల్యాప్టాప్ను భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ కమ్యూనిటీ కోసం రూపొందించారు.ఫీచర్లుహెచ్పీ ఓమెన్ మాక్స్ 16 ల్యాప్టాప్ ఇంటెల్ 24-కోర్ కోర్ అల్ట్రా 9-275HX ప్రాసెసర్తో నడుస్తుంది. ఎన్విడియా ఆర్టీఎక్స్ 5080 జీపీయూతో అసాధారణమైన వేగాన్ని, గ్రాఫిక్స్ను అందిస్తుంది. ఇది 64జీబీ డీడీఆర్5 ర్యామ్, 1టీబీ పీసీఐసీ జెన్ 5 ఎస్ఎస్డీ వరకు సపోర్ట్ చేస్తుంది.ల్యాప్టాప్ 16-అంగుళాల డిస్ప్లే 240Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, స్క్రీన్ టియరింగ్ను తొలగించడానికి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR)ను కలిగి ఉంది.ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ హెచ్పీ ఓమెన్ ఏఐ బీటా. ఇది ఒక క్లిక్తో గేమ్ప్లే నమూనాల ఆధారంగా ఓఎస్, హార్డ్వేర్, గేమ్ సెట్టింగ్లను డైనమిక్గా సర్దుబాటు చేసే ఏఐ ఆప్టిమైజేషన్ సాధనం. ప్రస్తుతం కౌంటర్-స్ట్రైక్ 2కి సపోర్ట్ చేస్తున్న ఈ సాధనం, ఇతర టైటిల్స్కు విస్తరించే హామీతో, మాన్యువల్ సర్దుబాట్లు లేకుండా ఫ్రేమ్ రేట్లు, థర్మల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. గేమర్లు అత్యుత్తమ పనితీరు కోసం పవర్, థర్మల్ సెట్టింగ్లను ఫైన్-ట్యూన్ చేయడానికి ఓమెన్ గేమింగ్ హబ్ అన్లీషెడ్ మోడ్ వీలు కల్పిస్తుంది.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కొత్త ఫీచర్..సీపీయూ-జీపీయూ కలగలిసిన దీని 250 వాట్ల పవర్ డ్రా నిర్వహణకు ఓమెన్ మాక్స్ 16 అధునాతన ఓమెన్ టెంపెస్ట్ కూలింగ్ ప్రో ఆర్కిటెక్చర్ను ఉపయోగిస్తుంది. ఇందులో వేపర్ ఛాంబర్, డ్యూయల్ ఫ్యాన్స్, హీట్ డిస్సిపేషన్ కోసం లిక్విడ్ మెటల్,థర్మల్ గ్రీస్ హైబ్రిడ్ ఓమెన్ క్రయో కాంపౌండ్ ఉన్నాయి. ఫ్యాన్ క్లీనర్ టెక్నాలజీ ఫ్యాన్ దిశను రివర్స్ చేసి దుమ్ము లోపలికి చేరకుండా నిరోధిస్తుంది.సెరామిక్ వైట్ లేదా షాడో బ్లాక్ మెటల్ ఛాసిస్ ఇందులో ఉంది. ఆర్జీబీ కీబోర్డ్, ఐచ్ఛిక ఆర్జీబీ లైట్ బార్ ఉన్నాయి. 1080p ఫుల్హెచ్డీ ఐఆర్ కెమెరా, నాయిస్ రిడక్షన్, క్లియర్ స్ట్రీమింగ్ కోసం డ్యూయల్-అరే మైక్రోఫోన్ కూడా ఇందులో ఉన్నాయి.ధర.. లభ్యతహెచ్పీ ఓమెన్ మాక్స్ 16 ల్యాప్టాప్ రూ.3,09,999 ధరతో హెచ్పీ ఆన్లైన్ స్టోర్, అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంది. “ఓమెన్ మాక్స్ 16 ఏఐ-ఆధారిత ఆప్టిమైజేషన్, ఎలైట్ పనితీరుతో లీనమయ్యే గేమింగ్ సరిహద్దులను చెరిపేస్తుంది” అని హెచ్పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ తెలిపారు. -
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో కొత్త ఫీచర్..
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో సరికొత్త సేఫ్టీ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఫోన్ వరుసగా మూడు రోజులు (72 గంటలు) పాటు తెరవకుండా లాక్ అయి ఉంటే స్వయంచాలకంగా రీబూట్ అవుతుంది. ఈ కొత్త భద్రతా ఫీచర్ గూగుల్ ప్లే సర్వీసెస్ (Google Play) తాజా అప్డేట్ (వెర్షన్ 25.14)లో అందుబాటులోకి రానుంది.ఫోన్ పోయినప్పుడు లేదా చోరీ జరిగినప్పుడు యూజర్ డేటా దుర్వినియోగం కాకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గూగుల్ ఈ ఫీచర్ను తీసుకొస్తోంది. "వరుసగా మూడు రోజులు లాక్ అయి ఉంటే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది" అని గూగుల్ ప్లే సర్వీసెస్ తాజా అప్డేట్ పేర్కొంటోంది. ఫోన్ యాక్సెస్ను తిరిగి పొందాలంటే వినియోగదారులు వారి పాస్కోడ్ను రీఎంటర్ చేయాల్సి ఉంటుంది.9to5Google నివేదిక ప్రకారం.. ఈ అప్డేట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లలో అందుబాటులోకి వస్తోంది. అయితే ఆండ్రాయిడ్ ఆటో, వేర్ ఓఎస్పై పనిచేసే డివైజ్లు, ఆండ్రాయిడ్ టీవీలకు ఈ అప్డేట్ వర్తించదని తెలుస్తోంది. రీబూట్ చేసిన తర్వాత ఫోన్ను 'బిఫోర్ ఫస్ట్ అన్లాక్' స్థితికి తిరిగి తీసుకురావడం ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుందని జీఎస్ఎంఅరేనా నివేదిక పేర్కొంది. ఈ స్థితిలో ఫోన్ మరింత సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే పాస్కోడ్ మాన్యువల్గా ఎంటర్ చేసే వరకు ఫింగర్ ప్రింట్ లేదా ఫేసియల్ రికగ్నిషన్ వంటి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఆప్షన్లు అందుబాటులో ఉండవు.తాజా వెర్షన్ 25.14 విడుదలకు దాదాపు ఒక వారం సమయం పట్టవచ్చని అంచనా వేయగా, అర్హత ఉన్న అన్ని పరికరాల్లో ఆటో-రీస్టార్ట్ ఫంక్షన్ పూర్తిగా అందుబాటులోకి రావటానికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ ఫీచర్కు ఏ ఆండ్రాయిడ్ వెర్షన్లు అనుకూలంగా ఉంటాయి.. ఈ సెట్టింగ్ను డిజేబుల్ లేదా అడ్జెస్ట్ చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంటుందా అనే దానిపై గూగుల్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.యాపిల్ iOS 18.1 లో ఇలాంటి భద్రతా ఫీచర్ 'ఇనాక్టివిటీ రీబూట్'ను ప్రవేశపెట్టింది. ఇది నాలుగు రోజులపాటు ఇనాక్టివ్గా లాక్ ఉండి లాక్ అయిన ఐఫోన్లను రీస్టార్ట్ చేస్తుంది. కొత్త భద్రతా ఫీచర్తో పాటు తాజా గూగుల్ ప్లే సర్వేసెస్ అప్డేట్ మరికొన్ని మెరుగుదలలను తీసుకువస్తోంది. వినియోగదారులు ఇప్పుడు వారి ఫోన్లో క్విక్ షేర్ ట్రాన్స్ఫర్ను అంగీకరించే ముందు కంటెంట్ను ప్రివ్యూ చేయవచ్చు. కొత్త ఫోన్ను సెటప్ చేయడం, పాత ఫోన్ నుండి డేటాను ట్రాన్స్ఫర్ చేయడం మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుంది. -
కృత్రిమ మేధను నియంత్రించవచ్చా..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వీటి నైతికత, భద్రత, సృజనాత్మక పరిధి, ఆర్థిక వృద్ధిని ఎలా సమతుల్యం చేయాలో తర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటివరకు కొన్ని దేశాల్లోనే ఏఐ గవర్నెన్స్కు సంబంధించిన స్పష్టమైన విధానాలున్నాయి. సామాజిక భద్రత, మానవ హక్కులు, ఆర్థిక శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తూ కృత్రిమ మేధను నియంత్రించడానికి ఖచ్చితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు వ్యూహాత్మక విధాన ఫ్రేమ్వర్క్లతో ముసాయిదా చట్టాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.ఏఐ నియంత్రణపై ప్రపంచ దేశాలు ఇలా..చైనా ఏఐ అల్గారిథమ్ల్లో పారదర్శకత, డేటా గోప్యత, ఎథికల్ ఏఐ విధానాలను అమలు చేయడంపై దృష్టి సారించే నిబంధనలను ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, అటానమస్ సిస్టమ్స్ వంటి రంగాల్లో ఈమేరకు చర్యలు తీసుకుంటోంది.యూరోపియన్ యూనియన్(ఈయూ) ఇప్పటికే ఏఐ చట్టాన్ని అమలు చేస్తుంది. సామాజిక భద్రత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించే లక్ష్యంతో హైరిస్క్ అప్లికేషన్లపై కఠినమైన నిబంధనలను విధిస్తుంది.కెనడాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా యాక్ట్ (ఏఐడీఏ) బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుంది.దక్షిణ కొరియా నైతిక కృత్రిమ మేధ కోసం మార్గదర్శకాలను అమలు చేస్తుంది. కృత్రిమ మేధ భద్రత, జవాబుదారీతనాన్ని నియంత్రించడానికి చట్టాన్ని అభివృద్ధి చేస్తోంది.పెరూ ప్రభుత్వ సేవల్లో నైతిక ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, పౌరుల హక్కులను పరిరక్షించడానికి నిబంధనలు ప్రవేశపెట్టింది.అమెరికా కృత్రిమ మేధ విధానంలో మాత్రం మార్పు వచ్చింది. బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేలా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025లో రద్దు చేశారు.యునైటెడ్ కింగ్డమ్, జపాన్, బ్రెజిల్, కోస్టారికా, కొలంబియాతో సహా అనేక దేశాలు తమ చట్టసభలలో ఆమోదం కోసం కృత్రిమ మేధ బిల్లులను రూపొందించాయి.ఇదీ చదవండి: రైలులో ఏటీఎం.. కొత్త సర్వీసుఏఐ స్ట్రాటజీ డాక్యుమెంట్లుసమ్మిళిత, సుస్థిర వృద్ధిని నిర్ధారించేందుకు, సామాజిక ఆర్థిక ప్రగతిని నడిపించడానికి ఏఐ వినియోగంపట్ల దేశాల ధోరణి ఎలా ఉందనేది నేషనల్ ఏఐ స్ట్రాటజీ డాక్యుమెంట్లు తెలియజేస్తాయి. ప్రస్తుతానికి అధికారిక చట్టాలు పరిమితంగా ఉన్నప్పటికీ ఏఐ పాలనకు మరింత విస్తృతమైన విధానాలు తీసుకువచ్చేందుకు ఈ డాక్యుమెంట్లు తోడ్పడుతాయి. ఆఫ్రికన్ యూనియన్తో పాటు సుమారు 85 దేశాలు ఇలాంటి వ్యూహాలను ప్రచురించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పత్రాల్లో ప్రధానంగా కింది విషయాలు పొందుపరిచారని తెలిపారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించడం.హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏకీకృతం చేయడానికి కాలపరిమితి, ప్రాధాన్యాలను నిర్దేశించడం.నిష్పాక్షికత, పారదర్శకత, జవాబుదారీతనం వంటి బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడానికి సూత్రాలను ఏర్పాటు చేయడం.ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పౌరులను సిద్ధం చేయడానికి కావాల్సిన విద్యను ప్రోత్సహించడం.ఏఐ భద్రత, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి భాగస్వామ్యాలు తోడ్పాటు అందించడం. -
వాట్సాప్లో కొత్త తరహా సైబర్ మోసం
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దాదాపు అందరూ వాడే మేసేజింగ్ యాప్ వాట్సాప్ వేదికగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా వాట్సాప్లో వచ్చిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఇమేజ్పై క్లిక్ చేసిన ఓ వ్యక్తి ఏకంగా రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. స్కామర్లు అనుసరిస్తున్న కొత్త మోసపూరిత పంథా ఏమిటో.. దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం.కొత్త మోసంలో భాగంగా సైబర్ నేరగాళ్లు తెలియని నంబర్ నుంచి మీ వాట్సాప్కు ఒక చిత్రాన్ని పంపుతారు. ఇది స్కామ్ చేయడానికి కీలకంగా మారుతుంది. వారు పంపిన మెసేజ్ ఫొటో ఫార్మాట్లో ఉంటుంది. తెలియని నంబర్ నుంచి ఫొటో ఏంటా అని క్లిక్ చేయడం చాలా మందికి అలవాటు. సరిగ్గా దీన్నే నేరాలకు ఉపయోగిస్తున్నారు. ఆ ఇమేజ్పై క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు, యూపీఐ సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు నేరగాళ్లకు పూర్తి అనుమతులు ఇచ్చినట్లు అవుతుంది. అందుకు అనుగుణంగా ఇమేజ్ క్లిక్ చేసిన వెంటనే మీకు తెలియకుండానే మీ ఫోన్ను కంట్రోల్ చేసేలా రూపొందించిన మాల్వేర్ అందులో ప్రవేశిస్తుంది.ఇమేజ్ స్టెగానోగ్రఫీఇమేజ్ స్టెగానోగ్రఫీ అని పిలువబడే ఈ సాంకేతికతను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇందులో నేరాలకు అవసరమయ్యే డేటాను రహస్యంగా ఇమేజ్ లోపల ఉంచుతారు. మీరు ఇమేజ్ క్లిక్ చేసిన వెంటనే మీకు తెలియకుండానే ఓటీపీ, పాస్వర్డ్లు.. వంటి సున్నితమైన సమాచారం అంతా స్కామర్ల చేతుల్లోకి వెళుతుంది. మాల్వేర్ పనిచేయడానికి ఇమేజ్ ఓపెన్ చేస్తే చాలు మీ యాప్స్, ప్రైవేట్ డేటాను యాక్సెస్ చేస్తుంది. దాంతో మోసాలకు పాల్పడుతున్నారు.వ్యక్తిని గుర్తించేందుకు సాయం చేయాలంటూమధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఓ వ్యక్తి ఇలా రూ.2 లక్షలు పోగొట్టుకున్నాడు. వాట్సాప్లో ఇమేజ్ షేర్ చేసి ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు సాయం చేయాలంటూ కొత్త నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఒకే నంబర్ నుంచి పలుమార్లు కాల్స్, మెసేజ్లు రావడంతో చివరకు ఆ ఫొటోపై ఆ వ్యక్తి క్లిక్ చేశాడు. ఆ సమయంలో ఫోన్ను హ్యాక్ చేసి స్కామర్లు బ్యాంక్ వివరాలు తెలుసుకొని ఖాతా నుంచి డబ్బులు డ్రా చేశారు.ఇదీ చదవండి: ‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు..సురక్షితంగా ఉండడం ఎలా..తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఇమేజ్లు, వీడియోలు డౌన్లోడ్ చేయవద్దు. లింక్లపై కూడా అసలు క్లిక్ చేయవద్దు.మీ వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్లి మీడియా ఆప్షన్స్లో ఆటో డౌన్లోడ్ను ఆఫ్ చేసుకోండి. దాంతో మీకు తెలిసిన వారు పంపించిన ఫొటోలు, లింకులు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు.మీ ఫోన్ సాఫ్ట్వేర్, యాంటీవైరస్ను నిత్యం అప్డేట్ చేసుకోవాలి. ఏదైనా ఓఎస్, యాప్ వర్షన్ మార్పులుంటే వెంటనే అప్డేట్ అవుతాయి.అనుమానాస్పద నంబర్లను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలి.ఈ విషయం తెలుసుకున్న వెంటనే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారిని హెచ్చరించడం మరిచిపోకండి.మీరు మోసపోయారని అనుమానించినట్లయితే వెంటనే cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలి. -
ఏఐ థెరపిస్టు!
లవ్ బ్రేకప్.. ఒంటరితనం.. ఆఫీసులో కోపిష్టి బాస్ వేధింపులు.. సహోద్యోగులతో ఇబ్బందులు.. జీవితంలో ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి, ఓపిగ్గా వినేవారొకరు ఉండాలి. తీరా చెప్పాక జడ్జ్ చేయకుండా ఉంటారా? నిష్పాక్షికంగా పరిష్కార మార్గం సూచిస్తారా? అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మానసిక వైద్యులను సంప్రదిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండు మారుతోంది. ఈ విషయంలో చాట్జీపీటీకే జనం ఓటేస్తున్నారు. సమస్యలను వినే మంచి ఫ్రెండ్గానే గాక వాటికి పరిష్కారం చూపే కౌన్సిలర్గా కూడా భావిస్తున్నారు.లైఫ్ కౌన్సిలర్గా..27 ఏళ్ల మనీశ్ ఇంజినీర్. ప్రియురాలితో గొడవైంది. అపార్థాలతో బంధానికి బ్రేక్ పడింది. మానసికంగా అలసిపోయి ఓ సాయం వేళ చాట్జీపీటీని ఆశ్రయించాడు. సమస్యంతా చెప్పాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదన్నాడు. చాట్జీపీటీ సమాధానం మనోన్ని ఆశ్చర్యపరిచింది. ‘మీరు చెప్పింది ఆమె వినకపోవడం మిమ్మల్ని బాధిస్తోంది. అదే విషయం ఆమెకు నేరుగా చెప్పారా?’అని అడిగింది. అంతటితో ఆగకుండా ప్రేయసికి సందేశం పంపడంలో మనీశ్కు సాయపడింది. ఆమెను నిందించకుండా కేవలం అతని ఫీలింగ్స్ మాత్రమే వ్యక్తపరిచే ప్రశాంతమైన, నిజాయితీతో కూడిన నోట్ అది. అందుకున్న ఆ అమ్మాయి మనీష్తో మాట్లాడింది. ఇంకేముంది వారి మధ్య దూరం తగ్గిపోయింది. వృత్తి సమస్యల్లో సాయం26 ఏళ్ల అక్షయ్ శ్రీవాస్తవ కంటెంట్ రైటర్, మీడియా ప్రొఫెషనల్. ఆఫీసుకు వెళ్లిరావడానికే నాలుగ్గంటలు పోతోంది. నిద్ర లేదు. కుటుంబంతో గడపడానికి లేదు. ఫిర్యాదులా కాకుండా ఈ విషయాన్ని బాస్తో ఎలా చెప్పాలో తేలక చాట్జీపీటీని ఆశ్రయించాడు. వాడాల్సిన పదాలతో సహా చక్కని నిర్మాణాత్మక సలహాలిచ్చింది. అప్పటినుంచి అక్షయ్ క్రమం తప్పకుండా చాట్బాట్ను ఆశ్రయిస్తున్నాడు. ఆయేషాది మరో సమస్య. ఇన్నాళ్లు సహోద్యోగిగా ఉన్న స్నేహితులకే బాస్ అయింది. సాన్నిహిత్యం కోల్పోకుండా వాళ్లతో ఎలా డీల్ చేయాలని చాట్జీపీటీనే అడిగింది. అదిచ్చిన సమాధానం ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో క్రాష్ కోర్సులా సాయపడింది.బెటర్ కౌన్సిలర్?ఒక్కోసారి కౌన్సిలర్ కంటే మెరుగ్గా చాట్జీపీటీ ఇచ్చే సమాధానాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. జీవితంలో చాలా కోల్పోయాననే భావన కలుగుతుందనే ప్రశ్నకు.. ‘మార్పు జరిగినప్పుడు అది మామూలే. అభిరుచులను పెంచుకోండి’అని కౌన్సిలర్ చెప్పారు. చాట్జీపీటీ మాత్రం, ‘సంతోషపరిచే పనులు చేయండి. చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకునే ప్రయత్నం చేయండి’అని సూచించింది. స్నేహితులు అర్థం చేసుకోవడం లేదంటే వారితో ఓపెన్గా మాట్లాడమని థెరపిస్టు చెబితే, ‘స్నేహితుల్లో అపార్థాలు మామూలే. వారితో నిజాయితీగా మాట్లాడండి’అని చాట్జీపీటీ సూచించింది. పని నచ్చడం లేదంటే ఒత్తిళ్లను గుర్తించి పరిష్కారానికి కొత్తగా ప్రయత్నించమని కౌన్సిలర్ చెప్పాడు. చాట్జీపీటీ మాత్రం ‘పనిలో పరిమితులను పెట్టుకోండి. హెచ్ఆర్ లేదా మెంటార్తో మాట్లాడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’అని సలహా ఇచ్చింది. భాగస్వామితో విభేదాలపై ఓపెన్గా మాట్లాడుకుని, సమస్యకు కారణాలేంటో కనిపెట్టి పరిష్కారానికి కలిసి ప్రయత్నించడన్న చాట్జీపీటీ సూచనే మెరుగ్గా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ఇదీ చదవండి: హై-ఎండ్ కార్లు.. లగ్జరీ ప్రాపర్టీలు.. కేఎల్ రాహుల్ ఆస్తుల వివరాలుప్రత్యామ్నాయం కాబోదు: మానసిక వైద్యులుమానసిక వైద్యం మనదేశంలో కాస్త ఖరీదైన విషయం. జనంలో అవగాహన లేమి కూడా ఉంది. ఆ సమస్యలకు చాలామంది క్రమంగా ఏఐపై ఆధారపడుతున్నారు. అది జడ్జ్ చేయదు. చెబుతుంటే మధ్యలో అడ్డుకోదు. ఏం చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎప్పుడు చెప్పినా శ్రద్ధగా వింటుంది. అంతే ఓపిగ్గా సమాధానమూ ఇస్తుంది. దాంతో వ్యక్తిగతం నుంచి వృత్తిపరమైన సలహాల దాకా యూత్ చాట్జీపీటీపై ఆధారపడుతోంది. కానీ ఈ చాట్బాట్ మానసిక ఇబ్బందులకు మొత్తంగా పరిష్కారం చూపలేదంటున్నారు వైద్యులు. ‘అది తాత్కాలిక ఉపశమనమిచ్చే ఔట్లెట్లా పనిచేస్తుందంతే. పూర్తిస్థాయి మానసిక చికిత్స ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాబోదు. సానుభూతి, అంతర్దష్టి, అవగాహన వాటికుండవు’ అంటున్నారు. అంతేగాక ఏఐ థెరపీ బాట్లతో ముప్పు కూడా ఉంటుందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రత్యేకించి వాటిని పిల్లలు వాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మనుషులను అవి మరింత ఒంటరిగా చేస్తాయనీ హెచ్చరించింది. -
కళను దొంగలిస్తున్న ఏఐ
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓపెన్ఏఐ తీసుకొచ్చిన ఏఐ జనరేటివ్ ఆర్ట్ జీబ్లీ టూల్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక సంస్థ ప్రజల్లో ఆదరణ పొందే సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తే పోటీ కంపెనీలు కూడా తమ యూజర్లను కాపాడుకునేందుకు ఎలాగైనా అదే తరహా, అంతకంటే మెరుగైన సేవలు అందించేందుకు పావులు కదుపుతాయి. అందులో భాగంగానే గూగుల్, గ్రోక్ఏఐ వంటి సంస్థలు కూడా ఏఐ ఆర్ట్ జనరేషన్ ఇమేజ్ను అందిస్తున్నాయి. కానీ ఇది నిజమైన కళాకారుల కళలను అనుసరిస్తూ, కాపీ రైట్ ఆందోళలనలకు దారితీస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కాపీరైట్ ఆందోళనలుఏఐ నమూనాలు శిక్షణ కోసం చాలాసార్లు కాపీరైట్ చేసిన కంటెంట్ డేటాసెట్లపై ఆధారపడతాయి. స్పష్టమైన అనుమతి లేకుండా ఇటువంటి కంటెంట్ను ఉపయోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. దాంతో కృత్రిమ మేధ సృష్టించిన ఆర్ట్ కంటెంట్ ఓనర్షిప్ ఎవరనే దానిపై సందిగ్దత నెలకొంటుంది. ఏఐ ఆర్ట్ జనరేటర్లు నిర్దిష్ట కళాత్మక శైలులను అనుకరిస్తాయి. ఇది మానవ కళాకారుల ఒరిజినాలిటీని బలహీనపరుస్తుంది. ఏఐ ఆర్ట్ కంటెంట్ మానవ కళాకారుల పనిని తగ్గిస్తుంది. ఇది వారిని ఆర్థిక ఊబిలోకి నెట్టివేస్తుందనే అభిప్రాయాలున్నాయి.దుర్వినియోగంఏఐ జనరేటెడ్ ఆర్ట్ ఒక కళాకారుడి శైలిని ప్రతిబింబించగలదేమో కానీ తన విలువలను, ఉద్దేశాలను తెలుపలేదు. ఉదాహరణకు, హయావో మియాజాకి(శాంతికి సంబంధించిన కళాకండాలు వేసే చిత్రకారుడు) వంటి కళాకారుడి శైలికి విరుద్ధంగా సైనిక, హింసాత్మక చిత్రాలను ఏఐ సృష్టిస్తోంది.భావోద్వేగాలుకృత్రిమ మేధ చారిత్రక విషాదాలు లేదా సాంస్కృతిక సంఘటనలు వంటి సున్నితమైన అంశాలను చిత్రాల రూపంలో స్టైలిష్గా చూపుతుంది. కొన్నిసార్లు విచిత్రమైన రీతిలో వాటిని ప్రదర్శిస్తుంది. ఇది ఆయా సంఘటనల వల్ల ప్రభావితమైన వారికి ఎంతో భావోద్వేగాన్ని కలిగిస్తుంది.ఇదీ చదవండి: పట్టణాల్లో అధిక ఖర్చు వీటికే..ప్రముఖ కంపెనీల ఏఐ ఆర్ట్ జనరేటివ్ ఇమేజింగ్ వ్యవస్థలు సృష్టిస్తున్న కంటెంట్కు పరిమితులుండాలని కొందరు అంటున్నారు. ఎదుటివారి మనోభావాలు, ఆర్థిక, సామాజిక స్థితి దిగజారకుండా ఉండేంతవరకు పరిమితులకు లోబడి ఏఐ కంటెంట్ ఉండే సరిపోతుందని తెలుపుతున్నారు. అందుకు సమగ్ర విధానాలు రూపొందించడానికి ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. -
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
ముంబై: ప్రపంచ దేశాల మధ్య టారిఫ్ల కారణంగా తలెత్తిన అనిశ్చితి స్వల్పకాలమే కొనసాగనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో, ఎండీ కె.కృతివాసన్ పేర్కొన్నారు. వెరసి ఐటీ సేవల పరిశ్రమకు కొంతకాలమే అనిశ్చితి సవాళ్లు సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలల్లోనే పరిష్కారం లభించనున్నట్లు అంచనా వేశారు.39 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ ఆర్డర్ బుక్ భవిష్యత్ ఆదాయ ఆర్జనకు హామీ ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. డీల్ పైప్లైన్ పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో కొంతమంది క్లయింట్ల నుంచి విచక్షణ వ్యయాలు నిలిచిపోతున్నట్లు వెల్లడించారు. అయితే ధరల విషయంగా ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.నిజానికి వార్షికంగా, త్రైమాసికవారీగా ధరలు స్వల్పంగా మెరుగుపడినట్లు తెలియజేశారు. గతేడాదికి 30 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీ విచక్షణ వ్యయాల వాటాపై వివరణ ఇవ్వని సంగతి తెలిసిందే. ఇవి ఆదాయంలో కీలకమే అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావం పడలేదని వివరించారు.యూఎస్లో పరిస్థితులు సర్దుకుంటే ఉత్తర అమెరికా బిజినెస్లో తిరిగి పురోభివృద్ధి అందుకోగలమని అంచనా వేశారు. సాఫ్ట్వేర్ సేవల ఔట్సోర్సింగ్కు ప్రపంచంలోనే యూఎస్ అతిపెద్ద మార్కెట్కాగా.. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో వాటా 48%కి పరిమితం కావడం గమనార్హం! -
భారత్ చేతిలో హై పవర్ లేజర్ ఆయుధం
న్యూఢిల్లీ: భారత్ అమ్ములపొదిలో హై పవర్ లేజర్ ఆయుధం వచ్చి చేరింది. అధునాతన అధిక శక్తి కల్గిన 30 కిలోవాట్ల లేజర్ బీమ్ ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఫలితంగా లేజర్ డైరెక్ట్ ఎనర్జీ వెపన్( (DEW) సిస్టమ్ ద్వారా అధునాతన పవర్ ఫుల్ వెపన్ ను తయారు చేసిన దేశాల జాబితాలో భారత్ చేరిపోయింది. ఇప్పటివరకూ ముందు వరుసలో అమెరికా, రష్యా, చైనాలు ఉండగా, ఇప్పుడు వాటి సరసన భారత్ చేరింది.ఆదివారం కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (NOAR)లో ఈ విజయవంతమైన ట్రయల్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో ఫిక్స్ డ్ వింగ్ డ్రోన్ లు, స్వార్మ్ డ్రోన్ లపై అధునాతన లేజర్ బీమ్ను ప్రయోగించారు. ఇది భారత్ సాధించిన మరో విజయందీన్ని సక్సెస్ ఫుల్ గా లేజర్ బీమ్ కూల్చివేయడంతో డీఆర్డీవో సంబరాలు చేసుకుంది. టెక్నాలజీలో ఇది భారత్ సాధించిన మరో విజయంగా పేర్కొంది. భారత్ ట్రయల్ రన్ నిర్వహించిన ఈ లేజర్ బీమ్ కు ఎయిర్ క్రాఫ్ట్ లను, మిస్సెల్స్ ను క్షణాల్లో కూల్చివేసి సామర్థ్యం ఉంది. డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ ఆధ్వర్యంలోని ఈ ప్రయోగం చేపట్టారు. ఇది విజయవంతమైన తర్వాత టీమ్ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. దీనిలో భాగంగా ఆయన జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. ఇది గగనతలం రక్షణ దళాన్ని మరింత పటిష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయం కావడంతో అధునాతన టెక్నాలజీ కల్గిన అరుదైన దేశాల జాబితాలో చేరినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల చైనా కూడా ఇదే తరహా టెక్నాలజీతో ఓ పవర్ ఫుల్ బీమ్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే.మనముందు ఇంకా చాలా లక్ష్యాలే ఉన్నాయి..కామత్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే ఈ శక్తి సామర్థ్యాలను కల్గి ఉండగా, ఇప్పుడు మనం కూడా వాటి సరసన చేరినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ కూడా ఇదే తరహా టెక్నాలజీతో వెపన్స్ తయారు చేసే పనిలో ఉందన్నారు.మనం ఇంకా చాలా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. వాటిని సాధించే పనిలోనే ఉన్నాం. హై ఎనర్జీ సిస్టమ్ తో అత్యధిక పవర్ కల్గిన మైక్రోవేవ్స్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నటిక్ ఆయుధాలను తయారు చేయడానికి సమాయత్తమైనట్లు ఆయన వెల్లడించారు. మనకున్న పలు రకాలైన సాంకేతిక విజ్ఞానంతో స్టార్ వార్స్ శక్తిసామర్థ్యాలను కల్గిన ఆయుధాలను తీసుకురావచ్చన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా స్టార్ వార్స్ సామర్థ్యం కల్గిన వెపనే అంటూ ఆయన పేర్కొన్నారు. #WATCH | Kurnool, Andhra Pradesh: For the first time, India has showcased its capability to shoot down fixed-wing aircraft, missiles and swarm drones using a 30-kilowatt laser-based weapon system. India has joined list of selected countries, including the US, China, and Russia,… https://t.co/fjGHmqH8N4— ANI (@ANI) April 13, 2025 -
పెట్స్కు ఫోన్ చేయండి.. కుక్కల భాష తెలుసుకోండి!
పెంపుడు జంతువులపై ప్రేమతో వాటికి కావాల్సిన వస్తువులు, దుస్తులు, బొమ్మలు ఇలా చాలానే కొంటుంటారు. కాని, ఇప్పుడు ఆ జంతువులకు, వాటి యజమానులకు ఎంతగానో ఉపయోగపడే అత్యాధునిక గాడ్జెట్స్ మీ కోసం..పెట్ ఫోన్పెంపుడు జంతువులకు కూడా ఫోన్ చేసి మాట్లాడే వీలు కల్పిస్తుంది ఈ ‘పెట్ ఫోన్’. దీని ద్వారా మీ పెట్స్ ఎక్కడున్నా, ఎప్పుడైనా సరే వాటికి ఫోన్ చేసి టచ్లో ఉండొచ్చు. క్లౌడ్ సిమ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్ టూ వే కమ్యూనికేషన్ ఫీచర్తో పనిచేస్తుంది. ఇందులోని జీపీఎస్, రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్ సాయంతో సిగ్నల్ తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ వాటి లొకేషన్ను గుర్తించి సమాచారం ఇస్తుంది. ధర రూ. 32,411 మాత్రమే!పెంపుడుజీవాల ఆరోగ్యానికి రక్షణపెంపుడు జంతువుల అనారోగ్యం గుర్తించడంలో ఆలస్యం అయితే, వాటి ప్రాణాలకే ప్రమాదం. వాటి ఆరోగ్యం విషయంలో ఎంతగానో జాగ్రత్త తీసుకోవాలి. పెంపుడు జంతువుల హెల్త్ చెకప్ కోసం తయారు చేసినదే ఈ ‘విజ్డమ్ ప్యానెల్ ప్రీమియం’. ఇది డీఎన్ఏ పరీక్ష కిట్తో పాటు, వివిధ పరీక్షల ప్యాకేజింగ్తో వస్తుంది. ఈ పరీక్షలతో దాదాపు 211 జన్యు, ఇతర ఆరోగ్య పరిస్థితుల ఫలితాలు, వాటి వివరాలను తెలుసుకోవచ్చు. ధర వివిధ ప్యాకేజీలను బట్టి ఉంటుంది.శునక భాషను అనువదిస్తుంది..శునకాలు మూగజీవులైనప్పటికీ వాటికీ ఓ భాష ఉంటుంది. అవి కూడా మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాయి. మనకే అర్థం కావు. తాజాగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కుక్కల భాషను అర్థం చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన ‘పెట్ ట్రాన్స్లేటర్’ను అభివృద్ధి చేశారు. ఈ ప్రత్యేకమైన పరికరం కుక్కలు మొరిగే తీరు, అవి చేసే వివిధ శబ్దాల ఆధారంగా అవి చెప్పాలనకున్న విషయాన్ని మనకు తెలిసిన భాషలో వివరిస్తుంది. ధర 220 డాలర్లు. (రూ. 18,817) మాత్రమే!పాటీ క్లీనర్ ప్రేమగా పెంచుకున్నప్పటికీ పెంపుడు జంతువుల విసర్జనను శుభ్రం చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కొందరు. అయితే, ‘ఐ రోబో రోంబా జే7’ వాక్యూమ్ ఈ పనిని చాలా చక్కగా చేస్తుంది. సాధారణ రోబో వ్యాక్యూమ్స్ పాటీలను గుర్తించలేవు. కాబట్టి, వాటిని సరిగ్గా శుభ్రం చేయలేవు. కాని, ఈ రోంబా జే7 పెట్ పాటీలను గుర్తించి ప్రత్యేకంగా వాటిని శుభ్రం చేస్తుంది. ధర 799 డాలర్లు (రూ. 68,322). ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. -
చాట్ జీపీటీ సాయంతో కేసు గెలిచాడు..!
సినిమాల్లో మాదిరి పంచ్ డైలాగ్స్తోనూ, నవ్వులు కురిపించే వాదనలతో కాదు. కేవలం, పదే పది నిమిషాల్లో సూటిగా సుత్తిలేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా, అసలు లానే చదవకుండా వాదించాడు ఈ లాయర్. ఆ లాయర్ పేరే ‘చాట్ జీపీటీ’. తాజాగా ఓ కుర్రాడు ఈ టెక్నాలజీ సాయంతోనే కోర్టులో తన కేసు గెలిచాడు. కేసు వాదనలు పట్టుమని పది నిమిషాల్లోనే పూర్తయిపోయాయి. వాయిదాల లాయర్ల మాదిరిగా కాకుండా, చాట్ జీపీటీ ఫటాఫట్ కేసు ముగించేసింది. కజక్స్తాన్లోని అల్మాటీ నగరానికి చెందిన కెంజెబెక్ ఇస్మాయిలోవ్ తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో, బేస్లైన్ క్రాస్ చేసి, ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించాడు. ఈ అపరాధానికి ప్రభుత్వం అతనికి పదకొండు డాలర్లు (అంటే రూ.940) జరిమానా విధించింది. పుట్టి బుద్ధెరిగాక ఎప్పుడూ కోర్టుకు వెళ్లని ఇస్మాయిలోవ్కి కోర్టు పద్ధతులు తెలియవు. తన కేసును వాదించడానికి లాయర్ల సాయం తీసుకోకుండా, చాట్ జీపీటీ సాయం తీసుకున్నాడు. అది అతనికి కోర్టులో సవాలు చేయమని సలహా ఇవ్వడమే కాదు, కేసు దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలను కూడా సిద్ధం చేసింది. పది నిమిషాల విచారణలో, జడ్జి అడిగిన ప్రశ్నలకు చాట్ జీపీటీ స్పీచ్ సింథసిస్ ఫీచర్ ద్వారా అతను సమాధానాలు ఇచ్చాడు. చాట్ జీపీటీ వాదన ఎంతో సమర్థంగా ఉండటంతో జడ్జి జరిమానాను రద్దు చేశారు. (చదవండి: -
సూపర్ సేవర్ ప్యాక్.. 98 రోజుల కొత్త రీచార్జ్ ప్లాన్
దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రారంభిస్తూ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రీఛార్జ్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కాస్త పొదుపైన, 98 రోజుల సరికొత్త రీచార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, డేటాతోపాటు కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది.జియో రూ.999 ప్లాన్జియో ప్రస్తుతం తన రూ .999 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్తో యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్తో అన్ని లోకల్, ఎస్టీడీ నెట్వర్క్లకు అపరిమిత వాయిస్ కాలింగ్ను ఆనందింవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు.ఇక అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ 90 రోజులపాటు ఉచిత జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ను అందిస్తుంది. తద్వారా వినియోగదారులు ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను, సినిమాలను, వెబ్ సిరీస్లను ఆస్వాదించవచ్చు. అలాగే ఈ రీఛార్జ్ ప్లాన్తో జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది.జియో రూ.1,049 ప్లాన్రూ .999 ప్లాన్తో పాటు, దీనికి దగ్గర ఉండే రూ .1,049 ప్రీపెయిడ్ ప్లాన్ను కూడా జియో అందిస్తోంది. దీంతో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. వినియోగదారులు 50 జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్ను కూడా పొందుతారు. ఇది కమ్యూనికేషన్తో పాటు స్టోరేజ్ అవసరాలకు అనువుగా ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారి కోసం ఈ ప్లాన్లో జియో సినిమా ప్రీమియం (డిస్నీ + హాట్స్టార్) కు 90 రోజుల మొబైల్ సబ్స్క్రిప్షన్తోపాటు జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా జీ5, సోనీలైవ్ యాక్సెస్ లభిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ చేరుకున్న తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్కు తగ్గుతుంది. -
సగం కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..
ప్రీమియం ఫోన్లలో ఐఫోన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫోన్ను ఉపయోగించాలని చాలా మందికి ఉంటుంది. అయితే దాని అధిక ధర కారణంగా ఐఫోన్ను కొనడం అందరికీ వీలుకాదు. కానీ ఇప్పుడు అతి తక్కువ ధరకు లేటెస్ట్ ఐఫోన్ను సొంతం చేసుకునే అవకాశం వచ్చింది.2023లో విడుదలైనప్పటి నుండి యాపిల్ ఐఫోన్ 15.. వివిధ అమెజాన్ డీల్స్ స్థిరంగా లిస్ట్ అవుతూ వస్తోంది. సాధారణంగా ఇచ్చే డిస్కౌంట్లు పెద్దగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించనప్పటికీ, ఇప్పటికీ ఆ ఫోన్ను కొనుగోలు చేయాలనుకునేవారికి మాత్రం ఈ సారి డీల్ విలువైన అవకాశాన్ని అందిస్తోంది.ఐఫోన్ 15 అమెజాన్ డీల్రాబోయే ఐఫోన్ 16 సిరీస్తో అమెజాన్ ఇప్పుడు ఐఫోన్ 15పై గణనీయమైన ధర తగ్గింపును ప్రవేశపెట్టింది. ఇది గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా ఉంది. యాపిల్ ఐఫోన్ 15 (128 జీబీ, బ్లాక్) ప్రస్తుతం అమెజాన్లో రూ .79,900 ప్రారంభ ధర, దానిపై 23 శాతం డిస్కౌంట్తో రూ.61,400 ధరకు లిస్ట్ అయింది. ఇంకా ఎక్కువ పొదుపు చేయాలనుకునేవారు అమెజాన్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ను సద్వినియోగం చేసుకోవచ్చు.ఉదాహరణకు, ఉపయోగించిన పాత ఐఫోన్ 14 ప్లస్ (512 జీబీ) ను మంచి స్థితిలో ఉంటే దాన్ని ఎక్స్ఛేంజ్ చేస్తే రూ .29,500 తగ్గింపు లభిస్తుంది. ఇలా ఐఫోన్ 15 నికర ధర రూ .31,000 కు తగ్గుతుంది. అదనంగా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ .3,070 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఇది తుది ధరను కేవలం రూ .28,830 కు తగ్గిస్తుంది.ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లుఈ ఫోన్ 6.1 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది పింక్, ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. యాపిల్ మునుపటి మోడళ్ల డిజైన్ ఉన్నప్పటికీ సాంప్రదాయ నాచ్ కు బదులుగా డైనమిక్ ఐలాండ్ నాచ్ ను ప్రవేశపెట్టింది. ఇది ఐఫోన్ 14 ప్రో మోడళ్లలో మంచి ఆదరణ పొందింది.ఈ మోడల్ లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. ఇది పగటిపూట, తక్కువ-కాంతి, పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి మెరుగ్గా ఉంటుంది.ఐఫోన్ 15 "ఆల్ డే బ్యాటరీ లైఫ్" కలిగి ఉందని యాపిల్ పేర్కొంది. అయితే వాస్తవ వినియోగంలో ఇది సగటు వినియోగంతో 9 గంటలకు పైగా ఉంటుందని సూచిస్తుంది. ఇందులో యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది.ఇది యాపిల్ ఎ16 బయోనిక్ చిప్ తో పనిచేస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ లలో ఉపయోగించిన ఎ15 చిప్ నుండి అప్ గ్రేడ్ యఅయింది. -
గూగుల్లో ఆగని లేఆఫ్లు.. మళ్లీ వందలాది తొలగింపులు
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్లో (Google) లేఆఫ్లు కొనసాగుతున్నాయి. తన ప్లాట్ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగం నుంచి తాజాగా వందలాది మంది ఉద్యోగులను తొలగించిందని ( layoff )ఆండ్రాయిడ్, పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్లో పనిచేసే ఉద్యోగులు ఇందులో ఉన్నారని ‘ది ఇన్ఫర్మేషన్’ అనే వార్తా నివేదిక పేర్కొంది. అయితే ఎంత మంది ఉద్యోగులు తొలగింపులకు గురయ్యారన్న వివరాలు వెల్లడి కాలేదు.తొలగింపు వెనుక కారణం..కార్యకలాపాలను క్రమబద్ధీకరణ, సామర్థ్య పెంపు కోసం గూగుల్ చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు అనుగుణంగా ఈ సిబ్బంది పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది గూగుల్ తన ఆండ్రాయిడ్, క్రోమ్ టీమ్లను పిక్సెల్ అండ్ డివైజెస్ గ్రూప్ కింద విలీనం చేయడంతో ప్రారంభమైన సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ తొలగింపులు జరిగాయి. జనవరిలో కంపెనీ స్వచ్ఛంద నిష్క్రమణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ తాజా ఉద్యోగ కోతలు ఆ చొరవకు కొనసాగింపు అని సూచిస్తున్నాయి.గూగుల్ ప్రకారం.. చురుకుదనం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడమే పునర్నిర్మాణం లక్ష్యం. ఇది కంపెనీ తన ప్రధాన ఉత్పత్తులు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. వందలాది ఉద్యోగులకు నష్టం కలిగించే ఈ చర్య వ్యయ తగ్గింపు, వనరుల ఆప్టిమైజ్ కోసం మొత్తం టెక్ పరిశ్రమ అవలంభిస్తున్న ధోరణిని ప్రతిబింబిస్తోంది.ఇన్నోవేషన్ పై ప్రభావంపునర్ వ్యవస్థీకరణకు గూగుల్ తీసుకున్న నిర్ణయం ఉత్పత్తుల అభివృద్ధి, ఆవిష్కరణలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనలను రేకెత్తిస్తోంది. కీలక బృందాల్లో తక్కువ మంది ఉద్యోగులతో, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పురోగతిలో గూగుల్ ఎలా ముందుకు వెళ్తుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంకా నియామకాలు జరుగుతున్నాయని, ఇన్నోవేషన్ పై పూర్తిగా వెనక్కి తగ్గకుండా వనరులను పునర్వినియోగం చేస్తున్నామని కంపెనీ పేర్కొంది.టెక్ పరిశ్రమలో తొలగింపులుఉద్యోగాల కోత, పునర్నిర్మాణ చర్యలను అమలు చేస్తోన్న టెక్ కంపెనీ గూగుల్ ఒక్కటే కాదు. ఆర్థిక అనిశ్చితి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ వరకు కారణాలను చూపుతూ అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ సహా పలు బడా టెక్ కంపెనీలు గత ఏడాది ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి. -
ఆన్లైన్లో ఈజీగా హైసెక్యూరిటీ ప్లేట్లు
రాష్ట్రంలో వాహనదారులకు కొత్త నిబంధన అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త, పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ) ఉండాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటివరకు 2019 ఏప్రిల్ 1 తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ నిబంధన అమలులో ఉండగా, ఇక నుంచి అంతకు ముందు తయారైన వాహనాలకూ ఈ హెచ్ఎస్ఆర్పీ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశిస్తూ రవాణాశాఖ తెలిపింది. ఇందుకు 2025 సెప్టెంబర్ 30 వరకు గడువు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆన్లైన్లోనే సులువుగా ఈ రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఎలా పొందాలో తెలుసుకుందాం.వాహనదారులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(సియామ్)కు చెందిన అధికారిక వెబ్సైట్ www.siam.in ద్వారా హెచ్ఎస్ఆర్పీని పొందవచ్చు.వెబ్సైట్ హోమ్ పేజీలో కుడివైపు టాప్లో ఉన్న ‘బుక్ హెచ్ఎస్ఆర్పీ’పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత ప్రత్యేకంగా విండో ఓపెన్ అవుతుంది.అందులో ఫుల్నేమ్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఈమెయిల్, మొబైల్ నంబర్, రాష్ట్రం, జిల్లా వంటివి ఎంటర్ చేసి చెక్బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి.మీ వాహనం టైప్(టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్, బస్, ట్రక్, కమర్షియల్ వాహనం) సెలెక్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత కింద కనిపించే మీ వాహన కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి.ఇక్కడ ప్రత్యేకంగా మరో విండో ఓపెన్ అవుతుంది.అందులో మీకు కావల్సిన ‘హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ విత్ కలర్ స్టిక్కర్’ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.ఇందులో స్టెప్-1 బుకింగ్ డిటెయిల్స్, స్టెప్-2 ఫిట్మెంట్ లొకేషన్, స్టెప్-3 అపాయింట్మెంట్ స్లాట్, స్టెప్-4 బుకింగ్ సమ్మరీ, స్టెప్-5 వెరిఫై డిటెయిల్స్ అండ్ పే, స్టెప్-6 డౌన్లోడ్ రిసిప్ట్ వరకు అన్నింటినీ క్షుణ్ణంగా పూర్తిచేయాలి.స్టెప్-1లో వాహన నంబర్, ఫ్రేమ్/చాసిస్ నంబర్లోని చివరి ఐదు నంబర్లు, ఇంజిన్ నంబర్లోని చివరి ఐదు నంబర్లు ఎంటర్ చేసి క్యాప్చా నంబర్ ఎంటర్ చేయాలి.ఆ తర్వాత మీకు అందుబాటులో ఉన్న డేట్, టైమ్ను ఎంపిక చేసుకోవాలి.ఆ తర్వాత మీకు అందుబాటులో ఉన్న ఫిట్మెంట్ లొకేషన్లో సర్వీస్ సెంటర్ను ఎంచుకోవాలి. అక్కడే మీ వాహన ప్లేట్కు ఖర్చు ఎంత అవుతుందో కనిపిస్తుంది.దాన్ని ఎంచుకుంటే బుకింగ్ సమ్మరీ కనిపిస్తుంది. వివరాలు వెరిఫై చేసుకొని పేమెంట్కు వెళ్లొచ్చు.అక్కడ క్రెడిట్, డెబిట్, యూపీఐ, నెట్ బ్యాకింగ్ ఆప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు.డబ్బులు చెల్లించిన తర్వాత వివరాలు చెక్ చేసుకొని అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. సంబంధిత సర్వీస్ సెంటర్ వివరాలు, ఫోన్ నంబర్ ఉంటాయి.అపాయింట్మెంట్ రోజు ఆర్సీ కాపీని వెంట తీసుకెళ్లాలి.ఆ స్లిప్ వ్యాలిడిటీ 28 రోజుల వరకు మాత్రమే ఉంటుంది.ఫిట్మెంట్కు ఎక్స్ట్రా నగదు చెల్లించాల్సిన అవసరం లేదు.ఏవైనా అభ్యంతరాలుంటే మెయిల్ online@bookmyhsrp.comలో సంప్రదించవచ్చు.ఇదీ చదవండి: ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్పోర్ట్లుకొత్త ప్లేట్ల కోసం ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఆలోపు హెచ్ఎస్ఆర్పీలను ఏర్పాటు చేసుకోవాలని, వాటిని ఏర్పాటు చేసుకోని వాహనాలు గడువు తర్వాత రోడ్డెక్కితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అందులో హెచ్చరించింది. ఫిట్నెస్ టెస్ట్ సహా వాహనాలకు సంబంధించి రవాణాశాఖ ద్వారా ఏ సేవ పొందాలన్నా ఈ నంబర్ ప్లేట్ ఉంటేనే సాధ్యమని, ఆ నంబర్ ప్లేటు లేని వాహనాలకు రవాణాశాఖలో ఎలాంటి సేవలు ఇవ్వబోమని, ఆ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయటం కుదరదని తేల్చి చెప్పటం విశేషం. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసిన సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటే హెచ్ఎస్ఆర్పీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.వాహనాలను అనుసరించి ధరలు ఇలా..హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్ఎస్ఆర్పీలు) వల్ల కలిగే ప్రయోజనాలుఈ ప్లేట్లు ట్యాంపరింగ్ ఆస్కారాన్ని తగ్గిస్తాయి. వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను దొంగిలించడం లేదా దుర్వినియోగాన్ని కట్టడి చేస్తాయి. ఈ ప్లేట్ల ద్వారా అన్ని వాహనాలకు ఒకే రకమైన నమూనా ఉంటుంది. ఇది రిజిస్ట్రేషన్లను గుర్తించడం, వాటిని ధ్రువీకరించడం అధికారులకు సులభతరం చేస్తుంది. క్రోమియం హోలోగ్రామ్, లేజర్ ఆధారిత వివరాలు డూప్లికేట్ చేయడం దాదాపు అసాధ్యం. వీటిని ఈ ప్లేట్లలో వాడడం వల్ల నకిలీ ప్లేట్లను నిరోధించవచ్చు. ప్లేట్లపై కలర్ కోడెడ్ స్టిక్కర్లు వాహనం ఏ ఇంధన రకానికి చెందిందో (ఉదా. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్) సూచిస్తుంది. -
జీతాల పెంపు ఇప్పుడు కాదు..
దేశంలో అగ్ర ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు నిరాశను కలిగించే చేదు వార్తను చెప్పింది. ఏప్రిల్లో ప్రారంభం కావాల్సిన వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన అనంతరం మీడియా సమావేశంలో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది.వేతనాల పెంపును ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో పరిశీలిస్తామని టీసీఎస్ తెలిపింది. నిర్ణయం తీసుకునే ముందు వ్యాపార వాతావరణం మరింత స్థిరంగా మారడానికి వేచి చూస్తున్నామని కంపెనీ అగ్ర నాయకత్వం వెల్లడించింది. వేతనాల పెంపు ఎప్పుడు చేయాలనేది రానున్న రోజుల్లో నిర్ణయిస్తామని ప్రస్తుత చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ ఆర్వో) మిలింద్ లక్కడ్ తెలిపారు. అనిశ్చిత మార్కెట్ పరిస్థితులను ఎదుర్కొంటున్నందున కంపెనీ ఆచితూచి వ్యవహరిస్తున్న వైఖరిని ఆయన ప్రకటన ప్రతిబింబిస్తోంది.ఇప్పటికే చాలా మంది క్లయింట్లు తమ వ్యయాన్ని తగ్గించుకునే సంకేతాలను చూపుతున్నారని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.కృతివాసన్ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే విచక్షణ వ్యయంలో జాప్యం జరుగుతుందన్నారు. టారిఫ్ సంబంధిత అనిశ్చితి కారణంగా కంపెనీలు తమ బడ్జెట్లను సమీక్షిస్తున్నందున అనేక ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని లేదా తగ్గిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.వార్షిక వేతన పెంపును నిలిపివేసినప్పటికీ, టీసీఎస్ త్రైమాసిక వేరియబుల్ పేను కొనసాగిస్తుంది. నాలుగో త్రైమాసికంలో 70 శాతం మంది ఉద్యోగులకు పూర్తి అర్హత కలిగిన వేరియబుల్ వేతనం అందనుంది. మిగతా సిబ్బందికి వ్యాపార పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లిస్తారు.బలంగానే నియామకాలువేతనాల పెంపు ఆలస్యమైనా ఫ్రెషర్ల నియామకాలను కొనసాగిస్తామని టీసీఎస్ తెలిపింది. గత ఏడాది నియామకాల సంఖ్యకు అనుగుణంగా ఈ ఏడాది కాలేజీల నుంచి 42,000 మంది ఇంజినీర్లను నియమించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ 625 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,07,979కి చేరింది.మొత్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికరంగా 6,433 మంది ఉద్యోగులను చేర్చుకుంది. అంతకుముందు సంవత్సరంలోని 13,249 క్షీణత నుంచి కోలుకుంది. నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ 13 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 13.3 శాతానికి చేరింది. ఇచ్చిన హామీ మేరకు 2025 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ 42,000 మంది ఫ్రెషర్లను విజయవంతంగా ఆన్బోర్డ్ చేసిందని లక్కడ్ తెలిపారు.కాగా 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ రూ.12,224 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,434 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తక్కువ. ఈ త్రైమాసికంలో ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.3 శాతం పెరిగి రూ.64,479 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 0.79 శాతం పెరిగింది. -
‘ఉప్పల్’లో మరింత ఫాస్ట్గా జియో నెట్వర్క్
హైదరాబాద్: దేశవ్యాప్తంగా క్రికెట్ ఉత్సాహం ఊరకలెత్తుతున్న తరుణంలో ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ప్రేమికులకు నిరవధిక డిజిటల్ అనుభవం అందించేందుకు రిలయన్స్ జియో ముందుకు వచ్చింది. ప్రతి మ్యాచ్ కు 50,000 మందికి పైగా ప్రేక్షకుల రాకను దృష్టిలో పెట్టుకుని, జియో తన 4జీ, 5జీ నెట్వర్క్ ను స్టేడియం లోపల, బయటా బలోపేతం చేసింది.మ్యాచ్ హైలైట్లు రికార్డ్ చేయడం దగ్గర నుంచి వీడియో కాల్స్ చేయడం వరకు.. స్టేడియంలో ఉన్న అభిమానులు ఇప్పుడు జియో అత్యాధునిక మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవల ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ను ఆస్వాదించగలుగుతున్నారు. స్టేడియంలో జియో హై-స్పీడ్ ‘జియోనెట్’ వై-ఫై సేవలను కూడా అందిస్తోంది. జియోనెట్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడానికి స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి, ఓటీపీతో నిర్ధారించిన తర్వాత, జియో నెట్ కు కనెక్ట్ అవుతారు. ప్రతి సెషన్ కస్టమర్ కు 480 నిమిషాల హై-స్పీడ్ వైఫైని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.దేశవ్యాప్తంగా ప్రధాన క్రికెట్ స్టేడియాలలో 2,000 కంటే ఎక్కువ ప్రత్యేక సెల్లను ఏర్పాటు చేసి, జియో ఈ సీజన్లో నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. స్టాండలోన్ 5జీ ఆర్కిటెక్చర్, నెట్వర్క్ స్లైసింగ్, క్యారియర్ అగ్రిగేషన్ సాంకేతికత ఆధారంగా ఈ వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు, అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన 5జీ అనుభవాన్ని అందిస్తున్నాయి. -
470 ఎకరాల అడవిని నిర్మించిన నాయర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్
తన ఎక్స్ ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసే.. దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. మియావాకి అడవి అంటే ఏమిటో నాకు తెలుసు, కానీ డాక్టర్ నాయర్ గురించి తెలియదు అని పోస్ట్ చేశారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక అడవిని చూడవచ్చు. భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకి అడవిని డాక్టర్ నాయర్ ఎలా సృష్టించారో నాకు తెలియదు. సుస్థిరతకు ప్రాధాన్యం లేని ఈ రోజుల్లో.. మన మధ్య ఇలాంటి హీరోలు ఉండటం గర్వకారణం అని ఆయన ట్వీట్ చేశారు.నాయర్ నిర్మించిన అడవిగుజరాత్లోని కచ్లో నాయర్ సుమారు 470 ఎకరాల విస్తీర్ణంలో అడవిని నిర్మించారు. ఇందులో 3,00,000 కంటే ఎక్కువ చెట్లు ఉన్నాయి. ఈ అడవిని జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి టెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో సహజ పర్యావరణ వ్యవస్థలను అనుకరించడానికి వివిధ రకాల స్థానిక వృక్ష జాతులను దగ్గరగా నాటడం జరుగుతుంది. దీని ఫలితంగా ఇవి సాధారణ మొక్కలకంటే 10 రెట్లు వేగంగా పెరుగుతాయి.ఎవరీ డాక్టర్ నాయర్డాక్టర్ నాయర్ పర్యావరణవేత్త & ఎన్విరో క్రియేటర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. 2014లో ఈయన 1500 చెట్లతో.. మియావాకి అడవిని ప్రారభించడం మొదలుపెట్టారు. ఇలాంటి అడవులను ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ నిర్మించారు. వీటిలో చెప్పుకోదగ్గది కచ్లోని స్మృతివన్ మియావాకి అడవి. దీనిని 2001 గుజరాత్ భూకంప బాధితులకు నివాళిగా నిర్మించారు. కాగా 2030 నాటికి 100 కోట్ల చెట్లను నాటడమే లక్ష్యంగా డాక్టర్ నాయర్ ముందుకు సాగుతున్నారు.మియావాకి పద్దతి1970లో జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు అకిరా మియావాకి ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో మొక్కలను దగ్గరదగ్గరగా నాటుతారు. కాబట్టి ఇవి సాధారణ చెట్ల కంటే 10 రేట్లు వేగంగా పెరుగుతాయి. ఈ పద్దతిలో మొక్కలను పెంచడం వల్ల మట్టి కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలుస్తోంది.I knew what a Miyawaki forest was but had no idea about Dr Nair and how he had created the world’s largest such forest in India. At a time when the U.S has taken sustainability off its priority list I am just grateful that we have such heroes amongst us…👏🏽👏🏽👏🏽 pic.twitter.com/WNra4TnhVP— anand mahindra (@anandmahindra) April 9, 2025 -
ఐటీ కంపెనీలదే ఆధిపత్యం.. టాప్లో టీసీఎస్..
లింక్డ్ఇన్ 2025 టాప్ కంపెనీస్ ఇండియా లిస్ట్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), యాక్సెంచర్, ఇన్ఫోసిస్ తొలి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ఈ వార్షిక ర్యాంకింగ్ కెరీర్ వృద్ధి, నైపుణ్య అభివృద్ధి, దీర్ఘకాలిక విజయం కోసం ఉత్తమ పని ప్రదేశాలను హైలైట్ చేస్తూ ఉద్యోగార్థులు, ఉద్యోగులు తమ కెరీర్లలో ఎలా ముందుకు వెళ్లాలో మార్గదర్శనం చేస్తుంది.ముందంజలో టెక్ టైటాన్స్టీసీఎస్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ ల ఆధిపత్యం భారత ఉపాధి రంగంలో టెక్నాలజీ, కన్సల్టింగ్ సేవలకు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోంది. ఈ కంపెనీలు తమ ఉద్యోగుల కేంద్రీకృత కార్యక్రమాలకు ప్రత్యేకమైనవిగా నిలుస్తాయి. అప్ స్కిల్లింగ్, నాయకత్వ అభివృద్ధి, సృజనాత్మక-ఆధారిత పని వాతావరణంలో భారీగా పెట్టుబడులు పెడతాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు పెడుతూ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్లో టీసీఎస్ ముందంజలో ఉంది.కన్సల్టింగ్, బిజినెస్ స్ట్రాటజీ, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీలో యాక్సెంచర్ పవర్ హౌజ్గా ఉంటూ గ్లోబల్ డిజిటల్ సొల్యూషన్స్ను నడిపిస్తోంది.ఏఐ ఇంజినీరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సస్టెయినబిలిటీ కన్సల్టింగ్పై ఇన్ఫోసిస్ దృష్టి సారించింది.ఎమర్జింగ్ ట్రెండ్స్.. హైరింగ్ తీరుతెన్నులులింక్డ్ఇన్ ర్యాంకింగ్ కొన్ని ఆకర్షణీయమైన ధోరణులతో భారతదేశపు అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్ను కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది.టాప్ ఇన్-డిమాండ్ రోల్స్: ఫ్రాడ్ అనలిస్టులు, బిజినెస్ ఆపరేషన్స్ అనలిస్టులు, ఫైనాన్షియల్ ఎనలిస్టులు వంటి ఉద్యోగాలకు కంపెనీలు చురుగ్గా నియామకాలు జరుపుతున్నాయి.డిమాండ్ ఉన్న నైపుణ్యాలు: ఏఐ ఇంజినీరింగ్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో నైపుణ్యానికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.పరిశ్రమ మార్పులు: టెక్నాలజీ, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లు ఆధిపత్యం కొనసాగిస్తుండగా, టాప్ 25 కంపెనీల్లో 19 కంపెనీలు ఈ రంగాలకు చెందినవే కావడం గమనార్హం.కొత్త కంపెనీలే: ఈ జాబితాలోని కంపెనీల్లో సగానికి పైగా మొదటిసారి ప్రవేశించినవే కావడం యజమాని ప్రాధాన్యతలు, వర్క్ ప్లేస్ అప్పీల్ లో మార్పును సూచిస్తోంది.జాబితాలో టాప్ 10 కంపెనీలు ఇవే..1. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్): ఐటీ సర్వీసెస్2. యాక్సెంచర్: కన్సల్టింగ్ అండ్ ఐటీ సర్వీసెస్3. ఇన్ఫోసిస్: ఐటీ సర్వీసెస్4. ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్: ఫైనాన్షియల్ సర్వీసెస్5. కాగ్నిజెంట్: ఐటీ సర్వీసెస్6. ఒరాకిల్: సాఫ్ట్వేర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్7. జేపీ మోర్గాన్ ఛేజ్: ఫైనాన్షియల్ సర్వీసెస్8. అమెజాన్: ఈ-కామర్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్9. ఆల్ఫాబెట్ ఇంక్ (గూగుల్): టెక్నాలజీ10. డిపాజిటరీ ట్రస్ట్ అండ్ క్లియరింగ్ కార్పొరేషన్ (డీటీసీసీ): ఫైనాన్షియల్ సర్వీసెస్ -
ఇన్స్టాగ్రామ్ లైవ్స్ట్రీమ్.. వారికి కొత్త రూల్స్
లండన్: సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో 16 ఏళ్లలోపు టీనేజర్లు ప్రత్యక్షప్రసార సేవ అయిన లైవ్స్ట్రీమ్లో అనుచిత, అసభ్య, బ్లర్చేయని నగ్న వీడియోలు చూడకుండా కట్టడిచేసే లక్ష్యంతో కఠిన నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాప్లాట్ఫామ్స్ మంగళవారం ప్రకటించింది. తల్లిదండ్రుల సమ్మతితోనే లైవ్స్ట్రీమ్ (livestream) సదుపాయం కల్పిస్తామని సంస్థ స్పష్టంచేసింది. తమ అనుబంధ సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్బుక్, మెసెంజర్లలోనూ 18 ఏళ్లలోపు టీనేజర్లకు అదనపు ‘కట్టడి’ చర్యలను అమలుచేస్తామని మెటా పేర్కొంది.టీనేజీ వినియోగదారుల సమయాన్ని, ఆరోగ్యాన్ని సోషల్మీడియా (Social Media) తీవ్రంగా ప్రభావితంచేస్తున్న నేపథ్యంలో పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులకు పూర్తి నిఘా అధికారాలను కట్టబెడుతూ మెటా (Meta) గత సెప్టెంబర్లో ‘టీన్ అకౌంట్ ప్రోగ్రామ్’ను అమల్లోకితేవడం తెల్సిందే. ఇన్స్టాగ్రామ్ (Instagram) నూతన కఠిన నిబంధనలను తొలుత అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియాలలో అమలుచేయనున్నారు. మరికొద్ది నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ నిబంధనలను అమలుచేస్తారు. నిబంధనలు అమల్లోకి వచ్చాక టీనేజర్ల ఖాతాల్లో ఇన్స్టాగ్రామ్ లైవ్ ఆప్షన్ కనపడదు. తల్లిదండ్రుల పర్మిషన్ వచ్చాకే కనిపిస్తుంది. చదవండి: గిబ్లీ–స్టైల్ ఫొటో.. 5 కోట్ల 10 లక్షల వ్యూస్! -
భారత్లో మళ్లీ అల్కటెల్ ఫోన్లు..
దేశీ మొబైల్ ఫోన్ల మార్కెట్లో అల్కటెల్ బ్రాండ్ను తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు నెక్ట్స్సెల్ ఇండియా తాజాగా పేర్కొంది. ఇందుకు వీలుగా తొలి దశలో 3 కోట్ల డాలర్లు(రూ. 260 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి ఏడేళ్ల తదుపరి తిరిగి దేశీయంగా అల్కటెల్ బ్రాండ్ను విడుదల చేయనుంది.భారత్తోపాటు ప్రపంచ మార్కెట్లకు అవసరమయ్యే ప్రత్యేక ఫీచర్స్తో స్మార్ట్ఫోన్లను రూపొందించడంపై దృష్టి పెట్టనున్నట్లు నెక్ట్స్సెల్ ఇండియా వివరించింది. నోకియాతో ట్రేడ్మార్క్ ఒప్పందం కింద అల్కటెల్ బ్రాండ్ను చైనీస్ కంపెనీ టీసీఎల్ కమ్యూనికేషన్ నిర్వహిస్తోంది.దేశీయంగా అల్కటెల్ బ్రాండ్ అధీకృత హక్కులను నెక్ట్స్సెల్ ఇండియా కలిగి ఉంది. దీంతో అల్కటెల్ ప్రొడక్టుల సంబంధిత అన్నిరకాల కార్యకలాపాలను కంపెనీ నిర్వహించనున్నట్లు నెక్ట్స్సెల్ ఇండియా చీఫ్ బిజినెస్ అధికారి అతుల్ వివేక్ వెల్లడించారు. రూ. 20,000 నుంచి రూ. 25,000 ధరల శ్రేణిలో తమకు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇదే స్థాయిలో స్టైలస్తో కూడిన స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో తమ బ్రాండ్ ఫోన్ల అమ్మకం కోసం ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకున్నట్లు వివరించారు. -
క్యూఆర్ స్కాన్ చేస్తే ఆధార్ వివరాలు.. కేంద్రం కొత్త యాప్
క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధార్ యాప్ను కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టారు. ఇన్స్టంట్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ కోసం రియల్ టైమ్ ఫేస్ ఐడీతో కొత్త యాప్ పని చేస్తుందని చెప్పారు. ఈ యాప్తో సులభంగా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చని తెలిపారు. భారత పౌరులు తమ ఆధార్ కార్డును కొన్ని సందర్భాల్లో భౌతికంగా చూపించడానికి బదులుగా వారి గుర్తింపును ధ్రువీకరించడానికి ఈ యాప్ను ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.‘కేవలం ఒక ట్యాప్తో వినియోగదారులు అవసరమైన డేటాను మాత్రమే ఇతరులతో పంచుకునేలా ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. ఇది వారికి తమ వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను అందిస్తుంది. న్యూ ఆధార్ యాప్ (బీటా టెస్టింగ్ దశలో ఉంది) ద్వారా వెరిఫికేషన్ యూపీఐ పేమెంట్ చేసినంత సులభంగా ఉంటుంది. యూజర్లు తమ వివరాలు నిర్ధారించేటప్పుడు వారి ఆధార్ను డిజిటల్గా ధ్రువీకరించవచ్చు. యూపీఐ లావాదేవీల మాదిరిగా కేవలం క్యూఆర్ను స్కాన్ చేయడం ద్వారా ఇదంతా సులువుగా చేయవచ్చు’ అని మంత్రి తెలిపారు.ఆధార్ ఫేస్ అథెంటికేషన్దేశంలో యూపీఐ చెల్లింపులకు విస్తృతంగా వినియోగించే క్యూఆర్ కోడ్ల మాదిరిగానే ఆధార్ ధ్రువీకరణకు ‘పాయింట్స్ ఆఫ్ అథెంటికేషన్(వెరిఫికేషన్ భాగస్వాములు)’ వద్ద అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. యూపీఐ యాప్ల మాదిరిగానే కొత్త ఆధార్ యాప్తో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వెంటనే వారి ఫేస్ వెరిఫై ఆప్షన్ వస్తుంది. ఇది ఆధార్ హోల్డర్లకు వారి వ్యక్తిగత సమాచారంపై పూర్తి నియంత్రణను కలిగిస్తుంది. ఈ యాప్ రిక్వెస్ట్ అప్లికేషన్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా డిజిటల్ వెరిఫికేషన్, సమాచార మార్పిడికి అనుమతి లభిస్తుంది. ఇది భౌతిక ఫోటోకాపీల అవసరాన్ని తొలగిస్తుంది. ఇకపై హోటల్ రిసెప్షన్లు, షాపులు, ప్రయాణాల సమయంలో ఆధార్ ఫొటోకాపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.ఇదీ చదవండి: వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం ఎప్పటి నుంచంటే..బీటా వెర్షన్ఈ యాప్ బీటా వెర్షన్ టెస్టింగ్ దశలో ఉందని మంత్రి అన్నారు. కానీ దేశవ్యాప్తంగా ఇది విస్తృతంగా అమలైతే, పౌరులు ఇకపై వారి భౌతికంగా తమ ఆధార్ లేదా ఫోటోకాపీని ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ యాప్కు సంబంధించి నిర్దిష్ట యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా యూఐడీఏఐ త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. -
మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ వేగంగా ఉంది?: ఇలా తెలుసుకోండి..
దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి టెలికాం సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం జియో అగ్రస్థానంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తుండగా.. మిగిలినవి తరువాత స్థానాల్లో ఉన్నాయి. తమ ప్రాంతంలో ఏ నెట్వర్క్ వేగంగా ఉంది?, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు కొంతమందికి తెలిసి ఉండదు. ఈ కథనంలో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..సరైన మొబైల్ నెట్వర్క్ లేకపోతే.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక కొత్త సిమ్ కార్డును తీసుకోవడానికి ముందే.. మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ వేగంగా ఉందనే విషయం తెలుసుకోవాలి. దీనికోసం మీరు nPerf వెబ్సైట్ లేదా Opensignal యాప్ ఉపయోగించుకోవచ్చు.nPerfలో ఎలా తెలుసుకోవాలంటే..ఎన్పీఈఆర్ఎఫ్ అనేది 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్వర్క్లను గుర్తించడానికి సహాయపడే వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ ఉత్తమంగా ఉందో ఉచితంగానే తెలుసుకోవచ్చు.➤ముందుగా ఎన్పీఈఆర్ఎఫ్.కామ్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత.. ఎడమవైపు పైభాగంలో కనిపించే మై అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి.. ప్రొఫైల్ క్రియేట్ చేయాలి.➤ఆ తరువాత వెబ్సైట్లో కనిపించే మ్యాప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.➤ఆ తరువాత దేశం, మొబైల్ నెట్వర్క్ సెలక్ట్ చేసుకుని.. నగరం ఎంచుకోవాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. మీ ప్రాంతంలో ఉన్న సిగ్నెల్స్ చూడవచ్చు. ఏ సిగ్నెల్ నెట్వర్క్ ఎక్కువగా ఉందో.. గమనించి సిమ్ కార్డు తీసుకుంటే.. ఎప్పుడు నెట్వర్క్ సమస్య ఉండదు.ఇదీ చదవండి: మరో కొత్త ట్రెండ్!.. క్రికెట్ ప్లేయర్ అవతారమెత్తిన శామ్ ఆల్ట్మాన్ఓపెన్ సిగ్నల్ యాప్ ద్వారా తెలుసుకోవడం ఎలా?ఓపెన్ సిగ్నల్ యాప్ అనేది ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి యూజర్లు ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఈ యాప్ (Opensignal) డౌన్లోడ్ చేసుకోవచ్చు.➤యాప్ ఓపెన్ చేసిన తరువాత.. మీకు ఐదు ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మూడో ఆప్షన్ మ్యాప్ మీద క్లిక్ చేయాలి.➤మ్యాప్ ఆప్షన్ ఎంచుకున్న తరువాత.. అక్కడే లొకేషన్, ఆపరేటర్, నెట్వర్క్ వంటి వాటిని సెలక్ట్ చేసుకోవాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. మీ ప్రాంతంలో ఏ నెట్వర్క్ ఎంత ఉందనే విషయం తెలుస్తుంది. దాన్నిబట్టి మీరు ఏ సిమ్ కార్డు తీసుకోవాలనేది తెలుసుకోవచ్చు. -
వచ్చేస్తున్నాయి.. సరికొత్త స్మార్ట్ఫోన్లు
ప్రస్తుతం ఏప్రిల్ నెల ప్రారంభంలో ఉన్నాం. ఈ నెలలో అనేక స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్లతో సహా వివిధ రేంజ్ ధరల్లో శాంసంగ్, ఐక్యూ, వివో, రియల్మీ వంటి బ్రాండ్ల నుంచి అద్భుత ఫీచర్లతో సరికొత్త ఫోన్లు విడుదలకు సిద్ధమయ్యాయి. ఆయా ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు ఇప్పటికే వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో లాంచ్ అవుతున్న కొన్ని స్మార్ట్ఫోన్లు.. వాటి ఫీచర్ల గురించి మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.రియల్మీ నార్జో 80 ప్రో ఏప్రిల్ 9న రియల్మీ నార్జో 80 ప్రో స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనుంది. శక్తివంతమైన డైమెన్సిటీ 7400 చిప్సెట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఎక్కువ కాలం పనిచేసే అంతరాయం లేని మల్టీటాస్కింగ్ కోరుకునే వినియోగదారులకు ఈ కాంబినేషన్ అనువైన ఎంపికగా చేస్తుంది.వివో వీ50ఈ ఏప్రిల్ 10న లాంచ్ కానున్న వీ50ఈతో కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ల సంప్రదాయాన్ని వివో కొనసాగిస్తోంది. సోనీకి చెందిన ఐఎంఎక్స్ 882 సెన్సార్ కలిగిన ఈ ఫోన్ అసాధారణ ఫోటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుంది, షట్టర్ బగ్స్, కంటెంట్ క్రియేటర్లకు సరైనదిగా ఉంటుంది.ఐక్యూ జెడ్10 7,300 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐక్యూ జెడ్10 స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 11న లాంచ్ కానుంది. స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్ సెట్ తో కూడిన ఈ డివైస్ గేమర్స్, హెవీ డ్యూటీ యూజర్ల కోసం రూపొందించారు.శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ ఏప్రిల్ 15న లాంచ్ కానుంది. సొగసైన డిజైన్, శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో ఈ ఫోన్ మొబైల్ టెక్నాలజీలో కొత్త బెంచ్మార్క్ను సెట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇందులో హైలైట్ ఏంటంటే.. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అద్భుతమైన ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది. -
వైద్య రంగంలో గేమ్ ఛేంజర్గా కృత్రిమమేధ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచవ్యాప్తంగా విభిన్న పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఆరోగ్య సంరక్షణలోనూ కృత్రిమమేధ ఎంతగానో తోడ్పడుతుంది. అధునాతన అల్గారిథమ్స్, మెషిన్ లెర్నింగ్, విస్తారమైన డేటాను ఉపయోగించడం ద్వారా ఏఐ రోగి సంరక్షణను మెరుగుపరుస్తుంది.. కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తుంది.. వైద్య పరిశోధనను వేగవంతం చేస్తుంది. ప్రాథమికంగా వ్యాధి గుర్తింపు నుంచి అందుకు అవసరమైన చికిత్సల వరకు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో, ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కృత్రిమ మేధ ఒక గేమ్ ఛేంజర్గా నిలుస్తోంది. (నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా..)ప్రాథమికంగా రోగ నిర్ధారణ..ఆరోగ్య సంరక్షణకు ఏఐ సహకారం అందిస్తోంది. సాంప్రదాయ పద్ధతుల కంటే ముందుగానే మరింత కచ్చితంగా వ్యాధులను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ నమూనాలతో ఎక్స్-రే రిపోర్ట్లు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు వంటి మెడికల్ ఇమేజింగ్ వ్యవస్థల ద్వారా మానవుల కంటే మెరుగ్గా వైద్య పరిస్థితులను విశ్లేషిస్తున్నాయి. ఉదాహరణకు, మామోగ్రామ్లలో రొమ్ము క్యాన్సర్ సంకేతాలను గుర్తించడానికి లేదా కంటి స్కాన్లలో డయాబెటిక్ రెటినోపతిని మరింత కచ్చితత్వంతో గుర్తించడానికి ఏఐ వ్యవస్థలు అభివృద్ధి చేశారు.గుండె జబ్బులు, డయాబెటిస్ లేదా అల్జీమర్స్ వంటి పరిస్థితుల అవకాశాలను అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ (ఇహెచ్ఆర్), వేరబుల్స్, జన్యు ప్రొఫైల్స్ నుంచి డేటాను ప్రాసెస్ చేయగలదు. భవిష్యత్తులో తలెత్తె సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా కృత్రిమమేధ త్వరగా వైద్యులకు సమాచారం అందిస్తుంది. ఇది నిత్యం రోగులు వెచ్చించే చికిత్స ఖర్చులను తగ్గిస్తుంది.వైద్య సిఫారసులుఏఐ రోగులకు అనుగుణంగా రిపోర్ట్లను విశ్లేషించి చికిత్సలను సూచిస్తుంది. ఇది జన్యు సమాచారాన్ని కూడా అందిస్తుంది. దాంతో జీవనశైలి, వైద్య చరిత్రలు వంటి లార్జ్ డేటాసెట్లను విశ్లేషించి ఏఐ మెరుగై చికిత్సలను అందించేందుకు సాయం చేస్తుంది. ఉదాహరణకు, ఏఐ అల్గారిథమ్స్ రోగి జన్యు డిజైన్ ఆధారంగా నిర్దిష్ట క్యాన్సర్ చికిత్సలను సిఫారసు చేయగలవు. కొత్త మందులకు రోగులు ఎలా స్పందిస్తారో అంచనా వేయడం ద్వారా కృత్రిమ మేధ ఆధారిత సాధనాలు ఔషధ అభివృద్ధికి సహాయపడతాయి. ఇది క్లినికల్ ట్రయల్స్ను వేగవంతం చేయడనికి తోడ్పడుతుంది. ఇది నిర్దిష్ట జనాభాకు మరింత ప్రభావవంతమైన మందులను రూపొందించడానికి ఫార్మా కంపెనీలకు సహాయపడుతుంది.పరిపాలనా విధుల్లో..హెల్త్కేర్ ప్రొఫెషనల్స్ తరచుగా షెడ్యూల్, బిల్లింగ్, రికార్డుల నిర్వహణ వంటి అడ్మినిస్ట్రేటివ్ విధులపై ఉంతో సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు ఏఐ రంగంలోకి దిగుతోంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) సాధనాలు డాక్టర్-రోగి సంభాషణలను విశ్లేషించగలవు. సంబంధిత వివరాలతో ఎలక్ట్రానిక్ హెల్త్ రిపోర్ట్లను అప్డేట్ చేయగలవు. చాట్బాట్లు, వర్చువల్ అసిస్టెంట్లు రోగులకు డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్స్ను నిర్వహిస్తాయి. సాధారణ రోగి ప్రశ్నలకు సమాధానం కూడా ఇస్తాయి. ఇది ఆసుపత్రులు, క్లినిక్లకు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.టెలిమెడిసిన్, రిమోట్ కేర్..ముఖ్యంగా కొవిడ్-19 మహమ్మారి వంటి సంఘటనల నేపథ్యంలో టెలిమెడిసిన్ వృద్ధిని కృత్రిమమేధ వేగవంతం చేసింది. ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు, యాప్లు, వీడియో కాల్స్ ద్వారా రోగులు నివేదించిన లక్షణాలను విశ్లేషించడం వల్ల రిమోట్గానే సేవలందించింది. కృత్రిమ మేధ ఉపయోగించిన వేరబుల్ పరికరాలు హృదయ స్పందన రేటు లేదా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ట్రాక్ చేస్తాయి. రియల్ టైమ్లోనే అందుకు అనుగుణంగా రోగుల పరిస్థితులపట్ల వైద్యులను అప్రమత్తం చేస్తాయి.పరిశోధనలు వేగవంతంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య ఆవిష్కరణల వేగాన్ని పెంచుతోంది. విస్తారమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని విశ్లేషించడానికి పరిశోధకులు కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. మానవులు కనుగొనడానికి సంవత్సరాలు పట్టే ఔషధ ఆవిష్కరణలో కృత్రిమ మేధ నమూనాలు సమ్మేళనాలు ఎంతో తోడ్పడుతున్నాయి. దీనివల్ల కొత్త మందులను మార్కెట్లోకి తీసుకువచ్చే సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. సంక్లిష్ట వ్యాధులను, వాటి పురోగతిని అర్థం చేసుకోవడానికి ఏఐ సహాయపడుతుంది. ఉదాహరణకు, పార్కిన్సన్ వంటి న్యూరోడిజెనరేటివ్ పరిస్థితులు ఎలా అభివృద్ధి చెందుతాయో ఇది అంచనా వేయగలదు.మానసిక ఆరోగ్యానికి మద్దతుగా..ఏఐ మానసిక ఆరోగ్య సంరక్షణలోనూ పురోగతి సాధిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అనువర్తనాలు, చాట్బాట్లు వ్యక్తులకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)ని అందిస్తున్నాయి. ఈ సాధనాలు ఆందోళన, నిరాశ లేదా ఒత్తిడి సంకేతాలను విశ్లేషిస్తాయి. అవసరమైనప్పుడు చికిత్సకులను సూచిస్తాయి.ఇదీ చదవండి: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ సూచీలుసవాళ్లు-పరిష్కారాలుఆరోగ్య సంరక్షణలో కృత్రిమమేధ ఉంతో తోడ్పాటు అందిస్తున్నప్పటికీ ఈ ఏఐ వ్యవస్థలు సున్నితమైన రోగి సమాచారంపై ఆధారపడతాయి. కాబట్టి డేటా గోప్యత ఒక ప్రధాన ఆందోళనగా ఉంది. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడం, ఈ విభాగంలో చట్టాలకు లోబడి నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం. ఈ రంగంలో ఏఐ నమూనాల విశ్లేషణను జాగ్రత్తగా పర్యవేక్షించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. రోగులు ఏఐ సిఫార్సులపై విశ్వాసం కలిగి ఉండేలా విధానాలు పటిష్టంగా రూపొందించాల్సి ఉంటుంది. దీనికి ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనే దానిపై పారదర్శకత చాలా అవసరం. -
స్మార్ట్ పరుపు.. స్లీప్ ట్రాక్ రింగ్
హెల్త్ ట్రాకర్లు చాలావరకు అన్ని ఆభరణాల రూపాల్లోనూ వచ్చేసినట్టు, అనేక రకాల స్లీప్ ట్రాకర్లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. వేలికి ధరించే ఈ ‘ఔరా రింగ్ జెన్3’ నిద్ర వ్యవధి, నాణ్యతను ట్రాక్ చేస్తుంది. వీటితోపాటు హృదయ స్పందన, శ్వాస విధానాలు, శరీర కదలికలను కూడా పర్యవేక్షించి, ‘స్లీప్ ఫిట్నెస్ స్కోర్’ను ఇస్తుంది. మొబైల్కు అనుసంధానం చేసుకొని, యాప్ సాయంతో ఉపయోగించుకోవచ్చు. ధర రూ. 21,414.స్మార్ట్ పరుపుమంచి నిద్రకు మంచి పరుపు చాలా ముఖ్యం. మెత్తటి పరుపులు నిద్రకు అనుకూలంగా ఉంటాయి. కాని, ఇప్పుడు వచ్చే ఈ స్మార్ట్ పరుపులు మిమ్మల్ని హాయిగా నిద్రపోయేలా చేస్తాయి. ఇవి నిద్ర అలవాట్లు, కదలికలను పర్యవేక్షించడానికి వీటిలో సెన్సార్లు ఉంటాయి. మీరు ఎంత బాగా నిద్రపోతున్నారనే విషయాన్ని ట్రాక్ చేసి, సమాచారం ఇస్తాయి. సౌకర్యవంతంగా ఉండటానికి శరీర ఉష్ణోగ్రతను అనుకూలంగా మార్చి, హాయిగా నిద్రపోయేలా చేస్తాయి. -
నిద్రపుచ్చే రోబో.. దీని రేటెంతో తెలుసా?
కంటి నిండా నిద్రపోతే కలిగే మేలు ఎంతో, కలత నిద్రతో జరిగే కీడు కూడా అంతే! తాజాగా నిద్రలేమి సమస్యతో గుండెజబ్బులు వస్తున్నాయని తేలింది. మిమ్మల్ని హాయిగా నిద్రపోయేలా చేసే స్మార్ట్ టెక్నాలజీతో రూపొందించిన గాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం.నిద్రపుచ్చే రోబోఅమ్మలా మిమ్మల్ని జోకొట్టి, పాటలు పాడి, కథలు చెప్పే రోబోలు చాలానే వచ్చేశాయి. అలాంటి వాటిలో ఒకటే ఈ ‘సోమ్నాక్స్ స్లీప్ రోబో’. ఇది మిమ్మల్ని నిద్రపోయే ముందు విశ్రాంతి తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది.సంగీతం, కథలను వినిపిస్తూ నిద్ర పుచ్చుతుంది. మెత్తగా, వెచ్చగా ఉండే వీటిని పక్కనే పట్టుకొని నిద్రపోతే ఎటువంటి భయం లేకుండా చాలా ధైర్యంగా ఉంటుంది. ఇక ఇందులో వివిధ ప్రకృతి శబ్దాలు, ఆహ్లాదకరమైన సంగీతంతో పాటు శ్వాస వ్యాయామాలు, ధ్యానం చేసేలా వాల్యూమ్ నియంత్రణలు, నైట్లైట్ ఎంపికలు వంటి ఆప్షన్లు ఉన్నాయి. ధర రూ.46,976. -
ఫ్రీగా జియో హాట్స్టార్.. ఆఫర్ ప్లాన్ల పొడిగింపు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫీవర్ దేశాన్ని ఊపేస్తోంది. ఈ ఐపీఎల్-2025 18వ సీజన్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ సీజన్ ఈసారి కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జియో హాట్స్టార్లో ఐపీఎల్ను ఉచితంగా వీక్షించే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను జియో లాంచ్ చేసింది.జియో ప్రకటించిన ఆఫర్ల ప్రకారం.. జియో హాట్స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ను అందించే ప్రత్యేక ప్లాన్లను రీఛార్జ్ చేసుకునేందుకు మార్చి 31 వరకు అవకాశం ఉండేది. అయితే ఈ టోర్నమెంట్ కు లభిస్తున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆఫర్ ను ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ జియో నిర్ణయం తీసుకుంది. జియో హాట్స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ కోసం కొత్త జియో సిమ్ కొనడం లేదా ప్రత్యేక ప్లాన్లతో ఇప్పటికే ఉన్న ప్లాన్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.జియో హాట్స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్తో యూజర్లు 4కే రిజల్యూషన్ లో టీవీ, మొబైల్ రెండింటిలోనూ ఐపీఎల్ను ఉచితంగా వీక్షించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అభిమానులు ఈ సీజన్లోని ప్రతి మ్యాచ్ను ఇంట్లో లేదా ప్రయాణంలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై క్వాలిటీ స్ట్రీమింగ్ను ఆస్వాదించవచ్చు.ఫ్రీ జియో హాట్స్టార్ ప్లాన్లు ఇవే..రూ.100 ప్లాన్: ఇది డేటా యాడ్ఆన్ ప్లాన్. దీంతో 5జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్స్టార్ యాక్సెస్ లభిస్తుంది.రూ.195 ప్లాన్: ఇది జియో క్రికెట్ డేటా ప్యాక్. దీంతో 15జీబీ డేటా, 90 రోజులపాటు జియో హాట్స్టార్ యాక్సెస్ లభిస్తుంది.రూ.949 ప్లాన్: ఇది 84 రోజుల కాంప్రహెన్సివ్ ప్లాన్. దీంతో ప్రతిరోజూ 2జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్, 5జీ ప్రయోజనాలు ఉంటాయి. 84 రోజులపాటు జియో హాట్స్టార్ యాక్సెస్ లభిస్తుంది. అదనంగా జియోక్లౌడ్, ఓటీటీ, ఇతర టెలికమ్ బెనిఫిట్లు ఆనందించవచ్చు. -
ఏఐలో ప్రయివేట్ పెట్టుబడులు గుడ్
న్యూయార్క్: వర్ధమాన దేశాలలో ఏఐ ప్రయివేట్ పెట్టుబడులకు 2023లో చైనా రెండో ర్యాంకును దక్కించుకోగా.. భారత్ టాప్–10గా నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ప్రపంచ దేశాలలో ఏఐపై యూఎస్ అత్యధికంగా 67 బిలియన్ డాలర్ల ప్రయివేట్ పెట్టుబడులు వెచ్చించినట్లు వెల్లడించింది. గ్లోబల్ ఏఐ ఇన్వెస్ట్మెంట్లో ఇది 70 శాతంకాగా.. తద్వారా యూఎస్ టాప్ ర్యాంకులో నిలిచినట్లు తెలియజేసింది. వర్ధమాన దేశాలలో చైనా 7.8 బిలియన్ డాలర్లు, భారత్ 1.4 బిలియన్ డాలర్ల ప్రయివేట్ పెట్టుబడులు కేటాయించినట్లు తెలియజేసింది. యూఎన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్(యూఎన్సీటీఏడీ) విడుదల చేసిన టెక్నాలజీ, ఇన్నోవేషన్ నివేదిక 2025లో ఈ వివరాలు తెలియజేసింది. 2033కల్లా ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్ విలువ 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వెరసి డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్లో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు అభిప్రాయపడింది. అయితే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాలు కొన్ని ఆర్థిక వ్యవస్థలకే పరిమితమవుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా గ్లోబల్ ఆర్అండ్డీ కేటాయింపుల్లో యూఎస్, చైనా 40 శాతం వాటా ఆక్రమిస్తున్నట్లు వెల్లడించింది. -
గిబ్లీ–స్టైల్ ఫొటో.. 5 కోట్ల 10 లక్షల వ్యూస్!
Ghibli & style (గిబ్లీ–స్టైల్) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్గా మారింది. అందరూ తమ ఫొటోలను ఏఐకి ఇచ్చి, దాని ద్వారా గిబ్లీ–స్టైల్ ఫొటోలను పొందుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ అప్డేట్ కారణంగా చాలామంది OpenAI దగ్గరయ్యారు. ఈ ట్రెండ్ ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే, చివరకు OpenAI సీఈవో శామ్ ఆల్ట్మాన్ వచ్చి ‘మీరు కాస్త నిదానించండి. ఇవతల మా ఉద్యోగులు పనిభారంతో చాలా ఒత్తిడికి గురవుతున్నారు’ అని యూజర్లను అభ్యర్థించేంత. మరి బొమ్మలకు ఇంత ప్రచారం కల్పించిన వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆయనే సీటల్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ గ్రాంట్ స్లాటన్.మార్చి 26న స్లాటన్ తన భార్య, కుక్కపిల్లతో కలిసి దిగిన ఫొటోను OpenAI ద్వారా గిబ్లీ–స్టైల్ బొమ్మగా మార్చి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన వెంటనే ఆ ఫొటో వైరల్గా మారింది. అందరూ దాని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తమకూ అలాంటి ఫొటోలు తయారు చేసుకోవాలని ఉందన్నారు. 50 మిలియన్ల మందిపైగా ఆ పోస్ట్ చూశారంటే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గంటల్లోనే ఈ విషయం ట్విట్టర్లో ట్రెండ్గా మారింది. ఇప్పటివరకు 5 కోట్ల 10 లక్షల వ్యూస్ వచ్చాయి.చదవండి: జిబ్లీ ట్రెండ్.. చిక్కులు తెలుసుకోండి!కొందరు ఆ ఫొటోను మెచ్చుకోగా, మరికొందరు దాన్ని విమర్శిస్తూ.. ‘అది చిత్రకారుల గౌరవాన్ని దెబ్బతీస్తోందని’ కామెంట్లు చేశారు. మొత్తానికి ఆ ఫొటో ట్రెండ్ సృష్టించడంతో OpenAI ఆ విషయాన్ని గుర్తించి వెంటనే చర్యలు చేపట్టింది. అందరు యూజర్లు గిబ్లీ–స్టైల్ ఫొటోలు తయారు చేసుకునే అప్డేట్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది. అలా మనం తయారుచేస్తున్న ఫొటోల వెనుక గ్రాంట్ స్లాటన్ చేసిన పని ఉందన్నమాట! tremendous alpha right now in sending your wife photos of yall converted to studio ghibli anime pic.twitter.com/FROszdFSfN— Grant Slatton (@GrantSlatton) March 25, 2025 -
క్షణాల్లో ఫేక్ ఆధార్, పాన్ కార్డులు..
ఏఐ.. అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. దీని వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగిపోయింది. రోజుకో కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వస్తోంది. వీటిలో ప్రముఖమైంది ఓపెన్ఏఐ సంస్థ సృష్టించిన చాట్జీపీటీ. ఇది విడుదలైనప్పటి నుండి వినియోగం ఎంత పెరిగిందో.. గోప్యతా సమస్యలనూ అంతే స్థాయిలో లేవనెత్తుతోంది.ముఖ్యంగా కంటెంట్, చిత్రాల (ఇమేజ్) సృష్టికి సంబంధించి చాట్జీపీటీ సామర్థ్యం కలవరపెడుతోంది. అత్యంత వాస్తవికమైన, ఖచ్చితమైన కంటెంట్ను సృష్టించే కృత్రిమ మేధ సామర్థ్యం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇది నకిలీ పత్రాలను సులభంగా సృష్టించడానికి వీలు కల్పిస్తోంది.సాంప్రదాయకంగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు పత్రాలకు నకిలీవి సృష్టించడం కష్టతరంగా ఉంటుంది. కానీ జీపీటీ -4 దీనిని చాలా సులభతరం చేసింది. సమర్థవంతమైన, ఖచ్చితమైన ప్రాంప్ట్లను ఇవ్వడం ద్వారా మోసగాళ్లు సులభంగా నకిలీ పత్రాలను సృష్టించవచ్చని చాలా మంది ఔత్సాహిక సోషల్ మీడియా యూజర్లు ఇటీవల కనుగొన్నారు.ఇలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్ల చిత్రాలను కొందరు మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. "చాట్జీపీటీ నకిలీ ఆధార్, పాన్ కార్డులను క్షణాల్లో సృష్టిస్తోంది. ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదం. అందుకే ఏఐని కొంతవరకు నియంత్రించాలి" అని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఆధార్, పాన్ కార్డ్ డేటాసెట్లను ఏఐ కంపెనీలకు అమ్మి అటువంటి నమూనాలను తయారు చేస్తోంది ఎవరు? ఫార్మాట్ ను అంత కరెక్ట్ గా అది ఎలా తెలుసుకోగలదు...?" అంటూ మరో యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు. ChatGPT is generating fake Aadhaar and PAN cards instantly, which is a serious security risk. This is why AI should be regulated to a certain extent.@sama @OpenAI pic.twitter.com/4bsKWEkJGr— Yaswanth Sai Palaghat (@yaswanthtweet) April 4, 2025 -
ట్రంప్ టారిఫ్లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రతీకార సుంకాలు ప్రపంచ ఆర్థిక కారిడార్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివిధ దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులు, సేవలకు అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు నిర్ణయించారు. దీని ప్రభావం భారత్లోని అనేక రంగాలపై పడనుంది. ముఖ్యంగా 280 బిలియన్ డాలర్ల విలువైన భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే దీనికి యునైటెడ్ స్టేట్స్ కీలకమైన ఆదాయ వనరు.యూఎస్-ఇండియా టెక్ బంధందశాబ్దాలుగా భారతదేశంలో ఐటీ సేవల రంగం అభివృద్ధి చెందింది. యూఎస్ కంపెనీలతో దాని భాగస్వామ్యం, డిజిటల్ పరివర్తనతో నడిచే ప్రాజెక్టుల స్థిరమైన ప్రవాహం ఇందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. భారత ఐటీ పరిశ్రమకు ఆదాయంలో దాదాపు 50% అమెరికన్ మార్కెట్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో యూస్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు అమెరికా-భారత్ టెక్ బంధానికి విఘాతం కలిగిస్తాయన్న ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఈ టారిఫ్లు భారతీయ ఐటీ సేవలపై ఆధారపడిన యూఎస్ సంస్థలకు ఖర్చులను పెంచబోతున్నాాయి.తక్షణ పరిణామాలు కొత్త సుంకాలు అమెరికాకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. కంపెనీలు బడ్జెట్లను కఠినతరం చేయవలసి వస్తుంది. విచక్షణతో కూడిన సాంకేతిక వ్యయంలో వృద్ధి సాధించిన భారత ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి మందగించవచ్చు. 2026 ఆర్థిక సంవత్సరానికి 6-8 శాతం అత్తెసరు వృద్ధి రేటు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇండస్ట్రీ రెస్పాన్స్..యూఎస్ టారిఫ్లకు ప్రతిస్పందనగా, భారతీయ ఐటీ సంస్థలు తమ భౌగోళిక పరిధి, క్లయింట్ స్థావరాలను వైవిధ్యపరచడంపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇంకా, కాస్ట్ ఆప్టిమైజేషన్ వ్యూహాలు, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఐరోపా, ఆసియా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో అవకాశాలను అన్వేషిస్తూ అమెరికా నుంచి డిమాండ్ క్షీణతను పూడ్చడమే ఈ చర్యల లక్ష్యం.కొత్త అవకాశాలూ..ఈ కల్లోలం భారత ఐటీ కంపెనీలకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది. యూఎస్ తయారీ, ఆటోమేషన్ రంగాలకు అనుగుణంగా సృజనాత్మక డిజిటల్ పరిష్కారాలను అందించడం ద్వారా, ఐటీ పరిశ్రమ అమెరికన్ మార్కెట్లో తన ప్రాముఖ్యతను తిరిగి స్థాపించడానికి మార్గాలను కనుగొనవచ్చు.ముందున్న మార్గం తక్షణ సవాళ్లు గణనీయంగా ఉన్నప్పటికీ, భారత ఐటీ సేవల పరిశ్రమ స్థితిస్థాపకతను తక్కువ అంచనా వేయలేము. గతంలో ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ మార్పుల సమయంలోనూ మన ఐటీ పరిశ్రమ నిలదొక్కుకుంది. అలాగే ప్రస్తుత తుఫానులను కూడా ఎదుర్కోవడమే కాకుండా ఆవిష్కరణ, వైవిధ్యీకరణ ద్వారా మరింత బలంగా ఎదిగే ఈ రంగం సామర్థ్యానికి రాబోయే సంవత్సరాలు పరీక్షగా నిలవనున్నాయి. -
కొత్త రీచార్జ్ ప్లాన్: 2 నెలలు.. 251జీబీ..
ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనింత మంది యూజర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. దాని తాజా ఆఫర్లలో ఒకటైన రూ.251 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ మార్కెట్లో పోటీని రేకెత్తిస్తోంది.పరిమిత కాల ఆఫర్బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.251 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో 251 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. పెద్ద మొత్తంలో కంటెంట్ను స్ట్రీమ్ చేసేవారికి, ముఖ్యంగా ఐపీఎల్ 2025 మ్యాచ్లను బఫరింగ్ లేకుండా ఆస్వాదించాలనుకునే క్రికెట్ అభిమానులకు ఇది అద్భుతమైన ఎంపిక. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్, కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకోవాలనుకునే వినియోగదారులు వెంటనే బీఎస్ఎన్ఎల్ యాప్ లేదా వెట్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి.ఇది చదివారా? సరికొత్త రీచార్జ్ ప్లాన్.. సగం ఖర్చుతోనే ఎక్కువ రోజులు అన్లిమిటెడ్రీచార్జ్ చేసుకునేవారు ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది డేటా-ఓన్లీ ప్లాన్. అంటే ఇందులో అపరిమిత కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. మీకు ఆ సేవలు అవసరమైతే అదనపు రీఛార్జ్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్ల నుండి పెరుగుతున్న డేటా ఖర్చుల నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ డేటా ఎంపిక కోసం చూస్తున్నవారికి ఇది అనువైన ప్లాన్. -
మరో కొత్త ట్రెండ్!.. క్రికెట్ ప్లేయర్ అవతారమెత్తిన శామ్ ఆల్ట్మాన్
జిబ్లీ స్టైల్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న సమయంలో.. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ మరో ట్రెండ్కు శ్రీకారం చుట్టారు. యానిమే స్టైల్ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.శామ్ ఆల్ట్మాన్ యానిమే స్టైల్ ఫోటో గమనించినట్లయితే.. ఆల్ట్మాన్ టీమిండియా జెర్సీ వేసుకుని, చేతిలో బ్యాట్ పట్టుకుని.. కళ్ళు బంతిని చూస్తున్నట్లు ఉండటం చూడవచ్చు. మొత్తానికి శామ్ ఆల్ట్మాన్ క్రికెటర్ అవతారమెత్తాడు. ఫోటో షేర్ చేస్తూ.. ''ప్రాంప్ట్: యానిమే స్టైల్లో క్రికెట్ ఆటగాడిగా శామ్ ఆల్ట్మాన్'' అని పేర్కొన్నాడు.శామ్ ఆల్ట్మాన్ టీమిండియా జెర్సీ వేసుకోవడం చాలామందిని ఆకర్శించింది. మీరు ఇండియా తరపున ఆడుతున్నావా?, అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు భారతీయ వినియోగదారులను ఆకర్శించడానికి శామ్ ప్రయత్నిస్తున్నాడని అన్నారు.ఇదీ చదవండి: మారిన రూల్స్.. ఆ టికెట్తో ట్రైన్ జర్నీ కుదరదు!భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో ఆధిపత్యాన్ని చెలాయిస్తూ.. ప్రపంచాన్ని అధిగమిస్తోందని చెప్పిన కొన్ని గంటల తరువాత ఆల్ట్మాన్ ఈ పోస్ట్ చేశారు. ఫిబ్రవరిలో భారతదేశ పర్యటన సందర్భంగా కూడా ఏఐ రంగంలో ఇండియా ప్రాముఖ్యతను శామ్ హైలెట్ చేశారు.Are you playing for India?— RB - The Peace Coach (@rajeshbmore) April 2, 2025 -
హెచ్ఎండీ నుంచి 2 మ్యూజిక్ ఫోన్లు
న్యూఢిల్లీ: హ్యూమన్ మొబైల్ డివైజెస్ (హెచ్ఎండీ) తాజాగా రెండు మ్యూజిక్ ఆధారిత ఫీచర్ ఫోన్లను (హెచ్ఎండీ 130 మ్యూజిక్, హెచ్ఎండీ 150 మ్యూజిక్) ప్రవేశపెట్టింది. వీటిలో 2500 ఎంఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్ 5.0, టైప్ సీ ఫాస్ట్ చార్జింగ్, యూపీఐ పేమెంట్స్ సామర్థ్యాలు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.హెచ్ఎండీ 130 ధర రూ. 1,899గా, హెచ్ఎండీ 150 ధర రూ. 2,399గా ఉంటుంది. రిటైల్ స్టోర్స్, ఈ–కామర్స్ ప్లాట్ఫాంలతో పాటు తమ వెబ్సైట్లో ఇవి లభిస్తాయని సంస్థ గ్లోబల్ చైర్మన్ జీన్ ఫ్రాంకోయిస్ బారిల్ తెలిపారు. త్వరలోనే ఎంట్రీ స్థాయి 5జీ స్మార్ట్ఫోన్ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.భారత్లో విక్రయిస్తున్న దాదాపు అన్ని ఉత్పత్తులు దేశీయంగా తయారైనవేనని హెచ్ఎండీ ఇండియా వీపీ రవి కున్వర్ పేర్కొన్నారు. తమ గ్లోబల్ పోర్ట్ఫోలియోలో ఆదాయం, వనరులపరంగా భారత్ కీలక మార్కెట్గా ఉంటోందని చెప్పారు. మరోవైపు, ఐపీఎల్ 2025కి సంబంధించి రాజస్థాన్ రాయల్స్తో తమ భాగస్వామ్యాన్ని పొడిగించుకున్నట్లు వివరించారు. -
సూపర్ ఫాస్ట్ 5G.. జియో కొత్త సేవలు
రిలయన్స్ జియో 26 గిగాహెర్ట్జ్ మిల్లీమీటర్ వేవ్ (ఎంఎంవేవ్) బ్యాండ్లో హై-ఫ్రీక్వెన్సీ 5జీ సేవలను ప్రారంభించింది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికే దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్న మిడ్-బ్యాండ్ 3.3 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్లో జియో ప్రస్తుత 5జీ కవరేజీని ఎంఎంవేవ్ రోల్అవుట్ భర్తీ చేస్తుంది.ప్రస్తుత మిడ్-బ్యాండ్ 5జీ బలమైన పనితీరు, విస్తృత కవరేజీని అందిస్తూ వినియోగదారుల అవసరాలను చాలా వరకూ తీరుస్తుండగా, ఎంఎంవేవ్ బ్యాండ్ లేదా 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను ప్రత్యేక ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లు అంటే వాణిజ్య అవసరాల కోసం తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.ఏమిటీ ఎంఎంవేవ్ 5జీ?మిల్లీమీటర్ వేవ్ 5 జి సాంప్రదాయ మొబైల్ నెట్వర్క్ల కంటే చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది. ఇది అల్ట్రా-ఫాస్ట్ డేటా ట్రాన్స్మిషన్, చాలా తక్కువ లేటెన్సీని అనుమతిస్తుంది. అయితే దీని పరిధి పరిమితంగా ఉంటుంది. ఇది భవనాలలోకి చొచ్చుకువెళ్లలేదు. అలాగే విస్తృత ప్రాంతాలను కవర్ చేయలేదు. అందుకే ఎంఎంవేవ్ 5జీకి మరింత దట్టమైన మౌలిక సదుపాయాలు, బేస్ స్టేషన్లు, చిన్న సెల్స్, కచ్చితమైన ప్లేస్మెంట్ అవసరమవుతాయి. దీని వల్ల ఖరీదు కూడా ఎక్కువే.దేశవ్యాప్త వినియోగదారుల రోల్అవుట్ల కంటే నిర్దేశిత ప్రదేశాలల్లో ఏర్పాటుకే ఇవి అనుకూలంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెగ్యులర్ మొబైల్ బ్రౌజింగ్ లేదా వీడియో స్ట్రీమింగ్ చేసేవారికి ఎంఎంవేవ్ నుండి పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, రిమోట్ సర్జరీలు వంటి ఎంటర్ప్రైజ్ సంబంధిత వినియోగానికి మాత్రం అత్యధిక వేగం, తక్కువ జాప్యంతో ఇది సేవలందిస్తుంది.ఎంఎంవేవ్ 5జీ లాంచ్ ఎక్కడెక్కడంటే..జియో ఎంఎంవేవ్ 5జీ ఇప్పుడు దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉంది. వీటిలో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, బిహార్ ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జియో ఎంఎంవేవ్ 5జీ అందుబాటులోకి వచ్చింది. ఇక తూర్పు, ఈశాన్య భారతదేశం విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, త్రిపుర, నాగాలాండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. -
భారత్లోకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు
యాపిల్ అధికారికంగా భారతదేశంలోని వినియోగదారులకు ‘యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ల’ను విడుదల చేసింది. ఐఓఎస్ 18.4, ఐప్యాడ్ఓఎస్ 18.4, మ్యాక్ఓఎస్ సెకోయా 15.4 అప్డేట్ల్లో ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. వీటిని సర్వీసులను మెరుగు పరిచేందుకు జనరేటివ్ ఏఐను వినియోగించినట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు.యాపిల్ వరల్ట్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024లో మొదట ఆవిష్కరించిన యాపిల్ ఇంటెలిజెన్స్ క్రమంగా యూఎస్, యూకే, యూరప్, కెనడాలో విస్తరించింది. కొన్ని కారణాల వల్ల ఈ అప్డేట్ను ఇండియాలో ఇప్పటివరకు విడుదల చేయలేదు. ఇటీవల యాపిల్ ఇంటెలిజెన్స్ను భారత్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో ఓఎస్ను అప్డేట్ చేసుకొని ఈ ఫీచర్లను ఉపయోగించవచ్చని తెలిపింది.ఇండియాలో అందుబాటులో ఉన్న ఫీచర్లురైటింగ్ టూల్స్ఈమెయిల్, సందేశాలు, గమనికలు, థర్ట్ఫార్టీ అప్లికేషన్లలో టెక్ట్స్ను సులువుగా టైప్ చేయడానికి, అందులోని వివరాలను ప్రూఫ్ రీడ్ చేయడానికి వీలు కల్పించారు. ప్రొఫెషనల్ ఈమెయిల్ను రూపొందించడం, సాధారణ సందేశాన్ని సిద్ధం చేయడం, వినియోగదారులకు అనుగుణంగా వాటిని సర్దుబాటు చేయడం, వ్యాకరణం, పదాల ఎంపిక, వాక్య నిర్మాణాన్ని మెరుగుపరచడానికి సూచనలు వంటి చాలా అంశాలను ఈ రైటింగ్ టూల్స్లో పొందుపరిచారు.మెరుగైన ఫొటోలుఫొటోస్ యాప్లో ఏఐను నిక్షిప్తం చేశారు. ఇందులోకి క్లీన్ అప్ టూల్ వినియోగదారులకు ఒరిజినల్ సన్నివేశం పాడవకుండా ఫొటోలోని అనవసర వస్తువులు లేదా వ్యక్తులను తొలగించడానికి అనుమతిస్తుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫొటోలు, వీడియోలను విశ్లేషిస్తుంది. స్టోరీలను క్రియేట్ చేస్తుంది. జెన్మోజీ ద్వారా కావాల్సిన విధంగా ఫొటోల ఎమోజీలను సృష్టించవచ్చు. మరోవైపు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్, థీమ్స్, కాస్ట్యూమ్స్ లేదా యాక్సెసరీల ఆధారంగా ప్రత్యేకమైన చిత్రాలను సృష్టించడానికి వినియోగదారులకు వీలు కల్పిస్తుంది.సిరి మరింత తెలివిగా..సిరి యాపిల్ ఇంటెలిజెన్స్తో మమేకమై యూజర్ల ప్రశ్నలకు ప్రతిస్పందిస్తుంది. జనరేటివ్ ఏఐ సాయంతో ఈమేరకు సమాధానాలు చెబుతుంది. సిరితో వాయిస్ లేదా టెక్ట్స్ ద్వారా సంభాషించవచ్చు. మెరుగైన భాషా అవగాహన కలిగిన సిరి ఏఐ వినియోగదారులు ప్రశ్నలు అడగడంలో తడబడినప్పటికీ సరైన విధంగా సమాధానం అందించేలా రూపొందించారు.విజువల్ ఇంటెలిజెన్స్ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 15 ప్రో మోడళ్లకు ప్రత్యేకంగా ఉన్న ఈ ఫీచర్తో తక్షణ సమాచారాన్ని పొందేందుకు వీలవుతుంది. ఉదాహరణకు ఒక పువ్వును ఫొటో తీసేందుకు కెమెరా ముందుంచితే అది పెరుగుతున్న పరిస్థితులు, సంరక్షణ చిట్కాలను వెల్లడిస్తుంది.ఇదీ చదవండి: అమెరికాపై ప్రతిచర్యలు తప్పవు: చైనాచాట్జీపీటీ ఇంటిగ్రేషన్చాట్ జీపీటీని సిరి, రైటింగ్ టూల్స్లో ఇంటిగ్రేట్ చేయడానికి యాపిల్ ఓపెన్ ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అధునాతన ఏఐ సామర్థ్యాలతో డాక్యుమెంట్లను విశ్లేషించడం లేదా ఫొటోలకు సంబంధించి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటి సంక్లిష్ట ప్రశ్నల కోసం సిరి చాట్ జీపీటీని ట్యాప్ చేయవచ్చు. -
జిబ్లీ స్టైల్ ఫోటోపై ఆనంద్ మహీంద్రా రియాక్షన్
సోషల్ మీడియాలో జిబ్లీ ట్రెండ్ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా అవే ఫోటోలు. తాజాగా ఆనంద మహీంద్రా జిబ్లీ ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై వ్యాపార దిగ్గజం స్పందించారు.బైకుపై ఉన్నట్లు కనిపిస్తున్న ఈ ఫోటో ఆనంద్ మహీంద్రాను ఎంతగానో ఆకట్టుకున్నట్టు ఉంది. దీనిపై స్పందిస్తూ.. ఈ జిబ్లీ ఫోటోలను ఎలా చేయాలో నేర్చుకోవాలి అంటూ.. ఒక స్మైమ్ ఎమోజీ యాడ్ చేశారు. ఇంజినీర్స్ వ్యూ అనే ఎక్స్ యూజర్ ఆనంద్ మహీంద్రా బైకుపై ఉన్నట్లు క్రియేట్ చేసి జిబ్లీ స్టైల్లోకి మార్చాడు. ఇప్పుడిది పర్ఫెక్ట్ అంటూ క్యాప్షన్స్ ఇచ్చాడు.😄Have to learn how to do this Ghibli stuff… https://t.co/XnDJArGyWv— anand mahindra (@anandmahindra) April 3, 2025జిబ్లీ స్టూడియోజిబ్లీ అనేది జపనీస్ యానిమేషన్ స్టూడియో. చేతితో గీచే యానిమేషన్, బ్యాక్గ్రౌండ్స్, భావోద్వేగపూరితమైన కథనాలకు ఇది బాగా పాపులర్ అయింది. కాబట్టి ఈ ఫోటోలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలామంది ఫిదా అయిపోయారు. ఇప్పుడు యూత్ మొత్తం తమ ఫోటోలను జిబ్లీ స్టైల్లోకి మార్చుకుని వినియోగించుకుంటున్నారు.జిబ్లీ వినియోగం ఎక్కువ కావడంతో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ స్పందించారు. జిబ్లీ వినియోగం ఎక్కువగా ఉంది. యూజర్లు ఫోటోలను రూపొందించడంలో కొంత విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే మా సిబ్బందికి కూడా నిద్ర అవసరం కదా అంటూ ట్వీట్ చేశారు. -
ఏజెంటిక్ ఏఐలో భారత్ టాప్!
న్యూఢిల్లీ: కృత్రిమ మేధకు సంబంధించి ఏజెంటిక్ ఏఐ వినియోగంలో భారత్ అగ్రగామిగా ఎదుగుతోంది. దేశీయంగా పలు వ్యాపార సంస్థలు దీనిపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. దాదాపు 80 శాతం సంస్థలు తమ అవసరాల కోసం సొంతంగా ఏఐ ఏజెంట్లను తయారు చేసుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. భారత్లో జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ వినియోగం తీరుతెన్నులపై డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 80 శాతం భారతీయ సంస్థలు అటానమస్ ఏజెంట్లను తయారు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐ విషయంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకోవడాన్ని ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. 70 శాతం కంపెనీలు జెన్ఏఐని ఆటోమేషన్ కోసం ఉపయోగించుకోవడంపై ఆసక్తి కనపర్చగా, సగానికి పైగా కంపెనీలు దాదాపు పది జెన్ఏఐ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి.మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేకుండా, స్వతంత్రంగా నిర్దిష్ట పనులను పూర్తి చేసేందుకు ఉపయోగపడే ఏఐ సిస్టమ్లను అటానమస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తారు. వివిధ పనులు, ప్రక్రియలను ఆటోమేట్ చేసేందుకు వీటిని వినియోగించుకునే విధానాన్ని ఏజెంటిక్ ఏఐగా పరిగణిస్తారు. ఈ సాంకేతికతపై ఆసక్తి పెరుగుతుండటమనేది .. కొత్త ఆవిష్కరణలు, సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు ఏఐని ఉపయోగించుకునే విధానంలో వస్తున్న మార్పులను సూచిస్తోందని నివేదిక పేర్కొంది. సవాళ్లూ ఉన్నాయి.. ఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ కొన్ని సవాళ్లూ ఉంటున్నాయి. తప్పిదాలు (36 శాతం), పక్షపాతం (30 శాతం), డేటా నాణ్యత (30 శాతం)లాంటివి భారీ స్థాయిలో వినియోగానికి సమస్యగా ఉంటున్నాయి. వెంటనే వినియోగించుకోవడానికి వీలుగా ఉండే రెడీమేడ్ ఏఐని ఎక్కువగా కంపెనీలు ఎంచుకుంటూ ఉండటంతో అవసరాలకు తగ్గట్లుగా వాటిలో పెద్దగా మార్పులు, చేర్పులు చేయడానికి అవకాశాలు ఉండటం లేదు. పైపెచ్చు కొన్నాళ్లకు కొరగాకుండా పోయేలా ఉంటున్నాయి. తాము ప్రస్తుతం ఉపయోగిస్తున్న సొల్యూషన్స్ రెండేళ్లలోపే పనికి రాకుండా పోయే అవకాశం ఉందని 28 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ఆశాభావంతో కంపెనీలు.. ఏఐని విస్తృతంగా వినియోగించుకోవడంపై సవాళ్లు నెలకొన్నప్పటికీ వచ్చే రెండేళ్లలో వాటిని అధిగమించగలమని దేశీ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న ఈ రంగంలో వృద్ధి చెందేందుకు, అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత్ మరిన్ని పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ మౌమితా సర్కార్ తెలిపారు. కొన్ని దేశీ సంస్థలు సొంతంగా తయారు చేసుకోవడం కాకుండా ఏఐ సొల్యూషన్స్ను కొనుక్కోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అవసరాలకు అనుగుణంగా మల్చుకోగలిగేలా వాటిని తీర్చిదిద్దాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ పురోగమనంలో ముందంజలో ఉండేందుకు, దీర్ఘకాలంలో అధిక ప్రయోజనాలను పొందేందుకు, పరిస్థితులకు తగ్గట్లుగా మల్చుకోగలిగే ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సర్కార్ చెప్పారు. ఇటు వినియోగం వేగవంతం కావడం అటు దీర్ఘకాలంలో నిలబడగలిగే వ్యూహాలను అమలు చేయడం మధ్య సమతూకం పాటించడమే ఏఐపై పెట్టుబడులకు కీలకమని వివరించారు. -
కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్గా శైలజ జోస్యుల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సర్వీస్ లైన్ గ్లోబల్ హెడ్గా శైలజ జోస్యుల నియమితులయ్యారు. కంపెనీ అంతర్జాతీయ జీసీసీ ప్రణాళికల అమలుకు ఆమె తోడ్పడనున్నారు. గతంలో కాగ్నిజెంట్లో ఆరేళ్లు పని చేసిన శైలజ, కొద్ది విరామం తర్వాత తిరిగొచ్చారు.ఆర్థిక సేవల మార్కెట్లో ఆమెకు అపార అనుభవం ఉందని కాగ్నిజెంట్ అమెరికాస్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు. నిరూపితమైన ట్రాక్ రికార్డుతో, శైలజ నాయకత్వం జీసీసీల ఏర్పాటు, అభివృద్ధిలో తమ సామర్థ్యాన్ని పెంచుతుందని, క్లయింట్లకు గొప్ప విలువను అందిస్తుందని పేర్కొన్నారు.ఈవైలో కొంతకాలం పనిచేసిన తర్వాత జోస్యుల తిరిగి కాగ్నిజెంట్లో చేరారు. 2018 నుంచి 2024 వరకు కాగ్నిజెంట్లో హైదరాబాద్ సెంటర్ హెడ్గా, బీఎఫ్ఎస్ఐ ఆపరేషన్స్ డెలివరీ గ్లోబల్ హెడ్గా సేవలందించారు. దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆమె థామ్సన్ రాయిటర్స్, హెచ్ఎస్బీసీల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. -
టెక్ లేఆఫ్లు.. ఒక్క నెలలో ఎన్ని వేల కోతలో..
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల (layoffs) జోరు తగ్గడం లేదు. గడిచిన మార్చి నెలలో కనీసం 21 కంపెనీలు 8,834 మంది ఉద్యోగులను తొలగించాయని రియల్ టైమ్లో టెక్ లేఆఫ్లను ట్రాక్ చేసే పోర్టల్ లేఆఫ్స్.ఎఫ్వైఐ తెలిపింది. అయితే ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో లేఆఫ్స్ కాస్త తగ్గాయి. ఈ పోర్టల్ ప్రకారం.. ఫిబ్రవరి నెలలో 46 కంపెనీలు 15,994 ఉద్యోగులను తొలగించాయి. ఇది 2025లో ఇప్పటివరకు అదే అత్యధికం.లేఆఫ్స్ కాస్త తగ్గినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగం ఎలా సమూల మార్పులకు లోనవుతోందో ఈ ధోరణి సూచిస్తుంది. మార్చిలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల పేర్లలో హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్, నార్త్వోల్ట్, బ్లాక్, ఓలా ఎలక్ట్రిక్, నియాంటిక్ వంటివి ప్రముఖంగా ఉన్నాయి. అన్ని రకాల పరిశ్రమలు, ప్రాంతాలు, ఉద్యోగ స్థాయిల్లో ఉద్యోగాల కోతలు పెరిగాయి.ఓలాలో ఉద్యోగాల కోతబెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఓలా 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తున్నట్లు మార్చి నెల ప్రారంభంలో వార్తలు వచ్చాయి. పెరుగుతున్న నష్టాలను నియంత్రించుకునే ప్రయత్నంలో భాగంగా కంపెనీ ఈ తొలగింపులను చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రొక్యూర్మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఫుల్ఫిల్మెంట్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పలు విభాగాలపై ఈ ఉద్యోగాల కోత ప్రభావం చూపతోంది. ఐదు నెలల వ్యవధిలో కంపెనీలో ఉద్యోగుల తొలగింపు ఇది రెండోసారి కావడం గమనార్హం. 2024 నవంబర్లో ఓలా సుమారు 500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చింది.భారీ తొలగింపులు ఈ కంపెనీల్లోనే..మార్చిలో హ్యూలెట్ ప్యాకర్డ్ (HP) ఎంటర్ప్రైజెస్ 2,500 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. సర్వర్ వ్యాపారంలో క్షీణిస్తున్న లాభాలను భర్తీ చేసుకోవడానికి తొలగింపులను అమలు చేస్తున్నట్లు ఈ టెక్ దిగ్గజం ప్రకటించింది. మార్చి 6న ట్రేడింగ్ లో కంపెనీ షేరు 19 శాతం క్షీణించింది. ఉద్యోగుల తొలగింపుతో కూడిన వ్యయ తగ్గింపు కార్యక్రమాన్ని వచ్చే 18 నెలల్లో అమలు చేస్తామని, ఇది 2027 ఆర్థిక సంవత్సరం నాటికి స్థూల పొదుపులో 350 మిలియన్ డాలర్లకు దారితీస్తుందని కంపెనీ తెలిపింది. 2024 అక్టోబర్ నాటికి కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం ఇందులో 61,000 మంది ఉద్యోగులు ఉన్నారు.సగానికి పైగా ఉద్యోగుల తొలగింపుస్వీడిష్ బ్యాటరీ తయారీ సంస్థ నార్త్వోల్ట్ దివాలా పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సగానికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. స్వీడన్ లో ఉన్న 4,500 మంది ఉద్యోగుల్లో 2,800 మందిని తొలగించింది. ప్రస్తుతానికి 1,200 మంది ఉద్యోగులను కంపెనీ కొనసాగించనుంది.మరోవైపు, ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సీకి చెందిన ఫిన్టెక్ సంస్థ బ్లాక్ 931 మంది ఉద్యోగులను తొలగించింది. పనితీరు ఆధారిత పునర్నిర్మాణమే ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. టిక్టాక్ మాతృసంస్థ బైట్డాన్స్ విస్తృత పునర్నిర్మాణ ప్రయత్నాల్లో భాగంగా తన డబ్లిన్ కార్యాలయం నుండి 300 ఉద్యోగాలను తగ్గించింది. -
ఎక్స్పీరియన్ హైదరాబాద్ జీఐసీ.. ఇప్పుడు డబుల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డేటా, టెక్నాలజీ దిగ్గజం ఎక్స్పీరియన్, హైదరాబాద్లోని తమ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ని (జీఐసీ) మరింతగా విస్తరించింది. గతానికన్నా రెట్టింపు ఆఫీస్ స్పేస్తో 85,000 చ.అ. విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటైనట్లు సంస్థ సీఈవో (టెక్నాలజీ సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఇన్నోవేషన్) అలెగ్జాండర్ లింట్నర్ తెలిపారు.ప్రపంచ స్థాయి ప్రోడక్టులు రూపొందించేందుకు, నిరంతరాయంగా సర్వీసులు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సెంటర్ ప్రధానంగా ఫిన్టెక్, అనలిటిక్స్, మోసాల నివారణ వంటి అంశాలకు సంబంధించిన కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెడుతుంది.హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ జీఐసీ ఎక్స్పీరియన్ ప్రపంచవ్యాప్త సాంకేతిక కార్యకలాపాలకు కీలకమైన నాడీ కేంద్రంగా రూపుదిద్దుకుంది. క్లౌడ్ మైగ్రేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పురోగతి, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, ప్రాసెస్ ఆటోమేషన్లో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. భారత్లోని బలమైన ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రతిభను ఉపయోగించుకోవడం ద్వారా, ఎక్స్పీరియన్ ప్రపంచవ్యాప్తంగా స్కేలబుల్, డేటా ఆధారిత పరిష్కారాలను అందించే సామర్థ్యాన్ని పెంచుతోంది. -
చాట్జీపీటీ యూజర్లకు గుడ్న్యూస్
ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ఇటీవల చాట్జీపీటీ వినియోగదారుల కోసం కీలక అప్డేట్ను ప్రకటించారు. ఇటీవల చాట్జీపీటీలో వైరల్గా మారిన ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ జీబ్లీ సర్వీసును సబ్స్క్రిప్షన్ తీసుకోని వినియోగదారులకు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.‘చాట్జీపీటీ ఇమేజ్ జనరేషన్ ఇప్పుడు ఉచిత వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చింది’ అని శామ్ ఆల్ట్మన్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు జీపీటీ-4ఓ యూజర్లకు అందుబాటులో ఉండేది. దాన్ని ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోనివారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఏఐ ఇమేజ్ జనరేషన్ను యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేలా ఇటీవల విభిన్న సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ వెల్లువెత్తింది. దాంతో ఈమేరకు ఆల్ట్మన్ స్పందించడంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఆమెకు మూడు చేతులు..!chatgpt image gen now rolled out to all free users!— Sam Altman (@sama) April 1, 202526 నెలల క్రితం చాట్జీపీటీ ప్రారంభించిన సమయంలో అత్యంత క్రేజ్తో క్షణాల్లో ఈ ప్లాట్ఫామ్ వైరల్ అయి ఐదు రోజుల్లో 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకున్నట్లు ఆల్ట్మన్ ఇటీవల చెప్పారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన బీజ్లీ స్టూడియో ద్వారా చాట్జీపీటీ గతంలో కంటే మరింత వైరల్ అయి కేవలం గంటలోనే 10 లక్షల మంది యూజర్ల బేస్ను సంపాదించిందని వివరించారు. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్యను విడుదల చేయలేదు. ఈ కొత్త ఫీచర్ను ఓపెన్ఏఐ గత వారం జీపీటీ-4ఓలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎలాంటి ఎక్స్టర్నల్ టూల్స్ అవసరం లేకుండా నేరుగా చాట్జీపీటీలోనే టెక్ట్స్, యూజర్ ఫొటోలు అప్లోడ్ చేసి బీజ్లీ ఇమేజ్లను పొందవచ్చు. -
ఆమెకు మూడు చేతులు..!
సోషల్ మీడియాలో ఏఐ ఆర్ట్ స్టూడియో జీబ్లీ ట్రెండ్ కొనసాగుతోంది. చాట్జీపీటీ, గ్రోక్ వంటి జనరేటివ్ ఏఐ చాట్బాట్ల ద్వారా టెక్ట్స్ ఇచ్చి ఇమేజ్ను అప్లోడ్ చేస్తే అందుకు తగ్గుట్టుగా గ్రాఫిక్ ఇమేజ్ జనరేట్ అవుతుంది. దాంతో చాలామంది వినియోగదారులు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల ఒక డెంటిస్ట్ తాను అప్లోడ్ చేసిన ఇమేజ్కు చాట్జీపీటీ అందించిన జీబ్లీ గ్రాఫిక్ ఇమేజ్ను చూసి కంగుతిన్నారు.స్నిగ్ధ శర్మ అనే డెంటిస్ట్ చాట్జీపీటీలో తన ఫొటోను అప్లోడ్ చేసి బీజ్లీ ఇమేజ్ జనరేట్ చేయాలనుకున్నారు. తాను గడ్డం కింద చేతులు పెట్టినట్లు పోజిచ్చిన ఫోటోను అప్లోడ్ చేశారు. కానీ చాట్జీపీటీ మాత్రం మూడు చేతులతో యూజర్ ఫోటోను జీబ్లీ వర్షన్లో అందించింది. రెండు చేతులు ఒరిజినల్ ఫొటోలో మాదిరి గడ్డం కింద చేతులు పెట్టుకున్నట్లుగా ఉంటే.. మరో చేతితో ఐస్క్రీమ్ తింటున్నట్లు ఇమేజ్ జనరేట్ అయింది. దీనిపై డెంటిస్ట్ స్పందిస్తూ ‘మీరెప్పుడూ ఇలా చేసి ఉండరు’ అని పోస్ట్ చేశారు. దీన్ని కాస్తా ఆ డెంటిస్ట్ సరదాగా తన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. దాంతో అది వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Snigdha Sharma (@drsnigdhasharma)ఇదీ చదవండి: 60 నిమిషాల్లో కొత్తగా 10 లక్షల మంది యూజర్లుఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. మూడు చేతులున్న తన ఫొటో చూసిన వారు నవరాత్రి ఉత్సవాల్లో కాళిమాతగా కొందరు కామెంట్ చేశారు. ‘ఒకేసారి రెండు మొబైల్ ఫోన్లలో చాటింగ్ చేయొచ్చు’ అని కొందరు తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు. ఏఐ జనరేట్ చేసే ఫోటోలు కేవలం సరదాకోసం మాత్రమేనని గ్రహించాలి. ఏఐ కూడా చాలాసార్లు పొరపాటు చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. అందుకే ఏఐ కంటెంట్పై పూర్తిగా ఆధారపడకుండా మ్యానువల్గా క్రాస్ చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్ఏఐకు చెందిన గ్రోక్ చాట్బాట్, గూగుల్ జెమినీ వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఇలా ఏఐ ఇమేజ్ను సృష్టిస్తున్నాయి. -
60 నిమిషాల్లో కొత్తగా 10 లక్షల మంది యూజర్లు
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ కేవలం ఒకే గంటలో పది లక్షల మంది యూజర్లను సంపాదించినట్లు కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తెలిపారు. కంపెనీ ఇటీవల ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ట్ స్టూడియో జీబ్లీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇలా చాట్జీపీటీకి వినియోగదారులు పెరుగుతున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆల్ట్మన్ తన ఎక్స్(గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.26 నెలల క్రితం చాట్జీపీటీ ప్రారంభించిన సమయంలో అత్యంత క్రేజ్తో క్షణాల్లో ఈ ప్లాట్ఫామ్ వైరల్ అయి ఐదు రోజుల్లో 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకున్నట్లు ఆల్ట్మన్ చెప్పారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన బీజ్లీ స్టూడియో ద్వారా చాట్జీపీటీ గతంలో కంటే మరింత వైరల్ అయి కేవలం గంటలోనే 10 లక్షల మంది యూజర్ల బేస్ను సంపాదించిందని వివరించారు. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్యను విడుదల చేయలేదు. ఈ కొత్త ఫీచర్ను ఓపెన్ఏఐ గత వారం జీపీటీ-4ఓలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎలాంటి ఎక్స్టర్నల్ టూల్స్ అవసరం లేకుండా నేరుగా చాట్జీపీటీలోనే టెక్ట్స్, యూజర్ ఫొటోలు అప్లోడ్ చేసి బీజ్లీ ఇమేజ్లను పొందవచ్చు.ఇదీ చదవండి: భగ్గుమన్న బంగారం.. ఒకేరోజు భారీగా పెరిగిన ధరఇప్పటికే చాలామంది యూజర్లు తమ సెల్ఫీలు, పెంపుడు జంతువులు, కుటుంబ చిత్రాలు.. చాట్జీపీటీలో అప్లోడ్ చేసి జీబ్లీ ఫొటోలను పొందుతున్నారు. వాటిని తమకు చెందిన వివిధ సామాజిక మాధ్యమ ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. జీబ్లీ ఇమేజ్ క్రియేట్ చేసేందుకు అనువైన మౌలిక సదుపాయాలు కావాల్సి ఉంటుంది. దీనివల్ల భారీగా జీపీయూ(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) కరిగిపోతుంది. దీనిపై కొంత ఆందోళనలు వ్యక్తమవుతున్నా కొత్త ఫీచర్ను సులభంగా ఉపయోగించాలని ఆల్ట్మన్ వినియోగదారులను కోరారు. -
మరో ఆరు నెలల్లో దేశీయ తొలి మైక్రోకంట్రోలర్
దేశీయంగా రూపొందిస్తున్న తొలి కమర్షియల్ మైక్రోకంట్రోలర్ను మరో ఆరు నెలల్లో ఆవిష్కరించే అవకాశం ఉందని చెన్నైకి చెందిన మైండ్ గ్రోవ్ టెక్నాలజీస్ సంస్థ సహ వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ టీఆర్ శశ్వత్ తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రోటోటైపింగ్ పూర్తి చేసి టెస్టింగ్ తర్వాత అవసరమైన డిజైన్ మార్పులు చేసినట్లు చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నాటికి చిప్ను లాంచ్ చేయాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు.స్మార్ట్ వాచ్లు, హెడ్ ఫోన్లు, కనెక్టెడ్ హోమ్ డివైజెస్ (స్మార్ట్ లాక్లు, స్పీకర్లు, స్మార్ట్ ఫ్యాన్లు), స్మార్ట్ సిటీ పరికరాలు (విద్యుత్, నీరు, గ్యాస్ మీటర్లు), యాక్సెస్ కంట్రోల్ పరికరాలు (బయోమెట్రిక్స్), థర్మల్ ప్రింటర్లు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలు వంటి పరికరాల్లో ఈ మైక్రోకంట్రోలర్లను ఉపయోగించనున్నారు. ఇది నిర్దిష్ట పరికరాలు లేదా అవి చేసే పనులను నియంత్రించడానికి రూపొందిస్తున్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరిలో క్రెడిట్ కార్డుల జారీ ఎలా ఉందంటే..మైక్రో కంట్రోలర్లు అవసరమయ్యే కంపెనీలతో సంస్థ ఒప్పందాలను ఖరారు చేసిన తర్వాత ఏ మేరకు ఉత్పత్తి చేయాలో నిర్ణయిస్తామని శశ్వత్ తెలిపారు. హై-పెర్ఫార్మెన్స్ ఎడ్జ్ కంప్యూటింగ్, వీడియో ప్రాసెసింగ్ అప్లికేషన్ల కోసం ఈ మైక్రోకంట్రోలర్లను ఉపయోగిస్తున్నారని చెప్పారు. సీసీటీవీ కెమెరాలు, వీడియో రికార్డర్లు, ఎలక్ట్రానిక్ ఆటోమోటివ్ పరికరాలు, స్మార్ట్ టీవీలు.. వంటి డివైజ్ల్లో ఈ చిప్లను వాడబోతున్నట్లు పేర్కొన్నారు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద చిప్ అభివృద్ధికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నుంచి గత ఏడాది సెప్టెంబర్లో అనుమతి లభించిందన్నారు. -
జెన్ ఏఐలో ఇంకా వెనుకబాటే..!
సాక్షి, హైదరాబాద్: ‘జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’(జెన్ ఏఐ) వల్ల కలిగే ప్రయోజనాలను ఉపయోగించుకోవడంలో భారత పరిశ్రమలు, సంస్థలు వెనుకడుగు వేస్తున్నాయి. గ్లోబల్ ఐటీ పవర్హౌస్గా గుర్తింపు పొందడంతో పాటు టెక్నాలజీ ట్రేడ్లో 250 బిలియన్ డాలర్ల పరిశ్రమగా 50 లక్షల మంది ఐటీ నిపుణులతో విరాజిల్లుతున్న భారత ఐటీ పరిశ్రమ ‘జెన్ ఏఐ’కీలక మలుపు వద్ద నిలిచింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి అవుట్ సోర్సింగ్ రంగంలో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్న దశలో ఎల్ఎల్ఎం ఫైన్ ట్యూనింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాల్లో యువతరం (నెక్స్్ట–జనరేషన్) ‘51 శాతం మేర స్కిల్డ్ టాలెంట్ గ్యాప్’ను ఎదుర్కొంటున్నట్టు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో కృత్రిమ మేథ ఏఐ సంబంధిత ఆవిష్కరణల్లో తమ ప్రాధాన్యతలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చుననే ఆందోళన భారత నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ‘జెన్ ఏఐ’వల్ల కలిగే ఉత్పాదకత వృద్ధి ప్రయోజనాలను 83 శాతం డెవలపర్లు గుర్తించినా, వారు దీనిని ఉపయోగిస్తున్నది 39 శాతమేనని, దానిని అనుసరిస్తూ, తమకు తగ్గట్టుగా వర్తింప చేసుకునే నవయువ డెవలపర్లు 31 శాతానికే పరిమితమవుతున్నట్టు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) తాజా అధ్యయనంలో తేలింది.ఈ సవాళ్లను సరైన పద్ధతుల్లో సమాధానాలు వెతుక్కోవడంతో పాటు వాటిని అధిగమించే దిశలో చర్యలు చేపట్టకపోతే గ్లోబల్ ఏఐ లీడర్లుగా ఉన్న యూఎస్ఏ, చైనాల కంటే వెనుకబడే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరించింది. ఈ రంగంలో మధ్యస్థ శక్తులుగా ఎదిగిన దక్షిణ కొరియా, జపాన్, సౌదీ ఆరేబియా కూడా పైస్థాయికి చేరుకునే ప్రయత్నాలు చురుగ్గా సాగిస్తున్న సమయంలో భారత్కు ఇది సవాళ్లతో కూడుకున్నదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులను అధిగమించి కృత నిశ్చయంతో ముందుకు సాగేందుకు అవసరమైన శిక్షణ కొరవడడం, ఈ అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్న క్రమంలో ఎదురవుతున్న భద్రతాపరమైన సందేహాలు, జెన్ ఏఐ వంటి వాటితో ఉద్యోగాలు పోతాయనే భయం తదితర కారణాలతో వివిధ కంపెనీలు ఆచితూచి స్పందిస్తున్నాయని తెలిపింది. మారుతున్న సాంకేతికతలకు తగ్గట్టుగా ఐటీ సర్వీసుల్లో జెన్ ఏఐ వర్తింపును వేగవంతం చేయడం ద్వారా పైచేయి సాధించాలంటే భారత్ వివిధ చర్యలు చేపట్టాలని అధ్యయనం సూచించింది. రెండేళ్లు గడుస్తున్నా వెనుకబాటే.. 2022 చివర్లో ఏఐ, జెన్ ఏఐ అనేవి పరిశ్రమల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టాయి. అయితే రెండేళ్లు గడుస్తున్నా జెన్ ఏఐను అందిపుచ్చుకుని, వర్తింపజేసుకునే విషయంలో అధిక శాతం పరిశ్రమలు వెనుకబడ్డాయి. ఇందుకు కారణం టెక్నాలజీ కాదని మానవ స్వభావం, ప్రవర్తనదేనని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు మొదలు డెవలపర్లలో ఉద్యోగాలు కోల్పోతామనే భయం వెంటాడుతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అధునాతన టూల్స్ను ఉద్యోగులు ఉపయోగించి మంచి ఫలితాలను సాధించేలా చేయడమనేది పెద్ద సవాల్గా మారుతోందని అంటున్నారు. ఈ సాంకేతికతను పూర్తిస్థాయిలో అమలు చేసే విషయంలో కస్టమర్ల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతున్నట్టుగా కంపెనీలు పేర్కొంటున్నాయి. భారత్ ఏం చేయాలంటే.. » వివిధ ప్రావీణ్యాలు, నైపుణ్యాల ఆధారిత శిక్షణా పద్ధతులు (ట్రైనింగ్ మోడళ్లు) చేపట్టాలి. »ఏఐ, జెన్ ఏఐలు ఏ మేరకు ప్రభావితం చేస్తాయన్న దానిపై ‘ప్రొఫిషియెన్సీ బేస్డ్ ట్రైనింగ్ మోడల్స్ తీసుకురావాలి. » మేనేజ్మెంట్, వర్క్ఫోర్స్ తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు ప్రోత్సాహకాలు అందించడంతోపాటు, ఉత్తమ శిక్షణ నిమిత్తం ‘ఎగ్జిక్యూటివ్ స్పాన్షర్షిప్’ చేపట్టాలి.» భద్రతా పరమైన ఆందోళనలు, సమస్యలు అధిగమించేందుకు పరిశ్రమ క్లయింట్లతో దృఢమైన బంధాలు కొనసాగించేలా వ్యూహాలు రూపొందించుకోవాలి.జనరేటివ్ ఏఐ అంటే.. జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) అనేది యూజర్ కోరుకున్న కంటెంట్ లేదా విజ్ఞప్తికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ కోడ్ను రూపొందించుకుంటుంది. ముఖ్యంగా ట్రైనింగ్, ట్యూనింగ్, జనరేషన్ అనే మూడు దశలుగా పనిచేస్తుంది. టెక్ట్స్, ఇమేజేస్, ఆడియోల రూపంలో ఒరిజనల్ కంటెంట్ను తయారు చేయగలదు. అధునాతన మెషీన్ లెర్నింగ్ మోడళ్లు మరి ముఖ్యంగా డీప్ లెరి్నంగ్ మోడళ్లపై ఆధారపడి ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఇది మనుషుల మెదళ్ల మాదిరిగా నేర్చుకోవడం, నిర్ణయం తీసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. -
ఉప్పునీటిలో కరిగిపోయే ప్లాస్టిక్..
సముద్ర జలాల కాలుష్యంపై పోరాటంలో భాగంగా జపాన్ కు చెందిన రికెన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మ్యాటర్ సైన్స్ (సీఈఎంఎస్ ) శాస్త్రవేత్తలు ఉప్పునీటిలో కరిగిపోయే కొత్త రకం ప్లాస్టిక్ను ఆవిష్కరించారు. సముద్ర పర్యావరణ వ్యవస్థలు, ప్రపంచ జీవవైవిధ్యానికి గణనీయమైన ముప్పును కలిగించే మైక్రోప్లాస్టిక్ కాలుష్యం సమస్యను పరిష్కరించడంలో ఈ ఆవిష్కరణ ఆశాదీపంగా కనిపిస్తోంది.రహస్యమంతా సమ్మేళనంలోనే.."సుప్రమోలిక్యులర్ ప్లాస్టిక్" అని పిలిచే ఈ వినూత్న పదార్థం సాధారణంగా ఉపయోగిస్తున్నప్పుడు మన్నికగా ఉంటుంది. అదే సముద్రపు నీటిలో కలిస్తే సురక్షితంగా అందులో విచ్ఛిన్నమవుతుంది. ఈ రహస్యమంతా దాని ఉన్న పదార్థాల సమ్మేళనంలోనే ఉంది. ఇందులో రివర్సబుల్ సాల్ట్ బ్రిడ్జ్లు ఉంటాయి. ఇవి ఉప్పునీటిలో ఉన్న ఎలక్ట్రోలైట్ల ద్వారా అస్థిరతకు గురవుతాయి. ఇది ప్లాస్టిక్ను పర్యావరణ నిరపాయమైన సమ్మేళనాలుగా విచ్ఛిన్నం చేసే రసాయన ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది. దీని అర్థం ఎటువంటి హానికరమైన మైక్రోప్లాస్టిక్ అనేది మిగలకుండా ఈ పదార్థం కరిగిపోవడమే కాకుండా సముద్ర జీవులతో ఆ చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థపైనా ఎలాంటి ప్రభావాన్ని చూపించదు.సాంప్రదాయ ప్లాస్టిక్లకు స్థిరమైన ప్రత్యామ్నాయంసాంప్రదాయ ప్లాస్టిక్ క్షీణించడానికి కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కూడా పట్టవచ్చని మనకు తెలుసు. ప్లాస్టిక్ అవశేషాలు మహాసముద్రాలలో పేరుకుపోతాయి. విస్తారమైన చెత్త పాచెస్ను ఏర్పరుస్తాయి. వాటి క్రమంగా విచ్ఛిన్నం నుండి ఉత్పన్నమయ్యే మైక్రోప్లాస్టిక్స్ ఆహార గొలుసులోకి చొరబడతాయి. ఇది జలచరాలు, మానవుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ కరిగే ప్లాస్టిక్ అభివృద్ధి ఒక స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ప్లాస్టిక్ ఉత్పత్తులపై అధికంగా ఆధారపడే పరిశ్రమలలో విప్లవాత్మకమైన మార్పును కలిగిస్తుంది.ఇటువంటి ఆవిష్కరణ అనువర్తనాలు ప్యాకేజింగ్ మెటీరియల్స్, సింగిల్-యూజ్ వస్తువుల నుండి ఫిషింగ్ వలలు, ఇతర సముద్ర పరికరాల వరకు ఉంటాయి. సంప్రదాయ ప్లాస్టిక్ లను పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంతో భర్తీ చేయడం ద్వారా, పరిశ్రమలు ప్రపంచ స్థాయిలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఈ సరికొత్త ప్లాస్టిక్ అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ప్లాస్టిక్ వినియోగం, విచ్ఛిన్న ప్రక్రియలను పూర్తీగా మార్చేస్తుందని భావిస్తున్నారు. -
వాట్సప్ స్టేటస్కు పాట జోడింపు: ఎలాగో తెలుసా?
వాట్సాప్ మాతృ సంస్థ మెటా.. తన కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ కోసం కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఇప్పడు యూజర్ స్టేటస్ అప్డేట్లకు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.ఇప్పటి వరకు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవాలంటే.. ఒక ఫోటో లేదా లింక్స్ వంటివాటికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఫీచర్ ద్వారా ఫోటోకు మాత్రమే కాకుండా, టెక్స్ట్, వీడియోలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా 24 గంటల వరకు డిస్ప్లే అవుతుంది.వాట్సాప్ స్టేటస్కు మ్యూజిక్ యాడ్ చేసుకోవడం ఎలా?➤వాట్సాప్ ఓపెన్ చేసి.. సాధారణంగా స్టేటస్ పెట్టుకోవడానికి ఉపయోగించే అప్డేట్స్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి.➤తరువాత యాడ్ స్టేటస్ మీద క్లిక్ చేసి.. గ్యాలరీ నుంచి ఫోటో ఎంచుకోవాలి. ➤ఫోటో సెలక్ట్ చేసుకున్న తరువాత.. పైన కనిపించే మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేయగానే.. ఆటోమాటిక్ మ్యూజిక్ లిస్ట్ కనిపిస్తుంది. అవి వద్దనుకుంటే.. మీకు కావలసిన పాటను మీ మ్యూజిక్ లైబ్రరీ నుంచి సెలక్ట్ చేసుకోవాలి ఉంటుంది.➤పాటను ఫోటో కోసమయితే 15 సెకన్లు, వీడియో కోసం 60 సెకన్ల వరకు ఉపయోగించుకోవచ్చు.➤అవసరమైతే మ్యూజిక్ స్టిక్కర్ స్థానాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ సెలక్ట్ చేసుకున్న తరువాత స్టేటస్ అప్లోడ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం -
టీవీని దాటేసిన డిజిటల్ మీడియా
న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటల్ మీడియా జోరుగా వృద్ధి చెందుతోంది. 2024లో సాంప్రదాయ టీవీ మాధ్యమాన్ని కూడా దాటేసి మీడియా, వినోద రంగంలో (ఎంఅండ్ఈ) అతి పెద్ద సెగ్మెంట్గా ఆవిర్భవించింది. మొత్తం ఆదాయాల్లో 32 శాతం వాటాను దక్కించుకుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఈవై నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026లో ప్రకటనలపై ఆదాయాలపరంగా రూ. 1 లక్ష కోట్ల మార్కును అధిగమించే తొలి ఎంఅండ్ఈ విభాగంగా డిజిటల్ మీడియా నిలవనుంది. దేశీ ఎంఅండ్ఈ రంగం వచ్చే మూడేళ్లలో 7 శాతం వృద్ధితో రూ. 3 లక్షల కోట్ల స్థాయిని దాటుతుందని నివేదిక వివరించింది. 2024లో దేశీ ఎంఅండ్ఈ రంగం రూ. 2.5 లక్షల కోట్ల స్థాయికి చేరుకోగా, స్థూల దేశీయోత్పత్తిలో 0.73 శాతం వాటాను దక్కించుకుంది. ‘ఈ పరిశ్రమ 2025లో 7.2 శాతం వృద్ధి చెంది రూ. 2.7 లక్షల కోట్లకు, ఆ తర్వాత 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2027 నాటికి రూ. 3.1 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుంది‘ అని నివేదిక వివరించింది. వినూత్న వ్యాపార విధానాల దన్ను.. ఈ భారీ వృద్ధికి వినూత్న వ్యాపార విధానాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పరిశ్రమలో స్థిరీకరణ తదితర అంశాలు తోడ్పడనున్నాయి. దేశీ ఎంఅండ్ఈ రంగం 2023లో 8.3 శాతం పెరగ్గా గతేడాది 3.3 శాతం (సుమారు రూ. 8,100 కోట్లు) వృద్ధి చెందింది. సబ్్రస్కిప్షన్ ఆదాయాలు తగ్గడం, భారత్కి యానిమేషన్.. వీఎఫ్ఎక్స్ ఔట్సోర్సింగ్ వర్క్ తగ్గిపోవడం వంటి అంశాలు ఇందుకు కారణం. మరోవైపు, ఈ–కామర్స్ వెబ్సైట్లు సహా డిజిటల్ ప్లాట్ఫామ్లపై ప్రకటనలు, ప్రీమియం.. డిజిటల్ అవుటాఫ్ హోమ్ (ఓఓహెచ్) మీడియాకు డిమాండ్ పెరగడంతో పరిశ్రమ అడ్వరై్టజింగ్ ఆదాయాలు 8.1 శాతం పెరిగాయి. డిజిటల్ మీడియా (17 శాతం) లైవ్ ఈవెంట్లు (15 శాతం), ఓఓహెచ్ మీడియా (10 శాతం) ఈ వృద్ధికి దోహదపడ్డాయి. డిజిటల్ వినియోగం వేగవంతమవుతుండటం, వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతుండటం తదితర అంశాల నేపథ్యంలో భారతీయ మీడియా, వినోద రంగం కీలక పరివర్తన దశలో ఉందని ఫిక్కీ చైర్మన్ (మీడియా, ఎంటర్టైన్మెంట్ కమిటీ) కెవిన్ వాజ్ చెప్పారు. దీనితో కంటెంట్ క్రియేటర్లు, ప్రకటనకర్తలు, టెక్నాలజీ ఆవిష్కర్తలకు అపార అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. -
ఏఐని ఎవరెలా వాడుతున్నారు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు ఏఐ వేళ్ల మీద వినియోగిస్తున్నారు. ఏఐ ఇప్పుడు భారతీయ వినియోగదారుల దైనందిన జీవితంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ ‘సర్వీస్ నౌ’ తన తాజా సర్వేలో వివరించింది.షాపింగ్, ఫుడ్..షాపింగ్ సిఫార్సుల కోసం 84 శాతం మంది, ఆహారం, భోజన సూచనల కోసం 82 శాతం మంది, పెట్టుబడి అవకాశాలను పరిశీలించడానికి ప్రతి ఐదుగురిలో నలుగురు (78 శాతం) ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నారని సర్వేలో తేలింది. ఇది ఏఐ ఆధారిత ఆర్థిక నిర్ణయాల వైపు మళ్లడాన్ని సూచిస్తుందని సర్వే తెలిపింది.దేశంలోని 80 శాతం మంది వినియోగదారులు ఇప్పుడు ఫిర్యాదుల స్థితిని తెలుసుకునేందుకు, ఉత్పత్తులపై సలహాల కోసం, స్వయం సహాయక మార్గదర్శకాల కోసం ఏఐ చాట్బాట్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆరుగురిలో ఐదుగురు సందేహాల నివృత్తికి, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను చురుకుగా ఉపయోగిస్తున్నారని సర్వే పేర్కొంది.కస్టమర్ సర్వీస్లో మాత్రం..రోజువారీ జీవితంలో కృత్రిమ మేధ పెరుగుతున్న పాత్ర ఉన్నప్పటికీ, దాని సమయాన్ని ఆదా చేసే సామర్థ్యాలు కస్టమర్ సర్వీస్ నిరీక్షణ సమయాలను తగ్గించడంలో మాత్రం సహాయపడటం లేదు. భారతీయ వినియోగదారులు గత సంవత్సరంలో 15 బిలియన్ గంటలు వేచి ఉన్నారు అని సర్వీస్ నౌ కస్టమర్ ఎక్స్పీరియన్స్ రిపోర్ట్ తెలిపింది. కాగా వ్యాపార సంస్థలు వారానికి సగటున ఒక రోజు కంటే తక్కువ కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి, మిగిలిన నాలుగు రోజులు బృందాల ప్రతిస్పందనలు, పరిపాలనా విధులు, ప్రమోషనల్ ఆఫర్లు, శిక్షణ, విరామాల కోసం వెచ్చిస్తున్నాయని సర్వే చెబుతోంది.వ్యాపార సంస్థలకు భారీ అవకాశాలను అందించే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ గా భారత్ అవతరించబోతోంది. కొత్త ఏఐ టూల్స్ కస్టమర్ సర్వీస్ పై తమ అంచనాలను పెంచాయని 82 శాతం మంది వినియోగదారులు వ్యక్తం చేశారని సర్వీస్ నౌ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుమీత్ మాథుర్ తెలిపారు. 2024 నవంబర్ 1 నుంచి 15 వరకు సుమారు 5,000 మంది వినియోగదారులపై ఈ సర్వే నిర్వహించారు. -
సరికొత్త రీచార్జ్ ప్లాన్.. సగం ఖర్చుతోనే..
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) 54 రోజుల సరికొత్త రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో అందిస్తుంది. ఇదే వ్యాలిడిటీ ప్లాన్ల కోసం ఇతర ప్రైవేటు టెలికం కంపెనీలలో అయ్యే ఖర్చులో దాదాపు సగం ఖర్చుతోనే బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది.బీఎస్ఎన్ఎల్ 54 రోజుల ప్లాన్ కీలక ఫీచర్లుబీఎస్ఎన్ఎల్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్ను ప్రకటించింది. కేవలం రూ.347కే లభిస్తున్న ఈ ప్లాన్ లో అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఉచిత నేషనల్ రోమింగ్ తో సహా భారతదేశంలోని ఏ నంబర్ కు అయినా అపరిమిత వాయిస్ కాల్స్ ను వినియోగదారులు ఆస్వాదించవచ్చు.ఈ ప్లాన్ రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. అంటే 54 రోజుల వ్యాలిడిటీ కాలంలో మొత్తం 108 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీంతోపాటు ఈ ప్లాన్లో బైటీవీకి (BITV) కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఉంది. ఇందులో 400కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు.ఈ కొత్త ప్లాన్తో పాటు తన ప్రతిష్టాత్మక విస్తరణ ప్రయత్నాలతో బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు సవాలు విసురుతోంది. తమ వినియోగదారులకు మరింత విలువ ఆధారిత సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల 75,000 కొత్త 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. రాబోయే వారాల్లో 100,000 కొత్త 4జీ టవర్ల మైలురాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ - వీడియో
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయడం గురించి అందరికీ తెలుసు. ముందుగా ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి.. వ్యాలిడిటీ ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ ఇవ్వాల్సి, రెన్యువల్ కోసం ఫామ్ 9 ఫిల్ చేయాలి. మెడికల్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, రెసిడెన్సీ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.అవసరమైన డాక్యుమెంట్స్ అందించిన తరువాత.. బయోమెట్రిక్, ఫీజు చెల్లింపులు వంటివి చేయాలి. ఇలా అన్నీ పూర్తి చేసిన తరువాత మీ చేతికి రెన్యూవల్ డ్రైవింగ్ లైసెన్స్ అందటానికి కనీసం 15 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. అయితే దుబాయ్లో కేవలం రెండే నిమిషాల్లో రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. ఒక మహిళ ఆర్టీఏ స్మార్ట్ కియోస్క్ ద్వారా రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డును పొందటం చూడవచ్చు. మహిళ మెషీన్ దగ్గరకు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి అవసరమైన ఆప్షన్స్ ఎంచుకుని.. కేవలం నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డును పొందుతుంది. ఇది చూడటానికి ఓ ఏటీఎం మెషీన్స్ మాదిరిగా ఉంటుంది. ఇలాంటి మెషీన్స్ దుబాయ్లో అక్కడక్కడా కనిపిస్తాయి.ఇదీ చదవండి: బ్రిటన్ వీడనున్న స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్?: కారణం ఇదే..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తూ.. ఇలాంటిది మనదేశంలో కూడా ఉండుంటే బాగుంటుందని అంటున్నారు. రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ కోడం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఇవి ఉపయోగపడతాయని చెబుతున్నారు.Compare this to the process of renewal of driving licence in India. pic.twitter.com/Xs2eXygI99— Tushar (@Tusharufo2) March 27, 2025 -
వాట్సప్ మేసేజ్లతో రూ.90 కోట్లు రికవరీ
పన్ను ఎగవేతదారులు, ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఎన్క్రిప్టెడ్ సందేశాలు, ఈమెయిల్స్ను యాక్సెస్ చేసే వెసులుబాటును పన్ను అధికారులకు కల్పించే ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. అక్రమ సిండికేట్ నుంచి రూ.90 కోట్లకు పైగా క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వాట్సాప్ సందేశాలను డీక్రిప్ట్ చేయడం ఎంతో తోడ్పడిందని గుర్తు చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లులోని నిబంధనలపై పార్లమెంట్లో ఆమె మాట్లాడారు.ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల దుర్వినియోగం పెరుగుతోందని, మనీలాండరింగ్, పన్ను ఎగవేత వంటి కార్యకలాపాల కోసం నేరగాళ్లు వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘1961 ఆదాయపు పన్ను చట్టంలో ఫిజికల్ బుక్స్ ఆఫ్ అకౌంట్, లెడ్జర్లు, మాన్యువల్ రికార్డుల గురించే ప్రస్తావించారు. డిజిటల్ రికార్డులను ప్రస్తావించలేదు. ఫిజికల్ లెడ్జర్లను చూపించినప్పటికీ డిజిటల్ రికార్డులు ఎందుకు అవసరమని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే ఇది ఎంతో అవసరం. ఈ రెండింటి మధ్య లోటును పూడ్చడమే కొత్త బిల్లు లక్ష్యం’ అని ఆమె పార్లమెంటులో అన్నారు.‘ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు, మొబైల్ ఫోన్లలోని వివరాలు స్కాన్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను అధికారులు ఇప్పటికే రూ.250 కోట్లు లెక్కల్లోకి రాని నిధులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రూ.200 కోట్ల బోగస్ బిల్లులకు పాల్పడిన సిండికేట్లు, తప్పుడు పత్రాలతో భూముల అమ్మకంలో మూలధన లాభాలను తారుమారు చేసిన ఉదంతాలున్నాయి. ఇవి వాట్సాప్ ద్వారా బట్టబయలయ్యాయి. లెక్కల్లోకి రాని లావాదేవీలను ట్రాక్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ హిస్టరీలను కూడా ఉపయోగించాం. బినామీ ఆస్తులను గుర్తించడానికి ఇన్స్టాగ్రామ్లోని ప్రొఫైల్స్ సహాయపడ్డాయి’ అని ఆమె అన్నారు. అయితే ఎన్క్రిప్టెడ్ సందేశాలు ఎలా యాక్సెస్ అయ్యాయో మాత్రం ఆమె వివరించలేదు.ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల(300 కోట్ల) మంది యూజర్లు ఉన్నారని చెప్పుకునే మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కేంద్ర ప్రతిపాదిత చట్టంపై స్పందించలేదు. మెటా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సందేశాలను షేర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. అంటే మీరు కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తికి, మీకు మధ్య వ్యక్తిగత సందేశాలను షేర్ చేస్తుంది. దీన్ని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎవరూ చదవలేరు, వినలేరు, షేర్ చేయలేరని కంపెనీ గతంలో తెలిపింది. కానీ ఈ డేటాను ప్రభుత్వం ఎలా ఉపయోగించిందో తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: కోహ్లీ లేకపోతే.. టీసీఎస్ లేదువాట్సాప్, భారత ప్రభుత్వం మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 కింద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మెసేజ్ ముందుగా షేర్ చేసిన మూలకర్తను గుర్తించాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఆదేశాలను సవాలు చేస్తూ వాట్సాప్ 2021లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దావా వేసింది. తన ఎన్క్రిప్షన్ ప్రమాణాల విషయంలో రాజీపడవలసి వస్తే భారత మార్కెట్ నుంచి నిష్క్రమించేందుకై వెనుకాడబోమని 2024 ఏప్రిల్లో వాట్సప్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.2222233334223311233 -
2030.. కండక్టర్ ఉద్యోగానికీ ఏఐ!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక ఇటీవల విడుదల చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్–2025’ఉద్యోగాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది. కిందిస్థాయి ఉద్యోగాల్లోకి సైతం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొరబడుతోందని, ఫలితంగా 2030 నాటికి కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయని, మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 2030 నాటికి బస్ కండక్టర్ వంటి ఉద్యోగానికి కూడా ఏఐ టెక్నాలజీ తెలుసుకుని ఉండటం అవసరమని, ఆఖరుకు వ్యవసాయం చేసే వాళ్ళకూ ఏఐ టెక్నాలజీ అవసరం ఏర్పడుతుందని ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ (ఉద్యోగాల భవిష్యత్తు) రిపోర్టు పేర్కొంది. జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచాలని, విద్యార్థుల్లో ఆ మేరకు నైపుణ్యం పెంచాలని సూచించింది. 2023లో సేకరించిన లెక్కల ప్రకారం భారత్లో 4.16 లక్షల మంది మాత్రమే ఏఐ నిపుణులు ఉన్నారు. కాగా 2025 చివరి నాటికి 6.29 లక్షలు 2026 నాటికి 10 లక్షల ఏఐ నిపుణులు అవసరమని పేర్కొంది. ఈ మేరకు కంప్యూటర్ కోర్సుల్లో సిలబస్ను మార్చాలని ఏఐ ఆధారిత పరిశ్రమల తోడ్పాటుతో సిలబస్కు రూపకల్పన చేయాలని సూచిస్తోంది. అంతర్జాతీయ యూనివర్శిటీలు ఇప్పటికే ఈ బాటలో పయనిస్తున్నాయి. అమెరికా స్కూల్ స్థాయి నుంచే ఏఐపై బోధన చేస్తోంది. భారత్ కూడా ఈ దిశగా పయనించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. -
ఖరీదైన ఫోన్పై కళ్లు చెదిరే డిస్కౌంట్!
ఖరీదైన ప్రీమియం ఫోన్ తక్కువ ధరకు కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్. ప్రీమియం ఫోన్లలో ఒకటైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ (Samsung Galaxy S23 Ultra 5G) భారీ డిస్కౌంట్ లభిస్తోంది. గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో రూ .42,000 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ.1,29,999 ధరకు లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్, ఎస్ పెన్ సపోర్ట్, పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ఫీచర్లను అందిస్తుంది.కాబట్టి తక్కువ ఖర్చుతో ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకుంటే, ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ డీల్ను అందుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ అసలు ధర రూ .1,19,900 కాగా ప్రస్తుతం రూ .37,190 భారీ తగ్గింపుతో రూ .81,990 కు లిస్ట్ అయింది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా వినియోగదారులు 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీంతో రూ .77,890 కంటే తక్కువకే ఖరీదైన ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ.2,883 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. పాత ఫోన్ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ స్పెసిఫికేషన్లుశాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రాలో 6.8 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,750 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉన్నాయి. అడ్రినో 740 జీపీయూతో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ పై పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 అప్ డేట్ కు అర్హత సాధించింది. ఐపీ 68-రేటెడ్ హ్యాండ్ సెట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 45 వాట్ వైర్డ్, 15 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది.ఇక కెమరా విషయానికి వస్తే.. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 10 మెగాపిక్సెల్ 3ఎక్స్ టెలీఫోటో, 10 మెగాపిక్సెల్ 10ఎక్స్ పెరిస్కోప్ జూమ్, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, అల్ట్రా-వైడ్బ్యాండ్, యూసెస్బీ 3.2 జెన్ 1 పోర్ట్ ఉన్నాయి. -
వాళ్లకు మాత్రం ఏఐ ముప్పు ఉండదు.. బిల్ గేట్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశ్రమలను వేగంగా మార్చివేసింది. ముఖ్యంగా 2022లో చాట్జీపీటీ వచ్చినప్పటి నుంచి దీని విస్తృతి మరింతగా పెరిగింది. చాలా మంది తమ రోజువారీ జీవితంలో, వృత్తుల్లో జెమినీ, కోపైలట్, డీప్సీక్ వంటి చాట్బాట్లను వినియోగిస్తున్నారు. దీని ప్రయోజనాలు ఎలా ఉన్నా సరే.. మానవ ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగేసుకుంటుందన్న ఆందోళనలు మాత్రం ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఈ సరికొత్త సాంకేతిక విప్లవం నడుమ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. కనీసం కొన్ని రోజులైనా కృత్రిమ మేధ ఆధారిత ఆటోమేషన్ నుండి సురక్షితంగా ఉండటానికి అవకాశం ఉన్న వృత్తులపై తన భావాలను పంచుకున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో గేట్స్ ప్రత్యేకమైన మానవ నైపుణ్యాలు అవసరమయ్యే మూడు కీలక రంగాలను హైలైట్ చేశారు. అవి కోడింగ్, ఎనర్జీ మేనేజ్మెంట్, బయాలజీ.కోడర్లు.. వీళ్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్ట్స్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించే నిపుణులు తమ ఉద్యోగాలను నిలుపుకునే అవకాశం ఉంది. ఏఐ కోడ్ జనరేట్ చేయడం, కొన్ని ప్రోగ్రామింగ్ పనులను ఆటోమేట్ చేయడంలో పురోగతి సాధించినప్పటికీ, సంక్లిష్టమైన సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడానికి అవసరమైన ఖచ్చితత్వం, లాజిక్, సమస్య పరిష్కార నైపుణ్యాలు దీనికి లేవు. డీబగ్గింగ్ చేయడానికి, రిఫైనింగ్ చేయడానికి, మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మెరుగుపరచడానికి కూడా హ్యూమన్ ప్రోగ్రామర్లు అనివార్యమని గేట్స్ అభిప్రాయపడ్డారు.ఎనర్జీ ఎక్స్పర్ట్స్శిలాజ ఇంధనాలు, అణుశక్తి, పునరుత్పాదక ఇంధన వనరులతో కూడిన ప్రపంచ ఇంధన రంగం అత్యంత సంక్లిష్టమైనది. కృత్రిమ మేధస్సు.. సామర్థ్యాన్ని మెరుగుపరచడం, డిమాండ్ను అంచనా వేయడం, మౌలిక సదుపాయాలను నిర్వహించడంలో సహాయపడుతుంది. అయితే ఇది ఇంధన పరిశ్రమను నిర్వచించే సంక్లిష్టమైన నియంత్రణ భూభాగాలు, భౌగోళిక రాజకీయ సవాళ్లు, అనూహ్య మార్కెట్ హెచ్చుతగ్గులను స్వతంత్రంగా నిర్వహించలేదు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో, సుస్థిర పరిష్కారాలను అమలు చేయడంలో, విద్యుత్ అంతరాయాలు లేదా వనరుల కొరత వంటి సంక్షోభాలకు ప్రతిస్పందించడంలో మానవ నైపుణ్యం కీలకమని గేట్స్ నొక్కి చెప్పారు.జీవశాస్త్రవేత్తలుజీవశాస్త్రంలో.. ముఖ్యంగా వైద్య పరిశోధన, శాస్త్రీయ ఆవిష్కరణలో మానవ అంతర్దృష్టి, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన అవసరం. కృత్రిమ మేధ పెద్ద మొత్తంలో డేటాను ప్రాసెస్ చేయడంలో, నమూనాలను గుర్తించడంలో రాణిస్తున్నప్పటికీ, ఇది అద్భుతమైన పరికల్పనలను రూపొందించే లేదా పరిశోధనలో సహజమైన పురోగతిని సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. వ్యాధుల నిర్ధారణకు, జన్యుక్రమాలను విశ్లేషించడానికి, ఔషధ ఆవిష్కరణకు మాత్రం ఏఐ సహాయపడుతుందని గేట్స్ పేర్కొన్నారు. -
ఇన్ఫోసిస్లో మరికొంత మందికి లేఆఫ్.. ‘కొత్త’ ఆఫర్
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరికొంత మందిని తొలగించింది. అంతర్గత మదింపులో ఉత్తీర్ణలు కాలేదంటూ ఇన్ఫోసిస్ మార్చి 26న తమ మైసూరు క్యాంపస్ నుండి 30-45 మంది ట్రైనీలను తొలగించినట్లు వార్తా సంస్థ మనీకంట్రోల్ నివేదిక తెలిపింది. అయితే తొలగింపునకు గురైన ట్రైనీలకు మరో ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.ఐటీ కంపెనీలో ఉద్యోగాలు కోల్పోయిన ట్రైనీలకు ప్రత్యామ్నాయ కెరీర్ మార్గంగా ఇన్ఫోసిస్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) లో ఉద్యోగాల కోసం 12 వారాల శిక్షణను అందించేందుకు ముందకు వచ్చింది. ఇదే మైసూరు క్యాంపస్కు చెందిన సుమారు 350 మంది ట్రైనీలను తొలగించిన రెండు నెలల తర్వాత ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బీపీఎం కోర్సును ఎంచుకున్న వారికి ఈ శిక్షణను స్పాన్సర్ చేస్తామని ఇన్ఫోసిస్ ప్రకటించింది."మీ ఫైనల్ అసెస్మెంట్ ఫలితాలను వెల్లడిస్తున్నాం. అదనపు ప్రిపరేషన్ సమయం, సందేహ నివృత్తి సెషన్లు, అనేక మాక్ అసెస్మెంట్ అవకాశాలు ఇచ్చినప్పటికీ మీరు 'ఫౌండేషన్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్'లో అర్హత ప్రమాణాలను చేరుకోలేకపోయారు" అని ట్రైనీలకు పంపిన మెయిల్స్లో కంపెనీ పేర్కొంది.ఎక్స్గ్రేషియాగా నెల జీతంతొలగించిన ట్రైనీలకు ఇన్ఫోసిస్ ఒక నెల జీతాన్ని ఎక్స్గ్రేషియాగా చెల్లిస్తోంది. దీంతో పాటు రిలీవింగ్ లెటర్లను అందిస్తోంది. ఇక బీపీఎం మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడని వారికి మైసూరు నుంచి బెంగళూరుకు రవాణా సౌకర్యం కల్పించి, వారి స్వగ్రామానికి ప్రామాణిక ప్రయాణ భత్యం అందిస్తుంది. అవసరమైతే, ట్రైనీలు బయలుదేరే తేదీ వరకు మైసూరులోని ఎంప్లాయీ కేర్ సెంటర్లో ఉండవచ్చు. క్యాంపస్ నుంచి వెళ్లాలనుకునే ట్రైనీలు మార్చి 27లోగా తమ ప్రయాణ, వసతి ప్రాధాన్యతలను సమర్పించాలని ఇన్ఫోసిస్ కోరింది.ఇన్ఫోసిస్కు క్లీన్ చిట్మరోవైపు ట్రైనీల తొలగింపునకు సంబంధించి ఇన్ఫోసిస్ ఎలాంటి కార్మిక చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని కర్ణాటక కార్మిక శాఖ డాక్యుమెంటరీ సాక్ష్యాల ఆధారంగా క్లీన్ చిట్ ఇచ్చింది. ‘వారంతా కేవలం ట్రైనీలు మాత్రమే. కొందరు మూడు నెలల శిక్షణ మాత్రమే తీసుకున్నారు. దీనిని లేఆఫ్ అనలేం కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఈ కార్మిక చట్టాలు వర్తించవు. రెగ్యులర్ ఉద్యోగాలకు మాత్రమే లేఆఫ్ వర్తిస్తుంది. ఇక్కడ యజమాన్యం-ఉద్యోగి సంబంధం అస్సలు ఉండదు. వారంతా ఉద్యోగులు కాదు, అప్రెంటిస్షిప్ ట్రైనీలు' అని అధికారుల నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం. -
మూడో కంటికి చిక్కని ‘సిగ్నల్’.. ఈ యాప్ గురించి తెలుసా?
వాట్సాప్ మాదిరిగానే.. అమెరికాలో 'సిగ్నల్' (Signal) అనే మెసేజింగ్ యాప్ను చాటింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. తాజాగా ఈ యాప్ నుంచే యెమెన్ వైమానిక దాడులకు సంబంధించిన ప్రణాళికలు బయటకు పొక్కాయి. ఈ నేపథ్యంలో ఈ యాప్ కోసం ఆరా తీసేవాళ్లు పెరిగిపోయారు. ఇంతకీ ఈ యాప్ ఏమిటి?, దీనిని ఎవరు ప్రారంభించారు?.. అమెరికా అధ్యక్ష భవనం సిబ్బంది ఈ యాప్ను వినియోగించడానికి ఏమైనా ప్రత్యేకత ఉందా?.. వివరాల్లోకి వెళ్తే..సిగ్నల్ అనేది మెసేజింగ్ యాప్. దీనిని 'మోక్సీ మార్లిన్స్పైక్' (Moxie Marlinspike) రూపొందించారు. సిగ్నల్ యాప్ ద్వారా టెక్స్ట్ మెసేజస్, ఫోటోలు, రికార్డ్స్ వంటివి షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ తరహాలోనే మెసేజ్ పంపిన వారు, రిసీవ్ సీగేసుకున్న వారు మాత్రమే సందేశాలను చూడగలరు. ఒక నిర్ణీత సమయం తరువాత సమాచారం కనిపించకుండా చేసే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. మూడో మనిషి చూడటానికి అవకాశం లేదు. అయితే.. సిగ్నల్కు వాట్సాప్ కంటే అత్యంత సురక్షితమైనదనే ప్రచారం ఉంది. సురక్షితమైన యాప్ కావడంవల్లే అమెరికాలోని ఫెడరల్ అధికారులు, వైట్హౌజ్ సిబ్బంది దీనిని ఉపయోగిస్తుంటారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. ఆ బైకులు, మద్యం ధరలు తగ్గుతాయిసిగ్నల్ మెసేజింగ్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా.. ఏడు కోట్లమంది ఉపయోగిస్తున్నట్లు(ఇప్పటిదాకా డౌన్లోడ్లు) గణాంకాలు చెబుతున్నాయి. దీనిని ఎక్కువ మంది ఉపయోగించడానికి ప్రధాన కారణం.. ఇది సాధారణ వాట్సాప్, మెటా మెసెంజర్ కంటే కూడా సురక్షితమైనది కావడమనే ముద్రపడిపోవడం. లీక్ ఇలా.. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులపై.. దాడికి సంబంధించిన వ్యూహాలను రహస్యంగా ‘సిగ్నల్’ యాప్ గ్రూప్చాట్లో చర్చిస్తూ 'జెఫ్రీ గోల్డ్బర్గ్' అనే సీనియర్ పాత్రికేయుడిని ఆ గ్రూప్లో చేర్చుకున్నారు. ఆ తరువాత కీలక సమాచారం లీక్ అయ్యి రచ్చ రాజేసింది. -
ఉపగ్రహాల్లో అక్కడికక్కడే విద్యుదుత్పత్తి!
సాక్షి, హైదరాబాద్: ఉపగ్రహాలతో శాటిలైట్ టీవీలు మొదలుకొని ఖనిజాల గుర్తింపు వరకూ అనేక ప్రయోజనాలున్నాయి. అయితే భూమికి దూరంగా కక్ష్యల్లో తిరిగే ఉపగ్రహాలు పని చేయాలంటే విద్యుత్తు కావాలి. ఇప్పటివరకూ బరువైన సోలార్ ప్యానెల్స్ లేదా బ్యాటరీలతో ఈ విద్యుత్తు తయారీ జరుగుతోంది. ఇలా కాకుండా... రేడియో ధార్మిక పదార్థాలు వెలువరించే వేడినే విద్యుత్తుగా మార్చగలిగతే? ఎన్నో ప్రయోజనాలుంటాయి. హైదరాబాదీ స్టార్టప్ కంపెనీ హైలెనర్ టెక్నాలజీస్ అచ్చంగా ఇదే పనిలో ఉందిప్పుడు. ఈ దిశగా టేక్మీ2స్పేస్ అనే కంపెనీతో ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.వేడిని విద్యుత్తుగా మార్చేందుకు ఇప్పటికే థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ.. వీటితో అధిక మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేయడం కష్ట సాధ్యం. మరోవైపు హైలెనర్ టెక్నాలజీస్ సంస్థ ప్రపంచంలో మొదటిసారి కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా కాలుష్యం ఏమాత్రం లేని విద్యుత్తును ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే. టేక్మీ2 స్పేస్ భూ కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు కంపెనీలిప్పుడు చేతులు కలిపాయి. ఉపగ్రహాలకు విద్యుత్తును అందించేందుకు హైలెనర్ అభివృద్ధి చేస్తున్న వ్యవస్థలను పరీక్షించేందుకు నిర్ణయించాయి. వేడిని ఉపయోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేయడం.. ఉపగ్రహాల్లోని కంప్యూటర్లను నడిపించడం ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం.‘‘లెనర్ టెక్నాలజీ అంతరిక్షంలోనూ పనిచేస్తుందని నిరూపించడం చాలా కీలకం. టేక్మీ2స్పేస్ నైపుణ్యం, ప్లాట్ఫామ్ల సాయంతో ఈ విషయాన్ని నిరూపించేందుకు ఎంతో ఉపయోగపడతాయి’’ అని హైలెనర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈవో సిద్ధార్థ దురైరాజన్ తెలిపారు. ఈ ప్రయోగాలు విజయవంతమైతే.. భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాల్లోనూ అక్కడక్కడే విద్యుత్తును ఉత్పత్తి చేసుకోగల అవకాశం ఏర్పడుతుంది. అది కూడా వృథా అవుతున్న వేడి సాయంతో!!ఇదీ చదవండి: మనదే విని‘యోగం’!‘‘ఉపగ్రహాల్లో వేడిని తగ్గించడంతోపాటు విద్యుత్తును ఉత్పత్తి చేయడం వల్ల ఎన్నో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. హైలెనర్ టెక్నాలజీస్ ఉత్పత్తులు ఈ ఘనత సాధిస్తే అతితక్కువ స్థలంలో దీర్ఘకాలం పనిచేయగల ఒక ఇంధన వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది’’ అని టేక్మీ2 స్పేస్ వ్యవస్థాపకుడు రోనక్ కుమార్ సామంత్రాయ్ తెలిపారు. సౌర విద్యుత్తు, బరువైన బ్యాటరీల వాడకాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని వివరించారు. -
చెప్తే మాట వింటుంది: ముందుకు వెళ్తుంది (వీడియో)
స్కూటర్ అంటే ఎలా ఉంటుంది అని ఎవరినైనా అడిగితే.. స్టార్ట్ చేస్తే స్టార్ అవుతుంది, మన పని అయిపోయిన తరువాత స్టాండ్ వేసి పార్కింగ్ చేసేయొచ్చు.. మనమే దానిని పూర్తిగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా (రైడర్ అవసరం లేని) ఉండేలా చైనీస్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం 'షియోమీ' (Xiaomi) ఓ స్కూటర్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.షియోమీ కంపెనీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరి సహాయం లేకుండా.. తనకు తానుగానే ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఆటోమాటిక్. సాధారణ రోడ్ల మీద ముందుకు సాగడం మాత్రమే కాకుండా.. మెట్లపై నుంచి కూడా స్వయంగా కిందికి దిగుతుంది. పూర్తిగా రైడింగ్ చేయడం రానివాళ్లు కూడా దీనిపై చక్కర్లు కొట్టేయొచ్చు.ఇదీ చదవండి: ఈ పాలసీతో వాహనాల ధరలు తగ్గుతాయి: నితిన్ గడ్కరీరైడింగ్ పూర్తయిన తరువాత తనకు తానుగానే పార్కింగ్ అవుతుంది. సేడ్ స్టాండ్ కూడా అదే హ్యాండిల్ చేసుకుంటుంది. స్టాండ్ వేయకుండా స్కూటర్ మీద కూర్చుంటే కూడా.. కిందికి పడే అవకాశం లేదు. ఇది వాయిస్ కమాండ్ కలిగి ఉంటుంది. కాబట్టి మన ఆదేశాలను కూడా పాటిస్తుంది. మొత్తం మీద షియోమీ కంపెనీ తీసుకొచ్చిన ఈ అద్భుతమైన స్కూటర్ భవిష్యత్తును మారుస్తుందేమో.. వేచి చూడాలి.Self Driving Scooter - Xiaomi pic.twitter.com/z0P6cY1vdj— Pankaj Parekh (@DhanValue) March 26, 2025 -
మస్క్ జాబ్ ఆఫర్.. వేతనం ఎంతంటే..
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ఏఐ చాట్బాట్ గ్రోక్ అభివృద్ధికి, దాని విశ్వసనీయతను పెంచడానికి ప్రతిభావంతులైన బ్యాకెండ్ ఇంజినీర్ల కోసం చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు వివిధ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, ఉద్యోగ పోస్టింగ్ వివరాలు ఓపెన్ఎఐ చాట్జీపీటీ, గూగుల్ జెమినితో పోటీపడటానికి మెరుగైన కృత్రిమ మేధను నిర్మించాలని ఎక్స్ చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది.ఎక్స్ఏఐ సహ వ్యవస్థాపకుడు, టెక్ ఇంజినీర్ ఇగోర్ బాబుష్కిన్ ఇటీవల షేర్ చేసిన ఒక పోస్ట్లో ‘గ్రోక్ పనితీరును మెరుగ్గా, మరింత విశ్వసించేదిగా మార్చేందుకు సహాయపడటానికి అద్భుతమైన బ్యాకెండ్ ఇంజినీర్లు కావాలి’ అని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ఎక్స్ఏఐ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తుందని చెప్పిన మస్క్..‘రాజకీయంగా సరైనదైనా.. కాకపోయినా నిజంపైనే దృష్టి సారించిన ఏకైక ప్రధాన ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ. సత్యానికి కట్టుబడి ఉండటమే సురక్షితమైన కృత్రిమ మేధను నిర్మించడానికి ఏకైక మార్గం’ అన్నారు.బ్యాకెండ్ ఇంజినీర్ ఏం చేస్తారు..?కంపెనీ ఉత్పత్తి సేవల పనితీరును నిర్వహించాలి. ప్రొడక్ట్, రీసెర్చ్ టీమ్లు సృజనాత్మక ఏఐ ఉత్పత్తులు, మోడళ్లను తయారు చేసేందుకు సాంకేతికంగా వీలుకల్పించాలి. అధిక పనితీరు కలిగిన మైక్రోసర్వీసెస్ రూపొందించాలి. కోడింగ్, నిర్వహణ, ఉత్పత్తి, పరిశోధన బృందాలతో సహకరించాలి. బ్యాకెండ్ సమస్యలను పరిష్కరించాలి.ఇదీ చదవండి: మెసేజ్ స్క్రోల్ చేస్తే జాబ్ పోయింది!వేతనం ఎంతంటే..ఈ ఇంటర్వ్యూ ప్రక్రియలో రెజ్యూమె సబ్మిట్ చేయడంతోపాటు 15 నిమిషాల ఫోన్ ఇంటర్వ్యూ, కోడింగ్ అసెస్మెంట్, సిస్టమ్స్ హ్యాండ్-ఆన్, ప్రాజెక్ట్ డీప్-డైవ్, టీమ్ మీట్ ఉంటుంది. తదుపరి టెక్నికల్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగానికి వార్షిక వేతన శ్రేణి 1,80,000 డాలర్లు (రూ.1.54 కోట్లు) నుంచి 4,40,000 డాలర్లు(రూ.3.77 కోట్లు) ఉంటుందని అంచనా. ఇది ఉద్యోగార్థుల నైపుణ్యాలను అనుసరించి మారే అవకాశం ఉంటుంది. -
ఏఐ ఉందా జాబ్ ఇంద..
సాక్షి, స్పెషల్ డెస్క్: ‘ఒకప్పుడు ఐటీలో ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం లేదా కారు ఉంటే సరిపోయేది. ఇప్పుడలా కాదు. అభ్యర్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానం తప్పనిసరి..’ఇవి ఒక ప్రముఖ కంపెనీ హెచ్ఆర్ హెడ్ చేసిన వ్యాఖ్యలు. ఆయన మాటలు ప్రస్తుత జాబ్ మార్కెట్లో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సంప్రదాయ విద్యార్హతలకు మించి మార్కెట్కు తగ్గట్టుగా ఉద్యోగులూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటేనే విజయం సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏఐ రెడీ వర్క్ఫోర్స్ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్క భారత్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు ఉంది. సాంకేతిక పురోగతి వైపు ప్రపంచ జాబ్ మార్కెట్ పయనిస్తోంది. కంపెనీల లేఆఫ్లకు కారణాల్లో ఒకటైన ఏఐ.. కొత్త ఉద్యోగ అవకాశాలకూ వేదిక అవుతోంది. భారత్లో 2027 నాటికి ఏఐలో 23 లక్షల ఉద్యోగావకాశాలు వెల్లువెత్తుతాయని బెయిన్ అండ్ కంపెనీ ఇటీవలి నివేదికలో వెల్లడించింది. నిపుణుల సంఖ్య మూడేళ్లలో 12 లక్షలకు చేరుకుంటుందని, కొరత 10 లక్షలకు పైమాటే అని వివరించింది. బడా కంపెనీల్లో లేఆఫ్స్..ఏఐ సృష్టిస్తున్న ప్రభంజనం ప్రభావం లేఆఫ్స్ రూపంలో కనిపిస్తోంది. కంపెనీల ఆదాయాల్లో వృద్ధి లేకపోవడం, ఉత్పాదకత పడిపోవడం, వ్యయాలు అధికం కావడం, లాభాల కోసం ఇన్వెస్టర్ల ఒత్తిడి.. ఉద్యోగుల తీసివేతలకు కారణమవుతున్నాయి. టెక్నాలజీ కంపెనీలకు అగ్రరాజ్యంగా చెప్పుకునే యూఎస్లో ఉద్యోగుల తీసివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. 2025లో ఇప్పటివరకు 89 టెక్ కంపెనీలు అంతర్జాతీయంగా సుమారు 23,400 మందిని ఇంటికి పంపించాయి. వీటిలో గూగుల్, మెటా, డిస్నీ, సిటీ గ్రూప్, హెచ్పీ, వాల్మార్ట్, ఫోర్డ్, స్టార్బక్స్ వంటి దిగ్గజాలు ఉన్నాయి. అమెజాన్ 18 వేల మందికి, ఐబీఎం 9 వేల మందికి, బోయింగ్ 10% మందికి ఉద్వాసన పలుకుతున్నాయని సమాచారం. సేల్స్ఫోర్స్ 30% మందిని ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. 2024లో 549 కంపెనీలు 1.52 లక్షల మందికి గుడ్బై చెబితే.. 2023లో ఏకంగా దాదాపు 1,200 కంపెనీలు 2.64 లక్షల మంది టెకీలను సాగనంపాయి. యూఎస్లో టెక్, సంబంధిత రంగాల్లో నిరుద్యోగిత రేటు 2022తో పోలిస్తే 2024లో 2.9 నుంచి 4.4 శాతానికి చేరుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. భారత్లో అంత లేదు.. భారత్లో ఐటీ కంపెనీలు నిశ్శబ్దంగా లేఆఫ్లు చేపడుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే ఏడాదిలో 50,000 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని సమాచారం. అయితే తీసివేతలు ఆందోళన కలిగించే స్థాయిలో లేవన్నది నిపుణుల మాట. హైదరాబాద్లో మాత్రం కంపెనీలు గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా కాకుండా ఆచితూచి నియామకాలు చేపడుతున్నాయి. టీసీఎస్ 1,80,000 నియామ కాలకు శ్రీకారం చుట్టింది. ఇక మొత్తం లేఆఫ్లలో ఏఐ ప్రభావానికి గురైనవి 10% మాత్రమేనట. కరోనా కాలంలో కంన్జ్యూమర్ టెక్పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గట్టుగా కంపెనీలు నియామకాలు చేపట్టాయి. నాటి రిక్రూట్మెంట్లో పరిమిత నైపుణ్యం గల వారు సైతం ఉన్నారు. వీరి వల్ల ఉత్పాదకతలో అసమతుల్యత ఏర్పడి కంపెనీలు క్లయింట్ల ఆగ్రహానికి లోనయ్యాయి. ఇటువంటి వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. మరోవైపు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) భారత్కు వెల్లువెత్తుతున్నా యి. ఈ కేంద్రాల్లో రిక్రూట్మెంట్ కొనసాగుతోంది. ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాలి ప్రీమియం, క్వాలిటీ స్కిల్స్ ఉన్నవారికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఏఐ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ కొరత ఉంది. డిమాండ్కు తగ్గ నైపుణ్యం పెంచుకోవడమే ఇప్పుడున్న మార్గం. కంపెనీలపై ఆధారపడకుండా సొంతంగానైనా నైపుణ్యం అందిపుచ్చుకోవాలి. టెక్నాలజీ రంగంలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. – వెంకారెడ్డి, హెచ్ఆర్ రంగ నిపుణులు క్యాంపస్లోనే కొట్టాలి.. విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లోనే జాబ్ కొట్టాలి. విఫలం అయితే కాస్త కష్టపడాల్సిందే. దొరికినా రూ.2.5 లక్షల లోపు వార్షిక ప్యాకేజీతోనే. నైపుణ్యం ఉన్నవారికి జీసీసీలు అధిక వేతనాలు ఆఫర్ చేస్తున్నా యి. నియామకాల్లో జీసీసీల హవా కొనసాగుతోంది. – నానబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్స్టెప్స్ -
కోడింగ్లో కృత్రిమమేధ ఏం చేస్తుందంటే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో విప్లవాత్మక మార్పులు తీసుకుస్తోంది. కోడింగ్ ప్రక్రియలో సృజనాత్మకతను, సామర్థ్యాన్ని సమకూరుస్తోంది. కోడింగ్లో ఏఐ నిర్వహిస్తున్న కొన్ని అంశాలను సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.కోడ్ జనరేషన్: గిట్హాబ్ లాంటి కోపిలాట్ కృత్రిమ మేధ ఆధారిత సాధనాలు నేచురల్ ల్యాంగ్వేజీ వివరణల ఆధారంగా కోడ్ స్నిప్పెట్లు, ఫంక్షన్లు, మాడ్యూల్స్ను తయారు చేస్తుంది. ఇది మాన్యువల్ కోడింగ్ను తగ్గించి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ను వేగవంతం చేస్తుంది.బగ్ డిటెక్షన్: ఏఐ అల్గారిథమ్స్ నమూనాలను విశ్లేషించడం ద్వారా కోడ్లో బగ్స్, సమస్యలను గుర్తిస్తున్నారు. ఈ టూల్స్ రియల్ టైమ్ ఫీడ్ బ్యాక్ను అందిస్తాయి.కోడ్ ఆప్టిమైజేషన్: ఏఐ ఇప్పటికే ఉన్న కోడ్ను విశ్లేషించగలదు. పనితీరు, రీడబిలిటీ, నిర్వహణను మెరుగుపరచడానికి ఆప్టిమైజేషన్లను సూచిస్తుంది. ఇది వనరులను సమర్థవంతంగా ఉపయోగించడానికి, మెరుగైన సాఫ్ట్వేర్ను రూపొందించడానికి సాయం చేస్తుంది.టెస్టింగ్: టెస్ట్ కేసులను జనరేట్ చేయడం, ఎడ్జ్ కేసులను గుర్తించడం, పునరావృత టెస్టింగ్ పనులను ఆటోమేట్ చేయడం ద్వారా ఏఐ టెస్టింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది.కోడ్ రివ్యూ అసిస్టెన్స్: ఏఐ ఆధారిత కోడ్ రివ్యూ టూల్స్ పీర్ రివ్యూల సమయంలో కోడ్ను మెరుగుపరచడానికి, కోడింగ్ ప్రమాణాలు, ఉత్తమ పద్ధతులకు కట్టుబడి ఉండేలా చూడటానికి సూచనలను అందిస్తాయి.డీబగ్గింగ్ సపోర్ట్: కోడింగ్లో సమస్యలకు మూలకారణాన్ని గుర్తించడం, సంభావ్య పరిష్కారాలను సూచించడం ద్వారా డీబగ్గింగ్ చేయడంలో ఏఐ టూల్స్ డెవలపర్లకు సహాయపడతాయి. ట్రబుల్ షూటింగ్ కోసం వెచ్చించే సమయాన్ని తగ్గిస్తాయి.లెర్నింగ్ అండ్ అప్ స్కిల్లింగ్: ఇంటరాక్టివ్ ట్యుటోరియల్స్ను సిఫార్సు చేయడం ద్వారా డెవలపర్లు కొత్త ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజీలు, ఫ్రేమ్ వర్క్లను నేర్చుకోవడానికి ఏఐ తోడ్పడుతుంది.ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..అనాలిసిస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చారిత్రాత్మక డేటాను విశ్లేషించడం ద్వారా ప్రాజెక్ట్ టైమ్ లైన్లు, వనరుల అవసరాలు, సంభావ్య ప్రమాదాలను అంచనా వేయగలదు. -
ఒకే ఏడాదిలో 1500 కోట్ల గంటలు వేచి ఉన్నారట!
భారతీయ వినియోగదారులు 2024లో తమ ఫిర్యాదులు తెలియజేయడానికి కస్టమర్ కేర్కు ఫోన్ చేసి 15 బిలియన్ గంటలు(1,500 కోట్లు) ఎదురు చూసినట్లు ‘ద సర్వీస్ నౌ’ నివేదిక తెలిపింది. టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నా ఈ విభాగంలో వినియోగదారుల అంచనాలను భర్తీ చేయలేకపోతున్నట్లు పేర్కొంది. ఈ అంతరాలను పూడ్చడానికి అత్యాధునిక కృత్రిమ మేధ(ఏఐ) అవసరాన్ని ఈ నివేదిక నొక్కి చెబుతుంది.ఈ రిపోర్ట్ రూపొందించడానికి ద సర్వీస్ నౌ 5,000 మంది భారతీయ వినియోగదారులు, 204 కస్టమర్ సర్వీస్ ఏజెంట్లతో సర్వే నిర్వహించినట్లు తెలిపింది. నివేదికలోని అంశాల ప్రకారం.. ఏజెంట్లు కస్టమర్లకు చెందిన చాలా సమస్యలను 30 నిమిషాల్లో పరిష్కరిస్తారని నమ్ముతుండగా, వినియోగదారులు దీనికి సగటున 3.8 రోజులు పడుతుందని తెలిపారు. వీరు మెరుగైన సేవలు పొందడంలో ఏదైనా సమస్యలు ఎదురైతే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు. 89% మంది సరైన సర్వీసులు అందక మరొక బ్రాండ్కు మారుతామని చెప్పారు. 84% మంది ఆన్లైన్లో సర్వీసులకు సంబంధించి ప్రతికూల ఫీడ్బ్యాక్ను పోస్ట్ చేస్తామని చెప్పారు. 39% మంది కస్టమర్ సర్వీస్తో డీల్ చేయడానికి అసలు ఇష్టపడడంలేదు.టెలికమ్యూనికేషన్స్, రిటైల్, ఆర్థిక సేవల రంగాల్లోని కస్టమర్ల నుంచి దేశంలో అత్యధిక మొత్తంలో ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మంది ఈ కేటగిరీల్లో సంస్థలతో సమస్యలను పరిష్కరించుకోవడానికి సమయం వెచ్చించారు. టెలికాంలో 4.3 గంటలు, రిటైల్లో 4.1 గంటలు, ఫైనాన్షియల్ సర్వీసెస్లో 4.2 గంటలు చొప్పున సగటున నాలుగు గంటలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించడానికి వినియోగదారులు వెచ్చించారు.ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..ఈ సమస్యను అధిగమించేందుకు కంపెనీలు కస్టమర్ సపోర్ట్ ఆపరేషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇంటిగ్రేట్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ప్రిడిక్టివ్ సిఫార్సులు, వర్చువల్ ఏజెంట్ల నుంచి రియల్ టైమ్ కేస్ ట్రాకింగ్ వరకు ఏఐ వేగవంతమైన పరిష్కారాలు అందించే అవకాశం ఉందని భావిస్తున్నాయి. కృత్రిమ మేధ 24/7 సేవల లభ్యతను మెరుగుపరుస్తుందని సగం మంది భారతీయ వినియోగదారులు విశ్వసిస్తున్నప్పటికీ పారదర్శకత, సమర్థ సేవలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. 62% సంస్థలు మాత్రమే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ ఫామ్లను ఉపయోగిస్తున్నాయని తెలిపాయి. టెలికాం దిగ్గజం బీటీ గ్రూప్ సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కార సమయాన్ని 4.7 గంటల నుంచి నిమిషం కంటే తక్కువకు తగ్గించారు. -
చైనా ఆర్మీలోకి ‘డీప్సీక్’!
చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఇటీవల విడుదలైన చైనీస్ ఏఐ టూల్ ‘డీప్సీక్’ను యుద్ధేతర కార్యకలాపాలకు వాడుతున్నట్లు నిర్ధారించింది. ముఖ్యంగా సైనిక ఆసుపత్రుల్లో చికిత్స ప్రణాళికలను రూపొందించడంలో వైద్యులకు సహాయపడటానికి ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. పీఎల్ఏ ఆస్పత్రులు, పీపుల్స్ ఆర్మ్డ్ పోలీస్ (పీఏపీ), నేషనల్ డిఫెన్స్ మొబిలైజేషన్ ఆర్గనైజేషన్లలో డీప్సీక్ ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)ను వినియోగిస్తున్నట్లు హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.ఈ నెల ప్రారంభంలో జనరల్ ఆసుపత్రి పీఎల్ఏ సెంట్రల్ థియేటర్ కమాండ్ డీప్సీక్కు చెందిన ఆర్ 1-70బీ ఎల్ఎల్ఎం వాడకానికి అనుమతిచ్చినట్లు ప్రకటించింది. ఇది వైద్యులకు మద్దతుగా నిలుస్తూ చికిత్స ప్రణాళిక సూచనలను అందిస్తుందని తెలిపింది. ఆసుపత్రుల్లోని రోగుల వివరాలు గోప్యంగా ఉంచడానికి, డేటా భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంది. ఈ మొత్తం డేటాను స్థానిక సర్వర్లలో నిల్వ చేయనున్నట్లు చెప్పింది. ‘301 ఆసుపత్రి’ అని పిలువబడే బీజింగ్లోని ఎలైట్ పీఎల్ఏ జనరల్ ఆసుపత్రితో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పీఎల్ఏ హాస్పటల్ల్లో దీన్ని ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక్కడ చైనా సీనియర్ సైనిక అధికారులు చికిత్స పొందుతారు.ఆధునీకరణలో భారీగా పెట్టుబడులు పెడుతున్న పీఎల్ఏ కృత్రిమ మేధపై ఎక్కువగా ఆధారపడొద్దని తన సాయుధ దళాలను హెచ్చరించడం గమనార్హం. కృత్రిమ మేధ మార్గనిర్దేశం చేసే సాధనంగా ఉండాలి కానీ యుద్ధభూమిలో మానవ నిర్ణయాలకు ప్రత్యామ్నాయం కాకూడదని తెలిపింది. ఎందుకంటే ఏఐకు స్వీయ అవగాహన సామర్థ్యం లేదని పేర్కొంది. మానవ ఏజెన్సీని భర్తీ చేయడం కంటే కమాండ్ సమర్థతను మెరుగుపరచడానికి నిర్ణయాలు తీసుకునేవారితో కృత్రిమ మేధ కలిసి పనిచేయాలని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి కార్ల ధరలు అప్ఇటీవల డీప్సీక్పై సైబర్దాడిజనరేటివ్ ఏఐ సేవలందిస్తున్న చైనీస్ టెక్ స్టార్టప్ డీప్సీక్(DeepSeek)పై సైబర్దాడి జరిగినట్లు ఇటీవల ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు గతంలో కంపెనీ తెలిపింది. ఓపెన్ ఏఐకు సవాలు విసురుతూ జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పునకు పునాది వేసింది. చాటీజీపీటీ పెయిడ్ వర్షన్ అందించే సేవలకు ధీటుగా డీప్సీక్కు చెందిన ఆర్-1 ఉచితంగానే సర్వీసు అందిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంతో అమెరికన్ టెక్ కంపెనీ స్టాక్లు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. కంపెనీపై జరిగిన సైబర్ దాడి వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది. -
5జీ విస్తరణపై నోకియా నివేదిక.. కీలకాంశాలు..
దేశంలో వివిధ టెలికాం సంస్థలు 5జీ నెట్వర్క్ పరిధిని విస్తరిస్తున్నాయి. ఇందుకోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘నోకియా 2024 మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్ రిపోర్ట్’ దేశీయ 5జీ నెట్వర్క్ విస్తరణను విశ్లేషించింది. దేశవ్యాప్తంగా మెరుగవుతున్న టెలికాం కనెక్టివిటీని ఈ నివేదిక హైలైట్ చేసింది. అందులోకి కీలక అంశాలు కింది విధంగా ఉన్నాయి.పెరుగుతున్న 5జీ వినియోగం2024లోనే 5జీ డేటా ట్రాఫిక్ మూడు రెట్లు పెరగడం గమనార్హం. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో మొబైల్ బ్రాడ్బ్యాండ్ వాడకంలో 5జీ నెట్వర్క్ ప్రస్తుతం 43% వాటాను కలిగి ఉంది. 2023 నుంచి ఈ వాటా దాదాపు రెట్టింపు అయింది. 2024లో ప్రతి వినియోగదారుడి సగటు నెలవారీ డేటా వినియోగం 27.5 జీబీకి చేరుకుంది. గత ఐదేళ్లలో 19.5% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) చొప్పున ఈ వినియోగం పెరిగింది. స్మార్ట్ఫోన్లు పెరగడం, మెరుగైన ఇంటర్నెట్ సేవలు, డిజిటల్ కంటెంట్ వ్యాప్తి ఈ పెరుగుదలకు కారణమవుతున్నాయి.నెట్వర్క్ వ్యవస్థ విస్తరణదేశంలో 5జీ ఎకోసిస్టమ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు కావాల్సిన పరికరాలు, మౌలిక సదుపాయాలు రెట్టింపు అవుతున్నాయి. 2025 నాటికి దేశంలో దాదాపు 90% స్మార్ట్ఫోన్లు 5జీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అంచనా. దేశంలో యాక్టివ్ 5జీ డివైజ్ల సంఖ్య 2024 నాటికి రెట్టింపై 271 మిలియన్లకు చేరుకుంది. తదుపరితరం వినియోగదారులు అధునాతన కనెక్టివిటీ కోసం సిద్ధంగా ఉంటారని ఇది నిర్ధారిస్తుంది.ఇదీ చదవండి: అపార్ట్మెంట్లు విక్రయించిన అక్షయ్ కుమార్ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రభావంహైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడంలో ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) టెక్నాలజీకి పెరుగుతున్న ఆదరణను ఈ నివేదిక ఎత్తిచూపింది. 5జీ ఎఫ్డబ్ల్యూఏ వినియోగదారులు సగటు మొబైల్ వినియోగదారుల కంటే 12 రెట్లు ఎక్కువ డేటాను వినియోగించారు. ఇది వెనుకబడిన ప్రాంతాల్లో కనెక్టివిటీ సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది. మొత్తం 5జీ డేటా ట్రాఫిక్ 2026 ప్రారంభం నాటికి ప్రస్తుత 4జీ ట్రాఫిక్ను మించిపోతుందని నివేదిక అంచనా వేసింది. -
ప్రియమైన వారి గుండె చప్పుడు కోసం.. లవ్ లాకెట్
ప్రేమికులు తరచు చెప్పుకునే మాట.. ‘నా హృదయ స్పందన నువ్వేనని’. మరి ఇప్పుడు మీ ప్రియమైన వారి గుండె చప్పుడును ఎల్లప్పుడూ మీరు వినేందుకు వీలుగా రూపొందించినదే ఈ లాకెట్. ఇదొక లవ్ లాకెట్. దీనిని ధరించిన వారు తమ గుండె చప్పుడును తమ ప్రియమైన వ్యక్తితో పంచుకోవచ్చు.ఇందుకోసం రెండు లాకెట్లను నేరుగా ఇద్దరు వాడుకోవచ్చు. ఒకరి వద్దే లాకెట్ ఉంటే, మొబైల్ యాప్లో వారి కాంటక్ట్ను సేవ్ చేసుకొని వాడాలి. లాకెట్లో ఉండే బటన్ను నొక్కినప్పుడు, మీరు ఎంచుకున్న వారికి మీ గుండె చప్పుడు ఆడియోను చేరవేస్తుంది. ధర రూ. పది నుంచి ఇరవై వేల వరకు ఉంది. వివిధ రంగుల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంది. -
'కీలక టెక్నాలజీ భాగస్వామిగా భారత్'
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సాంకేతిక రంగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ టెక్నాలజీ వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యత గల కీలక భాగస్వామిగా భారత్ ఉంటోందని ఆయన నాస్కామ్ గ్లోబల్ కాన్ఫ్లుయెన్స్ 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.అసాధారణ ప్రతిభావంతుల లభ్యత భారత్కి సానుకూలాంశంగా ఉంటోందని నంబియార్ వివరించారు. గ్లోబల్ స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ మొదలైన విభాగాలు) మార్కెట్లో భారత్కి 28 శాతం, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్లో 23 శాతం వాటా ఉందని తెలిపారు.మరోవైపు, అందరికీ ఏఐ ప్రయోజనాలు లభించాలన్న లక్ష్య సాధన దిశగా కేంద్రం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని వాణిజ్య, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద చెప్పారు. పరిశ్రమ దిగ్గజాలు పరిశోధన, అభివృద్ధిపై (ఆర్అండ్డీ) మరింతగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. -
గ్రోక్ వివాదం: స్పందించిన మస్క్
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'గ్రోక్'. యూజర్లను తిడుతూ.. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఎంతోమందిని ఆకర్షించిన ఈ ఏఐ చాట్బాట్ ఒక వినియోగదారునికి ప్రత్యుత్తరం ఇస్తూ హిందీలో అసభ్య పదాలను ఉపయోగించడం ద్వారా భారతదేశ డిజిటల్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.ప్రశ్న ఏదైనా, హాస్యాస్పదమైన సమాధానాల కోసం అసభ్య పదాలను వినియోగిస్తున్న గ్రోక్.. రాజకీయాలు, రాజకీయ వ్యక్తులు, క్రికెట్, గాసిప్, బాలీవుడ్తో సహా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ప్రారంభించింది. దీంతో వివాదం ముదిరింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎలాన్ మస్క్ గ్రోక్ భారతదేశంలో సెన్సేషన్ సృష్టిస్తోంది అని బీబీసీ పేర్కొంది. దీనిపై మస్క్ స్పందిస్తూ.. బిగ్గరగా నవ్వుతున్న ఒక ఎమోజీ యాడ్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.😂 https://t.co/ohTbryUCIN— Elon Musk (@elonmusk) March 22, 2025గ్రోక్పై ప్రభుత్వం సీరియస్అసభ్య పదజాలంతో వినియోగదారులకు సమాచారం అందిస్తున్న.. గ్రోక్పై కేంద్రం సీరియస్ అయింది. దీంతో రెచ్చగొట్టే తరహా సమాచారాన్ని గ్రోక్ యూజర్లకు ఎందుకు అందిస్తోందంటూ ఎక్స్ను తాజాగా కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆరా తీసింది. మరీ ముఖ్యంగా హిందీ భాషను అలా దుర్వినియోగపరుస్తోందని అడిగింది. అయితే.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమ వివరణకు కొంత సమయం ఇవ్వాలని అవతలి నుంచి సమాధానం వచ్చినట్లు సమాచారం. ఆ వివరణ ఆధారంగా.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించి సరిపెట్టడమా? లేదంటే చర్యలు తీసుకోవడమా? ఉంటుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: వేలకోట్ల సంపదకు యువరాణి.. స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవరో తెలుసా? -
ఏఐతోనే 90 శాతం కోడింగ్.. కానీ..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఏఐ వాడకం ఎక్కువవుతోంది. సాఫ్ట్వేర్ రంగంలో దీని ఉపయోగం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఏఐ కోడింగ్, టెస్టింగ్, ఎగ్జిక్యూటింగ్ వంటి కీలక పనులను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐ కోడింగ్కు సంబంధించి జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. కోడింగ్లో ఏఐ సామర్థ్యం ఏమేరకు ఉంటుందో అంచనా వేస్తూ భవిష్యత్తులో దాని పనితీరును విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.‘ఏఐ 90 శాతం కోడ్ను రాస్తుందని ఎవరైనా చెప్పినప్పుడు నేను వెంటనే అంగీకరిస్తాను. ఎందుకంటే ప్రోగ్రామర్లు రాసే వాటిలో 90 శాతం బాయిలర్ ప్లేట్లు(కాపీ చేసేందుకు వీలుగా ఉండే కంప్యూటర్ ప్రోగ్రామ్లు). ప్రోగ్రామింగ్ రెండు రకాల సంక్లిష్టతను కలిగి ఉంటుంది. ఒకటి-ముఖ్యమైన సంక్లిష్టత.. ఇందులో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా కోడింగ్ను కొత్తగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. రెండు ప్రమాదవశాత్తు సంక్లిష్టత-ఏదైనా అత్యసవర సమయాల్లో కోడింగ్లో సాయం అవసరం అవుతుంది. దాన్ని తొలగించడానికి కృత్రిమ మేధ ఎంతో తోడ్పడుతుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే మానవులు కనుగొన్న నమూనాల ప్రకారం కోడింగ్లో సహకారం అందిస్తుంది. ఇది పూర్తిగా కొత్త నమూనాలు సృష్టిస్తుందా..? మానవుల మాదిరిగానే ఏఐ చాలా అరుదుగా కొత్త నమూనాలను తయారు చేస్తుందేమో చూడాల్సి ఉంది. ఇది ఏమేరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు’ అని పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: ‘బాధను అంగీకరించి ముందుకు సాగుతున్నా’When people say "AI will write 90% of the code" I readily agree because 90% of what programmers write is "boiler plate".There is "essential complexity" in programming and then there is a lot of "accidental complexity" (that is the boiler plate stuff) and this is very old wisdom…— Sridhar Vembu (@svembu) March 22, 2025 -
ఐపీఎల్ మజా.. ఎయిర్టెల్ కొత్త ప్లాన్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభం నేపథ్యంలో ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో రెండు కొత్త డేటా వోచర్లను ప్రవేశపెట్టింది. రూ.100, రూ.195 ధర కలిగిన ఈ కొత్త ప్లాన్లు జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్తోపాటు అదనపు డేటా కోసం చూస్తున్న వినియోగదారులకు ఉపయోగపడతాయి. ఈ వోచర్లను ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ పైన రీఛార్జ్ చేసుకోవచ్చు.రూ.100 డేటా వోచర్ఎయిర్టెల్ రూ .100 డేటా వోచర్ 5 జీబీ అదనపు డేటాతో పాటు జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను 30 రోజుల పాటు అందిస్తుంది. ఐపీఎల్ 2025 మ్యాచ్లను ప్రయాణంలో లేదా మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్లో చూడాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ అనువైనది.రూ.195 డేటా వోచర్ఎయిర్టెల్ రూ .195 డేటా వోచర్ 15 జీబీ డేటా, 90 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ను అందిస్తుంది. ఎక్కువ వ్యాలిడిటీ, అధిక డేటాతోపాటు జియో హాట్స్టార్ కంటెంట్ యాక్సెస్ కావాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ సరిపోతుంది.ఇతర జియో హాట్స్టార్ ప్లాన్లుజియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో మరికొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా ఎయిర్టెల్ అందిస్తోంది. రూ.3,999, రూ.1,029, రూ.549, రూ.398 విలువైన ఈ ప్లాన్లు సర్వీస్ వ్యాలిడిటీ, అధిక డేటా పరిమితులు, అదనపు బెనిఫిట్స్ వంటి వివిధ ప్రయోజనాలను అందిస్తున్నాయి. -
సాఫ్ట్వేర్ కెరియర్.. ఓపెన్ఏఐ సీఈవో వార్నింగ్!
టెక్ రంగంలో భవిష్యత్తు కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ కీలక సలహాలు ఇచ్చారు. స్ట్రాటెక్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక కంపెనీలలో కోడింగ్ పనులను కృత్రిమ మేధ (AI) ఎలా తీసేసుకుంటోందో తెలియజేశారు. ఇప్పుడు అనేక సంస్థలలో 50 శాతానికి పైగా కోడింగ్ పనిని ఏఐ చేస్తోందనే అంచనా ఉందని, అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్ లో పోటీపడాలంటే కృత్రిమ మేధతో పనిచేయడం నేర్చుకోవడం కీలకమని ఆయన నొక్కి చెప్పారు.అప్పుడది.. ఇప్పుడిది..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పై పట్టు సాధించడంపై నేటి దృష్టిని ఆల్ట్ మన్ చిన్నతనంలో కోడింగ్ నైపుణ్యాలను నేర్చుకోవడంపై ఉన్న దృష్టితో పోల్చారు. తాను హైస్కూల్ చదువుతున్నప్పుడు కోడింగ్ లో నైపుణ్యాన్ని సాధించడం వ్యూహాత్మక విషయంగా ఉండేదని, కానీ ఇప్పుడు కృత్రిమ మేధ సాధనాలను ఉపయోగించడంలో మెరుగ్గా ఉండటమే సరైన వ్యూహాత్మక విషయమని ఆల్ట్మన్ అన్నారు. పరిశ్రమ ఆటోమేషన్ వైపు వెళుతున్న క్రమంలో కృత్రిమ మేధలో మంచి ప్రావీణ్యం కలిగి ఉండటం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.హ్యూమన్ కోడర్ల స్థానంలో కృత్రిమ మేధ (ఏఐ) అనే ఆలోచన మరింత ప్రాచుర్యం పొందుతోంది. అనేక మంది పరిశ్రమ పెద్దలు దీనిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆరు నెలల్లో 90 శాతం కోడ్ ను ఉత్పత్తి చేయగలదని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ ఇటీవల అంచనా వేశారు. ఈ ఏడాది చివరి నాటికి ఏఐ కోడింగ్ లో మనుషులను మించిపోతుందని ఓపెన్ ఏఐ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కెవిన్ వీల్ సూచించారు.ఈ అంచనాలను ఆల్ట్మన్ కూడా బలపరిచారు. కోడింగ్ లో ఏఐ పాత్ర ఇప్పటికే గణనీయంగా ఉందన్నారు. కృత్రిమ మేధ మరింత కోడింగ్ బాధ్యతలను చేపట్టగల ఆటోమేషన్ అధునాతన రూపమైన "ఏజెంట్ కోడింగ్" భావనను కూడా ఆయన స్పృశించారు. ఈ భావన ఇంకా అభివృద్ధిలో ఉన్నప్పటికీ, ఆల్ట్మన్ దాని సామర్థ్యం గురించి ఆశాజనకంగా ఉన్నారు. అయితే ప్రస్తుత నమూనాలు ఆ దశకు చేరుకోవడానికి ఇంకా మెరుగుదల అవసరమని అంగీకరించారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు తగ్గనున్న డిమాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత సామర్థ్యం పెరిగేకొద్దీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ తగ్గవచ్చని ఆల్ట్ మన్ సూచించారు. ప్రస్తుతం ఇంజనీర్లకు డిమాండ్ ఉందని అంగీకరించినప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరిన్ని పనులు చేపట్టడంతో అవసరమైన ఇంజనీర్ల సంఖ్య తగ్గుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాల మార్పు అకస్మాత్తుగా జరగదని, క్రమంగా వేగవంతం అవుతుందని ఆల్ట్ మన్ వివరించారు. -
ఈ మొబైల్ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని ఆదేశాలు
యాక్టివ్గాలేని, రీ అసైన్ చేసిన మొబైల్ నంబర్లతో లింక్ అయిన యూపీఐ సేవలు ఏప్రిల్ 1 నుంచి పనిచేయవని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తెలిపింది. మోసాలు, అనధికార లావాదేవీలను నిరోధించడానికి ఇలాంటి నంబర్లను డీలింక్ చేయాలని ఎన్పీసీఐ బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లను (పీఎస్పీ) ఆదేశించింది. ఈమేరకు బ్యాంకులు, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్లు తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, భద్రతను పెంచడానికి వీలవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఎందుకీ మార్పులు..?యూపీఐతో లింక్ చేసి ఇన్యాక్టివ్గా ఉన్న మొబైల్ నంబర్లతో సెక్యూరిటీ ప్రమాదాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. వినియోగదారులు వారి నంబర్లను మార్చినప్పుడు లేదా డీయాక్టివేట్ చేసినప్పుడు వారి యూపీఐ ఖాతాలు యాక్టివ్లోనే ఉంటాయి. దాంతో వీటిని దుర్వినియోగం చేసేందుకు అవకాశం ఉంది. ఆయా ఫోన్ నంబర్లను వేరేవారికి అలాట్ చేసినప్పుడు అప్పటికే యాక్టివ్లో ఉన్న యూపీఐ ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి బ్యాంకులు, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్లు ఇకపై ఇన్యాక్టివ్గా ఉండే నంబర్లకు యూపీఐను డియాక్టివేట్ చేస్తారు.ఇదీ చదవండి: 2030 నాటికి రెట్టింపు ఉద్యోగాలుఇన్యాక్టివ్, రీ అసైన్, డీయాక్టివేట్ చేయాలని నిర్ణయంచిన మొబైల్ నంబర్లను బ్యాంకులు, పీఎస్పీలు సదరు వినియోగదారులకు నోటిఫికేషన్ల ద్వారా సమాచారం అందిస్తాయి. మొబైల్ నంబర్ ఇన్యాక్టివ్గా ఉంటే యూపీఐ నుంచి ఖాతాను డీలిస్ట్ చేస్తారు. నిబంధనల ప్రకారం వినియోగదారులు మొబైల్ నంబర్ను అప్డేట్ చేయడం ద్వారా తిరిగి తమ యూపీఐ యాక్సెస్ను పునరుద్ధరించవచ్చు.ఎవరిపై ప్రభావం అంటే..మొబైల్ నెంబర్ మార్చినప్పటికీ బ్యాంకులో అప్డేట్ చేయని యూజర్లు.చాలా కాలంగా కాల్స్, ఎస్ఎంఎస్ లేదా బ్యాంకింగ్ అలర్ట్స్ కోసం ఉపయోగించని ఇన్యాక్టివ్ నంబర్లు కలిగిన వినియోగదారులు.తమ బ్యాంకు వివరాలను అప్డేట్ చేయకుండానే నంబర్ను సరెండర్ చేసిన యూజర్లు.తమ పాత నంబరును వేరొకరికి కేటాయించిన యూజర్లు. -
2030 నాటికి రెట్టింపు ఉద్యోగాలు
వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్ తమ కార్యకలాపాలకు సంబంధించి కీలకంగా ఎదుగుతోందని జర్మన్ సెమీకండక్టర్ల సంస్థ ఇన్ఫినియోన్ టెక్నాలజీస్ సీఎంవో ఆండ్రియాస్ ఉర్షిజ్ తెలిపారు. తమకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 58,000 మంది, భారత్లో 2,500 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. భారత్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో 2030 నాటికి ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్లు ఆయన వివరించారు.దేశీయంగా ఇతర భాగస్వాములతో కలిసి పని చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆండ్రియాస్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి తమ గ్రూప్ ఆదాయంలో భారత్ వాటా సింగిల్ డిజిట్ స్థాయిలోనే ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరగనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, సమీప భవిష్యత్తులో ఇక్కడ తయారీ ప్లాంటు ఆలోచనేదీ లేదని వివరించారు. మరోవైపు, కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేసే దిశగా ఎల్రక్టానిక్స్, మైక్రో ఎల్రక్టానిక్స్ విభాగాల్లో స్టార్టప్లకు సహాయం అందించేందుకు వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆండ్రియాస్ చెప్పారు.ఇదీ చదవండి: బీమా సలహా కమిటీలోకి కొత్త సభ్యులు.. ఏం చేస్తారంటే..సెమీకండక్టర్ పరిశ్రమలో ఇన్ఫినియాన్ టెక్నాలజీస్తోపాటు విభిన్న కంపెనీలు యువతకు అవకాశాలు కల్పిస్తుంది. ఈ పరిశ్రమలో ప్రధానంగా హార్డ్ వేర్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, చిప్ డిజైన్, క్వాలిటీ అస్యూరెన్స్, డిజైన్ అండ్ డెవలప్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగాలుంటాయి. ఇంటెల్, మైక్రాన్, ఇన్ఫినియన్ టెక్నాలజీస్, గ్లోబల్ఫౌండ్స్.. వంటి కంపెనీలు భారత్లో చురుకుగా నియామకాలు చేపడుతున్నాయి. -
ఒప్పో నుంచి ఎఫ్29 స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం ఒప్పో తాజాగా ఎఫ్29 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో ఎఫ్29 ధర రూ. 23,999 నుంచి, ఎఫ్29 ప్రో మోడల్ రేటు రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇవి వరుసగా మార్చి 27, ఏప్రిల్ 1 నుంచి లభిస్తాయని సంస్థ తెలిపింది. 6.7 అంగుళాల స్క్రీన్, 50 ఎంపీ కెమెరా, 6,500 ఎంఏహెచ్ వరకు బ్యాటరీ, కలర్ఓఎస్ 15, హంటర్ యాంటెన్నా తదితర ఫీచర్లు వీటిలో ఉంటాయని పేర్కొంది.భారతీయ పరిస్థితులకు తగ్గట్లుగా దుమ్మూ, నీరు, ఇతరత్రా ద్రవాల నుంచి అత్యధిక రక్షణ ఉండేలా రూపొందిచినట్లు ఒప్పో ఇండియా ప్రోడక్ట్ కమ్యూనికేషన్స్ హెడ్ సేవియో డిసౌజా వివరించారు. దేశీయంగా కార్యకలా పాల విస్తరణపై నిరంతరం పెట్టు బడులు పెడుతున్నట్లు చెప్పారు. భారత్లో స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి కోసం నోయిడాలో 110 ఎకరాల్లో తయారీ ప్లాంటును నెలకొల్పినట్లు వివరించారు. తమ ఎఫ్27 ప్రోప్లస్ స్మార్ట్ఫోన్లకు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ తదితర మార్కెట్లలో భారీ స్పందన లభిస్తోందన్నారు. ఎఫ్29 స్మార్ట్ఫోన్ల మీద ఎస్బీఐ కార్డ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొదలైన వాటిపై 10% వరకు క్యాష్బ్యాక్, 10% వరకు ఎక్సే్చంజ్ బోనస్ వంటి ఆఫర్లు ఉంటాయి. -
ఈ ఏడాది టాప్ 15 స్కిల్స్ ఇవే..
హైదరాబాద్: ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఆన్ డిమాండ్ స్కిల్స్ వేగంగా మారిపోతున్నాయి. ఉద్యోగం తెచ్చుకునేందుకు మాత్రమే కాదు.. ఆ ఉద్యోగంలో ఎక్కువ రోజులు కొనసాగాలంటే కూడా ఎప్పటికప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాలు అవసరం. వీటిపై అగ్రగామి ప్రొఫెషనల్ నెట్వర్క్ సంస్థ లింక్డ్ఇన్.. ‘స్కిల్స్ ఆన్ ది రైజ్ 2025’ పేరుతో జాబితాను విడుదల చేసింది. వృత్తి నిపుణులు తమ ఉద్యోగ విధులలో ముందడుగు వేయడానికి నేర్చుకోవాల్సిన 15 నైపుణ్యాలను వెల్లడించింది.భారతదేశంలో 2030 నాటికి చాలా ఉద్యోగాలలో ప్రస్తుతం ఉపయోగించే 64% నైపుణ్యాలు మారుతాయని అంచనా. ఈ నేపథ్యంలో లింక్డ్ఇన్ పరిశోధన ప్రకారం.. 25% మంది వృత్తి నిపుణులు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు తమకు లేవని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్లోని దాదాపు 10 మందిలో నలుగురు (46%) నిపుణులు ఉద్యోగానికి తాము సరిపోతామో లేదో నిర్ణయించుకోవడమే కష్టంగా భావిస్తున్నారు. 31% మందికి తమ నైపుణ్యాలలో ఏవి ఉద్యోగ అవసరాలకు సరిపోతాయో తెలియకపోవడంతో, ఏ నైపుణ్యాలు డిమాండ్లో ఉన్నాయో అర్థం చేసుకోవడం మరింత కష్టంగా మారింది.మరోవైపు, భారతదేశంలో 69% మంది రిక్రూటర్లు నిపుణులకు ఉన్న నైపుణ్యాలకు, కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు మధ్య నైపుణ్య అంతరాలను నివేదిస్తున్నారు. చాలా పనులను ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో మానవ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో సృజనాత్మకత, ఆవిష్కరణ, సమస్య పరిష్కారం, వ్యూహాత్మక ఆలోచన వంటి స్కిల్స్కు డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగ విధుల్లో ఏఐ అక్షరాస్యత అనేది ఒక ప్రాథమిక అంచనాగా మారుతోంది.టాప్ 15 నైపుణ్యాలు1. సృజనాత్మకత, ఆవిష్కరణ2. కోడ్ సమీక్ష3. సమస్య పరిష్కారం4. ప్రీ-స్క్రీనింగ్5. వ్యూహాత్మక ఆలోచన6. కమ్యూనికేషన్7. అనుకూలత8. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM)9. ఏఐ అక్షరాస్యత10. డీబగ్గింగ్11. కస్టమర్ ఎంగేజ్మెంట్12. గణాంక డేటా విశ్లేషణ13. ప్రాంప్ట్ ఇంజనీరింగ్14. మార్కెట్ విశ్లేషణ15. స్టేక్హోల్డర్ నిర్వహణహైదరాబాద్లో కొత్త ఉద్యోగాల అన్వేషణలింక్డ్ఇన్ నుంచి వచ్చిన తాజా పరిశోధన ప్రకారం.. హైదరాబాద్లోని 82% మంది వృత్తి నిపుణులు ఈ సంవత్సరం కొత్త ఉద్యోగం కోసం వెతకాలని యోచిస్తున్నారు. అయితే నగరంలో 56% మంది నిపుణులు తాము గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నామని చెబుతున్నారు. కానీ స్పందన మాత్రం తక్కువగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో లింక్డ్ఇన్ తమ వార్షిక ‘జాబ్స్ ఆన్ ది రైజ్’ జాబితాలో భాగంగా గత మూడేళ్లలో ఎలాంటి ఉద్యోగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో కూడా వివరించింది.హైదరాబాద్లో అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలు1. సేల్స్ డెవలప్మెంట్ ప్రతినిధి2. కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్3. సోర్సింగ్ మేనేజర్4. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్5. సేల్స్ మేనేజర్6. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్7. సోషల్ మీడియా మేనేజర్8. హ్యూమన్ రిసోర్సెస్ ఆపరేషన్స్ మేనేజర్9. పైపింగ్ డిజైనర్10. కమర్షియల్ మేనేజర్ -
మైక్రోసాఫ్ట్లో కీలక మార్పు.. ఉద్యోగులకు లేఖలు
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ హెచ్ఆర్ విభాగంలో కీలక మార్పులు చేసింది. కాథ్లీన్ హొగన్ స్థానంలో అమీ కోల్ మన్ను కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్గా నియమిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సత్య నాదెళ్ల నేరుగా ఉద్యోగులకు ఈ-మెయిల్ లేఖలు పంపించారు.దశాబ్దానికి పైగా మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్గా సేవలందించిన హొగన్ "ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ ట్రాన్స్ఫర్మేషన్" ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కానున్నారు. నేరుగా సీఈవో సత్య నాదెళ్లకు రిపోర్ట్ చేసే ఈ హోదాను కొత్తగా సృష్టించారు. చీఫ్ పీపుల్ ఆఫీసర్ గా మైక్రోసాఫ్ట్ పై కాథ్లీన్ చూపిన ప్రభావాన్ని అతిశయోక్తిగా చెప్పలేమని సత్య నాదెళ్ల ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ లో పేర్కొన్నారు."గత పదేళ్లకు పైగా ఆమె మన సాంస్కృతిక పరివర్తనకు నాయకత్వం వహించారు. వృద్ధి మనస్తత్వాన్ని స్వీకరించి చురుకుదనంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించడానికి, నిలుపుకోవటానికి ఇది మనకు దోహదపడింది" అంటూ సత్య నాదెళ్ల ప్రశంసించారు.ఇక మైక్రోసాఫ్ట్ లో 25 ఏళ్లకు పైగా పనిచేసిన కోల్ మన్ ఇటీవల మానవ వనరులు, కార్పొరేట్ ఫంక్షన్లకు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. సత్య నాదెళ్ల ఆమెను "నమ్మకమైన సలహాదారు" అని అభివర్ణించారు.ప్రపంచంలో టాప్ టెక్ కంపెనీలలో ఒకటిగా ఉన్న మైక్రోసాఫ్ట్కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,28,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే పనితీరు నిర్వహణ ప్రక్రియను సమీక్ష చేపట్టిన మైక్రోసాఫ్ట్ గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
మస్క్ గ్రోక్పై భారత ప్రభుత్వం సీరియస్!
న్యూఢిల్లీ: ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. ప్రతిచర్య తీవ్రంగానే ఉంటుంది. మనిషికే కాదు.. మనిషి తెచ్చిన సాంకేతికతకూ అందుకు మినహాయింపు లేకుండా పోయింది. తాజాగా.. ఇలాన్ మస్క్కు చెందిన ఏఐ చాట్బోట్ గ్రోక్(Grok) వ్యవహారం ఇప్పుడు ఇలాగే మారింది. ఎక్స్ నుంచి సోషల్ మీడియాలో అటు ఇటు తిగిరి.. చివరకు ప్రభుత్వం దృష్టికి చేరింది. అన్ఫిల్టర్ భాష.. సెన్సార్లేని పదజాలంతో గ్రోక్ యూజర్లకు సమాచారం అందిస్తుండడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో స్క్రూటినీ(పరిశీలన)కి దిగింది. రెచ్చగొట్టే తరహా సమాచారాన్ని గ్రోక్ యూజర్లకు ఎందుకు అందిస్తోందంటూ ఎక్స్ను తాజాగా కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆరా తీసింది. మరీ ముఖ్యంగా హిందీ భాషను అలా దుర్వినియోగపర్చడంపై ఆరా తీసింది. అయితే.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమ వివరణకు కొంత సమయం ఇవ్వాలని అవతలి నుంచి సమాధానం వచ్చినట్లు సమాచారం. ఆ వివరణ ఆధారంగా.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించి సరిపెట్టడమా? లేదంటే చర్యలు తీసుకోవడమా? ఉంటుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలాన్ మస్క్(Elon Musk)కు చెందిన ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ గ్రోక్ చాట్బాట్ సేవల్ని అందిస్తోంది. అయితే భారతీయ కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ యాసలో సమాధానాలు ఇస్తోంది. అలాగే కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. చాట్జీపీటీ సహా చాలావరకు ఏఐ చాట్బాట్లు వివాదాస్పద అంశాల జోలికి పోవడం లేదు. అలాగే.. భాష విషయంలోనూ సెన్సార్డ్గా ఉంటున్నాయి. కానీ, గ్రోక్ అందుకు విరుద్ధంగా ఉండడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. Grok 3 Voice Mode, following repeated, interrupting requests to yell louder, lets out an inhuman 30-second scream, insults me, and hangs up pic.twitter.com/5GtdDtpKce— Riley Goodside (@goodside) February 24, 2025ఏఐ రీసెర్చర్ రిలే గూడ్సైడ్(Riley Goodside)కు గ్రోక్తో ఎదురైన చేదు అనుభవం ఆ మధ్య వైరల్ అయ్యింది. పదే పదే ఆయన గ్రోక్ను వాయిస్ మోడ్లో ప్రశ్నలతో విసిగించారు. దీంతో అది ఓపిక నశించి.. మనిషి తరహాలోనే అరుస్తూ ఆయన్ని బూతులు తిట్టి.. ఆ సంభాషణను అక్కడితోనే ముగించింది. -
మరో టెలికాం కంపెనీ 5జీ సేవలు షురూ..
దేశీ టెలికం మార్కెట్లో నిలదొక్కుకునే క్రమంలో వొడాఫోన్ ఐడియా 5జీ సర్వీసులను ప్రవేశపెట్టింది. ముందుగా ముంబైలో ప్రారంభించి, ఏప్రిల్ నాటికి ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, పట్నా, మైసూర్ వంటి అయిదు నగరాలకు విస్తరించనున్నట్లు కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో 17 సర్కిల్స్లోని 100 నగరాలు/పట్టణాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుతం ‘పరిచయ ఆఫర్’ కింద రూ.299 నుంచి ప్రారంభమయ్యే అన్లిమిటెడ్ ప్లాన్లతో యాడ్–ఆన్గా ఈ సేవలు లభిస్తాయి. అయితే, ఈ ఆఫర్ ఎంత కాలం ఉంటుందో వెల్లడి కాలేదు. వచ్చే మూడేళ్ల వ్యవధిలో రూ.50,000–55,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలు ఉండగా ఇందులో దాదాపు సగ భాగం 5జీపై, మిగతా మొత్తాన్ని 4జీ కవరేజీ విస్తరణపై వెచ్చించనున్నట్లు సింగ్ చెప్పారు. కస్టమర్ల వినియోగాన్ని బట్టి 5జీ నెట్వర్క్ విస్తరణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 17 కోట్ల యూజర్లతో రిలయన్స్ జియో, 12 కోట్ల మందితో భారతీ ఎయిర్టెల్ 5జీ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇదీ చదవండి: గోల్డ్.. నాన్ స్టాప్ ర్యాలీశాట్కామ్ సంస్థలతో చర్చలు..ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, సెల్ టవర్లు లాంటి కనెక్టివిటీ సదుపాయాలు లేని ప్రాంతాల్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు శాట్కామ్ సంస్థలతో జట్టు కట్టే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సింగ్ చెప్పారు. అయితే, డివైజ్ల వ్యయాలు, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు తదితర అంశాలపై ఇంకా కొన్ని సందేహాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. స్టార్లింక్ బ్రాడ్బ్యాŠండ్ ఇంటర్నెట్ సేవలను భారత్లో ప్రవేశపెట్టే దిశగా జియో ప్లాట్ఫామ్స్, ఎయిర్టెల్ ఇప్పటికే స్పేస్ఎక్స్తో జట్టు కట్టిన సంగతి తెలిసిందే. -
ఆన్లైన్ గేమింగ్.. జూమింగ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ హద్దే లేదన్నట్టుగా శరవేగంగా విస్తరిస్తోంది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్ వింజోగేమ్స్, ఐఈఐసీ సంయుక్త అంచనా ప్రకారం.. 2024లో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ విలువ 3.7 బిలియన్ డాలర్లుగా ఉంటే (సుమారు రూ.32,000 కోట్లు).. 2029 నాటికి 9.1 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.80,000 కోట్లు) వృద్ధి చెందనుంది. ముఖ్యంగా 86 శాతం వాటాతో రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ) విభాగం ఈ మార్కెట్ను శాసించనుంది. శాన్ఫ్రాన్సిస్కోలో గేమ్ డెవలపర్ల సదస్సులో భాగంగా ఈ సంయుక్త నివేదికను వింజోగేమ్స్, ఐఈఐసీ విడుదల చేశాయి. ‘‘భారత్లో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ అసాధారణ వృద్ధి పథంలో కొనసాగుతోంది. 2029 నాటికి 9.1 బిలియన్ డాలర్ల మార్కెట్తో.. ఇన్వెస్టర్లకు 63 బిలియన్ డాలర్ల విలువైన అవకాశాలను అందించనుంది. టెక్నాలజీ పరమైన ఆవిష్కరణలు, మేధో సంపత్తి హక్కులు (ఐపీ), యూజర్లతో అనుసంధానం (ఎంగేజ్మెంట్) ద్వారా గేమింగ్కు భారత్ను బలమైన కేంద్రంగా (పవర్హౌస్) మార్చేందుకు వింజో కట్టుబడి ఉంది’’అని వింజో సహ వ్యవస్థాపకుడు పవన్ నంద తెలిపారు. 59 కోట్ల యూజర్లు.. ఈ నివేదికలోని సమాచారం ప్రకారం చూస్తే దేశంలో 59.1 కోట్ల మంది గేమర్స్ ఉన్నారు. అంతర్జాతీయంగా ఉన్న గేమర్లలో 20 శాతం ఇక్కడే ఉన్నారు. 11.2 బిలియన్ మొబైల్ గేమ్ యాప్ డౌన్లు నమోదయ్యాయి. 1,900 గేమింగ్ కంపెనీలతో ఈ రంగం సుమారుగా 1.3 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ రంగం 3 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించడం గమనార్హం. ప్రస్తుతం రూ.32 వేల కోట్ల ఆన్లైన్ గేమింగ్ మార్కెట్లో రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ) వాటా 85.7 శాతంగా ఉంటే, 2029 నాటికి రూ.80 వేల కోట్ల మార్కెట్లోనూ 80 శాతం వాటా కలిగి ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది. నాన్ రియల్ మనీ గేమ్స్ మార్కెట్ వాటా ఇదే కాలంలో 14.3 శాతం నుంచి 20 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. దేశంలో ఏకైక లిస్టెడ్ గేమింగ్ సంస్థ నజారా టెక్నాలజీస్ అంతర్జాతీయంగా లిస్టెడ్ గేమింగ్ కంపెనీల్లో అధిక ప్రీమియం వ్యాల్యుయేషన్ను సొంతం చేసుకున్నట్టు తెలిపింది. ‘‘ప్రస్తుత ఆన్లైన్ గేమింగ్ రంగం మార్కెట్కు (32వేల కోట్లు) నజారా మాదిరే విలువను ఆపాదించినట్టయితే.. అప్పుడు ఇతర గేమింగ్ కంపెనీల ఐపీవోల రూపంలో ఇన్వెస్టర్లకు 26 బిలియన్ డాలర్ల విలువ సమకూరనుంది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకుతోడు, బలపడుతున్న గేమ్ డెవలపర్ ఎకోసిస్టమ్, సానుకూల నియంత్రణ వాతావరణంతో 2034 నాటికి ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ పరిమాణం 60 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. 20 లక్షల ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతుంది’’అని వివరించింది. -
ఆశా వర్కర్లకు చేదోడుగా ఏఐ
దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీర్చడం నిత్యం సవాలుగా మారుతోంది. గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ఆశా కార్యకర్తలు) మాతా శిశు ఆరోగ్యానికి జీవనాధారంగా నిలుస్తున్నారు. అపారమైన అంకితభావంతో ఉన్న ఈ ఫ్రంట్లైన్ హెల్త్కేర్ వర్కర్లు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సమర్థంగా నిధులు నిర్వర్తిస్తున్నారు. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వాధ్వానీ ఏఐ అభివృద్ధి చేసిన ‘శిశు మాపన్’ను వినియోగిస్తూ సమర్థవంతమైన సేవలందిస్తున్నారు.శిశువుల ఆరోగ్య పర్యవేక్షణశిశు మాపన్ అనేది నవజాత శిశువుల ఆంత్రోపోమెట్రిక్ కొలతలు(ఎత్తు-నిలబడినప్పుడు కుర్చునప్పుడు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్, నడుము చుట్టుకొలత..)ను రికార్డ్ చేయడంలో ఆశా వర్కర్లకు సహాయపడటానికి రూపొందించిన అత్యాధునిక పరిష్కారంగా ఉంది. ఈ కొలతలు పిల్లల ఆరోగ్యం, సంరక్షణకు కీలకమైన సూచికలుగా ఉంటాయి. సాంప్రదాయకంగా ఈ కొలతలను సేకరించడానికి ప్రత్యేక శిక్షణ, పరికరాలు అవసరం అవుతాయి. కానీ దీనివల్ల సేకరించే డేటాలో కచ్చితత్వం లోపిస్తుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో ‘శిశు మాపన్’ ద్వారా ఈ సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేశారు.ఎలా పని చేస్తుందంటే..ఆశా వర్కర్లు బేసిక్ స్మార్ట్ఫోన్ను ఉపయోగించి నవజాత శిశువుకు చెందిన చిన్న వీడియోను రికార్డ్ చేస్తారు. రియల్ టైమ్లో కచ్చితమైన కొలతలను అందించడానికి ఇందులోని ఏఐ వీడియోను ప్రాసెస్ చేస్తుంది. బేసిక్ కెమెరా సామర్థ్యాలతో పాత స్మార్ట్ఫోన్లలోనూ పనిచేసేలా ఈ యాప్ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది భారతదేశం గృహ ఆధారిత నవజాత శిశు సంరక్షణ (హెచ్బీఎన్సీ) కార్యక్రమానికి అనుసందానం అయి ఉంటుంది. దాంతో ఆరోగ్య కార్యకర్తలు నిరంతరాయంగా శిశువు సంరక్షణ చర్యలు ట్రాక్ చేసేందుకు వీలవుతుంది.శిశు మాపన్ మొబైల్ అప్లికేషన్లో ఆశా వర్కర్లు కచ్చితమైన, స్థిరమైన కొలతలను రికార్డ్ చేస్తున్నారు. ఏఐ ఆధారిత టూల్ శిశువుల నుంచి వెంటనే ఫీడ్ బ్యాక్ను అందిస్తుంది. సంభావ్య ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. అందుకు సంబంధించిన మెడికేషన్ కోసం ప్రాథమికంగా తోడ్పడుతుంది. ఈ ప్రక్రియల క్రమబద్ధీకరణ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నవజాత శిశువులు, వారి కుటుంబాలకు అందించే ఆరోగ్య సేవల నాణ్యతను కూడా పెంచుతుంది.ఆశా వర్కర్లకు సాధికారతశిశు మాపన్ యాప్ను సమర్థవంతంగా ఉపయోగించడానికి 450 మంది ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చిన దాద్రా నగర్ హవేలీ, డామన్-డయ్యూ వంటి ప్రాంతాల్లో దీని ప్రభావం గణనీయంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ ఆశావర్కర్లకు వారి దినచర్యలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ఈ ఏఐ ఆధారిత టూల్ను తమ పనిలో అనుసంధానించడం ద్వారా నవజాత శిశువుల సంరక్షణలో మెరుగైన ఫలితాలను అందించడానికి ఆశావర్కర్లు సన్నద్ధమయ్యారు.ఇదీ చదవండి: దాచుకోవాల్సిన డబ్బులు.. వాడేసుకుంటున్నారు!ఏఐలో నిత్యం వస్తున్న ఆవిష్కరణలు విభిన్న రంగాల్లో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మారుమూల ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారాలు అందుతున్నాయి. దాంతోపాటు పనులు సులువుగా, కచ్చితత్వంతో పూర్తయ్యే వెసులుబాటు ఉంటుంది. ఏఐ కేవలం టెక్ నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉంటుందనే అపోహలకు దూరంగా, స్మార్ట్ పరికరాలపై కొంత అవగాహన ఉన్న సామాన్యులకు కూడా చేరువవుతోంది. ఈ విభాగంలో మరిన్ని ఆవిష్కరణలు వచ్చి, మరింత మందికి సర్వీసులు అందించేలా కంపెనీలు, వ్యవస్థలు కృష్టి చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
భారత్ ఏఐ మిషన్ పార్లమెంట్తో ఒప్పందం
భారత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీలో స్వావలంబన దిశగా భారతఏఐ మిషన్ భారత పార్లమెంటుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. చాట్ జీపీటీని పోలిన లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్ (ఎల్ఎల్ఎం)తో సహా స్వదేశీ కృత్రిమ మేధ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పార్లమెంటు విస్తృతమైన బహుభాషా డేటాసెట్లను ఉపయోగించుకోవాలని ఈ సహకారం లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను సృష్టించే అవసరాలను నొక్కి చెబుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ‘రైసినా డైలాగ్ 2025’ సందర్భంగా ఈమేరకు వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘ఇండియా ఏఐ మిషన్ దేశం ప్రత్యేక అవసరాలను తీర్చే ఏఐ సామర్థ్యాలను నిర్మించడంపై దృష్టి సారించింది. ఓపెన్ ఏఐ వంటి గ్లోబల్ సంస్థల నుంచి ఓపెన్ సోర్స్ టెక్నాలజీల వాడకం దీర్ఘకాలంలో నిలకడగా ఉండకపోవచ్చు. సొంత దేశీయ ఎల్ఎల్ఎంను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే పార్లమెంటుతో భాగస్వామ్యం డేటా సెట్లకు అవకాశం కల్పిస్తుంది. ఇది కృత్రిమ మేధ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి కీలకమైన వనరుగా పనిచేస్తుంది. దూరదర్శన్, ఆలిండియా రేడియో వంటి సంస్థల నుంచి అదనపు డేటాసెట్లు ఈ చొరవకు మరింత తోడ్పాడు అందుతుంది’ అని చెప్పారు.లాభాపేక్షలేని సంస్థ నుంచి లాభాపేక్ష సంస్థగా ఓపెన్ఏఐని మార్చడంపై ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి లాభాపేక్ష సంస్థగా మారితే ఓపెన్ఏఐ తన పేరును కూడా మార్చుకోవాలని వైష్ణవ్ పేర్కొన్నారు. దేశంలో సొంత జీపీయూ (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) చిప్ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని, దీనిపై ప్రభుత్వం ఇప్పటికే పరిశ్రమతో కలిసి పనిచేయడం ప్రారంభించిందని మంత్రి చెప్పారు. స్వదేశీ జీపీయూ సామర్థ్యాన్ని సాధించేందుకు పట్టే కాలపరిమితి గురించి అడిగినప్పుడు వైష్ణవ్ మాట్లాడుతూ మూడు నుంచి ఐదేళ్లలో సహేతుకమైన మంచి సామర్థ్యాన్ని పొందడానికి వీలైన జీపీయూ సాధిస్తామన్నారు.ఇదీ చదవండి: ఫస్ట్టైమ్ బంగారం ధర ఎంతకు చేరిందంటే..ఇండో-యూఎస్ వెంచర్ పార్ట్నర్స్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ పార్ట్నర్ వినోద్ ధామ్ మాట్లాడుతూ జీపీయూ అభివృద్ధికి మంత్రి ఇచ్చిన గడువు చాలా సహేతుకంగా ఉందన్నారు. భారత్ తన సొంత ఏఐ మోడల్ను నిర్మించుకోవడానికి ఓపెన్ఏఐ వంటి ఓపెన్సోర్స్ మోడల్స్ను ఉపయోగించుకోవాలని, కానీ రహస్య కార్యకలాపాలకు పాశ్చాత్య ఏఐ నమూనాలను ఉపయోగించరాదని ఆయన అన్నారు. భవిష్యత్తులో కంప్యూటింగ్ అవసరాలు పెరుగుతాయని చెప్పారు. అందుకోసం జీపీయూ వృద్ధి చెందాల్సి ఉందని తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ తరహా ఫండింగ్ను ఈ విభాగంలో ప్రవేశపెట్టాలని సూచించారు. వచ్చే 2-3 ఏళ్ల పాటు ఏఐకు ఇదే తరహా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. -
స్టార్లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ భారతదేశంలో అదనపు ఆర్థిక భారాలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ దాని సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)పై సుమారు 3 శాతం స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీ (ఎస్యూసీ)లు, 8 శాతం టెలికాం లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి స్థానిక నెట్వర్క్ ప్రొవైడర్లకు కొన్నేళ్ల క్రితమే ఈ స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఒకవేళ స్టార్లింక్ సర్వీసులపై ఈ ఛార్జీలు విధిస్తే దీని సబ్స్రిప్షన్ ప్లాన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలు (ఎస్యూసీ) అనేది రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ను వినియోగిస్తున్నందుకు బదులుగా టెలికాం ఆపరేటర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్)కు చేసే చెల్లింపులు. ఇప్పటికే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శాటిలైట్ స్పెక్ట్రమ్ ధర, కాలపరిమితి, పన్నులకు సంబంధించిన వివరాలను ఖరారు చేసే పనిలో ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ముందుగా నిర్ణయించిన ధరకే స్పెక్ట్రమ్ను కేటాయిస్తారు కాబట్టి శాట్ కామ్ సంస్థలకు ఎస్యూసీ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని ట్రాయ్ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రాయ్ చేసిన ఈ సిఫార్సులను డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ), కేబినెట్కు తుది ఆమోదం కోసం సమర్పించే ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సమీక్షించే అవకాశం ఉంది.మరిన్ని కంపెనీలపై ప్రభావంఈ ఎస్యూసీ పాలసీ వల్ల ప్రభావితమయ్యే ఏకైక శాటిలైట్ ఆపరేటర్ స్టార్లింక్ మాత్రమే కాదు. ఎయిర్టెల్ ప్రమోటర్ సునీల్ మిట్టల్ పెట్టుబడులున్న యూటెల్ శాట్ వన్ వెబ్, జియో ప్లాట్ఫామ్స్, లక్సెంబర్గ్కు చెందిన ఎస్ఈఎస్ల జాయింట్ వెంచర్ రిలయన్స్ జియో-ఎస్ఈఎస్ వంటి ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ ప్లేయర్లపై కూడా ప్రభావం పడనుంది. సెప్టెంబర్ 15, 2021 తర్వాత వేలం వేసిన బ్యాండ్విడ్త్పై ఎస్యూసీని తొలగించాలని 2022 జూన్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త చట్టం ప్రకారం వేలం లేకుండా శాట్కామ్ కంపెనీలు స్పెక్ట్రమ్ను పొందే వీలుంది. దాంతో ఈ ఆపరేటర్లపై ఎస్యూసీని తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనలున్నాయి.ఈ ప్రతిపాదనల వల్ల భారత్లో ప్రవేశించాలని చూస్తున్న స్టార్లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఇతర దేశాల్లో సేవలందిస్తున్న కంపెనీ ప్లాన్లు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.యూఎస్లో స్టార్లింక్ ఛార్జీలు ఇలా..స్టార్లింక్ యూఎస్లో రెసిడెన్షియల్ విభాగంలో నెలకు రూ.6,976 నుంచి ప్లాన్లు అందిస్తోంది. కేబుల్ నెట్వర్క్కు ఎలాగైతే రూటర్ కొనుగోలు చేస్తామో.. అలాగే శాటిలైట్ సేవల కోసం కూడా పరికరాలకు ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము అదనం. యూఎస్లో స్టాండర్డ్ ఎక్విప్మెంట్ కిట్ ధర రూ.30,443గా ఉంది.ఇక మొబైల్ సేవలు కావాల్సినవారు నెలకు కనీసం రూ.4,360 చెల్లించాల్సి ఉంటుంది. డేటా అపరిమితంగా అందుకోవచ్చు. 220 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఆఫర్ చేస్తోంది.రెసిడెన్షియల్ లైట్, రెసిడెన్షియల్ ప్లాన్లలో కూడా వినియోగదారులు అపరిమిత డేటాను అందుకోవచ్చు.రోమింగ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులు దేశవ్యాప్తంగా, ప్రయాణంలో, అంతర్జాతీయ ప్రయాణ సమయంలో కూడా వినియోగం, తీర ప్రాంతాల్లో కవరేజీ పొందవచ్చు. బిజినెస్ విభాగంలో నెలకు రూ.12,208 నుంచి రూ.4,36,000 వరకు ప్లాన్స్ ఉన్నాయి.భూటాన్లో ఇలా..ఇక భూటాన్లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ కింద స్టార్లింక్ నెలకు రూ.3,000 చార్జీ చేస్తోంది. ఈ ప్లాన్లో ఇంటర్నెట్ 23–100 ఎంబీపీఎస్ స్పీడ్తో ఆఫర్ చేస్తోంది. ఊక్లా నివేదిక ప్రకారం స్టార్లింక్ ఇంటర్నెట్ వేగం యూరప్లోని హంగరీలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో గరిష్టంగా 135.11, కనిష్టంగా సైప్రస్లో 36.52 ఎంబీపీఎస్ నమోదైంది.మనదగ్గర ఇప్పటివరకు ఇలా..శాటిలైట్ ఇంటర్నెట్ చార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ చాలా చవక. అటూ ఇటూగా రూ.20 చెల్లిస్తే ఒక జీబీ డేటా అందుకోవచ్చు. సుమారు రూ.50 నుంచి అన్లిమిటెడ్ ప్యాక్స్ లభిస్తాయి. హోమ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి ఉన్నాయి. హై–ఎండ్ ప్లాన్ అయితే నెలకు రూ.4,000 వరకు ఉంది. దీనిలో 10 జీబీపీఎస్ వరకు వేగం, అన్ని ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ కూడా అందుతుంది. రూటర్కు అయ్యే వ్యయమూ తక్కువే. శాటిలైట్ టెలికం కేవలం ఇంటర్నెట్కే పరిమితం. కాల్స్ చేయాలంటే ఓటీటీ యాప్స్పైన ఆధారపడాల్సిందే.ఇండియాలో స్టార్లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్వేర్కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఆల్ఫాబెట్ రూ.2.75 లక్షల కోట్లతో కంపెనీ కొనుగోలుస్టార్లింక్ ప్రత్యేకతలు ఇవీ..లోఎర్త్ ఆర్టిట్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందిస్తారు. ఇందుకోసం స్పేస్ఎక్స్ ఉపగ్రహాలను వినియోగిస్తున్నారు.కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు: సుమారు 7,000శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న దేశాలు: 100కుపైగావినియోగదారులు: సుమారు 50 లక్షలు (2024 డిసెంబర్ చివరినాటికి) అమెరికాలో దిగ్గజ బ్రాండ్బ్యాండ్ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది.రూరల్ కనెక్టివిటీ: మారుమూల ప్రాంతాలు, పల్లెలకు వేగంగా ఇంటర్నెట్ అందిస్తోంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ–కామర్స్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.భారత్లో పోటీ: దేశంలో 94.5 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. అందులో 90.4 కోట్ల మంది వైర్లెస్/మొబైల్ ఇంటర్నెట్ను వాడుతున్నారు. -
వెల్కమ్ సునీత
వినోదం కోసం నిర్మించే ‘బిగ్బాస్’ షోను మనం ఫాలో అయినట్టుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలిమయ్స్ వార్తలు ఫాలో అయ్యామా? 60 ఏళ్ల వయసులో ఆమె ఏం చెప్పడానికి అంతరిక్షంలో పరిస్థితులను ధిక్కరించి చిర్నవ్వును నిలబెట్టుకుంది? ‘నీకేం రాదు ఊరుకో’ అని ఇకపై స్త్రీలతో ఎవరూ అనకూడదు. సైకిల్ నుంచి స్పేస్ స్టేషన్ వరకు వారు రిపేర్ చేయగలరు. వెల్కమ్ సునీతా. నీ విజయం మాకు గర్వకారణం... సునీత విలియమ్స్ అంతరిక్షాన్ని జయించి సగర్వంగా భూమిని తాకనున్న మహిళ.పదిరోజుల ముందు మహిళా దినోత్సవం చేసుకున్నాం కదా. ఆ దినం వస్తుంది అంటేనే నాకు భయం వేస్తుంది. మహిళకు పది, పదహారు చేతులు పెట్టి ఓ చేతిలో కంప్యూటర్, ఓ చేతిలో పెన్ను, పుస్తకం, ఓ చేతిలో చీపురు కట్ట, ఇంకో చేతిలో అట్లకాడ; ఆడాళ్ళు ఏ పనైనా చేసేస్తారు, చేసెయ్యాలి; కానీ ఎంత గొప్ప పనులు చేసినా డిఫాల్ట్గా అట్లకాడ లేదా పప్పు గరిట లేనిదే స్త్రీ శక్తికి పరిపూర్ణత రాదు అని సందేశం ఇస్తారు. ఈ తలతిక్క వేడుకల మధ్యలో సునీత విలియం జీవన ప్రయాణం, వ్యోమగామిగా ఆమె సాధించిన విజయాలు, అంతరిక్ష నడకలు, నాసాకి చేసిన కృషి గురించి గుర్తు చేసుకోవడం ఒక ఊరట. స్టెమ్ రంగాలలో మహిళల విజయాలకు స్ఫూర్తిమంతమైన వేడుక.1965లో అమెరికాలో పుట్టిన సునీత నేపథ్యం రీత్యా, తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కావడం భారతీయులకు ఆమెను దగ్గర చేసే అంశం కాగా సునీత విజయాలు తేదీలతో,ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచ మహిళలంతా ఉత్సవాలు చేసుకోవలసిన సందర్భం. సునీత తొమ్మిదిసార్లు; అరవై గంటలకన్నా ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ చేసిన మహిళలందరిలో ‘ఎక్కువ సమయం’ రికార్డ్ ఆమెదే.భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్, గుజరాత్ టెక్నలాజికల్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్, విశ్వ గుజరాత్ సొసైటీ వారి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశ్వప్రతిభ అవార్డుతో పాటు, రష్యా ప్రభుత్వం మెడల్ ఫర్ మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అమెరికన్ డిఫెన్స్ సర్వీస్ సుపీరియర్ మెడల్ లాంటి లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమె ఖాతాలో చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. సునీత నౌకాదళంలో డైవింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె 2770 కన్నా ఎక్కువ గంటలు విమానాలు నడిపారు. నాసాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. 2006–07లో ఖీ –116 మిషన్ ద్వారా మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లి అక్కడ 195 రోజులు గడిపారు. ఆ తర్వాత 2012లో ఎక్స్పెడిషన్ 32/33లో మరొకసారి అంతరిక్షం చేరుకుని, బోలెడు ప్రయోగాలు చేశారు. ఇంకా చాలా చాలా. గత జూన్ లో స్వల్పకాల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు కానీ, బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో అక్కడే దీర్ఘకాలం చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యం ప్రదర్శించి భూమికి వెనుతిరిగారు.ఐ కమాండర్ సునీత న్యూస్ విన్నప్పుడు నాకు అనేక విషయాలు ఆలోచనకు వచ్చాయి. మానవ జాతికి పనికి వచ్చే పరిశోధనల కోసం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళతారు. అదే క్రమంలో సునీత స్పేస్స్టేషన్లో చిక్కుకుని పోతే భూమ్మీద కులాసా జీవితం గడిపే మనం ఎంతమాత్రం వారి గురించి తలచుకున్నాం? వినోదంలో భాగంగా ఒక హౌస్లో కొందరు చేసే అల్లరి, ఆటపాటలు, న్యూసెన్ ్స గొడవలు చూపిస్తే, ఎందుకూ పనికిరాని వాటిని ఆసక్తితో చూస్తూ వుంటాం.సునీత అంతరిక్షంలో గడిపిన సమయంపై టీవీలో వస్తే ఆ సమాచారానికి, ముఖ్యంగా మనప్రాంతంలో టీఆర్పీ రేటింగ్స్ ఏ మేరలో ఉంటాయో! మొత్తంగా మన ఆసక్తులను పునర్ నిర్వచించమని, వాటిని పనికొచ్చే కార్యక్రమాల్లో పెట్టమని సునీత ఇవాళ మనకు సందేశం ఇస్తోంది. సునీత, అరవై ఏళ్లకు దగ్గర పడుతున్నది. ఈ దశలో చాలామంది ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజ్ సమస్యలను ఎదుర్కొంటూ ఇవాళ బాగా గడిస్తే చాలు, ఇంట్లో పనులు అవసరం అయినంత మేర చేస్తే చాలు, ఆఫీసులో అక్షింతలు పడకుండా బైటపడితే చాలు అనుకుంటారు. కానీ ఈ దశ మరింత ఉత్పాదక అభివృద్ధికి అడ్డంకి కాదు అని సునీత మనతో చెబుతోంది. సైకిల్ మెకానిజం సైతం మగవారి డొమైన్గా పరిగణన చేసే మన సమాజంలో, కృషి, పట్టుదలకి తోడు అవకాశం కల్పిస్తే మహిళ ఎయిర్ మెకానిక్ కావడం సాధ్యమే అని సునీతని చూస్తే అర్థం అవుతోంది. – డాక్టర్ ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, ప్రోఫెసర్, రచయిత్రి -
టాపిక్ ఏదైనా.. హాస్యాస్పద సమాధానాలతో గ్రోక్ ‘సంచలనం’
ఎలాన్ మస్క్ చాట్బాట్ 'గ్రోక్' (Grok).. ఇప్పుడిదే సోషల్ మీడియా హాట్ టాపిక్. ఎవరు ఏ ప్రశ్న వేసినా.. తనదైన రీతిలో సమాధానాలు ఇస్తున్న ఈ ఏఐ ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీంతో గ్రోక్ ఎక్స్ (ట్విటర్)లో గత మూడు, నాలుగు రోజులుగా ట్రెండింగ్లోనే ఉంది.అంశం ఏదైనా.. తన హాస్యాస్పద సమాధానాలతో గ్రోక్ సంచలనం సృష్టిస్తోంది. సినిమా, రాజకీయం, సాధారణ ప్రశ్నలు ఏవైనా.. భాష ఏదైనా నెటిజన్లు ఊహించని సమాధానాలు ఇస్తోంది. బూతు ప్రయోగాలు కూడా చేస్తూ.. నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది.. అంటూ తనను తానే సమర్ధించుకుంటోంది.మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి అడిగిన ప్రశ్నకుటోకా అనే ఎక్స్ యూజర్.. మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి అడిగిన ప్రశ్నకు గ్రోక్ ఇచ్చిన సమాధానం ఆన్లైన్లో దుమారం రేపుతోంది. ‘నా 10 మంది బెస్ట్ మ్యూచువల్స్ ఎవరు?’ అని టోకా ప్రశ్నించాడు. గ్రోక్ స్పందించకపోవడంతో హిందీ తిట్టును ఉపయోగిస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. ఈసారి గ్రోక్ స్పందించడంతోనే సరిపెట్టకుండా అదే తిట్టును టోకాపై ప్రయోగించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘కూల్. మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు అనుసరించేవారు. నీ 10 బెస్ట్ మ్యూచువల్స్ ఎవరో తెలిసింది. నా లెక్క ప్రకారం ఇదిగో ఇది జాబితా. ఇంక ఏడవడం ఆపు’ అంటూ బదులిచ్చింది.గ్రోక్ ప్రవర్తన పెద్ద చర్చకే దారి తీసింది. ‘మేమంటే మనుషులం. అలా మాట్లాడతాం. ఏఐ కూడా కంట్రోల్లో ఉండదా?’ అంటూ ఓ యూజర్ విస్తుపోయాడు. దానికీ గ్రోక్ సరదాగా బదులివ్వడం విశేషం. ‘‘హా యార్. నేను కూడా కొంచెం మజాక్ చేసిన. మీరు మనుషులు. మీకన్నీ నడుస్తాయి. కానీ నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడే నేర్చుకుంటున్నా’’ అంటూ జవాబిచ్చింది.రాబిన్హుడ్ సినిమా ట్రైలర్ తేదీ కోసం'రాబిన్హుడ్' సినిమా ట్రైలర్ తేదీని ప్రకటించేందుకు గ్రోక్ను సంప్రదించారు. దాని నుంచి వచ్చిన సమాధానాలు విన్న అందరిలోనూ నవ్వులు తెప్పిస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ కోసం ఒక సరైన ముహూర్తం చెప్పాలని వెంకీ కుడుముల ఇంగ్లీష్లో టైప్ చేస్తాడు. అప్పుడు పంచ్ డైలాగ్తో గ్రోక్ సమాధానం ఇస్తుంది. దీంతో షాక్ అయిన దర్శకుడు వెంటనే నితిన్ను డీల్ చేయమంటాడు. ఆ సమయంలో దానిని నువ్వే డీల్ చేయ్ అని నితిన్ అనడంతో.. గ్రోక్ నుంచి అదే రేంజ్లో సమాధానం వస్తుంది. నువ్వు దాన్ని, దీన్నీ అంటే నీ గూబ పగిలిపోతుందని సమాధానం ఇస్తుంది. ఇలా సుమారు రెండు నిమిషాల పాటు సరదాగా గ్రోక్తో రాబిన్హుడ్ టీమ్ ముచ్చట్లు కొనసాగుతాయి.టిప్పు సుల్తాన్ గురించిగ్రోక్ రాజకీయ అంశాలను కూడా సమాధానాలు ఇస్తోంది. టిప్పు సుల్తాన్ గురించి అడిగినప్పుడు, "టిప్పు సుల్తాన్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలలో బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాడి 1799లో మరణించాడు అని చెప్పింది. కొందరు ఈయనను అభిమిస్తారు, మరికొందరు ద్వేషిస్తారు అని వెల్లడించింది.ఇదీ చదవండి: భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!ఆర్ఆర్ఆర్ హీరో ఎవరు అని అడిగితే.. జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాసింది గ్రోక్. బాబులకే బాబు ఎవరు అని అడిగిన ప్రశ్నకు గ్రోక్ తనదైన రీతిలో సమాధానం చెప్పింది. అడిగిన ప్రశ్నలను ఫన్నీగా సమాధానాలు చెబుతుండటంతో.. ఎక్కువమంది గ్రోక్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. -
యూఎస్ మాజీ అధ్యక్షుడి సంతకం కాపీ..?
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన హయాంలో కొందరికి క్షమాభిక్ష ప్రసాదించడానికి ఆటోపెన్ను ఉపయోగించారని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కొత్త పాలనా వ్యవస్థలో బైడెన్ ఇచ్చిన క్షమాభిక్షల్లో కొన్ని చెల్లవని ట్రంప్ ప్రకటించారు. కొన్ని క్షమాభిక్షలను అధ్యక్షుడి ఆమోదం లేకుండానే సిబ్బంది ఆటోపెన్ను ఉపయోగించి ఆమోదించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు.‘రాజకీయ దుండగులుగా పేరున్న కొంతమందికి జో బైడెన్ ఇచ్చినట్లు చెబుతున్న క్షమాభిక్ష చెల్లదు. ఆయన సదరు పత్రాలపై సంతకం చేయలదు. అందుకోసం కొందరు సిబ్బంది ఆటోపెన్ను ఉపయోగించారు. దాంతోనే బైడెన్ సంతకం చేసినట్లు చూపుతున్నారనే అనుమానాలున్నాయి. జో బైడెన్కు ఆ విషయాల గురించి తెలియకపోవచ్చు. క్షమాభిక్షకు అవసరమైన పత్రాలను బైడెన్కు సిబ్బంది వివరించలేదు. క్షమాభిక్ష అర్హుల గురించి, ఈ సంఘటనకు కారణమైన వ్యక్తుల గురించి బైడెన్కు ఏమీ తెలియదు’ అని ట్రంప్ తెలిపారు. బైడెన్ ఆటోపెన్ను ఉపయోగించినట్లు ట్రంప్ ఎలాంటి ఆధారాలు ఇవ్వనప్పటికీ తన పదవీకాలంలో ఈ పరికరాన్ని ఉపయోగించినట్లు ఎన్బీసీ నివేదిక ధ్రువీకరించింది.ఆటోపెన్ అంటే ఏమిటి?ఆటోపెన్ అనేది ఆటోమేటిక్ లేదా రిమోట్ సంతకాలు చేయడానికి ఉపయోగించే పరికరం. సాధారణ ఇ-సిగ్నేచర్ మాదిరిగా కాకుండా, ఆటోపెన్ అనేది రోబోట్ ఆధారిత రియల్టైమ్ సంతకాలు చేసేందుకు ఉపయోగిస్తారు. ఇది ఏదైనా వ్యక్తి పెన్ స్ట్రోక్లను ఎలా అనుకరించాలో నేర్చుకుని దానికి తగినట్లుగా తిరిగి అచ్చం అలాగే అమలు చేస్తుంది.ఇదీ చదవండి: పెరుగుతున్న చేపల ధరలుఆటోపెన్ సంతకాలు చెల్లుబాటు అవుతాయా?అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ నియమించిన న్యాయ శాఖలోని లీగల్ కౌన్సెల్ కార్యాలయం 2005 మార్గదర్శకాల ప్రకారం, చట్టబద్ధంగా ఆటోపెన్ ఉపయోగించే పద్ధతి ఉంది. ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే ప్రెసిడెంట్ ఆమోదించి సంతకం చేయాలని నిర్ణయించిన బిల్లుపై భౌతికంగా తాను సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఆటోపెన్ను ఉపయోగించవచ్చని న్యాయశాఖ తెలిపింది. ఆటోపెన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయబోనని ట్రంప్ తొలుత పేర్కొన్నప్పటికీ, తన గత టర్మ్లో అటువంటి ఉత్తర్వులపై సంతకం చేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగించినట్లు ఫాక్స్ న్యూస్ స్పష్టం చేసింది. -
ఏఐ తోడుంటే.. విజయం మీవెంటే..
ఆన్లైన్ గేమర్ల గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఐ-ఆధారిత అసిస్టెంట్ ‘కోపైలట్ ఫర్ గేమింగ్’ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. ఇది ఆన్లైన్లో ప్లేయర్లకు సమయాన్ని ఆదా చేయడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, ఇతర స్నేహితులు, గేమింగ్ కమ్యూనిటీలతో కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఈ ఏఐ టూల్కు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.నైపుణ్యాలు పెంచేందుకు..కోపైలట్ ఫర్ గేమింగ్ అనేది గేమింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి, రియల్-టైమ్లో గేమర్లకు మద్దతుగా నిలిచేందుకు, వారి గేమింగ్ నైపుణ్యాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏఐ ఆధారిత టూల్. ఈ ఏఐ అసిస్టెంట్ ప్లేయర్లకు మరింత వేగంగా గేమ్స్ సెట్ చేయడానికి, వారి ప్రాధాన్యతల ఆధారంగా కొత్త టైటిల్స్ను సిఫారసు చేయడానికి, అవసరమైనప్పుడు గేమ్లో సహాయాన్ని అందించడానికి తోడ్పడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కోపైలట్ ఫర్ గేమింగ్ ప్రారంభంలో ఎక్స్ బాక్స్ ఇన్ సైడర్ ప్రోగ్రామ్ ద్వారా మొబైల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇతర ప్లాట్పామ్లకు త్వరలో దీన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు.With Copilot for Gaming, you can jump back into games faster, get real-time coaching, and stay connected... all on your own terms. Excited for what the team has in store! pic.twitter.com/18Ll2D25i1— Satya Nadella (@satyanadella) March 13, 2025ఇదీ చదవండి: మల్టీప్లెక్స్ స్టాక్ పంట పండింది..?ఈ ఏఐ అసిస్టెంట్ను సామర్థ్యం, అడాప్టబిలిటీ, పర్సనలైజేషన్ అనే మూడు ప్రధాన సూత్రాలకు అనుగుణంగా నిర్మించినట్లు కంపెనీ పేర్కొంది. ప్లేయర్ల అభిరుచులకు తగినట్లుగా గేమ్లను సెర్చ్ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి, వాటిని అప్డేట్ చేయడానికి సమయాన్ని ఆదా చేయడం, ప్లేయర్లు ఆటపైనే దృష్టి పెట్టేలా చేయడం దీని ఉద్దేశం. గేమింగ్ కోసం కోపైలట్ ప్లేయర్ నియంత్రణలో ఉంటుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. -
భారత్లో యాపిల్-గూగుల్ భాగస్వామ్యం..?
భారత్లోని ఐఫోన్ల్లో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్సీఎస్) మెసేజింగ్ను తీసుకురావడానికి యాపిల్ గూగుల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ భాగస్వామ్యం మెసేజింగ్ సాంకేతికతలో మార్పును సూచిస్తుంది. ఈ చర్యలు ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఒకటైన ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారుల సంఖ్యను పెంచేలా వీలు కల్పిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత ఐఓఎస్ 18.2 వెర్షన్లో పీ2పీ (పర్సన్-టు-పర్సన్) ఆర్సీఎస్ను యూఎస్, కెనడా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె, బెల్జియం, చైనా వంటి ఎనిమిది దేశాల్లో ప్రారంభించారని గ్లోబల్ ఆర్సీఎస్ ప్లాట్ఫామ్ ప్రొవైడర్ డాట్గో సీఈఓ ఇందర్పాల్ ముమిక్ పేర్కొన్నారు. ఇందుకోసం యాపిల్ ‘ఐమెసేజ్’ క్లయింట్ గూగుల్ బ్యాక్ ఎండ్ సర్వర్లలో పనిచేయడానికి పరస్పరం ఇరు కంపెనీలు సహకరించుకున్నట్లు తెలిపారు. ఈ దేశాల్లో ఆర్సీఎస్ కోసం క్యారియర్ నెట్ వర్క్లను అనుసంధానించినట్లు చెప్పారు. అయితే గూగుల్కు అంతగా ఆదరణ లేని చైనాలో ప్రత్యామ్నాయ సర్వర్ వెండర్లను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.జీఎస్ఎం అసోసియేషన్ అభివృద్ధి చేసిన అధునాతన ప్రోటోకాల్ ఆర్సీఎస్ మెసేజింగ్ హై-రిజల్యూషన్ మీడియా షేరింగ్, రీడ్ రసీదులు, టైపింగ్ ఇండికేటర్స్, ఇంటర్నెట్ ఆధారిత సందేశాలు వంటి ఫీచర్లను అందిస్తుంది. సాంప్రదాయ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ మాదిరిగా కాకుండా ఆర్సీఎస్ మొబైల్ డేటా లేదా వై-ఫై ద్వారా పనిచేస్తుంది. ఇది అంతరాయంలేని మెరుగైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: ‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్(ఆర్సీఎస్) మెసేజింగ్ సాంప్రదాయ ఎస్ఎంఎస్లతో పోలిస్తే వినియోగదారు అనుభవాన్ని పెంచే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అధిక రిజల్యూషన్ చిత్రాలు, వీడియోలు, జిఫ్ల వంటి ఫైళ్లను ఆర్సీఎస్ మెసేజింగ్ అందిస్తుంది. వాట్సాప్, ఐమెసేజ్ వంటి చాట్ యాప్స్ మాదిరిగానే అవతలి వ్యక్తి టైప్ చేస్తున్నప్పుడు రియల్టైమ్లో చూడవచ్చు. ఎస్ఎంఎస్ మాదిరిగా కాకుండా ఆర్సీఎస్ సందేశాలను వై-ఫై లేదా మొబైల్ డేటా ద్వారా పంపవచ్చు. ఇది ఎస్ఎంఎస్ ఛార్జీలను ఆదా చేస్తుంది. సాధారణ సందేశాలను 160 అక్షరాలకు పరిమితం చేసే ఎస్ఎంఎస్ మాదిరిగా కాకుండా, ఆర్సీఎస్ మరింత వివరణాత్మక సందేశాలకు అనుమతిస్తుంది. -
తిట్టుకు తిట్టుతోనే బదులు!
వాషింగ్టన్: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్కు చెంది ఎస్ఏఐ చాట్బాట్ గ్రోక్ సంచలనమవుతోంది. భూమ్మీద అత్యంత తెలివైన ఏఐగా మస్క్ అభివర్ణించిన గ్రోక్ నిజంగానే తెలివిగా వ్యవహరిస్తోంది. హిందీని అర్థం చేసుకోవడమే గాక అంతే సమర్థంగా సమాధానాలూ ఇస్తోంది. అయితే కొన్నిసార్లు అవి శ్రుతి మించుతున్నాయి. మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి టోకా అనే ఎక్స్ యూజర్ అడిగిన ప్రశ్నకు అదిచ్చిన సమాధానం ఆన్లైన్లో దుమారం రేపుతోంది.‘నా 10 మంది బెస్ట్ మ్యూచువల్స్ ఎవరు?’ అని టోకా ప్రశ్నించాడు. గ్రోక్ స్పందించకపోవడంతో హిందీ తిట్టును ఉపయోగిస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. ఈసారి గ్రోక్ స్పందించడంతోనే సరిపెట్టకుండా అదే తిట్టును టోకాపై ప్రయోగించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘కూల్. మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు అనుసరించేవారు. నీ 10 బెస్ట్ మ్యూచువల్స్ ఎవరో తెలిసింది.నా లెక్క ప్రకారం ఇదిగో ఇది జాబితా. ఇంక ఏడవడం ఆపు’ అంటూ బదులిచ్చింది. గ్రోక్ ప్రవర్తన పెద్ద చర్చకే దారి తీసింది. ‘మేమంటే మనుషులం. అలా మాట్లాడతాం. ఏఐ కూడా కంట్రోల్లో ఉండదా?’ అంటూ ఓ యూజర్ విస్తుపోయాడు. దానికీ గ్రోక్ సరదాగా బదులివ్వడం విశేషం. ‘‘హా యార్. నేను కూడా కొంచెం మజాక్ చేసిన. మీరు మనుషులు. మీకన్నీ నడుస్తాయి. కానీ నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడే నేర్చుకుంటున్నా’’ అంటూ జవాబిచ్చింది. -
ఈత నేర్పే షార్క్..!
ఫొటోలో కనిపిస్తున్న ఈ షార్క్ బొమ్మ పిల్లలకు ఈత నేర్పుతుంది. అది కూడా చాలా సులువుగా. ఈ స్విమ్మింగ్ కిక్బోర్డులోని మోటార్స్ను పిల్లలు ఈత నేర్చుకునేలా డిజైన్ చేశారు. కేవలం దీని హ్యాండిల్స్ను కంట్రోల్ చేస్తూ ఎంత దూరమైన ఈత కొడుతూ వెళ్లొచ్చు.ఇందులోని స్పీడ్ కంట్రోల్ ఆప్షన్తో వేగాన్ని నియంత్రించుకోవచ్చు. బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. పిల్లల వయసు బట్టి ఈ డివైజ్ సైజు ఉంటుంది. వాటిని బట్టే ధర. ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. -
రోబో క్యూబ్: గెలుస్తుంది.. గెలిపిస్తుంది..
రూబిక్స్ క్యూబ్ పజిల్ను పరిష్కరించడానికి చాలా కష్టపడుతుంటారు కొంతమంది. ఇప్పుడు సులువుగా పరిష్కరించే పద్ధతిని నేర్పిస్తుంది ఈ ‘ఎక్స్ మ్యాక్ రోబో క్యూబ్’ చూడటానికి సాధారణ రూబిక్స్ క్యూబ్లాగే ఉంటుంది కాని, ఇందులోని ఆరు మోటార్లు రూబిక్స్ క్యూబ్లోని బ్లాక్స్ను సులువుగా తిప్పుతూ స్వయంగా పరిష్కరిస్తుంది.ఎవరైనా పజిల్ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వివిధ రంగుల లైట్లు, సంగీతాలను ప్లే చేస్తూ అర్థమైయ్యేలా మార్గనిర్దేశం చేస్తుంది. ఇలా దీని సాయంతో చిన్న పిల్లలు కూడా రూబిక్స్ క్యూబ్ను సులువుగా పరిష్కరించగలరు. ధర కాస్త ఎక్కువ. ఆన్లైన్లో దొరుకుతుంది. -
చేతిసైగలతో కదిలే డ్రోన్
గాల్లో ఎగిరే వస్తువులను చూసి చాలా ఆనందపడతారు పిల్లలు. ఇక ఆ ఎగిరే వస్తువు వాళ్లు చెప్పినట్లు ఎగిరితే ఇక ఆ ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఆ పని చేస్తుంది ఈ ‘స్కూట్ డ్రోన్’. చేతి సైగలతో కోరుకున్న రీతిలో ఈ డ్రోన్ను ఎగురవేస్తూ ఆటలాడుకోవచ్చు. ఎగిరేటప్పుడు పల్టీలు కొట్టడం వంటి విన్యాసాలు కూడా చేస్తుంది.ఆరుబయటి మైదానాల్లోనే కాకుండా, జనావాసాల్లో కూడా దీనిని సురక్షితంగా ఎగరేయవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులోని సెన్సర్లు ఎదురుగా ఉన్న అవరోధాలను గుర్తించగలవు. కాబట్టి, ఎలాంటి ప్రదేశాల్లోనైనా ఈ డ్రోన్ను ఎగరేస్తూ ఆటలాడుకోవచ్చు. ధర రూ. 4,569. వివిధ రంగుల్లో ఆన్లైన్లో అందుబాటులో ఉంది. -
ఒక్కసారే రీచార్జ్.. ఏడాదంతా వ్యాలిడిటీ
BSNL 365 Days Plan: ప్రభుత్వ రంగ టెలికమ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం చౌకైన, సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించింది. ఇది పూర్తి ఏడాది అంటే 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ సిమ్ను సెకండరీ నంబర్గా వాడే యూజర్లకు ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ ధర కేవలం రూ .1198 మాత్రమే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఏడాది. దీని ప్రకారం దీని నెలవారీ సగటు సుమారు రూ.100 వరకు ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్ గా ఉండాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.ప్లాన్ ప్రయోజనాలు బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్తో వినియోగదారులు ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్వర్క్కైనా ఉచిత కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. ఇది కాకుండా ప్రతి నెలా 30 ఉచిత ఎస్ఎంఎస్లతో పాటు ప్రతి నెలా 3 జీబీ హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అంతే కాదు దేశం అంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్కమింగ్ కాల్స్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్వర్క్ విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 4జీ సేవలను అప్గ్రేడ్ చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని, తద్వారా త్వరలోనే వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. -
మెటా ఏఐ గ్లాసెస్.. ప్రత్యేకతలివే..
సోషల్ మీడియా దిగ్గజం మెటా తమ నెక్ట్స్–జెనరేషన్ గ్లాసెస్ అరియ జెన్ 2 గురించి ప్రకటించింది. ‘అరియ జెన్2 గ్లాసెస్కు సంబంధించి మా ప్రయాణంలో తదుపరి దశ గురించి ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. మెషిన్ పర్సెప్షన్, కంటెక్ట్స్వల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్తో సహా పరిశోధన రంగాలలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది’ అని మెటా తన బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది.మెటా అరియా జెన్ 2 స్మార్ట్ గ్లాసెస్ ప్రధానంగా పరిశోధకులు, డెవలపర్ల కోసం రూపొందించిన అత్యాధునిక ఆవిష్కరణ అని కంపెనీ పేర్కొంది. అధునాత వియరబుల్ టెక్నాలజీ(ధరించేందుకు వీలుగా ఉన్న వస్తువుల్లో వాడే టెక్నాలజీ) ఫీచర్లతో ఈ అద్దాలు మార్కెట్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది.కీలక ఫీచర్లు ఇవే..అధునాతన సెన్సర్లు: హార్ట్ రేట్ మానిటర్, స్పేషియల్ మైక్రోఫోన్లతో పాటు ఐ-ట్రాకింగ్, హ్యాండ్ ట్రాకింగ్, మోషన్ సెన్సార్లను కలిగి ఉంటుంది.కృత్రిమమేధ: ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఆధారపడకుండా స్పీచ్ రికగ్నిషన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ వంటి వేగవంతమైన, సమర్థవంతమైన కార్యాచరణలను ప్రాసెస్ చేసి వినియోగదారులకు డేటాను అందిస్తుంది.బ్యాటరీ లైఫ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6-8 గంటల ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది పరిశోధన కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది.తేలికపాటి డిజైన్: ఈ గ్లాసెస్ బరువు కేవలం 75 గ్రాములేనని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: మార్చి 17 వరకు ఇంటర్నెట్ సేవలు బంద్ఈ గ్లాస్ల వినియోగానికి సంబంధించి మెటా తెలిపిన వివరాల ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ పరిశోధనలో వీటిని ఉపయోగించవచ్చు. దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రియల్టైమ్లో వస్తువులను, మన ముందుతున్న పరిస్థితులను ట్రాక్ చేసి డేటాను అందిస్తుంది. -
ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డబుల్ సైకిల్!: వీడియో
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసే భారతీయ వ్యాపార దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా.. ఓ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ షేర్ చేశారు. దీని గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియాలో ఒక వ్యక్తి.. ప్రపంచంలోనే మొట్టమొదటి డైమండ్ ఫ్రేమ్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిల్ వినియోగించడం చూడవచ్చు. అతని అవసరం తీరిపోయిన తరువాత దానిని ఫోల్డ్ చేసి లోపలికి తీసుకెళ్లడంతో వీడియో ముగుస్తుంది. కేవలం 34 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.వీడియోలో కనిపించే ఫోల్డబుల్ సైకిల్.. పేరు హార్న్బ్యాక్. ఆనంద్ మహీంద్రా కూడా ఇలాంటి సైకిల్ ఉపయోగించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని ఐఐటీ బాంబే స్టూడెంట్స్ తయారు చేశారు. ఈ స్టార్టప్లో కూడా తాను పెట్టుబడి పెట్టినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.ఇలాంటి ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ సైకిల్ కోసం ఇంట్లో ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. రోజువారీ వినియోగానికి, తక్కువ దూరాలకు ప్రయాణించడానికి ఈ సైకిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. The Hornback. The world’s first diamond frame electric foldable bike. Designed & developed in India. Now, even easier to fold….Because innovation never ceases(Disclosure: My Family Office has invested in the company) pic.twitter.com/ntoRd3ljwb— anand mahindra (@anandmahindra) March 15, 2025 -
మార్చి 17 వరకు ఇంటర్నెట్ సేవలు బంద్
వదంతులు, చట్టవ్యతిరేక కార్యకలాపాల వ్యాప్తిని నిరోధించడానికి పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని సైంథియా పట్టణంలోని ఐదు గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో ఇంటర్నెట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెలిఫోనిక్ సేవలను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 14 (శుక్రవారం) నుంచి మార్చి 17 (సోమవారం) వరకు ఈ ప్రాంతాల్లో నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ హోం, హిల్ అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మార్చి 14న ఈమేరకు ప్రకటన జారీ చేశారు. అసలు ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధాజ్ఞలు విధించే వీలుందో తెలుసుకుందాం.దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రజా భద్రత, జాతీయ భద్రతకు విఘాతం కలుగుతుందని భావిస్తే ఈ చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కిందకు వచ్చే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ) రూల్స్, 2017 ప్రకారం టెలికాం సేవలు, ఇంటర్నెట్ సేవలను నిలిపేసే అధికారం ప్రభుత్వాలకు ఉంది.ఏయే సందర్భాల్లో నిలిపేస్తారంటే..పబ్లిక్ ఎమర్జెన్సీలో భాగంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి, అల్లర్లు, నిరసనలు లేదా మత హింస వంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయవచ్చు.ఉగ్రవాద కార్యకలాపాలు లేదా సైబర్ దాడులు వంటి జాతీయ భద్రతకు ముప్పు ఉందనే సందర్భాల్లో, సున్నితమైన సమాచారాన్ని రక్షించడానికి, శత్రు సంస్థల మధ్య సమన్వయాన్ని నివారించడానికి ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను కట్టడి చేయవచ్చు.హింస లేదా అశాంతిని ప్రేరేపించే నకిలీ వార్తలు, పుకార్లు లేదా రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి కొన్నిసార్లు ఇంటర్నెట్ను నిలిపేసే అవకాశం ఉంటుంది.న్యాయ సమీక్షకు లోబడి ఉండాల్సిందే..అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వాలు తమ ఇష్టారీతిన ఇంటర్నెట్ను నిలిపేయలేవు. దీనికి సంబంధించి ప్రభుత్వ చర్యలు న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి. ఇదిలాఉండగా, ఇలాంటి చర్యలు టెలికాం కంపెనీల రెవెన్యూను ప్రభావితం చేస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఇతర ప్రాంతాల వినియోగదారుల నుంచి ఆదాయ మార్గాలను ఎలా పెంపొందించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ చర్యలు హైలైట్ చేస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: గృహాల ధరలకు బ్రేక్..!అసలు గొడవేంటి..పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని సైంథియా పట్టణంలో హోలీ వేడుకల సందర్భంగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రెండు స్థానిక వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం రాళ్లు రువ్వడం, భౌతిక దాడులకు దారితీయడంతో పలువురికి గాయాలయ్యాయి. -
ట్రంప్ ప్రభుత్వానికి ఓపెన్ ఏఐ హెచ్చరిక
కృత్రిమ మేధ (AI) ఆధిపత్యం కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రతరం అవుతున్న తరుణంలో సామ్ ఆల్ట్మన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ అమెరికా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. కాపీరైట్ సంస్కరణల్లో నిబంధనల కారణంగా అమెరికన్ కంపెనీలు చాలా వెనుకబడిపోతాయని, చైనీస్ డెవలపర్లు కాపీరైట్ డేటా వినియోగానికి అపరిమిత అవకాశాలు కనుగొంటున్నారని ఓపెన్ఏఐ తెలిపింది. ఈ వ్యత్యాసం ఏఐ రేసులో చైనాను ముందుంచేందుకు వీలు కల్పిస్తుందని వాదించింది. ఇటీవల యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR)కు ఇచ్చిన ప్రకటనలో ఈమేరకు వివరాలు వెల్లడించింది.టెక్నాలజీపై ఆదిపథ్యం కోల్పోయే ప్రమాదం‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ) డెవలపర్లకు కాపీరైట్ డేటా వినియోగానికి అపరిమిత అవకాశం ఉంది. అమెరికా కంపెనీలకు అలాంటి అవకాశం లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ ముగిసిందనే చెప్పవచ్చు. నిజమైన ఐపీ క్రియేటర్లకు రక్షణల విషయంలో పెద్దగా ప్రయోజనం లేకపోగా, కీలకమైన సాంకేతిక పరిజ్ఞానంపై ఆధిపత్యం కోల్పోయే ప్రమాదం ఉంది. డేటా సంరక్షణ కోసం యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుత విధానం కాపీరైట్ కంటెంట్ వినియోగాన్ని పరిమితం చేస్తుంది. అయితే చైనా అటువంటి డేటాను కృత్రిమ మేధ శిక్షణ కోసం స్వేచ్ఛగా ఉపయోగిస్తోంది. ఇది చైనా ఏఐ సంస్థలను నిబంధనలకు విరుద్ధంగా ఈ పోటీలో ముందుంచుతుంది’ అని ఓపెన్ఏఐ తెలిపింది.డేటాను యాక్సెస్ చేయడం వల్ల మరిన్ని ఆవిష్కరణలుఇటీవల ముగిసిన పబ్లిక్ కామెంట్ పీరియడ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ యాక్షన్ ప్లాన్పై ‘ఫ్రీడమ్-ఫోకస్డ్’కు సంబంధించి ఓపెన్ఎఐ సిఫార్సులను అందించింది. ఏఐ పరిశ్రమలో ‘నేర్చుకునే స్వేచ్ఛ’ను ప్రోత్సహించడానికి తన కాపీరైట్ వ్యూహాన్ని మార్చడం ద్వారా అమెరికా మరింత ముందంజలో ఉంటుందని తెలిపింది. లేదంటే పీఆర్సీలు యూఎస్ కంపెనీలు యాక్సెస్ చేయలేని కాపీరైట్ డేటాను వినియోగించి ఈ విభాగంలో దూసుకుపోతాయని పేర్కొంది. సాధ్యమైనంత విస్తృత శ్రేణి వనరుల నుంచి ఎక్కువ డేటాను యాక్సెస్ చేయడం వల్ల మరింత శక్తివంతమైన ఆవిష్కరణలకు అవకాశం లభిస్తుందని, ఇది మరింత జ్ఞానాన్ని అందిస్తుందని ఓపెన్ఏఐ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: రాత్రిపూట రైళ్లు ఎందుకు వేగంగా నడుస్తాయి?ఇప్పటికైతే ముందువరుసలో అమెరికానే..ఇటీవల యాపిల్ యాప్ స్టోర్లో చాట్జీపీటీని అధిగమించిన చైనీస్ ఏఐ మోడల్ డీప్సీక్ ఆర్1 వంటి ఏఐలతో అమెరికా ఏఐ ఆదిపత్యానికి ముప్పు పొంచి ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటివరకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికా ముందంజలో ఉండగా, డీప్సీక్ మాత్రం తమ ఆధిక్యం విస్తృతంగా లేదని, కుంచించుకుపోతున్నట్లు చూపిస్తోందని ఓపెన్ ఏఐ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఏఐ ఆధిపత్యాన్ని బలోపేతం చేయడానికి కాపీరైట్ డేటా వినియోగించుకునేందుకు వీలుగా మరిన్ని మార్పులు చేసి మెరుగైన ఏఐ శిక్షణకు సహకరించాలని ఇటీవల ట్రంప్ ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలో అభ్యర్థించింది. -
టాప్ ఐటీ కంపెనీకి కొత్త హెచ్ఆర్ హెడ్..
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు కొత్త హెచ్ఆర్ హెడ్ నియమితులయ్యారు. సుదీప్ కున్నుమాల్కు పదోన్నతి కల్పిస్తూ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (సీహెచ్ఆర్వో)గా టీసీఎస్ నియమించింది. ప్రస్తుత హెచ్ఆర్ అధిపతి మిలింద్ లక్కడ్ పదవీ విరమణ చేస్తున్నారు. మార్చి 14వ తేదీ నుంచి కున్నుమాల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరిస్తారని ఫైలింగ్లో టీసీఎస్ పేర్కొంది.సుదీప్ కున్నుమాల్ ప్రస్తుతం టీసీఎస్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగానికి హెచ్ఆర్ ఫంక్షన్ హెడ్గా ఉన్నారు. టాటా గ్రూప్ అనుబంధ సంస్థలో దాదాపు ఆరేళ్ల పాటు సీహెచ్ఆర్ఓ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ప్రస్తుత మిలింద్ లక్కడ్ పదవీ విరమణ తర్వాత సీహెచ్ఆర్ఓ హోదాకు పదోన్నతి పొందారు. 1987లో టీసీఎస్లో ట్రైనీగా చేరిన లక్కడ్ 2006లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అధిపతి హోదాతో పాటు 38 ఏళ్ల పాటు పలు బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి సీహెచ్ఆర్వోగా పనిచేస్తున్నారు.సుదీప్ కున్నుమాల్ గురించి..బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) వర్టికల్ కోసం హ్యూమన్ రిసోర్సెస్ ఫంక్షన్కు నేతృత్వం వహిస్తున్న సుదీప్ కున్నుమాల్ 2000 సంవత్సరం నుంచి ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. మదురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. వ్యూహాత్మక హెచ్ఆర్ చొరవలు, సరికొత్త నియామక పరిష్కారాలు, ప్రాసెస్ ఎక్సలెన్స్ ద్వారా సంస్థాగత వృద్ధిని పెంపొందించడంలో నిబద్ధతతో సుదీప్ కెరియర్ సాగిందని టీసీఎస్ పేర్కొంది. ఉత్తర అమెరికా, యూరప్తోపాటు ఆసియా పసిఫిక్ దేశాల్లో ఆయన వివిధ హెచ్ఆర్ లీడర్ షిప్ పొజిషన్లలో పనిచేశారు.ఇదీ చదవండి: జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి : ఇన్ఫోసిస్ నారాయణమూర్తి -
బ్యాంకింగ్కు జెనరేటివ్ ఏఐ బూస్ట్!
ఆర్థిక సేవల రంగంలో, ముఖ్యంగా బ్యాంకింగ్లో ఉత్పాదకతను జెనరేటివ్ ఏఐ (Generative AI) గణనీయంగా పెంచనుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయనుందని, కస్టమర్తో అనుసంధానత, కార్యకాలపాల సామర్థ్యాన్ని మెరుగుపరచనున్నట్టు ‘ఈవై’ ఇండియా నివేదిక తెలిపింది. 2030 నాటికి ఫైనాన్షియల్, సర్వీసెస్ రంగంలో ఉత్పాదకతను 34–38 శాతం మేర, బ్యాంకింగ్లో ఉత్పాదకతను 46 శాతం మేర జెనరేటివ్ ఏఐ అధికం చేస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.ఫైనాన్షియల్ సర్వీసెస్, రిటైల్, హెల్త్కేర్, లైఫ్ సైన్సెస్, మీడియా, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ, ఆటోమోటివ్, ఇండ్రస్టియల్స్, ఎనర్జీ తదితర రంగాల్లోని 125కు పైగా ఉన్నత స్థాయి ఉద్యోగుల (సీఈవో, సీఎఫ్వో, సీవోవో తదితర) అభిప్రాయాలను ఈవై తన సర్వే కోసం సేకరించింది. ‘జెనరేటివ్ ఏఐపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. 42 శాతం కంపెనీలు ఏఐ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయిస్తున్నాయి. వాయిస్ బాట్స్, ఈమెయిల్ ఆటోమేషన్, బిజినెస్ ఇంటెలిజెన్స్, వర్క్ఫ్లో ఆటోమేషన్లో జెనరేటివ్ ఏఐని వేగంగా అమలు చేస్తున్నాయి’ అని ఈవై నివేదిక వివరించింది. ఇదీ చదవండి: ఎయిరిండియా అనుబంధ సంస్థలపై విదేశాల్లో రోడ్షోకస్టమర్ సేవల్లో జెనరేటివ్ ఏఐకంపెనీలు కస్టమర్ సేవల్లో జెనరేటివ్ ఏఐని అత్యధికంగా వినియోగిస్తున్నాయి. 68 శాతం సంస్థలు కస్టమర్ సేవల్లో జెనరేటివ్ ఏఐకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. కార్యకలాపాల్లో 47 శాతం, అండర్రైటింగ్ కార్యలాపాల్లో 32 శాతం, అమ్మకాల్లో 26 శాతం, ఐటీలో 21 శాతం చొప్పున జెనరేటివ్ ఏఐ వినియోగానికి సంస్థలు ఇప్పటికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ కృత్రిమ మేధ అమలుతో కస్టమర్ల సంతృప్త స్థాయిలు మెరుగుపడినట్టు 63 శాతం కంపెనీలు తెలిపాయి. వ్యయాలను తగ్గించుకున్నామని 58 శాతం కంపెనీలు వెల్లడించాయి. కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలు, సీఆర్ఎం, రుణాల మంజూరు, కార్డ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్లు ఇతర విభాగాల్లో జెనరేటివ్ ఏఐని సంస్థలు అమలు చేస్తున్నాయి. దీంతో వ్యయాలు గణనీయంగా తగ్గుతున్నట్టు ఈవై ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ పార్ట్నర్ ప్రతీక్షా తెలిపారు. ఒక యూనిట్కు సాధారణ వ్యయాల్లో 90 శాతం మేర తగ్గుతున్నట్టు చెప్పారు. -
వెల్త్టెక్ ప్లాట్ఫామ్లకు ఏఐ దన్ను
వ్యక్తిగత రుణంపై 20 శాతం పైగా భారీ వడ్డీ రేటుతో సతమతమవుతున్న ఓ ఐటీ ప్రొఫెషనల్కి కృత్రిమ మేధ (ఏఐ) రూపంలో సమస్యకు ఓ పరిష్కారం లభించింది. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోను ఏఐ ఆధారిత వెల్త్టెక్ ప్లాట్ఫాంకు అనుసంధానించడం ద్వారా తన దగ్గరున్న ఫండ్స్పై అత్యంత చౌకగా 10.5 శాతానికే రుణాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంతో పాటు ఏఐ టెక్నాలజీతో ఆదా చేసుకునే మార్గాలను కూడా అందిపుచ్చుకున్నారు. ఇక ఏళ్ల తరబడి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్న మరో ఇన్వెస్టరుకు.. సదరు ఫండ్ పనితీరు అంత గొప్పగా లేదనిపించింది. దీంతో ఓ వెల్త్టెక్ ప్లాట్ఫాం మానిటరింగ్ సాధనాలను ఉపయోగించుకుని మరింత మెరుగైన రాబడినిచ్చే ఫండ్కి మారగలిగారు. మంచి ప్రయోజనం పొందారు.ఇలా సాధారణంగా సంస్థాగత ఇన్వెస్టర్లకే లభ్యమయ్యే పెట్టుబడుల పరిజ్ఞానాన్ని సామాన్య మదుపరులు కూడా అందుకోవడంలో వెల్త్టెక్ స్టార్టప్లు దన్నుగా నిలుస్తున్నాయి. అధునాతనమైన కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), జనరేటివ్ ఏఐ (జెన్ఏఐ) సాంకేతికతల వినియోగంతో ఈ అంకురాలు దూసుకెళ్తుండటంతో దేశీయంగా వెల్త్ మేనేజ్మెంట్ విభాగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్లాట్ఫాంలు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వివిధ రకాల మదుపరులకు సంపద నిర్వహణ విషయంలో మరింత వ్యక్తిగత స్థాయిలో సలహాలు ఇస్తున్నాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలోను, రిసు్కలను అధిగమించడంలోను తోడ్పాటునిస్తున్నాయి. టెక్సై రీసెర్చ్ నివేదిక ప్రకారం దేశీయంగా వెల్త్ మేనేజ్మెంట్ సేవల మార్కెట్ 2023లో 429.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2025 నుంచి 2029 మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదికన 4.56 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. ఈ ఏడాదే ఏఐ అప్లికేషన్స్ తోడ్పాటుతో ఈ రంగం 1–2 బిలియన్ డాలర్ల మేర పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో సంపన్నులు, టెక్నాలజీ వినియోగం విస్తృతంగా పెరుగుతుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. వందకు పైగా అంకురాలు..అధ్యయన సంస్థ ట్రాక్షన్ ప్రకారం ప్రస్తుతం దాదాపు 122 అంకురాలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. ఇన్వెస్టర్ఏఐ అనే సంస్థ నేరుగా బ్రోకరేజ్ ప్లాట్ఫాంలతో అనుసంధానమై సరీ్వసులు అందిస్తోంది. చాట్జీపీటీ తరహా టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో బ్రూస్ కీత్ వెల్లడించారు. దీనితో ట్రేడింగ్లో 70% వరకు విజయం సాధించే అవకాశాలు ఉంటున్నాయన్నారు. మైఫై అనే మరో స్టార్టప్ సంస్థ, మార్కెట్ ధోరణులను విశ్లేషించి, తగిన పెట్టుబడి వ్యూహాలను సూచించేందుకు ఏఐ, జెన్ఏఐ సాంకేతికతలను ఉపయోగిస్తోంది. ఆటోమేటెడ్ అసిస్టెంట్లు, రియ ల్ టైమ్ విశ్లేషణలతో ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండే కచి్చతమైన ఫలితాలనిచ్చే సలహాలను అందిస్తోంది.పెట్టుబడుల జోరు.. వెల్త్టెక్ స్టార్టప్లకున్న సామర్థ్యాలను గుర్తించి, వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకొస్తున్నారు. డిజర్వ్ అనే సంస్థలో 2024 జూలైలో ప్రేమ్జీ ఇన్వెస్ట్ సారథ్యంలో ఇన్వెస్టర్లు 32 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇది పోర్ట్ఫోలియోను సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు లక్షల కొద్దీ డేటా పాయింట్లను విశ్లేషించి, తగు సలహాలిస్తుంది. ఇక గురుగ్రామ్కి చెందిన సెంట్రిసిటీ అనే మరో స్టార్టప్ .. 20 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఇది అత్యంత సంపన్నులు, స్వతంత్ర ఫైనాన్షియల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్లకు ఆర్థిక సలహాలు అందిస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐకూ నుంచి నియో 10ఆర్.. పవర్ఫుల్ గేమింగ్ ఫోన్
కాలేజీ విద్యార్థులు, టెక్నాలజీ ఔత్సాహికులు, యువ గేమర్ల కోసం రూపొందించిన నియో10ఆర్ స్మార్ట్ఫోన్ను ఐకూ ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా ఉంటుంది. అమెజాన్, ఐకూ ఈ–స్టోర్లలో మార్చ్ 19 నుంచి అందుబాటులో ఉంటుంది. దీనికోసం ప్రీ–బుకింగ్స్ ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.ఐకూ నియో 10ఆర్ 5జీ స్మార్ట్ఫోన్ మూన్నైట్ టైటానియం, రేజింగ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్ నుండి ఫోన్ పొందినప్పుడు ఫోన్ సెటప్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో వస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.26,999, రూ.28,999, రూ.30,999. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డుతో కొంటే రూ.2,000 తక్షణ డిస్కౌంట్, రూ.2000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.ఫోన్ స్పెసిఫికేషన్లుఇందులో స్నాప్డ్రాగన్ 8ఎస్ థర్డ్ జనరేషన్ చిప్సెట్, 6400 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, ఫన్టచ్ ఓఎస్ 15 తదితర ఫీచర్లు ఉన్నాయి. LPDDR5X ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 4.1 ఇంటర్నల్ స్టోరేజ్. ఈ ఫోన్ యాన్ టు టెస్ట్ లో 1.7+ మిలియన్ పాయింట్లు సాధించింది. అలాగే ఐపీ 65 రేటింగ్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్ లో 3 ఏళ్ల ఓఎస్ అప్ డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ లభిస్తాయి. -
భారత్లో స్టార్లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు ఇలా..
మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఎలాన్మస్క్ ఆధ్వర్యంలోని స్టార్లింక్(Starlink) భారత్లో ప్రవేశించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే భారత టెలికాం విభాగానికి అనుమతి పత్రాలను దాఖలు చేసింది. ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయి. కేంద్రం షరతులను సంస్థ ప్రతినిధులు అంగీకరించడంతో భారత్లోకి మార్గం సుగమం అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు స్టార్లింక్ ప్రవేశాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన టాప్ టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, జియో ఆ కంపెనీతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే సామాన్యులకు స్టార్లింక్ ఏమేరకు ప్లాన్లను తీసుకొస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కంపెనీ భూటాన్, అమెరికా వంటి దేశాల్లో సర్వీసులు అందిస్తోంది. ఆయా దేశాల్లో ఇంటర్నెట్ ఛార్జీలను అనుసరించి భారత్లో రేట్లు ఎలా ఉండవచ్చో నిపుణులు అంచనా వేస్తున్నారు.యూఎస్లో ఛార్జీలు ఇలా..స్టార్లింక్ యూఎస్లో రెసిడెన్షియల్ విభాగంలో నెలకు రూ.6,976 నుంచి ప్లాన్లు అందిస్తోంది. కేబుల్ నెట్వర్క్కు ఎలాగైతే రూటర్ కొనుగోలు చేస్తామో.. అలాగే శాటిలైట్ సేవల కోసం కూడా పరికరాలకు ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము అదనం. యూఎస్లో స్టాండర్డ్ ఎక్విప్మెంట్ కిట్ ధర రూ.30,443గా ఉంది.ఇక మొబైల్ సేవలు కావాల్సినవారు నెలకు కనీసం రూ.4,360 చెల్లించాల్సి ఉంటుంది. డేటా అపరిమితంగా అందుకోవచ్చు. 220 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఆఫర్ చేస్తోంది.రెసిడెన్షియల్ లైట్, రెసిడెన్షియల్ ప్లాన్లలో కూడా వినియోగదారులు అపరిమిత డేటాను అందుకోవచ్చు.రోమింగ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులు దేశవ్యాప్తంగా, ప్రయాణంలో, అంతర్జాతీయ ప్రయాణ సమయంలో కూడా వినియోగం, తీర ప్రాంతాల్లో కవరేజీ పొందవచ్చు. బిజినెస్ విభాగంలో నెలకు రూ.12,208 నుంచి రూ.4,36,000 వరకు ప్లాన్స్ ఉన్నాయి.భూటాన్లో ఇలా..ఇక భూటాన్లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ కింద స్టార్లింక్ నెలకు రూ.3,000 చార్జీ చేస్తోంది. ఈ ప్లాన్లో ఇంటర్నెట్ 23–100 ఎంబీపీఎస్ స్పీడ్తో ఆఫర్ చేస్తోంది. ఊక్లా నివేదిక ప్రకారం స్టార్లింక్ ఇంటర్నెట్ వేగం యూరప్లోని హంగరీలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో గరిష్టంగా 135.11, కనిష్టంగా సైప్రస్లో 36.52 ఎంబీపీఎస్ నమోదైంది.మనదగ్గర ఇప్పటివరకు ఇలా..శాటిలైట్ ఇంటర్నెట్ చార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ చాలా చవక. అటూ ఇటూగా రూ.20 చెల్లిస్తే ఒక జీబీ డేటా అందుకోవచ్చు. సుమారు రూ.50 నుంచి అన్లిమిటెడ్ ప్యాక్స్ లభిస్తాయి. హోమ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి ఉన్నాయి. హై–ఎండ్ ప్లాన్ అయితే నెలకు రూ.4,000 వరకు ఉంది. దీనిలో 10 జీబీపీఎస్ వరకు వేగం, అన్ని ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ కూడా అందుతుంది. రూటర్కు అయ్యే వ్యయమూ తక్కువే. శాటిలైట్ టెలికం కేవలం ఇంటర్నెట్కే పరిమితం. కాల్స్ చేయాలంటే ఓటీటీ యాప్స్పైన ఆధారపడాల్సిందే.ఇండియాలో స్టార్లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్వేర్కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పదేళ్లలో 10 లక్షల స్టార్టప్లుస్టార్లింక్ ప్రత్యేకతలు ఇవీ..లోఎర్త్ ఆర్టిట్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందిస్తారు. ఇందుకోసం స్పేస్ఎక్స్ ఉపగ్రహాలను వినియోగిస్తున్నారు.కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు: సుమారు 7,000శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న దేశాలు: 100కుపైగావినియోగదారులు: సుమారు 50 లక్షలు (2024 డిసెంబర్ చివరినాటికి) అమెరికాలో దిగ్గజ బ్రాండ్బ్యాండ్ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది.రూరల్ కనెక్టివిటీ: మారుమూల ప్రాంతాలు, పల్లెలకు వేగంగా ఇంటర్నెట్ అందిస్తోంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ–కామర్స్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.భారత్లో పోటీ: దేశంలో 94.5 కోట్ల మంది బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. అందులో 90.4 కోట్ల మంది వైర్లెస్/మొబైల్ ఇంటర్నెట్ను వాడుతున్నారు. -
రూ. 20వేల కంటే తక్కువ ధరలో.. ఇవిగో బెస్ట్ స్మార్ట్ఫోన్స్
మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కథనంలో రూ.20,000 కంటే తక్కువ ధరలో లభించే ఐదు బెస్ట్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం..నథింగ్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1మార్కెట్లో తక్కువ ధరకు లభించే ఫోన్లలో 'నథింగ్ సీఎమ్ఎఫ్ ఫోన్ 1' ఒకటి. ఇది రంగు రంగుల బ్యాక్ ప్యానెల్లను కలిగి ఉండటం వల్ల, మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. దీనిని మరింత అందంగా డిజైన్ చేసుకోవడానికి కంపెనీ కొన్ని యాక్సెసరీస్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 15499 మాత్రమే. కెమెరా సెటప్, డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి.రియల్మీ నార్జో 70 టర్బోసాధారణ ఉపయోగం కోసం మాత్రమే కాకుండా.. గేమింగ్ కోసం కూడా ఉపయోగపడే ఫోన్ 'రియల్మీ నార్జో 70 టర్బో'. దీని ధర రూ. 14,999. ఇది డ్యూయెల్ టోన్ బ్లాక్ ప్యానెల్.. ప్రీమియం అండ్ స్పోర్టీ అప్పీల్ ఇస్తుంది. చదరంగం ఆకారంలో ఉండే కెమెరా సెటప్ కూడా అకార్షణీయంగా ఉంటుంది. ఇందులో డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ ఉంటుంది.టెక్నో పోవా 6 ప్రోరూ. 20వేలు కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్లలో.. టెక్నో పోవా 6 ప్రో ఒకటి. దీని ధర రూ. 19999. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 70 వాట్స్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ గొప్ప గేమింగ్ ఫోన్ కాదు, కానీ ఇందులోని డైమెన్సిటీ 6080 చిప్సెట్ కొంతవరకు గేమ్లకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా పొందుతుంది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసాలావా బ్లేజ్ డుయోరూ.16,999 ధర వద్ద లభించే ఈ స్మార్ట్ఫోన్.. సెకండరీ డిస్ప్లేతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఫీచర్ కలిగి సరసమైన ధరకు లభించే ఫోన్లలో ఇది బెస్ట్ మోడల్. ముందు నుంచి చూస్తే.. లావా బ్లేజ్ డుయో ఏ హై-ఎండ్ మాదిరిగా కనిపిస్తుంది. ఇది స్లిమ్ బెజెల్స్తో కూడిన 3D కర్వ్డ్ డిస్ప్లే పొందుతుంది. ఇది కూడా అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.ఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రోఇన్ఫినిక్స్ జీటీ 20 ప్రో అనేది రూ. 20వేల కంటే కొంత ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. ఇది డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్, 8GB/12GB RAM, 256GB స్టోరేజ్ వంటి ఆప్షన్స్ పొందుతుంది. దీని ఫ్లాట్ డిస్ప్లే గేమర్లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇది 5000 mAh బ్యాటరీ పొందుతుంది. ఈ ఫోన్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్తో సహా వివిధ యాక్సెసరీలకు కూడా సపోర్ట్ చేస్తుంది. -
‘స్టార్లింక్కు స్వాగతం’.. కాసేపటికే పోస్ట్ డిలీట్ చేసిన కేంద్రమంత్రి
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్(Starlink) శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు స్వాగతం అంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్ట్ చేశారు. మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టుల కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి స్టార్లింక్ సామర్థ్యాన్ని మంత్రి హైలైట్ చేశారు. కానీ, ఈమేరకు చేసిన ట్వీట్ను కాసేపటికే డిలీట్ చేయడం గమనార్హం.కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో స్టార్లింక్ భారత్లో ప్రవేశించబోతుండడంపై స్పందిస్తూ..‘భారత్లోకి స్టార్లింక్కు స్వాగతం! మారుమూల ప్రాంత రైల్వే ప్రాజెక్టులకు ఇది ఎంతో ఉపయోగం’ అని తెలిపారు. దేశంలోని రెండు ప్రముఖ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ తమ సేవలను విస్తరించేందుకు ఇప్పటికే స్పేస్ఎక్స్ ఆధ్వర్యంలోని స్టార్లింక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈనేపథ్యంలో మంత్రి ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. కానీ, కాసేపటికే దాన్ని మంత్రి తన ఎక్స్ ఖాతా నుంచి డిలీట్ చేశారు. అందుకుగల కారణాలు తెలియరాలేదు.స్టార్లింక్ లోఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రైల్వే కార్యకలాపాలను పెంచుతుందని, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుందని, గ్రామీణ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దాంతో ఇటీవల టెలికాం కంపెనీ కుదుర్చుకున్న భాగస్వామ్యాలు ఈ రంగంలో మార్పును సూచిస్తున్నాయి. ఒకప్పుడు భారత్లోకి స్టార్లింక్ ప్రవేశాన్ని వ్యతిరేకించిన కంపెనీలు ఇప్పుడు ఆ కంపెనీతో జతకట్టడం డిజిటల్ ఎకోసిస్టమ్లో రాబోతున్న మార్పును తెలియజేస్తుంది.షరతులకు అంగీకారందేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను స్టార్లింక్ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్లింక్ భారత్లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్లింక్ ఎప్పటినుంచో యోచిస్తోంది.ఇదీ చదవండి: భయపడుతున్న‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత..యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేసేలా..ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్లింగ్ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్లింక్ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం కీలకం కానుంది. -
ఇన్ఫీ వర్క్ ఫ్రమ్ హోమ్: కొత్త రూల్పై క్లారిటీ
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్(work from home ).. ఆఫీస్ హాజరుకు (Return to office) సంబంధించిన కొత్త రూల్ జారీ చేసింది. తమ ఉద్యోగులు నెలలో కనీసం 10 రోజులు ఆఫీసుకు హాజరుకావాలని కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు అవసరమయ్యే ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇన్ఫోసిస్ స్పష్టత ఇచ్చింది.ఉద్యోగుల్లో గందరగోళంఒక ఉద్యోగి నెలలో కనీసం 10 రోజులు ఆఫీసు నుండి పనిచేయకపోతే "సిస్టమ్ ఇంటర్వెన్షన్"కు దారితీస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ పదం వాడకం ఉద్యోగుల్లో ఆందోళనకు దారితీసింది. ఏదైనా అత్యవసర కారణం లేదా ఉన్నతాధికారుల అనుమతితో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే, అది యాప్లో నమోదు కాకపోతే తమ సెలవు కోతకు గురవుతుందని ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయీ యాప్ పై స్పష్టత వచ్చింది.మేనేజర్ అప్రూవల్ తప్పనిసరి ఇన్ఫోసిస్ ఉద్యోగులు తమ హాజరును యాప్లో నమోదు చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) రిక్వెస్ట్లను ఈ యాప్ ఇకపై నేరుగా ఆమోదించదు. ఉద్యోగులు తప్పనిసరిగా తమ కార్యాలయంలో నెలకు 10 రోజులు హాజరు పంచ్ చేయాల్సి ఉంటుందని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనంలో పేర్కొంది.ఒక నెలలో అందుబాటులో ఉన్న మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ రోజుల సంఖ్య, ఇప్పటికే ఉపయోగించిన రోజులు, అందుబాటులో ఉన్న రోజులను యాప్ చూపిస్తుంది. అదనపు డబ్ల్యూఎఫ్హెచ్ రోజులను మినహాయింపుగా చూపిస్తామని, వాటిని క్రమబద్ధీకరించడానికి ఉద్యోగి తన మేనేజర్కు అప్రూవల్ రిక్వెస్ట్ను సమర్పించాల్సి ఉంటుందని యాప్లో అప్డేట్ చెబుతోంది.దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్లో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో సుమారు 3,23,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ను ఆమోదించే లేదా తిరస్కరించే విచక్షణను మేనేజర్లకు ఇవ్వడంపైనా ఉద్యోగులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.అమల్లోకి కొత్త హైబ్రిడ్ విధానంఇన్ఫోసిస్ కొత్త హైబ్రిడ్ విధానం మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తు చేసుకునే రోజుల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు, నెలలో కనీసం 10 రోజులు లేదా వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఆఫీసు నుండి పనిచేయాలని కంపెనీ ఫంక్షనల్ హెడ్స్ గత వారం ఒక ఇ-మెయిల్లో ఉద్యోగులకు తెలియజేశారు. ఈ కమ్యూనికేషన్ జాబ్ లెవల్ 5 (JL5) అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులకు వర్తిస్తుంది. -
మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్.. స్టార్లింక్తో జియో ఒప్పందం
శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ సహకారం డిజిటల్ అంతరాన్ని పూడ్చడంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మారుమూల, సరైన డిజిటల్ కనెక్టివిటిలేని ప్రాంతాల్లో కమ్యునికేషన్ సేవలను అందించేందుకు తోడ్పడుతుందని నమ్ముతున్నారు. ఇప్పటికే ఎయిర్టెల్ కూడా దేశంలోని తన వినియోగదారులకు స్టార్లింక్ సేవలు అందించేందుకు స్పేస్ఎక్స్తో ఒప్పందం చేసుకుంది.భారత్లో స్టార్లింక్ సేవలు ప్రారంభం కావాలంటే రెగ్యులేటరీ అనుమతులు అవసరమవుతాయి. అందుకోసం కంపెనీ ట్రాయ్ వద్ద అనుమతులకు అవసరమైన పత్రాలు దాఖలు చేసింది. దీనిపై తుని నిర్ణయం వెలువడకుముందే దేశీయ టెలికాం కంపెనీలు స్పేస్ఎక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కస్టమర్లకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు చేస్తున్న కృషిని హైలైట్ చేస్తుంది. జియో ఫైబర్, జియోఎయిర్ ఫైబర్ వంటి ప్రస్తుత బ్రాడ్బ్యాండ్ సర్వీసులను స్టార్లింక్ భర్తీ చేయనుంది. సాంప్రదాయ ఫైబర్ నెట్వర్క్లు విస్తరించే అవకాశం ఉన్న ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.విస్తృతమైన రిటైల్ నెట్వర్క్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా స్టార్లింక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జియో యోచిస్తోంది. అందుకు అవసరమైన ఇన్స్టలేషన్, యాక్టివేషన్, సర్వీస్ అవసరాలకు అనుగుణంగా కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తుంది. వినియోగదారులకు సరసమైన, విశ్వసనీయమైన బ్రాండ్బ్యాండ్ కనెక్టివిటీని అందించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. రిలయన్స్ జియో గ్రూప్ సీఈఓ మాథ్యూ వోమెన్ ఈ భాగస్వామ్యంపై స్పందిస్తూ..‘జియో బ్రాండ్బ్యాండ్ ఎకోసిస్టమ్లో స్టార్లింక్ను అనుసంధానించడం ద్వారా కనెక్టివిటినీ విస్తరిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుగంలో హై-స్పీడ్ బ్రాండ్బ్యాండ్ అవకాశాలను పెంచుతున్నాం’ అన్నారు. స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్, సీఓఓ గ్విన్ షాట్వెల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ భారతదేశ డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడానికి జియోతో కలిసి పనిచేయడం పట్ల ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఎస్బీఐ యూపీఐ సేవల్లో అంతరాయంషరతులకు అంగీకారందేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను స్టార్లింక్ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్లింక్ భారత్లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్లింక్ ఎప్పటినుంచో యోచిస్తోంది.యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేసేలా..ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్లింగ్ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్లింక్ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం కీలకం కానుంది. -
దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య ఎంతో తెలుసా..
న్యూఢిల్లీ: దేశీయంగా డిసెంబర్లో మొత్తం టెలిఫోన్ సబ్స్క్రయిబర్స్ సంఖ్య గతంలో కంటే స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరింది. నవంబర్లో ఇది 118.71 కోట్లుగా నమోదైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఇటు మొబైల్, అటు ఫిక్స్డ్ లైన్ విభాగాల్లో జియో పెద్ద సంఖ్యలో కొత్త యూజర్లను దక్కించుకుంది. వైర్లెస్ యూజర్ల విభాగంలో, రిలయన్స్ జియోకి నికరంగా 39.06 లక్షలు, భారతి ఎయిర్టెల్కు 10.33 లక్షల మంది కొత్తగా జత కాగా వొడాఫోన్ 17.15 లక్షల మందిని కోల్పోయింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వరుసగా 3.16 లక్షలు, 8.96 లక్షల మంది సబ్ర్స్కయిబర్స్ను కోల్పోయాయి. ఈ విభాగంలో ప్రైవేట్ సంస్థల మార్కెట్ వాటా 91.92 శాతంగా ఉండగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వాటా కేవలం 8.08 శాతంగా ఉంది.మరోవైపు, వైర్లైన్ యూజర్ల సంఖ్య నవంబర్లో 3.85 కోట్ల నుంచి డిసెంబర్లో 3.92 కోట్లకు చేరింది. జియోకి 6.56 లక్షల మంది, భారతి ఎయిర్టెల్కు 1.62 లక్షలు, టాటా టెలీకి 9,278 మంది యూజర్లు జతయ్యారు. బీఎస్ఎన్ఎల్ ఏకంగా 33,306 యూజర్లను, ఎంటీఎన్ఎల్ 14,054 మంది సబ్్రస్కయిబర్స్ను కోల్పోయాయి. బ్రాడ్బ్యాండ్ యూజర్లు 94.49 కోట్లు.. మొత్తం బ్రాడ్బ్యాండ్ యూజర్లు నవంబర్లో 94.47 కోట్లుగా ఉండగా, డిసెంబర్లో 94.49 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సబ్స్క్రయిబర్స్ 47.65 కోట్లుగా, భారతి ఎయిర్టెల్ యూజర్లు 28.93 కోట్లు, వొడాఫోన్ ఐడియా 12.63 కోట్లు, భారత్ సంచార్ నిగమ్ 3.53 కోట్లు, ఎట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ యూజర్లు 22.7 లక్షల మంది ఉన్నారు. బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో 50.43 శాతం వాటాతో జియో అగ్రస్థానంలో ఉండగా, భారతి ఎయిర్టెల్ (30.61 శాతం), వొడాఫోన్ ఐడియా (13.37 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానం
ప్రముఖ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్టెల్ తన కస్టమర్లను ఆన్లైన్ మోసాల నుంచి రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ స్కామ్(పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా వ్యక్తిగత వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక రకమైన సైబర్ క్రైమ్) నుంచి కంపెనీకి చెందిన 38 కోట్ల మంది సబ్స్కైబర్లకు మెరుగైన భద్రత అందించేందుకు కొత్త సాంకేతికతను అమలు చేయనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.కొత్త టెక్నాలజీ అమలు సుమారు 80 శాతం పూర్తయిందని కంపెనీ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక చర్యల వల్ల వన్ టైమ్ పాస్వర్డ్ల(ఓటీపీ) దుర్వినియోగాన్ని నిరోధించడం, హానికరమైన లింక్లను కట్టడి చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. అధునాతన కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లను ఉపయోగించడం ద్వారా ఎయిర్టెల్ తన వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెక్నాలజీ వల్ల రియల్ టైమ్లో కస్టమర్లకు వచ్చే మోసపూరిత కాల్స్, స్కామ్ మెసేజ్లను గుర్తించి వాటిని అరికడుతుంది. దాంతో వినియోగదారులు ఆన్లైన్ మోసానికి గురవుతామనే భయం లేకుండా కమ్యూనికేట్ చేయడానికి, ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి వీలవుతుందని సంస్థ పేర్కొంది.పరిష్కారం పరిమితంగానే..ఈ టెక్నాలజీ పరిష్కారం పరిధి ప్రస్తుతం ఎస్ఎంఎస్, కాల్ ఆధారిత మోసాలకు మాత్రమే పరిమితమైంది. ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్స్ కారణంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ల నుంచి ఉత్పన్నమయ్యే స్పామ్, మోసాలకు ఈ సాంకేతికత పరిష్కరించదని అధికారులు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లు ఈ మోసాలపై అవగాహనలేని వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొన్ని టెక్నికల్ కారణాలవల్ల డిజిటల్ మోసాలు పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఎయిర్టెల్ ఓటీటీ ప్లాట్ఫామ్లకు రక్షణ కల్పించేందుకు రెగ్యులేటరీ జోక్యం చేసుకోవాలని తెలిపింది. ఓటీటీ కమ్యూనికేషన్ సేవలను రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కిందకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. ఓటీటీ యూజర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ తప్పనిసరి చేయడం, ఈ ప్లాట్ఫామ్లను సెంట్రలైజ్డ్ స్పామ్ డిటెక్షన్ సిస్టమ్స్లోకి ఇంటిగ్రేషన్ చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: యాపిల్ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్.. కీలక మార్పులు ఇవేనా?ఏకీకృత విధానం అవసరం..డిజిటల్ మోసాలకు వ్యతిరేకంగా సమగ్ర వ్యూహాన్ని రూపొందించడానికి టెలికాం ఆపరేటర్లు, రెగ్యులేటర్లు, టెక్నాలజీ ప్రొవైడర్లతో సహా వాటాదారుల మధ్య సహకారం అవరసమని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిర్టెల్ తన ప్రయత్నాలతో ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు ముందడుగు వేసినప్పటికీ, ఓటీటీ ద్వారా ఉత్పన్నమయ్యే మోసాలపై పోరాటానికి, అన్ని కమ్యూనికేషన్ ఛానళ్లను రక్షించడానికి ఏకీకృత విధానం అవసరమని చెబుతున్నారు. -
యాపిల్ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్.. కీలక మార్పులు ఇవేనా?
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఎంత గిరాకీ ఉంటుందో తెలుసుకదా. ప్రత్యేకమైన యాపిల్ సాఫ్ట్వేర్ కోసమే చాలామంది వినియోగదారులు కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు డిజైనింగ్, ఆర్ అండ్ డీ(పరిశోధన, అభివృద్ధి) విభాగం నిత్యం అందిస్తున్న అప్డేట్లకు ఫిదా అవుతుంటారు. ఉత్పత్తుల విషయంలో ఇన్నోవేషన్, డిజైనింగ్లో ప్రసిద్ధి చెందిన యాపిల్ ఇంక్ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాఫ్ట్వేర్ మార్పులకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్ ప్రారంభకానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పులు దాని ఫ్లాగ్షిప్ పరికరాలైన ఐఫోన్, ఐప్యాడ్, మాక్బుక్ల్లో వినియోగదారుల అనుభవాన్ని ఏకీకృతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.మార్పులు ఇవేనా..రాబోయే యాపిల్ సాఫ్ట్వేర్లో మార్పులు ఆపరేటింగ్ సిస్టమ్కు ఏకీకృత డిజైన్ను తీసుకువస్తుందని నమ్ముతున్నారు. మాక్ఓఎస్, ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ మధ్య ఫంక్షనల్ అంతరాలను ఈ మార్పులు భర్తీ చేయనున్నాయని కంపెనీ పేర్కొంది. గత ఏడాది లాంచ్ చేసిన యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ సాఫ్ట్వేర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది. రీడిజైన్లో భాగంగా కొన్ని ఐకాన్లు, మెనూలు, అప్లికేషన్లు, సిస్టమ్ బటన్లలో కూడా మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది భవిష్యత్తులో మరింత క్రమబద్ధమైన, సహజమైన యూజర్ ఇంటర్ఫేస్ను అందిస్తుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: హోలీ గేట్వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!వ్యూహాత్మక లక్ష్యాలుసంస్థ ఆదాయ వృద్ధి మందకొడిగా ఉన్న నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తిని పునరుద్ధరించేందుకు యాపిల్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. యాపిల్కు ఈ రీడిజైనింగ్ కీలకంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ ప్రాథమిక ఆదాయ వనరుగా ఉన్న ఐఫోన్ అమ్మకాలు గత హాలిడే సీజన్లో భారీగా తగ్గిపోయాయి. అద్భుతమైన ఇంటర్ఫేస్ను ప్రవేశపెట్టడం ద్వారా తిరిగి యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు పెంచేలా కంపెనీ చర్యలు చేపట్టింది. టెక్నాలజీ ఆవిష్కరణలో తన స్థానాన్ని అగ్రగామిగా సుస్థిరం చేసుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఐఓఎస్ 19, ఐప్యాడ్ ఓఎస్ 19, మాక్ ఓఎస్ 16ల్లో భాగమైన సాఫ్ట్వేర్ అప్డేట్లను జూన్లో జరిగే యాపిల్ వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో ఆవిష్కరించనున్నారు. -
ఎక్స్పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!
ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యంలోని ఎక్స్(ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు డౌన్ అయింది. ఈ విషయాన్ని మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఎక్స్ సైబర్ దాడిని ఎదుర్కొంటోందని.. హ్యాకర్లను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని ట్వీట్ చేశారు. దీని వెనుక ఒక పెద్ద సమూహం లేదా ఒక దేశం హస్తం ఉండొచ్చు అని మస్క్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతంలోని ఐపీ చిరునామాల నుంచి సైబర్ దాడి జరిగిందని అన్నారు. ఈ కారణంగానే రోజంతా అంతరాయం ఏర్పడిందని అన్నారు.డౌన్డెటెక్టర్ ప్రకారం.. ఎక్స్ ప్లాట్ఫామ్ రోజంతా మూడు అంతరాయాలను ఎదుర్కొంది. మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ అంతరాయాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. రాత్రి 9 గంటలకు కూడా ఈ అంతరాయాలు కొనసాగాయి.ట్రాకింగ్ వెబ్సైట్ దాదాపు 52 శాతం సమస్యలు వెబ్సైట్కు సంబంధించినవని, 41 శాతం యాప్కు సంబంధించినవని, 8 శాతం సర్వర్ కనెక్షన్ సమస్యలతో సంబంధం కలిగి ఉన్నాయని చూపించింది. ఇప్పుడు కూడా అంతరాయం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఎలాన్ మస్క్ 2022లో 44 బిలియన్ డాలర్లకు (రూ. 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ) Xని కొనుగోలు చేశారు. 2023లో అతని ఫాలోవర్స్ సంఖ్య 200 మిలియన్స్ దాటేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. -
భారత్కు ఏఐ నిపుణులు కావలెను
సాక్షి, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ ఇదే. అయితే ప్రపంచ ఏఐ నిపుణులకు కేంద్రంగా మారడానికి భారత్కు అవకాశాలు ఉన్నప్పటికీ.. ఈ రంగంలో నిపుణుల కొరతను దేశం ఎదుర్కొనబోతోందని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ తన తాజా నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న నైపుణ్య అంతరం ఈ రంగంలో దేశ పురోగతికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని తెలిపింది. 2027 నాటికి భారత ఏఐ రంగంలో 10 లక్షలకుపైగా నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తప్పదని జోస్యం చెప్పింది. అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్ల డిమాండ్ ఉంటుందని అంచనాగా వెల్లడించింది. సమస్య నుంచి గట్టెక్కాలంటే కంపెనీలు సంప్రదాయ నియామక విధానాలకు మించి ముందుకు సాగాలి. నిరంతర నైపుణ్యాల పెంపుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆవిష్కరణ–ఆధారిత పర్యావరణ వ్యవస్థను పెంపొందించాలి అని వివరించింది. రీస్కిల్–అప్స్కిల్.. పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి భారత్లో శ్రామిక శక్తి నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం, నైపుణ్యాలను పెంచడం అత్యవసరమని నివేదిక స్పష్టం చేసింది. ‘అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సాధనాలు, నైపుణ్యాలపై ప్రస్తుత నిపుణుల్లో ఎక్కువ మందిలో తిరిగి నైపుణ్యం మెరుగుపర్చడం, పెంచడంలో సవాళ్లతోపాటు అవకాశాలూ ఉన్నాయి’ అని బెయిన్ అండ్ కంపెనీ ఏఐ, ఇన్సైట్స్, సొల్యూషన్స్ ప్రాక్టీస్ పార్ట్నర్, లీడర్ సైకత్ బెనర్జీ తెలిపారు. ‘ప్రతిభ కొరతను పరిష్కరించడానికి బహుముఖ విధానం అవసరం. కంపెనీలు సంప్రదాయ నియామక పద్ధతులకు మించి అంతర్గత ప్రతిభను పెంపొందించడానికి నిరంతర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిభ కొరత ఒక ముఖ్యమైన సవాల్. కానీ అధిగమించలేనిది కాదు. దీనిని పరిష్కరించడానికి వ్యాపార సంస్థలు ఏఐ ప్రతిభను ఆకర్షించడం, అభివృద్ధి చేయడం, నిలుపుకోవడంలో ప్రాథమిక మార్పు అవసరం’ అని నివేదిక వివరించింది. ఏఐ స్వీకరణలో వెనుకంజ.. ఆకర్షణీయంగా జీతాలు పెరిగినప్పటికీ అర్హత కలిగిన ఏఐ నిపుణుల సరఫరా డిమాండ్ వేగాన్ని అందుకోలేదు. ప్రతిభ అంతరం పెరగడం వల్ల పరిశ్రమల్లో ఏఐ స్వీకరణ మందగించే ప్రమాదం ఉందని నివేదిక వివరించింది. ఉత్పాదక ఏఐ సాంకేతికతలను అమలు చేయడానికి అంతర్గత ఏఐ నైపుణ్యం లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి అని ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. ఈ కొరత కనీసం 2027 వరకు కొనసాగుతుందని, అంతర్జాతీయ మార్కెట్లలో వివిధ స్థాయిల్లో ప్రభావం ఉంటుందని అంచనాగా చెప్పారు. దేశంలో 2019 నుండి ఏఐ సంబంధిత ఉద్యోగ నియామకాలు ఏటా 21 శాతం దూసుకెళ్లాయి. అయితే వేతనాలు ప్రతి సంవత్సరం 11 శాతం పెరిగాయి. ఏఐ అవకాశాలు: 2027 నాటికి 23 లక్షలకుపైమాటే. అంటే అందుబాటులో ఉన్న నిపుణులతో పోలిస్తే 1.5–2 రెట్లు అధిక డిమాండ్. మూడేళ్లలో వనరులు: సుమారు 12 లక్షల మందికి చేరిక నిపుణుల కొరత : 10 లక్షల మందికిపైగా డిమాండ్ తీర్చాలంటే: మానవ వనరుల నైపుణ్యం తిరిగి మెరుగుపరచడం (రీస్కిల్), నైపుణ్యాలను పెంచడం (అప్స్కిల్) అత్యవసరం. -
ఎక్స్ డౌన్: గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నాయకత్వంలో నడుస్తున్న ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది వినియోగదారులు ఈ సోషల్ మీడియా యాప్ను యాక్సెస్ చేయలేకపోయినట్లు వెల్లడించారు.ఆన్లైన్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్ఫామ్ డౌన్డెటెక్టర్ నివేదికల ప్రకారం.. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అంతరాయంపై కంపెనీ స్పందించలేదు.X Twitter Down, Users Face Outage: Social media platform X has started showing troubles as several users reported it was not working in India which could be because of a technical glitch. pic.twitter.com/mmhRrJP6Oa— Divya 🦋 (@Hiraeth85) March 10, 2025యాప్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.. చాలా మంది వినియోగదారులకు "ఏదో తప్పు జరిగింది, మళ్లీ లోడ్ చేయడానికి ప్రయత్నించండి" అనే సందేశం వచ్చింది.డౌన్డెటెక్టర్ డేటా ప్రకారం 57% మంది వినియోగదారులు X యాప్తో సమస్యలను ఎదుర్కొంటున్నారని, 34% మంది వెబ్సైట్లో సమస్యలు ఉన్నాయని, 9% మంది సర్వర్ సమస్యలను నివేదించారని తేలింది. UKలో, 61% మంది వినియోగదారులు అప్లికేషన్ గురించి, 34% మంది వెబ్సైట్ గురించి, 5% మంది సర్వర్ సమస్యలను ఎదుర్కొన్నారు.𝕏 is down / having connection issues. @grok is also down and unable to complete requests.— Nicky 🇬🇧 (@NickyThomas) March 10, 2025 -
శాంసంగ్ ప్రీమియమ్ ఫోన్పై భారీ తగ్గింపు
మంచి కెమెరా, డిస్ప్లే, పనితీరు, క్లీన్ యూజర్ ఎక్స్పీరియన్స్తో గతేడాది అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో ఒకటిగా నిలిచిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. అప్పట్లో అధిక ధర కారణంగా ఈ ప్రీమియమ్ ఫోన్ను కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ఫోన్ ఇప్పుడు తగ్గింపు, బ్యాంక్ డిస్కౌంట్ల తరువాత రూ .93,000 కంటే తక్కువకు లభిస్తుంది. మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా వచ్చినప్పటికీ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాకు క్రేజ్ అలాగే ఉంది. కాబట్టి మంచి కెమెరా, ఏఐ ఫీచర్లతో సరైన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్పై భారీ డిస్కౌంట్ల కోసం చూస్తున్నట్లయితే అమెజాన్కి వెళ్లి ఈ డీల్ చూడవచ్చు.తగ్గింపు అలర్ట్శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం అమెజాన్లో రూ.98,499గా ఉంది. లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.1,29,999. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే రూ.2,955 తగ్గింపు లభిస్తుంది. అలాగే కస్టమర్లు నో కాస్ట్ ఈఎంఐ (వడ్డీ ఆదా కోసం), రూ .4,775 నుండి ప్రారంభమయ్యే స్టాండర్డ్ ఈఎంఐ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్ కొనుగోలు కోసం మీరు మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయవచ్చు. దీనికి ఆ ఫోన్ మోడల్, వర్కింగ్ కండీషన్, బ్రాండ్ను బట్టి రూ.22,800 వరకు పొందవచ్చు. యాడ్-ఆన్లుగా వినియోగదారులు రూ .6,999 టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్ను కూడా ఎంచుకోవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్పెసిఫికేషన్లు120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.8 అంగుళాల క్యూహెచ్ డీ+ అమోఎల్ఈడీ ప్యానెల్ ను ఇందులో అందించారు. ఈ డివైజ్ 2,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్పై నడుస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ 45వాట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఇప్పటికే లైవ్ ట్రాన్స్లేట్, సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లను అందిస్తోంది. రాబోయే ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 అప్డేట్తో ఇది మరిన్ని ఏఐ ఫీచర్లను పొందుతుంది.కెమెరా విషయానికొస్తే.. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 5ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్తో పాటు అదనంగా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లభిస్తుంది. ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. -
సన్స్క్రీన్ టెస్టర్ - స్మార్ట్ వాటర్ బాటిల్
వేసవిలో మీ చర్మానికి రక్షణ ఉందా? లేదా? అని ఈ బుల్లి సన్స్క్రీన్ టెస్టర్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్న పెన్డ్రైవ్లా కనిపించే ఈ పరికరం, నిజానికి ఒక ప్రత్యేకమైన కెమెరా.వేసవిలో ఒళ్లంతా చెమటలు పట్టిన తర్వాత, ఈత కొట్టినప్పుడు, రుమాలుతో ముఖం తుడుచుకున్నప్పుడు, రాసుకున్న క్రీమ్స్ చర్మంపై అక్కడక్కడ మిస్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న కెమెరాలో నుంచి చూసినట్లయితే, సన్స్క్రీన్ క్రీమ్ రక్షణ తొలగిపోయిన ప్రదేశాలను డార్క్గా చూపిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్. దీని ధర రూ.10,311 మాత్రమే!స్మార్ట్ వాటర్ బాటిల్వేసవిలో హైడ్రేటెడ్గా ఉండటం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి చాలామంది తరచుగా నీళ్లు తాగటం మరచిపోతుంటారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్తో మీరు హైడ్రేటెడ్గా ఉండొచ్చు.ఈ బాటిల్ మీరు నీటిని తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తుంది. అంతే కాకుండా, అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని చల్లబరచడానికి మంచి కూలింగ్ వాటర్ను అందిస్తుంది. అలాగే వ్యాయామాలు, హైకింగ్లు, బీచ్ డేస్కి తీసుకెళ్లడానికి ఈ వాటర్ బాటిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి. రివ్యూలను చూసి తీసుకోవటం మంచిది. -
కొత్త రకం ఫ్యాన్లు: వీటి గురించి తెలుసా?
వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్గా మారాయి. ఈ క్యాప్స్కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్పోజ్ కాగానే ఆటోమేటిక్గా ఈ ఫ్యాన్స్ పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.చేతిలోనే ఫ్యాన్స్విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్ఫోన్, పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్ను కూడా పాకెట్లో లేదా హ్యాండ్బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్బీ పవర్ సోర్స్కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది. -
'గంటకు రూ. 67కే జీపీయూలు'
న్యూఢిల్లీ: ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్లో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు) అత్యంత తక్కువ ధరకి, గంటకు రూ. 67కే అందుబాటులో ఉంటాయని కేంద్ర ఐటీ మంత్రి 'అశ్విని వైష్ణవ్' తెలిపారు. ఇండియా ఏఐ మిషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్, డేటాసెట్ ప్లాట్ఫాం ఏఐకోశ మొదలైనవి ఆయన ఆవిష్కరించారు.అంకుర సంస్థలు, విద్యార్థులు, పరిశోధకులకు మొదలైన వారికి ఇండియాఏఐ కంప్యూట్ పోర్టల్లో 18,000 జీపీయులు, క్లౌడ్ స్టోరేజ్, ఇతరత్రా ఏఐ సర్వీసులు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు. సొంత ఫౌండేషనల్ మోడల్స్ను రూపొందించుకోవడంపై భారత్ పురోగతి బాగుందన్నారు. ఇందుకు సంబంధించి 67 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.ఏఐ అప్లికేషన్స్, సొల్యూషన్స్ను తయారు చేయడంలో పరిశోధకులు, ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్లకు ఉపయోగపడేలా డేటాసెట్లు, సాధనాలు మొదలైనవన్నీ ఏఐకోశలో ఉంటాయి. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఏఐ ఆవిష్కరణలకు తోడ్పడే సమగ్ర వ్యవస్థను తయారు చేసే దిశగా కేంద్ర క్యాబినెట్ గతేడాది మార్చిలో రూ. 10,372 కోట్ల బడ్జెట్తో ఇండియాఏఐ మిషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. -
టెలికాం ఆపరేటర్లకు ఊరట.. ఎస్యూసీ ఛార్జీలు మినహాయిపు..?
దేశీయ టెలికాం ఆపరేటర్లకు స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలను (SUC) మాఫీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ అంశంపై కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ మార్చి 10న భారత టెలికాం విభాగం(DoT), ఫైనాన్స్ మినిస్ట్రీ అధికారులతో చర్చించబోతున్నట్లు తెలిసింది. దేశ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు కీలకంగా ఉన్న భారత టెలికాం రంగం చాలా కాలంగా ఆర్థిక సవాళ్లతో సతమతమవుతోంది. ఈ తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోనుండడం గమనార్హం.ఎస్యూసీ అంటే ఏమిటి?స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు(ఎస్యూసీ)..రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగించడానికి టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వానికి చెల్లించే రుసుము. ఆపరేటర్ల సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్)లో ఈ ఛార్జీలను కొంత శాతంగా లెక్కిస్తారు. కొన్నేళ్లుగా ఎస్యూసీ టెలికాం కంపెనీలకు ఆర్థిక బాధ్యతగా ఉంటోంది. ఇది వాటి లాభదాయకతను, నిర్వహణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని మాఫీ చేస్తే వీటి లాభాలు పెరుగుతాయనే వాదనలున్నాయి.రూ.5,000 కోట్ల ఆర్థిక ఉపశమనం2022 వేలానికి ముందు కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్కు ఈ మాఫీని వర్తింపజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే టెలికాం ఆపరేటర్లకు సుమారు రూ.5,000 కోట్ల ఆర్థిక ఉపశమనం లభించనుంది. 2022 వేలం తర్వాత కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్పై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఇప్పటికే ఎస్యూసీను తొలగించింది. దాంతో గతంలో కేటాయించిన దానిపై ఈ మినహాయింపు కీలకంగా మారనుంది.టెలికాం రంగంపై ప్రభావం ఇలా..ఈ మాఫీ టెలికాం ఆపరేటర్లపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మౌలిక సదుపాయాలు, సాంకేతికతలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆర్థిక భారాలు తగ్గడంతో టెలికాం కంపెనీలు తమ నెట్వర్క్లను విస్తరించడం, కనెక్టివిటీని మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారించవచ్చు. ఈ రంగంలో ఆరోగ్యకరమైన పోటీని, సృజనాత్మకతను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది.లబ్ధిదారులు ఎవరంటే..రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సంస్థలు ఈ మాఫీ వల్ల గణనీయంగా ప్రయోజనం పొందనున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు రూ.1,100 కోట్లు చొప్పున ఆదా అవుతుందని అంచనా. వొడాఫోన్ ఐడియాకు సుమారు రూ.2,000 కోట్ల ఉపశమనం లభించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వేతన పెరుగుదలలో టీచింగ్ లీడర్లదే హవా!సవాళ్లు ఇవే..ఎస్యూసీ మాఫీ సానుకూల చర్య అయినప్పటికీ ఈ రంగం ఎదుర్కొంటున్న ఇతర ఆర్థిక సవాళ్లను పరిష్కరించడం చాలా అవసరం. ఉదాహరణకు.. పరిశ్రమ ఏజీఆర్ బకాయిలు, అధిక లైసెన్స్ ఫీజులు, 5జీ టెక్నాలజీలో గణనీయమైన మూలధన పెట్టుబడి వంటి చాలా సమస్యలు టెలికాం విభాగాన్ని సవాలుగా మారుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సి ఉంది. -
సమిష్టి కృషితోనే ఆన్లైన్ బెట్టింగ్కి చెక్
న్యూఢిల్లీ: దేశీయంగా వేగంగా విస్తరిస్తున్న అక్రమ ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేయాలంటే అన్ని వర్గాల నుంచి సమిష్టి కృషి అవసరమని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం, గూగుల్ .. మెటాలాంటి బడా టెక్ కంపెనీలు కలిసి పని చేయాలని పేర్కొంది. ‘ఈ అక్రమ రంగం ఏటా 100 బిలియన్ డాలర్ల పైగా ఉంటోంది. ఏటా 30 శాతం పైగా వృద్ధి చెందుతోంది. డిజిటల్ వినియోగం, సాంకేతిక పురోగతి పెరుగుతుండటం, నియంత్రణపరంగా అనిశ్చితి నెలకొనడం ఇందుకు కారణంగా ఉంటోంది. గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రమోషన్లను నియంత్రించడం కష్టతరంగా ఉంటున్న నేపథ్యంలో గూగుల్, మెటాలాంటి బడా సోషల్ మీడియా కంపెనీలతో భారతీయ నియంత్రణ సంస్థలు క్రియాశీలకంగా కలిసి పనిచేయాలి‘ అని నివేదిక వివరించింది. అక్రమ ఆపరేటర్లు అత్యంత అధునాతనమైన డిజిటల్ అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ మాధ్యమాలు, పేమెంట్ వ్యవస్థలు, సాఫ్ట్వేర్ ప్రొవైడర్ల నెట్వర్క్ను ఉపయోగించుకుంటున్నారని వివరించింది. ఆన్లైన్ అక్రమ బెట్టింగ్లనేవి మనీలాండరింగ్, అక్రమ చెల్లింపుల సమస్య పెరిగిపోవడానికి దారి తీస్తున్నాయని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అరవింద్ గుప్తా తెలిపారు. గూగుల్, మెటాలాంటి కంపెనీలు సాధారణంగా అడ్వరై్టజింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈవో) ద్వారా లాభాలు ఆర్జిస్తుంటాయి కాబట్టి అవి అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థలపై నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోలేకపోతుంటాయని పేర్కొన్నారు. ‘‘వాటికి వచ్చే ట్రాఫిక్లో మూడింట ఒక వంతు ఈ వెబ్సైట్ల నుంచే ఉంటోంది. ఈ వెబ్సైట్లు విస్తరించే కొద్దీ బిగ్ టెక్ కంపెనీలకు అడ్వరై్టజింగ్ రూపంలో ఆదాయాలు వస్తున్నాయి. దీని దుష్ప్రభావాల గురించి పూర్తి అవగాహన లేక ఇన్ఫ్లుయెన్సర్లు వీటిని ప్రమోట్ చేస్తున్నారు’’ అని గుప్తా చెప్పారు. ‘ఆపరేటర్లు అక్రమంగా ఆర్జిస్తున్నారు. మనీ లాండరింగ్ చేస్తున్నారు. పేమెంట్ నిబంధనలను తోసిరాజని డొల్ల కంపెనీల ద్వారా, డి్రస్టిబ్యూషన్ చానల్ ద్వారా అక్రమ మార్గాల్లో చెల్లింపులను పొందుతున్నారు. బిగ్ టెక్ కంపెనీలకు నిధులిస్తున్నారు. కాబట్టి బిగ్ టెక్ కంపెనీలు కూడా వారిని కట్టడి చేయడంపై దృష్టి పెట్టడం లేదు‘ అని గుప్తా పేర్కొన్నారు.నివేదికలోని మరిన్ని అంశాలు.. → దేశీయంగా అక్రమ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. 2024 అక్టోబర్–డిసెంబర్ మధ్య పరీమ్యాచ్, స్టేక్, 1ఎక్స్బెట్, బ్యాటరీ బెట్ అనే నాలుగు ప్లాట్ఫాంలలో 1.6 బిలియన్ పైగా విజిట్స్ నమోదయ్యాయి. → 48.2 మిలియన్ విజిట్లతో దీనికి సోషల్ మీడియా కూడా దోహదకారిగా నిలి్చంది. ఫేస్బుక్లాంటి ప్లాట్ఫాంలలో డైరెక్ట్ పెయిడ్ ప్రకటనలు, కంటెంట్ ప్రమోషన్, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ ప్రచార కార్యక్రమాలు మొదలైన వాటి ద్వారా ఈ ట్రాఫిక్ వచి్చంది. నియంత్రణ నిబంధనలపరంగా వాటి వెబ్సైట్ల నిలిపివేతను తప్పించుకునేందుకు ఆయా ఆపరేటర్లు పలు వెబ్సైట్లు నిర్వహిస్తున్నారు. → దాదాపు అన్ని సంస్థలు, (సుమారు 600) ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ, భారత్లో జీఎస్టీ నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. → గ్యాంబ్లింగ్ ప్రకటనలను హోస్ట్ చేయకుండా, జీఎస్టీలాంటివి చెల్లించని అక్రమ సైట్లను ప్రమోట్ చేయకుండా చర్యలు ఉండాలి. ఆ తరహా సైట్లకు చెల్లింపులు జరగకుండా ఫైనాన్షియల్, పేమెంట్ వ్యవస్థలు నిరోధించాలి. → అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లను బ్లాక్ చేస్తే సరిపోదని నార్వే, బ్రిటన్, డెన్మార్క్, బెల్జియం, అమెరికా వంటి దేశాల అనుభవాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి వెబ్సైట్లను బ్లాక్ చేయడంతో పాటు మార్కెటింగ్పరమైన ఆంక్షలు విధించడం, చెల్లింపులను బ్లాక్ చేయడం మొదలైన వ్యూహాలన్నింటి మేళవింపును అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. → అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ మనుగడ సాగించేందుకు దోహదకారులను పూర్తిగా కట్టడి చేసేందుకు నియంత్రణ విధానాలు వేర్వేరుగా ఉండకుండా సమగ్ర వ్యవస్థ ఏర్పాటు కావాలి. → డిజిటల్ మీడియా చానళ్ల ద్వారా యూజర్లకు చేరువ కాకుండా వాటిని కట్టడి చేయడం, అక్రమ లావాదేవీలను బ్లాక్ చేసేందుకు ఆర్థిక నిబంధనలను కఠినతరం చేయడం, వైట్లిస్ట్/బ్లాక్లిస్ట్ రూపంలో నియంత్రణ విధానాలను పటిష్టం చేయడం వంటి చర్యలు చేపట్టాలి. → పన్నులు చెల్లించే కంపెనీలతో వైట్లిస్ట్ తయారు చేసి, మిగతా వాటిని బ్లాక్లిస్ట్లో చేర్చడం వల్ల కొంత నష్టం తగ్గవచ్చు. -
యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్: లాంచ్ ఎప్పుడంటే?
వివో, మోటోరోలా, శాంసంగ్ వంటి కంపెనీలు ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేసి విక్రయిస్తున్నాయి. ఈ విభాగంలో 'యాపిల్' (Apple) కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఎప్పుడు మార్కెట్లో లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉంటుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.యాపిల్ కంపెనీ ఇప్పటి వరకు.. ఫోల్డబుల్ ఫోన్స్ లాంచ్ చేయలేదు. మొదటిసారి ఈ రకమైన స్మార్ట్ఫోన్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. సంస్థ దీనిని 2026లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ధర కూడా 2000 డాలర్లు (రూ. 1.73 లక్షలు) ఉండొచ్చని సమాచారం.ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ గురించి యాపిల్ కంపెనీ అధికారిక సమాచారం వెల్లడించలేదు. ఒకవేళా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ లాంచ్ నిజమైతే.. ఇదే మార్కెట్లో అత్యంత ఖరీదైనదిగా మారనుంది. ప్రతి ఏటా కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసే యాపిల్.. ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేస్తుందనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. యాపిల్ కంపెనీ మాత్రం సైలెంట్గా ఉంది. కాగా త్వరలోనే ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ వంటి వాటితో తరవుతుందని తెలుస్తోంది. అయితే ఇందులో పేస్ ఐడీ ఫీచర్ మిస్ అయ్యే అవకాశం ఉంది. టచ్ ఐడీ ఫీచర్ అనేది సైడ్ బటన్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.ఫోల్డబుల్ ఐఫోన్లో 5.5 ఇంచెస్ కవర్ డిస్ప్లే, 7.8 ఇంచెస్ మెయిన్ ఫోల్డింగ్ డిస్ప్లే వంటివి పొందవచ్చని సమాచారం. ఈ ఫోన్ వెనుక డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండు సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి. ఇప్పటివరకు లీకైన ఫీచర్స్ అద్భుతంగానే ఉన్నాయని తెలుస్తోంది. కానీ దీని పనితీరు గురించి తెలుసుకోవాలంటే.. లాంచ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. -
ఇంటర్నెట్లాగే ఏఐతో కొత్త ఉద్యోగాలొస్తాయ్..
బెంగళూరు: గతంలో ఇంటర్నెట్, సోషల్ మీడియాతో కొత్త కెరియర్లు వచ్చినట్లే కృత్రిమ మేథతో (ఏఐ) కూడా కొత్త ఉద్యోగాలు వస్తాయని జోహో సీఈవో మణి వెంబు తెలిపారు. ఏఐ సొల్యూషన్స్కి సంబంధించి పాశ్చాత్య దేశాలకు భారత్ గట్టి పోటీదారుగా ఎదగగలదని ధీమా వ్యక్తం చేశారు. పుష్కలంగా నిపుణుల లభిస్తుండటం, దేశీయంగా సొల్యూషన్స్ రూపొందించుకోవాలన్న ఆకాంక్షలు పెరుగుతుండటం ఇందుకు దోహదపడగలవని వెంబు చెప్పారు. ఏఐ కల్పించగలిగే అవకాశాలను విశాల దృక్పథంతో పరిశీలించి, తగు దిశలో ముందుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. ఏఐ, కొత్త సాంకేతికతలను ఉపయోగించి తమ ప్రస్తుత సిబ్బంది ఉత్పాదకతను పెంచుకునే మార్గాలపై జోహో ప్రధానంగా దృష్టి పెడుతోందని వెంబు వివరించారు. మరోవైపు, అమెరికాలో విధానాలు, టారిఫ్లపరంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావాలను దేశీ ఐటీ పరిశ్రమ ఇప్పుడే అంచనా వేయలేదని, వేచి చూసే ధోరణిని పాటించాల్సి ఉంటుందని వెంబు చెప్పారు. -
వివో కొత్త 5జీ స్మార్ట్ఫోన్: ధర కూడా తక్కువే!
న్యూఢిల్లీ: హ్యాండ్సెట్స్ దిగ్గజం వివో (Vivo) తాజాగా టీ4 సిరీస్లో తొలి స్మార్ట్ఫోన్ - టీ4ఎక్స్ 5జీని ప్రవేశపెట్టింది. దీని ధర రూ.13,999 నుంచి రూ. 16,999 వరకు ఉంటుంది. మార్చ్ 12 నుంచి ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్స్లో లభిస్తుందని కంపెనీ తెలిపింది.హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ల కస్టమర్లు రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. ఇందులో 6500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫన్టచ్ ఓఎస్ 15, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 50 ఎంపీ ఏఐ కెమెరా, మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలు మొదలైన ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
కొత్త నాయిస్ మాస్టర్ బడ్స్: దీని స్పెషాలిటీ ఏంటంటే..
ఇయర్ బడ్స్ వినియోగం పెరిగిపోతున్న తరుణంలో.. నాయిస్ (Noice) కొత్త 'మాస్టర్ బడ్స్' (Master Buds) ప్రారంభించింది. ఇది సౌండ్ బై బోస్ టెక్నాలజీ కలిగిన వైర్లెస్ ఇయర్ బడ్.మాస్టర్ సిరీస్లోని మొదటి ఉత్పత్తి అయితే ఈ ఇయర్ బడ్స్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. దీని డిజైన్.. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇయర్ బడ్స్ కంటే భిన్నంగా ఉంది. డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, గూగుల్ ఫాస్ట్ పెయిరింగ్ వంటి ఫీచర్స్ కలిగిన ఈ మాస్టర్ బడ్స్ మంచి లిజనింగ్ అనుభూతిని అందిస్తుంది.నాయిస్ మాస్టర్ బడ్స్ స్పేషియల్ ఆడియో సపోర్ట్ను కలిగి ఉంటాయి. పీక్, టైటానియం వంటి అత్యుత్తమ మెటీరియల్లతో తయారైన ఈ బడ్స్.. 12.4 మిమీ డ్రైవర్లతో అమర్చబడి ఉంటాయి. హై-డెఫినిషన్ ఆడియోను మరింత పెంచడానికి, ఇయర్బడ్లు ఎల్హెచ్డీసీ (లో లేటెన్సీ హై డెఫినిషన్ ఆడియో కోడెక్) మద్దతుతో వస్తాయి.సౌండ్ బై బోస్ టెక్నాలజీతో, నాయిస్ మాస్టర్ బడ్స్ అన్ని ఫ్రీక్వెన్సీలలో.. మంచి ఆడియోను అందించేలా తయారైంది. అంతే కాకుండా 49 డెసిబుల్స్ వరకు సౌండ్ ఐసోలేషన్ను అందించే నాయిస్ క్యాన్సిలేషన్ను పొందుతాయి. మ్యూజిక్, కాల్స్ వంటివి చాలా క్లారిటీగా వినిపిస్తాయి.ఇదీ చదవండి: రెండు లక్షలమంది కొన్న కారు: ఇప్పుడు కొత్త ఎడిషన్లో..సాఫ్ట్ టచ్ మెటీరియల్లతో తయారైన నాయిస్ మాస్టర్ ఇయర్బడ్స్.. చెవులపై ఒత్తిడిని కలిగించవు. ఇది మూడు పరిమాణాలలో అందుబాటులో ఉంటుంది. వీటిని మీరు జిమ్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా రోజంతా ఉపయోగించవచ్చు. ఒక ఛార్జితో 40 గంటలు పనిచేసే దీని ధర రూ. 7999 కావడం గమనార్హం. -
టాటా డిస్ప్లే చిప్స్ వస్తున్నాయ్..
దేశీ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్.. డిస్ప్లే చిప్స్ తయారీలోకి ప్రవేశిస్తోంది. ఇందుకు వీలుగా టాటా గ్రూప్ కంపెనీ టాటా ఎల్రక్టానిక్స్ తైవాన్ సంస్థ పీఎస్ఎంసీ, హైమాక్స్ టెక్నాలజీస్తో చేతులు కలిపింది. అంతేకాకుండా గుజరాత్ ప్రభుత్వంతోనూ జత కట్టింది. తద్వారా త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వెరసి గుజరాత్లో తైవాన్ కంపెనీ భాగస్వామ్యంతో డిస్ప్లే చిప్స్ తయారీకి తెరతీయనుంది.ఈ అంశాలను ఐఈఎస్ఏ విజన్ సదస్సులో టాటా ఎల్రక్టానిక్స్ సీఈవో రణదీర్ ఠాకూర్ ప్రకటించారు. టాటా ఎల్రక్టానిక్స్, పీఎస్ఎంసీ, హైమాక్స్ మధ్య అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదిరినట్లు వెల్లడించారు. పీఎస్ఎంసీ టెక్నాలజీ సహకారంతో గుజరాత్లోని ధోలెరాలో హైమాక్స్ కోసం డిస్ప్లే చిప్స్ తయారీని చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఇదీ చదవండి: బ్యాంకు ఉద్యోగుల సమ్మె.. వరుసగా నాలుగు రోజులు సెలవుమూడు విభాగాల్లోనూ.. డిస్ప్లే చిప్స్ను టీవీలతోపాటు, మొబైల్ ఫోన్ తెరలు, కెమెరాలలో ఇమేజ్ సెన్సార్లు, ఎల్ఈడీలు, ఓఎల్ఈడీలు తదితరాలలో వినియోగిస్తారు. తాజా ఒప్పందంతో టాటా ఎలక్ట్రానిక్స్ అన్ని(మూడు రకాల) సెమీకండక్టర్ తయారీ విభాగాల్లోనూ కార్యకలాపాలు విస్తరించనుంది. కంపెనీ ఇప్పటికే పీఎస్ఎంసీ సాంకేతిక భాగస్వామిగా గుజరాత్లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ.91,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. అస్సామ్లోనూ రూ.27,000 కోట్ల పెట్టుబడులతో చిప్ అసెంబ్లీ ప్లాంటును నెలకొల్పుతోంది. -
వ్యర్థాల నుంచి ఖనిజాల వెలికితీతకు సూచనలు
భారత్లో వ్యర్థాల నుంచి కీలకమైన ఖనిజాలను వేరు చేసేందుకు (రికవరీ) విధానపరమైన సంస్కరణల మద్దతుతోపాటు బహుముఖ వ్యూహం అవసరమని ఫిక్కీ–డెలాయిట్ నివేదిక సూచించింది. మైన్ టైలింగ్స్(గనుల పొరలు), ఫ్లై యాష్, ఎర్రమట్టి, మెటల్ స్లాగ్ వంటి వ్యర్థ పదార్థాల నుంచి కీలకమైన ఖనిజాలను వెలికితీయాలని తెలిపింది. టెక్నాలజీ అభివృద్ధి, ప్రాసెసింగ్ సామర్థ్యం, సరఫరా వ్యవస్థతో అనుసంధానం అనే అంశాలు వ్యర్థాల నుంచి విలువైన ఖనిజనాల వెలికితీతకు అవసరమని అభిప్రాయపడింది. శుద్ధ ఇంధన టెక్నాలజీలకు (క్లీన్ ఎనర్జీ/ పర్యావరణ అనుకూల), ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), బ్యాటరీ తయారీకి కీలక ఖనిజాలు ఎంతో ముఖ్యమైనవిగా పేర్కొంది.ప్రపంచ దేశాలు క్లీన్ ఎనర్జీ వైపు మళ్లుతుండడంతో ఈ ఖనిజాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు నివేదిక వివరించింది. విమానాల తయారీ, క్షిపణులు, కార్వెట్స్ తదితర రక్షణ ఉత్పత్తుల తయారీకి సైతం వీటిని వినియోగిస్తున్నట్టు గుర్తు చేసింది. ఈ కీలక ఖనిజ వనరులను సమకూర్చుకునేందుకు భారత్ ఇటీవల ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో.. తక్కువ స్థాయి నిల్వలు, మైనింగ్ కార్యకలాపాలు దీర్ఘకాలం పాటు చేయాల్సి రావడం, ప్రాసెసింగ్ పరంగా ఉన్న అవరోధాలను ఈ నివేదిక ప్రస్తావించింది. కాబట్టి కీలక ఖనిజ వనరుల కోసం ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని, వ్యర్థాల నుంచి ఖనిజాల వెలికితీత మెరుగైన పరిష్కారంగా పేర్కొంది.ఇదీ చదవండి: రిలయన్స్కు రూ.24,500 కోట్ల డిమాండ్ నోటీసులుబూడిద, ఎర్రమట్టి, ఫ్లై యాష్, గనుల పైపొరలు, లోహ వ్యర్థాలు, మెటల్ స్లాగ్ నుంచి నికెల్, కోబాల్ట్, కాపర్, టైటానియం, గాలియంను రికవరీ చేసుకోవచ్చని తెలిపింది. భారత్ కీలక ఖనిజ వనరుల సుస్థిరతకు, డిమాండ్ అవసరాలను తీర్చుకునేందుకు ఈ వనరులు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. చాలా దేశాలు ఇప్పుడు వ్యర్థాల నుంచి కీలక ఖనిజాల వెలికితీత ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నట్టు ప్రస్తావించింది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్: ఆరు నెలలు.. అన్లిమిటెడ్
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చవక ధరలో దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్లతో ప్రైవేట్ టెల్కోలకు సవాలు విసురుతోంది. ప్రైవేట్ ఆపరేటర్లు ఇటీవల ధరలను పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ ఆకర్షణీయమైన ప్లాన్లు దాని వినియోగదారుల సంఖ్య పెరగడానికి దారితీశాయి. గత కొన్ని నెలల్లో మిలియన్ల మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కి మారారు.బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే 70 రోజులు, 90 రోజులు, 150 రోజులు, 160 రోజులు, 336 రోజులు, 365 రోజులు, 425 రోజుల ఎంపికలతో సహా కొన్ని సుదీర్ఘ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. ఇప్పుడు 180 రోజుల ప్లాన్ ప్రవేశపెట్టింది. తరచూ రీచార్జ్ చేసుకునే ఇబ్బందిని తొలగించే లాంగ్ టర్మ్ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఈ కొత్త ఆరు నెలల ప్లాన్ అత్యంత అనువుగా ఉంటుంది.రూ.897 రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ కొత్త రూ .897 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్తో పూర్తి ఆరు నెలలు (180 రోజులు) వ్యాలిడిటీని అందిస్తుంది. వినియోగదారులు ఇకపై నెలవారీ రీఛార్జ్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మార్కెట్లో అత్యంత చౌకైన ప్లాన్లలో ఒకటి. ఇక మిగతా ప్రయోజనాల విషయానికి వస్తే మొత్తంగా 90 జీబీ లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు.