breaking news
Guest Columns
-
ప్రజాభీష్టాన్ని పట్టించుకోవాలి!
స్వతంత్ర భారతదేశం పలు పునర్విభజనలతో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడటాన్ని చూసింది. ఈ మార్పులు దేశంలోని బహుళ సాంస్కృతిక, బహుళ జాతుల సంక్లిష్టతలను ప్రతి బింబింపజేశాయి. లద్దాఖ్లో ప్రస్తుతం కనిపిస్తున్న అశాంతి, సార్వభౌమాధి కారాన్ని పంచుకునేందుకు చేస్తున్న సాధారణ వక్కాణింపు కాదు. వారు స్వతంత్ర ప్రతిపత్తిని ఆకాంక్షిస్తున్నారు. జమ్ము–కశ్మీర్ను విభజించిన తర్వాత, 2019లో లద్దాఖ్కు కేంద్ర పాలిత ప్రాంత (యూటీ) హోదా కల్పించారు. అయితే, తమ హక్కుల పరిరక్షణను కోరుతూ లద్దాఖీయులు 2021 డిసెంబర్లో తిరిగి వీధులకెక్కారు. లద్దాఖ్ ఎందుకు కీలకం?లద్దాఖ్ ఒక శీతల ఎడారి. దాని గణనీయమైన ప్రాంతం చైనా, పాకిస్తాన్ల ఆక్రమణలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రణరంగం సియాచిన్ హిమనదం ఈ ప్రాంతం లోనిదే. వ్యూహ పరంగా లద్దాఖ్కు ఉన్న ప్రాధాన్యం, పొరుగునున్న రెండు శత్రు దేశాల ఉనికి వల్ల భారత్ అప్రమత్తంగా మెలగుతూ, అక్కడ సత్పరి పాలనకు బాధ్యత వహించవలసి ఉంది. ఉపాధి అవకాశాలను తగినంతగా పెంపొందించే విధంగా దాని ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంద కపోతే, ఆ ప్రాంత పౌరుల్లో అసంతృప్తి, అశాంతి కొనసాగుతూనే ఉంటాయి. వాస్తవాధీన రేఖ వెంబడి భారతదేశపు భద్రతను, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడంలో అది విఘాతంగా పరిణమించవచ్చు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయటడంలో లద్దాఖ్ నైసర్గిక స్వరూపం అధికారులకు సవాల్గా పరిణమిస్తోంది. లద్దాఖ్ ఇంత సంక్లిష్టమైనదిగా మారడానికి చారిత్రక కారణాలున్నాయి. డోగ్రా రాజు గులాబ్ సింగ్కు చెందిన సేనాపతి జోరావర్ సింగ్ 1834 –35లో ఈ ప్రాంతాన్ని జయించారు. జమ్ము–కశ్మీర్ అంశం వివాదంగా మారినపుడు, ఆ పెద్ద వివాదంలో లద్దాఖ్ చిక్కుకుంది. భారత సైన్యం 1947లో ప్రతిదాడులు చేపట్టి, ద్రాస్, కార్గిల్, లేహ్ల నుంచి చొరబాటుదారులను తరిమేయడంతో, జమ్ము–కశ్మీర్లోని మూడు పాలిత విభాగాల్లో లద్దాఖ్ ఒకటిగా రూపుదాల్చింది.నిరసనలకు కారణాలులద్దాఖ్ చాలా కాలం అభివృద్ధికి నోచుకోలేదు. పేలవమైన ఆరోగ్య సేవలతో మరణాల రేటు అధికంగా ఉంటూ వచ్చింది. ఉపాధి అవకాశాలు వ్యవసాయానికి, ప్రభుత్వ రంగానికి, చాలా కాలం తర్వాత టూరిజానికి పరిమితమయ్యాయి. దాంతో ప్రభుత్వంపై లద్దాఖ్కు పేచీ తలెత్తింది. తమ సొంత ప్రతినిధుల చేతిలో అధికారం ఉంటేనే, తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అందుకే, 2024 ఫిబ్రవరిలో నిరసనలు తలెత్తడం ఆశ్చర్యం కలిగించలేదు. అవి లేహ్, కార్గిల్లను ఏకం చేశాయి. ఇంజినీర్, విద్యావేత్త, గాంధేయవాది అయిన సోనమ్ వాంగ్చుక్ నాయకత్వ పాత్రను ధరించారు. వాంగ్చుక్ నూతన తరహా పాఠశాలను స్ఫూర్తిగా తీసుకుని హిందీ సినిమా ‘3 ఇడియట్స్’ రూపొందడంతో, ఆయన ఇదివరకే ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆయన నిరాహార దీక్షకు కూర్చుని, శ్రేయోభిలాషుల సలహా మేరకు, 21 రోజుల తర్వాత దాన్ని విరమించుకున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ఇసుమంత కూడా మార్చుకోలేదు. ఆయన గత నెలలోనూ నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. లేహ్లో హింసాయుత ఘటనలు చోటుచేసుకోవడంతో, మళ్ళీ విరమించుకున్నారు. తదనంతరం, ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి, జోధ్పూర్ జైలుకు తరలించారు. చర్చలతో ఈ సమస్యకు ఒక పరిష్కారం లభించవచ్చు. కానీ, ఆ ప్రక్రియలో వాంగ్చుక్కు పాత్ర కల్పించడం ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. కాల్పుల్లో నలుగురు నిరసనకారులు మరణించిన ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని వాంగ్చుక్ కోరుతున్నారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ హోదా, లద్దాఖ్కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ల విషయంలో లేహ్ అపెక్స్ బాడీకి, కార్గిల్ డెమొక్రాటిక్ అలయ¯Œ ్సకు తన మద్దతును పునరుద్ఘాటించారు. రాష్ట్ర హోదా వచ్చేనా?జమ్ము–కశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్నపుడు లద్దాఖ్ నుంచి శాసన సభలో నలుగురు సభ్యులు, ఒక లోక్సభ సభ్యుడు ఉండే వారు. ఈ ప్రాతినిధ్యం తగినంతగా లేదనే భావన అప్పుడూ ఉంది. ఈ ప్రాంతం, ప్రజల పట్ల అధికారులు వివక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రజాస్వామిక, ప్రాతినిధ్య పరిపాలనను పటిష్ఠ పరచేందుకు లేహ్కు (1995లో), కార్గిల్కు (2003లో) లద్దాఖ్ స్వయం ప్రతిపత్తి పర్వత ప్రాంత అభివృద్ధి మండళ్ళను జమ్ము– కశ్మీర్ ప్రభుత్వం ఎట్టకేలకు ఏర్పాటు చేసింది. కానీ, ఇది క్షేత్ర స్థాయిలో పరిస్థితులలో మార్పు వచ్చేందుకు తోడ్పడలేకపోయింది. 2019 ఆగస్టు 5న, 370వ అధికరణాన్ని రద్దు చేయడంతో కేంద్రపాలిత ప్రాంత హోదా డిమాండ్ నెరవేరిందికానీ, అవకాశా లను అది పరిమితం చేసింది. పాలనా యంత్రాంగంలోకి తీసుకునేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటిదేమీ లేకపోవడం వల్ల కేంద్ర పాలిత హోదా ఎక్కువ ఉద్యోగావకాశాలను చూపలేకపోయింది. దాదాపు 3 లక్షల జనాభా కలిగిన లద్దాఖ్ వ్యవస్థాగతంగా బలహీనంగా ఉంది. యూటీ అనిపించుకున్నా వనరులపై హక్కులు ఉండవు కనుక, అది రాష్ట్ర హోదాను కోరుకుంటోంది. అధికార కేంద్రీకరణకు మొగ్గు చూపే బీజేపీ కేంద్రంలో గద్దెపై ఉండటం వల్ల, రాష్ట్ర హోదా మంజూరు కుదిరే పని కాదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్టులు కట్టబెడుతుందనీ, బయటి ప్రాంతాల కార్మికులు ఉన్న కొద్ది పాటి అవకాశాలను ఎగరేసుకుపోతారనీ ఈ ప్రాంతంలో భయాందో ళనలు ఉన్నాయి. అందుకే, తమను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యులులో చేర్చాలనీ, రాష్ట్ర హోదా కల్పించాలనీ అడుగుతున్నారు. లద్దాఖ్కు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్, రెండు పార్లమెంట్ సీట్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి, ఉద్యోగావకాశాలు, రాజకీయ ప్రాతినిధ్య పెంపునకు పురిగొల్పే విధంగా ప్రత్యేక రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలని లద్దాఖ్ ప్రజానీకం చేస్తున్న డిమాండ్ న్యాయబద్ధమైనదే!అజయ్ కె. మెహ్రావ్యాసకర్త ‘సెంటర్ ఫర్ మల్టీ లెవెల్ ఫెడరలిజం’లోవిజిటింగ్ సీనియర్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విశ్రాంత పాత్రికేయులకేదీ భరోసా?
సంక్షేమంలో ఛాంపియన్లుగా పేరుపొందిన తెలుగు రాష్ట్రాలు పాత్రికేయుల సంక్షేమాన్ని మాత్రం పక్కన పెడుతున్నట్లున్నది! 1,000 నుంచి 2,500 రూపా యల పీఎఫ్ పెన్షన్ మాత్రమే అందుకొంటూ విశ్రాంత జీవితాన్ని నానాపాట్లూ పడుతూ గడుపుతున్న 60 ఏళ్లు పైబడిన విశ్రాంత పాత్రికేయులను పట్టించు కోవడం లేదని... కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.మన తెలుగు రాష్ట్రాల్లో గౌరవప్రదమైన జీతభత్యాలు ఇస్తూ, పీఎఫ్ చందాలు కడుతూ పాత్రికేయులకు అండగా, ఆలంబనగా నిలుస్తున్న సంస్థలు పరి మితమే. ఉద్యోగ భద్రత, నెలవారీగా వేతనం వస్తుందన్న గ్యారెంటీ లేకుండా జీవితాన్ని గడిపే పాత్రికేయులే ఇప్పడు ఎక్కువగా ఉన్నారు. అటువంటి వారు రిటైరైన తర్వాత కూడా కనీస అవసరాలు తీరక నరకయాతన పడుతున్నారు. ఉద్యోగంలో ఉన్నంత కాలం సమాజంలోని అన్ని వర్గాల కోసం పాటుపడిన పాత్రికేయులు రిటైరయ్యాక ఎవరూ పట్టించుకోని దైన్యస్థితిలో బతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. అక్ష రాన్నే నమ్ముకుని ఉన్న వేలాదిమంది పాత్రికే యుల పరిస్థితి అసంఘటిత కార్మికుల కంటే తీసికట్టుగా తయారైంది. చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?నిజానికి, తెలుగు రాష్ట్రాలు తప్ప దేశంలో మరో 19 రాష్ట్రాలు విశ్రాంత పాత్రికేయులకై పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా నెలకు రూ. 20 వేల చొప్పున పెన్షన్ను 60 ఏళ్ళు పైబడిన పాత్రికేయులకు అందజేస్తోంది. అసోం నెలకు రూ. 5 వేలు, ఛత్తీస్గఢ్ 10 వేలు, గోవా 10 వేలు, హరియాణా 10 వేలు, మన పొరుగునే ఉన్న కర్ణాటక 10 వేలు, కేరళ 11 వేలు చెల్లిస్తున్నాయి. పంజాబ్లో 12 వేలు, రాజస్థాన్లో 15 వేలు, తమిళనాడులో 12 వేలు, త్రిపురలో 10 వేల చొప్పున విశ్రాంత జీవితం గడుపుతున్న పాత్రికేయులకు పెన్షన్గా అందచేస్తున్నారు. ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులుతెలుగు రాష్ట్ర్రాలు వందల కోట్ల నిధులతో లక్షలమందికి సామాజిక పెన్షన్లు అందచేస్తున్నాయి. అయితే అరకొర ఆదాయంతో రిటైర్మెంట్ జీవి తాన్ని గడుపుతున్న పాత్రికేయులకు పెన్షన్ వసతి కల్పించడానికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ గత ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో పాత్రికేయులకు పెన్షన్ ఇస్తామంటూ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఆ వాగ్దానాన్ని గుర్తుచేశారు విశ్రాంత పాత్రికేయులు. త్వరలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలనూ కలిసి వినతిపత్రం సమర్పించ నున్నారు. రిటైర్డ్ జర్నలిస్టులకు దేశమంతటా ఒకే పెన్షన్ విధానం కావాలని సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సైతం తీర్మానం చేసింది. అక్షరాన్ని నమ్ముకొని, సమాజానికి మార్గదర్శనం చేసిన వయోధికులకు పాలకులు అండనివ్వాలి. – చొప్పరపు కృష్ణారావుపాత్రికేయుడు 84668 64969 -
ఊహకందని అంచనాలతో ఉత్కంఠ!
పండుగల సమయంలోనూ బిహార్ రాజకీయాలలో మునిగితేలుతుంది. బిహా రీలకు రాజకీయాలకు మించిన కాలక్షేపం లేదు. బిహార్ శాసన సభ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగ నున్న నేపథ్యంలో ఎన్నికల పండుగ మొద లైపోయింది. నితీశ్ కుమార్ ఎక్కడుంటే అధికారం అక్కడేనని గడిచిన రెండు దశాబ్దాలలో బిహార్లో ఒక కొత్త నానుడి రూపుదిద్దు కుంది. పొత్తు పెట్టుకున్న పార్టీలను దూరం పెట్టేదిగా బీజేపీ పేరు మోసినప్పటికీ, రాష్ట్రంలో అది జూనియర్ భాగస్వామిగా సంతృప్తి పడటానికి బహుశా అదే కారణం. నితీశ్ నేతృత్వంలోని జేడీ (యు)తో పొత్తు పెట్టుకున్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నాయక త్వంలోని ఆర్జేడీ కూడా అదే రకమైన సంకట స్థితిని ఎదుర్కొంది.నితీశ్ సరసన లేని ఏ పార్టీ అయినా, ఆయనపై విషం చిమ్మడం ఖాయం. అయినప్పటికీ, ఆయనతో అంటకాగాలని రహస్యంగా కోరుకుంటాయి. లాలూ 2022లో నితీశ్తో చేతులు కలపడానికి ఇదే కారణం. 2017లో చీలిక చేదును మిగిల్చినా లాలూ దాన్ని దిగ మింగుకోవాల్సి వచ్చింది. మహాఘట్ బంధన్ రెండు విడతల హయాంలో నితీశ్తో ఎన్నడూ పొత్తు పెట్టుకోమని బీజేపీ నాయ కులు బాహాటంగా ప్రతిన బూనారు. కానీ తమ ‘సహజ భాగ స్వామి’తో రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. నితీశ్ బలాబలాలుగతంలో బిహార్లో ఎన్నికల విజయాన్ని నితీశ్ ఎలా సొంతం చేసుకున్నట్లు? నితీశ్ 2005లో బిహార్ సీఎం అయినపుడు తన శక్తి యుక్తులన్నింటినీ శాంతి భద్రతల నిర్వహణపై కేంద్రీకరించారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, రవాణా, విద్యా రంగాలు మెరుగుపడ్డాయి. స్కూళ్ళలో అడ్మిషన్లను, హాజరును పెంపొందించేందుకు ఆయన 2006లో ‘స్కూల్ చలో అభియాన్’ ప్రారంభించారు. బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేశారు. అలా 2005లో ఒక మౌన విప్లవం మొదలైంది. రాష్ట్రంలో 2005లో కేవలం 1.8 లక్షల మంది బాలికలు 10వ తరగతి పరీక్షకు కూర్చుంటే, ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయ బోతున్న 15.85 లక్షల మంది విద్యార్థులలో సగంపైగా బాలికలే. ప్రతి ఒక్కరికీ ఇల్లు, తాగునీటి సదుపాయం కార్యక్రమాన్ని నితీశే మొదట ప్రారంభించారు. కానీ, అంతగా సఫలీకృతులు కాలేక పోయారు. రాష్ట్రం నుంచి జనం ఇప్పటికీ వలస పోతూనే ఉన్నారు. అనేక మానవ, అభివృద్ధి సూచికలలో బిహార్ అట్టడుగున ఉంది. నితీశ్ మూడవ, నాల్గవ విడత పాలన అనేక కారణాల రీత్యా అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి నితీశ్ వివిధ వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోగ్య స్థితి కూడా నిశిత పరిశీలనకు గురవుతోంది. ఈ కారణంగానే, ఈసారి నితీశ్ ప్రభుత్వం కోటి మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 చొప్పున నగదు జమ చేసింది. రకరకాల రాయితీలను, వరాలను ప్రకటించింది. తేజస్వి ప్లస్ కూటమినితీశ్ ప్రధాన ప్రత్యర్థి తేజస్వి యాదవ్, గత ఎన్నికల్లో అద్భు తమైన ఫలితాలు సాధించారు. ఆయన మహాఘట్ బంధన్ కేవలం 16,825 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్, వామ పక్షాలు ఇప్పటికీ ఆయనకే మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఓట్ల పునాదికి కోత పడినప్పటికీ, రాహుల్ గాంధీ తన యాత్రలో తేజస్విని పటిష్ఠపరచేందుకు ప్రయత్నించారు. మొత్తం ప్రతిపక్షమంతా తేజస్వి వెనుకనే నిలిచిందని చాటేందుకు దీపాంకర్ భట్టాచార్య (వామపక్షం), అఖిలేశ్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ), సంజయ్ రౌత్ (శివసేన), ఎం.కె.స్టాలిన్ (డీఎంకే), హేమంత్ సొరేన్ (జేఎంఎం), యూసుఫ్ పఠాన్ (తృణమూల్ కాంగ్రెస్) ఆయన యాత్రలో పాల్గొన్నారు. అయితే, ఆయన సహచరుల,సొంత కుటుంబ సభ్యుల మితిమీరిన ఆశలు పెను సవాలును విసురుతున్నాయి. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన కొత్త ఓటర్ల జాబితా 69 లక్షల ఓటర్ల తొలగింపును, 21 లక్షల మంది పేర్ల కొత్త జోడింపును చవి చూసింది. మహాఘట్ బంధన్ కొన్ని నెలలుగా దాన్నొక రాజకీయ అంశంగా మారుస్తూ వస్తోంది. సీట్ల పంపకంపై ప్రస్తుతం మహా ఘట్ బంధన్లో బురద జల్లుకునే కార్యక్రమం సాగుతోంది. ఇది ప్రతిసారీ కనిపించేదే. కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కలసి పోటీ చేయడం మాత్రం ఖాయం. పీకే ప్రభావంప్రశాంత్ కిశోర్, ఆయన ‘జన్ సురాజ్’ పార్టీ మరో ప్రభావిత అంశం కానుంది. ఆయన గతంలో, 2014 ఎన్నికలకు ముందు బీజేపీకి ఎన్నికల నిర్వహణ సేవలందించారు. తదనంతరం,కాంగ్రెస్, వైసీపీ, తృణమూల్, ఆప్, డీఎంకేలతో పాటు, చివరకు నితీశ్ కుమార్కు కూడా సేవలందించారు. రాష్ట్రంలో ఈ విడత ఎన్నికల సందర్భంగా, ప్రతి జిల్లాలోనూ ప్రశాంత్ కిశోర్ పాదయాత్రలు చేశారు. గత ఏడాదిగా ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శించి ప్రజలతో నేరుగా సంభాషించారు. రాత్రిపూట గ్రామాల్లోనే బస చేశారు. నితీశ్, బీజేపీ, ఆర్జేడీలపై సమానంగా విమర్శలు గుప్పించారు. ఆయన పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, ఆయన పార్టీకి నిధుల కొరత కూడా లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా లేక హంగ్ అసెంబ్లీ ఏర్పడే పక్షంలో కింగ్ మేకర్గా మారతారా? విజ యానికి పెద్ద సంఖ్యలో జన వాహినులు, ఆకర్షణీయమైన నినా దాలు అవసరమేగానీ, అవి విజయానికి పూచీ నివ్వలేవు. బీజేపీ గురించి కూడా ముచ్చటించుకుందాం. ఈ కాషాయ పార్టీకి అద్భుతమైన సంస్థాగత బలం ఉంది. కుల సమీకరణలు కూడా దానివైపు పటిష్ఠంగా ఉన్నాయి. జేడీ(యు)తోపాటు, చిరాగ్ పాశ్వాన్, జీతన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయేను తిరుగులేని కూటమిగా నిలబెడుతున్నారు. గత ఎన్నికల్లో, జేడీ (యు)తో పోల్చుకుంటే బీజేపీ రెట్టింపు సీట్లకు పైగా గెలుచుకున్నా, ముఖ్యమంత్రిగా తమ అభ్యర్థే ఉండాలని పట్టుబట్టలేదు. విశ్వస నీయమైన ముఖం ఏదీ లేకపోవడం దాని బలహీనత. ఈ అంశంపై ఇప్పుడు కాకపోయినా, రాబోయే రోజుల్లోనైనా ఆ పార్టీ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు. బిహార్ ఒక ఆసక్తికరమైన దశలోకి అడుగిడుతోంది. చివరి నిమిషం వరకు అంతిమ ఫలితం నిర్ణయం కాదని గత అసెంబ్లీ ఎన్నికలు సూచిస్తున్నాయి. ఎన్నికల సంరంభపు హడావిడి సద్దుమణగి,అంతిమ సంఖ్యా బలాలు వెల్లడైన తర్వాత, అసలు క్రీడ ఆరంభం కాబోతోంది. శశి శేఖర్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు(‘ది హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
'ఇష్టం ఉంటే' కష్టం ఉండదు!
కొత్తగా పట్టభద్రులైన వారికి అభినందనలు. ప్రత్యక్షంగా మీ ముందు లేకుండా, ఇలా ఇంటి నుంచి వర్చ్యువల్ ప్రసంగం చేస్తా నని నేను ఊహించలేదు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఆశావహ దృక్ప థంతో మెలగడం కష్టమే! కానీ, మీరు మరింత శక్తిమంతులుగా, ఉన్నతు లుగా నిరూపించుకోగలరనడంలో సందేహం లేదు. ఎందు కంటే, మీకంటే ముందు చాలా మంది దాన్ని రుజువు చేశారు. వందేళ్ళ క్రితం, 1920లో స్పానిష్ ఫ్లూ సమయంలోనూ కొందరు పట్టభద్రులుగా బయటకు వచ్చారు. అప్పటికి యాభై ఏళ్ళ తర్వాత, 1970లో వియత్నాం యుద్ధ కాలంలోనూ గ్రాడ్యుయేట్లు అయినవారున్నారు. అంతెందుకు, సెప్టెంబర్ 11 ఘటనకు కొద్ది నెలల ముందు 2001లో చదువు పూర్తి చేసుకుని యూనివర్సిటీల నుంచి బయటకొచ్చినవారు లేరా? మహమ్మారులను, యుద్ధాలను, ఇతర సంక్షోభాలను దాటుకుని వచ్చినవారు ఎందరో ఉన్నారు. వారు కొత్త సవాళ్ళను అనేకం ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని సంద ర్భాలలోనూ వారు విజయులుగా నిలిచారు. ఆశావాదంతో బతకమని మన సుదీర్ఘ చరిత్ర చాటుతోంది. ఆశావహులై ఉండండి. వర్తమానంలోని ప్రతి తరం, తమ తర్వాత రాబోయే తరం గురించి తక్కువ అంచనా వేసే విచిత్ర ధోరణిని నేను గమనించాను. ఒక తరం సాధించిన ప్రగతి తదుపరి తరానికి పునాది అవుతుందని గ్రహించ లేకపోవడమే దానికి కారణం. కొత్త వ్యక్తుల సమూహం అన్నింటినీ సాధ్యం చేసి చూపిస్తుంది. మీ అనన్యమైన దృక్పథం ఇంతవరకు ఊహించని వాటిని కూడా మన ముందుకు తేవచ్చు. టెక్నాలజీలో పుట్టిన తరంటెక్నాలజీ అంతగా అందుబాటులో లేని కాలంలో పెరిగి పెద్దవాడినయ్యాను. నాకు పదేళ్ళు వచ్చేదాకా నేను టెలిఫోన్ ముఖమే చూడలేదు. చదువుకునేందుకు అమెరికా వచ్చిన తర్వాతనే కంప్యూటర్ను రోజూ వాడుకోవడం కుదిరింది. పాత రోజుల్లోకి వెళితే, ఎంతో కాలానికి ఇంటికొచ్చిన టెలివిజన్లో ఒకే ఛానల్ ఉండేది. మీకిపుడు రకరకాల ఆకృతుల్లో, పరిమాణాల్లో కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా, దేని గురించైనా కంప్యూటర్ను అడగగలిగే సామర్థ్యం మీకిపుడు ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కానీ, అటువంటి సామర్థ్యాన్ని నిర్మించడంపైనే నేను ఓ దశాబ్ద కాలం పనిచేశాను. మిమ్మల్ని చూసి నేను కుళ్ళుకోను. ఈ రకమైన ప్రగతి నన్ను మరింత ఆశావహుడిని చేస్తుంది. టెక్నాలజీకి సంబంధించిన కొన్ని అంశాలు మిమ్మల్ని బహుశా నిస్పృహకూ, అసహనానికీ లోనుచేస్తూ ఉండవచ్చు. ఆ అసహనాన్ని అలాగే ఉండనివ్వండి. ఎందుకంటే, అదే కొత్త టెక్నాలజీ విప్లవాన్ని సృష్టిస్తుంది. నా తరం కలలుకనే సాహసం చేయలేనివాటిని మీరు తయారు చేసి చూపించగలరు. వాతావరణ మార్పు లేదా విద్యా రంగ సమస్యల పట్ల మా వైఖరి కూడా మిమ్మల్ని నిస్పృహకు గురిచేసి ఉండవచ్చు. అసహనంతోనే మెలగండి. అది ప్రపంచానికి అవసర మైన ప్రగతిని సృష్టిస్తుంది. పరిస్థితులను మార్చాలి, ఏదో చేయాలి అనే తపన నవీకరణలకు దారితీసి, ప్రపంచానికి కొత్త రూపురేఖలను సంతరిస్తుంది. టెక్నాలజీ మన కుటుంబాలకు ఎంతగా అందుబాటు లోకి వస్తే, మన జీవితాలు అంతగా మెరుగవుతాయి. మెరుగైన సెమీకండక్టర్లను తయారు చేయడం ద్వారా ఆ పని చేయగలనని నేను గ్రాడ్యుయేట్ని అయినపుడు భావించాను.అప్పటికి అంతకన్నా ఉత్తేజకరమైన అంశం ఏముంది? నేను అమెరికా రావడం కోసం విమాన టికెట్కు మా నాన్న ఒక ఏడాది జీతాన్ని వెచ్చించవలసి వచ్చింది. ఇంటికి ఫోన్ చేసేందుకు నిమి షానికి 2 డాలర్లకు పైగా ఖర్చయ్యేవి. బ్యాక్ ప్యాక్ కొనేందుకు కూడా ఇండియాలో మా నాన్నకు వచ్చే ఒక నెల జీతం అంత ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అందరి కోసం టెక్నాలజీనేను స్టాన్ఫోర్డ్లో చేరిన ఏడాదే ఇంటర్నెట్ రూపుదిద్దుకోవడం మొదలుపెట్టింది. అదే ఏడాది మొజాయిక్ బ్రౌజర్ విడుదలైంది. అది వరల్డ్ వైడ్ వెబ్, ఇంటర్నెట్లను ప్రాచుర్యంలోకి తెచ్చింది. టెక్నాలజీని మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటర్ నెట్ ఏకైక ఉత్తమ మార్గం అవుతుందని నాకు అప్పటికింకా తెలియలేదు. ఆ సంగతి గ్రహించాక, గూగుల్లో నేను నా కలలను సాకారం చేసుకునే పనికి ఉద్యమించాను. నా నేతృత్వంలో సాగిన కృషితో 2009లో క్రోమ్ మొదలైంది. సరసమైన ధరలకు ల్యాప్ టాప్లను, ఫోన్లను అందించడంలో గూగుల్ చేసిన కృషికి సహాయపడ్డాను. గ్రాడ్యుయేషన్ తర్వాత పీహెచ్డీ చేసివుంటే అమ్మ, నాన్న గర్వపడేవారే. కానీ, టెక్నాలజీ ప్రయోజనాలను అనేకమందికి అందుబాటులోకి తెచ్చే అవకాశాన్ని కోల్పోయి ఉండేవాడిని. గూగుల్ సీఈఓగా ఈరోజు మీ ముందు నిల్చొని మాట్లాడగలిగి ఉండేవాడిని కాదు. మీదైన రీతిలో ప్రపంచాన్ని మెరుగైనదిగా మార్చండి. మీకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని, మీదైన విశిష్టమైన మార్గంలో సాను కూల ప్రభావాన్ని చూపేందుకు, దాన్ని వినియోగించుకోండి. క్యాలిఫోర్నియా రాష్ట్రంలో 27 ఏళ్ళ క్రితం మొదటిసారి అడుగిడి నపుడు ఇవేవీ నా ఊహల్లో లేవు. అదృష్టంతోపాటు టెక్నాలజీ పట్ల గాఢమైన వ్యామోహం, విశాల దృష్టితో వ్యవహరించడం నన్నిక్క డకు తీసుకొచ్చాయి. అసహనమూ మంచిదే!ప్రపంచంలో మిగిలిన వాటన్నింటి కన్నా మిమ్మల్ని ఏది ఎక్కువ ఉత్తేజపరుస్తోందో దాన్ని కనుగొనే ప్రయత్నం చేయండి. మీ తల్లితండ్రులు చెప్పారని లేదా మీ స్నేహితులు చేస్తున్నారని లేదా సమాజం మీ నుంచి ఆశిస్తోందనే కారణంతో మీకిష్టం లేని పనుల్లోకి దిగకండి. ఊహించని దారులు గణనీయమైన ప్రభావానికి దారితీస్తాయి. ఎంచుకున్న రంగం ఇష్టమైనదైతే మనసు పెట్టి పనిచేయగలుగుతారు. అదృష్టం, పరిస్థితుల కన్నా, మీ వ్యామోహమే మిమ్మల్ని ముందుకు నడిపించే చోదక శక్తిగా పనిచేస్తుంది. అది మీ గమనాన్ని తీర్చిదిద్ది, కలకాలం నిలవగల వారసత్వాన్ని మిగల్చగలుగుతుంది. దేనినైనా అక్కున చేర్చుకునేందుకు సిద్ధ్దంగా ఉండండి. ఉన్న వాటిని ఇంకా మెరుగుపరచాలనే అసహనంతోనే వ్యవహరించండి. ఆశావహ దృక్పథాన్ని వీడవద్దు. ఇదే నేనిచ్చే సలహా. మీరు ఆ పని చేయగలిగితే చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. అన్నింటినీ మార్చగలిగిన అవకాశం మీకుంది. మీరు మారుస్తారనే నమ్మకం కూడా నాకుంది! -
ఒక తల్లి – ఆమె కూతురు
అరుంధతీ రాయ్ తన పేరులోని ‘ఫస్ట్ నేమ్’ వదులుకున్నారని మీకు తెలుసా? 18 ఏళ్లప్పుడు ‘‘నా మొదటి పేరు సుజానాను వదిలేసుకున్నాను. అప్పట్నుంచీ క్రమంగా, ఉద్దేశపూర్వకంగా, వేరెవరి మాదిరిగానో రూపాంతరం చెందుతూ వచ్చాను’’ అని తన తాజా పుస్తకంలో వెల్లడించారు. ‘మదర్ మేరీ కమ్స్ టు మి’లో ఆమె ఇలాంటి ఇంకా అనేక చిరు జ్ఞాపకాలను పంచుకున్నారు. మత్తుమందు లేకుండా గర్భస్రావం చేయించుకున్న సంగతి మన దృష్టిని ఆకర్షించే మరో దృష్టాంతం. అప్పటికి ఆమెకు ఇరవై రెండేళ్ళు. ‘‘అది భయంకరం. కానీ, అలా జరిగిపోయిందంతే’’ అని రాశారు. అదే రోజు రాత్రి ఆమె మరుసటి రోజు షూటింగ్లో పాల్గొనేందుకు హోశంగాబాద్ నుంచి పంచ్మఢీ వెళ్ళే రైలు ఎక్కేశారు. తల్లి మేరీ రాయ్తో ఆమెకు పడేది కాదు. ఈ పుస్తకం పాక్షికంగా ఆ సంగతులనూ, అరుంధతి జీవితంలోని వివిధ దశల్లోని ఆత్మా నుగత వివరాలనూ వెల్లడిస్తుంది. అవి తరచూ కలతకు గురి చేస్తాయి. అరుంధతి తన తల్లిని ‘శ్రీమతి రాయ్’ అనే సంబోధిస్తూ వచ్చారు. పుస్తకం వెనుక వైపు అట్టలో ఆమెను ‘బందిపోటు’ అని పేర్కొన్నారు. కానీ, ఈ పుస్తకం చదువుతూంటే ఆమె నాకు రాక్షసిగానే తోచారు. అరుంధతికి ఆరేళ్లున్నప్పుడు మొదటిసారి విమాన ప్రయాణంలో ‘‘అమ్మా! పిన్ని నీలాగా కాకుండా అంత సన్నగా ఉంటుంది ఎందుకని?’’ అని ప్రశ్నించడం ద్వారా తల్లికి చిర్రెత్తుకొచ్చేటట్లు చేసింది. ఆ ప్రశ్నకు ఆవిడ ఎంతగా కోప్పడిందంటే, అరుంధతి దానికి భయపడి విమానం కూలిపోవాలని కోరుకున్నారట. ‘‘విమానం కూలి మేమంతా చస్తే సరిపోతుంది అనిపించింది.’’అరుంధతిని మేరీ తరచు ‘బిచ్’ అనే తిట్టేవారు. సోదరుడు క్రిస్టొఫర్ను ఇంకా దారుణమైన మాటలన్నారు. ‘‘తను కౌమారంలో ఉన్నప్పుడు, అమ్మ ఒకసారి అందికదా: ‘నువ్వు అసహ్యంగా ఉన్నావు, తెలివితక్కువ సన్నాసి, నేను నీ స్థానంలో ఉంటే ఈపాటికి ఆత్మహత్య చేసుకునేదాన్ని.’’ మేరీ రాయ్లో మెచ్చుకోదగిన పార్శ్వం కూడా ఉంది. ఆమెది దృఢ సంకల్పం. ఆమె నెలకొల్పిన పల్లికూడంను చక్కని పాఠశాలగా పరిగణించేవారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను చెప్పడంతోబాటు మంచి నడవడికను అలవరచేవారు. వారి స్నానపానాలను, మరుగు దొడ్లను శుభ్రం చేయడాన్ని మేరీ స్వయంగా పర్యవేక్షించేవారు. ఓసారి బాలురు ఆడపిల్లల వక్షోజాలు, వేసుకునే బ్రాల గురించి అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించినపుడు, మేరీ తన కప్ బోర్డు నుంచి ఒక బ్రాను బయటకు తెచ్చి ‘‘ఇదే బ్రా. దీన్ని ఆడవాళ్లందరూ వేసుకుంటారు. మీ అమ్మలు వేసుకుంటారు. తొందరలోనే మీ అక్కచెల్లెళ్ళు వేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని అంతగా ఉత్తేజపరుస్తోందనుకుంటే, దీన్ని ఉంచుకోండి’’ అన్నారట. అరుంధతి నటించిన లేదా స్క్రిప్టు సమకూర్చిన ‘మాసీ సాహెబ్’, ‘ఇన్ విచ్ యానీ గివ్స్ ఇట్ దోజ్ వన్స్’, ‘ఎలక్ట్రిక్ మూన్’ లాంటి చిత్రాలతో ఈ పుస్తకం అరుంధతి జీవితపు తొలినాళ్ళలోకి తీసుకెళుతుంది. అయితే ‘గార్డియన్’ పత్రిక చిత్ర సమీక్షకుడు డెరెక్ మాల్కమ్ ‘‘పేరు మార్చి ఉండాల్సింది. ‘గివ్స్ ఇట్ దోజ్ వన్స్’ అనే దానికి ఇంగ్లీషులో అర్థమే లేదు’’ అని పెదవి విరిచారు. అరుంధతి, ఆమె బృందం ఆ వ్యాఖ్యను బాగా వాడుకున్నారు. ‘‘మిష్టర్ మాల్కమ్, ఇంగ్లండ్లో మీరు ఇక ఎంతమాత్రం ఇంగ్లిష్ మాట్లా డటం లేదు’’ అని పబ్లిసిటీ చేశారు. ఆమె జైలులో గడిపిన ఒక రోజు గురించి కూడా ఈ పుస్తకం ప్రస్తావించింది. ‘‘జైలు గది తలుపు వెనుక వైపు మూసుకున్న శబ్దం, నాలోని ధైర్యాన్ని, విశ్వాసాన్ని నీరుగార్చేసింది. నేను మరో ప్రపంచంలోకి అడుగు పెడుతున్నానన్నది స్పష్టం. అక్కడున్నన్నాళ్ళూ ఏమి చోటుచేసుకోవడానికైనా అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. నిజానికి, ఆమె అంత దుర్బలంగా ఏమీ అయి పోలేదు. అక్కడ ఆమె కొందరిని స్నేహితులుగా చేసుకున్నారు. జైలు పక్షులను తనవైపు తిప్పుకొని ఉంటారని నా అనుమానం. పుస్తకం చివరి పేజీల కొచ్చేసరికి, తల్లితో ఆమెకున్న సంక్లిష్ట సంబంధాన్ని అర్థం చేసుకుంటాం. ఒక్కోసారి ఆమె తల్లిని ద్వేషించారు. మరికొన్ని సందర్భాల్లో ప్రేమించారు. శ్రీమతి రాయ్ చని పోవడానికి కొద్ది నెలల ముందు కుమార్తెకు ఒక మెసేజ్ చేశారు. ‘‘ఈ ప్రపంచంలో నిన్ను మించి నేను ఎవరినీ ఎక్కువగా ప్రేమించింది లేదు.’’ అది అరుంధతిని ఆశ్చర్యపరచింది. కానీ, జవాబు మాత్రం అంతే ప్రేమాస్పదమైన రీతిలో ఇచ్చారు. ‘‘నాకింత వరకు తెలిసినవారిలో నువ్వు చాలా అసాధారణమైన, అద్భుతమైన మహిళవి. నేను నిన్ను ఆరాధించే వ్యక్తిని.’’తల్లితో పడకపోయినా, ఆమె లేని లోటును అరుంధతి అను భవిస్తోందనే నా సందేహం. ‘‘నేను నిన్ను కలుస్తాను’’ అంటూ పుస్తకాన్ని ముగించారు.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఐటీ పరిశ్రమకు గడ్డు రోజులు
అత్యంత నైపుణ్యం కలిగిన టెక్నాలజీ వృత్తినిపుణులు ఎవరైనా సరే అమెరికా వెళ్ళాలని కలలుగనడం సహజం. భారీ టెక్ లేదా భారతీయ సాఫ్ట్వేర్ సంస్థల ద్వారా వారు తమ కలలను సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దానికి, ఆరేళ్ళ పాటు చెల్లుబాటయ్యే హెచ్–1బి వీసా చేజిక్కించుకోవాలని అర్రులు చాస్తారు. కానీ, ఆ రకం వీసాల సంఖ్యపై పరిమితి ఉంది. గ్రహీతలను కూడా లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఇవి ఆ వీసాకున్న ప్రతికూలాంశాలు. హెచ్–1బి వీసా దారులు అమెరికాలో గ్రీన్ కార్డును చేజిక్కించుకోగలగడం, దీర్ఘకాలంలో పౌరసత్వాన్ని కూడా సంపాదించుకోవడం దానికున్న అనుకూలాంశాలు. హెచ్–1బి వీసాతో వృత్తి జీవితం మొదలుపెట్టి, తదనంతర కాలంలో ఉన్నత స్థాయికి చేరిన వారి జాబితా పెద్దదే. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ,గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా స్థాపకుడు జెన్సెన్ హుయాంగ్, జూమ్ స్థాపకుడు ఎరిక్ యువాన్ వంటి వారిని అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మారిన పరిస్థితులుఈ వీసాలపై 1,00,000 డాలర్ల చొప్పున ఒక విడత లెవీని ట్రంప్ ప్రభుత్వం విధించింది. అంత భారం మోయడం కష్టమని పెద్ద టెక్ కంపెనీలు శ్వేత సౌధానికి నచ్చజెబితే ఈ అంశానికి సంబంధించి, ఇతర కోణాలలో కూడా వీలైనంత త్వరగా మార్పు రావచ్చు. కానీ దీనివల్ల అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలపైనే పెను ప్రభావం పడబోతోందనడంలో సందేహం లేదు. హెచ్–1బి వీసాలకు సౌజన్యం వహిస్తున్న పది టాప్ కంపెనీలలో భారతీయ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక్కటే ఉంది. అమెజాన్ 10,000 వీసాలకు పైగా సంఖ్యతో 2025లో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. దానితో పోలిస్తే 5,500 వీసాలతో టి.సి.ఎస్. చాలా వెనుక నున్నట్లు లెక్క. మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, ఆపిల్ వంటి ఇతర దిగ్గజాలు జాబితాలో చాలా దిగువన ఉన్నాయి. అంతమాత్రాన ఈ పరిణామం వల్ల భారతీయ సాఫ్ట్వేర్ రంగా నికి వాటిల్లే నష్టం లేదనుకోవడం పొరపాటు. ఎందుకంటే, హెచ్– 1బి వీసాదారుల్లో దాదాపు 71 శాతం మంది భారతీయులే. దెబ్బ మీద దెబ్బఅమెరికన్ కంపెనీలు ఇకమీదట కూడా, బయట దేశాల నుంచి ఎక్కువ పనులు చేయించుకోవాలని కోరుకుంటాయా, ఫలితంగా, భారత్లో మరిన్ని గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (జీసీసీ) నెలకొంటాయా అనేది ప్రశ్న. దేశంలో వాటిని నెలకొల్పడంలో అగ్ర టెక్ సంస్థలు పట్టుదలతో ఉన్నాయి. అమెరికా వంటి అధునాతన ఆర్థిక వ్యవస్థలోకన్నా తక్కువ జీతభత్యాలతో భారతదేశంలో నిపుణులైన వారిని నియమించుకోవడం తేలిక. ఐటీ సేవలకు భారతీయ కంపెనీలపై ఆధారపడటం ఇక ముందు కూడా కొనసాగవచ్చు. కానీ అధిక ఫీజు వల్ల అటువంటి సేవలు మరింత ఖరీదైనవిగా మారతాయి లేదా లాభదాయకతను తగ్గిస్తాయి. ఒక విడత ఫీజు చెల్లించడం వల్ల అయ్యే ఖర్చు, తత్ఫ లితంగా ఒనగూడగల ప్రయోజనాన్ని విశ్లేషించుకుని కంపెనీలు కొత్తవారిని తీసుకునే వ్యూహాలను రూపొందించుకుంటాయి. ఈ ఫీజు వసూలు చాలా కాలం కొనసాగితే, ఈ వీసాకు సౌజన్యం వహించడాన్ని అవి తగ్గించుకోవచ్చు. ఎల్1, ఓ1 వంటి ఇతర వీసా మార్గాలున్నాయి. కానీ, వీటికి షరతులుంటాయి. అందరు దర ఖాస్తుదారులు వాటిని ఉపయోగించుకోలేరు. ఔట్ సోర్సింగ్కు ఇచ్చే కంపెనీలపై పన్ను విధించాలని అమె రికాలో ఇప్పటికే ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ బిల్లు భారతీయ ఐటీ పరిశ్రమ పాలిట పెను తుపాను అవుతుంది. సాఫ్ట్వేర్ సర్వీసులను ఎగుమతి చేయడం ద్వారానే భారతీయ ఐటీ పరిశ్రమ బ్రహ్మాండ మైన వృద్ధిని సాధించగలిగింది. వాటి వ్యూహంలో హెచ్–1బి వీసాలు కూడా అంతర్భాగం.అవకాశాల తలుపులుసంక్షోభాలు అవకాశాలకు కూడా తలుపులు తెరుస్తాయని అంటారు. హైటెక్ నవీకరణ, పరిశోధనకు దేశంలో తగిన వాతావరణాన్ని సృష్టించడంలో ప్రభుత్వం–పరిశ్రమలు ఇప్పటికైనా చేతులు కలపాలి. బెంగళూరు, హైదరాబాద్ నగరాలు భారతీయ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి వహించాయి గానీ, అత్యధునాతన టెక్నాలజీని తీర్చిదిద్దే వాగ్దానాన్ని అంతగా నిలబెట్టుకోలేకపోయాయి. అట్టడుగు స్థాయి నుంచి సమూల మార్పులు తీసుకురాగలిగినదిగా భారతీయ ఐటీ రంగం ప్రతిష్ఠను సంతరించుకోలేకపోయింది. ఇతర దేశాలలో వచ్చిన నవీకరణలను అనుసరించేదిగానే అది పేరుపడింది. అమెరికా చేరిన భారతీయ ప్రజ్ఞావంతులు అక్కడి సంస్థలను డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో అగ్ర స్థానాన నిలపడంలో కృతకృత్యులవుతున్నారు. పరిశోధన, అభివృద్ధి, కొత్త వెంచర్ల ప్రారంభానికి అమెరికాలో వాతావరణం అనుకూలంగా ఉండే మాట నిజమే. భారత్లో అందుబాటులో ఉన్న మానవ ప్రతిభా వ్యుత్పత్తుల సంపదను వినియోగించుకునేందుకు ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులను కల్పించాలి. ఇందుకు ప్రభుత్వాన్ని ఒక్కదాన్నీ నిందించి ప్రయోజనం లేదు. భారతీయ కంపెనీలు పరిశోధన–అభివృద్ధి విభాగంపై నిధులు వెచ్చించేందుకు విముఖత చూపుతూ వస్తున్నాయి. దేశంలో ‘స్టెమ్’ గ్రాడ్యుయేట్లు అపారంగా ఉన్నారు. వారిని ప్రోత్సహించే వాతావరణాన్ని దేశంలోనే సృష్టించు కోవలసిన అవసరం మున్నెన్నటికన్నా ఇపుడే ఎక్కువగా ఉంది. సుష్మా రామచంద్రన్వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇండియన్ ఇంగ్లిష్ స్థితి ఎలా ఉంటుంది?
ఇంగ్లిష్ దేశాలతో మన దేశ సంబంధాలు గందరగోళంలో ఉన్న రోజులివి. ఒకవైపు ఇండి యన్ యువకుల అమెరికన్ డ్రీమ్లపై అమెరికా మట్టికొ డుతున్న రోజులు. మరోపక్క కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్లు కూడా ఇమ్మిగ్రే షన్ (వలస)పై తిరుగుబాటు చేస్తున్న రోజులు. ఇందుకు రష్యన్ ఆయిల్ను ఇండియా కొనడం ఒక కారణమైతే, ప్రపంచ దేశాలన్నిటిలో మన దేశం ‘ఫస్ట్’ అనే సంకుచిత జాతీయ భావన పెరిగిపోవడం మరొకటి. ప్రపంచీకరణ ఆచరణలో ఉన్న గత ముప్పయి ఏండ్లలో ‘నా దేశం ఫస్ట్’ అనే నినాదం మన దేశ బీజేపీ ప్రభుత్వమే మొదట ఇచ్చింది. దీనితో పాటు భారతదేశంలో ‘హిందీ ఫస్ట్’ అనే ప్రచారం కూడా మొదలైంది. క్రమంగా వివిధ రంగాలలో ఇంగ్లిష్ భాషను వెనక్కి నెట్టే ప్రక్రియ నడుస్తున్నది. 2025 అక్టోబర్ 5 నాటికి ఇండియాకు ఇంగ్లిష్ భాష ఒక బోధనా భాషగా వచ్చి 208 ఏళ్ళు అవుతుంది. గత కొంతకాలంగా మనం ఆ రోజును ‘ఇండియన్ ఇంగ్లిష్ దినం’గా జరుపుకొంటున్నాం. ఈ భాష ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో; సివిల్ సర్వీస్ పరీక్షలలో చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ మధ్య ఇంగ్లిష్ దేశాలుగా ఉన్న అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఇండియన్ ఇమ్మిగ్రేషన్ మీద తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు ఇక్కడి ఇంజినీరింగ్ విద్యారంగాన్ని ఏం చెయ్యబోతున్నాయన్న అనుమానం కలుగుతోంది.గత 30 ఏళ్లుగా ఈ దేశంలో ఐఐటీ, ఎన్ఐటీ, వివిధ రాష్ట్రాల్లో పబ్లిక్, ప్రైవేట్ యూనివర్సిటీల్లో, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు కేవలం అమెరికాకో, మరో ఇంగ్లిష్ భాష మాట్లాడే దేశానికో పోవడం కోసమే చదవడం జరిగింది. కానీ ఇకముందు అన్ని రకాల కోర్సులను మన దేశంలో ఉండి ఏదో ఒక పనిచేసి కుటుంబం, దేశం అభివృద్ధి కావడం కోసం చదవాల్సి ఉంటుంది. ఈ స్థితిలో ఈ దేశంలో ఇంగ్లిష్ ప్రాధాన్యం తగ్గుతుందా? తగ్గించే వైపునకు పయనించాలా అనే ప్రశ్న ఎదురౌతుంది.ఇండియన్ ఇంగ్లిష్ ఇండియా అభివృద్ధికే!ఇతర ఇంగ్లిష్ దేశాలు భారతదేశం నుండి మొత్తం వలసలను ఆపినా సరే... ఇండియన్ ఇంగ్లిష్ను బాగా అభివృద్ధి చేసుకోవలసిందే. భవిష్యత్తులో అన్ని రంగాల్లో రీసర్చి ఇంగ్లిష్ భాష అభివృద్ధి అయిన దేశాల్లోనే పెరుగుతుంది. ఇంగ్లిష్ భాషకు ఉన్న కాన్సెప్ట్యువల్ క్లారిటీ ప్రపంచంలోని ఏ ఇతర భాషల్లో రాలేదు. పరిశోధనలో కొత్త ఆవిష్కరణలు జరగాలంటే భూమి మీద ఉన్న పదార్థాలను మానవులు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. అందుకు దోహదపడే భాష చాలా అవసరం. మన దేశంలోని ప్రాంతీయ భాషల్ని అటుంచండి; చైనా, జపాన్ వంటి సైన్సులో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ దేశ భాషలకు ఆ పట్టు లేక వాళ్ళు రీసర్చిలో, ఉన్నత చదువుల్లో ఇంగ్లిష్ను అభివృద్ధి చేసుకుంటున్నారు. అందుకే చైనా అతిశక్తిమంతమైన సెర్చ్ ఇంజిన్కు ‘డీప్ సీక్’ అని ఇంగ్లిష్ పేరు పెట్టింది. ఈ మధ్యకాలంలో అమెరికా హెచ్ వన్ బీ వీసా ఆంక్షలు విధించగా టాలెంట్ ఉన్నవారికి తాము స్వాగతం పలుకుతామని ఓ కొత్త వీసా ఇవ్వడానికి సిద్ధమయ్యింది చైనా. దానికి ‘కె–వీసా’ అని ఇంగ్లిష్ పేరే పెట్టింది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అన్ని స్కీములకూ హిందీ పేర్లు పెడుతున్నది. హిందీలో పెట్టిన ఆ పేర్లన్నీ ఈ దేశంలోని దక్షిణ, ఈశాన్య ప్రాంత పౌరులకు అర్థం కావు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రభుత్వ స్కూళ్లలో తీసెయ్యడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.యూఎన్ 80 ఏండ్ల చరిత్రలో ఇంగ్లిష్ పాత్రఈ మధ్యకాలంలో ఐక్యరాజ్యసమితి (యూఎన్) తన 80 ఏండ్ల సంబరాలు జరుపుకున్నది. ప్రపంచ దేశాల అధినేతలు అందులో పాల్గొని మాట్లాడారు. దాదాపు 80 శాతం ప్రపంచ దేశ నాయకులు తమ ఉపన్యాసాలు ఇంగ్లిష్లోనే ఇచ్చారు. కొద్దిమంది నాయకులు తమ దేశాల భాషల్లో మాట్లాడారు. కానీ వినే వారికి వారి పెదవుల కదలిక మాత్రమే కనిపించింది.ఇంగ్లిష్ అనువాదకుల మాట మాత్రమే వినిపించింది. అంటే 1945 నుండి 2025 నాటికి ఇంగ్లిష్ భాష ప్రపంచమంతటికీ పాకిందన్నమాట. చాలా దేశాల్లో భాషా సంకుచిత భావం బాగా తగ్గింది. మన దేశంలో భాషా ప్రాతిపదికన ప్రాంతాల మధ్య కొట్లాటలు తగ్గాయి. ఇప్పుడు హిందీని రాష్ట్రాలపై రుద్దుతున్నందువల్ల మళ్ళీ కొన్ని నిరసన ప్రదర్శనలు మొదలవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో సైన్సు అభివృద్ధి కీలకమైంది. ఈ స్థితిలో భారతదేశం వెనుకబడకుండా ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిష్ భాషను అభివృద్ధి పర్చి శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చెయ్యడం తప్ప మరో మార్గం లేదు.భారత్లో ఇంగ్లిష్ ప్రాముఖ్యంపైన పేర్కొన్న అన్ని రకాల కారణాల వల్ల అక్టోబర్ 5 నాడు దేశం మొత్తంగా ఇండియన్ ఇంగ్లిష్ డే జరపడం చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఇంగ్లిష్ ప్రాముఖ్యాన్ని చర్చించేందుకు అదొక సందర్భం అవుతుంది. ఇంగ్లిష్ దేశాల్లోకి యువత ఇమ్మిగ్రేషన్కు ఆటంకాలు ఏర్పడతున్నాయి కదా అని మన విద్యారంగాన్ని ప్రాంతీయ భాషల్లోకి జార్చితే సైన్సు, టెక్నాలజీ అభివృద్ధి సాధ్యం కాదు. ఈ సందర్భంలో చాలా తీవ్రంగా చర్చించాల్సిన అంశం: ‘అసలు మన చదువులు విదేశాల కోసమా, మన దేశం కోసమా?’ ‘మన చదువులు మన దేశంలో మన జీవితాలను, నిర్మించుకునేటందుకు’ అనే ఆలోచన కీలకమైంది. నేను జీవితాంతం ఇంగ్లిష్లో రాసింది, చదివింది విదేశాల్లో మార్పు, అభివృద్ధి కోసం కాదు కదా! ‘నా అభివృద్ధి నా దేశంతోనే ముడివడి ఉంది’ అనే ఆలోచనతో. ఈ ఆలోచనతోనే అంబేడ్కర్ విదేశాల్లో చదువుకొని ఇక్కడ ఇంగ్లిష్లో రాశారు, మాట్లాడారు. ఆ రోజుల్లో తన కమ్యూనిటీలో గానీ, తన వర్గంలో గానీ ఇంగ్లిష్ అర్థం చేసుకునే వారు గానీ, చదివేవారు గానీ లేరు. ఆ స్థితి ఇప్పుడు కొంతైనా మారింది కదా! అందుకే ఇంగ్లిష్ నేర్చుకోవాలనే పట్టుదలను దేశం వదలకూడదు.వ్యాసకర్త ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్ ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు(నేడు ‘ఇండియన్ ఇంగ్లిష్ డే’) -
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్) రాయని డైరీ
ఇండియా, పాకిస్తాన్ రెండూ కూడా ఫైనల్స్కు చేరుకుంటే, రెండు జట్ల మధ్య – ఈ రోజు మధ్యాహ్నం జరుగుతున్నట్లే – ఆ రోజు మధ్యాహ్నం కూడా ఇదే ప్రేమదాస స్టేడియంలో పోరు మొదలౌతుంది. ‘ప్రేమ’దాస స్టేడియంలో ‘పోరు’!! భలే ఉంటాయి ఈ అనుబంధాలు... కొట్లాడుకునే అక్కచెల్లెళ్ల మధ్య, ఘర్షణలు పడే అన్నదమ్ముల మధ్య! ఒకరి ఇంట్లోకి ఒకరు అడుగు పెట్టరు. పొరుగింట్లోనో, ఆ పై ఇంట్లోనో పంచాయితీ! ‘‘అలాగైతేనే వస్తాం’’ అని మొదటే అగ్రిమెంట్! నవ్వొస్తోంది నాకు!షేక్ హ్యాండ్స్ ఇవ్వాలనీ, సెల్ఫీలు తీసుకోవాలనీ, హగ్స్ ఇస్తుంటే వద్దనకూడదనీ రూల్ బుక్లో ఏమైనా ఉందా అని ‘బోర్డు’లో పెద్దవాళ్లు అంటున్నారు! అది నిజమే కానీ... షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదనీ, సెల్ఫీలు తీసుకోకూడదనీ, హగ్స్ ఇస్తుంటే వద్దనాలనీ కూడా రూల్ బుక్లో ఉండదేమో కదా! ఇలాంటప్పుడే, అమాయకమైన చిరునవ్వుతో – పైవారి ఆదేశాలను ధిక్కరిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన నాకు వస్తుంటుంది.‘‘అలా చెయ్యకు హ్యారీ’’ అనేవారు చిన్నప్పుడు నాన్న. చిరునవ్వుతో సరిగ్గా అలానే చెయ్యబుద్ది అయ్యేది నాకు!‘‘అలా చెయ్యటం కరెక్ట్ కాదు హర్మన్ ’’ అనేవారు కాలేజ్లో ప్రిన్సిపాల్. చిరునవ్వుతో సరిగ్గా అదే కరెక్ట్ అనాలనిపించేది నాకు!ఇప్పుడిక బీసీసీఐ సెక్రెటరీ! ‘మహిళల ప్రపంచ కప్లో భారత్–పాక్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారనే గ్యారంటీ ఏమీ లేదని అంటున్నారు! చిరునవ్వుతో సరిగ్గా నాకేం అనిపిస్తోందంటే, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోబోమనే గ్యారంటీ కూడా ఏమీ లేదని! మనసులో దగ్గరితనాన్ని ఉంచుకుని దూరాన్ని ఎంతకాలం నటించగలం? మాట్లాడాలని లోలోపల పీకుతూ ఉంటే మౌనాన్ని ఎలా పాటించగలం?కొద్దిసేపట్లో భారత్–పాక్ల మధ్య లీగ్ మ్యాచ్. అది వదిలేసి, ఎప్పుడో నెల తర్వాత నవంబర్ 2న ఎవరి మధ్య జరుగుతుందో కూడా తెలియని ఫైనల్ మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నాన్నేను!నిజంగానే భారత్–పాక్ ఫైనల్కి చేరుకుంటే, ఫైనల్లో గెలుపెవరిది అనే మాట అటుంచి... ఫైనల్లోనైనా టాస్ వేశాక షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటామా, ఆట ముగిశాకైనా చేతులు కలుపుకుంటామా అన్నదే ఆలోచిస్తూ యావద్దేశంతో పాటుగా నేను కూడా ఆ రోజు తెల్లవారుజాము నుంచే టెన్షన్ టెన్షన్గా ఉంటాననుకుంటా!ఫాతిమా సనా పాక్ కెప్టెన్ . చిన్న పిల్ల. నాకంటే 13 ఏళ్లు చిన్న. ఎం.ఎస్.ధోనీ తన ఇన్ స్పిరేషన్ అట. ధోనీలా కూల్గా ఉండి ఈ వరల్డ్ కప్లో తన జట్టును గెలిపిస్తుందట! బహిరంగంగానే చెప్పేసింది. అది కదా ‘హై–స్పిరిటెడ్’ అంటే. కానీ బీసీసీఐ వేరే ‘హై’లో ఉంది. మొన్నటి మెన్ ్స క్రికెట్ ‘సంప్రదాయాన్నే’ ఉమెన్ ్స క్రికెట్ కూడా ఫాలో అవాలట! అంటే, నో షేక్ హ్యాండ్స్ అని. 2022 వరల్డ్ కప్లో – న్యూజిలాండ్లో భారత్–పాక్ ఆటకు పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ తన ఆర్నెల్ల వయసున్న కూతుర్ని వెంటపెట్టుకుని వచ్చింది. తల్లీకూతుళ్లతో కలిసి టీమ్ ఇండియాలోని అందరం సెల్ఫీ తీసుకున్నాం. ఆ గేమ్లో ఇండియా గెలిచింది కానీ, ఇండియాను బిస్మా మరూఫ్ కూతురు తన బోసి నవ్వుల్తో ‘క్లీన్ బౌల్డ్’ చేసేసింది. ఆ పాప పేరు కూడా ఫాతిమానే!లీగ్ మ్యాచ్ టైమ్ అయింది. టాస్ కోసం లోపలికి వెళుతున్నాం. గెలుపు, ఓటమి... తర్వాతి సంగతి. ఫీల్డ్లో ఫాతిమా నాకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతే నేను చెయ్యి చాస్తానా? లేక, ఫాతిమా షేక్ హ్యాండ్ కోసం నేనే ముందుగా చెయ్యి చాస్తానా? అంతా ఫాతిమా చేతుల్లో ఉంది.ఊహు... చేతుల్లో కాదు, ఫాతిమా చిరునవ్వులో ఉంటుంది. -
టైమ్ మిషన్: ప్రపంచ చరిత్రనే మార్చిన యుద్ధం
ప్రపంచ చరిత్రలో అత్యంత నిర్ణయాత్మకమైన యుద్ధాలలో ‘గౌగమేలా’ యుద్ధం ఒకటి. ఈ యుద్ధంలో మేసిడోనియా యువరాజు అలెగ్జాండర్... అకిమెనిడ్ పారసీక సామ్రా జ్యపు చక్రవర్తి డరియస్–3ను చిత్తు చేశాడు. దీనితో ప్రపంచ చరిత్ర గతే మారి పోయింది. గ్రీకు సేనలకు ఆసియా ద్వారాలు తెరచుకున్నాయి.గౌగమేలాకు ముందు ‘ఇసస్’ యుద్ధంలో (క్రీ.పూ. 333) కూడా డరియస్ను అలెగ్జాండర్ ఓడించాడు. కానీ ఆ విజయం పారసీక సామ్రా జ్యాన్ని బలహీనం చేయలేకపోయింది. ఈసారి డరియస్ తన సామ్రాజ్య అపారమైన వనరులను ఉపయోగించుకుని భారీ సైన్యాన్ని (సుమారు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల మంది) సమ కూర్చుకున్నాడంటారు. అలెగ్జాండర్ కేవలం తన 47,000 మంది సైనికులతో ఈ భారీ సైన్యాన్ని ఎదుర్కొని విజయం సాధించడంలో అతడి యుద్ధ తంత్రమే ప్రధాన కారణం అయ్యింది.మెసపొటోమియా ఉత్తర ప్రాంతం (ప్రస్తుత ఇరాక్)లోని గౌగమేలా మైదానంలో క్రీస్తు పూర్వం 331 అక్టోబర్ మొదటివారంలో (1వ తేదీ) జరిగిన ఈ యుద్ధంలో... డరియస్ తన రథాలను, యుద్ధ గజాలను ప్రధాన ఆయు ధాలుగా ఉపయోగించాలని భావించాడు. అందుకే సమతలమైన ఈ మైదానాన్ని యుద్ధ క్షేత్రంగా ఎంచుకున్నాడు. కానీ అలెగ్జాండర్ ఈ వ్యూహాన్నే తనకనుకూలంగా మార్చుకున్నాడు.మైదానంలో ఎడమవైపు ఉన్న జాగాలో డరి యస్ తన అపార సైన్యాన్ని మోహరించి ఉన్నాడు. అతి కొద్ది సైన్యాన్ని డరియస్ను ఎదు ర్కోవడానికి అలెగ్జాండర్ అక్కడ మోహరించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్థానాన్ని వీడకుండా ఉండాలని ఆదేశించాడు. ప్రధాన సైన్యాన్ని కుడి వైపునకు మరల్చి దూరంగా పొమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. ఇది చూసిన డరియస్ చుట్టూ ఉన్న సైన్యం... శత్రుసైనికులు వెనక్కి తిరిగి పారి పోతున్నారని భావించి వారిని వెంబడించడం ప్రారంభించింది. దీంతో డరియస్ చుట్టూ ఖాళీ ఏర్పడింది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న అలెగ్జాండర్ తనను వెన్నంటి ఉన్న సుశిక్షిత అశ్విక దళంతో శరవేగంతో ఆ ఖాళీలో ప్రవేశించి డరియస్ను చుట్టుముట్టాడు.అలెగ్జాండర్ అత్యంత వేగంగా సైన్యాన్ని నడిపిస్తూ డరి యస్ చుట్టూ ఉన్న సైన్యాన్ని ఊచకోత కోశాడు. ఎడమవైపుకు డరియస్ సైనికులు పారిపోకుండా అంతకు ముందే మోహరించి ఉన్న తన కొద్ది పాటి సైనిక సమూహం వీరోచితంగా పోరా డుతూ ప్రధాన సైన్యం విజయం సాధించేంత వరకు తమ స్థానాన్ని కాపాడుకుంది. వారు వెనక్కి తగ్గి ఉంటే అలెగ్జాండర్ ప్రణాళిక విఫ లమై ఉండేది. ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడిన ఓ మృత్తికా ఫలక శాసనం (క్లే టాబ్లెట్ ఇన్స్క్రిప్షన్)లో ఈ వివరాలు ఉన్నాయి.యుద్ధ ప్రాముఖ్యంగౌగమేలా యుద్ధం తరువాత, అకిమెనిడ్ సామ్రాజ్యం అంతరించిపోయింది. డరియస్ తప్పించుకున్నాడు. కానీ అలెగ్జాండర్ పారసీక రాజదానులైన బాబిలోన్, సూసా, పెర్సెపోలిస్ లను సులభంగా స్వాధీనం చేసుకున్నాడు. యుద్ధం తరువాత, గ్రీకు సంస్కృతి, ఆచారాలు ప్రాచ్య ప్రపంచంలోకి వ్యాపించడానికి మార్గం సుగమమైంది. ఈ సంస్కృతుల మిశ్రమమే ‘హెలె నిస్టిక్ యుగం’గా ప్రసిద్ధికెక్కింది. ఇది శాస్త్రీయ, సాంస్కృతిక, రాజకీయ రంగాల అభివృద్ధికి దోహ దపడింది. ఈ విజయం తరువాత, అలెగ్జాండ ర్ను ‘అలెగ్జాండర్ ద గ్రేట్’ అని పిలవడం ప్రారంభమయ్యింది. చరిత్రలో ఆయన గొప్ప వారిలో అత్యంత గొప్పవాడిగా నిలిచాడు. -
స్వదేశీ అమలుకు అడ్డంకేమిటి?
‘స్వదేశీ’ అనే గొప్ప నినాదాన్ని స్వాతంత్య్రోద్యమ కాలంలో అప్పటి నాయకులు ఒకసారి ఇచ్చారు. స్వాతంత్య్రాన్ని సాధించుకుని కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత ప్రస్తుత నాయకత్వం మరొకసారి ఇస్తు న్నది. ఆ నినాదం పారిశ్రామిక వర్గాలను గానీ, సమాజాన్ని గానీ అపుడెట్లా ఉత్తేజ పరిచింది, ఇపుడెట్లా చేస్తున్నది? ఆ దరి మిలా నినాదపు అమలు అపుడెట్లా జరగింది, ఇపుడెట్లా జరుగుతున్నది?ఇందుకు సమాధానాన్ని మామూలు పద్ధతిలో వెతికి అపుడు గొప్పగా ఉండేదనీ, ఇపుడు ఆశించిన ఫలితాలు లేవనీ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కానీ అది విషయాలను సమగ్ర దృష్టితో పరిశీలించి చేసే విమర్శ కాబోదు. ఎందుకంటే, స్వాతంత్య్రోద్యమ కాలపు స్వదేశీ నినాద స్ఫూర్తి లోపించటం స్వాతంత్య్రం లభించిన తర్వాత కాంగ్రెస్ పాలనా కాలం నుంచే మొదలై, ప్రస్తుత బీజేపీ పాలన వరకు కూడా కొనసాగుతున్నది. ఎందుకన్నది ప్రశ్న. ఆ స్ఫూర్తి తిరిగి రావటం ఎట్లాగన్నది విషయం.బెంగాల్ విభజన కాలంలో...చర్చలోకి వెళ్లేముందు ఈ రెండు సందర్భాలలో ‘స్వదేశీ’ భావనల నేపథ్యం కొంత చూడాలి. ఆ మాట మొదటిసారిగా బ్రిటిష్ వలస పాలనా కాలంలో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రావిన్స్ను 1905లో రెండుగా విభజించినపుడు అందుకు నిరసనగా అక్కడి నాయకులు, సమాజం ముందుకు తెచ్చినటువంటిది. వారు బ్రిటన్కు సంబంధించిన అన్నింటిని బహిష్కరించి హింసాత్మక ఉద్యమం సాగించగా విభజన రద్దయింది. తర్వాత కొన్నేళ్లకు ఉద్యమ ప్రవేశం చేసిన గాంధీజీ ఆ నినాదానికి కొత్త అజెండాను రూపొందించారు. ప్రస్తుతం మనం అంటున్న స్వదేశీ నినాదానికి మూలాలు ఆయన అజెండాలో ఉన్నాయి. అందులో భాగంగా ఆయన ప్రజలకు బోధించింది ఆర్థిక స్వావలంబన, స్వయంసమృద్ధి, స్థానిక ఉత్పత్తుల వాడకం, అందుకు అవసరమైన వృత్తి నైపుణ్యాల అభివృద్ధి, వీటన్నింటికి సమాంతరంగా విదేశీ వస్తు బహిష్కరణ. ఆ కాలంలో టాటా, బిర్లా వంటి భారీ పారిశ్రామికసంస్థలు ఒక మేర బ్రిటిష్ కంపెనీల సహకారంతో నడిచినప్పటికీ, మరొకవైపు గాంధీజీ నినాదం ప్రజల స్థాయిలో ఒక ఉద్యమంగా సాగింది. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ ప్రభుత్వాలు పారిశ్రామి కాభివృద్ధి కోసం ప్రయత్నించటం అవసరమే అయినా, అందుకు సమాంతరంగా ఖాదీ గ్రామీణోద్యోగ రంగాన్ని కొంతకాలం మొక్కు బడిగా నడిపి దిక్కులేనిదిగా వదిలారు. పారిశ్రామిక రంగం క్రమంగా స్వదేశీ – విదేశీ మిశ్రమంగా మారింది. ప్రజలలో సైతం గత కాలపు స్ఫూర్తి అంతరించి విదేశీ ఉత్పత్తుల పట్ల మోజు పెరుగుతూ పోయింది. ఆ మాటే వినని తరం...1991లో భారతదేశం డబ్లు్యటీవోలో ప్రవేశించి, ఆర్థిక సంస్కర ణల ద్వారా విదేశీకి తలుపులు పూర్తిగా తెరిచింది. మతం విష యాన్ని అట్లుంచితే, జాతీయతా భావనలు బలంగా ఉండే ఆరెస్సెస్ ద్వారా అదే సంవత్సరం స్వదేశీ జాగరణ్ మంచ్ ఏర్పడింది గాని పరిమితంగానే పనిచేయగలిగింది. తర్వాత కాలంలో వాజ్పేయి ప్రధానిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కూడా స్వదేశీని పక్కకు పెట్టింది. అందుకు కారణం, భారత పారిశ్రామిక, వాణిజ్య వర్గా లలో అత్యధికులు విదేశీ పెట్టుబడులతో కలిసి ఉమ్మడి ఉత్పత్తులు, వ్యాపారాల వైపు మొగ్గటం. బయటినుంచి ప్రత్యక్ష పెట్టుబడులు, జాయింట్ వెంచర్లు, ఎగుమతులకు తగిన స్థాయిలో ఉత్పత్తులు చేసేందుకు టెక్నాలజీ దిగుమతులు, ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ అభివృద్ధి అవసరమనే దృష్టి పెరుగుతూ పోయాయి. ఈ కొత్త దశలో అత్యధికులు ‘స్వదేశీ’ అనే మాటనే విని ఉండరు. 1947కు ముందటి స్వదేశీ దృక్పథం, స్ఫూర్తీ, ఆ తర్వాత అర్ధ శతాబ్దం గడిచి, రెండు తరాలు మారి, రెండు ప్రధానమైన పార్టీల పరిపాలనను కూడా చూసిన వెనుక, ఉక్కిరిబిక్కిరై అవసాన దశలోకి ప్రవేశించింది.ఈ విధమైన రెండు దశల వెనుక 2014లో అధికారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, మరొక పేరుతో తిరిగి స్వదేశీ నినాదాన్ని ఇచ్చారు. అందుకు ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ వంటి పేర్లు పెట్టారు. ఆయన గుజరాత్కు చెందినవారు కావటం, గుజరాత్ – మహారాష్ట్ర ప్రాంతంలో స్థానిక పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు బలంగా ఎదగటం ఒకటైతే, విదేశీ పెట్టుబడులు, కంపెనీలు రావాలి గానీ అవి తమకు అనుకూలమైన విధంగా వ్యవ హరించాలనుకునే ధోరణులు పెరగటం మరొకటిగా మారి, ఈ కొత్త తరహా స్వదేశీ నినాదానికి భూమికగా మారాయి. దీనితోపాటు ఆత్మనిర్భర్కు మూల స్తంభాలని అయిదింటిని పేర్కొన్నారు. అవి ఆర్థికం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవస్థలను నిర్మించి బలోపేతం చేయటం, సమాజాన్ని క్రియాశీలం చేయటం, దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచటం. నాలుగు కీలకాంశాలుఅప్పటినుంచి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగిన సమీక్షలు ప్రోత్సాహకరంగా లేకపోవటం గమనించదగ్గది. ఆత్మ నిర్భర్కు మూలస్తంభాలుగా పైన పేర్కొన్న అయిదు రంగాలలో పెరుగుదల లేదని కాదు. కానీ అది సాధారణమైన రీతిలో జరుగు తుండేదే తప్ప ప్రత్యేకమైన ఊపు ఏదీ రాలేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థ పరిమాణం జపాన్ను మించి నాల్గవ స్థానానికి చేరటానికి ఒక కారణం మన దేశ పరిమాణం ఇంత పెద్దది కావటమైతే, మరొక కారణం జపాన్ అభివృద్ధి వేగం మందగించటం. దీని అర్థం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ పెనవేసుకుపోయిన స్థితిలో ఒంటరితనంగా ఎదగాలని కాదు. అది అసాధ్యం, అవాంఛ నీయం కూడా. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా పునర్నవీకరణ జరుగుతూనే, మౌలిక స్థాయిలో స్వదేశీ, స్వావలంబనలను పునాదులుగా నిలబెట్టుకోవచ్చు. ఇతరులపై ఆధారపడటం తగ్గుతూ, వారి ఒత్తిడులకు భయపడే స్థితిని పోగొట్టు కోవచ్చు. ఇది ప్రభుత్వపరంగా జరగవలసినది కాగా, సమాజాన్ని కూడా అదే స్ఫూర్తితో ఆ ప్రణాళికలో భాగస్వామిని చేయటం అసాధ్యం కాదు. అమెరికా ట్యారిఫ్లు వాణిజ్య ఒప్పంద ఒత్తిడుల స్థితిలో ఇపుడీ మాటను ప్రధాని మోదీ తనకు తాను పదేపదే గుర్తు చేసుకుంటూ దేశ ప్రజలకు గుర్తు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటికీ మూలంలో అసలు ప్రస్తావనకు రాని కీలకమైన విషయం ఒకటున్నది. భారతదేశానికి గొప్ప చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ప్రజలకు గొప్ప దేశభక్తి, జాతీయతా భావాలున్నాయి. ఏ దేశానికైనా, జాతికైనా ఈ నాలుగు అంశాలు కలిసి ఎనలేని శక్తిని ఇవ్వగలవు. వాటిని ఒక దార్శనికత, ప్రణాళిక, పట్టుదల, నిజాయితీ అనే నాలుగు అంశాలతో సమన్వయం చేసి ఆచరణలోకి తేగల నాయకత్వం ఉన్నట్లయితే ఆశించిన ఫలితాలను సాధించగలరు. అది జరిగినందువల్లనే స్వదేశీ నినాదం స్వాతంత్య్రోద్యమ కాలంలో విజయవంతమైంది. స్వాతంత్య్రానంతరం ఎవరు పాలించినా ఆ పని చేయలేక పోతున్నారు. స్వదేశీ నినాదాల అమలుకు మౌలికమైన అడ్డంకిగా నిలుస్తున్న లోపం అదే.- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
తమిళ రాజకీయాల తొక్కిసలాట
తమిళనాట కరూర్లోని వేలుసామిపురంలో హీరో విజయ్ రాజకీయ ర్యాలీలో విషాద ఘటన జరిగి నాలుగు రోజులు గడిచాయి కానీ, దానిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రం సమీప భవిష్యత్తులో సమసిపోయేలా లేవు. విజయ్ కొత్త రాజ కీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేతలపై వరుస ఎఫ్.ఐ.ఆర్.లు, రకరకాల కోర్టు కేసులు, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జ్యుడిషియల్ కమిషన్, బాధితులకు అండ పేరిట వివిధ రాజకీయ పార్టీల సందర్శనలు, కేంద్రంలోని పాలక ఎన్డీఏ కూటమి పక్షాన నటి హేమమాలిని సారథ్యంలో 8 మంది ఎంపీల బృందం క్షేత్రస్థాయి పర్యటన... ఇలా ఆగకుండా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయ్పై చెప్పులు విసరడం దగ్గర నుంచి ర్యాలీ వేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం దాకా అనేక అంశాలు, కుట్ర ఉందనే అభియోగాలు ఒక్కొక్కటిగా వస్తు న్నాయి. దుర్ఘటనపై సీబీఐ విచారణ జరపాలని విజయ్ కోరు తుంటే, సుప్రీంకోర్ట్ సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాత విచారణ కావాలని ఎన్డీఏ డిమాండ్ చేస్తోంది.మామూలుగా సినీ స్టార్ వస్తున్నారంటేనే భారీ జన సందోహం ఉంటుంది. ఇప్పుడు విజయ్ ఓ రాజకీయ నేత కూడా! త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాజకీయపార్టీ, దాని అధినేత సభలు పెట్టడం సహజం. దానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, దాని చెప్పు చేతల్లోని పోలీసు యంత్రాంగానిది. అందులోనూ వారాంతంలో రోడ్ షో అంటే, అభిమాన నాయకుణ్ణి చూసేందుకు పిల్లా పాపలతో సహా జనం మరింతగా తరలి వస్తారు. అంత పెద్దయెత్తున జనం వస్తుంటే, కచ్చితంగా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు అవసరం. క్రేజున్న విజయ్ సభలకు మద్రాసు హైకోర్ట్ అందుకు కొన్ని నిబంధనలు పెట్టింది. అవన్నీ తు.చ. తప్పక పాటించాల్సిందే! అదే సమయంలో కరూర్ ఘటనలో ప్రభుత్వ, పాలనా యంత్రాంగాల ఘోర వైఫల్యాలను విస్మరించలేం. అనుమతులు ఇవ్వడం దగ్గర నుంచి అత్యవసర రక్షణ వరకు అన్నీ చూసుకోవాల్సిన పోలీసు, ప్రభుత్వ యంత్రాంగాలు ఆ బాధ్యతల నుంచి తప్పించుకొని, సభ పెట్టిన వారిదే తప్పంటూ నెపం నెట్టివేయాలని చూస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కుట్ర ఉందనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అదే నిజమైతే, అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. నిజానికి, మరో సినీ హీరో స్వర్గీయ విజయ్కాంత్ ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం తన డీఎండీకె పార్టీతో మెరుపులు మెరిపించి నప్పటికీ, తమిళనాట రాజకీయాలంటే ప్రధానంగా రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకె, అన్నా డీఎంకెల మధ్యనే నడుస్తుంటాయి. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలది సహాయ పాత్రే. సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే, అలాగే పీఎంకే లాంటి ఇతర పార్టీలది మరీ చిన్న పాత్ర. అలాంటì ద్రవిడ రాజకీయాల తమిళనాట ‘ఇళయ దళపతి’ (యువ దళపతి) విజయ్ పార్టీ పెట్టడం కుదుపు తెచ్చింది. రాజకీయ రంగప్రవేశంపై సుదీర్ఘ కాలం దోబూచులాడిన సూపర్స్టార్ రజనీకాంత్ మిడిల్డ్రాప్తో ఖాళీగా ఉన్న స్థానంలోకి దూసుకువచ్చారీ ఇళయ దళపతి.విజయ్ ఇప్పటికే తమిళనాట రెండు రాష్ట్ర స్థాయి మహా సభలు పెట్టారు. రెండు వీకెండ్ రోడ్ షోలూ చేశారు. ఎక్కడకు వెళ్ళినా జనసందోహమే! గతంలో అన్నా డీఎంకె సంస్థాపకుడైన సినీ హీరో ఎమ్జీఆర్ కాలంలో లాగా ఇప్పుడు విజయ్ సభలకు అభిమాన గణం వెల్లువెత్తుతున్నారు. ప్రధానంగా పాతికేళ్ళ లోపు యువతీ యువకులు తమ అభిమాన హీరోను దగ్గర నుంచి చూడాలని ఉరకలెత్తుతున్నారు. ఫలితంగా, విజయ్ ఇటు పాలక డీఎంకెను కలవరపరచడమే కాక, అటు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో గద్దెనెక్కాలని ఆశలు పెట్టుకున్న ప్రతిపక్షం అన్నాడీఎంకె వ్యూహానికీ పెను సవాలయ్యారు. అలాంటి వేళ సెప్టెంబర్ 27న కరూర్లో వీకెండ్ రోడ్ షోలో జరిగిన తొక్కిసలాట అనూహ్యంగా బ్రేకులు వేసింది. కుంభమేళా తొక్కిసలాట ఘటన లాంటివన్నీ ఇటీవలి చేదు జ్ఞాపకాలే. అయితే, 41 మంది దుర్మరణానికీ, పదులసంఖ్యలో క్షతగాత్రులకూ కారణమైన కరూర్ ఘటన తమిళ రాజకీయ సభలలో కనీవినీ ఎరుగనిది. ఆ దుర్ఘటనతో మ్రాన్పడిపోయిన విజయ్ తక్షణమే 2 ఎయిర్పోర్టుల వద్దా మీడియాతో మాట్లా డకున్నా, తర్వాత సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2 లక్షల వంతున నష్టపరిహారం చెల్లించారు. పరామర్శకు ఆయన వెళ్ళాలను కున్నా, పరిస్థితి సద్దుమణగకుండా రావద్దన్న ప్రభుత్వసూచనను మన్నించక తప్పలేదు. రెండు వారాల పాటు రోడ్ షోలనూ వాయిదా వేసుకున్నారు. ర్యాలీ నిర్వహించిన రాజకీయ పార్టీ నైతిక బాధ్యతను ఎవరూ కాదనలేరు. కానీ, కరూర్ ఘటన మొత్తానికీ విజయ్నే దోషిని చేస్తూ, కొందరు ప్రత్యక్షంగానూ, మరికొందరు పరోక్షంగానూ వ్యాఖ్యలు చేయడమే విడ్డూరం. ఒకవేళ సభా నిర్వాహకులు నియమాలను పాటించడం లేదనుకుంటే, స్పష్టమైన రుజువులు చూపి, వారిని వారించాలి. అంతే కానీ, జరగకూడనిది జరిగాక తప్పంతా వాళ్ళదే అంటే ఒప్పదు. ‘‘పోలీసులు పూర్తిస్థాయిలో భద్రత కల్పించి ఉంటే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకుని ఉండేవి కావు. ఇకనైనా పోలీసులు అధికార పక్షానికి ఓ న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అన్నట్టు వ్యవహరించకుండా ఉంటే మంచిది’’ అని ప్రధాన ప్రతిపక్షమే వ్యాఖ్యానించడం గమనార్హం. రాజకీయ ఆరోపణలు చేయాలే తప్ప తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే క్రేజున్న విజయ్ను ప్రత్యక్షంగా బాధ్యుణ్ణి చేస్తే, ఆయ నను వేధిస్తున్నారన్న భావన జనంలో కలిగి అది తమకే ఎదురు కొడుతుందన్న ఎరుక పాలక పక్షానికీ లేకపోలేదు. అందుకే, పార్టీలన్నీ తమ స్వార్థప్రయోజనాలకు తగ్గ ప్రకటనలిస్తూ, ప్రజల్లో మార్కులు కొట్టేసే పనిలో తలమునకలయ్యాయి. ఏమైనా, రాజ కీయ ర్యాలీలలో భద్రతా ప్రమాణాలు కీలకమనీ, జవాబుదారీ తనం అత్యవసరమనీ కరూర్ దుర్ఘటన మరోసారి గుర్తు చేసింది. అందుకు, పాలకులే ప్రధాన బాధ్యత తీసుకోక తప్పదు. – ఆర్. పర్వతవర్ధని ‘ కోయంబత్తూరు -
వంద సంవత్సరాల దేశసేవ
ఓ శతాబ్దం కిందట విజయదశమి పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆవిర్భవించింది. అయితే, ఇది కొత్తగా సృష్టించినదేమీ కాదు... ప్రాచీన సంప్రదాయానికి నవ్య వ్యక్తీకరణ మాత్రమే. భారత నిరంతర జాతీయ చైతన్యం కాలానుగుణంగా భిన్న రూపాల్లో, విభిన్న సవా ళ్లను ఎదుర్కొంటూ ఇలా అవతరించింది. ఆ కాలాతీత జాతీయ చైతన్యానికి మన కాలపు ప్రతిరూపమే ఈ సంఘ్. ఇటువంటి సంఘ్ శతాబ్ది వేడు కలలో భాగస్వాములం కావడం మన తరం స్వయంసేవకుల అదృష్టం. దేశానికి, ప్రజలకు సేవ దిశగా ప్రతినబూని, అంకిత భావంతో ముందుకు సాగుతున్న అసంఖ్యాక స్వయం సేవకులకు ఈ చారిత్రక సందర్భంలో నా శుభాకాంక్షలు. సంఘ్ స్థాపకుడు, మనందరి మార్గదర్శకుడు అయిన డాక్టర్ హెడ్గేవార్జీకి నా సగౌరవ ప్రణామాలు అర్పిస్తున్నాను. వందేళ్ల ఈ అద్భుత పురోగమనాన్ని స్మరించుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లతో పాటు స్మారక నాణాన్ని కూడా ఆవిష్కరించింది.వ్యక్తి వికాసం.. దేశ పురోగమనంమానవ నాగరికతలన్నీ గొప్ప నదీ తీరాల్లోనే పరిఢవిల్లాయి. అదే తరహాలో సంఘ్ ప్రభావంతో లెక్కలేనన్ని జీవితాలు చరితార్థ మయ్యాయి. ఒక నది తాను తడిపిన ప్రతి అంగుళం నేలనూ సుసంపన్నం చేస్తుంది. అదే విధంగా సంఘ్ కూడా దేశంలోని ప్రతి మూలనూ, సమాజంలో ప్రతి రంగాన్నీ పెంచి పోషించింది. ఒక నదీ ప్రవాహం పలు విధాలుగా చీలి తన ప్రభావాన్ని మరింతగా విస్తరింపజేస్తుంది. సంఘ్ ప్రయాణం కూడా ఇలాంటిదే. వివిధ అనుబంధ సంస్థల ద్వారా విద్య, వ్యవసాయం, సామాజిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహిళా సాధికారత సహా జీవితంలోని అనేక రంగాల్లో సంఘ్ తన సేవానిరతిని రుజువు చేసుకుంది. ‘‘వ్యక్తి వికాసం నుంచి దేశ వికాసం, వ్యక్తిత్వ నిర్మాణంతో దేశ పురోగమనం’’... ఇదీ సంఘ్ అనుసరించిన పంథా! దేశభక్తికి మారుపేరుఆవిర్భవించిన మరుక్షణం నుంచే దేశ ప్రాధాన్యాన్నే తన ప్రాథమ్యంగా సంఘ్ పరిగణించింది. డాక్టర్ హెడ్గేవార్ సహా అనేకమంది స్వయంసేవకులు స్వాతంత్య్ర పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా అనేకసార్లు జైలుకు వెళ్లారు. పలువురు స్వాతంత్య్ర సమరయోధులకు సంఘ్ మద్దతునిస్తూ రక్షణగానూ నిలిచింది. స్వాతంత్య్రం తర్వాత కూడా దేశం కోసం తన వంతు కృషిని కొనసాగించింది. దేశభక్తికి, సేవకు మారుపేరుగా ‘సంఘ్’ నిలిచింది. దేశ విభజన సమయంలో లక్షలాది కుటుంబాలు ఆశ్రయం కోల్పోయిన వేళ... స్వయంసేవ కులు ముందుకొచ్చి శరణార్థులకు సేవలందించారు. పరిమిత వనరులే ఉన్నప్పటికీ... ప్రతి విపత్తు సమయంలోనూ ఆపన్న హస్తం అందించే వారిలో స్వయంసేవకులు ముందుంటారు. వారి దృష్టిలో ఇవి ఉపశమన చర్యలు మాత్రమే కాదు... దేశ చేతనను బలోపేతం చేయడం కూడా! వివక్షకు వ్యతిరేకంగా పోరాటంశతాబ్ద కాలపు ప్రయాణంలో సమాజంలోని వివిధ వర్గాల్లో స్వచేతననూ, ఆత్మవిశ్వాసాన్నీ సంఘ్ జాగృతం చేసింది. దశాబ్దా లుగా గిరిజన వర్గాల సంప్రదాయాలు, ఆచారాలు, విలువలను పరిరక్షించి, పెంపొందించడానికి అంకితమైంది. నేడు సేవా భారతి, విద్యా భారతి, ఏకల్ విద్యాలయాలు, వనవాసీ కల్యాణ్ ఆశ్రమ్ వంటి సంస్థలు గిరిజన వర్గాల సాధికారతకు మూలస్తంభాలుగా నిలిచాయి. కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు శతాబ్దాలుగా హిందూ సమాజానికి సవాళ్లుగా ఉన్నాయి. డాక్టర్ హెడ్గేవార్జీ కాలం నుంచి నేటి వరకు.. ప్రతీ స్వయం సేవక్, ప్రతీ సర్ సంఘ్ చాలక్ ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ‘‘అంట రానితనం తప్పు కాకపోతే, ప్రపంచంలో మరేదీ తప్పు కాదు’’ అని పూజ్య బాలసాహెబ్ దేవరస్జీ ప్రకటించారు. అనంతరం పూజ్య రజ్జు భయ్యాజీ, పూజ్య సుదర్శన్జీ కూడా ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ‘అందరికీ ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశానవాటిక’ ఉండాలంటూ ప్రస్తుత సర్ సంఘ్చాలక్ గౌరవ మోహన్ భాగవత్జీ ఐక్యత దిశగా స్పష్టంగా పిలుపునిచ్చారు. శతాబ్దం కిందట సంఘ్ ఏర్పడిన వేళ నాటి అవసరాలు, సవాళ్లు నేటి కాలానికి భిన్నంగా ఉన్నాయి. నేడు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పురోగమిస్తున్న కొద్దీ కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. మన ఐక్యతను భగ్నం చేసే కుట్రలు, చొరబాట్లు, ఇంకా ఎన్నింటినో ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. వీటిని సమర్థంగా ఎదుర్కోవడం కోసం ఆర్ఎస్ఎస్ కూడా సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయడం సంతోషదాయకం.తదుపరి శతాబ్దికి సమాయత్తంసంఘ్ ప్రవచిస్తున్న ‘పంచ పరివర్తన్’... నేటి సవాళ్లను అధిగమించే మార్గాన్ని ప్రతి స్వయం సేవకుడికీ నిర్దేశిస్తుంది.అవి: 1. స్వబోధ: వలసవాద మనస్తత్వం నుంచి విముక్తుల మయ్యేలా, మన వారసత్వ ఘనతను గర్వంగా ప్రకటించు కునేలా, స్వదేశీ సూత్రాన్ని పురోగమింపజేసేలా ఈ ‘స్వీయ అవగాహన’ దోహదపడుతుంది. 2. సామాజిక సామరస్యం: అణగారిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చి సామాజిక న్యాయంపై భరోసా కల్పించడం ద్వారా సామాజిక సామరస్యం సాకార మవుతుంది. మన సామాజిక సామరస్యానికి పెనుసవాలుగా పరిణమించిన చొరబాట్ల సమస్యను పరిష్కరించడం కోసం ఉన్నత స్థాయి జనాభా మిషన్ (హై పవర్డ్ డెమోగ్రఫీ మిషన్)ను ప్రభుత్వం ప్రకటించింది. 3. కుటుంబ ప్రబోధన్: మన సంస్కృతికి పునాది అయిన కుటుంబ వ్యవస్థను కుటుంబ విలువలు బలోపేతం చేస్తాయి. 4. నాగరిక్ శిష్టాచార్: సామా జిక స్పృహ, బాధ్యతా భావం ప్రతి పౌరుడి లోనూ జాగృతం కావాలి. 5. పర్యావరణ్: రాబోయే తరాల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం కోసం పర్యావరణ సంరక్షణ అత్యంత ముఖ్యమైనది. ఈ ఐదు సంకల్పాల నిర్దేశంలో... తదుపరి శతాబ్ది లోకి ప్రయాణాన్ని ‘సంఘ్’ నేడు ప్రారంభించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో సంఘ్ కృషి కీలకం. మరోసారి ప్రతి స్వయంసేవకుడికీ నా శుభాకాంక్షలు. నరేంద్ర మోదీభారత ప్రధాని -
కనకదుర్గమ్మ జనులను కాచుగాత!
విజయవాటిక యందు విజయదుర్గ నామమున నున్న జగదంబ కోమలాంగి సిరులు కురిపించు, భగవతిసింధుతనయ! కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!హస్తముల పుష్పశరమును, అంకుశమ్ము, నెన్నుదుట కాంతి జిమ్మెడి నేత్రమొకటి, విశ్వజనని లలితగా వెలసినట్టి కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!అష్టభుజములు ధరియించి దుష్టులైన రక్కసుల గర్వమణచిన రౌద్రమూర్తి! సర్వమంగళదాయిని జగము లేలు కనకదుర్గమ్మ జనులను కాచుగాత!!అక్షమాల అలరుచుండ హస్తమందు పుస్తకమును దాల్చి వేరొక హస్తమందు, కమలమందున కూర్చున్న కల్పవల్లి! కనకదుర్గమ్మ జనులను కాచుగాత !!పాయసాన్నంబు నిండిన పాత్రతోడ ‘అన్నపూర్ణ’వై కృపగాంచు కన్నతల్లి! భక్తులకు వరము లొసంగు భాగ్యరాశి కనకదుర్గమ్మ జనులను కాచుగాత !!– డా. జంధ్యాల పరదేశి బాబు, విశ్రాంత తెలుగు ఆచార్యులు ‘91219 85294 -
చేటు తెచ్చిన అనుభవ రాహిత్యం
తమిళనాడులోని కరూర్ పట్టణంలో ఓ కూడలి వద్ద సెప్టెంబర్ 27 రాత్రి సంభవించిన తొక్కిసలాటలో 41 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో గాయ పడిన జనం పదుల సంఖ్యలో ఆసు పత్రిలో చికిత్స పొందుతున్నారు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు అయిన విజయ్ ర్యాలీకి 27,000 మందికి పైగా హాజరైనపుడు ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆయన రాక ఏడు గంటలు ఆలస్యమై, సభ రాత్రి 7.30 గంటలకు మొదలైంది. అప్పటి వరకు విజయ్ కోసం ఉత్సుకతతో వేచి ఉన్న అభిమానులు ఒక్కసారిగా తోసుకోవడంతో తొక్కిసలాటలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామక్కల్లో సభ ముగించుకుని కరూర్ వచ్చేందుకు విజయ్కి అన్ని గంటల సమయం ఎందుకు పట్టిందని కొందరు అంటున్నారు.పోలీసులు కేటాయించిన స్థలమే!విజయ్ కరూర్ సభకు ఎంతమంది తరలిరాగలరో అంచనా వేయడంలో పోలీసులు విఫలమయ్యారా... అన్నది సహజంగానే ఇక్కడ తలెత్తే ప్రశ్న. రాజకీయంగా తనను ఎదగనీయకుండా చేసేందుకు పోలీసులు అవరోధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విజయ్ చేస్తున్న ఆరోపణలతో తమిళనాడు పోలీసులు గత కొద్ది నెలలుగా ఆత్మరక్షణ ధోరణిని అనుసరిస్తున్నారు. కొన్ని వారాల క్రితం తిరుచిరాపల్లిలో విజయ్ రోడ్ షో నిర్వహించినపుడు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో సభా నిర్వహణ కోసం కరూర్లో విజయ్ ఎంచుకున్న రెండు ప్రదేశాలకు పోలీసులు అను మతి నిరాకరించారు. అవి జన సమ్మర్ధంతో కిటకిటలాడే వాణిజ్య స్థలాలు కావడమే అందుకు కారణం. అందుకే ఆ రెండూ కాకుండా, కొద్ది రోజుల క్రితం అన్నా డి.ఎం.కె నాయకుడు ఎళప్పాడి పళని స్వామి సభ నిర్వహించిన కరూర్లోని మరో ప్రదేశాన్ని పోలీసులు విజయ్ సభకు కేటాయించారు. టీవీకే మొదట ఎంచుకున్న ఆ సభా ప్రాంతాలు రెండింటికీ ఇది కూడా దగ్గరలోదే కావడంతో పార్టీ అందుకు వెంటనే అంగీకరించింది. ఏర్పాట్లలో తడబడుతున్న టీవీకేకాగా, తాజా ఘటన రాజకీయంగా, సంస్థాగతంగా టీవీకేకు కొరవడిన సామర్థ్యాన్ని బహిర్గతం చేసింది. పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఎన్. ఆనంద్ ఒక్కరే టీవీకేలో రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు. ఆయన గతంలో వివిధ కాంగ్రెస్ చీలిక వర్గాలలో పనిచేశారు. ఇటువంటి విషయాల్లో ఏ రాజకీయ పార్టీలోనైనా జిల్లా కార్యదర్శులు ముఖ్యపాత్ర వహిస్తారు. వారు సాధారణంగా అట్ట డుగు స్థాయి సంబంధాలు కలిగినవారై ఉంటారు. అయితే టీవీకేలో విజయ్ అభిమాన సంఘాలలోని ప్రీతిపాత్రులే ఆ భూమిక నిర్వ హిస్తున్నారు. సభలకు తగిన ఏర్పాట్లు చేయడంలో వారు తడబడు తున్నారు. తమ సభలకు సుమారు పది వేల మంది హాజరు కావచ్చని అంచనా వేస్తున్నట్లు వారు పోలీసులకు చెబుతున్న సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది. ఇలాంటి సభలప్పుడు సాధారణంగా పార్టీలు కొద్దిమంది కార్యకర్తలకు డబ్బు పంపిణీ చేసి ఆహారం, నీరు సమకూర్చే ఏర్పాట్లు చేస్తూంటాయి. కాగా, సభలకు హాజరైన జనాన్ని అదుపులో ఉంచి, నియంత్రించవలసిన అవస రాన్ని ఇప్పటికే అనేక తమిళ పార్టీలు గుర్తించాయి కూడా! రాజీవ్ గాంధీ హత్యోదంతంతో తమిళనాడు ఈ చేదు పాఠాన్ని నేర్చు కోవాల్సి వచ్చింది. టీవీకే తన తరహాలో నిర్వహిస్తున్న రోడ్ షోల లాంటివి మాత్రం తమిళనాడు రాజకీయాలకు కొత్త. అప్పటి ‘సినీ–నాయకులు’ వేరు!గతంలో జయలలిత, కరుణానిధి కూడా వాహనాలలో రాష్ట్ర హైవేలలో ప్రయాణించినా ముందుగా నిర్ణయించిన చోట్ల మాత్రమే వారు వాహనాలను ఆపి ప్రసంగించేవారు. కొద్ది వేల మందిని ఉద్దే శించి ప్రసంగించి మరో చోటుకు బయలుదేరేవారు. పైగా, వారు జనాలు వేచి చూసేటట్లు చేసేవారు కాదు. నిర్హేతుకమైన జాప్యాలకు అవకాశమిచ్చేవారు కాదు. మొన్నటి ఘటనలో అంబులెన్సుల రాకకు సంబంధించిన శబ్దాలు వినిపిస్తున్నా విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగించడం కూడా ఆయన రాజకీయ అనుభవ రాహి త్యాన్ని సూచించింది. ఏం జరుగుతోందో ఎవరూ ఆయన చెవిన వేసినట్లు లేదు. పరిస్థితి తీవ్రతను గమనించిన వెంటనే ఆయన అక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. తిరుచిరాపల్లిలో ప్రైవేటు విమానం ఎక్కి, రెండు గంటల్లోపల చెన్నైకి చేరుకున్నారు. ఆయనతో పాటే టీవీకే సభ్యులు కూడా సభా ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. పోలీసుల ఎఫ్.ఐ.ఆర్కు ఎక్కిన కొందరు పరారీలో ఉన్నారు. ‘‘కక్ష ఉంటే నాపై తీర్చుకోండి!’’ఈ అవకాశాన్ని అధికార డి.ఎం.కె పార్టీ సద్వినియోగం చేసుకు న్నట్లే కనిపిస్తోంది. కరూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన సెంథిల్ బాలాజీ ఆ సమయంలో నియోజకవర్గంలోనే ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చింది. అయితే సెంథిల్ బాలాజీ ఆస్పత్రికి చేరుకోక ముందే, కరూర్ మాజీ ఎమ్మెల్యే అన్నా డి.ఎం.కె నాయకుడు ఎం.ఆర్. విజయ్ భాస్కర్ బాధితులను పరామర్శించటం ప్రారంభించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా శనివారం అర్ధరాత్రికల్లా కరూర్ చేరు కున్నారు. స్టాలిన్ కుమారుడు, ఆయన వారసత్వాన్ని అందుకుంటాడని భావిస్తున్న ఉదయనిధి కూడా ఆదివారం ఉదయానికల్లా కరూర్లో వాలారు. అయితే విజయ్కి మాత్రం ఈ ఘటనపై క్షమా పణ కోరుతూ బహిరంగ ప్రకటన చేయడానికి 12 గంటలకు పైగా పట్టింది. ఇక, తాజాగా నిన్న (సెప్టెంబరు 30) విడుదల చేసిన ఒక వీడియోలో, ‘‘నా జీవితంలో ఇంతటి బాధాకరమైన రోజు వస్తుందని ఊహించ లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైపోయింది. మాటలు రావటం లేదు. కరూర్ తొక్కిసలాట ఘటనలో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి. నాపై కక్ష ఉంటే తీర్చుకోండి. నా అభిమా నులపై కాదు’’ అని కూడా విజయ్ ఆ వీడియోలో అన్నారు. వచ్చే ఏడాది (2026) ఎన్నికలకు సమాయత్తమవుతున్న విజయ్కి ఈ సంఘటన పెను విఘాతమేనని చెప్పాలి. ఘటనపై ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి నేతృత్వంలో ఏకసభ్య విచారణ సంఘాన్ని నియమించ డాన్ని టీవీకే, అన్నా డి.ఎం.కెలు తోసిపుచ్చాయి. సి.బి.ఐతో దర్యాప్తు జరిపించాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.హీరో... నాయకుడిగా మారాలిఎం.జి. రామచంద్రన్, జయలలితలు కూడా సినీ రంగం నుంచి వచ్చినవారే అయినా, ఎమ్జీఆర్కు ద్రవిడ ఉద్యమ నేపథ్యం ఉంది. జయలలిత చాలా ఆటుపోట్లను తట్టుకుని ఎంజీఆర్ చెంత రాజకీయంగా సుశిక్షితురాలిగా మారారు. తాజా ఘటన నేపథ్యంలో విజయ్ తనను తాను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆయనకు లక్షల మంది అభిమానులున్నమాట నిజమే. అయితే ప్రజలు ఓటు వేయాలని కోరుకునే రాజకీయ నాయకునిగా ఆయన రూపాంతరం చెందాల్సి ఉంది. ఇక ఆయన రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి తిరిగి ఎప్పుడు బయలుదేరుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. భవిష్యత్ పరిణామాలు వెండితెరపై కాక, రాజకీయ యవనికపైనే ఆవిష్కృతం కానున్నాయి. నిరుపమా సుబ్రమణియన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అక్షరాన్ని అందిస్తూ...
దేశంలో సంపన్నులకే పరిమితమైన విద్యను సామాన్యుల దరికి చేర్చిన ఘనత అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకే దక్కింది. దేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా 1982లో ఏర్పాటైనప్పటి నుంచి విద్యకు దూరమైన వారిని అక్కున చేర్చుకుంది. మొత్తం విద్యార్థుల్లో సగటున 85 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. స్త్రీలు విద్యావంతులు కావడంలోనూ ఎంతో కృషి చేస్తోంది. మొత్తం మీద యూనివర్సిటీ విద్యార్థుల్లో సగటున ఏటా 48 శాతం మంది మహిళలుఉంటున్నారు.Dr B.R. Ambedkar Open University (BRAOU) యూనివర్సిటీ ఈ ఏడాది (2025–26) నుంచి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘చదువుతూ సంపాదించు’ విధానంపై దృష్టి సారించారు. విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా ‘శ్రీ రామానందతీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్’తో ఒప్పందం కుదుర్చుకుంది. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ఉచిత భోజన, వసతితో వివిధ అంశాల్లో రెండు నుంచి మూడు నెలలు ఈసంస్థలో శిక్షణ ఇస్తారు. కంప్యూటర్, ఆటోమొబైల్, సోలార్ విద్యుత్తు నుంచి అనేక రంగాలకు సంబంధించి వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి అవసరమైన మెలకువలు, నైపుణ్యం సాధించేలా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అదే తరహాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్)తోనూ యూనివర్సిటీ సంప్రతింపులు జరిపింది. నిర్మాణరంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్ర మానికి శ్రీకారం చుట్టనుందిచదవండి: Gorati Venkanna: పాటతల్లికి పెద్దకొడుకుయూనివర్సిటీ మహిళా విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ‘వీ హబ్’తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీల్లో పనిచేసే సిబ్బంది నైపుణ్యాల్ని పెంపొందించేందుకు సర్టిఫికెట్, డిప్లమో ప్రోగ్రామ్స్ రూపొందించింది. మహిళా, శిశు సంక్షేమశాఖతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రోగ్రామ్ను ప్రారంభించనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2025– 26) నుంచి గిరిజన విద్యార్థులకు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్స్కు ఉచిత విద్య అందించనున్నది. సైనికులకూ, ఖైదీలకూ ఇప్పటికే విద్యను అందుబాటులోకి తెచ్చింది. యూనివర్సిటీ మంగళవారం తన 26వ స్నాతకోత్సవం జరుపుకొంటోంది. రెండు విద్యాసంవత్సరాలకు (2023–24, 2024–25) సంబంధించిన 60,288 మందికి డిగ్రీలు అందిస్తోంది. 55 మందికి డాక్టరేట్ పట్టాలుఅందించనున్నారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయ నున్నారు. అందులో ఒకరు వాగ్గేయకారుడు గోరటి వెంకన్న కాగా మరొకరు ప్రఖ్యాత శాంతి విద్యా ప్రచారకులు ప్రేమ్ రావత్!– డా.ఎల్వీకే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, హైదరాబాద్(నేడు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం) -
పుడమితల్లికి నీరాజనం
మానవుడు పుడమి తల్లి ముద్దుబిడ్డ. ఆమె అతగాడికి కన్నతల్లి కంటె మిన్న. తల్లి తన బిడ్డలనందరినీ సమానంగానే ప్రేమిస్తుంది. కానీ ప్రతి బిడ్డతోనూ ఆమె అనుబంధం ప్రత్యేకం. తన బిడ్డలలో అందరికంటె ఎక్కువ చురుకుతనమూ, బుద్ధిబలమూ, కార్యకుశలతా, ప్రయోజకత్వమూ ఉన్న మానవుడిని చూస్తే, పుడమితల్లి గుండె ఒకింత గర్వంతో పొంగితే... అది సహజమే. తన మేధతో, కృషితో,సృజన శక్తితో తల్లి అందించిన వనరుల విలువను మరింత చేయగల మహత్తరమైన శక్తి మనిషికి ఉంది. ఆమె నీటినిస్తే, అతగాడు దానిని ఇంకని, తరగని, శోభాయమానమైన జలాశయాలుగా మారుస్తాడు. ఆమె పచ్చి దినుసులు ప్రసాదిస్తే, అతడు వాటిని పంచభక్ష్య పరమాన్నాలుగా మార్చగలడు. ఆమె పిట్టపాట వినిపిస్తే, అతడు ఆ జాడలో మరింత శోధించి... భావ, రాగ, లయలతో సమగ్రమైన సంగీత ప్రపంచం సమకూర్చుకోగలడు. ఆమె పువ్వులు ప్రసాదిస్తే, అతడు వాటితో అద్భుతమైన ‘బతుకమ్మ’ సంబరాలు సృష్టించగలడు! ఆమె ప్రసాదించిన పూలకు తన బహుముఖమైన కళాత్మకత జోడించి, పువ్వుల పండగ జరిపి, ఆమెకే తిరిగి కన్నుల పండుగనూ, వీనుల విందునూ అందిస్తాడు. పుడమి తల్లి మనసు పులకరింపజేసి రుణం తీర్చుకొంటాడు.బతుకమ్మ సంబరం అంటే సాధారణంగా లభించే వనరులతో అసాధారణమైన అందాల పుష్పాకృతులను అమర్చి చేసే నేత్రోత్సవం. నిసర్గ సౌందర్యం తొణికిసలాడే అమ్మలక్కల ఆటల నృత్యోత్సవం. కృత్రిమత లేని పల్లె పడతుల పాటల తీపిని శ్రవణపేయంగా చెవులకు చేర్చే కర్ణోత్సవం. ఆత్మీయతలతో అలరారే, ఆదర్శమైన, సౌహార్ద విలసితమైన, సామాజిక జీవన మాధుర్యానికి అద్దం పట్టే సందర్భం. వికసితమైన బుద్ధిగల మానవుడు, తన వికాసానికి అన్నివిధాలా ఆధారభూతమైన ప్రకృతి మాత పట్ల ప్రగాఢమైన కృతజ్ఞతను ప్రదర్శించే వార్షికోత్సవం. సౌందర్యోపాసనలోనూ, పర్యావరణం పట్ల బాధ్యతలోనూ, సామాజిక సామరస్యం పట్ల నిబద్ధతలోనూ, తన ప్రత్యేకత ప్రదర్శిస్తూ, మనిషి వినయంగా మట్టితల్లికి సమర్పించే సాష్టాంగ ప్రణామం.– ఎం. మారుతి శాస్త్రి -
'పోరాటస్ఫూర్తి'ని కోల్పోవద్దు!
యూనివర్సిటీ నుంచి మీరు బయటకు అడుగుపెట్టబోతు న్నారు. జీవితంలో కొన్ని అవరోధాలు, వైఫల్యాలు, అసంతృప్తులు ఎదురవడం సహజం. వాటిని తట్టుకుంటూ ముందుకు సాగడంలో, విజయాన్ని అందుకోవడంలో మీకు సహాయపడగలిగినవి, నాకు తోచిన జీవిత పాఠాలు కొన్ని చెబుతాను.మీపై మీరు నమ్మకం ఉంచండిటెలివిజన్, టెలిఫోన్లు, కంప్యూటర్లు, ఐపాడ్లు లేని రోజుల్లో పెరిగి పెద్దవాడినవటం వల్ల నేనొక రకంగా అదృష్టవంతుడినే. నాతో నేను ఎక్కువ సమయం గడపగలిగే వాడిని. దేన్ని నేను నిజంగా ఇష్టపడుతున్నానో నిర్ణయించుకోగలిగే వాడిని. అలా ఆస్ట్రియాలోని మా కుగ్రామం నుంచి – బాడీబిల్డింగ్ ఛాంపియన్ అవడం ద్వారా అమెరికాలో కాలుమోపాలని అనుకున్నా. నేను ఆరాధించే ‘మిస్టర్ యూనివర్స్’... రెగ్ పార్క్’. ఆయనలా బాడీబిల్డింగ్ చాంపియన్ అనిపించుకోవడం, సినిమాల్లో ప్రవేశించడం, కోట్లాది డాలర్లు సంపాదించడం నా లక్ష్యం. మిగిలినవారు ఏమనుకుంటున్నా పట్టించుకోకుండా, నా మీద నమ్మకంతో నేను ఏర్పరచుకున్న లక్ష్యం అది. సూత్రాలను పక్కన పెట్టండి!మా ఆవిడ వేసుకొనే ఒక టీషర్ట్పై ‘నియమానుసారంగా నడ చుకొనే మహిళలు చరిత్రను సృష్టించటం అరుదు’ అని అర్థం వచ్చే ఇంగ్లీషు వాక్యం ఉంటుంది. స్త్రీ పురుషులందరికీ అది వర్తిస్తుంది. మరీ సూత్రానుసారంగా ఉంటే, మీ లక్ష్య సాధనకు ‘పిచ్చి పట్టినట్లుగా’ ప్రయత్నించలేరు. నాకు ఎక్కడైనా ఏదైనా లభించిందీ అంటే, అది ఈ సూత్రాలలో కొన్నింటిని పక్కన పెట్టినందువల్లనే సాధ్యమైంది. బాడీబిల్డింగ్కు శ్రమించినట్లుగానే, సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడ్డాను.అందుకోసం ఇంగ్లీషు క్లాసులకు వెళ్లాను. ఫలితం దక్కింది. మొదట టెలివిజన్లో, తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. విజయవంతమైన నటుడిని అయ్యాను. తర్వాత గవర్నర్ని కూడా అయ్యాను. వైఫల్యానికి భయపడకండి!నేను ఏది ప్రయత్నించినపుడైనా, విఫలమవడానికి కూడా సుముఖంగా ఉండేవాడిని. ‘రెడ్ సోంజా’, ‘హెర్క్యులిస్ ఇన్ న్యూయార్క్’, ‘లాస్ట్ యాక్షన్ హీరో’ వంటి నా సినిమాలు కొన్ని బాక్సాఫీసు వద్ద చతికిలపడ్డాయి. ‘టెర్మినేటర్’, ‘క్యానన్’, ట్రూ లైస్’, ‘ప్రిడేటర్’, ‘ట్విన్స్’ వంటి చిత్రాలు ఊహించనంత విజయం సాధించాయి. కనుక, మనం అన్నిసార్లూ సఫలం కాలేకపోవచ్చు. కానీ, నిర్ణయాలు తీసుకునేందుకు భయపడకూడదు. విఫలమవు తామనే భయంతో నిర్వీర్యం కాకూడదు. మీపై మీకు నమ్మకం ఉంది కనుక, ఏది చేస్తున్నారో అదే సరైన పని అనిపించుకుంటుందని భావిస్తున్నారు కనుక ధైర్యంగా ముందుకు సాగండి. మాటలకు ప్రభావితం కాకండి!మా అత్తగారు యూనస్ కెనడీ ష్రైవర్ 1968లో స్పెషల్ ఒలింపిక్స్కు శ్రీకారం చుట్టినపుడు చాలామంది ఆమెను నివారించే ప్రయత్నం చేశారు. అదెలా సాధ్యపడుతుంది అన్నారు. ‘‘కుదరని పని. సంస్థల నుంచి పోటీదారులను బయటకు తీసుకురావడం కష్టం. వారు జంపింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ క్రీడల్లో పాల్గొనేటట్లు మీరు చేయలేరు. ఒకవేళ పాల్గొన్నా, వారు గాయపడవచ్చు. ఒకరి నొకరు గాయపరచుకోవచ్చు. ఈతకొలనులో మునిగిపోతారు’’ అని నిరుత్సాహపరచారు. 40 ఏళ్ల తర్వాత, గొప్ప సంస్థలలో స్పెషల్ ఒలింపిక్స్ ఒకటిగా ఉంది. ఈరోజు మానసిక వైకల్యంతో బాధపడు తున్నవారికి 164 దేశాలలో అంకిత భావంతో పని చేస్తోంది. జనం మాటలకు ఆమె నీరుగారిపోయి తన ప్రయత్నం ఆపేసి ఉంటే, ఇది సాధ్యమయ్యేదా? అంతరాత్మ ‘‘నీకు సాధ్యమే’’ అని చెబుతుంటే ఇక ఎవరి మాటా వినకండి!శ్రమిస్తేనే విజేతలు కాగలరు!తగినంత కృషి చేయకుండానే విఫలం అవకూడదు. అంటే, ప్రయత్న లోపం ఉండకూడదన్నది నా ఉద్దేశం. గట్టిగా ప్రయత్నించిన తర్వాత విఫలమైనా ఫరవాలేదు. అంతేకానీ, కష్టపడి సాధన చేయకుండా, పోటీలో లేదా ఎన్నికల్లో ఓటమి చెందడాన్ని నేను ఇష్ట పడను. లక్ష్య సాధనకు సర్వశక్తులూ ఒడ్డాలన్నదే నా అభిమతం. మధ్య మధ్యలో విరామం తీసుకోవడం కూడా ముఖ్యమే. కాదనను. కానీ, మనం సేదదీరుతున్న సమయంలో మరెవరో శ్రమించి పని చేస్తూ ఉంటారని గుర్తుంచుకోవాలి. వారూ విజేతలుగా నిలవొచ్చు. అంతమాత్రాన, ఏదో చేజారిపోయింది అని మనం అనుకోకూడదు. రోజుకు 6 గంటలు నిద్రిస్తే చాలు. మిగిలిన 18 గంటలూ పనిచేస్తూ ఉండాలి. సమయాన్ని సమర్థంగా నిర్వహించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలి. ఆకాంక్షలను నెరవేర్చుకు నేందుకు తగినంత సమయాన్ని కేటాయించుకోవాలి.చురుగ్గా చేజిక్కించుకోవాలిరెండు జేబుల్లోనూ చేతులు పెట్టుకుని నిచ్చెన ఎక్కగలం అని మాత్రం అనుకోకండి. కార్యాచరణకు దిగకుండా ‘విజయానికి సూత్రాల’ను నెమరువేయడం వల్ల ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. క్రియాశీలంగా వ్యవహరిస్తూ, అవకాశాలను చేజిక్కించు కోవాలి. కలలను సాకారం చేసుకునేందుకు సోమరితనం వదిలించుకుని, చురుకుగా పనిచేయాలి. ఇవన్నీ మీకు తెలియనివి ఏమీ కావు. శ్రద్ధాసక్తులతో చదువుకోకపోతే మీరీ రోజు ఇక్కడ కూర్చో గలిగేవారే కాదు. ఇక మీరు ఏ రంగంలో ఉన్నా సరే, సమాజానికి తిరిగి ఎంతో కొంత ఇవ్వడానికి సిద్ధపడాలి. అందుకు తగిన వ్యవధిని చిక్కించుకోవాలి. సమాజానికి, మీ రాష్ట్రానికి, లేదా మీ దేశానికి తిరిగి ఇవ్వడాన్ని ఒక నియమంగా పెట్టుకోవాలి. మా మామగారు సార్జంట్ ష్రైవర్ గొప్ప అమెరికన్. ఆయన పేదలకు న్యాయ సహాయం లాంటి పనులు నిర్వహించారు. ‘‘అదే పనిగా అద్దంలో మీ ముఖం మీరే చూసుకోకండి. కాసేపు అద్దాన్ని పక్కన పెట్టండి. అప్పుడే చేయూత అవసరమైన లక్షలాది మందిని మీరు మీ చుట్టుపక్కల చూడ గలుగు తారు’’ అని ఆయన ఒకసారి యేల్ పట్టభద్రుల స్నాతకోత్సవంలో చెప్పారు. ఇతరులకు సహాయపడడంలో ఉండే ఆనందం అంతా ఇంతా కాదని మాత్రం నేను మీకు చెప్పగలను.ఎన్నింటిని దాటుకుని వచ్చాం!చివరగా ఇంకొక్క సంగతి చెబుతా! ఈ విశ్వవిద్యాలయాన్ని 1880లో నెలకొల్పారు. అప్పట్లో లాస్ ఏంజలెస్ చిన్న పొలిమేర పట్టణం. మీకన్నా ముందు 125 పట్టభద్రుల బృందాలు తయారై ఉంటాయి. వారు మంచి రోజులను, గడ్డు రోజులను, యుద్ధాలను, శాంతియుత పరిస్థితులను, ఆశలు రేకెత్తించిన కాలాన్ని, మహా అస్థి రమైన కాలాన్ని కూడా చూసి ఉంటారు. వాటన్నింటినీ దాటుకుని ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ యూనివర్సిటీ దృఢంగా నిలిచాయి. ఇపుడు మనం తిరిగి గడ్డు రోజులను, ప్రపంచంలో చాలా అస్థిరతను చూస్తున్నాం. ఒకటి మాత్రం ఖాయం. మనం వాటిని తట్టుకుని నిలబడగలం. మునుపటికన్నా పటిష్ఠంగా, సంపన్నమైనదిగా దేశం పునరుత్తేజం పొందుతుంది. ఆశావాదాన్నీ, పోరాట స్ఫూర్తినీ కోల్పో వద్దు. మీ అందరికీ అభినందనలు. ఆ కరుణామయుడి చల్లని చూపులు మీపై ప్రసరించాలి. -
మనసులను వేరు చేసి చూడలేం!
నిజాయతీపరుడైన, ఉన్నతమైన భారతీయుడు ఎవరూ పాకిస్తాన్ను సొంత ఇంటిగా భావించడం ఇక ఎంత మాత్రం అంగీకార యోగ్యమైన విషయం కాదా? మనలో కోట్లాది మంది నేడు పాకిస్తాన్గా భావిస్తున్న రాష్ట్రాలలో పుట్టినవాళ్లమే. ఆ రోజుల్లో, మాకు తెలిసిన సొంత ప్రాంతం అదే. నా తల్లితండ్రులు, సోదరీమణులు, నా దగ్గరి బంధువులలో చాలా మంది అక్కడే జన్మించారు. మా అమ్మ తొంభై ఏళ్ల వయసులో సొంతూరు వెళ్లాలని కోరుకున్నప్పుడు లాహోర్ పేరు చెప్పింది కానీ, జీవించిన ఛతర్పుర్ కాదు. ఛతర్పుర్లో పొలాలు గట్రా ఉన్నా ఆమెకు ఠక్కున లాహోర్ గుర్తుకొచ్చింది. పిట్రోడా మాటలపై వివాదంపాకిస్తాన్లో ఉండగా తనకు సొంత ఇంటిలోనే ఉన్నట్లు అని పించిందని శామ్ పిట్రోడా ఇటీవల మనసులో మాట చెప్పేసి నప్పుడు, పిట్రోడాకు దేశభక్తి లేదంటూ ఎన్డీటీవీ ఆయనపై విమర్శ లతో ఊదరగొట్టేసింది. ‘‘నేను ఈమధ్య పాకిస్తాన్ వెళ్లొచ్చాను. నాకు అక్కడ నా సొంత ప్రాంతంలో ఉన్నట్లు అనిపించిందని నేను మీకు చెప్పి తీరాలి’’ అని ఆయన అన్నారు. ‘‘నేను బంగ్లాదేశ్ వెళ్లాను. నేపాల్ కూడా వెళ్లొచ్చాను. రెండు చోట్లా సొంత ప్రదేశంలో ఉన్నట్లే అనిపించింది’’ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ టీవీ ఛానల్లో ప్రసారమైన ఇరవై ఐదు నిమిషాల న్యూస్ బులెటిన్లో పదిహేను నిమిషాలకు పైగా సమయాన్ని హానికరం కాని, భంగ కరంకాని ఆ వ్యాఖ్యను తూర్పారబట్టడానికే కేటాయించారు. బి.జె.పి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆయనను పరుషమైన పదజాలంతో నిందించారు. నేపాల్, బంగ్లాదేశ్లలో కూడా సొంతూ రులో ఉన్నట్లుగానే ఉందన్న శామ్ పిట్రోడా మాటలను పూనావాలా సమయానుకూలంగా విస్మరించారు. మనసులను తాకిన అద్వానీ వాస్తవం ఏమిటంటే, ఎల్.కె. అద్వానీ సొంత ప్రాంతం కూడా పాకిస్తానే! ఆయన పుట్టింది, చదువుకుంది కరాచీలోనే! పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా 2005లో ఖుర్షీద్ కసూరీ ఉన్నపుడు పాకిస్తాన్ సందర్శనకు రావాల్సిందిగా అద్వానీని ఆహ్వానించారు. అద్వానీకిఆ ఆహ్వానం సంగతి చెప్పి, ఆయన స్పందన ఏమిటో తెలుసుకుని చెప్పవలసిందిగా నన్ను కోరారు. ‘‘దానిదేముంది? సంతోషంగా వెళ్లి రావచ్చు. నాకు నా కుటుంబ సభ్యులను కూడా వెంట బెట్టుకుని వెళ్లాలని ఉంది’’ అని అద్వానీ అన్నారు. అలాగే, అద్వానీ వెంట ఆయన కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. పాకిస్తాన్కు బయలు దేరేటపుడు అద్వానీ చేసిన ప్రకటన, తాను జరపబోయే ఆ పర్యటన తనకు ఎంత ముఖ్యమైనదో స్పష్టంగా వెల్లడించింది. ‘‘వ్యక్తిగత స్థాయిలో ఈ పర్యటన నాకు ప్రగాఢమైన ప్రాధాన్యం కలిగినది. కరాచీలో పుట్టి పెరిగినవాడిని కనుక, ఈ సందర్శన, నాకు మూలా లకు తిరిగి వెళ్లటం లాంటిది. ఈ రెండు దేశాలు సుస్థిరమైన శాంతితో సాగే మార్గాన్ని ఆ పరమాత్మ చూపాలని నేను ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన అన్నారు. అయితే, లాహోర్లో అద్వానీ అన్న మాటలను నేను ఎన్నటికీ మరచిపోను. ‘‘ప్రతి భారతీ యుడి మనసులో కొద్దిపాటి పాకిస్తాన్, ప్రతి పాకిస్తానీ హృదయంలో కొద్దిపాటి ఇండియా ఉంటాయని నేను ఎప్పుడూ విశ్వసి స్తాను’’ అని ఆయన అన్నారు. అది మనసును తాకే వాస్తవం. ముఖ్యంగా పంజాబీలు, బెంగాలీలకు సంబంధించినంత వరకు కాదనలేనిది. ఈరోజుల్లో అయితే, ఎన్డీటీవీ, అద్వానీని కూడా ఏకి పారేసి ఉండేది. దాని జాతీయతావాద చెవులకు ఆ మాటలు దేశ ద్రోహంతో సమానంలా అనిపించేవి. అదృష్టవశాత్తూ, ప్రణయ్ రాయ్ ఆధ్వర్యంలో 2006లో అది చాలా భిన్నమైన ఛానల్లా ఉండేది. ఒకేలా అనిపించటం సహజమే!నా సంగతి కూడా చెప్పనివ్వండి. నేను 1980లో మొదటిసారి పాకిస్తాన్ సందర్శించాను. ఆ తర్వాత చాలాసార్లు వెళ్లివచ్చాను. వెళ్లిన ప్రతిసారీ నాకు పూర్తిగా సొంత ఇంటిలోనే ఉన్నట్లే అని పించింది. వారి పంజాబ్లో భాష, ఆహారం, సంప్రదాయాలు, ఆచారాలు, ఇళ్లు, ప్రజా జీవనవిధానానికి మనకు తేడా ఏమీ లేదు. రెండింటినీ వేరు చేసి చూడలేం. అవే రకమైన మాటలతో శపిస్తాం లేదా అక్కున చేర్చుకుంటాం. అదే వైచిత్రి. తమిళులు, మలయాళీలు లేదా కన్నడిగులు సగటు పాకిస్తానీయులకు అపరిచితులుగా కనిపించవచ్చు. ఢిల్లీ, శ్రీనగర్లలో ఉన్నవారు కూడా అలానే అనిపించ వచ్చు. కానీ, అమృత్సర్, లూధియానాలలో ఉన్నవారు మాత్రం కాదు. పాకిస్తాన్ గురించి భారతీయుల తలపులు కూడా కొంత వరకు అదే రకంగా ఉంటాయని చెప్పవచ్చు. వారు మన దేశంలోని ఏ ప్రాంతానికి చెందినవారు అనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది. ఇటానగర్లో ఉండేవారికి కనిపించే సారూప్యం చాలా తక్కువ. అలీగఢ్లో ఉండేవారికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. అర్థం చేసుకోవచ్చు... కానీ!ఇటీవల దుబాయ్లో భారతీయ క్రికెట్ జట్టు ప్రవర్తన చిన్నపిల్లల మాదిరిగా, క్రీడా స్ఫూర్తి కొరవడినదిగా కనిపించింది. ముఖ్యంగా నన్ను వేదనకు గురి చేసింది. పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేసేందుకు వారు తిరస్కరించడం క్రికెట్ అనిపించుకోదు. కరచాలనం అనే బ్రిటిష్ పదబంధానికి అర్థం ఏమైనా ఉందీ అంటే, తప్పకుండా దానిలోకి, రీతి రివాజులకు సంబంధించిన తేలికపాటి మర్యాదలు, సత్ప్రవర్తన కూడా రాకుండా ఉంటాయా? తప్పక పాటించవలసిన చక్కని నడవడికను పక్కన పెట్టాలని భారత జట్టు తీసుకున్న నిర్ణయంతో మన విజేతలు చిన్నవాళ్లుగా కనిపించారు. పహల్గావ్ు ఉగ్రదాడి అనంతరం పాకి స్తాన్తో ఆడకూడదని కోరుకోవడాన్ని నేను అర్థం చేసుకోగలను. మైదానంలో అవతలి జట్టు ఎదురుగా నిలవడం ఇష్టం లేక ఒక ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి భారత్ తిరస్కరించడం ఇది మొదటిసారేమీ కాదు. దక్షిణాఫ్రికాతో ఆడడం ఇష్టం లేక 1974లో డేవిస్ కప్లో ఏకంగా ఫైనల్స్నే త్యజించడం ఇందుకు కలకాలం గుర్తుండే ఉదాహరణ. కానీ, ఒకసారి ఆడడానికి అంగీకరించిన తర్వాత, ప్రత్యర్థులతో కరచాలనం చేయడం ఆచారమే కాదు, నాగరికత అని కూడా అనిపించుకుంటుంది. మనసులో ఉన్నది నిర్మొహమాటంగా చెబుతున్నా, ఆ అంశంపై ఎవరూ దృష్టి సారించకపోవడం నన్ను ఆశ్చర్యపరచింది. అలాగే, పాక్లో ఉన్నపుడు సొంత ఇంటిలోనే ఉన్నట్లుగా అనిపించిందని శామ్ పిట్రోడా అన్నందుకు, ఆయనని ఏకిపారేయడం కూడా నన్ను అంతే ఆశ్చర్యపరచింది. నిజం చెప్పాలంటే, నా దేశస్థుల గురించి నేను తెలుసుకుంటున్న కొద్దీ నాలో ఆశ్చర్యం పాలు ఎక్కువ అవుతోంది!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
శశి థరూర్, (కాంగ్రెస్ ఎంపీ) రాయని డైరీ
ఆటలో– ‘పడని’వాళ్లు ఉండరు. తలపడవలసిన వాళ్లు మాత్రమే ఉంటారు. రాజకీయాలైనా అంతే. గెలుపు కోసం ఆటలోకి దిగినవాడు యోధుడైతే, ఓడించటానికే ఆడేవాడు మహాయోధుడు! శ్రీ మోదీజీ నాకెప్పుడూ యోధుడిలా అనిపించరు. అన్నీ బయటికే అనలేం. కొన్ని అనకుండానూ ఉండలేం. నేను ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కనుక, మా వైపూ యోధానుయోధులు ఉండే ఉంటారు కనుక, మోదీజీని నేను ‘మహాయోధుడు’ అనకూడదు. అనకూడదు కానీ, అనకుండా ఉండలేక పోతున్నాను కనుక, మోదీజీ యోధుడు కాదు అని మాత్రమే అనవలసి వస్తోంది.జట్టులో కెప్టెన్ అంటూ ఒకరు లేరంటే, జట్టులోని ఆటగాళ్లంతా కెప్టెన్కు సమానమైన వాళ్లేనని! ఇది బీజేపీ స్టయిల్. జట్టులోని ఆటగాళ్లంతా కెప్టెన్కు సమానమైన వాళ్లే అయినప్పటికీ, కెప్టెన్ ఎవరో తేల్చుకోలేక పోతున్నారంటే జట్టులో ఎవరి ఆట వారిదేనని! ఇది కాంగ్రెస్ ట్రెడిషన్! ఎప్పటిలా ఆటకు ముందే, తన ఆట మొదలు పెట్టేశారు మోదీజీ! నవంబరులో బిహార్ ఎన్నికలు. మార్చిలో బెంగాల్ ఎన్నికలు. ఏప్రిల్లో తమిళనాడు ఎన్నికలు. బిహార్ క్యాంపెయిన్కు ధర్మేంద్ర ప్రధాన్ని, సి.ఆర్. పాటిల్ని, కేశవ్ ప్రసాద్ మౌర్యని; పశ్చిమ బెంగాల్ క్యాంపెయిన్కు భూపేందర్ యాదవ్ని, విప్లవ్ కుమార్ దేవ్ని; తమిళనాడు క్యాంపెయిన్కు వైజయంత్ పాండాను, మురళీధర్ మొహల్ను పంపిస్తున్నారు మోదీజీ!‘పర్ఫెక్ట్ కాంబినేషన్‘, ‘పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‘ అని ప్రత్యర్థి జట్టు చేత కూడా అనిపించుకోగలరు ఆయన.బిహార్ వెళ్లే ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ మినిస్టర్. సి.ఆర్. పాటిల్ యూనియన్ మినిస్టర్–కమ్–గుజరాత్ బీజేపీ చీఫ్. కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్.పశ్చిమ బెంగాల్కు వెళ్లే భూపేందర్ యాదవ్ యూనియన్ మినిస్టర్. విప్లవ్ కుమార్ దేవ్ త్రిపుర మాజీ ముఖ్యమంత్రి.తమిళనాడుకు వెళ్లే వైజయంత్ పాండా పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్. మురళీధర్ మొహల్ యూనియన్ మినిస్టర్.ప్రధాన్, యాదవ్... ఓబీసీ ఓట్ల స్ట్రాటజిస్టులు. హర్యానాలో బీజేపీ ప్రధాన్ వల్ల గెలిచింది. మహారాష్ట్రలో యాదవ్ వల్లగెలిచింది. ఇక మౌర్య, దేవ్, పాండా, మొహల్ సముద్రపు గాలుల్నే మలుపు తిప్పగలిగిన నావికులు! కాంగ్రెస్ ఇంకా గంగా నది ఒడ్డునే ఉంది! పట్నాలో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్లో బిహార్ ఎన్నికల గురించి ఒక వ్యూహం లేదు.బెంగాల్, తమిళనాడు ఎన్నికల ఊసే లేదు.‘‘85 ఏళ్ల క్రితం ఇక్కడే ఈ సదాఖత్ ఆశ్రమంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది’’ అనుకున్నారు. ‘‘మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడే సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగుతోంది...’’ అన్నారు. ‘‘85 ఏళ్ల క్రితం అప్పటి ఆ సీడబ్ల్యూసీ మీటింగ్కు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షత వహించారు’’ అనుకున్నారు. ‘‘ఇప్పుడు ఈ మీటింగ్కు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షత వహించారు’’ అన్నారు. ‘‘85 ఏళ్లకు ముందు ఈ ఆశ్రమంలో గాంధీ, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు సమావేశం అయ్యేవారు...’’ అనుకున్నారు. ‘‘ఇప్పుడు రాహుల్, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్ వంటివారు హాజరయ్యారు’’ అన్నారు.అన్నీ అనుకున్నాక, అన్నీ అన్నాక – ‘‘అది స్వాతంత్య్ర పోరాటం అయితే, ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం’’ అని తీర్మానించి ఎటు వాళ్లు అటు వెళ్లిపోయారు! రెండో స్వాతంత్య్ర పోరాటం, మూడో స్వాతంత్య్ర పోరాటం... అవసరం అయితే ఎన్ని స్వాతంత్య్ర పోరాటాలైనా చేయవలసిందే! కానీ కాంగ్రెస్... గెలిచే పోరాటం చేయటం లేదు, ఓడించే పోరాటమూ చేయటం లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కబడ్డీ జట్టుతో ఆటకు బిలియర్డ్స్ ప్లేయర్స్ని దింపుతూ ఉంటుంది!! -
దారిచూపింది గత ప్రభుత్వమే!
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన వాణిజ్యం – పరిశ్రమల శాఖ (ఆహార శుద్ధి)... ఆ రంగానికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కూడా ప్రయో జనకరంగా మారింది. విశాఖపట్టణంలో ఆగస్టు 29న జరిగిన ఒక సదస్సులో ‘ఆహార శుద్ధి రంగంలో లక్ష కోట్ల పెట్టుబడులు’ అంటూ చంద్రబాబు నాయుడు దీన్ని తనదన్నట్టు ‘వోన్’ చేసుకున్నారు.రాష్ట్ర విభజన తర్వాత 2014–2019 మధ్య కాలంలో కేవలం ‘రాష్ట్ర ఆహార శుద్ధి సొసైటీ’ మాత్రమే ఉండేది. దానికి సీఈఓ స్థాయిలో ఒక అధికారి ఉండే వారు. వ్యవసాయ రంగానికి వాణిజ్య పంటల సాగుతో జవజీవాలు ఇవ్వడా నికీ, కార్పొరేట్ సంస్థల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో ఆహార పంటల సాగు, ఉత్పత్తుల శుద్ధి, ప్యాకింగ్ వంటి విభాగాల్లో మహిళలకు పెరిగే ఉపాధి వంటి బహుళ ప్రయోజనాలు లక్ష్యంగా ఈ శాఖను గత వైసీపీ ప్రభుత్వం 2020లో ప్రారంభించింది. దీనికున్న విలువను గ్రహించి కూటమి ప్రభుత్వం పరిశ్రమల శాఖ హోదా కల్పిస్తూ జీవో ఇచ్చింది. ఈ శాఖను ప్రారంభించాక, ఎటువంటి ప్రచార పటాటోపాలు లేకుండానే నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి 2023 జులై 26న తన క్యాంప్ ఆఫీస్ నుంచి రూ. 1,719 కోట్ల వ్యయంతో 11 ‘ఫుడ్ ప్రాసెసింగ్’ యూనిట్లను ప్రారంభిస్తూ, ఐదింటికి ‘వర్చువల్’ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. వీటి ఉత్పత్తి సామర్థ్యం ఏటా 3.14 లక్షల టన్నులు కాగా, 40,307 మంది రైతులు వీటి ద్వారా ప్రయోజనం పొందు తున్నారు. వీటిని ‘లొకేట్’ చేసిన పద్ధతి మొదటి నుంచి జగన్ ప్రభుత్వ విధానమైన ‘వికేంద్రీకరణ’ సూత్రానికి కట్టుబడి జరిగింది. కూరగాయలు, పండ్లు ‘ప్రాసెసింగ్ కేంద్రాలు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు; చిరు ధాన్యాల ప్రాసెసింగ్ కేంద్రం విజయనగరం జిల్లా ఎస్.కోట; ఉల్లిపాయలు, టమోటా ‘ప్రాసెసింగ్’ కోసం కర్నూలు జిల్లా తడకనపల్లిలను ఎంపిక చేయడం జరిగింది. 2023 అక్టోబర్ 5న తన ఆఫీస్ నుంచి ‘గ్రీన్ ల్యాండ్ సౌత్ లిమిటెడ్’, ‘డీపీ చాక్లెట్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘బనానా ప్రాసెసింగ్ క్లస్టర్’... ఇలా మూడు ‘ఫుడ్ ప్రాసెసింగ్’ కంపెనీలు ఒకే రోజు ‘వర్చువల్’గా ప్రారంభించి, మరో 9 పరిశ్ర మలకు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా రూ. 3,008 కోట్లు పెట్టుబడి వస్తే, 70 వేల మందికి ఉద్యోగాలు దొరికాయి. 14 జిల్లాలకు చెందిన 91 వేలమంది రైతులకు ప్రయోజనం కలిగింది. అదే రోజు గంటకు 60 టన్నుల ఆయిల్ పామ్ గెలల నుంచి పామాయిల్ నూనె తీసే ఫ్యాక్టరీ– ‘త్రీ ఎఫ్ ఆయిల్ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీని తూర్పు గోదావరి జిల్లా అయ్యవరం వద్ద రూ. 250 కోట్లతో ప్రారంబించడానికి ఒప్పందం జరిగింది. 50వేల మంది రైతులకు ప్రయోజనం, 1500 మందికి ఉపాధి కలుగుతోంది. ఇటువంటి ‘ఫుడ్ ప్రాసెసింగ్’ రంగం ఇప్పుడు రైతులకే కాక ఈ ప్రభుత్వానికి కూడా అక్కరకు వచ్చింది.– జాన్సన్ చోరగుడి ‘ అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తే ఎలా?
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, ‘ఇండియా టుడే’ గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్కు తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత న్యాయ వ్యవస్థలోని పలు కీలక అంశాలను స్పృశించారు. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ–సవాళ్లు, పౌరుల స్వేచ్ఛ మొదలు – రాజకీయాలతో ముడిపడిన కేసుల విచారణ సమయంలో, ప్రత్యేకించి ఈ సోషల్ మీడియా యుగంలో న్యాయమూర్తులు ఎదుర్కొనే సంఘ ర్షణ వరకు వివిధ సున్నిత అంశాలపై లోతైన దృష్టి కోణాన్ని జస్టిస్ చంద్రచూడ్ ఆవిష్కరించారు. తాను రచించిన ‘వై ది కాన్ స్టిట్యూషన్ మేటర్స్’ అనే కొత్త పుస్తకంలోని విశేషాంశాల ఆధారంగాసాగిన ఈ ఇంటర్వ్యూలో న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకతనుజస్టిస్ చంద్రచూడ్ పునరుద్ఘాటించారు. ఆ సుదీర్ఘఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు.భిన్నాభిప్రాయాలపై ఫిర్యాదులు ఓ భయంకర ధోరణి!మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. అభిప్రాయ వ్యక్తీకరణకు సోషల్ మీడియా స్వేచ్ఛా వేదిక. అలాంట ప్పుడు భిన్నాభిప్రాయాలు తప్పవు. కానీ, ఏం మాట్లాడితే కేసు పెడతారోనని సంకోచించే పరిస్థితులు ఉన్నప్పుడు అవి అభిప్రాయ వ్యక్తీకరణపై ప్రభావం చూపుతాయి. తద్వారా మాట్లాడే హక్కుకు భంగం కలుగుతుంది. మన అభిప్రాయం వ్యతిరేకంగా ఉందని, లేదా అనుకూలంగా లేదని ప్రత్యర్థులో, ప్రభుత్వమో భావిస్తే పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న భయం ఉంటుంది. ఇలాంటి భయాలు, సంకోచాలు ఇండియాకు మాత్రమే ప్రత్యేకం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న సమస్యే! మరో వైపు ప్రజా క్షేత్రంలో సైతం అసహనశీలత ఎక్కువైంది. సాధారణంగా ఎవరైనా తమకు నచ్చిందే వినాలనుకుంటారు. ఎవరో కార్టూన్ వేస్తేనో, లేక మరెవరో ప్రకటన జారీ చేస్తేనో, లేదంటే ప్రసంగిస్తేనో... అది ఎవరికో నచ్చకపోతేనో వెంటనే ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాదు, దేశంలోని ఏ ప్రాంతంలోని వారైనా ఫిర్యాదు చేయవచ్చు. ఏకకాలంలో పది వేర్వేరు ప్రాంతాల నుండీ కేసులు నమోదు కావచ్చు. ఇది నిజంగా చాలా భయంకరమైన ధోరణి. మాట్లాడితే మిమ్మల్ని శిక్షించవచ్చు అనే భయం చాలా ఆందోళన కలిగించే విషయం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. విమర్శలను తప్పు పట్టలేం!అభిప్రాయాలు వ్యక్తం చేసేవారికి కూడా బాధ్యత అవసరం. ముఖ్యంగా – సోషల్ మీడియా ద్వారా ద్వేషం, అసహనం వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున మాటలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సామాజిక స్పృహను కలిగి ఉండాలి. మన సమాజం బహుళ మతాలు, సంస్కృతుల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛా హక్కు ఉన్నా, మత భావాలను దెబ్బతీయకుండా మాట్లాడాలి. లేకపోతే చట్టపరమైన పరిణామాలు తప్పవు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ఇందుకు ఉన్న సహేతుకమైన పరిమితులను వివరిస్తుంది. అయితే ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడాన్ని మాత్రం తప్పు పట్టలేం. ఇది సానుకూల ఫలితాలకే దోహదం చేస్తుంది.చట్టాల పునఃసమీక్ష అవసరంబ్రిటిష్ ప్రభుత్వం ఇండియాను పాలిస్తున్నప్పుడు చేసిన ‘దేశద్రోహం’ వంటి చట్టాలను నేడు సమీక్షించాల్సిన అవసరం ఉంది. ‘భారత్ ఒక దేశంగా నిలవగలదా?’ అని స్వాతంత్య్రానికి ఆరంభంలో సందేహాలు ఉండేవి. కానీ రాజ్యాంగ నిర్మాణం దేశాన్ని అత్యంత పటిష్ఠంగా ఉంచేలా జరిగింది. ఈ ఏడున్నర దశాబ్దాలలో భారత్ ఒక బలమైన, స్థిరమైన రాజకీయ వ్యవస్థగా అభివృద్ధిచెందింది. కాబట్టి అప్పటి చట్టాలను సమీక్షించాలి. అలాగే ‘పరువు నష్టాన్ని’ క్రైమ్ పరిధి నుంచి తప్పించాలి. ఎందుకంటే, క్రిమినల్ డిఫమేషన్ గురించి కొత్త దృష్టికోణంతో పరిశీలించడం అవసర మనిపిస్తోంది. ఒకవేళ డిఫమేషన్ను క్రిమినల్ చర్యగా కొనసాగించాలంటే కొన్ని పరిమితులను తప్పక ఏర్పరచుకోవాలి. నేర స్వరూ పాన్ని కొత్తగా నిర్వచించాలి. మొత్తం ఈ చట్టాన్ని పార్లమెంట్ తిరిగి పరిశీలించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను.ప్రజలూ రాజ్యాంగ పరిరక్షకులే!భారత రాజ్యాంగం 75 ఏళ్లుగా దృఢంగా నిలిచి ఉండటం గర్వకారణం. రాజ్యాంగాన్ని సమీక్షించాల్సిన అవసరం లేదు. ఎన్నో సవాళ్లను తట్టుకుని నిలబడింది. ప్రధాన పీఠికకు ఎటువంటి భంగం కలుగకుండా పార్లమెంట్ ఎటూ సవరణలు చేస్తుంటుంది. కాలానికి తగ్గట్లు కోర్టులూ సూచనలు చేస్తుంటాయి. అందుకే రాజ్యాంగం సాధారణ చట్టం తరహాలో కాకుండా తరతరాల శాశ్వత విలువలను ప్రతిబింబిస్తుంది. డాక్టర్ అంబేడ్కర్ చెప్పినట్లు, రాజ్యాంగ ఫలితం దానిని అమలు చేసే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. కేవలం న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజలకూ రాజ్యాంగ పరిరక్షణలో బాధ్యత ఉంది.గత తీర్పుల సమీక్ష సహజం!మన పాలనలో లోపాలున్నప్పటికీ ఆ పాలనను పూర్తిగా తిర స్కరించాలనడం సరికాదు. విధానాల్లో అపసవ్యతలు ఉన్నప్పటికీ మన దేశం సాధించిన ఎన్నో విజయాలను కూడా గుర్తించాలి. హక్కుల సాధనలో మనం గొప్ప ముందడుగు వేశాం. ఇది మనం అంగీకరించవలసిన అంశం. అవసరాలకు అనుగుణంగా గత తీర్పుల సమీక్షలు ఎలాగూ జరుగుతుంటాయి. ఉదాహరణకు అత్యవసర పరిస్థితుల్లో ‘జీవించే హక్కు’ను తాత్కాలికంగా నిలిపే యవచ్చు’ అని ఏడీఎం జబల్పూర్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును ఆ తర్వాత ఉపసంహరించుకోవటం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఏ సమాజ చరిత్రలోనైనా ఉంటుంది. జైలు కాదు... బెయిల్ ముఖ్యం!ఉపా (ఉగ్రవాద కార్యకలాపాలు), పీఎంఎల్ఏ (మనీ ల్యాండ రింగ్) వంటి కొన్ని నిరోధక చట్టాల విషయంలో బెయిళ్లకు చాలా కఠినమైన నియమాలు అమలవుతున్నాయి. ఇది ఒక సమస్యే. న్యాయవ్యవస్థలోని అసలు సూత్రం ఏమిటంటే.. ‘ఆరోపణ నిరూ పణ అయ్యేంతవరకు ఒక వ్యక్తి నిర్దోషే’నన్నది. జస్టిస్ కృష్ణ చెప్పి నట్లు.. ‘బెయిలు నియమం కావాలి, జైలు మినహాయింపు అవాలి.’ (బెయిల్ మస్ట్ బి ది రూల్.. జైల్ మస్ట్ బి ఎక్సెప్షన్ ). ఏదైనా కేసులో అరెస్టయిన వ్యక్తి ప్రతి వాయిదాకు, అవసరమైనప్పుడూ, కోర్టు ముందుకు హాజరయ్యే హామీ ఇస్తే బెయిల్ ద్వారా ఆ వ్యక్తిని తాత్కా లికంగా విడుదల చేయవచ్చు. కోర్టులు వ్యక్తి స్వేచ్ఛను కాపాడాలి!జస్టిస్ సూర్యకాంత్ ఒక ప్రతిష్ఠాత్మకమైన తీర్పు ఇచ్చారు. నిర్దిష్ట సమయంలో విచారణ ముగియకపోతే కఠిన చట్టాలు ఉన్నా బెయిల్ను మంజూరు చేయవచ్చు. ఉదాహ రణకు ఒక కేసులో 100 మంది సాక్షులు ఉన్నారు. వారందరి విచారణకు 5–7 సంవ త్సరాలు పడుతుంది. ఈ కేసులో నింది తుడు చివరకు నిర్దోషిగా తేలితే అప్పటి వరకు దాదాపు ఐదు సంవత్సరాలు జైల్లో ఉండటం అన్యాయం. అందుకే ఆర్టికల్ 21 కింద వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టులు సంరక్షించాల్సిన అవసరం ఉంది. సాక్షులను ప్రభా వితం చేసే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడం జిల్లా కోర్టుల నుండి సుప్రీంకోర్టు వరకు అన్నిటి బాధ్యత.బెయిల్పై భిన్నమైన తీర్పులు తగ్గాలి!బెయిల్ మంజూరు విషయంలో భిన్నత్వం నిజమే. కానీ సుప్రీంకోర్టులో ప్రతి సంవత్సరం 70 నుంచి 80 వేల కేసులు దాఖలవుతున్నాయి. 34 మంది జడ్జీలు ఒకే సారి ఒకే కేసును విచారించలేరు కనుక ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులున్న బెంచ్లుగా విభజించడం జరుగు తుంది. ఫలితంగా వ్యక్తిగత న్యాయమూర్తుల ఆలోచనల వల్ల తీర్పుల్లో భిన్నాభిప్రాయాలు వస్తాయి. అందువల్ల బెయిల్స్ విష యంలో భిన్నమైన తీర్పులు వెలువడవచ్చు. ఈ భిన్నత్వాన్ని తగ్గించ వచ్చు కానీ పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. అయితే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన బెయిల్ విషయంలో మాత్రం ఏ బెంచ్కైనా ఒకే విధమైన ప్రాధాన్యత ఉండాలి. సుప్రీంకోర్టు నుండి హైకోర్టు లకు, అక్కడి నుండి జిల్లా కోర్టులకు ఈ సందేశం చేరాలి.వెనకాడుతున్న జిల్లా కోర్టులు!మన జిల్లా కోర్టులు బెయిల్ ఇవ్వాల్సిన కేసులలో కూడా ఇవ్వడం లేదు. ఫలితంగా ఏమవుతోందంటే... జిల్లా కోర్టు ద్వారా బెయిల్ సాధ్యమయ్యే కేసులు కూడా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్తాయి. ఇందులో పలు ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. మొదటిది ఆలస్యం. జిల్లా కోర్టు నుండి హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు వరకు కేసును తీసుకెళ్లేటప్పుడు తీవ్ర జాప్యం జరుగుతుంది.రెండవది వనరులు. ప్రతి ఒక్కరికీ సుప్రీంకోర్టు వరకు వెళ్లే వనరులు ఉండవు. వనరులు లేకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లలేకపోవచ్చు. మూడవది ఇలాంటి వ్యవస్థ సుప్రీంకోర్టుపై అనవసర పనిభారాన్ని మోపుతుంది. ఇది భారతదేశంలోని సంక్లిష్టత, వైవిధ్యం, కేసుల పరిమాణాన్ని సూచిస్తుంది. న్యాయమూర్తుల సంఖ్య పెంచడంకంటే సుప్రీంకోర్టుకు వచ్చే కేసులను పరిమితం చేయడం అవసరం. ప్రభుత్వం అతి పెద్ద కక్షిదారు కావడం వల్ల కేసుల భారమూ అధిక మవుతోంది. కాబట్టి సంస్థాగత సమీక్ష అవసరం. పదవీ విరమణ వయసు పెంచాలి!న్యాయమూర్తులకు పదవీ విరమణ వయసు ఉండాల్సిందే. అయితే ఆ వయఃపరిమితిని పెంచవలసిన అవసరం కూడా ఉంది. అలాగని అమెరికా సుప్రీంకోర్టు తరహాలో న్యాయమూర్తులు ఎప్ప టికీ పదవిలో కొనసాగడమనే పరిస్థితి ఉండకూడదు. కొత్త తరానికి అవకాశం రావాలి. ఇండియాలో ప్రస్తుత పదవీ విరమణ వయసు (జిల్లా జడ్జిలు 60, హైకోర్టు జడ్జిలు 62, సుప్రీంకోర్టు జడ్జిలు 65) తక్కువనే చెప్పాలి. సగటు జీవన ప్రమాణం పెరిగినందు వల్ల విరమణ వయసులనూ పెంచాలి. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వేర్వేరు వయసులు ఉండకూడదు. అందరికీ సమానంగా 68 చేయాలి. దాని వల్ల సుప్రీంకోర్టుపై కేసుల ఒత్తిడి తగ్గుతుంది. -
ఒప్పందమా? వ్యూహాత్మకమా!
పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య అనూహ్యమైన రీతిలో ఈనెల 17న జరిగిన రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రెండు దేశాల రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నవే. సౌదీ రాజు ఫైజల్, పాక్ అప్పటి ప్రధాని అయూబ్ ఖాన్ల మధ్య 1967 లోనూ ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. కానీ అప్పటి పరిస్థితులు, అవసరాలు సాధారణ స్థాయివి. అప్పటికి పాకిస్తాన్ అణ్వాయుధ దేశం కూడా కాదు. నాటి నుంచి 58 సంవత్సరాల సుదీర్ఘకాలంలో అన్నీ మారాయి. అరబ్ దేశాలు, ముస్లిం దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగానూ ఎంతో సంక్లిష్టంగా కూడా అయ్యాయి. అందువల్లనే ప్రస్తుత ఒప్పందం గమనార్హమైనది అవుతున్నది.దాడి తర్వాతే కుదిరిన ఒప్పందం! ఒప్పందం జరిగిన తక్షణ పరిణామాలు కూడా ప్రాముఖ్యం కలిగినవి. ఈ నెల 9న గల్ఫ్ దేశమైన ఖతార్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి జరిపి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అమెరికాతో వ్యూహా త్మక సంబంధం గల అరబ్ దేశాలు, తమ ప్రాంతంలో అర డజను అమెరికన్ సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్నవి అయినప్పటికీ ఈ దాడి జరగటం ఒకటైతే, మళ్లీ దాడులకు వెనుకాడబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. అది చాలదన్నట్లు అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో స్వయంగా టెల్ అవీవ్కు వెళ్లి ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించటం సౌదీతో పాటుగా సహ గల్ఫ్ దేశాలన్నింటిని తీవ్రమైన అభద్రతా భావానికి గురిచేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్ధోక్తులు వాటికి తోడయ్యాయి. ఈ తక్షణ నేపథ్యంలో జరి గిందే పాకిస్తాన్తో సౌదీ రక్షణ ఒప్పందం.అక్కరకు రాని అగ్రరాజ్యంఒప్పందం అనంతరం మీడియా ప్రశ్నలకు సౌదీ ప్రభుత్వం ప్రతినిధి ఇచ్చిన ఒక సమాధానం ఇదే స్థితిని ధ్రువీకరిస్తున్నది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు కొన్ని దశాబ్దాలుగా ఉండి, 1967 నాటి ఒప్పందం కూడా ఒకటి ఉన్నప్పుడు తిరిగి ఈ ఒప్పందం ఎందుకన్న ప్రశ్నకు ఆ ప్రతినిధి ఇచ్చిన సమాధానం – ‘అనిశ్చితంగా మారిన భవిష్యత్ అవసరాల కోసం’ అని! పైన ప్రస్తావించిన పరి ణామాల కారణంగా భవిష్యత్తు ఎందుకు అనిశ్చితంగా మారిందో వేరే వివరణ అవసరం లేదు. ఇక్కడ గుర్తించవలసిన మరొక విషయం ఏమంటే, అటువంటి అనిశ్చిత పరిస్థితులలో ఒక అణ్వస్త్ర దేశంతో సౌదీకి ఒప్పందం అవసరమైంది. సాటి గల్ఫ్ దేశం అయిన ఖతార్పై ఇజ్రాయెల్ అనే ఒక అణ్వస్త్ర దేశం దాడి జరిపినప్పుడు మరొక అణ్వస్త్ర దేశమైన అమెరికాతో తమకు గల వ్యూహాత్మక సంబంధం సౌదీకి కొరగానిది అయింది. దాంతో ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్తో పరస్పర రక్షణ ఒప్పందం అనివార్యం అయినట్లుగా కనిపిస్తోంది. మిగతా దేశాలూ చేరుతాయా?!ఒప్పంద పాఠం వెల్లడి కాలేదు గానీ, వారు అధికారికంగా ఒక ప్రకటనలో తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి: ‘రెండి టిలో ఏ దేశం పైన బయటి నుండి ఎవరు దాడి జరిపినా రెండవ దేశంపై కూడా జరిపినట్లే పరిగణించి, దాడికి గురైన దేశానికి తోడుగా నిలుస్తారు. ఉభయుల రక్షణకు అవసరమైన పరస్పర సహ కార చర్యలు ఇప్పటికన్నా మరింతగా తీసుకుంటారు’. ఈ ఒప్పందం పరిధిలోకి పాకిస్తాన్ అణ్వస్త్రాలు కూడా వస్తాయా అన్న సూటి ప్రశ్నకు రెండు దేశాల ప్రతినిధులు కూడా... పాకిస్తాన్కు గల ఆయుధశక్తి మొత్తం వస్తుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ అణు దేశమే గాక ముస్లిం ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి. ఇజ్రాయెల్ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న ఇతర గల్ఫ్ దేశాలు సైతం ఈ ఒప్పందంలో చేరవచ్చునా అన్న ప్రశ్నకు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, తమ ద్వారాలు ఎవరికీ మూసుకుపోలేదన్నారు. ఖతార్పై ఇజ్రాయెల్ దాడి 9న; అరబ్, ఇస్లామిక్ దేశాల శిఖరాగ్ర సమావేశం 15న జరిగిన తర్వాత, 17న ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి వారం రోజులలో ఆ సమావేశ దేశాలు గాని; ఇజ్రాయెల్, అమెరికా, యూరప్లు గాని స్పందించలేదు. భారత ప్రభుత్వ ప్రతినిధి మాత్రం, ‘మా మనోభావాలను సౌదీ నాయకత్వం మన్నించగలదని ఆశిస్తున్నా’మన్నది. అయితే, వెంటనే తలెత్తుతున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ సౌదీపై ఇజ్రాయెల్ దాడి జరిపితే పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొంటుందా? పాల్గొంటే అమెరికా ఏం చేయవచ్చు? అదే విధంగా ఇండియా–పాక్ల మధ్య సాయుధ ఘర్షణ, లేదా యుద్ధం జరిగితే సౌదీ ప్రభుత్వం తన అపారమైన ఆయుధ సంపత్తిని పాకిస్తాన్కు సమకూర్చుతుందా... అన్నవి ఆ ప్రశ్నలు. ఇక్కడ పాక్ రక్షణ మంత్రి 20వ తేదీన చెప్పిన మాటను గమనించాలి. తమ ఒప్పందం ఇరువురి ఆత్మరక్షణకే తప్ప ఇత రులపై దాడి చేసేందుకు కాదని, ఒకవేళ తమపై భారతదేశం దాడి జరిపితే మాత్రం సౌదీ అరేబియా తప్పక రంగంలోకి వస్తుందని, ఆ విషయమై ఎంత మాత్రం సందేహం అక్కర లేదని అన్నారాయన. ఊహకందని పర్యవసానాలుభారత ప్రభుత్వం ఈ అసాధారణ పరిణామాన్ని అనివార్యంగా గమనికలోకి తీసుకోవలసి ఉంటుంది. ఒకవేళ రాగల రోజులలో మరిన్ని అరబ్, ముస్లిం దేశాలు ఈ ఒప్పందంలో చేరితే పరిస్థితి తీవ్రత ఆ మేరకు పెరుగుతుంది. ఇజ్రాయెల్, అమెరికా తీరును బట్టి అది జరగవచ్చు కూడా! ఒప్పందానికి ఇది ఒక కోణం కాగా, ఇజ్రాయెల్ వైఖరిలో గమనించవలసిన మరొక కోణం ఉంది. వారి దాడులు ఖతార్తో ఆగుతాయా లేక ఇతర గల్ఫ్ దేశాలకు విస్తరించే అవకాశం ఉందా? ఈ దేశాలకు అమెరికాతో గల వ్యూహాత్మక సంబంధాలు, ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల పరిస్థితి ఏమిటి? ప్రస్తుత ఒప్పందాన్ని ప్రభావితం చేసి నిరుపయోగంగా మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తుందా? ఇటువంటి ఒప్పందం మూలంగా రాజకీయంగా పాకిస్తాన్ పాత్ర బలోపేతంగా మారే అవకాశం ఉంది గనుక ఆ ప్రభావం భారత్పై ఏ విధంగా ఉండవచ్చు?... అన్నీ ప్రశ్నలే. మున్ముందు అనేక మలుపులుఏమైనా... ఖతార్పై దాడి, అమెరికా మౌనం, దోహా శిఖరాగ్ర సమావేశం, సౌదీ–పాక్ ఒప్పందం అనే నాలుగు పరిణామాలు మాత్రం అసాధారణమైనవి. కేవలం 9 రోజుల పరిధిలో చోటు చేసుకున్న ఈ పరిణామాల అర్థం మున్ముందు అనేక రూపాలలో ఉంటుంది. ఈ పరిణామ పరంపరకంతా మూలకారణమైన పాలస్తీనా సమస్య ఏమి కానున్నదనేది అన్నింటికీ మించిన ప్రశ్న. వాస్త వానికి ఆ సమస్య కొనసాగటంలో ఇజ్రాయెల్, అమెరికాల బాధ్యత ఎంతున్నా, పరిష్కారం కోసం కచ్చితమైన వైఖరితో పట్టుదలగా ప్రయత్నించని దోషం మాత్రం అరబ్ దేశాలదే! వారు ఇప్పటికైనా ఆ పని చేయనట్లయితే, అన్ని దాడులు, పాలస్తీనా హత్యాకాండల దోషం వారిదే అవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అమృత కలశంలో అభాండాల విషం
ప్రజలకు నిశ్శబ్దంగా సేవ చేసేవారు ఒకరు. సేవ చేస్తున్నాము అని పెద్దగా అరుస్తూ ప్రకటించుకునేవారు మరొకరు. కొండంత చేసినా గోరంత కూడా చెప్పుకోని సంస్కారం ఒకరిది. గోరంత కూడా చేయకుండానే కొండంత చేశామని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి పత్రికా ప్రక టనలు ఇచ్చుకునే దగాకోరు సంస్కారం మరొకరిది. మొదటి వారు మాజీ ముఖ్య మంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, మరొకరు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కూటమి ప్రభుత్వం అని ప్రత్యేకంగా చెప్పకపోయినా అందరికీ తెలుసు. అయినప్పటికీ – అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల ఆరంభ సందర్భంలో పలు వాస్తవాలను మరొక్కసారి మీ ముందు ఉంచుతున్నాను.బాబుది అదే నీతి, అదే రీతి!తన అయిదు సంవత్సరాల పాలనలో హిందూ ధర్మానికి, హైందవ ధర్మ ప్రచారానికి, ధర్మ రక్షణకు జగన్మోహన్రెడ్డి చేసిన కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కాదు. కాని ఆయన ప్రచారం కోరుకోలేదు. కరోనా కాలంలో ప్రపంచంలోని ప్రతి వ్యవస్థా స్తంభించి పోయింది కాని, రాష్ట్రంలో ఏ హిందూ దేవాలయంలోనూ పూజలు ఆగలేదు, జగన్ ఆగనివ్వలేదు. అధికారంలో ఉన్నపుడు వందల ఆలయాలు కూల్చిన చంద్రబాబు, దైవ పూజను కాలికి బూట్లు తీయకుండానే చేసే చంద్రబాబు; సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టి, శాలువా కప్పుకుని మైకు ముందు ఊగితే చాలు అనుకునే ‘పవన’స్వామి... జగన్ పాలనలో హైందవ ధర్మానికి ఏదో అన్యాయం జరిగిందని అరుస్తున్నారు. మల మూత్రాలు, మద్యమాంసాల మధ్య సాక్షాత్తు మహావిష్ణువు విగ్రహం పడి ఉందయ్యా అంటే, ఆ తప్పును గుర్తించి సరిచేసుకోక, చెప్పిన వాడిది తప్పు. వెంటనే జైల్లో పెట్టండి అని పోలీసులను పురమాయిస్తున్నారు. అబద్ధాలు చెప్పే వాడికి అందలాలు, నిజం చెప్పే వాడికి అరదండాలు వేయడం అన్నది ఆది నుంచీ చంద్రబాబు నీతి, రీతి!హైందవ ధర్మానికి స్వర్ణయుగంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలం వేద సంస్కృతికీ, హైందవ ధర్మానికీ స్వర్ణయుగం. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాలన, జగన్ మోహన్రెడ్డి పాలన చిరస్మరణీయం అన్నది ప్రజావాక్కు. గత అయి దేళ్లు ప్రతి పక్షంలోనూ, ఇపుడు ప్రభుత్వంలోనూ చంద్రబాబు చేస్తున్న ఒకే ఒక్క పని... జగన్ను తిట్టడం! జగన్ చేసిన మంచి పనుల మీద బకెట్లతో కాక ఓ నదీ ప్రవాహంలా విషాన్ని చల్లడం! హిందూధర్మం మరింత వెలిగింది, తిరుమల తిరుపతి దేవస్థానం దేదీప్యమానమైందీ నిస్సందేహంగా జగన్ వల్లనే, ఆయన పరిపాలనా కాలంలోనే! తిరుమలలో ‘శ్రీవాణి ట్రస్టు’ ద్వారా స్వామి వారి దర్శనానికి అంకురార్పణ చేసింది జగనే. తద్వారా శ్రీవారి శీఘ్ర దర్శనం, దేశవ్యాప్తంగా శి«థిలమై ఉన్న హైందవ దేవాలయాల పున రుద్ధరణ జరిగింది. బాబుకు అది అర్థం కాక ‘శ్రీవాణి ట్రస్టు’పై అనేక ఆరోపణలు చేశారు. చేయించారు. తాను అధికారంలోకి వస్తే శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తామని ఎన్నికల హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్టు రద్దు మాటఅటుంచి, మరిన్ని ఎక్కువ టికె ట్లను అమ్ముతున్నారు. ఆలయాలలో దీపాలు వెలిగించి ఆరాధించిన వారు జగన్. విస్తరణ పనుల పేరుతో వందల ఆలయాలను కూల్చిన మనిషి చంద్రబాబు. ఎవరు నిజమైన హైందవ ధర్మ రక్షకులు? ఇప్పుడేదీ గో సంరక్షణ?!జగన్ హయాంలో దేవస్థానం గోశాల సంరక్షణ జరిగింది. గోవులు ఆరోగ్యంగాను, ఆనందంగాను ఉన్నదీ అప్పుడే. గో సంత తిని మరింత అభివృద్ధి చేయాలని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విరాళాల కింద గిర్, కాంక్రీజ్, సాహిపాల్, పుంగనూరు,ఒంగోలు జాతులకు చెందిన గోమాతలను తిరుపతి గోశాలకు తీసుకురావడం జరిగింది. వాటి సంరక్షణకు, సంతతికి వృద్ధికి పక్కా ప్రణాళికలు తయారుచేసి అమలు చేయడం మొదటిసారి జరిగింది. తెలుగు రాష్ట్రాలలోని వివిధ గోశాలలను గుర్తించి అనేక గోశాలలకు మేత, నిర్వహణ వ్యయం అందించింది జగనే. ఈ కూటమి ప్రభు త్వంలో, ఈ ధార్మిక మండలి పాలనలో దేవస్థానం గోశాలలో ఎన్ని గోవులు ఆకలితో, అనారోగ్యంతో మరణించాయో అందరికీ తెలుసు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారు నవనీత ప్రియుడు. అందుకే నిత్యం ఆయనకు నవనీత సేవ జరుగుతుంది. జగన్ ముఖ్యమంత్రి కావటానికి ముందు ఆ సేవ అత్యంత యాంత్రికంగా జరిపేవారు. దాన్ని పూర్తిగా మార్చివేశారు జగన్. ప్రతినిత్యం శ్రీవారి సేవకుల సహాయంతో మజ్జిగ చిలికించి, వెన్న తీసి అప్పుడే తీసిన నవనీతాన్ని ఆ నవనీత చోరుడికి ఆరగింపుగా అందించడం ఎంత ధార్మిక కార్యం!వేదంలా ఘోషించిన అలిపిరితిరుమల ఆస్థాన మండపంలో జాతీయ వేదసభ నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులను ఆహ్వానించాం. వేద వ్యాప్తికి, రక్షణకు, హైందవ ధర్మ పరిరక్షణకు అవసరమైన కార్యక్రమాలను, సలహాలను వారి నుంచి స్వీకరించాం. అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం చేయదగ్గ కార్యక్రమాలు ఎన్నో వారు వివరించారు. ఈ ఘనత జగన్ది కాదా? వేదమూర్తి, వేద స్వరూపుడు అయిన శ్రీవారికి నిత్యం వేదఘోష వినిపించాలని అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద శ్రీవేంకటేశ్వర దివ్యానుగ్రహ హెూమం ప్రారంభించాం. యువత వక్రమార్గం పట్టకుండా సక్రమ మార్గంలో సరైన హిందువుగా జీవించాలని శ్రీవారి గోవింద కోటి రాసినవారికి శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించాం. గోవిందనామ కోటి రాసి ఆలయ సంబంధిత అధికారికి అందజేస్తే వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా శ్రీవారి బ్రేక్ దర్శనం లభించేలా చేశాం. వంద కీర్తనలకు బాణీలువేదాలు, పురాణాలు అందరికీ అర్థం అయ్యే భాషలో ముద్రించ డానికి ప్రత్యేక ప్రాజెక్టులు ఏర్పాటు చేశాం. గతంలో నేను దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే వ్యాఖ్యానంతో, ప్రతి పదార్థంతో కూడిన భారతాన్ని, భాగవతాన్ని ముద్రించాం. దేవ స్థానం గ్రంథాలలో అత్యంత అధికంగా అమ్ముడు పోతున్నవి అవే. సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమయ్య శ్రీవారిపై 32 వేల సంకీర్తనలు రచించారు. అందులో కేవలం పదివేల కీర్తనలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఎస్.వి. భక్తి ఛానల్, ఇతర పండి తులు, సంగీతకారుల సహాయంతో నూతనంగా దాదాపు 100 కీర్తన లకు బాణీలు కట్టించి వెలుగులోనికి తెచ్చాం. ఆంజనేయస్వామి జన్మస్థలం మీద ప్రజలలో అనేక వాదాలు, అపోహలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని పండిత పరిషతు ఏర్పాటు చేశాం. వారు వేలాది గ్రంథాలు, శాస్త్రాలు, వేదాలు, భౌగోళిక అంశాలు పరిశీలించారు. ఆంజనేయుని జన్మ స్థలం తిరుమలలోని అంజనాద్రి అని నిర్ధారించారు. ఆ ప్రాంతంలో బాల ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశాం. జీవన భృతికి పారాయణంరాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, గిరిజన తండాలకు చెందిన వారికి శ్రీవారి బ్రహ్మోత్సవాలలోను, వైకుంఠ ఏకాదశి సందర్భంగాను ఉచిత దర్శనం కల్పించాం. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ వేదం వినిపించాలనే, బ్రాహ్మణ కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే మహత్తర సంకల్పంతో 700 మందికి పైగా వేద పారాయణ దారులను నియమించాలని సంకల్పించాం. దాని ద్వారా 700 పేద బ్రాహ్మణ కుటుంబాలకు జీవన భృతి ఏర్పడుతుంది. గ్రామ గ్రామాన వేదం వర్ధిల్లి, ధర్మరక్షణ జరుగుతుంది. కాని ఈ కూటమి ప్రభుత్వం, ఈ ధర్మకర్తల మండలి ఈ నియామకాలకు అడ్డుపుల్ల వేసింది. సనాతన ధర్మరక్షణ కంకణాబద్ధుడైన ‘పవనానందుడు’ దీనిపై మాట్లాడకపోవడం, 700 మంది పేద బ్రాహ్మణ కుటుంబాల నోరు కొట్టడం ఏ ధర్మరక్షణో ఆయనే చెప్పాలి.కూటమి వచ్చాక నత్తనడకతిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగులకు సైతం ఇంటిస్థలాలు ఇచ్చి తీరాలన్నది జగన్ సంకల్పం. నేను రెండవసారి అధ్యక్షుడిగా ఉండగా ప్రభుత్వం నుంచి దాదాపు 1200 ఎకరాల స్థలం తీసుకొని తి.తి.దే విశ్రాంత ఉద్యో గులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాం. తి.తి.దే.లోని కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగుల జీతం 5 వేల నుంచి 20 వేల వరకు పెంచి వారి కుటుంబాలకు ఆనందం పంచాం. 2021లో చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల నిమిత్తం రూ. 320 కోట్లతో పద్మావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం తలపెట్టాం. అత్యవసరంగా పూర్తి చేయవలసిన ఆ పను లను ఈ కూటమి ప్రభుత్వం నత్తనడక నడిపిస్తోంది. రాయలసీమ ప్రజలందరికి అందుబాటులో ఉన్న అత్యా ధునిక వైద్యశాల ‘స్విమ్స్’ ఆధునికీకరణకు గాను రూ. 200 కోట్లు మంజూరు చేశాము. న్యూరాలజీ, కార్డియాలజీ విభా గాలకు ప్రత్యేక భవనాల నిర్మాణం ప్రారంభించాం. మాట తప్పని మనిషి జగన్జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమలలోని స్థానికులు గుండె మీద చేయి వేసు కుని హాయిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వారికి ప్రతీది సమస్యే. వారిపై ప్రతి ఒక్కరూ ఆధిపత్యం చలాయించేవారే. మొదటిసారి కరోనా వచ్చినపుడు తిరుపతి వీధుల్లో వేలమంది కూలీలు, అనాధలు, చిరు వ్యాపారులు, వేరే ప్రాంతాల నుంచి వచ్చినవారు ఆకలికి అల్లాడుతూ రోడ్డుమీద మిగిలి పోయారు. జగన్ ఆదేశాల మేరకు దాతల సహాయంతో నిత్యం రెండు పూటలా దాదాపు 50 వేల ఆహార పొట్లాలు అందించి వారిని ఆదుకున్నాం. ఆకలి విలువ తెలిసిన, మాట తప్పని మనీషి జగన్. వాలంటీర్లకు జీతం రెట్టింపు చేస్తా అని వాగ్దానం చేసి, గెలిచాక మొండిచేయి చూపిన మోసపూరిత స్వభావి చంద్రబాబు. మనసున్న మనిషిగా, హైందవ ధర్మరక్షణ కార్యకర్తగా జగన్ చేసిన వేలాది కార్యక్రమాలు ఆయన చెప్పుకోలేదు. కానీ జనం మరచి పోలేదు. ఏమి చేయకుండానే ఎగిరెగిరి పడడం, అవతలి వారు చేసిన మంచికి మసి పూయడం చంద్రబాబు లక్షణం. అసత్య ప్రచారాలకు మీడియాను వాడుకోవడానికి హైందవ ధర్మక్షేత్రానికి ‘అసభ్యభాషా పద పండిత పంచ శస్త్రుడిని‘ అధిపతిని చేశారు. చివరికి దేవుడినీ, దేవుడి ప్రసాదాన్నీ తన అసత్యాలకు బాసట చేయాలనుకున్నారు. న్యాయస్థానం అక్షింతలు వేసినా దులుపుకుపోతున్నారు.గారడీని నిజమనుకుని, మాటల వలకు చిక్కి, సనాతన ధర్మరక్ష కుడి ఊపుల నటనకు ఊతం ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కాదనుకు న్నామని ఈ రోజు రాష్ట్ర ప్రజలు రోదిస్తున్న మాట సత్యం. ఈ సంద ర్భంగా మహాకవి దాశరథి వాక్యాలు మరోసారి స్మరించుకుందాం.‘‘మంచితనము కలకాలం నిలచి యుండును వంచన ఏనాటికి నశించి తీరును’’భూమన కరుణాకరరెడ్డివ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
దేశానికి రక్తతర్పణం చేసిన అహింసా మూర్తి!
ఆమె 73 ఏళ్ల ముదుసలి. జాతీయ పతాకాన్ని ఎత్తిపట్టి ‘వందేమాతరం’, ‘ఆంగ్లేయులారా! ఇండియాను వదిలి వెళ్లండి’ అంటూ నినాదాలు చేస్తూ ఆరువేల మందితో ఒక పోలీస్ స్టేషన్ను ఆక్రమించేందుకు శాంతియుతంగా దండయాత్ర చేస్తోంది. పోలీసులు గాలిలోకి కాల్పులు జరి పారు. అయినా ఆమె ముందుకే కదిలింది. ఈసారి జెండా పట్టుకున్న చేతిని గురిచూసి కాల్చారు. వెంటనే రెండో చేతిలోకి జెండాను మార్చుకుని మునుముందుకు దూకింది. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. ఆమె రెండో చేతి పైనా, నుదుటి పైనా కాల్పులు జరిపారు. తెల్లని ఖద్దరు చీర రక్తసిక్తమయ్యింది. ఆ బక్కచిక్కిన వృద్ధ యోధ కుప్పకూలింది – కానీ జెండాను మాత్రం కిందపడకుండా గుండెలకు హత్తుకునే!1942 సెప్టెంబర్ నాలుగవ వారంలో చోటు చేసుకున్న ఈ బలిదానం గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ‘వృద్ధ మహిళా గాంధీ’ (గాంధీ బురి)గా పేరుగాంచిన ఆమె పేరు మాతంగినీ హజ్రా (Matangini Hazra). 1869లో బెంగాల్లోని హొగ్లా గ్రామంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆమెకు పన్నెండేండ్లకే వివాహం చేశారు. కానీ 18 ఏండ్లకే వితంతువయ్యింది. పిల్లలు లేని ఆమె సమాజ సేవ, దేశ సేవకే తన జీవితాన్ని అంకితమిచ్చింది. ఆమెకు చదువు లేదు. అయినా గాంధీజీ బోధనలకు ఆకర్షితురాలయ్యింది. ఆయన చెప్పినట్లే జీవించింది. 1930లలో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు మిగతా ఉద్యమాల్లోనూ పాల్గొని జైలుకెళ్లింది. భారత జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ పాలనకు ముగింపు పలకాలని 1942 ఆగస్ట్ 8న ‘క్విట్ ఇండియా’ (ఇండియా వదిలి వెళ్లండి) ఉద్య మాన్ని ప్రారంభించింది. గాంధీజీ ‘డూ ఆర్ డై’ (విజయమో, వీరస్వర్గమో) అంటూ ఉద్య మాన్ని ఉరకలెత్తించారు. ఈ ఉద్యమ సమయా నికి మాతంగినికి 73 ఏండ్లు. బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో ఉద్యమానికి సరైన నాయకత్వం అందించే గాంధీవాదులు లేకపోవడంతో ఈ ఉద్యమం ప్రజల తిరుగుబాటుగా మారింది. బ్రిటిష్ అధికారాన్ని నేరుగా సవాలు చేసే సమాంతర ప్రభుత్వాన్ని లేదా ‘జాతీయ సర్కా ర్’ను తామ్లుక్లో ‘సమర్ పరిషద్’ ఏర్పాటు చేసింది. మాతంగినీ పక్కా గాంధేయవాదే కానీ ఈ తిరుగుబాటుదారుల్లో ఒకరుగా మారారు. పోలీస్స్టేషన్పైకి దండయాత్ర1942 సెప్టెంబర్ 29న తామ్లుక్ పోలీస్ స్టేషన్ (అప్పట్లో సెయ్లన్ స్క్వేర్)పై నియంత్రణ సాధించడానికి తామ్లుక్ జాతీయ సర్కార్ ఒక నిరసన మార్చ్ నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఇది బ్రిటిష్ అధికారంపై ప్రత్యక్ష తిరుగుబాటే! పోలీస్ స్టేషన్పై భారత జాతీయజెండాను ఎగురవేయడానికి వేలాదిమందితో (వీరిలో ఎక్కువమంది స్త్రీలు) మాతంగినీ బయలుదేరింది. పోలీస్ స్టేషన్ ఉన్న ఊరు సమీపానికి ఆమె తన అనుయాయులతో చేరుకున్నప్పుడు, యూరోపియన్ అధికారుల ఆధ్వర్యంలోని బ్రిటిష్ ఇండియన్ పోలీసు దళాలు అడ్డంగించాయి. అయినా ముందుకే కదలడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఆమె ‘వందేమాతరం’ నినాదం చేస్తూనే కుప్పకూలిపోయింది. ఆమె పక్కనే మార్చ్ చేస్తున్న ఇద్దరు యువకులు సఖావత్ అలీ, సతీష్ చంద్ర సామంతా పైనా పోలీసులు కాల్పులు జరపడంతో వారూ వీర మరణం పొందారు. మాతంగినీ హజ్రా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అత్యంత ధైర్యవంతురాలిగా చరిత్ర లిఖించారు. తామ్లుక్లో ఆమె బలిదానం జరిగిన చోట ఆమె విగ్రహాన్ని ప్రతి ష్ఠించారు. ప్రస్తుతం ఉన్న తామ్లుక్ పోలీస్ స్టేషన్ పేరు ‘మాతంగినీ హజ్రా పోలీస్ స్టేషన్‘గా మార్చారు. భారత ప్రభుత్వం 2002లో ఆమె గౌరవార్థం ఒక తపాలా బిళ్లను జారీ చేసి తనను తాను గౌరవించుకుంది. -
నేపాల్ సంధిస్తున్న శేషప్రశ్నలు
కొన్ని దశాబ్దాలు అసలేమీ జరగదు, కానీ కొన్ని రోజుల్లోనే దశాబ్దాలు జరిగిపోతాయి. లెనిన్ అన్న ఈ మాటలు నేపాల్ విషయంలో అక్షర సత్యాలయ్యాయి. నేపాల్లో ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్ళూనుకుంది. వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు పరస్పర ప్రయోజనా లందుకుంటూ చెట్టపట్టాలేసుకుని తిరిగాయి. అకస్మాత్తుగా ఎగసిన నిరసన ప్రదర్శనల వేడిని వారు ఇప్పుడు చవి చూశారు.ఇంటర్నెట్, డిజిటల్ టెక్నాలజీ మొగ్గ తొడిగిన (1997–2012) కాలంలో పుట్టిపెరిగిన తరాన్ని ‘జెన్ జెడ్’గా పిలుస్తున్నారు. ఈ ‘జెన్ జెడ్’ నేపాల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఈ యువతరం తెచ్చిన విప్లవం బహుశా స్వల్పకాలమైనదే కావచ్చు. కానీ, అది చూపిన ప్రభావం పెద్దది. నిరసనలు మొదలైన తెల్లారే మూడు పార్టీల ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాని కేపీ శర్మ ఓలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నిరసనలకు ఐదు రోజుల ముందు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్తో సహా 26 సామాజిక మాధ్యమ వేదికల మూసివేతకు ఆయన ఆదేశించారు. అప్పటి కాయన ప్రజాభిమతాన్ని ప్రతిఘటించే వ్యక్తిగానే కనిపించారు. తీరా, ప్రధాని అధికారిక నివాసమైన బాలూవతార్ నుంచి ఉడాయించ వలసి వచ్చింది. ప్రధాని సింహాసనాన్ని అధిష్ఠించేందుకు వేచి ఉన్న షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య అర్జూ దేవ్బా (ఈమె విదేశాంగ మంత్రిగా కూడా ఉన్నారు)లపై వారి నివాసంలోనే దాడి జరి గింది. దేశవ్యాప్తంగా యువత ధ్వంసం చేస్తూ వచ్చిన రాజకీయ పార్టీల ఆస్తులు, బడా నాయకుల ప్రైవేటు నివాసాలకు లెక్కలేదు. సుప్రీంకోర్టు, పార్లమెంట్, ప్రభుత్వం కొలువుదీరే సింఘ దర్బార్ కూడా వారి ఆగ్రహ ‘జ్వాలల’ నుంచి తప్పించుకోలేక పోయాయి. జన్ జెడ్ తొలి ఉద్యమంనిరసనకారుల్లో అనేక మంది స్కూలు యూనిఫారంలలో ఉన్నప్పటికీ, పోలీసులు వారిపై దమన నీతిని ప్రదర్శించారు. దమనకాండలో స్కూలు, కాలేజీ విద్యార్థులు పందొమ్మిది మంది (వారిలో 17 మంది ఖాట్మాండులోనే) హతులయ్యారు. దాంతో దేశ మంతా ఏకమైంది. 1990లో, తర్వాత 2006లో సామూహిక ప్రజా ఉద్యమా లప్పుడు కూడా ఇలాగే జాతీయ స్థాయిలో అతిశయం వ్యక్తమైంది కానీ, అవినీతిమయ రాజకీయ నాయకులతో వారి ఆశలన్నీ అడియా సలయ్యాయి. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ –యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) ప్రజాభిమతానికి అనుగుణంగా నడచుకోలేక పోయాయి. ఆ రెండు ఉద్యమాలలో ‘జెన్ జెడ్’ పాత్ర నామ మాత్రమే. ఇప్పుడు నేపాల్ రికార్డు స్థాయిలో వలసలను చూస్తున్న సమయంలో, యువతలో కోపం కట్టలు తెంచుకుంది. నేపాల్ అపసవ్య కారణాలతోనే ప్రపంచంలో వార్తలకెక్కడాన్ని చూసి వారు విసుగెత్తిపోయారు. అవినీతి సూచిలో ఏయేటికాయేడు నేపాల్ ఎగబాకుతూ వస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మినుకు మినుకు అంటూ అయినా ఉందంటే, దానికి, వర్తక వ్యాపారాలో, విదేశీ సాయమో కారణం కాదు. రాజకీయ పార్టీల చేయూత అంతకన్నా లేదు. విదేశాలలో పని చేస్తున్న నేపాలీయులు స్వదేశానికి పంపిస్తున్న జమలతోనే స్థాని కులు చాలా వరకు రోజులు వెళ్ళదీస్తూ వస్తున్నారు. పశ్చిమాసియా నుంచి మలేషియా వరకు, నార్వే నుంచి న్యూజిలాండ్ వరకు నేపా లీయులు కష్టపడి పనిచేస్తూ గడిస్తున్న నాలుగు రాళ్ళలో కొంత మొత్తాన్ని స్వదేశంలోని కుటుంబ సభ్యులకు పంపుతున్నారు. అలాచూస్తే, మారుమూల గ్రామాలలోని వారితో సహా, కుటుంబాల విడి ఆదాయాలు పెరుగుతూ వస్తున్నాయి. అంతమాత్రాన నేపాలీ యులు ధనికులుగా మారింది ఎన్నడూ లేదు.ఇప్పుడేం జరగొచ్చు?ఈ మార్పులన్నింటి మధ్య కొన్ని భయ సందేహాలు మిగిలే ఉన్నాయి. ప్రాబల్యం వహించిన పాత మూడు పార్టీలలోని నాయకులందరూ అపఖ్యాతి పాలైనవారు కాదు. వారిలో కొందరికి వారి నియోజకవర్గాలతో ఇప్పటికీ పటిష్ఠమైన సంబంధాలే ఉన్నాయి. వారు కౌంటర్ విప్లవానికి తెర లేపుతారా? అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం పాత పార్టీలన్నీ విలీనమవుతాయా? లేక నాల్గవ పెద్ద పార్టీ అయిన రాష్ట్రీయ స్వతంత్రతా పార్టీ (ఆర్.ఎస్.పి.)లోకి ఫిరాయింపులకు ఇది దారితీస్తుందా? ఈ పార్టీలోనే యువ టెక్నోక్రాట్లు పెద్ద వర్గంగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ వద్ద, 2022 సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే రిజిస్టరైన ఆర్.ఎస్.పి. త్వరితగతిన జాతీయ పార్టీగా పరిణమిస్తుందా? ఖాట్మండులో ప్రజాదరణ కలిగిన యువ మేయర్ బాలెన్ షా వీరితో చేతులు కలుపుతారా? రాజధానికి బయట పార్టీని విస్తరించడానికి ఎన్నడూ ఉత్సాహం చూపని షా, యువతతో కొత్త పార్టీని పెట్టి దానికి నాయకత్వం వహిస్తారా?ఈ పరిస్థితులన్నింటి మధ్య ‘జెన్ జెడ్’ స్థానం ఏమిటి? ఈ యువతకు గొంతుకగా సూదన్ గురుంగ్ ఉన్నారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి, నేపాల్ తొలి మహిళా ప్రధాని సుశీలా కర్కీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన సూదన్ ఆమె పట్ల గౌరవ ప్రపత్తులను ప్రదర్శించారు. కానీ పట్టుమని వారం కూడా గడవక ముందే, అదీ సూదన్ సమక్షంలోనే, ఆపద్ధర్మ ప్రధాని కర్కీ రాజీనామా చేయాలని ‘జెన్ జెడ్’ నిరసనకారులు డిమాండ్ చేశారు. మంత్రివర్గాన్ని విస్తరించే ముందు ఆమె తమతో సంప్రదించలేదని అన్నారు. బాలెన్ షా న్యాయ సలహాదారు ఓమ్ ప్రకాశ్ ఆర్యల్ను హోమ్ మంత్రిగా నియమించడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సైన్యం పాత్ర ఏమిటి?నేపాల్ సైన్యం ఏం చేయబోతోందనేది కూడా ముఖ్యమైనఅంశం. సార్వభౌమాధికారం 1990లో ప్రజల చేతికి వచ్చి, పార్లమెంట్ 2008లో రాచరికాన్ని రద్దు చేసేంత వరకు, రాచరికం పట్లనే సైన్యం విధేయత చూపుతూ వచ్చింది. తిరిగి అది ఇప్పుడు మళ్ళీ రాచరికం వైపే మొగ్గు చూపుతుందా? క్షేత్రస్థాయిలో నేపాలీయుల మధ్య సాంస్కృతిక పునరుజ్జీవనం కనిపిస్తోంది. హిందూ మతానికి చెందిన వివిధ వ్యక్తీకరణల్లో అది కేంద్రీకృతమవుతోంది. కానీ, నేపా లీయులు రాజకీయ హిందూయిజానికి ఎన్నడూ ఓటు వేయలేదు. వచ్చే ఏడాది (2026) మార్చి 5న నిర్వహిస్తారని చెబుతున్న ఎన్ని కలు చరిత్రను మలుపు తిప్పుతాయా? నూతన ప్రభుత్వం ఈ పరి ణామ క్రమాన్ని ఎలా నిర్వహిస్తుందనేది ప్రశ్న. నేపాలీ ప్రజలు ఆరు నెలల (రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కిందనే లెక్క) తర్వాత, రాజ కీయ తీర్పును వెలువరించేంత వరకు ఈ భయాందోళనలు కొన సాగుతూనే ఉంటాయి.అఖిలేశ్ ఉపాధ్యాయ్వ్యాసకర్త ఖాట్మండులోని ఐ.ఐ.డి.ఎస్.లో సీనియర్ రీసెర్చ్ ఫెలో (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా?
‘నువ్వు చెప్పే దానితో నేను ఏకీభవించకపోవచ్చు కానీ చెప్పడానికి నీకున్న ఆ హక్కును నా ప్రాణమిచ్చి అయినా కాపాడుతాను’ అన్న ప్రముఖ ఫ్రెంచ్ రచయిత వోల్టేర్ మాటలు గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థ (Democracy) అనుకుంటున్న మన దేశంలో నీటి మూటలే! దేశంలో పాత్రికేయులకు రచయితలకు గడ్డుకాలం దాపురించింది. అకారణమైన అరెస్టులు, అక్రమ కేసులు వారి చుట్టూ బిగించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంతకు భిన్నమైన పరిస్థితి ఏమీ లేదు.పత్రికా సంపాదకుల మీద, పాత్రికేయుల మీద నిర్బంధకాండ యథేచ్చగా కొనసాగుతున్నది. ప్రభుత్వాలు తమకు వ్యతి రేకంగా రాసే పత్రికా సంపాదకులనూ, పాత్రికేయులనూ, సోషల్ మీడియా (Social Media) జర్నలిస్టులనూ, యూట్యూబర్లనూ ఒక్కరనేమిటి... ఎవరినీ వదలడం లేదు. కేసులతో వారిని వేధిస్తున్నారు. ఇళ్లపై అర్ధరాత్రి దాడులు నిర్వహించి అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. తప్పును తప్పుగా చెప్పడం తప్పుగా భావిస్తున్నాయి ప్రభుత్వాలు. మార్గదర్శకాలను ఉల్లంఘించినా, నియంత్రణ రేఖలను అధిగమించినా ప్రభుత్వాలు వారిపై చర్య తీసుకోవడం సబబు, సమర్థనీయం. కానీ తమ పని విధానాన్ని, విధి విధానాలను వ్యతిరేకించినా లేక సమర్థించకపోయినా; ప్రభుత్వ పాలసీలను, పథకాలలో ఉన్న లొసుగులను ఎత్తిచూపినా ప్రభుత్వాలు అది చాలా క్షమించరాని నేరంగా భావిస్తున్నాయి. పత్రికలు ఏదైనా రాసినంత మాత్రాన ప్రజలు గుడ్డిగా నమ్ముతారా? అందులో నిజానిజాలు బేరీజు వేసుకోరనుకోవడం తప్పు. ప్రజలకు ఉన్న వివేచనను, విచక్షణను ప్రభుత్వాలు తక్కువగా అంచనా వేయకూడదు.పత్రికలు ఈ పోటీ ప్రపంచంలో పాత్రికేయ విలువలూ, సామాజిక బాధ్యతలూ రెండింటినీ రెండు భుజాలపై మోస్తూ ఈ వృత్తికి న్యాయం చేయాలి. ఒక రాజకీయ పార్టీవారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పనిని... వారు అధికారంలోనికి రాగానే ప్రతి పక్షాలు అదే పని చేస్తే సహించే పరిస్థితి నేడు లేదు. అంటే అధికారంతో, హోదాతో విలువలు మారుతాయన్న మాట! రాజ్యాంగం ఎన్నో విలువలతో పకడ్బందీ చట్టాలతో ప్రజల హక్కులను కాపాడుతూ తయారైన ఒక పవిత్ర, ప్రామాణిక గ్రంథం. దేశానికి దిశా నిర్దేశం చేసే గ్రంథం అది. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే ఏ రకమైన చర్యలైనా ప్రజలు సహించరు. ప్రజల సహనాన్ని పరీక్షిస్తే తగిన సమయంలో తగు తీర్పునిస్తారు.పత్రికా సంపాదకులను, పాత్రికేయులను వేధించిన ప్రభుత్వాలకు ప్రజాస్వామ్యంలో ప్రజామోదం ఉండదు. విమర్శను ఆహ్వానించాలి. విచక్షణతో అందులోని సహేతుకతను అర్థం చేసుకొని ఆలోచించాలి. అంతేకానీ విమర్శలోని విషయాలను విషంగా పరిగణిస్తే పరిణామాలు విషమంగానే ఉంటాయి. విధాన నిర్ణయాలపై విమర్శలు వస్తే విశ్లేషించుకుని సవరించుకోవాలి. అందుకు విరుద్ధంగా విమర్శకులపై విచ్చలవిడిగా కేసులు బనాయించి విశృంఖలంగా అరెస్టు చేస్తూ వారికున్న హక్కులను కాలరాయాలని ప్రయత్నిస్తే న్యాయస్థానాలు మౌనంగా ఉండవు.చదవండి: భావ ప్రకటన స్వేచ్ఛను బంధిస్తారా?మీడియా స్వేచ్ఛ విషయంలో ప్రపంచంలోని 180 దేశాల్లో భారత్ 151 స్థానాన్ని పొందింది. ఇక్కడే భావ ప్రకటన స్వేచ్ఛ (Freedom of Expression) దేశంలో ఏ మేరకు ఉందో స్పష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మీడియాపై ఎక్కుపెట్టిన ఆంక్షలను, కేసులను ఇండియన్ న్యూస్ పేపర్స్ సొసైటీ, ఎడిటర్స్ గిల్డ్ లాంటి సంస్థలు ఖండించాయి. పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని ఘనంగా చెప్పుకుంటున్నాం. దాని విలువను, గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత పాలకులదే!– శ్రీశ్రీ కుమార్ కవి–రచయిత -
ఐరాస అవసరం తీరిపోలేదు!
అమెరికాలో చార్లీ కిర్క్ హత్యోదంతంపై రేగుతున్న ప్రజాగ్రహం, పోలెండ్ను బెదిరిస్తున్న రష్యన్ డ్రోన్లు, ఇజ్రాయెల్ ఇపుడు బాహాటంగానే చెబుతున్న గాజాలోని జాతి నిర్మూలన, గాజా పొరుగు దేశాలపై ఇజ్రాయెల్ దాడులు... వీటన్నిటి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (ఐరాస) 80వ వార్షికోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉందా? కానీ, సహజ జ్ఞానానికి విరుద్ధంగా, ఇటువంటి సందర్భానికి ఇదే సరైన సమయమేమో అని కూడా అనిపిస్తోంది. సమస్యలను విడి విడిగా చూడాలని, చర్చలు జరపాలని అమెరికా విజ్ఞప్తి చేస్తోంది. కాల్పుల విరమణ పాటించాలనటం, శాంతియుతంగా చర్చలు జరపాలని పిలుపు నివ్వడంలో ఆ విజ్ఞప్తులు ప్రతిధ్వనిస్తున్నాయి. ఎనభై అన్నది కీలక ఘట్టంఅంతర్జాతీయ శాంతి, భద్రతలను సాధించడంలో – ఐరాస వైఫల్యాలు; నాగరికంగా చర్చలు జరుపుకొనే పద్ధతిని పెంపొందించడంలో, అందరికీ పూర్తి మానవ హక్కులను కాపాడడంలో – అమెరికా అంతర్గత బలహీనతలు స్పష్టంగా కనిపిస్తున్న దశ ఇది. మహా అయితే, ఐరాస 80వ వార్షికోత్సవం... గతి తప్పిన జాతీయ తావాదం, మిగిలిన వర్గాలను పట్టించుకోకుండా స్వీయ వర్గానికే వీర విధేయత చూపడం, విశృంఖల హింస వంటి వాటికి అతీతంగా కొన్ని విలువలున్నాయని గుర్తు చేసేందుకు ఉపయోగపడుతుంది. నానాజాతి సమితి 26 ఏళ్ళే మనగలిగింది. దానిని మించి మనుగడ సాగిస్తున్నందుకు ఐరాస గర్వపడవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో 80వ పడిలో పడడం కీలక ఘట్టం. ఆయుర్దాయాన్ని జాగ్రత్తగా కాపాడు కోవాల్సి ఉంటుంది. అలాగే, ఐరాస తన ప్రాధా న్యాన్ని కొనసాగించుకునేందుకు ఈ వార్షికోత్సవం కూడా ముఖ్యమైంది. ఏడేళ్లుగా నిధుల సంక్షోభం!ఐరాసలో తిరిగి జవజీవాలు నింపేందుకు ‘యూఎన్ 80 ఇనీషి యేటివ్’ పేరుతో 2025 మొదట్లో ఒక కార్యక్రమం ప్రారంభమైంది. కానీ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నట్లుగా కనిపిస్తున్న సంస్థను ప్రక్షాళన చేసే బదులుగా అది... వెలాతెలా బోతున్న సంస్థ వేడుకగా మారినట్లు కనిపిస్తోంది. ఐరాస ఆర్థిక సంక్షోభం నానాటికీ పెరుగు తోంది. ‘‘సభ్య దేశాలన్నీ తమ చందా మొత్తాలను పూర్తిగా చెల్లించక పోవడం, చాలా దేశాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కనీసం గత ఏడేళ్లుగా ఐరాస ద్రవ్యత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది’’ అని ఐరాస ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 11 నాటికి ‘‘మొత్తం 193 దేశాలలో 75 దేశాలే వాటి వంతు మొత్తాలను పూర్తిగా చెల్లించాయి. సంస్థ 2025 సంవత్సరపు బడ్జెట్ 3.72 బిలియన్ డాలర్లుగా ఉంది’’ అని ఆ ప్రకటనలో తెలి పారు. నిధుల లోటును; మధ్య ప్రాచ్యంలోను, ఉక్రెయిన్లోను శాంతిని నెలకొల్పడమనే ప్రాథమిక విధి లోని వైఫల్యాలను చూస్తుంటే ఐరాస కూడా నానాజాతి సమితి బాట పడుతుందా? అనే ప్రశ్న రావటం సహజమే. ‘శాంతి కోసం సమైక్యత’అయితే, సమితి గురించి ప్రముఖ న్యాయ కోవిదుడు, మాజీ ప్రొఫెసర్, జడ్జి, గుటెరస్కు సన్నిహితుడు అయిన జార్జ్ అబీ సాబ్ ఒక ఇంటర్వ్యూలో మూడు ఆశావహమైన సంగతులను చెప్పారు. మొదటిది: అంతర్జాతీయ సమాజం తన సమష్టి అభిమతాన్ని వ్యక్తీక రించేందుకు, ఆ సమాజాన్ని న్యాయబద్ధం చేసేందుకు ఉన్న ఒకే ఒక అంతర్జాతీయ వేదిక ఇప్పుడు ఐరాస మాత్రమే. ఖతార్ రాజధాని దోహాపై ఇటీవలి దాడిని (ఇజ్రాయెల్ పేరును నేరుగా ప్రస్తావించక పోయినప్పటికీ) భద్రతా మండలి ఖండించింది. ‘శాంతి కోసం సమైక్యత’ పేరుతో ఐరాస సర్వ ప్రతినిధి సభ చేసిన తీర్మానం ప్రకారం, ఆక్రమిత పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయెల్ తన సేనలను ఇప్పటికే సెప్టెంబర్ 18 నాటికి ఉపహరించుకుని ఉండాలి. ఇది అంతర్జాతీయ న్యాయస్థానం సలహా పూర్వకంగా వెలిబుచ్చిన అభి ప్రాయం. దాన్ని పాటించని ఇజ్రాయెల్పై సర్వ ప్రతినిధి సభ కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఐరాస శాంతి పరిరక్షక దళాన్ని నియోగించవచ్చు. చెప్పుకోదగిన విజయాలురెండు: శాంతి, భద్రతలను పక్కనపెడితే ఐరాస చెప్పుకోతగిన విజయాలు కొన్ని ఉన్నాయి. వివిధ ఐరాస సంస్థలు పర్యావరణం వంటి రంగాల్లో ప్రత్యేక సేవలందిస్తున్నాయి. పర్యావరణానికి హానికరమైన చేపల వేటకు పాల్పడేవారికి సబ్సిడీలను నిరాకరించే వాణిజ్య ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల కట్టుబడ వలసి వచ్చింది. మూడు: బహుళ పక్షానికి (మల్టీలేటరలిజం) వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించడం. ఏవో ఒకటి రెండు దేశాలు పెత్తనం చలాయించకుండా, ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దటంలో వివిధ దేశాలకు భాగస్వామ్యం కల్పించడానికి ఐరాస ప్రయత్నాలు ఎంతో కొంత ముందుకు సాగుతున్నాయి.షాంఘై సహకార సంస్థ ఐరాసకు ప్రత్యామ్నాయం వంటి బహుళ పక్ష వ్యవస్థ కాకపోవచ్చు. కానీ, డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులను ప్రతిఘటించే విధంగా వివిధ దేశాల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా–ఐరాస పోలికలుఅంతర్జాతీయ సహకారానికి అడ్డుపడుతున్న అంశాలకూ, అమెరికాలో రాజకీయ పోలరైజేషన్కూ మధ్యనున్న సారూప్యాలను గమనించకుండా ఉండడం కష్టం. భీకర అమెరికన్ అంతర్యుద్ధాలలో ఒకదాన్ని చవి చూసిన తర్వాత పెన్సిల్వేనియాలోని గెట్టీస్ బర్గ్లో 1863లో చేసిన ప్రసంగంలో అమెరికా పురుద్ధరణను అధ్యక్షుడు అబ్రహాం లింకన్ దర్శింపజేశారు. అమెరికా ఏర్పడిన 87 ఏళ్ల తర్వాత లింకన్ ‘‘ప్రజల కోసం, ప్రజలతో ఎన్నుకోబడిన, ప్రజా ప్రభుత్వం’ అన్న భావనను పునశ్చరణ చేశారు. ఐరాస ప్రణాళిక ఉపోద్ఘాతం కూడా ‘‘ఐక్యరాజ్య సమితి ప్రజలమైన మేము’’ అనే మొదలవుతుంది. అమెరికాను ఆ దేశ సంస్థాపక పితామహులు ముందుకు తెచ్చిన సుమారు 80 ఏళ్ల తర్వాత, లింకన్ ‘స్వాతంత్య్ర నూతన జననం’ గురించి మాట్లాడారు. ఇప్పుడు ‘యూఎన్ 80 ఇనీషియేటివ్’ అదే రకమైన నూతన ఆవిర్భావం గురించి ప్రస్తావించింది. అంతర్జాతీయంగా ప్రభుత్వాల మధ్య వారధిగా పని చేస్తున్న సంస్థ ఐరాస ఒక్కటే! కనుక సమితి తన జీవిత కాలాన్ని, ప్రాధాన్యాన్ని, 80 ఏళ్లకు మించి పొడిగించుకోగలుగుతుందా అన్నసందేహం అక్కర్లేదు. డేనియల్ వార్నర్వ్యాసకర్త అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు – రచయిత -
వాటా పెంచాలి!
వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి ఇటీవలి 56వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చారిత్రకమైనవి. జీఎస్టీ రెండవ అధ్యాయానికి అంకు రార్పణగా దాన్ని అభివర్ణించినా తప్పు లేదు. జీఎస్టీని అమలులోకి తెచ్చిన ఏడేళ్ళ తర్వాత, వినియోగంపై వేసిన ఈ లెవీని సంస్కరించేందుకు పెద్ద ప్రక్షాళననే చేపట్టారు. ఇంతవరకు ఉన్న నాలుగు ప్రధాన పన్ను శ్లాబులు సెప్టెంబర్ 22 నుంచి రెండు శ్లాబులు కానున్నాయి. అధిక విలాస వస్తువులు, పొగాకు వంటి ‘వ్యసనాల’ వస్తువులపై కొత్త శ్లాబు రేటు ప్రవేశపెట్టనున్నారు. ఇంతకుముందున్న పన్నుల రేట్లు, ‘సక్రమమైన, సరళమైన’ పన్నుగా జీఎస్టీకున్న స్ఫూర్తిని దెబ్బతీశాయి. కనుక, రెండు రేట్ల పద్ధతికి మారడం స్వాగతించదగిన పరిణామం. గతంలోని 12%–28% రేట్లను రద్దు చేసి 5%–18% రేట్లను అట్టేపెట్టారు. మొత్తం జీఎస్టీ రాబడిలో మూడింట రెండొంతుల భాగాన్ని 18% రేటు ఇప్పటికే తెచ్చిపెడుతోంది. ఆదాయంలో 7% భాగం 5% శ్లాబు ద్వారా లభిస్తోంది. అలాగే 12% శ్లాబు 5% ఆదాయానికి, 28% శ్లాబు 11% ఆదాయానికి కారణమవుతున్నాయి. ఇపుడు 18% శ్లాబు జీఎస్టీ రాబడిలో మరింత ఎక్కువ భాగాన్ని తెచ్చిపెట్టబోతోంది. అయితే, రెండు రేట్లుగా సరళీకరించిన పద్ధతి సమమితిగా సాగలేదు. ఏం చేశారంటే 12% కేటగిరీలోని చాలా వస్తువులను 5% లోకి, 28% వర్గంలోని చాలా వాటిని 18% వర్గంలోకి తెచ్చారు. అధిక పన్ను రేటులోకి చాలా తక్కువ వస్తువులే వెళ్ళాయి. మొత్తం మీద పన్ను భారం లేదా ఈ లెవీకి సంబంధించిన ప్రభావశీల పన్ను రేటు తగ్గింది. ఇది వినిమయ వ్యయాన్ని పెంపొందించే ద్రవ్య ఉద్దీపనగా ఉపకరించవచ్చు. చాలా భాగం వస్తువులు తక్కువ పన్ను రేట్లకి తరలిపోవడం వినియోగదారుల కోణం నుంచి ద్రవ్య ఉద్దీపన కావచ్చుకానీ, ప్రభు త్వానికి మాత్రం రాబడిలో లోటు ఏర్పడుతుంది. అయితే, దానివల్ల ఏర్పడే లోటు కన్నా, వినియోగదారుల అధిక వ్యయం వల్ల ఒనగూడగల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆర్థిక శాస్త్ర పరిభాషలో ‘ల్యాఫర్ కర్వ్ ఎఫెక్ట్’ అంటారు. సూటిగా చెప్పాలంటే, పన్ను రేటు తగ్గింపు పన్ను వసూళ్ళ పెరుగుదలకు దారితీస్తుంది. కానీ, భారతదేశం విషయంలో దీన్ని సిద్ధాంతపరంగా అన్వయించి చూడలేం. అనుభవంలో మాత్రమే అసలు విషయం తెలుస్తుంది. రెండు ఇబ్బందులుజీఎస్టీ వ్యవస్థలోని రెండు అంశాలు ఇప్ప టికీ వేధిస్తూనే ఉన్నాయి. ఇది పరోక్ష పన్ను. తిరోగమనదాయకమైనది కావడం వల్ల ధని కుల కన్నా పేదలను ఎక్కువ కుంగదీస్తుంది. పాటించవలసిన నియమ నిబంధనల భారం అధికంగా ఉండటం వల్ల, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు ఇది తలనొప్పి తెచ్చిపెట్టే అంశం. రాష్ట్రాలపై ప్రభావం రెండవ అంశం. రేటులో కోత, హేతుబద్ధీకరణ వల్ల ఏర్పడగల స్థూల నష్టం రూ. 1.5 ట్రిలియనా లేక రూ. 1 ట్రిలియన్ కన్నా తక్కువే ఉంటుందా అన్నది చూడవలసి ఉంది. కానీ, దానిలో సగం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే మోయవలసి ఉంది. తొలుతటి జీఎస్టీ చట్టంలో చేసిన రీయింబర్స్మెంట్ వాగ్దానానికి 2022లో కాలం చెల్లింది. పరిహారం సెస్సునకు కూడా గడువు తీరబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లలో పేర్కొన్న వ్యయాలను ఎలా నిర్వహించగలుగుతాయి? భారతదేశంలో మాత్రమే కనిపించే ‘మూడింట రెండు వంతులు/ మూడింట ఒకటో వంతు’ సమస్య దాని సమాఖ్య ఏర్పాటులోనే ఉంది. మూడింట రెండొంతుల వ్యయ కర్తవ్యం రాష్ట్ర ప్రభు త్వాలు, స్థానిక సంస్థలపైనే ఉంది. కానీ, రెవిన్యూ స్వయం ప్రతిపత్తిలో వాటికున్నది మూడింట ఒకటో వంతు మాత్రమే! పెట్రోలు, డీజిలు, విద్యుచ్ఛక్తి జీఎస్టీ పరిధిలోకి రాకుండా బయటే ఉండిపోవడానికి అది కూడా ఒక కారణం. అటువంటి ఆందోళనలపై స్పందిస్తూ ఆర్థిక మంత్రి రాష్ట్రాల కోశ సుస్థిరత, ఆర్థిక యోగక్షేమాల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్ని రాష్ట్రాలకూ హామీ ఇచ్చారు. ‘‘సహకార సమాఖ్యతత్వ స్ఫూర్తిని ఆలంబన చేసుకునే మా చర్చలు సాగాయి’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రాలకు ఆదాయం పెరిగేలా...ఈ నేపథ్యంలో, జీఎస్టీ విధానంలో ఒక సంస్కరణ రూపుదిద్దుకునేటట్లు చేయవచ్చు. ప్రస్తుతం 50:50గా ఉన్న పంపకం సూత్రాన్ని రాష్ట్రాలకు అనుకూలంగా 60:40గా మార్చవచ్చు. ఏదేమైనా, మొత్తం ప్రభుత్వ వ్యయాలన్నింటిలోనూ మూడింట రెండొంతుల భారాన్ని రాష్ట్రాలే భరిస్తున్నాయి కనుక, జీఎస్టీ ఆదాయంలో వాటికి 60 శాతం భాగం ఇస్తే, వాటి బడ్జెటరీ ఖర్చులకు తగ్గట్లుగా ఉంటుంది. వసూలు చేస్తున్న జీఎస్టీని సమీకృత మొత్తంగానే చూస్తున్నారు. అంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున (సగం, సగం) సమ భాగాలుగా వసూలు చేస్తున్నట్లు లెక్క. కేంద్రానికి సెస్సులు, దేశ రుణం, విదేశాల నుంచి అప్పులు తెచ్చుకోవడం వంటి ఇతర వనరులు అందుబాటులో ఉన్నాయి. పంపకాల సూత్రాన్ని రాష్ట్రాలకు అనుకూలంగా కొద్దిగా మొగ్గేటట్లు చేసినా, వాటి గాబరా కొంత ఉపశ మిస్తుంది. సహకార సమాఖ్యతత్వ స్ఫూర్తి మరింత బలపడుతుంది. అజిత్ రనడేవ్యాసకర్త పుణె ఇంటర్నేషనల్ సెంటర్లో సీనియర్ ఫెలో -
ఆత్మ నిర్భర జీఎస్టీ?
సెప్టెంబర్ మాసం శుభాలను మోసుకొస్తుందని ఓ నానుడి. దానిని నిజం చేస్తూ దేశ ప్రజలకు మేలు చేసే రెండు తీపి పరిణామాలు జరిగాయి ఈ మాసంలో! ఒకటి – ఎంతో కాలంగా దేశ ప్రజలు కోరుతున్న జీఎస్టీ సంస్కరణలు. రెండు – భారత్–చైనాల మధ్య చిగురించిన మైత్రీ బంధం. వీటిని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు అందిస్తున్న దీపావళి బహుమతులుగా చెప్పడం గమనార్హం!అమెరికా విధించిన అదనపు సుంకాల పుణ్యమా అని దేశంలో విని యోగ సంస్కృతిని... అది కూడా దేశీయ వస్తువుల వినియోగం పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణను తీసుకువచ్చింది. నాలుగు శ్లాబుల్లో ఉన్న వస్తువులను సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చే జీఎస్టీ 2.0లో మూడు శ్లాబ్లకు కుదించారు. 5 శాతం, 18 శాతం శ్లాబ్లలోకి దాదాపుగా అన్ని వస్తువులు వస్తాయి. సిన్ గూడ్స్ (పాపవు వస్తువులు)గా పేర్కొంటున్న సిగరెట్లు, గుట్కా వంటి ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడం కోసం అత్యధికంగా 40 శాతం పన్ను విధిస్తారు. కార్లు, ఫ్రిజ్లు, ఏసీల వంటి లగ్జరీ గూడ్స్ కారుచౌకగా లభిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటు న్నాయి. భారీ వాహనాల మీద జీఎస్టీ తగ్గింపు వల్ల వినియోగదారుడికి రెండు విధాల ప్రయోజనం కలుగుతుంది. ఒకటి – వాహనం ధర తగ్గుతుంది. రెండోది – వాహనం ధర ఆధారంగా రిజిస్ట్రేషన్,బీమా (ఇన్సూరెన్స్) చార్జీలు ఉంటాయి కనుక వాహనం ధర తగ్గితే... ఆ దామాషాలో వాటి ఛార్జీలు కూడా తగ్గుతాయి. ఇక, దేశంలో అత్యధిక శాతంగా ఉన్న మధ్యతరగతి వర్గానికి, పేదలకు ఊరట కలి గించే అంశం... నిత్యావసరాల ధరలు తగ్గడం. బియ్యం, గోధుమలు, పప్పులపై ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీ 18 శాతం కాగా, ప్యాకేజీలో ఉండేవి కాకుండా విడిగా లభించే ఈ వస్తువు లను కొంటే అవి 5 శాతం పరిధిలోకి వస్తా యని అంచనా వేస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందే జీఎస్టీ 2.0ను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారనీ, ఇది బీజేపీ గెలుపునకు బ్రçహ్మాస్త్రంగా పనికొస్తుందనీ ఆ పార్టీ నేతలు లెక్కలు కడుతున్నారు.రాష్ట్రాలకు ఆదాయం తగ్గుతుందా?జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ 2.0పై ఏకాభిప్రాయం కుదిరినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినప్ప టికీ... 4 రాష్ట్రాలు తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని గగ్గోలు పెట్టాయి. తమకు నష్టపరిహారం చెల్లించాలని బెంగాల్, కేరళ,పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు పట్టుబట్టాయి. కానీ మంత్రి ఆ రాష్ట్రాలకు సర్దిచెప్పారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల వస్తు వినియోగం పెరుగుతుందనీ, దాని వల్ల రాష్ట్రాల ఆదాయం పెరుగుతుందనీ వివరించారు. రాష్ట్రాలకు ఆదాయం చేకూరు స్తున్న రంగాలలో సిమెంటు, ఆటోమొబైల్, గ్రానైట్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వంటివి ఉన్నాయి. ప్రస్తుతం వీటిపై అత్యధికంగా 18 నుంచి 28 శాతం జీఎస్టీ ఉంది. తాజాగా సవరించిన రేట్ల వల్ల ఈ రంగాల్లో రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో సుమారు 10 శాతం కోత పడనుంది. చాలా కాలంగా ప్రజలు కోరుకుంటున్నట్లుగా... పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ 2.0 పరిధిలోకి తీసుకు రాకపోవడం సామాన్యుల్ని నిరాశపర్చేదే! పెట్రోల్, డీజిల్, విమానాల ఇంధనంగా వాడే టర్బైన్ ఫ్యూయెల్, సహజ వాయువులపై వివిధ రాష్ట్రాలు అత్యధికంగా 18 నుంచి 34 శాతం వరకు విలువ ఆధారిత పన్ను విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలైతే అదనంగా లీటర్ పెట్రోల్, డీజిల్పై రూపాయినుండి రెండు రూపాయల మేర సెస్సు విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా, అధిక మోతాదు చక్కెరతో తయారు చేసే చాక్లెట్లు, కేకులు, మిఠాయిలపై జీఎస్టీ తగ్గించటం పట్ల ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్యలో అగ్రస్థానంలో కొనసాగుతున్న దశలో, చక్కెర పదార్థాల ధరలు తగ్గే చర్యల వల్ల వాటి వినియోగం పెరిగి పిల్లల్లో చక్కెరస్థాయి నిల్వలు పెరుగుతాయని హెచ్చరి స్తున్నారు. ఇంకోవైపు బీడీ కార్మికులకు మేలు చేసే నెపంతో బీడీలపై జీఎస్టీ తగ్గింపు సరికాదంటున్నారు.చైనాతో దోస్తీ... సానుకూలం!అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన అదనపు సుంకాల నేపథ్యంలో భారత్ ఆత్మనిర్భర్ దిశగా అడుగులు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక మార్గం మూసుకుపోయి నప్పుడు, మరో మార్గాన్ని ఏర్పరచుకోవాలన్నట్లుగా ప్రధాని నరేంద్రమోదీ జీఎస్టీ 2.0తో పాటు చైనాతో వాణిజ్య బంధాన్ని మెరుగుపర్చుకోవడం గొప్ప ఊరటనిస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’ అన్నట్టుగా భారత్కు అమెరికాతో ఏర్పడిన సంక్షోభతో ప్రత్నామ్నాయ అవకాశాలు లభిస్తున్నాయి. జీఎస్టీ సరళీకరణ వల్ల దేశీయ ఉత్పత్తుల వినియోగం తప్పనిసరిగా పెరుగుతుంది. అదేవిధంగా చైనాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడటం కారణంగా చైనా పెట్టు బడులు, సాంకేతిక నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలను సద్వినియోగం చేసుకొని భారతదేశాన్ని ఆత్మనిర్భర్ దిశగా వడివడిగా అడుగులు వేయించాల్సిన బాధ్యత ప్రధానిదే!డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త మాజీ కేంద్రమంత్రి, ఏపీ శాసన మండలి సభ్యులు -
పడి లేచి... మళ్లీ పడిన కెరటం
బ్రిటిష్ వార్తలు అమితా సక్తితో చదివే వారైతే తప్ప మీకు పీటర్ మ్యాండెల్సన్ ఎవరో తెలిసే అవకాశం లేదు. ఆయన మూడుసార్లు ఉన్నత ప్రభుత్వ పదవి అలంకరించి, ఆ మూడు సార్లూ ఎంతో అవమాన కరంగా వైదొలగిన వ్యక్తి. నాకు తెలిసిన అలాంటి రాజకీయవేత్త ఆయన ఒక్కడే! చివరిసారి, అమెరికాలో బ్రిటన్ రాయబారి పదవి నుంచి సెప్టెంబర్ 11న డిస్మిస్ అయ్యాడు. ఎంతో కష్టపడి అధిరోహించిన విజయ శిఖరం నుంచి అమాంతం జారిపోయాడు. ఇది ఆయనకు కొత్తేం కాదు. అయితే ఎందుకిలా జరుగు తోంది? ఈ ప్రశ్న నన్ను ఆలోచనలో పడేస్తోంది. ఒకానొకప్పుడు ఆయన నాకు మంచి మిత్రుడు. సెక్స్ నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్తో దోస్తీ ఆయన తాజా ఎపిసోడ్కు ముగింపు నిచ్చింది. రాయబారిగా నియమితుడయ్యే సమయంలో ఈ మైత్రీబంధం ఎలాంటిదో ఆయన వివరించినట్లు లేడు. 18 ఏళ్లు నిండని బాలికను వ్యభిచారానికి ప్రేరేపించినట్లు 2008లో నేరం రుజువు అయిన తర్వాత, తన ‘ప్రియ మిత్రుడు’ ఎప్స్టీన్కు అదే ఏడాది జూలైలో పీటర్ ఒక లేఖ రాశారు. ‘‘నీ ప్రపంచం గురించి ఆలోచించాను. జరిగిన దానికి నాకు కోపం వస్తోంది, నిరాశా కలుగుతోంది’’ అని ఈ లేఖలో ఉంది. ‘‘నీ మిత్రులు నీతోనే ఉంటారు, నిన్ను ప్రేమిస్తారు’’.ఈ లేఖ బయట పడిన గంటల వ్యవధిలోనే బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆయనకు ఉద్వాసన పలికారు.మళ్లీ మళ్లీ రాజీనామాలుమ్యాండెల్సన్ను దురదృష్టం వెన్నాడటం ఇది మూడోసారి. డిసెంబర్ 1998లో అప్పటి ప్రధాని టోనీ బ్లెయిర్ మంత్రి మండలిలో వాణిజ్యం, పరిశ్రమల మంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి దెబ్బ తిన్నాడు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ప్రభుత్వ చెల్లింపుల ముఖ్య అధికారి’ (పే మాస్టర్ జనరల్) జ్యాఫ్రీ రాబిన్సన్ నుంచి 3,73,000 పౌండ్ల అన్సెక్యూర్డ్ రుణం తీసుకున్నట్లు బయటపడటంతో ప్రధాని ఆయనతో రాజీనామా చేయించారు.ఇది జరిగిన రెండేళ్లలోనే పీటర్ మళ్ళీ ఉన్నత పదవి అలంకరించ గలిగాడు. ఈసారి ఉత్తర ఐర్లాండ్ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యాడు. శ్రీచంద్ హిందూజాకు బ్రిటిష్ పౌరసత్వం ఇప్పించేందుకు అధికార దుర్వినియోగం చేశాడని ఆరోపణలు రావడంతో 2001 జనవరిలో మ్యాండెల్సన్ మళ్లీ రాజీనామా చేయవలసి వచ్చింది.ఏమయినప్పటికీ, అంతటి దురదృష్టం కూడా పీటర్ రాజకీయ జీవితాన్ని అంతం చేయలేక పోయింది. యూరోపియన్ యూనియన్లో బ్రిటన్ కమిషనర్గా పని చేశాడు. ఆ తర్వాత గోర్డాన్ బ్రౌన్ కేబినెట్లో బిజినెస్ సెక్రటరీగా చేరాడు. ఫస్ట్ సెక్రటరీ(ఉప ప్రధాన మంత్రి)గా పదోన్నతి కూడా పొందాడు. ఆయనకు దేవుడి ఆశీస్సులు, సాతాను శాపాలు... రెండూ ఉన్నట్టుంది. ఒకరు శిఖరం మీదకు చేర్చితే, మరొకరు పాతాళానికి లాగేస్తారు.నాకాయన తెలిసున్న రోజుల్లో ఇలాంటి ఆటు పోట్లు ఏవీ లేవు. అది 1980ల నాటి విషయం. ఆయన వయస్సు 30 పైన ఉంటుంది. మేం అప్పుడు లండన్ వీకెండ్ టెలివిజన్లో టీవీ ప్రొడ్యూసర్లుగా పని చేస్తున్నాం. బహుశా బ్రిటన్లో బాగా పేరు పొందిన ‘వీకెండ్ వరల్డ్’ కరెంట్ ఎఫైర్స్ అనే ప్రోగ్రామ్ చేసే వాళ్ళం. లెజెండరీ బ్రియాన్ వాల్డెన్ దానికి యాంకర్.ఆ రోజుల్లో పీటర్ పొడవుగా సన్నగా ఉండి కులీనుడిలా కనబడే వాడు. పీటర్ తాత క్లెమెంట్ అట్లీ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నాడు. కొంతమంది పీటర్ను అహంభావి అనుకునేవారు. మితభాషి కావడంతో ఆ అపవాదు వచ్చి ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం... ఆయన అంత త్వరగా దగ్గరయ్యే మనిషి కాడు. చాలామందిని దూరంలో ఉంచేవాడు. అప్పట్లో జరిగిన ఒక సంగతి చెబుతాను. ఏదో వివరించే ప్రయత్నం చేస్తూ, ఆ ఉత్సాహంలో పీటర్ తన కుడి చేతిని విసురుగా కదిలించాడు. అంతే... అది కాస్తా కాఫీ కప్పును తాకింది. కాఫీ ఒలికిపోయింది. నేను రాస్తున్న స్క్రిప్ట్ తడిసిపోయింది. అతడు చేసింది ఘోర తప్పిదం. ప్రోగ్రామ్ ఎయిర్ అయ్యేందుకు ఎంతో సమయం లేదు.పీటర్ తక్షణం క్షమాపణలు చెప్పాడు. ఇరకాటంలో పడినందుకో, తన మీద తనకే వచ్చిన కోపంతోనో... ముఖం కందగడ్డ అయ్యింది. తనే టైప్ చేసి పెట్టాడు. పూర్తి చేసి ఇచ్చేసరికి అర్ధరాత్రి దాటింది. టైప్ చేస్తూ కొన్ని మార్పులు కూడా చేశాడు. స్క్రిప్ట్ మరింత బాగా వచ్చింది. విజయం ఆయన్ను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. అంత ఎత్తున నిలిచిన పీటర్ను నిశితంగా చూడగలిగినవారు, ఆయన ఆత్మీయ స్వభావం గుర్తించగలిగిన వారు... ఎంతమంది ఉంటారు? నేను మాత్రం ఆయన్ని ఆత్మీయ వ్యక్తిగానే గుర్తు చేసుకుంటాను. ఆయన ఎప్పటి లాగా ఉవ్వెత్తున ఎగిసి మరో విజయ శిఖరం అందుకుంటాడు... ఇది నా నమ్మకం. పీటర్ను మరోసారి అదృష్టం వరిస్తుందనీ, త్వరలోనే మేం కలుసుకుంటామనీ ఆశిస్తున్నాను.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రహ్లాద్ కక్కడ్ (యాడ్ ఫిల్మ్ డైరెక్టర్) రాయని డైరీ
ఇరవై అంటే ఇరవయ్యే నిముషాల ఇంటర్వ్యూ కోసమని నన్ను నమ్మించి తన స్టూడియోకి రప్పించుకున్నాడు విక్కీ లల్వాని! గంటా ఇరవై నిముషాలు అయింది. ఎంతకూ వదలడు.రెండో ప్రశ్న వెయ్యడు.‘‘ఒక్కమాట చెప్పండి ప్రహ్లాద్జీ! ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ఏ క్షణమైనా విడిపోవచ్చునంటారా?’’ అంటాడు.ఏ క్షణమైనా జరిగేవి లోకంలో కొన్ని మాత్రమే ఉంటాయి. విలయాలు, విపరీతాలు, ప్రళయాలు, ప్రకంపనాలు! ఆ జాబితాలోనే ఇప్పుడు ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ల విడాకులను కూడా చేర్చినట్లున్నాడు అతడు. ‘‘చెప్పండి ప్రహ్లాద్జీ, వాళ్లిద్దరూ విడిపోకుండా ఏ శక్తీ ఆపలేదంటారా?’’ అన్నాడు మళ్లీ!నా డెబ్బై ఐదేళ్ల వయసులో ఇలాంటి ఒక ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వవలసిన భాగ్యం నాకు దక్కుతుందని విధి నన్ను ముందే ఆశీర్వదించి కిందికి పంపిందా?! బాంద్రాలోని లామెర్ బిల్డింగులో ఐశ్వర్య తల్లి బృందా రాయ్ ఉండే ఫ్లాట్ పక్కనే నేనుండే ఫ్లాటు ఉంటుంది. అందుకే నన్నతడు పట్టి పీడిస్తున్నాడు. ‘‘వాళ్లు విడిపోతారని మీకెందుకు అనిపిస్తోంది విక్కీ? వారిలో మీరు చూడ కూడనిది ఏం చూశారు? చూడవలసినది ఏం చూడకుండా ఉండిపోయారు?’’ అని అడిగాను. ‘‘ప్రహ్లాద్జీ! ఈమధ్య ఐశ్వర్య తన అత్తగారిల్లు జుహూలో కాకుండా, బాంద్రా లోని తన తల్లిగారి ఇంట్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారని విన్నాను’’ అన్నాడు విక్కీ. తల్లి గారింట్లో ఎక్కువగానా! తల్లిగారింట్లో ఎంత ఎక్కువ మాత్రం ఎక్కువవుతుంది కూతురికి! ఐశ్వర్య ప్రతి రోజూ ఆరాధ్యను అంబానీ స్కూల్లో డ్రాప్ చేసి, తిరిగి ఒంటిగంటకు పికప్ చేసుకోటానికి మళ్లీ స్కూల్కి వెళ్తుంది. ఆ మధ్యలో మూడు గంటలు గడవాలి కనుక ఆ మూడు గంటలూ, ఆ దగ్గరలోనే ఉండే తల్లితో ఉంటుంది. ఆ విషయమే చెప్పాను విక్కీకి.విక్కీ కడుపు నిండినట్లు లేదు.‘‘మరి ఐశ్వర్య, అభిషేక్ ఎందుకని బయటెక్కడా కలిసి కనిపించటం లేదు ప్రహ్లాద్ జీ?’’ అంటాడు!భార్యాభర్తలు అనేవాళ్లు కలిసి జీవిస్తారు కానీ, కలిసి కనిపించరు. ఇంట్లో కూడా ఒకరు హాల్లో ఉంటే, ఒకరు బాల్కనీలో ఉంటారు. ఒకరు టీవీ ముందు ఉంటే ఇంకొకరు కిచెన్లో ఉంటారు. ఇక బయటైనా వాళ్లెందుకు కలిసి కనిపించాలి? ఐశ్వర్య, అభిషేక్ కూడా భార్యాభర్తలే కదా! అయితే విక్కీతో నేనామాట అనలేదు. అన్నానంటే – ‘‘వాళ్లు విడిపోతున్న మాట నిజమేనన్న మాట!’’ అని సంతృప్తిగా నా కళ్లలోకి చూస్తాడు. అతడికి ఆ సంతృప్తిని నేను ఇవ్వదలుచుకోలేదు.‘‘ఐశ్వర్య, అభిషేక్ కలిసి కనిపించకుండా ఎప్పుడున్నారు విక్కీ! ఈ మధ్యే కదా కూతురుతో కలిసి వాళ్ల 18వ పెళ్లి రోజును కూడా జరుపుకొన్నారు’’ అన్నాను. విక్కీ తన ఆశలు కోల్పోలేదు. ‘‘మరైతే ప్రహ్లాద్జీ, ‘డివోర్స్’ మీద ఎవరిదో ఆర్టికల్కు సోషల్ మీడియాలో అభిషేక్ఎందుకు లైక్ కొట్టారంటారు?’’ అన్నాడు.నీరసంగా మూలిగాన్నేను. ఎవరు ఏ పోస్టుకు ఎందుకు లైక్ కొడతారో ఎవరు చెప్పగలరు! నేను అనుకో వటం అభిషేక్ లైక్ కొట్టింది ఆ ఆర్టికల్కి అయివుండదు. ఆ ఆర్టికల్కు ఇన్పుట్స్ ఇచ్చిన డాక్టర్ జిరక్ మార్కర్కి అయివుంటుంది. జిరక్ ఐశ్వర్య స్నేహితుడు. ఇద్దరూ జై హింద్ కాలేజ్లో కలిసి చదువుకున్నారు. ‘‘ఏమిటి ఆలోచిస్తున్నారు ప్రహ్లాద్జీ? అభిషేక్ ఆ పోస్ట్కి లైక్ ఎందుకు కొట్టారంటారు?’’– విక్కీ వదలటం లేదు.పైకి కనిపించే లైక్లను మాత్రమే లోకం చూడగలదు. బహుశా ఆ లైక్... ఐశ్వర్యకు అభిషేక్ – ఎవరికీ కనిపించకుండా కొట్టిన లైక్ ఎందుకు అయివుండ కూడదు?! -
అలాస్కా నుంచి అయోమయంలోకి!
రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఆగస్టు 15న అలాస్కాలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పాటు యూరోపియన్ నాయకు లతో 18న వైట్హౌస్లో ముఖాముఖి చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇక యుద్ధం ముగింపునకు మార్గం సుగమమవుతున్నదనే సూచనలు ప్రపంచానికి ఇచ్చారు. సరిగ్గా మూడు వారాలు గడిచేసరికే పరిస్థితి అయోమ యంగా మారగా, ఆయన సెప్టెంబర్ 6న అదే వైట్హౌస్లో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతూ, యుద్ధాన్ని ఆపలేకపోతున్నట్లు అంగీకరించారు. ప్రయత్న లోపం లేకపోయినా...దాని అర్థం ట్రంప్ ప్రయత్నాలు నిలిచిపోతాయని కాదు. ఇందులో తన ప్రయత్న లోపం ఏమీ లేదు. సైద్ధాంతికంగా, భౌగోళిక రాజకీయాల దృష్ట్యా తక్కిన అమెరికన్ అధ్యక్షుల వలెనే ట్రంప్ కూడా రష్యా వ్యతిరేకి. అది తన మొదటి పదవీ కాలంలో (2017–21) స్పష్టంగానే కనిపించింది. కానీ ఈ రెండవ విడతకు వచ్చేసరికి యుద్ధాలకు వ్యతిరేకినని ప్రకటించుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి అయితే ఎన్నికల ప్రచార సమయంలోనే ఆ వైఖరి తీసుకుని 24 గంటలలోనే ఆ స్థితిని ముగింపజేస్తానన్నారు. ఆ మాటను అక్షరాలా తీసుకుని నిందించనక్కరలేదు గాని, ఆ దిశలో ప్రయత్నాలను మాత్రం 24 గంటలలోనే మొదలుపెట్టారు. అప్పటి నుంచి గత ఎనిమిది మాసాలలో తన ప్రతినిధులను మాస్కో, కీవ్, బ్రస్సెల్స్లకు పలుమార్లు పంపారు. కొందరిని వైట్హౌస్కురప్పించి చర్చించారు. పుతిన్, జెలెన్స్కీ తదితరులతో పలుమార్లు టెలిఫోన్ సంభాషణలు జరిపారు. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి వర్గాల మధ్య ఇస్తాంబుల్లో చర్చలు జరిగేట్లు చూశారు. యుద్ధ విరమ ణకు, సమస్య పరిష్కారానికి ఉభయ పక్షాలు తమ తమ ప్రతిపాద నలను ప్రకటించేట్లు చూశారు. ఆంక్షల రూపంలో రష్యాను, ఆయు ధాల సరఫరా నిలిపివేత రూపంలో ఉక్రెయిన్ను ఒత్తిడి చేశారు.ఇంత తక్కువ కాలంలో ఇన్నిన్ని ప్రయత్నాలన్నది సాధారణమైన విషయం కాదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి మూల కారణం ఎక్కడుందనే అవగాహన ట్రంప్కు ఉంది. నాటో సైనిక కూటమిని రష్యా సరి హద్దు వరకు విస్తరించజూడటం వల్లనే అభద్రతాభావానికి గురైన పుతిన్ ఈ యుద్ధాన్ని సాగిస్తున్నారని అనేకమార్లు అన్నారాయన. ఉక్రెయిన్, యూరోపియన్ నాయకులకు ముఖాముఖిగా చెప్పటమే గాక, ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకునే ప్రసక్తి లేదని ప్రకటించారు. మొదట 20 ఏళ్లపాటు అని, తర్వాత ఎప్పటికీ జరగదన్నారు. క్రిమియా, దోన్బాస్లను రష్యాకు వదలివేయాలనీ చెప్పారు. ఈ ప్రతిపాదనలకు జెలెన్స్కీ, యూరోపియన్ నాయకులు సుముఖత చూపకపోవటంతో, ఇక మీ ఖర్మ మీదన్నట్లు మాట్లాడారు. పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి, నాటో సైనిక కూటమికీ నాయకత్వ స్థానంలోగల ఒక దేశాధినేత ఇటువంటి వైఖరి తీసుకోవటం మామూలు విషయం కాదు.యూరప్ మొండితనంఇంతకూ పరిస్థితి అలాస్కా నుంచి అయోమయంలోకి వెళ్లటా నికి కారణాలేమిటి? అందుకు బాధ్యత యూరోపియన్ నాయకు లది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్లది. జెలెన్స్కీని అడుగడు గునా రెచ్చగొట్టి రాజీలు జరగకుండా చేస్తున్నది వారే. భూభాగా లను వదులుకునేందుకు జెలెన్స్కీ పరోక్షంగా సిద్ధపడగా, ఆ మాటను వారు మార్పించారు. తమకు పూర్తి రక్షణ హామీలు చాలు నన్న ప్రతిపాదనను జెలెన్స్కీ ఒక దశలో చేయగా, అందుకు పుతిన్ను ట్రంప్ ఒప్పించారు. నాటో ఛార్టర్లో 5వ నిబంధన అనేది ఒకటుంది. ఒక నాటో సభ్య దేశంపై ఇతరులు దాడి జరిపితే మొత్తం అందరిపై దాడి జరిపినట్లుగా పరిగణించి అందరూ ఆ దేశానికి రక్షణగా ముందుకు రావాలని ఆ నిబంధన చెప్తున్నది. ఉక్రెయిన్కు సభ్యత్వం ఇవ్వకపోయినా ఆ నిబంధనను పోలిన రక్షణలు ఇచ్చేందుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. అందుకు కూడా అలాస్కాలో అంగీకరించిన పుతిన్, ఉక్రెయిన్ ప్రజలకు రక్షణ అవసరమేనన్నారు. ఈ ప్రస్తావనలన్నీ ఆగస్టు 18 నాటికి వైట్హౌస్ చర్చలలో వచ్చాయి. ఇక త్వరలో పుతిన్, జెలెన్స్కీల ముఖాముఖి సమావేశం జరిగి వారొక అంగీకారానికి రానున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ సమావే శానికి తగిన స్థలం కోసం వెతుకుతున్నారని, వారిద్దరి చర్చల తర్వాత ఒకవేళ ఆహ్వానించినట్లయితే తాను కూడా వెళ్ళగలనని అన్నారు.అటువంటి ఆశావహమైన సూచనల మధ్య అంతలోనే అంతా బెడిసిపోయింది. ఆ పరిణామాల మధ్య నుంచే ట్రంప్ సెప్టెంబర్ 6 నాటి నిస్పృహతో కూడిన వ్యాఖ్యలు వినిపించాయి. ‘నాటో’ విస్తరణ ఆగితేనే...అట్లా బెడియటానికి కనిపించే తక్షణ కారణం, ఉభయ పక్షాల మధ్య ఒప్పందం కుదిరే వరకు దాడులు కొనసాగించగలమనీ, అట్లాగాక ఉక్రెయిన్ పక్షం పట్టుబడుతున్నట్లు ముందుగానే కాల్పుల విరమణ జరిగితే ఆ వ్యవధిని ఉపయోగించుకుని సైన్యాన్ని, ఆయుధాలను సమీకరించుకోగలరనీ రష్యా వాదిస్తుండగా, అటు వంటిదేమీ చేయబోమనే హామీని ఇవ్వని ఉక్రెయిన్ తన దాడులు తాను సాగిస్తుండటం. ఇందులో ట్రంప్ రష్యా వైఖరినే సమర్థించారు. ఇది తక్షణ కారణం కాగా, కనీసం ట్రంప్ ప్రతిపాదించిన ప్రకారమైనా భూమిని రష్యాకు వదలుకోవటానికి ఉక్రెయిన్ నిరాకరిస్తుండటం ప్రధానమైంది. ఉక్రెయిన్ రక్షణ కోసం యుద్ధ ఆరంభంలో జరిగిన ఒప్పందం మేరకు అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లండ్, జర్మనీ హామీగా నిలిస్తే సరిపోతుందని పుతిన్ అంటుండగా, యూరోపియన్ దేశాలు ఉమ్మడి సేనలను పంపగలవన్నది బ్రస్సెల్స్ వాదన. ఉక్రెయిన్ భూభాగంలో అటువంటి సేనల ప్రవేశాన్ని ఎంతమాత్రం సమ్మతించబోమని పుతిన్ స్పష్టం చేస్తున్నారు. అలాస్కా వైట్హౌస్ చర్చల అనంతరం విషయమంతా ఇక్కడ స్తంభించిపోయింది. అక్కడి నుంచిముందుకు ఎట్లా, ఎప్పటికి కదిలేనో ట్రంప్కు బోధపడుతున్నట్లు లేదు. ఆ నిస్సహాయతలో తను చేయగల పని రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే ఇండియా వంటి దేశాలపై సుంకాలు పెంచటం ఒక్కటే గనుక అది మాత్రం అర్థంపర్థం లేకుండా చేస్తున్నారు. నాటో విస్తరణ సమస్య ఇపుడు కొత్తగా తలెత్తింది కాదు. 1991లో సోవియెట్ యూనియన్ వార్సా కూటమి రద్దయినాక కూడా, ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా వ్యతిరేకతను లెక్కచేయకుండా నాటోను అయిదుసార్లు విస్తరించారు. యుద్ధం మొదలైనాక ఆ పని మరో రెండుసార్లు చేశారు. ఆ చర్యలను రష్యా అప్పటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్, ఆ తర్వాత పుతిన్ వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినప్పటికీ అమెరికా అధ్యక్షులు ముఖ్యంగా క్లింటన్తో మొదలుకొని బైడెన్ వరకు వేగంగా విస్తరిస్తూ పోయారు. ఇపుడా దేశాల సంఖ్య 32కు చేరింది. ట్రంప్ మినహా ఆ నాయకుల లక్ష్యమంతా ఉక్రెయిన్ను కూడా చేర్చుకుని రష్యాను చుట్టుముట్టడం. ఇది పుతిన్కు తెలుసు.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-టంకశాల అశోక్ -
భావ ప్రకటన స్వేచ్ఛను బంధిస్తారా?
పత్రికా స్వేచ్ఛకు సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రత్యేకించి ప్రస్తావించక పోయినప్పటికీ, 19(1)(ఎ) అధికరణం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛను పొందుపరిచారు. తద్వారా పాత్రికేయులు, రచ యితలు, కవులు, కళాకారులు, సృజనాత్మక నిపుణులు తమ భావా లను నిర్ద్వంద్వంగా స్పష్టం చేసే హక్కులు పొందారు. ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తున్నప్పటికీ సహేతుకమైన విమర్శ లను సాదరంగా ఆహ్వానించాల్సిందే. అర్థవంతమైన సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీతనం వహించాలి. పత్రికలు సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య వారధిగా నిలబడాలి. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేర వేయాలి. మీడియా ప్రచురించిన వార్తల్లో వాస్తవాలను గ్రహించి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పాలనలో దిద్దుబాట్లకు శ్రీకారం చుట్టాలి. అంతేగానీ తాము చేసేదంతా మంచేననీ, దాన్నెవరూ ప్రశ్నించకూడదనీ ప్రభుత్వాలు భావిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది.ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన విస్తుగొలిపేలా ఉంది. ‘ఫలానా ప్రమోషన్లలో అవినీతి జరిగిందని’ ఎవరో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘సాక్షి’ పత్రిక రాసిన వార్త మీద పోలీసులు కేసు నమోదు చేయడం; ఎడిటర్, రిపోర్టర్లకు పోలీసులు నోటీసులు జారీ చేసి పోలీసు స్టేషన్లో ప్రశ్నించడం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి సహేతుకమైన సంకేతం. ఎడిటర్ ఇంట్లో సోదాలు నిర్వహించడం నిర్ద్వంద్వంగా నియంతృత్వ పోకడే. ప్రతిష్ఠాత్మక ‘ఇండియా టుడే’ మీడియా గ్రూపు కన్సల్టెంట్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ సైతం ఈ చర్యల పట్ల ధర్మాగ్రహం వ్యక్తం చేశారంటే సమస్య తీవ్రత ఎంతటిదో అర్థమ వుతుంది. ‘పీ4 పథకం ముఖ్య నేత పిచ్చికి పరాకాష్ట’ అనీ, ‘ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పరులే’ననీ రాసిన పత్రిక మీద మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే సదరు పత్రిక రాసి నవి వాస్తవాలని ప్రభుత్వం ఒప్పుకున్నట్టేనా? మరెందుకు కొన్ని పత్రికల పట్ల పక్షపాత వైఖరి?నిస్సందేహంగా మీడియాకు ‘లక్ష్మణ రేఖ‘ అవసరమే. అయితే ఇది స్వీయ నియంత్రణ రేఖ కావాలే కానీ, భావప్రకటన కుత్తుక మీద కత్తిలా ఉండకూడదు. మీడియాను బందిఖానాలో ఉంచాలను కుంటే రౌడీలు రాజ్యమేలతారు. అది మరింత ప్రమాదకరం!– ప్రొ‘‘ పీటా బాబీవర్ధన్జర్నలిజం విభాగ పూర్వాధిపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
సాంకేతిక సమానత్వ యోధుడు
ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం పొందడమనే ఓ సుదీర్ఘ ప్రక్రియ మీకు గుర్తుందా? పదేపదే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, కొండవీటి చాంతాడులా బారులు తీరిన జనాలు, అడపాదడపా రుసుముల చెల్లింపులు... ఇప్పుడివన్నీ మాయమై, మీ అరచేతిలోని ఫోన్లో సాక్షాత్తూ ప్రపంచమే ఇమిడిపోయింది. ఇది ఎంతమాత్రం ఆకస్మిక పరిణామం కాదు.ప్రధానమంత్రి మోదీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశపు సమానత్వ ఆయుధంగా మలిచారు. కార్పొరేట్ ప్రపంచంలోని ఓ ఉన్నతాధికారి తరహాలో ముంబయిలోని ఒక వీధి వ్యాపారి కూడా నేడు అదే యూపీఐ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించగలడు. ఈ పరిణామం మోదీ అనుసరించే అంత్యోదయ సూత్రం కీలక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టే, వరుసలో చివరి వ్యక్తికీ సాంకేతికత చేరువైంది.బీజం పడింది అక్కడే!మోదీ ముఖ్యమంత్రి హోదాలో తొలుత సాంకేతికత, ఆవిష్క రణల వినియోగం ద్వారా గుజరాత్ రూపాంతరీకరణకు కృషి చేశారు. ‘జ్యోతిగ్రామ్’ పేరిట ఆయన 2003లో ప్రారంభించిన పథకం ‘ఫీడర్ సెపరేషన్ టెక్నాలజీ’ని విజయవంతంగా ఉపయో గించింది. తద్వారా నిర్దిష్ట సమయం ప్రకారం వ్యవసాయ విద్యుత్ సరఫరాతో భూగర్భ జల క్షీణత అదుపులోకి వచ్చింది. మరోవైపు 24 గంటల విద్యుత్ సౌకర్యం గ్రామీణ పరిశ్రమలకు ఉత్తేజమిచ్చింది. చిన్న వ్యాపారాల విస్తృతితో వలసలు తగ్గాయి. ఒక అధ్యయనం ప్రకారం ఈ పథకంపై పెట్టిన రూ.1,115 కోట్ల పెట్టుబడి కేవలం రెండున్నరేళ్లలో తిరిగి వచ్చింది.నర్మదా నది కాలువపై 2012లో సౌర ఫలకాల ఏర్పాటుకు ఆయన నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 16,000 ఇళ్లకు ఏటా 1.6 కోట్ల యూనిట్ల విద్యుదుత్పాదన సాధ్యమైంది. మరోవైపు కాలువలో నీరు ఆవిరయ్యే ప్రక్రియ మందగించి, రైతులకు నీటి లభ్యత పెరిగింది. సాంకేతికతపై మోదీ దార్శనికతకు ఈ జోడు ప్రయోజ నాల విధానమే నిదర్శం. ఇక ‘ఇ–ధర’ వ్యవస్థ ద్వారా భూ రికార్డుల డిజిటలీకరణ చేపట్టారు. ‘స్వాగత్’ పేరిట పౌరులకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముఖ్యమంత్రితో నేరుగా ముచ్చటించే వీలు కలిగింది. ఆన్లైన్ టెండర్లతో అవినీతి అంతమైంది.జాతీయ యవనికపై...గుజరాత్లో సముపార్జించిన అనుభవాన్ని, ఆచరణాత్మక విధా నాలను ఆయన 2014లో ఢిల్లీకి తెచ్చారు. అనతి కాలంలోనే డిజిటల్ సార్వజనీన మౌలిక సదుపాయాలతో ‘ఇండియా స్టాక్’ రూపు దిద్దుకుంది. జన్ధన్, ఆధార్, మొబైల్ త్రయమే వీటికి పునాది.దేశవ్యాప్తంగా 53 కోట్ల మందికిపైగా ప్రజలను జన్ధన్ ఖాతాలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తెచ్చాయి. వీధి వ్యాపారులు, రోజుకూలీలు సహా పూర్తిగా నగదు లావాదేవీలు నిర్వహించే గ్రామీణులకూ ఇవాళ బ్యాంకు ఖాతాలున్నాయి. ఆధార్ పౌరులకు డిజిటల్ గుర్తింపునిచ్చింది. ఇప్పటివరకు 142 కోట్ల ప్రజలు దానికింద నమోదు చేసుకున్నారు. ఆధార్ ద్వారా ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) ద్వారా మధ్యవర్తుల జోక్యం తొలగి, నిధులు పక్కదారి పట్టడం తగ్గింది. డీబీటీని అవలంబించడం ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది.యూపీఐ ద్వారా దేశంలో చెల్లింపుల తీరులో సమూల మార్పు లొచ్చాయి. ఇది ప్రారంభించినప్పటి నుంచి 55 కోట్లకు పైగా వినియోగదారులు లావాదేవీలు నిర్వహించారు. ఒక్క 2025 ఆగస్టులోనే 20 బిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ. 24.85 లక్షల కోట్లు. నేడు ప్రపంచవ్యాప్తంగా రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్లోనే జరుగుతున్నాయి. డిజిటల్ లావాదేవీలు నిర్వహించాల్సిందిగా కోవిడ్ సమయంలో ఆయన కోరిన వేళ, ఆర్థిక వ్యవ స్థలో ఆ దిశగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వీసా కన్నా యూపీఐ ఎక్కువ లావాదేవీ లను ప్రాసెస్ చేస్తోంది. ఇప్పుడొక చిన్న మొబైల్ ఫోనే ఓ బ్యాంకు. సాంకేతికత అందరిదీ!సాంకేతికత వల్ల వ్యవసాయం, ఆరోగ్య రక్షణ రంగాల్లో సమూ లమైన మార్పులు వచ్చాయి. హరియాణాలో ఉండే ఓ రైతు జగదేవ్ సింగ్ విషయమే తీసుకోండి! ఆయనిప్పుడు ఏఐ యాప్లను ఉపయోగించి పంట సంబంధిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కచ్చితమైన వాతావరణ సమాచారాన్ని, భూసారా నికి సంబంధించిన డేటాను తన ఫోన్ లోనే తెలుసుకుంటున్నారు.పీఎం–కిసాన్ పథకం 11 కోట్ల రైతులకు డిజిటల్ పద్ధతిలో నేరుగా ఆర్థిక చేయూతను అందిస్తోంది. డిజి లాకర్కు ఇప్పుడు 57 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. 967 కోట్ల పత్రాలు అందులో డిజిటల్గా నిల్వ అయి ఉన్నాయి. మీ డ్రైవింగ్ లైసెన్సు, డిగ్రీ సర్టిఫికెట్లు, ఆధార్, ఇతర అధికారిక పత్రాలు భద్రంగా మీ ఫోన్ లోనే ఉంటాయి. ఇకపై రోడ్డు మీద పోలీసు తనిఖీల్లో భౌతిక పత్రాల కోసం తడబడాల్సిన అవసరం లేదు. డిజి లాకర్ నుంచి మీ డిజిటల్ లైసెన్సును చూపించండి చాలు. తక్షణ ఆధార్ ధ్రువీకరణ ద్వారా... ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సులభతరమైంది.అసాధ్యం అనిపించిన దానిని భారతదేశం సాధించింది. మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని... అది కూడా హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్తో చేరుకుంది. ప్రపంచ స్థాయి ఫలితాలను అందిస్తూ భారతీయ ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని నిరూ పించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ పై చేసిన వ్యయం రూ. 450 కోట్లు మాత్రమే. చంద్రయాన్–3 భూ ఉపగ్రహంపై దిగిన నాలుగో దేశంగా భారత్ను నిలబెట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కించింది. ఒకే మిషన్ లో 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించింది. భారతదేశ రాకెట్లు ఇప్పుడు 34 దేశాల ఉపగ్ర హాలను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నాయి. ‘గగన్ యాన్’ మిషన్తో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అంతరిక్షంలోకి మాన వులను పంపిన నాలుగో దేశంగా కూడా భారత్ నిలవనుంది. పీఎం గతిశక్తి పోర్టల్ అపూర్వమైన స్థాయిలో జీఐఎస్ టెక్నా లజీని ఉపయోగిస్తోంది. ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టునూ డిజిటల్గా మ్యాప్ చేస్తారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడ రేవులన్నీ కలిసి సమన్వయ ప్రణాళికగా రూపొందిస్తారు. ఇకపై సమన్వయ లోపం వల్ల జరిగే ఆలస్యం ఉండదు.ఇండియా ఏఐ మిషన్ ద్వారా, 38,000 జీపీయూలు మూడింట ఒక వంతు ప్రపంచ ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇది స్టార్టప్ లకు, పరిశోధకులకు, విద్యార్థులకు సిలికాన్ వ్యాలీ స్థాయి కంప్యూ టింగ్ను గంటకు సగటున రూ. 67 రేటుతో అందించింది.మానవ అనుసంధానంప్రధాని మోదీకి సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసు. కానీ ఆయన ప్రజలను మరింత బాగా అర్థం చేసుకున్నారు. అంత్యో దయకు సంబంధించి ఆయన దార్శనికత ప్రతి ఒక్క డిజిటల్ కార్య క్రమాన్నీ ముందుకు నడిపిస్తోంది. యూపీఐ బహుళ భాషల్లో అందు బాటులో ఉంది. అత్యంత ధనిక పారిశ్రామికవేత్తతో సమానమైన డిజిటల్ గుర్తింపును నిరుపేద రైతు కూడా కలిగి ఉన్నాడు.సింగపూర్ నుంచి ఫ్రాన్స్ వరకు ఎన్నో దేశాలు యూపీఐతో అనుసంధానమైనాయి. సమ్మిళిత వృద్ధికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ అవసరమని జీ20 ఆమోదించింది. దీనికి జపాన్ పేటెంట్ మంజూరు చేసింది. భారత్ పరిష్కారంగా ప్రారంభమైన యూపీఐ డిజిటల్ ప్రజాస్వామ్యానికి ప్రపంచ నమూనాగా మారింది.గుజరాత్లో మోదీ చేసిన ప్రారంభ ప్రయోగాల నుంచి డిజిటల్ ఇండియా వరకు... ఈ ప్రయాణం జీవితాలను మార్చే సాంకేతిక పరిజ్ఞాన శక్తిని ప్రదర్శిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన తన పాలన సారాంశంగా మార్చారు. పాలకులు మానవీయ కోణంలో సాంకేతికతను స్వీకరించినప్పుడు, మొత్తం దేశాలు భవిష్యత్తులోకి దూసుకెళ్లగలవని ఆయన నిరూపించారు.అశ్వినీ వైష్ణవ్వ్యాసకర్త కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార – ప్రసార శాఖ మంత్రి -
ఈ వేలంవెర్రికి తెర పడదా?
సింపుల్గా.... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్కు సన్నిహితుడూ, కరడు గట్టిన జాతీయవాదీ అయిన చార్లీ కిర్క్ హత్యోదంతంతో ప్రపంచం ఉలిక్కిపడింది. అమెరికాలో యూటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతుండగా, ఈ నెల 10న ఓ ముష్కరుడు జరిపిన ఆ కాల్పులతో అమెరికాలోని తుపాకీల సంస్కృతిపై మరో మారు చర్చ రేగింది. అలనాటి అబ్రహామ్ లింకన్ నుంచి నేటి కిర్క్ దాకా అనేక హత్యా ఘటనలు, స్కూళ్ళలో కాల్పులు, రాజకీయ ప్రేరేపిత దాడులు జరుగుతూనే ఉన్నాయి. తుపాకీ లపై వ్యామోహం, వినియోగాన్ని నియంత్రిస్తూ కట్టుదిట్టమైన చట్టం తీసుకువచ్చేందుకు గతంలో పలు అమెరికన్ ప్రభుత్వాలు ప్రయత్నించినా అడ్డంకులు ఎదురయ్యాయి ఇప్పుడేం జరిగింది?అమెరికాలో తుపాకీల పిచ్చి ఎంతంటే... ఆ దేశ జనాభా కన్నా తుపాకీల సంఖ్యే ఎక్కువ. ప్రపంచ జనాభాలో అక్కడున్నది 5 శాతం కన్నా తక్కువే. కానీ, భూమిపై సామాన్యుల దగ్గరున్న గన్స్లో 45 శాతం పైగా అక్కడే ఉన్నాయి. తుపాకీ లైసెన్సును దేవుడిచ్చిన హక్కుగా సంబోధిస్తూ, ఆ సంస్కృతిని సమర్థిస్తూ వచ్చిన 31 ఏళ్ళ వీర జాతీయవాది చార్లీ కిర్క్. ఆయన తన 18వ ఏటనే టర్నింగ్ పాయింట్ అనే సంస్థను నెలకొల్పి, తన ప్రసంగాలతో ఆకర్షిస్తూ వచ్చారు. ఉదారవాద అమెరికన్ కాలేజీల్లో జాతీయ వాద ఆదర్శాలను విస్తరింపజేసేందుకు ప్రయత్నించారు. గన్స్ నియంత్రణను వ్యతిరేకించిన ఆయన చివరకు ఓ స్నైపర్ దూరం నుంచి గురిచూసి కాల్చిన తూటా మెడకు తగిలి, ప్రాణాలు కోల్పోయారు. చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!నేపథ్యం ఏమిటి?అమెరికా రాజ్యాంగ రెండో సవరణ ప్రకారం గన్స్ హక్కు పౌరులకుంది. అదే ఆ దేశ సంస్కృతినీ తీర్చి దిద్దింది. సాక్షాత్తూ నలుగురు దేశాధ్యక్షుల నుంచి సామాన్యుల దాకా ఎందరో బలయ్యారు. అమెరికన్ రాజకీయాలనూ, నిత్యజీవితాన్నీ ప్రభావితం చేసిన ఈ తుపాకీల సంస్కృతి నియంత్రణకు సంబంధించి ఏళ్ళుగా చర్చ సాగుతూనే ఉంది. అయితే, ఈ అంశం కేవలం విధానపరమైనదే కాదు. రాజ్యాంగంలోని వివిధ అంశాల వ్యాఖ్యానం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, వ్యక్తిగత భద్రతలతోనూ ముడిపడిన విషయం. నియంత్రణ సమర్థకులు, వ్యతిరేకులుగా అమెరికన్ సమాజం నిట్టనిలువునా చీలిపోయింది. కిర్క్ హత్యా ఘటన చర్చను మరోసారి తెరపైకి తెచ్చింది.గత చరిత్రఅమెరికాలో మొదట వేట, స్వీయ రక్షణ కోసం గన్స్ వచ్చాయి. 1791లో తెచ్చిన ‘బిల్ ఆఫ్ రైట్స్’లో ఆయుధాలను కలిగివుండే రాజ్యాంగ రెండో సవరణ కూడా చోటుచేసుకుంది. క్రమంగా తుపాకీలను స్వేచ్ఛకు ప్రతీక అనుకోవడం మొదలైంది. అయితే, గన్స్ వినియోగం దోవ తప్పి నేరాలకు దారితీసింది. 1934లో ప్రధానమైన తొలి ఫెడరల్ ఆయుధ చట్టం తెచ్చారు. దశాబ్దాల అనంతరం జాన్ ఎఫ్ కెనడీ, రాబర్ట్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ల హత్యల తర్వాత అమెరికన్ కాంగ్రెస్ తుపాకీ నియంత్రణ చట్టం 1968 చేసింది. అయినా దుర్వినియోగం ఆగలేదు. తర్వాతా సంస్కరణలు తేవాలని పలు వురు అమెరికన్ అధ్యక్షులు యత్నించి, విఫలమయ్యారు. ఒబామా అలాంటి చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని 17 సార్లు ప్రయత్నించారు.వర్తమానం... భవిష్యత్తు...అమెరికాలో ప్రతి 10 మందిలో నలుగురి ఇంటి వద్ద తుపాకీలు ఉన్నాయట. యుద్ధ పీడిత యెమెన్తో పోలిస్తే ఇక్కడే రెట్టింపు కన్నా ఎక్కువగా తలసరి 1.2 గన్నులున్నాయి. సగటున రోజూ 128 గన్ డెత్స్ సంభవిస్తున్నాయి. అంటే, సగటున ప్రతి 11 నిమిషా లకూ ఒకరు ప్రాణాలు వదులుతున్నారు. ఇంత జరుగుతున్నా గన్ రైట్స్పై అమెరికా ఒక్క తాటి మీద లేదు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ లాంటి బలమైన లాబీలూ దీని వెనుక పనిచేస్తున్నాయి. మునుపు 1980, 90లలో ఆస్ట్రేలియాలో ఇలానే తుపాకీలు రాజ్యమేలుతుంటే, కఠినమైన నియంత్రణతోఅదుపు చేశారు. అమెరికాలోనేమో అలాంటిది కనుచూపు మేరలో కనిపించడం లేదు. -
గయ మహిమ : ఆయన శరీరమే క్షేత్రంగా
‘త్రిమూర్తుల్లో భేదం లేదు, ముగ్గురూ ఒకటే’ అనటానికి గయ క్షేత్రం నిదర్శనం. చనిపోయిన ఆత్మీయ బంధు మిత్రుల పేర ఈ చోట కర్మకాండలా చరిస్తే మరణించిన వారికి ఉత్తమ గతులు కల్గుతాయి. ఈ కర్మనే ‘గయా శ్రాద్ధ’ మంటారు. మన ఇంటిలో పితృకార్యం జరిగినప్పుడు కూడా ‘గయా శ్రాద్ధ ఫలితమస్తు’ అని మంత్రం చదువుతారు. పిండ ప్రదానం చేస్తూ ‘గయా పిండ సదృశా భవంతు’ అని అంటారు. మన దేశంలో గయ, కాశీ, ప్రయాగ... ఈ మూడు ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన క్షేత్రాలు, తీర్థాలున్నూ! వీటినే క్షేత్ర త్రయమంటారు. ఈ గయా క్షేత్రానికి పెద్ద చరిత్ర ఉంది. వేల సంవత్సరాలకు పూర్వం గయుడనే రాక్షసుడుండేవాడు. విష్ణువును గురించి ఘోరంగా తపస్సు చేసి, వందల మైళ్ళ దీర్ఘమైన భారీ శరీరం కావాలని వరం కోరుకున్నాడు. క్షణంలో అంత పెద్ద భయంకర శరీరం గయునికి వచ్చింది. గర్వం నెత్తికెక్కినప్పుడు ఎవరికైనా తిక్క మాటలు వస్తాయి. ఏకంగా బ్రహ్మదేవుడినే ఉద్దేశించి, ‘నీకేమైనా వరం కావాలంటే కోరుకో’ అన్నాడు. ఎంత కండకావరమో చూడండి! ‘అయితే గయుడా! ఈ శరీర భాగాల్లో ఒక చోట నాకు యజ్ఞం చేయాలని ఉంది’ అంటాడు బ్రహ్మ. ‘అలాగే యజ్ఞం చేయి కానీ, ఒక షరతు! అప్పుడు నా శరీరం కదలటానికి వీలులేనంత బరువు నాపై పెట్టాలి’ అన్నాడు. బ్రహ్మ ముందు శివ పార్వతులను ప్రార్థించాడు. ‘శివ శిల’ అనే పెద్ద రాయిని గయుడి మీద పెట్టారు. వెంటనే రాక్షసుని రొమ్ము మీద నిలబడ్డాడు విష్ణువు. ఎంత గింజుకున్నా గయుడింక కదలలేడు. బ్రహ్మ సంకల్పం కదా! శివుని శిల, విష్ణు పాదం... ఈ ముగ్గురి స్పర్శాదుల వల్ల వాడిలో మార్పు వచ్చింది. ‘త్రిమూర్తులు నా వల్ల జగత్తుకు ఏ మాత్రం బాధ కలగకూడదని సంకల్పించి యుక్తిగా నా లోని చెడును ఈ విధంగా తొక్కిపెట్టారు’ అని తప్పు తెలుసుకున్నాడు. ‘నా చివరి కోరిక ఒక్కటే. ఈ ప్రాంతానికి నా పేరు పెట్టాలి. నా మీద పడిన పవిత్ర పాదముద్రలకు అభిషేకం చేసినా, పితృశ్రాద్ధం చేసినా, నివేదనం పెట్టినా భక్తులను అనుగ్రహించాలి’ అని ప్రార్థించాడు.తమాషా ఏమిటంటే ఇంతవరకూ బ్రహ్మ గయుని దేహం మీద యజ్ఞం చేయలేదు. గయుని పైకి లెమ్మని కూడా అనలేదు. గయుని శరీరమే గయా క్షేత్రంగా ఉండిపోయింది. త్రిమూర్తుల సమష్టి కృషి ఫలితంగా లోక కల్యాణం కలుగుతున్నది.శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
వార్తలు రాయడమే నేరమా?
‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసింది!’ కోట్లాది హిందు వుల మనోభావాలను గాయపరుస్తూ ఏపీ ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ ఇది. ఆ వెంటనే దానిని అందుకుని సనాతని వేషం కట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ‘ప్రకాశం బ్యారేజీని బోట్లతో ధ్వంసం చేయడానికి యత్నించారు’... ఇది కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో బ్యారేజీ వద్దకు కొట్టుకు వచ్చిన బోట్ల గురించి చంద్రబాబు చేసిన మరో విమర్శ. ఇలా అనేక అభియోగాలను చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేశారు. వాటన్నిటిలో అత్యధిక భాగం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆపాదించి చేశారు. అలాగైతే ఎన్ని కేసులు పెట్టొచ్చు?అధికారంలోకి వచ్చాకే కాదు, అంతకు ముందు విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ నేతలు జగన్పై పలు తీవ్రమైన అభియో గాలు గుప్పించారు. ‘జగన్ ఏపీలో ప్రజల భూములన్నీ కొట్టేయడా నికి యత్నిస్తున్నారు; జగన్ పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు’ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇక పవన్ కల్యాణ్ అయితే 30 వేల మంది అమ్మాయిలు ఏపీలో తప్పిపోయారంటూ వలంటీర్లపై నిందలు వేశారు.ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుంటే అప్పట్లో వారిపై ఎన్ని కేసులు పెట్టి ఉండవచ్చో! అలాంటి అబద్ధపు ఆరోపణలను ప్రచారం చేసిన ఎల్లో మీడియాపై ఎన్ని కేసులు పెట్టాలో! కానీ జగన్ టైమ్లో అలా చేయలేదు. వాటిని రాజకీయంగానే చూసి వదలివేశారు. ఇటీవలి కాలంలో ఏపీని పోలీసు రాజ్యంగా మార్చి, విపక్ష వైసీపీ వారిపైనే కాకుండా, తనకు గిట్టని ‘సాక్షి’ మీడియాపైనా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ సంగతులు గుర్తు చేయవలసి వచ్చింది.కేసులతో కొత్త రికార్డులురాజకీయ నేతల ప్రెస్ కాన్ఫరెన్స్ల ఆధారంగా మీడియాపై కేసులు పెడుతూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ అమరావతి వరద ముంపు గురించి మీడియాకు ఒక విషయం చెప్పారు. ఆ వరద నీటి మళ్లింపు వల్ల గుంటూరు చానల్కు గండి పడిందనీ, తత్ఫలితంగా పొన్నూరు ప్రాంతంలో సుమారు 70 వేల ఎకరాల పంట పొలాలు మునిగాయనీ ఆరోపించారు. ఆయన చెప్పిన విషయాలను ‘సాక్షి’ ప్రచురించింది. సాధారణంగా ప్రభుత్వ పక్షాన ఎవరైనా ఏమి చేయాలి? అది వాస్తవమా, కాదా? అన్నదానిని పరిశీలించి మీడియాకు వివరణ ఇచ్చి, వార్తను ప్రజలకు తెలియచేయాలని కోరవచ్చు. అలాకాకుండా సంబంధిత అధికారి ఒకరితో ‘సాక్షి’పై ఏకంగా కేసు పెట్టించారు. తాడేపల్లి పోలీసులు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనంజయ రెడ్డికి నోటీసు ఇచ్చి తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరారు. విశేషం ఏమిటంటే, ఇదే సమయంలో టీడీపీ మీడియా ఒక కథనాన్ని ఇస్తూ, అమరావతిలో వరద ముప్పు నివారణ కోసం ప్రభుత్వం ఆరు వేల కోట్లతో మరో రెండు ప్రాజెక్టులను చేపడుతోందని తెలిపింది. కేసులు అక్రమమని తెలిసినా, పోలీసులు ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగక తప్పడం లేదు. ఆ మాట కొందరు పోలీసు అధికారులు జర్నలిస్టులకు వ్యక్తిగతంగా చెబుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇదంతా రెడ్ బుక్ ఎఫెక్ట్ అనీ, ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికీ, ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికీ ఇలాంటి అసంబద్ధ చర్యలకు దిగుతోందని తెలుస్తోంది. ‘సాక్షి’ గొంతు నొక్కివేస్తే తమను ప్రశ్నించేవారు ఉండ రని పెద్దలు భావిస్తున్నారేమో తెలియదు.మరో వార్త చూడండి. అవినీతి కారణంగానే పోలీసు అధికా రుల ప్రమోషన్లను జాప్యం చేస్తున్నారని ‘సాక్షి’ స్టోరీ ఇచ్చింది. దానికి పోలీస్ పెద్దలకు కోపం వచ్చిందట. అది నిజం కాకపోతే వారు ఖండించవచ్చు. కానీ, పోలీసు ఉద్యోగుల సంఘం నేతతో కేసు పెట్టించేశారు. గతంలో ఈ తరహా వార్తలు మీడియాలో వస్తే సదరు సంఘం నేతలు వివరణ ఇచ్చేవారు. పాపం... ఇప్పుడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కానీ, మరికొందరు టీడీపీ నేతలు, జనసేన క్యాడర్గానీ కొంతమంది పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినా ఈ సంఘం నేతలు నోరు మెదపలేకపోతున్నారు. కానీ ‘సాక్షి’ మీద సంఘం అధ్యక్షుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, అర్ధరాత్రి వేళ ‘సాక్షి’ ఆఫీస్కు పోలీసులు వచ్చి హడావిడి చేయడం జరిగింది. ఈ కేసులో కూడా విచా రణకు నోటీసులు ఇచ్చారు. ఆ విచారణకు ఎడిటర్ ధనంజయ రెడ్డితో పాటు సీనియర్ పాత్రికేయులు హాజర య్యారు. ఆ సందర్భంలో ఏ పోలీసు అధికారులు ఆ సమాచారం ఇచ్చారో చెప్పాలని కోరారట! జర్నలిజం సూత్రాల ప్రకారం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రహస్యంగా ఉంచాలి. అయినా ఆ వివరాలు కోరారు. ఆ పోలీసు అధికారులకు కూడా తమ శాఖలో జరుగుతున్న పరిణామాలు తెలిసే ఉండాలి. ఏ అధికారులు ప్రమోషన్లు పొందలేక పోయారో, దానికి కారణాలు ఏమిటో వారికి తెలిసి ఉండాలి. కానీ పై స్థాయి నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని అర్థం అవుతుంది.ద్వంద్వ ప్రమాణాలుఇంకో ఉదంతం చూద్దాం. రాయలసీమకు చెందిన ఒక పోలీసు అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై ‘సాక్షి’ ఒక వార్తను ఇచ్చింది. ఆ అధికారి పేరు రాయలేదు. తమకు వచ్చిన సమాచారంలో నిజం ఉందని నమ్మితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుని కథనాలు ఇస్తుంటారు. ఈ స్టోరీపై సీనియర్ అధికారికి ఆగ్రహం వచ్చింది. వేరే అధికారిని పిలిచి కేసు పెట్టించారు. ఆ అధికారి తను ఏ తప్పు చేయకపోతే, ఆ కథనం తనను ఉద్దేశించి రాశారన్న అభిప్రాయం కలిగితే ధైర్యంగా మీడియా సమావేశం పెట్టి తన వాదనను వినిపించి ఉండవచ్చు. తన పరువుకు భంగం కలిగించారని నోటీసు ఇచ్చి ఉండవచ్చు. అలా చేయకుండా మరొకరితో కేసు పెట్టించడంలోనే డొల్లతనం ఉందనిపిస్తుంది.ఏపీ పోలీసుల ప్రవర్తనకు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిన వైనమే పెద్ద శాంపుల్. తమ ఓట్లు తమను వేయనివ్వాలని కొందరు ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నారంటే అది పోలీస్ వ్యవస్థకు ఎంత అప్రతిష్ఠో ఊహించుకోవచ్చు. కోర్టులలో బెయిల్ రాకుండా ఉండటం కోసం సంబంధం ఉన్నా, లేకపోయినా తోచిన సెక్షన్లు పెట్టి రిమాండ్ ఉత్తర్వులు వచ్చేలా చేయడంలో ఏపీ పోలీసులు స్పెషలైజేషన్ సంపాదించారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ వారిపై వీలైనన్ని కేసులు పెట్టడం... అదే టీడీపీ, జనసేన కార్యకర్తలు తమ సమక్షంలోనే గూండాయిజానికి పాల్పడినా నిస్సహాయంగా ఉండిపోవడం సమాజానికే ప్రమాదకరమని చెప్పక తప్పదు. రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు చేసిన గూండాయిజం తెలిసిందే! ‘సాక్షి’ టీవీ చర్చలో అభ్యంతర పదం వాడారని అంటూ కూటమి నేతలే కొంతమందిని పురిగొల్పి కృత్రిమ ఆందోళనలు చేయించారు. రాజకీయాలు ఎలా ఉన్నా, పోలీసు వ్యవస్థ ధర్మంగా, నిష్పక్షపాతంగా లేకపోతే అది సమాజానికి హానికరం. పోలీసులకు ప్రామాణికం రెడ్ బుక్ కాదనీ, రాజ్యాంగమనీ ఎప్పటికి గుర్తిస్తారో!కొమ్మినేని శ్రీనివాసరావువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇది విమోచనమే!
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తిన సాహితీ యోధుడు స్వర్గీయ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవం ఇటీవలే జరుపుకొన్నాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17ను ‘విమోచన దినోత్సవం’గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఏడాది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా రానుండటం కోట్లాది తెలంగాణ రతనాలతో దాశరథికి నివాళులు అర్పించడమే అవుతుంది. వీరులను స్మరించుకోవడానికి...1998 సెప్టెంబర్ 17న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో భార తీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సమర యోధులను సత్కరించి వారి సమక్షంలోనే సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విమోచన దినం’గా ప్రకటించి, ప్రభుత్వమే అధికారిక ఉత్సవాలను నిర్వహించాలనీ, ప్రధాన కూడళ్లలో పోరాట యోధుల విగ్రహాలను ప్రతిష్ఠించాలనీ డిమాండ్ చేశాం. అది మొదలు బీజేపీ ఈ అంశంపై నిరంతరం ఉద్యమాలు చేస్తూనే ఉంది. ఇకపై ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విముక్తి దినం’ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించిందంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2024 మార్చ్ 12న ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ‘‘1947 ఆగస్ట్ 15న భారతదేశం స్వాతంత్య్రం పొందిన 13 నెలల వరకూ హైదరాబాద్కు స్వేచ్ఛ లభించలేదు. అది నిజాం పాలనలో ఉంది. ‘ఆపరేషన్ పోలో’ పేరిట పోలీస్ చర్య తర్వాత 1948 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతం నిజాం పాలన నుండి విముక్తి పొందింది. అయితే, సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విముక్తి దినం’గా జరపాలని ఈ ప్రాంత ప్రజల నుండి డిమాండ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ను విముక్తి చేసిన మర వీరులను స్మరించుకోవడానికీ, యువత మనస్సులో దేశభక్తి జ్వాలను నింపడానికీ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విముక్తి దినం’ జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఆ గెజిట్లో పేర్కొన్నారు. అసంబద్ధమైన పేర్లుగతంలో హైదరాబాద్ సంస్థానంలో ఉండి... మహారాష్ట్ర, కర్ణాటకల్లో కలిసిన జిల్లాల్లో ఆ ప్రాంత ప్రజల ఒత్తిడి మేరకు అక్కడ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. 2001 నుంచి మహా రాష్ట్రలో, 2009 నుంచి కర్ణాటకలో అక్కడి ప్రభుత్వాలు అధికారిక విమోచన ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ నిర్ణయాలు తీసుకున్నవి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలే కావడం విశేషం. తెలంగాణలో మాత్రం ప్రజలు ఎన్ని ఉద్య మాలు చేసినా ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించేది లేదని భీష్మించుకు కూచున్నాయి. కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరకు ఒక మెట్టు దిగి గత మూడు సంవత్సరాలుగా అధికారిక వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకలను ‘విమోచన దినోత్సవం’గా కాకుండా ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’, ‘ప్రజా పాలనా దినోత్సవం’ అంటూ సంబంధం లేని పేర్లతో సెప్టెంబర్ 17 ఉద్దేశ్యాన్ని నీరుగార్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారత రాజ్యాంగం స్వభావ రీత్యా సమాఖ్యగా ఉన్నా... ఆత్మ ఒక్కటే అని సాధారణంగా చెప్పుకొంటాం. అందుకే, రాజ్యాంగంలో ఈ దేశాన్ని ‘రాష్ట్రాల సమాఖ్య’గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ప్రచురించి సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అధికారిక వేడుకలు నిర్వహిస్తుంటే... దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వేరే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం అసంబద్ధంగా ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి హైదరాబాద్ సంస్థానం దేశంలోని సంస్థానాల్లో చాలా పెద్దది. బ్రిటిష్ అండదండలతో అరాచకాలు సాగిస్తున్న నిజాం నవాబుపై తెలంగాణ ప్రజలు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావుతో పాటు ఎంతో మందిని ఉస్మానియా యూనివర్సిటీ నుండి బహిష్కరిస్తే ఇతర రాష్ట్రాల్లో చదువు కొనసాగించి విద్యావంతులుగా విలసిల్లారు. పరకాల, బైరాన్పల్లిల్లో వెలుగు చూసిన దారుణ కృత్యాలు హైదరాబాద్ సంస్థానంలో అడుగడుగునా జరిగాయి. తెలంగాణ విమోచన కోసం ఆనాడు ప్రతి గ్రామంలో పోరాటాలు జరిగాయి. అతి సామన్యులైన మహిళలు, పురుషులు దృఢ చిత్తంతో సైనికులై పోరాడిన ఘటనలు కోకొల్లలు. వారి త్యాగాలు అనన్య సామాన్యం, అనితర సాధ్యం. రాబోవు తరాలకు వారి చరిత్ర ప్రేరణ దాయకం. ఒళ్లుగగుర్పొడిచే సాహస ఘట్టాలెన్నో ఉద్యమ చరిత్రలో కనిపిస్తాయి. ఆ ప్రజా పోరాటమే పోలీసు చర్యకు మార్గం సుగమం చేసింది. అందుకే 1948 సెప్టెంబర్ 17 ‘హైదరాబాద్ విమోచన పొందిన రోజు’ తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం విమోచన దినంగా అధికారిక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విమోచన దినంపేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించి, అమర వీరులకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత ఉంది.సీహెచ్. విద్యాసాగర్ రావు వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
వాదనల కన్నా 'పని మిన్న'!
హలో టులేన్! ఇక్కడి అన్ని విభాగాల సిబ్బందికీ అభివాదాలు. మీలో చాలా మంది మాదిరిగానే మా ఆపిల్ సంస్థలోని కొందరికి కూడా న్యూ ఓర్లీన్స్తో సన్నిహిత అనుబంధం ఉంది. ‘టులేన్ విశ్వవిద్యాలయ జట్టు’కు అభినందనలు అని అందరూ ముక్త కంఠంతో చెబుతూంటే ఒళ్ళు పులకరిస్తుంది. ఇక్కడున్న వారితోపాటు మరో ముఖ్యమైన వర్గం ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆ వర్గంలోకి వస్తారు. మిగిలిన వారందరికన్నా కూడా వారు మిమ్మల్ని ఎక్కువ ప్రేమించి, అండదండలను అందించి ఉంటారు. మీరు ఈ స్థితికి చేరడంలో వారు చాలా త్యాగాలను కూడా చేసి ఉంటారు. వారిని కూడా మన హర్ష ధ్వానాలతో అభినందిద్దాం. ఇదే నేనిచ్చే మొదటి సలహా. వారు ఈ క్షణాల కోసం వేయి కళ్లతో ఎంతగా ఎదురుచూశారో గ్రహించి, ప్రశంసించేందుకు, మీకు జీవితంలో ఇంకా చాలా కాలం పట్టవచ్చు. వారు మీపట్ల బాధ్యతతో, ప్రేమతో వ్యవహరించిన తీరు, మీ మధ్య నున్న అనుబంధం మిగిలినవాటన్నింటి కన్నా ఎక్కువ ప్రాధాన్యం కలిగినవని మీకు తదనంతర కాలంలో తెలిసిరావచ్చు.పది మందితో మెసలండి!నిజానికి, నేను ఈ రోజు దాని గురించే మాట్లాడదలచు కున్నాను. స్వీయ జీవితాలను నమోదు చేసుకోవడంలో, అవీ ఇవీ పోస్ట్ చేయడంలో తలమునకలై ఉన్న ప్రపంచంలో, మనలో చాలా మందిమి ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన బాధ్యత పైన మాత్రం తగినంత శ్రద్ధను కనబరచడం లేదు. ఇది తల్లితండ్రులతో మరింత టచ్లో ఉండటం గురించి చెబు తున్నది మాత్రమే కాదు. మీరు వారితో నెరపే సంబంధాలు వారిని మరింత సంతోష పరుస్తాయి.అసలు, కలసికట్టుగా మనం మరింత ఎక్కువ సాధించగలమని గుర్తించడంతోనే మానవ నాగరకత ప్రారంభమైంది. మనం మరింత కలసికట్టుగా వ్యవహరిస్తే మనకెదురవుతున్న ముప్పులు, ఆపద లను నివారించుకోవచ్చు. మనం పంచుకుంటున్న కొన్ని సత్యాలను గుర్తించి సమష్టిగా పనిచేసినపుడు ఈ లోకంలో మరింత సంపద, సౌందర్యం, విజ్ఞత, మెరుగైన జీవితాలను సృష్టించగలుగుతాం. ఈ పని సాధ్యం కాకపోవచ్చుననే సందర్భాలు జీవితంలో చాలాసార్లు ఎదురవుతాయి. కానీ, ప్రయత్నించి చూడటం కన్నా మరింత అందమైన, అర్థవంతమైన పని మరొకటి లేదని ఈ విశ్వ విద్యాలయం చాటుతుంది. ముఖ్యంగా సొంతానికన్నా నలుగురి మేలు కోసం ఆ పని చేయడంలో గొప్పదనం ఉందంటుంది.నా మటుకు నన్ను... ఆ ఉన్నత పరమార్థ అన్వేషణే ఆపిల్ కంపెనీకి తీసుకొచ్చింది. క్యాంపాక్ అనే కంపెనీలో అప్పుడు కుదురైన ఉద్యోగం చేసుకుంటున్నాను. అప్పట్లో ఎప్పటికీ ఆ సంస్థే అగ్ర స్థానంలో ఉంటుందనిపించింది. అప్పటికింకా మీరు కుర్రాళ్ళు కనుక, బహుశా ఆ సంస్థ పేరు కూడా గుర్తుండకపోయి ఉండవచ్చు. కానీ, క్యాంపాక్ను విడిచిపెట్టి, దివాళా తీసే స్థితిలో ఉన్న కంపెనీలో చేరవలసిందిగా స్టీవ్ జాబ్స్ 1998లో నాకు నచ్చజెప్పాడు. అది కంప్యూటర్లు తయారు చేస్తోంది. అప్పటికి, వాటిని కొనాలనే ఆసక్తి ప్రజల్లో లేదనే చెప్పాలి. పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు స్టీవ్ దగ్గరో ఆలోచన ఉంది. నేనూ అందులో భాగం అయ్యాను. ఐమ్యాక్, ఐపాడ్ లేదా ఆ తర్వాత వచ్చిన అలాంటి వస్తువుల గురించి కాదు చెప్పుకోవాల్సింది. జీవితంలోకి ఆ ఆవిష్కరణలు తేవడం వెనుకనున్న విలువల గురించి ముచ్చటించుకోవాలి. సాధా రణ ప్రజానీకం చేతిలో శక్తిమంతమైన సాధనాలను ఉంచాలనే ఆలోచన సృజనాత్మకత వెల్లివిరియడానికీ, మానవాళిని ముందుకు నడిపించడానికీ తోడ్పడింది.చిక్కుముడులు విప్పండి!ఇష్టమైన పని చేస్తూంటే అలుపనేదే తెలియదు అని సాధారణంగా చెబుతూంటారు. కానీ, ఆ మాటల్లో సారం లేదని ‘ఆపిల్’లో గ్రహించాను. అంతలా పనిచేయడం సాధ్యమేనని మీరు ఎన్నడూ ఊహించనంతగా, శ్రమపడి పని చేయాల్సి ఉంటుంది. ఎటొచ్చీ ఇష్టంతో పనిచేస్తే, మీ చేతుల్లోని ఉపకరణాలు తేలికవుతాయి, అంతే!ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు కనుక ఓ సంగతి చెబుతా. పరిష్కారాన్ని కనుగొన్న సమస్యలపైన మీ సమయాన్ని వృథా చేయకండి. ఇది ఆచరణసాధ్యమని ఇతరులు చెప్పిన దానికే పరిమితం అయిపోకండి. అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలోకే మీ నౌకను నడిపించండి. ఇతరులకు మరీ పెద్దవిగా కనిపించే, వారు మనకెందుకులే అనుకొనే చిక్కుముడులను విప్పేందుకూ, జటిలమైన పరిస్థితుల్లో పనిచేసేందుకూ మొగ్గు చూపండి. మీ జీవిత పరమార్థాన్ని అటువంటి చోటే కనుగొనగలుగుతారు. మీ సేవలను అక్కడే ఎక్కువ అందించగలుగుతారు.‘అతి జాగ్రత్త’కు పోకండి!ఏ పని చేసినా ‘అతి జాగ్రత్త’తో చేయాలనుకోవడం కూడా పొరపాటే! ఉన్నదున్నట్లుగా చేస్తూ పోతే, మీ కాలి కింద భూమి కదలకుండా ఉంటుందనుకోకండి. యథాతథ స్థితి కలకాలం ఉండదు. ఏదైనా మెరుగైన దాన్ని నిర్మించడంపై పనిచేయండి. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి మా తరం మిమ్మల్ని తప్పుదోవ పట్టించింది. పనుల్లోకి దిగకుండా చర్చలతోనే మేం చాలా సమయాన్ని గడిపేశాం. ప్రగతిపై కాక పోరాటంపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాం. మా వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకు మీరు ఎక్కువ వెతకాల్సిన పని లేదు. గత 100 ఏళ్ళలో చూడని ప్రకృతి వైపరీత్యాలతో వేలాది మంది నిరాశ్రయులు అవడాన్ని మనం చూస్తున్నాం. వాతావరణ మార్పు గురించి మాట్లాడుకోకుండా, వ్యక్తులుగా మనం ఒకరి పట్ల ఒకరం ఎలా బాధ్యతతో మెలగవలసి ఉందో మాట్లాడుకోగల మని నేను అనుకోవడం లేదు. మీతో విభేదించేవారిని నేలమట్టం చేయడం ద్వారానే మీరు బలవంతులు అనిపించుకోగలుగుతారని లేదా అసలు వారికి మాట్లాడే అవకాశమే ఇవ్వవద్దని నమ్మబలికేవారు కొందరుంటారు. వారి మాయలో పడకండి. అవి కొత్త ఆలోచనలు పుట్టనివ్వవు. కొత్త దారులు వెతకనివ్వవు. మాటవరుసకు వినడం కాకుండా, చెవికెక్కించుకునే విధంగా ఆలకించడాన్ని అలవరచుకోండి. కేవలం పని చేయడం కాదు, కలసిమెలసి పనిచేసే తత్వాన్ని ప్రదర్శించండి. మన సమస్యలకు పరిష్కారాలు మానవ సంబంధాల నుంచే లభిస్తాయి. సంకల్ప శక్తితో దేన్నైనా ప్రయత్నించి చూడండి. మీరు సఫలమూ కావచ్చు. విఫలమూ కావచ్చు. కానీ, ప్రపంచాన్ని నిర్మించడమే మీ జీవిత లక్ష్యంగా పెట్టుకోండి. మానవాళికి మెరుగైన వాటిని విడిచిపెట్టడం కోసం పనిచేయడం కన్నా మరింత అందమైనది ఏదీ లేదు. -
అడకత్తెరలో ఇండియా
ఇండియా–యూఎస్ బాంధవ్యం ఎంత ఘోరంగా దెబ్బ తిన్నది! అటు చూస్తే వాషింగ్టన్ – బీజింగ్ సంబంధాలు మెరు గవుతున్నాయి. ఈ నూతన పరిణామం... అమెరికాతో ఇండియా బాంధవ్యాన్ని ఇంకెంతగా ప్రభావితం చేయబోతోంది? రష్యా చమురు కొనుగోలు ఆపేయకుంటే, ఇండియాపై అగ్రరాజ్యం రెండవ, మూడవ విడత అదనపు సుంకాలు విధిస్తుందా? ‘‘ఇండియా దౌత్యానికి నిజంగా ఇదో పరీక్షా సమయం. కొంతకాలం ముందు నుంచీ పరిస్థితులు ఏమంత బాగోలేవు. ఇప్పుడు అవి మరింత దుర్బలంగా మారాయి’’... మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ శరణ్ అభిప్రాయం ఇది. అధ్యక్షుడు ట్రంప్ ‘‘స్వతహాగానే కక్ష సాధింపు మనిషి. ఇండియా పట్ల ఇప్పు డాయన అదే వైఖరితో వ్యవహరిస్తున్నారు’’. కాబట్టి ఇండియా– యూఎస్ సంబంధాలు ‘‘తప్పనిసరిగా మరింత క్షీణిస్తాయి’’.‘క్వాడ్’ను సైతం వదులుకుంటారా?వాషింగ్టన్తో ఢిల్లీ బాంధవ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీసే పరిణా మాల విషయానికి వద్దాం. మొదటిది – చైనాతో తనకున్న ఎంతో మంచి బాంధవ్యాన్ని గురించి, షీ జిన్పింగ్తో తన స్నేహాన్ని గురించి ట్రంప్ అదేపనిగా మాట్లాడుతున్నారు. బీజింగ్తో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన ఎంతో ఇదిగా ఉన్నారు. తాను చైనాలో పర్యటిస్తానని సైతం చెబుతున్నారు. ఆయన ఈ మొత్తం వ్యవహారంలో ఎంత దూరం వెళ్తారన్నదే ఇక్కడ ప్రశ్న.చైనాతో పెద్ద ఒప్పందం ఒకటి కుదుర్చుకోవడానికి ‘క్వాడ్’ను సైతం త్యాగం చేయబోతున్నారా? ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం, క్వాడ్ సదస్సు కోసం ఇండియాను సందర్శించే ఉద్దేశం ట్రంప్కు లేదు. దీనర్థం ఏమిటి? ఆయన ప్రభుత్వ విదేశాంగ విధానంలో ఇండో–పసిఫిక్ వ్యూహం ఇంకెంతో కాలం కీలకం కాదు. ఈ పరిణామం ఇండియా–యూఎస్ సంబంధాలకు శరాఘాతం లాంటిది. చైనా పట్ల అమెరికా విధానంలో ఒకప్పుడు కేంద్రస్థానంలో ఉన్న మనల్ని... ఇది అంచుల దాకా నెట్టివేస్తుంది. మన ప్రాధాన్యం పూర్తిగా మసకబారుతుంది. శరణ్ దీన్ని చాలా సున్నితంగా ఇలా చెప్పారు: ‘‘యూఎస్, చైనాలతో ఇండియా సంబంధాలు... వాటి పరస్పర సంబంధాల కంటే మెరుగ్గా ఉన్నప్పుడు ఇండియాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది’’. అయితే ఇప్పుడీ పరిస్థితి లేదు. వాషింగ్టన్–బీజింగ్ నడుమ ప్రస్తుత సంబంధాలు, కచ్చితంగా వాషింగ్టన్ – ఢిల్లీ నడుమ కంటే బాగున్నాయని చెప్పాలి. ఇదంతా చూస్తుంటే – అమెరికా, చైనా నడుమ జి–2 తరహా ఏర్పాటుకు అవకాశం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. సమాధానం అవును అనుకుంటే, ఆసియా ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి ‘చట్ట బద్ధత’ కల్పించినట్లే! ఇండియాకు అది అంగీకారం కాదు.ఈ పరిస్థితుల్లో, ఇండియా, చైనా సంబంధాల్లో ఎంత పురోగతి సాధ్యమవుతుంది? మరోపక్క పాకిస్తాన్తో చైనా దృఢ సంబంధాలు సడలిపోయే అవకాశం లేదు. సరిహద్దు సమస్య అలా అపరిష్కృతంగానే మిగిలిపోతుంది. ఆసియాలో ప్రాబల్యం వహించాలని చైనా కోరుకుంటోంది. ఇండియా అందుకు ససేమిరా అంగీకరించదు. వాణిజ్యం విషయానికి వస్తే– అరుదైన ఖనిజాలు, ఎరువులు,సొరంగ తవ్వక యంత్రాల్లో చైనా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.అందుకే, తియాన్జిన్లో ఎన్ని చిరునవ్వులు చిందించినా, ఎంత గట్టి కరచాలనాలు చేసినా... ఇండియా–చైనా సంబంధాల్లో గణ నీయ పురోగతికి అవకాశాలు అతి తక్కువ.రష్యా కోసం మూల్యం చెల్లిస్తున్నామా?రష్యా చమురు విషయానికి వద్దాం. రష్యా మీద ఆర్థికంగా ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకే ఇండియా మీద 25 శాతం అదనపు సుంకం విధించామని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ చెప్పారు. ఆ ఎత్తుగడ పారలేదు. దీంతో ట్రంప్ నిస్పృహ చెందారు. ఇప్పుడు ఆయన ఇండియా మీద అదనపు సుంకాలు విధిస్తారా?రష్యా చమురు గురించి జవాబు చెప్పుకోవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. రష్యా చమురుతో ఇండియా ఆదా చేస్తున్నది బారె ల్కు సుమారు 2 డాలర్లు మాత్రమే! ఈ చమురు కొనుగోళ్ల కారణంగా మనం అమెరికాకు ఏటా 48 బిలియన్ డాలర్ల ఎగుమతు లను కోల్పోతాం. రష్యా నుంచి చేసుకునే చమురు దిగుమతులతో మనకు సమకూరే ప్రయోజనం, మనం అమెరికాకు చేసే ఎగుమతులతో పోల్చితే చాలా తక్కువ. ఆర్థికంగా చూసినట్లయితే – రష్యా చమురు కొనుగోళ్లు నిలిపి వేయడం ఉత్తమం. అయితే వ్యూహాత్మక, రాజకీయ కోణాలు అందుకు అనుమతిస్తాయా? ఇప్పటి విధానం ప్రకారం చూస్తే, రష్యా చమురును ఇండియా కొంటూనే ఉంటుంది. దీనివల్ల రష్యాకు డబ్బు లభిస్తుంది. ఆంక్షల క్లిష్ట సమయంలో ఆర్థిక ప్రయోజనం పొందుతుంది. మరి ఇండియా? అమెరికాకు ఎగుమతులు చెయ్యలేకపోవడమే కాకుండా వాషింగ్టన్తో సంబంధాలు పూర్తిగా చెడతాయి. అలా రెండు రకాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ తెర వెనుక నడచిన ఒక అంశాన్ని ఇప్పుడు తెర పైకి తీసుకువచ్చి దీనికి ఒక ముగింపు ఇస్తాను. అమెరికాతో మన సంబంధాలు గడిచిన మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత అథమ స్థాయికి దిగజారి పోయాయి. మనకు పాకిస్తాన్తో ఎన్నడూ బాంధవ్యం లేదు. చైనాతో సంబంధాలు మెరుగుపడుతున్నా, ఆ దేశంతో మనకు ఉన్న సమస్యలు చిన్నవేమీ కావు. రష్యాతో మన సంబంధాలు బలోపేతం అయ్యాయి. అయితే అందుకు మనం ఇప్ప టికే భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం. మరోవంక చైనా, పాకిస్తాన్, రష్యాలతో అమెరికా సంబంధాలు బైడెన్ హయాంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయి. ఇది నిజంగా ఒక వైచిత్రి. తొమ్మిది నెలల్లోనే వీటి మధ్య సాన్నిహిత్యం మెరుగుపడింది. అదే సమయంలో అమెరికాతో మన సంబంధాలు కుప్ప కూలాయి. కాబట్టి ఇండియా దౌత్యానికి ఇది ‘బ్యాడ్ టైమ్’ అనుకోవాలా? దీనికి సమాధానం అవును అని తప్ప మరో విధంగా చెప్పలేను.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సరైన సమయంలో సముచిత నిర్ణయం
వస్తు సేవల పన్ను మండలి (జీఎస్టీ కౌన్సిల్) 56వ సమావేశం ఇటీవల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో ఆమోద ముద్ర వేసిన సంస్కరణలు దేశ పరోక్ష పన్ను వ్యవస్థ పరిణామ క్రమంలో ఓ కీలక ఘట్టం. ఈ సంస్కరణల అమలు ప్రధానంగా మూడు పరస్పర అనుసంధానిత మూల స్తంభాలు – ‘సమూల సంస్కరణ, పన్ను హేతుబద్ధీకరణ, చెల్లింపుదారుల జీవన సౌలభ్యం’పై ఆధారపడి ఉంటుంది.సమూల సంస్కరణల్లో భాగంగా – పన్ను విధింపులో అనిశ్చితి తగ్గింపు ధ్యేయంగా పన్ను శాతాల సంఖ్య కుదింపుపై సునిశిత శ్రద్ధ చూపారు. సామాన్యుల దైనందిన అవసరాలకు ఉపయోగపడే కొన్ని వస్తువులపై స్వల్ప ‘మెరిట్’ శాతంలోనూ– ‘హానికర’ (సిన్ ), విలాస స్వభావం గల వస్తువులపై అధిక ‘ప్రత్యేక’ శాతంలోనూ పన్ను విధించాలని నిర్ణయించారు. వస్తు, సేవల వర్గీకరణ, పన్నుశాతాలపై అభ్యంతరాలు, వివాదాలకు సంబంధించి అధికశాతం ఆహార, ఆటోమొబైల్ విడిభాగాల రంగాల్లోనే తలెత్తినట్లు ఒక అధ్యయనం వెల్లడించింది. మార్కెట్లో ఆహారోత్పత్తుల మధ్య సారూప్యం ఎక్కువగా ఉన్న ఫలితంగా వాటి వర్గీకరణ సమస్యా త్మకమైంది. అలాగే పన్ను శ్లాబుల నిర్ణయం కూడా! ప్రస్తుత సంస్కరణల్లో ఆహార రంగాన్ని ఒకే పన్ను శాతం కిందకు తేవడం ద్వారా గందరగోళం తొలగించారు. అలాగే ఆటోమోటివ్ రంగంలో కూడా... ముఖ్యంగా వాహన విడి భాగాలపై ఏకరూప పన్ను విధింపుపై తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపశమనం ఇవ్వడంతోపాటు పరిశ్రమలో విశ్వాసం ఇనుమడించి, వివాదాలకు ముగింపు పలుకుతుంది.జీఎస్టీ వ్యవస్థలో విలోమ సుంకం పద్ధతి (ఇన్ వర్టెడ్ టాక్స్ సిస్టమ్–ఐడీఎస్) నిరంతర సమస్యాత్మకంగా మారింది. దీనికింద వస్తు తయారీ ముడిసామగ్రిపై విధించే పన్ను, తయారైన వస్తువుపై విధించే పన్ను కన్నా ఎక్కువగా ఉంటుంది. పర్యవసానంగా ‘ముడి సామగ్రిపై పన్ను వాపసు’ (ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్–ఐటీసీ) మొత్తం పేరుకుపోతూ ఉంటుంది. పారిశ్రామిక రంగంలోని అనేక విభాగాలలో ముడి సామగ్రి వినియోగ స్వభావం కలిగి ఉంటుంది. వాటిపై సరైన రీతిలో విలోమ శాతం పన్ను విధించడంలో కొంత సంక్లిష్టత ఉంటుంది. అయితే, ఇప్పుడు వీలైన ప్రతి సందర్భానికీ తగినట్లు... ముఖ్యంగా ఎరువుల పరిశ్రమలో ముడి పదార్థం ప్రధానంగా ఒకే తరహా ఉత్పత్తికి ఉపయోగపడుతుంది కాబట్టి, విలోమ పన్ను విధింపు పద్ధతిని సరిదిద్దారు.‘ఎంఎస్ఎంఈ’లు ఎక్కువగా ఉన్న రంగాల్లో ‘ఐడీఎస్’ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు దేశంలో 4.5 కోట్ల మందికిపైగా ఉపాధి పొందే వస్త్ర పరిశ్రమకు సంబంధించి చేతితో వడికిన–నేసిన ఉత్పత్తుల నుంచి భారీ మిల్లుల ఉత్పత్తుల మధ్య వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వాటి స్వభావం ప్రకారం దుస్తులపై సుంకం 5 శాతం వంతున... సుంకం ‘మెరిట్’ రేటుకు లోబడి ఉంటుంది. ఇక్కడ వస్త్ర రంగంలోని సహజ నూలు విభాగంలో విలోమం లేకపోయినా, మానవ శ్రమతో తయారైన వస్త్ర విభాగంలో ఉంటుంది. అయితే, రాబడి పరంగా చిక్కుల వల్ల వీటి మొత్తం విలువ శ్రేణిలో విలోమాన్ని సరిదిద్దడం దాదాపు అసాధ్యం. అయినప్పటికీ, ఈ వ్యత్యాసం ‘ఎంఎస్ఎంఈ’లపై అనవసర భారం పడని రీతిలో ఉండేవిధంగా జాగ్రత్త వహించారు.తాజా సంస్కరణల ప్రక్రియను సామాన్యులు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే కసరత్తుగా తొలుత భావించారు. దీని ప్రకారం– జనసామాన్యం వాడే వస్తువులతో విలాసవంతమై నవిగా పరిగణించే కొన్ని వస్తువు లపై పన్నును ‘మెరిట్’ శాతానికి తగ్గించారు. తద్వారా విస్తృత జనాభా కొనుగోలు శక్తి పెరుగు తుంది కాబట్టి, డిమాండ్ కూడా పెరుగుతుంది. మొత్తం మీద ఈ సూత్రాలన్నీ కలిసి పన్ను శాతాల క్రమబద్ధీకరణ కసరత్తు హేతుబద్ధ తకు రూపమిచ్చాయి. రాష్ట్రాలకు 2022 జూలై తర్వాత పరిహార సుంకం వసూ ళ్లలో వాటా చేరడం లేదు. కోవిడ్ మహమ్మారి సమయంలో వసూళ్ల లోటు తగ్గించే దిశగా అవి తీసు కున్న రుణానికి దీన్ని జమ చేసుకోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఆ చెల్లింపులన్నీ దాదాపు పూర్తయ్యాయి కాబట్టి, కేంద్రంతోపాటు రాష్ట్రాలకూ ‘జీఎస్టీ’ వసూళ్లు పెరిగేందుకు తగిన ఆర్థిక వెసులు బాటు లభిస్తుంది. జీఎస్టీ వ్యవస్థతో పన్ను చెల్లింపుదారుల లావాదేవీలను ప్రతి దశలోనూ సరళీకరించే మార్గదర్శక సూత్రం ఈ సంస్కరణలకు మూడో మూలస్తంభం. తదనుగుణంగా వ్యాపారాల రిజిస్ట్రేషన్, పన్ను వాపసుల అంశాన్ని ఇవి లక్ష్యం చేసుకుంటాయి. దీంతో పన్ను చెల్లింపుదారులకు విధానపరమైన ఇబ్బందుల తగ్గడంతోపాటు నిర్వ హణ మూలధన సమీకరణలో అడ్డంకులు తొలగుతాయి.ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇప్పటికే ఎదిగింది. ఇక ప్రస్తుత సంస్కరణల ద్వారా దేశీయ డిమాండ్ దృఢం కావడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందుతుంది. ‘స్వయం సమృద్ధ భారత్’ స్వప్న సాకారం దిశగా విస్తృత జాతీయ దృక్కోణం బలపడేందుకు ఈ సంస్కరణలు ప్రధానంగా తోడ్పడతాయి.సంజయ్కుమార్ అగ్రవాల్వ్యాసకర్త కేంద్రీయ ప్రత్యక్ష పన్నులు–సుంకాల బోర్డు చైర్మన్ -
మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్) రాయని డైరీ
తెలిసిన పదాలకే అర్థాలు వెతుక్కుంటున్నాను నేను! రాహుల్ గురించి నాకేం తెలియదని?!ఆయన నాతో ఒక్క నవ్వును మించి ఎక్కువ మాట్లాడరు. ఆ నవ్వుకు ‘‘నమస్తే ఖర్గేజీ’’ అని అర్థం; ఎక్కడికి వెళుతున్నదీ చెప్పరు.‘‘నా కోసం చూడకండి’’ అని అర్థం; ఎందుకు వెళుతున్నదీ చెప్పరు. ‘‘ఎక్కువగా ఆలోచించ కండి’’ అని అర్థం; ఎప్పుడు వచ్చేదీ చెప్పరు. ‘‘రావాలని నాకూ ఉంటుంది’’ అని అర్థం;ఏం చేయబోయేది చెప్పరు. ‘‘నాకైనా ఎలా తెలుస్తుంది?’’ అని అర్థం; ఎవరి గురించి,ఏం మాట్లాడబోయేదీ చెప్పరు. ‘‘మాటలు మనకు చెప్పి వస్తాయా ఖర్గేజీ?!’’ అని అర్థం.రాహుల్ మళ్లీ ఇవాళ కొన్ని గంటలుగా కనిపించటం లేదు! ఆయన కనిపించక పోవటానికి – కనిపించకపోవటానికి మధ్య ఆయన కనిపించే నిడివి ఈ మధ్య కాస్త ఎక్కువగా తగ్గుతున్నట్లు నాకు అనిపిస్తోంది!‘‘మీకేమైనా సమాచారం ఉందా వేణుగోపాల్?’’ అని అడిగాను. పార్టీ ఆఫీస్లో నేను, వేణుగోపాల్ మాత్రమే ఉన్నాం. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ఆయన. ‘మీకు తెలియకుండా నాకు తెలుస్తుందా ఖర్గేజీ!’ అన్నట్లుగా... నిస్సహాయంగా నా వైపు చూశారు వేణుగోపాల్. ఆయన్నిక ఎక్కువ సంఘర్షణకు గురి చేయదలచుకోలేదు నేను. ‘‘సరే! తాళం వేసుకుని మీరు వెళ్లండి’’ అని పైకి లేచాను. నాతో పాటే వేణుగోపాల్ కూడా పైకి లేచి, ‘‘ఖర్గేజీ! మీతో ఒక మాట’’ అన్నారు!!‘చెప్పండి వేణు...’’ అన్నాను.‘‘ఖర్గేజీ! మీరీ మధ్య ఒకే మాటను రెండు అర్థాలు వచ్చేలా మాట్లాడుతున్నారు. లేదా, మీరు మాట్లాడుతున్న ఒకే మాట రెండు అర్థాలు వచ్చేలా ఉంటోంది...’’ అన్నారు వేణుగోపాల్.‘‘ఏమిటా ‘ఒక మాట – రెండర్థాలు’ వేణుగోపాల్?!’’ అన్నాను. ‘‘ఖర్గేజీ! జునాగఢ్లో మీరు – ‘‘మొత్తం పెట్టె కుళ్లిపోక ముందే, చెడిపోయిన మామిడిపండ్లను తొలగించాలి...’’ అని అన్నారు.వెంటనే టీవీ ఛానెళ్ల వాళ్లు, ‘కాంగ్రెస్లో ఎవరా చెడిపోయిన మామిడి పండ్లు?!’ అని డిబేట్ మొదలు పెట్టేశారు. ఇప్పుడేమో, ‘తాళం వేసుకుని మీరు వెళ్లండి’ అని నాతో అన్నారు. అదృష్టవశాత్తూ ఇది టీవీ వాళ్లకు తెలిసే అవకాశం లేదు కనుక – ‘తాళం వేయమంటే ఏమిటర్థం? పార్టీ ఆఫీస్కు తాళం వేసేద్దాం అనేనా ఖర్గే అంటున్నది...’ అని డిబేట్ పెట్టే ప్రమాదం తప్పిపోయింది...’’ అన్నారు వేణు!‘‘నిజమే కానీ వేణుగోపాల్, ఒక మాటను పది మంది పది రకాలుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పి, ఆ పది మందికీ ఒకే రకంగా అర్థం అయ్యేలా మాట్లాడాలంటే... ఒక్క మౌనంతో మాత్రమే కదా అది సాధ్యం అవుతుంది?’’ అన్నాను. అలా అంటున్నప్పుడు నాకు రాహుల్ గుర్తొచ్చారు. బహుశా అందుకేనా రాహుల్ నాతో గానీ, పార్టీలో మరొకరితో కానీ తక్కువ మాట్లాడి, ఎక్కువ మౌనంగా ఉంటారు?! ‘‘సీఆర్పీఎఫ్ వాళ్లు లెటర్ పంపించారు వేణుగోపాల్. సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేయకుండా రాహుల్ బయట తిరుగు తున్నారని కంప్లైంట్. ఈ తొమ్మిది నెలల్లోనే ఇటలీ, వియత్నాం, ఖతార్, లండన్, దుబాయ్ మలేసియా ట్రిప్పులు వేశారట! ‘హై రిస్క్ కేటగిరీలో ఉన్న వీఐపీలు ప్రోటోకాల్ని వయలేట్ చేస్తే ఎలా?’ అంటున్నారు’’ అన్నాను.వేణుగోపాల్ మౌనంగా ఉన్నారు! బహుశా అది, వివేచనతో కూడిన మౌనం కావచ్చు. ‘‘మీరు వెళ్లండి వేణుగోపాల్! నేను కాసేపు ఉండి వస్తాను‘ అన్నాను, తిరిగి కూర్చుంటూ. ఆయన వెళ్లిపోయారు. నా చేతిలో సీఆర్పీఎఫ్ వాళ్లు పంపిన లెటర్ ఉంది. ‘‘మీ అబ్బాయి మాట వినటం లేదు’’ అని స్కూల్ హెడ్ మాస్టర్, పేరెంట్స్కి లెటర్ రాయగలరు. ‘‘మా అబ్బాయి మాట వినటం లేదు...’’ అని పేరెంట్స్ ఎవరికి లెటర్ రాయగలరు?! రాహుల్ సీఆర్పీఎఫ్కే కాదు, సీడబ్ల్యూసీకీ చెప్పి వెళ్లటం లేదని నేనెవరితో చెప్పుకోగలను?! ఎవరికి లెటర్ రాయగలను? -
కచ్చతీవుపై ఆగని రచ్చ
భారతీయుల దృష్టంతా ఉత్తరాన చైనా లోని తియాన్జిన్పై ఉన్న సమయంలో, దక్షిణపు పొరుగు దేశం సడీచప్పుడు లేకుండా ఓ సందేశాన్ని పంపింది. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె ఇటీవల జాఫ్నా సందర్శించారు. ఒకే ఏడాదిలో దిస్సనాయకె ఆ రాష్ట్రాన్ని నాల్గవసారి సందర్శించడమే ఒక రికార్డు అనుకుంటే, ఆయన అక్కడ నుంచి నౌకా దళానికి చెందిన ఒక స్పీడు బోటులోబంజరు దీవి కచ్చతీవుకు వెళ్ళి మరో రికార్డు సృష్టించారు. శ్రీలంక అధ్యక్షుడు ఒకరు ఆ దీవిని సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన ద్వారా ఆయన శ్రీలంక భూభాగపు హద్దును స్పష్టంగా పేర్కొన్నట్లు అయింది. శ్రీలంకదే అని ఒప్పుకొన్నప్పటికీ...కచ్చతీవు శ్రీలంకలో భాగమే! పాక్ జలసంధిలోని ఈ చిన్న భూభాగంపై పొరుగు దేశపు క్లయిమును భారత్ అంగీకరించింది. ఆ మేరకు రెండు దేశాల మధ్య 1974లో ఒక అంగీకారం కుదిరింది. ఈ అంగీకారం 1976లో మరో అంగీకారానికి దారితీసింది. అది రెండు దేశాల మధ్య సాగర జలాల సరిహద్దును నిర్దేశించింది. అయినప్పటికీ, రామేశ్వరం–జాఫ్నాల మధ్యనున్న ఈ దీవి, భారత–శ్రీలంక సంబంధాలలో అడపాదడపా చిచ్చు రేపుతూనేఉంది. బ్రిటిష్ హయాంలోనూ, స్వాతంత్య్రానంతర కాలంలోనూ భారత్ మ్యాప్లలో దాన్ని ఒక భాగంగా ఎన్నడూ చూపలేదు. రామే శ్వరంలోని జాలర్ల కోపతాపాలను చల్లార్చేందుకు, తమిళనాడు రాజ కీయ నాయకులు మాత్రం ఆ నిర్జన దీవిని తిరిగి ‘వెనక్కి తీసు కోవడం’ గురించి తరచూ గొంతెత్తుతూ ఉంటారు. తమిళనాడు జాలర్లు చేపల వేటకు అనుసరిస్తున్న ‘బాటమ్ ట్రాలింగ్’, ‘పర్స్ సైన్’, ‘డబుల్ నెట్’ వంటి పద్ధతుల వల్ల చేపలు ఇక ఏమాత్రం లభ్యంకాని స్థితి ఏర్పడింది. శ్రీలంక వైపు వనరులు ఎక్కువ ఉండటానికి కారణం, 30 ఏళ్ళ అంతర్యుద్ధ సమయంలో, జాఫ్నా జాలర్లు దూర ప్రాంతాల్లో చేపల వేటకు సాహసించకపోవ డమే! దాంతో శ్రీలంక వైపు చేపల వేట భారతీయ జాలర్లకు ఆకర్షణీ యమైనదిగా మారింది. ఫలితంగా, వారిని శ్రీలంక నౌకా దళం అరెస్టు చేయడం, వారి బోట్లను, వలలను స్వాధీనపరచుకోవడం పరిపాటిగా మారింది. విజయ్ వ్యాఖ్యలతో మరోసారి...గంగపుత్రులకు ప్రత్యామ్నాయ జీవనోపాధులను సృష్టించవల సిందిపోయి వారి సమస్యలన్నింటికీ పరిష్కారం కచ్చతీవును స్వాధీనపరచుకోవడమే అన్న భ్రమను తమిళ నాయకులు పెంచి పోషిస్తూ వచ్చారు. ‘తమిళిగ వెట్రి కళగం’ పార్టీని ప్రారంభించిన సినీ నటుడు విజయ్ కూడా నిన్నగాక మొన్న అదే పల్లవిని అందు కున్నారు. ఇంతవరకు ఆయన నిర్వహించిన ర్యాలీలన్నింటిలోకెల్లా ఇటీవలి మదురై ర్యాలీని అతి పెద్దదిగా చెప్పాలి. రాష్ట్ర జాలర్లకు ‘చిన్న పని చేసి పెట్టండి చాలు’, ‘ఈ దీవి మనదేనని క్లయిముచేస్తే మన జాలర్లు సురక్షితంగా ఉంటారు’ అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి, అదే భ్రమను కొనసాగించడంలో తాను కూడా ఒక చేయి వేశారు.కచ్చతీవును ‘తిరిగి’ తెచ్చుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు నాలుగు తీర్మానాలు చేసింది. శ్రీలంకతో కుదిరినఅంగీకారాన్ని ‘రాజ్యాంగ విరుద్ధమైనది’గా పేర్కొంటూ రద్దు చేయవలసిందని కోరుతున్న కేసులు కొన్ని సుప్రీం కోర్టు ముందు న్నాయి. కచ్చతీవును కాంగ్రెస్ ‘నిర్లక్ష్యపూరితం’గా శ్రీలంకకు అప్ప గించిందని 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించడం ద్వారా ప్రధాన మంత్రి మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అగ్నికి ఆజ్యం పోశారు. కచ్చతీవును వెనక్కి తీసుకోవడం తమిళ జాలర్ల సమస్యలను పరిష్కరిస్తుందనే మాటే నిజమైతే, తమిళ చేపల బోట్లు కచ్చాతీవును దాటి, శ్రీలంక తూర్పు కోస్తా వరకు ఎందుకు వెళ్తున్నట్లు? విజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్, ‘‘రాజకీయ వేదికల నుంచి చేసే ప్రసంగాలను’’ చెవికెక్కించుకోవ ద్దంటూ శ్రీలంక పౌరులను కోరారు. దిస్సనాయకెకు కలిసొచ్చింది!కచ్చతీవును సందర్శించడం స్వదేశంలో దిస్సనాయకెకు చెందిన నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పార్టీకి సహాయపడటం ఖాయం. తమిళులు ఎక్కువగా ఉన్న జాఫ్నాలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాన్ని ఆయన పార్టీ కొనసాగిస్తోంది. అంతర్యుద్ధ సమయంలో, తమిళ ఉగ్ర సంస్థలకు ఉదారంగా సహాయపడిన, ఆవలి వైపునున్న తమిళ సోదరులు, ఇపుడు తమకే ఎసరు పెడుతున్నారనే భావన జాఫ్నా తమిళులలో పాదుకొంది. కచ్చతీవు దీవిలో కాలు మోపడం ద్వారా, తాను శ్రీలంక తమిళ జాలర్ల పక్షాన ఉన్నానని దిస్సనాయకె చాటుకున్నట్లు అయింది. దిస్సనాయకె ప్రతిష్ఠ కొద్ది నెలలుగా మసకబారుతూ వస్తోంది. ఆర్థిక వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తామని,కఠినంగా ఉన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ షరతులలో మార్పులు కోరతామని వాగ్దానం చేయడం ద్వారా ఎన్పీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ, అది ఇంతవరకు ఉన్నపరిస్థితులు మరింత దిగజారకుండా మాత్రమే నిర్వహించగలుగుతోంది. ఈ నేపథ్యంలో, కచ్చతీవు భూభాగం తమదేనని దిస్సనాయకె చాటుకోవడం, ఆయన ప్రభుత్వానికి ప్రధాన అండగా ఉన్నసింహళ జాతీయులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. భారత్ పట్ల మరీ మెతకగా వ్యవహరిస్తున్నారని నిందిస్తున్న స్వదేశంలోని విమర్శకులకు కూడా దిస్సనాయకె సందేశం పంపినట్లయింది. భారతదేశంతో రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఆయన విమర్శల పాలయ్యారు. మొత్తానికి, శ్రీలంక ప్రయోజ నాలకు కట్టుబడిన వ్యక్తిగా దిస్సనాయకె తనను తాను చాటుకో గలిగారు.సముద్రంపై జీవనం సాగించేవారికి సెయింట్ ఆంటొని ఆరాధనీయుడు. ఆయన స్మారక ప్రార్థనా మందిరం కచ్చతీవులో శతాబ్దంపైగా నిలిచి ఉంది. అంతర్యుద్ధం అంతమైన తర్వాత, ప్రార్థనా మందిరం కొత్త రూపురేఖలను సంతరించుకుంది. ఇంతా చేసి, 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పు కలిగిన కచ్చతీవు పర్యాటక ప్రదేశంగా పరిణమించవచ్చు. కానీ, తమిళనాడు నుంచి సన్నాయి నొక్కులు మాత్రం ఆగకపోవచ్చు. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ - నిరుపమా సుబ్రమణియన్ -
అతి క్లిష్ట స్థితిలో నేపాల్
నేపాల్ను ఈ నెల 8, 9వ తేదీలలో తీవ్రంగా కుదిపివేసిన నిరసనలు, హింసాకాండ శాంతించి ఉండవచ్చు. నిరసనలకు నాయకత్వం వహించిన ‘జెన్–జడ్’ ఉద్యమకారులకూ, సైన్యానికీ మధ్య చర్చలు ఫలించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడవచ్చు. కానీ, ఒక దేశంగా నేపాల్ ప్రస్తుతం ఒక అతి క్లిష్టమైన స్థితికి చేరింది. వందల సంవత్సరాల రాచరిక పాల నను కూలదోసి ప్రజాస్వామికంగా మారిన ఒక దేశం, సుస్థిరంగా అదే వ్యవస్థలో కొనసాగాలంటే ముఖ్యంగా కావలసిందేమిటి? లోపాలు ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసం పొంది, స్థిరపడి కొనసాగటం! అది జరగ నప్పుడు అనివార్యంగా వ్యక్తి నియంతృత్వాలు, వర్గ నియంతృత్వాలు, సైనిక నియంతృత్వాలు ఏర్పడతాయి. రాచరికం 2008లో పోయిన తర్వాత ఈ 17 ఏళ్లలో అక్కడి మూడు పార్టీలు కూడా స్వయంగానో, పరస్పరం చేతులు కలిపో పరిపాలించాయి. ప్రజల విశ్వాసాన్ని పొందటంలో మాత్రం అన్నీ విఫలమయ్యాయి. నిరసనకారులు మూడు పార్టీల నాయకుల ఇళ్ల పైనా దాడులు జరిపారు. దీనంతటి మధ్య ఆశాకిరణం–ఉద్యమ కారులు మౌలికంగా ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని కోల్పోకపోవటం, స్వయంగా సైన్యం ప్రజాస్వామ్యాన్ని కూలదోయక పోవటం!బద్దలైన నిరసనలునిరసనలు అనూహ్యంగా, అకస్మాత్తుగా సోషల్ మీడియాపై నిషేధం అనే చర్య నుంచి మొదలయ్యాయి. సాధారణంగా నిరస నలు, ముఖ్యంగా యువతరం నుంచి, నిరుద్యోగం, అవినీతి, బంధు ప్రీతి వంటి అంశా లపై జరగటం మనకు తెలుసు. కానీ నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధంతో మొదలై, ఆ తర్వాత తక్కిన అంశాలు వచ్చి చేరాయి. ఆ విధంగా, అక్కడి సమాజంలో సోషల్ మీడియాకు, ఇతర అంశాలకు అటువంటి అవినాభావ సంబంధం ఉంది. అది భారతదేశంలో కనిపించే స్థితికి భిన్నమైనది. ఇపుడు వెలుగులోకి వస్తున్న దానిని బట్టి, అక్కడి యువతరానికి నిరసనలకు సోషల్ మీడియా నిరంతర వేదికగా మారింది. దానితోపాటు, ఇతర దేశా లకు వలసపోయిన దాదాపు 25 లక్షలమంది నేపాలీలు అక్కడి నుంచి తమ వారికి చేస్తున్న ఆన్లైన్ నగదు బదిలీలకు కూడా! ఆ విధంగా ఆ నిషేధం పట్ల నిరసనలు, ఇతరత్రా పేరుకుపోతూ వస్తున్న నిరసనలు కలిసి అగ్ని పర్వతం వలె పేలేందుకు దోహద మయ్యాయి.ఇది ఒకటి కాగా, గత 17 ఏళ్లుగా పాలించిన అన్ని ప్రధాన పార్టీలలో ఏవీ ప్రజల విశ్వాసాన్ని పొందలేక పోయాయి. ఈ దోషం, వైఫల్యం ముఖ్యంగా వామపక్షాలవి కావటం గమనించ దగ్గది. అట్లా భావించటం ఎందువల్ల? రాచరికం నుంచి పరిమిత ప్రజాస్వామ్యం వైపు సంస్కరణల మార్గంలో ఇతర పార్టీలు ప్రయ త్నించగా, మావోయిస్టు పార్టీ పదేళ్ల పాటు రాజీలేని సాయుధ పోరాటం నడిపి రాచరిక వ్యవస్థనే అంతం చేసింది. అటువంటపుడు ఆ పార్టీగానీ, అంతకు ముందునుంచీ ప్రధాన స్రవంతిలో గల ఇతర కమ్యూనిస్టులు, సోషలిస్టులు గానీ ఏమి చేయాల్సింది? ప్రపంచంలోనే అతి పేద దేశాలలో ఒకటైన నేపాల్ అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రకారం, అంకితభావంతో కృషి చేయాలి. నైతిక విలువలను పాటిస్తూ ఆదర్శంగా నిలవాలి. తమ ఐక్యతను కొనసాగించి సుస్థిర పాలన సాగించటం మూడవ అవసరం. ఈ మూడూ జరిగి ఉంటే అసంతృప్తికి ఆస్కారమే ఉండేది కాదు.విశ్వాసం కోల్పోయిన పార్టీలునేపాల్లో అనేక పార్టీలు ఉన్నా, ప్రధానమైనవి మూడు: మధ్యే మార్గపు నేపాలీ కాంగ్రెస్, గతం నుంచి ఉన్న సాంప్రదాయిక కమ్యూ నిస్టు పార్టీ, రాచరికంపై పోరాడిన మావోయిస్టు పార్టీ. తక్కిన పార్టీ లలోనూ ఎక్కువ వామపక్ష మార్గం లోనివే. 2008లో రాచరికం పోయిన తర్వాత జరిగిన ఎన్నికలలో గెలిచి, మావోయిస్టు నాయ కుడు పుష్పకమల్ దహాల్ లేదా ప్రచండ ప్రధాని అయ్యారు. పరిపాలనలో విఫలమయ్యారు. ఏడాదికే పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. తన పార్టీ కూడా చీలిపోయింది. పరిపాలన ద్వారా సామా జిక మార్పులు, సమానత్వాలు కూడా తీసుకు రావాలని పట్టుబట్టిన ప్రచండ ప్రధాన సహచరుడు, జేఎన్యూ (ఢిల్లీ) పూర్వ విద్యార్థి బాబూరాం భట్టరాయ్ వేరే పార్టీ ప్రారంభించాడు. అప్పటి నుంచి నేపాల్లో ఇక రాజకీయ సుస్థిరత లేకపోయింది. 17 ఏళ్ళలో మొత్తం 14 మంది ప్రధానులు వచ్చారు. కొందరు మళ్లీ మళ్లీ అయ్యారు. వారిలో ఎక్కువసార్లు వామపక్షాల వారే. ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి సుశీల కర్కీ పేరు వినవస్తున్నది. గతంలోనూ ఒకసారి ఇదే విధంగా జస్టిస్ ఖిల్రాజ్ రెగ్మీ (2013–14) నియమితులయ్యారు. ఇటువంటి నియామకాలు రాజకీయ అస్థిరతకు మరొక గుర్తు అవు తున్నాయి. అస్థిరతవల్ల పెట్టుబడులు రావటం లేదు.ఆశ్చర్యకరంగా అవినీతి, బంధుప్రీతి, విలాసవంతమైన జీవితం లాంటి ఆరోపణలను మావోయిస్టు ప్రచండ తన మొదటి పాలనా కాలంలోనే ఎదుర్కొన్నారు. అప్పటి నుంచి అన్ని ప్రభు త్వాలూ ఈ విమర్శలకు గురవుతూనే ఉన్నాయి. అయినా సరైన విచారణలు, శిక్షలు లేకుండా పోయాయి. నిరుద్యోగం, పేదరికం విషయానికి వస్తే ఒక విచిత్ర స్థితి కనిపిస్తుంది. మూడు కోట్ల జనాభాలో సుమారు పావు కోటి మంది వలసలు పోయి పనులు చేసుకుంటున్నందున ఆ వర్గాల్లో స్థానికుల నిరుద్యోగం సుమారు 10 శాతం. కానీ యువతరంలో 20 శాతంగా ఉంది. అందుకు కారణం నైపుణ్యాలు నేర్పే చదువులు గానీ, స్థానిక పరిశ్రమలు గానీ లేక పోవటం. యువత తిరుగుబాటుకు ఇదీ ఒక ముఖ్య కారణం. పోతే, ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం పేదరికం 2022లో 7.5 శాతం కాగా, 2025లో 5.6కు తగ్గుతుందని అంచనా. అయితే, విపరీతమైన వలసలు, వారు పంపే డబ్బు ఈ విధంగా తక్కువ పేదరికానికి కారణమైంది. నిజంగా పేదరికం 25 శాతమని అంచనా.అక్కడ భూకంపాలు ప్రాకృతికమైన సహజ విపత్తు కాగా,ఇంకా 20 ఏళ్లయినా నిండని ఆ ప్రజాస్వామ్యానికి రాజకీయ అస్థిర తలు నాయకులు సృష్టించే విపత్తులుగా మారాయి. అన్ని పార్టీలూ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయినందున రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ స్థానాన్ని ఆక్రమించగల కొత్త పార్టీలు కనీసం ఉనికిలోకైనా రాలేదు. ఉద్యమకారులకు ఆగ్రహం, ఆకాంక్షలు మినహా విధానపరంగా, ఆచరణపరంగా ఎటువంటి ఆలోచనలూ లేవు. ప్రస్తుత రాజకీయ శూన్యాన్ని పూరించగలవారెవరూ కన్పించటం లేదు. రాజ వంశీకు లకు పునరాగమనపు ఆశలున్నా ప్రజలు ఆమోదించే అవకాశం లేదు. ఇవన్నీ ఒక విధమైన క్లిష్ట స్థితి కాగా, స్థానికంగా ఆర్థికాభివృద్ధి ప్రశ్నకు తోడు ఇవన్నీ ఎన్నటికి జరిగేనన్నది మరొక క్లిష్ట స్థితి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
జాతి సేవలో మునుముందుకు...
ఈ రోజు సెప్టెంబరు 11... ఈ తేదీ మనకు రెండు విభిన్న చారిత్రక సంఘటనలను గుర్తు చేస్తుంది. మొదటిది... షికా గోలో 1893నాటి స్వామి వివేకానంద ప్రసంగం. ‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’ అన్న ఆయన పలకరింపు ఆ సమావేశ మందిరంలోని వేలాది ప్రేక్షకుల హృద యాలను పులకరింప జేసింది. భారత అజరామర ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సార్వత్రిక సోదరభావన ప్రాధాన్యాన్ని ఈ అంతర్జాతీయ వేదికపై నుంచి ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. రెండోది... ఉగ్రవాద– తీవ్రవాద దుశ్చర్యల ఫలితంగా ఈ సౌహార్ద భావనను తుత్తు నియలు చేస్తూ సాగిన 9/11 నాటి భీకర దాడులు.ఇదే రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది... ‘వసుధైవ కుటుంబకం’ సూత్రంతో ప్రేరణ పొంది, సామాజిక మార్పు–సామరస్యం, సోదరభావ స్ఫూర్తి బలోపేతం లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుడి జన్మదినమిది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో అనుబంధంగల లక్షలాది మంది ఆయనను సగౌరవంగా... ప్రేమాభిమానాలతో పరమ ‘పూజ్య సర్సంఘ్ చాలక్’ అని పిలుచుకుంటారు. అవును... నేను చెబుతున్నది శ్రీ మోహన్ భాగవత్ గురించే! ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయన 75వ జన్మదిన వేడుక నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దైవం ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.మోహన్ భాగవత్ కుటుంబంతో నా అనుబంధం ఎంతో లోతైనది. ఆయన తండ్రి దివంగత మధుకర్ రావు భాగవత్తో సన్నిహితంగా పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఈ అనుభవాన్ని నా రచన ‘జ్యోతిపుంజ్’లో విస్తృతంగా వివరించాను. న్యాయ వ్యవస్థతో తన అనుబంధంతో పాటు, దేశ ప్రగతి కోసం ఆయన తనను తాను అంకితం చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆర్ఎస్ఎస్’ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దేశ పురోగమనంపై మధుకర్ రావు తపన ఎంతటిదంటే– తన కుమారుడు మోహన్ రావును భారత పునరుజ్జీవనం దిశగా కృషికి పురిగొల్పింది. మధుకర్ రావు ఒక పరుసవేది కాగా, మోహన్ రావు రూపంలో మరో ‘మణి’ని తీర్చిదిద్దారు.తొలి అడుగులుమోహన్ 1970 దశకం మధ్య భాగంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యారు. ‘ప్రచారక్’ అంటే– ఏదో ఒక సిద్ధాంతం ఆధారంగాసంబంధిత ప్రబోధాలను ప్రచారం చేసే బాధ్యతగా కొందరు అపార్థం చేసుకోవచ్చు. కానీ, ఆర్ఎస్ఎస్ పనితీరు గురించి తెలిసిన వారికి ‘ప్రచారక్’ అనేది సంస్థలో కీలక పని సంప్రదాయమనే వాస్తవం చక్కగా తెలుసు. గడచిన వంద సంవత్సరాలుగా దేశభక్తి ప్రేరణగా వేలాది యువత ‘భారతదేశమే ప్రధానం’ లక్ష్యంగా దాన్ని సాకారం చేసే దిశగా తమ జీవితాలను అంకితం చేశారు. ఇందు కోసం వారు ఇల్లూవాకిలీ సహా కుటుంబ బంధాలన్నిటినీ వదులు కుని దేశమాత సేవలో తరించారు.ఆయన ‘ఆర్ఎస్ఎస్’లో ప్రవేశించిన తొలినాళ్ల సమయాన్ని భారత చరిత్రలో అంధకార యుగంగా అభివర్ణించవచ్చు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత క్రూర ఎమర్జెన్సీ విధించిన సమయ మది. ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవిస్తూ, దేశం ప్రగతి పథంలో పయనించాలని ఆకాంక్షించే ప్రతి వ్యక్తీ దీన్ని ప్రతిఘటిస్తూ ఉద్యమంలో దూకడం అత్యంత సహజం. అదే తరహాలో మోహన్ సహా అసంఖ్యాక ‘ఆర్ఎస్ఎస్’ స్వయంసేవకులు కూడా ఇలాగే చేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో... ముఖ్యంగా విదర్భలో ఆయన విస్తృతంగా పనిచేశారు. తద్వారా పేదలు, అణ గారిన వర్గాల సమస్యలను ఆకళింపు చేసుకునే అవకాశం ఆయనకు లభించింది.అనంతర కాలంలో భాగవత్ ‘ఆర్ఎస్ఎస్’లో వివిధ బాధ్య తలు నిర్వర్తించారు. ఆ యా విధుల నిర్వహణలో ఆయన అసమాన నైపుణ్యం ప్రదర్శించారు. ముఖ్యంగా 1990 దశకంలో ‘అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్’ అధిపతిగా మోహన్ పనిచేసిన కాలాన్ని చాలామంది స్వయంసేవకులు నేటికీ ఎంతో ప్రేమాభిమానాలతో స్మరించుకుంటుంటారు. ఆ సమయంలో ఆయన బిహార్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంఘ్ నిర్మాణం కోసం అవిరళ కృషి చేశారు. జనజీవనంలోని క్షేత్రస్థాయి సమస్యలపై ఆయన అవగాహనను ఈ అనుభవాలు మరింత పెంచాయి. అటుపైన 20వ శతాబ్దారంభంలో ఆయన ‘అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్’గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2000లో ‘సర్కార్యవాహ్’ అయ్యారు.ఈ రెండు పదవుల్లోనూ తనదంటూ ప్రత్యేక పనిశైలిని ఆచరణలో పెట్టారు. అత్యంత సంక్లిష్ట పరిస్థితులను సులువుగా, కచ్చితత్వంతో నిభాయించారు. ఆ తర్వాత 2009లో ‘సర్సంఘ్చాలక్’గా ఆర్ఎస్ఎస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ అందరికీ ఉత్తేజమిచ్చే విధంగా పని చేస్తున్నారు.ఈ పదవీ నిర్వహణ సంస్థాగత బాధ్యతను మించిన కర్తవ్యం. సంస్థ ఉద్దేశాలు, నిర్దేశాలపై స్పష్టత, భరతమాతపై అపార ప్రేమగల అసాధారణ వ్యక్తులు త్యాగం, అచంచల నిబద్ధతతో ఈ బాధ్యతలకు కొత్త నిర్వచనమిచ్చారు. మోహన్ భాగవత్ ఈ గురుతర బాధ్యతను అనితర సాధ్యంగా నిర్వహించడంతోపాటు స్వీయ శక్తిసామర్థ్యాలు, మేధస్సు జోడించి కరుణార్ద్ర నాయకత్వాన్ని ఆచరణాత్మకంగా చూపారు. ‘దేశమే ప్రధానం’ అన్న సూత్రమే వీటన్నిటికీ ప్రేరణ!ప్రత్యేక కార్యశీలత్వంఅవిచ్ఛిన్నత, అన్వయం... మోహన్ జీ మనఃపూర్వకంగా భావించిన, తన కార్యశైలిలో ఇముడ్చుకున్న ముఖ్యమైన అంశాలపై ఆలోచిస్తే ఈ రెండూ నాకు స్ఫురిస్తాయి. మనం గర్వించే సంస్థాగత భావజాల పరంగా రాజీపడకుండా, అదే సమయంలో మారుతున్న సామాజిక అవసరాలకూ అనుగుణంగా... సంక్లిష్టమైన అంశాల్లోనూ ఆయన సమర్థంగా సంస్థను ముందుకు నడిపారు. ఆయనకు యువతతో సహజమైన అనుబంధం ఉంది. ఎప్పుడూ పెద్ద సంఖ్యలో యువతను సంఘ్పరివార్లో భాగస్వాములను చేయడంపై దృష్టి సారించారు. ఆయనెప్పుడూ బహిరంగ చర్చల్లో పాల్గొంటూ, ప్రజలతో సంభాషిస్తూ కనిపిస్తారు. నేటి గతిశీల, డిజిటల్ ప్రపంచంలో ఇది అత్యంత ప్రయోజనకరమైన అంశం. స్థూలంగా చెప్పాలంటే, వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో భాగవత్ జీ బాధ్యతలు నిర్వర్తించిన కాలం అత్యంత విప్లవాత్మక సమయమని చెప్పక తప్పదు. యూనిఫాంలో మార్పు నుంచి శిక్షా వర్గలలో (శిక్షణ శిబిరాలు) మార్పుల వరకు... ఆయన నేతృత్వంలో అనేక ముఖ్యమైన మార్పులు వచ్చాయి. మానవత్వం విపత్తుతో తలపడిన కోవిడ్ కాలంలో మోహన్ జీ కృషి నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. జీవితకాలంలో మునుపెన్నడూ చూడని ఆ విపత్తు వేళ ఆర్ఎస్ఎస్ సాంప్రదాయక కార్యకలాపాల కొనసాగింపు సవాలుగా మారింది. సాంకేతికత వినియోగాన్ని పెంచాలని మోహన్ జీ సూచించారు. ప్రపంచవ్యాప్త సవాళ్ల నేపథ్యంలో... సంస్థాగత యంత్రాంగాలను అభివృద్ధి చేస్తూనే, అంత ర్జాతీయ పరిణామాలనూ నిశితంగా పరిశీలించారు. స్వీయ రక్షణ చర్యలతోపాటు ప్రజా రక్షణను కర్తవ్యంగా భావిస్తూ.. ఆపన్నులను ఆదుకునేందుకు కోవిడ్ సమయంలో స్వయంసేవకులంతా శక్తివంచన లేకుండా కృషి చేశారు. అనేక చోట్ల వైద్య శిబిరాలు నిర్వహించాం. కష్టపడి పనిచేసే స్వయంసేవకులను కూడా కోల్పోయాం. కానీ మోహన్ జీ స్ఫూర్తి వల్ల వారి దృఢ సంకల్పం ఎప్పుడూ సడలలేదు.ఈ ఏడాది మొదట్లో నాగ్పూర్లో మాధవ్ నేత్ర చికిత్సాలయ ప్రారంభోత్సవం సందర్భంగా... ఆర్ఎస్ఎస్ ఒక అక్షయవటం లాంటిదనీ, అది మన దేశ సంస్కృతినీ, సామూహిక చైతన్యాన్నీ శక్తిమంతం చేస్తుందనీ నేను వ్యాఖ్యానించాను. ఈ అక్షయవట మూలాలు లోతైనవి, బలమైనవి. ఎందుకంటే అవి విలువలతో కూడుకున్నవి. ఈ విలువలను పెంపొందించడానికీ, ముందుకు తీసుకెళ్లడానికీ మోహన్ భాగవత్ జీ అంకితభావంతో వ్యవహరించిన విధానం నిజంగా స్ఫూర్తిదాయకం.మోహన్ జీ వ్యక్తిత్వంలో మరో అద్భుత లక్షణం ఆయన మృదు భాషణం. ఆయన అందరి మాటా వింటారు. ఈ లక్షణం విస్తృత దృక్పథానికి నిదర్శనం. ఇదే ఆయన వ్యక్తిత్వానికి, నాయకత్వానికి శోభనిచ్చింది. పంచ పరివర్తన్వివిధ ప్రజా కార్యక్రమాలపై ఆయన చూపించిన ఆసక్తి గురించి కూడా నేను రాయాలనుకుంటున్నాను. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ నుంచి ‘బేటీ బచావో బేటీ పఢావో’ వరకు.. ఈ కార్య క్రమాల్లో ఉత్సాహంగా భాగస్వామ్యం వహించాలని మొత్తం ఆర్ఎస్ఎస్ కుటుంబానికీ ఆయన ఎప్పుడూ చెప్పేవారు. సామాజిక శ్రేయస్సు కోసం మోహన్ జీ ‘పంచ పరివర్తన్’ అందించారు. సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ అవగా హన, జాతీయ భావన, పౌర విధులు ఇందులోని అంశాలు. జీవితంలోని ప్రతి దశలో ఇవి భారతీయులకు స్ఫూర్తిని స్తాయి. బలమైన, సంపన్నమైన దేశాన్ని చూడాలని ప్రతి స్వయంసేవక్ కలలుగంటాడు. దాన్ని సాకారం చేయడం కోసం... స్పష్టమైన దార్శనికత, నిర్ణయాత్మక కార్యాచరణ రెండూ కావాలి. మోహన్ జీలో ఈ రెండు లక్షణాలూ పుష్కలంగా ఉన్నాయి. భాగవత్ జీ ఎప్పుడూ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ గురించి బలంగా చెప్తారు. భారతదేశ వైవిధ్యాన్ని గట్టిగా నమ్మే వ్యక్తి. దేశంలో భాగమైన అనేక విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ఘనంగా చాటుతారు. తన షెడ్యూల్ వల్ల ఎంత బిజీగా ఉన్నా... మోహన్ జీ సంగీతం, పాటల వంటి అభిరుచులకు ఎప్పుడూ సమయం కేటాయించారు. వివిధ భారతీయ సంగీత వాయిద్యాలలో ఆయన చాలా ప్రజ్ఞాశాలి అని కొద్ది మందికే తెలుసు. చదవడం పట్ల ఆయనకున్న మక్కువ ఆయన ప్రసంగాలు, సంభాషణలలో కనిపిస్తుంది.మరి కొన్ని రోజుల్లో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సంవత్సరం విజయ దశమి, గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఒకే రోజున జరగడం కూడా ఒక ఆనందకరమైన యాదృచ్చికం. భారత దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న లక్షలాది మందికి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. ఈ సమయంలో మోహన్ జీ వంటి తెలివైన, కష్టపడి పనిచేసే సర్ సంఘచాలక్ సంస్థను నడిపిస్తున్నారు. మనం అంతరాలకూ, హద్దులకూ అతీతంగా ఎదిగి, ప్రతి ఒక్కరినీ మనవారిగా భావిస్తే సమాజంలో నమ్మకం, సోదరభావం, సమానత్వం బలపడుతుందని చాటిన మోహన్ జీ వసుధైక కుటుంబానికి సజీవ ఉదాహ రణగా చెబుతూ నేను ముగిస్తున్నాను. దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంతో మోహన్ జీ భరతమాత సేవలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నరేంద్ర మోదీభారత ప్రధాని -
ఇదెక్కడి న్యాయం?
దోషులుగా నిర్ధరణ కాకముందే మన యువతీ యువకులు ఐదేళ్ళకు పైగా జైలులో మగ్గుతూంటే మన ప్రజా స్వామ్యం గురించి ఏమని చెప్పుకోగలం? ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ నేడు అటు వంటి స్థితిలోనే చిక్కుకున్నారు. వారు దోషులుగా ప్రకటితులైనవారు కాదు. విచారణలో ఉన్న ఖైదీలు. నిర్దోషులుగానే ఇప్పటికీ భావించవచ్చు. అయినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యు.ఎ.పి.ఎ.) వల్ల ఢిల్లీ హైకోర్టు 2025 సెప్టెంబర్ ఆదేశం మేరకు వారు ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. వారు కుట్ర పన్నారనడానికి వారి ప్రసంగాలను, కరపత్రాలను, వాట్సాప్ గ్రూపులను సాక్ష్యాధారంగా తీసుకున్నారు. వేలాది పేజీల భారం కింద విచారణ కుంటు పడుతూ వచ్చింది. కేసులు ఏళ్ళకొద్దీ నానుతూ ఉంటే, స్వేచ్ఛను తొక్కి ఉంచడానికి లేదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు కె.ఏ. నజీబ్ కేసు (2021)లో హెచ్చరించింది. ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టినట్లే కనిపిస్తోంది. విచారణ రంగస్థలమా?విచారణ దశలో ప్రాసిక్యూషన్ చెబుతున్నదాన్నే పరిగణనలోకి తీసుకోవాల్సిందని జడ్జీలకు నిర్దేశిస్తున్న ‘వటాలీ’ తీర్పు (2019) పూర్వ ప్రమాణంపైనే హైకోర్టు ఆధారపడింది. తాను ‘మినీ విచా రణ’ను ఏమీ నిర్వహించడం లేదని కోర్టు చెబుతోంది. కానీ, ప్రబ లంగా లేని సాక్షుల ప్రకటనలను అది వేదవాక్యంగా తీసుకుంది. అహింసకు ప్రేరేపిస్తున్న ప్రసంగాలు రక్తపాతానికి ఇచ్చిన పిలుపు లయ్యాయి. అటువంటి కారణాలపై స్వేచ్ఛను నిరాకరిస్తే, ఇంక విచారణ రంగస్థలం కాక మరేమవుతుంది?కుట్రలను పరోక్షంగా కూడా రుజువు చేయవచ్చు. కానీ, ప్రాసంగిక సాక్ష్యాధారాలైనా కనీసం ఒకదానితో ఒకటి పొసగేవిగా ఉండాలి. ఇక్కడ పౌరసత్వ సవరణ చట్టం పట్ల అసమ్మతిని ఢిల్లీని బుగ్గి చేసే బృహత్ పథకం గాటన కట్టారు. ఉమర్ ఖాలిద్ 2020 ఫిబ్రవరిలో చేసిన అమరావతి ప్రసంగాన్నే తీసుకోండి. ఆయన 24–02–2020న నిరసనలు చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక పర్యటన కూడా కాకతాళీయంగా, అదే రోజున చోటు చేసుకుంది. ‘‘హింసాయుత అల్లర్లను ప్రేరేపించేందుకే ఉద్దేశపూర్వ కంగా ఆ రోజును ఎంచుకొన్నారు. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకే ఆ పని చేశారు’’ అని కోర్టు పేర్కొంది. అయితే, ‘‘హింస పట్ల హింసతో మేం ప్రతిస్పందించం. ద్వేషం పట్ల ద్వేషంతో మేం ప్రతి స్పందించం. వారు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే, మేం దానిపై ప్రేమతో స్పందిస్తాం. వారు మమ్మల్ని లాఠీలతో కొడితే, మేం త్రివర్ణ పతాకా లను చేతబూనుతాం’’ అని ఆయన సభికులతో అన్నట్లుగా వాస్తవిక రాతప్రతి వెల్లడిస్తోంది. ప్రజాస్వామ్యంలో నిరసన ఒక భాగంశర్జీల్ ఇమామ్ విషయంలో... ఆయన జామియా, అలీగఢ్, అసన్సోల్, గయలలో చేసిన ప్రసంగాలను ప్రముఖంగా పేర్కొంది. ‘‘భారతదేశంలోని మిగిలిన ప్రాంతం నుంచి ఢిల్లీని శాశ్వతంగా విడ గొట్టేస్తాం’’ అని ఆయన అన్నమాటలను కోర్టు ఉదాహరించింది. నిరసన ప్రదర్శనల్లో సాధారణ దృశ్యాలైన రోడ్డు దిగ్భంధ నాలు, బైఠాయింపులను ఉగ్రవాదానికి ప్రాథమిక సాక్ష్యాధారాలుగా ఉన్నత స్థానం కల్పించింది. అదే అలీగఢ్ ప్రసంగాన్ని విశ్లేషిస్తూ అలహాబాద్ హైకోర్టు ‘‘హింసకు పురికొల్పేది నిస్సందేహంగా ఏదీ లేదు’’ అని కనుగొన్న అంశాన్నీ, బెయిలు మంజూరు చేసిన విష యాన్నీ తీర్పు విస్మరించింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణాన్ని తీర్పు గుర్తించకపోలేదు.అందుకు అది మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ను ఉటంకించింది. ఇమ్రాన్ ప్రతాప్గఢీ కేసులో సుప్రీం కోర్టు 2025లో తీసుకున్న నిర్ణయాన్ని కూడా ప్రస్తావించింది. అయినా కూడా, పౌరసత్వ సవ రణ చట్ట వ్యతిరేక నిరసన ప్రదర్శనలు స్వభావసిద్ధంగా హింసా యుతమైనవని ప్రాసిక్యూషన్ చేసిన వాదనను అంగీకరించింది. భారతదేశంలో ఏ నిరసన ప్రదర్శన అయినా అవాంతరాలు సృష్టించేదిగానే ఉంటోంది.దండి యాత్ర, ఎమర్జెన్సీ వ్యతిరేక ర్యాలీల నుంచి చిల్లరమల్లర నిరసనలు, యాత్రలు, బైఠాయింపులు, రోడ్డు దిగ్బంధనాలు మన ప్రజాస్వామిక సరళిలో భాగంగా ఉంటూ వస్తున్నాయి. అటువంటి చర్యలను ‘ఉగ్రవాద కార్యకలాపాలు’గా ముద్ర వేయడం ప్రజాస్వా మ్యాన్నే నేరమయం అనడం అవుతుంది. ఈ కేసులోని పలువురు సహ నిందితులు (దేవాంగనా కలితా, నటాషా నర్వాల్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా) ఇప్పటికే బెయిలుపై బయ టకు వచ్చారు. సూత్రప్రాయంగా చూస్తే, వారి సరసన ఉన్న ఇతరులకూ అదే రకమైన ఊరట లభించాలి. కోర్టు దీన్ని కూడా పట్టించుకోలేదు. ‘‘తొలుతటి బెయిలు ఉత్తర్వులను పూర్వ ప్రమాణంగా తీసుకోవడానికి లేదు’’ అని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అది ఇందుకు వాడుకుంది. కానీ, ఖాలిద్, ఇమామ్ పాత్ర ఇప్పటికే విడుదలైనవారి కన్నా పెద్దది ఏమీ కాదు. ఏ విధంగానో చెప్పకుండానే, వారి ప్రమేయం ‘తీవ్ర’మైనదని ప్రకటించడం ద్వారా, చట్టం ముందు అందరూ సమానులేనన్న మౌలిక సూత్రాన్ని కూడా కోర్టు పట్టించుకోలేదు.ఈ కేసు కేవలం ఖాలిద్ లేదా ఇమామ్ గురించినది కాదు. భారతదేశంలో అసమ్మతికి ఉన్న తావు గురించినది. నిరసనను ఉగ్రవాదంగా చూస్తే, ఇక సమీకరించడానికి ఎవరు సాహసిస్తారు? వాట్సాప్ గ్రూపులు కుట్రలైతే వాటిలో చేరేందుకు ఎవరు సాహసిస్తారు? పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసన ప్రదర్శన రాజ్యాంగబద్ధంగా సమీకరించినదే. దాన్ని ఉగ్రవాద కుట్రగా చిత్రించడం ద్వారా కోర్టు ఒక మొత్తం ఉద్యమాన్ని చట్టవిరుద్ధం చేస్తోంది. పౌర ప్రజాస్వామ్యం స్వేచ్ఛ, భద్రత రెండింటినీ కాపాడుకొని తీరాలి. దామాషాయే అసలు పరీక్ష. మాటలకు, నిరసన ప్రదర్శ నలకుగాను, విచారణకు నోచుకోకుండా ఐదేళ్ళు జైలులో గడపడం దామాషా కిందకు రాదు. దోషిగా నిరూపణ కాకుండానే శిక్ష వేయ డమవుతుంది. పార్లమెంట్ కూడా తన బాధ్యత నుంచి తప్పించు కోలేదు. బెయిలును నిరాకరించే చట్టం ప్రజాస్వామ్యాన్ని కూడా బలహీనపరచేది అవుతుంది. ‘ఉపా’లోని సెక్షన్ 43(డి)(5) సరిగ్గా అదే పని చేస్తోంది. దాన్ని సత్వరం సంస్కరించవలసి ఉంది. ఇక్కడ పణంగా ఉన్నది ఒక్క కేసు కాదు, మొత్తం గణతంత్రం.సంజయ్ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
గెలుపు బాటలో 'ఓటమి పాఠం'
అమెరికన్ మిడిల్ – డిస్టెన్స్ రన్నర్ ఎమ్మా జేన్ కోబర్న్ 3,000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో ప్రపంచ ఛాంపియన్. ఒలింపిక్ కాంస్య పతక విజేత. 10 పర్యాయాలు అమె రికా జాతీయ ఛాంపియన్. ఈ ఏడాది మే 8న కొలరాడో విశ్వవిద్యాలయ 2025 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి కోబర్న్ చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం:శుభోదయం. 2025 బ్యాచ్ వాళ్ళకు అభినందనలు. నేటితో ఒక అధ్యాయం ముగిసినట్లు కాదు. ఒక పరుగు పందెం పరిసమాప్తమైంది. మరోటి మొదలవుతోంది. అంతే! మీరు విజయ రేఖ దాటే శారు. మిగిలినవాటిని ఎదు ర్కొనేందుకు మరో రేఖ ముందు ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయమే నన్ను తీర్చిదిద్దింది. క్యాంపస్లో చేతులు కలిపిన అమ్మ, నాన్నలకి నేను ఇక్కడే బౌల్డర్లో పుట్టాను. అథ్లెట్గా, మనిషిగా వృద్ధిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తూ తరచుగా ఆలోచించే సంగతులను మీతో పంచుకుంటాను.‘వెలితి’పై బెంగ వద్దు!నేను దాన్ని ‘వెలితి’గా పిలుస్తా. మీరు ఇపుడు ఉన్న స్థానానికీ, మీరు చేరుకోవాలనుకుంటున్న స్థానానికీ మధ్యనున్న ఖాళీ. ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితికి చేరుకోవాలనుకుంటున్నారో దానిమధ్య నున్న వ్యత్యాసం. అది ఒక లోపం కాదు. వెనుకబడ్డారనడానికి సంకేతమూ కాదు. అది మీకంటూ జీవితం పట్ల ఒక దార్శనికత ఉందనడానికి రుజువు. మరింత ఉన్నత స్థితికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కనుకనే ఆ వెలితి ఏర్పడింది. ఆ వెలితిని భరించడం ఒక్కోసారి ఇబ్బందికరంగా, బాధగా కూడా అనిపించవచ్చు. కానీ, సత్యాన్ని గ్రహించండి. ఒత్తిడి, అసౌకర్యం, అపరిచితం ఉన్నచోటనే వృద్ధి సాధ్యమవుతుంది. మీరు గమనించలేదేమో కానీ, ఒక ‘వెలితి’ని మీరు ఇప్పటికే భర్తీ చేసేశారు. చూస్తూ చూస్తూ ఉండగానే పట్టభద్రులై పోయారు. ఒక్కసారి కాలేజీలో అడుగు పెట్టిన మొదటి రోజును గుర్తు తెచ్చుకోండి. ఆత్మవిశ్వాసం, ఆనందాతిరేకాలతోనే క్యాంపస్లో కాలిడి ఉండవచ్చు. ఆడిటోరియం కోసం వెతుకుతూ దారి తప్పి ఉండవచ్చు. బెంగతో అమ్మకు రెండు మూడుసార్లు ఫోన్ చేసి ఉండ వచ్చు. బుర్ర నిండా ప్రశ్నలే! స్నేహితుల్ని పోగేసుకోవడం ఎలాగో నంటూ ఆలోచన. ఉదయం 8 గంటలకే మొదలయ్యే పాఠాలు వినడంపై తర్జన భర్జన. పరీక్షలో జవాబులు రాయడం, ఇంటెర్న్ షిప్నకు దరఖాస్తు చేసుకోవడం తెలియదు. వంటగదిలో పనులు చక్కబెట్టడం ఇప్పటికీ మీలో కొందరికి తెలియకపోవచ్చు.కానీ, గత కొద్ది ఏళ్ళుగా కొద్ది కొద్దిగా కొత్త నైపుణ్యాలను, కొత్త అలవాట్లను సంతరించుకుంటూ వచ్చారు. మీకు మీరే కొత్త వ్యక్తిగా రూపాంతరం చెందారు. సమయాన్ని వెచ్చించడంపై ఒక అవగాహ నకు వచ్చారు లేదా మీకు మీరు నచ్చజెప్పుకునే విధంగా కాలాన్ని వెచ్చిస్తున్నారు. అవసరమైతే ఇతరుల సహాయాన్ని ఎలా పొందాలో నేర్చుకున్నారు. వెలితిని భర్తీ చేసుకోవాల్సిన విధానం ఇదే అనుకుంటా! ఒక్క రాత్రిలో కాదు. ఒక్కసారిగా కాదు. కానీ, స్థిరంగా అడుగులు పడాలి. క్యాంపస్ లోకి మొదటి రోజు బెరుకుగా అడుగు లేస్తూ వచ్చిన వ్యక్తి... నేడు నిబ్బరంగా కూర్చున్న వ్యక్తి ఒక్కరే! కానీ, మార్పు యథాలాపంగా రాలేదు. సంతరించుకుంటే వచ్చింది. అది మీరిక్కడ నిశ్శబ్దంగా, ఆర్భాటాలు లేకుండా, శ్రద్ధ పెట్టి చదువు కోవడం వల్ల వచ్చిన మార్పు!రెండు నియమాలుకానీ, ఇక్కడ నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి? కాలేజీలోలాగా గురువులు లేకపోయినా స్వయంగా నిలబడగలగాలి. మీ తప్పటడుగులను మీరే సరిదిద్దు కోవాలి. ‘వెలితి’ని భర్తీ చేసుకోవడంలో రెండు నియమాలు నాకు సహాయపడ్డాయి. అవి మీకూ తప్పకుండా ఉపకరిస్తాయి.1. ప్రజ్ఞ అవసరం లేనివాటిని మొదట సాధించండి!త్వరగా నిద్ర లేవడానికి, సమయ పాలనకు, దయతో మెలగేందుకు, ప్రతిస్పందనలను ఆలకించేందుకు, స్థిర బుద్ధితో వ్యవహరించడానికి ప్రజ్ఞా పాటవాలు అవసరం లేదు. అవి ఎవరో కానుకగా ఇచ్చేవి కావు. మనం అలవరచుకుంటే వచ్చేవి. నేను అత్యంత అదృష్టవంతురాలినో లేదా శక్తి సామర్థ్యాలు ఉన్నదాన్నో కావడం వల్ల పరుగు పందాల్లో గెలవలేదు. చిన్న అడుగులే అయినా స్థిరంగా వేస్తూ వచ్చాను. పరుగెత్తాల్సిన దూరాన్ని తగ్గించుకోలేదు. ఆకర్షణగా లేనివాటిని వదిలేయలేదు. ఎదుటివారు చెప్పింది విన్నాను. శ్రమకోర్చి తర్ఫీదు పొందాను. క్రమశిక్షణను పెంపొందించుకున్నాను. కేవలం శక్తితోనే కాకుండా, ఆ రకమైన క్రమశిక్షణ వల్లనే 2016లో ఒలింపిక్ పతకాన్ని, 2017లో ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణాన్ని గెలుచుకున్నాను.2. చెయ్యగలిగింది చేయండి– మీ చేతిలో లేనివాటిని వదిలేయండి.క్రీడల్లో ఎవరన్నా నన్ను వంచిస్తే, లేదా నాకన్నా మెరుగైన సామర్థ్యాన్ని కనబరిస్తే, లేదా పోటీ రోజు వర్షం పడితే నేను చేయ గలిగింది ఏమీ లేదు. కానీ, నా స్పందనను నియంత్రించుకోగలను. జీవితంలో మార్పునకు లోనయ్యే అంశాలే ఎక్కువగా ఉంటాయి. కానీ, వాటిని తట్టుకోవడంలో సన్నద్ధత మన చేతిలో ఉంటుంది. మన నియంత్రణలో ఉన్నవాటిపై దృష్టి కేంద్రీకరిస్తే, మనం బలంగా తయారవుతాం. మన చేతిలో లేనివాటినే తలచుకుంటూ కూర్చుంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అయిపోతాం.కొన్నింటిలో విఫలం కావచ్చు. విజేతగా నిలుస్తామనుకున్న చోట ఓడిపోనూ వచ్చు. దానికి డీలా పడనక్కర లేదు. టోక్యోఒలింపిక్స్లో నేను విఫలమయ్యా. పరుగుపందెంలో ఆఖరి అంచెలో పడిపోయా. అనర్హురాలినయ్యా. దేని కోసం నేను ఏళ్ళ తరబడి శిక్షణ పొందానో, ఏవి నా ఒలింపిక్స్ అని చాటాలనుకున్నానో అందులో విఫలమయ్యా. బహిరంగ వైఫల్యం. నిరాశ చెందా. కానీ, శ్రమించి పెంచుకున్న సామర్థ్యం వల్ల, ఓటమిని దిగమింగుకున్నా.తదుపరి వేసవిలో నా పదవ అమెరికా జాతీయ ఛాంపియన్షిప్ సాధించా. ఒకే పోటీలో పదిసార్లు విజేతగా నిలిచిన రన్నర్ నేను ఒక్కదాన్నే!ఉద్యోగంలో, ప్రేమలో, జీవితంలో ఎవరైనా విఫలం కావచ్చు. కనుక, తిరిగి పోరాడగల సామర్థ్యాన్ని ఇప్పటి నుంచే పెంచుకోండి. వైఫల్యం లేకపోవడం విజయం కాదు. ఓటమి నుంచి ముందుకు సాగగల సత్తాయే విజయం. మీ జీవితానికి మీరే జవాబుదారీ. ఉన్న స్థితికీ, చేరుకోవాలను కుంటున్న స్థితికీ మధ్య వెలితిని భర్తీ చేయాల్సింది మీరే! భయం ముప్పిరిగొన్నా, సందేహం వెనక్కి లాగుతున్నా ధైర్యంగా, క్రమ శిక్షణతో చిన్న అడుగులైనా ముందుకు వేస్తూనే ఉండండి. -
విక్రమ్... ఒక గేమ్ ఛేంజర్
భారతదేశం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన 32 బిట్ ప్రాసెసర్ ‘విక్రమ్ 3201’ ప్రత్యేకత ఏమిటి? రేపటి తరం ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లను నడి పేంత శక్తిమంతమైంది కాకపోవచ్చు కానీ... భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో మాత్రం కీలకపాత్ర పోషించనుంది. ఇటీవల నిర్వహించిన ‘ఇండియా సెమికాన్ ’ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న విక్రమ్ 3201 ప్రాసెసర్దే ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ , గగన్ యాన్ యాత్రల ఎలక్ట్రానిక్స్లో ముఖ్య భూమిక. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిజైన్ చేయగా మొహాలీలోని సెమీకండక్టర్ లేబొరేటరీ తయారు చేసిన ఈ ప్రాసెసర్కు భారతదేశం గర్వించగదగ్గ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయి పేరు పెట్టారు. గతేడాది డిసెంబరులో ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ–60లో విజయవంతంగా పరీక్షించి చూశారు కూడా. 2009 నుంచి ఉపయోగిస్తున్న విక్రమ్ 1601 ప్రాసెసర్ స్థానంలో ఇకపై విక్రమ్ 3201ను ఉపయోగిస్తారు.పోటీ పడలేనప్పటికీ...ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో ఉపయోగిస్తున్న ప్రాసెసర్లతో పోల్చి చూస్తే విక్రమ్ 3201 గొప్ప శక్తిమంతమైందేమీ కాదు. సాంకేతిక పరి జ్ఞానం విషయంలోనూ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లలోని ప్రాసెసర్లతో సరితూగేది కాదు. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల్లో 64 బిట్ ప్రాసె సర్లు ఉపయోగిస్తూండగా విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్ మాత్రమే.కొంచెం సింపుల్గా చెప్పాలంటే 32 బిట్ ప్రాసెసర్తో నాలుగు గిగాబైట్ల ర్యామ్తో పనిచేయగలం. అదే 64 బిట్ ప్రాసెసర్తోనైతే 8 గిగాబైట్లు, అవసరమైతే 16 గిగాబైట్ల ర్యామ్తోనూ పనిచేయించవచ్చు. అంటే, 64 బిట్ ప్రాసెసర్తో చేయగలిగిన పనులన్నీ 32 బిట్ ప్రాసెసర్తో చేయడం కష్టమన్నమాట. అంతేకాదు... విక్రమ్ 3201ను 180 నానోమీటర్ల సైజున్న ట్రాన్సిస్టర్లతో తయారు చేశారు. ఆధునిక మైక్రోప్రాసెసర్లలోని ట్రాన్సిస్టర్ల సైజు ప్రస్తుతం మూడు నానోమీటర్లు! సైజు తక్కువగా ఉంటే ప్రాసెసర్లో ఎక్కువ ట్రాన్సి స్టర్లు పడతాయి. తద్వారా వాటి వేగం, సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ రకంగా చూస్తే విక్రమ్ 3201 ఎప్పుడో 1990ల నుంచి 2000 సంవత్సరం వరకూ అందుబాటులో ఉన్న ప్రాసెసర్ల స్థాయిది.ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, ఎలెవన్ ్త జనరేషన్ కూడా పది నానో మీటర్ల ట్రాన్సిస్టర్లతో తయారైందన్నది గమనార్హం. ట్రాన్సిస్టర్ల సైజు తక్కువగా ఉంటే ప్రాసెసర్ సైజు తగ్గి... చిన్న చిన్న పరికరాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. అన్నింటికీ తట్టుకునేలా...అయితే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లతో పోలిస్తే అంతరిక్షంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ తీరుతెన్నులు భిన్నం. అవి అంతరిక్షంలోని కఠిన పరిస్థితులను తట్టుకుని పనిచేయాలి. అక్కడ ఉష్ణో గ్రతల్లో విపరీతమైన మార్పులుంటాయి. భూ కక్ష్యలో తిరుగు తున్నప్పుడు సూర్యాభిముఖంగా ఉన్నప్పుడు ఉపగ్రహాలు 125 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకో వైపు ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు–55 డిగ్రీ సెల్సియస్కు పడిపోతాయి. రేడియోధార్మికత కూడా ఎక్కువ. పైగా ప్రయోగ సమయంలో పుట్టే ఎలక్ట్రిక్ ప్రకంపనలు, ధ్వని తాలూకూ షాక్లను తట్టుకుని మరీ పనిచేయాల్సి ఉంటుంది. భూ వాతావరణ పొర తాలూకూ రక్షణ ఉండదు కాబట్టి సౌరగాలులు, అత్యంత శక్తిమంతమైన కణాలతో కూడిన కాస్మిక్ రేస్ వంటివన్నీ నిత్యం ప్రాసెసర్లకు పరీక్ష పెడుతూంటాయి. ప్రాసెసర్లలో సమాచారం ‘1’, ‘0’ల రూపంలోనే నిక్షిప్త మవుతూ ఉంటుంది. ట్రాన్సిస్టర్ల గుండా విద్యుత్తు ప్రవహిస్తే ‘1’, ప్రవహించకపోతే ‘0’ అన్నమాట. ఖగోళం నుంచి దూసుకొచ్చే శక్తి మంతమైన కణాలు ట్రాన్సిసర్టలపై ప్రభావం చూపితే సమాచారం తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. ఆధునిక మైక్రో ప్రాసెసర్లలో ఇలా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. ట్రాన్సిస్టర్ల సైజు తక్కువగా ఉండటం, విద్యుదావేశాన్ని నిలిపి ఉంచుకోవడం దీనికి కారణాలు. విక్రమ్ 3201లో 180 నానోమీటర్ల ట్రాన్సిస్టర్లు ఉండటం వల్ల ఈ తప్పులు జరగవు.వేగం కంటే అవసరాలే ముఖ్యం...పీఎస్ఎల్వీ వంటి అంతరిక్ష ప్రయోగాల్లో టెలిమెట్రీ, నావిగేషన్, కంట్రోల్ సిస్టమ్స్ వంటివి నమ్మకంగా పనిచేయాలి. ఈ అవసరాలతో పోలిస్తే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లలోని ప్రాసెసర్ల గిగాబైట్ల వేగం అంత ముఖ్యం కాదు. అత్యంత దుర్భర పరిస్థితు లను తట్టుకుని, అతితక్కువ తప్పులు, వైఫల్యాలతో పనిచేసేలా విక్రమ్ 3201ను తయారు చేశారు. అంతరిక్ష రంగంలో స్వావలంబన అన్న భారతదేశ ఆశలు నెరవేర్చడంలో విక్రమ్ 3201 మేలి మలుపు కాగలదనడంలో సందేహం లేదు. 2009లో కార్టోశాట్ ఉప గ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఉపయోగించిన పీఎస్ఎల్వీ సీ–47లో విక్రమ్ 1601ను ఉపయోగించగా... ఫ్లోటింగ్ పాయింట్ కాలిక్యులేషన్ వంటి ఆధునిక హంగులు, అడా వంటి ఆధునిక కంప్యూటర్ భాషలతో పనిచేయగల సామర్థ్యాన్ని అందించి విక్రమ్ 3201ను తయారు చేశారు. దీన్ని విజయవంతంగా పరీక్షించిన నేప థ్యంలో ఇస్రో ఇప్పటికే 70 నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో కొత్త మైక్రో ప్రాసెసర్ తయారీ యత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. విక్రమ్ 1601 ప్రాసెసర్ వినియోగం కేవలం అంతరిక్షానికి మాత్రమే పరిమితం కాలేదు. రైల్వే వ్యవస్థల్లోనూ వినియోగి స్తున్నారు. ముఖ్యంగా ట్రాక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆటోమెటిక్ ట్రెయిన్ సూపర్విజన్స్ వంటి వాటిల్లో. ఇదే విధంగా విక్రమ్ 3201ను కూడా ఇతర రంగాల్లో వాడే అవకాశం ఉంది. విక్రమ్ 1601కు ముందు దేశం ప్రాసెసర్ల దిగుమతిపైనే ఎక్కువగా ఆధార పడి ఉండేది. తద్వారా సరఫరా, నియంత్రణలు, భద్రతాంశాల విషయంలో సవాళ్లు ఎదుర్కొనేది. 1998 నాటి పోఖ్రాన్ అణు పరీక్షల తరువాత అమెరికా విధించిన ఆంక్షలతో స్వావలంబన అవసరం మరింత పెరిగిన విషయం తెలిసిందే. ఈ సవాలును స్వీకరించిన శాస్త్రవేత్తలు విక్రమ్ 3201తో తొలి అడుగు వేశారని చెప్పాలి. అంత రిక్ష రంగంలో సాంకేతిక పరిజ్ఞానపరంగా ‘ఆత్మ నిర్భరత’ సాధించే విషయంలో ఇది నిజంగానే మేలిమలుపు!టి.వి. వెంకటేశ్వరన్ వ్యాసకర్త మొహాలీలోని ‘ఐసర్’ విజిటింగ్ ప్రొఫెసర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
డోనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు) రాయని డైరీ
అందంలోనే వికారం కలిసి ఉంటుంది! ఇది సృష్టి వైరుద్ధ్యమా, లేక మానవ మనో వైకల్యమా అని రెండు రోజులుగా వైట్ హౌస్ నుండి బయటికి రాకుండా టీవీ ముందే కూర్చొని ఆలోచిస్తున్నాను.విజ్ఞులు వికారాన్ని చూడొద్దని అంటారు. అందాన్ని వేరు చేసి చూడమంటారు! అందం, వికారం పక్కపక్కనే ఉంటే వేరు చెయ్యొచ్చు. పైనొకటి, కిందొకటి ఉంటే వేరు చెయ్యొచ్చు. ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటే ఎలా వేరు చేయటం?నేను టీవీ చూస్తుంటానని తెలిసి,జిన్పింగ్ నాకోసం బీజింగ్లోని తియానన్మెన్లో చేయించిన మిలిటరీ పరేడ్; తియాంజిన్లో పుతిన్, మోదీలతో కలిసి జిన్పింగ్ కలిసి చేసిన చిరునవ్వుల ప్రదర్శన (అది కూడా నేను టీవీ చూస్తుంటానని తెలిసే) రెండూ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి. మిలిటరీ పరేడా, లేక చిరునవ్వుల ప్రదర్శనా... ఏది ఆ రెండింటిలో బ్యూటిఫుల్గా ఉందంటే మాత్రం, చిరునవ్వుల ప్రదర్శనే అంటాన్నేను. చిరునవ్వుల్లో కేవలం చిరునవ్వులే ఉండవు. చేతులు కలుపుకోవడం ఉంటుంది. భుజాలు తాకించుకోవటం ఉంటుంది. హత్తుకోవటం ఉంటుంది. ఆలింగనం చేసుకోవటం ఉంటుంది. అదోలా చూసు కోవటం ఉంటుంది. ఏదైనా ఇచ్చిపుచ్చు కోవటం ఉంటుంది. కలిసి నాలుగు అడుగులు వేయటం ఉంటుంది. పరవశం కలిగించే చిన్న మాట ఉంటుంది. పెద్దపెట్టున నవ్వేయటం ఉంటుంది. లోకం దృష్టిలో పడాలన్న తహతహ ఉంటుంది. ఆ లోకంలో మళ్లీ పర్టిక్యులర్గా ఫలానా వ్యక్తి కంట పడుతున్నామా లేదా అనే దొంగచూపు ఉంటుంది. ఇన్ని ఉంటాయి చిరునవ్వుల్లో! గర్జించే శతఘ్నులను మించిన మారణాయుధాలు ఈ చిరునవ్వులు. వావ్!! చిరునవ్వుల మారణాయుధాలు! వండర్ ఫుల్ థాట్. నోబెల్ను పెద్ద పెద్ద పనులకే ఇవ్వక్కర్లేదు. నాకొచ్చే ఇలాంటి చిన్న చిన్న థాట్స్కు కూడా ఇవ్వొచ్చు.జిన్పింగ్ నన్ను టీవీలోంచి దొంగ చూపులు చూడటం నేను గమనించాను. తనేంటో నాకు చూపించుకోవటం అది. నా దగ్గర పుతిన్ ఉన్నారు, మోదీ ఉన్నారు, కిమ్ జోంగ్ ఉన్ ఉన్నారు అని చెప్పుకోవటం! ఏం మనిషి అతను?! చైనాకు జపాన్ లొంగిపోయి 80 ఏళ్లయిందని బీజింగ్లో పరేడ్ చేయించి ఆ పరేడ్కు అమెరికాను పిలవలేదు! పరేడ్ అందంగా ఉంది. జిన్పింగ్ మైండే... వికారంగా ఉంది.అమెరికా బెదిరిస్తేనే కదా జపాన్ వెళ్లి చైనాకు లొంగిపోయింది! ఫారిన్ గవర్నమెంట్స్కి థ్యాంక్స్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్కి థ్యాంక్స్ అంటారే గానీ, అమెరికాకు థ్యాంక్స్ చెప్పటానికి ఏమైంది జిన్పింగ్కి! చరిత్రను మరిచిపోయారా లేక, చేసిన మేలునే మరిచిపోయారా? చూస్తుంటే రష్యా, ఇండియాలు కూడా అమెరికాను మర్చిపోయేలా చేసేలా ఉన్నారు జిన్పింగ్! ఇలాంటప్పుడే నాకు మరింతగా ఎవరికైనా, ఏదైనా చేయాలనిపిస్తుంది. కాల్ బటన్ నొక్కి, ‘‘పీటర్ కెంట్... మనం ఇండియా మీద ఎంత వేశాం, రష్యా మీద ఎంత వేశాం, చైనా మీద ఎంత వేశాం?’’ అని అడిగాను. నా ట్రేడ్ అడ్వైజర్ ఆయన. ‘‘ఎస్, మిస్టర్ ప్రెసిడెంట్. ఇండియా మీద 50, చైనా మీద 30, రష్యా మీద 10’’ అని గుర్తు చేశారు పీటర్ కెంట్.‘‘వెల్, మిస్టర్ కెంట్. ఇండియా మీద ఇంకో 25 వేస్తే ఎలా ఉంటుంది? మొత్తం కలిపి 75’’ అన్నాను. ‘‘గుడ్ ఐడియా మిస్టర్ ప్రెసిడెంట్. మైండ్–బ్లోయింగ్’’ అన్నారు పీటర్ కెంట్. ఎవరికైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆత్మీయులే కదా ముందుగా మనకు గుర్తుకొస్తారు. మోదీతో నేను బాగా కలిసిపోతాను. ఫిబ్రవరిలో ఆయన ఇక్కడే ఉన్నారు! మళ్లీ సెప్టెంబర్ 23న యూఎన్ఓ సమావేశానికి ఇక్కడే ఉంటారు. -
అందరికీ వైద్యం అందేదెలా?
వ్యక్తిగత వికాసానికీ, దేశ ఆర్థికాభివృద్ధికీ ఆరోగ్య పరిరక్షణకు పూచీనిచ్చే సదుపాయాలు అత్యవ సరం. ఆ సేవలు విçస్తృతమైనవిగా ఉండాలి. ఆరోగ్యం కాపాడుకోవడాన్ని ప్రోత్సహించడం, వివిధ రుగ్మతలను వెంటనే కనిపెట్టడం, తొలి దశలోనే సరైన ఔషధాలను సేవించేటట్లు చేయడం వరకు దీనిలోకి చాలా వస్తాయి. దీని పరిధిని పునరావాస సేవలు, అవసరమైన చోట ఉపశమన సంరక్షణ కల్పించడానికి కూడా విస్తరించాలి. సగటు ఆయుర్దాయాన్ని పొడిగించడం నుంచి పూర్తి జీవితాన్ని ఆనందమయంగా గడిపేటట్లు చేయడంపై దృష్టి కేంద్రీకరించాలి. వ్యక్తులు తమ పూర్తి సామర్థ్యం మేరకు పని చేయడానికి, తద్వారా దేశాన్ని సుసంపన్నం చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ అవతరించేందుకు ప్రతి భారతీయుని ఆరోగ్యం చోదకశక్తిగా పనిచేస్తుంది. వైద్యానికి ప్రతిబంధకాలుదేశంలో నివసిస్తున్న అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగల స్థితి లేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) అధినేత మోహన్ భాగవత్ ఇటీవల వ్యాఖ్యానించారు. ‘‘ఏ వ్యక్తికైనా ఆరోగ్య రక్షణ, విద్య అత్యంత ముఖ్యమైనవి. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య మానవుడికి ఆ రెండూ అందని మావిపండుగానే ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. ఇందౌర్లో ఆరోగ్య కేంద్ర–క్యాన్సర్ కేర్ సెంటర్ను ప్రారంభిస్తూ భాగవత్ అలా వ్యాఖ్యానించారు. చాలా మందికి వైద్యం చేయించుకోవాలనే తాపత్రయం ఉన్నా దగ్గరలో అవి లేకపోవడం, ఉన్నా స్థోమతకు మించి ఉండటం, వైద్యం ఉన్నత ప్రమాణాలతో లేకపో వడం వంటివి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. దీర్ఘకాలిక ఔట్ పేషంట్లు కొందరు వైద్యానికి పెట్టిన ఖర్చుతో పేదరికంలోకి జారుకుంటున్నారు. సదుపాయాలకు మించి పేషెంట్లు ఉండటం, ఆ యా కేంద్రాల సామర్థ్యం అంతగా లేకపోవడం, పాలనాపరమైన వైఫల్యాలతో ఆయు ష్మాన్ భారత్ కార్యక్రమం సవాళ్ళను ఎదుర్కొంటోంది. దానికితోడు, భారత దేశంలో సమాఖ్య వ్యవస్థ అమలులో ఉంది. కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం వేర్వేరు బాధ్యతలను అప్పగించింది. ఆరోగ్య రక్షణ సదుపాయాలకు రూపకల్పన చేయడం, అమలుపరచడంలో ఆ రెండింటి మధ్య ఎంతో సమన్వయం అవసరం. బహుముఖ సేవలు వాడుకోవాలి!భారతదేశపు ఆరోగ్య సేవలు ప్రైవేటు రంగంపైన కూడా ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఒక ప్రణాళిక కింద కాక, అవసరాలు, అవకాశాలకు తగ్గట్లుగా ఇది ఒక మిశ్రమ వ్యవస్థగా తయారైంది. విడిగా ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లు ఇప్పటికీ ఉన్నారు. కుటుంబాల ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సింగ్ హోమ్లు ఉన్నాయి. ఏదో ఒక వైద్య విభాగానికి పరిమితమై, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారిని చేర్చుకుని సేవలందిస్తున్న ఆస్పత్రులున్నాయి. మల్టీ –స్పెషాలిటీ కార్పొరేట్ ఆసుపత్రుల సంగతి సరేసరి. అలా ప్రైవేటు వైద్య రంగం బహుముఖాలుగా ఉంది. స్వచ్ఛంద సంస్థల రంగం చెదురుమదురుగా ఉన్న చారిటబుల్ ఆసుపత్రులకు పరిమితమవుతోంది. వాటిలో కూడా కొన్నింటిలో అధునాతన వైద్య సదుపాయాలున్నాయి. అవి ధనిక రోగుల నుంచి కాస్త ఎక్కువ వసూలు చేసి, ఆ మార్జిన్ ద్రవ్యాన్ని పేద రోగుల చికిత్సకు వెచ్చిస్తున్నాయి. ప్రైవేటు రంగంపై నియంత్రణ పెళుసుగా ఉండటంతో, అది విధించే చార్జీలు తరచు సామాన్య మానవునికి పెను భారంగా పరిణమిస్తున్నాయి. ప్రతి ఒక్కరినీ ఆరోగ్య రక్షణ (యు.హెచ్.సి.) గొడుగు కిందకు తీసు కొచ్చేందుకు, మరింత మానవతావాద దృష్టితో స్పందించేందుకు ప్రభుత్వ రంగాన్ని మనం ఉద్దీపింపజేయవలసిన అవసరం ఉంది. పెద్ద సంఖ్యలో ఉంటున్న రోగుల తాకిడిని తట్టుకునేటట్లు, మరింత సమర్థతతో పనిచేసే టట్లు ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలి. ప్రైవేటు రంగం మరింత బాధ్య తాయుతంగా వ్యవహరించేటట్లు చూడాలి. అనవసర పరీక్షలు, అదనపు చార్జీల జోలికి వెళ్లకుండా వాటిని అరికట్టాలి. స్వచ్ఛంద రంగానికి మరిన్ని వనరులు సమకూర్చాలి. ప్రజలనే భాగస్వాములుగా చేసే విధంగా ప్రజా రోగ్య, సమాజ సంబంధిత క్లినికల్ కేర్ సెంటర్లను నెలకొల్పవచ్చు. ఇవి కొన్నిచోట్ల మొదలైతే మిగిలిన ప్రాంతాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.టెలీ–హెల్త్ సేవలను ప్రభావశీలంగా అమలులోకి తెచ్చేందుకు ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణను వినియోగించుకోవచ్చు. కంప్యూటర్ సేవల్లో ముందున్నాం కనుక ఇది సాధ్యపడే అంశమే. డాక్టర్లు లేకుండా టెక్నాలజీతో నడిచే ఆరోగ్య రక్షణ కేంద్రాలు ప్రాథమిక రక్షణకు సంబంధించి చాలా వరకు సేవలందించవచ్చు. తద్వారా, రెండవ, మూడవ స్థాయి కేంద్రాలపై భారం తగ్గుతుంది. టెక్నాలజీ కేంద్రాలే వ్యాధి తీవ్రతను బట్టి రోగి ఎక్కడికి వెళ్లాలో రిఫర్ చేయవచ్చు. ఇతర వైద్య విధానాలను కూడా ప్రోత్సహించి తీరాలి. ఏ రోగానికి ఏ రకం వైద్యం పనిచేస్తుందో గుర్తించి, వివిధ వైధ్య విధానాల పాత్రల మధ్య సరిహద్దు రేఖ గీయవచ్చు. అల్లోపతీ, సంప్రదాయ వైద్య పద్ధతులకు సరిపో యినంతగా వనరులు కేటాయిస్తేనే ఫలితం ఉంటుంది. అన్నింటినీ సమన్వయం చేయాలి!ఈ ప్రయత్నాలన్నీ సజావుగా సాగడానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు రెండింటిలోను ఆరోగ్యానికి ఎక్కువ నిధులు కేటాయించక తప్పదు. ఆరోగ్యంపై ప్రభుత్వ వ్యయం స్థూల జాతీయోత్పత్తిలో 3 శాతానికి క్రమంగా పెరగాలి. ఆరోగ్య రక్షణకు వ్యక్తులు తమ జేబుల్లోంచి తీసి పెట్టే ఖర్చు 20% కన్నా తక్కువగా ఉండేట్లు చూడాలి. ఆరోగ్య సేవల రూపకల్పనలోను, అందించడంలోను ధర్మమే ప్రధాన భూమిక వహించాలి. సమ న్యాయం అందరికీ ఒకే రకమైన సేవలను అందుబాటులోకి తెస్తుంది. నేషనల్ హెల్త్ మిషన్, పి.ఎం. జె.ఏ.వై. మధ్య సంబంధం లేకుండా ఉన్నవాటిని తొలగించి, సమీకృత రక్షణ నమూనాలను సృష్టించవచ్చు. ప్రభుత్వ ప్రైవేటు వ్యవస్థల మధ్య; అల్లోపతీ, సంప్రదాయ వైద్య వ్యవస్థల మధ్య పొంతన, సమన్వయం తీసుకొచ్చేందుకు చర్చలు జరగవలసి ఉంది.ప్రొ‘‘ కె. శ్రీనాథ్ రెడ్డి వ్యాసకర్త ‘పీహెచ్ఎఫ్ఐ యూనివర్సిటీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సైన్సెస్’లో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ -
ఇది సరికొత్త 2.0 ప్రపంచం
ఒక నిశ్శబ్ద విప్లవం చాప కింద నీరులా వస్తోంది. అది యుద్ధ భేరీలు మోగించదు. విజయ పతాకాలు ఎగరేయదు. కంటికి కనిపించని, ఊహకు అందని ఉప్పెనలా ఖండాలను ముంచెత్తుతూ వస్తోంది. విధ్వంసం దానికి కొలమానం కాదు. అది సకల సాంకేతికతల మహా కలయిక! ఆలోచనా పరులు, కార్యశీలురు ఆ ‘వరల్డ్ 2.0’కి ఊపిరులూదుతున్నారు.కొత్త ప్రపంచ సమతుల్యతకోవిడ్ విలయంలో దెబ్బతిన్న ప్రపంచ వాణిజ్య వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రపంచ దేశాల మధ్య కొరవడిన వాణిజ్య సమతుల్యతను తిరిగి తెచ్చే ఈ ప్రయత్నా లకు పరస్పర అవసరాలే చోదక శక్తి. డాలరు బలహీన పడటం ప్రపంచం కోలుకుంటోందనడానికి గట్టి సంకేతం. అంతర్జాతీయ వాణిజ్యం మీద అతిగా ఆధారపడకుండా డాలరును బలహీన పరచడం మంచిదే. ఈ పరిణామం వల్ల సరుకుల వాణిజ్యంలో స్థిరత్వం, అంతర్జాతీయ వడ్డీరేట్లలో సారూప్యత నెలకొంటాయి.సాంకేతికతల మీద మార్కెట్ల విశ్వాసం ఆ యా కంపెనీల విలువల్లో ప్రతిబింబిస్తోంది. ఎన్విడియా మార్కెట్ విలువ 4 లక్షల కోట్ల డాలర్లకు చేరువైంది. దీన్ని ఆ కంపెనీ వ్యక్తిగత విజయంగా చూడకూడదు. ఏఐ ఆధారిత నూతన వ్యవస్థ వేరూనుకుంటోందనడానికి నిదర్శనం. అమెజాన్, యాపిల్, ఇంకా ఇతర కంపెనీల వృద్ధి వాటికి మాత్రమే పరిమితం కాదు. ఒక బృహత్ పరిణామంలో భాగంగా ఈ మార్పును గుర్తించాలి. సాంకేతికతల మహా కలయికటెక్నాలజీల ముందడుగు కీలక ఘట్టానికి చేరింది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయో టెక్నాలజీ, అటానమస్ సిస్టమ్స్... ఇవేవీ ఇకమీదట వేటికవి కావు. అన్నీ కలసిపోయి ఒకే ఒక్కటిగా ఆవిర్భ విస్తున్నాయి. ఈ మహా కలయిక మానవ పురోభివృద్ధికి స్వయంచోదిత ఇంజిన్ కాబోతుంది. ఇది నూతన ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది. వ్యయాలను తగ్గిస్తుంది. అందుబాటులో ఉంటుంది.ఆరోగ్య విప్లవం మరింత ప్రముఖంగా ఉంటుంది. నూతన ఔషధాలను విజయవంతంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి ఇప్పుడు దశాబ్దాలు పడుతుండగా, ఇకపై నెలల్లోనే డ్రగ్ డిస్కవరీ జరుగుతుంది. డయాగ్నస్టిక్స్ లో ఏఐ ప్రవేశించి వ్యాధులను తొట్ట తొలి దశలోనో ఇంకా ముందుగానో నిర్ధారించడం సాధ్యపడుతుంది. 24 గంటలూ దేహాన్ని అంటిపెట్టుకుని ఉంటూ మన ఆరోగ్య మార్పుల్ని నిరంతరం పర్యవేక్షించే పరికరాలు వస్తున్నాయి. వ్యాధి నిర్మూలన నుంచి వ్యాధి నివారణ యుగంలోకి అడుగు పెడు తున్నాము. దీర్ఘాయుష్షు ఇంకెంతో కాలం కొంతమందికే సొంతం కాదు. అది అందరికీ అందించాల్సిన ప్రభుత్వ లక్ష్యం అవుతుంది.రూపురేఖలు మారుతున్న విద్యా రంగంచదువును డిగ్రీలతో కొలిచే రోజులు పోతున్నాయి. పట్టాలకంటే ప్రాసంగికతే ప్రధానం అవుతుంది. వ్యక్తిగత ప్రధానమైన, నైపుణ్యాల ఆధారితమైన విధానం దాన్ని ఆక్రమిస్తుంది. ఏఐ ట్యూటర్లు, వర్చువల్ క్లాస్ రూములు, డిజిటల్ ల్యాబ్లు వచ్చాయి. చదువుకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుంది. ఈ విద్యా విప్లవం ‘వరల్డ్ 2.0’కు పునాది అవుతుంది.వ్యర్థాల సద్వినియోగంఇప్పుడు వ్యర్థాలను ముడిసరుకుగా వాడుతున్నారు. కర్బన కాలుష్య వాయువులను పీల్చుకుని నిల్వ చేసే ఇటుకల తయారీ, నాచు ఆధారిత ప్యాకేజింగ్ మెటీరియల్ ఉత్పత్తి, మునిసిపల్ మురుగును, పంటల వ్యర్థాలను హైడ్రోజన్గా మార్చి దాంతో విమాన ఇంధనం తయారీ... ఇలా ఎన్నో టెక్నాలజీలు అభివృద్ధి అయ్యాయి. చెత్త కూడా సంపదగా మారింది. ఈ మార్పులోప్రపంచ శాంతి బీజాలు ఉన్నాయి.సంపదతోనే ప్రపంచ భద్రత సంపదతోనే శాంతి అనేది కొత్త మంత్రం కాబోతోంది. డేటా, ఇంధనం, స్వచ్ఛమైన గాలి, వైద్యం, అవకాశాలు... ఇవి అన్ని దేశా లకూ అందుబాటులో ఉండేట్లయితే ఇక దేనికోసం పోరాడాలి? భౌతిక ఆధిపత్యం స్థానే డిజిటల్ సార్వభౌమత్వం రాజ్యమేలే రోజుల్లో, ప్రాదేశిక ఆక్రమణ ఆర్థిక పరంగా అవివేకం అవుతుంది.ఆధార్, యూపీఐ, డిజీ లాకర్, ఓఎన్డీసీ లాంటివాటితో కూడిన ఇండియా డీపీఐ (డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) నమూనా సమ్మిళిత విధానాలు భద్రతకు ఎలా బాటలు వేయగలవో రుజువు చేస్తున్నాయి. ప్రపంచం ఈ నిశ్శబ్ద పరివర్తనను గమనిస్తోంది. వరల్డ్ 2.0 తాత్విక చింతనసమృద్ధి పెరిగే కొద్దీ హింస క్షీణిస్తుంది. పరమార్థం తెలుసు కోవడం మీద ప్రజలు తిరిగి దృష్టి పెడతారు. పనిలో ప్రయోజనం, రాజకీయాల్లో నిజాయతీ, ఆవిష్కరణల్లో నైతికత, సంస్థల్లో పారదర్శ కత ఉండాలని డిమాండ్ చేస్తారు. వారి దృక్పథం మరింతగా అంత ర్జాతీయతను సంతరించుకుంటుంది. వారి కార్యకలాపాలు సరిహ ద్దులను అధిగమిస్తాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్టుల నుంచి ఆర్కి టిక్ మంచు నదుల వరకు అన్ని ప్రాంతాల గురించీ ఆలోచిస్తారు. సైన్సును స్పిరిట్తో, టెక్నాలజీని హ్యుమానిటీతో అనుసంధానిస్తారు.శాంతి సాధన కోసం ఆపరేటింగ్ సిస్టం వరల్డ్ 2.0 ఆవిర్భవిస్తున్న తరుణంలో దాన్ని దాని మానానికి వదిలేయకూడదు. సుస్థిర శాంతి కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను డిజైన్ చేసుకోవాలి. పర్యావరణ సాంకేతికత, వ్యవసాయ సాంకేతి కత, విద్యా సాంకేతికత, వైద్య సాంకేతికతలు అన్నీ పరస్పరం సహ కరించుకునేలా టెక్నాలజీ కన్వర్జ¯Œ ్స ప్లాట్ఫారాలు రూపొందించు కోవాలి. ఏఐ నైతిక విలువలకు, అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి ఉండే డిజిటల్ పబ్లిక్ గూడ్స్ తయారు చేసుకోవాలి. అయితే ఈ వరల్డ్ 2.0 ఎలాంటి ఒప్పందం కోసం నిరీక్షించడం లేదు. లక్షల కోట్ల ఎంపికలు, వందల కోట్ల చర్యలు, లక్షల ఆవిష్కర ణల ద్వారా అది ఆవిర్భవిస్తోంది. ఓ కొత్త యుగం కళ్లు తెరుస్తోంది. అక్కడ శాంతి అంటే ఏమిటి? శ్రేయస్సు, సమ్మిళితం, అవకాశం, ఉమ్మడి సారథ్యం ఇవన్నీ నెలకొని ఉండటమే! అంతే కానీ, యుద్ధం లేకపోవడం మాత్రమే శాంతి కాదు. వరల్డ్ 2.0 ఇప్పుడు మనముందుంది. దాన్ని స్వాగతిద్దాం.-వ్యాసకర్త కార్పొరేట్ నిపుణుడు, రచయిత(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)- శైలేష్ హరిభక్తి -
అన్నీ మంచి శకునములే...
భారతదేశంపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు 50 శాతానికి పెంచిన ఐదు రోజులకు జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశాల నుంచి దేశానికి అన్నీ మంచి శకునాలే లభించాయి. చైనా, రష్యాలతో సంబంధాలు మరింత బలో పేతమయ్యాయి. ఈ కొత్త స్థితి వెంటనే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారోలు,ఇండియాపై చేసిన అనుచితమైన వ్యాఖ్య లలో ప్రతిఫలించింది. ప్రధాని మోదీ తమపై కొంత అలిగినా తిరిగి వైఖరి మార్చుకోగలరని వారు చివరి వరకూ ఆశించారు. ఆయనకు తాము తప్ప గత్యంతరం లేదనుకున్నారు. కానీ, మోదీ వైఖరి మరింత దృఢంగా మారినట్లు తియాన్జిన్లో అడుగడుగునా కనిపించింది.అర్థాలు–అంతరార్థాలుఈ సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్న మాటలేమిటో యథాతథంగా చూడటం అవసరం. జిన్పింగ్తో సమావేశం అనంతరం మోదీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ, రెండు దేశాలూ అభివృద్ధిలో భాగస్వా ములే తప్ప ప్రత్యర్థులు కాదనీ, భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారరాదనీ భావించినట్లు పేర్కొన్నది. పరస్పర గౌరవం, ఉభయుల ప్రయోజనాలు, ఇరువురి సున్నితమైన మనోభావాల గుర్తింపు అవసర మన్నది. ఇటువంటి అవగాహనలు 21వ శతాబ్దపు ధోరణులకు అను గుణంగా బహుళ ధ్రువ ప్రపంచంతోపాటు బహుళ ధ్రువ ఆసియా రూపు తీసుకునేందుకు ఆవశ్యకమని పేర్కొన్నది. చైనాతో సంబంధాల మెరుగుదల నిరుటి కజాన్–బ్రిక్స్ సమావేశాల నుంచే మొద లైందని పలుమార్లు గుర్తు చేస్తున్న మోదీ, ఇపుడు రెండు దేశాల మధ్య ‘శాంతి, సుస్థిరతల వాతావరణం ఏర్పడింద’న్నారు. జిన్పింగ్ మాటలను కూడా కొంత చెప్పుకొన్న తర్వాత ఇరువురి అభిప్రాయాల అర్థాలు, అంతరార్థాలు చూద్దాము: రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80 సంవత్సరాల తర్వాత కూడా ప్రచ్ఛన్న యుద్ధ కాలపు మనస్తత్వం, ఆధిపత్య ధోరణి, ప్రొటెక్షనిజం కొనసాగుతున్నాయి. కొద్ది దేశాల అంతర్గత విధానాలను ఇతరులపై రుద్దకూడదు. అంతర్జాతీయ నియమ నిబంధనలన్నవి పరీక్షాత్మక దశకు చేరుకున్నాయి. సమ్మిళితమైన ఆర్థిక ప్రపంచీకరణ అవసరం. భారతదేశం, చైనాలు పరస్పర విశ్వాసాన్ని బలపరచుకుని, పరస్పర అభివృద్ధికి అవకాశాలను పెంచుకోవాలి. వ్యూహాత్మకమైన, దీర్ఘ కాలిక దృక్కోణంతో వ్యవహరించాలి. నాయకులిద్దరూ చెప్పినవి ఇంకా ఉన్నాయిగానీ, అన్నీ ఈ ప్రధా నమైన మాటల చుట్టూ తిరిగేవే. సరిహద్దు వివాదాన్ని, పాకిస్తాన్ అంశాన్ని ప్రధానంగా ముందుకు తెచ్చుకుని అభివృద్ధి సహకార అవకాశాలను విస్మరించవద్దన్నది మొదటి అంతరార్థం. ఇరువురి సున్నిత మనోభావాలన్నది ఇందుకు సంబంధించినదే గాక, ఆసియాతో పాటు ప్రపంచంలోనూ ఒక శక్తిగా ఎదగజూస్తున్న ఇండి యాకు ఆటంకాలు కల్పించరాదనే అర్థం వస్తుంది. ఇక్కడ, బహుళ ధ్రువ ప్రపంచం అన్నమాటతో పాటు, బహుళ ధ్రువ ఆసియా అనే మాటను కొత్తగా ఉపయోగంలోకి తేవటం గమనించదగ్గది. అనగా, చైనాయేగాక ఇండియా కూడా ఒక ధ్రువమనేది గుర్తించటమన్న మాట. 21వ శతాబ్దపు ధోరణులలోకి అది కూడా వస్తుంది. సుంకాలకు ముందు నుంచే...చైనాతో సంబంధాల మెరుగుదల కజాన్ నుంచే మొదలైన మాట నిజమే అయినా ఆ విషయాన్ని మోదీ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు? కేవలం ట్రంప్ సుంకాలు అందుకు కారణమని అమెరికాలో, బయటా జరుగుతున్న ప్రచారం నిజం కాదనీ, భారత దేశం తన ప్రయోజనాల కోసం స్వతంత్ర నిర్ణయాలు గతం నుంచే తీసుకుంటున్నదనీ ప్రకటించేందుకు!చైనా అధ్యక్షుని ఉద్దేశం... రెండు దేశాల మధ్య సరిహద్దుల వంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అందుకు పరిష్కార ప్రయ త్నాలు జరుగుతున్నందున, అందుకు బందీ కాకుండా, పరస్పర అభివృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టాలని! అందుకు అనుగుణంగా తాము భారతదేశంతో కలిసి పనిచేయగలమనటం! ఆయన ఉప యోగించిన డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయటమనే మాటలో ఈ అంతరార్థాలన్నీ కనిపిస్తాయి. మారుతున్న పరిస్థితులు, అందు వల్ల రెండు దేశాలకు కలుగుతున్న సమస్యలు, వాటి నుంచి బయట పడేందుకుగానీ, భవిష్యత్తులో అభివృద్ధి కోసం గానీ అవసరమైన వేమిటో రెండు దేశాల నాయకులకు స్పష్టమైన అవగాహన ఏర్పడి నట్లు కనిపిస్తున్నది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా నిలిచి పోయిన ఒప్పందాలు ఒక్కటొక్కటిగా ఇప్పటికే జరుగుతుండటం తెలిసిందే.స్పష్టమైన సందేశంరష్యా విషయానికి వస్తే, ప్రధాని మోదీ రష్యా అధ్యక్షునితో జరిపిన సమావేశం, అనూహ్యంగా ఆయన కారులో ప్రయాణించటం, హోటల్కు చేరిన తర్వాత కూడా కారులోనే ఉండి ముప్పావు గంట సేపు చర్చించి ఆ ఫొటోను పోస్ట్ చేయటం, బయట కూడా పుతిన్తో కలిసి వెళ్లి జిన్పింగ్తో చేసిన సంభాషణల వంటివన్నీ ఇటు భారతీయులకు, ప్రపంచ దేశాలకు, అటు అమెరికా శిబిరానికి పంపవలసిన సందేశాలనే పంపాయి. దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగటమే గాక, ఉభయుల మధ్యగల చిరకాలపు సాన్నిహిత్యం ఇంకా బలపడగలదని, సుంకా లకు వెరవబోమనే సంకేతాలను భారత ప్రధాని అమెరికా శిబిరానికి 50 శాతం నాటి ముందుకన్నా బలంగా పంపటం విశేషం. ఇప్పటి కైనా వివేకం కలిగితే ఆ శిబిరం చేయవలసింది తమ తీరును అన్ని విధాలా మార్చుకుని, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వ్యవహరించటం!షాంఘై సంస్థ నిజానికి రక్షణ, తీవ్రవాదం అంశాలకు సంబంధించినది. కానీ, మొదటిసారిగా తియాన్జిన్లో ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వ్యూహాల గురించి చర్చించటం మారుతున్న పరిస్థితులకు, పాశ్చాత్య ప్రపంచానికి బయటి దేశాల ఆందోళనలు, అవసరాలకు అద్దం పడుతున్నది. ఈ విధంగా ‘బ్రిక్స్’కు అదనంగా మరొక సంస్థ క్రమంగా బలపడుతున్నది. కజాన్లో వలెనే తియాన్జిన్లోనూ పాశ్చాత్య ఆధిపత్య వ్యతిరేకత, బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం, డాలర్ను క్రమంగా బలహీనపరచటం, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలు, ప్రస్తుతం గల అంతర్జాతీయ వ్యవస్థలపై అమెరికా కూటమి నియంత్రణ స్థానే సంస్కరణలతో ప్రజాస్వామికీకరణ, వర్ధమాన దేశాల మధ్య అవగాహనలను, మైత్రీ సహకారాలను బలపరచుకోవటం ప్రధానాంశాలయ్యాయి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నిషేధించడమే మార్గమా?
ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక–క్రమబద్ధీ కరణ బిల్లు (2025)కు పార్లమెంట్ ఉభయ సభలు ఇటీవల ఆమోదం తెలిపాయి. రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ)ని నిషేధిస్తూ, ఇ–క్రీడలను, సోషల్ గేమ్లను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యం. నగదు పెట్టి ఆడే గేమ్స్ ఆర్ఎంజీ కిందకు వస్తాయి. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వర్చ్యువల్ ఆస్తుల మార్గాలలో ఆడేవి కూడా అదే కోవలోకి వస్తాయి. ఆర్ఎంజీ సామాజిక, ఆర్థిక, మానసిక పరంగా ప్రజారోగ్యానికి హాని కలిగిస్తోందని దాన్ని నిషేధించడానికి గల కారణాలలో పేర్కొ న్నారు. ముఖ్యంగా యువత ఆర్థికంగా బడుగు వర్గాలకు చెందిన వారు వాటి బారినపడుతున్నారని తెలిపారు. పెరుగుతున్న రంగంపై దెబ్బఊహించినట్లుగానే, ఈ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బిల్లు పర్యవసానాలపై ఆదుర్దా సహజంగానే ఆర్ఎంజీ ఆటగాళ్ళు, ఉద్యోగులు, ప్లాట్ ఫారమ్ స్థాపకులు, ఈ పరిశ్రమలోని ఇన్వెస్టర్ల నుంచి వ్యక్తమైంది. పన్ను రూపంలో రాబడులున్నా, విదేశీ ఇన్వెస్ట్మెంట్ల రూపంలో నిధులు తరలి వస్తున్నా... బేరీజు వేసి చూసినపుడు ప్రజాప్రయోజనాలే ముఖ్యమనిపించాయని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ప్రభుత్వం చెబుతున్న కారణాల్లో కొన్ని లొసుగులున్నాయి. ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇంచుమించుగా సున్నా. ఇప్పుడిప్పుడే పెట్టుబడులను ఆకర్షిస్తున్న రంగంపైన ప్రభుత్వం విరుచుకుపడటం వింత గొలుపుతోంది. పైగా, ఈ బిల్లుపై చర్చ జరగకుండానే లోక్సభ ఆమోదం తెలుపడం గమనార్హం. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపవలసిందని కొందరు రాజ్య సభ సభ్యులు కోరారు. కానీ, అసలు సమస్య మరెక్కడో ఉంది. భారతదేశంలో విధాన నిర్ణయాలు సాధారణంగా రెండు విధాలుగా రూపొందుతున్నాయి. ఒకటి– రాజకీయ నాయకులు వారి నియో జక వర్గాల్లోని ప్రజల అభిప్రాయాలను విని బిల్లులు రూపుదిద్దుకునే టట్లు చేయడం. రెండు – మీడియా కథనాలు. ఇది రెండు సమస్య లను సృష్టిస్తోంది. కాసేపు మిమ్మల్నే ప్రజా ప్రతినిధిగా ఊహించుకోండి. మీ వద్దకు శుభవార్తలు మోసుకొచ్చే పౌరులు అరుదు. ఉద్యోగం, ఆసుపత్రిలో పడక కేటాయింపు, లేదా తీసుకున్న రుణంలో కొంత రాయితీ ఇవ్వాలని కోరడం వంటి పనులతో వస్తారు. డిజిటల్ సేవలలోని సానుకూల కోణాలను వారి నుంచి వినే అవకాశం తక్కువ. ఉద్యోగాల కల్పన, ఉత్పాదకత, లేదా సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని పెంపొందించడానికి సంబంధించిన అంశాలను వారు ప్రస్తావించరు.సమస్య లోతులు పట్టించుకోకుండా...కోర్టుల మాదిరిగానే, చట్టసభ సభ్యులు కూడా కష్టనష్టాలు, విషాద ఘటనలపైనే ఎక్కువ శ్రద్ధ పెడతారు. ఆర్ఎంజీ వల్ల అప్పుల్లో కూరుకుపోయినవారి, ఆత్మహత్యలు చేసుకున్నవారి కథనాలే వారి దృష్టికి వస్తాయి. అయితే, అటువంటి సమస్యలకు మూలాలు ఇంకా లోతున ఉంటాయి. అలా దెబ్బతిన్నవారిలో చాలా మంది నియమ నిబంధలన్నింటినీ తుంగలో తొక్కే విదేశీ ఆపరేటర్ల చేతిలో బాధితులు. మూకుమ్మడిగా అన్నింటినీ నిషేధించడం వల్ల ఇక్కడ ఒనగూడగల ప్రయోజనం స్వల్పం. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్లు మళ్ళీ తెరపైకి వస్తారు. నిషేధించిన ఇతర కార్యకలాపాల విషయంలో మాదిరిగానే, ఈ రంగంలో కూడా అనధికారిక, నియంత్రణ లేని మార్కెట్ కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. ఆర్ఎంజీ వ్యసనం సమస్యను పరిష్కరించేందుకు యాక్సెస్ కంట్రోల్స్ అమలు చేయవచ్చు. తనకు తాను బయటకొచ్చేసే టూల్స్ ప్రవేశపెట్టవచ్చు. అనుమానాస్పద నడతను కనిపెట్టే సదుపాయం కల్పించుకోవచ్చు. రిఫరెల్ హెల్ప్లైన్స్ను తప్పనిసరి చేయవచ్చు. సకల భారతీయ ఆర్ఎంజీ స్టార్టప్లను తుడిచిపెట్టేసే బదులు, నిబంధనలను ఖాతరు చేయని సంస్థలపై జరిమానా విధించవచ్చు. వసూళ్లు కురిపిస్తున్నా...వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా వచ్చే రాబడులు, ఉపాధి కల్పన సామర్థ్యం అనే రెండు కోణాల నుంచి కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలించవచ్చు. విధానాన్ని పన్ను రాబడులు నిర్దేశించకూడదని ప్రభుత్వం చెబుతోంది. ఆదర్శనీయమే! కానీ, ఆన్లైన్ గేమింగ్కు కొత్త జీఎస్టీ విధానాన్ని వర్తింపజేసినప్పటి నుంచి (2023 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు) ఆరు నెలల్లో వసూళ్ళ స్థాయి, వృద్ధి కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. వసూళ్ళు 412% ఎదుగుదలను చూపుతూ రూ. 1,349 కోట్ల నుంచి రూ. 6,909 కోట్లకు పెరి గాయి. ఇవి 2024–25లో 200% పైగా వృద్ధి చెంది రూ. 20,000 కోట్లకు పెరిగాయి. మొత్తంమీది జీఎస్టీ రాబడులలోని 10% వృద్ధితో పోల్చుకుంటే, ఇది ఎంత ఎక్కువ ఉందో చూడవచ్చు. పొగాకు ఉత్పత్తుల ‘పాపపు’ పరిశ్రమ నుంచి ఎంత జీఎస్టీ లభిస్తోందో,అంత మొత్తమూ ఆర్ఎంజీ నుంచి కూడా లభిస్తోంది. ఆన్లైన్ గేమ్ల వల్ల ఏర్పడుతున్న ఉద్యోగాల సంఖ్య చిన్నదే అయినా గణనీయమైనదే! ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపుగా రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తోందని అంచనా. అలాగే ఈ పరిశ్రమకు చెందిన ఒక్కో ఉద్యోగి ద్వారా చేకూరుతున్న ప్రత్యక్ష పన్నులు సుమారు రూ. 10 లక్షల వరకు ఉన్నట్లు మా అంచనా. పొగాకు పరిశ్రమలోని వారి వల్ల ఒక్కొక్కరి నుంచి సుమారు రూ. 1,70,000 మాత్రమే సమకూరుతున్నాయి. జాతీయ రాజధాని ప్రాంతంలో వీధి కుక్కలను బంధించవల సిందని సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాన్నే చూడండి. వీధి కుక్కలు కరిచినవారి ఫిర్యాదులు, మీడియా కథనాలు, పిటిషన్లపైనే అది ఎక్కువ ఆధారపడినట్లు కనిపించింది. కుక్క కాటుతో రేబిస్ వల్ల మరణిస్తున్న వారి కంటే, దేశంలో పిడుగుపాటు వల్ల మరణి స్తున్న వారి సంఖ్య ఎక్కువ. పైగా ప్రభుత్వ ఆరోగ్య సదుపాయ కేంద్రాలు చాలా వాటిలో రేబిస్ టీకాల కొరత ఉంది. సమస్యలకు మూలకారణాలను వెతికే బదులు, లక్షణాలను చూసి స్పందించే ధోరణిని ప్రభుత్వం ఇక ముందు కూడా కొనసాగించవచ్చు. సమా జంలోని విభిన్న అవసరాలు, ఆకాంక్షలపై స్పందించే విధంగా భారత్ విధానాలను రూపొందించుకోవాలంటే... ముందుగా అది ‘వినే విధానాన్ని’ సవరించుకోవాలి.వివాన్ శరణ్వ్యాసకర్త విధాన నిపుణుడు, ‘వాంక్డ్! ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ యాన్ ఎకనామిక్ ఐడియాలజీ’ పుస్తక రచయిత(‘ద మింట్’ సౌజన్యంతో) -
ఏకాకిని చేయడమే ట్రంప్ లక్ష్యం
కొన్నాళ్ళుగా మన కళ్ళెదుట నిలుస్తున్న ఒక ప్రశ్నకు జవాబు కనుగొనవలసిన సమయం ఆసన్నమైంది. భారతదేశం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్ష సాధింపు వైఖరిని అవలంబిస్తున్నారా? మన దేశం రోగం కుదిర్చానని ఆయన అనుకుంటు న్నారా? ఔనన్నదే దానికి జవాబు అయితే, మనం భావిస్తున్న దానికన్నా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్లే లెక్క. రష్యన్ చమురును దిగుమతి చేసు కుంటున్నందుకు భారత్పై 25 శాతం సెకండరీ సుంకాలు విధించి నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రకటించారు. రష్యాను దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ‘సమరశీల ఆర్థిక లివ రేజి’ కింద ఆ సుంకాలు మోపుతున్నట్లు చెప్పుకొన్నారు. భారత దేశానికి ఆనుషంగిక నష్టం వాటిల్లుతోందనీ, మన దేశానికి ఏం జరిగినా ట్రంప్ పట్టించుకోదలచుకోలేదనీ అది సూచించడం లేదా?ఒకవేళ, రష్యాపై ‘సమరశీల ఆర్థిక లివరేజి’యే లక్ష్యమైతే, భారతదేశం కన్నా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న చైనాపై సెకండరీ సుంకాలు విధించలేదు ఎందుకని? పైగా, ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను చైనా కొనసాగించడం మంచిదే. అది అంతర్జాతీయ ఇంధన ధరలలో ద్రవ్యోల్బణం రాకుండా నివారిస్తుం’’దని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్యానించారు. ఇవి ద్వంద్వ ప్రమాణాలు కావా? చైనాకు ఒక న్యాయం, భారతదేశానికైతే మరో న్యాయమా?ఇది ప్రతీకారం కాదా?ఇంకా విడ్డూరం ఏమిటంటే, ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్ ద్వారానే నిధులు అందుతున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించడం. భారత్పై ఆంక్షలు విధించాలని యూరప్ను బిసెంట్ కోరారు. రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు వాటిల్లజేస్తోందనీ, ‘‘భారతదేశానికి ఏది ఎక్కువ నష్టదాయకమో అక్కడే దెబ్బ కొట్టడం’’ తమ అభిమతమనీ ట్రంప్కు వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆయన ఇపుడు ‘‘మోదీ చేస్తున్న యుద్ధం’’గా అభివర్ణించారు. ‘‘శాంతికి రహ దారి న్యూఢిల్లీ గుండానే పడుతుంది’’ అంటున్నారు. భారతదేశపు ‘‘మృతప్రాయ’’ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను పట్టించుకో నని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇది కక్ష సాధింపునూ, ప్రతీకా రాన్నీ సూచించడం లేదా?భారత్పై 50 శాతం సుంకాలు విధించడంలో, చైనాకు ట్రంప్ ఇవ్వదలచుకున్న సందేశం ఇమిడి ఉందనీ, అది కూడా భారతదేశా నికి ఆనుషంగిక నష్టం వాటిల్లజేసేదేననీ స్ట్రాట్ఫర్ సంస్థ మాజీ చైర్మన్ జార్జ్ ఫ్రైడ్మ్యాన్ ఇటీవల ఒక పాడ్కాస్ట్లో చెప్పారు.చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ తహతహలాడు తున్నారు. చైనాకు వ్యతిరేకంగా తాము భారత్ పక్షాన చేర బోమనే ట్రంప్ సందేశంలోని ఆంతర్యమని ఫ్రైడ్మ్యాన్ చెప్పారు. ట్రంప్ మనసులో ఉన్న విస్తృత భౌగోళిక రాజకీయ తంత్రంలో, రష్యా, చైనాలకు ప్రాధాన్యం ఉంది. అందుకే భారతదేశాన్ని ‘‘విడిచి పెట్టేయవచ్చు’’.ఫ్రైడ్మ్యాన్ మాటలే నిజమైతే, రష్యాను హెచ్చరించేందుకు, చైనాకు పూర్తిగా వేరే రకమైన సందేశం పంపేందుకు భారతదేశాన్ని వాడుకున్నారు. రెండిందాలా భారతదేశానికే నష్టం. ట్రంప్ లెక్క లేనట్లే వ్యవహరిస్తున్నారు. ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము!అయితే, సుంకాలు, చమురు, భౌగోళిక–రాజకీయాలను మించిన సంకట స్థితినే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం. భారత –అమెరికాల మధ్య సంబంధాలకు పునాది అయిన రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలను ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. హెచ్1బి వీసా విధానంలో మార్పు తేదలచినట్లు అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లట్నిక్ ప్రకటించారు. దాని ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 70 శాతం మంది భారతీయులే కనుక, అది మనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యార్థుల వీసాలను నాలుగేళ్ళ కాలానికి మాత్రమే పరిమితం చేయాలని అమెరికా ఆంతరంగిక భద్రతా శాఖ యోచిస్తోంది. అది భారతీయ విద్యార్థుల సంఖ్యను కుంచింపజేస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థులలో భారతీయులు పెద్ద వర్గంగానే ఉన్నారు. మరోవైపు ఇపుడున్న సంఖ్య కన్నా దాదాపు మూడింతలు ఎక్కువగా 6,00,000 మంది చైనా విద్యార్థులకు ప్రవేశం కల్పించే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, భారతదేశంలో అమెరికా కొత్త రాయ బారిగా సెర్గియో గోర్ నియామకాన్ని మనం ఎలా అర్థం చేసుకో వాల్సి ఉంటుంది? ఆయన ట్రంప్కు చాలా సన్నిహితుడు. కానీ ఆయనకు దౌత్యపరమైన అనుభవం గానీ, భారతదేశం పట్ల ముందస్తు అవగాహన గానీ లేవు. హెచ్చరించే విరామం తీసుకోకుండా, లేదా ప్రత్యామ్నాయాలను సూచించకుండా ట్రంప్ ఎంచుకున్న బాటలో సెర్గియో పరుగులు పెడతారని చాలామంది భయ పడుతున్నారు. అది మనకు శుభ సూచకం ఏమీ కాదు. ఆయన బాధ్యత అంతటితో తీరిపోవడం లేదు. దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా కూడా సెర్గియోను నియమించారు. ఈ అసాధారణ చర్య దేన్ని సూచిస్తోంది? భారతదేశానికి ఇష్టం లేని పనిని బలవంతంగా ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావించాలా? సూటిగా చెప్పాలంటే, భారత–పాకిస్తాన్ల మధ్య తమ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోవాల్సిందేనని చెప్పడమా?ఇది దాడి చేయడమేననే భయం నాలో మొదలైంది. అనేక స్థాయులలో, అనేక విధాలుగా భారతదేశంపై గురిపెడుతున్నారు. ట్రంప్కు ఇక మనం ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము. అంచ నాలు తలకిందులవడంతో ఆయన ఖంగు తిన్నట్లున్నారు. మనపై కోపానికి కూడా లోనై ఉంటారు.సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారని ట్రంప్కు ధైర్యంగా చెప్ప గలిగినవారు, భారతదేశం పక్షాన నిలిచేందుకు సుముఖంగా ఉన్న వారు అమెరికాలో ఎవరైనా ఉన్నారా? డెమొక్రాటిక్ పార్టీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సందేహం లేదు! కానీ, అమెరికాను మళ్ళీ గొప్పదిగా చేయడమనే(మాగా) వర్గంలోని వారి నుంచి గొంతుక వినిపించడం లేదు. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల గొంతు పెగలకపోవడం మరింత కలవరపరుస్తోంది. మనల్ని క్లిష్ట పరిస్థితుల్లో వదిలేయాలని ట్రంప్ చూస్తున్నారా? నా వద్ద స్పష్టమైన జవాబు లేదు. కానీ, అలానే అనిపించడం లేదా?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
వైఎస్ ఏం చేయలేదనీ...
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వంటి వారు ఎంత కృషి చేసినా 2003 ఆరంభం నాటికి కూడా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ చావు బతుకుల్లోనే ఉండేది. తొమ్మిదేండ్ల చంద్రబాబు పాలనతో రాష్ట్రం ఆత్మహత్యల రాష్ట్రంగా మారిపోయింది. ఆ స్థితిలో ‘పాదయాత్ర’ అనే ప్రజాసమస్యల అవగాహనా యాత్రతో, ‘జైత్ర యాత్ర’ అనే పార్టీ చైతన్య యాత్రతో జనంలో నమ్మకాన్ని కలిగించి, కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి, బలం చేకూర్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇక, 2004లో అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం పొందేట్లు చేశారు; సీఎం కూడా అయ్యారు. 2009 నాటి జనరల్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించేటట్లు చేశారు.‘పల్లెబాట’, ‘నగర బాట’, ‘రైతు బాట’, ‘ప్రాజెక్టుల బాట’ వంటి కార్యక్రమాలతో ఎల్లప్పుడూ జనంలో ఉంటూ, పార్టీని మరింత బలోపేతం చేస్తూ అన్ని వర్గాల ప్రజల అవస రాల్ని తీర్చడానికి కృషి చేశారు. సీఎం కావడంతోటే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చారు. రైతుల విద్యుత్ బకాయిలు రద్దు చేశారు. సబ్సిడీపై పంట విత్తనాలు, గడ్డి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్ని ఇచ్చారు. విత్తనాల కోసం ‘సీడ్ విలేజ్’లను ఏర్పరచారు. పంటల బీమా పథకం ప్రవేశపెట్టారు. పంట నిల్వలకు ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుల శిక్షణకై ‘పొలం బడి’ కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయాభివృద్ధికై ‘వ్యవసాయ టెక్నాలజీ మిషన్’ ఏర్పరచారు. ‘పని గ్యారంటీ’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి పేదలకు జీవన సమస్య లేకుండా చేయడానికి కృషి చేశారు. మధ్యతరగతి గృహ అవసరాల్ని ‘రాజీవ్ గృహ కల్ప’ ద్వారా తీర్చ డానికి ప్రయత్నించారు.డ్వాక్రా సభ్యులైన మహిళలందరికీ పావలా వడ్డీకే రుణాలిచ్చి వారి కుటుంబాల ఆర్థిక అభివృద్ధికై కృషి చేశారు. ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐటీఐ లను నెలకొల్పారు. హైదరాబాద్లో బిట్స్ క్యాంపస్ ఏర్పాటు చేశారు. ‘జవహర్ నాలెడ్జ్ సెంట ర్’లు, ఇరవై ఒకటవ శతాబ్ది గురుకులాలు, పలు మెడికల్, డెంటల్, ఇంజినీరింగ్ కాలేజీల్ని ఏర్పరచారు. భారీ, మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు కృషి చేశారు. వ్యవసాయేతర అవసరాలకు ఛార్జీలు పెంచకుండానే విద్యుత్ సరఫరా చేశారు. వ్యాపార, వాణిజ్యాల అభివృద్ధికై రోడ్ల సౌకర్యాల్ని పెంచారు. తీర జిల్లాల్లో ఓడరేవుల నిర్మాణానికై కృషి చేశారు. నగరాల్లో ‘108’ అంబులెన్సుల్ని, పల్లెల్లో ‘104’ అంబులెన్సుల్ని ఏర్పరచారు. ఇలా, పలు అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర రాజకీయాల్లో రాకెట్టులా దూసుకెళ్ళారు వైఎస్సార్. ఇంతటి అవగాహనతో ప్రజా సమస్యల పరిష్కారం జరిపి సామాన్య జనం కూడా మేమూ సంతోషంగా బతకగలం అనే ధీమా కల్పించిన వైఎస్ లేకపోవడం దురదృష్టకరం. అయితే, జనంలో ఆయనపై అభిమానం సడలస లేదనేది సుస్పష్టం. ఆయనపై గల విశ్వాసం, నమ్మకం, అభిమానం ఇప్పుడు జనం జగన్పై చూపుతున్నారు. డా‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, చరిత్ర శాఖ, ఎస్వీ యూనివర్సిటీ -
చిరస్మరణీయ ప్రజాబాంధవుడు!
వైఎస్సార్ మన నుంచి దూరమై నేటికి 16 సంవత్సరాలు. సంక్షేమం, అభివృద్ధి, దూరదృష్టి, విలువలు, విశ్వసనీయత, ఆదర్శ రాజకీయాలు వంటి మాటలు విన్నప్పుడల్లా ఆయనే గుర్తొస్తారు. ఆయన దూరదృష్టితో తీసుకున్న అనేక నిర్ణయాలు అద్భుత ఫలితాలనిచ్చాయి. జలయజ్ఞం అందుకు ఒక మంచి ఉదాహరణ. పోల వరం ప్రాజెక్టుకు నేడు జాతీయ హోదా రావడానికి నాడు అన్ని అనుమతులూ సాధించడం, కుడి– ఎడమ కాల్వల నిర్మాణం ప్రారంభించడం వల్లనే సాధ్యమయ్యింది. నేటి ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే పట్టిసీమ కూడా వైఎస్ కుడి కాలువను సింహభాగం పూర్తి చేసినందు వల్లే సాధ్యం అయ్యింది. దక్షిణ తెలంగాణ కోసం పాలమూరు– రంగారెడ్డి, దిండి; రాయల సీమ కోసం శంకుస్థాపనకి మాత్రమే పరిమితం అయిన గాలేరు– నగరి, హంద్రీ–నీవా, పోతిరెడ్డి పాడు వెడల్పు; ప్రకాశం జిల్లా కోసం వెలుగొండ; కృష్ణా డెల్టా కోసం పులిచింతల; హైదరాబాద్ శాశ్వత నీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి నీటి సరఫరా; ఉత్తరాంధ్ర కోసం ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ ప్రాజెక్టులు రూపకల్పన చేశారు కాబట్టే నేడు ప్రభుత్వాలు వాటి కోసం నిధులు ఖర్చు చేయడం, ప్రజలు అడగడం సాధ్యమవుతోంది.సంక్షేమం – అభివృద్ధివైఎస్సార్ అనగానే గుర్తుకు వచ్చేది సంక్షేమ పథకాలు. వాటిని రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల తాయిలాలని విమర్శించారు. కానీ వైఎస్సార్ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకానికీ ఒక శాస్త్రీయ పరిశీలన, హేతుబద్ధమైన కారణం కనిపిస్తుంది. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత రైతుల ఆత్మహత్యలకు కారణాలు, నివా రణ చర్యలు సిఫార్సు చెయ్యమని ‘ఆచార్య జయతీ ఘోష్ కమిషన్’ను నియమించారు. రైతుల ఆత్మహత్యలకు వ్యవసాయ సమస్యలే కారణం కాదనీ, విద్య, వైద్యం వంటివి కార్పొరేట్ల చేతుల లోకి వెళ్లడం వల్ల రైతులు మరిన్ని అప్పులు చేయవలసివచ్చి ఆత్మ హత్యలకు పాల్పడ్డారనీ కమిషన్ పేర్కొంది. దీంతో వైఎస్సార్ ‘ఫీజు రీయింబర్స్మెంట్’, ‘ఆరోగ్య శ్రీ’ పథకాలను ప్రవేశపెట్టారు. వైఎస్సార్ తరహాలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ‘రైతు భరోసా’, ‘అమ్మ ఒడి’, ‘నాడు–నేడు’ వంటి పథకాలు అమలు చేశారు. ఇవి చూడటానికి సంక్షేమ పథకాలు అనిపిస్తున్నా, ఈ పథ కాల వల్ల రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి.వైఎస్సార్ ఐదు సంవత్సరాల (స్వల్ప కాలపు) పాలనలోనే అనేక దీర్ఘకాలిక ఆలోచనలు మనకు ప్రతి అంశంలోనూ కనిపి స్తాయి. భవిష్యత్తు మొత్తం నగరాల చుట్టూ ఉంటుందని నాడే ఆయన గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ విశాఖ, గుంటూరు – విజయవాడ, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ తిరుపతి ఏర్పాటు ఆలోచన వైఎస్సార్దే! ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పారిశ్రామిక మార్పులను గమనంలో ఉంచుకుని ‘సెజ్’లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విదేశాలకు మనం వెళ్ళడం కాదు, మనం తగిన వాతావరణం సృష్టిస్తే విదేశీ కంపెనీలు మన దగ్గరకు వస్తాయని భావించి పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేశారు. ‘శ్రీ సిటీ’ ఆయన కలకు ప్రతిరూపమే!భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి కూడా తన పాలనలో ప్రజలకు అత్యంత కీలకమైన విద్య, వైద్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యారంగంలో ‘నాడు–నేడు’ పేరుతో వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రభుత్వ విద్యకు నాణ్యతా ప్రమాణాలు కల్పించారు. ఆంగ్ల మాధ్యమాల్లో చదువులు ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ అవకాశాలను మన యువత అందుకుంటారని జగన్ భావించారు. వైద్యం పేదలకు అందుబాటులోకి రావాలంటే వైద్యశాలలను మెరుగు పరచడంతో పాటు, డాక్టర్ల నియామకం అత్యంత కీలకం అని గుర్తించారు. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కళాశాల, దానికి అనుబంధంగా హాస్పిటల్ ఏర్పాటు జరిగితే డాక్టర్ల కొరత తీరి ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించవచ్చని భావించారు. ఆ దిశగానే నాడు వైఎస్సార్, నేడు జగన్ అడుగులు వేశారు. ప్రజలకు ఎనలేని సేవ చేశారు.మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరంసమన్వయ కర్త -
చరిత్ర చూసిన ఘోర విషాదం
మన సారథి మన సచివుడుమన వియ్యము మన సఖుండుమన బాంధవుడున్మన విభుడు గురుడు దేవరమనలను దిగనాడి చనియె మనుజాధీశా!శ్రీకృష్ణ పరమాత్ముడు ఇహం వీడి పరమ పదం చేరుకున్నపుడు అర్జునుడి ఆవేదన అది. కానీ, ఆధునిక యుగంలో ఓ పరమా ప్తుడు హఠాత్తుగా నవ్వుతూ అంతర్థానమ య్యాడని కోట్లాది మంది అల్లల్లాడిపోవడం ఆశ్చర్యం, అపూర్వం.డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అందర్నీ కలవాలని చిరు దరహాసంతో బయలుదేరి మేఘాల మధ్య, వర్షంలో పావురాల గుట్ట వద్ద ప్రపంచాన్ని వదిలిన వేళ కోట్ల మంది నిర్ఘాంతపోయారు. నమ్మలేదు, నిజంకాదు అనుకున్నారు. తెల్లటి దుస్తుల్లో చెరగని చిరు నవ్వుతో శత్రువుకైనా వరమిచ్చే ఆ మహర్షి అలా ఎలా వెళ్ళిపోతాడని ఏడ్చారు. ప్రసార మాధ్యమాలను నమ్మక ఆ ప్రాంతానికి పరు గెట్టారు. దేవుణ్ణి నిందించారు.తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. కన్నీటి వరదలో ఆకలి కొట్టుకుపోయింది. చరిత్రలో ఎందరో చక్రవర్తులు, తత్త్వవేత్తలు మరణించినపుడు కూడా ఇంతటి విషాదాన్ని, ప్రజా ప్రతిస్పందాశ్రు సంద్రాన్ని చూడ లేదు అన్నది వాస్తవం. వైఎస్ మరణవార్త విని కొండంత ఆ దుఃఖాన్ని గుండెల్లో మోయలేక, ఆ భారంతో బాధతో ఏడు వంద లకు పైగా గుండెలు కొండెక్కాయి. నమ్మలేని విషయం ఇది. కళ్ళ ముందు సత్యం ఇది. ‘నీవు లేని వేళ మాకీ బ్రతుకేల, నీ వెంటే వస్తాం, ఏ లోకంలో ఉన్నా నీ పరిపాలనలోనే ఉంటాం’ అంటూ కదిలిపోవడం ఏమనాలి!కారణ జన్ముడుమనతో, మన మధ్య తిరిగిన ఓ మనిషి, ఓ నాయకుడు ఇంత ఆదరం పొందటం నిజంగా చరిత్ర. భగవంతుడిని అనేక రూపాలలో కొలుస్తాం. అలా ఆ రాజన్నకు జనం గుండెల్లో గుడి కట్టడం; అన్నగా, నాన్నగా, బంధువుగా, హితుడిగా, గురువుగా, దేవరగా కొలవడం అసాధ్యమైన సాధ్యం. ఆయనకిచ్చారు హృదయ నైవేద్యం. ఆ రూపు నేటికీ ఆరాధ్యం. ఆ మూర్తి, ఆ వ్యక్తిత్వపు అయస్కాంత స్ఫూర్తి ఇంకా పచ్చగా, పచ్చిగా వుంది. ప్రజల హృద యాల్లో పలవరిస్తూ ఉంది, పలకరిస్తూనే ఉంది.ఇంతగా ఇంకా ఆ దరహాసపు చంద్రకాంతి మనలో ఉందంటే– ఆయన చేసిన సేవ, శత్రువును సైతం క్షమించే గుణం, కపటం లేని దార్శనికత, మోసం లేని రాజకీయం, కొందరివాడుగా కాక అందరి వాడుగా మారిన నైజం, పాలకుడే సేవకుడుగా మారిన రూపం, దుస్తులంత తెల్లని మనసు, చిరునవ్వంత అందమైన చిత్తం, ఆదరణ వేళ అమ్మతనం, కరుణించే ఔదార్యం, ఎముక లేని దాతృత్వం...ఇంకా ఇంకా ఇంకా ఎన్నో, ఎన్నెన్నో!కారణ జన్ముడు, రణ జన్ముడు, అనురాగ హృదయ రుణ అరుణ జన్ముడు రాజశేఖరరెడ్డి. దైవం, ఈ లోకాన్ని మార్చాలని మానుషరూప దైవంగా ఆయనను ఇలకు పంపి, మరింత కాలం మనుగడ సాగిస్తే ఆయన ముందు తనని మరచిపోతారేమోనని హఠాత్తుగా ఆయన శ్వాస వాయువును తన వాయులీనం చేసు కున్నాడు. ఈర‡్ష్యతో సర్వేశుడు చేసిన చర్య ఆయన మరణం అని అందరి హృదయ వచనం.ఎందుకు ఆయన పట్ల అంత ప్రేమ? రూపాయి డాక్టరు అయి నందుకా? సామాజిక సేవకై రాజకీయ వైద్యుడైనందుకా? సమ్మో హపు చిరునవ్వుతో సామాన్యులను పలకరించినందుకా? నాగలి మోసేవాడి భుజం నొప్పి తెలిసినందుకా? కార్మికుల ఘర్మజల మర్మం ఎరిగినందుకా? పేదలను ప్రేమించినందుకా? రాళ్ళ భూమిని నీళ్ళతో తడిపినందుకా? ఒక్క మనిషిలో ఎన్ని రూపాలు, ఎన్ని భిన్న స్వరూపాలు!చరిత్ర చూసిన ఘోర విషాదం, ఉప్పొంగిన అశ్రు సముద్రం, ఉలిక్కిపడిన శూన్యపు గగనం.... ఆ రోజు తలవటానికి కూడా ఇష్ట పడని సెప్టెంబరు... అయినవాళ్ళు పోతేనే అతి త్వరగా మరిచి పోయే ఈ రోజుల్లో ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఆ రోజును, ఆ మనిషిని, ఆ మనసును తలచుకుని కన్నీరు పెడుతున్నారంటే... ఎంత అదృష్టవంతుడు రాజశేఖరరెడ్డి! ఆయన లేని మనం ఎంత దురదృష్టవంతులం!!జన హృదిలో... పూజ గదిలో...ఆత్మీయుల ఫొటోలను ఇంటి గోడలకు తగిలించుకుంటాం. కానీ కొన్ని లక్షల కుటుంబాలు ఆయన ఫొటోను దేవుని గదిలో, దేవుడి పటాల పక్కన ఉంచి పూజించడం చూస్తున్నాం. ఎదలోని దేవుడు, ఎదురైన దేవుడు ఇంటిపూజలో ఉండాలి అని ‘రాజన్న’ను ‘రామన్న’ను చేసి కొలవడం కేవలం ఆయనకే దక్కిన గౌరవం. ఆనంద ఆత్మార్పణం ఆకాశదేశం నుంచి అందుకుంటున్నవాడు ఆ రాజశేఖరరెడ్డి.నాయకుల విగ్రహాలు ఆ యా పట్టణాలలో అరుదుగా వెలు స్తాయి. కానీ ఊరు ఊరునా ప్రజలు వై.ఎస్. విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. ‘అన్నా! నీవు అడుగు పెడితే నీతో పాటు మేఘాలు వస్తాయి, వర్షాలు మా పంట పొలాల్ని పలకరిస్తాయి, పంటతో మా ఇంట పండగే తెస్తాయి’ అని ప్రతి రైతు గుండె చెమ్మ చేసుకునేది ఆయన గురించే!‘పేదరికంలో పుట్టిన మేము ఈ రోజు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నామంటే, ఇలా విదేశాలకు వచ్చామంటే, మా కుటుంబ ఆర్థిక స్థితి బాగైందంటే అది ఆ ‘సామాజిక వైద్యుడు’ పెట్టిన భిక్ష. ఆయన అందించిన ఫీజు రీయింబర్సుమెంటు ఆర్థిక సాయంతోనే మా స్థితీ, గతీ మారింది’ అని చెబుతుంటే ఎవరన్నారు రాజన్న లేడని! ఇన్ని కోట్ల గుండెలు ఆయన్ని తలుస్తూ ఉంటే, పిలుస్తూ ఉంటే ఎక్కడికి పోతాడు? మనలోనే, మనతోనే, మన ఆత్మగా ఉంటాడు.స్వార్థంతో కొందరు జీవిస్తారు. సమాజం కోసం మహాత్ములు జీవితాన్ని అర్పిస్తారు. నిరంతరం మనుషుల కోసం, పేదవాడి పెదవి మీద చిరునవ్వు చూడటం కోసం, బతుకు పోరులో బడుగు వర్గాల వారిని గెలిపించడం కోసం తపన పడ్డాడు, ఆలోచనగా అడుగులు వేశాడు రాజశేఖరరెడ్డి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆయన పాలన అనితర సాధ్యం. దేశానికి ఒక ఉదాహరణ అనడం అతిశయోక్తి కాదు. రామరాజ్యం, రాజన్న రాజ్యం అని పోల్చుకోని పేదవాడు లేడు ఈ రోజు. శత్రువులను ఆయుధాలతో కాక చిరునవ్వుల విరివిల్లులతో గెలుస్తూ అభిమానాన్ని పొందాడు. ఆయన వెంట హర్షంతో వర్షం నడిచి వచ్చింది. నీటి కరువుకు నిత్య నిలయమైన అనంతపురం లాంటి జిల్లాను వరదలు పలకరించాయి. ఆయన హయాంలో ఒక్క రైతు కూడా ఆవేదనతో ఆత్మహత్య చేసుకోలేదు. నీళ్ళతో పాటు ఉచిత కరెంటు కూడా ఇచ్చి, కర్షకుడి కంట కన్నీరు రాకుండా కాపాడుకున్నాడు. నదుల నీరు వృథాగా సముద్రంలో కలవకూడ దని, ఆ జలబలాన్ని రైతుకు అందించాలని, భూములు తడిపి, వారి కుటుంబాల కన్నీళ్ళు తుడిచిన సత్యపథుడు, అపర భగీరథుడు వై.ఎస్.ఉద్యోగుల అలజడులు లేవు. విద్యార్థుల ఉద్యమాలు లేవు. హింసావాదుల్ని అహింసా మార్గానికి తీసుకువచ్చి సంస్కరించాలని సంస్కారంతో నక్సలైట్లతో చర్చలు జరిపాడు. ఎవ్వరూ ఊహించని ‘ఆరోగ్య శ్రీ’ని పేదలకు వరంగా అందించి, కార్పొరేట్ వైద్యాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గరకు తెచ్చిన మహా ప్రాణదాత. ఆయన పుణ్యమా అని ఎందరి ఇళ్ళల్లో దీపాలు వెలిగాయో!ఆయన వేగం, సాధిస్తున్న సంక్షేమం, ప్రజలలో ఆయన పట్ల ఉన్న ఆరాధనం చూసి శాసన సభలో ప్రతిపక్షాలు అల్లాడి పోయాయి. ఏం అనాలో, ఎలా తిట్టాలో అర్థం కాలేదు వారికి.చంద్రబాబు ప్రయత్నం చేసి, ఆయన చతురత, చమత్కారం, హాస్యం, దృఢచిత్తం ముందు నవ్వుల పాలయ్యాడు. నలిగి కూర్చు న్నాడు. ఆయనను తిట్టాలనుకున్న ప్రతి నోరూ మూతబడిపోయింది... తెరిస్తే అప్రయత్నంగా ఆయనను పొగడకుండా ఉండ లేమనే భయంతో! ఆయనలోని మానవత్వ విరాడ్రూప విజృంభణ చూసి ప్రపంచమే చేతులు జోడించింది.శ్రీవారిని భక్తుల చెంతకు చేర్చాడు!హిందువులకు, హైందవ ధర్మానికి, ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన సేవ, పనులు మరే నాయకుడూ, మరే ముఖ్యమంత్రీ చేయలేదు అన్నది వాస్తవం. కళ్ళు మూసుకుని అసత్యాలు ప్రచారం చేసే వాళ్లు సైతం అంతరంగంలో అంగీకరించిన సత్యం. పసుపు ఎంత పూసినా పాడవని అగ్నికణం.ఈ రోజు సమస్త ప్రపంచం తిరుమల శ్రీవారి ఆలయ విశే షాలను, ఉత్సవాలను చూస్తున్న ‘శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్’ ఆయన ఆలోచన. ఆయన రూపకల్పన. అన్య మతాల వారికి తి.తి. దేవ స్థానంలో ఉద్యోగాలు ఇవ్వకూడదు అని ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ.) ఇచ్చింది ఆయనే!‘కల్యాణమస్తు’ పేరుతో, శ్రీవారి మూలమూర్తి పాదాలు తాకిన తాళిబొట్లతో 36 వేల మందికి రాష్ట్రవ్యాప్తంగా తి.తి.దే. వివాహాలు జరిపించడానికి కర్త ఆయన. భగవంతుడు అందరివాడని దళిత వాడలకు గోవిందుడిని ‘దళిత గోవిందం’ పేరుతో తీసుకువెళ్ళిన సాహసి. ప్రపంచంలోని ప్రతి గ్రామంలో శ్రీనివాస కల్యాణాలు జరగాలని శ్రీకారం చుట్టినవాడు, తిరుపతిలో వేద విశ్వవిద్యాల యాన్ని స్థాపించినవాడు, స్వామివారిని కల్యాణ రథాలపై ఆసీనుల్ని చేసి రాష్ట్రం నలుమూలలకీ తీసుకువెళ్ళినవాడు, తిరుమల మాడ వీధులలో పాదరక్షలు ధరించడం నిషేధించినవాడు, శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని అందించి నవాడు, ఉచిత పుస్తక ప్రసాదం ఇచ్చినవాడు, అన్నమయ్య జన్మ గ్రామమైన తాళ్ళపాక వద్ద 103 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఆవిష్కరించినవాడు ఆ శ్రీరాజ హృదయుడే!తిరుమలలో ప్రతి పున్నమికీ గరుడసేవ, నిత్యం ఆగని అకుంఠిత హరినామ సంకీర్తనం, అంతర్జాతీయ అన్నమయ్య ఉత్సవాలు, గోవుకు సర్వోన్నత స్థానమిచ్చిన వందే గోమాతం, చంటి బిడ్డల జంటలకు శ్రీవారి తక్షణ దర్శనం, సవ్యాఖ్యాన భారత భాగవతాల ముద్రణ.... ఇలా రోజూ ఓ నూతన కార్యక్రమంతో భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేశాడు. శ్రీవారిని భక్తుల ముంగిళ్ళకు తీసుకెళ్ళాడు.తిరుమలలో కనీవిని ఎరుగని రీతిలో 75 మంది పవిత్ర పీఠాధిపతులతో ‘సనాతన ధర్మ ప్రచార సదస్సులు’ నిర్వహించి ధర్మ శంఖారావాన్ని నలుదిక్కులా వినిపించాడు. హైందవ ధర్మాన్ని నాలుగు పాదాలతో నడిపిన అపర నారాయణుడు ఆయన అంటే అది సర్వ సమ్మతం. తి.తి.దేవస్థానం అప్పటి అధ్యక్షుడిగా ఈ కార్య భారాన్ని నా చేత చేయించి, నన్ను అదృష్టజీవిగా మార్చినవాడు. వైభవమంతా చూశాను. భక్తుల పారవశ్యాన్ని దర్శించాను అంటే అది ఆయన చల్లని దీవెన, నా మీద ఆయనకున్న ప్రేమ.ఆయన పరిపాలనలో కవులు, కళాకారులు, రచయితలతో సాంస్కృతిక రంగం ఎంత గొప్పగా వెలిగిందో! తిరుపతిలో నాలుగు సంవత్సరాల తెలుగు భాషా బ్రహ్మోత్సవాల వైభవానికి ఆయన సూత్రధారి. శంకరంబాడి సుందరాచార్య, శ్రీకృష్ణదేవరాయలు,ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వంటి మహామహుల విగ్రహాలు ఆవిష్కరించింది ఆయనే!అన్ని రంగాలనూ అభివృద్ధి చేసి, ప్రజలను చల్లగా చూసిన ఆ అయిదేళ్ళూ ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల పాలనను గుర్తుకు తెచ్చింది, మరిపించింది అని ఎందరో పెద్దలు అన్నారు, అంటు న్నారు. ఆ స్వర్ణయుగ సూత్రధారిని నిత్యం ప్రజలు స్మరించుకుంటూనే ఉన్నారు.అంతటి మహానాయకుడు, మహానుభావుడు, మహర్షి నాకు హితుడు, సన్నిహితుడు, స్నేహితుడు, గురువు, దైవం కావడం నా పూర్వజన్మ పుణ్యఫలం. ఏ ముహూర్తం కలిపిందో, ఏ తల్లి చల్లని దీవెన ఫలించిందో వైఎస్ ప్రేమ నాకు దక్కింది. ‘కర్ణా’ అని పిలిస్తే కరిగి పోయేవాడిని. అండగా ఆయన కైదండ నా భుజం మీద వేసి నడిపిస్తే విశ్వ విజేతను అయ్యేవాడిని. ఆయన ఆప్యాయతకు మాటరాక మూగబోయేవాడిని. ఆ చిరునవ్వు నన్ను వెలిగించేది. ఆ చూపు నాకు వెలుగిచ్చేది. అది తీరని రుణం, తీర్చలేని రుణం. పాతికేళ్ళకు పైగా ఉన్న బంధాన్ని, అనుబంధాన్ని నిత్యం ఎదలో స్మరించుకుంటూ, భారమైన కాలంలో, జీవం లేని జీవితం గడుపుతూ, ఆ చల్లని ధవళ దరహాసాన్ని స్మరిస్తూ, జ్ఞాపకాలను దోసిలిలో పట్టుకుని, కలంలో కన్నీళ్ళు నింపుకుని, కడలి అంత ప్రేమను కాసిన్ని అక్షరాలుగా మార్చి అందిస్తున్నా.రాముడు అవతారం చాలించినా హనుమంతుడు ఉన్నాడు ఆ భక్తిని చాటడం కోసం, వారసుడిని సేవించడం కోసం. వై.ఎస్. ఆశయాలు చాటడానికి, సాధించడానికి ఆయన వారసుని సేవకు ఆ ‘నా దేవుని’ ఆదేశంతో నేను అందుకే కార్యోన్ముఖుణ్ణి. రక్తాశ్రువులతో...భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
వెన్నుపోటు అన్న పదమే వినబడకుండా...
నారా చంద్రబాబు నాయుడు రాజకీయ లక్ష్యం ముఖ్యమంత్రి కావడం. అందు కోసం ఆయన విద్యార్థి దశ నుంచే కలలు కనేవారు. చివరకు, ఇరవై మూడేళ్లుగా తాను కంటున్న కలలు నెరవేరే అవకాశం ఆసన్నమైంది. నమ్మిన మామగారికి వెన్ను పోటు పొడిచి, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు 1995 ఆగస్టు నెల చివరి తొమ్మిది రోజుల్లో అనూహ్యమైన విధంగా వ్యూహాలు పన్నారు. పార్టీలోని సీనియర్ నాయకులను ఉచ్చులోకి లాగారు. వామపక్షాలకు సైతం ఎరవేసి, తన వైపు తిప్పుకున్నారు. ఒక్క చుక్క రక్తం చిందకుండా, ఎక్కడా నిరసన ధ్వనులు వినబడకుండా, ‘వెన్నుపోటు’ అనే పదమే మీడియాలో కనబడకుండా పావులు కదిపి, తన మామగారిని పదవి నుంచి దింపి, తాను అందలం అందుకున్నారు.1995 ఆగస్టు 31 (గురువారం)ఎన్టీఆర్ ఆగస్టు 31న విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే రాజీ నామా చేశారు. ఆ రోజు ఉదయం ఆయన ఆదేశాల మేరకు సీఎం కార్యదర్శి జయప్రకాశ్ నారాయణ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ ఉదయం 11 గంటలకు రమ్మన్నారు. రాజ్ భవన్కు వెళ్లేందుకు ఇంకా సమయం ఉండటంతో ఎన్టీఆర్ తన నివాసంలో బుచ్చయ్య చౌదరి, దేవినేని నెహ్రూ వంటి వారితో ముచ్చటిస్తున్నారు. వారితో మాట్లాడుతూనే ఎన్టీఆర్ అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయారు. ఆయనను వెంటనే దగ్గరలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. తనను ఆస్పత్రిలో కలుసుకోవలసిందిగా ముఖ్యమంత్రి చేసిన అభ్యర్థనను గవర్నర్కు చీఫ్ సెక్రటరీ రాజాజీ తెలియజేశారు. అందుకు అంగీకరించిన గవర్నర్ కృష్ణకాంత్ ఆస్పత్రికి వెళ్లి, ఎన్టీఆర్ను పరామర్శించారు. ఎన్టీఆర్ ఆయనకు రాజీనామా లేఖ అందించారు. (అయితే తాను గవర్నర్కు రాజీనామా లేఖ ఇవ్వ లేదనీ, మంచంపై ఉన్న తన చేతిలోంచి గవర్నరే లేఖను తీసుకు న్నారనీ ఆ తర్వాత ఎన్టీఆర్ చెప్పారు. అయితే ఆయన మాటలను న్యాయస్థానం, ప్రజలు విశ్వసించలేదు.)కీలకమైన విశ్వాస తీర్మానం రోజున ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అభిమాను లనూ, మద్దతుదారులను విషాదంలో ముంచెత్తివేసింది. ధైర్యమే ఊపిరిగా, పోరాటమే నైజంగా తల ఎత్తుకుని బతికిన ఎన్టీఆర్ చివ రకు ఇలా అస్త్రసన్యాసం చేశారు.ఆ మరుసటి రోజు, అంటే 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా పదవులు చేప ట్టారు. వీరిలో హరికృష్ణ కూడా ఒకరు. (అప్పటికి శాసనసభలోగానీ, శాసన పరిషత్తులో గానీ ఆయన సభ్యుడు కారు. నిబంధనల ప్రకారం మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాలి. అయితే హరికృష్ణ మంత్రివర్గంలో కొనసాగడం ఇష్టం లేని చంద్రబాబు ‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి, హరికృష్ణ పోటీ చేసేందుకు వీలులేని పరిస్థితులు సృష్టించారు. దీంతో హరి కృష్ణ మంత్రి పదవి ఊడిపోయింది.)పత్రికాధిపతి రామోజీరావు తన సతీమణితో కలసి ఆగస్టు 31వ తేదీ సాయంత్రం ఎన్టీఆర్ దంపతులను కలసి పరామర్శించారు. ఎప్పుడూ తెరవెనుకనే ఉండి కథ నడిపించే రామోజీరావు ఈసారి తెర ముందుకు రావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. తననూ, తన భార్యనూ కించపరుస్తూ ‘ఈనాడు’లో కార్టూన్లు వేయించినా, తన ప్రతిష్ఠను మంట కలుపుతూ వార్తా కథనాలు ప్రచురించినా, అవేవీ మనసులో పెట్టుకోకుండా, రామోజీ దంపతులను ఎన్టీఆర్ సాదరంగా ఆహ్వానించారు.ఇంత జరిగినా ఎన్టీఆర్ తన బాధను బయటకు కనిపించ నివ్వలేదు. రోజులాగే మరునాడు తెల్లవారుజామునే లేచి దైనందిన కార్యక్రమాలు ముగించుకుని, తనను కలవడానికి వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎస్ రావు, సెక్రటరీ జయప్రకాశ్ నారాయణ్లతో సమా వేశమయ్యారు. ఆ రోజు సెప్టెంబర్ 1. అప్పటికి ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. అది ఎన్టీఆర్కు ముఖ్యమంత్రిగా చివరి రోజు.అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసి ఉండాల్సింది: పాల్కీవాలా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటును సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పురస్కరించుకుని ప్రముఖ న్యాయవాది నానీ పాల్కీవాలా... ఎన్టీరామారావుకు ఓ లేఖ రాశారు. అప్పటికి ఎన్టీఆర్ రాజీనామా చేసి రెండు వారాలైంది. ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరినైనా ఆహ్వానించే అధికారం గవర్నర్కు ఉన్నా, అప్పటికే చంద్రబాబును తెలుగుదేశం పార్టీ నుంచి అధ్యక్ష హోదాలో ఉన్న ఎన్టీఆర్ బహిష్కరించినందు వల్ల, అదే పార్టీ పేరిట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ చంద్రబాబును ఆహ్వానించటం చట్టరీత్యా తప్పని పాల్కీవాలా అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ రద్దుకు ఎన్టీఆర్ మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్లో జరిగిందంతా ఒక ప్రహసనం, ఒక మోసమని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ అభిప్రాయ పడ్డారు. ఆయన ‘ది హిందూ’ దినపత్రికలో 1995 సెప్టెంబర్ 4న రాసిన ఒక వ్యాసంలో బ్రిటిష్ పార్లమెంటరీ రాజకీయ సూత్రాలనే మనం పాటిస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఫారసు మేరకు గవర్నర్ కచ్చితంగా అసెంబ్లీని రద్దు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.‘ది హిందూ’ దినపత్రిక 1995 సెప్టెంబర్ 1న రాసిన సంపాద కీయంలో... తెలుగుదేశం పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు చంద్రబాబుకి ఉన్నప్పటికీ, అంతకు ఏడాది ముందు 1994లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ అఖండ విజయం సాధించారన్న సంగ తిని ప్రముఖంగా ప్రస్తావించింది.ఆగస్టు సంక్షోభం... ఉపసంహారంఎన్టీఆర్ జీవిత చరమాంకం ఎన్నో ఒడుదొడుకులకు లోనైంది. పిలిచి పిల్లనిచ్చి, పార్టీలో పదవులిచ్చి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తే, అధికార దాహంతో అల్లుడు తనకే వెన్నుపోటు పొడవడాన్ని ఆ వృద్ధ నేత తట్టుకోలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి జవ జీవాలు ఊది, అఖండ విజయంతో అధికారంలోకి తీసుకువస్తే, చివరకు ఆయనను పదవీచ్యుతుణ్ణి చేసిన ఉదంతం పార్టీలో ఎంతో మంది నాయకులను, కార్యకర్తలను కన్నీరు పెట్టించింది. ఇక లక్ష లాది అభిమానుల సంగతి వేరే చెప్పాలా?దేవులపల్లి అమర్ (స్వీయ రచన ‘మూడు దారులు’ నుంచి...) -
విధానాలకు వెన్నుపోటు
తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో 1995 ఆగస్టు సంక్షోభాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు చంద్రబాబు చేసిన ద్రోహం అనే కోణం నుంచి చర్చించడం జరుగుతూ వస్తున్నదే. ఆ పరిణామాలు మొత్తం దేశం దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇందులో రెండవ కోణం కూడా ఉంది. అది ఎందువల్లనో చర్చలోకి రావటం లేదు. ఢిల్లీ స్థాయిలో గానీ, దేశవ్యాప్తంగా పరిశీలకుల దృష్టిలో గానీ ఎన్టీఆర్ ఒక సాధారణ ప్రాంతీయ పార్టీ నాయకునిగా మిగలలేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పలుకుబడిలో ఉండిన ఒక రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయాన్ని మొదటి సారిగా సృష్టించి స్థిరపరచటం, తద్వారా రెండు పార్టీల వ్యవస్థను సుస్థిరపరచటం వాటిలో మొదటిది. 1980ల నాటికి కాంగ్రెస్ గణనీయంగా బలహీనపడుతూ దేశమంతటా ప్రాంతీయ శక్తులు బలపడు తున్న దశలో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ని ఆ వరసలోకి తేవటం అందరి దృషినీ ఆకర్షించింది. తర్వాత, ఒక సినిమా నాయకుని పరిపాలన ఏ విధంగా ఉండగలదనే సందేహాలు కలుగుతుండగా ఆయన సంక్షేమ రాజ్యం, అప్పటికి 30 ఏళ్లకు పైగా సంక్షేమ రాజ్యాన్ని నడుపుతున్నట్లు చెప్పుకునే కాంగ్రెస్ను మించి ప్రజల ఆమోదాన్ని పొందటం, అందుకు ఆధారప్రాయమైన పథకాలు, అవి లోపరహితంగా అమలు కావటం, పేదలు చిరకాలపు దారిద్య్ర రేఖ నుంచి క్రమంగా బయటపడుతుండిన సూచనలు పరిశీలకుల దృష్టిని ఆకర్షించాయి. మరో అంశం రాష్ట్రాల హక్కులకు సంబంధించిన ఫెడరలిస్ట్ వైఖరి. బలమైన ఫెడరలిస్ట్ వైఖరి తీసుకుంటూ ‘కేంద్రం మిథ్య’ అనే సాహసోపేత మైన ప్రకటనతో దేశంలోని ఫెడరలిస్టులందరినీ ఉలికిపడజేశారు. కాంగ్రెస్ అయితే ఆయనపై ‘దేశద్రోహి’ అనే ముద్ర వేసేవరకు వెళ్లింది. అయినా జంకలేదు. ఆయన రాజ కీయాలలో కొనసాగి ఉంటే కాంగ్రెస్ అనుసరిస్తుండిన యూనిటరిజానికి వ్యతిరేకంగా ఫెడరలిస్టు రాజకీయాలు మరెంతో బలపడి ఉండేవి. కాకతాళీయంగా ఇందుకు కొనసాగింపుగా ఎన్టీఆర్ అధ్యక్షునిగా, వీపీ సింగ్ కన్వీనర్గా 1989లో ‘నేషనల్ ఫ్రంట్’ ఏర్పడి కేంద్రంలో అధికారానికి కూడా వచ్చింది. ఫ్రంట్ మేనిఫెస్టోలో రాష్ట్రాల హక్కుల అంశాలు అనేకం ఉన్నాయి. అదే క్రమంలో ఒక ఆసక్తికరమైన అంశం... పరమ సాంప్రదాయికుడు కావటమే గాక కాషాయ వస్త్రధారిగా మారి విమర్శలను ఎదుర్కొన్న ఎన్టీఆర్, అప్పటి ‘జనసంఘ్’ పట్ల వీపీ సింగ్తో పాటు పూర్తి వ్యతిరేక వైఖరి తీసుకుని తనను తాను సెక్యులర్ వాడిగా ప్రకటించుకోవటం! ఇవన్నీ ఎన్టీఆర్ వారసత్వంగా మిగిలి తెలుగువారి చరిత్రలోనే గాక దేశ చరిత్రలోనే మిగిలిపోయాయి. కాగా, ఈయనను దారుణమైన రీతిలో పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు విధానాలు ఏ విధంగా ఉండ వచ్చునని అందరూ ఉత్సుకతతో ఎదురుచూశారు. చంద్రబాబు అధికార గ్రహణ చేయడానికి మించి ఎన్టీఆర్ ఘనమైన వారసత్వానికి గ్రహణం కూడా పట్టిస్తున్నట్లు అందరికీ త్వరలోనే అర్థమైంది. ఇండియా వంటి వర్ధమాన దేశంలో సామాన్య ప్రజల కన్నా ధనిక వర్గాల ప్రయోజనాలు ముఖ్యమని భావించిన చంద్రబాబు, మొదటి నుంచే ఆర్థిక సంస్కరణలకు పెద్ద పీట వేశారు. కనీసం ఆ సిద్ధాంతం చెప్పే పెర్కొలేషన్ థియరీని అయినా పాటించక, ఎన్టీఆర్ సంక్షేమ పథకాలకు ఒక్కటొక్కటిగా మంగళం పాడారు. సెక్యులరిజాన్ని వదిలేసి, అధికారం కోసం అవసరమైనప్పుడల్లా బీజేపీతో చేరుతూ అవకాశవాదిగా మారారు. ఫెడరలిస్ట్ శక్తులతో మైత్రి కూడా అదే విధమైన అవకాశవాదంగా మారింది. ఈ విషయాలన్నింటినీ గమనించినపుడు, చరిత్రలో ఎన్టీఆర్, చంద్రబాబుల స్థానాలు ఏ విధంగా మిగిలేదీ ఎవరైనా ఊహించగలరు. ఈ విధంగా 1995 నాటి సంక్షోభమన్నది కేవలం అధికార రాజకీయాల సంక్షోభ చరిత్రగా కాక, అంతకు మించి విధానపరమైన సంక్షోభంగా కూడా మిగులు తున్నది. దేశ రాజకీయాలకు చంద్రబాబు కాంట్రిబ్యూషన్ అది. ఒక మహానుభావుని ఆదర్శ రాజకీయాలు గాలిలో కలిసి, మరొక తరహా మహానుభావుని అధికార రాజకీయం రాజ్యమేలటం ఆ విధంగా మొదలైంది. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చరిత్ర చెప్పని కథ
భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత విషాద దినంగా సెప్టెంబరు 1 మిగిలిపోతుంది. ప్రజాస్వామ్యానికి పెను మచ్చగా చంద్రబాబు సొంత మామని దించివేసి తనది కాని పార్టీకి అధ్యక్షుడైన రోజు ఇది. ముఖ్యమంత్రి పదవికి తనను తానే ప్రకటించుకున్న రోజు. 1995 సెప్టెంబరు 1ని ‘చీకటి దినం’ (బ్లాక్ డే)గా ఎన్టీఆర్ గారు ప్రకటించారు. ఈ ద్రోహాన్ని చూస్తే రాజకీయాలే సిగ్గుపడతాయి.చంద్రబాబు ఏ కాంగ్రెసు పార్టీ అండ చూసుకుని 1982లో ఎన్టీఆర్ను ఓడిస్తానని శపథం చేశాడో మళ్ళీ అదే కాంగ్రెసు పెద్దల ప్రలోభాలకు తలొగ్గి వైస్రాయి హోటల్ డ్రామా నడిపించి భారత ప్రధాని కాబోయే వ్యక్తిని అడ్డుకున్నాడు. ఇతడికి రాజకీయ గురువు రామోజీరావు గారనే విషయం అందరికీ తెలుసు. ఎన్టీఆర్ పదవిలో ఉంటే 1996 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయ నెక్కడ ప్రధాని అవుతారోనని వెరచిన కాంగ్రెసు పెద్దలు వ్యూహం పన్నారు. అందులో భాగంగానే... ఎన్టీఆర్ తన ప్రభుత్వాన్ని డిజాల్వ్ చెయ్యమని అడిగినా, వాళ్ళ మనిషి అయిన గవర్నర్ కృష్ణకాంత్ దానికి అంగీకరించ లేదు. అదే సమయంలో ఫోర్జరీ సంతకాలతో చంద్రబాబు ఎమ్మెల్యేలు పంపిన లేఖను అంగీకరించారు. చంద్రబాబుతో పాటు మంత్రులుగా ఉన్న మాధవరెడ్డి, దేవేంద్ర గౌడ్, అశోక గజపతిరాజు, కోటగిరి విద్యాధరరావు లను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే పార్టీ నుండి సస్పెండ్ చేస్తే... ఆ చంద్రబాబు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశానికి ఎలా అధ్యక్షుడవుతాడు? పైగా నిస్సిగ్గుగా ఆగస్టు 27న పార్టీ నుండి ఎన్టీఆర్ను సస్పెండ్ చేశాడు. 40 మంది ఎమ్మెల్యేలతో వెళ్లిన దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఉప ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మబలికి ఆయనను తాను ముఖ్య మంత్రి అయ్యాక, తీరా బయటకు పంపేశాడు.ఆగస్టు 26న వైస్రాయి హోటల్ దగ్గరకు వెళ్ళిన ఎన్టీఆర్ మీద చెప్పులేసి అవమానించటమనేది ఆయన్ని బతికుండగానే చంపేయటమే! చంద్రబాబు కుట్రల గురించి ఎన్టీఆర్ అప్పట్లో ‘వార్త’ పేపరుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా చంద్రబాబు పార్టీని అక్రమంగా లాక్కున్నాడనీ, ఇలాంటి విశ్వాస ఘాతకు డిని చరిత్ర క్షమించదనీ అన్నారు. ఇలాంటి ఘాతుకాల పరంపర చంద్రబాబు జీవితంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అతని అబద్ధాలను పెంచి పోషించి ప్రజల మెదళ్ళలోకి బలవంతంగా ఎక్కించటానికి పెంపుడు కుక్కల్లా పచ్చమీడియా పనిచేస్తూనే ఉంది.ఆనాడూ, ఈనాడూ ఎన్టీఆర్ మీదా, లక్ష్మీపార్వతి మీదా వేయించిన కార్టూన్లు చూస్తే ‘ఈనాడు’ ఒక విష పత్రిక అనిపించక మానదు. కేవలం అధికారం కోసం ఒకరు, అధికారాన్ని నడిపించే రిమోట్ కోసం మరొ కరు ఎన్టీఆర్ను దారుణంగా చంపేశారు. చరిత్రనే తల్ల కిందులుగా చేసే రాతలు రాశారు. నిజానికి ఎన్టీఆర్ ప్రధానమంత్రి అవ్వకూడదనే కుట్రకు వీళ్ళు ఆజ్యం పోశారు. ఎందుకంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక నెలకో, రెండు నెలలకో వాజ్పేయి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ‘1996 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా నిలబడితే మా మద్దతు ఇస్తాము’ అనేది ఆ ప్రకటన. దీంతో కాంగ్రెసు వాళ్ళతోపాటు రామోజీకీ కన్నెర్ర అయ్యింది. తన చేతిలో కీలుబొమ్మలా ఆడే చంద్ర బాబును తెచ్చుకుంటే తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా ప్రభుత్వాన్ని నడిపించవచ్చనే దుష్ట పన్నాగానికి తెరతీశారు.ఇన్ని అవమానాల మధ్య కూడా ఎన్టీఆర్ తలవంచలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి అండమాన్ జైలుకు పంపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అతని కుట్రలను, కుయుక్తులను ‘జామాతా దశమగ్రహం’ అనే ఆడియో కాసెట్ ద్వారా బయటపెట్టారు. ఒక ఇంటర్వ్యూలో విలేఖరి ఎన్టీఆర్ను ‘మీ అల్లుడి గురించీ, అతని మోసాన్ని గురించీ మీరు తెలుసుకోలేక పోయారు. అతడి అవినీతిని గురించి ఇప్పుడు చెబుతున్నారు. ఇన్నేళ్ళలో మీకు తెలియదా’ అని అడిగారు.అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ ‘అతడొక మేకవన్నె పులి. వెనక గోతులు తీసేవాడిని, వెనక నుండి పొడిచేవాడిని తొందరగా గుర్తించలేం. అందులో అల్లుడి రూపంలో, నా ఇంట్లోనే ఉన్నాడాయె!. ఎలా గుర్తించగలం? తెలుసు కునేసరికి చాలా ఆలస్యమయ్యింది’ అన్నారు. కాళిదాసు చెప్పినట్లు– ‘విష వృక్షో2పి సంవర్ధ్య స్వయం / ఛేత్తుం అసాంప్రతమ్’ – విత్తనం నాటేటప్పుడు తెలియదు. అది చెట్టయ్యాక చేదు ఫలాలనిస్తుందని! అయినా మమకారంతో ఆ చెట్టును నరకలేము కదా! అతని దుర్మార్గాలు కొంత తెలిసినా చంద్రబాబు పట్ల నా ఉదాసీన వైఖరి ఇలాంటిదే’ అన్నారు.చంద్రబాబు దుర్మార్గాలకు పరాకాష్ఠ (1996 జనవరి 17) ఎన్టీఆర్ పార్టీ డబ్బు మీద స్టే ఆర్డర్ తెచ్చి ఆయనకు రూపాయి కూడా అందకుండా చెయ్యటం! పర్యవసానం ‘సింహగర్జన’ ద్వారా తన గర్జనను వినిపించి అల్లుడి దుశ్చర్యలనూ, దుర్మార్గాలనూ ప్రజల్లోకెళ్లి ఎండగట్టాలనుకున్న ఎన్టీఆర్ అదే రోజు రాత్రి మరణించారు. అలా చీకటి భూతాలకు బలి సమర్పించినట్లయ్యింది. ఆయన మరణం అరాచక శక్తులకు మరింత ఊతమిచ్చింది. ఎన్టీఆర్ పోరాటం మధ్యలోనే ముగిసిపోయింది. ఆయన ప్రాణాలు తీసిన చంద్రబాబు మాత్రం ఇప్పటికీ అవే అబద్ధాలను, దుర్మార్గాలను పచ్చ మీడియా అండగా కొనసాగిస్తూనే ఉన్నాడు.నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి -
ఆరో రుద్రుడి అమోఘ ముద్ర
కవి, రచయిత, సినిమారంగ ప్రముఖుడు, కాలమిస్టు, చరిత్ర, సాహిత్య పరిశోధకుడు, నాలుగైదు భాషలు తెలిసినవారు, శ్రీశ్రీ భాషలో తొలుత ఆరో రుద్రుడు... ఆరుద్ర. విశాఖపట్నంలో 1925 ఆగస్టు 31న పుట్టిన భాగవతుల సదాశివ శంకర శాస్త్రి అనేక కలం పేర్లను వాడుతూ ‘ఆరుద్ర’గా స్థిర పడ్డారు. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన ఆయన విద్యార్హత ఎస్సెస్సెల్సీనే! తండ్రి నరసింగరావు సాహిత్యా భిలాషి గనక కనిపించిన పుస్తకమల్లా తెస్తే మేనమామ శ్రీశ్రీ అప్పటికే విశాఖ రీడింగు రూములో పుస్తకాలన్నీ తాను చది వేసి ఆరుద్రతోనూ చదివించారు. ఆ విధంగా 13 ఏళ్ల వయసులోనే ఆరుద్ర కవిత్వ రచన మొదలుపెట్టారు. కొడవటిగంటి కుటుంబరావు కూడా రచనా శిల్పాన్ని మెరుగులు దిద్దారు. చాగంటి సోమయాజులు మార్క్సిజాన్ని మేధాగతం చేసుకోవడానికి ఉత్ప్రేరకంగా పనిచేశారు. 1942లో సెట్టి ఈశ్వరరావు సిఫార్సుపై ఆరుద్ర కమ్యూ నిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొ న్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యాపై జర్మనీ దాడి చేశాక... అందుకు వ్యతిరేకంగా తన వంతు పాత్ర నిర్వహించేందుకై ఆరుద్ర వైమానిక దళంలో చేరారు. ‘ఆనందవాణి’ పత్రికలో కొలువుతో సహా అనేక మజిలీల తర్వాత మద్రా సులో స్థిరపడి సృజన, పరిశోధన సాగించారు. 1955లో దర్శక దిగ్గజం హెచ్ఎం రెడ్డి, శ్రీశ్రీలే సాక్షులుగా రూ.60 ఖర్చుతో రామలక్ష్మిని రిజిస్టరు వివాహం చేసుకున్నారు.కవిత్వంలో ప్రయోగాలకూ ఆధునికతకూ ఆరుద్ర ప్రాధాన్యాన్నిచ్చారు. ‘గాయాలూ గేయాలూ’, ‘సాహిత్యోపని షత్’, (ఛందస్సు లేని) ‘ఇంటింటి పజ్యాలు’, ‘కూనలమ్మ పదాలు’, ‘సినీ వాలి’, ‘పైలా పచ్చీసు’, ‘అమెరికా ఇంటింటి పజ్యాలు’ తదితర రచనలు చేశారు. నాట్యశాస్త్రంలోని ‘హస్త లక్షణ పదాలు’ మరో ప్రత్యేక రచన. ‘ఆరుద్ర అరబ్బీ మురబ్బాలు’ ఆయన మరణానంతరం వెలువడ్డాయి. జీవితపు చివరి దశలో మొదలు పెట్టిన ‘మనిషి – ఆడ మనిషి’ కావ్యంలోని ఒక భాగం ‘స్త్రీ పురాణం’ మహిళా కోణాన్ని ఆవిష్కరించింది. తను రాయని ‘సినీవాలి’ అనే కావ్యం రాసినట్టు ఎవరో పొరబాటున పేర్కొంటే ఆ పేరుతో కావ్యం రాశారు. ఇంటింటి పజ్యాలు, కేరా శతకము వంటివి అలవోక ప్రయోగాలే. ‘కూనలమ్మ పదాలు’ వందల మందిని కవులను చేశాయంటారు. వీర తెలంగాణ సాయుధ పోరా టంపై హరీంద్రనాథ్ చటోపాధ్యాయ గీతాలను తెలుగులోకి అనువదించగా సుందరయ్యగారి పుస్తకంలో ప్రచురించారు.‘కొండగాలి తిరిగింది’ పేరిట వచ్చిన సినిమా పాటలు ఆయన పట్టును చెబుతాయి. ‘ఎదగడానికెందుకురా తొందర’ పాటలో నిరుద్యోగాన్ని వివరిస్తారు. ‘గాం«ధీ పుట్టిన దేశమా ఇది’ అంటూ ప్రశ్నిస్తారు. ‘వేదంలా ఘోషించే గోదావరి’, ‘మహాబలిపురం’ వంటి పాటలు వింటే రాగం చరిత్ర అల్లుకుపోవడం చూస్తాం. అందులో కూడా ‘కట్టు కథల చిత్రాంగి కనకమేడలు’ అంటూ అది నిజం కాదని సూచిస్తారు. ‘కొట్టుకుని పోయే కొన్ని కోటి లింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు’ అన్న ఆయన మాటలు సుభాషితాల్లా నిలిచిపోయాయి. ‘రగిలింది విప్లవాగ్ని ఈ రోజు’ అంటూ ‘అల్లూరి సీతారామరాజు’కు రాసిన పాట కూడా గొప్పగా ఉంటుంది. సినిమా పాటల తీరు మారి విలువలు తగ్గిపోతున్న దృష్ట్యా వాటిని రాయడం విరమించుకున్నారు. 150 చిత్రాలకు మాటలూ, 500 చిత్రాల్లో నాలుగు వేల పాటలూ రాశారు. సినీ జనానికి ఆయనో విజ్ఞాన సర్వస్వంలా గోచరించేవారు. సామాన్యుడికి సాహిత్య చరిత్ర తెలియడానికి ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ మహాభారం వేసుకున్నానని ఆరుద్ర వినయంగా చెప్పినా... పండితులకే గొప్ప వనరు సమ కూర్చారు. దాన్ని రాసే సమయంలో తీరిక లేకపోవడం వల్లనే గడ్డం చేసుకోవడం మానేసి పెంచేశానని సరదాగా చెబుతుండేవారు. ‘వేమన వేదం’, ‘మన వేమన’, ‘వ్యాస పీఠం’, ‘గురజాడ గురుపీఠం’ సంపుటాలు; ‘ప్రజా కళలూ – ప్రగతివాదులూ’ ఆయన ప్రజ్ఞకు ప్రతిబింబాలుగా నిలిచి ఉన్నాయి. ’రాముడికి సీత ఏమవుతుంది?, ‘గుడిలో సెక్స్’ అన్న గ్రంథాలు ఇప్పుడెంత సంచలనమయ్యేవో! కళలు, క్రీడలు, ఇంద్రజాలం వంటి అంశాలపై కూడా సాధికార గ్రంథాలు వెలువరించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజాన్ని ఓడించా లంటూ సైన్యంలో చేరడంతో మొదలైన ఆరుద్ర రాజకీయ అవగాహన ఆఖరు దాకా ప్రగతిశీలంగానే సాగింది. సైద్ధాంతిక విభేదాలు పెరిగినపుడు మామూలు కవులుగా అందు కోవడంలో తాము పొరబడి ఉండొచ్చని నిస్సంకోచంగా వినయంగా చెప్పారేగానీ ఇతరులపై దాడి చేయలేదు.1985లో ఆరుద్ర షష్టి పూర్తి సాహిత్య లోకంలో ఒక పండుగలా జరిగింది. తర్వాత కాలంలో ఆరుద్ర ఉద్యమానికి మరింత దగ్గరయ్యారు. సోవియట్ విచ్ఛిన్నం, ప్రపంచీ కరణ, దేశంలో అయోధ్య వివాదం తరుణంలో ఆరుద్ర ‘మనీ ప్రపంచం మనీ ప్రపంచం/ మనీ ప్రపంచం గెలిచిందా? మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం మారిందా?’ అని ప్రశ్నించారు. ఆరుద్ర 1998 జూన్ 4న కన్నుమూసిన సంగతి అంత్యక్రియలు ముగిశాక గాని తెలియలేదంటే అది ఆయన నిరాడంబరతకు ఓ నిదర్శనమే. తన అంతిమఘట్టం అలా నిశ్శబ్దంగా జరిగిపోవాలని ఆయన ఆకాంక్షించారని భార్య రామలక్ష్మి నా ఇంటర్వ్యూలో చెప్పారు. చరిత్రనే తిరగదోడే అసహన ధోరణులూ దాడులూ, కళాసాహిత్యాలలో వాణిజ్య ప్రలోభాలూ పెరిగిన ఈ తరుణంలో ఆరుద్ర జీవితం అధ్యయనానికీ, ఆచరణకూ మార్గదర్శకం. తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ పత్రికా సంపాదకులు(నేడు ఆరుద్ర శతజయంతి) -
మమతా బెనర్జీ (ప.బెం. సీఎం) రాయని డైరీ
నూట నలభై తొమ్మిది పుస్తకాలు రాశాక కూడా, ఇవాళ రాయటం మొదలు పెట్టిన కొత్త పుస్తకానికి ప్రారంభ వాక్యం కుదరటం లేదు! నెహ్రూ నుంచి ముందుకు రావటమా, లేక నరేంద్ర మోదీ నుంచి వెనక్కు వెళ్లటమా? భారత ప్రధానుల మీద నేను తలపెట్టిన మహాకావ్య యజ్ఞమిది. జనవరి 22 నుండి కోల్కతా బుక్ ఫెయిర్. ఆ లోగా నా బుక్ బయటికి వచ్చేయాలంటే ప్రారంభ వాక్యం ఏమిటన్నది చూసుకోకూడదు.నిజానికి, తొలి వాక్యానికి ఇంత యోచన అక్కర్లేదు. బెంగాల్ నుంచి ఒక్క ప్రధానీ లేరు కనుక బెంగాల్ను అమితంగా ఇష్టపడిన నెహ్రూజీతో నా పుస్తకాన్ని మొదలు పెట్టొచ్చు.నెహ్రూ పొద్దస్తమానం ఇక్కడికి వచ్చి వెళుతుండేవారు. కవులతో, కళాకారులతో ముచ్చట్లు పెట్టేవారు. టాగూర్, సుభాష్ చంద్రబోస్లతో క్లోజ్గా ఉండేవారు. నేనూ ఆ కాలం నాటి రచయిత్రిని అయుంటే... బహుశా నెహ్రూకూ, నాకూ మధ్య కూడా స్నేహం ఏర్పడి ఉండేదా! నా పెదవులపై చిరునవ్వు. నెహ్రూ తర్వాత, నాలో మెదిలిన వారు శ్రీమతి గాంధీ. ఇక్కడే శాంతి నికేతన్లో ఆమె చదువుకున్నారు. నెహ్రూకి, శ్రీమతి గాంధీకి మధ్యలో ప్రధానిగా ఉన్న శాస్త్రీజీతో కూడా పుస్తకం మొదలు పెట్టొచ్చు. బోస్ మరణం లాగే, శాస్త్రీజీ మరణం కూడా ఒక మిస్టరీ! లేదంటే, నెహ్రూకీ–శాస్త్రీజీకీ మధ్యలో, శాస్త్రీజీకీ–శ్రీమతి గాంధీకీ మధ్యలో ప్రధానిగా ఉన్న నందాజీని తీసుకోవచ్చు. కానీ ఆయన బెంగాల్తో అస్సలు కనెక్ట్ అయి లేరు. మొరార్జీ దేశాయ్ ఒకసారి ఇక్కడికి వచ్చి గంగలో మునకలేసి వెళ్లారు. చరణ్ సింగ్ అసలు కలకత్తాకే వచ్చినట్లు లేరు! వీపీ సింగ్, అప్పటి బెంగాల్ సీఎంతో మాట్లాడటానికి వచ్చారు. చంద్రశేఖర్ ఒక ఇండస్ట్రియలిస్టును కలిసేందుకు కలకత్తా వచ్చి వెళ్లినట్లున్నారు. దేవెగౌడ కూడా కలకత్తా వచ్చారు. పొలిటికల్గా నాకు సపోర్టు ఇచ్చారు. ఐ.కె. గుజ్రాల్ సై¯Œ ్స సిటీని ప్రారంభించి వెళ్లారు. అసలింత ఆలోచన లేకుండా నేరుగా రాజీవ్ గాంధీతో ప్రారంభ వాక్యాన్ని మొదలు పెట్టొచ్చు. నేను కలిసిన తొలి ప్రధాని ఆయన. నన్ను తన సిస్టర్లా చూసుకున్నారు. కెరీర్లో నాకు లిఫ్ట్ ఇచ్చారు. పీవీని, వాజ్పేయిని, మన్మోహన్ని కూడా నేను కలిశాను కానీ, పీవీజీ ఎప్పుడైనా కలకత్తా వచ్చారేమో నాకు గుర్తు లేదు. అటల్జీ కలకత్తాలో మా ఇంటికి కూడా వచ్చారు. మన్మోహన్ కలకత్తా వచ్చి నా కోసం ఎన్నికల ప్రచారం చేశారు. తొలిసారి నన్ను సీఎంను చేసిన ఎన్నికలవి! ఇక మోదీజీ అయితే ఉదయం లేస్తూనే ఇప్పుడు బెంగాల్లో ఉంటున్నారు. మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు!ఇంతమంది దిగ్గజాలలో ఎవరితో పుస్తకం మొదలు పెట్టాలో నిర్ణయించుకుంటే బహుశా ఆ వెనకే ప్రారంభ వాక్యం రావచ్చా అని ఆలోచిస్తూ ఉన్నాను. ‘‘శుభేచ్ఛా పీషీ’’ అంటూ లోపలికి వచ్చాడు అభిషేక్. తను నా అన్న కొడుకు. ‘‘రా, భిపో... వచ్చి కూర్చో’’ అని దగ్గరకు పిలిచాను. కూర్చున్నాక, ‘‘పుస్తకం ఎవరితో మొదలు పెడితే బాగుంటుంది?’’ అని అడిగాను. ప్రధానుల మీద నేను పుస్తకం రాయబోతున్నట్లు అభిషేక్కి తెలుసు. కాసేపు దీర్ఘంగా ఆలోచించి, ‘‘అయినా పీషీ, ప్రధాన మంత్రుల మీద పుస్తకాన్ని ప్రధాన మంత్రులతోనే ఎందుకు ప్రారంభించాలి? ప్రధానిగా అవకాశం వచ్చినా, పార్టీ నిర్ణయాన్ని గౌరవించి, ఆ అవకాశాన్ని వదులుకున్న వారితో మొదలు పెట్టొచ్చు కదా?’’ అన్నాడు!క్షణం తర్వాత గానీ, అభిషేక్ ఎవరి గురించి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. అర్థమయ్యాక, ‘‘ఎక్స్లెంట్, భిపో’’ అని మెచ్చుకోలుగా తన వైపు చూశాను. బెంగాల్కు 23 ఏళ్లు సీఎంగా ఉన్న జ్యోతి బసు ప్రధాని కాలేకపోవచ్చు. బెంగాల్లో ఆయన నా రాజకీయ ప్రత్యర్థి అయితే కావచ్చు. కానీ, నేను రాయబోయే ప్రధానుల పుస్తకానికి నిండుదనాన్నయితే తేగలిగినవారే! -
హిమాలయాల పెను హెచ్చరిక
ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో ఆగస్టు 5న వరుణుడు విలయ తాండవం చేశాడు. ఈ తీవ్ర అవపాతం హార్షిల్ దగ్గరలోని ధరాలీ, హార్షిల్ లోని సైనిక స్థావరం వద్ద ఆకస్మిక వరదలను సృష్టించింది. భారీ వర్షంతోపాటు మేఘ విస్ఫోటనం చోటుచేసుకుందని చెబుతున్నారు. అతి స్వల్ప కాలంలో అపారమైన వృష్టిని మేఘ విస్ఫోటనం అంటున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో ఈ రకమైన పరి ణామం ఇదే మొదటిది కాదు. ‘హిందూ కుశ్ హిమాలయ’ (హెచ్కెహెచ్) ప్రాంతం ఇప్పటికే అనేక వైపరీత్యాలను చవిచూసింది. నేపాల్ లిమి కోనలోని టిల్ గ్రామంపై మే 15న వినాశకర మైన వరద విరుచుకుపడింది. తర్వాత, హిమానీ సరస్సు ఉన్న జలాశయ ఆనకట్ట తెగి రసువా–భోటేకోశీ నది ఆయకట్టును జూలై 8న వరద ముంచెత్తింది. జమ్ము–కశ్మీర్ లోని కిస్త్వార్ జిల్లాలో ఆగస్టు 14న తీవ్ర ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. చినాబ్ నది ఆరగాణి పొడవునా మొత్తం గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వంతెనలు, రోడ్లు, జల విద్యుదు త్పాదన కేంద్రాల విభాగాలు కొట్టుకుపోవడంతో అనేక మంది నిరా శ్రయులయ్యారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళే దారిలో , ఆగస్టు 26న వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు చని పోయారు. అక్కడ కొండవాలు ప్రాంతాలు బలహీనంగా ఉన్నాయి. వాటికి తీవ్ర వృష్టి తోడవుతోంది. వరదలకు లోనుకాగల సానువుల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. జల బాంబులుఈ దుర్ఘటనలన్నీ, రకరకాల ఆపదల రాకను సమగ్రంగామదింపు చేసే (ఎంహెచ్ఆర్ఏ) వ్యవస్థ అవసరాన్ని మరోసారి చాటుతున్నాయి. అక్కడక్కడ విడి విడిగా ప్రమాదాలకు ఉన్న అవకాశాలనే కాకుండా , వాటి మధ్యన ఉండగల సంక్లిష్ట పరస్పర క్రియలను పరిశీలించేదిగా ఆ ప్రణాళిక ఉండాలి. అధిక వర్షపాతం కొండ చరియలు విరిగిపడటానికి, తదనంతరం, హిమానీ సరస్సు లకు గండిపడటానికీ దారితీస్తోంది. నీరు గడ్డకట్టిన ప్రాంతాలు, హిమం కరుగుతున్నాయి. ఈ జల ప్రవాహాలన్నీ కలసి లోయల్లో అస్థిరతను మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. హిందూ కుశ్ హిమానీ నదాలు ఆందోళనకరమైన వేగాలతో తగ్గుతున్నాయి. ఇవి కరుగు తున్న వేగం, హిందూ కుశ్ నదుల ప్రవాహ వేగాల గతులను మార్చే స్తోంది. ఇవి ‘క్రయోస్పియర్ టైమ్ బాంబులు’గా తయారవు తున్నాయి.సిక్కింలో 2023 అక్టోబర్ 3న సంభవించిన విపత్తు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇది హిమానీ సరస్సుకు గండిపడటంతో వచ్చిన వరద బీభత్సమే కాదు. ఒక పరిణామం మరో పరిణామా నికి పురిగొల్పే సంక్లిష్టమైన ఉపద్రవం. ఒక పెద్ద హిమఖండం దక్షిణ లోనక్ సరస్సులోకి వచ్చిపడటంతో ఆ గొలుసు కట్టు ప్రక్రియ మొదలైంది. హిందూ కుశ్లో ఉపేక్షిస్తూ వచ్చిన జల ఘనీభవన స్థానాల కీలక పాత్రను అది తేటతెల్లం చేసింది. ఆర్కిటిక్ప్రాంతంలో శాశ్వత ఐసు గడ్డల గురించి విస్తృతమైన అధ్యయనాలు సాగాయి. హిందూ కుశ్ ప్రాంతంలో హిమ ఖండాలు కరగడంపై ఇటీవలి కాలంలో మాత్రమే దృష్టి సారించారు. హిమ ఖండాలు కరిగితే లోయలు అస్థిరమవుతాయి. అది కొండ చరియలు విరిగి పడటానికి కారణమవుతుంది. భూకంపాలకు హెచ్చరించినట్టుగానే...ఏయేటి కాయేడు, పర్వత ప్రాంతాల్లో పెరుగుతున్న సంక్లిష్ట ఉపద్రవాల ద్వారా ప్రకృతి మనకు తరచూ హెచ్చరికలు పంపుతోంది. ఈ పరిణామాలను ప్రభావితం చేయగలిగిన నమూనాలు లేకపోలేదు. కానీ, వాటి కచ్చితత్వం పూర్తిగా ‘ఇన్ పుట్ డేటా క్వాలిటీ’పై ఆధారపడి ఉంటుంది. ప్రమాదాలను ముందే పసిగట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు, ఆపదలను తగ్గించుకునే వ్యూహాల రూపకల్పనకు మనం ఎత్తయిన ప్రదేశాలలో క్షేత్రస్థాయి డేటా సమీకరణ చేపట్టాలి. అందుకు అత్యవసరంగా మరిన్ని నిధులను వెచ్చించవలసిన అవసరం ఉంది. గ్లేసియర్ ద్రవ్య రాశి సమతౌల్య కొలతలను నమోదు చేసుకోవాలి. వాతావరణ పరిశోధన శాఖ రికార్డులను పదిలపరచుకుని పరిస్థితులను బేరీజు వేసుకోవాలి. సరస్సుల పరిమాణాలను కచ్చితత్వంతో అంచనా వేసేందుకు సమగ్ర బాతీమెట్రిక్ సర్వేలు నిర్వహించుకోవాలి.గ్లేసియర్ సంబంధిత వైపరీత్యాలు చెదురుమదురుగా ఉండటం అరుదు. అవి ఒకదానివెంట ఒకటి సంభవిస్తుంటాయి, సరిహద్దు లకు అతీతమైనవిగా తరచూ ఉంటాయి. ఎక్కడ వైపరీత్యం సంభ వించినా దాని చుట్టుపక్కల దేశాలన్నీ కష్టనష్టాలను అనుభవించక తప్పదు. కనుక, పటిష్టమైన ప్రాంతీయ సహకారం అనివార్యం. ప్రజలు లేదా మౌలిక వసతులపై ప్రభావం చూపినప్పుడు ప్రమాదం సైతం పెను ఉపద్రవంగా మారుతుంది. కనుక, జనావాస ప్రాంతాల ప్రణాళికలు, మౌలిక వసతుల అభివృద్ధి శాస్త్రీయ విజ్ఞానంతో కూడుకున్నవై ఉండాలి. ముఖ్యంగా, ఎప్పుడుఎలాంటి జలవాయు పరివర్తనాలు చోటుచేసుకుంటాయో తెలియని హిందూ కుశ్ పర్యావరణాలలో వాటి అవసరం మరింత ఉంది. వైజ్ఞానిక మదింపులను ఆధారం చేసుకున్న ఆచరణ యోగ్యమైన విధానాలను మనం తు.చ. తప్పకుండా అమలు చేయాలి. క్రయోస్పియర్ ప్రమాదకర మండలాల పటాన్ని తయారు చేయడం ఆ దిశగా వేసే ముఖ్యమైన అడుగు కావచ్చు. భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం సంభవించగల ప్రాంతాలను గుర్తించే పటం మాదిరిగానే దాన్నీ రూపొందించుకోవచ్చు. ఎత్తైన ప్రాంతాల్లోనూ, గడ్డ కట్టిన సరస్సులు ఉన్న చోట్ల ఎక్కడెక్కడ ఎలా అభివృద్ధి చేయవచ్చో ఆ మ్యాప్ మార్గం చూపుతుంది. ముఖ్యంగా ప్రవాహ దిగువ ప్రాంతాల్లో ప్రజలు ఉన్న చోట్ల, లేదా కీలకమైన మౌలిక వసతులు ఉన్నచోట ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చివరగా, హై–రిస్క్ మండలాల్లో ఆదిలోనే హెచ్చరించగల వ్యవస్థలను నియోగించుకోవాలి. శిక్షణ ఇవ్వడం, మాక్ డ్రిల్స్ నిర్వహించడం ద్వారా ప్రజలను సన్నద్ధులను చేసే కార్యక్రమాన్ని పటిష్ఠపరచుకోవాలి. కొద్ది నిమిషాల ముందు హెచ్చరించినా ప్రాణాలను కాపాడుకునేందుకు ఎంతో అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.– మహమ్మద్ ఫారూక్ ఆజమ్ ‘ గ్లేసియాలజీ, హైడ్రాలజీ ప్రొఫెసర్, ఐఐటీ, ఇందౌర్– శాశ్వతా సన్యాల్ ‘ ఇంటర్వెన్షన్ మేనేజర్, ఐసీఐఎంఓడీ(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భారత్కు పరీక్షా సమయం
భారత ప్రభుత్వం పలు దేశాలతో సంబంధాల అభివృద్ధికి శీఘ్రగతిన చేస్తున్న ప్రయత్నాలు, చూపుతున్న స్వతంత్ర ధోరణి అమెరికాతో తలెత్తిన సమస్యల వల్ల తాత్కాలికమా? లేక దీర్ఘ కాలంలో ‘బ్రిక్స్’ వేదికగా బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థే సరైన ప్రత్యామ్నాయమనే గుర్తింపు మౌలికమైన రీతిలో కలిగి నందువలనా? ఈ కీలకమైన ప్రశ్నపై స్పష్టత అవసరం. ఎన్నెన్ని లోపాలు ఉన్నా వర్ధమాన ప్రపంచంలోని అగ్ర దేశాలలో భారతదేశం ఒకటి. ప్రపంచం ఆర్థికంగా, రాజకీయంగా, వ్యూహాత్మకంగా కూడా ఒక చౌరస్తా వంటి పరిస్థితిలోకి వచ్చి చేరింది. ప్రపంచాన్ని అన్ని విధాలుగా కొన్ని శతాబ్దాల పాటు శాసించిన పాశ్చాత్య దేశాలు బలహీనపడు తుండటం ఒకవైపు కనిపిస్తున్నది. నెమ్మదిగా బలపడుతూ, స్వతంత్ర ధోరణిలో ముందుకు పోజూస్తున్న వర్ధమాన దేశాల ధోరణి మరో వైపు ఆవిష్కృతమవుతున్నది. అటువంటపుడు భారతదేశం ఎక్కడ నిలిచి ఏ పాత్ర వహించగలదన్నది చరిత్రాత్మక నిర్ణయం కానున్నది.తాత్కాలికమా? దీర్ఘ కాలికమా?భారతదేశం వివిధ కారణాల వల్ల గత పాతిక సంవత్సరాలుగా అమెరికన్ శిబిరానికి సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఇటీవలి కాలంలో బలహీనపడుతున్న అమెరికాకు తన పట్ల, ప్రపంచం పట్ల దృష్టి మారి గతం కన్నా భిన్నమైన విధానాలను రూపొందించుకుంటున్నది. ఈ కొత్త పరిస్థితి భారతదేశానికి ఒక పరీక్షగా మారిందన్నది గుర్తించవలసిన విషయం. అమెరికా విధానాలలోని మార్పుల వల్ల వాణిజ్య సుంకాల రూపంలో, వాణిజ్య ఒప్పందపు చర్చల రూపంలో, ఇతరత్రా కూడా ఎదురవుతున్న ఆర్థిక రంగ సమస్యలు కనిపిస్తున్నవే! ఇవి గాక, ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ప్రభావాలు భారతదేశంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉండ బోతున్నాయి. ఉదాహరణకు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ), ఐసీజే, ఐసీసీ, యూఎన్ఓ, డబ్ల్యూహెచ్ఓ, యునిసెఫ్ మొదలైన సంస్థలను బలహీనపరచటమో, వాటి నుంచి ఉపసంహరించుకోవ టమో అమెరికాకు నిత్యకృత్యంగా మారింది. అటువంటపుడు ప్రభుత్వం అమెరికాతో ఏర్పడిన సమస్యలు తాత్కాలికమని, క్రమంగా వెనుకటి స్థితి ఏర్పడగలదనే అవగాహ నతో ముందుకు పోతుందా అన్నది ఒక ప్రశ్న. దీని అర్థం అమెరికాతో మైత్రికి బదులు వైరం ఏర్పడాలని ఎంతమాత్రమూ కాదు. కానీ, తగిన స్పృహ, జాగ్రత్తలు లేని మైత్రికీ, అవి ఉండే మైత్రికీ తేడా ఉంటుంది. అదే సమయంలో రెండు దేశాల మధ్య ఇటీవల తలెత్తిన సమస్యలు పరిష్కారం కావటం అవసరం. అందువల్ల కలిగే మేలు చాలానే ఉంటుంది. అందులో వ్యూహాత్మకమైనవి, దేశ రక్షణకు సంబంధించినవి కూడా ఉంటాయి. అయితే, స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రయోజనాల కోసం అమె రికా వైపు చూడవలసి రావటం ఎంత అవసరమో, దీర్ఘకాలిక దృష్టితో ‘బ్రిక్స్’ వంటి ప్రత్యామ్నాయాలు, బహుళ ధ్రువ ప్రపంచా లను లక్ష్యంగా పెట్టుకోవటం కూడా అంతే అవసరం. ఏక కాలంలో ఈ రెండింటితో ఎట్లా వ్యవహరిస్తారన్నది దౌత్యనీతిపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి అటువంటి సంతులనం అవసరమని జైశంకర్ విదేశాంగ మంత్రి అయిన కొత్తలోనే ‘ది ఇండియా వే’ పుస్తకంలో సూచించారు. కానీ, అప్పటికన్నా పాశ్చాత్య ప్రపంచపు బలహీనతలు పెరిగాయి. ముఖ్యంగా ట్రంప్ విధానాలతో పరి స్థితులు గణనీయంగా మారుతున్నాయి. అందువల్ల, ప్రత్యామ్నా యాల వైపు లోగడకన్నా మరింత ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఏర్పడుతున్నది. బ్రిక్స్ కరెన్సీ అనకుండానే...పోతే, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కొన్నింటిని చూద్దాము. అవి – ట్రంప్ సుంకాలు, జిన్పింగ్తో జైశంకర్ సమా వేశం, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి రావడం, ఈ నెలాఖరున బీజింగ్లో జరిగే ‘షాంఘై సహకార సంస్థ’ శిఖరాగ్ర సమావేశానికి మోదీ వెళ్లనున్నట్లు ప్రకటన, ట్యారిఫ్లకు జంకబోమంటూ దేశ స్వావలంబనకు పిలుపునిచ్చి జీఎస్టీ స్లాబ్లను నాలుగు నుంచి రెండింటికి ప్రభుత్వం తగ్గించటం వంటివి. ఇవన్నీ జాబితా వలె రాసుకోవటం ఎందుకంటే, ఈ పరిణామాలు కొద్ది కాలంలోనే అమెరికా చర్యలకు స్పందనగా జరిగినటువంటివి. వాటన్నిటికి తగు ప్రాముఖ్యం ఉంది.వీటిమధ్య చాలా ముఖ్యమైనది ఒకటి జరిగింది. అది – అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి మారకపు చెల్లింపులకు సంబంధించిన నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సడలించటం. ప్రైవేట్ కంపెనీలు ఇతర దేశాలతో జరిపే లావాదేవీలలో రూపాయి కరెన్సీ వినియో గానికి ప్రత్యేకంగా వోస్ట్రో అకౌంట్లు తెరవాలి. అందుకు స్థానిక బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి అవసరమయేది. ఆ నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఇపుడు ఎత్తివేసింది. అందువల్ల వాణిజ్యం సులభతరం అవుతుందనేది సరేసరి. కానీ, అంతకుమించిన విశేషం ఉంది. ఇంతకుముందు వలె డాలర్పై ఆధారపడనక్కర లేక పోవటం! డాలర్కు బదులు ‘బ్రిక్స్’ దేశాలు పరస్పరం గానీ, ఇతర దేశాలతో గానీ తమ సొంత కరెన్సీలలో చెల్లింపులు చేసుకోవాలని, ఆ విధంగా డాలర్ బలహీన పడుతుందన్నది ఆ సంస్థ తీర్మానం. డాలర్కు ప్రత్యామ్నాయంగా ‘బ్రిక్స్’ కరెన్సీ అనకుండానే వారు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నారు. ఇండియా కూడా అటువంటి చెల్లింపులు కొన్ని చేస్తున్నా, డాలర్కు తాము వ్యతిరేకం కాదంటూ వచ్చింది. ధోరణి ఇదే విధంగా కొనసాగితే, కొందరు విమర్శకులు ఎత్తి చూపుతున్నట్లు బ్రెజిల్, చైనాల వలె భారత్ కూడా అమెరికాపై ఎదురు సుంకాలు విధించటం, డబ్ల్యూటీఓకు ఫిర్యాదు చేయటం వంటి చర్యలు తీసుకోగలదేమో చూడవలసి ఉంటుంది.వచ్చే సంవత్సరం ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకో నుంది. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం 2026లో ఢిల్లీలో జరిగి, ఆ సంస్థకు భారతదేశం అధ్యక్షత వహించనుంది. అందువల్ల ఈ దేశంపై ఎటువంటి బాధ్యతలు ఏర్పడతాయో ఊహించవచ్చు. ఇప్పటికే ఒక కొత్త ధోరణిలో ముందుకు వెళ్లవలసి వస్తున్న భారత ప్రభుత్వం ఆ మార్పును స్వల్పకాలికానికి పరిమితం చేయగలదా, లేక దీర్ఘకాలికం, మౌలికం చేయవచ్చునా అన్నది పెద్ద ప్రశ్న అవు తున్నది. ఈ పరిణామాలకు కొసమెరుపు 23వ తేదీ నాటి జైశంకర్ వ్యాఖ్యలు. తన జీవితంలో ట్రంప్ వంటి అధ్యక్షుడిని చూడలేదని, ఇండియా ఉత్పత్తులను వారికి కావాలంటే కొనవచ్చు, లేదా మాన వచ్చునని, మాకు వేరే మార్కెట్లు ఉన్నాయని అన్నారాయన. ఆత్మ విశ్వాసం కలిగి స్వతంత్రంగా వ్యవహరిస్తే ఇట్లాగే ఉంటుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
స్వావలంబన సాధించగలమా?
స్వాతంత్య్రానంతరం 1950వ దశకం మొదటి అర్ధ భాగంలో ఆహార ధాన్యాలు, హెవీ ఇంజినీరింగ్ వస్తువులు, రవాణా పరికరాలు, యంత్రాలు, మెషిన్ టూల్స్, ఇతర మూలధన వస్తువుల దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడింది. స్వావ లంబన, స్వీయ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ప్రారంభమైన మూడవ పంచ వర్ష ప్రణాళిక, ఆ తర్వాతి హరిత విప్లవం, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్లు సరైన ఫలితాలను అందించలేక పోయాయి. 2024–25లో వస్తు వాణిజ్య లోటు 282.3 బిలియన్ డాలర్లు కాగా, కరెంటు ఖాతా లోటు 23.3 బిలియన్ డాలర్లుగా నమోదవడాన్ని బట్టి, భారత్ వస్తు దిగుమతులపై అధికంగా ఆధారపడటం తేటతెల్లమవుతున్నది.తయారీకి దిగుమతులే ఆధారంతయారీ రంగాన్ని పటిష్ఠపరచడంతోపాటు భారత్ను ప్రపంచంలో ‘తయారీ, డిజైన్ హబ్’గా రూపొందించడానికి 2014 సెప్టెంబర్లో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రారంభమైంది. నియంత్రణ–విధానపరమైన అడ్డంకులు, లాజిస్టిక్స్–సప్లయ్ చెయిన్ వ్యవస్థ సమర్థంగా లేకపోవడం, ప్రైవేటు–విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో తక్కువ వృద్ధి, నైపుణ్యం గల శ్రామిక శక్తి లభ్యత తక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో అధిక పోటీ కారణంగా మేక్ ఇన్ ఇండియా తన లక్ష్య సాధనలో వెనుకబడింది.సెమీ కండక్టర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో మొబైల్ ఫోన్ తయారీదారులు అధికంగా దిగుమతులపై ఆధార పడుతున్నారు. భారత్లో ఫోన్ల అసెంబ్లింగ్లో నిమగ్నమైన ఆపిల్, శామ్సంగ్, షావోమీ కంపెనీలు చైనా, తైవాన్, దక్షిణ కొరియా నుండి చిప్సెట్స్, డిస్ప్లే ప్యానల్స్, కెమెరా మాడ్యూల్స్ను దిగుమతి చేసు కుంటున్నాయి. కార్ల తయారీలో నిమగ్నమయిన టాటా,హ్యుండాయ్, మారుతి సుజుకీలు ఎలక్ట్రానిక్స్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ, ఇంజిన్ కంట్రోల్ యూనిట్లను దిగుమతి చేసుకుంటున్నాయి. చైనా నుండి సోలార్ సెల్స్, మాడ్యూల్స్ను పెద్ద సోలార్ పార్క్లు దిగు మతి చేసుకుంటున్నాయి. భారత్లో అవసరమైన ఆరోగ్య సంరక్షణ సాధనాలు 90 శాతం చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రపంచ మార్కెట్లో టెక్స్టైల్స్కు సంబంధించి భారత్ అతి పెద్ద ఎగుమతిదారునిగా నిలిచినప్పటికీ వీటి తయారీలో ఉపయోగించే సింథటిక్ ఫైబర్, ముఖ్య యంత్రాల కొరకు భారత్ దిగుమతులపై ఆధారపడుతోంది. టీవీ, లాప్టాప్స్, వాషింగ్ మెషిన్ ఉత్పత్తుల అసెంబ్లింగ్కు అవసరమైన చిప్స్, సెన్సార్స్, డిస్ప్లేలు కూడా దిగుమతి చేసుకుంటున్నవే.ఎరువుల ఉత్పత్తిని పెంచడమెలా?79వ స్వాతంత్య్ర దినోత్సవాలలో భాగంగా ప్రధాని ‘స్వయం సమృద్ధ భారత్’ను ప్రస్తావించారు. 2047 నాటికి అన్ని రంగాలలో ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ విజన్ను పేర్కొన్నారు. అయితే, దేశీయంగా వ్యవసాయ డిమాండ్ నేపథ్యంలో ఎరువులు ప్రధాన దిగుమతులుగా నిలిచాయి. 2024–25లో ఎరువు లకు డిమాండ్ 650 లక్షల టన్నులు కాగా, దేశీయంగా ఉత్పత్తి తక్కు వగా ఉండటంతో 170 లక్షల టన్నులకు పైగా దిగుమతి చేసు కున్నట్లు అంచనా. అధిక దిగుమతులపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకున్నప్పుడు వాణిజ్య లోటు తగ్గుతుంది. యూరియా, ఫాస్పటిక్, పొటాసిక్ ఎరువుల దిగుమతులను తగ్గించుకోవడానికి గ్యాస్ ఫీల్డ్స్ అధికంగా ఉన్న ప్రాంతాలలో నూతన ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే మూసివేసిన ఎరువుల కర్మాగారాలను తిరిగి ప్రారంభించడంతో పాటు నానో– ఫెర్టిలైజర్ టెక్నాలజీని ప్రోత్సహించాలి. బయో ఆధారిత, ఆర్గానిక్ ఎరువుల వినియోగం పట్ల రైతులలో అవగాహన పెంపొందించినట్లయితే రసాయన ఎరు వుల వినియోగం తగ్గుతుంది. ఎరువుల ఉత్పత్తిని పెంచడానికి విదే శాలలో జాయింట్ వెంచర్స్ ఏర్పాటుతో పాటు ప్రపంచ ఎరువుల మార్కెట్లో ప్రధాన దేశాలుగా ఉన్న రష్యా, జోర్డాన్, కెనడాలతో దీర్ఘకాలిక ఒప్పందాలు అవసరం. ‘పునరుత్పాదక’ సమస్యలుజనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ నేపథ్యంలో 2040 నాటికి భారత్ శక్తి వినియోగం రెట్టింపు కాగలదని ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ’ అంచనా. భారత్ అవస్థాపిత విద్యుత్ సామర్థ్యం 2025 జూన్ నాటికి 476 గిగావాట్లకు చేరుకుంది. 2013 –14తో పోల్చినప్పుడు 2024–25లో విద్యుత్ కొరత తగ్గినప్పటికీ తలసరి వినియోగంలో 45.8 శాతం పెరుగుదల ఏర్పడింది. భారత్ మొత్తం విద్యుత్ సామర్థ్యంలో థర్మల్ విద్యుత్ వాటా 50.52 శాతం కాగా, శిలాజేతర ఇంధనాల వాటా 49 శాతం. 2014–15లో భారత్ మొత్తం ఎనర్జీ వినియోగంలో దిగుమతి వాటా 26 శాతం కాగా, 2025 జనవరి నాటికి 19.60 శాతానికి తగ్గింది. ‘వాణిజ్య బొగ్గు మైనింగ్’, ‘మిషన్ కోకింగ్ కోల్’ వంటి ప్రభుత్వ చర్యల వల్ల స్వదేశీ బొగ్గు ఉత్పత్తి పెరిగి, దిగుమతులపై ఆధారపడటం తగ్గింది. కానీ 2030–2035 మధ్య బొగ్గుకు డిమాండ్ అధికంగా ఉంటుందని నీతి ఆయోగ్ అంచనా. రాబోయే కాలంలో శక్తికి బొగ్గు ప్రధాన ఆధారంగా నిలిచే అవకాశం ఉన్నందువలన సౌర, పవన, జల విద్యుత్తు లాంటి పునరుత్పాదక శక్తి వనరులపై దృష్టి సారించాలి. శిలాజేతర ఇంధన ఆధారిత శక్తి సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు చేరుకోవాలని లక్ష్యం. అవస్థాపనా సౌకర్యాల కల్పన, గ్రీన్ ఫైనాన్సింగ్, ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యా లను ప్రోత్సహించినప్పుడు ఆయా ఉత్పత్తులు పెరిగి శక్తి సప్లయ్ పెరుగుతుంది. పునరుత్పాదక శక్తి ఆధారాలు ఎదుర్కొంటున్న సమస్యలైన ట్రాన్స్మిషన్ మౌలిక వసతులు సరిపోయినంతగా లేకపోవడం, నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం, వాతావరణ మార్పులు, సౌర, పవన క్షేత్రాలు నిర్మించడానికి అవసరమైన భూసేకరణ లాంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి.అవసరమైన సంస్కరణలురక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి ఇటీవల ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ఎఫ్డీఐ పరిమితిని సరళీకరించడంతోపాటు దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యమి స్తోంది. 2020–24 మధ్య ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆయుధాల దిగుమతిలో భారత్ వాటా 8.3 శాతం. మందుగుండు సామగ్రిలో భారత్ 88 శాతం స్వయంసమృద్ధి సాధించింది. రక్షణ రంగంలో భవిష్యత్ ఒప్పందాలు, ప్రాజెక్టులకు సంబంధించిన ‘డిఫెన్స్ ఆర్డర్ పైప్లైన్’ స్వదేశీ రక్షణ ఉత్పత్తుల పెరుగుదలకు దోహదపడగలదు. రక్షణ రంగంలో స్వావలంబన సాధన దిశగా ‘మిలిటరీ–ఇండ స్ట్రియల్ కాంప్లెక్స్’ను అభివృద్ధి పరచాలి.ముఖ్య రంగాలలో నైపుణ్యం, పోటీతత్వం, స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యం, కార్మిక సంస్కరణలు, కీలక పరిశ్రమలలో ప్రైవేటు కంపె నీలను అనుమతించడం లాంటి చర్యలు తీసుకున్నప్పుడే స్వావలంబన లక్ష్యం నెరవేరగలదు.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త వైస్ ఛాన్స్లర్ (ఇన్ఛార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ -
పేదవాడి గుండె చప్పుడు!
ఆయన భారతదేశ రాజకీయాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుగుతున్న పరిణామాలను అవలీలగా అర్థం చేసుకొని ప్రజలకు వివరించే బహుముఖ ప్రజ్ఞాశాలి. నిరంతరం కార్మిక, కర్షక, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ఆలోచన చేసే మేధావి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన గొప్ప నాయకుడు. ఆయనే కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి. 1942 మార్చి 25న జన్మించిన ఆయన ఈ 2025 ఆగస్ట్ 22న తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం కంచుపాడు ఆయన స్వగ్రామం. సురవరం ప్రతాపరెడ్డి గారికి సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామారెడ్డి స్వయానా తమ్ముడు. కర్నూలులో చదువుకునే రోజుల్లో 19 ఏళ్లకే ఏఐఎస్ఎఫ్ కర్నూల్ పట్టణ కార్యదర్శిగా, 1960లో కర్నూలు జిల్లా కార్యదర్శిగా పని చేశారు సుధాకర్ రెడ్డి. 1967లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కోర్సులో చేరారు. యూనివర్సిటీ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1963లో ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై అనంతరం రెండు పర్యాయాలు జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. లా పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలో సీనియర్ న్యాయవాది వద్ద చేరి ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం సీపీఐలో పూర్తి కాలం పని చేయడానికి అవకాశం ఇచ్చింది. దీంతో భారత కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఎదిగి 2012లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అయితే 2019లో అనారోగ్య కారణాల వల్ల పార్టీ పదవుల నుండి తప్పుకొన్నారు.1980, 1984ల్లో మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం నుండి పోటీచేశారు. 1994లో ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. 1998, 2004ల్లో లోక్ సభకు నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. భారతదేశ అత్యున్నత పార్ల మెంటరీ కమిటీలకు ప్రాతినిధ్యం వహించారు. అనేకమంది పేద లకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వడం కోసం కేంద్ర ప్రభు త్వంతో కీలకంగా వ్యవహరించారు. ఏఐఎస్ఎఫ్ ఉద్యమ సమయంలో పరిచయమైన డా‘‘ బీవీ విజయలక్ష్మిని 1974లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్న క్రమంలో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతల్లో ఉన్న సుధాకర్ రెడ్డి నాకు సైద్ధాంతిక అవగాహన కల్పించడంలో అందరి కంటే ముందున్నారు.2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆనాటి ఇందుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సిటింగ్ స్థానాన్ని సైతం నాకు ఇప్పించినేను శాసనసభ్యునిగా గెలుపొందడం కోసం కృషి చేశారు. శాసనసభలో సీపీఐ పక్ష నాయకునిగా పనిచేస్తున్న క్రమంలో ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చి ప్రోత్సహించారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్టుగా తుది శ్వాస విడిచే వరకు పని చేశారు. వారు విడిచిన సైద్ధాంతిక లక్ష్యాలను పుణికి పుచ్చుకొని ముందుకు పోవడమే ఆయనకు అసలైన నివాళి. – చాడ వెంకటరెడ్డిసీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు -
మట్టి చేతుల క్యూ!
అతను అదనపు భూమినోఅర్ధ సామ్రాజ్యాన్నో అడగడం లేదు పొలం తరఫున పంట కోసం ఎరువును అడుగుతున్నాడు అరువుకు కాదు ఖరీదుకే!ఇంట్లోనో పొలం దగ్గరో ఉండిఅతను హుకుం జారీ చేయడం లేదు క్యూలో నిల్చుని మట్టి చేతులు మోడ్చిమరీ అడుగుతున్నాడుపోలింగ్ బూత్ క్యూలనైతే మీరు ప్రేమతో పట్టించుకుంటారు కదా! పొలం వచ్చి క్యూలో నిల్చుంటే అసలు పట్టనట్లుంటే ఎట్లా? ఇది అన్న మూలమన్న సంగతి మరిస్తే ఎట్లా?తెలుసుకోండి: అతను ఎరువు కోసం క్యూలో నిల్చున్నాడంటేదేశం అన్నం కోసం క్యూలో నిల్చున్నట్లే!– దర్భశయనం శ్రీనివాసాచార్య94404 19039 -
బుద్ధిజీవులకైనా 'బలమైన సవాల్'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని నా రచనల్లో ఎలీన్ ఇంటెలిజెన్స్గా కూడా ప్రస్తావిస్తూ ఉంటాను. బుద్ధిజీవు లైన మానవ జాతిని మానవ పరిణామ శాస్త్ర పరిభాషలో హోమో సేపియన్స్గా పిలుస్తారు. నాకెందుకో ఒక కొత్త జాతి వృద్ధి చెంది ఈ హోమో సేపియన్స్ స్థానాన్ని భర్తీ చేస్తుందని అనిపిస్తోంది. ఈ భూగోళంపై మొదటిసారిగా మనకు నిజమైన పోటీ ఎదురవుతోంది. ఇప్పటికి కొన్ని వేలాది ఏళ్ళుగా మనమే అత్యంత తెలివైన జాతిగా ఉంటూ వస్తున్నాం. ఆఫ్రికాలో ఓ మూలన ప్రాధాన్యం లేని కోతులుగా పడి ఉన్న మనం ఈ తెలివి తేటల కారణంగానే, ఈ భూగోళానికి తిరుగులేని పాలకులుగా మారగలిగాం. కానీ, ఇపుడు మనం సృష్టిస్తున్నది సమీప భవిష్యత్తులో మనకు పోటీగా పరిణమించవచ్చు. పిల్లల్ని పెంచడం లాంటిదే!ఏఐ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన సంగతి ఒకటుంది. అది ఒక సాధనం కాదు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగిన ఏజెంట్. అది కొత్త ఐడియాలను కనిపెట్టగలదు. నేర్చుకోగలదు. తనకుతాను మారగలదు. మనం ఇంతకు ముందు కనుగొన్న ముద్రణాలయం, అణు బాంబు లాంటివి మనల్ని శక్తిమంతులను చేసిన సాధనాలు. వాటికి మన అవసరం ఉంది. ప్రెస్ స్వయంగా పుస్తకాలు రాయలేదు. ఏ పుస్తకాలను ప్రచురించాలో నిర్ణయించలేదు. అణు బాంబు తనకన్నా శక్తిమంతమైన మరో బాంబును కనుగొనలేదు. తానెక్కడ పేలాలో దాని కంతట అదే నిర్ణయించుకోలేదు. కానీ, ఏఐ ఆయుధం దాడికి లక్ష్యాన్ని ఎంచుకోగలదు. తదుపరి తరం ఆయుధాలను దానికంతట అదే డిజైన్ చేయగలదు.నా తాజా పుస్తకం ‘నెక్సస్’లో ఏఐని చిన్న పిల్లాడిలా అభివర్ణించాను. మనం ఏది నేర్పుతామో వాడు అదే నేర్చుకుంటాడు. కనుక, మనందరం ముఖ్యంగా, వివిధ దేశాల స్థితిగతులను ప్రభావితం చేస్తున్న నాయకులు చాలా బాధ్యతతో వ్యవహరించాలి. మనం అబద్ధాలాడుతూ, వంచన చేస్తూ, ఏఐ మాత్రం దయగలదిగా ఉండా లంటే కుదరదు. ఒక నిర్దిష్టమైన రీతిలో ఈ ఏఐని మనం డిజైన్ చేయగలమా? ఏఐకి నీతి నియమాలు బోధించగలమా? వాటిలోకి కొన్ని లక్ష్యాలను చొప్పించగలిగిన విధంగా కోడింగ్ చేయగలమా? అనే అంశాలపై పరిశోధన, ప్రయత్నాలు సాగుతున్నాయి. అపుడు మనం సురక్షితంగా ఉంటాం కదా అని భావిస్తున్నారు. కానీ, ఈ దృక్పథంలో రెండు ప్రధాన సమస్యలు ఇమిడి ఉన్నాయి. ఒకటి– అసలు ఏఐ అంటేనే నేర్చుకోగలదు, దానికంతట అది మారగలదు. కనుక మనం ఏఐని డిజైన్ చేస్తే, నిర్వచనాన్ని అనుసరించి, మనం ఊహించలేని అన్ని రకాల పనులనూ అది చేసేస్తుంది. రెండు– ఇది ఇంకా పెద్ద సమస్య. మనం ఏఐని పిల్లాడిలానే భావించి విద్యా బుద్ధులు నేర్పించాం అనుకుందాం. సత్పౌరుడుగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా పాటుపడ్డారు. వారి చదువు సంధ్యలపై మీరు ఎంత వెచ్చించారన్నది లెక్కలోకి రాదు. చివరకు, వారు చేసే పని మిమ్మల్ని ఆశ్చర్యపరచనూవచ్చు లేదా భయపెట్టనూవచ్చు. ఇంకో విషయం కూడా ఉంది. ఇది పిల్లల్ని పెంచేవారందరికీ అనుభవంలో ఉన్న విషయమే. మనం పిల్లలకి ఏం చెబుతామన్న దానికన్నా ఏం చేస్తున్నామన్నది ముఖ్యం. మనం పిల్లలకి అబద్ధా లాడవద్దని చెప్పేసి, మనం మాత్రం ఇతరులతో అబద్ధాలు చెబుతూంటే, వారు చూసి మనల్నే అనుకరిస్తారు. మన ఆదేశాల్ని పాటించరు. అబద్ధాలాడకూడదనే నీతిని ఏఐలలో చొప్పించే ప్రాజెక్టును చేపట్టామనుకుందాం. కానీ, వాటికి ప్రపంచంతో యాక్సెస్ ఉంది. మానవులు ఎలా ప్రవర్తిస్తున్నారో అవి గమనిస్తాయి. అదే నడతను మన పట్లా ప్రదర్శిస్తాయి. అన్నింటిలోనూ... అన్ని చోట్లా...వ్యాపారాలలో ఏఐ ప్రాధాన్యం ప్రస్తుతానికి పెద్ద లెక్కలోకి రానిదిగానే కనిపించవచ్చు. ఇప్పటికి 36 నెలల తర్వాత కూడా పరిస్థితి ఇలానే ఉంటుందా అంటే... అది టైమ్ స్కేల్పై ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఉదాహరణకు, ఇది లండన్లో 1835 సంవ త్సరం అనుకుందాం. మాంచెస్టర్– లివర్పూల్ మధ్య మొదటి రైలు మొదలై అప్పటికి ఐదేళ్లయింది. లండన్లో 1835లో చర్చకు కూర్చున్నవాళ్లకు ‘రైల్వేలు ప్రపంచాన్ని మార్చేస్తాయి, పారిశ్రామిక విప్లవం వచ్చేస్తుంది’ అంటే నాన్సెన్స్ అని కొట్టిపడేస్తారు. కానీ, ఇపుడు రైల్వేలు మొదలై చాలా ఏళ్ళు అయింది. పారిశ్రామిక విప్లవం, రైల్వేలు ప్రతీదాన్నీ మార్చేశాయని మనకు ఇపుడు తెలుసు. కానీ, మార్పు వచ్చేందుకు ఐదేళ్ళకన్నా ఎక్కువే పట్టింది. అలాగే, ఇప్పటికి తెలిసిన రంగాలు, అంతగా తెలియని రంగా లన్నింటిలో కూడా ఏఐతో మార్పులు రావచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగం ప్రధానమైన మార్పులను చూడవచ్చు. ఆర్థిక వ్యవస్థను ఏఐ చాలా వేగంగా హస్తగతం చేసుకోబోతోంది. ఆర్థికం పూర్తిగా సమా చార ప్రభావిత రంగం. డ్రైవర్ సీట్లో మనిషి లేకుండా నడిచే కార్లు లక్షల్లో మనకు అప్పుడే రోడ్డు మీద కనబడకపోవచ్చు. ఎందుకంటే, రోడ్డుమీద గుంతలుంటాయి, మనుషులు నడుస్తూంటారు, కంగా ళీగా ఉంటుంది కనుక ఏఐతో నడిచే వాహనాలు రాకపోకలు సాగించడానికి సమయం పడుతుంది. కానీ, ఆర్థికంలో సమాచా రమే ప్రధానం. వస్తుంది, వెళుతుంది. దానిపై పట్టు సాధించడం ఏఐకి చాలా తేలిక. ఆయుధ పోటీ లాంటి స్థితిఏఐ కొందరి ఉద్యోగాలకు ఎసరు పెడుతుంది అంటున్నారు. దీనిపై చాలా మందిలో ఆందోళన ఉంది. మరి ఒక సమాజంగా బతికి బట్టకట్టడమే కాదు, వృద్ధిలోకి రావాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఏఐకి అపారమైన సానుకూల సామర్థ్యమూ ఉంది. ప్రమాదకరమైన సామర్థ్యమూ ఉంది. ఒకే టెక్నాలజీ పూర్తిగా భిన్నమైన సమాజాలను సృష్టించడాన్ని మనం 20వ శతాబ్దంలో గమనించాం. అందుకే కమ్యూనిస్టు నిరంకుశ ప్రభుత్వాలతోపాటు, ఉదారవాద ప్రజాస్వామిక వ్యవస్థలూ ఏర్పడ్డాయి. ఏఐతోనూ అంతే! దాన్ని అనేక విధాలుగా ఉపయోగించుకునేందుకు మనకు అవకాశం ఉంది. కాకపోతే, మనం మొదటిసారిగా పనిముట్లతో కాకుండా ఏజెంట్లతో వ్యవహరిస్తున్నామనే సంగతిని గుర్తు పెట్టుకోవాలి. కానీ, ఇప్పటికీ ఏఐ చాలా వరకు మన చెప్పుచేతల్లోనే ఉంది. మనం ఆ టెక్నాలజీని ఎలా అభివృద్ధి చేస్తాం? అంతకన్నా ముఖ్యంగా మనం దాన్ని ఎక్కడెక్కడ నియోగించబోతున్నాం? అన్నది ప్రశ్న. ఎంచుకునేందుకు మనకు చాలా అవకాశాలున్నాయి. ప్రధాన సమస్య ఏమిటంటే, ఏఐ విప్లవంలో ప్రస్తుతం అగ్ర భాగాన ఉన్న కంపెనీలు, దేశాలు ఆయుధాల సమీకరణ లాంటి పోటీ స్థితిలో చిక్కుకున్నాయి. ఈ విషయంలో మందగతిన సాగడమే మంచిదని వాటికి తెలిసినా, సురక్షణపై మరింత వ్యయం అవసరమనే గ్రహింపు ఉన్నా, ఆ శక్తిమంతమైన పరిణామం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనే ఆలోచన ఉన్నా, మనం బ్రేకులు వేసి నంత మాత్రాన ఇతరులు వేయకపోవచ్చనే భయం వారిని నిరంతరం వెన్నాడుతోంది. ఎక్కడ ఎదుటివారు ప్రపంచంపై ఆధిపత్యం సంపాదిచ్చేస్తారేమోననే ఆదుర్దా వారిని నిలువనీయడం లేదు. -
దేశాన్ని కోల్పోయినవాడు!
ఆతిశ్ తాసీర్ (Aatish Taseer) ‘భారతదేశపు విదేశీ పౌర సత్వాన్ని’ భారత ప్రభుత్వం 2019 నవంబర్ 7న ఎత్తివేసింది. హోమ్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ట్వీట్ ద్వారా ఆయనకు ఈ సంగతి మొదట తెలిసింది. అధికారిక లేఖ ఆ తర్వాత జారీ అయింది. తండ్రికి చెందిన పాకిస్తానీ మూలాలను ఆయన కప్పిపెట్టారనే సాకుతో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. కానీ, సంపూర్ణ సత్యం అదేనా? ‘ఎ రిటర్న్ టు సెల్ఫ్: ఎక్స్కర్షన్ ఇన్ ఎక్సైల్’ పేరుతో ఆయన రాసిన పుస్తకం తాజాగా విడుదలైంది. అందులోని ముందు మాటలో, ‘‘అది వింతైన ఆరోపణ’’ అని ఆయన అభివర్ణించారు. ‘‘నేను ఇంతకుముందు కూడా ‘స్ట్రేంజర్ టు హిస్టరీ’ (2009) పుస్తకం రాశాను. నా జీవితంలో చాలా భాగం నేను నా తండ్రికి దూరంగానే ఉన్నప్పటికీ, అందులో మా నాన్న గురించిన వ్యాసాలు చాలానే చేర్చాను’’ అని కూడా పేర్కొన్నారు. సల్మాన్ తాసీర్ (పాకి స్తాన్ రాజకీయ నాయకుడు) ద్వారా తవ్లీన్ సింగ్(కాలమిస్ట్)కు పుట్టిన కుమారుడు ఆతిశ్ అన్న సంగతి రహస్యం ఏమీ కాదు. ఈ సంగతి ప్రభుత్వానికి తెలియ దనుకోవడానికి ఏమాత్రం వీలు లేదు.ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. ఆతిశ్ తరఫున తవ్లీన్ 1999లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు (ఇదే ఆ తర్వాత 2005లో ‘ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా’గా మారింది), ఆయన తల్లితండ్రులలో ఒకరు పాకిస్తానీ అనే కారణం అడ్డురాలేదు. కానీ 2016లో, అది ప్రతిబంధకంగా మారింది. నిజానికి, ఆతిశ్ తండ్రి సల్మాన్ పాకిస్తానీ, బ్రిటిష్ పౌరుడురెండూ అవుతారు. సల్మాన్ తల్లి బ్రిటిష్ పౌరురాలు. జన్మతః ఆతిశ్ బ్రిటిష్ పౌరుడ నడానికి బహుశా ఇదే కారణమేమో. కానీ, ఆతిశ్ ‘ఓవర్సీస్ సిటిజన్షిప్’ను వేరే కారణంతో ఎత్తి వేశారనడంలో సందేహమే లేదు. మోదీని విమర్శించడమే ప్రస్తుత స్థితికి కారణం. ‘‘మోదీ ప్రభుత్వ దృష్టిలో నేను ‘పాకిస్తానీ’గా మారాను. అన్నింటి కన్నా ముఖ్యంగా ‘ముస్లిం’ అయ్యాను. భారతదేశంలో చాలా వరకు తండ్రి మతమే పిల్లలకు వర్తిస్తుంది. ‘భారతదేశపు ప్రధాన విభజనకర్త’ శీర్షికతో నేను ‘టైమ్ మ్యాగజైన్’కు ముఖచిత్ర కథనం రాయడం, మోదీకి కోపం తెప్పించింది... మా అమ్మ భారతీ యురాలైనా లెక్కలోకి రాలేదు. నేను బయట వ్యక్తిగా, పరాయి మనిషిగా, పాకిస్తానీగా ముద్రపడ్డాను’’ అని ఆయన రాసుకున్నారు. పౌరసత్వాన్ని కోల్పోయిన తర్వాత, ప్రభుత్వం ఆయనకు వీసా ఇచ్చేందుకూ కూడా తిరస్కరించింది. దాంతో అమ్మమ్మ చనిపోయినపుడు ఆమె అంత్యక్రియలకు కూడా తాసీర్ హాజరు కాలేకపోయారు. పౌరసత్వాన్ని కోల్పోవడంలోని బాధేమిటో ఆతిశ్ ముందు మాటలో వివరించారు. ‘‘ఒక దేశం దూరంపెట్టడం కంటే అవ మానం వేరే ఉండదు. ఒక తండ్రి తన బిడ్డను తన బిడ్డ కాదంటే ఎలా ఉంటుందో... ఇంటి నుంచి తరిమేస్తే ఎలా ఉంటుందో అలా! దేశం లేకపోతే గాలికెగిరే విస్తరాకు అయిపోతాం.’’ ఇదీ చదవండి: భర్తను కాపాడుకునేందుకు భార్య లివర్ దానం.. కానీ ఇద్దరూ! సత్యం ఏమంటే, అమెరికాలోని విశ్వవిద్యాలయం నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఒక ఉన్నత వర్గ మైనారిటీకి చెందిన వాడిననే స్పృహ ఆతిశ్లో ఉంది. అయినా హిందీ, ఉర్దూ, సంస్కృత భాషలు నేర్చుకునేందుకు పాటుపడ్డారు. మమేకమయ్యేందుకు దేశంలో విస్తృతంగా పర్యటించారు. భారతదేశంలో భాగమ య్యేందుకు, ఇక్కడి వాడినని అనిపించు కునేందుకు హృదయపూర్వకంగా చేసిన ప్రయత్నం అది. ‘‘భారతీయ జీవితంలో మెరుగ్గా ఇమిడిపోయేందుకు... నాలోని కొన్ని దృక్పథాలను దూరం చేసు కున్నాను’’ అని ఆయన రాసుకున్నారు. చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!అందుకనే, మొహం మీద తలుపులు మూతపడినప్పుడు ఆయన ఇలా రాసుకోవడం ఆశ్చర్యం కలిగించదు: ‘‘నాకెందుకో విచి త్రంగా స్వేచ్ఛ లభించినట్లు అయింది. బంధ విముక్తుడిని అయ్యా ననిపించింది. ఇండియాలో ఇమిడేందుకు ప్రయత్నించాల్సిన కష్టం, నా స్వీయ పాశ్చాత్యీకరణకు మన్నించమన్నట్లు వ్యవహరించ వలసి రావడం నుంచి హఠాత్తుగా బయట పడేసినట్లయింది.’’ నేడు ఆయన భారతదేశం గురించి భూతకాలంలో ప్రస్తా విస్తున్నారు. ‘‘నాది ఒకప్పుడు భారతదేశం.’’ అలా రాయడం భరించలేని వేదన కలిగిస్తోందని ఆయన చెప్పుకొన్నారు. కానీ, దాన్ని ఆయనపై రుద్దారు. ఆతిశ్ 44 ఏళ్ళ వయసు వారే కాబట్టి, నిర్మించు కునేందుకు భవిష్యత్తు ఉంది. కానీ ప్రభుత్వం ఇండియాను ఆయనకు గతాన్ని చేసేసింది. పౌరసత్వాన్ని కోల్పోవడంలోని బాధేమిటో ఆతిశ్ తాసీర్ ముందుమాటలో వివరించారు. ‘‘ఒక దేశం దూరంపెట్టడం కంటే అవమానం మరొకటి ఉండదు. ఒక తండ్రి తన బిడ్డను తన బిడ్డ కాదంటే ఎలా ఉంటుందో అలా!’’దేశాన్ని కోల్పోయినవాడు!-కరణ్ థాపర్ , సీనియర్ జర్నలిస్ట్ -
నిలుపుకోవాల్సిన బంధం
ఇండియాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరుపారేసు కోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఆయన అక్కసు వెనుక ప్రతిసారీ ఒక భూ స్వామ్య పెత్తందారీ విధానం కనిపిస్తుంది. సుంకాలు, జరిమానాలను రక్షణ కవచంగా ధరించి ఆయన విమర్శలకు, బెదిరింపులకు దిగుతూంటారు. అమెరికా అధ్యక్షుడి వదరుబోతుదనంలో ఒక సామ్రాజ్య వాదిలో ఉండే దురహంకారం ప్రతిబింబిస్తూ ఉంటుంది.రష్యా చమురును ఒక బూచిగా చూపిస్తున్నారంతే. అలనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ధోరణి ఇప్పుడు అమెరికా వ్యవహార శైలిలో కనిపిస్తోంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమ పట్ల భారత దేశం అనుసరిస్తున్నట్లు చెబుతున్న సంరక్షణ విధానంపై నిజంగానే అమెరికా విభేదిస్తోందని మనకు ఎక్కడైనా మనసు పొరల్లో చిన్న సందేహం మిగిలి ఉంటే, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఉపయోగించిన భాషతో అది కాస్తా పటాపంచలైపోతుంది. ‘మహారాజా సుంకాలు’ అనే పద బంధాన్ని గమనిస్తే, భారత దేశాన్ని ప్రాచ్యవాద, పురాతన జాతివాద కళ్ళద్దాలతోనే నవారో చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఈసారి ఆయన ‘పాములు ఆడించే వాళ్ళ’ ఉపమానాన్ని ఉపయోగిస్తారేమో! ఏదో ఒక పక్షం వైపు రావలసిందిగా భారతదేశాన్ని నేరుగానే హెచ్చరించారాయన. కొత్తగా ఉపయోగించిన మాటలతో భారతీయుల మనసును నవారో మరింత గాయపరచారు. క్రెమ్లిన్కి ‘లాండ్రోమాట్’గా ఆయన భారతదేశాన్ని అభివర్ణించారు. నిజానికి, అప్ప టికి కొద్ది రోజుల క్రితమే అలాస్కాలో వ్లాదిమీర్ పుతిన్కి ట్రంప్ అక్షరాలా ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికిన సంగతిని ఆయన సమయానుకూలంగా మరచినట్లుంది. అమెరికా ఆత్మవంచనమనం రష్యా ముడి చమురు కొని, శుద్ధి చేసిన తర్వాత, ఆ చమురును యూరప్ దేశాలు కూడా కొనుగోలు చేశాయి. అలా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా మనం ‘లాభాలు గడిస్తున్నా’మని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించారు. కానీ, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నిజంగా లబ్ధి పొందు తున్నది వారే! ఐరోపా దేశాలు అమెరికా నుంచి ఆయుధాలు కొని ఉక్రెయిన్కు లాభాలకు అమ్ముతున్నాయి. అందుకే అవి విక్రయిస్తున్న అన్ని ఆయుధాలపైనా (అదనపు వ్యయాలు, లాభం కింద) ట్రంప్ ప్రభుత్వం 10% మొత్తాన్ని తీసుకుంటోందని బిసెంట్ మరో ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించారు. ఇండియా మాత్రం రష్యా చమురు కొనడం తమ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతూంటే... అదే వ్యక్తులు, పుతిన్ యుద్ధాన్ని మనం బలో పేతం చేస్తున్నట్లుగా నిందిస్తున్నారు. ఇక్కడ అమెరికా ఆత్మ వంచన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కపటత్వానికీ స్థిరమైన వాదన అవసరం.ఎవరో ఒక అధ్యక్షుడి చపలచిత్త ధోరణిని పట్టించుకోనక్కర లేదని, భారత–అమెరికా స్నేహ సంబంధాలు సుదీర్ఘమైనవి, గాఢ మైనవని వాదించేవారితో నేనూ ఏకీభవిస్తాను. కానీ, ట్రంప్కు అర్థ మయ్యే భాషలోనే ఆయనకు వ్యతిరేకంగా స్వల్పకాలిక చర్యనైనా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. అలా గని వాషింగ్టన్ ఇవ్వనిది చైనా మనకేదో దోచిపెడుతుందని కూడా నేను అనుకోవడం లేదు. చైనాను నమ్మవచ్చా?ట్రంప్ది దూకుడు తత్త్వం. చైనా సైనికంగా మనకి ప్రత్యర్థి. ట్రంప్వి అవాకులో చవాకులో బహిరంగంగానే ఉంటాయి. జిన్పింగ్వి పారదర్శకం కాని తెరవెనుక చర్యలు. పాకిస్తాన్ పట్ల ట్రంప్ మెతక వైఖరిని అర్థం చేసుకోవచ్చు. దాని పొగడ్తలకు ఆయన ఉబ్బి పోయాడు, లేదా అది ఇవ్వజూపిన ప్రయోజనాలకు ప్రలోభపడ్డాడు అనుకుందాం. కానీ, ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాకి స్తాన్తో చైనా చెట్టపట్టాలేసుకుని తిరిగింది.కనుక, ట్రంప్ను, ప్రస్తుత లోటుపాట్లను పక్కనపెట్టి అమెరికా – భారత్ స్నేహ సంబంధాన్ని కాపాడుకోవాలని కోరుకోవడంలో ఔచిత్యం ఉంది. ఇప్పటి అమెరికా స్పందన ఒకటే పాఠం నేర్పుతోంది. అది: ప్రపంచంలో ఓ మూలనున్న ప్రాంతంపై లేదా ఒకే దేశంపై ఆశలన్నీ పెట్టుకోవద్దు. అది ప్రమాదకరం.మనవాళ్లు ఏం చేస్తున్నట్టు?ట్రంప్ను భారత్ ఎందుకు దారికి తెచ్చుకోలేకపోయింది అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ ఆగి పోవడంలో ట్రంప్ స్వోత్కర్షను సమర్థించనందుకా? ఆయన ‘ఇగో’ దెబ్బతిందా? ట్రంప్ మాజీ అంగరక్షకుడు ఒకరిని పాకిస్తాన్ తన లాబీయిస్టులలో ఒకడిగా చేర్చుకుందని చెబుతున్నారు. మనం అలా కాకుండా, లాంఛన పూర్వకంగా, సంయమనంతో దౌత్యం నెరప డమా? కానీ, నాకొకటే సందేహం. అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన గొప్ప వ్యక్తులు ఏమైపోయినట్లు? యాభై లక్షల మంది ఇండియన్–అమెరికన్ సమూహాన్ని ఒక చక్కని వలస వర్గానికి నమూనాగా తరచూ అభినందిస్తూ ఉంటారు. ఆ వర్గం నాయకులు పెద్ద టెక్, ఫినాన్షియల్ సంస్థలను నడుపు తున్నారు. విద్యా, విధాన నిర్ణాయక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారు. ఇండియా పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు చూసి వారికి ఒళ్ళు మండటం లేదా? స్వీయ నిర్ణయాలు తీసుకోవడం భారతదేశానికున్న సార్వభౌమాధికారమనే సంగతిని ట్రంప్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతే, ఆయన శ్వేత సౌధం నుంచి నిష్క్ర మించే నాటికి కాపాడుకోవాల్సినవి పెద్దగా ఏమీ మిగలవు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఎర్రకోట పెడుతున్న పరీక్ష!
ఆగస్టు 15 వచ్చిందంటే చాలు ఢిల్లీలోని ఎర్రకోట పూర్వ వైభవాన్ని సంతరించు కున్నట్లు కనిపిస్తుంది. భారతదేశపు తొలి ప్రధాని నెహ్రూ 1947లో ఎర్రకోట బురుజులపై జాతీయ పతాకాన్ని ఎగుర వేసినప్పటి నుంచి, భారత ప్రధానులకూ, ఎర్రకోటకూ ఒక అవినాభావ సంబంధం ఏర్పడి పోయింది. ఏటా ఆగస్టు 15న ఎర్రకోట పైనుంచి జాతి నుద్దేశించి ప్రధాని ప్రసంగించడం ఆనవాయితీగా మారింది.ఫ్రాన్స్ ఏటా జూలై 14న జాతీయ దినోత్సవం జరుపుకొంటుంది. ఆ రోజున 1790లో ప్రాన్స్ ప్రజలు బాస్టిల్ జైలును చుట్టుముట్టి దానిలో నిర్బంధించిన ఉద్యమకారులను విడిపించుకున్నారు. ఫ్రాన్స్ జాతీయ జీవనంలో బాస్టిల్కు ఎంత ప్రాధాన్యం ఉందో ఎర్రకోటకీ అంత ప్రాధాన్యం ఉంది. ఎర్ర కోట మన గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి చెబుతుంది.మొఘల్ చక్రవర్తి షాజహాన్ (1592–1666) ఈ కోటను 1639లో ప్రారంభించారు. దానిలోని దీవాన్– ఇ– కాస్ (ప్రత్యేక సభాసదుల హాలు) గోడలపై పర్షియన్లో ‘గర్ ఫిర్దౌస్ బార్ రు–ఏ– జమీన్ అస్త్, హమీన్ అస్తో, హమీన్ అస్తో, హమీన్ అస్త్’ అని రాసి ఉంటుంది. ‘ఈ భూమిపై స్వర్గం ఏదైనా ఉందీ అంటే అది ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది’ అని ఆ మాటలకు అర్థం. అవి ఇండియా గురించిన మాటలుగానే నేను భావిస్తాను. కశ్మీర్ను చూశాక షాజహాన్ మొదటిసారి ఆ మాటలను ఉపయోగించినట్లు చెబుతారు.కానీ, ఎర్రకోట కథ అంత స్వర్గతుల్యమై నది ఏమీ కాదు. పైన చెప్పుకున్న మాటలకు పూర్తి విరుద్ధమైన సంగతులు ఎర్రకోటలో చోటుచేసుకున్నాయి. ‘ఈ భూమిపై నరకం ఏదైనా ఉందీ అంటే, అది ఇదే, అది ఇదే’ అనా లనిపిస్తుంది. మరో మొఘల్ చక్రవర్తి ఔరంగ జేబు (1618–1701) తన పెద్ద అన్నయ్య దారా షికో (1615–1659) తలను నరికేయడానికి ముందు గొలుసు లతో బంధించి, ఒక మురికి ఏనుగుపై కూర్చోపెట్టి, ఈ కోట నుంచే తీసుకెళ్ళి చాందినీ చౌక్ అంతటా తిప్పారు.నేటి పరి భాషలో చెప్పాలంటే, షికో సెక్యులర్ కావడమే దానికి కారణం. ఎర్రకోట నుంచి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాల మేరకే స్వేచ్ఛా పిపాసి సాధు సరమద్ (1590–1661), సిక్కుల గురువు తేజ్ బహదూర్ (1621–1675) తలలను వారి మొండాల నుంచి వేరు చేశారు. భారతదేశపు సామాజిక పొందికను ఛిద్రం చేస్తూంటే ఎర్రకోట సాక్షీభూతంగా నిలిచింది. దానిలాగానే, దేశాన్ని కూడా అదే పనిగా చీలికలు పీలికలు చేశారుకానీ, దేశం మళ్ళీ ఏకమవుతూ వచ్చింది.ఔరంగజేబు కాలగర్భంలో కలిసి సుమారు 150 ఏళ్ళు అయిన తర్వాత, బహదూర్ షా జాఫర్ (1775–1862) ఎర్ర కోట యజమాని అయ్యారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా, సిపాయిలు 1857లో తిరుగుబాటు చేసినపుడు చివరి మొఘల్ పాలకుడైన జాఫర్ అటు హిందువులు, ఇటు ముస్లింలు ఇద్దరికీ ఇరుసుగా మారారు. తర్వాత, దాదాపు 90 ఏళ్ళు గడి చాక, బ్రిటిష్ భారతీయ సైన్యం లోపల ఎగసిన తిరుగుబాటు ఎర్రకోటలోని గోడల లోపల ప్రతిధ్వనించింది. ఆ తర్వాత, 1945–1946 ప్రాంతంలో, కల్నల్ గురుబక్ష్ సింగ్ ధిల్లాన్ (సిక్కు), కల్నల్ ప్రేమ్ కుమార్ సెహగల్ (హిందువు), మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ (ముస్లిం) భారత మాత ముద్దు బిడ్డలుగా ప్రసిద్ధికెక్కారు.వారు ముగ్గురూ నేతాజీ నేతృత్వంలోని ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’కి చెందిన వారు. ‘బ్రిటిష్ చక్ర వర్తికి వ్యతిరేకంగా యుద్ధానికి ఎగదోస్తున్నారం’టూ ఆ శౌర్యవంతులను ఎర్రకోటలోనే విచారించారు. ఆ సమయంలో ‘లాల్ ఖిలాసే ఆయీ ఆవాజ్/ ధిల్లాన్, సెహగల్, షానవాజ్’ అంటూ ఎర్రకోట నుంచి ఒక నినాదం మిన్నుముట్టింది. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్చి కూర్చిన ఉద్దండులైన నెహ్రూ వంటి న్యాయవాదులు వారి తరఫున వాదించారు. ముగ్గురికీ దేశ బహిష్కార శిక్ష విధించారు. స్వాతంత్య్రం లభించాక, కొద్ది రోజుల్లోనే వారిని విడుదల చేశారు.‘హిందూ రాష్ట్ర’ లక్ష్య సాధనకు కృషి చేస్తున్న కొందరు... గాంధీజీ హత్య కేసులో నిందితులయ్యారు. వారిని ఎర్రకోట లోనే ప్రత్యేక కోర్టులో విచారించారు. వీరికి ప్రతిగా మరో వర్గం ఉంది. ఆ వర్గంవారు 2000 డిసెంబర్ 22న ఎర్రకోటలోకి చొచ్చు కువచ్చారు. ఆ రోజు కోటలోకి రాగలిగిన ఇద్దరు లష్కర్–ఏ– తోయెబా ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. భారతదేశంలో మత విభజన తేవడమే ఆ టెర్రరిస్టుల లక్ష్యం. ఇలా ఎర్రకోట చారిత్రక చిహ్నం స్థాయిని మించి ఎరుపెక్కింది.అదే సమయంలో, నైతిక శక్తి వాహికగా కూడా మారింది. కనీసం, 2047 ఆగస్టు 15న ఎర్రకోటపై 100వసారి పతాకావిష్కరణ జరుగుతున్నపుడు, ప్రసంగించే ప్రధాని అయినా, ‘స్వర్గం ఇక్కడే ఉంది! నా తోటి భారతీయులారా! ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. మనం పరస్పరం ద్వేషించుకోం, దేనికీ భయపడం, కలసి మెలసి శాంతియుత జీవనం సాగిస్తున్నాం’ అని ప్రకటించగలుగుతారా’?.వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సీపీ రాధాకృష్ణన్ (ఉప రాష్ట్రపతి అభ్యర్థి) రాయని డైరీ
మనవి కాని రోజులు కొన్ని ఉంటాయి. కచ్చితంగా అవి మన రోజులే అనుకుని, అవి తెచ్చిన ఆకూ వక్కల పళ్లేన్ని అందుకోవటానికి చేతులు చాస్తామా, హఠాత్తుగా అవి పక్కకు మళ్లిపోతాయి!మోదీజీ నన్ను ఉప రాష్ట్రపతిగా అనుకోగానే మొదట నాకు... ఇలా దగ్గరి వరకు వచ్చి, అలా దూరంగా మళ్లిపోయిన రోజులే గుర్తొచ్చాయి.అయితే నాకు ఒకటే నమ్మకం. మనవి కాని రోజులను కూడా మనవి అయ్యేలా చెయ్యగల శక్తిమంతులు మోదీజీ. లెక్కలైనా ఆఖరి నిమిషంలో అటూ ఇటూ అవొచ్చు. మోదీజీ లెక్క ఎటూ అవ్వదు.రెండు సభల మొత్తం ఓట్లు 782. ఉప రాష్ట్రపతిగా నేను గెలవటానికి కావలసిన ఓట్లు 394. ఎన్డీయేకు ఉన్నవి 422. ఇక నేను ఉప రాష్ట్రపతిని కాకుండా ఎలా ఉంటాను? ఉంటాను! ప్రతిపక్షాలకు ఉన్న 330 ఓట్లు, ఏ పక్షానికీ చెందని 30 ఓట్లు, ఎన్డీయే నుండి ఒకవేళ చీలిపోయే 35 ఓట్లు కలిస్తే నేను ఉప రాష్ట్రపతిని కాకుండా ఉంటాను.కానీ... గోడ మీది ఈ కూడికలు, తీసివేతలు మోదీజీ అనే సింహం ముందు వట్టి పిల్లి మొగ్గల వంటివి. ఆయన ఒకరి పేరు చెప్పారంటేæఆ ఒకరు రాష్ట్రపతి భవన్ ఫోర్కోర్టులో ప్రమాణ స్వీకారం చేసినట్లే!సెప్టెంబరు 9న ఉప రాష్టపతి ఎన్నిక! సెప్టెంబరు 9 అనగానే నాకు 25 ఏళ్లనాటి సెప్టెంబర్ 29 మనసులోకి వచ్చింది! ఆ రోజు... ప్రధాని వాజ్పేయి, వరుసగా ప్రమాణ స్వీకారాలు చేయిస్తున్నారు. నా వంతు వచ్చింది. నా పేరు కూడా వచ్చింది.‘‘రాధాకృష్ణన్ అనే ఆ గడ్డం మనిషి ఎక్కడ? ఆయన్ని పిలిపించండి’’ అని వాజ్పేయి, తన పక్కనే ఉన్న అద్వానీతో అన్నారు. అయితే వాళ్లు పిలిపించింది సీపీ రాధాకృష్ణన్ అనే నన్ను కాదు. పి. రాధాకృష్ణన్ అనే వేరొకర్ని! నేను కోయంబత్తూరు ఎంపీని. ఆయన నాగర్కోయిల్ ఎంపీ. పొరపాటున నాకు బదులుగా ఆయన చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు! ఎప్పుడూ గడ్డం ఉండే నాకు అప్పుడు గడ్డం లేక పోయుండాలి. లేదంటే, ఎప్పుడూ గడ్డం ఉండని పి.రాధాకృష్ణన్కు అప్పుడు గడ్డం ఉండి ఉండాలి. ‘‘ఎవరైతే ఏంటీ, ఇద్దరూ జెమ్సే కదా’’ అన్నారట వాజ్పేయి! బీజేపీ ఎప్పుడూ అలానే ఆలోచిస్తుంది. జెమ్ ఏదైనా జెమ్మే అయినప్పుడు కోయంబత్తూరు జెమ్ కోసమే ఎందుకు చూడటం అంటుంది. ఇంకోసారి 2014లో మోదీజీ ప్రధానిగా వచ్చినప్పుడు నా చేతికి రావలసిన ఆకూ వక్కల పళ్లెం చేజారి, మళ్లీ పి. రాధాకృష్ణన్ వైపే వెళ్లిపోయింది!సీఎం జయలలిత ప్రిస్టేజ్గా తీసుకుని కోయంబత్తూరులో నాకు పోటీగా వాళ్ల క్యాండిడేట్ను గెలిపించుకోవటంతో, కన్యాకుమారిలో గెలిచిన పి.రాధాకృష్ణన్ను నా ప్లేస్లో (నేను గెలిచి ఉంటే) కేబినెట్లోకి తీసుకున్నారు మోదీజీ.చేయలేకపోయిన సహాయాలను గుర్తు పెట్టుకుని, చేసిన సహాయాలను మర్చిపోయే మహనీయుడు మోదీజీ!నాకు మంత్రి పదవి ఇవ్వలేక పోయినందుకు ఆయన నన్ను పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ని చేశారు. తెలంగాణ గవర్నర్ని చేశారు. జార్ఖండ్ గవర్నర్ని చేశారు. మహారాష్ట్ర గవర్నర్ని చేశారు. ఇపుడు భారత ఉప రాష్ట్రపతిని చేస్తున్నారు! ఒకటి ఇవ్వలేక పోయినందుకు వంద ఇస్తారు మోదీజీ! మనవి కాని రోజులు ఉన్నట్లే, మోదీజీ తలచుకుంటే మనవి తప్ప వేరేవారివి కాని రోజులు కూడా ఉంటాయి. బహుశా అలాంటి రోజులలో ఒకటిగా 2027 జూలై 25 నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని నా నమ్మకం. ద్రౌపదీ ముర్ము తర్వాత వచ్చే వారు భారతదేశ 16వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు అది! -
అంతరిక్ష పరిశోధనలో నవ శకం
భారత్ నూతన అంతరిక్ష సాంకేతికతతో విశ్వ రహస్యాల అన్వే షణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు రెండవ జాతీయ అంత రిక్ష దినోత్సవాన్ని (National Space Day) జరుపుకొంటోంది. 2023 ఆగస్టు 23న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్–3లోని విక్రమ్ ల్యాండర్ ‘శివశక్తి’ అనే ప్రదేశంలో సురక్షితంగా దిగింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆగస్టు 23ను జాతీయ అంత రిక్ష దినోత్సవంగా నిర్ణయించింది. ఈ దినోత్సవం అంతరిక్ష పరిశోధన ప్రాము ఖ్యతపై అవగాహన, విద్యను ప్రోత్సహించడానికి ఒక వేదిక కానుంది. సైన్స్ , టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితంలోవృత్తిని కొనసాగించడానికి భవిష్యత్తు తరాలకు ప్రేరణ ఇవ్వనుంది. ఈ యేడు ‘ఆర్యభట్ట నుండి గగన్యాన్ వరకు: ప్రాచీన జ్ఞానం నుంచి అనంతమైన అవకాశాలు’ అనే ఇతివృత్తంతో అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకొంటున్నాం. 🚀 From Chandrayaan to #Mangalyaan, every launchpad in India is a gateway to history, and every mission a leap into shaping the future of space exploration! 🌌✨ On this #NationalSpaceDay, let’s celebrate India's trailblazing space missions, our growing space economy, and the… pic.twitter.com/vKmoZJ12qR— PIB India (@PIB_India) August 23, 2025 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని ఇస్రో నిర్దేశించు కున్నది. ఈ లక్ష్య సాధన దిశగా ప్రయాణించ డానికి గగన్యాన్ మిషన్ కీలకం కానుంది. వ్యోమగాములను భూమికి దగ్గ రగా 400 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలోకి పంపి, వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం ఈ మిషన్ తొలి లక్ష్యం. ఇందులో భాగంగా మొదట 2026 నాటికి ‘వ్యోమమిత్ర’ అనే రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. అనంతరం 2027లో మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ చేపట్టనున్నారు. మరోవైపు మానవ సహిత చంద్రుడి యాత్రకు ముందు ఇస్రో 2035 నాటికి సొంతంగా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అనంతరం మానవ సహిత చంద్రుడి యాత్రకు సిద్ధం కానుంది.ఇదీ చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే!చంద్రయాన్–4లో చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించి భూమికి తిరిగి తీసుకురావడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఎల్విఎం అనే పెద్ద రాకెట్లతో డాకింగ్ ద్వారా ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్ అంతరిక్ష ప్రయోగాలు కొన సాగుతున్నప్పటికీ... భారతదేశం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కేవలం 2 శాతం మాత్రమే కలిగి ఉంది. దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది.అంతరిక్ష ప్రయోగాల పట్ల పిల్లలు, యువతలో ఆసక్తిని పెంచాలి. ఇప్పటికే ఈ రంగంలో మక్కువ ఉన్న విద్యార్థులను ప్రొత్సాహించేందుకు ఇస్రో ‘యువిక (యుంగ్ సైంటిస్ట్)– 2025’ కార్యక్రమం నిర్వహిస్తున్నది.– సంపతి రమేష్ మహారాజ్ ‘ జన విజ్ఞాన వేదిక -
ప్రభుత్వాలను దించే ఆయుధమా?
రాజ్యాంగంలోని 75, 164, 239ఎఎ అధికరణలకు సవరణలను ప్రతిపాదిస్తూ రాజ్యాంగ (130వ) సవరణ బిల్లును ఇటీవల లోక్ సభలో ప్రవేశపెట్టారు. దానిని కేంద్ర పాలిత ప్రాంతాలు, జమ్ము–కశ్మీర్కు వర్తింపజేసే విధంగారెండు అనుబంధ బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. మూడింట రెండొంతుల మెజారిటీ ప్రభుత్వానికి కొరవడినందు వల్ల ఈ ప్రతిపాదనలు చట్ట రూపం ధరించకపోవచ్చు. అయినప్పటికీ, వాటి వెనుక ఆలోచన గమనార్హమైనది. ప్రధాని లేదా ముఖ్యమంత్రితో సహా ఏ కేంద్ర లేదా రాష్ట్రమంత్రి అయినా ఐదేళ్ళు లేదా అంతకు మించి శిక్షపడగల ఆరోపణ లను ఎదుర్కొంటూ అరెస్టు అయి, వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే సదరు మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి. లేకపోతే, వారు ఆయా పదవుల నుంచి ఆటోమేటిక్గా వైదొలగినట్లు పరిగణి స్తారన్నది సవరణ మూల సారాంశం. బిల్లును సమర్థించుకునేందుకు చెబుతున్న ఆశయాలు గొప్పవిగానే ఉన్నాయి. అవి: రాజ్యాంగ నైతిక తను కాపాడటం, ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించడం, ఉన్నత పద వుల్లో ఉన్నవారు తాము చట్టానికి అతీతులమనే భావనకు లోను కాకుండా చూడటం. కానీ, ఉన్నతాశయాలు ఎల్లప్పుడూ ఉన్నతమైన ఫలితాలనే ఇస్తాయనే పూచీ ఏమీ లేదు. రాజకీయాలలో వ్యూహం తరచు నైతికతను పక్కకు నెడుతున్న పరిస్థితుల్లో ఈ రాజ్యాంగ సవరణ ఆయుధంగా పరిణమించవచ్చు. పరిశుద్ధ రాజకీయాలపై వాగ్దానమేనా?మంత్రులు నిజాయతీకి ప్రతీకలుగా ఉండి తీరాలనీ, వారు కస్టడీలో ఉన్నపుడు పరిపాలనకు భంగం కలుగకుండా నివారించ వలసి ఉందనీ ఈ బిల్లును తేవడంలోని లక్ష్యాలు, కారణాలపత్రంలో పేర్కొన్నారు. రాజకీయ వాస్తవికత ముందు ఈ నైతిక విజ్ఞాపన తేలిపోవచ్చు. అరెస్టయి, కస్టడీలో ఉన్నంత మాత్రాన ఎవరూ దోషి కారు. అధికారంలో ఉన్నవారికి జీ హుజూర్ అనే పోలీసు వ్యవస్థ ఉన్న ప్రజాస్వామ్యంలో నిజాన్ని రాబట్టడానికి, వేధించడానికి మధ్య నున్న రేఖ బహు పల్చనైనది. ఈ సవరణ, అరెస్టు చేసేందుకు ఉన్న అవకాశాలను తక్కువ చేసే బదులు, అరెస్టు చేయడానికి మరిన్ని అవకాశాలను సృష్టించేలా ఉంది. దీనిలో కొట్టొచ్చినట్లు కనిపించే అంశం 30 రోజుల వ్యవధి. ఒక మంత్రి 30 రోజులకు మించి నిర్బంధంలో ఉంటే రాజీనామా చేసి తీరాలి. ఆచరణలో, ప్రభుత్వాన్ని మార్చేందుకు రాజ్యాంగం ప్రసా దించిన ‘కూల్చివేత ఆయుధం’గా ఇది ఉపకరించవచ్చు. ప్రతిపక్షా నికి చెందిన ఒక ముఖ్యమంత్రి ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు అనుకుందాం. పోలింగ్కు ఒక నెల ముందు పన్నాగంతో చేయించిన అరెస్టుతో అతని పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ప్రభుత్వాలనుదించడానికి బ్యాలట్ కన్నా లాకప్ ఒక మార్గంగా మారుతుంది. వ్యవస్థలు రాజకీయమయంఈ నిబంధన తటస్థంగా ఉండవలసిన వ్యవస్థలను అనివార్యంగా రాజకీయమయం చేస్తుంది. ఇప్పటికే రాజకీయ ఒత్తిడులకు లొంగిపోయేవారిగానున్న పోలీసు అధికారులు తాము ఒక ముఖ్య మంత్రిని అరెస్టు చేస్తే అతను లేదా ఆమె ప్రభుత్వం కూలిపోవచ్చని గ్రహించుకుంటారు. బెయిలు దరఖాస్తులను నిర్ణయించే జడ్జీలు ఎవరు పాలించారో నిర్ణయించే శక్తిమంతులుగా మారతారు. బెయిలు సంపాదించి పెట్టడంలో వ్యూహాత్మక మాయోపాయాలకు పాల్పడే యుక్తిపరులైన న్యాయవాదులు భారీ ప్రయోజనాలుపణంగా పెట్టే రాజకీయ పోరాటంలో ముఖ్యమైన పాత్రధారులుగా మారతారు. చట్టాలను అమలుపరచవలసిన వ్యవస్థలకూ, రాజకీయ ఇంజనీరింగ్కూ మధ్య రేఖ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. పాకిస్తాన్ నేర్పుతున్న పాఠాలులీగల్ సాధనాలు ప్రజాస్వామ్యాన్ని ఎలా డొల్ల చేయగలవో తెలుసుకునేందుకు పాకిస్తాన్ ప్రత్యక్ష ఉదాహరణ. రాజకీయ ప్రేరేపి తమైనవిగా చాలా మంది భావించిన ఆరోపణలపై సుప్రీం కోర్టు 2017లో నవాజ్ షరీఫ్ను అనర్హుడిగా ప్రకటించింది. ఆయన తొల గింపు ప్రజాస్వామిక ప్రక్రియలను అస్థిరపరచి, ఎన్నిక కాని పాత్ర ధారులను బలోపేతులను చేసింది. ఒకప్పుడు పాకిస్తాన్ అసలైన పాలక వ్యవస్థకు ప్రీతిపాత్రుడుగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ అనర్హుడుగా ప్రకటితుడై ఇపుడు జైలులో మగ్గు తున్నారు. ఓటర్లలో ఇమ్రాన్ ఖాన్కు ఉన్న ప్రజాదరణ జుడీషియల్ మాయోపాయాల నుంచి ఆయనను కాపాడలేకపోయింది. నైతికత ముసుగు కప్పుకున్న చట్టాలు అనర్హత వేటు వేసేందుకు, చట్టబద్ధ తను తొలగించడానికి సాధనాలుగా ఎలా ఉపయోగపడగలవో ఆ రెండు కేసులు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రభుత్వాల మార్పులో కోర్టులు కూడా ఒక పావుగా మారిపోబట్టే పాకిస్తాన్లో ప్రజా స్వామ్యం బలహీనపడింది. అదే దారిని రాజ్యాంగంలో చొప్పించే ప్రమాదంలో ఇపుడు భారతదేశం ఉంది. వ్యాధికన్నా దుర్భరమైన వైద్యంసుదీర్ఘ కాలం కస్టడీలో ఉన్న మంత్రి విధులను నిర్వర్తించలేడని బిల్లు మద్దతుదారులు వాదిస్తున్నారు. అది నిజమే. కానీ, దానికి విరుగుడులు ఇప్పటికే ఉన్నాయి. మంత్రిత్వ శాఖలను ఒకరి నుంచి మరొకరికి మార్చవచ్చు. తాత్కాలిక అధిపతులను నియమించ వచ్చు. కస్టడీలో ఉన్న నాయకునికి మద్దతు కొనసాగించాలో వద్దో చట్ట సభలు నిర్ణయించుకుంటాయి. ఈ ప్రక్రియలను పక్కనపెట్టేసి, ఒక నిర్దిష్ట గడువును విధించడం ద్వారా, ఈ సవరణ నియమాని కన్నా అవసరానికి పెద్ద పీట వేస్తోంది. అరెస్టు అయిన వ్యక్తి నిర్దోషి కూడా కావచ్చుననే సూత్రానికి నీళ్ళు వదులుతోంది. ప్రతి సవరణ ఒక ప్రమాణాన్ని నెలకొల్పుతుంది. ఈ రోజున మంత్రులను 30 రోజులు కాగానే పదవుల నుంచి తొలగిస్తే, రేపు 15 రోజులు కాగానే, శాసన సభ్యులను లేదా పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చు. రాజకీయాలను ప్రక్షాళన చేసే ప్రయత్నం కాస్తా, అరెస్టును రాజకీయాల్లో సర్వ సాధారణమైనదిగా రూపొందించవచ్చు. నాయకత్వం బ్యాలెట్ ద్వారా కాకుండా పోలీసు స్టేషన్లు, కోర్టులలో నిర్ణయమవుతుందని పౌరులు భావించడం ప్రారంభిస్తారు. ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని ఉద్దేశించారు కానీ, ప్రత్యర్థులను దునుమాడే కత్తులను సమకూర్చడానికి కాదు. 130వ సవరణ బిల్లు అభిమతం మంచిదే కానీ, అది అరెస్టులను ప్రోత్సహించేదిగా, సంకుచిత రాజకీయాలకు ధైర్యం కల్పించేదిగా, న్యాయవ్యవస్థను కూడా రాజకీయమయం చేసే ప్రమాదాలను కొనితెచ్చేదిగా ఉంది. అంతిమంగా, పాలకుడు అంటే, పోలీసు అధికారో లేదా మేజిస్ట్రేటో కాదు, ఓటరు. ఎవరు అధికారంలోఉండాలో ఎవరు వైదొలగాలో ఓటరు మాత్రమే నిర్ణయించాలి.-వ్యాసకర్త సుప్రీం కోర్టు న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- సంజయ్ హెగ్డే -
ఆంధ్రకేసరి టంగుటూరి.. ప్రజల మనిషి
మహోన్నత స్వాతంత్య్రోద్యమ నాయకుల్లో తెలుగు బిడ్డ, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు (1872–1957) ఒకరు. పదవుల కోసం ఆయన ఎన్నడూ పాకులాడలేదు. పదవులే ఆయనను వరించాయి. ఆయన దేనిని నమ్మారో దానినే త్రికరణ శుద్ధిగా ఆచరించారు. లక్షలాది రూపాయలు సంపాదించి, అంతా ప్రజల కోసమే ఖర్చు చేశారు. తన కోసం ఆయన పైసా కూడా మిగుల్చుకోలేదు. నాటి లోక్సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ ఆయన ధైర్యాన్నీ, నిస్వార్థపరత్వాన్నీ కొనియాడిన విధానాన్ని చూస్తే ప్రకాశం వ్యక్తిత్వం అర్థమవుతుంది– ‘మనం 1928లో సైమన్ కమిషన్ను బాయికాట్ చేసిన సమయంలో చెన్నపట్నంలో గల ఇతర నాయకులు సైమన్ రాకను ఎదిరించలేక చెన్నపట్నం వదిలి వెళ్ళి పోయారు. ప్రకాశంగారు మాత్రం మిలిటరీ పోలీ సులు అడ్డుకోబోయి నప్పుడు చొక్కా విప్పి కాల్చమని తన ఛాతీని చూపించిన సాహసి అయ్యారు. ఆయన తన సర్వస్వం దేశ స్వాతంత్య్ర సమరంలో త్యాగంచేసిన మహావ్యక్తి, మరణించే నాటికి ఒక రాగి పాత్ర అయినా మిగుల్చుకోలేదు’.ప్రకాశం మరణించినప్పుడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆయన విశిష్టతను ఇలా ప్రశంసించారు: ‘స్వాతంత్య్ర జ్యోతిని సాహసంతో వెలిగించిన దేశభక్తుల్లో అగ్రశ్రేణికి చెందిన వారు ప్రకాశంగారు. ముందువెనుకలు చూడని ధైర్యం, దాతృత్వం వలన ఆయన ఒక పురాణ పురుషులయ్యారు. ఆయన ఉత్తేజం వల్లనే వందలాది అనుయాయులు దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ జనకుడే కాదు, ఆయన భారత జాతీయోద్యమ నాయక శ్రేణిలో అగ్రశ్రేణికి చెందిన నాయకుడు’. ఇదీ చదవండి: అప్పుడే... ఏఐకి సార్థకతనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ... ‘నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 1920 సంవత్సరం నుండి 1935 వరకు పంతులు గారితో నాకు పరిచయం, సాహచర్యం ఉన్నాయి. ఒకప్పుడు సంపూర్ణంగా మేమిద్దరం ఏకీభ వించకపోయినా ఆయన గుణసంపత్తిని నేను ఎప్పుడూ ప్రశంసా భావంతోనే చూసేవాడిన’ని అన్నారు. ఈనాటి రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. – డా‘‘ పి. మోహన్ రావుచైర్మన్, ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ చదవండి: PCOS Belly తగ్గేదెలా? ఇవిగో అమోఘమైన టిప్స్ -
అప్పుడే... ఏఐకి సార్థకత
కృత్రిమ మేధ, డీప్ టెక్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్, డిజిటల్ ఇండియా వంటి వాటి గురించి తరచూ మన రాజకీయ నాయకులూ, ప్రభుత్వ పెద్దలూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ ఆ యా టెక్నాలజీలను భారత్ ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడే ఉందన్నది గమనించాలి. అలా అని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అర్థం కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏఐ మిషన్ కోసం పదివేల కోట్లనూ, జాతీయ క్వాంటమ్ మిషన్ కోసం ఆరు వేల కోట్లనూ కేటాయించింది. మౌలిక సదుపాయాలకు, డేటా వేదికల రూపకల్పనకు, నైపుణ్య శిక్షణా తరగతుల నిర్వహణకు, ఇతర సాధనాలను అందుబాటులోకి తేవటానికి సన్నాహాలు చేస్తోంది. అయితే కేవలం అధు నాతన టెక్నాలజీలను సమాజానికి పరిచయం చేయటం, పైపై మెరుగుల కోసం, అవసరాల కోసం వీటిని వాడుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఆధునిక సాంకేతికతలను ఉప యోగించి సామాన్య మానవుని జీవనాన్ని సులభతరం చేయడంతో పాటు, అనేక రంగాల్లో సమూల మార్పులు చేసినప్పుడు మాత్రమే ఈ సాంకేతికతలను సరిగా ఉపయోగించుకున్నట్లు లెక్క. ఎన్నికల అవకతవకలపై ఎన్నో ఆరోపణలూ, విమర్శలూ వినిపిస్తున్నాయి. వీటికి తావు లేకుండా చేయాలంటే ప్రతి ఓటునూ ఆధార్ కార్డ్తో అనుసంధానం చెయ్యడమే కాక, ఫేక్ ఓటర్లను గుర్తు పట్టడానికి డీప్ టెక్ను వినియోగించుకోవాలి. అపుడు అత్యంత పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించవచ్చు. అమెరికా, చైనా వంటి దేశాలు తమ వ్యవస్థలను కృత్రిమ మేధ వినియోగించి పునః రూపకల్పన చేస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవ సాయం, భద్రతా రంగాలను కృత్రిమ మేధతో అనుసంధానం చేస్తు న్నాయి. స్మార్ట్ నగరాల రూపకల్పన, డిజిటల్ పరిపాలన, వ్యవ సాయ ప్రణాళికలు, సామాజిక మౌలిక వసతులు వంటి రంగాలకు చైనా కృత్రిమ మేధను అనుసంధానం చేస్తోంది. కేవలం ఏఐ ఆధా రిత ఉపకరణాలను వినియోగించుకుంటూ వివిధ వ్యవస్థల పని తీరును సమూలంగా పునర్నిర్వచిస్తున్నాయి. మనదేశంలో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్వంటి ఆధునిక అంశాలను పాఠ్యాంశాలుగా విద్యార్థుల నెత్తిమీద రుద్దుతున్నారు తప్ప, ప్రతి విద్యార్థికీ తాను కోరుకున్నట్టు చదువుకోవడానికి కావలసిన స్వీయ అభ్యాసనా వాతావరణాన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చెయ్యడం లేదు. ఏఐ ఉపకరణాలు ఉపయోగించి ప్రతి విద్యార్థి పురోగతినీ అంచనా వేసి, వారి స్వీయ అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా బోధనా పద్ధతులను మార్పు చేయవచ్చు.అదే విధంగా వ్యవసాయంలో రైతులకు, స్వర/వాక్ ఆధారిత ఏఐ ద్వారా, ఆ యా ప్రాంతాలకు అనుకూలమైన వ్యవసాయ పద్ధ తుల గురించి, పంటల గురించి సలహాలను అందించవచ్చు. గిట్టుబాటు ధరలు, మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ రుణాలు వంటి వాటి గురించి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ రైతులు నష్టపోకుండా చూడవచ్చు.మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. కానీ ఆ మేధను కృత్రిమ మేధ, డీప్టెక్ తదితర రంగాల వైపు మళ్ళించి దేశీయ వ్యవస్థలను పునః రూపకల్పన చెయ్యటానికి పటిష్ఠమైన ప్రణాళికలు రచించడం లేదు. ఈ పని జరిగినప్పుడే ఆధునిక టెక్నా లజీ దన్నుతో దేశం అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదు.మన దగ్గర అనితర సాధ్యమైన మేధా సంపత్తి ఉంది. ఆ మేధను కృత్రిమ మేధవైపు మళ్లించి వ్యవస్థలను పునఃరూపకల్పన చెయ్యటానికి ప్రణాళికలను రచించినపుడు టెక్నాలజీ దన్నుతో దేశం అభివృద్ధి చెందుతుంది. – శ్రీవిద్య శ్రీనివాస్, కృత్రిమ మేధ నిపుణులు -
బంగ్లాదేశ్ ఇప్పుడొక టైమ్ బాంబ్!
‘ఉక్కు మహిళ’ షేక్ హసీనా నిరంకుశ పాలనకు తెరపడినా, బంగ్లాదేశ్లో ప్రజా స్వామ్య ద్వారాలు తెరుచుకోలేదు. విద్యార్థుల తిరుగుబాటుకు వెనుక ఉండి మద్దతు ఇచ్చిన సైన్యం హసీనా నిష్క్రమణతో నేరుగా రంగంలోకి దిగింది. తమ ఆటలు సాగనివ్వని హసీనాపై సైనిక అధికారులు పగ తీర్చుకున్నారు. చివరకు ఆమె దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. సైన్యంతో పాటు విద్యార్థుల తిరుగు బాటుకు అన్ని రకాలుగా తోడ్పాటు అందించిన ఇస్లామిస్ట్ శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. సెక్యులర్ పాలనలో కుక్కిన పేనుల్లా పడి ఉన్న ఈ శక్తులు ఇదే అదనుగా వీధుల్లోకి వచ్చాయి.యూనస్ దేనికి వారధి?తను స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ ద్వారా బీదాబిక్కీకి రుణ సాయం అందిస్తూ వారి పాలిట దేవుడిగా కీర్తించబడి 2006లో నోబెల్ శాంతి బహుమతి పొందిన మహమ్మద్ యూనస్ను గద్దె ఎక్కించడంతో బంగ్లాదేశీయుల ప్రజాస్వామ్య ఆశలు మరింత బలపడ్డాయి. అయితే అవి వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు.నోబెల్ కమిటీ యూనస్ను ఎంపిక చేయడానికి గ్రామీణ్ బ్యాంకు ద్వారా ఆయన సేవలు అందించారనడం అనేది పైకి కనిపించే కారణం మాత్రమే! భౌగోళిక రాజకీయాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఇస్లాముకూ, పశ్చిమ దేశాల ప్రజలకూ నడుమ యూనస్ ఒక వారధి లాంటి వాడని కమిటీ అధ్యక్షుడు ఆయనకు అవార్డు ప్రకటిస్తూ అభివర్ణించారు. 2001 సెప్టెంబర్ 11న యూఎస్ మీద జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో ‘ఇస్లామును ఒక భూతంగా చూసే విస్తృత ధోరణి’ని ఎదుర్కోవడానికి యూనస్ ఎంపిక తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. యూనస్ తరఫున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లాబీయింగ్ చేయడం వెనుక అసలు కారణం ఇదే!దేశంలో సమూల సంస్కరణలు ప్రవేశపెడతాననీ, ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తాననీ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేతగా సైన్యం వెన్నుదన్నుతో పగ్గాలు చేతబట్టిన యూనస్ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే ఎన్నికలు పదే పదే వాయిదా పడుతున్నాయి. ఇలా ఉండగా, రాజ్యాంగ బద్ధత లేనప్పటికీ, మధ్యంతర ప్రభుత్వం అనేక స్వతంత్ర సంస్థల్లో పెనుమార్పులు ప్రకటిస్తోంది. వీటిలో భాగంగా, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తినీ, సీనియారిటీ పరంగా ఆయన తర్వాతి స్థానాల్లో ఉండే అయిదుగురు న్యాయమూర్తులనూ పదవుల నుంచి తొలగించింది. హసీనా పార్టీ అవామీ లీగ్ను నిషేధించింది. దేశంలోనే అతి పెద్దదైన ఈ రాజకీయ పార్టీ నాయకత్వంలోనే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.వీధుల్లో బీభత్స కాండమానవ హక్కులను కాపాడవలసిన ప్రభుత్వమే వాటిని ఉల్లంఘిస్తోంది. నిరసనలను అణచివేస్తోంది. న్యాయవాదులు, విద్యా వేత్తలు, పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలను, హసీనా మద్దతుదారు లను మూకుమ్మడిగా జైళ్లకు పంపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అనేక వేల మందిని నిర్బంధంలోకి తీసుకుంది. హత్యలు వంటి అభియోగాలు మోపి జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెడు తోంది. వారిపై పెరిగిపోయిన దాడుల పట్ల అంతర్జాతీయ మీడియా పరిశీలక సంస్థలు ఆందోళన ప్రకటిస్తున్నాయి. దేశంలో కస్టడీ హత్యలు, చిత్రహింసలు మామూలు అయ్యాయి.ఇస్లామిస్టు ఉగ్రవాదులకు పునరావాసం కల్పించే కొత్త పరి ణామం మరింత ఆందోళన కలిగిస్తోంది. యూనస్ నాయకత్వంలోని మిలిటరీ–ముల్లా ప్రభుత్వం జిహాదీ గ్రూపుల మీద నిషేధాలు ఎత్తివేసింది. కరడు గట్టిన ఉగ్రవాద నాయకులకు స్వేచ్ఛ ప్రసాదించింది. అంతకంటే ఘోరంగా, అనేక మంది ఉగ్రవాదులు మంత్రి పదవులు, ఉన్నత ప్రభుత్వోద్యోగాలు పొందారు. వారి అనుచర గణాలు ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బౌద్ధులు, క్రైస్తవులు, హిందువులు, గిరిజన తెగల మీద దాడులు చేస్తున్నారు. ‘ఇతర’ ఇస్లామిక తెగలనూ వారు విడిచి పెట్టడం లేదు. ఈ దాడులను నేరాలుగా పరిగణించక పోవడం విశేషం. స్త్రీలు ధరించే దుస్తులను సాకుగా చూపి, వారి మీదా దాడు లకు తెగబడుతున్నారు. తాలిబన్ శైలిలో ‘మోరల్ పోలీసింగ్’ సంస్కృతి వ్యాప్తి చెందుతోంది. పరిస్థితి ఎంత దుర్మార్గంగా తయా రైందంటే, ఆఖరుకు అవామీ లీగ్ పార్టీకి బద్ధ వ్యతిరేకమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సైతం ఈ మౌలిక హక్కుల హననాన్ని, ‘మతం పేరిట రేగిన ఉన్మాదం’గా, ‘వీధుల్లో బీభత్స కాండ’గా అభివర్ణిస్తోంది.పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. జీడీపీ వృద్ధి కుప్పకూలింది. విదేశీ రుణం పెరిగి పోయింది. ద్రవ్యోల్బణం 12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. ఇన్వెస్టర్ల విశ్వాసం క్షీణించడంతో, స్టాక్ మార్కెట్ అయిదేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఉద్యోగాలు పోతున్నాయి. ఉపాధి దొరకడం లేదు. జీవన ప్రమాణాలు తిరోగమిస్తున్నాయి. ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఉగ్రవాద వ్యాప్తికీ, సామాజిక అశాంతికీ దారి తీస్తుంది.ఇండియాకూ గట్టి దెబ్బముస్లిం మెజారిటీ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యానికి బంగ్లాదేశ్ ఒకప్పుడు చిరునామాగా ఉండేది. కోవిడ్–19 మహమ్మారి ముంచు కొచ్చే వరకు ఆర్థిక అభివృద్ధి, సామాజిక స్థిరత్వం దిశగా పురోగమించింది. ఏ దేశం నుంచి విడిపోయేందుకు విముక్తి ఉద్యమం చేసిందో ఆ దేశం బాటలోనే ప్రయాణించే దుఃస్థితి నేడు బంగ్లాదేశ్కు పట్టింది. బంగ్లాదేశ్ దుష్పరిణామాల ప్రభావం ఈ ప్రాంతం అంతటా పడుతుంది. బంగ్లాదేశ్కు మూడు వైపులా సరిహద్దుగా ఉన్న ఇండి యాలోకి అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు ప్రవేశించారు. హసీనా హయాంలో ఉగ్రవాద నిరోధకత, ప్రాంతీయ సంధాయకత అంశాల్లో ఇండియాకు బంగ్లాదేశ్ అత్యంత సన్నిహిత భాగస్వామిగా ఉండేది. ఆమె ప్రభుత్వం కూలిపోవడం... వ్యూహాత్మక ప్రయోజ నాల పరంగా ఇండియాకు గట్టి దెబ్బ. ఇప్పుడు ఆ వైపున కూడా సరిహద్దు భద్రత పెంచడం అనివార్యం అయ్యింది. లేదంటే, బంగ్లా దేశ్ నుంచి కూడా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం పొంచివుంది.హసీనా పదవీచ్యుతి వల్ల ఎదురు కానున్న ప్రమాదాలను ఇండియా తక్షణం గుర్తించినప్పటికీ, అమెరికా అందుకు విరుద్ధంగా ఆ మార్పును స్వాగతించింది. అయితే, బంగ్లాదేశ్ ఇదే పంథాను కొనసాగిస్తే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ సుస్థిరత సౌభాగ్యాల కోసం యూఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కృషి కొరగాకుండా పోతుంది. సుదూర దేశాలను సైతం ముగ్గులోకి దించే మరో అంత ర్జాతీయ స్థాయి ఉద్రిక్త కేంద్రంగా బంగ్లాదేశ్ అవతరిస్తుందని పరి శీలకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు, మత స్వేచ్ఛ, ప్రాంతీయ సుస్థిరతలను పరిరక్షించాల్సిన తక్షణ అవసరాన్ని అంతర్జాతీయ సమాజం సీరియస్గా తీసుకోవాలి, బంగ్లాదేశ్ అధః పతనాన్ని ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదు.బ్రహ్మ చేలానీ వ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ ఎమిరెటస్ ప్రొఫెసర్ (‘ప్రాజెక్ట్ సిండికేట్’ సౌజన్యంతో) -
మనసుంటే భూపంపిణీ చేయొచ్చు!
భారతదేశంలో నూటికి 65 శాతం పైగా ప్రజలు గ్రామీణప్రాంతంలో నివసిస్తున్నారు. భూమిని కలిగి ఉండటం రైతు కుటుంబానికి సామాజిక హోదాను కల్పిస్తుంది. కానీ 78 సంవత్సరాల ‘స్వాతంత్య్రం’ తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదలు అత్యధికంగా ఉన్నారు. గ్రామాల్లోని సుమారు 10 కోట్ల కుటుంబాలకు, అంటే గ్రామాల్లోని దాదాపు 56 శాతం కుటుంబాలకు సాగు భూమి అనేది లేదు. 1970 దశకంలో ప్రజల, ముఖ్యంగా గిరిజన ప్రజల పోరాటం ఫలితంగా భూమి సమస్య ప్రధాన ఎజెండాగా ముందుకు వచ్చింది. రాష్ట్రాల వారీగా భూసంస్కరణల చట్టాలు వచ్చాయి. 1972లో జరి గిన ముఖ్యమంత్రుల సమావేశంలో జాతీయ స్థాయిలో ఒకే సీలింగ్ విధానాన్ని రూపొందించారు. ఈ సీలింగ్ ద్వారా 67 లక్షల ఎకరాల మిగులు తేలింది. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం ఫలితంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో 1972లో భూ సంస్కరణల చట్టం చేయబడి 1973లో అమల్లోకి వచ్చింది. భూ సంస్కరణల చట్ట ప్రకారం మొదట 18 లక్షల ఎకరాలను మిగులు భూమిగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రక టించింది. సవరణలతో కుదిస్తూ చివరికి 7.9 లక్షల ఎకరాల మిగులు భూమి ప్రకటించి, అందులో 6.47 లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని, 5.82 లక్షల ఎకరాలను లక్షా 79 వేల మందికి పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చట్టంలో ఉన్న లొసుగు లను ఉపయోగించుకొని భూస్వాములు, ధనిక రైతులు సీలింగ్లోకి రాకుండా తమ భూములను కాపాడుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ సుమారు 51 లక్షల ఎకరాలను మాత్రమే 57.8 లక్షల పేద రైతులకు పంపిణీ చేయడం జరిగింది. భూ సంస్కరణల చట్టాల వల్ల భూ సంబంధాల్లో మౌలికమైన మార్పులు జరగలేదు. కొద్ది మంది వద్దే భూమి ఇంకా కేంద్రీకరించ బడి ఉంది. 2020 జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం, 84%గా ఉన్న చిన్న, సన్నకారు రైతులు హెక్టార్ కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నారు. కేవలం 4.9% ఉన్న భూస్వాముల వద్ద 32% సాగు భూమి ఉంది. రాష్ట్రాల వారిగా కూడా భూకేంద్రీకరణలో వ్యత్యాసాలు ఉన్నాయి. పంజాబ్, బిహార్ రాష్ట్రాల్లో 10%గా ఉన్న భూస్వాముల వద్ద 80 శాతం భూమి ఉంది. తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో 55% భూమి 10%గా ఉన్న భూస్వాముల వద్ద ఉంది. భారతదేశంలో ఒక పెద్ద భూ కామందు ఒక సన్నకారు రైతు కన్నా 45 రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్నారు. దేశంలో భూ సంస్కరణలు అమలు జరిపారనీ, భూస్వామ్య విధానం లేదనీ, దాని అవశేషాలు మాత్రమే ఉన్నాయనీ, పంచ టానికి ఇంకా భూములు లేవనీ కొందరు చేస్తున్న వాదనలు వాస్తవ విరుద్ధం. భూ కామందుల వద్దే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల వద్ద, మత సంస్థల వద్ద లక్షలాది ఎకరాల భూమి ఉంది. ఆ భూము లను ప్రభుత్వం పంపిణీ చేయగలిగినప్పుడే పేదలందరికీ భూమి లభిస్తుంది. 10 నుండి 12 ఎకరాల సీలింగ్ విధించి భూ సంస్కర ణలు అమలు జరిపితే లక్షల కొద్ది భూములను పేదలకు పంపిణీ చేయవచ్చు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ పేదలు భూమి కోసం సంఘటితం కావాలి. – బొల్లిముంత సాంబశివరావురైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు -
దీపావళి కానుకపై ఆశలు
దేశవ్యాప్త వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఎనిమిదేళ్ళ క్రితం అట్టహాసంగా ప్రారంభించారు. ఆ సందర్భంగా అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు. దేశాన్ని ఉమ్మడి ఆర్థిక మార్కెట్గా ఏకీకృతం చేసే చారిత్రక సంస్కరణగా దాన్ని కొనియాడారు. పరోక్ష పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తున్నామన్నారు. ఘర్షణలు, ఎగవేతలను నిర్మూలిస్తుందని చెప్పారు. ఎక్సైజ్, సర్వీసు పన్నులను విధించే హక్కును కేంద్ర ప్రభుత్వం వదులుకోవడంతో సాయలాపాయలాగా కుదుర్చుకున్న వ్యవహారంగా జీఎస్టీ సంస్కరణ ఆమోదం ఖ్యాతికెక్కింది. దానికి తగ్గట్లుగానే అన్ని రాష్ట్రాలూ రాష్ట్ర స్థాయిలో విధించే అమ్మకం పన్నులు, విలువ–జోడింపు పన్ను, ఆక్ట్రాయ్ వంటి ఇతర చిన్నా చితకా పన్నులను విధించే హక్కును కేంద్రానికి దత్తం చేశాయి. రాష్ట్రాలకు పన్నుల రాబడులలో ఏర్పడే లోటును తాము భర్తీ చేస్తామని కేంద్రం వాగ్దానం చేయడం వల్ల ఆ రాజీ బేరం కుదిరింది. రాష్ట్రాలు పన్నుల విధింపులో ఉన్న స్వయం ప్రతిపత్తిని త్యాగం చేశాయి. దీన్ని 2017 నాటి తొలి చట్టంలో జీఎస్టీ పరిహార క్లాజుగా చేర్చారు. ఆ క్లాజు గడువు 2022తో పూర్తయింది. ఇపుడు జీఎస్టీలో తమ వాటా ఒక్కసారిగా బాగా తగ్గిపోయే ప్రమాదం ఉందని రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘దీపావళి కానుక’గా జీఎస్టీలో పెద్ద సంస్కరణనే తీసుకురానున్నట్లు ప్రకటించడం హర్షణీయం. తదుపరి సంస్కరణలు సాధారణ ప్రజానీకంపై, ముఖ్యంగా మధ్యతరగతి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించేవిగా ఉంటాయని ఆయన వాగ్దానం చేశారు. సంస్థాగత సంస్కరణలు, రేటు హేతుబద్ధీకరణ, బతుకు తెరువును సులభతరం చేయడమనే మూడు అంశాలను ప్రభుత్వం పరిగణించవచ్చు.పుట్టుకలోనే లోపాలురూపకల్పన, అమలులో కూడా ఏకీకృత, దేశవ్యాప్త, పరోక్ష పన్నుగా జీఎస్టీ పుట్టుకలోనే కొన్ని లోపాలున్నాయని చెప్పక తప్పదు. రూపకల్పనలోని లోపం ఏమిటంటే, జీఎస్టీ వంటి పరోక్ష పన్ను అంతర్గతంగానే తిరోగమనమైనది. ఒక వ్యక్తి చెల్లించే పన్ను ఆ వ్యక్తి ఆదాయంపైన కాక, కొనే వస్తువు విలువపై ఆధారపడి ఉంటుంది. కనుక, జీఎస్టీ మంట ధనికుల కన్నా పేదలకు ఎక్కువ తెలుస్తుంది. ఆదాయ పన్ను, సంపద పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నుల కన్నా ఔచిత్యంతో కూడినవిగా ఉంటాయి. మీ పన్ను ఆదాయంతోపాటే పెరుగుతుంది. ఆదాయం తగ్గితే పన్ను ఉండదు.జీఎస్టీలోని అసమంజసత్వాన్ని తగ్గించేందుకు బహుళ శ్లాబులు పెట్టారు. పేదలు కొనే వస్తువులను సున్నా లేదా 5 శాతం శ్లాబులో పెట్టారు. ధనికులు కొనే వస్తువులను హెచ్చు శ్లాబులో పెట్టారు. ఇది ఒక రకంగా పేదలు ఏ వస్తువులను వాడాలో శాసించడమవుతుంది. సాధారణంగా ఆహారం, ఔషధాలను పన్నుల నుంచి మినహా యించే విధానం ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉంది. అన్ని వస్తు వులు, సేవలకు ఒకే రేటు ఉండటం హేతుబద్ధమైన, సమర్థమైన వ్యవస్థ అనిపించుకుంటుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు, సింగపూర్, ఆస్ట్రేలియాలలో అది కనిపిస్తుంది. మధ్యస్థ రేటు ఉండా లన్నది స్థూలంగా అంగీకరించే సూత్రం. (ఆహారం, ఔషధాలు వంటి) అత్యవసర వస్తువులపై చాలా తక్కువగా, (పొగాకు, మద్యం వంటి) వ్యసన, విలాస వస్తువులపై చాలా ఎక్కువగా ఉంటుంది. సులభతర శ్లాబులు మేలుఇక అమలులో లోపాల గురించి ముచ్చటించుకుందాం. జీఎస్టీ బహుళ పన్ను శ్లాబుల (0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం, పాప కార్యాల కింద వచ్చే వాటిపై వేసే పన్ను, వివిధ సెస్సులు)తో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. ఈ సంక్లిష్టత, వస్తువులు, సేవల వర్గీకరణ, పన్ను చెల్లింపుదారులలో అయోమయం, వ్యాజ్యాలు వంటి వివాదాలకు దారితీస్తోంది. అంతిమ వస్తువుల పైన కన్నా ఆ యా వస్తువులను తయారు చేసేందుకు ఉపయోగించే వస్తువులపై పన్ను రేట్లు అధికంగా ఉన్న దృష్టాంతాలు కూడా ఉన్నాయి. ఇది దేశంలో వస్తూత్పత్తిని నీరుగారుస్తోంది. వ్యవసాయం, పెట్రోలు ఉత్పత్తులు, విద్యుచ్ఛక్తి, ఆల్కహాల్, స్థిరాస్తుల రంగం వంటి జీడీపీలోని పెద్ద భాగాలు... జీఎస్టీ పరిధికి బయటనే కొనసాగుతున్నాయి. కొన్నింటికి మినహాయింపు ఇవ్వడం వల్ల రెవెన్యూ తగ్గుతుంది. జీఎస్టీ సంస్కరణలోని స్ఫూర్తి దెబ్బతింటోంది. చిన్న వ్యాపారాల వారు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల వారిపై భారం పడుతోంది. కారణం– వారు వెంటనే జీఎస్టీ చెల్లించాల్సి రావడం, వారి ఖాతాదారులు చెల్లింపులలో జాప్యం చేయటం! రిఫండులలో జాప్యాలు ఉండనే ఉన్నాయి. ఇవి వ్యాపారు లకు చేతిలో నగదు ఆడకుండా చేస్తున్నాయి. ప్రధాని ప్రకటించిన ప్రతిపాదిత సంస్కరణల్లో ఒకటి గణ నీయమైన మార్పు తీసుకురాగల ఆశ రేపుతోంది. అది ప్రస్తుత బహుళ శ్లాబుల పద్ధతిని రద్దు చేసి, రెండు (స్టాండర్డ్, మెరిట్ ) రేట్ల శ్లాబుల సులభతర విధానానికి మళ్ళడం! కొన్ని ఎంపిక చేసిన వస్తువులపైన మాత్రం ప్రత్యేక రేట్లు ఉంటాయి. వ్యాజ్యాలతోపాటు, వర్గీకరణకు సంబంధించిన వివాదాలు తగ్గుతాయి. దైనందిన వాడుక వస్తువులు, జనం సమకూర్చుకోవాలని ఆశపడే వాటిపై పన్ను రేటు తగ్గుతుందని భావిస్తున్నారు. వినిమయం పెరగడం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రేట్లు తగ్గించడం వల్ల భారతదేశపు ఎగుమతుల పోటీ సామర్థ్యం పెరుగుతుంది. దేశంలో ఉద్యోగాల కల్పనకూ సాయపడుతుంది. మధ్యస్థ రేటును మరీ భారం మోపేదిగా ఉన్న 18 శాతంగా కాక 15 శాతంగా నిర్ణయించవచ్చు. పన్నుల సంస్కరణలపై ఏర్పాటు చేసిన కేల్కర్ సత్వర కార్యాచరణ బృందం సిఫార్సు చేసినట్లుగా దాన్ని 15 శాతంకన్నా తక్కువగా 12 శాతంగా నిర్ణయిస్తే ఇంకా బాగుంటుంది. రాష్ట్రాలకు చేయి తిరిగేలా...చివరగా, ఫెడరలిజంలో (ఆరోగ్యం, విద్య వంటివాటిపై) వ్యయాల బాధ్యతలను రాజ్యాంగం రాష్ట్రాల పైనే మోపింది. కానీ, స్వతంత్ర ఆదాయ వనరులను మాత్రం కొద్దిగానే కల్పించింది. ఈ అసమతౌల్యాన్ని జీఎస్టీ ఇంకా పెంచి, కేంద్ర బదలాయింపులపైనే రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడక తప్పని స్థితి కల్పించింది. స్థానిక అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి నిధుల సమీకరణకు రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారం కొంత కావాలి. జీఎస్టీ భారతదేశపు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసిందనే అభిప్రాయం ఒకటి ఉంది. రాష్ట్రాలకు కోశాగారాన్ని విస్తరించుకునే, స్వయం ప్రతిపత్తిని కల్పించే అవకాశాన్ని పునరుద్ధరించేందుకు అన్వేషించవలసిన అవసరం ఉంది. ఫలితంగా, రాష్ట్రాలు వాటి నిర్దిష్ట ఆర్థిక, సామా జిక, ప్రాంతీయ అవసరాలకు తగ్గట్లుగా విధానాలు రూపొందించు కోగలుగుతాయి. అసమానతలను తగ్గించేందుకు, ప్రస్తుతం పరోక్ష పన్నుల వైపు తూగిన తక్కెడను ప్రత్యక్ష పన్నుల వైపు మొగ్గే విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అజీత్ రానాడే వ్యాసకర్త ఆర్థికవేత్త (‘దక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో) -
మలేరియా తగ్గితే జీడీపీ పెరిగింది!
ప్రపంచ వ్యాప్తంగా దోమల నివారణ పెద్ద సమస్యగా మారింది. దోమల వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధి మలేరియా. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఒక మరణం సంభవిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా మలేరియా నియంత్రణలో కష్టించి సాధించిన ప్రగతి ఇప్పుడు ప్రమాదంలో పడి, ముందుకు సాగలేని పరి స్థితి వచ్చింది. వాతావరణం, సామాజిక సంఘర్షణలు, ఆర్థిక స్థితి గతులు, అత్యవసర పరిస్థితులు దీనికి అడ్డంకులుగా మారుతు న్నాయి. అందువలన మలేరియా నియంత్రణ ప్రాథమిక సూత్రాలైన గుర్తింపు, చికిత్స, నివారణ చర్యలు అందుబాటులో ఉండటం లేదు. నిరూపితమైన నివా రణ చర్యల కోసం తిరిగి పెట్టుబడి పెట్టడం, అడ్డంకులను తొలగించు వ్యూహా లను పన్నడం, కలసికట్టుగా తిరిగి అందరూ ఈ కొత్త ప్రయత్నాలను మొదలు పెట్టడం ద్వారా మలేరియాను అంతం చేయవచ్చు.2000 – 2017 మధ్య 180 దేశాల మలే రియా, స్థూల దేశీయోత్పత్తు (జీడీపీ)ల డేటాలను విశ్లేషించినప్పుడు... మలేరియా సంభవం 10% తగ్గినప్పుడు తలసరి జీడీపీలో సగటున 0.3% పెరుగుదల ఉందని తేలింది. ప్రతి దేశం మలేరి యాను నివారించడానికీ, గుర్తించడానికీ, చికిత్స చేయడానికీ ఒక కొంగొత్త సాంకేతికతను వాడుతున్నాయి. దోమల జీవిత కాలాన్నీ, అవి మలేరియాను వ్యాప్తి చేసే సామర్థ్యాన్నీ తగ్గించడానికి పురుగు మందులతో కూడిన దోమ తెరల సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 2000లో ఈ సాంకేతికతను విస్తరించినప్పటి నుండి 68 శాతం మలేరియా కేసులను నివారించినట్లు అంచనా. ‘కాలానుగుణ మలేరియా చికిత్స’ పొందిన పిల్లలలో దాదాపు 75 శాతం మలేరియా బారి నుంచి బయటపడ్డారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు దీర్ఘకాలం ఉండే దోమ తెరలు, మోనోక్లోనల్ యాంటీ బాడీ చికిత్స, శక్తిమంతమైన కొత్త వాహక నియంత్రణ సాధనాలు, జన్యుపరంగా మార్పు చెందిన దోమలు, ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగాEven mosquitoes are worried! 🦟With clean surroundings, covered tanks, and repellents in every home, they have nowhere to hide. This World Mosquito Day, let’s keep our communities safe and mosquito-free.#WorldMosquitoDay #FightTheBite pic.twitter.com/ydoux9ZrwO— Ministry of Health (@MoHFW_INDIA) August 20, 2025 అందువలన గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ దేశాలు మలేరియా నిర్మూ లనకు దగ్గరగా ఉన్నాయి. మన దేశంలో గత సంవత్సరం 2,57,383 మలే రియా కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ఆవాసాలు, కొండ ప్రాంతాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమో దవుతూ ఉన్నాయి. అక్కడ జనాభా 20% మాత్రమే ఉన్నప్పటికీ, 80% కేసులు అక్కడే ఉన్నాయి. మనందరం కలిసి మలేరియాను సమూలంగా తొలగించేందుకు కంకణం కట్టుకుందాం. ఇది మన సమష్టి బాధ్యత.– తలతోటి రత్న జోసఫ్, మెడికల్ ఎంటమాలజిస్ట్ -
శాంతి సాధనలో మూడు ముక్కలాట
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 15న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో, 18 నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయ కులతో జరిపిన చర్చలు ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి. అందుకు సంబంధించి ఉండిన చివరి అనుమానాలు 18 నాటి వైట్ హౌస్ సమావేశంతో తీరిపోయాయి. అంతకుముందు 15న అలాస్కాలో ట్రంప్, పుతిన్ల మధ్య జరిగిన చర్చలలో కనిపించిన సానుకూలతను జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నాయకులు వైట్హౌస్ సమావేశంలో భంగపరచవచ్చుననే సందేహా లుండేవి. శాంతి ప్రయత్నాలకు ముందు కాల్పుల విరమణ జరిగి తీరాలనే పట్టుదలతో ఉండిన ఆ బృందం, ట్రంప్ ఆలోచనను తిరిగి మార్చవచ్చుననే భావన చాలా మందికి కలిగింది. కానీ, అది గ్రహించి కావచ్చు 18 నాటి చర్చలకు ముందు రాత్రే ట్రంప్, కేవలం కాల్పుల విరమణ వల్ల ఉపయోగం లేదనీ, పూర్తి స్థాయిలో శాంతి కోసం ప్రయత్నం జరగాలనీ స్పష్టం చేశారు.పుతిన్ వాదనను అంగీకరించిన ట్రంప్అంతిమంగా అలాస్కా, వైట్ హౌస్ భేటీల సారాంశం ఏమిటి? మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంపై అమెరికా, రష్యా అధ్యక్షులు మొదటిసారి సమావేశమయ్యారు. వెంటనే కాల్పుల విరమణకు పుతిన్ను ఒత్తిడి చేయగలనని, అందుకు సమ్మతించని పక్షంలో తీవ్ర మైన చర్యలు తీసుకోగలనంటూ వెళ్లారు ట్రంప్. అక్కడ మూడు గంటల చర్చలలో పుతిన్ ఇచ్చిన సుదీర్ఘమైన వివరణలతో పూర్తిగా సంతృప్తి చెంది, కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని,సంపూర్ణ స్థాయిలో శాంతి సాధనే సరైన మార్గమనే వాదనతో అంగీ కరించారు. చంచల స్వభావిగా పేరున్న ఆయన అటువంటి అభిప్రా యంపై స్థిరపడటం ఈ కథాక్రమంలోని కీలకమైన మలుపు. పుతిన్ వాదన నచ్చినప్పటికీ అట్లా స్థిరపడక పోయి ఉంటే, యూరోపియన్ల సమావేశంలో తన ఆలోచనను తిరిగి మార్చుకునే వారేమో! అపుడు విషయం మళ్లీ మొదటికి వచ్చేది. జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ షుల్జ్, యూరోపియన్ నాయకుల తరఫున మాట్లాడుతూ, శాంతి చర్చల కన్నా ముందు కాల్పుల విరమణ తప్పనిసరియని వాదించారు. కానీ ట్రంప్ జర్మనీ ఛాన్స్లర్ మాటను తోసిపుచ్చారు.ఈ ఒక్క విషయమే ఇంతగా చెప్పుకోవటం ఎందుకంటే, ఈ దశలో మొత్తం విషయమంతా అమెరికా అధ్యక్షుడు ఎవరి వాదనను అంగీకరించి ముందుకు పోగలరన్న దానిపైనే ఆధారపడి ఉంది. ఇపుడు రెండు చర్చల అనంతరం అందుకు స్పష్టత వచ్చినందున ఇతర విషయాలను చూద్దాము. అవి ప్రధానంగా మూడు. ఒకటి– రష్యా కోరుతున్న భూభాగాలను ఉక్రెయిన్ వదలుకోవటం; రెండు– ఉక్రెయిన్ ‘నాటో’లో చేరకపోవటం; మూడు– ఉక్రెయిన్కు భవిష్యత్తులో భద్రత కోసం రక్షణ హామీలు లభించటం. ఈ మూడు అంశాలు కూడా అలాస్కాలో, వైట్ హౌస్లో ప్రస్తావనకు వచ్చాయి. రష్యా తాను ఇప్పటికే పూర్తిగానో, పాక్షికంగానో ఆక్రమించిన క్రిమియా, డొనెటెస్క్, జపోరిజిజియా, ఖేర్సాన్, లుహాన్స్క్, ఖార్కివ్ ప్రాంతాలను తమకు అప్పగించటం, ఆ యా నియంత్రణ రేఖలను అదే స్థాయిలో స్తంభింపజేయటం జరగాలని కోరుతున్నది. అవి అన్నీ కాకపోయినా ఏదో ఒక మేరకు వదులుకోవాలని ట్రంప్ మొదటినుంచి అంటున్నారు. యూరోపియన్ నాయకుల వైఖరి ఇంచుమించు అదే! వైట్ హౌస్ చర్చల సందర్భంలో అవుననక, కాదనక... అది జెలెన్స్కీ తేల్చుకోవలసిన విషయమని వదలి వేశారు. భూభాగాలను వదలుకొనే ప్రసక్తి లేదని జెలెన్స్కీ అంటూనే, అది తనకు, పుతిన్కు, ట్రంప్కు మధ్య త్రైపాక్షిక చర్చ లలో తేలుతుందని మరొకవైపు సూచిస్తున్నారు. ఈ పరిణామాల న్నింటినీ పరిగణనలోకి తీసుకున్నపుడు, రష్యా డిమాండ్లలో ఒకటి కొలిక్కి రాగల అవకాశాలు సూత్రరీత్యా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ‘నాటో’లో చేరకూడదు...‘నాటో’లో ఉక్రెయిన్ సభ్యత్వం విషయానికి వస్తే, రష్యా డిమాండ్కు అమెరికా అధ్యక్షుడు మొదటి నుంచీ సానుకూలంగా ఉన్నారు. అసలు ఉక్రెయిన్ ఆ సంస్థలో చేరాలనుకోవటమే రష్యా అభద్రతా భావానికి, ఈ దాడికి మూల కారణమని కూడా అన్నారు. అటువంటి వైఖరి తీసుకున్న తర్వాత ఇక ఉక్రెయిన్ ఆ సైనిక కూట మిలో చేరగల అవకాశం ఉండదు. వాస్తవానికి అందులో చేరాలనే మాట ఉక్రెయిన్ రాజ్యాంగంలో లాంఛనంగా ఉన్నప్పటికీ, ఆ పట్టుదల యూరోపియన్ దేశాలదే! రష్యాను క్రమంగా చుట్టుముట్టి, ఛిన్నాభిన్నం చేయాలన్నది వారికి గతం నుంచి గల దీర్ఘకాలిక ప్రణాళిక. అయితే, ఈ ఒప్పందాల క్రమంలో ఉక్రెయిన్ తామిక ‘నాటో’లో చేరబోమంటూ రాజ్యాంగపరంగా ప్రకటించవలసి ఉంటుందన్నది రష్యా డిమాండ్. అది జరగాలని ట్రంప్ కూడా ఒత్తిడి చేయవచ్చు. అదే జరిగితే యూరోపియన్ నాయకులు చేయ గలిగింది ఉండదు. ఆ విధంగా శాంతి సాధనకు మరొక అడ్డంకి తొలగిపోతుంది. ఉక్రెయిన్లోని రష్యన్ జాతీయుల హక్కుల పరి రక్షణ వంటి మరికొన్ని అంశాలు ఉన్నాయి గానీ, ఇతరత్రా గల ప్రధాన సమస్యలు పరిష్కారమైనపుడు అవీ కావచ్చు.ఉక్రెయిన్కు ఆందోళనకరంగా ఉన్న ప్రధానాంశం తమ రక్షణ. చర్చలలో రష్యా అధ్యక్షుడు మొట్టమొదటిసారిగా అందుకు కొన్ని సడలింపులు చూపటం శాంతి సాధనకు మార్గాన్ని సుగమం చేసింది. అక్కడ ట్రంప్తో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్కు భద్రత ఏర్పడటం తప్పనిసరి అవసరమని, అక్కడి ప్రజల మూలాలూ తమ ప్రజల మూలాలూ ఒకటేనని, కనుక వారికి రక్షణ ఏర్పాట్లకు ఎటు వంటి అభ్యంతరమూ లేదని అన్నారు. ఆ భద్రత ఏ రూపంలోన న్నది ప్రశ్న. ‘నాటో’లో చేరేందుకు వీలు లేదన్న పుతిన్ డిమాండ్ను ట్రంప్ అంగీకరించారు. అట్లా చేరకపోయినా 5వ ఆర్టికల్ను పోలిన రక్షణలు కల్పించగలమని ట్రంప్ సూచించగా అందుకు పుతిన్ సమ్మతించారు. ఆర్టికల్ 5 అనే మాట ప్రచారంలోకి వచ్చినట్లు అందులోని వివరాలు ప్రచారంలోకి రాలేదు గానీ, అవి గమనించ దగ్గవి. నాటోలోని ఏ దేశంపై అయినా బయటి దేశం దాడి జరిపితే అది మొత్తం నాటో కూటమిపై జరిగిన దాడిగా పరిగణించి అందరూ ఆ దేశానికి మద్దతుగా కదలివస్తారు. కానీ దాని అర్థం అందరూ యుద్ధంలో ప్రవేశిస్తారని కాదు. ఎవరు ఏ రూపంలో పాల్గొంటారన్నది వారి నిర్ణయం. ఉక్రెయిన్ నాటోలో లేకపోయినా అమెరికా సహా అందరూ తమ తమ సహాయాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో గుర్తించవలసింది మరొకటి ఏమంటే, ఉక్రెయిన్కు అంద జేసే ఆయుధాలన్నీ ఖరీదుకేగానీ ఉచితంగా కాదు. వైట్హౌస్ చర్చలు సానుకూలంగా ఉన్నట్లు భావించిన ట్రంప్ ఆ వెంటనే పుతిన్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇక ఇరుపక్షాలూ సన్నద్ధమైతే మొదట రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య ద్వైపాక్షికంగా, తర్వాత అమెరికా అధ్యక్షుని చేరికతో త్రైపాక్షికంగా చర్చలు జరుగు తాయి. శాంతి దిశగా అడుగులైతే పడుతున్నాయి. ఇందుకు తిరిగి ఏ భంగమూ కలగదని ఆశించాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇది సాకారమైతే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యానికి చెక్!
భారత ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ను శాసించాలి. అధిక నాణ్యత, తక్కువ ధరే మన బలం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై విధించిన ట్యారిఫ్లను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఈ పిలుపునిచ్చారని వేరే చెప్పాల్సిన అవ సరం లేదు. ఏ దేశమైనా వేరే దేశం నుంచి వస్తు సేవలను దిగుమతి చేసుకుంటుందంటే అర్థం అవి దానికి అవసరమనే కదా! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో భారత్ తన మీద ఆధారపడి ఉందన్నట్లుగా వ్యవహ రిస్తున్నారు. భారతదేశ ఉత్పత్తుల్ని దయతలిచి దిగుమతి చేసుకుంటున్నట్లుగా సుంకాలను విధిస్తున్నారు. అమెరికాకు భారత్ ఎగు మతి చేసే వస్తువులు, సేవల మొత్తం సుమారు 87 బిలియన్ డాలర్లు. ఇది భారత్ మొత్తం ఎగుమతులలో 18% వాటా. ఈ ఏడాది చివరి నాటికి సుమారు 90–100 బిలియన్ డాలర్ల విలువైన వస్తు సేవల ఎగుమతి ఉండవచ్చనేది విశ్లేషకుల అంచనా. సుంకాల వల్ల ఈ ఎగుమతులన్నీ ఆగిపోతాయా అంటే కాదనే చెప్పవచ్చు. భారత్ అతి తక్కువ ధరలకు, నాణ్యమైన వస్తువుల్ని సరఫరాచేస్తోంది. ఉదాహరణకు ఫార్మాస్యూటికల్ రంగం దాదాపు 8 బిలి యన్ డాలర్ల విలువైన పేటెంట్ లేని ఔషధ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి కాక పోతే అక్కడి ప్రజలే ఇబ్బంది పడతారు. అలాగని పూర్తిగా మనకు ఇబ్బంది ఉండదా అంటే... ట్యారిఫ్ల వల్ల అమెరికా ప్రజలు వస్తువులు కొనలేక వినియోగం తగ్గించుకుంటారు. ఆ ప్రభావం మన మీద పడుతుంది. ఇదీచదవండి : బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పైపైకి ఎగబాకుతుండటాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. ఇప్పటివరకూ ఇండో – పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, దాని మిత్ర దేశాలు గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం భారత్ తన చర్యల ద్వారా స్వీయ ముద్ర వేస్తోంది. తైవాన్తో వాణిజ్య ఒప్పందం, ఫిలిప్పీన్స్తో మిసైల్స్ సరఫరా ఒప్పందం, జపాన్తో టెక్నాలజీ సరఫరాకుసంబంధించిన ఒడంబడిక, వియత్నాంతో సైనిక సహకారం, ఇండో నేషియాతో సముద్ర భద్రత వంటి వాటిపై ఒప్పందాలు కుదుర్చు కుంది. అంతటితో ఆగడం లేదు. రష్యా ప్రతిపాదించిన రష్యా–ఇండియా–చైనా (ఆర్ఐసీ) ప్రతిపాదన మరోసారి తెరమీదికివచ్చింది. ఇది సాకారమైతే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యానికి పూర్తిగా గండికొట్టేయ వచ్చు. నిజానికి ట్రంప్ సుంకాలు విధించింది భారత్పై కాదు. అమెరికా ప్రజలపై! 2025లో అన్ని సుంకాల వల్ల సగటు అమెరికా కుటుంబానికి సంవత్సరానికి 3,800 డాలర్ల నష్టం ఏర్పడుతుందని అంటున్నారు. ట్రంప్ లాంటి వాళ్లు ట్యారిఫ్లు ఎంత ఎక్కువ వేసినా భారత్కు ఇబ్బంది తాత్కాలికమే అవుతుంది. కొత్త మార్కెట్లు భారతీయ వ్యాపారులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సవాళ్లు భారతదేశానికి ఎగుమతులను మెరుగుపరచడానికీ, భౌగోళికంగా వైవిధ్యభరితమైన మార్కెట్లను అన్వేషించడానికీ అవకాశం ఇస్తాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. ట్రంప్ ట్యారిఫ్లు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టేందుకు భారతదేశానికి అవకాశం కల్పిస్తాయి. చదవండి: రూ.13వేల కోట్లను విరాళమిచ్చేసిన బిలియనీర్, కారణం ఏంటో తెలుసా?-ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు -
నాకెవరూ చెప్పని... ఐదు సంగతులు!
శుభ మధ్యాహ్నం. ఇంతటి గౌరవాన్ని కల్పించినందుకు అరిజోనా విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులకు కృత జ్ఞతలు. గౌరవ డాక్టరేట్ అందుకున్నందుకు గర్వంగా ఉంది. మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం లభించడాన్ని కూడా నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎన్నడూ అందుకోని దానిని...అంటే నిజమైన కాలేజీ డిగ్రీని యూనివర్సిటీ మీకు అందిస్తోంది. నేను డిగ్రీ పూర్తి చెయ్యని సంగతి మీలో కొందరికి తెలిసి ఉండవచ్చు. మూడు సెమిస్టర్లు పూర్తి చేసిన తర్వాత, ‘మైక్రోసాఫ్ట్’ను ప్రారంభించేందుకు నేను చదువుకు స్వస్తి చెప్పేశాను. ఆ సంగతులనే నేను మీతో పంచుకోదలచుకున్నా. నేను పూర్తి చేయని గ్రాడ్యుయేషన్లో నాకు ఐదు సంగతులు చెప్పివుంటే బాగుండుననిపించింది. రెండవ వృత్తి తప్పు కాదు!మొదటిది – మీ జీవితం ఏకాంకిక కాదు. మీరు చేపట్టబోయే వృత్తి జీవితం గురించి సరైన నిర్ణయాలు తీసుకోవాలనే ఒత్తిడిలో బహుశా మీరు ఉండి ఉంటారు. అవి శాశ్వతమైన నిర్ణయాలుగా మీకు తోచవచ్చు. కానీ, అవి శాశ్వతమైనవి కావు. రేపు చేసేవి లేదా తదుపరి పదేళ్ళలో చేసేవి... మీరు జీవితాంతం చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. స్కూలు చదువును మధ్యలోనే ఆపేసినపుడు, ఇక జీవితమంతా మైక్రోసాఫ్ట్లోనే పనిచేస్తానని అనుకున్నాను. నేడు గమనిస్తే, సాఫ్ట్వేర్పై పనిచేయడాన్ని నేను ఇప్పటికీ ఇష్టపడతాను గానీ, వాతావరణ మార్పును నివారించే నవీకరణలను సృష్టించడం; ఆరోగ్యం, విద్యా రంగాలతో పాటు ఇతరత్రా అసమానతలను తగ్గించడంపైన పనిచేయడానికి నా సమయాన్ని వెచ్చిస్తున్నా. ఇది నేను నా 22 ఏళ్ళ వయసప్పుడు ఊహించింది కాదు. కనుక, అవసరమైతే భవిష్యత్తులో మీ మనసు మార్చుకోవడంలో లేదా రెండవ వృత్తి జీవితాన్ని ఎంచుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు... నిజానికి, అది సరైన పని అనిపించుకుంటుంది.సలహా అడగడానికి వెనుకాడొద్దు!రెండు – ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదబ్బా అనుకుంటూ గందరగోళపడిపోనంత తెలివితేటలు మనకు ఎన్నడూ ఉండవు. కాలేజీ నుంచి బయటపడుతున్నప్పుడు, నాకు అవసరమైనవన్నీ నాకు తెలుసునని అనుకున్నా. కానీ, ఏదైనా నేర్చుకునేందుకు మొదటి అడుగు... మనకు తెలియని సంగతిని అక్కున చేర్చు కోవడంలోనే పడుతుంది. తెలిసున్నదానిపైనే దృష్టి కేంద్రీకరించే బదులు కొత్తవాటిని నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. ఒక్కరే స్వయంగా పరిష్కరించుకోలేని సమస్యను మనం మన వృత్తి జీవితంలో ఏదో ఒక దశలో ఎదుర్కొంటాం. అటువంటి సందర్భం ఎదురైనపుడు ప్రజ్ఞావంతులను వెతికిపట్టుకుని, వారి నుంచి పరిష్కార మార్గాలను గ్రహించండి. ఆ వ్యక్తి మీకన్నా ఎక్కువ అనుభవం ఉన్న సహోద్యోగి కూడా కావచ్చు. మీతో కలిసి చదువు కున్న విద్యార్థి అయినా కావచ్చు. ఆ వ్యక్తి సరైన దృక్పథం కలిగి, మిమ్మల్ని భిన్నంగా ఆలోచించేటట్లు చేయగలిగినవాడై ఉండాలి. ఆ వ్యక్తి మనకు అవసరమైన రంగంలోని నిపుణుడైతే మరీ మంచిది. నేను సాధించిన వాటన్నింటికీ కారణం, ఆ యా అంశాల్లో నాకన్నా ఎక్కువ పరిజ్ఞానం కలిగిన వారి సలహాలు, సూచనలు తీసు కోవడమే. మనకు సహాయపడేందుకు ముందుకొచ్చేవారు ఎప్పుడూ ఉంటారు. కాకపోతే మనం నిస్సంకోచంగా వారిని ఆశ్రయించడం ముఖ్యం. పరిష్కరించడంలోనే పరమార్థం!మూడు – ఒక ముఖ్యమైన సమస్యను పరిష్కరించే దిశగా అడు గులు వేయండి. ప్రతి రోజూ కొత్త రకం పరిశ్రమలు, కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అవి మీకు జీవనోపాధి కల్పించడమే కాదు, కొత్త పుంతలు తొక్కేటట్లు ప్రోత్సహిస్తాయి. ఉదాహరణకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నుంచి ప్రజలందరికీ ప్రయోజనం ఒనగూడే టట్లు మీరు మీ ప్రతిభా సంపత్తులను వినియోగించవచ్చు. ఒక పెద్ద సమస్యను పరిష్కరించే అంశంలో నిమగ్నమైనపుడు, ఉత్తమమైన ఫలితాలను సాధించే విధంగా అది మీకు ఉత్సాహ ప్రోత్సాహాలను కూడా ఇస్తుంది. అదే మిమ్మల్ని మరింత సృజనా త్మకతతో వ్యవహరించేటట్లు చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, మీ జీవితానికి ఒక పరమార్థాన్ని కల్పిస్తుంది. స్నేహితులే మీ నెట్వర్క్!నాలుగు – స్నేహ బంధంలోని శక్తిని తక్కువ అంచనా వేయ వద్దు. స్కూలులో నాకొక మిత్రుడు ఉండేవాడు. సైన్స్ ఫిక్షన్ నవ లలు, కంప్యూటర్ మ్యాగజైన్లు వంటి నాకు ఇష్టమైన వ్యాపకాలు చాలా వాటిని అతనూ పంచుకునేవాడు. ఆ స్నేహం ఎంత ముఖ్య మైనదిగా పరిణమిస్తుందో నేను అప్పట్లో ఊహించలేదు. నా స్నేహి తుని పేరు పాల్ ఆలన్. మేం ఇద్దరం కలసి ‘మైక్రోసాఫ్ట్’ ప్రారంభించాం. లెక్చరర్ పాఠం చెప్పేటపుడు తరగతి గదిలో పక్కన కూర్చున్నవాళ్ళు, ఆటపాటల్లో పాల్గొంటూ మీతో పోటీ పడేవాళ్ళు మీ తోటి విద్యార్థులు మాత్రమే కాదు, వారు మీ నెట్ వర్క్ అని గుర్తుంచుకోండి. వారు మీ భవిష్యత్ సహ–సంస్థాపకులు, సహో ద్యోగులు. వారు మున్ముందు మీకు అండగా నిలిచి, సమాచారాన్ని, సలహాలను ఇచ్చే గొప్ప వనరుగా పరిణమించ వచ్చు. ఈ రోజు మీరు వేదిక కింద ఎవరితో కలసి నడుస్తున్నారో, వారితో రానున్న కాలంలో మీరు వేదికను పంచుకోవచ్చు. విరామం ముఖ్యమే!నా చివరి సలహా ఏమంటే... నిజానికి ఈ సలహాను నేను ఎక్కువ పాటించి ఉండాల్సిందికానీ, దాన్ని ఒంట బట్టించుకునేందుకు నాకు చాలా కాలం పట్టింది. మరేమీ లేదు... మీరు మధ్య మధ్యలో కొద్దిగా విరామం తీసుకున్నంత మాత్రాన బద్ధకస్తుడు ఏమీ అయిపోరు. నేను మీ వయసులో ఉన్నపుడు, కొన్నాళ్ళు సేద దీరడం మంచిదని నమ్మేవాడిని కాదు. నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరినీ అదనంగా గంటలకొద్దీ కూర్చోబెట్టేవాడిని. మైక్రోసాఫ్ట్ను నెలకొల్పిన కొత్తల్లో, ఎవరు తొందరగా వెళ్ళిపోతున్నారు, ఎవరు పని గంటలు ముగిసినా చాలాసేపు ఉంటున్నారు అని గమనించేవాడిని. కానీ, కొంత వయసు మీద పడిన తర్వాత – ముఖ్యంగా నేను తండ్రినయ్యాక – జీవితమంటే పని ఒక్కటే కాదని, ఇంకా చాలా ఉందని గ్రహించాను. ఈ పాఠం నేర్చుకునేందుకు మీరు నాలాగా చాలా కాలం వేచి ఉండకండి. సంబంధ బాంధవ్యాలను నిలబెట్టుకునేందుకు, విజ యాలను వేడుక చేసుకునేందుకు, కష్టనష్టాల నుంచి తిరిగి శక్తిని కూడగట్టుకునేందుకు కొంత సమయాన్ని వెచ్చించండి. -
చరిత్ర సృష్టించిన సామాన్యుడు
రాజ్యాధికారం గురించి సామాన్యుడు ఆలోచించడానికి సాహసించని రోజులలో ఏకంగా గోల్కొండ రాజ్యాన్ని ఏలిన సామాన్యుడు పాపన్న. గౌడ కులంలో పుట్టి 12 మందితో సైన్యాన్ని ప్రారంభించి 12వేలకు సైనిక శక్తిని పెంచి పాలన చేపట్టాడని మన జానపద కథలు చెబుతున్నాయి. మొగల్ ఆస్థానంలో పనిచేసిన ఖాఫీ ఖాన్ రచించిన ‘ముంతఖబ్ – అల్ లుబాబ్’ పాపన్నను ప్రస్తావించింది. పాపన్న గురించి జేఏ బోయల్ ‘దిఇండియన్ యాంటీ క్వెరీ’ 1874 జనవరి సంచికలో ‘తెలుగు బల్లాడ్ పొయెట్రీ’ అనే శీర్షికతో పాపన్న గురించి రాశాడు. లండన్లోని ‘విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం’లో పాపన్న చిత్రపటం ఉంది. కొంపల్లి వెంకట్ గౌడ్... పాపన్నపై చేసిన పరిశోధన ప్రకారం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న పాపన్న చిత్రపటాన్ని ఆయన సమకాలిక చిత్రకారుడు జగదీష్ మిట్టల్ వేశాడు. పాపన్న అసలు పేరు నాశగోని పాపన్న గౌడ్. ప్రస్తుత సిద్దిపేట జిల్లా దూల్ మిట్టలో ఉన్న రాతి శాసనం ప్రకారం పాపన్న 1650 ఆగస్టు 18న సర్వమ్మకు జన్మించాడు. ఆయన పుట్టిన ఊరు ప్రస్తుత జనగామ జిల్లాలో రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్. కులవృత్తి కల్లు గీతను విరమించి చిన్న సైన్యాన్ని ఏర్పరచుకొని మొదట తాటికొండ చుట్టు పక్కల గ్రామాలలో ధనవంతులను, భూస్వాములను కొల్లగొట్టాడు. ఆ తర్వాత తన చర్యలను హుస్నాబాద్, జనగాం, షాపురం చుట్టుపక్కలకు విస్త రించాడు. కౌలాస్ జమిందారు దగ్గర పనికి కుదిరి ఆ కోట చుట్టుపక్కలా ధనవంతులను దోచుకుని సైన్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. సర్వాయిపేట కోటను నిర్మించి స్వతంత్రాన్ని ప్రకటించుకొని విజయయాత్ర ప్రారంభించాడు. హుస్నాబాద్, తాటికొండ, షాపురం వంటి చోట్లా కోటలు నిర్మించాడు. చివరికి 1709లో గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించాడని అంటారు. అయితే చివరికి మొగల్ సైన్యం చేతికి చిక్కి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారంలో ఉన్న కథలు చెబుతున్నాయి. – నర్సింగు కోటయ్య ‘ చరిత్ర అధ్యాపకులు, నల్లగొండ(నేడు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి) -
మనమంటే మొహం మొత్తిందా?
ఇండియాపై ట్రంప్కు మొహం మొత్తిందా? ఆయన తన చేతల ద్వారా అదే విషయాన్ని తెగేసి చెబుతున్నారా? ఆయన మనపై 50% సుంకాలు విధించారు. సుంకాలపై వివాదం పరిష్కారమ య్యేంత వరకూ వాణిజ్య చర్చలను సుప్తావస్థలో పెడుతున్నట్లు ఆయన తెలి పారు. భారతదేశ మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను లెక్క చేయబోనని కరాఖండీగా చెప్పేశారు. రష్యా చమురును కొంటూ, అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు తెస్తోందని ట్రంప్కు వాణిజ్య సలహాదారైన పీటర్ నవారో ప్రకటించారు. పుతిన్తో ట్రంప్ చర్చలు విఫలమైతే భారత్పై సెకండరీ సుంకాలు పెరగ వచ్చని ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ వెల్లడించారు. యూరప్ కూడా భారత్పై సెకండరీ సుంకాలు విధించాలని ఆయన కోరారు. అమె రికా స్నేహహస్తం నుంచి భారత్ చేజారిందని ఇవన్నీ సూచిస్తున్నాయా? చైనా, రష్యాలను హెచ్చరించేందుకు భారత్ను ట్రంప్ వాడు కుంటున్నారనే అభిప్రాయమూ ఉంది. అది కూడా సంతోషపడదగ్గ అంశం కాదు. మనం ఆనుషంగిక నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మనం ఏమైపోయినా నిజంగానే, ఆయనకు పట్టదు.మరోపక్క, ట్రంప్ పాకిస్తాన్తో ప్రేమలో పడినట్లు కనిపిస్తోంది. అదీ మనల్ని సంకటంలో పడేసే సంగతే. ఆయన పాక్పై 19% సుంకాలే విధించారు. ఆయన ప్రభుత్వం ఇస్లామాబాద్ను ఉగ్రవాదంపై పోరాటంలో ‘అసాధారణ భాగస్వామి’గా పరిగణి స్తోంది. ‘ఉగ్రవాద సంస్థలను అరికట్టడంలో విజయాలను కొనసా గిస్తున్నందుకు’ అది ఇటీవల పాకిస్తాన్ను కొనియాడింది. ట్రంప్... పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్ను విందుకు ఆహ్వానించి, చమురును వెలికితీయడంలో పాక్కు సాయపడతామని చెప్పారు. నిజం చెప్పా లంటే, ఏదో ఒక రోజున పాక్ నుంచి భారత్ కూడా చమురును కొనుగోలు చేసే రోజు రావచ్చని, ఆయన మనల్ని కవ్వించారు.అంటే, ఆయనకు పాకిస్తాన్ కొత్త ముద్దుగుమ్మగా మారినట్లా? రష్యన్ చమురు ఢిల్లీని చీకాకుపరచే అంశంగా మారడమేకాదు, అది పరిష్కారమయ్యేంత వరకూ భారత్తో వాణిజ్య చర్చలు జరి పేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు కనుక మొదట దానిపై దృష్టి కేంద్రీకరిద్దాం. పైగా, జరిమానా కింద మరిన్ని సుంకాలు విధిస్తా మని బిసెంట్ హెచ్చరించారు. సత్యం ఏమంటే, రష్యన్ చమురు కొనేటట్లుగా ఇండియాను బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ‘వాస్తవానికి, ధరపై పరిమితి ఉన్న రేటు వద్ద రష్యన్ చమురు కొనుగోలు చేయాల్సిందిగా మేము (అమెరికా) కోరబట్టే వారు (ఇండియా) కొనుగోలు చేశారు...ఎందుకంటే, చమురు ధరలు పెరగడం మాకిష్టం లేదు. వారు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించారు’ అని ఢిల్లీలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి 2024 మే నెలలో చెప్పారు. ట్రంప్ ఈరోజు, తనకు ముందున్న ప్రభుత్వ విధానాన్ని కావాలని ఉపేక్షిస్తూ, ఇండియాను నిందిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ ఆత్మవంచన తేటతెల్లమవుతోంది. రష్యా నుంచి అమెరికా పాలాడియం, యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే, గడచిన ఆరు నెలల్లో ఈ దిగుమతుల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్తాకథనంలో పేర్కొంది. రష్యా నుంచి అమెరికా స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నప్పుడు లేని అభ్యంతరం, ఇండియా పట్లనే ఎందుకు? ఇక మూడవ అంశం – ట్రంప్ అసలు ఉద్దేశాలను బయట పెడుతోంది. ఆయన ద్వంద్వ ప్రమాణాలకు ఇది మరో నిదర్శనం. రష్యా చమురును పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్న, మూడవ పెద్ద దిగుమతిదారులుగా ఉన్న చైనా, తుర్కియేలను ట్రంప్ హెచ్చరించ లేదు. రష్యన్ చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ, స్లొవేకియా – రెండూ యూరప్ దేశాలు, ‘నాటో’లో సభ్యత్వం ఉన్నవీనూ! కానీ ట్రంప్ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ ఏడాది జూన్ నుంచి జపాన్ కూడా దిగుమతి చేసుకుంటున్న సంగతిని ఆయన సమయానుకూలంగా విస్మరిస్తున్నారు. చైనాపై సుంకాల విధింపులో ఇచ్చిన విరామాన్ని ఆయన ఇటీవల మరో 90 రోజులు పొడిగించారు. ఆయన ఢిల్లీపైన మాత్రమే మూడవ కన్ను తెరిచారని స్పష్టమవుతోంది. ఈ సమస్యకు సంబంధించి మరో పార్శ్వం కూడా అంతే కలవరపరుస్తోంది. ‘క్వాడ్’ (ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమె రికా)లోని మిగిలిన మూడు దేశాలతో తనకు అవసరం తీరిపోయిందని ట్రంప్ భావిస్తున్నారని... ఆయన వైఖరి, నడతను బట్టి అర్థం చేసుకోవచ్చా? అదే నిజమైతే, ఇండో–పసిఫిక్ వ్యూహం విషయంలో అమెరికా వైఖరి ఏమిటి? చైనాతో మనకున్న సమస్యల దృష్ట్యా ‘క్వాడ్’ కూటమి మనకు ఊరటనిచ్చిన మాట నిజం. ‘క్వాడ్’ పట్ల ట్రంప్ నిబద్ధత చూపకపోతే, అది మనకు మరిన్ని చిక్కులు సృష్టించవచ్చు.చైనాతో ట్రంప్ ఆర్థిక ఒప్పందానికి వస్తారా? ఊహించడం కష్టం. కానీ, షీ జిన్ పింగ్తో శిఖరాగ్ర సమావేశమై ఆయన ఇప్పటికే మాట్లాడుతున్నారు కనుక, అటువంటి దానికి అవకాశం ఉందని పిస్తోంది. చైనాను రాజకీయంగా మరింత మెరుగ్గా అవగాహన చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందా అనేది ప్రశ్న. బీజింగ్ ప్రాంతీయ ఆకాంక్షలకు అమెరికా మరింత వెసులుబాటు కల్పిస్తుందా? ఒకవేళ అదే కార్యరూపం ధరిస్తే, చైనాతో సరిహద్దు వివాదంపై అమెరికా మద్దతు మనకు కొనసాగుతుందా? ఈ విషయమై మనం ఎటువంటి వైఖరిని అనుసరించాలన్నది పెద్ద ప్రశ్న? జవాబు కోసం మనం గాభరా పడాల్సిన అవసరం లేదు. మన నుంచి దిగుమతి చేసుకోకపోతే బతకలేమన్నంతగా, అమెరికా మొహం వాచి చూస్తున్నవాటిని మనం ఏమీ అమెరికాకు ఎగుమతి చేయడం లేదు. చైనా వద్ద రేర్ ఎర్త్ ఖనిజాలు, లోహాలు ఉన్నాయి. మనకి లేవు! కనుక, బేరసారాలకి మనకున్న అవకాశం తక్కువ. మనకున్న ఆశ ఒక్కటే! ఉక్రెయిన్పై పుతిన్–ట్రంప్ ఒక ఒప్పందానికి రాగలిగితే, అది మనపై విధించిన సెకండరీ ఆంక్షలను ఎత్తివేయడానికి తోడ్పడవచ్చు. అమెరికా దృష్టిలో భారత్ ఇప్పటికీ ఉందని స్కాట్ బిసెంట్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అనుకున్నట్లు జరగకపోతే ట్రంప్ తీవ్ర ఆగ్రహ జ్వాలలకు మనం గురికావాల్సిందే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
జెలెన్స్కీ, (ఉక్రెయిన్ అధ్యక్షుడు) రాయని డైరీ
శుక్రవారం అలాస్కాలో ట్రంప్, పుతిన్ కలిసినప్పుడు చరిత్రలో నేను చదువుకున్న ‘యాల్టా’ సమావేశమే నాకు గుర్తుకొచ్చింది!నేను పుట్టటానికి 33 ఏళ్ల ముందు జరిగిన సమావేశం అది. అప్పటికి పుతిన్ పుట్టలేదు. ట్రంప్ కూడా పుట్టలేదు. యాల్టా సమావేశం జరిగిన ఏడాదికి ట్రంప్, ఏడేళ్లకు పుతిన్ పుట్టారు.‘యాల్టా’ ఇప్పుడు ఉక్రెయిన్లో ఉంది. అప్పట్లో సోవియెట్ యూనియన్లో ఉంది. యాల్టాకు పోలికగా ఇప్పుడు అలాస్కా నాకు గుర్తుకు రావటానికి తగినన్ని కారణాలే ఉన్నాయి.రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో యాల్టా సమావేశం జరిగింది. ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో అలాస్కా సమావేశం జరిగింది.యాల్టా సమావేశం రూజ్వెల్ట్, స్టాలిన్, చర్చిల్ల మధ్య జరిగింది. అలాస్కా సమావేశం ట్రంప్, పుతిన్ల మధ్య జరిగింది.యాల్టాలో రూజ్వెల్ట్, చర్చిల్ కలిసి స్టాలిన్కు కొన్ని దేశాల భూభాగాలను పంచి పెట్టారు! ఇప్పుడు ట్రంప్ కూడా ఉక్రెయిన్లో కొన్ని ప్రాంతాలను నా చేత ఇప్పించేందుకు ట్రంప్కు మాట ఇచ్చి ఉంటారా?!అలాస్కాకు, యాల్టాకు అన్నిటికన్నా ముఖ్యమైన పోలిక... యాల్టా సమావేశం ఫిబ్రవరిలో జరగటం! ఆ తర్వాత 77 ఏళ్లకు ఉక్రెయిన్ మీదకు రష్యా దురాక్రమణ కూడా ఫిబ్రవరిలోనే ప్రారంభం అవటం!శనివారం ఉదయం ట్రంప్ పర్సనల్ సెక్రెటరీ నటాలీ ఫోన్ చేసి, ‘‘ప్రెసిడెంట్ ట్రంప్ హ్యాపీగా లేరు...’’ అన్నారు!సోమవారం వాషింగ్టన్లో ట్రంప్కూ, నాకూ మధ్య జరగబోయే సమావేశంలో ట్రంప్ తనేమి చెప్పబోతారో, దాన్నే ముందుగా నటాలీ చేత నాకు చెప్పించటానికి ట్రంప్ ఫోన్ చేయించి ఉంటారని నాకు అర్థమైంది. ‘‘ట్రంప్ ఒక్కరేనా, ప్రెసిడెంట్ పుతిన్ కూడా హ్యాపీగా లేరా?’’ అన్నాను.నా వ్యంగ్యాన్ని ఆమె సరిగానే అర్థం చేసుకున్నప్పటికీ, అదేమీ పట్టనట్లు ‘‘మీరూ, పుతిన్ ఓపెన్ డోర్స్ మీటింగ్లో కూర్చుంటే బాగుంటుందని ప్రెసిడెంట్ ట్రంప్ భావిస్తున్నారు...’’ అన్నారు.‘‘ఓపెన్ ఆన్సర్లు లేకుండా, ఓపెన్ డోర్ మీటింగులతో ఏమౌతుంది చెప్పండి మిసెస్ నటాలీ?’’ అన్నాను.నటాలీ కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత, ‘‘మూడో ప్రపంచ యుద్ధం కనుక మొదలైతే ఇక అదే చివరిది అవుతుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు’’ అన్నారు!!మూడో ప్రపంచ యుద్ధం వస్తే అదే ఆఖరి యుద్ధం అవుతుందని జోస్యంలా చెప్పటం కాకుండా, మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఈ భూగోళానికే పెద్ద విపత్తు అని ఒక జాగ్రత్తలా ఎవరూ ఎందుకు మాట్లాడరు!‘‘మిసెస్ నటాలీ! రోజంతా మీరు ప్రెసిడెంట్ పక్కనే ఉంటారని, ఇంటర్నెట్లో ప్రెసిడెంట్ ట్రంప్పై వచ్చే ప్రశంసాపూర్వకమైన కథనాలను ఆయనకు అందిస్తుంటారని విన్నాను. ట్రంప్ కనుక పుతిన్తో, ‘మీరే ముందు యుద్ధం ఆపేయండి’ అని ఒక్క మాట అనగలిగినా మా వైపు నుండి కూడా ఒక ప్రశంసాపూర్వకమైన కథనం మీకు లభ్యమౌతుంది...’’ అన్నాను, నవ్వుతూ.ఆ మాటకు తనూ నవ్వారు. ఇద్దరం ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కెరీర్లో ఉన్నవాళ్లం. ఆ మ్యాజిక్ ఏదో మా మాటల్లో పనిచేసినట్లుంది. ప్రెసిడెంట్కు సెక్రెటరీగా కాకుండా, ఒక కో–ఆర్టిస్ట్గా నాతో సైన్ ఆఫ్ అయ్యారు నటాలీ.అలాస్కా సమావేశం జరిగినప్పటికీ కీవ్ను ఆక్రమించేందుకు రష్యా ఇంకా ఇంకా దగ్గరికి వస్తూనే ఉంది! రేపు ట్రంప్తో నా మీటింగ్ తర్వాత కూడా రష్యాకు నేను ఒకటే చెబుతాను.‘‘మీరు మాపై దాడికి వచ్చినప్పుడు మీరు మా ముఖాలను చూస్తారు. మా వీపులను కాదు, మా ముఖాలను!’’ అని చెప్పిందే చెబుతాను. -
మన ముందున్న 'ఏఐ' బాధ్యత
కశ్మీర్లో మళ్ళీ హింసాయుత సంఘట నలు పెచ్చుమీరడం చూశాక, రణ తంత్రంలో టెక్నాలజీ, ముఖ్యంగా జనరే టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (జెన్ ఏఐ) పాత్ర గురించిన ప్రశ్నలు నా మెదడును తొలవడం ప్రారంభించాయి. మీరు బత కండి, ఇతరులను బతకనివ్వండి అనే తాత్త్వికత భారతదేశానికి పునాది. అంత మాత్రాన దురాక్రమణను చూస్తూ ఊరు కుంటామని కాదు. ఫినాన్షియల్ సర్వీసులు, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు, వస్తూత్పత్తి వంటి కీలకమైన పరిశ్రమల్లో ఏఐని బాధ్యతాయుతంగా వర్తింపజేసే పనిలో ఉన్న వ్యక్తిగా, మేం అభివృద్ధి చేసే సాధనాలకున్న కలవర పరచే ద్వంద్వ వినియోగ సామర్థ్యం గురించి నాకు బాగా తెలుసు. సామర్థ్యానికి, నవీకరణకు చోదక శక్తిగా పనిచేసే అదే టెక్నాలజీ హానికరమైన ఆయుధంగానూ పరిణమించవచ్చు. మనం కీలకమైన ఘట్టంలో ఉన్నాం. జెన్ ఏఐ సాంకేతిక పురోగతిగా చెప్పుకొనే స్థాయి నుంచి చాలా వేగంగా ప్రగాఢమైన భౌగోళిక రాజకీయ సాధనంగా మారుతోంది. ఏ గూటి ఏఐ...అధునాతన జెన్ ఏఐ సామర్థ్యాలను సంతరించుకున్న దేశా లకూ, విదేశాలలో అభివృద్ధి చెందిన సిస్టంలపై ఆధారపడిన దేశా లకూ మధ్యన కొట్టొచ్చినట్లు కనిపించే చీలిక వ్యూహపరంగా తీవ్ర మైన రిస్కులను రేకెత్తిస్తోంది. ఏఐని అభివృద్ధి చేస్తున్న ప్రధాన దేశాలు, ముఖ్యంగా అమెరికా, చైనాల ప్రయోజనాలు, పక్షపాతా లతో రూపుదిద్దుకున్న మోడళ్ళు అనివార్యంగా వాటిని సృష్టించిన వారి కథనాలనే వ్యాప్తి చేస్తాయి. అవి తరచూ ప్రపంచ నిష్పాక్షికతను నీరుగారుస్తాయి. ఓపెన్ ఏఐకి చెందిన జీపీటీ సిరీస్ లేదా చైనాకు చెందిన డీప్ సీక్ వంటి ఏఐ మోడళ్ళలో అంతర్లీనంగా నిక్షిప్తమైన పక్షపాతాలనే పరిశీలించండి. అవి చాలా శక్తిమంతంగా భౌగోళిక రాజకీయ అభి ప్రాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ మోడళ్ళు వాటి మాతృదేశాలపై వచ్చే విమర్శలను తగ్గిస్తాయి. దానితో ఆగక పక్షపాతాల వల్ల అంత ర్జాతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతాయి. ఉదాహరణకు, చైనా ఏఐ దృక్పథం దాని జాతీయ విధాన వైఖరులను బలంగా చాటు తుంది. సరిహద్దు వివాదాలలో చైనా వైపునే న్యాయం ఉన్నట్లు చెప్పే స్తుంది. సార్వభౌమాధికారం ఉన్న సంస్థలను కూడా చట్ట బద్ధమైనవి కావని తోసిపారేస్తుంది. ఫలితంగా, అస్తుబిస్తుగా ఉన్న దౌత్యసంబంధాలు మరింత జటిలంగా మారతాయి. కశ్మీర్ వంటి సున్నిత మైన ప్రాంతాల్లో ఇది ఇంకా ఎక్కువ ప్రస్ఫుటమవుతుంది. సుస్థిరత కోసం డిజిటల్ పోటీగతంలో పరస్పరం విధ్వంసాన్ని చవిచూడటం ఆ యా దేశాల వద్దనున్న అణ్వాయుధాలపై ఆధారపడి ఉండేది. నేటి ఆయుధాల పోటీలో ‘డిజిటల్’ ఆ స్థానాన్ని ఆక్రమించింది. అంతర్జాతీయ సుస్థిర తకు కొత్త రూపునిచ్చే సామర్థ్యంలో ఏఐ అణ్వాయుధాలతో సమా నంగా ప్రాధాన్యం ఉన్నదే. కాలం చెల్లిన ఈ చట్రాన్ని మనం అత్య వసరంగా పునః పరిశీలించవలసి ఉంది. డిజిటైజేషన్ ద్వారా పర స్పరం పురోగతి సాధించే కొత్త విధానానికి మళ్ళాలని నేను చెప్ప దలచుకున్నాను. ఈ నమూనా విధ్వంసకర పోటీ నుంచి నలుగురితో కలసి అభివృద్ధిని, సాంకేతిక స్వావలంబనను సాధించేందుకు ప్రాధాన్యం ఇచ్చేట్లు చేస్తుంది. ఈ కొత్త నమూనాను అనుసరించేందుకు దేశాలు, ముఖ్యంగా టెక్నాలజీపరంగా దుర్బలంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వతంత్రమైనవి, సాంస్కృతిక పరిజ్ఞానం ఉన్నవి అయిన ఏఐదొంతరలను ఏర్పరచుకోవలసి ఉంటుంది. అటువంటి స్వయం ప్రతిపత్తి మాత్రమే స్థానిక చరిత్రలను, సంస్కృతులను, రాజకీయ పరమైన సూక్ష్మ భేదాలను ప్రతిబింబించగలుగుతుంది. అప్పుడే ఈ దేశాలు బాహ్యపరమైన మాయోపాయాలకు లోనుకాకుండా నిల బడగలుగుతాయి. సాంస్కృతిక వివరాలను పుష్కలంగా నిక్షిప్త పరచుకున్న ఏఐ, దుష్ప్రచారం నుంచి తమ దేశాన్ని కాపాడుకోవ డమే కాదు సిసలైన అంతర్జాతీయ చర్చలను పెంపొందించ గలుగు తుంది. సమతూకంతో కూడిన బహుళపక్ష ఏఐ ల్యాండ్స్కేప్ ఏర్ప డేందుకు తోడ్పడగలుగుతుంది. ప్రపంచంలో ప్రాబల్యం వహిస్తున్న ఏఐ మోడళ్ళు ప్రాథమికంగా ఇంగ్లీషు, చైనా భాషల్లో రూపొందినవి. అవి 22 అధికార భాషలు, వందలాది మాండలికాలతో కూడిన, భాషాపరంగా,సాంస్కృతికంగా బహుళత్వంతో నిండిన భారత్ వంటి వైవిధ్యభరి తమైన దేశాలను ప్రమాదకరమైన స్థితిలోకి నెడుతున్నాయి. భాషా పరంగా సూక్ష్మమైన భేదాలను పట్టుకోలేని ఏఐ అవగాహనా లోపా లను సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది. అవి దౌత్యపరంగా తీవ్ర మైన పర్యవసానాలకు దారితీయవచ్చు. దీన్ని నివారించడానికిసాంస్కృతిక చైతన్యం కలిగిన అధునాతన ఏఐ మోడళ్ళను అభివృద్ధి చేయడం ఆవశ్యకం. మరాఠీ–గుజరాతీ లేదా తమిళం–కన్నడంవంటి సంబంధిత భాషలలో ఉన్న సారూప్యాలను బహుభాషా ఏఐ సిస్టంలు వినియోగించుకుని తీరాలి. అప్పుడు ఆ యా భాషల్లోఉండే గాఢతను, సూక్ష్మతరమైన భేదాలను విస్మరించకుండా వేగంగా ఆంతర్యాన్ని అందిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది. నిర్ణయాధికారం మనిషిదే కావాలి!సామాజిక మౌలిక సదుపాయాలలోకి, నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియలలోకి జెన్ ఏఐ మమేకం అయితే అది మానవ పాత్రలకు తప్పకుండా కొత్తరూపునిస్తుంది. సమర్థత విషయంలో ఆటోమేషన్ బ్రహ్మాండమైన ఆశలు రేపుతున్న మాట నిజమేకానీ, యుద్ధ తంత్రం వంటి జీవన్మరణ సందర్భాలలోనూ నిర్ణయం తీసుకునే బాధ్యతను ఏఐ సిస్టంలకు అప్పగించేయడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా నాకు, ప్రచ్ఛన్న యుద్ధ కాలానికి సంబంధించి 1983 నాటి ఉదంతం ఒకటి గుర్తుకువస్తోంది. ఆనాటి సోవియట్ లెఫ్టినెంట్ కల్నల్ స్టానిస్లావ్ పెట్రోవ్ సాంకేతిక తార్కిక ప్రమాద హెచ్చరి కల కన్నా మానవ అంతఃకరణనే ఎక్కువ లెక్కలోకి తీసుకున్నారు. ఫలితంగా, ఒక అణు వినాశనాన్ని నివారించగలిగారు. మనుషులు ఒక నిర్ణయం తీసుకునే లేదా ఆలోచించే పనిని ఇష్ట పూర్వకంగానే బీజగణితాలకు అప్పగించేస్తారేమోనని నన్నొక పెద్ద భయం వెన్నాడుతోంది. ఆ రకమైన భవిష్యత్తును మనం అంగీకరించకూడదు. మానవ విజ్ఞతకు ఏఐ ఉపయోగపడాలే కానీ, విజ్ఞత స్థానాన్ని అది ఆక్రమించకూడదని డిమాండ్ చేసే కర్తవ్యం, అలా జరగకుండా చూసే బాధ్యత నవీకరణవేత్తలుగా, టెక్నాలజిస్టులుగా, ప్రపంచ పౌరులుగా మనందరి మీదా ఉంది. మానవాళి విజ్ఞతను పక్కకు తోసేసే టెక్నాలజీని ఎన్నటికీ అనుమతించేది లేదని ఈ రోజే మనం ప్రతిన బూనుదాం.-వ్యాసకర్త ఏఐ కంపెనీ ‘ఆర్టికల్8’ వ్యవస్థాపక సీఈఓ(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-అరుణ్ సుబ్రమణియన్ -
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందినప్పుడే...
భారతదేశం నేడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు ఎంతవరకు కృషి చేస్తున్నామో మనం ప్రశ్నించుకోవాలి. 2024 ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం, భారతదేశం 127 దేశాలలో 105వ స్థానంలో ఉంది. ‘సర్వైవల్ ఆఫ్ ద రిచెస్ట్: ది ఇండియా స్టోరీ’ అనే శీర్షికతో ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ తాజా నివేదిక భారతదేశంలో గణనీయమైన ఆదాయ అసమానతను పేర్కొంది. అత్యంత ధనవంతులైన 1% మంది ఇప్పుడు దేశ మొత్తం సంపదలో 40% కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. దిగువన ఉన్న 50% మంది కేవలం 3% మాత్రమే సంపద కలిగి ఉన్నారు. వీటితో పాటు 2024లో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ‘కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్’ ప్రకారం భారతదేశం అవినీతి అవగాహన సూచికలో 180 దేశాలలో 96వ స్థానంలో ఉంది.2025 నాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై చేసే మొత్తం వ్యయం జీడీపీలో 4.64%గా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. అయితే ఇది నూతన విద్యా విధానం –2020 నిర్దేశించిన 6% లక్ష్యం కంటే తక్కువగా ఉండటం గమనార్హం. 2025–26 కేంద్ర బడ్జెట్లో, భారతదేశం ఆరోగ్య రంగానికి రూ. 99,859 కోట్లు కేటాయించింది. ఇది గత సంవత్సరం సవరించిన అంచనాలతో పోలిస్తే 11% పెరుగుదలను సూచిస్తుంది. మొత్తం ఆరోగ్య బడ్జెట్లో 96%తో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు ఎక్కువ కేటాయింపులు లభించాయి. అయితే ఇది వార్షిక బడ్జెట్ కేటాయింపులు, విధాన మార్పుల ఆధారంగా మారవచ్చు. ఆర్థిక వ్యవస్థలో రెడ్ టేపిజం ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతోంది. బంధుప్రీతి దాదాపు అన్ని రంగాలలో కనిపిస్తోంది. ఇప్పటికీ మనం వరకట్నం, ఆడ శిశువుల హత్య, లింగ అసమానత, గృహ హింస, అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలతో కునారిల్లడం బాధాకరం.అయితే మన దేశం ఎన్ని ఆటంకాలు ఎదురైనా విభిన్న రంగాలలో చాలా అభివృద్ధిని సాధించింది. మానవ వనరులలో (జనాభా) భారతదేశం మొదటి స్థానంలో ఉంది. భారతదేశం ప్రపంచంలోనే పాలు, పప్పుధాన్యాలు, జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. బియ్యం, గోధుమలు, చెర కు, వేరుసెనగ, కూరగాయలు, పండ్లు, పత్తి ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశంగా ఉంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్యలో అమెరికా, చైనాల తర్వాత మూడవ స్థానంలో ఉంది. ప్రపంచంలో 10వ అతిపెద్ద దిగుమతిదారుగా, 16వ అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచింది. 2024లో, భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్వీకరించడంలో ప్రపంచవ్యాప్తంగా 15వ స్థానంలో నిలిచింది. సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణల నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అనుసరిస్తున్న ట్రంప్ విధానాల నుండి, యుద్ధాల నుండి రక్షించుకోవడం కోసం నిరంతర ఆర్థికాభివృద్ధి, విభిన్న సంక్షేమ కార్యక్రమాలతో స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలపై అవగాహన ఉన్న పౌరుల భాగస్వామ్యంతోనే స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని అందుకుని అభివృద్ధి సాధించగలం.– డా‘‘ పి.ఎస్. చారి, కామర్స్– మేనేజ్మెంట్ స్టడీస్లో ప్రొఫెసర్ -
మానవత్వాన్ని మింగే ప్రపంచ స్వార్థం
‘కళ్ల ముందు హింస జరుగుతుంటే, దానిని చూస్తూ మౌనంగా ఉండటం కూడా హింసలో భాగమే’ అన్నారు మహాత్మా గాంధీ. ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని అందించి ప్రపంచ మానవాళి సుఖసంతోషాలతో ఉండాలంటే అదొక్కటే ఏకైక మార్గమని ఆయన నిరూపించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధోన్మాదానికి రక్తపుటేరులై పారుతున్న ‘గాజా’ను చూస్తూ కూడా ప్రపంచంలోని అత్యధిక బలమైన దేశాలు నోళ్లు కుట్టేసుకున్నట్లు ప్రవర్తించడమే నెతన్యాహు హింస కంటే బీభత్సంగా గోచరిస్తోంది. ‘గాజా’ మొత్తం ఛిద్రం అయింది. 75,000 మంది ఇప్పటివరకు మట్టిలో కలిసిపోయారన్నది అధికారిక లెక్క. అంతకు మించిన సంఖ్యలో అక్కడి ప్రజలు, సైనికులు హతం అయ్యారన్నది అనధికార అంచనా. అంకెలను బట్టి చూస్తే, గతంలో హిట్లర్, ముస్సోలినీ నెలకొల్పిన రికార్డులన్నింటినీ నెతన్యాహు తిరగరాసినట్లే ఉంది.మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోగానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు గానీ బాధితులకు, క్షతగాత్రులకు రెడ్క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థలు అందించిన సాయాన్ని అడ్డుకొన్న దాఖలాలు లేవు. కానీ, నేడు అంతర్జాతీయ సమాజం అందిస్తున్న సాయంపై ఇజ్రాయెల్ సైనికులు ఆంక్షలు పెట్టారు. ఇంతటి అమానవీయం కనివిని ఎరుగం. 22 నెలలు గడిచినా ‘గాజా’లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఏ దేశమూ చొరవ చూపడం లేదు. ఆ ఒక్క యుద్ధం సరిపోదన్నట్లుగా... ఇరాన్లో అణ్వస్త్రాయుధాలు, శుద్ధి చేసిన యురేనియం నిక్షేపాలు ఉన్నాయనే మిషతో ఆ దేశంపై కూడా విరుచుకుపడి పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు సృష్టించి ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేశారు నెతన్యాహు. వియన్నా డిక్లరేషన్ను అనుసరించి యుద్ధంలో పాల్గొనే దేశాలు... సామాన్య పౌరులను చంపకూడదు. జన సామాన్యం, నివాస ప్రాంతాలపై దాడులు చేయరాదు. ఈ నిబంధనను ఇజ్రాయెల్ అటకెక్కించింది. అలాంటి నాయకులేరీ?‘వసుధైక కుటుంబం’ అన్నది భారతదేశం ప్రవచించిన మహత్తరమైన భావన. దానిని భావనగానే ఉంచకుండా ఆచరణలోకి తేవడానికి చిత్తశుద్ధితో కృషి చేసింది కూడా భారతదేశ నాయకత్వమే. గాంధీజీ, నెహ్రూ, అంబేడ్కర్, లోహియా, వినోబాభావే మొదలైన నాయకులతో పాటు, ఆ తర్వాత తరానికి చెందిన ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి, అబ్దుల్ కలాం వంటివారు ప్రపంచ శాంతికి, ప్రపంచ దేశాల ఆర్థిక సామాజిక పురోగతికి కృషి చేశారు. కెన్నెడీ, చౌ ఎన్ లై, మార్షల్ టిటో, నాజర్ మొదలైన వివిధ దేశాల నాయకులు సైతం ప్రపంచశాంతికి కృషి చేశారు. మానవజాతి వినాశనానికి దారితీసే యుద్ధాల నివారణకు ఎందరో నేతలు గతంలో తాపత్రయ పడ్డారు. వివిధ దేశాల నడుమ ఘర్షణలు చెలరేగినప్పుడు ఆ ఉద్రిక్తతలను తగ్గించడంలో, సంప్రదింపుల ద్వారా, ఒడంబడికల ద్వారా యుద్ధాలను నివారించడాన్ని అనుభవంలో చూశాం. కానీ ఇప్పుడా చొరవ ఒక్క నాయకుడూ చేయడం లేదు. ‘నేను– నా పొట్ట’ అనే రీతిలో, ‘నేను– నా దేశం’ అనే విధంగా మాట్లాడటం తమ దేశీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడం గానూ, తమ దేశాభి వృద్ధిని కాంక్షించే జాతీయ విధానంగానూ భావిస్తున్నారు తప్ప... అటువంటి విధానం వల్ల దేశాల మధ్య పరస్పర సహకారం, సహజీవనం, శాంతి సౌభాగ్యాలకు విఘాతం కలుగుతుందని ఆలోచించడం లేదు.అప్పుల కోసం, ఆయుధాల కోసం నేడు అనేక దేశాలు... ఆగ్రదేశాల ముందు సాగిలపడుతున్నాయి. బదులుగా అగ్రదేశాలు ఏం చేసినా... ‘తానా అంటే తందాన’ అంటున్నాయి. ఈ ధోరణి ఇప్పటికిప్పుడు అలవాటు చేసుకొన్నది కాదు. దాదాపు 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. ఇప్పుడది పరాకాష్ఠకు చేరింది. ఐక్యరాజ్యసమితి కోరల్ని ఎప్పుడో పీకేయడంతో ఆ సంస్థ అస్తిత్వం నామమాత్రంగా మారి యుద్ధాలను నివారించడంలో ఎటువంటి పాత్రనూ పోషించలేకపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపగల చొరవ ఎవరు తీసుకొంటారు? ఆ శక్తి ఎవరికి లేకపోవడం అటుంచి... అలాంటి ప్రయత్నం చేయాలన్న తపన కొరవడటమే అత్యంత బాధాకరం.ద్వంద్వ ప్రమాణాలుయుద్ధోన్మాదులు దేశాధినేతలైతే, ఆ దేశ ప్రజల భవిష్యత్తే కాదు... యావత్ ప్రపంచ భవిష్యత్ తారుమారవుతుందని గత అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసిన కొన్ని గంటల్లోనే అంతర్జాతీయ చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ యుద్ధం కారణంగా వాతావరణంలోకి ప్రవేశించిన ప్రమాదకర ‘ధూళి’ యూరప్తో సహా పొరుగునున్న పలు దేశాలలో ప్రతికూల ఫలితాలు చూపిస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి. దేశాల మధ్య ఏర్పడుతున్న ఉద్రిక్తతల కారణంగా తమ తమ గగనతలాలను మూసివేయడం, నౌకాయాన మార్గాలను దిగ్బంధనం చేయడం వంటి దుందుడుకు చర్యల ఫలితంగా మానవాళికి జరుగుతున్న నష్టం, కాలహరణం ఊహాతీతమైనది.ప్రపంచంలో మూడు బలమైన దేశాలు అమెరికా, రష్యా, చైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా యుద్ధాల్లో పాల్గొనడం లేదా మిత్రదేశాలకు యుద్ధాల్లో సాయపడటం విరమించుకోనంత వరకు ప్రపంచంలో శాంతి స్థాపన జరగడం కష్టం. నిజానికి ఈ దేశాల ప్రజలకూ, ఆ మాటకొస్తే ఉత్తరకొరియా ప్రజలకు సైతం యుద్ధం అభిలషణీయం కాదు. ప్రజలెప్పుడూ అభివృద్ధిని ఆశిస్తారు. సుఖశాంతులను కోరుకుంటారు. కయ్యానికి కాలు దువ్వే మనస్తత్వం మెజారిటీ ప్రజలకు ఉండదు.ప్రజల ఆశలు, ఆకాంక్షలకు భిన్నంగా, తమ ప్రతిష్ఠను పెంచుకోవడానికీ, తమ దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చాటుకొని అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికీ కొందరు ప్రపంచ నేతలు హ్రస్వదృష్టితో అనుసరిస్తున్న విధానాల వల్లనే... యుద్ధాలు ముగింపు లేకుండా కొనసాగుతున్నాయి. యుద్ధం పేరుతో బలహీనులపై అన్ని రకాల దారుణాలూ జరుగుతున్నాయి.స్వార్థమే యుద్ధకారణంకళింగ యుద్ధంలో గెలిచిన తర్వాత అశోక చక్రవర్తిలో పశ్చాత్తాపం కలుగుతుంది. ప్రత్యర్థులకు కలిగిన నష్టం కంటే మన నష్టం కొంచెం తక్కువ... అంతే... ఇది విజయం కాదు... పరాజయం... మానవత్వానికి తీరని మచ్చ అని మథన పడతాడు. యుద్ధాలకు స్వస్తి పలికి శాంతి కాముకుడిగా మారి శాంతిని విశ్వజనీనం చేయడానికి తన జీవితాన్ని ధారపోస్తాడు. ప్రపంచాన్ని జయించాలనుకున్న అలెగ్జాండర్ కథ కూడా చివర్లో విషాదంగానే ముగిసింది. ఈ ఉదంతాల నుంచి గుణపాఠాలు నేర్చుకొనే విశాల దృక్పథం నేడు నాయకుల్లో కరువైంది. వారి స్వార్థం నుంచే యుద్ధాలు మొదలవుతున్నాయి. అవి అంతిమంగా మానవత్వాన్ని మింగేస్తున్నాయి. ఉక్రెయిన్లో కావొచ్చు, గాజాలో కావొచ్చు... జరుగుతున్న పరిణామాల పట్ల ప్రపంచ దేశాలు నిర్లిప్తంగా, ఉదాసీనంగా, శిలాసదృశంగా మారిపోయాయి. వీటి ప్రతికూల పరిణామాలు ఊహిస్తేనే భయంగా ఉంటుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు -
'దేశ'మంత మందికి ఓటుండదా?
బిహార్ ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్–సర్)లో భాగంగా ఎంత మంది పేర్లు గల్లంతయ్యాయి? దానికంటే ముఖ్యంగా, ఎంతమంది పేర్లు ఈ తాజా జాబితాల్లో నమోదు కాలేదు? ఈ సంఖ్యలు చాలా ముఖ్యం. వీటిని బట్టే ‘సర్’ పట్ల నా అభిప్రాయం ఉంటుంది. నేననుకోవడం, మనకు చెప్పిన దానికంటే వాస్తవ సంఖ్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. వివరాల్లోకి వెళ్దాం.ఎన్నికల కమిషన్ ఒకటో తేదీన ముసాయిదా జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం, 65.6 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారు. సవరణ ప్రక్రియ ప్రారంభించడానికి ముందున్న మొత్తం ఓటర్లలో వీరు దాదాపు 9 శాతం ఉంటారు. ఈ తాత్కాలిక సంఖ్య చిన్నదేం కాదు. ఇప్పటికే ఇది ఆందోళన కలిగిస్తోంది.పెరగాల్సింది పోయి...మరొక విషయం ఏమిటంటే – 2024 సాధారణ ఎన్నికలతో, 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినట్లయితే ఈ దఫా నమోదైన ఓటర్లు తక్కువగా ఉన్నారు. 2005లో రెండు సార్లు వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు మినహా, 1977 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికలకూ మొత్తం ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది.బిహార్ రాష్ట్ర అధిక సంతానోత్పత్తి రేటు (ఫెర్టిలిటీ రేట్)ను దృష్టిలో పెట్టుకుంటే, ఇది మరింత కలవరపెడుతోంది. 2001, 2011 మధ్య కాలంలో వయోజనులు 28.5 శాతం పెరిగారు. అయినా 2025లో మొత్తం రిజిస్ట్టర్డ్ ఓటర్ల సంఖ్య పెరగటానికి బదులు తగ్గటం వింతే!కొద్ది రోజుల క్రితం ప్రకటించిన దానికంటే అంతిమంగా ప్రకటించే వాస్తవ తొలగింపులు పెరిగే అవకాశం ఉంది. ‘భారత్ జోడో అభియాన్’ నేషనల్ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 65.6 లక్షలు అనే సంఖ్య ఇంకా పెరుగుతుందన డానికి ఆయన మూడు కారణాలు చెబుతున్నారు. ఒకటి – బూత్ లెవెల్ ఆఫీసర్స్ ముసాయిదాలోని పలు పేర్లను తిరస్కరించే అవ కాశం ఉంది. వారికా అధికారం ఉంది. రెండు – తమ దరఖాస్తు ఫారాలను అప్లోడ్ చేసిన అనేక మంది వాటిలో పొందుపరచిన వివరాలకు సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి ఉండరు. అలాంటి వారి పేర్లను మలి విడతలో తొలగిస్తారు. మూడు – ఎల క్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు స్థానికంగా విచారణ చేసి మరికొన్ని పేర్లను కొట్టేసే వీలుంది. ఈ మూడు కారణాల ప్రకారం, 65.6 లక్షలు అనేది ఆరంభ సంఖ్య మాత్రమే. చివరి లెక్కల్లో ఇది తప్పనిసరిగా చాలా ఎక్కువ ఉంటుంది.నమోదు కానివారి మాటో?ఓటర్ల జాబితాలపై, అంతిమంగా బిహార్ ఎన్నికలపై ఈ పేర్ల తొలగింపు ప్రభావం గురించి మాత్రమే విశ్లేషణ జరిగింది. మరి, జాబితాల్లో కొత్త ఓటర్ల నమోదు మాటేమిటి? ఈ అంశానికి దక్కా ల్సినంత ప్రాధాన్యం దక్కలేదు.యోగేంద్ర యాదవ్ దీనిపై అధ్యయనం చేశారు. ప్రభుత్వ అధికారిక జనాభా అంచనాలనే ఆయన తన అధ్యయనానికి ఆధా రంగా తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ సైతం ఓటరు జాబితాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడానికి, ధ్రువీకరించుకోవడానికి వీటినే ప్రాతిపదికగా తీసుకుంటోంది.బిహార్ ఓటర్ల జాబితాల్లో నమోదైన వయోజన జనాభా (18 ఏళ్ల లేదా అంతకు మించిన వయసు ఉన్నవారు) శాతం వారి వాస్తవ జనాభాలో ఎంత ఉందో యోగేంద్ర యాదవ్ లెక్కగట్టారు. ‘సర్’కు ముందు, జూన్ 24న ఇది 97 శాతం. ‘సర్’ తర్వాత, ఇప్పుడు 88 శాతం! అంటే, 9 శాతం తగ్గింది. ఇది 94 లక్షలకు సమానం. జాబితాల నుంచి తొలగించిన 65.6 లక్షల పేర్ల కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. మరో విధంగా చెప్పాలంటే, 30 లక్షల మంది వయోజనులు అర్హత ఉండీ ఓటర్లుగా నమోదు కాలేదు.యోగేంద్ర యాదవ్ తన అధ్యయన ఫలితాలు ప్రచురించి పది రోజులు దాటింది. ఎన్నికల కమిషన్ వీటిని ఖండించలేదు, ప్రశ్నించలేదు. ఈ నిశ్శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?దేశమే అదృశ్యం?యోగేంద్ర యాదవ్ తన అధ్యయనంలో రెండు నిర్ధారణలకు వచ్చారు. బిహార్ ఓటర్ల జాబితాల్లో పేర్లు అదృశ్యమైన వారూ, పేర్లు నమోదు కాని వారూ కలిసి 1.5 కోట్ల మంది ఉంటారని ఆయన అంచనా. ఇది నిజం కాకపోతే బాగుండని అనుకోవడం తప్ప మనం చేయగలిగింది లేదు. ఇక రెండో నిర్ధారణ మనందరికీ ఆందో ళన కలిగించక మానదు. అధికారిక ప్రకటన ప్రకారం, 9 శాతం పేర్ల తొలగింపునే పరిగణనలోకి తీసుకున్నా సరే, ఇప్పటికిప్పుడు దేశ వ్యాప్తంగా ‘సర్’ నిర్వహిస్తే ఈ లెక్కన 9 కోట్ల మంది పేర్లు అదృశ్యమవుతాయి. వీరి సంఖ్య బ్రిటన్ లేదా ఫ్రాన్స్ జనాభాకు ఒకటి న్నర రెట్లు! బిహార్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ గురించి ఒక అభిప్రాయానికి వచ్చేందుకు ప్రధానంగా ఈ వివరాలు సరిపోతాయని అనుకుంటున్నాను. మీరేమంటారు?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
భారత్ వైపు ప్రపంచం చూపు!
ఇప్పుడు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదనటంలో అతిశయోక్తి లేదు. ఈ పరిణామం ఈ నెల 6వ తేదీన చోటుచేసుకుంది. ఆ రోజున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై సుంకాలను మరొక 25 శాతం పెంచి, మొత్తం 50 శాతానికి చేర్చారు. దానితో మోదీ ప్రభుత్వం ఒత్తిడికి గురై రష్యన్ చమురు కొనుగోళ్ళను ఆపటంతో పాటు, వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలో తమ ప్రతిపాదనలకు అంగీకరించగలదన్నది ట్రంప్ ఎత్తుగడ. అనూహ్యమైన రీతిలో ప్రధాని మోదీ అదేరోజు రాత్రి ఎదురుదాడి ప్రారంభించారు.ప్రపంచం కోసం నిలబడగలమా?ట్రంప్ చర్యలను చైనా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్, దక్షిణాఫ్రికా, రష్యా వంటివి మొదటి నుంచి పూర్తిగానో, పాక్షికంగానో వ్యతిరేకిస్తుండటంలో విశేషం లేదు. వీటన్నింటికి భిన్నంగా పెద్ద దేశాలలో ఇండియా ఒక్కటే మొదటి నుంచి అమెరికాతో మెత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఒక పెద్ద వర్ధమాన దేశం అయి ఉండి, ‘బ్రిక్స్’లో ప్రధాన పాత్ర వహిస్తూ, ట్రంప్ చర్యల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తున్నా, ప్రతిఘటించకపోవటంపై అంతటా విమర్శలు వినిపించాయి. అటువంటి స్థితిలో మోదీ చేసిన ప్రసంగం, అందులోని భాష, తనలో కనిపించిన దృఢమైన వైఖరి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడిక ఆయన భారతదేశం కోసమే గాక, తక్కిన ప్రపంచంతో కూడా కలిసి నిలబడవచ్చుననే ఆశాభావాలు వినవస్తున్నాయి.అదే సమయంలో, ఇల్లలకగానే పండుగ కాదనే పెద్దల హెచ్చరికను గుర్తుంచుకోవలసి ఉంటుంది. వీటికి స్వల్పకాలిక, మధ్యకాలిక ప్రభావాలు అనేకం ఉంటాయి. అవి వాస్తవంగా భూకంపానికి దారితీయగలవు. స్లో మోషన్లో ఆర్థిక ప్రపంచ యుద్ధాన్ని సృష్టించగలవు. మన ప్రపంచం నిజమైన అర్థంలో రాజకీయంగా, ఆర్థికంగా, ప్రజాస్వామికంగా మారాలంటే, చిరకాలపు అధిపత్య శక్తుల భూమి కింద అటువంటి భూకంపం రావటం అవసరం.కొండ చరియలలో కింది వైపున కేవలం ఒక రాయి కదలికలో మొత్తం చరియలే కూలినట్లు, చరిత్రలో ఒకోసారి చిన్న ఘటనలు పెనుమార్పులకు దారి తీస్తుంటాయి. క్రమంగా బలహీనపడుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను, భౌగోళిక ఆధిపత్యాన్ని తిరిగి శక్తిమంతం చేయదలచిన ట్రంప్, అమెరికన్ కొండచరియలో ఒకొక్క రాయినే తనకు తెలియకుండానే తోసివేస్తున్నారు. ఇప్పుడు ఇండియా రూపంలో ఒక ముఖ్యమైన రాయి తొలగిపోతున్నదనుకోవాలా?ఇండియా దృఢ వైఖరినిజంగానా, లేక ఇది తొందరపాటు మాటా అన్నది ప్రశ్న. ఒకవైపు అమెరికా నాయకత్వాన ఒక శక్తిమంతమైన కూటమి ఉంది. అది బలహీన పడుతున్న మాట నిజమేగాని అవసాన దశకేమీ చేరలేదు. మరొకవైపు భారత్తో కూడిన ‘బ్రిక్స్’ దేశాలు నానాటికీ బలపడుతున్నాయి. ఇది తమ ఆధిపత్యానికి ఎంత ప్రమాదకరం కాగలదో అర్థమైనందువల్లనే ట్రంప్ ‘బ్రిక్స్’పై కత్తిగట్టారు. ఆయన వేర్వేరు దేశాలపై వేర్వేరుగా ప్రకటిస్తున్న ట్యారిఫ్లను, వేర్వేరు పద్ధతులలో సాగిస్తున్న చర్చలను గమనిస్తే, ‘బ్రిక్స్’ దేశాల పట్ల ‘విభజించి పాలించే’ వ్యూహాన్ని అనుసరిస్తున్నటు స్పష్టమవుతుంది.చర్చలోకి వెళితే, మోదీ నాయకత్వాన భారతదేశానికి అమెరికాతో అవసరాలున్నాయి, పేచీలు కూడా ఉన్నాయి. గతకాలపు చిన్నచిన్న పేచీలను అటుంచి ఇప్పుడు ట్యారిఫ్లతో, వాణిజ్య ఒప్పందంలోని ప్రతిపాదనలతో పెద్ద పేచీ తలెత్తింది. ఒకవైపు భారతదేశం స్వతంత్ర శక్తిగా గతం కన్నా బలపడుతూ తన భవిష్యత్తు పట్ల దృష్టి మారుతుండటం, మరొకవైపు అమెరికా క్రమంగా బలహీనపడుతూ ఏకధ్రువ ప్రపంచ స్థితి మారుతుండటం గమనించవలసిన కొత్త పరిణామాలు.ఇటువంటిది ఏర్పడినపుడు, వ్యూహాత్మకంగా అగ్రరాజ్యం ఎంతో వివేకంగా, చతురతతో వ్యవహరించాలి. ట్రంప్ నాయకత్వాన అమెరికా అవివేకపు వ్యూహాన్ని అనుసరిస్తున్నందున, ఇండియా వంటి మిత్రదేశంతోనూ సంబంధాలు చెదిరిపోతున్నాయి. అట్లా జరగకుండా ఉండేందుకు మోదీ మొదట గట్టి ప్రయత్నమే చేశారు. కానీ, ఏమి చేసైనా సరే తన ‘మాగా’ లక్ష్యాలను సాధించాలనే ఒత్తిడుల మధ్య అమెరికా అధ్యక్షుడు– యూరప్, కెనడా, జపాన్, మెక్సికో వంటి ఇతర మిత్ర దేశాలకు వలెనే ఇండియాను కూడా దారికి తెచ్చుకోగలనని నమ్మారు. వాటికీ,భారత్కూ మధ్యగల వ్యత్యాసాలను గ్రహించలేకపోయారు. దానితో, ఇంధనం అయితేనేమి, వ్యవసాయ రంగం అయితేనేమి... దేశ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం నిలబడక తప్పలేదు. వాస్తవానికి వ్యవసాయ రంగం విషయమై, గాట్ – డబ్ల్యూటీవో చర్చల దశలో ఇండియా ఇతర వర్ధమాన దేశాలతో కలిసి గట్టిగానే నిలబడింది. అదే ఇపుడు కూడా జరుగుతున్నది. పాఠాలు నేర్చుకోనిది అమెరికా కూటమే!ఆర్థిక భూకంపం రానుందా?ఇంతవరకు బాగున్నది. రాగల కాలపు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. ట్రంప్ తన ధోరణిని మార్చుకుని అంతా సుఖాంతం కావచ్చునా? భారతదేశంతో తగినంత రాజీ పడవచ్చునా? ట్రంప్ స్వభావమేమిటో ఈ సరికి బోధపడింది గనుక ఆయనను నమ్మలేమని ప్రధాని మోదీ తన స్వతంత్ర వైఖరిని కొనసాగించగలరా? మొన్నటి 6వ తేదీ తర్వాత వడివడిగా రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో సంప్రతింపులు జరిపి, పుతిన్ను ఆహ్వానించి, చైనాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశాలకు వెళ్ళనున్నట్లు ప్రకటించి, అక్కడ జిన్పింగ్తో సమావేశం జరగవచ్చుననే సంకేతాలు పంపినందున, ఇవన్నీ మునుముందు బ్రిక్స్ వేదికగా కొత్త మార్గాన్ని మరింత దృఢంగా అనుసరించగలమనే సూచనలు కావచ్చునా? అటువంటిది గనుక అయితే, ఆగస్టు 6 నాటి భూ ప్రకంపనలు రాగల కాలపు భూకంపానికి నాంది అవుతాయి. అట్లా జరగాలన్నదే వర్ధమాన ప్రపంచపు కోరిక కావచ్చు కూడా! కానీ అది తేలిక కాదు. ట్రంప్ ప్రతీకారాన్ని తట్టుకునేందుకు సైతం సిద్ధపడవలసి ఉంటుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వాళ్ళు అడిగేది ‘జీతాలు’ పెంచమని! ‘లాభాలు’ పంచమని కాదు!
ఒక వారం రోజులుగా, తెలుగు సినిమారంగంలో పనిచేస్తున్న కార్మికులు ‘మా జీతాలు 30 శాతం పెంచాలి’! అనే డిమాండుతో సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె చేస్తున్న వేలాదిమంది కార్మికులలో, వేరు వేరు శాఖల్లో, రకరకాల శ్రమలు చేసే వాళ్ళున్నారు. మేధా శ్రమలు చేసేవారూ, శారీరక శ్రమలు చేసేవారూ, వాళ్ళల్లోనే నైపుణ్యంగల శ్రమలు చేసేవారూ, నైపుణ్యం లేని శ్రమలు చేసేవారూ, వాళ్ళల్లోనే మురికిని శుభ్రం చేసే శ్రమలు చేసే వారూ... ఇలా! రకరకాల శ్రమలు చేసే వారిని ఏ పేర్లతో పిలుస్తారో, వాళ్ళకి జీతాలు ఎంత తేడాగా ఉంటాయో– అటువంటి వివరాలన్నీ ఇక్కడ అనవసరం. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవలసింది, సమ్మె చేస్తున్న కార్మికులు అడుగుతున్న ‘జీతాల పెంపు’ గురించి! జీతాలు పెంచాలి– అనేవాళ్ళ డిమాండ్ న్యాయమా, కాదా అన్నది తేలాలంటే, ‘జీతం’అంటే ఏమిటో తెలుసుకోవాలి.అసలు ‘జీతం’అనేది ఒక మాయ తెర! దాని వెనక ఒక రహస్యం వుంది. ఈ సంగతి సమ్మె చేస్తున్న కార్మికులకూ తెలియదు, వాళ్ళకి జీతాలు ఇచ్చే యజమానులకూ తెలియదు. ‘జీతం’ అనేది, కార్మికులు చేసే ‘శ్రమ మొత్తానికి’ కాక, వాళ్ళు కేవలం శ్రమ చేసేవారిగా జీవించడానికి సరిపడేది మాత్రమే– అనేదే ఆ రహస్యం! అసలు విషయం, ‘జీతంగా వచ్చేది ఏమిటీ’ అన్నది తెలియాలి! విషయాలు తేలిగ్గా అర్థం కావడానికి ఒక్క కార్మికుణ్ణే తీసుకుందాం.మన ఉదాహరణలో, ‘కాల్షీట్’ అనే పేరుతో నడిచే ‘పనిదినం’ లో, కార్మికుడు 12 గంటలు పని చేసినందుకు, నిర్మాత 1,200 జీతం ఇస్తాడనుకుందాం. కానీ, కార్మికుడు చేసే శ్రమ, యజమానికి ఎంత విలువని ఇస్తుందంటే, ఉదాహరణ తేలిగ్గా వుండడం కోసం 2,400 విలువని ఇస్తుంది. అంటే, కార్మికుడు ఏ రోజు పనిచేసినా ఆ రోజున, యజమానికి 1,200 విలువ గల శ్రమని ‘ఉచితంగా’ ఇస్తున్నాడన్నమాట! జీతాన్ని 30 శాతంగా పెంచినా, అది మొత్తం శ్రమ విలువ అవదు! అదీ తక్కువే! అప్పుడు కూడా, తీసుకునే జీతం కన్నా అదనంగా ఇచ్చే శ్రమ విలువే ‘అదనపు విలువ’. ఇది ‘శ్రమ దోపిడీ’! కానీ, ఈ విషయం, ఇటు కార్మికులకూ తెలియదు; అటు యజమానులకూ తెలియదు! ఇప్పుడు వచ్చిన సమస్య కార్మికుడు యజమానితో అనేది: ‘ఒక రోజుకి నువ్విచ్చే 1,200, మా కుటుంబ పోషణకి చాలడం లేదు. ఇంకో 30 శాతం పెంచు! ఇక నించీ 1,200 కాకుండా, 1,360 ఇవ్వు!’ అని కార్మికుడు అనడం. ‘అలా వీల్లేదు. నాకు అసలే ఖర్చులు బాగా పెరిగిపోయాయి. (హీరో గారికి కోట్లలో ఇవ్వాలి మరి!)’ అంటాడు నిర్మాత! నిజం చెప్పాలంటే, నిర్మాత కార్మికుడికి జీతం 30 శాతం పెంచి, 1,360 ఇచ్చినా, ఆ కార్మికుడి నించీ 70 శాతం విలువ గల శ్రమని ‘ఉచితంగానే’ లాగుతాడు! ఉచితంగా లాగే ఈ అదనపు విలువను, పెట్టుబడిదారీ యజమానులూ, వారి ఆర్థిక శాస్త్రవేత్తలూ ‘లాభం’ అని ముద్దుగా పిల్చుకుంటారు. కార్మికులు ఇచ్చే అదనపు విలువ నించే, సినిమా తీయడానికి ఖర్చు పెట్టిన డబ్బుకి వడ్డీ, షూటింగు చేసే స్టూడియోకి అద్దే, సినిమాని ప్రదర్శించే సినిమా హాళ్ళకి అద్దే, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులూ, చివరికి తనకి మిగిలే ‘లాభమూ’– అన్నీ... కార్మికుల అదనపు విలువనించీ వచ్చేవే!ఈ సమ్మె సందర్భంగా కొందరు మధ్యవర్తులు, ‘నిర్మాత కూడా బాగుండాలి గదా? అతన్ని ఇబ్బంది పెడితే ఎలా? నిర్మాతలుంటేనే గదా, కార్మికులకి పనులు దొరికేది?’ అంటూ, కార్మికులకు సర్ది చెపుతూ, జీతం మరీ అంతగా పెంచమని ఒత్తిడి చెయ్యవద్దని హితవు పలుకుతున్నారు. మన అమాయక సమ్మెకారులు కూడా, ‘అవును! నిర్మాతలు బాగుంటేనే కదా, మాకు పనులు దొరికేది. కాకపోతే, మా బాగు కూడా కొంచెం ఆలోచించమంటున్నాం’ అని అంటారు. అసలు ఆలోచించవలసింది – నిర్మాతలకి పెట్టుబడికి, ఆ మొదటి డబ్బు ఎక్కడిది?– అని! వాళ్ళ తండ్రులదీ, తాతలదీ అంటారా? ఆ తాతలకి అంత డబ్బు కూడటానికి కారణం – ఈనాటి కార్మికుల తాతల్నించీ ఆనాడు లాగిన అదనపు విలువే! (‘‘అదనపు విలువలో ఒక భాగాన్ని ఆదాయంగా పెట్టుబడిదారుడే తన కుటుంబ పోషణకు ఉపయోగించుకుంటాడు. ఇంకో భాగాన్ని కొత్త పెట్టుబడిగా ఉపయోగించుకుంటాడు’’ అనే విషయాన్ని, మార్క్స్ తన ‘పెట్టుబడి’ అనే పరిశోధనా గ్రంథంలో – రుజువు చేశాడు.) ఇంతకీ, సమ్మె చేస్తున్న, సినిమా రంగంలోని, మన పిచ్చి కార్మికులు ఏ మడుగుతున్నారు? వాళ్ళు అడిగేది జీతాలు పెంచమని! లాభాలు పంచమని కాదు! ఎంత అల్ప సంతోషులు మన కార్మిక జనాలు!వ్యాసకర్త: ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ -
ఈ దానం మానవతకే శిఖర ప్రాయం
ఆరోగ్య రక్షణ రంగంలో గడచిన దశాబ్దంలో భారతదేశం మెచ్చుకోదగిన విధంగా ముందంజ వేసింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను పటిష్ఠపరచింది. మాతా, శిశు మరణాల రేటును తగ్గించింది. ప్రమాణాలతో కూడిన ఆరోగ్య రక్షణను అందరికీ అందుబాటులోకి తేవడంలో పురోగతి సాధించింది. అయినా, అవయవాల మార్పిడికి వచ్చేసరికి, దురదృష్టవశాత్తు, ఒక మౌన సంక్షోభం వేలాది మంది జీవితాలను బలి తీసుకుంటూనే ఉంది. విస్తృత స్థాయిలో అవయవ దానం అవసరం గురించి చాటి చెప్పేందుకు ‘ప్రపంచ అవయవదాన దినోత్సవం’ మనకొక అవకాశం కల్పిస్తోంది. అవయవ మార్పిడికి అవకాశం లేక ఒక వ్యక్తి ప్రాణాలను కోల్పోవడం కన్నా పెను విషాదం మరొకటి ఉండదు. ప్రాణాలను కాపాడగల అవయవం కోసం ఎదురు చూస్తూ ఏటా దాదాపు ఐదు లక్షల మంది భారతీయులు కన్ను మూస్తున్నారు. మార్పిడికి అవయవం కొరవడటం వల్ల ఒక తోటి భారతీయుడిని లేదా భారతీయురాలిని కోల్పోవడం ఎంతమాత్రం అంగీకరించదగిన విషయం కాదు. ఎందుకంటే, మనం ఆ మరణాలను నివారించగలిగిన స్థితిలో ఉన్నాం. మనకు వైద్యపర మైన నైపుణ్యం ఉంది. కావాల్సిందల్లా అవయవాల సరఫరాకు, డిమాండ్కు మధ్యనున్న వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు జాతీయ స్థాయి సమష్టి సంకల్పమే! అత్యవసరం – చేదు వాస్తవం మూత్రపిండాల వ్యాధి చివరి దశలో ఉన్న రోగులు దాదాపు 2,00,000 మంది ఉన్నారు. తీవ్ర కాలేయ వైఫల్యంతో బాధపడు తున్నవారు 50,000 మంది ఉన్నారు. తీవ్ర గుండె జబ్బుతో బాధ పడుతున్నవారు మరో 50,000 మంది ఉంటారు. వారి ప్రాణాలు కాపాడేందుకు అవయవ మార్పిడి అవసరం. దీనికి భిన్నంగా, ప్రతి ఏటా దేశంలో సుమారు 1,600 మూత్రపిండాలు, 700 కాలేయాలు, 300 గుండెల మార్పిడి చికిత్సలు మాత్రమే చోటుచేసుకుంటున్నాయి. అవసరమైన అవయవం దొరక్క వేచి చూస్తూనే ప్రతి రోజూ కనీసం 15 మంది చనిపోతున్నారు. అవయవ మార్పిడి కోసం ఎదురు చూసేవారి జాబితాలో, ప్రతి 10 నిమిషాలకు, ఒక కొత్త పేరు వచ్చి చేరుతోంది. వారందరి జీవితాలు కొనప్రాణాలతో ఉన్నట్లే లెక్క. చివరి దశ కిడ్నీ సమస్యతో ఉన్నవారిలో 5 శాతం కన్నా తక్కువ మందికే ప్రాణాలు కాపాడగల కిడ్నీ మార్పిడి జరుగుతోంది. గుండె, ఊపిరితిత్తుల పేషెంట్ల పరిస్థితి మరింత హృదయ విదారకం.ప్రపంచ స్థాయి ట్రాన్స్ప్లాంట్ సర్జన్లు మనకి అందుబాటులో ఉన్నా, భారతదేశంలో అవయవ దానం రేటు ప్రపంచంలోనే అతి తక్కువగా (ప్రతి పది లక్షల మంది జనాభాకు కేవలం 0.65 దాతల చొప్పున) ఉంది. దీనికి భిన్నంగా, స్పెయిన్, క్రొయేషియా వంటి చిన్న దేశాల్లో కూడా ప్రతి పది లక్షల మందికి 30కి పైగా దాతలు అందుబాటులో ఉంటున్నారు. ఈ వ్యత్యాసం... భారతదేశంలో అవయ వాల కొరత వైద్యానికి పరిమితమైన అంశం కాదనీ, సామా జిక, విధానపరమైన సవాల్గా పరిణమించిందనీ వెల్లడిస్తోంది.ఒక దాత–ఎనిమిది జీవితాలు!అవయవ దానం కేవలం ఒక క్లినికల్ ప్రొసీజర్ కాదు. అంతకన్నా మానవతకు అంతిమ ప్రతిచిహ్నం మరొకటి ఉండదు. ఒక దాత దేహం నుంచి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, ప్యాంక్రియాస్, కణజాలం వంటివి తీసుకుంటే ఎనమండుగురి ప్రాణాలను కాపాడవచ్చు. ఒక వ్యక్తి అవయవాలను దానం చేస్తే, ఒకరికి మించిన వ్యక్తులకు ప్రాణం పోసినవాళ్ళం అవుతాం. ఇంత కన్నా గొప్ప వారసత్వాన్ని మించి ఎవరైనా ఏమి విడిచి వెళ్ళగలరు? మనం ఎంత చేయడానికి వీలుందో తెలుసుకునేందుకు సంజయ్ కందసామి కథనమే నిదర్శనం. అతను 1998లో, 20 నెలల శిశువుగా ఉన్నప్పుడు కాలేయ వైఫల్యం చివరి దశతో బాధపడుతూ, ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్లో కాలేయ మార్పిడి చేయించుకున్నాడు. కందసామి తండ్రే తన కాలేయంలో చిన్న ముక్కను దానం చేశాడు. ఈరోజు సంజయ్ డాక్టరుగా ప్రాక్టీసు చేస్తూ అనేక మంది ప్రాణాలను నిలుపుతున్నాడు. ఇది సైన్స్ గురించిన కథ కాదు. ప్రాణం దక్కించుకునేందుకు ఉన్న రెండవ అవకాశాల గురించిన కథనం. జీవితంపై ఆశలు చిగురింపజేయగల కథనం. ఒక రకంగా జీవితం గురించిన కథే!ఊహాత్మక అనుమతి – జాతీయోద్యమంస్థిరంగా ఎదురవుతున్న సవాల్ ఏమిటంటే, ఎవరన్నా తమ అవయవాలను దానం చేయాలని చెప్పి గతించినా కూడా సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు అందుకు అనుమతించేందుకు తిరస్కరిస్తు న్నారు. చైతన్యాన్ని పెంచే ప్రచారాలు, విధానపరమైన మార్పుల ద్వారా ఆ యా కుటుంబాల వైఖరిలో మార్పు తేవాలి. దానం చేయడానికి యోగ్యత ఉన్న వ్యక్తి కుటుంబంతో కరుణామయమైన కమ్యూనికేషన్ నెరపడం చాలా కీలకం. ‘ఊహాత్మక అనుమతి’ భావనను స్వీకరించడం ద్వారా అవయవ దాన వ్యవస్థను నెలకొల్పే విధంగా సాహసోపేతమైన విధాన నిర్ణయం తీసుకోవడం మరొకటి. సింగపూర్, క్రొయేషియా, స్పెయిన్, యూరప్లోని ఇతర దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తు న్నాయి. ‘ఊహాత్మక అనుమతి’ కింద, మరణానంతరం ప్రతి వయోజనుడినీ, అతని బంధువుల నిర్ణయంతో సంబంధం లేకుండా, అవయవ దాత కిందే పరిగణిస్తారు. తన మరణానంతరం కూడా తన అవయవాలను తీసుకోవడానికి లేదని సదరు వ్యక్తి బాహాటంగా నమోదు చేసుకుంటే తప్పించి, ఆ విధానం అమలవు తుంది. యూరప్లో ఈ ఊహాత్మక భావన, అవయవ దానాల పెరుగుదలపై సానుకూల ప్రభావం చూపింది. అవయవ దానాలు పెరిగాయి. అవయవ దానాల పట్ల సుముఖతా పెరిగింది. సాహసోపేతమైన ఆలోచనలను అక్కున చేర్చుకోవడంలో భారతదేశం ఎల్లప్పుడూ ముందుంది. అవయవం దొరకక, మన ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోవడాన్ని మనం ఎంత మాత్రం సహించకూడని సమయం వచ్చేసింది. ఒక ప్రాణాన్ని నిలబెట్టే కానుకనివ్వడం జాతీయ ప్రాధాన్యంగా మారాలి. సరైన సమష్టి కార్యాచరణతోనే, అవయవ మార్పిడి అవసరమైన ప్రతి భారతీయునికీ అది లభించగల భవిష్యత్తులోకి మనం అడుగు పెట్టవచ్చు. డా‘‘ ప్రతాప్ సి. రెడ్డి వ్యాసకర్త అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ -
విద్యార్థులకు 'భవిష్యత్' పాఠం
అవి మా ముత్తాత పోయిన కొత్తలు. ఆయన ఒక సన్నకారు రైతు. ఆయన పోవడంతో మా ముత్తవ్వ యువ వితంతువుగా మారింది. అప్పటికే ఆమెకు ఇద్దరు కుమారులు. ఆదాయ వనరు సున్నా. ఇద్దరు పిల్లలను చదివించి, వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో దగ్గరలోని ఓ పట్టణానికి మకాం మార్చారు. ఓ ఇంట్లో పని మనిషిగా చేరారు. చాలీచాలని ఆదాయం ఇద్దరు పిల్లల్లో ఒకరిని చదివించేందుకే సరిపోతుంది. ఇద్దరు పిల్లల మధ్య వయసులో పెద్ద తేడా లేదు. ఆ ఇద్దరిలో ఒక పిల్లాడు బాధ్యతతో మెలిగేవాడుగా కనిపించాడు. రెండవవాడు కాస్త పేచీకోరు. పరిస్థితులకు అనుగుణంగా మసలుకునే పిల్లాడిని, ఆమె పనిలోకి దింపారు. అతను భవన నిర్మాణ పనుల్లో దినసరి కూలీగా మారాడు. కొత్త నైపుణ్యాలను గడించుకుని, ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని అందుకొనే అవకాశం ఎన్నడూ లభించలేదు. మరో పిల్లాడిని స్థానికంగా ఉన్న పాఠశాలకి పంపించగలిగారు. ఆ పిల్లాడే మా తాతయ్య. తక్కువ బాధ్యతతో వ్యవహరించే పిల్లాడిగా ముద్రపడినా, స్కూలు చదువును కొనసాగించగలిగాడు. పోలీసు అధికారి అయ్యాడు. అతని సోదరుడు నాలుగు రాళ్ళు సంపాదించడం ప్రారంభించిన పదేళ్ళ తర్వాత ఉద్యోగంలో చేరినా, ప్రారంభంలోనే ఎక్కువ జీతభత్యాలు తీసుకోగలిగాడు. మా తాత చదువుకోవడం, ఉద్యోగ జీవితం వల్ల, మా నాన్నకు చదువుకొనే అవకాశం లభించింది. ఫలితంగా, నేను నాకు ఇష్టమైన బాటలో అడుగులు వేసేందుకు అవకాశం చిక్కింది. మా తాతకు లభించిన అవకాశం వల్ల, ఆ తరువాత తరాలు కూడా బాగుపడే వీలు చిక్కింది. ప్రతిభావంతులు ప్రతిచోటా ఉన్నారు. కానీ, వారు వెలుగులోకి వచ్చే అవకాశమే ఉండటం లేదు అనే దానికి ఈ వ్యక్తిగత జీవిత వివరాలే ఉదాహరణ. టెక్నాలజీ ఉపకరణం మాత్రమే!ఈ రోజు కార్యక్రమం విద్య, టెక్నాలజీ గురించి! సూటిగా చెప్పాలంటే, రేపటి ప్రపంచాన్ని సృష్టించేవారిగా నేటి విద్యార్థులను తీర్చిదిద్దడానికి సంబంధించినది. సాంకేతికంగా అబ్బురపరచే ప్రగతిని సాధిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. మన జీవితాలలో ప్రతి పార్శ్వాన్ని, ఆర్థిక వ్యవస్థలను, సమాజాలను డిజిటల్ టెక్నాలజీలు రూపుదిద్దుతున్నాయి. అయితే, టెక్నాలజీ అంతరాయా లను కూడా సృష్టిస్తోంది. టెక్నాలజీ ఏ కొద్ది మందికోకాక, అందరికీ అవకాశాలను అందివ్వగలదా? అన్నదే అసలైన ప్రశ్న. ఇతరులు సాధించే విజయంపైనే మన విజయం గణనకు వస్తుంది. చదువుకునే అవకాశాన్ని అందరికీ కల్పించడం మన ధ్యేయం కావాలి. నేటి సమాజం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్ళలో అది ఒకటి. ‘మైక్రోసాఫ్ట్’ మాజీ పరిశోధకుడు, ‘గీక్ హేర్సే’ పుస్తక రచయిత కెంటరో టొయోమ ఆ అంశాన్ని బాగా పట్టుకున్నారు. టెక్నాలజీలో కన్నా ముందుగా సమాజంలో మార్పు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. టెక్నోక్రాట్లు సాధారణంగా టెక్నాలజీ గుణగణాల గురించి గొప్పగా చెప్పేందుకు మొగ్గు చూపుతూంటారు. వ్యవస్థలోని అన్ని రుగ్మతలకూ దానినే విరుగుడుగా భావిస్తూంటారు. దానితో విభేదం ఉన్నవాడిగానే నేనిక్కడికి వచ్చాను. విద్యను రూపాంతరీకరించడానికి టెక్నాలజీ ఒక్కటే సమాధానమనే భ్రమల్లో మనం లేము. విద్యా రంగంలో మార్పు తీసుకొచ్చేందుకు అంకిత భావం కలిగిన పాలకులు, గొప్ప ఉపాధ్యాయులు, ప్రేరణ పొందిన విద్యార్థులు, పాలుపంచుకునే తల్లితండ్రులు, సమాజాలు అవసరం. టెక్నాలజీ వారి సృజనాత్మకతకు, చాతుర్యానికి సాధికారత కల్పించగల ఒక ఉపకరణం మాత్రమే. ప్రపంచం నలుమూలల ఉన్న విద్యార్థులను చూడగలగడం, వారి నుంచి నేర్చుకోగలగడం నా ఉద్యోగ బాధ్యతల్లో నేను ఇష్టపడే అంశాల్లో ఒకటి. గత రెండేళ్ళుగా, నేను 20కి పైగా దేశాలలో విద్యార్థులను కలుసుకునే అవకాశం లభించింది. సియాటిల్లో నా కూతుళ్ళు ఏ ఆఫీసు టూల్స్ని ఉపయోగిస్తున్నారో అవే టూల్స్ని జకార్తా, టెల్ అవీవ్లలోని విద్యార్థులు కూడా ఉపయోగిస్తున్నారు. ఆ యా తరగతి గదుల్లో కొంత సమయాన్ని వెచ్చించినప్పుడల్లా, ప్రతిసారీ నాలో కొన్ని అంశాలు ముసురుకుంటూ వచ్చాయి. పిల్లలను ఎలా తీర్చిదిద్దాలి?ఒకటి– తరగతి గదిలో టీచర్ పనికి టెక్నాలజీ సాయపడాలే గానీ, అవరోధం కాకూడదు. సమయాన్ని వెచ్చించడంలో టీచర్లపై చాలా డిమాండ్లు ఉంటాయి. వారు పాఠ్యాంశాలను ఎంపిక చేయాలి. పరీక్షలు పెట్టాలి. పేపర్లు దిద్దాలి. తరగతుల్లో విద్యార్థు లను అదుపాజ్ఞలలో ఉంచాలి. క్రమశిక్షణ నేర్పాలి. టెక్నాలజీ టీచర్ల జీవితాలను సులభతరం చేసి, విద్యార్థులలో సృజనాత్మకతను రేకెత్తించేదిగా ఉండాలిగానీ, వాటి నుంచి దృష్టి మళ్ళించేదిగా ఉండకూడదు. రెండు– పని స్వరూప స్వభావాలలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒక సమస్యను పరిష్కరించేందుకు సమష్టిగా పనిచేస్తున్నారు. సమస్యను విభజించి చూడటంకన్నా ఏక మొత్తంగా చూస్తున్న ధోరణి కనిపిస్తోంది. ఈ రకమైన భవిష్యత్తుకి మనం విద్యార్థులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. తరగతి గదిలో కూడా టీమ్ల వారీగా పనిచేయడాన్ని ప్రోత్సహించాలి. సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా నేర్చుకో వడం తరగతి గదిలోనే మొదలవ్వాలి. టీమ్ వర్క్కి అవి కేంద్రాలు కావాలి. అప్పుడే దేన్నైనా కలసి సృష్టించగల సామర్థ్యం సొంత మవుతుంది. విద్యార్థులను కలసిమెలసి నేర్చుకునేటట్లుగా చేస్తే, వారి విద్యావకాశాలు కూడా మెరుగుపడతాయి. మూడు– రేపటికి తగినట్లుగా మన విద్యార్థులను తయారు చేసి తీరాలి. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ నివేదికను, అది రూపొందించిన ఉద్యోగాల నివేదికను పరిశీలించండి. నేడు పాఠశాలల్లో అడుగు పెడుతున్న విద్యార్థుల్లో 65 శాతం మందికి లభించబోయే ఉద్యో గాలు, ఇపుడు ఉనికిలో ఉన్నవి కావట! ‘కాంపుటేషనల్ థింకింగ్’, సమస్యను పరిష్కరించగల నైపుణ్యాలు భవిష్యత్తుకు కీలకమని టీచర్లకు తెలుసు. ‘స్టెమ్’ పాఠ్య ప్రణాళికను విస్తృతంగా వీక్షించవలసిన అవసరం ఉందని కూడా వారికి తెలుసు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితాన్ని కలిపి పొందికతో కూడిన అధ్యయన నమూనాగా చేయడాన్ని ‘స్టెమ్’గా పిలుస్తున్నారు. చదవడం, రాయడం, డిజైన్, కళలకు తోడు, ‘స్టెమ్’ పాఠ్య ప్రణాళికను కూడా తీసుకువస్తే, భవిష్యత్తులో ఈ విద్యార్థులు విజయం సాధించడానికి రంగం సిద్ధం చేసినవాళ్ళం అవుతాం. చివరగా– మా తాతకు లభించిన అవకాశం, మా కుటుంబ గతిని మార్చివేసింది. ఇపుడు నాకు స్ఫూర్తినిస్తున్న అంశం ఈ తరంలోనూ, రాబోయే తరాలలోనూ ప్రతి విద్యార్థికి విద్యావకాశాన్ని ప్రజాస్వామ్యీకరణ చేసేందుకు మనందరం కలసి మెలసి ఎలా ఒకటవాలన్నదే! అందరికీ కృతజ్ఞతలు. -
గాజాను గాలికి వదిలేయడమేనా?
‘మొత్తం గాజాను ఇజ్రాయెల్ తన అదుపులోకి తీసుకుంటుంది –నెతన్యాహు ప్రకటన’, ‘గాజా నగరం మొత్తాన్ని గుప్పిట్లోకి తీసుకోనున్న ఇజ్రాయెల్’– గత రెండు రోజుల్లో పత్రికల్లో కనిపించిన ఈ శీర్షికలు చూసిన ఎవరైనా అడగవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవి: ఆ మాట అనడానికి ఆయనకు ఎంత ధైర్యం? ఆ పని చేసేందుకు ఇజ్రాయెల్కు ఉన్న హక్కే మిటి? కానీ, ఈ ప్రశ్నలను ఎవరూ అడిగినట్లు లేదు. కానీ, నేడు ప్రపంచంలో రాజ్యమేలుతున్న నైతిక పరిస్థితులు అలాంటి ప్రశ్నలు లేవనెత్తగల పరిధిని కుంచించివేశాయి. దాదాపు రెండేళ్ళ నుంచి పాలస్తీనా పౌరుల్ని ఇజ్రాయెల్ భయంకర హింసకు గురి చేస్తున్నా, సైనికంగా, ఆర్థికంగా శక్తిమంతమైన పాశ్చాత్య దేశాలు నిరోధించ లేదు. పరిస్థితులు ఇంతవరకు రావడానికి అవే ప్రధాన కారణం. ఇజ్రాయెల్ చేతిలో 60,000 మందికి పైగా పాలస్తీనియన్లు హతమైనా, అంతకు రెండింతల కన్నా ఎక్కువ మంది గాయపడినా ఉదార ప్రజాస్వామిక ఆదర్శాలను వల్లెవేసే ఈ దేశాలు చోద్యం చూశాయి. లేదా ఇజ్రాయెల్ చర్యలను ప్రోత్సహించాయి. అంతర్జా తీయంగా దేశాలు నాగరిక ప్రవర్తనను గాలి కొదిలేస్తే, ఆ యా దేశాలలోని సమాజాలలో ప్రజాస్వామిక విలువలే దెబ్బతింటాయి. గాజాపై సైనికచర్యలో వినియోగించడానికి అవకాశమున్న ఆయుధాలను ఇజ్రాయెల్కు ఇవ్వడాన్ని నిలిపివేస్తామని జర్మనీ ప్రకటించింది. ఈ ఘర్షణలో జోక్యం చేసుకోకూడదని అమెరికా నిర్ణయించుకుంది. గాజా నగరంపై దాడికి దిగాలన్న ఇజ్రాయెల్ నిర్ణయంపై వివిధ దేశాల, అంతర్జాతీయ ఏజన్సీల స్పందనలు అలా రకరకాల స్థాయుల్లో వ్యక్తమయ్యాయి. సైనిక హింసను వెంటనే నిలువరించేందుకు ఒక జీ7 లానో, జీ20 మాదిరిగానో ఏర్పడకుండా ఈ దేశాలకు అడ్డుపడిన అంశం ఏమిటి? పాలస్తీనా ప్రయోజనాలకు ఇండియా కొన్ని దశాబ్దాలుగా మద్దతు ఇస్తూ వస్తోంది. కానీ, మన దేశం కూడా ఇప్పటికీ అధికారిక స్పందనను వెల్లడించలేదు.హమాస్ 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ పై దాడులకు దిగింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ 15 నెలలపాటు ఏకధాటిన పాలస్తీనాను పిండి చేసిన తర్వాత అమెరికా, ఖతార్, ఈజిప్టుల మధ్య వర్తిత్వంతో మూడు దశల కాల్పుల విరమణకు జనవరిలో ఇజ్రా యెల్, హమాస్ అంగీకరించాయి. కానీ, రెండు నెలలు గడిచాయో లేదో గాజా నగరంపై రాత్రిపూట వైమానిక దాడులకు ఇజ్రాయెల్ తెగబడింది. వాటిలో 400 మంది పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో హింసకు తాత్కాలికంగానైనా అడ్డుకట్టపడుతుందనే ఆశను కాల్పుల విరమణ ఒప్పందం కల్పించింది. ఆరు వారాల మొదటి దశలో – బందీలుగా పట్టుకున్న ఇజ్రాయలీలను హమాస్ వదిలేయాలి. ప్రతిగా ఇజ్రాయెల్ జైళ్ళలో ఉన్న పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ సేనల ఉప సంహరణ మొదలవ్వాలి. నానా అగచాట్లు పడుతున్న పాలస్తీనియ న్లకు మానవతా సహాయం పెరగాలి. రెండవ దశలో– ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడంతో యువ బందీలు, ఖైదీల మార్పిడి సాఫీగా సాగాలి. మూడవ దశలో– బందీలు, ఖైదీల మృతదేహాల అప్పగింత అమలవ్వాలి. గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ సేనల ఉపసంహ రణతోపాటు, గాజాలో పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలి. కానీ, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనపెట్టిన ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూ, పాలస్తీనియన్లను చంపుతూనే ఉంది. గాజాకు ఆహారం, దుస్తులు, ఆస్పత్రి సామగ్రితో సహా మానవతా దృష్టితో సాగుతున్న అంతర్జాతీయ సాయానికీ అడ్డుపడింది. గాజా నగరాన్ని హస్తగతం చేసుకోవాలన్న ఇజ్రాయెల్ నిర్ణయాన్ని హమాస్ చేతిలో ఇప్పటికీ బందీలుగా ఉన్నవారి కుటుంబాల వారు వ్యతిరే కిస్తున్నారు. దాడికి సంబంధించి ఇజ్రాయెల్ సైనిక ప్రణాళికలను ఈ ప్రతిఘటన ఆపుతుందో లేదో రాబోయే రోజుల్లో చూడాలి. ఇజ్రాయెల్ సైనిక దాడులు మొదలైన తొలి నెలల్లో లక్షలాది మంది పాలస్తీనియన్లు గాజాను విడిచి వెళ్ళిపోయారు. వివిధ ప్రాంతాల్లో నిస్సహాయ పరిస్థితుల్లో తలదాచుకున్న పాలస్తీనియన్లు కాల్పుల విరమణ తర్వాత తిరిగి వచ్చారు. అప్పటికే వారి గృహాలు, వాడలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. గాజాలో నివసిస్తున్న పది లక్షల మంది పాలస్తీనియన్లను, రానున్న వారాల్లో ఇజ్రాయెల్ సేనలు తరిమేస్తే, ఆ తర్వాత వారు తిరిగి వచ్చేందుకు, ఆ మాత్రం నగరం కూడా మిగిలి ఉండదు. రఫాకు పట్టిన గతే గాజాకూ పడుతుంది. హమాస్ సేనలను పట్టుకునేందుకు రఫాలో ఉన్న పది లక్షల మంది పౌరులను ఇజ్రాయెల్ ఖాళీ చేయించేసింది. ఇపుడు రఫా ఏ మాత్రం నివాసయోగ్యం కాని విధంగా నేలమట్టమై ఉంది. గాజాలో పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న భీతావహ పరిస్థి తుల్ని ఊహించుకోవచ్చు. అస్తిత్త్వానికే ముప్పు ఎదురవుతున్న ఈ సమయంలో వారి పట్ల మనం సానుభూతితో వ్యవహరించాలి. జాతిని తుదముట్టించే ప్రణాళికలు నిర్వహించకుండా ఇజ్రాయెలీలను ఆపే బాధ్యతను శక్తిమంతమైన దేశాలు భుజానికెత్తుకుంటాయా? అలా చేస్తే, అంతర్జాతీయ వ్యవస్థపై మళ్ళీ నమ్మకం నెలకొంటుంది. తాత్కాలిక విధానాలతోనే అన్నింటిని సద్దుపుచ్చే తత్వం నేడు ప్రపంచమంతటా కనిపిస్తోంది. ఆ జాడ్యం నుంచి దూరం జరిగేందుకు కూడా అది తోడ్పడవచ్చునని ఓ చిగురాశ! ప్రొ‘‘ చందన గౌడ వ్యాసకర్త డీన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, విద్యాశిల్ప్ యూనివర్సిటీ(‘దక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో) -
మాలెగావ్ తీర్పే కాదు, విచారణా విచిత్రమే!
మహారాష్ట్రలోని మాలెగావ్లో 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పదిహేడేళ్లుగా విచారణను ఎదుర్కొంటున్న ఏడుగురు నింది తులు నేరం చేశారని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ న్యాయస్థానం న్యాయమూర్తి ఏకే లాహోటీ ఈ ఏడాది జూలై 31న తీర్పు ప్రకటించారు. ఆరుగురి మరణానికీ, వంద మంది దాకా గాయపడటానికీ కారణమైన ఆ నేరం ఎవరు చేశారో ఇప్పటికీ బయటపడలేదు! ఈ కేసు గురించీ, విచారణ క్రమం గురించీ, తీర్పు గురించీ ఆలోచించవలసిన అంశాలెన్నో! ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే మాలెగావ్లో ఒక మసీదు సమీపంలో మోటార్ సైకిల్కు అమర్చిన బాంబులు పేలి, ఆరుగురు మరణించిన ఆ కేసు దర్యాప్తును అప్పటి ప్రభుత్వం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటి ఎస్)కు అప్పగించింది. అప్పటి ఏటిఎస్ అధిపతి హేమంత్ కర్కరే నాయకత్వంలో ఆ దర్యాప్తు జరిగి అక్టోబర్–నవంబర్లలో 11 మంది అనుమానితులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అఖిల భారత విద్యార్థి పరిషత్ మాజీ నాయ కురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, మతాచార్యులు దయా నంద పాండే అలియాస్ స్వామి అమృతానంద, రిటైర్డ్ సైనికాధికారి మేజర్ రమేశ్ ఉపాధ్యాయ, అప్పటికి సైన్యంలో పని చేస్తున్న అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ ఉన్నారు. వారిలో అత్యధికులు ‘అభినవ భారత్’ అనే సంస్థ సభ్యులనీ, ఆ సంస్థ హిందూ రాజ్య స్థాపన లక్ష్యంతో విధ్వంసాలకు పూనుకుంటున్నదనీ ఏటిఎస్ అధి కారి హేమంత్ కర్కరే చెప్పారు. ఈ సంస్థకు, అనుబంధ సంస్థలకు దేశంలో 19 చోట్ల జరిగిన పేలుళ్లతో సంబంధం ఉందని తేలిందని కూడా కర్కరే అన్నారు. అప్పటికి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండిన భారతీయ జనతా పార్టీ, శివసేనలు ఇదంతా కాంగ్రెస్ పన్నాగమనీ, కేసు దర్యాప్తు ఇలా సాగించిన హేమంత్ కర్కరే ‘దేశద్రోహి’ అనీ ప్రకటించారు. అప్పటి గుజరాత్ సీఎం మోదీ ఏటిఎస్ దర్యాప్తు మన సైనిక బలగాల నైతిక ధృతిని కించపరిచేలా ఉందని విమర్శించారు. ఈ దర్యాప్తు వివరాలు బయటపెట్టి, నిందితులను అరెస్టు చేసిన నెల రోజుల తర్వాత ముంబా యిపై తీవ్రవాద దాడిలో హేమంత్ కర్కరేను గురిచూసి కాల్చి చంపారు. ఆయన తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయా రనే అభిప్రాయం ఎంత ఉందో, ఆయన హత్య వెనుక కుట్ర ఉందనే అభిప్రాయం అంత ఉంది. ఆయన చనిపోగానే తన ‘శాపం వల్లనే చనిపోయాడ’ని సాధ్వి అన్న మాటలు ఆ అనుమానాలకు ఆజ్యం పోశాయి. మరొకవైపు, ఏటిఎస్ 2009 జనవరి 20న పదకొండు మంది నిందితుల మీద చార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటికి ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పింది. 2011 ఏప్రిల్లో ఈ కేసును ఎన్ఐఏ తన పరిధిలోకి తీసుకుని, 2012లో మరొక ఇద్దరిని అరెస్టు చేసి నిందితుల సంఖ్యను 14కు చేర్చింది. 2016 మేలో ఎన్ఐఏ కొత్త ఛార్జిషీట్ తయారు చేసింది. ‘ఉపా’ చట్టం కింద ఆరోపణలున్నప్పటికీ, 2017లో నిందితులందరూ బెయిల్మీద బయటికి వచ్చారు. 2018లో విచారణ ప్రారంభమయింది. 323 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను, 8 మంది డిఫెన్స్ సాక్షులను విచారించిన తర్వాత, ప్రాసిక్యూషన్ నేర నిర్ధారణకు తగినంత విశ్వసనీయంగా సాక్ష్యాధారాలను సమర్పించలేదని తీర్పు వెలువడింది.ఆ తీర్పులోనే న్యాయమూర్తి కొందరు కీలకమైన సాక్షులను ఎన్ఐఏ ఉపసంహరించుకోవడం ప్రాసిక్యూషన్ ఉద్దేశాల గురించి ప్రతికూల నిర్ధారణలకు అవకాశం ఇచ్చిందని అన్నారు. ఆ సాక్షులను ప్రవేశపెట్టి ఉంటే, ఆరోపణలను రుజువు చేయడంలో చాలా ఖాళీలు పూరింపబడేవని అన్నారు. కేసు విచారణకు, నేర నిరూపణకు ఉపయోగపడే సాక్షులను ప్రాసిక్యూషన్ తనంతట తానే ఎలా పక్కన పెట్టిందో తీర్పులో వివరంగా రాశారు. అలాగే, సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ దగ్గర నమోదు చేసిన పద ముగ్గురు సాక్షుల వాంఙ్మూలాలు మాయమై పోయాయని ఎన్ఐఏ కోర్టుకు చెప్పింది. ఆ పత్రాలు మాయమైనప్పుడు, అవి ఏ మేజిస్ట్రేట్ ముందర నమోదయ్యాయో ఆ మేజి స్ట్రేట్ను విచారించవలసి ఉంటుంది. కాని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. అయితే ఇలా ప్రాసిక్యూషన్ తప్పులన్నిటినీ జాగ్రత్తగా నమోదు చేసిన న్యాయమూర్తి, ప్రాసిక్యూషన్ వ్యతిరేకించినా అవసరమైన సాక్షులను పిలవడానికి తన కున్న హక్కును మాత్రం వాడుకోలేదు! విచారణలో మరొకమలుపు కూడా ఉంది. కేసు మొద లయిన నాటి నుంచీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉండిన రోహిణి సాలియాన్ ఈ కేసు విచారణలో వేగంగా సాగవద్దని ఎన్ఐఏ నుంచి తనకు ఆదేశాలు వచ్చాయని 2015లో బయట పెట్టారు. ఆ తర్వాత ఆమెను ఎన్ఐఏ ప్రాసిక్యూటర్ల జాబితా నుంచి తొలగించారు. ఏటిఎస్ నేతృత్వంలో తాము చాలా బలమైన సాక్ష్యాధారాలు తయారు చేశామని, ప్రస్తుత కేసు ఓటమి సాక్ష్యాధారాల లేమి వల్ల జరగలేదనీ, సంస్థా గత, రాజకీయ నిజాయతీ కుప్పకూలడం వల్ల జరిగిందనీ ఆమె అన్నారు. ‘చట్టాన్ని అమలు చేయ వలసినవారే అధికా రంలో ఉన్నవారిని సంతృప్తి పరచడం కోసం దురుద్దేశాలతో పని చేస్తే న్యాయం పట్టాలు తప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు’ అన్నారామె. ఇదీ మన దర్యాప్తు వ్యవస్థల పని తీరు!! ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు -
సబీర్ భాటియా (బిజినెస్మేన్) రాయని డైరీ
దేశభక్తి మంచి విషయమే. అయితే నేనంటానూ... దేశానికి ఆర్థికంగా చేవనిచ్చే శక్తి కూడా మనలోని ఆ దేశభక్తికి ఉండాలని! శక్తి లేని భక్తి ఉత్త వేస్ట్ వ్యవహారం. దేశానికి వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. గర్వంగా తల పైకెత్తి చూస్తూ గట్టిగా ‘జై హింద్’ అని సెల్యూట్ కొట్టినప్పుడు జాతీయ జెండా నుండి బిలియన్ల కొద్దీ ఫారిన్ ఎక్ఛ్సేంజ్ నాణేలు దేశ ప్రజలపై గలగలమని కురిసినప్పుడు మాత్రమే అది ప్రయోజన కరమైన దేశభక్తి అవుతుంది. డబ్బును ఉత్పత్తి చెయ్యలేని దేశభక్తికి నా దృష్టిలో ఒక్క డాలర్ విలువైనా లేదు.తక్కువ మాట్లాడి ఎక్కువ పని చెయ్యటం దేశభక్తి. జీడీపీని చేతులు మారుతున్న డబ్బుతో కాకుండా, ముక్కలవుతున్న రెక్కల చెమట చుక్కలతో లెక్కేయటం దేశభక్తి. మన జీడీపీ ఘనంగా ఉన్నందువల్ల దేశంలో ఏం మార్పు వచ్చింది? మన ఎకానమీ ఫోర్త్ లార్జెస్ట్కి చేరుకున్నందు వల్ల ప్రపంచం మనల్ని చూసే విధానం ఏం మారింది? ఇలా మాట్లాడితే, ‘యాంటీ నేషనల్’ అంటారు! నిజాలను చూడటం యాంటీ నేషనల్ అయితే, నిజాలను చూడనివ్వకుండా చేయటం ‘నేషనలిజం’ అవుతుందా? నేనిక్కడ క్యాలిఫోర్నియాలో కూర్చుని ‘నా దేశం’ అంటూ ఇండియా గురించి మాట్లాడటం హర్ష్ గోయెంకా వంటి దేశభక్త భారతీయ పారిశ్రామికవేత్తలకు బొత్తిగా నచ్చటం లేదు! ‘‘మేము ఇక్కడ జీవిస్తున్నాం. ఇక్కడ ఓటు వేస్తున్నాం. ఇక్కడ పని చేస్తున్నాం. ఇక్కడ పన్నులు కడుతున్నాం. మేము ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాం. కాబట్టి, మా తలనొప్పులేవో మేము పడతాం. అన్నీ సర్దుకుని దేశం వదిలి వెళ్లిన వారు, మా కోసం ఏమీ ధర్మోపదేశాలు చేయనవసరం లేదు’’ అని హర్ష్ గోయెంకా!ఏం? దేశం లోపల ఉండేవారికి మాత్రమే దేశభక్తి ఉండాలా? దేశం బయట ఉన్నవారికి దేశభక్తి ఉండకూడదా? దేశభక్తి అంటే జయజయధ్వానాలు మాత్రమేనా? నా దేశం గురించి నేను మాట్లాడటం దేశభక్తి అవదా?!ఇంట్లో బియ్యానికి డబ్బుల్లేవు. దాని గురించి నేను మాట్లాడతాను. బయట అమ్మా, చెల్లి స్వేచ్ఛగా మసల లేరు. ఆ విషయమూ నేను మాట్లాడతాను. నాన్న మా అందర్నీ చదివించటానికి సతమతమౌతున్నారు. అదీ మాట్లాడతాను. ఇది పరువు సమస్య కాదు.నా దేశపు దాపరికాల సమస్య!దాపరికము, దీర్ఘాలోచన... రెండూ ఒకటే! మాట్లాడవలసిన చోట మౌనంగా ఉండటం తప్పవుతుంది. నిర్ణయం తీసుకోవలసినప్పుడు ఆలోచిస్తూ కూర్చోవటం అనర్థాన్ని తెస్తుంది.18 ఏళ్ల వయసులో నేనొక నిర్ణయం తీసుకున్నాను. అలాగే 28 ఏళ్ల వయసులో ఇంకొక నిర్ణయం. ఇప్పుడు నేనేమిటన్నది అప్పటి ఆ రెండు నిర్ణయాలే!‘‘నా లైఫ్ను నాకు వదిలేయండి’’ అని ఇంట్లో చెప్పి, నేను బెంగుళూరు రైల్వే స్టేషన్లో ఢిల్లీ రైలెక్కాను. ఢిల్లీ చేరాక, అక్కడి నుంచి ట్యాక్సీలో బిట్స్ పిలానీకి. అది నా మొదటి నిర్ణయం. తర్వాత పదేళ్లకు, నా ‘హాట్ మెయిల్’ను 400 మిలియన్ డాలర్లకు మైక్రోసాఫ్ట్కు ఇచ్చేశాను. అది నా రెండో నిర్ణయం.మరోసారి నేనిప్పుడు నిర్ణయం తీసుకోవా ల్సిన టైమ్ వచ్చింది. అయితే అది తీసుకునే నిర్ణయం కాదు, తీసుకోవాలని చెప్పే నిర్ణయం! అమెరికా మనపై ట్యారిఫ్లు వేస్తోంది. 25 శాతం, 50 శాతం, ఇంకా అంతకుమించి కూడా! మనమూ అమెరికాపై టారిఫ్లు వెయ్యాలి. ఇరవై శాతమో, యాభై శాతమో, వంద శాతమో కాదు. ‘0’ శాతం వెయ్యాలి! అవును. ‘0’ శాతంతో మనమంటే ఏంటో చూపించాలి. ట్యారిఫ్లు వెయ్యకపోతే అమెరికా బతకలేదు, ట్యారిఫ్లు ఎత్తేసి కూడా ఇండియా నిలబడగలదు అని నిరూపించాలి. ఇది సాహసం. కానీ, ఇదే తగిన సమాధానం! మనకెంత దేశభక్తి ఉందన్నది కాదు లెక్క, మనమంటే ప్రపంచానికి భయ భక్తులుండటం లెక్క! దేశభక్తికీ ఆర్థిక శక్తి ఉన్నప్పుడే లెక్కలు తేలుతాయి. -
యాభై శాతం హద్దు తొలగేనా?
దేశ రాజకీయం మళ్ళీ బీసీల చుట్టూ తిరుగుతున్నది. ఇందుకు తెలంగాణ ఒక వేదికగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం స్థానాలను కేటాయించాలని నిర్ణ యించి శాసన పరమైన చర్యలు చేపట్టింది. దీనిని పార్లమెంటు చేత ఆమోదింపజేసి రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించేలా కేంద్రంపై ఒత్తిడి కల్పించ డానికి సన్నాహాలు మొదలుపెట్టింది. తమిళనాడులో చాలా కాలం కిందటే 69 శాతం కోటా అమల్లోకి వచ్చింది. అంతే కాకుండా కేసులు వేయకుండా న్యాయ సమీక్షకు అతీతం చేస్తున్న రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో ఈ కోటాను తమిళనాడు ప్రభుత్వం చేర్పించుకున్నది. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినా...రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి, లక్షణానికి విరుద్ధంగా ఉండే చట్టాలను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినా వాటిని సమీక్షించే అధి కారం తనకున్నదని సుప్రీంకోర్టు ప్రకటించి ఉంది. తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్టు పంచాయతీల్లో బీసీలకు 42 శాతం కోటా బిల్లును పార్లమెంటు ఆమోదించడం గానీ, అది 9వ షెడ్యూ ల్లో చేర్చడం గానీ సులభ సాధ్యమైనవి కావు. కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే పనులను బీజేపీ ఎందుకు చేస్తుంది? పని కాకపోతే బీజేపీ బీసీలకు వ్యతిరేకి అని ప్రచారం చేయవచ్చన్నది కాంగ్రెస్ ఎత్తుగడ. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా కల్పిస్తే సుప్రీం కోర్టు మొత్తం రిజర్వేషన్లపై విధించిన 50 శాతం హద్దును అది మీరిపోతుంది. ఇలా హద్దు మీరిన రిజర్వేషన్లను కోర్టులు చాలా సార్లు రద్దు చేశాయి. తాజాగా మహారాష్ట్రలో మరాఠాలకు కేటాయించిన 16 శాతం రిజర్వేషన్లు వివాదాస్పదమయ్యాయి. దీనితో మహా రాష్ట్రలో రిజర్వేషన్లు 50 శాతం హద్దును దాటిపోతున్నాయంటూ బొంబాయి హైకోర్టును కొందరు ఆశ్రయించగా అది వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను 16 నుంచి 12 శాతానికి, విద్యాసంస్థల్లో13 శాతానికి తగ్గించివేసింది. దీని మీద సుప్రీం కోర్టు స్టే ఇచ్చి, ఇప్పుడు విచారణ జరుపుతోంది. 1931 నాటి లెక్కలతో...విచిత్రమేమిటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ 1980–90 మధ్య పదేళ్ల పాటు మండల్ కమిషన్ నివేదికను అమలుపరచకుండా ఆటకెక్కించింది. 1990లో వి.పి.సింగ్ ప్రధానిగా ఈ నివేదికను పాక్షికంగా అమలుచేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను ఆచరణలోకి తెచ్చారు. తిరిగి 2006లో మన్మోహన్ సింగ్ నాయక త్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్ర విద్యా సంస్థలలోనూ బీసీలకు 27 శాతం కోటాను అమలు చేసింది. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నియమించిన బి.పి. మండల్ కమిషన్ 1931 కులగణన ప్రకారం దేశ జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులవారు 52 శాతం ఉంటారని నిర్ధారించి, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించ కుండా ఉండేందుకు వారికి 27 శాతం కోటాను సిఫారసు చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కుల గణన జరిపిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో తన చిరకాల వ్యతిరేకతకు తెర దించి, త్వరలో జరగబోతున్న దేశ జనాభా గణనలో భాగంగా కులాలవారీ గణనను చేపట్టడానికి అంగీకరించింది. ఇందుకు కారణం లేక పోలేదు. ఇంతవరకూ కేవలం ధనిక, మధ్యతరగతి వర్గాల పార్టీగా మాత్రమే ఉన్న బీజేపీ వైపు ఇప్పుడు పేదలు, అణగారిన వర్గాలు కూడా గణనీయంగా మళ్ళినట్టు భావిస్తున్నారు.రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని 1992 నవంబర్ 16న సుప్రీం కోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం విధించింది. ఇంద్ర సాహనీ కేసు లేదా మండల్ కమిషన్ కేసుగా ప్రసి ద్ధమైన వ్యాజ్యంలో ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు దేశంలో రిజ ర్వేషన్లపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలను ప్రకటించింది. కులం ప్రాతిపదిక వెనుకబాటుతనాన్ని ఈ తీర్పు గుర్తించింది. అంటే సామాజిక న్యాయ అవసరం రాజ్యాంగ విహితమైనదని చెప్పింది. అదే సమయంలో పరిమితులను విధించింది. 50 శాతం హద్దు, బీసీలలో మీగడ వర్గం, లేదా ముందుబడిన వర్గాన్ని (క్రీమీ లేయ ర్ను) గుర్తించి కోటా నుంచి దూరం చేయడం, పదోన్నతులలో రిజర్వేషన్లు ఉండరాదనడం ఈ కోవలోకి వస్తాయి. కేంద్రం తలుచుకుంటే...పదోన్నతులలో రిజర్వేషన్లను సుప్రీం కోర్టు రద్దు చేసినా 1995లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 16(4ఎ)ను చేర్చి ఎస్సీ, ఎస్టీల విషయంలో వాటికి తిరిగి ప్రాణం పోశారు. వాస్తవానికి రాజ్యాంగం 340, 341, 342 అధికరణాలు బీసీ, ఎస్సీ, ఎస్టీల పరి స్థితులను మెరుగుపరచడానికి, వారి యెడల సానుకూల వివక్షను ఉద్దేశించి చేర్చినవి. అయితే సుప్రీం కోర్టు 50 శాతం పరిమితి ఉల్లంఘన రాజ్యాంగం 14వ అధికరణం హామీ ఇస్తున్న సమానత్వ సూత్రానికి విరుద్ధమని ప్రకటించింది. అత్యంత ప్రత్యేక పరిస్థితు లలో 50 శాతానికి మించి రిజర్వేషన్లను కేటాయించవచ్చని సైతం ఈ తీర్పు చెప్పింది. కానీ కోర్టులు ప్రధానంగా 50 శాతం హద్దును అమలు పరచడమే కర్తవ్యంగా తీర్పులు వెలువరిస్తున్నాయి. కేంద్రం తలచుకుంటే 50 శాతం హద్దును ప్రభావరహితం చేయడం కష్టమేమీ కాదు. విద్యకు, హక్కులకు సుదూరంగా విసిరి వేసిన ప్రజలను పైకి తేవడానికి ఉద్దేశించిన అధికరణాలురాజ్యాంగం ప్రసాదించినవి కాగా, 50 శాతం హద్దు సుప్రీం కోర్టు విధించినది. నిజానికి రాజ్యాంగం కేవలం సాంఘికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాలకే విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందులో ఆర్థిక వెనుకబాటుతనం ప్రస్తావనే లేదు. అయినా మోదీ ప్రభుత్వం 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థిక బలహీన (ఈడబ్ల్యూఎస్) వర్గాలకు 10% రిజర్వేషన్లను కల్పించింది. ఇది 50 శాతం పరిమితిని దాటిపోడమే కదా! రాజ్య సభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ విషయాన్నే ప్రశ్నించగా, సామాజిక న్యాయ శాఖ మంత్రి విచిత్రమైన సమాధానంతో సమర్థించుకున్నారు. ఇంద్ర సాహనీ కేసులో సుప్రీం కోర్టు విధించిన 50 శాతం హద్దు సామాజి కంగా విద్యాపరంగా (ఎస్.ఇ.బి.సి.) వెనుకబడిన వర్గాలకు మాత్రమే వర్తిస్తుందని, ఆర్థిక బలహీన వర్గాలకిచ్చిన 10 శాతం రిజర్వేషన్లకు, దానికి సంబంధం లేదని చెప్పారు. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు రాజకీయ అవకాశవాదాన్నే రుజువు చేస్తాయి. అందుకే ‘మేమెంద రమో మాకు అంత కోటా’ అనే నినాదం రోజు రోజుకీ పుంజుకుంటు న్నది. అందుకోసం మరొక రాజ్యాంగ సవరణ ద్వారా 50 శాతం హద్దును కూడా రద్దు చేయడమే ఏకైక మార్గంగా తోస్తున్నది.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-జి. శ్రీరామమూర్తి -
‘గ్లోబల్’ వ్యూహంలో భాగమైన కోస్తాంధ్ర
ప్రపంచీకరణ ప్రభావాన్ని సకాలంలో అంచనావేసి, ఆసియాలో ముందుగా దాన్ని అందిపుచ్చుకున్న చైనా... తన తదుపరి ఆర్థిక విస్తరణకు ‘వన్ బెల్ట్ – వన్ రోడ్’ (‘ఓబిఓఆర్’) విధానాన్ని చేపట్టింది. 2017 మేలో జరిగిన ఆ అధికారిక ప్రకటనకు 28 దేశాల అధిపతులు, వంద దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఆ రోజు 50కి పైగా వాణిజ్య ఒప్పందాలు అక్కడ జరి గాయి. అయితే భారత్ దీనికి హాజరు కాలేదు. మధ్య ఆసియా, యూరప్, ఇండో–పసిఫిక్ దేశాలతో–‘బెల్ట్’ ద్వారా, అలాగే ‘రోడ్’– ద్వారా ఆగ్నేయ ఆసియా దేశాల్లోకి సముద్ర జలాల ద్వారా, రైలు మార్గాల ద్వారా చైనా ప్రవేశించింది. అయితే ‘ఈ గైర్హాజరీ వల్ల మనం ఒంటరి కావడం అనే రిస్క్ (ఇదే పదం వాడారు)ను కూడా కాదనలేము’ అని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారి ఒకరు అన్నట్టు ‘ది హిందూ’ అప్పట్లో రాసింది. ఇంతకూ దీనిపై మోదీ ప్రభుత్వం అభ్యంతరం ఏమిటి?‘బెల్ట్’లో భాగంగా పాకిస్తాన్ పశ్చిమ తీరాన అరేబియా సముద్రంలో ఉన్న గ్వాదర్ పోర్టుకు ‘చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్’ పేరుతో చైనా తన నిధులతో ఒక ప్రత్యేక రోడ్డును 3,217 కి.మీ. మేర నిర్మించింది. అది పాకిస్తాన్ భూభాగాన్ని తూర్పు నుంచి పడ మరకు ఆసాంతం దాటి గ్వాదర్ పోర్ట్ చేరుతుంది. పాక్ దాన్ని అనుమతించింది. కానీ దానిలో పాక్ ఆక్రమిత కశ్మీర్ ఉండడం మోదీ ప్రభుత్వం అభ్యంతరంగా భావించింది. నిజానికి అప్పుడే ఇండియా దాన్ని అవకాశంగా తీసుకుని ‘రికార్డు’లో అది ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ అనే ‘క్లాజ్’తో చైనా ప్రతిపాదనను అంగీకరించి ఉంటే ఎలా ఉండేదో! కానీ అది జరగలేదు. మన అభ్యంతరం గురించి అప్పట్లోనే – ‘విస్తరిస్తున్న ఆసియా మార్కెట్తో కలిసి, దాని సప్లై, తయారీ, మార్కెట్ అవసరాలతో అనుసంధానం అయితేనే 2032 నాటికి ఇండియా 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యానికి చేరగలదు’ అని యూఎన్ఓ మాజీ డైరెక్టర్ ముకుల్ సన్వల్ అన్నారు.మరిప్పుడు ‘గ్లోబల్ సౌత్’ భావన ముందుకొచ్చి ఈ దేశాలు తమ మధ్య ఉండాల్సింది ‘సౌత్–సౌత్ కో–ఆపరేషన్’ అంటుంటే, మన పొరుగున ఉన్న చైనా, పాక్లతో ఇన్నాళ్లుగా ‘ఎన్డీఏ’ ప్రభుత్వం అనుసరించిన దౌత్య విధానం మాటేమిటి? ప్రస్తుతం జీ–7 దేశాల మధ్య కంటే ‘బ్రిక్స్’ దేశాల మధ్య వాణిజ్యం శరవేగంగా సాగుతోంది. గత 20 ఏళ్లలో బ్రెజిల్–చైనా మధ్య అది యాభై రెట్లు పెరిగితే, చైనా–ఇండియాల మధ్య కేవలం 28 రెట్లు మాత్రమే పెరిగింది. అంతే కాదు ఇండో– పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిలువరించడం లక్ష్యంగా 2007లో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా ‘క్వాడ్’ కూటమిగా ఏర్పడితే... అందులో ఇండియా కలిసింది.చదవండి: ఇండియాలోనూ పదహారేళ్లకు తగ్గించాలా?కానీ ‘ఎన్డీఏ’ పాలనలో మన వేగం పెరిగి అదిప్పుడు ‘మలబార్’ పేరుతో విశాఖపట్టణం కేంద్రంగా మన సముద్ర జలాల్లో ఏటా అక్టోబర్లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ల నౌకాదళాలతో కలిసి విన్యాసాలు చేసే స్థాయికి చేరింది. కాకినాడ పోర్టు వద్ద ఈ ఏప్రిల్లో అమెరికా నౌకా దళాలు మన త్రివిధ దళాలతో కలిసి విపత్తు నివారణ చర్యల రిహార్సల్ చేశాయి. ఇవికాక ఈశాన్య రాష్ట్రాలలోని మణిపూర్ జాతుల సమస్య, వెస్ట్ బెంగాల్లోకి వలస వస్తున్న బంగ్లాదేశ్ పౌరుల ఓటర్ల సమస్య వంటివాటికి వ్యూహాత్మకంగా జాతీయ వార్తల స్థాయిలో ఏళ్ల తరబడి ఇస్తున్న ప్రచారాన్ని బట్టి, సరిహద్దు దేశాలతో మన దౌత్య సంబంధాలు ఎలా ఉండాలి అని మనం అను కుంటున్నదీ చెప్పక చెప్పే అంశాలు.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఈ అణు దూకుడుతో మళ్లీ అనర్థం
హిరోషిమా, నాగసాకీలపై అణ్వస్త్ర ప్రయోగాలు జరిగిన 80 సంవత్సరాలకు తిరిగి అణ్వస్త్రాల ప్రస్తావనలు వస్తుండటం ప్రపంచాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నది. కాకతాళీయంగా ఈసారి కూడా ఆ ప్రస్తావనలు చేస్తున్న అమెరికా... రష్యా సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలా లలోకి రెండు అణ్వస్త్ర జలాంతర్గాములను తరలించింది. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్ది రోజుల క్రితం స్వయంగా ప్రకటించారు. అక్కడి నుంచి దక్షిణాన అవే సముద్ర జలాలలో జపాన్ ఎంతో దూరంలో లేదు. ట్రంప్ చర్యలకు ప్రతిగా రష్యన్లు తమవద్ద గల ‘డెడ్ హ్యాండ్’ అణ్వస్త్ర వ్యవస్థ గురించి గుర్తు చేశారు. 1987 నుంచి గల అణ్వాయుధ క్షిపణుల నిరోధక ఒప్పందం నుంచి ఉపసంహరించుకున్నారు. ఇది ఈ 5వ తేదీ నాటి పరిణామం. ఇవన్నీ వెంటవెంటనే వారం రోజులలోపే జరిగిపోయాయి.ఏమిటీ ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ?అమెరికా, రష్యాల మధ్య అణు యుద్ధం రాగల అవకాశం సాధారణ దృష్టికైతే కనిపించటం లేదు. ట్రంప్ ఒకవైపు అణు జలాంతర్గాముల మోహరింపునకు ఆదేశాలిస్తూనే, ‘డెడ్ హ్యాండ్’ ప్రస్తావ నలు చేస్తున్న రష్యా అటువంటి చర్యలకు పాల్పడగలదని భావించటం లేదనీ, అయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ అన్నారు. మరొకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఈ తరహాలో అణు ప్రస్తావనలు ఎవరికీ మంచిది కాదన్నారు. ఆ విధంగా చూసినపుడు ఎవరికి వారు ఎంతో కొంత జాగ్రత్తలలోనే ఉన్నట్లు భావించాలి. అసలు విషయం ఇంత దూరం ఎందుకు వచ్చింది?చర్చను ఒక తక్షణ విషయంతో ఆరంభిద్దాము. రష్యా తన ఉక్రెయిన్ యుద్ధాన్ని 10 రోజులలో ఆపివేసి శాంతి ఒప్పందంపై సంతకాలు చేసి తీరాలని అమెరికా అధ్యక్షుడు తనంతట తానే ఒక గడువు విధించారు. ఆ గడువు ఈనెల 9వ తేదీతో ముగుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఇలాగే 50 రోజుల గడువు ప్రకటించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా అన్నట్లు ప్రపంచానికి అన్ని విధాలా ఒక చక్రవర్తి వలె వ్యవహరిస్తున్న ట్రంప్, అందరికీ ఆదేశాలు, హెచ్చరికలను ఎడాపెడా జారీ చేస్తున్న తీరును చూస్తూనే ఉన్నాము. ట్రంప్ నుంచి ఇటువంటి ధోరణిని సహించలేని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మెద్వెదేవ్ ఆయనకు తమ అణ్వస్త్ర శక్తిని, ‘డెడ్ హ్యాండ్’ పేరుతో గల అణు వ్యవస్థను గుర్తు చేశారు. సాధారణ ప్రచారంలో లేని ‘డెడ్ హ్యాండ్’ వ్యవస్థ ఏమంటే, ఒకవేళ అమెరికా మొదటగా అణ్వస్త్రాలు ప్రయో గించి రష్యా రాజకీయ నాయకత్వాన్ని, సైనిక నాయకత్వాన్ని పూర్తిగా తుడిచి పెట్టినట్లయితే, తదనంతర చర్యలకు వారి నుంచి ఆదేశాలు అందని స్థితిలో, మొదటినుంచే మోహరించి ఉన్న అణ్వ స్త్రాలు అన్నీ వెంటనే తమంతట తాము అమెరికా, యూరప్లలోని తమ లక్ష్యాల వైపు క్షణాలలో దూసుకుపోతాయి. నాయకత్వాల నుంచి ఆదేశాలు ఆగిపోయాయనే సంగతి అల్ట్రా లో ఫ్రీకెన్సీ రేడియో తరంగాల ద్వారా తెలుస్తుంది. ఆ తరంగాలను అమెరికా సహా ఎవరూ పసిగట్టలేరు, విశ్లేషించలేరు, హైజాక్ చేయలేరు, నిరోధించ లేరు. ట్రంప్కు మెద్వెదేవ్ ఇచ్చిన సందేశమది. అంతిమార్థం ఏమంటే, ట్రంప్ చర్యలు వినాశనానికి దారితీయవచ్చునని.ప్రపంచం మొత్తానికీ యుద్ధమే!అణుయుద్ధం అమెరికా, రష్యాల మధ్య అయితే తక్కిన ప్రపంచానికి సమస్య ఏమిటనే సందేహం కలగవచ్చు. 1945కూ, ఇప్పటికీ తేడాలున్నాయి. అపుడు అమెరికా ఏకైక అణుశక్తి. తర్వాత నాలు గేళ్లకు 1949లో రష్యా అణుశక్తి పరీక్షతో పరిస్థితులు మారసాగాయి. అమెరికా, రష్యాలు పరస్పరం పోటీపడి అణ్వస్త్రాల సంఖ్యను వేలకు వేలుగా పెంచటంతో పాటు అందులో కొత్త రకాలపై పరిశోధనలు నేటికీ జరుపుతున్నాయి. అందులో, మొదటి విడత విధ్వంసం, దానిని తట్టుకుని రెండవ విడత విధ్వంసం, పరస్పర విధ్వంస శక్తి, యుద్ధ విమానాలు, సముద్ర జలాల నుంచి ప్రయోగాలు (ట్రయాడ్ వ్యవస్థ) అంటూ రెచ్చి పోయారు. ఈమధ్యలో మరొక అర డజన్ అణ్వస్త్ర దేశాలు తయారయ్యాయి. అటువంటి ఆయుధాలు అర డజను ఉన్నా చాలు విధ్వంసానికి అనే వివేకం కలగటంతో అణ్వస్త్ర పరిమితి ఒప్పందాలు, వాటి మోహరింపుల పరిమితిపై ఒప్పందాలు దశలు దశలుగా జరిగాయి.వాటిలోని లోపాలను అట్లుంచితే, ప్రపంచం కొన్ని దశాబ్దా లుగా ఇతర యుద్ధాలు ఎట్లున్నా అణ్వస్త్ర ప్రయోగాలు లేక ప్రశాంతంగా ఉంది. అందుకు కారణం పరస్పర విధ్వంస శక్తి (మ్యూచు వల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, లేదా మ్యాడ్) అని, ఆ విధంగా ‘బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్’ అనే స్థితి ఏర్పడిందని అంతా భావించారు. ఆ పరిస్థితు లలోనూ గమనించదగ్గవి కొన్ని జరిగాయి. ఎవరిపైనా అణ్వస్త్ర ప్రయోగపు ఆలోచనలు రష్యా చేయలేదు గానీ, వియత్నాం, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్లు కొరకరాని కొయ్యలుగా మారటంతో అమె రికా అందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి మళ్లీ వెనుకకు తగ్గింది.అప్రమత్తత కలిగేనా?ఇటువంటి చరిత్ర ఉన్నందువల్లనే ఇపుడు తిరిగి అమెరికా,అందులోనూ ట్రంప్ వంటి అనాలోచితుడు, చంచలచిత్తుడు, విపరీ తమైన అహంభావి ఆదేశాలతో అణుజలాంతర్గాములను ఇప్పటికే రష్యా సమీపానికి తరలించిందంటే, ప్రపంచవ్యాప్తంగా భయాందో ళనలు కలగటం సహజం. అణుయుద్ధం జరిగితే అది అమెరికా, రష్యాలకు పరిమితం కాదు. అమెరికా మిత్ర దేశాలను, రష్యా మిత్ర దేశాలను అనివార్యంగా అందులోకి లాగుతాయి. భయంకరమైన స్థాయిలో వెలువడే అణుధార్మిక శక్తి ఇండియా సహా అన్ని దేశాలకూ వ్యాపిస్తుంది. దాని ప్రభావం అన్ని సముద్ర జలాలతో పాటు మొత్తం వాతావరణాన్ని ఎంతకాలంపాటు కలుషితం చేస్తుందో బహుశా నిపుణులు కూడా అంచనా వేయలేరు. 80 ఏళ్ల క్రితం నాటి హిరో షిమా ప్రభావాలు జపాన్లో నేటికీ ఉన్నాయి.ఈ ప్రమాదకర పరిస్థితికి మూల కారణం, అమెరికా నాయ కత్వాన ‘నాటో’ దేశాలు ప్రత్యక్షంగా రష్యాను, పరోక్షంగా చైనాను లొంగదీసుకోవాలని భావించటంలో ఉంది. అందుకోసం చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో భాగంగా ఉక్రెయిన్ను ఒక పావుగా ఉప యోగించుకుంటున్నారు. అది ఒక తప్పు కాగా, ఆ యుద్ధ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించలేకపోవటం ఒక వైఫల్యం. రష్యాను ఎన్ని ఆంక్షలు విధించినా బలహీనపరచలేకపోవటం ఇంకొక వైఫల్యం అవుతుండగా, ట్యారిఫ్ల పేరిట రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వగైరాలను బెదిరించజూడటం అసమర్థ దుర్జనత్వమవుతున్నది. చివరకు అంతిమ ఆయుధంగా 50 రోజులు, 10 రోజుల గడువులు, అణు జలాంతర్గాముల స్థాయికి పతన మవుతూ యావత్ ప్రపంచాన్నే ప్రమాదంలోకి నెడుతున్నారు.విచారకరం ఏమంటే, మన దేశంలో ఒకప్పుడు ఉన్నత స్థాయిలో ఉండిన ఈ అప్రమత్తత ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతున్నది. వారు మళ్లీ అప్రమత్తులు కావటం 80 ఏళ్ల హిరోషిమా విషాదానికి తగిన నివాళి అవుతుంది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇండియాలోనూ పదహారేళ్లకు తగ్గించాలా?
16 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని యునైటెడ్ కింగ్డమ్ నిర్ణయించింది. స్కాట్లాండ్, వేల్స్ పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటికే ఈ అర్హత అమలులో ఉంది. వయఃపరిమితి తగ్గింపు నిర్ణయం అనూహ్యమేం కాదు. లేబర్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే ఈ వాగ్దానం చేసింది. దీని ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలం ఆ ప్రభుత్వానికి ఉంది.16 ఏళ్ల బ్రిటిషర్లకు దీంతో సమకూరే ఇతర హక్కులు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. జాతీయ ఎన్నికల్లో ఓటేయడమే కాకుండా, తల్లితండ్రుల అంగీకారం ఉంటే వారు పెళ్లి కూడా చేసుకోవచ్చు. సివిల్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చు కొనేందుకు అర్హులు.ఇంట్లోంచి వెళ్లిపోయి స్వతంత్రంగా జీవించే హక్కు లభిస్తుంది. ట్రేడ్ యూనియన్లో చేరే హక్కు వస్తుంది. పన్నులు చెల్లిస్తారు. వెయి టర్గా పనిచేసే హక్కుంటుంది. రైళ్లలో ఇక హాఫ్ టికెట్ కుదరదు, ఫుల్ టికెట్ తీసుకోవాలి.అయితే కొన్ని పనులు చేయడానికి వారికి ఇక మీదట కూడా అనుమతి ఉండదు. ఉదాహరణకు, వారు లాటరీ టికెట్లు కొనడం నిషేధం. తమంతట తాము కారు డ్రైవ్ చేయకూడదు. పబ్బులో కూర్చుని బీరు తాగకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా, ఎన్నికల్లో పోటీ చేయడానికి పదహారేళ్ళ వారు అనర్హులు. అంటే తమకు తాము ఓటేసుకునే హక్కు ఉండదు. ఇదంతా సమాజంలో గందర గోళం సృష్టిస్తుంది అనుకుంటున్నారు కదూ? మీరే కాదు, బ్రిటన్ ప్రతిపక్ష మితవాదులు కూడా మీలానే అనుకుంటున్నారు. దేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించే అంతటి పరిపక్వత 16 ఏళ్ల వారికి ఉంటుందా అనేది కీలకమైన ప్రశ్న. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, తెలివితేటలతో అనే పదం నేను ఈ ప్రశ్నలో ఉపయోగించ లేదు. 20లు, 30లు, లేదా 50లు, 60ల వయసులో ప్రజలు తెలివితేటలతో నిర్ణయం తీసుకుంటున్నారా? ఉద్వేగంతోనే ఓటేస్తున్నారా? లేదా కేవలం ఆనవాయితీగానో, దురభిప్రాయంతోనో వ్యవహరిస్తున్నారా? ఎలా నిర్ణయం తీసుకున్నా పెద్దవారికి చెల్లుబాటు అయినప్పుడు 16 ఏళ్ల వారికి ఎందుక్కాకూడదు?అయినా సరే, వారి పరిపక్వత సరిపోతుందా అనేది ప్రశ్నే. ఆ వయసు వారు కొందరికైనా సరే ఓటేసే పరిపక్వత ఉంటుంది. చాలా మంది పెద్దవారి కంటే వారు ఆలోచనాపరులు అని ‘యూకే యూత్ పార్లమెంట్’ చైర్పర్సన్ వ్యాఖ్యానించారు.16 ఏళ్ల వారు ఇంకా మానసికంగా ఎదిగే దశలోనే ఉంటారని యాభై పైబడిన పెద్దవాడిని కాబట్టి నేను అలానే అనుకుంటాను. అనుభవం ద్వారా నేర్చుకునే వయసనీ అంటాను. ఆ నేర్చుకునేది... ఒప్పు లేదా తప్పు ఏదైనా కావచ్చు. 1970ల ప్రారంభంలో నాకది కచ్చితంగా వర్తిస్తుంది. ఇందిరా గాంధీ కాంగ్రెస్, ప్రతిపక్ష మహా కూటమి... రెంటిలో ఒకదాన్ని నేను అప్పట్లో అర్థవంతంగా ఎంచు కునేవాడినా? చాలామంది మాదిరిగానే నా తల్లిదండ్రుల అభిప్రా యాన్నే నా అభిప్రాయం చేసుకుని ఉండేవాడినా?సొంత నిర్ణయం తీసుకునే చిన్న వాళ్లూ ఉంటారు. నేను కాదనను. కానీ, అధిక సంఖ్యాకులు తమ చుట్టూ ఉండే పెద్దవారి భావాలనే ఆమోదిస్తారు. వారితో ఏకీభవించడం లేదనీ, వారి కంటే ఎదిగిపోయామనీ తెలుసుకొనే వరకైనా అలా చేస్తారు. ఎవరికి ఓటేయాలనేది మన ముందున్న పలు ప్రత్యామ్నా యాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవలసిన విషయం. మరోసారి ఆలోచించండి. పెద్దవారు నిజంగా అలానే చేస్తున్నారా? 16 ఏళ్ల వారు ఎలా చేస్తారో అలానే మనం కూడా ఇతరుల ప్రభా వానికి లోనవటం వాస్తవం కాదా?వాస్తవానికి ఇండియా 1989లో 18 ఏళ్ల వారికి ఓటు హక్కు ఇచ్చినప్పుడు ఇవే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వ్యతిరేకుల సంశ యాలు అన్నీ తప్పని కాలం రుజువు చేసింది. ఇప్పుడూ అదే పున రావృతం అవుతుందా? పెద్దవారికి తేలిగ్గా మింగుడు పడని సత్యం ఏమిటంటే, ఇవ్వాళ్టి చిన్నవారు మనం ఆ వయసులో ఉన్నప్పటికంటే తెలివైనవారు. ప్రతి తరమూ తన ముందటి తరం కంటే తెలివిగా ఉంటుంది. కావాలంటే స్మార్ట్ ఫోన్ పట్టుకున్న నాలుగేళ్ల పిల్లాడిని గమనించండి. నేను చెప్పేది నిజమని మీకు తెలుస్తుంది. అందుకే నేను బ్రిటిష్ వారిని మెచ్చుకుంటున్నా. మనం కూడా వారిలా అలాంటి నిర్ణయం తీసుకోవాలేమో!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పాక్ ప్రమిదకు ట్రంప్ చమురు
పాకిస్తాన్–అమెరికాలు జూలై 31న ఒక నూతన వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. పాకిస్తాన్లోని చమురు నిక్షేపాలను అభివృద్ధి చేయడానికి సంయుక్తంగా కృషి చేయడంపై ఈ ఒప్పందం ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇంధనం, ఖనిజాలు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, క్రిప్టో కరెన్సీలలో కూడా విస్తృత సహకారాన్ని అభివృద్ధి చేసుకోవాలని రెండు దేశాలూ కోరుకున్నాయి. ఇది పాకిస్తాన్లోని మౌలిక సదుపాయాలపై అమెరికా పెట్టుబడులను పెంపొందించేందుకు తోడ్పడవచ్చు. ద్వైపాక్షిక మార్కెట్ సౌలభ్య విస్తరణకు సాయపడవచ్చు. ‘మేం ఈ భాగస్వామ్యానికి నేతృత్వం వహించగల ఆయిల్ కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పాకిస్తాన్ చమురు సంపద మొదట్లో ఆ దేశ సెంట్రల్ పంజాబ్ లోని టూట్ చమురు క్షేత్రానికే పరిమితమైంది. ఆ ప్రాంతం పోటో హార్గా సుపరిచితం. అది ఇస్లామాబాద్కు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొదటి చమురు బావిని 1964లో తవ్వారు. వాణి జ్యపరమైన ఉత్పాదన 1967లో మొదలైంది. సుమారు 6 కోట్ల పీపాల చమురు ఉందని భావించారు. దాని నుంచి 12–15 శాతం భాగం మాత్రమే తవ్వితీయగలమని నిర్ణయించారు. ఉత్పాదన 1986లో శిఖర స్థాయికి చేరి, రోజుకు సుమారు 2,400 పీపాల చమురు వెలికి తీశారు. పెట్రో దిగ్గజం యూనియన్ టెక్సాస్కు చెందిన పాకిస్తానీ అనుబంధ సంస్థ... సింథ్ దిగువన ఒక చమురు క్షేత్రాన్ని 1981లో కనుగొంది. సింథ్ చమురు క్షేత్రాలు 1998–1999 నాటికి టూట్ చమురు క్షేత్రం కంటే ఎక్కువ చమురును అందించాయి. టూట్ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ జాతీయ చమురు కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్ మెంట్ కంపెనీ (ఓజీడీసీ) లిమిటెడ్తో వాంకూవర్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ సావరిన్ ఎనర్జీ కార్పొరేషన్ 2005లో ఒక అవగా హనా పత్రంపై సంతకాలు చేసింది. షుంబర్గర్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ 2006లో అక్కడ మొదట కార్యకలాపాలు ప్రారంభించింది. టూట్ చమురు క్షేత్రంలోను, దాని పొరుగునున్న మిస్సా కేశ్వాల్ చమురు క్షేత్రంలోను పనిచేసేందుకు రెండు కెనడియన్ కంపెనీలు రంగంలోకి దిగాయి. వీటి స్థానాన్ని ఇపుడొక అమెరికన్ కంపెనీ భర్తీ చేయవచ్చు. పాక్లో ఐదు చోట్ల –చెంగియూ పీకే లిమిటెడ్ (బెలూచిస్తాన్ లోని హబ్ ), పాక్–అరబ్ రిఫైనరీ కంపెనీ లిమిటెడ్ (గుజరాత్లోని కస్బా), పాకిస్తాన్ రిఫైనరీ లిమిటెడ్ (కరాచి), అటాక్ రిఫైనరీ లిమి టెడ్, నేషనల్ రిఫైనరీ లిమిటెడ్ (కామ్చి)–చమురు శుద్ధి కర్మాగారా లున్నాయి. వాటన్నింటి చమురు శుద్ధి సామర్థ్యం రోజుకు 4,20,000 పీపాల వరకు ఉంటుంది. గ్వాదర్లో మరో ఆయిల్ రిఫైనరీ నెల కొల్పే ఆలోచనలో ఉన్నట్లు సౌదీ ఆర్మకో 2019లో ప్రకటించింది. అమెరికా–పాకిస్తాన్ల మధ్య వాణిజ్యం 2024లో 7.3 బిలియన్ల డాలర్ల మేరకు ఉంది. అమెరికా వస్తువుల వాణిజ్య లోటు 300 కోట్ల డాలర్ల మేరకు ఉంటుంది. పాకిస్తాన్ నుంచి అమెరికా లినెన్ ఉత్ప త్తులు, లెదర్ వస్తువులు, కలపతో చేసిన ఫర్నిచర్ వస్తువులను దిగు మతి చేసుకొంటూ, పాకిస్తాన్కు ముడి పత్తి, విమానాల భాగాలు, ఇతర యంత్ర సామగ్రి పరికరాలను ఎగుమతి చేస్తోంది. ఈ అసమతౌల్య సమస్యను పరిష్కరించేందుకు అమెరికా నుంచి వస్తువుల దిగుమతులను పెంచుకుంటామని పాక్ పేర్కొంది. పాకిస్తాన్లోని ఖనిజ నిక్షేపాల పట్ల అమెరికాకు కొత్తగా ఆసక్తి పుట్టుకురావడం వెనుక వేరే లావాదేవీలు ఉన్నాయని వాషింగ్టన్ లోని విల్సన్ సెంటర్లో సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ మైకేల్ కుగెల్ మ్యాన్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ట్రంప్ బంధువులకి వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ సంస్థలో షేర్లు ఉన్నాయి. ఆ సంస్థ పాక్లో 2025 మార్చిలో ఏర్పడిన పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్తో ఆ వెంటనే ఏప్రిల్లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. పాక్లో కొత్తగా మంత్రిగా నియమితుడైన బిలాల్ బిన్ సాకిబ్ ఆ కౌన్సిల్కి నేతృత్వం వహిస్తున్నారు. సాకిబ్ ఇటీవల బిట్ కాయిన్ల రంగంలోకి ప్రవేశించారు. లాస్ వేగాస్లో మే నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాకిబ్, క్రిప్టోను కాపాడిన అధ్యక్షుడిగా తాను ట్రంప్ను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. తర్వాత, వైట్ హౌస్లో అమెరికా అధికారులతో సాకిబ్ మంతనాలు జరిపారు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కి, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్కి వైట్ హోస్లో ట్రంప్ విందు ఏర్పాటు చేయడానికి ఆ సమావేశమే మార్గం సుగమం చేసిందని చెబుతారు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకుని నాలుగేళ్ళు గడుస్తున్నా, అమెరికా–పాక్ సంబంధాలలో ఇప్పటికీ చాలా అనిశ్చితి ఉంది. పాకిస్తాన్కు చెందిన ఎఫ్–16 యుద్ధ విమా నాల నిర్వహణ, మరమ్మతు పరికరాలకు సంబంధించి ఈ ఏడాది మొదట్లో అమెరికా సైన్యం సమకూర్చిన సాయం 397 మిలియన్ల డాలర్ల మేరకు ఉంది. చైనా ఆయుధాలపై మితిమీరి లేదా దాదాపు పూర్తిగా ఆధారపడుతున్న స్థితి నుంచి పాక్ రక్షణ వ్యవస్థను తప్పించాలని అమెరికా కోరుకుంటూ ఉండవచ్చుకానీ, మునుపు పాక్తో భారీ స్థాయిలో ఉన్న ఆయుధాల సంబంధాలను పునరు ద్ధరించుకోవడంపై అమెరికా వైపు ఏకాభిప్రాయం లేదు.ఈ నేపథ్యంలో, భారత్–పాక్ల మధ్య శాంతికి ప్రయత్నించినట్లు ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నా, భారత్తో కలసి అడుగులు వేయడంపై అమెరికా తాత్సారం చూపడం సహజ పరిణామంగానే తోస్తుంది. రాణా బెనర్జీ వ్యాసకర్త క్యాబినెట్ సెక్రటేరియట్లో మాజీ ప్రత్యేక కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మృత్యువు ముంగిట మానవాళి
హిరోషిమా పేరు తలచుకోగానే, ఒక కళాత్మక సినిమాలోని ఒక చిన్న దృశ్యం నా మదిలో మెదులుతూ ఉంటుంది. అది రుయుసుకె హమగుచి తీసిన ‘డ్రైవ్ మై కార్’ సినిమా. దానికి 2021లో ఆస్కార్ అవార్డు లభించింది. అది వియోగం, కళాత్మక స్ఫూర్తి గురించిన కళాఖండం. ఆ సినిమాలో ఒక సన్నివేశం. శరదృతువు. ఆరుబయలులో హాయిగొలిపే గాలిలో రిహార్సల్ చేసేందుకు థియేటర్ నుంచి కొందరు నటులు బయటకు వస్తారు. చెఖోవ్ రాసిన ‘అంకుల్ వన్యా’ రష్యన్ నాటకంలో ఒక ఘట్టం రిహార్సల్ కోసం ఇద్దరు నటీమణులు నడుస్తూంటే వారి పాదాల కింద నలుగుతున్న ఎండు టాకుల చప్పుడు వినిపిస్తుంది. వారు అప్పటి వరకు విచారం, స్తబ్ధత గురించి చెఖోవ్ రాసిన వాక్యాలను వల్లె వేయడంలో సతమత మవుతూంటారు. బతకలేని జీవితాలు, చిదిమేసిన కలలు, కలలు కల్లలేనా? అనుకుంటూ మథనపడుతుంటారు. కానీ, ఆ పార్క్లో వారికి ఏదో తట్టింది. వారు బతికి తీరాలనుకున్నారు. జీవితాన్ని కొనసాగించాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. ఆ నటులకు ఈ పార్క్ విచారం, సహనశక్తికి సంబంధించి మొత్తం విశ్వాన్ని ఎలా చూపినట్లు? బతకడానికి స్ఫూర్తి ఎందుకంటే, అది ‘హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్’. గొప్ప ఆధునిక ఆర్కిటెక్ట్ కెన్ జో టాంగే 1954లో దాన్ని డిజైన్ చేశారు. అక్కడ 80 ఏళ్ళ క్రితం సుమారు 1,900 అడుగుల ఎత్తున, ఇంచుమించుగా చడీచప్పుడు లేకుండా ఒక కొత్త రకం బాంబు పేలింది. అక్కడ 1945లో నుంచున్నవారందరూ వెంటనే విగత జీవులయ్యారు. తర్వాత మంటలు. మిగిలిన పర్యవసానాలు!ఆగస్టు 6 తర్వాత, అక్కడ కొద్ది రోజులపాటు వర్షం పడింది.నల్లని జిగట చుక్కలు. మసి, శిథిలాల అణువులతో బరువైనవి. హిరోషిమా శిథిలాల మధ్యన కొనప్రాణాలతో ఉన్నవారు ఆర్తిగా ఆ నీటినే తాగారు. కానీ, అవి అణు ధార్మికతతో నిండిన వర్షపు చినుకులు. ‘‘అణువు మరింత విభజనకు గురైంది. ఈ అణు విచ్ఛిత్తితో, మొత్తం ప్రపంచం కుప్పకూలినట్లు నా అంతరాత్మకు అనిపించింది’’ అని పెయింటర్ వాసిలి కాండినిస్కీ 1913లో రాశారు. గడచిన శతా బ్దపు ఆరంభంలో ఎర్నెస్ట్ రూథర్ ఫర్డ్, పియరీ, మేరీ క్యూరీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటివారు అణు భౌతిక శాస్త్ర రహస్యాలను విప్పడం ప్రారంభించినపుడు, తదనంతర కాలంలో, నిర్ణీత కాల వ్యవధుల్లో వచ్చిన ఆర్టిస్టులు, రచయితలు, తత్త్వవేత్తలు ఈ కొత్త సైన్స్ సాంస్కృతిక పర్యవసానాలపై ఒకే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ వచ్చారు. ‘‘ప్రతీదీ అస్థిరమైనదిగా, ప్రమాదకరమైనదిగా, నిస్సారమైనదిగా పరిణమించింది’’ అని కాండినిస్కీ వ్యాఖ్యానించారు. ఆ వాదన ఎక్కడికి దారితీసిందో చూసేందుకు, అనుభూతి చెందేందుకు ప్రయత్నించడానికి నేను హిరోషిమా వచ్చాను. పీస్ మెమోరియల్ మ్యూజియం జనంతో నిండినా, మౌనం రాజ్య మేలుతూ, అణు శక్తి పార్శా్వన్ని చూపింది. కాలిపోయిన విద్యార్థుల యూనిఫారాలు. పిల్లల దుస్తులు. హిరోషిమాలోని కుటుంబం ఒకటి ఈ మధ్యనే ఆరు ముడతల తెరను మ్యూజియానికి ఇచ్చింది. దాని బంగారపు అంచులపై నల్లని వాన చారికలు. ఇంత భయం గొలిపే నైరూప్య చిత్రాన్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు.హిరోషిమాలో హైపోసెంటర్కి సుమారు 850 అడుగుల దూరంలో ఓ బ్యాంక్ బిల్డింగ్ ఉంది. సుమారు 3,871 డిగ్రీల సెల్సి యస్ లేదా అంతకుమించిన ఉష్ణోగ్రతలో అక్కడ చనిపోయిన ఒక వ్యక్తి శాశ్వత నీడతో బ్యాంకు మెట్లు నల్లని రూపు సంతరించు కున్నాయి. వాటిని చూడడంతోనే ఆధునిక కళారీతి ‘ఆటమిక్ ఆప్టిమిజం’ దెబ్బకు అదృశ్యమైపోయిందని చెప్పాలి. ఒక డాక్యుమెంటరీలో ఆ మెట్లను చూసిన పెయింటర్ ఈవ్ క్లేన్ కొన్ని భయంకర మానవాకారాలను సృష్టించారు. నీలి రంగు ‘ట్రేడ్ మార్క్’గా గుర్తింపు పొందిన ఆయన చిత్రాలు కొన్ని ఆ తర్వాత బూడిద తెలుపునకు మారాయి. ఏదీ రాజకీయ వివేకం?హిరోషిమాపై మొదటి బాంబును ప్రయోగించిన మూడు రోజులకే నాగసాకిపై రెండవ బాంబు వదిలారు. 1945 ఆగస్టు 6 తదనంతర దశాబ్దాలలో చిత్రకళ, సినిమా, సాహిత్య రంగాలు పరస్పర విధ్వంసం వల్ల ఉత్పన్నమయ్యే వినాశకర పరిస్థితులను రూపుకట్టించేందుకు నడుం బిగించాయి. ‘ఆన్ ద బీచ్’ (1959) సినిమాలో, మూడవ ప్రపంచ యుద్ధం నుంచి బతికి బట్టకట్టిన వారు, అణు ధార్మికత ఆస్ట్రేలియాను తాకనుందని బితుకు బితుకు మంటూ ఉంటారు. జార్జ్ ఆర్వెల్, ఫిలిప్ కె. డిక్, కిమ్ స్టాన్లీ రాబిన్సన్ వంటివారు అణు ఉత్పాతం తర్వాత జీవితం ఎలా ఉండ గలదో లేదా ఏం మిగిలి ఉంటుందో ఊహించారు. వారంతా అణు భవిష్య ప్రవక్తలు. మన సంస్థలు, మన నాయకులు ప్లుటోనియం మాదిరిగానే అస్థిరమైనవారని వారు కనుగొన్నారు. హిరోషిమాపై దాడి జరిగిన 80 ఏళ్ళ తర్వాత, మనం మన నడవడికను సరిదిద్దుకోకపోగా అణు వినాశనపు నూతన శకంలోకి అడుగులు వేసే పెద్ద పొరపాట్లు చేస్తున్నాం. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ తర్వాత, క్యూబా క్షిపణుల సంక్షోభం తర్వాత తిరిగి, ఈ భూగోళం అణు యుద్ధపు అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అన్నారు. ‘‘మును పెన్నటికన్నా కూడా అణ్వస్త్రాలతో నిర్మూలనం కాగల ప్రమాదం అంచున’’ మనం ఉన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ పాలనా యంత్రాంగంలో జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఈ ఏడాది మొదట్లో హెచ్చరించారు. ఇరాన్లోని అణుశక్తి అభివృద్ధి ప్రదే శాలపై అమెరికా, ఇజ్రాయెల్ జూన్లో బాంబులు కురిపించాయి. అణు సామర్థ్య శక్తులను ఆధునికీకరించే పనులను ఉత్తర కొరియా కొనసాగిస్తోంది. అణ్వస్త్ర అగ్ర రాజ్యాలు రెండు కాదు మూడు అని తెలుసుకుని తీరాలన్నట్లుగా చైనా అణ్వాయుధాలను విస్తరిస్తోంది. అమెరికా–రష్యాల మధ్య కుదిరిన కడపటి ఆయుధ నియంత్రణ ఒడంబడికకు ఇంకో ఆరు నెలల్లో కాలం చెల్లనుంది. ఆయుధాల నియంత్రణ అనే సూత్రానికే దాంతో కాలం చెల్లుతుందని అను కోవచ్చు. ఇంత జరుగుతున్నా ప్రజల నుంచి ఆగ్రహావేశాలు ఏమంత లేవు. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎక్కడా గతంలోలా శాంతి కాముక అడ్వర్టయిజ్మెంట్లు లేవు. పైగా, గ్రహాంతరవాసులు, ఏ దిశగా దూసుకెళతాయో చెప్పలేని గ్రహ శకలాలు, అత్యంత తాజాగా అయితే కిల్లర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటివల్ల ఈ భూగోళానికి ప్రమాదం పొంచి ఉన్నట్లుగా పుస్తకాలు, సినిమాలు వస్తున్నాయి.ప్రస్తుతం వివిధ దేశాల వద్ద 12,000 అణ్వాయుధాలు ఉన్నట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్’ అంచనా. అయినా, అవేవో రెండవ ప్రపంచ యద్ధం నాటివనే భ్రమల్లోనే మనం ఇప్పటికీ ఉన్నాం. హిరోషిమా దాడిపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడానికి బదులు అణుబాంబు అంత విధ్వంసాన్ని సృష్టించిందా అనే ఆశ్చ ర్యమే అమెరికన్లలో ఎక్కువ వ్యక్తమైంది. బతికి ఉండగలమా?‘ద న్యూయార్కర్’ పత్రిక 1946లో తెచ్చిన ప్రత్యేక సంచికలో హిరోషిమాపై జాన్ హెర్షే రాసిన వార్తా కథనాన్ని మినహాయిస్తే, అణు విధ్వంసాన్ని మొదట్లో విహంగ వీక్షణంగానే చూశారు. అమెరికా ఆక్రమిత దళాలు 1945 నుంచి 1952 వరకు ఆ రెండు విధ్వంస నగరాలలోని దృశ్యాలను నిష్ఠగా సెన్సార్ చేస్తూ వచ్చాయి. హిరోషిమాలో అమెరికా సైన్యం తీసిన ఫోటోలలో జనం అరకొర గానే కనిపిస్తారు. అవి చికిత్స పొందుతున్నవారిని చూపుతాయి. ప్రజలు ఎంత బాధకు ఓర్చు కున్నదీ తెలియదు. నాగసాకిలో ఎట్సూయూకీ మాట్సీ అనే హైస్కూలు టీచరు ఉన్నారు. తీరిక వేళల్లో ఆయన హైకూలు రాస్తూంటారు. ఆయన 1945 ఆగస్టు 9న ఒక ఆహార పంపిణీ కేంద్రం వద్ద పనిచేస్తున్నారు. అర్ధరాత్రి మంటలను దాటుకుంటూ ఎలాగో ఇంటికి పరుగెత్తారు. ఆయన పిల్లల్లో ఇద్దరు అప్పటికే చనిపోయారు. ఇంకో పిల్లాడు ఆ మర్నాడు కన్నుమూశాడు. భార్య వారం లోపలే గతించింది. అణు విస్ఫోటం గురించి 1946లో నాగసాకిలోని ఒక జర్నల్లో ఆయన కవితలను ప్రచురించాలని కోరుకున్నప్పుడు దాని ఎడిటర్లు అందుకు నిరాకరించారు. దానికి విరుద్ధంగా 1960లు, 1970లలో అమెరికాలో చాలామంది ఆర్టిస్టులకు ఈ బాంబులు కథా వస్తువుగా మారాయి. అణుబాంబు దాడి వంటి అత్యంత వినాశకర ఘట్టాన్ని నిజంగా పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాని పని. టోక్యో నుంచి హిరోషిమాకు బులెట్ రైలులో వెళుతూ నేను గుంథర్ యాండర్స్ రాసిన పుస్తకాన్ని చదవడం ప్రారంభించా. ఆయన 1945 ఆగస్టు 6న న్యూయార్క్లో ఉన్నారు. ఆ రోజు రేడియోలో వార్తలు విన్నప్పుడు ఆయన మెదడు మొద్దుబారిపోయింది.తర్వాత కొన్నేళ్ళపాటు ఆయన కాగితంపై కలం పెట్టలేక పోయారు. సవ్యంగా లేదా సత్ప్రవర్తనతో జీవించడం గురించిన పరిశీలనే 2,500 ఏళ్ళుగా తత్త్వశాస్త్రానికి మూల బిందువుగా ఉంటూ వస్తోంది. అది కాస్తా, ఒక్క రోజులో, ఒక్క చర్యతో, తుడిచి పెట్టుకుపోయింది. హిరోషిమా తర్వాత, ‘‘గత యుగాల మౌలిక నైతిక ప్రశ్నను విప్లవాత్మకంగా పునర్ నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని యాండర్స్ వాదించవచ్చు. ‘‘మనం ఎలా జీవించాలి? అని ప్రశ్నించుకోవడానికి బదులుగా, అసలు మనం జీవించి ఉంటామా?’’ అని ప్రశ్నించుకుని తీరాలి. మన ముఖ్య నైతిక వైఫల్యం అందులోనే ఉంది.జేసన్ ఫారగో వ్యాసకర్త కళా విమర్శకుడు (‘న్యూయార్క్ టైమ్స్ సౌజన్యంతో) -
పాటుపడనిదే 'ఫలితం' రాదు!
ధన్యవాదాలు.నేను చెప్పగలిగినవి, అత్యంత ఉపయోగకరమైనవి, ఏవైనా ఉంటే చెప్పవలసిందని నాకు సుమారు ఐదు నుంచి ఆరు నిమిషాల సమయం ఇచ్చారు. వీలైనంత ప్రయత్నిస్తాను. ఏవైనా మూడు అంశాలకు పరిమితం కావలసిందని కూడా నాకు సూచించారు. నేను నాలుగు అంశాలు చెప్పాలనుకుంటున్నాను. అవి చాలా ముఖ్యమైన అంశాలని నేను భావిస్తున్నాను. వాటిలో కొన్ని ఇంతకు ముందు మీరు విన్నవి కూడా కావచ్చు. కానీ, వాటి గురించి మళ్ళీ చెప్పు కోవడంలో తప్పు లేదు.కష్టపడి పనిచేయాలి!మొదటిది – కృషి చేయడం! మీరు ఒక పనిని ఎంత బాగా చేయాలనుకుంటున్నారో, దాని కోసం అంతగా కృషి చేయాలి. మీరు ఒక కంపెనీని నెలకొల్పదలిస్తే, దానికి సంబంధించి మీరు ఇంకా ఎక్కువ పాటుపడాలి. ఎంతగా అంటారా... నేను, నా సోదరుడు కలసి మొదటి కంపెనీని ప్రారంభించినపుడు, అపార్ట్మెంట్ తీసుకోవడానికి బదులు, ఒక చిన్న ఆఫీసును అద్దెకు తీసుకున్నాం. అక్కడే సోఫాలో పడుకునేవాళ్ళం. స్నానాలు, నిత్యకృత్యాలు వై.ఎం.సి.ఏ.లో కానిచ్చేసే వాళ్ళం. ఎంత కష్టపడ్డామంటే, ఒకటే కంప్యూటర్ ఉండేది. పగటి పూట వెబ్సైట్కి వాడుకునేవాళ్ళం. కోడింగ్ పని నేను రాత్రిపూట చేసేవాడిని. వారంలో 7 రోజులూ, మొత్తం సమయాన్ని దానికే వెచ్చించేవాళ్ళం. నా సంగతి తెలుసుగా! నాకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. నాతో ఉండటం కోసం, ఆమె కూడా ఆఫీసులోనే పడుకునేది. కనుక కష్ట పడాలి. మెలకువగా ఉన్నంతసేపూ పని చేస్తూనే ఉండాలి. అదే నేను చెప్పదలచుకుంది. ముఖ్యంగా మీరు ఏదైనా కంపెనీ ప్రారంభించాలంటే శ్రమించక తప్పదు. ఏమీ లేదు. చిన్న లెక్కే. ఎవరన్నా వారి సంస్థ కోసం వారానికి 50 గంటలు పని చేస్తున్నారనుకుందాం. మీరు 100 గంటలు పని చేయాలి. ఫలితంగా,రెండింతల పని పూర్తవుతుంది. తర్వాత కాలంలో, ఆ ఇతర కంపెనీలలా పనిచేసినా ఫరవాలేదు.గొప్ప బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి!రెండవ సంగతి. మీరు ఏదైనా కంపెనీ ప్రారంభిస్తున్నా లేదా ఏదైనా కంపెనీలో చేరదలచుకున్నా కూడా ప్రజ్ఞావంతుల సాహ చర్యం లభించేటట్లు చూసుకోండి. పెట్టదలచుకుంటే ప్రతిభా వంతులతో కంపెనీ పెట్టండి లేదా మీరు గౌరవించే ప్రతిభావంతులున్న కంపెనీలో చేరండి. కంపెనీ అంటే ఏమిటి? ఒక వస్తువును తయారు చేసేందుకు లేదా ఒక సేవను అందించేందుకు కొంతమంది ఒకచోట చేరి, కలసికట్టుగా పనిచేయడం. అంతేనా? ఒక బృందంలోనివారి శక్తియుక్తులు, కష్టపడి పనిచేసే తత్త్వం, సరైన దిశలో సమన్వయంతో, సమష్టిగా దృష్టి కేంద్రీకరించి పని చేయడాన్ని బట్టి ఆ కంపెనీ విజయం ఆధారపడి ఉంటుంది. అందుకని, కంపెనీని నెలకొల్పదలిస్తే, గొప్ప వ్యక్తులందరినీ ఒక చోట చేర్చేందుకు ఏం చేయాలో అంతా చేయండి. పూర్తిగా మీ పని మీదే దృష్టి పెట్టాలి!హంగు ఆర్భాటాలకన్నా శ్రేష్ఠతపై దృష్టి పెట్టడం మూడవ అంశం. చాలా కంపెనీలు ఈ విషయంలో గందరగోళంగా ఉంటాయి. వస్తువును మెరుగుపరచడానికి, వాస్తవానికి ఏ విధంగానూ తోడ్పని అంశాలపై అవి పెద్ద మొత్తంలో ద్రవ్యాన్ని వెచ్చి స్తూంటాయి. మేం ‘టెస్లా’లో ఎన్నడూ అడ్వర్టయిజింగ్ కోసం ఖర్చు పెట్టింది లేదు. కారును వీలైనంత గొప్పదిగా తీర్చిదిద్దేందుకు డిజైన్, తయారీ, పరిశోధన–అభివృద్ధి విభాగాలపైనే మొత్తం డబ్బు వెచ్చించాం. పయనించాల్సింది ఆ మార్గంలోనేనని అనుకుంటున్నా. ఆ మాటకొస్తే ఏ కంపెనీ విషయంలోనైనా సరే, ‘‘మనం చేస్తున్న ప్రయత్నాలు ప్రజల ఆశలను ప్రతిఫలిస్తున్నాయా? వాటి వల్ల మెరుగైన ఉత్పత్తి ఒనగూడుతోందా? సేవలు సమకూరుతు న్నాయా?’’ అని నిరంతరం ఆలోచిస్తూనే ఉండండి. లేదని భావిస్తే, ఆ ప్రయత్నాలకు అంతటితో స్వస్తి పలకండి. ట్రెండ్స్ను ఫాలో కావొద్దు!చివరగా చెప్పదలచుకున్నది ఏమంటే, గొర్రెదాటు మనస్తత్త్వం వద్దు. వర్తమాన ధోరణిని పరిశీలించాల్సిందే. కానీ, దాన్ని గుడ్డిగా అనుసరించ కూడదు. భౌతిక శాస్త్ర దృక్పథంతో చూడటం అన్నమాట. పోల్చి చూసి ఒక నిర్ణయానికి రావడం కన్నా, ఆ వస్తువుల మూలాల్లోకి వెళ్ళాలి. అత్యంత మౌలిక సత్యాలను తెలుసుకునేందుకు ఎంతవరకు అన్వేషించగలరో అంతవరకు అన్వేషించండి. తార్కికతను అక్కడ నుంచి వర్తింప జేయండి. ఒక వస్తువును సృష్టించడంలో లేదా ఏదైనా ఒక పని చేయడంలో ప్రయోజనం ఏమైనా ఉందా లేక మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు కనుక మనమూ అదే పనిచేస్తున్నామా అని తెలుసుకునేందుకు అదే సరైన మార్గం. ఆ విధంగా ఆలోచించడం కష్టం. అన్నింటి విషయంలోనూ అలాగే ఆలోచించలేం. దానికి చాలా కృషి చేయాలి. ఒప్పుకుంటాను. కానీ, మీరు ఏదైనా కొత్తది చేయదలచుకున్నప్పుడు, అదే ఉత్తమ మార్గం. అది అంతరాత్మ ప్రబోధాలకు వ్యతిరేకమైన అంశాలను అర్థం చేసుకునేందుకు భౌతికశాస్త్రం అభివృద్ధి చేసిన చట్రం. క్వాంటమ్ మెకానిక్స్ లాగా అది చాలా చాలా శక్తిమంతమైన పద్ధతి. రిస్క్ తీసుకోవాలి!అదీ సంగతి. ఇంకొక్కటి చెప్పదలచుకున్నాను. మీరు రిస్క్ తీసుకోవడాన్ని నేను ప్రోత్సహిస్తాను. అందుకు ఇదే సరైన సమయం. మీకు పిల్లాజెల్లా లేరు. బరువు బాధ్యతలు లేవు. మీలో కొందరికి బరువు బాధ్యతలు ఉంటే ఉండవచ్చు. బహుశా పిల్లలు మాత్రం ఉండి ఉండరు. వయసు పెరుగుతున్న కొద్దీ బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీకో కుటుంబం ఏర్పడ్డాక, రిస్కులు తీసుకోవడం ప్రారంభిస్తే, మీతోపాటు మీ కుటుంబంలోని వారు కూడా ఆ రిస్కులను స్వీకరిస్తున్నట్లు లెక్క. ఫలిస్తాయో లేదో తెలియని వాటిని ప్రయత్నించి చూడటం కష్టమవుతుంది. కనుక, సాహసించేందుకు ఇదే తగిన సమయం. బరువు బాధ్యతలు మీద పడకముందే, తెగించండి. ఏమైతే అదవుతుంది అనుకోండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈ విషయంలో మీ భుజం తట్టేందుకు నేను రెడీ. చేసిన పనికి చింతించాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్యూ. నా మాటలు మీకేమైనా ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు. మంచి విషయాలే మాట్లాడుకున్నాం అనుకుంటా! -
ఎవరిని ఉద్ధరించడానికి ఈ ఒప్పందం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం సృష్టించాయి. ట్రంప్ రోజుకో మాదిరిగా మార్చివేస్తున్న ఈ సుంకాలు ఎంతోకాలం మనలేవు. అయితే, వీటిని భౌగోళిక రాజకీయ ఆయు ధాలుగా ప్రయోగిస్తున్న తీరు మాత్రం రానున్న సంవత్సరాల్లో అంతర్జాతీయ వాణిజ్య రూపురేఖలను మార్చేస్తుంది.ఇతర దేశాలు తమ వస్తువుల మీద అధిక సుంకాలు విధిస్తు న్నాయని అదేపనిగా చెబుతూ అమెరికా ప్రపంచ ప్రజల దృష్టి మళ్లిస్తోంది. నిజానికి సుంకాల ముసుగులో అగ్రరాజ్యం అల్పా దాయ దేశాల అభివృద్ధిని బలిచేస్తూ, తమ కంపెనీలకు ప్రపంచ మార్కెట్లలో పెద్ద పీట వేయించడమే ఎజెండాగా పెట్టుకుంది. టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టకుండా చైనాను నిలువరించాలన్న వ్యూహాత్మక లక్ష్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. పేటెంట్లు, కాపీరైట్లు, పారిశ్రామిక డిజైన్లతో కూడిన మే«ధాసంపత్తి వర్ధమాన దేశాలకు అందకుండా నిరోధించడం అమెరికా ధ్యేయం. ఇండోనేషియాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇందుకు ఒక ఉదాహరణ.ఇండోనేషియాకు జరిగినట్టే...అమెరికా పారిశ్రామిక, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై ఇండో నేషియా 99 శాతం సుంకాలను ఎత్తివేసింది. ఇక ఆ దేశ ఎగు మతులపై అమెరికా 19 శాతం సుంకం విధిస్తుంది. ఈ ఒప్పంద ఫలితంగా ఇండోనేషియా రైతులు ప్రభుత్వ భారీ సబ్సిడీల ఫలితంగా చౌకగా లభించే అమెరికా వ్యవసాయోత్పత్తులతో పోటీ పడాల్సి ఉంటుంది. అమెరికా సంస్థలు అత్యధిక ప్రయోజనాలు పొందుతాయి. యూఎస్ తయారీ వస్తువులపై పరిమాణపరంగా ఎలాంటి నిబంధనలూ ఉండవు. అమెరికా వెహికల్ సేఫ్టీ నిబంధ నలను, ఉద్గార ప్రమాణాలను ఇండోనేషియా యథాతథంగా ఆమో దించింది. వైద్య పరికరాలు, ఔషధాల విషయంలోనూ అమెరికా ఎఫ్డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతులను అంగీకరిస్తుంది. యూఎస్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తులకు స్థానిక లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. మరింత సమస్యాత్మకంగా మేధాసంపత్తి నిబంధనలు ఉన్నాయి. సాంప్రదాయిక విజ్ఞానం, జన్యు వనరులు, నిర్బంధ లైసెన్సులు వంటి అంశాల్లో ఇప్పటికే ఉన్న అన్ని వివాదాలనూ పరిష్కరించుకోవాలని ఈ ఒప్పందం ఒత్తిడి చేస్తోంది. దీంతో, అమెరికా కంపెనీలు ఎలాంటి సమ్మతి పొందాల్సిన, పరిహారం చెల్లించాల్సిన అవసరం లేకుండానే అక్కడి సాంప్రదాయిక విజ్ఞా నాన్ని కొల్లగొడతాయి.ఇండియాకు ఏం లాభం?ఇలాంటి ఎజెండాతో ముందుకు పోతున్న దేశం అమెరికా ఒక్కటే కాదు. యూకేతో ఇటీవలే ఇండియా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇండోనేషియా ఒప్పందం కంటే ఎక్కువగా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. చెప్పాలంటే ఈ ఒప్పందానికి వాణిజ్యపరంగా ఎలాంటి ప్రాధాన్యతా లేదు. కారణం, ఈ రెండు దేశాలు ప్రపంచ వ్యాప్తంగా చేసే ఎగుమతుల విలువలో వీటి ద్వైపాక్షిక వాణిజ్యం 2.5 శాతం కంటే కూడా తక్కువే. యూకే–ఇండియా తాజా ఒప్పందం పర్యవసానంగా, 92 శాతం యూకే ఎగుమతులకు ఇండియా పూర్తిగానో పాక్షికంగానో సుంకాల మినహాయింపు ఇచ్చింది. అలాగే యూకేకు ఇండియా చేసే 99 శాతం ఎగుమతులు ‘ట్యాక్స్ ఫ్రీ’గా ఉంటాయి. వాటిపై ఆ దేశం ఎలాంటి సుంకాలూ విధించదు. అయితే, యూఎస్–ఇండోనేషియా ఒప్పందంలో వలే ఈ ఒప్పందంలోనూ మేధాసంపత్తి నిబంధనలు కీలకమైనవి. ఇవి పశ్చిమ దేశాల పేటెంట్ దారులకు అనుకూల రీతిలో ఉన్నాయి. ఔషధాల విషయంలో భారత పౌరులు, దేశీయ ఉత్పత్తి సంస్థల కంటే యూకే ‘బిగ్ ఫార్మా’ ప్రయోజనాలకే ప్రాధాన్యం లభించింది. ఉదాహరణకు, నిర్బంధ లైసెన్సులకు బదులు ‘స్వచ్ఛంద లైసెన్సు’లను ఈ ఒప్పందం ప్రోత్సహిస్తోంది. భవిష్యత్తులో ధరల తగ్గింపు అవకాశాలను ఈ నిబంధన నీరుగార్చుతుంది. పేటెంటు ప్రమాణాల సమన్వయీకరణ క్లాజుకూ ఇండియా అంగీకారం తెలిపింది. దీంతో ప్రస్తుత ఔషధాలకు చిన్నా చితకా మార్పులు చేసి వాటి పేటెంట్ హక్కులు పొడిగించుకునే దొడ్డిదారికి ద్వారాలు పూర్తిగా తెరచినట్లయింది.ఇండియాలో పేటెంటెడ్ డ్రగ్ వాడకం వివరాలు వెల్లడించాల్సిన గడువును ఏడాది నుంచి మూడేళ్లకు పొడిగించే నిబంధన వినాశ కరమైంది. గిరాకీకి తగినంత సరఫరా లేదని (అన్ మెట్ డిమాండ్) నిరూపించడం ఆ ఔషధం ఉత్పత్తి చేయదలచిన కొత్త దరఖాస్తు దారుకు కష్టతరంగా మారుతుంది. ఇవి ఫార్మా పరిశ్రమ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయి. అంతే కాకుండా, అందుబాటు ధర లకు మందులు లభ్యం కాని పరిస్థితి ఉత్పన్నమవుతుంది.బలహీన పడిన ఒక మాజీ వలసవాద దేశానికి, అదీ ప్రధాన వాణిజ్య భాగస్వామి కూడా కానటువంటి దేశానికి ఇండియా ఇలా రాయితీలు ఇవ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ), యూఎస్లతో జరుపుతున్న వాణిజ్య చర్చల మీదా ఈ ఒప్పందం వల్ల మరింత ఆందోళనకరమైన ప్రభావం పడుతుంది. ప్రొ‘‘ జయతీ ఘోష్వ్యాసకర్త యూనివర్సిటీ ఆఫ్ మసాచూసెట్స్లో ఎకనామిక్స్ ప్రొఫెసర్ -
తలతిక్క సుంకాల తలనొప్పి!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన బృందంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై భారత్ నాలుగు నెలలు చర్చలు జరిపినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నవాటిపై 26 శాతం సుంకం విధిస్తామని ఏప్రిల్ 2న బెదిరించిన ట్రంప్ ఆగస్టు 30న 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.చర్చలు మొదలైనప్పటి నాటికన్నా పరిస్థితి ఇపుడు మరింత దారుణంగా తయారైంది. రష్యా నుంచి చమురు, రక్షణ సామగ్రి కొనుగోళ్ళను నిలిపివేయకపోతే జరిమానా కింద మరికొంత సుంకాన్ని విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఆ సుంకం శాతాన్ని నిర్దిష్టంగా ప్రకటించలేదు. భారత్ సుంకాలు ప్రపంచం మొత్తంమీద చాలా ఎక్కువగా ఉన్నాయని, ద్రవ్యేతర వాణిజ్య చర్యలు ‘‘అత్యంత శ్రమ పెట్టేవిగా, అప్రియమైనవిగా’’ ఉన్నాయని ఆయన అన్నారు.ట్రంప్ కోరుతున్నదేమిటి?అమెరికాతో వాణిజ్యం విషయంలో, ట్రంప్ కుయుక్తులను, మనం ఎలా అర్థం చేసుకోవాలి? అన్ని రకాల చర్చలనూ విరమించుకోవాలా లేక లొంగిపోవాలా? ద్వైపాక్షిక వాణిజ్య లోటును నిర్మూలించే పేరుతో ట్రంప్ మొదలెట్టిన జూదం దాని భాగస్వామ్య దేశాలకు ఎంత రుచించని దైనా, ఆయన లక్ష్యాలు మాత్రం స్పష్టం. అమెరికాతో వాణిజ్యంలో మిగులులో ఉన్న దేశాలు, ఆ వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు నాలుగు చర్యలు తీసుకోవాలని ట్రంప్ కోరుతున్నారు. 1. సుంకం పైసా కూడా లేకుండా అన్ని అమెరికా ఉత్పత్తులకూ సంపూర్ణ మార్కెట్ సౌలభ్యం కల్పించడం; 2. అమెరికాకు ఎగుమతి చేసే వాటిపై 15–25 శాతం సుంకం విధించడానికి అంగీకరించడం; 3. వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు వీలుగా అమెరికా నుంచి ఇపుడు కొంటున్నవాటికి తోడుగా విమానాలు, ఇంధనం వంటివాటిని కొనడం; 4. అమెరికాలో వస్తూత్పత్తికి పెట్టుబడులు పెట్టడం.చాలా దేశాలు రెండు కారణాలతో అమెరికాకు ఎగుమతులు ఇష్టపడతాయి. ఒకటి– అది చాలా పెద్ద మార్కెట్ (మొత్తం ప్రపంచం ఎగుమతుల్లో సుమారుగా 15 శాతం దానికే వెళుతున్నాయి), రెండు – ఎగుమతిదారులకు లాభాలు సమకూరుతాయి. కానీ అద నపు సుంకాల భారాన్ని నెత్తికెత్తుకుని అనిష్టంగానైనా ఎగుమతులు చేస్తే వారికొచ్చే లాభాలు ఏమీ ఉండవు. అదనపు సుంకాల భారాన్ని భరించినా ఎంతో కొంత లాభాన్ని మిగుల్చుకోగలిగిన అవకాశం భారతీయ ఎగుమతిదారులకు లేదు. కనుక, అదనపు 25 శాతం సుంకానికీ, జరిమానా సుంకానికీ భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు.తీర్చలేని డిమాండ్లుజన్యుపరంగా సవరించిన గింజలతో తీసిన వంటనూనె దిగు మతులను (జీఎం నూనె మనుషుల ఆరోగ్యానికి మంచిది కాదని నిరూపించే శాస్త్రీయ అధ్యయనాలు ఏవీ జరగలేదు), పాడి పరిశ్రమ ఉత్పత్తులను, పౌల్ట్రీ ఉత్పత్తులను (అమెరికన్ చికెన్ లెగ్స్ వినియోగదారుల సంక్షేమాన్ని మెరుగుపరుస్తాయి) అనుమతించడం అంటే... వ్యావసాయిక వాణిజ్యాన్ని భారత్ సరళీకృతం చేయడం. ఇది వివేకవంతమైన చర్యగానే తోస్తుంది. కానీ, దేశీయ రైతులను సంరక్షించవలసిన బాధ్యత వల్ల, ఈ విషయంలో భారత దేశం పాలుపోని స్థితిలో ఉంది. వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికాకు ఎలాంటి రాయితీలూ ఇవ్వగలిగిన స్థితిలో ఇండియా లేదు. భారతదేశ రక్షణ అవసరాలకు ఒదగని లేదా మరీ ఖరీదుతో కూడిన ఎఫ్–35 విమానాలను లేదా ముడి చమురును కొనాలని అమెరికా బలవంతపెట్టడం బ్లాక్ మెయిల్ చేయడమే! దానికి లొంగి పోతే భారత్ బలహీనమైనదనే ముద్రపడుతుంది. ఇక భారత్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించడమేకానీ, ఇవ్వడం చాలా అరుదు. విదేశాల్లో భారత్ పెట్టుబడులు కొద్దిగానే ఉన్నాయి. రానున్న 5–10 ఏళ్ళలో, అమెరికాలో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడం కూడా మనకు కష్టమే. ట్రంప్ అడుగుతున్న నాలుగింటిలో దేన్నీ తీర్చగల స్థితిలో ఇండియా లేదు.ట్రంప్ నాలుగు డిమాండ్లకూ వియత్నాం, జపాన్, ఇండో నేషియా, యూరోపియన్ యూనియన్ మాత్రమే అంగీకరించాయి. అమెరికా అదనపు సుంకాలను దిగమింగుకుని ఈ దేశాల ఎగుమతిదారులు తమ వస్తువుల ధరలను తగ్గిస్తారా లేక అమెరికా వినియోగదారులకు ఆ భారాన్ని బదలీ చేస్తారా? లేక రెండింటి మిశ్రమంతో ముందుకు సాగుతారా? ఆ యా ఎగుమతి దేశాలు అదనపు సుంకాలను తామే భరించడంలో లేదా అమెరికా వినియోగ దారులకు బదిలీ చేయడంలో విఫలమైతే నష్టపోయేది అమెరికా, దాని వినియోగదారులే! ఇచ్చిన వాగ్దానం మేరకు, ఆ యా దేశాలు, నిజంగా చెప్పినంత సంఖ్యలో విమానాలను, ఇంధన ఉత్పత్తులను, రక్షణ పరికరాలను కొనుగోలు చేయగలుగుతాయా? దానికి చాలా కాలం పడుతుంది. పైగా, వాటి ధరలు తగ్గించాలని అవి అమెరికాను డిమాండ్ చేయవచ్చు. తాము దిగుమతి చేసుకుంటున్న వస్తువులు ఇలా ఉండాలి, అలా ఉండాలని చర్చలతో సుదీర్ఘ కాలయాపన చేయ వచ్చు. ఈ తతంగం ద్వారా ట్రంప్ ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారో అది నెరవేరకపోవచ్చు. లేదా ఆశించింది కొండంత, లభించింది ఆవగింజంతగా పరిణమించవచ్చు. ఇండియా ముందున్న మార్గంభారత్ ఎదుట రెండు అవకాశాలున్నాయి. ఒకటి– జపాన్, వియత్నాం, ఇండోనేషియా, యూరోపియన్ యూనియన్ల మాదిరిగా తలొగ్గి ఒప్పందం కుదుర్చుకోవడం. తర్వాత, భారత్ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎగువ పేర్కొన్న ఎత్తుగడలను అనుసరించడం. రెండు– ట్రంప్ వాణిజ్య బృందంతో అన్ని చర్చలకూ స్వస్తి పలికి, ఏ సుంకాలు విధించుకుంటావో విధించుకో అనడం. అదనపు సుంకాల భారాన్ని నెత్తిన రుద్దుకోకుండా, వస్తువులను వాటి సాధారణ ధరలకే విక్రయించవలసిందని ఎగుమతిదారులకు నచ్చజెప్పడం. అమెరికాలోని దిగుమతిదారులు కొంటే మంచిదే. లేదంటే, ఆ వస్తువులను, అటువంటి అసంబద్ధ సుంకాలు లేని ఇతర దేశాలకు విక్రయిచడం. దేశీయ మార్కెట్ లోనూ అమ్ముకునేటట్లు చూసుకోవడం. కొన్ని ఎంపిక చేసుకున్న వాటికి అంగీకరించి, మధ్యే మార్గాన్ని అనుసరించడం వల్ల భారత దేశానికి పెద్దగా ఒనగూడేది ఏమీ ఉండదు. అంతకంటే, రెండవ దారిని ఎంచుకుని ముందుకు సాగడమే మంచిది. ట్రంప్ పాలనా యంత్రాంగం తలతిక్కతో తీసుకుంటున్న సుంకాల చర్యల ప్రతికూల పర్యవసానాలను త్వరలోనే (మహా అయితే 3–6 నెలల్లో) చవిచూడవలసి రావచ్చు. అమెరికా దిగు మతులు మందగిస్తాయి (ఏప్రిల్–జూన్ త్రైమాసిక గణాంక వివ రాలు దాన్ని ధ్రువపరుస్తున్నాయి). సుంకాల రాబడి కింద అమెరికాకు కొద్ది వందల బిలియన్ల డాలర్లు లభించవచ్చు. కానీ, దానిలో చాలా భాగాన్ని అమెరికాలోని దిగుమతిదారులు, వినియోగదారులే చెల్లించవలసి ఉంటుంది. ధరలు మంట పుట్టించడంతో వినియోగ దారుల తిరుగుబాటుకు ఎంతో కాలం పట్టదు. పరిస్థితులు తేటతెల్లమవుతున్నకొద్దీ, ట్రంప్ తాను విధించిన చాలా సుంకాలను వెనక్కి తీసుకోక తప్పదు. అందుకే ఇండియా వేచి చూడటమే మంచిది. దానివల్ల పెద్దగా ఖర్చయ్యేదేమీ ఉండదు.సుభాష్ చంద్ర గర్గ్ వ్యాసకర్త ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అన్యాయమా? ఆలస్యపు న్యాయమా?!
బొంబాయి హైకోర్టు జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్ల ద్విసభ్య ధర్మాసనం జూలై 21న ఒక చరిత్రా త్మకమైన తీర్పు ఇచ్చింది. అది పదిసంవత్సరాల కింద జరిగిన అన్యాయాన్ని కొంతవరకు సరిదిద్దడం మాత్రమే గాని పూర్తి న్యాయం అనడానికి కూడా వీలు లేదు.ప్రత్యేక మకోకా న్యాయస్థానం 2015లో అయిదుగురు నిందితులకు విధించిన మరణశిక్ష, ఏడుగురికి విధించిన యావజ్జీవ శిక్ష చెల్లవని, పందొమ్మిదేళ్లుగా జైలులో మగ్గుతున్న నిందితులు నేరం చేశారని ప్రాసిక్యూషన్ నిస్సందేహంగా రుజువు చేయలేకపోయిందని, తప్పుడు సాక్ష్యాలు సృష్టించిందని, పోలీసు కస్టడీలో చిత్రహింసలు పెట్టి నేరాలు ఒప్పించారని, కూటసాక్ష్యాలు తయారుచేశారని, దర్యాప్తు ప్రక్రియ కళ్లకు గంతలు కట్టుకున్నట్టు ఇతర అవకాశాల వైపు చూడకుండా ఎవరో ఒకరిని ఇరికించి శిక్ష విధించే లక్ష్యంతో సాగిందని హైకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.దేశంలో కొనసాగుతున్న పోలీసు వ్యవస్థ మీద, దర్యాప్తు యంత్రాంగం మీద, ప్రాసిక్యూషన్ మీద, కిందిస్థాయి న్యాయ వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శనాత్మక వ్యాఖ్యానం ఇది.పందొమ్మిది సంవత్సరాల కింద, 2006 జూలై 11న ముంబాయి సబర్బన్ రైళ్లు రద్దీగా ఉండే సమయంలో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లలో వరుస బాంబు పేలుళ్లు జరిగి 187 మంది మరణించారు, ఎనిమిది వందల మంది గాయపడ్డారు. ఈ దారుణ మారణకాండకు వ్యతిరేకంగా దేశమంతా నిరసన పెల్లు బికింది. మహారాష్ట్రలో అప్పుడు అధికారంలో ఉండిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కేసు దర్యాప్తు చేయడానికి నియమించిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కొద్ది నెలల్లోనే 13 మంది నేరస్థులను పట్టుకున్నామని ప్రకటించింది.సరైన దర్యాప్తు జరపకుండానే కొందరు ముస్లిం అనుమానితులను పట్టుకుని వారి చేత నేరం ఒప్పించి కేసు నడిపే ఆనవాయితీని పాటించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ, లష్కర్ ఎ తోయెబా, దేశంలో నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లా మిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, కొందరు భారతీయ అను చరులతో కలిసి కుట్ర చేసి ఈ బాంబు దాడులు చేశారని మహా రాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మకోకా), భారత శిక్షా స్మృతి, ఆయుధాల చట్టం, చట్ట వ్యతిరేక కార్యకలా పాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నడిపారు. ప్రత్యేక మకోకా న్యాయస్థానం 2007లో విచారణ ప్రారంభించి, 2015 సెప్టెంబర్లో పదమూడు మంది నిందితులలో పన్నెండు మందికి శిక్షలు విధించి, ఒకరిని నిర్దోషిగా విడుదల చేసింది. అలా నిర్దోషిగా విడుదలైన వ్యక్తి డా‘‘ అబ్దుల్ వహీద్ షేఖ్ ప్రస్తుత హైకోర్టు తీర్పుకు ప్రధాన కారకులలో ఒకరు. అప్పటికి తొమ్మిది సంవత్సరాల పాటు జైలులో మగ్గిపోయి నిర్దోషిగా విడుదలయ్యాడు. అరెస్టుకు ముందు ఆయన ముంబైలో ఉపాధ్యాయుడుగా పని చేసేవారు. రాజకీయాలలో పాల్గొనడం కాదు గదా, వాటి మీద ఆసక్తి కూడా ఎన్నడూ చూపలేదు. తాను, తన ఉద్యోగం, కుటుంబంగా ఉండేవారు. జైలులో ఉన్న కాలంలో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎల్ఎల్బీ చదివాడు. విడుదలయ్యాక శిక్షలు పడిన ఇతరనిందితులు కూడా తనలాగనే నిర్దోషులేననీ, వారి మీద ప్రాసిక్యూషన్ తప్పుడు కేసు బనాయించిందనీ, వారిని కూడా నిర్దోషులుగా న్యాయస్థానంలో నిరూపించడమే తన లక్ష్యమని ‘ఇన్నోసెన్స్ నెట్వర్క్’ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి హైకోర్టు అప్పీలు ప్రక్రియలో పాలు పంచుకున్నాడు. ‘అక్విట్ అండర్ ట్రయల్’ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నిరపరా ధులైన ఖైదీల విషాద గాథలు వినిపించాడు. ఎల్ఎల్ఎం చదివి, దేశంలో నేర విచారణ వ్యవస్థ మీద పీహెచ్డీ చేశాడు. దేశమంతా ఎన్నోచోట్ల సభల్లో ఈ కేసు గురించి మాట్లాడాడు. ‘బేగునా ఖైదీ’ (నిరపరాధులైన ఖైదీలు) అని ఆయన ఉర్దూలో రాసిన పుస్తకం ఎన్నో భాషల్లోకి అనువాదమై ఈ కేసులో పోలీసులు, ప్రాసిక్యూషన్ చేసిన అక్రమాల గుట్టు విప్పింది.ఒకవైపు సామాజిక స్థాయిలో ఈ పోరాటం చేస్తూనే, న్యాయపోరాటాన్ని కూడా కొనసాగించాడు. మొత్తం కేసులో ప్రాసిక్యూషన్ వాదన అంతా నిందితుల ఒప్పుదల ప్రకటనల మీదనే ఆధారపడిందని, ఆ ఒప్పుదల ప్రకటనలు చిత్రహింసలు పెట్టి తయారు చేసినవని ఆయన వాదించాడు. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఇతర సాక్ష్యాలు ఆకుకు అందకుండా పోకకు పొందకుండా, పరస్పర వైరుద్ధ్యాలతో ఉన్నాయని చూపాడు. పేలుడు పదార్థాలకు సంబంధించిన కీలక ఫోరెన్సిక్ నిర్ధారణలు బలహీనంగా, వీరే నిందితులు అని నిర్ధారించడానికి వీలులేకుండా ఉన్నాయని చూపాడు. సమాంతరంగా జరిగిన పరిశోధ నలు కూడా నిజంగా నేరస్థులు ఇతరులని నిర్ధారించాయి.అప్పీలులో ఈ వాదనలను కూలంకషంగా పరిశీలించి హైకోర్టు ఇచ్చిన 671 పేజీల తీర్పు... ఆ ఒప్పుదల ప్రకటనల విశ్వసనీయతను ప్రశ్నించింది. సందర్భ సాక్ష్యం బలహీనంగా ఉందని చెప్పింది. కాల్ డాటా రికార్డులలో, అవి ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చడంలో ప్రాసిక్యూషన్ తప్పులు చేసిందని చెప్పింది. సాక్షులు పరస్పర విరుద్ధంగా, పొంతన లేకుండా మాట్లాడారని గుర్తించింది. ప్రాసిక్యూషన్ చట్టపరమైన నిబంధ నలను ఉల్లంఘించిందని గుర్తించింది. ‘ఈ పోరాటం నా ఒక్కడిదే కాదు. అది సత్యం కోసం, న్యాయం కోసం, అన్యాయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మా సమూహం కోసం జరిపిన పోరాటం’ అన్నాడు వహీద్. ఇప్పుడు నిర్దోషులుగా, లేదా నేరం చేశారని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేక పోయినవారిగా బైటపడిన పన్నెండు మందిలో ఒకరు 2021లో కోవిడ్తో జైలులోనే చనిపోయారు. మిగిలిన వారందరూ వారి ఇరవైల్లో జైలుకు వెళ్లి ఇప్పుడు నలభయ్యో పడి దగ్గర పడుతుండగా విడుదల అవుతున్నారు. అందుకే హైకోర్టు తీర్పు రాగానే వహీద్ ‘ఈ తీర్పు అసంపూర్ణం. కోర్టు కేసు పునర్విచారణకు ఆదేశించ లేదు. రెండు దశాబ్దాల జీవితం నష్టపోయినవారికి పరిహారం గురించి మాట్లాడలేదు. కనీసం ఇప్పటికైనా నిజమైన నేరస్థులను పట్టు కొమ్మని ప్రాసిక్యూషన్కు చెప్పలేదు. అయితే ఇవాళ్టి భారతదేశంలో ఈ అసంపూర్ణ తీర్పు అయినా ముస్లింలకు గొప్ప విజ యమే’ అన్నాడు. ఈ నిర్దోషులు ఇంతకాలం అనుభవించిన తప్పుడు ముద్ర తర్వాత, విచ్ఛిన్న మైన తమ జీవితాలను పునర్నిర్మించుకోగలరా? ఆలస్యంగా జరిగిన న్యాయం అన్యాయమే అన్నమాట మరొకసారి రుజువు అవుతున్నదా? -ఎన్. వేణుగోపాల్, వ్యాసకర్త ‘వీక్షణం’ సంపాదకుడు -
జేమ్స్ కామెరన్ (డైరెక్టర్) రాయని డైరీ
‘అవతార్–3’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. సన్నగా మళ్లీ కడుపునొప్పి మొదలైంది! డైవర్టిక్యులిటిస్!! డాక్టర్లు ఈ నొప్పికి పేరైతే పెట్టారు కానీ, నయమవటం మాత్రం నా చేతుల్లోనే ఉందంటారు. నా చేతుల్లో అంటే – నేను తినే వాటిల్లో! ‘‘మిస్టర్ కామెరన్! ఇలా నొప్పి వచ్చినప్పుడు మీరు కొద్ది రోజుల పాటు కూరగాయల రసం మాత్రమే తాగండి. అలాగే గుజ్జు లేని పండ్ల రసాలు...’’ అంటారు వైద్యులు. ఈ మందు చీటీ నా దగ్గర ‘అవతార్–1’ ముందు నుంచే ఉంది. పొత్తి కడుపు కింద, ఎడమవైపు సన్నగా మొదలైన నొప్పి... కాసేపు మెలిపెడుతోంది, కాసేపు కత్తితో పొడిచినట్లుగా ఉంటోంది. ఆత్మశక్తిని కూడదీసుకుని పని చేస్తున్నాను. ‘‘ఏంటి మళ్లీనా?’’ అన్నారు, నా పక్కనే ఉన్న స్టీఫెన్ ఇలియెట్. ఫిల్మ్ ఎడిటర్ తను. అతడికి నా డైవర్టిక్యులిటిస్ గురించి తెలుసు.‘‘లేదు, లేదు... స్టీఫెన్, ఏదో కొద్దిగా! అంతే’’ అన్నాను, నవ్వే ప్రయత్నం చేస్తూ. పెయిన్ కన్నా కూడా పని ఆగి పోవటం ఎక్కువ పెయిన్ నాకు. డిసెంబర్లో ‘అవతార్–3’ రిలీజ్ పెట్టుకున్నాం. ఆ లోపే నేను అన్నీ సర్దేసుకుని న్యూజిలాండ్ వెళ్లిపోవాలి. ఇప్పటికి రెండుసార్లు యూఎస్ సిటిజెన్షిప్కు అప్లికేషన్ పెట్టి కూడా వెనక్కు తీసుకున్నాను. మొదటిసారి 2004లో జార్జి బుష్ అమెరికా ప్రెసిడెంటుగా రీ–ఎలెక్ట్ అయినప్పుడు. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ డోనాల్డ్ ట్రంప్ రీ–ఎలెక్ట్ అయినప్పుడు. హారిఫిక్ ప్రెసిడెంట్లు ఇద్దరూ! ఇలాంటి వాళ్లు మళ్లీ గెలవటం అంటే ఒకే కారుకు పదే పదే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండటం. అమెరికాను వదిలి, న్యూజిలాండ్ వెళ్లటం అంటే కేవలం ఇల్లు మారటం కాదు. ఒక మంచి ఇంట్లోకి మారటం! న్యూజిలాండ్ అందర్నీ సమానంగా చూస్తుంది. కెనడా నుంచి వెళ్లిన వారినైనా, వేరే ఖండం వారే అయినా అక్కడ ప్రశాంతంగా జీవించవచ్చు. ప్రశాంతంగా జీవించటం అంటే, జీవితమంతా ఇష్టంగా చేస్తూ వచ్చిన పనిని జీవితాంతమూ కొనసాగిస్తూ ఉండటం. నేనైతే ఎనభై ఏళ్లకీ, తొంభై ఏళ్లకీ ఎన్ని ‘అవతార్’లు తీయగలిగితే అన్నీ తీస్తూనే ఉంటాను. ఇక తీయలేనప్పుడు, సినిమా తియ్యటం ఎంత తేలికో పిల్లలకు చెబుతూ ఉండిపోతాను. న్యూజిలాండ్ వెళ్లినప్పుడు నన్నొక పట్టభద్రుడు కలిశాడు. ‘‘సర్! నేను సినిమా డైరెక్టర్ని అవ్వాలనుకుంటున్నాను. అవగలనా?’’ అని అడిగాడు.‘అవగలనా?’ అనుకుంటే ఎవరూ అవలేరు.‘‘అవలేనా!’ అనుకుంటే ఎవరైనా అవగలరు అన్నాను.అతడి కళ్లు మెరిశాయి. ‘‘ఒక కెమెరా తీసుకో. ఒక కథ అనుకో. చిన్న కథా, చెత్త కథా అని చూడకు. నీ ఫ్రెండ్స్ చేత యాక్ట్ చేయించు. నీకు సిస్టర్ ఉంటే తనకూ ఒక పాత్ర ఇవ్వు. షూటింగ్ అయ్యాక టైటిల్స్లో డైరెక్టర్గా నీ పేరు పెట్టుకో. ఇక అప్పట్నుంచీ నువ్వు సినిమా డైరెక్టర్! నువ్వెంత బడ్జెట్లో తీస్తావో, నీకెంత ఇవ్వాలో నిర్మాతలతో బేరం కుదుర్చుకో’’ అని చెప్పాను. మెరుస్తున్న అతడి కళ్లలో నాకు ‘జెనోజెనిసిస్’ సినిమా కనిపించింది. నా 24 ఏళ్ల వయసులో మా టీమ్ తీసిన తొలి సినిమా అది. 12 నిమిషాల సైన్స్ ఫిక్షన్ షార్ట్ ఫిల్మ్! ‘‘కామెరన్... కామెరన్... మళ్లీ మీరు న్యూజిలాండ్ వెళ్లిపోయారా?’’ అని, నా భుజం ఊపుతూ పండ్ల రసం అందించారు స్టీఫెన్.‘‘థ్యాంక్యూ స్టీఫెన్’’ అన్నాను, అతడి చేతిలోని గ్లాసును తీసుకుంటూ. స్టీఫెన్ నా భుజం ఊపినప్పుడు ఏ యాంగిల్లోనో నా కడుపు నొప్పి కాస్త తగ్గినట్లుగా అనిపించింది.కదలిక వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తోందీ అంటే నాకెందుకో నమ్మకం కలుగుతోంది – నేను ముందసలు అమెరికా నుంచి కదిలితే, ఈ డైవర్టిక్యులిటిస్ నన్నొదిలేస్తుందని!-మాధవ్ శింగరాజు -
ఇండియన్ ఎకానమీ ‘డెడ్ ఎకానమీ’నా?
‘ఇండియన్ ఎకానమీ... డెడ్ ఎకానమీ’ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం, వెనువెంటనే రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలను సమర్థించడం; శశిథరూర్, రాజీవ్ శుక్లా లాంటి కాంగ్రెస్ నేతలే రాహుల్ వ్యాఖ్యల్ని తప్పు పట్టడం... తాజా పరిణామాలు.నిజానికి ఏ ప్రభుత్వం పనితీరును అయినా అంచనా వేయడా నికి కీలక అంశం ద్రవ్యోల్బణం. అది ముఖ్యంగా... పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ప్రభావితం చేస్తుంది. యూపీఏ రెండో హయాంలో ప్రజల్లో ఏర్పడిన ఆగ్రహానికి ఒక కారణం... దేశంలోని ద్రవ్యోల్బణం. ఇది అప్పట్లో గరిష్ఠంగా 12 శాతానికి చేరుకుంది. ఆ తరువాత ప్రతిపక్ష నేతలు... ఆర్థిక మాంద్యాన్ని, ద్రవ్యోల్బణాన్ని ఆయుధంగా మలచుకుని మోదీ ప్రభుత్వాన్ని బద్నాం చెయ్యాలని పదేపదే ప్రయత్నించారు. కానీ... వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్పటికీ, ద్రవ్యోల్బణం అనేది 2019 ఎన్నికల్లో గానీ, 2024 ఎన్నికల్లో గానీ ప్రముఖ ఎన్నికల నినాదంగా మారలేదు. ద్రవ్యోల్బణాన్ని నిర్ధారించటానికి మన దేశంలో... 2012 వరకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)ని అనుసరించారు. ఆ తర్వాత నుంచి కంజ్యూ మర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)ని అనుసరిస్తున్నారు. ఎన్డీయే హయాంలో సగటు సీపీఐ ద్రవ్యోల్బణం 5.03 శాతంగా ఉంది. ఇది ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4 శాతం నుండి 6 శాతానికి మధ్యలో ఉంది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం రేటు ఇంకా తక్కువగా... 3.1 శాతమే ఉంది. కాబట్టి ఇది ఆల్ టైవ్ు రికార్డ్ అన్నమాట! మోదీకి ముందు ప్రధానిగా పని చేసిన మన్మోహన్ సింగ్ పాలనా కాలంతో పోల్చినా కూడా ఇది ఎంతో మెరుగైన స్థితి. తక్కువ సమయంలో ద్రవ్యోల్బణం అంతగా నియంత్రణ అయిందంటే, దాని పైన ప్రభుత్వ ప్రభావం ఉందనే కదా! దీర్ఘకాలిక ద్రవ్యోల్బణ సమస్యను అధిగమించడంలో మోదీ ప్రభుత్వం తెచ్చిన అనేక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు సహాయపడ్డాయి.అంతకుముందు, భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువుల రవాణాలో... పర్మిట్లు, పన్నుల పరంగా ఆలస్యం చోటు చేసుకునేది. జీఎస్టీ రావడంతో పరిస్థితి మారిపోయింది. దీనివల్ల రవాణా వేగంగా జరిగి ఇంధన ఆదా పెరిగింది.క్రూడాయిల్ ధరలలో తగ్గుదల, డిజిటల్ సంస్కరణలు, పాల నలో అవినీతి తగ్గడం... ముఖ్యంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు నేరుగా అందేలా చెయ్యడం కూడా ద్రవ్యోల్బణ నియంత్రణకు తోడ్ప డ్డాయి. ప్రజలకి డబ్బులివ్వడం కంటే... వాళ్లకి పనికొచ్చే నాణ్యమైన ఇళ్ళను ‘పీఎమ్ ఆవాస్ యోజన’ ద్వారా ప్రభుత్వమే కట్టించి ఇవ్వడం, టాయిలెట్లు కట్టించి ఇవ్వడం లాంటి ప్రత్యక్ష ప్రయోజన కార్యక్రమాలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయ పడ్డాయి. కార్పొరేట్ పన్ను తగ్గింపులు, పీఎల్ఐలతో సహా అనేక పథకాలతో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్రం సఫలమైంది. ఇవన్నీ పటిష్ఠమైన ఆర్థిక క్రమశిక్షణతో వచ్చాయి. వాటి కారణంగానే ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలలో 4వ స్థానానికి మనం ఎగబాకాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుత పరిస్థితులపై ఎవరైనా ఒక అంచనాకు రావాలి.– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి ‘ సామాజిక విశ్లేషకుడు -
పట్టాలెక్కాల్సిన సంస్కరణలెన్నో!
ప్రభుత్వం గత పదేళ్ళుగా పెట్టుబడి వ్యయాన్ని రక్షణతోపాటు మరో రెండు రంగాలపై కేంద్రీకరించింది. ఆ రెండూ రోడ్లు, రైల్వేలు. తిరిగి రైల్వేలలో కూడా వేగంగా వెళ్ళే అధునాతన రైళ్ళను ప్రవేశ పెట్టడం, నూతన మార్గాలను జోడించడం, మెట్రో వ్యవస్థలను అభివృద్ధి చేయడంపైన చాలా వరకు దృష్టి పెట్టారు. రైల్వేలపై ప్రభుత్వ వ్యయం కొనసాగే అవకాశం ఉంది. రైళ్ళ విషయంలో ఆదర్శంగా తీసుకోదగిన ఇతర దేశాలలోని సేవలను మన దేశంలో కూడా అందించే విధంగా సంస్కరణలపై దృష్టి పెట్టడానికి ఇదే అనువైన సమయం. ముఖ్యంగా రెండు విభాగాలు ఈ సందర్భంగా మదిలో మెదు లుతాయి. రైల్వేల పనితీరుకు సంబంధించి నిర్దిష్ట కోణాలలో మొత్తంగా వ్యవస్థలను సంస్కరించవలసి ఉంది. ఇది మొదటగా చేయాల్సిన పని. దీనివల్ల ప్రయాణికులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలందుతాయి. భద్రతా పెరుగుతుంది. రెండు: రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ. ఫలితంగా, రైల్వేలకు కొంత రాబడి దక్కుతుంది. నూతన రాబడి మార్గాలను సృష్టించుకునేందుకు ఉన్న ఆస్తులను వినియోగించుకునే కేటగిరీలోకి ఇది వస్తుంది. తీసుకోవాల్సిన భద్రతా చర్యలుగత ఏడాది నుంచి చోటుచేసుకుంటున్న వివిధ సంఘటనల పాఠాలు భద్రతపైన కూడా దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నాయి.అందుకే: 1. సబర్బన్ రైళ్ళ బోగీలకు ఆటోమేటిక్ తలుపులను అమర్చాలి. దీనివల్ల రైళ్ళలో వెళుతున్నప్పుడు ప్రయాణికులు గాయపడే అవకాశాలు తగ్గుతాయి. 2. సుదూరాలకు పయనించే రైళ్ళలో జనరల్ బోగీలు వాటి సామర్థ్యానికి మించి కిటకిటలాడుతూ ఉంటాయి. ఇది ప్రయాణికుల మధ్య సిగపట్లకు, కొండొకచో ప్రమాదాలకు కారణమవుతోంది. అన్ని టికెట్లనూ రిజర్వేషన్ల ప్రాతిపదికనే విక్రయించాలి. 3. పట్టాలు, సిగ్నలింగ్ వంటివాటిలో లోపాల వల్ల సంభవిస్తూ వచ్చిన ప్రమాదాలను నివారించేందుకు భద్రతా పరిక రాలను ప్రథమ శ్రేణికి చెందిన వాటినే వినియోగించాలి. 4. విసర్జించినవి సాఫీగా వెళ్ళిపోయేందుకు వీలుగా మరుగుదొడ్ల వ్యవస్థలను ఆధునీకరించేందుకు బోగీలను పూర్తిగా మార్చాలి లేదా తగిన మార్పులు చేపట్టాలి. 5. విమానాశ్రయాల మాదిరిగానే అన్ని రైల్వే స్టేషన్ల చుట్టూ పూర్తిగా కంచెను ఏర్పాటు చేయాలి. ప్రహరీని దాటి ప్రయాణికులు మాత్రమే లోపలికి ప్రవేశించే వీలుండాలి. 6. చివ రగా, ప్రభుత్వం మూలధన వ్యయంలో కొంత భాగాన్ని ప్లాట్ ఫారాల నిడివిని, ఎత్తును పెంచేందుకు వినియోగించాలి. దీంతో ప్రయాణికులు చాలా బోగీలున్న రైళ్ళను కూడా సురక్షితంగా ఎక్కగలుగుతారు, దిగగలుగుతారు. ఇవన్నీ ప్రాథమిక పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉపయోగపడే సూచనలు. బడ్జెట్లో తగు కేటాయింపులతో సులభంగా ఈ సదుపాయాలు కల్పించుకోవచ్చు.చేయాల్సిన కొన్ని సంస్కరణలురైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ మరో పార్శ్వం. విమానాశ్రయాల విషయంలో అనుసరించిన పద్ధతినే వీటికీ వర్తింపజేయవచ్చు. సదు పాయాలు పెంచి యూజర్ చార్జీలు వసూలు చేసుకోవచ్చు. చార్జీలు పెంచినా, అవి ప్రయాణికుల సంఖ్యపై అరుదుగానే ప్రభావం చూపడం మన దేశంలో గమనించవచ్చు. దేశంలోని చాలా ప్రాంతా లను రైల్వేలే అనుసంధానపరుస్తూండటం దానికి కారణం. 1. ప్రయాణికులకు మాత్రమే స్టేషన్ల లోపలికి ప్రవేశం ఉండాలి. టికెట్ కోడ్ చూపిస్తేనే తలుపులు తెరచుకునేటట్లు చేయవచ్చు. విజిటర్ల సంఖ్యను వీలైనంత పరిమితం చేయాలి. ప్రయాణికులలో అన్ని వయసులవారు ఉంటారు కాబట్టి, వారికి తోడుగా వచ్చేవారిని నివారించడం సాధ్యం కాకపోవచ్చు. ప్లాట్ ఫారమ్ టికెట్ ధరను పెంచితే, వీడ్కోలు పలకడానికి వచ్చేవారి సంఖ్య దానంతట అదే తగ్గుతుంది. 2. పోర్టర్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. నిర్ణయించిన ధరలను పోర్టర్లకు తప్పనిసరి చేయాలి. అదే సమయంలో, లిఫ్టులు, ఎస్కలేటర్లను ప్రవేశపెడితే, ప్రయాణికులు వారి లగేజీని వారే తీసుకెళ్ళగలుగుతారు. 3. స్టేషన్ల వద్ద దోపిడీకి వీలు కల్పిస్తున్న మరో అంశం ట్యాక్సీలు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్తో ్రíపీ–పెయిడ్ సౌకర్యాన్ని అన్ని స్టేషన్ల వద్ద కల్పించాలి. ఫలితంగా, ఎంత వసూలు చేస్తున్నారో తక్షణం తెలిసిపోతుంది. 4. రుచికి, శుచికి పూచీవహించే విధంగా అల్పాహార శాలలను పునర్వ్యవస్థీకరించాలి. దుకాణాల సంఖ్య, ధరల విషయాన్ని స్టేషన్ డెవలపర్కు విడిచి పెట్టవచ్చు. ప్రయాణికులలో అత్యధిక సంఖ్యాకుల ఆర్థిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తినుబండారాల ధరలను తక్కువ స్థాయిలో నిర్ణయించడం సముచితంగా ఉంటుంది. కావాలంటే, ఉన్నత తరగ తుల బోగీల్లో ప్రయాణించేవారికి వేరే దుకాణాలు పెట్టవచ్చు.కనులకు ఇంపుగా, అనుభవానికి పసందుగా ఉండే ఈ ప్రధాన రూపాంతరీకరణకు డబ్బులు ఖర్చయ్యే మాట నిజమే. విమానయాన సంస్థల మాదిరిగానే యూజర్ చార్జీల ద్వారా ఆ డబ్బును తిరిగి రాబట్టుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే, ఈ ఏడాది దాదాపు 350 కోట్లమంది సుదూరాలకు వెళ్ళే రైళ్లలో ప్రయాణిస్తున్నారు అనుకుందాం. వారిలో 300 కోట్ల మంది ద్వితీయ తరగతిలో, 50 కోట్ల మంది అప్పర్ క్లాస్లో ప్రయాణిస్తారని భావిద్దాం. హయ్యర్ క్లాసుల వారి నుంచి సగటున రూ. 200, సెకండ్ క్లాస్ వారి నుంచి రూ. 50 చొప్పున వసూలు చేసినా ఏడాదికి రూ. 25,000 కోట్ల ఆదాయం అదనంగా లభిస్తుంది. ఈ విషయంలో రకరకాల సమీకరణాలు రూపొందించు కోవచ్చు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామి మధ్య వాటిని పంచు కోవచ్చు. ఒకవేళ రైల్వే స్టేషన్లను ప్రైవేటు వ్యక్తులకు వేలం వేస్తే వారే ఆ లెక్కలు చూసుకుంటారు. ఈ రెండు ఐడియాలను వచ్చే పదేళ్ళలో దేశవ్యాప్తంగా అమలుపరచే దిశగా కృషి చేయాలి. అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది.మదన్ సబ్నవీస్ వ్యాసకర్త ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’లో చీఫ్ ఎకనామిస్ట్, ‘కార్పొరేట్ క్విర్క్స్: ద డార్కర్ సైడ్ ఆఫ్ ద సన్’ పుస్తక రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
సభాపతులకు 'సుప్రీమ్' పాఠం
పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టానికి సుప్రీం కోర్టు తాజా తీర్పు పదును తెచ్చింది. తెలంగాణలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల అనర్హతపై పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను, ఎట్టి పరిస్థితుల్లో మూడు నెలలు దాటకుండా పరిష్కరించాలని స్పీకర్కు గడువు నిర్దేశిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. చాలా కాలంగా ఏర్పడిన ఒక రాజ్యాంగ ప్రతిష్టంభన దీంతో తొలగిపోయినట్టయింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్పీకర్లు,మండలి చైర్మన్ల నిర్ణయ జాప్యం, తాత్సారం వల్ల చట్టం స్ఫూర్తికి ఇన్నాళ్లూ తూట్లు పడుతూ వచ్చింది. తాజా తీర్పుతో పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టానికి జవం, జీవం వచ్చినట్టయింది. ఇప్పుడిక, తెలంగాణలో పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? అదే జరిగితే బీఆర్ఎస్ ఆశిస్తున్నట్టు ఉప ఎన్నికలు తప్పవా? ఆ ఉప ఎన్నికలను తమ ఏడాదిన్నర పాలనకు రెఫరెండమ్గా స్వీకరించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా?ఇదివరకటి రాజ్యాంగ ధర్మాసనాలు ఇదే అంశంపై వెల్లడించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, భారత అత్యున్నత న్యాయస్థానం వెల్లడించిన తాజా తీర్పు పార్టీ మారిన పదిమంది తెలంగాణ శాసన సభ్యులను కలతకు గురిచేసేదే! శాసన వ్యవస్థ గొడుగు కింద రాజ్యాంగం తమకు కల్పించిన విశేష రక్షణ (ఇమ్యూనిటీ) ఈ విషయంలో వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన అన్వయం స్పీకర్లకు పాఠమే! ‘అనర్హత పిటిషన్ల విషయంలో ఎప్పటిలోగా నిర్ణయం ప్రకటించాలో న్యాయస్థానాలు తమకు గడువు విధించజాలవు’ అన్న స్పీకర్ల వాదన ఇక నిలువదు. ఎన్నికలు ముగిసిన స్వల్ప కాలంలోనే బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్) లను పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టం (1985) కింద అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి (హుజూరా బాద్), కె.పి.వివేకానంద (కుత్బుల్లాపూర్) స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ స్పందించక పోవడంతో వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఒక పార్టీ నుంచి గెలిచి, కనీసం ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీ తరఫున దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేయడాన్ని తప్పుపడుతూ బీజేపీ శాసన సభాపక్ష నేత అయిన మహేశ్వరరెడ్డి విడిగా న్యాయ స్థానంలో మరో పిటిషన్ వేశారు. అదే క్రమంలో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి (బాన్సువాడ), ఎం. సంజయ్ కుమార్ (జగిత్యాల), కాలె యాదయ్య (చేవెళ్ల), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), టి.ప్రకాశ్ గౌడ్ (రాజేంద్ర నగర్), ఆరెకపూడి గాంధీ (శేరిలింగం పల్లి) కూడా విపక్ష బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ శిబిరం చేరారు. చట్టంలోని ఒక నిబంధన ప్రకారం ఒక రాజకీయ పార్టీలోని ప్రజాప్రతినిధుల్లో మూడింట రెండొంతుల మంది వేరొక పార్టీలో చేరితో దాన్ని ‘విలీనం’ కింద ప్రకటించుకోవచ్చు. అప్పుడు వారికి అనర్హత వర్తించదు. అంటే, 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (ఎన్ని కైన 39లో మూడోవంతు) కాంగ్రెస్లోకి మారితే అది ‘విలీనం’ అవుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్లో తగ్గిన సంఖ్య తర్వాత అది 25కి తగ్గుతుందన్నా మరో 15 మంది (ఇప్పటికే పార్టీ మారిన పదిమందికి తోడు) మారాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అయ్యే పని కాదు. పార్టీ మారిన పదిమందిని అనర్హులుగా ప్రకటించకుండా స్పీకర్ ముందు మరే ప్రత్యామ్నాయమైనా ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్ను తిరస్కరించవచ్చు. ఆ నిర్ణయం ఆధారంగా వారు మళ్లీ న్యాయస్థానాన్ని సంప్రదిస్తారు. అప్పుడది కోర్టుల న్యాయ సమీక్షకు నిలబడాలి. ఒక్క నాగేందర్ తప్ప మిగతా సభ్యులు, తాము పార్టీ మారనే లేదు, ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని, స్పీకర్ తమను వ్యక్తి గతంగా సంప్రదించినపుడు చెప్పొచ్చు. తనపై లేనిపోని దుష్ప్రచా రాలు చేస్తున్నారు తప్ప, తాను పార్టీయే మారలేదని కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల) ఇదివరకు ఇలా ప్రకటించారు.ఎవరి ఎత్తుగడ ఏముంటుందో?ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక తెచ్చి తీరాలని విపక్ష నేత కె. చంద్రశేఖర రావు పట్టుదలగా ఉన్నారు. పదిమంది పార్టీ మారి కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు, తమ పార్టీ విప్ను ధిక్క రించినట్టు నిరూపించే ఆధారాలను స్పీకర్కు సమర్పించవచ్చు. పార్టీ మార్పిళ్ల నిరోధక చట్టంలో గతంలో మూడింట ఒక వంతు సభ్యులు బయటకు వచ్చి ఇతర పార్టీలో చేరినా వారిని ‘చీలిక’ వర్గంగా గుర్తించే వెసులుబాటుండేది. కానీ 2003లో జరిగిన ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఆ నిబంధనను తొలగిస్తూ, చట్ట సవరణ చేశారు. దాంతో ‘చీలిక’ను గుర్తించే వీలు లేదు. పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల అనర్హత కోరిన పిటీషన్లను స్పీకర్ తిరస్కరించే సాహసా నికి పార్టీ నాయకత్వం ఒడిగడుతుందా? అన్నది అనుమానమే! సుప్రీం కోర్టు తాజా తీర్పు, సమయ, నిర్బంధం దృష్ట్యా దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ తెలంగాణ స్పీకర్ నిర్ణయంపైనే ఉంటుంది.ప్రజా న్యాయస్థానాల్లో పార్టీ ఫిరాయింపుదారులకు ఎప్పుడూ చుక్కెదురే! 2014, 2018 ఎన్నికల్లో ఇతర పార్టీలో గెలిచి, తన పార్టీ లోకి వచ్చిన ఎందరో ఎమ్మెల్యేలకు కేసీఆర్ తర్వాత ఎన్నికల్లో టిక్కె ట్లిచ్చినా, వారిని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఏపీలో ప్రత్యర్థి వైఎస్సార్సీపీలో గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్ని చంద్రబాబు నాయుడు తన పార్టీలోకి తీసుకొని తర్వాత ఎన్నికల్లో టిక్కెట్లిచ్చినా, వారికీ ప్రజాకోర్టుల్లో ఘోరంగా చుక్కెదురైంది. స్పీకర్లు ఇంకా రోగుల్ని చంపలేరేమో?‘వీలయినంత త్వరగా మూడు నెలలు మించకుండా పిటిషన్లను పరిష్కరించాల్సిందే’ అని తీర్పిస్తూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ పరిస్థితుల్లో మేం ఏ నిర్దేశం ఇవ్వకుంటే రాజ్యాంగంలో పదో షెడ్యూల్ పొందుపరిచిన లక్ష్యమే చిన్నబోతుంది’’ అని వ్యాఖ్యానించింది. ‘‘తాము ఏ నిర్దేశమూ ఇవ్వకుంటే, ‘చికిత్స విజ యవంతమైంది, కానీ, రోగి చచ్చాడు’ అన్న పంథాలో స్పీకర్లు/ చైర్మన్లు సాగించే ప్రక్రియను మేం అనుమతించినట్టవుతుంది’’ అని కూడా అన్నది. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు సముచితంగా ఉండిందని, హైకోర్టు ధర్మాసనమే సదరు తీర్పులో కల్పించు కోవాల్సిన అవసరమే లేకుండిందని పేర్కొంది. చట్ట సభాపతుల నిర్ణయాలకు కాలపరిమితి విధించవచ్చో? లేదో అన్న ఇన్నినాళ్ల సందేహాలను పటాపంచలు చేస్తూ ఒక అంశం వెల్లడించింది. అన ర్హత పిటిషన్లను పరిష్కరించే క్రమంలో స్పీకర్/చైర్మన్లు న్యాయా ధికారులుగా, రాజ్యాంగ పదో షెడ్యూల్, పేరా 6(1) ప్రకారం, ట్రిబ్యునల్ హోదాతో, అధికరణం 226, 227 కింద, హైకోర్టు పరిధి లోకి, అధికరణం 136 కింద సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది. ‘రాజేంద్రసింగ్ రాణా’ కేసుతో సహా పలు కేసుల్లో రాజ్యాంగ ధర్మాసనాలు వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం న్యాయా ధికారులుగా వ్యవహరించేటప్పుడు స్పీకర్లు/చైర్మన్లకు రాజ్యాంగంలోని అధికరణాలు 122, 212 కింద రక్షణ లభించదనీ స్పష్టం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అనుచిత జాప్యాలకు కారణ మవుతున్న సభాపతులకు సుప్రీం తాజా తీర్పు గట్టి పాఠమే!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
సుప్రీంకోర్టు సంశయించకూడదు!
బిహార్లో ఓటర్ల జాబితాలపై ప్రత్యేక సునిశిత సవరణ (ఎస్.ఐ.ఆర్.–సర్) నిర్వ హించాలన్న భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదోపవాదాలను వింటోంది. ఈలోగా, ఆ తతంగానికి సంబంధించిన మొదటి దశ ఇటీవలే పూర్తయింది.రాష్ట్రంలో రాబోయే ఎన్నికల లోగా జాబితా లను మెరుగుపరచాలని ‘సర్’ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశ పూర్తయ్యేనాటికి జాబితాలో చేర్చాలని కోరుతూ 7.24 కోట్ల దర ఖాస్తులు వచ్చాయని కమిషన్ వెల్లడించింది. జాబితాల సవరణ మొదలుపెట్టిన జూన్ 24 నాటికి రాష్ట్రంలో నమోదై ఉన్న ఓటర్లసంఖ్య కన్నా అది 65 లక్షలు తక్కువ. పిటిషనర్ల ఆగ్రహానికి కారణాలు1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 21వ సెక్షన్ కింద ఓటర్ల జాబితాలను సవరించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంది. కానీ, రెండు ముఖ్యమైన అంశాలు పిటిషనర్లకు కోపం తెప్పించాయి. ఒకటి – 2003 తర్వాత నమోదైన ఓటర్లు అందరూ తిరిగి తమ పేర్లను నమోదు చేసుకోవాలనీ, అందుకు తగిన అర్హతను చూపాలనీ కోరడం. రెండు – వారు ఆ పని చేయడానికి ఒక నెల వ్యవధి మాత్రమే ఇవ్వడం. తిరిగి పేరు నమోదు చేసుకునేందుకు తక్కువ వ్యవధినివ్వడం, వేగంగా సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చూడటం వల్ల ఈ విధానం అపారదర్శకంగా తయారైంది. మూకుమ్మడిగా పేర్లు తొల గింపునకు గురవుతాయనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయినా, ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు కోర్టు తిరస్కరించింది. ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డులను కూడా ‘పరిగణన’లోకి తీసుకోవలసిందని మాత్రమే కోర్టు కోరింది. ఆ విధంగా చాలా మందిని అనర్హులుగా చేయనున్నారనే విమర్శలకు తావు ఇవ్వకుండా ప్రయత్నించింది. ఓటర్ల జాబితా ఎందుకు కీలకం?భారతదేశంలో ప్రజాస్వామ్య హృదయాన్ని పదిలపరచేది ఓటు హక్కేనని, దాన్ని వినియోగించుకోవడంలోని ప్రాధాన్యాన్ని వివరిస్తూ గతంలో కొన్ని తీర్పులు వెలువడ్డాయి. అయితే, ఓటు హక్కు చట్ట పరమైన హక్కుగానే మిగిలిపోయింది. దాని అస్తిత్వం ఒక ప్రత్యేక శాసనంతో ముడిపడి ఉంది. దానివల్ల వచ్చిన చిక్కేమిటంటే, ఆ హక్కు విషయంలో జోక్యం చేసుకోవచ్చు లేదా అది కొన్ని షరతులకు లోబడి ఉండేటట్లు చేయవచ్చు. నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 62వ సెక్షన్ పేర్కోంటోంది. ఫలితంగా, అర్హులైన ఓటర్లను గుర్తించడంలో ఓటర్ల జాబితాలను రూపొందించడం లేదా సవరించడం ముఖ్యమైన ప్రక్రియగా మారింది. గడువు ముగిసిన తర్వాత ఓటర్ల జాబితాలను సవరించడానికి అనుమతించబోమని ఒకసారి బిహార్ విషయంలోనే బైద్యనాథ్ పంజియార్ వర్సెస్ సీతారామ్ మహతో (1969) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.నమోదుకు కడపటి తేదీ ముగిసిన తర్వాత, ఓటర్ల జాబితా లకు సవరణ తేవడం, చేర్చడం లేదా తొలగించడం, ఒకచోటు నుంచి ఇంకో చోటుకు మార్చడం చేయకుండా 1960 నాటి నిబంధనలు నివారిస్తున్నాయి. జాబితాల సవరణపై స్టే విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించడం బట్టి, ప్రస్తుత కేసులో పిటిషనర్లకు అనుకూలంగా ఫలితం వస్తుందని ఆశించడానికి అటువంటి పూర్వ ప్రమాణాలు, నిబంధనలు స్ఫూర్తినిచ్చేవిగా లేవు. పైగా, సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రెండు కారణాల రీత్యా తోసిపుచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకటి– అటువంటి కేసులను సమీక్షించడానికి సుప్రీంకోర్టుకు ఉన్న పరిధులు పరిమితం. రెండు– ఎన్నికలను జాప్యం చేసేందుకే అలాంటి కేసులు పెట్టే ఎత్తుగడ అనుసరిస్తూ ఉంటారని సుప్రీంకోర్టుకు ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. ఫిర్యాదులు చేయడం సాధ్యమేనా?ఫిర్యాదులు చేసేందుకు లేదా సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు వీలుగా ఒక ఆంతరంగిక సమీక్షా యంత్రాంగాన్ని 1950 నాటి చట్టం సమకూరుస్తోంది. ఎన్నికల అధికారులపై ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. తదుపరి ఆదేశాలు జారీ చేయవలసిందిగా కమిషన్ను కోరవచ్చు. కోర్టులను ఆశ్రయించడానికి ముందు ఆ మార్గాలను అనుసరించవలసిందిగా కోర్టు గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్కు సంబంధించి ఎన్నికల జాబితాలను రూపొందించడం, మార్పు చేర్పులు చేయడంలో అవకతవకలు జరిగాయని, జోక్యం చేసుకోవలసిందని కోరుతూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం (1996)పై అనురాగ్ నారాయణ్ సింగ్ పెట్టిన కేసులో తలదూర్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బిహార్ సవరణ ప్రక్రియలోని న్యాయ బద్ధతను విశ్లేషించేటపుడు కోర్టు ఈసారి కూడా అదే రీతిలో, ఫిర్యాదు దారులందరినీ ఆ యా చట్టపరమైన ప్రక్రియల వైపు మళ్ళవలసిందిగా సూచించి చేతులు దులుపుకోవచ్చు. ఈ ఆంతరంగిక పరిష్కార యంత్రాంగాలలో వేళ్ళూనుకు పోయిన సమస్యలు చాలా ఉన్నాయని గతంలో వచ్చిన కేసులు చెబు తున్నాయి. ఫిర్యాదులతో వెళ్ళడం అధికారులకు రుచించకపోవడం వల్ల, వారు తమ అభ్యంతరాలను చెవికెక్కించుకున్నది లేదనికొందరు వాపోయిన సందర్భాలున్నాయి. పైగా, మురికివాడనివాసుల వంటి బలహీన వర్గాల పౌరులలో కొన్ని వర్గాలకు ఈ ప్రక్రియ అందని మావిపండుగానే ఉంది. ఓటరుగా అనర్హుడవని వచ్చిన నోటీసులను చదువు సంధ్యలు లేనివారు అర్థం చేసుకోగలరా? ఎన్నికల అధికారి ముందుకు వెళ్ళడం కోసమని దినసరి వేతన కార్మికుడు ఒక రోజు పనిని వదులు కోగలడా? న్యాయ పరిరక్షణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత బిహార్ ‘సర్’ కేసులో సుప్రీంకోర్టు గణనీయంగా కల్పించుకుని సరైన తీర్పరిగా వ్యవహరించవలసి ఉంది. ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో...లక్ష్మీ చంద్రసేన్ వర్సెస్ ఏ.కె.ఎం. హసన్ (1985) కేసులో ఓటర్ల జాబితాలను సవరించాలని ఆదేశించడానికి సుప్రీంకోర్టు వెనుకాడింది. అది ఎన్నికలపై న్యాయవ్యవస్థ అవాంఛనీయ జోక్యానికి కార ణమవుతుందనీ, ఒక్కోసారి ఎన్నికల నిరవధిక వాయిదాకు దారి తీస్తుందనీ కోర్టు కలవరపడింది. ఎన్నికలు ఎంత ఎక్కువగా అనివా ర్యమైతే, దానిలో జోక్యం చేసుకునేందుకు కోర్టు అంత ఎక్కువగా విముఖత చూపుతుందన్న అప్రకటిత సూత్రం ఒకటి ఉంది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకుంటే మాత్రం, అది మొత్తం ఎన్నికలను విషపూరితం చేసే అవకాశం ఉంటుంది కనుక కోర్టు ఆ బాధ్యతను భుజాలకు ఎత్తుకుంటుంది. దాన్ని పరిష్క రించేందుకు తదనంతరం, కోర్టు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు అవుతుందనే సాకుతో బిహార్ విషయంలో తలదూర్చేందుకు కోర్టు మొదట తిరస్కరించవచ్చు. ఓటర్ల జాబితాల సవరణ అక్రమమని ఒకవేళ కోర్టు భావించినా కూడా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం కానీ, అనర్హులుగా చేసే విధానాన్ని నివారించడం కానీ చేయకపోవచ్చు. భారతీయ ప్రజాస్వామ్యానికి కించిత్తు హాని జరుగుతుందని తలచినా అప్రమ త్తంగా ఉండే కాపలాదారు పాత్రనే సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో నిర్వహిస్తూ వచ్చింది. ఓటు వేసేందుకు ప్రజలకు ఉన్న హక్కు ప్రజా స్వామ్యానికి ప్రాథమిక పునాది కనుక ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను సుప్రీం కోర్టు చేపట్టడం ఇప్పుడు చాలా ముఖ్యం.-వ్యాసకర్త ‘విధి సెంటర్ ఫర్ లీగల్ స్టడీస్’ రిసెర్చ్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-అంశుల్ డాల్మియా -
228 మంది విద్యార్థినులకు ఒకే ఒక వాష్రూం!
బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువుకోవడం కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు లేక పిల్లలు నానా ఇబ్బందులు పడు తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉండే పిల్లలు ఇళ్ల దగ్గర ఉండి చదువుకోవడానికి కనీస సౌకర్యాలు, ఆర్థిక వనరులూ లేకపోవడం, ఎక్కడో దూరంగా ఉన్న స్కూల్కు వెళ్లడం కష్టం కావడంతో కొందరు పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇలాంటి పరిస్థితుల కారణంగా ఎంతో కొంత ఆదాయం వస్తుందని తమ పిల్లలను కూలీ నాలీ పనులకు పంపి స్తున్నారు. దీంతో ఆయా వర్గాల పిల్లల్ని బడిబాట పట్టించేందుకు ఏర్పాటు చేసినవే సంక్షేమ హాస్టళ్లు. ప్రస్తుతం ఏపీలో ఉన్న హాస్టళ్లకు కొన్నింటికి సొంత భవనాలు ఉండగా, మరి కొన్నింటిని ప్రయివేటు అద్దె గృహాల్లో నిర్వహిస్తున్నారు.ఇక్కడ చదువుకునే పిల్లలకు వసతితో పాటు, పోషకాహారం అందించాలి. పరిశుభ్రమైన పరిస్థితులు కల్పించాలి. అక్కడే నివాసం ఉండేలా వార్డెన్లను నియమించాలి. పిల్లల ఆరోగ్య అవసరాల కోసం వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఈ హాస్టళ్లలో ఎక్కువగా ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన పిల్లలే ఉంటారు కనుక ఆయా వర్గాలకు చెందిన సంక్షేమ శాఖల నుంచే నిధులు కేటాయిస్తారు. గిరిజన బిడ్డల కోసం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. ఇదంతా కాగితాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవని ఇటీవల ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్రంగా ఆక్షేపించింది.ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాల పిల్లలకు చెందిన హాస్టళ్ల నిర్వహణ అత్యంత దయనీయంగా మారిందనీ, ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని హాస్టళ్లలో కంటే వారి ఇళ్ళల్లోనే పిల్లలు సురక్షితంగా ఉండగలరనీ హైకోర్టు అభిప్రాయపడడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది. సంక్షేమ హాస్టళ్లలోని ఘోరమైన పరిస్థితుల గురించి దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం నేపథ్యంలో జిల్లా న్యాయ సేవాధి కారులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో అనేక వాస్తవాలు వెల్లడయ్యాయి.చదవండి: విద్యారంగం బతికే భరోసా ఏదీ?నర్సీపట్నం (Narsipatnam) సంక్షేమ హాస్టల్లో 228 మంది విద్యార్థినులు ఉండగా వారికి కేవలం ఒకే ఒక మరుగుదొడ్డి ఉంది. అలాగే విజయనగరంలోని అంధుల ఆశ్రమ పాఠశాలలో 33 మంది విద్యార్థులు ఉండగా ఒక్క సహాయకుడు కూడా లేడు. వారు ఎలా మనగలుగుతున్నారో అర్థం కాదు. అదే జిల్లాకు చెందిన మరో సంక్షేమ హాస్టల్లో కేవలం పదిగదుల్లో 168 మంది విద్యార్థినులను కుక్కేశారు. కొన్నిచోట్ల పైకప్పు పెచ్చులూడి పిల్లలు గాయాల పాలైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఆహారంలో పురుగులు, కలుషిత తాగునీరు వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. ఇక వార్డెన్ల లైంగిక వేధింపులు, సొంత పనులను విద్యార్థినీ, విద్యార్థులకు పురమాయించడం మామూలే. ఇవన్నీ వెలుగులోకి రాకుండా నిర్వాహకులు కప్పిపుచ్చుతున్నారు.- ప్రొఫెసర్ పీటా బాబీ వర్ధన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం పూర్వ విభాగాధిపతి -
చైనా బలం ఏమిటి?!
ప్రపంచాన్ని కొన్ని వందల సంవత్సరా లుగా పాలించి శాసిస్తున్న పాశ్చాత్య దేశా లను తట్టుకుని నిలవాలని, వాటితో సమాన స్థాయికి ఎదగాలని భావిస్తున్న చైనా... ఆ లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నట్లుగానే కనిపిస్తోంది. అయితే తన లక్ష్య సాధన కోసం చైనా వ్యూహం ఏమిటి? ఆ వ్యూహంలోని బలమెంత? అనే ఆలోచనలు– చైనా గురించి కొంత తెలిసి ఉండి, కొన్నాళ్లు అక్కడికి వెళ్లి గమనించిన మీదట కలుగుతాయి. అవమానాల శతాబ్దం (1839 –1949) నుంచి పునరుజ్జీవన శతాబ్దం (1949–2049) లోకి ప్రవేశించదలచిన చైనా, అందుకు అవసరమైన విధంగా వరుసగా కొన్ని పాఠాలను చరిత్ర నుంచి, వర్తమానం నుంచి తీసుకుంటూ వస్తున్నది. చైనా వ్యూహానికి పునాదులు వేసినది ఆ పాఠాలే! మావో ప్రయోగాల ప్రభావంచైనాకు మొదట అవమానాల శతాబ్ది ఎదురు కావటానికి ప్రధాన కారణం... చివరిదైన ఛింగ్ రాజ వంశ కాలంలో ఫ్యూడల్ వ్యవస్థాపరమైన అభివృద్ధి నిజంగానే గొప్పగా ఉండినా, ఆ కాలపు యూరప్, జపాన్లలో వలె పరిశ్రమలు, సైన్స్, టెక్నాలజీ, సైన్యం, చైనాలో ఆధునికం కాకపోవటం. ఇక రెండవ కారణం... సువిశాల దేశమైన చైనాలోని వేర్వేరు ప్రాంతాలు, ప్రజల మధ్య తగిన ఐక్యత లేకపోవటం. కనుక, కమ్యూనిస్టు విప్లవం తర్వాత పునరుజ్జీవన కాలంలో ఈ రెండూ సాధించటం చైనా ప్రాధాన్య లక్ష్యం అయింది.అయితే, మావో ఒక సోషలిస్టు స్వాప్నికుడు అయినందున, ఆర్థికా భివృద్ధిని కోరుకుంటూనే సామాజిక సమానత్వానికి అంతకన్న పెద్ద పీట వేయాలని భావించటంతో 1976 వరకు ఆయన జీవిత కాలంలో పలు ప్రయోగాల వల్ల చైనా ఒడుదొడుకులకు లోనైంది. మరొకవైపు, అవమానాల శతాబ్ది నాటి సైనిక పరాజయాలు గుర్తున్నందున కొరియా యుద్ధంలో, ఇతరత్రా కూడా తమ సైన్యం బలహీన మైనదయినప్పటికీ అమెరికా, రష్యా, జపాన్లను ధిక్కరించి చైనా నిలిచింది తప్ప గతంలో వలె లొంగిపోలేదు. అది చైనా ప్రజలకు స్ఫూర్తిదాయకమైన ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది.‘తియానన్మెన్’ తిరుగుబాటుమావో అనంతరం డెంగ్ శియాగో పింగ్ కాలం మొదలుకొని చైనా, ప్రపంచాన్ని చూసి ఆధునీకరణ పాఠాలు నేర్చుకోవటం ఆరంభించింది. ఆర్థికంగా, సైనికంగా, విద్యా–వైజ్ఞానికపరంగా. ఆర్థికసంస్కరణలు అందుకు తొలి అడుగయ్యాయి. అదే సమయంలో – పేదరికం, నిరుద్యోగం వల్ల విద్యార్థులు, యువకుల నుంచి సామా జికంగా ఒక పెద్ద కుదుపు మొదలై 1989లో తియానన్మెన్ స్క్వేర్ తిరుగుబాటు తలెత్తింది. తియానన్మెన్ తిరుగుబాటు... సామాజికాభి వృద్ధితో పాటు, ఆర్థికాభివృద్ధి కూడా వేగంగా జరిగి, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకూ చేరాలన్న పాఠాన్ని చైనాకు నేర్పింది. ఇరాక్ –అమెరికా కూటమి మధ్య జరిగిన గల్ఫ్ యుద్ధం (1991), సైనికంగా ఇరాక్ వంటి స్థితిలోనే గల తమపై ఒకవేళ అమెరికా దాడి జరిపితే ఏమి కావచ్చునో అర్థం చేయించింది. తర్వాత అదే సంవ త్సరం (1991) చివరలో సాటి సోషలిస్టు దేశమైన సోవియెట్ యూనియన్ పతనం చైనాకు అనేక పాఠాలను నేర్పింది. ఒక విధంగా ఈ మూడు పరిణామాలు లేదా పాఠాలు చైనా నాయకత్వపు ఆలోచ నలకు, భవిష్యత్ వ్యూహానికి పదును పెట్టాయి. వ్యూహాత్మకంగా ‘డబ్ల్యూటీ వో’లోకి! భవిష్యత్తులో ఏమి సాధించాలన్నా ఆర్థికాభివృద్ధి అందుకు ప్రాతిపదిక కాగలదని బోధపడటంతో, ఒకవైపు అంతర్గతంగాసంస్కరణలను కొనసాగిస్తూనే మరొకవైపు విదేశీ సాయాలు, పెట్టు బడులు, వాణిజ్యం కోసం డబ్ల్యూటీవోలో చేరటం తప్పనిసరి అనే నిర్ణయానికి చైనా వచ్చింది. అందుకు అమెరికా అంగీకారం అవసరం గనుక, ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండు’ అనే వ్యూహాన్ని పాటిస్తూ అమెరికాను మెప్పించి 2001లో ఆ సంస్థలో సభ్యత్వం సంపాదించింది. అప్పటినుంచి చైనా ఇక వెనుదిరిగి చూడలేదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కమ్యూనిస్టు రష్యా కూలిన తర్వాత కమ్యూనిస్టు చైనా బలహీనపడాలని అమెరికా కోరుకోవాలి గానీ, డబ్ల్యూటీవోలో చేరి బలపడాలని ఎందుకు భావిస్తుంది? దీనికి స్వయంగా అమెరికన్లు ఇచ్చే వివరణను బట్టి అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్, చైనా ఆర్థికంగా అభివృద్ధి చెందే కొద్దీ వారి సంపదలు, కోరికలు, సమాజం, సంస్కృతి వంటివి మారి క్రమంగా పాశ్చాత్య సమాజం వలె మారుతుందని, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కోరుకున్న తియానన్మెన్ నాటి ధోరణి బలపడుతుందని, ఆ విధంగా కమ్యూనిజం అంతర్ధానమై పెట్టుబడిదారీ వ్యవస్థ, పశ్చిమ దేశాల తరహా ప్రజాస్వామ్యం రాగలవని అంచనా వేశారు. కానీ, అది గ్రహించిన చైనా నాయకత్వం తన తరహా వ్యవస్థను తాను నిర్మించు కుంటూ ముందుకు సాగింది. బుష్ ఆలోచన నెరవేరలేదు.కేంద్రీకృత మార్క్సియన్ పాలనఇప్పుడు వెనుదిరిగి సమీక్షిస్తే చైనాకు తన తరహా వ్యవస్థ అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం మనకు కనిపిస్తున్నవి. అవి : దేశ అవసరాలు, ప్రజల అవసరాలు, రక్షణ అవసరాలు, విద్యా వైజ్ఞానిక అవసరాలు తీరటంతో పాటు; తమ అంతర్గత పెట్టుబడు లకు, విదేశాలలో పెట్టుబడులకు, అమెరికా కూటమి ఒత్తిళ్లను తట్టు కునేందుకు చాలినంతగా సంపదలు వృద్ధి చెందటం. ప్రజల అవస రాలు తీరి, తలసరి ఆదాయాలు పెరుగుతూ, పేదరికం వేగంగా తొల గిపోతూ తియానన్మెన్ వంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండ టం. ఈ తరహా వృద్ధి అన్నదే చైనీస్ సోషలిజంగా స్థిరపడి క్లాసికల్ సోషలిజం భావన మరుగున పడటం. అదే సమయంలో ఈ నమూ నాకు ఆటంకాలు అంతర్గతంగా కానీ, బయటి నుంచి గానీ ఎదురవ కుండా, కేంద్రీకృత మార్క్సియన్ పాలనా వ్యవస్థ అమలు అవటం. అసలు వ్యవస్థనే వ్యతిరేకించని మేరకు ప్రజలు స్వేచ్ఛగా ఉండటం.‘బహుళ ధ్రువ’ నినాదంఈ క్రమంలో, తమ నమూనా సరైనదని చైనా నాయకత్వానికి గల నమ్మకాన్ని మరింత పెంచిన పరిణామాలు మరొక రెండు చోటు చేసుకున్నాయి. మొదటిది, 2008లో పాశ్చాత్య ప్రపంచం ఆర్థికసంక్షోభంలో చిక్కుకుని 1930ల నాటి ఆర్థిక మాంద్యాన్ని గుర్తు చేయగా, చైనాలో వృద్ధి రేటు మరింత పెరిగింది. ఆ తర్వాత 2019లో కోవిడ్ సమస్యను అమెరికా ఎదుర్కొనలేకపోగా, చైనా సమర్థవంతంగా బయటపడింది. ఇదే 21వ శతాబ్దంలో మరో స్థాయిలోఇంకొకటి కూడా జరిగింది. తమ పలుకుబడిని ప్రపంచవ్యాప్తం చేసుకుంటూ పోతేగానీ అమెరికాను తట్టుకుంటూ, క్రమంగా అమె రికాను బలహీనపరచలేమని భావించిన చైనా నాయకత్వం అందుకు తగిన వ్యూహం తయారు చేసింది. ఆ ప్రకారం 2009 నుంచి బ్రిక్స్ను, 2013 నుంచి బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ను బలోపేతం చేస్తూ, ఏకధ్రువ ప్రపంచం స్థానంలో బహుళ ధ్రువ ప్రపంచమే వాంఛనీయ మన్న నినాదాన్ని ముందుకు తెచ్చింది. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం, ప్రపంచ ఆరోగ్యసంస్థ, అంతర్జాతీయ న్యాయస్థానం, యునిసెఫ్ మొదలైన వాటిని అమెరికా తన స్వార్థం కోసం బలహీనపరుస్తున్నందున, వాటిని ప్రపంచ దేశాలు పరిరక్షించుకోవాలని వాదిస్తున్నది. ఈ క్రమంలో తాజాగా తలెత్తిన సమస్య... డబ్ల్యూటీవో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా అమెరికా అన్ని దేశాలపై ఏకపక్షంగా సుంకాలు పెంచి, వారిని ఒత్తిడి చేసి, తమకు అనుకూలంగా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవటానికి ప్రయత్నించటం. ఆ తీరును చైనా తీవ్రంగా వ్యతి రేకించటం మిగతా సభ్యదేశాలను ఆకర్షిస్తున్నది. ఈ విధమైన ఆంతరంగిక, ప్రాపంచిక విధానాలు, వ్యూహాలూ కలిసి చైనా సమగ్ర, దీర్ఘకాలిక వ్యూహానికి బలంగా మారుతున్నట్లు కనిపిస్తున్నది. 2049 నాటికి పునరుజ్జీవనం పూర్తయి, తైవాన్ విలీనంతో ప్రపంచంలో ఆర్థి కంగా చైనా మొదటి స్థానానికి చేరటం జరుగుతుందా? వేచి చూడాలి. -వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు- టంకశాల అశోక్ -
వలస కార్మికుల వెల లేని శ్రమ!
రియాక్టర్ల పేలుళ్లు, రసాయనాల లీకేజీలు, షార్ట్ సర్క్యూట్స్, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేకనే తరచూ జరుగుతున్నాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం పరిశ్రమ యాజమాన్యాల తీవ్ర నిర్లక్ష్యమే. గడచిన ఐదేళ్లలో 600కు పైగా జరిగిన పారిశ్రామిక ప్రమాదాల్లో 1,116 మంది మృత్యువాత పడ్డారు, ఇంకా ఎంతో మంది క్షతగాత్రులై జీవచ్ఛవాలుగా బతుకు లీడుస్తున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ తెలియజేస్తోంది.ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పాశ మైలారం పారిశ్రామిక ప్రాంతంలో ‘సిగాచి’ పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదంలో 46 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా పదుల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్సలు పొందు తున్నారు. కనీస భద్రత లేని పరిస్థితుల్లోనే కార్మికులు పనిచేసినట్లు, యాజమాన్యపు తీవ్ర నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి ప్రధాన కార ణమని ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ ప్రమాదంపై నిపు ణుల కమిటీ ఇచ్చిన నివేదిక సిగాచి కంపెనీ సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయా లనే సూచనను కూడా కమిటీ చేసింది.అంతేకాదు ఆయా కంపెనీల్లో పని చేసే వలస కార్మికుల వివరాలు కార్మిక శాఖ దగ్గర ముందే ఉండాలనే కీలక సూచన చేయడం అభినందించదగ్గ అంశం. పారిశ్రామిక, వ్యవసాయ, నిర్మాణ రంగంలో వలస కార్మికులు లేనిదే పనులు జరగని పరిస్థితి ఈనాడు దేశంలో ఉంది. దేశ నిర్మాణంలో వీరిదే కీలక పాత్ర. స్థూల జాతీయోత్పత్తిలో 10% వలస కార్మికుల శ్రమ నుంచే వస్తుందని లెక్కలు చెబుతున్నాయి. ఇలాంటి వలస కార్మికుల పరిస్థితి నేడు అత్యంత దయనీయంగా మారింది. పర్మినెంట్ కార్మికుల కంటే ఏడు రెట్లు అధికంగా వలస కార్మికులు ఉన్నట్లు జాతీయ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ వెల్లడించిన గణాంకాల మాట. ముఖ్యంగా పరిశ్రమలలో పనులకు కుదిరిన వలస కార్మికులను బానిసల కంటే దారుణంగా పరిశ్రమల యజమానులు ఉపయోగించుకుంటున్నారు. అతి తక్కువ వేతనాలు ఇచ్చి, భద్రత లేని పని ప్రదేశాల్లో అధిక గంటలు పనిచేయిస్తూ ఉత్పత్తులను పెంచుకుంటున్నారు. రసాయన, ఔషధ పరిశ్రమలోనే ఎక్కువగా ప్రమాదాలు జరగ టానికి కారణం నిపుణులను నియమించుకోవలసిన చోట వారిని కాదని తక్కువ వేతనాలకు దొరికే వలస కార్మికులను నియమించుకోవడమే. వీరికి తక్కువ నైపుణ్యాలు ఉండటంతో నిర్వహణ లోపాలు జరిగి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా పరిశ్రమల యాజమాన్యాలను అధికారులు దోషులుగా ఎప్పుడూ నిలపలేదు, వారికి శిక్షలు పడింది కూడా లేదు. ప్రమాదం జరిగిన ప్రతి సారీ కార్మికుల నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం జరిగిందనే నెపం వారి మీదనే వేస్తూ యాజమాన్యాలు తప్పించుకుంటు న్నాయి. ఇక ప్రమాదాల్లో చిక్కుకొని మరణించినవారికీ, క్షతగాత్రులుగా మిగిలిన వారికీ చెల్లించే పరిహారం విషయంలో కూడా వలస కార్మికులకు తీరని నష్టం జరుగుతోంది. వలస కార్మికులు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నారు. ఈ వలసలను నివారించాలంటే ఆ యా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలి. కానీ అలాంటి అలోచనలు పాలకులు చేయడం లేదు. రానున్న ఐదేండ్లలో భారతదేశంలో 70 శాతం కొలువులు నగరాలలోనే పోగుబడనున్నాయని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడిస్తోంది. దీంతో చదువుకున్న వారూ, చదువు కోని వారూ గ్రామాలను వదిలి నగరాలకు వలస వెళ్లే సంఖ్య మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వలస కార్మికుల సంక్షేమానికి తగిన చట్టాలు చేసి తమ వంతు బాధ్యతను నెరవేర్చాలి.– పి.వి. రావు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
తెలివి కన్నా ఎంపిక ముఖ్యం
ప్రిన్స్టన్! ప్రతిష్ఠాత్మకమైన ప్రైవేట్ ఐవీ లీగ్ రిసెర్చ్ యూనివర్శిటీ! యూఎస్లోని న్యూజెర్సీలో ఉన్న 278 ఏళ్ల నాటి ఈ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయ 2010 సంవత్సరపు పట్టభద్రుల బ్యాచ్ని ఉద్దేశించి ఆ ఏడాది మే నెలలో అమెజాన్ సంస్థాపకుడు జెఫ్ బెజోస్ ఉత్తేజ పూరితమైన ప్రసంగం చేశారు. పుట్టుకతో మనకున్న వరాలతోనా, లేక మనం ఎంచుకునే మార్గాలతోనా ఎలా ముందుకు సాగటం?... అనే ఆలోచనను తన ప్రసంగం ద్వారా – జీవితంలోకి ప్రవేశించ బోతున్న ఆ గ్రాడ్యుయేట్లలో – రేకెత్తించారు జెఫ్ బెజోస్. ఏనాటికీ పాత పడని ఆనాటి ఆయన ప్రసంగం... సంక్షిప్తంగా! చిన్నప్పుడు వేసవి సెలవులకు తాతయ్య, నానమ్మ దగ్గరకి టెక్సాస్ వెళ్లేవాడిని. వారికక్కడ పెద్ద కమతం ఉంది. గాలి మరలు బిగించడంలో, పశువులకు టీకాలు వేయటంలో, ఆ వ్యవసాయ క్షేత్రంలో ఇతర చిన్నా చితక పనులు చేయడంలో సాయపడేవాడిని. మా తాతయ్య, నానమ్మ ఒక సేవా కార్యక్రమాల కారవాన్ క్లబ్లో సభ్యులుగా ఉండేవారు. వారికో చైతన్య రథం లాంటిది ఉండేది. దానిలో అన్నపానాలకు, స్నానానికి, విశ్రమించేందుకు సదుపాయా లుండేవి. మా తాతయ్య కారుకి దాన్ని తగిలించేవాళ్లం. అందరూ కలసి దానిలో అమెరికా, కెనడాలలో పర్యటిస్తూ ఉండేవాళ్లం. సాధార ణంగా వేసవిలో నేను వారితో కలిసేవాడిని. తాతయ్య, నానమ్మ అంటే నాకు ప్రేమ. ఒక రకమైన ఆరాధన. వారితో కలసి తిరిగేందుకు ఆశగా ఎదురు చూస్తూండే వాడిని. ప్రతిదీ నాకు లెక్కే!నాకు పదేళ్లప్పుడు చేసిన ఒక ప్రయాణం బాగా గుర్తుంది. తాతయ్య కారు నడుపుతూంటే, నానమ్మ ఆయన పక్క సీట్లో కూర్చుంది. నేను వెనక సీట్లో దొర్లుతున్నా. ఈ ప్రయాణాల్లో ఆమె ఒకటే దమ్ము కొడుతూ ఉండేది. నాకు ఆ సిగరెట్ల వాసన గిట్టేది కాదు. అప్పట్లో నోటితో లెక్కలు కట్టేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ నేను వదులు కునేవాడిని కాను. పెట్రోల్ ఎన్ని కిలోమీటర్లకు సరిపోతుందో లెక్కవేయడం నుంచి సరుకులపై ఖర్చులను అంచనా వేయడం వరకు... పనికొచ్చేవీ, పనికిరానివీ అన్నీ లెక్కలు కడుతూండేవాడిని. ధూమపానం చేయగల హాని గురించి అంతకు ముందు నేనొక అడ్వర్టయిజ్మెంట్ చూశాను. ఇపుడు పూర్తి వివరాలు గుర్తు లేవు కానీ, ‘‘సిగరెట్ పొగ లోపలికి పీల్చినప్పుడల్లా మీ ఆయుర్దాయంలో కొన్ని నిమిషాలు హరించుకు పోతాయి’’ అని ఆ అడ్వర్టయిజ్మెంట్లో పేర్కొన్నట్లు మాత్రం గుర్తుంది. పొగ పీల్చి నప్పుడల్లా రెండు నిమిషాల ఆయుర్దాయం తగ్గిపోతుందని చెప్పారనుకుంటా. నానమ్మ కళ్లు చెమర్చాయి!నానమ్మ రోజుకు ఎన్ని సిగరెట్లు కాలుస్తుందో అంచనా వేశా. ప్రతి సిగరెట్టుకు ఎన్నిసార్లు పొగని లోపలికి పీలుస్తారో లెక్కగట్టా. నేను సహేతుకమైన అంచనాకే వచ్చానని అనిపించిన తర్వాత,ముందుకు వంగి నానమ్మ భుజాన్ని తట్టి చాలా గొప్పగా ‘‘ప్రతి రెండు నిమిషాలకి ఒకసారి పొగని పీల్చావనుకుంటే, నీ ఆయు ర్ధాయంలో తొమ్మిదేళ్లు తగ్గిపోయినట్లు లెక్క’’ అన్నాను. దానిపై, నానమ్మ స్పందన నాకు బాగా గుర్తుంది. నా తెలివితేటలకి, అంక గణిత సామర్థ్యానికి నన్ను అభినందిస్తారనుకున్నా. ‘‘జెఫ్ నీ బుర్ర అసామాన్యం. కొన్ని క్లిష్టమైన లెక్కలు వేశావు. ఏడాదిలో ఎన్ని నిమి షాలుంటాయో గణించి, కొన్ని భాగహారాలు చేసి భలే అంచనాకు వచ్చావు’’ అని తాతయ్య నా భుజం తడతారు అనుకున్నా. అలాంటి దేమీ జరగలేదు. మా నానమ్మ కళ్లు చెమర్చాయి. కన్నీటి చుక్కలు రాలుతున్నాయి. నానమ్మ ఏడుస్తూంటే, వెనక సీట్లో కూర్చున్న నాకు ఏం చేయాలో తెలియలేదు. అంతవరకు మౌనంగా డ్రైవ్ చేస్తున్న తాతయ్య, కారుని నెమ్మదిగా రోడ్డు పక్కగా ఆపి, దిగి, వెనక డోర్ తెరిచారు. నేనూ దిగి ఆయనతో అడుగులు వేయాలన్నట్లు ఆయన నుంచి ఓ చూపు. ‘‘జెఫ్! దయగా ఉండు!’’ కారు వెనుక తగిలించిన రథం పక్క నుంచున్న నా వంక ఓ క్షణం మౌనంగా చూసి తాతయ్య ‘‘జెఫ్! ఏదో ఒకరోజు, తెలివితేటలు చూప డంకన్నా, దయతో మసలడం చాలా కష్టమని గ్రహిస్తావు’’ అన్నారు! వరాలు ముఖ్యం కాదు!ఈరోజు నేను వరాలు–ఎంపికల మధ్యనున్న తేడా గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. తెలివి తేటలు మనిషికి ఒక వరం. దయను మాత్రం ఎంచుకోవలసిన విషయం. వరా లను తీసుకోవడం తేలిక. వాటిని ఎవరైనా ఇస్తారు. ఎంపికల విషయం వచ్చినప్పుడే కష్టమవుతుంది. మనం జాగ్రత్తగా లేకపోతే ఎవరైనా వరాలతో మనల్ని మభ్య పెట్ట వచ్చు. అలాంటి ప్రలోభాలకు లోనైతే, బహుశా, అది ఎంపికల విషయం వచ్చేసరికి మనకు విఘాతంగా పరిణమిస్తుంది. మీరంతా అనేక వరాలతో నిండిన బృందం. యుక్తితో, సామర్థ్యంతో కూడిన మెదడు మీ అందరికీ ఉండడం వాటిలో ఒకటి. అందులో నాకెలాంటి సందేహం లేదు. ఎందుకంటే, అడ్మిషన్ సంపాదించడానికే మిగిలిన వారితో మీరు పోటీపడి తీరాలి. మీలో తెలివితేటలున్నట్టు కనిపించ కపోతే అడ్మిషన్ల డీన్ మిమ్మల్ని లోపలకు అడుగుపెట్టనివ్వరు. ‘ఎంపిక’లోనే... మీ శక్తి! వింతలు విశేషాల గడ్డపై తిరుగాడే మీకు మీ శక్తి యుక్తులు బాగా ఉపయోగపడతాయి. మనుషులమైన మనం, మనల్నే ఆశ్చర్యపరచే పనులు చేస్తూంటాం. కాలుష్య రహిత ఎనర్జీ ఉత్పాదక మార్గాల లాంటి వాటిని కనుగొంటాం. కణాల గోడల లోపలకి ప్రవేశించి, మరమ్మతులు చేయగల మెషీన్లను పరమాణువుల లాంటి చిన్న వాటితో కూర్పు చేస్తాం. మానవాళి చేస్తున్న పరిశోధనల ఫలితంగా ఇటువంటి వార్తలు వెలువడటం ఆశించదగ్గదే కావచ్చు కానీ, ఈ నెలలో మనం నిజంగానే, ఒక అసాధారణమైన వార్తను విన్నాం. జీవన వనరులను, ఆలోచనలను సమ్మిళితం సాధించాం. రానున్న కాలంలో లైఫ్ని ఇలా సింథసైజ్ చేయడమే కాదు, కోరుకున్న ప్రత్యే కాంశాలతో దాన్ని ఇంజనీర్ చేయగలుగుతాం. మానవ మెదడును అర్థం చేసుకోగల స్థితిని కూడా మీరు చూడగలుగుతారని నాకు నమ్మకం ఉంది. ఇపుడు మనలో చాలా మంది భావిస్తున్నట్లుగానే, గతించిన కాలాలకు చెందిన జ్యూల్స్ వర్న్, మార్క్ ట్వైన్, గెలీలియో, న్యూటన్ వంటి ఉత్సుకత కలిగిన వ్యక్తులు సజీవంగా ఉండాలని కోరుకుని ఉంటారు. ఒక నాగరికతగా మనకు అనేక శక్తి యుక్తులు న్నాయి. ఇపుడు నా ముందు కూర్చున్న మీలో కూడా అనేక మందికి గొప్ప శక్తి సామర్థ్యాలుండవచ్చు. ఈ వరాలను మీరు ఎలా విని యోగించుకుంటారు? ఉన్నవాటిని చూసుకుని గర్వపడతారా లేక మీరు ఎంచుకున్న వాటిపట్ల గర్వపడతారా? సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు!అమెజాన్ ప్రారంభించాలనే ఆలోచన నాకు కొన్నేళ్ల క్రితం తట్టింది. వెబ్ వినియోగం ఏటా 2300 శాతం చొప్పున వృద్ధిచెందు తోందనే వాస్తవాన్ని గమనించాను. అంత వేగంగా మరోటి వృద్ధి చెందడాన్ని నేను కనలేదు. వినలేదు. లక్షలాది పుస్త కాలతో భౌతిక ప్రపంచంలో ఒక పుస్తక భాండా గారాన్ని నిర్వహించడం సాధ్యం కానిపని. అటు వంటిది అసంఖ్యాక పుస్తకా లతో ఒక ఆన్లైన్ బుక్ స్టోర్ను నిర్మించడమన్న ఆలోచనే నాలో ఎంతో ఉత్సుకత రేపింది. అప్పటికి నాకు 30 ఏళ్లు నిండాయి. పెళ్లయి ఏడాది అయింది. ఉద్యోగం వదిలేద్దా మనుకుంటున్నానని, ఈ కొత్త వ్యాపారం చేపడతానని నా భార్య మెకంజీకి చెప్పాను. అది ఫలించవచ్చు, ఫలించకపోవచ్చునని కూడా చెప్పేశా. ఎందుకంటే, చాలా భాగం అంకుర సంస్థల తీరు అలానే ఉంది. తర్వాత ఏమవుతుందో నాకూ తెలియదు. ఈ ప్రిన్స్టన్ విద్యాలయం నుంచే పట్టభద్రురా లైన మెకంజీ ఇప్పుడిక్కడ రెండవ వరుసలో కూర్చొనుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయాల్సిందిగా ఆమె నా వెన్ను తట్టింది. టైమ్ తీసుకుని ఆలోచించాలి!నూనూగు మీసాల బాలుడిగా ఉన్నప్పుడే సిమెంట్ నిండిన టైర్లతో ఆటోమేటిక్ గేట్ క్లోజర్ కనిపెట్టా. సోలార్ కుక్కర్ తయారు చేశా. అది గొప్పగా ఏమీ పనిచేయలేదనుకోండి. అల్యూమినియం ఫాయిల్ రూపొందించా. వంటగదిలో వాడే బేకింగ్ అలారమ్లు తయారు చేశా. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తది కనిపెట్టాలని నా అభి లాష. మెకంజీ దానికి అడ్డు చెప్పకుండా ప్రోత్సహిస్తూ వచ్చింది. అప్పటికి, న్యూయార్క్ నగరంలో ఒక ఫైనాన్షియల్ సంస్థలో కొందరు మెరికలతో కలసి, ఒక ప్రతిభావంతుడైన బాస్ కింద పనిచేస్తున్నా. ఆ బాస్ అంటే నాకు చాలా ఆరాధనా భావం. ఆయన వద్దకు వెళ్లి,ఇంటర్నెట్లో పుస్తకాలు అమ్మే కంపెనీని ప్రారంభించాలని అను కుంటున్నట్లు చెప్పా. ఇద్దరం మాట్లాడుకుంటూ సెంట్రల్ పార్క్లో చాలాసేపు నడిచాం. నా మాటలు శ్రద్ధగా ఆలకించిన ఆయన ‘‘అది గొప్ప ఐడియాగానే కనిపిస్తోంది. కానీ, గొప్ప ఉద్యోగం లేని ఎవరి కైనా అది మరింత గొప్ప ఐడియాగా భాసిస్తుందేమో చూడు’’ అన్నారు. ఆలోచించుకుని తుది నిర్ణయం తీసుకునేందుకు 48 గంటల గడువు నిచ్చారు. ఆయన మాటల్లోనూ వాస్తవం ఉందనిపించింది. కానీ, కష్టమని తోచినా, అడుగు ముందుకేయడానికే నిర్ణయించుకున్నా. ఏదైనా ప్రయత్నించి, విఫలమైతే బాధపడడం అన్నది నాకెప్పుడూ లేదు. అసలు, ప్రయత్నించి చూడకపోతేనే, అది నన్ను వెంటాడుతూ ఉంటుంది! ఎంతో ఆలోచించిన మీదట, అంత సురక్షితం కాని మార్గాన్నే ఎంచుకున్నా. కానీ, దానికి నేను గర్వపడుతూనే ఉంటా.మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి!రేపు మీరు నిజంగానే కొత్త జీవితానికి శ్రీకారం చుట్టబోతు న్నారు. మీ భవితవ్యాన్ని మీరే రాసుకో బోతున్నారు. మీకున్న ప్రతిభా సంపత్తులను మీరు ఎలా వినియోగించుకుంటారు? ఎటు వంటి మార్గాన్ని ఎంచుకుంటారు? స్తబ్ధుగా ఉంటూ ఎలా జరిగితే అలా జరుగుతుంది అనుకుంటారా? లేక దేనిమీద ప్రీతి ఉందో ఆ పనులు చేస్తారా? ఉన్నవాటిని పట్టుకుని వేలాడ తారా? లేక కొత్తదనం చూపేందుకు ప్రయత్ని స్తారా? సాఫీగా సాగిపోయే జీవితాన్ని ఎంచుకుంటారా? లేక సేవ, సాహసాలతో నిండినదాన్నా? మిమ్మల్ని విమర్శించినపుడు నీరసించిపోతారా? లేక మీరు నమ్మినదాన్ని అనుసరించి ముందుకు సాగుతారా? తప్పు చేస్తే ఊకదంపుడుతో సమర్థించుకుంటారా? లేక క్షమాపణ కోరతారా? ప్రేమలో పడినపుడు ఎవరన్నా నిరాకరించినా మీ హృదయాన్ని కాపాడుకుంటారా? లేక భావోద్రేకాలతో వ్యవహరిస్తారా? సురక్షితంగా వ్యవహరించడం మంచిదనుకుంటారా? లేక కొద్దిగా సాహసంతో వ్యవహరిస్తారా? కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు విరమించుకుంటారా? లేక విడువ కుండా శ్రమిస్తారా? మీరు నిరాశా వాదా? లేక నిర్మాతా? ఇతరులను పణంగా పెట్టి తెలివి తేటలు ప్రదర్శిస్తారా? లేక దయతో వ్యవహరిస్తారా?నేనొక జోస్యం చెప్పే సాహసం చేస్తా. 80 ఏళ్ల వయసులో మీరు ప్రశాంత జీవితం గడుపుతూ ఒకసారి సింహావలోకనం చేసుకున్న ప్పుడు, అర్థవంతమైన మీ ఎంపికలే మీ జీవిత సంగ్రహం అవుతా యని మరచిపోకండి. మన ఎంపికలే మనల్ని రూపుకట్టిస్తాయి.మీ జీవితాన్ని ఒక విజయవంతమైన గాథగా మీరే తీర్చిదిద్దుకోండి. థ్యాంక్యూ అండ్ గుడ్ లక్! -
మనుషులను కలిపేదే సాహిత్యం
మనుషులను విడదీసేందుకు చాలా దారులు ఉన్నాయి. కానీ వారిని కలిపే పని సాహిత్యమే చేయగలదు. బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్ను నిర్వహించడం వెనుక ఈ సంకల్పమే ఉంది’ అన్నారు సతీష్ చప్పరికె. గత సంవత్సరం మొదలై ఇకపై ప్రతి ఏటా నిర్వహించ తలపెట్టిన నాలుగు దక్షిణాది భాషల భారీ సాహిత్య సమ్మేళనం‘బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్’ 2025 Book (Brahma Literature Festival-2025) సంవత్సరానికిగాను బెంగళూరులో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో జరగనుంది. ఈ సందర్భంగా ఈ ఫెస్టివల్ ఫౌండర్, సీనియర్ పాత్రికేయుడు సతీష్ చప్పరికెతో సంభాషణ: గత సంవత్సరం బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్కు వచ్చిన స్పందన ఎలా అనిపించింది? నాలుగు దక్షిణాది రాష్ట్రాల రచయితలను ఒకచోట చేర్చి, వారు ఒకరితో ఒకరు పరిచయమయ్యేలా, పాఠకులతో ఇంటరాక్ట్ అయ్యేలా చేసి, మనదైన సాహితీ వాతావరణం ఏర్పరచడమే ఈ లిటరేచర్ ఫెస్టివల్ ఉద్దేశం. దక్షిణాది రచయితలందరూ పాల్గొనే ఇలాంటి ఫెస్టివల్ ఇంతకు మునుపు లేదు. అందుకే గత సంవత్సరం మూడు రోజుల పాటు 36 వేల మంది హాజరైతే, వీడియో ప్రసారాలను 42 దేశాల్లో రెండున్నర లక్షల మంది తిలకించారు. ఇది చాలా పెద్ద స్పందన.ఈ సంవత్సరం విశేషాలు ఏమిటి?గత సంవ త్సరం నాలుగు రాష్ట్రాల నుంచి 300 మంది రచయితలు పాల్గొంటే, ఈ సంవ త్సరం 450 మంది పాల్గొంటున్నారు. ఐదు వేదికల మీద మూడు రోజుల పాటు నిరాటంకంగా సెషన్స్ జరుగు తాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లిష్లో సెషన్స్ ఉంటాయి. దక్షిణాదిలో పుట్టి ఇంగ్లిష్లో రాస్తున్న రచయితలను కూడా ఈసారి ఆహ్వానించాం. ఈసారి పాల్గొంటున్న వారిలో అదూర్ గోపాలకృష్ణన్, దామోదర్ మౌజో, శశి థరూర్, బాను ముష్తాక్, జయ మోహన్, సచ్చిదానందన్, మను పిళ్లై తదితరులెందరో ఉన్నారు. మరో విషయం... ఈ ఫెస్టివల్లో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు ఉండరు. ఇది పూర్తిగా సాహిత్య ఉత్సవం.కన్నడ భాష నుంచి బాను ముష్తాక్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలిచారు. ఆమెకు ఏదైనా సత్కారం ఉంటుందా?ఆమెను ఈ ఫెస్టివల్కు ఆహ్వానించి పాఠకులు ఆమెతో ముచ్చటించేలా చేయడమే మేము చేసే సత్కారం. ఒక రచయిత పాఠకులను కలవడం కంటే ఏం కావాలి!మీరు ఆహ్వానించే రచయితలు ఏ ధోరణి సాహిత్యానికి ప్రతినిధులు?మీ ప్రశ్న నాకు అర్థమైంది. మేము లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు. ప్రజల తరఫున మాట్లాడే, సాహితీ వికాసం కోరే ప్రతి రచయితా మాకు మిత్రుడే. ఈసారి తెలుగు నుంచి ఎవరెవరు ఆహ్వానం అందుకున్నారు?గత సంవత్సరం 30 మందిని ఆహ్వానించాం. ఈసారి రచయితలు, పబ్లిషర్లు, పెర్ఫార్మర్లు దాదాపు 100 మంది వరకూ ఉంటారు. భాష ఒకటే అయినా రెండు రాష్ట్రాల నుంచి సమాన సంఖ్యలో ఆహ్వానించాం. ఈసారి ఆహ్వానం అందుకున్న వారిలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, బండి నారాయణ స్వామి, మధురాంతకం నరేంద్ర, కొలకలూరి ఇనాక్, పెద్దింటి అశోక్ కుమార్, షాజహానా తదితరులు ఉన్నారు. తగుళ్ల గోపాల్, బాల సుధాకర మౌళి తదితర యువ కవులను ఆహ్వానించాం.గతంలో వచ్చినవారు రిపీట్ కాకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. ఈసారి ఆహ్వానం అందుకోనివారు వచ్చే సంవత్సరం అందు కుంటారు. అందరూ ఏదో ఒక సంవత్సరం పాల్గొనాలనేదే మా కోరిక. వీరిని ఆహ్వానించడంలో అనువాదకుడు అజయ్ వర్మ అల్లూరి మాకు సహకరిస్తున్నారు.లక్ష్యం ఏమిటి?మన దక్షిణాది భాషల్లో గొప్ప రచయితలు ఉన్నారు, రచనలు ఉన్నాయి. ప్రపంచ భాషలకు ఏమాత్రం తగ్గని పుస్తకాలు ఉన్నాయి. వాటిని ప్రపంచ భాషల్లోకి అనువాదం చేయించడం బుక్ బ్రహ్మ లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణాది భాషల సాహిత్య సౌరభాన్ని దేశం ఎదుట సగర్వంగా నిలిపేందుకు ఈ ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఎవరైనా ఉచి తంగా రిజిస్టర్ చేసుకుని హాజరు కావచ్చు.ఇంటర్వ్యూ: ‘సాక్షి’ ప్రతినిధి‘ -
అంతుచిక్కని భూమ్యాకర్షణ శక్తి!
భూమ్యాకర్షణ శక్తి కారణంగానే మొక్కలు ఎదుగుతున్నాయి. మనం నేల మీద నడవ గల్గుతున్నాం. ఈ శక్తి వలననే సమస్త జంతు జాలానికి ఒక భౌతిక రూపం ఏర్పడుతోంది. కానీ ఈ శక్తి ఎలా ఏర్ప డుతున్నది? ఈ విషయంపై ఇంతవరకు ఎవరికీ సంతృప్తికరమైన జవాబు దొరకలేదు. ఈ శక్తి ఎలా ఏర్పడుతున్నదో తెలిస్తే దానిని అదుపు చేయడం సాధ్యమౌతుంది. న్యూటన్ దీనిని గుర్తించి 300 ఏళ్ళు దాటినా ఇది ఇంకా పరిశోధన అంశంగానే ఉంది.కాంతికి, వేడికి శక్తి కల్గించే ‘విద్యుదయస్కాంతత్వం’, ‘పరమాణు కేంద్రకాలను ఏకం చేసే కేంద్రక బలాలు’, ‘ రేడియో ధార్మికతను’ బల హీనపరిచే శక్తుల గురించిన సమాచారం శాస్త్రవేత్తలు తెలుసు కోగలిగారు. ఇన్ని విజ యాలు సాధించిన శాస్త్రవేత్తలు భూమ్యాకర్షణ శక్తి రహస్యాలు తెలుసు కోవడంలో ఎటువంటి ప్రగతీ సాధించలేకపోయారు. ఏ వస్తువునైనా సరే భూమి ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బలమే ఆ వస్తువు బరువు. ఈ ఆక ర్షణ ఒక్క భూమికే కాదు, ప్రతి గ్రహానికీ ఉంది. ఈ ‘గురుత్వాకర్షణ శక్తి’ అనేది ప్రతి చోటా కనిపిస్తుంది. దీనినుండి ఎవరూ తప్పించు కోలేరు. ఇదొక ప్రకృతి శక్తి. భూమికి బాగా ఎత్తుగా అంతరిక్షంలోకి వెళ్ళినపుడు ఈ భూమ్యాకర్షణ శక్తి బాగా తగ్గిపోయి మనిషికి భార రహిత స్థితి వస్తుంది. పదార్థ నిర్మాణంలో ఉన్న అస్థిరత వల్ల రేడియో ధార్మిక పదార్థాలలో రేడియో ధార్మిక లక్షణం క్షీణిస్తుంది. అయితే భూమ్యాకర్షణ శక్తి అనేది భూమి అస్థిరత వల్ల వచ్చినది కాదు. భూమికి ద్రవ్యరాశి ఉన్నంత కాలం భూమ్యాకర్షణ శక్తి ఉంటుంది.భూమి ద్రవ్యరాశి స్థిరంగా ఉండి దాని వ్యాసార్ధం తగ్గితే, అప్పుడు భూమి మీద ఉన్న వస్తువుకు, భూకేంద్రానికి మధ్యన ఉన్న దూరం తగ్గిపోతుంది. వీటి మధ్య దూరం తగ్గితే భూమ్యాకర్షణ బలం పెరుగుతుంది. భూ కేంద్రం వద్ద వస్తువును ఉంచితే దీనికి ఒక వైపున గల భూద్రవ్యరాశి దానిపై కలిగించే ఆకర్షణ బలాన్ని, రెండవ వైపుగల భూద్రవ్య రాశి దానిపై కలిగించే ఆకర్షణ బలాన్ని రద్దు చేస్తుంది. అందువల్ల భూకేంద్రం వద్ద ఉంచిన వస్తువుపై ఎటువంటి భూమ్యాకర్షణ బలమూ ఉండదు.మన శరీరంలో రక్త ప్రసరణ నిరంతరం జరిగేందుకు రక్తాన్ని గుండె పంపు చేస్తూ ఉంటుంది. ఇది భూమ్యాకర్షణ బలానికి వ్యతి రేకంగా పని చేయాలి. భూమ్యాకర్షణ బలం తగ్గితే గుండె పని తగ్గుతుంది, ఫలితంగా శరీరంలో రక్త పోటు తగ్గుతుంది.ఐన్స్టీన్ ఉద్దేశంలో భూమ్యాకర్షణ లేదా గురుత్వాకర్షణ ఒక శక్తి కాదు. దీనిని ‘అంత రిక్షంలో ఉండే పెద్ద గొయ్యి’తో పోల్చి చెప్పాడు. గొయ్యి చుట్టుపక్కల ఉండే వస్తువులన్నీ అటువైపు దొర్లుతూ అందులో పడిపోతాయి. ఆదేవిధంగా వస్తువులు గురుత్వాకర్షణ కారణంగా అటువైపు పడిపోతు న్నాయని ఆయన వాదన. ఐన్స్టీన్ సైద్ధాంతిక శాస్త్రవేత్త మాత్రమేననీ, ప్రాయోగిక శాస్త్రవేత్త కాదనీ ఇతర శాస్త్రవేత్తలు ఆయన సిద్ధాంతాన్ని ఆమోదించలేదు.అంతరిక్ష ప్రయోగాలు ఎన్నో విజయాలు సాధిస్తున్న ఈ తరుణంలో భూమ్యాకర్షణ రహస్యాలు బట్టబయలైతే దానిని అదుపు చేసే విధానాలు తెలుస్తాయి. అప్పుడు నీటిలో చేప పిల్లలు ఈదినట్లు మనం కూడా భూవాతా వరణంలో తేలుతూ ఎక్కడకి కావాలంటే అక్కడికి వెళ్లవచ్చు.డా‘‘ సి.వి. సర్వేశ్వర శర్మ వ్యాసకర్త పాపులర్ సైన్స్ రచయిత -
వాళ్లకు 'న్యాయం' చేయడం ఎలా?
మన ప్రజాస్వామ్యం ఎన్నో విధాలుగా మనకు గర్వకారణం. అందుకు విరుద్ధంగా భావించడానికి కూడా అన్ని విధాలుగా ఆస్కారం ఉంది. మన వైఫల్యాల జాబితా చిన్నదేం కాదు. గత వారమే ఈ జాబితాలో మరో భయానక వాస్తవం చోటు చేసుకుంది. మన సమష్టి మనస్సాక్షిపై దీని ప్రభావం సంవత్సరాల తరబడి అలా ఉండిపోతుంది. ఇది అంత తేలిగ్గా మానే గాయం కాదు. ఈ అపరాధ భావన మనల్ని మున్ముందు కూడా వేధిస్తూనే ఉంటుంది. దీన్నుంచి బయటపడేందుకు మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అంత కష్టపడగలమా? అసలు అలా కష్టపడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా? ఇది మరీ ముఖ్యమైన ప్రశ్న. పన్నెండు మంది(ఇందులో ఒకరు ఇప్పటికే మరణించారు) సాటి పౌరులు వారు. న్యాయం పొందడానికి మీకూ నాకూ ఎంత హక్కు ఉందో... వారికీ అంతే ఉంది. కానీ ఏం జరిగింది? నేరం చేశా రంటూ అభియోగాలు ఎదుర్కొన్నారు. దోషులుగా తొలుత ‘నిరూ పణ’ జరిగింది. 19 సంవత్సరాలు జైల్లో గడిపారు. నిర్దోషులు అయ్యుండీ ‘శిక్ష’ అనుభవించారు. మనం వారిని పట్టించుకోలేదు. వారి దుఃస్థితిని మర్చిపోయాం. వారి ఖర్మకు వారిని వదిలేశాం. నిన్న మొన్న హైకోర్టు తీర్పు వచ్చేవరకూ ఇదే జరిగింది.చెదిరిన భ్రమలుఎట్టకేలకు బాంబే హైకోర్టు తీర్పు వెలువడింది. అప్పుడు గానీ వారు జైలు నుంచి విడుదల కాలేదు. ఇది మనకు సిగ్గుచేటు. ‘‘నిందితుల మీద మోపిన కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైంది. నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టం.’’ మనం తలలు దించుకోడానికి ఈ ఒక్క మాట చాలదా? (ఈ తీర్పు మీద ప్రస్తుతానికి సుప్రీంకోర్టు స్టే ఇచ్చినా, విడుదలైనవారిని తిరిగిజైలుకు రప్పించబోమని వ్యాఖ్యానించింది.)హైకోర్టు తీర్పు అక్కడే ఆగిపోలేదు. వారిపై మోపిన అభియోగాల నిరూపణ సవ్యంగా, సక్రమంగా జరిగిందని మనం అనుకున్నాం. న్యాయం పట్ల మనం ఎంతో నమ్మకం ఉంచాం. అయితే, మన భ్రమలను ఈ తీర్పు పటాపంచలు చేసింది. ‘‘కేసును మోసపూరితంగా క్లోజ్ చేయడం వల్ల ప్రజల విశ్వాసం దెబ్బ తిన్నది.’’సరే, ఇప్పుడు మనం ఏం చేయగలం? ఈ పన్నెండు మందికి ఎలా ఊరట కలిగించగలం? అసలు ఈ పని మన వల్ల అవుతుందా? వారు జీవితంలో రెండు దశాబ్దాలు కోల్పోయారు. వాటిని ఎప్పటికీ తిరిగి ఇవ్వలేం. ఇరవై ఏళ్ల పాటు వారిని తల్లితండ్రులకు, పిల్లలకు, కుటుంబానికి, మిత్రులకు దూరం చేశాం. కోల్పోయిన ఆ జీవితం ఎప్పటికైనా తిరిగొస్తుందా? దీనికి ప్రాయశ్చిత్తం ఉంటుందా? నాకు తెలియదు. కానీ మనం ఏదైనా చేయాలి.క్షమాపణ చెప్పకూడదా?చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. కాబట్టి ముందుగా మనం క్షమాపణ చెప్పాలి. ఆ క్షమాపణ లోతైనదిగా ఉండాలి. బేషరతుగా చెప్పాలి. దాన్ని బాహాటంగా ప్రకటించాలి. ఇక్కడ మనం అంటే... ఎవరు? అభియోగాలు మోపి, తప్పుడు సాక్ష్యాలతో వారిని ఇరికించిన పోలీసులా? కేసును అన్యాయంగా 20 ఏళ్లు నడిపించిన న్యాయవ్యవస్థ కూడానా? విచారణ ఆరంభ దశలోనే 9 ఏళ్లు గడచిపోయాయి. తర్వాత హైకోర్టు స్థాయిలో వాద ప్రతివాదాలు వినకుండానే, ఈ కేసు మరో 9 సంవత్సరాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా పడి ఉంది. గత ఏడాదే కేసులో కదలిక వచ్చింది. వారి సహ పౌరులమైన మనం సైతం పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్పాల్సిన వారిలో ఉంటామా? ఉంటే, ఆ మనం– అంటే మీరు, నేను, ఈ విశాల సమాజం– తరఫున మాట్లాడే వారెవరు? కచ్చితంగా ప్రభుత్వమే కదా? మనం అనుకుంటున్నట్లు ప్రభుత్వంలోని వారు మనకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే, వారి మీదే ఈ బాధ్యత ఉంటుంది. అయితే, క్షమాపణ సరిపోతుందా? ఇప్పటి వరకూ అనుభవించిన క్షోభను పూర్తిగా తొలగించలేక పోయినా, ఈ చర్య ఆ 12 మంది బాధను కొంతైనా తగ్గిస్తుంది. ఇంకా ఏం చేయగలం? నాతో ప్రతి ఒక్కరూ ఏకీభవిస్తారో లేదో చెప్పలేను కానీ, దీనిపై నాకంటూ స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది. దాన్ని మీతో పంచుకుంటాను. ఏకీభవించాలో లేదో మీరో నిర్ణయించుకోండి. కానీ, ముందు నా అభిప్రాయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.కొత్త జీవితానికి ఆర్థిక పరిహారంఇతరత్రా ఎలా ఉన్నా ఆర్థికంగా అన్నా ఇబ్బందులు లేకుండా వారు తమ శేష జీవితం సుఖంగా గడిపేలా చూడటం మన బాధ్యత. కాబట్టి ఆ మేరకు వారికి ఆర్థిక పరిహారం అందించాలి. ఇది సరిపోతుందని కాదు. మనం అండగా ఉన్నామని చెప్పడానికైనా ఈ సుహృద్భావ చర్య తోడ్పడుతుంది. సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు వారికి ఒక అవకాశం ఇద్దాం. బతుకు పుస్తకంలో ఒక పేజీ తిప్పడానికి సరికొత్త అధ్యాయం ప్రారంభించడానికి మనం సహాయపడదాం. అలా చేస్తామా? మనకు, మన విలువలకు ఇదొక పరీక్ష. వ్యవస్థల కర్కశత్వానికి గురై నలిగిపోయిన సాటి పౌరుల పట్లమనం నిబద్ధతతో ఉండాలి. వారి గురించి ఆందోళన చెందాలి. సమైక్య సమాజంగా, ఒక దేశంగా కొనసాగాలంటే మనం ఇప్పుడే స్పందించాలి. లేనట్లయితే, దెబ్బతింటాం. అద్దంలో చూసుకునే మన ముఖం మన ఒక్కరిదే కాదు, సమష్టిగా మన అందరిదీ! ఆ ప్రతిబింబం ఆహ్లాదకరంగా, భరోసా ఇచ్చేదిగా ఉండాలి. మరోలా కాకుండా అది అలానే ఉండటం మన మీదే ఆధారపడి ఉంది.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చరిత్ర సృష్టించిన కుట్ర కేసు!
1969 డిసెంబర్ 19వ తేదీన మద్రాసులోని అన్నా నగర్లోని ఒక ఇంటిలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ విప్లవ కారుల రాష్ట్ర కమిటీ సమావేశం రహస్యంగా జరుగుతున్న మొదటి రోజున పోలీసులు దాడిచేసి కొందరు నాయకులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ), తరిమెల నాగిరెడ్డి (టీఎన్) తదితరులు ఉన్నారు. చండ్ర పుల్లారెడ్డి అనుకున్న సమయానికి రాని కారణంగా అరెస్టు కాలేదు. సమావేశానికి హాజరైన నాయకులతో పాటు మరి కొంతమంది ముఖ్య నాయకులను కలిపి మొత్తం 68 మందిపై ఆనాడు కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలో రాజకీయ ప్రేరేపితమైన తొలి కుట్ర కేసును బనాయించింది. దానికి ప్రభుత్వం పెట్టిన పేరు ‘హైదరాబాదు కుట్ర కేసు’. అయితే అది జనంలో ‘నాగిరెడ్డి కుట్ర కేసు’గా బహుళ ప్రచారం పొందింది. దీనికి ముఖ్య కారణం వీరిపై పెట్టిన కేసును డీవీ, టీఎన్లు స్వయంగా వాదించి సంచలనం సృష్టించడం. 1969 ఏప్రిల్ నెలలో కృష్ణా జిల్లా అట్లప్రగడలో రహస్యంగా జరిగిన రాష్ట్ర ప్లీనంలో ఆమోదించిన ‘తక్షణ కార్యక్రమం’ డాక్యుమెంట్ ఆధారంగా ప్రభుత్వం ఈ కేసును బనాయించింది. జనతా ప్రజాతంత్ర విప్లవ దశలో కమ్యూనిస్టు విప్లవ కారుల వ్యూహం – ఎత్తుగడల స్థూల రూపమే ఈ తక్షణ కార్యక్రమం. ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు కమిటీ ప్రకటించిన ‘తక్షణ కార్యక్రమం’ ఆధారంగా ఈ ప్రభుత్వాన్ని కూల్చటానికి వీరు కుట్ర పన్నినట్లు పేర్కొంది. 1970 జూన్లో ఈ కేసు విచారణ హైదరాబాద్ అదనపు సెషన్స్ జడ్జి కోర్టులో జరిగిన సందర్భంలో– డీవీ, టీఎన్లు ఈ ‘తక్షణ కార్యక్రమా’న్ని పూర్తిగా సమర్థిస్తూ తమ వాదనలను దృఢంగా వినిపించారు. ఈ కేసులో తమకు తీవ్రమైన శిక్షలు పడతాయని తెలిసి కూడా పార్టీ విధానాలను సమర్థించాలనే నిర్ణయం తీసుకుని కమ్యూనిస్టుల విప్లవసంప్రదాయాలకు పట్టం కట్టారు. కోర్టులో 48 మంది ముద్దాయిలను విచారించి 18 మందికి నాలుగు సంవత్సరాల మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. హైకోర్టు కూడా ఈ శిక్షలను నిర్ధారించింది. 1972 మే నెలలో కఠోరమైన బెయిల్ కండిష¯Œ ్సపై జైలులో ఉన్న నాయకులు బయటకు వచ్చారు. 1975 జూన్ 25వ తేదీన ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో డీవీ, టీఎన్లతో సహా కుట్రకేసులో ఉన్న ముఖ్య నాయకులంతా రహస్య జీవితానికి వెళ్లిపోయారు.డీవీ, టీఎన్ ఈ కుట్రకేసులో జైల్లో ఉన్న కాలంలో జైలును ఒక అధ్యయన కేంద్రంగా మార్చుకున్నారు. ‘కమ్యూనిస్టు విప్లవకారుల వ్యూహం – ఎత్తుగడలు’ అన్న స్టేట్మెంట్ను కేసులో ఉన్న అందరి తరఫున తయారుచేసి, విచారణ సందర్భంగా డీవీ వివరించారు. ఈ ప్రకటన ‘డీవీ స్టేట్మెంట్’గా ప్రచారం పొందింది. జైలు జీవితంలో ఉన్న టీఎన్ ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో తగిన గణాంక వివరాలతో సమకాలీన ఆర్థిక రాజకీయ పరిణామాలను ‘తక్షణ కార్యక్రమా’నికి అన్వయించి రాసి... స్టేట్మెంట్ రూపంలో కోర్టులో రెండు గంట లపాటు ఎంతో శక్తిమంతంగా వివరించారు.డీవీ, టీఎన్ కోర్టును తమ రాజకీయాల ప్రచార వేదికగా చేసుకున్న ఫలితంగా ఈ స్టేట్మెంట్లు కొత్త ఒరవడిని సృష్టించాయి. వారు ఇచ్చిన స్టేట్మెంట్లలో ముఖ్యమైనవి: ‘సాయుధ పోరాటాలు జరగకుండా ప్రజాస్వామిక పద్ధతుల్లో భూసంస్కరణలు అమలు జరగటం అసంభవం’, ‘వర్గపోరాటం, ప్రజల సాయుధ విప్లవం ద్వారా పాలకవర్గాన్ని కూలదోయటం తప్పనిసరిగా జరుగుతాయి’, ‘కమ్యూనిస్టు విప్లవకారులమైన మేము ప్రజాయుద్ధ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం’, ‘మా విప్లవ పంథా రివిజనిస్టుల పార్లమెంటరీ పంథాకు పూర్తిగా భిన్నమైనది, మా పం«థాను గురించి మా తక్షణ కార్యక్రమంలో ప్రకటించాం.’ ప్రభుత్వం కుట్ర కేసు ద్వారా విప్లవకారులపై ఏవైతే ఆరోపణలు చేసిందో... వాటిని అంగీకరిస్తూ కోర్టులో స్టేట్మెంట్లు ఇచ్చి విప్లవకారుల ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు పెంచారు వీరు. డీవీ 1984 జూలై 12న చనిపోగా, టీఎన్ ఎమర్జెన్సీకాలంలో రహస్యంగా ఉంటూ అనారోగ్యంతో హైదరాబాదు ఉస్మానియా ఆసుపత్రిలో 1976 జూలై 28న చనిపోయారు. అలా వీరు జూలై మాసంలోనే అమరులవ్వడం యాదృచ్ఛికమే అయినా ఆసక్తిదాయకం. వారికి విప్లవాభివందనాలు.– ముప్పాళ్ళ భార్గవ శ్రీ సీపీఐ ఎంఎల్ నాయకులు(రేపు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి వర్ధంతి) -
సుందర్ పిచాయ్ (గూగుల్ సీఈవో) రాయని డైరీ
అదృష్ట సూచిక నిన్న ఉన్నట్లుగా నేడు ఉండదు. నేడు ఉన్నట్లుగా రేపు ఉండదు. కానీ, నిన్న – నేడు – రేపు కూడా మనం ఒకేలా ఉండాలి! ఒక అదృశ్య సూచికలా, ఒక నిశ్శబ్ద వీచికలా. కష్టకాలాన్ని ఎలాగైనా దాటుకుని వెళ్లొచ్చు. గొప్ప వైభోగాన్ని పట్టించి, ధనరాశులను దట్టించి, కీర్తి ప్రతిష్ఠల్లో ఊరేగిస్తున్న కాలాన్ని తట్టుకుని నిలబడటానికే మనిషికి శక్తి కావాలి. తలపై కిరీటం ఉన్నా లేకున్నా తల ఎప్పుడూ తలలా ఉండాలి. కిరీటంలా ఉండకూడదు. బ్లూమ్బర్గ్ ఇండెక్స్లో నేను బిలియనీర్ని అయ్యానని తెలియగానే, ‘ఇంప్రెసివ్’ అని ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్! ముకుళిత హస్తాల సింగిల్ ఎమోజీతో నేనూ వెంటనే ఆయనకు ధన్యవాదాలను ట్వీట్ చేశాను. మితభాషణ మనుషుల్ని మరింతగా దగ్గర చేస్తుంది. బ్లూమ్బర్గ్ ఇండెక్స్లో నా బిలియనీర్ స్టేటస్ మారుతూ ఉంటుంది. కానీ, ఎప్పటికీ మారని స్టేటస్ సుందర్ పిచాయ్ అనే నా ఐడీ. సక్సెస్ మీట్లో ఉన్నాం కంపెనీ స్టాఫ్ అందరం. నేను వేదిక మీద ఉన్నాను.‘‘స్టేటస్లో ఒక్కోసారి కిందికి జారిపోతాం. ఆ ఫెయిల్యూర్ను కూడా చొక్కా జేబుకు ధరించదగిన గౌరవప్రదమైన బ్యాడ్జిలానే భావించాలి’ అన్నాన్నేను. ‘‘బట్, మిస్టర్ పిచాయ్... ఫెయిల్యూర్ అన్నది సంతోషించ తగిన విషయమైతే కాదు కదా? ఎలా ధరించగలం ఆ బ్యాడ్జిని?’’ అని, టీమ్లోకి కొత్తగా వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలు!వాళ్లనేది నిజమే. కానీ, ఒక వ్యక్తి సంతోషంగా ఉండటం అంటే ఆ వ్యక్తి జీవితంలో ప్రతిదీ సరిగ్గా ఉందని అర్థం కాదు. జీవితంలో ప్రతిదాని పట్ల ఆ వ్యక్తి వైఖరి సరైనదిగా ఉందని. ఆ మాటే చెబుతూ, ‘‘సంతోషం మనం చూసేది కాదు, మనకు కనిపించేది’’ అన్నాను.‘‘అర్థం కాలేదు మిస్టర్ పిచాయ్’’ అంటూ ఆడియె¯Œ ్సలోంచి ఓ గర్ల్ ఇంటర్న్!ఒక్కసారిగా నవ్వాన్నేను. ఆ అమ్మాయి మాటలకు నాకు అంజలి గుర్తొచ్చింది. కాలేజ్లో అంజలి సరిగ్గా ఇలానే అంటుండేది... ‘‘అర్థం కాలేదు సుందీ...’’ అని! అర్థం కాకపోవటానికి అంతగా నేను అర్థం కాకుండా ఏం మాట్లాడేవాడినో నాకు అర్థం అయ్యేది కాదు.‘‘మీ మాటల్ని కూడా తమరు నా చేతే మాట్లాడించే వారు కదా. అందుకే తమర్ని మళ్లీ మళ్లీ మాట్లాడించటం కోసం ‘అర్థం కాలేదు సుందీ’ అంటుండేదాన్ని అని మా పెళ్లయ్యాక ఆ రహస్యాన్ని విప్పింది అంజలి!ఖరగ్పూర్ ఐఐటిలో మా ఇద్దరిదీ సేమ్ బ్యాచ్. నాది మెటలర్జికల్ ఇంజినీరింగ్. తనది కెమికల్ ఇంజినీరింగ్. నేనుండేది నెహ్రూ హాల్. తనుండేది ఆల్ గర్ల్స్ హాస్టల్. తనకు తెలియకుండా నేను తనను చూస్తుండే వాడిని. తర్వాత తెలిసింది నాకే తెలియకుండా నేను తనని ప్రేమిస్తున్నానని. క్యాంపస్లో ఒక రోజు తనకి పట్టుబడిపోయాను. ‘‘ఏంటి చూస్తున్నావ్? హా!’’ అంది అంజలి నా ముందుకొచ్చి, నా ముఖంలోకి వచ్చి!! తననే చూస్తూ ఉండిపోయాను. ‘‘ఓయ్ సుందీ, మాటలొచ్చా?’ అంది కోపంగా చూస్తూ. నా క్లాస్మేట్స్ నన్నలాగే పిలుస్తారు... ‘సుందీ’ అని. తను కూడా నన్ను ‘సుందీ’ అంటోందంటే? ఎస్, అర్థమైంది నాకు!కోపంగా నా వైపు చూస్తున్న అంజలిలో ఆ చూపు నిజం, ఆ కోపం అబద్ధం. ‘మిస్టర్ పిచాయ్, మీటింగ్ హాల్ బయట మిసెస్ అంజలీ మీ కోసం వేచి ఉన్నారు, పూలగుచ్ఛంతో’’ అన్నారు థామస్ కురియన్, వేదిక మీదకు వచ్చి నా చెవికి దగ్గరగా! కురియన్ గూగుల్ క్లౌడ్ సీఈవో. బయటికి వెళ్లేందుకు వేదిక దిగబోతూ,ఆ గర్ల్ ఇంటెర్న్తో మళ్లీ అదే మాట చెప్పాను... ‘‘సంతోషం మనం చూసేది కాదు గైస్, మనకు కనిపించేది’’ అని నవ్వుతూ చెప్పాను.మాధవ్ శింగరాజు -
చదువు– సంస్కారం కోరుకున్న మనిషి
టి.వి. నారాయణ (తక్కెళ్ల వెంకట నారాయణ) గారు 1925 జూలై 26న సికింద్రాబాదులోని బొల్లారంలో వెంకయ్య, నర్సమ్మ దంపతులకు జన్మించారు. ఆ రోజుల్లో సామాజిక అసమానతలకు, అంటరానితనానికి గురైనా, విద్యకు నోచుకోని దళిత సమాజంలో ఒక సామాన్య పేద కుటుంబంలో జన్మించినా వాటినన్నింటిని తట్టుకొని ప్రాథ మిక విద్యను బొల్లారంలో, కళాశాల విద్యను నిజాం కాలేజీలో అభ్యసించారు. అంతటితో ఆగకుండా బెనారస్లోని హిందూ విశ్వ విద్యాలయంలో ఆంగ్లంలో పీజీ విద్యను, కర్ణాటకలో పీహెచ్డీని పూర్తి చేసుకున్నారు.నారాయణ నిత్య విద్యార్థి. అన్ని విషయాల్లో నిష్ణాతుడు. అకుంఠిత దీక్షతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుడు. వీరి సతీమణి టి.ఎన్. సదాలక్ష్మి మాజీ మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారిణి, మంచి సాహసి. నాకు 1980లో తొలినాళ్లలో రాజకీయాల్లో ఎలా పనిచేయాలో తెలియజేశారు.నారాయణ తెలంగాణ విమోచన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. నిరంకుశ నిజాం పాలన నుండి విముక్తి కోసం రజాకార్ల మీద పోరాటంలో భాగంగా స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో పనిచేసి జైలుకు సైతం వెళ్లి వచ్చారు. రజాకార్ల నుండి తప్పించు కోవడానికి అండర్ గ్రౌండ్కు కూడా వెళ్ళారు.నారాయణ గారు మొదట్లో పాఠశాల ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, స్కూల్స్ ఇన్స్పెక్టర్గా, సిటీ కాలేజ్ ప్రిన్సి పాల్గా, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. తదనంతరం 1978–80 కాలంలో ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గానూ సేవలు అందించారు.ఆయన ఆర్య ప్రతినిధి సభ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేశారు. సామాజిక సేవలో భాగంగా వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ‘బంధు సేవ మండలి’ని స్థాపించారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో వారిలో పూర్తి స్వదేశీ భావన ఉండేది. ఎల్లప్పుడూ ఖాదీ వస్త్రాలను ధరించి వాటి వాడకాన్ని విరివిగా ప్రోత్సహించారు. వారి మాటల్లో, వేషంలో, ఆచరణలో అది స్పష్టంగా కనిపించేది.ఆయన మంచి రచయిత. నిర్మాణాత్మకమైన సూచనలతో, జీవిత విలువల గురించి భారతీయ ఉపనిషత్, వేదాలలో ఉన్న అనేక అంశాలను వివరిస్తూ పుస్తకాలు రచించారు. వారి సేవలను గుర్తించిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016లో వారిని ‘పద్మశ్రీ’తో గౌరవించింది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ‘దళిత రత్న’ పురస్కారం అందుకున్నారు. నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ఉమ్మడి రాష్ట్ర సేవ ప్రముఖ్గా నియమితులైన తరువాత, హైదరాబాద్లోని దళిత బస్తీల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాం. దోమలగూడలోని ఫూల్ బాగ్ బస్తీలో దళిత పిల్లలను చేరదీసి వారు ప్రాథమికంగా శారీరక శుభ్రత పాటించేలా చర్యలు తీసుకునేవాళ్ళం. ఈ కార్యక్రమం గురించి తెలుసుకున్న నారాయణ ‘ఇది చాలా మంచి కార్యక్రమం’ అని ఎంతగానో ప్రోత్సహించారు. తాను కూడా ఇందులో భాగం అవుతానని అన్నారు. ఈ సేవా కార్యక్రమాలకు ఏ పేరు పెడదామని ఆలోచిస్తుండగా, ఆయనే స్వయంగా ‘సేవా భారతి’ అని నామ కరణం చేశారు. ఇందులో చేపట్టే సంస్కార కేంద్రాల సిలబస్ను సైతం తయారు చేశారు. వేదాల సారాంశం, సుమతీ శతకాలు, రామాయణ శ్లోకాలు సేకరించి వాటిని పిల్లలకు బోధించే ఏర్పాటు చేశారు. ఆయా సంస్కార కార్యక్రమాలు పేద, దళిత విద్యార్థుల్లోకి అత్యధికంగా తీసుకెళ్లాలని సూచించారు. తదనుగుణంగానే హైదరాబాద్లో వీటిని విస్తృతంగా నిర్వహించాం.చదవండి: ఉన్నత విద్యకు డిజిటల్ వేగంనేను రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత కూడా ఆయన నన్ను ఎంతో ఆత్మీయతతో ప్రోత్సహించారు. నేను కేంద్ర మంత్రి అయ్యాక వారి ఇంటికి వెళ్తే నన్ను ప్రేమగా ఆశీర్వదించి, సన్మానించి సంతోషించారు. నారాయణ గారి శతజయంతి సందర్భంగా మనం అందరం కూడా విద్య పట్ల వారికున్న శ్రద్ధను; పేదలు, దళితుల పట్ల వారి అనురాగాన్ని; దేశం, ధర్మం మీద వారి చింతనను ఆదర్శంగా తీసుకోవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి.- బండారు దత్తాత్రేయ మాజీ గవర్నర్జూలై 26న, ‘పద్మశ్రీ’డాక్టర్ టి.వి. నారాయణ శత జయంతి -
ఉన్నత విద్యకు డిజిటల్ వేగం
భారత దేశ ఉన్నత విద్యకు ఓ విశిష్టత ఉంది. సవాళ్ళ మధ్యే పురోగతి సాధించడం దీని ప్రత్యేకత. దశాబ్ద కాలంలోనే ఉన్నత విద్యా సంస్థలు గణనీయంగా పెరిగాయి. 2013లో 651 యూనివర్సిటీలు ఉంటే, 2022 నాటికి 1,100కు చేరాయి. ఇదే కాలంలో కాలేజీల సంఖ్య 31,324 నుంచి 45 వేలకు పెరిగింది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఇప్పుడు 4.14 కోట్లు దాటారు. ఇందులో మహిళల వాటా 49 శాతం. అయితే, మార్కెట్ అవసరాలకు తగ్గ నైపుణ్యం విద్యార్థుల్లో లేకపోవడం వారి ఉపాధి అవకాశాలను తగ్గిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య మౌలిక వసతులలో ఉన్న భారీ అంతరం మరో ప్రధాన సమస్య. టెక్నాలజీలో అధ్యాపకుల కొరత, పరిశోధనా రంగంలో తగిన నాణ్యత లేక పోవడం వంటివి కూడా ఆలోచించించాల్సిన సమస్యలే. అయితే డిజిటల్ టెక్నాలజీ ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది.మారిన విద్యాస్వరూపం కోవిడ్ తర్వాత ఉన్నత విద్య స్వరూపమే మారిపోయింది. డిజిటల్ బోధన అనివార్యంగా తెరపైకి వచ్చింది. ఇంటర్నెట్ అనుసంధానం, రిమోట్ లెర్నింగ్ సర్వసాధారణమైంది. కృత్రిమ మేధ, వర్చువల్ రియాలిటీ, వెబ్ ఆధారిత బోధనలే ఇక భవిష్యత్ను శాసిస్తాయనడం అతిశయోక్తి కాదు. అయితే, డిజిటల్ విద్యకు మౌలిక సదుపాయాలే కీలకం. సరైన అధ్యా పక వర్గమే ఆయువు పట్టు. బోధకులు, విద్యార్థులు ఇరువురిలో డిజిటల్ నైపుణ్యాలు ఉండి తీరాలి. ‘డిజిటల్ సాధనాల ద్వారా విద్యను బలోపేతం చేయాలి’ అన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు సాంకేతికత ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, లెర్నింగ్ ఎనలిటిక్స్ ఇక మీదట విద్యారంగ పురోగతికి అదనపు సాధనాలుగా మారబోతున్నాయి.కోవిడ్ మహమ్మారి వచ్చేనాటికి (2019) కంప్యూటర్, ఇతర డిజిటల్ డివైస్ల గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రాథమిక అవగాహన మాత్రమే ఉండేది. కోవిడ్ తర్వాత విద్యారంగంలో వీటి ప్రాధాన్యం అనూహ్యంగా పెరిగింది. తరగతి బోధనలో టచ్ స్క్రీన్లు, ప్రొజెక్టర్లు, ఆన్లైన్ నోట్బుక్స్, వాట్సాప్ మెసేజ్లు అంతర్భాగమయ్యాయి. జ్ఞాన సముపార్జనను టెక్నాలజీ (Technology) మరింత సులభతరం చేసింది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ రంగ ప్రవేశం తర్వాత సరికొత్త బోధనా పద్ధతుల వైపు వెళ్ళాల్సి వస్తోంది.సాంకేతిక పునాదులుస్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అందరికీ నాణ్యమైన విద్యను అందించడంపైనే దృష్టి పెట్టాయి. ఐఐటీల స్థాపన తర్వాత టెక్నాలజీతో కూడిన విద్యలో మార్పులు జరిగాయి. మౌలిక వసతుల కల్పన అవసరమైంది. ఈ కాలంలోనే శిక్షణా ప్రయోగశాలలు, గ్రంథాలయాలు అందుబాటులోకి వచ్చాయి. పరిశోధనలూ ఊపిరి పోసుకున్నాయి. ఇవన్నీ విద్యా వ్యవస్థ ఆధునీకరణకు తోడ్పడ్డాయి. 1970–80ల మధ్య యూనివర్సిటీలు ఆడియో విజువల్ సాధనాల వైపు వెళ్ళాయి. క్లాస్ రూముల్లోకి డిజిటల్ బోధన ప్రవేశించేలా వేగం పెరిగింది. 2009 తర్వాత హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, మార్పుల వేగాన్ని మరింత పెంచింది.ఇదే కాలంలో ప్రైవేటు వర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలూ పెరిగాయి. కంప్యూటర్ ఆధారిత బోధనా పద్ధతులు వచ్చాయి. డిజిటల్ అవగాహనతో కూడిన బోధనా విధానాలు అనివార్య మయ్యాయి. 2017లో ‘స్వయం’ ప్లాట్ఫామ్ సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, సులభతరమైన మూల్యాంకన పద్ధతులు, డిజిటల్ లైబ్రరీలు విద్యా వనరులను పెంచాయి.సాంకేతికత ఉన్నత విద్యలో మార్పులు తెచ్చినా... ఇది గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికీ అంతగా వెళ్ళలేదనే చెప్పాలి. డిజిటల్ మౌలిక వసతుల కొరత కనిపిస్తోంది. వర్చువల్ ప్రయోగశాలలు పల్లెపల్లెకూ చేరాలి. ఆన్లైన్ లోనే ప్రయోగాలు నిర్వహించే కాలమిది. భౌతిక ప్రయోగశాలలు లేని ప్రాంతాల్లో ఇది మంచి మార్పు తెస్తుంది. ఈ దిశగా వేగంగా అడుగులు పడాలి. ఇవన్నీ పరిశోధన రంగానికి కొత్త బలాన్ని ఇస్తాయి. ‘నేషనల్ అకడమిక్ డిపాజిటరీ’ ఆవిష్కరణతో విద్యార్థి అన్ని సర్టిఫికెట్లు డిజిటల్ రూపంలో భద్రంగా ఉంటాయి. ‘బ్లాక్చైన్’ సాంకేతికత ద్వారా డేటాను భద్రంగా ఉంచుతున్నారు. ఆన్లైన్ నివేదికలు, డిజిటల్ పాఠ్య సామగ్రి, వ్యవస్థీకృత విద్యా విధానాల వేగం మరింత పెంచేందుకు కృషి జరగాలి.చదవండి: అమెరికి కొరివితో తల గోక్కుందామా?కోవిడ్ తర్వాత ఊహాతీతంగా వెబ్నార్లు, సెమినార్లు, వర్క్షాపులు సర్వసాధారణం అయ్యాయి. ఆన్లైన్ వ్యవస్థకు అధ్యాపకులూ అనుసంధానం అవ్వాల్సి వచ్చింది. వాళ్ళూ కొత్త పరికరాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. డిజిటల్ స్క్రీన్ ద్వారా విద్యార్థులను ఆకర్షించే మార్గాలను అన్వేషించడం అనివార్యమైంది. కంప్యూటింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీ కలిస్తే అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుతుంది. ఈ తరహా టెక్నాలజీ విద్యా పరిమితిని విస్తృతం చేసింది. ఇక్కడి నుంచే ప్రపంచంలోని ప్రఖ్యాత విద్యాలయాల్లోని అధ్యాపకుల పాఠాలు వినవచ్చు. ఎక్కడి నుంచైనా డిజిటల్ సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు వచ్చింది.సమస్యపై దృష్టి పెట్టాల్సిందే!గ్రామీణ పేదలకు డిజిటల్ విద్య ఇప్పటికీ సవాల్గానే ఉంది. ఇంటర్నెట్ లేని పల్లెలు; స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు లేని పేద విద్యార్థులు ఇప్పటికీ ఉన్నారు. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనడం వారికి సాధ్యం కాదు. ఈ వెనుకబాటుతనం పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉంది. సాంకేతిక విప్లవంలో గ్రామీణ ప్రాంతాలనూ భాగస్వాములను చేయడానికి అవసర మైన చర్యలపై దృష్టి పెట్టాలి. ఆ ప్రాంతాలకు వనరులు సమకూర్చడంలో ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలి. నిజానికి స్వయం ప్లాట్ఫామ్... పాఠశాల నుంచి పీజీ స్థాయి వరకూ ఉచిత ఆన్లైన్ కోర్సులు అందిస్తోంది. ఈ సేవలను అందుకునే స్థితికి అందరూ రావాలి. ఇంటర్నెట్ అందుబాటులో లేని విద్యార్థులకు 32 టీవీ చానళ్ళ ద్వారా పాఠాలు అందిస్తున్నారు. అయితే, డిజిటల్ విద్యను మరింత చేరువ చేస్తేనే వీరికి ఉపయోగం. అత్యున్నత ప్రమాణాలతో విద్య అందించడం అప్పుడే సాధ్యమవుతుంది.- ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డితెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ -
అమెరికా కొరివితో తల గోక్కుందామా?
అమెరికాతో కుదుర్చుకొనే వాణిజ్య ఒప్పందాలపై కీలకమైన చర్చలు జరపడానికి భారత విదేశీ వాణిజ్య శాఖకు చెందిన ఓబృందం అమెరికాలో పర్యటించి ఇటీవలనే స్వదేశం చేరుకొంది. అమెరికా కొన్ని నిర్దిష్ట మైన చర్యల్ని ప్రతిపాదిస్తోంది. ప్రధానంగా ఎగుమతులు, దిగుమతులపై భారత్ విధి స్తున్న అన్ని రకాల ఆంక్షల్ని ఎత్తివేయాలని పట్టుబడుతున్నది. అమెరికా సూచనలను, పెంచుతున్న ఒత్తిళ్లను ఇప్పటివరకూ భారత్ అంగీకరించకపోవటం ఊరట కలిగించేదే. కాగా, ఆగస్ట్ మొదటి వారంలోనే తుది నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత భారత్ ముందుంది. అమెరికా ఒత్తిడి మేరకు వ్యవసాయ, పాడి పరిశ్రమ రంగాలను ‘ఓపెన్ అప్’ చేసినట్లయితే... భారత్ నుంచి ఎగుమతుల మాట అటుంచి, అమెరికా నుంచి అన్ని రకాల వ్యవసాయ, పాల ఉత్పత్తులు భారత మార్కెట్లను ముంచెత్తుతాయి. ప్రారంభంలో మెట్రోలు, తర్వాత దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలలో అమెరికా పండ్లు, కూరగాయలు... చివరకు ఆకుకూరలు, పూలు దర్శన మిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ముందు స్వేచ్ఛ, అటుపై సంకెళ్లు1990 ముందువరకు ‘జనరల్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ అంటే టారిఫ్ (గాట్) వ్యవస్థ అధ్యక్షుడు ఆర్థర్ డంకెల్ ప్రతిపాదించినఅంతర్జాతీయ స్వేచ్ఛా వాణిజ్య సమాజంలో భారత్ భాగస్వామి కాలేదు. కానీ, 1991లో పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాకదేశంలో మొదలైన ఆర్థిక సంస్కరణల పర్వంలో భారత్ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) భాగస్వామి అయింది. దీనివల్ల్ల మన వ్యవసాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరిగి మంచి ధర లొస్తాయనీ, నాసిరకం స్వదేశీ వస్తువులకు బదులుగా మేలు రకం విదేశీ వస్తువులు కారుచౌకగా అందుబాటులోకి వస్తాయనీ పాలకులు ఊదరగొట్టారు. బహుళజాతి సంస్థల ఉత్పత్తులు మనతో పాటు కొన్ని వర్ధమాన దేశాల్లో కొంత మేర చౌకగా లభించిన మాట నిజం. అయితే, దానివల్ల స్వదేశీ సంస్థలు శీఘ్రగతిన తమ ప్రాభ వాన్ని కోల్పోయాయి. అనేకం మూతబడ్డాయి. మరికొన్నింటిని బహుళజాతి సంస్థలే హస్తగతం చేసుకొన్నాయి. మోన్శాంటో వంటి బహుళజాతి సంస్థలు దేశీయ విత్తన రంగాన్ని గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఏర్పడింది.ఇప్పుడు అమెరికాతో కుదుర్చుకొనే వాణిజ్య ఒప్పందంలో వ్యవ సాయం, పాల ఉత్పత్తులు కూడా భాగమైతే... దేశీయ రైతాంగంకుదేలవడం తథ్యం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ‘డెడ్ లైన్’ను లెక్క చేయకుండా భారత్ కచ్చితమైన వైఖరిని తీసుకోవా లనీ, లేదంటే అమెరికా వలలో ఇండోనేషియా చిక్కుకొన్నట్లుఅవుతుందనీ ‘గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆర్ఐ)’ ఇప్పటికే హెచ్చరించింది. ట్రంప్ వ్యక్తిగతంగా ఫోన్లు చేసి ఇండో నేషియా, కంబోడియా దేశాధినేతల్ని అమెరికా ఒప్పందాలకు అను కూలంగా సంతకాలు చేయించారని.. అటువంటి పరిస్థితి భారత్ తెచ్చు కోరాదని పలువురు వాణిజ్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇండోనేషియాలో ఏం జరిగింది?అమెరికాతో ఇండోనేషియా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ప్రకారం, అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై ఆ దేశంలో ప్రస్తుతం విధిస్తున్న సుంకాల్లో 99 శాతం కోతపడింది. దాంతో ఇండో నేషియా పారిశ్రామిక, సాంకేతిక, వ్యవసాయ ఉత్పత్తుల రంగాలపై అమెరికా గుత్తాధిపత్యం వహించే పరిస్థితి ఏర్పడింది. మరోవిధంగా చెప్పాలంటే... దాదాపు సున్నా సుంకాల కారణంగా ఇండోనేషియా మార్కెట్లను అమెరికా ఉత్పత్తులు ముంచెత్తుతాయి. అందువల్ల ఇండో నేషియాలో స్వదేశీ పరిశ్రమలకు గిరాకీ లేక మూతపడతాయి. అక్కడి వ్యవసాయదారులు ఇకపై వ్యవసాయం విరమించుకోవాల్సిందే. అయితే ట్రంప్ దయతలచి ఇండోనేషియా నుంచి వచ్చే ఉత్పత్తులపై తమ దేశంలో ప్రస్తుతం విధిస్తున్న 40% సుంకాలను 19%కు తగ్గించారు. అంటే, ఇండోనేషియాలోని అన్ని రకాల ఉత్పత్తి రంగాలు... అమెరికా ఎగుమతుల మీదనే ఆధారపడాలి. ఏదో సామెత చెప్పి నట్లు, చెయ్యోడిని వదిలి కాలోడిని పట్టుకొన్న చందంగా ఉంది.ప్రపంచంలోనే భారత్ వ్యవసాయ మార్కెట్ పెద్దది. ప్రస్తుతం దేశంలో 3,323 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పండుతుండగా, అందులో దేశీయ అవసరాలకు సుమారు 280 లక్షల మెట్రిక్ టన్నులు ఖర్చవుతున్నట్లు అంచనా. సగటున ఏటా 45 నుంచి 50 బిలియన్ల డాలర్ల ఆహారోత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది.29 బిలియన్ల డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. ఇందులో పప్పుదినుసులు, వంటనూనెలు, పండ్లు, కూరగాయలు అధికం. దశాబ్దంగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు పెరుగుతున్నాయి. దానివల్ల వ్యవసాయ వాణిజ్య మిగులు క్రమేపీ తగ్గుతోంది. పప్పు ధాన్యాలు, వంటనూనె గింజల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు తగ్గిస్తూ... దిగుమతులపై విధించిన సుంకాలను గణనీయంగా తగ్గించడంతో కొందరు వ్యాపారస్తులు విదేశాల నుండి కారుచౌకగా వీటిని దిగుమతి చేసుకొంటూ దేశీయ రైతాంగం పొట్టకొడుతున్నారు. ఫలితంగా, రైతులు వీటి సాగును విరమించుకొంటున్నారు, లేదా తగ్గించుకొంటున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 50% క్షీణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.అమెరికాతో వ్యవసాయ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే... భారత్లోకి అమెరికా ఉత్పత్తులు మాత్రమే వస్తాయన్న గ్యారంటీ లేదు. చైనా లేదా మరికొన్ని దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసు కొని, వాటినే భారత్కు ఎగుమతి చేసే అవకాశం ఉందని వాణిజ్య నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే పరిస్థితి మరింత దుర్భరం అవుతుంది.భారత్ ఎగుమతి మార్కెట్లపై అమెరికా కన్నుభారత్ ఎగుమతి మార్కెట్లను సైతం అమెరికా దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా, జపాన్ పై విధించిన 25 శాతం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గించారు. దానివల్ల జపాన్ ఇప్ప టివరకు భారత్ నుంచి దిగుమతి చేసుకొంటున్న బియ్యాన్ని కాదని, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి మొగ్గుచూపుతోంది.ఈ నేపథ్యంలోనే వాణిజ్య ఒప్పందాలలో వ్యవసాయ, పాల ఉత్పత్తి రంగాలను పూర్తిగా మినహాయించాలని ‘ఇండియన్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఫార్మర్స్ మూమెంట్ (ఐసీసీఎఫ్ఎం)’ కేంద్రా నికి విజ్ఞప్తి చేసింది. అమెరికా తన దేశీయ రైతాంగానికి ఏటా సగటున వ్యవసాయ బడ్జెట్లో 1.5 ట్రిలియన్ డాలర్ల మేర సబ్సిడీలుఅందిస్తూ, వాటిని విదేశీ మార్కెట్లలో లాభసాటిగా అమ్ముకోవడం ద్వారా సబ్సిడీల మొత్తానికి పదింతలు లాభాల్ని ఆర్జిస్తోంది. ఇటువంటి సూత్రాలను అన్ని రంగాలలో అమలు చేస్తున్న అమెరికాతో భారత్ సరైన ప్రాతిపదిక లేకుండా ఒప్పందం కుదుర్చుకోవడంఅంటే కొరివితో తల గోక్కోవడమే.ప్రస్తుతం 70 కోట్ల మంది భారతీయులు బతుకు తెరువు కోసం వ్యవసాయ రంగం మీదనే ఆధారపడుతున్నారు. దేశ ప్రజలకు ఆహార భద్రత అందిస్తూ, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి, స్థిరమైన ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న వ్యవసాయ, పాడి రంగాలకుసంబంధించి తీసుకొనే ప్రతి నిర్ణయమూ జాతి ప్రయోజనాల కోణంలో ఉండాలి.-వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు,కేంద్ర మాజీ కేంద్రమంత్రి-డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు -
అయిననూ అనుమానించాల్సిందే!
పహెల్గామ్లో 26 మంది సాధారణ పౌరుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల దాడి వెనుక ఉన్నది ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) అని అమెరికా ప్రకటించింది. టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్రసంస్థగా, గ్లోబల్ టెర్రరిస్ట్గా తాము పరిగణిస్తున్నట్టు అమెరికా ప్రకటిస్తూ... అది లష్కరే తోయిబా సోదర సంస్థ అనీ, దాని మరో రూపమే టీఆర్ఎఫ్ అనీ, లష్కరే తోయిబా కనుసన్నల్లో విదేశాలలో పరోక్ష యుద్ధం చేసే సంస్థ అనీ యూఎస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘ఈ చర్య... పహెల్గామ్ దాడికి తగిన న్యాయం చెయ్యడంలో అధ్యక్షుడు ట్రంప్ నిబద్ధతను వెల్లడిస్తోంది’ అని ఆ శాఖ వ్యాఖ్యానించడం గమనార్హం.ఇవాళ అమెరికా టీఆర్ఎఫ్ను గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించడం అంటే... ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్ చేస్తున్న విజ్ఞప్తులకు అంతర్జాతీయ ఆమోదం, సహకారం లభించడానికి మార్గం సుగమం అయ్యిందని అర్థం. మన దేశం ఐక్యరాజ్యసమితి భద్రతాసమితి 1267 తీర్మానాన్ని అనుసరించి టీఆర్ఎఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించేలా చేయడానికీ, తద్వారా దానిపై ఆంక్షలు అమలు జరిపేలా చూడటానికీ అమెరికా ప్రకటనను ఉపయోగించుకోవచ్చు. దీంతో టీఆర్ఎఫ్ ఆగడాలకు కొంతవరకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. దానికి అందే నిధులు తగ్గిపోతాయి. ఇటీవలి కాలంలో భారత్కు లభించిన అతి పెద్ద దౌత్య విజయంగా నిపుణులు ఈ నిషేధాన్ని అభివర్ణిస్తున్నారు.అయితే తమ మనుగడకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఉగ్రవాద సంస్థలు పేర్లు మార్చుకుని తమ కార్యకలాపాలను యథాతథంగా నిర్వహించడం కొత్తకాదు. భావ సారూప్యం కలిగిన వివిధ రకాల వ్యక్తుల సహకారం రహస్యంగా అందుతున్నంత కాలం ఉగ్రసంస్థలను అంతమొందించడం సాధ్యం కాదు. ఈ మధ్యనే రాయచోటిలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో కొందరు వ్యక్తులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చెయ్యడం మనం చూశాం. వాళ్లు దశాబ్దాలుగా అదే ఊర్లో నివసిస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. పైకి మామూలుగానే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు నిర్ఘాంతపోయే రీతిలో అక్కడ పేలుడు పదార్థాలు, తీవ్రవాద సాహిత్యం, తుపాకులు దొరికాయి. ఇటువంటివాళ్లను గుర్తించటం అంత తేలికేమీ కాదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉన్నంత మాత్రాన, అమెరికా ఇవాళ కొత్తగా ఆ సంస్థను గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ప్రకటించినంతమాత్రాన అలాంటి కార్యకలాపాలు రాత్రికి రాత్రే ఆగిపోతాయి అనుకోవటం ఒట్టి భ్రమ.మరొక గమనార్హమైన సంగతేమిటంటే అమెరికాను నమ్మదగిన దేశంగా భావించలేకపోవడం. ముఖ్యంగా ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు మాట మారుస్తుందో చెప్పలేం. యూఎస్ ఎయిడ్ (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) సంస్థ భారతదేశంలో ప్రభుత్వాలను అస్థిరపరచడానికీ, తప్పుడు కథనాలను వ్యాపింపజేసేందుకు మీడియా సంస్థలను ప్రోత్సహించడానికీ నిధులను వెచ్చించిందనే సమాచారం ఉండనే ఉంది. అంతేకాదు, యూఎస్ ఎయిడ్ సంస్థ, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆర్థిక విభాగం ఫతా–ఎ–ఇన్సానియత్ (ఎఫ్ఈఐ)కు నిధులు సమకూర్చిందన్న సంగతి కూడా ఆ మధ్య వెలుగు చూసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో టీచర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం యూఎస్ ఎయిడ్ సంస్థ 7.5 కోట్ల డాలర్లను ఖర్చుచేస్తోంది. ఈ నిధుల్లో ఎక్కువ భాగం వివిధ మార్గాల్లో లష్కరే తోయిబాకి చేరుతున్నాయనేదీ ఒక విమర్శ. పహెల్గామ్ దాడి తర్వాత అమెరికా స్పందించాల్సినంత తీవ్రంగా స్పందించకపోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకే పాక్ అత్యున్నత సైనికాధికారిని అధ్యక్ష భవనానికి విందుకు ఆహ్వానించి పొగడ్తలతో ముంచెత్తడం వంటి పరిణామాలను గమనించినప్పుడు అమెరికాను నమ్మవచ్చా అనే ప్రశ్న తలెత్తక మానదు.– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటియూట్యూబర్ -
అమానుషంపై స్పందించి తీరుదాం!
నాకెందుకో నిమిష ప్రియకు మరణ దండనను అమలుపరచకపోవచ్చు అనిపిస్తోంది. ఇరాన్ అండదండలున్న హూతి దళాల పాలనలో ఉన్న యెమెన్లోని భాగంలో షరియా చట్టం అమలులో ఉంది. కేరళకు చెందిన 38 ఏళ్ళ నర్సు నిమిష ప్రియ ఆమె వ్యాపార భాగస్వామిని హత్య చేసిందంటూ అక్కడి చట్టం ఆమెకు మరణ దండనను విధించింది. హూతీల రాజకీయ, న్యాయ పాలనా సౌధంలో ప్రతి ఒక్కరు ఆ శిక్షను ధ్రువపరచేశారు. పాలక్కాడ్లో జన్మించిన ఆ క్రైస్తవ మతస్థురాలు అరెస్టు అయి, శిక్షపడినప్పటి నుంచి ఇప్పటికి అనేక నెలలుగా ఫైరింగ్ స్క్వాడ్ ను ఎదుర్కోవలసిన స్థితిలో ఉంది. మరణ దండనను అమలుపరచేందుకు యెమెన్లో కాల్పులు జరిపి చంపే విధానం అమలులో ఉంది. నాలుగు ఆశలువర్తమాన భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో భారతదేశానికున్న ప్రాధాన్యం వల్లనైతేనేమి లేదా నిమిష కేసు దాదాపుగా మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం వల్లనైతేనేమి లేదా మరణ దండనకు వ్యతిరేకంగా ఇరాన్, సౌదీ అరేబియాలు యెమెన్కు నచ్చజెప్పడం వల్లనైతేనేమి ఆ దేశం బుల్లెట్లకు ఇంకా పనిచెప్పలేదు. నిమిషను కాపాడేందుకు ‘సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్’ పేరుతో కొందరు ఒక సంఘంగా ఏర్పడ్డారు. నిమిష లీగల్ డిఫెన్స్ను సమన్వయపరచుకుంటూ ఆ కౌన్సిల్ పనిచేస్తోంది. కేరళలోని ఇస్లామిక్ మత పెద్దలు, ప్రసిద్ధ స్కాలర్లు బహిరంగంగా, తెర వెనుక మార్గాల ద్వారా శిక్షను ఆపు చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ ప్రయత్నాలు వృథా పోవని అనిపిస్తోంది. మరణ దండనకు గురిచేయకుండా ఆమెను విడిచిపెట్టవచ్చుననడానికి నాకు మరో నాలుగు కారణాలు తోస్తున్నాయి. ఒకటి– షరియా అమలులో ఉండటం నిజం. హతుని కుటుంబ ఆగ్రహం కూడా అర్థం చేసుకోదగిందే. నమ్మశక్యం కాకపోయినా, కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతాన్ని ప్రపంచం అసహ్యించుకుంటుందని సానా(యెమెన్ రాజధాని) లోని అధికార వర్గాలకు తెలియదనుకోలేం. రెండు– యెమెన్లోని ఆ భాగంలో ఉన్న అధికారులు మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ నిబంధనలకు జవాబుదారులు ఏమీ కారు. గతంలో మరణ దండనలను గణనీయంగానే అమలు జరిపి ఉండవచ్చు. అంతమాత్రాన, ప్రపంచ మనోభిప్రాయాన్ని లెక్క చేయనివారుగా బాహాటంగా కనిపించకూడదని వారు అనుకుంటూ ఉండవచ్చు. మూడు– జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వంటి సమర్థులు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్నారు. పరాయి దేశంలో బందీగా ఉన్న ఒక భారతీయ మహిళను కాపాడలేకపోయినదిగా కనిపించడం భారత ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. నిమిష ప్రాణాలను కాపాడేందుకు హంగు ఆర్భాటాలు లేకుండా ఎంత ప్రయత్నించాలో అంతా న్యూఢిల్లీ చేస్తుంది. నాలుగు– హతుని కుటుంబం దోషిని క్షమించినందుకు పరిహారంగా ఇచ్చే నగదు(బ్లడ్ మనీ) మొత్తంపైనే ఇపుడు సంప్రదింపులు సాగుతున్నట్లు చెబుతున్నారు. వాటిలో ప్రభుత్వం పాల్గొన్నా పాల్గొనకపోయినా ప్రపంచంలోనే నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ నగదు కొరతతో బాధపడుతున్నదిగా ముద్రపడలేదు.ఒకవేళ ఆశలు అడియాసలైతే...పైన పేర్కొన్న కారణాలన్నింటివల్ల నిమిష ప్రియను కాపాడారు అనుకుందాం. అదృష్టం బాగుండి ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది అనుకుందాం. ఆమెకు ఘన స్వాగతం లభిస్తుంది. ఆమె ప్రాణాలను కాపాడిన ఘనత తమదేనని చెప్పుకునేవారూ చాలా మంది ఉంటారు. కానీ, నా ఈ అంచనాలన్నీ ఘోరంగా తలకిందులు కావచ్చు. సానాలోని పాలకులు నిమిష ప్రియకు మరణ దండనను అమలుపరిస్తే, నేను పైన చెప్పిన విషయాలన్నీ బుద్ధి హీనమైనవిగా తేలతాయి. నిజంగానే, ఘోరం జరిగితే, భారత్ ఏం చేయవలసి ఉంటుంది? భారత్ తన అసంతృప్తిని సానాకు తెలిపి తీరాలి. ‘‘ఇది టెర్రరిజం కేసు కాదు కదా. ఆ పని భారత్ను ఉద్దేశించి చేసింది కాదు. ఆ చర్య భారత రాజ్య వ్యవస్థకు లేదా ప్రజానీకానికి వ్యతిరేకంగా తీసుకున్నది కాదు’’ అని ఎవరూ అనుకోకూడదు. ఎందుకంటే, సానాలోని రాజకీయ వ్యవస్థ చట్టబద్ధమైనదని ప్రపంచం గుర్తించలేదు. అటువంటి వ్యవస్థ తమ దేశంలో ఉంటున్న ఒక భారతీయురాలి జీవితాన్ని అంతమొందిస్తే మనం మౌనంగా చూస్తూ ఊరుకోవాలా? అందులోనూ ఆమె సేవా భావంతో నిండి ఉండే నర్సింగ్ వృత్తిలో ఉన్న వ్యక్తి. ఆమెకు అలాంటి గతి పట్టవచ్చా? అనేక దేశాలలో వివిధ వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్న భారతీయులు సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారిలో నర్సులు గణనీయమైన వర్గం కిందకు వస్తారు. ఆ యా దేశాలు అన్నింటి దృష్టిలో మనం చులకన అయిపోమా? నిమిష చేసిన నేరం తక్కువదేమీ కాదు. దాన్ని గర్హించకుండా ఉండటమో లేదా ఉపేక్షించడమో చేయలేం. దాన్నలా ఉంచినా, హతుని దేహాన్ని ఆమె ముక్కలు చేసిన తీరు ఇంకా ఘోరం. కానీ, ఆమె హంతకురాలిగా మారడానికి పురికొల్పిన అంశాలను కూడా విస్మరించలేం. అటువంటి నేరమే భారతదేశంలో జరిగి ఉంటే, దిగువ కోర్టు ఉరి శిక్ష విధించినా సంబంధిత హైకోర్టు లేదా సుప్రీం కోర్టు దాన్ని జీవిత ఖైదు శిక్షగా తగ్గించే అవకాశాలు ఎక్కువ. కోర్టులన్నీ మరణ దండనను సమర్థించినా, క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించి శిక్షను తగ్గించే అవకాశమూ ఉంది. అసంతృప్తిని చాటి తీరాలి!సరే. అది ఇపుడు అప్రస్తుతం. దేశపు చట్టబద్ధమైన ప్రభుత్వంగా గుర్తింపు పొందని కొన్ని శక్తుల నియంత్రణలో ఉన్న యెమెన్లోని ఒక భూభాగంలో ఫైరింగ్ స్క్వాడ్ నిమిషను కాల్చి చంపితే, ఇండియా ఎలా స్పందించాలి? ఆపరేషన్ రాహత్ కింద, ఆ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులను భారత ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చింది. యెమెన్లోని ఆ ప్రాంతంలో ఇప్పటికీ కొద్ది వేల మంది భారతీయులు ఉన్నారని చెబుతున్నారు. వారినందరినీ ఏకమొత్తంగా వెనక్కి తీసుకొచ్చే అంశాన్ని భారత్ పరిశీలించవలసి ఉంటుందా? వారిలో కొంత మందికి స్వదేశానికి రావడం ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ఆ పని చేయాలా? దానివల్ల యెమెన్కు వాటిల్లే నష్టం ఏమైనా ఉంటుందా? అక్కడున్న భారతీయుల భద్రత పట్ల భారత్కు నమ్మకం కలగడం లేదనే అంశాన్ని మనం వెల్లడించి తీరాలి. యెమెన్లోని ఆ ప్రాంతంతో వాణిజ్యాన్ని (అది లెక్కలోకి వచ్చేది కాకపోయినా) మనం తీవ్రంగా పరిమితం చేయాలి. సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని మనం ఈ విషయంలో అనుసరించినా తప్పు లేదు. కానీ, నేను మొదట ధైర్యంగా అనుకుంటున్నదే నిజమవ్వాలని ఆశిద్దాం. ఇలాంటి స్పందనలకు వెళ్ళాల్సిన అవసరం రాకూడదనే ప్రార్థిద్దాం. ఈ సందర్భంగా భారత్ చేసి తీరవలసిన పని మరొకటుంది. పాకిస్తాన్లో మరణ దండనను ఎదుర్కొంటున్న కులభూషణ్ జాధవ్ను స్వదేశానికి తిరిగి రప్పించాలన్న మన డిమాండ్ను ఇది మరింత బలోపేతం చేయాలి. నిమిష కేసును (ఒకవేళ ఆమె శిక్షను మనం నిలువరించలేకపోతే) ఆసరాగా చేసుకుని, జాధవ్కు కూడా అటువంటి గతి పట్టించే సాహసం పాకిస్తాన్ అధికారులకు కలుగకుండా మనం ప్రతిఘటించి తీరాలి. ఇది చాలా ముఖ్యం. అన్నింటికన్నా మించి, అరుదైన కేసుల్లోనే విధిస్తున్నప్పటికీ, మన దేశంలోనూ ఉరి శిక్షకు అవకాశం కల్పిస్తున్నాం. శిక్షా స్మృతికి సంబంధించి నీతి నియమాలు పరిణామం చెందుతున్న పరిస్థితులలో, ఆ రకమైన (ఉరి) శిక్ష తగినది కాదని మనం గ్రహించవలసి ఉంది.గోపాలకృష్ణ గాంధీవ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, ఆధునిక భారతదేశ చరిత్ర విద్యార్థి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఢిల్లీ ఉల్లంఘనల రాజధాని కూడానా?!
దేశమంతా ఎలా ఉన్నా, కనీసం రాజధాని ఆదర్శప్రాయంగా, ఉదాహరణప్రాయంగా ఉండాలంటారు. రాజధానిలోనే సుప్రీంకోర్టు, పార్లమెంటు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కీలకమైన అధికార యంత్రాంగం వంటి అత్యున్నత అధికార పీఠాలు, విదేశీ రాయబార కార్యాలయాలు, విదేశీ ప్రచార సాధనాల ప్రతినిధులు ఉంటారు. దేశమంతటికీ అది కూడలి. అందరి దృష్టీ రాజధాని మీదనే ఉంటుంది. (కొన్నేళ్ల కిందనైతే జంతర్ మంతర్ (Jantar Mantar) రోడ్డు మీద అరగంట తిరిగితే దేశపు సమస్యలన్నీ తెలిసేవి. ఇప్పుడది మారిందనుకోండి. సమస్యలు పోయాయని కాదు, జంతర్ మంతర్ను మార్చేశారు!) మొత్తం మీద రాజధానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అందువల్ల ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చకుండా, కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంచి, పోలీసు యంత్రాంగాన్ని స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వం చేతిలో కాక, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంచారు. ఢిల్లీ ప్రభుత్వం ఏ పార్టీదైనప్పటికీ, పోలీసు యంత్రాంగం నేరుగా కేంద్ర ప్రభుత్వ హోం శాఖ నిర్వహణలో ఉంటుంది.అటువంటి మహా ఘనత వహించిన ఢిల్లీ పోలీసుల ఇటీవలి పనులు వారు స్థానిక ప్రభుత్వం కన్న పై స్థాయిలో మాత్రమే కాదు, భారత రాజ్యాంగం కన్న, భారత ప్రజాస్వామిక ఉద్యమాలలో వెల్లువెత్తి, చట్టాలుగా మారిన విలువల కన్న, అసలు మానవత కన్న, నాగరికత కన్న పైన ఎక్కడో అతీతంగా, వాటన్నిటినీ లెక్క చేయనక్కర లేని స్థితిలో ఉన్నారని చూపుతున్నాయి. దేశంలో పాలనా విధానాల పట్ల, తమ జీవితాలను అతలాకుతలం చేస్తున్న ఆర్థిక, రాజకీయ పరిణామాల పట్ల విద్యార్థి లోకంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతున్నది. ఉద్వేగభరితమైన వయసు వల్ల ఆ అసంతృప్తి వ్యక్తీకరణలు తీవ్రంగా ఉండటం కూడా సహజమే. ఢిల్లీలో జేఎన్యూ, జామియా మిలియా, అంబేడ్కర్ విశ్వవిద్యాలయాలు అటువంటి అసంతృప్తికి, ఆందోళనలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అక్కడి విద్యార్థి లోకాన్ని బెదిరించి, ప్రశ్నను, ఆలోచనను చిదిమేయాలని ఢిల్లీ పోలీసులు (Delhi Police) ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా అక్కడ విద్యార్థులలో పని చేస్తున్న భగత్ సింగ్ ఛాత్ర ఏకతా మంచ్, దిశ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నజరియా పత్రిక, ఫోరం అగెనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఫాకమ్) వంటి సంస్థల సభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.భగత్ సింగ్ ఛాత్ర ఏకతా మంచ్కు చెందిన గురుకీరత్ అనే విద్యార్థిని, గౌరవ్, గౌరంగ్ అనే విద్యార్థులు జూలై 9న కనబడకుండా పోయారు. జూలై 11న ఫాకమ్కు చెందిన పరిశోధక విద్యార్థి ఎహెతమామ్ ఉల్ హక్, విద్యార్థిని బాదల్లను వారి ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుపోయారు. జూలై 12న పొరుగున హరియాణా యమునా నగర్లో సామాజిక కార్యకర్త, మనస్తత్వ శాస్త్రవేత్త సామ్రాట్ సింగ్ను ఢిల్లీ పోలీసులు స్థానిక హరియాణా (Haryana) పోలీసులకు సమాచారం కూడా ఇవ్వకుండా పట్టుకుపోయారు. జూలై 19న విద్యార్థి రుద్రను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి పట్టుకుపోయారు. ఇలా నాలుగు దఫాలుగా జరిగిన ఏడుగురు విద్యార్థి, యువజనుల అపహరణలను చట్టబద్ధమైన అరెస్టు అనడానికి వీలులేదు. వారిని పట్టుకుంటున్నప్పుడు పోలీసులు ఎటువంటి వారంట్, నోటీసు చూపలేదు. రాజ్యాంగ అధికరణం 22, చట్టాలు, అనేక కోర్టుల ఆదేశాలు చెపుతున్నట్టుగా ఇరవై నాలుగు గంటల లోపు ఏదైనా కేసు పెట్టి న్యాయస్థానం ముందు హాజరు పరచలేదు. చట్టం నిర్దేశిస్తున్నట్టుగా వారి కుటుంబ సభ్యులకు తెలపలేదు, వారు కోరుకున్న న్యాయవాదిని పిలిపించి వారి ముందే నిర్బంధితులను ప్రశ్నించలేదు. వారందరినీ రోజుల తరబడి ఢిల్లీలో న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో భయంకరమైన చిత్రహింసలకు గురిచేశారు. ఏడు రోజుల అక్రమ నిర్బంధం తర్వాత జూలై 16న గురుకీరత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి పోలీసు స్టేషన్కు వచ్చి కూతురిని తీసుకుపోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులు చూసేటప్పటికి ఆమె శారీరకంగా, మానసికంగా శిథిలమైన స్థితిలో ఉంది. అదే స్థితిలో జూలై 17న బాదల్, గౌరవ్, గౌరాంగ్లను, జూలై 18న ఎహెతమామ్, సామ్రాట్లను, జూలై 21న రుద్రను వదిలిపెట్టారు.ఈ దౌర్జన్యం, అక్రమ నిర్బంధం, చిత్రహింసలు ఇరవైలలో ఉన్న నవయువత మీద కాగా, ఏడు పదులు నిండిన హర్ష్ మందర్, అరవై ఆరేళ్ల జీన్ డ్రీజ్, నందితా నారాయణ్ వంటి సుప్రసిద్ధుల విషయంలో కూడా రాజ్యాంగ అధికరణం 19ని, భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించబోమని పోలీసులు చూపారు. వారితోపాటు వంద మంది జూలై 19న నగరం నడిబొడ్డున నెహ్రూ ప్లేస్లో జరుపుతున్న శాంతియుత ప్రదర్శన మీద మూకదాడి జరుగుతుంటే దౌర్జన్యకారులను అడ్డుకోవలసిన పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు. హర్ష్ మందర్ ఐఏఎస్ వదులుకుని ప్రజా ఉద్యమాలతో పని చేస్తున్నారు. జీన్ డ్రీజ్ ప్రపంచ ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త. చదవండి: విచారణా లేదు.. విడుదలా లేదు!నందితా నారాయణ్ ఢిల్లీ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్. వారితోపాటు పౌర సమాజ ప్రముఖులు, విద్యార్థి యువజనులు గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న మారణహోమానికి నిరసనగా జరుపుతున్న ప్రదర్శన అది. వారి ప్రదర్శన మొదలయిందో లేదో, ఒక పెద్ద మూక చుట్టూ ఉన్న భవనాల మొదటి అంతస్తుల నుంచి ప్రదర్శనకారుల మీద కోడిగుడ్లు, టమాటాలు, పేడ, రాళ్లు విసిరింది. పోలీసులు ఘర్షణను నివారించడానికి ప్రయత్నించలేదు. రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామిక సంప్రదాయాలను, నాగరిక విలువలను, మానవత్వాన్ని తుంగలో తొక్కడంలో కూడా తమది రాజధాని అని ఢిల్లీ పోలీసులు చూపదలిచారా?- ఎన్ వేణుగోపాల్ ‘వీక్షణం’ సంపాదకుడు -
బిహార్ ఎన్నికల దిక్సూచి ఎటువైపు?
దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బిహార్ రాజకీయాలది ఎప్పుడూ ప్రత్యేకతే! రెండు వేల యేళ్లకు పైగా చరిత్ర కలిగిన నాటి పాటలీపుత్ర, నేటి పట్నా రాజధానిగా గల బిహార్... సంకీర్ణ ప్రభుత్వాలకు పుట్టినిల్లు. 1990లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తర్వాత రాష్ట్రంలో 35 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా! రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశాలుండటంతో దేశ వ్యాప్తంగా బిహార్పై ఆసక్తి నెలకొంది. అస్థిర ప్రభుత్వాల రాష్ట్రంబిహార్ రాజకీయాల్లో కుల ప్రభావం ఎక్కువ. రూ. 28,485 తలసరి ఆదాయంతో దేశంలోనే పేద రాష్ట్రంగా నిలిచిన బిహార్ అస్థిరమైన ప్రభుత్వాలతో మరింత వెనుకబడింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ) కొద్ది కాలం తర్వాత మహాఘట్ బంధన్తో చేతులు కలిపింది. అనంతరం తిరిగి ఎన్డీఏతో జత కట్టింది. తొమ్మిది సార్లు బిహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీశ్ కుమార్ పలుమార్లు కూటములు మారడం రాజకీయ అస్థిరతకు నిదర్శనం. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూటముల కూర్పు కూడా ఆసక్తి కలిగిస్తోంది. నితీశ్ నేతృత్వంలో ఎన్డీఏ ఎన్నికలకు సిద్ధమవుతున్నా, కూటమిలోని బీజేపీ ఎత్తుగడలను అంచనా వేయలేము. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న మహాఘట్ బంధన్ కూటమిలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్దే ఆధిపత్యం. ఈ రెండు కూటములకు పోటీగా బరిలోకి దిగుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బీజేపీ, జేడీ (యూ) సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉండటంతో పాటు దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ప్రచారం కలిసి వచ్చే అంశం. గత ఎన్నికల్లో 115 స్థానాల్లో పోటీ చేసిన జేడీ(యూ) 43 స్థానాల్లో గెలవగా, 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 74 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో తామే అధిక స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ చెబుతుంటే, 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను చూపుతూ, సమ స్థానాల్లో పోటీ చేయాలని జేడీ(యూ) వాదిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాల్లో, జేడీ (యూ) 16 స్థానాల్లో పోటీ చేయగా ఈ రెండు పార్టీలు చెరో 12 చోట్ల గెలిచాయి. ఎన్డీఏ కూటమికి హిందువుల్లోని అగ్రవర్ణాలు, యాదవేతరుల ఓబీసీ వర్గాలు ఓటు బ్యాంకుగా ఉన్నాయి. సీఎం నితీశ్ బిహార్ మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్లు ఇటీవల ప్రకటించడంతో ఎన్డీఏకు మహిళల మద్దతు రెండింతలైంది. దీంతోపాటు రోడ్ల నిర్మాణం, మద్య నిషేధం, సంక్షేమ పథకాలు కూడా ఎన్డీఏకు లబ్ధి చేకూర్చనున్నాయి. నితీశ్ రాష్ట్రంలో నిర్వహించిన కులగణనతో ఓబీసీలు ఎన్డీఏకు సానుకూలంగా ఉన్నారు. పార్టీల బలాబలాలుబలం సంగతి అలా ఉంటే, నిజానికి పాలక ఎన్డీఏ కూటమికి బిహార్లో ఆశించినంత సానుకూలత లేదు. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ఎన్డీఏ ఓట్లు చీలే ఆస్కారముంది. మరో పార్టీ హిందుస్థాని అవామ్ మోర్చ (హెచ్ఏఎమ్) ఎక్కువ స్థానాలు కోరుతుండటంతో గందరగోళం నెలకొంది. అలాగే 20 ఏళ్లుగా జేడీ (యూ) అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత గుదిబండగా మారనుంది. ప్రభుత్వోద్యోగాల భర్తీ ఆశించిన మేర జరగకపోవడంతో యువత అసంతృప్తిగా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడాన్ని మహాఘట్ బంధన్ సానుకూలంగా మలచుకుంటే ఎన్డీఏకు తిప్పలు తప్పవు. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ ఆశలన్నీ ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పైనే ఉన్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనకు ప్రజాదరణ ఉందని కొన్ని సర్వేల్లో వెల్లడైంది. నిరుద్యోగం, ఉపాధి కోసం బిహారీ యువత వలసలు, ద్రవ్యోల్బణంతో నిత్యావసర ధరలు పెరగడం, రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం వంటి అంశాలను యువనేత తేజస్వీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యారు. వామపక్ష పార్టీలు కూటమికి అదనపు బలం. మైనారిటీ, ఓబీసీ ఓట్లపై గంపెడాశలు పెట్టుకున్న ఈ కూటమి భవితవ్యం ముస్లిం, యాదవ సామాజిక వర్గాల చేతుల్లోనే ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)ల మధ్య సీట్ల పంపకంలో సయోధ్య పైనే మహాఘట్ బంధన్ విజయావకాశాలు ఆధారపడ్డాయి. 2020 శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ గెలుపు 19 చోట్లకు పరిమితం అవడం వల్లే అధికారానికి దూరమయ్యామనే భావన ఉంది. ఆ ఎన్నికల్లో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీ ఈసారి జాగ్రత్త పడుతోంది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్కు ప్రజాదరణ ఉన్నా, ఆయన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ హయాంలో అవినీతి, శాంతి భద్రతల వైఫల్యంతో ‘జంగల్ రాజ్’గా ముద్రపడటం ఆర్జేడీకి నష్టం చేకూర్చే అంశం. జాతీయ స్థాయిలో ఎన్నికల వ్యూహకర్తగా పేరు గడించిన ప్రశాంత్ కిశోర్ బిహార్లో రాజకీయ అదృష్టంపై దేశ వ్యాప్త రాజకీయ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జన్ సురాజ్ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పార్టీకి పట్టణ ప్రాంతాల్లో, యువతలో ఆదరణ ఉన్నా రాష్ట్ర కుల రాజకీయాలు, పొత్తు జిత్తుల మధ్య ఆయన వ్యూహాలు ఫలించడం అంత తేలిక కాదు. సోషల్ మీడియా వేదికలపై జన్ సురాజ్ బలంగా కనిపిస్తున్నా, సంస్థాగతంగా బలహీనంగా ఉంది. జన్ సురాజ్ గెలుపు కంటే, ఆ పార్టీ చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాఘట్ బంధన్ కూటమి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయడం ఖాయం.‘సర్’ వివాదంఅసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు వ్యూహరచనలు, ప్రణాళికలు రూపొందిస్తుంటే బిహార్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం... బిహార్లో 40 లక్షలకుపైగా ఓటర్లపై అనుమానాలున్నాయి. వీటిలో 14 లక్షలకుపైగా మృతుల పేర్లు జాబితాలో ఉన్నాయంటున్నారు. 19 లక్షలకు పైగా ఇతర ప్రాంతాలకు వెళ్లారు. 7 లక్షల మంది ఇతర చోట్ల కూడా ఓటర్లుగా నమోదయ్యారు. 11 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఓటర్లలో బంగ్లాదేశ్, మయాన్మార్, నేపాల్ దేశస్థులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఏడాది కిందటి లోక్సభ ఎన్నికలప్పుడు రాని ఈ అంశాలన్నీ ఇప్పుడే రావడం వివాదాస్పదమవుతోంది. ((నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పార్లమెంట్లో జేడీ(యూ) మద్దతు కీలకమైన నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.)) ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. తేడావస్తే మాత్రం నితీశ్ వైఖరిలో మార్పు వచ్చినా ఆశ్చర్యం లేదని గత అనుభవాలే చెబుతున్నాయి. ఎన్డీఏకు మెజారిటీ వచ్చినా నితీశ్ విషయంలో బీజేపీ వైఖరి మారితే కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం పడుతుంది. ఈ సమీకరణాల దృష్ట్యా బిహార్ ఎన్నికల రాజకీయ దిక్సూచి ఎటు వైపు మళ్లేనో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.దిలీప్ రెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎనలిస్ట్ -
చైనాలో ఇంత అభివృద్ధి ఎలా?
చైనా పేరు వినగానే సర్వసాధారణంగా తోచే ప్రశ్నలు కొన్నున్నాయి. అక్కడ ఇంతటి అభివృద్ధి ఎందుకు? మార్క్సిజం, సోషలిజం పరిస్థితి ఏమిటి? ప్రజలకు స్వేచ్ఛలు ఉంటాయా? వంటివి. ఇవి ఎంత ముఖ్యమైన ప్రశ్నలో వాటన్నింటి మధ్యగల పరస్పర సంబంధం కూడా అంత ముఖ్యమైనది. ఈ విషయాల గురించి ఎంతో చదువుతుంటాం, వింటుంటాం. కానీ అక్కడి పరిస్థితులను కళ్లారా చూడటం, వారితో మాట్లాడి తెలుసుకోవటం వేరు. చైనాలో కొద్ది వారాల పాటు పర్యటించిన తర్వాత కలిగిన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.రెండు శతాబ్దాలుఅభివృద్ధి గురించి మాట్లాడేవారు గుర్తించనిది ఏమంటే, ఈ భావనకు, అభివృద్ధి చెంది తీరాలన్న పట్టుదలకు మూలాలు చరిత్రలో ఉన్నాయి. అవి 1949 నాటి కమ్యూనిస్టు విప్లవంతో మొదలయ్యాయి. వారిలో విప్లవం కోసం ఎంత తపన ఉండేదో, బలమైన అభివృద్ధి కోసం అంత ఉండేది. ఆ మేరకు వారి ఆలోచనలు ఏమిటి? చైనా, భారతదేశం గొప్ప చరిత్ర, సంస్కృతి, ఆర్థికాభివృద్ధి ఉండిన దేశాలు. విదేశీయుల ఆధిపత్యం, దోపిడీ వల్ల దెబ్బ తిన్నాయి. చైనాకు సంబంధించి 1839 నాటి మొదటి నల్లమందు యుద్ధంతో మొదలై సరిగా 110 సంవత్సరాల తర్వాత 1949లో కమ్యూనిస్టు విప్లవం విజయవంతమయే వరకు గల కాలాన్ని కమ్యూనిస్టులు ‘అవమానాల శతాబ్దం’ (సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్) అన్నారు. తమ నాయకత్వాన ఆ తర్వాతి నూరేళ్లు 1949 నుంచి 2049 కాలం ‘పునరుజ్జీవన శతాబ్దం’ (సెంచరీ ఆఫ్ రిజువనేషన్) కావాలని గట్టిగా తీర్మానించుకున్నారు.చైనా చరిత్రను, సంస్కృతిని విస్తారంగా అధ్యయనం చేసినట్లు పేరున్న మావో కాలంలో జరిగిన ఈ తీర్మానం ప్రకారం ఈ రోజు వరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఏకదీక్షతో పనిచేస్తూ వస్తున్నాయి. తమ లక్ష్యం సాధనకు అవసరమైన అవగాహనలు, ప్రణాళికలు, వాటి అమలులో పట్టుదల, అందుకు కావలసిన ఆర్థిక, శాస్త్ర–సాంకేతిక, మానవ వనరులు అన్నీ వారికున్నాయి. ప్రజల సహకారం ఉంది. అందువల్లనే, ‘పునరుజ్జీవన శతాబ్దం’ 1949లో మొదలై ఇప్పటికి 75 సంవత్సరాలు గడిచి ఇంకా 25 సంవత్సరాలు మిగిలి ఉన్న దశకు చేరేసరికి, చైనా ఇంతటి అభివృద్ధిని సాధించగలిగింది. ఈ లక్ష్య సాధన కోసం వారు చేస్తున్న గమనార్హమైన ప్రయత్నం మరొకటి ఉంది. కమ్యూనిస్టు విప్లవానికీ, అవమానాల శతాబ్దం, పునరుజ్జీవన శతాబ్దం అనే భావనలకూ బీజాలు ఏ విధంగానైతే వారి చరిత్ర, సంస్కృతులలో ఉన్నాయో, అదే ప్రకారం ఆ చరిత్ర, సంస్కృతి, జాతీయ భావన, దేశభక్తి భావనల పునాదిగా ప్రజలను పాజిటివ్గా సమీకృతం చేస్తూ, వారిని ఈ అభివృద్ధి మహా యజ్ఞంలో భాగస్వాములను చేయగలుగుతున్నారు. ఆ అభివృద్ధి ఫలాలను మొత్తం మానవజాతి చరిత్రలోనే ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఇది సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి మాట.కళ్లకు కట్టిన అభివృద్ధిఇక ఆ అభివృద్ధి తీరుతెన్నులపై అనేక కథనాలు తరచు వెలువడుతున్నవే అయినందున, ఆ వివరాలు, గణాంకాలలోకి ఇక్కడ వెళ్లటం లేదు. వాటిలో పేర్కొననివి, నేను స్వయంగా చూసి సంభ్రమం చెందినవి కూడా అనేకం ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం చెప్తాను. నేను బీజింగ్ నుంచి శియాన్ నగరానికి వెళ్లిన హైస్పీడ్ రైలు వేగం గంటకు 350 కి.మీ.లు. అది గాక 450 కి.మీ. రైలు మరొక మార్గంలో ఉంది గానీ అందులో ప్రయాణించలేదు. అయితే, 600 కి.మీ.ల రైలుపై ప్రయోగాలు జరుగుతున్నట్లు విన్నాను. చైనా నుంచి ఇండియా చేరిన తర్వాత 48 గంటలలో వచ్చిన వార్త ఆ ప్రయోగం విజయవంతమైందని, ఆ రైలు వేగం 620 కి.మీ.లకు చేరిందని. అక్కడి హైస్పీడ్ రైళ్లు ఏవీ నేలపై నడవవు. వందల, వేల కి.మీ.లు ఎలివేటెడ్ కారిడార్లలోనే (హైదరాబాద్ మెట్రో తరహాలో) నడుస్తాయి. చైనా అభివృద్ధి లక్ష్యం 2049 నాటికి ప్రస్తుత రెండవ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరాలని. అవమానాల శతాబ్ది, పునరుజ్జీవన శతాబ్దిగా మారాలన్న లక్ష్యం ఆ విధంగా నెరవేరగలదన్నది ఆలోచన. ప్రచారంలోకి రాలేదు గానీ ఈ ఆలోచన మావో కాలంలోనే మొదలై నేటికీ కొనసాగుతున్నది. ఆ రోజులలో అందుకు సవాళ్లు పలు అభివృద్ధి చెందిన అన్ని దేశాల నుంచి ఉండేవి. ఇపుడు మిగిలింది అమెరికా ఒక్కటే. ఇది అన్నింటికి మించిన సవాలు. ఇక్కడి తరహా లోనే...ప్రస్తుతానికి మాత్రం చైనా అభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు సజావుగానే సాగుతున్నట్లు కనిపిస్తున్నది. అందువల్లనే ఆర్థికంగా రెండవ స్థానానికి చేరింది. పర్చేజింగ్ పవర్ పేరిట (సమానమైన సరకులు, సర్వీసులకు అయే ఖర్చు అమెరికా కన్న చైనాలో తక్కువ కావటం)లో అమెరికాను 2017లోనే మించిపోవటం, నౌకా బలంలో అమెరికాను దాటడం, వైమానిక శక్తిపై పెట్టుబడులు, ఆధునిక పరిశోధనలు గణనీయంగా పెంచుతుండటం, సైన్స్–టెక్నాలజీ రంగంలో దరిదాపులకు వస్తుండటం, కొన్నింటిలో ఇప్పటికే అమెరికా కన్న ముందుకు పోవటం వంటివి ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఏక ధ్రువ ప్రపంచం నుంచి బహుళ ధ్రువ ప్రపంచం అనే నినాదం, బ్రిక్స్, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ) వంటి సంస్థలు, ఇతర దేశాలతో అమెరికా కూటమికి భిన్నంగా విన్–విన్ పాలసీ (మీరు, మేము ఉభయులమూ లాభపడాలి) అనే ఆర్థిక సంబంధాలు, మీ అంతర్గత విషయాలలో అమెరికా కూటమి వలె జోక్యం చేసుకోబోమనే రాజకీయ విధానం, సైన్స్ – టెక్నాలజీ బదిలీలు మొదలైనవి దీర్ఘకాల ఆర్థిక – రాజకీయ వ్యూహాలు అవుతున్నాయి. అందుకు ఒక మంచి ఉదాహరణను చెప్పాలంటే, నేను చైనాలో ఉన్న రోజులలోనే బ్రిక్స్ సమావేశాలు బ్రెజిల్లో జరిగాయి. ఆ సంస్థలో చేరే దేశాలపై పెద్ద ఎత్తున అదనపు సుంకాలు విధించగలమని గతం నుంచి హెచ్చరిస్తుండిన ట్రంప్, అదే హెచ్చరిక తిరిగి చేశారు. కానీ, అదేమీ లెక్క చేయకుండా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల నుంచి మరొక 16 దేశాలు కొత్తగా చేరాయి. ఇవన్నీ అమెరికా పలుకుబడిని తగ్గించి చైనా పలుకుబడిని పెంచేవి. చైనా 2049 నాటికి అగ్రరాజ్యమయ్యేందుకు తోడ్పడగలవి.ఇవే రంగాల గురించి తెలుసుకోగలది ఇంకా చాలా ఉంది గానీ అదంతా ఇక్కడ చెప్పుకోలేము గనుక మొదట ప్రస్తావించిన ప్రశ్నలలో రెండు ముఖ్యమైన వాటి గురించి కొద్దిగా చూద్దాము. అక్కడ మార్క్సిజం, సోషలిజం, క్యాపిటలిజం పరిస్థితి ఏమిటన్నది ఒకటి. ప్రజలకు గల స్వేచ్ఛలు ఏమిటన్నది రెండవది. క్యాపిటలిజం పెట్టుబడులు, వ్యాపారం, లాభాలు అక్కడి ప్రభుత్వపరంగా, సంపన్నులైన చైనీయులపరంగా, బయటి దేశాలతో ఉమ్మడి పెట్టుబడుల పరంగా బాగా వర్ధిల్లుతున్నాయి. ఈ విధానాలు డెంగ్ శియావో పింగ్ సంస్కరణలు, 2001లో డబ్ల్యూటీవోలో చైనా చేరటం నుంచి మొదలై సాగుతున్నాయి. ఆ విధంగా ఒనగూరే లాభాలు, సమాజంలో కింది స్థాయి వరకు లభిస్తున్న ఆదాయాలూ క్లాసికల్ సోషలిజానికి ప్రత్యామ్నాయంగా మారాయి. సోషలిజం విత్ చైనీస్ క్యారక్టరిస్టిక్స్ అన్న డెంగ్ సూత్రీకరణకు రూపం, సారం ఇదేననుకోవాలి. అడుగడుగునా కెమెరాల నిఘాలు, మౌలికంగా వ్యవస్థకు వ్యతిరేకమైన చర్యలను సహించక పోవటం, ఒకే పార్టీ వ్యవస్థల వల్ల ఎన్నికలు గ్రామస్థాయిలో తప్ప ఇతరత్రా లేకుండటం మినహా, ఇక్కడ ఉన్న స్వేచ్ఛలన్నీ అక్కడా కనిపించాయి. చదువులు, ఉద్యోగ వ్యాపారాలు, దేశ విదేశాలకు ప్రయాణాలు, సంపాదనలు, ఖర్చులు, అవినీతి, విలాసాలు, కోరుకున్నట్లు బట్టలు వేసుకోవడం, కొన్ని అవలక్షణాలు, సంప్రదాయికమైన నమ్మకాలు, ఆచారాలు అన్నీ ఉన్నాయి. చివరకు నైట్ లైఫ్ వీధులు, మసాజ్ పార్లర్లు, సెక్స్ టాయ్ షాపులు సహా. సగటు మనిషికి ఇంతకన్న కావలసిన స్వేచ్ఛలేమిటి?టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధమేనా?
ప్రభుత్వ పెద్దలూ, ప్రభుత్వాలను నడిపే రాజకీయ పార్టీలూ ఒక నిర్ణయం తీసుకున్నాయంటే దాని వెనుక ఏదో మతలబు ఉంటుంది అనే అనుమానం వ్యక్తం చేయ వలసిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పంచాయితీ ఎన్నికల్లో 42 శాతం సీట్లు కేటాయించే ఆర్డినెన్స్ను జారీ చేయడాన్ని అందుకే అనుమానించాల్సి వస్తోంది. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై ఇప్పటి దాకా మౌనం పాటించిన ప్రభుత్వం హఠాత్తుగా పంచాయితీ ఎన్ని కలకు ముందు, ఆర్డినెన్స్ జారీ చేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.అసలు ఇది రాజ్యాంగ విరుద్ధమనే విషయాన్ని ముందు ప్రజలు తెలుసుకోవాలి. ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రయత్నిస్తున్నదని అర్థం చేసుకోవాలా? కావాలనే రాజకీయ చాణక్యంతో చేసిన వ్యూహ రచనా? సుప్రీంకోర్టు మొత్తం రిజర్వేషన్ల కోటా 50% మించి ఉండరాదనే పరిమితీ, పలు రాజ్యాంగ నిబంధనలు ఇటువంటి ఆర్డినెన్స్ల జారీ సరికాదనీ సూచిస్తున్నా ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు?ప్రజలు అమాయకులని ప్రభుత్వం భావిస్తున్నదా? కె. కృష్ణమూర్తి అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ఇండియా అండ్ అనదర్ (2010) తీర్పులో ట్రిపుల్ టెస్ట్ ప్రిన్సి పుల్ చెప్పిన సుప్రీంకోర్టు... వికాస్ కిశన్రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం (2021) కేసులో ముఖ్యమైన ప్రమాణా లను నిర్దేశించింది. ట్రిపుల్ టెస్ట్ ప్రిన్సిపుల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజ ర్వేషన్కు సంబంధించినది. మరీ ముఖ్యంగా ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్కు సంబంధించినది. ఇందులో మూడు అంశాలు ఉన్నాయి. ఒక నిర్ధారిత స్థానిక సంస్థ పరిధిలో ఉన్న ఓబీసీల వెనుకబాటు తనాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ను నియమించాలి. కమిషన్ రికమండేషన్లను పరిగణనలోకి తీసుకుని అవసరమైన రిజర్వేషన్ నిష్పత్తిని నిర్ణయించడం రెండోది. రిజర్వేషన్ల మొత్తం పరిమితి 50 శాతానికి మించకుండా చూడటం మూడోది. అయితే అత్యవసర పరిస్థితులలో మాత్రమే, స్పష్టమైన ఆధారాలు,సంఖ్యా పరమైన డేటా ఉంటే మినహాయింపు ఇవ్వవచ్చు.తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన కులగణనలో బీసీ జనాభా 56% అని తెలిపినా, అధ్యయన నివేదికను గోప్యంగా ఉంచడం అను మానాలకు కారణమైంది. రెండు ముఖ్యమైన బిల్లులు (విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు) రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. వాటిని రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపించారు కూడా. కానీ రాష్ట్రపతి ఏం చేస్తారో చెప్పలేం.ఎందుకంటే తమిళనాడు చట్టాలు చేసిన బిల్లులను, ఆర్డినెన్సు లను ధర్మాసనాలు విని, నిర్ణయించి ఈ విధంగా వేధించకండి అని స్పష్టం చేశాయి. అయినా రాష్ట్రపతికి సలహా కోసం మళ్లీ సుప్రీంకోర్టు పెద్దలకు పంపించడం మరో చాణక్యమే.మధ్యాహ్నం 3 గంటలకు శాసనసభను ప్రోరోగ్ చేసి, సాయంత్రం గవర్నర్కు ఆర్డినెన్స్ పంపించడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసే ప్రయత్నంగా చూడాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 213(1)(ఏ) ప్రకారం, రాష్ట్రపతి అనుమతి అవస రమైన అంశంపై గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయలేరు. కాబట్టి, ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమయ్యే అవకాశాలు బోలెడు.ఇంద్రా సహానీ కేసు (1992)లో సుప్రీంకోర్టు 50% రిజ ర్వేషన్ పరిమితి విధించింది. ఇదే చరిత్రలో మండల్ కమిషన్ కేసుగా ప్రసిద్ధం. కృష్ణమూర్తి, గవాలి కేసుల్లో ఇదే నియమాన్ని పునరుద్ఘాటించింది. మరాఠా రిజర్వేషన్ కేసు (2021)లో కోర్టు ఇలా చెప్పింది: ‘50 శాతానికి మించటం అనేది నియమం కాదు. అతీ తమైన పరిస్థితుల్లో మాత్రమే మినహాయింపు.’ దీన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నాయకులు అర్థం చేసు కోవాలి.సర్వే వివరాలు దాయడం ఎందుకు? తెలంగాణ ప్రభుత్వం డేటా గోప్యంగా ఉంచడం, అత్య వసర పరిస్థితి ఆధారాలు చూపకపోవడం వల్ల ఈ నిర్ణయం న్యాయపరంగా బలహీనం అయిపోతున్నది. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి రానున్న పంచాయితీ ఎన్నికలు కారణం కావచ్చు. బీసీ ఓటుబ్యాంక్ను ఆకట్టుకోవడానికి ఇదొక ఎత్తుగడై ఉంటుందనే అను మానం. బీసీ సాధికారత తప్పనిసరి అయినా, రాజ్యాంగ పరిమితులు, పారదర్శకతను విస్మరించి తీసుకున్న ఈ నిర్ణయం సమస్యాత్మకం.ఆర్టికల్స్ 243డి (6), 243టి (6) అనేవి స్థానిక సంస్థల రిజర్వేషన్ విధానాన్ని స్పష్టంగా నిర్ధారించాయి. అయితే విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబాటు వేరు, రాజకీయ వెనుకబాటు వేరు అని ఇవి స్పష్టం చేశాయి. కాబట్టి వీటిని ఉటంకించి సుప్రీంకోర్టు న్యాయవాదులు ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వెళితే ఓ ఆట అడుకుంటారు. కావాలని కోర్టులో ఓడిపోయే విధంగా చట్టాలు, ఆర్డినెన్సులు చేయడం అంటే కాల క్షేపం చేయడమే తప్ప మరేమీ కాదు.చివరకు మిగిలేది, తగిలేది ఒకే ప్రశ్న: సామాజిక న్యాయం పేరుతో రాజ్యాంగ నియమాలను అతిక్రమించవచ్చా? సమాధానం కోర్టుల తీర్పులో తెలుస్తుంది. రాజ్యాంగం పట్ల గౌరవం కోల్పోతే, ప్రజాస్వామ్య విశ్వసనీయత దెబ్బతింటుంది.-వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
ఆ సోయి ఎరిగే దశకు చేరేది ఎప్పుడు?
బ్రెజిల్లో జూలై మొదటి వారంలో ముగిసిన ‘బ్రిక్స్’ దేశాల సదస్సులో... తదుపరి 2026 డిసెంబర్లో జరిగే సమావేశం ఆతిథ్య బాధ్యత ఇండియాది అయింది. దాంతో – ఆ కూటమిలో సీనియర్ సభ్యదేశంగా ఇక్కడ మూడవ ‘టర్మ్’ కూడా ప్రభుత్వంలో కొనసాగు తున్న ఎన్డీఏ విధానాలలోని ‘బ్రిక్స్’ స్ఫూర్తిని ‘గ్లోబల్’ దృష్టి నుంచి సూక్ష్మ స్థాయి సమీక్షగా చూడటం తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే, 2001లో మొదలైన ‘బ్రిక్స్’ కూటమి సమీప దేశాలను కలుపు కొని విస్తృతమై 2025 నాటికి ‘గ్లోబల్ సౌత్’ భావన స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఉపాంగమైన ‘యూఎన్డీపీ’ సభ్యదేశాలకు 2030 నాటికి అమలు లక్ష్యంగా ఇచ్చిన 17 ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ (ఎస్డీజీ) విష యమై ‘బ్రిక్స్’ సభ్యదేశాల ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి అని చూసినప్పుడు... బ్రెజిల్ పర్యావరణం ప్రధానంగా తన ప్రాధా న్యతలు ఎంచుకుని, ‘ధరిత్రికి శ్వాస’గా పరిగణించే అమెజాన్ చిత్తడి అడవుల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. అందుకు భిన్నంగా ఒకప్పటి ‘హరిత విప్లవ’ దేశమైన ఇండియా ‘గ్లోబల్ ఐటీ పవర్ హౌస్’గా ఐటీ మ్యాన్పవర్ సర్వీసులు యూరోపి యన్ దేశాలకు అందించే వనరుగా ఉంది.దాంతో యూఎన్డీపీ ఎస్డీజీ జాబితాలోని చివరి రెండు అంశాలపై మన ‘స్టాండ్’ ప్రశ్నార్థకం అయింది. అధిక జనాభాతో అసంఖ్యాకంగా ఉన్న మానవ వనరులను పర్యావరణ హితానికి ఏ మేరకు దేశం వాడుతున్నదన్నది ‘పాలసీ’ చర్చ అవుతున్నది. ఉదాహరణకు పదేళ్ళ క్రితం తెలంగాణ అనే ఒక కొత్త రాష్ట్రాన్ని కేంద్రం ఏర్పాటు చేయవలసి వస్తే, ఆ కారణంగా వట్టి చేతులతో మిగిలిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతము–ప్రజలు దృష్టి నుంచి కొన్నేళ్ల పాటు అయినా అమలు చేయాల్సిన ఒక ‘పబ్లిక్ పాలసీ’ని రూపొందించే విషయమై కేంద్ర, రాష్ట్రాలు మిన్నకుండి పోయాయి. రెండు చోట్ల ఏర్పడ్డవి కొత్త ప్రభుత్వాలు కావడంతో వాటి రాజకీయ ప్రయోజనాల ముందు రాష్ట్ర ప్రయోజనాలు చిన్నవి అయ్యాయి. అయితే, ఇవి వేటితోనూ పనిలేని ‘నీతి ఆయోగ్’ ప్రతి మూడు నెలలకు జిల్లాల వారీగా ఎస్డీజీ లక్ష్యాలను మదింపు చేయాలి కనుక, అది ఆ యా ప్రభుత్వాల రాజకీయాలతో పనిలేకుండా అధికారుల వెంట పడుతున్నది. దాంతో ‘నీతి ఆయోగ్’కు జవాబుదారీ కావడం అనేది వారికి తప్పనిసరి అయింది. ఇలా ఇప్పుడు ఇవేవీ ఎవ్వరూ ‘లైట్’ తీసుకునేవి కావు. ఇందులో ‘లెజిస్లేచర్’ బాధ్యత కూడా ఉన్నప్పటికీ, ‘బ్యూరోక్రసీ’ కనుక తమ విధుల్లో వెనకబడితే అది సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. మరి అధికారులను ప్రభుత్వం వారి పని వారిని చేసుకోనిస్తున్నదా? వారి అనుభవానికి తగిన బాధ్యతలు అప్ప గిస్తున్నదా అంటే అది వేరే చర్చ. రేపు ఏదైనా జిల్లాలో పెరిగిన శాంతిభద్రతల సమస్య వల్ల మేము ఎస్డీజీ లక్ష్యాలు సాధించ లేకపోయాం అని కలెక్టర్ అంటే, అందుకు ఆ జిల్లా పోలీస్ ఎస్పీ వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. ‘గుడ్ గవర్నెన్స్’ సాధన దిశలో అన్ని శాఖల సమష్టి కృషి ఇక్కడ అనివార్యం. అప్పట్లో అలా అప్పగించిన పనిచేసి చూపించడం వల్లనే 2024 నాటికి ‘నీతి ఆయోగ్’ ఎంపిక చేసిన ఏలూరు, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు ఢిల్లీ నుంచి అవార్డులు అందు కున్నారు.మళ్ళీ ప్రధాన విషయానికి వస్తే, కేంద్రం–రాష్ట్రాలకు అప్ప గించిన ప్రాధాన్యతాంశాలను పక్కన పెట్టి ‘వరల్డ్ క్లాస్ కేపిటల్’, ‘క్వాంటమ్ వ్యాలీ’, ‘క్రియేటివ్ సిటీ’, ‘డ్రోన్ సిటీ’ అంటూ మన సొంత ఎజెండా ఎత్తుకుంటే, వ్యవసాయం ప్రధానం అయిన రాష్ట్రంలో ఏడాదిలోనే భూమి పుత్రుల నుంచి వెల్లువెత్తే సమస్యల తీవ్రత ఎలా ఉంటుందో ఈ ఏడాది మొదటి 6 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ విషయంలో చూశాం. మిర్చి, పొగాకు, మామిడి, పంటల రైతుల సమస్యలు చివరికి శాంతి భద్రతల విషయంగా మారడం అనేది పెద్ద జాబితాలోని కొన్ని అంశాలు మాత్రమే. అది అలా ఉంచి అస్సలు ఎస్డీజీ లక్ష్యాలు రూపొందించడంలోనే యూఎ న్డీపీ సున్నితమైన సూక్ష్మదృష్టి గమనిస్తే స్పష్టం అవుతున్నది. ఈ 17 అంశాల జాబితాలోని 12వది – ‘బాధ్యతాయుతమైన విని యోగం–ఉత్పత్తి’, పదిహేన వది ‘జీవావరణం’. ఈ రెండు కూడా ప్రాధాన్యతల విషయంలో గందరగోళంలో ఉన్న కొత్తద యిన ఏపీకి నేరుగా వర్తించే అంశాలు. ఇక్కడే మరోసారి బ్రెజిల్–ఇండియా ప్రాధాన్యతలలోని వైరుద్ధ్యాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇండియా ‘గ్లోబల్ ఐటీ పవర్ హౌస్’గా పరిణమించడం వరకు బాగుంది. మరి మన ఎకానమీ మాన్యుఫ్యాక్చర్ రంగం నుంచి సర్వీసుల రంగా నికి బదిలీ అయ్యాక, ఏ సర్వీసుల్లో ఏ కులాల ప్రజలు ఉన్నారు అనే వర్గీకరణ అక్కరలేదా? ఎందుకంటే, ‘కులం’ మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన అంశం. మరి వ్యవసాయం ప్రధానం అయిన దేశంలో యాంత్రీకరణను తెచ్చి, అందరూ ‘సర్వీస్’ రంగంలోనే ఉపాధి అవకాశాలు వెతుక్కోవాలి అన్నప్పుడు, కనీస అర్హతలు లేని అసంఖ్యాక శ్రేణులు జీవిక కోసం మళ్ళీ ఎవరిపై ఆధారపడేట్టుగా మన ‘పాలసీలు’ నిర్దేశిస్తున్నాయి? ఆర్థిక సంస్కరణలతో ‘ప్రైవేట్’ రంగం ‘రాజ్యం’ కార్యక్షేత్రంలోకి చొచ్చుకురావడం తెలిసి జరిగిందే అయినప్పటికీ, ఒక దేశం ‘ఎకానమీ’ వ్యవసాయం ప్రధానం అయినప్పుడు, రాజకీయ కారణాలతో ఏర్పడ్డ ఏపీ వంటి కొత్త రాష్ట్రం విషయంలో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా, స్థూలంగా అది ఒక ‘లైన్’ తీసుకుని దాని అమలుకు ఒక ‘పాలసీ’ని అనుసరించాలా, వద్దా? మరది ఎటువంటిది అయ్యుండాలి? ఇటు వంటి సోయి ఎరిగే దశకు మనం చేరేది ఎప్పుడు?జాన్సన్ చోరగుడివ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఇథనాల్ ఎకానమీ మంచీ చెడూ!
ఇంధన వినియోగం పెరగకుండా ఇండియా ఆర్థిక పురోగతి సాధ్యపడదు. వచ్చే ఇరవై ఏళ్లలో జీడీపీ వృద్ధి రేటు ఎంత ఎగబాకుతుందో, ఇది కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఇళ్లకు, ఫ్యాక్టరీలకు, ఆఫీసు లకు విద్యుత్ సరఫరా పెంచాల్సిఉంటుంది. రవాణా అవసరాలకు మరింత ఇంధనం సమకూర్చాలి. మూడొంతుల విద్యుదుత్పత్తికి బొగ్గే ఆధారం. మిగిలిన ఒక వంతు సోలార్, హైడ్రో, న్యూక్లియర్, బయోమాస్ మార్గాల ద్వారా ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వ్యవస్థాపక సామర్థ్యం మొత్తం విద్యుత్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో 50 శాతానికి చేరినప్పటికీ, వాస్తవ ఉత్పత్తి 25 శాతం మించిలేదు. చేరుకున్న లక్ష్యం బొగ్గు నిక్షేపాల్లో ఇండియా ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. అయినా 20 శాతం అవసరాలకు దిగుమతులపై ఆధార పడుతున్నాం. దీంతో విదేశీ బొగ్గు కోసం 20 బిలియన్ డాలర్లు (రూపాయల్లో దాదాపు 1.70 లక్షల కోట్లు) ఖర్చు పెట్టక తప్పడం లేదు. రవాణారంగం అవసరాలకు మరింత ఎక్కువగా దిగు మతులపై ఆధారపడాల్సి వస్తోంది. దేశవ్యాప్త ముడిచమురు విని యోగంలో 90 శాతం దిగుమతి అవుతోంది. గతేడాది 24.2కోట్ల టన్నుల క్రూడాయిల్ విదేశాల నుంచి వచ్చింది. అంతర్జాతీయ క్రూడ్ ధరలు బ్యారెల్ 65 నుంచి 85 డాలర్ల మధ్య ఉంటాయనుకుంటే, ఈ దిగుమతులపై 125 నుంచి 150 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం (రూ. 10 లక్షల కోట్ల నుంచి 13 లక్షల కోట్లు) వెచ్చించాల్సి వస్తుంది. శుభ వార్త ఏమిటంటే, పెట్రోలు, డీజిలు ఎగుమతులు ముడి చమురు దిగుమతుల కంటే వేగంగా పెరుగుతున్నాయి.గడచిన ఏడాది, 6.5 కోట్ల టన్నుల పెట్రోలు, డీజిలు మంచి లాభాలతో ఎగుమతి అయ్యాయి. ఇండియా చమురు శుద్ధి సామర్థ్యం 20 శాతం పెరిగి 31 కోట్ల టన్నులకు చేరుకోబోతోంది. దేశీయ అవసరాల కంటే వేగంగా రిఫైనింగ్ కెపాసిటీ పెరుగుతోంది. పశ్చిమ మహారాష్ట్రలో నెలకొల్పాలని ప్రతిపాదించిన కొత్త రిఫైనరీ వల్ల ఉత్పత్తి, ఉపాధి, ఎగుమతులు ఇంకా ఊపందుకుంటాయి. భవిష్యత్తులో దేశీయ రిఫైనింగ్ కెపాసిటీలో నాలుగో వంతు ఎగు మతులకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. ఇది విశేషమే అయినప్పటికీ, మనం గుర్తు పెట్టు కోవలసిన విషయం ఒకటుంది. ప్రపంచం శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి వేస్తోంది. ఇండియా సైతం కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని తగ్గించే ప్రధాన ధ్యేయంతో పెట్రోలు, డీజిలులో ఇథనాల్ బ్లెండింగ్ను పెంచేసింది. ఇండియాలో చెరకు నుంచి, మొక్కజొన్న, బియ్యం తదితర ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నారు. 2013లో 1.5 శాతంతో ప్రారంభించిన ఇథనాల్ బ్లెండింగ్ ఇప్పటికే 20 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. ఈ వృద్ధి పెట్రోలు, డీజిలు వినియోగ వృద్ధి కంటే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ (ఈబీపీ) విజయవంతం అయ్యేందుకు వీలుగా ఇథనాల్ ఉత్పత్తిదారులకు ప్రత్యేక సబ్సిడీలు ఇస్తున్నారు. తక్కువ జీఎస్టీ రేట్ల వర్తింపు, రుణాలపై వడ్డీ రాయితీ వంటి పలు ప్రోత్సాహకాలు అమలు అవుతున్నాయి. ఇథనాల్ ఉత్పత్తి టెక్నాలజీలో ఇండియా ప్రపంచ అగ్రగామిగా అవతరించింది. ఇథనాల్ ఇంత శాతం కలపాలి అనే నిబంధన వల్ల ఆయిలు కంపెనీలు ఆ మేరకు ఉత్పత్తిదారుల నుంచి తప్పనిసరిగా దాన్ని కొనుగోలు చేసితీరాలి. కాబట్టి, ఇథనాల్కు మార్కెటింగ్ సమస్య లేదు. ప్రస్తుతం 1,810 కోట్ల లీటర్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉండగా,ఇందులో చెరకు లేదా మొలాసిస్ ఆధారిత ప్లాంట్ల కెపాసిటీ 816 కోట్ల లీటర్లు. మిగిలిన దానిలో మొక్కజొన్నలు, బియ్యం సహా ధాన్యం నుండి ఇథనాల్ తయారు చేసే కెపాసిటీ 858 కోట్ల లీటర్లు. మరో 136 కోట్ల లీటర్ల కెపాసిటీ ప్లాంట్లు ఈ రెండు ముడి సరుకు లనూ ఉపయోగించుకుని పనిచేస్తాయి.నాలుగు ప్రయోజనాలునాలుగు ధ్యేయాలతో పదేళ్ల క్రితం ఈబీపీ అమలులోకి వచ్చింది. ప్రధానంగా ఒనగూరే ప్రయోజనం క్రూడాయిలు దిగు మతుల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. మరో మూడు ధ్యేయాలు ఉన్నాయి. అవి: విదేశీ మారక ద్రవ్యం ఆదా, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెంపు. ఇప్పటికే 20 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకున్నందు వల్ల, ఈబీపీ తన ధ్యేయాల సాధనలో ఎంతవరకు సఫలీకృతమైందో పరిశీలిద్దాం. ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చి 2024 నాటికి పదేళ్లయ్యింది.1. ఈ కాలంలో క్రూడాయిలు దిగుమతుల్లో 1.8 కోటి టన్నులు ఆదా చేయగలిగాం. కానీ ఇది మొత్తం దిగుమతిలో 0.8 శాతం మాత్రమే. 2. విదేశీమారక ద్రవ్యం పరంగా చూస్తే ఈ ఆదా విలువ దాదాపు రూ. 1.06 లక్షల కోట్లు. (రూపాయి సగటు మారకం రేటు ప్రకారం 10 బిలియన్ డాలర్లు). ఇది కూడా పదేళ్ల వ్యయంలో 0.5 శాతం కంటే తక్కువ. 3. ఇక కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను ఈబీపీ 5.4 కోట్ల టన్నులు తగ్గించగలిగింది. శాతంలో చూస్తే 1 శాతం కంటే తక్కువ. 4. వ్యవసాయానికి సంబంధించినంత వరకు, ఈబీపీ ఫలి తంగా రైతాంగం ఆదాయం పదేళ్లలో రూ. 1 లక్ష కోట్లు పెరిగింది. అదే సమయంలో డిస్టిలరీలు మరో లక్ష కోట్లు అదనంగా గడించాయి.శాతం ప్రకారం చూస్తే, చెరకు లేదా మొక్కజొన్న రైతుల వ్యవ సాయ ఆదాయంలో వృద్ధి ఫర్వాలేదన్నట్లు ఉంది. ఈబీపీ వచ్చిన తర్వాత చెరకు మార్కెట్లో అస్థిరత తొలగిపోయింది. అప్పటి వరకు చెరకు అధికోత్పత్తి సమస్య ఉండేది. ధాన్యాల విషయానికి వస్తే, 50 లక్షల టన్నుల బియ్యాన్ని ఇథనాల్ తయారీకి మళ్లించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి ప్రపంచ ఎగుమతుల్లో 9 శాతానికి, దేశీయ ఉత్పత్తిలో 4 శాతానికి, ప్రభుత్వ గోదాముల్లో మూలుగుతున్న నిల్వల్లో 10 శాతానికి సమానం.దుష్పరిణామాలుబియ్యం, మొక్కజొన్న వంటి ధాన్యాలను ఈబీపీ కోసం తరలించడం వల్ల ఉత్పన్నమైన దుష్పరిణామం ఏమిటంటే, దేశంలో కోళ్ల దాణా పరిశ్రమ చిక్కుల్లో పడింది. మొక్కజొన్నల నికర ఎగు మతిదారుగా ఉన్న ఇండియా నికర దిగుమతిదారుగా మారింది. ధాన్యంగా అమ్మేకంటే వాటితో ఇథనాల్ తయారు చేసి అమ్మడం డిస్టిలరీలకు లాభసాటిగా మారింది. ఈ ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం ఆహార ద్రవ్యోల్బణానికీ దారితీసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 81 కోట్ల మంది పేదలకు అయిదేసి కిలోల గోధుమలు లేదా బియ్యం ఉచితంగా సమ కూరుస్తోంది. దీనికోసం, ప్రభుత్వం పెద్దఎత్తున ధాన్యం సేకరణ, పంపిణీలు చేపట్టవలసి వచ్చింది. ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోలు, డీజిలు అమ్మకాల మీద 50 శాతం పైనే ఎక్సయిజ్; ఇతర పన్నులు చెల్లిస్తున్నాయి. ఇథనాల్ మీద పన్నుల భారం నామమాత్రం కాబట్టి, ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఈ భారం వారికి గణనీయంగా తగ్గుతుంది. అందుకే పెట్రోలు, ఇథనాల్ సుంకాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలించాలి. 20 శాతం బ్లెండింగు గొప్ప మైలురాయే. ఈ సందర్భంగా, ఆహార భద్రతపై దుష్ప్రభావాలు, ఆహార ద్రవ్యోల్బణం, రాయితీలు, ఆర్థిక భారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈబీపీ విధానాన్ని పునఃసమీక్షించడం అవసరం.అజిత్ రానాడే వ్యాసకర్త ప్రముఖ ఆర్థికవేత్త -
టెక్నాలజీతో మేలెంత? కీడెంత?
రోజుకో కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వస్తున్న కాల మిది. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, తయారీ రంగం... ఇలా అన్ని చోట్లా కృత్రిమ మేధ విస్తరిస్తోంది కూడా. అయితే... నిత్యజీవితంలోకి చొచ్చుకొచ్చేస్తున్న కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికత మన ఆలోచనా శక్తిపై చూపుతున్న ప్రభావం ఏంటి? వీటిపై ఆధారపడుతూ మనం మెదళ్లతో ఆలోచించడం తగ్గించేస్తున్నామా? తార్కికత, జ్ఞాపకశక్తి, హేతుబద్ధత వంటి మన మేధోశక్తులను టెక్నాలజీ కోసం చేజేతులా వదులుకుంటున్నామా?టెక్నాలజీ ప్రభావం మనపై ఎలా ఉంటుందో సులువుగా అర్థం చేసుకోవాలంటే... మొబైల్ అప్లికేషన్ల వాడకాన్ని గమనించండి. సోషల్ మీడియాలో రెండు, మూడు నిమిషాలుండే షార్ట్ వీడియోలు, రీల్స్కు కొన్ని కోట్ల మంది బానిసలైపోయారంటే అతిశయోక్తి కాదు. గంటల కొద్దీ పొట్టి వీడియోలు చూస్తూండటం తెలిసిందే. ఈ వ్యసనంలో మన మెదడుకు పనేమీ లేదు. చకచక కనిపిస్తున్న సమాచారాన్ని స్వీకరించడం మినహా. అయితే ఇలా చేయడం వల్ల మన మెదడు చాలా వేగంగా వినోదం అనే అనుభూతిని పొందుతుంది. ఇలా రోజూ గంటల తరబడి చూడటం అల వాటైన తర్వాత మన ఏకాగ్రత దెబ్బతింటుంది. డిజిటల్ డివైసెస్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడిపితే మన మెదడులోని నాడీ మార్గా(న్యూరల్ పాథ్వే)లలో మార్పులు జరుగుతాయని ఇప్పటికే జరిగిన కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.డిజిటల్ టూల్స్ జ్ఞాపకశక్తితో పని లేకుండా చేయ డమే కాకుండా... సంక్లిష్టమైన పనులను కూడా సులు వుగా అర్థమయ్యేలా చేయడం ద్వారా ఆలోచించే అవ సరం లేకుండా చేస్తాయి. ఇంకో మాటలో, నేర్చుకునేందుకు నేరుగా అవకాశం కల్పించకుండా విషయా లను అరటిపండు ఒలిచినట్టు ఒలిచి పెడతాయన్న మాట. అయితే ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ డిజైన్ బాగా ఉంటే మనకు మేలే జరుగుతుంది. ఆటో కంప్లీట్, డిజిటల్ కాలిక్యులేటర్లు, వ్యాకరణాన్ని సరిచేసే టూల్స్ వంటివి మన పనిని సులువు చేయడంతోపాటు ఈ పనులపై పెట్టాల్సిన శ్రమను తగ్గిస్తాయి. ఇంటర్నెట్, డిజిటల్ టూల్స్ను తగిన రీతిలో వాడుకుంటే మన మెదడు సమాచారాన్ని మరింత సమర్థంగా ప్రాసెస్ చేయగలదు. అవసరమైన విషయాలను జ్ఞాపకాల పొరల్లోంచి మెరుగ్గా అందివ్వగలదు. తద్వారా మన మేధాశక్తి మెరుగవుతుంది. ఇంటర్నెట్ ద్వారా మన మేధకు ఎదురయ్యే సవాళ్లూ ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా అతిగా సమాచారం అందడం వల్ల మెదడు దేనిని గ్రహించాలో తెలియక ఒత్తిడికి గురవుతుంది. ఫలితంగా నేర్చుకునే సామర్థ్యం తగ్గుతోంది. అధిక సమచారం మన నిర్ణయ సామర్థ్యంపై ప్రభావం చూపుతుందనీ, మేధపై ఒత్తిడిని పెంచుతుందనీ... ఫలితంగా నేర్చుకున్నది మనకు గుర్తుండే అవకాశాలు తగ్గిపోతాయనీ ఇప్పటికే జరిగిన పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. తగిన రీతిలో మన మెదడును వాడుకోకపోతే కాలక్రమంలో దీని నిర్మాణంలోనూ తేడాలొస్తాయి. అయితే టెక్నాలజీ నేరుగా మెదడు కుంచించుకు పోయేలా చేస్తుంది అనేందుకు ప్రస్తుతానికి స్పష్టమైన రుజువుల్లేవు. మన మెదడులోని న్యూరాన్లు అవసరా నికీ, కొత్త పరిస్థితులకూ, టూల్స్కూ తగ్గట్టుగా తమని తాము మార్చుకోగలవు. తగిన విధంగా వాడుకోక పోవడం వల్ల మెదడు చేసే కొన్ని పనుల సామర్థ్యం తగ్గవచ్చునేమో కానీ... టెక్నాలజీ ద్వారా కొన్నింటిని పెంచుకోవచ్చు కూడా. వీడియో గేమ్లను ఉదాహ రణగా తీసుకుంటే... వీటితోప్రాదేశిక తార్కికత (స్పేషి యల్ రీజనింగ్), మల్టీటాస్కింగ్ సామర్థ్యాలు పెరుగు తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అధిగమించడమెలా?డిజిటల్ టెక్నాలజీల ద్వారా వస్తున్న మేధో సంబంధిత సమస్యలను అధిగమించేందుకు: సోషల్ మీడియా బ్రౌజింగ్ లేదా ఇతర డిజిటల్ అలవాట్లను రోజులో నిర్దిష్ట సమయానికి పరిమితం చేయాలి. వారంలో ఒక రోజు స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్లో షార్ట్స్, రీల్స్ను చూడకుండా నియంత్రించుకోవాలి. ఏకాగ్రతను, వాస్తవికంలో ఉండేట్టు చేసే ‘మైండ్ఫుల్ నెస్ టెక్నిక్లను ఉపయోగించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మన మేధాశక్తికి బలం చేకూరుస్తుందనీ, జ్ఞాపకశక్తిని పెంచడంతోపాటు ఇతర లాభాలు చేకూరుస్తుందనీ పరిశోధనలు చెబు తున్నాయి. పుస్తకాలు చదవడం మన ఏకాగ్రతను పెంచేందుకు మంచి మార్గం. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘డిజిటల్ డీటాక్స్’ను మొదలు పెట్టాలి. సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్ను నిర్దిష్ట సమయం పాటు దూరంగా ఉండే ఈ డిజిటల్ డీటాక్స్ వల్ల టెక్నాలజీపై ఆధారపడే అల వాటు తగ్గుతుంది. అలాగే ప్రకృతికి దగ్గరగా జీవించడం, కళల పట్ల అభిరుచిని పెంచుకోవడం వంటివి సత్ఫలితాలను ఇస్తాయి. రోజూ తగినంత సమయం నిద్రపోవడం కూడా మన జ్ఞాపకశక్తి బలపడేందుకు, మేధోశక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. ఈ పద్ధ తులు అన్నింటినీ పాటించడం ద్వారా టెక్నాలజీ సవాళ్లను అధిగమించవచ్చు.బి.టి. గోవిందరెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అత్యున్నత గౌరవానికి అర్హులు కాదా?
భారత దేశపు అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ అనేది తెలిసిన విషయమే. ఎన్నో చర్చలు జరిపి, ఎంతో పరిశీలన చేసి, ఆ తర్వాతే ఈ అవార్డు ఎవరికి ఇవ్వాలో నిర్ణ యించాల్సి ఉంటుంది. సంబరాల్లో చమ్కీల్లా వెదజల్లితే (‘పందుల ముందు ముత్యాలు పోసినట్లు’ అని ఇంగ్లీష్ వాళ్లంటారు, నేను ఆ సామెత ఉపయోగించడం లేదు) దాని విలువ క్షీణిస్తుంది. ఆ పురస్కారం అభాసు పాలు అవుతుంది. ఏమైనా ఈ అవార్డు ఇస్తున్న తీరుపై చర్చ జరగాల్సిందే. వాస్తవాలు మీ ముందుంచుతాను, పరిశీలించండి. 1954లో పద్మ అవార్డులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 53 మందికి భారత రత్న ప్రదానం చేశారు. వీరిలో నా లెక్క ప్రకారం 31 మంది రాజకీయ నాయకులు. అంటే దాదాపు 60 శాతం. ఈ గణాంకాలు పరికిస్తే, ప్రతిభా పాటవాల గుర్తింపుగా కాకుండా వ్యూహాత్మక రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఈ అవార్డు ఇస్తున్నట్లు అనిపించడం లేదా? కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులకు పార్టీ లోని వారి సహచరులు ఈ పురస్కారం ప్రకటించి తమ భక్తిని చాటుకున్నారు. అది అవార్డు ఔన్నత్యాన్ని దిగజార్చడం కాదా? కచ్చితంగా అంతే. బతికున్నప్పుడు కదా గుర్తించాలి!మరో కలవరపరిచే వాస్తవం ఏమిటంటే, 18 మంది తమ మర ణానంతరమే భారత రత్నకు ఎంపికయ్యారు. బతికున్నప్పుడు వారిని గుర్తించకపోవడం అలక్ష్యం చేసినట్లే అనుకోవాలి. అలా అని మరణానంతరం దశాబ్దాలు గడిచిన తర్వాత ఆ తప్పిదం సరి చేద్దా మనుకోవడం కూడా కరెక్టు కాదు. అది అవమానం కాకపోవచ్చుగానీ అవివేకం అవుతుంది. వల్లభ్ భాయ్ పటేల్నే తీసుకోండి... మరణానంతరం 41 ఏళ్లకు ఆయన ఈ పురస్కార గ్రహీత అయ్యారు. వాస్తవానికి భారతరత్న ప్రవేశపెట్టక మునుపే ఆయన చనిపోయారు. బి.ఆర్.అంబేడ్కర్, మౌలానా అజాద్ తమ మరణానంతరం 34 ఏళ్లకు ఈ గౌరవం పొందారు. కర్పూరీ ఠాకూర్ చనిపోయిన 36 ఏళ్లకు ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. మదన్ మోహన్ మాలవీయకు అయితే 69 సంవత్సరాల తర్వాత ఇచ్చారు. నిజానికి ఆయన ఇండియాకు స్వతంత్రం రాక మునుపే కన్ను మూశారు. ఈ అర్హులందరకూ ఇవ్వగా లేనిది మహాత్మా గాంధీని మాత్రం ఎందుకు విస్మరించాలి?ఇక ఈ 53 మందిలో ఎంతమంది ఈ ఇండియా అత్యున్నత పురస్కారానికి అర్హులు? మీరు నాతో ఏకీభవించకపోవచ్చు. మనందరికీ ఎవరి అభిప్రాయలు వారికి ఉంటాయి. నా అంచనా ప్రకారం కనీసం 14 మంది గ్రహీతలకు ఈ అవార్డు పొందే అర్హత లేదు.గోవింద్ బల్లభ్ పంత్, జాకీర్ హుస్సేన్, వి.వి. గిరి, కె.కామరాజ్,ఎం.జి.రామచంద్రన్, రాజీవ్ గాంధీ, మొరార్జీ దేశాయి, గుల్జారీలాల్ నందా, గోపీనాథ్ బోర్డోలాయి, ప్రణబ్ ముఖర్జీ, నానాజీ దేశ్ ముఖ్, కర్పూరీ ఠాకూర్, లాల్ కృష్ణ అద్వానీ, చౌధరీ చరణ్ సింగ్... వీరంద రికీ భారత్ రత్న ఇచ్చి ఉండాల్సిందేనా? ఈ ముగ్గురూ అర్హులే!ఈ అవార్డుకు తగినవారు లేరని కాదు. తప్పకుండా ఉంటారు. అలాంటి వారిలో కనీసం ఇద్దరి పేర్లు నేను చెప్పగలను. మొదటి వ్యక్తి ‘ఫీల్డ్ మార్షల్’ ఎస్.హెచ్.ఎఫ్.జె.మానెక్శా. ఆయన నిస్సందేహంగా దేశం గర్వించదగిన మిలిటరీ హీరో. మనం తిరుగులేని విధంగా గెలి చిన ఏకైక యుద్ధాన్ని (1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధం) నడిపింది ఆయనే. ఫీల్డ్ మార్షల్ ర్యాంకు ఇచ్చిన మాట నాకు తెలుసు. కానీ మానెక్శా వంటి వ్యక్తికి భారత రత్న కూడా ఇచ్చి ఉండాల్సింది. ఆయన ఇప్పుడు లేరు కదా అనే వాదన చెల్లదు. అలా చెప్పి నిరాకరిస్తే, అది ద్వంద్వ ప్రమాణాలు పాటించడం, కపటత్వం అవుతుంది. నేను చెప్పబోయే రెండో వ్యక్తి కూడా ఈ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయదగిన వ్యక్తే. మరి మన ప్రభుత్వానికి అంతటి దార్శనికత, వివేకం ఉన్నాయా? నేను ప్రస్తావిస్తున్న ఆ వ్యక్తి దలై లామా. ఈ దేశంలోనే ఉంటున్న దలై లామా తనను తాను భారత పుత్రుడిగా భావిస్తారు. ఆయన ఔన్నత్యాన్ని ప్రపంచం గుర్తించినా, మనం మాత్రం గుర్తించలేక పోతున్నాం. లేదంటే చైనాను నొప్పించడం మనకు ఇష్టం లేదా? 1989లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.అంటే మనం ఇప్పటికే 36 ఏళ్లు వెనుకబడ్డాం. వాస్తవానికి, నోబెల్ కమిటీ కంటే ముందే మనం ఆయన్ను ఈ అవార్డుతో సత్కరించి ఉండాల్సింది. దలై లామా ఇటీవలే తన 90వ పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఇదొక మైలురాయి వంటిది. కనీసం దీన్నయినా ఒక అవకాశంగా మార్చుకుని ఆయనకు భారత రత్న ప్రకటించాలి. తద్వారా మన పోరబాటును దిద్దుకోవచ్చు. మీరేమంటారు? దలై లామాకు ప్రదానం చేయడం ద్వారా భారత రత్న ఔన్నత్యం పెంచినట్లు కూడా అవుతుంది.మనం ఈ పురస్కారానికి పరిశీలించవలసిన వ్యక్తి మరొకరు కూడా ఉన్నారు. ఆయన అమితాబ్ బచ్చన్. ఆయన కంటే ముందు కూడా గొప్ప నటీనటులు ఉన్నారన్న వాస్తవాన్ని నేను కాదనడం లేదు. వారు ఈ గౌరవం పొందకుండానే పరమపదించారు. బచ్చన్ నేటికీ మన మధ్యే ఉన్నారు. ఆయన లెజెండ్లా భాసించారు. చాలా మంది దృష్టిలో ఇప్పటికీ కూడా లెజెండే. 1992లో భారత రత్న వరించిన సత్యజిత్ రాయ్, లేదా 2001లో ఈ సత్కారం పొందిన లతా మంగేష్కర్ అంత గొప్పవాడు. ఆయనకు భారత రత్న ఎందుకు ఇవ్వకూడదు? నటనలో ఇప్పటి వరకు ఎవరికీ ఈ అవార్డు లభించ లేదు. ఆ చరిత్ర సృష్టించిన తొలి వ్యక్తి అమితాబ్ బచ్చన్ ఎందుక్కాకూడదు?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మిషెల్ ఒబామా (మాజీ ఫస్ట్ లేడీ) రాయని డైరీ
‘‘మీరిద్దరూ ఒకే గదిలో కలిసి కనిపించటం ఎంతో బాగుంది మిస్టర్ అండ్ మిసెస్ ఒబామా’’ అన్నారు క్రెయిగ్, నవ్వుతూ.క్రెయిగ్ ‘ఐఎంఓ’ పాడ్ కాస్ట్ హోస్ట్.‘ఇన్ మై ఒపీనియన్’ అనే ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలలో క్రెయిగ్ తన సుతిమెత్తనైన చిరునవ్వులతో గెస్టుల గుండె కవాటాలను తెరుచుకుని ఏ విధమైన అనుమతి, ఆహ్వానం లేకుండానే లోపలికి చొరబడతారు. ‘‘మేమిద్దరం ఒకే గదిలో కలిసి ఉండటం అనే విషయానికి మీరిస్తున్న ప్రాధాన్యం దేనిని సంకేతపరుస్తున్నట్లుగా నేను భావించవచ్చు మిస్టర్ క్రెయిగ్?’’ అన్నాను, నవ్వుతూ. ఆ మాటకు క్రెయిగ్ తగు మోతాదులోనే నవ్వారు కానీ, అక్కడే ఉన్న నా హస్బెండ్ బరాక్ ఒబామా... ఆ చిన్న పాడ్కాస్ట్ స్టూడియో మొత్తం అదిరిపడేంతగా నవ్వారు.అంతలా నవ్వటం ద్వారా ఆయన ఆ స్టూడియో వాళ్లకి ఏం తెలియపరచాలని అనుకుంటున్నారు? ‘‘నిజమే, మేమిద్దరం ఒకే గదిలో కలిసి ఉండటం లేదు’’ అనా? ‘‘ఉండక పోవటానికి కారణం నా వైఫ్’’ అనా?భర్తలు భార్యలకు తలనొప్పిగా మారటానికి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు. చిన్న చిన్న అకారణాలు చాలు. ‘‘ఏమీ లేదు’’ అని బరాక్ చెప్పటం, ‘‘ఏదో ఉంది’’ అనుకునేలా ఉంటుంది!‘‘వెల్, చెప్పండి మిస్టర్ ఒబామా... మీరిద్దరూ ఒకే గదిలో కలిసి ఉండలేని ‘యుగాంతం’ వంటిదొకటి మీ దాంపత్య జీవితంలోకి ఒక దుర్భరమైన శీతాకాలంలా అడుగుపెట్టిందని అమెరికన్ ప్రజలంతా అనుకోవటానికి కారణం ఏమై ఉంటుందని మీరు ఊహిస్తున్నారు?’’ అని అడిగారు క్రెయిగ్... ‘యుగాంతం’ అన్న మాటను మృదువుగా నొక్కి వదులుతూ.బరాక్ కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నారు. ఆయన ఏం చెబుతారా అని ఆ కొద్ది క్షణాలూ నేను టెన్షన్తో చచ్చిపోయాను.‘‘మిస్టర్ క్రెయిగ్... మీరంటున్నది నేనూ, మిషెల్ ఒకే ‘గది’లో కలిసి ఉండక పోవటం గురించా లేక, ఒకే ‘ఇంట్లో’ కలిసి ఉండక పోవటం గురించా? ఎందుకంటే, ఇంట్లో గది ఉంటుంది కానీ, గదిలో ఇల్లు ఉండదు కదా’’ అని పెద్దగా నవ్వారు.నేను కోపంగా బరాక్ వైపు చూశాను. ఏమిటతని ఉద్దేశం? ఒకే ఇంట్లో ఉంటున్నాం కనుక ఒకే గదిలో లేకుంటే మాత్రం ఏమిటని ప్రశ్నించటమా? లేక, ‘‘అవును, మేము ఒకే గదిలో ఉండటం లేదు’’ అని నిర్ధారణ చేసి చెప్పటమా? క్రెయిగ్, చిరునవ్వుతో నన్నే గమనిస్తూ ఉన్నారు. ఆయన ‘ఐఎంఓ’ పాడ్ కాస్ట్ హోస్ట్ మాత్రమే కాదు. నా సొంత అన్నయ్య కూడా. బరాక్ అంటే క్రెయిగ్కి చాలా రెస్పెక్ట్. నేనంటే అంతకు మించిన ఇష్టం. బరాక్ మీద ఉండే రెస్పెక్ట్నీ, నేనంటే ఉండే ఇష్టాన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఔట్సైడర్గా మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు క్రెయిగ్.‘‘మీరు చెప్పండి మిసెస్ ఒబామా.కొంతకాలంగా మీరు మిస్టర్ ఒబామాతో కలిసి బయటెక్కడా కనిపించలేదు. మీ దాంపత్య జీవితం హ్యాపీగానే ఉందని మీరు చెప్పగలుగుతారా?’’ అన్నారు క్రెయిగ్. ‘‘ఎస్, అఫ్కోర్స్ మిస్టర్ క్రెయిగ్! హ్యాపీగా ఉన్నాం. ఇక మీదటా హ్యాపీగా ఉంటాం. ఎప్పటికీ హ్యాపీగా ఉంటాం. నా భర్తను వదిలేయాలని నేను ఏ క్షణమూ అనుకోలేదు. మాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి, అయినా ఒకటిగా ఉన్నాం’’ అని చెప్పాను.‘‘అవును, నా భార్య నన్ను మళ్లీ స్వీకరించింది’’ అన్నారు ఒబామా, హఠాత్తుగా మధ్యలోకి వచ్చి!దేవుడా! ఈయనెందుకు అడగని విషయాలన్నీ చెబుతుంటారు?! భర్తలంతా ఇంతేనా, బరాక్ ఒబామా ఒక్కరే ఇలానా? నయం, ఇద్దరూ కూతుళ్లే అయ్యారు! కొడుకు కూడా ఉండుంటే, ఊపిరి ఆడకుండా ప్రేమగా నా మెడను చుట్టేయటానికి ‘మరొక బరాక్’ తయారై ఉండేవాడు! -
అందరూ చదవాలనీ... ఎదగాలనీ...
చాలామంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి మార్కులు, ర్యాంకులు వచ్చిన పిల్లలకి మా చిన్నప్పుడు నగదు రూపంలో బహుమానాలు ఇచ్చేవారు. సాధు సుబ్రహ్మణ్య శర్మ గారు మాత్రం పుస్తకాలు బహుమానంగా ఇచ్చేవారు. సైన్సుని, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి విస్తృతంగా చదవడం తప్పనిసరి అనే ఎరుక నా మటుకు నా చిన్నప్పుడు సాధు సుబ్రహ్మణ్య శర్మ (Sadhu Subrahmanyam Sarma) గారిలోనే చూశాను. చిన్నతనంలో ఆ కాలానికి ఆయన ఇచ్చిన పుస్తకాల విలువ నాకు తెలియ లేదు. అందుకే, చిన్నప్పుడు ఆయన నాకు స్వయంగా బహూకరించిననండూరి రామ్మోహనరావు ‘విశ్వదర్శనం’ దర్శనానికి నోచుకోకుండా చాలా కాలం అలాగే ఉండిపోయింది. అందరి చేతా చదివించాలి అనే ఆయన బలమైన ఆశయమే కాకినాడలో సొంత ఖర్చులతో గ్రంథాలయాన్ని నెలకొల్పేలా చేసింది. ‘బంకోలా’ నవలా రచయితగా సుప్రసిద్ధులైన ఆయన ఇండస్ట్రీస్ డిపార్ట్ మెంట్లో పని చేసి పదవీ విరమణ చేశారు. కాకినాడలో నివాసం. గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో గల సముద్ర తీరంలోని కోరంగి రేవు ప్రాంతంలో బ్రిటిష్ కాలం నాటి మత్స్యకారుల జీవన ఘర్షణ, వలస దేశంగా మారుతూ ఉన్న పరిణామాలు, దాని గురించి వారి ఆవేదన కథా వస్తువుగా బంకోలా రాశారు. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే నవల అది. అందులో 1825–30లలో వాడుకలో ఉండి కనుమరుగైన అనేక అచ్చ తెలుగు పదాలు కనబడతాయి. ఒక చారిత్రక సందర్భానికి నవలా రూపం ఇవ్వదలచుకున్న రచయిత ఎంత లోతుగా పరిశోధన చేయాలో తెలియజేసే గ్రంథం అది.ఈ మధ్యే ఆయన్ని కాకినాడ వెళ్లి కలిశాను. అదే ఆఖరి కలయిక అవుతుందని మాత్రం అనుకోలేదు. తొంభైకి పైగా వయసు, నడవ లేని స్థితిలో కూడా నేను పుస్తకాల గురించి మాట్లాడితే ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. ‘జీవితం చాలా పెద్దది, ఒక సిద్ధాంతానికి పరిమితమవ్వద్దు. విస్తృతంగా తెలుసుకోవాలి’ అని చెప్తూ, ఆయన సహాయకురాలితో, ‘లైబ్రరీకి తీసుకుని వెళ్ళు’ అన్నారు. ‘సాధు మెమోరియల్ మినీ లైబ్రరీ మరియు పిల్లల ఆటలకేంద్రము’ అని బోర్డు ఉంది. లోపలకి వెళ్తే రెండు గదుల నిండా పుస్తకాలు. ఐదారు పుస్తకాలు తీసుకుని రిజిస్టర్లో నోట్ చేశాను. మళ్ళీ వాళ్ళింటికి వెళ్ళి తీసుకున్న పుస్తకాలు చూపించాను. కొంత సేపు పుస్తకాల గురించి మాట్లాడారు. ఎక్కువ మాట్లాడలేక ఆక్సిజన్ పెట్టుకుంటున్నారు. ఇబ్బంది పెట్టకూడదు అని, ‘థాంక్స్ అండి, వెళ్తున్నాను’ అన్నాను. ఇంతలో సహాయకురాలిని పిలిచి, ఆయన రాసిన పుస్తకాలు ఇమ్మన్నారు. ఆయనకి చాలా పేరు తెచ్చిన ‘బంకోలా’ నా దగ్గర ఉండటంతో మిగతా పుస్తకాలు ఇచ్చారు. అందులో ఒకటి ‘డయలెక్ట్స్ ఆఫ్ ఎవల్యూషన్స్ సిస్టమ్స్ ఎప్రోచ్అండ్ న్యూ ఫ్రంటీర్స్ ఆఫ్ ఫిలాసఫీ’. 600 పేజీల పుస్తకం. దానికి రెండవ భాగం కూడా రాయ వలసిందని నేను అంటే, ‘అనుకున్నాను కానీ కుదరలేదు’ అన్నారు.ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్లలో ఏ ఊరు వెళ్తే ఆ ఊరులో ఉన్న సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్స్కి మా పిల్లలని తీసుకుని వెళ్ళి పుస్తకాలు కొనే వాడిని అని పాత సంగ తులను అపురూపంగా గుర్తు చేసుకున్నారు. తొమ్మిది పదుల వయసులో ఒక మంచి మానవ సమాజాన్ని కాంక్షిస్తూ తనకి ఉన్న పరిమితుల్లో సొంతంగా లైబ్రరీ నిర్వహించ డానికి మించిన సార్థకత ఒక మనిషికి ఇంకేముంటుంది! ఆ సార్థక జీవి తన 93వ యేట జూలై 18న తుది శ్వాస విడిచారు. పుస్తకాలు అందరూ చదవాలి, అందరూ ఎదగాలని చివరి క్షణం వరకూ కాంక్షించిన గొప్ప పుస్తక ప్రేమికుడికి ఇవే కన్నీటి నివాళులు. గోదావరి సముద్ర తీరంలోని కోరంగి రేవు ప్రాంతంలో బ్రిటిష్ కాలం నాటి మత్స్యకారుల జీవన ఘర్షణ, వలస దేశంగా మారుతూ ఉన్న పరిణామాలు, దాని గురించి వారి ఆవేదనకథా వస్తువుగా ‘బంకోలా’ (లైట్హౌజ్) నవల రాశారు సాధు సుబ్రహ్మణ్య శర్మ. – పిన్నింటి సాయి పవన్ న్యాయవాది -
రెండు ధ్రువాలతో సమతూకం ఎలా?
అమెరికాలో కొత్త ప్రభుత్వ సమర్థతను మదింపు చేసేందుకు సాధారణంగా, అధ్య క్షుడి మొదటి 100 రోజుల పాలనను లెక్క లోకి తీసుకుంటారు. కానీ, ట్రంప్ రెండవ విడత పాలన మొదలై 180 రోజులు గడు స్తున్నా వాణిజ్య వివాదాలకు పరిష్కారం ఒక కొలిక్కి రాలేదు. ఉక్రెయిన్, గాజాలలో సైనిక కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యూహాత్మక భాగస్వామి అమెరికా, ముఖ్య మైన ఆర్థిక పోషక దేశం చైనాలతో సంబంధాలలో సమతూకం పాటించేందుకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథొని ఆల్బనీస్ జూలై నెల మధ్యలో 6 రోజుల పర్యటనపై చైనా వెళ్ళారు. దౌత్యం, వాణిజ్యంతో వ్యవహరిస్తున్న భారత దౌత్యవేత్తలు కూడా అలాంటి సందేహ డోలనే ఎదుర్కొంటున్నారు. ‘బ్రిక్స్’ శిఖ రాగ్ర సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆ మధ్య బ్రెజిల్ వెళ్ళారు. ఆయన భారత్కు తిరిగి వచ్చే మార్గ మధ్యంలో ఉన్నప్పుడే బ్రెజిల్ అధ్యక్షుడు లూల డ సిల్వా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మధ్య వాగ్వాదం నెలకొంది. వారి మధ్య మాట మాట పెరగడానికి విదేశాంగ విధానంపై అభిప్రాయ భేదాలు కారణం కాదు.బ్రెజిల్ ఆంతరంగిక వ్యవహారాలలో ట్రంప్ బాహాటంగా జోక్యం చేసుకోవ డమే తగాదాకు దారితీసింది. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జాయిర్ బొసొనారొపై విచారణకు స్వస్తి పలకాలని ట్రంప్ డిమాండ్ చేశారు. దీనిపై అమెరికా జోక్యాన్ని లూల తిరస్కరించారు. అమెరికా దండి స్తున్నట్లుగా సుంకాలు విధిస్తే తామూ ప్రతీకార చర్యలకు దిగాల్సిఉంటుందని హెచ్చరించారు. చైనాతో సవ్యంగా లేకపోయినా...ఆ విధంగా, ప్రజానీకం నేడు రెండు ధ్రువాల ప్రపంచాన్ని ఎదు ర్కొంటోంది. ‘నాటో’ దేశాల మద్దతు ఎంతవరకు లభిస్తుందో తెలియకపోయినా, వాటిని తోడు చేసుకుని అమెరికా ఒక ధ్రువంగా ఉంది. చైనా–రష్యా ఇరుసు రెండవదిగా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి స్థితితో పోలిస్తే, ఒక్కటే తేడా కనిపిస్తోంది. చైనా–అమెరికా ప్రత్యర్థులే కావచ్చు కానీ, వాణిజ్యం, సాంకేతికతల విషయంలో అవి ప్రస్తుతం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి.ప్రచ్ఛన్న యుద్ధ ప్రత్యర్థులైన సోవియట్ యూనియన్, అమెరికా మధ్య అప్పట్లో అలాంటి సంబంధాలు ఉండేవి కావు. దాంతో, బ్రెజిల్, భారత్ లాంటి ప్రవర్ధమాన దేశాలకు ఈ రెండు ధ్రువాల మధ్య సమతౌల్యం పాటించడం కష్టంగా మారుతోంది. చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉండటం, మనల్ని చైనా ఒక బలమైన ప్రత్యర్థిగా చూస్తూండటం వల్ల, మన పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఆగస్టు 1లోగా, ఏదో ఒక అంగీకారానికి రాకపోతే, ‘ప్రతిగా ఎదురు కాగల సుంకాలను’ తప్పించుకునేందుకు అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడం భారత్కు తక్షణ సమస్యగా ఉంది. అధ్యక్షుడు ట్రంప్ సుంకాలపై తడవకో మాట మాట్లాడుతున్నారు. ఇదంతా అనిశ్చితిని పెంచుతోంది. ‘విముక్తి దినం’గా ప్రకటించిన ఏప్రిల్ 2 నుంచి రెండు డజన్లకు పైగా పర్యాయాలు సుంకాలపై తలకిందుల ధోరణిని చూశాం. సుంకాల పేరిట అమెరికా బెదిరింపులు పరిపాటిగా మారడంతో కాబోలు,అంతర్జాతీయ మార్కెట్లు కూడా వాటిని పెద్దగా లెక్కలోకి తీసు కోవడం మానేశాయి. ‘90 రోజులలో 90 ఒప్పందాలు’ అంటూట్రంప్ చేసిన వాగ్దానం నీటిమీద రాతగా మారింది. ఒక్క వియత్నాం, బ్రిటన్లతోనే వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. చైనాతో పాక్షికంగా మాత్రమే అవగాహన కుదిరింది. వాణిజ్య ఒప్పందం కొరవడిన నేపథ్యంలో, ఆగస్టు 1 తర్వాత, అమెరికా 30% సుంకాల బెదిరింపును అమలు జరిపితే తామువిధించగల ప్రతీకార సుంకాల జాబితా సిద్ధంగా ఉందని యూరోపి యన్ యూనియన్ వెల్లడించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొని ఆల్బనీస్ బాటనే భారత్ కూడా అనుసరించింది. షాంఘై సహకార సంస్థ సమావేశాలలో పాల్గొనేందుకు బీజింగ్ వెళ్ళిన భారతవిదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, భారత్–చైనా సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, వాస్తవాధీన రేఖ వద్ద సేనల ఉపసంహరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా, పాకిస్తాన్కు చైనా క్రియాశీల సహాయం అందించిన సంగతి తెలిసిందే. వీటికితోడు, దలైలామా 90వ పుట్టిన రోజు ఈ సమయంలోనే వచ్చింది. దలైలామాకు క్రియాశీల మద్దతు ఇవ్వడం ద్వారా, టిబెట్పై తమ పట్టును తగ్గించడంలో భారత్ తోడుదొంగగా వ్యవహరిస్తోందని చైనా భావిస్తోంది. అదే సమయంలో, ట్రంప్ కల్లోలిత ప్రపంచంలో, భారతీయ మార్కెట్ ప్రాధాన్యాన్ని చైనా గ్రహించింది. పాకిస్తాన్కు అమెరికా స్నేహహస్తంఅమెరికాతో తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసు కునేందుకు భారత్ కడపటి ప్రయత్నాలలో ఉంది. భారతీయదృక్కోణం నుంచి చూసినప్పుడు వ్యావసాయిక, పాడిపరిశ్రమ మార్కెట్లను సంరక్షించుకోవడం ప్రాధాన్యంగా ఉంది. ఎలాన్ మస్క్ సంస్థ ‘టెస్లా’ ముంబయిలో తన మొదటి షోరూమ్ తెరవడం, సాధారణ పరిస్థితులలోనైతే, సానుకూల సంకేతంగానేఉండేది. కానీ, ఆయనకు, అధ్యక్షుడు ట్రంప్కి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భారత్–అమెరికా వాణిజ్య వివాదాన్ని పరిష్క రించడంలో మాట సాయం చేయగల స్థితిలో లేనని మస్క్ చేతులు ఎత్తేయవచ్చు. భారత్ దౌత్యపరంగా పెద్ద సవాల్నే ఎదుర్కొంటోంది. అమె రికాతో పెంచిపోషించుకుంటూ వచ్చిన సన్నిహిత సంబంధాలు ఏ మేరకు ప్రతిఫలాలు చూపగలవో తెలియడం లేదు. పాకిస్తాన్కు అమెరికా చాస్తున్న స్నేహ హస్తమే ఇందుకు నిదర్శనం. జైలులో ఉన్న పాకిస్తాన్ తెహ్రీక్–ఏ–ఇన్సాఫ్ నాయకుడు ఇమ్రాన్ ఖాన్తో సయోధ్య కుదుర్చుకోవలసిందిగా పాక్ సైన్యాన్ని అమెరికా ప్రభుత్వం ముందుకు తోస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అమెరికా నిర్దేశించిన 50 రోజుల గడువు లోగా ఉక్రెయిన్తో రష్యా కాల్పుల విరమణకు రాకపోతే, రష్యా నుంచి చమురు కొనే అన్ని దేశాలను అమెరికా లక్ష్యం చేసుకోగల కత్తి కూడా భారత్ మెడపై వేలాడుతోంది. చైనాకు దగ్గరయ్యేందుకు ఆస్ట్రేలియా ప్రధాని చేసిన ప్రయత్నం చూసిన అమెరికా, ఆస్ట్రేలియాతో (బ్రిటన్తో కలుపుకొని) ఉన్న వ్యూహాత్మక త్రైపాక్షిక పొత్తును సమీక్షిస్తామని సంకేతాలుపంపుతోంది. ఆ పొత్తు ప్రకారం ఆస్ట్రేలియాకు అణు జలాంత ర్గాములు అందవలసి ఉంది. తైవాన్ విషయంలో చైనాతో సైనిక ఘర్షణ తలెత్తితే, తమకు అండగా ఉంటామంటూ హామీ ఇవ్వాలని జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను పెంటగాన్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క వివిధ దేశాలపై ఏకపక్షంగా సుంకాలు విధించు కుంటూపోతున్న అమెరికా, ఒకవేళ చైనాతో ఏదైనా ఘర్షణ తలెత్తితే, వ్యూహాత్మక మిత్ర దేశాల నుంచి క్రియాశీల సైనిక మద్దతు ఆశించడం కష్టమన్న వాస్తవాన్ని మాత్రం విస్మరిస్తోంది. అయితే, ట్రంప్ తాను మొదలెట్టిన వాణిజ్య యుద్ధానికి తానే త్వరలో ఒక పరిష్కారం కనుగొనక తప్పని స్థితిలో పడవచ్చు.ఎందుకంటే, లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టైన్కు సంబంధించిన పత్రాలు ప్రస్తుతం అమెరికా న్యాయ శాఖ వద్ద ఉన్నాయి. ఆ నేరాలతో మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా ముడిపడి ఉన్నాయి. వాటిలో ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ వెల్లడించారు. ట్రంప్ ఆ రొంపి నుంచి బయటపడే హడావిడిలో కూడా ఉన్నారు. అమెరికా నుంచి చమురు కొనుగోళ్ళను భారత్ ఇప్పటికే పెంచింది. భారత్ తమ నుంచి రక్షణ సామగ్రిని ఎక్కువ కొనుగోలు చేయాలని అమెరికా కోరుకోవడం మరో సమస్యగా ఉంది. కానీ, సైనిక పరంగా అమెరికాపై మితిమీరి ఆధారపడటం వ్యూహాత్మకంగా పెద్ద పొరపాటు అవుతుంది. ప్రస్తుత ప్రపంచ రాజకీయ–ఆర్థిక స్థితిగతులు ‘ప్రతి ఒక్కరినీ ఊహాగానాలకు లోను చేస్తు న్నాయి’ అని ఎకనామిస్ట్ మ్యాగజైన్ ఇటీవల వ్యాఖ్యానించడంలో వింతేముంది?-వ్యాసకర్త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో)-కె.సి. సింగ్ -
విచారణా లేదు... విడుదలా లేదు!
‘‘అన్యాయం ఏ ఒక్కరికి జరిగినా అందరికీ హెచ్చరికే, ఏ ఒక్కచోట జరిగినా అంతటా న్యాయానికి ప్రమాద హెచ్చరికే’’ అని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963లో బర్మింగ్ హామ్ జైలు నుంచి రాసిన లేఖలో అన్నాడు. మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో వందల, వేలసార్లు ఉటంకించబడిన వాక్యం అది. కానీ అదే సమయంలో లక్షలసార్లు మరచిపోతున్న వాక్యం కూడా. ముఖ్యంగా భారత ప్రభుత్వం ఎడాపెడా అమలు చేస్తున్న అక్రమ జైలు నిర్బంధం అనే అన్యాయపు సందర్భంలో ఈ వాక్యం గుర్తుకు రాకుండా ఉండదు.దేశంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇస్తున్న అధికారిక గణాంకాల ప్రకారం, 2022 డిసెంబర్ 31 నాటికి దేశంలోని జైళ్లలో ఉన్న 5,73,220 మంది ఖైదీలలో 4,34,302 మంది విచారణలో ఉన్న ఖైదీలే. అంటే జైళ్లలో ఉన్న వారిలో నూటికి 76 మంది తమ నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న వాళ్లు కాదు, కేవలం విచారణలో ఉన్న వాళ్లన్నమాట! సాధారణంగా భారత న్యాయ తత్వశాస్త్రంలో ‘బెయిల్ సాధారణం, జైలు మినహాయింపు’ అని జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ 1977లో ప్రకటించిన సూత్రాన్ని పాటించడం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. కానీ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం (అన్లాఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్ – యూఏపీఏ) కింద నమోదైన కేసులలో బెయిల్ ఇవ్వడానికి నిబంధనలను కఠినతరం చేశారు. దేశవ్యాప్తంగా వేలాది మందిని ఆ చట్టం కింద కేసులలోనే నిర్బంధిస్తున్నారు. అందువల్ల ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నా ఆ కేసులు విచారణకూ రావు, ఈలోగా ఖైదీలు బెయిల్ మీద విడుదలయ్యే అవకాశమూ లేదు. యూఏపీఏ నేరాలను ఎంత అస్పష్టంగా, ఎంత విశా లంగా నిర్వచించిందంటే... ప్రభుత్వం, పోలీసు అధికా రులు తలచుకుంటే ఎవరినైనా, ఏ పని చేసినందుకైనా, చేయనందుకైనా ఆ చట్టం కింద నిందితులుగా చూప వచ్చు. విచారణంటూ జరిగితే, ఆ కాలంలో బెయిల్ మీద విడుదల చేయకుండా ఉండవచ్చు. విచారణను తాత్సారం చేసి ఏళ్ల తరబడి జైలులో ఉంచవచ్చు. ఆ అస్పష్ట నేరం కింద ఏడెనిమిదేళ్లుగా విచారణ లేకుండా, బెయిల్పై విడు దల లేకుండా వందలాది మంది జైళ్లలో మగ్గిపోతున్నారు. ఆ చట్టం కింద 23 ఏళ్లు జైలులో ఉండి, చివరికి నిర్దోషిగా విడుదలైన వారు కూడా ఉన్నారు. ఇలాంటి అక్రమ కేసుల నుంచి వేలాది ఆదివాసులకు విముక్తి కలిగించిన వారు నాగపూర్కు చెందిన న్యాయవాది సురేంద్ర గడ్లింగ్. అటువంటిది ఆయనే స్వయంగా ఏడేళ్లకు పైగా భీమా కోరేగాం కేసులో విచారణ లేకుండా, బెయిల్ రాకుండా జైలులో ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ రీసర్చ్ ఫెలోషిప్ కింద ఆదివాసి ప్రాంతాలలో క్షేత్ర పరిశోధన చేస్తున్న పరిశోధక విద్యార్థి మహేష్ రౌత్ కూడా అదే కేసులో 2018 జూన్ 6 నుంచి జైలులో ఉన్నారు. యూఏపీఏ కేసులలో కఠిన తరమైన బెయిల్ నిబంధనలు ఉన్నప్పటికీ, ఏపీ, తెలంగాణలలో న్యాయమూర్తులు బెయిల్ ఇస్తున్నారనీ, అరెస్టు వంటి నిర్బంధ చర్యలకు పాల్పడగూడదని ఆదేశాలు ఇస్తున్నారనీ, ఆగ్రహించిన కేంద్ర దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ రెండు రాష్ట్రాల కార్యకర్తలను పొరుగు రాష్ట్రాల అక్రమ కేసుల్లో నిందితులుగా చూపుతున్నది.ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ జిల్లా నాగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరియా గ్రామం దగ్గర 2019 జూలైలో నమోదైన కేసు ఒకటి ఉంది. అడవిలో సీఆర్పీ, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలకూ – మావోయిస్టులకూ జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులూ, ఒక గ్రామస్థుడూ చనిపోయారనీ, ఘట నాస్థలిలో దొరికిన డైరీలో కొందరి పేర్లు ఉన్నాయనీ పోలీసులు ప్రకటించారు. అలా చనిపోయిన మావోయిస్టులనూ, పారిపోయారంటున్న మావోయిస్టులనూ, డైరీల్లో ఉన్నాయని చెపుతున్న తెలుగువారి పేర్లనూ కలిపి 2019 జూలై 28న కేసు పెట్టారు. రెండేళ్ల తర్వాత 2021 మార్చిలో ఈ కేసును ఎన్ఐఏ తన అధీనంలోకి తీసుకుంది.ఈ కేసులో భాగంగా డొంగరి దేవేంద్ర, చుక్క శిల్ప లను 2022 జూన్లో అరెస్టు చేసి మరెన్నో కేసుల్లో నింది తులుగా చూపారు. పద్మ అంతకు ముందు ఛత్తీస్గఢ్లో ఎన్నో అక్రమ కేసుల్లో పదేళ్లు జైలు జీవితం గడిపి, అన్ని కేసులలోనూ నిర్దోషిగా విడుదలై, హైదరాబాద్ (Hyderabad) వచ్చి ఎల్ఎల్బీ పూర్తిచేసి న్యాయవాదిగా ఉండగా, 2023 జూన్లో అరెస్టు చేసి ఈ ఛత్తీస్గఢ్ కేసులో జైలుకు పంపారు. అలాగే 2021లో మరణించిన మావోయిస్టు పార్టీ నాయకుడు రామకృష్ణ సహచరి, ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో సాధారణ జీవితంలో ఉన్న కందుల శిరీషను, ఆంధ్రప్రదేశ్ కుల నిర్మూలనా పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభా కర్ను 2023 జూలై 21న అరెస్టు చేసి ఈ కేసులో నిందితులుగా ఛత్తీస్గఢ్లో జైలులో నిర్బంధించారు. రెండేళ్లు గడిచినా విచారణా లేదు, బెయిలూ లేదు.చదవండి: నస్ బందీ, నోట్ బందీ దారిలో ఓట్ బందీ!దుడ్డు ప్రభాకర్ 1985 కారంచేడు నరమేధం నాటికి చీరాలలో పీజీ విద్యార్థిగా ఉంటూ, ఆ నరమేధానికి వ్యతి రేకంగా జరిగిన ఆందోళనతో కుల నిర్మూలన రాజకీయాలలో ప్రవేశించారు. దళితులపై దాడులు జరిగిన చీమకుర్తి, వై చెర్లోపల్లి, వేంపెంట, రాజుపాలెం, చుండూరు, లక్షింపేట తదితర ఎన్నోచోట్ల ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. ‘కుల నిర్మూలన’ మాసపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ఆయన గొంతు వినిపించకుండా చేయాలని, బెయిల్ ఇవ్వకుండా సుదీర్ఘకాలం జైలులో ఉంచాలని ఈ కేసులో నిందితులుగా చూపారు. చార్జిషీట్ ప్రకారమే చూసినా ఈ కేసులో ఉన్న తెలుగు వారెవరికీ ఎటువంటి నేరంతో, ఘటనతో, ప్రాణ నష్టంతో, ఆస్తి నష్టంతో సంబంధం లేదు. అది ఎవరిదో తెలియని, అసలు ఉందో లేదో తెలియని ఒక డైరీలో వీళ్ల పేర్లు ఉన్నాయనేది మాత్రమే ఆరోపణ. ఆ ఆరోపణ మీద విచారణ కూడా జరపకుండా రెండేళ్లకు పైగా జైలులో మగ్గిపోయేలా చేసిన ఘనమైన చట్టబద్ధ పాలన మనది! - ఎన్. వేణుగోపాల్‘వీక్షణం’ సంపాదకుడు -
ప్రశ్నించడం ప్రజల హక్కు... బాధ్యత!
గతంలో రాజకీయాలు అంటే దేశ సేవ, ప్రజల కోసం పని చేయడం, న్యాయం కోసం పోరాటం అనే భావనలతో నిండిపోయిఉండేది. లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, అంబే డ్కర్ వంటి చాలామంది నాయకులు రాజ కీయాలను దేశ పునర్నిర్మాణానికి వేదికగా మలచారు. పదవులను ప్రజలు తమపైఉంచిన అతి విలువైన బాధ్యతగా భావించి వారు. కానీ కాలం మారింది. ఆ ఆలోచనలు మరుగున పడి పోయాయి. ఇప్పుడు రాజకీయాలు అంటే, అధికారం కోసం పోటీ, డబ్బు సంపాదించేందుకు మార్గం, వ్యక్తిగత స్వప్రయోజనాల వేదికగా మారిపోయాయి. ఈ పరిణామం కేవలం మన దేశానికే కాదు, అనేక ప్రజాస్వామ్య దేశాలలోనూ కనిపిస్తోంది. మన దేశంలో, ఇది మరింత తీవ్రమవుతోంది. ప్రజాస్వామ్య సూత్రాలకు వ్యతిరేకంఒకసారి రాజకీయ నాయకుడు అయిన తర్వాత, వారి ఆర్థిక బలం అమాంతం పెరిగిపోతుంది. పదవిలో ఉన్నవారికి లభించే వన రులు, అధికారాలు స్వార్థ ఆలోచనలకు దారి తీయడానికి ఉపయోగ పడుతున్నాయి.ఎన్నికల్లో విజయం సాధించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆ ఖర్చును తిరిగి సంపాదించేందుకు కాంట్రాక్టులు, కమీషన్లు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరుగుతోంది. వారి వ్యక్తిగత వ్యాపారాలకు పదవిని వాడుకుంటున్నారు. ప్రజల బదు లుగా తమ లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు వ్యతిరేకం.ఎక్కువ మంది చెడు ఆలోచనలతో రాజకీయాలలోకి వస్తున్న కారణంగా, ఎవరైనా మంచి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినా, సమాజం అతడిని అనుమానంగా చూస్తోంది. ‘ఇతను డబ్బు, అధికారం కోసం వచ్చాడేమో’, ‘తన ఉద్దేశాలు నిజమా?’ అనే ప్రశ్నలు వస్తున్నాయి. దానితో సామర్థ్యం, యోగ్యత గల నాయకులూ రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నారు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి ఎందుకు రావడం లేదు? ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చవుతుందని భావన. ఈ మధ్య పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు పదుల లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఇది భరించలేరు. 2019 లోక్సభ ఎన్నికలో – మొత్తం దేశవ్యాప్తంగా సుమారు 60,000 కోట్ల రూపాయలు ఖర్చయినట్టు అంచనా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రజాస్వామ్య ఎన్నికగా గుర్తించబడింది. రాష్ట్ర స్థాయిలో, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజక వర్గాల్లో ఒక్కో అభ్యర్థి 10 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. దీనివల్ల సామాన్యులకు, నిష్కల్మషమైన వారికి ఎదగడానికి అవకాశాలు రావడం లేదు. నాయకులు ఎదిగేలా...రాజకీయాలు దేశ అభివృద్ధికి మూలం. పాలనలో తగిన మార్గదర్శకత్వం ఉంటేనే ప్రజలకు మంచి విద్య, మెరుగైన వైద్యం, ఉద్యోగ అవకాశాలు, మహిళల భద్రత, రైతుల సంక్షేమం వంటివి అందుతాయి. పాలన బాగుండాలి అంటే నాయకులు బాగుండాలి. మరి మంచి వ్యక్తులను రాజకీయాల్లోకి తేవడం ఎలా సాధ్యం? ప్రభుత్వమే కొంతవరకు ఖర్చును భరించాలి. ఎన్నికల్లో ఖర్చు అదుపులో ఉంటే, సామాన్యులూ పోటీ చేయగలుగుతారు. చిన్ననాటి నుంచే ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు గురించి విద్యార్థులకు బోధించాలి. యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. నాయకత్వ లక్షణాలను ఎదగనివ్వాలి. ఆసక్తి గల యువతకు తగిన శిక్షణ ఇప్పించాలి. నిజాయితీ గల నాయకులను ఆదర్శంగా చూపించడం ద్వారా మరిన్ని మంచి వ్యక్తులు ప్రేరణ పొందుతారు. వ్యక్తిగత, పార్టీల దూషణలకు పోకుండా సమాజంలోని సమస్యలు, వాటి పరిష్కా రాలకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రచారం చేయాలి. మంచి వ్యక్తులు రాజకీయ పార్టీలకు చెందకపోయినా, స్వతంత్ర అభ్య ర్థులుగా పోటీ చేస్తే, ప్రజలు వారికి మద్దతివ్వాలి.ప్రజాస్వామ్యంలో అధికారం ఓటర్లదే. కానీ ఓటుతో పాటు బాధ్యత కూడా మనదే. దేశ పాలన మెరుగవ్వాలంటే మంచి నాయ కులకు మద్దతు ఇవ్వాలి. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించాలి. మనం తీసుకునే ఒక నిర్ణయం దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే పౌరుడిగా దేశ భవిష్యత్తును మెరుగు పరచే బాధ్యత మనపై ఉంది. నాయకత్వం అంటే పదవి కాదు, అది బాధ్యత. ఒక నిజమైన నాయకుడు ప్రజల సమస్యలను విని, వాటికి పరిష్కారం చూపే విధంగా పనిచేయాలి. ప్రజల పట్ల బాధ్యతతో, నిస్వార్థంగా, నిజా యితీతో ఉండే వ్యక్తులే మంచి నాయకులవుతారు. దేశానికి అవసరం అయినది – సేవాభావంతో పనిచేసే నాయకులు. అలాంటి నైపుణ్యం ఉన్నవారు ఎక్కడైనా ఉండవచ్చు – డాక్టర్లు, ఇంజినీర్లు, ఉపాధ్యా యులు, రైతులు, ఉద్యోగులు. వీరి అనుభవం సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. పాలన అనేది కేవలం రాజకీయ నాయకుల పని కాదు. అది చైతన్యవంతులైన ప్రతి పౌరుడి బాధ్యత. సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో ముందుకు వచ్చేవారు మాత్రమే ప్రజలకు నిజమైన మార్గదర్శకులవుతారు. అలాంటి వారికి మద్దతు ఇవ్వాలి. అప్పుడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా నడుస్తుంది.నిలదీతే మార్గంమంచి రాజకీయం కోసం పౌరులుగా మన మొదటి బాధ్యత ఓటు హక్కు వినియోగం. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. మన సమాజానికి శ్రేయస్కరంగా పనిచేసే నాయకులను ఎంచుకోవాలి. ఓటు వేయకపోవడం లేదా ప్రలోభా లకు లొంగి ఓటు వేయడం మన భవిష్యత్తుకే ప్రమాదం.రాజకీయాలలో అవినీతి పెరిగిపోతున్నదంటే, దానికి కారణం సరైన నాయకులను ఎన్నుకోకపోవడమే. వారు ఎవరైనా సరే – వారి వర్గం, కులం, పార్టీని పక్కన పెట్టి, వారి సేవా దృక్పథాన్ని పరిశీలించి ఓటు వేయాలి. ప్రశ్నించే ధైర్యంకూడా మన బాధ్యతలలో ఒకటి. అధికారంలో ఉన్నవారు ప్రజల సేవకు వచ్చారు... వాళ్ల పని తీరును ప్రశ్నించాలి, తప్పుంటే నిలదీయాలి. ప్రజలు నిశ్శబ్దంగాఉంటే, పాలకులు తప్పుడు దారిలో వెళ్తారు.అంతేకాక, యువత రాజకీయాల్లోకి రావాలి. విద్యావంతులు, విలువలతో కూడిన వ్యక్తులు రాజకీయాల్లోకి అడుగుపెడితేనే మార్పు వస్తుంది. దేశం ఎలా ఉండాలన్నది మన చేతుల్లో ఉంది. మంచి రాజకీయ వాతావరణం కోసం ప్రతి పౌరుడు చైతన్యంతో, నైతికంగా, బాధ్యతగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే, పౌరుల భాగస్వామ్యం అత్యంత అవసరం. ఒక మంచి దేశం కోసం, మంచి నాయకత్వం అవసరం. ఒక మంచి నాయకత్వం కోసం, మనం ముందడుగు వేయాలి.-వ్యాసకర్త ‘ఏకలవ్య ఫౌండేషన్’ ఛైర్మన్ pvg2020@gmail.com-పి. వేణుగోపాల్రెడ్డి -
నిధులు ముద్దు... జాప్యం వద్దు!
ప్రభుత్వం ఇటీవల ఒక లక్ష కోట్ల రూపాయల నిధితో ఒక నూతన పరిశోధన, అభివృద్ధి, నవీకరణ(ఆర్డీఐ) పథకానికి ఆమోదం తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) వంటి ప్రగాఢమైన సాంకేతిక రంగాల్లో నవీకరణ, వాణిజ్యపరమైన పరి శోధన–అభివృద్ధి (ఆర్–డి)లో ప్రైవేటురంగ పెట్టుబడులను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిధిని నెలకొల్పింది. దీర్ఘకాలిక రుణ సదుపాయాల కల్పనకు లేదా తక్కువ వడ్డీ రేట్లపై రీఫైనాన్సింగ్కు ఈ నిధులను వినియోగిస్తారు. జాతీయ లక్ష్యమైన స్వావలంబన సాధనకు చేయూతనందించదలచుకున్న ప్రైవేటు కంపెనీలు ఆర్–డి, టెక్నాలజీ అభివృద్ధి స్థాయిని పెంచాలనుకున్నప్పుడు వృద్ధి, రిస్క్ క్యాపిటల్ రూపంలో ఈ నిధులు అందుతాయి. కీలకమైన లేదా వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉన్న టెక్నాలజీల సమీకరణతో ప్రమేయం ఉన్నవాటితోపాటు, ‘టెక్నాలజీ సంసిద్ధత స్థాయి’ని హెచ్చుగా కనబరచిన ప్రాజెక్టులకు రుణాలు ఇస్తారు. పరిశోధనలో ఎక్కడున్నాం?‘ఆర్–డి’లో పెట్టుబడులు తక్కువగా ఉండటం, ప్రైవేటు రంగ వాటా పేలవంగా ఉండటంతో నూతన నిధిని సృష్టించవలసిన అవసరం ఏర్పడింది. ఆర్–డిపై స్థూల వ్యయాన్ని (జీఈఆర్డీ)గా పిలుస్తారు. ఇది ఎంత ఉందనేదానిని బట్టే పరిశోధనల పట్ల సదరు దేశపు నిబద్ధతను అంచనా వేస్తారు. భారతదేశపు జీఈఆర్డీ అత్యల్పంగా 0.64 శాతంగా ఉంది. ఎదుగు బొదుగు లేకుండా ఉండి పోయిన ఈ సంఖ్య, వాస్తవానికి, 2019–20 నుంచి ఇంకా తగ్గిపోవడం ప్రారంభించింది. అయితే, స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో పెరుగు దలతోపాటు ఆర్–డి కాసుల మూట కూడా కాస్తోకూస్తో బరువు పెరుగుతూ రావడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. ఆర్–డిపై వ్యయంలో భారత్ స్థానం ఎక్కడా చెప్పుకోతగినదిగా లేదు. ఈ విషయంలో అమెరికా 784 బిలియన్ల డాలర్లతో 2023లో మొదటి స్థానంలో నిలిచింది. చైనా (723 బిలియన్ల డాలర్లు), జపాన్ (184 బిలియన్ల డాలర్లు), జర్మనీ (132 బిలియన్ల డాలర్లు), దక్షిణ కొరియా (121 బిలియన్ల డాలర్లు), బ్రిటన్ (88 బిలియన్ల డాలర్లు), ఇండియా (71 బిలియన్ల డాలర్లు) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయని ‘వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్’ వెల్లడిస్తోంది. చైనాతో సహా ఆర్–డిపై అధికంగా వెచ్చిస్తున్న దేశాల్లో ప్రైవేటు రంగమే దానికి సారథ్యం వహిస్తున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలో మాత్రం జీఈఆర్డీకి ప్రభుత్వ రంగమే ప్రధాన చోదక శక్తిగా నిలుస్తోంది. మన దేశంలో ఆర్–డిపై మొత్తం వ్యయంలో ప్రైవేటు రంగ వాటా 36.4 శాతంగానే ఉంది. ప్రభుత్వ ఊతంతోనే ఎదుగుదల!ఉన్నత సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ప్రైవేటు రంగ పెట్టుబడిని నష్ట ప్రమాదం లేకుండా మార్చేందుకు ఈ రకమైన ప్రోత్సాహక చర్యకు శ్రీకారం చుట్టడం ఇదే మొదటిసారేమీ కాదు. ప్రపంచీకరణ యుగంలో సాఫ్ట్వేర్, బయోటెక్నాలజీ విప్లవాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి విజయవంతమైన ఉదాహరణలుగా నిలవడం వెనుక ప్రభుత్వ ప్రాయోజిత పథకాల మూల నిధులు ఉన్నాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ (ఎస్టీపీ) అనే కొత్త ఐడియానే తీసుకుందాం. ఉపగ్రహ డాటా–లింక్ సదుపాయాలు పంచుకోవడం, సరసమైన ధరలకు కార్యాలయాల స్థలాన్ని పొందడం, పన్నుల్లో భారీ వెసులుబాట్ల రూపంలో ఔత్సాహిక సాఫ్ట్వేర్ సంస్థలకు ఎంతో అవసరమైన సహాయం ఎస్టీపీ ద్వారా లభించింది. అలా ఉత్సాహం చూపిన చాలా సంస్థలు కోట్లాది డాలర్ల బృహత్ సంస్థలుగా రూపాంతరం చెందాయి. ఆర్–డి, ప్రాడక్ట్ డెవలప్మెంట్ ఔట్సోర్సింగ్ లోకి అవి విస్తరించాయి. భారతదేశపు జి.డి.పి.లో సాఫ్ట్వేర్ రంగ వాటా ప్రస్తుతం సుమారు 8 శాతంగా ఉంది.శాంతా బయోటెక్నిక్స్, భారత్ బయోటెక్ మొట్టమొదటి బయో టెక్నాలజీ, వ్యాక్సీన్ కంపెనీలు అదే కోవలో లబ్ధి పొందినవే. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో నెలకొల్పిన టెక్నాలజీ అభివృద్ధి బోర్డు (టి.డి.బి.) ఆ రెండు సంస్థలకు ఉదారంగా నిధులు అందించింది. అవి కూడా నిధులను సద్వినియోగం చేసుకుని, హైదరాబాద్ను భారతదేశపు వ్యాక్సీన్ రాజధానిగా అవతరించేటట్లు చేశాయి. విద్యాసంస్థలతో కలిసి నడిస్తేనే...ఆర్–డిపై ఆసక్తి ఉన్న ప్రైవేటు రంగాన్ని తీసుకురావడంలోఇంతవరకు గడించిన అనుభవాన్ని ఆధారం చేసుకుని ఇంకా పైకెద గడం, ఇంతకుముందు తెచ్చిన పథకాల్లోని లోటుపాట్లను సరిదిద్దు కోవడం తెలివైన పని అనిపించుకుంటుంది. మొట్టమొదటగా, అటు వంటి పథకాల అమలులో, అధికార యంత్రాంగం నుంచి ఎదు రయ్యే జాప్యాలను తలచుకుని ప్రైవేటు రంగం ఎప్పుడూ జంకుతూ ఉంటుంది. కనుక, పాలనాపరమైన జోక్యం వీలైనంత తక్కువగాఉండేటట్లు చూడాలి. కొత్త ఆర్డీఐ పథకం పాలనాపరంగా పీడకలకు కారణమయ్యే దిగా కనిపిస్తోంది. ఈ పథకానికి ‘వ్యూహాత్మక దిశా నిర్దేశం’ చేసేందుకు ప్రధాన మంత్రి అధ్యక్షతన గల ‘అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్’ (ఎ.ఎన్.ఆర్.ఎఫ్.) గవర్నింగ్ బోర్డ్ పెద్ద తలకాయలా ఉంటుంది. ఎ.ఎన్.ఆర్.ఎఫ్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మార్గదర్శక సూత్రాలను ఆమోదించి, నిధులు ఇవ్వదగిన ప్రాజెక్టుల పరిధి, తరహాలపై సిఫార్సు చేస్తుంది. క్యాబినెట్ కార్యదర్శి అధ్యక్షతన కార్యదర్శుల సాధికార బృందం ఒకటి ఉంటుంది. ఏయే రంగాల్లో, ఏయే తరహా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చవచ్చునో ఈ బృందం సిఫార్సు చేస్తుంది. వాటి పనితీరుపై సమీక్ష నిర్వహిస్తుంది. ఈ అధికార యంత్రాంగపు పిరమిడ్కు అట్టడుగున వైజ్ఞానిక, సాంకేతిక శాఖ ఉండి ఈ పథకాన్ని అమలుపరుస్తుంది. రెండు అంచెల వ్యవస్థ ద్వారా నిధుల ప్రవాహం సాగుతుంది. ఎ.ఎన్.ఆర్.ఎఫ్. లోపల స్పెషన్ పర్పస్ ఫండ్ (ఎస్.పి.ఎఫ్.) అని ఒకటుంటుంది. అలాగే, ద్వితీయ స్థాయి ఫండ్ మేనేజర్లు కొందరుంటారు. కొల్లేటి చాంతాడు లాంటి అధికార యంత్రాంగాన్ని అలాఉంచితే... రూ. 10,000 కోట్ల నిధులతో డీప్ టెక్ ఫండ్ ఆఫ్ పంఢ్స్ పేరుతో ఆర్డీఐ లాంటి పథకం ఇప్పటికే ఒకటి ఉంది. అయినా, కొత్త దానికి ఎందుకు రూపకల్పన చేశారో అర్థం కాదు. స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో, ఏఐ, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూ టింగ్ వంటి రిస్క్ ఎక్కువ ఉన్న రంగాల్లో వ్యాపారాల తొలి అభివృద్ధి దశల్లో పెట్టుబడులకు డీప్ టెక్ ఫండ్ సాయపడాల్సి ఉంది. బహుశా, ఒకే రకమైన పథకాలు రెండింటికి రూపకల్పన చేశామని గ్రహించినందువల్లనే కాబోలు, డీప్ టెక్ ఫండ్కు ఆర్డీఐ నిధులు తరలించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక నిధి మరో నిధికి నిధులిస్తే, ఇక అది ఏ ప్రయోజనాలను నిర్వర్తించనున్నట్లు? టెక్నాలజీ అభివృద్ధిని ప్రైవేటు రంగం చేపట్టాలని మనం కోరు కుంటున్నట్లయితే, విద్యా సంస్థలతో కలసి పనిచేయడమనే ప్రాథ మిక సూత్రం ఉండనే ఉంది. వాటితో కలసి అడుగులు వేస్తే, ఐడి యాలలో పురోగతిని త్వరగా అందిపుచ్చుకునేందుకు కంపెనీలకు వీలవుతుంది. పీహెచ్డీ హోల్డర్లు, సుశిక్షితులైన రిసెర్చర్లు, ఇంజనీర్లు తగినంత సంఖ్యలో అందుబాటులో ఉంటారు. పరిశోధనా దశనుంచే సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటే, వస్తువులను అభివృద్ధిపరచ గల సమయాన్ని కంపెనీలు కుదించుకోగలుగుతాయి. దీనికి, విద్యా సంస్థల్లో పరిశోధనను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీల్లో ముందడుగులో ఉన్న దేశాలు అదే చేశాయి.-వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-దినేశ్ సి. శర్మ -
తొలి డెవలప్మెంటల్ బయాలజిస్ట్
భారత స్వాతంత్య్ర సమరం జరుగుతున్న రోజుల్లో పూణెలోని పరశురామ్ బావ్ కాలేజీలో జువాలజీ లెక్చరర్గా పనిచేస్తున్న 39 ఏళ్ల లీలా గణేష్ ముల్హెర్కర్ (Leela Ganesh Mulherkar) 16 నెలల్లో గొప్ప పరిశోధన చేశారు. ఎడిన్బరో పరిశోధకులు చార్లెస్ వెడ్డింగ్టన్ ఆధ్వర్యంలో ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్ అండ్ ఎంబ్రియాలజీ’లో పిండం పరిణామం, అభివృద్ధి మధ్య ఉన్న సంబంధం గురించి అధ్యయనం చేయడంతో ఆమె పేరు మారు మోగి పోయింది. పూనా విశ్వ విద్యాలయంలో ఈ డెవలప్మెంటల్ బయాలజీ కోర్సును ప్రవేశపెట్టడమే కాకుండా, ‘ఇండియన్ సొసైటీ ఆఫ్ డెవలప్మెంటల్ బయాలజిస్ట్స్’ (Indian Society of Developmental Biologists (InSDB)) అనే సంస్థను కూడా ప్రారంభించారామె. ముంబైకి ఉత్తరాన ఉన్న ‘బోర్డీ’ గ్రామంలో 1915లో లీల జన్మించారు. 1954లో భారత ప్రభుత్వమిచ్చే విదేశీ చదువుల స్కాలర్షిప్ రావడంతో ఇంగ్లాండ్లోని ఎడిన్బరో విశ్వవిద్యా లయంలో పీహెచ్డీ పూర్తిచేశారు. తిరిగివచ్చి పుణె విశ్వవిద్యా లయం జువాలజీ శాఖలో అధ్యాపకులుగా చేరారు. గర్భవతుల నిద్రలేమి, వికారం, మబ్బుగా ఉండటం వంటి లక్షణాలకు ప్రపంచవ్యాప్తంగా వాడే ‘తలిడోమైడ్’ ఔషధం ఎన్నో సమస్యలకు దారి తీసిన కాలమది. దీనికి సంబంధించి లీలా ముల్హెర్కర్ దృష్టి పెట్టి పరిశోధనలు కొనసాగించారు. తన ఇంటినే పరిశోధనాశాలగా మార్చుకొని సాగిన పరిశోధనా ధీర లీల. తన విద్యార్థులను పరిశోధకులుగా మలుస్తూ స్థానికంగా లభ్యమయ్యే హైడ్రాలు, కప్పలు, బల్లులు, నత్తలు వంటి వాటి పిండోత్పత్తి, దాని ఎదుగుదల,ఆ ప్రక్రియలో సంభవించే పరిణామాల గురించి అధ్యయనంచేపట్టారు. పరిశోధనలో మునిగిపోయి లీల తన 52వ ఏట 1967లో వసంతరావు గోలేను వివాహం చేసుకున్నారు.యూనివర్సిటీలో రెండు దశాబ్దాలు పనిచేసి 1977లో పదవీ విరమణ చెందినా మరో 15 ఏళ్లు అక్కడ పరిశోధనలు కొనసాగించారు. 65 ఏళ్ల వయసులో కూడా సున్ని తంగా ఉండే పలురకాల పిండాలను కోసి భాగాలను అధ్యయనం చేయడం ఆమెకుఎంతో సునాయాసంగా ఉండేది. కనుకనే 2005లో ఆమె మరణించేదాకా యూనివర్సిటీ క్యాంపస్లోనే చలాకీగా అందుబాటులో ఉండేవారు. ఆమె దగ్గర 18 మంది పరిశోధన పట్టాలు పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్లారు. భారతీయ కళలు, కవిత్వం, నాటకాలు, ఫిలాసఫీ వంటి అంశాల పట్ల లీలా ముల్హెర్కర్కు చాలా మక్కువ. ఆమె నాటకానికి వెళితే తప్పనిసరిగా తొలి వరుసలోనే కూర్చునేవారు. బాలగంధర్వ ఆడిటోరియం ముందు వరుసలో వారికి రెండు సీట్లు ప్రత్యేకంగా కేటాయించబడేవి. వృక్ష శాస్త్రవేత్తలు, జంతుశాస్త్రవేత్తలు, వైద్యులు... ఈ మూడు విభాగాల జీవశాస్త్రజ్ఞులకు ఒక వేదికను కల్పిస్తూ 1977లో ’ఇండియన్ సొసైటీ ఆఫ్ డెవలప్మెంటల్ బయాలజిస్ట్స్’ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా నేటికీ శాస్త్రజ్ఞులు ప్రతి రెండేళ్లకు ఒకచోట పెద్ద ఎత్తున సమావేశమవుతూ డెవలప్మెంటల్ బయాలజీ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నారు.- డా.నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారి -
విద్యా రంగం బతికే భరోసా ఏది?
ప్రభుత్వ విద్యా సంస్థల్లో నమోదు పెంచడానికి ఎవరికి తోచిన విధంగా వారు ఉచిత సలహాలు ఇస్తున్నప్పటికీ ఆచరణలో అవేవీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచలేకపోతున్నాయి. ప్రభుత్వ విద్యారంగ గతం, వర్తమానం, భవిష్యత్తును ఒకసారి పరిశీలన చేస్తే... 1990వ దశకం వరకు మన దేశంలో ప్రభుత్వ విద్యా రంగం పటిష్ఠంగా ఉండేది. నూటికి తొంభై ఐదు మంది విద్యార్థులు ప్రభుత్వ బడులలోనే చదివేవారు. బడులన్నీ విద్యార్థులతో కళకళలాడేవి. ఆంక్షలు లేని స్వేచ్ఛాయుత ప్రపంచ వాణిజ్యం కొరకు ‘ప్రపంచ వాణిజ్య ఒప్పందం (గాట్)–1994’లో మన దేశం చేరిన నాటినుండి విద్యారంగంలో ప్రయివేటు పెట్టుబడులు విపరీతంగా పెరిగి, విద్య కుడా లాభాలను ఆర్జించిపెట్టే ఒక సరుకుగా మారింది. దీంతో ప్రభుత్వ విద్యా సంస్థలు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా నేడు వాటి ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఆంధ్రప్రదేశ్లో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాకానుక’, ‘జగనన్న గోరుముద్ద’, ‘విద్యాకానుక కిట్’ లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. వెఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనా కాలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టారు. ‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించి, అధునీకరించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఇంతటితో సరిపెట్టుకోక, ఇప్పటి వరకు ప్రయివేటు పాఠశాలల్లో ధనవంతుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్ను ప్రభుత్వ బడుల్లో అమలుకు ఆదేశాలు ఇచ్చి, దేశానికే ఆదర్శంగా నిలిచారు. ప్రపంచంలో అత్యుత్తమ బోధనకు పేరొందిన ఐబీ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడుల్లో అమలుచేయడానికి ఏపీ స్టేట్ కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్తో ఒప్పందం చేసుకోవడం ఊహకు కూడా అందని చారిత్రక ఘట్టం. అయితే, ఆ ప్రభుత్వం మారగానే ‘అమ్మ ఒడి’ భరోసాను భంగపాటుకు గురిచేసి రద్దుచేశారు. ‘తల్లికి వందనం’ అని పథకం పేరు మార్చినా పాఠశాలల్లో నమోదు శాతం పెరగడం లేదు. జూన్ నెల ముగింపు నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభత్వ బడుల్లో ఒకటో తగతిలో విద్యార్థుల తక్కువ నమోదు వెక్కిరిస్తున్నది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ తీరుతెన్నులే ఇందుకు కారణం. దేశంలోనే సంపద సృష్టిలో, జీఎస్టీ వసూళ్లలో మొదటి వరుసలో ఉన్నామని చెప్పుకొంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు... విద్యా ప్రగతి సూచికలో మాత్రం కింది స్థానానికి దిగజారాయి. ఉచిత భోజన వసతితో కూడిన గురుకులాలలో కూడా పిల్లలు అంతగా చేరడం లేదంటే కారణం ప్రభుత్వం సరైన సౌకర్యాలు ఏర్పరచక పోవడం, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకపోవడమే అని చెప్పక తప్పదు. తెలంగాణలో పాఠశాల విద్యను, ఇంటర్ విద్యను కలపాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇది మరో సంక్షోభానికి దారితీయవచ్చు. పాఠశాల విద్యాశాఖ ఆరేడు ఎన్జీఓలతో ‘సీఎస్సార్’ పథకం కింద ఎంఓయూ కుదుర్చుకోవడం చూస్తే... రెగ్యులర్ క్లాసుల బోధనకు కలిగే ఆటంకాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు కడబడటం లేదు. ప్రభుత్వాలు మారగానే విద్యారంగం తీవ్రమైన ఒడుదొడుకులకు గురవుతోంది. గత ప్రభుత్వాల బ్రాండ్ కొనసాగింపుకన్నా తమ ప్రభుత్వ బ్రాండ్ ఉండాలనే తలంపు నేడు విద్యారంగానికి శాపంగా పరిణమిస్తున్నది. వెరసి చూస్తే విద్యారంగం ఒక విషవలయంలో చిక్కుకున్నట్లు గోచరిస్తున్నది.అడ్మిషన్ల లేమితో ప్రాభవం కోల్పోతున్న ప్రభుత్వ పాఠశాలలకు... పరిశ్రమలకు కల్పించే ఉద్దీపన చర్యలు తక్షణ అవసరం. ఒకవైపు ప్రయివేటు పాఠశాలల్లో కృత్రిమ మేధ సహాయంతో పాఠాల బోధన, మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా సరళీకృత ఆర్థిక, వ్యాపార, సాంకేతిక విధానాలు విస్తృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి సమాజంలో పేద పిల్లల భవిష్యత్తును నిర్ణయించే ఇంగ్లీష్ విద్యతో పాటు, ఒకటవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ వృత్తి విద్యా సంస్థల కోర్సుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% ప్రత్యేక రిజర్వేషన్కు భరోసా ఇచ్చే చట్టం చేయాలి.మామిడి నారాయణ వ్యాసకర్త ‘సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్’ వ్యవస్థాపక చైర్మన్ ‘ 94410 66032 -
బ్రిక్స్... ట్రంప్... కాగితం పులి కథ!
బ్రెజిల్లోని రియో డి జనేరో నగరంలో ఈ నెల 6–7 తేదీలలో జరిగిన ‘బ్రిక్స్’ 17వ శిఖరాగ్ర సమావేశాలను ఒకవైపు, దానిపై మొదటినుంచే కత్తులు దూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను మరొకవైపు గమనించగా కాగితం పులి కథ గుర్తుకు వస్తుంది. బ్రిక్స్... తన సభ్య దేశాల అభివృద్ధికి, పరస్పర సహకారానికి ఏర్పడినటువంటిది. 2009లో స్థాపించినప్పటి నుంచి గత 16 సంవత్సరాలలో అందుకు అనుగుణంగా వ్యవహరిస్తూ వచ్చింది తప్ప, అమెరికాకు గానీ, మరొకరికిగానీ వ్యతిరేకంగా ఎప్పుడు ఏ చర్యలూ తీసుకోలేదు. అయినప్పటికీ, అమెరికా అధ్యక్షులందరికి భిన్నమైన రీతిలో ట్రంప్ మాత్రం బ్రిక్స్ను తమకు వ్యతిరేకమైన కూటమి అంటున్నారు. అధికారానికి వచ్చిన కొత్తలో బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇపుడు బ్రెజిల్ సమావేశాలకు ముందు రోజున 10 శాతం అన్నారు. బ్రిక్స్లో చేర రాదంటూ ప్రపంచ దేశాలను కొన్ని నెలలుగా ఒత్తిడి చేస్తున్నారు. కానీ, ఈసారి సమావేశాలు ముగిసే నాటికి, ట్రంప్ను అమెరికా సన్నిహిత దేశాలు సహా ఎవరూ ఖాతరు చేయనట్లు స్పష్టమైంది. జనాభా... జీడీపీ... 40 శాతం వాటా!2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలలో బ్రిక్గా మొదలైన సంస్థ, దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారటం తెలిసిందే. ట్రంప్ హెచ్చరికలు చేసిన మరునాడే ఇండోనేషియా పూర్తి సభ్య దేశంగా చేరింది. ఇపుడు బ్రెజిల్లో బేలారూస్, బొలీవియా, కజకిస్థాన్, క్యూబా, నైజీరియా, మలేషియా, థాయ్లాండ్, వియత్నాం,ఉగాండా, ఉబ్జెకిస్తాన్ భాగస్వామ్య దేశాలుగా కొత్తగా చేరాయి. బ్రెజిల్ సమావేశాల కన్న ముందు మాసాలలో ఈజిప్టు, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ పార్ట్నర్ దేశాలయ్యాయి. ఈ జాబితాను విశ్లేషించినట్లయితే నాలుగు విషయాలు దృష్టికి వస్తాయి. ఒకటి, సంఖ్య రీత్యా ఇపుడవి మొత్తం 21 దేశాలు. రెండు, అమెరికా, యూరప్తో కూడిన పాశ్చాత్య ప్రపంచానికి బయటగల ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలన్నింటికి అందులో ప్రాతినిధ్యం ఉంది. మూడు, వాటిలో అనేకం ఆర్థికంగా శక్తిమంతమై నవి. నాలుగు, బహుశా అంతకన్న విశేషంగా పలు దేశాలకు అమెరి కాకు అనుకూలమైనవనే పేరున్నది. అటువంటి పేరే గల ఆసియన్ కూటమి దేశాలు కూడా బ్రిక్స్కు తోడుకావటం మరొక విశేషం.తాజా విస్తరణ తర్వాత బ్రిక్స్ దేశాల జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో 41 శాతానికి చేరింది. వీటి జీడీపీ ప్రపంచ జీడీపీలో 40 శాతం అయింది. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల కూటమి అయిన జి–7కు మించిపోయిన లెక్కలు. బ్రిక్స్ నెలకొల్పిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డిబి) రుణ సహాయాలతో 40 బిలియన్ డాలర్ల విలువ గల 120 అభివృద్ధి పథకాలను వర్ధమాన దేశాలలో అమలుపరుస్తున్నారు. అమెరికా చెప్పు చేతలలో గల ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ తరహా షరతులుగానీ, ఆయా దేశాల ఆర్థిక విధా నాలలో జోక్యం గానీ బ్రిక్స్ బ్యాంక్ నుంచి ఉండవు.అమెరికాకు ఎందుకు కలవరం?అమెరికా తన డాలర్ను ఒక ఆయుధంగా ఉపయోగిస్తూ ప్రపంచ దేశాల కరెన్సీ విలువలను, మార్కెట్లను, బ్యాంక్ చెల్లింపులను, రిజర్వ్లను నియంత్రిస్తున్నందున, తమకు సరిపడని దేశాల డాలర్ అకౌంట్లను స్తంభింపజేస్తున్నందున, డాలర్ మారకం నుంచి విముక్తి అవసరమని బ్రిక్స్ దేశాలు కొంతకాలం క్రితమే నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా నిరుడు అక్టోబర్లో రష్యాలోని కజాన్ నగరంలో జరిగిన 16వ సమావేశాలలో ఇందుకు మరింత కదలిక వచ్చింది. ఆ ప్రకారం బ్రిక్స్ దేశాలు డాలర్తో సంబంధాలను ఒకే సారి పూర్తిగా తెంచుకోవటంగాక, తమ మధ్య వాణిజ్యానికి పరస్పర చెల్లింపులు డాలర్లో గాక వీలైనంత మేర తమ సొంత కరెన్సీలలో జరుపుకోవాలనీ, ఆ స్థాయిని క్రమంగా పెంచుకోవాలనీ నిర్ణయించుకున్నాయి. ఈ పని బ్రిక్స్ దేశాల మధ్యనే గాక, ఇతర దేశాలతోనూ జరిగేందుకు ప్రయత్నించాలని భావించాయి. అనగా డాలర్ పాత్రను, ఆధిపత్యాన్ని తగ్గించటమన్నమాట!నిజానికి స్థానిక కరెన్సీలలో చెల్లింపుల పద్ధతి స్వల్ప స్థాయిలో గతంలోనూ ఉండేది. కానీ బ్రిక్స్ నిర్ణయాలతో అది గణనీయంగా పెరిగి ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో 30 శాతానికి మించినట్లు అంచనా. బ్రెజిల్ విస్తరణతో ఈ ధోరణి పెరిగినట్లయితే, త్వరలో 50 శాతానికి చేరే అవకాశం ఉంది. బ్రిక్స్ అంటే అమెరికా అధ్యక్షుడు ఎందుకింత కలవరపడుతున్నారో, దీన్ని బట్టి తేలికగా అర్థం చేసు కోవచ్చు. ప్రపంచంపై అమెరికా సామ్రాజ్యవాదపు ఆధిపత్యం వెంటనే అంతం కాక పోయినా క్రమంగా బలహీనపడుతుంది. మారిన పరిస్థితులలో ఒకప్పటివలె బ్రిక్స్ వంటి దేశాలపై ప్రత్యక్ష యుద్ధాలు చేయలేరు గనుక, టారిఫ్ల హెచ్చింపు, ఇతర వాణిజ్య ఆంక్షల రూపంలో ఆర్థిక యుద్ధాలు ప్రకటిస్తున్నారు. వాస్తవానికి, అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ఇతరుల నుంచి వస్తున్న పోటీలను తట్టుకునేందుకు ఆయన స్వపర భేదాలు లేకుండా అన్ని దేశాలపై ఎడాపెడా టారిఫ్ల యుద్ధం ఆరంభించారు. అయితే, బ్రిక్స్తో వైరం భిన్నమైనది. ఆ సంస్థ వర్ధమాన దేశాల కోసం భిన్న మైన, దీర్ఘకాలిక, ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించే అజెండాతో పని చేస్తున్నది. ఆర్థికంగానే కాదు. అభివృద్ధి నమూనా దృష్ట్యా కూడా. వాణిజ్యంలో ‘స్వేచ్ఛ’ కోసం...మరొక కీలకమైన అంశం స్వేచ్ఛా వాణిజ్యం. ఈ భావనను ముందుకు తెచ్చి డబ్ల్యూటీవోను నెలకొల్పిన అమెరికా కూటమి, దానిని తమ ప్రయోజనాలకు అనుకూలమైనంత కాలం ఉపయోగించుకుని, ఇటీవల ఇతర దేశాలు కూడా లాభపడుతుండటంతో ఆ నియమాలను భంగపరచజూస్తున్నది. స్వేచ్ఛా వాణిజ్యం యథా తథంగా కొనసాగటమే గాక, ఆ సంస్థలో వర్ధమాన దేశాల గొంతుకలు వినవస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలన్నది బ్రిక్స్ వాదనలలోని ముఖ్యాంశాలలో ఒకటి. ఆ పని జరిగితే వర్ధమాన దేశాల వనరులకు, ఉత్పత్తులకు తగిన ధరలు లభిస్తాయి. ధనిక రాజ్యాలు ఇతరులను ఒత్తిడి చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేయటం, తమ ఉత్పత్తులను మాత్రం అధిక ధరలకు విక్రయించటం వంటి పరిస్థితి పోతుంది. మరొక స్థాయిలో బ్రిక్స్ దేశాలు అమెరికా ఏకధ్రువ ప్రపంచం ఆమోదయోగ్యం కాదనీ, బహుళ ధ్రువ ప్రపంచం తమ లక్ష్యమనీ స్పష్టంగానే చెప్తున్నాయి. బ్రిక్స్ గురించి యూరోపియన్ దేశాలు ఇంతవరకైతే వ్యతిరేకంగా మాట్లాడలేదుగానీ, అమెరికా వైపు చూస్తు న్నాయి. కజాన్, రియో డి జనేరో సమావేశాల దరిమిలా ట్రంప్పై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల తక్షణ ప్రభావాల గురించి కూడా కొంత చెప్పు కోవాలి. ఇండియాను టారిఫ్లతో లొంగదీసి ఒప్పందాలు చేసుకో జూడగా, దానిపై ఒకవైపు చర్చలు సాగిస్తూనే, తాము కూడా 25 శాతం ఎదురు సుంకాలు విధించగలమని భారత ప్రభుత్వం డబ్ల్యూటీవోలో స్పష్టం చేసింది. తామూ అదే పని చేయగలమని బ్రెజిల్, వియత్నాం, ‘ఆసియాన్’, దక్షిణాఫ్రికా మొదలైనవి హెచ్చరించాయి. చైనా, రష్యా సరేసరి. టారిఫ్లు ప్రకటించినపుడు ట్రంప్ మాట్లాడుతూ 90 రోజులలో 90 ఒప్పందాలు చేసుకోగలమని,అందరూ క్యూలు కడుతున్నారని ఆట్టహాసంగా అన్నారు. 90 రోజులు గడిచేసరికి జరిగినవి ఇంగ్లండ్, వియత్నాంలలో మాత్రమే. కెనడా, యూరప్ సైతం ధిక్కార స్వరంలోనే ఉన్నాయి. ఈ పరిణా మాల మధ్య బ్రిక్స్ను ఢీకొంటున్న ట్రంప్, కాగితం పులిగా మిగలటం తప్ప గత్యంతరం కనిపించదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చరిత్రకెక్కని సిక్కోలు యోధులు
భారతదేశంలో బిర్సా ముండా (1875 –1900), కుమరం భీమ్ (1901– 1940), అల్లూరి సీతారామరాజు (1897 –1924) వంటివారి పోరాటాల కోవ లోకి వచ్చే సిక్కోలు యోధులు తాటి రాజు(మరణం: 1865), కొర్ర మల్లయ్య (మరణం: 1900). చెప్పాలంటే, వాళ్ల పోరాటాలకు ముందుగానే వీళ్లు మద్రాసు ప్రెసిడెన్సీలోని నాటి గంజాం ప్రాంతంలోని వైజాగ్ పటం జిల్లాలో అనగా నేటి ఉత్తరాంధ్రాలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి ఆశువులు బాశారు. వీళ్ల గురించి జానపదులు ఇప్పటికీ పాడుతుంటారు.గొలుగొండ ఏజన్సీలో వీరయ్య దొర (1879), గోదావరి జిల్లాలోని ద్వారబంధాల చంద్రయ్య (1879) వంటి ఆదివాసీ యోధులు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి అమరులయ్యారు. అయితే వారి ప్రాణత్యాగాలు నేటి వరకూ వెలుగులోకి రాలేదు. నాటి ఉమ్మడి గంజాం జిల్లాలోని గుణుపురం, పర్లాకిమిడి, పాలకొండ ఏజన్సీలలో (1833–34) జరిగిన సవరల తిరుగుబాటు, 1834లో మేరంగి, కురుపాం ప్రాంతాలలో జరిగిన అచ్చిప్పవలస తిరుగుబాటు, విశాఖ పట్నం జిల్లా శృంగవరపు కోట తిరుగుబాటు (1837), గొలుగొండ ఏజెన్సీలో వీరయ్య దొర (1879–80) పితూరీలు చరిత్ర (History) కెక్కలేదు.1900వ సంవత్సరంలో సాలూరు, పాచిపెంట ఏజెన్సీలలో కొర్రవానివలస పితూరీగా చెప్పబడుతున్న గిరిజనుల తిరుగుబాటులో కొండదొర తెగకు చెందిన కొర్ర మల్లయ్య (Korra Mallaiah) బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడి మరణించారు. కరువుతో అల్లాడిన గిరిజన రైతులు కప్పం చెల్లించాలన్న స్థానిక దళారులకు, బ్రిటిష్ అధికారులకు ధీటుగా సాలూరు ఏజెన్సీలో 5,000 మంది గిరిజనులతో మల్లయ్య తిరుగుబాటు చేశాడు. వెదురుకర్రలతో తుపాకులను చేసి అవే నిజమైన తుపాకీలుగా నమ్మించాడు.ఆధ్యాత్మిక గురువుగా స్వామి అని పిలవబడే కొర్ర మల్లయ్య మట్టి సుద్దలను బాంబులుగా మార్చగలనని చెప్పాడు. తన కుటుంబ సభ్యులను పంచ పాండవులుగానూ, తన కుమారుణ్ణి శ్రీకృష్ణుని అవతారంగానూ భావించి, తనకు అతీత శక్తులు ఉన్నాయని చెప్పి గిరిజనులను ఏకంచేసి బ్రిటిష్వాళ్లపై పోరాటం చేశాడు.1900 మే నెల ఏడవ తేదీన పాచిపెంట దరి కొర్రవాని వలస గ్రామాన్ని బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టి కాల్పులు జరపగా ఏడుగురు గిరిజనులు నేలకొరిగారు. పట్టుబడిన మల్లయ్య, మరో ఇద్దరికి మరణదండన విధించారు. ఇది తెలుగు నేలపై కొర్రవానివలస పితూరీగా ప్రసిద్ధి గాంచింది.అలాగే ఉమ్మడి గంజాం జిల్లా పర్లాకిమిడి, గుణుపూరు ప్రాంతాలలో (1854–58) జరిగిన తాటిరాజు పితూరి, 1864లో పుత్తాసింగ్ పితూరీ గూర్చిన సమాచారం వెలుగులోకి రాలేదు. గయాబిసాయిగా పేరుగాంచిన తాటిరాజును 1865 ప్రాంతంలో శ్రీకాకుళం నడిబొడ్డున వందలమంది పోలీసుల సమక్షంలో ఉరితీసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రాంతాలలో జానపద కళా కారులు ‘తాటిరాజు వేషం’ వేసి ప్రదర్శనలు ఇవ్వడం కనిపిస్తుంది. దీన్నిబట్టి తాటిరాజు (Tati Raju) సామాన్య ప్రజలకు కూడా తెలిసిన ఉద్యమ నాయకుడని అర్థమవుతుంది. విశాఖ మన్యంలోని గొలుగొండ ఏజెన్సీలో వీరయ్య దొర బ్రిటిష్ సైన్యం గుండు దెబ్బ తగిలి మరణించాడు. అలాగే 1891లో గొలుగొండలో శాంతి భూపతి పోరాటాలు కూడా వెలుగులోకి రాలేదు. ఇలా కళింగాంధ్రలో జరిగిన మన్యం పోరాటాలు భారతదేశంలో ఏ ప్రాంతానికి తీసిపోనివి.చదవండి: దళితోద్యమ విజయాలు ఎన్నెన్నో!కానీ ఎందుకో ఈ పోరాటాలు చరిత్రకెక్కని కథలుగా మిగిలిపోయాయి. ఇకనైనా వీటిపై పరిశోధన జరిపి విస్మృతికి గురైన కళింగాంధ్ర ఆదివాసీల పోరాటాలకు చరిత్రలో చోటు కల్పించాలి. అలాగే వాళ్ళ జయంతులు, వర్ధంతులు జరిపి నేటి తరానికి వారి పోరాటాలను అందివ్వ వలసిన అవసరం ఉన్నది.- బద్రి కూర్మారావు ‘గిడుగు రామమూర్తి తెలుగు భాషా జానపద కళాపీఠం’ వ్యవస్థాపక అధ్యక్షుడు -
దళితోద్యమ విజయాలు ఎన్నెన్నో!
భారత దేశంలో నడిచిన ఉద్యమాల్లో దళి తోద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉద్యమానికి అంబేడ్కర్ భావజాలమే ప్రధాన ఊపిరి. ఇందులో మేధావులు, కళాకారులు, కవులు, స్త్రీలు, ప్రజలు అంచెలంచెలుగా ఉద్య మంతో కలసి నడిచారు. ఉద్యమం ఒక విశ్వా సాన్ని ప్రజలకు కల్గించింది. స్వాతంత్య్రోద్యమంలో అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ సామాజిక స్పృహను మేల్కొ ల్పారు. వీటన్నిటి అవగాహనతోనే కారంచేడు, చుండూరు ఉద్యమాలను సాగించడం సాధ్యమయ్యింది. అంబేడ్కర్ ‘మహద్ చెరువు’ పోరాట దృక్పథాన్ని అర్థం చేసు కుని సామాజిక, ప్రజాస్వామిక, లౌకిక వాద పోరాటాన్ని న్యాయ సమ్మతమైన పోరాట ధర్మాన్ని స్వీకరించాం. దానిని దళిత ఉద్యమా నికి అన్వయించడంతో కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట ఉద్యమాల నిర్మాణం జరిగింది. సిద్ధాంత పరమైన, తాత్త్విక పరమైన అనేక చర్చలు జరిగాయి. అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కులు, అనేక సందర్భాల్లో ఆయన ఎదుర్కొని నిలబడిన పోరాట ఘట్టాలు, ప్రభు త్వాన్ని నిలదీయటానికి ఆయన వేసిన ప్రశ్నలు దళిత ఉద్యమానికి ఆయువుగా నిలిచాయి. ప్రధానంగా హేతువాద ఉద్యమాల నుండి దళిత ఉద్యమంలోకి వచ్చినవారం ఇందులో ఎక్కువగా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని అందుకే కుల నిర్మూలనా ఉద్యమంగా నడపగలిగాం. కారంచేడు, చుండూరు, ఇంకా అనేక చోట్ల మాల, మాదిగల మీద దాడులు జరిగినా అన్ని కులాలలో లౌకికవాదులు కలిసి రావటానికి కారణం ఈ ఉద్యమానికి ఉన్న కుల నిర్మూలన సైద్ధాంతిక భావనే. అంబేడ్కర్ ఆలోచనలను కమ్యూనిస్ట్ ఉద్యమాలు కూడా అర్థం చేసుకోవటం ప్రారంభించాయి. అస్పృశ్యులను ఎందుకు ఊరి బయట ఉంచారో అంబేడ్కర్ చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా అస్పృశ్యత కేవలం పేదరిక నిర్మూలన వల్ల పోతుందని కమ్యూనిస్టులు వాదించినందువల్ల అస్పృశ్యతా నివారణ జరక్కపోగా, అది స్వాతంత్య్రం అనంతరం మరింత జఠిల మైంది. అంబేడ్కర్ తీసుకొచ్చిన రిజర్వేషన్ల వల్ల దళితుల్లో చదువు కున్నవాళ్ళు పెరిగారు. రిజర్వేషన్ల వల్ల లాభం పొందినవారు కింది తరగతులను చైతన్యపరిచారు.కొన్ని గ్రామాల్లో జరిగిన సంఘటనల నుండి ప్రారంభం అయిన దళిత ఉద్యమం రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. దళితులపై దాడులు జరగకుండా ఉండటం కోసం సామాజిక న్యాయ పోరాటాన్ని అన్ని దిశలకు తీసుకెళ్లే పెద్ద ప్రయత్నం జరిగింది.ఇందులో ప్రధానమైన అంశం కుల నిర్మూలనా భావాన్ని విస్తృతం చేయడమే. ఎందుకంటే కులం అనేది కొన్ని వందల సంవత్సరాలుగా సమాజంలో ఘనీభవించింది. అది మెదడులోకి ఇంకిపోయింది. దాని రూపాన్ని మార్చాలి. ఆ మెదడులో ఏర్పడిన నమ్మకం శాస్త్రీయంగా నిజం కాదు. కొందరు ప్రత్యేకంగా ఆ భావాన్ని మెదడులోకి ఇంకించారు. దానికి మత ప్రయోజనాలు ఉన్నాయి. దళిత ఉద్యమ ప్రభావం వల్ల అంబేడ్కరిజాన్ని చాలా లోతైన విషయంగా కమ్యూనిస్ట్ ఉద్యమాలు గమనించాయి. కేవలం ఆర్థిక పోరాటాలు కుల సమస్యనూ, కుల ఆర్థిక దోపిడినీ నివారించలేవు అని తెలుసుకున్నారు. నక్సలైట్ ఉద్యమంలో ప్రసిద్ధులైన కేజీ సత్య మూర్తి, బీఎస్ రాములు, వైకే, కంచె ఐలయ్య, ఊసా, ఎంఎస్ గోపి నాథ్, గద్దర్ లాంటి ఎందరో కళాకారులు, మేధావులు, దళిత ఉద్య మంలోకి వచ్చారు. ఇది పెద్ద కీలకమైన పరిణామం. ఈ పరిణామంతో భారతదేశంలో భావజాల చర్చ బలంగా జరిగింది. దానివల్ల కుల నిర్మూలన మీద గొప్ప పరిణామాత్మకమైన చర్చ జరిగింది. ఈ ఉద్యమాలలో దళిత ఉద్యకారులు ఆ యా సంఘటనల్లో, ప్రధాన ఘట్టాల్లో, బొజ్జ తారకం లాంటి సామాజిక న్యాయవాదులు, ఉద్యమకారులతో కలిసి నడిచారు. అది చాలా విస్తృతమైన తాత్త్విక సామాజిక పరిణామానికి దారి తీసింది. 111 మంది ఎంపీలను ఏకతాటి మీదకు తీసుకు వచ్చిన ఉద్యమం... దళిత ఉద్యమం. అదే సమయంలో ‘‘ద ఎస్సీస్ అండ్ ద ఎస్టీస్ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) ఆక్ట్, 1989’’ని అంబేడ్కర్కి కొనసాగింపుగా చట్ట రూపంలోకి తెచ్చిన ఉద్యమం... దళిత ఉద్యమం. అలాగే ‘రాష్ట్రపతి దళితుడు కావాలి’ అనే నినాదాన్ని ప్రయోగాత్మకంగా చేసిన మహోద్యమం కూడా ఇదే. ముగ్గురు ప్రధాన మంత్రులు దళిత బాధితులను స్వయంగా కలసి చర్చలను జరిపిన ఉద్యమం కూడా దళిత ఉద్యమమే. మాజీ ప్రధాన మంత్రి వీపీ సింగ్, రామ్ విలాస్ పాశ్వాన్, శరద్ యాదవ్, వెంకట స్వామి వంటి ఉద్ధండులు ఢిల్లీ బోటు క్లబ్లో ఉద్యమంలో పాల్గొ న్నారు. పార్లమెంటు భవనం ముందు మహా మానవహారం నిర్మించిన మహోద్యమం దళిత ఉద్యమం. బీసీ ఉద్యమాలు, స్త్రీవాద ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, ఉపకుల ఉద్యమాలు ఎన్నో దళిత ఉద్యమ ప్రేరణతో వచ్చాయి. భావ జాల చర్చతో పాటు ఆచరణాత్మకమైన కార్యక్రమం నిర్మాణం జరిగింది. ప్రత్యామ్నాయ భావజాల ఉద్యమాన్ని సాహిత్యాన్ని దళిత ఉద్యమం ముందుకు తీసుకువచ్చింది. నీతి, నిజాయతీ, ఆచరణ, కార్యాచరణ, నిరంతర ఆధునీకరణలు దళిత ఉద్యమ గమనంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దళిత ఉద్యమం పేదరిక నిర్మూలనను, కుల నిర్మూలనను పరస్పర సంబంధితాలుగా భావించింది. కుల నిర్మూలనతో పాటు ఆర్థిక స్వావలంబన కోసం కూడా కృషి చేసింది. ప్రభుత్వం కూడా ఉద్యమస్ఫూర్తితో దళితుల చైతన్యాన్ని అవగాహన చేసుకునే పరిస్థితులు వచ్చాయి. దళితుల్లో కళాకారులు, కవులు, ఉపన్యాసకులు, నిర్మాణ కర్తలు, ఆర్గనైజర్లు రూపొందారు. వీరికి అంబే డ్కర్, మహాత్మా ఫూలే, బుద్ధుడు వంటివారి భావధారలే బలం. అంబేడ్కరిజం సత్యం అనే పునాది మీద నిలబడి మాట్లాడగల్గే ధైర్యంతో నాలుగు దశాబ్దాల్లో కొన్ని లక్షల మందిని తీర్చిదిద్దింది. దళిత మహిళలు భూ పోరాట ఉద్యమాలను నడిపారు. యువకులు క్రమశిక్షణ కల్గిన సైనికులుగా రూపొందారు. మేధావులు ఎన్నో పరిశో ధనల ద్వారా భారతదేశ పునఃనిర్మాణానికి పూనుకున్నారు. నాలుగు దశాబ్దాల దళిత ఉద్యమ ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, తాత్విక ప్రత్యామ్నాయ నిర్మాణానికి అందరం పూనుకోవాల్సిన సందర్భంలో ఉన్నాం. ఈ జూలై 17 నాటికి కారంచేడు ఉద్యమం ప్రారంభమై 40 ఏళ్ళు! చుండూరు ఉద్యమం 1991లో జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి ఈ సందర్భంగా ఒక పెద్ద మహాసభ జరిపి భవిష్యత్తు కార్యాచరణ మీద విస్తృతమైన చర్చ చేయాలనేది ఆలోచన. ఈ చర్చలు ఒక శతాబ్ది కాలానికి దిక్సూచి అవ్వాలి. అంబేడ్కర్ ఇచ్చిన స్ఫూర్తి కొన్ని తరాలు, యుగాలకు ఊపిరిగా నిలుస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వేలు, లక్షలమంది ఉద్యమంతో కలిసి నడిచారు. ఇది ఏ ఒక్కరో నడిపిన ఉద్యమం కాదు. ఇది సమూహ ఉద్యమం. ఉద్యమం ఒక అనంత ప్రయాణం. అది ఆగదు. భవిష్యత్తు కార్యాచరణలు కాలానుగుణంగా రూపొందించి ముందుకు నడవాలి. ఇది అంబేడ్కర్ బాట. దీనికి నిరంతర కార్యాచరణే ఊపిరి. ఆ దిశగా నడుద్దాం. అందరం ఏకమై మహా సంఘటిత శక్తిగా నడుద్దాం. ప్రతి ఒక్క దళిత బహుజనుడు ఉద్యమకారుడే. అంబేడ్కర్ ఆలోచన విధానమే దళిత ఉద్యమానికి స్ఫూర్తి.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695(జూలై 17 నాటికి కారంచేడు ఉదంతానికి 40 ఏళ్లు.) -
హద్దులు లేని స్నేహబంధం
హిమాలయాల తలమానికం. గౌతమ బుద్ధుని జన్మభూమి. హిందూ – బౌద్ధ సంస్కృతుల కలయిక. రాజకీయంగా పునర్నిర్మాణం. ఇలాంటి నేపాల్ను సందర్శించాలన్న ఆలోచన ఎంతో కాలంగా మనసులో ఉంది. ‘నేపాల్ శాంతి సంఘీ భావ సమితి’ ద్వారా ఈ అవకాశం కలిగింది. ‘భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం’ (ఇస్కఫ్) బృందం 2025 జూన్ 15 నుండి 20 వరకు ఖాట్మండు పర్యటన జరిపింది. ఈ బృందంలో ఒడిశా, తమిళనాడు, కశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన 27 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొన్న వారిలో ఈ వ్యాస రచయిత ఉన్నాడు. మా బృందానికి ఇస్కఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బిజయ్ కుమార్ పదిహారి నాయకత్వం వహించారు. నేపాల్ పర్య టన రాజకీయ, ఆధ్యాత్మిక, విద్యా కోణాల్లో ఎన్నో కొత్త అనుభవాలను అందించింది. భారత్–నేపాల్ దేశాలు భౌగోళికంగా,సాంస్కృతికంగా, మతపరంగా అత్యంత సమీప సంబంధాలున్న దేశాలు. రామాయణంలో పేర్కొన్న సీతాదేవి జన్మస్థలం జనకపురి నేపాల్ లోనిదే. అంతేగాక, బుద్ధుడు జన్మించిన లుంబిని ఈ దేశంలోనే ఉంది. ఈ విధంగా హిందూ – బౌద్ధ సంప్రదాయాల మధ్య సాంస్కృతిక అను బంధం గాఢంగా ఏర్పడింది. 1947లో భారత్ స్వాతంత్య్రం పొందిన తరువాత, 1950లో భారత్–నేపాల్ మధ్య స్నేహ, శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాల ప్రజలు ఇరు దేశాలకూ స్వేచ్ఛగా ప్రయాణించ గలుగుతారు. వాణిజ్యం, ఉద్యోగం, స్థిరాస్తుల విషయంలో సమాన హక్కులు కలిగి ఉంటారు.మా తొలి రోజు కార్యక్రమం, ఖాట్మండు పరిసరాల్లోని చారిత్రక ప్రదేశాలను సందర్శించడం. తొలి ఆధ్యాత్మిక ఆరాధన పశుపతి నాథ్ ఆలయంతో మొదలైంది. హిందూ ధర్మంలో ఒక శైవపీఠంగా గుర్తించబడే ఇది మన సాంస్కృతిక బంధానికి మూల స్తంభంగా నిలుస్తోంది.ఒక విశేష సమావేశంగా మేము నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్టు–లెని నిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు రాజన్ భట్టా రాయ్ని కలిశాం. నేపాల్ రాజ్యాంగ నిర్మాణానికి, రాచరికం అంతానికి, ప్రజాస్వామ్య స్థాపనకు కమ్యూనిస్టు ఉద్యమం ఎలా ఉద్యమించిందో ఆయన వివరించారు. ప్రజలు స్వయం శక్తితో ఎలా ఉద్యమించారో, మావోయిస్టుల హింసా త్మక మార్గం ఎలా విఫలమై, పార్లమెంటరీ పద్ధ తులు ఎలా విజయవంతమయ్యాయో ఆయన తెలియజేశారు. భారత కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ రాజకీయ పరిణామాలు మౌలికంగా పనికి వస్తాయి. నేపాల్ కమ్యూనిస్టు ఉద్యమం అనేది హిమాలయ ప్రజల నిబద్ధత, బలమైన రాజకీయ ఆవేశం, సామాజిక న్యాయం సాధించాలన్న కోరికల ఫలితం. ఇది కేవలం ఒక రాజకీయ ఉద్యమం కాదు – ఒక దేశ ప్రజలను రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య దేశంగా మార్చిన విప్లవ గాథ. నేపాల్లో వందల ఏళ్లుగా సాగుతున్న రాచరిక పాలనను తుడిచిపెట్టిన ప్రజా ఉద్యమా నికి కమ్యూనిస్టులు కేంద్ర బిందువులయ్యారు. నేపాల్కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగ స్వామి. 2023–24లో నేపాల్ దిగుమతులలో దాదాపు 60% వరకు భారతదేశం నుంచి జరిగి నవే. భారత ప్రభుత్వం నేపాల్లో అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులకు సహాయంగా పనిచేస్తోంది. రహదారులు, విద్యుత్, రైల్వే, డ్యామ్లు వంటివి ఇందులో ఉన్నాయి. భారత్, నేపాల్ మధ్య రక్షణ సంబంధాలు బలంగా ఉన్నాయి. నేపాల్ గూర్ఖా సైనికులు భారత ఆర్మీలో ప్రత్యేక స్థానం పొందారు. ప్రస్తుతం భారత సైన్యంలో దాదాపు 32,000 నేపాలీయులు పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం భారత రక్షణ దళాలు నేపాల్ ఆర్మీకి శిక్షణ, పరికరాలు, సాంకేతిక సహాయం అంది స్తాయి. భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో వేలాది నేపాలీ విద్యార్థులు ఉన్నారు. ఖాట్మండు విశ్వవిద్యాలయంలో భారత దౌత్య శాఖ సహా యంతో నడుస్తున్న ఇండియా–నేపాల్ ఫ్రెండ్షిప్ లైబ్రరీ, విద్యారంగానికి ఒక సంకేతంగా ఉంది. ఇండియన్ ఎంబసీ తరఫున నేపాల్కు విద్యా, పర్యావరణ, ఆరోగ్య రంగాల్లో భారీగా స్కాలర్ షిప్లు, మద్దతు అందిస్తున్నాయి.ఈ యాత్ర మాకు ఒక పాఠశాల. రాజకీయ చైతన్యం, మతసామరస్య దృక్పథం, ఆధ్యాత్మి కత, సేవా, విద్యలో సమానత్వం– అన్నింటినీ ఒకే వేదికపై ముందు ఉంచిన అనుభవం.– కె. రాజశేఖర్ ఇస్కఫ్ ఏపీ శాఖ అధ్యక్షుడు ‘ 99483 17270 -
హాస్యాస్పద ఓటరు ధ్రువీకరణ
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ కోసం జూన్ 24న ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తు న్నాయి. కలవరపరచే పలు ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఈ సవరణ ఫలితంగా కోట్ల మంది తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉండదా? వీరిలో అత్యధికులు పేదలు, అణగారిన వర్గాలే ఉంటారా? అసలు ఇప్పటికిప్పుడు ఈ సవరణ కార్యక్రమం చేపట్టడం అవసరమా? ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఏ సమయంలోనైనా, ఏ తరహాలోనైనా ఓటర్ల జాబితాల్లో ప్రత్యేక సవరణ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. నాకు ఆ విషయం తెలుసు. అయితే, కేవలం నాలుగు నెలల్లో బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉన్న తరుణంలో ఈ ఆదేశం ఎంతవరకు సబబు? 2003లో, అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందుగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్– సర్) జరిగింది. అది నాలుగు నెలల ముందు కాదన్నది మనం గమనించవలసిన విషయం.ఆధారాలు ఎలా తెస్తారు?రెండోది, ఈ ‘సర్’ను జూన్ 25న ప్రారంభించి, జూలై 25 నాటికి పూర్తి చేయాలి. అంటే కేవలం ఒక నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. 8 కోట్ల మంది ఓటర్లను ప్రభావితం చేసే ఈ కార్య క్రమాన్ని కేవలం 30 రోజుల్లో పూర్తి చేయడం అసలు సాధ్యపడే పనేనా?ఇవి సందర్భానికి సమయానికి సంబంధించిన ప్రశ్నలు. అయితే, ఇక్కడ ప్రశ్నార్థకం సమయం ఒక్కటే కాదు; ప్రక్రియ మీదా నీలినీడలు ముసిరాయి. ఎలాగో తెలుసుకోడానికి ఉత్తర్వుల వివ రాల్లోకి వెళ్దాం. కమిషన్ ఆదేశాల ప్రకారం, 1987 జూలైకి ముందు జన్మించిన వ్యక్తులు తమ పుట్టుకకు, పుట్టిన ప్రదేశానికి సంబంధించిన ఆధారాలు సమర్పించి తీరాలి. అయితే, చాలా మందికి జనన ధ్రువీకరణ పత్రాలు ఉండవు. వీరిలో ఎంతో మంది ఆసుపత్రుల్లో కాకుండా ఇళ్లలోనే జన్మించారు.2000 సంవత్సరం వరకూ కూడా బిహార్లో కేవలం 3.7 శాతం జననాలే అధికారికంగా నమోదు అయ్యాయి. 2007 నాటికి ఇది 25 శాతానికి పెరిగింది. ఈ సంవత్సరంలో పుట్టిన వారికి 2025లో 18 ఏళ్లు నిండుతాయి. అంటే ఏమిటి? వీరిలో గణనీయ సంఖ్యాకుల వద్ద జనన ధ్రువీకరణ పత్రాలు లేవు. స్వయంగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. జనన ధ్రువీకరణ పత్రాలు లేని వారు 11 ఇతర ఆధారాల్లో ఏదో ఒకటి చూపించగలిగితే చాలని కమిషన్ చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే గుర్తింపు కార్డు, పాస్పోర్టు, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, అటవీ హక్కు సర్టిఫికెట్ వంటివి వీటిలో ఉన్నాయి. కానీ, సాధారణంగా అందరి దగ్గరా ఉండే ఆధార్, రేషన్ కార్డులను సుప్రీంకోర్టు సూచించినప్పటికీ వీటినుంచి మినహాయించారు. కమిషన్ పేర్కొన్న 11 పత్రాల్లో ఏదో ఒకటి ఎంత మంది బిహారీల వద్ద ఉండి ఉంటుంది? ఆ ఏదో ఒక పత్రంలో జన్మస్థలం నమోదై ఉంటుందా అనేది మరో ముఖ్యమైన ప్రశ్న. చాలా వాటిలో ఉండదు. దళితులు, ముస్లింలు, అత్యంత వెనుకబడిన కులాలు, ఆది వాసీలు వంటి అట్టడుగు వర్గాల బీద ప్రజలకు ఈ ధ్రువీకరణ పత్రాలు ఉండవు. కాబట్టి వారి ఓటు హక్కు రద్దవుతుంది. ఇది అన్యాయం కాదా?కమిషన్ మౌనంమరో అడుగు ముందుకు వెళ్లి పరిశీలిద్దాం. 1987 జూలై తర్వాతి నుంచి 2004 డిసెంబరు వరకు గడచిన కాలంలో పుట్టినవారు జనన, జనన ప్రదేశ ఆధారాలు మాత్రమే ఇస్తే సరిపోదు. తమ తల్లిదండ్రుల్లో ఒకరి జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 2004 డిసెంబరు తర్వాత పుట్టిన వారైతే తల్లిదండ్రుల ఇద్దరి వివరాలు ఆధారాలతో సహా సమర్పించాలి. ఎంతమంది ఇలా చేయగలరు? ఉదాహరణకు, నా తల్లిదండ్రుల జనన ధ్రువపత్రాలు నా వద్ద లేవు. నేను వాటిని సమర్పించలేను. చాలామంది బిహారీల వద్ద వారి తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు ఉండవని నేను కచ్చితంగా చెప్పగలను. కమిషన్ ఆ తర్వాత చెప్పిన దాని ప్రకారం, బిహార్లో 2003 ‘సర్’ జరిగిన తర్వాత 7.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4.96 కోట్ల మంది ఓటర్లు ఎలాంటి డాక్యుమెంట్లూ సమర్పించాల్సిన అవసరం లేదు. మరి మిగిలిన 3 కోట్ల మంది మాటేమిటి? హక్కు ఉన్నప్పటికీ 2003 ఎస్ఐఆర్లో నమోదు కాని వారి సంగతేమిటి? ఈ ప్రశ్నలకు కమిషన్ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు.అక్రమం... హాస్యాస్పదంఇవి ఇప్పటికే వేధిస్తున్న ప్రశ్నలు కాగా, సవరణ ప్రక్రియముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. కమిషన్ కోరుతున్న అన్ని వివరాలూ నెల రోజుల్లోనే సమకూర్చాలి. అలా చేయలేని వారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తారు. అసలే నడి వర్షాకాలం, పైగా ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా సాగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో పనులు మానుకుని ఎంతమంది ఈ అదనపు బరువు నెత్తికి ఎత్తుకుంటారు? ఇక్కడితో అయిపోలేదు. బిహార్ జనాభాలో 20 శాతం మంది వలసలు పోయే కార్మికులు. ఈ ప్రత్యేక సవరణ జరిగేటప్పుడు వారు స్థానికంగా అందుబాటులో ఉండరు. అలాంటి వారి విషయంలో ఏం జరుగుతుంది? ఓటర్ల జాబితాల నుంచి వారి పేర్లు గల్లంతయ్యే ప్రమాదం లేదా?చివరిగా, మరో అంశం ప్రస్తావించాలి. ఓటర్ల జాబితాల్లో ఇలా పేర్లు గల్లంతైన వారు పౌరులుగా కూడా గుర్తింపు కోల్పోయే ప్రమాదం లేదా? ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్’ (ఏడీఆర్) వ్యవస్థాపక ట్రస్టీ అయిన జగదీప్ ఛోకర్ అందుకే ఈ ఎస్ఐఆర్ ‘‘అక్రమం, హాస్యాస్పదం, అనవసరం’’ అంటున్నారు. నిర్మొహమాటంగా చెబుతున్నాను, నేను ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తాను. మరి మీ సంగతేమిటి?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మోహన్ భాగవత్ (ఆరెస్సెస్ చీఫ్) రాయని డైరీ
శ్రీ మోదీజీకి, నాకు ఈ ఏడాదితో 75 నిండుతాయి. నేను ఆయన కన్నా ఓ ఆరు రోజుల ముందు డెబ్బై ఐదును దాటేస్తాను. డెబ్బై ఐదేళ్లు పూర్తయిన వాళ్లు పదవి నుంచి హుందాగా తప్పుకుని, తర్వాతి వాళ్లకు సగౌరవంగా దారివ్వాలనేమీ ఆరెస్సెస్లో రూలు లేదు, రాజ్యాంగమూ లేదు కనుక, రిటైర్మెంట్ ప్లాన్ల గురించి చింతపడే అవసరం డెబ్బై ఐదు దాటిన ఆరెస్సెస్ చీఫ్లకు ఏ రోజూ ఉండదు. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్’ అంటారు! ఆరెస్సెస్లో ఏజ్ అసలు నంబరే కాదు. బాలాసాహెబ్ దేవరస్ డెబ్బై ఐదు దాటాక కూడా మూడేళ్లు ఆరెస్సెస్ చీఫ్గా ఉన్నారు. రజ్జూ భయ్యా డెబ్బై ఐదు దాటాక కూడా ఐదేళ్లు చీఫ్గా ఉన్నారు. కేఎస్ సుదర్శన్ డెబ్బై ఐదు దాటాక కూడా మూడేళ్లు చీఫ్గా ఉన్నారు. బీజేపీలో కూడా ఈ డెబ్బై ఐదు అన్నది అసలు ఒక నంబరే కాకపోయేది. కానీ శ్రీ మోదీజీ వచ్చి అత్యవసరంగా దానికొక నంబర్ హోదాను కల్పించారు. డెబ్బై ఐదు దాటిన అద్వానీని, మురళీ మనోహర్ జోషిని, జశ్వంత్ సింగ్ని మార్గదర్శకులుగా మార్చి, రాజకీయాల నుంచి వీడ్కోలు ఇప్పించారు. డెబ్బై ఐదు దాటిన ఎవరికైనా ‘‘నో టిక్కెట్’’ అన్నారు. డెబ్బై ఐదు దాటాయని గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్ను మధ్యలోనే కుర్చీలోంచి లేపేశారు. ఇప్పుడా డెబ్బై ఐదు అటు తిరిగి ఇటు తిరిగి శ్రీ మోదీజీ వైపే ఒక గ్రహ శకలంలా రాబోతోంది. ఆ గ్రహ శకలం ఆయన్ని ఢీ కొంటుందా, లేక ఆయనే ఆ గ్రహ శకలాన్ని ఢీ కొంటారా అన్నది సెప్టెంబర్ 17న కానీ తెలీదు. ఆ రోజు శ్రీ మోదీజీ బర్త్ డే.‘‘డెబ్బై ఐదు అన్నది మోదీజీ నిర్ణయమే తప్ప, ఆయన పెట్టిన నియమం కాదు’’ అని అమిత్ షా ఎప్పటికప్పుడు పార్టీని, ప్రతిపక్షాలను నెట్టుకొస్తున్నారు. అందుకు ఆయనను అభినందించాలి.ఆరెస్సెస్ వందేళ్ల వేడుకలకు మార్చిలో శ్రీ మోదీజీ నాగపుర్ వచ్చినప్పుడు ఆయన ఎంతో భావోద్వేగంతో కనిపించారు. ఆరెస్సెస్ను ఒక పెద్ద మర్రిచెట్టుతో పోల్చారు.ఆరెస్సెస్ కూడా శ్రీ మోదీజీని చూసి అదే స్థాయిలో భావోద్వేగానికి గురైంది. ముఖ్యంగా నేను గురయ్యాను. పదవిలో ఉండగా ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని శ్రీ మోదీజీ! అటల్జీ ఓడిపోయి, బీజేపీ నిర్వేదంలో మునిగి ఉన్నప్పుడు, పార్టీకి ప్రధాని అభ్యర్థిగా నేను చేసిన ఎంపికే శ్రీ నరేంద్ర మోదీజీ. నేను నాటిన మహా మర్రి ఆయన.శ్రీ మోదీజీ నాగపుర్ వచ్చి ఢిల్లీ వెళ్లిపోగానే ఇక్కడ ముంబైలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మొదలు పెట్టేశారు! ‘‘డెబ్బై ఐదు నిండాక కూడా ప్రధానిగా కొనసాగేందుకు పర్మిషన్ కోసం మోదీ నాగపుర్ వచ్చి, మోహన్ భాగవత్ను కలిసి వెళ్లారు’’ అని!!నిజానికి శ్రీ మోదీజీ, నేను ఆ రోజు మాట్లాడుకున్నది భారత స్వాతంత్య్ర దినోత్సవానికి 2047లో రానున్న వందేళ్ల గురించే కానీ, 2025లో భారత ప్రధానికి నిండనున్న డెబ్బై ఐదేళ్ల గురించి కాదు. ఆరెస్సెస్ సిద్ధాంత కర్త మోరోపంత్ పింగ్లే అనేవారు... డెబ్బై ఐదు దాటాయని మీకెవరైనా శాలువా కప్పితే దానర్థం మీరిక విశ్రాంతి తీసుకోవాలనీ, కొత్తవారికి అవకాశం ఇవ్వాలనీ! పింగ్లేకి డెడికేట్ చేసిన ఒక సభలో మొన్న నేను ఈ మాట గుర్తు చేసుకున్నప్పుడు, వెంటనే కాంగ్రెస్ నా మాటను బంతిలా క్యాచ్ పట్టేసింది. ‘‘చూశారా, మోదీని దిగిపొమ్మని మోహన్ భాగవత్ ఎంత సంకేతంగా చెబు తున్నారో...’’ అని ప్రచారం మొదలు పెట్టింది. అదే రోజు వేరొక సభలో అమిత్ షా – తను రిటైర్ అయ్యాక వేదాలు, ఉపనిషత్తులలో పడిపోతానని, ప్రకృతి వ్యవసాయం చేస్తానని అన్నారు! సహకార సంఘాల మహిళలతో మాట్లాడే సందర్భంలో ఆయన అలా అన్నారు. నేనైనా, అమిత్ షా అయినా సందర్భాన్ని బట్టే మాట్లాడాం. అయితే మా రెండు సందర్భాలూ... ఏ మాత్రం సమయం,సందర్భం కానీ టైమ్లో వచ్చిపడ్డాయంతే! -
కలయిక సరే... లాభం ఎవరికి?
జూలై 9 నాటి, సాక్షి పత్రిక సంపా దకీయం– ‘ఠాక్రే సోదరుల యుగళం’ చదివాక, మరిన్ని వాస్తవాలు తెలియ జేయటానికి ఈ విశ్లేషణ. మరాఠీ అస్మిత (ఉనికి), మరాఠీ యువత ఉద్యోగావకాశాల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా 1966 జూన్ 19న ఏర్పాటైన శివసేన ‘మరాఠీ మానసాంచా హక్ ఆని న్యాయ సాఠీ’ (మరాఠీ వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం) అనే నినాదం ఆ రోజుల్లో యువతను ఆకట్టుకుంది. భూమి పుత్రుల (సన్స్ ఆఫ్ సాయిల్) ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తూ, చట్ట సభలో వారి గొంతు వినిపించాలని మొదట ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు, తర్వాత విధాన స¿ý కు ప్రతినిధులన పంపటంతో రాజకీయాలతో ప్రమేయం లేని శివసేన, రాజకీయ రంగు పులుముకుంది. 1960, 1970 దశకాలలో కమ్యూనిస్టులకు నిలయం బొంబాయి నగరం అనేవారు. శివసేన రాకతో క్రమేణా కమ్యూనిస్టులు ఈ నగరంలో తెరమరుగు కావటం అప్పట్లో కాంగ్రెసుకు కూడా కలిసొచ్చింది. 1984 నుండి రైట్ వింగ్ జాతీయ పార్టీ అయిన భాజపాతో చేతులు కలిపిన శివసేన 1995లో కాషాయ కూటమితో మహారాష్ట్రలో (శివ షాహి) అధికారం చేజిక్కించుకుని, రాష్ట్రంలో కాంగ్రెసుకు ముఖ్య విరోధిగా ఎదిగింది. సుమారు నాలుగు దశాబ్దాలు పార్టీ అధినేత బాలా సాహెబ్ ఠాక్రే, సర్వం తానై పార్టీని రిమోట్ కంట్రోల్ శైలిలో, పకడ్బందీగా నడిపించారు (అడపా దడపా వలసలు మినహా). బాల్ ఠాక్రే సోదరుడు శ్రీకాంత్ కొడుకు స్వరరాజ్. ఈయన్నే రాజ్ అని పిలుస్తారు. చిన్నప్పటి నుండీ సాహెబ్తో చనువుగా ఉండేవాడు. తొమ్మిది పదేళ్ల ప్రాయం నుండే అతడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని పార్టీ మీటింగుకు తరచుగా హాజరయ్యేవారు బాల్ ఠాక్రే. పెద నాన్న ముఖ కవళికలు కలిగిన రాజ్ ఆయనలాగే పొలిటికల్ కార్టూన్లు గీయటం హాబీగా చేసుకున్నారు. బాలా సాహెబ్ హావ భావాలు, ఆయన ఉపన్యాస శైలి, బాడీ లాంగ్వేజ్ను అప్పటినుండే పుణికిపుచ్చుకున్న రాజ్ను, కాలేజీ రోజుల్లోనే శివసేన విద్యార్థి విభాగం ‘భారతీయ విద్యార్థి సేన’ చీఫ్గా నియమించి రాజకీయ సెలయేటిలోకి దించారు బాలా సాహెబ్. 1990 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధినేతకు కుడి భుజంగా మెదిలిన రాజ్ను... మున్ముందు అతడే పార్టీ పగ్గాలు చేపట్టే సాహెబ్ వారసుడు అని అప్పట్లో కార్యకర్తలు చెప్పు కోసాగారు. మరాఠీ యువతకు కొత్త ఒరవడి చూపిస్తూ, పార్టీ లోకి వారిని చేర్చుతూ నవ చైతన్యం ప్రోదిచేశారు రాజ్. అయినా, పుత్ర వాత్సల్యం ప్రభావమో, మరే కారణమో తెలియదు కానీ రాజకీయాలకు బహుదూరంగా ఉన్న తన చిన్న కొడుకు ఉద్ధవ్ ఠాక్రేను 2002 నుండి రాజకీయాల వైపు మరల్చటం మొదలెట్టారు బాలా సాహెబ్. 2003లో జరిగిన శివసేన కార్యకర్తల శిబిర్లో ఉద్ధవ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించారాయన. అది రాజ్కు అస్సలు మింగుడు పడలేదు. ఆ లగాయతు పార్టీలో ఉద్ధవ్, రాజ్ మధ్య అంతర్గత యుద్ధం ముదిరింది. చివరికి 2005 నవంబర్లో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, నాలుగు నెలల తర్వాత (మార్చి 2006) సొంత కుంపటి, ‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన’ (ఎమ్ఎన్ఎస్) ఏర్పాటు చేసు కున్నారు రాజ్ ఠాక్రే. కానీ, రాజ్కు అనుకున్న ఫలితం దక్క లేదు. ఎమ్ఎన్ఎస్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 13 సీట్లతో ఖాతా తెరిచింది. అయితే శివసేన ఓట్లను చాలా వరకు చీల్చింది. ఆ తర్వాత 2014, 2019ల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమై, మొన్నటి 2024 ఎన్నికల్లో 1.55 ఓటింగ్ శాతంతో ఆ ఒక్క సీటును సైతం పోగొట్టుకుంది. గత ఇరవై సంవత్సరాల నుండి ఉత్తర–దక్షిణ ధ్రువాలుగా ఉన్న ఈ సోదరులు మొన్నటి (జూలై 5) హిందీభాష వ్యతిరేక ఉద్యమ విజయోత్సవ ర్యాలీలో ఒకే వేదిక పైకి వచ్చినప్పటికీ, రాజ్ ఠాక్రే వ్యవహార తీరులో అనుకున్న స్పందన కనిపించ లేదని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. రాజ్ దూకుడు వైఖరి, ఉద్ధవ్ నిదానమే ప్రధానం పద్ధతి వల్ల రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇరుపార్టీలూ సీట్లు సర్దుబాటు చేసుకుని, ఓటర్ల ముందుకు రావటం క్లిష్ట సమస్యే కావచ్చు. అదీకాక, ఉద్ధవ్ కొడుకు, మాజీ మంత్రి ఆదిత్య; రాజ్ కొడుకు అమిత్ (మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు)ల రాజకీయ భవిష్యత్తులు కూడా ఈ కలయిక నేపథ్యంలో ఆలోచించాల్సిన మరో కోణం.కాంగ్రెస్ దోస్తీ పుణ్యమా అని శివసేన (ఉద్ధవ్) పార్టీకి గత లోక్సభ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు చాలానే కలిసి వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీకి ఎమ్ఎన్ఎస్తో స్నేహం కారణంగా ఆ మైనారిటీ ఓట్లే కాక ఉత్తర భారతీయుల ఓట్లు కూడా మున్ముందు దూరం కావచ్చు. ‘రాజ్ ఠాక్రే బహిరంగ సభలో జనాన్ని ఆకర్షించవచ్చు కానీ, ఆయన భాషణ్ బ్యాలెట్ లోకి ఓట్లను తేలేద’ని సీనియర్ మరాఠా అధినేత, శరద్ పవార్ గతంలో ఒకసారి ఘంటాపథంగా చెప్పారు. అది వాస్తవం కూడా. ఏది ఏమైనా రాజ్ ఠాక్రే, తన అన్నయ్య ఉద్ధవ్తో రాజకీయ మైత్రి నెరపడానికి కారణం ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఓటు బ్యాంక్కు చెక్ పెట్టడమే కావచ్చు. అయితే ఈ కలయిక ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిని కూడా ఇరకాటంలో పడేసింది. చివరిగా, ఠాక్రే సోదరులు కలిసిపోయే ఎపిసోడ్కు స్క్రిప్ట్ రైటర్ రాష్ట్ర బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే అని అంటున్న స్థానిక విశ్లేషకుల మాటా గమనార్హమే!జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్, ముంబైమొబైల్ : 98190 96949 -
నస్ బందీ, నోట్ బందీ దారిలో ఓట్ బందీ!
ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్ల యిన సందర్భంగా సంజయ్ గాంధీ ప్రోద్బలంతో 1975– 77ల్లో జరిగిన నస్ బందీ (బల వంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స) గురించి చాలామంది తలచుకున్నారు. అలాగే, తొమ్మి దేళ్ల కిందటి నోట్ బందీ (పెద్ద నోట్ల రద్దు) పర్యవసానాలు అందరికీ స్వానుభవమే. సరిగ్గా ఎమర్జెన్సీని గుర్తు చేసుకునే రోజు (జూన్ 25)కు ఒక రోజు ముందు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు ‘వోట్ బందీ’ అంటున్నాయి. అది గత జూన్ 24న ఎన్నికల సంఘం బిహార్లో ప్రత్యేక తీవ్రతర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్– సర్) కోసం ఇచ్చిన ఆదేశం. బిహార్లోని 7,80,22,933 మంది వోటర్లలో 2003లో ఉండిన నాలుగు కోట్ల మంది పోగా, మిగిలిన వోటర్లలో ప్రతి ఒక్కరినీ కలిసి అర్హులా అనర్హులా ధ్రువీకరించి, కొత్త వోటర్ల జాబితా తయారు చేయాలనేది ఈ ఆదేశం.ప్రస్తుతం ఉన్న వోటర్ల జాబితా తప్పుల తడక అనీ, అందులో పేర్లన్నీ అనుమానాస్పదమైనవనీ ఎన్ని కల సంఘం అంటున్నది. విపరీతమైన వర్షాలతో, రాష్ట్రంలో 70 శాతం భూభాగం వరదల్లో చిక్కుకుని ఉన్న ప్రస్తుత స్థితిలో ఈ ఇంటింటి పర్యటన సాధ్యమా అనుమానమే.2003 జాబితా తర్వాత చేరిన వోటర్లందరూ బర్త్ సర్టిఫికేట్, ప్రభుత్వోద్యోగి ఐడెంటిటీ కార్డ్, పెన్షన్ కార్డ్, పాస్ పోర్ట్, విద్యార్హతల సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణ పత్రం, అటవీ హక్కుల సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం, జాతీయ పౌర రిజిస్టర్, స్థానిక అధికారులు తయారు చేసిన కుటుంబ పట్టిక, ప్రభుత్వం భూమి పంపిణీ చేసి ఉంటే ఆ పత్రం వంటి పదకొండు పత్రాలలో ఏదైనా ఒకటి చూపితేనే అర్హుడైన వోటర్గా లెక్కి స్తారు. ఈ అర్హతా పత్రాలలో ఆశ్చర్యకరంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, గ్రామీణ ఉపాధి హామీ పథకపు జాబ్ కార్డ్ లేవు. చివరికి ఎన్నికల కమిషన్ తానే స్వయంగా జారీ చేసిన వోటర్ కార్డ్ కూడా లేదు. బిహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రంలో ఆ పదకొండు పత్రాలలో ఏదో ఒకటి కన్నా వోటర్ కార్డ్, జాబ్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉండే అవకాశమే ఎక్కువ. కొన్ని రోజులు గడిచాక, ‘అర్హత నిర్ధారణను బూత్ లెవల్ ఆఫీసర్ల విచక్షణకు వదులుతున్నాం’ అని ఎన్నికల సంఘం అంది. అంటే ఒక వ్యక్తి వోటరా కాదా అన్నది స్థానిక అధికారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడుతుందన్నమాట!ఈ కార్యక్రమం అనుమానాస్పదంగా ఉన్నదనీ, దీన్ని ఆపాలనీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను కలిసి ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన స్వయంగా బిహార్ వోటర్ల జాబితా నుంచి కనీసం ఇరవై శాతం పేర్లు తొలగించవలసి ఉంటుందని అన్నారు. అంటే ఒక కోటీ అరవై లక్షల వోటర్ల అర్హత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లలో కొందరు నిజంగానే అనర్హులు కావచ్చు గాని, ఈ పేరుతో అధి కార పక్షం చాలామంది పేర్లు తొలగించదలచుకున్న దన్న అనుమానాలు విస్తారంగా ఉన్నాయి. 2003లో వోటర్ల జాబితా సవరించడానికి 700 రోజులు పట్టింది. ఇప్పుడు నిర్దేశించిన నెల రోజుల్లో శిక్షణ, మెటీరియల్ తరలింపునకు పట్టిన కాలాన్ని మినహాయిస్తే 19 రోజుల్లో కార్యక్రమాన్ని ముగించాల్సి ఉంది. అంటే తూతూమంత్రంగా ముగిస్తారన్నమాట. ఎన్నికల సంఘం ప్రకటనలను బట్టి మొత్తం కోటీ అరవై లక్షల వోటర్ల అర్హత ప్రశ్నార్థకమయింది. అసలు వోటర్ల జాబితాలు ఎప్పటికప్పుడు పునర్నవీకరణ చెందుతూనే ఉంటాయి. 2003 నుంచి ఇప్పటివరకూ జరిగిన ఐదు లోకసభ ఎన్నికలలో, ఐదు శాసనసభ ఎన్నికలలో వోటు వేసిన వారందరినీ ఇప్పుడు అనర్హు లుగా, అర్హత రుజువు చేసుకోవలసినవారిగా ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నది. అంటే ఆ ఐదు లోకసభలూ, శాసనసభలూ ఈ అనర్హులైన వోటర్ల వల్ల ఏర్పడ్డాయని ఎన్నికల సంఘం భావిస్తున్నదా? అలా అయితే వాటి సాధికారత, చట్టబద్ధత ఎంత?వోటర్ల జాబితాల సవరణ ఎప్పటికప్పుడు చేయ వలసిన పనే గనుక ఎన్నికల నిబంధనలు అది ఎట్లా చేయాలో నిర్దేశించాయి. ఆ నిబంధనల్లో ఇంటెన్సివ్ రివి జన్ ఉంది గాని ఇప్పుడు ప్రకటించిన స్పెషల్ ఇంటె న్సివ్ రివిజన్ లేదు. అటువంటి పని చేసే అధికారం చట్ట ప్రకారం ఎన్నికల సంఘానికి ఉందా అనే ప్రశ్నకు జవాబు లేదు. బిహార్ నుంచి ప్రతి జూన్–జూలై–ఆగస్ట్ నెలల్లో కనీసం 21 శాతం వోటర్లు ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వలస వెళ్తారని ఎన్నికల సంఘమే ఇది వరకు అంచనా వేసింది. మరి సరిగ్గా అదే సమయంలో ప్రతి వోటర్నూ కలిసి జాబితాను సంస్కరించాలనడంలో ఔచిత్యం ఏమిటి? ఇంకా విచిత్రం, ఇదే ఎన్నికలసంఘం గత సంవత్సరం జూన్లో వోటర్ల జాబితాను సంస్కరించమని బిహార్ ఎన్నికల అధికారులను ఆదేశించింది. వారు ఆరు నెలల పాటు శ్రమించి 2025 జన వరిలో జాబితా ప్రకటించారు. దాన్ని జూన్ 24 వరకూ ఎన్నికల సంఘం కూడా ఆమోదిస్తూ వచ్చింది.చదవండి: మారక నిల్వలు కరిగిస్తేనే కదలిక!ఇప్పుడు హఠాత్తుగా బిహార్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే, ప్రతిపక్షానికి వోటు వేస్తారనే అను మానం ఉన్న లక్షలాది వోటర్లను అనర్హులుగా మార్చ డమే ఏకైక మార్గంగా ఏలినవారు భావించినట్టున్నారు. అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఈ వోట్ బందీ ప్రకటించినట్టుంది. నస్ బందీ తలపెట్టినవారు 1977లో ఓటమి పాలయ్యారు. 2016 నోట్ బందీ ప్రకటిత లక్ష్యాలు సాధించలేక బొక్కబోర్లా పడింది. ఇప్పుడు 2025 వోట్ బందీకి ఏమవుతుంది?- ఎన్. వేణుగోపాల్ ‘వీక్షణం’ సంపాదకుడు