Guest Columns
-
దాచటం దేశభక్తిని చాటడమా?
దేశభక్తి ఎంత అవసరమో, స్వప్రయోజనాల కోసం ఆ భావనను మితిమీరిన స్థాయికి తీసుకెళ్లి చూడటం అంత అనర్థదాయకం. ‘ఆపరేషన్ సిందూర్’ క్రియాశీలకంగా మే 10న ముగిసిన 20 రోజులకు 31వ తేదీన ఈ విషయం బాగా స్పష్టమైంది. ఆ రోజున భారతదేశపు త్రివిధ దళాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి.డి.ఎస్.) జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్లో ‘బ్లూమ్బర్గ్’ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, ‘ఆపరేషన్ సిందూర్’లో భారత వైమానిక దళం యుద్ధ విమానాలు కూలిన మాట నిజమేనని ఎట్టకేలకు అంగీకరించారు. దానితో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సుడిగాలిలా చర్చ చెలరేగింది. రఫేల్ కూలిందనగానే కలకలంయుద్ధాలు జరిగినపుడు రెండు వైపులా నష్టాలు ఏదో ఒక మేర వాటిల్లటం సహజం. అమెరికా వంటి అత్యంత శక్తిమంతమైన దేశం సైతం చిన్న చిన్న దేశాల చేతిలో నష్టపోయిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మన యుద్ధ విమానాల నష్టాల వార్తలు ప్రపంచమంతటా వ్యాపించిపోయినా, అలాంటిదేమీ జరగలేదంటూనే వచ్చింది. పైగా, పహల్గామ్ దురంతం, ఆపరేషన్ సిందూర్ల దరిమిలా దేశంలో పెల్లుబికిన దేశభక్తి రాజకీయ ప్రయో జనంగా మారుతుండగా, దాన్ని అంతులేని విధంగా పొందేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. యుద్ధ విమానాల నష్టాలను దాచి పెట్టటం వాటిలో ఒకటి. మే 6–7 తేదీల మధ్య ‘ఆపరేషన్’ మొదలై పాకిస్తాన్లోని ఉగ్ర వాద స్థావరాలపై భారత వైమానిక దాడులు విజయవంతంగా జరి గాయి. ఆ వెంటనే పాకిస్తాన్ సైన్యం తాము ఆ దాడి సమయంలో భారత్కు చెందిన 5 విమానాలను (మర్నాడు ఆరుకు పెంచారు) కూల్చివేశామని ప్రకటించింది. వాటిలో భారత్కు ఫ్రాన్స్ సరఫరా చేసిన రఫేల్ విమానాలు మూడు, రష్యా నుంచి వచ్చిన మిగ్లు రెండు, మరొకటి ఉన్నాయని పాకిస్తాన్ కనీస వివరాలు కూడా ఇచ్చింది. ఆ వార్త ప్రపంచం అంతటా సంచలనంగా మారింది.అందుకు కారణం మిగ్ల కన్నా ఎక్కువగా రఫేల్ విమానాలు కూలి పోవటం! రఫేల్ విమానాలకు ఉన్న పేరు, మనం వాటిని ఖరీదు చేసినప్పుడు వర్ణించిన వాటి శక్తి సామర్థ్యాల గురించి తెలిసిందే.అందువల్ల, మరీ ముఖ్యంగా పాక్ వైమానిక బలం సాధారణమైన దనే అభిప్రాయం మనలో ఉన్నందున, పాకిస్తాన్ ప్రకటన నమ్మ శక్యం కానిదయింది. గమనించవలసిందేమంటే, ఆ ప్రకటనకు భారత సైన్యం అవునని గానీ, కాదని గానీ స్పందించకపోవటం. ‘వ్యూహాత్మక పొరపాటు’గా ఒప్పుకోలుమరొకవైపు ప్రపంచ వార్తా సంస్థలు విచారణలు మొదలుపెట్టి భారత్ విమానాలు కూలిన మాట నిజమని ధ్రువీకరించాయి. మొద టైతే ఒక రఫేల్ విమానం కూలిన మాట వాస్తవమేనని స్వయంగా రఫేల్ ఉత్పత్తిదారైన ఫ్రెంచ్ దస్సాల్ట్ కంపెనీ తెలియజేసింది. ఆ వెంటనే అమెరికన్ ఇంటిలిజెన్స్ ధ్రువీకరించింది. ఇంతకూ రఫేల్ను కూల్చగలిగిన పాకిస్తాన్ యుద్ధ విమానాలు, క్షిపణులు ఏవి అనే విచారణను పాశ్చాత్య మీడియా సంస్థలు, నిఘా సంస్థలు జరిపినప్పుడు, అవి చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన జె–35 విమానాలని తేలింది. దానితో అందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే చైనా స్వయంగా గత 40 ఏళ్లుగా ఎవరితోనూ వైమానిక యుద్ధాలు చేయలేదు. వారు ఆ విమానాలను విక్రయించిన మరే దేశమూ యుద్ధం చేయలేదు. కనుక వారి ఆయుధాల శక్తి ప్రపంచానికి డాక్యు మెంట్లలో చదవటం తప్ప ప్రత్యక్షంగా తెలియదు. ఆ శక్తి ఏమిటో ఇపుడు ప్రదర్శితం కావడంతో జె–35ను ఉత్పత్తి చేసిన చెంగ్దూ కంపెనీ స్టాక్స్ 48 గంటలలో 40 శాతం పెరగగా, దస్సాల్ట్ స్టాక్స్ 10 శాతానికి పైగా పడిపోయాయి. జె–35 కొనుగోలుకు వేర్వేరు దేశాల నుంచి ఆసక్తి వ్యక్తం అయింది. అయితే స్వయంగా ఆ కంపెనీ గానీ, చైనా గానీ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ‘ఆపరేషన్ సిందూర్’ మే 10న ఆగే నాటికి ఇదీ పరిస్థితి.వైమానిక నష్టాల గురించి విదేశాలలో ఎన్నెన్ని కథనాలు వెలు వడుతున్నా, ఆ నష్టాలు తాము చేసినట్లు పాకిస్తాన్ పదే పదే ప్రకటి స్తున్నా, భారత ప్రభుత్వం మౌనం వహించింది. మే 11న భారత త్రివిధ దళాధిపతులు మీడియా పమావేశం నిర్వహించారు. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అయిన ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి – ‘‘యుద్ధంలో నష్టాలు సర్వ సాధారణం. యుద్ధం ఇంకా సాగుతున్నందున నేను ఆ వివరాల్లోకి వెళ్లబోను’’ అన్నారు. అదే ప్రశ్నను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీకి వేయగా, ‘‘ఆ విషయాలు నాకు తెలియవు. కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తాము’’ అని జవాబిచ్చారు. ఆ మాటల అంతరార్థం తెలిసిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఆ విషయం మాట్లాడేందుకు నిరాకరిస్తూనే పోయింది. ఆ 11వ తేదీ నుంచి 31 వరకు 20 రోజుల పాటు నష్టాల వివరాలు ప్రపంచానికంతా తెలి శాయి. సింగపూర్లో అయినా జనరల్ చౌహాన్, విమానాలు కూలా యన్నారు గాని ఎన్ని కూలాయో పేర్కొనలేదు. ఇక సైన్యాధికారులు 11న గాని, 31న గాని, మనం లక్ష్యాలను ఛేదించామా లేదా, దాడి సమయంలో జరిగిన వ్యూహాత్మక పొరపాటును గ్రహించి దిద్దుబాటు చేసుకున్నామా లేదా అనేవే ప్రధానమని అంటూ దాటవేయ బూనారు. ప్రభుత్వ విధానం అది గనుక వారినేమీ అనలేము. దేశభక్తిని ప్రేరేపించే ప్రయత్నాలు!ఏ యుద్ధంలోనూ ఏ దేశం కూడా సమగ్రమైన వివరాలు వెల్లడించదు. అందులో రక్షణపరమైన అంశాలు కొన్ని ఇమిడి ఉంటాయి గనుక! కానీ, ప్రస్తుత సందర్భంలోæపలు వివరాలు వెల్లడై సంచలనంగా మారుతున్నపుడు, మనం వాస్తవాలను అనవసరంగా దాచి పెడుతున్నామనే అభిప్రాయం ఏర్పడుతూ ప్రతిష్ఠకు భంగం వాటిల్లు తున్నప్పుడు, వాస్తవాలు ఏమిటని ప్రతిపక్షాలు పలుమార్లు ప్రశ్నిస్తున్నప్పుడు, పార్లమెంటరీ కమిటీలో ప్రస్తావించి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నపుడు ఇది సాధారణ పరిస్థితుల వంటిది కాబోదు. కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించి అందుకు తగినట్లు వ్యవహరించటానికి బదులు, వాస్తవాలు ప్రజలకు తెలిస్తే వారిలో దేశభక్తి తగ్గుతుందనీ, అది తగ్గితే రాజకీయ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందనీ అన్నట్లుగా ఉండిపోయింది.ఇది చాలదన్నట్లు సింధూ నదీ జలాల ఒప్పందం, పీఓకేలను మోదీ ప్రభుత్వం బలంగా ముందుకు తెచ్చింది. ఈ లక్ష్యాలు నెరవేరటం ఆచరణలో ఎంత సాధ్యమన్నది అలా ఉంచి, పనిలో పనిగా వాటి పేరిట కూడా దేశభక్తిని స్థాయి పెంచి రాజకీయంగా లబ్ధి పొందాలన్న యోచన మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఉగ్రవాదాన్ని, దాని ప్రోత్సాహకులను దెబ్బతీయాల నటం వరకు నిర్వివాదమైన విషయం. ఇటువంటి సందర్భాలలో ప్రజల దేశభక్తి అత్యంత సహజం. అదేవిధంగా యుద్ధాలు జరిగి నపుడు ఏదో ఒక మేరకు రెండు వైపులా నష్టాలు అనివార్యం. అంతి మంగా చూడ వలసింది పైచేయి సాధించి లక్ష్యాలను ఆ మేరకు నెరవేర్చుకున్నామా లేదా అనేది మాత్రమే. ‘క్రికెట్ మ్యాచ్లో పోయిన వికెట్లు ముఖ్యం కాదు, తుది ఫలితం ముఖ్యం’ అంటూ ఆఖరికి జనరల్ చౌహాన్ వెల్లడించిందీ అదే! విషయాన్నంతా రాజ కీయ స్వప్రయోజనాల కోసం వినియోగించదలుచుకొని, రకరకాల పద్ధతులలో వాస్త వాలను దాచేందుకు ప్రభుత్వం మితిమీరి వ్యవహ రించటం సరి కాదు. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే హితవు భారతీయ సంస్కృతిలో ఊరకనే రాలేదు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అన్నిటికీ తమిళమే అంటే ఎలా?
‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’ అంటూ కమలహాసన్ చేసిన కామెంట్ను కన్నడ హైకోర్ట్ ఖండించింది. ఆ మాటల్ని వెనక్కు తీసుకోమని కూడా సూచించింది. అయితే ఆయన అందుకు నిరాకరించారు. అది ఆయన ఇష్టం. అయితే భాషలపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ‘హిందీ భాష డైపర్లు వేసుకున్న చిన్న పిల్లాడి వంటిది అనీ; హిందీతో పోలిస్తే తమిళ భాషకు చాలా చరిత్ర ఉంద’నీ గతంలో కూడా అన్నారు.రచయిత్రి రంగనాయకమ్మ అన్నట్లు ‘ఫొనెటిక్స్ ప్రకారం గానీ, లింగ్వి స్టిక్స్ ప్రకారం గానీ ఒక భాష గొప్పదనీ, ఇంకో భాష తక్కువదనీ ఏమీ ఉండదు. అన్ని భాషలూ సమానమైనవే. ఒక్కో భాష ఒక్కో ప్రాంత అవసరాన్ని తీరుస్తుంది. దేని ఉప యోగం దానికి ఉంటుంది. బ్రిటీష్ వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించారు కాబట్టి, ఇంగిలీషు ప్రపంచపు భాష అయ్యింది. అదే జర్మనీ వాళ్ళే పరిపాలించి ఉంటే, అప్పుడు జర్మనీ ప్రపంచపు భాష అయ్యి ఉండేది. అంతకు మించి ఇంగిలీషుకి ఏ ప్రత్యేకతా లేదు’.అలాగే – హిందీ అయినా అంతే! తమిళం అయినా అంతే! తెలుగు అయినా అంతే! కోయవాళ్ళ ‘కోయతూర్’ భాషనే తీసుకుంటే... ఆ భాష మాట్లాడే వాళ్లకు దానికి బదులు తమిళం తెచ్చిపెడితే అప్పుడు కోయ వాళ్ళ ‘భాషావసరం’ తీరుతుందా? తమిళానికి ‘ప్రాచీన చరిత్ర’ ఉంది కాబట్టి, ‘తమిళం చాలా గొప్ప భాష’ అని, ఆ కోయవాళ్ళు తమిళాన్ని మెచ్చుకుంటారా? వాళ్ళు మెచ్చు కోలేదు కాబట్టి, తమిళం తన ‘ప్రత్యేక తను’ కోల్పోతుందా? ఇంత చిన్న విషయాలు కూడా కమల్ హాసన్ లాంటి వాళ్లకు అర్థం కాకో, తెలియకో కాదు. ఇలాంటి వివాదాలు వాళ్లకి అవసరం. ప్రజల్లో ‘ప్రేమ’ ఉన్నట్లుగానే ‘ద్వేషం’ కూడా ఉంటుంది. ద్వేషానికి చాలా కోణాలు ఉంటాయి. ‘భాషా ద్వేషం’ అనేది కూడా ఒక కోణమే. సమాజంలో ‘సంస్కృతి’ అనే దానికి దేని ప్రత్యేకతలు దానికి ఉండవచ్చు. కానీ ‘భాష’కు ఉండవు. ఉండ కూడదు. అయినా ప్రత్యేకతలు అనేవి గుర్తించడానికీ, నేర్చుకోడానికీ మాత్రమే ఉండాలి గానీ, ద్వేషించ డానికి కాదు.తమిళ భాషకూ, తమిళ సాహిత్యానికీ ‘ప్రాచీన చరిత్రే’ ఉండవచ్చు.ఆ మాటను భాషా పరిశోధకులు, చరిత్రకారులు కూడా అన్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అలాగే ఇంకా కొన్ని భాషల్ని కలిపి ‘ద్రావిడ భాషా కుటుంబం’ అని అన్నారు. అంతే తప్ప, ద్రావిడ ప్రాంతా ల్లోని అన్ని భాషలూ ‘తమిళం నుంచి పుట్టాయి’ అని మాత్రం ఎక్కడా ఎవ్వరూ అనలేదు. మిడిమిడి జ్ఞానంతో ఏదంటే అది మాట్లాడే వారి తమిళ దురభిమానాన్ని కాసేపు పక్కనబెడదాం. 1816లో ‘ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్’ మొదటగా కొన్ని దక్షిణభారత (ద్రవిడ) భాషల మధ్య సంబంధం ఉందని కనుగొన్నారు. ఈయన కూడా ‘తమిళం అన్నిటికీ తల్లి భాష’ అని ఎక్కడా అనలేదు. ఈయనే కాదు దక్షిణ భారత దేశ భాషల మధ్య ‘వ్యాకరణ సంబంధాల్ని’ పరిశోధించి ‘ద్రావిడ’ అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన (1856) ‘రాబర్ట్ కాల్డ్వెల్’ అనే ఆయన కూడా మన కమలహాసన్ లాగా ఏమీ చెప్పలేదు. అంతే కాకుండా ‘ద్రావిడ భాషలకీ సంస్కృతానికీ మధ్యన ఎలాంటి జన్యు పరమైన సంబంధం కూడా లేదని’ తేల్చి చెప్పేశాడు. అప్పటికి కొన్ని వందల ఏళ్లగా ‘సంస్కృతం మిగతా అన్ని ద్రావిడ భాషలకూ మూలం’ అంటూ భార తీయ పండితులు అనుకొంటున్న దాన్ని ఈయన కూకటి వేళ్ళతో పెకలించి వేశాడు.ఈయన తన పరిశోధన కోసం స్కాట్లాండ్ను విడిచిపెట్టి వచ్చేశాడు. ముందు ఎల్లిస్ ఏడు ద్రావిడ భాషల్ని గుర్తిస్తే... కాల్డ్వెల్ 12 భాషల్ని గుర్తించాడు. ద్రావిడ భాషల్లోని హల్లుల్ని ‘నాలుక కొసల ద్వారా పలికే విధా నాల్ని’ గుర్తించాడు. వాళ్ళందరూ కూడా తమిళాన్ని ‘పురాతనమైన సాహిత్య భాష’గా మాత్రమే గుర్తించారు. అంతే తప్ప ‘వీటన్నిటికీ మూలం తమిళం’ అని ఎక్కడా చెప్పలేదు. మొదటైతే మను షులుగా పుట్టాం. పోనీ పరిణామం చెందాము. ఆ తరువాత సైగలు, శబ్దాలు. మను షులంతా ఒకేచోట పుట్టనట్లుగానే భాషలు కూడా ఒకేసారి, ఒకేచోట పుట్టవు. మనుషుల్లో ఎదుగుదల ఒకే రకంగా లేనట్లుగానే భాషల్లో కూడా ఎదుగుదల ఒకే రకంగా ఉండదు. ఎగుడు దిగుడులు ఉంటాయి. ముందూ వెనకలు ఉంటాయి. అంత మాత్రాన ఒక భాష గొప్పా, ఒకటి తక్కువా అనుకోకూడదు. తమిళం అవసరాన్ని తెలుగు తీర్చదు. మలయాళం అవసరాన్ని కన్నడం తీర్చదు. పోనీ వీటన్నిటి అవసరాన్ని హిందీ తీర్చదు. అందరి దాహాన్నీ మంచి నీళ్లు తీర్చినట్లుగా అందరి అవసరాల్నీ ఏ ఒక్క భాషా తీర్చదు. ఆ జ్ఞానం అందరికీ ఉండాలి. ముఖ్యంగా కమలహాసన్ వంటి బహుభాషా నటులకు ఎక్కువగా ఉండాలి. అది తెలుసుకొని ఇకనైనా కమలహాసన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పడం మంచిది.– నన్నూరి వేణుగోపాల్ ‘ మానవహక్కుల కార్యకర్త ‘ 98494 49012 -
కోర్టులోనూ అమెరికాది అదే పాట!
భారత్–పాకిస్తాన్లను ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరింపజేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టముకు వేసుకోవడంపై ఏర్పడిన వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఆయన మాటల్లో వాస్తవం లేదని భారత్ చెబుతున్నా, ట్రంప్ మాత్రం తాను శాంతి దూతగా వ్యవహరించినట్లు చెప్పుకుంటూనే ఉన్నారు. ‘‘ఈ ఒప్పందం కుదర్చగలగడం నాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే, బులెట్లకు బదులు వాణిజ్యం ద్వారా భారత్–పాకిస్తాన్లను దారికి తేగలిగాను. ఆ రెండింటి మధ్య ఘర్షణ అణ్వస్త్ర యుద్ధంగా పరిణమించకుండా ఆపగలిగాను’’ అని ట్రంప్ మే 30న ప్రకటించారు. నేనే శాంతిదూతను!మే 10న ప్రకటించిన కాల్పుల విరమణ సందర్భంగా ఆయన చెప్పిన మూడు అంశాల సారాంశంగా ఈ వ్యాఖ్య నిలుస్తోంది. ఒకటి – తానే పెద్దమనిషిగా వ్యవహరించినట్లు చెప్పుకోవడం. రెండు – ఘర్షణ అణు యుద్ధంగా మారగల అవకాశం ఎంతైనా ఉందని భావించడం. మూడు – రెండు దేశాలతోను వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంటానని తాను హెచ్చరించినట్లు చెప్పడం. ఆ విధంగా రెండు దేశాలను కాల్పుల విరమణకు అంగీకరించేట్లు చేయడం. పాకిస్తాన్కు చెందిన సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ) భారత్లోని తన సహచరునికి మే 10న ఫోన్ చేసిన తర్వాతనే దాడి ప్రతిదాడులు ఆగాయని భారత్ ప్రకటించింది. ఘర్షణ సంప్రదాయ చట్రం లోపలికే పరిమితమైందనీ, అణ్వస్త్రాన్ని బయటకు తీస్తాననే సంకేతం పాక్ నుంచి ఏమీ రాలేదనీ కూడా భారత్ తేటతెల్లం చేసింది. ‘‘ఆపరేషన్ సిందూర్ మే 7న మొదలైనప్పటి నుంచి, కాల్పులు, సైనిక చర్యను నిలిపివేయాలని మే 10న ఒక అవగాహనకు వచ్చేంత వరకు, మారుతూ వస్తున్న సైనిక పరిస్థితులపై భారత్–అమెరికా నాయకుల మధ్య సంభాషణలు కొనసాగుతూ వచ్చాయి. ఈ మాటల్లో వాణిజ్య అంశం ప్రస్తావనకు రానేలేదు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మే 13న చెప్పిన సంగతి గమనార్హం. కాల్పుల విరమణ కుదిర్చేందుకు ట్రంప్ వాణిజ్య అంశాన్ని లేవనెత్తారని అమెరికా వాణిజ్య మంత్రి హవర్డ్ లట్నిక్ ఒక అమెరికన్ కోర్టులో వాఙ్మూలం ఇచ్చిన సంగతిని మే 29న జైస్వాల్ దృష్టికి తెచ్చినపుడు, ‘‘కోర్టు ఉత్తర్వును కూడా మీరు చూసే ఉంటారు’’ అని ఆయన జవాబిచ్చారు. తర్వాత, జైస్వాల్ తాను మే13న చేసిన వ్యాఖ్యలనే పునరుద్ఘాటించారు. కోర్టు ఉత్తర్వు గురించి ప్రస్తావించడంలో ఆయన తొందరపడ్డారనిపించింది. ఎందుకంటే, అమెరికాలోని మరో పైకోర్టు అదే రోజు (మే 29)న దిగువ కోర్టు ఉత్తర్వుపై స్టే ఇచ్చింది. ఆ అధికార ప్రతినిధి భారత్ వైఖరిలోని సత్యసంధతను నిరూపించేందుకు దిగువ కోర్టు నిర్ణయంపై ఆధారపడకుండా ఉండాల్సింది. ఇంకో ఆరు దేశాలు!వివిధ దేశాలు జోక్యం చేసుకున్న ఫలితంగా కాల్పుల విరమణ సాధ్యమైందని పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్ సైనిక దళాల సంయుక్త కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా, గత వారం సింగపూర్లో సాగిన షాంగ్రి–లా డైలాగ్ సందర్భంగా, ఆరు దేశాల పేర్లను ప్రస్తావించారు. అవి – అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, తుర్కియే, చైనా. తాను కుదిర్చిన ఉత్తమ ‘ఒప్పందానికి’ మొత్తం ఘనత తనదేనని చెప్పుకుంటున్న ట్రంప్కు ఆ మాటలు ఇంపైనవి కావని వేరే చెప్పనవసరం లేదు. ఈ ఘర్షణ సంప్రదాయ చట్రం పరిధిని మించగల ప్రమాదం ఉందని ఇస్లామాబాద్ అనలేదు. జోక్యం చేసుకునేందుకు విదేశీ శక్తులు తగినంత సమయాన్ని వెచ్చించకపోతే, భారత్ చలన శక్తి, పరస్పర అణ్వాయుధ ప్రయోగాలకు దారితీయగల అవకాశముందని తనకున్న సాధారణ ఆందోళనను పాక్ ఈ సందర్భంగా పునరు ద్ఘాటించింది. ఘర్షణలను నిలిపివేయకపోతే వాణిజ్య సంబంధాలను నిలిపివేస్తానని బెదిరించినట్లు ట్రంప్ చెప్పుకోవడంపై పాకిస్తాన్ ఏ విధమైన వ్యాఖ్యా చేయలేదు. మరోవైపు పాకిస్తాన్–అమెరికాల మధ్య వాణిజ్య చర్చలకు రంగం సిద్ధమైంది. వాణిజ్యానికి సంబంధించి భారత్ సంవేదనలపై ట్రంప్ ప్రభుత్వం ఎందుకంత ఉపేక్ష వహించినట్లు? పైగా, లట్నిక్ ఒక అమెరికా కోర్టుకు మే 23న సమర్పించిన అఫిడవిట్లో కూడా దాన్ని ఎందుకు చేర్చినట్లు? ట్రంప్ అనుసరిస్తున్న సుంకాల విధానాలకు ఎదురవుతున్న చట్టపరమైన సవాల్కు సంబంధించిన కేసు అది.అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐ.ఇ.ఇ.పి.ఏ.) అని అమెరికాలో ఓ చట్టం ఉంది. దానికింద, ట్రంప్ సుంకాల విధా నాలను సమర్థించుకుంటున్నారు. సాంకేతికంగా చూస్తే, లట్నిక్ ఒక డిక్లరేషన్ ఇచ్చినట్లే లెక్క. ‘‘అంతకుముందు పేర్కొన్న మాటలు సత్యమైనవి, సరైనవి’’ అని ఆయన ప్రకటించారు. కాల్పుల విరమణను అమలులోకి తెచ్చేందుకు వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకున్నట్లు ట్రంప్ చేసిన లాంటి రాజకీయ ప్రకటనను ఒక దేశం లీగల్ డాక్యుమెంట్గా మార్చడం కనివిని ఎరుగనిదని నా దౌత్యపరమైన అనుభవం సూచిస్తోంది. దీని వల్ల ట్రంప్ చెప్పుకుంటున్న గొప్పను అమెరికా కాదనలేని అనివార్య స్థితి ఏర్పడుతోంది. ట్రంప్ నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. తరచూ తన ప్రకటనలకు తానే విరుద్ధంగా మాట్లాడు తూంటారు. కానీ, లీగల్ డాక్యుమెంట్ను తారుమారు చేయడం కుదరదు. పైగా, భారత్–అమెరికాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగిస్తున్న సమయంలో, అమెరికా అలాంటి వాఙ్మూలం ఇవ్వడం ఈ అంశంపై భారత్ వైఖరికి విరుద్ధంగా ఉంది. స్నేహం ఉన్నట్టేనా?‘‘పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించేందుకు అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని అమెరికాతో వాణిజ్య సౌలభ్యాన్ని రెండు దేశాలకు ఇవ్వచూపబట్టే కాల్పుల విరమణ సాధ్యమైంది. ఈ కేసులో, అధ్య క్షుడి అధికారాన్ని నిరోధించే విధంగా ఎటువంటి ప్రతికూల తీర్పు నిచ్చినా, ట్రంప్ ఇచ్చిన ఆఫర్ చట్టబద్ధతను భారత్–పాకిస్తాన్లు ప్రశ్నించగల స్థితి తలెత్తుతుంది. అది ఒక మొత్తం ప్రాంత భద్రతకు, కోట్లాది మంది జీవితాలకు ముప్పుగా పరిణమిస్తుంది’’ అని కూడా లట్నిక్ పేర్కొన్నారు. లట్నిక్ డిక్లరేషన్పై మే 29న అడిగిన మరో ప్రశ్నకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహం ముటకరించుకుని ‘‘నేను నా వైపు నుంచి పరిస్థితిని వివరించాను. రెండు వైపుల దేశ పతాకాలను పెట్టుకుని, భారతదేశ ప్రభుత్వ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా నేను ఆ పని చేసినట్లు లెక్క. దానికి పర్యవసానాలుంటాయి. అవి చాలా పెద్దవిగా ఉంటాయని అర్థం చేసుకోవాలి’’ అన్నారు.నిజమే! అమెరికా వాణిజ్య మంత్రి ఒక అమెరికన్ కోర్టులో తప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రక టిస్తే, వ్యవహారం మరింత పెద్దదవుతుంది. భారత్ విషయానికి వస్తే – ఆపరేషన్ సిందూర్ నుంచి ట్రంప్ చర్యలు, ప్రకటనలు చూసి, నమ్మక ద్రోహానికి గురయ్యామనిభావించడం తప్ప చేయగలిగింది లేదు. హిందీ సినిమా ‘సంగమ్’ లోని ‘దోస్త్ దోస్త్ న రహా...’ పాట నేటి భారత్ స్థితికి అద్దంపడుతుంది. ‘హోడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ అంటూ జబ్బలు చరుచు కున్న ఘట్టాల రోజులు ఇపుడు సుదూర జ్ఞాపకాలుగానే ఉంటాయి. వివేక్ కాట్జూ వ్యాసకర్త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మహారాష్ట్ర రాజకీయాల మెలోడ్రామా
మహారాష్ట్రలో గత మూడేళ్ల నుండి వాయిదాపడిన 29 మున్సిపల్ కార్పొరేషన్, 257 నగర పురపాలక, ఇతర స్థానిక పంచాయతీ ఎన్నికలను రాబోయే నాలుగు నెలల్లో పూర్తి చేయాల్సిందిగా 2025 మే 6న సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. అంతే, ప్రాంతీయ పార్టీలు... ముఖ్యంగా, ఉభయ శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్సీపీ) పార్టీలు వారి వారి కార్యకర్తలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. మినీ అసెంబ్లీ ఎన్నికలుగా పేర్కొనే ఈ ఎన్నికల జయాపజయాలు జాతీయ విషయాలపై కాకుండా, స్థానిక సమస్యలపైనే ఆధారపడుతుంటాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉద్ధవ్ థాకరే శివసేనకు... పుణె మునిసిపల్ కార్పొరేషన్, దగ్గర్లో ఉన్న పింప్రీ చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీలకు భాలే ఖిల్లా(కంచుకోట)గా చెప్పుకుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ పార్టీలు ఇక్కడ పట్టు కోల్పోవటంతో, తిరిగి వారి ఉనికిని క్రియేట్ చేయటానికి సీనియర్ పవార్, ఉద్ధవ్ థాకరే క్షేత్ర స్థాయి ఎన్నికల విజయం కోసం పావులు కదుపుతున్నారు.227 కార్పొరేటర్లు ఉన్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్, దేశంలోనే అతిపెద్ద, అతి పురాతన (1889) ప్రజా ప్రతినిధుల సంస్థ. డెబ్భై నాలుగు వేల కోట్ల రెవెన్యూ బడ్జెట్తో, గత ముప్పై సంవత్సరాల నుండి గ్రేటర్ ముంబై కార్పొరేషన్ శివసేన ఆధీనంలో ఉంది. 2017 ఎన్నికల్లో 84 సీట్లు సాధించింది శివసేన. అప్పట్లో జరిగిన పోటా పోటీ ఎన్నికలో బీజేపీ 82 సీట్లు గెలిచి, కేవలం రెండు సీట్లు మాత్రమే శివసేనకు వెనుకంజలో ఉంది. కానీ, 2022లో పార్టీ చీలికతో 42 మంది సేన కార్పొరేటర్లు ఇప్పుడు ఏక్నాథ్ షిండే వర్గంలోకెళ్ళిపోయారు. కార్పొరేషన్ ఎన్నికలు సమీపించటంతో మాజీ కార్పొరేటర్లు కూడా కొందరు ఉద్ధవ్ పార్టీకి తిలోదకాలు ఇచ్చారు. అయినా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 20 మంది ఉద్ధవ్ శివసేన ఎమ్మెల్యేలలో ముంబై సిటీకి చెందినవారు 10 మంది! రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు ఇది వారికి ఒక విధంగా ఆశా కిరణమే అనొచ్చు.రాజ్ థాకరే ప్రాతినిధ్యం వహిస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) ఇప్పటివరకూ, ఉద్ధవ్ శివసేనకు ఓట్ కట్టర్ గానే నష్టం చేకూర్చింది. సందర్భోచితంగా స్థానిక బీజేపీ నేతలు, రాజ్ థాకరే పార్టీని తమకు అనుకూలంగా వాడుకుంటారు. ఉద్ధవ్, రాజ్ కలిసి ఎన్నికల బరిలో దిగితే ఇరు పార్టీలకు కలసి వస్తుంది అని రాజకీయ విశ్లేషకులే కాక, పార్టీ కార్యకర్తలు సైతం తరచుగా చెపుతుంటారు. కానీ, అది ఇంత వరకూ జరగ లేదు. 2024 డిసెంబరులో రాష్ట్ర ముఖ్య మంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగానే, ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్ థాకరే వెళ్ళి ఆయనను కలవటం, మహాయుతి భాగస్వామి షిండే వర్గంలో కలకలం సృష్టించింది; ‘టిట్ ఫర్ టాట్’ అన్నట్టు శివసేన (షిండే) నేత, ఉపముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, రాజ్ సాహెబ్ ఇంటికెళ్ళి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఇదంతా గమనిస్తే, ప్రస్తుతం ఇక్కడి రాజకీయాల్లో ‘దోస్తీ దుష్మనీ’కి నిర్వచనమే తెలియటం లేదు. ఇక, మొన్న జరిగిన మరాఠీ సినీ కార్యక్రమంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఎం.ఎన్.ఎస్. నేత రాజ్ థాకరే, ‘మహారాష్ట్ర సంక్షేమం కోసం తన పార్టీ ఉద్ధవ్ శివసేనకు మద్దతివ్వటానికి సిద్ధమే’ అని అన్నారు. మరుసటి రోజు ముంబై నగర వీధుల్లో, థాక్రే బ్రదర్స్ ‘మహారాష్ట్ర హిత్’ కోసం ఒక్కటవ్వాలి అని శివసేన పోస్టర్లు వెలిశాయి.ఇక బాబాయి, అబ్బాయిల (ఎన్సీపీ పార్టీల) విషయానికి వస్తే, ‘రాబోయే స్థానిక ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం, మీ పార్టీతో చేతులు కలుపుతుందా?’ అన్న విలేఖరి ప్రశ్నకు శరద్ పవార్, ‘మున్ముందు ఈ రెండు పార్టీలు విలీనం అయినా ఆశ్చర్యం లేదు’ అంటూ తన పార్టీ నేతలను కూడా విస్మయంలో ముంచారు. 2019 నుండి మహారాష్ట్ర రాజకీయాలు చిత్ర విచిత్రంగా మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. భాజపాతో 30 ఏళ్ల సంబంధం తెగతెంపులు చేసుకుని ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ ఎన్సీపీలతో మైత్రి కుదుర్చుకుని ముఖ్యమంత్రి కావటం; తర్వాత, 2022 జూన్లో ఏక్నాథ్ షిండే 52 మంది శివసేన ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ను పదవీచ్యుతుణ్ణి చేసి భాజపా సహాయంతో సీఎం కావటం; మరో సంవత్సరం గడిచాక (2023 జూలై) అజిత్ దాదా, 43 ఎన్సీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి, భాజపా కనుచలువతో ఉపముఖ్యమంత్రి కావటంతో మహారాష్ట్ర రాజకీయ రంగస్థలంలో మెలోడ్రామా చోటు చేసుకుంది.రాష్ట్ర స్థాయి నేతలకు అతీతంగా, గ్రామ, జిల్లా, నగర స్థాయిలో అధికారం కోసం ఉబలాటపడే నాయకులు మాత్రం ముంబైలోని వారి అగ్ర నాయకుల ఫర్మాన్ పట్టించుకోదలచుకో లేదు. శివసేన, ఎన్సీపీ రెండూ రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఈ పార్టీల నాయకులు, వాలంటీర్లు వారికి తోచిన రీతిలో సమీకరణలు చేసుకుంటున్నారు. అయితే స్థానిక నాయకులను తమ ‘గ్రిప్’లో ఉంచుకోవాలనే ప్రయత్నమే పవార్, థాకరే పార్టీలు చెప్పే మెర్జర్ ధోరణి రహస్యం.జిల్లా గోవర్ధన్ వ్యాసకర్త మాజీ పీఎఫ్ కమిషనర్, ముంబై ‘ 98190 96949 -
ప్రత్యామ్నాయంగా ఎదగడమే మార్గం
అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్నారు. ఒక పక్క సామ్రాజ్యవాద భావనతో అనేక దేశాలపై అధిక సుంకాలు విధిస్తూ మరొక పక్క విద్య, ఆరోగ్య వ్యవస్థలపై విధ్వంసపు దాడి చేస్తున్నారు. ట్రంప్లో జాత్యాహంకార భావాలు మిన్నంటుతున్నాయి. నిజానికి అమెరికా ఒకనాడు ప్రసిద్ధి చెందినది హార్వర్డ్, కొలంబియా యూనివర్సిటీల లాంటి వాటి వల్లనే. ఈ యూనివర్సిటీలు సామ్రాజ్యవాదానికి భిన్నంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దే స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు నెలవుగా రూపొందించబడ్డాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల్లో ఆర్థిక, సామాజిక, పరిపాలన రాజకీయ శాస్త్రాల్లో నిష్ణాతులైన ప్రపంచ జ్ఞానులు ఆవిర్భవించారు. అందులో అంబేడ్కర్ ఒకరు. అంబేడ్కర్ అమెరికాలో తాను స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవించానని స్వయంగా చెప్పారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ అనుభవించిన స్వేచ్ఛను గూర్చి డబ్ల్యూ.ఎన్. కుబేర్ ఇలా విశ్లేషించారు: అంబేడ్కర్ అమెరికా వెళ్ళడంతో ఆయనలో నూత్న వికాసం వచ్చింది. ముఖ్యంగా అందరు కలిసి భోజనం చేయడం అనేది ఆయన ఇండియాలో చూడలేదు. ఇండియాలో కొందరు భోజనం చేస్తుంటే, కొందరు నిలుచుండేవారు. కలిసి భోజనం చేసే సంస్కృతి లేదు. జీవన వ్యవస్థలో కుల వ్యత్యాసాలు, మత వ్యత్యాసాలు విపరీతంగా ఉన్నాయి. మనిషిని మనిషిగా చూడలేని సంస్కృతిని చూసిన ఆయన ఒక్కసారి ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయారు. న్యాప్కిన్ తో చేతులు తుడుచుకోవడం, ముఖ్యంగా సూట్ ధరించి కాలేజీకి వెళ్ళడం, క్లాసులో అందరు సమానంగా కూర్చోవడం, ఉపాధ్యాయుడికి భేదభావాలు లేకపోవడం వంటివన్నీ ఆయనకి కొత్తగా అనిపించాయి. ఒకే విద్యా ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి భావజాలాలు ఉండటం చూసి ఆయన విస్తుపోయారు. ఇలా భారతీయ మేధావులెందరో అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనం చేయటమే గాక ఆ విశ్వవిద్యాలయాల్లో ఉండే స్వేచ్ఛను గురించి అక్కడి అధ్యాపకులైన సెలిగ్మన్, జాన్ డ్యూయీ వంటి వారి విద్యా సంపన్నత గురించి; జాతి, కుల, మత, వివక్ష లేకుండా అక్కడ విద్యార్థుల కుండే స్వేచ్ఛా స్వాతంత్య్రాల గురించి ఎంతో కొనియాడారు. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ స్వభావం జాతి వివక్షలో హిట్లర్ను మించి ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీకి చేస్తున్న ఆర్థిక వ్యయాన్ని గురించి ట్రంప్ ప్రపంచం మొత్తానికి గగ్గోలుపెట్టి చెప్పుతున్నారు. కానీ ఆ యూనివర్సిటీలో అధ్యయనం చేసిన మేధావులు, సాంకేతిక నిపుణులు, నోబెల్ బహుమతి గ్రహీతలు, పరిపాలనా శాస్త్ర పండితులు అమెరికాకు ఎంత కీర్తి తెచ్చారు? అమెరికాకు ఎంత సాంకేతిక సాంస్కృతిక జ్ఞానాన్ని తీసుకువచ్చారు? ఎంత మానవ హక్కుల పోరాట శక్తిని ప్రపంచానికి అందించారు? ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. ఒక పక్క గాజాపై మారణహోమం జరపడానికి యూదుల దేశమైన ఇజ్రాయెల్ని ప్రోత్సహిస్తూ, మరోపక్క హార్వర్డ్ యూనివర్సిటీ యూదా (యూదు) జాతి యువకులు అమెరికా తెల్లజాతి వారిని అణచివేస్తున్నారని మాట్లాడడం ఆయనలో ఉన్న ద్వైదీభావానినికి నిదర్శనాలు. నల్లజాతీయుడైన ప్రెసిడెంట్ ఒబామా తీసుకువచ్చిన అనేక విద్యా, వైద్య సంస్కరణలకు ట్రంప్ చరమగీతం పాడారు. అమెరికాకు చెందిన ‘నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’ వార్షిక బడ్జెట్ సుమారు 48 బిలియన్ డాలర్లు. దీనికి తోడు సుమారు 2,500 విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రుల్లో పనిచేసే పరిశోధకులకు గ్రాంట్లు మంజూరు చేసేవారు. ఒక్క పెన్ను పోటుతో ట్రంప్ వీటన్నింటికీ నిధుల్లో కోత పెట్టారు. ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టే వ్యాక్సిన్ల అభివృద్ధి, సరికొత్త చికిత్సా విధానాల రూపకల్పన, ఔషధాల తయారీ, మానసిక ఆరోగ్య పరిరక్షణ, అరుదైన జబ్బుల నివారణకు ఈ నిధులు ఎంతగానో తోడ్పడేవి. కొలంబియా యూనివర్సిటీకి 400 మిలియన్ డాలర్ల గ్రాంటును కుదించారు. స్రపంచ దేశాలకు అందించే నిధులనూ నిలిపివేశారు. దాంతో లైంగిక వ్యాధులు, హెచ్ఐవీ నివారణ, టీకాల అభివృద్ధి ప్రాజెక్టులు ఒక్కసారిగా మందగమనంలోకి జారిపోయాయి. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా జాతీయ వైద్య సంస్థ ఆధ్వర్యంలోని సుమారు 800 పరిశోధక ప్రాజెక్టులు సాగడానికి, విపత్తుల నివారణకు... నిధుల కటకట ఏర్పడిందని ప్రముఖ సైన్ ్స జర్నల్ ‘నేచర్’ విశ్లేషించింది.ట్రంప్ భారతదేశంతో చెలిమి చేస్తున్నట్టు నటిస్తూ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులను తరిమివేయాలని చూస్తున్నారు. భారతీయుల మేధస్సు మీద గొడ్డలి వేటు వేయాలని చూస్తున్నారు. జాన్ డ్యూయీ రూపొందించిన విద్యా ప్రజాస్వామ్య దృక్పథాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. డ్యూయీ తన ‘ప్రజాస్వామ్యం’ అనే గ్రంథంలో ఈ విధంగా తెలియజేశారు: ‘ప్రజాస్వామ్యం ఒక ప్రత్యేక రాజకీయం కంటే, ఒకే పద్ధతిలో సాగే ప్రభుత్వం కంటే కూడా విస్తృతమైంది. ప్రజాస్వామ్యం మనుష్యులందరూ కలిసి జీవించగలిగే విధానాన్ని రూపొందిస్తుంది. మనిషికి ప్రజాస్వామ్యం పరిణ తి తీసుకొస్తుంది. మనిషికి ప్రజాస్వామ్యం నైతికతను నేర్పుతుంది. ప్రజాస్వామ్యం సామాన్య, సామాజిక సంక్షేమ విలువలకు, మానవ సంపూర్ణ జీవన సంస్కృతీ విస్తరణకు, ఒక వ్యక్తికి మానవ విలువలు ఉండే క్రమాన్ని రూపొందించడానికి నిర్మాణ సూత్రాలు ఇస్తుంది. ప్రజాస్వామ్యం మానవ విలువల శాస్త్రం’. ఆయన చెప్పిన ప్రతి వాక్యం అంబేడ్కర్ మీద పని చేసింది. ట్రంప్ చేస్తున్న పనులు చూస్తుంటే డ్యూయీ వచించిన మాటలకు ఎంత వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. తద్వారా అంతకు ముందు అమెరికాకు అంతర్ శక్తిగా ఉన్న విద్యా సంస్కృతిపై గొడ్డలి వేటు వేస్తున్నారు. ఇది మొత్తం ఆసియా దేశాల్లో విస్తృతమవుతున్న విద్యా సాంకేతిక, జ్ఞాన సంపత్తిపై దాడిగానే మనం భావించాలి. ఈ నేపథ్యంలో భారతదేశ ప్రజలు, పాలకులు మేల్కొని మన విశ్వవిద్యాలయాలను సుసంపన్నం చేసుకొని అతి ప్రాచీన కాలం నుండి భారతదేశం ఇతర దేశాలకు ఎలా విద్యను, సంస్కృతిని, సాంకేతికతను, తత్వశాస్త్రాన్ని, కళలను, మానవ పరిణామ శాస్త్రాన్ని అందించిందో అలా ఇప్పుడు కూడా అందించడానికి సిద్ధపడి అమెరికాకు ప్రత్యామ్నాయంగా దేశాన్ని నిలబెట్టాలి. ఫలితంగా మన విద్యా ఉత్పత్తులు పెరుగుతాయి. తన విద్యా ఉత్పత్తుల ద్వారా అమెరికా ఎంతో సంపదను పోగు చేసుకుంటోంది. దానికి ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే గండి కొడుతున్నారు. ఈ సందర్భాన్ని చైనా ఉపయోగించుకోవాలని చూస్తోంది. భారత్ కూడా తన శక్తిమేర ఉన్నత విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసుకుని అలనాటి నలంద, తక్షశిల వంటి ప్రపంచ స్థాయి విశ్వ విద్యాలయాలను అభివృద్ధి చేయాలి. అప్పుడే దేశం నిజమైన ప్రగతి బాట పడుతుంది.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
'ఆలిండియా ర్యాంకుల్లో అందుకే వెనుకబడి పోతున్నాం'
విద్యకు ప్రోత్సాహకాలు అందించడం అనేది అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వడంతో సమానమన్నది అంగీకరించాల్సిన అంశం. విద్యకు నిధులు కేటాయించడం అంటే అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడంతో సమానమని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనడమే కాదు తదనుగుణంగా విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు కూడా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. గ్రామీణ, గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేసేందుకు విశేష కృషి చేశారు. కేవలం యూనివర్సిటీలు స్థాపించడమే కాకుండా కనీస వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. యూనివర్సిటీ గ్రాంట్ల సంఘం నిబంధనలు మేరకు ఒక్కో విభాగంలో ‘కోర్ అధ్యాపకుల’ నియామకాలకు కేటాయింపులు చేశారు. దీని ప్రకారం ఒక్కో విభాగంలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరుగుతుంది. హార్టికల్చర్ యూనివర్సిటీ (తాడేపల్లిగూడెం), వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ (అనంతపురం) కూడా ఈ ప్రణాళికలో భాగమే. ఇదంతా గతం.ప్రస్తుతం ఉన్నత విద్య సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతోంది. యూనివర్సిటీల మనుగడకు అత్యంత ప్రధానమైన బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా పీడిస్తోంది. కొత్త కోర్సులు (New Courses) ప్రవేశపెట్టినా, మౌలిక వసతులు లేక విద్యలో నాణ్యత లోపిస్తోంది. ఒప్పంద అధ్యాపకులు, (రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో నాలుగు వేల పైబడి వున్నారు), అతిథి అధ్యాపకుల (సుమారు మూడు వేలమంది సేవలు అందిస్తున్నారు) సహకారంతో నెట్టుకొస్తున్నారు. ఖాళీలను భర్తీ చేసే నియామక ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. దీంతో వయస్సు పెరిగిపోయి ఎక్కడ అర్హత కోల్పోతామోనని ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు.ఒప్పంద, అతిథి అధ్యాపకుల్లో మెజారిటీ సభ్యులు యాభై ఏళ్లు దాటిన వారుండడం విచారించదగిన అంశం. గత ప్రభుత్వం ఎంపిక నియామకాల కోసం ప్రకటన విడుదల చేసినా, కోర్టు కేసులతో ప్రక్రియ నిలిచిపోయింది. సిబ్బంది కొరత కారణంగా బోధన కుంటుపడడంతో పాటు, పరిశోధన పూర్తిగా నిలిచి పోయింది. జాతీయ స్థాయిలో ర్యాంకుల (All India Ranks) విషయంలో మనం పూర్తిగా వెనుకబడి పోతున్నాం. నిర్దేశకులు(గైడ్స్) లేక పీహెచ్డీ (Phd) ప్రవేశాలు పూర్తిగా తగ్గిపోయాయి. సిబ్బంది నియామకం అత్యంత ప్రాధాన్యతాంశంగా భావించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలి.చదవండి: సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇదేనా? శాశ్వత నియామకాల్లో తమకు పాధాన్యం ఇవ్వాలని ఒప్పంద, అతిథి అధ్యాపకులు కోరుతున్నారు. కనీసం అప్పటివరకు టైమ్ స్కేల్ వేతనాలు ఇవ్వాలంటున్నారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యామండలి ఒప్పంద అధ్యాపకులకు తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆదేశిస్తూ కాకినాడ జేఎన్టీయూ, అనంతపురం జేఎన్టీయూ, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలకు ఓ సర్క్యులర్ పంపింది. రెండు దశాబ్దాల అనుభవం ఉన్న తమకు మళ్లీ ఇంటర్వ్యూలేమిటని, ఇది ‘పొమ్మన లేక పొగబెట్టడం లాంటిదే’నని, తమకు ఇష్టమొచ్చిన అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు ఇది ఒక పన్నాగమని ఒప్పంద అధ్యాపకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఇంటర్వ్యూలను తాము బహిష్కరిస్తున్నట్లు ఒప్పంద అధ్యాపకుల సంఘం ప్రకటించింది. అతిథి అధ్యాపకులు సైతం తమకు నెలనెలా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో జూన్ నాలుగో తేదీన ఉన్నత విద్యామండలి నిర్వహించ తలపెట్టిన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఒప్పంద, అతిథి అధ్యాపకులు (contract lecturers) ఆశగా ఎదురు చూస్తున్నారు.- ప్రొఫెసర్ పీటా బాబీ వర్ధన్ మీడియా విశ్లేషకులు -
ఇది సఫ(బ)ల తెలంగాణ
మన ఉపనిషత్తులు, శాస్త్రాలు... స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. అలాంటి మహిళకు తెలంగాణ వచ్చాక ఎలాంటి ఆదరణ లభించలేదు. సంక్షేమ పథకాల నుంచి మొదలుకొని కేబినెట్ బెర్త్ల దాకా అడుగడుగునా అన్యాయమే. కానీ 2023 డిసెంబర్ 7న గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నది. ఆడబిడ్డల మోములపై నవ్వులు చిందుతుండగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించింది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక తమ ఆకాంక్షలన్నీ నెరవేరుతాయనుకున్న యువత, ముఖ్యంగా మహిళల ఆశలు అడియాసలే అయ్యాయి. బీఆర్ఎస్ మొదటి కేబినెట్లో ఒక్క మహిళను కూడా తీసుకోకుండా అతివలను అతి ఘోరంగా అవమానించింది. ఇతర పదవులూ ఇవ్వలేదు. కానీ... కాంగ్రెస్ సర్కారు మహిళలకు పెద్దపీట వేసింది. కేబినెట్లోకి ఆదివాసీ బిడ్డ ధనసరి సీతక్కను, బీసీ బిడ్డ కొండా సురేఖను తీసుకున్నది. అలాగే, ‘తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’, ‘తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్’ల చైర్మన్లుగా, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలిగా అతివలకు అవకాశం కల్పించింది. తెలంగాణలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అతివల ఇంటి కష్టాలను తీర్చుతున్నది. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం విద్యార్థులు, పోలీసుల యూనిఫామ్ కుట్టే పనిని అప్పగించింది. దీంతో మహిళలకు స్థిరమైన ఆదాయం వస్తున్నది. అలాగే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తున్నది. దీంతోపాటు ‘రాజీవ్ యువ వికాసం’ ద్వారా రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల దాకా స్వయం ఉపాధికి సాయం అందజేస్తున్నది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు, ప్రభుత్వం 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా ఏర్పాటు చేయిస్తున్నది. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తిరగడమే కాదు... ఆ బస్సులకు వారినే ఓనర్లను చేసే మరో మహత్తర కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 150 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇప్పించింది. మరో 450 బస్సులను కూడా అద్దెకు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదీ చదవండి: World Bicycle Day 2025 డయాబెటిస్కు, ఊబకాయానికి చెక్మహిళలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు శిల్పారామంలో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసింది. ఈ బజార్లు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి అయిన వస్తువులకు మార్కెట్ను అందిస్తాయి. దీనివల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతున్నది. అలాగే, మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా 196 ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు’ ఏర్పాటు చేసింది. ఈ క్యాంటీన్లు మహిళలకు స్వయం ఉపాధిని అందిస్తున్నాయి. మహిళలంతా ఒకేచోట చేరి తమ పురోగతికి ప్రణాళికలు రచించుకునేలా 22 ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలను నిర్మించింది. ఇవి మహిళలకు కార్యాలయాలుగా, వ్యాపార కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. మహిళలకు ‘మీ సేవా’ కేంద్రాలను అప్పగించి, వారికి ఉపాధి కల్పిస్తున్నది. డైరీ సహకార రంగంలో 40 వేల మంది మహిళలకు శిక్షణ ఇప్పించింది. మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి, ఆర్థిక భద్రతకు భరోసానిస్తున్నది. ఇలా నేటి ప్రభుత్వం మహిళా సాధికారతకు పాటుపడటంతో పాటు ఆర్థికంగా ఆగమైపోయిన రాష్ట్రాన్ని అత్యంత క్రమశిక్షణతో ఒక్కో పువ్వేసి బతుకమ్మను పేర్చినట్టు పునర్నిర్మిస్తున్నది. -ఇందిరా శోభన్కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు -
నదీ జలాలతో ఆటలాడవచ్చా?
పాల్ సెజాన్ (ఫ్రాన్స్) 1890లో ఓ పెయింటింగ్ వేశారు. దాని పేరు ‘ఎట్ ద వాటర్’స్ ఎడ్జ్.’ నీటిపై కాంతి ప్రతిఫలనాన్ని వినూత్న రీతిలో చూపెడుతూ చేసిన చిత్రమిది. దాన్ని గీసేందుకు రంగులను పొరలు పొరలుగా అద్దారు. అవి కరుగుతున్నట్టుగా ఉంటాయి. దీనికి ఈ టైటిల్ ఇవ్వడం వెనుక చిత్రకారుడి ఉద్దేశం ఏమిటో తెలియదు. కానీ, పహల్గామ్ ఊచకోత ఇండియా, పాకిస్తాన్ దేశాలను సింధూ నది నీటి అంచున నిలబెట్టింది.టిబెట్ పర్వతాల మీద 18,000 అడుగుల ఎత్తున మానస సరోవరం వద్ద పుట్టిన సింధూ నది వేల సంవత్సరాలుగా ఎన్నో నాగరికతలకు ఆలవాలమైంది. ఇటీవలి సంవత్సరాల్లో నదుల గురించి, వాటి చరిత్రల గురించి చాలా రచనలు వెలువడుతున్నాయి. బ్రిటిష్ చరిత్రకారుడు, ‘ద కాంక్వెస్ట్ ఆఫ్ నేచర్’ రచయిత డేవిడ్ బ్లాక్బోర్న్ ఇలా అంటాడు: ‘‘ప్రకృతిపై విజయం సాధించాలన్న మానవుడి తపన వెనుక అనేక ఊహలు ఇమిడి ఉంటాయి. మానవ, సాంకేతిక శక్తులతో ప్రకృతిని జయించాలని మనిషి అనుకుంటాడు. నదుల అస్తిత్వం పట్ల అతడి వైఖరి కూడా దీనికి ఒక కారణమవుతుంది’’.నైలు నదిని మార్చిన ఫలితం?నదులకు వ్యక్తిత్వం ఉందీ అనుకున్నా, అవి ఏం ఆలోచిస్తాయో తెలియదు. అయితే, నదుల గురించి మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారో మనకు తెలుసు. నీటి ప్రవాహాన్ని క్యూసెక్కులలో లెక్కగట్టి వాటి స్వరూపాన్ని నిర్ణయిస్తాం. అంతే కాకుండా, వాటిపై ఆధారపడి ఉండే వృక్ష జంతుజాలం, ఆ నదులను పెనవేసుకుని ఉండే ఆచార వ్యవహారాలు, కల్పిత గాథలు ఆధారంగా వాటి గొప్పతనాన్ని అంచనా వేస్తాం. శత్రుదేశం మీద ప్రయోగించడానికి సింధూ నదిని ఒక అస్త్రంగా మార్చుకోవాలని ఇండియా భావిస్తోంది. నదులతో ఆడుకుంటే వాటి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసిన విషయమే. నైలు నదీ స్వరూపాన్ని మార్చేయాలని 200 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడలేదు. ఆస్వాన్ డామ్ కట్టడంతో నైలు నదీ డెల్టాను వేల సంవత్సరాలుగా సారవంతం చేసిన ఒండ్రుమట్టి ఆ ప్రాంతంలో మేట వేయడం నిలిచిపోయింది. అంతేకాదు, నత్తగుల్లల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి శిస్టోమియాసిస్ ప్రబలడానికీ, మలేరియా వ్యాప్తికీ కారణమైంది.నది మీద డ్యామ్ కడితే అది ఇక నదే కాదు. ‘‘నీటిని అదుపులోకి తెచ్చుకోవడమంటే, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడమే. హైడ్రలాజికల్ ప్రాజెక్టుల వల్ల అక్కడి మానవ ఆవాసాలు అంతరిస్తాయి. ఆ మానవ సమూహాల విలువైన పారంపరిక విజ్ఞానం శాశ్వతంగా కనుమరుగవుతుంది’’ అని కూడా బ్లాక్బోర్న్ రాస్తాడు.భారీ నీటిని నిల్వ చేయగలమా?కశ్మీర్ ‘పాకిస్తాన్ జీవనాడి’ అంటూ, పహల్గామ్ ఊచకోతకు కొద్దిరోజుల ముందు, పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. వాస్తవానికి సిం«ధూ నది ఈ రెండు దేశాలను యుద్ధం వైపు నడిపించే అవకాశం ఉన్నది! సైనిక ప్రతిచర్యలకు అదనంగా, ఇండియా 1960 నాటి సింధు నదీజలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతలు ఇన్నిసార్లు వచ్చినా ఇలా చేయడం ఇదే ప్రథమం. జల యుద్ధాలు సంభవించే ముప్పు ఉందంటూ కొన్ని దశాబ్దాలుగా భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిప్పుడు పరీక్షా సమయం. ఒప్పందం నిలిపివేయడంతోనే సిం«ధూ జలాలు దిగువకు ప్రవహించకుండా ఆగిపోవు. ఒక్క చుక్క నీటిని కూడా వదలం అంటూ జలశక్తి మంత్రి హెచ్చరించడం పాక్ను బెదిరించే రాజకీయ ప్రకటన. సిం«ధూ ప్రవాహాన్ని అకస్మాత్తుగా అపేయడం సాధ్యపడేది కాదన్నది మనకు తెలిసిన విషయమే. ‘‘నెత్తురు నీరు కలసి ప్రవహించ జాలవు’’ అని 2016 కశ్మీర్ ఉగ్రదాడి అనంతరం ఇండియా హెచ్చరించింది. అయితే, ఇస్లామాబాద్కు మద్దతుగా చైనా రంగంలోకి దిగిత్సాంగ్పో (బ్రహ్మపుత్ర) ఉపనది ప్రవాహాన్ని అడ్డుకుందని వార్తలు వచ్చాయి.ఇండియా ప్రస్తుత జలవిద్యుత్ ప్రాజెక్టులతో భారీ పరిమాణంలో నీటిని నిల్వ చేయలేదు. ఇండస్ వాటర్ ట్రీటీ (1960) అందుకు అంగీకరించదు కూడా. ఒప్పందాన్ని పునః సమీక్షించడం కోసం, స్టోరేజ్ సదుపాయాల ఏర్పాటు కోసం దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చేందుకు రచించిన వ్యూహం ఇది. ఇండియా ప్రస్తుతం 20 శాతం నీటినే వినియోగించుకోగలుగుతోంది. మరీ ఎక్కువగా నీరు నిల్వ చేస్తే వరద ముంపు ప్రమాదం ఎదురవుతుంది.దౌత్యవ్యూహంగా సరే!ఇరు దేశాలూ తమ జల వివాదాలను పరిష్కరించుకోడానికి 2022 నుంచీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. మారుతున్న జనాభా, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ఒప్పందంపై పునఃసమీక్ష జరగాలని 2023లో ఇండియా ప్రతిపాదించింది. నదీ ప్రవాహాన్ని మళ్లించడం అంటే వ్యయంతో కూడుకున్న పని. నీటి మళ్లింపు ఆర్థిక రీత్యా సాధ్యం కాకపోవచ్చు. చైనా సైతం త్సాంగ్పో నీటి మళ్లింపు విషయంలో ఈ కారణంతోనే సందిగ్ధంలో పడింది.‘‘సింధూ నదుల పరీవాహక ప్రాంతంలో ప్రత్యేకించి చీనాబ్ బేసిన్లో జలవాతావరణం భారీ మార్పులకు లోనవుతోంది. ఈ వాతావరణ మార్పుతో ఇప్పటికే మనం సమరం చేస్తున్నాం’’ అని ‘సౌత్ ఏషియా నెట్వర్క్ ఆన్ డామ్స్, రివర్స్ అండ్ పీపుల్’ (ఎస్ఏఎన్డీఆర్పీ) సమన్వయకర్త పరిణీతా దాండేకర్ చెబుతున్నారు.ఇండియాలోని సింధూ పరీవాహక ప్రాంతపు పశ్చిమ నదులపై ఎక్కడా లేనన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులు చీనాబ్ బేసిన్లో ఉన్నాయి (హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, పంజాబ్లో కొంతభాగం చీనాబ్ పరీవాహక ప్రాంతం కిందకు వస్తాయి). తొందరపడి మరిన్ని రిజర్వాయర్లు, ఆనకట్టలు నిర్మించాలని నిర్ణయిస్తే ఇండియా, పాకిస్తాన్ దేశాలు రెండూ ప్రకృతి విపత్తుల బారిన పడే ప్రమాదం ఉంది. ఎస్ఏఎన్డీఆర్పీ బృందం 2024లో చీనాబ్ నది ఆసాంతం పర్యటించి సమగ్ర నివేదిక రూపొందించింది. ఇప్పటికే భూకంపాలు, నిరంతర వాతావరణ విపత్తులు ఎదుర్కొంటున్న చీనాబ్ నదీ ప్రాంతం మరిన్ని భారీ ప్రాజెక్టులను తట్టుకోలేదు. అయినా సరే నిర్మిస్తే పెను ఉపద్రవం తప్పదని ఈ నివేదిక హెచ్చరించింది. వీటివల్ల ఉత్పన్నమయ్యే జీవావరణ, భూగర్భ సంబంధిత దుష్పరిణామాలను సరిదిద్దడానికి వీలు కూడా కాదు. నదీజలాల మళ్లింపు వల్ల ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇక్కట్ల పాలవుతారు. లక్షల మంది నిర్వాసితులు అవుతారు. జలప్రవాహాన్ని నిలిపివేయడం తెలివైన దౌత్యవ్యూహమే కావచ్చు. కానీ నదీప్రవాహంతో ఆటలాడితే దీర్ఘకాలంలో ప్రమాదం తప్పదు.కిసలయ భట్టాచార్జీ వ్యాసకర్త జిందాల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ డీన్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
బాధలెవరివి? భోగాలెవరివి?
పన్నెండు వందలమంది ఆత్మబలిదానాలతో, వందలాదిమంది విప్లవకారుల పరోక్ష త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో రాసుకున్న వారిదే చరిత్రగా, దోచుకున్న వారిదే సంపదగా దిగజారుతుండగా... 2025 జూన్ 2న మనం పుష్కర తెలంగాణలో అడుగుబెడుతున్నాం. కడుపులు ఎండుతున్న వారి దుఃఖానికి బదులు, కడు పులు నిండిన వారి ఆక్రోశాలు వార్తలవుతున్న సమ యంలో అసలు ఈతి బాధలెవరివో, రాజ భోగా లెవరివో మాట్లాడుకోవాల్సి రావడమే అత్యంత విషాదం. ఆంతరంగిక వలస విముక్త అవగాహ నతో, ప్రాంతీయ ప్రజాస్వామిక నినా దంతో, ఆత్మగౌరవ పతాకతో, సాంస్కృతిక అస్తిత్వ గానంతో తెలంగాణ రాష్ట్ర డిమాండ్కు ప్రాణం పోసిన విప్లవోద్యమం లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదు.1969లో మున్నూట అరవై మంది ప్రాణాలను బలిగొని తెలంగాణ ఉద్య మాన్ని అణిచివేస్తే, విప్లవోద్యమం సార్వజనీన ప్రజా విముక్తి ఆశగా అప్రతిహతంగా పెరుగుతూ వచ్చింది. తిరిగి విప్లవోద్యమాన్ని నెత్తుటేర్లలో ముంచిన ప్రపంచీకరణ విధానాల తర్వాత అనేక కష్టనష్టాల మధ్య కూడా ఆ విప్లవోద్యమమే తెలంగాణ రాష్ట్ర డిమాండ్కు ప్రాణ ప్రతిష్ఠ చేసింది.అందుకే వీరన్నలను, పోరన్నలను, ఐలమ్మలను ఆదర్శంగా ప్రకటించిన పాలక పార్టీలు నక్సలైట్ ఎజెండానే తమ ఎజెండాగా ప్రకటించాల్సివచ్చింది. వారి దేశభక్తిని ఆకాశానికెత్తాల్సివచ్చింది. చివరకు ముఖ్యమంత్రి పదవి కంటే పౌరహక్కుల సంఘం అధ్యక్ష పదవి గొప్పదని ప్రకటించేదాకా పోయారు. లక్షల మంది ఉద్యమ కార్యకర్తల కృషిని అంగీకరించకుండా తెలంగాణ తెచ్చామంటున్నవారు, తెలంగాణ ఇచ్చామంటున్న వారు... ఇద్దరూ ఇప్పుడు మన ముందు పాలకులుగా, ఏలికలుగా ఉన్నారు. అందుకే టీఆర్ఎస్/ బీఆర్ఎస్ పదేళ్ల పాలనను, ఒకటిన్నర సంవత్సర కాల కాంగ్రెస్ పాలన తీరును బేరీజు వేసుకుంటూ భవిష్యత్ తెలంగాణను ఎట్లా తీర్చి దిద్దుకోవాలో ఆలోచించుకోవడానికి ఒక మంచి సందర్భం కూడా ఇదే. తెలంగాణలో భూమి సమస్యను తెలంగాణ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున లేవనెత్తింది. ఆ తర్వాతి ఆదివాసీ, విప్లవోద్యమాలూ దీనిపైనే ప్రధానంగా సాగాయి. అయితే పాలకులు భూపంపిణీని విస్మరించి నీళ్ల సమస్యను పాపులర్ నినాదం చేశారు. భూమిని సరుకుగా మార్చి... రియల్ ఎస్టేట్ వ్యాపారులను తలదన్నే విధంగా ప్రభుత్వమే భూములు అమ్మే పక్కా వ్యాపార వేత్తగా అవతారం ఎత్తింది. ప్రజా ప్రతిపక్షంగా నిల బడ్డ శక్తులమైనా కలసికట్టుగా ప్రపంచీకరణ రుద్దిన విధ్వంసకర అభివృద్ధి నమూనాను ఐక్యంగా ప్రతి ఘటించలేకపోతున్నాం. అందుకే ‘ఆరు గ్యారెంటీ ల’తో పాటు ప్రజాస్వామిక హక్కుల పునరుద్ధరణ అనే ఏడో హామీ కూడా ప్రజలను ఒక మేరకు ప్రభావితం చేసింది. అందుకే ఒక పుష్కర కాలంలోనైనా వీటిని బేరీజు వేసుకుంటూ ఆర్థిక విధానంతో పాటు, హక్కుల విషయం, కేసుల ఎత్తివేత వంటి అంశాలలో కూడా ప్రభుత్వాలు రాజకీయ కోణంలో నిర్ణయం తీసుకోవాల్సిందే. తెలంగాణలో కులగణన ఆధారంగా ‘మేమెంతో మాకంత’ అనే సామాజిక న్యాయం ఆచరణ మార్గం పట్టించాలి.ఒక ప్రజా సాంస్కృతిక కార్యకర్తగా ఆరు పదులు నిండిన నా జీవితంలో 50 ఏళ్లు ప్రజా పాటలతో ముడిపడి ఉంటే, అందులో 30 ఏళ్ల చైతన్య పూరిత జీవితమంతా (1995–2025) ప్రధానంగా తెలంగాణ సాంస్కృతిక–రాజకీయ ఉద్యమాలతోనే ముడివడి ఉంది. ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాల మూరు లోనా/ మన తెలంగాణ లోనా’ అంటూ మొదలై ‘దగాబడ్డ మన తెలంగాణలో సంఘ మొకటి పెడుదాం/సంగతేందో చూద్దాం’ అనే పిలుపులో పిలుపునై వేల సభల్లో వందల పాటలు పాడాను. 1996లో ‘తెలంగాణం’ అనే పుస్తకాన్ని, పాటల క్యాసెట్ను విడుదల చేసిన ‘అరుణోదయ’లో కీలకమైన బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నాను.గొంతులు పచ్చి పుండయినా రాష్ట్రమంతా కలియ తిరిగి పాడాను.2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటనకు ముందే ఉస్మానియా శిబిరాన్ని కాపాడు కోవడంలో, బహుజన బతుకమ్మను తలపై ఎత్తు కోవడంలోనూ, వలస పెత్తందార్ల ఆర్థిక మూలా లను దెబ్బ కొట్టి తెలంగాణ సాధించుకోవాలని చేసిన అనేక మిలిటెంట్ పోరాటాల్లో ముందు బాగాన్నే ఉండి జైళ్ళు–సంకెళ్లు అన్నీ ఎదుర్కొ న్నాము. గాయిదోల్ల తెలంగాణ కావాలని, గరీ బోల్ల తెలంగాణ రావాలని, గారడీ తెలంగాణ వద్దని నినదించాము. ఫలితంగా అక్రమ కేసుల పరంపర, ఆఫీసులకు తాళాలు, అవమానాలు ఎదుర్కొన్నాం. అయినా ఎవరో గద్దె దిగి, మరొకరు గద్దెనెక్కాలని కాకుండా తెలంగాణలో సామాజిక న్యాయం పరిఢవిల్లాలని పోరాడాము.చరిత్ర నిర్మాతలు ప్రజలని చాటుతూ నవ తెలంగాణ నిర్మాణం కోసం, సామాజిక న్యాయా నికై గొంతెత్తడమే మన కర్తవ్యం. నిజమైన పోరాట కారుల చరిత్ర ప్రజా తెలంగాణలోనే సాధ్యం. అప్పుడే దోచుకున్న సంపద ప్రజల సొంతమవు తుంది. అమరులు కన్న నిజమైన ప్రజా తెలంగాణ కల సాకారమవుతుంది.వ్యాసకర్త టీయూఎఫ్ అధ్యక్షురాలు ‘అరుణోదయ’ విమలక్క -
జూన్ 2 స్ఫూర్తితో ముందుకు...
2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన రోజు. తెలంగాణ ఆత్మ గౌరవం నిలువెత్తుగా నిలి చిన రోజు. తెలంగాణ సమాజం ఏ బాధలు పడ్డదో ఆ బాధల నుంచి విముక్తి పొందేందుకు సాగిన తెలంగాణ పునర్ని ర్మాణ ప్రక్రియ కూడా ఉద్యమ ఉత్తేజంతోనే కొనసాగింది. ఎవరు ఎన్నెన్ని విమర్శలు చేసినా దేశంలోనే తెలంగాణ అనేక విషయాల్లో నమూనాగా నిలవటానికి కారణం తెలంగాణ తొలి ప్రభుత్వ కృషే. తొలిసారి, మలిసారి కూడా ముఖ్యమ్రంతిగా కేసీఆర్ చూపిన దార్శనికత చూసి దేశమే ముచ్చట పడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అడు గడుగునా అడ్డుపడ్డశక్తులు రాష్ట్రం వచ్చాక కూడా ఆపసోపాలు పడి తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. తెలంగాణలో నిజంగా ప్రభుత్వాన్ని నడపడమంటే అభివృద్ధి ఉద్యమాన్ని నడపడమే. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ పాలన చేయాలి. ఎన్నికల్లో గెలవటం, ఓడటాలు ప్రామాణికంగా చూడకుండా గాయాల నుంచి బయటపడ్డ తెలంగాణకు భవి ష్యత్తును అందించే ప్రాణవాయువుగా పాలన కొనసాగాలి. ఈ విషయంలో రాజీపడే ఆలోచనలు రానివ్వవద్దు. జూన్ 2 స్ఫూర్తితో ప్రతి తెలంగాణీయుడు మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించుకుంటూ ముందుకు సాగే శక్తులు బలంగా నిలవాలనే కోరుకోవాలి. ఇందుకు భిన్నమైన ఆలోచన చేయటమంటే తెలంగాణ అస్తిత్వంపై దాడి చేయటంగానే భావించవలసిఉంటుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే శక్తులు, అస్తిత్వంపై దాడి చేసే శక్తులు నిరంతరం సంఘర్షించుకుంటూనే ఉంటాయి. ఈ సందర్భంలో ప్రతి మలుపులోను తెలంగాణ సమాజం తన చైతన్యాన్ని ఎప్పటికీ మెరుగుపరుచుకుంటూనేఉంటుంది. ఇక్కడ చిక్కుముడి విప్పాల్సిందేమిటంటే – ప్రతి పదేళ్ళకు వచ్చే మార్పు కొత్త తరాన్ని ముందుకు తెస్తుంది. 1997 నుంచి రాజుకున్న మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 2001 ఏప్రిల్ 27న అగ్గిలాగామండింది. యువకుల ఆత్మ బలిదానాల దగ్గర్నుంచి కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష వరకూ ఉద్యమాన్నే మలుపు తిప్పిన ఘటనలు ఉన్నాయి. కొత్తతరం అవలోకనం చేసుకునేవిధంగా ఈ చరిత్రను వారిచేతికి అందించాలి. 1969 తొలిదశ ఉద్యమం తర్వాత 2001 నుంచి అగ్గిమంటైన మలిదశ ఉద్యమ ఘట్టాలు, వాటి నేపథ్యాలన్నీ ఈ తరం లోతుగా అవలోకనం చేసినప్పుడే ఉద్యమకారులెవరు? ఉద్యమ ద్రోహు లెవరో తెలుస్తుంది. తెలంగాణ అస్తిత్వ భావనను జీవితకాలం విడనాడని కొత్తపల్లి జయశంకర్లాంటి వాళ్ళు మలిదశ ఉద్యమంలో ప్రత్యక్షంగా టీఆర్ఎస్ కొనసాగించిన ఉద్యమ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆ విషయం లోతుగా అధ్యయనం చేస్తేనే, ‘సకలజనుల సమ్మె’ దగ్గర నుంచి ‘మిలి యన్ మార్చ్’, ‘సాగరహారాల’ వరకు జరిగిన ఉద్యమం అర్థమవుతుంది.కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే తెలంగాణ ఎగువభూములకు నీళ్ళందేవి కావు. కాళేశ్వరమే తెలంగాణ కరవు, నేలల దప్పిక తీర్చింది. జూన్ 2ను స్మరించుకోవటమంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం దశాబ్దకాలంలో ఎలా దేశానికి నమూనాగామారిందో తెలుసుకోవడమే! కరవు బారిన పడ్డ తెలంగాణ దేశానికే ఆకలితీర్చే ధాన్యాగారంగా మారింది. సమైక్యాంధ్రలో జరగని అభివృద్ధి స్వరాష్ట్రంలోనే అందనంత ఎత్తుగా శరవేగంతో సాగింది. సామాజిక న్యాయానికి బాటలు పడ్డ స్థితిని చూస్తున్నాం. అదింకా పరిపూర్ణం కావాల్సి ఉంది. ‘దళితబంధు’ పథకం విప్లవాత్మకం. గొర్రెల పంపిణీ జరిగింది. చెరువుల్లో జలసంపదలు పెరిగాయి. పల్లెకు కావాల్సిన మౌలిక వసతులన్నీ తొలి తెలంగాణ ప్రభుత్వం అందించింది. అది ఏ పల్లెనడిగినా చెబుతుంది. హైదరాబాదు విశ్వ నగరంగా ఐటీ విస్తరణ నగరంగా మారింది. అడవులు పెంచే కార్యక్రమం జరిగింది. వనసంపద పెరిగింది. జలసంపద పెరిగింది. భూముల విలువలు పెరిగాయి. పాలన ప్రతి గడపదాకా పోయింది. ఇవన్నీ కళ్ళు చూపించే సత్యాలు. ఇవన్నీ నేడు మననం చేసుకోక తప్పదు.రాష్ట్ర అవతరణ ముందు, ఆ తర్వాత తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్న వారిని కని పెట్టకపోతే ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర సాకారం అర్థ రహితమవుతాయి. ‘నీళ్ళు, నిధులు, నియామకాలు’ మలిదశ ఉద్యమ ట్యాగ్ లైన్. స్వరాష్ట్ర సిద్ధి తర్వాత నీళ్ళు, నిధులు, నియా మకాలు అమలు జరిగేందుకు కృషి ప్రతి తెలంగాణీ యుడికి తెలియంది కాదు. గోదావరి జలాలను రక్షించుకోవలసిన బాధ్యత ఉంది. స్వరాష్ట్రం వచ్చినా నదీ జలాల మళ్ళింపు విషయంలో అప్రమత్తంగా లేకపోతే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రతిష్ఠను భంగపరిచే ఏ పని చేసినా అది తెలంగాణ అస్తిత్వానికే దెబ్బతగులుతుంది. కాళేశ్వరం జలాలతో తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా వర్ధిల్లాలి. అదే జూన్ 2 స్ఫూర్తితో పాలకులు అడుగులు వేయాలి.వ్యాసకర్త తెలంగాణ రాష్ట్రతొలి బీసీ కమిషన్ సభ్యులు(జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం) -
ప్రజలే సమాధానం చెబుతారు!
వెనుకబడిన కులాలను అభివృద్ధి చేయటం అంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లటమనే సత్యాన్ని 41 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడికి తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్రంలో ఓ 50 మంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తే, రాష్ట్రంలోని 139 బీసీ కులాలు బాగుపడినట్టేనా? రాష్ట్రంలోని బీసీల అభివృద్ధికి ఆయన పార్టీ ఇచ్చే ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్ పదవులు మాత్రమే గీటురాయి కాదు కదా! అభివృద్ధి అంటే అన్ని రంగాల్లోనూ ఇతర కులాలతో పోటీపడే సమాన అవకాశాలను కల్పించటం. బీసీల మీద నిజంగా ప్రేమ ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆయనే ముందు తీసుకొచ్చి ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఈ రాష్ట్రాన్ని 9 ఏళ్ళు పాలించిన చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఆలోచించనే లేదు. ప్రభుత్వ బీసీ హాస్టళ్ల సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతోంది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల సంఖ్యలు కూడా తగ్గిపోతున్నాయి. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన ఏ రోజైనా బీసీల విద్యావకాశాల గురించి సమీక్షించారా? బీసీల అభివృద్ధి కోసం ఆయన దగ్గర ప్రణాళిక లేదు. హామీలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలోని 139 బీసీ కులాల్లో ఇప్పటి వరకూ 28 కులాల ప్రతినిధులు మాత్రమే శాసనసభ మెట్లు ఎక్కారు. శాసనసభకు పోటీ చేసి గెలిచే అవకాశం లేని సామాజిక వర్గాలకు శాసనమండలిలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి, మరచిపోయారు. కానీ ఈ హామీని ఈ రాష్ట్రంలోని బీసీలు ఇంకా మర్చిపోలేదు. కడప మహా నాడులో సోషల్ ఇంజనీరింగ్ తెలుగుదేశం పార్టీకే సాధ్యమని, బీసీల తలరాత మార్చేస్తామని నారా లోకేష్ అంటున్నారు. అయితే తెలుగు దేశం పార్టీ బీసీల అభివృద్ధి కోసం అమలు చేసిన పథకాలు, ఫలి తాలపై శ్వేత పత్రం విడుదల చేయగలరా?2016లో 32 ఎంబీసీ కులాలను గుర్తించి, కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ 32 కులాల్లో ఒక్కరినైనా ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో చేశారా? ఎంబీసీల మీద బాబు ప్రేమ ఏమైంది? సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇదేనా? 2024లో మరలా అధికారంలోకి వచ్చినా బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. బీసీ జాబితాలో కులాల సంఖ్య 92 నుండి 139 కి పెరిగాయి కదా! ఆ స్థాయిలో రిజర్వేషన్ను ఆయన ఎందుకు పెంచలేకపోయారు? బీసీ జాబితాలోని రజక, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి ఇత్యాది సేవా కులాలకు అనాదిగా ఉన్న ఈనాం భూములు అన్యాక్రాంత మయ్యాయి. ఈ భూముల్ని తిరిగి ఆ కులాలకు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఏ రోజూ ప్రయత్నించలేదు. ‘ఆదరణ’ పేరుతో ఈ కులాలకు పనిముట్లను ఇస్తున్నారు కానీ ఈనాం భూములను వెనక్కి ఎందుకు ఇప్పించటం లేదు? సేవా కులాల వృత్తి అవసరాల కోసమైనా భూమి కొనుగోలు చేసి ఇచ్చే ప్రయ త్నమూ చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం తన 22 ఏళ్ళ పాలనలో బీసీల కోసం భూమి కొనుగోలు పథకాన్ని ఏ రోజూ అమలు చేయలేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు ఇచ్చేందుకు ఎంపిక చేసిన యూనిట్లలో వ్యవసాయ సంబంధమైన యూనిట్లు లేక పోవడం ఆశ్చర్యకరమే. వ్యవసాయ భూములకు కరెంట్ కనెక్షన్ తెచ్చుకోలేక, బావులు, బోర్లు నిర్మించుకోలేక బీసీలు భూములను అమ్ముకుంటున్నారు. బీసీ లకు ప్రత్యేకమైన సబ్ ప్లాన్ ఉందని చెప్తున్నారు కదా, వారి పొలాలలో కరెంటు కనెక్షన్లు ఏర్పాటు చేసుకునేందుకు, బావులు, బోర్లు నిర్మించుకొని పంటలు పండించుకునేందుకు అవకాశం ఇవ్వని తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ ఎలా అవుతుందో చంద్రబాబు సమాధానం చెప్పగలరా ? జగన్ ప్రభుత్వంలో ‘చేయూత’ పేరుతో రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఏడాదికి పదివేల రూపాయలుగా ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని నిలిపివేసిన టీడీపీ ప్రభుత్వం బీసీల మీద ప్రేమ చూపించే ప్రభుత్వమా? ఇంతకూ బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ హామీ ఏమయ్యింది? డైవర్షన్ పాలిటిక్స్తో ఎల్లకాలం ప్రజల్ని మభ్య పెట్టలేరు, ఏమార్చలేరు. ఈ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినా చెప్పకున్నా, ఈ పాలనకు ప్రజలు తమదైన రోజున సరైన సమాధానం చెబుతారు! – పొటికలపూడి జయరామ్బీసీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ‘ 95151 84699 -
కళింగాంధ్ర వలసలకు ఎక్స్పైరీ డేట్ లేదా?
పదేళ్ల కిందటి గణాంకాల ప్రకారం కళింగాంధ్ర నుంచి పొట్ట చేత్తో పట్టుకొని, ఉపాధి వెదుక్కుంటూ... ఇరవై రెండు లక్షల మంది గుజరాత్, బొంబాయి, చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ వంటి నగరాలకు వలస పోయినారు. అంటే కళింగాంధ్ర జనాభాలో అయిదో వంతు జనాభా వలస పోయినట్టు. ఇదెంతటి విషాదం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, విడివడిన ఆంధ్ర లోనూ వలసలు పోయే జనాభాలో కళింగాంధ్ర మొదటి స్థానంలో ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు వంటి మిగిలిన అన్ని రంగాల్లోనూ కళింగాంధ్ర (ఉమ్మడి ఆంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు) అన్ని ప్రాంతాల కన్నా వెనకబడి ఆఖరి స్థానంలో ఉంది. ఈ దుఃస్థితి దేశ స్వాతంత్య్రం పూర్వం నుంచి నేటిదాకా కొనసాగుతూనే ఉంది.‘రా పిలడో బిలాయి పోదాం – నీకు బీడీలు లేక పోతే బియ్యం అమ్ముతాను – రా పిలడో భిలాయి పోదా మ’ని గ్రామాల్లో అలనాడు పాట మార్మోగేది. అంటే అంతగా ఇక్కడి వాళ్ళు భిలాయి, అండమాన్ వంటి ప్రాంతాలకు వలస పోయే వారన్నమాట.ఓ ఇంజనీర్ మిత్రుడు మాటల సందర్భంలో– ‘కళింగాంధ్ర పేదల వలస బాటకు ఎక్స్పైరీ డేట్ లేదా?’ అని తన కొడుకు ప్రశ్నించాడన్నాడు. చాలా వేదనతో కూడిన ప్రశ్న అది. బహుశా కళింగ ప్రజలు చాన్నాళ్లుగా వేస్తున్న ప్రశ్న కూడా! కాకపోతే పాలకులు వినడం లేదు. ఇటీవల కూటమి ముఖ్యమంత్రిగారు కళింగమ్ లోని మత్స్య తీర ప్రాంతానికి వచ్చి, ఆ ప్రాంతాన్నీ, ఆ ప్రజలనూ పరిశీలించి ఇంతగా పేదరికంలో, ఉపాధి లేమితో, అభివృద్ధికి నోచుకోకుండా వెనకబాటులో ఉంటే మీకు సిగ్గుగా (ఇదే అర్థంలో పదాలు) లేదా అని ఈ ప్రాంత తన పార్టీ నేతలను ప్రశ్నించారని పత్రికల వార్త.ఎక్స్పైరీ డేట్ లేదా అని ప్రశ్నించిన వాడు పౌరుడు, సిగ్గు లేదా అని ప్రశ్నించిన వారు పాలకులు. సిగ్గు పడాల్సింది ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు మాత్రమేనా? సమస్యల్లా ప్రజలు కోరుకునే అభివృద్ధి మోడల్ వేరు, పాలకులు అమలు చేసే అభివృద్ధి మోడల్ వేరు కావడంలోనే ఉంది. దాదాపు నాలుగు వందల కిలోమీటర్ల సముద్ర తీర ప్రజలు కోరుకునేది... ఫిషింగ్ హార్బర్లు, కోల్డ్ స్టోరేజీలు, సముద్రంతో సాము జేసే మత్స్య కారులు ఏ వేరావాలి(గుజరాత్)కో వలస పోయి, ప్రమాదాలకు గురి కాకుండా, విదేశీ జైళ్ళల్లో బందీలు కాకుండా ఆదుకునే ప్రణాళికలు, పథకాలును! కోట్ల రూపాయల మత్స్య సంపద, తీరంలోని విలువైన ఖనిజాలు కార్పొ రేట్లకు, ప్రైవేట్ శక్తులకు గాక, మత్స్యకారులకు, దేశానికీ చెందాలన్న మోడల్ అభివృద్ధిని ప్రజలు కోరుకుంటు న్నారు. కానీ పాలకులు ప్రైవేట్ శక్తుల, కార్పొరేట్ శక్తుల ద్వారా అభివృద్ధి జరుగుతుందని నమ్మబలుకుతూ ఆ నమూనాను అమలుచేస్తున్నారు.పాతిక లక్షల ఎకరాల సాగుభూమి వుంది. నాగా వళి, వంశధార, జంఝావతి వంటి పద్దెనిమిది జీవ నదులున్నాయి. అధిక వర్షపాత ప్రాంతం. అయినా మూడో వంతు భూమికి మాత్రమే సాగునీరు అందుతోంది ప్రాజెక్టుల ద్వారా. మిగిలిన భూమి కోసం రైతులు ఆకాశాన్ని ఆశగా చూడాలి. వంశధార రెండో దశ పూర్తి కాదు, నదుల అనుసంధానం ఆగిపోయింది. ‘వెంగళ రాయ సాగరం’ వెక్కిరిస్తోంది. నదుల మీద ఆనకట్టలు, పంటలకు గిట్టుబాటు ధర, పంట మదుపులకు సబ్సిడీ రుణాలు, పంటల ఆధార పరిశ్రమలు ఈ ప్రాంత అభివృద్ధి మోడల్ అని ప్రజలు కోరుకుంటున్నారు. పాలకులేమో కాలుష్య కారక ఫార్మా కంపెనీలు, థర్మల్, అణువిద్యుత్ కర్మాగారాలతో డంపింగ్ యార్డ్ చేస్తున్నారు. ఏటా ఈ కర్మాగారాల్లో ప్రమాదాలతో ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. ఎర్ర బస్సులకే దిక్కులేని ప్రాంతానికి విమానాశ్రయాలను నిర్మించి అభివృద్ధి మోడల్ అంటున్నారు పాలకులు. అనేక చిన్న పరిశ్రమలు మూత పడినాయి. చేతివృత్తుల జీవుల బతుకులు పోయాయి. ఉక్కు కర్మాగారంతో పాటుగా మరిన్ని భారీ పరిశ్రమలు మూతకు, ప్రైవేట్ శక్తుల అధీనంలోకి పోతున్నాయి. విస్తారమైన అటవీప్రాంతం ఉంది. టేకు, మద్ది, ఎగిస వంటి వృక్ష సంపద, అయిదు వందల రకాల ఔషధ వృక్షాలు, కోట్ల రూపాయల విలువైన ఖనిజాలు... మామిడి, అరటి, పనస, కందులు, చింతపండు వంటి పంటలు... వీటికి ప్రాసెసింగ్ యూనిట్లను, మార్కెటింగ్ సౌకర్యాలను; ఖనిజాల వెలికితీతకు ఆదివాసీ సొసైటీలు, ఆర్థిక వనరులు సమకూర్చి చేసే అభివృద్ధి మోడల్ను ప్రజలు కోరుతున్నారు. అడవులను, కొండ లను తొలిచేసే, ఆదివాసీలను విస్తాపనకు గురి చేసే నమూనాను, కార్పొరేట్లకు లాభించే మోడల్ను పాల కులు చెప్తున్నారు. పాలకుల ఈ అభివృద్ధి మోడల్ వలన లక్షలాది మంది కళింగాంధ్రులు నిర్వాసితులై, ఉపాధి వెదుక్కుంటూ వలస పోయినా... రోడ్లు, భవనాలు, కార్పొరేట్ సెజ్లతో, ప్రైవేట్ విద్యా, వైద్యాలయాలతో గతంలో కంటే ఈ ప్రాంతం కాస్తయినా అభివృద్ధి చెందిన ప్రాంతంగా కనిపిస్తుంది. కానీ ఇవేవీ నేటివ్ కళింగాంధ్ర వారివి కావు. పెట్టుబడులతో, పాలకుల సహకారంతో పరాయి జిల్లాల, రాష్ట్రాల నుండి వచ్చిన బడా, బడా బాబులవి. కనిపించే అభివృద్ధి అందుకొని అనుభవిస్తున్నది వారు. కళింగాంధ్ర తీరం భిన్నమైన ప్రాకృతిక భూభాగం. సహజ సంపదల సీమ. దీన్ని అభివృద్ధి చేయాలంటే... ప్రజలు కోరుకునే అభివృద్ధి నమూనా అమలు కావాలి. లేనినాడు ఇక్కడి ప్రజలు సర్వమూ కోల్పోయి, రెక్కలు కట్టుకొని వలసలు పోవడం తప్పదు. ఈ వలసబాటకు ఎక్స్పైరీ డేట్ వుండదు..!అట్టాడ అప్పల్నాయుడు వ్యాసకర్త ఉత్తరాంధ్ర రచయితల,కళాకారుల వేదిక (ఉరకవే) అధ్యక్షుడు -
పరిధి అతిక్రమించడం కాదా?
మన న్యాయమూర్తులకు బయటి శత్రువు లెవరూ ఉండరు. వారికి వారే శత్రువులు. ఇలా అనడం మీకు విచిత్రం కావచ్చు. కానీ నాకు అలాగే తోచింది. వారు ఒక్కోసారి తమను తాము మర్చిపోయారా అన్నట్లు అసాధారణంగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడేప్పుడు తమ మాటల పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచన వారిలో ఉండదా? వాటి ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందరా? అశోకా యూనివర్సిటీలో ప్రొఫెసరైన అలీ ఖాన్ మహ్ముదాబాద్ వ్యాఖ్యల కేసులో వారు వ్యవహరించిన తీరు ఎలా ఉందో ఈ సందర్భంగా పరిశీలిద్దాం.మొదటగా వారు ఆయన పోస్టును ‘డాగ్–విజిలింగ్’ అని నిందించారు. పదాలను ద్వంద్వార్థాలతో ఉపయోగించారని వ్యాఖ్యానించారు. ‘‘ఇతరులను అవమానించడానికి, కించపరచ డానికి లేదా అసౌకర్యం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా పదాలు ఎంపిక చేసుకున్నారు’’ అని పేర్కొన్నారు. కానీ తాము అనుకుంటున్న ఆ పదాలేమిటో చెప్పారా? చెప్పలేదు. పైగా, ‘‘ఆయన ఈ భావాలను సులభమైన, మర్యాదపూర్వకమైన, ఎంతో తటస్థమైన పదజాలం ఉపయోగిస్తూ, అతి సులభమైన భాషలోనూ వ్యక్తం చేయొచ్చు’’ అంటూ చెప్పుకుపోయారు. ఇక్కడ కూడా తాము అనుకుంటున్న ఆ భావాలేమిటో వారు చెప్పలేకపోయారు. డాగ్–విజిల్ అంటే ఏమిటి? ఆ విజిల్ సాధారణంగా మనిషి చెవులు ఆలకించలేని శబ్దతరంగాల్లో (ఫ్రీక్వెన్సీలో) ఉంటుందని రాజ్యాంగ న్యాయశాస్త్రంలో పండితుడైన గౌతమ్ భాటియా అంటారు. మరి మహ్ముదాబాద్ ఫేస్బుక్ పోస్టుల్లో ఏ భాగాలను డాగ్ విజిల్స్ అని భావించాలి? ఏ ‘కుక్కల’కు ఆయన విజిల్స్ వేశారు? ఆయన ఉద్దేశించని ‘శునకేతరులు’ ఎవరు? అసలు ఆందోళనజడ్జీలు వీటిలో వేటినీ వేలెత్తి చూపించలేదు. ఏం... వారు అలా చేయదగిన పని కాదా అది? అందుకు బదులుగా... ‘‘అతను వాడిన పదజాల సంక్లిష్టతను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి, ఈ రెండు ఆన్లైన్ పోస్టుల్లో ఉపయోగించిన కొన్ని వ్యక్తీకరణల స్వభావాన్ని సరైన రీతిలో గ్రహించడానికి ఒక సిట్ ఏర్పాటు చేయాలని హరియాణా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ను మేం ఆదేశిస్తున్నాం’’ అని ఉత్తర్వు జారీ చేశారు. అయితే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)లో పోలీసు అధికారులే ఉంటారు. శామ్యూల్ జాన్సన్, నోవా వెబ్స్టర్ వంటి నిఘంటుకారులు (లెక్సికోగ్రాఫర్లు) ఉండబోరు. వాస్తవం చెప్పాలంటే, ఈ ఇద్దరు న్యాయమూర్తులు రేకెత్తించిన ఆందోళనల్లో ఇది చిన్నమెత్తు కూడా ఉండదు. తీవ్రంగా ఆందోళన కలిగించేవి ఇంకా ఉన్నాయి. వారు పేర్కొన్న ఈ వాక్యాలను చూడండి: ‘‘ప్రతి ఒక్కరూ హక్కుల గురించి మాట్లాడతారు. నాకు ఇది చేసే హక్కు ఉందని, అలా చేసే హక్కు ఉందని అంటారు. కాని దేశం పట్ల మీ బాధ్యత ఏమిటో చెప్పరు.’’నిజం ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది? పౌరులుగా మనకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను మాత్రమే అది ప్రత్యేకంగా గుర్తించింది తప్ప, రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సినవి అంటూ ఎలాంటి బాధ్యతలనూ రాజ్యాంగం గుర్తించలేదు. దేశ భక్తుడిగా ఉండాల్సిన బాధ్యత కూడా మనకు లేదు. జెండా చుట్టుకు తిరగమని రాజ్యాంగం చెప్పలేదు. దేన్నయినా సరే సందేహించ డానికి, ప్రశ్నించడానికి మనకు ప్రతి హక్కూ ఉంది. మరి ఏ ప్రాతిపదికన ఈ న్యాయమూర్తులు హక్కులను, బాధ్యతలను ఒకే గాట కట్టారు? ఆ విషయం వారు చెప్పలేదు. ఏమైనప్పటికీ, మహ్ముదాబాద్ ప్రొఫెసర్గా ఉన్న అశోకా యూని వర్సిటీ విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి వారు మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి అత్యంత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అవేమిటో చదవండి: ‘‘వారు ఏమైనా సరే చేయగలం అనుకుంటే మేం ఒక ఉత్తర్వు జారీ చేస్తాం... ప్రైవేటు యూనివర్సిటీలు అని చెప్పుకొనే ఇలాంటి కొన్ని సంస్థలను ప్రారంభించడం, వాటిలో నానా రకాల శక్తులూ చేరి చేతులు కలపటం, బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం మాకు సమ్మతం కాదు. ఇలాంటి వారితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు.’’మాటలు న్యాయసమ్మతమేనా?ఈ భూమ్మీద ఏ శక్తి వారిని ఇందుకు పురికొల్పింది? ఎలాంటి వివరణ గానీ, న్యాయ ఔచిత్యం గానీ లేకుండా కలగాపులగంగా మాట్లాడిన అనేక విషయాల్లో అలవోకగా చేసిన ఈ వ్యాఖ్యా చేరుతుంది. తమ ఆలోచనల విపరీత పోకడ వల్లే ఒక అంశం నుంచి మరొక అంశంలోకి, అది తమకు సంబంధం లేనిదైనప్పటికీ, వారు ఇలా ఒక గెంతు గెంతినట్లు అనుకోవాలి.న్యాయమూర్తులు ఇలా మాట్లాడేందుకు వారిని ప్రోత్సహించిందేమిటి? ఎదుటి పక్షం వాదనలను లోతుగా తరచి చూసే ‘డెవిల్స్ అడ్వకేట్’ పాత్ర పోషించేప్పుడు, వారు మాట్లాడాల్సిన విషయాలు కావివి. ఇవి వారి వ్యక్తిగత అభిప్రాయాల్లా ధ్వనిస్తున్నాయి.రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులకు పూచీ వహించడమే వారి బాధ్యత. దానికి వారు విధేయతతో కట్టుబడి ఉండాలి. అయితే ఏం జరిగింది? అలా కాకుండా, కొందరు రాజకీయ ప్రేక్షకుల ముందు వినమ్రతతో శిరస్సు వంచుతున్నారా? ఇలా అని ఎవరైనా అనుకుంటే ఆశ్చర్య పోనవసరం లేదు. వారు ఎక్కువగా మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే, ఆ మాటలు న్యాయసమ్మతం కావు. గౌతమ్ భాటియా ఒక జాతీయ దినపత్రిక ద్వారా లేవనెత్తిన అంశం నన్ను నిజంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. మహ్ముదాబాద్ మీద ప్రకటించిన గ్యాగ్ ఆర్డర్ను ప్రస్తావిస్తూ, ‘‘ఒకరి నోరు నొక్కే అధికారం (గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం) న్యాయవ్యవస్థకు లేదన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింటు. ఒకవేళ ప్రభుత్వం ఇలా చేయాలని నిర్ణయిస్తే, అది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా అనేది తేల్చడానికి మాత్రమే దానికి అధికారం ఉంది’’ అని భాటియా పేర్కొన్నారు. అంటే ఈ న్యాయమూర్తులు తమకు లేని అధికారాలను ఉపయోగించారా అని ఆయన్ను ప్రశ్నించాను. దానికి ఆయన ఎంతో వివేకంతో, ఎంతో స్పష్టంగా, ‘‘వారు తమ పరిధులను మించి పోయి’’ వ్యవహరించారని చెప్పారు. ఓహ్! కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఒమర్ అబ్దుల్లా (జమ్మూకశ్మీర్ సీఎం) రాయని డైరీ
జ్ఞాపకాల స్తూపాలను నిర్మించుకోగలం. పోగొట్టుకున్న నమ్మకాల సౌధాలను పునర్ని ర్మించుకోగలమా?! కశ్మీర్ ఖాళీ అయిపోయింది! కశ్మీర్ గుండె వట్టి గ్రీష్మాన్ని ఊపిరి తీసి వదులుతోంది. ఒక్క వాన చుక్క... ధైర్యం చేసి జారి పడే ఒక్క వాన చుక్క కోసం... మోరెత్తి లోయలోకి చూస్తోంది. లోయే కశ్మీర్ ఆకాశం. టూరిస్టులే వాన జల్లులు, మురిసి కురిసిపోయే కరి మబ్బులు.కశ్మీర్ నన్ను అడుగుతోంది, ‘‘ఏమయ్యా ఒమర్ అబ్దుల్లా... ఈ దాల్ సరస్సుని, మొఘల్ సొగసుని, గుల్మార్గ్ పూతల్ని, సలీం అలీ పార్క్ పిట్టల్ని, శంకరాచార్యుల వారిని, వైష్ణోదేవిని ఎవరికి సాక్షాత్కరింప చేసుకోమంటావ్?!కొండా కోనలున్నా చూసే కన్నే లేకుంటే ఏం చేసుకోను ఈ వరాలన్నీ?!’’ అని అడుగుతోంది.కశ్మీర్ కంట్లో వాన చుక్క! ఇప్పుడంతా ప్రశాంతంగా ఉందని చెప్పటానికి పెహల్గాంలో నేను సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు ఓ గడప దగ్గర కశ్మీర్ నన్ను ఆపింది. ‘‘నీ కోసమే చూస్తున్నా ఒమర్!’’ అంది. ‘‘చెప్పండి అమ్మీజాన్...’’ అన్నాను, సైకిల్ దిగి స్టాండ్ వేసి అమ్మీ పాదాలకు నమస్కరిస్తూ. ‘‘నీకు తెలుసు కదా ఒమర్! తెర్లుతున్న తేయాకు నీటిలో యాలకులు, దాల్చిన చెక్క దంచి వేసి, కుంకుమ పువ్వుతో ‘కావా’ టీని నేను ఎంత చక్కగా కాస్తానో! నాక్కాస్త నమ్మకం ఇవ్వు ఒమర్. నా ఇంటికి మళ్లీ అతిథులు వస్తారని, నా చేతి టీని ప్రియంగా సేవిస్తారని...’’ అంటోంది అమ్మీజాన్.‘‘అందుకోసమే పెహల్గాం వచ్చాను అమ్మీజాన్. మంత్రులందర్నీ రప్పించి ఇక్కడే మీటింగ్ కూడా పెడుతున్నాను...’’ అన్నాను.‘‘మీటింగ్ పెడితే మంత్రులు వస్తారు కానీ, నా ఇంటికి అతిథులు వస్తారంటావా ఒమర్?! అంది అమ్మీజాన్ నిస్పృహగా. ‘‘వస్తారు, నన్ను నమ్మండి...’’ అని చెప్పాను. పెహల్గాంలో కేబినెట్ మీటింగ్కి వెళుతున్నప్పుడు కూడా బయట కొందరు నా దగ్గరకు పరుగున వచ్చి, ‘‘ఒమర్జీ! మాక్కాస్త నమ్మకం ఇవ్వగలరా..?’’ అని అడిగారు... నా చేతిని స్పృశించే ప్రయత్నం చేస్తూ! మనిషి స్పర్శకు మనిషెంతగా అలమటించి ఉన్నాడు!!వారి చేతిని మృదువుగా అందుకున్నాను. ‘‘ఒమర్జీ! మేము కశ్మీర్కు వచ్చిన టూరిస్టులం. ధైర్యం చేసి వచ్చేశాం. ధైర్యం మేము చేస్తాం. నమ్మకం మీరు ఇవ్వండి చాలు. ఇస్తారా ప్లీజ్...’’ అన్నారు. అతిథులు వస్తారని కశ్మీర్కు, కశ్మీర్ ఎదురు చూస్తోందని అతిథులకు నమ్మకం ఇవ్వాలి. ఒకవైపు నమ్మకమే సరిపోదు. ‘‘కశ్మీర్ మీ అతిథి గృహం. మీ అతిథి గృహానికి నేను కాపలాదారుడిని...’’ అని వారితో చెప్పాను. రెండో రోజు గుల్మార్గ్లో నాకు మరికొందరు ఎదురుపడ్డారు. అయితే వాళ్లు, ‘‘మాక్కాస్త నమ్మకం ఇవ్వండి’’ అని అడగటానికి వచ్చినవాళ్లు కాదు. ‘‘మీ మీద నమ్మకం లేదు’’ అని చెప్పటానికి వచ్చినవాళ్లు! ‘‘కశ్మీర్ను బహిష్కరించండి’’ అని నినాదాలు చేస్తున్నారు. వాళ్లంతా యువకులు. ఉడుకు రక్తాన్ని పిడికిలి పట్టి ఉన్న వారు. ‘‘ఉగ్రవాదులు కూడా ఇదే కోరుకుంటు న్నారు మిత్రులారా..! ‘కశ్మీర్ను బహిష్కరించండి’ అన్నదే వారి పిలుపు కూడా. వాళ్లు దేశానికి శత్రువులు. మీరు, వాళ్లూ ఒకటి కాదనే అనుకుంటున్నాను...’’ అన్నాను. వాళ్లేమీ మాట్లాడలేదు. నన్ను దాటుకుని ముందుకు వెళ్లిపోయారు. వాళ్ల నినాదం వాళ్లను అనుసరిస్తూ వెళ్లిపోయింది. ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా పెహల్గామ్లో ఒక స్మారక స్తూపం నిర్మించా లని కేబినెట్ మీటింగ్లో అనుకున్నాం. మరి కోల్పోయిన నమ్మకానికి తిరిగి ఎలా ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవటం?ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ నా లోపల అంటున్నారు.. ‘‘హృదయం నిస్సహాయంగా ఏం లేదు. ప్రస్తుతానికి ఓడిపోయిందంతే! దుఃఖపు సాయంత్రం సుదీర్ఘంగా ఉంది. కావచ్చు కానీ, ఇది ఒక సాయంత్రం మాత్రమే’’! -
Covid-19 ‘హ్రస్వ దృష్టి’ సంక్షోభంలో ప్రపంచం
2020లో లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వ అధికారులు లాక్డౌన్ ప్రకటించారు. కార్యాలయాలను, పాఠశాలలను మూసివేశారు. వినియోగదారు అనుకూల ఇంట ర్ఫేస్ జూమ్, ఇదే విధమైన వీడియో–కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫా మ్ల కారణంగా, ఇంటి నుండి పని చేసే కొత్త సంస్కృతి పుట్టింది. లాక్డౌన్ అనిశ్చితి, విద్యా కార్యకలాపాలను కోల్పోతామనే భయంతో చిన్నపిల్లలు, పసిపిల్లలు రోజుకు చాలా గంటలు తమ ఇళ్లలోనే ఉండి ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారు. ఫలితంగా పిల్లలు హ్రస్వ దృష్టి (మయోపియా, Myopia) బారినపడ్డారు.మొదట్లో చైనా, ఆ తరువాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని నేత్ర వైద్య నిపుణులు 2020 నాటికి, చిన్న పిల్లల్లో ఆందోళన కలిగించే స్థాయి వేగంతో హ్రస్వ దృష్టి వ్యాపిస్తోందని కనుగొన్నారు. దీంతో ప్రమాద హెచ్చరికలు మోగాయి. చైనాలో ఆరేళ్ల వయస్సు పిల్ల లలో మయోపియా వ్యాప్తిలో 400 శాతం పెరుగుదలను గుర్తించారు. ముఖం నుండి 30 సెం.మీ. కంటే తక్కువ దూరంలో పుస్తకాలను ఉంచుకోవడం, 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిరంతరం చదవడం అనేవి చిన్న పిల్లలలో హ్రస్వ దృష్టి పెరగడానికి ప్రధాన ప్రమాద కారకాలు. చదవడం, రాయడం ప్రభావితం కానప్ప టికీ, ఉపాధ్యాయుడు బ్లాక్బోర్డ్పై రాసిన అక్షరాలను, సుదూర వస్తువులను చూడలేకపోవడమే హ్రస్వదృష్టిగా సాధారణంగా వ్యవహరిస్తుంటారు. 1960లలో పట్టణ, గ్రామీణ జనాభా రెండింటినీ విస్తృతంగా సర్వే చేసిన చీఫ్ డాక్టర్ ఐఎస్ జైన్ ముఖ్య మైన విషయాన్ని వెల్లడించారు. గ్రామీణ జనాభాలో (2.77 శాతం), పాఠశాల పిల్లల్లో (4.79 శాతం), చండీ గఢ్ పట్టణ జనాభాలో (6.9 శాతం), పీజీఐ వైద్యులలో (33 శాతం) మందిలో హ్రస్వ దృష్టి వ్యాప్తి క్రమంగా పెరగడానికి కంటికి దగ్గరలో పని చేయడం, అధిక అక్ష రాస్యత రేట్లు, ఆదాయ స్థాయులు కారణమని ఆయన అన్నారు. ఇటీవల, ఉత్తర భారతదేశంలో పాఠశాలకు వెళ్లే పట్టణ పిల్లలలో 21 శాతం మందికి హ్రస్వ దృష్టి ఉన్నట్లు గుర్తించారు. ఇది 50 ఏళ్లలో 4 రెట్లు ఎక్కువ.పెరుగుతున్న హ్రస్వ దృష్టిపై కోవిడ్-19 క్వారంటైన్ ప్రభావం తూర్పు, ఆగ్నేయాసియాలో ముందుగా ఎక్కువగా కనిపించినప్పటికీ, తక్కిన ప్రపంచంలో ఎవరూ దానినుంచి తప్పించుకోలేదు. ఒక అధ్యయనం ప్రకారం, డిజిటల్ పరికరాల్లో రోజుకు సగటున ఒక గంట గడిపిన పిల్లలలో 46 శాతం మంది హ్రస్వదృష్టితో ఉన్నారు. నాలుగు గంటలు గడిపిన వారిలో 76 శాతం మంది ఉన్నారు. తక్కువ బహిరంగ కార్యకలాపాలు, మసక గది వెలుతురు, అధిక పని దీనికి కారణం.గత 10 సంవత్సరాలలో, డిజిటల్ పరికరాల వాడకం నాలుగు రెట్లు పెరిగింది. ఇటీవల ప్రతిష్ఠాత్మక మైన ‘జామా’ జర్నల్లో ‘3 లక్షల కంటే ఎక్కువ మంది పాఠశాల పిల్లలు పాల్గొన్న శాస్త్రీయ అధ్యయనాల ఆధా రంగా, రోజుకు కనీసం నాలుగు గంటల వరకు డిజిటల్ స్క్రీ¯Œ లపై గడిపే వారిలో, ప్రతి గంటకూ హ్రస్వ దృష్టి అభివృద్ధి చెందే అవకాశాలు 21 శాతం పెరిగాయని’ ఓ విశ్లేషణ ప్రచురితమయ్యింది. హ్రస్వదృష్టి బారిన పడిన అన్ని రకాల రోగుల్లో దాదాపు 8 శాతం మంది జీవితంలో తరువాత అంధత్వాన్ని ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది మయో పిక్ రోగులే అవుతారని డాక్టర్ హోల్డెన్, ఆయన సహ చరులు చేసిన అంచనాలు నిజమైతే ఈ వ్యవహారం ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారవచ్చు. కంటి కండరాలను సడలించే అట్రోపిన్ కంటి చుక్కలను ఉపయోగిస్తే అవి చిన్న పిల్లలలో కనుగుడ్డు వ్యాప్తి చెందటాన్ని నిరోధిస్తాయని, అంతే కాకుండా హ్రస్వదృష్టి పెరగడాన్ని కూడా అవి తగ్గిస్తాయని సింగపూర్కు చెందిన డాక్టర్ చువా, ఆయన సహచరులు ఇరవై సంవత్సరాల క్రితమే నిరూపించారు. డాక్టర్ రోహిత్ సక్సేనా నేతృత్వంలో జరిగిన దేశవ్యాప్త అధ్య యనం ప్రకారం, రెండేళ్ల కాలంలోనే భారతీయ పిల్ల లలో కరిగిపోయే అట్రోపిన్ చుక్కలు (0.01 శాతం) ఉపయోగించినప్పుడు అవి హ్రస్వదృష్టి పెరుగుదలను తగ్గించాయని తేలింది. సూర్యరశ్మికి గురికావడం వల్ల రెటీనాలో డోపమైన్ స్థాయులు పెరుగుతాయి. ఇది హ్రస్వ దృష్టి బారిన పడ కుండా కాపాడుతుంది. కోవిడ్–19 సమయంలో ప్రతి రోజూ రెండు గంటలు బయట గడపడం అనేది పిల్ల లలో హ్రస్వ దృష్టి వ్యాప్తిని అరికడుతుందని టర్కీకిచెందిన డాక్టర్లు ధ్రువీకరించారు. బహిరంగ కార్యకలా పాలు రోజుకు 2 గంటలు మించి ఉంటే అట్రోపిన్ (బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నిరోధకం) మరింత ప్రభావవంతంగా ఉంటుందని చండీగఢ్లోని డాక్టర్లు కనుగొన్నారు. అనుభవపూర్వకమైన, సమగ్ర అభ్యాసంపై దృష్టి సారించిన ‘జాతీయ విద్యా విధానం–2020’, పట్టణ భారతదేశంలో స్థల పరిమితుల సాకును చూపి, 2008 విద్యా హక్కు చట్టంలో తప్పనిసరి చేసిన ముఖ్యమైన ఆట స్థలం అవసరాన్ని తొలగించింది. అయితే ఉపా ధ్యాయులు పిల్లలను రోజుకు రెండుసార్లు కనీసం ఒక గంట బయట నడవడానికి అనుమతించాలి.-అమోద్ గుప్తాఎమెరిటస్ ప్రొఫెసర్,పీజీఐఎమ్ఈఆర్, చండీగఢ్ -
దేశమంటే కేంద్రం కాదోయ్!
‘ఇండియన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ చిక్కుల్లో పడింది. న్యాయం, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలు అందరికీ సమానంగాఅందిస్తూ, ఇండియాను ఆధునిక, ప్రజాస్వా మిక, లౌకిక రాజ్యంగా మార్చడమే రాజ్యాంగ అభిమతం. ఇండియా కాషాయ రంగు ఒక్కటే పులుముకున్న దేశంగా ఉండాలన్న భావన ఏనాడూ లేదు. భిన్న జాతులు, సంస్కృతులు, భాషలతో విలసిల్లే వైవిధ్యభరిత దేశమే లక్ష్యంగా రాజ్యాంగ రచన జరిగింది. ఈ వైవిధ్యత నేడు పెను సవాలు ఎదుర్కొంటోంది. ఇండియాలోని ఒక్కో రాష్ట్రం స్వరూప స్వభావాలు ఒక్కోవిధంగా ఉంటాయి. కాబట్టి వాటిమధ్య రాజకీయ, ఆర్థిక బలాబలాల సమతుల్యత సాధించడం ముఖ్యం. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జనాభాను తగ్గించుకున్న రాష్ట్రాలకు ప్రస్తుత డీలిమిటేషన్ (నియో జకవర్గాల పునర్విభజన) కసరత్తు వల్ల పార్లమెంటులో వెయిటేజ్ తగ్గుతుంది. అలా చేయలేని విఫల రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరిట అధిక పార్లమెంటు స్థానాలిచ్చి సత్కరిస్తున్నారు. పార్లమెంటరీ నియో జక వర్గాల సంఖ్యను ఇప్పుడున్న స్థాయిలోనే శాశ్వతంగా స్తంభింప జేయాలి. డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపేయాలి.విద్య పూర్తిగా రాష్ట్రాలదే!ప్రపంచం ఇప్పుడు సాంకేతిక యుగంలోకి ప్రవేశించింది. విద్యా ప్రమాణాలే సమాజాల ప్రగతిని శాసిస్తాయి. కేంద్ర నిర్వహణలోని ఉన్నత విద్యావిధానం చాలావరకు విఫలమైంది. విద్య యావత్తూ రాష్ట్ర జాబితాలోకి రావాలి. ఏఐసీటీఈ, యూజీసీ వంటి సంస్థల అధికార పరిధి నుంచి రాష్ట్రాలను విముక్తం చేయాలి. వైద్య, న్యాయ, సామాజిక శాస్త్రాల విద్యను మెరుగుపరచడం మాత్రమే నేటి జాతీయ అవసరం. నాణ్యమైన విద్యలో రాష్ట్రాలు పరస్పరం పోటీ పడేవిధంగా విధానాలు ఉండాలి. అంతేతప్ప, సగటు స్థాయి కేంద్రీకృత నిర్వహణ సంస్థలకు తలొగ్గే పరిస్థితి ఉండకూడదు. కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) చెల్లించి పంటలను కొనుగోలు చేయడం అనేది ప్రస్తుతం ఏవో కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకే పరిమిత మైంది. ఇలా సేకరించడం అంటే సబ్సిడీ ఇవ్వడమే. వ్యవసాయ సాగుభూమి ప్రాతిపదికగా, ఈ సేకరణ అన్ని రాష్ట్రాలకూ వర్తింప జేయాలి. ఆహారధాన్యాల్లో తృణధాన్యాలు ఎక్కువ భాగం ఆక్రమి స్తాయి కనుక అన్ని రాష్ట్రాల్లో వాటి సేకరణకు గ్యారెంటీ ఇవ్వాలి. అన్ని రాష్ట్రాల్లో ఇలా సేకరణ చేయడం సాధ్యం కాదనుకున్నప్పుడు, ఆ యా రాష్ట్రాలకు అందుకు బదులుగా గ్రాంట్ల రూపేణా పరిహారం ఇవ్వాలి.గంగా పరివాహకేతర ప్రాంతాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, అల్యూమినియం, రాగి, జింకు, నికెల్ వంటి ఖనిజ వనరులు విరివిగా ఉన్నాయి. ఈ వనరులు ఎవరి భూమి కింద ఉన్నాయో వారికి చెందాలి. అన్ని ఖనిజాల మీద ఆ యా రాష్ట్రాలకే తవ్వకం హక్కులు కట్టబెట్టాలి. వాటి ద్వారా సమకూరే ఆదాయాలు సైతం వాటికే సంక్రమించాలి.పన్నుల్లో వాటా రాష్ట్రాలకు ముందే ఇచ్చేయాలి!రాష్ట్రాలు ఆర్థిక స్వయంప్రతిపత్తి సాధించినప్పుడే నిజమైన సమాఖ్య వ్యవస్థ సాధ్యమవుతుంది. అంటే రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక వనరులుండాలి. ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం, పన్నుల రాబడిలో రాష్ట్రాలకు ప్రస్తుతం 42 శాతం వాటా దక్కాలి. అలా జర గటం లేదు. కేంద్రం వద్ద నిధులు కేంద్రీకృతమవుతున్నాయి. దీనికి తోడు, రాష్ట్రాలకు రావలసిన పన్ను బకాయిలను తొక్కిపట్టే ధోరణి పెరుగుతోంది. రాష్ట్రాలకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆదాయాన్ని కేంద్రం తన పథకాల కోసం వాడుకుంటోంది. దీని నివారణకు మార్గాలు ఆలోచించాలి. పన్ను చెల్లింపు మూలం వద్దే రాష్ట్రాలకుచెందాల్సిన వాటా మినహాయించే విధానం అవసరం. దీనివల్ల సకాలంలో రాష్ట్రాలకు నిధులు అంది, అవి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోగలుగుతాయి. నిధుల బదిలీలో జాప్యం జరిగితే ఆర్బీఐ రేట్ల ప్రకారం వడ్డీ చెల్లించే నిబంధన కూడా ఉండాలి.అలాగే, రాష్ట్రాలకు తమ సాంస్కృతిక చారిత్రక వనరులను పరిరక్షించుకునే హక్కు ఉంది. కేంద్రం తన అధీనంలోని ఆర్కియ లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ద్వారా ఈ పరిరక్షణ హక్కును కాపాడటంలో విఫలమైంది. పురాతన కట్టడాలు, కళాఖండాల సంపద నాశనమవుతోంది. ఈ బాధ్యతను నేరుగా రాష్ట్రాలకే అప్పగించాలి. ఏఎస్ఐ వద్ద ఉండే రాష్ట్రాల నిధులను తక్షణం బదిలీ చేయాలి. ఏఎస్ఐ, కేంద్ర సాంస్కృతిక శాఖ సంకుచిత భావజాలంతో కొన్ని ప్రాంతాల మీద అధిక ప్రేమ కనబరచే ధోరణి పెరుగుతోంది.సైన్యంలో ఆ ఒక్క రాష్ట్రమేనా?సైనిక దళాలు, పారామిలిటరీ దళాల నియామకాలు కొన్నిప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. పరిమిత కాల సర్వీసు, జీవితకాల పెన్షన్, ఇతర బెనిఫిట్స్ కారణంగా యుద్ధ జాతులుగా పరిగణనలో ఉన్న వారికి మిలిటరీలో ఎక్కువ అవకాశాలు దక్కి వారే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. ఇది ఎలా జరుగుతోందో ఉదాహరణలతో పరిశీలిద్దాం. మద్రాస్ రెజిమెంట్ భారత సైన్యంలో అత్యంత పురాతనమైన పదాతిదళం. నీలగిరుల్లోని వెల్లింగ్టన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ రెజిమెంటులో 21 బెటాలియన్లు ఉన్నాయి. దక్షిణ భారతం అంతటికీ చెందిన దాదాపు 27 కోట్ల మంది (భారతీయుల్లో 22 శాతం) దీని పరిధిలోకి వస్తారు. అదే సిక్కు రెజిమెంటును తీసుకుంటే, కేవలం 80 లక్షల జనాభా నుంచి దీనికి ఎంపికలు జరుగుతాయి. ఈ ఒక్క రెజిమెంటులోనే 22 పదాతిదళ బెటాలియన్లు ఉన్నాయి. కేవలం 3 కోట్ల జనాభా ఉన్న పంజాబు రాష్ట్రంలోని అన్ని రెజిమెంట్ల కిందా కలిపి 74 బెటాలియన్లు ఉంటాయి. గ్రామీణ యువ తకు అద్భుత ఉపాధి అవకాశాలు కల్పించే ఒక సంస్థలో ఆ యాప్రాంతాల ప్రాతినిధ్యంలో ఇంతటి అసమానత ఉండటం సమంజసం కాదు. ఇతర ప్రాంతాల నుంచి సైనిక దళాల్లోకి నియామకాలు పెంచాల్సి ఉంది.ఇక మీడియా విషయానికి వద్దాం. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడి యాలు రెండూ భారీ పెట్టుబడితో ముడిపడి ఉంటాయి. పైగా, వీటిని కేంద్ర ప్రభుత్వం, బడా వ్యాపార సంస్థలు అదుపు చేస్తున్నాయి. గమ నించవలసిన అంశం ఏమిటంటే, ఈ రెండూ ప్రముఖంగా ఉన్నా, నేటికీ రేడియో వార్తలు దేశంలో అధిక సంఖ్యాకులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అదుపు చేస్తోంది. రేడియో వార్తలను ఎఫ్ఎం బ్యాండ్స్ మీద ప్రసారం చేయడానికి స్థానిక ఔత్సాహికులను అనుమతించాలి. ప్రింటు, టీవీ ప్రసార మాధ్యమాల నిర్వహణను ప్రయివేటు, ప్రభుత్వ సంస్థలు రెండూ చేపట్టే అనుమతి ఉన్నప్పుడు, అత్యధికులకు అందుబాటులో ఉండే రేడియో ద్వారా సమాచారం అందించడానికి ప్రయివేటు, రాష్ట్ర ప్రభు త్వాలకు ఎందుకు అనుమతి ఇవ్వరో అర్థం కాని విషయం.అన్ని జాతులకూ వర్గాలకూ సమాన గౌరవం దక్కినప్పుడేఇండియా సమైక్యత వికసిస్తుంది. ప్రతి ఒక్కరికీ తమ వాణి వినిపించే అవకాశం కల్పించిన రాజ్యాంగం రాష్ట్రాలను ఒక రాజకీయ సమాహా రంగా కూర్చింది. అందుకు భిన్నంగా దేశాన్ని ఏకవర్ణంగా, ఏకశిలగా మార్చే ఎలాంటి ప్రయత్నం చేసినా అది దుస్సాహసం అవుతుంది. అదే జరిగితే రాజ్యాంగ మౌలిక భావన కుప్పకూలుతుంది. యూని యన్ విచ్ఛిన్నం అవుతుంది.-వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత , మోహన్ గురుస్వామి- mohanguru@gmail.com -
Operation Kagar: అభివృద్ధి అంటే అడవుల నరికివేతా?
ఈ వారం అన్ని ప్రధాన స్రవంతి వార్తా పత్రికలూ, ఛానళ్లూ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఎన్కౌంటర్ వార్తతో, అనుబంధ వార్తలతో, వ్యాఖ్యా, విశ్లేషణా వ్యాసాలతో నిండిపోయాయి. సామాజిక మాధ్యమాలైతే చెప్పనక్కరలేదు. ఒక సుప్రసిద్ధ ప్రధాన స్రవంతి ఇంగ్లిష్ దినపత్రిక ఆ వార్తను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురిస్తూ, ఉద్దేశపూర్వకంగానో, అనుద్దేశపూర్వకంగానో ఆ మూడు కాలమ్ల వార్తకు పక్కనే మరొక రెండు కాలమ్ల వార్త కూడా వేసి... చాలా పెద్దవయ్యాయి గనుక రెండు వార్తలనూ రెండో పేజీలో కూడా పక్కపక్కనే కొనసాగించింది. ఆ రెండు వార్తల మధ్య కార్య కారణ సంబంధం ఉండడం ఆ పత్రిక చెప్పకుండానే చెప్పిన రహస్యం. ఆదివాసుల, మావోయిస్టుల వ్యతిరేకత వల్ల పద్దెని మిదేళ్లుగా ఆగిపోతున్న ఆ ‘అభివృద్ధి’ పథకాన్ని కొనసాగించడం గురించి వార్తా, మావోయిస్టు ప్రధాన కార్యదర్శిని చంపి వేసిన వార్తా పక్కపక్కనే కలిసి రావడం ఒక తలకిందుల కవితాన్యాయం.మహారాష్ట్ర లోని మావోయిస్టు ప్రభావిత గడ్చిరోలిజిల్లాలో ఇనుప ఖనిజం శుద్ధి కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖమే 12న అనుమతి ఇచ్చిందనేది ఆ వార్త. ఒకవైపు ‘ఆపరేషన్ కగార్’ పేరిట ఎడాపెడా ఎన్కౌంటర్లు జరుపుతూ ఆది వాసులను భయోత్పాతంలో ముంచుతున్న సందర్భంలోనే ఈ అనుమతి వచ్చిందని ప్రత్యేకంగా గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడానికి ముందు మహారాష్ట్ర మంత్రివర్గం గడ్చిరోలీ జిల్లా గనుల తవ్వకపు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసిందని కూడా ఆ వార్తలోనే ఉంది. మావోయిస్టు నిర్మూలన, ఆదివాసుల తరలింపు అనే ప్రణాళిక దండకారణ్యంలోని ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడానికే అనే ఆరోపణను నిజం చేస్తూ, ఈ శుద్ధి కర్మాగారం కోసం భారత ప్రభుత్వం ‘లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్’ అనే బహుళజాతి కార్పొరేట్ సంస్థకు 2,324 ఎకరాల అడవిని ధారాదత్తం చేసింది. ఈ ‘అభివృద్ధి’ కింద ఒక లక్షా ఇరవై మూడు వేల చెట్లను నరికి వేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదీ చదవండి: మెకంజీ షాక్, ప్రియురాలితో రెండో పెళ్లికిముందే జాగ్రత్తపడుతున్న జెఫ్ బెజోస్నిజానికి ఈ కంపెనీకి ఇక్కడ 2007లోనే ఇరవై సంవ త్సరాల లీజు కింద వెయ్యి ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఆ లీజు వ్యవధిని మరొక ముప్పై సంవత్సరాలు పెంచారు. అంటే ఆ కంపెనీ ఇక్కడి ఖనిజ వనరులను 2057 వరకూ తవ్వుకుపోవచ్చు. అయితే ఆ ప్రాంతంలో ఆదివాసులు తమ ‘జల్, జంగల్, జమీన్’లను కార్పొరేట్లకు ఇవ్వడానికి అంగీకరించబోమని, అలా ఇవ్వడం రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో, ‘1996 పంచా యత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం’లో, ‘2006 అటవీ హక్కుల చట్టం’లో ఉన్న నిబంధనలకు వ్యతిరేకమని పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటానికి మావోయిస్టులుఅండగా నిలిచారు. ఆ కారణం వల్లనో, మరే కారణం వల్లనో లాయిడ్ స్టీల్ కంపెనీ 2016 దాకా తవ్వకాలు ప్రారంభించలేకపోయింది. 2016లో తవ్వకాలు ప్రారంభించినప్పటికీ, ఆదివాసుల, మావోయిస్టుల వ్యతిరేకత మరింత క్రియాశీలంగా మారి 2016 డిసెంబర్లో సుర్జాఘర్ గనుల దగ్గర లాయిడ్ కంపెనీకి చెందిన ట్రక్కులను, ఎర్త్ మూవర్లను తగులబెట్టడంతో గనుల తవ్వకం ఆగిపోయింది. ఇప్పుడు ఆ ఆగిపోయిన గనుల తవ్వకానికి, అదనంగా అక్కడే ఒక శుద్ధి కర్మాగారం పెట్టుకోవడానికి అనుమతు లిచ్చా రన్నమాట. ఆ వార్త కూడా సరిగ్గా మావోయిస్టు కార్యదర్శి చని పోయిన రోజు ప్రకటించారన్నమాట. ఇప్పుడు ఇస్తున్న అనుమ తులకు కాగితం మీద కొన్ని షరతులు ఉన్నమాట నిజమే. ఇక్కడ ఒక లక్షా ఇరవై మూడు వేల చెట్లను నరికినందుకు, 2,400 ఎకరాల అడవిని నాశనం చేసినందుకు, అక్కడి నుంచి వెయ్యి కి.మీ. అవతల అరేబియా సముద్ర తీరంలో చిప్లున్, రత్నగిరి ప్రాంతాల్లో సమానమైన విస్తీర్ణంలో మొక్కలు నాటాలని ఒక షరతు ఉంది. ఇటువంటి అడవిని నరికే అనుమతులు పొందిన వారందరికీ అటువంటి షరతులు ఉండడమూ, వాటిని తుంగలో తొక్కి, భయంకరమైన ఉల్లంఘనలను ఆమోదించడమూ దశాబ్దాలుగా యథావిధిగా జరిగిపోతూనే ఉన్నాయి.ఇలా అడవిని పందారం చెయ్యడం ఆదివాసుల హక్కులకు మాత్రమే కాదు... దేశ సంపదకు, ప్రజల ఆరోగ్యానికి, భద్రతకు, పర్యావరణానికి, భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదకరం. ఈ గడ్చిరోలి అడవి మహారాష్ట్రలోకి విస్తరించిన దండకారణ్యంలో భాగం.చదవండి: అరుదైన ఆపరేషన్.. మెడలోంచి మెదడులోకి 8 సెం.మీ మేకు!దండకారణ్యం దేశానికే ఊపిరితిత్తుల వంటిది. అక్కడ ఆ సువిశా లమైన, దట్టమైన అరణ్యాలు ఉండడం వల్లనే దేశంలో జీవ వైవిధ్యం మిగిలి ఉంది. అక్కడ పుట్టిన అనేక నదులు దేశంలో, కనీసం మధ్య భారతంలో భూగర్భ జలాలను రక్షిస్తున్నాయి. ఆ అడవి సువిశాల ప్రాంతాలకు ప్రాణవాయువును అందిస్తున్నది. పర్యావరణ రీత్యా ఇంత సుసంపన్నమైన ఈ అడవిలో దాదాపు ముప్పై ఖనిజాలు కోట్లాది టన్నులు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ ఖనిజ నిలువలు దేశ సంపద. దాన్ని పొదుపుగా వాడుకుని, భవిష్యత్త రాలకు అందించడం ఈ తరం బాధ్యత. ఐదేళ్ల కోసం అధికారం పొందినవారు యాభై ఏళ్ల భవిష్యత్తును కార్పొరేట్ లాభాపేక్షకు, ఆశ్రితులకు రాసి ఇస్తున్నారు. ఆ సంపద కొల్లగొట్టడానికి అక్కడి నుంచి ఆదివాసులను ఖాళీ చేయించదలచారు. ఆదివాసులకు మద్దతుగా ఉన్న ఉద్యమకారులను నిర్మూలించ దలచారు. ఆదివాసుల మీద ప్రభుత్వాలు, కార్పొరేట్లు, మైదాన ప్రాంతవాసులు దాడి చేసి జాతులకు జాతులనే అంతరింపజేసిన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఉంది గనుకనే, భారత రాజ్యాంగం ఐదవ, ఆరవ షెడ్యూళ్లలో ఆ ప్రాంతాలకు, ఆ ప్రాంతాలలోని ఆదివాసులకు ప్రత్యేక రక్షణలు కల్పించింది. ‘పేసా చట్టం –1996’లో, ‘ఎఫ్ఆర్ ఏ చట్టం –2006’లో ఆ రక్షణలను విస్తరించింది. ఇప్పుడు జరుగుతున్న ఈ అడవుల పందారం ఆ చట్టాలన్నిటి ఉల్లంఘన. ఇది కేవలం మావోయిస్టుల సమస్యో, ఆదివాసుల సమస్యో కాదు. ఇది ఈ దేశంలో ప్రతి ఒక్కరి సమస్య. ఈ దేశాన్ని ప్రేమించేవారందరి సమస్య. -ఎన్ వేణుగోపాల్ ‘వీక్షణం’ ఎడిటర్ -
ఏఐకి విరుగుడు సహజ మేధ
మీ వంటింట్లోని పళ్లేలు, గిన్నెలు వాడి వాడి మొహం మొత్తాయా? లేదు కదా! అవి మీకు వారసత్వంగా వచ్చాయి. వాటి మీద ఇప్పటికీ మీ పూర్వీకుల పేర్లు ఉండొచ్చు. ఆ పేర్లు చూసినప్పుడల్లా వారిని స్మరించుకుంటాం. ఆ పాత్రల్లో మన ఆహారపు అల వాట్లు ప్రతిఫలిస్తుంటాయి. ఆ పళ్లేలలో కొన్ని తరాల వారు భోజనాలు చేశారు.ఇత్తడి గ్లాసులు, రాగి పాత్రలు, గరి టెలు, మసిబారిన కళాయిలు, పెనాలు, పింగాణీ పాత్రలు, పలురకాల చాకులు, కొబ్బరి కోరే పరికరాలు, కాఫీ గింజల మరలు, మజ్జిగ చిలికే కవ్వాలు... వీటిని మీరు ఆప్యాయంగా చూడండి.అంతేకానీ పాత ఇనుప సామాను కింద తీసేయకండి. ఇవన్నీ ఇప్పుడు అంతరించిపోతున్న జీవజాలం కోవలోకి చేరుతున్నాయి. ఆధునికమైన విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వచ్చాయి. తరతరాల స్మృతులను మన ముందు నిలిపే మన సాంప్రదాయిక వంటిల్లు మీద ఇవి దాడి చేస్తున్నాయి. పాతవైనా పారేసుకోలేనివి!అలాగే, జీర్ణావస్థకు చేరిన పాత కాటన్ చీరలు, పట్టు చీరలు, ధోతీలు, కుర్తాలు, పైజామాలు, చిల్లులు పడిన స్వెట్టర్లు,మఫ్లర్లు, గ్లవ్స్... వీటిని కూడా పారేయకండి. అన్నీ కాకపోయినా కొన్నింటినైనా దాచుకోండి. అవి పాతబడ్డాయే కానీ చచ్చిపోలేదు. వాటిని మళ్లీ బాగు చేసుకోవచ్చు. దర్జీ ఎక్కడైనా దొరుకుతాడేమో వెతకండి. వాచీలు, టైమ్ పీస్లు, గోడ గడియారాలను కాలం కాటేసింది. వీటిని మెయిన్టెయిన్ చేయడం కష్టం. ఎందుకంటే రిపేరు వస్తే స్పేర్ పార్టులు దొరకవు. కంటికి దుర్భిణి పెట్టుకుని పెద్ద పళ్ల చక్రాల్లోపల ఉండే చిన్న చిన్నపళ్ల చక్రాలకు మరమ్మతులు చేసే ఈ రిపేరువాలాలు కాలానికి చలనం తెప్పిస్తారు. గడియారాల పాలిట వీరు కంటి ఆపరేషన్లు చేసే వైద్యుల్లాంటి వారు. వీరి నైపుణ్యం గొప్పగా ఉంటుంది. పాత వాచీలు రిపేర్ చేసే ఇలాంటి వారూ ఇప్పుడు కనుమరుగవుతున్నారు.పాతకాలపు గడియారాలకు బదులుగా డిజిటల్ ‘హారర్స్’ వచ్చాయి. ఇవి 8 అనే ఒక్క డిజిటల్ అంకెను రకరకాలుగా మార్చి టైమ్ను మన మొహాన కొడతాయి. గంటలకు నిమిషాలకు, నిమిషాలకు సెకన్లకు మధ్య ఒక కోలన్ పెట్టి కాలాన్ని ప్రదర్శిస్తాయి. క్షణం క్షణం మారే ఈ అంకెలు ‘మన టైం దగ్గరపడుతోంద’ని చెబుతున్నట్లుగా అనిపిస్తుంది.ఇక పుస్తకాలు. పాతబడిన కొద్దీ వాటికి విలువ ఎక్కువ.కారణం – అవి గొప్ప రచయితలవి కావడం మాత్రమే కాదు, వాటిలోని అక్షరాలు చదివిన కళ్లు, వాటి పేజీలు తిప్పిన వేళ్లు ఇప్పుడు లేవు. అసంఖ్యాకులైన వాటి పాఠకులు తమ గుండెల్లో ఆనందా నుభూతిని పదిలపరుచుకుని మరో ప్రపంచానికి వెళ్లిపోయారు. ఈ పుస్తకాలు రద్దీవాలాల చేతికి వెళ్తే రీసైకిల్ అవుతాయి. శాశ్వతంగా అదృశ్యమవుతాయి. అదృష్టం బావుంటే, కొన్ని సెకండ్ హ్యాండ్ బుక్ షాపులకు చేరతాయి. అక్కడ మాత్రం మీ లాంటి పుస్తక ప్రేమికులు వాటి విలువ గుర్తిస్తారు. అరుదైన పుస్తకాలతో వారు తమ బుక్ షెల్ఫ్లను నింపేస్తారు.సంగీతానిదీ ఇదే పరిస్థితి. స్లో మూవింగ్ రికార్డులు పోయి ఎల్పీలు వచ్చాయి. వాటి స్థానంలో క్యాసెట్లు, క్యాసెట్లు పోయి సీడీలు ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు ఇవేవీ అక్కర్లేదు. ల్యాప్ టాప్, మొబైల్, లేదంటే బ్లూటూత్ సాధనాలు ఉంటే చాలు. అయితే మీరు పాత పాటల షాపులకు వెళ్లి చూడండి. నిజమైన బీథోవెన్, బాక్, నిజమైన ఆమిర్ ఖాన్, రవిశంకర్, బేగమ్ అఖ్తర్, ఎంఎస్ సుబ్బులక్ష్మి పాటలు, సంగీతం మీకక్కడ దొరుకుతాయి. అందుకే ఈ ఓల్డ్ మ్యూజిక్ స్టోర్స్ అమూల్యమైనవి. మార్కెట్లో బీథోవెన్ లాంటి లేదా అంతకంటే చక్కగా వినిపించే మ్యూజిక్ దొరకవచ్చు. కానీ అది ఒరిజినల్ కాదు. అలాగే, ఎంఎస్ సంగీతం లభిస్తుంది. కానీ అది నైటింగేల్ ఆఫ్ ఇండియాది కాదు కదా!అసలైనది వదులుకోవద్దు!ఈ రియల్, ఒరిజినల్, ట్రూ స్టఫ్కు ఇప్పుడు ఇంట్లో చోటెక్కడుందని మీరు అడగొచ్చు. ఒకప్పుడు మనం అనేక గదుల ఇళ్లలో ఉండేవాళ్లం. క్రమంగా చిన్న కుటుంబాలుగా మారుతూ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్కు పరిమితం అవుతున్నాం. నిత్యావసరాలకు అవస రమయ్యే సాధారణ ఉపకరణాలు, ఫర్నిచర్కే జాగా లేనప్పుడు, లవ్లీగా ఉన్నాయని చెప్పి ఈ పాత వస్తువులను ఎక్కడ దాచుకోవాలి? ఈ ప్రశ్నలో ఔచిత్యం లేకపోలేదు.ఇక్కడ మీకొక విషయం స్పష్టం చేస్తాను. ఏది ‘రియల్’ అనేది చెప్పడానికే ఇవన్నీ ప్రస్తావించి కొంత ఆలంకారికంగా చెప్పాను. దీనికి ఇంకొక పదం ఉంది. రియల్కు బదులు ఆర్గానిక్ అనవచ్చు. ఆర్గానిక్ అనగానే రసాయనాలు వాడకుండా పండించే పళ్లు, కూర గాయలు, తృణధాన్యాలు అనుకుంటారు. నేను వాడుతున్నది ఆ అర్థంలో కాదు. ఏఐ (కృత్రిమ మేధ) యుగంలో ఆర్గానిక్ అంటే ఏమిటనే దాని గురించి మాట్లాడుతున్నాను. ఏదైతే ఒకరి అంత రాత్మకు వాస్తవం అనిపిస్తుందో అదే ఈ సందర్భంలో ఆర్గానిక్ అవుతుంది. ఈ ఏఐ కాలంలో... ఆర్గానిక్, వాస్తవ, యథార్థ అంశాలే మన ఎంపిక కావాలి. ఏఐతో ఔషధ, విద్యా రంగాల్లో అద్భుత ప్రయోజనాలు ఉన్న మాట నిజమే. అయినా ఏఐ కావాలా, ఏఐ వద్దా అనేది మనం ఎంచుకోవలసి ఉంటుంది. అయితే, అతి తొందర్లోనే ఈ చర్చ కేవలం ఒక విద్యావిషయికమైందిగా మిగిలి పోతుంది. బదులుగా, ఈ ఏఐ కావాలా, ఆ ఏఐ కావాలా అనేదే తేల్చుకోవలసి ఉంటుంది. ఏఐని కొత్త దేవుడు అనుకోనవసరం లేదు; అలాగే అపరిమిత జ్ఞానం కోసం దయ్యానికి ఆత్మను అమ్ముకోవాలేమోనన్న భీతి కూడా అనవసరం. ఏఐని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. మనకు ఏం కావాలో నిర్ణయించే అధికారం ఏఐకి అప్పగించకూడదు. ఏఐ విషయంలో మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి. ఆర్గానిక్ వెర్సస్ ఆర్టిఫిషియల్ అనే చర్చ అంతా, మనం ఏఐకి బాస్ గానే కానీ బానిసగా ఉండకూడదన్న అంశం మీదే! ఏఐ మనకు ఏం అందిస్తుందనేదే తప్ప మనం ఏఐకి ఏం సమర్పించుకుంటామన్నది ప్రశ్న కారాదు.యుద్ధంలో ఏఐ సునాయాసంగా మూకుమ్మడి విధ్వంసం సృష్టించగలదు. ఈ ప్రళయాన్ని ఎంచుకునే స్వేచ్ఛను మనం ఏఐకి ఇస్తామా? లేదా ఇలాంటి సామూహిక ఆత్మహత్యా సదృశ నిర్ణయం తీసుకోకుండా అడ్డుకునే ఛాయిస్ మన ఆర్గానిక్ మేధకే ఉంటుందా? ఇదే ప్రధానం.ఆర్టిఫిషియల్గా ఉండటం మేధ. ఆర్గానిక్గా ఉండటం విజ్ఞత. మనం ఆహారం తినాలి గానీ ఆహారం లాంటిది కాదన్న, అసలైన పానీయాన్నే డ్రింక్ చేయాలి గానీ నురగను కాదన్న వివేచన కలిగి ఉండటమే ఆర్గానిక్ ఇంటెలిజన్స్.కృత్రిమ మేధ యుగంలో సహజ మేధతో ఉండటమంటే... మనం చూడని, మనకు తెలియని, మనం ఎంతమాత్రం అదుపు చేయలేని యంత్రం ముందు మోకరిల్లి, అది చెప్పినట్లు ఆడటం కాదు; మనం ఏం చేయాలో ఎంచుకునే అధికారం మనకు ఉండి తీరాలి! గోపాలకృష్ణ గాంధీ వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, ఆధునిక భారత చరిత్ర విద్యార్థి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
రాజకీయ పార్టీల గెలుపు మంత్రం ఇదే!
మనకు తెలిసిన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల పార్టీలే. కొందరు వాటిని గొప్పగా పార్లమెంటరీ ప్రజాస్వామిక పంథా పార్టీలు అనుకోవచ్చు. అప్పట్లో పీపుల్స్ వార్, ఇప్పట్లో సీపీఐ– మావోయిస్టు పార్టీ ఒక్కటే దీనికి భిన్నంగా ఉంటూ వచ్చింది. అది తన పరిధి పరిమితుల్లో సాయుధపోరాట పంథాను కొనసాగిస్తూ ఉండేది. ప్రస్తుతం దాని భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మావోయిస్టు పార్టీ కూడా ఎన్నికల పంథాను స్వీకరించవచ్చు అనే ఊహాగానాలు అప్పుడే వినిపిస్తున్నాయి.స్వాతంత్య్రానంతర కాలపు తొలి దశ రాజకీయాలు (Politics) వేరు. అవి ఎంతో కొంత సిద్ధాంతపరంగా ఉండేవి. వాటి ఆర్థిక విధానాలు ఆదర్శవంతంగా ఉండేవి. ఇటు వ్యవసాయ రంగంలోనూ, అటు పారిశ్రామిక రంగంలోనూ ఉత్పత్తిని పెంచడానికి భారీ ప్రాజెక్టుల్ని నిర్మించడం మీద కాంగ్రెస్ దృష్టి పెట్టేది. ఇటు రైతు కూలీలు, అటు శ్రామికుల శ్రేయస్సు దిశగా కమ్యూనిస్టు పార్టీల కృషి సాగుతుండేది. రాజకీయాల్లో కులమతాలకు ఒక పాత్ర, పెట్టుబడికి ఇంకో పాత్ర ఉంటుంది. మన ఆలోచనాపరులది ఒంటికన్ను వ్యవహారం. కులమతాల్ని చూసేవాళ్లు పెట్టుబడిని చూడలేరు; పెట్టుబడిని చూసేవాళ్లు కులమతాల్ని చూడలేరు. నిజానికి ఎన్నికల్లో కులమతాల కన్నా పెట్టుబడి ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడయినా సరే పెద్ద పెట్టుబడి చిన్న పెట్టు బడుల్ని తనవైపు లాక్కుంటుంది. రాజకీయ కూటములు అలాగే ఏర్పడుతుంటాయి. దేశ తొలి ఎన్నికల్లో ప్రధాని నుండి రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు దాదాపు అందరూ బ్రాహ్మణ సామాజిక వర్గం నుండే ఎన్నికయ్యారు. ఆ తరువాత వ్యావసాయిక కులాల్లో పెట్టుబడి పెరిగింది. సహజంగానే రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోనికి మారింది. ఆ తరువాత వెనుకబడిన తరగతుల్లోనూ పెట్టుబడి పోగవడం మొదలయింది. వాళ్ళూ కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులయ్యారు.ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది. ఎస్సీ, బీసీలకు అధికారం వచ్చిందనడం అర్ధసత్యం మాత్రమే! ఎస్సీ, బీసీ కులాల్లో పెట్టుబడి ఎక్కువగా పోగయిన కులాలకు, కుటుంబాలకు మాత్రమే అధికారం దక్కుతుంది. కులమతాలకూ, పెట్టుబడికీ ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోకపోతే వర్తమాన రాజకీయాలు అర్థం కావు.1991లో సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఆర్థిక విధానాలు వచ్చాక రాజకీయాలు ఫక్తు వాణిజ్య వ్యవహారంగా మారిపోయాయి. కొంతకాలం ఆశావహులుగా కొనసాగిన ఎస్సీ, బీసీ రాజకీయ పార్టీల్ని వాణిజ్య రాజకీయాలు గట్టిగా దెబ్బతీశాయి. స్వాతంత్య్రానంతర రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్స్ వేసుకుని బతికిన ముస్లిం సమూహానికి ఆర్థిక పునాది బీటలు వారడంతో ప్రేక్షక పాత్రకు పరిమితం కావలసి వచ్చింది. పైకి ఎంత వైవిధ్యపూరితంగా కనిపించినా సమస్త రాజకీయ పార్టీల గెలుపు మంత్రం ఒక్కటే; 20: 80! శత్రు వర్గం 20; సొంత వర్గం 80. 20 వాళ్ళు; 80 మనం!ఓటర్లలో 20 శాతంగా ఉండే రాజవంశీకులు, బడా భూస్వాములకు తాను వ్యతిరేకం అని కాంగ్రెస్ చెప్పుకొనేది. మిగిలిన 80 శాతం ఓటర్లను ఎన్నికల్లో ఆకర్షించడానికి ఆ పార్టీ ప్రయత్నించేది. అది క్యాచ్మెంట్ ఏరియా; ఆరగాణి ప్రాంతం. అందులో సగం ఓట్లు పడినా విజయం తథ్యం. మరోవైపు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఓటర్లల్లో 20 శాతంగా ఉండే పెట్టుబడిదారులు, భూస్వాములకు తాము వ్యతిరేకులమనీ, 80 శాతంగా ఉండే కార్మికులు, వ్యవసాయకూలీలకు తాము రక్షకులమనీ చెప్పుకొనేవి. 1990వ దశకంలో బహుజన రాజకీయాల్ని ముందుకు తెచ్చిన కాన్షీరామ్ కూడా దేశంలో పెత్తందారీ కులాలు 20 శాతం మాత్రమేననీ, 80 శాతం మంది బహుజనులనీ లెక్కలు కట్టి మరీ చెప్పేవారు.భారతీయ జనతా పార్టీది కూడా సరిగ్గా అదే వ్యూహం. దేశంలో 20 శాతం మాత్రమే హిందూయేతరులు; 80 శాతం హిందువులు అనేది దాని విభజన. మనుషులకుండే సమస్త భావోద్వేగాల్లో మతం చాలా శక్తిమంతమైనది. ఈ 80 శాతం హిందువుల్లో 36 శాతం ఓట్లు పడినా అధికారం ఖాయం అని గత మూడు ఎన్నికల్లో బీజేపీ నిరూపించింది. మతభావోద్వేగాలనీ, కార్పొరేట్ శక్తుల్నీ, రాజకీయ అధికారాన్నీ మిళితం చేయడంలో బీజేపీ గొప్ప నైపుణ్యాన్ని సాధించింది. ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాల్ని రచించడానికి దాదాపు అన్ని పార్టీలూ తలలు పగలగొట్టుకుంటున్నాయి. కార్పొరేట్ మతతత్త్వ నియంతృత్వాన్ని ఎదుర్కోవడానికి ఓటర్లలో 80 శాతాన్ని ఏకం చేసే బైండింగ్ వైర్ను కనిపెట్టడం అంత సులువు కాదు. కమ్యూనిస్టులు, అంబేడ్కరైట్లు ఏకం అయితే (లాల్– నీల్ మైత్రి) బీజేపీని నిలవరించవచ్చు అనేది ఒక ఆలోచన. 2019 ఎన్నికల్లో దీన్ని ప్రయోగాత్మకంగా తెలంగాణలో అమలు చేశారు. మొత్తం రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్క లేదు. ఓటర్లు తిరస్కరించారు.చదవండి: డాలర్ డ్రీమ్స్ ముగింపులో మరో కొత్త బంగారు లోకంమరోవైపు, ఒక వ్యూహం ప్రకారం అంబేడ్కర్ను బీజేపీ క్రమంగా హైజాక్ చేసింది. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్లోనే ఉనికిని కోల్పోయింది. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ఆ పార్టీకి ఒక్క స్థానం మాత్రమే దక్కింది. దాదాపు మూడున్నర దశాబ్దాలు నిరాఘాటంగా పశ్చిమ బెంగాల్ను ఏలిన సీపీఎం 2021 ఎన్నికల్లో తనకున్న 26 సీట్లనూ కోల్పోగా బీజేపీ (BJP) అదనంగా 74 సీట్లు గెలుచుకుంది. కమ్యూనిస్టుల స్పేస్ను కూడా బీజేపీ ఆక్రమించుకుంటున్నది అనడానికి ఇదొక ఉదాహరణ. అంబేడ్కరైట్లు, కమ్యూనిస్టులు కొత్తగా ఆదివాసులు, మైనారిటీలతో (లాల్ – నీల్ – హర్యాలీ) కలిసి నడిస్తే ఎమైనా మెరుగైన ఫలితాలు వస్తాయా? అనేది ఒక కొత్త ఆలోచన. ముందు అలాంటి కూటమి ఏర్పడాలి. అంత పెట్టుబడి సమకూరాలి. ఆ తరువాత అది ఎన్నికల్లో పనిచేయాలి. వచ్చే ఎన్నికల వరకు ఇంకే మార్పులు వస్తాయో చూడాలి.- డానీసమాజ విశ్లేషకులు -
India-UK deal రెండింటికీ లాభమే!
ఇటీవలి కాలంలో వస్తువుల తయారీలో చైనా, కంప్యూటర్ రంగ సేవలలో భారత్ ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అమెరికా, పశ్చిమ యూరప్ దేశాలు పరిశోధన, కొత్త వస్తువులు కనుగొనడంలో ముందంజలో ఉన్నాయి. అమెరికా అనేక దేశాల నుండి వస్తు–సేవలను విరివిగా దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా గత శతాబ్దం ఆఖరి రెండు దశాబ్దాలలో ప్రపంచ వాణిజ్యం విరివిగా పెరిగింది. ఈ సమ యంలో అమెరికా దిగుమతులు పెరగడం వల్ల ఆ దేశ పారిశ్రామిక రంగ అభివృద్ధి కొంతవరకు తగ్గుముఖం పట్టింది. తిరిగి విరివిగా తమ దేశంలోనే వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతులు పెంచి గత వైభావాన్ని తిరిగి సాధించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా దిగుమతి సుంకాలను పెంచడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నడుం బిగించారు. అలాగే పశ్చిమ ఐరోపా దేశాలు కూడా ఈ దిశలోనే అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలలో భాగమే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు.ఈ మే నెల ఆరవ తేదీన భారత్–బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (India-UK free trade agreement) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాలూ లాభంపొందాలని చూస్తున్నాయి. ఒప్పందం ఫలితంగా ఇరు దేశాలలో వస్తుసేవల ఉత్పత్తిపై పడే వ్యతిరేక ప్రభావాన్ని తగ్గించడానికి క్రమ క్రమంగా ఉభయ దేశాలూ సుమారు పదేళ్ల కాలంలో దిగుమతి సుంకాలను చాలా వరకు తగ్గించి నామ మాత్రపు సుంకాలనే విధిస్తాయి. దీనివల్ల భారత్ జౌళి ఉత్పత్తులను ఇతోధికంగా బ్రిటన్కు ఎగుమతి చేయవచ్చు. మన పౌరులు బ్రిటన్లో ప్రస్తుతం కంటే సులభంగా ఉద్యోగాలు పొందవచ్చు. ఇందుకు ప్రతిఫలంగా విస్కీ లాంటి మత్తు పానీయాలపై భారత్ వెంటనే దిగుమతి సుంకాలు తగ్గిస్తుంది. అలాగే కొన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులు, మాంసం ఉత్పత్తులపై కూడా భారత్ తక్కువ దిగుమతి సుంకాలు విధిస్తుంది. ఇందువలన భారత్లో అ వస్తువుల ఉత్పత్తిదారులు కొంత ఇబ్బంది పడే మాట వాస్తవమే. మొత్తం మీద ఈ ఒప్పందం రెండు దేశాలకూ లాభసాటి అనేది నిపుణుల భావన.అమెరికా, ఐరోపాలతో కూడా ఇటువంటి ఒప్పందాలు చేసుకుని ఎగుమతులు పెంచడానికి భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాలు తగ్గించాలని అమెరికా పట్టుబడుతోంది. అయితే వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు మన రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకం. అందువలన భారత్ ఏ దేశంతో అయినా ఆచి తూచి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి.– శ్రీరామ్ చేకూరి, జె.ఎస్. సుధాకరుడు ఆర్థిక రంగ నిపుణులు -
పెరుగుతున్న చైనా ప్రాబల్యం
పహల్గామ్లో ఉగ్రదాడిపై భారత్ స్పందించిన తీరు, తదనంతర పరిణా మాలు ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో మౌలికంగా తీసుకొచ్చిన మార్పులేమీ లేకపోవచ్చు. కానీ, దక్షిణాసియాలో రూపు దిద్దుకుంటున్న ప్రాబల్య సమతూకానికి సంబంధించి అవి కొన్ని ముఖ్యమైన దృక్కోణాలను బయటపెట్టాయి. ఈసారి భారత్–పాకిస్తాన్ల మధ్య నెలకొన్న తాజా సైనిక ప్రతిష్టంభన మునుపటి దృష్టాంతాలకు భిన్నమైంది. భారత్ –పాక్ల మధ్య సైనిక ఘర్షణ పరస్పరం అణ్వాయుధాలను ప్రయో గించుకోగల స్థితికి చేరుతోందని అమెరికా పొరపడింది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చకుండా రెండు దేశాల నాయకులకూ రాత్రికి రాత్రి అమె రికా ఫోన్లు చేసి ఉండవచ్చు. కానీ, ఒకటి మాత్రం స్పష్టం. ఇది ప్రాంతీయ ఆధిపత్య సమతూకపు స్థితిగతులను మార్చి వేసింది. సూటిగా చెప్పాలంటే, దక్షిణాసియాను అత్యంత ప్రభావితం చేయగలి గిన శక్తిగా అమెరికా స్థానాన్ని చైనా ఆక్రమించిందని చెప్పడం సబబు.ఇండియాకు గట్టి మద్దతివ్వని రష్యాప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన సైనిక శక్తిగా అమెరికా ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయాలను ప్రభా వితం చేయగల అవకాశం సదరు దేశపు శక్తితోపాటు అభిమతంపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి సంబంధించి స్పష్టమైన వ్యూహాత్మక ప్రయోజనం అమెరికాకు కొరవడినట్లుగా కని పిస్తోంది. ఫలితంగా, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని శాసించగల శక్తిగా ఉన్న అమెరికా ఇపుడు నామమాత్రపు పాత్రధారి స్థాయికి కుంచించుకుపోయింది. అటూఇటూగా వాషింగ్టన్ స్థానాన్ని బీజింగ్ ఆక్ర మించింది. ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న చైనా దౌత్యపరమైన యుక్తిని ప్రదర్శిస్తూ ఆయుధాల సరఫరాదారుగా, మధ్యవర్తిగా ఈ ప్రాంతపు పరిణామాలను నిర్దేశించగల స్థితిలో ఉంది. ప్రాంతీయ సైనిక ఘర్షణలు, దౌత్యపరమైన ప్రతిష్టంభనలు, రాజకీయ వాద వివాదాలకు తీర్పరిగా వ్యవహరించాలని చైనా కోరు కుంటోంది. ఇటీవల పాక్కు అందించినట్లుగానే హైటెక్ ఆయుధాల సరఫరా ద్వారా, లేదా దౌత్యపరంగా ప్రత్యక్షంగా జోక్యం చేసు కోవడం, ఆర్థికపరమైన ఒత్తిడిని తీసుకురావడంతో అది ఆ యా పను లను చక్కబెట్టాలని భావిస్తోంది. దక్షిణాసియా, ఇండో–పసిఫిక్లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం ఇప్పటికే కనిపిస్తోంది. కానీ, అది సైనికపరంగా వత్తాసు ఇస్తానని పాక్కు చెప్పడం, తాజా భారత–పాక్ ఘర్షణలో ప్రధానాంశం.అలాగే, భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామిగా అండగా నిలవడంలో రష్యా సామర్థ్యం తగ్గిన సంగతిని గమనించవలసిఉంది. ఇటీవలి ప్రతిష్టంభనలో రష్యా వైఖరి సాధారణంగా ఇతర దేశాలు చూపే మాదిరిగానే ఉంది. అది భారతదేశానికి బాహాటంగా మద్దతు ప్రకటించలేదు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు సరికదా, భారత సైనిక చర్యలకు ఆమోదం కూడా తెలుపలేదు. ‘‘ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. అవి ఏ రూపంలో వ్యక్తమైనా వ్యతిరేకిస్తోంది. ఈ రాక్షసత్వంపై సమర్థంగా పోరాడటా నికి మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఏకోన్ముఖంగా ప్రయత్నాలు సాగించవలసిన అవసరం ఉందని భావిస్తోంది’’ అని రష్యా విదేశీ వ్యవ హారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఘర్షణలు మరింత ముదరకుండా సంయమనం పాటించవలసిందని రష్యా రెండు పక్షాలనూ కోరింది. ఒక రకంగా, రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఘర్షణ సందర్భంలో భారత్ ఏం చెప్పిందో, భారత్–పాక్ ఘర్షణపై రష్యా అదే చెప్పింది. రష్యా–పాశ్చాత్య దేశాల మధ్య భారత్ సమతూకం పాటించినట్లు గానే, భారత్–చైనాల మధ్య సమతూకం పాటించేందుకు రష్యా ప్రయత్నించింది. దక్షిణాసియాలో రష్యాకున్న ప్రయోజనాలు పరిమితమే కావచ్చు. కానీ, ఇస్లామాబాద్తో బీజింగ్ అంటకాగుతోంది. బీజింగ్తో సన్నిహితంగా మెలిగే మాస్కో, తీరా చైనా ప్రయోజనాలు పణంగా ఉన్నపుడు భారతదేశానికి వీలైనంత తక్కువ సహాయాన్నే అందిస్తుంది. దానర్థం – భారత్ ప్రాంతీయ ప్రయోజనాలకు భంగం కలిగించాలని రష్యా కోరుకుంటోందని కాదు. చైనా ప్రయోజనాలను తక్కువ చేసేదిగా కనబడటం రష్యాకు ఇష్టం లేదు. ఏమైతేనేం, అది పాకిస్తాన్కే ప్రయోజనకారి అవుతుంది. రష్యాతో ఉన్న దోస్తీని ఉపయోగించుకుని చైనా నడవడికలో మార్పు తేగలమని మనం ఒకప్పుడు అనుకున్న రోజులున్నాయి. బహుశా ఇప్పుడు భారత దేశంతో రష్యాకున్న మైత్రిని నిగ్రహించగల శక్తి తనకుందని చైనా చాటుకోవడాన్ని మనం చూస్తున్నాం. రష్యా పట్ల భారత ఆసక్తి సన్నగిల్లుతున్నట్లుగానే, భారత్ పట్ల రష్యా ఆసక్తి కూడా రంగు, రుచి కోల్పోతోంది. ఇది మనం అంగీకరించక తప్పని వాస్తవం. క్షీణిస్తున్న ఈ స్నేహ బంధాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఉన్న మార్గాలను మనం గుర్తించవలసి ఉంది. ఒంటరిగానే పోరాడగలగాలి!ఇక భారతదేశానికున్న బాహ్య సమతూక (అంటే ఇతర దేశాలతో చెప్పించడం లేదా వాటిని పావులుగా వాడుకునేందుకు ఉన్న) అవకాశాలు అంతర్నిహితంగా పరిమితంగానే ఉండటం ఇటీ వలి ప్రతిష్టంభనలో వెలుగు చూసిన మరో గణనీయమైన అంశం. దక్షిణాసియాలో అణు యుద్ధం సంభవించవచ్చనే (అటువంటి అవకాశం లేశ మాత్రంగానే ఉన్నప్పటికీ) భయాలు అంతర్జాతీయంగా భారతదేశంతో స్నేహంగా మెలిగే చాలా దేశాలకున్నాయి. ఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని మనం ఉక్రెయిన్ విషయంలో చెబుతూ వస్తున్నాం. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు అదే పల్లవి అందుకుంటున్నాయి. ఇతరుల సంక్షోభ సమయాల్లో మనం ఎలా వ్యవహరిస్తామో వారూ మన పట్ల అలానే వ్యవహరిస్తారని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎటువంటి సైనిక కూటమిలోనూ చేరకూడదని మనం ఉద్దేశపూర్వకంగానే నిర్ణయించుకుని ఉండవచ్చు. బహుశా, అది సక్రమమైన నిర్ణయమే కావచ్చు కూడా! కానీ, దాని పర్యవసానాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన యుద్ధాలను మనమే చేయాలి. అందుకు అనుసరించవలసిన విధానం స్పష్టమవుతూనే ఉంది. జాతీయ భద్రత సన్నద్ధతకు గణనీయమైన మొత్తాలను వెచ్చించడం ద్వారా మనం మొదట అంతర్గత సమతూకానికి ప్రయత్నించాలి. ప్రైవేటు సంస్థలు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరింత ప్రోత్సాహం, అనువైన వాతావరణం అవసరం. స్థానిక, అంతర్జాతీయ భాగస్వాముల ద్వారా రక్షణ సామగ్రిని ఉత్పత్తి చేసుకోవాలి.ఉగ్రవాదంపై మనం స్పందించే తీరు ఇకపై ఇదే మాదిరిగా ఉండబోతోందని లిఖితపూర్వకంగా కాకపోయినా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది కనుక, ఆపరేషన్ సిందూర్ను వివిధ కోణాల నుంచి నిష్పక్షపాతంగా మదింపు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కర్తవ్య నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. భవిష్యత్తులో పాటించవలసిన రక్షణ సన్నద్ధత, నిఘా, వ్యూహ్మాతక కమ్యూనికేషన్లు, ఇతర కీలక అంశాలపై ఈ బృందం అవసరమైన చర్యలను సూచిస్తుంది. ఇటీవలి పరిణామాలను నిష్పాక్షికంగా పరిశీ లించి, భవిష్యత్తుకు వ్యూహాత్మక దిశా నిర్దేశాలు చేసేందుకు కార్గిల్ సమీక్షా కమిటీ తరహాలో పహల్గామ్ సమీక్షా కమిటీని ఏర్పాటు చేసేందుకు సమయం ఆసన్నమైంది. చివరగా, ఇంత తీవ్రతతో కూడిన ఈ తరహా సైనిక ప్రతిష్టంభనలు దేశపు విశాల వ్యూహాత్మక లక్ష్యాలను కూడా పక్కనపెట్టేవిధంగా మన దృష్టిని మళ్ళించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నేటి భారతదేశం దక్షిణాసియాకు మాత్రమే పరిమితమై ఉండలేదు. కేవలం పాక్ పైనే మన దృష్టినంతటినీ నిలిపి ఉండలేం. ఇప్పటికే పరిమితంగా ఉన్న రాజకీయ, దౌత్య, సైనిక వనరులను ఇతర విశాల లక్ష్యాల వైపు మళ్ళించడానికి లేకుండా సతమతమవుతున్నాం. పాక్నే బూచిగా చూస్తూ కూర్చుంటే ఆ సామర్థ్యాలు మరింత పరిమిత మవుతాయి. పాక్ నుంచి తరచూ ఎదురుకాగల ఉద్రిక్తతల వలయంలో చిక్కుకుపోకుండా నిలవడమే భారత్ ముందున్న అతి పెద్ద వ్యూహాత్మక సవాల్!హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్యూలో ఇండియా విదేశాంగ విధాన బోధకులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఇది గ్రహణమే!
కొద్ది దశాబ్దాలుగా కమ్యూనిస్ట్ పార్టీలకు గ్రహణం పట్టింది. వాటి ప్రాభవం గణనీయంగా తగ్గింది. దేశంలోని అనేక చోట్ల ప్రజానీకానికి కమ్యూనిస్టు పార్టీ అంటే ఏమిటో తెలియని స్థితి నెలకొంది. కమ్యూనిస్టు పార్టీలు ‘కాలం చెల్లిన’ సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడుతుండటమే దీనికి కారణం అనేవారు మొదలు కొని... అసలు కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, తాము కూడా, తాము నిత్యం విమర్శించే బూర్జువా పార్టీల లాగే తయారవ్వడం వల్లనే, వాటికి ఈ పరిస్థితి దాపురించిందని రకరకాల విమర్శలు ఉన్నాయి. పునాది లేకుండా పోయింది!కమ్యూనిస్టు పార్టీల అస్తిత్వానికీ, మనుగడకూ అనివార్యం అయిన ప్రాథ మిక పునాదులు నేటి సమాజంలో లేకుండా పోయాయన్నది గమనార్హం. కమ్యూనిస్టు పార్టీల అస్తిత్వానికి పునాది – వర్గ పోరాటాలు. కార్మికులు, యజమానులు అనే పరస్పరాభిముఖాలైన రెండు వర్గాలు ఉండటం, వారి మధ్యన పెట్టుబడి, శ్రమల ద్వారా సృష్టించబడిన సంపద తాలూకు పంపిణీలో ఏర్పడే ఘర్షణలు... ఇదీ సూక్ష్మంగా కమ్యూనిజానికీ, కమ్యూనిస్టు పార్టీలకూ ఆస్కారం కల్పించే నేపథ్యం. ఒక పారిశ్రామిక సంస్థలోనో, సేవారంగపు కార్యాలయంలోనో శారీరక లేదా మేధాశ్రమతో సృష్టించబడిన సంపదలోని సింహభాగాన్ని ఆ సంస్థ యజమాని నొల్లుకోవడం, పెట్టుబడిదారీ వ్యవస్థలో సహజంగా జరిగే పరిణామం. అంటే, పరిశ్రమలో ఒక కార్మికుడు 8 గంటల పాటు శ్రమ చేయడం ద్వారా సృష్టించిన సంపదలోని కొంత వాటాను మాత్రమే (ఉదాహరణకు: 4 గంటల శ్రమ ఫలితం మేరన మాత్రమే) కార్మికుడికి వేతనంగా ఇచ్చి, మిగతా శ్రమ ఫలితాన్ని (దీనినే ‘అదనపు విలువ’ అని పిలుస్తారు) యజమాని సొంతం చేసుకోవడమే కమ్యూనిజం చెప్పే శ్రమ దోపిడీ సారాంశం! తన శ్రమ ఫలితాన్ని కొల్లగొడుతూ రోజు రోజుకూ మరింత ధనవంతుడవుతోన్న యజమాని పట్ల కార్మికులకు సహజంగానే ద్వేషభావం ఏర్పడుతుంది. ఈ ద్వేష భావమే వర్గ పోరాటాలకు ప్రేరణ. వర్గ రహిత సమాజ ఆలోచనకు చోదక శక్తి.కొన్ని దశాబ్దాలుగా ఈ పెట్టుబడిదారీ పునాది లోనే మార్పు వచ్చింది. పారిశ్రామిక, సేవా రంగాల ఉత్పాదక శ్రమ... తద్వారా సంపద సృష్టి స్థానంలో ఎటువంటి ఉత్పత్తికీ స్థానం లేని ఫైనాన్స్ పెట్టుబడుల యుగం నేడు ప్రధాన స్రవంతిగా నడుస్తోంది. ఈ ఫైనాన్స్ ఆధారిత రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లలో... ఉత్పత్తి రంగాలలో చూసే శ్రమ దోపిడీ, అదనపు విలువ వంటివి కనపడవు. అంటే, యజమాని–కార్మి కుడి సంబంధాలు... దాని ఫలితంగా ఏర్పడే దోపిడీ భావన... వర్గ పోరాటాలు... ఈ రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల వంటి స్పెక్యులేటివ్ రంగాలలో పాత్ర పోషించవు. సూక్ష్మంగా చెప్పాలంటే ఇక్కడ వర్గ పోరాటానికి చోదక శక్తిగా ఉండే వర్గాల మధ్య ద్వేష భావనకు స్థానం లేకుండా పోయింది. దాని స్థానంలో ఫైనాన్స్ పెట్టుబడుల ఈజీ మనీ యుగం పేదలు, ధనికుల మధ్య పోల్చి చూసుకోవడాన్నీ, ఈర్ష్యనూ తెచ్చి పెట్టింది. అంటే, నేటి ఈ రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ ఆధిపత్య యుగంలో – పేదలు (‘శ్రామి కులు’) ధనికులతో పోల్చి చూసుకుంటున్నారు. ఈ యుగం లక్షణం వర్గ పోరాటం ద్వారా హక్కుల సాధనో, సోషలిజం నిర్మాణమో కాదు. ధనవంతుడిని అనుకరించడం, అతని నమూనాని ఆరాధించడం, ఎలాగైనా తాను కూడా ఆ స్థానాన్ని చేరుకోవడం! ఈ క్రమంలోనే వర్గ పోరాటాలు, సోషలిజం లక్ష్యంగా గల కమ్యూనిస్టు ఉద్యమాలకు గ్రహణం పట్టింది. దీనితో పాటుగా తెలుగు రాష్ట్రాలలో వచ్చిన సాఫ్ట్వేర్ రంగ ‘విప్లవ’ ఫలితంగా మన యువతీ యువకులకు అమెరికా ఒక అంతిమ డెస్టినేషన్ గా మారింది. మన పట్టణ, నగర, గ్రామీణ ప్రాంతాలు అమెరికా డాలర్ల ప్రవాహంలో మునిగి తేలుతున్నాయి. ఫలితంగా, కమ్యూనిస్టు సిద్ధాంతానికి గుండెకాయ వంటి సామ్రాజ్య వాద వ్యతిరేక భావన అంతరించింది. మొత్తంగా మధ్యతరగతి వర్గం, నయా మధ్యతరగతి వర్గాలకు కమ్యూనిజం అనేది ఒక ఉబుసుపోని కబురుగా మిగిలిపోయింది. తమ తల్లిదండ్రులు, తాత ముత్తాతల పాత కాలం వాసనగా తయారయ్యింది. అదీ విషయం! మళ్లీ తెర లేస్తోంది!ఇదే క్రమంలో సోవియట్ పతనం కూడా దీనికి అదనపు జోడింపై, ఉన్న కాస్తపాటి కమ్యూనిస్టు పార్టీలలో కూడా నైతిక శక్తి, సైద్ధాంతిక బలం నిర్జీవం అయిపోయి రంగు, రుచి, వాసనలను కోల్పో యాయి. ఫలితంగా అవి ఏ సైద్ధాంతిక నిబద్ధతా లేని కొద్దిపాటి మంది అవకాశవాద నాయకుల సమూ హంగానో, లేకుంటే మరేం చెయ్యాలో తెలియక ఎర్ర జెండా కప్పించుకొని చనిపోతే చాలు అనుకునే దుర్భల మనఃస్థితిలో జీవిస్తోన్న మానసిక దౌర్బల్యపరులతోనో నిండిపోయాయి. ఇక్కడ గమనించవలసినది 3, 4 దశాబ్దాల గ్రహణ కాలం నేడు అంతిమ దశకు చేరింది. ఫైనాన్స్ పెట్టుబడుల యుగం దాని చరమాంకానికి చేరుతోంది. పెట్టుబడిదారీ దేశాలు మరెంత మాత్రమూ, మరింతగా కరెన్సీలను ముద్రించి వ్యవస్థలను కాపాడుకొనే అవకాశం లేకుండా పోతోంది. నిరంతరంగా ముద్రించబడిన డబ్బుల ప్రవాహం వలన ఏర్పడిన రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ బుడగలు బద్దలైపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగానే రియల్ ఎస్టేట్ రంగం పతనం, షేర్ మార్కెట్లలో సంక్షోభాలు నేటి సర్వసాధారణ లక్షణాలుగా ఉన్నాయి. ఆర్థిక మాంద్య వాతావరణం ప్రపంచాన్ని కమ్ముకుంటోంది. దీనినంతటినీ మించి ఈ 3, 4 దశాబ్దాల ఫైనాన్స్ వికృత క్రీడకు కేంద్రబిందువయిన అమెరికా పెట్టుబడి దారీ వ్యవస్థ నేడు సంక్షోభాలతో సతమతమవుతోంది. కథ కొలిక్కి వస్తోంది.ఫైనాన్స్ యుగం గ్రహణం వీడి, పేద–ధనిక వర్గ పోరాటాల యుగానికి నేడు మరలా వేగంగా తెర లేస్తోంది. డాలర్ డ్రీమ్స్ ముగింపులో మరో కొత్త బంగారు లోకం తాలూకు లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద టన్నెల్ మిలమిలా మెరుస్తూ కనబడుతోంది. ఈసారి ఈ గ్రేట్ మార్చ్ ప్రపంచాన్ని సోషలిస్ట్ మహా యుగం దిశగా నడిపించబోతోంది. వింటున్నారా కామ్రేడ్స్! మేం మళ్ళీ వస్తామన్న మాట నిలబెట్టు కోవడం ఇక మీ వంతు. లాల్ సలామ్!డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు ‘ 98661 79615 -
ప్రాథమిక హక్కుల రక్షణ కోర్టు బాధ్యత
‘ఒక వ్యక్తి వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా మందికి నచ్చనప్పటికీ ఆ అభిప్రాయాలు వ్యక్తీకరించే వ్యక్తి హక్కులను గౌరవించాలి. అంతేకాదు రక్షించాలి.’ ‘ఏ ఖూన్ కే ప్యాసే బాత్ సునో’ అన్న జీవిత నేపథ్యం కలిగివున్న ఒక వీడియో క్లిప్ను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినందుకుగాను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గఢీపై గుజ రాత్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్.ను గత మార్చి 28వ తేదీన సుప్రీంకోర్టు కొట్టివేస్తూ అన్న మాటలు అవి. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ప్రతాప్ గఢీ దాఖలు చేసిన పిటీషన్ను అనుమతిస్తూ... ‘ఆ పోస్ట్ ప్రచురించడం వల్ల ఎలాంటి నేరం జరగలే’దని పేర్కొంది. భావప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తీకరణ స్వేచ్ఛలను రక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద, పోలీసుల మీద ఉందని కోర్టు నొక్కి చెప్పింది.గతంలో భారత రాజ్యాంగ సభలో కమ్యూ నిస్ట్ పార్టీ ప్రతినిధిగా ఉన్న సోమ్నాథ్ లహరి ‘ప్రాథమిక హక్కుల అధ్యాయం ఒక పోలీస్ కాని స్టేబుల్ దృక్కోణం నుండి రూపొందించి నట్టు అనిపిస్తుం’దని వ్యాఖ్యానించారు. ఈ హక్కుల వినియోగం చట్టబద్ధమైనదా కాదా అన్నది నిర్ణ యించేది పోలీసులే అని ఆయన అన్నారు. ఈ అభిప్రా యంతో మనం ఏకీభవించకపోవచ్చు. కానీ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులను చూస్తే ఆయన వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయి.ఇమ్రాన్ ప్రతాప్ గఢీపై 2024 డిసెంబర్లో ఓ క్రిమినల్ కేసును పోలీసులు నమోదు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు 2025 మార్చిలో కొట్టివేసింది. ఒక సామూహిక వివాహ కార్యక్రమం వీడియోను ఇమ్రాన్ తన ఇన్స్టాగ్రామ్లో ప్రచురించారు. ఆ వీడియో నేపథ్యంలో అతను రాసిన కవిత చది వారు. ఈ కవిత వివిధ వర్గాల ప్రజలను రెచ్చ గొట్టే విధంగా ఉందనీ, వారి మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని రేపేదిగా ఉందనీ ఎఫ్ఐఆర్లో ఆరోపించారు. అందుకని ఆయనపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 196, 197 (1), 302, 299, 57, 3 (5) కింద కేసును నమోదు చేశారు. అంటే ప్రజా సమూహాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని కలిగించే చర్యలను, జాతీయ సమైక్య తకు భంగం కలిగించే చర్యలనీ; మత విశ్వా సాలను అవమానించడం, గాయపరచడం చేస్తుందనీ ప్రథమ సమాచార నివేదికలో ఆరోపించారు. ఈ ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ హైకోర్టులో దర ఖాస్తుని దాఖలు చేశారు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని హైకోర్టు పేర్కొంటూ దర ఖాస్తును కొట్టివేసింది. గుజరాత్ హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టివేయడాన్ని విమర్శిస్తూ సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది: ‘‘భారత రాజ్యాంగం అభయం ఇచ్చిన ప్రాథమిక హక్కు లను బలపరచడం, అమలు చేయడం కోర్టుల విధి. వాళ్ళు మాట్లాడిన మాటలు, రాసిన రాతలు న్యాయమూర్తులమైన మనకు నచ్చకపోవచ్చు. అయినప్పటికీ ఆర్టికల్ 19 (1) అభయం ఇచ్చిన భావ ప్రకటన, వ్యక్తీకరణ హక్కులను కాపాడా ల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ఆదర్శాలను నిలబెట్టాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీద ఉంది. ప్రాథమిక హక్కులను కాపాడటం కోర్టుల విధి... ఈ హక్కులు ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉండే అతి ముఖ్యమైన హక్కులు.’’ఇక పోలీసుల నిర్వాకాన్నీ కోర్టు గర్హించింది. ‘‘పోలీసు అధికారి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగ ఆదర్శాలను గౌరవించాలి... దేశ పౌరులందరూ భావప్రకటనా స్వేచ్ఛను కలిగి వున్నారు. అది మన రాజ్యాంగ ఆదర్శాలలో ఒకటి. పోలీసులు కూడా దేశ ప్రజలే. వారు కూడా రాజ్యాంగానికి, అందులోని హక్కులకు కట్టుబడి ఉండాలి. ఇమ్రాన్ రాసిన కవిత ఏ మతాన్ని, కులాన్ని, భాషను ప్రస్తావించదు. ఏ మతానికి చెందిన వ్యక్తులను కూడా కవిత ప్రస్తావించదు. ఏ రకంగా చూసినా గ్రూపుల మధ్య శత్రుభావాన్ని ఈ కవిత కలిగించదు. జాతీయ ఐక్యతకి అవి ఎలా హాని కలిగిస్తాయో అర్థం కాదు’’ అని కోర్టు అభిప్రాయపడింది.నేర సమాచారం రాగానే కానిస్టేబుల్ కేసు నమోదు చేయాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెబుతుంది. ప్రాథమిక విచారణను చేయడానికి వెసులుబాటును ‘భారతీయ నాగరిక సురక్షా సంహిత’ కల్పించింది. ఈ కేసులో ప్రాథమిక విచారణ కూడా అవసరం లేదు. గుర్తించదగిన నేరమే జరగనప్పుడు ప్రాథమిక విచారణ అవసరం లేదు. సాహిత్యం, కళలు మన జీవితాలను అర్థవంతం చేస్తాయి. భావప్రకటనా స్వేచ్ఛ గౌరవప్రదమైన జీవితాన్ని ఇస్తుంది. ఇదే ఇమ్రాన్ ప్రతాపగఢీ కేసులో సుప్రీం తీర్పు సారాంశం.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త గతంలో జిల్లా సెషన్స్ జడ్జి -
విరమణే సరా?
గణనీయంగా బలహీనపడటంతో పాటు దారీతెన్నూ లేకుండా సాగుతున్న నక్సలైట్ ఉద్యమం గురించిన చర్చలు ‘ఆపరేషన్ కగార్’ కన్నా కొన్నేళ్ల ముందు నుంచే జరుగుతున్నాయి. అందుకు కారణాలు రెండు. ఒకటి – నక్సలిజం పట్ల గత కాంగ్రెస్ ప్రభుత్వాల కన్నా మౌలికంగానే భిన్నమైన విధానం గల బీజేపీ అధికారానికి వచ్చింది. రెండు – యథాతథంగా ఆ ఉద్యమం బలహీనపడటం 1990ల నాటికి మొదలై, 2010లు వచ్చేసరికి బాగా పెరిగింది. ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటున్నది. నక్సలైట్ ఉద్యమకారుల త్యాగాలు వృథా ప్రయాసగా మారుతున్నాయన్న భావనలు సాధారణ సమాజంతోపాటు, వారిపట్ల ఏదో ఒక మేర సానుభూతిగల వర్గాలలోనూ కొంతకాలం నుంచి ఉండగా, ఇటీవల పెరిగాయి. ఈ అభిప్రాయాలన్నింటి సారాంశం, ఉద్యమం ఇక ముందుకు సాగే అవకాశం లేదు గనుక విరమించుకోవటం మంచిదని!తగ్గిన జనాదరణదేశం దశాబ్దాల తరబడి ఉద్యమించి 1947లో స్వాతంత్య్రాన్ని సాధించుకోగా, 20 ఏళ్లు గడిచేసరికి దేశంలో వేర్వేరు వర్గాల అసంతృప్తి, అశాంతి, అందులో భాగంగా నక్సలైట్ ఉద్యమం ఎందుకు మొదలైనట్లు? అది బలహీనపడినప్పటికీ 55 ఏళ్లు గడిచినా ఎందుకు కొనసాగుతున్నట్లు? అనే చర్చ ఎట్లున్నా, అది మరెంతో కాలం సాగే అవకాశాలు లేవన్నది స్పష్టం. అందుకు కారణాలు అనేకం. స్వీయ లోపాల వల్ల, ప్రభుత్వ అణచివేతల కారణంగా ఉద్యమం బలహీనపడింది. స్వీయ లోపాలు అనేవి సైద్ధాంతికమైనవి, నాయకత్వపరమైనవి, వ్యూహాలూ, ఎత్తుగడలకు సంబంధించినవి, ప్రజాదరణతో నిమిత్తం గలవి. ఈ నాలుగింటిని నక్సలైట్లు సరిదిద్దుకొని తేరుకోగల సూచనలు ఎంతమాత్రం కనిపించటం లేదు. వీటిలో ప్రజాదరణ అన్నింటి కన్న కీలకమైనది. అది ఉన్నట్లయితే తక్కిన మూడింటిలో కొన్ని లోటుపాట్లు ఉన్నా ముందుకు పోగలరు. ఈ సూత్రం ఏ ఉద్యమానికైనా, ఏ సాధారణ రాజకీయ పార్టీకైనా వర్తిస్తుంది.నక్సలైట్లు తొలి దశాబ్దాలలో ఉండిన ప్రజాదర ణను మలి దశాబ్దాలు వస్తుండగా కోల్పోవటం మొద లైంది. అందుకు కారణాలు అనేకం. కొన్ని ప్రభుత్వ అణచివేతలు, దానితోపాటు అభివృద్ధి–సంక్షేమ కార్య క్రమాలలో ఉన్నాయి. మరికొన్ని సమాజం వైపునుంచి. అవి – కొత్త తరాలు ఉనికిలోకి రావటం, వారి ఆలోచనలూ, కోరికలూ, వ్యవహరణా శైలి కొత్తది కావటం, తమ తల్లిదండ్రులు అనుభవించిన స్థాయి పేదరికానికి గురికాక పోవటం, వ్యవసాయ సంక్షోభా లతో నిమిత్తం లేకపోవటం, గ్రామాలతో సంబంధాలు తగ్గి పట్టణీకరణలూ ఆధునికీకరణలలోకి ప్రవేశిస్తుండటం వంటివి కొత్త సామాజిక మార్పులయ్యాయి. పాత తరాలకు కూడా నక్సలిజం పట్ల ఉండిన గురి వివిధ కారణాల వల్ల తగ్గటం మొదలైంది.పోతే, అణచివేతలు, వాటిని తట్టుకోలేక పోవ టాలు, కలిగే నష్టాలను ఒకప్పటి వలె పూడ్చుకోలేక పోవటాలు సరేసరి కాగా, ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ చర్యల ప్రభావాలు కూడా ఉన్నమాట నిజం. విరమిస్తే ఏం చేయొచ్చు?నక్సలైట్ ఉద్యమం మొదలైన తర్వాత ఆ తొలి దశాబ్దాల ఉధృతి, మలి దశాబ్దాల బలహీనతల దశకు చివరన చెప్పుకోవలసింది ఏమంటే, ఒకవైపు ఉద్య మానికి ఆ పరిస్థితులలో ముందుకు పోవటం ఎట్లా గన్న సైద్ధాంతిక స్పష్టత లేకపోయింది. ప్రజలను, వారి భాగస్వామ్యం కేంద్రంగా చేసుకుని ఉద్యమ నిర్మాణానికి బదులు మిలిటరిజానికి పెద్దపీట అయింది. దాని నష్టాలు, సమస్యలు దానివయ్యాయి. ఆ దశకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వాలు ద్వంద్వ వ్యూహం అనుసరించి విజయవంతమయ్యాయి. నక్సలిజాన్ని తీవ్రంగా అణచివేస్తూనే, అది కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, అభివృద్ధి సమస్య కూడానని చెప్పటం విధానం అయింది. ఆ రెండు విధాల చర్యలు వ్యూహంగా మారాయి. వాటి ఫలితంగా ఉద్యమం దెబ్బతింటుండగా, ఉద్యమా నికి మైదాన ప్రాంతాల ప్రజలు, బీసీ, ఎస్సీలు దూరం కాసాగారు. ఆర్థిక మార్పులతో కొత్త తరాల దృక్పథం మారి వారు దూరమయ్యారు. పలు ప్రాంతాలలో గిరిజన శ్రేణులు కూడా! బీజేపీ అధికారానికి వచ్చే సరికే సమాజ వర్గాలకు, ఉద్యమానికి సంబంధించి ఈ మార్పులు స్థిరపడుతుండగా, కొత్త అధికార పార్టీ కొత్త విధానాన్ని ముందుకు తేవటం మొదలు పెట్టింది. సామాజిక దృష్టికి కాంగ్రెస్ తరహాలో నటనా పరంగానైనా చోటు లేకపోయింది. ఉద్యమం విషయానికి వస్తే, వర్తమాన స్థితిని, భవిష్యత్ అవకాశాలను లేదా అవకాశ రాహిత్యాన్ని, వీటన్నింటితోపాటు మొదట చెప్పుకున్న విధంగా వ్యక్తమవుతున్న విస్తృతాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు నక్సలైట్ నాయకత్వం ఉద్యమ విరమణను ప్రకటించటమే సరైనదిగా తోస్తుంది. నిర్ణయం తేలిక కాదు. ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడైనా కష్టమైనవే. కానీ పరిస్థితులనుబట్టి తప్పనివి. సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవటం వల్ల ఎదురయ్యే నష్టాలు మరింతగా ఉంటాయి. తమతోపాటు ప్రజలకు కూడా! శాంతి చర్చలని ప్రాథేయపడిన స్థాయిలో ఇంతగా విజ్ఞప్తులు చేయటమే ఉద్యమం ఎన్నడూ లేనంత బలహీనపడినట్లు చెప్తున్నది. చర్చలని పౌరసమాజం నుంచి మాట్లాడు తున్నవారు ఎంత సహేతుక కారణాలు, తర్కాలు చెబుతున్నా ప్రభుత్వం అణుమాత్రం సడలింపు చూపకపోవటం కనిపిస్తున్నదే! ఒకవేళ ఉద్యమ విరమణ జరిగినట్లయితే అనంతరం ఏమి చేయాలన్నది వేరే విషయం. ప్రధాన స్రవంతిలో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి సాధారణ ప్రజా ఉద్యమాలు జరపాలనీ, ఇప్పటికే గల వామపక్షాలతో కలిసి పని చేయాలనీ, ఎన్నికలలో పోటీ చేయాలనీ, ఇవేవీ కావనుకుంటే తమకు తోచిన ప్రజాస్వామిక మార్గాలను అనుసరించవచ్చుననే సూచనలు వస్తున్నాయి. సమాజంలో సమస్యలు కొల్లలుగా ఉన్నాయనీ, ప్రజలలో అసంతృప్తి తక్కువ కాదనీ, వివిధ పార్టీ ప్రభుత్వాలే గాక ప్రతిపక్షాల వైఫల్యాలు అనేకం కనిపిస్తున్నాయనీ, కనుక వాటి ఆధారంగా, ప్రజాస్వామిక వ్యవస్థ కల్పించే అవకాశాలను వినియోగించుకుని కృషి చేయవచ్చుననీ పలువురి నుంచి వినవస్తున్న సలహా. నక్సలైట్ నాయకత్వం తన విజ్ఞతతో ఏ నిర్ణయం తీసుకోగలదో చూడాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నవ రాయ్పూర్ దారిలో అమరావతి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మే 22న నిర్వహించిన ప్రెస్ మీట్లో అమరావతి పేరుతో జరుగు తున్న ఆర్థిక దోపిడీని ఆధా రాలతో సహా వివరించారు. ఇప్పటి వరకూ రాజధానిగా ఎటువంటి చట్టబద్ధత లేని అమరావతి పేరుతో చంద్రబాబు సుమారు రూ. ఐదు వేల కోట్లు ఖర్చు చేశారు. దీని నిర్మాణానికి ఒక్క పైసా కూడా అవసరం లేదనీ, ఇదో సెల్ఫ్ ఫైనాన్స్స ప్రాజెక్టు అంటూ ఒకవైపు ప్రచారం చేస్తూనే మరో వైపు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు, జర్మన్ బ్యాంకు నుంచి రూ. 5 వేల కోట్లు, సీఆర్డీఏ బాండ్ల జారీ ద్వారా 21 వేల కోట్లు అప్పులు చేసి అమరావతికి ఖర్చు చేస్తున్నారు. ఏడాది బడ్జెట్లో అమరావతి కోసం రూ. 6 వేల కోట్లు కేటాయించారు. దీనికి తోడు అమరావతి కోసం మరో 50 వేల ఎకరాలు సమీకరించబోతు న్నామనీ, దానికి మరో రూ. 77 వేల కోట్లు అవసర మవుతాయనీ ఆర్థిక సంఘానికి తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది, పన్నుల రాబడులు తగ్గాయి. ఏడాది కాలంలోనే లక్షా 50 వేల కోట్ల రూపాయల రుణాలు చేసి దేశంలోనే అప్పుల్లో అగ్రస్థానంలో ఏపీని నిలిపారు బాబు. అమరా వతిలో ఇప్పటికీ భూ సమీకరణ పూర్తి చేయలేక పోయారు. రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారంటూ ఇప్పటికీ తప్పుడు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఇంకా 20 శాతం మంది రైతులు తమ భూములను సీఆర్డీఏకు అప్పగించి రిటర్నబుల్ ప్లాట్స్ పొందలేదు. రాష్ట్రం ఏమైపోయినా సరే తాము మాత్రం అమరావతిపై లక్షల కోట్లు కుమ్మరిస్తామంటున్నారు.ఒక రాజధాని నగరాన్ని నిర్మించడం ఎంత కష్టమో ‘అటల్ నగర్– నవ రాయ్పూర్’ను చూస్తే అర్థమవుతుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2006 నుంచి 20 వేల ఎకరాల్లో ఈ నగరాన్ని నిర్మించడానికి ఆప సోపాలు పడుతోంది. 41 గ్రామాల నుంచి సేకరించిన ఈ భూమిలో నిర్మాణాలు ప్రారంభించి 19 ఏళ్లయినా ఇప్పటికీ నగర నిర్మాణం పూర్తి కాలేదు. చంద్రబాబు మాత్రం లక్ష ఎకరాల్లో మహా నగరం నిర్మిస్తానంటూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అటల్ నగర్ నిర్మాణ విషయంలో ఎంతో ఆర్భాటం చేసింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ అనీ, దేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ఆరో నగరమనీ, దేశంలో మొదటి జీరో వాటర్ డిశ్చార్జ్ సిటీ అనీ, 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తామనీ ప్రచారం చేశారు. చిన్న పిల్లలకు ఉచితంగా చికిత్స అందించే దేశంలోని అతిపెద్ద శ్రీసత్యసాయి సంజీవిని ఆస్పత్రి, ప్రపంచంలో నాల్గో అతి పెద్ద క్రికెట్ స్టేడియం, నాలుగు జాతీయ విద్యా సంస్థలు, పది కిలోమీటర్ల దూరంలోనే ఎయిర్ పోర్ట్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్, జెమ్స్ అండ్ జ్యూయలరీ సెంటర్, జూ, సఫారీ, గోల్ఫ్ విలేజ్, మ్యూజియం, బొటానికల్ గార్డెన్ , ఫిల్మ్ సిటీ, 5 స్టార్ హోటల్స్ ఏర్పాటు చేశారు. ఇన్ని ఏర్పాటు చేశామని చెబు తున్నప్పటికీ ఇది ఒక ఘోస్ట్ సిటీగా మారింది. 5.36 లక్షల జనాభా అవసరాల కోసం నిర్మించిన ఈ నగరంలో ప్రస్తుతం రెండు లక్షల 50 వేల మంది మాత్రమే నివసిస్తున్నారు. నగర జనాభా 5.36 లక్షలకు చేరాలంటే 2031 వరకూ వేచి చూడాల్సిందే అంటున్నారు నయా రాయ్పూర్ డెవలప్మెంట్ అధారిటీ అధికారులు.ఎంత ప్రచారం చేసినా, ఎన్ని సదుపాయాలు కల్పించినా, అనేక రాయితీలు ప్రకటించినా నవ రాయ్పూర్కు పెట్టుబడులు రావడం లేదు, ఉపాధి కల్పన లేదు. ప్రజలు కూడా ఇక్కడ స్థిరపడటానికి ఆసక్తి చూపడం లేదు. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం లేదు. 2022–23 లెక్కల ప్రకారం విజయవాడ, గుంటూరు నగరాల జీడీపీ విలువ రూ. 1,467 కోట్లు కాగా, విశాఖపట్నం జీడీపీ విలువ రూ.1,867 కోట్లు. వేలాది కోట్ల వ్యయంతో నిర్మించిన నవరాయ్పూర్ జీడీపీ కేవలం రూ. 270 కోట్లు. పక్కనే ఉన్న రాయ్పూర్ జీడీపీ రూ. 750 కోట్లు. నగర నిర్మాణం పేరుతో చేసిన అప్పులు తీర్చడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తంటాలు పడుతోంది.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల 16వ ఫైనాన్స్ కమిషన్ సభ్యులను కలిసి రూ.4,131 కోట్లు ప్రత్యేక గ్రాంట్గా ఇవ్వాలని కోరారు. నూతన నగరాలను నిర్మించాలనుకునే వారికి ఇది ఒక హెచ్చరిక. నగర నిర్మాణాల ద్వారా సంపదను సృíష్టించవచ్చని చంద్ర బాబు అంటున్నారు. ఇది నిజం కాదని నవ రాయ్ పూర్ రుజువు చేస్తోంది. అంతే కాదు, చైనాలో కొత్తగా నిర్మించిన అనేక నగరాలు, మలేషియా నిర్మించిన ఫారెస్ట్ సిటీ, పరిపాలనా నగరం ‘పుత్రజయ’ కూడా నిర్మానుష్య నగరాలుగా మారాయి. ఈ నగరాలు సంపద సృష్టించకపోగా అప్పులు, నిరర్థక ఆస్తులు మిగి ల్చాయి. ఇదే పరిస్థితి అమరావతికి ఏర్పడినా ఆశ్చర్య పోనక్కర లేదు!వి.వి.ఆర్. కృష్ణంరాజువ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ప్రెసిడెంట్ ‘ 89859 41411 -
పేదల నోరుకొట్టే ట్రంప్ ప్రతిపాదన
సగటు భారతీయులు అమెరికా వెళ్ళాలని ఎందుకు కోరుకుంటారు? అక్కడ సంపాదించే డాలర్లలో కొద్ది మొత్తం ఇక్కడకు పంపించినా అది వారి కుటుంబ సభ్యులకు రూపాయలలో గణనీయమైన మొత్తాలుగా మారుతాయి కనుక. అమెరికా నుంచి జమ చేసే మొత్తాలు, స్వదేశంలోని బంధు జనాన్ని నిజంగానే ఎంతగానో ఆదుకుంటున్నాయి. ప్రవాస భారతీయులు అలా చేసే జమలపైన 5% పన్ను విధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపా దించారు. దానిని ఆయన తమ ఖజానాకు పెద్ద మొత్తం గడించి పెట్టగల సొగసైన బిల్లుగా భావిస్తున్నారు. మనకు మాత్రం అది పీడకల లాంటి ప్రతిపాదనే. ఇది భారతదేశంలోని అనేక కుటుంబాల జీవనాధారాన్ని నీరుగార్చవచ్చు. జమ చేసే మొత్తాలపై ఇక మీదట అమెరికా ప్రభుత్వానికి పన్ను కట్టవలసి ఉంటుంది కనుక వారు పంపే మొత్తాలు కొంతమేరకైనా తగ్గవచ్చు. ఆ విధంగా అది మనకు తిరోగమన చర్య కిందే లెక్క. అమెరికా నుంచే ఎక్కువ...భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, అమెరికాలో 12 లక్షల 80 వేల మంది ప్రవాస భారతీయు (ఎన్.ఆర్.ఐ)లుగా ఉన్నారు. మరో 31 లక్షల 80 వేల మంది భారతీయ సంతతికి చెందిన వ్యక్తు (పి.ఐ.ఓ.)లుగా ఉన్నారు. విదేశాల నుంచి నగదు జమల విషయంలో భారతదేశం అగ్ర స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంకు 2024 రెమిటెన్స్ రిపోర్ట్ తెలుపుతోంది. 2024లో అలా 129 బిలియన్ల డాలర్లు వచ్చిపడ్డాయని అది వెల్లడించింది. ఇలా జమ అయ్యేదానిలో అమెరికా నుంచి వచ్చేదే పెద్ద మొత్తంగా ఉంటోందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్.బి.ఐ.) నివే దిక పేర్కొంటోంది. అమెరికా నుంచి జమయ్యే మొత్తం 2016–17లో 22.9 శాతంగా ఉన్నది 2023–24 నాటికి 27.7 శాతానికి పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. మన దేశానికి 120 బిలియన్ల డాలర్లు జమ అయ్యాయనుకుందాం. దానిలో అమెరికా వాటా 27% అంటే, ఒక్క అమెరికా నుంచే 33 బిలియన్ల డాలర్లు చేకూరినట్లు లెక్క. దీనిపై ఇపుడు 5% పన్ను విధిస్తే, అది సుమారుగా 1.6 బిలియన్ డాలర్లు (రూ. 13,000 కోట్లు)గా లెక్కకు వస్తుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇండియాకు రావలసిన ఆ మొత్తానికి, ట్రంప్ నూతన పన్ను విధానం వల్ల గండి పడుతుంది. దీన్ని కేవలం సంఖ్యల రూపంలో చూడవద్దు. ఇది అనేక భారతీయ కుటుంబాల దైనందిన జీవితంపై ప్రభావం చూపుతుంది. బతుకు బండి లాగించడానికి, ఇతర కుటుంబ సభ్యుల చదువు సంధ్యలకు, ఆరోగ్య రక్షణకు ఆ మొత్తాలు ఉపయోగపడుతున్నాయి. ఆ ముఖ్య ఆదాయానికి కత్తెర పడితే భారతదేశంలోని ఆయా కుటుంబాల భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ఈ జమలు ఎవరి దయా ధర్మాలూ కావు. వలస వెళ్ళినవారు చెమటోడ్చి సంపాదించిన ఆదా యంలో కుటుంబ పోషణకు పంపుతున్న కొంత మొత్తాలు. అల్ప, మధ్యాదాయ దేశాలు 2023లో 650 బిలియన్ల డాలర్లను విదేశీ జమల కింద అందుకున్నాయి. ఇది ఆ యా దేశాల అభివృద్ధికి అధికారికంగా అందిన సహాయం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కన్నా ఎక్కువ. ఇది భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యమే కాదు, లక్షలాది మందికి సామాజిక భద్రతా కవచంలా పనిచేస్తోంది. ఎంతో ముఖ్య మైన ఈ మొత్తాలు అధిక లావాదేవీ రుసుములతో ఒత్తిడిని ఎదు ర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీజు 2023లో సగటున 6.18 శాతంగా ఉంది. కొన్ని దేశాల్లోనైతే ఆ ఫీజు 8 శాతం పైచిలు కుగా ఉంది. అసమంజసంగా ఉన్న ఈ ఫీజుల భారాన్ని తగ్గించాలనీ, ప్రపంచంలోని పేదలకు ఊరట కల్పించాలనీ ఐక్యరాజ్య సమితి భావించింది. విదేశాల నుంచి నగదు జమ చేసేవారిపై పడే ఫీజుల భారాన్ని 3% కన్నా తక్కువకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. లావాదేవీల రుసుము 5%కన్నా మించి ఉన్నవి 2030 నాటికి ఒక్కటి కూడా లేకుండా చేయాలని సంకల్పించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్య స్ఫూర్తికి తూట్లు ట్రంప్ ప్రతిపాదిత పన్ను ఈ అంతర్జాతీయ నిబద్ధతపై ప్రత్యక్ష దాడి కిందకే వస్తుంది. ఇది లావాదేవీ జరిపినందుకు మోస్తున్న భారాన్ని మరింత పెంచడమే కాదు, ఆర్థిక అన్యాయానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుంది. విదేశాల్లో రకరకాల ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నవారు తమ వ్యక్తిగత కోరికలను పక్కనబెట్టి, తమకున్న పరిమిత ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని కుటుంబాల సంక్షే మానికి పంపుతున్నారు. లావాదేవీ ఫీజుకు తోడు మరో 5% పన్ను విధించడం వారిని శిక్షించడం, దోచుకోవడమే అవుతుంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించుకున్న పేదరికం లేకుండా చేయడమనే సుస్థిర అభివృద్ధి లక్ష్యం (ఎస్.డి.జి.) స్ఫూర్తికి తూట్లు పొడిచినట్లవుతుంది. నగదు జమ చేసేందుకు రుసుములు మితిమీరితే జనం బ్యాంకులు, డిజిటల్ వ్యాలెట్ల వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. అని యత, క్రమరహిత మార్గాల వైపు మొగ్గు చూపవచ్చు. అటువంటి పద్ధతుల్లో మోసపోయే, దోపిడీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మహిళలకు ఆసరా కల్పించడమనే దృక్కోణం నుంచి చూసినా ట్రంప్ ప్రతిపాదన కల్లోలపరచేదిగానే ఉంది. ఎందుకంటే, విదేశాల నుంచి నగదు అందుకుంటున్నవారిలో మహిళలే ఎక్కువ. కుటుంబ పోషణకు, పిల్లల ఆలనాపాలనకు వారు ఆ మొత్తాలపైనే ఆధార పడుతున్నారు. నగదు జమలపై పన్ను విధిస్తే, వారి ఆర్థిక స్థితి గతులు, ప్రగతి బలహీనపడతాయి. ఇది ఐక్యరాజ్యసమితి పెట్టుకున్న (స్త్రీ పురుష సమానత్వ) ఐదవ ఎస్.డి.డి. లక్ష్యాన్ని నీరుగారుస్తుంది. మహిళా సాధికారత వారి ఆర్థిక సౌలభ్యంపైన కూడా ఆధారపడి ఉంది. ఈ పన్ను దానికి కోత పెట్టేదిగా ఉంది. తక్కువ ఖర్చుతో, తక్షణం నగదు వేయడం, తీసుకోవడం వీలయ్యే సమీకృత చెల్లింపుల వ్యవస్థ (యు.పి.ఐ.) వంటివాటి ద్వారా భారతదేశంలో ఫైనాన్షియల్ సౌలభ్యం ఒక రకంగా ప్రజా స్వామికీకరణ చెందింది. ట్రంప్ వేయదలచిన పన్ను ఆ విజయాన్ని కూడా నీరుగారుస్తుంది. మరింత సమ్మిళిత, పరస్పరాశ్రిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన సిసలైన నవీకరణలను... డిజిటల్ జమలపై ఫెడరల్ పన్నును జోడించదలచిన ట్రంప్ చర్య నిర్వీర్యపరుస్తుంది. పేదరికం, అసమానత, వాతావరణ మార్పుపై పోరాటానికి బహుముఖ సహకారం ఎంతో అవసరమైన సమయంలో అటువంటి ఏకపక్ష చర్యలు, సొంత బాగు మాత్రమే చూసుకునే విధానాలు అంతర్జాతీయ సంఘీభావాన్ని సడలింపజేస్తాయి. జమలకు రుసుము వసూలు చేయకుండా చూడాలనే ప్రయ త్నాలను లాభాపేక్షతో నడిచే ఫైనాన్షియల్ సంస్థలు ప్రతిఘటిస్తు న్నాయి. పెద్ద మొత్తంలో జమలు చేసే దేశం శాసనపరమైన విద్రోహా నికి కూడా పాల్పడడం వలస కార్మికులకేకాక, అంతర్జాతీయ అభివృద్ధికే నమ్మకద్రోహం చేసినట్లవుతుంది. ఎస్.డి.జి.ల సాధనకు పెట్టుకున్న 2030 సంవత్సరపు గడువు సహాయానికో లేదా విధానానికో సంబంధించినది మాత్రమే కాదు. న్యాయం చేయాలనే ఉద్దేశంతో పెట్టుకున్నది. జమలపై పన్ను వేసే ఎటువంటి ప్రయత్నమైనా పేదలను దోచుకోవడమే అవుతుంది. భారతదేశంతోపాటు ప్రపంచంలోని పేద దేశాలన్నీ రాజకీయ దృఢ సంకల్పంతో దీన్ని ప్రతిఘటించాలి. జమలపై పన్ను వేయాలనే ట్రంప్ నిర్ణయం అనుచిత విధానమే కాదు, వలసవెళ్ళేవారి హక్కు లకు, మరింత సమానత, స్వావలంబన ఏర్పడాలనే ప్రపంచ దార్శని కతకు ప్రత్యక్ష ముప్పు.రెజిమన్ కుట్టప్పన్వ్యాసకర్త కార్మిక వలసల పరిశోధకుడు, ‘అన్ డాక్యుమెంటెడ్; స్టోరీస్ ఆఫ్ ఇండియన్ మైగ్రెంట్స్ ఇన్ ది అరబ్ గల్ఫ్’ పుస్తక రచయిత ‘ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
చదువుకూ, విద్యకూ తేడా!
వేసవి కాలం ఉక్కపోత, విద్యార్థులకు పరీక్షలు, ఫలితాల కాలం. చదువుకు అధిక ప్రాముఖ్యాన్నిచ్చే సమాజంలో, ముఖ్యంగా మధ్యతరగతి తెలుగు కుటుంబాలలో, చదువుతో వచ్చే పట్టాలకి ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తల్లిదండ్రులు పిల్లలపై ఉంచే అంచనాల వల్ల పెరిగే ఉక్కపోత వేసవి ఉక్కపోత కంటే ఎక్కువగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్నది అందరం గమనించే విషయమే. ఏ దేశానికైనా మూల వనరులతో పాటు మానవ వనరులు కూడా చాలా అవసరం. దేశంలో సుమారు 60 వేల ఉన్నత విద్య సంస్థలు ఉన్నాయి. 2023–24 ఆర్థిక సర్వే ప్రకారం, సగం మంది పట్టభద్రులు నైపుణ్యం లేమి కారణంగా ఉద్యోగార్హత లేనివారు. ఈ పట్టభద్రులలో విద్యావంతులు ఎంతమంది?చదువు, విద్య అన్న పదాలను సమానార్థకంగా వాడుతున్నా, వాటి అంతరార్థం వేరు. కొన్ని విషయాలను నేర్చుకుని పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఒక పట్టా పొందే అవకాశం ఇచ్చే ప్రక్రియను ‘చదువు’ అని అంటున్నాం. మరి విద్య అంటే?చదువుకూ, విద్యకూ తేడా!‘అజ్ఞానాన్ని తరిమివేసే సత్యాన్వేషణే విద్య’ అంటాడు సోక్రటీస్; ‘ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య’ అని నిర్వచించాడు అరిస్టాటిల్’; ‘మానవుడి బుద్ధి దేని ద్వారా వికసిస్తుందో, మనశ్శాంతి పెంపొందుతుందో, శీలం ఏర్పడుతుందో, మానవుడు దేని ద్వారా స్వశక్తితో నిల్చుంటాడో అదే విద్య’ అని స్వామి వివేకానంద ఉద్ఘాటించారు.ప్రస్తుత కాలంలో, కొలువుల కోసం కనీస అర్హతనిచ్చే పట్టాలు పొందడమే పరమావధిగా చదువుల ప్రహసనం సాగుతోంది. చదివే సబ్జెక్టుకీ, చేసే ఉద్యోగానికీ పొంతన లేని సందర్భాలు చాలా చూస్తాం. ఏ సబ్జెక్టులో డిగ్రీ పొందినా సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించడం కోసం యువత పడే పాట్లు ఆధునిక భారత సమాజంలో చూస్తున్నాం. అమెరికాలో ఆర్థిక మాంద్యం అని పుకార్లు వస్తే చాలు అబ్బాయికి వణుకు, అయ్యకి గుండె నొప్పి! ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలమనే ఆత్మ నిబ్బరం కలిగించే ‘విద్యనివ్వని చదువులు’ ఒత్తిడి కారకం అవుతున్నాయన్నమాట!చదువు జ్ఞానాన్ని ఇవ్వాలి. కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలో జ్ఞానం ఇచ్చే చదువులు అరుదు. ప్రస్తుత చదువులు సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నాయి. బతుకుతెరువు నేర్పే విద్యలు కళాశాలలో, విశ్వ విద్యాలయాలలో దొరకడం లేదు. ఏ పట్టాలూ లేని రైతు అనుభవంతో పొందిన నైపుణ్యంతో పంట పండిస్తాడు. ఎంతో ఖర్చు పెట్టి ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాస్త్రంలో అత్యున్నత పట్టా పొందిన వారికి పొలం దున్నడం, విత్తనాలు వేయడం పాఠ్యాంశంగా మాత్రమే తెలుసు.పట్టాల కోసం చదివినా... చదువులు యువతకు కొన్ని బతుకు పాఠాలు నేర్చుకునే సాధనాలుగా ఉండాలి. సొంతంగా, తార్కికంగా ఆలోచించి జీవిత ప్రయాణం కొనసాగించే నేర్పు, మనఃస్థితి అలవర్చుకునేలా విద్యనభ్యసించాలి. అది విద్యాలయాల ద్వారా సాధ్యం కాకపోయినా పుస్తక పఠనం ద్వారా, పెద్దల నుంచీ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అయితే, యువతకు మార్గనిర్దేశం చేయగల పెద్దలు సమాజంలో ఉన్నారా? తమ పిల్లలు ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు సంపాదించే గొప్ప డిగ్రీలు పొందాలని ఆశించడం సహజమే కానీ సంపాదనతో పాటు సమాజ హితం కాంక్షించే నైజం అలవరచుకోవాలని కోరుకోవడం అభిలషణీయం కదా!ముఖ్యంగా యువత విద్యతో పాటు విచక్షణ నేర్వడం అవసరం. మంచి చెడుల మధ్య తేడా తెలుసుకోగల వివేకం అలవ ర్చుకోవడమే చదువు అంతిమ లక్ష్యంగా ఉండాలి. పట్టాలు పొంది విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టే యువతకు ‘వివేక చూడామణి’ ఏది? శ్రీవిష్ణుపురాణం ‘విద్యయా యో యయా యుక్తస్తస్య సా దైవతం మహత్, సైవ పూజ్యార్చనీయా చ సైవ తస్యోపకారికా’ అని విద్యా శక్తిని ప్రతిపాదిస్తుంది. ఏ విద్య సాయంతో ఒక వ్యక్తి తన జీవనాన్ని సాగిస్తుంటాడో, ఆ విద్యయే అతడికి ఇష్టదైవం వంటిది. ఆ విద్య ఆ వ్యక్తికి పూజనీయమైనది; ఆ విద్య ఆ వ్యక్తికి చిరకాలం ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది అని సారాంశం. విద్య ప్రయోజనాలు, ఆవశ్యకత గురించి ‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్’ అనే భర్తృహరి సుభా షితం సమగ్రంగా చెబుతుంది. భౌతిక సుఖాలు, సౌకర్యాలు చేకూర్చే సాధనంగా విద్యను నిర్వచించినా, ‘విద్య గురువు, విశిష్ట దైవతము’ అని చెబుతాడు. అంటే సన్మార్గంలో నడిచే విధంగా మార్గదర్శనం చేసేది, ఉత్తమ గుణసంపదనిచ్చేది. విద్యకు రూపం లేదు; కానీ మంచి విద్య పొందినవారు తమకు తాము గురువు గానూ, దైవం గానూ మలచుకునే శక్తియుక్తులు సంపాదించి సమాజానికి ఉపయో గపడాలన్నది భర్తృహరి ఉపదేశ సారం.చదవండి: గూగుల్ నిర్ణయంతో పిల్లలకు చేటు? పుస్తక జ్ఞానమూ, అనుభవ జ్ఞానమూ కలగలిపి సర్వశక్తి సంపన్నుడుగా, వివేకం, విచక్షణ గల వ్యక్తిగా ఎదగడానికి తనకు తానే గురువుగానూ, దైవం గానూ పరిణమించాలి. అప్పుడే, యువత వేగంగా మారుతున్న ప్రపంచ పరిస్థితులను తట్టుకుని స్వయం ప్రతిభతో విరాజిల్లగలదు.- డాక్టర్ గోపాలకృష్ణ కొవ్వలిసీనియర్ శాస్త్రవేత్త, అమెరికా -
గూగుల్ నిర్ణయంతో పిల్లలకు చేటు?
కృత్రిమ మేధ... ఎటు చూసినా ఇదే హాట్టాపిక్. అయితే ఈ అత్యాధునిక టెక్నాలజీని పిల్ల లకూ చేరువ చేసేందుకు గూగుల్ చేస్తున్న ప్రయత్నం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కృత్రిమ మేధ ఛాట్బోట్ ‘జెమి నీ’ని 13 ఏళ్ల కంటే తక్కువ వయసు వారికీ అందుబాటు లోకి తెస్తున్నట్లు గూగుల్ ఇటీవలే ప్రకటించింది. మొదట అమెరికా, కెనడాల్లో ప్రవేశపెట్టి ఈ ఏడాది చివరికి ఆస్ట్రేలియాలోనూ లాంచ్ చేయనున్నట్లు సమా చారం. గూగుల్ ఫ్యామిలీ లింక్ అకౌంట్లు ఉన్న వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ పరిణామం ఏమంత మంచిది కాదని అనిపిస్తోంది. సోషల్ మీడియా వాడకంపై పిల్లలకు నిషేధం ఉన్నా వారిని సురక్షితంగా ఉంచేందుకు ఎన్ని పాట్లు పడాలో ఈ నిర్ణయం హైలైట్ చేస్తోంది. బహుశా దీన్ని ముందుగా గూగుల్ లాంటి పెద్ద కంపెనీల్లో వెంటనే అమలు చేసి చూడటమే మేలేమో!పదమూడేళ్ల లోపు పిల్లలకు అందబాటులోకి తెస్తున్న కృత్రిమ మేధ ఛాట్బోట్ ‘జెమినీ’ వాడకంపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉంటుందని గూగుల్ చెబు తోంది. ఫ్యామిలీ లింక్ అకౌంట్ల ద్వారా పిల్లలు ఏయే అప్లికేషన్లు వాడవచ్చో నిర్ణయించవచ్చు. పిల్లల పేరుతో అకౌంట్ను సృష్టించేందుకు తల్లిదండ్రులు పిల్లాడి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాస్తా వారి వ్యక్తిగత గోప్యతపై ప్రశ్నలు లేవనెత్తే అవకా శాలున్నాయి. అయితే పిల్లల వాడకానికి సంబంధించిన సమాచారాన్ని ఏఐ వ్యవస్థల శిక్షణకు వాడుకోబోమని స్పష్టం చేస్తోంది. ఛాట్బోట్ డీఫాల్ట్గా అందుబాటులో ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు నియంత్రణ కోసం కొన్ని ఫీచర్లను స్విచ్చాఫ్ చేయాలి. ఈ వ్యవస్థ తప్పులు చేసేందుకు అవకాశముందని అంగీకరిస్తోంది కాబట్టి ఇది అందించే సమాచారం నాణ్యత, విశ్వసనీయత ఎంత అన్నది ప్రశ్నార్థకం. కొన్నిసార్లు ఛాట్ బోట్లు కొన్ని సమాధానాలను ఊహించుకుని చెబుతూంటాయి. టెక్ పరిభాషలో దీన్ని ‘హెలూసినేషన్ ’ అంటూంటారు. పిల్లలు ఒకవేళ తమ హోంవర్క్ కోసం ఈ ఛాట్బోట్ను వాడుతూంటే.. అందులో వాస్తవాలు ఎన్నో... ఛాట్ బోట్ తాలూకూ భ్రాంతి, భ్రమ ఎంతో తెలియకుండా పోతుంది. గూగుల్, ఇతర సెర్చ్ ఇంజిన్లు తమంతట తాము ఒక స్పందన ఇవ్వకుండా... ఆ యా అంశాలకు సంబంధించిన వేర్వేరు సమాచారాలను మీ ముందు ఉంచు తాయి. వాటిల్లో వార్తలుంటాయి. ఫీచర్ కథనాలుంటాయి. విద్యార్థులు ఎవరైనా వీటిని చదివి అర్థం చేసుకుని తమ హోం వర్క్లను చేసుకోవచ్చు. అయితే ఏఐ టూల్స్ ఇలా కాదు. అందుబాటులో ఉన్న సమా చారంలో ఒక ప్యాటర్న్ కోసం వెతుకుతాయి. వాటి ఆధారంగా సమాధానాలను సృష్టిస్తాయి. లేదా చిత్రాన్ని తయారు చేస్తాయి. ఇవన్నీ మనం అందించే ప్రశ్న అంటే ప్రాంప్ట్ ఆధారంగా జరుగుతాయి. ఉదాహరణకు... ఒక కుర్రాడు పిల్లి బొమ్మ గీయమని అడిగాడని అనుకుందాం. అప్పుడు ‘జెమినీ’ ఛాట్బోట్ వ్యవస్థ... పిల్లి లక్షణాలు అంటే పొడుచుకొచ్చిన చెవులు, మీసాలు, పొడవైన తోక వంటి వాటిని గుర్తించే ప్రయత్నం చేస్తుంది. వీటి ఆధారంగా పిల్లి చిత్రాన్ని గీస్తుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్లు, జెమినీ ఛాట్బోట్లు అందించే సమాచారంలోని తేడాలను గుర్తించడం పసిపిల్లలకు సవాలే. ఏఐ టూల్స్ పెద్దవాళ్లను కూడా... అది కూడా న్యాయవాదుల వంటి నిపుణులను కూడా తేలికగా బురిడీ కొట్టించగలవని ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. వయసుకు తగ్గ సమాచారం మాత్రమే పిల్లలకు అందేలా తాము రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని గూగుల్ చెబుతోంది. అయితే ఇలాంటి ఏర్పాట్లు కొత్త సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఉదాహరణకు... లైంగిక సంబంధిత సమాచారం పిల్లలకు అందకుండా చూసేందుకు కొన్ని పదాలను (ఉదాహరణకు రొమ్ము) నిషేధించామనుకోండి... పిల్లలకు అవసరమైన సమా చారం (కౌమార దశలో శరీరంలో చోటు చేసుకునే మార్పులు) కూడా అందకుండా పోతుంది. ఈ–సేఫ్టీ కమిషన్ సూచనలుఏఐ ఛాట్బోట్లతో రాగల సమస్యలను ఈ–సేఫ్టీ కమిషన్ ఇప్పటికే వివరించింది. ఏఐ ఛాట్బోట్లు ‘‘హాని కరమైన సమాచారాన్ని, తప్పుడు సమాచారాన్ని పంచు కోవచ్చు. అలాగే ప్రమాదకరమైన సలహాలూ ఇవ్వ వచ్చు’’ అని హెచ్చరించింది. పిల్లలకు ఛాట్బోట్లు అందుబాటులోకి వస్తే ఏం జరుగుతుందో ఈ సూచన స్పష్టం చేస్తోంది. ఛాట్ జీపీటీ, రెప్లికా, టెస్సా వంటి ఛాట్బోట్లను ఇప్పటికే పరిశీలించాము. మనుషులు అలిఖిత నిబంధనల సాయంతో చేసే సామాజిక ప్రవర్త లను ఈ ఛాట్బోట్ల స్పందనలు ప్రతిబింబిస్తున్నాయి. ఈ అలిఖిత నిబంధనలను ‘ఫీలింగ్ రూల్స్’ అంటారు. తలుపు తెరిచారని ‘థ్యాంక్యూ’ చెప్పడం, లేదా పొర బాటున ఎవరినైనా ఢీకొంటే ‘సారీ’ చెప్పడం వంటివి ఈ ఫీలింగ్ రూల్స్ కోవలోకి వస్తాయి. వీటిని అనుకరించడం ద్వారా మన నమ్మకాన్ని చూరగొనేలా ఈ ఛాట్ బోట్లను రూపొందించారు. అయితే ఈ రకమైన మాన వీయ ప్రవర్తన పిల్లల విషయానికి వచ్చేసరికి గందర గోళం సృష్టించవచ్చు. తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నా నమ్మేలా చేస్తుంది. అంతేకాకుండా... ఓ యంత్రంతో కాకుండా... సాటి మనిషితోనే వ్యవహారాలు నడుపుతున్నామని వారు నమ్మడం మొదలవుతుంది. ఆస్ట్రేలియాలో జెమినీ ఛాట్బోట్ చాలా కీలక సమ యంలో పిల్లలకు అందబాటులోకి వస్తోంది. ఎందుకంటే... పదహారేళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్లపై ఈ ఏడాది డిసెంబరు నుంచే నిషేధం అమలు కానుంది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూని యన్, యునైటెడ్ కింగ్డమ్లు 2023లో చేసిన ‘డిజిటల్ డ్యూటీ కేర్ చట్టం’ గురించి తెలుసుకోవడం అవసరం. గత ఏడాది నవంబరు నుంచి ఆస్ట్రేలియా ఈ చట్టం అమలును స్తంభింపజేసింది. హానికారక సమాచారం విషయంలో టెక్నాలజీ కంపెనీలనే బాధ్యులను చేస్తుందీ చట్టం!లీసా ఎం. గివెన్ వ్యాసకర్త ఆర్ఎంఐటీ యూనివర్శిటీ అధ్యాపకులు(‘ద కాన్వర్సేషన్ ’ సౌజన్యంతో) -
కశ్మీరీలతో ఇలాగేనా వ్యవహరించేది?
మనలో చాలా మందికి పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, 4 రోజుల ‘యుద్ధం’ గురించి ఎక్కువగానే తెలుసు. తెలుసుకోవడం మనం ఒక పనిగా పెట్టుకున్నాం. కానీ ఈ కాలంలో జరిగిన ఇతర వాస్తవాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఏప్రిల్ 27, మే 8 మధ్య భారతదేశ వ్యాప్తంగా వివిధ రకాలుగా 184 ముస్లిం వ్యతిరేక దాడులు జరిగాయని పౌర హక్కుల రక్షణ సంఘం నివేదించింది. వాటిలో 19 విధ్వంసక చర్యలు, 39 దాడులు, 42 వేధింపుల సంఘటనలు, 84 ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు ఉన్నాయి. వీటిలో 106 దాడులు పహల్గామ్ ద్వారా ‘ప్రేరేపితం’ అని అంచనా. వీటిలో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలలో జరిగాయి.కశ్మీరీలను, ఇతర ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం సర్వసాధారణం కాబట్టి ఈ వాస్తవాలు మనకు తెలియలేదా? అవి మన అసహనం, నిరాశ, కోపానికి బాక్సింగ్ బ్యాగులుగా మారాయా? పత్రికలు వాటిని ఎందుకు నివేదించవు? వాటి గురించి తెలుసు కోవడానికి మనం ఎందుకు ప్రయత్నించడం లేదు?కశ్మీర్లో ఏమి జరిగిందో పరిశీలించండి. కేవలం అనుమానం ఆధారంగా, ఎటువంటి ప్రక్రియా లేకుండా, బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఉల్లంఘించి, ఉగ్రవాదులుగా చెప్పబడుతున్న వారి ఇళ్లను కూల్చివేశారు. చట్ట పాలనను అనుసరించే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం తనను తాను చెప్పు కోవడాన్ని ఇది అపహాస్యం చేయడం లేదా?అంతే కాదు. బహుశా 2,000 మందిని అనుమానంతో అరెస్టు చేశారు. పాశ్చాత్య పత్రికలు వారిలో అనేక మందిని హింసించారని నివేదించాయి. ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ఇది కశ్మీరీలు, ముస్లింలు అనే కారణంగా కశ్మీరీ ముస్లింల పట్ల అనుమానాస్పద దృక్పథంతో వ్యవహరించడమేనని అనిపించడం లేదా?కశ్మీరీలు ఎలా స్పందించారు?ఇప్పుడు, కశ్మీరీలు పహల్గామ్ ఘటన పట్ల ఎలా స్పందించారో పోల్చి చూద్దాం. హోటల్ బుకింగ్లు లేని వారికి పడకలు అందించ డానికి మతాధికారులు మసీదులను తెరిచారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల నుండి ఛార్జీలు వసూలు చేయడానికి ట్యాక్సీ డ్రైవర్లు నిరాకరించారు. బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడా నికి దుకాణాలు, హోటళ్ళు, కళాశాలలు, పాఠశాలలు మూసివేయడంతో పూర్తి హర్తాళ్ జరిగింది. అధికారంలో ఉన్నా, లేదా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ ఉగ్రవాదులను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించాయి. దీని గురించి మనకు వివరంగా తెలియాలి కానీ మనకు తెలియలేదు. లేదా దీని గురించి చాలా తక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకు? కచ్చితంగా కశ్మీర్ నుండి మనం వినాలనుకున్న, వినవలసిన సందేశం ఇది కాదా?లోయలోని కశ్మీరీల ప్రవర్తనకు పూర్తి విరుద్ధంగా, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలలో కశ్మీరీలను ఎలా చూశారో పరిశీలిద్దాం. పంజాబ్, ఉత్తరాఖండ్లలో కశ్మీరీ విద్యార్థులను కొట్టారు. వారు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోవలసి వచ్చింది. ముస్సోరీలో, దశాబ్దాలుగా అక్కడ పనిచేస్తున్న‘షాల్ వాలాస్’ బల వంతంగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కనిపించాయి. మళ్ళీ ప్రశ్నిస్తున్నాను... ఎందుకు? వీరు మీలాగే, నాలాగే హక్కులతో కూడిన భారత పౌరులు కాదా?బహుశా, అన్నింటికంటే ఘోరంగా, అధికార స్థానాల్లో ఉన్నవారు కశ్మీరీలనూ, ముస్లింలనూ రక్షించడానికి బదులుగా దాడి చేయడాన్ని ఎంచుకున్నారు. ‘కశ్మీర్లో జరిగిన దాడి హిందువులపై జరిగిన దాడి. మేము కూడా అదే విధంగా స్పందిస్తాం. కశ్మీరీలపై మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతి ముస్లింపైనా’ అని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషీని ‘ఉగ్రవాదుల సోదరి’ అన్నారు. అయినా వీరంతా తప్పించుకున్నారు. వారిని ఏ రకంగానూ హెచ్చరించలేదు. వారిని కచ్చితంగా శిక్షించలేదు.ఇప్పుడు నేను రాసిన దాని గురించి ఆలోచించండి. ముస్లింలపై ప్రధానంగా దాడులు జరిగిన రాష్ట్రాలు ఏవి? అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి? ఏ పార్టీ సభ్యులు లేదా సైద్ధాంతిక మద్దతుదారులు అలా వ్యవహరించారో మీకే తెలుస్తుంది.అదేమీ రహస్యం కాదు. నిజానికి, ఇది కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది.ఇదీ నాగరిక పద్ధతి!దేశ విభజన తర్వాత హత్యలు తారస్థాయికి చేరుకున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ 1947 అక్టోబర్ 15న రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాసిన లేఖ నుండి నన్ను ఉటంకించనివ్వండి: ‘మన దగ్గర ముస్లిం మైనారిటీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు కోరుకున్నా, వేరే చోటికి వెళ్లలేరు. వారు భారతదేశంలోనే నివసించాలి’. తరువాత స్పష్టంగా ఇలా జోడించారు: ‘పాకిస్తాన్ నుండి ఏదైనా రెచ్చగొట్టడం జరిగినా... మనం ఈ మైనారిటీతో నాగరిక పద్ధతిలో వ్యవహరించాలి.’ఆ సలహా 80 సంవత్సరాల క్రితం ఉన్నంత సందర్భోచితంగానే ఇప్పుడు కూడా లేదా? మిస్టర్ మోదీ నుండి మనం వినవలసిన సందేశం ఇది కాదా? పైగా ప్రధానమంత్రి మౌనం వ్యూహాత్మక ప్రతిస్పందన అని చాలామంది విశ్వసిస్తున్నట్లయితే మనం ఎలాంటి దేశంగా మారాం?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రామఫోసా (దక్షిణాఫ్రికా అధ్యక్షుడు) రాయని డైరీ
డోనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం బాగుంది! ఓవల్ ఆఫీస్లోకి నేను అడుగు పెట్టగానే, సాదరంగా ఆయన నాకు పలికిన అపూర్వ ఆహ్వానం... ఆ గదిలోని లైట్స్ అన్నీ డిమ్ చేయించటం!!రెస్టారెంట్లలో, ఇలాగే డిమ్ లైట్ల కాంతిలో రాచమర్యాదలు ఉంటాయి. ఓవల్ ఆఫీస్లో ట్రంప్ నాకోసం ఏర్పాటు చేయించిన డిష్లూ లేవు, చేసిన మర్యాదలూ లేవు. ఆయన ఆతిథ్యం నాకు బాగుండటానికి ఆ ‘లేకపోవటం’ తప్ప, వేరే కారణాల్లేవు.మర్యాద తెలియని మనిషి నుంచి మర్యాదను పొందటం అవమానం. అది నాకు జరగలేదు. తింటున్నప్పుడైనా ఏం మాట్లాడకూడదో తెలియని మనిషితో కలిసి తినటానికి కూర్చోవలసి రావటం మర్యాదను పోగొట్టుకోవటం. అదీ నాకు జరగలేదు. కనుక ట్రంప్ నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చినట్లే!లైట్స్ డిమ్ చేయించాక, స్క్రీన్ మీద ఒక చిన్న క్లిప్ వేయించి, ‘‘చూడండి, మిస్టర్ రామఫోసా... అక్కడ మీ వాళ్లు మా వాళ్లను ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో’’ అన్నారు ట్రంప్. ఆ మాటతోనే మా మీటింగ్ మొదలైంది. ఆ మాటతోనే మా మీటింగ్ మొదలు కాకుండానూ అయింది.స్క్రీన్ మీద ట్రంప్ వేయించిన ఆ క్లిప్ నిజమైనది కాదు. నిజమని ట్రంప్ అనుకుంటున్నా... దాని గురించి మాట్లాడే సందర్భం అది కాదు. ట్రేడ్ డీల్ కోసం పిలిపించుకున్నప్పుడు ట్రేడ్ డీల్ గురించే మాట్లాడాలి.ఓవల్ ఆఫీస్ను స్కూల్ హెడ్ మాస్టర్ రూమ్గా మార్చేశారు ట్రంప్. రూమ్కి పిలిపించి, ‘‘రష్యా అడిగింది ఇచ్చేయ్’’ అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీని గద్దిస్తారు!‘‘గాజా నుండి మీ దేశానికి వచ్చే శరణార్థుల్ని అడ్డుకోవద్దు...’’ అని జోర్డాన్ రాజు అబ్దుల్లా హుస్సేన్ కు చెబుతారు! ‘‘ఉక్రెయిన్ కి సహాయం ఆపేయాలని ఐరోపాకంతటికీ మీరే చెప్పాలి...’’ అని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మెక్రాన్ ను బలవంత పెడతారు!‘‘కెనడాను సైనికంగా రక్షించటానికి అయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని అమెరికానే భరిస్తోంది కనుక, కెనడాను అమెరికాలో ఎందుకు విలీనం చేయకూడదు?’’ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీని ప్రశ్నిస్తారు.‘‘జెలెన్ స్కీకి అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఇచ్చి ఉండాల్సింది కాదు కదా...’’ అని ఇటలీ ప్రధాని మిస్ మెలనీతో అంటారు. ఇప్పుడు నన్ను పిలిపించుకుని, ‘‘దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులపై జరుగుతున్న ఊచకోతకు వివరణ ఇవ్వండి’’ అంటున్నారు.జెలెన్ స్కీలా కోపగించుకొని మీటింగ్ మధ్యలోనే లేచి వెళ్లిపోవటం నా వయసుకి బాగుండదు కనుక, మండే అగ్నిగోళం నెల్సన్ మండేలాను మనసులోకి తెచ్చిపెట్టుకుని ప్రశాంతంగా కూర్చున్నాను. అమెరికా గురించి మండేలా గొప్పగా చెబుతుండేవారు. ‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్’ పార్టీకి మండేలా ప్రెసిడెంట్గా, నేను పార్టీ సెక్రెటరీ జనరల్గా ఉన్నప్పుడు మండేలా తరచూ అమెరికన్ డెమోక్రసీ మీద,అమెరికన్ లీడర్షిప్ మీద ప్రశంసా పూర్వకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండేవారు.27 ఏళ్ల కారాగార వాసం నుండి విడుదలయ్యాక, మండేలా తొలిసారి సందర్శించిన దేశాల్లో అమెరికా కూడా ఉంది. పన్నెండు రోజుల టూర్లో ఆయన ఎనిమిది అమెరికన్ సిటీలలో పర్యటించారు.అనేకమంది నాయకులను కలుసుకున్నారు. ప్రెసిడెంట్ జార్జిబుష్తో ఇదే ఓవల్ ఆఫీస్లో సమావేశం అయ్యారు. ఇదే ఆఫీస్లో నేను,జో బైడెన్ కూడా కలిసి కూర్చున్నాం.ట్రంప్... బైడెన్ లా లేరు. జార్జి బుష్లా లేరు. ఏ అమెరికన్ ప్రెసిడెంట్లానూ లేరు. అందరికన్నా భిన్నంగా ఉన్నారు! ఆయన ఎలా ఉన్నా, ఎలా లేకున్నా...మండేలా అన్నట్లు అమెరికా గొప్ప దేశమే! కానీ కొన్నిసార్లు బ్రైట్నెస్ తగ్గి బాగా డిమ్ అయిపోతుంటుంది! -
కార్పొరేట్ల కోసమే ఈ నిర్మూలనా?
‘ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని వంద లాది గ్రామాలలో వేలాది రైతుల నుండి వ్యవసాయ శాస్త్రవేత్త డా‘‘ రిఛారియా 22,000 లకు పైగా వరి వంగడాలను, 1,800లకు పైగా ఆకుకూరలను సేకరించి వాటి జర్మ్ ప్లాస్క్ను రాయ్పూర్లోని ‘ఇందిరా గాంధీ జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం’లో 1950, 1960లలో భద్రపరిచారు. ఇందులో తక్కువ నీటితో పండేవి, తక్కువ గడ్డినిచ్చేవి, ఎక్కువ గడ్డినిచ్చేవి, సువాసనలు వెదజల్లేవి, పొడవైన– పొట్టి రకాలు, ఏ కాలంలోనైనా పండే అనేక వంగడాలు ఉన్నాయి. అయితే మన దేశ దళారీ పాలకుల కుమ్మక్కుతో ఈ వరి వంగడాల జర్మ్ ప్లాస్క్ను అమెరికా తదితర దేశాల బహుళజాతి కంపెనీలు దొంగిలించుకు పోయాయి. మనీలాలోని ‘ఇంటర్నేషనల్ రైస్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్’ (ఐఆర్ఆర్ఎ)లలో అభివృద్ధి చేశామని చెప్తూ ఇలా దొంగిలించుకు పోయిన వంగడాలను వివిధ పేర్లతో (ఐఆర్–36, ఐఆర్–72 తదితర) బహుళజాతి కంపెనీలు భారత్ లాంటి అనేక దేశాల్లో అమ్ముకుని భారీగా లాభాలు గడిస్తున్నాయి. విత్తనాల కోసం భారతదేశ రైతులు ప్రతి సంవత్సరం బహుళజాతి కంపెనీలపై ఆధారపడేలా చేస్తు న్నారు...’ ఈ మాటలు విదేశీ జర్నలిస్టు అల్ఫ్ బ్రెనన్ కు 2022లో ఇచ్చిన ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూలో మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి బసవరాజువి. ఈ దేశ ప్రజల పరంపరాగత జ్ఞానం పట్ల, దేశీయత పట్ల, వనరుల పట్ల ఆయన వైఖరిని సూచించే మాటలు ఇవి.దేశభక్తి అనే ఒక్క మాటతో ఈ రోజు అందరినీ శిలువ ఎక్కించి పరీక్షిస్తున్నారు. కానీ నిజంగానే దేశం పట్ల ప్రేమ ఉంటే ఎలా ఆలోచించాలో బసవరాజు చేసిన ఈ సూక్ష్మ పరిశీలన తెలియజేస్తోంది. జాతీయత పేరుతో మావోయిస్టు నిర్మూలనను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న తరుణంలో ఏది దేశభక్తి, ఏది ప్రజల మీది ప్రేమ అనే చర్చ జరగలవసి ఉన్నది.మావోయిస్టుల ఆలోచనలు విదేశీయమని కొందరు చెబుతుంటారు. మావోయిస్టుల వల్ల ఈ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, అభివృద్ధికి వాళ్లు ఆటంకంగా ఉన్నారని అంటున్నారు. కానీ కొద్దిగా ఈ దేశ రాజకీయార్థిక వ్యవహారాలను పరిశీలిస్తే ఎవరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నదీ అర్థమవుతుంది. గతంలో కంటే తీవ్రంగా అభివృద్ధి అనే మాట ఇప్పుడు చలామణీలోకి వచ్చింది. కానీ ఇది ఎవరి అభివృద్ధి అనేది అతి ముఖ్యమైన ప్రశ్న.ఏడాదిన్నరగా మావోయిస్టు నిర్మూలన పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్’ కేవలం సైనిక చర్య కాదు. అభివృద్ధి నమూనా కేంద్రంగా సాగుతున్న రాజకీయార్థిక యుద్ధం. సరిహద్దుల కోసం పక్క దేశ ప్రజలపై యుద్ధం చేసే భారత ప్రభుత్వం అభివృద్ధి నమూనా విషయంలో జరుగుతున్న సంఘర్షణను అంతర్యుద్ధంగా మార్చేసింది. తన దేశ ప్రజల మీదే దండయాత్ర చేస్తోంది. యుద్ధాల్లో ఆయుధాలు, విమానాలు, డ్రోన్ లు చేసే వికృత ధ్వనుల వెనుక రాజకీయార్థిక విధ్వంసాలు ఉంటాయి.కగార్ పేరుతో అదే జరుగుతోంది. అందుకే మావోయిస్టు ప్రభా విత మధ్య భారత రాష్ట్రాల్లో హత్యాకాండ ఆపాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఆదివాసుల జీవించే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన రక్షణ చట్టాల చర్చగానే ఇది ముగిసి పోవడం లేదు. ఈ రక్తపాతం వెనుక ఉన్న పాలకుల అభివృద్ధి నమూనా ఉంది. ఈ ఏడాదిలోనే వందలాది మంది ఆదివాసుల హత్య వెనుక ఉన్న అభివృద్ధి–విధ్వంసాల సంఘర్షణకు మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాళ కేశవరావు హత్య ఒక పరాకాష్ఠ.ఒకప్పుడు మావోయిస్టులు, వాళ్ల అభిమానులు మాత్రమే పాలకుల అభివృద్ధి నమూనాను మౌలికంగా విమర్శించేవాళ్లు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఎట్లా ఉండాలో చెప్పేవాళ్లు. ఈ దేశ ప్రజల అవసరాలే కేంద్రంగా అభివృద్ధి నమూనా ఉండాలని విశ్లేషించేవాళ్లు. ఈ దేశ వనరులు ఇక్కడి ప్రజల కోసమే వినియోగించాలనే వాళ్లు. చిన్న చిన్ని సవరణలు ఎన్ని చేసినా అది ప్రజలకు పనికి రాదని, చాలా మందికంటే భిన్నమైన వైఖరిని ప్రకటించేవాళ్లు. విప్లవం ద్వారా మౌలిక మార్పు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని అనేవాళ్లు.ఇదే విమర్శ ఇప్పుడు దేశంలోనే ఒక ప్రధాన విమర్శగా ఎదిగింది. ఈ దేశం పిడికెడు మంది కార్పొరేట్లది కాదని, అసంఖ్యాక ప్రజలదనే అవగాహన అనేక రకాలుగా ప్రచారంలోకి వచ్చింది. కార్పొరేటీకరణ ఉద్ధృతంగానే సాగుతూ ఉండవచ్చు. కానీ దాని మీద విమర్శ పదునెక్కుతోంది. అనేక రూపాల్లో ప్రజా పోరాటాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశభక్తి, జాతీయత అనే భావనలను ఆ పక్క పాలకులు ప్రచారంలో పెట్టే కొద్దీ... ఈ పక్క నుంచి రోజువారీ జీవిత సంక్షోభంలోంచి ప్రజా ప్రయోజనాల చర్చ వేగవంతం అవుతున్నది.మావోయిస్టు ఉద్యమం ఈ విషయాలను చర్చించడంతో సరి పెట్టుకోలేదు. వాళ్లకు బలం ఉన్న ప్రాంతాల్లో మిలిటెంట్ ఉద్యమాలను నిర్మిస్తోంది. మిగతా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా జరుగుతున్న వేర్వేరు ప్రజా పోరాటాలకు మద్దతు ఇస్తున్నది. వాటిలో తనకు వీలైన పద్ధతిలో పాలుపంచుకుంటోంది. ఈ దేశంలో మౌలిక స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి నమూనా చర్చను ప్రజా ఆచరణలోకి మళ్లిస్తున్నది. ఇది ముఖ్యంగా కేంద్ర పాలకులకు ఆగ్రహం తెప్పించింది. పైకి మావో యిస్టు ఉద్యమం గురించి అప్పుడప్పుడు శాంతి భద్రతల సమస్యగా చెప్పినా... ఇది తాను ఎంచుకొన్న అభివృద్ధి నమూనాకు ఆటంకం అని గ్రహించింది. అడవుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే అశేష పీడిత ప్రజానీకానికీ, కార్మికులకూ, నానాటికీ పెరుగుతున్న మధ్య తరగతికీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న అభివృద్ధి నమూనా ప్రమాదకరమనే చైతన్యం పెరగడంలో మావోయిస్టుల పాత్ర ఉన్నది.కాబట్టి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించకపోతే తాను ఎంచుకున్న కార్పొరేట్ అభివృద్ధి నమూనాను అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వానికి స్పష్టమైంది. కొన్ని తేడాలతో గత ప్రభుత్వాలది కూడా ఇదే వరుస. వాళ్లు చూసిన దారిని మరింత నిర్దాక్షిణ్యంగా, అమానవీయంగా నేటి ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ మేరకు వివిధ ప్రజా పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. వ్యవస్థ మౌలిక మార్పులో కీలకమైన ఉత్పత్తి సంబంధాల చర్చను, కొత్త దోపిడీ రూపాల సమస్యను మావోయిస్టు ఉద్యమం కేంద్ర స్థానంలోకి తీసుకొని వచ్చింది. కార్పొరేట్ పెట్టుబడి, దాని వనరుల దాహం, శ్రమశక్తిని కొల్లగొడుతున్న పద్ధతుల మీద విమర్శను ప్రజల కామన్ సెన్స్లో భాగం చేసింది. కాబట్టి కార్పొరేట్ ఇండియాను సాధించడానికి మావోయిస్టు రహిత భారత్ ఒక షరతుగా మారిపోయింది.వ్యక్తిగా నంబాళ కేశవరావు భౌతిక కాయం అరమోడ్పు కన్నులతో ఈ నేలలో కలిసిపోవచ్చు. కానీ ఆయన చూపు, మేధ,హృదయం, చైతన్యం మాత్రం పాలకుల అభివృద్ధి నమూనాను గురి చూస్తూనే ఉంటాయి. పాణి వ్యాసకర్త ‘విరసం’ కార్యవర్గ సభ్యుడు -
మెడికల్ టూరిజంలో ముందంజలో మనం
ఇవాళ ‘మెడికల్ టూరిజం’ (వైద్య పర్యాటకం) వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడానికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేషెంట్లు వివిధ వ్యాధులకు అత్యున్నత చికిత్స పొందడానికీ వాహకంగా నిలుస్తోంది. ఈ రంగంలో భారత్ పైపైకి దూసు కుపోతుండటం మనందరికీ గర్వకారణం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్’ (టీటీడీఐ)– 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 119 దేశాల్లో మన భారతదేశం 39వ స్థానంలో ఉంది. అదే 2001లో మనం54వ స్థానంలో ఉన్నాం. కీలకమైన అంశాల్లో భారత్ అద్భుతంగా రాణిస్తోంది. ఉదాహరణకు మిగతావారి కంటే మంచి ధరకువైద్య సేవలు అందించడంలో 18వ స్థానం, విమాన రవాణా సామర్థ్యంలో 26వ స్థానం, అలాగే ఉపరితల రవాణాతో పాటు నౌకారవాణాలో 25వ స్థానంలో ఉంది. అందుకే ఈ ఏడాది నాటికి మెడికల్ టూరిజమ్లో భారత్లో మరో 12% పెరుగుదల నమోదవు తుందని అంచనా. ఈ రంగంలో ప్రస్తుతం ఫ్రాన్స్ అగ్రస్థానంలోఉంది. పేషెంట్స్కు ఇవాళ చాలా ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. వాళ్లు ఏదైనా మెడికల్ టూరిజమ్ తాలూకు గమ్యాన్నిఎంపిక చేసుకోవాలంటే... అక్కడున్న ఆరోగ్య మౌలిక సదుపా యాలు, తేలిగ్గా చేరేందుకు అవసరమైన ప్రయాణ సౌకర్యాలు, తమ ప్రాంతానికీ, అక్కడికీ సాంస్కృతికంగా ఉన్న పోలికలూ, అక్కడ దొరికే వైద్యసదుపాయాల నాణ్యత, అక్కడి వైద్యుల విద్యార్హతలూ – నైపుణ్యాలూ, అంతర్జాతీయ థర్డ్ పార్టీ ద్వారా వాళ్లకు లభించిన ప్రశంసలూ కితాబులూ (అక్రెడిటేషన్స్), తాము వాళ్లతో ఎంత తేలిగ్గా సంభాషించడం సాధ్యమవుతుంది వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 2020-2021 మధ్యకాలంలో అంతర్జాతీయంగా/ప్రపంచవ్యాప్తంగా 46 ప్రాంతాలు అత్యద్భుతమైన మెడికల్ టూరిజమ్ గమ్యస్థానాలుగా ప్రఖ్యాతి పొందాయి. అనేక అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకింగ్లు ఇవ్వడం జరిగింది. మన భారతదేశం... ఆసియా ఖండంలోనే అత్యుత్తమమైన మెడికల్ టూరిజమ్ డెస్టినేషన్స్లో ఒకటిగా ప్రశస్తి పొందింది. మనం ఆరో స్థానంలో నిలిచాం. సౌకర్యాల నాణ్యతలోనే కాదు... విభిన్నమైన అనేక సేవలూ అందించగల మనే ప్రఖ్యాతి పొందాం. మన మెడికల్ వీసా విధానం ఎంత అత్యుత్తమైనదంటే... ఓ పేషెంట్తో పాటు అతడి సహాయకులూ (అటెండెంట్స్) దాదాపు 60 రోజులకు పైబడి ఇక్కడ అత్యంత సౌకర్యవంతంగా ఉండిపోయి సేవలందుకునేంత ఉత్తమమైన గమ్యస్థానంగా పేరొందడమన్నది అంతర్జాతీయంగా అన్ని దేశాల పేషెంట్స్నూ ఆకర్షిస్తోంది. ‘గ్లోబల్ హెల్త్కేర్ అక్రెడిటేషన్ (జీహెచ్ఏ) వంటివి... భారతదేశాన్ని పేషెంట్ల పాలిట ఓ సురక్షిత మైన, నాణ్యమైన, సాంస్కృతికంగా ఉత్తమమైన సేవలందించే, భాషాపరంగా కూడా ఇబ్బందులు లేని మెడికల్ టూరిజమ్ గమ్య స్థానంగా సిఫార్సు చేస్తున్నాయి. భారతదేశంలో అనేక ఆస్పత్రులు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలందిస్తున్నాయి. అనేక మంది సందర్శించే నగరాల్లో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. మనం అనేక రకాల వైద్యసేవలందించేలా సుశిక్షితులమై ఉన్నాం. ఉదాహరణకు జబ్బుపడకముందే నివారించగల సేవలు (ప్రివెంటివ్ మెడిసిన్) వంటివాటినీ అంది స్తున్నాం. ఎన్నో వ్యాధులకు చికిత్స నివ్వగల నిపుణులమంటూ గర్వంగా ప్రకటించుకో గలిగేంత పటిష్ఠమైన స్థానంలో ఉన్నాం. వైద్య సేవల కోసం నేడు అనేక ఆఫ్రికన్ దేశాలూ, పశ్చిమ ఆసియా, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్)తో పాటు... యూరప్లోని పలు దేశాలు, ఉత్తర అమెరికా నుంచి కూడా ఇవాళ భారత్ను... మరీ ముఖ్యంగా హైదరాబాద్ను పలువురు పేషెంట్లు సందర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంక్లిష్టమైన సర్జరీలు, సంతాన సాఫల్య చికిత్సలు, క్యాన్సర్ థెరపీలు, సౌందర్యసాధనాల ఉత్పా దనల రవాణా వంటివి మెడికల్ టూరిజమ్ రంగాన్ని మరింతముందుకు నడిపే అంశాలు. దాంతోపాటు గణనీయమైన ప్రైవేటు పెట్టుబడులు, అలాగే అనుకూలమైన ప్రభుత్వ విధానాల వంటి వాటితో ఇంకాస్త మెరుగుదల సాధ్యమవుతుంది. దీన్ని సుసాధ్యం చేసేలా బడ్జెట్లో ఈ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు చేయాలి. వీసా విధానాలను సులభతరం చేయాలి. తద్వారా మన ‘హీల్ ఇన్ఇండియా’ నినాదానికి ఓ ఉద్యమరూపం కల్పించవచ్చు. మన హైదరాబాద్ విషయానికి వస్తే... ఇప్పటికే ఈ నగరం వైద్య పర్యాటక రంగంలో ప్రపంచవ్యాప్త గమ్యస్థానాల్లో ఒకటిగా మారింది. కానీ అంతర్జాతీయంగా వైద్య సేవలను కోరుకుంటున్న కొన్ని దేశాలతో నేరుగా విమానయాన సర్వీసులు లేకపోవడం ఒక ప్రధాన అడ్డంకి అయ్యింది. వైద్యసేవలు ఇక్కడ చాలా చవగ్గా దొరుకుతుండటమూ, ఇంగ్లిష్లో సంభాషించగలిగినవారు ఉండ టమూ, కాస్మోపాలిటన్ సంస్కృతి, సురక్షితమైన భద్రత వంటివి ఇక్కడి సానుకూల అంశాల్లో కొన్ని. అయితే ఈ పరిశ్రమలో రిఫరల్ ఫీజుల వంటి అనేక అనైతిక అంశాల వల్ల, అలాగే ఈ రంగంలోని మధ్యవర్తుల కారణంగా కొన్ని నిందలూ, అపవాదులు వినాల్సి రావడం ఓ దురదృష్టకరమైన అంశం. ఇక్కడికి వచ్చే విదేశీయుల్లో కొందరికి ఇంగ్లిష్ రాకపోవడం వల్ల ఇక్కడి మధ్యవర్తులు (దుబాసీలు) దోపిడీ చేస్తుండటమూ గర్హనీయమైన మరో అంశం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఓ మంచి హెల్త్ టూరిజమ్ డెస్టినే షన్గా వృద్ధి చెందాలంటే... విదేశీ పేషెంట్స్కు అవసరమైన అనువాదకులను ఏర్పాటు చేయడం, వారు ఏ విధంగానూ దోపిడీకి గురి కాకుండా చూసే ప్రత్యేక రక్షణ వ్యవస్థను సృష్టించడం, వారి సంస్కృతికి తగ్గట్లుగా ఆహారాలు, పానీయాలు అందేలా చేయడం, వారి మత ఆచారాలూ, విధానాలకు తగ్గట్లుగా ప్రార్థనా సౌకర్యాలు కల్పించడం, వారు ఖర్చు చేసే ప్రతి పైసాకూ తగిన ప్రతిఫలం అందేలా చూడటం అవసరం. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఓ మంచి వైద్యుడిగా,వైద్య సేవలు అదించే బృందాలకు నేతృత్వం వహిస్తున్నవాడిగా, ఇక్కడా, అలాగే అమెరికాలో కూడా సంపాదించిన అనుభవంతో చెప్పొచ్చేదేమిటంటే... మెడికల్ టూరిజమ్ రంగంలో మనం ప్రపంచంలోనే అందరూ కోరుకునే ఆదర్శ వనరులతో ఓ అద్భుతమైన గమ్యంగా ఉన్నాం. ఈ వేల కోట్ల డాలర్ల పరిశ్రమలో హైదరా బాద్నూ, మన రాష్ట్రాలనూ అగ్రస్థానంలో ఉంచడానికి కృషి చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వినమ్రపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. డా. గురుఎన్రెడ్డి వ్యాసకర్త కాంటినెంటల్ హాస్పిటల్స్ స్థాపకుడు–చైర్మన్ -
సలహా కోరితే సమాధానమివ్వాలా?
మన రాజ్యాంగం వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు విషయాలను సూచిస్తుంది. రాజకీయ వర్గాలకు, ప్రతికూలమైన తీర్పులను ఎత్తి చూపడానికి ఒక సాధనం కావచ్చు. న్యాయ వ్యవస్థకు మాత్రం ఇదొక వేగుచుక్క. చట్టపర మైన ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరడానికి రాష్ట్రపతిని అనుమతించేదే ఆర్టికల్ 143. తాజాగా బిల్లులను పరిష్కరించడంలో గవర్నర్లు, రాష్ట్రపతి అధికారాలకు సంబంధించిన 14 ప్రశ్నలు వేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యాయసలహా కోరి దీన్ని ఉపయోగించారు.సాధారణ సందర్భాల్లో ఇది వివాదాస్పదం అయ్యేది కాదు. కానీ ఈ ప్రశ్నలు తమిళనాడు గవర్నర్ ఉదంతంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పిన అంశాలనే తిరిగి పరిశీలించేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ఒక క్లిష్టమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. రాష్ట్రపతి కోరుతున్న న్యాయ సలహా అనేది చట్టబద్ధమైన రాజ్యాంగ చర్యా లేదా సుప్రీం తీర్పును దొడ్డిదారిలో సమీక్షించే ప్రయత్నమా?కోర్టు సమాధానం చెప్పనక్కర్లేదు!ఇటీవల తమిళనాడు కేసు విషయంలో– మంత్రి మండలి సహాయం, సలహా ప్రకారమే గవర్నర్ పనిచేయాలనీ, బిల్లులను ఆమోదించే ప్రక్రియలో నిరవధికంగా ఆలస్యం చేయలేరనీ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతితో సహా రాజ్యాంగ అధికారులు జవాబుదారీతనం లేకుండా లేదా కాలపరిమితిని దాటి వ్యవహరించలేరని కూడా ఆ తీర్పు పేర్కొంది. ఈ తీర్పు ఫలితంతో కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి చెందింది. ఫలితంగా ఇప్పటికే కోర్టు సమాధానం ఇచ్చిన వాటికి దాదాపు సమానమైన ప్రశ్నలను సంధి స్తున్న రాష్ట్రపతి న్యాయ సలహాకు కేంద్రం మద్దతు ఇచ్చింది.ప్రజా ప్రాముఖ్యం కలిగిన చట్టపరమైన విషయాలపై సుప్రీంకోర్టు న్యాయ సలహాను, అభిప్రాయాన్ని కోరడానికి ఆర్టికల్ 143 రాష్ట్రపతిని అనుమతిస్తుంది. కోర్టుకు మాత్రం అటువంటి న్యాయ సలహాకు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. 1964లో ప్రత్యేక సూచన నం.1లోనూ, అయోధ్య వివాదంపై 1993లో ప్రత్యేక సూచన నం.1లోనూ మనం చూసినట్లుగా, న్యాయ సలహాను ఇవ్వకుండా తిరస్కరించే విచక్షణ న్యాయస్థానానికి ఉంది.కావేరీ జల వివాదాల కేసులో (1998లో ప్రత్యేక సూచననం.1), కోర్టు అప్పటికే ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేయడానికి లేదారెండవ అభిప్రాయాన్ని కోరడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించ లేరని స్పష్టంగా పేర్కొంది. ‘రాజ్యాంగం ప్రకారం, అలాంటి అప్పీల్ అధికార పరిధి ఈ కోర్టుకు ఉండదు; ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి కూడా దానిపై సమీక్ష కోరలేరు... అటువంటి అధికారం ఆర్టికల్ 143లో ఉందనుకుంటే, అది న్యాయవ్యవస్థ స్వతంత్ర తలోకి తీవ్ర మైన చొరబాటు అవుతుంది’ అని నాడు కోర్టు నొక్కి చెప్పింది.పునఃపరిశీలన కోరుతున్నట్లయితే...రాష్ట్రపతి తాజాగా వేసిన 14 ప్రశ్నలు తమిళనాడు తీర్పులో ఇప్పటికే పరిష్కరించబడిన అనేక ప్రశ్నలను ప్రతిధ్వనిస్తాయి. గవర్నర్ ఒక బిల్లును అనేకసార్లు వెనక్కి ఇవ్వవచ్చా, లేదా ఆమోదం కోసం రాష్ట్రపతి నిర్దిష్ట కాలపరిమితికి కట్టుబడి ఉండాలా అనేవి వీటిలో ఉన్నాయి. వీటిని సుప్రీంకోర్టు అస్పష్టంగా వదిలివేయలేదు. అత్యంత స్పష్టతతో నిర్ణయం చెప్పేసింది. అందుకే రాష్ట్రపతి తాజా న్యాయ సలహా నివేదన నిజంగా స్పష్టతను కోరడం లేదనీ, పునఃపరి శీలన కోరుతోందనీ సూచిస్తుంది. అలా అయితే, ఇది చట్టపరమైన సమస్య కాదు. న్యాయవ్యవస్థ అంతిమం అనే పునాదినే ప్రశ్నిస్తోంది.2012లో 2జీ స్పెక్ట్రమ్పై న్యాయసలహా దీనికి ఒక ముఖ్యమైన మినహాయింపు. ఇక్కడ సుప్రీంకోర్టు మునుపటి తీర్పులోని అంశా లను స్పష్టం చేయడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించింది. కోర్టు 122 టెలికామ్ లైసెన్సులను రద్దు చేసిన తర్వాత, సహజ వనరులను కేటాయించడానికి వేలం మాత్రమే అనుమతించదగిన పద్ధతా అనే దానిపై నాటి కేంద్ర ప్రభుత్వం... సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాన్ని కోరింది. వేలం న్యాయమైన పద్ధతి అయినప్పటికీ, అది మాత్రమే రాజ్యాంగబద్ధమైన మార్గం కాదని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా, కోర్టు ఇచ్చిన ఈ స్పష్టత ప్రధానమైన తీర్పును భంగపరచలేదు. ఈ వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. 2జీ విషయంలో, తన తీర్పును వెనక్కు తీసుకోవాలని కోర్టును ప్రభుత్వం అడగలేదు. కేవలం భవి ష్యత్ విధానంపై తనకు మార్గనిర్దేశం చేయాలని కోరింది.దీనికి విరుద్ధంగా, తాజాగా రాష్ట్రపతి కోరిన న్యాయ సలహా అనేది తమిళనాడు కేసు తీర్పులోని ప్రధాన విషయానికి వెళుతుంది. ఇది పరిణామాల వివరణ, లేదా భవిష్యత్ కేసులకు మార్గ దర్శకత్వం కోరదు. బదులుగా, కోర్టు ఇప్పటికే సమాధానం ఇచ్చిన ప్రశ్నలను తిరిగి లేవనెత్తుతుంది. దీన్ని అనుమతించడం అంటే సమీక్షను నియంత్రించే ఆర్టికల్ 137ను కార్యనిర్వాహక వర్గం దాటవేయవచ్చు. ఆర్టికల్ 143 ద్వారా కేసులను తిరిగి వ్యాజ్యం చేయవచ్చు. అది రాజ్యాంగపరంగా అనుమతించరానిది, అలాగే వ్యవస్థాగతంగా ప్రమాదకరమైనది.రాష్ట్రపతి కార్యాలయ గౌరవం నిలుపుతూనే...కోర్టుకు స్పందించాల్సిన బాధ్యత ఉందా? లేదు! ప్రత్యేక కోర్టుల బిల్లు కేసులో, కోర్టు ఒక సూచనకు సమాధానం ఇవ్వ డానికి నిరాకరించవచ్చనీ, కాకపోతే అలా చేయడానికి కారణా లను పేర్కొనాలనీ న్యాయస్థానం మాట. 2జీ కేసులో, న్యాయ సలహాను తిరస్కరించడానికి కోర్టు అనేక కారణాలను పొందు పర్చింది: (1) ప్రశ్నలను ఇప్పటికే పరిష్కరించి ఉంటే; (2) ప్రశ్నలు రాజకీయమైనవి అయితే; (3) అవి రాజ్యాంగ ప్రయోజనానికి ఉపయోగపడకపోతే; (4) అవి చట్టపరమైన ప్రాముఖ్యత కలిగిన సమస్యలను కలిగి ఉండకపోతే!తమిళనాడు తీర్పు స్పష్టంగా పరిష్కరించబడిన రాజ్యాంగ ప్రశ్నా విభాగంలోకి వస్తుంది. దీన్ని తిరిగి తెరవడం వల్ల న్యాయ నిర్ణయాల అంతిమత్వంపై సుప్రీం కోర్టుకు కాకుండా కార్య నిర్వాహక వర్గానికి ప్రాధాన్యతను కట్టబెట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ రాజకీయ నేపథ్యాన్ని విస్మరించలేము. అనేక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోని గవర్నర్లు చట్టాలకు మోకాలడ్డేందుకు కాలయాపన వ్యూహాలను అనుసరించారు.ఇది రాజ్యాంగ ప్రశ్న కంటే ఎక్కువగా – రాజకీయంగా అడ్డుకొనే చర్య. ముఖ్యంగా రాజ్యాంగ సమీక్ష మార్గం ఎల్లప్పుడూ అందు బాటులో ఉన్నప్పుడు... రాష్ట్రపతి న్యాయ సలహాను సుప్రీంకోర్టు అంగీకరిస్తే, అది రాజకీయ ఒత్తిడికి లొంగి పోయినట్టు కనిపించే ప్రమాదం ఉంది. అయితే, కోర్టుకు ఇది క్లిష్టమైనదే. రాష్ట్రపతి కార్యాలయం పట్ల గౌరవాన్నీ, తన నిర్ణయాల సమగ్రతనూ కాపాడు కునే బాధ్యతను సమతుల్యం చేసుకోవాలి.ఈ న్యాయ సలహాను కోరడం నిజంగా తమిళనాడు కేసును తిరగదోడే ప్రయత్నమే అయితే, కోర్టు దానికి సమాధానం ఇవ్వడా నికి నిరాకరించాలి. న్యాయపరమైన తీర్పుల అంతిమత్వాన్ని తప్పించుకోవడానికి ఆర్టికల్ 143ని ఉపయోగించలేమని స్పష్టంగా పేర్కొ నాలి. అయితే, భవిష్యత్ పాలన కోసం స్పష్టత అవసరమయ్యేఅంశాలు తీర్పులో ఉంటే, కోర్టు సమాధానం ఇవ్వడానికి ఎంచు కోవచ్చు. కానీ అది తన మునుపటి నిర్ణయానికి చెందిన అధికారాన్ని నీరుగార్చకుండా చూసుకోవాలి.ఆర్టికల్ 143 రాజకీయంగా తప్పించుకునే మార్గంగా కాకుండా చట్టపరమైన స్పష్టత కోసం ఒక సాధనంగా ఉద్దేశించబడింది. రాష్ట్రపతి కోరిన ఈ న్యాయ సలహాను పరిశీలన లేకుండా స్వీకరిస్తే, అది కోర్టు అధికారాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది. కోర్టు రాజ్యాంగ వ్యాఖ్యాతగా మాత్రమే కాకుండా, దాని సంరక్షకురాలిగా కూడా వ్యవహరించాలి. సమాధానం ఇవ్వడానికి నిరాకరించడం అనేది రెండింటినీ కాపాడుకోవడానికి స్పష్టమైన మార్గం కావచ్చు.-వ్యాసకర్త సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-సంజయ్ హెగ్డే -
కవిత్వమూ, ఆలోచనా రాజద్రోహాలేనా?
నాగపూర్ పోలీసులు ఒక ఆశ్చర్యకరమైన పని చేశారు. ఒక సభలో పాడిన పాట ఆధారంగా సభా నిర్వాహకుల మీద ‘రాజద్రోహ నేరం’ కేసు పెట్టారు. సుప్రీంకోర్టు మూడు సంవ త్సరాల కింద 2022 మే 11న అప్పటికి ఉండిన భారత శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్)లో సెక్షన్ 124-ఎ ‘రాజద్రోహ నేరం’ ఔచిత్యాన్ని విచారిస్తూ, దాన్ని పునస్సమీక్షించే వరకూ, ఆ ఆరోపణ మీద విచారణలు ఆపేయాలని, కొత్త కేసులు నమోదు చేయగూడదని మధ్యంతర ఆదేశం ఇచ్చింది. తర్వాత ప్రభుత్వం ఐపీసీని రద్దు చేస్తూ తీసుకు వచ్చిన భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్)లో ‘రాజద్రోహం’ అనే మాట వాడలేదు గాని, మిగిలి నదంతా సెక్షన్ 152లో యథాతథంగా ఉంచారు. ఇప్పుడు నాగపూర్ పోలీసులు ఆ బీఎన్ఎస్ సెక్షన్ 152తో పాటు, సెక్షన్ 196 (సమూహాల మధ్య శత్రుత్వం పెంచడం), సెక్షన్ 353 (ప్రజల మనో భావాలను గాయపరిచే ప్రకటనలు చేయడం) అనే నేరారోపణలతో కేసు పెట్టారు. ఇంతకీ ఆ సభ ‘వీరా సాథీదార్ (vira sathidar) స్మృతి సమ న్వయ్ సమితి’ అనే బృందం మే 13న నాగపూర్ లోని ‘విదర్భ సాహిత్య సంఘ్’ హాలులో ఏర్పాటు చేసిన సంస్మరణ సభ. వీరా సాథీదార్ (1958– 2021) సుప్రసిద్ధ మరాఠీ కవి, నటుడు, రచయిత, పత్రికా సంపాదకుడు, దళిత హక్కుల కార్యకర్త. అంబేడ్కర్, మార్క్స్ల భావాలతో ప్రభావితుడైన వీరా కులవివక్షకూ, సామాజిక అన్యాయాలకూ వ్యతిరేకంగా అపారమైన కృషి చేశారు. ‘ఇండియన్ పీపుల్స్ థియేటర్’ అసోసియేషన్ కన్వీనర్గా ఉన్నారు. మరాఠీ మాసపత్రిక ‘విద్రోహి’ సంపాదకు లుగా ఉన్నారు. ‘కోర్ట్’ అనే 2014 నాటి మరాఠీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. అది ఉత్తమ సిని మాగా జాతీయ అవార్డు అందుకుంది. కోవిడ్ రెండో దశలో 2021 ఏప్రిల్ 13న మరణించారు. నాలుగేళ్లుగా ఆయన సహచరి పుష్పా సాథీదార్, ఇతర మిత్రులు సంస్మరణ సభలు నిర్వ హిస్తున్నారు. ఈ సంవత్సరం సంస్మరణ సభలో సామాజిక కార్యకర్త ఉత్తమ్ జాగీర్దార్ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘ప్రజా భద్రతా బిల్లు’ గురించి ప్రధాన ఉపన్యాసం చేశారు. ముంబయికి చెందిన సమతా కళా మంచ్ గాయ కులు పాటలు పాడారు. ఆ పాటల్లో ఒకటి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన ‘హమ్ దేఖేంగే’ అనే సుప్రసిద్ధ గీతం.‘మన సైనికులు పాక్తో వీరోచితంగా పోరాడి ఓడిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ఒక వామపక్ష కళాబృందం పాక్ కవి పాటలు పాడుతున్నది. ఆ పాటలో సింహాసనాలను వణికించాలి అని ఉంది. వాళ్లు ఇది ఫాసిస్టు ప్రభుత్వం అంటున్నారు. ఈ సభ, ఉపన్యాసం, పాట దేశ సమగ్రతకు, భద్రతకు, సార్వభౌమత్వానికి వ్యతిరేకం. కనుక నిర్వాహకు రాలు పుష్పా సాథీదార్ మీద కేసు పెట్టి విచారించండి’ అని నాగపూర్ ‘జనసంఘర్ష సమితి’ అధ్యక్షుడు దత్తాత్రేయ షిర్కే చేసిన ఫిర్యాదు మీద పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో రెండు విచిత్రమైన విషయాలున్నాయి. ఒకటి-ఫైజ్ అహ్మద్ ఫైజ్ (faiz ahmed faiz)ను, ఆ మాటకొస్తే ఏ కవినైనా ఒక దేశానికి పరిమితం చేయడానికి వీలు లేదు. ఫైజ్ 1911లో అవిభక్త భారత్లో పంజాబ్లో పుట్టిన కవి. 1947 దేశ విభ జన తర్వాత ఇంగ్లిష్ దినపత్రిక ‘పాకిస్తాన్ టైమ్స్’కూ, ఉర్దూ దినపత్రిక ‘ఇమ్రోజ్’కూ ప్రధాన సంపాదకుడిగా పాకిస్తాన్కు వెళ్లారు. పాకి స్తాన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుల్లో ఒకరయ్యారు. లియాఖత్ అలీఖాన్ ప్రభుత్వం 1951లోనే ఆయ నను రావల్పిండి కుట్ర కేసు నిందితుడిగా అరెస్టు చేసి నాలుగేళ్లు జైల్లో పెట్టింది. తర్వాత ఆయన మధ్య పాకిస్తాన్ వస్తూపోతూ ఉన్నప్పటికీ జీవితంలో ఎక్కువ భాగం మాస్కోలో, లండన్లో, బీరుట్లో గడిచింది. 1984లో మరణించే లోపు, మొత్తం 73 ఏళ్ల జీవితంలో ఆయన పాకిస్తాన్లో గడిపినది పదిహేనేళ్ల లోపే. ఆయనను పాకిస్తాన్ కవి అనడం హాస్యా స్పదం. రెండు-హమ్ దేఖేంగే కవితను ఫైజ్ పాకిస్తాన్లో సైనిక నియంత జియా ఉల్ హక్కు వ్యతిరేకంగా 1979లో రాశారు. ఫైజ్ చనిపోయాక కూడా పాకిస్తాన్లో ఆయన పేరు ఎత్తడానికి వీలు లేదని జియా ఉల్ హక్ ఆదేశించగా, 1986లో లాహోర్లో ఒక బహిరంగ వేదిక మీద ఈ పాట పాడి పాకిస్తానీ గాయని ఇక్బాల్ బానో సంచలనం సృష్టించారు. మరొక పాకిస్తాన్ సైనిక నియంత పర్వేజ్ ముషర్రఫ్ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లో కూడా ఇది మార్మోగింది. అలా మౌలికంగా పాకిస్తాన్ నియంతలకు వ్యతిరేక ప్రతీక అయిన పాటను చూసి భారత పాల కులు ఉలిక్కిపడడం ఆశ్చర్యకరం. అయితే ఈ ఉలికిపాటు, అసహనం, అభూత కల్పనల నేరారోపణలు, సుప్రీంకోర్టు కొట్టివేసిన నేరారోపణలు ఒకచోట ఆగిపోవడం లేదు, విస్తరి స్తున్నాయి. అశోకా యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి, ప్రపంచ ప్రఖ్యాత కవి, చరిత్ర కారుడు అలీఖాన్ మహమూదాబాద్ను మే 18న రాజద్రోహ నేరారోపణలతో అరెస్టు చేశారు. ఆ అరె స్టుకు కారణం ఆయన ఫేస్బుక్ మీద రాసిన ఒక పోస్టు. అలాగే లండన్లోని వెస్ట్ మినిస్టర్ యూనివ ర్సిటీ అధ్యాపకురాలు, సుప్రసిద్ధ సామాజిక శాస్త్ర వేత్త, స్వయంగా కశ్మీరీ పండిట్ నిటాషా కౌల్కు ‘భారత వ్యతిరేక రచనలు చేస్తున్నందుకు’ అనే ఆరో పణతో ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు రద్దుచేస్తూ నోటీసు పంపారు. భారత ప్రభుత్వ విధానాల మీద విమర్శనాత్మక రచనలు చేసినందుకే ఈ చర్య. ప్రజాస్వామ్యానికి కన్నతల్లి అంటే అర్థం... భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డు కోవడమేనా? - ఎన్ వేణుగోపాల్ ‘వీక్షణం’ ఎడిటర్ -
పాకిస్తాన్ ఎందుకు భ్రష్టు పట్టింది?
పాకిస్తాన్ వ్యవస్థాపకుడు, ఆ దేశ ప్రథమ గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా బతికున్నంత కాలం పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ ప్రజాస్వామ్యం అయినా ఇతర మతాలు,సంస్కృతులు అక్కడ సహజీవనం చేసేందుకు అవకాశం ఉండేది. జిన్నా మృతి అనంతరం ఈ భావన అంతరించిపోయింది. దేశంలో రాజకీయ–సైనిక సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయి. అస్థిరత్వం వేరూనింది. పాకిస్తాన్ బ్రిటిష్ కాలనీ నుంచి ఒక ఆధునిక దేశంగా రూపొందే పరిణామ క్రమాన్ని ఈ పరిస్థితులు దెబ్బతీశాయి. పాక్ రాజకీయ–సైనిక సంబంధాలను మూడు ప్రధాన ఇతి వృత్తాలతో వివరించవచ్చు. వీటిలో మొదటిది: అక్కడి రాజకీయ నాయకత్వానికి ఏనాడూ సరైన విజ్ఞత లేదు. రాజకీయ పార్టీలు ఆది నుంచీ అవినీతికి మారుపేర్లుగా ఉన్నాయి. ఈ పరిస్థితి సైనిక జోక్యా నికి తావిచ్చింది. ఆ దేశంలో రాజకీయ అస్థిరత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఇప్పటి వరకు ఇండియాలో 14 మంది ప్రధాని పదవి అలంకరించగా, పాకిస్తాన్ ప్రజలు ఇదే కాలంలో 24 మంది ప్రధానులను చూశారు.రెండోది: పాకిస్తాన్ సైన్యం రాజకీయ స్థాయికి ఎదిగి హింసా యుత రాజకీయాలపై క్రమంగా పట్టు సాధించడం. 1951లో అప్పటి ప్రధాన మంత్రి లియాఖత్ అలీ ఖాన్ హత్య నుంచి 2022 నవంబర్లో ఇమ్రాన్ ఖాన్పై హత్యాయత్నం వరకు... ఈ ఘటనలు అన్నీ ఏదో రూపంలో పాక్ సైన్యంతో ముడిపడి ఉన్నాయి. రాజకీయ వేదిక మీద ప్రాబల్యం సంపాదించే ప్రక్రియలో పాక్ సైన్యం రెండు పద్ధతులు అనుసరించింది. వీటిలో మొదటిది– సైనిక నియంతృత్వం. ఈ పద్ధతిలో పాక్ సైనిక అధిపతులు నిస్సిగ్గుగా రాజకీయ అధికారం హస్తగతం చేసుకుని తమను తాము దేశాధ్య క్షులుగా ప్రకటించుకున్నారు. రాజకీయ సంక్షోభాలను సృష్టించి, వాటిని సాకుగా చూపిస్తూ తాము దేశానికి రాజకీయ సుస్థిరత అందిస్తామంటూ వారీ దుశ్చర్యకు పాల్పడ్డారు. మిలిటరీ జనరళ్లు అయూబ్ ఖాన్, యాహ్యా ఖాన్, జియా–ఉల్–హక్, పర్వేజ్ ముషా రఫ్ ఈ పద్ధతిలో రాజకీయ అధికారం చేపట్టారు. వీరి హయాంలో ప్రధానులు డమ్మీలుగా ఉండేవారు. ఇక్కడో ఆసక్తికరమైన అంశం ఉంది. పాకిస్తాన్ ఏర్పాటు నుంచీ ఆ దేశ సైన్యానికి కేవలం 15 మంది ఆధిపత్యం వహించారు. వీరి పదవీ కాలం 2 నుంచి 12 ఏళ్లు. ఇదే సమయంలో ఇండియాకు 31 మంది సైనికాధిపతులుగా వ్యవహ రించారు. ఆర్మీ చీఫ్గా వీరి పదవీకాలం రెండేళ్లు/ 62 ఏళ్లకు రిటైర్మెంటు నిబంధనకు లోబడి ఉంటుంది.పాక్ సైన్యం ప్రాబల్యాన్ని జుల్ఫికర్ అలీ భుట్టో, నవాజ్ షరీఫ్, బేనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్ వంటి శక్తిమంతులైన రాజకీయ నాయకులు సవాలు చేశారు. వీరు భారత వ్యతిరేకతనూ, కశ్మీర్ అంశాన్నీ రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి వచ్చారు. పాకిస్తాన్కు ఆర్థిక సాయం కొనసాగించాలంటే ప్రజాస్వామ్య ప్రక్రియలను తిరిగి అమలులోకి తేవాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చినప్పుడు ఆర్మీలోని కొన్ని ఫ్యాక్షన్లు వీరికి మద్దతు ఇచ్చాయి. అయితే, ఈ రాజకీయ నాయకులు తమ రాజకీయ బలం చూసుకుని సైన్యాన్ని ఖాతరు చేయలేదు. అటువంటి సమయంలో, సైనికాధిపతులు వారిని అధికారం నుంచి తప్పించారు. జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరి తీశారు. బేనజీర్ భుట్టోను హత్య చేశారు. నవాజ్ షరీఫ్ను దేశం నుంచి తరిమేశారు. ఇమ్రాన్ ఖాన్ జైలు పాలయ్యారు. వీరందరి దుర్గతికీ సైనికాధిపతులే కారకులు. మూడో చివరి ఇతివృత్తం గురించి ఇండియలో అంతగా చెప్పుకోం. పాకిస్తాన్ రాజ్యాంగం నిరంతరం సవరణలకు గురయ్యింది. తద్వారా అక్కడి రాజకీయ–సైనిక సంబంధాలను అవి ప్రభావితం చేశాయి. పాకిస్తాన్ సైన్యం రబ్బర్ స్టాంపు అధ్యక్షుల ద్వారా నేషనల్ అసెంబ్లీని రద్దు చేయించి తాజా ఎన్నికలు జరిపించేది. సర్వసాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సైన్యానికి అను కూల ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేవి. 1987లో అప్పటి అధ్యక్షుడు జియా–ఉల్–హక్ దేశాధ్యక్షుడికి (అంటే తనకు) నేషనల్ అసెంబ్లీని రద్దు చేసే విశేష అధికారాన్ని కట్టబెడుతూ రాజ్యాంగానికి 8వ సవరణ చేశారు. బేనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్లు ప్రధానులుగా పదేళ్ల సుదీర్ఘ పౌరపాలన అందించిన కాలంలో రాజ్యాంగానికి 13వ సవరణ తీసుకువచ్చారు. 1997 నాటి ఈ సవరణతో 1987 నాటి 8వ సవరణ రద్దు అయ్యింది. ఇలా అధ్యక్షుడి తోక కత్తిరించారు. తరువాతి దశాబ్దంలో ఆర్మీ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. 2001లో, మూడేళ్లు సైనికాధిపతిగా పనిచేసిన అనంతరం, ముషారఫ్ తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అధికారంలో కొన సాగేందుకు అతడు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. చిట్టచివరకు 2008లో అభిశంసన నుంచి తప్పించుకోవడానికి పదవికి రాజీనామా చేశారు.ముషారఫ్ అనంతరం, 2010లో 18వ రాజ్యాంగ సవరణ వచ్చింది. దేశంలో సమాఖ్య విధానాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం. ఈ సవరణ సైతం సైన్యం అధికారాలను బలహీనం చేయలేక పోయింది. ఇటీవలి సంవత్సరాల్లో జనరల్ కమర్ బాజ్వా వంటి సైనికాధిపతులు పౌర అధికారానికి లోబడి ఉన్నట్లు నటిస్తూ, తెలివిగా అధికారం చలాయించాలని ప్రయత్నించారు. బాజ్వా తర్వాతి వాడు జనరల్ అసీమ్ మునీర్. జనరల్ జియా మూసలో ర్యాడికలైజ్ అయిన మునీర్ పాక్ రాజకీయ–సైనిక సంబంధాలను సరికొత్త స్థాయికి దిగజార్చారు.ఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) అర్జున్ సుబ్రమణియం వ్యాసకర్త మిలిటరీ హిస్టారియన్, రిటైర్డ్ ఫైటర్ పైలట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పెరిగేది... దిగుబడా? సమస్యలా?
మొన్న మే 4న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దేశంలో మొదటి సారిగా జీనోమ్ ఎడిట్ చేసిన రెండు కొత్త వరి రకాలను విడుదల చేశారు: డీఆర్ఆర్ రైస్ 100 (కమల), పూసా డీఎస్టీ రైస్ 1. కమల రకాన్ని సాంబా మహసూరి (బీపీటీ 5204) ఆధారంగా ఐసీఏఆర్–ఐఐఆర్ఆర్ హైదరా బాద్ అభివృద్ధి చేసింది. రెండవ రకం– పూసాను ఎంటీయూ 1010 ఆధారంగా ఐసీఏఆర్–ఐఏఆర్ఐ న్యూఢిల్లీ అభివృద్ధి చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వీటి వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయి: దిగుబడిలో 19 శాతం పెరుగుదల. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో 20 శాతం తగ్గింపు. 7,500 మిలియన్ క్యూబిక్ మీటర్ల సాగునీరు ఆదా. కరువు, లవణీయత, వాతావరణ ఒత్తిళ్లను మెరుగ్గా తట్టుకోగలగడం.ఈ ప్రకటన ప్రకారం, ఈ రకాలు పంట కాలాన్ని 20 రోజులు తగ్గిస్తాయి. తద్వారా కర్బన ఉద్గారాలను, నీటి వినియోగాన్ని తగ్గిస్తాయి. అయితే, మొత్తం సమాచారం బయటపెట్టలేదు. వీటి విడుదల ఆహారానికి, ఆహార భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది కాబట్టి తెలుసుకోవడం, ప్రతిస్పందించడం ప్రజల హక్కు. ఇతర దిగుబడి సమస్యలో?దాదాపు 50 ఏండ్ల క్రితం అధిక దిగుబడి వంగడాల పేరిట హైబ్రిడ్ రకాలను విడుదల చేయడం వల్ల కొనసాగుతున్న అనర్థాలు అనేకం. ఈ రెండు వరి రకాలు వాతావరణ మార్పులను తట్టుకునేవి అనుకుందాం (ఇది ఒక సందేహాస్పద వాదనగానే కనిపిస్తుంది). మరి దిగుబడి ఎట్లా పెరుగుతుంది? వరి దిగుబడిపై ప్రభావం చూపే కారణాలలో విత్తనాలతో సహ అనేకం ఉన్నాయి– సారవంతమైన నేల, సరైన పోషకాలు, నీరు, పొలంలో ఇతర జీవాల పాత్ర, వగైరా. తీవ్ర వాతావరణ మార్పుల వల్ల పంటలకు ఉపయోగపడే ఇతర రకాల జీవులు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. వాటిలో మట్టిలో ఉండే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. తెగుళ్లు కూడా ఉన్నాయి. కేవలం వరి ధాన్యానికి వాతావరణ మార్పు ఒత్తిడిని తట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుందా? దిగుబడిని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఆ విధమైన శక్తిని సంపాదించకుంటే, వరి దిగుబడి స్థిరంగా ఉంటుందా? వరి జన్యువులో ఒకటి మార్చినంత మాత్రాన దిగుబడి పెరగదు. ప్రధానంగా, భారతదేశంలో వరి దిగుబడి సమస్య చాలా కాలంగా అనేక రూపాలలో కనిపిస్తున్నది. నిరంతరం ఒకే పంట వేయడం వల్ల, అధిక నీరు ఇవ్వడం నేల సారం పూర్తిగా పడిపోయింది. కృత్రిమ, రసాయన ఎరువులు వేయనిదే పంట రావడం లేదు. ఈ రకమైన దిగుబడి సమస్య మీద పరిశోధన చేయకుండా ఇంకేదో చేయడం సరి కాదు. వాస్తవానికి, ప్రభుత్వ సమాచారం ప్రకారమే 2025 ఏప్రిల్ 1 నాటికి వరి నిల్వలు రికార్డు స్థాయిలో 63.09 మిలియన్ టన్నులు ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యం కంటే 13.6 మిలియన్ టన్నులు అధికం. మరింత దిగుబడి పెరిగితే రైతుకు గిట్టుబాటు కాదు. ప్రభుత్వం కొనదు! మరి ఈ రెండు కొత్త వరి విత్తన రకాల ద్వారా శాస్త్రవేత్తలు ఏ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు? సరళంగా చెప్పాలంటే, శాస్త్రవేత్తల అవగాహన రైతుల సమస్యలకు భిన్నంగా ఉంటున్నది. రైతులు తక్కువ దిగుబడి గురించి ఫిర్యాదు చేయడం లేదు. అధిక సాగు ఖర్చులు, గిట్టుబాటు లేని ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ తాజా వరి రకాల విడు దలలో భారతీయ రైతులకు ఏమి అవసరమో అది కాకుండా, కంపెనీ లకు ఉపయోగపడే శాస్త్రీయ పరిశోధన పేరుతో కొత్త రకాలను నెత్తిన రుద్దుతున్న వైనం కనబడుతోంది.‘శుద్ధి’ చేయడం సాధ్యమా?ఈ వరి రకాలు ఒక కొత్త సాంకేతిక విప్లవం అని ఢంకా బజాయిస్తున్నారు. గింజలను అధికంగా ఉత్పత్తి చేసే జన్యువు పని సానుకూలం చేశాము అంటున్నారు. పోషకాలు లేదా ఇతర ‘సహాయం’ లేకుండా ఒక జన్యువు అధికంగా గింజలను సాధించగలదా? గాలిలో నుంచి సాధువు భస్మం పుట్టించినట్టు వరి గింజలోని ఒక జన్యువు అధిక దిగుబడి ఇస్తుంది అంటున్నారు. పర్యవసానాలు, దీర్ఘకాలిక పరిణామాల గురించి చెప్పడం లేదు. ఈ ఆహారం తినే మనుష్యుల మీద, జంతువుల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలియదు. విత్తనాల జన్యుక్రమం, సహజ సంపదకు కలిగే దీర్ఘకాలిక పరిణామాల గురించి అసలే తెలియదు. ఈ రకమైన విత్తనాల వల్ల సహజ, మంచి రకం విత్తనాలు కలుషితం అయితే తిరిగి వాటిని ‘శుద్ధి’ చేయడం అసాధ్యం. పరిశోధనలు, పరిశీలనలు, పరీక్షలను కొన్ని ఏళ్ల పాటు ప్రయోగశాలలో జరపాల్సి ఉండగా, కేంద్రం తొందర పడి ఈ రెండు రకాలను విడుదల చేయడంలో సార్వజనీన సంక్షేమ లక్ష్యం కనపడటం లేదు. విదేశీ ప్రైవేట్ కంపెనీల గుప్పిట్లో ఉన్న ఈ టెక్నాలజీకి ప్రభుత్వమే ముందుండి ప్రోత్సాహం ఇవ్వడం ఆశ్చర్యం కలిగి స్తున్నది. పేరుకే కేంద్ర ప్రభుత్వ సంస్థల పేర్లు ముందట పెడుతున్నా దీని వెనుక విదేశీ, లాభాపేక్ష శక్తులు ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. విత్తనాలు, జన్యు సంపదతో ఆడుకోవడానికి శాస్త్రవేత్తలకు క్రిస్పర్ (సీఆర్ఐఎస్పీఆర్) ఒక సాధనంగా మారింది. ఈ టెక్నాలజీ ఉపయోగించి ఇంకా 40 పంటల మీద పరిశోధనలు జరుగుతున్నా యని కేంద్రం ప్రకటించింది. వరి జన్యుక్రమంలో జన్యువులను తమ ఇష్టానుసారంగా తొలగించి, శాస్త్రవేత్తలు కోరుకున్న విధంగా ‘స్పంది స్తుందని’ మనకు విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అధిక దిగుబడి, వాతావరణ ఒత్తిళ్లకు తట్టుకునే శక్తి సామాజిక–ఆర్థిక లక్ష్యాలు. ఇవి ఇప్పుడు ప్రకృతిలో చొప్పించబడ్డాయి. ప్రకృతిపై ఇటువంటి పరిశోధన నిరపాయ కరమైనది కాదు. ఈ పరిశోధన వెనుక ఉన్నతమైన ఆదర్శాలు లేవు. స్వతంత్ర పర్యవేక్షణ లేకుండా ఒక కొత్త ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టి వ్యాపారం పెంచుకోవడానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఆక్షేపించదగినది. భారత ప్రభుత్వం ఈ రకం పరిశోధనలను నియంత్రించాలి, నిషేధించాలి. అంతగా అవసరం అనుకుంటే ప్రయోగశాలలకే పరిమితం చేయాలి. క్రిస్పర్ ఆధారిత జన్యుమార్పిడి పంటల మీద భారత సమాజంలో విస్తృత, బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉంది.దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
International Day for Biological Diversity మనల్ని కాపాడే వైవిధ్యం!
‘ప్రకృతితో సామరస్యం, సుస్థిర అభివృద్ధి’ అనే ఇతివృత్తంతో ఈ యేటి ‘అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం’ (International Day for Biological Diversity) నేడు జరుపుకొంటున్నాం. మానవుని కార్యకలా పాల కారణంగానే ఈ భూమిపై జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. గత దశాబ్దంలో, మనం గణనీయమైన జీవవైవిధ్య నష్టాన్ని చవి చూశాం. 467 జాతులు అంతరించిపోయాయి. ఈ నష్టం అస్థిరమైన వనరుల వినియోగం, కాలుష్యం, అన్యజీవుల ఆవాస ప్రాంతాల దురాక్రమణ వంటి వాటి వల్ల సంభవించిందే. గత దశాబ్దంలో వివిధ కారణాల వల్ల గణ నీయమైన పంట జన్యు వైవిధ్యం కోల్పోయాం. జీవ వైవిధ్య నష్టా నికి వాతావరణ మార్పు ఒక ముఖ్యమైన చోదకంగా లేదా ఉత్ప్రే రకంగా పనిచేస్తుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్ష పాత పరిమాణాలు, అడవి మంటలు వంటి సంఘట నలు జీవ జాతుల ఆవాసాలను నాశనం చేస్తాయి. INTERNATIONAL DAY FOR BIODIVERSITY 2025"Harmony with nature and sustainable development".#BiodiversityDay #BiodiversityDay2025 pic.twitter.com/LLHRlWJ5gn— Ministry of Cities, Local Government, Public Works (@MoCLPmv) May 21, 2025 పొంచి ఉన్న జీవవైవిధ్య సంక్షోభం జన్యు వనరు లకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది, ఇది జాతుల జన్యు వైవిధ్యంలో క్షీణతకు, వాటి విలుప్తానికి కూడా దారితీస్తుంది. ఆహార భద్రతను కాపాడుకోడానికి, కొత్త ఔషధాల అభివృద్ధికి, వాతావరణ మార్పులకు అను గుణంగా జీవజాలంలో ఉన్న మారగలిగిన సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు జన్యు వైవిధ్యం తప్పనిసరి. జీవవైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా జాతీయ, అంత ర్జాతీయ ‘చట్టపరమైన చట్రాలు’ ఉన్నప్పటికీ, ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దేశంలోని జీవ వైవిధ్య చట్టంలో చేసిన కొన్ని సవరణలు, జీవవైవిధ్య పరిరక్షణ స్ఫూర్తికి అనుగుణంగా లేవని చెప్పక తప్పదు. అలాగే చట్టాల బలహీనమైన అమలు, అవినీతి, రాజ కీయ జోక్యం, అవగాహనా రాహిత్యం, ప్రజా మద్దతు కొరవడటం, జీవవైవిధ్యానికి అపార నష్ట హేతువులు.ఇదీ చదవండి: అల్జీమర్స్ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకిజీవవైవిధ్యాన్ని కాపాడటానికి ‘ఇన్–సీతూ’ పరి రక్షణ అవసరం ఉంది. ఆ యా జీవ జాలాల సహజ ఆవాసాలలో ఉండే పరిస్థితుల రక్షణ ఒక కీలకమైన వ్యూహం కావాలి. జీవజాలాల ఆవాసాల పునరుద్ధరణ, నిర్వహణలలో ప్రజలకు అవగాహన కల్పించి వారినిఆ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. జాతీయ ఉద్యానాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు వంటి రక్షిత ప్రాంతాలను స్థాపించాలి. కేంద్ర ప్రభుత్వ రెండవ ‘జీన్ బ్యాంక్’ నిర్మాణానికి పూనుకో వడం ఆహ్వానించదగిన పరి ణామం. స్థానిక సమాజాల ‘కమ్యూ నిటీ విత్తన నిధుల’ను అనుసంధాన పరచడం జీవ వైవిధ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన అంశం అవు తుంది. వ్యవసాయం, అడవులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివాటి విషయంలో భూవినియోగ ప్రణా ళికను జీవవైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించాలి. ఈ అన్ని చర్యలూ జీవవైవిధ్యాన్ని కాపాడి భూగోళాన్ని సజీవంగా ఉంచుతాయి. ఇదీ చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీబలిజేపల్లిశరత్ బాబు వ్యాసకర్త జాతీయ జన్యు వనరుల బ్యూరో విశ్రాంత శాస్త్రవేత్త(నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం) -
ఆ వాఙ్మూలం ముమ్మాటికీ చెల్లదు!
ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం కేసులో కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహనిందితుల నేరాంగీకార వాఙ్మూలానికి సంబంధించి హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేవలం సహనిందితుడి నేరాంగీకారం ఆధారంగా ఒక వ్యక్తి బెయిల్పై నిర్ణయం తీసుకోరాదని వ్యాఖ్యానించింది. సీఆర్పీసీ 161 సెక్షన్ కింద ఇచ్చిన వాఙ్మూలాన్ని మరొకరికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ‘భారతీయ సాక్ష్యాల చట్టం–1872’ సెక్షన్ 30 కింద తుది విచారణ సందర్భంగా ఏ వాఙ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో పిటిషనర్లకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఎందుకు నిరాకరించింది అనేది ముఖ్య మైన ప్రశ్న. రిజిస్టర్ చేసిన కేసులో ఆరోపణలు తీవ్రమైనవి. ఐపీసీ సెక్షన్ 409, 420, 12బి, రెడ్ విత్ సెక్షన్ 34, 37 కింద ఈ కేసు నమోదయ్యింది. అయితే, ముందస్తు బెయిల్ను కొట్టివేసే సమయంలో సహనిందితుని వాఙ్మూలానికి సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 30కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సహనిందితుడి పోలీసు భయం ఆధారంగా నేరాంగీకార ప్రకటన నిలబడదనీ, కనుక అలాంటి అరెస్టు చెల్లదనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చెప్పారా, చెప్పించారా?నేరాలు చేసినప్పుడు సాక్ష్యాలు దొరకవు. పరిశోధనలో, దర్యా ప్తులో కొన్ని సాక్ష్యాలు దొరుకుతాయి. పోలీసులు న్యాయంగా సాక్ష్యాలు సేకరిస్తే, అందులో లంచగొండితనం లేకపోతే నిజాలు రుజువయ్యే అవకాశం ఉంటుంది. కానీ మన లోకంలో, లౌక్యంలో ఏం చెప్పగలం? అందరికీ తెలుసు, పోలీసులు నాలుగు తగిలిస్తే తప్ప నిజాలను కక్కడం సాధ్యం కాదు అంటారు. చాలా వరకు నిజం. కానీ తన్నినప్పుడు చెబుతున్నారా, లేక తంతున్నప్పుడు దెబ్బలు భరించలేక నేరాన్ని ఒప్పుకొంటున్నారా? ఈ రెండిటికీ చాలా తేడా ఉంటుంది. ‘దెబ్బలు నా వల్ల కాదు’ అనుకున్నపుడు, దానికన్నా నేరం ఒప్పుకొంటే కోర్టుకు పోయేదాకా బతికిపోవచ్చు అనుకుంటారు. కనుకనే పోలీసుల హింసలో చెప్పిన అంశాలను కోర్టులో చూపినప్పుడు, ఆ నిందితుడు ఇదంతా హింసించడం వల్ల రాసిందే గానీ నిజం కాదని చెప్పినప్పుడే తగాదా మొదలవుతుంది. అక్కడే లాయర్లు వస్తారు. నేరం రుజువు కాదు. నేరాంగీకారం రుజువు కాదు. సహ నింద భరించే గతి!నేర విచారణలో ఒక నిందితుడు, మరొక వ్యక్తి కూడా ఆ నేరంలో పాలు పంచుకున్నాడని వాఙ్మూలం ఇస్తే, సంబంధిత రెండవ వ్యక్తి సహ నిందితుడు అవుతాడు. పోలీసులు చెప్పించుకున్న నేరాంగీ కారం వాడుకుని మొదటి వాడినీ, తరువాత రెండో వాడినీ కూడా జైలుకు పంపిస్తారు. అప్పుడు బెయిల్ కోసం పోరాటం ప్రారంభ మవుతుంది. అది లాయర్ల భారీ ఫీజు ఆధారంగా, కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టుదాకా న్యాయ పోరాటం సాగుతూ ఉంటుంది. అందుకే తీర్పులు ఆలస్యమవుతాయి. వాయిదాలు వస్తాయి. అప్పీల్సు ఉంటాయి. మధ్యలో తాత్కాలిక ఆర్డర్స్ వస్తాయి. (అంటే అంతిమ నిర్ణయం వంటిది కాకుండా వచ్చే తాత్కాలిక ఉత్తర్వు ఇస్తారు. అక్కడ ఉన్నపుడే, తరువాతి స్థాయి, అంటే సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో అన్యాయంగా జైలుకు పోకుండా బెయిల్ హక్కుల్ని కాపా డుకుని విడుదల అవుతూ ఉంటారు. మన పత్రికా భాషలో ‘నిందితు డికి సుప్రీం నుంచి ఊరట’ అని అంటూ ఉంటాం.)సీఆర్పీసీ సెక్షన్ 161 కింద (ఇది పాత కేసు. పాత నేరం కావడం వల్ల కొత్త ఎన్డీఏ సర్కారు రచించిన భారతీయ న్యాయ చట్టాలను ఈ సందర్భంలో ఉటంకించడం లేదు. కూడదు. లేకపోతే అయోమ యంలో పడిపోతాం) అనుమానితుడి వాఙ్మూలానికి విలువ ఉన్న ప్పటికీ, పోలీసులకు చెప్పిన నేరాంగీకారాన్ని వాడుకుంటూ సహనిందితుడిని అరెస్టు చేయడం న్యాయమా? నేరారోపణ అనే గుడ్డ కాల్చి మొఖాన పారేసినప్పుడు జైల్లో పడేస్తారు. అందులో నిజా నిజాలు తేలకుండానే ఉన్నప్పుడు ఏం చేయాలి? బెయిల్ ఇవ్వాల్సిందే! రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని చెప్పగలిగితే, ఆయా అంశాలను కోర్టు విశ్వసిస్తే, పోలీసులను నమ్మని దశలో బెయిల్ దొరుకుతుంది. అంటే పోలీసులు సాధించిన నేరాంగీకారాల ఆధారంగా నిందితులు, అనుమానితులు అనే పేరుతో అమాయకులను జైలుకు పంపిస్తే, కోర్టే దిక్కు. న్యాయమూర్తులు, జిల్లా స్థాయి న్యాయాధికారులు... మంత్రుల వంటి పెద్దల వీవీఐపీ కేసులని భయపడకుండా ఉత్తర్వులు ఇస్తేనే బెయిల్ దొరుకుతుంది. న్యాయం లభిస్తుంది. ఊరట లభిస్తుంది. ఇది అటువంటి కేసు! వారి ఆరోప ణలు నిజమో కాదో ఇప్పుడే చెప్పలేము. కానీ మొదటి దశలోనే పోలీసుల భయం ఆధారంగా వచ్చిన నేరాంగీకారాలు తీసుకుని అరెస్టు చేయకూడదు.మన ‘కొత్త’ నేర చట్టాలుమన ‘భారతీయ’ సాక్ష్య చట్టం కొత్తది కాదు. ఇది ఆంగ్లేయులు రాసిపెట్టిన సాక్ష్యాల చట్టం... ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 నుంచి... అంటే 153 ఏళ్ల నుంచి అమలులో ఉన్న చట్టం. (మనం అంతా కొత్త చట్టాలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్నాం. పాత సాక్ష్య చట్టపు నియమం కొత్త న్యాయ చట్టంలోనూ ఉంది.) పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకొంటే అనుమానం ఉంటుంది. కనుక ఆ వాఙ్మూలానికి ఆమోద యోగ్యత ఉండదు. ఇది సెక్షన్లు 24, 25, 30 కింద అనుమానితమైన ప్రకటన అని 153 సంవత్సరాల నాటి సూత్రం. దీనిపైన ఎన్నో వందల కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. నేరాంగీకారాన్ని అనుమానిస్తారు. పోలీసుల సమక్షంలో, లాకప్లో, లేదా మరెక్కడైనా సరే కొందరు పోలీసులు ఎదురుగా ఉండినప్పుడు ఈ అనుమానం బలవంతం అని అనుకుంటారు. చట్టం తెలియకపోయినా, సాధారణంగా మామూలు మనుషులకు కూడా ఈ విషయం తెలుసు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ), భారతీయ సాక్ష్య చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ భారతదేశ న్యాయ వ్యవస్థలపైన, సమాజం పైన, న్యాయస్థానా ల్లోనూ ఇప్పటికీ నిలబడిన చట్టాలు. 153 సంవత్సరాల నుంచి ఈ సూత్రాలు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి మౌలిక మైన సూత్రాలు. ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా అమలు చేయ వలసిన సూత్రాలు. బ్రిటిష్ వారి సూత్రాలు కాబట్టి పనికిరావని అనుకోవడానికి వీల్లేని నియమాలు ఇవి. ఆ సూత్రాలను కాపాడుకుంటూ కొన్ని మార్పులు చేశారు. అయితే, ఈ చట్టాలు మన న్యాయ వ్యవస్థకు పునాదిగా ఉన్నప్పటికీ, ఆధునిక భారతదేశ సంక్లిష్టతలను పరిష్కరించడానికి ఇబ్బంది పడ్డాయి. అందుకే 2020లో ప్రొఫెసర్ (డాక్టర్) రణ్బీర్ సింగ్ అధ్యక్షత వహించిన ‘కమిటీ ఫర్ రిఫార్మ్స్ ఇన్ క్రిమినల్ లాస్’ (సీఆర్సీఎల్) ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రూపొందించిన కొత్త చట్టాల పేర్లు ఇవి: భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత.బెదిరిస్తే, ప్రలోభ పెడితే...నేరారోపణకు గురైన వ్యక్తి చేసిన అంగీకారం ఏదైనా ప్రేరేపణ లేదా బెదిరింపు లేదా లాభం చేస్తామనే వాగ్దానంతో జరిగినట్లు కనిపిస్తే, ఆ వ్యక్తి నేరాంగీకారం అసంబద్ధం. ఇది కీలకమైన సూత్రం. పోలీసు కస్టడీలో నేరాంగీకరణ విషయంలో ఇది కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు. తాజాగా 2022లో కూడా ఇంద్రేశ్ కుమార్ కేసులో సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఇటువంటి నేరాంగీకారాన్ని ఒప్పుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, ‘వికాస్ సిమెంట్స్’ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్కై హైకోర్టుకు వెళ్లారు. ఆపై సుప్రీంకు అప్పీలు చేశారు. ‘నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాఙ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రం’ అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడమే కాక, దీనిపై సంపూర్ణ వివరణ ఇచ్చింది. బెయిల్ మంజూరు సమయంలో కోర్టులు ఆ యా అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని నిర్దేశించింది. ముందస్తు బెయిల్, బెయిల్ మంజూరు సమయంలో సహనిందితుల వాఙ్మూలా లను పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
Rajiv Gandhi Death Anniversary ఆధునిక భారత స్వాప్నికుడు
అతిపిన్న వయసులోనే ప్రధాన మంత్రి పదవిని అధిష్ఠించిన రాజీవ్ గాంధీ (Rajiv Gandhi)దేశ భవిష్యత్తుకు నాడు నాటిన అభివృద్ధి మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయి. ఆయన దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ సరళీకృతం చేయడం, పరిశ్రమలకు రాయితీలు, పంచా యతీ రాజ్ వ్యవస్థ పటిష్ఠత వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 21వ శతాబ్దిలో దేశాన్ని నూతన పథంలో నడిపించేలా దిశానిర్దేశం చేశారు. ఆయన యువతరంలో శక్తిమంతమైన మార్పును ఆకాక్షించి కంప్యూటర్ యుగానికి నాంది పలకడంతో ఇప్పుడు దేశం ప్రVýæతి దిశలో పయనిస్తోంది. నాటి ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ ముష్కరుల చేతిలో హత్యకు గురవడంతో దేశ ప్రజల ఆకాంక్ష, ఒత్తిడి మేరకు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31న భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984 డిసెంబర్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయిలో 414 స్థానాలు గెలిచింది. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలనే ప్రధానలక్ష్యంతో ‘పబ్లిక్ కాల్ ఆఫీస్’ (పీసీఓ) విధానాన్ని ప్రవేశ పెట్టడంతో సాధారణ ప్రజలకు కూడా కమ్యూనికేషన్ కనెక్ట విటీ పెరిగింది. రాజీవ్ ప్రభుత్వం అత్యాధునిక టెలి కమ్యూ నికేషన్ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేయడానికి 1984లో ‘సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్’ స్థాపించింది. 1985లో విద్యను సార్వత్రికీకరించడానికి‘ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ’ని ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఓపెన్ యూనివర్సి టీల ప్రారంభానికి ఇది స్ఫూర్తిగా నిలిచింది. బడుగు, బల హీన వర్గాలకు ప్రయోజనం కలిగేలా జాతీయ విద్యా విధా నాన్ని విస్తరించాలనే లక్ష్యంతో1986లో రాజీవ్ గాంధీ దేశంలో ‘జవహర్ నవోదయ విద్యాలయాల’ను ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకున్నారు. రాజీవ్గాంధీ ప్రభుత్వం 1989 మే 15వ తేదీన చేసిన 64వరాజ్యాంగ సవరణకు అనుగుణంగా పీవీ నరసింహారావు ప్రభుత్వం 1993లో చేసిన 73వ రాజ్యాంగ సవరణతోపంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది. మానవ వనరుల అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలనే తలంపుతో రాజీవ్ గాంధీ 1985లో దీనికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి పీవీ నరసింహారావుకు అప్పగించారు. దేశ రాజకీయాల్లో ముఖ్యంగా 1967 తర్వాత పార్టీ ఫిరాయింపులు ఎక్కువవడంతో వాటి కట్టడికి రాజీవ్ నడుం కట్టారు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘పార్టీ ఫిరా యింపుల నిరోధక చట్టా’న్ని 10వ షెడ్యూల్లో చేర్చడంతో పార్టీలు మారే ప్రజాప్రతినిధుల సభ్యత్వాన్ని రద్దు చేసే అవ కాశం ఏర్పడింది. రాజీవ్ గాంధీ చేసిన చరిత్రాత్మక చట్టాల్లో 61వరాజ్యాంగ సవరణ బిల్లు కీలకమైంది. దేశ నిర్మాణంలో యువతను భాగస్వాములుగా మార్చాలనే ఉన్నతమైన ఆశ యంతో ఈ చట్ట సవరణ ద్వారా ఓటు వేసే కనీస వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు.దీంతో దేశ రాజకీయాల్లో యువత ప్రాధాన్యం పెరగడమే కాకుండా వారు తమ ఆశయాలకు అనుగుణంగా ప్రజాప్రతి నిధులను ఎన్నుకునే అవకాశాలు ఏర్పడ్డాయి.రాజీవ్ గాంధీ 1991లో ఎన్నికల ప్రచారంలో హడా విడిగా ఉన్న సమయంలో మే 21 రాత్రి కాళరాత్రిగామారింది. శ్రీపెరంబుదూర్లో ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం’ ఆత్మాహుతి దళం బాంబర్ బెల్టు దాడిలో రాజీవ్గాంధీ మరణించారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాకు ఈ దుర్ఘటన షాక్ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్ప టికీ ఆ విషాదాన్ని తలుచుకుంటే దుఃఖం ఆగదు. రాజీవ్ గాంధీని ఉగ్రవాదులు హతమార్చిన మే 21వ తేదీని భారత దేశంలో ప్రతి ఏటా ‘ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం’గా పాటిస్తున్నారు. భారత్లో సాంకేతిక విప్లవానికి ఆద్యుడైన రాజీవ్ గాంధీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మనం ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ను అనుసరిస్తున్నామంటే అందుకునాడు సాంకేతిక రంగానికి రాజీవ్ గాంధీ వేసిన బీజాలే కారణం. మరణానంతరం ఆయనకు దేశంలో ప్రతిష్ఠాత్మక మైన ‘భారతరత్న’ ప్రకటించారు. రాజీవ్ గాంధీ పేరున అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డు అందిస్తున్నారు. ‘మిస్టర్ క్లీన్’గా రాజకీయాల్లో ప్రవేశించిన రాజీవ్ గాంధీకి ప్రజాదరణ పెరగడంతో పాలు పోని ప్రతిపక్షాలు భోఫోర్స్ కేసు పేరుతో అసత్య ఆరోపణలు చేసినా అవి నిరూపితం కాకుండా ఫాల్స్ కేసులుగానే మిగిలి పోయాయి.-బి. మహేశ్ కుమార్ గౌడ్వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు(నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి) -
విచారణలో ఉన్నా చర్చించవచ్చు!
ఏదైనా కేసుపై విచారణ జరుగుతున్నా, లేదా కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నా ... ఆ కేసును మీడియా ప్రస్తావించడం, చర్చించడం, విమర్శించడం తప్పు కాదని సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసు విషయంలో అభిప్రాయపడింది. ఇప్పటివరకూ అలా ప్రసార మాధ్యమాల్లో ప్రస్తావించడం తప్పుగా భావించేవారు. ప్రజాస్వామ్యంలో పటిష్ఠమైన చర్చలు, నిర్మాణాత్మక విమర్శలను స్వాగతించాల్సిన అవసరం ఉందనీ, బలమైన చర్చలతోనే ఆత్మపరిశీలన సాధ్యమవుతుందనీ కూడా కోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థ, మీడియా ప్రజాస్వామ్య మూల స్తంభాలనీ, ఇవి రెండూ పరస్పరం అనుబంధంతో కొనసాగాలనీ, అప్పుడే స్వేచ్ఛాయుత ప్రజా స్వామ్యం పరిఢవిల్లు తుందనీ సుప్రీం పేర్కొంది.వికీమీడియా ఫౌండేషన్పై ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ) ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్ విచారణలో ఉంది. అయినా ఆ ఫౌండేషన్ తాను నడుపుతున్న ‘వికీపీడియా’ వెబ్సైట్లో ఆ కేసు వివరాలు పోస్ట్ చేసింది. దీంతో ఏఎన్ఐ అభ్యర్థన మేరకు హైకోర్టు ఈ కేసు వివరాలున్న వెబ్ పేజీని తొలగించాలని వికీమీడియాను ఆదేశించింది. వికీమీడియా ఈ విషయంలో సుప్రీం కోర్టు మెట్లెక్కడంతో అత్యు న్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ హైకోర్టు ఆదేశాలను రద్దుచేసింది. న్యాయస్థానాలు ప్రజలకు సంబంధించిన బహిరంగ వ్యవస్థలనీ, అక్కడ జరిగే అంశాలు, ప్రస్తావనలు ప్రజలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారనీ, అందువల్ల వాటిని గోప్యంగా ఉంచా ల్సిన అవసరం లేదనీ సుప్రీం పేర్కొంది. అలాగని మీడియా విచ్చలవిడిగా వ్యవహరిస్తే కోర్టులు సహించవని సున్నితంగా హెచ్చరించింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో న్యాయస్థానాలను అప్రతి ష్ఠపాలు చేసినా, న్యాయ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా వార్తలు రాసినా, చర్చలు జరిపినా తీవ్రంగా పరిగ ణిస్తామని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ మెరుగుపడాలన్నా ఆత్మపరిశీలన అవస రమనీ, అప్పుడే మెరుగైన ఫలితాలు వెలువడే అవకాశాలు ఉంటాయనీ పేర్కొంటూ, ఇందుకు న్యాయ వ్యవస్థ కూడా మినహాయింపు కాదని స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. మీడియాకు మరింత స్వేచ్ఛ సమకూరడం ఆహ్వా నించదగిన పరిణామమే. అయితే భద్రతా కార ణాల రీత్యా ‘రహస్యం’ (ఇన్ కెమెరా)గా నిర్వహించే విచారణకు ఈ తీర్పు ‘పెనుముప్పు’గా మారే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా, ఎటు వంటి నియంత్రణా లేని సామాజిక మాధ్యమాలకు అడ్డూ అదుపు ఉంటాయా? సంచలనాల పేరుతో మరింత చెలరేగి పోయేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే విచ్చలవిడిగా, బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తున్న ‘కొన్ని’ సోషల్ మీడియా వేదికలు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రాణాలకు తెగించి వార్తా ప్రసారాలు చేసే చానళ్లు, వార్తలు ప్రచురించే పత్రికలు ఈ తీర్పును మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించుకుంటాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ‘గోప్యత హక్కు’ (రాజ్యాంగ అధికరణం 21), అధికారిక రహస్యాల చట్టం, కోర్టు ధిక్కార చట్టం (1971) ఇత్యా దిగా గల చట్టాల సంగతి ఏం కాను? సుప్రీం తాజా తీర్పును ‘యథాతథం’ (ట్రూ స్పిరిట్ )గా అర్థం చేసుకుంటే సానుకూల ఫలితాలు చారెడు. విపరీతా ర్థాలు తీసి, ఇష్టానుసారం వక్రీకరిస్తే అనర్థాలు బారెడు. అందుకే సంయమనంతో మీడియా సంస్థలు వ్యవహరించాల్సి ఉంటుంది.ప్రొ‘‘ పీటా బాబీ వర్ధన్ వ్యాసకర్త మీడియా విశ్లేషకులు -
ఇండియా, చైనాల మధ్య ఇంత వ్యత్యాసమా?
నేను బీజింగ్ నుండి తిరిగి వచ్చి పదిహేను సంవత్సరాలు గడిచింది కానీ, నేను ఇంకా దాని గురించి రాయబోతున్నాను. అప్పట్లోనే చైనా రాజధాని నన్ను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పడం దాన్ని తక్కువ చేసినట్లే అవుతుంది. నిజం ఏమిటంటే బీజింగ్లో ఆనాడు నేను చూసిన, కనుగొన్న అంశాలు నన్ను ఆశ్చర్యచకితుడిని చేశాయి. ఇప్పుడు అదనంగా, చాలా కాలం క్రితం పరిష్కృతమైందని నేను భావించిన వాస్తవం, పాత చర్చను మళ్ళీ రేకెత్తించింది.నేను బీజింగ్లో మూడు రోజులు మాత్రమే ఉన్నాను. రాజధానిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే చూశానని చెప్పాలి. కానీ గ్రేట్ వాల్, మింగ్ సమాధులను దర్శించాను. నగరంలో, గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ గడిపాను. కానీ నేను చూసిన ప్రతిదీ అభివృద్ధి చెందిన మొదటి ప్రపంచాన్ని సూచించింది. రోడ్లు, భవనాలు, దుకాణాలు, ప్రజల వేషధారణ, వారి ప్రవర్తన... మూడవ ప్రపంచ నగరాన్ని కాదు, యూరోపియన్ లేదా ఉత్తర అమెరికా మహానగర సంçస్కృతిని తలపింపజేశాయి. ఏ అర్థంలో చూసినా ఈ అంశాలలో దేనిలోనూ ఢిల్లీ పోటీపడలేదు.బీజింగ్ నమ్మశక్యం కాని విధంగా శుభ్రంగానూ, ఆశ్చర్యకరంగా స్నేహపూర్వకంగానూ ఉంది. చైనీయులు బహిరంగంగా ఉమ్మివేస్తుంటారని నాకు చెప్పారు. నేను చైనాలో గడిపిన మూడు రోజుల్లో అలా ఉమ్మి వేసినవారిని అరడజను మందిని కూడా చూడలేదు. మింగ్ సమాధులు లేదా ఫర్బిడెన్ సిటీ వద్ద వేలాది మంది ఉన్నారు కానీ వారిలోనూ ఈ అలవాటును చూడలేదు. కాలిబాటలపై చెత్త లేదు, గోడలపై పాన్ మరకలు లేవు, దుకాణాల వెలుపల పారవేసిన సిగరెట్ పీకలు, చిరిగిన పాలిథిన్ సంచులు కూడా లేవు.అంతేకాకుండా చైనీయులు స్నేహపూర్వకంగా ఉన్నారు. నేను హోటల్ నుండి తియానన్మెన్ స్క్వేర్కు వెళుతున్నప్పుడు అపరి చితులు తరచుగా నడుచుకుంటూ వచ్చి కబుర్లు చెప్పారు. వారు అడుగులో అడుగు వేసి, అది సహజమైన, స్పష్టమైన పని అన్నట్లుగా సంభాషణను ప్రారంభించారు. వారిలో చాలామంది ఇంగ్లిష్ అభ్యసించే విద్యార్థులే అంటే సందేహం లేదు, కానీ మరే ఇతర నగరంలోనూ ఇంత స్వేచ్ఛాయుతమైన ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదు.ఏది మంచి వ్యవస్థ?వాస్తవానికి 1962 నాటికి చైనాతో మనకు ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితిపై, చైనా–ఇండియా పోటీపై స్పష్టమైన భారతీయ దృక్పథంతో నేను బీజింగ్కు వెళ్లాను. కానీ, చైనా పట్ల తీవ్రతకు తగ్గని ఆకర్షణ, ఏకపక్షతతో తిరిగి వచ్చాను. కానీ ఇప్పుడు అది పాత భావజాల ఘర్షణను మళ్లీ రగిలించింది.నిరంకుశ రాజ్యమైన చైనా – ఆర్థిక వృద్ధిని, అభివృద్ధిని తన ప్రాథమ్యంగా చెప్పుకొంటుంది. స్వేచ్ఛా వ్యక్తీకరణ, సహకారం, రాజకీయ ఎంపికలకు సంబంధించిన ఉదారవాద హక్కులను విస్మరిస్తుంది. క్రమశిక్షణ అనేది అక్కడ స్వేచ్ఛా వ్యక్తీకరణ కంటే ముఖ్యమైనది. భిన్నాభిప్రాయాన్ని తీవ్రంగా శిక్షిస్తారు. దీనికి విరుద్ధంగా, భారతదేశం స్వేచ్ఛా పత్రికా వ్యవస్థ, బహుళ, పోటీ రాజకీయ పార్టీలు, స్వతంత్ర న్యాయవ్యవస్థతో పాటు సిద్ధాంతపరంగా తాము కోరుకున్నది చేయడానికి స్వేచ్ఛ ఉన్న వ్యక్తులతో కూడిన ప్రజా స్వామ్యం. మనం తరచుగా మన ప్రభుత్వాలను మారుస్తాం. తరచుగా మన రాజకీయ నాయకులను పక్కన పెడుతుంటాం. స్పష్టంగా చెప్పాలంటే, భారత్తో పోలిస్తే చైనా తక్కువ ఆహ్వానించదగిన దేశంగా కనిపిస్తుంది.కానీ ఈ విషయాన్ని కాస్త భిన్నంగా చూడండి: చైనా తన ప్రజలకు ఆర్థిక భద్రత, మెరుగైన జీవనశైలి, అధిక తలసరి ఆదాయం ఇచ్చింది. 1947లో (లేదా 1949లో, పీపుల్స్ రిపబ్లిక్ పుట్టినప్పుడు) భారత్, చైనాలు ఒకే ఆర్థిక స్థితిలో ఉన్నాయి. 2010లో, నేను చైనాను సందర్శించినప్పుడు, దాని తలసరి ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువ. వారి పిల్లలలో 7 శాతం మందే పోషకాహార లోపంతో ఉన్నారు; కానీ మన పిల్లలలో 46 శాతం మంది పోషకాహార లోపంతో ఉన్నారు. దేశంలో పరిస్థితులు మారాయనడంలో సందే హం లేదు. కానీ భారతీయులు పేదరికం నుంచి పూర్తిగా బయట పడతారనే భావన సందేహంగానే ఉంటుంది!కాబట్టి రెండు దేశాలకు సంబంధించి ఏది మంచి వ్యవస్థ? అత్యవసర పరిస్థితి సమయంలో గంటల తరబడి దీనిపై తీవ్రమైన చర్చను నిర్వహించిన విషయం నాకు గుర్తుంది. 1977 ఎన్నికలు ఈ విషయాన్ని పరిష్కరించాయని నేను అనుకున్నాను. భారత ప్రజలు స్వేచ్ఛ కోసం ఓటు వేసి, ఇందిరా గాంధీ వేసిన పురోగతి, అభివృద్ధి అనే ఎరను తిరస్కరించారు. కానీ చైనా ఆ ప్రశ్నను తిరిగి మేల్కొలిపింది. ముప్పై సంవత్సరాలుగా చైనా సాధిస్తూ వచ్చిన 10 శాతం వృద్ధి, భారత్ సాధించిన దానికి స్పష్టమైన, ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. పైగా రానురానూ ఈ అంతరం పెరు గుతూ ఉండవచ్చు.నేను నా భావనలను స్థిరం చేసుకునే ముందు చైనా గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి, చూడాలి. కానీ నా విశ్వాసం దెబ్బతింది. తద్వారా వచ్చిన ప్రశ్నలు నన్ను కలవరపెడుతున్నాయి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
చైనాతో అమెరికా వైరం ముగిసేదేనా?
అమెరికా, చైనాల ప్రతినిధుల మధ్య ఈనెల 10, 11 తేదీలలో జెనీవాలో జరిగిన చర్చలు వాణిజ్య సుంకాల విషయంలో ఒక రాజీని కుదిర్చాయి గానీ, మరికొన్ని సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి. మౌలికంగా గుర్తించవలసింది ఏమంటే, ఇరువురి మధ్య అసలు సమస్య సుంకాలకు మించినది. అది ఆధి పత్య సమస్య. చైనాకు ఆధిపత్యం లభించకుండా ఉండేందుకు పలు విధాలుగా ప్రయ త్నిస్తూ వస్తున్న అమెరికా, అందుకు సుంకాల యుద్ధాన్ని కూడా ఒక సాధనంగా ఎంచుకుంది. అయితే, ఈ యుద్ధంలో గెలవలేక పోతు న్నట్లు అర్థం కావటంతో జెనీవాలో రాజీకి వచ్చింది. అంతమాత్రాన ఇరువురి మధ్య ఆధిపత్య వైరం ముగిసినట్లు కాదు. అది అనేక రూపాలలో పలు సంవత్సరాలపాటు సాగనున్నది.తొలుత తగ్గింది అమెరికానే!జెనీవాలో రెండు రోజుల చర్చల తర్వాత, చైనాపై సుంకాలను అమెరికా 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించగా, చైనా 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. అంతకు ముందు వారాలలో ఒకరిపై ఒకరు పోటాపోటీగా సుంకాలు పెంచుతూ పోయారు. తక్కిన అన్ని దేశాలపై అమెరికా సుంకాలు 50 శాతానికి లోపే కాగా, చైనాపై ఒక దశలో 245కి పెంచారు. తర్వాత అన్ని దేశాలపై 90 రోజులు వాయిదా వేసి చైనాకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. ఆ విధంగా తమ యుద్ధం ప్రధానంగా చైనాపై అన్నది అందరికీ అర్థ మైంది. కానీ, ట్రంప్ అంచనా వేసినట్లు చైనా లొంగి రాలేదు. వాణిజ్య యుద్ధాలు తగవనీ, స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలకు విరుద్ధమనీ స్పష్టం చేసింది. వాణిజ్య యుద్ధం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయని తెలిసినా, ప్రత్యామ్నాయాలను అన్వేషించటం మొదలు పెట్టింది.తనవైపు నుంచి అమెరికాకు చైనా కన్నా ఎక్కువ నష్టాలు కనిపించ సాగాయి. ఆ పరిస్థితులలో చైనాతో రాజీ చర్చల కోసం ట్రంప్ ప్రయత్నాలు సాగించారు. చర్చలను చైనాయే కోరుకుంటున్నదంటూ మొదట మేకపోతు గాంభీర్యం చూపి, చివరకు తామే చర్చల తేదీలు ప్రకటించారు. సుంకాలు ఆ స్థాయిలో అవాస్తవికమని ట్రంప్తో పాటు ఆయన అధికారులు ముందునుంచే వ్యాఖ్యానించారు. సుంకాలను తాము బహుశా 80 శాతానికి తగ్గించవచ్చునని కూడా ట్రంప్ సూచించారు. అటువంటిది జెనీవాలో అనూహ్యంగా 30 శాతానికి వచ్చారు. ఈ విరామం 90 రోజుల కోసం! ఆ తర్వాత కూడా 145 శాతానికి వెళ్లే అవకాశం లేదని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.ఈ 90 రోజులలో ఏమి జరగవచ్చునన్నది ఒక ప్రశ్న. అదట్లుంచి, జెనీవాలో ఉభయులకూ మరికొన్ని ప్రయోజనాలు కలి గాయి. ఉదాహరణకు, అమెరికాకు అరుదైన ఖనిజాలు, లోహాల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని చైనా ఎత్తివేసింది. అవి లేనట్లయితే అమెరికాలో రక్షణ రంగంతో సహా అనేకం తీవ్రంగా దెబ్బతింటాయి. మొత్తం ప్రపంచంలోనే ఈ ఖనిజ నిక్షేపాలు, వాటి శుద్ధి పరిశ్రమలు 70 శాతానికి పైగా చైనా అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నిక్షేపాల కోసం ఉక్రెయిన్, రష్యా, కెనడా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, గ్రీన్లాండ్, ఆఫ్రికా తదితర ప్రాంతాలలో అమెరికా వేగంగా ప్రయత్నాలు ఆరంభించింది గానీ, అవి ఒకవేళ ఫలించినా వినియోగంలోకి రావాలంటే పదేళ్ళు పట్టవచ్చుననే అంచనాలున్నాయి. కనుక చైనా సరఫరాలు తప్పనిసరి. అదేవిధంగా, చైనా రవాణా నౌకలపై ఆంక్షలు, సుంకా లను అమెరికా రద్దు చేయనున్నది. ఆ విధంగా జెనీవాలో ఇతర లాభాలు కూడా ఇరువురికీ కలిగాయి.చైనా సవాలుసుంకాల యుద్ధం ప్రారంభించటంలో ట్రంప్ ఆశించినవి మరొక రెండు ఉన్నాయి. చైనాకు, ఇతర దేశాలకు తరలిపోయిన అమెరికన్ పరిశ్రమలు తిరిగి రావటం, తమ వద్ద అన్ని సుంకాలనూ రద్దు చేయగలమని ప్రకటించినందున ఇతరులు తమ దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం ఒకటైతే, ఆ కారణంగా తమ వద్ద ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగటం రెండవది. అవి సాకారం కావటం తేలిక కాదని అమెరికా సహా పాశ్చాత్య నిపుణులే విశ్లేషిస్తున్నారు. అందుకు ఎదురయ్యే తక్షణ సమస్యలు రెండున్నట్లు చెప్తు న్నారు. ఒకటి–అవసరమైన మౌలిక సదుపాయాలు, సప్లయ్ చెయిన్లు లేకపోవటం; వాటి అభివృద్ధికి తగినంత కాలం అవసరం కావటం. రెండవది–ఇతర దేశాల కార్మికులు చేసే అనేక పనులకు అమెరికన్ కార్మికులు సిద్ధపడక పోవటం, వారికి ఆ శిక్షణలూ లేకపోవటం.అందువల్ల, 90 రోజుల అనంతరపు అనుభవాలు, సమీక్షలు ఆశావ హంగా ఉండే అవకాశాలు కన్పించవు.మరొక ముఖ్య విషయం. ట్యారిఫ్లకు చిన్న దేశాలు బెదిరిపోగా, కెనడా, యూరప్, చైనా గట్టిగా ప్రతిఘటించాయి. ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, తైవాన్ ఇచ్చిపుచ్చుకునే విషయం ఆలో చించాయి. చివరకు జెనీవాలో జరిగినది అందరికీ కొంత ధైర్యాన్నిస్తు న్నది. వారు చైనా స్థాయిలో ధిక్కరించటం సాధ్యం కాకపోయినా,ట్రంప్తో మరికొంత బేరమాడగలరు. తమకు అమెరికా ఎంత అవస రమో వారికి అమెరికా అవసరం కూడా ఏదో ఒక స్థాయిలో ఉంటుంది. అమెరికా ఎంత శక్తిమంతమైన దేశమైనా అన్నీ తను కోరు కున్నట్లే జరగబోవు. స్వేచ్ఛా వాణిజ్యానికి, డబ్ల్యూటీఓకు సృష్టికర్తలు వారు. పెట్టుబడులు ఎటునుంచి ఎటైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చునని సిద్ధాంతీకరించిందీ వారే! దాని ఫలితాలను దశాబ్దాల పాటు పొందిన తర్వాత ఇపుడు భయపడటం ఎందుకు? కొన్ని విధానాల ఫలితాలు ఒక దశలో ఒక విధంగా ఉన్నప్పటికీ, కాలం గడిచినకొద్దీ కొత్త పరిణా మాలు సంభవిస్తాయి. అపుడు ఆ విధానాలు, ఫలితాలలో వైరు ద్ధ్యాలు తలెత్తుతాయి. అటువంటి కొత్త పరిణామం చైనా అయింది.చరిత్ర మలుపులో...అమెరికా సమస్య కేవలం వాణిజ్య లోటు కాదు. చైనా గత 15–20 ఏళ్ళుగా నాలుగు విధాలుగా వేగంగా అభివృద్ధి చెందుతు న్నది. ఆర్థికం. సైనికం. శాస్త్ర–సాంకేతిక రంగాలు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పలుకుబడి. ఇవి నాలుగూ అమెరికా అగ్రస్థానాన్ని దెబ్బతీ యగలవు. ఒకప్పటి సోవియెట్ యూనియన్ ఏ బలహీనతల వల్ల పతనమైందో చైనా కూడా అదే విధంగా పతనం కాగలదని ఒక దశలో ఆశించారు. కానీ, సోవియెట్ పతనం నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా తన జాగ్రత్తలు తాను తీసుకుంటూ వస్తున్నది. కనుకనే అమెరికా తర్వాత రెండవ ఆర్థిక శక్తిగా, రెండవ సైనిక శక్తిగా, రెండవ శాస్త్ర–సాంకేతిక శక్తిగా మారింది. బ్రిక్స్, బీఆర్ఐ (బెల్ట్ అండ్ రోడ్), డీడాల రైజేషన్, బహుళ ధ్రువ ప్రపంచ బలోపేతం వంటి మార్గాలలో అమె రికా రాజకీయ ఆధిపత్యం కోల్పేయే సూచనలు కనిపిస్తున్నాయి.అమెరికా, చైనాల వైరం ఈ విధంగా మౌలికమైనది, దీర్ఘకాలిక మైనది, వ్యూహాత్మకమైనది. ఇందులో సుంకాల యుద్ధం ఒక చిన్న విషయం. జెనీవా రాజీ వరకు జరిగిన పరిణామాలు ఆ చిన్న ఆరంభ యుద్ధంలో తొలి దశ మాత్రమే! ఇందులో ఏది జరిగినా, వైరం మాత్రం కొనసాగుతుంది. ఈ యుద్ధకాండ సుదీర్ఘమైనది. చరిత్రను ఒక కొత్త మలుపు తిప్పగలది.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
War యుద్ధాల్లో ఓడేది శ్రామిక ప్రజలే!
ఇప్పుడు ప్రపంచంలో, ఏ ఖండంలో చూసినా, విన్నా, యుద్ధాలే యుద్ధాలు: దేశాల మధ్యా, ఒకే దేశంలో వేరు వేరు పక్షాల మధ్యా! యాభై ఏళ్ళ కిందట, చెరబండ రాజు రాసిన ఒక కవిత పేరు, ‘విప్లవాల యుగం మనది! విప్ల విస్తే జయం మనది!’ అని. ప్రస్తుత పరి స్థితి వేరే రకంగా వుంది. ‘యుద్ధాల యుగం మనది! ఆప కుంటే చావు మనది!’ అన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్యా; రష్యా–ఉక్రె యిన్ల మధ్యా జరుగుతున్నవి భీకర యుద్ధాలు! ఈ యుద్ధాలలాగా పత్రికల్లో, టీవీల్లో, ఎక్కు వగా ప్రచారం కాని యుద్ధాలు ఎన్నో ఆఫ్రికాలో నిరంతరం ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. బుర్కినా ఫాసో, కామెరూన్, కాంగో, ఇథియోపియా, మొజాంబిక్, నైజీరియా, సోమాలియా, సూడాన్-ఇలా ఎన్నో దేశాల్లో దాదాపు 35 సాయుధ ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నట్టు వార్తలున్నాయి. ఈ యుద్ధాల వల్లా, నిరంతరం జరిగే సాయుధ ఘర్ష ణల వల్లా, కలిగే బీభత్సాల గురించి, అనేక అంతర్జాతీయ నివేదికలు వచ్చాయి. ఆ యా దేశాల తరఫున యుద్ధం చేసే సైనికులూ, ఆ దేశాల శ్రామిక జనాలూ, పెద్దసంఖ్యల్లో చనిపోతున్నారు. బతికి ఉన్నవాళ్ళలో అనేకులు తీవ్ర గాయాలపాలై, కళ్ళూ, కాళ్ళూ, చేతులూ, పోగొట్టు కుంటున్నారు. స్త్రీలు అత్యాచారాలకు గురవుతున్నారు. పిల్లలు ఏ దిక్కూ లేని ‘అనాథలవుతున్నారు. లక్షలాది మంది శరణార్థులుగా తరలిపోతున్నారు. పొలాలూ, నదులూ, చెరు వులూ, నివాసాలూ– అన్నీ ధ్వంసం అవు తున్నాయి. గాలి కాలుష్యం వల్లా, నీటి కాలుష్యం వల్లా, జనాలు భరించలేని, నయంకాని, జబ్బుల పాలవు తున్నారు.ఇదీ చదవండి: మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్ఐక్యరాజ్యసమితి నివేదికల్లోనూ, ‘ప్రపంచ శాంతి గురించిన పరిశోధనా సంస్థల నివేదికల్లోనూ, యుద్ధ బీభ త్సాల గురించిన వివరాలెన్నో చూడవచ్చు. ఉదాహర ణకు, గాజా యుద్ధంలో 18 నెలల్లో 50 వేల మంది పాల స్తీనా ప్రజలు చనిపోయారు. లక్షా 13 వేలమంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో దాదాపు 4 వేల 5 వందల మంది పిల్లలకు, ఆ గాయాలు విషంగా మారడం వల్ల, రెండు కాళ్ళూ తీసేశారు. ఆకలి మరణాలు సరేసరి. ఇజ్రాయెల్ దాడిలో, 85 వేల టన్నుల పేలుడు పదార్థాల వల్ల, గాలి కాలుష్యం విపరీతంగా ఉందని తేలింది. అలాగే రష్యా–ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలోనూ సైనికులూ, ప్రజలూ పెద్ద ఎత్తున చనిపోయారు. రష్యాలో ఉన్న బీబీసీ వార్తా సంస్థ యూనిట్... అక్కడి స్థానిక మీడియా సంస్థలు, వలంటీర్ల సహకారంతో జరిపిన సర్వే ప్రకారం: 1 లక్షా 6 వేల 745 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్తో జరిగిన యుద్ధంలో చని పోయారని అంచనా వేసింది. గత మూడు సంవత్స రాలలో ఆఫ్రికా దేశాలలో జరిగిన సాయుధ సంఘర్షణల్లో 3 లక్షల 30 వేలమంది చనిపోయారు.యుద్ధ మరణాలు ఎన్ని లక్షలైనా, కోట్లు అయినా, ఉత్త అంకెలుగానే చూస్తున్నాము తప్ప దుఃఖభారంతో కుంగిపోవడం లేదు. ‘నల్ల స్తూపం’ అనే 1956 నాటి ఒక జర్మన్ నవలలో, ఆ రచయిత ఇలా అంటాడు: ‘ఒక మనిషి చనిపోతే, అది ఒక మరణం మాత్రమే. అదే 20 లక్షలమంది చనిపోతే, అది ఒక అంకె మాత్రమే!’ ఇదే రకం అభిప్రాయాన్ని, అంతకు చాలా సంవత్సరాలముందే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో చలం గారు, ‘మ్యూజింగ్స్’లో ఇలా రాశారు: ‘యుద్ధం ముందు హత్యలు! యుద్ధమంతా హత్యలు! యుద్ధం తర్వాత హత్యలు! పదివేల మందిని హత్య చేశారంటే, అది వినే వారికి ఉత్త అంకెలు. చీమలమల్లే పుట్టుకొచ్చే ఈ ప్రజ లలో పదివేల మంది ఒక సంఖ్య కాదు. మళ్ళీ నిండుకుంటారు అవలీలగా! కానీ, ఒక్క జీవితం, ఒక మనిషిది. ఆలోచించి, మాట్లాడి, ప్రేమించి, కలలు కనే ఒక్కజీవితం! ఇంక ఎన్నడూ తిరిగిరాని జీవితం! అనేకమైన సజీవమైన లత లతో ఇతరుల్ని పెనవేసుకున్న జీవితం! ఎంత విలువ!’ఇదీ చదవండి: నిహారికను తీర్చిదిద్దిన శిల్పి ఆమె తల్లే!ఇంతకీ, ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? పెట్టుబడిదారీ ప్రపంచంలో యుద్ధాలన్నీ స్వదేశంలోనైనా, విదేశాల్లో అయినా ప్రకృతి వనరుల్నీ, శ్రామికుల శ్రమనీ దోచే లక్ష్యంతో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అనేక పరిశోధనలు రుజువు చేశాయి. ముగ్గురు ఆఫ్రికా ఖండ పరిశోధకులు 54 ఆఫ్రికా దేశాలలో జరుగుతున్న యుద్ధాల గురించి, విస్తారంగా సమాచారం సేకరించి, ‘ఆఫ్రికాలో జరుగుతున్న ఘర్షణలపై, ప్రకృతి వనరుల ప్రభావం ఉందా?’ అన్న వ్యాసంలో (రిసోర్సెస్ పాలసీ మాస పత్రిక, డిసెంబర్, 2021) ఇదే సంగతిని నిరూపించారు. ఈ యుద్ధాలకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ... ఫ్రాన్సూ, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా వంటి పెద్ద దేశాల ప్రోత్సాహం ఉంది. యుద్ధాలు జరిగితే, ఆ దేశాల్లోని ఆయుధ పరిశ్రమల యజమానులకు పండగే పండగ! సరే, ఇంతకీ యుద్ధాల సమస్యకు పరిష్కారం ఏమిటి? యుద్ధ వ్యతిరేక మేధావిగా పేరుపొందిన బ్రిటిష్ తత్వవేత్త, బెట్రండ్ రస్సెల్ ప్రకారం: ‘మనుషులన్నా యుద్ధాల్నిరద్దు చేస్తారు. లేదా యుద్ధాలన్నా మనుషుల్ని రద్దు చేస్తాయి!’ అయితే, ఏ రకం మనుషులు యుద్ధాల్ని రద్దు చేస్తారు? లాభాలే లక్ష్యంగా ఉన్న పెట్టుబడిదారీ మనుషులైతే యుద్ధాల్ని రద్దు చెయ్యరు కదా?శ్రామిక వర్గ మానవులు, శ్రమ దోపిడీ అనే దుర్మా ర్గాన్ని తీసిపారేసినప్పుడే, యుద్ధాలను రద్దు చెయ్య గలరు! అది జరిగేలోగా, తాత్కాలిక ఉపశమనం ఏమిటంటే, శ్రామిక జనాలు, తమ దేశాల ప్రభుత్వాలు దేశ రక్షణ పేరుతో చేసే ఆయుధ వ్యాపారాన్ని మాని ఆ వేల, లక్షల కోట్ల రూపాయల్ని విద్య మీదా, వైద్యం మీదా, ఉద్యోగాల మీదా ఖర్చుపెట్టేలా ఒత్తిడి తేవాలి. అది జరగకుండా, యుద్ధాలే కొనసాగితే, ఆ యుద్ధాల్లో ఏ దేశ ప్రభుత్వాలు గెలిచినా, ఓడిపోయేది మాత్రం అన్ని దేశాల శ్రామిక జనాలే!– బి.ఆర్. బాపూజీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు -
ప్రజల ఆశలతో బాబు కపట రాజకీయం!
‘‘ప్రజలకు మరీ ఆశ ఉండకూడదు. దురాశ పనికిరాదు’’ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తరచూ చేసే వ్యాఖ్య ఇది. ఈమధ్య సోషల్ మీడియాలోనూ ఆయన వాడిన ఈ డైలాగులు ఎక్కవగా కనిపిస్తున్నాయి. ఆయన చెప్పింది వాస్తవమే. ఎందుకంటారా? బాబు, పవన్కళ్యాణ్ లాంటి వాళ్లు ఇచ్చినమాటకు కట్టుబడి హామీలన్నీ నెరవేరుస్తారని నమ్మడం ప్రజల అత్యాశే కదా! ఈ దురాశతోనే ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించింది! పాపం.. పై పై వాగ్ధానాలు చేసిన వాళ్లు ఎవరు? వారి ట్రాక్ రికార్డు ఏమిటి అన్నది కూడా గుర్తుపెట్టుకోకుండా ప్రజలు అతిగా ఆశపడ్డారు. టీడీపీ ఎన్నికల మానిఫెస్టోలోని ‘ఆడ బిడ్డ నిధి’కి కూడా బాబు అండ్ కో మంగళం పాడేసినట్లేనన్న వార్తలు చూసిన తరువాత ప్రజలను ఇంత గొప్పగా మోసం చేయవచ్చా? అని అనిపించక మానదు. ప్రజలను దురాశా పరులుగా చిత్రీకరించి నిందించవచ్చు కానీ.. ఆ ఆశ పెట్టిన వారి తప్పు మాత్రం ఏమీ లేదన్నచందంగా ఉందీ వ్యవహారం. ప్రజలను ఇంత బాహాటంగా మోసం చేసినందుకు ఇతర దేశాల్లో ఎలాంటి శిక్షలు పడతాయో తెలియదు కానీ.. ఇలాంటి వారు.. ప్రజల ఆగ్రహాన్ని, ఛీత్కారాలనైతే తప్పకుండా చూస్తారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో నేతల వైఖరి నమ్మి మోసపోయిన వారిదే తప్పన్నట్టుగా ఉండటం. అయ్యో ఈ నేతలు ప్రజలను పిచ్చోళ్లుగా చూస్తున్నారే అన్న ఆవేదన కలుగుతుంది. నిజాయితీ లేని నేతలు అధికారంలోకి వచ్చి, చెప్పినవి చేయకపోగా, వారినే బెదిరిస్తున్న తీరు, విషయాలను పక్కదారి పట్టిస్తున్న తీరులపై పెద్ద పరిశోధనే చేయవచ్చు. ఆశపెట్టి ఏమార్చడం.. ఆ తరువాత ప్రజలనే నిందించడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. సుమారు రూ.లక్ష కోట్ల రైతు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్న హామీతో 2014లో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తరువాత ఏం చేశారో అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే ఆయన ‘‘ఆశకు హద్దు ఉండాలి’’ అని రైతులను ఉద్దేశించి నేరుగానే అన్నారు. తాజాగా 2024 ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ ప్రతి మహిళకూ రూ.1500 చొప్పున నెల నెల ఇస్తానని! ఈ పథకానికి ఆడబిడ్డ నిధి పేరూ పెట్టారు. ప్రతి ఒక్కరికీ ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకూ రూ.15 వేలు చొప్పున ఇస్తామని ఊదరగొట్టడంతో మహిళలు చాలామంది ఆశపడ్డారు. ఓట్లేశారు. ప్రస్తుత మంత్రి నిమ్మల రామానాయుడు అప్పట్లో ‘‘నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు’’ అంటూ ప్రచారం చేయడమూ మనం చూశాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు సైతం.. ‘‘ఒకరుంటే రూ.15 వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60 వేలు..ఇంకా పిల్లలను కనండి..వారి బాధ్యత మాది’’ అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాది పూర్తి అయిపోయింది.. తల్లికి వందనం లేదు. విద్యార్ధులకు సుమారు రూ.13 వేలు ఎగవేశారు. వచ్చే విద్యా సంవత్సరం ఇస్తామని అంటున్నారు. ఏమవుతుందో తెలియదు! ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత రవాణా సౌకర్యం అన్న హామీని కూడా అటకెక్కించేశారు. అమలు చేసి ఉంటే ఏపీ మహిళలకు ఏడాదికి రూ మూడు వేల కోట్ల వరకూ మిగిలేది! ఈ లెక్క కూడా ఎల్లోమీడియాదే. ఆగస్టు పదిహేను నుంచి ఈ స్కీము అమలు చేస్తామని చంద్రబాబు ఈమధ్య కర్నూలులో ప్రకటించారు. అంటే మరో మూడు నెలలు ఈ స్కీమ్ ఉండదు. దీనిని కూడా లెక్కలోకి తీసుకుంటే మహిళలు మరో రూ.వెయ్యి కోట్లు నష్టపోయినట్లు! ఇదే సభలో చంద్రబాబు ఆడబిడ్డ నిధి స్కీము లేనట్లే తేల్చారని వార్త వచ్చింది. దానికి ఆయన ఇచ్చిన వివరణ చూస్తే మరీ ఇంత పచ్చి పాపమా అనిపిస్తుంది. తాను అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలు మోసపూరితమని ఆయనకు తెలుసు. తాను ఆ వాగ్దానాలు ఎందుకు చేసింది.. ఎందుకు అమలు చేయలేకపోతున్నది నిజాయితీగా వివరించడం మానేసి, మరో కొత్త అబద్దాన్ని సృష్టించారు. అదేమిటంటే తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని ఏపీలో పేదలు బాగానే సంపాదిస్తున్నట్లు చంద్రబాబే తేల్చేశారు! అందువల్ల వారికి ఆ స్కీమ్ అవసరం లేదని, 2029నాటికి పేదరికం లేకుండా చేసేస్తామని, అప్పటికీ పేదలు ఉంటే పీ-4 కింద దాతలకు అప్పగిస్తామని అన్నారట. కూటమి ప్రభుత్వం వచ్చాక, ప్రజల చేతుల్లో డబ్బులు ఆడక పేదలు, గిట్టుబాటు ధరలు లేక రైతులు, వ్యాపారాలు లేక వ్యాపారస్తులు అల్లాడుతుంటే పేదలంతా బాగా సంపాదించుకుంటున్నారని చంద్రబాబు చెబుతున్నారు. ఇలాంటి వారి మాటలు నమ్మి ఓటు వేసినందుకు తమకు బాగానే శాస్తి అయిందని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఆడబిడ్డ నిధి స్కీము రాష్ట్రంలోని కోటిన్నర మంది మహిళలకు ఉపయోగపడేది! ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్లకుపైగా అవసరమని లెక్క. ఇంత మొత్తం ఎలా సాధ్యమని అప్పట్లో ప్రశ్నించిన వారికి బాబు ఇచ్చిన సమాధానం తాను సంపద సృష్టించగలనూ అని! ఇప్పుడేమో సంపద వచ్చేసిందని చెబుతుంటే బిత్తరపోవడం తప్ప ప్రజలు చేయగలిగేది ఏముంటుంది! ఒకరకంగా చెప్పాలంటే ఈవీఎంల మాయాజాలం సంగతి పక్కనబెడితే అనేక నియోజకవర్గాలలో తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి వాగ్దానాలు గేమ్ చేంజర్ గా మారి కూటమిని అధికారంలోకి తెచ్చాయి. ఇప్పుడేమో చేతులెత్తేసి పేదల జీవితాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు. వాగ్దానాల గురించి చెప్పకుండా, చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామని, ఓర్వకల్లో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేశామని, బుద్దుడి సలహాలు పాటించండని కధలు చెబుతున్నారు. ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. చెత్త ఎత్తడానికి పనివారు వస్తున్నారా అని చంద్రబాబు ప్రశ్నిస్తే లేదు..లేదు..అని ఎక్కువ మంది చేతులెత్తారు. దాంతో చెత్త గురించి ఆయన చెబుతున్న కబుర్లలో డొల్లతనం బయటపడింది. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు పెడతామని, లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తామని, ఉద్యానవన పంటలను 18 లక్షల హెక్టార్ల నుంచి 36 లక్షల హెక్టార్లు చేస్తామని, ఇలా ఏవేవో సంబంధం లేని మాటలతో ప్రసంగం చేశారు. అక్కడితో ఆగితే ఫర్వాలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కూడా దబాయించి మరీ చెప్పారు. నవ్వుకుని ఊండిపోవడం అక్కడి ప్రజల వంతైంది. చివరికి బుద్దుడు, ఆయన శిష్యుడి కథ అంటూ చంద్రబాబు ప్రజలకు ఒక స్టోరీ చెప్పారు. దాని ప్రకారం శిష్యుడి కోరిక మేరకు బుద్దుడు కొత్త వస్త్రాలు ఇప్పించారట. ఆ తర్వాత కొద్ది రోజులకు బుద్దుడు పిలిచి పాత వస్త్రాలు ఏమి చేశావని అడిగాడట. వాటితో చిరిగిపోయిన బొంతలో పెట్టి కుట్టుకున్నానని శిష్యుడు చెప్పాడట. మరీ చినిగిపోయిన బొంతలోని వస్త్రాలు ఏమి చేశావు అని బుద్దుడు అడిగాడట. వాటిని కిటికీ తెరలు చేశానని జవాబు ఇచ్చారు.మరి అప్పటికే ఉన్న కిటీకి తెరలు ఏమి చేశావని అడిగితే గది తుడవడానికి వాడుతున్నానని, ఆ వస్త్రాన్ని మసిబట్టగా వాడుతున్నానని, అప్పటిదాకా ఉన్న మసిబట్ట దారాలను కొవ్వొత్తిలో వాడే వత్తులకు వినియోగిస్తున్నానని శిష్యుడు చెప్పారట. ప్రతి వస్తువుకూ ఒక ఉపయోగం ఉంటుందని చెప్పడానికి చంద్రబాబు ఈ కథ చెప్పినా, విన్న వారికి మాత్రం చివరికి ఏపీ పరిస్థితి ఇలా మారిందన్నమాట అని అనుకున్నారనుకోవాలి. ఒక పక్క అమరావతిలో ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ తదితర భవనాలు ఉన్నా, అవి పనికి రావంటూ లక్ష కోట్లు వ్యయం చేస్తూ గొప్పలు చెప్పే చంద్రబాబు ప్రజలు మాత్రం ఈ ఆధునిక యుగంలో చినిగిన వస్త్రాలు సైతం వాడుకోవాలని చెబుతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి బుద్దుడు, శిష్యుడు కథ వర్తించదా అంటే ఏమి చెబుతాం. ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు అన్న సూత్రం చంద్రబాబు వంటివారిని చూసే వచ్చిందనుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఈ కరవులో ఊళ్ళు బతికేదెట్లా?
ఆంధ్రదేశం నదులతో, కొండలతో, సముద్ర తీరంతో సుసంపన్నమైనది. గోదా వరి, కృష్ణ, పెన్నా వంటి నదులు, ఉప నదు లతో ఒకనాడు సస్యశ్యామలంగా వర్ధిల్లింది. ఆంధ్రదేశ భౌగోళిక, సాంస్కృతిక, తాత్విక సాంకేతిక సంపద ప్రసిద్ధమైనది. చరిత్రకా రుల ప్రకారం మొత్తం భారతదేశంలోనే ఇన్ని భౌగోళిక వనరులున్న ప్రాంతం మరొకటి లేదు. 974 కిలోమీటర్ల సముద్ర తీరం దీనికి ఆయువు. నదులు, చెరువులు, కాలువలు, గడ్డి మైదానాలతో; పండ్ల, ఫల, వృక్షాలతో ఆంధ్రదేశం సుసంపన్నమైనది. అంతేకాదు, దక్షిణాపథంలో ఆంధ్రదేశం కీలక స్థానంలో ఉంది. దానికితోడు తూర్పు తీరమైదానం సారవంతమైన పంట భూమి. అచటి రేవు పట్టణాలు దూరదేశాలతో వాణిజ్యం సాగించి ఐశ్వర్యవంతమైనాయి. కాకతీయులు విజృంభించే వరకు తీరాంధ్రమే ఆంధ్రదేశ రాజకీయా ధికారానికి కేంద్రమై, సాంస్కృతిక ఉద్యమాలకు పుట్టినిల్లయింది. దక్షిణాపథంలో పశ్చిమ ప్రాంతంలో విజృంభించిన రాజవంశాలు తీరాంధ్రాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాయి. ఆంధ్రదేశాన్ని ఆక్రమించినవారు సులభంగా దక్షిణాపథ ఆధిపత్యం సాధించగలరు. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్రా నదుల అంతర్వేదిపై ప్రతి రాజవంశం దృష్టి ఉండేది. అందుకే దాన్ని వశపరచుకోడానికై పల్లవులు, చాళు క్యులు, రాష్ట్రకూటులు, చోళులు, కల్యాణి చాళుక్యులు, విజయనగర రాజులు, బహుమనీ సుల్తానుల సంఘర్షణలు యావద్భారత చరిత్ర లోనే ఆసక్తిదాయకమైనవి. తత్ఫలితంగా ఈ రాజ వంశాలకు యుద్ధ రంగమై ఆంధ్రదేశం అశాంతికి, బాధలకు గురైంది. ఈదండ యాత్రల ద్వారా ద్రావిడులు, కన్నడిగులు, మరాఠీలు (కాయస్థులు), కాళింగులు అధిక సంఖ్యలో ఆంధ్ర దేశానికి వచ్చి నిలిచిపోయినారు. అందుచేతనే భారతజాతిలో వలెనే ఆంధ్రజాతిలో భౌతికమైన వైవిధ్యం కనిపిస్తుంది. ఒకప్పుడు వర్ధిల్లిన ప్రాంతంభారతదేశాన్ని పాలించిన శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, ముఖ్యంగా కృష్ణదేవరాయలు మన వ్యవ సాయ సంస్కృతిని విస్తృతపరిచారు. అంతేగాకుండా మన సంపద బంగారు, వెండి, రాగి ధనాగారాలతో ఎలా వర్ధిల్లిందో చూడండి: విజయనగరంలో బంగారు, వెండి, రాగి నాణేలు అమలులో ఉండేవి. గద్యాణం బంగారు నాణెం. దాన్నే ‘వరాహ’ అనేవారు. ఇది చాళు క్యుల కాలం నుండి వస్తున్న నాణెం. బహుశా వరాహ పదమే ‘వరహా’ అయివుంటుంది.కృష్ణరాయల గద్యాణం 119.7 వడ్ల గింజల ఎత్తు ఉండేది. ఘట్టి వరాహ, దొడ్డ వరాహ అనే ప్రత్యేక గద్యా ణాలు కూడ ఇచ్చేవారు. గద్యాణంలో సగం ‘ప్రతాప’. తరువాతవి ‘పణం’, ‘చిన్నం’. ఇవి అన్నీ బంగారు నాణేలే. ఎక్కువ వాడుకలో ఉన్న నాణెం పణం. ‘తార్’ అనేది వెండి నాణెం. ఇది పణంలో ఆరో వంతు. జిటలు, కాసు అనేవి రాగి నాణాలు. ఇవిగాక రాజ్యం పశ్చిమ ప్రాంతాల్లో పోర్చుగీస్, ఈజిప్షియన్ నాణేలు వాడుకలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనారం ఈజిప్షియన్ నాణెం. ప్రౌఢరాయలు ‘దీనార టంకాల’తో శ్రీనాథుని తీర్థమాడించినాడు. ప్రభుత్వమేగాక రాష్ట్రపాలకులు నగరాధిపతులు (వర్తక శ్రేష్ఠులు) గూడా నాణేలు ముద్రించేవారు. ‘ప్రతి సంస్థానానికీ టంక శాల గుత్త చేసుకొని వారి వారి పేరటను ముద్రలు కల్పించుతూ వచ్చిరి’ అని అట్టవన తంత్రం చెబుతున్నది. నాణేల నాణ్యతను కంసాలులు ఒరపు రాతినుపయోగించి నిర్ణయించేవారు. గ్రామాల్లో దుర్భర పరిస్థితులుఇకపోతే ఇప్పుడున్న ఆంధ్రదేశ పరిస్థితి చరిత్రతో పోల్చుకుని చూస్తే దారుణంగా ఉంది. ముఖ్యంగా గ్రామాలు త్రాగునీరు లేక, సాగునీరు అందక, చివరకు పశుగ్రాసం కూడా అందక విలవిల్లాడు తున్నాయి. ఆంధ్రదేశంలో జీవించే పరిస్థితులు లేక దళితులు, బడుగు వర్గాలు విలవిలలాడుతున్నాయి. ఈ పరిస్థితి కరవును తలపిస్తూ ఉంది. కరవు రాష్ట్రజీవన వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. ప్రధా నంగా గ్రామాల్లో వృద్ధులు అన్నం లేక, గంజి లేక, సూరుల క్రింద ఉసూరుమంటూ జీవిస్తున్నారు. సామాజిక కార్యకర్తలుగా గ్రామాలకు వెళితే గుండెలు తరుక్కు పోయే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని మూడుతాళ్ళ పాడులో దళిత స్త్రీలను ప్రశ్నిస్తే, ‘అన్నం వండుకొని మూడు రోజు లైంది’ అని చెప్పారు.ఒకవేళ అన్నం వండుకున్నా చింతపండు పచ్చడి తప్ప కూర వండుకోలేని దశలో ఉన్నామనీ, ఇటువంటి దయ నీయమైన పరిస్థితి మా జీవిత కాలంలో ఎప్పుడూ చూడలేదనీ వారు అన్నారు. అంటే ఒక కూర వండుకునే పరిస్థితిలో కూడా ఇవ్వాళ్టి గ్రామాలు లేవు. ఈ పరిస్థితుల్లో కూడా భర్తలకు ఏదైనా పని దొరికితే వారు తాగే వస్తున్నారని చెప్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా రోడ్డులోని గోవిందాపురం మాదిగవాడలో కొందరు స్త్రీలతో మాట్లాడితే, కనీసం పని దొరికి వారం రోజులైందనీ, దొరికినా వచ్చే తక్కువ కూలీకి బియ్యం, ఇతర వస్తువులు రాక పస్తులుంటున్నామనీ, తలకు నూనె కూడా పెట్టుకోక నెలలు అయ్యిందనీ, పిల్లలను బడికి పంపలేక పనికి తీసుకెళుతున్నామనీ చెప్పారు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాలలో కూలీ లేక ఊళ్ళకు ఊళ్ళు తరలి వెళ్ళిపోతున్నాయి. వ్యవసాయ కూలీలే కాదు, చేనేత కార్మికులైతే దుర్భర దారిద్య్రంలో ఉన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట దేవాంగులు, పద్మశాలీలు... ఒక్కొక్క ఇంట్లో నాలుగైదు కుటుంబాలు జీవిస్తున్నామనీ, సరైన మజూరు లేక, ఇండ్లస్థలాలు లేక ఎమ్మార్వో చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయామనీ అంటున్నారు. ముఖ్యమంత్రి గారు చేనేతవారికి ప్రకటించిన లోన్లు అడిగితే... ‘ప్రకటనలు అలాగే ఉంటాయి, మాకు ఏమీ ఆర్డర్స్ రాలే’దని చెపుతున్నా రనీ, ఇటువంటి ఆర్థిక దుఃస్థితి మేము గత 30 ఏళ్ళుగా ఎప్పుడూ చూడలేదనీ అంటు న్నారు. విజయవాడలో ఒక బ్రాహ్మణ వీధిలో ఉంటున్న 200 కుటుంబాల్లో కనీసం 50 కుటుంబాలైనా పస్తులు ఉంటా యనీ, పట్టణాలలో పనిలేదనీ, ఇండ్ల స్థలాలు లేవనీ చెప్పారు. పోరాటమే మార్గం!ఆకలికి కులం లేదు. ఆంధ్రప్రదేశ్లో కరవు వలన నిరాసక్తత, నిర్వీర్యత అలుముకొని ఉన్నాయి. అటు పొలం పనులైన నాట్లు, కోతలు, కలుపులు లేవు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పనిచేసు కోవాలంటే, బిల్డింగ్ కట్టే పనులే కాని వ్యవసాయ కూలీ పనులు లేవు. ఆంధ్ర దేశానికి గుండెకాయగా చెబుతున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపల చెరువులు, రొయ్యల చెరువుల వలన వ్యవసాయ పనులు పూర్తిగా మృగ్యమయ్యాయి. పశువుల పరిస్థితి దారుణంగా ఉంది. పశువుల దాహార్తి, పశుగ్రాస లేమి సామాజిక, ఆర్థికవేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఏటా వేసవి సీజన్లో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉన్నా అధికారులు సకాలంలో స్పందించ లేదు. వేసవిలో పశుగ్రాసం కొరత, వాతావరణ పరిస్థితుల కారణంగా పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఎండు గడ్డి, పచ్చగడ్డి సమ పరిమాణంలో అందించడంతోపాటు వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణకు సరైన చర్యలు తీసుకోవాలి. ఇకపోతే ఆంధ్ర రాష్ట్రంలో భూమి ఎందుకు పంచటం లేదనేది, కార్పొరేట్ వ్యవస్థలకే భూమి ఎందుకు చవక రేట్లకు ఇస్తున్నారనేది నగ్న సత్యం. ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి కూలీలు మండుటెండల్లో ఎండుతున్నా వారికి మంచినీళ్ళు లేవు. వారికి కూలీ నెలలు తరబడి ఆపుతున్నారు. వారు దిక్కులేని పక్షుల్లా బతుకుతున్నారు. నిరాశా నిస్పృహలతో ప్రజలు జీవిస్తున్నారు. ఇది మంచిది కాదు. పాలక వర్గాలు రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచించాలి. దేశానికి ఆయువైన గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నిండాలి. రైతులు, రైతు కూలీలు, వృత్తిదారుల ముఖాలలో నవ్వు వికసించాలి. అందుకు పోరాటాలే మార్గం. ప్రజలు చైతన్యవంతులై అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి. దళిత బహుజనులు తమ రాజ్యాంగ హక్కుల కోసం పోరాడినప్పుడే నిజమైన విముక్తి కలుగుతుంది. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ఈ డ్రగ్తో జాగ్రత్త సుమీ! 2 గ్రాములు చాలు
ఈ మధ్య కాలంలో ఓ మహిళా వైద్యురాలు 53 గ్రాముల కొకైన్తో పట్టుబడి వార్తలకెక్కడంతో కొకైన్పై చర్చ మరోసారి బయలుదేరింది. కొకైన్ డోస్ 30 నుంచి 70 మిల్లీగ్రాములు తీసుకుంటే చాలు, రెండు లేదా మూడు నిమిషాల్లో మెదడులో స్వైరకల్పనలు మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది. పోను పోనూ అలవాటు ముదిరితే 1 గ్రాము వరకు ఒకేసారి తీసుకోగలరు.అంతకుమించి 2 గ్రాముల వరకు ఒకేసారి తీసుకుంటే చావు-బ్రతుకుల మధ్య ఉన్నట్లే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతిరోజూ 5 గ్రాముల దాకా విడతలు, విడతలుగా తీసు కునే వారి శరీరంలో అనేక అవయవాలు దెబ్బతింటాయి. కిడ్నీలు, ప్రేవులు, ఊపిరితిత్తులు నాశనమవుతాయి. కేంద్ర నాడీమండల వ్యవస్థ పాడై మానసిక భ్రాంతులు కలగడం, వణుకు రావడం, ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు... ఇలా ఎన్నో రుగ్మతలు వస్తాయి. సాధారణంగా కొకైన్ని ముక్కుతో పీల్చడం, ఇంజెక్ట్ చేసుకోవడం, సిగరెట్లలో పెట్టి కాల్చడం వంటి పద్ధతుల్లో తీసు కుంటారు. తీసుకున్న తర్వాత ఒక్కొక్కరికి రకరకాల తేడాలతో భ్రాంతులు కలుగుతాయి. కోకా ఆకులు నుంచి కొకైన్ని తయారు చేస్తారు. కొలంబియా, పెరూ, బొలీవియా వంటి దేశాల్లో ఈ కోకా పంట విరివిగా పండుతుంది. మొట్టమొదట స్థానికులు అజీర్ణానికి, చురుకుగా ఉండటానికి ఈ ఆకుల్ని మందుగా నమిలేవారు. అయితే జర్మన్ రసాయన శాస్త్రవేత్త అల్బర్ట్ నీమన్ ఒకసారి ఈ ఆకుల్ని నమలగా విచిత్ర అనుభూతి కలిగింది. దాంతో ఆయన కోకా ఆకుల్లో నుంచి రసాన్ని పిండి, దానికి కొన్ని రసాయనాలు కలిపి కొకైన్ అనే తెల్లటి పదార్థాన్ని 1860లో తయారు చేశాడు. ఆ విధంగా ఇప్పుడు మనం చూసే కొకైన్ పుట్టింది.ఒక కిలోగ్రామ్ కొకైన్ తయారు చేయాలంటే వెయ్యి కిలో గ్రాముల కోకా ఆకులు కావాలి. దానికి మరిన్ని రసాయనాలు కలుపుతారు. ప్రపంచంలోని మొత్తం కొకైన్లో 70 శాతం పైగా ఒక్క కొలంబియాలోనే తయారవుతుంది. ఆ తర్వాత స్థానం పెరూ, బొలీవియా దేశాలది. కేవలం ఈ కొకైన్ వల్లనే కొలంబియా దేశం వారానికి 400 మిలియన్ డాలర్లు ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఈ కొకైన్ డ్రగ్ మాఫియా ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించింది. – మూర్తి కేవీవీఎస్ -
ఇండియా ఇంత బలహీనమైనదా?
ఈ మధ్య కాలంలో ప్రపంచం యుద్ధాల భూమిగా మారింది. గత నాలుగేళ్ళుగా ఉక్రెయిన్ – రష్యా యుద్ధం తీవ్ర విధ్వంసానికి దారి తీసింది. ఏడాదిన్నర నుండి ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధం భీకర నష్టానికి కారణమైంది. ఏప్రిల్ 22న అమా యక భారతీయులను కశ్మీర్లో టెర్రరిస్టులు దారుణంగా హత్య చెయ్యడంతో దేశం ఉడికిపోయింది. మే 7న పాక్లోని టెర్రరిస్టు క్యాంపు మీద ఇండియా దాడి చేసింది. అది ఒక మినీ వార్కు దారి తీసింది. అందులో రెండు యుద్ధాలు టెర్రరిస్టులు అమాయక ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడంతో మొదలయ్యాయి. ఒకటి భూభాగ సమస్యగా మొదలైంది.టెర్రరిజంపై యుద్ధాలుగత కొన్ని దశాబ్దాలుగా టెర్రరిస్టులు ప్లాన్ చేసి అమాయక ప్రజలను చంపడంతో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అవి దేశాలను సైతం ధ్వంసం చేయడానికి దారి తీస్తున్నాయి. ఇప్పుడు ఇండియా–పాకిస్తాన్ మధ్య అటువంటి టెర్రరిస్టు దాడి వల్ల నాలుగు రోజులు కాల్పులు జరిగాయి. చివరికి మే 12న విరమణ జరిగింది. అయితే దీన్ని ఇండియా–పాకిస్తాన్ అధికారులు ప్రకటించకముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అదీ యుద్ధం విరమించకపోతే ఈ రెండు దేశాలతో వ్యాపార సంబంధాలు ఉండవని చెప్పాననీ, అందువల్ల వారు వెంటనే ఆపడానికి అంగీకరించారనీ అన్నారు. ఇది చాలా తీవ్రమైన ప్రకటన.అంతేకాదు, ఆ రెండు దేశాలు ఒక తటస్థ ప్రదేశంలో కశ్మీర్ సమస్యను చర్చించి, పరిష్కరించుకోవడానికి అంగీకరించారని కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతటితో ఆగకుండా ఆ రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదాన్ని ఆపానని కూడా అన్నారు. ట్రంప్ ప్రకటనలు పాక్ కంటే ఎక్కువగా ఇండియాను ఇరకాటంలో పెట్టాయి. అయితే పాక్ కూడా ట్రంప్ మధ్యవర్తిత్వానికి పాకులాడి ఎందుకు లొంగిపోయిందని చైనా నిలదీస్తున్నది. చైనా పాకిస్తాన్కు చాలా ఆయుధాలను ఇచ్చిందనేది తెలిసిందే. ఈ నాలుగు రోజుల ఇండియా–పాకిస్తాన్ ఉద్రిక్తతలు... చైనా, యూరప్, అమెరికా ఆయుధాల అమ్మకపు మార్కెట్ బలాబలాలను మార్చేసింది అనే చర్చ ప్రపంచమంతటా జరుగుతోంది.దౌత్య విలువలను మంటగలిపిన ట్రంప్ట్రంప్ భారత ప్రభుత్వానికి దగ్గరి మిత్రుడని బీజేపీ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేపదే చెబుతూ వచ్చారు. కానీ ట్రంప్ రెండోసారి గెలిచాక భారత్ను అవమానపరిచే అనేక ప్రకట నలు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ప్రధాని మోదీ వాషింగ్టన్ పర్యటనలో ఉండగానే మన దేశ పౌరులను అక్రమ వలసదారులు అనే నెపంతో చేతు లకు బేడీలు వేసి, మిలిటరీ విమానంలో చండీగఢ్ విమానాశ్రయంలో వదిలారు.అలాగే ఇండియా–పాక్ రెండు దేశాలనూ అవమానపరిచేలా, ఆయా ప్రభుత్వాలు ప్రజలకు చెప్పకముందే తాను చేయబట్టే యుద్ధం ఆగిపోతోంది అని ట్వీట్ చేశారు. ఇది అన్ని విధాలుగా అంతర్జాతీయ దౌత్య విలువలకూ, యుద్ధ నీతికీ వ్యతిరేకం. ఆయా ప్రభుత్వాలు చెప్పాల్సిన విషయమది. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినా దాన్ని ఆపేందుకు అటు ఐక్యరాజ్యసమితి(యూఎన్ఓ), లేదా ఇతర దేశాలు రాయబారాలు జరిపి రెండు దేశాలనూ ఒప్పించి యుద్ధం ఆగేట్లు చూడటం దౌత్య నీతిలో భాగమే.అందులో ఇండియా–పాక్ న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉన్న దేశాలు కనుక ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధం ఆపాలని చూడటం అవసరం. కానీ మొన్న యూఎన్ఓ ఎక్కడా కనిపించలేదు. అది నిజానికి ఉక్రెయిన్ – రష్యా, ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధాలను ఆపడానికి కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ, ఇండియా–పాక్ ఉద్రిక్తతల సమయంలో దాని ఉనికి కనిపించలేదు. యూరోపియన్ దేశాలు కూడా ఇండియా–పాక్ ఉద్రిక్తతలను ఇజ్రాయెల్–పాలస్తీనా యుద్ధంలాగా ఘోరంగా అమాయక ప్రజలను టెర్రరిస్టులు చంపడంతో మొదలైనా పెద్దగా పట్టించుకోలేదు. రష్యా కూడా బహిరంగంగా ఇండియాకు మద్దతు పలుకలేదు. చైనా, టర్కీ, ఇరాన్... పాకిస్తాన్కు అండగా ఉన్నాయనేది స్పష్టంగానే కనిపించింది.వీటన్నింటినీ మించి యూఎస్, ముఖ్యంగా ట్రంప్ పాత్ర అన్ని యుద్ధ సమయపు దౌత్య విలువలనూ నాశనం చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ కొద్ది రోజుల ముందే ఇండియా వచ్చి మిత్రగానం చేసి ‘ఆ యుద్ధంలో జోక్యం చేసుకోవడం మా పని కా’దన్నాడు. కానీ పాక్కు 2.3 బిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ ద్వారా ఇప్పించారు. పైగా ట్రంప్ కశ్మీర్ను మళ్ళీ చర్చల తెర మీదకి తెచ్చి ఒక తటస్థ స్థలంలో ‘వెయ్యి ఏండ్ల’ సమస్యగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తామనడం, కాల్పుల విరమణను వాణిజ్య లావాదేవీలతో ముడిపెట్టి ప్రకటించడం చూస్తే, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశాన్ని తన డొమినియన్ స్టేట్గా భావిస్తున్నట్టు కనబడుతుంది.ఈ ప్రశ్నలకు జవాబుందా?భారతదేశం నుండి అమెరికా వెళ్ళి చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు వేల కోట్ల రూపాయలు అక్కడ ఫీజులుగా చెల్లిస్తున్నారు. వారికి వర్క్ పర్మిట్లో 3–5 సంవత్సరాల వరకు వీసాలిచ్చి వారినందరినీ ట్రంప్ దిక్కులేని వారిగా చేశారు. అక్కడి నాణ్యత లేని విద్యా సంస్థల్లో కూడా భారతీయ విద్యార్థులు చేరింది ఉద్యోగం ఆశతో! ఒక ప్రభుత్వ కాలంలో నిర్ణయాలు మార్చదల్చుకుంటే రాబోయే విద్యార్థులకు మార్చాలి. కానీ ఆయన గెలిచే నాటికే ఆ దేశంలో ఉన్న విద్యార్థుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. విచిత్రమేమంటే భారత ప్రభుత్వం వీటి మీద అంతర్జాతీయ విధానాలతో, చట్టపరమైన విధానాలతో అమెరికాను నిలదీసింది లేదు.పైగా కాల్పుల విరమణ పేరుతో ట్రంప్ ఈ దేశం పరువు తీశారు. ఇటువంటి డిప్లమాటిక్ ఇమ్మోరాలిటీని ఈ దేశం ఎదిరించలేదా? భారతదేశం ఇంత బలహీనమైనదా? జాతీయవాదం, ఆత్మగౌరవం అని చెప్పే, బలమైన ఆర్థిక వ్యవస్థగా యుద్ధశక్తిగా ఎదుగుతున్నామని చెప్పే బీజేపీ/ఆరెస్సెస్ ట్రంప్కు ఎందుకు భయపడుతున్నాయి? అమెరికా మద్దతు లేకపోతే దేశం బతకలేదు అనే స్థితి ఎందుకొచ్చింది? భారతదేశంలోని పెద్ద వ్యాపారులందరికీ అమెరికన్ ఆర్థిక పెట్టుబడులతో ఉన్న అనుబంధంతో ఈ స్థితి వచ్చిందా? అయినా ఈ సంక్షోభ సమయంలో అమెరికా, ముఖ్యంగా ట్రంప్ పాకిస్తాన్కే ఎక్కువ మేలు చేసినట్టు కనిపించింది కదా! టెర్రరిజాన్ని పోషించే పాక్కు ఇన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయి అంటే అర్థమేమిటి?గత పదేళ్ళుగా బీజేపీ/ఆరెస్సెస్ గ్లోబల్ డిప్లమసీలో మన దేశాన్ని గొప్ప స్థానంలో పెట్టామని చెబుతూ వచ్చాయి కదా! అమెరికాలోని ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు ట్రంప్కు ఎంతో సపోర్టు చేస్తూ వచ్చాయి కదా! మరి ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఏ ఇతర దేశ పౌరుల్నీ మన పౌరుల్లాగా చేతులకు బేడీలు వేసి యుద్ధ విమానాల్లో వెనక్కి పంపలేదే! ఆఖరికి పాక్ అక్రమ వలసదారులకు కూడా ఆ స్థితి వచ్చిన దాఖలాలే లేవే! ఇప్పుడు బీజేపీ/ఆరెస్సెస్ 370 ఆర్టికల్ను రద్దు చేసి కశ్మీర్ను సంపూర్ణంగా దేశంలో విలీనం చేశామని చెబుతుంటే ట్రంప్ ఆ సమస్యను మళ్ళీ ప్రపంచ సమస్య చేశారు కదా! ఇది కూడా ఆరెస్సెస్/బీజేపీ అనుకూల అంశమేనా? ఇది కూడా ఈ దేశ సమగ్రతను కాపాడే చర్చయేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? - ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
మనమంతా ఒక్కటే... శాంతే మార్గం!
పోప్ లియో–14 ఈస్టర్ ఆది వారం రోజు ప్రసంగిస్తూ చెప్పిన ‘మనమంతా ఒక్కటే’ అనే మాటలు ప్రపంచంలో శాంతి నెలకొనడానికి ఆయన ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో తెలియ చేస్తున్నాయి. మే 8న 267వ అగస్టినియన్ పోప్గా, సెయింట్ పీటర్ వారసుడిగా ఎన్నికైన పోప్ లియో మే 18న ఆ సర్వోన్నత చర్చి పదవిని స్వీకరించనున్నారు. రెండు వేల ఏళ్ల క్యాథలిక్ చర్చి చరిత్రలో ఆయన తొలి అమెరికన్ పోప్ కావడం విశేషం. అంతే కాదు ద్వంద్వ పౌరసత్వాలు (అమెరికన్, పెరువియన్) కలిగిన తొలి పోప్ కూడా ఆయనే. పారిశ్రామిక యుగం తొలి నాళ్లలో సామాజిక న్యాయం కోసం, కార్మికుల హక్కుల కోసం గళమెత్తి నిరసన తెలిపిన పోప్ లియో–13 గౌర వార్థం ఆయనకు ‘లియో–14’ అనే పాపల్ పేరు (పోప్ అయ్యాక పెట్టే పేరు) పెట్టారు. ఆయన అసలు పేరు రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివస్ట్.పోప్ లియోది అమెరికాలోని చికాగో. కానీ జీవితంలో ఎక్కువ భాగం పెరూలోని చిక్లాయోలో గడిపారు. పెరువి యన్ జీవనశైలిలో ఆయన మమేకమై వారితో కలిసి పోయారు. కేవలం ఆ భాష నేర్చుకోవడంతోనే ఆగిపో కుండా వారి జీవితాల్లోని పలు పార్శా్వలను పరిశీలించారు. వారి బాధల్నీ, వేదనల్నీ గమనించారు. అణగారిన వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడుతూ మారుమూల పల్లెల్లో సైతం ఆయన ప్రయాణించారు. ఎల్లవేళలా శాంతి, న్యాయం, మతస్వేచ్ఛ, సమానత్వం, దేశభక్తి, మనిషిని మనిషిగా గౌరవించడం వంటి అంశాల కోసం పని చేశారు. అందుకే పెరువియన్లు ఆయనను తమ కొత్త నాయకుడని పిలుస్తారు. ఇక పోప్ పదవిని ఓ అమెరికన్ స్వీకరిస్తాడన్న నమ్మకం చాలా మందికి చాలా కాలంపాటు లేదు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు పోప్ లియో ఆ పదవిలోకి వచ్చి అమెరికన్ల ఆధ్యాత్మిక అంతస్తును పెంచారు.1982లో ప్రీస్ట్గా మారిన పోప్ లియోకు చర్చి చదు వులో పలు డిగ్రీలు ఉన్నాయి. ఇతరుల మాటలు ఆలకించడంలో, వారి అభిప్రాయాలను గౌరవించడంలో పోప్ లియోది అందె వేసిన చెయ్యి. ఈ గుణమే ఆయనను తోటి వారికి, అంతర్జాతీయ నేతలకు దగ్గర చేశాయి. ఆంగ్లం, స్పానిష్, ఇటాలియన్, ఫ్రెంచ్, పోర్చుగీస్ భాషలు అనర్గ ళంగా మాట్లాడగలిగిన పోప్ లియో ఈ బహుభాషలను ఆడంబరం కోసం కాక, ప్రపంచంలోని అనేకులతో నేరుగా సంభాషించి, వారితో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఉపయోగిస్తున్నారు. 2004, 2006లలో రెండుసార్లు లియో భారతదేశాన్ని సందర్శించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ సమయంలో ఆయన ఎటువంటి ప్రత్యేక వసతులూ కోరలేదు. చాలా నిరాడంబరంగా ఉన్నారు. ఆయన పద్ధతి, సామాన్య జీవనశైలి భారతీయులను ఆకట్టుకుంది.పోప్ లియో రాబోయే రోజులలో ఎటువంటి ప్రభావం చూపబోతున్నారో ఆయన వెల్లడి చేస్తున్న భావాల ద్వారా అర్థం చేసుకునేందుకు ప్రపంచం ప్రయత్ని స్తున్నది. ఈస్టర్ ఆదివారం నాడు ఆయన చేసిన తొలి ప్రసంగంలో ‘మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని దేశాధి నేతలను అభ్యర్థిస్తున్నాను’ అన్నారు. ఇప్పటికే రెండు మహా యుద్ధాలను చూసిన ప్రపంచం మరో భారీ యుద్ధా నికి సిద్ధంగా లేదని వివరించారు. తన ముందు పోప్గా ఉన్న ఫ్రాన్సిస్ సందేశమే తన సందేశమని ఆయన పేర్కొన్నారు. గాజాలో శాంతి నెలకొనాలని పిలుపునిచ్చారు. భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని అభి నందించారు. చేతిలో ఆయుధం పెట్టుకొని ఎవరూ ప్రేమను పంచలేరని, యుద్ధాల నిరోధానికి ఐక్యరాజ్య సమితి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. పోప్ లియో తన ప్రసంగంలో సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు దాని వెనకే ఉన్న దుష్పరిణామాల గురించి వివరించడం గమనార్హం. సాంకేతిక పరిజ్ఞానం ఎల్లప్పుడూ బాధ్యతా యుతంగా వ్యవహరించాలనీ, సర్వమానవాళి శ్రేయస్సును కాంక్షించాలనీ అంటున్న ఆయన మాటల్ని బట్టి చూస్తే, ఈ ఏఐ యుగంలో ఆధునిక సాధువులా కనిపిస్తున్నారాయన.ఇటీవల అంతర్జాతీయ మీడియాతో పోప్ లియో మాట్లాడుతూ ‘మీడియాను నియంత్రిస్తే కొంతమేర ప్రజల ఆలోచనా విధానాన్ని నియంత్రించినట్లు అవుతుంది’ అన్నారు. క్రైస్తవులు సార్వజనీన మానవులని పోప్ మాట. అందర్నీ సమానంగా సోదరభావంతో చూడలేనివారు క్రైస్త వులు కారనేది ఆయన మాట.ప్రపంచంలోని అనేక దేశాల మధ్య యుద్ధాలు నడు స్తున్నాయి. దాయాది దేశాల మధ్య సమస్యలు నెల కొన్నాయి. ఇవి ప్రస్తుతం పోప్ ముందున్న సవాళ్లు. తన తొలి ప్రసంగంలోనే శాంతి కోసం ఆయన పడిన తపనను బట్టి తప్పకుండా ఆయన ఈ సమస్యలకు పరిష్కారం చూపుతారని చాలామంది విశ్వసిస్తున్నారు. దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు వారి మధ్య సయో ధ్యను కుదిర్చి, యుద్ధాన్ని నివారించే పెద్దలు ఈ సమాజా నికి చాలా అవసరం. అటువంటివారే పోప్. ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోప్ ఏర్పరిచే శాంతిబాటలకు ఎంతో ప్రాధాన్యం ఉందని అందరూ భావిస్తున్నారు.జహారా బేగం, - వ్యాసకర్త సామాజిక కార్యకర్త, అమెరికా -
వారెన్ బఫెట్ (బిజినెస్ టైకూన్) రాయని డైరీ
వృద్ధాప్యం అన్నది మంచి విషయం కాక పోవచ్చు. అయితే, అంతకంటే కూడా మంచిది కాని విషయం... ఊరికే వృద్ధాప్యాన్ని వెంటేసు కుని తిరగటం! నెరుపో, మరుపో కాదు. తలపు మనవృద్ధాప్యం. వెనక ఇన్నిన్ని జ్ఞాపకాలు ఉన్నాక, ఎన్నెన్ని జన్మలకైనా వృద్ధ కపోతాలు వచ్చి వాలటానికి చోటుంటుందా భుజాల పైన?! 94 ఏళ్ల వయసులోనూ నేనింకా ఆరేళ్ల పిల్లవాడిలా ఔన్సుల కొద్దీ కోకాకోలా తాగుతూ, మెక్డొనాల్డ్స్ నుంచి తెప్పించుకున్న బేకన్, ఇంకా.. చీజ్ బిస్కెట్లు ఇష్టంగా తింటూ ఉంటానంటే నా వయసు ఆరేళ్లన్నట్లా? లేక, తొంభై నాలుగేళ్లన్నట్లా?!‘‘డిసెంబరులో కంపెనీ సీఈవో బాధ్యతల నుండి తప్పుకుంటాను..’’ అని ఈ నెల మొదట్లో ఓమాహాలో జరిగిన ‘బెర్క్షైర్ హాథ్వే’ వార్షిక సమావేశంలో నేను ప్రకటించినప్పుడు కూడా నా వయసు ఆరేళ్లుగానే ఉంది, తొంభై నాలుగేళ్లుగా కాదు! ‘‘మిస్టర్ వారెన్! ఫస్ట్ టైమ్ మీకు ఎప్పుడు అనిపించింది వయసు పైబడినట్లు?’’ అని – వాల్స్ట్రీట్ జర్నల్ నుంచి మిస్ క్యారెన్ లాంగ్లీ!తన వైపు బ్లాంక్గా చూశాను. ప్రపంచంలోని టాప్–10 కంపెనీలలో ఒకటైన 1.08 ట్రిలియన్ డాలర్ల ‘బెర్క్షైర్ హాథ్వే’ గురించి కానీ, నా తర్వాత సీఈవోగా ఉంటారని నేను ప్రకటించిన 62 ఏళ్ల గ్రెగ్ అడెల్ గురించి కానీ అడగటానికి తన దగ్గర ఒక్క ప్రశ్నా లేనట్లుంది! ‘‘లుక్... మిస్ క్యారెన్! ఎవరికైనా ఎలా తెలుస్తుంది ఫలానా తేదీ నుంచి తమకు వయసు పైబడినట్లు! జన్మదినంలా, ఒక వృద్ధాప్య దినం ఎందుకు ఉంటుంది?!’’ అన్నాను... నవ్వుతూ. బహుశా ఈ జర్నలిస్టులు మానవ జీవిత యుగాంతానికి ప్రారంభ సంకేతాలుగా, ఒక కంపెనీ సీఈవో నుండి ఆశిస్తుండేది... అడు గులు తడబడటం, బాడీ బ్యాలెన్ ్స తప్పటం, తూలి పడబోవటం... ఇలాంటివి కావచ్చు.కానీ, అవేవీ అడల్ట్హుడ్ ఆరంభ ఛాయలు కాదు. భుజాల మీది జ్ఞాపకాలు ఒకటొకటిగా మసక ‘జారి’పోతూ ఉంటే, వాటి స్థానంలోకి మెల్లిగా వచ్చి వాలుతుండే మతిమరపులే ఈ ఓపలేని వయో భారాలు. ఓమాహాలో మేముండే చోట బెట్టీ గాలఘార్ అనే అమ్మాయిని గాఢంగా ప్రేమించాన్నేను. అప్పుడు నా వయసు 18 ఏళ్లు. అయితే ఆ అమ్మాయికి అప్పటికే బాయ్ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి నా గుండె బద్దలైపోయింది. ఆ బాయ్ఫ్రెండ్కు రాని విద్య ఏదో కనిపెట్టి, బెట్టీకి దగ్గరయ్యేందుకు ‘యూకలేలీ’ హవాయ్ గిటార్ను ప్లే చేయటం నేర్చుకున్నాను. తను చూస్తూ ఉండగా శ్రావ్యంగా ప్లే చేశాను. బెట్టీ నన్ను మెచ్చుకోలుగా చూసింది కానీ, తన బాయ్ఫ్రెండ్ని మాత్రం విడిచిపెట్టలేదు!ఇంకో జ్ఞాపకం – నా 20 ఏళ్ల వయసప్పుడు నా చెల్లెలి రూమ్మేట్ సూజన్ను పెళ్లి చేసుకుంటానని నేను వెళ్లి ఆమె తండ్రిని అడగటం. ‘‘నా కూతుర్ని పస్తులుంచి చంపే స్తావా ఏంటి నువ్వు!’’ అనేశారాయన!! ఆ వెంటనే మెత్తబడి...‘‘నీ మీద నమ్మకం ఉన్నా ఈ డెమొక్రాట్లు, కమ్యూనిస్టుల మీద నమ్మకం లేదు...’’ అన్నారు. ఆ మాట ఎప్పుడు గుర్తొచ్చినా పెద్దగా నవ్వేస్తుంటాను నేను. తొలినాళ్ల ప్రేమలు, నవ్వులు నూరేళ్లకైనా వయసును మీద పడనివ్వవు. ‘‘మిస్టర్ వారెన్! మిస్టర్ వారెన్! ఎక్కడికి వెళ్లిపోయారు మీరు? గతంలోకా, భవిష్యత్తులోకా?’’ అని నవ్వుతోంది మిస్ క్యారెన్ లాంగ్లీ.‘‘చెప్పండి సర్! ఏజ్ కారణం కాకుంటే మరెందుకు సీఈవోగా స్టెప్ డౌన్ అవాలని అనుకున్నారు?’’ అంటోంది తనింకా! ‘‘న్యూస్ పేపర్స్ చదవటానికి టైమ్ సరిపోవటం లేదు మిస్ క్యారెన్...’’ అని చెబితే ఆశ్చర్యపోనంత వయసు తనకు వచ్చి ఉండొచ్చని నాకైతే అనిపించటం లేదు. న్యూస్ పేపర్సే కాదు, మళ్లీ మళ్లీ అదే పనిగా ‘బ్రేకింగ్ బ్యాడ్’ క్రైమ్ డ్రామా సీరీస్ని చూడాలని కూడా ఉంది నాకు! -
AP: పేదలకు అందని ద్రాక్షగా వైద్య విద్య!
అధికారం అంటే కేవలం రాజకీయ ఆట కాదు – ఇది పేదల జీవితాలను మార్చే, వారి కలలకు ఊపిరి పోసే బాధ్యత. వై.ఎస్. జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ, ‘నవ రత్నాలు’ అనే తొమ్మిది స్తంభాల ద్వారా విద్య, ఆరోగ్యం, సంక్షేమాన్ని ప్రతి ఇంటి గడప వద్దకు చేర్చింది. ఈ పథకాలు పేదలకు సమాజంలో గౌరవం పెంచడమే కాదు... కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాయి. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ వాగ్దానాలను నిధుల కేటాయింపు లేకుండా చేసి వాటిని నీటి మీద రాతలుగా మార్చింది. ముఖ్యంగా వైద్యరంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టి వైద్యాన్ని పేదలకు దూరం చేస్తోంది. ఇందుకు మంచి ఉదాహరణ మెడికల్ కాలేజీలను ‘పబ్లిక్ – ప్రైవేట్ పార్ట్నర్షిప్’ (పీపీపీ) పేరుతో 66 ఏళ్లు ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలనుకోవడం!వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–2024 మధ్య నవరత్నాలను నూటికి నూరుశాతం అమలు పరచి ఏపీలో సుస్థిర సమగ్ర అభివృద్ధిని సాధించింది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో వైఎస్సార్సీపీ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2,485 ఎంబీబీఎస్ సీట్లను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చింది. 2023–24 నాటికి 5 కాలేజీలు ప్రారంభం కాగా, 750 సీట్లు అందు బాటులోకి వచ్చాయి. ‘ప్రతి పార్లమెంటరీ నియో జకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ’ అనే లక్ష్యం స్థాని కంగా నాణ్యమైన వైద్య శిక్షణను నిర్ధారించింది. ‘ఆరోగ్యశ్రీ’ పథకం పేదలకు ఉచిత వైద్య సేవలను అందించి, ఆర్థిక భారం లేకుండా చికిత్సలు అందేలా చేసింది.అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటైజేషన్ విధానం ఏపీలో పేదల ఆశలకు పెను ముప్పుగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలను పీపీపీ మోడల్ కింద ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించడం పేదలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కాలేజీలు ఏటా తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ సీట్లను అందించాయి. పేదలకు వైద్య విద్యను సరసమైనదిగా చేశాయి. కానీ, ప్రైవేటైజేషన్ తర్వాత ఫీజులు కేటగిరీ ఏ (కన్వీనర్ కోటా) సీటు రూ. 5–10 లక్షలు, కేటగిరీ బీ (మేనేజ్మెంట్ కోటా) సీటు రూ. 15–20 లక్షలకు చేరవచ్చని అంచనా. ఒక ఎంబీబీఎస్ కోర్సుకు రూ. 27.5–110 లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు. ఇంత అధిక ఫీజులు పేదలకు వైద్య విద్యను అందని ద్రాక్షగా మారుస్తాయి.ప్రజా ఆరోగ్య వేదిక (పీఏవీ) ఈ ప్రైవేటైజేషన్ 1,500 ఎంబీబీఎస్ సీట్లను ప్రభావితం చేస్తుందనీ, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ విద్యార్థుల రిజర్వేషన్ కోటాను 50% వరకు తగ్గి స్తుందనీ హెచ్చరిస్తోంది. ప్రైవేటు యాజమాన్యాల నిర్వహణలో 50% సీట్లను మార్కెట్ రేట్లతో విక్ర యించుకోవచ్చు, పైగా ప్రభుత్వ కాలేజీల కంటే 10–20 రెట్లు ఎక్కువగా ఫీజులు ఉంటాయి. ఈ చర్య పేదలకు వైద్యవిద్యను పూర్తిగా దూరం చేస్తుందనడంలో సందేహం లేదు. సేవా– ఆధారిత వైద్యుల సంఖ్యను తగ్గిస్తుంది. ఉదాహరణకు, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో హాస్పిటల్స్కు అప్పగించిన తర్వాత సేవల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇదే ధోరణి మెడికల్ కాలేజీల్లోనూ కనిపిస్తే, పేదలకు వైద్య సేవలు అత్యంత ఖరీదైనవిగా మారతాయి.ఈ ప్రైవేటైజేషన్ విధానాన్ని విజయవాడలో 2025 ఏప్రిల్లో జరిగిన పీఏవీ సదస్సు ‘క్రూరం’ అని విమర్శించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతీ నలుగురిలో ఒకరు సరసమైన, నాణ్యమైన వైద్యం అందక ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారనీ, ప్రభుత్వ ప్రైవేటైజేషన్ పాలసీ ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందనీ హెచ్చరించింది. మధ్యప్రదేశ్లో 10 ట్రామా సెంటర్లను ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఖర్చులు 10–20 రెట్లు పెరిగాయి. ఇదే ఆంధ్రలో జరిగితే పేదలు ఉచితంగా పొందాల్సిన వైద్య సేవలను కోల్పోతారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సూపర్–స్పెషాలిటీ ఆసుపత్రులను పీపీపీ మోడ్లో నిర్మించాలనే కూటమి ప్రభుత్వ మరో ప్రణాళిక కూడా ఆరోగ్య రంగాన్ని వాణిజ్యీకరణ వైపు నడిపించనుంది. ఇది ఆరోగ్యశ్రీ వంటి పథకాలను బలహీనపరుస్తుంది. ఈ విధానం ప్రజల ఆరోగ్యం, ఆశల కంటే కార్పొరేట్ లాభా లకు ప్రాధాన్యం ఇస్తుంది.చదవండి: ఎవరి కోసం ఈ ఒప్పందం?ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. సొంత లాభాల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టే విధానాలను మేధావులు, ప్రజాస్వామ్య వాదులు తిరస్కరించాలి.- తలకోల రాహుల్ రెడ్డిసామాజిక ఆర్థిక రంగాల విశ్లేషకుడు -
ఆ రకమైన కులగణన జరపాలి!
కుల గణన డిమాండును మొదటి నుండీ చాలా తీవ్రంగా నిరాకరిస్తూ వస్తున్న బీజేపీ ఇప్పుడు తానే ఆ పని చేస్తాను అంటోంది. ఒకవేళ ఎన్ని కల్లో లబ్ధి కోసమే తన విధా నాన్ని మార్చుకుందను కున్నా సరే ఇది గొప్ప నిర్ణయం. దీనిని అన్ని రాజకీయ పార్టీలు, పౌర సమాజం తప్పక మెచ్చుకోవాలి. అయితే, సామా జిక న్యాయం దిశగా చేసే ప్రయాణంలో కులగణన అనేది తొలి అడుగు మాత్రమే. ఇది ఒక పరికరమే కానీ పరిష్కారం కాదు; సాధనమే కానీ సమా ధానం కాదు. వర్తమాన భారతదేశం ఎదుర్కొంటున్న సామాజిక సంక్షోభాన్ని కొలవడానికీ,అందులోని అపార వైవిధ్యాన్నీ, సంక్లిష్టతను అర్థం చేసుకోవడానికీ కులగణన ఒక్కటే సరిపోదు. రాజకీయ ఆర్థిక, సామాజిక, కుల మత గణన జరగాలి. కులగణన వల్ల దేశంలో ఏ కులస్థులు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది. ప్రభుత్వంలోనో, ప్రభుత్వరంగ సంస్థల్లోనో ఈ కులాలన్నింటికీ ఎంతెంత శాతం రిజర్వేషన్లు కల్పించాలి అన డానికి ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. ప్రభుత్వా నికి నిజాయితీ ఉంటే ఈ కేటాయింపుల్ని వెంటనే అమలు చేయనూవచ్చు.ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్న కులాలే రిజర్వేషన్ అవకాశాలను దక్కించుకోగలుగు తాయనేది అందరికీ తెలిసిన సత్యం. ఇది హిందూ సమాజానికే కాక ముస్లిం సమాజానికి కూడ వర్తిస్తుంది. ఇక ముందు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వంటి అమూర్త, సామూహిక ఉను కులు ఉండవు. చాకలి, సాలె, వడ్రంగి, లద్దాఫ్. నూర్ బాషా, సంబన్, రెల్లి వంటి నిర్దిష్ట కులాలు మాత్రమే ఉంటాయి. ఇటీవల ఎస్సీలను మూడు విభాగాలుగా వర్గీకరించారు. ఇక ముందు ఈ వర్గీకరణ కూడా ఉండదు. ప్రతి కులానికీ వాళ్ళ జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ ఇవ్వాల్సిఉంటుంది.దేశంలో ముస్లిం సమాజం మీద సాగుతున్న వివక్ష మరీ క్రూరంగా తయారయ్యింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ, ఆర్థిక, సాంస్కృతికరంగాల్లో నయా అస్పృశ్యులుగా మార్చేశారు. కొన్ని కీలకమైన ఉద్యోగాలను వారికి నిషే«ధితమైన విగా మార్చారు. వాళ్ళ చేతివృత్తుల్నీ, వ్యాపారా లనూ; ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటోలు వంటి వాటిలో చిరు ఉద్యోగాలను సహితం బహిష్కరించాలంటూ ఏలినవారి కాల్బలం ప్రకటనలు చేస్తు న్నది. రోడ్డు పక్కన జీవనాధారాన్ని ఎంచుకున్న చిరువ్యాపారుల్ని హింసిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తున్నాం. ఉపాధి కల్పనలో ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి సంఖ్య రీత్యా చాలా పరిమితమైనవి. ప్రభుత్వరంగ సంస్థలు క్రమంగా ప్రైవేటుపరం అయిపోతు న్నాయి. అంటే, అక్కడా అవకాశాలు తగ్గిపోతు న్నాయి. అప్పుడు ప్రైవేటు రంగంలోనూ రిజర్వే షన్లు కల్పించాలి అనే డిమాండు సహజంగానే ముందుకు వస్తుంది. దానికి ప్రభుత్వం సిద్ధమా? కార్పొరేట్లను ప్రభుత్వం ఒప్పించ గలుగుతుందా?దేశ సంపద ఏ సమూహాల్లో తగ్గిపోతున్నది, ఏ సమూహాల్లో పోగవుతున్నది అనేది ప్రాణప్రద మైన అంశం. టెలీకమ్యూనికేషన్స్, ఐటీ, రెన్యూవ బుల్ ఎనర్జీ, మౌలికరంగ నిర్మాణాలు, ఇ–కామర్స్, డిజిటల్ ఎకానమీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మా స్యూటికల్, హెల్త్ కేర్, ఆయిల్– గ్యాస్, పెట్రో కెమి కల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, గనులు, సహజ వన రులు, కార్పొరేట్ విద్యా సంస్థలు తదితర రంగాల్లో ఇప్పుడు సంపద సృష్టి అవుతున్నది. వీటి యాజ మాన్యంలో సమస్త కులాలకు స్థానం కల్పిస్తారా? అణగారిన సమూహాలను ఎప్పటిలానే సేవకులుగా కొనసాగించి ప్రాతినిధ్యం కల్పించాం అంటారా? వర్తమాన భారత దేశంలో రెండు పరస్పర విరుద్ధ పరిణామాలు ఒకే సందర్భంలో సాగు తున్నాయి. ఒకవైపు సంపద వేగంగా పెరుగుతోంది; మరోవైపు పేదరికం అంతకన్నా వేగంగా పెరుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా ప్రకారం 2025లో భారత స్థూల జాతీయోత్పత్తి నాలుగున్నర ట్రిలియన్ డాలర్లను మించుతోంది. త్వరలో జర్మనీని అధిగమిస్తుందనే అంచనా ఉంది. ‘ఆక్స్ ఫామ్ సంస్థ ఇటీవల ప్రకటించిన‘ఇండియా రిపోర్టు – 2024’లో దిగ్భ్రాంతి కలిగించే అనేక అంశాలున్నాయి. మొత్తం జాతీయ సంపదలో 77 శాతం ఓ పది శాతం ధనికుల చేతుల్లో ఉందట. 40 శాతం జాతీయ సంపద కేవలం ఒక్క శాతం ధనికుల చేతుల్లో ఉందట. 50 శాతం జనాభాకు జాతీయ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే దక్కుతున్నదట. అంటే పేద రికం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు.సంపద పంపిణీలో అసమానత్వం అత్యధికంగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. విచిత్రం ఏమిటంటే, మన రాజ్యాంగ ఆదర్శాల్లో సామ్య వాదం కూడా ఉంది. 39వఅధికరణం భౌతిక వనరుల పంపిణీలో సమానత్వాన్ని పాటించాలని ఆదేశిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచా లని రాజ్యాంగం అదేశిస్తున్నదంటూ రెండేళ్ళ క్రితం బీజేపీ చాలా హంగామా చేసింది. అటు ఆదే శిక సూత్రాల్లోనేగాక, ప్రధాన ఆదర్శాల్లోనూ ఉన్న సామ్యవాదం గురించి మాత్రం ఆ పార్టీ మాట్లాడడం లేదు.-డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
‘అదిగో పులి... ఇదిగో తోక’..ఎంత రెచ్చగొడితే అంత!
గత వారం ఘటనలూ, పరిణామాలూ చూస్తే ‘అదిగో పులి... ఇదిగో తోక’ సామెత గుర్తుకొస్తోంది. విహారయాత్రలకు వెళ్లిన వారిని ఊచకోత కోసిన దుర్మార్గం ఎవరైనా ఖండించవలసినది, కన్నీరు కార్చవలసినది. నేరస్థులను పట్టుకుని, విచారించి, కఠినంగా శిక్షించమని కోరవలసినది. ఆ దుర్మార్గానికి కారకులైన వారిని పొరుగుదేశం ప్రోత్సహిస్తున్నదని, బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం ఆ దేశంలోని ‘టెర్రరిస్టుల స్థావరాలు’ అని అనుమానం ఉన్నచోట్ల దాడి చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం డ్రోన్లతో ఎదురుదాడులు చేసింది. స్వయంగా భారత ప్రభుత్వ అధికారులే అది యుద్ధం కాదని ఎన్నోసార్లు అన్నారు. కాని లేని పులికి తోకలు వెతికి, తాము చూశామని ప్రచారం చేసి అమాయకులను నమ్మించేందుకు అనేకమంది వీరంగం వేశారు. అందులో బాధ్యతాయుతంగా ఉండవలసిన నాలుగో స్తంభమూ ఉంది. వ్యక్తులుగానూ, బృందాలుగానూ... భావజాల ప్రోత్సాహపు ఐటీ సెల్స్ ఉన్నాయి. సున్నిత సందర్భంలో టీవీ ఛానళ్లూ, యూట్యూబ్, వాట్సప్, ఫేస్ బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలూ గత వారంలో కోట్లాది అబద్ధాలను వండి వార్చాయి. టీవీ ఛానళ్లు వార్తా, విశ్లేషణా ప్రసార వేదికలు గనుక అక్కడ చెప్పే చిన్నపాటి అబద్ధమైనా, అర్ధసత్యమైనా బహుగుణీకృతమై ప్రచారంలోకి వస్తుంది. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ అవకాశాన్ని తప్పని సరిగా బాధ్యతాయుతంగా వాడాలి. కాని భారత ప్రధాన స్రవంతి ఛానళ్లన్నీ బాధ్యతా రాహిత్యంలో అవధులు దాటాయి. ‘ఆజ్ తక్’ లాహోర్ను స్వాధీనం చేసుకుంది, ‘జీన్యూస్’ కరాచీని పట్టుకుంది. రిపబ్లిక్ టీవీ న్యూయార్క్ను స్వాధీనం చేసుకుంది. ఉదయానికల్లా వాళ్లు అన్నీ వెనక్కి ఇచ్చేశారు, మళ్లీ రాత్రి స్వాధీనం చేసు కోవడానికి!’ అని మే 9 రాత్రి సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి మార్కండేయ ఖట్జూ చేసిన వ్యంగ్య ట్వీట్ పరిస్థితి ఎంత చేజారిందో చూపుతుంది. ఆ ట్వీట్లో ఆయన మూడు ఛానళ్ల పేర్లే ప్రస్తావించారు గాని, ఎటువంటి మినహాయింపు లేకుండా దాదాపు అన్ని ఛానళ్ల రిపోర్టర్లూ,యాంకర్లూ పోటీ పడి తామే స్వయంగా యుద్ధ క్షేత్రంలో ఉన్నట్టు, తమ ముందరే బాంబు దాడులు, వైమానిక దాడులు, డ్రోన్ దాడులు జరుగుతున్నట్టు అభినయించారు. తమ పని నిష్పక్షపాతంగా, వస్తుగతంగా, తటస్థంగా ప్రజలకు వార్తలు చెప్పడం మాత్రమే అనేది మరిచిపోయి, తామే ఒక పక్షం తీసుకుని, వార్తలు వండి వార్చారు. కేకలూ పెడబొబ్బలూ పెట్టారు. ప్రాంతీయ భాషా ఛానళ్లు, పత్రికలు కూడా ఆ టీవీ ఛానళ్లనూ సామాజిక మాధ్య మాలలో ఉద్దేశపూర్వకంగా వెలువడిన అబద్ధాలనూ అనుసరించాయి. మొత్తం మీద సత్యం కనబడకుండా పోయింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సత్యం మీద పొగమంచు కమ్మే మాట నిజమే. కాని వార్తామాధ్యమాల పని ఆ పొగమంచును చెదరగొట్టడం! దాన్ని పెంచడం కాదు! కాని సత్యం మీద పొగమంచు కమ్మే పని, నేరుగా అబద్ధాలు ప్రచారం చేసే పని సరిహద్దుకు అవతలా, ఇవతలా... ప్రచార మాధ్యమాలూ, సామాజిక మాధ్య మాలూ శాయశక్తులా చేశాయి. ఆశ్చర్యమేమంటే, ఈ అబద్ధాల కాలపరిమితి కొన్ని గంటలు మాత్రమే. ఎందుకంటే, ఇక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పినా కొన్ని గంటల్లోనే నిజమేమిటో ప్రభుత్వం అధికా రికంగా ప్రకటిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం చెప్పేది కూడా పూర్తి నిజం కాదనుకుంటే అంతర్జాతీయ ప్రచార మాధ్య మాలు చూసే సాంకేతికత అందుబాటులో ఉంది. ఇవాళ్టి సమాచార విస్ఫోటనంలో దేశదేశాల రక్షణ వ్యవహారాల నిపుణులు ఆ యా ఘటనల మీద నిమిషాల్లోనే తమ విశ్లేషణ వినిపిస్తున్నారు. అంటే జర్నలిస్టులమని చెప్పుకునే ఆర్ణబ్ గోస్వామి వంటివారు ఎన్ని అరుపులు అరిచినా కొన్ని గంటల్లో అబద్ధాలని రుజువైపోయే అవకా శాలున్నాయి. నిజాలు చెప్పే, అంతర్జాతీయ తటస్థ వార్తలు పునర్ము ద్రించే వెబ్సైట్ల మీద ఆంక్షలు విధించిన ప్రభుత్వం, ఈ అబద్ధాల దుమారాన్ని మాత్రం యథావిధిగా సాగనిచ్చింది. ఈ అబద్ధాలు, అర్ధసత్యాలు ఒక ఎత్తయితే... కనీస మర్యాద, సభ్యత లేకుండా సంబంధం లేని వారిని లాగడం, తిట్లూ, దుర్భాషలూ కురిపించడం విపరీతంగా జరిగాయి. యుద్ధం వద్దన్నవారి మీద, శాంతి వాక్యాలు చెప్పినవారి మీద ద్వేషం వెదజల్లడం జరిగింది. ఈ పరిణామం ఎంత దూరం పోయిందంటే... రిపబ్లిక్ ఛానల్కు సలహాదారుగా ఉన్న మేజర్ (రిటైర్డ్) గౌరవ్ ఆర్య... తన సొంత యూట్యూబ్ ఛానల్లో చేసిన వ్యాఖ్యలతో భారత ప్రభుత్వం దౌత్యస్థాయిలో క్షమాప ణలు చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చిని సువ్వర్ (పంది) అనీ, సువ్వర్ కె ఔలాద్ (పంది సంతానం) అనీ అసభ్య కరమైన మాటలెన్నో అన్నాడు. అక్కడ ఆయన చూపిన కారణం – ఇరాన్ మంత్రి భారత పర్యటనకు ముందు పాకిస్తాన్ పర్యటన చేశారని! ఆ వీడియో ఇరాన్లో కూడా వైరల్ అయి, న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యా లయం ‘అతిథులను గౌరవించడం ఇరానియన్ సంస్కృతిలో చిరకాల సంప్రదాయం. ఇరానియన్లం అతిథులను దైవానికి ప్రియమైనవారిగా భావిస్తాం. మరి మీరో?’ అని ట్వీట్ చేయగా, భారత ప్రభుత్వం అది ‘ఒక ప్రైవేటు భారత పౌరుడి’ అభిప్రాయం అనీ, తమకు దానితోసంబంధం లేదనీ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. మర్నాడే ఆ ఇరాన్ మంత్రి భారత్కు కూడా వచ్చి ఎన్నో ద్వైపాక్షిక, వాణిజ్య ఒప్పందాల మీద సంతకాలు చేశారు! అలాగే, ఇరుదేశాల సైనికాధిపతులు కాల్పుల విరమ ణకు అంగీకరించారనే వార్త ప్రకటించినందుకు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద బూతులు కురిపించారు. అటువంటి దాడులకు గురైనవారు మరెందరో ఉన్నారు. యుద్ధంలో మొట్టమొదట మరణించేది సత్యం అంటారు. ప్రస్తుత సత్యానంతర యుగంలో మరణించడాని కైనా, సజీవంగా ఉండడానికైనా సత్యానికి స్థానమే లేదు. భావోద్వేగాలదీ, మనోభావాలదీ మాత్రమే రాజ్యం! ఎంత రెచ్చగొడితే అంత వ్యాపారం, అంత జనాకర్షణ!!-ఎన్ వేణుగోపాల్ వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్ -
దేశవ్యాప్తంగా న్యాయ ‘కొరత’
ప్రతి వ్యవస్థనూ – అది సాధించాల్సిన ఫలి తాలు సాధించేలా – పరిపూర్ణంగా రూపొందిస్తారు. మరి భారత న్యాయ వ్యవస్థ మాటే మిటి? పనితీరులో వెనుకబాటుతనం, అసమానత్వం, జాప్యం... ఇవేనా దీని నుంచి మనం ఆశించిన ఫలితాలు? ఇటీవలే ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025’ వెలువడింది. 18 పెద్ద రాష్ట్రాలు, 7 చిన్న రాష్ట్రాల్లో ప్రజలకు న్యాయం ఎలా అందు తోందో ఇది అద్దం పడుతోంది. పాత నివేదికల మాదిరిగానే ఇది కూడా పోలీసు, జ్యుడీషియరీ, జైళ్లు, న్యాయ సహాయం గురించి విపులంగా చర్చించింది. ఆ యా రంగాల్లో వ్యవస్థాగత సామర్థ్యాలు తగిన స్థాయిలో లేవనీ, వాటిని పెంచుకోవలసి ఉందనీ ఈ నివేదిక తేల్చింది. అనేక మందికి ఈ వ్యవస్థ అందుబాటులో ఉండటం లేదు. తను చేయగలిగినంతా చేస్తోంది. అయినా అత్యవసర న్యాయ సేవను అవసరమైన స్థాయిలో అందించలేక పోతోంది. సిబ్బంది కొరతతో న్యాయంలో లోటురాష్ట్ర బడ్జెట్ల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. జస్టిస్ సిస్టమ్కు తగినన్ని నిధుల కేటాయింపు జరగటం లేదు. కేటాయింపుల్లోసింహభాగం జీతాలకే పోతుంది. మౌలిక సదుపాయాలు, పరిక రాలు, నైపుణ్యాల పెంపునకు మిగిలే నిధులు అంతంత మాత్రమే. రాష్ట్రాల జీడీపీలు పెరిగిన సందర్భాల్లోనూ, ఏవో కొన్ని రాష్ట్రాలు మాత్రమే అదే నిష్పత్తిలో జ్యుడీషియరీకి నిధులు పెంచుతున్నాయి. న్యాయ వ్యవస్థలు మొత్తం మీద 25 శాతం సిబ్బంది కొరత ఎదుర్కొంటున్నాయి. హైకోర్టు జడ్జీలలో 31 శాతం, పోలీసుయంత్రాంగంలో 22 శాతం, జైళ్ల శాఖలో 33 శాతం ఖాళీలు భర్తీ చేయ కుండా పడున్నాయి. పోలీసు స్టేషన్ పర్యవేక్షణలో ఉండే జనాభా, ప్రాంతం చాలా ఎక్కువగా ఉండటం మరో సమస్య. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లు తక్కువగా ఉంటున్నాయి.దీంతో గ్రామీణులకు న్యాయ పరిష్కారాల లభ్యత తగ్గిపోతోంది. సివిల్ పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నప్పటికీ, నిరంతరం ఖాళీలు ఉంటూనే ఉన్నాయి. దీంతో ఈ వ్యవస్థా కుంటినడక నడు స్తోంది. జాతీయస్థాయిలో ప్రతి అయిదు పోస్టుల్లో ఒకటి ఖాళీగాఉంటోంది. అంటే 5,00,000 మందిని నియమించాల్సి ఉంది. జనాభా–పోలీసు నిష్పత్తి అతి తక్కువగా ఉండే ప్రపంచ దేశాల్లోఇండియా ఒకటి. మన పోలీసు దళాల్లో 80 శాతం మంది కానిస్టేబుళ్లు ఉంటారు. సూపర్వైజరీ, టెక్నికల్ విభాగాల్లో 35 శాతం ఖాళీలుఉండటంలో పర్యవేక్షణ అధికారులు తక్కువ అవుతున్నారు. నియామక ప్రక్రియ లోపభూయిష్ఠంగా ఉండటం వాస్తవం. ఎప్పుడు ప్రకటన వెలువడుతుందో తెలియదు. చివరకు ప్రకటన వెలువడినా నియామకాలు పూర్తి కావడానికి రెండేళ్లకు పైగా పడుతోంది. దీంతో శిక్షణ సంస్థల మీద భారం పెరిగి శిక్షణ ప్రక్రియ తూతూ మంత్రంగా సాగుతోంది. సిబ్బంది సరైన అవగాహన లేకుండానే విధుల్లోకి వస్తున్నారు. ఇది ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తోంది. శిక్షణ సంస్థలకు నిధుల కొరత కూడా ఉంది. పోలీసు బడ్జెట్లో కేవలం 1 శాతమే వీటికి దక్కుతోంది. సిబ్బంది వైఫల్యాలకు అధికారులు వీటిని సాకులుగా చూపిస్తున్నారు. న్యాయలోపానికి వారు ఇలా కార ణాలు చూపించే వీల్లేదు. ఇది ప్రమాదకరమైన సమస్య. ఇది విధాన పరమైన వైఫల్యాలకూ దోషులు శిక్షలు పడకుండా తప్పించు కోవడానికీ దారితీస్తుంది.పెండింగ్ కేసుల గుట్టఇక జ్యుడీషియల్ వ్యవస్థలో 5 కోట్లకు పైగా పెండింగు కేసులు మూలుగుతున్నాయి. జనాభాలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 15 మంది జడ్జీలు ఉన్నారు. 40 ఏళ్ల క్రితమే 50 మంది ఉండాలని సిఫారసు చేసినా, మంజూరైన 21 పోస్టులు కూడా భర్తీ కావడం లేదు. ప్రతి హైకోర్టు న్యాయమూర్తీ 7,000కి పైగా కేసులు పరిష్కరించాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. దిగువ కోర్టుల్లో ఈ సంఖ్య 2,200. ఈ నేపథ్యంలో అపరిష్కృత వ్యాజ్యాల సంఖ్య త్వరలోనే 6 కోట్లకు చేరుకోబోతోంది. పర్యవసానంగా, జైళ్లు కిక్కిరిసి పోతున్నాయి. బెయిలు మంజూ రుపై సుప్రీం మార్గదర్శకాలతో పాటు, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీలు, డిఫెన్సు కౌన్సెల్ స్కీములు, బెయిలుకు ప్రభుత్వ నిధులు, జైలువారీగా లీగల్ క్లినిక్స్, వేల కొద్దీ న్యాయ సహాయ లాయర్లువంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నప్పటికీ... పదేళ్లలో ఖైదీల రద్దీ 18 నుంచి 30 శాతానికి పెరిగింది. 1,330 జైళ్లు ఉండగా, 90 కారాగారాల్లో సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ఖైదీలు కిటకిటలాడుతున్నారు. ఉత్తర ప్రదేశ్లోని మురాదాబాద్ వంటి కొన్ని చెరసాలల్లో ఉండ వలసిన వారి కంటే నాలుగు రెట్ల మంది ఉంటున్నారు. సుప్రీం కోర్టుకు సమర్పించిన ఒక నివేదిక ప్రకారం, 40 శాతం మందికి నిద్ర పోవాలంటే కూడా స్థలం కరవే! ఖైదీలలో సుమారు మూడో వంతు మందే దోషులుగా శిక్ష అనుభవిస్తున్నవారు... మిగిలినవారుఅందరూ విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలే! వీరిలో అత్యధికులు అట్టడుగు వర్గాల వారు. పేదరికం ఇక్కడ నిజమైన నేరం. ఆహ్వానించదగిన మార్పులుఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, కొన్ని సానుకూల అంశాలు కూడా లేకపోలేదు. బడ్జెట్లు పెరుగుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్స్ను ఆధునికంగా మార్చుతున్నారు. టెక్నాలజీ వినియోగంలోకి వస్తోంది. ఢిల్లీ డిజిటల్ వ్యాజ్య నిర్వహణ విధానం, తెలంగాణ ఇ–ప్రిజన్ సిస్టమ్స్, మహారాష్ట్ర ఏఐ ఆధారిత లీగల్ ఎయిడ్ చాట్ బాట్స్, తమిళనాడు పోలీసు స్టేషన్లలో మెరుగైన సీసీటీవీ కవరేజీ ఇందుకు ఉదాహరణలు. బిహార్ పోలీసు దళాల్లో స్త్రీల వాటా 24 శాతానికి పెరిగింది. సబార్డినేట్ కోర్టు జడ్జీల్లో మహిళలు 38 శాతానికి పెరిగారు. అయితే, హైకోర్టుల్లో ఇది 14 శాతం మాత్రమే! ప్రప్రథమంగా, ఛత్తీస్గఢ్ పోలీసులు, జైలు సిబ్బందిలో ట్రా¯Œ ్సజెండర్ల గణన అధికారికంగా చేపట్టారు. కేరళ ప్రభుత్వం కోర్టు రూములు దివ్యాంగులకు అను కూల రీతిలో ఉండేలా చర్యలు చేపట్టింది.ఆ యా కులాల ప్రాతినిధ్యం కూడా పెరుగుతోంది. వాణిజ్య వివాదాల్లో మధ్యవర్తిత్వ విధానాన్ని గుజరాత్ ప్రాచుర్యంలోకితెస్తోంది. కోర్టుల్లో రద్దీ తగ్గించడానికి వీలుగా సైబర్ క్రైమ్ యూనిట్లు, పోక్సో, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వంటి ప్రత్యేక సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి.సంస్థలు బలహీనంగా ఉన్నా వ్యక్తిగత చొరవ సత్ఫలితాలు ఇస్తుంది. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక శ్రద్ధ వహించి జైళ్ల ఆక్యుపెన్సీ రేటును 91 నుంచి 83 శాతానికి తగ్గించి, ఖైదీలకు వసతి సదుపాయం పెంచగలిగారు. అలాగే అధికారుల ఖాళీలను 46 శాతం నుంచి 14 శాతానికి తగ్గించారు. సంకల్పంఉంటే మార్గం ఉంటుంది. న్యాయం అనేది మాటలకే పరిమితమైన ఒక ఉన్నత ఆదర్శం కాదు. అది సాధించగలిగిన లక్ష్యం. దాన్ని అందించే బాధ్యత ప్రభు త్వాల మీద, కోర్టుల మీద ఉంది. మనం చట్టబద్ధ ప్రజాస్వామ్యంలో కొనసాగాలంటే, ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ నిరంతర ప్రాతిపదికన న్యాయం అందాలి. -వ్యాసకర్త ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్’ చీఫ్ ఎడిటర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-మాజాదారూవాలా -
తేలని తెలంగాణ బీజేపీ గమనం
కాంగ్రెస్ను ‘కప్పల తక్కెడ’ అని విమర్శించే బీజేపీ (BJP), తెలంగాణ (Telangana) విభాగం పార్టీ అంతర్గత వివాదాల్లో కాంగ్రెస్ను మించింది. కమలంలో ఎన్ని పువ్వు రేఖలున్నాయో అంత కన్నా ఎక్కువ గ్రూపులున్నా యని పార్టీ వర్గాలే నర్మగర్భ వ్యాఖ్య చేస్తాయి. రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేని పరిస్థితి! ఉన్న ఎని మిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో... అత్యధికులు పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానానికి పోటీ పడేవారే! వీరిలో ఒకరంటే మరొకరికి పడదు.పార్టీ జాతీయ బాధ్యులు కుదించిన రెండు, మూడు పేర్ల జాబితాల్ని అధిష్ఠానానికి సమర్పించినట్టు సమాచారం. పోయినసారి ఎన్నికల్లోనే వెనుకబడిన వర్గాల (బీసీ) వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ నాయకత్వం, అదే ఒరవడిలో బలమైన బీసీ సామా జికవర్గాలను మచ్చిక చేసుకునే ‘సోషల్ ఇంజినీరింగ్’కు యత్నిస్తోంది. ముది రాజ్, మున్నూరు కాపు (బీసీ), మాదిగ (ఎస్సీ) సామాజికవర్గాలకు ప్రాధాన్యంతో ‘త్రీ–ఎమ్ ఫార్ములా’ను ముందుకు తోస్తోంది. మల్కాజ్గిరిఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ (కరీంనగర్) పేర్లను అధినాయకత్వం సీరి యస్గా పరిశీలిస్తోందని అంటున్నారు. ఒకరు ముది రాజ్ సామాజికవర్గానికి చెందితే మరొకరు మున్నూరు కాపు సామాజికవర్గం వారు. బండి సంజయ్ ఇది వరకు అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్నందున ఈటల రాజేందర్ వైపు అధినాయకత్వం కొంత మొగ్గింది. పార్టీలో తరచూ రగిలే పాత (తొలి నుంచి పార్టీలో ఉన్న), కొత్త (ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన) నాయకుల మధ్య ఉండే స్పర్థ ఒక అడ్డంకిగా మారింది. పార్టీ పాత నాయకులు పలువురు ఈ ఆలోచనను వ్యతిరేకించారు. దానికి తోడు పార్టీ నియమావళి ప్రకారం పదిసార్లకు తగ్గకుండా సాధా రణ సభ్యుడిగా, కనీసం మూడు పర్యాయాలు క్రియా శీల సభ్యుడిగా ఉన్న వారిని మాత్రమే అధ్యక్షుడిగా నియమించాలని ఉంది. తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్య క్షుడిగా అన్నామలైని నియమించే విషయంలో లోగడ ఇటువంటి అడ్డంకే వచ్చింది. ఆయన 2017లో ఏఐఏడీఎంకే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు. పార్టీ నియమావళిని సడలించడం, పాత నాయకులకు నచ్చ జెప్పడం ద్వారా అధిష్ఠానం ఒక నిర్ణయం చేయవచ్చు. అలా చేస్తుందా? అన్నది ప్రశ్న. పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ (సంస్థా గత వ్యవహారాలు), సునీల్ బన్సల్ (రాష్ట్ర ఇంచార్జీ) వారివైన నివేదికలు పై వారికి (మోదీ–షా ద్వయం) ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, ఒక్క రాష్ట్రాధ్యక్ష ఎన్నిక మినహా దాదాపు పూర్తయింది. మండల, జిల్లా స్థాయి అధ్యక్షులు ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షులు ఎన్నికై రెండు, మూడు మాసాలవుతున్నా... రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో ముడివడి ఉండటం వల్ల జిల్లా కమిటీలు ఏర్పాటు కాలేదు.మండల స్థాయి కమిటీలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాటు కావాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితేనే సంస్థా గతంగా బలోపేతం చేసి, గ్రామ స్థాయి వరకు పార్టీని పటిçష్ఠపరచి, స్థానిక సంస్థలకు సమాయత్తం చేయడా నికి వీలవుతుంది. అన్ని స్థాయిల్లో మూడోవంతు మహిళలుండాలి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమి టీల్లోనూ ‘త్రీ ఎమ్ ఫార్ములా’కు ప్రాధాన్యం ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రాధ్యక్ష నియామకపు చిక్కుముడి వీడితే ఈ అన్నీ ఓ కొలిక్కివస్తాయి.అంచనాల స్థాయిలో బీఆర్ఎస్ రాష్ట్రంలో పుంజు కోవట్లేదని భావిస్తున్న బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని భావిస్తున్నాయి. నిజంగానే ప్రజలు ఆ దిశలో ఆలోచించినా... ఆ పరిస్థితిని సానుకూలంగా మలచుకునే స్థితిలో పార్టీ లేదని బీజేపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ‘త్రీ ఎమ్ ఫార్ములా’లో భాగమైన మాదిగలను ఆకట్టుకో వడానికి గత ఎన్నికల్లోనే మంద కృష్ణ మాది గను అక్కున చేర్చుకొని ప్రధాని మోదీ ఎస్సీ వర్గీక రణకు సానుకూలత ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా, సదరు బాధ్యతను రాష్ట్రాలకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయించడం, రాష్ట్రంలో ఆ మేర చట్టం తీసుకురావడం జరిగిపోయాయి.పార్టీని గెలిపిస్తే బీసీని సీఎంగా చేస్తామని ఎన్ని కల ప్రకటన చేస్తూ, సరిగ్గా ఎన్నికల ముందు బీసీ రాష్ట్రాధ్యక్షుడిని కారణం చెప్పకుండా అధిష్ఠానం పక్కకు తప్పించడాన్ని ఇప్పటికీ తప్పుబట్టేవారు పార్టీలో ఉన్నారు. అదే సమయంలో, నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీని నివారించి బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేసి, ఏడాది తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో ముఖాముఖి తలపడి ఆధిక్యత తీసుకోవడం పార్టీ వ్యూహమని,అందుకే అలా చేశారని చెప్పేవాళ్లూ ఉన్నారు. వ్యూహాలు ఎత్తుగడల సంగతెలా ఉన్నా... ఢిల్లీ నాయ కత్వం స్థాయిలో రాష్ట్ర పార్టీ పని చేయటం లేదనే భావన బలంగా ఉంది. పార్లమెంటు కమిటీ హాలులో ప్రత్యేక సమావేశం పెట్టి ప్రధాని మోదీ మందలించిన తర్వాత రాష్ట్ర ఇంచార్జీ బన్సల్ మందలించింది కూడా అందుకే! ‘గోడమీద రాతల నుంచి చిన్న పోస్టర్ అతికించడం వరకు... అన్నీ డబ్బుమయం అయిపోయాయి తప్ప తెలంగాణలో ఆశించన ఫలితాలు రావట్లేద’ని ఆయన మండిపడటం వెనుక ఎంత నిజముందో పార్టీ రాష్ట్ర నాయకత్వం బేరీజు వేసుకోవాలి.-దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ -
రాజుగారి పీచుమామిడి.. కోటలోనే లభ్యం
వేసవి అంటే మామిడిపళ్ళ సీజన్.. నూజివీడు రసాలు.. బంగినపల్లి.. చిత్తూరు మామిడి.. కొబ్బరంటు.... చేరుకురసాలు.. సువర్ణ రేఖ.. ఇలా ఎన్నో రకాలు మననోరూరిస్తుంటాయి. ఒక్కో రకానికి ఒక్కో ఫ్లేవర్.. ఒక్కో రుచి ఒక్కో ప్రాంతానికి ఒక్కో మామిడి రకాలతో అనుబంధం.. వాటి పేరుతోనే ఆ ప్రాంతానికి సైతం ఒక గుర్తింపు.. ప్రాచుర్యం కూడా వస్తుంది.. అలాగే విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాజుల సంస్థానానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మామిడి రకం ఉంది.. అది ఆ సంస్థానం వారి సొంత బ్రాండ్. వారి పెరట్లోనే కాస్తాయి.. వారి తోటల్లోనే కాస్తాయి.. వారు ఇస్తేనే తినాలి.. బయట ఎక్కడా దొరకదు.వాస్తవానికి ఈ బొబ్బిలి .. మెట్టవలస అనేది బొబ్బిలి సంస్థానం పాలకుల సొంత బ్రాండ్. అది ఆ వీరబొబ్బిలి కోట పరిసరాల్లో తప్ప ఇంకెక్కడా పండేది కాదు, ఆ మొక్కలు ఇంకెక్కడా లేవు కూడా. దీంతో ఆ మామిడి పళ్ళను బొబ్బిలి రాజులు తమ ఆంతరంగికులు, ఆత్మీయులు, అభిమానులకు కానుకగా ఆ పళ్ళను పంపేవారు. ఏటా రాజుల చేతులమీదుగా పళ్ళను శ్వీకరించడాన్ని ఆనందంగాను, గౌరవంగాను భావించేవారు. అందుకే ఆ పళ్ళ ప్రాశస్త్యాన్ని, బ్రాండ్ వాల్యూను గుర్తించడంతోబాటు రాజుల పట్ల అమితమైన ప్రేమ, గౌరవం కలిగిన వారంతా ఆ పళ్ళను తినేసి మళ్ళీ ఆ టెంకలను కోట పరిసరాల్లో పడేసేవారట. దీంతో ఆ పళ్ళు వేరే ఎక్కడ ఆభ్యమయ్యేవికాదన్నమాట. మొత్తానికి కొన్ని దశాబ్దాల తరువాత బొబ్బిలి సంస్థనాధీశులు తమకు ఆత్మీయులైన కొందరు రైతులకు ఆ మొక్కలు ఇవ్వడంతోబాటు మొక్కలకు అంట్లు కట్టడం నేర్పించి ఆ మామిడి పలుచోట్ల కాసేలా, పళ్లు అందరికి లభ్యమయ్యేలా ప్రోత్సహించారు. దీంతో ఆ బ్రాండ్ కాస్తా బయటి సమాజంలోకి వచ్చింది. ఇప్పుడు పలుచోట్ల ఆ పీచుమామిడి చెట్లు మధురఫలాలను ఇస్తున్నాయి. ఏదేమైనప్పటికి ఇప్పటికి మెట్టవలస పీచు రసాలు అంటే బొబ్బిలి రాజుల బ్రాండ్ అనేది ఫిక్స్ అయిపోయింది. నన్ను గుర్తుంచుకుని నాకోసం బుట్టెడు పళ్ళను కానుకగా పంపిన మా అన్నగారు బేబీ నాయిన గారికి ధన్యవాదాలు. రుచిలోను, మధుర్యంలోను దేశంలోని వేరే ఏ గొప్ప మామిడి బ్రాండ్ కు తీసిపోనివి ఈ బొబ్బిలి మెట్టవలస రసాలు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. బంగినపల్లి, సువర్ణ రేఖ మాదిరిగా కాకుండా ఈ పీచుమామిడి టెంకకు పీచు అధికంగా ఉంటుంది. రసాన్ని పీల్చేకొద్దీ ఊరుతూనే ఉంటుంది. అందుకే ఎన్ని తిన్నా ఇంకోటి..ఇంకోటి అనేలా ఉంటాయి.. -
ఎవరి కోసం ఈ ఒప్పందం?
చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ విధానాలతో ముందుకు పోతున్నది. పోర్టులను, మెడికల్ కాలేజీలను, విద్య, వైద్యం వంటివాటిని ప్రైవేట్ పరం చేయనుంది. తాజాగా నిత్యం అవసరంగా ఉన్న కరెంట్ను కూడా ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడుతున్నది. అందులో భాగమే ‘యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్’తో విద్యుత్ కొనుగోళ్ల గురించి చేసుకున్న ఒప్పందం. 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించి, వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ 25 సంవత్సరాల పాటు యూనిట్కు 4.60 రూపాయల చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. ధర తగ్గించేందుకు వీలు లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్’ షరతు విధించారు.ఇంతకు ముందు కూడా యాక్సిస్ సంస్థ 5 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకునేందుకు 2018లో టీడీపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. అందుకే 400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు 2019 జనవరి 23న విద్యుత్ సంస్థలు అనుమతించాయి. దీన్ని గమనిస్తే యాక్సిస్తో చంద్రబాబు అనుబంధం ఏమిటో తెలుస్తుంది. 2014–18 మధ్య టీడీపీ పాలనలోనే ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 464 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు 15 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాని ప్రకారం మొదటి ఏడాది యూనిట్కు 5.98 రూపాయల చొప్పున చెల్లించాలి. రెండవ ఏడాది నుంచి ఏటా 3% పెంపుతో పదో సంవత్సరం దాకా కొనుగోలు వ్యయం పెరుగు తుంది. ఫలితంగా పదో ఏడాది నాటికి యూనిట్కు 7 రూపాయలకు పైగా చెల్లించాలి. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ యూనిట్ 4.20 రూపాయలకే అందు బాటులో ఉన్నా, 7 రూపాయలకు ప్త్రెవేట్ సంస్థల నుంచి కొనేందుకు టీడీపీ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది?2019 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం లోని పీపీఏల సమీక్షతో పాటు 2019 ఏప్రిల్ 1 ముందు కుదిరిన ఒప్పందాల మేరకు ఇంకా మొదలు కాని పనులను రద్దు చేయాలని ఆదేశించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో యూనిట్ రూ. 2.49 చొప్పున కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని టీడీపీ వ్యతిరేకించింది. కానీ, ‘చౌకగా విద్యుత్ వస్తున్నప్పుడు ఎందుకు కొనుగోలు చేయకూడదు?’ అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. యాక్సిస్ సంస్థ నుంచి తొలుత 400 మెగావాట్లకు, తర్వాత మరో 774.9 మెగావాట్లకు ఒప్పందాలు కుదుర్చుకునేలా దస్త్రాన్ని ఏపీఈఆర్సీ ఆమోదం కోసం అధికారులు పంపారు. ఆ పీపీఏల ద్వారా యూనిట్ ధర 4.28 రూపాయల చొప్పున ఖరారు చేయాలని డెవలపర్ సంస్థ విద్యుత్ నియంత్రణ మండలిని కోరింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో హైబ్రిడ్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ యూనిట్ రూ. 2.90లకు దొరుకుతుంది. అలాంటప్పుడు 4.28 రూపాయలకు ఎందుకు కొనుగోలు చేయాలి? గత ప్రభుత్వంలో 2022 నవంబర్ 11న యాక్సిస్ సంస్థ నుంచి యూనిట్ 3.50 రూపాయల చొప్పున పీపీఏల కొనుగోలు ఆమోదం కోసం ఏపీఈఆర్సీ అనుమతి కోసం డిస్కం పంపింది. ఆ పీపీఏలను ఎలా సమర్థించుకుంటారో వివరణ ఇవ్వాలంటూ డ్రాప్ట్ పీపీఏలను విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంకి తిప్పి పంపింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 ప్రకారం యాక్సిస్ సంస్థతో పీపీఏలను ఆమోదించాలంటూ 2024 సెప్టెంబర్ 24న ఏపీఈఆర్సీకి లేఖ రాసి, దీన్ని తిరస్కరించటానికి వీలు లేదనీ, ఒక వేళ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ముందుకు పోతా మనీ బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది. యాక్సిస్తో కచ్చితంగా పీపీఏలు కుదుర్చుకోవాలంటూ విద్యుత్ సంస్థలను అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశించలేదు. కాని ఆ సంస్థతో పీపీఏలు కుదుర్చు కోవటానికి విద్యుత్ సంస్థలు ముందుకు వచ్చాయి. అధికారులు కూడా ఆ సంస్థ నుంచి విద్యుత్ తీసుకోవటం చాలా చౌకనే రీతిలో వివరణ ఇవ్వటం ద్వారా పీపీఏలకు మద్దతు పలికారు. చంద్రబాబు ప్రభుత్వం, విద్యుత్ అధికారుల మద్దతుతో యాక్సిస్ సంస్థకు చెందిన సౌర, పవన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే వాటి ప్రతిపాదనలను ఏపీఈఆర్సీకి చేరాయి. విద్యుత్ యూనిట్ ట్యారిఫ్ ఎంత ఉండాలో కూడా యాక్సిస్ సంస్థే ప్రతిపాదించింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ కో – ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) ఏపీఈఆర్సీ ఆమోదం కోసం పంపింది. దీన్ని గమనిస్తే కూటమి ప్రభుత్వ విద్యుత్ ఒప్పందం ద్వారా యాక్సిస్ సంస్థ ఎంత ప్రయోజనం పొందుతుందో తెలుస్తుంది. బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుమొబైల్: 98859 83526 -
ద్వైపాక్షిక వాణిజ్యాల ‘లోటు’పాట్లు
మూడేళ్ల చర్చల అనంతరం మే 6న ఇండియా, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలతో ఇండియాకు జరిగిన మేలెంతో, లోటెంతో సమీక్షించుకోవడం అవసరం.ఏదైనా రెండు దేశాల మధ్య జరిగే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’గా భావిస్తాం. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి కార్యకలాపాలను ప్రోత్సహించడం లక్ష్యంగా వస్తు, సేవల వినిమ యానికి సంబంధించి ఈ ఒప్పందాలు జరుగుతాయి. దిగుమతి సుంకాలు, దిగుమతి కోటాలు, ఎగుమతులపై నియంత్రణ లాంటి వాణిజ్య అడ్డంకుల నిర్మూలనకు ఈ ఒప్పందాలు దోహదపడతాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం, 2024 సెప్టెంబర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 373 వాణిజ్య ఒప్పందాలపై (సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు, సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాలు కలుపుకొని) ఇండియా సంతకం చేసింది.ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువమార్కెట్ అందుబాటు పెంపు, ఎగుమతుల పెంపు ద్వారా అధిక వృద్ధి సాధన లక్ష్యంగా వివిధ దేశాలతో భారత్ ఈ ఒప్పందాలు కుదు ర్చుకుంది. కానీ ఆ లక్ష్య సాధనలో ప్రతికూల, మిశ్రమ పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వ్యవసాయం, తయారీ, సేవా రంగాలను పరిశీ లించినప్పుడు ఆ యా రంగాలకు సంబంధించి కొన్ని పరిశ్రమలు ప్రయోజనం పొందగా, మిగిలిన రంగాలు అనేక సవాళ్ళను ఎదు ర్కొంటున్నాయి. వాణిజ్య ఒప్పందాల కారణంగా వాణిజ్య పరిమాణంలో పెరుగుదల ఏర్పడినప్పటికీ, ఎగుమతులతో పోల్చినప్పుడు దిగుమతుల పరిమాణం పెరిగి భారత్కు సంబంధించి వాణిజ్య లోటు పెరిగింది. ‘ఏషియాన్’– ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత, ఆ యా దేశాలకు సంబంధించి భారత్ వాణిజ్య లోటు 2011లో 7.5 బిలియన్ డాలర్లు కాగా, 2023లో 44 బిలియన్ డాలర్లకు పెరిగింది. దక్షిణ కొరియాతో ఒప్పందం జరిగే సమయంలో భారత్ వాణిజ్య లోటు 4 బిలియన్ డాలర్లు కాగా, ప్రస్తుతం 9 బిలి యన్ డాలర్లకు పెరిగింది.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా భారత్ స్వదేశీ పరి శ్రమలు – ముఖ్యంగా చిన్న, మధ్యతరహా సంస్థలు, వ్యవసాయం, డైరీ రంగాలపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది. ఒప్పంద దేశాల నుండి ‘చౌక దిగుమతుల’ కారణంగా భారత్లో స్థానిక రైతులు, ఉత్పత్తిదారులకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. వాణిజ్య సరళీకరణ వలన ఐటీ, సేవలకు కొంతమేర ప్రయోజనం ఏర్పడి నప్పటికీ, సంప్రదాయ పరిశ్రమలు అధిక దిగుమతుల కారణంగా పోటీ ఎదుర్కొంటున్నాయి.స్థానిక మార్కెట్లో విదేశీ కంపెనీల ప్రవేశం వలన చిన్న, స్థానిక వ్యాపారాలు పోటీని ఎదుర్కోలేక మూసివేతకు గురవుతాయి. అలాగే కొన్ని ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నప్పటికీ, అధిక సామర్థ్యంతో కూడిన సప్లయ్దారుల నుండి వాణిజ్య ప్రవాహం భాగస్వామ్య దేశా లకు జరుగుతుంది. 2017 నుండి 2022 మధ్య కాలంలో ఒప్పంద భాగస్వామ్య దేశాలకు సంబంధించి భారత్ ఎగుమతులలో 31 శాతం పెరుగుదల ఏర్పడగా, దిగుమతులలో 82 శాతం పెరుగుదల ఏర్పడింది. దక్షిణ కొరియా, ఏషియాన్ దేశాలు టెక్స్టైల్స్, తోలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ను తక్కువ ధరకు ఉత్పత్తి చేయడం వలన ఆ యా ఉత్పత్తులకు సంబంధించి భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఏర్పడింది.దిగుమతేతర సుంకాల ఇబ్బందులువాణిజ్య ఒప్పందాలలో భాగంగా దిగుమతి సుంకాలకు సంబంధించి స్పష్టత ఉన్నప్పటికీ, దిగుమతేతర సుంకాలు వస్తు ప్రవాహానికి అవరోధంగా నిలుస్తున్నాయి. దిగుమతి కోటా, దిగుమతి లైసెన్సింగ్, రూల్స్ ఆఫ్ ఆరిజిన్(వస్తు తయారీ మూలానికి సంబంధించిన), శానిటరీ, ఫైటో శానిటరీ(చీడలు, వ్యాధులు లేవని చెప్పాల్సిన) చర్యలు, సాంకేతిక నియంత్రణలు, కస్టమ్స్ కార్యసరళిని దిగుమతే తర సుంకాలుగా భావింపవచ్చు.దక్షిణ కొరియా మార్కెట్ అందుబాటు భారత ఉత్పత్తులకు క్లిష్టంగా మారడానికి శానిటరీ, ఫైటో శానిటరీ చర్యలు, సర్టిఫికేషన్ ఆవశ్యకత లాంటివి కారణాలుగా నిలుస్తున్నాయి. దిగుమతి లైసెన్సింగ్, రూల్స్ ఆఫ్ ఆరిజిన్ క్లిష్టతరంగా ఉండటం, శానిటరీ, ఫైటో శానిటరీ చర్యల వల్ల థాయ్లాండ్కు భారత ఎగుమతుల వృద్ధి తగ్గింది. మలేషియా అవలంబిస్తున్న వాణిజ్యపరమైన సాంకేతిక అడ్డంకులు, శానిటరీ, ఫైటో శానిటరీ చర్యలు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఆస్ట్రేలియా దిగుమతేతర సుంకాల చర్యలలో భాగంగా ఆరోగ్యం, భద్రతా సర్టిఫికేషన్స్, బయో సెక్యూరిటీ ఆవశ్యకత, ఇతర ప్రమాణాలు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపించాయి. అధిక దిగుమతి ప్రమాణాలను పాటిస్తున్న కారణంగా జపాన్కు సంబంధించి భారత్ ఎగుమతులలో ప్రతిష్టంభన ఏర్పడింది. దిగుమతేతర సుంకాలు భారత్ ఎగుమతిదారుల ఎగు మతుల అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. వాణిజ్య వ్యయాల పెరుగుదల, మార్కెట్ అందుబాటు పెరగకపోవడం వాణిజ్య సరళీ కరణ ప్రయోజనాలను భారత్ అందుకోలేకపోవడానికి కారణ మయ్యాయి.ఉదాహరణకు 2019–23 కాలానికి జపాన్కు ఇండియా ఎగుమతుల విలువ 5,730 మిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 19,900 మిలియన్ డాలర్లు. ఇదే కాలానికి యూఏఈకి మన ఎగుమతుల విలువ 30 వేల మిలియన్ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 50,510 మి.డాలర్లు. ఇక ఆస్ట్రేలియాకు మన ఎగుమతులు 8,730 మి.డాలర్లు కాగా, దిగుమతులు 11,300 మి.డాలర్లు. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్గానిస్తాన్, చిలీ లాంటి చిన్న ఆర్థిక వ్యవస్థలు మినహా పెద్ద వాణిజ్య దేశాలతో భారత్ వాణిజ్య లోటు పెరిగింది. అయితే, 2000–24 మధ్య కాలంలో మారిషస్, సింగపూర్, జపాన్, యూఏఈ నుండి భారత్ అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మాత్రం ఆకర్షించగలిగింది. భారత్ మొత్తం వాణిజ్యంలో భాగ స్వామ్య ఒప్పంద దేశాల వాటా సుమారు 20 శాతం.అడ్డంకులు తొలగించుకునేలా...ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలుగా– నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్–నాఫ్టా (అమెరికా, మెక్సికో, కెనడా), ట్రాన్స్ – పసిఫిక్ భాగస్వామ్యం (జపాన్, ఆస్ట్రే లియా, సింగపూర్), సమగ్ర ప్రాంతీయ భాగస్వామ్య ఒప్పందం(ఆర్సీఈపీ), చైనా – ఏషియాన్ ఒప్పందాలను పేర్కొనవచ్చు. భారత్కు సంబంధించి వాణిజ్య ఒప్పందాల ముందు కాలంతో పోల్చినప్పుడు ఒప్పందం అమలు కాలంలో భారత్ వాణిజ్య పరి మాణం, విలువలో పెరుగుదల ఏర్పడింది. అయితే, ముఖ్య భాగ స్వామ్య దేశాల నుండి దిగుమతులు పెరిగిన కారణంగా భారత్ వాణిజ్య లోటులో పెరుగుదల ఏర్పడింది. అందుకే వాణిజ్యపరంగా వ్యూహాత్మకమైన దేశాలతో ఒప్పందాల కోసం భారత్ ప్రయత్నించాలి. నియంత్రణలు, దిగుమతేతర సుంకాల అడ్డంకులను భాగస్వామ్య దేశాలు తొలగించే విధంగా వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలి. అమెరికాతో సహా వాణిజ్య పరంగా ముందంజలో ఉన్న ఏ దేశాలతోనైనా దిగుమతి సుంకాలు, దిగుమతేతర సుంకాల చర్యలను తగ్గించినట్లయితే భారత్ మార్కెట్ విస్తృతి పెరుగుతుంది.వ్యాసకర్తలు డా‘‘ తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్ అండ్ డీన్; రితికారావు వీరిశెట్టి, పీహెచ్డీ స్కాలర్,ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హైదరాబాద్ -
Operation Sindoor ఎవరిని అడగాలి?
ఇంటి పనులూ బయటి పనులూ చింతలూ చిక్కులూ చికాకులూ రోజూ వుండేవే వాటికి కాస్త విరామమిస్తూ విహారానికని అపుడపుడు ఊరు దాటి బయటికి వెళ్లొస్తాం దూరమైనా ఈ పరి ఈ కాశ్మీరానికి వచ్చాం ముచ్చటపడి –ఏమంద మేమంద మేమందం అంటూ పచ్చగా మురిసిపోతూ మేం ఉల్లాసపడుతున్న వేళ అదాటున కాల్పులు! కళ్లెదుటే మా ఇంటి మనిషి క్షణాల్లో శవమయ్యాడు భూతల స్వర్గపు పచ్చదనం ఉన్నట్టుండి ధడేల్మని ఎరుపెక్కుతుందని తెలిస్తే అసలు ఇటు నిండు కుటుంబంగా వచ్చే వాళ్ళమా! నిండు మనిషిని పోగొట్టుకునే వాళ్ళమా! ఇపుడు మాకు ఏ అందాల సంబరాలొద్దు మా మనిషి మాక్కావాలి, తెచ్చిస్తారా ఊపిరితో –ఈ సరిహద్దు వివాదాలూ లోయలో కల్లోలాలూ తుపాకుల కవాతులూ పేలుళ్ళూ దాడులూ ఇక్కడి చరిత్రా మాకేం తెలుసు! మామూలు మనుషులంతుపాకులు, ఎదురు తుపాకులతోనే తలపడతాయని తలచాం కానీ... యాత్రికుల కన్నులను సైతం తుపాకుల్లా చూస్తాయని గుర్తించి మరీ గురి చూస్తాయని అనుకోలేదు! ఉన్నట్టుండి ఈ కొత్త చోటున మేం ఎవరికి ఇంతలోనే ఇంత బద్ధ శత్రువులమెట్లయ్యామో తెలియట్లేదు ముగ్గురం వచ్చి ఇపుడిద్దరమే ఇంటికెళ్తున్నాం మూడో మనిషేడని ఇల్లు కలవరపడుతూ అడుగుతుంది దాన్ని ఎట్లా ఓదార్చాలి? మా మనిషి లేడు నిట్రాడు లేదు మరింత బరువైపోయిన మా బతుకు! ఇపుడు ఎట్లా నిలబడేది క్షణ క్షణం భయం భయంగా వుంది మా బయటా మా లోపలా – కారణమెవరని ఇపుడు మేం ఎవ్వరినడగాలి?– దర్భశయనం శ్రీనివాసాచార్య ఇదీ చదవండి: కేన్స్లో తళుక్కున మెరిసిన బ్యూటీ, చిలక రహస్యం ఏమిటో? -
సేంద్రియ సాగులో హిమాచల్ నమూనా
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఒక ట్రెండ్ సెట్టర్. నేను రాజ కీయాల గురించి మాట్లాడటం లేదు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు గీటు రాయి లాంటి ధరల వ్యవస్థను రూపొందించడంలో ఆయన చేపట్టిన మార్గదర్శక పాత్రను ప్రస్తావిస్తున్నాను. రసాయన వ్యవసాయం నుండి స్థిరమైన, ఆరోగ్యకరమైన పర్యావరణ అనుకూల వ్యవసాయ వ్యవస్థల వైవు పరి వర్తన చెందడానికి ఇది కచ్చితమైన మార్గం.2022 డిసెంబర్లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్య తలు స్వీకరించినప్పటి నుండి, పర్వత ప్రాంతంలో సేంద్రియ వ్యవ సాయాన్ని ప్రోత్సహించడానికి సుఖు చేసిన ప్రయత్నాలను నేను ఆసక్తితో అనుసరించాను. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, సేంద్రియ ఆవు, గేదె పాలకు రూ. 45, రూ. 55 చొప్పున సేకరణ ధర పెట్టారు. ఇది మంచి ప్రారంభం. ఇటీవలి బడ్జెట్లో ఆ ధరలను లీటరుకు మరో ఆరు రూపాయలు రెంటికీ పెంచడం హృద్యం గమం. ఆ తర్వాత ఆయన సేంద్రియ మొక్కజొన్న, గోధుమలను సేకరించడానికి కనీస మద్దతు ధరను వరుసగా కిలోకు రూ. 30, కిలోకు రూ. 40 చొప్పున ప్రకటించారు. మళ్లీ వాటిని రూ. 30 నుండి రూ. 40కి, 40 నుండి రూ. 60కి పెంచారు. అదనంగా, గోధుమలను, మొక్కజొన్నలను కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లడానికి కిలోకు రెండు రూపాయల రవాణా రాయితీని ప్రకటించారు.సేంద్రియ సాగుకు ధరే ఊతంపర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అవలంబించే రైతులకు అధిక ధరలు ప్రకటించడం వల్ల పంట రాబడిలో గణనీ యమైన పెరుగుదలకు వీలు కలుగుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, వ్యవసాయాన్ని ఇంటెన్సివ్ వ్యవసాయ పద్ధతుల నుండి పర్యావరణ అనుకూల వ్యవస్థలకు మార్చాలనే ప్రయత్నాలకు ధర ప్రోత్సాహకాలు మరింత ఊతమిస్తాయి. కొన్ని రోజుల క్రితం, సేంద్రియ పసుపు రైతుల కోసం హిమా చల్ ప్రదేశ్ సీఎం ఒక రిజిస్ట్రేషన్ ఫారమ్ను ప్రారంభించారు. సేంద్రియ పసుపునకు కనీస మద్దతు ధర కిలోకు రూ. 90గా నిర్ణయించారు. మార్కెట్ ధర కిలోకు రూ. 25 నుండి రూ. 30 వరకు మాత్రమే ఉంది. ధరలలో గణనీయమైన పెరుగుదల సేంద్రియ పసుపు ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.కోవిడ్–19 మహమ్మారి తర్వాత, ప్రజలు శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడంలోని ప్రాముఖ్యతను గ్రహించిన తర్వాత, సేంద్రియ పసుపునకు డిమాండ్ పెరిగింది. ముడి పసుపు ప్రాసెసింగ్ను రాష్ట్ర సంస్థలు ‘హిమాచల్ హల్దీ’ పేరుతో విక్రయిస్తాయని సుఖు వెల్లడించారు. గతంలో సేంద్రియ మొక్కజొన్న కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా తుది ఉత్పత్తులను ఐదు కిలోలు, 120 కిలోల సంచులలో విక్రయిస్తారు.2025–26 నాటికి లక్ష మంది రైతులను సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకురావాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దూకు డుగా ముందుకు సాగకపోవడం నాకు సంతోషం కలిగిస్తోంది. హామీ ఇచ్చిన ధరలను అందించడం, ప్రత్యేక ప్రాసెసింగ్ను, మార్కెటింగ్ను నిర్ధారించడం ద్వారా ప్రభుత్వ మద్దతుతో నెమ్మదిగానే కానీ స్థిరమైన ప్రయత్నం చేయడం అవసరం. కాగితంపై మాత్రమే మిగిలే అసాధ్య మైన లక్ష్యాలను ప్రకటించడం కంటే ఇది చాలా మంచిది.రాజకీయాలకు అతీతంగా, పర్యావరణ అనుకూల వ్యవసాయ వ్యవస్థల వైపు మళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. సహజ వ్యవసా యంలో నిమగ్నమైన అనేక వ్యవసాయ సమూహాలు ఇప్పటికే సాను కూల ఫలితాలను చూపిస్తున్నప్పటికీ, తక్కువ మార్కెట్ ధరల కార ణంగా ఈ ప్రయత్నం వీగిపోయింది. ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్ పాటించవలసిన ధరల చట్రాన్ని అందించింది. సేంద్రియ సాగుదారులకు అధిక ఆదాయం రావడానికి తక్కువ ఉత్పత్తి ఖర్చుపై ఆధారపడటానికి బదులుగా, తక్షణ అవసరం ఏమిటంటే అధిక హామీ ధరను అందించడం. అంతే తప్ప తక్కువ సాగు ఖర్చు అవస రమనే వాదన పనిచేయదు. నీతి ఆయోగ్ కూడా సహజ వ్యవసాయ విస్తరణను అభినంది స్తోంది. కానీ సాగుదారులకు ఆకర్షణీయమైన ధర అవసరాన్ని అది విస్మరించింది. అందుకే హిమాచల్ ప్రదేశ్ సీఎం ప్రారంభించిన కార్యక్రమంలో కొత్తదైన సానుకూల ధోరణిని నేను చూస్తున్నాను. మార్కెట్లు సామర్థ్యాన్ని, నాణ్యతను ప్రోత్సహిస్తాయనే తప్పుడు నమ్మకం ఉన్నప్పటికీ, సేంద్రియ రైతులకు సరైన, హామీ ఇవ్వబడిన ధరలను నిర్ణయించడానికి ప్రభుత్వ జోక్యం అవసరం.దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
నీళ్ల కోసం ఇక పాక్ కాళ్లబేరం!
ఇండియా, పాకిస్తాన్ మే 10న కాల్పులను విరమించాయి. దీనికి అమెరికా చొరవ చూపి నట్టుగా వార్తలొచ్చాయి. ఏప్రిల్ 22 పహల్ గామ్ దాడి నుంచి మే 10 కాల్పుల విరమణ వరకు గడచిన ఈ స్వల్పకాలంలో ఇరు దేశాల సంబంధాలు మౌలికంగా కొత్త రూపు సంతరించుకున్నాయి. ఉగ్రదాడికి ముందు ఇండియా–పాకి స్తాన్ సంబంధాలు ఎలా ఉండేవో ముందుగా తెలుసుకోవాలి. రెండు దేశాల నడుమ పరిష్కారం కాని సమస్యలపై ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, కాల్పుల విరమణ సజావుగా కొనసాగుతోంది. సింధూ నదీ జలాల ఒప్పందానికి (ఇండస్ వాటర్ ట్రీటీ– ఐడబ్ల్యూటీ) ఇండియా కట్టుబడి ఉంది. పరిమిత కాల పర్యటనలకు వీలుగా అటారీ–వాఘా సరిహద్దు తెరిచే ఉంటోంది. రాజధానుల్లో హై కమిషనర్లు మినహా సీనియర్ దౌత్యాధికారులు పనిచేస్తున్నారు. ఏదో ఒకరోజు కశ్మీర్ మీద చర్చలు సాధ్యమేనన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి మరునాడు, అంటే ఏప్రిల్ 23న, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. అటారీ– వాఘా సరిహద్దును మూసేసింది. రక్షణ సహాధి కారుల పోస్టులను రద్దు చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ భగ్నమైంది. పాకిస్తాన్ ఒకడుగు ముందుకేసి 1972 సిమ్లా ఒప్పందం రద్దు చేస్తానని బెదిరించింది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే నీళ్లు!కట్ చేస్తే... మే 11న అకస్మాత్తుగా వైరాలు నిలిచిపోయాయి. మళ్లీ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో మారిన పరిస్థి తులు ఏవి? దీని తర్వాతా మారనివేమిటి? మే 10న రెండు దేశాల డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్)లు టెక్నికల్ అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. దీని ప్రకారం, నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్–ఎల్ఓసీ) పొడవునా కాల్పులు జరగవు. డ్రోనులు, క్షిపణులు ప్రయోగించుకోరు. ఇతర లాంగ్ రేంజ్ ఆయు ధాల ప్రయోగం జరగదు. పరస్పర సైనిక దాడులు నిలిచిపోతాయి. ఇక కాల్పుల విరమణ ఒప్పందం వమ్ము చేయలేనివి ఏమిటో చూద్దాం. ఏప్రిల్ 23న ఇండియా, ఆ తర్వాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలను మే 10 ఒప్పందం రద్దు చేయలేదు. ఇది టెక్నికల్ స్థాయి పత్రం తప్ప రాజకీయ ఒప్పందం కాదు. డీజీఎంఓలకు రాజకీయ ఒప్పందాలు చేసుకునే అధికారం లేదు. వీటిని విదేశీ వ్యవహారాల శాఖలు మాత్రమే కుదుర్చుకోగలవు. మరో విధంగా చెప్పాలంటే, ఏప్రిల్ 22 నాటి పరిస్థితిని ఇరు దేశాలూ పునరుద్ధరించలేదు. అందుకే, ఇండియా, పాకిస్తాన్ నడుమ ఇప్పుడున్నది నయా స్టేటస్ కో! అంటే, ఐడబ్ల్యూటీ ఇక ముందు కూడా నిలుపుదలలోనే ఉంటుంది. సింధు జలాలు ఇండియా ఇష్టానుసారం ప్రవహిస్తాయి. ఈ జలాల గణాంకాలను పాకిస్తాన్తో పంచుకోవడానికి ఇండియా సుముఖంగా లేదు. దాయాది దేశ ఆర్థిక వ్యవస్థను, అంతర్గత రాజకీయాలను దీర్ఘ కాలంలో ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఐడబ్ల్యూటీ నిలిపివేత ఇండియా–పాకిస్తాన్ దౌత్య సంబంధాల రూపురేఖలను మౌలికంగా మార్చేసిన తీవ్ర చర్య. పాక్ టెర్రరిజానికి స్వస్తి పలికితే తప్ప సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించబో మని ఇండియా తేల్చిచెప్పింది. ఏకపక్షంగానో, లేదా ద్వైపాక్షిక చర్చల అనంతరమో దీన్ని పునరుద్ధరించడం పూర్తిగా ఇండియా చేతిలో ఉంది. మే 10 కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి ఈ అంశం రాదు.భవిష్యత్ చర్చల్లో పాకిస్తాన్ మెడలు వంచడానికి ఈ ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ గొప్ప అస్త్రం అని చెప్పాలి. పాకిస్తాన్కు సింధూ బేసిన్ నీళ్లు కావాలంటే, టెర్రరిజం విషయంలో ఇండియా డిమాండ్లకు అది తలొగ్గాల్సిందే. కశ్మీర్ అనేది భావోద్వేగాలకు సంబంధించిన అంశం. అయితే, పాకిస్తాన్ ప్రజలకు నీరు జీవన్మరణ సమస్య. పాకిస్తాన్ ఇకముందు కూడా కశ్మీర్ పాట పాడుతుంది. కానీ, ఐడబ్ల్యూటీ విషయంలో ఇండియాను సానుకూలం చేసుకోడమే మున్ముందు వారి అసలు లక్ష్యం అవుతుంది. ఉభయ పక్షాల చర్చల్లో కశ్మీర్ అంశం ప్రాముఖ్యం కోల్పోతుంది. దాని స్థానంలో ఐడబ్ల్యూటీ కీలకాంశంగా మారుతుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇండియా తీసు కున్న ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ అనే ఒకే ఒక్క చర్యతో... ఇరు దేశాల సంబంధాల్లో ఇప్పటి వరకు కేంద్రబిందువుగా ఉన్న కశ్మీర్ స్థానాన్ని ఇప్పుడు నీరు ఆక్రమించింది. నిగ్రహం బాధ్యత పాక్ మీదే...1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అనంతరం, 1972లో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసినప్పుడు కూడా ఇండియా ఇలానే వ్యవహరించింది. యుద్ధం ముందు ఉన్న ప్రాదేశిక స్థితిని (1965 యుద్ధానంతరం మాదిరిగా) యథాతథంగా అంగీకరించలేదు. కశ్మీర్ సరిహద్దు పేరును ‘కాల్పుల విరమణ రేఖ’ నుంచి ‘నియంత్రణ రేఖ’ (ఎల్ఓసీ)గా మార్చింది. ఇలా చేయడం ద్వారా కశ్మీర్లో తృతీయ పక్షం జోక్యాన్ని వ్యతిరేకించగలిగింది. అప్పటి నుంచి జమ్ము– కశ్మీర్లో యూఎన్ పరిశీలకుల ఉనికి నామమాత్రమైంది. సారాంశం ఏమిటంటే, పహల్గామ్ ఉగ్రదాడి, దాని పర్యవ సానాలు ఇండియా–పాకిస్తాన్ సంబంధాలను రెండు విధాలుగా ప్రభావితం చేశాయి. మొదటిది: పాకిస్తాన్ కోరుకున్నట్లు కశ్మీర్ అంశం కొంతవరకు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అయితే ద్వైపాక్షిక చర్చల నుంచి కశ్మీర్ను తప్పించడంలో ఇండియా విజయం సాధించింది. పాకిస్తాన్ ఇప్పుడు సర్వశక్తులూ ఐడబ్ల్యూటీ మీదే కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్కు నీళ్లు కావాలి.ఇండియాకు టెర్రరిజం అంతం కావాలి. ఇప్పటి వరకు, టెర్రరిజం అంతానికి పాకిస్తాన్ అంగీకరించాలంటే ఇండియా కశ్మీర్పై చర్చలు జరపాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడది మారింది.రెండవది: ఇరు దేశాల నడుమ సంఘర్షణ తలెత్తినప్పుడు, వైరాన్ని ఉప–సాంప్రదాయిక (సబ్–కన్వెన్షనల్) స్థాయిని దాటనివ్వ లేదని ఇండియా తన చర్యలు, ప్రతిచర్యల ద్వారా చాటిచెప్పింది. భవిష్యత్తులో మాత్రం ఇది కుదరదని, సబ్–కన్వెన్షనల్ దాడులకు సాంప్రదాయిక స్థాయిలోనే ప్రతి చర్యలు ఉంటాయని ప్రకటించింది. అంటే, ఇండియాతో పూర్తిస్థాయి యుద్ధం వద్దనుకుంటే, ఉప–సాంప్రదాయిక స్థాయిలోనూ పోరు ప్రారంభించకుండా నిగ్రహం పాటించాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీదే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, టెర్రరిజానికి ఇక సాంప్రదాయిక యుద్ధంతోనే జవాబు చెబుతామని ఇండియా స్పష్టం చేయగలిగింది. ఇందుకోసం భారీ మిలిటరీ సంక్షోభం ఉత్పన్నమై అనేక మంది బలి కావలసి రావడం దురదృష్టకరం. వైరి దేశం ఉగ్ర దాడులకు తెగబడ కుండా నిరోధకత సాధించడానికి, దాన్ని కొనసాగించడానికి ఈ పాటి మూల్యం చెల్లించక తప్పదు.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్యూలో ఇండియా ఫారిన్ పాలసీ బోధకులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
బహుజన సాధికారతకు మరో మెట్టు!
ఇది బీసీల కాలం. ఇది బీసీ శతాబ్దం. ఇది బీసీ చైతన్యం వెల్లివిరుస్తున్న కాలం. దేశానికి స్వాతంత్య్రం వస్తే బహుజనులకు ఏమిస్తారో చెప్పండని 150 ఏళ్ళ క్రితమే మహాత్మా జ్యోతిబా ఫూలే వేసిన ప్రశ్నకు నేటికీ భారత పాలకులు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దేశమంతా బీసీ చైతన్యం రాజుకుంటోంది. బీసీలు నిప్పుల కుంపట్లయి భగ్గుమంటున్నారు. దేశమంతా బీసీ కులగణన చేయాలని బీసీ సంఘాలు, సామాజిక ఉద్యమకారులు కోరు తున్నారు. అనేక రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీ లలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాయి. రామస్వామి పెరియార్ తమిళనాడులో జరిపిన అలుపెరుగని పోరాటాలకు గుర్తుగా బీసీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లలో 69 శాతం రిజర్వేషన్లు ఆ రాష్ట్రంల్లో అమలు లోకి వచ్చాయి. జనతా పార్టీ ‘బీపీ మండల్’ కమిషన్ వేస్తే జనతాదళ్ పాలనలో ప్రధాని వీపీ సింగ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ తీర్మానించారు. మండల్ కమిషన్ అమలులో జరిగిన ఘర్షణల అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే పీవీ నరసింహా రావు ప్రభుత్వం మండల్ సిఫారసులను అమలు చేసింది. తమ జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రిజర్వేషన్లు పొంది చట్టసభల్లోకి అడుగు పెట్ గలిగినప్పుడే బీసీలకు సంపూర్ణ న్యాయం వచ్చినట్లు, స్వాతంత్య్రం లభించినట్లు అవు తుంది. బీసీ సామాజిక వర్గాలు సుదీర్ఘకాలం చేసిన పోరాటాలకు ఫలితం దక్కినట్లవుతుంది. ఇది జరగడానికి బీసీ కుల గణన చేయటం తొలిమెట్టు అవుతుంది. ఆ పనికి ఇంతకాలానికి కేంద్ర ప్రభుత్వంముందుకు వచ్చినందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని బీసీ సామాజిక వర్గాలు ముక్తకంఠంతో అభినందిస్తున్నాయి. హర్షం వ్యక్తం చేస్తున్నాయి.దేశంలో రావాల్సిన విప్లవం ఏదైనా ఉంటే అది బీసీ విప్లవమే! పాలకులు చాలావరకు ఏదో ఒక రకంగా బీసీ చైతన్యాన్ని అణచి వేసినవాళ్ళే. బీసీలకు పాలించే లక్షణాలు లేవనీ, వారిని ఏవో కొన్నిసంక్షేమ పథకాలను అనుభవించడానికే పరిమితం చేశారు. ఈ పెత్తందార్లు ఇప్పటికీ బీసీలు ఐక్యం కారని గట్టిగా నమ్ముతున్నారు. బీసీ ఐక్యతపై వీలు చిక్కినప్పుడల్లా దాడి చేస్తూ విభజించడానికే ప్రయత్ని స్తున్నారు. అయితే ఇపుడిపుడే అన్ని పార్టీలూ గొంతులు సవరించుకుని బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని అంటున్నాయి. దీనికి సమాంతరంగా బీసీల చైతన్యం పెరిగింది. బీసీ భావజాల ప్రచారాలు విస్తృతంగా జరుగుతున్నాయి. బాబా సాహెబ్ అంబేడ్కర్ అన్నట్లుగా అన్నింటికీ రాజ్యాధికారమే అసలు ‘కీ’. దాన్ని పొందాలంటే తొలుత బీసీ కులగణన జరగాలి. ఈ దిశలో కేంద్రం ఒక అడుగుముందుకు వేసింది. ఇందుకు సానుకూలంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా...బీసీ కులగణన జరిపి చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు పొందేంత వరకు పదును తగ్గని బీసీ ఉద్యమాలను కొనసాగించవలసే ఉంటుంది. అప్పటిదాకా దేశానికి బీసీ జ్వరం పట్టవలసిందే. బీసీల జనాభా ఎంతో లెక్కప్రకారం తేల్చేదాకా విశ్రమించకుండా ఉండాలి. బీసీలు చట్టసభల్లో, విద్య, ఉద్యోగాల్లో తమ వాటా తాము పొందేంతవరకు నిరంతర చైతన్యంతో ముందుకు సాగాలి. బీసీలు, ఇందులో బాగా వెనుకబడిన ఎంబీ సీలు, సంచార, విముక్త జాతులందరికీ జనాభా దామాషా పద్ధతిలో సమ వాటా పొందినప్పుడే బీసీలకు నిజమైన స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. ఆ స్ఫూర్తితోనేబీసీల అవగాహన, ఉద్యమాలు ఎగిసి పడాలి. బీసీ విద్యావంతులు, ఉపాధ్యా యులు, ప్రొఫెసర్లు విస్తృతంగా బీసీలలో అవగాహన కల్పించే పనికి మరింత ముమ్మర కృషి చేయాలి. ప్రధానంగా బీసీ యువత ఈ బాధ్య తను భుజం మీద వేసుకోవాలి. నెత్తుటిచుక్క చిందించకుండా బీసీల సంపూర్ణ హక్కుల సాధన దిశగా బీసీ యువత కదలాలి. బీసీల సంపూర్ణ స్వాతంత్య్రం సాధించే ఉద్యమాలలో బీసీ యువత కీలక పాత్రధారి కావాలి. పలు పార్టీలుగా చీలి పోయిన బీసీలంతా ఒక్కతాటిపైకి వచ్చి నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. బీసీల కులగణన జరిపి, స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంటుల్లో వారి వాటా వారు పొందేంత వరకు విశ్రమించ కూడదు. బీసీ కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావుల ఐక్యత వర్ధిల్లేవిధంగా ఉద్యమాలు జరగాలి. ‘బీసీలం ఇక ఎంతమాత్రం పాలితులం కాదు పాలకులమ’ని నిరూపించేదాకా విశ్రమించ కూడదు. ‘చట్టసభల్లోసమ ప్రాధాన్యం’ అన్న ఏకవాక్య నినాదమే ప్రతి బీసీ స్వప్నం, లక్ష్యం కావాలి. వ్యాసకర్త తెలంగాణ తొలి బీసీ కమిషన్ సభ్యులు -
గుర్తుకొచ్చిన ‘నాజీల’ పాలన
ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఏకంగా ఒక ప్రముఖ పత్రికా ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం ఒకప్పటి హిట్లర్ నాజీల పాలనను ప్రజల కళ్లకు కట్టింది. ప్రజాభిప్రాయాన్ని నాణేనికి రెండో పక్క ప్రతిబింబించే ప్రధాన పత్రిక ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డిపై ఇప్పటికే మూడు, నాలుగు కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం, తాజా ఘటన ద్వారా ఏకంగా ఆయన నైతిక స్థైర్యాన్నే దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ‘సాక్షి’పై వీలైనప్పుడల్లా విషం కక్కే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోని పోలీ సులు నాటి నాజీ సేనలను గుర్తు చేశారు. నాజీల పాలనలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందన్న విషయాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటే...ప్రజాభిప్రాయాన్ని నియంత్రించే సాధనాలుగా...అడాల్ప్ హిట్లర్ నాజీ పాలనలో (1933–1945), ప్రెస్ స్వాతంత్య్రాన్ని పూర్తిగా అణచివేశారు. ప్రజాభిప్రాయాన్ని నియంత్రించడానికి పత్రికలను ప్రచార పరికరంగా ఉపయోగించారు. ప్రభుత్వ నిర్దేశాలను అనుసరించి అన్ని మీడియా, పత్రికలు, రేడియో లకు కఠిన నియంత్రణలు విధించారు. జర్మనీలోని అన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ పార్టీకి అనుకూలంగా ఉండాల్సిందే. నాజీ ప్రభుత్వాన్ని ప్రోత్సహించడానికి, నిరసనలు నెమ్మదింపచేయడానికి మీడియానే సాధనంగా వినియోగించారు. నాజీలకు నిరసనలు తెలిపే పత్రికలను మూసివేశారు. వ్యతిరేక వార్తలను ప్రచురించడాన్ని పూర్తిగా నిషేధించారు. యూదులపై ద్వేషాన్ని ప్రేరేపించడానికి, ప్రజల మనస్సులో హిట్లర్, నాజీ పార్టీకి అనుకూల భావనను పెంపొందించేందుకు పత్రికలు పనిచేసేవి.ప్రతి పత్రికనూ జర్మనీ ప్రచార, ప్రజల బోధన మంత్రిత్వ శాఖ (రీచ్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ ఎన్లైట్మెంట్ అండ్ ప్రాపగాండా) పరిధిలోకి తీసుకొచ్చారు. దీనిని జోసెఫ్ గోబెల్స్ (తప్పుడు ప్రచారానికి ప్రస్తుత నానుడి) నాయకత్వం వహించారు. స్వతంత్రంగా పనిచేసే పత్రికలు, విపక్ష పత్రికలను నిషేధించారు లేదా బలవంతంగా మూసివేశారు. నాజీ పార్టీ ఆమోదించిన సమాచారం మాత్రమే ప్రచురితం కావాలి. ఒక జర్నలిస్ట్ చట్టబద్ధంగా పని చేయాలంటే, రీచ్ ప్రెస్ చాంబర్లో సభ్యత్వం తప్పనిసరి.కమ్యూనిస్టు, సోషలిస్టు, యూదు, లిబరల్ పత్రికలు తొలుత నిషేధానికి గురయ్యాయి. హిట్లర్ లేదా నాజీ పార్టీపై చేసే ఏవైనా విమర్శలను దేశద్రోహం లేదా రాజద్రోహంగా పరిగణించేవారు.పత్రికల నుంచి రేడియో, సినిమాలు, పిల్లల పుస్తకాల వరకు కూడా నాజీ ప్రచారంతో నిండిపోయేవి.చదవండి: ఇప్పటికైనా బౌద్ధాన్ని అర్థం చేసుకున్నామా?భావ ప్రకటనా స్వేచ్ఛ రద్దయ్యింది. జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే నాజీ ప్రభుత్వానికి సహకరించాలి. లేదంటే జైలుకు పోవాలి. లేదంటే ప్రాణాలే పోగొట్టుకోవాలి.జర్నలిస్టులు నిరంతరం భయంతో నిఘా నీడన బ్రతకాల్సి వచ్చేది. ఒక మాటలో చెప్పాలంటే, నాజీ పాలన పత్రికలను ప్రజాభిప్రాయం ప్రతిబింబించడానికి మాధ్యమాలుగా కాకుండా, తమకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలిచే శక్తిమంతమైన ఆయుధంగా మార్చింది. – ఎన్. భాస్కర్ ప్రసాద్, విజయవాడ -
ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే...
ఈ ఏడాది ఉగాది నుంచి ‘స్వర్ణాంధ్ర–2047’ విజన్లో భాగంగా రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలను ఆదుకోవడానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ప్రభుత్వ–ప్రైవేటు–ప్రజల భాగ స్వామ్యం’ (పీ4). మరింత వివరంగా చెప్పాలంటే, అత్యంత పేదరికం (జీరో పావర్టీ)తో మగ్గిపోతున్న 20 శాతం కుటుంబాలను అత్యున్నత స్థాయిలో ఆర్థికంగా నిలదొక్కుకున్న 10 శాతం మంది మార్గదర్శకులు పేదరికం నుండి విముక్తి చేసే బాధ్యతను చేపట్టాలని చంద్రబాబు నిర్దేశి స్తున్నారు. ఈ పథకంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించటం సాధ్యమేనా? 1991 తర్వాత దేశంలో ప్రవేశపెట్టబడిన సరళీకృత ఆర్థిక విధానాలు ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయి? ఈ విధానాలు ఆశ్రిత పెట్టు బడిదారీ వర్గం పెరగడానికి తోడ్పడ్డాయి. కనుకనే జాతీయ ఆర్థిక అభివృద్ధి పెరిగినట్లు కనిపిస్తోంది కానీ పేదరికం తగ్గలేదు. ఫలితంగా భారత దేశం ఆకలి సూచీలో 150వ స్థానానికి దిగజారింది. ఈ అసలు వాస్తవా లను మరుగుపరిచి చంద్రబాబు ‘పీ4’ పథకంతో పేదరికాన్ని నిర్మూలి స్తానని చెప్పటం వృథా ప్రయాస.వాస్తవానికి ఈ పీ4 విధానం చంద్ర బాబు కొత్తగా కనిపెట్టినది ఏమీ కాదు! ఏనాడో గాంధీ ప్రబోధించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతంలో భాగంగా వచ్చినదే. 2013లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే నూతన ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సి బిలిటీ (సీఎస్ఆర్) పథకాన్ని చట్టం రూపంలోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ సంస్థలు రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టులు చేపట్టినా, పెట్టు బడులు పెట్టినా ఓ ప్రాంతాన్ని లేదా మండలాన్ని లేదా గ్రామాన్ని దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ అభివృద్ధి చేయడమే కాదు, ప్రజలను కూడా పేదరికం నుంచి గట్టెక్కించాలి. సింపుల్గా ఇదే పీ4 కాన్సెప్ట్. టాటాలు మొదలుకొని మైక్రోసాఫ్ట్ అధినేతల వరకు అనేక ట్రస్టుల పేరులతో కొన్ని వేల కోట్ల రూపాయల వరకు వివిధ రూపాలలో సామా జిక అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. అయినా దేశ సామాజిక చిత్రంలో మౌలిక మార్పులు జరిగాయా! లేకపోగా దేశ సామాజిక చిత్రపటం మరింతగా మసకబారి పోయింది. ఈ వాస్తవాల నేపథ్యంలో చూసిన ప్పుడు పీ4 పథకంతో పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమేనా? అసలు పీ4 పథకంలో ప్రకటించిన మార్గదర్శకులు ఎవరు? నూతన ఆర్థిక విధానాలలో భాగమైన ప్రైవేటీకరణకు పుట్టిన బిడ్డలే కదా! సహ జంగా ఈ సమాజంలో నెలకొన్న జీవ కారుణ్య సిద్ధాంతాలలో భాగంగా ధనవంతులు పేదవారికి సహాయం చేస్తున్నారు. కానీ చంద్రబాబు అమలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా లాభం పొందిన పెట్టుబడిదారులకు ‘మార్గదర్శకులు’ అని పేరు పెట్టడం అన్యాయం. వివిధ రాయితీల రూపంలో ప్రజల ఆస్తులను చౌకగా కట్టబెట్టిన పెట్టు బడిదారుల చేత సహాయం చేయించి, పేదరికాన్ని నిర్మూలించాలను కోవడం ఎవరి ప్రయోజనాలను కాపాడటం కోసం? సామాజిక వ్యవస్థలో నానాటికీ పెరుగుతున్న ఆర్థిక అసమానతల ఫలితంగా ఉద్య మాలవైపు ఆకర్షితులవుతున్న ప్రజల్ని పేదరిక నిర్మూలన జరుగుతుందనే ఊహాజనిత భ్రమల్లో ముంచడానికి ప్రపంచ బ్యాంకు నిర్దేశిత పథకాల్లో ఒకటైన పీ4 పథకాన్ని ప్రజలపై ప్రయోగించటానికి పూనుకున్నారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ పథకాన్ని కొత్తరూపంలో ప్రవేశపెట్టిందే పీ4 పథకం! ఉత్పత్తి సాధనాలపై ప్రజల యాజమాన్యంలో భాగంగా ‘దున్నే వానికే భూమి’, అటవీ ప్రాంతాల్లో అపారంగా ఉన్న ఖనిజ వనరులపై ఆదివాసులకు పూర్తి హక్కులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పటం, ప్రైవేటీకరణ విధానా లను విడనాడి ప్రభుత్వ రంగంలో అన్ని రంగాల పరిశ్రమలనూ నెలకొల్పడం లాంటి విధానపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాల బాట పడుతున్న ప్రజల్ని ఉద్య మాల బాట వైపు వెళ్లకుండా నిరోధించటా నికి, అంతిమంగా ప్రజలు తమ పట్ల విధేయ తాభావంతో ఉండి తమను నాలుగు కాలాల పాటు అధికారంలో కొనసాగేలా, తమను ప్రజల పాలిట ధర్మ ప్రభువులుగా పొగిడేలా చేసుకోవడానికి ఈ పథకం ప్రవేశపెట్టారన్నది అసలు రహస్యం. ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి, ప్రజల ఓట్లను కొల్ల గొట్టడానికి ఆచరణ సాధ్యం కానీ ‘సూపర్ సిక్స్’ హామీలు ఇచ్చి, ఆ పేరుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నెరవేర్చటంలో తమ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై విసురుతున్న ‘పీ4’ లాంటి మాయా పథకాలను ఈ దృక్కోణంతోనే చూడాలి. ప్రజలను ఆ భ్రమల్లో పడనీయకుండా చైతన్య పరుస్తూ, ప్రజా పోరాటాలను ఉద్ధృతం చేయాలి! – ముప్పాళ్ళ భార్గవ శ్రీసీపీఐ ఎంఎల్ నాయకులు ‘ 98481 20105 -
ముక్కలు చేయడమే మార్గం!
క్రమం తప్పకుండా జరుగుతున్న భారీ ఉగ్ర వాద దాడులు భారత్, పాకిస్తాన్ సంబంధాలను ఘోరంగా దెబ్బతీశాయి. సాధారణంగా, ప్రతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి దాడులు జరుగుతాయి. ఎక్కువకాలం సైనిక నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి, పౌర అధికారంపై మరింతగా నియంత్రణ సాధించాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు లేదా అతని బలగాలు దేశంలో గౌరవాన్ని కోల్పోతున్నప్పుడు ఉగ్రవాద దాడులు చోటు చేసుకుంటాయి. భారతదేశం నుండి సైనిక ముప్పు ఉందన్న ప్రచారం కంటే పాకిస్తాన్ ప్రజలను మరేదీ కలిపి ఉంచదు. పైగా వరదలు, కరవులు, ఉగ్రవాద ఘటనలతో సహా పాకిస్తాన్ లో జరిగే ప్రతిదానికీ భారతదేశంపైనే నిందలు మోపుతూ వస్తారు.భారతదేశం మన పాకిస్తాన్ను నాలుగు ముక్కలు చేయాలని చూస్తోందనీ, దాన్ని రక్షించే ఏౖకైక శక్తి పాక్ సైన్యమే అనీ పాక్ ప్రజలకు తొలి నుంచీ నేర్పించారు. భారత్ సహన పరిమితిని దాటిన ప్రతి ఉగ్రవాద ఘటన తర్వాత, పాకిస్తాన్ సాధారణ వ్యాఖ్యలను పునరావృతం చేస్తుంటుంది. వారి మంత్రులు దీనిని భారతదేశం ప్రారంభించిన ‘తప్పుడు’ ఆపరేషన్ అని, లేదంటే ఇది కశ్మీర్ ‘స్వాతంత్య్ర సమరయోధుల’ పని అని గావుకేకలు పెడతారు. తమ గడ్డపైనే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నామనే ఆరోపణను వారు నిరంతరం తిరస్కరిస్తారు. పైగా ఉగ్రవాదానికి అత్యంత ప్రభావి తమైన దేశం తమదే అని వాపోతుంటారు. అయితే దాదాపు ప్రతి ప్రపంచ స్థాయి ఉగ్రవాద ఘటనకూ పాకిస్తాన్తో సంబంధం ఉందనీ, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులలో అత్యధికులు పాక్లోనే ఆశ్రయం పొందారనీ ప్రపంచానికి తెలుసు.ఎన్నని సహిస్తాం?కథ పునరావృతమవుతుంది. పైగా విసుగు పుట్టిస్తుంది. బహిరంగ అంతర్జాతీయ దర్యాప్తునకు పాక్ వైపు నుంచి ఎప్పుడూ హామీ ఉంటుంది, కానీ ఈ ప్రతిపాదనను ఎవరూ నమ్మరు. ముంబై ఉగ్ర దాడి సూత్రధారులలో ఒకరైన తహవ్వుర్ రానాను అమెరికా ఇటీవలే భారతదేశానికి అప్పగించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ముంబై ఉగ్రవాద దాడులపై ఇంకా దర్యాప్తు చేయవలసి వస్తోంది. ఉగ్రవాద నాయకులపై పాకిస్తాన్ ఎప్పటికీ చర్య తీసు కోదు. ఎందుకంటే వారే పాక్ ప్రధాన ఆస్తులు. పహల్గామ్ ఉగ్ర దాడిపై దర్యాప్తు కూడా దశాబ్దాలుగా నిగూఢంగా ఉండిపోతుంది. దావూద్ ఇబ్రహీమ్ ఉనికిని అది ఎల్లప్పుడూ ఖండిస్తూ వచ్చింది. అయినప్పటికీ ప్రతి ప్రపంచ సంస్థకూ పాకిస్తాన్ లో అతని బహుళ నివాసాల గురించి తెలుసు. దీనికి విరుద్ధంగా, ప్రతీకారం తీర్చు కుంటామని ఇండియా బెదిరిస్తే, వారు అకస్మాత్తుగా తమ భూ భాగంపై ఉగ్రవాద కార్యకలాపాలలో భారతదేశ ప్రమేయం ఉందని ఇష్టారాజ్యంగా అబద్ధాలాడతారు.ప్రజల మద్దతు పొందాలనే ఆశతో, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంపై భారతదేశాన్ని పాక్ బెదిరించడం ప్రారంభించింది. దాని ఆనకట్టలు భారతీయ రక్తంతో నిండిపోతా యని రెచ్చ గొట్టేంత వరకు వెళ్ళింది. చరిత్ర గమనిస్తే, భారత ప్రభు త్వాలు రావల్పిండిని నియంత్రించడంపై ప్రపంచ మద్దతు కోరుతూ పాకిస్తాన్ ఉగ్రవాద దాడులపై తీవ్ర విమర్శ చేస్తూ వచ్చాయి. కానీ అది ఎప్పుడూ పని చేయలేదు. దీనికి విరుద్ధంగా, తరచుగా విరామాలతో కూడిన ఉగ్రవాద దాడులకు పాక్ తలుపులు తీసింది. 2001 అక్టోబర్లో జమ్మూ–కశ్మీర్ శాసనసభపై దాడి, ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో పార్లమెంటుపై దాడి, 2002 సెప్టెంబర్లో అక్షరధామ్పై దాడి, 2003 ఆగస్టులో ముంబై బాంబు దాడులు, ఆ తర్వాత 2005 అక్టోబర్లో ఢిల్లీలో బహుళ బాంబు దాడులు, 2006 జూలైలో ముంబై రైలు దాడులు, 2008 నవంబర్లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి కొన్ని ఉదాహరణలు. బాలాకోట్పై జరిగిన దాడి తర్వాత మాత్రమే భారత్ సందేశం అంతటా వినిపించింది. కానీ సరిహద్దులు దాటి భారత్ చేసిన బాలాకోట్ సర్జికల్ దాడి కూడా పాకిస్తాన్ను నిరోధించడంలో విఫలమైంది. ఎందుకంటే భారత్ దాడిలో సంభవించిన ప్రాణనష్టాన్ని పాక్ దాచగలిగింది. కారణం... హతమార్చబడిన వారు ఉగ్రవాదులు!పెద్ద మార్పు ఉండదు!సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన ప్రభావం ఇస్లామాబాద్కు బాగా తెలుసు. వారి నాయకత్వాన్ని అది భయ పెట్టింది. కానీ, ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని చెప్పడం తప్ప వారికి వేరే పరిష్కారం లేదు. భారతదేశం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని వారు ఇక ఒప్పించలేరు. రెండు దేశాల మధ్య సంబంధాలు శాంతియుతంగా ఉండాలనే ముందస్తు షరతు పైనే ఈ ఒప్పందంపై సంతకం చేశారనేది వాస్తవం. మరోవైపున అఫ్గానిస్తాన్కు భారతదేశం సన్నిహితం కావడం పాకిస్తాన్లో ఆందోళనలను మరింత పెంచింది. ముఖ్యంగా పాకిస్తాన్ తన బలగాలను భారత సరిహద్దుకు తరలించినప్పుడల్లా బలోచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ ఈ అంతరాన్ని బాగా ఉపయోగించు కుంటాయి. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట పాకి స్తాన్ తన సైన్యాన్ని మోహరించి ఉంచినంత కాలం, వారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే భారత్ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే, అది ఏ సైనిక చర్య తీసుకున్నా, పెద్దగా మార్పు ఉండదు. పాక్లో కొత్త ఆర్మీ చీఫ్ వచ్చి తనవంతుగా ఏదైనా చేయాలని భావించే వరకు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి తక్కువ స్థాయిలో మద్దతు ఇస్తూనే ఉంటుంది. తర్వాత, మరొక ఘటన జరుగుతుంది. కథ పునరావృతమవుతూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం నుండి భారతదేశాన్ని రక్షించడానికి ఏకైక పరిష్కారం దాని బాల్కనైజేషన్ మాత్రమే (అంటే ఒక దేశం లేదా ప్రాంతాన్ని బహుళ చిన్న, శత్రు యూనిట్లుగా విభజించే ప్రక్రియ). దీని కోసం, పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమూహాలకు భారతదేశం తన మద్దతును ఇవ్వాలి.హర్ష కక్కడ్ వ్యాసకర్త భారత సైన్యంలో రిటైర్డ్ మేజర్ జనరల్(‘ద స్టేట్స్మన్’ సౌజన్యంతో) -
ఇప్పటికైనా బౌద్ధాన్ని అర్థం చేసుకున్నామా?
‘నా దృక్పథం రాజకీయాల నుంచి కాక మత సంస్కృతి నుంచి అలవడింది.’’ – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హేతువుకు ప్రాధాన్య మిచ్చి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ముందుకు తీసుకొచ్చిన బౌద్ధం ప్రాచీన భారతదేశంలోనే కాకుండా ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రాసంగికతను కలిగివుంది. గౌతమబుద్ధుడు భారతదేశపు మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు. ఆయన తన కాలం నాటికి అమలులో ఉన్న సాంఘిక దుర్నీతినీ; మతం పేరున జరుగుతున్న హింసాకాండ, అమానవీయతనూ ప్రశ్నించాడు. హేతువు పునాదిగా ప్రజాస్వామిక సంస్కృతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేశాడు. బుద్ధుడు క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దికి చెందిన వాడైనప్పటికీ ఆయన బోధించిన సమానత్వ భావన, హేతువాద దృక్పథం, ప్రజాస్వామికతత్త్వం ఈనాటికీ ఎంతో ప్రాసంగికతను సంతరించుకున్నాయి. ఆయన ముందుకు తీసుకువచ్చిన ‘అనాత్మవాదం’, ‘అనిత్యత’, ‘ప్రతీత్య సముత్పాద’ వంటి భావనలు బౌద్ధాన్ని ఇతర మతాల కంటే భిన్నంగా నిలబెట్టాయనవచ్చు. ఈ భావనలు బౌద్ధాన్ని ఒక మతం అనే స్థాయి నుంచి గొప్ప ప్రాపంచిక దృక్పథాన్నిచ్చే తాత్విక స్థాయికి తీసుకెళ్ళాయనవచ్చు. బుద్ధుడి బోధనలలో ముఖ్యమైన ‘అష్టాంగ మార్గం’ మనుషుల వ్యక్తిత్వ వికాసానికి దోహదంజేసే అత్యున్నత మార్గం. సమత, కరుణ, ప్రజ్ఞ, మైత్రి, శీలం అనేవి బుద్ధుని తాత్వికతలోని ప్రధాన అంశాలు. అలాగే బుద్ధుడు వైదిక మతంలో భాగం అని వాదించడం బుద్ధుణ్ణి బ్రాహ్మణ వాదంలో జీర్ణం చేసుకోవాలనే ప్రయత్నం చెయ్యడమే! అటువంటి ఆకాంక్షల ఫలితమే పురాణాల కాలానికి బుద్ధుడిని విష్ణుమూర్తి దశావతారాలలో ఒక అవతారంగా మార్చడమని తెలుస్తోంది. విద్య, విజ్ఞానం, ఆధునిక భావాల పరంగా ఎంతో ముందంజ వేశామని భావిస్తున్న ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా మతమౌఢ్యం పెచ్చరిల్లిపోతోంది. బౌద్ధం రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల పరంగా విస్తృతమైన పరిధి కలిగిన తత్త్వం కాబట్టి సమకాలీన సామాజిక, సాంస్కృతిక వైరుద్ధ్యాలకు బౌద్ధంలో పరిష్కారమార్గాలు వెదకవచ్చు.పండిత అయోతీదాస్, ప్రొఫెసర్ లక్ష్మీ నరసు, డాక్టర్ అంబేడ్కర్ బౌద్ధాన్ని సామాజిక విముక్తి సిద్ధాంతంగా ప్రతిపాదించారు. అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించడాన్ని హిందూమతంలో అంటరానివారనే దళితుల సామాజిక స్థాయిని తిరస్కరించడంగా భావించాడు. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా లౌకికవాదులు, హేతువాదులు, శాస్త్రవేత్తలు అయిన మేధావులు తాము బౌద్ధాభిమానులమని చెప్పుకోవడానికి గర్విస్తున్నారు. ఎడ్విన్ ఆర్నాల్డ్ అన్నట్లు బుద్ధుడు ‘ఆసియా జ్యోతి’ మాత్రమే కాదు ఆయన బోధనల ప్రాసంగికత పెరిగేకొద్దీ బుద్ధుడు ‘ప్రపంచ జ్యోతి’గా పరిణామం చెందుతున్నాడు. అయితే బుద్ధుడిని సమాజం కేవలం అహింసా మూర్తిగా, చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకున్న సన్యాసిగా, లేకపోతే శాకాహారిగా మాత్రమే అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. బుద్ధుడు అహింసావాది అన్నమాట నిజమే... కానీ శాంతిని, న్యాయాన్ని స్థాపించడం కోసం యుద్ధం చెయ్యడంలో తప్పు లేదంటాడు. ఆయన కేవలం ధ్యానం మాత్రమే చెయ్యక ప్రాపంచిక విషయాలపై వివిధ వ్యక్తులతో చర్చించి సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. చాలామంది భావించినట్లు బుద్ధుడు శాకాహారి కాడు. అలాగే ఆయన శాకాహారాన్ని కీర్తించలేదు. క్రతువులలో జంతు వధను ఖండించి, పండితుల భాషగా ఉన్న సంస్కృతం స్థానంలో ప్రజల భాష అయిన ‘పాళీ’ని ప్రతిపాదించి వైదిక సంస్కృతికి ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రవేశపెట్టాడు. నిజానికి బౌద్ధం సంధించిన విమర్శల ఫలితంగానే తర్వాత కాలంలో హిందూమతం తనను తాను సంస్కరించుకుని అహింసనూ, శాకాహారాన్నీ ఆదర్శాలుగా స్వీకరించింది. బౌద్ధ భిక్షువులు సామాజిక కార్యకర్తల వలే బహుజన హితం, బహుజన సుఖం కోసం పనిచెయ్యాలని బుద్ధుడు సూచించాడు. బౌద్ధసంఘంలో రాజుల నుంచి, బానిసల వరకు అందరికీ సమాన హోదాను కల్పించాడు. బౌద్ధసంఘంలో ‘ఉపాలి’ అనే మంగలి కులస్థుడు, ‘జీవకుడు’ అనే వేశ్యాపుత్రుడు, ‘ఆమ్రపాలి’ అనే వేశ్య, రాజవంశీకులైన ‘ప్రసేనజిత్’, రాకుమార్తె ‘విశాఖ’; భర్త, బిడ్డల చేత, సమాజం చేత నిర్లక్ష్యానికి గురైన స్త్రీలు... సమానమైన గుర్తింపును పొందారు. భిన్న సామాజిక వర్గాల మధ్య బుద్ధుడు సామరస్యాన్ని కుదిర్చాడు. ‘విధికుడు’ అనే చర్మకారుడు అమరావతి క్షేత్రానికి కానుకగా ఇచ్చిన పూర్ణకుంభం బౌద్ధంలోని సమతకు చిహ్నంగా మిగిలింది. బౌద్ధంలో దేవుడి స్థానాన్ని నైతికత ఆక్రమిస్తుంది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త గెయిల్ ఆంవెత్ బౌద్ధం అధికారిక మతంగా ఉన్న ప్రాచీన భారత సంస్కృతిని ‘బుద్ధిస్ట్ సివిలైజేషన్’గా పేర్కొన్నారు. ‘భారతీయ ఆత్మను కలిగి ఉన్న బౌద్ధాన్ని దేశం నుంచి వెళ్లగొట్టి భారతదేశం ఆత్మహత్య చేసుకుంద’ని గురజాడ అనడంలో అతిశయోక్తి లేదు. బౌద్ధం అనే గొడుగు కింద ప్రజల్లో సమైక్య భావన ఏర్పడే అవకాశం ఉంది. - ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపరాణి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బుద్ధిస్ట్ స్టడీస్ శాఖలో సీనియర్ ప్రొఫెసర్ (మే 12న బుద్ధ పూర్ణిమ) -
శాంతితోనే స్థిరమైన అభివృద్ధి
ఇరుదేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు కాల్పుల విరమణ ఒప్పందంతో కొంతలో కొంత చల్లబడినప్పటికీ, దక్షిణాసియా అభివృద్ధికి శాశ్వత శాంతి నెలకొనాల్సి ఉంది. దీనికి కావాల్సిన రాజకీయ నాయకత్వ కొరత ఉందన్నది కాదన లేని నిజం. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుండి ఉత్పన్నమయ్యే సీమాంతర ఉగ్రవాద దాడులపై తాను ఎలా స్పందిస్తాను అనే అంశాన్ని భారతదేశం సరికొత్తగా నిర్వచించింది. సింపుల్గా చెప్పాలంటే భారత్ తిరిగి దాడి చేస్తుంది. దీని ప్రకారమే భారత వైమానిక దళం పాకిస్తాన్లోని వివిధ లక్ష్యాలను గురి చూసి కొట్టి తన పనిని పూర్తి చేసింది. పహెల్గామ్లో జరిగిన దారుణమైన, విషాదకరమైన, మత తత్వ ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా, భారతదేశం పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే కాకుండా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడి చేసింది. పాకిస్తాన్పై ఒత్తిడి తేవడానికి అవసరమైన వరుస చర్యలను చేపట్టడం ద్వారా భారత్ ముందడుగువేసింది. దీనిపై రాజకీయ పరంగా దేశంలో విస్తృత స్థాయిలో ఐక్యత ఏర్పడింది.కొత్త యుగానికి నాంది పలకాలి!అయితే, భారతదేశమైనా, పాకిస్తాన్ అయినా తమను తాము తీవ్రంగా గాయపరచుకోకుండా పూర్తి స్థాయి సైనిక యుద్ధాన్ని చేపట్టలేవని, చేపట్టినా దాన్ని కొనసాగించలేవని అన్ని పక్షాలకూ స్పష్టంగా తెలిసిపోయి ఉండాలి. ఇరుదేశాల మధ్య యుద్ధంలో ఓడిపోయిన వారు వాస్తవానికి– భారత్, పాక్ ప్రజలే! ఒక పక్షాన్ని మరొక పక్షం అనుమానించిన ప్రతిసారీ ఈ రెండు దేశాలూ పరస్పర దాడులకు పాల్పడతాయనే అభిప్రాయం ఇప్పుడు స్థిరపడింది. తన భూభాగంలో జాఫర్ ఎక్స్ప్రెస్పై జరిగిన దాడిలో 25 మంది మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పహెల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కార ణాన్ని వివరించింది. అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందనలను పరి శీలిస్తే కొన్ని దేశాలు మాత్రమే ఒక పక్షం కథనాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. సంఘటనలపై భారతీయ కథనానికి ఎక్కువ మంది మద్దతుదారులు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ కూడా తనదైన మద్దతుదారులను కూడగట్టింది.రెండు దేశాల ముందు ఉన్న సవాలు, నిజానికి భారత ఉపఖండం అంతటా ఇప్పుడు ఉన్న సవాలు – గత శతాబ్దంలో ఉనికిలోకి వచ్చిన అనేక దేశాలు కూడా ప్రాంతీయ, దేశీయ శాంతికి, అభివృద్ధికి చెందిన కొత్త యుగానికి నాంది పలికే నాయకత్వాన్ని కనుగొనడమే! విచార కరంగా, దక్షిణాసియాలో అలాంటి రాజకీయ నాయకత్వ కొరత ఉంది. వలసవాదం నుండి విముక్తి పొందినప్పటి నుండి ఈ ప్రాంతం స్వీయ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, గత చరిత్రలతో అంతర్గత పోరాటాల కారణంగా వెనుకబడి ఉంది.పొరుగు సంబంధాలు కీలకందక్షిణాసియా విషాదం ఏమిటంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాలలో చాలా మందికి తమ బండిని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చుననీ, పొరుగువారితో సంబంధాలను మెరుగు పర్చుకోకుండానే అభివృద్ధిని కొనసాగించవచ్చుననీ నమ్మకం ఉంది. గత పావు శతాబ్దంలో భారతదేశపు విశ్వసనీయ ఆర్థిక పనితీరు, తన పొరుగువారితో ప్రబలంగా ఉన్న వివాదాలను పరిష్కరించకుండానే ఎదగడాన్ని భారత్ కొనసాగించగలదని చాలా మంది నమ్మేలా చేసింది. కొంతవరకు, అది సాధ్యమైంది. అయితే, భారతదేశం దీర్ఘకా లిక యుద్ధంలోకి లాగబడితే అది కూడా ఆర్థికంగా దెబ్బతింటుంది. చెలరేగిన ఘర్షణ వాతావరణపు దుమ్ము కాస్తా అణిగి, ‘యుద్ధం పొగమంచు’ నుండి బయటపడిన తర్వాత, రెండు దేశాలలోని రాజకీయ నాయకత్వం ప్రాంతీయ భద్రత అంటే ఏమిటో సుదీర్ఘంగా పరిశీలించాలి. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం ప్రాంతీయ వాతావ రణాన్ని తప్పకుండా నిర్వచించాలి. భూభాగం గురించిన నిరంతర వివాదాల ద్వారా ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి? ప్రతి దేశంలోనూ, ప్రాంతం అంతటా మతపరమైన ప్రాంతీయ విభజనల నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?సరిహద్దుకు ఇరువైపులా గొప్ప వ్యూహకర్తల జ్ఞానం ఉన్నప్పటికీ, నేడు ఏ పక్షమూ ప్రాంతీయ శాంతి, భద్రత కోసం కొత్త చట్రాన్ని నిర్వచించలేకపోయింది. ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2000–2007 కాలంలో చివరిసారిగా ఒక ప్రయత్నం జరిగింది. పాకిస్తాన్ అధ్య క్షుడు పర్వేజ్ ముషారఫ్ కొంతకాలం వారి చొరవతో ముందుకు సాగారు. కానీ ఆయన త్వరలోనే పదవీచ్యుతుడయ్యారు. అప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం శాంతి భద్రతలకు సంబంధించి ‘మన్మోహన్ – ముషారఫ్’ ఫార్ములాను తిరస్కరించింది.ఈ రోజు ఆ ఫార్ములా గురించి ప్రస్తావిస్తే ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే... దీనిని తప్పక ప్రస్తావించాలి. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉంది. జపాన్ను అధిగమించింది. స్వదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, భారత వృద్ధి ప్రక్రియలో లోపాలు ఉన్నప్పటికీ, భారతదేశం అభివృద్ధి చెందడం కొనసాగించడానికీ, ప్రపంచాన్ని అనుకూలమైన నిబంధనలతో నిమగ్నం చేయడానికీ తప్పక అవకాశం ఉంది.నియంత్రణ రేఖే సరిహద్దుభారతదేశం తన సొంత పొరుగు ప్రాంతాన్ని సురక్షితం చేసుకోకుండా అలా చేయగలదని భావించడం చాలా మంది సమకాలీన విశ్లేషకులు, వ్యూహకర్తల ఊహ మాత్రమే! భారత్ పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భారతదేశానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, వారు భారత్ నుండి ఎటువంటి ప్రయో జనాలనూ పొందకపోతే ఈ వృద్ధి వ్యయాలు పెరుగుతాయి. మోదీ ప్రభుత్వం పాటించిన గత దశాబ్దపు భారత విధానం ఏమిటంటే, కష్టాల్లో ఉన్న పొరుగువారిపై భారీ ఖర్చులను విధించడమే. ఇది స్వల్పకాలిక ప్రయోజనాలను అందించవచ్చు కానీ దాని పర్యవస నాలు భారత్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.మేము పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని భారత్ ప్రదర్శించే రాజకీయ ధైర్యం, కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడం గురించిన పాకిస్తాన్ వాక్చాతుర్యానికి చెల్లిపోతుంది. కానీ రెండూ ఎప్పటికీ జరగవు! సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్, మన్మో హన్–ముషారఫ్ ఫార్ములా ముఖ్య ఉద్దేశ్యం అదే! అన్ని ప్రధాన శక్తులు – అమెరికా, రష్యా, చైనా – నియంత్రణ రేఖ వాస్తవానికి అంతర్జాతీయ సరిహద్దు అనే ఆలోచనను సమర్థించాయి. నేడు రెండు దేశాలలోని ప్రముఖులు అలాంటి పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవికత నుండి తప్పించుకునే అవకాశం లేదనీ, ఈ వాస్తవికత అందరికీ పెనుభారంగా మారవచ్చనీ ఇరువైపులా ఉన్న వాస్తవికవాదులకు తెలుసు.సంజయ బారు వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ వ్యవస్థాపకుడు,భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు -
విరాట్ కోహ్లీ (స్టార్ క్రికెటర్) రాయని డైరీ
ఆట ఎన్ని పొరపాట్లనైనా క్షమించేస్తుంది. మళ్లీ మళ్లీ ఆడేందుకు అవకాశం ఇస్తూ ఉంటుంది. కానీ పెళ్లయిన వాడి జీవితంలో ఒక్క పొరపాటుకైనా క్షమాపణ ఉండదు. పోన్లే పాపం, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అని జీవితం అనుకోదు. జీవితం దయ తలచినా, జీవిత భాగస్వామి క్షమాభిక్ష పెట్టదు!ఎవరో తెలియనైనా తెలియని ఒక అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పొరపాటున లైక్ కొట్టినందుకు అనుష్క నా వైపు చూడటమే మానేసింది! తెలియని అమ్మాయికి, తెలియకుండా లైక్ కొట్టడంలో ఉండేది పొరపాటే కానీ మరొకటి మరొకటి ఎందుకవుతుంది?! నా నెత్తి మీద ఏ దేవతో ఆ క్షణంలో కూర్చొని ఉండాలి. ఊరికే ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఆ అమ్మాయి కనిపించింది. ప్రింటెడ్ ర్యాప్ స్కర్ట్, గ్రీన్ టాప్. నా అంతట నేనే ఆ అమ్మాయి ఫొటోకి లైక్ కొట్టానా, లేక లైక్ తనంతటదే వెళ్లి ఆ అమ్మాయి ఫొటో కింద పడిందా తెలియటం లేదు. అసలు ఆ అమ్మాయే గుర్తు లేదు.అమ్మాయి వేసుకున్న ర్యాప్ స్కర్ట్, గ్రీన్ టాప్ గుర్తుండీ, అమ్మాయి గుర్తు లేక పోవటం అనేది ఉంటుందా? ఉండొచ్చేమో! నా నెత్తి మీద దేవతకు ఎంత మహిమ ఉందంటే... సరిగ్గా అనుష్క పుట్టిన రోజుకు మర్నాడే ఇలా జరిగింది. తనదొక రేర్ ఫోటోను వెతికి తీసి, ‘యూ ఆర్ మై లవ్’ అని కవిత్వం రాసి, తనకు బర్త్ డే విషెస్ చెప్పిన కొద్ది గంటలకే... ఆ ఎవరో తెలియని అమ్మాయికి నేను లైక్ కొట్టిన స్క్రీన్ షాట్లను క్రికెట్ అభిమానులు గొప్పగా సెలబ్రేట్ చేశారు.ఆ సెలబ్రేషన్ అనుష్క వరకు వచ్చింది. ‘‘ప్రేమించుకుని కదా పెళ్లి చేసుకున్నాం... ఈ తిక్క వేషాలేంటి?’’ అని అనుష్క నన్ను డైరెక్ట్గా అడిగినా బాగుండేది. తన ముందు ఆరార్లు ముప్పై ఆరు గుంజీళ్లు తీసేవాడిని.పాపభూయిష్ఠమైన నా పొరపాటుకు నివృత్తి, నిష్కృతి రెండూ లభించేవి. తనకు సిక్సర్లంటే ఇష్టం. అందుకే అన్ని గుంజీళ్లు.సిక్సర్లంటే తనకు ఇష్టమే కానీ, నేనంటే ఉండేంత ఇష్టమేమీ కాదు. మిడ్ ఓవర్స్లో స్పిన్ బాల్స్ని ఫేస్ చెయ్యలేక ఔట్ అయి బయటికి వచ్చిన ప్రతిసారీ... ‘‘నాకోసం అదే పనిగా సిక్సర్లు కొట్టేయనవసరం లేదు’’ అని నవ్వేసేది. ఇప్పుడు తనే నా మీద బౌన్సర్లు వేస్తోంది... తన మౌనంతో!అనుష్క మాట్లాడటం లేదు. వామిక నిద్రపోతోంది. అకాయ్కి మాటలు రావటానికి ఇంకా టైమ్ పడుతుంది. అకాయ్ ఒక్కడే ఇంట్లో ఇప్పుడు నా మేల్ ఫ్రెండ్. వాడు నా చెయ్యి పట్టుకుని నడవటానికి, బ్యాట్ పట్టుకుని నాతో ఆడటానికి, బైక్ మీద కాలేజీకి వెళ్లి రావటానికి, మళ్లీ ఎప్పుడైనా అనుష్క నాతో మాట్లాడటం మానేసినప్పుడు.. ‘‘ఏంటి డాడీ అలా ఉన్నారు?’’ అని నన్ను అడగటానికి వాడికి టైమ్ పడుతుంది.రెస్టారెంట్ నుంచి రాగానే అనుష్క నేరుగా పిల్లల గదిలోకి వెళ్లిపోయింది. రెస్టారెంట్ ముందు కార్లోంచి దిగుతున్నప్పుడు ఎప్పటిలా తనకు చెయ్యందించినా, తను నా చెయ్యందుకోలేదు. కనీసం నాకోసం ఆగనైనా ఆగకుండా నన్ను దాటుకుని, నడుచుకుంటూ రెస్టారెంట్ లోపలికి వెళ్లిపోయింది.ఒక్క లైక్ జీవితాన్ని ఎంత ఛిద్రం చేసింది!బాల్కనీలోకి వెళ్లి నిలుచున్నాను. సిటీ అంతా వెలిగిపోతోంది. నాలో మాత్రం చీకటి. ఎందుకు నేనలా చేశాను?!ఆకాశంలో చుక్కలు మిణుకు మిణుకుమంటున్నాయి. ఒక చుక్క అమితాబ్ బచ్చన్. ఒక చుక్క బిల్ క్లింటన్. ఒక చుక్క బరాక్ ఒబామా. ఒక చుక్క బిల్ గేట్స్.ఆ చుక్కల్లో నేనూ ఒక చుక్కనయ్యానా? అనుష్కకు తీవ్రమైన ఆవేదన మిగిల్చినందుకు! రాత్రి రెండు దాటేసినట్లుంది. మెల్లిగా అడుగులు వేసుకుంటూ పిల్లల గదిలోకి వెళ్లాను. వామిక నిద్రపోతోంది. అకాయ్ నిద్ర పోతున్నాడు. అనుష్క నిద్ర పోతున్నట్లుగా ఉంది. తను పడుకుని ఉన్న వైపు వెళ్లి, తన తల పక్కనే నేల పైన మోకాలి మీద కూర్చున్నాను. -
ఫేక్ న్యూస్తో జాగ్రత్త సుమా!
దేశం యుద్ధ పరిస్థితుల్లో కూరుకుపోయిన సమయంలో శత్రువులు మన ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికీ, తమదే పైచేయి అని చెప్పడానికీ అనేక తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. అదే సమయంలో కొందరు భారతీయులూ సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇష్టమొచ్చినట్లు రాశారు. ఇది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగం ఇచ్చిన భావ వ్యక్తీకరణ హక్కును అనుసరించి ప్రతి పౌరుడు తన అభిప్రాయాలను, నమ్మకాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. కానీ దాన్ని దుర్వినియోగపరచడం క్షంతవ్యం కాదు. పహెల్గామ్లో పర్యాటకులను ఉగ్రవాదులు చంపిన నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్పై దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. పాక్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్ను భారత్లో అందుబాటులో లేకుండా నిలిపి వేసింది. పలువురు పాక్ జర్నలిస్టులకు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా నిషేధించింది. తప్పుడు, రెచ్చ గొట్టే, సున్నితమైన మతపరమైన అంశాల కంటెంట్ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేంద్రం 16 పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లపై కూడా నిషేధం విధించింది. ఇందులో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్కు చెందిన యూట్యూబ్ చానల్ కూడా ఉంది. హోం శాఖ సిఫారసు మేరకు డాన్ న్యూస్, జియో న్యూస్, సమా టీవీ, సునో న్యూస్,ద పాకిస్తాన్ రిఫరెన్స్ తదితర యూ ట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆ తర్వాత పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను కూడా నిలిపివేసింది. అలాగే పాక్ సినిమాల ప్రదర్శనపైనా నిషే«దం అమలులోకి వచ్చింది. అలాగే భారత్లోని అనేక వెబ్సైట్లనూ, యూట్యూబ్ చానళ్లనూ ప్రభుత్వం బ్లాక్ చేసింది. అందులో ‘ద వైర్’ న్యూస్ పోర్టల్ ఒకటి. ఇటువంటి వెబ్సైట్ను నిషేధిత జాబితాలో చేర్చడం న్యాయం కాదని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీ డి.రాజా ఖండించారు. ‘ద వైర్’ వంటి వెబ్సైట్ను నిషేధించవలసిన అవసరం లేదు. ఆ పేరుమీద పత్రికా స్వేచ్ఛను నిలిపివేయడం న్యాయం కాదు. జాతీయ సమగ్రత కోసం పహెల్గామ్లో ఉగ్రవాదుల చర్యను ఖండించడం మంచిదే కాని, వైర్ను నిషేధించడం న్యాయం కాదని ‘ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్’ న్యాయవాదీ, ఫౌండర్ డైరెక్టర్ అయిన అపర్ గుప్తా అన్నారు. ఫేక్ న్యూస్ను ప్రచారం చేయడం పరోక్ష యుద్ధంలో భాగం. జమ్మూకశ్మీర్లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్పై సూసైడ్ దాడి జరిగినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఏడు వీడియోలు పరిశీలించి అన్నీ అబద్ధాలే అని తేల్చింది. పంజాబ్లోని జలంధర్పై డ్రోన్ దాడి జరిగినట్లు వచ్చిన వార్త కూడా కల్పితమే అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఓ పాత వీడియోపై కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వివరణ ఇచ్చింది. వాస్తవానికి ఆ క్షిపణి దాడి 2020లో లెబనాన్లోని బీరూట్లో జరిగిన పేలుడు ఘటన అని ప్రభుత్వం పేర్కొన్నది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్... ఆర్మీ కంటోన్మెంట్పై ఫిదాయీ సూసైడ్ దాడి జరగ లేదని చాలా స్పష్టంగా వెల్లడించింది. ఇండియన్ ఆర్మీ పోస్టును పాకిస్తానీ దళాలు ధ్వంసం చేసినట్లు ప్రచారం అయిన మరో వీడియో కూడా ఫేక్ అని ప్రభుత్వం తేల్చింది. భారతీయ సైన్యంలో 20 రాజ్ బెటాలి యన్ అనే యూనిట్ లేనే లేదని ఫ్యాక్ట్ చెక్ పేర్కొన్నది. పాకిస్తాన్లోని ప్రధాన మీడియాతో పాటు కొందరు సోషల్ మీడియాలో భారత ప్రజల్లో భయాందోళనలు కలిగించే లక్ష్యంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేశారు. ఏది వాస్తవమో, ఏదికాదో తేల్చుకోవలసింది మనమే!మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
చట్టం పట్ల న్యాయమూర్తులకే శ్రద్ధ లేదా?!
ఒక కీలకమైన కేసు సందర్భంగా ఛత్తీస్గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ అరవింద్ కుమార్ వర్మల ద్విసభ్య ధర్మాసనం ఇటీవల (2025 మే 5న) చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన తీర్పు మన ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులకు కూడా చట్ట బద్ధ పాలన పట్ల శ్రద్ధాసక్తులు లేవా అనే అనుమానాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఈ కేసు ‘మూలవాసి బచావో మంచ్’ (ఎంబీఎం) అనే ఆదివాసీ సంస్థ మీద ఛత్తీస్గఢ్ ప్రభుత్వం విధించిన నిషేధపు నోటిఫికేషన్ చెల్లదని, దాన్ని కొట్టివేయాలనీ కోరుతూ దాఖలైన పిటిషన్కు సంబంధించినది.‘ఛత్తీస్గఢ్ విశేష్ జన సురక్షా అధినియమ్ – 2005’ (ఛత్తీస్గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం–2005) అనే చట్టం ప్రకారం అక్టోబర్ 30న ఆ నోటిఫికేషన్ విడుదలయింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్య క్రమాలకు వ్యతిరేకంగా ఎంబీఎం నిరంతరంగా ప్రజలను రెచ్చగొడుతున్నదని, ప్రజలలో శాసనోల్లంఘనను ప్రోత్సహిస్తూ, సామాజిక శాంతిని భగ్నం చేస్తూ, రాజ్య భద్రతకు ప్రమాదంగా మారిందని, అందువల్ల నిషేధం విధిస్తున్నామని ఆ నోటిఫికేషన్లో ప్రభుత్వం చెప్పింది. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం ఏదైనా ఒక సంస్థను చట్టవ్యతిరేకమైనదిగా భావిస్తే, ఆ సంస్థపై నిషేధం విధించవచ్చు. ఈ ‘భావిస్తే’ అనే మాట చాలా అస్పష్టమైనదని, ఎవరి మీదనైనా చట్టాన్ని నిష్కారణంగా ప్రయోగించే అవకాశం ఉందని, అందువల్ల ఈ చట్టమే అన్యాయమైనదని, కొట్టివేయాలని సుప్రీం కోర్టులో వేసిన వ్యాజ్యం ఇరవై ఏళ్లు కావస్తున్నా విచార ణకే రాలేదు!ఆ చట్టంలోని సెక్షన్ 2 ‘చట్టవ్యతిరేక కార్య కలాపాలు’ అనే మాటకు ఇచ్చిన నిర్వచనం ఎంత విశాలమైనదంటే అన్ని ప్రజాస్వామిక నిరసనలనూ ఆ మాట కింద చేర్చవచ్చు. సెక్షన్ 3 (2)లో నోటిఫికేషన్లో నిషేధానికి కారణాలు స్పష్టీకరించాలి అంటూనే, తర్వాత వాక్యంలో ‘ఆ వాస్తవం బైట పెట్టడం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని భావిస్తే, ప్రభుత్వం ఆ కారణాలను బైటపెట్టకుండా ఉండవచ్చు’ అని రాశారు. అంటే ఏ కారణమూ చెప్పకుండానే ఒక సంస్థను ‘చట్టవ్యతిరేకమైనద’ని ముద్ర వేసి నిషేధించే అధికారాన్ని ప్రభుత్వం తనకు తానే ఇచ్చుకుంది. ఈ నిరంకుశ, ప్రశ్నాతీత అధికారాన్ని తనకు తాను ఇచ్చుకున్న ప్రభుత్వ చర్యే నిజానికి చట్టవ్యతిరేకమైనది, న్యాయ వ్యతిరేకమైనది. ఈ మితిమీరిన అధికారాన్ని కొట్టివేయ వలసిన న్యాయస్థానాలు దాని వైపే చూడడం లేదు. ఈ చట్టం కింద వందలాది కేసులు పెట్టి, వేలాది మంది ఆదివాసులను సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గి పోయేలా చేస్తుంటే మన న్యాయవ్యవస్థకు చీమ కుట్టిన ట్టయినా లేదు. అంతేకాదు, న్యాయస్థానాలలో ఇంకా విచిత్రా లున్నాయి. అనుచితంగా నిషేధపుటుత్తర్వులు జారీ చేస్తే అడ్డుకోవడానికి చట్టమే రెండు మూడు పరిమితులు విధించింది. ఆ పరిమితులను న్యాయబద్ధంగా అమలయ్యేలా చూడాలని కూడా న్యాయస్థానాలు అనుకోవడం లేదు. నోటిఫికేషన్ వెలువడినప్పటినుంచి పదిహేను రోజుల్లోగా బాధిత సంస్థ తన అభ్యంతరాలు చెప్పుకోవచ్చునని, నోటిఫికేషన్ జారీ అయిన ఆరు వారాలలోగా ప్రభుత్వం హైకోర్టు న్యాయ మూర్తుల స్థాయికి తగ్గని ముగ్గురితో సలహా మండలిని నియమించాలని, బాధిత సంస్థ అభ్యంతరాలను విచారించిన సలహా మండలి మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని, ఆ నివేదికను బట్టి నిషేధం అమలులోకి రావడం గాని, ఉపసంహరించడం గాని జరుగుతుందని సెక్షన్ 5, 6, 7 చెబుతాయి.మూలవాసి బచావ్ మంచ్ విషయంలో ఈ చట్ట నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కారు. అక్టోబర్ 30 నోటిఫికేషన్ను నవంబర్ 8న గెజిట్ విడుదల చేసి, నవంబర్ 18న బహిరంగంగా ప్రకటించారు. అంటే సాంకే తికంగా బాధిత సంస్థ అభ్యంతరాలు చెప్పే హక్కును కొల్లగొట్టారు. అయినా సరే ఎంబీఎం తన అభ్యంతరాలను నవంబర్లో ప్రభుత్వానికి అందజేసింది. తాము అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటు న్నామనేది అబద్ధమని, నిజానికి తాము ఆదివాసీప్రాంతాలలో విద్య, వైద్యం, తాగునీరు వంటి అభివృద్ధి సౌకర్యాలు కల్పించమని కోరుతున్నామని వాదించింది. తాము చట్టవ్యతిరేకంగా ప్రవర్తించడం లేదని, శాసనోల్లంఘనను ప్రోత్సహించడం లేదని, వాస్తవానికి రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ను, ‘పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం – 1996’ను, ‘అటవీ హక్కుల చట్టం–2006’ను ప్రభుత్వం ఉల్లంఘిస్తుండగా, వాటిని పాటించమని కోరుతున్నామని వాదించింది. సలహా మండలి మరిన్ని వివరాలు కావాలని తాత్సారం చేస్తూ, తనకు చట్టం ఇచ్చిన మూడు నెలల కాలం దాటి, మరొక మూడు నెలలు గడిచినా కిమ్మనకుండా ఉన్నది. ఈలోగా నిషేధం పేరిట ఎడాపెడా అరెస్టులు జరిగిపోతున్నాయి. అసలు ఎంబీఎం స్థాపనే ప్రభుత్వ బలగాల చట్టవ్యతిరేక ఆక్రమణలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన శాంతియుత నిరసనల క్రమంలో జరిగింది. 2021 మే 12 ఉదయానికల్లా ‘సిల్గేర్’ అనే గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న పది ఎకరాల పంట భూమిని ఆక్రమించి సీఆర్పీఎఫ్ క్యాంపు నిర్మాణాలు చేశారు. తెల్లవారిన తరువాత వాటిని చూసి ఆ గ్రామస్థులు... ఐదవ షెడ్యూల్, పీసా, అటవీ హక్కుల చట్టాల ద్వారా తమ ప్రాంతంలో ప్రభుత్వమైనా సరే ఏ నిర్మాణం చేయా లన్నా గ్రామసభ ముందస్తు అనుమతి పొందాలి కదా, తమ భూమిని ఎలా ఆక్రమించారని క్యాంపు అధికారులను అడిగారు. పోలీసులు తమకు తెలిసిన ఏకైక భాషలో ఆదివాసుల మీద లాఠీచార్జీ జవాబు ఇచ్చారు. మూడు రోజుల తర్వాత పరిసర గ్రామాల ఆదివాసులందరూ దాదాపు ఇరవై వేల మంది ఆ క్యాంపు ముందు నిరసన ప్రదర్శనకు వచ్చారు. పోలీసులు వారి మీద కాల్పులు జరిపి అక్కడికక్కడే ముగ్గురు ఆదివాసులను చంపేశారు. కాల్పులకు బాధ్యుల మీద చర్య తీసుకునే వరకూ మృతదేహాలను అక్కడి నుంచి కదిలించబోమని ఆదివాసులు చేసిన ఆందోళన నుంచి మూలవాసి బచావో మంచ్ పుట్టింది. సల్వా జుడుమ్ కాలంలో పోలీసు క్యాంపుల్లో తమ కుటుంబాల మీద జరిగిన హత్యాకాండను, అత్యాచా రాలను చూసిన బాల బాలికలు ఇప్పుడు యువతగా ఎదిగి, ఈ నిరాయుధ, శాంతియుత ఆందోళనా రూపాన్ని చేపట్టి ఎంబీఎంను స్థాపించారు.ఆ సంస్థ సిల్గేర్ లో నాలుగు సంవత్సరాలుగా నిరసన శిబిరాన్ని నడుపుతున్నది. మరొక ముప్పై చోట్ల క్యాంపుల పట్ల నిరసన తెలుపుతున్నది. ఈ శాంతి యుత ప్రజా నిరసనలను అడ్డుకోవడానికే ప్రస్తుత నిషేధం. ‘సంస్థ అభ్యంతరాల మీద సలహా మండలి ఇంకా మాట్లాడలేదు గనుక మేం దీనిలో జోక్యం చేసుకోలేం’ అంటూ ధర్మాసనం... సారాంశంలో నిషేధానికీ, నిర్బంధానికీ ఆమోదముద్ర వేసింది. ప్రాసిక్యూటర్ల అబద్ధాలకు, ప్రభుత్వపు చట్ట ఉల్లంఘనలకు, రాజ్యపు దౌర్జన్యా లకు వత్తాసు పలకడమే తమ విధి అని కొందరు న్యాయమూర్తులు అను కోవడమే విషాదం!- ఎన్. వేణుగోపాల్‘వీక్షణం’ ఎడిటర్ -
ఈ ఉద్రిక్తతలు తగ్గే మార్గం
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపైనే కాకుండా, 1971 తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్ పై, అది కూడాపంజాబ్ నడిబొడ్డున ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడులు ప్రారంభించడంతో ఇప్పుడు యుద్ధ ఢంకా గట్టిగా మోగుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ ఒక సైనిక విన్యాస క్రమంలో యుద్ధట్యాంక్ పైకి ఎక్కి, తమపై ఏదైనా భారతీయ ‘సైనిక దురదృష్టకర ఘటన’ జరిగితే, ‘తక్షణ స్పందన’తో దాన్ని ఎదుర్కొంటామని ప్రకటించారు. కానీ భారత్ ప్రతిదాడి చేశాక పాక్ ఆర్మీ చీఫ్ ప్రతిష్ఠ దెబ్బతింది.అసీమ్ మునీర్ అన్నట్లుగా, భారత ప్రతి దాడి నిజంగా ‘సైనిక దురదృష్టకర ఘటనా’? ఏ రకంగా చూసినా, అది నిజం కాదు. ఇది చాలా కచ్చితమైన ఉగ్రవాద నిరోధక దాడి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ, మన ప్రతిదాడి ఉద్రిక్తతలు పెంచేది కాదనీ, పాక్లోని ఏ సైనిక లక్ష్యాన్నీ ‘ఆపరేషన్ సిందూర్’ తాకలేదనీ తెలిపారు. సందేశం స్పష్టంగా ఉంది. పౌరులను, భారత సైన్యాన్ని తాకాలా వద్దా అనే విషయాన్ని పాకిస్తాన్ నిర్ణయించు కోవాల్సి ఉండింది. ఎందుకంటే, భారత్లో ఉగ్రవాద శిబిరాలు లేవు. అయినా సరే, పాక్ సైన్యం ఏకంగా భారతీయ నగరాలపై, జనావా సాలపై, విమానాశ్రయంపై నేరుగా దాడికి దిగింది. తర్వాత ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం.జనరల్ మునీర్ దూకుడుపాక్ సైనిక దాడులకు ఒక రోజు ముందే భారత హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ కసరత్తులకు ఆదేశించింది. భారతదేశం పూర్తి యుద్ధానికి సిద్ధమ వుతోందని ఇది సూచిస్తుంది. అయితే, ఇది నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) లేదా నేషనల్ సర్వీస్ స్కీమ్(ఎన్ఎస్ఎస్) వంటి స్వచ్ఛంద సంస్థలను మాత్రమే సమీకరించే రక్షణాత్మక చర్య. జాగ్రత్తగా చేపట్టిన ఈ ప్రయత్నాలన్నింటికీ భిన్నంగా, పాకిస్తాన్ చేపట్టిన సైనిక దాడి ఆ దేశానికి ఏ ప్రయోజనమూ కలిగించలేదు. జనరల్ మునీర్ దూకుడు మీద ఎటువంటి సందేహం లేదు. ఉద్దేశపూర్వకంగా మతతత్వ రంగు పులుముతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడికిముందు ఇస్లామాబాద్లో ఏప్రిల్ 18న జరిగిన ఒక కార్యక్రమంలో ‘రెండు దేశాల సిద్ధాంతం’పై ఆయన చేసిన ఆవేశపూరిత ప్రసంగం భారతదేశాన్ని రెచ్చగొట్టింది. ఉగ్రదాడిపై గట్టి చర్యకు దిగాలనే దృఢ సంకల్పాన్ని భారత్కు కలిగించింది.మునీర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు దాదాపు 66 శాతం పెరిగి, తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఎంతోమంది అనుచరు లున్న మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను, ఆ పార్టీ నేతలను పాక్ సైనిక వ్యవస్థ జైలులో పెట్టించింది. మాజీ ఐఎస్ఐ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్నూ, తన సొంత ప్రజలపై కాల్పులు జరప డానికి నిరాకరించిన మరో జనరల్తో సహా మరి కొందరు సీనియర్ అధికారులనూ జైల్లో పెట్టింది. మునీర్ తన ప్రతిష్ఠను తానే చెరుపుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు, ఐఎస్ఐ డీజీగా ఉన్న తనను అమర్యాదగా బయటకు నెట్టివేయడం తనకు జరిగిన ఘోరావమానంగా మునీర్ భావించారు. దాంతో సరైన అవకాశం కోసం చాలా కాలం వేచి ఉండి చివరకు కొరడాను ఉపయోగించారు.బాలాకోట్ సర్జికల్ దాడులు జరిగినప్పుడు పాక్ స్పందన సంయమనంతో ఉండింది. అప్పుడు పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ బాజ్వా పూర్తి భిన్నమైన మనిషి. ఆయన ఇండియాతో వాణిజ్యసంబంధాలను కోరుకున్నారు. కానీ ఇప్పుడు భారత్– పాక్ ఘర్షణ భిన్న స్థాయికి చేరుకుంది.పట్టించుకునే స్థితిలో లేని ప్రపంచంవిస్తృత ప్రాంతీయ సంఘర్షణను రెచ్చగొట్టవద్దని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ భారతదేశానికి సలహా ఇచ్చారు. అలా రెచ్చగొట్టిన పక్షంలో చైనా జోక్యం చేసుకోవచ్చనే హెచ్చరిక దీంట్లో ఉండవచ్చు లేదా ఈ ప్రకటనకు పెద్దగా అర్థం ఏమీ ఉండకపోవచ్చు. కానీ, అగ్రశ్రేణి దేశాల నాయకత్వంలో ఉన్న గందరగోళం కనివిని ఎరుగనిది. తూర్పున, మాస్కో మరింత దారుణమైన ఇబ్బందుల్లో ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు మద్దతు ఇచ్చిన తర్వాత, తన వైఖరిని కాస్త సవరించి మధ్యవర్తిత్వం అందించడానికి ప్రయత్నించారు. ఇది ఢిల్లీకి ఏమాత్రం నచ్చదని క్రెమ్లిన్ కు తెలుసు. కానీ క్షిపణుల భారీ సమూహాన్ని మనకు రష్యా పంపడం ప్రోత్సాహకరంగా ఉంది. అయితే రష్యన్ సైనిక భుజం ఇప్పుడుఅందుబాటులో లేదు. ఆర్థిక మాంద్యం, తీవ్రమైన అంతర్గతఇబ్బందులతో పోరాడుతున్న యూరోపియన్ యూనియన్ సంయ మనం వహించాలని ప్రకటించింది. ఇజ్రాయెల్, భారతదేశం పట్ల క్రియాశీలంగా, బలంగా సానుభూతి చూపుతున్నప్పటికీ, గాజాలో గందరగోళాన్ని చూస్తే ఇజ్రాయెల్ ఇక్కడ నిర్వహించే పాత్రచాలా తక్కువేనని చెప్పాలి. మొత్తం మీద, ప్రపంచం ఈ యుద్ధాన్ని పట్టించుకునే స్థితిలో లేదు.ఇప్పుడు ఇరు దేశాల సైనిక ఘర్షణను తగ్గించడానికి చైనా ప్రభుత్వం గనక పూనుకుంటే అదొక పరిహాసం అవుతుంది. పాకిస్తాన్లో చైనా ప్రాబల్యం నిస్సందేహంగా ఉందనేది జగమెరిగిన సత్యం. మరోవైపున చైనానే పాకిస్తాన్ యుద్ధానికి నిధులుసమకూర్చే అవకాశం ఉంది. దేశాలు చాలా అరుదుగా హేతుబద్ధంగా వ్యవహరిస్తాయి. అలా సమకూర్చిన నిధులు వేరే విధంగా మళ్లే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరమని ఢిల్లీకి పూర్తిగా తెలుసు. ఇరు దేశాలు ఏం చేయొచ్చు?అయితే, ఇప్పుడు కూడా ఆశ ఉంది. అంగీకరించని నిజం ఏమిటంటే– భారతదేశం, పాకిస్తాన్ తమ సైనిక చర్యల విషయంలో అనేక పాశ్చాత్య దేశాల కంటే గతంలో చాలా పరిణతితో వ్యవహరించాయి. గత మూడు యుద్ధాలలోనూ ఏవీ పౌర లక్ష్యాలపై పెద్ద ఎత్తున బాంబు దాడి చేయలేదు. భారతదేశ క్షిపణి పాకిస్తాన్ ను తాకినప్పుడు, సైన్యం ప్రతిస్పందన సాపేక్షంగా తేలికగా ఉంది. ప్రస్తుతానికి, రెండు వైపులా సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ మాట్లాడుతున్నారు. అది ఒక ఆశాజనకమైన సంకేతం. ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీమ్ మాలిక్ను పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా నియ మించడం కూడా అంతే. రెండు దేశాల నిఘా సంస్థల అధిపతులు మాట్లాడుకోవాలని నిర్ణయించుకుంటే, అది పెద్ద విషయమే.ఉపఖండం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి రెండు దేశాలు ఉమ్మడి చొరవను ప్రకటించవచ్చు. పాకిస్తాన్ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రవాద ప్రేరేపక దేశం అనే ఆరోపణనుపదే పదే ఎదుర్కొంటున్నందున ఇదేమీ అంత అసాధ్యమైనది కాదు. ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాలు ప్రస్తుత పరిస్థితుల్లో సాగేలా లేవు. కాబట్టి, పాత్రధారులు, సూత్రధారులతో సహా ఉగ్ర వాదానికి సంబంధించిన ప్రతిదానినీ దెబ్బతీయడమే ఏకైక ఎంపిక. ఇది ప్రమాదకరం. మొత్తంగా చివరి పాఠం మాత్రం ఇదీ: మీ సొంత యుద్ధాలను మీరే చేసుకోవాలి. ‘ఆపరేషన్ సిందూర్’ ఇప్పుడే దాన్నే తెలియజెప్పింది.-వ్యాసకర్త డైరెక్టర్ (రిసెర్చ్), సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ ‘ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-తారా కార్థా -
Bhimireddy Narasimha reddy రైతాంగ విప్లవ వీరుడు
ఆయన పేరు వినగానే వీర తెలంగాణ(Telangana) రైతాంగ సాయుధ పోరాట స్మృతులు ఉప్పెనలా ఎగిసి పడతాయి. ఆయనే కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహా రెడ్డి (బీఎన్) (bhimireddy narasimha reddy ) భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం జరిగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయుధం చేబూని ఉద్యమాన్ని నడిపిన నాయకులలో కామ్రేడ్ బీఎన్ ఒకరు. ఆయన 1922లో నేటి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం, కర్విరాల కొత్త గూడెం గ్రామంలో ఓ భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. అయినా రైతాంగ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. హైదరాబాద్ సంస్థానానికి తెలంగాణలో 2,600 మంది జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్ముఖ్లు ఉండేవారు. వీరి అధీనంలో 10 వేల గ్రామాలు, కోట్లాది ఎకరాల సాగుభూమి ఉండేది. ప్రజల్లో అత్యధికులు పెత్తందారీ భూస్వాముల కింద వెట్టిచాకిరీ చేసి బతకవలసి ఉండేది. ఈ వాతావరణం రైతు కూలీలలో అసంతృప్తిని రగుల్కొల్పి ఉద్యమానికి దారి తీసింది.చదవండి : వెయిటర్ టు కరోడ్పతి: కె.ఆర్. భాస్కర్ ఇన్స్పైరింగ్ జర్నీకమ్యూనిస్టు పార్టీ స్ఫూర్తితో ఎర్రజెండా నీడన గ్రామాలలో గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. శత్రువు మూకలను ఎదిరించడానికి ‘గుత్పలసంఘాలు’ ఏర్పడ్డాయి. పాత సూర్యాపేట, దేవరుప్పల, ఆలేరు; అలాగే కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అనేక ప్రాంతాలలో బీఎన్ నిజాం రైఫిల్లను ఎదిరించి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. ఆయన ఆధ్వర్యంలో రావుల పెంట, కోటపాడు, చివ్వెంల గ్రామాలలో జరిగిన దాడుల ద్వారా సేకరించిన ఆయు ధాలతో పోరాటం ముందుకు సాగింది. 1947 అధికార మార్పిడి తరువాత ఇటు నిజాం సైన్యాలతో, అటు యూనియన్ సైన్యాలతో తలపడవలసి వచ్చింది. దళాలను మైదాన ప్రాంతాల నుండి అడవి ప్రాంతాలకు మలిపి గోదావరి పరివాహక ప్రాంతంలో నదికి రెండు వైపుల సుమారు 200 గ్రామా లలో ఉద్యమాన్ని విస్తరింప జేశారు బీఎన్. చదవండి: Operation Sindoor సలాం, హస్నాబాద్!1946 నుండి 1951 అక్టోబర్ వరకు విరామం ఎరుగక జరిగిన ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చివరగా ఆయుధం కిందకు దించింది ఆయనే. రెండుసార్లు సూర్యాపేట నుండి రాష్ట్ర శాసనసభకు, మూడు సార్లు మిర్యాలగూడ నుండి భారత పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై ప్రజల హక్కులపై, సమస్యలపై చట్టసభలలో తన గళాన్ని వినిపించారు. ఒకానొక దశలో స్వయంగా సీపీఎం (బీఎన్) పార్టీని స్థాపించి దానిని తరువాత ఎమ్సీపీఐలో కలిపారు.– వనం సుధాకర్ ఎమ్సీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బీఎన్ రెడ్డి వర్ధంతి -
పూర్తిస్థాయి యుద్ధమే వస్తే...
పాకిస్తాన్ దుశ్చర్యల కారణంగా ‘ఆపరేషన్ సిందూర్’ను భారత్ అనివార్యంగా చేపట్టింది. అయితే దీనికి ప్రతి చర్యగా పాకిస్తాన్ ఉత్తర, పశ్చిమ భారత్లలోని 15 లక్ష్యా లపై దాడికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను దీటుగా ఎదుర్కొని పాక్ ప్రయోగించిన మిస్సైళ్లను కూల్చివేసింది. అలాగే పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ లక్ష్యంగా చేసుకోవడంతో లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నిర్వీర్యమయ్యింది. భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాలనే లక్ష్యంచేసుకుని ఆపరేషన్ సిందూర్ను చేపట్టింది. కానీ పాక్... తన పౌరులపై దాడి చేసినట్లు దుష్ప్రచారం మొదలు పెట్టింది. నిజానికి పాకిస్తానే సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరిపి 16 మంది భారత పౌరులను పొట్టన పెట్టుకుందని విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని ప్రకటించడం గమనార్హం.పాక్ ఆక్రమిత కశ్మీర్తో సహా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై భారత్ దాడి చేయడంతో ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ విచ్చ లవిడిగా కాల్పులు ప్రారంభించింది. ఈ దాడిలో అమాయకులైన సరిహద్దు గ్రామాల ప్రజలు చని పోతున్నారు, గాయపడుతున్నారు. శ్రీనగర్, జమ్మూల లెఫ్టినెంట్ గవర్నర్లు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి పాకిస్తాన్ దుశ్చర్యలు దానికి మరిన్ని కష్టాలు తీసుకువస్తాయి తప్ప పరిస్థితి సద్దు మణిగే అవకాశం లేదు. ఈ దాడుల్లో జైష్ ఏ మహ మ్మద్కు చెందిన మౌలానా మసూద్ అజార్ కుటుంబ సభ్యులు చనిపోవడంతో అతడు ఆగ్రహావేశాలతో రగిలిపోతూ మన ప్రధానికి ఒక హెచ్చరిక లేఖను పంపాడు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ తిరిగి తన పరువును నిలబెట్టుకోవడం కోసం మూడు స్థాయి లలో భారత్పై దాడి చేస్తోంది. ఇవి: ఒకటి, భారత సరి హద్దు ప్రాంతాల్లో తీవ్ర చర్యలు చేపట్టడం, రెండు, భారత్పై ఆక్రమణ చర్యలకు పూనుకోవడం, మూడు, ప్రతీకారంతో ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడం.గతంలో ఈ ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కోవడానికి మాత్రమే మనం వ్యూహాన్ని రచించేవాళ్ళం. అయితే గత కొన్ని దశాబ్దాలుగా మన వ్యూహం కూడా మారింది. రాజ్యాంగ అధికరణ 370ను రద్దు చేయడంతో కశ్మీర్లో 90 శాతం తీవ్రవాదం తగ్గిపోయింది. అక్కడ సాధారణ జనజీవన స్రవంతి నెలకొంది. దీనిని ఈర్ష్యతో, పగతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. అందుకే కొత్తగా ఉగ్రదాడులకు తెరలేపింది. ఈసారి జరిగిన దాడులకు ఇజ్రాయెల్ తరహాలో భారత్ ప్రతిస్పందించింది. భారత్ తన యుద్ధతంత్రం మార్చి దౌత్యపరంగా, ఆర్థికంగా, సాంకేతికంగా, మానసికంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అంతర్జాతీయ సమాజంలో పాక్ను ఒక ఉగ్రవాద దేశంగా నిరూపించడంలో కొంత విజయం సాధించగలిగింది. 53 దేశాలు భారత్కి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతు తెలియజేయడం విశేషం. అమెరికా పాత్ర పాకిస్తాన్, భారత్ల విషయంలో గోడ మీద పిల్లిలా కనిపిస్తోంది. ఇదే మంచి అవకాశంఈ సమయంలో పాకిస్తాన్ ఏ ఒక్క చిన్న పొర పాటు చేసినా అది పూర్తిస్థాయి యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఉగ్రవాద స్థావరాలకు నెలవుగా మారిన పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అవుతుంది. అయితే యుద్ధం తలెత్తితే చైనా కచ్చితంగా పాకిస్తాన్కు సహాయం చేస్తుంది. కారణం భారత్ను చైనా చిరకాల శత్రువుగా భావించడం. అలాగే బంగ్లా దేశ్ను మతం పేరుతో పాక్ దగ్గర తీసుకునే అవకాశం లేకపోలేదు. అంటే యుద్ధం వస్తే భారత్ మూడు వైపుల నుంచి ముప్పు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. కేవలం పంజాబ్, రాజస్థాన్, కశ్మీర్, గుజరాత్ రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు కూడా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారమైన ‘చికెన్ నెక్’ లేదా సిల్గురి కారిడార్పై చైనా ఎప్పటి నుంచో కన్ను వేసిన విషయం గుర్తుంచుకోవాలి. భారత్పై అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పాక్ పదేపదే హెచ్చరిస్తోంది. ఇదే జరిగితే భారత్కు ఎక్కువ నష్టం కలగకపోవచ్చు కానీ పాకిస్తాన్ ‘మరుసటి రోజు సూర్యోదయం చూడదు’ అనే మాట అతిశయోక్తి కాదు. మనం అణ్వాయుధాల విషయంలో ‘మొదట మేం ప్రయోగించం’ అని చెప్పాము గాని ‘ఇతర దేశాలు ప్రయోగించినా మేం ప్రయోగించం’ అని ఎప్పుడూ చెప్పలేదు. ప్రపంచంలో నాలుగవ రక్షణ శక్తిగా ఉన్న భారతదేశం అన్ని రకాలుగానూ పాకి స్తాన్ను ఎదుర్కోగలుగుతుంది. పౌరులు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించి, అనుమానాస్పదమైన సంఘటనలను ప్రభుత్వ యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తెలియచేయాలి. అవసరమైతే కదనరంగంలో కాలు పెట్టాలి. అప్పుడే ఉగ్రవాదంపై చేస్తున్న పోరులో విజయం సాధించ గలుగుతాం.మేజర్ (రిటైర్డ్) శ్రీనివాస్ వ్యాసకర్త అంతర్జాతీయ వ్యవహారాలు, రక్షణ రంగ నిపుణులు -
‘కగార్’పై జనాంతిక ఆలోచనలు
కొన్ని విషయాలు సున్నితంగా ఉంటాయి. విషయాలు పూర్తి బహిరంగమైనవే. అందు గురించిన చర్చలు హోరాహోరీగా సాగినవే. కానీ పరిస్థితులు ఒక దశ నుంచి ఒకానొక దశకు మారినపుడు అంతా సున్నితం అవు తుంది. ‘ఆపరేషన్ కగార్’ సందర్భంగా ఆపరేషన్ విషయాలు కాదుగానీ నక్సలైట్ల గురించి, నక్సలిజం గురించిన చర్చ సున్నితంగా మారింది. పక్షం రోజులకు పైగా సాగుతున్న కర్రె గుట్టల ఉదంతం, ఎప్పటినుంచో జరుగుతున్న ఆ చర్చకు ఒక తక్షణ లక్షణాన్ని తీసుకు వచ్చింది. ఇది సున్నితం కావటానికి కారణం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన ‘ఆపరేషన్’ను ఒక భీషణ సమరంగా మార్చటం కాదు. అందుకు నేపథ్య పరిస్థితులు ఇదమిత్థంగా ఫలానా అప్పటి నుంచి మొదలయ్యాయని చెప్పలేముగానీ, సుమారు మూడు దశాబ్దాలుగా కావచ్చు. అవి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక మాత్రం తీవ్రం కావటం మొదలైంది.ప్రస్తుత ప్రభుత్వం తన నక్సలైట్ వ్యతిరేక చర్యలకు ‘ఆపరేషన్ కగార్’ అనే పేరు పెట్టింది. ‘కగార్’ అనే హిందీ మాటకు నిఘంటు అర్థం ‘అంచు’ లేదా ‘చివరి స్థితి’, ‘చివరి దశ’ అని. రాజకీయ అర్థం ‘అంతిమ దాడి’ అని! ఇది ఇతరుల నిర్వచనం కాదు. నక్సలైట్లను, నక్సలిజాన్ని 2026 మార్చ్ చివరి నాటికి అంతం చేసి తీరగలమని హోంమంత్రి అమిత్ షా పదేపదే ప్రకటిస్తున్నారు. అది సాధ్యమా కాదా అన్నది కాదు ఇక్కడ చేస్తున్న ఆలోచన. ఈ సందర్భాన్ని పురస్క రించుకుని, సుమారు 57 సంవత్సరాలుగా సాగుతున్న నక్సలైట్ ఉద్యమాన్ని పలువురు సమీక్షిస్తుండవచ్చు. అందులో భాగంగా, పైన ప్రస్తావించిన ఇటీవలి మూడు దశాబ్దాల కాలాన్ని కూడా. అంటే నక్సలిజం బలహీనపడుతూ వస్తున్న మూడు దశాబ్దాలను!ఎముకలు మెడలో వేసుకోని కాంగ్రెస్సూటిగా చెప్పుకోవాలంటే, మొదటి సగకాలం బలంగా సాగిన ఉద్యమం, తర్వాత సగకాలం నుంచి బలహీనపడుతూ వస్తున్నది. ఆ బలహీనతలు నాలుగు విధాలు. ఒకటి – సైద్ధాంతికంగా. రెండు – నాయకత్వ పరంగా. మూడు – ఉద్యమ నిర్వహణలో. నాలుగు – జనాదరణ విషయమై! ప్రభుత్వ అణచివేతలు ఎప్పుడూ ఉన్నవే. అణచివేతకు ఆరంభం తెలంగాణ రైతాంగ పోరాట కాలంలోనే జరిగినపుడు నక్స లిజం తర్వాతి కాలంలో అంతకు భిన్నంగా ఉండగల ఆస్కారమే లేదు. పైగా 1948కి 1968కి మధ్యకాలం 20 సంవత్సరాలు మాత్రమే. అప్పటినుంచి మరో 20 ఏండ్లు గడిచేసరికి నక్సలైట్ ఉద్యమ క్షీణతకు అంకురార్పణ జరిగింది. గమనించదగినదేమంటే, ఆ కాలమంతా పాలించింది బీజేపీ కాదు... కాంగ్రెస్. కొన్ని రాష్ట్రాలలో ఇతర పార్టీలు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం రాసుకుని, చట్టాలు చేసుకుని, ప్రణాళికలు రూపొందించుకుని, ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటించుకున్నప్పటి నుంచి అన్నీ కపటమైన రీతిలో అరకొరగానే అమలయ్యాయి. అందుకే 1947 నుంచి 20 ఏండ్లయే సరికి నక్సలైట్లు అవతారమెత్తారు. అన్ని మలుపులూ 20–20–20 గానే కనిపిస్తు న్నాయి. అదొక విచిత్రం. ‘ఆపరేషన్ కగార్’ తరహా మాటలను కాంగ్రెస్ ఉపయోగించ లేదు, బీజేపీ ఉపయోగిస్తున్నది. చేతలు అవే, మాటలు వేరు. మాటలు వేరవటానికి మంచి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్కు 1885 నుంచి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అందులో సామాజిక సమ్మిళితత్వం, ఉదారవాద మధ్యే మార్గం, కొంత అభ్యుదయ ధోరణి, దేశ వ్యాప్తమైన జాతీయత వంటివి ఉన్నాయి. అవి కాలం గడిచినకొద్దీ బలహీనపడుతూ అనేక అవలక్షణాలు ప్రవేశించినా, కనీసం ఎము కలను మెడలో వేసుకునే ధోరణి ఇంకా రాలేదు. ఆ కారణంగా, నక్సలిజం వెనుక పేదరికం ఉన్నమాట నిజమనీ, అది కేవలం శాంతి భద్రతల సమస్య కాదనీ, పేదల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయ గలమనీ మాటలు, ప్రకటనల రూపంలో చెప్పటం ఎన్నడూ మాన లేదు. అణచివేతలకు సాయుధబలాల ఉపయోగమైతే యథావిధిగా సాగించారు గాని, ‘కగార్’ తరహా ‘అంతిమ దాడి’ అనకుండా జాగ్రత్తపడ్డారు. పౌరహక్కుల సంస్థలను అనేక ఇబ్బందులకు గురిచేసినా, వారికి ‘అర్బన్ నక్సల్స్’ అనే ముద్ర వేయలేదు.నాగరిక, ప్రజాస్వామిక, ఆధునిక సమాజాలలో ఉదారవాద, ప్రగతిశీల భావనల సంప్రదాయం గురించి తెలిసిందే. ముఖ్యంగా రినైజాన్స్, ఫ్రెంచ్ విప్లవం, పారిశ్రామిక విప్లవం, బ్రిటన్లో రాజ్యాంగ ఆవిర్భావ కాలాల నుంచి ఉన్నత తరగతులపై, మధ్యతరగతిపై ఈ ప్రభావాలు మొదలయ్యాయి. ఈ వర్గాలు ప్రగతిశీలమైనవేగానీ, వ్యవస్థలో సంస్కరణలను కోరటం మినహా వ్యవస్థలను కూలదోయా లనేవి కావు. ఆ పరిమితులను తెలిసినందువల్లనే ఇక్కడ పౌర హక్కుల సంస్థల పాత్రను కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీసం ఒక మేర గౌరవించటం, ఒకోసారి వారిని సంప్రదించటం చేస్తుండేవి. ఆ ధోరణి గత పదేళ్లుగా ఎట్లా మారిందో కనిపిస్తున్నదే. ఇది అంతి మంగా వ్యవస్థకు మేలు చేసేది కాదని ప్రభుత్వం గ్రహించవలసిందే తప్ప ఎవరూ చెప్పగల స్థితి కనిపించటం లేదు.మారిన సమాజ ధోరణులుఉద్యమాలకు ఎగుడు దిగుడులు సహజమేగానీ, నక్సలైట్ ఉద్యమం పైన చెప్పిన నాలుగు బలహీనతలలో దేని నుంచి కూడా నిజమైన అర్థంలో బయటకు రాలేక పోయింది. లేనట్లయితే, వారు కర్రె గుట్టల సందర్భంలో ఈ విధంగా చిక్కుకు పోవటం, చర్చల కోసం పది రోజుల్లో నాలుగుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయటం, తెలంగాణ ప్రభుత్వాన్ని కోరటం, పౌర హక్కుల సంస్థలను కదలించేందుకు ఇంతగా ప్రయత్నించటం వంటి పరిస్థితులు ఏర్పడేవి కావు. ఇంత జరుగుతున్నా సమాజం నుంచి ఒకప్పటివలె స్పందనలు లేవు. ప్రస్తుత తరాలు వివిధ కారణాల వల్ల మారిపోయాయి. వారి దృష్టి ఇప్పుడు తమ కెరీర్పై, ఇతర అంశాలపై ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఒకప్పుడు ఉద్యమానికి పెద్ద బలం. ఇపుడు కొద్ది ప్రాంతాలలోని కొంతమంది ఆదివాసీలు మాత్రం స్థానిక పరి స్థితులనుబట్టి నక్సలైట్లతో కదులుతున్నారు. స్వయంగా ఆదివాసీలైన ప్రజాప్రతినిధులు గతంలో కన్నా ఎక్కువగా స్వప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల వెంట ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, వెనుకటి తరాలకు ఉద్యమం పట్ల గురి తప్పి నిరాశ ఏర్పడగా, కొత్త తరాలకు ఒక అగాథం వచ్చి కొత్త ప్రపంచంలో తమ జీవితాలను వెతుక్కుంటున్నారు. ఒకపుడు మధ్యతరగతిలో గణనీయమైన భాగానికి ఆదర్శవాదాలు ఉండేవి. అది సోవియెట్ యూనియన్కు, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు, విప్లవకారులకు, సాహిత్య–కళాకార్యకలాపా లకు పచ్చని కాలం. ఆ తరహా మధ్యతరగతి ఇపుడు పిడికెడుగా మిగిలింది. వామ పక్షాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.నక్సలైట్లకు కొత్త రిక్రూట్మెంట్లు తగ్గటం ఎప్పటినుంచో ఉన్నది. ఎన్కౌంటర్లలో ఒకపుడు ఒకరు చనిపోయినా వార్తలు, ప్రజలలో చర్చలు ఉండేవి. ఇపుడు చాలామంది చనిపోవటం వరుసగా జరిగితే తప్ప వార్తలు, చర్చలు కనిపించటం లేదు. మరొకవైపు సిద్ధాంతాలు, పోరాట పద్ధతులు, సంస్థ నిర్మాణాలు, నాయకత్వాలు ప్రస్తుత ఆధునికమైన, బలమైన ప్రభుత్వ వ్యవస్థలను ఎదుర్కొనగల విధంగా ఉన్నాయనే అభిప్రాయం వారి సానుభూతిపరులలోనైనా ఉందా అన్నది అనుమానమే. పౌరహక్కుల సంఘాల స్పందనలు సైతం స్వీయ సంశయాల మధ్య మందకొడిగానే కనిపిస్తున్నాయి. నక్సలైట్లు, నక్స లిజం భవిష్యత్తు అగమ్యగోచరం కావటానికి వెనుక ఈ పరిస్థితులు, దీర్ఘకాలిక పరిణామాలు అన్నీ ఉన్నాయి.విషయాన్ని జనాంతికంగా చర్చించుకోవటం ఎందుకంటే, ఒక వైపు పేదరికం, పీడన కొనసాగుదల, ధనిక–పేద తారతమ్యాల పెరుగుదల అనే వాస్తవ స్థితి ఎంత కనిపిస్తున్నదో, ఆ పరిస్థితులను మార్చే సంస్కరణల కోసం లేదా కొత్త వ్యవస్థ ఆవిష్కరణ కోసమని చెప్పేవారు విఫలం కావటం కూడా అంత కనిపిస్తున్నది. ఈ విష యాలు ముఖ్యంగా ‘కగార్’ వంటి సందర్భంలో దాపరికం లేకుండా మాట్లాడటం సున్నితమైనదే!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పాక్ను ఇంకెలా దెబ్బ కొట్టాలంటే...
అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ తన స్వరాన్ని గట్టిగా వినిపించాలి. పొరుగు దేశానికి భూగోళం, చరిత్ర, అర్థశాస్త్రాలకు సంబంధించిన దిమ్మతిరిగే గుణపాఠాలు చెప్పాలి. పక్క దేశం హింస, నేరం, రక్తపాతాలను తనకు ఎగుమతి చేస్తూ ఉంటే ఏ దేశం కూడా మౌనంగా చూస్తూ ఉండి పోలేదు. మొదటగా పాకిస్తాన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాలి. ఆ దెబ్బ దాని ఆర్థిక నవనాడులూ కుంగిపోయేలా ఉండాలి. దేశ ఆర్థిక వ్యవస్థే టెర్రర్ నెట్వర్క్కు వెన్నెముక లాంటిది. పాకిస్తాన్ పెంచి పోషించే టెర్రరిస్టులకూ ఇది వర్తిస్తుంది. యూరోపియన్ యూనియన్ పాక్తో సహా కొన్ని దేశాలకు వాణిజ్య రంగంలో ప్రత్యేక ప్రాధాన్య హోదా కల్పించింది. అలాగే, టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశాలను శిక్షించడానికి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) ఉంది. అలాంటి దేశాలను గుర్తించి ‘గ్రే లిస్ట్’ అనే జాబితా తయారు చేస్తుంది. ఇందులో చేర్చిన దేశాలకు ఆర్థిక సాయం నిలిపి వేస్తారు. పాక్ను గ్రే లిçస్టులో చేర్చేలా ఒత్తిడి చేసి దానికి వాణిజ్య రాయితీలు అందకుండా చేయాలి. అసలైన పీడ మరొకటి ఉంది. దీన్ని వదిలించడా నికి యూఎన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ఆఫీస్ (యూఎన్ఓడీసీ) నివేదికలను ఉపయోగించుకోవాలి. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం, హెరాయిన్ తయారీకి అవసరమైన ముడి సరుకు (ఓపియం)లో 90 శాతం అఫ్గానిస్తాన్ నుంచి సరఫరా అవుతోంది. పాక్ సైనిక గూఢచారి వ్యవస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్ (ఐఎస్ఐ) ఈ ఓపీయంను దిగుమతి చేసుకుని దాన్నుంచి హెరాయిన్ తయారు చేయిస్తోంది. ఈ మాదక ద్రవ్యాన్ని దొంగచాటుగా మత్తుబానిసలకు సరఫరా చేసి సంపాదించి నెత్తుటి సొమ్ము ఆర్జిస్తోంది. దీంతో టెర్రరిస్టు లను పెంచి పోషిస్తోంది. ఇండియా ముందుగా ఈ మాదకద్రవ్య చీకటి సామ్రాజ్యాన్ని సర్వ శక్తులూ ఒడ్డి ఛిన్నాభిన్నం చేయాలి. అప్పుడే ఐఎస్ఐ టెర్రర్ రాకాసి ఊపిరాడక చస్తుంది.పాక్ను నలుదిక్కులా చిక్కుల్లో పడేయాలి. ఒక వంక డ్యురాండ్ లైన్ సరిహద్దులో అఫ్గానిస్తాన్తో చారిత్రక వైరం నడుస్తోంది. ఒకప్పుడు తనే పెంచిన తాలిబన్ బిడ్డలు ఇప్పుడు దానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇండియా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అఫ్గానిస్తాన్తో సంబంధాలు పెంచుకోవాలి. నమ్మకమైన తృతీయ పక్షాల సహకారంతో తాలిబన్ వర్గాలను దువ్వాలి. ఈ సమస్య మీద పాక్లో చీలికలు పెంచాలి. ఐఎస్ఐ మద్దతు పొందు తున్న హక్కానీ నెట్వర్క్ను ఏకాకిని చెయ్యాలి. తద్వారా పాక్ బీజం వేసిన మహావృక్షం దాని మీదే విరిగి పడేట్లు చెయ్యాలి. బలూచిస్తాన్ లోనూ ఇరాన్ సహకారంతో ఇదే విధంగా వ్యవహారం నడపాలి.ప్రపంచ వేదిక మీద పాకిస్తాన్ నిజరూపం బయట పెట్టాలి. తీవ్రవాద మూలాలను తుదముట్టించేందుకు ఐరాస భద్రతా మండలి తీర్మానాల (1267, 1373) కింద పాక్ను దోషిగా నిలబెట్టాలి. ఈ దిశగా మనం మరింత గట్టిగా ప్రయత్నించాలి. ఇండియా, పాకిస్తాన్లలో ఉన్న ఐరాస మిలటరీ అబ్జర్వర్ గ్రూపునకు ఇంటి దారి చూపెట్టాలి. స్వదేశంలోనూ పాకిస్తాన్ క్రూరత్వానికి హద్దు ల్లేకుండా పోయాయి. హజారాలు, అహ్మదీయులు వంటి జాతులు, కులాల వారి పరిస్థితి మెడ మీద కత్తిలా ఉంది. ఏకపక్ష నిర్బంధాలతో మగ్గిపోతున్నారు. పహల్గామ్ ఊచ కోతకు ముందు, తర్వాత కూడా వీరంతా ఇండియాతో భుజం భుజం కలిపి పనిచేస్తున్నారు. ఈ వర్గాలకూ అలాగే చైనాలోని ఉయిగర్లకూ మనం నైతికపరంగా, దౌత్యపరంగా ఆపన్నహస్తం అందించాలి.పాకిస్తాన్, టర్కీ, మలేసియాల దుష్టత్రయం అపవిత్ర కూటమిగా ఏర్పడటంతో మనకు ప్రమాదం పెరిగింది. ఈ దేశాలు ఉమ్మా (ముస్లిం ప్రపంచం) రక్షకులుగా చెప్పుకుంటూ ఒకప్పుడు ఆర్మేనియాలో సాగించిన మారణహోమం, గ్రీకులు, అస్సిరియా ప్రజలపై జరిపిన హింసాకాండలు వీటి రక్త చరిత్రకు ఆనవాళ్లు. ఇప్పుడివి కశ్మీరు ప్రజల మీద తెగబడే సాహసం చేస్తున్నాయి.ఇలా ఉండగా, సౌదీ అరేబియా దాని మిత్రదేశాలు ఇండియాకు వ్యూహాత్మక, సాంస్కృతిక భాగస్వాములుగా ఆవిర్భవించాయి. మనం కూడలిలో తటస్థంగా నిలబడితే కుదరదు. చొరవ తీసుకోవాలి. వాషింగ్టన్లో హాలోకాస్ట్ మ్యూజియం, యెరెవన్లో ఆర్మేనియన్ జినోసైడ్ మ్యూజి యంలు నిర్మించినట్లు... ఇండియా ఇప్పటికైనా కళ్లు తెరిచి శ్రీనగర్లో టెర్రర్ మ్యూజియం ఏర్పాటు చేయాలి. జిహాద్ పేరిట దశాబ్దాల తరబడిగా పాకిస్తాన్ సాగిస్తున్న ఊచకోత లకు అది సజీవ స్మారకంగా నిలవాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్–బాల్టిస్తాన్లలో నినదించే అసమ్మతి స్వరాలతో ఇండియా గొంతు కలపాలి. పంజాబీ ఆధిపత్య పాక్ సైనికాధికారులు వెంటాడి తరిమికొట్టిన ఇతర ప్రాంతాల వారికి ప్రవాస ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకునేందుకు మనం సహాయం చేయాలి. 1950లలో టిబెట్ ప్రవాస ప్రభుత్వం ఏర్పాటుకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పునాది వేయగలిగినప్పుడు, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయన అడుగుజాడల్లో ఎందుకు నడవలేదు? తప్పకుండా నడవగలదు. చివరగా ఇండియా డిజిటల్ యోధులను రంగంలోకి దించి తీరాలి. మనం మానవ మేధలో అగ్రగణ్యులం. అలాగే సాంకేతిక మేధలో అంతకంటే అత్యుత్తమ స్థానంలో ఉంటాం. డిజిటల్ స్ట్రయిక్స్ చేయాల్సిన అవసరం కూడా ఇప్పుడుంది. బుల్లెట్ పేల్చకుండానే శత్రు దేశ మౌలిక సదు పాయాలను నిర్వీర్వం చేయగలం. మిలిటరీ రహస్యాలు లీక్ చేయగలం. వ్యతిరేక కథనాలను తిప్పికొట్టగలం. డిజిటల్ యుద్ధం నేటి ఆధునిక తంత్రం. టెర్రరిజం సరిహద్దులను దాటినప్పుడు, దాని పర్యవసానాలూ అలాగే ప్రయాణించాలి. మనుగడ, ఆధిపత్యం కోసం జరుగుతున్న దీర్ఘకాలిక చదరంగ క్రీడ ఇది! ఇండియా ఈ ఆటలో మూడు ఎత్తులు ముందుగా ఆలోచించి తీరాలి. మనం డిఫెన్స్ మాత్రమే ఆడితే కుదరదు. నివ్వెరపోయేలా సాహసోపేతమైన మరిన్ని త్రివిధ దళాల దాడులకు రూపకల్పన చేయాలి. ఇన్నాళ్ళూ మన సహనాన్ని నిష్క్రియాపరత్వంగా పాకిస్తాన్ పొరబ డుతూ వచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరమూ మనం బహుముఖ వ్యూహాలతో దూకుడు చూపాలి. మార్పు తరంగాలను అలా చూస్తూ ఉండిపోయే వారిపట్ల చరిత్ర ఎప్పుడూ కనికరం చూపించదు. తుపాను మీద స్వారీ చేస్తూ తీరరేఖను మార్చగలిగే వారికే అది ప్రతిఫలం చేకూర్చుతుంది!– అభిషేక్ మను సింఘ్వీ, పార్లమెంట్ సభ్యులు– ఆకాశ్ కుమార్ సింగ్, జేఎన్యూ జాతీయ భద్రతా అధ్యయనాల ప్రత్యేక కేంద్రంలో పీహెచ్డీ స్కాలర్ -
గతానికి భిన్నంగా...
ఏప్రిల్ నెల చివరలో జమ్మూ–కశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది నిరాయుధులను దారుణంగా హత్య చేసినందుకు ప్రతీకారంగా, మే 7 ఉదయం పాకిస్తాన్లో ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న తొమ్మిది ప్రదేశాలపై భారత సైన్యం దాడి చేసింది. పహల్గామ్ ఘాతుక చర్యకు సమాధానం ఇచ్చి తీరుతామని దేశ రాజకీయ నాయకత్వం స్పష్టం చేయడంతో సైనిక దాడి తప్పదని తేలిపోయింది. అయితే, పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు, కానీ సరిహద్దు రేఖలు మారుతున్నాయని సూచించే లక్షణాలు ‘ఆపరేషన్ సిందూర్’లో ఉన్నాయి.సరిహద్దును దాటి...పాకిస్తాన్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చివరి ప్రధాన దాడి 2019 ఫిబ్రవరిలో చోటు చేసు కుంది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని బాలాకోట్ను అప్పుడు భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్ కేంద్ర బిందువైన పంజాబ్ ప్రావిన్స్లోని ప్రదేశాలపై భారతీయ సైన్యం దాడికి దిగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన తర్వాత,భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. దక్షిణ పంజాబ్లోని బహావల్పూర్లో జైష్–ఎ–మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. పంజాబ్లోని మరొక ప్రదేశం మురీద్కే! ఇక్కడ లష్కరే తోయిబా చాలా కాలంగా ఉనికిలో ఉంది. అయితే కశ్మీర్లో వాస్తవ సరిహద్దును గుర్తించే ఎల్ఓసీకీ, పాకిస్తానీ పంజాబ్కు మధ్య వ్యత్యాసం ఏమిటంటే, స్థిరపడిన అంతర్జాతీయ సరిహద్దు. సూటిగా చెప్పాలంటే, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులకు చెందిన భౌగోళిక ప్రాంతం ఇప్పుడు విస్తరించింది. ప్రతీకారం తీర్చుకునే విషయంలో పాకిస్తాన్లోని ఏ ప్రదేశం కూడా భారత్ లక్ష్యాలకు దూరంగా లేదని తాజా దాడులు స్పష్టంగా సందేశమిస్తున్నాయి.1971 నాటి యుద్ధంలోని ముఖ్యాంశాలలో ఒకటి, భారత సైన్యంలోని త్రివిధ బలగాలూ పాల్గొనడమే! నాటి యుద్ధంలో పూర్తి విజయం సాధించడానికి త్రివిధ దళాలు కలిసి పనిచేశాయి. ఆపరేషన్ సిందూర్లో కూడా మూడు దళాలూ పాల్గొన్నాయని ప్రభుత్వం తెలిపింది. వనరులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడానికి సైన్యం దీర్ఘకాలిక లక్ష్యంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లకు ఇది శుభ సూచకం.నిజానికి భారతదేశం నుండి ప్రతిస్పందన అని వార్యం అయింది. అయినా భారీ స్థాయి దళాల కదలికల ద్వారా భారత్ ప్రతిస్పందన ఉంటుందని చెప్పే సూచన లేవీ లేవు. పాకిస్తాన్ వైపు మాత్రం వారు ప్రతిస్పందన కోసం సిద్ధమవుతున్నప్పుడు గణనీయ స్థాయిలో దళాల కదలిక కనిపించింది. అదే సమయంలో భారత్ సంయమన మార్గాన్ని ఎంచుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన దాడుల్లో ఏవీ పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడిని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకే పరిమితం చేశారు. దాడుల తర్వాత కూడా ప్రభుత్వం తన మీడియా ప్రకటనలో భారతదేశం తీవ్ర స్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టంగా సూచించింది.ప్రతిదాడి చేయడానికి ముందు, భారతదేశం తాను అనుకున్న విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి గణనీయమైన స్థాయిలో అంతర్జాతీయ మద్దతును సాధించింది. చైనా మాత్రమే దీనికి మినహాయింపు. అదే సమయంలో, అంతర్జాతీయ ప్రధాన శక్తులు వాణిజ్య యుద్ధంతో పాటుగా పశ్చిమాసియాలో, ఉక్రెయిన్లో దీర్ఘకాలిక సంఘర్షణ సవాలును ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఒక స్థాయికి మించి పెరగకూడదని అవి ఆశిస్తున్నాయి.వికసిత భారత్, రుణ సంక్షోభ పాక్భారతదేశం మూడు దశాబ్దాలకు పైగా జమ్మూకశ్మీర్లో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంతో పోరాడు తోంది. ఈ క్రమంలో రెండు దేశాలలోనూ, వేర్వేరు ఆర్థిక పథాల్లో అభివృద్ధి జరుగుతోంది. భారత్ తన ఆర్థిక సరళీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 1991 నాటికి, పాకిస్తాన్ తలసరి జీడీపీ భారత్ కంటే ఎక్కువగా ఉంది. తాజాగా ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, 2023లో పాకిస్తాన్ తలసరి జీడీపీ 1,365 డాలర్లు కాగా, భారత్ జీడీపీ 82 శాతం ఎక్కువగా 2,481 డాలర్ల వద్ద ఉంది. అంటే రెండు దేశాల ఆర్థిక పథాలు వాటి వ్యూహాత్మక ఎంపికలను ప్రభావితం చేశాయి.భారత్ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ‘బ్రెగ్జిట్’ తర్వాత అది బ్రిటన్తో చేసుకున్న అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవలే ముగించింది. మరోవైపు, పాకిస్తాన్ ఒక రుణ సంక్షోభం నుండి మరొక రుణ సంక్షోభానికి గురవుతూ, ఐఎమ్ఎఫ్ ఆపన్న హస్తం కోసం విజ్ఞప్తి చేస్తోంది. అది దాదాపు చైనా కాలనీగా మారింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఎంచుకున్న ఎంపికలనూ, పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సార్వభౌమాధికారపు నిరంతర బలహీనతనూ పరిశీలించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ అసీమ్ మునీర్కు అది ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు.సంజీవ్ శంకరన్ వ్యాసకర్త ‘మనీ కంట్రోల్’ ఒపీనియన్స్–ఫీచర్స్ ఎడిటర్ -
దృఢసంకల్పంతో...
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ తగిన ప్రతీకారం తీర్చుకుంది. కుటుంబాల విచ్ఛిన్నమే లక్ష్యంగా పురుషులను మాత్రం ఎన్నుకుని... వారి మతం అడిగి మరీ భార్యల ఎదుటే భర్తలను ఉగ్రవాదులు చంపిన వైనం దేశాద్యంతం ప్రకంపనలు సృష్టించింది. ఇది కేవలం ఒక హింసాత్మక ఘటన కాదు. మానసిక యుద్ధ తంత్రం. ఈ విషయంపై భారత్ ఆచితూచి స్పందించింది. ఉద్రేకాలకు పోలేదు. కచ్చితమైన, వ్యూహాత్మకమైన, సమన్వయ యుతమైన మిలిటరీ ప్రతిచర్యకు దిగింది. నిఘా వర్గాల అంచనాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి మరీ ‘ఆప రేషన్ సిందూర్’ను నిర్వహించారు. పహల్గామ్ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదు లకు, పాకిస్తాన్లోని వారి గురువులను రూఢి చేసుకునేంతవరకూ అత్యంత ఓరిమితో వ్యవహరించారు. మిలటరీ భాషలో ఈ ఓరిమిని క్రమశిక్షణ అనాలి. మరోవైపు పాకిస్తాన్ యథావిధిగా పహల్గామ్ దాడి తరువాత సరిహద్దుల్లో తన పదాతి దళాలను పెంచుకుని భారత మిలిటరీ ప్రతిచర్య కోసం ఎదురు చూసింది. అయితే భారత్ ఈసారి తన వ్యూహాన్ని మార్చుకున్న విషయం పాక్కు తెలియలేదు.బయటకు కనిపించని అసలు వ్యూహంఏదో జరగబోతోందన్న సంకేతాలు రెండు వారాలుగా కనిపిస్తున్నా కచ్చితంగా ఏమిటన్నది చివరి క్షణం వరకూ బయటపడలేదు. ప్రధాని కేబినెట్ సమావేశాలు, ప్రతిపక్ష నేతలతోనూ మంతనాలు జరిపారు. భద్రతాదళ ఉన్నతాధికారులు, రక్షణ శాఖ మంత్రి అందరూ చర్చల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్కూ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరిపారు. బయటకు కనిపించిన ఈ వ్యూహం వెనుక అసలైన ప్రతీకార చర్య చోటు చేసుకుంది. అణుబాంబుల బెదిరింపులతో మన ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు జరిగిన విఫల యత్నాన్ని కూడా భారత్ అధిగమించింది. భారత రక్షణ దళాలు నియంత్రణ రేఖకు (ఎల్ఓసీ) ఆవల తొమ్మిది కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. ఇది భారత సత్తాను, కృత నిశ్చయాన్ని చాటే ప్రణాళికా బద్ధమైన ప్రతిదాడి. యుద్ధాల్లో ప్రతీకాత్మకతకు ప్రాముఖ్యం ఉంటుంది. మానసిక యుద్ధాల్లో మరీ ఎక్కువ. అందుకే అనూహ్యంగా ఇద్దరు మహిళా సైనికాధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి ఆపరేషన్ సిందూర్ గురించిన అధికారిక ప్రక టన వెలువరించారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్య దర్శితో ఇద్దరు మహిళ సైనికాధికారులు పాల్గొనడం పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలన్నింటికీ బలమైన సంకేతం పంపినట్లు అయ్యింది. భారత్కు తన గౌర వాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు అన్న సందే శాన్ని స్పష్టం చేసింది. అయితే, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరుపుతూనే ఉంది. భారత్ వీటికి అంతే స్థాయిలో ప్రత్యుత్తరమూ ఇస్తోంది. దురదృష్టవశాత్తూ ఈ క్రమంలో భారత పౌరులు కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఒకటి మాత్రం వాస్తవం: నిష్క్రియతో శాంతిని పొందలేమ న్నది అందరూ గుర్తించాలి.మునీర్పై విమర్శలుఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీమ్ మునీర్పై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. పాకిస్తాన్ భద్రతాంశాల విశ్లేషకురాలు అయేషా సిద్దిఖా ఆయన్ని ‘ఆలోచన లేని జనరల్’గా అభివర్ణించారు. మతానికి మాత్రమే కట్టుబడిన జనరల్కు వాస్తవిక కార్యాచరణ ప్రణాళికల గురించి ఏమీ తెలియదని విమర్శించారు. జనరల్ జియా–ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్ల మాదిరిగా తానూ ఏదో పేరు సంపాదించాలన్న తాపత్రయం ఆయనలో కనబడుతోంది. జియా, ముషారఫ్ ఇద్దరూ విభ జనకు ముందు భారత్లో పుట్టిన వారే. వాళ్లు సిద్ధాంతానికి వ్యూహాన్ని జోడించగల సమర్థులు. మునీర్ మతాన్ని, మాటలనే నమ్ముకున్నారు.ప్రస్తుతం జరుగుతున్నది రెండు సరిహద్దుల మధ్య యుద్ధం కాదు. సైద్ధాంతికమైనది. త్యాగమంటే ఏమిటో చెప్పేది. నష్టానికి దేశాలు న్యాయం పొందడం ఎలాగో చెప్పేది. ఆపరేషన్ సిందూర్ అన్న పేరు కేవలం ప్రతీకాత్మకమైంది మాత్రమే కాదు. భారతీయ సంప్రదాయంలో కుంకుమ బొట్టుకు ఉన్న ప్రాశస్త్యం తెలియంది కాదు. పహల్గామ్లో ఉగ్రవాదులు కుటుంబంలోని భర్తలే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అందుకే మహిళల నుదుటి బొట్టును కాపాడేందుకే ఈ దాడులు చేసిందన్న సంకేతాన్ని భారత్ పంపింది. బెదిరింపులు, బుల్లెట్లు భారత సంకల్పాన్ని దెబ్బతీయలేవని, అణ్వాయుధాల పేరుచెప్పినా ఇక వదిలేది లేదన్నది ఆపరేషన్ సిందూర్ ఇచ్చే స్పష్టమైన సందేశం. మరి ఈ దాడులకు పాక్ స్పందించకుండా ఉంటుందా? కచ్చితంగా స్పందిస్తుంది. కాకపోతే ఎప్పుడు, ఎలా అన్నది వేచి చూడాలి. ఇందుకు భారత రక్షణ దళాలు పూర్తి సన్నద్ధంగానే ఉన్నాయి. పాక్ కవ్వింపులకు దిగితే గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ఇండియా స్పష్టమైన సంకే తాలిచ్చింది. అంతేకాదు... ఇదేదో పరిస్థితిని మరింత జటిలం చేసుకునేందుకు మాత్రం కాదనీ, పొరుగు దేశం తన హద్దుల్లో తానుండటం మేలన్న సంకేతాన్ని ఇచ్చేందుకేననీ స్పష్టం చేసింది. హద్దు మీరితే అంతే గట్టి సమాధానం దొరుకుతుందన్న హెచ్చరిక కూడా అందులో ఉంది. మనోజ్ కె. చన్నన్ వ్యాసకర్త భారత సైన్యంలో లెఫ్ట్నెంట్ కల్నల్ (రిటైర్డ్) -
ప్రజల సొమ్ము గంగపాలు చెయ్యొద్దు!
కాళేశ్వరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలోని తప్పులనే చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చేస్తోంది. తెలంగాణలో నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కి, భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంలో భాగంగా అనేక బ్యారేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసి కేసీఆర్ ప్రారంభించారు. ఇదే అడుగుజాడల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నడుస్తూ 2027 నాటికి పోలవరం ప్రారంభిస్తామని డెడ్ లైన్ ప్రకటించడం ఆందోళనకరం. 2014లో తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నీరు లేదనే సాకుతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును రద్దు చేశారు. రీ–ఇంజ నీరింగ్, రీ–డిజైనింగ్ పేరిట మేడిగడ్డకు మార్చారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్ను లక్ష కోట్లకు చేర్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో మొదలుపెట్టి, 2019లో ప్రారంభించారు. 4 ఏళ్ల లోపే, అసెంబ్లీ ఎన్నికల ముందే 2023 అక్టోబర్ 21న ఏడవ బ్లాకులోని కొన్ని పియర్లు ఐదు అడుగుల లోతుకు పైగా కుంగిపోయాయి. ఏడవ బ్లాక్లోని మొత్తం 11 పియర్లను కూల్చి నిర్మించడం తప్ప మరో గతి లేదని జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ (ఎన్డీఎస్ఏ) పేర్కొంది. మళ్లీ నిర్మించినా, మరో బ్లాక్ లోని పియర్ల గేట్లు కుంగిపోవనే గ్యారెంటీ లేదు. అన్నారం,సుందిళ్ల బ్యారేజీలో పునాది అడుగున కూడా లీకేజీలు, సీపేజీలు బయటపడ్డాయి. ఎన్డీఎస్ఏ అత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం కుంగిన మేడిగడ్డను పరిశీలించింది. నీటిని నిలువ ఉంచితే ప్రమాదమని, అత్యవసరంగా అన్ని బ్యారేజీలలో పూర్తి నీటిని ఖాళీ చేయించాలని నాటి సీఎం కేసీఆర్కు చెప్పి ఖాళీ చేయించింది. జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ మధ్యంతర నివేదిక సంవత్సరం క్రితమే వచ్చింది. ఇటీవలే వచ్చిన పూర్తిస్థాయి నివేదిక కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణంలో గత తెలంగాణ ప్రభుత్వం చేసిన అత్యంత ఘోరమైన తప్పుల నిగ్గు తేల్చింది. దీని ప్రకారం ఇంజ నీరింగ్ ప్రమాణాల ప్రకారం, పునాదులకు సంబంధించిన, ఏ రకమైన భూగర్భ పరీక్షలూ చేయకుండానే నిర్మాణం చేపట్టారు. బలహీనమైన ఇసుక పునాదులపై బ్యారేజీల నిర్మాణం జరిగింది. బ్యారేజీలలో వచ్చిన నీరు వచ్చినట్టు కాలువకు వెళ్లాలి. ఎక్కువైన నీరు నదిలోకి వెళ్లాలి. కానీ బలహీన పునాదులపై నిర్మించిన బ్యారేజీలలో ప్రాజెక్టులలో మాదిరిగా భారీ ఎత్తున నీటిని నిలువ చేసింది ప్రభుత్వం. ఇలా చేయడం ప్రమాదకరం. భారీ నీటి నిలువ ఒత్తిడి, తాకిడికి పునాదులు దెబ్బతిన్నాయి. పునాదుల కింద నుంచి భారీగా ఇసుక కొట్టుకుపోయి, లీకేజీలు నిరంతరం సాగుతున్నాయి. ఆగమేఘాల మీద దోపిడే లక్ష్యంగా సాగిన, ఈ తప్పుడు డిజైన్ వల్ల ఇసుక కొట్టుకుపోవడం నిరంతరంగా సాగుతోంది. స్పిల్వే నిట్ట నిలువుగా మూడు ఫీట్ల వెడల్పుతో చీలి పోయి, రెండు చెక్కలైంది. భూమిలో ఐదు అడుగులు లోపలికి కుంగిపోయింది.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు ఇప్పుడు ఉన్నవి ఉన్నట్లుగా పనికి రావని ఎన్డీఎస్ఏ పేర్కొంది. నీటి ఒత్తిడి ఎక్కు వైనందువల్ల సీకెండ్ ఫైల్స్ కూలిపోయాయనీ, బ్యారేజీ ఎగువ, దిగువ భాగాల్లో భారీ రంధ్రాలు పడ్డాయని తేల్చింది. మూడు బ్యారేజీలకు విస్తృత నష్టం జరిగిందని పేర్కొంది. ఈ నష్టం ఇక్క డితో ఆగదనీ, నీటి ఒత్తిడి ఎక్కువైతే మొత్తం బ్యారేజీలకే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఒక బ్లాక్ను కూల్చి పునర్ని ర్మాణం చేస్తే, మరొకటి మళ్లీ కుంగి కూల్చవలసిన ప్రమాదపు అంచులలోకి వెళ్లవచ్చని చెప్పింది. అంటే మూడు బ్యారేజీల నిర్మాణానికి ఖర్చు చేసిన 30 వేల కోట్లు గంగలో కలిసినట్లే. సమగ్ర పునర్నిర్మాణ డిజైన్ చేయాలని, జియో ఫిజికల్ పరీక్షలు, జియో సాంకేతిక పరీక్షలు చేసి, ఆధునిక హైడ్రాలిక్ నమూనాల (నీటి ప్రవాహ ఒత్తిడికి సంబంధించిన నమూనా ల)ను ఉపయోగించి ఈ పునర్నిర్మాణ రీడిజైన్ చేయాలని ఎన్డీఎస్ఏ చెప్పింది. కానీ ఈ పరీక్షలన్నీ చేస్తే ఇంతకంటే ప్రమాదకర తప్పులన్నీ బయటపడతాయి. మూడు బ్యారేజీలలో ఇంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మేడిగడ్డ పునరుద్ధరణ అసంబద్ధమైనది. మేడిగడ్డ ముగిసిన అధ్యాయం. పునరుద్ధరణ తెలంగాణను మళ్లీ అప్పుల విష వలయంలోకి ఈడ్చడమే! తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టు మాత్రమే దీనికి నిజమైన ఏకైక ప్రత్యామ్నాయం. దాన్ని వెంటనే చేపట్టాలి.ఇక ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కూడా కాళేశ్వరం మేడిగడ్డలో జరిగిన తప్పిదాన్నే పునరుక్తం చేయబోతున్నట్లని పిస్తోంది. పోలవరం పునాది అడుగున 460 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కూలిపోయింది. మేడిగడ్డ లాంటి విపత్తు, పోలవరంలో జరగదని చంద్రబాబు ఆంధ్ర ప్రజలకు హామీ ఇవ్వగలరా? పోలవరం ప్రాజెక్టు 2027కల్లా ప్రారంభమవుతుందని ప్రకటించడం ద్వారా ఇంజినీర్లను బాబు కూడా డమ్మీలను చేసినట్లే! ఎన్డీఎస్ఏ కాళేశ్వరం బ్యారే జీలపై తుది నివేదిక ఇచ్చింది. పోలవరంపై లోతైన రక్షణ నివేదికను ఎన్డీఎస్ఏ ఇవ్వగలదా? డయాఫ్రమ్ వాల్ కూలిన క్రమంపై ప్రఖ్యాత ఇంజనీర్లు, భూగర్భ నిపుణులు పోలవరం ప్రాజెక్టును నిశితంగా పరిశోధించారు. చంద్రబాబు ఆ నివేదికలను వెల్లడించాలి.నైనాల గోవర్ధన్ వ్యాసకర్త నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకులు -
ఇది ఐక్యతా సమయం
గత వారం ఓ రోజు ఉదయం 6 గంటల తర్వాత నా మొబైల్లో నోటిఫికేషన్ పింగ్ అయింది. నా స్నేహితుడి కొడుకు నుండి ఒక సందేశం వస్తున్నట్లు నేను చూశాను. పహల్గామ్లో జరిగిన సంఘటనల గురించి అతను కలత చెందాడు. సంఘటన తర్వాత వెంటనే ఎటువంటి ప్రతీకార చర్యా తీసుకోనందుకు మన ప్రభుత్వంపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవడానికి తీవ్రస్థాయిలో మీడియా ప్రచారాన్ని నడపటం ద్వారా నా వంతు కృషి నేను చేస్తానని అతను ఆశించాడు. నేను షాక్ అయ్యాను. చిన్నప్పటి నుండి అతడు నాకు తెలుసు. దేశంలోని ఉత్తమ పాఠశాలల్లో అతను చదువుకున్నాడు. ఇంజనీరింగ్ డిగ్రీని సాధించాడు. ఇన్ స్టిట్యూట్ నుండి పట్టభద్రుడయ్యే ముందు, అతనికి ఓ బహుళజాతి సంస్థ ఉద్యోగం ఆఫర్ కూడా ఉండేది. ఉన్నత స్థాయికి ఎదిగాడు. నేడు కార్పొరేట్ వర్గాల ఆకర్షణీయమైన సర్కిల్లో ఉంటున్నాడు. తన తెలివితేటలు, జ్ఞానం వల్ల మంచి గుర్తింపు, గౌరవం పొందాడు. అందుకే తాను ప్రకటించిన విద్వేష భావానికి నేను పెద్దగా కలత చెందలేదు. తనను ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చాను. ప్రభుత్వాన్ని విశ్వసించమని నచ్చ చెప్పాను. సరైన సమయం వచ్చినప్పుడు, ప్రపంచం భారత్ నుండి పూర్తి స్థాయి చర్యను వీక్షిస్తుందని చెప్పాను. 1971లోనూ భారతదేశంలో ఇలాంటి యుద్ధ సన్నద్ధతే పెరుగుతూ వచ్చిందని అతనికి గుర్తు చేశాను. తిరుగులేని వ్యూహకర్త మానెక్ షా!అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ఆర్మీ చీఫ్ జనరల్ శ్యామ్ మానెక్ షాను పిలిపించారు. ‘‘తూర్పు పాకిస్తాన్ పై భారత సైన్యం వెంటనే దాడి చేసి, దాన్ని స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్గా మార్చడానికి సహాయం చేయగలదా?’’ అని ఆమె అడిగారు. అద్భు తమైన వ్యూహకర్త మానెక్ షా. కొన్ని నెలల్లో రుతుపవనాలు రాను న్నాయని ప్రధానితో చెప్పారు. వర్షాకాలంలో, బంగ్లాదేశ్లోని పొలాలు చిత్తడి నేలలుగా మారతాయి. అందువల్ల అలాంటి సమయంలో దాడి చేయడం అంటే అది పెద్ద ఎత్తున సైనికుల మరణానికి దారితీస్తుందని వివరించారు. దాంతో మానెక్ షా తొందరపాటు ఆదేశాలు జారీ చేయబోవడం లేదని నిర్ధారణ అయింది. అనంతరం, తొమ్మిది నెలలపాటు జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళిక, సమన్వయం, కచ్చితమైన వ్యూహం తర్వాత, భారత దళాలు తూర్పు పాకిస్తాన్పై దాడి చేసినప్పుడు, శత్రువు ఓడిపోవడమే కాకుండా, 90,000 మందికి పైగా పాక్ సైనికులు భారత్కు లొంగిపోయారు. మానవాళి చరిత్రలో, ఇంత పెద్ద సైనిక దళం ఎప్పుడూ ప్రత్యర్థికి లొంగి పోలేదు. 1971 డిసెంబర్ 16న, భారత సైన్యం తన అత్యుత్తమ ఘడియను ఆస్వాదిస్తూ, మన సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యా యాన్ని లిఖిస్తున్న సమయంలో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది.1971ని తలపిస్తున్న మంతనాలుప్రస్తుత ప్రధాని కూడా భారత సాయుధ దళాలకు పాక్పై తగిన చర్య తీసుకోవడానికి అధికారం ఇచ్చారు. నెంబర్ 7 – లోక్ కల్యాణ్ మార్గ్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లలో వ్యూహాత్మక సమావేశాలు జరిగాయి. సైనిక చర్యలు ఆర్థిక, దౌత్యపరమైన పర్యవసానాలను కలిగి ఉంటాయి. కనీస ప్రాణనష్టంతో త్వరిత విజయాన్ని సాధించడానికి, శక్తిమంతమైన మిత్రులు మద్దతు ఇవ్వడానికి లేదా నిర్ణాయక సమయంలో కనీసం తటస్థంగా ఉండటానికి కొన్ని నిబద్ధతలు అవసరం. 1991లో మొదటి గల్ఫ్ యుద్ధంలో సంకీర్ణ సైన్యానికి నాయకత్వం వహించిన యు.ఎస్. జనరల్ నార్మన్ స్క్వార్జ్కోఫ్, ‘‘మీరు శాంతిలో ఎంత ఎక్కువ చెమట చిందిస్తే, యుద్ధంలో అంత తక్కువ రక్తస్రావం అవుతుంది...’’ అని అన్నారు.రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా సహా వివిధ దేశాలలో తమ సమ ఉజ్జీలతో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు 1971ని గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు మానెక్ షా, నావికాదళ, వైమానిక దళ అధిపతులు యుద్ధా నికి సిద్ధమవుతుండగా, ఇందిరా గాంధీ కూడా నమ్మకమైన దౌత్య భాగస్వాముల కోసం వెతికే పనిలో పడ్డారు. భారతదేశం అప్పటికి కొంతకాలం క్రితం పాశ్చాత్య జోక్యానికి వ్యతిరేకంగా హామీ కోసం నాటి సోవియట్ యూనియన్తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తరువాత, యుద్ధ సమయంలో బంగాళాఖాతంలో అమెరికన్ సిక్స్త్ ఫ్లీట్ కనిపించడం, దాన్ని ఎదుర్కోవడానికి సోవి యట్ జలాంతర్గాములు రావడం వంటి సంఘటనలు భారతదేశపు దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్ (పైఎత్తు)ను ధ్రువీకరించాయి. నేడు రెండూ అణ్వాయుధ శక్తులే!నేటి పరిస్థితి కూడా అంతే ప్రమాదకరమైనది. ట్రంప్ 2.0 యుగంలో ఇది మరింత క్లిష్టంగా మారింది. ఎటువంటి భావజాలం లేకుండా, సోషల్ మీడియా నిరంతర చూపు కింద నడిచే భౌగోళిక రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 1971లో మాది రిగా కాకుండా భారతదేశం, పాకిస్తాన్ రెండూ ఇప్పుడు అణ్వాయుధ శక్తులు. మనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు. ఏదైనా సహాయం అందించే పరిమిత సామర్థ్యంతోనే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ తో పోరాడుతోంది, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వ్యాఖ్యలు బీజింగ్ జాగరూకతా వైఖరిని వెల్లడిస్తున్నాయి: ‘‘సంఘర్షణ అనేది భారత్ లేదా పాకిస్థాన్ ప్రాథమిక ప్రయోజనాలకు నష్టం చేస్తుంది..’’ అని వాంగ్ వ్యాఖ్యానించారు. అయితే చైనా సానుభూతి పాక్ వైపు ఉంది. ప్రపంచంలోని ఏకైక అగ్రరాజ్యమైన అమెరికా, మిశ్రమ సంకేతాలను పంపుతోంది. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రకటనను పరిగణించండి: ‘‘పహల్గామ్ దాడి పట్ల భారత్ విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీయని విధంగా ప్రతిస్పంది స్తుందని మేము ఆశిస్తున్నాము’’ అన్నారాయన. ప్రమాదకరంగా సోషల్ మీడియా!ప్రభుత్వం చేతులు కట్టివేయడం, దాని ఎంపికలను పరిమితం చేయడం వంటి సంక్లిష్టతలను గ్రహించకుండా, లెక్కలేనన్ని స్వరాలు సోషల్ మీడియాలో ఇప్పుడు ఉగ్రదాడి పట్ల, పాక్ పైన నిరంతరం మండిపడుతున్నాయి. సర్జికల్ స్ట్రయిక్స్ అయినా, లేదా బాలాకోట్ వైమానిక దాడి అయినా సరే, తన మాటను నిలబెట్టుకోవడంలో ప్రధాని మోదీకి ఉన్న విశ్వసనీయతను వారు విస్మరిస్తున్నారు.దాంతో మన సోషల్ మీడియా కార్యకలాపాలు శత్రువులకు ఫిరంగి మేతగా మారాయి. ఎవరైనా సరే, ప్రభుత్వ పక్షాన నిశ్శబ్దంగా నిలబ డాల్సిన సమయం ఇది. అనవసరమైన వాగ్వాదాలకు పాల్పడకుండా ఉండాల్సిన సమయం ఇది. మతతత్వపు విష బీజాలు నాటడానికి కొందరు ఈ పరిస్థితిని మలచుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం బృందావన్లో ఆలయ సేవలో పాల్గొన్న ముస్లింలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాంకే బిహారీ ఆలయం ముందు ఒక మూక నిరసన తెలిపింది. అయితే ఆలయ ట్రస్ట్... స్పష్టంగా ప్రతిస్పందించింది. ఆ ముస్లింలు శతాబ్దాలుగా శ్రీకృష్ణుని దుస్తులను తయారు చేస్తున్నారని ట్రస్ట్ నిర్వాహకులు నొక్కి చెప్పారు.ఐక్యంగా ముందుకు సాగాలిఉగ్రవాద దాడిని జమ్మూ – కశ్మీర్ అసెంబ్లీ ఏప్రిల్ 29న ఏకగ్రీవంగా ఖండించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు సంఘీభావం తెలిపింది. లోయలో ఉగ్రవాదం అంతం ప్రారంభమైందని శాసన సభ్యులు భావిస్తున్నారు. ద్వేషపూరిత వ్యక్తులు అలాంటి సంఘీభావ ప్రదర్శనను విస్మరించడమే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక మసీదులు మొన్నటి ఉగ్రవాద దాడిని ఖండించడాన్ని సులువుగా మరచి పోతారు. ఇప్పుడు పాకిస్థాన్ను బహిరంగంగా ఖండించని ముస్లిం నాయకుడు లేడు. ద్వేషం, విభజన రాజకీయాలతో రెచ్చగొట్టడం కాకుండా, అందరూ ప్రభుత్వంతో కలిసి నిలబడి సామాజిక ఐక్యత కోసం పనిచేయాల్సిన సమయం ఇది!శశి శేఖర్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రోజు నేను అమెరికాలో ఉన్నాను. సాధారణంగా నేను టెలివిజన్ వార్తలు చూడను, కానీ ఈ మారణహోమం మాతృభూమిలో జరుగుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఉండవలసి వచ్చింది. మూడు దశాబ్దాలుగా నా రిపోర్టింగ్ బీట్ కూడా ఇదే. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న 26 మంది కశ్మీర్ పర్యాటకులను ఘోరంగా చంపిన ఘటనపై ఆదుర్దాతో నేను హోటల్లో టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికలు వెతికాను.‘ఘర్షణ’గా మాత్రమే చూపారు!నిజానికి ఈ అనాగరిక దాడి జరిగిన రోజు అమెరికా ఉపాధ్య క్షుడు జె.డి. వాన్ ్స భారతదేశంలోనే ఉన్నారు కాబట్టి దాడిపై అమెరి కన్ మీడియా ఆసక్తి చూపించాల్సి ఉంది. పైగా, ఉగ్రవాదులు తమ ప్రణాళికను వాన్ ్స రాకకు ముందే ముగించారు. వారి ఆ కార్యా చరణను 25 ఏళ్ల నాటి పూర్వఘటన నుండి తీసుకున్నారు. 2000లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఢిల్లీలో అడుగు పెట్టినప్పుడు కశ్మీర్ లోయలోని చిట్టిసింగ్పురా గ్రామంలో 36 మంది సిక్కులను ఉగ్రవాదులు ఊచకోత కోశారు. అప్పటిలాగే ఇప్పుడు కూడా, కశ్మీర్ సమస్యపై మరింతగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ఉగ్ర వాదుల లక్ష్యం. కానీ ఆ సమయంలోనే జరిగిన ఒక ప్రముఖ ఘటన కారణంగా భారత్లో ఉగ్రదాడిపై అమెరికా దృష్టి దాదాపుగా కను మరుగై పోయింది. ఆశ్చర్యకరంగా, అమెరికా నెట్వర్క్లలో అందు బాటులో ఉన్నదంతా పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం గురించి గంటల తరబడి కార్యక్రమాలు మాత్రమే. కొన్ని వార్తా పత్రికలలో ఉగ్రదాడిపై నివేదికలు లోపలి పేజీలలో క్లుప్తంగా ఉన్నాయి. ఈ దాడి ఘటనను అమెరికన్ మీడియా దాదాపుగా ఒక సాధారణ భద్రతకు సంబంధించిన ‘ఘర్షణ’గా మాత్రమే చూపింది.పశ్చిమాన లోపించిన ప్రస్తావననేను భారతదేశానికి తిరిగి రావాలని త్వరపడుతున్నాను. జరి గిన దాడి భారత్ నుండి తీవ్రమైన సైనిక ప్రతిస్పందనకు దారి తీయవచ్చని, నేను కలిసిన వారికి వివరించాను. ఇది యుద్ధ చర్య అని నొక్కి చెప్పాను. భారతదేశం తదనుగుణంగానే స్పందించవచ్చునని కూడా అనుకున్నాను. నేను ఇలా చెబుతున్నప్పుడు చాలామంది సహోద్యోగులు, స్నేహితులు నన్ను ప్రశ్నార్థకంగానే చూశారు. వారు చూస్తుండే టీవీ, ప్రింట్ లేదా డిజిటల్ మీడియాలలో పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావన చూడలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ప్రతిదాడి స్వభావం, లక్ష్యం, ప్రతిస్పందన సమయం’పై నిర్ణయం తీసుకోవడానికి సాయుధ దళాలకు ‘పూర్తి స్వేచ్ఛ’ ఇచ్చేశారు. దీంతో, భీతిల్లిపోయిన పాక్, తదుపరి 24–36 గంటల్లోనే భారత్ దాడి జరగవచ్చని ప్రకటించేంతవరకు వెళ్లింది. ఒక పాకిస్థాన్ మంత్రి బహిరంగంగానే బెదిరింపు ప్రకటన చేశారు. ‘‘అణ్వాయుధా లను అలంకరణ కోసం తయారు చేయలేదు’’ అని కఠినంగా అన్నారు. ‘సాయుధ దాడి..’ అని రాశారు! ఇప్పటికైనా ప్రపంచ మీడియా అంతా ఈ దాడికి సంబంధించిన భౌగోళిక రాజకీయ ఫలితం గురించి ఆలోచిస్తుందని మీరు అనుకుంటారు కదా! కానీ అలాంటిదేమీ లేదు. ఉగ్రదాడిపై కవరేజ్ నామ మాత్రంగానే ఉంది. ఇంకా దారుణంగా, ప్రారంభ రోజుల్లో ప్రచురి తమైన కొన్ని వార్తా నివేదికలను చూస్తే, పాశ్చాత్య వార్తాపత్రికల లోపలి పేజీలలో ఈ దాడి ఘటనపై ఉపయోగించిన భాష వారి స్వంత కథను వినిపించింది. అదేమిటంటే – జరిగిన దాడి ఘటనకు ‘ఉగ్రవాదం’ అనే పదాన్ని ఉపయోగించడానికి తీవ్రంగా నిరాకరించడం! దానికి బదులుగా, సాయుధులు, తీవ్రవాదులు వంటి మూస పోత పదాలతో ఎప్పటిలాగే వర్ణించారు.సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు గుంపులోని పురుషులను ఒక్కొక్కరిగా చంపేశారు, కానీ వారు హిందువులా లేదా ముస్లింలా అని అడిగిన తర్వాత మాత్రమే చంపారని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాదులతో పోరాడి వారి తుపాకీని లాక్కోవడా నికి ప్రయత్నించిన స్థానిక కశ్మీరీపై కూడా తూటాలు గుప్పించారు.ఇది ‘ఉగ్రవాదం’ అనిపించలేదా?!లష్కరే తోయిబాకి నీడలాగా ఉన్న ‘ది రెసిస్టెన్ ్స ఫ్రంట్’ ఈ దాడికి తక్షణ బాధ్యత వహించింది. తరువాత, పాకిస్థాన్పై ఒత్తిడి పెరగడంతో వారు సైబర్ హ్యాక్ ద్వారా ఈ ప్రకటన జరిగిందని మాట మార్చారు! లష్కర్ తోయిబా ఇంతకు మునుపే అమెరికా అధికారికంగా విడుదల చేసిన ఉగ్రవాద సంస్థల జాబితాకెక్కింది. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడిలో ఆరుగురు అమెరికన్లు మరణించారు. పాకిస్థాన్లో దాక్కున్న ప్రదేశం నుండి ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా బయటకు తీసుకెళ్తే అమెరికన్లు ఎలా భావిస్తారు? దీన్ని కూడా వారు సాయుధుల చర్య గానే వర్ణిస్తారా?చివరికి ఇప్పుడు భారతదేశం ‘చర్యకు ప్రతి చర్య’ సూత్రం ప్రాతిపదికన ప్రతీకార చర్యకు సిద్ధమవుతుండగా, పశ్చిమ దేశాలు స్పందించడం ప్రారంభించాయి. వాషింగ్టన్ నుండి కొన్ని ప్రకటనలు సంఘీభావం ప్రకటించాయి. పహల్గామ్ ఘటనకు కారణమైన ఉగ్ర వాదులను శిక్షించడంలో భారత్కు పాకిస్థాన్ సహకరించాలని వాన్ ్స కోరుతూనే, భారతదేశం ‘పెద్ద ప్రాంతీయ సంఘర్షణ’కు దారితీయని విధంగా స్పందిస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.భారతదేశ సైనిక పరమైన చర్యల ఎంపికలకు అమెరికన్లు అడ్డంకులు కల్పించే అవకాశం లేదు. కానీ 2023 అక్టోబర్ 7 తర్వాత ఏ అమెరికన్ రాజకీయ నాయకుడూ ఇజ్రాయెల్తో ఇలా (ఉద్రిక్తతలు తలెత్తకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని) చెప్పి ఉండక పోవచ్చు. యెమెన్ లోని హౌతీలపై తాము నిరంతరం బాంబు దాడి చేస్తూ మరొకవైపు భారతదేశం సైనిక సంయమనం పాటించాలని అమెరికా నేతలు కోరటాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పటికీ వారి తీరులో భారీ ద్వంద్వ వైఖరి ఉందనే చెప్పాలి.కశ్మీర్ లోపల... కశ్మీర్ వెలుపలా.!పహల్గామ్ ఉగ్రవాద దాడి స్థానికంగా జరిగిన ‘భద్రతా సంఘ టన‘ కాదనీ; అది భారత్, పాక్ల మధ్య కొనసాగుతున్న ఏదో ఒక రకమైన ‘వివాదానికి’ సంబంధించిన మరొక అభివ్యక్తి కాదని ప్రపంచం ఇంకా అర్థం చేసుకోనే లేదు. కశ్మీర్లోనూ, కశ్మీర్ వెలుపల కూడా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటోందని 26/11 ముంబై దాడులు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈసారి మాత్రం ఒక నమూనా మార్పు జరిగింది. భారతదేశం పాకిస్థాన్ యుద్ధం అంచున ఉన్నాయి. కానీ ఈ సంఘర్షణ... అది తలెత్తిన రోజు నుండే పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య ప్రభుత్వాల దృష్టి నుంచి తప్పిపోయింది. ఉగ్రదాడి గురించి వారు తప్పుగా నివేదించారు, తప్పుగా అర్థం చేసుకున్నారు.బర్ఖా దత్వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత్రి -
కులగణనపై మోదీ యూ–టర్న్తో ఎవరికి లాభం?
దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కొన్నేళ్లుగా కుల గణన( CastCensus) డిమాండ్లు వినిపిస్తున్నా... హిందువులంతా ఒక్కటే అని చెబుతూ వచ్చిన బీజేపీ (BJP), ఎవరూ ఊహించని విధంగా కుల గణన నిర్వహించాలని నిర్ణయించింది. కుల గణన మీదే రాజకీయాలు నడుపుతున్న ప్రతి పక్షాల నోరు మూయించడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి ప్రమాదం తెచ్చిపెట్టనున్నదా అనే చర్చ మొదలైంది. మన దేశంలో మతం కన్నా కులమే బలమైనది. ఏ రాష్ట్రంలో చూసినా కులం చుట్టే రాజకీయాలు నడుస్తుంటాయి. స్వాతంత్య్రం అనంతరం 2011లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కులగణన కోసం సామాజిక, ఆర్థిక సర్వే చేపట్టింది. కానీ, రాజకీయ ఎత్తుగడల మధ్య ఆ డేటాను విడుదల చేయలేదు. తర్వాత అధికారం కోల్పోయిన కాంగ్రెస్... సామాజిక న్యాయం కోసం కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నా... బీజేపీ పట్టించుకోనట్టే వ్యవహరించింది. బీజేపీ సైద్ధాంతిక గురువైన ఆర్ఎస్ఎస్, ముందు నుంచీ కులగణనను వ్యతిరేకిస్తోంది. కులాలకు అతీతంగా హిందువులను ఒకే గొడుగు కింద ఏకం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో ఆర్జేడీ–జేడీ(యూ) కూటమి ప్రభుత్వం బిహార్లో కులగణనను చేసినప్పుడు కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కులగణన చేసినప్పుడు కూడా కుల ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలను అవి వ్యతిరేకించాయి. ప్రతిపక్ష పార్టీలు కుల విభజనలను రెచ్చగొట్టి ఎన్నికల లబ్ధి పొందుతున్నాయని విమర్శించాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘బటెంగే తో కటెంగే’ (విడిపోతే చంపబడతాం) అనే నినాదంతో కులగణన డిమాండ్ను తెరమరుగు చేసే ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి మోదీ ఈ ప్రచారంలోనే ‘ఏక్ హై తో సేఫ్ హై’ (ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) అనే నినాదం ఇచ్చారు. ఇప్పుడు తన యూ–టర్న్కు ఆయన ఏమని సంజాయిషీ చెప్పుకొంటారు?వ్యూహాత్మక నిర్ణయమా?తెలంగాణ, కర్ణాటకలలో చేపట్టిన కులగణనతో దేశ వ్యాప్తంగా సామాజిక న్యాయం డిమాండ్లు పెరిగాయి. దీనికి తోడు ఈ ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకునేలా బీజేపీపై ఒత్తిడి పెరిగింది. బిహార్లో 2015లో నితీశ్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేలో మొత్తం జనాభాలో 65 శాతం ఓబీసీలని తేలింది. ఈ నేపథ్యంలో ఓబీసీ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, ప్రతిపక్ష సామాజిక న్యాయ ఎజెండాను నియంత్రించడానికి బీజేపీ కులగణనకు ఒప్పుకుని ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందన్న అనుమానం ఉంది. ఆర్ఎస్ఎస్ ఈ నిర్ణయంపై సంయమనంతో స్పందిస్తూ, కులగణన రాజకీయ సాధనంగా మారకూడదని, శాస్త్రీయంగా, సామాజిక అసమానతలను తొలగించేందుకు మాత్రమే జరగాలని చెప్పింది. ఈ స్పందన వారి అంతర్గత అసౌకర్యాన్ని సూచిస్తుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు రోజే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి తన యూ–టర్న్ గురించి ఆయనతో చర్చించే ఉంటారు. కాబట్టి, ఈ నిర్ణయం బీజేపీ సైద్ధాంతిక మార్పు కాదనీ, ఎన్నికల ఒత్తిడి వల్ల తీసుకున్న రాజకీయ నిర్ణయం మాత్రమేననీ స్పష్టమవుతోంది.2014 నుండి దేశంలో బీజేపీ తన బలం పెంచుకుంటూవస్తోంది. కానీ, తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి వెనుకబడిన వర్గాల మద్దతు చాలా కీలకం. బీజేపీలో అత్యధిక శాతం నాయకులు అగ్రవర్ణాలవారే ఉన్నారు. కాబట్టి, కులగణన వల్ల ఓబీసీలు, ఇతర వెనుకబడిన వర్గాలు అధికారంలో తమ వాటాను డిమాండ్ చేస్తే, పార్టీ బలహీనపడే అవకాశం ఉంది. ఇండియా కూటమి ఎక్కువ కులాలు, సముదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తుందనే అభిప్రాయం బీజేపీకి ప్రతికూలంగా మారింది. బీజేపీ రోహిణీ కమిషన్, రాఘవేంద్ర కుమార్ ప్యానెల్ వంటి ఓబీసీ ఉప–వర్గీకరణ ప్రయత్నాలు చేసినప్పటికీ, వాటి నివేదికలను విడుదల చేయలేదు. దీనికి విరుద్ధంగా, ప్రతిపక్షం కులగణనకు నిబద్ధత చూపిస్తూ... తాము అధికా రంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన జరిపించి, బీజేపీ శిబిరంలో రాజ కీయ ఒత్తిడిని పెంచింది. చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుఈ నిర్ణయం బీజేపీకి స్వల్పకాలిక రాజకీయ లబ్ధిని ఇవ్వవచ్చు, కానీ దీర్ఘకాలంలో అనేక సవాళ్లను తెచ్చిపెడుతుంది. కులగణన హిందూత్వ సిద్ధాంతానికి విరుద్ధంగా, కుల ఆధారిత రాజకీయాలను మరింత బలపరుస్తుంది. ఇది మండల్ 3.0 ఆవిర్భావానికి దారి తీసే అవకాశం కూడా లేకపోలేదు. కులం మన దేశ రాజకీయాల్లో బలమైన శక్తిగా కొనసాగుతోంది. దానిని మతం పేరు చెప్పి తొలగించలేం. ఈ నిర్ణయం బీజేపీ సైద్ధాంతిక పునాదులను కదిలించి, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ప్రతిపక్షాలకు నైతిక విజయాన్ని అందించింది. 2021లోనే నిర్వహించాల్సిన జనగణన ఇప్పటికీ జరగలేదు. ఈ నేపథ్యంలో కులగణన నిర్ణయం ఎప్పుడు అమలవు తుందో అనే సందేహాలను కొట్టిపారేయలేం!-జి. శ్రీలక్ష్మి రీసెర్చర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ -
మానవీయ మతగురువు
నేను ఒకసారైనా పోప్ ఫ్రాన్సిస్ని కలిసి ఉండాల్సింది. ఆయన విషయంలో తప్ప, ఇతర ప్రముఖుల గురించి ఎప్పుడూ ఇలా అనుకోలేదు. పోప్ ముఖంలో ఎప్పుడూ కరుణ, ఆప్యాయత, ఆనందం ఉట్టిపడుతూ ఉండేవి. ఆయన నవ్వుతూ ఉండేవారు. నవ్విన ప్రతిసారీ ఆ కళ్లు వెలుగులు ప్రసరించేవి. అది పెదవుల మీద చిందే మామూలు మందహాసం కాదు. గుండె లోతుల్లోంచి వచ్చినట్లుంటుంది. సహజమైనది. చిన్నారుల పట్ల ఆయన ఎంతో వాత్సల్యం ప్రదర్శించేవారు. అందులోనూ నిజాయతీ కనిపించేది. పోప్ మరణం తర్వాత నేను ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. వాటితోనే నాకాయన ఎంతో ప్రేమాస్పదుడు అయ్యారు.క్యాథలిక్ చరిత్రలో పరమ పూజ్యుడిగా గుర్తింపు పొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పేరును పోప్ తన ‘పాపల్ నేమ్’గా స్వీకరించారు. ఆ ఇటాలియన్ మార్మికుడి మాదిరిగానే పోప్ అతి నిరాడంబరంగా జీవించారు. పోప్ అధికారిక నివాసమైన వ్యాటికన్ ప్యాలెస్ను (దీన్నే గ్రాండ్ పాపల్ హోమ్ అంటారు) కాదని అక్కడి అతిథి గృహంలోని ఓ చిన్న రెండు గదుల అపార్టుమెంటులో ఉన్నారు. ఆయన ఎంత సాదాసీదాగా ఉండేవారంటే, తను వేసుకునే బ్రౌన్ కలర్ షూస్ బాగా నలిగిపోయి ఉండేవి. గార్డులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం ఆయనకు పరిపాటి. కార్మికులు తినే క్యాంటిన్లోనే తరచూ భోజనం చేసేవారు. ప్రీస్ట్ కావటానికి ముందు బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా)లో ఫ్రాన్సిస్ ఒక బౌన్సర్ ఉద్యోగం చేశాడంటే నమ్మగలరా? ఇతర ప్రీస్టుల కంటే భిన్నంగా ఉండటా నికి బహుశా అదొక కారణం అయ్యుంటుంది. పేదల పక్షం ఉండటమే ఈ పోప్ తత్వం. వారి కళ్లలో ఆయనకు చర్చి కనబడేది. కాబట్టే ఆయన్ను మురికివాడల బిషప్పు అని పిలుచుకునేవారు.2023 అక్టోబరులో ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలైనప్పటి ఉదంతమిది: గాజాలో హోలీ ఫెయిత్ చర్చి ఉంది. ఆ ఏకైక క్యాథలిక్ చర్చిలోనే క్రైస్తవులు, ముస్లిములు తల దాచుకున్నారు. వారి కోసం ప్రార్థించడానికి, వారికి ఊరడింపుగా ఉండటానికి పోప్ రాత్రి సమయాల్లో వాటికన్ నుంచి ఫోన్ చేసేవారు. ప్రపంచానికి తెలియని ఇలాంటి ఎన్నో అద్భుతమైన పనులు ఆయన చేశారు. వాటిలో ఇదొకటి. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా తాను అనుకున్నది చేయడం సెయింట్ ఫ్రాన్సిస్ స్వభావం. అలా ఉండటానికే పోప్ ఫ్రాన్సిస్ కూడా ఇష్టపడేవారు. ఈ విషయాలు తెలిసిన ఆయన సన్నిహితులు సైతం వాటిని అందరి దృష్టికీ తెచ్చేందుకు ప్రయత్నించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. స్వలింగ సంపర్కం పట్ల క్యాథలిక్ చర్చి వైఖరి కఠినంగా ఉంటుంది. ఈ కాఠిన్యాన్ని సడలించిన మొట్ట మొదటి పోప్... ఫ్రాన్సిస్సే! తన విమర్శకులను ఉద్దేశించి, మంచో చెడో ‘‘తీర్పు చెప్పడానికి నేనెవరిని?’’ అని ప్రశ్నించారు. విడాకులు తీసుకున్నవారు, పునర్వి వాహం చేసుకున్నవారు ‘సాక్రమెంటు’ స్వీకరించడంలో తప్పు లేదని చెప్పిన మొదటి పోప్ కూడా ఆయనే. నలుగురు మితవాద కార్డినల్స్ బాహాటంగా వ్యతిరేకించినప్పటికీ పోప్ తన అభిమతం మార్చుకోలేదు.గర్భనిరోధం, గర్భస్రావం, స్వలింగ వివాహాలు, ట్రాన్స్జెండర్లకు గుర్తింపు వంటి అంశాల్లో ఆయన సంప్రదాయానికి లోబడి వ్యవహరించారు. ఏదేమైనా, ఆనవాయితీలను అధిగమించి నూతన భావనలు ప్రవేశపెట్టడాన్నే ఆయన ఇష్టపడేవారు. ఎంత తిరిగినా మళ్లీ అక్కడకే వస్తాం... పోప్ ఫ్రాన్సిస్ సామాన్య జనం గురించి తపన పడేవాడు. వలసదారులు, శరణార్థుల సమస్యపై ఆయన తీసుకున్న వైఖరి దీన్ని రుజువు చేస్తుంది. పోప్ హోదాలో తన తొలి పర్యటనకు ల్యాంపెడుజా అనే ఇటలీ ద్వీపాన్ని ఎంచుకున్నారు. ఉత్తర అమెరికా అక్రమ వలసదారు లను కలిసి వారి సమస్య పరిష్కరించడమే ఈ పర్యటన ఉద్దేశం. తాను జబ్బు పడటానికి కొన్ని వారాల ముందు కూడా, అక్రమ వలసదారులను నేరస్థులుగా పరిగణిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన విధానాలను పోప్ విమర్శించారు. మరే ఇతర దేశాధిపతీ ఇంతగా తెగించి ఉండడని వ్యాఖ్యానించారు. ఇస్లాంతో అధికారికంగా చర్చ జరిపిన మొట్ట మొదటి పోప్ కూడా ఆయనే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఆయన బహిరంగ ‘మాస్’ నిర్వ హించారు. అరబ్ ద్వీపకల్పంలో ఇలా చేయడం ఇదే ప్రథమం. ఈ మతాంతర సౌభ్రాతృత్వ చర్యల మీద మితవాదులు దాడి చేశారు. వారిని ఆయన అసలు పట్టించుకోలేదు. పోప్ జీవితంలో వైఫల్యాలు లేవని చెప్పలేం. ముఖ్యంగా వాటికన్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వ్యవహారంలో సమర్థంగా వ్యవహరించలేక పోయారు. ఈ కేసులో కార్డినల్ ఏంజెలో బెచూ మీద ఆరోపణలు రుజువు అయ్యాయి. 2023లో జైలు శిక్ష కూడా పడింది. అంతిమంగా, పోప్ ఈ సమస్యను విస్తృత స్థాయిలో ఎదుర్కోలేక పోయారనే చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ముందున్న వారెవరూ ఆయన కంటే సమర్థులు కారు. ఏమైనప్పటికీ, ఫ్రాన్సిస్ తన తర్వాత కూడా క్యాథలిక్ చర్చ్ తన ఆకాంక్షలకు అనుగుణంగా నడిచేలా జాగ్రత్తపడ్డారు. ఆయన వారసుడిని ఎన్నుకునే అర్హత 135 మంది కార్డినల్స్కు ఉంటుంది. వారిలో 108 మందిని తనే నియమించారు. అందులో యూరోపి యన్లు 53 మంది కాగా, 82 మంది ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, ఓసియానియా (ఆస్ట్రేలియా సహా అనేక ఇతర పసిఫిక్ దీవులు) ప్రాంతాల వారే! అంటే, ఆయన వారసుడు మరో యూరపే తరుడు అవుతాడా? అవకాశాలు అలానే ఉన్నాయి.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కులగణన... చరిత్రాత్మక నిర్ణయం
జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కులగణన నిర్వహించా లన్న ప్రతిపక్షాల డిమాండ్కు కేంద్రం తలొ గ్గిందని కూడా కొందరు సామాజిక రాజకీయ వేత్తలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏమైనా కులగణన ప్రకటన చరిత్రాత్మక రాజకీయ ప్రకటన అని భావించవచ్చు. అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా భారతదేశంలో కుల గణన జరగాలని ఎంతో పోరాడారు. నిజానికి బీసీల కులగణన లేక పోవటం వల్ల బహుజనుల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో న్యాయం జరగలేదు. ఓబీసీల జీవన వ్యవస్థ ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, పాశ్చాత్యీకరణ వలన విధ్వంసం అవుతూ... వారు జీవించే హక్కులు మృగ్యమవుతున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ముదావహం.మారిన పార్టీల అవగాహనఈ ప్రకటన తర్వాత దేశంలోని రాజకీయ, సామాజిక విశ్లేషకు లకు అనేక ప్రశ్నలు ముందుకొచ్చాయి. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ కులగణన ప్రస్తావన వచ్చినప్పుడల్లా వ్యతిరేకించాయి. ఇప్పుడు వాళ్లు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. బిహార్, బెంగాల్, తమిళనాడుల్లో జరగబోయే ఎన్నికల కోసం ఈ ప్రకటన జరిగిందా అనే మరో ప్రశ్న అందరి ముందుకు వచ్చింది. సాక్షాత్తూ పార్లమెంటులోనే బీజేపీ ఎంపీలు కులగణనను వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశ పాలకవర్గం... బ్రాహ్మణ, బనియా, భూస్వామ్య కూటమిగా ఉందనేది స్పష్టం. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అంబేడ్కర్, లోహియా, పెరియార్ రామస్వామి చెబుతూనే వచ్చారు. ‘లండన్ హౌజ్ ఆఫ్ కామన్స్’లో అంబేడ్కర్ శత జయంతి సందర్భంగా... భారత మాజీ ప్రధానమంత్రి వీపీ సింగ్ నాతో మాట్లా డుతూ బీసీల రాజకీయ, సామాజిక సంస్కరణల విషయంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వ్యతిరేకంగా వ్యవహరించార ని అన్నారు. మండల్ కమిషన్ రిపోర్టును ఇందిరాగాంధీ అమలు జరపలేదు. దీనికోసం వీపీ సింగ్ చొరవ చూపారనేది సత్యం. ఈ విషయాలను వీపీ సింగ్, శరద్ యాదవ్, రామ్విలాస్ పాశ్వాన్ అనేక సందర్భాల్లో, ముఖ్యంగా చుండూరు పోరాటం సందర్భంలో నాతో చర్చించడం జరిగింది. బీజేపీ అధికారంలోకి రాక ముందున్న తన ప్రవర్తనను కాంగ్రెస్... బీజేపీ అధికారంలోకి వచ్చాక మార్చుకున్నట్లు అర్థమవుతోంది. నెహ్రూ, ఇందిరాగాంధీ కంటే కూడా సామాజిక, రాజకీయ విషయాల్లోనూ; దళిత బహుజన దృక్పథంలోనూ రాహుల్ గాంధీ అవగాహన భిన్నంగా ఉంది. ఆయనపై సబాల్ట్రన్ స్టడీస్ ప్రభావం కనిపిస్తుంది. తమిళనాడు ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో ఒక అడుగు ముందుకు వేసి 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేసేందుకు పూనుకున్నప్పుడు, వీపీ సింగ్ ప్రభుత్వ మండల్ నివేదికలను అమలు జరపడానికి పూనుకున్నప్పుడు రిజర్వే షన్లకు వ్యతిరేకంగా పోరాటం నడిపినవారు ఆర్ఎస్ఎస్, బీజేపీ వారేనన్నది స్పష్టమే. కుల నిర్మాణ చట్రంఒక రాజకీయ పథకంపై ఓ తీర్పు ఇవ్వడానికి ముందు దానికి సంబంధించిన ప్రాథమిక ప్రణాళికను పరిశీలించడం తప్పనిసరి. ‘ప్రాథమిక ప్రణాళిక’ అంటే ఏ సమాజానికైతే రాజకీయ పథకాన్ని వర్తింపజేయాలని అనుకుంటున్నారో, ఆ సమాజపు నిర్మాణమే ప్రాథ మిక ప్రణాళిక అని చెప్పవచ్చు. సామాజిక నిర్మాణంపై రాజకీయ నిర్మాణం ఆధారపడి ఉందని చెప్పడానికి ఎటువంటి సమర్థనా అవసరం లేదు. వాస్తవానికి రాజకీయ నిర్మాణంపై సామాజిక నిర్మాణం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రాజకీయ నిర్మాణం పని చేసే తీరును అది మార్చవచ్చు, నిరర్థకం చేయవచ్చు లేదా అపహాస్యం పాలు కూడా చేయవచ్చు. భారతదేశ విషయంలో సామాజిక నిర్మాణం అనేది కుల వ్యవస్థపై నిర్మితమై ఉంది. కుల స్వభావం గురించి ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. కానీ కులవ్యవస్థకు ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలను గుర్తించి తీరాలి. కులాలు ఎలా పంపిణీ అయ్యాయి అంటే... ప్రతి ప్రాంతంలోనూ ఒక ప్రధాన కులమూ, కొన్ని చిన్న కులాలూ ఉన్నాయి. జనాభా రీత్యా ప్రధాన కులంతో పోల్చినప్పుడు చిన్నవి కావడం వల్లనూ, గ్రామంలో ఉన్న భూమిలో ఎక్కువ భాగం సొంతం చేసుకున్నటువంటి ప్రధాన కులంపై ఆర్థికంగా ఆధారపడి ఉండటం వల్లనూ... ఈ చిన్న కులాలు ప్రధాన కులానికి లోబడి ఉండేవిగా ఉన్నాయి. కేవలం అసమానతే కులవ్యవస్థ ప్రత్యేకత కాదు. క్రమబద్ధంగా శ్రేణీకరించిన అసమానతతో అది ప్రభావితమై ఉంది. కులాలు ఒకదానిపై మరొకటి ఉంటాయి. అదొక రకమైన ఆరోహణా క్రమపు ద్వేషమూ, అవరోహణా క్రమపు ఏవగింపూ కలిగి ఉన్నాయి. కులమనేది సామాజిక, సాంస్కృతిక, తాత్త్విక జీవన వ్యవస్థల నుండి ఆ యా కాలాలలో పరిణామం చెందుతూ వచ్చి కుల నిర్మూలనా దశకు చేరుకుంటుందని అంబేడ్కర్ భావించారు. అందుకే ఆయన కులనిర్మూలనా ప్రణాళికను రూపొందించారు. కులనిర్మూలనా సంస్కృతి కార్యక్రమ ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో కుల గణనే కాక, కుల ఆర్థిక గణన కూడా చేయగలిగితే... భారతదేశ సామాజిక, ఆర్థికపరమైన నిజ స్వరూపం బయటకు వస్తుంది. అప్పుడే ఏ కులానికి ఎంత సంపద ఉందన్నది బయటకు వస్తుంది. మొత్తం మీద నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన భారతదేశంలో తప్పక గుణాత్మకమైన మార్పు వస్తుందనీ; బీసీలు, దళితులలో... ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం పెరుగుతుందనీ ఆశించాల్సిన చారి త్రక సందర్భం ఇది. సానుకూల దృక్పథమే భారతదేశ భవితవ్యానికీ, దళిత బహుజన రాజకీయ విప్లవానికీ దోహదం చేస్తుందన్నది వాస్తవం.డా‘‘ కత్తి పద్మారావువ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
జైరాం రమేష్ (కాంగ్రెస్) రాయని డైరీ
అక్బర్ రోడ్డులోని పార్టీ ఆఫీసులో ఖర్గేజీ, నేను, ‘ఇంకా కొందరం’ సమావేశమై ఉన్నాం. నిజానికి, ఆ ‘ఇంకా కొందరం’ అనేవాళ్లలో కొందరింకా రానే లేదు. ఆ రానివాళ్ల కోసం చూడటం మానేసి, ఖర్గేజీ మాట్లాడటం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను నేను. ఖర్గేజీ ఎంతకూ మాట్లాడటం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు కాకముందు ఆయన ఎలాగైతే ఉన్నారో, కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఖర్గేజీ వింతగా మెరిసే వజ్రంలా అనిపిస్తారు నాకెందుకో! బహుశా మా ఇద్దరిదీ ఒకే రాష్ట్రం కావటం వల్లనేమో!వజ్రం మాట్లాడదు. ఊరికే మెరుస్తూ ఉంటుంది. మాట్లాడని ‘ఖర్గే’ అనే ఈ కాంగ్రెస్ వజ్రాన్ని చూసి ఏ పార్టీ వాళ్లయినా ఎంతో కొంత నేర్చుకోవలసింది తప్పక ఉంటుందని నాకొక నమ్మకం. ముఖ్యంగా మోదీ... ఖర్గేజీని చూసి మౌనంగా ఎలా ఉండాలో, లేదంటే మితంగా ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి.ప్రధాని ఎంత మితంగా మాట్లాడితే దేశం అంత ప్రశాంతంగా ఉంటుంది. పెద్దాయన చూసుకుంటాడులే అని ప్రజలు ధీమాగా ఉంటారు. పెద్దాయన కూడా మన పొరుగింటి ఆయనలా మాట్లాడేస్తుంటే పాకిస్తాన్కు ఏం భయం ఉంటుంది? పాకిస్తాన్కు చైనా ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటుంది?దేశానికి మోదీజీ పెద్దాయన అయితే,కాంగ్రెస్కు ఖర్గేజీ పెద్దాయన. రాహుల్ బాబు, ఆయన బావగారు రాబర్ట్ వాద్రా ఎప్పుడైనా మితం తప్పి మాట్లాడినా, ఖర్గేజీ తన మౌనంతో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మౌనంతో ఏదైనా బ్యాలెన్స్ అవుతుంది. అతీ బ్యాలెన్స్ అవుతుంది, మితమూ బ్యాలెన్స్ అవుతుంది.‘‘విన్నారా ఖర్గేజీ?’’ అన్నాను, ఆయన్ని నా వైపు తిప్పుకునే ప్రయత్నంగా. ‘‘ఏమిటి వినటం?’’ అన్నట్లు చూశారు. ‘‘డెడ్ లైన్ లు చెప్పకుండా మోదీజీ హెడ్ లైన్లు చెప్పేస్తున్నారు! దెబ్బకు దెబ్బ అంటున్నారు. ఆ దెబ్బ ఎప్పుడో చెప్పటం లేదు. జనాభా లెక్కలతో పాటే కులాల లెక్కలు అంటున్నారు. ఆ జనాభా లెక్కలు ఎప్పుడో చెప్పటం లేదు’’ అన్నాను.‘‘చెప్పవలసినవి ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి’’ అన్నారు రాహుల్ బాబు లోనికి ప్రవేశిస్తూ. ఆ వెనుకే ప్రియాంక. ఖర్గేజీ వారిద్దరి వైపూ చూశారు కానీ మాటలతో ఏమీ స్పందించలేదు. అలాగని మౌనంతోనూ స్పందించలేదు. ప్రియాంక పార్టీ జనరల్ సెక్రెటరీగా ఉండి, మీటింగ్కి లేట్గా రావటం ఆయనకు నచ్చినట్లు లేదు. ‘‘సారీ ఖర్గేజీ... రేఖాగుప్తా సీఎం అయ్యాక ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. అక్బర్ రోడ్డులో అయితే మరీ ఘోరం. అందుకే మీటింగ్కి లేటైంది’’ అన్నారు ప్రియాంక. రాహుల్ సెల్ ఫోన్ చూసుకుంటూ వచ్చి, దొరికిన కుర్చీలో కూర్చొని, ‘‘చెప్పవలసినవి ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి’’ అని మళ్లీ అన్నారు మోదీ గురించి. ‘‘అవును రాహుల్జీ, దేశంలో కులగణన చేయించాలని మనం డిమాండ్ చేస్తున్నందుకు మోదీ మనల్ని అర్బన్ నక్సలైట్లు అన్నారు. ఇన్నాళ్లకు వాళ్లూ మన దారిలోకి వచ్చి కులగణన అంటున్నారు. మరి వాళ్లెప్పటి నుండి అర్బన్ నక్సలైట్ అయ్యారో’’ అన్నాను. అంతా నవ్వారు. ఖర్గేజీ నవ్వలేదు!‘‘ఇప్పుడైనా... అదే పనిగా కాకుండా, పనిలో పనిగా మాత్రమే కులగణనను చేయిస్తామంటున్నారు’’ అన్నారు రాహుల్. ‘‘అది నిజమే కానీ...’’ అని ఆగారు... ఖర్గేజీ హఠాత్తుగా మౌనం వీడి! అందరం ఖర్గేజీ వైపు చూశాం.‘‘... వాళ్లు చేయాలనుకుంటున్నది జనగణనలో భాగంగా కులగణన కాదు. కులగణనలో భాగంగా జనగణన. నేరుగా కులగణన అంటే రాహుల్కి క్రెడిట్దక్కుతుందని జనగణనలో భాగంగా కులగణన అంటున్నారంతే’’ అన్నారు ఖర్గేజీ!!వజ్రం లాంటి మాట!ఆ మాటతో మా మీటింగ్ మొదలైంది. -
AP: ఈ చట్టం పేదల పాలిట శాపం
ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ (నిషేధం) చట్టం–2024 ఉభయ సభల్లో ఆమోదం పొందింది. గత నవంబర్ 14వ తేదీన రెవెన్యూ శాఖ మంత్రి శాసన సభలో బిల్లు ప్రవేశపెట్టారు. శాసనసభలో ఎలాంటి చర్చలు లేకుండా ఏకపక్షంగా ఈ బిల్లును ఆమోదింప చేసుకుంది ప్రభుత్వం. శాసన మండలిలో పీడీఎఫ్ సభ్యులు చేసిన సూచనలను పట్టించు కోలేదు. పేదలకు అన్యాయం తలపెడతాయని సందే హిస్తున్న క్లాజులను తొలగించాలన్న డిమాండ్లను ప్రభుత్వం తిరస్కరించింది. సెలెక్టు కమిటీకి కూడా సిఫారసు చేయలేదు. కేంద్ర చట్టాలతో ముడిపడి ఉన్నందున రాష్ట్ర ఉభయ సభల్లో బిల్లు ఆమోద మయ్యాక, గవర్నర్ నుంచి ఈ బిల్లు రాష్ట్రపతి పరి శీలన, ఆమోదం కోసం వెళుతుంది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) అధికారంలో ఉంది కనుకా, అది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఆధార పడి ఉంది కనుకా; ఇటువంటి చట్టం గుజరాత్, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెచ్చినందునా ఈ బిల్లుకు సులువుగానే రాష్ట్రపతి ఆమోదం లభించవచ్చు.రాష్ట్రంలో వేగవంతంగా జరుగుతున్న పట్టణీకరణ, వ్యాపారీకరణలు.. ప్రభుత్వ, ప్రైవేటు భూముల దురాక్రమణలకు ఉత్ప్రేరకాలుగా ఉన్నాయనీ, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న భూకబ్జాలు, సంబంధిత పరిణామాల వలన అన్ని వర్గాలూ ఇబ్బందులు పడుతున్నాయనీ; వాటిని అరికట్టడానికి చట్టం తెస్తున్నామని కూటమి ప్రభుత్వం బిల్లులో పేర్కొంది. ‘ఏపీ భూ దురాక్రమణ (నిషేధం) చట్టం–1982’ కంటే గట్టి చట్టం తెస్తున్నందున, ఇప్పటివరకు ఉనికిలో ఉన్న ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నామన్నారు. నిజానికి పాత చట్టానికి, కొత్త చట్టానికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు. 1982 యాక్ట్ అప్పటి ఉమ్మడి ఏపీలోని అర్బన్ ప్రాంతాలకు పరిమితంకాగా, ‘2024 బిల్లు’లో రూరల్, అర్బన్ సహా రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది. ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, చారిటబుల్, ప్రైవేటు భూముల ఆక్రమణలను నేరాలుగా పరిగణించి శిక్షిస్తామన్నారు.పాత చట్టంలో భూముల కబ్జాకు పాల్పడిన వారిపై అభియోగం రుజువైతే ఆరు నెలలకు తక్కువ కాకుండా జైలు శిక్ష అన్నారు. కొత్తగా తీసుకొచ్చిన బిల్లులో పదేళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష అన్నారు. పధ్నాలుగేళ్ల వరకు జైలు శిక్షను పెంచవచ్చు అన్నారు. ప్రత్యేక కోర్టులు అప్పుడూ ఇప్పుడూ ఉన్నాయి. కోర్టులను ఏర్పాటు చేసే, జడ్జిలను నియమించే అధికారం, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పర్చారు. దీనిపై 1982 ఆగస్టులో బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో, ఎప్పుడుపడితే అప్పుడు కోర్టులను, జడ్జిలను ఏర్పాటు చేసే, రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పరిస్తే, ఒక వేళ ప్రభుత్వంలో ఉన్న వారిపైనే భూకబ్జా అభియోగాలు వస్తే, శిక్షల దాకా వెళితే సదరు కోర్టులను, జడ్జిల నియామకాలను ఆపివేస్తారా అని ప్రశ్నించి.. ఆ గ్యారంటీ బిల్లులో లేదని వామపక్ష పార్టీలు నిలదీశాయి. రద్దు చేసిన చట్టంలో ఏముందో కొత్తగా తెచ్చిన చట్టంలోనూ అదే ఉంది. దీనిని బట్టి ప్రభుత్వం అసలు నైజం బట్టబయల వుతుంది. నాలుగున్నర దశాబ్దాలుగా పాలకులు అమలు చేస్తున్న నూతన ఆర్థిక విధానాల కారణంగా ఆశ్రిత పెట్టుబడిదారులు భూకబ్జాలకు పాల్పడి శిక్షలు పడే దాకా వస్తే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ కోర్టులను రద్దు చేయిస్తారు కదా!బిల్లులో పేర్కొన్న శిక్షల విషయానికొస్తే జైలు శిక్ష, జరిమానా అన్నారు. కబ్జాకు పాల్పడిన ఆస్తి మార్కెట్ విలువను గ్రాబర్ (ఆక్రమణదారు) నుంచి వసూలు చేస్తామంటున్నారు. ఇక్కడ మార్కెట్ విలువంటే (Market Value) రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఉండే బుక్ వాల్యూనా, లేదంటే బహిరంగ మార్కెట్లో క్రయ విక్రయాల రేటా అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ బుక్ వాల్యూనే అయితే కబ్జాదారుకే లాభం. ఆ విధంగా గ్రాబింగ్ చట్టబద్ధమైపోతుంది. అందుకే కబ్జా చేసిన ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తే కబ్జాదారులకు సరైన శిక్ష అవుతుంది. జైలు శిక్ష, జరిమానాతో పాటు ఆస్తి జప్తు కూడా చట్టంలో ఉండాలి. బిల్లులో ఈ ప్రధాన అంశం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూములను ఆక్రమించుకున్నవారు ల్యాండ్ గ్రాబర్ల (Land Grabbers) కిందకు వస్తారని బిల్లు చెబుతోంది. ఇళ్లు లేని పేదలు ప్రభుత్వ భూముల్లో వంద యాభై గజాల్లో నివాసాలు ఏర్పరుచుకుంటే చట్ట ప్రకారం ల్యాండ్ గ్రాబర్ అయిపోతారు. ఇళ్లు వేసుకోమని పేదలను ప్రోత్సహించిన రైతు కూలీ సంఘాల నాయకులు కూడా నేరస్థులవుతారు. ప్రభుత్వ ఎండోమెంట్, వక్ఫు భూములను ఎకరమో, రెండెకరాలో సాగు చేసుకుంటున్న పేదలు భూ దురాక్రమణదారులై శిక్షలకు గురవుతారు. కొంత మంది పెద్దలు ప్రభుత్వ భూములను ఆక్రమించి ప్లాట్లు వేసి దర్జాగా అమ్ముకుంటున్నారు. చౌకగా వస్తుందన్న ఆశతో సామాన్యులు కొంటున్నారు. ఎవరు ప్రస్తుతం పొజిషన్లో ఉన్నారో వారు గ్రాబర్ అయిపోతారు తప్ప ఆక్రమంగా భూములను ఆక్రమించి అమ్మిన అసలు వ్యక్తి తప్పించుకుంటారు.చదవండి: ఐక్యంగా నిబడటం మనకు తెలుసు!ఇలాంటి ప్రమాదకర చట్టంపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులతో విస్తృతంగా చర్చించకుండా ఏకపక్షంగా అసెంబ్లీలో ఆమోదింపచేసు కోవడం అప్రజాస్వామిక చర్య అవుతుంది. పేదల హక్కులపై భస్మాసుర హస్తంగా మారే భూదురాక్రమణ చట్టానికి వ్యతిరేకంగా పేదలను సంఘటిత పరిచే ఉద్యమాన్ని రైతు కూలీ సంఘాలు తీవ్రతరం చేయాలి.– ముప్పాళ్ళ భార్గవశ్రీసీపీఐ ఎంఎల్ నాయకులు -
మరో మహమ్మారిని ఎదుర్కొనేలా...
కోవిడ్ వంటి మహమ్మారిని మరింత సమ ర్థంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నేతృత్వంలో ఏప్రిల్ 16న ఈ మేరకు ‘ద పాండెమిక్ ట్రీటీ’ ఒప్పందం కుదిరింది. డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలో కుదిరిన రెండో అంతర్జాతీయ ప్రజారోగ్య ఒప్పందం ఇది. 2003లో ‘ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్’ చర్చల్లో నేను భారత్కు ప్రాతినిధ్యం వహించాను. పొగాకు నియంత్రణకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని అమెరికా, జపాన్ , అర్జెంటీనా వ్యతిరే కించినా, యూరోపియన్ యూనియన్ తటపటాయించినా చివరకు వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని గుర్తించారు. ‘ద పాండెమిక్ ట్రీటీ’ విషయంలోనూ వాణిజ్య ప్రయోజనాలు కొందరి ప్రాధాన్యంగా ఉండింది. ఫలితంగా ఈ ఒప్పందంపై నాలు గేళ్లుగా చర్చలు, వాద ప్రతివాదాలూ నడిచాయి. కోవిడ్ వంటి మహ మ్మారి విషయంలో ఎదురైన వైఫల్యాలను మాత్రం ప్రపంచ దేశా లన్నీ గుర్తించాయి. విపత్కర పరిస్థితుల్లో దేశాల మధ్య మరింత సమ న్వయం, సహకారం అవసరమనీ, వట్టిమాటలు, సంఘీభావాలతో ప్రయోజనం తక్కువేననీ అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఒక ఒప్పందం అవసరాన్ని కూడా గుర్తించాయి. వాస్తవానికి ఈఒప్పందం గత ఏడాదే అమల్లోకి రావాల్సింది. ఒప్పంద ప్రతిలోని భాష విషయంలో కొన్ని దేశాలు విభేదించడంతో ఈ ఏడాదికి పొడిగించాల్చి వచ్చింది. ధనిక దేశాల మొండిపట్టు‘ద పాండెమిక్ ట్రీటీ’ ఏడాది క్రితమే కుదరకపోవడానికి రెండు ప్రధానమైన అంశాలు కారణం. ప్రపంచం మొత్తానికి టీకాలు,మందులు, టెక్నాలజీలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండేలా హామీ పొందడం ఒకటైతే... ప్రమాదకరమైన సూక్ష్మజీవులను మొట్టమొదట గుర్తించిన దేశం దాన్ని ఇతర దేశాలతో పంచుకోవడం (టీకా, మందులపై ప్రయోగాలు, నిర్ధారణ పరీక్షల అభివృద్ధి వంటి వాటికోసం) రెండో విషయం. ధనిక దేశాలు తమ ఫార్మా కంపెనీల ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఈ విషయాలపై పేటెంట్ హక్కులను రక్షించుకునే ప్రయత్నం చేశాయి. అదే సమయంలో తమకు టీకాలు, మందులు, టెక్నాలజీలు అందుబాటు ధరల్లోఉండేలా చూడాలని పేద, మధ్యస్థాయి దేశాలు పట్టుబట్టాయి. హాని కారక సూక్ష్మజీవులను ఇతర దేశాలతో పంచుకుంటున్నందుకు, క్లినికల్ ట్రయల్స్ ద్వారా తమ జనాభాల్లో టీకా, మందులను ప్రయో గించి చూస్తున్నందుకు తమకు ఈ వెసలుబాటు కల్పించాలని కోరాయి. ఈ వైరుధ్యం కారణంగా చర్చలు దీర్ఘకాలం కొనసాగాయి. ఒప్పందంలోని పదాలను కూడా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో మార్చాల్సి వచ్చింది. చివరకు ఈ 2 వివాదాస్పద అంశాలను కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమావేశాల్లో చర్చలు కొనసాగించాలని నిర్ణ యించారు. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ట్రీటీని ప్రవేశ పెట్టిన తరువాత ఇది అమల్లోకి వస్తుంది. ఫార్మా కంపెనీల ప్రయోజనాలను కాపాడేందుకు ధనిక దేశాలు ఎంత మూర్ఖంగా బేరాలాడాయి అంటే... సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునే విషయంలో ‘పరస్పర అంగీకారం ఆధారంగా’ అన్న వాక్యాన్ని ‘స్వచ్ఛంద పరస్పర అంగీకారం’ అని మార్చేంత వరకూ ఒప్పుకోలేదు. సానుకూలతలుకోవిడ్ సమయంలో ధనిక దేశాలు టీకాలను నిల్వ చేసుకున్న దాఖలాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. టీకాలు అందుబాటులో లేని చోట్ల కోవిడ్ వైరస్ వేగంగా రూపాంతరం చెందిన విషయమూ తెలిసిందే. ఒక్క విషయమైతే స్పష్టం. ద పాండెమిక్ ట్రీటీ విషయంలో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా 193 దేశాలు కొన్ని కీలకఅంశాల విషయంలోనైతే ఏకాభిప్రాయానికి వచ్చాయి. కోవిడ్ వంటి మహమ్మారులు ప్రబలుతున్న సమయంలో సమాచారాన్ని వేగంగా, తగిన సమయంలో పంచుకోవాలన్నది వీటిల్లో ఒకటి. అలాగే టీకాలు, మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల తయారీదారులు తమ ఉత్పత్తిలో కనీసం 20 శాతాన్ని అందుబాటు ధరల్లో డబ్ల్యూహెచ్ఓకు అందించాలన్నది రెండోది. వ్యాధిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం మూడోది. మాస్కులు, పీపీఐ కిట్ల వంటి వాటి సరఫరా, లభ్యతల విషయంలో డబ్ల్యూహెచ్ఓకు పర్యవేక్షణ అధికారం దక్కడం ఒక విశేషం.ఈ ఒప్పందం కోవిడ్ లాంటి మహమ్మారుల నివారణపై కూడా దృష్టి పెడుతోంది. వన్ హెల్త్ పద్ధతిని అనుసరించాలని సూచిస్తోంది. భౌగోళికంగా వేర్వేరు ప్రాంతాల్లో పరిశోధనలు చేపట్టాలనీ, ప్రమాద కర సూక్ష్మజీవులు పరిశోధనలకు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, మందులు, ఇతర ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలనీ కూడా ఈ ఒప్పందం ప్రస్తావిస్తోంది. అంతేకాకుండా... అంతర్జాతీయ స్థాయిలో వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులను అరోగ్య అత్యవసర పరిస్థితులకు దీటుగా స్పందించేలా సిద్ధం చేయాలని, ఈ కార్యకలా పాలకు అవసరమైన ఆర్థిక వనరుల సమన్వయానికి, ఆరోగ్య వ్యవస్థ లను బలోపేతం చేసేందుకూ, అంతర్జాతీయంగా సప్లై చెయిన్, లాజి స్టిక్స్ నెట్వర్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.ప్రజారోగ్యం విషయంలో దేశాలకు ఉన్న సార్వభౌమ అధికారా లను గుర్తించే ఈ ఒప్పందం, అందులోని అంశాలు ఏ రకంగానూ డబ్ల్యూహెచ్ఓ ఇస్తున్న ఆదేశాలుగా భావించరాదని స్పష్టం చేస్తోంది. దేశీ విధానాలు, కార్యక్రమాలను మార్చుకోవాల్సిన అవసరమూ లేదని తెలిపింది. అంటే ప్రయాణీకుల నిలిపివేత, టీకాలు తప్పనిసరి చేయడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టడం వంటివి.నిపుణుల ఆమోదం...ఈ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరడంపై అంతర్జాతీయ నిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్య చట్టాల విషయంలో నిపుణుడైన అమెరికా న్యాయవాది లారెన్స్ గోస్టిన్దృష్టిలో ఈ ఒప్పందం ఒక ఘన విజయం. ఈ ఒప్పందంపై విమర్శకులు కూడా లేకపోలేదు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ఉండగా... రిపబ్లికన్ పార్టీ నేతలు, ఒక వర్గం మీడియా వ్యాఖ్యాతలు అమెరికా ఈ చర్చల్లో పాల్గొనడాన్నే తప్పుపట్టారు. డబ్ల్యూహెచ్ఓ అమెరికా సార్వభౌమత్వంలో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ ముసాయిదా ఒప్పందాన్ని తిరస్కరించారు. వాణిజ్యం, పర్యాటకరంగాలపై దీని ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ప్రభుత్వంగా మారే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత డబ్ల్యూహెచ్ఓ నుంచిట్రంప్ వైదొలగడంతో ఈ ఒప్పందంపై చర్చలు వేగవంత మయ్యాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సాగాయని కూడా చెప్పాలి. ఇక్కడ ఒక కీలకమైన విషయం గురించి చెప్పుకోవాలి. ఒప్పందాన్ని ఆమోదించిన దేశాల జాబితాలో అమెరికా లేకపోవడం హానికారక సూక్ష్మజీవులపై ప్రపంచవ్యాప్త నిఘా అన్న అంశాన్ని బలహీన పరిచేదే. సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి కూడా ఎంతవరకూ సాధ్యమవుతుందన్నది చూడాలి. కాబట్టి ఆ యా దేశాల స్థాయిలో వనరుల నిర్మాణం, ప్రాంతీయ స్థాయిలో సహకారం వంటి ఇతర మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయి సవాళ్లకు అంతే స్థాయి స్పందన కూడా అవసరమవుతుంది. పాండె మిక్ ట్రీటీ ఈ దిశగా వెళ్లేందుకు తగిన చోదక శక్తిని ఇస్తోంది!-వ్యాసకర్త ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’,‘ఇండియన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ’ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)- కె. శ్రీనాథ్ రెడ్డి -
ఇప్పుడు మనం ఏం చేయాలి?
సిసలైన ఉద్వేగాలు సాటి మనుషులకు అర్థమవుతాయి. ఉద్వేగాలలోని నిజాయితీ ఉద్దేశాలలో ఉండదు. ‘పహల్గామ్’ ఘటన తరువాత ఏర్పడిన ఉద్వేగాలనూ, ఉద్దేశాలనూ కాస్త ముందు వెనుకలుగా వేరు చేసి మనమంతా ఒక్కటిగా శత్రువును ఎదుర్కొందాం అనే సందేశాన్ని ఇవ్వడంలో దేశవాసులు దాదాపు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. అయితే అదంత సులువు కాలేదు. ఉద్దేశాలున్నవారు వాట్సప్లలో మునివేళ్లను కదిలించినంత వేగంగా ఉద్వేగాలున్నవారు కదిలించలేకపోయారు. అయినప్పటికీ వేగంగా మేలుకొని జవాబు చెప్పడానికి ప్రయత్నించారు. ఇందుకు అల్లాహ్కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్గామ్ (pahalgam) ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారన్న వార్త వినగానే ముందు మనిషిగా, తర్వాత ముస్లింగా ఎంతో బాధను, ఆందోళనను అనుభవించాను. దేశంలోని కోట్ల ముస్లింలు ఇటువంటి పాశవిక దాడికి తీవ్రంగా నాలాగే బాధ పడ్డారు. మతం అడిగి ఇలాంటి దాడి చేశారన్న వార్త వారిని వేదనలో, విషాదంలో ముంచెత్తింది. ఈ తీవ్ర ఘటన తాలూకు విషాదాన్ని అనుభవించాలా, లేకుంటే తమకు ఏ సంబంధమూ లేకపోయినా జరిగే విద్వేష ప్రచారానికి కలత పడాలా అనే ఆందోళనలో వారు తల్లడిల్లారు. అయితే ఎవరైతే చావు నోటి వరకూ వెళ్లి వచ్చారో వారే ఈ పరిస్థితిని కుదుట పరచగలిగారు. మానవీయత ఉన్న కశ్మీరీలు తమ ప్రాణాలకు వారి ప్రాణాలను ఎలా అడ్డు పెట్టి కాపాడారో చెప్పిన కథనాలు దేశ ప్రజలకూ, ముఖ్యంగా ముస్లింలకూ ఊరటనిచ్చాయి.కశ్మీర్ (Kashmir) విషయంలో భారత్–పాకిస్తాన్ల మధ్య చాలా కాలంగా సాగుతున్న వైరం లెక్కలేనంత మందిని బలిదీసుకున్నా గత దాడులన్నీ సైన్యంపై జరిగితే, ఈసారి పర్యాటకులపై హిందూ మతం పేరిట జరిగింది. ఈ దాడి వెనుక ఉగ్రవాదుల ప్రధాన ఉద్దేశం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడం, కశ్మీర్ను ప్రపంచ దృష్టికి తీసుకురావడం. ఈ ఉగ్రచర్యకు పాల్పడినవారు, వారికి ఆర్థిక సాయం అందించినవారు, స్పాన్సర్లు.. పహల్గామ్ అమాయకుల ప్రాణాలను బలిదీసుకోవడంలో పాత్ర పోషించినవారే. వారందరినీ ఈ దాడికి జవాబుదారీగా చేసి, న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి.మతం అడగడం సిగ్గుచేటుప్రపంచంలోని ఏ మతగ్రంథం కూడా ప్రజలను చంపమని చెప్పలేదు. ఈ ఉగ్రదాడిలో బాధితుడి మతాన్ని అడగడం, అతను హిందువా, ముస్లిమా అని గుర్తించడానికి కల్మా పఠించమనడం సిగ్గుచేటు. శాంతిని కోరే భారతీయ ముస్లింలు ఇలాంటి నీచత్వాన్ని ఏ మాత్రం హర్షించరు. నిజమైన మానవుడంటే ప్రాణాలను కాపాడేవాడే కానీ ప్రాణాలను తీసేవాడు కాదు. ఖురాన్ లోని సూరహ్ అల్–మాయిదా వచనం 5:32 ‘ఒక అమాయకుడిని చంపేవాడు మొత్తం మానవాళిని చంపినట్లే’ అని చెబుతుంది. ఈ సూరహ్ కరుణ, సానుభూతి, బలహీనుల రక్షణను ప్రోత్సహిస్తుంది. తాను ముస్లిం అని చెప్పుకొనే వ్యక్తి ఈ భూమిపై ఏ మానవుడినీ చంపడు.భారతదేశ ప్రజలు కోరుకునేది మత విద్వేషాలు కాదు. భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల శరణార్థులను స్వీకరించిందే తప్ప, ఈ దేశం నుండి ఏ వ్యక్తిని ఇతర ప్రాంతాలకు శరణార్థిగా పంపలేదు. అదే ఈ దేశానికున్న ఘనత. ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రేమగల దేశం. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న ముస్లింలతో పోలిస్తే భారతదేశంలో ముస్లింలకు అత్యున్నత గౌరవం, రక్షణ దొరుకుతున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇక్కడి ముస్లింల పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది.ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ మతాన్నీ కలవరపెట్టకుండా, ద్వేషించకుండా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చు. రాజకీయ నాయకుల ప్రసంగాలు, మీడియా వ్యాఖ్యలను ఒక తటస్థ స్థితికి తేవాలి. సమస్యకు పరిష్కారం వెతకాలి. అన్ని మతాల ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు, ముస్లిం, హిందూ మతాధికారులు, అన్ని మత పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల అధిపతులు, ఉపాధ్యాయులు ఇందులో భాగం కావాలి. అన్ని మతాలను ప్రేమించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, ఉమ్మడి విలువలను తీసుకురావాలి. ప్రభుత్వాన్నో, ఫలానా రాజకీయ పార్టీనో విమర్శించి చేతులు దులుపుకోకుండా ఉగ్రవాదాన్ని బలంగా ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడమే ఇప్పుడు మన ముందున్న బాధ్యత.దేశం ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మీడియా దేశంలోని భిన్నవర్గాలను బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ పార్టీలు, మతాల పేరుతో వర్గాలను విభజించకూడదు. ముస్లింల వల్లే తాము బతికి ఉన్నామని చెప్పిన బాధితుల కుటుంబాల మాటలను మీడియా కూడా ప్లే చేయాలి. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు ఇలా చేయడం లేదు. పౌర హక్కులు, మానవ హక్కుల కార్యకర్తల్లాగే ఇప్పుడు మతస్వేచ్ఛ కార్యకర్తలు అవసరం. మత విద్వేషాన్ని ఆపేందుకు వారి తోడ్పాటు కావాలి.చదవండి: ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశంభారత్–పాక్ అణుశక్తిని కలిగి ఉన్న దేశాలు. ఒకసారి యుద్ధం మొదలైందంటే ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియదు. అందుకే యుద్ధకాంక్షను ఆపి, శాంతి వైపు చర్చలు జరపాలి. స్నేహపూర్వక దేశాలతో కూర్చుని ఈ సమస్యను పరిష్కరించాలి. యుద్ధమనేది అంతిమ పరిష్కారం. ఉగ్రదాడిలో అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరులకు వందనం చేద్దాం. భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవుల మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు. బయట శత్రువు కన్నెత్తి చూస్తే ఈ దేశంలోని అన్ని మతాల వారు ఐక్యమై సింహాల్లా గర్జించగలరని చాటడమే ఇప్పుడు కావలసింది. జై భారత్. జై హింద్.- జహారా బేగం సామాజిక కార్యకర్త, యూఎస్ఏ -
NCERT చెరిపేస్తే చెరిగిపోతుందా చరిత్ర?
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసర్చ్ అండ్ ట్రయినింగ్ (ఎన్సీఈఆర్టీ) 2025–26 విద్యాసంవత్సరం నుంచి అమలులోకి రావడం కోసం ప్రచురింన ఏడో తరగతి పాఠ్య పుస్తకం మొదటి భాగం వెలువడిన సందర్భంగా అందులో గతం నుం కొనసాగిన, రద్దయిపోయిన, మారిన అంశాల గురించి వార్తా కథనాలు ఈ సోమవారం సంచలనం సృష్టించాయి.పాఠ్య పుస్తకాలు మార్చడాన్ని ఎవరూ తప్పు పట్టనక్కరలేదు. తప్పనిసరిగా పాఠ్య పుస్తకాలు ఎప్పటికప్పుడు మారవలసిన అవసరం ఉంటుంది. ఆ రంగంలో కొత్త పరిశోధనలు జరిగి కొత్త ఆవిష్కరణలు బైటపడినప్పుడు ఆ కొత్త విషయాలు విద్యార్థులకు అందుబాటులోకి తేవడానికి పాఠ్య పుస్తకాలలో మార్పులూ చేర్పులూ చేయవలసి ఉంటుంది. కానీ ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలలో గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న మార్పులూ, చేర్పులూ, తొలగింపులూ ఆ యా శాస్త్ర రంగాలలో జరిగిన నూతన అన్వేషణలకు సంబంధింనవి కావు. అవి ఆ సంస్థనూ, విద్యా శాఖనూ, భారత ప్రభుత్వాన్నీ ఇవాళ నడుపుతున్నవారి భావజాలానికి తక్షణ ప్రయోజనాలకు అనుగుణమైనవి. ఏదో ఒక భావజాలం మాత్రమే చెప్పడం విద్యార్థుల చిన్నారి మనసులను కుంంపజేసి, కళ్లకు గంతలు కట్టడమే. అలాగే ఐదు సంవత్సరాల పాలనాధికారం కోసం గద్దెనెక్కిన వారు తమ తక్షణ ప్రయోజనాలను న్నారి పిల్లల మనసులపై సుదూర ప్రభావం పడేలా నింపడం అనుచితం. ఇప్పుడు ఏడో తరగతి కోసం కొత్తగా విడుదల చేసిన ‘ఎక్స్ప్లోరింగ్ సొసైటీ – ఇండియా అండ్ బియాండ్ (భాగం 1)’ అనే పుస్తకం ఇప్పటివరకూ ఉండిన చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పౌరనీతి (సామాజిక, ఆర్థిక జీవనం) అనే మూడు విడివిడి పుస్తకాలను తొలగించి ఆ స్థానంలో ఒకే సమగ్ర పుస్తకంగా తయారయింది. రెండో భాగం కూడా త్వరలో వెలువడుతుందని అంటున్నారు గానీ, ఈ పుస్తకం వరకే చూస్తే చాలా మార్పులు కనబడుతున్నాయి. ‘ప్రపంచం’, ‘గత వైభవ దృశ్యం’, ‘మన సాంస్కృతిక వారసత్వం-జ్ఞాన సంప్రదాయాలు’, ‘పాలన- ప్రజాస్వామ్యం’, ‘మన చుట్టూ ఉన్న ఆర్థిక జీవనం’ అనే ఐదు ఇతివృత్తాలతో ఈ పుస్తకం ఉంది. అంతకు ముందరి ఏడో తరగతి చరిత్ర పుస్తకం ఏడో శతాబ్ది నుంచి భారత చరిత్రను పరిచయం చేయగా దానికి భిన్నంగా ప్రస్తుత పుస్తకం ఆరో శతాబ్దితో ముగుస్తుంది. అందువల్ల పాత పుస్తకంలో ఉండిన మధ్య యుగాల చరిత్ర, ఢిల్లీ సల్తనత్, ముఘల్ పాలన వంటి పాఠాలు లేకుండా పోయాయి. చరిత్రలో ఒక భాగాన్ని న్నారి పిల్లల పాఠ్యాంశాల్లోం తొలగించినంత మాత్రాన ఆ చరిత్రను రద్దు చేయగలమని అనుకోవడం హాస్యాస్పదం. కోవిడ్ తర్వాత న్నారి విద్యార్థుల మీద పాఠ్యాంశాల భారం ఎక్కువగా ఉండగూడదనే సదుద్దేశంతో పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ పేరుతో కొన్ని పాఠ్యాంశాలను కుదించడం ప్రారంభించారు. ముఘల్ చరిత్రలో కొంత భాగాన్ని, డార్విన్ జీవ పరిణామవాద సిద్ధాంతాన్ని, పీరియాడిక్ టేబుల్ను పాఠ్యాంశాలలో కుదించారు. ప్రస్తుత పుస్తకం మరొక అడుగు ముందుకు వేసి కొన్ని పాఠ్యాంశాలను పూర్తిగానే తొలగింంది. అయితే ‘భారం తగ్గించడం కోసం పాఠ్యాంశాల తగ్గింపు, తొలగింపు’ అనే సూత్రం కూడా త్తశుద్ధితో పాటించలేదు. కొన్ని కొత్త పాఠాలు వచ్చి చేరాయి. ‘భూమి పుణ్యభూమి ఎలా అవుతుంది’ అని ఒక అధ్యాయం చేర్చి, ప్రత్యేక స్థలాలను మతాలు ఎలా పవిత్రంగా భావిస్తాయో ఒక పాఠం చేర్చారు. ద్వాదశ జ్యోతిర్లింగాల గురిం, చార్ ధామ్ యాత్ర గురిం, శక్తి పీఠాల గురిం ఏడో తరగతి పిల్లలకు పాఠాలు పెట్టారు. అలాగే ‘అరవై ఆరు కోట్ల మంది పాల్గొన్న కుంభమేళా’ గురించి పాఠం చేర్చారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, పాణిని వ్యాకరణం, ఆర్యభట్టు ఖగోళ శాస్త్రం, గుప్త సామ్రాజ్యంలో శాస్త్ర పరిశోధనలు వంటి ప్రాచీన భారత మేధా కృషి గురించి పాఠాలు చేర్చారు. వర్ణ–కుల వ్యవస్థ ప్రాచీన భారత సమాజంలో స్థిరత్వం సాధించడంలో నిర్వహింన పాత్ర గురిం ఒక పాఠం పెట్టి, బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కుల వ్యవస్థ కరడుగట్టి అసమానతలకు దారి తీసిందని రాశారు. ఆరో శతాబ్దం నుంచి ఇరవై ఒకటో శతాబ్దానికి గంతు వేసి ప్రస్తుత ప్రభుత్వపు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘బేటీ బచావో బేటీ పఢావో’, ‘అటల్ సొరంగం’ నిర్మాణం వంటి విషయాలు రాశారు. ఇలా మనం ఏకీభవింనా ఏకీభవించకపోయినా చరిత్ర లో జరిగిపోయిన వాస్తవ ఘటనలను, పరిణామాలను చెప్పకుండా ఉండాలనుకుంటే ఆ మేరకు చిన్నారి పిల్లల మనసులలో, పరిజ్ఞానంలో అనవసరమైన, ప్రమాదకరమైన ఖాళీలు, శూన్యాలు ఏర్పడతాయి. ఉద్దేశపూర్వకంగా ఖాళీలు వదలడం జ్ఞాన సముపార్జన శక్తిని ధ్వంసం చేసే, ఆలోచనా శక్తిని కురచబరిచే పద్ధతి. ఎటువంటి విషయమైనా చెప్పి, దాని పట్ల విమర్శనాత్మకంగా ఉండాలనే సందేశం ఇవ్వవలసిన చోట, కొన్ని విషయాలను తుడిచేయగలమని అనుకోవడం అనుతం. ఈ పద్ధతి ఎన్సీఈఆర్టీ వంటి ప్రామాణిక సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. అది పాఠశాల విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి 1961లో కేంద్ర ప్రభుత్వం రపొందించిన అత్యున్నత ప్రవణాల స్వతంత్ర సంస్థ. అది చేసే అనేక పనులలో భాగంగా పాఠ్యాంశాలను రూపొందించి, వాటి ఆధారంగా ఆ యారంగాల నిపుణుల చేత పాఠ్యపుస్తకాలు రాయిం, మూడు నాలుగు అంచెల పర్యవేక్షణ, పరిశీలన, సవరణల తర్వాత అచ్చువేసి దేశవ్యాప్తంగా పంపిణీ చేసే పథకం 1970ల నుం సాగుతున్నది. ముఖ్యంగా ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాలు, భాషా సాహిత్యాల పుస్తకాలు ఆ యా తరగతుల వారు మాత్రమే కాక యూపీఎస్సీ పరీక్షార్థులు, సాధారణ పాఠకులు కూడా చదువుకునేంత ఆసక్తికరంగా తయారయ్యాయి. నిష్ణాతులు రాసిన, దశాబ్దాల పాటు అపారమైన గౌరవాన్ని చూరగొన్న ఆ పుస్తకాలను అడ్డదిడ్డంగా మార్చి, సంఘ్ శాఖలలో ఇన్నాళ్లుగా చెబుతున్న వక్రీకరింన, సంకుతమైన, కళ్లకు గంతలు కట్టే చరిత్రను ఇప్పుడు పాఠ్యపుస్తకాలకు ఎక్కిస్తున్నారు. ఎటువంటి పరిశోధన లేకుండా, వాస్తవాల పట్ల గౌరవం లేకుండా ఐటీ సెల్స్లో వండి వార్చిన అసత్యాల, అర్ధసత్యాల, వాట్సప్ యూనివర్సిటీ చరిత్రకు పాఠ్యపుస్తకాల గౌరవం కల్పిస్తున్నారు. భవిష్యత్ తరాన్ని ధ్వంసం చేస్తున్నారు. -ఎన్ వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్ట్ -
ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశం
పహల్గామ్ ఊచకోత పట్ల భారత ప్రభుత్వం ఎంతో పరిపక్వత ప్రదర్శించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్నారు. తక్షణం కశ్మీర్ వెళ్లి పరిస్థితి ఏమిటో స్వయంగా తెలుసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై అప్పటికప్పుడు ఏయే చర్యలు చేపట్టాలో గుర్తించారు. వీసాలు రద్దు చేశారు. అటారీ చెక్ పోస్టు మూసేశారు. పాక్ హైకమిషన్ కీలక అధికారులను దేశం నుంచి బహిష్కరించారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశారు. ఉగ్రదాడి సూత్రధారులకు తగిన గుణపాఠం చెప్పేందుకు వ్యూహ రచనా జరుగుతోంది. ‘‘భారత రిపబ్లిక్తోనే ఆటలాడతారా, మీ అంతు చూస్తాం, ఖబడ్దార్!’’ అంటూ ఇండియా పంపిన హెచ్చరిక ఇప్పటికే టెర్రరిస్టులకు అందేవుంటుంది. అత్యంత శక్తిమంతమైన రష్యా, అమెరికాల నుంచి, సౌదీ అరేబియా సహా మనకు విస్పష్టమైన మద్దతు లభించింది. ఇది ఈ సందేశానికి మరింత బలం చేకూర్చింది. సాధారణ పరిస్థితుల్లో ఎన్ని భేదాభిప్రాయాలున్నా, కష్టకాలంలో అన్నీ మరచి ఒక్క తాటి మీద నిలవటం భారత ప్రజల విశిష్టత. ప్రస్తుత బాధకర సమయంలోనూ కోపంతో రగిలిపోతూ అందరం ఒక్కటయ్యాం. ఒక్కుమ్మడిగా మన ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించాం. భౌతికంగానూ బయటికొచ్చాం. మనం భాగ్యవంతులం కాకపోవచ్చు, కాని ఆపదలో అండగా నిలిచే సహజగుణ సంపన్నులం. కేంద్ర ప్రభుత్వం, జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఈ తరుణంలో ఏ చర్యలు తీసుకున్నా ఇండియా యావత్తూ వాటికి వెన్నుదన్నుగా నిలిచి ఉంటుంది. ఇండియా జాతీయ భద్రతకు పౌర సమాజం ఎప్పుడూ చేయూత ఇస్తుంది. ఇది కాలపరీక్షలో నిగ్గుదేలిన వాస్తవం.యుద్ధం వస్తే సిద్ధమే!రెండు దేశాల నడుమ యుద్ధం వస్తుందా? పహల్గామ్లో పాక్ అంతటి దుస్సాహసానికి పాల్పడితే మనం చేతులు ముడుచుకుని కూర్చోలేం. కానీ ఇవి మాత్రమే యుద్ధానికి దారి తీసే కారణాలు కావు. పాకిస్తాన్ మనకు వ్యతిరేకంగా అల్లుతున్న కథనాలు కూడా ఇందుకు పురిగొల్పుతున్నాయి. పహల్గామ్లో ఉగ్రదాడి పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబికిన తర్వాత పాకిస్తాన్ తన ఆత్మరక్షణ కోసం ఎంతటి దుందుడుకు విమర్శలకూ వెనుకాడటం లేదు. ఇండియా సైనికపరంగా ఎలాంటి చర్య తీసుకున్నా, యుద్ధానికి ‘మ్యాచ్’ అయ్యే ప్రతిచర్యలు ఎదురవుతాయి. పరిస్థితి అంతదాకా వస్తే, ‘‘అయితే సరే, అయితే సరే. మేం కూడా ఆ ‘మ్యాచ్’ను ఎదుర్కుంటాం. ఘోర కృత్యాలకు తెగబడుతున్న ఉగ్రవాదాన్ని మా దేశంలో ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించం’’ అని మనం చెప్పి తీరాలి.ఈ సన్నద్ధతలో మనం గుర్తు పెట్టుకోవలసిన అంశం: యుద్ధానికి సిద్ధంగా ఉండటం వేరు, యుద్ధం కోసం ఉవ్విళ్లూరడం వేరు. యుద్ధం తాలూకు నిర్బంధాలు, ఫలితాలు ఎప్పుడూ బాధాకరంగానే ఉంటాయి. అదీ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం అంటే, దాని పరిణామాలు ప్రళయ సమానంగా ఉండగలవు. అణ్వస్త్రాలపై ఇండియా విధానాలు వివేకంతో కూడుకుని ఉంటాయి. అణ్వస్త్ర నిగ్రహం మన విధానం. పాకిస్తాన్ ఇదే బాటలో పయనిస్తోందా? అది అణ్వస్త్రం సమకూర్చుకున్న చరిత్రే దాని ఉద్దేశాలను వెల్లడిస్తుంది.‘ఒక్క దేశం’గా నిలబడదాం!ఇండియా తన సైనిక వ్యూహాలను విజ్ఞతతో బేరీజు వేసుకుని ఏది సరైన మార్గమో నిర్ణయించుకోగలదు. మనం ప్రభుత్వాన్ని సంపూర్ణంగా, బేషరతుగా విశ్వాసంలోకి తీసుకోవాలి. ఇక, దేశంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేవారు కొందరు ఉంటారు. వారికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి మనం సహకరించాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి మనం ఇలా చెప్పాలి: ‘‘ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదించి మీరు వేరే దేశాన్ని సాధించుకున్నారు. మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి మా ‘వన్ నేషన్’ను విభజించాలని చేసే ప్రయత్నాలు మేం సహించేది లేదు. హిందువులు, ముస్లిములు, సిక్కులు... వీరందరికీ మా ‘వన్ నేషన్’ మాతృభూమి. ‘ఇండియా దటీజ్ భారత్’ విలువలకు నిలయం. మీ క్రూరాతి క్రూరమైన వక్రబుద్ధికి ఇవి అర్థం కావు.’’1948 జనవరి 30న ‘తీస్ జనవరి మార్గ్’లో మంచు కప్పిన గడ్డి మీద రక్తం చిందినట్లే, ఈ ఏప్రిల్ 22న పహల్గామ్ అందమైన కొండ లోయల మీద చిందిన రక్తం... మానవత్వం మీద బుల్లెట్ల దౌష్ట్యానికి నిదర్శనం. అయినప్పటికీ మానవత్వం మీద మన విశ్వాసాన్ని అది చాటి చెబుతోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా తీసుకురావాలని చూస్తున్న ‘ఉగ్రవాదపు రెండో దశ’ను నిరోధించి, మన మన మధ్య ఒక్క నెత్తుటి బొట్టు చిందనీయకుండా సాయుధ బలగాలకు పౌరదళాలుగా మన సమైక్య సంఘీభావం ప్రకటించాలి. టెర్రరిస్టులకు, టెర్రరిజానికి పురిటిగడ్డ అయున పాకిస్తాన్లోనూ హింసాద్వేషాలను వ్యతిరేకించే విజ్ఞులు ఉన్నారు. పహల్గామ్ ఘటన పట్ల కలత చెందినవారు, మేధావులు అక్కడ కొద్దిమంది కాదు... ఎక్కువగానే ఉంటారు. వారెవరో మనకు తెలియాల్సినంతగా తెలియడం లేదు. అలాంటివారు ఈ సమయంలో మతతత్వ గుంపులను, వ్యక్తులను గట్టిగా వ్యతిరేకిస్తారని ఆశిద్దాం. గొప్ప భారతీయుడైన లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపును గుర్తు చేసుకుంటూ, భారత దేశం ఈ సవాలును విజయవంతంగా తిప్పికొట్టాలని ఆశిద్దాం. ఆయన ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి ‘జై ఇన్సాన్’ (ఇన్సాన్ అంటే మానవ్) కూడా చేర్చుదాం. మన మతం మానవత్వం అనీ, దుష్టత్వం కాదనీ పహల్గామ్ సాయుధ దుండగులకు చెప్పి తీరాలి. ‘‘ఖబడ్దార్, ఇండియాతో, ఇండియా మానవత్వంతో ఆటలొద్దు’’ అని మరోసారి చెబుదాం!గోపాలకృష్ణ గాంధీవ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
కార్మికులంతా ఒక్కటవ్వాలి!
కార్మికుల పండగ దినం ‘మే డే’. ప్రపంచంలోని కార్మికులందరూ తమ హక్కుల సాధన దినోత్సవంగా మే 1వ తేదీని జరుపుకొంటారు. 1886 ముందు కార్మికులు వెట్టి చాకిరితో మగ్గిపోతూ రోజుకు 18 గంటల పాటు పనిచేసేవారు. దీనికి వ్యతిరేకంగా అమెరికాలోని చికాగో నగ రంలో జరిగిన కార్మికుల ప్రదర్శనపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ మారణకాండను ప్రపంచమంతా ఖండించింది. ఆ తర్వాత జరిగిన అనేక ఉద్యమాల ద్వారా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేసే హక్కును కార్మికులు దాదాపు అన్ని దేశాల్లోనూ సాధించు కున్నారు. ఈ విజయానికి సూచిక గానే మే డేని జరుపుకుంటున్నారు కార్మిక సోదరులు. భారతదేశంలో కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాలు జరి పిన పోరాటాల ఫలితంగా వెట్టి చాకిరీ నిర్మూలన జరిగింది. వేతన సవరణకు సంబధించిన ఒప్పందాలకు అంకురార్పణ జరిగింది. సెలవులు, ఇంక్రిమెంట్లతోపాటు కార్మికులకు అవసరమైన కనీస సౌకర్యాలను పని ప్రదేశంలో సాధించడంలో కొంతవరకు కృత కృత్యులమయ్యాము. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంకానీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ మళ్లీ వారిని పాత కాలపు కష్టాల పాలు చేయడానికి ప్రయత్ని స్తున్నాయి. కేంద్రం కార్మిక చట్టాలన్నంటినీ నాలుగు కోడ్ల కిందికి తీసుకురావడం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే.కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎన్ని ఆందో ళనలు చేపట్టినా ప్రభుత్వ పెద్దలఆలోచనా విధానంలో మార్పు రానందున మే 20వ తేదీనాడు పెద్ద ఎత్తున కార్మిక వర్గం రోడ్లమీదికి వచ్చి ఉద్యమం చేయనున్నది. మే డే స్ఫూర్తితో కార్మిక లోకం ఉవ్వెత్తున ఎగసిపడనున్నది. మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వత్తాసు పలుకుతున్నారు. అందుకే ఆయన మోదీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఇప్పుడు మాట్లాడడం లేదు.కానీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా వారికి మేలు చేకూర్చే కార్యక్రమాలు ఎన్నో చేపట్టింది. ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి అనేక ప్రయోజనాలు కలుగ జేసింది. ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకున్న ఉద్యోగులను పర్మినెంట్ చేశారు నాటి సీఎం జగన్. ఇదే తరుణంలో ఆటో కార్మికులకు రూ. 10,000, దర్జీలు, దోబీలు, నాయి బ్రాహ్మణులు, బెస్త కార్మికులు వంటివారికీ 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేయ టం తెలిసిందే. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకూ కృషిచేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తలంచితే దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు జగన్. అసెంబ్లీలో ప్రైవేటీకర ణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన కార్మికుల పక్షపాతి జగన్. ఎన్డీఏ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను అన్ని వర్గాలూ ఖండించాలి. మే డే స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగవలసిన అవసరం ఉంది.పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుమొబైల్: 98481 05455(నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే) -
హిందీ భాష మూలాలు ఏమిటి?
ఇండియా అనే పేరు వెనుక చాలా చరిత్ర ఉంది. ఈ పదం ఇండస్ నుంచి వచ్చింది. ప్రాచీన పర్షియన్ పదం అయిన హిందుష్ నుంచి ఇండస్ ఆవిర్భవించింది. ఇది సంస్కృత పదం సింధుకు రూపాంతరం. అయితే, ప్రాచీన గ్రీకులు ఇండియన్స్ను ఇండోయి అని వ్యవహరించేవారు. ఇండోయి అంటే వారి భాషలో ఇండస్ ప్రజలు అని అర్థం. ఇండస్ రివర్ అంటే స్థానికులు ఎప్పటి నుంచో పిలుచుకునే సింధూ నదే. మన దేశానికి భారత్ అనేది రాజ్యాంగ గుర్తింపు పొందిన అధికారిక నామం. ఈ భౌగోళిక పదం అనేక భారతీయ భాషల్లో కొద్ది మార్పులు చేర్పులతో వ్యవహారంలో ఉంది. హిందూ ధర్మ గ్రంథాలు చెప్పే పౌరాణిక చక్రవర్తి భరతుడి పేరు నుంచి భారత్ వచ్చింది.అధికార భాషగా పర్షియన్హిందుస్థాన్ వాస్తవంగా పర్షియన్ పదం. అంటే ‘హిందువుల భూమి’ అని అర్థం. 1947 వరకూ ఉత్తర భారతం, పాకిస్తాన్ వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని ఈ పేరుతో పిలిచేవారు. ఇండియా మొత్తాన్నీ కలిపి చెప్పేందుకు కూడా అప్పుడప్పుడూ ఈ పదం ఇప్పటికీ వాడతారు.ఢిల్లీ సుల్తానుల, మొఘలుల సామ్రాజ్యాల్లో, వారి వారసత్వపు రాజ్యాల్లో పర్షియన్ అధికారిక భాషగా ఉండేది. కవిత్వం, సాహిత్యం కూడా ఈ భాషలోనే ఉండేవి. చాలా మంది సుల్తానులు, నాటి కులీనులు పర్షియన్ ప్రభావిత తురుష్కులే. మధ్య ఆసియా నుంచి వచ్చిన వీరి మాతృభాషలు తురుష్క భాషలు. మొఘలులు కూడా పర్షియన్ ప్రభావిత మధ్య ఆసియా నుంచే వచ్చారు. కాకుంటే వీరు తొలినాళ్లలో ప్రధానంగా చగతాయి తురుష్క భాష మాట్లాడేవారు. తర్వాత్తర్వాత పర్షియన్కు పరివర్తనం చెందారు.నార్త్ ఇండియాలోని ముస్లిం ఉన్నత వర్గాలకు పర్షియన్ ప్రాధాన్య భాష అయ్యింది. మొఘల్, ఇండో–పర్షియన్ చరిత్ర కారుడైన ప్రముఖ పండితుడు ముజఫర్ ఆలమ్ చెప్పే ప్రకారం, ఈ పర్షియన్ భాష అక్బర్ సామ్రాజ్యంలో సామాన్యుల భాషగా మారింది. ఎందుకంటే, అన్ని మతాల వారు దీన్ని మాట్లాడేవారు. భాష సరళంగా ఉండేది. దీంతో, పలు రాజకీయ సామాజిక ప్రయోజనాలు ఆశించి అక్బర్ దీన్ని విశేషంగా అభివృద్ధి చేశాడు. పరాయి భాషల భారతీయ అపభ్రంశాల కలయికతో నాడు ఏర్పడిన ఒక మాండలికమే ఇవ్వాళ్టి ఉర్దూ, హిందీ, హిందుస్థానీ భాషలకు మూలం. బ్రిటిష్ వారి రాకతో...మొఘలుల కాలం నుంచి బ్రిటిష్ పాలన వరకు పర్షియన్ భాష మనుగడలో ఉంది. ‘గొప్ప మొఘలుల’లో చిట్టచివరి వాడుగా చరిత్రకారులు భావించే ఔరంగజేబ్ చక్రవర్తి 1707లో చనిపోయే వరకు కూడా ఈ ప్రాభవం కొనసాగింది. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. 1739లో ఢిల్లీపై నాదిర్ షా దండ యాత్ర చేయడం, దక్షిణ ఆసియాలో క్రమేపీ యూరప్ పట్టు బిగియటం... ఈ పరిణామాల నేపథ్యంలో పర్షియన్ భాష,సంస్కృతి క్షీణదశలోకి ప్రవేశించాయి. ఏమైనప్పటికీ, ఆ తర్వాత కూడా సిక్కు మహారాజా రంజిత్ సింగ్ (పాలనా కాలం 1799– 1837) సహా దక్షిణ ఆసియాలోని అనేక మంది పాలకుల ప్రాంతీయ ‘సామ్రాజ్యాల్లో’ దీనికి రాజాదరణ లభించింది. చిట్టచివరకు, 1839లో ఈ భాషకు మృత్యు ఘంటికలు మోగాయి. బ్రిటిష్ పాలకులు పర్షియన్ భాషను పరిపాలన, విద్యా బోధన వ్యవస్థల నుంచి తొలగించారు. నామమాత్రపు చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను బ్రిటిష్ వారు అధికారపీఠం నుంచి కూలదోశారు.మూలాలు ఏవైనప్పటికీ ఆర్య ద్రావిడ కలయిక నుంచి పుట్టిన సంస్కృతం స్థానాన్ని అలా పర్షియన్ ఆక్రమించింది. ఇక్కడ విశేష మేమిటంటే, లేత వర్ణ చర్మం (లైట్ స్కిన్) కలిగిన ఒక ఉన్నత వర్గం భాషను మరో ‘లైట్ స్కిన్’ ఉన్నత వర్గం భాష తోసి రాజంది. ఉత్తర భారత దేశంలో ఈ కులీన భాషలు చివరకు ప్రాంతీయ మాండలీ కాలతో కలిసిపోయి హిందావి లేదా ఉర్దూ అనే ఒక సామాజిక భాషగా రూపొందాయి. నిజానికి విభిన్న భాషలేనా?హిందీ, ఉర్దూలు రెండు విభిన్న భాషలు అన్న భావనకు 19వ శతాబ్దపు ప్రథమార్ధంలో ఫోర్ట్ విలియం కాలేజ్ అధ్యయనాల్లో స్పష్టత వచ్చిందని ‘ఇండియాలో భాష గురించిన సత్యం’ (ట్రూత్ అబౌట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా) అనే వ్యాసం (ఈపీడబ్ల్యూ, డిసెంబర్ 14, 2002)లో సంతోష్ కుమార్ ఖారే పేర్కొన్నారు. పర్షియన్/అరబిక్ నుంచి ఉర్దూ... సంస్కృతం నుంచి హిందీ తమ భాషా సాహిత్యాలను అరువు తెచ్చుకున్నాయని హిందీ పుట్టుక గురించి వివరించారు. కొత్తగా పుట్టుకొచ్చిన మధ్యతరగతి పట్టణ హిందూ, ముస్లిం/కాయస్థ వర్గాల సంకుచిత ప్రయోజనాల పోటీని అవి ప్రతిబింబించాయి. అసలైన బాధాకరమైన విషయం వ్యాసం ముగింపులో ఉంటుంది. అదేమిటంటే, ‘‘ఆధునిక హిందీ (లేదా ప్రామాణిక భాష) అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ సృష్టి. ఉర్దూ వ్యాకరణం,శైలిని పరిరక్షిస్తూనే దాన్ని విదేశీ పదాల నుంచి, గ్రామ్యాల నుంచి ప్రక్షాళన చేసి, వాటి స్థానంలో సంస్కృత సమానార్థకాలను చేర్చింది.’’హిందీకి ప్రధాన ప్రచారకర్త పాత్ర పోషిస్తున్న ఆర్ఎస్ఎస్ నేడు ఇండియాలో ఇంగ్లిష్ మాట్లాడేవారిని ‘మెకాలే పిల్లలు’ అంటూ ఎగతాళి చేసి ఆనందం పొందుతోంది. ఇదొక విషాదం!మోహన్ గురుస్వామి వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com -
చిగురిస్తున్న ఇండో-కెనడా స్నేహం
భారత్-కెనడా మధ్య సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ స్నేహం కొత్త చివుళ్లు వేస్తోందా? ఏడాదిన్నర కాలానికి పైగా గాడి తప్పిన భారత్, కెనడా దౌత్య సంబంధాలు పట్టాలెక్కబోతున్నాయా... అంటే అవుననే చెప్పాలి. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన లిబరల్ పార్టీ నేత, ఆ దేశ ప్రస్తుత తాత్కాలిక ప్రధాని, కాబోయే పూర్తికాలపు ప్రధాని మార్క్ కార్నీకి భారత్ ప్రధాని మోదీ పంపిన అభినందన సందేశానికి సంకేతం అదే. మార్క్ కార్నీకి ముందు కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు గత అక్టోబరులో రెండు దేశాలూ పరస్పరం హై కమిషనర్లను బహిష్కరించాయి. ఈ ఏడాది జూన్ మాసానికల్లా హై కమిషనర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని ఉభయ దేశాలు తలపోస్తున్నాయి. ప్రస్తుతం ‘స్పెయిన్’లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న దినేష్ కుమార్ పట్నాయక్ ను కెనడాలో తదుపరి హై కమిషనరుగా భారత్ నియమించే అవకాశముందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో ఆరంభమవనుందని తెలుస్తోంది. కెనడా ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. 343 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభలో లిబరల్ పార్టీ 168 సీట్లు, కన్జర్వేటివ్ పార్టీ 144 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ రావాలంటే లిబరల్ పార్టీ 172 సీట్లు గెలవాలి. కానీ ఆ మేజిక్ నంబరుకు కొద్ది దూరంలో అది ఆగిపోయింది. చిన్న పార్టీల సహకారంతో లిబరల్ పార్టీ మైనారిటీ సర్కారు ఏర్పాటు చేసే అవకాశముంది. ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హరదీప్ సింగ్ నిజ్జర్ 2023లో కెనడాలో హత్యకు గురయ్యాడు. భారత ప్రభుత్వ ఏజెంట్లే అతడిని హతమార్చారని కెనడా ఆరోపించడంతో ఆ దేశంతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తదనంతర పరిణామాల్లో కెనడాలో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మను కెనడా వెళ్లగొట్టడం, ప్రతిగా కెనడా దౌత్యవేత్తలను ఇండియా బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. దరిమిలా చాలినంత మంది దౌత్యవేత్తలు లేక కెనడా కాన్సులేట్లు మూతపడ్డాయి. నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదవి నుంచి దిగిపోయారు. మరోవైపు కెనడా ఎన్నికల్లో ఖలిస్థాన్ సానుకూల నేత, న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు జగ్మీత్ సింగ్ కూడా ఓటమి పాలయ్యాడు. ఈ రెండు పరిణామాలు ఇండో-కెనడా బంధం మళ్లీ మొగ్గ తొడిగేందుకు పరిస్థితులను అనుకూలంగా మార్చాయి. ట్రూడోలా కాకుండా మార్క్ కార్నీ మరింత పరిణతితో వ్యవహరిస్తారని భారత్ అభిప్రాయపడుతోంది. - జమ్ముల శ్రీకాంత్ -
బైబిల్... షేక్స్పియర్... అగథా క్రిస్టీ!
ఎప్పటికీ గుర్తుండిపోయే నా టీనేజ్ జ్ఞాపకం: నేను అగథా క్రిస్టీ నవలల్ని చదవటం! అంతుచిక్కని క్రిస్టీ హత్యోదంతాలలో గల్లంతవుతూ ఉక్కపోత వేసవి మధ్యాహ్నాలను గడిపేవాడిని. ప్రధానంగా హెర్క్యూల్ పాయ్రోట్, మిస్ మార్పుల్ (క్రిస్టీ నవలల్లోని కల్పిత డిటెక్టివ్ పాత్రలు)ల అపరాధ పరి శోధనలు నన్ను కదలనివ్వకుండా చేసేవి. తక్కిన డిటెక్టివ్ పాత్రలు... టామీ, టపెన్స్ బెరెస్ఫోర్డ్; పార్కర్ పైన్, హార్లీ క్విన్ అనే వాళ్ల గురించి నాకసలు ఏమీ తెలియకపోయినా... క్రిస్టీ 66 డిటెక్టివ్ నవలలు రాశారనీ, అవి 200 కోట్ల కాపీలకు పైగా అమ్ముడయ్యాయనీ; బైబిలు, షేక్స్పియర్ రచనలు మాత్రమే ఆ సంఖ్యను దాటిన ప్రచురణలనీ, క్రిస్టీ నవలలు వందకు పైగా భాషలలోకి తర్జుమా అయ్యాయనీ అస్పష్టంగానైనా తెలుసు. అగథా క్రిస్టీ వ్యక్తిగత విషయాలు మాత్రం నాకు దాదాపుగా ఏమీ తెలియదు. అయితే ఆ లోటును, గత వారం నేను అనుకోకుండా చూసిన రెండేళ్ల నాటి లూసీ వర్స్లీ ‘అగథా క్రిస్టీ’ జీవిత చరిత్ర భర్తీ చేసింది. ఆమె ఇంగ్లండ్ రచయిత్రి. ఆమె తండ్రి అమెరికన్. క్రిస్టీ అనే పేరు ఆమెకు మొదటి భర్త నుండి వచ్చింది. వాళ్ల ఏకైక సంతానం కుమార్తె రోసాలిండ్. వారి వైవాహిక జీవితం 1914 నుండి 1928 వరకు కొనసాగింది. భర్తకున్న వివాహేతర సంబంధం చివరికి ఆమె చేత అత్యంత బాధా కరమైన విడాకులకు దారి తీయించింది. ఆ తర్వాత రెండేళ్లకు క్రిస్టీ తనకన్నా పదేళ్లు చిన్నవాడైన ఒక పురావస్తు శాస్త్రవేత్తను పెళ్లి చేసుకున్నారు. మధ్య ప్రాచ్యంలో అతడు జరిపిన తవ్వకాల ద్వారానే క్రిస్టీ ఇరాక్ (మెసపటేమియా), ఈజిప్టుల గురించి తెలుసుకున్నారు. భర్త తవ్వకాల పనికి చాలా వరకు క్రిస్టీనే డబ్బును సమ కూర్చారని పుస్తక రచయిత్రి వర్స్లీ రాశారు. ప్రతిఫలంగా ఆమెకు ‘డెత్ ఆన్ ద నైల్’, ‘మర్డర్ ఇన్ మెసపటేమియా’, ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ప్రెస్’ అనే మూడు పుస్త కాలు రాసేందుకు ముడి సరకు లభించింది. ఆమె తరచూ భర్త పాల్గొనే పురావస్తు త్రవ్వకాల దగ్గరకు వెళుతూ ఉండేవారు. బహుశా మీలో చాలామందికి అగథా క్రిస్టీ అనే ఆవిడ ‘థ్రిల్లర్’ల నవలా రచయిత్రి అని తెలిసి ఉండొచ్చు. కానీ ఆమె గురించి తెలుసుకోవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ‘మేరీ వెస్ట్మెకాట్’ పేరుతో ఆమె ఆరు రొమాంటిక్ నవలలు రాశారు. ఆమె నిష్ణాతురాలైన నాటక రచయిత్రి కూడా! వాటిల్లో ప్రసిద్ధి చెందిన రెండు నాటకాలు ‘మౌస్ ట్రాప్’, ‘విట్నెస్ ఫర్ ద ప్రాసిక్యూషన్’. మొదటి నాటకాన్ని లండన్ వెస్ట్ ఎండ్ థియేటర్లో 1952 నుండి 2020 వరకూ ప్రద ర్శించారు. ఇంకా నడిచేదే కానీ, కోవిడ్ రాకతో తాత్కాలి కంగా నిలిపి వేయవలసి వచ్చింది. తిరిగి 2021 నుండి నిరవధికంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. హెర్క్యూల్ పాయ్రోట్ ఆమె అత్యంత ప్రసిద్ధ కాల్ప నిక డిటెక్టివ్ పాత్ర. అయితే ఆ పాత్రను మోయటం ఆ ‘కల్పితుడికి’ తలకు మించిన పనైపోయిందని క్రిస్టీ తల పోశారు. 1975 నాటి ‘కర్టెన్’ నవలలో చివరిసారి అతడు కనిపించాక, ‘న్యూయార్క్ టైమ్స్’ తన మొదటి పేజీలో అతడికి శ్రద్ధాంజలి ఘటించింది. అగథా 86 సంవత్సరాలు జీవించారు. ఆమె తన 80లలో కూడా రాస్తూనే ఉన్నారని వర్స్లీ వెల్లడించారు. ‘‘ఆమె చనిపోయాక, ఆమె చివరి రాత పుస్తకాల్లో సైతం, తర్వాత రాయబోయే నవల కోసం తన ఆలోచనల్ని రాసి పెట్టుకున్నారు. అవి పూర్తిగా కొత్త ఆలోచనలు. ఇద్దరు విద్యార్థులు ఒక బాలుడిని ఏ కారణం లేకుండానే ఒక ప్రయోగంలా హత్య చేయటం గురించిన ఐడియాలు అవి...’’ అని రాశారు వర్స్లీ. అగథా క్రిస్టీ జీవితాన్ని కూడా రహస్యాలు చుట్టు ముట్టాయంటే ఆశ్చర్యంగా ఏమీ అనిపించదు. మొదటి భర్త క్రిస్టీతో తన వివాహ బంధం ఊగిసలాడుతూ ఉన్న సమ యంలో 1926లో ఆమె పది రోజుల పాటు అదృశ్యమై పోయారు. ఆమె కోసం భారీ ఎత్తున గాలింపు జరిగింది కానీ, ఆమె జాడ తెలియలేదు. ‘‘నమ్మకద్రోహం చేసిన తన భర్తపై ప్రతీకారం తీర్చుకోటానికి ఈ మాయలాడి ఏదో పథకం వేసి ఉంటుంది’’ అని విమర్శకులు కొందరు ఆమె గురించి మాట్లాడినట్లు వర్స్లీ రాశారు. మహోజ్వలమైన అగథా రచనా జీవితం... ఆరంభంలోనే తడబాటుకు లోనైంది. ఆమె తొలి పుస్తకం ‘ద మిస్టీరియస్ ఎఫైర్స్ ఎట్ స్టైల్స్’ను ఇద్దరు ప్రచురణకర్తలు తిరస్కరించారు. ఆ తర్వాత ‘ద బాడ్లీ హెడ్’ అనే సంస్థ ప్రచురణకు తీసుకుంది. 36 ఏళ్ల వయసులో అగథా 70 కిలోల బరువు ఉండే వారు. తర్వాత సంవత్సరాలలో ఆ బరువు 82 కిలో లకు చేరుకుంది. ఆమె భారీ మనిషి అనడంలో సందేహం లేదు. అగథాకు నివాస గృహాలంటే ఇష్టం. ఆమెకు ఎనిమిది ఇళ్లు ఉండేవి. ఆమె చాలాసార్లు నిర్లక్ష్యపూరితంగా రచన చేసేవారు. వర్సిలీ చెప్పినదాని ప్రకారం... పాయ్ రోట్ ‘ వైట్హెవెన్ మాన్షన్స్‘లో నివసిస్తాడు, కానీ కొన్నిసార్లు అతను ‘వైట్హౌస్ మాన్షన్స్‘లో కూడా ఉన్నట్లు చూపిస్తారు. ‘స్లీపింగ్ మర్డర్‘లో, ఒక క్లర్క్, రిసెప్ష నిస్ట్, రైలు ప్రయాణీకుడు... ముగ్గురికీ యాదృచ్ఛికంగా ఒకే పేరు ‘నార్రాకాట్’ పెట్టారు. ఈ పేరు మరో మూడు వేర్వేరు పుస్తకాల్లో ఒక చాంబర్మేడ్, పడవవాడు, పోలీసు అధికారి పేరుగా కూడా కనిపిస్తుంది. 1974లో గుండెపోటు వచ్చి కోలుకున్నాక, ఒక సందర్భంలో అగథా క్రిస్టీని ‘‘మీరెలా గుర్తుండిపోవాలని కోరు కుంటున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘డిటెక్టివ్ కథలు రాసిన ఒక మంచి రచయిత్రిగా’’ అని ఆమె చెప్పారు. ఆశించినట్టే ఆమె డిటెక్టివ్ కథారచయిత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇంతకూ పరిష్కారం ఏమిటి?
పహల్గామ్లో తీవ్రవాదుల ఘాతుకమైన దాడి ఏప్రిల్ 22న జరిగి వారం రోజులు గడిచాయి. ప్రతిగా భారత ప్రభుత్వం దౌత్య పరమైన చర్యలు కొన్ని తీసుకున్నది గాని, దేశంలో రగులుతున్న ఆగ్రహావేశాలు చల్లారు తున్న సూచనలు లేవు. ‘కశ్మీర్ రెసిస్టెన్స్’ పేరిట దాడి జరిపిన వారిని పట్టుకుని శిక్షించటం ఒకటైతే, ఇటువంటి సంస్థలను మొదటినుంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్పై తగిన ప్రతీకార చర్య అన్నది అంతకుమించిన అవసరంగా సాధారణ భారతీయుల మనస్సులను దహించి వేస్తున్నది. పాక్తో గల సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నామన్న ప్రకటన దాని పర్యవసానాల రీత్యా తీవ్రమైనదేగానీ, అంతకుమించిన తక్షణ చర్య, సూటిగా చెప్పాలంటే సైనిక చర్యను జనం కోరుతున్నారు. తీవ్రవాదుల కోసం కశ్మీర్లో ముమ్మరమైన తనిఖీలు సాగు తున్నాయి. అనుమానితులను ఇప్పటికే పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకుని కొందరి ఇళ్ళను కూల్చివేస్తున్నారు. సాధారణంగా జరిగేట్లు ఇంతవరకు ఎవరినీ ఎన్కౌంటర్లలో కాల్చివేయలేదు. కశ్మీర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పర్య టించి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. వైమానిక బలగాన్ని కూడా. నౌకా బలాలు విన్యాసాలు జరిపాయి. అనగా త్రివిధ బలాలు సన్నద్ధ మవుతున్నాయన్నమాట. యుద్ధంతో మనకూ నష్టమే!కొద్ది రోజులుగా ప్రతి రోజూ రాత్రి సరిహద్దు దళాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అది ‘తేలిక రకం’ ఆయుధాలతోనన్నది సైన్యం స్వయంగా చెప్తున్నమాట. తేలిక రకం అనే మాట కిందకు పలు రకాల ఆయుధాలు వస్తాయి. వాటిలో ప్రజలు వినే పేర్లు ఇన్సాస్ రైఫిళ్లు, లైట్ మెషీన్ గన్స్, సబ్ మెషీన్ గన్స్. వాటి ప్రయోగంతో రెండువైపులా ప్రాణ నష్టాలు ఇప్పటికి జరగలేదు. సరిహద్దులలో తగినంత దూరం పాటిస్తారు, బంకర్లలో ఉంటారు. గనుక ప్రాణ నష్టాలు సాధారణంగా జరగవు. తేలిక రకం ఆయుధాల వినియోగం స్థానిక కమాండర్ల నియంత్రణలో జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీ ఆయుధాల వినియోగం జరిగితేనే ఘర్షణ పైస్థాయికి వెళ్లినట్లు! త్రివిధ బలాలను అప్రమత్తం చేసినందున పూర్తి స్థాయి యుద్ధమా? 2019లో పుల్వామా వద్ద భారత సైనికులపై దాడిలో 40 మంది చనిపోయిన దరిమిలా పాకిస్తాన్లోని బాలాకోట్ టెర్రరిస్టు స్థావరాలపై మెరుపు దాడులు జరిపి అంతకు పరిమితం కావడం వంటిదా? కొద్దిగా ఆలోచించినట్లయితే పూర్తి స్థాయి యుద్ధానికి అవకాశం కన్పించదు. ఇండియా కన్నా పాకిస్తాన్ సైనిక శక్తి తక్కువే గానీ మరీ అంత బలహీనమైనది కాదు. యుద్ధం దీర్ఘకాలం సాగితే పాకిస్తాన్ ఓడుతుంది గానీ భారతదేశానికి కూడా తీవ్ర నష్టాలు కలుగుతాయి. యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనపరచుకోవచ్చునని ఎవరైనా భావిస్తే, కొత్త సమ స్యలు కొని తెచ్చుకోవటమవుతుంది. సగం కశ్మీర్తోనే ఇన్ని సమస్య లున్నాయి. అణు యుద్ధానికి ఇపుడెవరూ సుముఖంగా లేరు. కానీ పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనపరచుకునే స్థితి అంటూ కనిపిస్తే, అణు ప్రయోగానికి పాక్ సైన్యం వెనుకాడబోదు. తూర్పు పాకిస్తాన్ తమది కాకుండా పోయిందనే ఆగ్రహం వారికి ఇప్పటికీ చల్లారలేదు.అందువల్ల, అటు ఇటుగా బాలాకోట్ నమూనా ప్రతిదాడులకే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాన్ని ముదరనివ్వకండంటూ ఇప్పటికే సూచనలు చేస్తున్న అమెరికా జోక్యాలు తెర వెనుక నుంచి ఎట్లుండవచ్చునన్నది మరో ప్రశ్న. అమెరికా మాటను కాదనే శక్తి భారత, పాకిస్తాన్లలో దేనికీ లేదన్నది ఒక చేదు నిజం. కశ్మీర్లో అంతర్గతంగా టెర్రరిజంపై, మిలిటెన్సీపై ఎటువంటి చర్యలైనా భారత భద్రతాదళాలు యథేచ్ఛగా తీసుకోగలవు. ఆ చర్యలు సుమారు 1990 నుంచి 35 సంవత్సరాలుగా తీసుకుంటున్నవే.అందువల్ల కలిగిన ఫలితాలేమిటన్నది వేరే ప్రశ్న.నీటిని ఆపగలమా?ప్రభుత్వం ఇప్పటికి ప్రకటించిన చర్యలలో నిజంగా తీవ్రమైనది సింధూ ఒప్పందాన్ని సస్పెండ్ చేయటం. 1960 నాటి ఆ ఒప్పందం పాకిస్తాన్కు కీలకమైనది. ఆ జలాలు ఆగినా, తగ్గినా వారి వ్యవ సాయం అల్లకల్లోలమవుతుంది. కనుకనే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అది తమపై ‘యుద్ధ చర్య’ కాగలదంటూ తీవ్రమైన భాషను ఉపయోగించారు. పాకిస్తాన్కు ‘ఒక్క చుక్క’ నీరు కూడా పోనివ్వమని భారత ప్రభుత్వ బాధ్యులు ప్రకటించనైతే ప్రకటించారు గానీ,పోకుండా ఆపటం నిజంగా సాధ్యమా? ప్రపంచబ్యాంకు ఆధ్వర్యాన జరిగిన ఈ అంతర్జాతీయ జలాల పంపిణీ ఒప్పందంలో ఐక్యరాజ్య సమితి పాత్ర ఉంది. బ్యాంకు పక్షాన ‘ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్’ (ఐబీఆర్డీ) సంతకం చేసింది. ఏదైనా వివాదం తలెత్తితే మొదట ‘తటస్థ నిపుణుని’ దృష్టికి, తర్వాత ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్’ ముందుకు వెళ్లాలి. తిరిగి ఇందులోనూ రెండు దేశాల సార్వభౌమాధికారానికి ఏది వర్తిస్తుంది, ఏది వర్తించదనే మీమాంస ఉంది. లోగడ రెండుసార్లు వాస్తవంగా యుద్ధాలు జరిగి నపుడు కూడా ఇటువంటి సస్పెన్షన్లు జరగలేదు. ఇదంతా సాంకేతిక పరమైన కోణం కాగా, నీరు అటు పోకుండా ఆపగల జలాశయ నిర్మా ణాలు అసలు ఇండియాకు లేనే లేవనీ, ఆ నిర్మాణాలకు అనేక చిక్కు లున్నాయనే ఆచరణపరమైన విషయాలను నిపుణులు ప్రస్తావిస్తు న్నారు. అనగా, ఈ చర్య ఎంత ప్రభావం చూపగలిగేది అయినా ఇప్పటికిప్పుడు జరిగేది కాదన్నమాట.వాస్తవాధీన రేఖే పరిష్కారమా?మనం విస్మరించేదేమంటే కశ్మీర్ తరహా అనేక భౌగోళిక, సరిహద్దు సమస్యలను బ్రిటిష్ వలస పాలకులు ప్రపంచమంతటా సృష్టించిపోయారు. భారత–చైనా, భారత–బంగ్లాదేశ్, పాలస్తీనా– ఇజ్రాయెల్ వంటివన్నీ అందుకు ఉదాహరణలు. తిరిగి వాటిని సొమ్ము చేసుకుంటూ పాశ్చాత్య దేశాలు ఇరుపక్షాలకూ ఆయుధాలను అమ్ముకుంటున్నాయి.కశ్మీర్కు సంబంధించి ఒక వివేకవంతమైన పరిష్కార మార్గాన్ని మొదటిసారిగా కనుగొన్నది 1972లో అప్పటి ప్రధానులు ఇందిరా గాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత వారు సిమ్లాలో సమావేశమై, కశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ, లేదా లైనా ఆఫ్ కంట్రోల్)ను శాశ్వత సరిహద్దుగా గుర్తించుకున్నట్ల యితే అన్ని సమస్యలూ సమసిపోగలవని సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. కానీ, తమ రాజధానులకు తిరిగి వెళ్లి ప్రజాభిప్రాయా నికి జంకి వెనుకకు పోయారు. ఆచరణాత్మకంగా ఆలోచించినట్లయితే, అది మాత్రమే ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం కాగలదా?ఇది భారత–పాకిస్తాన్ సమస్యల పరిష్కారం అయితే, ఇక మిగి లేది కశ్మీర్లో అంతర్గత సమస్యలు. మొదటిది తేలినపుడు రెండవది సగం మేర తేలుతుంది. తక్కినది అభివృద్ధి, ఉపాధి కల్పన, అవి నీతిని అదుపు చేయటం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలతో తప్పకుండా పరిష్కారమవుతుంది. ఈ మాట నేను 3 విడతలుగా 55 రోజుల పాటు కశ్మీర్ అన్ని ప్రాంతాలలో తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మాట్లా డిన మీదట అంటున్నది. 1947 నుంచి ఇంతవరకు గల కశ్మీర్ చరిత్ర నేపథ్యంలో అక్కడి ప్రస్తుత పరిస్థితులను, యుద్ధం ద్వారా ఏదైనా తేలగలదా అనే అవకాశాలను, మిలిటెన్సీ–టెర్రరిజాల హెచ్చు తగ్గుల క్రమాన్ని, ముఖ్యంగా 1987 నుంచి తీవ్రవాదం తలెత్తి సాగుతున్న కారణాలను పరిశీలించినపుడు, ఇటువంటి అభిప్రాయం ఏర్పడుతు న్నది. అందువల్ల రెండు దేశాలూ విజ్ఞతతో ఆలోచించి ఇందిరాగాంధీ–భుట్టోల స్ఫూర్తితో రాజీ మార్గానికి రావటం సమస్యను శాశ్వ తంగా పరిష్కరించి ఇరు దేశాలకు ఎనలేని మేలు చేయగలదు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
గూడు కట్టుకుందాం గువ్వల చెన్నా
మనిషన్నాక బాధ్యత ఉండాలి.. సిగ్గుండాలి.. పిల్లలు పెరుగుతున్నారు.. ఒక గూడు ఉండాలన్న భయం... ఒక అది.. ఒక ఇది లేదు.. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేలా ఉంటే ఎలా.. చుట్టూ ఉన్నోళ్లు ఎలా ఉన్నారు. మనం ఎలా ఉన్నాం.. వాళ్ళ కుటుంబాలు చూడు ఎంత కంఫర్ట్ ఉన్నాయి.. నువ్వూ ఉన్నావు.. సిగ్గులేని మనిషి... సిగ్గులేని జన్మ అంటూ భార్య నోరాపకుండా తిడుతూనే ఉంది. ఒసేయ్.. నేను మనిషిని అని ఎవరన్నారు.. కాదు.. ఐన ఒకరితో నన్ను పోల్చకు.. ఇన్నేళ్ళకాపురంలో నిన్ను బిడ్డల్ని సరిగా చూశానా లేదా.. మీ అమ్మానాన్నను కాదని నన్ను నువ్వు ప్రేమించి ఎగిరిపోయి వచ్చినపుడే నిన్ను గుండెల్లో గూడు కట్టి చూసుకున్నాను అన్నాడు భర్త. ఓరి నా తింగరి మొగుడా.. గుండెల్లో కాదురా.. బయట కట్టాలి గూడు.. ముందు ఆ పని చూడు అని మళ్ళీ మురిపెంగా కసిరింది ముద్దులుపెళ్ళాం.. సరే రెండ్రోజుల్లో సైట్ చూసి మెటీరియల్ డంప్ చేసేద్దాం.. వారంలో ఇల్లు రెడీ అన్నాడు.. మొత్తానికి ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి ప్లాట్ ఫిక్స్ చేసారు..గూటి కోసం ప్లాట్ ఫిక్స్ చేస్తామని చెప్పిన మొగుడుగారు.. ఏకంగా మా స్కూటీని తీసుకొచ్చి పెళ్ళానికి చూపించినట్లున్నాడు.. బయటెక్కడినా ఐతే ఎండ. పైగా శత్రుభయం .. ఈ స్కూటీ డిక్కీ ఐతే నీడ.. పైగా సేఫ్.. అందుకే ఇక్కడకు ఇద్దరూ ఫిక్షయారు .. అయ్యో.. పనికిమాలిన మొగుడు అనుకున్నాను కానీ తెలివైనవాడే.. మంచి సైట్ చూసాడు అని కిచకిచలాడింది.. పెళ్ళాం పిచ్చుక.. మొత్తానికి రెండ్రోజుల్లో కొన్ని చిన్న పుల్లలు. ఎండుగడ్డివంటిది తెచ్చి పెట్టారు.. ఇదేంటి అనుకుంటి తీసేసి పక్కన పడేసినా మళ్ళీ రెండ్రోజుల్లో ఇద్దరూ కలిపి మొత్తం డిక్కీ సగం నింపేశారు. పోన్లే ఏమవుతుందో అని జాలితో డిక్కీని. బండికి ముట్టుకోకుండా వదిలేశాం. నెలరోజులు బండి ముట్టుకోకపోతే బ్యాటరీ పోతుందేమో. మళ్ళా స్టార్ట్ అవ్వదేమో అనే చర్చ వచ్చినా.. పోన్లే ఒక పక్షి కుటుంబానికి ఆసరాగా నిలిచాం చాలు అనే భావనతో బండి అలాగే వదిలేశాం...నాలుగు రోజుల్లో దానిలో రెండు గుడ్లు పెట్టింది.. దానికి కాపలాగా తల్లి అక్కడే స్కూటీ దగ్గర్లో ఉంటే తండ్రి ఎక్కడెక్కడికో తిరిగి ఏదేదో తెచ్చిపెట్టేవాడు. అన్యోన్య దాంపత్యం.. ఒక్కోరోజు రెండూ ఆ స్కూటీ దగ్గర్లోనే కూర్చు బహుశా పిల్లల భవిష్యత్ గురించి కావచ్చు కిచకిచలతో చర్చలు పెట్టేవి.. అరుదైన నల్ల పిచ్చుకలు. కంఠం వద్ద ఎర్రని జీర.. చూస్తుంటే ముచ్చటేస్తుంది.. అపురూపమైన కాపురాన్ని చూడాలనిపించి నెలరోజులు స్కూటీ కదపలేదు.. నాలుగురోజుల తరువాత డిక్కీ చూస్తే కళ్ళు తెరవని రెండు చిన్న జీవులు వచ్చి చేరాయి.. ఆ చిన్న దంపతుల ఆనందానికి అంతులేదు.. రోజూ ఆ స్కూటీ దారిలోనే తిరుగుతూ ఎవరైనా అక్కడికి వస్తే చాలు భయంతో అరిచేవి.. జీవి చిన్నదే కావచ్చు.. తల్లిదండ్రుల ప్రేమ అనంతం కదా.. అందుకే బిడ్డల కోసం వాటి ఆరాటం.. రోజూ తిరిగి ఏదేదో పురుగులు. నీళ్లు తెచ్చి బిడ్డలకు పోస్తుండేది తల్లి.. అలా పదిరోజులు గడిచాక చిన్నగా రెక్కలొచ్చి పిచ్చుకలు ఎగిరిపోయాయి.. తల్లి పిచ్చుక మళ్ళీ అక్కడే తిరుగుతోంది... ఇక మీ గెస్ట్ హౌస్ వదలండి.. అన్నట్లుగా నేను బండి తీసి స్టార్ట్ చేయబోతే ..ఉహు.. మొరాయించింది.. షెడ్డుకు తీసుకెళ్తే వెయ్యి వదిలింది.. పొతే పోనీ.. ఒక గువ్వల జంటకు నెలకు ఫ్రీగా ఆశ్రయం ఇచ్చాను అనిపించింది. :::సిమ్మాదిరప్పన్న -
ఈ ప్రశ్నకు జవాబు ఉందా?
ఒక సీజనల్ పొలిటీషియన్ ఎంత ‘లోతు’ తక్కువ రాజకీయాలు చేయగలిగితే,అంతలా వేగంగా మాటలు మారుస్తూ, ఎన్నాళ్ళు అయినా ఎలాగోలా అధికా రంలో ఉండగలడు. అయితే ఒక లీడర్గా వారి స్థాయి ఏమిటి అనేది రేపు చరిత్ర ఎటూ రికార్డు చేస్తుంది. తమదొక ‘పొలిటికల్ ఫిలాసఫీ’ అని ఇటువంటివారు నమ్మబలికితే, ‘అదే మని’ ఎవరూ ప్రశ్నించరు. అదేమిటో చెప్పలేక పోయినా, అదేమిటో ఎవరికీ తెలియకపోయినా, అప్పటికే దాని నుంచి ఫలాలు కోసుకునే వర్గం వారి వెనుక తమ ‘టర్న్’ కోసం కనిపెట్టుకుని ఉండి గుంపుగా తయారై ఆ నాయకునికి సమర్థన కూడా మొదలవుతుంది. విషయాల లోతులు మనకు అక్కర లేనప్పుడు, ఆ మేరకే మన ఎంపికలు కూడా ఉంటాయి. అక్కడ ఎక్కువ ఆశించడం తప్పు. ఇటువంటి చోట – ‘నువ్వు నన్ను నమ్మనప్పుడు, నిన్ను నేను మాత్రం ఎందుకు నమ్మాలి?’ అనే లాజిక్ నాయకునికి ఎటూ ఉంటుంది. ఇలా పరస్పర విశ్వాసాలు లేకుండానే ఎన్నికయిన నాయకులకు ఈ అధి కారం, తమకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని వారు అను కోరు కనుక ఇప్పటికి ఇదే ప్రస్తుతం.బ్రిటిష్ పాలన తర్వాత కూడా యాభై–అరవై దశకాల్లో భూమి–నీరు–వ్యవసాయం కేంద్రితంగా మన రాష్ట్ర రాజకీయాలు ఉండేవి. కారణం ప్రజలు జీవన సంస్కృతి ఆ రెండింటి చుట్టూనే ఉండేది. అయితే, డెబ్బై దశకంలో వచ్చిన ‘జై ఆంధ్ర’ ఉద్యమ రూపంగా పొడచూపిన 1972 నాటి సాంఘిక సంజ్ఞను సకాలంలో మనం అర్థం చేసుకోలేక పోయాం. అప్పుడే దాన్ని గుర్తించి దాన్ని ‘అడ్రెస్’ చేసి ఉంటే, మన పరిస్థితి మరోలా ఉండేది. అప్పట్లో ఇక్కడి నుంచి హైదరాబాద్కు మొదలైన రైతు కుటుంబాల యువత ఉపాధి వలసల తీవ్రత తగ్గేది. ఆ వలసల ఒత్తిడితో ఆ దశకం చివర 1978లో కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు అవసరం అయింది. రంగా రెడ్డి ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ వద్ద ఆంధ్రుల రద్దీతో విషయం అర్థమయినా అప్పటికే ఇక్కడ కొత్తగా మహిళా కళాశాలలు కూడా మొదలయ్యాయి.ఏమైంది, గుప్పిట్లోని ఇసుకలా కాలం కళ్ళముందు అలా జారిపోయింది. వెనక్కి తిరిగివచ్చి చూసుకుంటే, ఒకప్పటి తయారీ రంగం ఉపాధి అవకాశాల్ని ‘సర్వీస్ సెక్టార్’ ఆక్రమించాక, మూడు దశాబ్దాలుగా ఎక్కడా నిలకడ లేని ఉపాధిరంగం మిగిలింది. ఇప్పుడు ఉన్నది భుజానికి సంచి (షోల్డర్ బ్యాగ్ఎంప్లాయ్మెంట్) ఉపాధి. ఇక్కడ ఉద్యోగే కాదు,కంపెనీ అధిపతిది కూడా అమూర్త (రూపం తెలి యని) స్థితే. ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో అది ఎన్నాళ్ళో తెలియని స్థితి.అయినా ‘లీడర్’ అంటే ప్రజలు–ప్రాంతము పక్షంగా నిలబడి, అక్కడి సామాజిక పర్యావరణానికి తగిన ‘జియో–ప్లానింగ్’తో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన వాతావరణం సృష్టించాలి. మన ప్రయోజనాలు కాపాడుకుంటూనే, మనవి కాని బయట పవనాల వేగాన్ని అతడు ఎదుర్కోవాలి. అది లేకపోగా ముప్పై ఏళ్ళుగా ఏదొచ్చినా అదంతా నా వల్లనే అని ‘క్లెయిం’ చేసుకునే పరిస్థితి. ఇక్కడే అస్సలు ఒక నాయకుడి మూలాలు ప్రశ్న అవుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు (74) కాలం చూస్తే, 1995 నుంచి తొమ్మిదేళ్లు; మధ్యప్రదేశ్ దిగ్విజయ్ సింగ్ (78) 1993 నుంచి పదేళ్ళు, శరద్ పవార్ (84) మహరాష్ట్రలో 1988 నుంచి 1995 వరకూ కనిపిస్తారు. వీరిలో చంద్రబాబుది తప్ప మిగతా ఇద్దరిదీ రాజకీయ కుటుంబ నేపథ్యం. దిగ్విజయ్ సింగ్ తండ్రి 1951లో శాసనసభ్యులు, శరద్ పవార్ తండ్రి 1937–1952 మధ్య మూడుసార్లు జిల్లా బోర్డు సభ్యుడు, ఖాదీ, సహకార చక్కెర రైతు సంఘాల రాష్ట్ర నాయకుడు. అయితే, ఈ కాలంలో స్వయం ప్రతిభతో ఎదిగిన నాయకుడు లాలూప్రసాద్ యాదవ్. పట్నా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా చేస్తూ 1977లో 29 ఏళ్లకే ఎంపీగా పార్లమెంట్లోకి వెళ్ళిన అరుదైన చరిత్ర ఆయనది. బిహార్పై వీరి బలమైన ప్రభావం 1990–1997 వరకూ ఉంది. ఆయన సతీమణి రబ్రీదేవి ప్రభావం 2000–2005 వరకూ కనిపిస్తుంది. స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం గురించి సమీక్ష అంటే, దాన్ని మండల్ కమీషన్ నివేదిక అమలు, పి.వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ఈ పూర్వరంగంలో విధిగా చూడాలి. అలా ‘లాలూ– బిహార్’ లోతుల్ని కనుక వెతికితే ఏముంది? ఒక ప్పుడు ఆసియా జ్ఞాన కేంద్రాలకు నెలవైన బిహార్లో ‘రీ మ్యాపింగ్ ఇండియా’ మొదలై– జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ అనే మరో రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.వీరితో పోల్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డికి సీఎంగా గత అనుభవం లేదు, అయినా ‘జై ఆంధ్ర’ ఉద్యమ 50 ఏళ్ళ చరిత్ర తర్వాత, జరిగిన రాష్ట్ర విభజన వల్ల ‘పరిపాలన–అభివృద్ధి–సంక్షేమం–ఉపాధి’ రాష్ట్రం అంచులకు చేరేలా ‘జియో–ప్లానింగ్’ చేశారు. మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసి, 26 జిల్లాలతో తన వికేంద్రీకరణ పని మొదలు పెట్టారు. ఆ పాలనలోని మంచి–చెడులు గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అది సహజం కానీ, పార్టీలకు రాజకీయా లకు బయట ఉండి రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలో చించేవారు, ఏపీకి కీలకమైన కాలంలో తాము ఎంత బాధ్యత కలిగిన పౌరసమాజంగా ఉన్నాం? అనే ప్రశ్నకు మాత్రం జవాబు వెతుక్కోవలసి ఉంటుంది.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
విభేదిస్తే వ్యతిరేకించాలా?
‘అధికారం చెడగొడుతుంది. సంపూర్ణ అధి కారం సంపూర్ణంగా చెడగొడుతుంది.’ లార్డ్ జాన్ డల్బర్గ్ 1887లో చెప్పిన మాట ఇది. అధికారం అహంకారం కూడా తెస్తుంది,సంపూర్ణ అధికారం సంపూర్ణ అహంకారం తెస్తుంది... ఇది నేటి మాట. ఈ అహంకారానికి అవమానించే గుణం తోడవుతోంది. అహంకారులు భిన్నస్వరాన్ని భరించలేరు. అణచివేస్తారు. ఇండియాలోనే కాదు, అమెరికా తదితర అనేక దేశాల్లోనూ ఈ ధోరణి ప్రబలుతోంది.స్వేచ్ఛ కాగితాలకే పరిమితమా?అధికార పార్టీ నేతల పట్ల వ్యతిరేక భావాలు వ్యక్తం చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి వారిపై భౌతిక దాడులు జరుగుతాయి. ప్రభుత్వ ఏజన్సీలు వారిని వేటాడతాయి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తారు. రాజకీయ, సామాజిక రంగాల్లో అసమ్మతి ప్రకటించే వారి పట్లే ఈ తృణీకార ధోరణి ఇంతకాలం పరిమితమైంది. కానీ ఇప్పుడిది ఎల్లలు దాటింది. ఆఖరికి న్యాయవ్యవస్థను కూడా వదిలిపెట్టని దుఃస్థితి దాపురించింది. తమ మాటకు తలొగ్గని వారు ఎవరైనా వారికి ఒకటే. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఇందుకు మినహాయింపు కాదు. తమతో విభేదించిన న్యాయవ్యవస్థ వారి అవమానానికి గురవుతోంది.చిన్నప్పుడు మనకు స్కూల్లో ఏం చెప్పేవారు? చట్ట సభలు ప్రజా స్వామ్య పీఠాలనీ, సభ్యులకు అక్కడ భయం లేకుండా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందనీ చెప్పేవారు కదా! నిజానికి అవన్నీ కాగితాలకే పరిమితం. ప్రజలెన్నుకున్న ప్రతినిధులు చట్టసభల్లో అధికార పక్షంతో విభేదించి తమ గొంతు వినిపించగలుగుతున్నారా? అధికార పార్టీ సభ్యులు గానీ, అధ్యక్ష స్థానంలో ఉన్నవారు గానీ వారిని అందుకు అనుమతించడం లేదు. శాసన నిర్మాణ సంస్థల స్థాయి పెరిగే కొద్దీ వాటిలో ఈ ధోరణీ హెచ్చుతోంది.ప్రతిపక్ష సభ్యుల గొంతు వినబడకుండా అరుపులు కేకలతో పాలకపార్టీ సభ్యులు వారిని నిరోధించడం సర్వసాధారణమైంది. ఒక వేళ వారా పని చేయలేకపోతే, సభాధ్యక్షులు జోక్యం చేసుకుని ప్రతి పక్ష సభ్యుల మాటలను రికార్డుల నుంచి తొలగిస్తారు, మైకులు కట్ చేస్తారు. లేదంటే మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఇచ్చినా తగినంత సమయం కేటాయించరు.తటస్థత చూపనక్కర్లేదా?అత్యున్నత పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం, దిగువ సభ స్పీకర్, ఎగువ సభ చైర్మన్ తమ రాజకీయ అనుబంధాలను పక్కన పెట్టి విధి నిర్వహణలో తటస్థంగా ఉండాలి. కానీ చాలా సందర్భాల్లో ఇలా జరగటం లేదు. ఈ సంప్రదాయం నుంచి వారు వైదొలగుతున్నారు. కింది స్థాయి చట్టసభల్లోనే కాదు, లోక్సభలో, రాజ్యసభలో సైతం ఇదే జరుగుతోంది. ఉదాహరణకు, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను చూడండి. బీజేపీతో ఆయన తన అనుబంధాన్ని వీడలేక పోతున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యవహరించారు. ఇప్పుడూ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఆయన కళ్లన్నీ రాష్ట్రపతి పదవి మీదున్నాయి. అధినాయకుడి అను గ్రహం ఉంటేనే ఆ కల నెరవేరుతుంది. అందుకోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయనొక్కడే కాదు, అలాంటివారు పార్లమెంటులో చాలామంది ఉన్నారు. తగిన అర్హతలు లేకున్నా అధి నాయకుడి పట్ల విధేయత అనే ఒక్క అర్హతతో వారు మహనీయమైన ఉన్నత పదవులు పొందగలిగారు. గొప్ప మేధావులు ఎందరో ధన్ ఖడ్కు ముందు ఆ పదవిని అలంకరించారు. అత్యున్నత ప్రజాస్వా మిక విలువలతో వారంతా తమ పదవికి వన్నె తెచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ని అణు క్షిపణిగా పేర్కొంటూ ధన్ ఖడ్ ఈ మధ్య ఒక తూటా పేల్చారు (సంపూర్ణ న్యాయం చేయడం కోసం సుప్రీంకోర్టుకు విస్తృత విచక్షణాధికారాలను కట్టబెట్టే ఆర్టికల్ ఇది). ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే! ఆ అధికరణంపై సమగ్ర సమీక్ష, అవగాహనతో చేసిన వ్యాఖ్య కాదు! తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన ప్రకటన వెలువడింది. గవర్నర్లు చట్టసభలు చేసిన బిల్లులకు తప్పనిసరిగా సమ్మతి ఇవ్వాలన్నది తీర్పు సారాంశం. ఈ మధ్యకాలంలో చాలా మంది గవ ర్నర్లు కేంద్రానికి పక్క వాద్యకారులుగా పని చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు ధన్ఖడ్ సైతం ఇలాగే చేశారు. కాబట్టి, అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సబబే! ఆయన ఆర్టికల్ 142ని అణు క్షిపణిగా పేర్కొనడం... శాసన, న్యాయ వ్యవస్థల నడుమ ఉండాల్సిన అధికార సమతుల్యతను తిర స్కరించడమే అవుతుంది. ఇలా వ్యాఖ్యానించి, రాజ్యాంగ నిర్మాతల విజ్ఞతకు ఆయన సవాలు విసిరారు. ఇది మరీ తీవ్రమైన అంశం. నైతికత సారథులుగా వ్యవహరించాలి!రాష్ట్రపతి మూడు నెలల్లో బిల్లుపై నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గడువు విధించడాన్ని ధన్ఖడ్ తప్పు పట్టారు. అయితే, మనం ఉన్నది రాజరిక వ్యవస్థలో కాదనీ, మనది ప్రజాస్వామ్యం అనీ ఉప రాష్ట్రపతి గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రపతి పౌరులకు జవాబుదారీ కనుక, న్యాయవ్యవస్థకు లోబడి ఉండాలని మర్చిపోకూడదు. చట్టం తు.చ. తప్పకుండా అమలయ్యేట్లు చూడటంతో పాటు, ఆ శాసన ఆదేశాల ఉద్దేశం ఏమిటో గ్రహించడం కూడా న్యాయ వ్యవస్థ విధి.శాసన, న్యాయ వ్యవస్థల నడుమ అధికార విభజన గురించి స్పష్టంగా చెప్పిన వాళ్లలో మాంటెస్క్యూ ఒకరు. ‘ద స్పిరిట్ ఆఫ్ లా’ (1748) పుస్తకంలో ఆయన దీన్ని గురించి చర్చించారు: శాసన, కార్య నిర్వాహక అధికారాలు ఒకే వ్యక్తి వద్ద లేదా న్యాయాధికారుల బృందం చేతిలో ఉంటే స్వేచ్ఛ బతకదు. అందుకే వాటి నుంచి న్యాయాధికారాన్ని వేరు పరచాలి. మూడు అధికారాలు ఒకే వ్యక్తి లేదా ఒకే సంస్థ చలాయించేట్లయితే అన్నీ నాశనమవుతాయి... ఇదీ ఆయన సిద్ధాంతం. దేశంలో ‘సివిల్ వార్’కు సుప్రీంకోర్టు బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. ధన్ఖడ్ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన ఈ మాటలన్నారు. హిందూ రాష్ట్ర స్థాపన తమ ధ్యేయమని బీజేపీ నాయకత్వం పదేపదే ప్రకటిస్తోంది. ఈ సందర్భంగా, బీజేపీ నాయకత్వం శామ్యూల్ టేలర్ కొలరిజ్ రాసిన ‘ద స్టేట్స్మన్స్ మాన్యువల్’ చదివి తీరాలి. రాజకీయ నాయకులు తమ నిర్ణయాలు నైతిక, ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగాఉండేట్లు జాగ్రత్త వహించాలి. తమను తాము నైతికత సారథులుగా భావించాలి. కేవలం వ్యావహారిక నైపుణ్యం, ప్రయోజకత్వం మీద ఆధారపడే రాజకీయాలను ఆయన విమర్శిస్తాడు. బదులుగా, పవిత్ర గ్రంథాల్లోని దివ్యజ్ఞానం ప్రాతిపదికగా ఉండే సూత్రప్రాయ విధానా లను అనుసరించాలని కొలరిజ్ సూచిస్తాడు. తద్వారా రాజనీతిజ్ఞులు ప్రజలకు సమర్థమైన పాలన అందించడంతో పాటు సమాజాన్ని నైతికంగానూ ఉన్నతస్థితికి చేర్చగలరని హితవు పలికాడు.అభయ్ మోకాశీవ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మీడియా ట్రెయినర్ -
‘ఛీ’నా రాజకీయం...
అవకాశం దొరికింది కదాని ఇండియాను పాకిస్థాన్ భుజాల మీదుగా కాల్చాలని ప్రయత్నిస్తోంది కుటిల చైనా. ఆ దిశగానే బీజింగ్-ఇస్లామాబాద్ రక్షణ భాగస్వామ్యం బలపడుతోంది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న తరుణంలో... గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల తమ అత్యాధునిక పీఎల్-15 క్షిపణులను పాక్ వైమానిక దళానికి చైనా అందించింది.బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) పీఎల్-15 క్షిపణులను మోసుకెళుతున్న తమ జేఎఫ్-17 బ్లాక్ 3 యుద్ధ విమానాల ఫొటోలను పాక్ వైమానిక దళం (పీఏఎఫ్) ఇటీవల విడుదల చేయడం గమనార్హం. ‘పీఏఎఫ్’కు చైనా సరఫరా చేసినవి ఎగుమతులకు ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ రకం క్షిపణులు అనుకుంటే పొరపాటు! తమ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్)కు చెందిన సొంత పీఎల్-15 క్షిపణులను చైనా నేరుగా పాక్ కు అందజేసినట్టు ‘యూరేషియన్ టైమ్స్’ ఓ కథనం ప్రచురించింది.భారత్, పాక్ నడుమ వైరం ముదురుతున్న అత్యంత కీలక తరుణంలో ఆగమేఘాలపై ఆయుధాలను సరఫరా చేయడానికి చైనా ఈ మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరింత ఎక్కువ దూరం నుంచి భారత్ విమానాలను లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్ని పీఎల్-15 క్షిపణులు పాక్ యుద్ధ విమానాల పైలట్లకు కల్పిస్తాయి. అలా శత్రువుపై గెలుపును సునాయాసం చేస్తాయి.ఏమిటీ పీఎల్-15 మిసైల్?పీఎల్-15 క్షిపణి ఆధునిక వైమానిక యుద్ధరంగంలో చైనాకు ఓ ప్రధానాస్త్రం. ఇది ప్రభుత్వ ఏరోస్పేస్ సంస్థయిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (ఏవీఐసీ) అభివృద్ధి చేసిన రాడార్ గైడెడ్ దూరశ్రేణి క్షిపణి. ధ్వని వేగానికి ఐదు రెట్లు (మ్యాక్ 5) మించిన వేగంతో గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించదగ్గ ఈ మిసైల్ 200-300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ వెర్షన్ మిసైల్ 145 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. జే-10సి, జే11-బి, జే-15, జే-16, జేఎఫ్-17 బ్లాక్ 3, జే-20 విమానాలకు పీఎల్-15 క్షిపణిని అమర్చవచ్చు. 160 కిలోమీటర్ల రేంజితో, శబ్ద వేగానికి నాలుగు రెట్ల వేగంతో ప్రయాణించగల అమెరికాకు చెందిన ఏఐఎం-120డి అమ్రామ్ క్షిపణితో పోలిస్తే రేంజి, వేగం పరంగా మెరుగైన ఈ పీఎల్-15 మిసైల్ 2018 నుంచి చైనా వైమానిక దళానికి సేవలు అందిస్తోంది.పీఎల్-15 వర్సెస్ మీటియర్... యూరోపియన్ ఎంబీడీఎం మీటియర్ క్షిపణితో పీఎల్-15ను పోల్చవచ్చు. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల మీటియర్, ఎంఐసీఏ దూరశ్రేణి క్షిపణులను ప్రస్తుతం భారత్ చెంత ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలకు అమర్చవచ్చు. లాంచ్ ప్లాట్ ఫాం, ఎత్తు, లక్ష్యపు చలనశీలత అంశాలపై ఆధారపడి మీటియర్ మిసైల్ పరిధి 100-200 కిలోమీటర్లు ఉంటుంది. ధ్వని వేగానికి నాలుగు రెట్లు మించిన వేగాన్ని అది అందుకోగలదు. సామర్థ్యం పరంగా పీఎల్-15ఈ (ఎగుమతి రకం)తో మీటియర్ క్షిపణిని పోల్చవచ్చు. కానీ పీఎల్-15 స్టాండర్డ్ వెర్షన్ (పాక్ కు చైనా సరఫరా చేసిన ప్రామాణిక రకం) మాత్రం మీటియర్ కంటే అధిక వేగం, దూరశ్రేణి గల క్షిపణి. రాంజెట్ ఇంజిన్ సాయంతో మీటియర్ క్షిపణి ప్రయాణమంతటా స్థిర వేగంతో దూసుకెళుతుంది.ఇందుకు భిన్నంగా పీఎల్-15 మిసైల్ డ్యూయల్ పల్స్ ఘన ఇంధన రాకెట్ మోటార్ సాయంతో ప్రయాణిస్తుంది. ఇందులోని ఘన ఇంధనం కొద్దిసేపు మాత్రమే జ్వలించినప్పటికీ రాంజెట్ ఇంజిన్ గల మీటియర్ కంటే ఎక్కువ వేగం అందిస్తుంది. అయితే ధ్వనికి ఐదు రెట్లు పైబడిన స్పీడ్ అందుకున్నా ప్రయాణం పొడవునా అదే వేగాన్ని పీఎల్-15 మిసైల్ కొనసాగించలేదు! క్షిపణుల బయటివైపు చిన్న రెక్కల్లాంటి భాగాలు (ఫిన్స్) ఉంటాయి. వాటిని మడవగలిగితే మరిన్ని క్షిపణులను యుద్ధవిమానాలకు అమర్చవచ్చు. ఈ బుల్లి రెక్కల్ని మడిచిన పీఎల్-15 క్షిపణి నమూనాను చైనా నిరుడు జూహాయ్ ఎయిర్ షోలో ప్రదర్శించింది. దీంతో జే-20 లాంటి యుద్ధవిమానాలు నాలుగు బదులుగా ఆరు పీఎల్-15 మిసైళ్లను మోసుకెళ్లే వీలు కలిగింది.రష్యన్ ‘ఆర్-37ఎం’ వైపు భారత్ చూపు?పాక్ మోహరించిన పీఎల్-15 మిసైళ్లతో భారత వైమానిక దళానికి తలనొప్పి తప్పేలా లేదు. వాటిపై పైచేయి సాధించే ఆప్షన్ ఇండియాకు లేకపోలేదు. అది... రష్యాకు చెందిన అత్యాధునిక ఆర్-37ఎం దూరశ్రేణి క్షిపణి! అతిధ్వానిక వేగాన్ని (మ్యాక్ 6) అందుకోగల ఈ హైపర్ సానిక్ మిసైల్ 300-400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తుత్తునియలు చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దీన్ని విస్తృతంగా వినియోగించింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి ఆర్-37ఎం క్షిపణి నుంచే ప్రధాన ముప్పు ఎదురైందంటే అతిశయోక్తి కాదు.ఆర్-37ఎంను అమర్చిన మిగ్-31 విమానాలు పలు ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశాయి. ఉక్రెయిన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని సైతం ఈ మిసైల్ సాయంతో రష్యా కూల్చివేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. విశేషం ఏమిటంటే సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 యుద్ధ విమానాలపై ఆర్-37ఎం క్షిపణులను మోహరించవచ్చు. భారత్ వద్ద ‘సుఖోయ్ ఎస్యు-30’ శ్రేణికి కొదవ లేదు. ప్రస్తుతం మనకు 260కి పైగా సుఖోయ్ ఎస్యు-30ఎంకెఐ యుద్ధ విమానాలు ఉన్నాయి.వాటిని సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 వేరియంట్లుగా ఉన్నతీకరించే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. ఎస్యు-30ఎంకెఐ విమానాలకే ఆర్-37ఎం క్షిపణులను అమర్చాలంటే పెద్ద సాంకేతిక ప్రక్రియ ఉంది. దాదాపు 84 ఎస్యు-30ఎంకెఐ విమానాలను ఎస్ఎం2 వేరియంట్ స్థాయికి అప్గ్రేడ్ చేయడానికి రూ.63 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఆర్-37ఎం క్షిపణులను ఇండియాకు విక్రయించడానికి రష్యా కూడా ఆసక్తి కనబరుస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలపై ఈ క్షిపణులను మోహరించే అంశంలోనూ చర్చలు సాగుతున్నాయి. 2019లో బాలాకోట్ దాడుల సందర్భంగా ఇండియాకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని పాక్ తన ఎఫ్-16 విమానం-అమ్రామ్ క్షిపణితో కూల్చివేసింది. నాడు ఇండియా చెంత దూరశ్రేణి క్షిపణులు లేకపోవడం పెద్ద లోటు. ఆ తర్వాత మీటియర్ క్షిపణులను అమర్చిన రాఫెల్ విమానాలను భారత్ మోహరించింది. - జమ్ముల శ్రీకాంత్ -
‘ఫూలే’ను ఎందుకు ఆపాలని చూశారు?
మొదటిసారి మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే మీద ఒక హిందీ సినిమా వచ్చింది. దాన్ని ప్రఖ్యాత సినిమా డైరెక్టర్ అనంత్ మహాదేవన్ తీశారు. ప్రతీక్ గాంధీ, పత్రలేఖా పాల్ అనే ఇద్దరు యాక్టర్లు ఫూలే, సావిత్రిగా నటించారు. ఆ సినిమా నిజానికి ఫూలే 198వ జయంతి అయిన 2025 ఏప్రిల్11న విడుదల కావలసి ఉంది. కానీ దేశంలోని కొన్ని బ్రాహ్మణ సంఘాలు సినిమా విడుదలను వ్యతిరేకించి ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్’ (సీబీఎఫ్సీ)కి ఎన్నో ఫిర్యాదులు పంపారు. సీబీఎఫ్సీ అతివేగంగా స్పందించి, విడుదల కావాల్సిన సినిమాను ఆపేసి కొన్ని మార్పులు సూచించింది. ఎన్నో ఇబ్బందుల అనంతరం చివరికి ఏప్రిల్ 25న సినిమా విడుదలయ్యింది.‘ఫూలే’ సినిమా ఊహాజనిత కథపై ఆధారపడి తీసింది కాదు. ఫూలే, సావిత్రిపై రాసిన ఇంగ్లిష్, మరాఠీ, హిందీ భాషల్లోని చాలా జీవిత చరిత్రలపై ఆధారపడి తీసింది. కానీ సీబీఎఫ్సీ బలమైన చారిత్రక ఆధారాలతో సినిమాలో పెట్టిన ఘటనలను, కొన్ని పేర్లను తొలగించాలని సూచించింది. ముఖ్యంగా ఫూలే కాలంలో కూడా దళితులు గ్రామ వీధుల్లోకి వస్తే మూతికి ముంత, నడుముకు తాటాకు కట్టుకోవలసి ఉండింది. ఈ ఘోరమైన అంటరానితనాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించిన బ్రాహ్మణ రాజులైన పీష్వాలు కఠినంగా అమలుచేశారు.ఫూలే స్వయంగా చదువు చెప్పి సావిత్రీబాయిని దేశంలోనే మొదటి మహిళా టీచర్ని చేశాక, పుణె పట్టణ సమీపంలోని దళితవాడలో ఆడపిల్లలకు స్కూలు పెట్టారు. ఏ కులానికి చెందిన అమ్మాయిలైనా వచ్చి చదువుకోవచ్చని ప్రకటించారు. సావిత్రీబాయితోపాటు చదువుకున్న ముస్లిం స్త్రీ ఫాతిమా షేక్ ఆమెకు అండగా ఉండేది. సావిత్రీబాయి ఈ దేశం మొత్తం చరిత్రలో భర్త సహాయంతో చదువుకొని టీచరై, ఆడపిల్లలకు బడి పెట్టిన మొదటి మహిళ. ఫూలే దంపతులు బ్రాహ్మణులతో తగువు పెట్టుకోలేదు. కొట్టినా, తిట్టినా ఈ దేశ రైతాంగ జీవితాన్ని, కూలీల జీవితాన్ని, వృత్తిపనివారి జీవితాన్ని, ముఖ్యంగా స్త్రీ సమాజ జీవితాన్ని మార్చిన ఏకైక ఆదర్శ భార్యాభర్తల జంట అది. ఆ జంట అహింసకు మారుపేరు.ఈ సినిమాలో పీష్వాల కాలం నాటి ఘోర అంటరానితనం, మనుషులను జంతుప్రాయంగా చూసిన పీష్వా రాజ్య న్యాయ వ్యవస్థను ఈనాటి సమాజానికి చెప్పకుండా, సినిమా రూపంలో చూపించకుండా ఎందుకుండాలి? చుట్టూ బ్రిటిష్ పరిపాలన ఉన్నా, పీష్వా రాజులు పుష్యమిత్రశుంగుని క్రూరాతిక్రూరమైన వర్ణధర్మ రాజ్యాన్ని నడిపింది చరిత్ర కదా! మొత్తం రైతాంగాన్ని – అంటే ఇవాళ పై శూద్ర కులంగా ఉన్న మరాఠాలు, కుంబీలు (ఫూలే కులస్థులు) సైతం చదువు నేర్చుకునే హక్కు లేని కట్టుబానిసలు కదా! అందుకే ‘గులాంగిరీ’ పుస్తకంలో ఫూలే వ్యవసాయ ఉత్పత్తిదారులను బానిసత్వం నుండి విముక్తి చెయ్యకుండా దేశం అభివృద్ధి కావడం అసంభవం అని రాశారు.ఆనాటి శూద్ర బానిసలకు తాము బానిసలమనే సోయి కూడా లేదు. ఈ వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తిని పెంచలేదు. ఉన్న పంటలో అదిరించి, బెదిరించి, స్వర్గం–నరకం సిద్ధాంతం చెప్పినవాళ్లు మాత్రమే కాస్త మంచి తిండి తిన్నారు. వీళ్ళకు ఆనాడు జాతీయ భావం లేదు. కుల భావం మాత్రమే ఉంది. జాతీయ భావన సమానత్వంతో ముడిపడి ఉంది.ఈ దేశంలో అన్ని కులాల వారికి జాతీయ భావాన్ని నేర్పిన మొట్టమొదటి దైవసమాన జంట ఫూలే–సావిత్రీబాయి. వారిని మించిన జంట ఈ భూమి మీద ఆనాటికి పుట్టలేదు. ఈనాటికీ వెతికినా దొరికే స్థితి లేదు. పిల్లలు లేని ఈ జంట... విధవలుగా జీవిస్తున్న ఇద్దరు (బ్రాహ్మణ, ఇతర కులాలకు చెందిన) స్త్రీలను... ఇంట్లో పెట్టుకొని, ఒక బ్రాహ్మణ విధవకు పుట్టిన యశ్వంత రావును పెంచుకొని, మొదటి డాక్టరును చేశారు. ఆనాటి వరకు బ్రాహ్మణ పురుషులు కూడా అలోపతి మెడిసిన్ చదవడం లేదు. సముద్రాలు దాటడం లేదు. ఈ దంపతులను ఈనాటి బ్రాహ్మణులైనా, ఏ కులస్థులైనా ఎలా చూడాలి? ఈ భూమి మీద నడిచిన దేవ–దేవతా దంపతులుగా చూడాలి కదా! వారి జీవిత చరిత్ర చిత్రీకరణను వ్యతిరేకించడమేమిటి?సావిత్రీబాయి ఈ దేశ మొదటి మహిళా టీచరయ్యారు నిజమే. ఆమెపై ఆనాటి సంప్రదాయ యువకులు పేడ కొట్టింది నిజమే. కొంతమంది బ్రాహ్మణులు ఆ దంపతులకు మద్దతిచ్చిందీ నిజమే. సీబీఎఫ్సీ పేడకొట్టే సీను సినిమాలో తీసెయ్యాలని ఎలా అన్నది? ఈ సీబీఎఫ్సీలో ఒక్క శూద్ర వ్యక్తిగానీ, దళిత వ్యక్తిగానీ లేకుండా ఎలా చేశారు బీసీ ప్రధానమంత్రి? ఈ సీబీఎఫ్సీ కశ్మీర్ మీద, గుజరాత్ మీద, కేరళ మీద ముస్లింలపై సినిమా తీసినప్పుడు వాళ్ళు ట్రైలర్లు చూసి ఎన్ని అభ్యంతరాలు పెట్టినా ఒక్క సీన్గానీ, ఒక్క పదంగానీ కట్ చెయ్యలేదు. ఇప్పుడు సీబీఎఫ్సీ అధ్యక్షుడు ప్రసూన్ జోషీ ఈ దేశ జాతీయతను ఏం చెయ్యదలచుకున్నారు?ఆ సినిమాలు ప్రధానమంత్రి చూశారు. పొగిడారు. మరి ‘ఫూలే’ సినిమాను ప్రధానమంత్రి చూస్తారా? ఒక బీసీగా ప్రధానమంత్రి అయి, ముఖ్యంగా శూద్ర బీసీల ఓట్లతో గెలిచి ఫూలే వ్యతిరేకులను సమర్థిస్తారా అనేది చాలా ముఖ్యమైన అంశం.ఈ సినిమా భారతదేశపు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త మలుపు. మన సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలు పుస్త కాలుగా వచ్చాయి. కానీ వారిపై పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమాలు తీసే ప్రయత్నం చెయ్యలేదు. అందులో ముఖ్యంగా ప్రపంచ ఆధునిక చరిత్రలో ఎక్కడా లేని ఒక ఫూలే జంట లాంటి జంట మీద సినిమా తీయడం, వారి జీవితాలను ఇంటింటికీ ఆదర్శవంతం చేయడం నిజానికి జాతీయ లక్షణాలు కలిగిన సినిమా ఇండస్ట్రీకి ఉండాలి. కానీ అదెక్కడా కనిపించలేదు. ఈ సినిమాతో అది మొదలయింది.ఒక సినిమా మంచిదా, కాదా అనేది అది ఎన్ని కోట్లు సంపాదిస్తుంది అనే మార్కెట్ విలువను బట్టి ఈ రోజుల్లో, మార్కెట్లో కూడా ఈ సినిమా విలువను పెంచాల్సి ఉంది. ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను తగ్గిస్తాయా, మాఫీ చేస్తాయా అనేది అంత ముఖ్యం కాదు. ఎంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సినిమాను చూస్తారు అనేది ముఖ్యం. అమెరికాలో రేసిజాన్ని అంతం చేసిన ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ 1865లో ‘అవర్ అమెరికన్ కజిన్’ డ్రామాను థియేటర్లో చూస్తూ హత్యకు గురయ్యారు. మంచిని నేర్చుకోవడానికి ఆయన చూపిన శ్రద్ధ అది. ఈ సమాజం సమానత్వం వైపు పయనిస్తేనే ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది. లేకపోతే ఫూలేలు నేర్పిన శ్రమ గౌరవ పాఠాలు ఇసుక దిబ్బల మీద రాసిన రాతలయ్యే ప్రమాదముంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
పాక్కు ఏది సరిపోయే శిక్ష?
పహల్గామ్లో 26 మంది పౌరులను కాల్చి చంపిన భయంకర ఉగ్రదాడి తర్వాత భారత్ లో పాకిస్తాన్ పై ఆగ్రహం పెరుగుతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) కటువైన ప్రకటన విడుదల చేసింది. దాడి చేయడంలో ఉగ్రవాదులు ప్రదర్శించిన క్రూరత్వాన్ని చూస్తే ఆ ఆగ్రహం ఆశ్చర్యం కలిగించదు. పాక్ మీడియా వ్యాఖ్యాతలు ఇస్లామాబాద్ను ఇరికించడానికి భారతదేశమే ఈ దాడిని నిర్వహించిందని దారుణమైన ఆరోపణ చేస్తున్నారు. స్పష్టంగా, వారు ఘోరమైన పరిణామాన్ని ఆశిస్తున్నారు.భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన కావలసిన అన్ని అంచనాలను తీర్చింది. న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ లోని ఛార్జ్ డి’అఫైర్ సహా 14 మంది సిబ్బంది ఇంకా మిగిలి ఉన్నప్పటికీ, పాక్ సైనిక సలహాదారులు, ఇతర సహాయక సిబ్బందిని భారత్ విడిచి వెళ్ళమని ఆదేశించారు. ఇది పాక్ సైనిక సంస్థపై పూర్తిగా నిందను మోపుతుంది. అటారీ చెక్పోస్ట్ మూసివేయడం, మిగిలిన వీసా ప్రోటోకాల్స్ని నిలిపివేయడం కూడా ఊహించినదే. పాక్పై తీవ్రమైన ప్రభావం కలిగించడానికి భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించలేదు. గత సంవత్సరం చివర్లో, సింధునదీ జలాల ఒప్పందంపై తిరిగి చర్చలు జరిగే వరకు సింధునదీ జలాల కమిషన్ సమావేశాలను నిర్వహించడానికి కూడా భారత్ నిరాకరించింది.కేవలం నిలిపేసింది!భారత్లో జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికి పాకిస్తాన్ అతి స్వల్ప కారణాలను చూపుతూ సింధు జలాల ఒప్పందాన్ని ఉపయోగించుకుంటోంది. ఒప్పందంలో ఇరు దేశాల కమిషనర్లు సహా మూడు అంచెల వివాద యంత్రాంగం ఉంది. అది విఫలమైనప్పుడు, 1960లో ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకు ఒక తటస్థ నిపుణుడిని నియమిస్తుంది. అది కూడా పని చేయకపోతే, మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయవచ్చు. 1970లలో, భారతదేశం సలాల్ (జమ్ము–కశ్మీర్) ఆనకట్ట ఎత్తును తగ్గించి, దాని అవుట్లెట్లను తెరిచి వేయవలసి వచ్చింది. దీనివలన ఆనకట్ట ఉపయోగం తగ్గి భారీగా బురద చేరి, కోతకు గురైంది. మరొక సందర్భంలో, బాగ్లిహార్ ఆనకట్ట (జమ్ము–కశ్మీర్) 14 ఏళ్ల ఆలస్యాన్ని ఎదుర్కొంది. కిషన్గంగా ప్రాజెక్టు మరింత ఇబ్బందులకు గురైంది. ప్రపంచ బ్యాంక్ నియమించిన తటస్థ నిపుణుడు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడే పాక్ మధ్యవర్తిత్వ స్థాయికి వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత నీటి కొరత ఉన్న దేశాలలో పాకిస్తాన్ 15వది. భారతదేశం ప్రస్తుతం జలాల ఒప్పందాన్ని కేవలం ‘నిలిపివేసింది’. సరిహద్దుకు అవతలి వైపు ఉన్న బాధ్యతాయుతమైన మనుషులు ఈ స్వల్పభేదాన్ని అర్థం చేసుకోవాలి.అయితే, ఇవేవీ భారతదేశ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేవు. భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన ‘ఇటీవల తహవ్వుర్ రానాను వెనక్కి రప్పించినట్లే, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లేదా వాటిని సాధ్యం చేయడానికి కుట్ర పన్నిన వారిని వెంబడించడంలో భారతదేశం అవిశ్రాంతంగా ఉంటుంది’ అని పేర్కొంది. ఉగ్రదాడి తర్వాత ప్రధాని బిహార్లో ఉద్దేశపూర్వకంగానే ఇంగ్లీషులో మాట్లాడుతూ, ‘భారతదేశం ప్రతి ఉగ్రవాదినీ, వారికి మద్దతు ఇచ్చేవారినీ గుర్తించి, వెంబడించి, శిక్షిస్తుంది. మేము వారిని భూమ్మీద ఎక్కడున్నా దొరికించుకుంటాం’ అన్నారు. ఉగ్రవాదాన్ని శిక్షించే చర్యలు దీర్ఘకాలంపాటు కొనసాగుతాయని ఈ ప్రకటన సూచిస్తుంది.ఎలా దాడి చేయొచ్చు?కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఏమి సాధ్యమవుతుంది అంటే కచ్చితంగానే బాలకోట్ తరహా దాడి సాధ్యం కాదు. ఈసారి, పాక్ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. స్పష్టమైన ప్రత్యామ్నాయం ఏమిటంటే, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను గుర్తించే లక్ష్యంతో భారత భూభాగం నుంచే 290 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించడం. అది భారత్ తనదని చెప్పుకొంటున్న ప్రాంతం కాబట్టి ఇది సాంకేతికంగా పాకిస్తాన్పై దాడి కాదు. మరింత కావాల్సిన లక్ష్యం లష్కర్–ఎ–తొయిబా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న మురిద్కే. ఇది లాహోర్కు దగ్గరగా, భారత సరిహద్దు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంది. సాయుధ డ్రోన్ లను ఉపయోగించి కూడా దీనిపై దాడి చేయవచ్చు. దీని వలన కచ్చితత్వంతోపాటు ఎటువంటి ఆనుషంగిక నష్టం ఉండదు.కానీ ఏదైనా సరే, ఎంత సమర్థనీయమైనా సరే, అది యుద్ధ చర్యే. పాకిస్తాన్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలకోట్ తరువాత, అది జాగ్రత్తగా దాడి చేసింది. పెద్దగా నష్టం కలిగించకుండా ప్రతిస్పందనను నమోదు చేసింది. దానికి ప్రధానంగా అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బాజ్వా కారణం. ఆయన దేశ సొంత ప్రయోజనం కోసం పాక్ అంతటా భారతదేశానికి వాణిజ్యాన్ని ప్రతిపాదించిన వాస్తవికవాది. కానీ, యుద్ధం, దాని అన్ని తీవ్రతరమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుత చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వివేకవంతమైన వ్యూహకర్త కాదు. భారతదేశం ఈ యుద్ధాన్ని భరించగలదు. అయినప్పటికీ ముఖ్యంగా ఆయుధాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పుడు ఇది అత్యంత వ్యర్థమైన ఖర్చు.ముక్కలుగా కత్తిరిస్తే!భారత్ యుద్ధాన్ని కాకుండా, ఆర్థిక వృద్ధిని కోరుకుంటోంది. పాక్ నిజంగా యుద్ధాన్ని భరించలేదు. పైగా అంతర్జాతీయ ద్రవ్య నిధి అటువంటి ఖర్చులను దయతో చూస్తుందా లేదా అనేది విషయం కాదు... వాస్తవం ఏమిటంటే, ఆ దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు సంక్షోభంలో ఉన్నాయి. ఇది జెట్ ఇంధనం విషయంలో తీవ్రమైన కొరతకు దారితీస్తుంది. గత తొమ్మిది నెలల్లో ఆరు ప్రధాన శుద్ధి కర్మాగారాలలో ఏవీ చమురు పంపిణీ చేయలేదు. కనీస జ్ఞానం ఉన్న ఏ దేశమైనా, కీలకమైన ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభించదు. అయినా భారత్ను పాక్ యుద్ధంలోకి లాగాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. దానికి పోయేది ఏమీ లేదు. అందుకే తక్కువ ‘ఆడంబర’ ప్రత్యామ్నాయం ఏమిటంటే, ఎల్ఓసి అంతటా ఫిరంగి కాల్పులు జరపడం. కానీ మన వైపు పౌరులకు కూడా నష్టాలు ఉంటాయి. పైగా ఈ మొత్తం విన్యాస ప్రయోజనమే ప్రశ్నార్థకం అవుతుంది. ఏమైనప్పటికీ ఉగ్రవాదులు చొరబడతారు. ఏమైనా పాక్ కోరుకుంటున్న దిశలో ఇండియా కొట్టుకుపోకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా, చాలా నైపుణ్యంతో పాక్ని శిక్షించడాన్ని ఎంచుకోవాలి.చాలా కాలంగా, పాకిస్తాన్ రెండు వైపులా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని అందరూ గుర్తించారు. పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేసేవరకు సంబంధిత దేశాలు ఆంక్షలు విధించాలని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఆంక్షలనేవి పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. ఇకపై పాక్ సైన్యాధికారులు సౌకర్యవంతమైన విదేశాల పర్యటనలు చేయకుండా చూడాలి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి వచ్చే అన్ని బాహ్య నిధులకు అడ్డుకట్ట వేయాలి.అవును, చాలా దేశాలు పాక్ను శిక్షించే కార్యక్రమంలో చేరవు. ఉగ్రవాదాన్ని ఎంత ఇష్టపడకపోయినా, పాక్ని శిక్షించని దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే పాక్ కోరుకోని విధంగా, దీర్ఘకాలంగా అణచివేతకు గురైన బలూచ్లు, పష్తూన్లకు బహిరంగ మద్దతు ప్రకటించే సమయం ఇదే కావచ్చు. ఇది పాక్ రహస్య వ్యూహాల అనుకరణ కాకూడదు. ఇది ప్రపంచాన్ని ముందుకు రావాలని పిలుపునిచ్చే బహిరంగ మద్దతుగా ఉండాలి. ఇక జరిగింది చాలు, పాక్కు దాని స్థాయేమిటో తెలియజెప్పాలి.తారా కార్థా వ్యాసకర్త డైరెక్టర్ (పరిశోధన), సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
తహవ్వుర్ రానా (26/11 సూత్రధారి) రాయని డైరీ
‘‘రేపటితో నీ రిమాండ్ ముగుస్తుంది...’’ అన్నాడు నా లాయర్. ‘‘తర్వాత ఏం జరుగుతుంది?’’ అని నేను నా లాయర్ని అడగలేదు. నా తరఫున వాదించటానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాయర్ అతడు. ‘ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ’ నుంచి వచ్చాడు. గవర్నమెంట్ డబ్బులిచ్చి నడిపిస్తున్న లీగల్ అథారిటీ నుంచి, గవర్నమెంటే ఏర్పాటు చేస్తే నా కోసం వచ్చిన లాయర్ను నేను అడిగేది ఏముంటుంది? అతని పేరేమో పీయూష్ సచ్దేవ!‘ఏమైనా తిన్నావా?’ అంటాడు!‘ఏమైనా అన్నారా?’ అంటాడు! ‘ఆరోగ్యం ఎలా ఉంది?’ అంటాడు. ‘ఇక ఉండేదా మరి?!’ అంటాడు.ఈ నాలుగే... రోజు మార్చి రోజు అతడు నన్ను అడిగే ప్రశ్నలు. ఊరికే వస్తుంటాడు, పోతుంటాడు. ‘ధైర్యంగా ఉండు, న్యాయం గెలుస్తుంది..’ అంటాడు! నేనడిగానా ‘నాక్కాస్త ధైర్యమివ్వు’ అని, నేనడిగానా ‘న్యాయాన్ని గెలిపించు’ అని!!ఒకరోజు వచ్చాడు. ‘‘నువ్వు మందులేమీ వేసుకోవటం లేదనీ, కనుక నువ్వు చెప్పుకుం టున్నట్లుగా నీకు 33 అనారోగ్యాలేమీ లేవనీ, అందుచేత నీ ఇంటరాగేషన్ టైమ్ను తగ్గించే అవసరం లేదనీ వాళ్లు వాదించబోతున్నట్లు తెలిసింది...’’ అన్నాడు! ‘‘నువ్వూ, వాళ్లూ నా గురించి ఏదైనా వాదించుకోండి. అది నాకు సంబంధం లేని విషయం. నాకైతే ఒక ఖురాన్, ఒక పెన్ను, కొన్ని తెల్ల కాగితాలు తెప్పించు...’’ అన్నాను. తెప్పించాక, ‘‘ఇవన్నీ ఎందుకు?!’’ అని అడిగాడు.‘‘పవిత్ర ఖురాన్ గ్రంథం నా డాక్టర్. ఆ డాక్టర్ నాకు ప్రిస్క్రిప్షన్ రాయటానికి ఈ పెన్ను, ఈ తెల్ల కాగితాలు. ప్రవక్త సూక్తులే నేను వేసుకునే మందులు...’’ అని చెప్పాను.తర్వాతి విజిట్లో ... ‘‘నా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించగలవా?!’’ అని అడిగాను.‘‘కష్టం కావచ్చు’’ అన్నాడు. ‘‘ఎందుకు కష్టం కావచ్చు?!’ అన్నాను. ‘‘మీ ‘కుటుంబ సభ్యులు’ ఒకరు పాకిస్తాన్ లో 78 ఏళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకొకరు లాహోర్, రావల్పిండి వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ వారు జైల్లో ఉన్నారని పాకిస్తాన్ అంటోంది కనుక జైల్లోంచి మాట్లాడటం కుదరదు. మీ మిగతా కుటుంబ సభ్యులు పాకిస్తాన్లోని కోట్ లఖ్పట్ జైల్లో వెంటిలేటర్ మీద ఒకరు, అమెరికా జైల్లో ఒకరు, ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో ఒకరు ఉన్నారు. కాబట్టి వారందరితో ఫోన్లో మాట్లాడించటం కష్టం’’ అన్నాడు నా లాయర్! నా చేతిలో కనుక ఒక గన్ ఉండి ఉంటే అక్కడికక్కడ... అది ఎన్.ఐ.ఎ జైలు అని, నేను పోలీస్ రిమాండ్లో ఉన్నానని కూడా చూడ కుండా రూఫ్ టాప్ మీదకు బులెట్ని పేల్చి అతడి భయాన్ని కళ్లజూసేవాడిని!‘‘నేను మాట్లాడతానంటున్నది నా కుటుంబ సభ్యులతో మిలార్డ్...’’ అన్నాను నా లాయర్తో, కోపంగా. ‘‘కానీ అవతలి వైపు వాళ్లు ఇలాగే వాదిస్తారు మిస్టర్ తహవ్వూర్. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం...’’ అన్నాడు. రెండు రోజుల తర్వాత వచ్చి – ‘‘మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి జడ్జి గారు ‘నాట్ అలౌడ్’ అనేశారు...’’ అని చెప్పాడు.అతడు అటు వెళ్లగానే, ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ వచ్చి కూర్చున్నాడు. ‘‘నువ్వు 26ని వదిలి పెట్టటం లేదా? లేక 26 నిన్ను వదిలిపెట్టటం లేదా?’’ లేక... నువ్వూ, 26 కలిపి ఈ దేశాన్ని వదిలిపెట్టటం లేదా?’’ అన్నాడు!నాకర్థమైంది! నా రిమాండ్ రేపే ముగిసి, మళ్లీ రేపే మొదలు కాబోతోంది. ‘‘చెప్పు... మొన్న పహల్గామ్లో 26 మందిని చంపిన టెర్రర్ ఎటాక్ వెనుక నీతో పాటు ఎవరెవరు ఉన్నారు?’’ అని ఫ్రెష్గా ఇంటరాగేషన్ మొదలుపెట్టాడు ఎన్.ఐ.ఎ. ఆఫీసర్!! -
పార్టీ స్థాపనకు ఏడాది ముందు...
టీఆర్ఎస్ ఆవిర్భవించే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ లక్ష్య శుద్ధితో విజయం సాధించాలని కేసీఆర్ పార్టీని స్థాపించారు. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్ రెండు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాలు. వీరికి ధన బలంతో పాటు ప్రసార మాధ్యమాల తోడు ఉంది. ఒక్క అంశం అనుకూలంగా లేని, చుట్టూ గాఢాంధకారం అలుముకున్న ప్రతికూల పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు సాహసోపేతం. ఈ సాహసం ఒక్క కేసీఆర్కే చెల్లు.విస్తృత చర్చలు– సంతృప్తికర వివరణలుతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపనకు ఒక సంవత్సరం ముందు నుండే సన్నాహాలు, చర్చలు ప్రారంభమయ్యాయి. పార్టీ పేరు, జెండా, కండువా 2000 లోనే నిర్ణయమైనాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన నాటి పరిస్థితుల సమీక్ష జరిగింది. కాంగ్రెస్పై ఉన్న వ్యతిరేకతను, తనపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మల్చుకొని కేవలం 9 మాసాల కాలంలోనే ఎన్టీయార్ అధికారం చేపట్టిన విషయం ప్రస్తావనకొచ్చింది.పార్టీ పెట్టాలనుకునే విషయం తెలిసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష దీపాన్ని ఆరిపోకుండా అప్పటివరకు కాపాడుతున్న సంఘాలు... తెలంగాణ జన సభ, తెలంగాణ మహా సభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్, తెలంగాణ లాయర్స్ అసోసియేషన్, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ స్టడీ ఫోరం, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ జన పరిషత్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ జన సంఘటనలకు చెందిన కొందరు వచ్చి చర్చించడం, తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం జరిగింది. మరికొందరిని కేసీఆరే స్వయంగా ఆహ్వానించి చర్చించారు. తెలంగాణలోని ప్రముఖుల వివరాలను సేకరించి, సందర్భానుసారంగా వారితోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. వారిలో దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, వైస్ ఛాన్స్లర్లు నవనీత రావు, ఆర్వీయార్ చంద్రశేఖర్ రావు, జయశంకర్, జస్టిస్ సీతారాం రెడ్డి, గౌరవ నిఖిలేశ్వర్, ‘ప్రెస్ అకాడమీ’ పొత్తూరి వెంకటేశ్వరరావు, జస్టిస్ భాస్కర్ రావు, ప్రొఫెసర్లు మధుసూదన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కోదండరాం రెడ్డి, సింహాద్రి, బియ్యాల జనార్ధన రావు, కంచె ఐలయ్య, కేశవరావు జాదవ్, జల సాధన సమితి దుశర్ల సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రభాకర్, ప్రజ్ఞా మ్యాగజైన్ కెప్టెన్ పాండురంగ రెడ్డి తదితరులున్నారు. వీరిలో చాలామందితో సంప్రదింపులు జరిపి, వారి సూచనలు స్వీకరించారు.తెలంగాణ మేధావులు, విద్యావంతులు, యువకులు, కవులు, కళాకారులతో చర్చలు సాగిస్తూనే, మరొవైపు తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తన వద్దకు వచ్చేవారి సందేహాలన్నిటికీ సవివరమైన, సంతృప్తికరమైన వివరణ ఇచ్చి, అప్పటివరకు అపనమ్మకం ఉన్నవారిలో సంపూర్ణ విశ్వాసం పెంచేవారు. వివిధ పార్టీలలో పనిచేసే నాయకులు ఎవరికి వారుగా కేసీఆర్ను కలిసి, చర్చించి, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాత కలిసి పనిచేయడానికి సంసిద్ధత చెప్పేవారు. ఇటువంటి వారిలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, దేశిని చిన్న మల్లయ్య, నాయిని నర్సింహారెడ్డి లాంటి పెద్దలు ఉన్నారు. ఒకానొక సందర్భంలో లక్ష్మీకాంతరావు ‘తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనా? ఎలా సాధ్యమవుతుంది?’ అని సంశయం వ్యక్తం చేయగా, కేసీఆర్ ఇచ్చిన సుదీర్ఘ వివరణ అనంతరం, ‘తెలంగాణ సిద్ధించిందనే భావన మీ జవాబుతో నాకు కలిగింది. ఇక నుండి ఎప్పుడు ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేయను, వివరణ కోరను. తెలంగాణ సాకారం అయ్యేంత వరకు మీతోనే నా పయనం’ అని ఉద్విగ్నుడయ్యారు. స్టేట్ ఫైట్– స్ట్రీట్ ఫైట్ కాదు!వివిధ రాజకీయ పార్టీల నాయకుల, కార్యకర్తల తాకిడి రోజురోజుకు పెరుగుతూ రేయింబవళ్ళు చర్చోపచర్చలు సాగేవి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే చర్చలు మధ్యరాత్రి వరకు జరిగేవి. కొన్ని సందర్భాల్లో తెల్లవారు వరకు ఈ చర్చలు జరిగేవి. ఒకరిద్దరు ఉన్నా, పది మంది ఉన్నా, వందలాది మందిలో ఉన్నా కేసీఆర్ నాలుగైదు గంటలు నిరాఘాటంగా తెలంగాణ ఉద్యమం సాగించే క్రమాన్ని సోదాహరణలతో సహా వివరించేవారు. వారు లేవనెత్తిన సంశయాలకు సంతృప్తికర సమాధానం ఇచ్చి, వచ్చిన వారిలో అత్యధికులను ఉద్యమ కార్యోన్ముఖులను చేసేవారు. ఒకట్రెండు సందర్భాల్లో ఉద్యమం ఆవేశభరితంగా, ఆందోళన పథంలో సాగాలని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయగా... ఇది స్టేట్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ కాదనీ; లక్ష్యం సాధించే వరకు సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావాలనీ; పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి భావవ్యాప్తిని సాగించి, ప్రజలను సమీకరించి, శక్తిగా మలిచి, ఎన్నికల్లో గెలిచి, గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గంలోనే రాష్ట్రం సాధించాలనీ; ఒక ప్రాంతానికి న్యాయం జరగాలని చేసే ఈ ప్రయత్నంలో ఇంకొక ప్రాంతం వారికి ఇబ్బందులు కలిగించడం వాంఛనీయం కాదనీ; తాను శాంతియుత పంథాలో మాత్రమే పయనిస్తాననీ కరాఖండిగా చెప్పేవారు. ఈ విధానం నచ్చని కొందరు మళ్ళీ వచ్చేవారు కాదు. సంకీర్ణాల్లో ఒక్క ఓటైనా విలువే!2000వ సంవత్సరంలో తెరాస పార్టీని స్థాపించవలెననే చర్చలు సాగుతున్న తరుణంలో దేశ రాజకీయ చిత్రపటం అనుకూలంగా ఉందా లేదా అనే సమీక్ష కూడా జరిగింది. కారణం గతంలోని చేదు అనుభవం. అయితే 1969 – 71 నాటి రాజకీయ పరిస్థితులకు పూర్తి భిన్నమైన పరిస్థితులు అప్పుడు నెలకొన్నాయి. ఒకప్పుడు ఇందిరా గాంధీ భారీ మెజారిటీతో ఏక పార్టీ పాలన సాగింది. తదనంతరం కొన్ని దశాబ్దాలు తక్కువ మెజారిటీతో ఏక పార్టీ పాలన, అటుపిమ్మట సంకీర్ణ ప్రభుత్వాల కాలం సాగుతోంది. సంకీర్ణ యుగం రాష్ట్రం సాధించుకోవడానికి అనువైనదిగా తేలింది. 1999వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షను కోల్పోయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్సభలో ఒక సభ్యుడి ఓటు కూడా అత్యంత కీలకంగా మారిన ఈ పరిణామం ప్రస్తావనకు వచ్చింది. అంటే సంకీర్ణాల యుగంలో మూడు, నాలుగు లోక్సభ స్థానాలతో కూడా జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించవచ్చని తేలింది. 1971 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ప్రజా సమితిని 14 స్థానాల్లో పదింట గెలిపించారు. టీఆర్ఎస్ చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉద్యమాన్ని నడిపి ప్రజా విశ్వాసాన్ని పొందగలిగితే, కచ్చితంగా లోక్సభకు చెప్పుకోదగిన సంఖ్యకు ప్రతినిధులను తెలంగాణ ప్రజలు తప్పక గెలిపిస్తారనే నమ్మకం కలిగింది. 10 మంది లోక్సభ సభ్యులున్నప్పటికీ 1971లో తెలంగాణ రాష్ట్రం సాధించబడక పోవడానికి బలమైన కారణం లోక్సభలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని సంఖ్యా బలం ఉండటమే. నాడు అధికార బలంతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజా సమితి సభ్యులను విలీనపర్చుకుంది. కానీ దానికి భిన్నంగా నేడు సంకీర్ణాలే శరణ్యం కాబట్టి పార్లమెంట్లో కనీస ప్రాతినిధ్యంతో ఒత్తిడి ద్వారా రాష్ట్రాన్ని సాధించవచ్చని నమ్మకం కుదిరింది. తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనని సంపూర్ణ విశ్వాసం కలిగిన కేసీఆర్... శాసన సభ్యత్వానికి, డిప్యుటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ప్రజలను ఆలోచింపజేసి, ఆశలు రేకెత్తించి విశ్వాస బీజాలు నాటారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్ 27న పార్టీ జెండా ఎగురవేయబడింది. పదవీ త్యాగంతో పార్టీ స్థాపించారు, ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రం సాధించారు. వ్యాసకర్త బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతసిరికొండ మధుసూదనాచారి (బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా) -
తీవ్రవాదులను ఓడిద్దాం... దేశాన్ని గెలిపిద్దాం!
కేవలం పహల్గామ్లోనే కాదు, కేవలం పాకిస్తాన్లోనే కాదు, దేశమంతా ఉన్నారు. అవకాశవాద, అవినీతిలో నిండిన ప్రజా, సివిల్ అధికారుల వల్లనే టెర్రరిస్టులు బతుకుతున్నారు, టెర్రరిజం బతుకుతున్నది. టెర్రరిస్టు డబ్బుతో ఆ దేశం, ఈ దేశం అనికాదు, ప్రతి బిజినెస్లో పెద్దలు, నేతలు బతుకుతున్నారు. సిగ్గు సిగ్గు! రాబోయే పదేళ్లదాకా, లేదా వందేళ్లదాకా తీవ్రవాదం ఉంటుంది, ఉంచుతారు. వ్యాపారం కోసం, రాజకీయం కోసం! అధికారం కోసం, ఎన్నికల కోసం!అంతర్జాతీయంగా అన్నీ అమ్ముకోవడాలే గాని, జాతీయతా భావనే లేదు. నాయకులకే కాదు, సగం మంది ప్రజలకు కూడా సిగ్గు పడవలసిన ‘దుర్మార్గం’ ఎక్కువగా ఉంది. గుడికి దర్శనానికి వెళుతున్నాం. ప్రసాదాలను, నిజాలను నమ్ముకోకుండా, ఖనిజాలు అమ్ముకుంటున్నాం. ఆ ఖనిజం కోసం అడవులు నరికేస్తున్నాం. ‘సత్యమేవ జయతే’ అని మన జాతీయ నినాదం. 150 కోట్ల జనాల్లో ఎంతమంది నిజం చెబుతున్నారు? ‘రామ్ నామ్ సత్య్ హై’ అనేది మనదేశంలో చిత్తశుద్ధితో వినేవారున్నారా? రామ్ పేరుతో రాజకీయాలు, మతం పేరుతో అధికారాలతో ఆడు కుంటూ, పై పెదవుల కొస నుంచే ‘జై శ్రీరామ్’ అంటున్నాం. రామరాజ్యం రావడం లేదు. భక్తి లేదు, భయం లేదు. గర్భగుడులలో ఒక్కొక్క స్తంభానికి బంగారపు తాపడాలకు డబ్బిస్తాం కానీ పేదవాడికి తిండిచ్చేవాడు లేదు.చదవండి: ఈ దేశాన్ని ఎన్ని ముక్కలు చేద్దామనీ!అమెరికాలో అద్భుత ఆకాశాలను తాకే రెండు భవనాలను విమానాల్లో కూల్చిన దుర్మార్గం ద్వారా వందలాది జీవనాలు ధ్వంసమయ్యాయి(2001 సెప్టెంబర్ 11). నిన్న పహల్గామ్లో 26 మంది ప్రాణాలు తీసిన నేరం చిన్నదేం కాదు. వెంటాడి వేటాడి ఒక్కొక్కణ్ణి పట్టుకు శిక్ష వేస్తాం అంటున్న ప్రభుత్వానికి వందలాది వందనాలు. అమెరికా చేసిందేమిటి? మాటలు కాదు. తూటాలు కాదు. రాజకీయం కాదు. ఎక్కడున్నా సరే వేటాడి పట్టుకుని అమెరికాను కాపాడుకోవడానికి చూపిన కమిట్మెంట్ మనకు ఆదర్శం కావాలి. కమిట్మెంట్ అంటే కట్టుబాటు, దీక్ష. అకుంఠిత దీక్ష కావాలి. అది ఉందా? ఒక్కో మరణానికి కన్నీటి బిందువునైనా ఇచ్చుకున్నామా? క్రికెట్ మైదానంలో ఓ రెండు క్షణాలు నిలబడితే చాలా? కోట్ల కోట్ల వ్యాపారం కోసం, ప్రచారం కోసం మౌనమే సరిపోతుందా? ఒక్కో ప్రాణానికి, ఒక్కో సైనికుడి జీవనానికి డబ్బు ఇచ్చే దమ్ముందా?రాజ్యాంగాన్ని మార్చుకున్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలితం చేశారు. అంటే జరిగినదానికి రాష్ట్ర బాధ్యత లేదు, కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. టూరిస్టులయిన మామూలు మనుషుల్ని టెర్రరిస్టులకు బలిచేసిన ప్రభుత్వానికి బాధ్యత లేదా? పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు, మరికొన్ని భూభాగాలతో అఖండ భారత్ అనే నినాదాలు చేసే పెద్దలు... పక్కనున్న టెర్రరిస్టులు, మన నేల మీద మన వారిని చంపేస్తుంటే ఏం చేస్తున్నట్టు? పదేళ్ల ముందు దద్దమ్మలని పాత పాలకులను తిట్టి పోశాం. యూపీఏ చెత్త పరిపాలన వల్ల తీవ్రవాదులు జనాన్ని చంపేస్తున్నారన్నారు. మరి ఇప్పుడు 2025 దాకా ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహానాయకుడు అవసరం. ప్రతి సైనికుడిని ఒక శక్తిగా మార్చి, తుపాకీలు ఎక్కుపెట్టినట్టే మహా ధైర్యంగా, రాజకీయ నాయకులను కూడా ప్రశ్నించి, నిజం చెప్పి, వ్యూహం నేర్పి భారత దేశాన్ని గెలిపించిన (1971 ఇండో–పాక్ యుద్ధం) ఫీల్డ్ మార్షల్ మానెక్శా వంటి సైన్యాధిపతులు మనకు అవసరం. ఆ విధంగా మన దేశాన్ని గెలిపిద్దాం. తీవ్రవాదులను మట్టి కరిపిద్దాం. చెత్త రాజకీయాలు కాదు, మన కైలాస హిమాలయాలున్న మన కశ్మీర్ను గెలిపిద్దాం. మన రాజ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజనీతిని నిలబెడదాం.ప్రొ. మాడభూషి శ్రీధర్ మహీంద్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్ -
ఈ దేశాన్ని ఎన్ని ముక్కలు చేద్దామనీ!
సంవత్సరాల క్రితం, నేను హిందీ నవలా రచయిత కమలేశ్వర్ రాసిన ‘కిత్నే పాకిస్తాన్’ (ఎన్ని పాకిస్తాన్లు) – అనే నవల చదివాను. ఆయన భారతీయ సమాజపు విచ్ఛిన్నకరమైన, వివక్ష, అధికార దాహంతో కూడిన ధోరణులను విజయవంతంగా వ్యక్తపరిచారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా నుండి ప్రజలు వలస వెళ్ళిన నేపథ్యంలో.. ‘ధర్మిక విశ్వాసం’ ఆధారంగా ప్రజలను విభజించే మనస్తత్వాన్ని మనం ఎప్పుడు వదిలించుకోగలం అని మరోసారి అడగవలసిన అగత్యం ఏర్పడింది. మెజారిటీ వర్గంవారి మనుగడకు ప్రత్యేక హక్కులు ఉండే మెజారిటీవాదాన్ని... మెజారిటీ పాలన స్థానంలో ఉంచాలనుకుంటున్నారా? మనం ముర్షిదాబాద్తో ప్రారంభిద్దాం. భారత ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించిన తర్వాత చెలరేగిన అల్లర్లు, అక్కడి మైనారిటీ హిందువుల జీవితాలను దుర్భరంగా మార్చాయి. పరిస్థితి దారుణంగా ఉంది. బాధితుల కుటుంబం ఎదుర్కొన్న విచారణలను బట్టి దీనిని అర్థం చేసుకోవచ్చు. ఆ జిల్లాలోని జాఫరాబాద్ నగరానికి చెందిన టీ స్టాల్ యజమాని హృదయ్ దాస్, అతని కోడలు సుచరిత సర్కార్ జార్ఖండ్–పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో ఉండే రాజ్మహల్లో ఒక జాతీయ పత్రిక విలేకరికి తమ కథను వివరిస్తు న్నప్పుడు కూడా వారు భయంతో వణుకుతున్నారు. కన్నీళ్లు నిండిన వారి కళ్లలో... జరిగిన బీభత్సం ఛాయలు స్పష్టంగా కనిపించాయి. ఏప్రిల్ 12 ఉదయం ఇదంతా ప్రారంభమైందని వారు చెప్పారు. ప్రతి రోజులాగే, 170 దళిత కుటుంబాలు పనికి సిద్ధమవుతుండగా అకస్మాత్తుగా డజన్ల కొద్దీ సాయుధ వ్యక్తులు వారిపై దాడి చేశారు. వారు తాళం వేసిన ఇళ్లపై రాళ్ళు రువ్వారు. దాస్ దుకాణాన్ని ధ్వంసం చేశారు. కానీ అతను తన నివాసంలోనే ఇరుక్కుపోయాడు. తన ఇంటికప్పుపై రాళ్ళ వర్షం కురుస్తూనే ఉందనీ, వీధుల్లో ఉన్న ప్రజలను కొట్టారనీ దాస్ అన్నారు. అతని సోదరుడు హర్గోబింద్, మేనల్లుడు చందన్ దాక్కునేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆ గుంపు వారిని పట్టుకుంది. రాడ్లు, కర్రలు. కత్తులతో వారిపై దాడి చేసింది. ‘తిరిగి వచ్చే వారిని తుడిచి పెట్టేస్తామనే ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఆ గుంపు హెచ్చరించింది. ‘మిమ్మల్ని రక్షించే ధైర్యం పాలనా యంత్రాంగంలో ఎవరికి ఉందో చూద్దాం’ అనేది దాడి చేసినవారి మరో సవాల్.సుచరిత భయంతో వణుకుతూ, తాను ముర్షిదాబాద్కు ఎప్పటికీ తిరిగి రానని చెప్పింది. ముర్షిదాబాద్, 24 పరగణాలు, పరిసర జిల్లాల్లో చాలా మంది ఇలాంటి కథనాలను వివరించారు. బాధితులంతా తమను రక్షించడానికి పాలనా యంత్రాంగం ఎందుకు ముందుకు రాలేదన్న ఒకే ఒక సాధారణ ప్రశ్న అడుగు తున్నారు. ఇది చట్టబద్ధమైన ప్రశ్న. కానీ వారికి భద్రత కల్పించే బాధ్యత అప్పగించబడిన వారు రాజకీయాలలో బిజీగా ఉన్నారు. వాస్తవానికి, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలలో మతతత్త్వ మహమ్మారి చాలా సంవత్సరాలుగా విజృంభిస్తోంది. ఇప్పుడు, ఈ విభేదాలు బయటపడ్డాయంతే! రాష్ట్ర బీజేపీ నాయకుడు, ఒకప్పుడు మమతా బెనర్జీకి కీలక అనుయాయి అయిన సువేందు అధికారి, బెంగాల్లో ప్రబలంగా ఉన్న చట్టవిరుద్ధతను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోలేకపోతోందని పేర్కొంటూ, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపున ముర్షిదాబాద్ హింసాకాండ కొన్ని రాజకీయ పార్టీలతో కుమ్మక్కై కేంద్ర సంస్థలు చేసిన పని అని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ చిరకాల హింసాకాండలో నేరస్థులు, బాధితుల ముఖాలు మాత్రమే మారాయి. నాయకుల ప్రకటనలు మాత్రం అలాగే ఉన్నాయి.అందరూ బాధితులే!గత 50 సంవత్సరాలలో దేశంలో జరిగిన అన్ని ప్రధాన హింసాత్మక ఘటనలను సమీక్షిస్తే ఇది నిజమే సుమా అనిపిస్తుంది. 1970–80ల మధ్య, అస్సాంలో హిందీ మాట్లాడే ప్రజలపై జరిగిన దౌర్జన్యాలతో ఈ విద్వేషం ప్రారంభమైందనాలి. దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆ రాష్ట్రం నుండి పారిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో, ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా చాలా మంది హిందువులు పంజాబ్ను విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఇందిరా గాంధీ మరణం తరువాత జరిగిన అల్లర్లు సిక్కు సమాజాన్ని ధ్వంసం చేసి పడేశాయి. ఉత్తరప్రదేశ్లోని మాలియానా, బిహార్లోని భాగల్పూర్ ప్రత్యేకించి ముస్లింలకు చాలా కఠిన పరిస్థితులను తెచ్చిపెట్టాయి. అల్లర్ల తర్వాత భాగల్పూర్ నగరాన్ని విడిచిపెట్టిన పట్టు నేత కార్మికులు తిరిగి రాలేదు. 1990లలో కశ్మీరు పండిట్లు కశ్మీర్ లోయను వదిలి వెళ్ళవలసి వచ్చింది. ఈ దురదృష్టకర జాబితా సుదీర్ఘమెనది.21వ శతాబ్దం మొదటి రెండు దశాబ్దాలలో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. అయితే, గత సంవత్సరం మణిపుర్లో చెలరేగిన హింస మళ్ళీ పాత గాయాలను రేపింది. ఇక్కడ, నిర్వాసితులైన వారిలో ఎక్కువ మంది క్రైస్తవ సమాజానికి చెందినవారు. ఈ హింసాత్మకమైన సంక్లిష్ట సంఘటనలు హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులను ఒకేలా ప్రభావితం చేశాయి. కొన్ని సంఘటనలలో వారు నేరస్థులు, మరికొన్నింటిలో బాధితులు. మతం కంటే మెజారిటీవాదం కారణంగా వలసలు ఎక్కువగా జరిగాయి. అల్లర్లను ప్రేరేపించడానికి మత విశ్వాసం ఒక అనుకూలమైన సాధనం. సోషల్ మీడియా విస్తరణ ఇప్పటికే దిగజారుతున్న పరిస్థితిని క్లిష్టతరం చేస్తోంది. ఇది వేర్పాటువాదులు, పుకార్లు వ్యాప్తి చేసేవారు, దుష్ట శక్తులకు శక్తినిచ్చేదిగా సోషల్ మీడియా పనిచేసింది. మన రాజకీయ నాయకులు కూడా విభజనవాద పరిస్థితులను ఉపయోగించు కోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతారు. మతంతో పాటు, ప్రాంతీయ, భాషా వ్యత్యాసాలను ప్రజల మధ్య విభజనను రేకెత్తించడానికి ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోనే మరెన్ని దేశాలను సృష్టించాలనీ! -శశి శేఖర్ ‘ది హిందుస్థాన్ టైమ్స్’ సంపాదకుడు -
యువ సృష్టికర్తలకు ప్రోత్సాహం
వాణిజ్య సుంకాలు, స్టాక్ మార్కెట్ అస్థిరతలు ప్రపంచాన్ని వేధిస్తున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తూనే ఉంది. విస్తృత జనాభా, సాంకేతిక సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ, సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని ప్రపంచ ‘క్రియేటివ్ పవర్ హౌస్’గా తనను తాను నిరూపించుకునే సత్తా భారత్కుంది. కథలు చెప్పడంలో మనకున్న సామర్థ్యాన్ని ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్’ విజన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సృష్టికర్తలను (క్రియేటర్స్) లక్ష్యంగా చేసుకుని భారత మీడియా–వినోద (ఎం అండ్ ఇ) రంగం ముందుకు సాగుతోంది.చలనచిత్రం, సంగీతం, కళ, సాంకేతికత వంటి వివిధ రంగాలలో యువ సృష్టికర్తలకు భారత్ నిలయంగా ఉంది. ముఖ్యంగా ‘డ్యూన్–2’ సినిమా ఆస్కార్ గెలుపునకు కారణమైన అద్భుత వీఎఫ్ఎక్స్ను అందించిన విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ స్టూడియోగా నమిత్ మల్హోత్రాకు చెందిన ‘డీఎన్ఈజీ’ని చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచ వినోద పరిశ్రమలో భారత్ ప్రాబల్యాన్ని తెలియచెబుతూ భారత్కు 7వ ఆస్కార్ను తెచ్చిపెట్టింది. సంప్రదాయ ఫిల్మ్ మేకింగ్ నుంచి డిజిటల్ నిర్మాణానికి మళ్ళుతూ ప్రపంచ స్థాయి కంటెంట్ను రూపొందించడంలో భారత్ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.ముంబయి వేదికగా మే నెలలో భారత ప్రభుత్వం ‘ప్రపంచ ఆడియో–విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)– 2025’ను నిర్వహిస్తోంది. యువ సృష్టికర్తలను పరిశ్రమ దిగ్గజాల చెంతకు చేర్చడం, అంకుర సంస్థలను ప్రోత్సహించడం వేవ్స్లో భాగమైన వేవ్స్ ఎక్స్లెరేటర్ (వేవెక్స్) లక్ష్యం. యువ సృష్టికర్తలు అనుభవజ్ఞుల సలహాలు పొందేలా చూడటం, నిధుల లభ్యత, అంతర్జాతీయ అవకాశాలను అందించడం ద్వారా మీడియా, వినోద రంగాల్లో భారత అంకుర సంస్థల స్థాయిని పెంచడానికి వేవ్స్ కృషి చేస్తుంది. గేమింగ్, కృత్రిమ మేధ, మెటావర్స్ వంటి వినూత్న రంగాలపై దృష్టి సారిస్తూ... ఈ రంగం 2023లో రూ. 2,422 బిలియన్ల నుంచి 2027 నాటికి రూ.3,067 బిలియన్లకు పెరుగుతుందని అంచనా.కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, బ్రాహ్మణ్ గేమ్ స్టూడియోస్, కీబౌండ్, వాయన్ క్లౌడ్ వంటి అంకుర సంస్థలు ప్రపంచ పెట్టుబడిదారుల ముందు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేవ్స్ ఒక వేదికగా ఉపకరిస్తుంది. వీటిలో మీడియా – వినోద రంగ సామర్థ్యాన్ని చాటే ల్యాప్వింగ్ స్టూడియోస్, వైగర్ మీడియా వంటి మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అడుగు పెట్టడానికి ఒక పోటీతత్వ అంకుర సంస్థల వాతావరణాన్ని వేవ్స్ అందిస్తుంది. పెట్టుబడులు పొందడానికి, అంతర్జాతీయ అరంగేట్రంలో ఇబ్బందులను తప్పించడానికి, మెంటార్షిప్ అడ్డంకులకు ఒక పరిష్కార వేదికగా నిలుస్తుంది. కేవలం రూ.10,000 పెట్టుబడితో ఒక విజన్తో ‘బయోకాన్’ను ప్రారంభించిన నాకు ఇటువంటి ప్రోత్సాహక వేదికల ప్రాముఖ్యం ఏమిటో బాగా తెలుసు.క్రియేటివ్ హబ్ కళలంటే ఇష్టపడే నేను మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ ఫొటోగ్రఫీ (మ్యాప్), సై¯Œ ్స గ్యాలరీ బెంగళూరు కార్యక్రమాలకు నా సహకారాన్ని అందిస్తూ ఉంటాను. ఒక దేశ సంస్కృతి దాని కళలు, శాస్త్రాలతో ముడిపడి ఉందని బలంగా నమ్ముతాను. కళలు, విజ్ఞాన శాస్త్రం రెండూ సృజనాత్మకతలో భాగమే. కళాకారులు వేదికపై ప్రదర్శించే విధంగానే శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేస్తారు.కథలు చెప్పడంలో శతాబ్దాలుగా నైపుణ్యం కలిగిన భారత్... ప్రపంచ సృజనాత్మక శక్తిగా ఎదగడానికి గొప్ప అవకాశం ఉంది. శాస్త్రీయ నృత్యం నుంచి సినిమా వరకు; కామిక్స్ నుంచి ఇమ్మర్సివ్ టెక్నాలజీ వరకు, అధునాతన సృజనాత్మకత ఆవిష్కరణలతో ముడిపడి ఉన్న ఉత్తేజకరమైన యుగంలోకి ప్రవేశిస్తున్నాం. ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్’ అనే ఆలోచన ఈ ఆశయాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తుంది.సృజనాత్మక అంకుర సంస్థలకు ఉత్ప్రేరకంసాంకేతికత, కథ చెప్పడంలోని నైపుణ్యానికి వేవ్స్ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. యానిమేషన్, ఏఐ, ఏఆర్/వీఆర్, గేమింగ్, మెటావర్స్ వంటి వినూత్న రంగాల్లో అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వడం ద్వారా వేవెక్స్ తన ప్రాబల్యాన్ని చాటడానికి సిద్ధంగా ఉంది.వేవ్స్ బజార్లో 4,500కు పైగా అమ్మకందారులు, 5,900కి పైగా కొనుగోలుదారులు నమోదు చేసుకున్నారు. ఇది భారతీయ అంకుర సంస్థలను అంతర్జాతీయ సంస్థల చెంతకు చేర్చడం ద్వారా ప్రపంచ మీడియా, వినోద రంగాల్లో భారత్ పురోగమనాన్ని మరింత వేగవంతం చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సంప్రదాయ మీడియాకు మించిన ఆవిష్కరణలకు కూడా వేవ్స్ పెద్దపీట వేస్తుంది. కృత్రిమ మేధ ఆధారంగా తయారుచేసిన ప్రకటనల్లో ఎరుకానావిస్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు అగ్రగామిగా ఉన్నాయి. అదే సమయంలో యానిమేషన్, వీఆర్ ద్వారా అమేజ్ స్టూడియోస్, ఆఫ్లైన్ హ్యూమన్ స్టూడియోలు కథను చెప్పే విధానాన్ని పునర్నిర్వచిస్తున్నాయి. ఇన్స్కేప్ ఎక్స్ఆర్, విజన్ ఇంపాక్ట్ వంటి ఎడ్–టెక్ వెంచర్లు ఇమ్మర్సివ్ మీడియాతో నేర్చుకునే విధానంలో మార్పులు తెస్తున్నాయి.భవిష్యత్ దృక్కోణంమీడియా, వినోద రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి రూపొందించిన వేవ్స్ వంటి కార్యక్రమాలకు మద్దతునిచ్చే విషయంలో భారత ప్రభుత్వం నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం వేవ్స్ ద్వారా కేవలం అంకుర సంస్థల్లో పెట్టుబడి పెట్టడమే కాదు, కథను చెప్పే, స్వీయ–వ్యక్తీకరణ, భవిష్యత్తును నిర్వచించే సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలోనూ పెట్టుబడి పెడుతున్నాం. అది బయోటెక్ ల్యాబ్ కావొచ్చు, డిజిటల్ స్టూడియో కావొచ్చు... సృజనాత్మకత అనేది రేపటి పరిశ్రమలు, గుర్తింపులను రూపొందించే ఒక సాధనం.వేవ్స్–2025 భారతదేశపు మీడియా, వినోద పరిశ్రమలకు సంబంధించిన వేడుకే కాదు... ఇప్పటి వినోదం, విద్య, సంస్కృతుల్లో సమూల మార్పులు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రపంచంలో తదుపరితరం సృష్టికర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిచయ వేదిక.ఈ ప్రయాణంలో వేవ్స్ సలహా సంఘంలో నేనూ ఒక సభ్యురాలైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. ప్రపంచ సృజనాత్మక విప్లవానికి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధమవుతున్న క్షణమిది. ‘భారత్లో సృష్టిద్దాం– ప్రపంచం కోసం సృష్టిద్దాం’ అంటూ అనంత కాల్పనిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేద్దాం.-వ్యాసకర్త బయోకాన్ గ్రూప్ చైర్ పర్సన్-కిరణ్ మజుందార్ షా -
Maoists Peace Talks ఇరువురి అజెండా ఒకటవ్వాలి!
వామపక్ష తీవ్రవాదమైన నక్సలిజాన్ని 2026 మార్చి నాటికి సమూలంగా అంతం చెయ్యాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా హోం మంత్రి అమిత్ షా ప్రకటించి, ఆ లక్ష్యం నెర వేరేలాగా పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. సాధార ణంగా బీజేపీ ప్రతిపాదిత విధా నాలను వ్యతిరేకించడమే విధానంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు నక్సలిజంపై యుద్ధం విషయంలో మాత్రం అమిత్ షా కి అనుకూలంగా ఉన్నాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరయి విజయన్లు కూడా మావోయిస్టుల ఏరివేతలో తాము భాగస్వాములేనని ప్రకటించారు. దాదాపుగా జాతీయ ఏకాభిప్రాయంతో మావోయిస్టుల ఏరివేత జరుగుతున్నదనేది వాస్తవం. వేల సంఖ్యలో ఉన్న పారామిలిటరీ బలగాలను ఎదుర్కోవటం మావో యిస్టులకు కుదరడం లేదు. ఈ స్థితిలో మావోయిస్టులు తెల్ల జెండా ఎత్తి లొంగిపోకుండా మేము చర్చలకు సిద్ధం అని ప్రకటించారు. అయితే ఈ చర్చల ప్రకటన కొత్తదేమీ కాదు. నక్స లిజం పుట్టిన తర్వాత చర్చల ప్రస్తావన ఒకసారి కన్నా ఎక్కువ సార్లే వచ్చింది. 2004లో ఆంధ్ర ప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చర్చలు జరిపినా అవి విఫల మయ్యాయి. ముందుగా ఆయుధాలు, అడవులను వదిలి బయటకు రావాలని ప్రభుత్వం చర్చలకు నిబంధన పెడితే... రక్షణ బలగాలను ముందుగా ఉపసంహ రించుకోండి అంటున్నారు మావోయిస్టులు. చుట్టు ముట్టిన ప్రతిసారీ చర్చల ప్రతిపాదన పెట్టి కొత్త స్థావరాలను సృష్టించుకున్నారు మావోయిస్టులు అనేది ప్రభుత్వ వర్గాల వాదన. చర్చల పేరుతో బయటకు రప్పించి తమ ఆనవాళ్ళను తెలుసుకుని దాడులుపెంచుతున్నారనేది మావోయిస్టుల ఆరోపణ. ఎవరి వాదనలు ఎలా ఉన్నా అడవుల్లో పోరాటం సాగుతున్నది. మావోయిస్టులు, భద్రతా దళాల సభ్యులు నేలకొరుగుతున్నారు. కొత్త తరం మావో యిజం పట్ల ఆకర్షించబడటం లేదు. అడవిబాట పట్టి తమ జీవితాలను వృథా చేసుకునే ఆలోచన నేటి యువతకు లేదు. అయినా కొందరు యువకులు మావోయిస్టులుగా మారుతున్నారంటే వారి గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న పెత్తందారీ వ్యవస్థలో బలిపశు వులు కావటమే. అలాంటి పెద్దలను వ్యక్తిగా వ్యతిరేకించలేక, పోరాడే మార్గం కనబడక నక్సల్స్ సహాయం కోసం అడవుల్లోకి వెళుతున్నారు. తమ వ్యక్తిగత కక్షను నక్సల్స్ ద్వారా తీర్చుకున్న తర్వాత వారికి ఆ ఉద్యమంతో అవసరం లేదు. కానీ అప్పటికే పోలీసులు లిస్టులోకి ఎక్కి ఉన్న ఆ యువతీయువకులు అడవులు, ఆయుధాలను వదలలేక అక్కడే ఉంటున్నారు. ఇటీవల కాలంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వస్తున్న మావోయిస్టుల కథలు ఇటువంటివే. నక్సల్ ఉద్యమం పుట్టిన నాటికి ఉన్న సామాజిక పరిస్థితులు నేడు లేవు. భూమి మీద పెత్తనం బడా భూస్వాముల చేతిలో లేదు. పలు రాష్ట్రాలలో అమలైన భూసంస్కరణలు కేంద్రం, రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చాల వరకు మార్పును తెచ్చాయి. ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. జీతాలు పెరిగాయి. యువతలో సైద్ధాంతిక రాద్ధాంతం కన్నా కెరీర్ ముఖ్యం అనే అభిప్రాయం పెరిగింది. అందుకే నక్సల్ ఉద్యమంవైపు కొత్తవారు వెళ్లడం లేదు. ఒకనాటి సైద్ధాంతిక నేతలు వయసుమళ్లి మరణించారు. కొందరు అనారో గ్యంతో చివరి దశకి చేరారు. బయటి సమాజంలోఉండే అవలక్షణాలు అడవుల్లోని మావోయిస్టుల్లోనూ ఉన్నాయి. శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ, కుల అహంకా రాలు, అధికారాలు ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు మాజీ మావోయిస్టుల నోటి వెంట వచ్చాయి. మరోవైపు నవీన ఆయుధాలు, సాంకేతికతను భద్రతా బలగాలు ప్రయోగిస్తున్నాయి. అడవిలో ఏ మూల నక్కిన నక్సలైట్నైనా పట్టకలిగిన సాంకేతికత వచ్చింది. గురిచూసి వారిని చంపేసే డ్రోన్స్ వచ్చాయి. ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లో రహదారులు, ఆసు పత్రులు, పాఠశాలలను నిర్మించారు. కమ్యూనికేషన్ టవర్లు, బ్యాంకులు ఏర్పాటు చేశారు. అభివృద్ధి ఫలా లను గిరిజనులు అనుభవించి, మావోయిస్టులకు మద్దతు తగ్గించారు. ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో గిరిజనులు 2024 ఎన్నికల్లో భారీగా ఓటింగ్లో పాల్గొనడం అందుకు నిదర్శనం. చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికిఅయితే ప్రభుత్వ అభివృద్ధి నమూనాను మావో యిస్టులు తిరస్కరిస్తున్నారు. అటవీ, ఖనిజ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు, ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూ అభివృద్ధి ముసుగులో దోచుకుంటున్నారు అనేది వారి ఆరోపణ. రహదారులనిర్మాణం, గనుల ఏర్పాటుకు, ముడి సరుకు రవాణాకు తప్పించి ఆ ప్రాంత అభివృద్ధికి పనికి రాదన్నది మావోయిస్టుల మాట. ఎవరి వాదన వారిది. వాస్తవం ఆ రెండింటి మధ్యలో ఎక్కడో ఉంటుంది. గిరిజనుల జీవితాలు మెరుగవ్వాలంటే వారిని నలిపేస్తున్న ఇరుపక్షాలలోనూ మార్పులు రావాలి. ముందుగా ప్రభుత్వం సమాజంలో ఉన్న ఆర్థిక అవక తవకల తొలగింపునకు కూడా ఒక నిర్దిష్ట ప్రణాళికను ప్రకటించాలి. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఒక స్పష్ట యోజనను ప్రకటించాలి. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. అధికారంలో ఉన్నవారి ఆదరణతో పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల సంపద సమకూర్చుకున్నారు. అదే సమ యంలో సామాన్య వర్గాలు ఆర్థికంగా చితికి పోతు న్నాయి. అధిక ధరలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అధికార యంత్రాంగం అవినీతి పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నక్సల్స్ ఉద్యమం మళ్లీ బలపడుతుంది. అవినీతి, సామాజిక, ఆర్థిక అసమాన తలను తొలగించే విధానాల అమలు మాత్రమే ప్రజ లందరినీ ఏకం చేసి, సవ్య అభివృద్ధి అజెండాకి కట్టు బడి ఉండేలా చేస్తాయి. అడవి బాట పట్టినవారిదీ, అధి కారంలో ఉన్న వారిదీ ఒకే తరహా అజెండా కాగలిగితే ఘర్షణ వాతావరణం పోయి, సమాజం ప్రశాంతంగా ఉంటుంది.-పి. వేణుగోపాల్ రెడ్డి ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులుpvg2020@gmail.com -
హైబ్రిడ్ తీవ్రవాదం
ఉగ్రవాద కర్కశ దాడితో పహల్గామ్ ప్రశాంతత భగ్నమైంది. కశ్మీర్ లోయలో శాంతి ఇప్పటికీ దైవాధీనమే! శత్రువుల తుపాకులు ఎంత ప్రమాదకరమైనవో... ఉదాసీనత, తప్పుడు అంచనాలు కూడా అంతే ప్రమాదకరమైనవి. పౌరుల మీద కాదు, ఇండియా విశ్వసనీయత మీద జరిగిన దాడి ఇది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ దేశంలో పర్యటిస్తున్న సందర్భంలో దెబ్బ తీయడాన్ని ఇంకెలా భావించాలి? ఇదొక కొత్త రకం మిలిటెన్సీ. కశ్మీర్ వినూత్న విపత్తును ఎదుర్కొంటోంది. రమారమి 60 మంది విదేశీ ఉగ్రవాదులు కశ్మీర్ లోయలో మాటు వేసి ఉన్నారని నిఘా వర్గాల అంచనా. వీరిలో సగం మంది టీఆర్ఎఫ్ సంబంధీకులే. ఇది లష్కర్–ఎ–తోయిబాకు ముసుగు సంస్థ. ప్రపంచం కళ్లు గప్పేందుకు, స్థానిక సంస్థగా మభ్యపెట్టే పేరుతో వ్యవహారం నడిపిస్తోంది. భౌతిక గస్తీ కీలకంటీఆర్ఎఫ్ తదితర గ్రూపులు హైబ్రిడ్ తీవ్రవాదాన్ని అవలంబిస్తున్నాయి. అందుకే ఇవి మరింత ప్రమాదకరమైనవి. తుపాకుల వంటి మారణాయు ధాలలో శిక్షణ పొంది, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అధీన రేఖ దాటి వచ్చే దుండగులపై ఈ కొత్త తరహా ఉగ్రసంస్థలు ఆధార పడవు. బదులుగా స్థానికులనే ‘రాడికలైజ్’ చేసి వారిని ఉపయోగించు కుంటాయి. వీరికి పిస్టల్స్ లేదా గ్రనేడ్స్ సమకూరుస్తాయి. వీటితో లక్ష్యాలపై దాడి చేసి వెంటనే జనంలో కలిసిపోతారు. వీరు రెండోసారి మళ్లీ దాడులకు పాల్పడరు. కాబట్టి ఎలాంటి డిజిటల్ ఆధారాలూ ఉండవు. దాడులూ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి. కాబట్టి ‘సెక్యూరిటీ గ్రిడ్స్’ పసి గట్టలేవు. సంప్రదాయ నిఘా, పోలీసు వ్యవస్థలను ముప్పుతిప్పలు పెట్టే రహస్య తీవ్రవాదం ఇది. నిజానికి వాన్స్ వంటి హైప్రొఫైల్ వ్యక్తులు పర్యటనకు వచ్చినప్పడు అన్ని సున్నిత ప్రాంతాలపై నిఘా పకడ్బందీగా ఉండాలి. అలా జరగలేదు. ముప్పు అవకాశాల మదింపు, ముందస్తుగా బలగాల మోహరింపు వంటి చర్యలు తీసుకోవ డంలో మునుపటి క్రియాశీలత్వం కొరవడింది. ప్రాంతాల వారీగా ముమ్మర గస్తీ నిర్వహించే విధానం సడలిపోయింది. మరీ ముఖ్యంగా 24/7 ఎలక్ట్రానిక్ నిఘా కింద లేని ప్రాంతాల్లో ఈ ఉదాసీనత ఆందోళనకరమైన విషయం. డ్రోన్ సమాచారం, జియో ఫెన్సింగ్ ఏర్పాటు పర్వత మార్గాల భద్రతకు చాలవు. పర్వత ప్రాంతాల్లో భౌతిక గస్తీకి ప్రత్యామ్నాయం లేదు. డ్రోన్లు స్కాన్ చేస్తాయి, కెమెరాలు రికార్డు చేస్తాయి, సమాచార నిఘా వ్యవ స్థలు హెచ్చరిస్తా్తయి. కాదనలేం. కానీ క్షేత్రస్థా యిలో భౌతిక ఉనికి, అంతర్దృష్టికి ఇవి ప్రత్యా మ్నాయం కావు.స్థానిక నిఘా వ్యవస్థవిద్రోహ నిరోధక వ్యవస్థను తక్షణం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దుర్ఘటనను ప్రతిఘ టించడం కాకుండా ముందుగానే దాన్ని అరికట్టే దిశగా మార్పు రావాలి. ఇందులో భాగంగా శాశ్వత గస్తీ యూనిట్లు, రొటేషనల్ నిఘా బృందాలు ఏర్పాటు చేయాలి. ఈ సందర్భంగా, చురుకైన కౌంటర్ ఇంటెలిజన్స్ గ్రిడ్ (సీఐ గ్రిడ్) చాలా ముఖ్యమైంది. ఉరి, పుల్వామా దాడుల అనంతరం చురుగ్గా పనిచేసి ప్రశంసలు పొందిన ఈ గ్రిడ్ ఇప్పుడు బలహీనపడినట్లు ఉంది. దీనిపై ఎలాంటి రాజకీయ సంకోచాలూ లేకుండా కఠినమైన సమీక్ష జరగాలి. స్థానికుల సాయంతో నిఘా పెట్టే వ్యవస్థ ఎప్పుడో విచ్ఛిన్నమైంది. దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుస్తోంది. హైబ్రిడ్ టెర్రరిస్టులు సంప్రదాయ ఉగ్రవాద నెట్ వర్క్ల నుంచి వచ్చిన వారు కారు. వారి నియామకాలు స్వల్పకాలానికి పరిమితమై ఉంటాయి. తరచూ ఆన్లైన్లోనే జరిగిపోతుంటాయి. వారికి వన్ టైమ్ ప్రాతిపదికన విద్రోహ లక్ష్యాలు అప్పగిస్తారు. ఉగ్రవాద స్థావ రాల్లో తల దాచుకోరు. కోడెడ్ ఫోన్ కాల్స్ చేయరు. కాబట్టి, లోతైన రియల్ టైమ్ నిఘా అవసరమ వుతుంది. మొహల్లాలు, స్కూళ్లు, మదర్సాలు, మార్కెట్ల నుంచి గుట్టుగా సమాచారం రాబట్టాలి. టెక్నా లజీకి దాని ప్రాధాన్యం దానికి ఉంటుంది. అయితే, కశ్మీర్ పరోక్ష యుద్ధం (షాడో వార్)లో స్థానికుల నుంచి సమాచారం రాబట్టే నిఘా వ్యవస్థను మరే ఇతర వ్యవస్థా భర్తీ చేయలేదు. స్థానిక ఇన్ఫార్మర్ల విశ్వాసం చూరగొనడం, లోప్రొఫైల్ క్షేత్రస్థాయి ఏజెంట్లను ఉపయోగించడం తప్పనిసరి. ఉగ్రవాద వ్యూహాల ముందస్తు గుర్తింపునకు ఈ వ్యూహం వెన్నెముక లాంటిది.నిర్మొహమాటంగా మాట్లాడుకుందాం. ‘అమన్ కీ ఆశా’ (శాంతి కోసం ఆశ) నినాదం ప్రస్తుతానికి అటకెక్కుతుంది. కశ్మీర్ లోయలో ఇటీవలి సంవత్సరాల్లో పర్యాటకం అద్భుతంగా పుంజుకుంది. దేశీయ, విదేశీయ పర్యాటకులు కలిసి 2023లో రెండు కోట్లు దాటారు. కశ్మీర్ ప్రజల్లో తిరిగి ఆశలు చిగురించాయి. ఇప్పుడవి చెదిరిపోయాయి. పర్యాటకులు బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారు. హోటళ్లు, హౌస్ బోట్లలో ఖాళీ రూములు దర్శనమిస్తున్నాయి. కశ్మీరీల ఆర్థిక నష్టం భారీగా ఉంటుంది. అయితే, కౌంటర్ – టెర్రర్ కార్యకలాపాలతో సాధారణ ప్రజల్ని దూరం చేసుకోకూడదు. ఉగ్రవాదంపై పోరాటానికీ, వర్గాలను తూలనాడటానికీ మధ్య ఉండే రేఖను దాటకూడదు. కశ్మీరీలు విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదం, రాజకీయ అనిశ్చితి... ఈ రెండింటి బాధితులు.కశ్మీర్లో నాయకత్వం అలంకారప్రాయంగా కాకుండా క్రియాశీలం కావాలి. జాతీయ భద్రత బాధ్య తను ఎవరికైతే అప్పగించారో వారు ఫలితాలు చూపెట్టాలి. లేదా వైదొలిగి సమర్థులకు అవకాశం ఇవ్వాలి. ఈ వేసవి తీవ్రత కశ్మీర్లో ఎక్కువగానే ఉంటుంది. కర్ఫ్యూలు, సోదాలు, ఉద్రిక్తతలు పునరావృతం కావచ్చు. స్థానికుల పట్టువిడుపులకు, భారత ప్రభుత్వ రాజనీతికి ఇది పరీక్ష లాంటిది. ఒకవంక దేశ సరిహద్దులో శత్రువుతో పోరాడుతూ, మరోవంక దేశం లోపల భారతీయత భావనను పరిరక్షించు కోవాలి. ఇండియా అంతర్గత శాంతిని ఎవరూ తుపాకీతో శాసించలేరని రుజువు చేసుకోవడానికి మనం సుదీర్ఘ ప్రయాణమే చేయాలి.మనోజ్ కె. చన్నన్ వ్యాసకర్త భారత సైన్యంలో లెఫ్ట్నెంట్ కల్నల్ (రిటైర్డ్) -
ఆ హామీ ఏమైంది?
కశ్మీర్లో శాంతి ప్రక్రియ తన నాయకత్వంలో సాధారణ స్థితికి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ గత కొంతకాలంగా పలు సందర్భాల్లో ప్రకటిస్తూ వచ్చారు. కశ్మీర్కు శాంతిని తెస్తానన్నది జమ్ము–కశ్మీర్ విషయంలో మోదీ ఇచ్చిన ప్రధానమైన హామీ. కానీ ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి, ప్రధాని ఎంత పొరబడ్డారో చూపించింది. పౌరులపై ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇది. ఇందులో 26 మంది పర్యాటకులు నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ఈ దాడి ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీర్ఘకాల వేదనలను పరిష్కరించనప్పుడు అవి ఏదో ఒక రూపంలో బయటపడతాయి. తగ్గని ఉగ్రచర్యలుఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మోదీ, అమిత్ షా ద్వయం పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం ద్వారానే దాని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కానీ అది జరగలేదని తాజా ఉగ్రదాడి తేల్చి చెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ఈ నేపథ్యంలో తన సౌదీ పర్యటన నుండి అర్ధంతరంగా వెనుదిరిగిన మోదీ యథాప్రకారం కశ్మీర్ లోయలో హింసను ఖండించారు. ఆ ఘటన వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోమని హెచ్చరించారు. మరో వైపున పహల్గామ్ దాడి ఇటీవలి కాలంలో పౌరులపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అభివర్ణించారు. దీనికి ప్రతిస్పందన అన్నట్లుగా, ముస్లింలు అధికంగా ఉన్న కశ్మీర్లోని పాఠశాలలు, దుకాణాలను మూసి వేశారు. పహల్ గామ్ దాడి చెదురుమదురు ఘటన కానే కాదు. లోయలో ఉగ్రవాద చర్యలు ఎన్నడూ తగ్గు ముఖం పట్టలేదని సూచిస్తూ ఇటీ వల పలు హింసా ఘటనలు జరుగుతూ వచ్చాయి. కానీ అవి పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. 2019లో కశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కశ్మీర్లో హింసా కాండను అంతం చేయడమే ప్రత్యేక హోదా రద్దుకు కారణం అని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. దాని కొనసాగింపుగానే గత ఫిబ్రవరి 24న అమిత్ షా ఒక ప్రకటన చేస్తూ జమ్మూ కశ్మీర్లో ఏర్పడిన శాంతిని శాశ్వత శాంతిగా మార్చాలి అన్నారు. అయితే కశ్మీర్ రాజధాని శ్రీనగర్కు తూర్పున 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గామ్ ఉగ్రదాడి ఆ రాష్ట్రంలో శాశ్వత శాంతి ఇంకా ఏర్పడలేదని స్పష్టంగా చూపించింది.ఈ ఘటనకు తామే కారణమని లష్కర్–ఎ–తోయిబా అనుబంధ సంస్థ ఇప్పటికే ప్రకటించుకుంది. ఈ ప్రకటనలోని నిజానిజాలు వెంటనే తేలకపోయినా, ఈ దాడి భారత, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు. పర్యాటకుల ప్రాణనష్టం పట్ల పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, పాక్ ప్రభుత్వానికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దాడికి ప్రతిగా పాకిస్తాన్తో దశాబ్దాల క్రితం కుదుర్చుకున్న సింధూజలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత ప్రభుత్వం, ఆ దేశంతో దౌత్య సంబంధాలను తగ్గించడానికి పూనుకుంది.బలహీనమైన కశ్మీర్కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసమే ఆ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని రద్దుచేసినట్లు మోదీ తమ ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. కానీ కశ్మీర్ భూభాగంలో పెట్టుబడులు నేటికీ పరిమితంగానే ఉన్నాయన్నది గ్రహించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, మోదీ పదవీకాలంలో కశ్మీరీలు మరింత బలహీనంగా మారారు. లక్షలాది మంది సైనికులు కాపలా కాస్తున్న ఈ ప్రాంతంలో హిందువులు స్థిర నివాసం ఏర్పర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కశ్మీర్ లోయ జనాభా దామాషాను మార్చే ఈ లక్ష్యాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. బయటి జనాభా లోయలోకి వస్తే తమ ఉద్యోగాలు, భూయాజమాన్య హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు భీతిల్లుతున్నారు. అదే సమయంలో నిరంతర దర్యాప్తులు, అణచివేత విధానాల మధ్యనే వారు జీవిస్తున్నారు. విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయకుండా ఉండటానికి, భారత ప్రభుత్వం కఠినమైన ప్రయాణ నిషేధాలను, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద ఏకపక్ష నిర్బంధాలను ఉపయోగిస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గతేడాది కశ్మీర్ ఎన్నికల సందర్భంలో పేర్కొంది.ఈ ఉగ్రదాడి, చాలా కాలంగా నలుగుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభు త్వానికి అవకాశాన్నిస్తోంది. నిజానికి మోదీ మొదటి ఉద్దేశ్యం ఈ ప్రాంతాన్ని మరింతగా దిగ్బంధించడమే. అలా చేస్తే అది పొరపాటవుతుంది. 2019లో భారత ప్రభుత్వం విధించిన అన్ని ఆంక్షలూ... ఇంటర్నెట్ సేవలను దీర్ఘకాలికంగా నిలిపివేయడం, రాజకీయ నేతలను నిర్బంధించడంతో పాటు లాక్డౌన్ని కఠినంగా అమలు చేయడం వంటివి ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని రేపాయి. ఆ చర్యలను క్రమంగా ఎత్తివేశారు, అయినా నష్టం జరిగిపోయింది. మరోపక్క ప్రధాన స్రవంతిలో, సోషల్ మీడి యాలో అదుపు లేకుండా ముస్లిం వ్యతిరేక భావన కొనసాగుతోంది. మోదీ దాన్ని చూసీచూడనట్టు వదిలే యాలని భావిస్తే కష్టమే. భారతీయులందరికీ నాయకుడిగా ఆయన వ్యవహరించాలి. సంయమనం పాటించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వాలి. ఇప్పటికే ప్రతీకారదాడి అంటూ భావోద్వేగాలతో జనం ఊగిపోతున్నారు. ఆచితూచి వ్యవహరించడమే అంతర్జాతీయంగా ముఖ్యమని గ్రహించాలి.కరిష్మా వాస్వానీ వ్యాసకర్త ఆసియా వ్యవహారాల నిపుణురాలు -
అతి జాప్యంతో అదృశ్యమైన న్యాయం!
ఇటీవల ఒక న్యాయ, చట్ట సంబంధమైన వార్తల వెబ్ సైట్లో ఒక ఆశ్చర్యకరమైన వార్తా కథనం కనబడింది. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ల ధర్మాసనం ముందు, తన కక్షిదారు చనిపోయాడనీ, ఆ కేసులో నిందితులుగా ఉన్న ఇరవై ఆరు మందీ చనిపోయారనీ ఒక న్యాయవాది చెప్పారు. అవి ప్రతీకార హత్యలేమీ కావు, సహజ మరణాలు. ఈ దేశంలో సామాజిక వ్యవస్థ గురించీ, న్యాయవ్యవస్థ గురించీ ఎన్నో పాఠాలు చెప్పగల నేరమూ–శిక్షా కథ ఇది.బిహార్ లోని అర్వాల్ జిల్లా లక్ష్మణ్ పూర్ బాతే అనే గ్రామంలో 1997 డిసెంబర్ 1న నరసంహారం జరిగింది. రాజధాని పట్నాకు తొంభై కి.మీ. దూరంలో సోన్ నదీ తీరగ్రామం లక్ష్మణ్ పూర్ బాతే. అప్పుడు ఆ ప్రాంతంలో ఎన్నో అరాచకాలకూ, హత్యాకాండలకూ పాల్పడిన రణ వీర్ సేన అనే అగ్రవర్ణాల సేన ఆ గ్రామంలోని దళితుల ఇళ్ల మీద దాడి చేసి చిన్నారి పిల్లలు, స్త్రీలతో సహా 58 మందిని ఊచకోత కోసింది. హతులలో ఒక ఏడాది పసిపాప, ఒక గర్భిణి కూడా ఉన్నారు. నదికి అవతలి ఒడ్డు నుంచి రాత్రి పదకొండు గంటలకు పడవలలో వచ్చి దళిత వాడలో ఇళ్ల తలుపులు విరగ్గొట్టి, లోపలికి చొరబడి, పడుకున్నవాళ్లను పడుకున్నట్టే కాల్చి చంపారు. మూడు గంటల పాటు జరిగిన మారణకాండలో యువతుల మీద అత్యాచారాలు చేసి చంపేశారు. తర్వాత అక్కడికి వెళ్లిన పోలీసులకు అత్యాచారానికి గురైన ఐదుగురు బాలికల నగ్న మృతదేహాలు కనిపించాయి. ఈ నరసంహారం సాగించి, తిరిగి అదే పడవలలో నది దాటిన హంతకులు సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి తమను నది దాటించిన ఇద్దరు పడవవాళ్ల గొంతులు కోసి చంపేశారు.అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ‘దేశానికి సిగ్గు చేటు’ అని అభివర్ణించిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది. ఈ మారణకాండ కారణాలు, పూర్వరంగం ఏమైనప్పటికీ, తర్వాత జరిగిన న్యాయ విచారణా ప్రక్రియ ఆశ్చర్యకరమైన మలుపులు తిరిగింది. జహానాబాద్ జిల్లా సెషన్స్ కోర్టులో జరగవలసిన ఈ విచారణను పట్నా హైకోర్టు ఆదేశాల మేరకు 1999 అక్టో బర్లో పట్నాకు బదిలీ చేశారు. తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత 2008 డిసెంబర్లో 46 మంది రణవీర్ సేన కార్యకర్తల మీద నేరారోపణలు నమోద య్యాయి. రెండు సంవత్సరాల తర్వాత 2010 ఏప్రిల్ 7న పట్నా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి విజయ్ ప్రకాష్ మిశ్రా నిందితులలో 16 మందికి మరణశిక్ష, 10 మందికి యావ జ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ హత్యాకాండ ‘పౌర సమాజం మీద మచ్చ’ అనీ, ‘పాశవికత్వంలో అరుదైన వాటిలోకెల్లా అరుదైనది’ అనీ తీర్పులో రాశారు. శిక్షితులు అప్పీలుకు వెళ్లగా పట్నా హైకోర్టు జస్టిస్ వీఎన్ సిన్హా, జస్టిస్ ఏకే లాల్ ద్విసభ్య ‘ధర్మాసనం’ 2013 అక్టోబర్ 9న ‘సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా’ శిక్షలన్నిటినీ కొట్టివేసింది. ఇంత అన్యాయమైన హైకోర్టు తీర్పు వార్త ప్రధాన స్రవంతి పత్రికలకు పట్టనే లేదు. యాభై ఎనిమిది మందిని హత్య చేసి, కింది కోర్టులో నేరం రుజువై తీవ్రమైన శిక్షలు కూడా పడిన నేరస్థులను, అలా సాక్ష్యాధారాలు లేవంటూ వదిలివేసిన దుర్మార్గమైన వార్త కన్నా ఆ రోజే క్రికెట్ నుంచి విరమించుకుంటున్నానని సచిన్ టెండూల్కర్ చేసిన ప్రకటన పెద్ద వార్త అయింది! హైకోర్టు తీర్పును బిహార్ ప్రభుత్వమూ, బిహార్లోని రాజకీయ పార్టీలన్నీ తప్పు పట్టాయి. ఈ తీర్పును ఎంత మాత్రమూ అంగీకరించడానికి వీలు లేదని, తీర్పును సమీక్షించమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని బిహార్ రాజకీయ పార్టీలు కోరాయి.పట్నా హైకోర్టు తీర్పును సమీక్షించి, కొట్టివేయాలని, మారణకాండ దోషులకు కఠిన శిక్షలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2013 డిసెంబర్లో సుప్రీంకోర్టును అభ్యర్థించింది. 2014 జనవరి 13న సుప్రీంకోర్టు కేసు నమోదు చేసుకుని నోటీసులు పంపింది. నాలుగు సంవత్సరాల తర్వాత 2018, 2019లలో కాస్త విచారణ జరిగి, కేసు మౌలిక దస్తావేజులు, అదనపు పత్రాలు పంపమని కింది కోర్టులను ఆదేశించడంలోనే సమయం గడిచిపోయింది. 2023 ఒక్క సంవత్సరంలోనే ఎటువంటి వాదనలు, విచా రణ జరగకుండా ఆరుసార్లు వాయిదాలు పడ్డాయి. ఈ మధ్యలో కొందరు నిందితులు మరణించారని న్యాయ వాదులు సుప్రీంకోర్టు దృష్టికి తెస్తూనే ఉన్నారు. 2025 జనవరి 1 నాటికి ఇరవై ఆరు మందిలో ఐదుగురు మర ణించారని నమోదయింది. పన్నెండేళ్లుగా వాయిదాలు పడుతూ నత్తనడకలతో సాగుతూ సాగుతూ వచ్చిన ఆ కేసులో 2025 ఏప్రిల్ 3న ఒక నిందితుడి తరఫున వాది స్తున్న న్యాయవాది ‘ఇరవై ఆరు మంది నిందితులూ మరణించారని ధర్మాసనానికి తెలియజేస్తున్నాం’ అన్నారు. వాస్తవ స్థితి ఏమిటో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనం కేసును మళ్లీ వాయిదా వేసింది. ఆలస్యం చేయడమంటే న్యాయాన్ని నిరాకరించినట్టే అనే నానుడిని నిజం చేస్తూ మన న్యాయవ్యవస్థ సాచివేత ద్వారా న్యాయాన్ని నిరాకరిస్తున్న తీరు ఇది! ఇప్పుడు నడుస్తున్న మందకొడి వేగంతోనే నేర విచారణలు సాగుతూ పోతే దేశంలో ఆ నాటికి న్యాయస్థానాలలో పెండింగ్లో ఉన్న కేసులన్నీ పూర్తి కావడానికి 324 సంవ త్సరాలు పడుతుందని 2018లో నీతి ఆయోగ్ ఒక వ్యూహ పత్రంలో నిర్ధారించింది. ఆ నాటికి దేశం మొత్తం మీద పెండింగ్లో ఉన్న కేసులు రెండు కోట్ల తొంబై లక్షలు కాగా, 2025 జనవరి నాటికి ఆ సంఖ్య ఐదు కోట్ల ఇరవై లక్షలకు చేరింది. నీతి ఆయోగ్ అంచనా ప్రకారమే చూస్తే, ప్రస్తుత పెండింగ్ కేసులు పూర్తి కావడానికి 580 సంవ త్సరాలు పడుతుంది!! అప్పటికి వాదులూ ఉండరు, ప్రతి వాదులూ ఉండరు. అటు, ఇటు వాదించే న్యాయ వాదులూ ఉండరు! న్యాయం ఉంటుందా?ఎన్. వేణుగోపాల్ సీనియర్ జర్నలిస్ట్ -
నాడు క్షీరధార! నేడు కన్నీటి వరద!
సర్వదేవ మయే దేవీ–సర్వ దేవా రలంకృతా మామాభిలషితం కర్మ–సఫలం కురు నందినీ ఇది హిందువులు చేసే గోప్రార్థన. ‘సర్వ దేవతా స్వరూపిణీ! సర్వదేవతలచే అలంక రింపబడినదానా! ఓ నందినీ! నా కోరికలను సఫలం చేయి’ అని అర్థం. కేవలం గోవును పూజిస్తే సమస్త దేవత లను పూజించిన ఫలం దక్కుతుందని పెద్దల వాక్కు. ఇది వేదం నుంచి వచ్చిన సంప్ర దాయం, నమ్మకం. హిందువులకు ఆవు ఓ జంతువు కాదు, అభీష్టా లను నెరవేర్చే దైవ స్వరూపం. ఆకలి తీర్చే అన్నపూర్ణ. హిందూ ధర్మానికి వేదం మూలం. వేదం నుంచి యజ్ఞం వచ్చింది. యజ్ఞం వల్ల వర్షం కురుస్తుంది. మానవాళి ఆకలి తీరుతుంది. ఆ యజ్ఞపు అగ్నిహోత్రానికి ఘృతాన్ని (నెయ్యి) సమర్పించాలి. యజ్ఞానికి ఆవు నెయ్యి తప్ప ఇతరాలు సమర్పించరు. గోవు అనే పదానికి సూర్యుడు, యజ్ఞము, భూమి, నీరు, స్వర్గం... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. ‘‘గవా మంగేషు తిష్ఠంతి/ భువవాని చతుర్దశ’’ గోవు శరీర భాగాలలో పదునాలుగు భువనాలు ఉంటాయట. అంటే సమస్త సృష్టికి మూలం గోవు. గోవు అంత పవిత్రమైనది కాబట్టే దాని పేడ, పంచకాలను కూడా ఔషధాలకు ఉపయోగి స్తున్నాం. శాస్త్రం అంగీకరిస్తున్న సత్యం ఇది.పూర్వకాలంలో గోవులేని ఇల్లు వుండేది కాదు. ఎన్ని గోవులుంటే అంత సంపద వున్నట్లు. మహాభారతంలో విరాటరాజు గోవులను దుర్యోధనాదులు అపహరించటానికి పూనుకున్నది ఈ కారణం వల్లే! ఆవు నడయాడిన ప్రాంతంలో క్షేమం తప్ప, క్షామం ఉండదు. నూతన గృహప్రవేశ కాలంలో గోవును తీసుకువెళ్లేది ఇందుకే!శ్రీ మన్మహావిష్ణువు... గోపాలుడు, గోవిందుడు. గోకులంలో ఉండటం, గోవులను కాయడం ఆయనకు ఇష్టం. కాయడం అంటే కేవలం కాపలా కాదు, అన్ని విధాలా రక్షించడం! శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడన్నది మన నమ్మకం. నిజానికి ఆ స్వామికి నిత్య స్థానము గోలోకమట. అది వైకుంఠం కన్నా పైన ఉంటుందట.అందుకే గోవిందా అని పిలిస్తేనే ఆ స్వామికి ఇష్టం. నవనీత చోరుడు కదా! నేటికీ తిరుమలలో శ్రీవారికి నవనీత నివేదన జరుగుతూనే ఉంది. గోహృదయం తెలిసిన వైఎస్ ఆ శ్రీవారి సన్నిధానంలో గోవులకు ఆస్థానం ఉండాలని 1956లో డైరీ ఫారం పేరుతో చిన్న గోశాల ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. 2002లో దాన్ని ట్రస్టు గానూ, 2004లో శ్రీ వేంకటేశ్వర గోరక్షణ శాలగానూ మార్చారు.ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా, నేను తి.తి.దే. అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తిరుపతి గోశాలను అభివృద్ధి చేసినంతగా మరెవ్వరూ చేయలేదు అన్నది అతిశయోక్తి కాదు. రైతు హృదయమే కాదు, రైతుకు సంపద అయిన గోçహృదయం కూడా తెలిసినవారు రాజశేఖరరెడ్డి. ఆయన ఆదేశంతో గోసంరక్షణ కోసం తిరుపతిలో మూడు రోజుల పాటు ‘వందే గోమాతరం’ పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించాం. నోబెల్ బహుమతి గ్రహీతలైన ఇద్దరు ప్రముఖులు, అరవై మందికి పైగా గోసంరక్షణ ఉద్యమకారులు, వివిధ పీఠాధిపతులు ఆ సదస్సులో పాల్గొన్నారు. ఔషధీకరణ రీత్యా గోవిసర్జితాలు ఎంత ముఖ్యమైనవో, వీరు తమ ప్రసంగాల ద్వారా నిరూపించారు. గోసంరక్షణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు వివరించారు. వందే గోమాతరం సదస్సును దేశమంతా ప్రశంసించింది. ఎందరో పీఠాధిపతులు ఆశీస్సులు పంపారు. అప్పటి రాష్ట్రపతి రాజశేఖర రెడ్డి గారిని అభినందిస్తూ లేఖ పంపారు.శ్రీవారి సన్నిధానంలో ఉన్న గోశాలను మరింత విస్తృత పరచాలన్న రాజశేఖర రెడ్డి ఆదేశానుసారం పలమనేరులో అతి పెద్ద గోశాలకు అంకురార్పణ చేశాం.తండ్రి వలెనే ప్రత్యేక శ్రద్ధ వై.ఎస్. జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి వలెనే గోసంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. గోసంపద మరింత విస్తరించాలని సాహివాల్, గిర్, కాంక్రీజ్ వంటి నాణ్యమైన దేశవాళీ గోవులు సుమారు 550 తెప్పించారు. రిలయన్స్, మై హోమ్, ఇతర పారిశ్రామిక వేత్తల సహాయంతో ఈ గోవులను పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి తెప్పించారు. రవాణాలో అవి ఇబ్బందులకు గురి కాకూడదని, అప్పటి రైల్వే మంత్రితో మాట్లాడి ప్రత్యేక కంపార్టుమెంట్ల ద్వారా తెప్పించడం జరిగింది. ఇదీ నాటి ముఖ్యమంత్రి జగన్కు ఉన్న శ్రద్ధ.పూర్వకాలపు పద్ధతిలో కవ్వంతో చిలికి వెన్నతీసి, దానిని తిరుమలలో ధూప దీప నైవేద్యాలకు, అన్నప్రసాదాలకు వినియోగించాలని ఏర్పాట్లు చేయడం జరిగింది. కవ్వంతో చిలికి వెన్న తీయడాన్ని బిలోనా పద్ధతి అంటారు. దీనికి 5 కోట్ల నిధిని కేటాయించాం.ఈ 550 గోవుల ద్వారా పునరుత్పత్తి చేసి నాణ్యమైన గోవుల సంఖ్య మరింత పెంచాలని నిర్ణయించాం. దీనికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సహకారం తీసుకున్నాం. దాదాపు 48 కోట్ల రూపాయల ఖర్చుతో ఆవుల కృత్రిమ గర్భధారణకు ప్రయ త్నాలు చేస్తూ, అందులో 90 శాతం ఆడ దూడల జననం కొరకు బృహత్ సంకల్పం చేశాం.నవనీత చోరుడు, నవనీత ప్రియుడు అయిన వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత అనంతరం నవనీత (వెన్న) నివేదన చేస్తారు. ఆ వెన్నను పూర్వం బయట నుంచి కొని తీసుకువచ్చేవారు. స్వామికి వెన్న కొనడం తగదు అని తిరుమలలో గోశాలను ఎనిమిది ఎకరాలకు విస్తరించేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. అందులో 50 సాహివాల్ గోవులను ఉంచి, శ్రీవారి సేవకులైన మహిళల ద్వారా వెన్న చిలికించారు. ఆ వెన్నను ప్రతిదినం గోశాల నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీవారి నవనీత సేవకు అందేలా ఏర్పాటు చేశారు.శ్రీవారికి నివేదించిన వివిధ రకాల పుష్పాలను వృథాగా పారేయక వాటి ద్వారా అగరుబత్తీలు, తదితర పరిమళ ద్రవ్యాలు తయారు చేయడానికి, గోమయంతో సబ్బులు తదితర 14 ఉత్పత్తులు గోశాల ద్వారా రావటానికి ముఖ్య కారకులు జగన్ గారే! ఈ రోజు ఆ ఉత్పత్తుల ద్వారా 40 కోట్ల రూపాయల వ్యాపారం జరుగు తోంది. శ్రీవారికి దాదాపు 10 కోట్ల లాభం వస్తోంది. డబ్బు విషయం పక్కన పెడితే, కొన్ని కోట్ల గృహాలలో శ్రీవారి అగరుబత్తీలు వెలు గుతూ తిరుమలను తలపిస్తున్నాయి.అలిపిరి దగ్గర గోప్రదక్షిణశాలను పూర్తి చేసి భక్తులకు అందు బాటులోకి తెచ్చింది జగన్ గారే. ఆవు అలమటిస్తోంది! కొండంత చేసినా కొంచెంగా ఉండటం మాకు అలవాటు. అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిగా చేశాం తప్ప ప్రచారం కోసం కాదు. చేసినవి చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ కళ్ళు మూసుకుని కనిపించలేదు అంటే అది తప్పు!ఇరువురు ముఖ్యమంత్రులు ఇంతగా అభివృద్ధి చేసిన గోశాల నేడు దీనంగా ఉంది. ఆవు అలమటిస్తోంది. క్షీరధార బదులు, కన్నీటి ధార విడుస్తోంది. నిజం చెబితే దాన్ని స్వీకరించాలి, సరిదిద్దుకోవాలి. అంతేగానీ విమర్శకు విలవిలలాడిపోయి ఎదురుదాడికి దిగితే,దొంగ కేసులు పెడితే అది వారికే నష్టం. నేను కోరేది ఒక్కటే! అధికారాలు, ప్రభుత్వాలు మారవచ్చు. కానీ పీఠంపై ఎవరున్నా శ్రీవారికి ఇష్టమైన ‘గోపతు’లుగా ఉండాలి తప్ప, ‘గోఘ్నులు’గా ఉండకూడదు అని!భూమన కరుణాకర రెడ్డి వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్ -
బిహార్ ఎన్నికలు... ఎన్నెన్నో ప్రశ్నలు!
బిహార్ రాష్ట్రం 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల మంది ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలనీ; వలసలు నియంత్రించాలనే డిమాండ్స్ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్లో బిహార్ రాష్ట్రానికి పెద్ద పీట వేసి అందరికంటే ముందుగానే బీజేపీ అక్కడ ప్రచారం మొదలుపెట్టింది. గత ఎన్నికల వరకు ఎన్డీయే కూటమిలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ)దే పైచేయిగా ఉండేది. కానీ, ఐదేళ్లలో రాజకీయ సమీకరణాలు మారాయి. బీజేపీ అగ్రవర్ణాలపై తన పట్టును కాపాడుకుంటూనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రెండు దశాబ్దాలుగా జేడీ(యూ) ఓటు బ్యాంకుగా ఉన్న ఓబీసీలను, దళితులను తన వైపు తిప్పుకుంది. నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో, పరిపాలనా సంస్కరణలతో లబ్ధిపొందిన ఈ వర్గాలను ఆకర్షించడం ద్వారా... బీజేపీ తన ‘సామాజిక’ కూటమిని బలోపేతం చేసుకుంది. సామాజిక న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించిన లోక్ జన్ శక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకులు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆ పార్టీ తన బలాన్ని కోల్పోయింది. ఆ పార్టీ తమ గుర్తింపును కాపాడుకోవడానికి తీవ్రంగా పోరాడు తున్న క్రమంలో బీజేపీకి సానుకూలంగా మారింది. వివిధ కుల సమూహాలను తనవైపు తిప్పుకోవడానికి బీజేపీ అంతర్గతంగా ప్రత్యేక వ్యూహాలను అనుసరిస్తోంది. పలు సందర్భాల్లో జేడీ(యూ)తో విభేదాలొ చ్చినా రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉండటం వల్ల బీజేపీ తన హిందూత్వ భావ జాలాన్ని బిహార్ మట్టిలో జాగ్రత్తగా నిక్షిప్తం చేయగలిగింది. హిందూ సంఘటితం చుట్టే రాజకీయాలు నడు పుతూ మొట్టమొదటిసారి ఈ ఎజెండాతోనే ఎన్నికలు నడిచేలా వ్యూహాలను రచిస్తోంది. బడుగు, బలహీన వర్గాల ఐక్యతను కాపాడాలనే సిద్ధాంతంతో పని చేస్తున్న ‘ఇండియా’ కూటమికి ఇది అతిపెద్ద సవాలుగా మారబోతోంది. రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉంది. అలాగే ఆ పార్టీ వ్యూహాత్మ కంగా సృష్టిస్తున్న హిందూ కులాల ఐక్యత ఈసారి బిహార్ ఎన్నికలను రసవత్తరంగా మార్చనున్నది. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం, బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ, హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమికి 43.17 శాతం ఓట్లు రాగా; ఆర్జేడీ,కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన మహాగఠ్బంధన్ (ఎంజీబీ) కూటమికి 38.75 శాతం ఓట్లు వచ్చాయి.ఈ ఓట్ల వ్యత్యాసం ఇకముందు కూడా కొనసాగితే ఎన్డీఏ 2025లోనూ సునాయాసంగా విజయం సాధించే అవకాశాలున్నాయి. కానీ 2020 తర్వాత వికాసషీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) మహాVýæఠ్బంధన్లో చేరడం, జేడీ (యూ)లో రాష్ట్రీయ లోక్సమతా పార్టీ విలీనం కావడంతో ఈసారి లెక్కలు మారవచ్చు.బిహార్లో 18 శాతం ఉన్న ముస్లింలు కీలక పాత్ర పోషిస్తారు. 2020లో ఎంజీబీకి 76 శాతం ముస్లిం ఓట్లు రాగా, ఎన్డీఏకు కేవలం 5 శాతమే వచ్చాయి. యాదవ్– ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే బీజేపీ వైపు ఉన్న బీసీలను, దళితులను తనవైపు తిప్పుకోగలిగితే ఎంజీబీ గెలుపు అవకాశాలు పెరుగుతాయి. అయితే రాష్ట్రంలో పుట్టుకొచ్చిన కొత్త పార్టీలు ఎన్డీఏ–ఎంజీబీ కూటముల గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) జన్ సూరజ్ పార్టీ నుంచి ఎంజీబీకి ముప్పు పొంచి ఉంది. 2024లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఆయన ఇటు ఎంజీబీ, అటు జేడీ(యూ) ఓట్లను గణనీయంగా చీల్చవచ్చు. ఆయన ఆర్జేడీ, జేడీ(యూ) పార్టీలపైనే విమర్శలతో విరుచుకుపడుతుండటంతో బీజేపీకి పరోక్షంగా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుల ఆధారిత రాజకీ యాలు కాకుండా అభివృద్ధి తరహా రాజకీయాలు చేస్తా నని పీకే చెప్తున్నారు. లాలూ, నితీష్ల వృద్ధాప్యం, పాశ్వాన్ మరణంతో ఏర్పడిన ఖాళీని తాను భర్తీ చేయా లనుకుంటున్నారు. అయితే 243 నియోజకవర్గాల్లో నిల బెట్టడానికి బలమైన, నమ్మకమైన అభ్యర్థులు ఆయన పార్టీకి లేరు. కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత ఐ.పి. గుప్తా ‘ఇండియన్ ఇంక్విలాబ్ పార్టీ’ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రెండు కులాలపై ఈ పార్టీ ప్రభావం ఉండే అవకాశాలున్నాయి. ఐపీఎస్ అధికారిగా బిహార్లో ప్రత్యేక పనితీరు కనబర్చిన మహా రాష్ట్రకు చెందిన శివ్దీప్ లాండె ‘హింద్ సేన’ పార్టీ ఏర్పాటు చేశారు. ఒకప్పుడు నితీష్కు సన్నిహి తునిగా ఉన్న ఆర్సీపీ సింగ్ ఆయనతో విభేదించి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ – జేడీ(యూ) మళ్లీ పొత్తు పెట్టుకో వడంతో ఈయన ‘ఆప్ సబ్కీ ఆవాజ్’ పార్టీని నెలకొల్పారు. కుర్మీ సామాజిక నేత అయిన ఆర్పీ సింగ్ ఆ సామాజిక ఓట్లు చీల్చే అవకా శాలున్నాయి. ఈ చిన్న పార్టీలు చీల్చే ఓట్లు ఎన్డీఏ, మహాగఠ్బంధన్ అభ్యర్థుల గెలుపోటములను శాసించ నున్నాయి.ఆర్జేడీ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. బీజేపీకి పెరుగుతున్న ఆకర్షణను అడ్డుకోవడానికి ఆర్జేడీ కాంగ్రెస్తో చేతులు కలిపింది. ఓబీసీలను ఏకం చేయాలనీ, మైనారిటీ ఓట్లను కాపాడుకుంటూనే ఈబీసీలను, దళితులను ఎన్డీయే శిబిరం నుంచి తమ వైపు తిప్పుకోవాలనీ ఎంజీబీ లక్ష్యాలుగా పెట్టుకుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇది. మరో ఏడు నెలల్లో ఎవరు గెలుస్తారో వేచిచూడాల్సిందే!ఆర్. దిలీప్ రెడ్డి వ్యాసకర్త పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
సంక్షోభంలో విశ్వవిద్యాలయాలు
నేడు ప్రపంచ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు సంక్షోభంలో వున్నాయి. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన హార్వర్డ్, కొలంబియా యూనివర్సిటీలు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధిపత్య, సామ్రాజ్య వాద చర్యలకు గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొలంబియా యూనివర్సిటీలో అంబేడ్కర్ ఎంతో స్వేచ్ఛను అనుభవించిన విషయం ఆయన జీవన గాథల్లో వ్యక్తం అవుతుంది. అమెరికాలోని హార్వర్డ్, కొలంబియా విశ్వవిద్యాలయాల్లో విద్యతో పాటు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం వెల్లివిరిసినట్లు మనకు చరిత్ర చెబుతున్న సత్యం. ఇక్కడ ప్రపంచంలోని ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, జ్ఞానవంతులు, సాంకేతిక నిపుణులు తయా రయ్యారు. అనేక దేశాల్లో అత్యున్నతంగా చదువుకున్న మేధావులు పెక్కుమంది ఇక్కడ తమ జ్ఞానానికి పదును పెట్టుకున్నారు. ట్రంప్ వర్సెస్ హార్వర్డ్ట్రంప్ ఆదేశాలను హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు అలెన్ ఎం. గార్బర్ ధిక్కరించడం పట్ల సామాజిక, రాజకీయ మేధావి వర్గం సానుకూలంగా స్పందించింది. ‘‘హార్వర్డ్ విశ్వవిద్యాలయం తన స్వాతంత్య్రాన్ని ప్రభుత్వాధీనం చేయబోదు. తన రాజ్యాంగ హక్కు లను వదులుకోబోదు. ఏ పార్టీ ప్రభుత్వమైనా సరే విశ్వవిద్యాల యాలు ఏమి బోధించాలి, ఏ విద్యార్థులను చేర్చుకోవాలి. ఏ సిబ్బందిని నియమించుకోవాలి, ఏ పరిశోధనలు జరపాలి అనే విషయా లను ఆదేశించజాలదు’’ అని గార్బర్ వ్యాఖ్యానించారు. విశ్వవిద్యా లయ వ్యవహారాల నిర్వహణలో పాలకుల జోక్యానికి ప్రతిస్పందిస్తూ ఏ భారతీయ విశ్వవిద్యాలయ వైస్ఛాన్స్లర్ ఇంత నిక్కచ్చిగా మాట్లాడి ఉంటారు? ఈ ధరిత్రిపై తన కంటే శక్తిమంతుడు మరొకరు లేరని విశ్వసిస్తున్న ట్రంప్ ఆదేశాలను గార్బర్ ధిక్కరించారు.అందుకు ఆగ్రహించిన ట్రంప్ విశ్వవిద్యాలయానికి 2.2 బిలియన్ డాలర్ల నిధుల విడుదలను నిలిపివేశారు. అయినప్పటికీ శ్వేత సౌధ ఆదేశాలను పాటించేందుకు హార్వర్డ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. గత నెలలో మరో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయం కొలంబియాకు కూడా 400 మిలియన్ డాలర్లను మంజూరు చేసేందుకు ట్రంప్ నిరాకరించారు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆయన షరతులకు కొలంబియా సమ్మతించింది. నిజానికి విశ్వవిద్యాలయాల అధిప తులు సామ్రాజ్యాధిపతుల కంటే గొప్పవారు. వారు ఎంతో జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంటేనే ప్రపంచం నడుస్తుంది. అమెరికా నేడు అనేక విషయాల్లో ప్రపంచంలో ముందు ఉందంటే అందులో విశ్వవిద్యాలయాల పాత్ర ఎంతో ఉంది. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజా స్వామ్యాన్ని ప్రవచించిన, స్టాలిన్ నియంతృత్వాన్ని ఎదిరించి ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని ప్రవచించిన జాన్ డ్యూయీ వంటి ఎందరో మేధావులు ఆవిర్భవించిన కొలంబియా విశ్వవిద్యాలయం నేడు ఆంక్షలను ఎదుర్కోవడం బాధాకరమైన విషయం. ‘‘ప్రజాస్వామికం అనే భావాన్నీ, ప్రజాస్వామికం అర్థాన్నీ మనం ఎప్పటికప్పుడు కొత్తగా తరచి చూసుకుంటూ వుండాలి. రాజకీయ, ఆర్థిక, సాంఘిక సంస్థలను కూడా దీనికి అనుకూలంగా మార్చుకోవాలి. ప్రజాస్వా మికం నిత్యనూతనం అయి, ప్రజల అవసరాలతోపాటు మారుతూ వచ్చినపుడే అది ప్రజల జీవితాన్ని ప్రతిబింబించేదీ, ప్రజలకు సహాయం చెయ్యగలిగేదీ అవుతుంది. ఈనాటి మార్పులనూ, రాబోయే మార్పులనూ తెలుసుకోటానికి అది ముందుకు నడవాలి. అది కదలకుండా నిలబడటం ఆత్మహత్య చేసుకోవటమే అవుతుంది’’ అని హెచ్చరించారు జాన్ డ్యూయీ. ఆయన విద్యకు ప్రధానమైన పాత్రను ఇచ్చారు. విద్య అంటే జ్ఞాన జ్యోతి, విద్య అంటే విప్లవ సంకేతం, విద్య అంటే మానవాభ్యుదయానికి మార్గం. భారతదేశ పరిస్థితిమన దేశంలో కూడా యూనివర్సిటీల మీద పెత్తనం అప్రజాస్వా మికంగా, లౌకిక భావజాలానికి భిన్నంగానే జరుగుతోంది. విశ్వ విద్యాలయాల గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపాన్నే మార్చే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. 2023 నాటికి మనకు 1,074 విశ్వవిద్యాల యాలున్నాయి. ఇందులో 128 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. ఇక్కడ ఒకప్పుడు లౌకికవాద, ప్రజాస్వామ్య, ఆర్థిక, సామ్యవాద, సామాజిక పరిణామవాద భావజాలం అభివృద్ధి చెందింది. జీవశాస్త్రం, పదార్థ శాస్త్రం, రసాయన శాస్త్రంలో ప్రపంచానికే జ్ఞానసంపత్తిని అందించ గల్గిన పరిశోధనలు వచ్చాయి. దళిత బహుజన విద్యార్థులకు మెరు గైన స్కాలర్షిప్లు లభించాయి. దళిత బహుజన మైనారిటీల నుండి కూడా ఎంతో నూత్న జ్ఞానం ఆవిర్భవించింది. జేఎన్ యూ, ఢిల్లీ విశ్వ విద్యాలయం, జామియా మిలియా, ఏఎవ్ుయూ, జాదవపూర్, జమ్ము సెంట్రల్ వర్సిటీల్లో (వాటి అధ్యాపకులు, విద్యార్థులు) ఎంతో విలువైన పరిశోధనలు చేశారు. జేఎన్యూలో ఇమ్మానుయేల్ కాంట్, హెగెల్, కారల్ మార్క్స్ గురించిన విస్తృతమైన అధ్యయనాలు జరిగాయి. సబాల్ట్రన్ స్టడీస్లో భాగంగా హిస్టరీలో అత్యంత విలువైన విషయాలను ముందుకు తెచ్చిన రొమిల్లా థాపర్ జేఎన్యూలో చరిత్ర బోధకురాలని మరువరాదు. కానీ నేడు దేశంలో మత గ్రంథాల్లోని పురాణ కథలను పాఠ్య గ్రంథాలుగా తెచ్చే పెద్ద ప్రయత్నం జరుగుతోంది. భారతీయ విశ్వ విద్యాలయాలకు ప్రభుత్వ ప్రోత్సాహం చాలా తక్కువగా వుంది. ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని విమర్శిస్తున్న భారత మేధావులు కేంద్ర ప్రభుత్వ చర్యలను సమర్థించడం ఆశ్చర్యాన్ని గొలుపుతోంది. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా విద్యా వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది. భారతదేశంలో ఎక్కువ ధనం విద్యకే ఖర్చవుతోంది. అయినా ఉపాధి రంగాలు లేక ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతు న్నారు. ఇప్పుడు భారత పాలకులకు, రాష్ట్రాలను పాలించే ముఖ్య మంత్రులకు ఈ దేశంలో ఉన్న మానవ వనరులను, మానవ శక్తిని ఎలా సమన్వయించాలో తెలియక ఇతర దేశాలకు ఉపాధి రంగాల కోసం విద్యార్థులను వెళ్ళమని పురమాయిస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్ళడం తప్పు కాదు. దేశంలో ఉన్న విద్యను, విద్యా మూలాలను దెబ్బతీసుకోవడం వలన వనరుల మీద ఆసక్తి తగ్గిపోతుందనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. విద్యకు హద్దులా?ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు పాలకవర్గ సామ్రాజ్య వాద, పెట్టుబడిదారీ, మతోన్మాద భావజాలాల ఒత్తిడిలో వున్నాయి. సరైన గ్రాంట్స్, స్కాలర్షిప్లు లేక విలవిల్లాడుతున్నాయి. తెలంగాణలో సెంట్రల్ విశ్వవిద్యాలయ భూములను ఆక్రమిస్తున్నారు. విశ్వవిద్యాలయాలు కులాధిపత్య భావాల మధ్య నలుగుతున్నాయి. భారతదేశంలో జీవించలేక, ఉపాధి లేక, స్వేచ్ఛ లేక ఇతర దేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో అమె రికా విధిస్తున్న ఆంక్షలు గొడ్డలిపెట్టుగా ఉన్నాయి.ఆసియా దేశాలు తమ స్వీయ విద్యోత్పత్తి, జ్ఞానోత్పత్తి విషయంలో స్వయంకృషికి పూనుకోవలసిన అవసరం వుంది. విద్య మానవుని వికాసానికి సోపానం. ఉన్నత విద్య ప్రపంచ జీవన వ్యవస్థ లను పునరుజ్జీవింపజేయగల శక్తిని కలిగి వుంటుంది. హార్వర్డ్, కొలంబియా, భారతీయ విశ్వవిద్యాలయాల పునరుజ్జీవన ఉద్యమం అత్య వసరం. ప్రపంచంలో విశ్వ మానవులైన వారందరూ విద్య ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే అయ్యారు. సామ్రాజ్యానికి ఎల్లలుంటాయి. పాలనకు హద్దులు వుంటాయి. కానీ విద్యకు హద్దులుండవు. విద్య గురించి అంబేడ్కర్ మాట్లాడుతూ, ‘‘ఏ విద్య అయితే సమర్థతను సమున్నతంగా పెంచలేదో, సమానత్వాన్ని పెంపొందించుకోవడానికి బాధ్యత వహించదో, నీతికి భూమికగా నిలువదో అది విద్యకాదు. విద్య అనేది మానవ సంక్షేమానికి రక్షణగా, శక్తిమంతంగా, బహుళ ప్రయోజనకారిగా సమతానురాగాల మూలస్థానంగా ఉండాల’’న్నారు. విద్యావంతమైన జాతి దానంతటదే అభివృద్ధిలోకి వస్తుంది. అంబే డ్కర్ ఆలోచనలే ప్రపంచ విశ్వవిద్యాలయాల వికాసానికి మార్గం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
గ్లోబల్ కలలు సరే... మరి లోకలో!
రాష్ట్రానికి ప్రపంచ విద్యాసంస్థలను తీసు కొస్తామని తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, విద్యాశాఖా మాత్యులు ఆర్భాటంగా ప్రకటించడం పరిపాటిగా మారి పోయింది. గ్లోబల్ సంస్థలను తీసుకొస్తే కాదనే వారెవరు? మరి ఇప్పటికే ఇక్కడ ఉన్న విశ్వవిద్యాలయాల్లో కనీస సౌకర్యాల కల్పన చేయాలన్న సంగతే మర్చిపోతే ఎలా? అధ్యాపకుల కొరతతో విశ్వవిద్యాలయాలు ఒప్పంద అధ్యాపకులతో నెట్టుకొస్తున్నాయి. విద్యార్థుల సమస్యలు, శిక్షణా అవసరాల కంటే రాజకీయ అజెండాలకే విశ్వ విద్యాలయాల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. ప్రతిపక్ష పార్టీలను నిరోధించే వేదికలుగా, ప్రభుత్వ విధానాలను సమర్థించే ప్రచార కేంద్రాలుగా మారుతున్న ఈ విద్యా సంస్థలు తమ పరిపక్వతను కోల్పో తున్నాయి. విశ్వవిద్యాలయాల నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. ఎటువంటి స్పష్టమైన పాలనా విధానం లేకుండా, అనుసంధాన కార్యక్రమాలు లేకుండా, విశ్వవిద్యాలయాలు కేవలం తమ తమ అస్తిత్వం కొనసాగించేందుకు మాత్రమే పరిమిత మవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, తెలుగు రాష్ట్రాల విద్యా వ్యవస్థ మరింత దిగజారిపోతుంది.రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్రం మంజూరు చేసిన ‘గిరిజన విశ్వవిద్యాలయా’ లు పూర్తి స్థాయి క్యాంపస్లుగా రూపుదిద్దుకోలేదు. తాత్కాలిక అద్దె భవనాల్లోనే ఇంకా నెట్టుకొస్తున్నాయి. ఏర్పాటు చేసి దశాబ్దం కావొస్తున్నా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా వీటి పరిస్థితి కొనసాగుతోంది. ఏ ఉద్దేశ్యంతో అయితే ఈసంస్థలు ఏర్పాటు చేయబడ్డాయో వాటిని అందుకోవడంలో విఫలమవు తున్నాం. కానీ వీటి గురించి ఆలోచించే నాథుడే లేకపోవడం గమనార్హం. విద్య, పరిశోధనల వైపు దృష్టి సారించాల్సిన అధ్యాపకులు పదవుల కోసం పాకులాడుతూ విద్యా వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. మన విశ్వవిద్యాలయాల్లో గ్లోబల్ (అంతర్జాతీయ) ప్రమాణాలను కల్పించేందుకు పలు చర్యలు తీసుకోవాలి. అధ్యాపకుల నియామకాన్ని తక్షణం చేపట్టాలి. పూర్తి స్థాయి అధ్యాపకులను నియమించి, వారి శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. విశ్వ విద్యాలయాల్లో పరిశోధన నిధులను పెంచాలి. పరిశోధనాపత్రాలను ప్రచురించేలా ప్రోత్సహించడంతోపాటు, విదేశీ విశ్వవిద్యాలయాలతో అను సంధానం చేయాలి. ఆధునిక మౌలిక వసతులు కల్పించి, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే ల్యాబ్లు, గ్రంథాలయాలు, డిజిటల్ లెర్నింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. విద్యార్థుల స్టార్ట్అప్లను ప్రోత్సహించే విధంగా నూతన విధానాలను అమలు చేయాలి. విశ్వవిద్యాలయాల పాలనలో పారదర్శకతను పెంచి, అకడమిక్ స్వాతంత్య్రాన్ని పరిరక్షిస్తూ, రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి.అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల విధానాన్ని అనుసరించి, విద్యార్థులకు పరిశ్రమ అను భవాన్ని పెంచే ఇంటర్న్షిప్లు, కో-ఆపరేటివ్ ప్రోగ్రామ్లను అమలు చేయడం అత్యవసరం. పరిశ్రమతో అనుసంధానం పెంచి, విద్యార్థులను వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారానికి సిద్ధం చేయాలి. విద్యాబోధన, పరిశోధన రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి...ప్రభుత్వాలు మౌలిక వసతుల కల్పనకు సమగ్ర ప్రణాళికలతో ముందుకు రావాలి. ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యా సంస్థలతో పోటీ పడటమే కాకుండా, పరిశోధన, నూతన ఆవిష్కరణల కేంద్రాలుగా మారతాయి. అప్పుడు ఎక్కడి నుంచో కొత్తగా విశ్వవిద్యాలయాలను, సంస్థలను తీసుకు రావలసిన అవసరమే ఉండదు.-డా.తారకేశ్వరరావు ఇప్పిలి (అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, విజయనగరం) -
ఇండియా విధానం సరైనదేనా?
భారత ప్రభుత్వం సుంకాల విషయమై అమెరికాతో చర్చిస్తున్న పద్ధతిని కొందరు సమర్థిస్తుండగా, కొందరు విమర్శిస్తున్నారు. విలువైన అంశాలు రెండింటిలోనూ ఉన్నాయి. కానీ ఈ చర్చలన్నీ తక్షణ అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. అవి అవసరమే. అదే సమయంలో మరికొంత లోతుకు వెళ్లటం, దీర్ఘకాలిక దృష్టి తీసుకోవటం కూడా చేస్తే తప్ప ఇంత ముఖ్యమైన విషయమై సమగ్రమైన అవగాహన ఏర్పడదు. ఇతర దేశాల నుంచి దిగుమతులపై తాము స్వల్పమైన సుంకాలు విధిస్తున్నామనీ, తమ ఎగుమతులపై మాత్రం వారు భారీ సుంకాలు వేస్తున్నారనీ, ఆ విధంగా తాము రెండు విధాలుగానూ నష్టపోతున్నామన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటున్నమాట. కేవలం గణాంకాలకు పరిమితమైతే అది నిజమే. కానీ, అందులో అనేక మతలబులున్నాయి. అమెరికాలో ఒకప్పుడు విస్తారంగా ఉండిన ఉత్పత్తుల రంగాన్ని కుదించి, పరిశ్రమలను ఇతర దేశాలకు తరలించింది అక్కడి ప్రభుత్వమే గదా? అసలు వివిధ అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య సంస్థలను ఉనికిలోకి తెచ్చి స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిందే అమెరికా. ఒకవేళ 90 రోజుల వాయిదా కాలంలో చర్చల ద్వారా కొన్ని సర్దుబాట్లు జరిగినా కొంత నష్టం మిగిలే ఉంటుంది. ఈ పరిణామాలన్నింటి ప్రభావంతో అమెరికా పట్ల ప్రపంచానికి ఇంత కాలం ఉండిన విశ్వాసం తగ్గుతుందనే సందేహం ఉంది. అది జరిగినపుడు ఇప్పటికే గల బహుళ ధ్రువ ప్రపంచ ధోరణులు మరింత బలపడగలవనే అభిప్రాయాలు ఎక్కువవుతున్నాయి.నాలుగు ధోరణులుఇండియాతో అమెరికా వాణిజ్య లోటు 2024–25లో 41.18 బిలి యన్ డాలర్లు. మన దిగుమతులపై అమెరికా సుంకాల రేటు సగటున 2.7 శాతం. అమెరికా నుంచి దిగుమతులపై మన సుంకాల రేటు సగ టున 12 శాతం కాగా, కొన్ని సరుకులపై 48 శాతం వరకు ఉంది. ఈ లెక్కలను బట్టి అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలతో గల వాణిజ్య లోటులో 50 శాతం మేర సుంకాలు పెంచిన ప్రకారం భారత ఎగుమతులపై రేటును 26 శాతంగా ప్రకటించారు. ఏప్రిల్ 2న ఈ కొత్త రేట్లు ప్రకటించటానికి ముందే చేసిన హెచ్చరికలను బట్టి భారత ప్రభుత్వం అమెరికన్ మోటార్ సైకిళ్లు వగైరాపై సుంకాలు తగ్గించటం తెలిసిందే. అయినప్పటికీ కొత్త రేట్లు యథావిధిగా పెరిగాయి.ఈ పరిస్థితుల దృష్ట్యా భారత్ ఏమి చేయాలన్నది ప్రశ్న. ప్రపంచ దేశాలు చేస్తున్నదేమిటని చూడగా నాలుగు ధోరణులు కనిపిస్తు న్నాయి. కొన్ని చిన్న ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా లొంగి పోతున్నాయి. అమెరికా నుంచి దిగుమతులపై సుంకాలు నూరు శాతం రద్దు చేస్తు న్నాయి. ఇందుకు ఒక ఉదాహరణ జింబాబ్వే. కొన్ని సామరస్య ధోర ణితో ఇచ్చిపుచ్చుకునే మార్గాన్ని అనుసరిస్తున్నాయి. జపాన్ అందు కొక ఉదాహరణ. కొన్ని ఎదురు సుంకాలతో ప్రతిఘటిస్తూ అమెరికా తగ్గితే తాము తగ్గుతామంటున్నాయి. కెనడా, యూరోపియన్ దేశాలు ఈ కోవలోకి వస్తాయి. చైనా ఒక్కటి భిన్నంగా కనిపిస్తున్నది. పోరాడు తాము తప్ప లొంగే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నది.ఈ నాలుగింటిలో ఇండియా ప్రయోజనాలకు ఉపయోగపడ గలది ఏది? చైనా వలె పూర్తిగా ధిక్కరించటమన్నది అభిలషణీయం కాదు, కావాలనుకున్నా సాధ్యమయ్యేదీ కాదు. వారిది రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత దేశం కన్నా అయిదు రెట్లు పెద్దది.క్రమంగా అమెరికాను మించిపోయి అగ్రస్థానానికి చేరాలన్నది చైనా లక్ష్యం. మన స్థితిగతులుగానీ, లక్ష్యాలుగానీ వీలైనంత అభివృద్ధి చెందటమే తప్ప చైనా వంటివి కావు. కనుక ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు అటువంటి వైఖరి తీసుకోవటమన్న ఆలోచనే అసందర్భం. ఇదంతా అర్థమయ్యో, కాకనో కొందరు భారత ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తున్నారు. జపాన్ మార్గంఇక మిగిలినవి జపాన్, కెనడా ప్లస్ యూరోపియన్ మార్గాలు. ఈ రెండింటిలో రెండవది కూడా ఇండియాకు అనుకూలించగలది కాదు. అందుకు ఒక కారణం యూరోపియన్ దేశాలన్నీ ఒక బృందం వలె నిలిచి ఉన్నాయి. అది గాక సైనికంగా, భౌగోళిక వ్యూహాల రీత్యా అమెరికా, కెనడా, యూరప్ల సాన్నిహిత్యం భిన్నమైనది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నందువల్లనే అమెరికా ట్యారిఫ్లను వారు బలంగా ఎదుర్కొంటూ, ఆ దేశం దిగి రావలసిందేనని స్పష్టం చేస్తు న్నారు. ఇదంతా భారతదేశానికి సాధ్యమయ్యేది కాదు.అందువల్ల స్థూలంగా జపాన్ నమూనా ఒక్కటే మిగులుతున్నది. దక్షిణ కొరియా, మెక్సికో మొదలైన వాటి వైఖరి కూడా ఇంచుమించు ఇదే విధంగా కనిపిస్తున్నది. ఈ పద్ధతి ఇంకా ఇదమిత్థంగా రూపు తీసుకోలేదు. చర్చలు జరిగే కొద్దీ ఇందుకొక రూపం రాగలదని భావించవచ్చు. భారత్ స్థూలంగా జపాన్ తరహా వైఖరిని తీసుకుంటున్నట్లు కని పిస్తున్నది. ఇందులోనూ ఒక ఆకు తక్కువే. అమెరికాతో జపాన్కు గల వ్యూహాత్మక భాగస్వామ్యం వేరు. అందుకే ‘స్థూలంగా’ అనే మాటను ఉపయోగించటం. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత, భారతదేశం గురించి మాట్లాడుకోవలసిన మౌలికమైన విషయాలు రెండున్నాయి. భారత అభివృద్ధి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? కొత్త అభివృద్ధి లక్ష్యాల సాధనకు అనుసరించవలసిన మార్గం ఏమిటని ప్రభుత్వం భావిస్తున్నది? సుంకాల యుద్ధంపై తీసుకోగల వైఖరికి ఈ ప్రశ్నలతో సంబంధం ఉంటుంది.దేశ ప్రయోజనాలే ముఖ్యం!ఆర్థికాభివృద్ధి రీత్యా ఇండియా ఇంకా వర్ధమాన దేశమే. అభివృద్ధి చెందుతున్నా, ఆ వేగం ఉండవలసినంతగా లేదు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే అంతర్గతంగా జరగవలసింది చాలా ఉండటంతో పాటు, అభివృద్ధి చెందిన దేశాల నుంచి, ఇంచు మించు తన స్థాయిలో గల వర్ధమాన దేశాల నుంచి, అవసరమైన వనరులు గల దేశాల నుంచి సహకారం అవసరం. అందుకోసం ఈ కూటమి, ఆ కూటమి అనే ఒకప్పటి రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వైపుల నుంచి సహకారం కోసం సమ సంబంధాలు పాటించాలి. దేశ ప్రయోజనాలే దేనికైనా గీటురాయి కావాలి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులంటూ ఉండరు. పరిస్థితులు, ఫిలాసఫీ రెండూ ఇవే. ఇదంతా ఇప్పుడు మనం సుంకాల సమస్యల సందర్భంలో కొత్తగా సూత్రీకరిస్తున్నది కాదు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ‘ది ఇండియా వే, స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్సర్టెన్ వరల్డ్’ (2020) పేరిట రాసిన పుస్తకంలో ఈ సూత్రీ కరణలన్నీ కనిపిస్తాయి. శీర్షిక దానికదే ఎంతో అర్థవంతమైనది. ‘మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా జీవించటమే వివేకం’ అనే తిరు వళ్ళువర్ బోధనతో ఆయన తన పుస్తకాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ పాలకులు వచ్చిపడుతుండగా చదరంగంలో మునిగి రాజ్యం పోగొట్టుకున్న బెంగాల్ నవాబుల ఉదంతంతో ‘షతరంజ్ కే ఖిలాడీ’ సినిమా తీసిన సత్యజిత్ రే హెచ్చరిక, అమెరికా బలహీనపడుతుండగా ముందుకు దూసుకుపోతున్న చైనాల గురించి చర్చిస్తూ, ‘ఇప్పుడు భారతదేశం తనను తాను నిర్వచించుకుంటుందా? లేక ఇంకో ప్రపంచమే నిర్వచిస్తుంటుందా?’ అని ప్రశ్నిస్తారు. స్వయంగా అమెరికా, చైనాలలో రాయబారిగా పనిచేసిన జైశంకర్ సూత్రీకర ణలు, రూపొందిస్తున్న విదేశాంగ విధానాలు ప్రస్తుత క్లిష్ట పరిణా మాలకు తగినవే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
గులామ్ నబీ ఆజాద్ (మాజీ కాంగ్రెస్) రాయని డైరీ
ఆత్మవిశ్వాసం మీదకెక్కి కూర్చున్నప్పుడు వినూత్నమైన ఆలోచనలు మదిలో మెదులుతుంటాయి. మంచి ఉద్యోగంలో ఉన్న వారు ఆ ఉద్యోగం మానేసి, సొంతంగా ఒక కంపెనీ పెట్టాలనుకుంటారు! గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఉన్నవారు ఆ పార్టీని వదిలేసి, సొంతంగా ఒక పార్టీ పెట్టాలనుకుంటారు.జమ్మూ–కశ్మీర్ లోయలో ఇటీవలి కాలంలోని పరమ ఆత్మవిశ్వాసపు కథ ఏదైనా ఉందీ అంటే అది నాదే! నా సొంత పార్టీ ‘డీపీఏపీ’ పెద్ద ఫెయిల్యూర్ స్టోరీ. డీపీ అంటే డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్, ఏపీ అంటే ఆజాద్ పార్టీ. పాత పార్టీ లోంచి బయటికి వచ్చాక నేను కొత్తగా డీపీఏపీని స్థాపించినట్లు లేదు, కొత్తగా డీపీఏపీని స్థాపించటం కోసం పాత పార్టీ నుంచి నేను బయటికి వచ్చినట్లు ఉంది. మీదకెక్కి కూర్చున్న వారి మహిమ అనుకుంటాను!పాత పార్టీలో యాభై ఏళ్లు ఉన్నాక; పార్టీ సీఎంగా, పార్టీ ఎంపీగా, పార్టీ కేంద్రమంత్రిగా, రాజ్యసభలో పార్టీ అపోజిషన్ లీడర్గా నన్ను కూర్చోబెట్టి గౌరవించిన పాత పార్టీని అమర్యాదగా వదిలి వచ్చేశాను నేను. అప్పుడే నా ఫెయిల్యూర్ స్టోరీ మొదలైందా?!కాదు, ఇంకొకరి ఫెయిల్యూర్స్ని ఎప్పుడైతే వేలెత్తి చూపుతామో అప్పుడే మన స్టోరీ మొదల వుతుంది! పార్టీ నుండి బయటికి వచ్చేటప్పుడు నేను మౌనంగా వచ్చేయలేదు. ‘‘పార్టీ పనైపోయింది’’ అంటూ అడుగు బయటికి వేశాను. బయటికి వచ్చాక, ‘‘రాహుల్ అన్ఫిట్’’ అని, ‘‘రాహుల్ చైల్డిష్’’ అని సోనియాజీకి లెటర్ రాశాను.‘భారత్ జోడో యాత్ర’లో రాహుల్కు తోడుగా ఉండకుండా; గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో ఖర్గేజీకి చేదోడుగా లేకుండా పార్టీ నుంచి వచ్చేసి, సొంతంగా పార్టీ పెట్టుకున్నాను. నన్ను తన సొంత మనిషి అనుకున్న పార్టీని నేను దెబ్బకొట్టి వచ్చేస్తే, నేను పెట్టుకున్న నా సొంత పార్టీ నన్ను దెబ్బకొట్టేసింది!పార్టీ పెట్టాక, తొలిసారి పోటీ చేసిన రెండు లోక్సభ స్థానాల్లోనూ నా పార్టీ గెలవ లేకపోయింది! పార్టీ పెట్టాక, తొలిసారి పోటీ చేసిన 23 అసెంబ్లీ స్థానాల్లోనూ నా పార్టీ ఓడిపోయింది. కొన్నిచోట్ల ‘నోటా’కు పడినన్ని ఓట్లు కూడా నా పార్టీకి రాలేదు!ఓటమి మనిషినే కాదు, పార్టీని కూడా ఒంటరిని చేస్తుంది. నాతో పాటు పాత పార్టీని వదిలి వచ్చిన వారంతా తిరిగి ఆ పార్టీలోకే వెళ్లిపోయారు! రెండున్నరేళ్ల నా కొత్త పార్టీలో 76 ఏళ్ల వయసున్న పార్టీ చైర్మన్గా నేను, నా సెక్రెటరీ బషీర్ ఆరిఫ్ మాత్రమే ఇప్పుడు మిగిలాం.‘‘పని పూర్తయింది ఆజాద్జీ...’’ అంటూ వచ్చారు బషీర్ ఆరిఫ్. ‘‘రండి బషీర్జీ! మొత్తం డిజాల్వ్ చేసేశారు కదా?!’’అని అడిగాను. ‘‘ఒక్క యూనిట్ను కూడా మిగల్చలేదు ఆజాద్జీ. స్టేట్, ప్రావిన్షియల్, జోనల్, డిస్ట్రిక్ట్ యూనిట్లతో పాటు... పార్టీ బ్లాక్ లెవల్ కమిటీలను కూడా రద్దు చేసేశాం, త్వరలోనే వాటిని పునరుద్ధరిస్తాం అని ఉత్తినే ప్రెస్ నోట్ కూడా పంపించాం...’’ అన్నారు బషీర్. ప్రాణం కాస్త తేలిక పడింది. మీదకెక్కిన వారెవరో దిగిపోయినట్లుగా ఉంది.‘‘నాకిప్పుడు ఫ్రీ బర్డ్నన్న ఫీలింగ్ కలుగుతోంది బషీర్జీ. మీక్కూడానా?’’ అని అడిగాను. ఆయన నవ్వారు. ‘‘ఎక్కడికి వెళుతున్నాం అనే దాని కంటే, ఎక్కడి నుంచి వెళుతున్నాం అన్నదే ఒక్కోసారి ఫ్రీడమ్ అనే మాటను చక్కగా డిఫైన్ చేస్తుంది ఆజాద్జీ. నాకు సెలవిప్పించండి...’’ అన్నారు నమస్కరిస్తూ!!చదవండి: మహువా మొయిత్రా (ఎంపీ) రాయని డైరీసాయంత్రం బాల్కనీలో ఒంటరిగా నిలుచుని లోయలోకి చూస్తూ ఉన్నప్పుడు తులిప్స్, కుంకుమ పూలు, కశ్మీరీ గులాబీలు, బంతిపూలు... గాలికి ఊగుతూ కనిపించాయి. ఒక్క కమలం పూలు మాత్రమే స్థిరంగా ఉన్నాయి. ఆ కమలం పూల వైపే నేనూ స్థిరంగా చాలాసేపు చూస్తూ ఉండిపోయాను. -
The Earth Day 2025 : పుడమితల్లిని రక్షించుకుందాం!
పర్యావరణ పరిరక్షణకు మద్దతును ప్రదర్శించడానికి జరిగే వార్షిక కార్యక్రమాన్ని ‘ధరిత్రీ దినోత్సవం’ (ఎర్త్ డే) అంటున్నాం. ఈనాడు పర్యావరణ ఉద్యమాలకు మద్దతు ఇవ్వడానికీ, పర్యావరణ ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికీ ప్రపంచవ్యాప్తంగా 1970 ఏప్రిల్ 22 నుండి ఈ ఉత్సవాన్ని జరుపుకొంటున్నారు. ఈ 55వ వార్షిక దినోత్సవానికి ఎంపిక చేసిన విషయం ‘మన శక్తి–మన గ్రహం’. ఈ సంద ర్భంగా ‘భూమి మొదట – మిగిలినవన్నీ తరువాత’ అనీ, ‘ప్రపంచ వ్యాప్తంగా ఆలోచించి స్థానికంగా వ్యవహరించండి’ అనీ పిలుపు ఇస్తు న్నారు. అంతేకాదు ‘పరిశుభ్రమైన భూమి – ప్రకాశవంతమైన భవి ష్యత్’ అని గుర్తు చేస్తున్నారు.భూమి ఉపరితలం 70 శాతం నీరు, 30 శాతం భూమి మాత్రమే కలిగి ఉంది. మహా సముద్రాలు, నదులు, సరస్సులు, హిమనీ నదాలు, సముద్రాల వంటివి ముఖ్యమైన నీటివనరులు. పర్వతాలు, కొండలు, పీఠ భూములు, మైదానాలు వంటివి ముఖ్యమైన భూరూపాలు. నీటిలో కానీ, నేలపై కానీ మానవునితో సహా వృక్షాలు, జంతువులు, కీటకాలు వంటి జీవులు లెక్కకు మించి జీవిస్తున్నాయి. భూమిని కాపాడుకోకపోతేఇందులో కొన్ని అదృశ్యం అయిపోయే ప్రమాదం ఉంది. శిలాజ ఇంధనాలు మాత్రమే మన గ్రహానికి శక్తి నివ్వగలవనే అబద్ధాన్ని సంవత్సరాలుగా కొన్ని శక్తులు మనకు చెబుతూనే ఉన్నాయి. కానీ శిలాజ ఇంధనాలు ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గా రాలకు ప్రధాన వనరులు. ఇవి గ్లోబల్ వార్మింగ్కు ప్రత్యక్షంగా దోహదం చేస్తాయి. ఫలితంగా శ్వాసకోశ సమస్యల నుండి కేన్సర్ వరకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.గ్రీన్ హౌస్ ఎఫెక్ట్బొగ్గు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటి శిలాజ ఇంధనాలుమండినపుడు కార్బన్ డై ఆక్సైడ్ పుడుతుంది. పూర్తిగా మండనిఇంధనం నుండి వచ్చే పొగలో కూడా కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. కుళ్లిన పదార్థాల నుండి, చెత్త గుట్టల నుండి, వరి పంట నుండి మీథేన్ వాయువు వెలువడుతుంది. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్, నీటి ఆవిరి కలిసి సూర్యుని నుండి వచ్చిన వేడిని గ్రహించి బయటకు పోనీ యకుండా పట్టేస్తాయి. మానవులతో సహా జంతువులు, పక్షులు శ్వాస క్రియలో భాగంగా ఆక్సిజన్ వాడుకుని కార్బన్ డై ఆక్సైడ్ను వదిలి వేస్తాయి. మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, ఓజోన్, కార్బన్ మోనాక్సైడ్,క్లోరో ఫ్లోరో కార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి కొన్ని రకాల వాయువులు పరారుణ కిరణాలను పీల్చుకుని ఇముడ్చుకుంటాయి. ఫలితంగా వేడిమి పెరిగి ప్రపంచ వాతావరణంలో మార్పులు వస్తు న్నాయి. దీనినే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. మనకు శక్తి అవసరం. దానిని పొందడానికి మన గ్రహం యొక్క వనరులను పూర్తిగా వినియోగించుకోవాలి. శిలాజ ఇంధనాలు పరిమితమైనవి. ఎప్పటికైనా అయిపోయేవే. పునరుత్పాదక ఇంధ నాలపై ఇప్పటికే దృష్టి సారించారు. పునరుత్పాదక శక్తి అనేది గేమ్–ఛేంజర్. ఇది చౌకైనదే కాక స్థిరమైన విద్యుత్ను అందిస్తుంది. దీని వలన వాతావరణ మార్పులు ఉండవు. మానవ ఆరోగ్యానికి ఏ విధమైన హానీ ఉండదు. సౌర, పవన, జల, భూ ఉష్ణం, అలలు వంటివి పునరుత్పాదక శక్తులు. ఈ వనరులు ఎప్పటికీ తరిగిపోవు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే ఇంధన ఉత్పత్తి మూడు రెట్లు పెరగాలని ఆశిస్తున్నారు. ఈ లక్ష్య సాధనకై సమష్టి కృషి అవసరం. ఆస్ట్రేలియాలోని ఇళ్ళలో మూడింట ఒక వంతు ఇప్పటికే సౌర శక్తిని ఉపయోగిస్తున్నారు. ఐస్లాండ్, నార్వే, ఇథియోపియాలు ఎక్కువగా శక్తిని పునరుత్పాదక వనరుల నుంచేపొందుతున్నాయి. ఉరుగ్వే పునరుత్పాదక వనరుల నుండి 98 శాతం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. డెన్మార్క్ పవన టర్బైన్ల ద్వారా 50 శాతంకంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటోంది. ఈ విషయంలో ఆఫ్రికాలో కెన్యా అగ్రగామిగా ఉంది. దాని విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు సగం భూ ఉష్ణ శక్తి ద్వారా లభిస్తోంది. మన దేశంలో కూడా సౌర శక్తి వినియోగం బాగా పెరుగుతోంది. తమిళనాడు, రాజస్థాన్, మహా రాష్ట్ర్టలలో పవన విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సౌర ఫలకాలు, పవన టర్బైనులు నిర్మించడానికి కాడ్మియం, రాగి, వెండి ఎంతో అవసరం. ఈ సమస్య పరిష్కారానికి శాస్త్రవేత్తలుతీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు.డా.సి.వి. సర్వేశ్వర శర్మ పాపులర్ సైన్స్ విషయాల రచయిత(నేడు 55వ ‘ధరిత్రీ దినోత్సవం) -
అబ్దుల్లాకు జరిగిన నమ్మక ద్రోహం
అమర్జీత్ సింగ్ దులత్ పుస్తకం జమ్ము –కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఫరూఖ్ అబ్దుల్లాను ఎందుకంత తీవ్రంగా బాధించిందో అర్థం కాని విషయం. ఆర్.ఏ. డబ్ల్యూ(రా) మాజీ ఉన్నతాధికారి దులత్ ఆయన మీద రాసిన ‘ద చీఫ్ మినిస్టర్ అండ్ ద స్పై’ పుస్తకం ఏమీ ఫరూఖ్కు తెలియకుండా వెలువడలేదు. ‘‘ఫరూఖ్ అబ్దుల్లా మీద నా అవగాహనతో రాసిన నా కథ’’ అని రచయిత ముందుమాటలో చెప్పుకొన్న ఈ రచనకు ఫరూఖ్ మద్దతు ఉంది. దాని గురించి వారిద్దరూ ‘‘అనేకసార్లు మాట్లాడుకున్నారు.’’ ఆయన ‘‘కరో నా (కానీయ్)’’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే పుస్తకం వెలుగు చూసింది. కానీ పుస్తకం బయటకు వచ్చాక ఫరూఖ్ ఎంతో నొచ్చుకున్నారు. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఈ పుస్తకం ఒక ప్రశంసా గీతిక అనేది సత్యం. ‘నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అంటే ఫరూఖ్ అబ్దుల్లానే అనీ, ఆయన లేకపోతే ఎన్సీ ఎక్కడ ఉండేదో ఊహించలేమనీ పుస్తకం చెబుతుంది. అంతటి తోనే ఆగదు. ‘‘డాక్టర్ సాహిబ్ కేవలం ముఖ్యమంత్రి కారు, ఆయనే కశ్మీర్’’ అని తేల్చిచెప్తుంది. ఫరూఖ్ తన తండ్రి షేక్ అబ్దుల్లా కంటే గొప్ప వ్యక్తి అనీ, బహుశా ఆయనే నేడు దేశంలో అత్యున్నత నాయ కుడు అనీ దులత్ ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ ప్రశంస అతిశయోక్తి. కానీ, దులత్ దృష్టిలో అక్షర సత్యం.ఫరూఖ్ ఎదుర్కొన్న పలు సంక్షోభాల గురించి ఈ పుస్తకం చెబుతుంది. ఫరూఖ్ ‘‘శ్రీనగర్కు ఢిల్లీకి నడుమ వారధిగా ఉండాలని కోరుకున్నారు... ఆయన రాజకీయాల్లో ఉన్నది ఢిల్లీతో కలిసి పని చేయడానికే గానీ, వ్యతిరేకంగా కాదు.’’ కానీ సమస్య ఏమిటంటే, ఢిల్లీ ఆయన ఆలోచనను గ్రహించలేక పోయింది. ‘‘ఫరూఖ్ అబ్దుల్లాను, ఆయన ఆశయాలను ఢిల్లీ ఏనాడూ అర్థం చేసుకోలేదు... దేశ రాజధానికి అంతు చిక్కనిది ఏదో ఆయనలో ఉంది.’’ ఇది ఒక పార్శ్వమైతే, రెండోది – కశ్మీరు ప్రజలతోనూ ఆయన సంబంధాలు. అవి ఏనాడూ సవ్యంగా లేవు. ఢిల్లీ మీద కశ్మీర్ ప్రజలకు విశ్వాసం లేదు. ‘‘ఢిల్లీతో ఏ మాత్రం సంబంధం ఉన్నా సరే ఆ వ్యక్తులను, సంస్థలను వారు అనుమానిస్తారు.’’ ఈ క్రమంలో ‘‘ఇండియా పట్ల విధేయత కారణంగా ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబం కశ్మీరు పౌరుల ఆగ్రహానికి గురైంది.’’ ఫరూఖ్ అబ్దుల్లా అడకత్తెరలో పోకచెక్క అయ్యారు. ఢిల్లీకిచేరువ కావడం కోసం ఆయన ప్రయత్నించారు. కాని అక్కడ ఆయనకు పూర్తి ఆదరణ లభించలేదు. ఇక తాను దేని కోసం తపన పడుతున్నదీ తన సొంత ప్రజలకు అర్థం కాలేదు. వారి నుంచిమద్దతుకు బదులుగా అనుమానం, ఆగ్రహం ఎదుర్కోవలసివచ్చింది.కశ్మీరు రాజకీయాలను మిగతా దేశం నుంచి విడదీసిన క్లిష్ట సమస్య ఏమిటో దులత్ బాగానే అర్థం చేసుకున్నారు. ‘‘కశ్మీరు నాయ కులు కశ్మీరులో ఒక విధంగా మాట్లాడతారు, ఢిల్లీ వెళ్లి అక్కడ వేరేలా మాట్లాడతారు’’ అని ఆయన వివరించారు. ఆయన ఈ రెండు నాలుకల వైఖరిని కపటత్వంలా కాకుండా ‘ఫ్రెంచి భాష’లో పేర్కొనే ఒక రకమైన సభ్యతగా భావిస్తారు. వారున్న పరిస్థితిలో మనుగడ కోసం అలా మాట్లాడక తప్పదు. అది అవకాశ వాదం కాదు.దులత్ కథనం ప్రధానంగా ఫరూఖ్ అబ్దుల్లా ఎదుర్కొన్న మూడు నమ్మక ద్రోహాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. కశ్మీర్కు ప్రత్యేక అధికారాలను ఇచ్చిన 370వ అధికరణం రద్దు వాటిలో ఒకటి. దులత్ దీన్ని సరిగ్గా చెప్పలేక పోయారు. అది వేరే విషయం. మిగిలిన రెండూ ఫరూఖ్ మెచ్చేలానే రాశారు.మొట్టమెదటి ద్రోహం – 1984లో ఒక అర్ధరాత్రి జరిగింది.ఇందిరా గాంధీ ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి కూలదోశారు. అది ఆయన మనసులో మానని గాయాన్ని మిగిల్చింది. ‘‘... ఆయన దీన్నుంచి కోలుకున్నారని నేననుకోవడం లేదు’’ అని ఇందిరను తీవ్రంగా దుయ్యబడుతూ దులత్ వ్యాఖ్యానించారు. దీంతో ఫరూఖ్ విభేదిస్తారని నేను అనుకోను. రెండోది – 2002 నాటిది. వాజ్పేయి, అద్వానీ కలిసి ఫరూఖ్కు ఉప రాష్ట్రపతి పదవి వాగ్దానం చేశారు. అయితే, వారు తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేక పోయారు. వారి వాగ్దానానికి ‘‘ఫరూఖ్ఉప్పొంగిపోయారు... ఏదో ఒక రోజు భారత రాష్ట్రపతి కావాలన్నది ఆయన జీవితాశయం. దానికి ఇది తొలి మెట్టు అను కున్నారు.’’ దులత్, ఫరూఖ్ స్నేహబంధం ఇప్పుడు చిక్కులు ఎదుర్కొంటున్నా అది తెగేది కాదు. దులత్ తమను కలిపి ఉంచే ఆ బంధంపై ఇలా అంటారు. ‘‘డాక్టర్ సాహిబ్ నన్ను ఎంత నమ్మారో నేను ఎప్పటికీ తెలుసుకోలేను – ఆయన గురించి నాకు ఎంత తెలుసో ఆయన ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.’’ఏమైనప్పటికీ, దులత్ అవగాహనలో లోపాలు స్పష్టంగా కనబడతాయి. లేనట్లయితే, తనను విశ్వాసంలోకి తీసుకుని ఉంటే 370వ అధికరణం రద్దు విషయంలో సాయం అందించడానికి ఫరూఖ్ అబ్దుల్లా సుముఖమే అనే ఆరోపణ మీద దురదృష్టకరమైన ఈ వివాదం తలెత్తేదే కాదు. తన పుస్తకం మొదటి అధ్యాయంలోనే దులత్ ఇంతటి కీలకాంశం లేవనెత్తడం హాస్యాస్పదం.‘‘ఫరూఖ్ మూడు దశాబ్దాలుగా నాకు తెలిసి ఉన్నా, నాకు ఆయన నిజంగా తెలుసు అని పూర్తి నమ్మకంగా ఏనాడూ చెప్పలేను. అదీ డాక్టర్ సాహిబ్ అనే ప్రహేళిక. ఆయన్ను తెలుసుకోవడం అంత సులభం కాదు.’’ గత వారం తలెత్తిన వివాదం, దులత్ చెప్పిన అంశాన్నే విషాదకరంగా రుజువుచేసింది.-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-కరణ్ థాపర్ -
ప్రభుత్వ ప్రాయోజిత మత పక్షపాతం
కొత్త వక్ఫ్ చట్టాన్ని ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఒక తప్పుడు సంకే తాన్ని ఇస్తున్నాయి. ముస్లిం ధర్మాదాయ దేవాదాయ వ్యవహారాలను వక్ఫ్అంటారు. 1995 నాటి వక్ఫ్ చట్టం ఇప్పటి వరకు అమలులో వుంది. ఇప్పుడు దీన్ని ‘యునైటెడ్ వక్ఫ్ మేనే జ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్–2025 (యూడబ్ల్యూఎమ్ఈఈడీఏ)గా మార్చారు. వక్ఫ్ సవరణ బిల్లు ఏప్రిల్ 3న లోక్సభలో 288 – 232 ఓట్ల తేడాతో గెలిచింది. రాజ్యసభలో ఏప్రిల్ 4న 128 – 95 ఓట్ల తేడాతో గెలిచింది. ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడిపోయింది. ఇక్కడ ఒక విశేషం ఉంది. 543 మంది సభ్యు లున్న లోక్ సభలో ముస్లింలు 24 మంది మాత్రమే. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.అంటే 208 మంది ముస్లిమే తర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. అలాగే 245 మంది సభ్యులున్న రాజ్య సభలో ముస్లింలు 15గురు మాత్రమే. 95 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. అంటే 80 మంది ముస్లిమేతర సభ్యులు ముస్లింల పక్షాన నిలిచారు. రెండు సభల్లోనూ కలిపి ముస్లింల సంఖ్య 39 మాత్రమే. వాళ్ల పక్షాన నిలిచిన ముస్లిమేతరులు 288 మంది. కొత్త చట్టం రాజ్యాంగ ఆదర్శాలకు, హామీలకు విరుద్ధంగా ఉందనీ, దాన్ని పునఃసమీక్షించాలని కొన్ని సంఘాలు, కొన్ని రాజకీయపార్టీలు సుప్రీంకోర్టులో 70కు పైగా పిటీషన్లు వేశాయి. ఈ విషయంలోనూ ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ముస్లిమేతరుల సంఖ్య చాలా ఎక్కువ. మన దేశంలో వర్ధిల్లుతున్న మతసామరస్యానికి ఇది తాజా ఉదాహరణ. దీనికి విరుద్ధంగా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టానికి మద్దతు ప్రకటించాయి. ఒక బిల్లు ఉభయ సభల్లో మెజారిటీ సాధించి రాష్ట్రపతి ఆమోద ముద్రపడి చట్టంగా మారాక కూడ సుప్రీం కోర్టుకు చేరడం విశేషం. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. కొత్త చట్టంలో వివాదాంశాలు అనేకం ఉన్నాయి. ఇందులో నాలుగు అంశాలు మరింత తీవ్రమైనవి. వక్ఫ్ బోర్డులో, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో కొత్తగా ముస్లిమేతరులను అనుమతించడం తీవ్రమైన వివాదంగా మారింది. వక్ఫ్ భూముల్లో ‘వక్ఫ్ బై యూజర్’ సౌలభ్యాన్ని తొలగించి అది వక్ఫ్గా కొనసాగాలంటే రిజిస్ట్రేషన్ దస్తావేజులు చూపాలనడం ఇంకో వివాదాంశం. వక్ఫ్ ఆస్తి అవునో కాదో తేల్చడానికి జిల్లా కలెక్టర్లకు విశేషాధికారాలు కల్పించడం, కనీసం ఐదేళ్ళుగా ఇస్లామిక్ ధార్మిక ఆచరణను కొనసాగిస్తున్నవారు మాత్రమే వక్ఫ్ దానం చేయడానికి అర్హులు అనడం కూడా వివాదంగా మారింది. వక్ఫ్ భూములకు దస్తావేజులు చూపడం అసాధ్యమైన విషయం. 19వ శతాబ్దం ఆరంభం వరకు మన దేశంలో అసలు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ల సంప్రదాయమే లేదు. లార్డ్ కార్న్ వాలిస్ 1793లో తొలిసారిగా శాశ్వత భూమిపన్ను విధానాన్ని తెచ్చాడు. అది కూడా ఇప్పటి బెంగాల్, బిహార్, ఒడిశాప్రాంతంలో మాత్రమే. ఆ తరువాత థామస్ మన్రో మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీల్లో రైత్వారీ విధానాలను తెచ్చాడు. భారత దేశంలో 8వ శతాబ్దం నాటికే ఇస్లాం ప్రవేశించింది. ఇస్లాం ప్రవేశించిన వెయ్యేళ్ళ తరువాత మనకు దస్తావేజులు, రిజిస్ట్రేషన్ విధానాలు వచ్చాయి. అత్యున్నత న్యాయస్థానపు ధర్మాసనం సరిగ్గా ఈ అంశాన్నే పట్టించుకుంది. ‘మనం చరిత్రను తిరగరాయలేం’ అని భారత ప్రధాన న్యాయమూర్తి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు గుర్తుచేశారు. వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకతను ప్రదర్శించడమేగాక, రెండు మత సమూహాల సహవాసాన్ని కొత్త చట్టం ప్రోత్సహిస్తుందని, ముస్లింల గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నదని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ఇలా రెండు మతసమూహాల కలయిక ఒక ఆదర్శం అని కేంద్ర ప్రభుత్వం నిజంగానే నమ్ముతోందా? నమ్మితే హిందూ ధర్మాదాయ కమిటీల్లోనూ హిందూయేతరులకు స్థానం కల్పించాలిగా? సరిగ్గా ఈ ప్రశ్ననే భారత ప్రధాన న్యాయమూర్తి వేశారు. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు వక్ఫ్ భూములు వేటినీ డీ–నోటిఫై చేయరాదని ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.కేంద్ర ప్రభుత్వ వాదనను వినిపించడానికి ఒక వారం రోజులు గడువు ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ ధర్మాసనాన్ని కోరారు. ఇందులో ఒక కిటుకు ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా మరో మూడు వారాల్లో, మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఎలాగోలా ఈ సమయాన్ని సాగదీస్తే అనుకూ లమైన తీర్పు తెచ్చుకోవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.- వ్యాసకర్త సమాజ విశ్లేషకులు ‘ 90107 57776'- డానీ -
Dr B R Ambedkarవీళ్ళే ఇలా రాస్తే ఎలా?!
అంబేడ్కర్ జయంతికి కేంద్ర మంత్రులు అంబేడ్కర్పై పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఒకరు దీన్ని కాంగ్రెస్ విమర్శకు వాడుకుంటే, మరొకరు అంబేడ్కర్ నోట అబద్ధాలు కుక్కారు. వీటిని ఆదర్శాల పేరుతో భావితరాలకు బోధిస్తారట. ఆర్య దండ యాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తప్పు పట్టారనీ, సంస్కృతాన్ని అధికార భాషగా ఆమోదించడానికి మద్దతుగా రాజ్యాంగ సభలో సవరణను ప్రవేశపెట్టారనీ. హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి అని ప్రకటించారనీ ఇలా ఎన్నో అవాస్తవాలను రాశారు వారు. ‘‘ఇండో–ఆర్యులు ఇండియాకు వలస వచ్చి స్వదేశీయులను తరిమేశారు. వలస వాద, బ్రాహ్మణవాద కథనాలు కులాధిపత్య సమర్థనలు. ఆర్యులు సాంస్కృతిక భాషా సమూహం, ప్రత్యేక జాతి కాదు. రుగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాల్లోని విభేదాలు సామాజిక అంత ర్గత పోరాటాల ప్రతిబింబాలు. ఆర్య దండయాత్ర సూత్రం ఆర్యేతర శూద్రుల, దళితుల అణచివేత సాధనం.’’ అని రాశారు అంబేడ్కర్. ఆర్య సూత్ర జాతి సంస్కృతుల ఊహలను సవాలు చేశారు. యజుర్, అధర్వణ వేదాల రుషులు శూద్రు లకు తగిన ప్రాధాన్యమిచ్చినట్లు అంబేడ్కర్ అనలేదు. ‘‘శూద్రులు ముందు ఆర్య క్షత్రియుల్లో భాగం. జనశ్రుతి (శూద్రుడు) వైదికజ్ఞాన అభ్యాసం, కవశ ఐలూశ (శూద్రుడు) శ్లోకాల రచన సంగతులు ఈ వేదాల్లో ఉన్నాయి. వేదాలు శూద్రుల జాతి, సామాజిక హీనతను సమర్థించ లేదు. మనుస్మృతి ఆ పని చేసింది. బ్రాహ్మణ, ప్రత్యేకించి ఉపనయన, ఆచారాల విభేదాలతో వారిని నాల్గవ వర్ణానికి దిగజార్చారు. శూద్రుల ఉన్నత స్థాయి తగ్గింపునకు వేదకాలం తర్వాతి బ్రాహ్మణ నీతి ఇది’’ అని అన్నారు. అంబేడ్కర్ శూద్రులతో పోల్చి ఆర్యులను పొగడలేదు. ఆర్య ఉన్నత జాతి సూత్రీ కరణను తిరస్కరించారు. ద్రవిడ, నాగ, దాస తెగలు అనార్యుల్లో భాగమని, వారు ఆర్యు లకు ఏ విధంగానూ తక్కువ కారని అంబేడ్కర్ అభిప్రాయం. అంబేడ్కర్ అధి కార భాషగా సంస్కృతానికి మద్దతివ్వలేదు. సంస్కృతాన్ని ప్రజలు అతి తక్కువగా వాడు తారని, పాలనకు, ప్రజలు ఒకరితోనొకరు మాట్లాడుకోవడానికి సంస్కృతం ఆచరణీయం కాదనేది ఆయన అభిప్రాయం. హిందీని రుద్దడం హిందీయేతర భాషా ప్రాంతాల అణచివేతకుదారి తీయగల అపాయాన్ని జాగ్రత్తగా పరిగణించాలన్నారు. ఆంగ్లంతో పాటు హిందీ భారత ప్రజల లంకె భాషగా ఉండాలని అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాణ సభలో వాదించారు. మరిఅంబేడ్కర్ ఆదర్శాలను సంఘ్ సర్కారు ఆచరిస్తుందా? – సంగిరెడ్డి హనుమంత రెడ్డి,ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
50 years of Aryabhata ఆర్యభట్ట స్ఫూర్తితో...
విఖ్యాత భారతీయ శాస్త్రవేత్త సతీష్ ధావన్ నాయకత్వంలో 1975 ఏప్రిల్ 19న రష్యాలో కపుస్టిన్ యార్ కేంద్రం నుండి సోవియట్ కాస్మోస్–3 రాకెట్ ద్వారా ప్రసిద్ధ భారతీయ ఖగోళ – గణిత శాస్త్రవేత్త పేరుతో తయారుచేసిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట‘ (aryabhata satellite) ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది మన అంతరిక్ష సంస్థ ఇస్రో. ‘ఇండియా ఎంటర్స్ స్పేస్ ఏజ్’ అంటూ ప్రపంచ మీడియా మన ప్రయత్నాన్ని పెద్ద అక్షరాలతో కీర్తించింది. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యి 50 వసంతాలైన సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ఆర్యభట్ట గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఇస్రో, ఇండియా స్పేస్ ల్యాబ్ వంటి కొన్ని సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.360 కిలోగ్రాముల బరువు వుండి సౌర ఫలకాల ఆధారంగా పనిచేసే ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 96.46 నిమిషాల ప్రదక్షిణ కాలం పట్టే కక్ష్యలో, 611 కిలోమీటర్ల అపోజీ, 568 కిలోమీటర్ల పెరిజీ ఎత్తులో, 50.6 డిగ్రీల ఏటవాలులో ఉండే కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఎక్స్–రే ఖగోళ శాస్త్రం, వ్యవసాయశాస్త్రం, సోలార్ ఫిజిక్స్లో ప్రయో గాలు చేయడానికి, సూర్యుడి నుంచి వచ్చే న్యూట్రాన్లు, గామా కిరణాలను కొలవడానికి, భూమి ఐనోస్పియర్లోని పరిస్థితులను అన్వేషించడం తదితర లక్ష్యాలతో ఈ ప్రయోగాన్నిఇస్రో సోవియట్ యూనియన్ సహకారంతో చేపట్టింది. 50 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సమస్యలను సవాళ్లను అధిగమించాం. కొన్ని ఎగతాళి శబ్దాల మధ్య మౌనంగానే శత కోటి గుండెల సాక్షిగా చంద్రుని దక్షిణ ధ్రువపు ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సాయంతో గర్వంగా మన జాతీయ జెండాను నిలిపాం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంగారకుడిపై పరిశోధనల కోసం అన్వేషణ ఆరంభించి నవ చరిత్ర సృష్టించాం. సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం కోసం ఆదిత్య–ఎల్1 మిషన్ను ప్రయోగించాం. On this day in 1975, India launched its first satellite, Aryabhata, laying the foundation of India’s satellite programme.Today, India stands among the world’s leading spacefaring nations.#Aryabhata #IndianSpaceProgramme #ISRO@IndiaDST @isro @DrJitendraSingh @AshwiniVaishnaw… pic.twitter.com/YZMRazZfpD— Ministry of Information and Broadcasting (@MIB_India) April 19, 2025 నేడు ఆసియా – పసిఫిక్ప్రాంతంలోనే అతిపెద్ద ఉపగ్రహ సమాచార వ్యవస్థను కలిగి ఉన్నాం. డాకింగ్, అన్డాకింగ్ వంటి శాస్త్రీయ సామర్థ్యాలు కలిగిన నాలుగో దేశంగా అద్భుతాలు సాధించాం. గగన్యాన్ వంటి మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలతో పాటు 2030 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం. కేవలం ఐదు దశాబ్దాల కాలంలో ఒకే ప్రయోగంలో 100కు పైగా ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగే స్థాయికి ఎదిగాం. ముందు ముందు మరిన్ని అద్భుత విజయాలు మన పరం అవుతాయనడంలో సందేహం లేదు.– పి. అరుణ్ కుమార్, ఫిజిక్స్ రీసెర్చ్ స్కాలర్, పాలమూరు యూనివర్సిటీ(నేడు ఆర్యభట్ట ఉపగ్రహానికి గోల్డెన్ జూబ్లీ వేడుకలు) -
పటేల్కూ, నెహ్రూకూ పడదంటారా?
ఇండియా ఈ ఏడాది అక్టోబర్ 31నసర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంత్యుత్సవం జరుపుకోబోతోంది. జనం మర్చి పోయిన పటేల్ గుణగణాలు కొన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. తన సహోదరు లను ఆయన ఎంతో జాగ్రత్తగా చూసుకు న్నాడు. వల్లభ్కు నలుగురు సోదరులు. వారిలో ముగ్గురు తన కంటే పెద్ద వారు. ఆయన ఏకైక సోదరి దహిబా అందరికంటే చిన్నది. సంతానంలో మధ్యవాడు కాబట్టి వల్లభాయికి చిన్నతనంలో తగినంత మన్నన, ఆప్యాయత లభించలేదు. ఈ అనాదరణే ఆయనను ఒక వాస్తవవాదిగా, యోధుడిగా మార్చింది. తండ్రి ఝవేర్ భాయ్ ఎప్పుడూ ధనికుడు కాదు. పైగా కాలక్రమంలో ఉన్నది కూడా కరిగిపోయింది. వల్లభ్ తెలివైన వాడు, విశాల హృదయుడు. కాబట్టే, తోడబుట్టిన అయిదుగురి బాగోగులు, డబ్బు అవసరాలు తనే చూసుకున్నాడు.వల్లభ్ దయాగుణం నుంచి ఆయన చిన్నన్న విఠల్ భాయ్ అత్యధికంగా ప్రయోజనం పొందాడు. మన స్వాతంత్య్రోద్యమ హీరో కూడా అయిన విఠల్ 1933లో యూరప్లో అనారోగ్యంతో చనిపోయాడు. ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ ఆయనకు సుశ్రూషలు చేశాడు. విఠల్ భాయ్ 1925–30 కాలంలో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా వ్యవహరించాడు. ఈ ఇద్దరు సోదరులూ బొర్సాద్ (గుజరాత్) టౌనులో లాయర్లు. ఆ సమయంలో, వల్లభ్ లండన్ వెళ్లి బారిష్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన డబ్బు పొదుపు చేసుకుని పాస్ పోర్టు, టికెట్ సంపాదించాడు. అయితే వీజే పటేల్, ప్లీడర్, బొర్సాద్ పేరిట ఆయనకు వచ్చిన కవరును పోస్ట్మన్ అదే పేరుతో నమోదై ఉన్న సోదరుడు విఠల్ ఇంటికి బట్వాడా చేస్తాడు. దీంతో విఠల్కు తానూ ఇంగ్లాండు వెళ్లి బారిష్టరు కావాలన్న ఆలోచన వచ్చింది. ముందు నువ్వు వెళ్తే నీకంటే పెద్దవాడినైన నేను ఆ తర్వాత వెళ్లలేను. నీ పాస్ పోర్టు, టికెట్తో నేను లండన్ వెళ్తాను అని తమ్ముడిని కోరతాడు. వల్లభ్ సరే అనడమే కాకుండా విఠల్ లండన్ చదువుకు డబ్బు కూడా సమకూర్చాడు. ఆయన కుటుంబ భారాన్నీ మోశాడు. నాలుగేళ్ల తర్వాత 1910లో తనూ లండన్ వెళ్లి అద్భుత ప్రతిభ కనబరచి, 1912లో బారిష్టర్ పట్టాతో ఇండియా తిరిగి వస్తాడు. జైల్లో ఉండి కూడా సర్దార్ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తన సాటి సమర యోధులను ఎందరినో ఆర్థికంగా ఆదుకునేవాడని, వారి వైద్య ఖర్చులకు సాయం చేసేవాడని... పటేల్ జీవిత చరిత్ర కోసం 1987 ఏప్రిల్లో నేను ముంబాయిలో ఇంటర్వ్యూ చేసినప్పుడు మురార్జీ దేశాయ్ చెప్పారు. సాటి సమర యోధుల ఇక్కట్లను చూసి మన ఉక్కుమనిషి హృదయం ఇట్టే కరిగిపోయేది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జీవితంలో ఆయన ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అవి నేడు ఎంతమందికి తెలుసు? 1927 జులైలో పెను తుపాను రావడంతో గుజరాత్ విలవిల్లాడి పోయింది. ఆ సమయంలో బాధితులను ఆదుకునేందుకు అహ్మదా బాద్, పరిసర ప్రాంతాల్లోని ఎందరో ఆయన స్ఫూర్తితో ముందు కొచ్చారు. అప్పట్లో పటేల్ గుజరాత్ కాంగ్రెస్ కమిటీ, అహ్మదాబాద్ మునిసిపల్ కౌన్సిల్ రెంటికీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో కనబరచిన దక్షతను గుర్తించి బ్రిటిష్ రాజ్ అధికారులు ఆయనకు తగిన బిరుదు ఇవ్వజూపారు. సమాధానంగా ఆయన బిగ్గరగా ఒక నవ్వు నవ్వారు. ‘సర్ వల్లభ్ భాయ్’ అని పిలిపించుకుంటే చాలామందికి అప్పుడు ఇప్పుడు సంబరంగా ఉండేదేమో. కాని, ఖేదా జిల్లా వాసులైన ఝవేరీభాయ్, లద్భా దంపతుల ఈ బిడ్డ ఎంతో గట్టి మనిషిగా, ఎన్నో కీలక పర్యవసానాలకు కారకుడిగా భారత దేశ భావితరాలకు తన ముద్రను మిగిల్చి వెళ్లేవాడా?దాదాపు ఒక శతాబ్దం క్రితం 1920లలో మునిసిపల్ కౌన్సిల్ సారథిగా పటేల్ అహ్మదాబాద్ను ‘నడిపించాడు’. అలాగే జవహర్ లాల్ నెహ్రూ అలహాబాద్ ను ‘నడిపిస్తున్నాడు’. 1920–22 సహాయ నిరాకరణ ఉద్యమానికి 1930–33 శాసనోల్లంఘన ఉద్యమానికి మధ్య కాలమది. దేశం ఇతర ప్రాంతాల్లో, కోల్కతా మునిసిపాలిటీకి చిత్తరంజన్ దాస్, పాట్నా టౌన్ కౌన్సిల్కు రాజేంద్ర ప్రసాద్, ముంబాయి మునిసిపాలిటీకి విఠల్ భాయ్ పటేల్ సారథులుగా ఉన్నారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పుడు నేర్చుకున్న పాఠాలు ఎంతగానో ఉపకరించాయి. 1948లో, వల్లభ్ భాయ్ పటేల్ నగర పాలక పాత్రకు ముగింపు పలికి రెండు దశాబ్దాలు ముగిసిన సందర్భంగా, ముంబాయిలో ఆయనకు పుర ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. స్వతంత్ర భారత ఉప ప్రధాని ఆ సభలో మాట్లాడుతూ, ‘‘ మీరు ఎన్నో విజయాలు ప్రస్తావించారు. వాటిలో కొన్ని నేను సాధించినవి. కొన్ని నేను సాధించనివి. కాని అభ్యంతరం లేకుండా నేను అంగీకరించే ఒక విషయం: అహ్మదాబాద్ మునిసిపాలిటీకి నా శక్తివంచన లేకుండా సేవ చేశాను. స్వచ్ఛమైన ఆనందం పొందాను... నగరంలోని మురికిపై పోరాడితే మీకు రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. రాజకీయాలతో వ్యవహరించేటప్పుడు మీకు రాత్రి కూడా ప్రశాంతత ఉండదు’’ అని వ్యాఖ్యానించారు.నగర బాధ్యతల నుంచి వైదొలగిన తర్వాత పటేల్ అసాధారణ నాయకత్వ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. 1928లో గుజరాత్లోని బార్డోలీ ప్రాంత రైతాంగం మీద బ్రిటిష్ పాలకులు విధించిన పన్నులకు వ్యతిరేకంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆయన విజయవంతంగా నిర్వహించారు. అప్పుడే అక్కడి ప్రజలు పటేల్కు ‘సర్దార్’ బిరుదు ఇచ్చారు.1916 నుంచీ వల్లభ్ భాయ్ పటేల్– నెహ్రూలు స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా ఉన్నారు. అయితే, 1937లో ఇద్దరూ కలిసి గుజరాత్లో ఒక వారం రోజులు పర్యటించినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.ఇద్దరూ జట్టుగా పనిచేశారు. పటేల్కు మహాత్మా గాంధీ ఒక లేఖ రాస్తూ, ‘‘ మీరిద్దరూ కలిసినప్పుడు, మీలో ఎవరు గట్టివారో చెప్పడం కష్టం’’ అని వ్యాఖ్యానించారు. తర్వాతి సంవత్సరాల్లో పటేల్– నెహ్రూల నడుమ ఉద్రిక్తతలు, అపోహలు, అప్పుడప్పుడు పరుష భాషణలు తలెత్తాయి. ఏమైనప్పటికీ, స్నేహం, ఒకరి మీద మరొకరికి ప్రశంసా భావన, పరస్పర విధేయత, గాంధీ పట్ల ఉభయుల విధేయత, స్వాతంత్య్ర పోరాటం పెంచిన బంధం... వాటికంటే బలమైనవి.ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. సంబరాలు తెచ్చింది. వాటితో పాటే విభజన విషాదాలు ప్రజలు చవిచూశారు. తాము ఉభయులం ఒకరికొకరుగా ఉండటం ఎంత అదృష్టమో వల్లభ్ భాయ్ పటేల్– నెహ్రూలు గుర్తించారు. 1950 జనవరిలో గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి స్వతంత్ర భారత తొలి దేశాధిపతి పదవీకాలం ముగిసిన అనంతరం దేశానికి తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ వీరిరువురినీ ప్రస్తావిస్తూ, ‘‘ప్రధాన మంత్రి, ఆయన తొలి సహచరుడైన ఉప ప్రధాన మంత్రి కలిసి దేశాన్ని అన్ని విధాలాసుసంపన్నం చేసే గొప్ప ఆస్తి అయ్యారు. మొదటి వారు సార్వజనీన ప్రేమను, రెండో వారు సార్వజనీన విశ్వాసాన్ని చూరగొన్నారు’’ అని చెప్పారు. కాలం మారుతుంది. గడచిన దశాబ్దాలు మర్చిపోతారు. ఎడతెగని తప్పుడు ప్రచారం జరుగుతుంది. అది ఎంత హాని చెయ్యాలో అంత హాని చేస్తుంది. నెహ్రూ అవమానం పాలయ్యాడు. పటేల్ విగ్రహం ఆకాశాన్ని తాకుతోంది... కానీ, ఆయన జీవితానికి, ఆలోచనకు, ఆయన చేసిన కృషికి సంబంధించిన వాస్తవాలు పాతాళంలోకి వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 1940లు, 1950లు ఇంకా గుర్తున్న, పటేల్– నెహ్రూలు ఉభయులనూ కలిసిన, పటేల్ జీవితాన్ని పరిశోధించి ఆయన జీవిత చరిత్ర రాసిన నాలాంటి వాడు తనకు తెలిసిన వాస్తవాలు ఏమిటో చెప్పితీరాలి.కాబట్టి, వారిద్దరి మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల నుంచి కొన్ని వాక్యాలు ఉటంకించి ఈ వ్యాసం ముగిస్తాను. 1948 ఫిబ్రవరి 3న సర్దార్ పటేల్కు నెహ్రూ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఒకరికొకరం సన్నిహితంగా ఉంటూ, ఎన్నో తుపానులనూ, ఇక్కట్లనూ కలసి కట్టుగా ఎదుర్కొని పావు శతాబ్దం గడచిపోయింది. ఈ కాలంలో మీ పట్ల నా గౌరవాభిమానాలు పెరిగాయని పూర్తి నిజాయితీతో చెప్పగలను...’’1948 ఫిబ్రవరి 5న నెహ్రూకు సర్దార్ పటేల్ రాసిన లేఖ నుంచి: ‘‘మనం ఇద్దరం ఒక ఉమ్మడి లక్ష్య సాధనలో జీవితకాల మిత్రులు (కామ్రేడ్స్)గా ఉంటున్నాం. దృక్పథాలు స్వభావాలు విభేదించినా, మన దేశ అత్యున్నత ప్రయోజనాలు, మనకు ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమాభిమానాలు వాటిని అధిగమించేలా చేస్తూ మనల్ని కలిపి ఉంచుతున్నాయి.’’-వ్యాసకర్త సంపాదకుడు, ప్రముఖ రచయిత, ‘పటేల్ – ఎ లైఫ్’ గ్రంథకర్త-రాజ్మోహన్ గాంధీ -
నేపాల్ పరిణామాలకు బాధ్యులెవరు?
మహారాజు జ్ఞానేంద్రకు మద్దతుగా నేపాల్లో ఏదో ఒక ప్రాంతంలోఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఇవి నేపాల్లో ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మార్చ్ 28వ తేదీన ఇవి ఘర్షణ స్థాయికి చేరి ఇద్దరు వ్యక్తులు మరణించగా అనేకమంది గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. ఇందుకు మహారాజు, ఆయన మద్దతుదారులు బాధ్యులని ప్రభుత్వం ఆరోపించింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినందుకు రాజు 8 లక్షల రూపాయల జరి మానా చెల్లించాలని కూడా ఆదేశించింది. దీన్ని ప్యాలెస్ఖండించింది. మరోవైపు ప్రభువు మద్దతుదారులంతా నిధులు సేకరించి సొమ్ము చెల్లించటానికి సిద్ధమవుతున్నారు.ఒకప్పుడు రాచరికాన్ని కాదనుకున్న నేపాలీ సమాజం ఇప్పుడు రాజుకు ఎందుకు మద్దతు పలుకుతోంది? ఇందుకు నేపాల్ పాలకుల తీరే కారణం. 2008లో నేపాల్లో రాచరికం రద్దయిన తర్వాత 17 ఏళ్ల కాలంలో 18 ప్రభుత్వాలు నేపాల్ను పాలించాయి. ఏ ఒక్క ప్రభుత్వం కూడా సజావుగా పాలించిన రికార్డు లేదు. అవసరార్థం సర్దుబాట్లు చేసుకుని సంకీర్ణ ప్రభుత్వాలను నడిపారు. ఇప్పటి కేపీ ఓలి, షేర్ కుమార్ దుబా, ప్రచండ... ఇలా ప్రధానులంతా తీవ్ర అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న వారే. రాజకీయ అస్థిరత ఒకవైపు, అవినీతి మరోవైపు నేపాల్ను దారుణంగా దెబ్బతీశాయి. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఉపాధి అవకాశాలు తగ్గి పోయాయి. యువత దేశాన్ని వదిలి ఉపాధి కోసం బయట దేశాలకు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజు మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. రాచరికాన్నిరద్దు చేయటం వల్ల నేపాల్ సార్వభౌమాత్వానికి దెబ్బ తగిలిందనీ, తిరిగి రాజు అధికారం చేపడితే ప్రపంచ దేశాల్లో నేపాల్ గుర్తింపు సంపాదిస్తుందని భావిస్తున్న వాళ్లు కొందరు ఉన్నారు. మరొక అంశం ‘హిందూత్వ’. నేపాల్ను హిందూ స్టేట్గా మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇందుకోసం తెరవెనక ప్రయత్నాలు సాగుతున్నాయి. మహరాజు జ్ఞానేంద్ర ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో భేటీ కావటం, ఆయన ఫొటోలు నేపాల్ వీధుల్లో దర్శనం ఇవ్వటం వంటి ఇటీవల పరిణామాలు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. అల్లర్ల వెనక భారత్ ఉందని నేపాల్ ప్రభుత్వం ఆరోపించటానికి ఇది కూడా ఒక కారణమని మనం భావించవచ్చు. ఇప్పుడు చెలరేగుతున్న ఆందోళనలు రానున్న రోజుల్లో ఎటు దారితీస్తాయో తెలి యదు. నేపాల్లో ఆందో ళనలకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నాయకత్వం వహిస్తున్నా, ఇందులో అసాంఘిక శక్తులతో పాటు చైనా పాత్రను కొట్టేయలేం. చాలా కాలంగా చైనా ఆధ్వ ర్యంలో నేపాల్లో భారత్ వ్యతిరేక కార్యక్రమాలు సాగుతున్నాయి. దీనికి కమ్యూనిస్టు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. సరిహద్దులో ఆగడాలను చూసీ చూడకుండా వదిలేస్తోంది. భారత్తో సంబంధాలు దెబ్బ తిన్నప్పుడు రాజు జ్ఞానేంద్ర చైనాతో స్నేహంగా మసిలిన మాట నిజమే. అలాగని ఆయనకు ఇప్పుడుచైనా మద్దతుగా ఉంటుందని భావించలేం. నేపాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని యూఎస్, యూకే, ఇండి యాలు గుర్తిస్తున్నాయి. ప్రజాపాలన నుంచి రాచరికంలోకి మారినంత మాత్రాన నేపాల్ అభివృద్ధి ఫలాలను అందుకుంటుందని చెప్పలేం. రాజు అధికారంలోకి వస్తే అన్నీ సర్దుకుంటాయన్న భావన తార్కికంగా సమంజసంగా లేదు. మార్పు మంచిదే. అదీ అభివృద్ధికి తోవ చూపించినప్పుడే కదా? డా.పార్థసారథి చిరువోలు సీనియర్ జర్నలిస్ట్ -
పెరుగుతున్న మత సమ్మతి
దేశంలో మతతత్వం పెరిగిపోతోంది. కొన్నే ళ్లుగా ఈ ధోరణి మరీ ఎక్కువైంది. అడు గడుక్కీ గుళ్లు, మసీదులు వెలుస్తున్నాయి. నేనీ మధ్య తెలంగాణ వెళ్లాను. చిన్న పల్లె టూళ్లలో సైతం రెండు మూడు దేవాలయాలు ఉన్నాయి. హిందువులకు దేవుళ్లు చాలామంది, కాబట్టి గుళ్ళు కూడా ఎక్కువ గానే ఉంటాయి అనుకోవడం పొరపాటు. హిందూ సమాజం కులాలు, గోత్రాలు, జాతులు,వంశాలుగా చీలిపోయి ఉంది. గుళ్లు గోపురాలు అసంఖ్యాకంగా పుట్టుకురావడానికి ఈ భిన్నవర్గాల సమాజం ఒక ప్రధాన కారణం.జనంలో పెరుగుతున్న వ్యాపార దృష్టి ఇందుకు మరొక ముఖ్య కారణం అనిపిస్తోంది. పౌర సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తు న్నాయి. ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ ఏజెంట్లకు, బళ్లపై పళ్లు అమ్ముకునే వారికి, అనేకానేక చిల్లర పనులకు రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ‘లైసెన్స్’లు ఇచ్చి డబ్బు పోగేసు కోవడం మనకు తెలుసు. గ్రామాల్లో సైతం ఈ తరహా సంస్కృతి విస్తరించింది. గ్రామ కమిటీలు అంటూ తయారయ్యాయి. ఇవీ ఇదే మాదిరిగా కొత్త ఆదాయ మార్గాలు కనిపెట్టాయి. ఇసుక మైనింగు, అక్రమ మద్యం అమ్మకాల వంటి కార్యకలాపాలను ఈ కమిటీలు నియంత్రిస్తున్నాయి. ఆ డబ్బును ప్రజల రోజువారీ జీవితాలను బాగు పరచేందుకు వాడతారా అంటే అదీ లేదు. బహుశా ఇక్కడికంటే పరలోకపు జీవితాలకు గిరాకీ ఎక్కువలా ఉంది. అందుకే, ఇలా ఆర్జించిన డబ్బును గుళ్లు కట్టడానికి వాడుతున్నారు.పెరుగుతున్న భక్తిమతం ఇప్పుడు రాజకీయాల్లో కంటే ఆర్థిక రంగంలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పర్యాటక ఆదాయం వాటా 9.6 శాతం. ఇందులో దేశీయ పర్యాటకం 88శాతం. గతేడాది ఇండియా సందర్శించిన విదేశీ పర్యాటకులు కేవలం 90 లక్షలు కాగా, స్థానిక యాత్రికుల సంఖ్య కళ్లు చెదిరేలా 14 కోట్లను దాటింది. కేంద్ర ప్రభుత్వాలు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఢిల్లీ–ఆగ్రా–జైపూర్ ‘స్వర్ణ త్రిభుజం’ మీద అధిక శ్రద్ధ పెడుతుంటాయి. వాస్తవానికి తమిళనాడు సందర్శించేవారు అత్యధికంగా 20 శాతం ఉన్నారు. ఢిల్లీ పర్యాటకులు వారిలో సగం ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలు దేశవిదేశాల టూరిస్టులను ఆకర్షించడంలో ముందు వర సలో నిలుస్తాయి. కారణం – మతపరంగా ప్రముఖమైన తిరుపతి, మదురై వంటి ప్రదేశాలు వీటిలో ఎక్కువగా ఉండటమే. తిరుపతి వల్ల ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అతిపెద్ద దేశీయ పర్యాటక ప్రదేశంగా రూపొందింది. రెలిజియస్ టూరిజం ఇప్పుడు అతిపెద్ద వ్యాపారం. గడచిన నాలుగైదు ఏళ్లలో గతంలో కంటే అధికంగా మతం మీద మమకారం పెంచుకున్న భారతీయులు 25 శాతం పైగానే ఉన్నారని ‘ప్యూ’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ యాటిట్యూడ్’ సర్వే తేల్చింది. ఇది ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. అన్ని మతాల్లోనూ ఈ ధోరణి కనబడింది. మతం ఎంతో ముఖ్యమైందని భావిస్తున్న వారు 2007–15 మధ్య ఏకంగా 80 శాతానికి పెరిగారు. 11 శాతం పెరుగుదల! ఎన్ఎస్ఎస్ఓ (నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్) నివేదిక ప్రకారం, మత ప్రదేశాల సందర్శనలపై చేసిన సగటు వ్యయం ఇదే కాలంలో రెట్టింపు కంటే ఎక్కువైంది. మత వ్యాపారానికి ఆకాశమే హద్దు (ఇందులో శ్లేష లేదు). ఇది ఉపాధి అవకాశాలు పెంచవచ్చు. సంతోషమే! మరి మత భావన పెరుగుతూ పోవడం వల్ల తలెత్తే ఇతర పరిణామాల మాటేమిటి? సమాజంలో మూఢనమ్మకాలు, అంధభక్తి, మతపిచ్చి పెచ్చరిల్లుతాయి. ఒక ఆధునిక సమాజంగా ఇండియా ఆవిర్భవించకుండా ఇవి అడ్డుపడే ప్రమాదం ఉంది. లాభదాయక వ్యాపారంగుళ్లు లేదా మసీదులు నిర్మించడం లాభదాయక వ్యాపారం.అందుకే, ప్రార్థనా మందిరాల పేరిట నీతి లేని మనుషులు బహిరంగ ప్రదేశాలను కబ్జా చేయడం రివాజుగా మారుతోంది. ఒకసారి దేవుళ్ల విగ్రహాలు ప్రతిష్ఠిస్తే, ఇక వాటిని ఎవరూ తొలగించలేరు. నగరాల్లో ట్రాఫిక్ చిక్కులకు ఈ నిర్మాణాలే చాలావరకు కారణాలు.సంత్ కబీర్ దాసు ఎంతో సరళంగా చెప్పిన కవితను ఈ సంద ర్భంగా నేను ప్రస్తావిస్తాను: ‘రాతిని పూజించడం వల్ల దేవుడు లభిస్తే, నేను పర్వతాన్ని పూజిస్తాను. కానీ ఈ చక్కీ (తిరగలి రాయి)మంచిది, ఎందుకంటే ఇది ప్రపంచాన్ని పోషిస్తుంది’. చేదు నిజం ఏమిటంటే, రాతి విగ్రహం తిరగలి రాయి కంటే మంచి ప్రతిఫలం ఇస్తోంది. మతభావన, మతపిచ్చి వ్యాపారంగా మారబట్టే, ప్రభు త్వాలు సైతం ‘రెలిజియస్ టూరిజం’కు పెద్దపీట వేస్తున్నాయి.వాస్తవానికి, ‘మీ విగ్రహం కంటే మా విగ్రహం మంచిది’ అనే రీతిలో ఒక కనిపించని పోటీకి దారి తీస్తోంది. తిరుమల ఆలయం ఇండియాలోనే అతి పెద్ద ‘మనీ స్పిన్నర్’. ఈ వైష్ణవ ఆలయాన్ని ఏటా 4 కోట్ల మంది దర్శించుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్టను పెద్ద మత పర్యాటక కేంద్రంగా ప్రమోట్ చేస్తోంది. సీపీఎం కమ్యూనిస్టు ప్రభుత్వ హయాంలో కేరళ దేవాలయ బోర్డులు విగ్రహాల ‘మహిమల’ గురించి ప్రచారం చేస్తున్నాయి. దేవుడు మానవుడి ఊహాకల్పన అంటూ మనల్ని హేతుబద్ధంగా ఆలోచింప జేయాల్సిన సిద్ధాంతం ఆ ప్రభుత్వానిది. కానీ మాస్కో రెడ్ స్క్వేర్ , చైనా తియనాన్మెన్లలో మమ్మీలుగా మారిన శవాల నుంచి స్ఫూర్తి పొందే సిద్ధాంతం నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం?బహిరంగ సమర్థనా?మన తొలి ప్రధాన మంత్రి, నవ భారత వ్యవస్థాపక పితా మహుడు జవహర్లాల్ నెహ్రూ దేశం శాస్త్రీయ దృక్పథంతోముందుకు సాగాలని తలచారు. ఇప్పుడేం జరుగుతోంది? పిడివాదం, అంధవిశ్వాసం మనల్ని నడిపిస్తున్నాయి. మతం, మూఢభక్తి దేశానికి ప్రమాదకరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సమాజంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నెహ్రూ ఎప్పుడూ ప్రార్థనా స్థలాలు సందర్శించలేదు. విశ్వాసి అయినప్పటికీ ఇందిరా గాంధీ సైతం ఆలయాలకు దూరంగానే ఉండే వారు. అయితే ఆమె మనవడు రాహుల్ గాంధీ బొట్టు పెట్టుకుని గుళ్ల చుట్టూ తిరుగుతున్నారు. జంధ్యం కూడా ధరిస్తానని ప్రకటించారు. తాను శివభక్తుడిననీ చెప్పుకొంటారు. అమిత్ షా కూడా అదే చేస్తారు. ఇద్దరికీ కావల్సింది ఓట్లు! రేపిస్టుగా రుజువైన రామ్ రహీం సింగ్ను నరేంద్ర మోదీ ప్రశంసించడం అతడి నుంచి రాజకీయ మద్దతు ఆశించే కదా? రాజ్యాంగ పరిరక్షకులు, ప్రముఖ వ్యక్తులు ఆర్భాటంగా మత స్థలాలు సందర్శించడం పెరిగింది. గతేడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల ఆల యంలో ప్రార్థనలు చేయడం మనకు తెలుసు. అంతకు ముందు ఏడాది మోదీ కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాలు దర్శించారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ తిరుమల ఆలయంలో బాహాటంగా పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాథాలయంలో ఆయన అవమానం పాలైనట్లు వార్తలు వచ్చాయి. ప్రధాని కేదార్నాథ్ లేదా అయోధ్య సందర్శించినా, మరొకరు అజ్మీర్ షరీఫ్ వెళ్లినా అది వాటిని ఆమోదించడమే అవుతుంది. అలా వెళ్లడం... షారుఖ్ ఖాన్ కోక్ బ్రాండ్కు ప్రచారం చేయడం కంటే భిన్నమైనమీ కాదు.- వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయిత- mohanguru@gmail.com -
Doon School మార్పు మంచిదే... ఆత్మనే మార్చకూడదు కదా!
‘డూన్’ స్కూల్లో బాలబాలికలు కలిసి చదువుకోవడాన్ని (కో–ఎడ్యుకే షన్) ప్రవేశపెట్టాలా? ఇది కొత్త ప్రశ్నేం కాదు. 2010లో చివరిసారి దీనిపై చర్చ జరిగింది. అప్పటి రాష్ట్ర పతి ప్రతిభా పాటిల్ స్కూల్ 75వ ఫౌండర్స్ డే కార్యక్రమంలో ఈ అంశం ప్రస్తావించారు. ఆమె ప్రతిపా దన విని మగపిల్లలు ముసిముసిగా నవ్వుకున్నారు. ఈ ఆలోచన వారి గుండెల్లో వెచ్చదనం నింపి వుంటుంది. పెద్దవారికి మాత్రం ఇదేం రుచించలేదు. కేవలం మగపిల్లల కోసం నెలకొల్పిన డూన్ స్కూల్ ఇండియాలోనే ప్రతిష్ఠాత్మక ఆశ్రమ పాఠశాల (బోర్డింగ్ స్కూలు) అని యాజమాన్యం భావిస్తుంది. సమాజంలో లింగ సమానత్వం ఉండాలన్న భావనతో ప్రతిభా పాటిల్ ఈ వ్యాఖ్య చేసి ఉంటారని ఆహూతులు భావించారు. ‘వెల్హామ్ గరల్స్’ లేదా ‘మహారాణి గాయత్రీ దేవి’ లేదా ఇండియాలో ఉన్న అనేక ‘లొరాటో కాన్వెంట్స్’ స్కూళ్లు ‘గరల్స్ ఓన్లీ (బాలికల) పాఠశాలలుగానే కొనసాగు తున్నాయి. అందుకు లేని అభ్యంతరం డూన్ స్కూల్ విషయంలో ఎందుకు? తొలుత ఎలా ప్రారంభమయ్యాయో అలాగే కొనసాగే హక్కు స్కూళ్లకు ఉండాలి. ఇది కో–ఎడ్యుకేషన్కు వ్యతిరేక వాదన అని పొరబడకండి. స్కూళ్ల హక్కుకు సంబంధించిన సమర్థన మాత్రమే. వాస్తవానికి, మనకు కో–ఎడ్యుకేషన్ విద్యాసంస్థలు ఉండి తీరాల్సిందే. ఇందులో ఎలాంటి సందే హం లేదు. అదే విధంగా, కేవలం బాలురకు, అలాగే కేవలం బాలికలకు మాత్రమే ఉద్దేశించిన పాఠశాలలూ ఉండాలి.15 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రశ్న మీద చర్చ మొదలైంది. 2010లో మాదిరిగా ఏదో యథాలాపంగా కాకుండా, ఈఅంశం మీద ఇప్పుడు పకడ్బందీగా చర్చ జరుగుతోంది. ప్రపంచం మారుతోంది. సమతుల్యం, సమ్మిళితం, వైవిధ్యం... వీటితో కూడిన విద్యాభ్యాస వాతావరణాన్ని కో– ఎడ్యుకేషన్ అందిస్తుంది. బాయ్స్ ఓన్లీ స్కూళ్లలో సాంప్ర దాయిక పురుషత్వ భావనలతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుంది. సహవిద్యే దీనికి విరుగుడు. పరస్పరం ఎలా గౌరవించుకోవాలో, ఒకరి నుంచి మరొకరు ఎలా నేర్చు కోవాలో బాల బాలికలు ఉభయులకూ కో–ఎడ్యుకేషన్ వ్యవస్థ నేర్పిస్తుంది. ఇదీ ప్రస్తుతం డూన్ స్కూల్ సహవిద్యకు అనుకూలంగా సాగుతున్న వాదన. వీరు లేవనెత్తుతున్న ఈ అంశాలతో ఎలాంటి పేచీ లేదు. ఇవి మంచి వాదనలు. అయితే, వీటిని తోసిపుచ్చేందుకూ ఇంతే బలమైన, ముఖ్య మైన ఇతర కారణాలు ఉన్నాయి.డూన్ స్కూల్కు ఒక గుర్తింపు ఉంది. అది దాదాపువందేళ్ల పురాతనమైంది. ఎవరెన్ని చెప్పినా, సంప్రదాయం ముఖ్యమైంది. ‘మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి’ అంటూ సంప్రదాయాన్ని గాలికి వదిలేయ కూడదు. సహవిద్యా విధానం అనేది డూన్ స్కూల్ అస్తిత్వాన్నీ, వ్యవస్థాపకుడి ఆశయాన్నీ మౌలికంగా మార్చివేస్తుంది. కాబట్టే, ఇంగ్లండులో అనేక వందల ఏళ్ల సుప్రసిద్ధ చరిత్ర కలిగిన ఈటన్ కాలేజీ, హ్యారో పాఠశాలలు మారలేదు.స్కూల్ సంస్కృతినీ ఈ సందర్భంగా మనం పరిగణన లోకి తీసుకోవాలి. దాదాపు శతాబ్ద కాలం నుంచీ డూన్ కొన్ని విలువల ప్రాతిపదికగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అక్కడ విద్యార్థుల ఆలనాపాలన; గురువులతో, పాత విద్యార్థులతో విద్యార్థుల స్నేహపూర్వక సాన్నిహిత్యం ఎన్నదగినవి. కో-ఎడ్యుకేషన్ అయినా, కాకున్నా కొన్ని ఇతర ప్రముఖ పాఠశా లలకూ ఇలాంటి ఔన్నత్యం ఉంటుంది. కాదనడం లేదు. మరో ముఖ్యమైన వాస్తవం ఏమిటంటే, కో–ఎడ్యుకేషన్ విద్యాసంస్థగా అవతరించడానికీ, అందుకు అవసరమైన వస తులు కల్పించడానికీ, ఇతర మార్పులు చేయడానికీ డూన్ క్యాంపస్ ఎంతమాత్రం సరిపోదు. అయినా సరే బాలికలకు ప్రవేశం కల్పించాలీ అంటే బాలుర సంఖ్యను కుదించాల్సి వస్తుంది. నిజంగా ఇది అవసరమా? మేయో కాలేజీని సహవిద్యాభ్యాస సంస్థగా మార్చక పోవడానికి బహుశా ఇదే కారణమై ఉంటుంది. బదులుగా, ‘మేయో గరల్స్ స్కూల్’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డూన్ స్కూలుకు కూడా ఈ అవకాశం ఉంది. నిజానికి, ఇలా చేయడం మరింత అర్థవంతంగా ఉంటుంది.డూన్ స్కూల్ విషయంలో ఈ చర్చ కంటే ముఖ్యమైంది... స్కూలు పనితీరు విద్యాపరంగా మెరుగుపడాలి. క్రీడా సదుపాయాలు పెరగాలి. అలాగే ఇతర మౌలిక సదు పాయాలు పెంచాలి. ఇవన్నీ సమకూర్చుకోవడమే స్కూలు ప్రథమ ప్రాధాన్యం! కో–ఎడ్యుకేషన్ కాదు!!డాస్కోస్ (డూన్ స్కూల్ బాయ్స్ తమకు తాము పెట్టుకున్న పేరు)కు అమ్మాయిల ప్రపంచం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎవరూ కాదనరు. దగ్గర్లోనే ఉన్న వెల్హామ్ వంటి గరల్స్ స్కూల్స్తో డూన్ భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. వెల్హామ్లో డాస్కోస్ అక్కలు, చెల్లెళ్లు, కజి¯Œ ్స చాలామంది చదువుతుంటారు. ఉభయులూ కలిసి అనేక విద్యా, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి చేపట్టడం సాధ్యమే. కో–ఎడ్యుకేషన్ కంటే ఇది సరైనది. అర్థవంతంగానూ ఉంటుంది. మార్పు అనేది ఇతర సంస్థలకే పరిమితం కాదు. డూన్ స్కూల్ కూడా ఎప్పటికప్పుడు మార్పును అందిపుచ్చు కోవాలి. అంటే దాని మౌలిక స్వరూపమే మారాలని కాదు. మార్పును స్వాగతించడం నిర్మాణాత్మకమైనది. పరిపూర్ణత్వం కోసం పొరపాటు లక్ష్యాన్ని నిర్ణయించి, ఏదో మంచి జరుగు తుందనే నమ్మకంతో అసలు ఆత్మనే మార్చాలనుకోవడం విధ్వంసాత్మకం. అమూల్యమైన, గౌరవనీయమైన ఒక బాయ్స్ స్కూల్గా కొనసాగే హక్కును డూన్ స్కూల్ ఇప్పటికే సాధించింది. అలా కొనసాగనిద్దాం.-కరణ్ థాపర్ సీనియర్ జర్నలిస్ట్ -
గనులకై యుద్ధం
మధ్యభారత అరణ్యాలలో ఆదివాసుల మీద, ఆదివాసుల జల్, జంగల్, జమీన్, ఇజ్జత్ పోరాటానికి మద్దతు ఇస్తున్న మావోయిస్టుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి గట్టడం, ఆ ప్రాంతంలోని అపారమైన, సంపన్నమైన ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే వ్యూహంలో భాగమే అని దాదాపు ఇరవై సంవత్సరాలుగా పరిశీలకులు, విమర్శకులు ఎందరో రాస్తున్నారు. సల్వా జుడుం పేరుతో 2005లో పాలకులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిన ఆదివాసుల మధ్య అంతర్యుద్ధం నుంచి, ఇప్పుడు 2026 మార్చ్ 31 నాటికి మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ తయారు చేస్తామని ముహూర్తం నిర్ణయించి మరీ సాగిస్తున్న ఆపరేషన్ కగార్ దాకా మధ్య భారత అరణ్యాలలో చాలా నెత్తురు ప్రవహించింది. చివరి యుద్ధం అని చెప్పుకొంటున్న ప్రస్తుత దశ మొదలైన 2024 జనవరి 1 నుంచి గడచిన పద హారు నెలల్లో 400 మందికి పైగా ఆదివాసులను, మావోయిస్టులను భద్రతా బలగాలు చంపివేశాయి.ఖనిజ వనరుల కోసమే!ఈ మారణకాండ అంతా ఆదివాసులను భయభ్రాంతులకు గురిచేసి, స్వస్థలాల నుంచి వారిని నిర్వాసితులను చేసి, వారి కాళ్లకింది నేలలో నిక్షిప్తమైన సంపన్న ఖనిజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడానికే అని విమర్శకులు చేస్తున్న అభియోగం నిజమేనని చూపే పరిణామాలు జరుగు తున్నాయి. కార్పొరేట్ సంస్థల రక్షణ కోసం లెక్కలేనన్ని భద్రతా బలగాల క్యాంపులు నిర్మాణమవుతున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర్ సీమా బల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి సరిహద్దులను రక్షించవలసిన బలగాలు ఇప్పుడు మధ్య భారతంలో ఉన్నాయి. ఆ బలగాలను తీసుకుపోవడానికీ, తవ్విన ఖనిజాన్ని బైటికి తీసుకురావడానికీ నాలుగు లైన్ల, ఆరు లైన్ల రహదారుల నిర్మాణం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వేగంగా జరిగిపోతున్నది. ఈ ‘అభివృద్ధి’ కార్యక్ర మానికి అడ్డు వస్తారనే అనుమానం ఉన్నవాళ్ల మీదికి డ్రోన్లతో నిఘా, వైమానిక బాంబు దాడులు, వేలాది కాల్బలాలతో జల్లెడ పట్టి, చుట్టుముట్టి, ఎటువంటి ప్రతిఘటన లేకపోయినా కాల్చి చంపి ఎదురుకాల్పుల కథనాలు విడుదల చేయడం జరుగు తున్నది.ఆ వరుసలోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అత్యుత్తమ స్థాయి ఇనుప ఖనిజం (హెమటైట్) గనులను వేలం వేయడానికి శరవేగంతో ప్రయత్నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖనిజ వనరుల శాఖ 2025 జనవరి 15న సరిగ్గా ఈ హత్యాకాండల వార్తలు వస్తున్న దంతెవాడ, కాంకేర్ జిల్లాలలోని ఇనుప ఖనిజం గనుల బ్లాకులు నాలుగింటిని వేలం వేసే ప్రక్రియ ప్రారంభించింది. వీటిలో బైలదిల్లా గనులుగా ప్రఖ్యాతమైన ఖనిజ వనరుల కొండలు దంతెవాడ జిల్లా కిరండుల్ నుంచి బీజాపూర్ జిల్లా గంగలూరు దాకా వ్యాపించి ఉన్నాయి. బైలదిల్లా డిపాజిట్ 1ఎ, 1బి, 1సి, కాంకేర్ జిల్లాలోని హాహాలొద్ది అనే ఈ నాలుగు బ్లాకుల వేలం ప్రక్రియ ఫిబ్రవరి 28 దాకా సాగి, 58 ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడ్డాయి. చివరికి మూడు గనులను ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా, ఒక గనిని రూంగ్టా స్టీల్ దక్కించుకున్నాయి. ఈ రెండు కంపెనీలు కూడా ప్రభుత్వ వేలంపాటలో ప్రతిపాదించిన కనీస ధర కన్నా 154 శాతం, 160 శాతం ఎక్కువకు పాడు కున్నాయంటే, అక్కడ వారికి ఎంత లాభం చేకూరే అవకాశం ఉందో ఊహించవచ్చు. ఈ గనుల లీజు యాభై సంవత్సరాల పాటు ఉంటుంది గనుక ఇది రేపో మాపో వట్టిపోయే ఆవు కూడా కాదు, కామధేనువు! ఇప్పటివరకూ బైలదిల్లా గనుల్లోకి ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) తప్ప ప్రైవేటు కంపెనీలు ప్రవేశించలేదు. ఇప్పటివరకూ ఆర్సెలార్ మిత్తల్ తనకు అవసరమైన ఖనిజాన్ని ఎన్ఎండీసీ నుంచి తీసుకుని పైప్ లైన్ ద్వారా విశాఖపట్నం పంపుతుండేది. ఇప్పుడీ వేలంతో ఆ కంపెనీకి సొంత గనులు వచ్చాయి. వీటిలో బైలదిల్లా 1ఎ, 1బి ఒక్కొక్కటీ 2,100 ఎకరాలు, 1సి 1,976 ఎకరాలు, హాహాలొద్ది 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ నాలుగు బ్లాకులతోనే దట్టమైన దండకారణ్యంలో దాదాపు ఏడు వేల ఎకరాల అడవి నేలమట్టమైపోయి ‘అభివృద్ధి’ జరగబోతున్నది. ఈ నాలుగు బ్లాకులూ కలిసి దాదాపు ముపై్ఫ కోట్ల టన్నుల ఉత్తమశ్రేణి ఖనిజం తవ్వబోతున్నారు. ఇటువంటి లెక్కలలో తాము కాగితాల మీద పొందినదానికన్న ఎక్కువ విస్తీర్ణపు గనులు తవ్వి, మరింత ఎక్కువ ఖనిజాన్ని దోచుకుపోవడం అందరికీ తెలిసిందే. వేలం ప్రక్రియలో చెప్పిన మేరకే తవ్వుతారని అనుకున్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారమే ఈ నాలుగు గనుల ఖనిజం విలువ ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు. కాగా, ప్రభుత్వానికి దక్కే ఆదాయం ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే! ఈ రాష్ట్రంలో ఇంతకుముందే ఎన్ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వ ఛత్తీస్గఢ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సీఎండీసీ)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పరచి, గనులకు పర్యావరణ అనుమతులు సంపాదించి, ఆ గనులను తవ్వకం, ఖనిజాభివృద్ధి కార్యకలాపాలకు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు ఇచ్చింది. ఖనిజ సంపన్నమైన ఈ రాష్ట్రంలో ఇప్పటికే అంబుజా, బిర్లా, ఎస్సార్, జిందాల్, జె కె లక్ష్మి, లఫార్జ్, ఎల్ అండ్ టి, వేదాంత వంటి కార్పొరేట్ దిగ్గజాలన్నీ ఉన్నాయి. ఇది పలు రకాల సమస్యఇది ఆదివాసులకో, మావోయిస్టులకో సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది ముహూర్తాలు నిర్ణయించి మనుషులను చంపవచ్చునా అనే మానవతా సమస్య, నాగరికతా సమస్య. పర్యావరణ సమస్య, దేశ సంపద ఎవరికి చెందాలనే సమస్య, అటవీ హక్కుల చట్టం, పంచాయత్ రాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం వంటి చట్టాల ఉల్లంఘన సమస్య. రాజ్యాంగ ఆదర్శాలు, ప్రజల హక్కులు అమలవుతున్నాయా అనే సమస్య. మనందరి సమస్య!ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘శాంతము లేక సౌఖ్యము లేదు...’!
‘శాంతము లేక సౌఖ్యము లేదు...’ అన్న త్యాగరాజ కీర్తన సంగీత కచేరీలలో ఎక్కువగా కనిపించదు. పాత రోజులలో నాగయ్య, భాను మతి వంటివారు సినిమాలలో ఈ పాట పాడటం వల్ల, ఆ పాటకూ, మాటకూ బాగా ప్రాచుర్యం ఉండేది.ఎవరికయినా అకస్మాత్తుగా కోపం బుస్సుమని పొంగివస్తే, చను వున్న సన్నిహితులు, ‘నాయనా! కోపం తగ్గించు. శాంతము లేక సౌఖ్యము లేదు!’ అని త్యాగరాజు గారి పల్లవిని సామెతగా, సుభాషితంగా వాడటం శిష్ట సమాజంలో ఇప్పటికీ అప్పుడప్పుడూ వినిపిస్తుంది.‘తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష!’ అన్న విషయం అందరికీ అనుభవవైక వేద్యమే. కోపాన్ని దూరంగా ఉంచేవాడికి, సుఖ సంతోషాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి, దార, సుతులు, ధన, ధాన్యములుండిన, / సారెకు జప, తప సంపదలుండిన, / ఆగమ, శాస్త్రములన్నియు చదివిన,.../ భాగవతు లనుచు బాగుగ పేరైన, / శాంతము లేక సౌఖ్యము లేదు! అన్న అయ్య వారి మాట వరహాల మూటే. అయితే, ఇక్కడ ‘శాంతం’ అంటే, క్రోధ రాహిత్యమనీ, కోపం లేకుండా వ్యవహరించటమనీ మాత్రమే అర్థం చెప్తే, అదీ మంచి మాటే! కానీ అది కొంచెం పరిమితమైన అర్థం. వాస్తవానికి, చివరి దాకా చూస్తే, త్యాగయ్య గారంటున్నది, ‘... త్యాగ రాజ నుత! సాధురక్షిత! తనకు ‘ఉప/శాంతము’ లేక సౌఖ్యము లేదు!’ అని. ఉపశాంతం అంటే ఉపశమనం, శమింపజేయటం, నియంత్రించటం! కామ క్రోధ లోభాది ఆరు అంతశ్శత్రువులనూ అదుపులో ఉంచటం. క్షణికోద్రేకం కట్టలు తెగకుండా చూడటం. ఇంద్రియ కాంక్షల విజృంభణను నిగ్రహించటం. ఒత్తిళ్ళ వల్ల ఓర్పు కోల్పోకుండా,సంయమనంతో స్పందించటం. అటు లౌకిక విషయాలలో గానీ, ఇటు ఆధ్యాత్మిక సాధనలలో గానీ పురోగతి కోరేవాడికి, ఇది అత్యావశ్యకమైన గుణం అనడంలో సందేహానికి ఆస్కారం లేదు!– మారుతి శాస్త్రి -
Phule movie ‘ఫూలే’ సినిమాపై అభ్యంతరాలా?
మూడు వేల ఏళ్ల కులవ్యవస్థ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మానవతావాది మహాత్మా ఫూలే. ఆయనపై అనంత్ మహాదేవన్ దర్శకత్వంలో ప్రముఖ నటులు ప్రతీక్ గాంధీ, పత్రలేఖ ప్రధాన పాత్రలలో... ‘ఫూలే’ సినిమా తయారయింది. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపిస్తుందనీ... కులవాదాన్ని ప్రోత్సహిస్తుందనీ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్య క్షుడు ఆనంద్ దవేతో పాటు పలు బ్రాహ్మణ సంఘాలు ఆరోపించడంతో సినిమా విడుదల వాయిదా పడింది. వారి అభ్యంత రాల కారణంగా... సెన్సార్ బోర్డు కూడా కుల సంబంధిత పదా లను తొలగించాలని సూచించింది. అయితే స్వయంగా బ్రాహ్మ ణుడైన ఈ చిత్ర దర్శకుడు అనంత్ మహాదేవన్ ఈ ఆరోపణలను ఖండిస్తూ, సినిమా చారిత్రక వాస్తవాల ఆధారంగా రూపొందిందనీ, ఎటు వంటి అజెండా లేదనీ చెప్పారు. మూడు వేల ఏళ్ల పాటు ఈ దేశంలోని మెజారిటీ వర్గాల ప్రజలకు క్షుద్రులు, శూద్రులు, మ్లేచ్ఛులు, ఛండాలురు అనే పేర్లు తగిలించి... బానిసలుగా చూసిన అమా నుష కులవ్యవస్థ ఈ దేశంలో రాజ్యమేలింది. తమ స్వార్థం కోసం మతాన్ని, సమా జాన్ని భ్రష్టు పట్టించిన ఆ మనువాదుల దౌర్జన్యాలను ఒంటరిగా ఎదిరించిన ధీశాలి ఫూలే. ‘మనుషులందరినీ పుట్టించినవాడు దేవుడే అయినప్పుడు... ఒక తండ్రి తన బిడ్డలలో కొందరు ఎక్కువ కొందరు తక్కువ... కొందరు ద్విజులు, కొందరు పంచ ములు అంటూ ఎలా శాసిస్తాడు? ఇవన్నీ మీరు రాసిన అబద్ధపు రాతలు! ఇక ఈ అకృత్యాలను కట్టిపెట్టండి!’ అంటూ గర్జించి, స్వార్థపర వర్గాల దౌర్జన్యాలపై సమర శంఖం పూరించాడు మహాత్మా ఫూలే.శూద్ర బిడ్డలకూ, స్త్రీలకూ చదువు చెప్పడానికి పుణే వీధుల్లో సావిత్రిబాయి ఫూలే వెళుతుంటే... అగ్రవర్ణాలు రాళ్లు వేసే దృశ్యాన్ని తొలగించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఫూలే జీవిత చరిత్రలో ఆయన ఎదుర్కొన్న అవరోధాల ప్రస్తావన ఉండకపోతే... మరేమి ఉంటుంది? జరిగిన చరిత్రను చూపెడితే... మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ బుకాయిస్తే ఎలా?– ఆర్. రాజేశమ్సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ -
Biruduraju Ramaraju తెలుగు సంస్కృతీరాజం రామరాజీయం
ఆచార్య బిరుదురాజు రామరాజు గురించిన ఆలోచన రాగానే సంస్కృతి, సంప్రదాయం, సాధన, విద్వత్తు మూర్తీభవించిన వ్యక్తిని మనోనేత్రంతో చూస్తాం. 55 ఏళ్ళనాడు పరిచయమైన రామ రాజుగారు కీర్తిశేషులయ్యే వరకు నా మీద చూపిన వాత్సల్యం ఎప్పటికీ గుర్తుంటుంది. వయసులో చిన్నవాళ్ళయినా ప్రేమతోబాటు గౌరవం చూపే సౌజన్యం ఆయనది. దీన్ని ఎన్నో సందర్భాలలో నేను చవిచూచాను. 24 సంవత్సరాల వయస్సులోనే నన్ను ఉస్మా నియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు పిలిపించి తెలుగు ఎం.ఎ. విద్యార్థులకు జానపద సాహిత్యం మీద ఉప న్యాసం ఇప్పించారాయన. 26 ఏళ్ళ వయస్సులోనే పిహెచ్.డి. పరీక్షకునిగా చేశారు. 27 ఏళ్ళ వయసులో ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్తు ప్రాదుర్భావ సందర్భంగా నాచేత ప్రధానోపన్యాసం ఇప్పించారు. ‘గుణాః పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః’ అనే వాక్యానికి నిలువెత్తు ఉదాహరణ రామరాజుగారు. హైదరాబాదుకు ఎప్పుడైనా వెళ్ళానంటే చిక్కడ పల్లిలో రామరాజుగారి నివాసానికి వెళ్ళి గంటల తరబడి మాట్లాడవలసిందే. జానపద విజ్ఞానంలో జరుగుతున్న కొత్త పరిశోధనలను గురించి అడిగి తెలుసుకొనే ఆయన ఆసక్తి ఆశ్చర్య పరిచేది. ‘నేను చెప్పిందే చివరి వాక్యం. చేసేదేదో చేసేశాను. ఇక చేయవల సింది ఏదీ లేదు’ అనే మనస్తత్వం కాదు రామరాజుగారిది. ఆయన చేసిన పరి శోధన, జానపద సాహిత్యంలో ఆయన కృషి తక్కువదేమీ కాదు. ‘జానపద సాహిత్యంలో పరిశోధన చేయడానికి ఏముంది?’ అని భావించే రోజుల్లో పట్టుబట్టి జానపదగేయ సాహిత్యాన్ని పరిశోధనాంశంగా తీసు కున్న సందర్భం తెలుగులో జానపద పరిశోధనకు నాందీ వాక్యం పలికింది. తెలుగులో విస్తృతంగా జానపద విజ్ఞాన పరిశోధన జరగడానికి మూలకారణం రామరాజుగారే. జానపద సాహిత్య సేకరణ, వర్గీకరణ, వివేచన విషయంలో ఆయనదే ఒరవడి.సంస్కృతి, సంప్రదాయాలు అంటే రామరాజుగారికి విపరీతమైన అభిమానం. అందువల్లనే మనకు తరతరాల వారసత్వంగా సంక్రమించిన జానపద సాహిత్యాన్ని ఆయన అంతగా అభిమానించారు. కాని అభిమా నించడంతో ఆగిపోలేదాయన. జానపద సాహిత్య పరిశోధనపైన దృష్టి సారించారు. పరిశోధనతో ఆగిపోక పోవడం ఆయన ముందుచూపునకు నిదర్శనం. ఆయన పరిశోధన గ్రంథాన్ని రెండోసారి ప్రచురించేటప్పుడు 1976లో నేను ప్రచురించిన ‘జానప సాహిత్య స్వరూపం’ పుస్తకాన్ని చూచినట్లుగా అందులో ఉటంకించారు. ఇది వారి హృదయ వైశాల్యాన్ని తెలుపుతుంది. జానపద విజ్ఞాన అధ్యయనాన్ని గురించి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఈ విషయంలో ఆయన ఆసక్తిని తెలుపుతుంది.బిరుదురాజు రామరాజుగారు జానపద సాహిత్య పరిశోధనతోనే ఆగిపోలేదు. వారి సమకాలికులైన దిగ్దంతులవంటి పండితులతో సమానంగా వ్యవహరించాలని సంస్కృతంలో కూడా ఎం.ఎ. చేశారు. ప్రాచీన తెలుగు కావ్యాలవైపు దృష్టి సారించారు. ప్రాచీన రచనలను పరి చయం చేయడమే కాకుండా ‘చరిత్రకెక్కని చరితార్థులు’ పేరుతో విస్మృత కవులను గురించి ప్రచురించారు. ప్రాచీన తెలుగు కావ్యాలనే కాకుండా కొన్ని సంస్కృత గ్రంథాల్ని సేకరించి ప్రచురించారు. తెలుగు, సంస్కృతం మాత్రమే కాక ఆంగ్లంలో కూడా రామరాజు గారు ప్రావీణ్యం గడించారు. ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి అనువదించడమే కాకుండా ‘ఫోక్లోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఆంగ్ల గ్రంథాన్ని ప్రచురించారు. ‘జానపద సాహిత్య బ్రహ్మ’ అనిపించుకోవడమే కాకుండా ప్రాచీన సాహిత్య పరిశోధన, నిఘంటు రచన, చారిత్రక నవలారచన, అముద్రిత గ్రంథాల పరిష్కరణ వంటి రంగా లలో కృషి చేసిన బిరుదురాజు రామరాజుగారు చిరస్మరణీయులు. -ఆర్వీయస్ సుందరం వ్యాసకర్త సాహితీ విమర్శకులు(నేడు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంఎన్టీఆర్ కళామందిరంలో బిరుదురాజు రామరాజు శత జయంతి సదస్సు) -
కష్టం వేరొకరిది! కాసులు ఏఐవి!!
డిజిటల్ ప్రపంచంలో మరో కొత్త అంశం చక్కర్లు కొడుతోంది. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు కాస్తా ప్రఖ్యాత జపనీస్ యానిమేటర్ హయావో మియజాకీ శైలిలో గీసిన ఫ్యామిలీ, వ్యక్తిగత చిత్రాలతో నిండిపోతున్నాయి. గిబ్లీ ఆర్ట్ పేరు పెట్టుకున్న ఈ చిత్రాల ధోరణి నాలుగు దశాబ్దాల పాటు యానిమేషన్ రంగంలో ఎన్నో ప్రఖ్యాత క్యారెక్టర్లను సృష్టించిన గిబ్లీ స్టూడియో నకలు అన్నది మీకు తెలిసే ఉంటుంది. తేలిక పాటి పేస్టల్ షేడ్స్లో క్యారెక్టర్ల చిత్రీకరణ దీని హైలైట్. ప్రస్తుతానికి ఈ గిబ్లీ ఆర్ట్ అన్నది ఏఐ ప్లాట్ఫామ్స్ కొన్నింటిలో ఉచితంగా లభి స్తోంది. కొన్ని క్లిక్ల సాయంతో ఏ చిత్రాన్నైనా గిబ్లీ ఆర్ట్గా మార్చేయ వచ్చు. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఫ్యాషన్ , స్పోర్ట్స్ ఇన్ఫ్లుయెన్స ర్లతో పాటు కొన్ని కోట్ల మంది ఇప్పటికే ఈ గిబ్లీ ఆర్ట్ను వాడేశారు.సరదాగా కనబడుతున్నా...కంటెంట్ను సృష్టించేందుకు ఉపయోగించే జనరేటివ్ ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చి కొంత కాలం అయినప్పటికీ, ‘ఓపెన్ ఏఐ’ అభివృద్ధి చేసిన సరికొత్త ఏఐ టూల్ ఈ గిబ్లీ ఆర్ట్ ట్రెండ్కు కారణమైంది. ఛాట్జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లు మనం అందించే సమాచారం (టెక్ట్స్) ఆధారంగా మనకు కావాల్సిన సమ చారాన్ని వివిధ రూపాల్లో (ఆర్టికల్స్, సోషల్ మీడియా పోస్టులు వంటివి) తయారు చేస్తాయి. అదే గిబ్లీ ఆర్ట్ వంటివి మల్టీమీడియా జనరేటివ్ ఏఐ టూల్స్! టెక్ట్స్తో పాటు వీడియోలు, వాయిస్, ఫొటోలు, మ్యూజిక్ వంటి వాటినన్నింటినీ అది తీసుకోగలదు. ‘మిడ్ జర్నీ’, ‘స్టేబుల్ డిఫ్యూషన్ ’, ‘డాల్–ఈ’ వంటివి టెక్ట్స్ను తీసుకుని ఇమేజెస్ ఇవ్వగలవన్నది తెలిసిందే. డాల్–ఈతో ఢిల్లీ వీధుల చిత్రాలను ఎం.ఎఫ్.హుస్సేన్ లేదా జామినీ రాయ్ శైలిలో కొన్ని సెకన్ల సమయంలోనే తయారు చేయవచ్చు. ఇక ‘లెన్సా’ వంటివి ఇచ్చిన ఇమేజ్కు ప్రత్యామ్నాయాలను సృష్టిస్తాయి. వీటితో పోలిస్తే గిబ్లీ ఆర్ట్కు ఎక్కువ ఆదరణ ఎందుకు లభించిందంటే... ఇవి ముద్దుగా, హాస్యస్ఫోరకంగా ఉండటమని చెప్పాలి. చూసేందుకు హాస్యస్ఫోరకంగానే ఉండవచ్చు కానీ, దీని వెనుక ఒక సీరియస్ సమస్య ఉంది. ఏదైనా ఏఐ వ్యవస్థ వాస్తవ ప్రపంచం నుంచి వచ్చే సమాచారం ఆధారంగానే పనిచేస్తుంది. ఈ సమాచారం ద్వారా ఏఐ వ్యవస్థలకు శిక్షణ అందుతుంది. రకరకాల మార్గాల ద్వారా ఏఐ వ్యవస్థలకు డేటా (టెక్ట్స్, ఇమేజెస్, సంగీతం) అందు తూంటుంది. రస్కిన్ బాండ్ లేదా అమితవ్ ఘోష్ శైలిలో ఒక చిన్న కథ రాయమని మనం ఏదైనా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను అడిగా మనుకోండి... వీరిద్దరి రచనల తాలూకూ సమాచారం మొత్తాన్ని వెతికేస్తుంది ఏఐ! చివరకు కాపీరైట్ హక్కులున్న సమాచారం కూడా. కానీ ఏఐ కంపెనీలు ఈ కాపీరైట్ హక్కులు పొందకపోవడం గమ నార్హం. గిబ్లీ ఆర్ట్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏ కంపెనీ కూడా గిబ్లీ స్టూడియో తాలూకూ చిత్రా లను వాడుకునే హక్కులు తీసుకోలేదు. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్నే తాము వాడుకుంటున్నట్లు ఏఐ కంపెనీలు చెబుతున్నా... రచయితలు, కళా కారుల స్పందన వేరుగా ఉంది. కాపీరైట్ చట్టాల్లోని ‘ఫెయిర్ యూజ్’ సిద్ధాంతం గురించి ఏఐ కంపెనీలు చదివితే మేలని వీరు అంటు న్నారు. అప్పుడే అమెరికా, యూరప్లలో న్యాయపోరాటాలైతే మొద లయ్యాయి. సృజనకారులకు దక్కేదేమిటి?గిబ్లీ ఆర్ట్ వంటి ఏఐ టూల్స్ అసలు సృజనాత్మకత అన్న అంశంపైనే సవాళ్లను లేవనెత్తుతున్నాయి. ఓ అందమైన పెయింటింగ్, కార్టూన్ క్యారెక్టర్, సంగీతం... ఇవన్నీ మనిషి సృజనకు మచ్చుతున కలు. ఇవన్నీ ఆ యా వ్యక్తుల సొంత అనుభవాలు, సందర్భాల నుంచి పుట్టుకొచ్చినవి. గిబ్లీ ఆర్ట్నే ఉదాహరణకు తీసుకుందాం. జపాన్ సమాజం, సంస్కృతులకు అది అద్దం పడుతుంది, అమెరికన్ సంస్కృతికి వాల్ట్ డిస్నీ స్టూడియో అద్దం పట్టినట్లు!ఇలాంటి సృజనాత్మక కళాకృతులను యంత్ర సృష్టిగా మార్చడం లేదా ఒక ఏఐ సిస్టమ్ మానవ సృజనాత్మకత, అభినివేశాలకు విరు ద్ధంగా వెళ్లడం మేలైన ఆలోచనైతే కాదు. ఒక పెయింటింగ్ను పూర్తి చేసేందుకు కళాకారుడికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు. అలాగే పుస్తకం రాయడానికి ఏళ్లు పడుతుంది. ఒక కార్టూన్ లేదా యానిమేషన్ స్ట్రిప్ తయారు చేసేందుకు ఆర్టిస్టులు వందల గంటలు కష్టపడాల్సి రావచ్చు. వీటన్నింటి ఆధారంగా పనిచేసే ఏఐ సృష్టించే ఆర్ట్కు పేరు, డబ్బు... రెండూ అసలు కళాకారులకే దక్కాలి. అందుకే ఏఐ కంపె నీలు డేటా లాండరింగ్కు పాల్పడుతున్నాయనీ, కళాకారులకు దక్కా ల్సిన డబ్బు, క్రెడిట్ రెండింటినీ ఎగ్గొడుతున్నాయనీ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని లక్షల మంది కళాకారులపై ఆధారపడి అభివృద్ధి అవుతున్న ప్రతి ఏఐ జనరేటివ్ మోడల్ కంపెనీ విలువ వందల కోట్ల డాలర్లుగా ఉండటం ప్రస్తావనార్హం. ఇవి వినియోగ దారుల నుంచి వేల డాలర్ల రుసుము వసూలు చేస్తూంటాయి. అయితే, అసలు కళాకారులకు ఇందులోంచి ఏమీ దక్కడం లేదు. ఇమేజ్ జనరేటర్లు కళాకారులు కాదు కానీ... కళాకారులకు సవాలు విసురుతున్నాయి. జనరేటివ్ ఏఐ మోడళ్లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సృజనాత్మకత కలిగిన వారి జీవనోపాధిని దెబ్బ తీస్తున్నాయి. యానిమేషన్ రంగంలోని కళాకారులు, ఇల్లస్ట్రేటర్లు, డిజైనర్లపై ప్రభావం ఎక్కువే ఉంది. పైగా మానవ కళాకారులతో పోలిస్తే ఏఐ తయారు చేసే బొమ్మల్లో డెప్త్, భావ ప్రకటన తక్కువ. ఏఐ ఆకృతులు ఓ మోస్తరువి మాత్రమే! ఒప్పందాలు మేలా?ఇప్పుడు డిజిటల్ ప్రపంచం మొత్తం గిబ్లీ వంటి ఉచిత ఏఐ టూల్స్ ఉత్పత్తులతో నిండిపోయింది. సినిమా స్టుడియోలు, నెట్ వర్క్లు ఇప్పటికే ఈ ఏఐ టూల్స్ను శ్రమ, ఖర్చులు రెండూ తగ్గించేవిగా చూస్తున్నాయి. పదుల కొలదీ యానిమేటర్ల బృందాలను నియమించుకునే బదులు, కొందరు ఏఐ టెక్నికల్ డైరెక్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ధోరణి మనదేశంలో ఆందోళనకు కారణం అవుతోంది. వేల మంది భారతీయ టెకీలు హాలీవుడ్ స్టూడియోలు ఔట్సోర్స్ చేసే యానిమేషన్ వర్క్పై ఆధారపడి ఉన్నారు. వాళ్లు కంప్యూటర్ గ్రాఫిక్స్, ఇతర టూల్స్ను వాడుతున్నారు. కానీ ఏఐ టూల్స్తో ఆటోమేషన్ మరో స్థాయికి వెళ్తుంది.ఈ సమస్యకు సులభ పరిష్కారం లేదు. కాపీరైట్ల విషయంలో న్యాయ స్థానాలకు వెళ్లడం ఒక మార్గం. డేటా ప్రొటెక్షన్ చట్టాలు, ఏఐ నియంత్రణలు ఇప్పుడిప్పుడే ఏఐ టూల్స్ తాలూకూ సైడ్ ఎఫెక్ట్స్్పై దృష్టి పెడుతున్నాయి. కొంతమంది పబ్లిషర్లు, పుస్తక, సంగీత కంపె నీలు ఆదాయాన్ని పంచుకునే విషయంలో ఏఐ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. తద్వారా తమ పుస్తకాలు, సంగీతం లేదా ఇతర కళలను ఏఐల శిక్షణకు ఉపయోగించుకునే వీలు ఏర్పడుతోంది. డేటా ట్రెయినింగ్ కోసం ఎటూ టెక్ కంపెనీలు తమ కళను వాడుకుంటున్నట్లు వీరు భావిస్తున్నారు. బదులుగా ఒప్పందం కుదుర్చుకో వడం మేలని వీరి ఆలోచన. అనుమతులు తీసుకుని కళలు, సమా చారాన్ని ఏఐ ట్రెయినింగ్ కోసం వాడుకోవడం ఇంకొక మార్గం. సోషల్ మీడియా వేదికలు కూడా ఏఐ ఆధారిత ఇమేజెస్, వీడి యోలు, యానిమేషన్లను అనుమతించే విషయంలో ఆచితూచి వ్యవ హరించాలి. ప్రస్తుత గిబ్లీ ఆర్ట్ ట్రెండ్ ముప్పు లేదని అనిపించవచ్చు. కానీ... వాస్తవానికి ఇది మనకు మేలుకొలుపు లాంటిది!దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విస్తరణ డ్రామాపై అమరావతి రైతులు కోర్టుకు !
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి విషయంలో ఇప్పుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు తీసుకున్న భూములన్నీ చాలడం లేదు.. అన్నిటికీ కేటాయించేయగా.. అన్నీ కట్టేయగా.. మహా అయితే రెండు వేల ఎకరాలు మాత్రమే మిగలబోతున్నాయి. ఇంత పెద్ద నగరం కట్టడానికి ఆ భూమి ఏమూలకూ చాలదు. ఇంకా 44 వేల ఎకరాలను సేకరించి మహా రాజధాని కడతాం అని.. చంద్రబాబునాయుడు ఈ కొత్త డ్రామాకు స్క్రిప్టు సిద్ధం చేశారు. కొత్తగా 44 వేల ఎకరాలు లాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అయితే.. ఆయన సొంత వర్గానికి చెందిన అమరావతి ప్రాంత రైతులే ఈ ఆలోచన మీద ఆగ్రహంతో నిప్పులు కక్కుతున్నారు. తా దూరను కంత లేదు.. మెడకో డోలు అన్నట్టుగా.. ఆల్రెడీ రాజధానిగా నోటిఫై చేసిన భూముల్లో ఏడాదిగా ఒక్క పని మొదలుపెట్టలేకపోయారు గానీ.. ఇప్పుడు ఇంకో 44 వేల ఎకరాలు అంటున్నారు. తమ వద్ద నుంచి సేకరించిన భూములలో తమకు హామీ ఇచ్చిన రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదాకా, నగర విస్తరణ పేరిట కొత్త భూసేకరణ/ పూలింగ్ ప్రయత్నాలను నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ.. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిని ఇప్పుడు చంద్రబాబునాయుడే వంచించడానికి పూనుకున్నారు. అమరావతి ని రాజధానిగా పూర్తిగా అభివృద్ధి చేసి, ఆ ప్రాంతంలో.. భూములు ఇచ్చిన రైతులకు దామాషా ప్రకారంగా భూములకంటె విలువైన స్థలాలుగా మార్చి ఇస్తాం అని చంద్రబాబునాయుడు లాండ్ పూలింగ్ సందర్భంగా చాలా చాలా మాటలు చెప్పారు. ప్రజలందరూ కూడా దానిని నమ్మారు. నమ్మి ఇచ్చిన వారు కొందరైతే.. బెదిరించి ప్రలోభ పెట్టి బలవంతంగా మరికొందరితో కూడా భూములు లాక్కున్నారు. మొత్తానికి 54 వేల ఎకరాల వరకు సమీకరించారు. తొలి అయిదేళ్ల పాలనలో కేవలం డిజైన్ల పేరుతో వందల కోట్ల రూపాయలు తగలేసి.. బొమ్మ చూపించి మాయచేస్తూ వచ్చారు. ప్రజలు నమ్మకం లేక ఓడించిన తర్వాత.. జగన్ ప్రభుత్వం ఏర్పడింది. మంచి పాలనలో అధికారవికేంద్రీకరణ ఉండాలనే ఉద్దేశంతో జగన్ ఆలోచన చేసి, శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించారు తప్ప.. దానిని వ్యతిరేకించలేదు. అయితే.. చంద్రబాబునాయుడు అమరావతి రైతులను రెచ్చగొట్టి వారితో హైకోర్టులో కేసులు వేయించి.. అసలు ఏ పనీ ముందుకు సాగకుండా అడ్డుపడ్డారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ ప్రాంత క్లీనింగ్ పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. నిర్మాణ పనులు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. అప్పుడే మరో 44 వేల ఎకరాలు రాజధాని విస్తరణకు సేకరిస్తాం అంటూ మరో పాట అందుకోవడంపై అమరావతి రైతులు రగిలిపోతున్నారు. ముందు మాకు మాట ఇచ్చిన విధంగా ఈ 54 వేల ఎకరాల రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసి.. మాకు కేటాయించిన స్థలాలు మాకు అప్పగించిన తర్వాతే.. మరో పూలింగ్ కు వెళ్లాలని వారు మొండికేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇష్టారాజ్యంగా తమను పక్కన పెట్టేసి, ఇంకో నగరం మాయతో తిరగకుండా అడ్డుకోవడానికి అమరావతి రైతులు తమ స్వబుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారి డిమాండు సహేతుకమైనదే గనుక.. కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు. 44 వేల ఎకరాలంటూ చంద్రబాబు ఎంచుకున్న కొత్త డ్రామాకు ఆదిలోనే బ్రేకులు పడేప్రమాదం కనిపిస్తోంది. సొంత సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ.. తమ పట్ల చంద్రబాబు తలపెడుతున్న ద్రోహాన్ని జీర్ణించుకోలేక అమరావతి రైతులు కోర్టు గడప తొక్కడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది...ఎం. రాజేశ్వరి -
ట్రంప్ చర్యలతో అమెరికాకు అతి పెద్ద నష్టం ఇదే!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలవల్ల ఆ దేశానికి జరుగుతున్న అతి పెద్ద నష్టం ఏమిటి? స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోవటమా? బాండ్స్ మార్కెట్ దెబ్బ తినటమా? డాలర్ విలువ తగ్గుతుండటమా? ఇవేవీ కావు. అన్నింటికన్న ముఖ్యమైనది విశ్వసనీయతకు కలుగుతున్న నష్టం. స్టాక్స్ను, బాండ్లను, కరెన్సీ విలువను దిద్దుబాటు చర్యలతో పునరుద్ధరించుకోవచ్చు. కానీ విశ్వసనీయత (credibility) మౌలికమైనది. అది ఒకసారి దెబ్బతినటం మొదలైతే కోలుకునేందుకు చాలా సమయం తీసుకుంటుంది. అమెరికాకు ఇది అన్నింటికి మించిన నష్టమవుతున్నది. మరొకవైపు బహుళ ధ్రువ ప్రపంచ బలోపేతానికి దోహదపడుతున్నది. ఇది అమెరికా (America) కోరుకోని ఫలితం.డాలర్ బాండ్ల సంక్షోభందీనంతటికీ ఆరంభం దిగుమతి సుంకాలను ఒకేసారి 184 దేశాలపై హెచ్చించటమన్నది తెలిసిందే. సుంకాల చెల్లింపులు గతంలోనూ ఉన్నవే. అమెరికాయే గాక ఇతరులూ అప్పుడప్పుడు చేస్తుండినవే. ట్రంప్ ఒక కొత్త పద్ధతిని అనుసరిస్తూ ఒకేసారి అందరిపై ఒకే విధంగా అన్ని సరకులపై 10 శాతం పెంచి, కొద్ది రోజుల తర్వాత ఆ యా దేశాలతో వాణిజ్య లోటు అనే మొత్తాలపై 50 శాతం పెంచారు. కానీ బాండ్ల మార్కెట్కు, డాలర్ విలువకు నష్టాలు మొదలు కావటం జరిగింది. ఆ మాట ఆయన బహిరంగంగానే అంగీకరిస్తూ, 50 శాతం సుంకాల హెచ్చింపును అమలుకు తెచ్చిన కొద్ది గంటలలోనే ఆ చర్యను 90 రోజులపాటు వాయిదా వేయవలసి వచ్చింది.ఇందులో బాండ్ల మార్కెట్ నష్టాలు అతి తీవ్ర మైనవి కావటం ఎందుకంటే, అమెరికన్ డాలర్ విలువ అతి సుస్థిరమైనదనీ, డాలర్ బాండ్లు కొన్న ట్లయితే తమ డబ్బుకు లభించే వడ్డీ ఆదాయం, దీర్ఘకాలిక భద్రత సురక్షితమనీ నమ్మేవారు ప్రపంచం అంతటి నుంచీ డాలర్ బాండ్లలో మదుపు చేస్తారు. ఆ విధంగా చైనా సైతం ఒక ట్రిలియన్ డాలర్లకుపైగా బాండ్లు ఖరీదు చేసిందంటే పరిస్థితిని ఊహించవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఇపుడు ట్రంప్ ధోరణితో డాలర్ పట్ల, అమెరికా పట్ల విశ్వాసం దెబ్బతింటుండటంతో సామాన్య ప్రజల నుంచి ఆయా దేశాల వరకు ఆ బాండ్లను అమ్మడం మొదలైంది. అమెరికాకు అతి సన్నిహితమైన జపాన్ (Japan) ప్రభుత్వం సైతం వందలాది బిలియన్ల బాండ్లు సత్వరంగా విక్రయించిందంటే సమస్య తీవ్రతను గమనించవచ్చు. మరొకవైపు కొత్త బాండ్ల అమ్మకాలు ఆగిపోయాయి. ఈ ధోరణి కొనసాగితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేక తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది. దీనికితోడు డాలర్ విలువ (Dollar Value) తగ్గుదల సరేసరి. ఈ పరిణామాల కారణంగానే సుంకాలను 90 రోజులు వాయిదా వేయక తప్పలేదు. అంత చేసినా విశ్వసనీయతకు నష్టం జరగనే జరిగింది.లొంగని చైనా సుంకాలకు బెదిరి అమెరికాతో చర్చలకు కొన్ని దేశాలు సిద్ధపడటం నిజమే అయినా – కెనడా, యూరప్, చైనా (China) వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు అందుకు నిరాకరిస్తూ ఎదురు సుంకాలు విధించటం, అమెరికాకు అవసరమైన కీలకమైన ముడిసరకుల రవాణాను నిలిపివేయటం మొదలుపెట్టాయి. ఇది కూడా అమెరికన్ స్టాక్స్ను, బాండ్ల మార్కెట్ను, డాలర్ విలువను, ప్రజల నిత్యావసర సరకుల ధరలను ప్రభావితం చేయటం మొదలైంది.తమకు అన్నివిధాలా సవాలుగా మారిన చైనాను ఆర్థికంగా, ఇతరత్రా కూడా కట్టడి చేసేందుకు రిపబ్లికన్, డెమోక్రటిక్ ప్రభుత్వాలు రెండూ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. ఆ విధానాలు ఇప్పుడు ట్రంప్ రెండవ హయాంలో పరాకాష్ఠకు చేరుతున్నాయి. దీనంతటి నిజమైన ఉద్దేశం అమెరికా ఆర్థిక ప్రయోజనాల కన్నా తమను దీర్ఘకాలం పాటు దెబ్బతీయటమే అని భావిస్తున్న చైనా, ఎన్ని నష్టాలనైనా భరిస్తాముగానీ ఎటువంటి ఒత్తిడికైనా లొంగబోమని, చివరికంటా పోరాడుతామని ఒకటికి నాలుగు సార్లు స్పష్టం చేసింది.పేరు మోసిన ఆర్థిక నిపుణులంతా ట్రంప్ బృందానికి ఆర్థిక విషయాలపై అవగాహన లేదని వ్యాఖ్యానిస్తుండటం కూడా అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య ఆసక్తికరమైన దౌత్యనీతి ఛాయలు కనిపించటం మొదలైంది. అమెరికన్ మీడియా (American Media) వెల్లడించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి: ట్రంప్ అధికారులు చైనా అధికారులకు ఫోన్ చేసి, తాము పెంచిన సుంకాలకు పోటీగా చైనా ఇక పెంచవద్దనీ, అది చైనాకే నష్టదాయకమనీ కోరారు. కానీ చైనా ఆ మాటను లెక్కచేయక మరిన్ని సుంకాలు పెంచింది. ఆ వెనుక ట్రంప్ అధికారులు మరొకసారి చైనా అధికారులకు ఫోన్ చేసి, ఒకసారి జిన్పింగ్ (Xi Jinping) చేత ట్రంప్తో మాట్లాడించమని కోరారు. అందుకు చైనా అధ్యక్షుడు నిరాకరించారు. మరొకవైపు అమెరికా నష్టాలు కొనసాగటం, సుంకాలను 90 రోజులు వాయిదా వేసినా మార్కెట్లకు నమ్మకం ఏర్పడక ఒక రోజు విరామం తర్వాత తిరిగి పతనమవుతుండటం, బాండ్ల సమస్య, ఉత్పత్తులకు కొరతలు, ధరల పెరుగుదలలు కొనసాగటంతో పరిస్థితి అర్థమైంది. దానితో, సుంకాలు పెంచిన ఈ నెల 2వ తేదీ నుంచి సరిగా 10 రోజులు గడిచి 12వ తేదీ వచ్చేసరికి, చైనా నుంచిదిగుమతి అయ్యే సెల్ఫోన్లు, పలు ఎలక్ట్రానిక్, కంప్యూటర్ సామగ్రిపై సుంకాల పెరుగుదలను ట్రంప్ నిలిపి వేశారు.చదవండి: ట్రంప్ సుంకాల సంక్షోభం.. అనూహ్య పరిణామాలుఇదిట్లుండగా, తన కొత్త విధానాల వల్ల అమెరికన్, తదితర పరిశ్రమలు అమెరికాకు తరలి రాగలవనే ట్రంప్ ఆశాభావానికి ఎవరి నుంచీ సుముఖత కనిపించటం లేదు. చట్టబద్ధత లేని వలస కార్మికులను పారదోలటంతో వ్యవసాయం, హోటళ్ల వంటి రంగాలు దెబ్బ తింటుండటంతో, వారి కొనసాగుదలకు యజమానులు దరఖాస్తు చేసుకోవచ్చునన్నది ఇదే 12వ తేదీ నాటి మరో ఉత్తర్వు. పోతే, విద్యా వైద్య రంగాలలో కుదింపులు, విదేశీ సహాయాల (యూఎస్ ఎయిడ్ ద్వారా) రద్దు పేద దేశాలల్లో కలిగిస్తున్న హాని, ఆగని గాజా మారణకాండ వంటి ఇతర అనేక చర్యలు కూడా ట్రంప్ పట్ల, అమెరికా పట్ల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇది వారికి ఆర్థికానికి మించిన దీర్ఘకాలిక నష్టం.- టంకశాల అశోక్ సీనియర్ సంపాదకుడు -
అరకు ఆర్గానిక్ కాఫీ.. అలా విదేశాలకు ఎగిరింది!
ఈ తరానికి ‘ఫ్యాన్సీ’గా అనిపించే వైజాగ్–అరకు ‘గ్లాస్ రైల్’కు ‘అరకు కాఫీ’కి ఒక దగ్గర పోలిక ఉంది. కొండలు, లోయలు, గుహలు దాటుకుంటూ ఆ రైలు పట్టాలు వేసింది ‘డీబీకే’ రైల్వే లైన్ (దండకారణ్య–బోలానగిర్ – కిరుబురి) కోసం. ముడి ఇనుమును విశాఖపట్టణం పోర్టు నుంచి జపాన్ ఎగుమతి కోసం 1960లో దీన్ని వేశారు. తొలితరం గిరిజన జాతుల జీవితంలోకి ఈ ‘ప్రాజెక్టు’ తెచ్చిన మార్పులో ఆ తర్వాత కాలంలో కాఫీ కూడా భాగమైంది. తూర్పు కనుమల్లో ఒక్క విశాఖ మన్యసీమ మాత్రమే ఎందుకు ‘కాఫీ’కి నెలవయింది అంటే, ఇది సముద్ర మట్టానికి 900–1100 అడుగుల ఎత్తున ఉంది. వర్షపాతం 1000–1200 మి.మీ. ఉండి, కాఫీ మొక్క వేళ్ళకు తడి తగిలితే చాలు కనుక ఇక్కడి కొండవాలులు వీటి పెంప కానికి అనువు అయ్యాయి. ఎండ నేరుగా ఈ మొక్కలకు తగలకూడదు కనుక, నీడ కోసం పెంచే సిల్వర్ వోక్స్ చెట్లు (Silver Oak Trees) కూడా ఈ నేలలో బాగా పెరగడంతో అంతర పంటగా పెంచే మిరియాల పాదులు ఈ చెట్ల మధ్య పెంచుతారు. గిరిజనులకు అదొక అదనపు ఆదాయం.అటవీ శాఖ 1960లో అరకు, అనంతగిరి, చింతపల్లి, పాడేరు రిజర్వ్ ఫారెస్ట్లో కాఫీ తోటల (Coffee Plantation) పెంపకం మొదలు పెట్టింది. దాంతో సాగులో మెలకువలు, సాంకేతిక అంశాలు చూడడానికి కాఫీ బోర్డ్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం కూడా ఏజెన్సీకి వచ్చింది. అలా అటవీ శాఖ పెంచిన తోటలు 1985లో ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్కు అప్పగించే నాటికి వాటి విస్తీర్ణం 10,100 ఎకరాలు. ఇక ఎనభైల్లో పాడేరు ఐటీడీఏ (ITDA) వచ్చాక, విశాఖ ఏజెన్సీకి ఊరట కోసం వారాంతపు యాత్రలకు వచ్చే కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ‘వీఐపీ’లకు ఐటీడీఏ అధికారులు చూపించే ఒక టూరిస్ట్ స్పాట్గా మన్యసీమలో ఈ కాఫీ తోటలు మారాయి.అయితే వీటి విస్తీర్ణం 2002–03 నాటికి అరవై వేల ఎకరాలకు చేరినా, ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ప్రధాని అయ్యాక మాత్రమే, ‘గిరిజన్ కాఫీ’కి వాణిజ్యపరమైన విలువ పెరిగింది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిది ‘డవున్–టు–ఎర్త్’ ధోరణి కనుక, ముందు ‘భూమి’ – ‘మనిషి’, ఆ తర్వాతే కాఫీ అయినా దాని రుచి అయినా... అన్నట్టుగా మన్యం ‘కాఫీ’ గురించి ఆయన ఆలోచించారు. ప్రభుత్వం పెంచిన కాఫీ తోటలపై స్థానిక గిరిజనులకు యాజమాన్య హక్కులు ఇచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి రెండు ఎకరాలు ఇచ్చి వాళ్ళ తోటల్లో వాళ్ళు తమ పని చేసుకుంటుంటే, దాన్ని– ‘నెరేగా’ ఉపాధి హామీ క్రిందికి వైఎస్ తెచ్చారు. గిరిజనుల పట్ల ఆయన ధోరణి ఇటువంటిది కనుకనే, నక్సలైట్లను – ‘అయినా మీరు ఇంకా అడవుల్లో ఎందుకు బయటకు రండి’ అని చర్చలకు పిలిచారు.అరకు కాఫీ (Araku Coffee) తోటల పచ్చని భూముల కింది పొరల్లో బాక్సైట్ ఖనిజముంది. దాన్ని అల్యూమినియంగా మార్చి వ్యాపారం చేసుకోవడానికి కంపెనీలు 2009 నాటికే మన్యం ముఖద్వారం వద్ద ఫ్యాక్టరీలు పెట్టుకుని మరీ కనిపెట్టడం మొదలెట్టాయి. సరిగ్గా అప్పుడే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయిన డాక్టర్ జైరాం రమేష్ (Jairam Ramesh) కేంద్ర మంత్రి అయితే, ఆయన చేసిన అటవీ–వాణిజ్య శాఖల సేవలను వైఎస్ గిరిజనుల కాఫీ తోటల కోసం పూర్తి స్థాయిలో వాడుకున్నారు. కేంద్ర ‘ఉపాధి హామీ’ నిధులు 2009–10, మళ్ళీ 2015–16 మధ్య ఇలా రెండుసార్లు రూ. 287 కోట్లు, కాఫీ బోర్డు నిధులు రూ. 62 కోట్లతో 1.04 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు, మరొక లక్ష ఎకరాల్లో కాఫీ మొక్కలకు నీడ కోసం ‘షేడ్ ప్లాంటేషన్’ మొక్కలు ఆ కాలంలో నాటారు.చదవండి: ప్రైవేటు ఎత్తులకు చిత్తవ్వాల్సిందేనా?అయితే మన ‘కాఫీ కథ’ ఆ తోటల్లోనే ఆగిపోలేదు. కేంద్ర పరిశ్రమలు–వాణిజ్య సహాయ మంత్రిగా 2009 ఆగస్టు 13న ‘ఆసియాన్’ 49 దేశాలతో మన దేశం చేసు కున్న స్వేచ్ఛా వాణిజ్య ఒడంబడిక (ఎఫ్టీఏ) రూప కల్పనలో మంత్రి జైరాం రమేష్ది కీలక పాత్ర అయింది. ఆ ఒప్పందం 2010 జనవరి 1 నుండి అమలులోకి వచ్చేది. కానీ, వైఎస్ ఒత్తిడితో సీఎంఓ డిల్లీతో చేసిన నిరంతర ‘లాబీయింగ్’తో మన దేశం ఎగుమతి చేసే 489 వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో మన ‘గిరిజన్ కాఫీ’కి చోటు దొరికింది. ఒప్పందం ముగిసిన నెలకు ఆయన లేరు. ఇది జరిగిన మూడు నెలలకు మన గిరిజన్ కాఫీ ‘అరకు ఆర్గానిక్ కాఫీ’ బ్రాండ్తో రెక్కలు కట్టుకుని మరీ విదేశాలకు ఎగిరింది.- జాన్సన్ చోరగుడి అభివృద్ధి– సామాజిక అంశాల వ్యాఖ్యాత -
వైరల్ : తప్పుడు వార్తలు ఎలా వ్యాపిస్తుంటాయంటే..
నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరంతా చుట్టివచ్చేస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి సంగతే ఇది.‘‘మధ్యప్రదేశ్ లో నలుగురు వ్యక్తులు కలిసి, ఒక మేకను దేవుడికి బలి ఇవ్వడానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారి వాహనానికి యాక్సిడెంటు అయింది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వంతెన మీద నుంచి సోమావతి నదిలోకి పడిపోయింది. మేకను బలి ఇవ్వడానికి తీసుకువెళుతున్న ఆ నలుగురు వ్యక్తులూ, ఆ ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. కానీ దైవికంగా సంభవించిన చిత్రమేమిటంటే.. ఆ మేక మాత్రం క్షేమంగా బతికి బయటపడింది.’’ ఇలాంటి వార్త ఇక్కడ చూపిస్తున్న ఫోటోతో సహా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు మనకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది.‘దేవుడి మహిమ అంటే అదీ’ అని వాదించేవాళ్లు..‘వాళ్లు మేకను బలి ఇవ్వాలనుకున్నారు. దేవుడు వాళ్లనే బలి తీసుకున్నాడు’ అనే వాళ్లూ..‘దేవుడు కరుణమాయుడు.. తాగుబోతులను కాకుండా మూగజీవిని కాపాడాడు’ అని సూత్రీకరించేవాళ్లూ.. బోలెడు మంది తయారవుతారు.ఫోటోలో ప్రమాదం చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఇది తప్పుడు వార్త! మరి ఫోటో ఎలా? అని సందేహించకండి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా తయారైన ఫోటో కావొచ్చు. వాహనం తలకిందులుగా పడి ఉంటే.. దాని నెంబర్ ప్లేట్ మాత్రం.. స్ట్రెయిట్ గానే కనిపిస్తుండడం ఈ ఫోటో ఫాబ్రికేషన్ లో ఒక లోపం.తత్వ ఇండియా (#thetatvaindia) అనే బ్లూటిక్ ఉన్న అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ పోస్టు పబ్లిష్ అయింది. 23 గంటలు కూడా గడవక ముందే.. ఈ పోస్టును కోటి మంది వీక్షించారు. దాదాపు 600 మంది తమ కామెంట్లను పంచుకున్నారు. దాదాపు మూడువేల మంది ఈ పోస్టును షేర్ చేశారు. దాదాపు 30 వేల మంది దీనిని లైక్ చేశారు. 1300 మంది వరకు బుక్ మార్క్ చేశారు. అంతగొప్పగా వైరల్ అయిన ఈ విషయాన్ని కాస్త లోతుగా గమనిస్తే.. అది కాస్తా తప్పుడు వార్త అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన మాట నిజం. కానీ ఈ పోస్టు మాత్రం తప్పు!వాస్తవాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని భేడాఘాట్ చౌకీతాళ్ కు చెందిన ఆరుగురు వ్యక్తులు.. నర్సింగ్పూర్ జిల్లాలోని దుల్హా దేవ్ మహరాజ్ ఆలయంలో బలి ఇవ్వడానికి మేకను తీసుకుని వెళ్లారు. ఆ ఆలయంలో ప్రతీకాత్మకంగా మాత్రమే బలి జరుగుతుంది. బలి ఇచ్చినట్టు గుర్తుగా మేక చెవులను మాత్రం కత్తిరిస్తారు. వీళ్లు ఆ బలి మొక్కుబడిని తీర్చుకుని గోటగావ్ నుంచి జబల్పూర్ కు తిరిగి బయల్దేరారు. చెవులు కత్తిరించిన మేక కూడా అదే వాహనంలో ఉంది. డ్రైవ్ చేస్తూనే బాగా మద్యం సేవించారు. జబల్పూర్ సమీపంలో ఛర్గావాన్ ప్రాంతానికి వచ్చిన తర్వాత.. అదుపు తప్పి వంతెన మీదనుంచి సోమవతి నదిలో పడిపోయింది. ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. మేకమాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన అసలు ఫోటో ఇది (తెల్ల స్కార్పియో ఉన్నది). వాహనంలో ఉన్న వాళ్లు మద్యం సేవించి నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.సంఘటన నిజంగానే జరిగింది. కానీ దానిని.. తమకు కావాల్సిన రీతిలో వక్రీకరించి సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారంలో పెట్టారు. ఏ రకంగా వక్రీకరించి ప్రచారంలో పెడితే.. వ్యూస్ ఎక్కువగా వస్తాయో.. ఇలాంటి తప్పుడు వ్యక్తులకు బాగా తెలుస్తుంది. అంత తెలివైన వాళ్లు కాబట్టే.. ఒక్కరోజు కూడా గడవకముందే కోటి వ్యూస్ సంపాదించుకున్నారు. దీనిని బట్టి నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే.. సోషల్ మీడియాలో ఏది కనిపిస్తే అది నిజం అని నమ్మకూడదు. కంటికి కనిపించేవి.. చెవులకు వినిపించేవి అన్నీ నిజం కాదు. బ్లూ టిక్ ఉన్నంత మాత్రాన ఆ సోషల్ మీడియా అకౌంట్లు నిజాలు చెప్పే నిజాయితీ ఉన్నవి అనుకోవడానికి కూడా వీల్లేదు. సోషల్ మీడియాలో ఏ సంగతి కనిపించినా.. ముందు దానిని అపనమ్మకంతో చూడాలి. ఇంకాస్త అనుమానం కలిగితే.. ఏదో ఒక రకంగా క్రాస్ చేసుకోవాలి. లేకపోతే.. ఈ తప్పుడు ట్వీట్ ను షేర్ చేస్తూ వెళ్లిన మూడు వేల మంది అమాయకుల్లో ఒకరుగా మనం కూడా మారిపోతాం...ఎం.రాజేశ్వరి -
తాత్కాలిక అధ్యాపకులకు భరోసా ఏది?
వివిధ కారణాలతో ఒక దశాబ్దానికి పైగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో బోధనా సిబ్బంది నియా మకాలు చేపట్టకపోవటం వలన ఆ యా విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోనే యూజీసీ మార్గదర్శ కాల మేరకు అర్హత కలిగిన వారిని కాంట్రాక్ట్, అకడమిక్ కన్సల్టెంట్, పార్ట్ టైం ప్రాతిపదికన బోధనా సిబ్బందిగా నియమించుకుంటున్నాయి. రాష్ట్రంలోని 12 రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో బడ్జెట్ ఆమోదం పొంది ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులలో దరిదాపు 900 మందికి పైగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన, 600 మందికి పైగా పార్ట్ టైం ప్రాతిపదికన పని చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయా లలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని వివిధ వర్గాల నుండి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి హామీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయటానికి జీవో నెంబర్ 21 ద్వారా నియామకపు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో తాత్కాలిక అధ్యాపకులు ఆందోళన చెందుతూ ఉద్యమ బాట పట్టారు.దాదాపు 15 ఏళ్లుగా కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాప కులు తక్కువ వేతనాలతో విశ్వవిద్యాలయాలలోని పని భారాన్ని మోస్తున్నారు. యూజీసీ మార్గదర్శకాల మేరకు రోస్టర్ పాయింట్ ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటిస్తూ అర్హతగల వారిని కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాప కులుగా ఎంపిక చేసి ఆ యా విశ్వవిద్యాలయాలు వారి సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలోని మూడు విభాగాలలో... ముఖ్యంగా మొదటి విభాగంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంపిక కోసం వారి సామర్థ్యాన్ని పరిశీలించటానికి మార్గదర్శకాలు రూపొందించినట్లుగా కనపడుతుంది. కానీ విశ్వవిద్యాలయం లాంటి ఒక అత్యు న్నత విద్యాసంస్థ తరగతి గదిలో పాఠాలు బోధించటానికి అర్హత ప్రమాణాలు రూపొందించినట్లుగా కనిపించటం లేదు. అధ్యాపక నియామకాలకు కొత్తగా అర్హత ప్రమా ణాలు రూపొందించటాన్ని తప్పు పట్టలేము కానీ ఆ అర్హత ప్రమాణాలు యూజీసీ మార్గదర్శకాల మేరకు సమర్థంగా పాఠాలు బోధించే సామర్థ్యం కలవారిని, అనుభవం కలవారిని ఎంపిక చేసే విధంగా ఉండాలి. పీహెచ్డీలాంటి అత్యున్నత విద్యార్హతకు జాతీయ క్వాలిఫయింగ్ టెస్ట్ జేఆర్ఎఫ్కి సమానంగా మార్కులు కేటాయించటం ఏమిటి? అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామ కానికి ప్రధాన అర్హత పోస్టు గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ మార్కులకు వెయిటేజ్ ఇవ్వటం ఏమిటి? పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసెస్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు అనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి పాఠాలు బోధించటానికి అత్యంత సమర్థత కలవారిని ఎంపిక చేయటానికి జీవో నెం. 21 మార్గదర్శకాలలో మార్పులు చేయవలసిన అవసరం కూడా ఉంది.తెలంగాణ రాష్ట్రంలోని 12 రాష్ట్ర విశ్వవిద్యాలయా లలో కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, నియామకాలలో ప్రాధాన్యం ఇవ్వకుండా నియామకాలు చేపట్టటం అంటే దశాబ్దాలుగా విశ్వవిద్యా లయాలలో శ్రమ దోపిడీకి గురవుతూ తక్కువ వేతనాలతో పని చేస్తున్న వారికి అన్యాయం చేసినట్లుగానే భావించాలి. ‘పనికి మాత్రమే పనికొస్తామా! అవకాశాల కోసం పనికిరామా! మాకు ఉద్యోగ భద్రత కల్పించకుండా, మా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం విశ్వవిద్యాల యాలలో నియామకాలకు సిద్ధపడటం ఎంతవరకు సమంజసం’ అనే ప్రశ్నలు అధ్యాపక వర్గాల నుండి వçస్తున్నాయి. 2022లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలలో; పాలి టెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 8,000 మందికి పైగా అధ్యాపకుల క్రమబద్ధీకరణకు వ్యతి రేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భవి ష్యత్తులో విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల సేవలను క్రమబద్ధీకరించే అవ కాశాలు లేవు కాబట్టి తమకు టైం స్కేల్తో ఉద్యోగ భద్రత కల్పించి నియామకాలలో ప్రాధాన్యమిచ్చి, తదనంతర చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.డా. తిరుణహరి శేషు వ్యాసకర్త రాష్ట్ర పార్ట్ టైం అధ్యాపకుల సంఘం సలహాదారు -
వన్ వే రూటు
రుణపత్రాల విపణిలో ఉత్పన్నమైన అనూహ్య పరిణామాలు అమెరికా అధ్యక్షుడికి గుబులు పుట్టించాయి. అమెరికా బాండ్స్కు గిరాకీ పెరిగినట్లే పెరిగి వెంటనే తగ్గిపోయింది. డాలర్ ఇండెక్స్ విలువ కూడా క్షీణిస్తోంది. దీంతో కొత్త సుంకాల విధింపు అమలును 90 రోజుల పాటు నిలిపివేశారు. ఇతర ప్రపంచ దేశాల విషయంలో తాత్కాలికంగానే అయినా ఒక మెట్టు దిగిన ట్రంప్ చైనా విషయంలో మాత్రం చాలావరకు బెట్టుగానే ఉన్నారు. ఏమైనా, అమెరికా సృష్టించిన ఈ అల్లకల్లోలం రోడ్డు మ్యాపు లేని వన్ వే రూటు! ట్రంప్ సుంకాల సంక్షోభం మధ్యకాలిక అనిశ్చితిని పెంచుతుంది. ఆర్థిక కార్యకలాపాలు అంచనాల మీద ఆధారపడి ఉంటాయి. అనిశ్చితి అనేది అంచ నాలను మార్చేస్తుంది. వ్యాపార సంస్థలు, కుటుంబాలు నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. ట్రంప్ 90 రోజుల ఊరట నిజానికి ఈ అనిశ్చితి వ్యవధిని పెంచుతుందే తప్ప, అనిశ్చితికి ముగింపు పలకదు. ఆర్థిక కార్యకాలపాల్లో తెగింపు, నిర్ణయ శక్తి కొరవడతాయి. ప్రభుత్వాలు ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ, ప్రపంచ వ్యాప్త ఆర్థిక మందగమనం తప్పదు. సుంకాల వెనుక రెండు లక్ష్యాలువిచ్ఛిన్నకర సుంకాల ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలని ట్రంప్ అనుకుంటున్నారు. అమెరికా వస్తూత్పత్తుల తయారీ వ్యవస్థ ఏనాడో కుప్పకూలింది. దీన్ని పునరుద్ధరించడం మొదటిది. తద్వారా దిగువ స్థాయి ఫ్యాక్టరీ ఉద్యోగాలు విశేషంగా సృష్టి అవుతాయి. ఇక రెండోది, చైనాను శిక్షించడం. ప్రపంచ వాణిజ్య విధానాన్ని అడ్డు పెట్టుకుని అది అనుచిత ప్రయోజనం పొందుతోంది. పాతికేళ్ల క్రితమే అమెరికాలో పాగా వేయ గలిగింది. ఈ రెండో లక్ష్యం కంటే, మొదటిదే ట్రంప్ రాజకీయ మద్దతుదారులకు మరింత ముఖ్య విషయం. దేశీయంగా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కల్పించలేనప్పుడు, ధరలు పెరిగిపోతున్నప్పడు, చైనాను శిక్షించడం వల్ల అమెరికన్లకు ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ ఒక సమస్య ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి మొదటి లక్ష్యాన్ని సాధించడమే... చైనాను దెబ్బ తీయడమనే రెండో లక్ష్యం కంటే కష్టమైన విషయం. చైనా భౌగోళిక ఆర్థిక విస్తరణను అదుపు చేసే వ్యూహాలు ఇప్పటికిప్పుడు రూపొందినవి కాదు. గడచిన రెండు దశాబ్దాలుగా అమెరికాలో వీటి గురించి పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు, పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయో, వీటిని ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధం కావాలో చైనా ప్రభుత్వానికి మంచి అవగాహనే ఉంది. మరి, ట్రేడ్ వార్ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు అమెరికా ఎంతవరకు సన్నద్ధంగా ఉందనేది ప్రశ్న. కర్మాగారాల స్థాపనకు కనీసం రెండేళ్లు పడుతుంది. ట్రంప్ నిరుద్యోగ మద్దతుదారులు అందాకా ఓర్పుతో ఉండగలరా? స్వల్పకాలంలో కష్టాలు, దీర్ఘకాలంలో లాభాలు అనే సూత్రం రాజకీయంగా కుదిరేది కాదు. ట్రంప్ స్వదేశంలోనే మద్దతు కోల్పేతే ఆయన విధానాలకు అంతర్జాతీయంగా స్పందన ఎలా ఉంటుంది?దేశాల స్పందనట్యారిఫ్ సంక్షోభం అనంతర కాలంలో ప్రపంచ దేశాలు అమెరికా మీద విశ్వాసం కోల్పోతాయి. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు తన విధానాలు, (వివాదాస్పద) మాటలు వెనక్కు తీసుకున్నా, ఆయన ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాధిపతులు విశ్వాసంలోకి తీసుకోరు! కెనడా, మెక్సికో, డెన్మార్క్, దక్షిణా ఫ్రికాలను ట్రంప్ బాహాటంగానే టార్గెట్ చేసి మాట్లాడారు. బ్రెజిల్, కొలంబియా, జర్మనీ, ఫ్రాన్స్,సింగపూర్, నమీబియా, ఆస్ట్రేలియా వంటి దేశాల అధినేతలు యూఎస్ అధ్యక్షుడిపై బహిరంగ విమర్శలకు వెనుకాడటం లేదు. యూరోపియన్ యూనియన్ ఈ విషయంలో ఒక్కతాటి మీద లేకున్నా, మెజారిటీ సభ్యదేశాలు అమెరికాను నమ్మే స్థితిలో లేవు. ఈయూ అటు చైనాతోనూ, ఇటు ఇండియా తోనూ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తుంది. బలహీన ప్రధాని నేతృత్వంలోని జపాన్ మాత్రం అమెరికాను ప్రాధేయపడుతున్నట్లు వ్యవహరిస్తోంది. ఏమైనా, అది కూడా చైనాతో వాణిజ్య సంబంధాలు స్థిరీకరించుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇండియా మౌనం వెనుక...ఇక ఇండియా నాయకత్వం అమెరికా ట్రేడ్ పాలసీ పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది. చైనాతో అమీతుమీకి ట్రంప్ సిద్ధపడటం ఇండియాకు ఆనందంగా ఉంది. మరోవంక, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందానికి చర్చలు జరుపుతోంది. అమెరికా నుంచి రక్షణ సామగ్రి, ఇతరత్రా దిగుమతులు పెంచు కునేందుకు సిద్ధపడుతోంది. అయినా కూడా, ట్రంప్ మొదటి విడత పదవీకాలంలో ఆయనతో వ్యవహరించినంత సంతోషంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దఫా ఉన్నారా? ట్రంప్ ఆయనకు చురకలు వేస్తూ మాట్లాడుతున్నారు. అంతగా స్నేహపూర్వకం కాని ధోరణిలో ఇండియా పేరు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎంతో సెల్ఫ్ ఇమేజ్, ఇగో ఉన్న మోదీ ఈ అవమానాలకు లోలోపల కుమిలిపోయే ఉంటారు!ఉభయ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుస్థిరపరచుకోవాలని ఇండియా భావిస్తోంది. అయినా సరే, ఏ భారతీయ నాయకుడూ జపాన్, ఇటలీ మాదిరిగా ట్రంప్ ముందు సాగిలపడేందుకు సిద్ధంగా లేరు. బహుశా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్న నేపథ్యంలో మోదీ మౌనం పాటిస్తూ ఉండొచ్చు. దీంతో, గ్లోబల్ సౌత్ (పేద దేశాలు) తరఫున మాట్లాడేందుకు ఇతరులకు అవకాశం లభించింది. ట్రేడ్ ట్యారిఫ్లను వ్యతిరేకిస్తూ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు చైనా సంఘీభావం ప్రకటిస్తోంది. ఇండియా కూడా కలిసి రావాలని ఆహ్వానిస్తోంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా నాయకులు కూడా ఇతర వర్ధమాన దేశాలకు సంఘీభావం ప్రకటించాయి. ‘గ్లోబల్ సౌత్’ ఇండియా ‘వాయిస్’ కోసం ఎదురు చూస్తోంది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వైరుద్ధ్య భారతంలో జాతీయవాదమా?
బాబా సాహెబ్ అంబే డ్కర్ ఒక సందర్భంలో గాంధీజీతో జరిపిన సంభా షణలో ‘నాకు మాతృ దేశం లేదు’ అంటారు.అందుకు గాంధీజీ ‘లేదు, మీకు మాతృ దేశం వుంది’ అని బదులిస్తే... ‘మమ్మల్ని కుక్కలు, పందు లకంటే హీనంగా చూసే దేశాన్ని చూసి ఏ అంట రానివాడైనా ఈ దేశం నాది అని ఎలా అనుకో గలడు?’ అని అంబేడ్కర్ పేర్కొనడం విశేషం. భారత్లో ఇటీవలి కాలంలో జాతీయవాదం లేదా దేశభక్తి అనే భావనలు తరచూ వివాదాస్పద చర్చలకు దారితీస్తున్న క్రమంలో అంబేడ్కర్ జాతీ యవాదంపై వెలిబుచ్చిన అభిప్రాయాలను చర్చించడం అవసరం. ఒకవైపు బ్రిటీష్ వలసవాదం అంతమై దేశానికి పాలనాధికారాలు బదిలీ అవుతున్న సందర్భంలో ఆయన జాతీయవాదంపై వ్యక్తపరి చిన అభిప్రాయాలు ఎంతో కీలకమైనవి. బ్రిటిష్ పాలన అంతమొందడంతోనే ఇక్కడి సమస్యలన్నీ సద్దుమణిగిపోతాయని అంబేడ్కర్తో పాటు అణ గారిన కులాలు భావించకపోవడం గమనార్హం.బ్రిటిష్ వారికంటే ఇక్కడ ప్రత్యక్షంగా తమపై కుల దాష్టీకాన్ని ప్రదర్శించే నల్ల దొరలే తమ ప్రధాన శత్రువులు అనే అవగాహన అణగారిన వర్గాల్లో దేశ వ్యాప్తంగా పెంపొందింది. ఉత్తరాదిన పంజాబ్లో ‘ఆదిధర్మి’ ఉద్యమం, ఒరిస్సాలో ‘మహిమ ధర్మం’, ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ రాష్ట్రాలలో ‘ఆది హిందూ’, దక్షిణాదిలో ‘ఆది ద్రావిడ’, ‘ఆది ఆంధ్ర’, ‘ఆది కన్నడ’ వంటి ఉద్య మాలు దళితులు ఈ దేశ మూలవాసులనే ఆత్మ గౌరవ ప్రకటనలు వెలువడుతున్న కాలమది. ఆధి పత్య కులాలకు చెందిన కవి గరిమెళ్ళ సత్యన్నా రాయణ బ్రిటిష్ వలస పాలనను వ్యతిరేకిస్తూ ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అనే గేయాన్ని రాస్తే... కుసుమ ధర్మన్న అనే దళిత కవి ‘మాకొద్దీ నల్ల దొరతనం’ అనే గేయాన్ని రాసి స్వరాజ్యం, స్వతంత్రం అనే అంశాలలో దళితుల ఆకాంక్షలను వ్యక్తీక రించడం గమనార్హం. తమిళనాట పండిత అయోతీ దాస్, పెరియార్ల నాయకత్వంలో జరిగిన ఆది ద్రావిడ ఉద్యమం కూడా ఆధిపత్య కులాల జాతీ యోద్యమంలో భాగస్వామి కాకుండా తమదైన స్వతంత్ర ఆకాంక్షలను వ్యక్తపరచడం చూస్తాం.ప్రాంతీయంగా వ్యక్తమవుతున్న అణగారిన కులాల స్వతంత్ర ఆకాంక్షలకు అంబేడ్కర్ జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తూ పెద్ద కాన్వాసు మీద తమ జాతీయవాదం ఏమిటో నిర్మొహ మాటంగా చెబుతూ బ్రాహ్మణ బనియాల జాతీయవాద లొసుగులను దుయ్యబట్టాడు. అనేక కులాలు, మతాలు, భాషలు, ప్రాంతీయ అస్తి త్వాలు, వాటిమధ్య వైరుద్ధ్యాలు గల భారతదేశం ఒక జాతిగా ఉండే అవకాశం లేదని చెబుతూ ఇక్కడ జాతీయతా భావన ఇంకా సాధించాల్సిన ఆదర్శమేనని పేర్కొన్నారు. ఈ ‘దేశభక్తులు’ ఎంత సేపటికీ తమకూ, తమ వర్గానికీ అధికారం దక్కా లని తాపత్రయ పడుతుంటారని అన్నారు. తన జాతీయవాదం అన్ని రకాల గుత్తాధిపత్యాలనూ తిరస్కరిస్తుందని అన్నాడు.అంబేడ్కర్ జాతీయవాదంపై వెలిబుచ్చిన భావాలకు నేటికీ ప్రాసంగికత ఉంది. ఆయన ఒక సందర్భంలో తన కాలపు దేశ భక్తులను ఉద్దేశించి వీరికి తమ పూర్వీకులు అణగారిన ప్రజలపై సాగించిన దారుణాలపై ఎటువంటి ప్రాయశ్చిత్త ధోరణీ లేకపోగా రాబోయే కాలంలో తమ వారు గతంలో సాగించిన ధోరణినే తిరిగి ప్రదర్శించడానికి వెన కాడబోరు అని పేర్కొన్నారు. అది ఈనాటి దేశ భక్తుల విషయంలో అక్షర సత్యమని తెలుస్తుంది. ఇప్పుడు అణ గారిన కులాలు, ఆది వాసులు, స్త్రీలు, మైనారిటీల పట్ల పెత్తందారీ కులాల వారు సాగించే హత్యలు, అత్యా చారాలు సమస్తమైన దౌర్జన్యాలకు వారు దేశభక్తినీ, దైవ భావ ననూ అడ్డు పెట్టుకోవడం కళ్ళారా చూస్తున్నాం. కుహనా జాతీయవాదుల రెండు నాల్కల ధోర ణిని ఆయన సరిగ్గానే అంచనా వేయడం గమ నార్హం. ఆయన చూపించిన వెలుగు దారిలో సమ కాలీన ప్రజా వ్యతిరేక శక్తుల ఆట కట్టించి సామా జిక, రాజకీయ వైరుద్ధ్యాలను పరిష్కరించుకోవడం మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి. ప్రొ. చల్లపల్లి స్వరూపరాణి వ్యాసకర్త ప్రముఖ దళిత కవి, రచయిత్రి -
ఏదీ ఎండాకాలం ఎక్కడొచ్చింది.. ఆ రోజులెక్కడున్నాయి
ఏదీ ఎండాకాలం వచ్చిందన్నారు.. నాకేం కనిపించలేదేం... తెల్లారితే మొదలయ్యే కోయిల కూతలు ఎక్కడా లేవేం.. రెండు నెలలపాటు పెరట్లోని మామిడి చెట్టుమీద కూర్చుని పొద్దల్లా కచేరీ చేసే కోయిలల గుంపు లేనేలేదేం.. ఒకటి గొంతు ఆపగానే ఇంకోటి కూ.. కూ.. అంటూ అందుకునే రాగాలు కనిపించవేం..ఒంటిపూట బడులు ఇచ్చాక స్కూలు వదిలిపెట్టగానే నేరుగా ఇంటికి రాకుండా మామిడితోటలు.. జీడీ తోటల్లో తిరుగుతూ పచ్చిమామిడి కాయలన్నీ ఏరుకుని పుస్తకాల సంచుల్లో వేసుకుని ఎవరెక్కువ కాయలు ఏరుకుంటే వాడే హీరో అని చెప్పుకునే పిల్లలేరీ... ఆ పిల్లగ్యాంగులు ఎక్కడా కనిపించవేం..ఒరేయ్ ఎండల్లో ఎక్కడికి తిరక్కండి.. పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగలు తిరుగుతున్నారు.. వాళ్లకు కానీ దొరికితే మిమ్మల్ని మాయచేసి పిల్లులు.. కుక్కపిల్లల్లా మార్చేసి తీసుకెళ్ళిపోతారు అని తల్లిదండ్రులు చెప్పి మరీ ఎండాకాలం కాసేపు నిద్ర పుచ్చడానికి తాపత్రయపడిన సందర్భాలేవీ.. తల్లిదండ్రులు అలా నడుం వాల్చగానే పిల్లిలా అడుగులో అడుగువేసుకుంటూ బయటకు పారిపోయి చెట్లకిందమామిడి తోటల్లో చెట్లకింద జీడిపిక్కలు.. మామిడి టెంకలతో ఆటలాడుతున్న పిల్లలు ఏరీ.. ఏమైపోయారు వాళ్లంతా చెరువులు ఎండిపోయే కాలం. బురదలో దిగి నిక్కర్ ఎగేసుకుని చేపలు పట్టి ఇళ్లకు తీసుకెళ్తే ఎండల్లో మీకు ఇదేం పనిరా.. ఆ బురదలో పురుగుపుట్రా ఉంటే ఎంత ప్రమాదం అని నాన్న టెంకి జెల్లలు తగిలించిన సన్నివేశాలు ఊళ్లలో లేవేంది..స్కూళ్లకు సెలవులు ఇస్తున్నాను పట్నంలోని మామయ్య ఇంటికి వెళ్ళాలి అంటూ నాలుగురోజులు ముందే నిక్కర్లు .. చొక్కాలు సంచిలో సర్దుకుని అమ్మను కంగారు పెట్టె పిల్లకాయలు లేనేలేరేం... వాళ్ళంటా ఏమైపోయారు.. అసలు ఎండాకాలం అంటేనే గోళీకాయలు ఆట.. రౌండ్ గా ఒక వృత్తం గీసి మధ్యలో గోళీలు పెట్టి వృత్తం అవతలికి ఎగిరిపడేలా గోళీకాయలను కొట్టే ఛాంపియన్లు ఎక్కడికెళ్ళిపోయారు..రూపాయి తీసుకుని గంటకు అర్ధరూపాయి చొప్పున సైకిల్ అద్దెకు తీసుకుని గరుకు మెరకల్లో తొక్కడం నేర్చుకునే క్రమంలో మోకాలి చిప్పలు గీక్కుపోయిన పిల్లలూ లేరేం.. అసలు అద్దె సైకిళ్ళు ఇచ్చేవాళ్లంతా ఏమైపోయారు...ఒరేయ్ జాగ్రత్తగా దించండి.. ముంజెలు మాత్రం నాకు రెండు ఎక్కువ ఇవ్వాలి అంటూ. వాంతులు వేసుకుని మరీ తాటిముంచెలు పంచుకుని తినే పిల్లలెక్కడున్నారు...ఊళ్లలో ఐదారు ఇళ్లల్లోని ఆడాళ్ళంతా ఒక చోట చేరి చింతపండు పిక్కలు తీస్తూ కబుర్లు చెబుతూ.. సినిమా పాటలు పాడుకుంటూ గడిపే సన్నివేశాలు ఈ ఊళ్లోనూ లేవేంది..సెలవులకు పిన్ని.. బాబాయ్.. మేనత్తలు ఇళ్లకు వెళ్లి వచ్చేటపుడు వాళ్ళిచ్చే చిల్లర డబులు జేబులో ఉంచుకుని స్కూళ్ళు తెరిచాక వాటిని ఇంటర్వెల్లో ఐస్ క్రీములు.. చేరుకుముక్కలు కొనుక్కునేందుకు వాడుకునే పొదుపరి పిల్లలు కనిపించరేం..రానున్నది వానాకాలం .. ఈలోపే ఇల్లు నేయించాలి.. పాత రెల్లుగడ్డి తీసేసి కొత్త గడ్డి వేయించాలి అనే బాధ్యత.. బెంగతో గెడ్డలు.. వాగులు వంకలవద్ద రెల్లుగడ్డి కోసే ఇంటి పెద్ద లేనేలేడు అటు ఎండ కాస్తుండగా ఇటు చినుకులు రాల్తుంటే ఎండ వాన కుక్కలకు నక్కలకు పెళ్లి.. పెళ్లి అంటూ వీధుల్లో ఎగిరే చిన్నారుల సందడి ఎక్కడుంది...ఎండాకాలంలో ఒకేసారి పెద్దగా గాలివీయగానే మామిడి తోటలకు పరుగెత్తి రాలిన కాయలు ఏరుకొచ్చే పిల్లలూ.. పెద్దలూ ఎక్కడున్నారో...స్కూళ్లకు సెలవులిచ్చేశారు.. ఎండాకాలంలో మేము తిరప్తి వెళ్తాం.. సింహాచలం వెళ్తాము.. యాత్రలు తీర్థాలకు వెళ్లొస్తాం తెలుసా అంటూ తోటి పిల్లలతో గొప్పలు చెప్పుకునే గడుగ్గాయిలు కూడా లేరు.. ఇవేం లేకుండా వేసవికాలం ఎలా ఉంటుంది.. ఎలా వస్తుంది.. ఏమో కలం మారింది. వాటన్నిటినీ మింగేసిన వేసవికాలం మాత్రం వచ్చింది.. వేడిని తెచ్చింది.. ఇంట్లో ఏసీలు లేకుండా బతకలేని పరిస్థితిని తెచ్చింది. ఒకళ్ళ ఇళ్లకు ఇంకొకరు వెళ్లకుండా ఎవరిళ్ళలో వాళ్ళే ఉండేలా గిరిగీసేసిన అసూయలు .. తెచ్చింది...- సిమ్మాదిరప్పన్న -
అంబేడ్కరుని పాత్రికేయ ప్రమాణాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటే గుర్తొచ్చేవి రాజ్యాంగ రచన, అంటరానితనం, కులనిర్మూలన పోరాటాలు, పోరాడి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలు అందరికీ సమానంగా దక్కాలన్న భావన, సమాలోచనలు. అయితే అంబేడ్కర్ గొప్ప పాత్రికేయులనీ, పాత్రికేయ ప్రమాణాలు, నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చేవారనీ, వాటిని కాపాడేందుకు స్వయంగా తానే పత్రికలు స్థాపించి అక్షర పోరాటం చేశారనీ చాలా తక్కువ మందికే తెలుసు. ఆయన ‘మూక్ నాయక్’ (1920), ‘బహిష్కృత భారత్’ (1027), ‘సమత’ (1928), ‘జనత’ (1930) ‘ప్రబుద్ధ భారత్’ (1956) పత్రికలు స్థాపించి పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టారు. ప్రతి అక్షరాన్ని నిటారుగా నిలిపి, పాత్రికేయ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన ఏ పత్రిక ప్రారంభించినా, దానికి ఒక ప్రత్యేక అజెండా ఉండేది. ఆరంభ సంచికలోనే తానెందుకు, ఎవరి కోసం సదరు పత్రిక ప్రారంభించారో తెలియచేసేవారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కులవివక్ష, అంటరానితనం తనని ఎక్కువగా ప్రభావితం చేశాయని ‘బహిష్కృత భారత్’ పత్రిక లక్ష్యాన్ని వివరిస్తూ తొలిసంచికలో ‘సంతకపు సంపాదకీయం’(సైన్డ్ ఎడిటోరియల్) రాశారు. చైతన్య పరచడం ద్వారానే ప్రజల్లో కదలిక తీసుకురావడం సాధ్యమవుతుందనీ, దాన్ని సాధించడం కోసం ‘ప్రబుద్ధ భారత్’ పత్రిక ప్రారంభించాననీ ఆరంభ సంచికలో సంపాదకీయం ద్వారా పత్రిక అజెండాను చెప్పారు.అంబేడ్కర్ స్థాపించిన పత్రికల్లో అగ్రస్థానం ‘మూక్ నాయక్’దే! నూరేళ్ళ చరిత్రకు సాక్ష్యంగా నిలచి, ఈ మధ్యనే అక్షర సంబరాలు జరుపుకొన్న ఈ పత్రిక జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిందనే చెప్పాలి. నిర్భీతిగా, నిజంవైపు నిలబడడం, పాత్రికేయ విలువలు తు.చ. తప్పక పాటించడం, రాతల్లో అపోహలకు, అసత్యాలకు తావివ్వక పోవడం; కుల రాజకీయాలకు, వివక్షకు దూరంగా రచనలు చెయ్యడం వంటి సూత్రాలను కడదాకా పాటించారాయన. చాలా మటుకు భారతీయ పత్రికలు ఏకపక్షంగా రాస్తున్నాయనీ, కేవలం ఒక వర్గం తాలూకు అభీష్టానికి అనుగుణంగానే రాస్తున్నాయనీ, కొన్నిసార్లు ఊహాజనిత వార్తల్ని వండి వార్చుతున్నాయనీ దుయ్యబట్టారు. రాజ్యాంగ రూపశిల్పిగా, కేంద్ర మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా పేరు పొందిన తనపైనే అవాకులు, చవాకులు పేలడం తనను కలచివేసిందని, అందు వల్లనే తానీ పత్రిక ప్రారంభించడానికి సంకల్పించినట్లు తన సంపాదకీయంలో పేర్కొన్నారు. పెద్దలకు అనుకూలంగాను, పేదలు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగానూ పత్రికలు కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి పెను ప్రమాదమని హెచ్చ రించారు. వెనుకబాటు తనానికి ఆర్థిక అంశాలు ద్వితీయ స్థానంలో ఉండగా, సామాజికాంశాలే ప్రథమ స్థానంలో ఉన్నా యనేది అంబేడ్కర్ నిశ్చితాభిప్రాయం. తద నుగుణంగానే రాజ్యాంగ రూపకల్పనలో సామాజిక రిజర్వేషన్లకు ప్రాధాన్యమిచ్చినట్లు తన రచనల్లో స్పష్టం చేశారు. పేదరికం, నిస్సహాయత, ఆత్మ న్యూనత, వెనుక బాటుతనం దాడి చేస్తుండడం వల్లనే అణగారిన వర్గాలు అభివృద్ధి ఫలాలను అందుకోలేక పోతున్నాయని, ఈ రుగ్మతల నుంచి మెజారిటీ జనాలను ‘విముక్తుల్ని’ చేయడమే తన ముందున్న లక్ష్య మని తన పత్రికల్లో పదే పదే ప్రస్తావించారు.మిగతా వృత్తుల కంటే జర్నలిజం ‘పవిత్ర’మై నదని, జనజాగృతికి, దిశానిర్దేశం చేయడానికి దీన్ని మించిన ‘వజ్రాయుధం’ మరోటి లేదన్నది అంబే డ్కర్ దృఢమైన అభిప్రాయం. సంచలనాల కోసం, తానెప్పుడూ తప్పుడు రాతలు రాయబోనని ప్రతిన బూనారు. పాత్రికేయునికి నైతికబాధ్యత ఆయుధమై ఉండాలన్నారు. జర్నలిజం వృత్తిని గౌరవించేవారు కనీసం ఆయన ప్రమాణాల్లో కొన్ని పాటించినా ఆ మహనీయునికి ఘననివాళి అర్పించినట్లే!ప్రొ‘‘ పీటా బాబీ వర్ధన్ వ్యాసకర్త మీడియా విశ్లేషకులుమొబైల్: 93931 00566 -
దూరదృష్టి గల సంస్కర్త
భారతదేశపు గొప్ప దార్శనికులలో ఒకరైన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి ఈ రోజు. ఆయన వారసత్వాన్ని తక్కువ చేసి చూపించడానికి ఉద్దేశపూర్వకంగా అవాంఛ నీయ ప్రయత్నాలెన్నో జరిగాయి. శతాబ్దం గడచిన తర్వాత కూడా, అంబేడ్కర్ అంటే కేవలం ఒక దళిత నాయకుడిగా పరిగణించడం శోచనీయం. ఆయనను దళితులు, అణ గారిన వర్గాల ప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఆధునిక భారత దేశపు అగ్రశ్రేణి మేధావుల్లో ఒకరిగా పరిగణించాలన్నది అత్యావశ్యం. చదువుకునే రోజుల్లో పిల్లలంతా తాగే సాధారణ కుళాయి నుంచి నీళ్లు తాగడానికి కూడా ఆయనను అనుమతించేవారు కాదు. ఒకసారి మండు వేసవిలో దాహం తట్టుకోలేక దగ్గర్లో ఉన్న కుళాయి నుంచి నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తే... కట్టుబాట్లు ఉల్లంఘించారనే కారణంతో ఆయన మీద దాడికి తెగబడ్డారు. ఆ సంఘటన తరువాత చాలామంది తమ రాత ఇంతే అని సరిపెట్టుకుని ఉండేవారు. మరి కొందరైతే హింసా మార్గాన్ని ఎంచుకుని ఉండేవారు. కానీ, ఆయన అలా చేయలేదు. తనలోని బాధను గుండెల్లోనే అదిమిపెట్టుకుని జీవితాన్ని చదవడం నేర్చుకున్నారు. కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డిగ్రీలతో సహా ఎంఏ, ఎంఎస్సీ, పీహెచ్డీ, డీఎస్సీ, డీలిట్, బార్–ఎట్–లా పూర్తి చేశారు. ఏ పాఠశాలల్లో అయితే తనను చదువుకోవడానికి అనుమతించలేదో... అంతకు మించిన స్థాయిలో విదేశాల్లో విద్యను పూర్తి చేసి తానేమిటో సమాజానికి చూపించారు. అయినా తన మాతృభూమి, కర్మభూమి అయిన భారతదేశానికి తిరిగి వచ్చే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉండేవారు.పేరెన్నికగన్న సంస్థల ఏర్పాటులో అంబేడ్కర్ పాత్ర విస్మరించలేనిది. ఆధునిక భారతదేశంలో ఆర్బీఐ, సెంట్రల్ వాటర్ కమిషన్ వంటి అనేక సంస్థలు బాబాసాహెబ్ దూరదృష్టితో పురుడు పోసు కున్నవే. ఆర్థికశాస్త్రం, ఆర్థిక చరిత్రపై తన ప్రావీణ్యంతో భారత్ ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యలను ఆధారాలతో సహా ‘రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్’కు విశ్లేషణాత్మకంగా వివరించారు. ఫలితంగా ఒక సెంట్రల్ బ్యాంక్గా విధులను నిర్వర్తించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు పునాది పడింది.గట్టి ప్రజాస్వామ్యవాదిఅంబేడ్కర్ దృఢమైన ప్రజాస్వామ్యవాది. భారత దేశపు భవి ష్యత్తు, దాని ప్రజాస్వామ్యం, కష్టపడి సంపాదించిన స్వాతంత్య్రం గురించే ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. రాజ్యాంగ సభలో ఆయన చివరి ప్రసంగంలో ఈ భయాందోళనలు సుస్పష్టంగా వ్యక్తమ య్యాయి. ఆయన హెచ్చరికలే భారతదేశాన్ని దాదాపు ఎనిమిది దశా బ్దాలుగా ప్రజాస్వామ్య మార్గంలో నడిపిస్తున్నాయి. అయితే నేడు కులం, మతం, జాతి, భాష మొదలైన సామాజిక విభేదాలతో భారతీ యుల మధ్య సోదరభావాన్ని తగ్గించే ప్రయత్నాలను చూస్తున్నాం.ఆర్య–ద్రావిడ విభజన నుంచి ఎక్కువ ప్రయోజనం పొందగలిగే సమయంలో కూడా ఆర్య దండయాత్ర సిద్ధాంతాన్ని అంబేడ్కర్ తప్పు పట్టారు. ‘ఒక తెగ లేదా కుటుంబం జాతిపరంగా ఆర్యులా లేదా ద్రావిడులా అనేది విదేశీ వ్యక్తులొచ్చి విభజన రేఖ గీసేవరకు భారత ప్రజల మదిలో ఇలాంటి ఆలోచనలు తలెత్తలే’దని 1918లో ప్రచురించిన ఒక పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. పైగా యజుర్వేద, అధర్వణ వేదాల్లోని రుషులు శూద్రులకు తగిన ప్రాధాన్యమిచ్చిన అనేక సందర్భాలను ఉదాహరించారు. ఆర్యులు, ద్రవిడుల కంటే అంటరానివారు జాతిపరంగా భిన్నమైనవారనే సిద్ధాంతాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు.తమ సంకుచిత, మతపరమైన ప్రయోజనాల కోసం భాషా సమస్యలను సాకుగా చూపించేవారు దేశ ఐక్యత విషయంలో అంబే డ్కర్ అభిప్రాయాలను తెలుసుకుంటే ఎంతో ప్రయోజనం పొందుతారు.తాను ప్రావీణ్యం సంపాదించిన తొమ్మిది భాషలలో ఒకటైన సంస్కృతాన్ని అధికారిక భాషగా ఆమోదించడానికి మద్దతుగా 1949 సెప్టెంబరు 10న ఆయన రాజ్యాంగ సభలో ఒక సవరణను ప్రవేశ పెట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై తన ఆలోచనలు వెల్లడిస్తూ... ‘హిందీని తమ భాషగా స్వీకరించడం భారతీయులందరి విధి’ అని ప్రకటించారు. హిందీ మాట్లాడే ప్రాంతానికి చెందిన వ్యక్తి కాక పోయినప్పటికీ, దేశ ప్రాధాన్యాలకు ప్రథమ స్థానమిచ్చా రన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఆయన దార్శనికతకు అనుగుణంగా...’ప్రజాస్వామ్యం విజయవంతంగా సాగడానికి అనుసరించా ల్సిన పద్ధతుల’పై 1952 డిసెంబర్ 22న ఒక ప్రసంగమిస్తూ... ప్రజా స్వామ్యం రూపం, ఉద్దేశం కాలక్రమేణా మారుతాయనీ, ప్రజలకు సంక్షేమాన్ని అందించడమే ఆధునిక ప్రజాస్వామ్యపు లక్ష్యమనీ పేర్కొ న్నారు. ఈ దార్శనికతతోనే మా ప్రభుత్వం గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో విజయం సాధించింది. 16 కోట్ల గృహాలకు కుళాయి నీటిని అందించడానికి కృషి చేశాం. పేద కుటుంబాల కోసం 5 కోట్ల ఇళ్లను నిర్మించాం. 2023లో ‘జన్ మన్ అభియాన్’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ ప్రారంభించారు. బలహీన గిరిజన వర్గాల (పీవీటీజీ) సామాజిక– ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, పీవీటీజీ గృహాలు–ఆవాసా లకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం దీని లక్ష్యం. ప్రధాన మంత్రి 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇది బాబాసాహెబ్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాదు, బాబాసాహెబ్ వారసత్వం, రచనల గురించి భవిష్యత్ తరాలకు మరింతగా తెలియజెప్పడానికి, మా ప్రభుత్వం పంచతీర్థాన్ని అభివృద్ధి చేసింది. అంబేడ్కర్తో ముడిపడిన మహూ (మధ్యప్రదేశ్); నాగపూర్ (మహారాష్ట్ర) లోని దీక్షా భూమి; లండన్ లోని డాక్టర్ అంబేడ్కర్ మెమోరియల్ హోమ్; అలీపూర్ రోడ్ (ఢిల్లీ) లోని మహాపరినిర్వాణ భూమి, మరియు ముంబయి (మహారాష్ట్ర) లోని చైత్య భూమిలే ఆ పంచ తీర్థాలు.గత నెలలో ప్రధాని దీక్షాభూమిని సందర్శించినప్పుడు, బాబా సాహెబ్ ఊహించిన భారతదేశాన్ని సాకారం చేయడానికి మరింత కష్టించి పనిచేయాలన్న ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అంబేడ్కర్ ఆదర్శాలకు అనుగుణంగా నడుచుకుంటామంటూ ప్రతిజ్ఞ చేసే అవకాశాన్ని ఆయన జయంతి కల్పిస్తోంది. జాతి, మత, ప్రాంత, కులాలకు అతీతంగా మనమంతా ‘భారతీయులు’గా సాగిపోదాం. ఆయన్ని ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన నాయకుడిగా చేసే ప్రయత్నాలను అడ్డు కోవాలి. ఒక సందర్భంలో సైమన్ కమిషన్ ఆధా రాల గురించి అడిగితే... ప్రాంతీయ దురభిమానమూ, సమూహ భావనలకూ లోనయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తూ, ‘మనమె ప్పుడూ భారతీయులమే’ అన్న చైతన్యాన్ని ప్రజల్లో కలిగించడం అత్యవశ్యమని చెప్పారు. బాబాసాహెబ్... భారతదేశానికి దేవుడి చ్చిన వరం. ప్రపంచానికి భారతదేశమిచ్చిన బహుమతి. అప్పటి బ్రిటిష్ ఇండియా గానీ, నవ స్వతంత్ర భారతం గానీ ఇవ్వని గౌరవ పీఠాన్ని మనం ఆయనకిద్దాం.రాజ్నాథ్ సింగ్వ్యాసకర్త భారత రక్షణ మంత్రి -
మహువా మొయిత్రా (ఎంపీ) రాయని డైరీ
పురుషుడితో గొడవ పడిన స్త్రీ పూర్తిగా అతడిని పట్టించుకోవటం మానేస్తుంది. స్త్రీతో గొడవ పడిన పురుషుడు మరింతగా ఆమెను పట్టించు కోవటం మొదలు పెడతాడు! నిజానికది పట్టించుకోవటం కాదు, ఆమె తనని పట్టించు కోక పోవటాన్ని పట్టించుకోవటం! కానీ ఎంపీలు కూడా ఇలా స్త్రీ, పురుషులుగా గొడవ పడాల్సిందేనా? ఏ నాగరికతా, ఏ పదవీ బాధ్యతా... స్త్రీని స్త్రీగా, పురుషుడిని పురుషుడిగా కాక, పరిణతి చెందిన ఒక మనిషిగా ఉంచలేవా? కల్యాణ్ బెనర్జీ, నేనూ లోక్సభ ఎంపీలం. కానీ మా మధ్య ఘర్షణను ఇద్దరు ఎంపీల మధ్య ఘర్షణలా అతడు ఉండనివ్వటం లేదు!లోక్సభలో అతడు పార్టీ చీఫ్ విప్. సభలో తృణమూల్ ఎంపీలు ఎవరు మాట్లాడాలన్నది అతడిదే నిర్ణయం. ఎవరు మాట్లాడకూడదన్నదీ అతడి నిర్ణయమే. లోక్సభలో మొత్తం 28 మంది తృణమూల్ ఎంపీలం ఉన్నాం. అందర్నీ మాట్లాడనిచ్చేవారు కల్యాణ్ బెనర్జీ. నా దగ్గరికి వచ్చేసరికి ‘నో’ చెప్పేవారు! ‘‘నేను మాట్లాడతాను’’ –‘‘నో’’‘‘నాకు అవకాశం ఇవ్వండి’’ – ‘‘నో’’‘‘రెండే రెండు నిమిషాలు...’’ –‘‘నో’’‘‘నన్ను చెప్పనివ్వండి ప్లీజ్..’’ – ‘‘నో’’కల్యాణ్ బెనర్జీ నాకన్నా 18 ఏళ్లు పెద్దవారు. 16 ఏళ్లుగా ఎంపీగా ఉంటున్నవారు. నిన్న మొన్న, ఆరేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన నాతో ఈయనకు ఏంటి ప్రాబ్లం?! ‘‘ఎందుకు మీరు నన్ను మాట్లాడనీయటం లేదు మిస్టర్ బెనర్జీ?’’ అని లాస్ట్ సెషన్లో మళ్లీ అడిగాను. కళ్లింత చేశారు! ‘‘ఫస్ట్ మీరు మీ చీఫ్ విప్తో మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఆ తర్వాత మీకు సభలో మాట్లాడే అవకాశం వస్తుంది. మిస్టర్ బెనర్జీ ఏంటి... మిస్టర్ బెనర్జీ? మన చైర్పర్సన్ని కూడా ఇలాగే ‘మిస్ బెనర్జీ’ అనేసేలా ఉన్నారు?’’ అన్నారు! మధ్యలోకి దీదీజీని ఎందుకు తెచ్చినట్లు!ఏప్రిల్ 4న తృణమూల్ ఎంపీలం అందరం ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్లాం. డూప్లికేట్ ఓటర్ ఐడీ నంబర్లు తొలగించాలని డిమాండ్ లెటర్ తయారు చేసి, అందులోఅందరి సంతకాలూ తీసుకున్నారు కల్యాణ్ బెనర్జీ... ఒక్క నా సంతకం తప్ప!‘‘ఏమిటిది మిస్టర్ బెనర్జీ! ఎందుకిలా చేస్తున్నారు?’’ అని అడిగాను.ఆ మాటకు అక్కడ సమాధానం చెప్పకుండా తృణమూల్ ఎంపీల వాట్సాప్ గ్రూప్లో నాపై పోస్టులు పెట్టారు. ‘‘ఇంగ్లిష్లో మాట్లాడగలనని అహంకారం... ఆఇంటర్నేషనల్ లేడీకి...’’ అని నా పేరెత్తకుండా అన్నారు! నవ్వొచ్చింది నాకు. సమాధానం లేనప్పుడు... ‘పెద్ద మగాళ్లం’ అనుకునే మగాళ్లు కూడా ఇలాగే చిన్నపిల్లల్లా మాట్లాడతారు! గ్రూప్లోంచి బయటికి వచ్చేశాను. వెంటనే నన్ను వెతుక్కుంటూ వచ్చారు సాగరికా ఘోష్! సాగరిక రాజ్యసభ ఎంపీ. ‘‘ఏప్రిల్ 4న జరిగిన దానికి దీదీజీ చాలా కోపంగా ఉన్నారు మొయిత్రా. కల్యాణ్ బెనర్జీతో తగాదా మానేయమంటున్నారు. సోమవారం లోపే ఇదంతా ముగిసిపోవాలని దీదీజీ కోరుకుంటున్నారు...’’ అన్నారు సాగరిక. ఆ విషయాన్ని దీదీజీనే నేరుగా నాతో ఎందుకు చెప్పలేకపోయారు!‘‘అంబేడ్కర్ని ఓన్ చేసుకోటానికి రేపు ఏప్రిల్ 14న బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని దీదీజీ అంటున్నారు మొయిత్రా. మహిళలకు రాజకీయాల్లో గౌరవం దక్కాలని అంబేడ్కర్ ఆకాంక్షిస్తే, తృణమూల్ పార్టీలో అందుకు విరుద్ధంగా జరుగుతోందన్న మాటను రానీయకూడదని మీకు చెప్పమన్నారు... ’’ అన్నారు సాగరిక. ‘‘అంటే, కల్యాణ్ బెనర్జీకి నన్ను అపాలజీ చెప్పమని అంటున్నారా?’’ అని అడిగాను. ‘‘లేదు. మిమ్మల్ని వెంటనే ఎంపీల వాట్సాప్ గ్రూప్లోకి తిరిగి వచ్చేయమంటున్నారు...’’ అన్నారు సాగరిక!!రెండూ ఒకటే కదా! కాదా?! - మాధవ్ శింగరాజు -
రామయ్య నిష్క్రమించే ... వనమల్లా విలపించే
నాడు శ్రీరాముడు అయోధ్యను వీడి సీతా లక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళినపుడు అయోధ్యాపురం కంటికిమింటికి రోధించిందట.. నేడు.. ఆ వనమాలి .. వనజీవి రామయ్య భూలోకాన్ని వీడి దివికేగిన తరుణంలో వనాలు విలపించావా.. తమను ఇన్నాళ్లూ సాదుకుని ఆదుకుని నిలబెట్టిన రామయ్య తానే కాలం ఒడిలో ఒదిగిపోతే మొక్కలు.. మానులు.. తీగలు లతలు అల్లాడిపోవా.. తలవంచి విలపించవా..ఎక్కడెక్కడో.. ఏ రోడ్డుమీద ఏ లారీకింద పది నలిగిపోవాల్సిన గింజలను ఏరుకొచ్చి ఒడిలో వేసుకుని భద్రంగా తీసుకెళ్లి అడవిలో ఓ చిన్న గొయ్యి తీసి.. వాటిని నాటి.. పెరిగేవరకూ కంటికి రెప్పలా చూసుకునేవారు. అవి పెరిగిపెద్దవవుతుంటే తన బిడ్డలే ఎదుగుతున్న భావన. గాలికి ఒరిగిపోకుండా వాటికి తన చిటికెనవేలు మాదిరి ఓ కట్టెపుల్లను దాన్నుగా ఉంచి పెంచాడు. అవి పెద్దవై పూలు.. పళ్ళు.. కాయలు ఇస్తుంటే పసిపిల్లాడి లెక్క కేరింతలు కొట్టేవాడు. ఎక్కడైనా మొక్కలు చెట్లు చనిపోయేలా ఉంటే తన చేత్తో తీసుకెళ్లి నీళ్ళుపోసి వాటి ప్రాణం నిలబెట్టేవారు. ఒకటా రెండా.. దశాబ్దాలుగా లక్షలాది మొక్కలపాలిట దేవుడాయన .. దేవుడంటారో.. బిడ్డల్ని పెంచిన తండ్రి అంటారోగానీ వనజీవి రామయ్య కన్నుమూత సమాచారం వనానికి అందింది.. .. మొక్కలను చేరింది.. తీగలకు తెలిసింది ... మానులకు చెవినపడింది..క్షణాల్లో వార్త అడవంతా వ్యాపించింది.. మొక్కలు చెట్లు తీగలు లతలు అంతా ఏకమై తమ ప్రాణాలను ఎవరో తీసుకుపోయారన్నంతగా రోదించాయి.. వేపమాను విలవిల్లాడింది ..రేపట్నుంచి తమ విత్తనాలు ఎవరు సేకరిస్తారు..ఎవరు ఏరుకెళ్ళి వేరే ప్రాంతంలో తమ శాఖను జాతిని విస్తరిస్తారు అంటూ కుమిలిపోయింది. జామచెట్టు జవగారింది.. తన పెద్దవేరును ఎవరో గొడ్డలితో నరికినంత పనైందని కుమిలిపోయింది. మల్లెతీగ మ్రాన్పడిపోయింది .. మందారం బాధతో ముడుచుకుపోయింది. చింత మాను చిన్నబోగా మద్ది చెట్టు మూలకుచేరి వెక్కివెక్కి ఏడ్చింది. బంతిమొక్క బావురుమనగా సన్నజాజి చిన్నబోయింది.ఒకటా రెండా.. వేలాది ముక్కలు తమకు జీవాన్ని జీవితాన్ని ఇచ్చిన రామయ్యకు సద్గతులు కలగాలని మొక్కాయి..మొక్కుకున్నాయి.. మున్ముందు కూడా ఇలాంటి రామయ్యలు భూమ్మీద జన్మించాలని.. వారి ద్వారానే వనాలు..తద్వారా జనాలు సైతం సుభిక్షంగా జీవిస్తారని ఆశించాయి. వనాల మారిన బతికే జీవాలు.. కూడా రామయ్య వంటి వాళ్ళు యుగానికొక్కరైనా పుట్టి దేశాన్ని సస్యశ్యామలం చేయాలని కోరుకున్నాయి..(వనజీవి రామయ్యకు సంతాపం తెలిపేందుకు ఈ కథనం)-సిమ్మాదిరప్పన్న -
గాడి తప్పిన గవర్నర్లకు పెద్ద గుణపాఠం
సుప్రీంకోర్టు తమిళనాడు గవర్నర్కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు గాడి తప్పిన గవర్నర్లకు పెద్ద గుణపాఠం. రాజ్యాంగ నిపుణులైన న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, ఆర్. మహ దేవన్లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వం తమ గవర్నర్ బాధ్యతా రాహిత్యంపై దాఖలు చేసిన పిటిషనన్పై చిర కాలం నిలిచిపోయే తీర్పు ఇచ్చింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఏ నిర్ణయమూ తీసుకోకుండా తన దగ్గరే ఉంచుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) తలుపు తట్టింది. బిల్లులను తొక్కిపట్టడం రాజ్యాంగ నేరం అని దూషించకపోయినా, అది రాజ్యాంగ పరమైన నైతిక చర్య కాదని పెద్ద పదాలు వాడుతూ తమిళనాడు గవర్నర్ రవిపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఒక్క తమిళనాడు గవర్నర్ (Tamil Nadu Governor) మాత్రమే కాదు. కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒక్కటేమిటి... చాలా రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగాన్ని అనేకసార్లు అతిక్రమించారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ మాత్రం కొనసాగుతూనే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200... ‘వీలైనంత తొందరగా’ (యాజ్ సూన్ యాజ్ పాజిబుల్) తన దగ్గరకు వచ్చిన శాసనసభ (Assembly) ఆమోదించిన బిల్లులపై సంతకం పెట్టాలని పేర్కొంటోంది. కానీ తమిళ నాడు గవర్నర్ రవి తన దగ్గరకు వచ్చిన బిల్లులపై నెలల తరబడి అసలు ఏ నిర్ణయమూ తీసుకోకుండా తొక్కిపట్టారు. ప్రతిదానికీ కాలపరిమితనేది ఒకటి ఉంటుంది. రాజ్యాంగంలో అక్షరబద్ధం కాలేదనే వంకతో ఇష్టమొచ్చినంత కాలం బిల్లులకు ఆమోదం తెలపకపోతే పాలన ఎలా జరుగుతుంది?ఆర్టికల్ 200 ప్రకారం పనిచేయాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉంది. ఒక బిల్లుపై సమ్మతిని ఆపాలన్నా, లేదా అభ్యంతరాలు ఉండి రాష్ట్రపతికి నివేదించాలన్నా నెల రోజుల్లోగా గవర్నర్లు ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందనే కనీస విజ్ఞత ఉండదా? పది బిల్లులను ఏ నిర్ణయం తీసుకోకుండా ఎలా ఆపుతారు? అందుకే ఈ తీర్పులో ‘బిల్లుపై తమ అభ్యంతరాలను తెలియచేస్తూ గవర్నర్లు 3 నెలల్లోగా అసెంబ్లీకి వాపసు చేయాల్సి ఉంటుంది. బిల్లుపై తన అభ్యంతరాలను రాష్ట్రపతికి తెలియచేయాలనుకుంటే గరిష్ఠంగా మూడు నెలల్లో ఆ పని చేయాల్సిఉంటుంది. అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొంది వచ్చిన బిల్లుకు నెల రోజుల్లోగా గవర్నర్లు తమ సమ్మతిని తెలియచేయాల్సి ఉంటుంది.గవర్నర్లు సత్వరంగా చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం ఆశిస్తున్నది. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం ప్రజాస్వామ్య పాలన స్ఫూర్తిని ఉల్లంఘించడమే’ అని స్పష్టంగా చెప్పవలసి వచ్చింది. రాజ్యాంగ పరంగా అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి చర్యల కారణంగా ఏర్పడిన సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఈ మార్గదర్శకాలు అవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు మిగతా గవర్నర్లకూ మార్గదర్శకాలు అవుతాయి. బిల్లులపై సమ్మతి తెలియజేయకుండా శాశ్వతంగా పెండింగ్లో ఉంచే అధికారం గవర్నర్లకు లేదని ఉన్నత న్యాయస్థానం మరీ మరీ చెప్పింది. గవర్నర్లకు మూడు అవకాశాలు మాత్రమే ఉంటాయని, ఒకటి బిల్లుకు సమ్మతి తెలియచేయడం, రెండు అభ్యంతరాలతో అసెంబ్లీకి బిల్లును తిప్పి పంపడం, మూడు రాష్ట్రపతికి నివేదించడమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వివరించింది.వాటిలో ముఖ్యమైన మార్గదర్శకం ఇది: ‘ఏదైనా బిల్లును పునఃపరిశీలనకు పంపాక అసెంబ్లీ మళ్లీ దాన్ని ఆమోదించి రెండవసారి గవర్నర్కు పంపించిన పక్షంలో అటువంటి బిల్లును గవర్నర్ రాష్ట్రపతికి నివేదించడానికి వీల్లేదు. అలా చేయడం చట్టవిరుద్ధం. ఒకవేళ రాష్ట్రపతికి నివేదించదలిస్తే నెలరోజుల్లోగా దానిపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రపతికి నివేదించాల్సిన అవసరం లేదని భావించిన పక్షంలో మూడు నెలల్లోగా బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి’.చదవండి: కాలంతో కాలు కదిపితేనే.. కాంగ్రెస్కు మళ్లీ పాత రోజులుజవహర్లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) కాలంలోనే కాదు, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రధానుల కాలంలోనూ దారుణంగా గవర్నర్లు ప్రజాస్వామ్యంతో ఆట లాడుకున్నారు. గతంలో కర్ణాటక, బిహార్, ఆంధ్రప్రదేశ్, కేరళల్లో గవర్నర్లు హద్దులు మీరారు. ఎన్టీఆర్ (NTR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ రామ్లాల్ ఆయన ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇదే దారిలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలున్న కాలంలోనూ గవర్నర్లు వ్యవహరించారు, వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య కాలంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ వ్యవహారశైలి కూడా వార్తలకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా సరైన తీర్పు ఇచ్చిందనే భావించాలి.- మాడభూషి శ్రీధర్ మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్ ఆఫ్ లా’ ప్రొఫెసర్ -
ఇది కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు!
కాంగ్రెస్ పునర్వైభవం, కాంగ్రెస్ కన్నా దేశానికి ఎక్కువ అవసరమనే ప్రజల ఆకాంక్షని పార్టీ నాయకత్వం గ్రహించినట్టుంది. కానీ, అదెలా జరగాలనే విషయంలో దానికొక స్పష్టత లేదని ఏఐసీసీ 86వ జాతీయ సమావేశాన్ని చూస్తే అర్థమవుతుంది. పాత విషయాల వల్లెవేతే తప్ప... జాతికి నూతన ఆశలు కల్పించే, మిత్రపక్షాలకు కొత్త నమ్మిక ఏర్పరిచే, పార్టీ శ్రేణులకు తాజా ప్రేరణనిచ్చే అంశా లేవీ తీర్మానాల్లోకి రాలేదు. కాలం చెల్లిన అంశాలను వల్లెవేయడం కాకుండా కాలంతో కాలు కదిపితేనే కాంగ్రెస్కు మళ్లీ పాత రోజులు వస్తాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు బలంగా నమ్ము తున్నారు. ఆ దిశలో నాయకత్వమే చొరవ చూపటం లేదు. జాతిపిత గాంధీజీ ఆశ్రమం నెలకొల్పిన సబర్మతి నదీ తీరంలో జరిగిన రెండు రోజుల కాంగ్రెస్ జాతీయ సదస్సు (Congress National Convention) ‘మరో భేటీ’ లాగ, సాదాసీదాగానే ముగిసింది. కాంగ్రెస్ మహామహుల పుట్టిల్లయి ఉండీ, మూడు దశాబ్దాలుగా అధికారానికి పార్టీ దూరమైన గుజరాత్ (Gujarat) నేల నుంచి గట్టి సందేశం ఇచ్చి ఉండాల్సిందనే భావన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉంది. సదస్సు చప్పగా సాగిందని పార్టీ ముఖ్యనేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.కాంగ్రెస్ లేని భారత్ (కాంగ్రెస్ ముక్త్ భారత్) నెలకొల్పాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముమ్మరంగా ప్రచారం చేస్తూ, పార్టీ ప్రభుత్వాలను కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితం చేసిన తరుణంలో... ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ మిశ్రమ ఫలితాలు సాధించిన 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీ నాయకత్వాన్ని కుంగదీసింది. ముఖ్యంగా హరియాణా, మహారాష్ట్రల్లో గెలిచే పరిస్థితులుండీ బీజేపీ నేతృత్వపు ఎన్డీయే కూటమి చేతిలో ఓటమి తప్పలేదు. జమ్మూ–కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విపక్ష ‘ఇండియా కూటమి’ నెగ్గినా అక్కడ కాంగ్రెస్ ప్రభావ రహితమైన మైనర్ పార్ట్నర్గానే ఉంది. కొన్ని చోట్ల జాతీయ పార్టీని, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తుల్ని, మరికొన్ని చోట్ల జతకట్టిన మతతత్వ శక్తుల్నీ... ఇలా ఆ యా రాష్ట్రాల్లో భిన్నమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్కుంది. అందుకే, ప్రస్తుత భేటీ కాంగ్రెస్కు ముఖ్యమైనదిగా పార్టీ శ్రేణులు పరిగణించాయి.యువతరాన్ని ఆకట్టుకోవాల్సిందే!ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ను ఎవరు సొంతం చేసుకుంటున్నారు అన్నది ఇవాళ్టి యువతకు పట్టే అంశం కానేకాదు. పటేల్, నెహ్రూల మధ్య, లేని అంతరాల్ని ఎగదోస్తూ ప్రత్యర్థులు రాజేసే రాజకీయ కుంపటి చుట్టూ కాంగ్రెస్ తిరగాల్సిన అవసరమే లేదన్నది సగటు కాంగ్రెస్ కార్యకర్త మనోభావన! భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందనే కాంగ్రెస్ ఘాటైన విమర్శకు 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే ‘పొలిటికల్ డివిడెండ్స్’ లభించాయి. ‘ఇండియా కూటమి’కి 150 స్థానాలు మించి రావని దేశంలోని 16 ప్రముఖ సర్వే సంస్థలు వేసిన అంచనాల్ని తలకిందులు చేస్తూ, 235 స్థానాలు గెలుచుకోవడం ఈ ప్రచార ప్రభావమే! 400 స్థానాలు ఆశించిన బీజేపీ సొంతంగా 240, కూటమికి 293 స్థానాలతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. మళ్లీ అదే నినాదాన్ని ఎంత బిగ్గరగా వినిపించినా.... తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలేదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, అభివృద్ధి లేమి వంటి సమస్యలు ప్రజల నిత్య ఆలోచనల్లో ఉన్నాయి. ఆయా అంశాల్లో ప్రభుత్వం ఎంతగా విఫలమైందో ఎండగట్టే విపక్ష ఎత్తుగడలు యువతను ఆకట్టుకోవడానికి పనికొస్తాయి.‘కులగణన’ ఒక స్థాయి వరకు సానుకూల ఫలితాలిచ్చినా, తదుపరి ప్రతికూలించే ప్రమాదముందనే అభిప్రాయాన్ని పార్టీలోని ఒక వర్గం వ్యక్తం చేస్తోంది. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలనే ప్రజాభిప్రాయం స్వాగతించదగిందనీ, లేకుంటే ప్రాంతీయ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందనే భావనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కూడా జరిగిన జాతీయ సదస్సు ఈ విషయంలో ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోయిందనే భావన శ్రేణుల్లో ఉంది.ఆశ, ఆకాంక్ష అయితేనే...పార్టీ కీలక తీర్మానానికి మద్దతు పలుకుతూ, సదస్సులో ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఒక మాటన్నారు: ‘కాంగ్రెస్ అంటే పగ. ప్రతీకారం కాకుండా ప్రజలకు ఒక ఆశ, ఆకాంక్ష అవ్వాలి. కాంగ్రెస్ అంటే కేవలం గత వైభవమే కాకుండా, సానుకూల దృక్పథం కలిగిన ఒక ఆశావహ భవిష్యత్ కావాలి. వ్యతిరేకిస్తూ చేసే విమర్శ మాత్రమే కాకుండా సద్యోచన, నిర్మాణాత్మక సహకారం అందించే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండాలి.’సదస్సు రెండో రోజు సాంఘిక శాస్త్ర పాఠంలా సాగిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగంలో ప్రధానంగా కాంగ్రెస్ కృషిని, త్యాగాలను ప్రశంసించడంతో పాటు బీజేపీ, ఆరెస్సెస్ది విపరీత భావజాలమంటూ విమర్శలు గుప్పించారు. ‘రాహుల్ ఇలా మాట్లాడాలి. కానీ, మాట్లాడరు’ అంటూ సంపాదకుడు హరీశ్ ఖరే ఒక రోజు ముందుగా ‘ద వైర్’ వేదికగా వెలువరించిన ప్రసంగ(వ్యాస)ంలోని ముఖ్యాంశాలను రాహుల్ నిజంగానే ప్రస్తావించలేదు. ‘..మతఛాందసం, వేర్పాటువాదం, నియంతృత్వాలకు వ్యతిరేకంగా నా శక్తి మొత్తాన్ని వెచ్చించి కడదాకా పోరాడుతానని విస్పష్టంగా ప్రకటిస్తున్నాను..’ అనే మాటలతో మొదలై, ‘.. గాంధీ, నెహ్రూ కుటుంబానికి చెందిన వాడినైనందున, మా తండ్రి, నాయనమ్మ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినందున... సహజంగానే నేను ప్రధానమంత్రి పదవికి అర్హుడనైతానని మీలో కొందరు భావిస్తుండవచ్చు. కానీ, నాకా ఆలోచన లేదు. నేను గానీ, మా కుటుంబంలో మరెవరైనా గానీ, ఆ పదవిని ఆశించడం లేదు’ అనే మాటలతో హరీశ్ వ్యాసం సాగుతుంది. ఆయన రాసినట్టుగానే ఇవేవీ రాహుల్ మాట్లాడలేదు.ఈ పద్ధతి సరికాదు!పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తామంటూనే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పార్టీ బలహీనపడే పరిస్థితులను అధినాయకత్వం ఉపేక్షించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. కొన్నిసార్లు పరోక్షంగా అధిష్ఠానమే ప్రోత్సహిస్తోంది. ఇందుకు తెలంగాణ, కర్ణాటకలో ప్రత్యక్ష ఉదంతాలున్నాయి. తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి మీనాక్షీ నటరాజన్ నేరుగా సచివాలయానికి వెళ్లి, మంత్రివర్గ ఉపసంఘంతో, అధికారులతో భేటీ అయి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) భూవివాదాంశాన్ని సమీక్షించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. పార్టీ కార్యాలయమైన గాంధీభవన్లో కాకుండా నేరుగా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థి ప్రతినిధులు, పౌర సంఘాల వారితో ఆమె ముచ్చటించారు. మళ్లీ వచ్చి, ఆ అంశాలను మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ, ఆయా ప్రతినిధులు, వర్గాల వారితో అది చర్చిస్తుందన్న ముఖ్యమంత్రి మాటలు అమలు కాకముందే, ఆమె ఈ ‘హడావిడి’ చర్యలకు పూనుకున్నారు. ఆమె ఏ హోదాతో సచివాలయంలో ఉపసంఘంతో, అధికారులతో భేటీ అయ్యారనే ప్రశ్న సహజంగానే తలెత్తింది. ఇది సదరు మంత్రివర్గాన్ని, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన పరిస్థితి. ప్రత్యర్థి పార్టీల విమర్శలకూ, సొంత పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికీ కారణమైంది. అంతకు ముందు ఇన్చార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షీపై ఒక రకం ఆరోపణలుంటే, గాంధేయవాది, ప్రజాస్వామ్య ప్రేమికురాలు, నిరాడంబరనేత అని పేరున్న మీనాక్షి చొరవను, ఒక అతి చేష్టగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.చదవండి: కన్నీరు కార్చడమే దేశద్రోహమా?ఢిల్లీలో బీసీ ధర్నా రోజు, అప్పటివరకు స్పందించకుండా ఉండి, ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన తర్వాత రాహుల్, సోనియాలు బీసీ నాయకుల్ని కలవటం కూడా తప్పుడు సంకేతాలనిచ్చిందనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. ఇది పార్టీకి అంత మంచిది కాదు.- దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్, పీపుల్స్ పల్స్ -
ఇలాగేనా పేదరిక నిర్మూలన?
‘ఉగాది’ రోజున ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడికి ఎవరికీ రాని విచిత్రమైన ఆలోచన వచ్చింది. పేదరికం గురించి తీవ్ర మనోవేదన చెందుతూ, పేదరికాన్ని నిర్మూ లించేందుకు కొత్త విధానాన్ని కనుక్కున్నారు. అదే ‘పీ4’ విధానం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో 2047 నాటికి పూర్తిగా పేదరికాన్ని నిర్మూలిస్తాననీ, ఇందుకు దాతృత్వమేఅత్యంత కీలకమనీ పేర్కొన్నారు. పేదలకు సహాయం చేసేలా సంపన్నుల్లో స్ఫూర్తి నింపటం పీ4 లక్ష్యమని అన్నారు. ఇది ఆచరణ సాధ్యమేనా? ప్రపంచంలో ఇటువంటి విధానంతో పేదరిక నిర్మూలన చేసిన ఉదాహరణలు ఏవైనా ఉన్నాయా?‘పబ్లిక్, ప్రైవేట్ – పీపుల్ – పార్టనర్షిప్’ (పీ4) విధానంలో ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు, ప్రజలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అంటున్నారు. 1995లో ప్రపంచ బ్యాంకు అమలు చేసిన సంస్కరణల్లో భాగంగా ‘పీ3’ పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ విధానాన్ని అమలు చేసి అద్భుతాలు సాధించాననీ, ఆ స్పూర్తితోనే íపీ4 రూపొందించాననీ అంటున్నారు. ఆ ‘అద్భుతాలు’ ఏమిటో మాత్రం చెప్పలేదు. ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయటంలో మాత్రం ముందు ఉన్నారు. 1995లోని పీ3లో లేని ప్రజలను అదనంగా పీ4లోఎందుకు చేర్చారో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వలేదు. బడా పారిశ్రామిక వేత్తల పరిశ్రమలకు భూములు కావాలి. భూ సేకరణ చట్టం ప్రకారం భూములకు పరిహారం ఇవ్వటం పరిశ్రమాధిపతులకు ఇష్టంలేదు. పీ4లో పేదలను చేర్చటం ద్వారా వారి భూములను పారిశ్రామిక వేత్తలకు ఇచ్చేలా చేయటం కోసమే వారిని ఇందులో చేర్చారు.తమ పేదరికానికి కారణాలైన వాటికి వ్యతిరేకంగా పేదలు తిరుగుబాటు చేయకుండా బడా సంపన్న వర్గాలను కాపాడటం కోసం గతంలోనూ ఇలాంటి అభిప్రాయాలు ముందుకు వచ్చాయి. ఫ్యాక్టరీ యజమానులు సంపాదించుకున్న సొమ్ము నుండి కార్మికులకు దానధర్మాలు చేయాలని మహాత్మాగాంధీ ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని దెబ్బతీయటానికి 1951 ఏప్రిల్ 18న తెలంగాణలోని పోచంపల్లిలో వినోబా భావే ప్రారంభించిన ‘భూదానో ద్యమం’ భూస్వాముల ప్రయోజనాలు కాపాడటం కోసమే! ఆచరణలో భూస్వాములు భూములు దానం చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే తరహాలో పీ4 విధానాన్ని ప్రకటించారు. దేశంలోని 10% ఉన్న బడా సంపన్న వర్గాలు, అట్టడుగులో ఉన్న 20% పేదలను దత్తత తీసుకుంటే పేదరికం నిర్మూలించబడుతుందని చెప్పటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. పేదరికాన్ని రూపుమాపటం పాలక ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత నుంచి చంద్రబాబు తప్పుకొంటున్నారు. పేదలు, బడా సంపన్న వర్గం, వర్గ సంబంధాల రీత్యా శత్రు వర్గాలే గాని మిత్ర వర్గాలు కాదు. బడా పెట్టుబడిదారులు, భూస్వాములు... కార్మికుల, గ్రామీణ పేదల శ్రమశక్తిని దోపిడీ చేసి సంపదలను కూడబెట్టారే గానీ కష్టపడి ఒక్క రూపాయి కూడాసంపాదించ లేదు. వారు అనుభవిస్తున్న సంపద అంతా వాస్తవంగా కార్మికుల, గ్రామీణ పేదలదే! అందువల్ల బడా సంపన్నులు, భూస్వాములు పేదలను దత్తత తీసుకోమని చెప్పటం ఏమిటి! వారి దాన ధర్మాలపై ఎందుకు ఆధారపడాలి? వారు సృష్టించిన సంపద మొత్తం వారికే చెందాలి. అది వారి హక్కు. ఈ హక్కును పక్కన పెట్టటమే చంద్రబాబు పీ4 విధానం. ఒక సమావేశ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘ఒకప్పుడు నాతో పాటు ఇక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది పేదరికం నుంచి వచ్చిన వారే. మేమందరం గ్రామాల్లోని మామూలు కుటుంబాల నుంచి వచ్చి పేదరికాన్ని జయించి ఈ స్థాయికి వచ్చా’మని చెప్పారు. గ్రామీణ పేద కుటుంబాలు అప్పుడు, ఇప్పుడు నిత్యం కష్టపడుతున్నప్పుడు, ఆ కుటుంబాలు పేదరికాన్ని జయించాలి గదా! ఎందువల్ల జయించలేక పోయాయి?నిత్యం పేదరికంలోనే ఎందుకు ఉంటున్నాయి? పేదరికం నుంచి బయటపడాలంటే, అందుకు అనుగుణమైన సామాజిక మార్పు విప్లవాత్మకంగా జరగాలి. ఆ మార్పును అడ్డుకోవటమే పీ4 విధానం. ఆంధ్రప్రదేశ్లో పేదరికం తగ్గక పోగా పెరుగుతూ ఉంది. చిన్న, సన్న కారు రైతులు భూములు కోల్పోవటం, గ్రామీణ ఉపాధి తరిగిపోవటం కార ణాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి 2022– 2023లో 45 శాతం ఉండగా 2023–24 నాటికి 46.1 శాతానికి పెరిగింది. గ్రామీణ పేదరికానికి, భూమికి విడదీయరాని సంబంధం ఉంది. సేద్యానికి భూమి ప్రధానం. ఆ భూమి పరాన్నభుక్కులైన కొద్ది మంది భూ కామందుల వద్ద బంధించబడి ఉంది. తమ శ్రమశక్తితో వివిధ పంటలు పండించే గ్రామీణ పేదలకు ఆ పంటలపై ఎటువంటి హక్కూ ఉండదు. ఎటువంటి శ్రమ చేయని భూ కామందులు ఆపంటలను తరలించుకుపోయి సంపదలను పెంచుకుంటున్నారు. పేదలు తీవ్రమైన దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామీణ పేదలకు భూమిపై హక్కు లభించినప్పుడే పేదరికం నుంచి బయటపడతారు.పట్టణ ప్రాంతంలోని కార్మికులు, పేదలు ఉపాధికి దూరమవుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరగక పోవటం, ఉత్పత్తులు సృష్టించే కార్మికులకు పరిశ్రమల్లో భాగస్వామ్యం లేక పోవటం, పాలక ప్రభుత్వాల విధానాల వల్ల పరిశ్రమలు మూతపడి కార్మికులు నిరుద్యోగులుగా మారటం, ఫలితంగా పరిశ్రమలపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారు కూడా ఉపాధి కోల్పోవడం వల్ల పట్టణ పేదరికం పెరుగుతూ ఉంది. తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని చంద్రబాబు చెబుతున్నారు కాబట్టి పేదరికానికి కారణాలు ఆయనకు తెలుసు. ఆ కారణాల పరిష్కారం గురించి నేడు ఆలోచించటం లేదు. నేడు చంద్ర బాబు బడా సంపన్న వర్గాల జాబితాలో ఉండటమే కాకుండా, ఆ వర్గాల ప్రతినిధిగా ఉన్నారు. నేటి వ్యవస్థను కాపాడే ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అందుకు భిన్నంగా చంద్రబాబు విధానాలు ఉండవు. పీ4 విధానం అనేది పేదరిక నిర్మూలనకు కాక... నేటి వ్యవస్థనూ, అందులో భాగమైన బడా పెట్టుబడిదారుల, భూస్వా ముల ప్రయోజనాలనూ కాపాడుతుంది. సమాజ పరిణామక్రమంలో దోపిడీ వర్గాలు పేదలు సృష్టించిన సంపదలను దోచు కోవటమే కాకుండా, అణచివేతకు గురి చేశాయి. అంతే తప్ప వారి గురించి ఆలోచించలేదు, ఆలోచించరు కూడా! అది వారి వర్గలక్షణం. పీ4 విధానం పేదలను పేదలుగా ఉంచటం, వారి పేదరికా నికి కారణాలపై పోరాటం చేయకుండా చేయటం, బడా సంపన్న వర్గాల దానధర్మాల కోసం ఎదురు చూసేలా చేయటమే!గ్రామీణ ప్రాంతంలో భూ సంస్కరణల ద్వారా పేదలకు భూముల పంపిణీ జరగాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి, తద్వారా గ్రామీణ ఉపాధిని పెంచాలి. పట్టణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణమైన పరిశ్రమలు నిర్మించి అందులో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. పరిశ్రమల అనుబంధంగా పట్టణ పేదలకు ఉపాధి ఏర్పడినప్పుడే దేశంలో, రాష్ట్రంలో పేదరికం పోతుంది. కానీ చంద్రబాబు పేదలకు భూములపంపిణీకి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యతిరేకం. రాష్ట్ర ప్రజలే పోరాటాల ద్వారా సాధించుకోవాలి. -వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526-బొల్లిముంతసాంబశివరావు -
కన్నీరు కార్చడమే దేశద్రోహమా?
ఉత్తరాది రాష్ట్రాలు ఆశ్చర్యకరమైన వార్తలకు జన్మనిస్తాయి. ఉత్తర ప్రదేశ్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగి సాఖిబ్ ఖాన్ (35)ను ఉద్యోగం నుంచి తొలగించారనేది అటువంటి తాజా వార్త. సాఖిబ్ ఖాన్ సహారన్పూర్ జిల్లా కైలాష్పురిలో విద్యుత్ సంస్థకు చెందిన సబ్ స్టేషన్లో కాంట్రాక్టు మీద లైన్ మన్గా పని చేస్తున్నాడు. మార్చి 31న ఈద్ నమాజ్ అయి పోయిన తర్వాత పాలస్తీనా జెండా పట్టుకుని ఫొటో దిగి, ఆ ఫొటోను సోషల్ మీడియా మీద పంచుకున్నాడు. ఆ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆయనను పిలిచి రెండు గంటల పాటు ప్రశ్నించి ఏ నేరారోపణలూ, కేసూ లేకుండా వదిలివేశారు. ఆయన మీద ఏ చర్యా తీసుకోకపోతే నిరసన ప్రదర్శనలు చేస్తామని స్థానిక సంఘ్ పరివార్ (Sangh Parivar) సంస్థలు పోలీసులను హెచ్చరించాయి. ఈలోగా ఈ విషయం విద్యుత్ శాఖ దృష్టికి వచ్చి, ఆ చర్యను దేశద్రోహ కర చర్యగా పరిగణించి, తక్షణమే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అదే సమయంలో సహారన్పూర్లో అంబాలా రోడ్ ఈద్గాలో నమాజ్ ముగిసిన తర్వాత పాలస్తీనా (Palestine) జెండాను ప్రదర్శించిన కొందరు యువకుల వీడియో తమ దృష్టికి వచ్చిందని, వారిలో ఎనిమిది మందిని గుర్తించి దేశద్రోహ నేరానికి విచారణ జరపనున్నామని నగర పోలీస్ సూపరింటెండెంట్ వ్యోమ్ బిందాల్ వార్తాసంస్థలకు తెలిపాడు. ఈ యువకులు చేసిన నేరం ఏమిటి? చనిపోయిన వారికి కన్నీరు కార్చడం! గత ముప్పై నెలలుగా గాజా మీద ఇజ్రాయెల్ బాంబు దాడులు సాగిస్తున్నది. యుద్ధ విరమణ ఒప్పందం మీద సంతకం చేసిన తర్వాత కూడా మారణహోమం కొనసాగిస్తున్నది. కళ్ళముందర ఘోరకలి సాగిపోతుంటే ఇంకేమీ చేయలేకపోయినా, ‘మీ దుఃఖం పంచు కుంటున్నాము’ అని పాలస్తీనీయుల పతాకను ప్రదర్శించడం అత్యంత మానవీయమైన, ప్రతీకాత్మక చర్య. సానుభూతి ఈ దేశంలో నేరమైపోయిన పాడు కాలానికి చేరాం. నిజానికి పాలస్తీనా జెండా ప్రదర్శించడం, ఆ మాట కొస్తే స్నేహ సంబంధాలున్న ఏ దేశపు జెండానైనా ప్రదర్శించడం భారత చట్టాల ప్రకారం, ప్రత్యేకించి ‘ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002’ ప్రకారం నేరం కాదు. దేశద్రోహం కాదు. కానీ గత రెండు సంవత్సరాలుగా, ముఖ్యంగా గాజా మారణకాండ ప్రారంభమైనప్పటి నుంచీ పాలస్తీనా బాధితుల పట్ల సంఘీభావం వ్యక్తం చేస్తూ ముహర్రం ఊరేగింపులోనో, ప్రార్థనల తర్వాతనో పాలస్తీనా పతాకం ప్రదర్శించిన వందల మంది మీద ఉత్తరాది రాష్ట్రాల పోలీసులు కేసులు బనాయిస్తున్నారు. కొందరి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసులు కూడా పెట్టారు. అదే సమయంలో ఇజ్రాయెల్కు అనుకూలంగా ఇజ్రాయెల్ జెండా ప్రదర్శిస్తూ ప్రదర్శనలు జరిపినవారి మీద ఎటువంటి కేసులూ లేవు. దేశంగా పాలస్తీనాతో, పాలస్తీనా ప్రజల ఆకాంక్షలతో, చివరికి సాయుధ పోరాటం చేస్తుండిన పాలస్తీనా విమోచన సంస్థతో, దాని నాయకుడు యాసర్ అరాఫాత్తో భారత ప్రభుత్వానికీ, భారత దేశానికీ ఉండిన సంబంధాల నేపథ్యంలో చూస్తే ఈ కొత్త ‘దేశద్రోహకర నేరం’ ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం బాల్ఫోర్ డిక్లరేషన్ ద్వారా పాలస్తీనాలో యూదులను స్థిరపరచడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నాటి నుంచీ భారత వలస వ్యతిరేక జాతీయోద్యమ నాయకులందరూ బ్రిటిష్ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ, పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించడం ప్రారంభించారు. 1938లోనే ఒక వ్యాసంలో గాంధీ ‘ఇంగ్లండ్ ఇంగ్లిష్ వాళ్లకూ, ఫ్రాన్స్ ఫ్రెంచి వాళ్లకూ ఎలా చెందుతుందో, అదే విధంగా పాలస్తీనా కూడా అరబ్బులకు చెందుతుంది. అరబ్బుల మీదికి యూదులను రుద్దడం తప్పు, అమానుషం’ అన్నారు. పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్ (Israel) ఏర్పాటు చేయాలనే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి 1947 లోనే భారతదేశం వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇజ్రాయెల్ ఏర్పాటును 1950లో ఆమోదించినప్పటికీ, 1992 దాకా దౌత్య సంబంధాలు నెలకొల్పలేదు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ... ‘పాలస్తీనా పాలస్తీనీయులదే’ అని అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ వ్యతిరేక తీర్మానాలను సమర్థిస్తూ వచ్చింది భారతదేశం. ఇజ్రాయెల్ మీద సాయుధ పోరాటం ప్రారంభించిన పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్ఓ)ను ‘పాలస్తీనా ప్రజల ఏకైక, సాధికార ప్రతినిధి’గా గుర్తించి, 1974లోనే ఢిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. 1980 నాటికి పీఎల్ఓతో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నది. 1988 నవంబర్ స్వాతంత్య్ర ప్రకటనతో ఏర్పాటైన పాలస్తీనాను గుర్తించిన తొలి అరబేతర దేశం భారతదేశమే! గాజాలో 1996లోనే భారత ప్రభుత్వ ప్రతినిధి కార్యాలయం స్థాపించింది. అదే సమయంలో 1990ల నుంచే ఇజ్రాయెల్తో కూడా భారత ప్రభుత్వం వాణిజ్య సంబంధాలు ప్రారంభించింది. దీంతో పాలస్తీనా నాయకులలో వ్యక్తమైన అనుమానాలను కూడా భారత నాయకులు కొట్టివేస్తూ వచ్చారు. పీఎల్ఓ అధ్యక్షుడు యాసర్ అరాఫాత్ 1997 నవంబర్లో భారత పర్యటనకు వచ్చినప్పుడు ఎన్నో వాణిజ్య, పారిశ్రామిక సహకార, సాంస్కృతిక సంబంధాల ఒప్పందాల మీద సంతకాలు జరిగాయి. అప్పుడే అరాఫాత్ హైదరాబాద్కు కూడా వచ్చి ఇండో–అరబ్ భవన సముదాయానికి పునాది వేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University)) నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. ఈ సుహృద్భావాన్నీ, సంఘీభావాన్నీ తోసివేస్తూ, 2014 తర్వాత భారత ప్రభుత్వం అధికారికంగా తన వైఖరి మార్చుకోకుండానే, అనధికారికంగా పాలస్తీనాకు దూరంగా, ఇజ్రాయెల్కు దగ్గరగా జరుగుతూ వచ్చింది. ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారతీయ ప్రధానిగా నరేంద్ర మోదీ 2017 జూలైలో ఇజ్రాయెల్ వెళ్లి బెంజమిన్ నెతన్యాహూను కౌగిలించుకుని సాన్నిహిత్యాన్ని ప్రకటించారు. చదవండి: కఠిన వాస్తవాలను దాచేస్తారా?అక్కడి నుంచి ఆ సంబంధాలు మరింత బలపడుతూ, 2023 అక్టోబర్ 27న, మారణహోమం మొదలైన ఇరవై రోజుల తర్వాత ఇజ్రాయెల్ దాడిని ఆపి, శాంతి ఒప్పందానికి రావాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత ప్రభుత్వం ఓటు వేయకుండా ఉండి పోయింది. మరి, అరవై వేల మరణాలకు కన్నీరు కార్చడం, సానుభూతి ప్రకటించడం దేశద్రోహకర నేరమవుతుందా?ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ధ్వంసరచన
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూసిన వాణిజ్య సుంకాల కత్తి పోట్లకు ఇండియా సహా ప్రపంచ స్టాక్ మార్కెట్స్ నెత్తురోడాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అకస్మాత్తుగా అనిశ్చితి ఊబిలో కూరుకుపోయింది. చైనా, కెనడా వెంటవెంటనే తొలివిడత ప్రతీకార సుంకాలను ప్రకటించాయి. దీంతో ట్రేడ్ వార్ అనివార్యం అనిపిస్తోంది. ఈ యుద్ధరంగంలో దూకేందుకు తామూ సిద్ధమేనంటూ యూరోపియన్ యూనియన్ హెచ్చరిక జారీ చేసింది. ఇతర దేశాలు అమెరికా నూతన విధానం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ఈ వాణిజ్య ఉద్రిక్తతల తక్షణ ప్రభావంతో నాస్డాక్ ఇండెక్స్ కుప్పకూలింది. ఇతర ఏషియన్ సూచీలూ పతనమయ్యాయి. చమురు ధర బ్యారెల్ 64 డాలర్లకు దిగివచ్చింది.ఆభరణాలకు దెబ్బ – వస్త్రాలకు మేలుఇండియా ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. దీనిక్కారణం, ఇప్పటికే ద్వైపా క్షిక వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు ప్రారంభమై ఉండటమే. గతంలో ప్రపంచ వాణిజ్యసంస్థ (డబ్ల్యూటీవో) వేదికపై ధనిక దేశాల ఒత్తి ళ్లను అధిగమించి ఇండియా వ్యవసాయ రంగం కోసం రాయితీలను సాధించింది. ఇప్పుడూ అమె రికాతో విజయవంతంగా ఒప్పందం కుదురుతుందని నిపుణుల అంచనా. అలాగే, ఇక్కడ తయారు కాని వస్తువులపై విధించే నిర్హేతుకమైన అధిక సుంకాలకు ఒప్పందంలో అంగీకరించవచ్చు. బదులుగా, ప్రాసెస్డ్ ఫుడ్స్, సాగర ఉత్పత్తుల ఎగు మతిపై నాన్–ట్యారిఫ్ ఆంక్షలు సరళీకరించాలని కోరుతుంది. స్థానిక సర్వర్లలో డేటా నిల్వ (డేటా లోకలైజేషన్), మేధాసంపత్తి హక్కులు వంటి అంశాలు అంత తేలిగ్గా పరిష్కారం కావు. రాజీ ఫార్ములాలే శరణ్యం అవుతాయి. ఇండియా వాణిజ్యపరంగా తన పరిశ్రమ లను, వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు స్వీయ రక్షణ విధానాలను అవలంబిస్తోందని ట్రంప్ పదే పదే విమర్శిస్తున్నప్పటికీ, ఆయన హయాంలో ఉభయ దేశాల నడుమ వ్యూహాత్మక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. రక్షణ బంధం బలపరచుకోడానికి రెండు దేశాలూ సిద్ధంగా ఉన్నాయి. ఏమైనప్పటికీ, కొత్త సుంకాలు కొన్ని భారతీయ పరిశ్రమలకు స్వల్ప కాలంలో అశని పాతంగా పరిణమిస్తాయి. వజ్రాలు – ఆభ రణాల పరిశ్రమనే తీసుకుందాం. ఇది 2023–24 ఆర్థిక సంవత్సరంలో 33 బిలియన్ డాలర్ల ఎగు మతులు చేయగా, అందులో మూడో వంతు ఒక్క అమెరికాకే సరఫరా అయ్యాయి. ఈ పరిశ్రమ ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థలతో కూడుకుని ఉంది. దాదాపు 50 లక్షల మంది (పూర్తి నైపుణ్యం ఉన్న, ఒకమాదిరి నైపుణ్యం ఉన్న) కార్మి కులు జీవనోపాధి కోసం వీటిపై ఆధారపడు తున్నారు. కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన సంక్షోభ కాలంలో వీరు ఉపాధి కోల్పోయి గ్రామా లకు తరలి పోయారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఆర్డర్లు తగ్గిపోయి అలాంటి దుఃస్థితి పునరావృతం అవుతుందన్న భయాలు వ్యాపిస్తున్నాయి.అయితే, అమెరికా వాణిజ్య సుంకాల పెంపు వల్ల ఇండియాకు అంతా ప్రతికూలమే అనుకో నక్కర్లేదు. మారిన పరిస్థితుల్లో ఇండియా దుస్తుల ఎగుమతి ధరలు పోటీ దేశాల్లో కంటే తక్కువగా ఉంటాయని వస్త్ర ఉత్పత్తుల కేంద్రమైన తిరుప్పూరు (తమిళనాడు) నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో కొనుగోలు దారులు ఇప్పటికే ఇండియా మీద దృష్టి సారించారు. కాబట్టి, భారతీయ వస్త్ర ఉత్పత్తులకు ఆర్డర్లు భారీగా పెరిగే వీలుంది. అమెరికాకే నష్టంసుంకాల పెంపు సంక్షోభం ఫలితంగా ఇతర ప్రపంచ దేశాల కంటే యూఎస్ ఆర్థిక వ్యవస్థే అధికంగా నష్టపోతుంది. అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన తీరు రానున్న దుర్భర స్థితికి సంకేతం. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని ఇంతకు ముందునుంచే అంటున్నారు. సుంకాల పెంపు వల్ల ఈ రిస్కు అనూహ్యంగా పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. జేపీ మోర్గాన్ ప్రకారం, ‘అమెరికా విచ్ఛిన్నకర రాజకీయాల’ ఫలితంగా అక్కడ ఆర్థిక మాంద్యం రిస్కు 40 నుంచి 60 శాతానికి పెరిగింది. కొత్త సుంకాల వల్ల యూఎస్ ఆర్థిక వ్యవస్థపై 700 బిలియన్ డాలర్ల భారం పడుతుంది. ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ లెక్కలు చైనా 34 శాతం ప్రతీకార సుంకాలు విధించక ముందు వేసినవి! ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోతే అది ఇండియా సహా అన్ని దేశా లకూ దుర్వార్తే! దీంతో, దేశం గడచిన సంవత్సరాల్లో సాధించిన వృద్ధి తగ్గిపోతుంది. 2025–26కి ఇండియా వృద్ధిరేటు 6.3 నుంచి 6.1కి క్షీణిస్తుందని ‘గోల్డ్మన్ సాక్స్’ ఇప్పటికే అంచనాలు సవరించింది.అంతర్జాతీయంగా వాణిజ్య సుంకాలను హేతుబద్ధీకరించడానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసి నప్పటి నుంచీ ప్రయత్నాలు మొదలై, దశాబ్దాల పాటు సంప్రతింపులు, చర్చలు జరిగి ఎట్టకేలకు ఒక బహుళ పక్ష వేదిక ఏర్పడింది. ఈ ప్రపంచ ఆర్థిక పాలనలో పేద దేశాల మాటకు విలువ కల్పించిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఇప్పుడు విధ్వంసమైపోతోంది. ట్రేడ్ వార్ ప్రభావం ఇండియాపై అనుకున్న దానికంటే తీవ్రంగానే ఉంటుంది. మరి దీనికి పరి ష్కారం ఏమిటి? యూరోపియన్ యూనియన్ వంటి బడా వాణిజ్య భాగస్వాములతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అదే సమయంలో, ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఏ దేశాలు ఎగుమతులకు అనువైనవో గుర్తించాలి. ఈ ప్రపంచ వాణిజ్య యుద్ధాల్లో అంతిమంగా ఇండియా నష్టపోతుందా, ప్రయోజనం పొందుతుందా అనేది ఇప్పుడప్పుడే తేలదు. రానున్న రోజుల్లో ఈ గొడవ సద్దుమణిగిన తర్వాతే వాస్తవిక అంచనా సాధ్యమవుతుంది.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ ‘ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మూర్ఖత్వం
1. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ మద్దతుదారులలో చాలామంది, బహుశా ట్రంప్ కూడా, అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలే అధిక సుంకాలను చెల్లిస్తాయని నమ్ముతున్నట్లుంది. వాస్తవం ఏమిటంటే, సుంకాలను దిగుమతి దారులు చెల్లిస్తారు. వారు ఆ ఖర్చును వినియోగదారులకు, ఈ సందర్భంలో, అమెరికన్ ప్రజలకు బదిలీ చేస్తారు.2. సుంకాల విధింపు అనేది చర్చల వ్యూహంలో భాగమా? ట్రంప్ మొదటి పదవీకాలం విషయంలో అది నిజమే కావచ్చు. ఇప్పుడు అలా చేయడం కష్ట తరమైన ఆలోచన. కొన్ని దేశాలు తమ సుంకాలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా దేశాలు ప్రతీకార సుంకాలను విధిస్తున్నాయి. తన మద్దతుదారులకు తాను బలంగా కనిపించాలని ట్రంప్ అనుకుంటున్నట్లుగానే, ఇతర దేశాల నాయకులు కూడా బలహీనంగా కనిపించడానికి ఇష్టపడకపోవచ్చు.3. ట్రంప్ మాంద్యాన్ని పెంచి పోషించడానికీ, తద్వారా అమెరికా ఫెడరల్ రిజర్వ్ను వడ్డీ రేట్లను తగ్గించమని బలవంతం చేయడానికీ ప్రయత్నిస్తు న్నారని కూడా చెబుతున్నారు. తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధిని నడిపిస్తాయి. అలాగే 2026 మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి సహాయపడ తాయి. అయితే, ఆర్థిక వ్యవస్థ కారు లాంటిది కాదు. కారు వేగాన్ని యాక్సిలరేటర్తోనూ, బ్రేక్ తోనూ సులభంగా నియంత్రించవచ్చు. ఇది సంక్లి ష్టమైన వ్యవస్థ. అమెరికా సుంకాలు అలాగే ఉంటే, అక్కడ రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వడ్డీ రేటు కోత అవకాశాలను తగ్గిస్తుంది. ఇంకొకటి: ప్రజలు పేదరికాన్ని అనుభూతి చెందుతూ సాధా రణంగా వారు చేసే దానికంటే తక్కువ ఖర్చు చేయడం వల్ల, వినియోగదారుల వ్యయం, ఆర్థిక వృద్ధి మందగిస్తాయి.4. దేశాలేవీ గతంలో సుంకాలను వేయలేదని దీని అర్థం కాదు. అవి వాటిని అస్త్రాలుగా వాడాయి. కానీ సార్వత్రిక సుంకాలు సాధారణంగా బలహీనంగా ఉండే ఆర్థిక ఫలితాలకు దారితీస్తాయి. 1930 జూన్లో అమెరికా ఆమోదించిన ట్యారిఫ్ చట్టం (లేదా స్మూట్–హాలీ చట్టం), 1929లో ప్రారంభ మైన మహా మాంద్యం తర్వాత దాని ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ఉద్దేశించబడింది. రక్షణ వాద ప్రభంజన కాలంలో ఈ చట్టం 20,000 పారి శ్రామిక, వ్యవసాయ వస్తువులపై సుంకాలను రికార్డు స్థాయికి పెంచింది. ఇతర దేశాలు తమ సొంత సుంకాలతో స్పందించాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసి, మాంద్యాన్ని పొడిగించింది. దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ఖర్చులతో సిద్ధమై, పోరాడటం ప్రారంభించిన తర్వాత పరిస్థితి మారింది. నాటి ఈ పాఠాన్ని అమెరికా పాలనాయంత్రాంగం మరచిపోయింది. 5. పరస్పర సుంకాల రేట్లను చాలా మోటు సూత్రాన్ని ఉపయోగించి నిర్ణయించినట్లు అనిపి స్తుంది. భారతదేశం విషయంలో, ఈ సుంకం 26 శాతం వేశారు. 2024లో, అమెరికా భారతదేశంతో 45.7 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య లోటును కలిగి ఉంది. అంటే భారతదేశం నుండి అమెరికా వస్తువుల దిగుమతులు భారతదేశానికి దాని వస్తువుల ఎగుమతుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఇది సూచిస్తుంది. భారతదేశం నుండి అమెరికా సరుకుల దిగుమతులు 87.4 బిలియన్ డాలర్లు. ఈ 87.4 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతుల్లో 45.7 బిలియన్ డాలర్ల అమెరికా లోటు 52 శాతానికి వస్తుంది. ఈ రేటును సగానికి తగ్గించినప్పుడు, 26 శాతం అవుతుంది.ఇక్కడ బహుళ సమస్యలు ఉన్నాయి. సేవల వాణిజ్యాన్ని పరిగణించలేదు. కరెన్సీ తారుమారు, వాణిజ్యేతర అడ్డంకులను పరిగణనలోకి తీసుకోలేదు. ఒక దేశం దాని సుంకాలను తగ్గించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ దేశంతో అమెరికా వాణిజ్య లోటు తగ్గకపోవచ్చు. ఎందుకంటే ఆ దేశానికి అమెరికా మరిన్ని ఎగుమతి చేయవలసి ఉంటుంది. మరిన్ని ఎగుమతి చేయడం అంటే తక్కువ సుంకాల రేటు గురించి మాత్రమే కాదు. అమెరికా ముందుగా వస్తువులను ఉత్పత్తి చేయాలి. అది కూడా ఇతర దేశాలకు ఆసక్తి కలిగించే ధరకు ఉత్పత్తి చేయాలి.తనకు తెలియదని తెలియదు!6. ట్రంప్ ఇలా సుంకాలు వేస్తున్నారంటే, తాను దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించే ఉంటారని నమ్మే ఒక ఆలోచనా విధానం కూడా ఉంది. ఇది మన ముందున్న అతిపెద్ద ప్రమాదాన్ని వెల్లడిస్తుంది: ట్రంప్కు తనకు తెలియనిది తెలియదని తెలీకపోవచ్చు. ఆయన అందరి దృష్టీ తన వైపు ఉండటాన్ని ఇష్టపడు తున్నట్లు, తనను తాను నిర్ణయాత్మక వ్యక్తిగా చూపించుకుంటున్నట్లు అనిపిస్తుంది.7. విధించిన ఈ సుంకాలు దేశీయ మార్కెట్ కోసం అమెరికాలోనే ఉత్పత్తి చేయమని కంపెనీలపై ఒత్తిడి తెస్తాయనే నమ్మకాన్ని ట్రంప్ మాటలు సూచిస్తున్నాయి. కానీ అది అంత సులభం కాదు.ఎందుకంటే అమెరికాలో ఉత్పత్తి చేయడం ఖరీదైన ప్రతిపాదన కావచ్చు. అసలు అందుకే కంపెనీలు మొదటగా బయటకు వెళ్లాయి. ఇప్పుడు కంపెనీల సరఫరా గొలుసులు చాలా పరిణామం చెందాయి. ఒక ఉత్పత్తి దాని తయారీ ప్రక్రియలో అనేకసార్లు అమెరికా సరిహద్దులను దాటవచ్చు. అందుకే కంపె నీలు ట్రంప్ రెండవ పదవీ కాలం ముగిసేదాకా వేచి ఉండాలని నిర్ణయించుకునే అవకాశం కూడా ఉంది.8. ట్రంప్ ఈ సుంకాల విధింపు వ్యూహాన్ని ద్విగిణీకృతం చేసినట్లయితే, అది దేశాలను అమెరికా నుండి మరింత దూరం చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్ డాలర్ కేంద్రంగా ఉద్భవించిన ప్రపంచ క్రమాన్ని అది చెదరగొడుతుంది.ఇప్పుడు దానికి మరొక వివరణాత్మక వ్యాసం అవసరం. కానీ ఒకే వాక్యంలో చెప్పాలంటే, గ్రాహమ్ గ్రీన్ 1978లో ప్రచురించిన ‘ది హ్యూమన్ ఫ్యాక్టర్’ నవలలో ఇలా రాశాడు: ‘మనకు చైనీయులు అవసరమయ్యే రోజు రావచ్చు’.వ్యాసకర్త ఆర్థిక అంశాల వ్యాఖ్యత, రచయిత ‘ (‘ద మింట్’ సౌజన్యంతో) -
తెలంగాణ పంటల విధానం మారాలి!
బియ్యం ఎగుమతులకు తెలంగాణ రాష్ట్రం శ్రీకారం చుట్టింది. ఫిలిప్పీన్స్కు తొలివిడత సరఫరా కూడా పూర్తయ్యింది. రాష్ట్ర వ్యవసాయ పురోభివృద్ధిలో ఇదొక మైలురాయి అంటూ ప్రశంసలు కూడా వినవచ్చాయి. నిజంగా ఇదంత సంబరపడాల్సిన పరిణామమేనా? తెలంగాణకు పది కాలాల పాటు లబ్ధి చేకూర్చేదేనా? బియ్యం ఎగుమతుల ద్వారా లభించే తక్షణ లాభాలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వవచ్చు. కాని, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ స్వస్థత, ఆహార భద్రత, పర్యావరణ సుస్థిరత దీర్ఘకాలంలో ప్రమాదంలో పడతాయి. ఫిలిప్పీన్స్ (Philippines) ఇందుకు సరైన నిదర్శనం. అక్కడి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని విశ్లేషణ చేసినట్లయితే, ఇదెంత ప్రమాదకర పరిణామమో విశదమవుతుంది.వైవిధ్యంతో కూడిన వ్యవసాయ–వాతావరణ పరిస్థితులు తెలంగాణ (Telangana) సొంతం. కాబట్టే, ఈ రాష్ట్రం అనాదిగా పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వంటి ఉద్యాన పంటలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చింది. క్రమేణా పరిస్థితి మారింది. విధానాల ఊతంతో వరి సాగు విస్తరించింది. ముఖ్యంగా ధాన్య సేకరణ, సాగునీటి ప్రోత్సాహకాలు రాష్ట్రంలో పంటల సరళిని నాటకీయంగా మార్చేశాయి. తెలంగాణలో వరి సాగు నీటి వనరుల కల్పన మీద విపరీతంగా ఆధారపడి ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం (Kaleswaram) ఎత్తిపోతల ప్రాజెక్టు కమాండ్ ఏరియాల్లో మనం దీన్ని గమనించవచ్చు. ఇప్పటికే భూగర్భ జలాలు క్షీణించిపోతున్న తెలంగాణలో ఇది సుస్థిర సేద్యం కానేకాదు. రాష్ట్రంలో 70 శాతం పైగా జిల్లాల్లో భూగర్భ జలాల వాడకం మితిమీరి ప్రమాదకర స్థాయికి చేరిందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు తాజా నివేదికలు సూచిస్తున్నాయి.నానాటికీ వరి సాగు (Paddy Cultivation) విస్తరిస్తోంది. 2014–15లో 41 లక్షల ఎకరాల్లో వరి పండించగా, 2023–24లో ఈ విస్తీర్ణం దాదాపు 50 శాతం పెరిగి 56 లక్షల ఎకరాలకు చేరింది. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారానే ఈ వృద్ధి సాధ్యపడింది. అయినప్పటికీ, భూగర్భ జలాలు తరిగి పోతున్నాయి. తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ ప్రకటించిన 2024 అధ్యయనం ప్రకారం, వరి పండిస్తున్న జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు ఏడాదికి 1.2 మీటర్ల వంతున పడిపోతున్నాయి.ఎగుమతులను ప్రధాన వ్యూహంగా చేసుకుని వాటి మీద ఆధారపడటం శ్రేయస్కరం కాదు. ధరల పతనం, వాణిజ్య ఆంక్షల రిస్కులకు తెలంగాణ రైతాంగాన్నీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనూ గురి చేయడం ఎంత వరకు సబబు? ఎగుమతి బియ్యం సేకరణ ధర (టన్నుకు రూ 36,000) ఇప్పుడు లాభసాటిగానే కన బడుతుంది. అంతర్జాతీయంగా గిరాకీ అటూఇటూ అయితే, అమ్ముడుబోని బియ్యం రాష్ట్రంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతాయి. దేశీయంగా ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇండియా 2023లో బాస్మతి యేతర బియ్యం ఎగుమతులపై ఆంక్ష విధించిన విషయం గుర్తు చేసుకోవాలి.ఫిలిప్పీన్స్ పాఠాలుఫిలిప్పీన్స్ అనుభవం మనకు ఒక హెచ్చరిక లాంటిది. ఆ దేశం ఒకప్పుడు బియ్యం ఎగుమతిదారు. తర్వాత్తర్వాత స్వయంసమృద్ధి మీద సకలశక్తులూ ఒడ్డాల్సి వచ్చింది. పలురకాల పంటల సాగుకు స్వస్తి పలికి అన్ని వనరులనూ వరి సేద్యానికి మళ్లించింది. 2018 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా మారింది. దేశీయ గిరాకీని తట్టుకునేందుకు 31 లక్షల టన్నుల బియ్యం (Rice) కొనుగోలు చేసింది. ఆహారభద్రతా సంక్షోభంలో కూరుకుపోయి 2023లో దేశంలో రైస్ ఎమర్జెన్సీ విధించింది. వాతావరణ ప్రతికూలతలు, వాణిజ్య ఆంక్షలు, ధరల హెచ్చుతగ్గులు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఇదంతా వరి పంట మీదే అతిగా ఆధారపడటం వల్ల సంభవించిన బాధాకర పర్యవసానం. ఎగుమతి మార్కెట్లు కుప్పకూలినా, స్థానిక సరఫరాలో కొరత ఏర్పడి ఎగుమతులపై ఆంక్షలు విధించినా... తెలంగాణలోనూ ఇదే పునరావృతం అవుతుంది.మామిడి, నిమ్మజాతి పండ్ల తోటలకు, పసుపు పంటకు, ఔషధ మెక్కల సాగుకు అనువైన భూములు, వాతావరణ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. వీటితో ఉద్యాన పంటలకు ప్రముఖ కేంద్రంగా అవతరించగల సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. నేషనల్ హార్టికల్చర్ బోర్డు గణాంకాల ప్రకారం, ఇండియా (India) సాగుభూమిలో కేవలం 15 శాతమే ఉండే ఉద్యాన పంటలు వ్యవసాయ జీడీపీలో 40 శాతం ఆక్రమి స్తున్నాయి. 2023–24లో తెలంగాణ హార్టికల్చర్ ఉత్పత్తి 120 లక్షల టన్నులు. ఈ పంటల కోసం ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి విలువైన తయారీ ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగితే ఎంతో ఆదాయం లభిస్తుంది. కాబట్టి, అధిక విలువ కలిగిన హార్టికల్చర్ (Horticulture) ఎగుమతుల మీద దృష్టి సారించాలి. తద్వారా వ్యవసాయం సుస్థిర మవుతుంది. అన్నింటి కంటే ముఖ్యమైన మరో అంశం, ఉద్యాన పంటలకు మళ్లడం ద్వారా విలువైన నీటి వనరులను నేల సారాన్ని కాపాడుకోగలం. చదవండి: వ్యవసాయం సుంకాల కాపట్యంతెలంగాణ తన వ్యవసాయ విధానంపై పున రాలోచన చేయాలి. భూగోళ వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో వాటిని తట్టుకుని దీర్ఘకాలిక సౌభాగ్యానికి బాటలు వేసే సుస్థిరమైన హై వ్యాల్యూ హార్టికల్చర్, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమల దిశగా దృష్టి మళ్లించాలి.- డాక్టర్ షేక్ ఎన్. మీరా వ్యవసాయ శాస్త్రవేత్త – డైరెక్టర్, ఐసిఎఆర్ – వ్యవసాయ సాంకేతిక అనువర్తన పరిశోధన సంస్థ -
రాయలసీమకు అన్యాయం చేయద్దు!
కడప కేంద్రంగా 2006లో రాయలసీమ, అనంత, పినాకిని గ్రామీణ బ్యాంకుల విలీనంతో ‘ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు’ (ఏపీజీబీ) ప్రారంభమైంది. గత 18 ఏళ్లలో, స్థానిక అవసరాలకు అనుగుణంగా, కొత్త సాంకేతిక తను స్వీకరిస్తూ, మంచి వ్యాపార ఫలితాలతో 10 జిల్లాల పరిధిలో పనిచేస్తున్నది. రాజకీయ అనిశ్చితులు, మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, తన పరిధిలో వెనకబడిన ప్రాంతాల స్థానిక అభివృద్ధికి ఆసరాగా నిలిచింది. ఈ రోజు, దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ బ్యాంకుగా పేరు తెచ్చుకుంది. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ‘వన్ స్టేట్, వన్ రూరల్ బ్యాంక్’ విధానంతో రాష్ట్ర స్థాయిలో ఒకే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో... ఏపీజీబీ భవి ష్యత్తు ఏమిటి? దాని ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగితే ఈ ప్రాంతానికి ఎంత మేలు జరుగుతుంది? అమరావతికి తరలిపోతే రూరల్ బ్యాంకింగ్ లక్ష్యాలకు, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎంత నష్టం వాటిల్లుతుంది అన్న ప్రశ్నలపై లోతైన చర్చ అవసరం.గతంలో పినాకిని (నెల్లూరు), అనంత (అనంత పురం), రాయలసీమ (కడప) గ్రామీణ బ్యాంకులు విలీనమైనప్పుడు, రాయలసీమ బ్యాంకు అతిపెద్దది కావడంతో ప్రధాన కార్యాలయం కడపలో ఏర్పాటైంది. ఈ సంప్రదాయం ఇప్పుడూ కొనసాగాలి. ప్రస్తుతం, ఏపీజీబీలో చిత్తూరు కేంద్రంగా ఉన్న సప్తగిరి,గుంటూరు కేంద్రంగా ఉన్న చైతన్య గోదావరి, వరంగల్ కేంద్రంగా ఉన్న ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులు విలీనం కానున్నాయి. వ్యాపారం, ప్రత్యేకతలు, సామర్థ్యం... ఇలా ఏ కోణంలో చూసినా ఈ నాలుగు గ్రామీణ బ్యాంకులలో ఏపీజీబీ అగ్రగామి. అందుకే, కొత్త రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యా లయం కడపలోనే ఉండాలి.2024 నవంబర్ 4న కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్.ఆర్.బి. విభాగం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, విలీనం తర్వాత ప్రధాన కార్యాలయం అతిపెద్ద బ్యాంకు యొక్క కేంద్రంలోనే ఉండాలి. ఈ మార్గదర్శకాన్ని గౌరవించాలి.అమరావతి వాదన ఎవరి కోసం?రాష్ట్ర రాజధానిలో ప్రధాన కార్యాలయం ఉండా లన్న వాదన ప్రజల మనోభావం కాదు – ఇది స్పాన్సర్ బ్యాంకుల రాజకీయం, పాలకవర్గాల స్వార్థం. అమరా వతిని ముందుకు తెచ్చే ఈ ప్రయత్నం వెనుక రాష్ట్ర ప్రభుత్వ కేంద్రీకృత అభివృద్ధికి ప్రాతినిధ్యం వహించే సిఫారసులు, కేంద్రం యొక్క విభజన హామీల నిర్లక్ష్యం ఉన్నాయి. ఇది రాజకీయ ఒత్తిడికి లోనైన నిర్ణయమే అవుతుంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని చాలా గ్రామీణ బ్యాంకులు రాజధానుల్లో కానీ, రాష్ట్రం నడిబొడ్డున కానీ లేకుండానే విజయవంతంగా నడుస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ (నహర్లగున్), కేరళ (మళప్పురం), మహారాష్ట్ర (ఔరంగాబాద్), పంజాబ్ (కపుర్తలా) గ్రామీణ బ్యాంకులు ఇందుకు ఉదా హరణలు. ఈ వాస్తవాన్ని విస్మరించరాదు. రాయల సీమకు రాష్ట్రావతరణ నుంచీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ బ్యాంకును అమరావతికి తరలించి మరో అన్యాయానికి ప్రభుత్వం పాల్పడ కూడదు.ఏపీజీబీ దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ బ్యాంకు. రాష్ట్ర గ్రామీణ బ్యాంకుల వ్యాపారంలో 43 శాతం (రూ. 56,056 కోట్లు) దీనిదే. 25.65 శాతం మూలధన సామర్థ్యం, 86.75 లక్షల కస్టమర్లు, 551 శాఖలు,రూ. 1,400 కోట్ల రిజర్వులు– ఇవన్నీ ఏపీజీబీ ఔన్న త్యాన్ని చాటుతాయి. కిసాన్ కార్డులు, ఎమ్ఎస్ఎమ్ ఈలకు రూ. 50 లక్షల రుణాలు, 2,934 ఆర్థిక సాక్షరతా శిబిరాల ఏర్పాటు వంటి సేవలను 2,775 గ్రామాలకు అందించడం ద్వారా... మొత్తం రాయలసీమలోనే కాక, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో సైతం ప్రజల జీవనోపాధి పెరగడానికి కారణమయ్యింది. అటువంటి బ్యాంకు అమరావతికి తరలితే, ఈ రూరల్ ఎకోసిస్టమ్ కుప్ప కూలుతుంది.రూరల్ బ్యాంకింగ్ లక్ష్యం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి. కడప ప్రధాన కేంద్రంగా ఏపీజీబీ ఈ లక్ష్యాన్ని నెరవేర్చింది. ‘అమరావతి’ రాజకీయ కేంద్రీ కరణకు ప్రతీక అయితే, ‘కడప’ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆలంబన. ఇక్కడి పౌర సమాజం, రైతులు, కార్మికులు, రాజకీయ పక్షాలు అందరూ అమరావతికి ఏపీజీబీ తరలింపును వ్యతిరేకిస్తున్నారు. అధికార పక్షా నికి కడప పట్ల సానుకూలత ఉన్నా, నాయకుడిని కాదని బహిరంగంగా మాట్లాడలేని పరిస్థితి. వైసీపీ ఎంపీలు అమరావతికి వ్యతిరేకంగా పార్లమెంటులో గళమెత్తారు, కేంద్రానికి లేఖలు రాశారు. కాబట్టి కడపకు అనుకూలంగా ఉన్న ఈ ఏకాభిప్రాయాన్ని కాదనడం అన్యాయం. అవసరమైతే, అమరావతిలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయవచ్చు. ఒకవేళ కడపలో కేంద్ర కార్యాలయం ఉంచడం సాధ్యం కాకపోతే ఏపీజీబీ, సప్తగిరి బ్యాంకులను రాష్ట్ర స్థాయి విలీన ప్రక్రియ నుంచి మినహాయించాలి. ఆ రెండు బ్యాంకులను మాత్రమే విలీనం చేసి కడప కేంద్రంగా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి నడపాలి. ఏపీజీబీ 18 ఏళ్ల అనుభవం, నెట్వర్క్,సాంకేతికత రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఆధారం. అందువల్ల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలి. రాయలసీమ ఆర్థిక భవిష్యత్తు దెబ్బతినకుండా చూడాలి!రఘునాథరెడ్డి అలవలపాటి వ్యాసకర్త రాయలసీమ ఆకాంక్షల పౌరవేదిక కోఆర్డినేటర్ ‘ 85238 41285 -
ప్రాసంగికత కోల్పోతున్న యూరప్?
డోనాల్డ్ ట్రంప్, జె.డి. వాన్స్ కలిసి వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఎలా వేధించారో ప్రపంచం అంతా చూసింది. అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆయన పట్ల పాశవికంగా ప్రవర్తించి గుడ్ బై సైతం చెప్పకుండా తరిమేశారు. ‘రష్యాను ధిక్కరించండి, మీకు మేము అండగా ఉన్నాం...’ అంటూ ఉక్రెయిన్ అధినేతకు బాసటగా నిలిచి ఎంతగా ప్రోత్సహించాలో అంతగా ప్రోత్సహించిన యూరప్ ఈ ఘట్టాన్ని చేష్టలుడిగి చూసింది. యూరప్ ప్రభావం పలుచబడిపోతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?తగ్గుతున్న జనాభాయూరోపియన్ యూనియన్ (ఈయూ)కు బలమైన నాయ కత్వం లేదు. ఎవరి దౌత్య విధానం వారిదే. ‘యూరప్తో మాట్లాడా లనుకుంటే, నేను ఎవరికి ఫోన్ చేయాలి?’ అంటూ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్ ఒక సందర్భంలో చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్య ఇందుకు అద్దం పడుతుంది. యూరప్ దేశాలకు కాలం కూడా కలిసిరావడం లేదు. ఆ దేశాల్లో జననాల రేట్లు తగ్గుతున్నాయి.వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా, యువకులు తగ్గిపోతున్నారు. 2050 నాటికి యూరప్ సగటు వయసు 48 ఏళ్లకు పెరుగుతుంది. 60 ఏళ్లు దాటినవారు జనాభాలో 40 శాతం ఉంటారు. వందేళ్ల క్రితం ప్రపంచ జనాభాలో 25 శాతం యూరప్ దేశాల ప్రజలే ఉండేవారు. 2050 నాటికి, వీరి వాటా కేవలం 7 శాతానికి పరిమితం అవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.యుద్ధరంగానికి దళాలు సమకూర్చుకోవడం కూడా ఈ దేశాలకు సమస్యగా మారుతోంది. రష్యా ఇప్పటికే ఉత్తర కొరియా దళాలను రెగ్యులర్ ప్రాతిపదికన తన సైన్యంలో నియమించుకోవలసి వచ్చింది. పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతున్నా సరే... యూరప్ కాలం చెల్లిన తన పాత ఇమ్మిగ్రేషన్ విధానాలనే పట్టుకు వేలాడుతోంది. ఇది శ్రమశక్తి సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఉక్రెయిన్ శ్వేతజాతి శరణార్థుల పుణ్యమా అని పనిచేసే వారి సంఖ్య పెరిగినా ఇది తాత్కాలికమే! ఎదుగుదల లేని ఆర్థిక వ్యవస్థపరిపాలన సరిగా ఉండదు, ఆర్థికంగా పురోగమనం లేదు, వయసు మళ్లుతున్న జనం పెరుగుతున్నారు, వృత్తిపరమైన అవకా శాలూ అంతంత మాత్రమే. ఇలాంటి యూరప్ ఇండియాను ఎలా ఆకట్టుకుంటుంది? అమెరికాలో ఒంటి రంగును బట్టి కాకుండా, సత్తాను బట్టి మనుషుల్ని అంచనా వేస్తారు. ఆ మాదిరిగా మార్పు చెందటంలో యూరప్ సమాజం విఫలమైంది. నత్తనడకగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు, పెరుగుతున్న సామాజిక భద్రతా వ్యయాలు, నడ్డి విరుస్తున్న రుణభారం... ఇవన్నీ ఆ ఖండం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. అమెరికా పాత్రికేయుడు ఫరీద్ జకారియా చెప్పినట్లు, యూరప్ దుఃస్థితికి మూల కారణం ఆర్థిక వృద్ధి లోపం. ఉదాహర ణకు ఇటలీ ఆర్థిక వ్యవస్థలో ఏకంగా ఒక దశాబ్దంగా ఎలాంటి పెరుగుదల లేదు.ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాల్లోని వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు బలం పుంజుకుంటూ దూసుకు వస్తున్నాయి. గ్లోబల్ గవర్నెన్స్లో తమకు అధిక పాత్ర ఉండాలని ఈ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, జీ–7, నాటో వంటి ప్రపంచ అధికార సంస్థలు ఇప్పటికీ యూరప్ చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. కానీ ఆర్థిక వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం అయిదు యూరప్ దేశాలు (జర్మనీ, యూకే, రష్యా, ఫ్రాన్స్, ఇటలీ) ప్రపంచ టాప్–10 ఆర్థిక వ్యవస్థల్లో ఉన్నాయి. 2050 నాటికి ఈ అయిదింటిలో కేవలం జర్మనీ, యూకే రెండే టాప్–10 జాబితాలో మిగిలి ఉంటాయి. ఆ పదిలో వాటికి దక్కే ర్యాంకులు చిట్టచివరి తొమ్మిది, పది! ఇందుకు భిన్నంగా, వాటి కంటే ముందుండే ఇండియా, బ్రెజిల్, ఇంకా ఇతర వర్ధమాన దేశాలు అంతర్జాతీయ వ్యవహారాల్లో తమకు గణనీయ పాత్ర ఉండాలని ఒత్తిడి చేస్తాయి. ఇప్పటి ప్రపంచ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణను ఎంతో కాలం అడ్డుకోలేరు.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్మాణం ఇప్పటికే కాలం చెల్లిపోయింది. దీన్ని ఎలా పునర్ వ్యవస్థీకరించాలనే అంశంపై పరిశీలన జరుగుతోంది. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ వంటి దేశాలు ప్రస్తుత సభ్యత్వాల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఒత్తిడి తెస్తున్నాయి.ఇండియా జీడీపీలో మూడోవంతు కంటే తక్కువ, జపాన్ జీడీపీలో దాదాపు సగం ఉండే యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు శాశ్వత సభ్యు లుగా ఉండటం... ఇండియా, జపాన్ వెలుపల ఉండటం ఎలా సమంజసమనీ, వాటి మీద ఈ రెండు యూరప్ దేశాలు ఎలా పెత్తనం చలా యిస్తాయనీ గట్టి వాదన వినబడుతోంది. భద్రతా మండలి, జీ–7 లను సభ్యత్వ పరంగా విస్తరించడం మీద చర్చలు నడుస్తున్నాయి. ప్రపంచ పాలన సంస్థల పునర్ వ్యవస్థీకరణ జరగాలన్నది కాదనలేని అంశం. తిరుగులేని అమెరికా?శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా మున్ముందు కూడా ప్రబలమైన ప్రపంచ శక్తిగా కొనసాగుతుంది. చైనా, ఇండియా వంటి దేశాలు దాన్ని వెన్నంటి ఉంటాయి. ఒకవేళ అధిగమించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఏమైనా, రెండో ప్రపంచ యుద్ధం ముగిసి వందేళ్లు గడిచే లోపే అప్పటి విజేతల్లో ఒక్క అమెరికా మినహా మిగిలినవన్నీ టాప్–10 జాబితా నుంచి కను మరుగవుతాయి.అమెరికా లోలోపల పలు మార్పులు చెందుతోంది. జనాభా వర్గాల్లో పరివర్తన ఫలితంగా రాజకీయంగానూ మార్పులు సంభవి స్తున్నాయి. నల్ల జాతీయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆఫ్రో–ఇండి యన్ మహిళ ఉపాధ్యక్ష పదవిని చేపట్టగలిగింది. భారతీయ అమెరికన్లు ప్రభుత్వంలో, విద్యా పారిశ్రామిక రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎగబాకారు. గుజ్జూభాయి కశ్యప్ పటేల్ ఎఫ్బీఐ పగ్గాలు చేపడతాడని ఎప్పుడైనా అనుకున్నామా? వివిధ దేశాల సంతతులకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ, ఇతర రంగాల్లో ప్రముఖ స్థానాలు పొందడం వల్ల ఆ యా దేశాలు అమెరికాతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నాయి. విదేశీయులకు ప్రవేశం కల్పించడం వల్ల అమెరికా ప్రతిభ ఇనుమడించింది. యూరప్ ఈ విషయంలో విఫలమైంది. వర్ధమాన దేశాలు 21వ శతాబ్దపు నూతన వ్యవస్థకు రూపు దిద్దబోతున్నందున... ప్రపంచ వ్యవహారాల్లో యూరప్ పాత్ర క్రమేపీ క్షీణించిపోతుంది. యూరప్ గనుక జనాభా సంబంధిత (డెమో గ్రాఫిక్) నూతన విధానాలు రూపొందించకపోతే, ఆర్థిక పరమైన సంస్కరణలు చేపట్టకపోతే అది ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో గుర్తింపు లేని ఖండంగా మిగిలిపోతుంది.రానున్న రోజుల్లో ఆసియానే ప్రపంచ అధికార కేంద్రంగా ఆవి ర్భవిస్తుంది. 2020లో ఈ ఒక్క ఖండమే ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 60 శాతం వాటా కైవసం చేసుకుంది. ఇదే ట్రెండ్ ఇక మీదటా కొనసాగబోతోంది. చైనా, ఇండియా ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమ పలుకుబడి పెంచుకుంటూ పోయి, ప్రపంచ పాలన (గ్లోబల్ గవర్నెన్స్)లో మార్పుల కోసం పట్టుబడతాయి. అయితే, అమెరికాతో విరోధం కారణంగా చైనా, యురోపియన్ యూనియన్ (ఈయూ)కు చేరువయ్యే అవకాశం ఉంది. ఇక చైనాతో సంబంధాలు బెడిసినందువల్ల ఇండియా, అమెరికాకు బహుశా మరింత దగ్గర అవుతుంది.మోహన్ గురుస్వామి వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com -
ఊడల మర్రికి వేలాడిన వీరుడు రాంజీ గోండ్
పాలకుల అకృత్యాలను ఎదిరించడంలో మొదటి నుంచీ గిరిజనులు ముందే ఉన్నారు. భారత దేశాన్ని మొదటగా ఏకం చేసిన మొఘల్ కాలంలోనే కాదు, ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్వాళ్లపైనా ఆదివాసీలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అయితే వీళ్ల తిరుగుబాటుల గురించి అంతగా ప్రచారం జరగకపోవడం శోచనీయం. ముఖ్యంగా మన తెలంగాణలో రాంజీ గోండ్ చేసిన తిరుగుబాటు నిజాం నవాబుకు, ఆయన పాలనకు రక్షణగా నిలిచిన బ్రిటిష్ వాళ్లకూ పెద్ద గుణపాఠాన్ని నేర్పింది. గోండ్వానా ప్రాంతాన్ని పాలించిన గోండు రాజులను మరాఠాలు జయించిన తర్వాత... ఆ ప్రాంతం నిజాంకు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లకు వశమయ్యింది. వారి నిరంకుశత్వం గోండులను తిరుగుబాటుకు పురిగొల్పింది. ఆదిలాబాద్ జిల్లాలోని గోండుల్లో ధైర్యశాలిగా పేరున్న మార్సికోల్లరాంజీగోండ్ 1838–1880 మధ్యకాలంలో నాటి జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా బ్రిటిష్ సైన్యాలను దీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు. తెలంగాణలో హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి, తదితర కార్యక్రమాల్లో పాల్గొన్న రోహిల్లాల పోరాటం రాంజీ గోండ్ నాయకత్వంలో తీవ్రరూపం దాల్చింది. రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా ఆసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనులుండే ప్రాంతం. 1880 మార్చి, ఏప్రిల్ నెలల్లో బ్రిటిష్వాళ్లకు వ్యతిరేకంగా తుదిపోరాటం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం గోండుల తిరుగుబాటును అణచివేసే బాధ్యతను కల్నల్ రాబర్ట్కు అప్పజెప్పింది. తెల్లదొరల నిర్బంధాన్ని వ్యతిరేకించడం, వెట్టికి ప్రతిఫలం ఆశించడాన్ని తెల్లదొరలు సహించలేకపోయారు. సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూర్, లక్సెట్టిపేట, ఉట్నూర్, జాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీ నాయకత్వంలో వెయ్యి మంది రోహిల్లాలు, గోండులు కలిసి నిర్మల్ సమీప కొండలను కేంద్రంగా చేసుకొని పోరాటం చేశారు. వారిపై నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు దాడులు చేశాయి.అడవంతా తుపాకుల మోతతో మారుమోగింది. సాంప్రదాయిక ఆయుధాలతో పోరాటానికి దిగిన ఆదివాసులు ఆధునిక ఆయుధాలు, తుపాకుల ముందు నిలువలేక పోయారు. తెగించి పోరాడుతున్న ఆదివాసులను కాల్చిచంపారు. కడదాకా పోరాడిన రాంజీ గోండు సహా 1000 మందిని పట్టుకొని నిర్మల్ నడిబొడ్డున ఉన్న ‘ఊడల మర్రి’ చెట్టుకు 1880 ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రిచెట్టు ఇప్పుడు ‘వెయ్యి ఉరిల మర్రిచెట్టు’గా ప్రసిద్ధి! – గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక(నేడు రాంజీ గోండ్ వర్ధంతి)