breaking news
Guntur
-
22న చలో అసెంబ్లీ జయప్రదం చేయండి
ఏపీ కౌలు రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు నరసరావుపేట: కౌలు రైతుల సంక్షేమం, హామీల అమలుకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 22న విజయవాడలో నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమంలో కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పిలుపునిచ్చారు. శనివారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో చలో అసెంబ్లీ ర్యాలీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 400 మంది రైతులు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆయా కుటుంబాలను పరామర్శించలేదని, పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. అసెంబ్లీ, మండలిలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కౌలు రైతు కొత్త చట్టం అమలుకు కృషిచేయాలన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థ విధానాలే కౌలు రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయన్నారు. కౌలు రైతుల సంక్షేమం కోసం సంఘం ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలు చేస్తామన్నారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, సంఘం నాయకులు టి.పెద్దిరాజు, కె.ఆంజనేయులు, అమరలింగేశ్వరరావు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నాయకుడు అంజి అక్రమ అరెస్టు
చెట్టుపై పడిన పిడుగు మాచవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షానికి మాచవరం సెయింట్ ఆనన్స్ లయోలా ప్రేమ నిలయం హాస్టల్ ఆవరణలో ఉన్న కొబ్బరి చెట్టుపై శనివారం పిడుగు పడింది. ఆ సమయంలో విద్యార్థులందరూ హాస్టల్ గదుల్లోనే ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని సిస్టర్ కవిత తెలిపారు. పిడుగు పడిన సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది స్పందించి సరఫరాను నిలిపివేశారు. ఘటన స్థలాన్ని తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు కంకర గుంట వద్ద శనివారం రాత్రి రైలు కింద పడి ఓ యువకుడు (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి మాచర్ల ప్యాసింజర్ రైలు కంకర గుంట గేటు వద్దకు చేరుకోగానే ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందాడు. మృతదేహం గుర్తు పట్టలేకుండా ఉండటంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు గుంటూరు రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్కు సమాచారం తెలియజేయాలని తెలిపారు. -
ఉధృతంగా గుంటూరు చానల్ ప్రవాహం
పెదకాకాని: గుంటూరు చానల్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 12వ తేదీన రాత్రి కురిసిన వర్షాలకు గుంటూరు చానల్కు గండి పడటంతోపాటు కట్టలపై నీరు పొంగి ప్రవహించింది. దీంతో మొక్క దశలో ఉన్న వరి పొలాలు నీట మునిగాయి. ప్రస్తుతం శనివారం కురిసిన వర్షానికి పెద్ద మొత్తంలో గుంటూరు చానల్కు నీరు వచ్చి చేరింది. కాలువకు కూడా నీరు ఎక్కువగా విడుదల చేయడంతో అంచులను తాకుతూ ప్రవహిస్తోంది. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద ప్రారంభమైన గుంటూరు చానల్ (కొత్తకాలువ) 47 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. కాలువ పొడవునా ప్రజలు నీటిని సాగు, తాగు అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. కాలువ కట్టలను పటిష్టం చేయకపోవడంతో ఎక్కడ గండి పడుతుందోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ లాకులకు తూటికాడ, గుర్రపుడెక్క అడ్డపడిన ప్రాంతంలో నీటి పరిమాణం మరింతగా పెరిగి కట్టలను తాకుతోంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
నిన్న తురకపాలెం.. నేడు కొత్తరెడ్డిపాలెం
సాక్షి ప్రతినిధి, గుంటూరు, చేబ్రోలు: తురకపాలెం ఘటనతో కూడా గుంటూరు జిల్లా యంత్రాంగం మొద్దునిద్ర వీడటం లేదు. తురకపాలెంలో మెలియోడోసిస్ వ్యాధితో రెండు నెలల్లోనే పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ శివారు కొత్తరెడ్డిపాలెంలో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు దీనిపై ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆశా వర్కర్ సుమలత జ్వరంతో బాధపడుతూ నాలుగు రోజులు పాటు చికిత్స పొందారు. శుక్రవారం ఆమె మరణించటం కలకలం రేగింది. జ్వరం ఇతర అనారోగ్య సమస్యలతో గత నెలలో ఇరువురు మృతి చెందారు. తురకపాలెం తరహా అనుమానిత లక్షణాలు ఇక్కడి వారికి కూడా ఉన్నట్లు ఏకంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష సమావేశంలోనే వెల్లడించారు. అధికారులు మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. ఇంటింటి సర్వే నిర్వహించామని, ప్రమాదకరమైన లక్షణాలు ఏమీ లేవని చెబుతున్నారు. తొమ్మిదిమంది అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించగా... వారిలో ఐదుగురికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. మిగిలిన నలుగురికి కోకై బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నట్లు స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ ఊర్మిళ చెబుతున్నారు. విజృంభిస్తున్న జ్వరాలు.... చేబ్రోలుతోపాటు గ్రామ శివార్లలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా వేదికగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఏనాడు పంచాయతీలలో పారిశుధ్యం గురించి సమీక్షించిన పాపాన పోలేదు. ముఖ్యంగా తురకపాలెం, చేబ్రోలు సహా ఇతర గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. చేబ్రోలులో ఏడు దళితవాడలు ఉండగా.. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి దోమలు వ్యాప్తి పెరిగింది. డ్రైనేజీ వ్యవస్థ సమస్యగా ఉంది. గ్రామంలో ప్రస్తుతం ప్రతి ఇంట్లో జ్వరాలతో బాధపడుతున్నారు. తురకపాలెంలో 109 మంది జ్వరపీడితుల నుంచి బ్లడ్ కల్చర్ పరీక్షలు చేయగా నలుగురికి మెలియోడోసిస్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఒకరు మరణించగా ముగ్గురు కోలుకున్నారు. పరీక్షలు చేసిన 1,501 మందిలో 48 శాతం మందికి రక్తహీనత ఉందని గుర్తించారు. 49 శాతం మందికి ఏదో ఒక ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు తేలింది. వీటన్నింటికీ కారణాలు అన్వేషించకుండా ఆర్ఎంపీలు అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందనే ప్రచారానికి కూటమి ప్రభుత్వం తెరలేపింది. వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో తీసుకున్న చికిత్సలు, వాడిన మందులపై కూడా వివరాలు సేకరిస్తే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. -
లోక్ అదాలత్లో 11,388 కేసులు పరిష్కారం
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 11,388 కేసుల పరిష్కారం అయ్యాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 41 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 908 సివిల్ కేసులు, 10,480 క్రిమినల్ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా, కాటూరు గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో యార్లగడ్డ శ్రీనివాసులు మరణించిన క్లెయిమ్ కేసులో వారి కుటుంబానికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు తరఫున రూ.1,11,82,343 అందించి, పరిష్కారం చేసుకున్నారు. సంబంధిత చెక్కును బాధితుల తరఫు న్యాయవాది వి.బ్రహ్మారెడ్డి , బీమా కంపెనీ తరఫు న్యాయవాది పి.రామాంజనేయులు, కంపెనీ మేనేజర్ సమక్షంలో బాధితులకు జిల్లా జడ్జి అందజేశారు. -
సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం
గుంటూరు వెస్ట్: పేదలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేలా విధులు నిర్వహిస్తానని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శనివారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఎక్కువ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటానన్నారు. అనంతరం కలెక్టర్ను సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, డీఆర్వో ఎస్కే ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు, జిల్లా పరిషత్ సీఈవో జ్యోతిబసు, ఆర్డీడీఏ పీడీ విజయలక్ష్మి, డీఈఓ ఇ.రేణుక, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వీ రమణ, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి మురళీధర్, డీపీఓ నాగ సాయికుమార్, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దుర్గాబాయి, మెప్మా పీడీ విజయలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ ప్రసూన, హార్టికల్చర్ డీడీ రవీంద్రబాబు, కలెక్టర్ కార్యాలయం ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి జిల్లా యంత్రాంగం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా పాలన సాగించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా -
తెనాలి నుంచి తీరాలు దాటిన ప్రతిభ
తెనాలి: ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో చేరిన పదేళ్లలోనే ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన సంస్థలో అతి పిన్న వయసు వారైన సీనియర్ డైరెక్టర్గా అనుదీప్ ముత్తవరపు ఎదిగారు. క్లౌడ్, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సాంకేతికతలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆరు దేశాల్లో విస్తరించిన రెండు వందలమంది సభ్యుల బృందాన్ని నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అత్యవసర సేవల సిబ్బందికి సాధికారత కల్పించే పది బిలియన్ డాలర్ల పోర్టుఫోలియోకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఆ కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘యూత్ ఐకాన్’ గౌరవాన్ని అందించింది. చదువుకునే దశ నుంచే.. అనుదీప్ ముత్తవరపు సొంతూరు తెనాలి సమీపంలోని వరహాపురం. తండ్రి ఉద్యోగరీత్యా తెలంగాణాకు వెళ్లారు. గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో అనుదీప్ ఇంజినీరింగ్ చదివారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో టెలీ కమ్యూనికేషన్స్లో మరో మాస్టర్స్ డిగ్రీ చేశారు. నార్త్ వెస్టర్న్ కెల్లోగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చదివారు. విద్యార్థి దశలోనే పలు కార్యక్రమాలను చేపట్టి గుర్తింపు పొందారు. కేఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివేటప్పుడే స్టూడెంట్ ఆర్డినెన్స్కు అధ్యక్షుడిగా పనిచేశారు. కెల్లోగ్ స్కూలు ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేసినప్పుడు చూపిన ప్రతిభకు ‘డీన్స్ లీడర్షిప్ అవార్డు’ను పొందారు. అనుదీప్ ముత్తవరపు ప్రస్థానం పిన్నవయస్కుడు ఆయనే... 2015లో టెక్సాస్లోని ప్లానోలో ఉన్న కోడియాక్ అనే చిన్న స్టార్టప్ టెక్నాలజీ సంస్థలో ఇంటర్న్గా అనుదీప్ కెరీర్ ప్రారంభించారు. 2017లో మోటరోలా సొల్యూషన్స్ కంపెనీ కోడియాక్ను టేకోవర్ చేసింది. కొద్ది సంవత్సరాల్లోనే ఇంజినీర్ నుండి మేనేజర్, డైరెక్టర్ పదవుల నుండి ఏకంగా సీనియర్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. మోటరోలా కంపెనీ చరిత్రలోనే ఆ పదవిని పొందిన అతి పిన్న వయస్కుడిగా అనుదీప్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆరు దేశాల్లో గల ఆయన బృందంలోని 200 మంది సభ్యుల్లో ఎక్కువమంది ఆయనతోపాటు ఉద్యోగాలు చేసినవారే ఉన్నారు. ప్రజా భద్రతా సాంకేతికతలకు అందించిన సేవలకుగాను అనుదీప్, గత జనవరిలో కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ‘యూత్ ఐకాన్–2025’ అవార్డు స్వీకరించారు. గుంటూరుకు చెందిన విశ్రాంత కాలేజీ ప్రిన్సిపాల్ కొల్లి కృష్ణప్రసాద్ కుమార్తె, డల్లాస్లోనే డేటా సైంటిస్ట్గా చేస్తున్న సుస్మితతో అనుదీప్కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. -
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
నెహ్రూనగర్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో శుక్రవారం మార్కెట్ సెంటర్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. క్రాంతికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలు వలే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర గడిచినప్పటికీ రక్షణ చట్టం ఊసే లేదన్నారు. చట్టసభల్లో 33 శాతం, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని మరో వాగ్దానం ఇచ్చినప్పటికీ ఇంతవరకు అతీగతి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందే నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ చెబుతుంటే.. మరోపక్క ఇంతవరకు బీసీల కులగణన చేపట్టకపోవడం చూస్తుంటే బీసీలను అన్యాయం చేయడమే అన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు, ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, పారేపల్లి మహేష్, కోలా అశోక్, కొల్లూరు హనుమంతరావు, ముప్పన వెంకటేశ్వర్లు, తురక రమేష్, కోలా మణికంఠ, రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సీతారాం ఏచూరి స్ఫూర్తితో మతోన్మాదంపై పోరాడాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజి లక్ష్మీపురం: సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి స్ఫూర్తితో మతోన్మాదంపై పోరాడాలి అని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘సీతారాం ఏచూరి ఓ సోషలిస్టు ఆచరణ పథం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఎన్.భావన్నారాయణ, వై.కృష్ణకాంత్, బి.ముత్యాలరావు, ఎం.ఎ చిష్టీ, కె.నాగేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, ఎం.కిరణ్, ఎం.సాంబశివరావు, జి.వెంకట్రావు, సతీష్ తదితరలు పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు లక్ష్మీపురం: ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) గుంటూరు జిల్లా 10వ మహాసభలో అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి పలు తీర్మానాలు చేసినట్లు ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు జి రమణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధనలక్ష్మి, ఏవీఎన్ కుమారి తెలిపారు. పాతగుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు గత 42 రోజుల సమ్మె విరమణ సందర్భంగా చేసిన ఒప్పందంలో భాగంగా తక్షణమే జీతాలు పెంపుదల చేయాలన్నారు. ధరల పెరుగుదల కనీస వేతనాలను దృష్టిలో ఉంచుకొని రూ.26 వేలు జీతం ఇవ్వాలని తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆదాయ పరిమితి ఉన్నప్పటికీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు విడో పెన్షన్, తల్లికి వందనం, రేషన్ కార్డులు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే నిర్ణయం చేసి అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. పలు సమస్యలపై తీర్మానాలు చేశారు. జిల్లా కార్యవర్గం ఎన్నిక మహాసభలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు జిల్లా గౌరవాధ్యక్షులుగా జి రమణ, అధ్యక్షులుగా ఎం.ధనలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్గా జి ప్రేమలత, ప్రధాన కార్యదర్శిగా ఏవీఎన్ కుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా టీ.శివపార్వతి, కోశాధికారిగా ఈ రత్నమంజుల, ఉపాధ్యక్షులుగా వి.విజయలక్ష్మి, రుక్మిణి, రజిని, టి పద్మావతి, ఓ రోజమ్మ కార్యదర్శులుగా కె ఎలిజబెత్, హేమలత, అస్మత్ తార, కే పద్మ, ఎస్ కే షాహిదా ఎన్నికయ్యారు. మరో 18 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికై నట్లు తెలిపారు. -
రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు 19 మందికి అర్హత
తూములూరు(కొల్లిపర): ఉమ్మడి గుంటూరు జిల్లా స్థాయి 69వ ఎస్జీఎఫ్ అండర్–19 సైక్లింగ్ పోటీలు మండల పరిధిలో తూములూరు గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో గురువారం ఎంఈఓ–2 ఝూన్సీలత, అండర్–19 సూల్క్ గేమ్స్ సెక్రటరీ నరసింహారావు సమక్షంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు 19 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. 19 మంది విద్యార్థులను పాఠశాల హెచ్ఎం కె.నాగలక్ష్మి, పిట్టలవానిపాలెం గవర్నమెంట్ కాలేజి ఫిజికల్ డైరెక్టర్ ఎస్.సుధాకర్రెడ్డి, గుంటూరు సైక్లింగ్ కోచ్ కనకారావు, పీఈటీ కవి, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.సాంబశివరావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆందోళన
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లకు వినతి పత్రాలు గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయులు ఆందోళనలు కొనసాగించారు. నిరసనవారంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 60 మండలాల పరిధిలో తహసీల్దార్లకు మెమోరాండం సమర్పించినట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ తెలిపారు. ఆయా మండలాల వారీగా తహసీల్ధార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులతో కలిసి ఏపీటీఎఫ్ నాయకులు పాల్గొనగా, గుంటూరు తూర్పు, పశ్చిమ మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో బసవ లింగారావు, ఎండీ ఖాలీద్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థిక పరమైన డిమాండ్లను నెరవేర్చేందుకు కృషి చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు రోడ్మ్యాప్ షెడ్యూల్ ప్రకటించాలని, లేని పక్షంలో ఈనెల 13,14వ తేదీల్లో ప్రజా ప్రతినిధులందరినీ కలిసి మెమోరాండంలను సమర్పిస్తామని తెలిపారు. నిరసన ప్రదర్శనల్లో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుట్టా జనార్ధనరావు, పి.పార్వతి, సత్యనారాయణమూర్తి, కార్యదర్శి జి.దాస్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్బాషా, నాయకులు గడ్డిపాటి శివరామకృష్ణ, బి.సాయిలక్ష్మీనారాయణ, సీహెచ్ లక్ష్మణ్కుమార్, చక్కా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నాన్–టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు
గుంటూరురూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాన్–టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు అందించటం సంతోషకరమని నాన్ టీచింగ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శుక్రవారం నగర శివారు లాంలోని విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం స్థాపితమైన 1964 నుండి, ఇలాంటి భారీ సంఖ్యలో బోధనేతర సిబ్బందికి పదోన్నతులు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషమన్నారు. పదోన్నతులకు సహకరించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి, రిజిస్ట్రార్ డాక్టర్ జి రామచంద్రరావు ఇతర ఉన్నతాధికారులకు అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ అశోక్, అసోసియేట్ ప్రెసిడెంట్ సతీశ్, జనరల్ సెక్రటరీ శివరామకృష్ణ, తదితరులున్నారు. -
పొగాకు కేంద్రంలో రైతులకు తప్పని కష్టాలు
తెనాలి: తెనాలిలోని పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులకు కష్టాలు కొనసాగుతున్నాయి. తీసుకొచ్చిన పొగాకును కొనకుండా తిరస్కరించారని కొద్దిరోజుల కిందట రైతులు ఆవేదనతో ఇంటిదారి పట్టిన ఘటన మరువక ముందే యాప్లో సాంకేతిక సమస్యతో సంబంధిత రైతులు రెండురోజులుగా పడిగాపులు కాయాల్సి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్రంలోని రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. మార్క్ఫెడ్ బయ్యర్లను ఏర్పాటుచేసి పొగాకు కొనుగోళ్లను చేయిస్తోంది. ఈ క్రమంలో పొగాకు పండే ప్రాంతాల్లో గౌడౌన్లు ఖాళీ లేకపోవటంతో తెనాలిలోని రాష్ట్ర ప్రభుత్వ వేర్హౌసింగ్ గిడ్డంగిలో ఈనెల ఒకటో తేదీ నుండి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించింది. పొగాకు పండించే గ్రామాల్లోని రైతు సేవాకేంద్రాల్లో పొగాకు రైతులకు షెడ్యూలు ఇచ్చి, విడతలవారీగా ఏయే కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు పొగాకు తీసుకెళ్లాలనేది మెస్జ్లను పంపుతున్నారు. పొగాకు నాణ్యత ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత లేదని తిరస్కరణ నాణ్యత లేదనే కారణంగా కారంచేడు, చీరాల ప్రాంతానికి చెందిన పలువురి రైతుల పొగాకు బేళ్లను బయ్యర్లు ఇటీవల తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అధికారుల సమాచారం ప్రకారం కారంచేడు మండలం జరుబులవారిపాలెం, కొడవలివారిపాలెం గ్రామాల నుంచి పొగాకును తీసుకుని వచ్చిన మైనేని సంజీవరావు, కంచర్ల రెబెక్కాలకు ఇక్కడ చుక్కెదురైంది. మార్క్ఫెడ్ యాప్లో లాగిన్ కావటం లేదంటూ కొనుగోలు చేయలేదు. వీరి సరుకును కనీసం వాహనంలోంచి దించుకోవాటినికి కూడా అనుమతించలేదు. దీనితో రెండురోజులుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని శుక్రవారం మీడియాతో మొరబెట్టుకున్నారు. సాంకేతిక సమస్య మార్క్ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలో సాంకేతిక సమస్య కారణంగా ఈ అవాంఛనీయ పరిస్థితి తలెత్తిందని, సమాచారం ఇచ్చామని అధికారులు రైతులకు నచ్చజెబుతూ వస్తున్నారు. వీరితోపాటు వచ్చిన మరో రైతు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తమ గ్రామంనుండి వంద కిలోమీటర్ల దూరంలోని తెనాలికి తీసుకువచ్చిన తమకు రూ.10 వేలకు పైగా రవాణా ఛార్జీలు అయినట్టు చెబుతున్నారు. ఇంత దూరంలో కొనుగోలు కేంద్రం కేటాయించటం, ఇక్కడా సరుకు అమ్మకానికి అవకాశం లేకుండా ఇబ్బంది పెట్టటం భావ్యమైనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రానికి వీరి ఆవేదనకు తెరపడింది. మార్క్ఫెడ్ కార్యాలయం అధికారులు సాంకేతిక సమస్యను తొలగించారు. రైతుల పేర్లు లాగిన్ కావటంతో వారి పొగాకును కొనుగోలు చేశారు. దీనితో ఆయా రైతులు, మీడియాకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. -
లాంలో ఎన్ఆర్ఎల్ఎమ్ కేంద్ర బృందం పర్యటన
లాం(తాడికొండ): తాడికొండ మండలం లాం గ్రామంలో శుక్రవారం నేషనల్ లవ్లీ హుడ్ మిషన్, ఎస్ఆర్ఎల్ఎం న్యూఢిల్లీ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. ఎన్ఆర్ఎల్ఎం హెచ్ఆర్ డిపార్ట్మెంట్ టీం సభ్యులు లక్ష్మీకాంత్ స్థానిక మహిళా గ్రూపు సభ్యులతో సమావేశమై జీవనోపాధి కోసం చేస్తున్న వ్యాపారాల గురించి తెలుసుకున్నారు. అనంతరం మండల సమాఖ్య సమావేశంలో గ్రామ సమాఖ్య అధ్యక్షులు వీవోఏలతో సమావేశమై పలు వివరాలు అడిగి తెలుసుకొని అభినందించారు. కార్యక్రమంలో ఏపీ సెర్ఫ్ టీం అధికారులు వాల్మీకి, ఎం శోభ, ప్రభావతి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కుంభా పద్మ, డీఆర్డీఏ డీసీఎం శివ ప్రసాద్రెడ్డి, ఐబీ ఏపీఎం జగ్జీవన్రామ్, తాడికొండ ఏపీఎం ఆర్ సాంబశివరావు, క్లస్టర్ కో ఆర్డినేటర్ పఠాన్ నాగుల్ ఖాన్, సీసీలు, వీవోఏలు సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడాస్ఫూర్తితో ఆటంకాలను అధిరోహించాలి
● ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు ● క్రీడాకారులకు క్యాష్ అవార్డు ప్రదానోత్సవంపెదకాకాని(ఏఎన్యు): క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిరోహించాలని వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు అన్నారు. వర్సిటీ పరిధిలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు శుక్రవారం వ్యాయామ విద్య విభాగం ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి వ్యా యామ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్ అధ్యక్షత వహించారు. నగదు పురస్కారాలు అందజేత వర్సిటీ పరిధిలో 2024 –25 లో సౌత్ వెస్ట్ జోన్ అంతర్ యూనివర్సిటీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ 76 కేజీల విభాగంలో బంగారు పతకం, ఆల్ ఇండియా ఇంటర్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన తెనాలి ఏఎస్ఎన్ కళాశాలకు చెందిన టి రేణుకకు రూ.40 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు. 71 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన గుంటూరు మహిళా కళాశాలకు చెందిన బి నానికి రూ.12,500, సౌత్ వెస్ట్ జోన్ అంతర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ 61 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్, ఆల్ ఇండియా ఇంటర్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్షిప్ పోటీలలో బ్రాంజ్ మెడల్ సాధించిన నిడుబ్రోలు పీబీఎన్ కళాశాలకు చెందిన డి మౌలాలికి రూ.32,500, సౌత్ వెస్ట్ జోన్ అంతర్ వర్సిటీ పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 96 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన నగరంలోని ఎస్వీఆర్ఎం కళాశాల విద్యార్థి ఎ.అరుణ్ బాబుకు రూ.10,000 నగదు అందజేశారు. -
డాక్టర్ అని బోర్డు పెట్టుకుంటే చర్యలు తప్పవు
● ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సకి మించి వైద్యం చేయరాదు ● ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి శ్రీహరిరావు హెచ్చరిక గుంటూరురూరల్: నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా ఆర్ఎంపీలు, పీఎంపీలు డాక్టర్ అని బోర్డు పెట్టిన అత్యవసర ప్రథమ చికిత్స తప్ప ఏవిధమైన వైద్యం చేసినా చట్టబద్ధ చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి.శ్రీహరిరావు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తో కలసి తురకపాలెం గ్రామాన్ని సందర్శించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, వైద్యుల్ని అడిగి నమోదవుతున్న కేసుల వివరాలు, అందిస్తున్న చికిత్సల గురించి తెలుసుకున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, స్థానిక వైద్యాధికారులు వివరించారు. అనంతరం గ్రామంలో పలు వీధులను పరిశీలించిన ఆయన ఏపీ మెడికల్ కౌన్సిల్ విజిలెనన్స్ అధికారి డాక్టర్ ఆశాకిరణ్తో కలిసి ఆర్ఎంపీలు పీఎంపీల ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. పేరు ముందు డాక్టర్ అని పేరు పెట్టుకున్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. వారు రోగులకు ఇస్తున్న మందులను పరిశీలించారు. ప్రథమ చికిత్స కేంద్రాలలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సిన స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్లను గుర్తించామన్నారు. తురకపాలెంలో చనిపోయిన వారిలో చాలామంది ఈ ప్రథమ చికిత్స కేంద్రాలలో సైలెన్లు, యాంటీబయాటిక్స్ విచక్షణ రహితంగా వాడడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందరికీ అందుబాటులో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్వాలిఫైడ్ వైద్యులు ఇతర పారామెడికల్ సిబ్బంది ఉండగా ప్రజలు నకిలీ వైద్యుల నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలకు వెళ్లడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. దీనివల్ల చిన్నచిన్న వ్యాధులే ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉందన్నారు. ప్రజలందరూ ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయక ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి నందకిషోర్ మాట్లాడుతూ తురకపాలెం గ్రామ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తొలిదశలోనే క్వాలిఫైడ్ వైద్యుల్ని సంప్రదిస్తే ఎలాంటి సమస్యలు రావన్నారు. ఐఎంఏ వైద్యులు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మెడికల్ కౌన్సిల్ చైర్మన్తో పాటు తురకపాలెం సందర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పూర్వ ఉపాధ్యక్షులు, ఐఎంఏ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్ నాగేళ్ల కిషోర్, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి.సేవాకుమార్, ఐఎంఏ గుంటూరు బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ వై సుబ్బారాయుడు, ఉపాధ్యక్షులు డాక్టర్ డి అమరలింగేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ బి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు
శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025తెలుగు ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న సాక్షిపై కూటమి సర్కారు అక్కసు వెళ్లగక్కుతుంది. ప్రతిపక్ష నేతలను, ప్రజల పక్షాన మాట్లాడే సాక్షిని నోరు మూయించే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన విధంగా ‘ఇస్ ద ప్రెస్ ఇన్ ద హ్యాండ్.. ఈజీ టు మ్యానుఫ్యాక్చర్ ద గ్రేట్ మాన్‘ అనే మాటలు చంద్రబాబు, లోకేష్ విషయంలో నిజమయ్యాయి. చంద్రబాబు పాలనలో చేసిందేమీ లేకపోయినా ఏదో అద్భుతాలు జరుగుతున్నట్లు చూపిస్తున్నారు. ప్రజలకు ఇవన్నీ సరికాదని చెబుతున్నందుకు సాక్షిపై అక్రమ కేసులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం తప్పులు సరిచేసుకోకుండా కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. అక్రమ కేసులు, అరెస్టులు సాక్షిని ఏమీ చేయలేవు. – మోదుగుల వేణుగోపాల్రెడ్డి, మాజీ ఎంపీ ప్రశ్నించే హక్కు, తప్పొప్పులను వెలికితీసే హక్కు సమాజంలో మీడియాకు ఉంది. వారి హక్కులను, స్వేచ్ఛను హరించేలా వ్యవహరిండం సిగ్గుచేటు. సాక్షి దినపత్రిక ఎడిటర్తోపాటు పలువురు జర్నలిస్టులపై తాడేపల్లి పోలీస్స్టేషన్లో అక్రమంగా కేసులు బనాయించి విచారణ పేరుతో పిలుస్తుండటం మంచిది కాదు. ఏమైనా లోపాలుంటే వివరణ ఇస్తే సరిపోతుంది, కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాజకీయాలు చేయడం వలన ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారో ఆలోచించుకోవాలి. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్న ఇలాంటి చర్యలను మానుకుంటే మంచిది. – నందిగం సురేష్, మాజీ ఎంపీ, బాపట్ల 7తెనాలిరూరల్: తెనాలి సాలిపేటలో ఉన్న 39వ నంబర్ రేషన్ దుకాణాన్ని సీజ్ చేసినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ శుక్రవారం తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదుల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఫిర్యాదులు వాస్తవం అని తేలడంతో షాపు సీజ్ చేసినట్టు తెలిపారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 68,340 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 89,306 క్యూసెక్కులు వదులుతున్నారు.గుంటూరు రూరల్: వరుస మరణాలతో హడలెత్తిపోతున్న తురకపాలెం గ్రామ ప్రజలు బొడ్రాయికి శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. -
తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : వైఎస్సార్సీపీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్రెడ్డి మృతిపై పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్రెడ్డి ఆకస్మిక మరణం దిగ్శ్రాంతికి గురి చేసిందని, క్రమ శిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని కొనియాడారు.‘ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్. మా పార్టీకి చెందిన అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్రెడ్డిగారి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పార్టీకి ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివి. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని,… pic.twitter.com/oypzFBZ9ui— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2025 కాగా, శుక్రవారం(సెప్టెంబర్ 12) మధ్యాహ్న సమయంలో తోపుదుర్తి భాస్కర్రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. భాస్కర్ రెడ్డి మృతిపట్ల రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన చిన్నాన్న భాస్కర్రెడ్డి మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారాయన. -
‘ చంద్రబాబు మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎప్పుడూ విజన్తోనే ఆలోచిస్తుందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తాము నేరుగా లబ్ధిదారుడికే పథకాలు అందించామని, 2029 వరకూ అధికారంలో ఉండి ఉంటే ఏపీ పూర్తిగా అభివృద్ధి చెందేదన్నారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 12వ తేదీ) మీడియాతో మాట్లాడిన సజ్జల.. ప్రజల ఆకాంక్షల మేరకు తాము అధికార వికేంద్రీకరణ అన్నామన్నారు.‘ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేసింది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని పెడితే బాగుండేది. బాబు తన జేబు, తన కోటరీ జేబులను నింపడానికే చూస్తున్నారు. అమరావతిలో లక్షల కోట్లు రూపాయలు పెడితే రాష్ట్రం భరించే స్థితిలో లేదు. అమరావతిలో రాజధాని అంటే స్టేట్ను ఊబిలో దింపడమే. బాబు సెన్స్బుల్గా ఆలోచించి అప్పులు పాలు కాకుండా చూడాలి. చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ అంటుంటే అనుమానాలు వస్తున్నాయి. మేం వచ్చేలోపు బాబు అప్పులు పాలు చేయకుండా ఉంటే చాలు’ అని తెలిపారు. -
‘పవన్.. సుగాలి ప్రీతికి న్యాయం, 30 వేల మంది అదృశ్యం సంగతి ఏమైంది?’
తాడేపల్లి : రాజ్యాంగం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఏపీలో జరుగుతున్న దారుణాలు కనబడుతున్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్12) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. ‘ సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం గురించి ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తే దాడి చేస్తారా?, ఇదేనా రాజ్యాంగ బద్దమైన పాలన అంటే?, లక్షల పుస్తకాలు చదివిన పవన్ రాజ్యాంగాన్ని చదివారా?, ఒకసారి చదివితే విషయాలు తెలుస్తాయి. మచిలీపట్నం మంగినపూడిలో మా పార్టీ నేత గిరి పై జనసేన నేతల దాడి అమానుషం. పెద్దమనిషిని మోకాళ్ళపై పెట్టి దాడి చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది?, దాడి చేసిన జనసేన గూండా కొరియా శీను జనసేన నేత పార్టీలో చాలా కీలకం. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చేసిన కామెంట్ మేరకు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి. 30వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారన్న మీ వ్యాఖ్యలకు మీరే సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్న అడిగితే మా పార్టీ నేతపై దాడి చేశారు. ఇలా దాడి చేసి కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది పవన్ కళ్యాణ్?, కూటమి వచ్చాక ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. ఇది మీకు తెలీదా.?, మా నాయకుడు వైఎస్ జగన్కు రాజ్యాంగం తెలుసు కాబట్టే ప్రతిపక్ష హోద అడిగారు. అందుకే ఆయన న్యాయ బద్దంగా పోరాటం చేస్తున్నారు’ అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: మా పవనన్ననే ప్రశ్నిస్తావా?.. -
నైపుణ్యంతోనే పోటీ ప్రపంచంలో రాణింపు
పెదకాకాని(ఏఎన్యూ): నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 49వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం వేడుకగా జరిగింది. అతిథులు, యూనివర్సిటీ అధికారుల జ్యోతి ప్రజ్వలన అనంతరం విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ లోగో ఆవిష్కరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, దేశ ప్రగతికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి వృత్తి విద్య కళాశాలలు ఆర్థిక స్థిరత్వం తెచ్చిపెట్టాయని చెప్పారు. అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రైవేటు యూనివర్సిటీలను దీటుగా ఏఎన్యూ ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. రాబోయే పదేళ్లలో అమెరికా, చైనాను మించి భారత్ ప్రగతి సాధించే అవకాశం కనిపిస్తోందని, దీనికి విద్యార్థుల కృషి కూడా అవసరమని తెలిపారు. 1976లో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల కంటే నాగార్జున యూనివర్సిటీ ఎంతో ప్రగతిని సాధించిందని చెప్పారు. అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన రెక్టర్ ఆచార్య రత్న షీలామణి మాట్లాడుతూ రాబోయే ఏడాది కాలం పాటు స్వర్ణోత్సవ వేడుకలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవాల లోగో ప్రత్యేకతను వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం మాట్లాడుతూ పూర్వ ఉప కులపతుల దూరదృష్టి విశ్వవిద్యాలయ అభివృద్ధికి దోహద పడిందని కొనియాడారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి ఫలాలు వారి కృషి, పట్టుదల, దార్శినికానికి నిదర్శనం అన్నారు. పండుగ వాతావరణం మేధావులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకుల సందడితో పండుగ వాతావరణంలో వర్సిటీ ప్రాంగణం నిలిచింది. అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతులు గా విశిష్ట సేవలు అందించిన ప్రొఫెసర్ డి. రామకోటయ్య, ప్రొఫెసర్ సి.వి. రాఘవులు, ప్రొఫెసర్ ఎల్. వేణుగోపాల్రెడ్డి, ప్రొఫెసర్ వి. బాలమోహన్దాస్, ప్రొఫెసర్ వై.ఆర్. హరగోపాల్రెడ్డి, ప్రొఫెసర్ ఏ. రాజేంద్రప్రసాద్ లను ఘనంగా సత్కరించారు. ముందుగా ప్రొఫెసర్లు తమ అమూల్యమైన సందేశాలను అందించారు. ఉత్తమ అధ్యాపకులకు సన్మానం ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డులు పొందిన విశ్వవిద్యాలయ అధ్యాపకులు ప్రొఫెసర్ జి. చెన్నారెడ్డి, ప్రొఫెసర్ పి.పి.ఎస్. పాల్ కుమార్, ప్రొఫెసర్ వి. దివ్య తేజ మూర్తి, ప్రొఫెసర్ రమేష్ రాజు, డాక్టర్ పి. సుధాకర్లను సత్కరించారు.కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆచార్య వీరయ్య, ఆచార్య సురేష్ కుమార్, ప్రొఫెసర్ లింగరాజు, ప్రొఫెసర్ ప్రమీలారాణి, ప్రొఫెసర్ పాల్ కుమార్, పాలకమండల సభ్యులు ప్రొఫెసర్ సుమంత్ కుమార్, ప్రొఫెసర్ జగదీష్ నాయక్, ఓఎస్డీ ఆచార్య రవికుమార్, సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. వెంకటేశ్వర్లు, రూసా డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్. మురళీమోహన్, సీడీసీ డీన్ ఆచార్య వి. రవికుమార్, సీడీఈ పరీక్షలు కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రామచంద్రన్, యూజీ పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.వి. కృష్ణారావు, నూట అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ బ్రహ్మాజీరావు, ప్రొఫెసర్ త్రిమూర్తిరావు, వికాస అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, శ్రీనివాసరావు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పశ్చిమ డెల్టాకు 6,522 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,522 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజ్ వద్ద 12 అడుగులు నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 180 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,736, తూర్పు కాలువకు 637, పశ్చివ కాలువకు 226, నిజాపట్నం కాలువకు 432, కొమ్మూరు కాలువకు 2,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 36,250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయుల నిరసన గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్థిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధ్యాయులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్లలో ప్రభుత్వ సాచివేత ధోరణికి వ్యతిరేకంగా నిరసన వారం ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలను ధరించి, ప్రదర్శనలు నిర్వహించారని తెలిపారు. శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించి, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.తెనాలిలో డెంగీ కలకలం తెనాలి అర్బన్: తెనాలి పట్టణంలో అధికారికంగా డెంగీ కేసు నమోదైంది. ఈ విషయం బయటకు రావడంతో పట్టణంలో కలకలం మొదలైంది. తెనాలి 17వ వార్డుకు చెందిన 60 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం కొద్దిరోజుల కిందట వెళ్లాడు. అతడిలో డెంగీ లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్యులు రక్త పరీక్షలు చేయించడంతో వ్యాధి నిర్ధారణ అయింది. విషయాన్ని ప్రభుత్వ వైద్యశాల అధికారులు తెనాలి మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వ్యక్తి నివసించే ప్రాంతంలో మురుగు కాల్వలను బాగు చేయించి బ్లీచింగ్, స్ప్రేయింగ్ చేయిస్తున్నారు.డీఎల్డీవో కార్యాలయ పనులు పూర్తి చేయాలిసత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని డీఎల్డీవో కార్యాలయ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ అన్నారు. గుంటూరు రోడ్లోని అయ్యప్పస్వామి దేవాలయం పక్కన గల పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ను సత్తెనపల్లి డీఎల్డీవో కార్యాలయానికి ఇటీవల కేటాయించారు. దీంతో గురువారం ఆయన దానిని పరిశీలించారు. కార్యాలయంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రూ. 10 లక్షలు కేటాయించాల్సిందిగా సీఈఓకు సూచించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, సత్తెనపల్లి డీఎల్డీవో బి.రాజగోపాల్, సత్తెనపల్లి ఇన్చార్జి ఎంపీడీవో టి.శ్రీనివాసరావు, ఇన్చార్జ్ డిప్యూటీ ఎంపీడీవో షేక్ రెహమాన్, పంచాయతీరాజ్ ఏఈ కె.రామ్మోహన్ సింగ్ పాల్గొన్నారు. -
కొరియన్ కంపెనీల్లో విస్తృత అవకాశాలు
చేబ్రోలు: కొరియన్ భాషలో ప్రావీణ్యం సాధించడం ద్వారా భారత విద్యార్థులు, యువతకు కొరియన్ కంపెనీలలో విస్తృత అవకాశాలను పొందవచ్చని చైన్నెలోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ కొరియా చాంగ్–న్యూన్ కిమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో గురువారం కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చాంగ్ న్యూన్ కిమ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న పోటీ పరిస్థితుల్లో ఆసియా ఖండంలో భారతదేశం, కొరియాలు కీలక భాగస్వాములని పేర్కొన్నారు. భద్రతా రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజల మధ్య పరస్పర సంబంధాలను విస్తరించడం అత్యవసరమని తెలిపారు. కొరియా సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో కొరియన్ సినిమా ప్రతిభను, సాంస్కృతిక వైవిధ్యాన్ని భారతదేశ ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారని తెలిపారు. భావోద్వేగ ప్రధానమైన డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్లు, హాస్య చిత్రాలు, కుటుంబమంతా చూసే వినోదాత్మక సినిమాలు మాత్రమే కాకుండా, కొరియా సమాజం, సంస్కృతి, జీవన శైలి, విలువలను కూడా ప్రతిబింబిస్తాయని వివరించారు. కొరియన్ సంస్కృతి ప్రత్యేకతలైన కే పాప్, కే డ్రామా, కే ఫుడ్, కే కాస్మటిక్ వంటి వాటిని విద్యార్థులతో పంచుకున్నారు. కొరియన్ సినిమాల వైశిష్ట్యాన్ని ఆస్వాదిస్తూ, రెండు సంస్కృతుల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలపరచడానికి ఈ ఫెస్టివల్ ఎంతో దోహదపడుతుందని పేర్కొ న్నారు. ఈ ఫెస్టివల్లో కొరియా సంస్కృతి, సినిమాలు విద్యార్థులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పోరాటాలతోనే ఐసీడీఎస్ పరిరక్షణ
లక్ష్మీపురం: సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) పరిరక్షణకు అంగన్వాడీలు పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా 10వ మహాసభను గురువారం పాత గుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అవుతుందని, ఈ కాలంలో ప్రభుత్వాలు ఈ స్కీంను నిర్వీర్యం చేయటానికి అనేక ప్రయత్నాలు చేశాయని తెలిపారు. దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నా బలోపేతం చేయటానికి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఏటా బడ్జెట్లో నిధులు తగ్గిస్తోందని, బిల్లులు సకాలంలో విడుదల చేయట్లేదని చెప్పారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు కూడా ఇవ్వట్లేదని తెలిపారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాని మోదీ అంగన్వాడీల వేతనాలు పెంచుతామని, ఐసీడీఎస్ను బలోపేతం చేస్తామని వాగ్దానం చేశారని ఆమె గుర్తు చేశారు. మూడుసార్లు అధికారంలోకి వచ్చినా చిల్లిగవ్వ పెంచలేదని, పథకానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. ఇప్పటికై నా ఈ పథకం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎ.వి.ఎన్.కుమారి, సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు
గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెంలో వరుస మరణాల మిస్టరీ ఇంకా తేలలేదు. ప్రభుత్వ తాత్సారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇటు ప్రజల్లోనూ అనేక అపోహలు నెలకొన్నాయి. బొడ్డురాయి పూజలు, గౌతు రాయిని సరి చేయడం కార్యక్రమాలను గ్రామ పెద్దలు నిర్వహించారు. అయినా, పరిస్థితిలో మార్పులేదు. గ్రామస్తులు జ్వరాలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆరుగురు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వారం రోజులుగా చికిత్సలు పొందుతూనే ఉన్నారు. మెలియాయిడోసీస్గా ప్రైవేటు వైద్యులు నిర్ధారణ గ్రామంలో మెలియాయిడోసీస్తో పలువురు తమ ఆసుపత్రుల్లో చికిత్స పొందారని ప్రైవేటు వైద్యులు బాహటంగానే చెప్పారు. కొందరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. గత వారం రోజలుగా గ్రామంలో రాష్ట్ర, నేషనల్ స్థాయి వైద్య బృందాలు పర్యటించి శాంపిల్స్ సేకరిస్తూనే ఉన్నాయి. గ్రామస్తుల నుంచి రక్తాన్ని తీసుకుని వెళుతున్నారే కానీ వాటి ఫలితాలను మాత్రం వెల్లడించలేదు. నేటికి వ్యాధి నిర్థారణ కాలేదనే ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. తమ అనుమానాలను నివృత్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి, వైద్యులకు ఉందా.. లేదా ? అనే సంశయమం గ్రామస్తుల్లో నెలకొంది. నిత్యం ఇదే చర్చాంశనీయంగా మారింది. ఆర్ఎంపీపై మరణాల భారం గ్రామంలో వరుస మరణాల్లో పలువురు సమీపంలోని ఒక ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స పొందారు. అతడు అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ వినియోగిస్తూ, కలుషిత సైలెన్స్ వినియోగించటం వల్ల ఇన్ఫెక్షన్లకు గురై కొందరు మృత్యువాతకు గురైనట్లు అనుమానంతో జిల్లా వైద్యాధికారులు క్లినిక్ను సీజ్ చేశారు. అయితే, అదే ఆర్ఎంపీ వద్ద సమీప గ్రామాలకు చెందిన మల్లవరం, పెద్దపలకలూరు, చిన్నపలకలూరు, తోకావారిపాలెం, జన్మభూమినగర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు చికిత్సలను పొందారు. ఆర్ఎంపీ అత్యధిక మోతాదులో మెడిసిన్ రోగులకు వినియోగిస్తే ఇతర గ్రామాల ప్రజలకు ఎందుకు ఇన్ఫెక్షన్లు సోకలేదు ? కేవలం ఆర్ఎంపీ చేసిన తప్పు వల్లే మరణాలకు గురయ్యారనటం సబబేనా? అని గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే అనారోగ్యంతో మృత్యువాతకు గురైన వారిలో ఇతర ఆసుపత్రుల్లో చికిత్సలు పొందినవారు ఉన్నారు. మరి ఆయా ఆసుపత్రులను వదిలి, ఆర్ఎంపీ క్లినిక్పైనే చర్యలు తీసుకోవటం ఏంటి? ఇంకా ఆ గ్రామం సమీప గ్రామాల్లో ఆర్ఎంపీలు లేరా? అనే విషయాలపై గ్రామస్తులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. బయటకురాని రక్త పరీక్షల వివరాలు గ్రామంలో రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థలు పలు బృందాలుగా గ్రామంలో జ్వర పీడితుల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించాయి. వాటి ఫలితాలు నేటికి తెలియకపోవటం శోచనీయం. పది రోజులుగా గ్రామంలో మెడికల్ క్యాంపులు జరుగుతూనే ఉన్నాయి. వరుస మరణాలకు కారణం ఏంటని రాష్ట్ర ప్రభుత్వం కానీ, వైద్యా ఆరోగ్యశాఖ కానీ నేటికీ నిర్ధారించకపోవటం గ్రామ ప్రజల్లో పలు ఆలోచనలను రేకెత్తిస్తోంది. మెడికల్ క్యాంపులో పరీక్షలు చేయించుకుంటున్న ప్రజలుబాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో లక్షల రూపాయల అప్పులు చేసి తమ కుటుంబ సభ్యులను బతికించుకునే ప్రయత్నం చేశారు. డబ్బులు పోగా అనారోగ్యాలకు గురైనవారిని కోల్పోయారు. ప్రతి ఇంటిలో పెద్దను కోల్పోయి, నేడు ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. బాధిత కుటుంబాలు రాష్ట్ర ప్రభుత్వం నేటికి ఆర్థిక సాయం ప్రకటించలేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ఆదుకోవాలని కోరుతున్నారు. -
పల్నాడు జిల్లా కలెక్టర్గా కృతిక శుక్లా నియామకం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్గా 2013వ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆమెను జిల్లాకు కలెక్టర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం జీఓ జారీ చేసింది. జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్ర కేడర్కు చెందిన కృతికా శుక్లా తన బ్యాచ్కే చెందిన ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లాను వివాహం చేసుకొని ఏపీ క్యాడర్కు బదిలీ అయ్యారు. కృతిక శుక్లా 2016 నవంబర్ 11వ తేదీ నుంచి 2018 ఆగస్టు 12వ తేదీ వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్, మదనపల్లి సబ్ కలెక్టర్, ఉమ్మడి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గానూ విధులు నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్; దిశా స్పెషల్ ఆఫీసర్, కాకినాడ కలెక్టర్, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ తదితర హోదాలలో పనిచేశారు. అరుణ్బాబుకు దక్కని పోస్టింగ్ గత ఏడాది కాలంగా జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న పి.అరుణ్బాబుకు తాజా బదిలీలలో పోస్టింగ్ ఇస్తున్నట్లు జీఓలో పేర్కొనలేదు. గతంలో నరసరావుపేట, గురజాల ఆర్డీఓగా పనిచేసిన అరుణ్బాబు 2024 ఆగస్టు 7వ తేదీన పల్నాడు జిల్లా మూడవ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల కోసం కలెక్టర్ ప్రాంగణంలో ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేయించారు. ఉచితంగా అర్జీలు రాసిచ్చే ప్రక్రియను చేపట్టారు. ప్రతి మూడో శనివారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తూ వారి సమస్యలు తీర్చేందుకు ప్రయత్నాలు చేశారు. కలెక్టరేట్కు దగ్గరలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటులో కూడా కీలక పాత్ర పోషించారు. శంకరభారతీపురం జెడ్పీ హైస్కూలును దత్తత తీసుకున్నారు. -
ఏఎన్యూ నిర్వాకం.. బాధ్యతారాహిత్యం !
గుంటూరు: ఏపీ పీజీ సెట్ నిర్వహణలో ఆది నుంచి జాప్యం చేస్తూ వచ్చిన ఉన్నత విద్యాశాఖ అధికారులు చివరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్లోనూ విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూలైలో ఏపీ పీజీ సెట్ నిర్వహించారు. వారం పది రోజుల్లోపే ర్యాంక్ కార్డులను విడుదల చేశారు. ఆ తర్వాత రెండు నెలల పాటు అడ్మిషన్లపై ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు నిరీక్షణ తప్పలేదు. ఎట్టకేలకు ఈనెల 8న విడుదల చేశారు. 8 నుంచి 15 వరకు వెబ్ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, 9 నుంచి 16 వరకు ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించారు. దీంతోపాటు స్పెషల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 11న గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. దీని ఆధారంగా ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ (క్యాప్), దివ్యాంగులు తదితర కేటగిరీలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురువారం నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. తీరా అక్కడికి వచ్చిన తర్వాత కార్యక్రమాన్ని వాయిదా వేశామని, బుధవారం సాయంత్రం తమ వెబ్ సైట్ ద్వారా తెలియపరచామని యూనివర్సిటీ అధికా రులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి అక్కడికి చేరుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అధికారులతో వాదనకు దిగిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారులు వెబ్సైట్లో ప్రకటించిన విషయాన్ని గుర్తించలేదని, ఇప్పుడు ఉన్న పళంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి వెనక్కు పంపడం తగదని విద్యార్థులు అధికారులతో వాదనకు దిగారు. దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం జీజీహెచ్ వైద్యాధికారులు అందుబాటులో లేరని, అందువల్ల వాయిదా వేస్తున్నామని అధికారులు చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు దివ్యాంగుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే వాయిదా వేయాలి గానీ, మిగిలిన వారివి యథావిధిగా నిర్వహించకపోవడంలోని ఆంతర్యం ఏమిటని విద్యార్థులు ప్రశ్నించారు. అన్ని ఒకేసారి నిర్వహించడం వల్ల తమకు సులువుగా ఉంటుందని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని అధికారులు చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది. దూర ప్రాంతం నుంచి వచ్చిన తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని, మళ్లీ రావాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని, సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగించాలని విద్యార్థులు చేసిన విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోలేదు. హాజరైన విద్యార్థుల నుంచి అధికారులు మొక్కుబడిగా వారి పేర్లు, హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. దాదాపు 100 మంది వరకు విద్యార్థులు అక్కడ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా వేశారనే విషయం తెలుసుకుని ఆలస్యంగా వచ్చిన చాలామంది విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. మొత్తానికి యూనివర్సిటీ అధికారుల వైఖరి కారణంగా పీజీ సెట్ విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. -
బాపట్ల జిల్లా కలెక్టర్గా వినోద్కుమార్ నియామకం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా కలెక్టర్గా వి.వినోద్కుమార్ నియమితులయ్యారు. అనంతపురం కలెక్టర్గా ఉన్న ఆయనను బాపట్లకు బదిలీ చేస్తూ గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015 ఐఏఎస్ క్యాడర్కు చెందిన వినోద్కుమార్ ఏప్రిల్ 2024లో అనంతపురం కలెక్టర్గా బదిలీ అయ్యారు. కర్ణాటకు చెందిన వినోద్ కుమార్ డాక్టర్ చదువు పూర్తి చేసి 2015లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. 2016 – 17లో అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. 2017– 19లో రంపచోడవరం సబ్ కలెక్టర్, 25 జూన్ 2019 నుంచి 17 సెప్టెంబరు 2019 వరకు ఐటీడీఏ పార్వతీపురం, 11 మే 2020 నుంచి 11 ఆగస్టు 2020 వరకు నెల్లూరు అడిషనల్ జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. 2020– 23లో ఏపీ హెల్త్ సిస్టం స్ట్రెంతెనింగ్ ప్రాజెక్టు డైరెక్టర్గా వ్యవహరించారు. 12 ఏప్రిల్ 2023 నుంచి 4 ఏప్రిల్ 2024 వరకు స్కిల్ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. 9 జూలై 2024న బాపట్ల కలెక్టర్గా వచ్చిన జె.వెంకట మురళిని ఏడాది తర్వాత ప్రభుత్వం బదిలీ చేసింది. -
తురకపాలెం మరణాలపై జెడ్పీలో చర్చ
అంతుచిక్కని మరణాలపై వైద్యారోగ్యశాఖాధికారుల నుంచి చైర్పర్సన్ వివరాలు సేకరణ గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలపై జెడ్పీ స్థాయి సంఘ వేదికగా చర్చ జరిగింది. సమావేశ మందిరంలో గురువారం సంఘాలు భేటీ అయ్యాయి. మొత్తం ఏడు స్థాయి సంఘాలకు గానూ మూడు సంఘ సభ్యులు గైర్హాజరుతో కోరం లేక వాయిదా పడింది. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా అధ్యక్షతన 1,2,4,7వ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తురకపాలెంలో చోటు చేసుకున్న మరణాలపై వైద్యారోగ్యశాఖాధికారుల నుంచి వివరాలు సేకరించారు. పల్నాడు జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారు. తాగునీటి పంపిణీకి పంపిణీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారని రూరల్ వాటర్ వర్క్స్ ఎస్ఈ కల్యాణ్ చక్రవర్తిని హెనీ క్రిస్టినా ప్రశ్నించగా, తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. అనంతరం ప్రణాళిక, ఆడిట్, గ్రామ పంచాయతీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్యం, రహదారులు భవనాలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ట్రెజరీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ ,రవాణా శాఖ, గనులు భూగర్భ వనరుల శాఖ, భూగర్భ జల వనరుల శాఖ, గృహ నిర్మాణ సంస్థ, సహకార శాఖ, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, గ్రామీణ పరిశ్రమల మండలి, పరిశ్రమల శాఖ, ప్రణాళిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల వారీగా వివిధ అంశాలపై చర్చించారు. పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ మాట్లాడుతూ జిల్లా పరిషత్తు ఆధ్వర్యంలో ముద్రించిన విద్యాజ్యోతి పుస్తకం వల్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని 599 మార్కులు సాధించిందని తెలిపారు. 577 మార్కులు సాధించిన విద్యార్థులు 100 మందికి పైగా ఉన్నారని వివరించారు. గుంటూరు జిల్లా డీఈఓ సీవీ రేణుక మాట్లాడుతూ విద్యార్థులకు యూనిఫాంతో పాటు మెరుగైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, ఓఎస్డీ పి.శివన్నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గుంటూరు జిల్లా కలెక్టర్గా తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: గుంటూరు జిల్లా కలెక్టర్గా 2015 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన తమీమ్ అన్సారియాను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన ఆమె ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. జిల్లా కలెక్టర్గా ఇప్పటి వరకు పనిచేసిన ఎస్.నాగలక్ష్మిని జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశించారు. ఇటీవలే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాకు నూతన కలెక్టర్, జేసీల కాంబినేషన్లో పాలన కొనసాగనుంది. 38 ఏళ్లలో జిల్లాకు మూడో మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్ వచ్చారు. 1987లో జన్నత్ హుస్సేన్ పనిచేయగా 2007 లో మొహమ్మద్ ఆలీ రఫత్ను జిల్లా కలెక్టర్గా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నియమించారు. మళ్లీ జిల్లాకు మైనారిటీ వర్గానికి చెందిన కలెక్టర్ రావడం గమనార్హం. -
ప్రతిభకు ఉపకారం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతిభే కొలమానంగా ఉపకార వేతనాలు దక్కనున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలు మంజూరు చేస్తోంది. ఇందు కోసం ఏటా జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్ఎంఎంఎస్) పరీక్ష నిర్వహిస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ఏపీ మోడల్ స్కూల్స్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా వరుసగా 9,10,11,12వ తరగతుల్లో ఏడాదికి రూ.12వేలు చొప్పున ఉపకార వేతనం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. డిసెంబర్ 7న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏటా 450 మంది విద్యార్థులు ఎంపికవుతున్నారు. ఎన్ఎంఎంఎస్కు అర్హతలు పరీక్ష విధానం -
సెపక్తక్రా ఉమ్మడి జిల్లా జట్ల ఎంపికలు
సత్తెనపల్లి: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్–14 , అండర్–17 బాల,బాలికల సెపక్ తక్రా జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా మైదానంలో గురువారం నిర్వహించారు. ఎంపికలకు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి బాలబాలికల విభాగంలో 150 మంది క్రీడాకారులు హజరయ్యారు. క్రీడా ఎంపికలు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్ కుమార్ పర్యవేక్షణలో జరిగాయి. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరగబోయే 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ పోటీలలో పాల్గొంటారని సురేష్ కుమార్ తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా పీఈటీలు లాకు పిచ్చయ్య, బి.అనిల్దత్తనాయక్, కోనంకి కిరణ్కుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ దాసరి కోటేశ్వరరావు, హెచ్ఎం కాకరపర్తి శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు గండు సాంబ శివరావు, కోనంకి కిరణ్కుమార్, జి.తులసీరామ్నాయక్, ఒ.రత్నాకర్, షేక్ మెహబూబి, కె.స్వాతి, సిహెచ్ అనూష పాల్గొన్నారు. అండర్ –14 బాల బాలికల జట్లు.. అండర్–14 సెపక్తక్రా బాలుర జట్టుకు కె.రాము, టి.కళ్యాణ్బాబు, బి.రత్నాకర్, పి. సన్నీ, ఎస్.మహేష్, స్టాండ్బైలుగా షేక్.నాగుర్వలి, ఎస్.వేణు, జి.పవన్కుమార్ ఎంపికయ్యారు. అండర్–14 బాలికల జట్టుకు పి.శ్రీ జర్షిని, కె.తిరుమలభార్గవి, కె.స్వరూప, కె.ప్రశాంతి, పి.వర్షిని స్టాండ్బైలుగా ఎ.వేదవతి, ఆర్.సిరివెన్నెల, కె.మాళవిక. అండర్–17 బాలుర జట్టు కె.శామ్యూల్ రాజు,ఆర్.సంతోష్ కుమార్, ఎం.ప్రభుదాస్, ఎం.శ్రీశాంత్, బి.మనిధర్, స్టాండ్ బైలుగా వి.సురేంద్ర, బి.అనీల్ కుమార్, ఎ.కిశోర్ ఎంపికయ్యారు. అండర్ –17 బాలికల జట్టుపి.గాయత్రి, కె.గీతిక, జి.చిన్మయి, డి.స్వరూప, షేక్.సమీర, స్టాండ్ బైలుగా ఎ.ప్రశాంతి, పి.దివ్యశ్రీ, జి.వర్ష -
ఫార్మసీ ప్రవేశాలకు వేళాయే !
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025)లో అర్హత సాధించిన విద్యార్థులు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. బైపీసీ స్ట్రీమ్లో అర్హత సాధించిన విద్యార్థుల మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆన్లైన్ ఆధారిత కౌన్సెలింగ్ జరగనుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బీ.ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఈనెల 16వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్తో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంది. ఆన్లైన్లో కళాశాలల జాబితా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 43 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు తమ ఇళ్లలోని పర్సనల్ కంప్యూటర్తో పాటు ప్రైవేటు ఇంటర్నెట్ కేంద్రాలు, ఫార్మసీ కళాశాలల నుంచి సహాయాన్ని పొందవచ్చు. అయితే, తమ ర్యాంకు, ఫీజు చెల్లించిన రసీదు వివరాలు, కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్ల నమోదుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుకోవాల్సి ఉంది. ఆన్లైన్లో పొందుపర్చిన జాబితా నుంచి తాము చేరదలచుకున్న కళాశాలలను తల్లిదండ్రుల సమక్షంలో ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఫీజు చెల్లింపుతో మొదలయ్యే ప్రక్రియ ఏపీ ఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఎస్ఈటీఎస్.ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్కు లాగిన్ అయ్యి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మార్గాల్లో చెల్లించాలి. ఏపీ ఈఏపీ సెట్ డిటైల్డ్ నోటిఫికేషన్, యూజర్ మాన్యువల్, కళాశాలల జాబితా, విద్యార్థులకు మార్గదర్శకాలను ఇదే సైట్లో పొందుపర్చారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలోనే పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన ర్యాంకులు సాధించిన విద్యార్థులు హెల్ప్లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దరఖాస్తు సమయంలోనే సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆన్లైన్లో పూర్తి చేశారు. అసంపూర్తిగా ఉన్న విద్యార్థులు వాటిని కంప్యూటర్ స్క్రీన్పై కనిపించే సూచనల ఆధారంగా తిరిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమీపంలోని హెల్ప్లైన్ కేంద్రంలో పరిశీలన చేసి, అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తవుతుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. -
‘బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ జగన్ మాత్రమే’
తాడేపల్లి : బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 11) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షుల సమావేశం జరిగింది. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్సీ బీసీ విభాగం అధ్యక్షుడు రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెండ్ నౌడు వెంకట రమణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకం రెడ్డి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆలూరు సాంబ శివారెడ్డి సహా బీసీ కులాల సాధికర అధ్యక్షులు హాజరయ్యారు. ఈ మేరకు మాట్లాడిన సజ్జల ఏమన్నారంటే.. ‘ బీసీల ఉనికిని వెలుగులోకి తెచ్చింది వైఎస్ జగన్ మాత్రమే. అన్ని కులాలను గుర్తించి ప్రత్యేకంగా కార్పోరేషన్లు సైతం ఏర్పాటు చేయించారు. ఒక సమగ్ర విధానం ద్వారా బీసీలందరికీ అభివృద్ధి ఫలాలను అందించారుబీసీలందరినీ చైతన్య పరిచి మళ్లీ ఏకతాటి మీదకు తీసుకు రావాలి. మన హయాంలో జరిగిన అభివృద్ధిని అందరికీ వివరించాలి. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై విసుగు చెందారు. టీడీపీ నేతలు చేస్తున్న ఫేక్ ప్రచారాలను తిప్పి కొట్టాలి’ అని సూచించారు. -
ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదకరం
పత్రికా స్వేచ్ఛ లోపించిన ప్రజాస్వామ్యం చాలా ప్రమాదకరం. మీడియా స్వేచ్ఛను పునరుద్ధరించడానికి నిష్పాక్షిక న్యాయపరమైన విచారణ, జర్నలిస్టుల సురక్ష చట్టాలు, ప్రభుత్వం – మీడియా సంబంధాల పారదర్శకత చాలా అవసరం. పత్రికా స్వేచ్ఛ అంటే మీడియా ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ప్రభుత్వ హస్తం లేకుండా వార్తలను ప్రచురించే హక్కు కలిగి ఉండడం. కానీ నేడు పాత్రికేయులపై, మీడియా సంస్థలపై జరుగుతున్న దాడులు, అన్యాయంగా జరుగుతున్న అరెస్టులపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. – కలకోటి సునీల్కుమార్, న్యాయవాది, వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడునాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలుస్తూ, వాస్తవాలను ప్రచురిస్తూ, ప్రజలకు– ప్రభుత్వానికి వారధిగా ఉండే ఏ పత్రికా జర్నలిస్ట్ స్వేచ్ఛనైనా హరించడం అప్రజాస్వామికం. ఏమైనా అభ్యంతరాలు ఉంటే పత్రికాముఖంగా ఖండించాలనేగానీ ఎడిటర్పై అక్రమకేసులు పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు. సాక్షి లేదా మరేదైనా పత్రిక ఇచ్చిన వార్తా కథనాలతో ప్రభుత్వం విభేదిస్తే తప్పకుండా ఖండించవచ్చు. తమ కోణంలో చెప్పినా కానీ స్పందించలేని పక్షంలో ఆ సంస్థపై నోటీసులు ఇచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. కానీ నేరుగా కేసులు నమోదు చేయడం సరికాదు. – కారుమంచి రామారావు, ఎస్సీ, ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ -
బోధన, పరిశోధనల్లో ఏఎన్యూ ప్రత్యేకత
పెదకాకాని(ఏఎన్యూ): బోధన, పరిశోధనల్లో ప్రత్యేకత చాటుతూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పేరొందిందని ప్రొఫెసర్ జి.చెన్నారెడ్డి అన్నారు. వర్సిటీ 49వ వ్యవస్థాపక దినోత్సవం గురువారం జరగనుంది. బుధవారం డైన్మెన్ హాల్లో మీడియా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ప్రొఫెసర్ వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చెన్నారెడ్డి మాట్లాడుతూ... గుంటూరు జిల్లా నల్లపాడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రంగా ప్రారంభమై, స్వతంత్ర విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించిందన్నారు. ఏఎన్యు ప్రాంగణంలో ఆర్ట్స్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ వంటి ఆరు కళాశాలలు ఉన్నాయని చెప్పారు. నేడు రెగ్యులర్ విధానంలో 65 యూజీ, పిజి, వృత్తి విద్య కోర్సులు, దూరవిద్య విధానంలో 43 కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతిర్మయి మట్లాడుతూ సీఎస్ఆర్, సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధ్యయన కేంద్రం, మహాత్మ జ్యోతిరావు పూలే అధ్యయన కేంద్రం, బాబు జగ్జీవన్రామ్ చైర్, సెంటర్ ఫర్ గాండియన్ స్టడీస్ డాక్టర్ కొత్త సచ్చిదానందమూర్తి అధ్యయన కేంద్రం నెలకొల్పినట్లు గుర్తుచేశారు. పూర్వ వీసీలు, ప్రొఫెసర్లు వేడుకలకు హాజరుకానున్నారని చెప్పారు. ముఖ్యఅతిథిగా వీసీ ఆచార్య కె.గంగాధరరావు హాజరుకానుండగా, పూర్వ వీసీలు ప్రొఫెసర్ డి. రామకోటయ్య, ప్రొఫెసర్ సీవీ రాఘవులు, ప్రొఫెసర్ ఎల్. వేణుగోపాల్ రెడ్డి, ప్రొఫెసర్ వి. బాలమోహన్దాస్, ప్రొఫెసర్ వై.ఆర్. హరగోపాల్రెడ్డి, ప్రొఫెసర్ ఎ.రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొంటారని వివరించారు. సమావేశంలో డాక్టర్ కె. శశిధర్, డాక్టర్ ఎన్.బాబు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
భారీ యంత్రాలతో పనులు చేయిస్తున్న అక్రమార్కులు తాడేపల్లి రూరల్: కృష్ణానది కరకట్ట లోపల ప్రభుత్వం పేద ప్రజలకు అందించిన అసైన్మెంట్ భూముల్లో రాత్రి పగలు తేడా లేకుండా మట్టితవ్వకాలు నిర్వహిస్తున్నారు. తాజాగా తాడేపల్లి రూరల్ పరిధిలోని చిర్రావూరు గ్రామంలో పెద్ద యంత్రాలతో తవ్వకాలు మళ్లీ ప్రారంభించారు. 2015–16 సంవత్సరాల్లో ఇలాగే అసైన్మెంట్ భూముల్లో తవ్వకాలు నిర్వహిస్తుంటే పది జేసీబీలు, 40 ట్రాక్టర్లను సీజ్ చేసి తాడేపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తాడేపల్లి రూరల్లోని గుండిమెడ, ప్రాతూరు, చిర్రావూరు తదితర ప్రాంతాల్లో అసైన్మెంట్ భూముల్లో మట్టితవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. జేబులు నింపుకొంటున్న మాఫియా తిరిగి కొంతమంది రైతులను మట్టి మాఫియా వారు మభ్యపెట్టి నామమాత్రంగా నగదు ఇచ్చి తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.2500 నుంచి రూ.4 వేల వరకు మాఫియా అమ్ముతోందని స్థానికులు తెలియజేశారు. అసైన్మెంట్ భూముల్లో వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇస్తే కొంతమంది వాటిలో మట్టితవ్వకాలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల పక్కనే పంట భూములకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి 3 లక్షల నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ అసైన్మెంట్ భూముల్లోకి నీరు చేరుతుందని, తవ్వకాలు వల్ల పక్కనే ఉన్న భూమి సైతం కొట్టుకుపోయే పరిస్థితి ఉందని వాపోయారు. -
ఆర్థికసేవల్లో ప్రజా పాలకుడు నాగరాజు
తెనాలి: శాస్త్రవిజ్ఞానాన్ని గ్రామీణులకు చేరువ చేసిన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డును ఆర్థికరంగంలో పీపుల్స్ అడ్మినిస్ట్రేటర్గా గుర్తింపు పొందిన మద్దిరాల నాగరాజుకు బహూకరించటం సముచితమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఏర్పాటైన ప్రత్యేక సభకు ఫౌండేషన్ అధ్యక్షుడు యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. శాస్త్ర విజ్ఞానం ప్రజల పురోభివృద్ధికి తోడ్పడేందుకు నాయుడమ్మ తపించారన్నారు. ఆ దిశగా జీవితకాలం పనిచేసి ఎన్నో విజయాలను సాధించారని చెప్పారు. వికసిత్ భారత్కు వెన్నెముక అయిన ఆర్థికరంగంలో నాగరాజు, పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. త్రిపుర ఉప ముఖ్యమంత్రి / ఫైనాన్స్ మంత్రిగా ఉన్నపుడు ఆ రాష్ట్ర ఫైనాన్స్ కార్యదర్శిగా ఉన్న నాగరాజుతో బడ్జెట్ రూపకల్పనలో అనుభవాన్ని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేసుకున్నారు. నాయుడమ్మ స్ఫూర్తితో సాధిస్తాం చైన్నెలోని జాతీయ చర్మ పరిశోధన సంస్థ ముఖ్య కార్యదర్శి డాక్టర్ స్వర్ణ వి.కాంత్ తన ప్రసంగంలో డాక్టర్ నాయుడమ్మను ‘నేషన్ బిల్డర్’గా అభివర్ణించారు. విదేశాలు టారిఫ్లు పెంచిన నేపథ్యంలో ఎగుమతులు ప్రధానమైన తోలు పరిశ్రమలో 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల వృద్ధి నిజంగా సవాలు అని, నాయుడమ్మ స్ఫూర్తితో సాధిస్తామని చెప్పారు. ఫౌండేషన్ వైస్చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం తమ లక్ష్యాలను వివరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. సాటి మనిషిని అంటుకుంటే పాపమనే మకిల మనస్తత్వాలను శుద్ధిచేసిన సామాజిక శాస్త్రవేత్త, చర్మకారుల చేతివాసనలనే కాదు... సమాజానికి పట్టిన ఆధిపత్య దుర్వాసనలను కూడా తుడిచేసిన పరిశోధకుడిగా, మానవతావాదిగా నాయుడమ్మ ప్రజల హృదయాల్లో నిలిచి పోయారని చెప్పారు. తొలుత డాక్టర్ నాగరాజుకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతులమీదుగా నాయుడమ్మ అవార్డును ప్రదానం చేశారు. నాగరాజు దంపతులను సత్కరించారు. నాయుడమ్మపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లను బహూకరించారు. యడ్లపాటి స్వరూపరాణి, అయినాల మల్లేశ్వరరావు, తమిరిశ అనంతాచార్యులు, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. తొలుత నాయుడమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సమాజాభివృద్ధికి కృషి అవార్డు గ్రహీత మాట్లాడుతూ... భారత్ ఆధునికతను సంతరించుకుంటున్న రోజుల్లో డాక్టర్ నాయుడమ్మ తన పరిశోధనలు, ఆవిష్కరణల ప్రయోజనాలను పరిశ్రమలకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా చేశారని చెప్పారు. ఇటీవల మన గ్రామీణ భారతదేశం గొప్ప ప్రతిభ చాటిందన్నారు. దేశంలోని ఎంఎస్ఎంఈలు 11 కోట్ల మందికిపైగా ఉపాధి కల్పిస్తూ వికసిత్ భారత్కు ఇంజిన్లుగా ఉన్నాయని, డిజిటల్ మౌలిక వసతులు పునాదిగా ఉన్నట్టు నాగరాజు చెప్పారు. ఈ డిజిటల్ నిర్మాణం కేవలం జాతీయ విజయం మాత్రమే కాదని, ప్రపంచానికి ఒక నమూనాగా వివరించారు. ఇంతటి ఘన విజయాలు అన్నింటికీ పలు వాణిజ్య బ్యాంకులు దిక్సూచిగా నిలిచాయన్నారు. -
13న జాతీయ లోక్ అదాలత్
డాక్టర్ దుర్గాభార్గవికి మూడు బంగారు పతకాలు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ పిల్లల వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వనం దుర్గాభార్గవికి మూడు బంగారు పతకాలు దక్కాయి. మంగళవారం విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 28వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, బంగారు పతకాలు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎండీ పీడియాట్రిక్స్లో అత్యధిక మార్కులు సాధించినందుకు డాక్టర్ ధర్మవరపు అమృతవల్లి మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు గోల్డ్ మెడల్, ఎండీ పీడియాట్రిక్స్లో ఉత్తమ అవుట్గోయింగ్ స్టూడెంట్గా గుర్తింపు పొందినందుకు డాక్టర్ కృష్ణారావు పురోహిత్ గోల్డ్ మెడల్, ఎండీ పీడీయాట్రిక్స్ పార్ట్–2 పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి ఉత్తమ డిజార్టేషన్ సమర్పించినందుకు ఎస్వీరావు అండ్ ఎంఎం స్వామి గోల్డ్ మెడల్ను డాక్టర్ దుర్గాభార్గవి అందుకున్నారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ దేవకుమార్, పలువురు పిల్లల వైద్య నిపుణులు ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. తురకపాలెంలో ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెం గ్రామంలో అనధికారికంగా వైద్య సేవలు అందిస్తున్న ఒక ఆర్ఎంపీ క్లినిక్ను జిల్లా వైద్య అధికారి డాక్టర్ కె. విజయలక్ష్మి బుధవారం సీజ్ చేశారు. ఆర్ఎంపీ వైద్యుడు సైలెన్లు, అధిక మోతాదులోని యాంటీబయాటిక్స్ రోగులకు అందిస్తున్నట్లు రుజువు కావటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే అర్హులని గుర్తుచేశారు. దానికి మించి చికిత్సలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీలో పదవుల నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలో పలువురిని పలు పదవుల్లో నియమించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తాడికొండ నియోజకవర్గానికి చెందిన దాసరి కత్తెరేణమ్మను మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన భుక్యా శాలినిని మహిళా విభాగం సహాయ కార్యదర్శిగా, తాడికొండ అసెంబ్లీకి చెందిన కందుల సిద్ధయ్యను బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన చిన్నపోతుల దుర్గారావును ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఐటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా కోనా రుతిక్రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా మహ్మద్ ఫిరోజ్, తాడికొండ నియోజకవర్గానికి చెందిన ముత్యాల బాలస్వామిని పబ్లిసిటీ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, ఆరేపల్లి జోజిని పంచాయతీరాజ్ విభాగం సహాయ కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అంగన్వాడీ విభాగ అధ్యక్షురాలిగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సత్తెనపల్లి రమణిని నియమించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడిగా కానూరు శశిధర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పిడతల భానుప్రకాష్లను నియమించారు. సరుకు రవాణా లక్ష్యాన్ని చేరుకోవాలి లక్ష్మీపురం: గూడ్స్, పార్సిల్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు గుంటూరు డివిజన్ అధికారులు అందుబాటులో ఉంటారని గుంటూరు రైల్వే డివిజనల్ డీఆర్ఎం సుధేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గూడ్స్, పార్సిల్ వినియోగదారులు బిజినెస్ డెవలప్మెంట్ యూనియన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సరుకు లోడింగ్ను పెంచి లక్ష్యాన్ని సాఽధించేందుకు సహకరించాల్సిందిగా కోరారు. సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ పాల్గొన్నారు. నేటి నుంచి స్కూల్ గేమ్స్ జిల్లా జట్ల ఎంపికలు నరసరావుపేట ఈస్ట్: పాఠశాల విద్యాశాఖ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 11నుంచి 19వరకు వివిధ క్రీడాంశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు డీఈఓ ఎల్.చంద్రకళ, స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్కుమార్, మహిళా కార్యదర్శి వి.పద్మావతి బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంపికలు స్పెల్– 1లో భాగంగా అండర్–14, అండర్–17 బాలురు, బాలికల విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. పోటీల్లో భాగంగా ఈనెల 11న నందిగామ జెడ్పీ హైస్కూలులో సెపక్తక్రా, 12న డీఎస్ఏ స్టేడియంలో కరాటే, 15న చిలకలూరిపేట ఏఎంజీ పాఠశాలలో జూడో, గట్కా, 16న డీఎస్ఏ స్టేడియంలో ఫుట్బాల్, 17న అచ్చంపేట గురుకుల పాఠశాలలో రగ్బీ, 18న ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల స్విమ్మింగ్ పూల్లో ఈత, 19న ఏఎంజీ పాఠశాలలో బాక్సింగ్, అచ్చంపేటలో రెజ్లింగ్ (కుస్తీ) పోటీలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఏపీఆర్ఎస్ఏ క్రీడా పోస్టర్ ఆవిష్కరణ గుంటూరు వెస్ట్: ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర స్థాయి క్రీడా పోస్టర్ను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ నవంబర్ 7, 8, 9వ తేదీల్లో అనంతపురంలో రెవెన్యూ స్పోర్ట్స్ మీట్కు జిల్లా నుంచి 55 మంది పాల్గొంటారని తెలిపారు. 13న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సదస్సు లక్ష్మీపురం: ఈ నెల 13న జరిగే రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ పిలుపునిచ్చారు. గుంటూరు నగరంలోని కొత్తపేట సీపీఐ జిల్లా కార్యాలయంలోని మల్లయ్యలింగం భవన్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో నాసర్జీ మాట్లాడుతూ విద్య, వైద్యరంగాల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బాలనవ్యశ్రీ , జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్ పాల్గొన్నారు. -
కొంటాం అంటూనే... కొర్రీ!
తెనాలి: ఆరుగాలం కష్టించి పండించిన పొగాకును అమ్ముకోవటానికి రైతులు అవస్థలు పడుతున్నారు. కొనుగోళ్ల కోసం నెలల తరబడి ఎదురుచూసి, తీరా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాక నాణ్యత లేదని తిరస్కరించటంతో దిక్కుతోచటం లేదంటున్నారు. పొగాకును వదిలేసి వెళ్లటం మినహా మరో మార్గం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. కొనుగోళ్లు కొంతే.. రాష్ట్రంలోని రైతులు పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవటంతో ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. మార్క్ఫెడ్ బయ్యర్లను ఏర్పాటుచేసి పొగాకు కొనుగోళ్లను చేయిస్తోంది. ఈ క్రమంలో పొగాకు పండే ప్రాంతాల్లో గౌడౌన్లు ఖాళీలేకపోవటంతో తెనాలిలోని రాష్ట్ర ప్రభుత్వ వేర్హౌసింగ్ గిడ్డంగిలో ఈనెల ఒకటో తేదీ నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించింది. గ్రామాల్లోని రైతు సేవాకేంద్రాల్లో పొగాకు రైతులకు షెడ్యూళ్లనిచ్చి, విడతలవారీగా ఏయే కొనుగోలు కేంద్రానికి ఎప్పుడు పొగాకు తీసుకెళ్లాలనేది మెస్జ్లను పంపుతున్నారు. ఆ ప్రకారం సమాచారం అందుకున్న బాపట్ల జిల్లా కారంచేడు, చీరాల ప్రాంత రైతులు పలువురు మంగళవారం రాత్రికి తమ పొగాకు బేళ్లతో సహా తెనాలిలోని కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. బుధవారం ఉదయాన్నే బయ్యర్లు వచ్చి కొంత సరుకును మాత్రమే తీసుకుని మిగిలినది తిరస్కరించారు. ఎంతోకొంతకు తీసుకోమన్నా.. పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం మూడు గ్రేడ్లను నిర్ణయించింది. కిలో రూ.12, రూ.9, 6 చొప్పున నాణ్యత ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కొందరు రైతులకు చెందిన పొగాకును కనిష్టమైన రూ.6లకు కూడా తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని రైతులు చెప్పారు. పొగాకును ఇక్కడకు తరలించటానికే బోలెడు ఖర్చయిందనీ, మళ్లీ ఇప్పుడు దీనిని ఎక్కడికి తీసుకెళ్లాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. బయ్యర్లు నాణ్యత తనిఖీకని బేళ్లను విడదీశారనీ, ఇప్పుడా పొగాకు దేనికీ పనికిరాదని వాపోతున్నారు. కనిష్ట ధరకు కాకపోయినా ఎంతోకొంతకు తీసుకోమని ప్రాధేయపడుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదంటున్నారు. -
ఈవీఎంలు, ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాలను అడ్డుకునేందుకు అన్నిరకాల పోరాటాలు చేస్తామన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. తాను కూడా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటానానని వైఎస్ జగన్ తెలిపారు. ఇదేస సమయంలో పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రైవేటీకరణపై అన్నిరకాల పోరాటం చేస్తాం. ఆందోళనలు, నిరసనలు చేస్తాం. చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాలను అడ్డుకునేందుకు అన్నిరకాలుగా పోరాడుతాం. నేను కూడా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాను. రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతీ ఒక్కరికీ ఇందులో కలిసి రావాలని పిలుపు ఇస్తున్నాం. అయినా బరి తెగిస్తే.. ఊరుకోం. ఎవరు టెండర్లలో పాల్గొంటారో పాల్గొండి.. మేం చూస్తాం. మేం అధికారంలోకి వచ్చాక అన్నింటినీ రద్దు చేస్తాం.. గుర్తు పెట్టుకోండిప్రతిపక్ష హోదాపై..18 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుందన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఇంత సేపు మాట్లాడేందుకు సమయం దొరికింది?. మరి అక్కడ అంత సమయం ఇస్తారా?. ప్రధాన ప్రతిపక్ష హోదాలోనే ఆ అవకాశం ఉంటుంది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉంది. ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీనే. మా పార్టీని కూడా ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు. ఆ సమయంలో ప్రజా సమస్యలపై ఏం చెప్పగలుగుతాం. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే సభాధ్యక్షుడితో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే మాకు హోదా ఇవ్వడం లేదు. గతంలో సభలో జరగిని దాడికి చంద్రబాబు ఏడ్చేసి నానా యాగి చేశారు. చంద్రబాబు ఎన్ని రోజులు సభకు వచ్చారు అని ప్రశ్నించారు.ఎన్నికల విషయమై..స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టబోతున్నారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు.. పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి?. కేంద్ర బలగాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ పాలనలో సూపర్ సిక్స్.. అట్టర్ఫ్లాప్ సినిమా అని ఎద్దేవా చేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సూపర్ సిక్స్ అనే.. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతపు విజయోత్సవాలు జరుపుతున్నారు. అనంతపూర్లో ఇవాళ ఇదే చెప్పచోతున్నారు అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఒక స్థాయిలోనే ఉంటాయి. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్ అని ప్రజలకు అర్ధమైంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్.. ఇది ఏ లెవల్ మోసమో.. వాళ్ల అనుకూల మీడియాలో వచ్చిన అడ్వైర్టైజ్మెంట్లను చూడండి. 50 ఏళ్ల వాళ్లకు పెన్షన్ తీసేశారు. ఆడబిడ్డ నిధి ఎగిరిపోయింది. మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి.. కనిపించడం లేదు. క్యాంటీన్లను ఇప్పుడు కొత్తగా సూపర్సిక్స్లో చేర్చారు. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలతో పాటు అదనంగా ఇస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు.సూపర్ సిక్స్కు పొంతనేది..ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్కు ఈరోజు సూపర్ సిక్స్ పొంతన లేదు. ఇప్పుడు ఇచ్చేది కాకుండా రైతులకు అదనంగా రూ.20వేలు ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద ఆంక్షలు లేకుండా ప్రతీ బిడ్డకు రూ.15వేలు ఇస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఏ ఊరికి పోవాలన్నా ఉచితం అని చెప్పారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. గతేడాది ఎన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు. ఆడబిడ్డ ధి పేరుతో నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో ప్రతీ మహిళకు 36వేలు ఇచ్చారా?.నిరుద్యోగ భృతి కింద రెండేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.72వేలు బాకీ పడ్డారు. 50 ఏళ్లు దాటిన మహిళలకు గతేడాది 48వేలు, ఈ ఏడాది 48 వేలు పెన్షన్లకు ఎగనామం పెట్టారు. మేము దిగిపోయే నాటికి 66,34,742 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇప్పుడు 61,91,864 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇది మోసం కాదా? చంద్రబాబు అని అడుగుతున్నాను. పీఎం కిసాన్ కాకుండా అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20వేలు ఇస్తామన్నారు. గతేడాది, ఈ ఏడాది కలిపి రైతులకు రూ.40వేలు బాకీపడ్డారు. తల్లికివందనం కింద 15వేలు ఇస్తామన్నారు. రూ.8వేలు, 9వేలు, 13వేలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?.ఉచితం పేరిట.. ఇసుక దోపిడీ నడుస్తోంది. లిక్కర్ మాఫియా నడుస్తోంది. అమరావతి పేరిట మాపియా జరుగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. చంద్రబాబు, ఆయన మాఫియాకు ఆదాయం పెరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది. ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. రోమన్ చక్రవర్తి నీరోలా చంద్రబాబు ఫిడేల్ వాయిస్తున్నారు. సూపర్సిక్స్ పేరిట బలవంతపు సంబురాలు చేయిస్తున్నాడు. రాష్ట్ర చరిత్రలో కనివినీ ఎరుగని అధ్యయం ఇది. చంద్రబాబు హయాంలో అప్పులు ఎగబాకాయి అని చెప్పుకొచ్చారు. -
బ్లాక్ మార్కెట్కు చంద్రబాబే భాగస్వామి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎరువులు దొరక్క రైతులు అవస్థలు పడుతుంటే మీకు పట్టదా చంద్రబాబు అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. సమయానికి ఎరువులు అందిస్తే రైతులు రొడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొస్తుంది?. సీఎం సొంత జిల్లా, కుప్పంలో కూడా రైతులు ఆగచాట్లు పడుతున్నారు. దీనిపై చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలన్నారు. బ్లాక్ మార్కెట్కు చంద్రబాబే భాగస్వామి అని చెప్పుకొచ్చారు.ఏపీలో యూరియా కొరత, రైతుల అవస్థలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ైవైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రైతులు రోడ్డెక్కడం ఎక్కడైనా చూశారా?. మా హయంలో రైతులకు ఇబ్బంది అనేదే రాలేదు. చంద్రబాబు సొంత జిల్లాలోనే రైతులు ఆగచాట్లు పడుతున్నారు. మా పాలనలో.. ఇప్పుడూ అదే అధికారులు ఉన్నారు. అప్పుడు రాని సమస్య.. ఇప్పుడు ఎందుకు వచ్చింది?. జగన్ అనే వ్యక్తి రైతులకు ఇబ్బంది కలగకూడదని ఆలోచించారు. ఇప్పుడు ఎరువుల దగ్గర కూడా స్కామ్లకు పాల్పడుతున్నారు. ీజన్ ప్రారంభంలోనే ఎంత విస్తీర్ణం సాగు అవుతుంది. ఎంత మొత్తంలో ఎరువులు కావాలో తెలియదా?. చంద్రబాబు చెప్పినట్టు యూరియా సరఫలా జరిగిందా.?రైతుల అవస్థలకు కారణం.. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఎరువుల్ని టీడీపీ నేతలు దారి మళ్లించి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అధికంగా కేటాయించిన ఎరువుల్ని బ్లాక్ చేసి.. బ్లాక్లో అమ్మేసుకుంటున్నారు. చంద్రబాబే ఇందులో భాగస్వామి రైతులను పీడించి.. స్కామ్లు చేసి కింద నుంచి పైదాకా అందరూ పంచుకుంటున్నారు. దాచుకో.. దోచుకు. యూరియా విషయంలో రూ.250 కోట్ల స్కామ జరిగింది’ అని ఆరోపించారు. చిత్తశుద్ధి లేని చంద్రబాబు వల్లే.. మా హయాంలో గట్టి హెచ్చరికలు వెళ్లేవి. తప్పు చేయాలంటే భయపడేవాళ్లు. అందుకే ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు చంద్రబాబే దగ్గరుండి స్కాంలు నడిపిస్తున్నారు. చంద్రబాబుకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ఎవరి మీద చర్యలు లేవు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ.. స్కాంలు చేస్తున్నారు.. వీళ్లు మనుషులేనా?. రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ల తరఫున మాట్లాడకూడదా?. ఉల్లి, టమాటా, చీనీ పంటలకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో పరిణామాలు చూస్తుంటే అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు సున్నా వడ్డీ పథకం ఎత్తేశారు అని ఆరోపించారు. -
చంద్రబాబువన్నీ మోసాలే.. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
సాక్షి, గుంటూరు: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో.. యూరియా కొరత, గిట్టుబాటు ధరలేక రైతులు పడుతున్న అవస్థలు, 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం.. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి వైద్య రంగాన్ని దెబ్బ తీయడం.. అలాగే సూపర్సిక్స్ హామీలు అమలు చేయకపోయినా, సూపర్హిట్ పేరుతో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం గురించి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మీడియా ద్వారా సుదీర్ఘంగా మాట్లాడారు. రైతులకు అందాల్సిన ఎరువులు, యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తూ స్కామ్కు పాల్పడుతున్నారు. దాన్ని నిరసిస్తూ మా పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ, వారి పక్షాన వారితో కలిసి ఆర్డీఓలకు అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. దాన్ని కూడా అడ్డుకుంటూ, పోలీసుల ద్వారా అణగదొక్కే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులకు నోటీసులు ఇచ్చారు. (అంటూ, పోలీసులు ఇచ్చిన నోటీసులు మీడియాకు పీపీటీలో చూపారు) యూరియా కోసం రైతులతో కలిసి ఆర్డీఓకు అర్జీలు ఇవ్వడం తప్పా? రైతుల తరపున మాట్లాడొద్దా? ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారు. అసలు మీరు అవసరమైన ఎరువులు అందిస్తే, ఏ రైతు కూడా రోడ్డెక్కడు కదా? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు స్కామ్లు చేశారు. అందుకే ఈ పరిస్థితి. ఏకంగా రెండు నెలల నుంచి రైతులు యూరియా కోసం నానా అగచాట్లు పడుతున్నారు. అది మీ దారుణ పాలనకు సాక్ష్యం కాదా?. మీ అవినీతి పాలనకు నిదర్శనం కాదా? (అంటూ.. యూరియా కోసం అనేక చోట్ల రైతులు బారులు తీరిన ఫోటోలు ప్రదర్శన. చివరకు కుప్పం, టెక్కలిలో కూడా అదే స్థితి).నేను ఒకటే అడుగుతున్నాను. ప్రజలంతా ఆలోచించాలి. మా పాలనలో 5 ఏళ్లలో ఎక్కడైనా, ఎప్పుడైనా రైతులు ఇలా ఎరువుల కోసం అగచాట్లు పడ్డారా? రోడ్డెక్కారా? అప్పులు ఆ పరిస్థితి ఎందుకు రాలేదు?. ఇప్పటి పరిస్థితికి కారణం.. జగన్ అనే వ్యక్తికి రైతుల మీద ఆపేక్ష. వారికి మంచి చేయాలన్న తపన, తాపత్రయం. నాటి సీఎంకు, ఇప్పటి సీఎంకూ అదే తేడా. ఎరువుల సరఫరాలో కూడా స్కామ్ చేస్తున్నారు. అందుకే ఈ దుస్థితి. ఇందుకు చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి.చంద్రబాబు నోట అబద్ధాలు..ఈనెల 3న మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఈ ఖరీఫ్లో 6.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియ సరఫరా చేశామని, గత ఏడాదితో పోలిస్తే 97 వేల టన్నులు ఎక్కువ సరఫరా చేశామని చెప్పారు. మరి చంద్రబాబుగారు చెబుతున్నట్లుగా ఎరువులు అంది ఉంటే, రైతులు రోడ్కెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? వారికి యూరియా అందలేదు కాబట్టే, ఈ పరిస్థితి వచ్చింది కదా?. రాష్ట్రానికి వస్తున్న యూరియాను టీడీపీ నాయకులు దారి మళ్లించి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులకు ఎక్కువగా ఇచ్చేశారు. వారు కొరత సృష్టించి బస్తాకు రూ.200 వరకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇలా బ్లాక్మార్కెట్లో ఎరువులు అమ్ముతూ దాదాపు రూ.250 కోట్ల వరకు స్కామ్ చేస్తున్నారు. రైతులను పీడించి, స్కామ్లు చేసి అందరూ పంచుకుంటున్నారు.మరోవైపు, ఏ ఒక పంటకూ గిట్టుబాటు ధర లేదు. వరి, చీనీ.. ఏది చూసినా. ఇప్పుడు కూడా ఉల్లి, టమోటా పరిస్థితి కూడా అదే. ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ, సీఎం చంద్రబాబు పట్టించుకోడు. తూతూ మంత్రంగా ప్రకటన చేస్తాడు. అసలు ముందు వాస్తవాలు ఒప్పుకోడు. తప్పదనుకుంటే, ఒక ప్రకటన చేస్తాడు. దాన్ని ఎల్లో మీడియా హైలైట్ చేస్తుంది. ఈరోజు ఉల్లి క్వింటాలు ధర రూ.200 నుంచి రూ.300 ఉంటే, బహిరంగ మార్కెట్లో కేజీ రూ.34. అంటే క్వింటాలుకు రూ.3400.మా ప్రభుత్వ హయాంలో రూ.7,802 కోట్లు ఖర్చు చేసి, మార్కెట్లో జోక్యం చేసుకున్నాం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం. మార్కెట్లో పంటల ధరలు తగ్గితే.. సీఎం–యాప్ (కంటిన్యూయస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్) ద్వారా ప్రభుత్వం రంగంలోకి దిగి, కొనుగోలు చేసేది. కానీ, ఇప్పుడవేవీ లేవు. మా ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలకు మంగళం పాడేశారు.ప్రజారోగ్య రంగం నిర్వీర్యం.. సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను శనక్కాయలు, బెల్లానికి అమ్ముకంటున్నారు. తన మనుషులకు దోచి పెడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. తారాస్థాయికి చేరిన చంద్రబాబు అవినీతి, స్కామ్లకు పరాకాష్ట. 2019 వరకు మన రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు 11. పద్మావతి వర్సిటీ కాలేజీ కూడా కలుపుకుంటే వాటి సంఖ్య 12. చంద్రబాబు తన అన్నేళ్ల పాలనలో కనీసం ఒక్కటంటే, ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా? కనీసం ఆ ఆలోచన అయినా చేశాడా?. అదే మా ప్రభుత్వంలో కేవలం 5 ఏళ్ల అతికొద్ది కాలంలోనే, ప్రతి జిల్లాకు ఒక టీచింగ్ హాస్పిటల్ తీసుకురావాలని, ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని చూశాం. జిల్లాలు 13 నుంచి 26కు పెంచి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఒక జిల్లాలో మెడికల్ కాలేజీలో భాగస్వామ్యంగా టీచింగ్ హాస్పిటల్ ఏర్పాటైతే, అక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. ఆ స్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులోకి వస్తారు. మా హయాంలో 17 మెడికల్ కాలేజీల పనులు చేపట్టాం. ఒక్కో దానికి రూ.500 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి కాలేజీని 50 ఎకరాల్లో చేపట్టాం. అన్ని హంగులతో వాటి నిర్మాణం చేపట్టాం. అంకితభావంతో పని చేశాం కాబట్టే.. 2023–24లో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. తరగతులు మొదలయ్యాయి. అవే కాకుండా, గత ఏడాది ఎన్నికల నాటికి, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తైంది. అడ్మిషన్లకు సిద్ధం చేశాం. పులివెందుల కాలేజీని ప్రారంభించాను. ఎన్నికలు ముగిశాక, పాడేరు మెడికల్ కాలేజీ మొదలైంది. అడ్మిషన్లు జరిగి, క్లాస్లు కూడా ప్రారంభం అయ్యాయి. అంటే, మా హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తి చేసి, ప్రారంభించాం. మెడికల్ కాలేజీలే కాదు.. మా హయాంలో ఎంతో చేశాం. కానీ చేసింది చెప్పుకోలేకపోయాం.. అదే తప్పైంది మెడికల్ సీట్లు వద్దన్న చంద్రబాబుచంద్రబాబు ఎంత దుర్మార్గుడు అంటే, పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ (జాతీయ వైద్య కమిషన్) 50 సీట్లు కేటాయించి, భర్తీ చేయడానికి అనుమతి ఇస్తే, ఆ సీట్లు వద్దంటూ చంద్రబాబు లేఖ రాశాడు. అలాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉంటాడా?. చంద్రబాబు అసలు మనిషా? లేక రాక్షసుడా? ఆలోచించండి.మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం, చంద్రబాబు చొరవ చూపి ఉంటే.. 2024–25లో మరో 4 కాలేజీలు.. అదోని, మదనపల్లె, మార్కాపురం, పిడుగురాళ్లలో క్లాస్లు మొదలై ఉండేవి. ఆ మేరకు నిర్మాణాలు కొనసాగించాం. (అంటూ ఆ కాలేజీల ఫోటోలు కూడా చూపారు). ఇంకా మా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే, మరో 6 మెడికల్ కాలేజీలు.. అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, పాలకొల్లు, పెనుకొండలో మెడికల్ కాలేజీలు 2025–26 విద్యా సంవత్సరంలో మొదలై ఉండేవి. ఆ ప్రకారం మేము పనులు చేశాం. మా ప్రభుత్వం వచ్చే నాటికి ఉన్న మెడికల్ సీట్లు 2360. కొత్త కాలేజీల ద్వారా మరో 2550 మెడికల్ సీట్లు పెరిగేవి. మొత్తం 4,910కి మెడికల్ సీట్లు చేరుకునేవి. మా హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీల ద్వారా 800 సీట్లు భర్తీ అయ్యాయి. వైద్య విద్యలో ఇది అద్భుత ఘట్టం. నాకు క్రెడిట్ వస్తుందని, దెబ్బ తీయడం, రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత వరకు ధర్మం?మేం దిగిపోయే నాటికి దాదాపు రూ.3 వేల కోట్ల పనులు జరగ్గా, మిగిలిన రూ.5 వేల కోట్లకు కూడా నాబార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ స్పెషల్ అసిస్టెన్స్ ద్వారా కానీ, ఇతర సంస్థల ద్వారా నిధులకు ఓకే అయింది. కొత్త కాలేజీల వల్ల భూమలు విలువ బాగా పెరిగింది. మొత్తం కాలేజీల విలువ కూడా పెరిగింది. భవిష్యత్తులో దాని విలువ లక్ష కోట్లు దాటుతుంది. కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడబడతాయి.ఇంకా చంద్రబాబునాయుడుగారి హయాంలో వైద్య రంగం నిర్వీర్యం అయింది. మా ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో 3,257 ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు వ్యయ పరిమితి. వార్షికాదాయం రూ.5 లక్షలు ఉన్న వారికి కూడా పథకాన్ని వర్తింప చేయడం వల్ల 95 శాతం కవర్ అయ్యారు. దాని నిర్వహణకు నెలకు రూ.300 కోట్లు కావాలి. 15 నెలలకు రూ.4500 కోట్లు కావాల్సి ఉంటే, చంద్రబాబు ఇచ్చింది రూ.600 కోట్లు మాత్రమే. దాంతో కార్పొరేట్ ఆస్పత్రులు పథకంలో వైద్యం చేయడం లేదు. ఇన్ని చేసిన చంద్రబాబు, ఇంకా మరో మోసం. డ్రామా చేస్తున్నాడు. కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకొచ్చాడు. దానిలో వైద్యం ఖర్చును కేవలం రూ.2.5 లక్షలకే పరిమితం చేయడంతో పాటు, ప్రొసీజర్లను 2500కు తగ్గించారు. చంద్రబాబు వైద్య రంగాన్ని నాశనం చేసిన తీరుకు.. తురకపాలెం ఉదాహరణ. 2 నెలల్లో 45 మంది చనిపోతే, ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితి. ఇది సీఎం ఇంటికి చాలా చేరువ.సూపర్హిట్ ఫ్లాప్ సంబరాలు:చంద్రబాబుకు ఉన్న నైపుణ్యం. కళ్లార్పకుండా పచ్చి అబద్ధాలు చెప్పడం. అది ఆయనకు మాత్రమే తెలుసు. ఒకవైపు పథకాల అమలు లేదు. మరోవైపు మోసం. అయినా సూపర్సిక్స్ సూపర్హిట్ అంటూ వేడుక. ఇది అట్టర్ఫ్లాప్ అయిన సినిమాకు బలవంతంగా విజయోత్సవం చేసినట్లు ఉంది. చంద్రబాబు అబద్దాలు, మోసాలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. ఒకసారి చూడండి. (అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన అడ్వరై్జజ్మెంట్స్. సూపర్సిక్స్పై ప్రదర్శన). ఇంకా ఎన్నికల ముందు సూపర్సిక్స్ గురించి చంద్రబాబు ఏమన్నారనేది చూద్దాం. (అంటూ ఆ పత్రికా ప్రకటనలు. అప్పుడు ఇంటింటికీ పంపించిన బాండ్లు. వాటిలో ఏమేం చెప్పారు?. బాబు ష్యూరిటీ. భవిష్యత్తు గ్యారెంటీ. దీనిపై చంద్రబాబు, పవన్కళ్యాణ ఫోటోలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఇంకా పథకాలపై చంద్రబాబు హామీల ప్రచార వీడియోల ప్రదర్శన).ఇప్పుడు నేను అడుగుతున్నాను.. ఇవన్నీ మోసాలు కావా?:18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా?. ఆడబిడ్డ నిధి కింద రెండేళ్లకు రూ.36 వేలు బాకీ. ఈరోజు అనంతపురంలో సూపర్హిట్ పేరుతో సభ పెట్టావు. నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు. రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అవి ఇవ్వనప్పుడు మోసం కాదా? అది నీ సూపర్సిక్స్ హామీ కాదా?.. 50 ఏళ్లకే పెన్షన్ నెలకు రూ.4 వేలు. ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇది మోసం కాదా?. పెన్షన్ల సంఖ్య గత ఏడాది మార్చి నాటికి 66,34,742 ఉంటే, ఈనెలలో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,864. అంటే దాదాపు 5 లక్షలు కోత. ఇది మోసం కాదా?. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి పోవాలన్నా మహిళలకు ఫ్రీ అన్నావు. కానీ పరిమిత బస్సుల్లోనే అనుమతి. ఇది మోసం కాదా?. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నావు. కానీ గత ఏడాది ఒక్కటే ఇచ్చావు. ఈ ఏడాది ఒక్కటి కూడా లేదు. అంటే 6 సిలిండర్లకు గానూ, కేవలం ఒక్కటే ఇవ్వడం మోసం కాదా?. పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్నావు. అలా రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?. తల్లికి వందనం కింద రెండేళ్లకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా, 30 లక్షల మందికి ఎగ్గొట్టి కేవలం రూ.13 వేలు మాత్రమే, ఇంకా చాలా మందికి రూ.8 వేలు మాత్రమే ఇవ్వడం మోసం కాదా?గత ప్రభుత్వంలో అమలైన పథకాలు రద్దు చేయడం మోసం కాదా? చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, తోడు, చేదోడు, ఉచిత పంటల బీమా, విద్యాదీవెన, వసతిదీవెన, పిల్లలకు ట్యాబ్లు రద్దు చేశావు. ఇది మోసం కాదా?.. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, ఆయన చేసిన మోసంతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే.. ఆయన సూపర్హిట్ పేరుతో బలవంతపు వేడుకలు. ఇది దారుణం.15 నెలల్లో రికార్డు స్థాయిలో అప్పులుఒక్కటే అడుగుతున్నాను. 15 నెలల్లో దాదాపు రూ.2 లక్షల కోట్ల అప్పు చేశారు. ఎవరి జేబులోకి పోతోంది ఆ మొత్తం. ఇది రాష్ట్ర చరిత్రలోనే లేదు. రాష్ట్రం విభజించిన రోజు, మొత్తం అప్పులు కలిపి రూ.140,717 కోట్లు ఉంటే ఆయన దిగిపోయేనాటికి రూ,3,90,247. అంటే 22.63 శాతం సీఏజీఆర్. అది మా హయాంలో అది 13.57 శాతం మాత్రమే. ఇక మా ప్రభుత్వ హయాంలో అప్పు రూ.3,90,247 కోట్ల నుంచి రూ.7,21,918 కోట్లకు పెరిగింది. అంటే మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన మొత్తం అప్పు రూ.3,32,671 కోట్లు కాగా, చంద్రబాబు కేవలం 15 నెలల్లో చేసిన అప్పు ఏకంగా రూ.1,91,361 కోట్లు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 57.5 శాతం ఈ 15 నెలల్లోనే చేశారు.ఈ ప్రభుత్వంలో ఇసుక, మట్టి దోచేస్తున్నారు. ఉచితం లేనే లేదు. లిక్కర్ మాఫియా. పర్మిట్రూంలు, బెల్టు షాప్లు విచ్చలవిడిగా. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. మద్యం మాఫియా దోచేస్తోంది. సిలికా, క్వార్ట్జ్ దోపిడి. అమరావతిలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10 వేలు. అదో దోపిడి. శనక్కాయలు, బెల్లానికి ఇష్టం వచ్చినట్లుగా.. ఉర్సా, లులూకు భూముల కేటాయింపు. రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది. మీ ఆదాయం, మీ అనుయాయుల సంపద పెరుగుతోంది.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం స్కామ్ల్లో పరాకాష్ట. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. దీన్ని అడ్డుకుంటాం. నిరసనలు, ర్యాలీలు చేస్తాం. నేనూ అక్కడక్కడా పాల్గొంటా. – రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క పార్టీని కోరుతున్నా. అందరూ కలిసి రండి. కొత్త మెడికల్ కాలేజీలు మన సంపద. రాష్ట్ర సంపద. అందరం కలిసి పోరాడుదాం. వాటిని కాపాడుకుంటాం. అయినా ఈ ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే, రేపు మా ప్రభుత్వం రాగానే, వాటన్నింటినీ రద్దు చేస్తాం. ఆ కాలేజీలు వెనక్కు తీసుకుంటాం.మీడియాతో జగన్ చిట్చాట్ 👉స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టబోతున్నారు? ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు.. పోలీసు వ్యవస్థ సక్రమంగా లేదు. పోలీసుల చేతనే రిగ్గింగ్ చేయిస్తున్నారు. అలాంటప్పుడు ఈవీఎంలు ఉంటే ఏంటి?.. పేపర్ బ్యాలెట్ పెడితే ఏంటి?. కేంద్ర బలగాలు వస్తేనే ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి. సాధారణ ఎన్నికలప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. 👉ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారన్న ఆరోపణలకు స్పందిస్తూ.. అలాంటిదేం లేదు, అదంతా ఉత్త ప్రచారమే.. 👉18 నుంచి అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుందన్న ప్రశ్నకు.. ఇప్పుడు ఇంత సేపు మాట్లాడేందుకు సమయం దొరికింది?. మరి అక్కడ అంత సమయం ఇస్తారా?. ప్రధాన ప్రతిపక్ష హోదాతోనే ఆ అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకూడదన్న రీతిలో సభను నడిపిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఎన్నిరోజులు అసెంబ్లీకి వచ్చారు. జరగనిదాన్ని జరిగిందని రాద్ధాంతం చేశారు.👉సోషల్ మీడియా తప్పుడు ప్రచారం పేరిట ఏపీ ప్రభుత్వ తీసుకోబోయే కఠిన నిర్ణయంపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి అలాంటి అధికారం ఉండదు. అది కేవలం కేంద్ర పభుత్వ పరిధిలో ఐటీ చట్టాల పరంగా జరగాలి. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. 👉వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలో ఎలా వస్తుందో చూస్తాం అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్కు స్పందిస్తూ.. ‘‘ఈయనేంది చూసేది.. పైన దేవుడు చూస్తాడు’’ -
రైతులపై అంత కక్ష ఎందుకు?
రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు 50 వేల టన్నుల యూరియా టీడీపీ వర్గీయులకే అందజేత రైతులపై కక్ష సాధిస్తున్న కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి విశేష స్పందన – నల్లమోతు రామకృష్ణ, రైతు, కాకుమాను – కొండా కృష్ణా రెడ్డి, రైతు, ప్రత్తిపాడు -
రైతులకు కన్నీరు మిగిల్చిన కూటమి ప్రభుత్వం
● కన్నీటిలోనే పాలకులు కొట్టుకుపోవడం ఖాయం ● ‘అన్నదాత పోరు’లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు మురళీకృష్ణ, వేమారెడ్డి, శివకుమార్లు బాబు పాలనలో అన్నీ కష్టాలే రైతులపాలిట శనిలా చంద్రబాబు సీఎం వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం ‘చంద్ర’గ్రహణం చీకటిలో రాష్ట్రం కూటమికి గుణపాఠం తప్పదు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలి ఎడ్లబండిపై వస్తున్న లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీపార్వతి, శ్యామల, శివకుమార్, వేమారెడ్డి, మురళీకృష్ణ, హనుమంతరావు తెనాలిలో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పార్టీ శ్రేణులు, రైతులు -
ఆర్థిక సేవల్లో నిపుణుడు డాక్టర్ నాగరాజు మద్దిరాల
తెనాలి: ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డును ఈ పర్యాయం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా చేస్తున్న ఐఏఎస్ అధికారి నాగరాజు మద్దిరాలకు బహూకరించనున్నారు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 4.30 గంటలకు తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఏర్పాటయే సభకు ఫౌడేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులమీదుగా నాగరాజు మద్దిరాలకు అవార్డును ప్రదానం చేస్తారు. ఇదే వేదికపై నాయుడమ్మపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేస్తారు. తెలుగుతేజం నాగరాజు మద్దిరాల ఆకివీడు దగ్గర్లోని ఆలపాడు గ్రామంలో 1966లో జన్మించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో పీజీ కోర్సు చేశారు. 27 ఏళ్ల వయసులో త్రిపుర కేడర్లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. అదే రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆర్థిక, పరిశ్రమల, వాణిజ్యశాఖ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా వంటి కీలక పదవులు నిర్వహించారు. ఆయన హయాంలోనే 2016లో త్రిపుర, ‘మోస్ట్ ఇంప్రూవ్డ్ స్మాల్ స్టేట్ ఇన్ ఈ–గవర్నెన్స్’గా గుర్తింపును పొందింది. అదే సంవత్సరంలో రాష్ట్రంలో శిశు మరణాల రేటును 26 నుంచి 21కు తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి త్రిపురకు రెండో బహుమతి లభించింది. 2004–08లో ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్థిక వ్యవహారాల విభాగంలో జపాన్, ఉత్తర అమెరికా, ప్రపంచ బ్యాంక్ విభాగాల్లో డైరెక్టర్గానూ నాగరాజు చేశారు. 2008 – 12లో వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, సలహాదారుగానూ వ్యవహరించారు. బొగ్గు మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా వినూత్న సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అనే చారిత్రక మైలురాయిని చేరుకునేలా చేశారు. ప్రస్తుతం ఆర్థిక సేవలశాఖ కార్యదర్శిగా ఆ రంగ బలోపేతానికి కృషి చేస్తున్నారు. నేడు తెనాలిలో డాక్టర్ యలవర్తి నాయుడమ్మ అవార్డు స్వీకరణ -
‘కిల్కారి’ అమలు పరిశీలన
గుంటూరు మెడికల్: కిల్కారి అమలు తీరును పరిశీలించేందుకు కేంద్రం బృందం వచ్చింది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన బృంద సభ్యులు సందర్శించారు. జిల్లా బృందంతో సమావేశం అయ్యారు. గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. జిల్లా బృందం ఈ సేవలను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. డీపీహెఎన్ఓ డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ అమలు తీరు వివరించారు. 911 60010 3660 అనే నెంబర్ కాల్ వస్తుందని, ఈ నెంబర్ సేవ్ చేసుకోవాలన్నారు. తిరిగి వినాలి అంటే 14423 నెంబర్కి కాల్ చేయాలని చెప్పారు. గుంటూరు ఎడ్యుకేషన్: ప్రత్తిపాడు మండలం బోయపాలెంలోని ఈనెల 11, 12వ తేదీల్లో నిర్వహించనున్న కళా ఉత్సవాలను జయప్రదం చేయాలని గుంటూరు, పల్నాడు జిల్లాల విద్యాశాఖాధికారులు సీవీ రేణుక, ఎల్. చంద్రకళలు తెలిపారు. మంగళవారం డీఈవో కార్యాలయంలో డీఈవో రేణుకకు నోడల్ అధికారి డాక్టర్ ఎన్. విమల కుమారి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రేణుక మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విజేతలకు బహుమతులతోపాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. రెండు రోజులపాటు భోజన ఏర్పాట్లు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసీం పాల్గొన్నారు. నెహ్రూనగర్: స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోర్సులలో ప్రవేశ ఎంపికకు ట్రాన్స్జండర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డి. దుర్గాబాయి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ లెవల్ కోర్సులో ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, పబ్లిక్ స్పీకింగ్, ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయన్నారు. డిగ్రీ లెవల్లో అడ్వాన్స్ ఆప్టిట్యూడ్, న్యూస్ పేపర్ అనాలసిస్ట్, కంప్యూటర్ ప్రావీణ్యాలు ఉంటాయని పేర్కొన్నారు. సంబంధిత శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
అర్ధరాత్రి వేళ నోటీసుల జారీ ఏంటి?
నగరంపాలెం: రాష్ట్ర వ్యాప్తంగా రైతుల బాధలను తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుమేరకు అన్నదాత పోరు చేపట్టామని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఓ మహిళా పోలీస్ అధికారిణి మంగళవారం గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన నివాసానికి చేరుకుని నోటీసులు జారీ చేశారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు, ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగేలా, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అన్నదాత పోరు చేపట్టామని అన్నారు. ఈ క్రమంలో అనుమతి కోసం లెటర్లు పెట్టామని గుర్తుచేశారు. అయితే సోమవారం అర్ధరాత్రి 12.40 గంటల సమయంలో రెండు వ్యాన్లల్లో పోలీసులు తమ ఇంటి వద్దకు వచ్చారని చెప్పారు. తలుపులు కొట్టడంతో తన భార్య, మనవరాళ్లు భయపడిపోయారని అన్నారు. అర్ధరాత్రి దాటాక పోలీసులు రావడం ఏంటని నిద్ర లేచి వచ్చానని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు చెప్పారన్నారు. దీంతో ఉదయం వేళ రావాలని పోలీసులకు చెప్పానని తెలిపారు. అయినా ఇదేమి పద్ధతి అని, చట్టబద్ధమైన పరిపాలన జరుగుతున్న రాష్ట్రంలో పోలీసులు దొంగల్లా అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉదయం వేళ ఇంటికి రావచ్చునని లేదా ఆదివారం రాత్రి 8లోపు నోటీసులు జారీ చేయవచ్చునని అన్నారు. కేవలం భయభ్రాంతులకు గురిచేయాలనే పోలీసులు వచ్చారని మండిపడ్డారు. అన్నదాతల కోసం తాము పోరాటం చేస్తున్నామని, రాజకీయ లబ్ధి కోసం కానేకాదని స్పష్టం చేశారు. అణచివేయాలనే ధోరణితో పోలీసులు వ్యవహరించడం దురదృష్టకరమని ఆరోపించారు. ఒకవేళ నోటీసులు ఇవ్వాలంటే కబురు పంపితే పోలీస్స్టేషన్కు స్వయంగా వస్తానని చాలా సందర్భాల్లో చెప్పానని అంబటి గుర్తుచేశారు. అరెస్ట్ చేయాలనుకున్నా పోలీస్స్టేషన్కు వచ్చి అరెస్ట్ అవుతానని స్పష్టం చేశారు. అర్ధరాత్రుళ్లు ఇళ్లకు రావడం ఏంటని నిలదీశారు. దొంగలు, రౌడీల్లాగా వ్యవహరించడంపై మండిపడ్డారు. తమాషాలు అనుకుంటున్నారని, గతంలో తాము కూడా రాష్ట్రాన్ని పరిపాలించామని, మంత్రిగా చేశానని గుర్తుచేశారు. చట్ట పరిధిలో విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు రెండు రోజులు ముందు వచ్చి నోటీసులు జారీ చేయవచ్చుగా అని ప్రశ్నించారు. మంగళవారం కలెక్టరేట్ సమీపాన టెంట్లను పోలీసులు కూల్చివేయడంపైనా మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్లు చెబుతున్నట్టు వింటున్న పోలీసులు తర్వాత ఇబ్బంది పడతారని హెచ్చరించారు. అనుమతిస్తే అన్నదాత తరఫున పోరాటం చేస్తామని, లేదంటే పోలీసులతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలీసుల పేరిట అణచివేత యత్నం సిగ్గుచేటు పట్నంబజారు: అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లకుండా పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమాకు ఆంక్షలు విధించారు. మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమానికి వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు జారీ చేశారు. 30 పోలీసు యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రదర్శనలు, నిరసనలు తెలిపేందుకు అనుమతి లేదని తెలిపారు. పాతగుంటూరు పోలీసులు మంగళదాస్నగర్లోని ఆమె నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. సానుకూలంగా స్పందించిన నూరిఫాతిమా పోలీసుల నుంచి నోటీసులు స్వీకరించారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మా ట్లాడుతూ.. రైతన్నల సమస్యలు పరిష్కరించలేని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై పోలీసులను అడ్డుపెట్టుకుని అణచివేత యత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రైతులు, ప్రజల పక్షాన ఎలాంటి సమస్యలు ఉన్నా పోరాడేందుకు ఏ మాత్రం వెనుకాడమన్నారు. అక్రమ కేసులు, నోటీసులు, అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి, వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు రెండు రోజులు ముందు వచ్చి నోటీసులు జారీ చేయవచ్చని వ్యాఖ్య ఇవ్వాలనుకుంటే స్టేషన్కు తామే వచ్చి తీసుకుంటామని స్పష్టీకరణ -
ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ నిరసన
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ ఆగ్రహించారు. మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లాల్ వజీర్ మాట్లాడుతూ ఉదయం 5 గంటలకు వాకింగ్ చేస్తున్న సమయంలో సిబ్బంది లైట్లు తీసేశారన్నారు. వర్షం కారణంగా స్టేడియం బురదగా ఉందన్నా పట్టించుకోలేదని తెలిపారు. ట్రాక్ పనులు పూర్తి చేయలేదన్నారు. మైక్ మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదని తెలిపారు. గ్రౌండ్ మెన్స్ కూడా లేరన్నారు. జిమ్లోని కొన్ని పరికరాలు ఎంతో కాలంగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేడియంలో ఆటలకు బదులు రాజకీయాలు నడుస్తున్నాయని సీనియర్ సభ్యులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఇక్కడి సభ్యులను కలుపుకొని బాస్కెట్ బాల్ కోర్ట్, స్కేటింగ్ రింక్, అత్యాధునిక పరికరాలతో జిమ్, స్టేడియం సుందరీకరణ వంటి అభివృద్ధి పనులు చేపట్టారు. తర్వాత ఒక్క కొత్త పని కూడా పూర్తి చేయలేదు. ఇటీవల నూతన కమిటీ ఎన్నికలు కూడా టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే రద్దయ్యాయి. కమిటీ వస్తే స్టేడి యం అభివృద్ధి చెందుతుందని భావించిన సభ్యుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. స్టేడియం నగరపాలక సంస్థకు చెందిన ఆస్తి. అంటే ప్రభుత్వానికి సొంతం. కొందరు వ్యక్తులు మాత్రం స్టేడియం తమదే అన్నట్లు వ్యవహరించడాన్ని పలువురు సభ్యులతోపాటు క్రీడాకారులు తప్పుబడుతున్నారు. ఇప్పటికై నా రాజకీయాలు ఆపి క్రీడలను ప్రోత్సహిస్తే మేలని ప్రజలు పేర్కొంటున్నారు. -
డాక్టర్ జగదీష్రెడ్డికి బంగారు పతకం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ న్యూరో సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉయ్యూరు జగదీష్రెడ్డికి గోల్డ్మెడల్ లభించింది. మంగళవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రొఫెసర్ ఎం.ఆర్.సి.నాయుడు గోల్డ్మెడల్, ప్రశంసా పత్రాన్ని డాక్టర్ జగదీష్రెడ్డి స్వీకరించారు. డాక్టర్ జగదీష్రెడ్డి గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో న్యూరో సర్జరీలో సూపర్స్పెషాలిటీ పీజీ అభ్యసించారు. పీజీ కోర్సులో యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినందుకు గోల్డ్ మెడల్ లభించింది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి, న్యూరో సర్జరీ వైద్య విభాగాధిపతి డాక్టర్ సత్యనారాయణమూర్తి, పలువురు న్యూరో సర్జన్లు ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. -
సీపీ రాధాకృష్ణన్కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రడ్డి అభినందనలు తెలియజేశారు. ‘ రాధాకృష్ణన్ జీ.. మీరు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు నా అభినందనలు. దేశానికి మీరు చేసే సేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ అంకితభావం, సుదీర్ఘ అనుభవం మన దేశానికి ఖచ్చితంగా మార్గనిర్దేశంగా పని చేస్తాయి అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. Congratulations Shri C. P. Radhakrishnan Ji on being elected as the Vice President of India!Wishing you all the success in your service to the Nation. Your dedication and experience will surely guide our country.@CPRGuv pic.twitter.com/QRJ8SUEixe— YS Jagan Mohan Reddy (@ysjagan) September 9, 2025 కాగా, ఉపరాష్ట్రపతి ఎంనిక కోసం ఈరోజు(మంగళవారం సెప్టెంబర్ 9వ తేదీ) జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు. సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి,. ఫలితంగా భారత 17వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 15 ఓట్లు చెల్లలేదు 98.2 శాతం పొలింగ్ నమోదైంది. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం, సెప్టెంబర్ 10వ తేదీ) ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం గం.11 కి వైఎస్ జగన్ ప్రెస్మీట్లో మాట్లాడనున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతుల సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ, వేల కోట్ల రూపాయిల విలువైన భూములను బినామీలకు దోచిపెట్టడం సహా అనే అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. -
‘అన్నదాతల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
తాడేపల్లి: అన్నదాతల ఆగ్రహంలో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,. కూటమి ప్రభుత్వంపై అన్నదాతలు మండిపోతున్నారని స్పష్టం చేశారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘రైతులకు ఉపయోగపడే ఒక మంచి పని కూడా చంద్రబాబు చేయలేదు. సమాజానికి అన్నం పెట్టే రైతన్న సంతోషంగా లేడు. రైతులు ఉసురు తగిలిన ప్రభుత్వాలు ఉండవు. కూటమి ప్రభుత్వం కుట్రలు, నోటీసులు రైతన్నలను ఆపలేవు. కూటమి ప్రభుత్వ సమీక్షలు ఎవరి ప్రయోజనాల కోసం?, లక్షలాది మంది రైతన్నలు రోడ్డెక్కారు. టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముకుంటున్నారు. అన్నదాత పోరు సక్సెస్ అయింది. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే. రాష్ట్రంలో 74 ప్రాంతాల్లో చేసిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. చంద్రబాబు రైతు వ్యతిరేకి. ఆయనకు రైతులంటే ఎప్పుడూ చిన్నచూపే. అందుకే వ్యవసాయం దండుగ అని నిస్సిగ్గుగా మాట్లాడారు. రోడ్డు మీదకు వస్తే రైతుల కష్టాలు కనడతాయి నిజంగా రైతులకు కష్టాలు లేకపోతే కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదు?, 4 సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఏనాడైనా రైతుల మేలు కోసం పని చేశారా?, ఈ 15 నెలుగా రాష్ట్రంలో ఏ పంట సాగు చేసిన రైతయినా ప్రశాంతంగా ఉన్నాడా?, చంద్రబాబు వలన రైతులకు రూపాయి ప్రయోజనం కూడా లేదు. గంటల తరపడి యూరియా కోసం నిత్యం క్యూలో నిలపడుతున్నా చంద్రబాబుకు కనపడటం లేదు. రైతులు ఏడ్చిన రాజ్యాలు ఏనాడూ నిలపడలేదు. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం. కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహంలో కొట్టుకుపోక తప్పదు. వైఎస్సార్ సీపీ నిరసనల ప్రకటన తర్వాతనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. యూరియా మొత్తం టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అన్నదాత పోరులో పాల్గొంటే కేసులు పెడతామని బెదిరిస్తారా?, అరెస్టులు చేస్తామని హెచ్చరిస్తారా?, ఇలాంటి బెదిరింపులను లెక్క చేయకుండా రైతులు రోడ్డు మీదకు వచ్చారు. ధర్మాన, రామసుబ్బారెడ్డి, జోగి రమేష్, జక్కంపూడి రాజా, పిన్నెళ్లి లాంటి అనేకమంది నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?, ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు ఏం చేయదలచుకున్నారు?, జగన్ హయాంలో ఏనాడైనా ఏ రైతైనా రోడ్డు ఎక్కాడా?, ఇప్పుడే ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది?, సమస్యలు రాకముందే జగన్ ముందుగానే పసిగట్టి పాలన చేశారు. అందుకే రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు పట్టించుకోనందునే రైతులు రోడ్ల మీద ఆందోళనకు దిగుతున్నారు. ఈరోజు 74 చోట్ల చేసిన నిరసనలు సక్సెస్ అయ్యాయి. రైతులు కదం తొక్కటం చూసి డీజీపి మాట మార్చారు. నిరసనలకు అనుమతి లేదని మొదట నోటీసులు ఇచ్చి మధ్యాహ్నం తర్వాత అనుమతులు ఇస్తున్నామని ఎందుకు ప్రకటించారు?, అంటే రైతుల ఆందోళనలు చూసి చంద్రబాబు ప్రభుత్వం భయపడింది’ అని పేర్కొన్నారు.కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత.. అధిక ధరలతో రైతన్నలను దగా చేయటాన్ని నిరసిస్తూ ‘అన్నదాత పోరు’ పేరుతో వైఎస్సార్ సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టాయి. వైఎస్సార్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి రాష్ట్రంలోని రైతులు కదం తొక్కారు. -
టూరిజం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్ జగన్ భరోసా
సాక్షి, తాడేపల్లి: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఆంధ్రప్రదేశ్-ఏఐటీయూసీ) ప్రతినిధుల బృందం మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసింది. కూటమి పాలనలో తాము పడుతున్న ఇబ్బందులు, బాధలను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఏపీ పర్యాటక అభివృద్ది సంస్ధలోని 22 హోటల్స్, రిసార్ట్స్లను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు వీలుగా ఇచ్చిన జీవో నెంబర్ 23 తీసుకొచ్చింది. దానిని అడ్డుకోవాలని కోరుతూ ప్రతినిధుల బృందం వైఎస్ జగన్కు ఓ వినతి పత్రం సమర్పించింది. ‘‘గత పాతికేళ్ళుగా టూరిజం సంస్ధలో కాంట్రాక్ట్ పద్దతిలో 504 మంది, ఔట్సోర్సింగ్లో 488 మంది ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ ఈ జీవోతో మాకు ఉద్యోగ భద్రత లేకుండా చేశారు. టూరిజం ఆస్తులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా మా కుటుంబాలు రోడ్డున పడతాయి’’ అని జగన్ వద్ద కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తన దృష్టికి వచ్చిన విషయాలను పరిశీలించిన వైఎస్ జగన్.. టూరిజం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషిచేస్తానని భరోసా ఇచ్చారు. -
రేపు నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం
తెనాలి: ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సం ఈనెల 10న ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు ఏర్పాటయే ప్రత్యేక సభకు సంస్థ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ విభాగ కార్యదర్శి నాగరాజు మద్దిరాలకు నాయుడమ్మ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రదానం చేయనున్నారు. కార్యక్రమంలో చైన్నెలోని సీఎల్ఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ స్వర్ణ వి.కాంత్, పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం పాల్గొంటారు. తెనాలి ముద్దుబిడ్డ తెనాలికి చెందిన విలక్షణ మహనీయుల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ ఒకరు. విదేశాల్లో ఉన్నతవిద్య చదువుకుని, అక్కడే ఉద్యోగావకాశం లభించినా, కాదనుకుని మాతృదేశం వచ్చారు. చైన్నెలోని కేంద్ర చర్మ పరిశోధన సంస్థ (సీఎల్ఆర్ఐ)లో శాస్త్రవేత్తగా చేరారు. తన కృషితో డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. తోలు పరిశ్రమ రంగంలో సాధించిన విజయాలతో 48 జాతీయ పరిశోధనాశాలలు, 30 వేల శాస్త్రవేత్తలు కలిగిన సీఎస్ఐఆర్కు డైరెక్టర్ జనరల్గా చేశారు. శాస్త్ర విజ్ఞాన అధ్యయనాలు, పరిశోధనలపై ఎంతో నిబద్ధత కలిగిన డాక్టర్ నాయుడమ్మ, దేశమంతా శాసీ్త్రయ అభినివేశం లోతుగా విస్తరించాలని తపించారు. హేతుబద్ధ చింతన, శాసీ్త్రయ వివేచనా, నిరంతరం అధ్యయనం, నిత్య పరిశోధన ఆయన జీవ ధాతువులు. సామాజిక విషయాల్లోనూ శాసీ్త్రయ అభినివేశాన్ని ప్రదర్శించటం నాయుడమ్మ ఆశయం. మూఢ విశ్వాసాల్నీ ముహూర్త బలాల్నీ వీడి, మనిషి చైతన్యం, వ్యక్తిత్వం వికసించే మానవీయ సమత వైపు అడుగిడటం ఆయన కర్పించే నిజమైన నివాళి. అలాగే ఆయన పేరిట అవార్డులకూ శాస్త్రవేత్తలనే ఎంపిక చేస్తే సబబుగా ఉంటుంది. -
ఎయిమ్స్లో ‘ఎస్పికాన్’ డిక్లరేషన్ ఆవిష్కరణ
మంగళగిరి: అనారోగ్యం, మరణాల ముప్పును ఎదుర్కొనేందుకు ఎస్పికాన్– 2025 డిక్లరేషన్ను మంగళగిరి ఎయిమ్స్ విడుదల చేయడం అభినందనీయమని మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ప్రొఫెసర్ ఆఫ్ ఎక్సెలెన్స్ న్యూఢిల్లీ డాక్టర్ అతుల్ గోయెల్ తెలిపారు. సోమవారం ఎయిమ్స్లో డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యాంటీ మైక్రోబయల్ స్టీవార్డ్షిప్ కోసం ఎయిమ్స్ మంగళగిరి డిక్లరేషన్ విడుదల చేసిందని వివరించారు. క్లినికల్ మైక్రోబయాలజీ , జనరల్ మెడిసిన్, క్లినికల్ ఫార్మకాలజీ విభాగాల సహకారంతో సొసైటీ ఫర్ యాంటీ మైక్రోబయల్ స్టీవార్డ్ షిప్ ప్రాక్టీషస్ ఇన్ ఇండియా(సెస్పీ) జాతీయ వార్షిక కాన్ఫ్రెన్స్ ఎస్పికాన్– 2025ని విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. భారతదేశం అంటు వ్యాధుల భారాన్ని ఎదుర్కుటోందని తెలిపారు. ఉష్ణమండల వాతావరణం, పరిశుభ్రత గురించిన అపోహలు వన్ హెల్త్ విధానానికి సవాళ్లు మరింత తీవ్రమయ్యాయని వివరించారు. మందులు ఓవర్ ది కౌంటర్(ఓటీసీ) లభ్యత కారణంగా సాధారణ బ్యాక్టీరియా వల్ల ఇప్పుడు అనేక ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని తెలిపారు. ఈ మప్పును ఎదుర్కునేందుకు ఎస్పికాన్–2 ల్యాండ్ మార్క్ ఎయిమ్స్ మంగళగిరి డిక్లరేషన్ విడుదల చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో ప్రొఫెసర్ డాక్టర్ అహంతేమ్ శాంత సింగ్, సెస్పీ అధ్యక్షురాలు డాక్టర్ సరితా మోహపాత్ర, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సుమిత్ రాయ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ దేబబ్రత దాష్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. పాండా, డీన్ డాక్టర్ డి. రామ్మోహన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నటరాజ్ పాల్గొన్నారు. -
చట్ట పరిధిలో ఫిర్యాదులకు పరిష్కారం
నగరంపాలెం: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం ప్రజా ఫిర్యాదులు– పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి బాధలను అలకించి, సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడారు. పోలీస్ శాఖ ద్వారా పరిష్కరించే ప్రతి ఫిర్యాదును బాధితులు తమ దృష్టికి తేవాలని కోరారు. అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరిస్తామని చెప్పారు. ప్రజల నుంచి జిల్లా ఏఎస్పీ జీవీ రమణమూర్తి (పరిపాలన), డీఎస్పీలు అబ్దుల్ అజీజ్ (గుంటూరు తూర్పు), శివాజీరాజు (సీసీఎస్), భానోదయ (దక్షిణ) అర్జీలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఏడాది కిందట ఇన్స్ర్ట్రాగామ్లో పరిచమయ్యాడు. కులాలు వేరైనా కుటుంబ సభ్యులకు తెలి యకుండా గతేడాది ఫిబ్రవరి 25న కాకినాడలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నాం. అక్కడే ఓ ఇంట్లో అద్దెకున్నాం. అయితే, భర్త బంధువు ఒకరూ టీడీపీ గ్రామ అధ్యక్షునిగా ఉన్నాడు. ఈ క్రమంలో మేమిద్దరం ఉండే చిరునామా గుర్తించి, పెదకాకాని పీఎస్లో హాజరుపరిచారు. మేజర్లు కావడంతో, మళ్లీ కాకినాడ వెళ్లి కాపురం చేసుకుంటున్నాం. భర్తకు, అతని సోదరికి బ్యాంక్లో జాయింట్ అకౌంట్ ఉందని, బంగారం విడిపించాలంటూ నంబూరు పిలిచారు. బ్యాంక్ పనులు పూర్తయ్యాక భర్తను బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను. కొద్ది రోజుల తర్వాత భర్త, అతని కుటుంబ సభ్యులు అసభ్యంగా, కులం పేరుతో నన్ను దూషించారు. అప్పటికే గర్భవతిగా ఉండగా, ఇష్టానుసారంగా మాట్లాడారు. అయితే, అప్పటి నుంచి భర్త ఆచూకీ తెలియలేదు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనంలేదు. ఇటీవల భర్త పల్నాడు జిల్లా నరసరావుపేట రెడ్డిపాలెం ఉంటున్నాడని తెలిసింది. అయితే, మరో యువతీతో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ఇన్స్ర్ట్రాగామ్లో ఫొటోలు చూశాను. కులం పేరుతో దూషించి చితకబాదిన వారిపై చర్యలు తీసుకోవాలి. వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని కోరుతున్నా. – పి.దీపిక, నంబూరు, పెదకాకాని మండలం -
చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన
లక్ష్మీపురం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద చెవిలో పూలు పెట్టుకుని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ పది మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నడపడం వల్ల మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్కు దూరమవుతారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 14 మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారని, వాటిలోరాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో గత విద్యా సంవత్సరంలో కళాశాలలు ప్రారంభమైనట్లు గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో భాగంగా ప్రతి మెడికల్ కళాశాలను 100శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి ఈరోజు కళాశాలలను కార్పొరేట్లకు అప్పజెబుతున్నారని ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫణీంద్ర మాట్లాడుతూ ఈ విధానం వల్ల పేద మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య కలగానే మిగిలిపోతుందని తెలిపారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ 77 రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో మోసాన్ని విద్యార్థుల్లోకి తీసుకువెళ్లి పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు . కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గండు శివ, బందారపు యశ్వంత్, నగర కార్యదర్శి ప్రణీత్, నాయకులు అజయ్, దుర్గా ప్రసాద్, సాయి గణేష్, పవన్, వెంకీ పాల్గొన్నారు. -
వృద్ధ మహిళను ఇంటి నుంచి గెంటేశారు
నగరంపాలెం: ఇంట్లోంచి బయటకు పంపించడంతో ఓ వృద్ధురాలు ఆరుబయట చీకట్లోనే ఉండిపోయింది. ఆర్టీసీ కాలనీ వెంకట్రావుపేట రెండో వీధిలోని ఓ ఇంట్లో 62 ఏళ్ల సంగీత సుధ ఉంటోంది. పైన ఆమెకు తెలిసిన కుటుంబ సభ్యులు ఉంటున్నారు. సోమవారం రాత్రి ఆస్తి విషయంపై సుధతో వారు గొడవకు దిగారు. ఇంట్లోంచి బలవంతంగా ఆమెను బయటకు పంపేశారు. లోపలకు రాకుండా గేటుకు లోపల తాళాలు వేశారు. దీంతో చేసేది లేక సుధ ఇంటి ఎదుట ఓ కుర్చీలో కూర్చుండి పోయింది. ఇంటి ఆస్తికి సంబంధించి గొడవ కోర్టులో ఉందని, ఆస్తితో సంబంధం లేని వారు ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయింది. స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయినట్లు తెలిపింది. -
అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ వద్దు !
కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకూడదని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఎంఓ నుంచి అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. తమ శాఖకు వస్తున్న అర్జీల పరిష్కారంపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని తెలిపారు. అర్జీల పరిష్కారంపై ప్రజల్లో సంతృప్తి స్థాయి శాతం తగ్గుతుందని, వాటిని పెంచేలా అధికారులు కృషి చేయాలని ఆమె చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించి నిర్ణీత సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. అనంతరం వచ్చిన 276 అర్జీలను డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ ఓ. శ్రీనివాసరావు , డెప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీకుమారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్, జిల్లా అధికారులు పరిశీలించారు. పట్టణంలోని 1వ డివిజన్లోని నారా భువనేశ్వరి కాలనీ ( పందుల కాలనీ)లో 30 సంవత్సరాల నుంచి నివాస ఉంటున్నారు. పందులను పెంచుకుని జీవనం పొందడమే వారి ప్రధాన వృత్తి. ఇక్కడ ఇప్పటి వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. మౌలిక సదుపాయాల కల్పన కూడా లేదు. – పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ, నవ్యాంద్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాది తెనాలి మండలం చిన్న రావూరు డొంక. ఫిబ్రవరిలో మా కాలనీలోని యానాది కులానికి చెందిన ముగ్గురు పెదకాకాని గోశాలలో పనికి వెళ్లి విద్యుత్ షాక్తో మరణించారు. కలెక్టర్తోపాటు ఆర్డీఓ బాధిత కుటుంబాలకు ఉద్యోగంతో పాటు ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిరిగినా స్పదించడం లేదు. – బాధిత కుటుంబ సభ్యులు తురకపాలెంలో మూడు నెలల్లోనే 30 మంది అకాల మరణాలకు పాల్పడ్డారు. ఇంత జరుగున్నా ప్రభుత్వం ఏం చేస్తుంది.. ముందే జాగ్రత్తపడాలి కదా ! అధికారులు కనీసం తమ శాఖలపై సమీక్షలు కూడా జరపడం లేదు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షలతోపాటు మరణించిన వారి కుటుంబాలకు వితంతు, ప్రత్యేక పెన్షన్లు అందించాలి. గ్రామానికి ప్రస్తుతం అందుతున్న మంచినీటి సౌకర్యం ఏ మాత్రం సరిపోవడం లేదు. దీన్ని పెంచాలి. గ్రామంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వైద్యుల నియామకంతో పాటు మందులను అందుబాటులో ఉంచాలి. మరణాలపై న్యాయ విచారణ జరపాలి. – సీపీఎం జిల్లా నాయకులు -
భర్త వేధింపుల నుంచి రక్షించండి !
గుంటూరు: వారసత్వంగా రానున్న పొలం కాగితాలు రాయించుకుని తేవాలంటూ భర్త, బావ అయిన ఈనాడు విలేకరి (గుంటూరు జిల్లా ప్రత్తిపాడు)తో పాటు అత్త, మామల నుంచి రక్షణ కల్పించాలని ఓ మహిళ, తన కుమార్తెతో కలసి ప్రాథేయపడింది. గత నాలుగు రోజులుగా కనిపించకుండా బంధువుల ఇళ్లల్లో ఉంటున్నట్లు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన ప్రజా ఫిర్యాదులు– పరిష్కార వేదికలో మొరపెట్టుకుంది. అనంతరం బాధితురాలైన కల్లూరి నాగేశ్వరి మీడియాతో మాట్లాడారు. 2009లో ప్రత్తిపాడుకి చెందిన కల్లూరి గురునాథంతో పెళ్లి అయ్యింది. ఇద్దరు ఆడ పిల్లలు. పెద్దమ్మాయి గుంటూరు బ్రాడీపేటలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, రెండో కుమార్తె ఏడో తరగతి చదువుతోంది. భర్త, నేను పొలం పనులకు వెళ్తాం. భర్తకు మద్యం అలవాటు ఉంది. అయితే మా అమ్మమ్మ చెవినేని ఈశ్వరమ్మ నుంచి తల్లి ఆదిలక్ష్మి వాటా కింద రావాల్సిన 70 సెంట్ల పొలం ప్రత్తిపాడులో ఉంది. ప్రస్తుతం దాని ధర రూ.20 లక్షలు ఉంది. నేను పుట్టిన తరువాత అమ్మ చనిపోయింది. అప్పట్లో నాన్న సంజీవరావు మరొకర్ని పెళ్లి చేసుకున్నాడు. అమ్మమ్మ ఈశ్వరమ్మ వద్దకెళ్లి 70 సెంట్ల పొలం రాయించుకుని కాగితాలు తేవాలంటూ భర్త, బావ అయిన ఈనాడు ప్రత్తిపాడు విలేఖరి సురేష్, అత్త, మామలు బెదిరిస్తున్నారు. అమ్మమ్మ నుంచి కాగితాలు తీసుకురాకపోతే చంపుతామంటూ చితకబాదడం, గదిలో నిర్బంధిస్తున్నారు. ఈనెల ఐదున నన్ను కొట్టి, తెల్ల కాగితాలు, రూ.50 స్టాంప్ కాగితాలపై సంతకాలు పెట్టించాలని ప్రయత్నించగా అందుకు నిరాకరించాను. దీంతో చెంపలపై కొట్టగా, వారి నుంచి తప్పించుకున్నాను. గతంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా, అతని పలుకబడితో కేసు నమోదు చేయలేదు. అదిగాక ఎమ్మెల్యే రామాంజనేయులు, రాజకీయ నాయకులు, పోలీసులు తెలుసంటూ బెదిరిస్తున్నారు. ఆఖరికి గుంటూరులో చదువుతున్న కుమార్తెను చూడాలన్నా విలేకరి అయిన బావ అనుమతి తప్పనిసరి అని బాధితురాలు నాగేశ్వరి వాపోయింది. డీపీఓలో కూడా న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణమని ఆందోళన వ్యక్తం చేసింది. -
రైతుల సమస్యలపై కూటమి నిర్లక్ష్యం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలో రైతుల అవసరాలకు తగినంత యూరియా అందుబాటులో ఉందంటూ అధికారులు లెక్కలు వేసి మరీ చెబుతున్నా అవస్థలు తప్పడం లేదు. రైతు సేవా కేంద్రాలు, గిడ్డంగుల వద్ద పడిగాపులు పడుతూనే ఉన్నారు. డిమాండ్కు సరిపడా స్టాక్ క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో కర్షకులు అగచాట్లు పడుతున్నారు. స్టాక్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు నో స్టాక్ అంటారోనని సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారు. రైతుల ఆవసరాలను అడ్డం పెట్టుకుని కొందరు వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ దోచుకుంటున్నారు.రాజకీయ పలుకుబడి ఉంటేనే ఎరువులుఎరువులకు రాజకీయ గ్రహణం పట్టింది. యూరియాకు సైతం రాజకీయ పలుకుబడి కావాల్సిన దుస్థితి గ్రామాల్లో చోటు చేసుకుంది. ఎరువుల బస్తాలు తమకు అనుకూలమైన వారికే ఇవ్వాలంటూ ఆయా గ్రామాల్లోని ఆర్ఎస్కే సిబ్బందిపై స్థానిక కూటమి నాయకులు కర్ర పెత్తనం చేస్తుండటంతో కర్షకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరి సాగు చేసిన పలువురికి యూరియా కట్టలు సకాలంలో అందని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్ఎస్కే సిబ్బంది కూడా కూటమి నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోతున్నారు. ఓ వర్గం రైతులకే యూరియా కట్టలు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో స్టాక్ వచ్చిన గంటల వ్యవధిలోనే ఆర్ఎస్కే సిబ్బంది నో స్టాక్ అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక, బయట మార్కెట్లో దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.కాగితాల మీద భారీగా లెక్కలుజిల్లాలో ఖరీఫ్ సీజన్కు 24,012 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటి వరకు 22,384.4 మెట్రిక్ టన్నులను సరఫరా చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ చిల్లర, టోకు వర్తకులతో పాటు మార్క్ఫెడ్ల వద్ద మరో 2,739.85 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచినట్లు చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో 4,100 మెట్రిక్ టన్నులు జిల్లాకు రానుందని, ఈ నెల చివరిలోగా మరో 6,100 మెట్రిక్ టన్నులు వస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు.అరకొరగా పంపిణీతెనాలి నియోజకవర్గంలో యూరియా కష్టాలు తీరడం లేదు. రైతుకు అవసరం ఉన్నంత మేరకు ఇవ్వలేకపోతున్నారు. తెనాలి మండలానికి సంబంధింది 185 మెట్రిక్ టన్నులు, కొల్లిపర మండలంలో 80 టన్నుల యూరియా ఉంది. రోజుకు 50 మంది రైతులకు స్లిప్పులు ఇచ్చి అరకొరగా పంపిణీ చేస్తున్నారు. అదేమంటే రేపు మరికొంత వస్తుందని చెబుతున్నారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన రైతులు అవస్థలు పడుతున్నారు. పొరుగున ఉన్న వేమూరు నియోజకవర్గానికి చెందిన రైతులు కూడా ఇక్కడకు వస్తున్నారు. ప్రైవేటు దుకాణాల్లో యూరియా అమ్మడం లేదు. కంపెనీలు అధిక రేటు వసూలు చేయడం, ప్రతి కట్టకు ఒక నానో కట్ట తీసుకోవాలనే షరతులతో ప్రైవేటు ఎరువుల షాపుల వాళ్లు అసలు తీసుకోవడం లేదు. దీంతో ఆయా షాపుల్లో అమ్మకాలు లేవు. ప్రభుత్వ సొసైటీల పైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. కొల్లిపర మండలంలోనే ప్రైవేటు దుకాణాల్లో అమ్మకాలు లేవు. తెనాలిలో ప్రైవేట్ ఎరువుల దుకాణాలు కూడా సరిగా సప్లై చేయడం లేదు. దీంతో ఎరువుల కొట్ల బజార్లో దుకాణాలు వద్ద రైతులు ఎదురుచూస్తున్నారుపచ్చ నేతల దారి మళ్లింపుపొన్నూరు నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలు, మార్కెట్ యార్డులు, రైతు సేవా కేంద్రాల వద్ద తెల్లవారుజామున 4 గంటల నుంచే పడిగాపులు కాస్తున్నా లభించని పరిస్థితి నెలకొంది. వచ్చిన యూరియాను కొంతమందికే ఇచ్చి మిగతావి పచ్చ నేతలు దారి మళ్లిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సొసైటీలకు రాత్రి వేళ లారీల్లో వచ్చిన యూరియాను దిగుమతి చేసే సమయంలో కరెంట్ తీసి వంద కట్టలకు పైగా పక్కదారి పట్టించారని రైతులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారుల పనితీరుపై రైతులు మండిపడుతున్నారు.బస్తాకు రూ. వంద అదనంగా వసూలుతాడికొండ నియోజకవర్గంలో రైతులకు యూరియా దొరకడం లేదు. ప్రైవేటు దుకాణాల్లో బస్తాకు రూ. వంద అదనంగా వసూలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులే గతంలో వచ్చిన యూరియా బస్తాలను నిల్వ చేసుకుని బ్లాక్లో అమ్ముకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. యూరియా బస్తాతో పాటు నానో యూరియా కొనాల్సిందేనని డిమాండ్ పెడుతున్నారు.నేడు అన్నదాత పోరుఅన్నదాతల యూరియా కష్టాలపై వైఎస్సార్ సీపీ మంగళవారం జిల్లాలోని అన్ని ఆర్డీవో కార్యాలయాలవద్ధ నిరసన చేపట్టనుంది. కార్యక్రమంలో పార్టీ శ్రేణులతోపాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొననున్నారు. గుంటూరు, తెనాలి ఆర్డీవో కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.తెల్లవారుజాము నుంచే..పొన్నూరు మార్కెట్ యార్డులో తెల్లవారుజాము నుంచే వందల సంఖ్యలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. అనేక సొసైటీలు, ఆర్ఎస్ కేంద్రాల్లో ఇదే దుస్థితి. సామాన్య రైతులకు పక్కన బెడుతూ, సొసైటీల్లో పరపతి ఉన్న వారికే అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో యూరియా అందిన రైతుల నుంచి అరువు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్ డీలర్లు అధిక ధరలకు విక్రయించడంతో పాటు పురుగు మందులు కూడా తీసుకోవాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. సాగుకు యూరియా అందించలేని కూటమి ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. -
మైనార్టీలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
గుంటూరు వెస్ట్: ఎన్నికల సమయంలో మైనార్టీలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాధారుణంగా మోసం చేసిన కూటమి ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటుందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్ తెలిపారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇమామ్లు, మౌజన్లకు ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ. 5000, రూ.10 వేలు చెల్లించారని, కూటిమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మరచిపోయిందని పేర్కొన్నారు. దీంతోపాటు మసీదుల మరమ్మతులకు ఇస్తామన్న రూ.లక్ష కూడా ఇవ్వలేదని తెలిపారు. నెల వారీ వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తమ కాలనీలకు వచ్చిన టీడీపీ శాసన సభ్యులు కనీసం సమస్యలపై స్పందించకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందని తెలిపారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సైదాఖాన్ -
బకాయిల విడుదలకు ఏపీటీఎఫ్ ‘నిరసన వారం’
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ చేపట్టిన ‘నిరసన వారం’ ఉద్యమ కార్యాచరణ విజయవంతం చేయాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ఎదుట ఉన్న సంఘ జిల్లా శాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 15నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని తెలిపారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పటం లేదని, 30శాతం ఐఆర్పై కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. సరెండర్ లీవ్ బకాయిలను చెల్లించకపోవడంతో ఉపాధ్యాయుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని తెలిపారు. అనవసరమైన యాప్స్ రద్దు చేయక పోగా పనిభారం పెంచే అస్సెస్మెంట్ బుక్లెట్స్ పెట్టడం పుండు మీద కారం చల్లినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను ఉపసంహరిచుకోవాలని మొర పెట్టుకునేందుకు విద్యాశాఖా మంత్రి అందుబాటులో లేకపోవడం అత్యంత బాధాకరమని తెలిపారు. 15 నెలలు వేచి చూశామని, అన్ని బకాయిలు వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులు రోజుకొక ఉద్యమ కార్యాచరణ నిరసన వారం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్, ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, పి.లక్ష్మీనారాయణ, సత్యనారాయణమూర్తి, జి.దాస్, ముని నాయక్, షుకూర్, గురుమూర్తి, కృష్ణారావు, సుబ్బారావు, రాజ్ పాల్గొన్నారు. -
Annadata Poru: గతంలో ఇలాంటి పరిస్థితి కనిపించిందా?
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (9వ తేదీన) రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ ఎరువుల బ్లాక్ మార్కెట్పై 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రం లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు, రైతుసంఘాలు శాంతియుత ఆందోళనలు నిర్వహించనున్నాయి. అనంతరం అధికారులకు వినతిపత్రాలను సమర్పిస్తాయి. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. బస్తా యూరియా కోసం గంటల తరబడి రైతులు ప్రైవేటు దుకాణాలు, ఆర్బీకేలు, పీఎసీఎస్ల ముందు వేచి ఉండాల్సిన దుస్థితి సర్వత్రా కనిపిస్తోంది. మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లోనే యరియా పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్కు చేరుతోంది. నల్లబజార్లో రూ.200 అధికంగా చెల్లిస్తే తప్ప యూరియా లభించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని పురుగుమందులు కొనుగోలు చేస్తేనే ఎరువులు విక్రయిస్తామంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కృత్రిమంగా సృష్టించిన యూరియా కొరతను అడ్డం పెట్టుకుని కూటమి పార్టీలకు చెందిన పెద్దలే యూరియాను నల్లబజార్కు తరలిస్తూ, కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క యూరియా ద్వారానే దాదాపు రూ.200 కోట్ల మేరకు అక్రమంగా రైతుల నుంచి కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఇప్పటికే వైఎస్సార్సీపీ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి రుజువుగా పలుచోట్ల యూరియా అక్రమంగా తరలిస్తుండటం, రైతులే దానిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా కనీసం కారకులైన వారిపై ఎటువంటి చర్యలు లేవు. కృష్ణాజిల్లాలో పట్టుబడిన యూరియాను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్లోనే మార్చేసిన ఘటనలు ఈ ప్రభుత్వ నిర్వాకాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వం స్పందించి రైతాంగ డిమాండ్లపై దిగి వచ్చేలా అన్నదాత పోరును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టి ఎమ్మార్పీ ధరలకే రైతులందరికీ సక్రమంగా పంపిణీ చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించాలి. టమాట, ఉల్లి, చీనీ, బొప్పాయితో పాటు రైతులు పండించే అన్ని పంటలకు మద్దతు ధర చెల్లించాలి. గత వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మార్కెట్లో పోటీ పెంచాలి. ప్రైవేటు వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు ఒప్పించి రైతులకు అండగా నిలబడాలి. తదితర రైతాంగ డిమాండ్లపై బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరును ముందకు తీసుకువెళుతున్నారు. ఇప్పటికే దీనిపై రైతుల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఈనెల 6న తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే 7వ తేదీన అన్ని నియోజకర్గ కేంద్రాల్లోనూ, 8న అన్ని మండల కేంద్రాల్లోనూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు.యూరియా సమస్యతో రైతులు సతమతం అవుతుంటే సీఎం చంద్రబాబు స్పందించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించిన తీరు, బెదిరిస్తూ మాట్లాడటం, సమస్యే లేదని చెప్పడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతగా క్యూలైన్లు ఉన్నా కూడా రైతుల్ని బెదిరించేలా మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. అసలు రాష్ట్రంలో సమస్యే లేదని దబాయించి మాట్లాడుతున్న వైనంపై సమస్య లేదని, వైఎస్సార్ సీపీ సమస్య క్రియేట్ చేస్తోందన్నట్లు రైతు సమస్యలను కూడా రాజకీయం చేస్తున్న కూటమి సర్కార్పై రైతుల్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. మరోవైపు ఈ సీజన్లో కేవలం అరవై శాతం మాత్రమే పంటలు సాగవుతుంటే, ఇంతగా యూరియా కొరత ఎలా ఏర్పడిందనే దానిపై ప్రభుత్వంలోనే సరైన సమాధానం లేదు. సీజన్కు సంబంధించి ముందుగా పంటల సాగు, ఎరువుల అవసరంపై ఎందుకు ప్రణాళికలను సిద్దం చేసుకోలేకపోయారు, ముందస్తుగా సమీక్షా సమావేశాలను నిర్వహించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.ప్రభుత్వంలో కలవరం!అన్నదాత పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ వైఎస్సార్సీపీ ఆందోళనలకు సిద్దం కావడంతో కూటమి సర్కార్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే రైతుల విషయంలో ఇదొక విఫల ప్రభుత్వం, పాలన చేతగాని ప్రభుత్వంగా ప్రజల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటోంది. కూటమి పాలనకు ముందు.. గత అయిదేళ్ళ వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో రైతులు పోల్చి చూస్తున్నారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయడం, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇన్పుట్ సబ్సిడీనీ సకాలంలో అందించడం, సీజన్ ప్రారంభంలోనే అవసరమైన మేరకు ఆర్బీకేలు, పీఎసీఎస్ల ద్వారా ఎరువులను రైతు ముంగిట్లోనే అందుబాటులో ఉంచడం, రైతుభరోసా ద్వారా పెట్టుబడి సాయానిన్ని అందించడం ద్వారా అప్పుల పాలు కాకుండా రైతులకు అండగా నిలవడం, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన అన్ని రకాల పంటలకు మార్కెట్లో ధరలు లేని సమయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేయడం ఇలా అనేక అంశాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మంచిని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఉల్లి, మినుము, చీనీ, అరటి తదితర పంటలకు మార్కెట్లో రేటు లేని పరిస్థితుల్లో రైతులను పట్టించుకోకుండా వదిలేసిన కూటమి సర్కార్ నిర్వాకాన్ని రైతులు పోల్చి చూస్తున్నారు. వైఎస్సార్సీపీతో కలిసి తమ ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వానికి చూపించేందుకు అన్నదాత పోరులో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొనేందుకు సిద్దమైంది.రైతులకు అండగా వైఎస్సార్సీపీ.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్అన్నదాత పోరు కార్యక్రమంతో.. రైతుల సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీత సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తడం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనం నుంచి విక్రయం ద్వారా అడుగడుగునా అండగా నిలబడ్డ జగన్ ప్రభుత్వంగత 15 నెలల పాలనలోనే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న కూటమి. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం దాకా రైతులు పడిగాపులు పడ్డా ఉత్త చేతులేరైతులకు పార్టీ ముద్ర వేస్తూ.. యూరియా కొరత లేదని చెబుతున్న చంద్రబాబు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడిన రైతులను హేళన చేస్తున్న వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్సీపీ హయాంలో ఎక్కడా ఆర్బీకే సెంటర్ల ముందు క్యూలైన్లు కనిపించిన ఫొటో ఒక్కటైనా చూపించగలరా?ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు -
‘చంద్రబాబు మద్యం విధానానికి మేం వ్యతిరేకం’
తాడేపల్లి: చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోవడానికి తమకు భయం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. చంద్రబాబుకు సిట్ అనేది జేబు సంస్థగా మారిపోయిందని విమర్శించారు. ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 8వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్.. ‘ చంద్రబాబు మద్యం విధానానికి మేం వ్యతిరేకం. చంద్రబాబు హయాంలో మంచి నీళ్లు దొరకవు. మద్యం దొరుకుతుంది. చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానాకి లిక్కర్ కేసు పెట్టారు. ఇది కుట్ర పూరిత లిక్కర్ కేసు. లేని అభూతకల్పనను సృష్టించి జగన్కి సన్నిహితులుగా ఉన్నవాళ్లను, ప్రభుత్వంలో పనిచేసిన వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు.. చంద్రబాబు, లోకేష్ ఆడిస్తున్న కట్టు కధ లిక్కర్ కేసు. ఏం లేదు కాబట్టే నెమ్మదిగా ఎదుర్కొంటున్నాం..అమాయకులు అయిన వారితో స్టేట్మెంట్స్ ఇప్పించి మద్యం కేసుల్లో ఇరికిస్తున్నారు. వాసుదేవరెడ్డి కూడా చంద్రబాబు కుట్రలో పడ్డారు. చంద్రబాబుకు అనుకులంగా వాగ్మూలం ఇచ్చారు కాబట్టే కేంద్ర సర్వీస్లోకి పంపారు. సిట్ దర్యాప్తు లోప భూయిష్టంగా మారిపోయింది. ఎందుకు సిట్ చంద్రబాబు నాయుడుకి జేబు సంస్ధగా మారిపోయింది?, 90 రోజులు పాటు చిత్ర హింసలకు గురిచేశారు. డ్రోన్ కెమెరాలు పెట్టి ఇబ్బందులు పెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాకా బెల్ట్ షాపులను లేకుండా చేశారు. మద్యాన్ని తాగుతున్న వాళ్లను కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వమే అమ్మింది. ధర పెంచింది. మద్యా న్ని అందని ద్రాక్షగా జగన్ చేస్తే.. చంద్రబాబు చదువును, ఉపాధిని అందని ద్రాక్షగా చేశారుఉ. కిల్లీ షాపుల్లో కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. టీనిపై టీడీపీ సవాల్కి సిద్ధం. గత ప్రభుత్వ హయంలో డిస్కరీలు అన్నింటికి చంద్రబాబు పర్మిషన్లు ఇచ్చినవే.. చర్చకు సిద్దం. కోర్టు అడిగినా ప్రభుత్వానికి సిగ్గులేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బ్యారెక్ మొత్తం ఇచ్చాం. దోమలు కుడుతున్నాయని ఒకసారి, డెంగ్యూ అని ఒకసారి , దద్దుర్లు వస్తున్నాయని బెయిల్ కావాలని అడిగారు. అన్ని రోగాలకు బెయిల్ మందు అని చంద్రబాబు అడిగారు. రాజమండ్రి నుండి భారీ ర్యాలీ చేశారు. ఇన్ని రోగాలు ఉన్నవాడు ర్యాలీ చేస్తారా?, ఎంతమందిని అరెస్ట్ చేసినా రాష్ట్ర ప్రజలకోసం జగన్ చేసే యుద్దన్ని ఒక్క క్షణం కూడా ఆపలేరు. ప్రజల తరపున జగన్ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. చంద్రబాబుకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా?, ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది.. న్యాయం నిలబడుతుంది.. వంద మద్యం కేసులు పెట్టినా మా గుండె ధైర్యాన్ని తగ్గించలేరు’ అని టీజేఆర్ స్పష్టం చేశారు. -
టీడీపీ నేత ఫరీద్ సలీం వైఎస్పార్ సీపీలో చేరిక
మేడికొండూరు: మండలంలోని తురకపాలెం గ్రామానికి చెందిన మొదటి వార్డు మెంబర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు షేక్ ఫరీద్ వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ లో చేరారు. ఆదివారం పేరిచర్లలో జరిగిన కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఫరీద్ సలీం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సరైన గుర్తింపు లేకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటానికి ఆకర్షితుడైనట్లు చెప్పారు. భవిష్యత్తులో గ్రామ ప్రజల అభివృద్ధి కోసం వైఎస్సార్ సీపీ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు. వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ ‘గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం రోజు రోజుకీ పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఫరీద్ లాంటి యువ నాయకులు చేరడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొన్నారు. -
రైతులకు అండగా ‘అన్నదాత పోరు’
● రైతుల యూరియా కష్టాలపై రేపు తెనాలిలో నిరసన ● తెనాలిలో పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ● మంగళగిరిలో ఆవిష్కరించిన సమన్వయకర్త వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు తెనాలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9న రైతులకు అండదండగా ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. ఆర్డీవో కార్యాలయాల వరకు ప్రదర్శనగా వెళ్లి, రైతులకు తగినంత యూరియాను అందించాలనే డిమాండ్తో వినతిపత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నాయకులతో కలిసి అన్నదాత పోరుబాట పోస్టరును శివకుమార్ ఆవిష్కరించారు. అక్కడే విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యతలతో సతమతమవుతున్నట్టు గుర్తు చేశారు. ప్రధానంగా యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతులను అన్నివిధాల నష్టపరుస్తూ, కనీసం యూరియాను కూడా అందించలేని అసమర్థంగా ఉందని విమర్శించారు. ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం బారులు తీరిన దృశ్యాలు రోజూ మీడియాలో కనిపిస్తున్నాయని తెలిపారు. ఈనెల 9వ తేదీన ఉదయం రామలింగేశ్వరపేటలోని ఏ 1 కన్వెన్షను హాలు నుంచి ప్రదర్శనగా సబ్కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి, అక్కడ యూరియాను అందించాలన్న డిమాండ్తో వినతిపత్రం అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీలు పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. ముఖ్యంగా రైతులు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దేసు శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కొల్లిపర మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజిరెడ్డి, షేక్ గోల్డ్ రహిమ, గుంటూరు కోటేశ్వరరావు, తాడిబోయిన రమేష్, కటారి హరీష్, కొడాలి క్రాంతి, మల్లెబోయిన రాము, పెదలంక వెంకటేశ్వరరావు, అమర్తలూరు సీమోను, షేక్ దుబాయ్ బాబు, దూరు రత్నబాబు, కుదరవల్లి శంకరరావు, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని నిర్వీరం చేయడమే చంద్రబాబు లక్ష్యం మంగళగిరి: వ్యవసాయ రంగాన్ని నిర్వీరం చేసి కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ధ్వజమెత్తారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట కల వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం అన్నదాత పోరు వాల్ పోస్టర్లును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు గతంలో వ్యవసాయం దండగ అని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పడు వరి సాగు చేయవద్దని మరోసారి తన మనస్సులోని మాటను బయటపెట్టారన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ను ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెనాలిలో జరిగే అన్నదాత పోరుబాట కార్యక్రమంలో నియోజకవర్గ రైతులతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసి, ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ రైతులు యూరియా, ఎరువులు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు బందాపు రుక్మాంగరెడ్డి, మంగళగిరి పట్టణ, రూరల్, తాడేపల్లి పట్టణ, రూరల్, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ, బుర్రముక్క వేణుగోపాలస్వామిరెడ్డి, అమరా నాగయ్య, తాడిబోయిన శివగోపయ్య, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు దుర్గానాయక్, సోషల్ మీడియా విభాగ అధ్యక్షుడు భీమిరెడ్డి శరణ్కుమార్ రెడ్డి, జిల్లా యాక్టివ్ సభ్యురాలు మల్లవరపు సుధారాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, నాయకులు జంగా నాగిరెడ్డి, ఊట్ల పాలశ్రీనివాసరావు, ధనుంజయ్, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంలో రైతు పరిస్థితి దయనీయం
గుంటూరు రూరల్: కూటమి ప్రభుత్వంలో రైతు పరిస్థితి దయనీయంగా మారిందని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ తెలిపారు. ఆదివారం మండలంలోని ఏటుకూరు బైపాస్రోడ్డులో గల నియోజకవర్గ కార్యాలయంలో అన్నదాత పోరు కార్యక్రమ పోస్టర్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బలసాని మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులను బ్లాక్ మార్కెట్ ద్వారా పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉండగా రైతులు రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు విత్తనాలు సకాలంలో అందుకుని ఎంతో సంతోషంగా ఉండేవారని తెలిపారు. పొగాకు, ఉల్లి, మామిడి రైతుల కష్టాలను చూడకుండా చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్లు ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులకోసం చేపడుతున్న ఉద్యమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రైతులకు అండగా నిలవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
అన్నదాత సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
మేడికొండూరు: అన్నదాత సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు విమర్శించారు. ఎన్నికల సమయంలో కూటమి అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. ఆదివారం పేరేచర్ల సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని, నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేద ని పేర్కొన్నారు. ఈ – క్రాప్ నమోదు చేసిన రైతుల పంటల బీమా ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని తెలిపారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నేడు దాన్ని నిరూపిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిల్చుంటే వ్యవసాయ శాఖ మంత్రి రైతులు బఫే భోజనం కోసం నిలుచున్నట్లు ఉన్నా రని ఎద్దేవా చేయడం దుర్మార్గమని ఖండించారు. రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని తెలిపారు. మార్క్ఫెడ్ల ద్వారా యూరియా సరఫరా చేయాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గం రైతు విభాగ అధ్యక్షుడు మల్లంపాటి రాఘవరెడ్డి, మండల అధ్యక్షుడు తాళ్లూరి వంశీకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి షేక్ మ స్తాన్ వలి, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ రబ్బాని. ఎంపీటీసీ సభ్యులు వల్లెపు శ్రీను, షేక్ బాజీ, మల్లిపెద్ది లక్ష్మీనారాయణ, బొడ్డు పెద్ద సాంబయ్య, ముత్యాల బాలస్వామి, గండికోట రసూలు, కోకా అర్జున్ రా వు, నాసరవల్లి అబ్బాస్, పార్టీ పేరేచర్ల గ్రామ అధ్యక్షులు షేక్ సుభాని, రాఘవరావు, ఉడతా శ్రీనివాసరావు, కిశోర్ రెడ్డి, గొంది రవి, షేక్ బుడే, దండసూరి నారాయణరెడ్డి, కొరివి చెన్నయ్య, అల్లు శ్రీనివాస్ రెడ్డి, భవనం రాజశేఖర్ రెడ్డి, మిరియాల శివరామకృష్ణ, లూర్దు రాజు, నోసిన కోటి, రావిపాటి విజయ చందర్రావు, షేక్ జిలాని, ఆలూరి శ్రీను పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు -
శాసీ్త్రయ సమాజం కోసం పనిచేయాలి
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మంగళగిరిటౌన్: శాసీ్త్రయ సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. నగర పరిధిలోని ఎస్ఎల్ఎం చైతన్య హై స్కూల్లో ఆదివారం జనవిజ్ఞాన వేదిక జిల్లా 18వ మహాసభలు నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలను కూడా మార్చివేస్తున్నారని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సినిమాల్లో మతానికి సంబంధించిన అంశాలను మాట్లాడడం సరికాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు 80 శాతం పైగా చదువుకుంటున్నారని, అలాంటి పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు పాలకులు చూస్తున్నారని విమర్శించారు. ఇటీవల ఉత్తమ అవార్డు పొందిన ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులుగా కేఎస్ లక్ష్మణరావు, టి.రత్నారావు, డాక్టర్ ఏఎస్వీఎన్ ప్రసాద్, ప్రొఫెసర్ వేణుగోపాలరావు, అధ్యక్షుడిగా ఉదయ భాస్కర్, ఉపాధ్యక్షులుగా డి.ప్రసాద్, రమేష్, స్వాతి, అహమ్మద్ హుస్సేన్, కోశాధికారిగా రామారావు, ప్రధాన కార్యదర్శిగా జాన్బాబు, కార్యదర్శులుగా రాము, ప్రసాద్, వెంకటేశ్వరరావు, భాస్కరరావు, అనీల్కుమార్, గోకుల్ చంద్ ఎన్నికయ్యారు. -
రైతులను ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేక చతికిలపడిందని..ముఖ్యంగా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా పేర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం అన్నదాత పోరు పోస్టర్ను పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ కూటమి పాలనలో రైతులు పడుతున్న ఇబ్బందులను మంగళవారం ఉదయం 9గంటలకు ధర్నా చౌక్ వద్ద ప్రజలకు వివరించడంతో పాటు ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు వివరించారు. ఉల్మాలకు, మౌజన్లకు గౌరవ వేతనాలు ఇవ్వకపోవడంపై వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మైనార్టీలందరితో కలిసి సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్కు కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు ఆమె చెప్పారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా -
చేనేత రంగానికి రూ 1000 కోట్లు కేటాయించాలి
మంగళగిరి : రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి రూ.1000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని రత్నాలచెరువులోని సింహాద్రి శివారెడ్డి భవనంలో చేనేత కార్మిక సంఘం 9వ పట్టణ మహాసభ జంజనం శివ భవన్నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ పాలకులు అవలంబిస్తున్న కార్పొరేట్ విధానాల వల్ల చేనేత పరిశ్రమ సంక్షేభంలో కూరుకుపోయిందన్నారు. నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక మరో వృత్తిలోకి వెళ్లలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని, 20 శాతం రిబేట్ సంవత్సరం కొనసాగించాలన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం మగ్గం నేస్తున్న ప్రతి చేనేత కార్మికుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోగస్ చేనేత సహకార సంఘాలను రద్దు చేసి, పనిచేస్తున్న సంఘాలను ప్రోత్సహించాలని కోరారు. మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు, సీఐటీయూ నాయకుడు ఎస్ఎస్ చెంగయ్య పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ నూతన అధ్యక్షుడుగా డోకుపర్తి రామారావు, ఉపాధ్యక్షుడిగా గోలి దుర్గాప్రసాద్, కార్యదర్శిగా సాదు నరసింహారావు, సహాయ కార్యదర్శిగా ఎం. శివచంద్రరావు, కమిటీ సభ్యులుగా జె. చంద్రమౌలి, కే కుమారి, కె.మల్లికార్జునరావు, జె. శివభావన్నారాయణ, వై. నాగు, జె. రవి, టి. హేమసుందరరావు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ -
బ్రాహ్మణ సేవా సమితి విద్యా పారితోషికం ప్రదానం
గుంటూరు మెడికల్: బ్రాడీపేటలో బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణంలో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి విద్యా పారితోషిక ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి సమితి అధ్యక్షుడు నందిరాజు పాండురంగారావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ పాల్గొన్నారు. 252 మంది విద్యార్థులకు రూ.21.50 లక్షలు అందించారు. పాండురంగారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని ఉన్నత స్థానం పొందిన తరువాత, సమితి వారికి సహాయ సహకారాలు అందజేయాలన్నారు. బ్రాహ్మణ సేవా సమితి కార్యదర్శి ఎం.లక్ష్మీపతి పర్యవేక్షించారు. విద్యా పారితోషికాల చైర్మన్ ఎ.సంజీవరావు, కో చైర్మన్ కర్లపాలెం బాలకృష్ణ, కోశాధికారి తుళ్లూరు ప్రకాష్, ఉపాధ్యక్షుడు మాదల వెంకటకృష్ణ, సహాయ కార్యదర్శులు ఆదిరాజు శ్రీధర్, బొప్పూడి కృష్ణ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పాతూరు శ్రీనాథ్, కోదండ రామారావు, మారుతీ రామ్ గోపాల్, పాంచజన్య శర్మ, కటక రాజు సాయిబాబా శర్మ, గండ్రకోట వెంకటేశ్వరరావు, మద్దూరు రామకృష్ణ పరమహంస, వింజనంపాటి సుబ్రహ్మణ్యం, వి.ఫణీంద్ర కుమార్, అవ్వారి మంగాదేవి పాల్గొన్నారు. -
జాబ్ క్యాలెండర్పై మాట మార్చిన కూటమి ప్రభుత్వం
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన మంగళగిరి టౌన్: కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్పై మాట మార్చిందని, తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. మంగళగిరి నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏఐవైఎఫ్ మంగళగిరి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వలి మాట్లాడుతూ ఎన్ని కల సమయంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి న తరువాత వారిని పూర్తి మోసం చేస్తు న్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి కల్పిస్తా మని హామీ ఇచ్చి నేడు కూటమి ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా నేటికీ నిరుద్యోగ భృతిపై ఒక్క సమీక్ష కార్యక్రమం కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకు లు సామ్యేలు, ఫిరోజ్, గోపిరాజు, నరేంద్ర, జాలా ది నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
అసత్య ప్రచారాలను నమ్మవద్దు
నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన బార్ పాలసీపై కొంత మంది తమ స్వార్థంతో, ఇతరులు కొత్తవారు బార్ బిజినెస్లోకి రాకుండా అడ్డుకునేందుకు చెడు ప్రచారం చేస్తున్నారని అటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాస్ తెలియజేశారు. ఆదివారం బ్రాడీపేటలోని ఎకై ్సజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంటూరు జిల్లాలో 53 మంది, పల్నాడు జిల్లాలో 24 మంది బార్ లైసెన్సులు తీసుకొని చక్కగా వ్యాపారం చేస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 15న కలెక్టరేట్లో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్యబాబు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
మంగళగిరిలో మూసిన నృసింహస్వామి ఆలయ ముఖ ద్వారం పెదకాకాని శివాలయం తలుపులు మూసి వేస్తున్న అర్చకులు, సిబ్బంది జిల్లావ్యాప్తంగా పలు ఆలయాల మూత సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా పలు ఆలయాలు మూత పడ్డాయి. ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అర్చకులు మధ్యాహ్నం తర్వాత తలుపులు మూసి వేశారు. తిరిగి సోమవారం గ్రహణ శుద్ధి అనంతరం ఉదయం 8 గంటల నుంచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని మంగళగిరిలోని నృసింహస్వామి ఈవో సునీల్కుమార్ తెలిపారు. పెదకాకాని శివాలయంలో సంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి భక్తులకు స్వామి దర్శనాలు, అభిషేకాలతో పాటు అన్నిసేవలు యథావిధిగా జరుగుతాయని ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. తెనాలిలోని వైకుంఠపురంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి భక్తులను అనుమతిస్తామని అర్చకులు తెలిపారు. –మంగళగిరి/తెనాలి/పెదకాకాని -
కట్టలు తెగిన రైతుల ఆవేదన
తాడికొండ: అన్నదాతలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సకాలంలో అందించాల్సిన ఎరువుల నిల్వలు అధికార పార్టీకి చెందిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి పోయాయి. చిన్న, సన్నకారు రైతులకు సైతం బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ముమ్మరంగా వ్యవసాయ సీజన్ కొనసాగుతోంది. తాడికొండ, తుళ్లూరు మండలాల్లో పత్తి, మిర్చి అపరాల పంటలు సాగు ఊపందుకుంటోంది. దీనికి తోడు ఖరీఫ్ సీజన్ ముగిసి మరో 20 రోజుల్లో రబీ పంట సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వరినాట్లు కూడా ముమ్మరంగా కొనసాగించేందుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో ఉన్నట్టుండి యూరియా అందకుండా పోయింది. రైతుల ఆశలు అడియాస ప్రైవేటు దుకాణాల్లో అయినా దొరుకుతుందేమో అని ఎదురుచూస్తున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. బ్లాక్ మార్కెట్ దందా తప్పడం లేదు. బస్తాకు రూ.100 అదనంగా వసూలు చేస్తుండటంతో రైతులు కుదేలవుతున్నారు. కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వాటికి కూడా అరకొరగానే పంపిస్తోంది. వచ్చిన కొద్దిపాటి బస్తాలు కూడా తమ్ముళ్ల బందిఖానాలోకి వెళ్లిపోతున్నాయి. రైతులకు అరకొరగా బస్తాలు అందించి సొసైటీలు చేతులు దులుపుకుంటున్నాయి. సీనియర్ నాయకుడి అనుచరుడి దోపిడీ తాడికొండలో ఓ సీనియర్ నాయకుడి అనుచరుడు రైతుల్ని దోపిడీ చేయడం హాట్ టాపిక్గా మారింది. గతంలో వచ్చిన యూరియా బస్తాలను తరలించుకొని నిల్వ చేసుకొన్నాడను. అత్యవసరం అయిన రైతులకు అదనంగా రూ.100 తీసుకొని అమ్ముకుంటున్నాడు. చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలిచి అదుకోవాల్సిన నాయకులే ఇలా బరితెగిస్తే తమ పరిస్థితి ఏంటని పలువురు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి యూరియాతో పాటు డీఏపీని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
యూరియా సరఫరాలో కూటమి విఫలం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నగరంపాలెం: మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈనెల తొమ్మిదో తేదీన తలపెట్టిన అన్నదాత పోరుబాటను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వర్తించారు. అంబటి మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలోని రైతుల పరిస్థితి గందరగోళంగా మారిందని తెలిపారు. ప్రైవేటు దుకాణాల వద్ద యూరియా కోసం బారులుతీరుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ అప్రజాస్వామిక పరిపాలనతో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ గొంతెత్తి ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేవారు. తురకపాలెంలో చిత్రమైన వ్యాధితో నలభై మంది మృత్యువాతకు గురయ్యారని, వైఎస్సార్ సీపీ చేపట్టిన ఆందోళనలతోనే కూటమి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందని గుర్తు చేశారు. గ్రామ ప్రజలకు ఉచితంగా తాగునీరు, మౌలిక సౌకర్యాల కల్పించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. అయితే, రెండు రోజుల కిందట చద్ది అన్నం వడ్డించడంతో అక్కడ గ్రామ ప్రజలు వ్యతిరేకించారని చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ●గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పక్షాన పోరాడేందుకు అందరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. గుంటూరు కేంద్రంగా చేపట్టే అన్నదాత పోరుని చంద్రబాబు, పవన్కల్యాణ్, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఇద్దరు మంత్రులకు బలంగా వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ●పార్టీ నగర అధ్యక్షురాలు, గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఉమ్మడి ఏపీలోని రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల పరిపాలనలో రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ఈనెల 9న తలపెట్టిన అన్నదాత పోరు జయప్రదం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో యూరియా సరఫరాలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. అంతా బ్లాక్మార్కెట్కు చేరడంతో రైతులకు అందడం లేదని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, నాయకులు వలి వీరారెడ్డి, ఎన్.రాజేష్, పఠాన్ సైదాఖాన్, బత్తుల దేవా, సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ప్లీజ్.. టెండర్లలో పాల్గొన వద్దు !
నెహ్రూనగర్: అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహార శైలిపై గత నెల 22న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణకు నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశించారు. అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్న వారి వివరాలు సేకరించి తనకు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులకు చెప్పారు. కమిషనర్ ఆదేశంతో టెండర్లు రద్దు చేయడంతో పాటు పలువురిని ఇంజినీరింగ్ అధికారులు బ్లాక్ లిస్ట్లో పెట్టారు. దీంతో తెలుగు తమ్ముళ్లు లాబోదిబోమంటున్నారు. సగంలో ఆగిపోయిన వర్కులు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో ఎక్కువ లాభాలు వచ్చే వాటిని తెలుగు తమ్ముళ్లు బ్లాక్ చేసుకున్నారు. టెండర్లలో పాల్గొనకుండానే దొంగ డాక్యుమెంట్లు పుట్టించి పనుల్ని దక్కించుకున్నారు. లెస్సుల్లో కూడా మాయాజాలం చూపి కోట్లాది రూపాయిల పనులిన్న కై వసం చేసుకున్నారు. దీనిపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడంతో, అడ్డదారిలో దక్కించుకున్న టెండర్లు రద్దు చేశారు. ప్రస్తుతం పనులు సగం వరకు పూర్తయ్యాయి. వాటిని ఆపేసి తిరిగి టెండర్లు పిలవాలని ఇంజినీరింగ్ అధికారులు నిర్ణయించడంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. చర్చనీయాంశంగా మారిన మెసేజ్ వర్కుకు ఎవరూ టెండర్ వేయవద్దంటూ టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ వాట్సాప్ గ్రూప్లో మేసేజ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. నగర పరిధిలో ఓ డివిజన్లో 1.14కోట్ల రూపాయిల పనులపై ఎవరూ టెండర్ వేయవద్దంటూ వేడుకున్నాడు. వర్కులు గతంలో తనకు వచ్చాయని..కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యాయని..తిరిగి వాటికి టెండర్లు పిలిచినట్లు అందులో వాపోయాడు. నేడు కలెక్టర్కు వినతి పత్రం నగరపాలక సంస్థ అధికారులు కేవలం ఒక వర్గానికే కొమ్ము కాస్తూ వారికే బిల్లులు చెల్లింపులు చేస్తున్నారని, టెండర్ల ప్రక్రియలో అవకతవకలపై మిగిలిన కాంట్రాక్టర్లంతా సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. -
చంద్రబాబుకు న్యాయస్థానాలంటే లెక్కలేదు: అంబటి
సాక్షి, విజయవాడ: చంద్రబాబుకు కోర్టులంటే లెక్కలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోర్టు ఆర్డర్స్ను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? అంటూ ప్రశ్నించారు. 1989 నుండి రాజకీయాల్లో ఉన్నానని.. ఇంత దారుణమైన ఘటన ఇప్పటివరకు చూడలేదన్నారు.‘‘రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు నిన్న(శనివారం) సాయంత్రం బెయిల్ వచ్చింది. వారిని నిన్ననే విడుదల చేయాలి. ఇవాళ(ఆదివారం) ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. జైలర్ మచిలీపట్నం నుంచి బస్లో బయల్దేరి దిగకుండా ఉండాలని చంద్రబాబు, లోకేష్ చెప్పారు. జైలు నుంచి బయటకి రాకుండా లంచ్ మోషన్ వేయాలని ఆలస్యం చేశారు’’ అంటూ అంబటి దుయ్యబట్టారు‘‘వంశీ కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. లిక్కర్ కేసు ఛార్జ్షీట్ అంతా తప్పుల తడక. చంద్రబాబు చెప్పినట్టు సిట్ అధికారులు నడుస్తున్నారు. లేని స్కామ్ను సృష్టించి వైఎస్సార్సీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు’’ అని అంబటి పేర్కొన్నారు. -
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం
పొన్నూరు: రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. యూరియా అందించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 9వ తేదీన తలపెట్టిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహణపై పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోస్టర్ను నాయకులతో కలిసి మురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొన్నూరు నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల కనీసం రైతులను పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదన్నారు. రైతు సంక్షేమాన్ని విస్మరించి సంగం డెయిరీ ఉత్పత్తులను విక్రయించుకునే పనిలో ఎమ్మెల్యే నిమగ్నమయ్యారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులను వెన్నుపోటు పొడిచి యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ ఇబ్బంది పెడుతోందని అన్నారు. వెంటనే రైతులకు రూ. 10 వేలు నష్టపరిహారం, ఉచితంగా ఎరువులు, పురుగు మందులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలి రండి రైతు సమస్యల పరిష్కారం కోసం 9న తెనాలి ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి యందేటి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పొన్నూరు అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. సమావేశంలో ఎంపీపీ భవనం పద్మలీల, వైస్ ఎంపీపీ అంబటి రాఘవయ్య, వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆకుల వెంకటేశ్వరరావు, పొన్నూరు, పెదకాకాని మండల పార్టీ అధ్యక్షుడు చింతలపూడి మురళీకృష్ణ, మల్లికార్జునరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు మరియారాణి, నాయకులు లంకపోతు పిచ్చిరెడ్డి, షేక్ నాజర్, అంబటి వెంకటేశ్వరరావు, బోయిన నాగరాజు, గేరా సంజీవ్, దేవరకొండ గోపి, ఆర్. ఆదిశేషు, భీమవరపు విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మరణాలు
గుంటూరు రూరల్: తురకపాలెం గ్రామంలో పలువురు కేవలం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ ఆరోపించారు. శనివారం గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతులకు నివాళులు అర్పించారు. ప్రతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకూ పోరాడదామని భరోసా కల్పించారు. ఈ సందర్బంగా బలసాని మాట్లాడుతూ... గ్రామంలో తాగునీరు ప్రజలకు అందటం లేదన్నారు. కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోందన్నారు. చిన్నపాటి గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నాలుగు బెల్ట్ షాపులు వెలిశాయని పేర్కొన్నారు. ఇంటి దగ్గరే మద్యం దొరుకుతుండటంతో అందరూ వాటికి అలవాటు అవుతారన్నారు. మెరుగైన వైద్యసేవలు కీలకం కలుషిత తాగునీరు, పారిశుద్ధ్యం లోపం, అక్రమ మద్యం విక్రయ దుకాణాలు వంటి వాటి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ అధికారులు దీనికి బాధ్యత వహించాలన్నారు. ప్రతి ఇంటిని మినరల్ వాటర్ను అందించాలన్నారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి వెంటనే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని పేర్కొన్నారు. ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగిలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇంటూరి పద్మావతి అంజిరెడ్డి, మండల కన్వీనర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, పిల్లి మేరి, పెద్దిరెడ్డి సామ్రాజ్యం, మెట్టు వెంకటప్పారెడ్డి, దారం అశోక్కుమార్, వెంకటరావు, గ్రామంలోని ప్రజలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అన్నదాతకు అండగా పోరు బాట
ఆరుగాలం శ్రమించే రైతులకు కూటమి పాలనలో అడుగడుగునా ఘోష తప్పడం లేదు. సాగునీరు మొదలు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరల వరకు కన్నీరే మిగులుతోంది. పాలకుల నిర్లక్ష్యంతో కష్టాల్లో కూరుకుపోతున్నారు. అన్నదాతల తరఫున కూటమి సర్కార్ వైఫల్యాలను నిలదీయడానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్సార్సీపీ ఈ నెల 9వ తేదీన ‘అన్నదాత పోరు’ చేపట్టనుంది. జిల్లాల్లోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, వినతిపత్రాల సమర్పణతో కూటమి పాలకుల కళ్లు తెరిపించి రైతులను ఆదుకునేలా పోరుబాట పట్టనుంది. ఈ మేరకు నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు శనివారం జరిగాయి. నగరంపాలెం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన, అనంతరం వినతిపత్రాల సమర్పణ కార్యక్రమం ఉంటుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం నియోజకవర్గాల సమన్వయకర్తలు దొంతిరెడ్డి వేమారెడ్డి (మంగళగిరి), అన్నాబత్తుని శివకుమార్ (తెనాలి), వనమా బాల వజ్రబాబు (డైమండ్బాబు)(తాడికొండ), అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు ఉడుముల పిచ్చిరెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ సైదాఖాన్, గులాం రసూల్లతో కలిసి ‘అన్నదాత పోరు’ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని గుంటూరు, తెనాలి ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శన, వినతి పత్రాలు అందిస్తామని చెప్పారు. ఏపీలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని ఆరోపించారు. కొరతపై దుష్ప్రచారం చేసే వారిపై కేసులు బనాయిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించడం దుర్మార్గం అని విమర్శించారు. రాష్ట్రంలోని రైతులు, వైఎస్సార్సీపీ నాయకులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఎరువుల కొరత లేకపోతే విజయనగరం జిల్లాలోని ఓ ప్రైవేటు దుకాణం వద్ద లైనుల్లో ఉన్న రైతులు యూరియా కోసం ఎందుకు కొట్టుకున్నారని అంబటి గుర్తుచేశారు. రైతులు ఎరువుల కోసం అల్లాడిపోతున్న వైనంపై సోషల్ మీడియాతోపాటు చంద్రబాబు అనుకూలమైన ఎల్లో మీడియాలో రాస్తున్నారని గుర్తుచేశారు. వరుస లైన్లల్లో రైతులు ఉన్న ఫొటోలను ఓ పత్రిక లోపలి పేజీలో ఇచ్చిందని తెలిపారు.దారుణంగా విఫలమైన ప్రభుత్వం సకాలంలో రైతులకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. యూరియా ఇప్పటికే దళారులు, టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయిందని మండిపడ్డారు. సుగాలి ప్రీతి కేసుని కూడా ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో జరిగిన మరణాలపై వైఎస్సార్సీపీ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వల్లే స్పందన వచ్చిందని అన్నారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రైతుల పక్షాన చేపట్టిన ‘అన్నదాత పోరు’లో రైతులు భారీగా పాల్గొనాలని అంబటి పిలుపునిచ్చారు. -
మొక్కల పేరిట మళ్లీ కక్కుర్తి!
కూటమి వచ్చాక ప్రజాధనం అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారు. దొరికినంత దోచుకునేందుకు పచ్చనేతలు, ఆ ముసుగులోని కాంట్రాక్టర్లు కలిసి ప్రభుత్వ సొమ్ము ఫలహారంలా ఆరగించేస్తున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కల పెంపకం పేరిట రూ.కోటి వరకు ఖర్చు చేశారు. పైగా టెండర్లు పిలవకుండా అయినవారికి పనులు కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న మొక్కలనే అధికారులు సంరక్షించడం లేదు. పైగా కొత్తగా కొన్ని వేల మొక్కలను తెప్పించారు. వాటి సంరక్షణ సంగతి కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వీటికోసం డివైడర్లలో కొత్తగా మట్టిని నింపుతున్నారు. ఈ రెండు పనులు చేసినందుకు సుమారు రూ.కోటి వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. టెండర్ ప్రక్రియ లేకుండానే? టెండర్లు వేయకుండానే నకిలీ పత్రాలు పెట్టి కొందరు టెండర్లు దక్కించుకున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొక్కలు తీసుకొచ్చేందుకు కూడా టెండర్ పిలవలేదని సమాచారం. నామినేషన్ పద్ధతిలో మొక్కలు, మట్టిని తెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటిని నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో దించారు. మట్టిని మాత్రం రోడ్లపై పోసి గతంలో ఉన్న పాత మట్టిని తొలగించి కొత్తగా నింపుతున్నారు. టీడీపీ కార్పొరేటర్లే వద్దన్నా.. గతంలో ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం రూ.30 లక్షలకుపైగా వెచ్చించి గుంటూరుకు మొక్కలు తీసుకొచ్చారు. అవి పాడైపోవడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది. అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. మళ్లీ మొక్కలు తెప్పించే అంశంపై టీడీపీకి చెందిన కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. ఉన్న మొక్కలను సంరక్షించకుండా కొత్తవి ఎందుకని అధికారులను పలు సందర్భాల్లో ప్రశ్నించారు. వారి తీరు మాత్రం మారలేదు. మొక్కలను తెప్పించారు. డివైడర్లలో ఉన్న మొక్కలు చాలా ప్రాంతాల్లో ఎండిపోయాయి. వీటి సంరక్షణను పట్టించుకోవడం లేదు. దీంతో ఎండిపోతున్నాయి. -
రైతులను అవమానించేలా సర్కార్ వైఖరి
ఫిరంగిపురం: రైతులకు అండగా వైఎస్సార్సీపీ ఎప్పుడూ నిలుస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్బాబు) అన్నారు. మండలంలోని అల్లంవారిపాలెంలో ఎరువుల బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరు, రైతన్నకు బాసటగా వైఎస్సార్సీపీ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతు సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. వనమా బాల వజ్రబాబు మాట్లాడుతూ... యూరియా, ఎరువుల కోసం రైతులు కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని తెలిపారు. రైతుల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్డీవోకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. ఎరువుల కోసం రైతులు బారులుతీరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రైతులను ఆదుకోవాల్సిన కూటమి నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలిచి వైఎస్సార్సీపీ పనిచేస్తుందన్నారు. పార్టీ రైతు విభాగం నాయకులు ఎం. రాఘవరెడ్డి, కె. రామారావు, నాయకులు మాట్లాడారు. పార్టీ మండల అధ్యక్షుడు మార్పుల శివరామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కె.చిన్నప్పరెడ్డి, దాసరి సురేష్, చిట్టా అంజిరెడ్డి, దాసరి మెల్కియా, ఎస్ చిన్నప్ప, పెరికల చిన్న, కె.ప్రవీణ్రెడ్డి, వై.హేమలతారెడ్డి, చేవూరిరామమోహన్రెడ్డి, షేక్.మస్తాన్వలి, కె.బ్రహ్మారెడ్డి, బి. అంజిరెడ్డి, టి.కృష్ణ, జుబేర్, ఎం.రాయప్ప, జె.ఆనంద్, ఇజ్రాయిల్, పిచ్చిరెడ్డి, ప్రతాప్దేవ్, కె.రాజు, పి.శ్రీనివాసరెడ్డి, ఎస్.సైదులు, బాలిరెడ్డి, సాల్మన్, డి.బాబురావు, డి.నరేంద్రకుమార్, కె.శ్రీనివాసరెడ్డి, చిన్నసుబాని, రాంబాబు, ఎం.గోపి, రోశయ్య, మోరంరెడ్డి, డి.శ్రీను, వెంకట్, పి.శ్రీనివాసరెడ్డి, వెంకట్, రవి. వెంకట్రావులు పాల్గొన్నారు. -
సీపీఎస్, జీపీఎస్ రద్దు బిల్లును పెట్టాలి
గుంటూరు వెస్ట్: ఈ నెల 11వ తేదీన జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్, జీపీఎస్ రద్దు బిల్లును ప్రవేశపెట్టాలని జిల్లా ఐక్యవేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ బాషా కోరారు. శనివారం స్థానిక కలెక్టరేట్ సమీపంలోని ఉద్యోగ సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఉద్యోగులకు మేలు చేయాలన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు కీలక భూమిక పోషిస్తారని గుర్తుచేశారు. వారి కనీస కోర్కెలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. సమావేశంలో ఉద్యోగ సంఘ నాయకులు లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, పెదరత్తయ్య, శ్రీనివాస్, నాగరాజు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.జోన్-1 వర్కింగ్ ప్రెసిడెంట్గా గొంటు రఘురామ్ (శ్రీకాకుళం), జోన్-2 వర్కింగ్ ప్రెసిడెంట్గా బూరుగుపల్లి సుబ్బారావు (తూర్పుగోదావరి), జోన్-3 వర్కింగ్ ప్రెసిడెంట్గా సింహాద్రి రమేష్ బాబు (కృష్ణాజిల్లా), జోన్-4 వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎనుముల మారుతి ప్రసాద్రెడ్డి (ప్రకాశం), జోన్-5 వర్కింగ్ ప్రెసిడెంట్గా వంగల భరత్ కుమార్రెడ్డి (కర్నూలు), ఆక్వా కల్చర్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా వడ్డి రఘురామ్ (పశ్చిమ గోదావరి) నియమితులయ్యారు. -
సిట్ భేతాళ కథలు ఇక చెల్లవు: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: సిట్ భేతాళ కథలు ఇక చెల్లవని.. కోర్టులో న్యాయమే జరుగుతుందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేకపోయిందన్నారు.‘‘కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టును కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. సిట్ అధికారులు చాలామందిని బెదిరించి వాంగ్మూలాలు తీసుకున్నారు. వైఎస్ జగన్ చుట్టూ ఉన్న నాయకుల అరెస్టే లక్ష్యంగా లిక్కర్ కేసును నడిపిస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులు కోర్టు ముందు నిలపడవు. తాత్కాలికంగా మా నాయకులను వేధించవచ్చునేమోగానీ న్యాయ పరీక్షకు కేసు నిలపడదు’’ అని మనోహర్రెడ్డి తేల్చి చెప్పారు.మా పార్టీ ముఖ్య నేతలను కేసులో ఇరికించటానికే కేసును నడుపుతున్నారు. సిట్ ఓవరాక్షన్ చేస్తోంది. సిట్ బెదిరింపులపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. రూ.11 కోట్లు చూపించి లిక్కర్ కేసులోని డబ్బంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. నిజం నిలకడగా తెలుస్తుందని జగన్ నమ్ముతారు. అన్యాయం మీద న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుంది. మా నాయకులకు బెయిల్ రానీయకుండా ఉండేందుకు ఛార్జిషీటు వేయకుండా ఆలస్యం చేశారు. బాలాజీగోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈరోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం’’ అని మనోహర్రెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్ రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్ చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్రెడ్డి చెప్పారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కాం: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు చంపేశారంటూ మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఒక్కో మెడికల్ కాలేజీని తీసుకు రావటానికి ఎంత కష్టమో చంద్రబాబుకు తెలియదు.. ప్రతి జిల్లాలోనూ మెడికల్ కాలేజీ, ఆస్పత్రి ఉంటే ప్రజలకు మంచి వైద్యం అందుతుందని వైఎస్ జగన్ ఊహించారు. వైద్యం, టెస్టులు అన్నీ ఫ్రీగా అందించాలన్నదే వైఎస్ జగన్ ఆలోచన. చంద్రబాబు మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెడితే ఇక పేదోడి పరిస్థితి ఏంటి?’’ అంటూ విడుదల రజిని ప్రశ్నించారు.శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు వైద్యవిద్యను దూరం చేశారని.. కోట్లు ఖర్చు చేసి ఆ కుటుంబాలు వైద్య విద్య చదవగలరా? అంటూ నిలదీశారు. మెడికల్ కాలేజీల కోసం సేకరించిన భూమిని కూడా ప్రైవేటుపరం అవుతోంది. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం. మేము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను తిరిగి ప్రభుత్వ పరం చేస్తాం. ఈ స్కాం వెనుక ఎవరున్నారో విచారణ చేస్తాం’’ అని విడదల రజిని పేర్కొన్నారు.‘‘ఆరోగ్యశ్రీని దివంగత మహానేత వైఎస్సార్ తీసుకు వచ్చారు. కొన్ని లక్షలమందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించారు. అలాంటి సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు పడ్డారు. ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో పెట్టడం వెనుక స్కాం ఉంది. వైఎస్సార్, జగన్ పేరును ప్రజల్లో లేకుండా చేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను 120 సంవత్సరాలు బతికిస్తానని చంద్రబాబు డబ్బా కొడుతున్నారు. ముందుగా తురకపాలెంలో జరుగుతున్న మరణాలను ఆపండి. మాటలు ఆపి ప్రజల ప్రాణాలను కాపాడాలి’’ అంటూ విడదల రజిని డిమాండ్ చేశారు. -
ఈనెల 9న వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై వైఎస్సార్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఈనెల 9న వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’ కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా ‘అన్నదాత పోరు’ పోస్టర్ని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు, రాయన భాగ్యలక్ష్మి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోంది. రైతులు యూరియా అడిగితే బొక్కలో తోస్తానంటూ సీఎం మాట్లాడతారా?. రైతులను బెదిరించటం, తొక్కుతాం, నారతీస్తాం అంటారా?. రైతులంటే అంత చిన్న చూపేంటి?. ఈ ప్రభుత్వ మెడలు వంచేంత వరకు వైఎస్సార్సీపీ పార్టీ వెనుకడుగు వేయదు. రైతులకు యూరియా సరఫరా చేసే వరకు పోరాటం చేస్తాం. ఈనెల 9న ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపడతాం. రాష్ట్రంలో ఇప్పటికి 60 శాతం సాగు కూడా కాలేదు. కానీ, ఎక్కడా యూరియా మాత్రం అందటం లేదు. యూరియాను టీడీపీ నేతలే బ్లాక్ మార్కెట్కు తరలించుకున్నారు. సమస్యను సృష్టించి, అందులో నుంచి దోపిడీ చేయటం టీడీపీ నేతలకు బాగా తెలుసు. రైతులకు విత్తనాలు, ఎరువులు ఏవీ అందటం లేదు. ఎరువుల కొరత లేదంటున్న చంద్రబాబుకు రైతుల క్యూలు కనపడటం లేదా?. కాళ్లు అరిగేలా తిరుగుతున్న రైతులు కనపడటం లేదా?. మిర్చి, పొగాకు, మామిడి రైతులు కష్టపడుతుంటే చంద్రబాబు చోద్యం చూశారు. వైఎస్ జగన్ వెళ్తే హడావుడిగా కేంద్రానికి లేఖలు రాశారు. ఉల్లికి ధర లేదని వైఎస్సార్సీపీ నేతలు వెళ్తే మళ్ళీ హడావుడి చేశారు. ఇదేమైనా నియంతృత్వ పాలనా?. యూరియా అడిగితే బెదిరించే సీఎంని ఇప్పుడే చూస్తున్నాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
మరణాలపై వీడని మిస్టరీ
సాక్షి ప్రతినిధి, గుంటూరు / గుంటూరు మెడికల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామ ప్రజల మరణాలపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజులుగా మీడియాలో వార్తా కథనాలు రావడంతో నిద్రలేచిన అధికార యంత్రాంగం గ్రామానికి కదిలింది. రాష్ట్ర ప్రజ్రాప్రతినిధులు సైతం గ్రామ బాట పట్టారు. మూడు రోజులుగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు చేస్తున్నా.. ప్రజలకు ఆవగింజంత ఆత్మవిశ్వాసాన్ని కల్పించలేకపోతున్నారు. మేమున్నామంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ప్రజల్లో ఉన్న భయాందోళనలు రవ్వంత కూడా తొలగిపోలేదు. మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి?ఎక్కడ లోపం జరిగింది ?అనే విషయాలు ఎవరూ తేల్చలేదు. కొన్ని నెలలుగా గ్రామ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా, అధికార యంత్రాంగం నిద్రమత్తులో తూలుతుండటంతో గ్రామం వల్లకాడును తలపిస్తోంది. భిన్న ప్రకటనలతో గందరగోళం మరణాలకు ఎప్పుడు పుల్స్టాప్ ? రెండు నెలలుగా గ్రామంలో మరణ మృదంగం మోగుతోంది. రెండు నెలల అనంతరం కళ్లు తెరిచిన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మూడు రోజులుగా హడావుడి చేస్తున్నారు. గ్రామ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని, భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వ్యాధికి గల కారణాలు, అందుకు అందుబాటులో ఉన్న చికిత్సలు, సదరు చికిత్సలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అరకొరగా ఉన్నాయి. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు తేటతెల్లంగా కనిపించే వరకు తురకపాలెం గ్రామస్తులు నిద్రపోయే పరిస్థితి లేదు. వైద్య ఆరోగ్య శాఖ నిర్లిప్తత గ్రామంలో ఏదైనా విపత్కర పరిస్థితులు తక్షణ కర్తవ్యంగా జిల్లా వైద్య అధికారులు జరుగుతున్న సంఘటనలపై జిల్లా ఉన్నతాధికారులకు, రాష్ట్ర ఉన్నతాధికారులకు సమాచారం తెలియజేసి, అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. కానీ గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరు అందుకు పూర్తి భిన్నంగా ఉంది. మరణాల గురించి మీడియా వెలుగులోకి తీసుకొచ్చే వరకు చలనం లేదు. విపత్తులు అంచనాలు వేసేందుకు ఐడీఎస్పీ విభాగం ప్రత్యేకంగా డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉంది. సదరు విభాగం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోవడం వల్లే రెండు నెలలుగా గ్రామం వల్లకాడుగా మారింది. గుంటూరు వైద్య కళాశాల ఎస్పీఎం వైద్య విభాగం సైతం విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు గ్రామాలకు వెళ్లి వ్యాధులకు కారణాలు, మరణాలకు కారణాలు విశ్లేషించాలి. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించి, మరణాలు, వ్యాధుల కట్టడికి కృషి చేయాల్సిన నైతిక బాధ్యత ఉంది. ఎస్పీఎం వైద్య విభాగం నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించడం వల్లే నేడు ఓ చిన్న గ్రామం రాష్ట్రవ్యాప్తంగా సంచనాలకు నిలయంగా మారింది. లక్షలాది మంది ప్రజల్లో భయాందోళనకు కారణంగా నిలిచింది. -
యూట్యూబ్ ద్వారా నేర్చుకుని చోరీలు
నగరంపాలెం: పార్కింగ్ చేసిన కార్ల అద్దాలను పగులకొట్టి నగదు, నగలు, ల్యాప్ట్యాప్లు దొంగలించే పాత నేరస్తుడ్ని అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. రూ.6 లక్షల ఖరీదైన ల్యాప్టాప్లు, 11 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలులో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. గడిచిన రెండు నెలలుగా కార్ల అద్దాలను పగులకొట్టి నగలు, నగదు, ల్యాప్ట్యాప్లను తస్కరిస్తున్నారు. వరుస ఘటనలపై బాధితులు ఆయా పోలీస్స్టేషన్లల్లో ఫిర్యాదులు చేశారు. ఈ తరహా సంఘటనలు నల్లపాడు పీఎస్ పరిధిలో నాలుగు, నగరంపాలెం పీఎస్ పరిధిలో మూడు జరిగాయి. దీంతో సీసీఎస్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల (పీఎస్) పోలీస్ అధికార, సిబ్బందిని అప్రమత్తం చేశారు. చిన్న క్లూ ఆధారంగా చేసుకుని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి, నిందితుడిని గుర్తించామని ఎస్పీ చెప్పారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామ వాసి 33 ఏళ్ల జంగం బాజిని అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. నేరం రుజువుకావడంతో అరెస్ట్ చేశామన్నారు. అతని నుంచి రూ.6 లక్షల ఖరీదైన ల్యాప్ట్యాప్లు, 11 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నల్లపాడు పీఎస్ పరిధిలో– 4, నగరంపాలెం పీఎస్ పరిధిలో– 3, పెదకాకాని పీఎస్, పాత గుంటూరు పీఎస్, అరండల్పేట పీఎస్ పరిధిలో ఒక్కొక్క కేసు నిందితుడిపై నమోదైందని వివరించారు. రౌడీషీట్ కూడా.. 2022లో పల్నాడు జిల్లా నరసరావుపేట ఒకటో పట్టణ పీఎస్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో బాజీ నిందితుడని, రౌడీషీట్ కూడా ఉందని ఎస్పీ తెలిపారు. చోరీలు చేసే విధానాన్ని యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాడని చెప్పారు. చేతులకు గ్లౌజ్లు, తలకు హెల్మెట్ ధరించి, గులక రాళ్లతో కార్ల అద్దాలను ధ్వంసం చేసేవాడని విచారణలో తెలిసినట్లు వివరించారు. చాకచక్యంగా వరుస కేసులను ఛేదించిన నల్లపాడు పీఎస్ సీఐ వంశీధర్, సీసీఎస్ సీఐ అనురాధ, ఎస్ఐ చల్ల వాసు, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, కానిస్టేబుళ్లు సాంబశివరావు, భిక్షునాయక్, మస్తాన్వలిని జిల్లా ఎస్పీ అభినందించారు. అనంతరం ప్రశంసా పత్రాలు అందించారు. సమావేశంలో దక్షిణ సబ్ డివిజనల్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు పీఎస్ సీఐ వంశీధర్ పాల్గొన్నారు. -
గురువుల స్థానం మహోన్నతం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచంలోని అత్యున్నత స్థానాలను అధిరోహించేలా విద్యార్థులను తీర్చి దిద్దగల మహోన్నతమైన వారు విద్య నేర్పించే గురువులు అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఉన్న రెవెన్యూ కల్యాణ మండపంలో జిల్లాస్థాయి గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హెనీ క్రిస్టినా మాట్లాడుతూ గురువులు తరగతి గదుల్లో చేస్తున్న కృషి, ప్రోత్సహం వల్లే సమాజంలో ఎంతో మంది ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజాభివద్ధిలో గురువులు భావిభారత పౌరులైన విద్యార్థులను తీర్చిదిద్దిన విధానమే కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే నిరుపేద విద్యార్థులను సమర్థమైన పౌరులుగా తీర్చదిద్దడంలో గురువుల పాత్ర కీలకమైందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ గళ్లా మాధవి మాట్లాడుతూ జ్ఞాన జ్యోతులు వెలిగించి అజ్ఞాన అంధకారాల నుంచి విజ్ఞానం వైపు నడిపించే సమాజ రూపకర్తలే గురువులని చెప్పారు. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పాల్గొన్నారు. జిల్లాలో తొమ్మిది మంది ప్రధానోపాధ్యాయులు, 20 మంది స్కూల్ అసిస్టెంట్ టీచర్లు, 25 మంది ఎస్జీటీలతో కలుపుకుని మొత్తం 54 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా సత్కరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, డీవైఈవోలు శాంతకుమారి, ఏసురత్నం, ఎంఈవోలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అతిపెద్ద సంఘం ఏపీ ఎన్జీజీవో
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యవర్గం, అన్నీ తాలూకా కార్యవర్గ సభ్యులతో స్థానిక ఎన్జీజీవో హోంలో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి రమణలు కొత్త జిల్లాల పునర్విభజన సందర్భంగా నూతన ఆడహాక్ కార్యవర్గ సభ్యుల ఎన్నిక సమావేశం శుక్రవారం ఎన్జీవో రిక్రియేషన్ హాలులో జరిగింది. సమావేశానికి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. అలపర్తి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో తమ సంఘం 205 తాలూకాలతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగ సంఘాలతో కలిసి అతిపెద్ద జేఏసీ సంఘంగా ఉద్యోగుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ మాట్లాడుతూ సంఘాన్ని పటిష్టపరిచేందుకు ప్రతి ఒక్క సభ్యుడు సహాయ సహకారాలు అందించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్లు మాట్లాడుతూ ఉద్యోగుల ప్రయోజనాలు సాధించడంలో తాము శాయశక్తుల కృషి చేస్తామని చెప్పారు. ఏఎన్ఎంలు విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను, పదోన్నతి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అడహాక్ కమిటీ చైర్మన్గా ఎం.రామకృష్ణ, కన్వీనర్ కే.నాగేశ్వరరావు, ట్రెజరర్ బ్రహ్మహేశ్వరరావు, సభ్యులు రామయ్య, అప్పారావు, వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను నియమించారు. వీరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు జరిగి నవంబర్ నాటికి ఏ.పీ ఎన్జీజివో సంఘ పల్నాడు జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఏర్పడుతుందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు జగదీష్, రంజిత్ నాయుడు, రామ్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, ఏఐజిఎఫ్ మహిళ విభాగ కన్వీనర్ రాజ్యలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూర్ షరీఫ్, జిల్లా నాయకులు సుకుమార్, కూరాకుల శ్రీనివాసరావు, శ్రీవాణి, కృష్ణకిషోర్, సయ్యద్ జానీబాషా, విజయ్, విజయలక్ష్మి, నగర అధ్యక్ష కార్యదర్శులు సూరి కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పలువురు ఎన్జీవో నాయకులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. విజయ్కుమార్కు ఏపీ ఎన్జీజీవో ఆర్థిక సాయం గుంటూరు జీజీహెచ్ కాంట్రాక్టు మేల్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న వి.విజయ్కుమార్ అమెరికాలో అక్టోబరులో జరగనున్న వరల్డ్కప్ పారాసిట్టింగ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈనేపథ్యంలో శుక్రవారం గుంటూరులోని ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ కార్యాలయంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ చేతుల మీదుగా జిల్లా నేతలు విజయకుమార్కు రూ.10వేల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, సెక్రటరీ శ్యామ్సుందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ -
వీవీఐటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన జర్మనీ బృందం
పెదకాకాని: జర్మనీలోని అతి పెద్ద నైపుణ్య శిక్షణ సంస్థ డెక్రా అకాడమీ ప్రతినిధులు నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయంలోని సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. రాష్ట్ర యువతలో నైపుణ్య కార్యక్రమాలను మెరుగుపరచడానికి, ప్రపంచ ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు గాను నియమితులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (అంతర్జాతీయ నైపుణ్య, ఉద్యోగ కల్పన) సీతాశర్మతో కలసి శుక్రవారం యూనివర్సిటీని సందర్శించారు. విద్యార్థులకు అందించే శిక్షణ గురించి సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ రావెల నవీన్ బృందానికి వివరించారు. సీతాశర్మ మాట్లాడుతూ జర్మనీ ప్రస్తుతం నైపుణ్యం గల నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని తెలిపారు. ఇండో జర్మన్ సమష్టి కృషితో యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు శిక్షణను అందించడం ద్వారా అంతర్జాతీయ నియామకాలు అందించవచ్చని సూచించారు. -
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు చంద్రగ్రహణం
పిడుగురాళ్ల: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చంద్ర గ్రహణం పట్టిందని వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ విమర్శించారు. పట్టణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా ఉందని అన్నారు. కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాయడం చంద్రబాబునాయుడు నైజం అని మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబునాయుడు పాలన అంటేనే ప్రైవేటు వ్యవస్థకి కేంద్ర బిందువని అన్నారు. దాదాపు 15 సంవత్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఈ రాష్ట్రానికి తీసుకురాగలిగరా అని ప్రశ్నించారు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని తెలియజేశారు. వాటిని చంద్రబాబు ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారని అన్నారు. ప్రజల కోసం పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని చెప్పే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీనిపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. అధికారపక్షంలో ఉండి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికై నా మెడికల్ కళాశాలల ప్రైవేటుపరం ఆలోచనకు స్వస్తి పలకాలని ఆయన కోరారు. వైఎస్సార్సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ -
తురకపాలెంలో వరుస మరణాలపై పరిశీలన
గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పర్యటించారు. గ్రామంలో బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంప్ను స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులుతో కలిసి పరిశీలించారు. అందుబాటులో ఉంచిన మెడిసిన్స్, పరీక్ష యంత్రాలు, ఏర్పాట్ల గురించి వైద్య సిబ్బందిని ఆయన అడిగి తెలుసుకున్నారు.అనంతరం మాట్లాడుతూ గ్రామంలో వరుస మరణాలపై పరిశీలన చేశామని తెలిపారు. బర్కోల్డేరియా సూడోమలై అనే బ్యాక్టీరియా వల్ల జ్వరాలు వచ్చి కొందరు మరణించారని చెప్పారు. మెలియాయిడోసిస్ అనేది చాలా అరుదైన వ్యాధి అని, దాని వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి ఇబ్బందులు వస్తాయని వివరించారు. యాంటీబయాటిక్ ద్వారా జబ్బు తగ్గించవచ్చని చెప్పారు. అన్ని రకాల యాంటీబయాటిక్లు ఈ బ్యాక్టీరియాపై పని చేయవని, నాలుగైదు రకాలు మాత్రమే పనిచేస్తాయని తెలిపారు. జ్వరాలు ఉన్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారని, అనారోగ్యం బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. అరుదైన వ్యాధి కాబట్టే గుర్తించడంలో ఆలస్యం జరిగిందని, పరీక్షల ఫలితాలు రావడానికి సమయం పడుతుందని చెప్పారు. ఇది కామన్ డిసీజ్ కాదని, తాను డాక్టర్గా ప్రాక్టీస్ చేసిన సమయంలో కూడా చూడలేదని చెప్పారు. సరైన పరీక్షలు చేసిన తరువాత తేల్చి చెప్పగలమని మంత్రి తెలిపారు. -
దర్జాగా ప్రైవేట్ దందా!
పట్నంబజారు: ఆర్టీసీ బస్టాండ్ వెలుపల రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. నడి రోడ్డుపైనే బస్సుల్ని నిలిపి, ప్రయాణికుల్ని ఎక్కించుకుంటున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. వాహనాలపై కొరడా ఝుళిపించాల్సిన ఆర్టీఏ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కళ్ల ముందే ప్యాసింజర్లను హైజాక్ చేసి సంస్థ ఆదాయానికి గండికొడుతున్నా ఆర్టీసీ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నిబంధనలు బేఖాతర్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా 100పైగా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. గుంటూరు నుంచి హైదరాబాద్, బెంగుళూరు, వైజాగ్, చైన్నె, తిరుపతితో అనేక దూర ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. ఈ సమయంలో నిబంధనలు పాటించాల్సిన బస్సు యజమానులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో రెండు కిలోమీటర్ల లోపు ఎటువంటి బస్సులు నిలపకూడదని మోటార్ వెహికల్ యాక్ట్ స్పష్టంగా చెబుతోంది. అయితే, దీనిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆర్టీఏ అధికారులపై ఉంది. తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత, ఫోర్స్ను రంగంలోకి దించి చర్యలు తీసుకోవాల్సిన కనీస విషయాన్ని వారు మరిచిపోయారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఒక రోజు విధుల్లో ఉంటే.. నాలుగు రోజులు సెలవులో ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం పట్టించుకుంటారని ఆర్టీసీ అధికారులు, సిబ్బంది బాహటంగానే విమర్శిస్తున్నారు. పలుమార్లు విన్నవించినప్పటికీ కనీసం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ), సిబ్బందిని కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రాఫికర్తో నరకం ఇష్టారాజ్యంగా ప్రైవేటు వాహనాలను ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు పైనే నిలపడంతో ట్రాఫిక్ సంగతి చెప్పాల్సిన పనే లేదు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11గంటలకు పైగాను ప్రైవేట్ బస్సులను రోడ్డుపై అడ్డంగా పెట్టి, ప్రయాణికుల్ని ఎక్కించుకుని వెళుతున్నారు. దీనిపై ట్రాఫిక్ అధికారులను అడిగితే, నోటీసులు జారీ చేశామని చేతులు దులుపుకుంటున్నారు. దీనిపై ఒక సామాజిక కార్యకర్త జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పులేదు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతలో బీట్ను చూసే అధికారులు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై అడ్డంగా పెట్టిన బస్సును తీయాలని చెప్పినప్పటికీ కనీసం పట్టించుకోకుండా, ప్రైవేట్ బస్సు డ్రైవర్ నోరు పారేసుకున్న పరిస్థితులున్నాయి. ప్రైవేట్ బస్సులు అంశంలో ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బహిరంగ రహస్యమే ! నెలవారీ మామూళ్ళు ఇస్తున్న క్రమంలో మిన్నికుండిపోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై డీటీసీ సీతారామిరెడ్డిని వివరణ అడిగే ప్రయత్నం చేసినప్పటీకీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు. బస్టాండ్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిలుపుదలపై ప్రత్యేక దృషి సారించి చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపడతాం. సిబ్బందిని ఏర్పాటు చేసి బస్సులు నిలువకుండా యాక్షన్ తీసుకుంటాం. –ఏ. అశోక్, ఈస్ట్ ట్రాఫిక్ సీఐ -
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
తెనాలి రూరల్: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలకలూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఘటనాస్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. సుమారు 50 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. మృతుడు లేత ఆకుపచ్చ చొక్కా, తెలుపు మీద ఎరుపు, నలుపు గళ్ల చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం వద్ద టర్కీ టవల్ ఉండడంతో రైతు అయి ఉంటాడని భావిస్తున్నారు. ఛిద్రమైన మృతదేహం భాగాలను తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిసిన వారు 7207076614 నంబరులో సంప్రదించాలని ఎస్ఐ జి. వెంకటాద్రిబాబు సూచించారు. గుండెపోటుతో వ్యక్తి మృతి బొల్లాపల్లి: వెల్లటూరులో శుక్రవారం జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గంగనబోయిన గోవిందరాజులు (29) శుక్రవారం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని గుండెపోటుతో కుప్పకూలిపోయి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు గోవిందరాజులుకు భార్య భూలక్ష్మితోపాటు ఇరువురు సంతానం ఉన్నారు. మృతుని కుటుంబాన్ని స్థానిక వైఎస్సార్ పార్టీ నాయకులు పరామర్శించి, సంతాపం తెలిపారు. -
శోభిల్లిన ధన గణపతి
మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కారొరేషన్(ఎంటీఎంసీ) పరిధిలోని కాణిపాక వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన గణనాథుడిని శుక్రవారం రూ 17.55లక్షల కరెన్సీ నోట్లతో లక్ష్మీ గణపతిగా అలంకరించారు. భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఉత్సవ కమిటీ ప్రతినిధులు లేళ్ల నరసింహారావు, గుండాల సాయి, పాశం శ్రీరామ్ పర్యవేక్షించారు. – యర్రబాలెం(మంగళగిరి) -
యువత భుజస్కంధాలపై భారత్ భవిత
గుంటూరు ఎడ్యుకేషన్: భారత్ ఉజ్వల భవిత యువత భుజస్కంధాలపై ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం భాష్యం మెడెక్స్ ఆధ్వర్యంలో ఏటుకూరు రోడ్డులోని వివాహ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నలంద, తక్షశిల వంటి విశ్వ విద్యాలయాల ద్వారా ప్రపంచ మానవాళికి జ్ఞానమందించిన ఘనమైన మన భారత సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. దేవుడిపై ఎంత భక్తి, గౌరవం ఉంటాయో, జ్ఞానాన్ని అందించే గురువుపై కూడా అంతే శ్రద్ధాభక్తులు ఉండాలని చెప్పారు. రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ మనం నేర్చుకున్న జ్ఞానం, వైపుణ్యాలను సరైన మార్గంలో నడింపిచేవారే గురువని అన్నారు. జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ అంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నల్లబోతు మురళి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదని, ఏ వృత్తిలో రాణించాలన్న గురువుల పాత్ర అమూల్యమైనదని పేర్కొన్నారు. భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకష్ణ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు జీవితంలో ఎంతో సాధించిన ప్రేరణాత్మకమైన వ్యక్తులను వారికి పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. వారి అనుభవసారాన్ని వినమ్రంగా గ్రహించి లక్ష్యసాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. సభకు భాష్యం మెడెక్స్ ప్రిన్సిపాల్ హరిబాబు అధ్యక్షత వహించారు. తొలుత అతిథుల చేతులమీదుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్, డాక్టర్ రమేష్, డాక్టర్ మురళీలను భాష్యం ఛైర్మన్ భాష్యం రామకృష్ణ సత్కరించారు. విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతుల్ని అలరించాయి. అనంతరం అధ్యాపకులను సత్కరించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ తదితరులు పాల్గొన్నారు. భాష్యం అన్ని శాఖల్లోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
అప్పాపురం చానల్లో మునిగి యువకుడు మృతి
చేబ్రోలు: వినాయక విగ్రహ నిమజ్జనం కోసం వచ్చి అప్పాపురం ఛానల్లో ఈత కోసం దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగి యువకుడు మృతిచెందిన సంఘటన చేబ్రోలులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నల్లచెరువు గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఎం. శైలేష్ (18) స్నేహితులతో కలిసి గురువారం రాత్రి గుంటూరు నుంచి చేబ్రోలు కొమ్మమూరు చానల్లో నిమిజ్జనం కోసం బయలుదేరారు. మార్గంమధ్యలో అప్పాపురం ఛానల్ వద్ద మృతుడు శైలేష్ అతనితోపాటు మరో ఇరువురు స్నేహితులు ఆగి ఛానల్లో ఈత కోసం దిగారు. కొంత సేపు తరువాత అతని స్నేహితులు వరుణ్, షన్నులు ౖైశెలేష్ అప్పాపురం ఛానల్లో గల్లంతైన విషయాన్ని గమనించి కుటుంబసభ్యులకు తెలియజేశారు. రాత్రి సమయంలో గాలించినప్పటికి ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం ఛానల్ నీటి పరిమాణం తగ్గించి ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టడంతో మునిగిపోయిన కొంతదూరంలో మృతదేహం లభ్యమైంది. మృతుడి తండ్రి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వీరనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నార -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి
నరసరావుపేట: గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్ మాట్లాడారు. మాజీ సీఎం జగన్ రూ.8,850 కోట్లతో 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలకు చర్యలు తీసుకోగా అందులో ఐదింటిని పూర్తిచేసి తరగతులు కూడా ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు పావులు కదుపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు విద్య అందించడం ఇష్టంలేని ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కౌన్సిల్కు సీట్లు అవసరం లేదని లేఖ రాశారని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం తెలుగు రాష్ట్ర ప్రజల దురదృష్టకరం అన్నారు. ఆయన పాలన బినామీల ప్రయోజనాల కోసమే అన్నట్లుగా సాగుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందనే దుగ్ధతో చంద్రబాబు ఈ పాపానికి వడిగడుతున్నాడన్నారు. ఈ జీఓను వెనక్కి తీసుకోకపోతే పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కోటపాటి మణికంఠారెడ్డి, బూదాల కల్యాణ్, ఉప్పతోళ్ల వేణుమాధవ్, బంటి, షోయబ్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగ నాయకుల డిమాండ్ -
వైభవంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహణ
బాపట్ల: బీచ్ ఫెస్టివల్ను అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. నిర్వహణపై అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో సూర్యలంక, రామాపురంలో బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దక్షిణ భారత స్థాయిలో బీచ్ క్రీడా పోటీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఫెడ్ లైట్ల మధ్య వాలీబాల్, ఖోఖో, బాక్సింగ్, ఫెన్సింగ్ తదితర క్రీడా పోటీలు భారీ స్థాయిలో నిర్వహించాలని చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగలా జరపాలని ఆయన సూచించారు. పర్యాటకుల సౌకర్యార్థం 100 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం తెలుగు సినీ రంగం నుంచి కళాకారులను పిలిపిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యలో సరదాగా ఉండడానికి జబర్దస్త్ బృందాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రసిద్ధ గాయకులతో పాటు సినీ రంగ నటులు, ప్రముఖుల సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని కలెక్టర్ తెలిపారు. డాన్సర్లు, మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయాలన్నారు. తీర ప్రాంతంలో బోట్ల ప్రదర్శన, స్పీడ్ బోట్లు, స్పోర్డ్స్ రైడర్స్, గుర్రాలు, ఒంటెలు ప్రదర్శన ఉంచాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. 350 మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వేలాదిమంది కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డెప్యూటీ కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, జిల్లా పర్యటకశాఖ అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశం -
కదిలిస్తే ఉబుకుతున్న క‘న్నీళ్లు’
గుంటూరు రూరల్: తురకపాలెం చుట్టూ అక్రమ నీటి విక్రయ కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నా గ్రామస్తులకు మాత్రం చుక్క నీరు దొరకడం లేదు. క్వారీ గుంతల్లో నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామం నలువైపులా 20కి పైగా అక్రమ నీటి విక్రయ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 300 అడుగుల నుంచి 400 అడుగుల లోతు వరకూ బోర్లను ఏర్పాటు చేసి అక్రమార్కులు నీటి విక్రయాలను చేపడుతున్నారు. ప్రతి రోజు సుమారు 500 వందల ట్యాంక్ల నీటిని గుంటూరు నగరంలోని అపార్ట్మెంట్లు, పలు ప్రైవేటు కళాశాలలకు, హాస్టల్స్కు, నిర్మాణాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం 40 లక్షల లీటర్ల విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ట్యాంకర్ను రూ. 1000 నుంచి రూ.1500 వరకూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. 24 గంటలు నీటి తోడకం బోర్లను 400 అడుగుల లోతు వరకూ ఏర్పాటు చేసి 24 గంటలు నీటిని తోడటంతో గ్రామస్తులు ఇళ్లలో వేసుకున్న బోర్లకు నీరు అందటం లేదు. గ్రామస్తులు 100 అడుగుల నుంచి 150 అడుగుల లోతు వరకూ మాత్రమే బోర్లను ఏర్పాటు చేసుకోవటంతో నీరందక అవస్థలు పడుతున్నారు. వేసవిలో నానా పాట్లు పడుతున్నారు. భూగర్బ జలాలు అడుగంటి బోర్లు మూగబోతున్నాయి. అనుమతులు లేకుండా భూగర్భ జలాలను విక్రయిస్తున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఐదు నెలల కిందట ఫిర్యాదు గ్రామానికి సరఫరా చేస్తున్న నీరు మురికిగా వస్తోందని ప్రజలు ఐదు నెలల కిందట ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు.అయినా స్పందన లేదు. గత్యంతరం లేక క్వారీ గుంతల్లో నిల్వ చేసిన నీటిని వాడుకుంటున్నారు. క్వారీల్లో బ్లాష్టింగ్ వ్యర్థాలు, మురుగు నీరు కలిసి ప్రజలు చర్మవ్యాధులు, విషజ్వరాల బారిన పడుతున్నారు. నీటి కాలుష్యంపై గ్రామంలో చర్చలు గ్రామంలో ప్రస్తుతం ఉన్న బ్యాక్టీరియా నీటిని ట్యాంకుల ద్వారా నగర ప్రజలకు అమ్ముతున్నారని, ఆ నీటిని వినియోగిస్తున్నవారి పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అక్రమ సంపాదన కోసం నిర్వహిస్తున్న నీటి విక్రయాలను నిలిపి వేయాలని, తమకు మంచినీటిని అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామంలోని నీటిని ప్రజలకు అందించకుండా విక్రయాలు చేపడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
చంద్రబాబు అనుకున్నంత పనీ చేశారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.‘‘చంద్రబాబు అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంల కోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరితెగింపునకు నిదర్శనం. రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం.’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ప్రజల ఆస్తులను దోచుకున్న వ్యక్తిగా ఇదివరకే మీకు పేరు ఉంది. దీనితో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతారు చంద్రబాబు. ప్రజలకోసం కాకుండా దోపిడీకోసం నిర్ణయాలు తీసుకోవడానికే మీరు మంత్రివర్గ సమావేశాలు పెట్టుకుంటున్నట్టుగా మీ తీరు ఉంది. 1923 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 11. పద్మావతి అటానమస్ కాలేజీతో కలుపుకుంటే మొత్తం 12. 2019కి ముందు 3 దఫాలుగా ఉన్న సీఎంగా ఉన్న మీరు, ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘కనీసం ఆ ఆలోచన చేశారా? మీరెలాగూ చేయలేదు. కనీసం మా 5 ఏళ్ల అతికొద్ది కాలంలో మేము పెట్టిన 17 కాలేజీల్లో 5 చోట్ల కాలేజీలు పూర్తై, క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. ఎన్నికలు ముగిశాక మరోచోట అడ్మిషన్లు కూడా జరిగాయి. మిగిలిన పనులు మీరు బాధ్యతగా ముందుకు తీసుకెళ్లి ఉంటే, గత ఏడాది మరో 5, ఈ ఏడాది మరో 7 కాలేజీల్లో కూడా క్లాసులు స్టార్ట్ అయ్యేవి కదా?. మరి వాటిని ముందుకు తీసుకెళ్లకుండా ఈ రాష్ట్రానికి ఎందుకు ద్రోహం చేస్తున్నారు?. ప్రస్తుతం ఈ కాలేజీలు అక్కడ రావడంతో అమాంతంగా విలువ పెరిగిన ఆ కాలేజీల భవనాలు, భూములు కొట్టేయడానికి మీరు వేసిన ప్లానే కదా ఇది?. అవినీతికోసం ఇంతగా తెగిస్తారా?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.1.@ncbn గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంలకోసం… pic.twitter.com/oBXj40vmOP— YS Jagan Mohan Reddy (@ysjagan) September 5, 2025‘‘మా ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2,360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా సీట్లు మరో 2,550 పెరిగి, 4,910కి చేరుకుంటాయి. మేం పూర్తిచేసి, క్లాసులు ప్రారంభించడంతో కొత్తగా సుమారు 800 సీట్లు భర్తీ కూడా అయ్యాయి. వైద్య విద్యలో ఇదొక అద్భతమైన కార్యక్రమం అయినప్పుడు దీన్ని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసం?. రాష్ట్రంలో అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి చిరునామాగా నిలిచిన కాలేజీల్లో సగం సీట్లు ఉచితంగానూ, మరో సగం సీట్లు ప్రైవేటు వాళ్లతో పోలిస్తే తక్కువ ఫీజుతోనూ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కదా?. కళ్లముందే ఫలితాలు కనిపిస్తున్నా, ఈ కాలేజీలను ఎందుకు నాశనం చేస్తున్నారు?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘ఇక్కడ సరిపడా మెడికల్ సీట్ల లేకపోవడంతో తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటున్న తల్లిదండ్రులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఇక్కడ ప్రయివేటు మెడికల్ సీట్లు కొనే స్తోమత లేక, ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి ఇతర రాష్ట్రాలకు, జార్జియా, ఉక్రెయిన్, రష్యా, పిలిప్ఫైన్స్ లాంటి ఇతర దేశాలకూ పంపిస్తున్న మాట వాస్తవం కాదా?. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందుల కాలేజీకి NMC మెడికల్ సీట్లు ఇస్తే, వద్దంటూ మీరు లేఖ రాసినప్పుడే మీ కుట్ర ఏంటో బయటపడింది చంద్రబాబూ?. పేదలకు ఆ జిల్లాలోనే ఉచితంగా సూపర్ స్పెషాల్టీ సేవలు అందాలన్న గొప్ప ఉద్దేశాన్ని నిలువునా దెబ్బకొడుతున్నారు కదా చంద్రబాబూ?..ప్రతి జిల్లాలోనూ వైద్య ఆరోగ్య రంగంలో, ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వరంగం కూడా ఉండాలని, అప్పుడే, అక్కడే ఈ కొత్త కాలేజీల వల్ల అందుబాటులోకి వచ్చే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, వివిధ రంగాల్లో ఫ్యాకల్టీలు, సూపర్ స్పెషాల్టీ సేవల కారణంగా మంచి మెడికల్ విద్యతోపాటు, ప్రజలకు కూడా వైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటుందని, అంతేకాకుండా ప్రభుత్వ రంగం, ప్రైవేటు ఆస్పత్రులు, ఈ రెండూ సమతుల్యతతో, స్వయం సమృద్ధితో పనిచేస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా, లంచాలకోసం, కమీషన్ల కోసం కక్కుర్తితో ప్రజల ఆస్తులను ఇలా మీ వాళ్లకు పందేరం చేస్తారా?ఈ రాష్ట్రం మీ జాగీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ మీరే కుర్చీలో ఉంటారని కలలు కంటున్నారా?. రాష్ట్ర ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా మీరు బతకనివ్వలేదు కదా చంద్రబాబూ?. ఈ 15 నెలల కాలంలో నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన, దాదాపు రూ. 300 కోట్లు, అంటే 15 నెలల్లో రూ.4,500 కోట్లకు గాను, కేవలం రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చి, దాదాపు రూ.4,000 కోట్లు ఎగ్గొట్టి, పేదవాడి ఆరోగ్య భద్రతను భ్రష్టు పట్టించారు. వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే, 3,257 ప్రొసీజర్లకు ఉచిత వైద్యం అందించేలా, రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే ఉచితంగా భరించేలా ప్రజలకోసం తీసుకు వచ్చిన గొప్ప ఆరోగ్యశ్రీని నాశనం చేశారు...చివరకు ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఆ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేలు అందించే “ఆరోగ్య ఆసరా’’ను కూడా సమాధిచేశారు. దీనికి సంవత్సరానికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లు, ఈ 15 నెలలకుగానూ దాదాపుగా రూ.600 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి మీరు తప్పుకుని ప్రైవేటుకు ఇవ్వడం, అదో ఘనకార్యంగా ప్రచారం చేయించుకోవడం సిగ్గుగా లేదా?. మా ప్రభుత్వ హయాంలోనే సంవత్సరాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారందరికీ వర్తింపు చేయడం ద్వారా మొత్తంగా రాష్ట్రంలో 95% కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఇది వాస్తవం కాదా?...ఇక మీరు కొత్తగా చేసేది ఏముంది? మీ ఎల్లో మీడియాలో మోసం చేయడానికి డబ్బా కొట్టుకోవడం ఏంటి?. ఒక్కోచోట, ఒక్కోమాదిరిగా మోసం చేసేందుకు ప్రచారం చేస్తున్నారు. అసలు మీ ఇన్సూరెన్స్ పథకం పరిధి రూ.2.5 లక్షలకేనా లేక రూ.25 లక్షలకా?. అసలు ఈ 3257 ప్రొసీజర్లు అంటే, ఆపరేషన్ల ఖర్చు రూ.25 లక్షలదాకా ఉచితం అంటే అప్పుడు ప్రభుత్వం కట్టాల్సిన ప్రీమియం ఏ రూ.5వేల కోట్లో దాటుతుంది. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద రూ.3,600 కోట్లు ఖర్చు చేయడానికే మనసు లేనివారు, ఇక రూ.5వేల కోట్లు ప్రీమియంగా ఖర్చు చేస్తారా?. ఇది నమ్మదగ్గ విషయమేనా? అంటే దీని అర్థం మళ్లీ మోసం...ఒక బాధ్యతగా ప్రభుత్వం చేసే పనికీ, ప్రైవేటు కంపెనీలు చేసే పనికీ తేడా ఉంటుంది కదా చంద్రబాబూ. దేశంలో అనేక ఆరోగ్య బీమా సంస్థల నుంచి క్లెయిముల పరిష్కారంలో వస్తున్న ఇబ్బందులు తెలియనివా?. లాభాలు లేకుండా వారు ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తారా?. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులు చేతులెత్తేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించింది. ఇప్పుడు అలాంటి వెసులుబాటు ఉంటుందా?. చికిత్సల జాబితాలో లేకపోయినా, ఏ కొత్త వ్యాధి అయినా ప్రభుత్వం తన విచక్షణాధికారాన్ని వినియోగించుకుని వెంటనే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే అవకాశాన్ని ప్రజలు ఇప్పుడు కోల్పోతారు కదా?..కేవలం ప్రీమియం పేరిట మీ మనుషులకు చెందిన కంపెనీలకు దోచిపెట్టడానికి మీ ఈ నిర్ణయాలంటున్న ఆరోపణలకు, మీ సమాధానం ఏంటి? ఇన్ని పాపాలు చేస్తున్న మిమ్మల్ని ప్రజలు క్షమించరు చంద్రబాబూ. ఇప్పటికే మీ పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే ఈ నిర్ణయాలను రద్దుచేస్తాం. ఈ కాలేజీలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెచ్చుకుంటాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
సోషల్ మీడియా దెబ్బ.. చంద్రబాబు అబ్బా..
మొత్తానికి చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇంకా తటస్థ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి బాగానే భయపడుతున్నారు. ఆయనకు సొంతానికి.. ఆయన్ను మోయడానికి ఐదారు చానెళ్లు.. పలు పత్రికలూ ఉన్నాసరే అవేమీ ఆయన్ను బయటి సోషల్ మీడియా దాడుల నుంచి కాపాడలేకపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు.. తప్పుడు ప్రచారాలను యువత ఎప్పటికప్పుడు వీడియోలు.. పోస్టుల ద్వారా ఎండగడుతూ వస్తున్నారు.మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం చంద్రబాబుకు వంత పాడుతున్నప్పటికీ ఇటు సోషల్ మీడియా ప్రభావము మాత్రం చాలా ఎక్కువగా ఉంది.. దీంతో చంద్రబాబు ఎన్ని రకాలుగా నమ్మించాలని చూస్తున్నా కుదరడం లేదు.. మొన్నటికి మొన్న కుప్పానికి నీళ్లు అంటూ కాలువకు భారీగా ప్రారంభోత్సవం చేసారు.. ఒకరోజు నీళ్లు ఇచ్చారు.. దాన్ని తమ సొంత మీడియాలో ప్రచారం చేసుకున్నారు.. మర్నాడు ఆ కాలువకు నీళ్లు రాక ఎండిపోయింది.. ఇదే విషయాన్నీ స్థానిక యువత .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి వేదికల మీద ఫోటోలు.. వీడియోలతో సహా ఎండగట్టింది.అమరావతి అంతర్జాతీయ నగరం అని చెప్పుకున్న చంద్రబాబును వెక్కిరిస్తూ అది మునిగిపోతున్న నగరం.. ఇవిగో ఐకానిక్ టవర్స్, అదిగో మునిగిపోయిన హైకోర్టు అంటూ వీడియోలు వెల్లువలా సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఈ తాకిడిని తెలుగు దేశం తట్టుకోలేక తెల్లమొహం వేసింది. స్టీల్ ప్లాంట్ మీద.. పరిశ్రమల మీద ఇలా అన్ని అంశాలమీదా సోషల్ మీడియా ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తుండడంతో తట్టుకోలేక ఇక సోషల్ మీడియాను నియంత్రించడానికి ఏకంగా నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని వేశారు.మంత్రులు వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో ఈ కేబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్లను అరికట్టేందుకు, వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ఈ కమిటీ విధివిధానాలు నిర్ణయిస్తుందన్నమాట.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. ఎరువుల్లేక రైతులు అల్లాడిపోతున్నారు.. ధరల్లేక మిర్చి, మామిడి, చీనీ నిమ్మ రైతులు అవస్థలు పడ్డారు.. ఇలా అన్ని వర్గాలవాళ్ళూ ఇబ్బందులు పడిన ఏనాడూ చంద్రబాబు ఉపసంఘాన్ని వేయలేదు.స్టీల్ ప్లాంటును కేంద్రం ప్రయివేటుకు అప్పగిస్తున్న పరిస్థితి పైనా ఉపసంఘం వేయలేదు.. కేంద్ర నిర్ణయాన్ని ఆపడానికి ప్రయత్నించలేదు.. కానీ తన అసమర్థతను ఎప్పటికప్పుడు బయటకు తెలియజేస్తున్న సోషల్ మీడియాను కట్టడి చేసి ప్రజల కళ్ళకు గంతలు కట్టడానికి మాత్రం ఉపసంఘం వేశారని .. సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అరచేత్తో సూర్యుణ్ణి.. దొంగచట్టాలతో మీ అసమర్థతను కప్పిపుచ్చలేరని యువత అంటోంది.-సిమ్మాదిరప్పన్న -
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం అని చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారని తెలిపారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు జరిగాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కల్పలతా రెడ్డి, సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడు అంటే ఒక ఉద్యోగిగా కాదు.. పిల్లల భవిష్యత్ తీర్చి దిద్దేవారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. అందరి జీవితాల్లో వెలుగులు నింపగలిగిన శక్తి టీచర్లకే ఉంది. తల్లిదండ్రుల తర్వాత టీచర్లకే ప్రాధాన్యత. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత వైఎస్ జగన్ది. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండేలా విద్యాలయాలను తీర్చిదిద్దారు. పిల్లలను స్కూల్కి పంపటం తల్లిదండ్రులకు భారం కాకూడదని జగన్ ఆలోచించారు. పిల్లలకు మంచి చదువులు, సదుపాయాలు కల్పించారు. మంచి ఆహారం కోసం గోరుముద్ద కార్యక్రమాన్ని తెచ్చారువిద్యార్థులకు ఇచ్చే బ్యాగ్, షూస్, పుస్తకాలతో సహా అన్నీ జగన్ చెక్ చేసేవారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం జగన్ అంతగా ప్రాధాన్యత ఇచ్చారు. అప్పట్లో ప్రభుత్వ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. మెడికల్ కాలేజీలను కూడా ఉన్నతంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్కు తీసిపోకుండా నిర్మాణాలు చేపట్టారు. పేద, మధ్య తరగతి వారందరికీ మంచి వైద్యం అందాలని చూశారు. అలాంటి మెడికల్ కాలేజీలను నిర్వహించలేనప్పుడు ఇక ప్రభుత్వం ఎందుకు?.కార్పొరేట్ చేతుల్లోకి విద్య, వైద్యం వెళ్తే పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడతాయి. ఆ ఆలోచనతోనే స్కూళ్లను రూపురేఖలు మార్చారు. కార్పొరేట్ స్కూళ్లు కూడా ప్రభుత్వ స్కూల్స్కు పోటీగా నిలిచాయి. ఇప్పుడు మళ్ళీ విద్యా వ్యవస్థ పతనం దిశగా వెళ్తోంది. వైఎస్ జగన్ విద్యారంగంపైనే అత్యధిక సమీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఓట్లు లేకపోయినా జగన్ రాజకీయం కోసం ఆలోచించలేదు. వారి భవిష్యత్తు బాగుండాలి కోరుకున్నారు. ఉపాధ్యాయులకు అత్యంత గౌరవం ఇచ్చారు -
యూరియా అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు
దాచేపల్లి: యూరియా అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ జి.శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఇటీవల యూరియా కొరత అధికంగా ఉండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వ్యాపారులు ఏపీ నుంచి యూరియా బస్తాలను తెలంగాణకు అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు. దీంతో యూరియా ఇలా తరలిపోకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్తంగా బుధవారం రాత్రి పొందుగల, తంగెడ సరిహద్దు చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. యూరియా తెలంగాణకు తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. పూర్తిస్థాయిలో ఏపీలోనే రైతులు వినియోగించాలని కోరారు. అక్రమంగా తెలంగాణకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ పిడుగురాళ్ల ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఏవో వెంకటేష్, ఆర్ఐ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
పంటలపై పరిశోధన, విస్తరణ దిశగా రోడ్ మ్యాప్
గుంటూరు రూరల్: లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో గురువారం హైదరాబాద్కు చెందిన జాతీయ నూనె గింజల సంస్థ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రంలో వ్యవసాయ ప్రాముఖ్య అంశాల గుర్తింపుపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. రాష్టంలోని వివిధ వ్యవసాయ జాతీయ పరిఽశోధన సంస్థల ప్రతినిధులు, రాష్ట్రస్థాయి పరిశోధన సంస్థలు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. వర్క్షాప్ నోడల్ ఆఫీసర్ ఐఐఓఆర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్కె మధుర్ మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాలకు రాష్ట్రంలోని వివిధ పంటల్లో ముఖ్యమైన పరిశోధన, విస్తరణ, అంశాలను గుర్తించి వాటిని సాధించేందుకు అవసరమైన ప్రణాళికల కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలని తెలిపారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు వివిధ శాఖల సమన్వయం కావాలన్నారు. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం పద్ధతులను శాసీ్త్రయంగా పరిశోధించి ఫలితాలను రైతులకు అందజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఐఐఓఆర్ డైరెక్టర్ డాక్టర్ కె సురేష్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ మధుమతి, డాక్టర్ పీవి సత్యనారాయణ, డాక్టర్ ఎ.లత పాల్గొన్నారు. ఐఐఓఆర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కె. మధుర్ -
జీజీహెచ్ ఏడీగా పూసల శ్రీనివాసరావు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్గా (ఏడీ) పూసల శ్రీనివాసరావు గురువారం విధుల్లో చేరారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో నేషనల్ హెల్త్ మిషన్ ఏడీగా పనిచేస్తున్న ఆయన్ను గుంటూరు జీజీహెచ్ ఏడీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను కలిసి జాయినింగ్ రిపోర్టు అందజేశారు. గుంటూరు జీజీహెచ్లో సీనియర్ అసిస్టెంట్గా, పరిపాలనా అధికారిగా, ఇన్చార్జి ఏడీగా శ్రీనివాసరావు పని చేశారు. 2024లో ఏడీగా పదోన్నతి పొంది, కమిషనర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం జీజీహెచ్ ఏడీగా పనిచేస్తున్న చింతలపూడి నాగేశ్వరరావు ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. నూతనంగా విధుల్లో చేరిన ఏడీని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ శ్యామ్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, జీజీహెచ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నేతలు, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది బొకేలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్లో పెండింగ్లో ఉన్న రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతులను మూడు నెలల్లో ఇస్తామని తెలిపారు. మందులు, సర్జికల్స్, ఇంప్లాంట్ల టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసి, ఆసుపత్రిలో రోగులకు అన్నీ అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న ఆడిట్ పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, జాయింట్ డైరెక్టర్ సుధారాణి సహకారంతో పరిపాలన విభాగంలో మార్పులు తీసుకొచ్చి, మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తామని శ్రీనివాసరావు తెలిపారు. -
ఎక్స్లో లోకేష్ స్పందన... పోలీసుల అత్యుత్సాహం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): చేసిన సహాయాన్ని మరిచి అధికారం ఉందని జోజిబాబు అనే వ్యక్తి ‘వైఎస్సార్సీపీ నాయకుడు నా కారు తీసుకుని ఇవ్వడం లేదని, నగరంపాలెం పోలీసులు పట్టించుకోవడం లేదని’ ఎక్స్లో చేసిన పోస్టుకు మంత్రి లోకేష్ స్పందించారు. ఆయన స్పందనతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి కారును స్వాధీనం చేసుకున్న ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఈ మేరకు బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నారు. శ్రీనివాసరావుపేటకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్కుమార్ వద్దకు కారంపూడి ప్రాంతానికి చెందిన జోజి బాబు అనే వ్యక్తి గతంలో వచ్చారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కారును సబ్సిడీపై జోజిబాబు తీసుకున్నారు. ఆ తరువాత మంగళగిరికి చెందిన పున్నా రామచంద్రరావుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇచ్చారు. మూడేళ్లయినా వాహనం అప్పగించకపోగా, డబ్బులు కూడా చెల్లించడం లేదంటూ 2022లో జోజి బాబు వాపోతూ ప్రేమ్కుమార్ సాయం కోరారు. ఎలాగైనా కారు ఇప్పించాలని ప్రాథేయపడ్డారు. దీంతో పున్నా రామచంద్రరావు వద్దకు ప్రేమ్కుమార్ వెళ్లి నిలదీశారు. రూ.8 లక్షలకు కారును జోజిబాబు తాకట్టు పెట్టారని, డబ్బు ఇచ్చి కారు తీసుకెళ్లాలని రామచంద్రరావు చెప్పారు. దీంతో ప్రేమ్కుమార్... ఆ సమయంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ హైమారావును కలిసి జోజిబాబు చేత ఫిర్యాదు చేయించారు. దీంతో సీఐ దర్యాప్తు చేపట్టారు. మంగళగిరికి చెందిన పున్నా రామచంద్రరావును స్టేషన్కు పిలిపించారు. కారు ఇవ్వాల్సిందిగా సూచించారు. కానీ తమకు ఇవ్వాల్సిన రూ.8 లక్షలు చెల్లించాలని రామచంద్రరావుకు మధ్యవర్తిగా వచ్చిన అద్దంకి ప్రాంతానికి చెందిన రాజ్కుమార్ పేర్కొనగా.... అంత ఇవ్వలేనని జోజిబాబు చెప్పారు. ప్రేమ్కుమార్ను బతిమిలాడి ఎలాగైనా కారు ఇప్పించాలని కోరారు. ప్రేమ్కుమార్ వద్ద ఉన్న స్కార్పియో కారును విక్రయించి, దాని ద్వారా వచ్చిన రూ.5 లక్షలు పున్నా రామచంద్రరావుకు చెల్లించారు. ఆ కారుకు సంబంధించి 2022 జూన్ 30వ తేదీన జోజిబాబు చేత రూ.50 స్టాంప్ పేపర్ మీద షరతులతో కూడిన అంగీకార పత్రాన్ని రాయించుకుని కారును ప్రేమ్కుమార్ తన అవసరాలకు వినియోగించుకుంటున్నారు. 2022 నుంచి జోజిబాబు అడిగినప్పుడల్లా ఎంతో కొంత నగదు ఇస్తూ స్నేహంగా ఉన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు ఆరు నెలల కిత్రం జోజిబాబు కారంపూడి పోలీస్ స్టేషన్లో కారు తీసుకుని ప్రేమ్కుమార్ తిరిగి ఇవ్వడం లేదని చెప్పారు. పోలీసులు వెంటనే ప్రేమ్కుమార్ను పిలిపించారు. జరిగిన విషయాన్ని ఆయన పోలీసులకు తెలిపారు. మళ్లీ మూడు నెలల క్రితం నగరంపాలెం పోలీస్ స్టేషన్లో జోజిబాబు ఫిర్యాదు చేయగా, ప్రేమ్కుమార్ను పిలిచి మాట్లాడారు. జోజిబాబు నుంచి రూ.5 లక్షలు ఇప్పించాలని, తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని ప్రేమ్కుమార్ చెప్పారు. పై నుంచి ఆదేశాలు ఉన్నాయంటూ బాధితుడికి బెదిరింపులు కారు ఇచ్చి వెళ్లాలని వైఎస్సార్సీపీ నేతకు హుకుం జారీ చేసిన అధికారులు లేని పక్షంలో కేసులు బనాయించి రౌడీషీట్ తెరుస్తామని ఎస్సై హెచ్చరిక దిక్కుతోచక కారును పోలీసులకు అప్పగించిన వైఎస్సార్సీపీ నేత సాయం చేయడానికి వెళ్లినందుకు ఆర్థికంగా నష్టపోయిన వైనం -
మంత్రి నారా లోకేష్కు ఎక్స్లో చేసిన పోస్ట్ ఇదే...
జోజిబాబు అనే వ్యక్తి ఎక్స్లో గురువారం ఉదయం 10.45 గంటలకు ‘అన్నా.. నారా లోకేష్ గారు. నా పేరు జోజిబాబు. నా జీవనాధారం అయిన ఇన్నోవా కారును వైఎస్సార్సీపీ చెందిన ఒక వ్యక్తి అన్యాయంగా లాక్కుని వెళ్తే ఏడాదిగా నాకు జరిగిన అన్యాయం గురించి గుంటూరులోని నగరంపాలెం పోలీసుల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదు. దయచేసి నా కారు నాకు ఇప్పించండి. నాకు అదే జీవనాధారం.’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. తక్షణమే స్పందించిన లోకేష్ ‘ప్లీజ్ లుక్ ఇన్టూ దిస్ ఇష్యూ ఏపీ పోలీస్ 100. కై ండ్లీ ఫాలో అప్.. అండ్ కీప్ మీ అప్డేట్ అని పోస్ట్ చేశారు. ప్రేమ్కుమార్కు అప్పటి వరకు జోజిబాబు నగదు చెల్లించాలని చెప్పిన పోలీసులే... ఇప్పుడు మాటమార్చి స్టేషన్కు పిలిపించారు. కారు తక్షణమే అప్పగించాలని లేని పక్షంలో చీటింగ్, దొంగతనం కేసులు బనాయిస్తామని ప్రేమ్కుమార్ను బెదిరించారు. అవసరం అయితే రౌడీషీట్ కూడా తెరుస్తామని హెచ్చరించారు. గంటల వ్యవధిలో ప్రేమ్కుమార్ నుంచి కారు తీసుకున్నారు. తన వద్దకు వచ్చి ప్రాథేయపడి సహాయం పొందిన వ్యక్తి ఎలాగైనా ఆ కారు వెనక్కి తీసుకోవాలని మంత్రి లోకేష్కు ఎక్స్లో పోస్ట్ చేశారని.... మంత్రి లోకేష్ అప్డేట్ చేయమని చెబితే పోలీసులు అత్యుత్సాహంతో కారు తాళాలు తీసుకున్నారని బాధితుడు వాపోయారు. ది ఎంతవరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన రూ.5 లక్షలు వెనక్కి ఇప్పించాలని కోరారు. -
ఉమేష్ చంద్రకు ఘన నివాళి
తెనాలి రూరల్: దివంగత ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్ చంద్ర 26వ వర్ధంతిని గురువారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సబ్ డివిజన్ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో చెంచుపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో ఆయన చూపిన అంకిత భావం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసాంఘిక శక్తులపై ఉమేష్ చంద్ర ఉక్కుపాదం మోపారని గుర్తు చేశారు. నిజాయతీ కలిగిన అధికారిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమేష్ చంద్ర సతీమణి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, డీఎస్పీ బి. జనార్ధనరావు, సీఐలు వి. మల్లికార్జునరావు, రాములనాయక్, ఎస్. రమే ష్బాబు, ఆర్. ఉమేష్, సబ్ డివిజన్లోని ఎస్ఐలు సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ముందుగా ఉమేష్చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. -
మరణాల వెనక కారణాల నమోదుకు చర్యలు
● వైద్యారోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ ● తురకపాలెంలో పర్యటన గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణాలకు దారితీసిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కారణాల నమోదుకు చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. గురువారం తురకపాలెం గ్రామంలో గత రెండు నెలలలో 30 మరణాలకు దారితీసిన కారణాలను పరిశీలించడానికి ఆయన గురువారం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మితో కలసి గ్రామంలో పర్యటించారు. మెడికల్ క్యాంప్ను పరిశీలించి అక్కడ బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను, పరీక్షల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరపాండియన్ మాట్లాడుతూ వైద్య నిపుణుల బృందాన్ని రెండు రోజుల క్రితం ఏర్పాటు చేశామని, ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చినట్లు తెలిపారు. నివేదిక ప్రకారం నిర్ణయానికి రావడం సాధ్యపడదని, మైలెడియోసిస్ అని, ఆల్కహాల్ అని చెబుతున్నారని , రక్త నమూనాల పరీక్షల నివేదిక అనంతరం కారణాలను విశ్లేషిస్తామని తెలిపారు. రెండు మూడు రోజులలో కారణాలు తెలుసుకుంటామని, చనిపోయిన వారి మెడికల్ బిల్లులు తీసుకుని సీయంఆర్ఎఫ్ ద్వారా చెల్లిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి మాట్లాడుతూ తురకపాలెంలో గత రెండు నెలలుగా మరణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 14 టీంలను జనరల్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రో బయోలాజీ తదితర ఆరు విభాగాల నుంచి బృందాలను నియమించామని, మరణాలకు గల కారణాలు తెలియాలంటే మూడు రోజులు సమయం పడుతుందని తెలిపారు. గ్రామంలోని మహిళలు కొన్ని సమస్యలను తన దృష్టికి తెచ్చారని, వారు కోరిన విధంగానే బోరు వాటర్ బయటకు పంపకుండా గ్రామంలోనే వినియోగించేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు , జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీయం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు, డీపీఓ నాగసాయికుమార్, గుంటూరు పశ్చిమ మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, గ్రౌండ్ వాటర్, మెడికల్, పంచాయతీ శాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
శ్రీ గురుభ్యో నమః
● నేడు జిల్లాస్థాయి గురుపూజోత్సవం ● 54 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో జాబితా విడుదల గుంటూరు ఎడ్యుకేషన్: మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు 54 మంది ఎంపికయ్యారు. తొమ్మిది మంది గ్రేడ్–2 హెచ్ఎంలతో పాటు వివిధ కేటగిరీల వారీగా స్కూల్ అసిస్టెంట్, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, ఎస్జీటీలను ఎంపిక చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆమోదంతో జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక జాబితా విడుదల చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ● గ్రేడ్–2 హెచ్ఎంల విభాగంలో సీహెచ్. మంజులాదేవి, శ్రామికనగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల (మంగళగిరి మండలం), బి. రాజీవ్రత్న, జెడ్పీ హైస్కూల్ (నూతక్కి), కె.లాజర్బాబు, మున్సిపల్ హైస్కూల్ (నేతాజీనగర్), వై.శేషతల్ప సాయి, జెడ్పీ హైస్కూల్ (చింతలపూడి), ఏ.తిరుమలేష్, జెడ్పీ హైస్కూల్ (తురకపాలెం), ఎం.నాగేశ్వరరావు, జెడ్పీ హైస్కూల్ (కొలకలూరు), ఎస్.శ్రీనివాసరావు, మున్సిపల్ హైస్కూల్, బీఆర్ నగర్ (మంగళగిరి), ఈపూరి అరుణ (జెడ్పీ హైస్కూల్ చిర్రావూరు), పొట్లూరి విజయలక్ష్మి (జెడ్పీ హైస్కూల్ శేకూరు), ● ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం విభాగంలో ఎంపీపీ స్కూల్ కె.శ్రీనివాసరావు (బీసీ), పేరేచర్ల), బి.జగన్నాథనాయక్ (ఏవీఆర్ రజకపేట (తెనాలి), కొత్తపల్లి నాగజ్యోతి, ఫిజికల్ సైన్స్ అధ్యాపకురాలు (డైట్, బోయపాలెం) ● స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లెళ్లపల్లి వెంకయ్య, జెడ్పీ హైస్కూల్ (పెదకాకాని), అహ్మదున్నీసా, ఎంపీయూపీ స్కూల్ (నులకపేట), తోట రామలీల, జెడ్పీ హైస్కూల్ (కొర్నెపాడు), కొనికి శ్రీనివాసరావు, జెడ్పీ హైస్కూల్ (మామిళ్లపల్లి), అవనిగడ్డ వెంకటరెడ్డి, జెడ్పీ హైస్కూల్ (గొట్టిపాడు), గుడిపూడి సత్యనారాయణ, జెడ్పీ హైస్కూల్ (మందడం), సీహెచ్. ప్రమీలాదేవి, జెడ్పీ హైస్కూల్ (కొండపాటూరు), శంకరమంచి వరలక్ష్మి, కేవీఆర్ జెడ్పీ హైస్కూల్ (తుళ్లూరు), సీహెచ్. శంకరరెడ్డి, కేసీహెచ్ఎస్ (కొత్తరెడ్డిపాలెం), కె.జయరావు, జెడ్పీ హైస్కూల్ (కొర్రపాడు), ఎస్.వెంకటరెడ్డి, జెడ్పీ హైస్కూల్ (వెనిగండ్ల), షేక్ సలీమ్, జెడ్పీ హైస్కూల్ (జీజీపాలెం), కన్నెగంటి శ్రీనివాసరావు, జెడ్పీ హైస్కూల్ (ఏటుకూరు), తోకల ఆంజనేయులు, జెడ్పీ హైస్కూల్ (ఉండవల్లి), ఆర్. విజయకుమారి, జెడ్పీ హైస్కూల్ (దొప్పలపాడు), యు.ఉమాదేవి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల (చౌత్రా, గుంటూరు), ఏ.నాగమణి, ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ (తెనాలి). –ఎస్జీటీ విభాగంలో షేక్ అబ్దుల్ హనీఫ్, ఎంపీపీ స్కూల్ (మేడికొండూరు), మండా శ్రీదేవి, ఎంపీపీ స్కూల్, స్వర్ణాంధ్రనగర్ (గుంటూరు), ఎస్.కోటేశ్వరరావు, ఎంపీపీ స్కూల్ (దుగ్గిరాల), ఎండీ కరీముల్లా, ఎంపీపీ స్కూల్ (ఈమని), ఎం.మోహనకృష్ణ, ఎంపీపీ స్కూల్ (మోరంపూడి), పాలెం సాంబశివరావు, ఎంపీపీ స్కూల్ (వడ్డేశ్వరం), ఏ. హరివరప్రసాద్, ఎంపీపీ స్కూల్, జీఎంపీ (కొలకలూరు), పి.శ్రీధర్, ఎంపీయూపీఎస్ (లేమల్లెపాడు), డి.ఉమాదేవి, మోడల్ ప్రైమరీ స్కూల్ (వల్లభాపురం), దాసరి అలివేలు కుమారి (ఎంపీపీ స్కూల్, కొల్లిపర), పి.శ్రీనివాసమూర్తి, ఎంపీపీ స్కూల్ (వేజెండ్ల), ఎంవీఎస్ లక్ష్మీకుమారి, ఎంపీపీ స్కూల్ (వేజెండ్ల), ఎం.జ్యోతి, ఎంపీపీ స్కూల్ (కాకుమాను), బి.కృష్ణకిశోర్, ఎంపీపీ స్కూల్ (దాసరిపాలెం), వి.వినోద్, ఎంపీపీ స్కూల్ (సరిపూడి), ఎస్.కోటేశ్వరరావు, ఎంపీపీ స్కూల్ (రాయపూడి), సీహెచ్ ఆదినారాయణ, ఎంపీపీ స్కూల్ (నెక్కల్లు), కె.సైదా నాయక్, మున్సిపల్ ప్రైమరీ స్కూల్ (మంగళగిరి), జి.సుందరరాజు, ఎంపీపీ స్కూల్ (చినకాకాని), కె.సువర్ణకుమారి, మోడల్ ప్రైమరీ స్కూల్ (పొన్నెకల్లు), ఏ. నిర్మల, ఎంపీపీ స్కూల్ (పమిడివారిపాలెం), జి.సుధారాణి, ఎంపీపీ స్కూల్ (వరగాని), పి.స్వాతి, ఎంఈఎస్ చెంచుపేట (తెనాలి), పి.రజియాబేగం, నగరపాలకసంస్థ ప్రాథమిక పాఠశాల (చిన్నబజారు, గుంటూరు), బి.సమత, ఎంపీపీ స్కూల్ (పుల్లడిగుంట). ఏఎన్యూలో ఐదుగురు ఎంపిక పెదకాకాని(ఏఎన్యూ): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఐదుగురు అధ్యాపకులకు రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డులు లభించాయి. ఆచార్య జి. చెన్నారెడ్డి (ఇంగ్లిష్), ఆచార్య పి.పి.ఎస్.పాల్ కుమార్ (వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్, ఆచార్య ఆర్ రమేష్రాజు (కెమిస్ట్రీ), ఆచార్య వి. దివ్యతేజోమూర్తి (రూరల్ డెవలప్మెంటు), డాక్టర్ పి. సుధాకర్ (బయోటెక్నాలజీ)లకు శుక్రవారం విజయవాడలో జరిగే టీచర్స్ డే వేడుకల్లో సీఎం నారా చంద్రబాబునాయుడు అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులకు ఇన్చార్జి వీసీ ఆచార్య కె. గంగాధరరావు, రెక్టార్ ఆచార్య కె. రత్నషీలామణి, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, ప్రిన్సిపాల్స్ ఆచార్య వీరయ్య, సురేష్కుమార్, లింగరాజు, ప్రమీలారాణి ఓఎస్ అభినందనలు తెలియజేశారు. -
రచ్చబండ పేరుతో ఎమ్మెల్యే హడావుడి
గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రచ్చబండ పేరుతో ప్రధాన వీధి చెట్టుకింద కూర్చుని ప్రజలతో ముచ్చటించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని పలువురు అడిగారు. ప్రతి ఇంటికీ రూ. వెయ్యి చొప్పున కలెక్ట్ చేయించండని, దానికి తోడు మరికొంత తాను ఇస్తానని, దాన్ని బాధిత కుటుంబాలకు ఇద్దామని ఎమ్మెల్యే అన్నాడని ప్రజలు వాపోతున్నారు. ఒక పక్క అనారోగాలతో మృత్యువాతకు గురవుతున్న ప్రజలు ఇంటికి వెయ్యి రూపాయలు ఎలా ఇస్తారని మహిళలు, ప్రజలు చర్చించుకుటున్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రజా ప్రతినిధి ఈ విధంగా మాట్లాడటంపై కొందరు పెదవి విరుస్తున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టండి: ఎమ్మెల్యే బూర్ల గుంటూరు రూరల్: తురకపాలెంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గురువారం పర్యటించారు. గత నాలుగు నెలలుగా గ్రామంలో ప్రజలు అకాల అనారోగ్య మృత్యువాతలకు గురవ్వడంతో గురువారం గ్రామంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యశాఖ, తాగునీటి శాఖ అధికారులతో మాట్లాడారు. గ్రామంలో పరిస్థితులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సరిపోకపోతే ఇతర గ్రామాలనుంచి తెచ్చుకుని పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడి ప్రజల ఆరోగ్య పరిస్థితులను వాకబు చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ను పరిశీలించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
ఏపీపీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం
గుంటూరు వెస్ట్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫారెస్ట్ అధికారుల ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ ఆదివారం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ఖాజావలి తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కు పరీక్ష ఉంటుందని, దీనికి 7,655 మంది హాజరవుతారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు జరగనున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు 1,492 మంది హాజరవుతారని తెలిపారు. జిల్లాలోని 10 కేంద్రాలను పరీక్షల నిర్వహణకు కేటాయించామని, వీటికి సీనియర్ డెప్యూటీ తహసీల్దార్లు లైజనింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని వివరించారు. పరీక్ష కేంద్రాలు, ఇతర సమాచారం పొందేందుకు అభ్యర్థులు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 0863–2234014ను సంప్రదించాలని సూచించారు. అభ్యర్ధులు పరీక్ష కేంద్రాలకు గంట ముందు హాజరుకావచ్చన్నారు. హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా గుర్తింపు కార్డు చూపాలని ఆయన తెలిపారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ను అనుమతించమని చెప్పా రు. సమావేశంలో వెస్ట్ జోన్ డీఎస్పీ అరవింద్, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. 7న ఫారెస్ట్ అధికారుల ఉద్యోగాలకు స్క్రీనింగ్ టెస్ట్ -
బతుకులు సమాధి
అంతుచిక్కని వ్యాధి.. గుంటూరు రూరల్: తురకపాలెం గ్రామస్తులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రతి వీధిలో నలుగురైదుగురు మృత్యువాతకు గురవ్వడంతో చిన్నపాటి అనారోగ్యం కలిగినా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరిస్తున్నారే గానీ కారణాలు చెప్పడం లేదని ఆందోళన చెందుతున్నారు. తమను పక్క గ్రామాల వారు పనులకు పిలవడం లేదని, జీవనం ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు. గ్రామంలో అధికారులు మెడికల్ క్యాంప్లను ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు రావాలంటే భయపడుతున్నారు. పరీక్షలు చేసిన తరువాత ఏ రోగం బయటపడుతుందో.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాం కదా! అని కొందరు మిన్నకుండిపోతున్నారు. మరికొందరైతే ప్రభుత్వ వైద్యులను నమ్మలేక ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. చిన్నపాటి అనారోగ్యానికి పెద్ద మొత్తంలో ఖర్చుచేసి చికిత్సలు తీసుకుంటున్నారు. ఇదే అదనుగా చేసుకుని ప్రైవేటు వైద్యులు అందిన కాడికి బిల్లులు కట్టించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తురకపాలెం అని పేషెంట్ చెబితే చాలు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. గ్రామంలో మీడియా తిరుగుతుందని తెలిసి అధికారులు హడావుడిగా పర్యటనలు చేశారు. మండల స్థాయి అఽఽధికారుల నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ గడిచిన నాలుగు నెలలుగా ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు హడావుడి పర్యటనలు చేస్తున్నారంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది హడావుడిగా గ్రామంలోని మురుగు కాల్వలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లుతున్నారు. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత తీరిగ్గా ప్రజారోగ్యశాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి గ్రామస్తుల నుంచి రక్తం, ఇతర నమూనాలను సేకరిస్తున్నారు. తాగునీటి, మట్టి పరీక్షలు చేస్తున్నారు. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? అని పారిశుద్ధ్యం కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. నాలుగు నెలల కిందట గ్రామంలో ఏర్పాటు చేసిన పొలిమేర రాయి ఒక పక్కకు ఒరగడంతో అనర్థాలు జరుగుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామంలోని పెద్దలు శాస్త్రోక్తంగా గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సరిహద్దు రాయిని సరిచేశారు. ఇప్పటికై నా అకాల మరణాలు ఆగుతాయని గ్రామస్తులు భావిస్తున్నారు. భయం గుప్పెట్లో తురకపాలెం బయటకు రావాలంటే భయపడుతున్న గ్రామస్తులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చుట్టాలు కూడా రావడం లేదని ఆవేదన ఇతర గ్రామాల్లో పనులకు వెళ్లాలన్నా రానివ్వడం లేదు వైద్య శిబిరానికి రావాలన్నా భయపడుతున్న ప్రజలు హడావుడిగా కదిలిన యంత్రాంగంఇంటి నుంచి బయటకు రావాలంటే భయంతో వణికి పోతున్నారు. అదేదో వైరస్.. బ్యాక్టీరియా అంట.. నీటి ద్వారా, మట్టి ద్వారా వస్తుందంట.. అది రావడంతోనే ఇన్ఫెక్షన్లకు గురై మృత్యువాతకు గురవుతున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. రాత్రి 8 గంటల తరువాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయం కలుగుతుందని వాపోతున్నారు. -
గుంటూరు
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025 గ్రామ వీధుల్లో చల్లిన బ్లీచింగ్ ఒరిగిన బొడ్డు రాయిని సరి చేస్తున్న గ్రామస్తులు గ్రామస్తులు తాగే నీటి గుంతను పరిశీలిస్తున్న గోపిరెడ్డి ఇళ్లకు తాళాలు 7నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : కంచి కామకోటి పీఠం మారుతి దేవాలయ ప్రాంగణంలో గురువారం ఉదయం గణపతి స్వామికి అభిషేకం, హోమం నిర్వహించారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 31,550 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 17 క్యూసెక్కులు వదులుతున్నారు. -
‘ప్రభుత్వ నిరక్ష్యంతోనే తురకపాలెంలో మరణమృదంగం’
తురకపాలెం: గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో గడిచిన రెండు నెలలుగా జ్వరాల బారిన పడి దాదాపు 40 మందికి పైగా చనిపోయిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాలతో మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీఅధ్యక్షులు అంబటి రాంబాబు నేతృత్వంలో వైయస్సార్సీపీకి చెందిన డాక్టర్లు, నాయకులతో కూడిన ప్రతినిధుల బృందం తురకపాలెం గ్రామాన్ని సందర్శించింది. గ్రామంలో మృతుల కుటుంబాలతో మాట్లాడి, మరణాలకు గల కారణాలపై వివరాలు సేకరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తాగునీరు కలుషితం అవ్వడం వల్లే గ్రామస్తులు అస్వస్తతకు గురై, మృత్యువాత పడుతున్నారని తమ ప్రాథమిక పరిశీలనలో తేలినట్లు వైఎస్సార్సీపీ వైద్య విభాగం ప్రతినిధులు తెలిపారు. నీరు కలుషితం అవుతోందని నెల రోజుల కిందటే వైఎస్సార్సీపీ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోలేదని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం గ్రామంలోని ప్రజలకు రక్తపరీక్షలు జరిపించాలని, అస్వస్తతకు గురైన వారికి గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడారంటే...స్పెషలిస్ట్ డాక్టర్లను రప్పించాలిమాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిగుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో రెండు నెలలుగా దాదాపు 40 మందికి పైగా జ్వరం బారిన పడి అకస్మాత్తుగా చనిపోతున్నారు. మృతుల్లో 27 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారు కూడా ఉండటం కలవరపరుస్తోంది. వైఎస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలను సందర్శించి వారితో మాట్లాడటం జరిగింది. వైయస్సార్సీపీ తరఫున గ్రామాన్ని సందర్శించి దీనికి గల కారణాలపై అన్వేషణ చేస్తే గ్రామానికి సరైన మంచినీటి సదుపాయం లేదని అర్థమైంది. క్వారీ గుంతల్లో నుంచి పైపులైన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకుకి నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీరు తాగిన వారే రోగాల బారిన పడి చనిపోతున్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదు. గుంటూరు నగరానికి ఈ గ్రామం నుంచి రోజూ 45 లక్షల నీరు వెళ్తున్నా, వీరికి మాత్రం సురక్షితమైన మంచినీరు దొరకడం లేదు. మృతులకు చికిత్స చేసిన డాక్టర్లతో మాట్లాడితే మిలినియోసిస్ అనే కొత్త బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని రిపోర్టులు ద్వారా తెలుస్తోందని చెప్పారు. అపరిశుభ్ర పరిసరాలు, వాతావరణం, తాగునీటి కారణంగానే ఈ బ్యాక్టిరియా వ్యాప్తి చెంది మరణాలు సంభవిస్తున్నట్టు స్పష్టంగా అర్థమైపోతోంది. తక్షణమే ప్రభుత్వం ఓవర్హెడ్ ట్యాంక్ నీటి సరఫరాను ఆపేసి సురక్షిత మంచినీటి సరఫరా చేయాలని వైఎస్సార్సీపీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడున్న క్యాంపుల వల్ల గ్రామానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పీహెచ్ సీ డాక్టర్లతో ఏం ప్రయోజనం ఉండదు. మెడికల్ కాలేజీ నుంచి జనరల్ మెడిసిన్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ల నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లు రావాలి. గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ఈ గ్రామస్తుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలి. సాధారణ మందుల ద్వారా ఈ వ్యాధిని అరికట్టడం సాధ్యమయ్యే పనికాదు. బాధితులకు మంచి మందులు తెప్పించి అందించాలి. ఇన్ఫెక్షన్ రాకుండా గ్రామస్తులు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని మరిగించి తాగాలి. స్నానం చేసే నీటిలో కూడా డెటాల్ వేసుకోవాలి.మైనింగ్ గుంతల్లో నీరు సరఫరా చేయడం వల్లేసత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్రెడ్డిగత రెండు నెలలుగా తురకపాలెం గ్రామంలో జ్వరాల బారిన పడి దాదాపు 40 మందికి పైగా చనిపోయారు. జ్వరాల బారిన పడి వారం రోజుల్లోనే చనిపోతున్న ఘటనలు రెండు నెలలుగా జరుగుతున్నాదానికి కారణాలను ప్రభుత్వం ఇంతవరకు కనుక్కోలేకపోయింది. పీహెచ్సీ డాక్టర్లతో మాట్లాడితే శాంపిల్స్ పంపినా ఇంకా రిపోర్టులు రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీతరఫున గ్రామాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను కలిసి వివరాలను సేకరించాం. వారు చెప్పిన దాని ప్రకారం జ్వరం రావడం, నాలుగైదు రోజుల తర్వాత తగ్గడం మళ్లీ రావడం, ఒళ్లు నొప్పులు, కండరాలు నొప్పులు వేధిస్తున్నాయని చెబుతున్నారు. ఆ తర్వాత తీవ్రమైన ఆయాసం, గుండెనొప్పి రావడంతో పాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోతున్నట్టు తెలిసింది. ఏడెనిమిది మంది ప్రభుత్వ ఆస్పత్రిలో కొంతమంది ప్రైవేట్ ఆస్పత్రిలో చనిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. కొంతమంది జ్వరం తగ్గిందని ఇంటికొచ్చినా మళ్లీ సమస్య రావడంతో ఆస్పత్రికి వెళ్లేలోపే మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని కాలువలు, వీధులన్నీ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. రెండు నెలలుగా గ్రామస్తులంతా అపరిశుభ్రమైన వాతావరణ పరిస్థితుల్లో జ్వరాల బారిన పడి చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి రక్షణ చర్యలు తీసుకోకపోతే మరణాలు మరిన్ని సంభవించే ప్రమాదం కూడా లేకపోలేదు. గ్రామస్తులు కూడా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటినే తాగుతున్నామని చెబుతున్నారు. గ్రామం నుంచి రోజుకి 45 లక్షల లీటర్ల నీటిని బోర్ల ద్వారా తోడేసి అక్రమంగా సరఫరా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. మైనింగ్ గుంతల్లో నుంచి తోడిన నీటిని తాగడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీప్రభుత్వంలో మాదిరిగా విలేజ్ క్లీనిక్స్ అందుబాటులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం తక్షణం గ్రామస్తుల నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ తీసుకుని కల్చర్ టెస్టు చేయాలని వైఎస్సార్సీపీతరఫున డిమాండ్ చేస్తున్నాం.జ్వరంతో మొదలై మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోతున్నారుడాక్టర్ అశోక్తురకపాలెంలో వరుస మరణాలకు గల కారణాలను అన్వేషించడానికి వైఎస్సార్సీపీతరఫున గ్రామాన్ని సందర్శించడం జరిగింది. చనిపోయిన ప్రతిఒక్కరూ జ్వరం, ఆయాసంతో బాధపడిన వారే. మృతులంతా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో వారం రోజుల్లోనే చనిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇక్కడ జరుగుతున్న మరణాల మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ఈ గ్రామంలోని బాధితుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషాలిటీ మెడికల్ వార్డును ఏర్పాటు చేసి చికిత్సలు అందించాలి. గ్రామస్తులకు అవగాహన కల్పించాలి. గ్రామంలో మట్టి, నీరు కలుషితం జరుగుతోందని గుర్తించాం. గ్రామస్తులకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి. పారిశుద్ధ్య పరిరక్షణ మీద కూడా ప్రభుత్వం దృష్టిపెట్టాలి.నెల క్రితమే కలెక్టర్కి వైఎస్సార్సీపీఫిర్యాదు చేసినా పట్టించుకోలేదుగుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుతురకపాలెంలో జరుగుతున్న మరణమృదంగంపై ప్రభుత్వం సీరియస్గా విచారణ చేసి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకే గ్రామంలో ఒకే రకమైన వ్యాధితో 40 మందికి పైగా చనిపోవడం మామూలు విషయం కాదు. వైఎస్సార్సీపీతరఫున మేము గ్రామానికి వస్తున్నామని తెలిశాకనే ప్రభుత్వం స్పందించింది. మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో బోర్ల ద్వారా తోడిన నీటిని ట్యాంకర్ల ద్వారా బయటకు సరఫరా చేస్తున్నారు. గ్రామస్తులకు మాత్రం (సంజీవయ్య గుంట) నుంచి క్వారీ గుంతల్లో నీటిని సరఫరా చేస్తున్నారని గుర్తించాం. ఈ గుంతల్లోకి నీరు కొండల్లో నుంచి వస్తుంది. ఆ నీటితోపాటు బ్లాస్టింగ్ మెటీరియల్ కూడా కలిసి నీరు కలుషితమవుతోంది. దీనిపై జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి దృష్టి పెట్టాలి. మేం గ్రామంల పర్యటిస్తే తప్ప ఆరోగ్యశాఖ మంత్రిలో కదలిక రాలేదు. అధికారుల మీద నిప్పులు చెరిగారని టీవీల్లో బ్రేకింగులు వేసుకుంటున్నారు. కలుషిత నీటి సరఫరా జరుగుతోందని నెల క్రితమే జిల్లా కలెక్టర్కి నెల రోజుల క్రితమే వైఎస్సార్సీపీతరఫున ఫిర్యాదు చేసినా స్పందించలేదు. తక్షణమే గ్రామానికి ఆరోగ్యశాఖ మంత్రిని పంపించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలి. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి. బాధితులకు న్యాయం జరిగేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుంది.మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలిమాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డిమా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి వైయస్సార్సీపీ బృందం గ్రామంలో పర్యటించింది. మేం వస్తున్నామని తెలిసి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పర్యవేక్షణలో హడావుడిగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదని వారికి కూడా తెలుసు. గుంటూరు పక్కనే కూతవేటు దూరంలో తురకపాలెం గ్రామంలో రెండు నెలలుగా అకాల మరణాలు సంభవిస్తున్నా పట్టించుకోని దుస్థితికి ప్రభుత్వం సిగ్గుపడాలి. మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. బాధితులకు న్యాయం జరిగేదాకా వైఎస్సార్సీపీపోరాడుతుంది. తురకపాలెం గ్రామ పరిస్థితులపై ప్రభుత్వం రిపోర్టు ఇవ్వాలి. గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా సురక్షితమైన నీటిని సరఫరా చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
ఏం సక్సెస్ సాధించారని సూపర్ సిక్స్ బహిరంగ సభ: తలారి రంగయ్య
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ సక్సెస్ పేరుతో అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ ఎంపీ తలారి రంగయ్య మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా.. కూటమి ప్రభుత్వం ఆర్డీడీ రెన్యువల్, నీటి సరఫరా, పెనుగొండ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వంటి అంశాల్లో జిల్లాకు తీరని అన్యాయం చేసిందని ఆక్షేపించారు. జిల్లాకు జరిగిన అన్యాయానికి ఏ రకంగా న్యాయం చేస్తారో.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..అనంతపురం జిల్లాకేం చేశారు..?సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ పేరుతో కూటమి ప్రభుత్వం అనంతపురంలో 3 లక్షల మందితో సభ నిర్వహించబోతుంది. అయితే అనంతపురం జిల్లాకు ఏం చేశారని... ఏం తెచ్చారని ఈ సభ పెడుతున్నారు. ఈ సభలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు ద్వారా మీరు ఈ ప్రాంత ప్రజల సమస్యలపై మాట్లాడాలి. మీ సభా ప్రాంగణానికి సమీపంలో ఆర్డీటీ ఉంది. అది క్షీణదశకు చేరి, మూత దశలోకి వచ్చింది. దానిపైన ఏమైనా మాట్లాడతారా?ఎన్నికల్లో టిక్కెట్లు పంచుకోవడానికి, మంత్రి పదవులు తీసుకోవడానికి మీకు చర్చించే సమయం ఉంది కానీ.. ఆర్టీడీకి రెన్యువల్ తీసుకురావడానికి ఎందుకు సమయం లేదు ? మీకు ఎందుకు అది ముఖ్యమైన అంశం కాకుండా పోతుంది? ఇవాళ మీరు చెబుతున్న పీ4 లాంటి కాన్సెప్ట్ ను స్పెయిన్ నుంచి 1969లో వచ్చిన ఆర్టీడీ సాధిస్తూ వచ్చింది. అలాంటి ఆర్టీటీ రెన్యువల్ చేసే ప్రయత్నం చేయకుండా మీరు పీ 4 గురించి మాట్లాడ్డం.. సక్రమంగా నడుస్తున్న వాళ్ల కాళ్లు నరికి, వారికి జైపూర్ పుట్ అమర్చుతామన్నట్లుంది.మాకెందుకు నీళ్లివ్వరు?మీ మీటింగ్ నుంచి నడిచి వెళ్లేంత దూరంలోనే కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కాలువ లైనింగ్ వేసి ఉంది. మాది అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అయినా.. కుప్పానికి నీళ్లు తీసుకుపోతూ.. పక్కనే జీడిపల్లి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోఉన్న కళ్యాణదుర్గం, రాయదుర్గానికి మాత్రం నీళ్లివ్వలేదు. కాలువలు తవ్వలేదు. చంద్రబాబు నాయకత్వం వహిస్తున్న కుప్పానికి నీళ్లు పోతున్నాయే తప్ప మాకు నీళ్లు లేవు. మాకెప్పుడు నీళ్లిస్తారు? దాని గురించి ఈ సభలో ఏమైనా మాట్లాడబోతున్నారా?..మరో వైపు అనంతపురం జిల్లాకు వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలిండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి తీసుకుని పోయి, అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కనీసం మీరు దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు సరికదా మా నాయకుడు వైఎస్ జగన్ హయాంలో పెనుగొండలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే మీరు దాన్ని కూడా బ్రతకనివ్వకుండా పీపీపీ మోడ్లో మార్చి ప్రజలకు నష్టం చేస్తున్నారు.మద్యం అక్రమ సంపాదనలో కూటమి నేతలు దేశంలో నెంబర్ వన్:మీ సమావేశానికి వచ్చే ప్రజా ప్రతినిధులను సూటిగా అడుగుతున్నాను. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు టీడీపీ సమావేశానికి వచ్చే ఏ ప్రజాప్రతినిధి అయినా మీ నియోజకవర్గంలో మద్యం బెల్టుషాపులు నడవడం లేదు అని చెప్పగలరా? ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను మీ గెజిట్ పత్రికల్లోనే అక్రమ మద్యం వరద అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అలా ఎవరైనా చెప్పే ధైర్యం చేయగలిగితే.. నేను కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఆ నియోజకవర్గంలో ఏ మండలంలో, ఏ గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారో చెప్పగలను.అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఒక్కో బాటిల్ పైన అక్రమంగా రూ.10 నుంచి రూ.40 వరకు దోచుకుంటున్నారు. మద్యం అక్రమ అమ్మకాల ద్వారా ఈ ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అక్రమ సంపాదన మరే కాలంలోనూ లేదు. ఒక్క కళ్యాణ దుర్గం నియోజకవర్గం లోనే 389 వరకు బెల్టు షాపులున్నాయంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత అక్రమ మద్యం ప్రవహిస్తుందో అర్థం చేసుకోవచ్చు.ఈ అక్రమ సంపాదనతో మీరు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశమంతా ఎన్నికలు చేయగలరు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా.. ఎంపీల్లోనూ అత్యంత ధనిక ఎంపీలు టీడీపీలోనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిదో, పదో స్థానంలో ఉంది. ఇంత ధనికపార్టీ పేదవాడు తాగుతున్న మద్యం బాటిల్ పైన రూ.10 నుంచి రూ.40 వరకు అదనంగా దోచుకుంటున్నారు.ప్రజల ఆశలను వమ్ము చేసిన పవన్ కళ్యాణ్:ప్రజలు ఎంతో ఆశగా ఓట్లేసిన విషయం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. ఎన్నికల ముందు మీరు అనంతపురం పట్టణంలో కూడా గుంతలున్నాయని ట్రాక్టర్లతో మట్టిపూసి హడావుడి చేశారు. కానీ అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారూ? ఏడాది పూర్తవుతుంది.. మీరు ఎక్కడైనా అనంతపురంలో ఆ గుంతలు పూడ్చి ఉంటే సభలో చెప్పండి.దేశం మొత్తం మీద స్వయం సహాయక సంఘాల మహిళలు అప్పులు మొత్తం తీర్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. రూ.27 వేల కోట్లు మహిళా సంఘాల అప్పులను తీర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అలా అప్పు తీర్చడంతో పాటు రూ.75 వేల రూపాయలు నాలుగేళ్లలో అందించిన ఘనత కూడా వైఎస్ జగన్దే. మీరు ఉచిత గ్యాస్, ఫ్రీ బస్సు కూడా తూతూ మంత్రంగానే అమలు చేస్తూ.. మొత్తం చేసేశామని చెబుతున్నారు.అధికారం ఉండి న్యాయం చేయలేని మీకు పదవులెందుకు?నేను వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం వల్లే సుగాలీ ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. మీరు ప్రశ్నించడం వల్లే ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే మీరు ప్రతిపక్షంలోనే ఉండి ఆ పని చేయాల్సింది.. అంతే తప్ప ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేనప్పుడు మీకు పదవులు ఎందుకు? మీ హయాంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే కనీసం.. బాధితురాలి మృతదేహంలో ఆందోళన చేసే అవకాశం కూడా లేకుండా మృతదేహాలను కూడా కనిపించకుండా చేస్తున్నారు.నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి బాలికపై అఘాయిత్యంలో అదే జరిగింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్న మాట పచ్చి అబద్ధం అని తలారి రంగయ్య తేల్చి చెప్పారు. అనంతపురం జిల్లాకు చేసిన అన్యాయానికి పరిహారంగా ఏ మేరకు న్యాయం చేస్తారో సూపర్ సిక్స్ సభ సాక్షిగా సమాధానం చెప్పాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
‘రైతులు వెళ్ళి అడిగితే బెదిరిస్తున్నారు’
తాడేపల్లి : యూరియా గురించి రైతులను బెదిరిస్తారా? అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ కైలే అనిల్కుమార్. కృష్ణాజిల్లాలో తీవ్రమైన యూరియా కొరత ఉందిని, పీఏసీఎస్ల దగ్గర రైతులు బారులు తీరుతున్నారన్నారు. యూరియాని కేవలం టీడీపీ వాళ్లకు మాత్రమే ఇస్తున్నారని, చైతులు వెళ్లి అడిగితే బెదిరిస్తున్నారని అనిల్ కుమార్ మండిపడ్డారు.ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు. ఆర్బీకేలను రైతు సేవా కేంద్రాలుగా పేర్లు మార్చారే తప్ప రైతులను పట్టించుకోవడం లేదన్నారు. పామర్రు నియోజకవర్గంలో బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న యూరియాని రైతులు అడ్డుకున్నారన్నారు. పోలీస్ స్టేషన్కు తరలించిన తర్వాత లోపల ఉన్న యూరియా రంగు కూడా మారిపోయిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులు పట్టుకున్న యూరియా లారీ వ్యవహారం తేల్చాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. -
ఏపీ కేబినెట్కు యూరియా సెగ
సాక్షి, విజయవాడ: ఏపీ కేబినెట్కు యూరియా సెగ తగిలింది. యూరియా కోసం రైతుల కష్టాలపై చర్చ జరిగింది. యూరియా విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందంటూ కేబినెట్లో చర్చ నడిచింది. యూరియా అంశంపై ఎదురుదాడి చేయాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. మంత్రులంతా వైఎస్సార్సీపీని తిట్టాలని సీఎం ఆదేశించారు.కాగా, యూరియా కట్ట కోసం రైతన్నలు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రైతు సేవా కేంద్రాల్లో ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. సీజన్లో పొలం పనులు మానుకుని రోజంతా తిండి తిప్పలు లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు కాస్తున్నా ‘కట్ట’ దొరకడం కష్టంగా మారింది.యూరియాతో సహా ఎరువులన్నీ డిమాండ్కు మించే ఉన్నాయంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు రాయలసీమ జిల్లాల్లో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. మరోవైపు పక్కదారి పడుతున్న యూరియాను అడ్డుకోవాల్సిన కూటమి సర్కారు చేతులెత్తేసింది. -
లోకేష్తోనే ప్రద్యుమ్నకు సంబంధాలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: భీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంటే లేదని.. బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా హయాంలో పేపర్ల కోసం కథలు సృష్టించలేదన్నారు. లేని స్కాం మీద ప్రజల్లో విషం నింపాలని చంద్రబాబు చూస్తున్నారని.. అందులో భాగంగానే రోజువారి విషపు కథలు ప్రచురిస్తున్నారంటూ సజ్జల దుయ్యబట్టారు.‘‘యాక్టివిటి లేని కంపెనీని అక్రమ లిక్కర్ స్కాంలో ఇరికించాలని చూస్తున్నారు. డబ్బులతో పట్టుబడిన వ్యక్తికి చెవిరెడ్డికి లింక్ పెట్టారు. ఈనాడు, ఆంధ్రజ్యోతికి సిట్ బ్యానర్ ఐటమ్స్ అందిస్తుంది. గతంలో ప్రద్యుమ్న స్టూడియో-ఎన్లో యాక్టివ్ డైరెక్టర్. స్టూడియో-ఎన్ను నారా లోకేష్ ప్రమోట్ చేశారు. లోకేష్తోనే ప్రద్యుమ్నకు సంబంధాలున్నాయి. రోజుకో కథ రాసి బురద అంటించాలని చూస్తున్నారు. సజ్జల భార్గవ్రెడ్డికి సంబంధించి ప్రచురించిన కథనాలు అవాస్తవం.లిక్కర్ స్కాంలో సజ్జల భార్గవ్రెడ్డిపై ఆరోపణలు అవాస్తవం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.‘‘సిట్ పేరు చెప్పి ఎల్లోమీడియా మాపై విష ప్రచారం చేస్తోంది. సజ్జల భార్గవ్ కంపెనీగా చెప్తున్న భీమ్ అసలు ఎలాంటి యాక్టివిటీ చేయటం లేదు. ఆ సంస్థకు కనీసం బ్యాంకు ఎకౌంట్ కూడా లేదు. మరి లిక్కర్ స్కాంలోని నిధులను భీమ్ సంస్థ ఎకౌంట్ ద్వారా ఎలా వెళ్తాయి?. సిట్ విచారణ ఎలా జరుగుతుందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. మా హయాంలో మద్యం పాలసీ పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్టు తన మనుషులకు లాభం చేకూర్చేలాగ జరగలేదు..డిస్టలరీల్లో ఏదైనా తప్పు జరిగి వాటి ద్వారా మేమైనా లబ్ధి పొందినట్టు ఆధారాలు ఉంటే ఏదైనా జరిగిందనుకోవచ్చు. కానీ ఏమీ జరగనిది జరిగినట్టు చూపించటానికి తెగ తాపత్రయ పడుతున్నారు. లేని స్కాం ఉన్నట్టుగా చెప్పి ప్రజల్లో విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాదిగా ఇలా కట్టుకథలతో విచారణ జరుపుతున్నారు. సజ్జల భార్గవరెడ్డిని కూడా లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరికో లింకులు కలుపుతూ స్కాం జరిగిందని ప్రచారం చేస్తున్నారు...ఎల్లోమీడియా ఆఫీసుల్లో కూర్చుని సిట్ అధికారులు పని చేస్తున్నారా?. లేకపోతే ఎల్లో మీడియా, సిట్ అందరూ కలిసి టీడీపీ ఆఫీసులో కూర్చుని పని చేస్తున్నారా?. ప్రద్యుమ్న స్టూడియో ఎన్ డైరెక్టర్. ప్రద్యుమ్న, నారా లోకేష్ మధ్య సంబంధాలు ఉన్నాయి. దానిని బట్టి నారా లోకేష్ను కూడా కేసులో ఇరికించవచ్చా?. చంద్రబాబు చిల్లర వార్తలతో రాజకీయాలు చేయటం, పరిపాలన చేయటం సిగ్గుచేటు. రాష్ట్రంలో సమస్యలను పక్కన పెట్టి నిత్యం ప్రజల మీద విషం చిమ్మే వార్తలు రాయిస్తున్నారు...కళ్లముందు కనిపిస్తున్న నిజాలను కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నిజాలు మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. యూరియా కష్టాలు గురించి జగన్ ట్వీట్ చేస్తే అది ఫేక్ అంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా రైతులు యూరియా కోసం అవస్థలు పడుతున్నారు. మరి ఇవన్నీ ఫేక్ అని చంద్రబాబు చెప్పగలరా?. చినముత్తేవి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న యూరియాను రైతులు అడ్డుకున్నారు. ఇందులో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. కానీ వైఎస్సార్సీపీ వారు లారీని అడ్డుకున్నారంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు...అసలు సమస్యను పరిష్కరించకుండా రైతులను దూషించటం ఎందుకు?. యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ల విషయంలో కూడా సమస్యలు సృష్టించి వారి నుండి లంచాలు మెక్కుతున్నారు. యూరియా కూడా సమృద్ధిగా ఉంటే మరి ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా?. ఫేక్ వార్తలు సృష్టిస్తున్నదే టీడీపీ...టీడీపీ ఆఫీసులోనే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పెట్టారు. తండ్రీ కొడుకులు వీకెండ్లో హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. వారికి జనం సమస్యలు పట్టటం లేదు. వీటన్నిటి నుంచి డైవర్షన్ చేయటానికి లేని లిక్కర్ స్కాంని సృష్టించారు. సీఎం స్థాయి వ్యక్తే జనాన్ని బెదిరిస్తుంటే ఇంకేం అనాలి. అంత దిగజారి వ్యవహరించాలా చంద్రబాబూ?. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా ఇంకా జగన్ మీద పడి ఏడవాలా?. విష ప్రచారం చేయటంలో లోకేష్ తండ్రిని మించి పోయారు. లోకేష్ ఆఫీసే సీఎంవోగా మారిపోయింది. తండ్రి నిర్ణయాల కంటే లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నాయి...వైఎస్ జగన్, విజయమ్మ విషయంలో కూడా లోకేష్ దిక్కు మాలిన రాజకీయం చేస్తోంది. ఫేక్ వీడియోలు, ఫోటోలతో శునకానందం పొందుతున్నారు. చంద్రబాబుకు అసలు కుటుంబ బంధాల గురించి తెలుసా?. చంద్రబాబు చెల్లెళ్లు ఎవరో ఈ ప్రపంచానికి తెలుసా?. కనీసం లోకేషైనా వారి మేనత్తలను గుర్తు పట్టగలడా?. చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లుకు ఏం న్యాయం చేశారు?. అత్యధిక ధనవంతుల సీఎంలలో చంద్రబాబే దేశంలో నంబర్ వన్. అలాంటి వ్యక్తి తన తమ్ముడు, చెల్లెళ్లకు ఏం న్యాయం చేశారు?. రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకోని ఫేక్ సీఎం చంద్రబాబు...యూరియా సమస్యపై ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీవో ఆఫీసుల ఎదుట నిరసన చేపడతాం. రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదు. జరుగుతున్నదల్లా దోపిడీలు, కుంభకోణాలే.. ప్రశ్నిస్తే ఎంతమందిని అరెస్టు చేయగలరు?. వైఎస్సార్సీపీ కార్యకర్తల నుంచి ఇప్పుడు సామాన్య ప్రజల మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు ఈస్టమన్ కలర్లో సినిమా చూపించే టైం దగ్గర పడింది. లోకేష్ ఢిల్లీ పర్యటన వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు. తమ పైరవీలు చేసుకోవటానికే పదేపదే ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఆయనపై ఉన్న కేసులు కొట్టేయించుకునేందుకు వెళ్తున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. -
తురకపాలెం ట్రాజెడీ.. సకాలంలో స్పందించకపోవడం వల్లే మృత్యుఘోష!
సాక్షి, గుంటూరు: ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వంతో.. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం ప్రాణభయంతో విలవిల్లాడుతోంది. దాదాపు మూడు వేల జనాభా ఉన్న ఆ గ్రామంలో.. 45 మరణాలు సంభవించాయి. అధికారుల లెక్కలు ఎలా ఉన్నా.. ఏడాది కాలంలో 100 మంది చనిపోయారని గ్రామస్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎం నేతలు గురువారం గ్రామంలో పర్యటించారు. ‘‘ఇవి సహజ మరణాలు కాదు అసహజ మరణాలు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇంత వ్యవహారం జరుగుతున్న ఎందుకు కళ్ళు తెరవలేదు?. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారు?. జిల్లా మంత్రి లోకేష్ ఇప్పటిదాకా ఎందుకు పర్యటించలేదు?. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నారు?. ప్రభుత్వం ముందుగానే స్పందించి ఉంటే మరణాలు ఆగిపోయేవని.. ఇంతవరకు మరణాలకు సంబంధించి కారణాలు కనుక్కోలేకపోయారని మండిపడ్డారు. ఈ మరణాలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి. ప్రభుత్వం ఇకనైనా ప్రజల ప్రాణాలను ప్రాధాన్యతగా తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారాయన. ఈ క్రమంలో సీపీఎం నేతలు ఇంటింటికి వెళ్లి వరుస మరణాలపై వివరాలు తెలుసుకున్నారు. వరుస మరణాలతో గ్రామంలో పరిస్థితి అదుపు తప్పింది. తమ ఊరికి బయటి నుంచి జనాలు కూడా రాలేకపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోంది. వైద్యారోగ్య శాఖ సర్వేల పేరుతో కాలయాపన చేస్తోంది. విషయం తెలిసిన తర్వాత కూడా వేగంగా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. విమర్శల నేపథ్యంలో.. మరణాలకు కారణాలేమిటో తెలుసుకునేందుకు గుంటూరు వైద్యకళాశాలలోని ఆరు విభాగాల నుంచి నిపుణులైన వైద్యులు, సాంకేతిక బృందం, వైద్యారోగ్య శాఖ అధికారులు వచ్చి వైద్యశిబిరం నిర్వహించారు. మరణాలకు ఇన్ఫెక్షన్ మెలియాయిడోసిస్ ఈ పరిస్థితికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
దాతల సహకారం అభినందనీయం
కారంచేడు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులు అదృష్టవంతులని డీఈఓ ఎస్.పురుషోత్తం పేర్కొన్నారు. స్థానిక యార్లగడ్డ నాయుడమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కారంచేడులోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామానికి చెందిన అనేక మంది ఎన్నారైలు, పాఠశాలల పూర్వ విద్కార్థులు చేతులు కలపడం మంచి పరిణామమని కొనియాడారు. గ్రామంలోని వైఎన్ ప్రభుత్వ పాఠశాలను దాతల సహకారంతో రూ. 12 లక్షలతో అభివృద్ధి చేశారని తెలిపారు. అమెరికాలోని డల్లాస్ పట్టణంలో స్థిరపడిన గ్రామానికి చెందిన రాయినీడి మురళీకృష్ణ సహకారంతో రూ. 33 లక్షలతో నూతనంగా బస్సును కొనుగోలు చేసి ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నుంచి ఉన్నత పాఠశాల వరకు ఉన్న 360 మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులను గ్రామానికి చెందిన హైదరాబాద్లోని స్మైల్ ఫౌండేషన్ నిర్వాహకులు గౌర అనీల్కుమార్ సమకూర్చగా, వాటిని కూడా ఆయన చేతుల మీదుగా అందించారు. ఎన్నారై ఘంటా పద్మజ మాట్లాడుతూ తాను ఈ పాఠశాల పూర్వ విద్యార్థినేనని తెలిపారు. అవిభక్త పిల్లల వైద్యులు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ుడ్సలో పేరు నమోదు చేసుకున్న డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ కూడా ఈ పాఠశాల విద్యార్థే అని గుర్తు చేశారు. వేసవి తరగతులు నిర్వహించిన పావులూరి శ్రీనివాసరావు, పొదిలి మురళీకృష్ణలను సత్కరించారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ యార్లగడ్డ రాఘవయ్య, చుండూరి రామయ్య, పాఠశాల పూర్వ కరస్పాండెంట్ యార్లగడ్డ రఘుబాబు, ఎంఈఓ ఎం. వెంకటేశ్వర్లు, హెచ్ఎం సామ్రాజ్యం పాల్గొన్నారు. బాపట్ల డీఈఓ పురుషోత్తం -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
పెదకాకాని(ఏఎన్యూ): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని రాష్ట్ర గిరిజన, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి 4వ స్పోర్ట్స్మీట్–2025 ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథులుగా మంత్రి సంధ్యారాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ, గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ వైస్ చైర్మన్ ఎం. మల్లికార్జుననాయక్, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ సదా భార్గవి, గురుకులం సెక్రటరీ గౌతమి, వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడాలని ఆలోచన వచ్చిందంటేనే పిల్లలు గెలిచినట్టన్నారు. రోజూ గంటకుపైగా ఆడుకోవడం ద్వారా శారీరక సామర్థ్యం పెరుగుతుందన్నారు. గురుకులం సెక్రటరీ గౌతమి మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి 5వ తేది వరకు బాలికలు, 7 నుంచి 9వ తేదీ వరకూ బాలురకు 12 అంశాల్లో క్రీడలు ఉంటాయని చెప్పారు. 13 జిల్లాల నుంచి 656 మంది హాజరు అవుతున్నారని పేర్కొన్నారు. మంత్రి సంధ్యారాణి విద్యార్థుల నుంచి క్రీడావందనం స్వీకరించారు. వసతులు కరువు 1500 మంది క్రీడాకారులతో నిర్వహించడానికి అనుకూలంగా వసతులు లేని కారణంగా బాలికలు, బాలురకు వేర్వేరు తేదీల్లో క్రీడాపోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. వర్సిటీలో అథ్లెటిక్స్, బాడ్మింటన్, టేబుల్టెన్నిస్, తైక్వాండో, బాస్కెట్బాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, షూటింగ్, స్విమ్మింగ్ విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ ఆఫీసర్ శ్యాంసుందర్ వివరించారు. ముందుగా జాతీయ జెండా, స్పోర్ట్స్ జెండా, ఈఎంఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సంధ్యారాణి 800 మీటర్లు పరుగుపందెం పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు, రిజిస్ట్రార్ సింహాచలం, పలువురు స్పోర్ట్స్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి సూచన ఘనంగా గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభం -
కాల్వలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య
నకరికల్లు: మతిస్థిమితం సక్రమంగా లేక వృద్ధురాలు ఎన్ఎస్పీ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ చల్లా సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. చీమలమర్రి గ్రామానికి చెందిన సురభి సీతమ్మ(75) గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈక్రమంలో బుధవారం సాయంత్రం సమయంలో చల్లగుండ్ల సమీపంలోని గోరంట్ల మేజర్లో దూకింది. సమీపంలోని వారు గమనించి వెలికితీసే సరికే మృతిచెందింది. ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి ఆరుగురు పిల్లలు ఉండగా వారందరూ వివాహితులే. 14 యూరియా బస్తాలు స్వాధీనం దాచేపల్లి: అక్రమంగా తరలిస్తున్న 14 యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సౌందర్యరాజన్ బుధవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు మంగళవారం అర్ధరాత్రి పొందుగుల రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టామని, ఈ తనిఖీల్లో గురజాల మండలం గంగవరం గ్రామం నుంచి 14 యూరియా బస్తాలను రైతులు పేరుమీద కొనుగోలు చేసి తెలంగాణలోని దామరచర్ల మండలంలోకి ఆటో ద్వారా అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని గుర్తించి యూరియా బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. యూరియాను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సౌందర్యరాజన్ వెల్లడించారు. నరసరావుపేట టౌన్: నిషేధిత సింగిల్ నంబర్ లాటరీ విక్రేతలు నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.51,480లు స్వాధీనం చేసుకున్నట్లు నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. బుధవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. చిత్రాలయ టాకీస్ సెంటర్లో సింగిల్ నంబర్ లాటరీ టిక్కెట్లు విక్రయిస్తున్నారన్నా సమాచారం మేరకు టూటౌన్ పోలీసులు దాడులు నిర్వహించి ఇస్లాంపేటకు చెందిన షేక్ మస్తాన్వలి, ఉప్పలపాడు గ్రామానికి చెందిన పరిమి వెంకటేశ్వర్లులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.6,580 నగదు, లాటరీ నంబర్లకు సంబందించి స్లిప్లను స్వాధీనం చేసుకున్నారన్నారు. అదే విధంగా ఏంజెల్ టాకీస్ సమీపంలో వన్టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి నిమ్మతోటకు చెందిన గుడిపాటి వెంకటేశ్వరరావు, ఇస్లాంపేటకు చెందిన షేక్ నన్నూ బాజీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.44,900 నగదు, లాటరీ నంబర్ల స్లిప్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ఇస్లాంపేటకు చెందిన షేక్ ఖాజాషరీఫ్ అలియాస్ బుజ్జి, రామిరెడ్డిపేటకు చెందిన షేక్ గౌస్పీరాలను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. నిందితులను అరెస్ట్ చేయటంలో ప్రతిభ కనపరిచిన వన్టౌన్, టూటౌన్ సీఐలు ఎం.వి.చరణ్, ఎం.హైమారావు, ఎస్ఐలు టి.అశోక్ బాబు, అరుణలను అభినందించారు. నిషేదిత లాటరీ, మట్కా నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. -
బడ్జెట్లలో చేనేతకు మొండిచేయి
సత్తెనపల్లి: చేనేతకు బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకష్ణ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిని ఫణిదం చేనేత సహకార సంఘం భవన ఆవరణలో బుధవారం జరిగిన చేనేత కార్మిక సంఘం పల్నాడు జిల్లా 3వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహాసభకు పల్నాడు జిల్లా అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు అధ్యక్షత వహించారు. బాలకష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ చేనేతకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్లూమ్స్, జెట్లూమ్స్లను ప్రోత్సహిస్తూ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై అక్టోబర్ 6,7 తేదీలలో సత్తెనపల్లిలో జరిగే చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభ లలో చర్చించి కార్యచరణ ప్రణాళికను రూపొందించి భవిష్యత్తు పోరాటాలకు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ముందుగా చేనేత జెండాను చేనేత జాతీయ అవార్డు గ్రహీత కర్నాటి మురళి, సామాజిక సేవా కార్యకర్త గంజి వీరాస్వామి, పణిదం చేనేత సొసైటీ కార్మికురాలు మంచి మల్లేశ్వరి లు ఆవిష్కరించారు. మహాసభలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుములు వీరబ్రహ్మం కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం నివేదికపై మహాసభలో ప్రతినిధుల చర్చించి నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. భవిష్యత్ కర్తవ్యాల కార్యచరణ ప్రణాళికను రూపొందించారు. మహసభలో చేనేత కార్మిక సంఘ నాయకులు, చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకష్ణ -
చేనేత సహకార సంఘం జిల్లా అధ్యక్షుడిగా శివదుర్గారావు
మాట్లాడుతున్న చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకష్ణ సత్తెనపల్లి: ఏపీ చేనేత సహకార సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా సత్తెనపల్లికి చెందిన కట్టా శివదుర్గారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఫణిదం చేనేత సహకార సంఘం భవన్ ఆవరణలో బుధవారం జరిగిన ఏపీ చేనేత సహకార సంఘం పల్నాడు జిల్లా మూడో మహసభలో 10 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా అనుముల వీరబ్రహ్మం, కమిటీ సభ్యులుగా బిట్రా పానకాలు, పంతంగి ప్రభాకర్, గడ్డం సుసులోవ్, గనికపూడి ఏసురత్నం, వలపర్ల దిబ్బ య్య, మోపపర్తి బాబురాజు, మల్లాల గురవయ్య, సాముల నాగలక్ష్మిలను ఎన్నుకున్నారు. -
తురకపాలెంలో మరణమృదంగం..
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: ప్రజారోగ్య పరిరక్షణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలం అవుతోంది. గతేడాది విజయనగరం జిల్లా గుర్లలో కలరా బారినపడి అమాయకులు మృత్యువాత పడిగా, ఇప్పుడు గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో తాజాగా తలెత్తిన మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన మే నుంచి ఇప్పటి వరకూ గ్రామంలో 45 మంది వరకూ మృత్యువాతకు గురయ్యారని సమాచారం అందుతుండగా, అధికారికంగానే ఈ సంఖ్య 30గా ఉంది. మృత్యువాతకు గురైన వారిలో ఎక్కువ మంది 18 నుంచి 50 ఏళ్ళలోపు వారే కావటం గమనార్హం. ప్రమాదకరమైన మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ మరణాలు సంభవించినట్టు వైద్య శాఖ అనుమానిస్తోంది.ఎవరిపై ఎక్కువ ప్రభావం బర్ఖోల్డేరియా సూడోమాలీ అనే బ్యాక్టీరియా సోకిన వారిలో ప్రమాదకరమైన మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. షుగర్, లివర్, కిడ్నీకి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈ వ్యాధి భారత్సహా దక్షిణ ఆసియాలోని ఇతర ఉష్ణమండల ప్రాంతాలలో వర్షా కాలంలో ఎక్కువగా ప్రబలుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు మొదలై క్రమంగా రోగనిరోధక శక్తి క్షీణించి చివరకు ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరణాలు సంభవిస్తాయి.తీవ్ర నిర్లక్ష్యం డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాల కేసులు కొంత అనుమానాస్పదంగా నమోదయితే చాలు.. ఆ ప్రాంతంలో సర్వేలెన్స్ పెట్టి కేసులు నమోదుకు గల కారణాలను అన్వేíÙంచాలి. అలాంటిది పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ప్రైవేట్ ఆస్పత్రిలో మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ అని నిర్ధారించిన 3వారాల అనంతరం ప్రత్యేక బృందాలను తురకపాలెంకు పంపి ప్రభుత్వం హడావుడి చేసింది. గ్రామంలో ఇప్పటికే 45 మంది మృతిచెందగా, 29 మంది బాధితుల నుంచి రక్తనమూనాలు తీసి గుంటూరు వైద్య కళాశాల ల్యాబ్కు పంపారు. ఇన్ఫెక్షన్ నిర్ధారణకు బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం డీఎంహెచ్వో బృందం ప్రజల నుంచి రక్తనమూనాల సేకరించింది. క్షణ క్షణం.. భయం భయం ఈ గ్రామం అంటే భయం ఏ స్థాయికి చేరిందంటే, బంధువులుసహా బయటి వ్యక్తులు ఎవ్వరూ గ్రామానికి రావడం లేదు. రాత్రి 8 దాటితే గ్రామంలో ఎవ్వరూ సంచరించడం లేదు.అతిసారంతో వృద్ధురాలి మృతి తిరుపతికి చెందిన సుభద్ర(75) ఆదివారం ఓ విందులో పాల్గొన్నారు. అనంతరం వాంతులు, విరోచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మరణించింది. విందులో పాల్గొన్న మరో 40 మంది కూడా ఆస్పత్రి పాలయ్యారు. రక్త నమూనాల పరీక్షల కోసం ఎదురుచూస్తున్నాం: వైద్య బృందం ఈ మరణాలు మెలియోడోసిస్ కారణంగా జరిగాయా లేదా అన్న విషయం శనివారంలోగా అందే రక్త నమూనాల పరీక్షల నివేదిక ఫలితాల ద్వారా తెలుస్తుందని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషషన్ (డీఎంఈ) డాక్టర్ రఘునందన్ పేర్కొన్నారు. డాక్టర్ రఘునందన్ నేతృత్వంలోని వైద్య బృందం బుధవారం బాధిత గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా రఘునందన్ ఏమన్నారంటే, ‘‘ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో ఇద్దరు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు జ్వరంతో ఉన్న 29 మంది నుంచి సేకరించిన రక్తనమూనాలను గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని మైక్రోబయోలజీ ల్యాబ్లో పరీక్షిస్తున్నారు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే మెలియోడోసిస్ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐవీ యాంటీబయోటిక్ చికిత్స ద్వారా రోగులు కోలుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. ఈ బృందంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి ఇతర అధికారులు ఉన్నారు. వెల్దుర్తిలో ముగ్గురికి డెంగీ లక్షణాలు కర్నూలు జిల్లా వెల్దురిలో ఇటీవల డెంగీ బారిన పడి చిన్నారి మోక్షిత మృతి చెందగా.. తాజాగా మరో ముగ్గురిలో డెంగీ లక్షణాలు కనిపించాయి. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో 15వ వార్డు ఓవర్హెడ్ ట్యాంకు వద్ద ఏడాది చిన్నారి, అదే వార్డుకు చెందిన నిఖిల్.. 7వ వార్డుకు చెందిన ఇంటర్ విద్యార్థి డెంగీ లక్షణాలతో చేరారు.కారణాలు.. అనుమానాలు!» గ్రామంలో పారిశుధ్యం క్షీణించడం తాగునీరు కలుషితం కావడం » సమీప క్వారీల నుంచి వెలువడే దుమ్ము, ధూళి » నాసిరకం మద్యం వరుస మరణాలతో గ్రామంలోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మా ఊరికి అసలు చుట్టాలు రావాలంటేనే భయపడిపోతున్నారు. గ్రామంలో ఏం జరుగుతోందో అర్థం కావటంలేదు. మా కళ్లముందే బాగా తిరుగుతున్న వ్యక్తులు ఉన్నట్టుండి ఒక్కసారిగా జ్వరాల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. – తురకా దాసు, తురకపాలెం గ్రామస్తుడు. -
మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం
తాడేపల్లి రూరల్: ‘డ్రగ్స్ వద్దు బ్రో.. చదువే ముద్దు బ్రో’ అనే నినాదంతో విద్యార్థులు మత్తుపదార్థాలను తరమికొట్టాలని ఏపీ ఈగల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. ‘డ్రగ్స్ వినియోగం వలన కలిగే నష్టాల’పై మండలంలోని వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్ యూనివర్సిటీలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రవికృష్ణ మాట్లాడుతూ ఇప్పుడు మాదక ద్రవ్యాలు వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయన్నారు. యువతలో మాదకద్రవ్యాల అలవాటు పెద్ద సవాలుగా మారిందన్నారు. మొదట స్నేహితుల ఒత్తిడి లేదా ఆసక్తితో మొదలై తర్వాత బానిసలుగా మారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ఈ చీకటి లోకంలోకి అడుగు పెడితే బయటకు రావడం చాలా కష్టమని తెలిపారు. సమస్యను అధిగమించే దిశగా పయనిస్తూ మాదకద్రవ్యాలను అరికడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.రవికుమార్, డీన్ ప్రసాద్, రిజస్ట్రార్ సుబ్బారావు, డీఎస్పీ సింగయ్య, సీఐ విక్టర్, ఎస్ఐ సునీల్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలి ఈగల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ -
పిడుగురాళ్లలో వందేభారత్ను ఆపాలి
పిడుగురాళ్ల: వందే భారత్కు స్టాపింగ్ కల్పించాలంటూ జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టెంట్ కమిటీ మెంబర్ జూలకంటి శ్రీనివాసరావు విన్నవించారు. సికింద్రాబాద్లో బుధవారం జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే 75వ జెడ్ఆర్యూసీసీ మీటింగ్లో రైల్వే అధికారులకు విన్నవించినట్లు ఆయన తెలిపారు. పిడుగురాళ్ల స్టేషన్లో వందే భారత్, ఎల్టీటీ ఎక్స్ప్రెస్, భావ్నగర్ ఎక్స్ప్రెస్, రామేశ్వరం ఎక్స్ప్రెస్లు ఆగే లా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. నడికుడి – శ్రీకాళహస్తి నూతన రైలు మార్గంలో కొత్తగా రైళ్లు నడపాలని, పల్నాడు ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల రద్దీ ఎక్కుగా ఉందని బోగీల సంఖ్య పెంచాలని కోరానన్నారు. పిడుగురాళ్ల – నడికుడి రైల్వే స్టేషన్ల మధ్య గడిచిన నెలల్లో దోపిడీలు పలు మార్లు జరిగినందున ప్రయాణికులకు భద్రత పెంచాలని, రైల్వే పోలీసుచే రాత్రిళ్లు గస్తీ ఏర్పాటు చేయాలని సమావేశం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీ వత్సవకు వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. -
టిష్యూ కల్చర్ అరటికి సబ్సిడీ
కొల్లూరు : టిష్యూ కల్చర్ అరటి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ లభిస్తుందని మండల ఉద్యాన శాఖాధికారి కల్యాణ చక్రవర్తి తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాగుకు ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. మండలంలోని జువ్వలపాలెం, కిష్కింధపాలెం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ పంటలకు చీడ, పీడలు ఆశించకుండా అధికారుల సూచనల మేరకు మందులు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ఏఓ వి.నరేంద్రబాబు మాట్లాడుతూ సాగు చేసిన ప్రతి పంటను రైతు సేవా కేంద్రాల్లో ఈ–క్రాప్ బుకింగ్ చేయించుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి బి.ఎన్. వంశీ, వీహెచ్ఏ ఎం. నవీన్, వీఏఏలు కె. విజయ్కుమార్ పాల్గొన్నారు. -
‘ఛత్ర’ గణపతి
గుంటూరు జేసీగా అశుతోష్ శ్రీవత్స గుంటూరువెస్ట్: గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా అశుతోష్ శ్రీవత్సను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ఇప్పటి వరకు వెయిటింగ్లో ఉన్నారు. గుంటూరు జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న ఎ.భార్గవ్తేజను జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి నగరంపాలెం: ఏపీలో పలు రేంజ్లలోని ఎనిమిది మంది సీఐలకు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతులుగా కల్పిస్తూ రాష్ట్ర డీజీపీ హరిష్కుమార్గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా గుంటూరు రేంజ్లోని సీఐలు ఎం.వెంకట సుబ్బారావు, కె.వెంకటేశ్వర్లు, బెల్లం శ్రీనివాసరావు, సీహెచ్ చంద్రమౌళిలకు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి లభించింది. 16 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత నగరంపాలెం (గుంటూరు వెస్ట్): అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ముగ్గురిపై పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పాత గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందస్తు సమాచారంతో సీతానగర్ రెండో వీధి పీడీఎస్ దుకాణం నుంచి తరలివెళ్తున్న రేషన్ బియ్యం టాటా ఏసీ ఆటోను బుధవారం పరమయ్యకుంట వద్ద పట్టుకున్నారు. అందులో 16 క్వింటాళ్ల బియ్యం బస్తాలను గుర్తించారు. కోళ్ల మేతకు ఉపయోగించేందుకు ఈ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు దుకాణం నిర్వాహకుడు దాసరి శ్రీను, ఆటో యజమాని చంద్రశేఖర్రెడ్డి, పల్నాడు జిల్లా నకరికల్లు గుండ్లపల్లికి చెందిన షేక్ అలీపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ‘పచ్చ’ పైత్యం... రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు -
వైభవంగా నృసింహుని పవిత్రోత్సవాలు
మంగళగిరి: మంగళాద్రిలో వేంచేసివున్న శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు బుధవారం ఉదయం గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం హోమాలు జరిగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను ఈవో సునీల్కుమార్ పర్యవేక్షించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. పశ్చిమ డెల్టాకు 6,830 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,830 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 296, బ్యాంక్ కెనాల్కు 1,748 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 598, పశ్చివ కాలువకు 204, నిజాపట్నం కాలువకు 200, కొమ్మూరు కాలువకు 3,120, బ్యారేజి నుంచి సముద్రంలోకి 60,150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. యువతకు ప్రేరణాత్మక సందేశం గుంటూరు మెడికల్: సర్వేపల్లి రాధాకృష్ణ మనవడు ఎ. సుబ్రహ్మణ్య శర్మ బుధవారం నగరానికి విచ్చేశారు. డాక్టర్ శనక్కాయల అరుణ, ఎ.కృష్ణారావుల నివాసానికి బుధవారం వచ్చి యువతతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘ఇండియా ఈజ్ ఇన్ యువర్ హార్ట్’ అనే ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. దేశభక్తి, క్రమశిక్షణ, కృషి ద్వారానే యువత తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉదయశంకర్, రాధా మాధవి, ఉమా శంకర్, రాజ కుమారి పాల్గొన్నారు. ఆత్మీయ ఆతిథ్యంతో అల్పాహారం ఏర్పాటు చేశారు. స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహాగణపతికి ప్రత్యేక పూజలు గుంటూరు రూరల్: నగర శివారు ఇన్నర్ రింగ్రోడ్డులో ఏర్పాటు చేసిన 99 అడుగుల మట్టి మహాగణపతికి శ్రీశైల దేవస్థానం నుంచి తెచ్చిన 36 అడుగుల వరి కంకుల గజమాలను బుధవారం అలంకరణ చేశారు. సింగంశెట్టి సుబ్బారావు దంపతులు వరి కంకుల గజమాలను తెచ్చి స్వామివారికి అలంకరింపజేశారు. సౌత్ డీఎస్పీ భానోదయ బుధవారం స్వామి వారిని దర్శించుకుని, పూజలు చేశారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నరేంద్ర, వైస్ చైర్మన్ రాజానాయుడు, సెక్రటరీ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీటీడీ అన్నదాన ట్రస్ట్కు రూ.10 లక్షల విరాళం తిరుమల: టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు గుంటూరు జిల్లాకు చెందిన భక్తుడు ఆలపాటి సురేష్ రూ.10,11,111 విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన డీడీని బుధవారం సాయంత్రం తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి స్వయంగా అందజేశారు. -
శాంతించిన కృష్ణమ్మ
ఊపిరి పీల్చుకుంటున్న రైతులు కొల్లూరు: కృష్ణా నదీ తీర గ్రామాల ప్రజలు, రైతులను భయాందోళనలకు గురి చేసిన కృష్ణమ్మ ఎట్టకేలకు శాంతించింది. నెల రోజుల నుంచి నదిలో నిండుగా నీరు ప్రవహించింది. వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో బుధవారం నీటి మట్టం కూడా అడుగంటడం మొదలెట్టింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటి విడుదలను ఆ శాఖాధికారులు తగ్గించడంతో రైతులను వరద భయం వీడింది. ఎగువనున్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి కూడా నీటి విడుదల నిలిచిపోయింది. మున్నేరు తదితర వాగుల నుంచి వస్తున్న స్వల్ప మొత్తంలో నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదలవుతోంది. బుధవారం ఉదయం 1.73 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవగా, క్రమంగా అధికారులు తగ్గించారు. సాయంత్రానికి 36 వేల క్యూసెక్కులకు పరిమితమైంది. యథాతథంగా రాకపోకలు వరద తీవ్రత తగ్గిన కారణంగా మండలంలోని దోనేపూడి కరకట్ట దిగువున పోతార్లంక మార్గంలో లోలెవల్ వంతెన పైనుంచి రాకపోకలు యథథావిధిగా జరుగుతున్నాయి. ఇన్నాళ్లు వరద భయంతో ఆందోళనకు గురైన పరీవాహక ప్రాంత రైతులు కృష్ణమ్మ శాంతించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. -
కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో అల్లాడుతున్న జిల్లా ప్రజలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు, గుంటూరు మెడికల్: జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. తురకపాలెంలో అంతుచిక్కని రోగంతో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. అటు కూటమి పాలకులు, ఇటు జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పేదల ఆరోగ్యం అంటే కనీసం లెక్కలేకుండా పోతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పలు ఆసుపత్రులలో నాడి పట్టి చూసే దిక్కు కూడా లేదు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళితే రూ. లక్షల్లో బిల్లులు వేసి అందినకాడికి గుంజుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధితో బెంబేలు గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో అంతుచిక్కని జ్వరం ప్రజలను అల్లాడిస్తోంది. మెలియాయిడోసిస్ జ్వరంగా కొంత మంది వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి సోకితే ప్రాణాలు పోతున్నాయి. రెండు నెలల వ్యవధిలో సుమారు 25 మంది చనిపోయినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా గ్రామంలో అత్యధిక సంఖ్యలో జ్వర పీడితులు ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గ్రామస్తులంతా నూతన రకం జ్వరంతో భయాందోళనలు చెందుతున్నా వైద్య అధికారులు ఇప్పటి వరకు వ్యాధికి గల కారణాలు నిర్ధారించలేదు. వారి భయాలు తొలగిపోయేలా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొద్దిరోజులుగా మీడియాలో గ్రామంలో నెలకొన్న భయాలపై కథనాలు ప్రచురితం కావడంతో మంగళవారం నామమాత్రంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తూతూ మంత్రంగా చర్యలు జిల్లా వైద్య అధికారులు జూన్, జూలై నెలల్లో డెంగీ, మలేరియా అవగాహన మాసోత్సవాల పేరుతో ఒకటి రెండు రోజులు ర్యాలీలు చేసి మిన్నకుండిపోయారు. కేవలం పట్టణాల్లోనే ఒకటి, రెండు రోజులు ప్రచార ఆర్భాటాలు ఉంటున్నాయి తప్ప, గ్రామస్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఏమాత్రం జరగడం లేదు. ఫ్రైడే డ్రైడే పేరుతో వారంలో ఒక్కరోజు వైద్య సిబ్బంది హడావుడి చేయడం తప్ప, నిజంగా జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్న దాఖలాలు లేవు. దోమల నియంత్రణలో భాగంగా చేసే ఫాగింగ్, ఇతర కార్యక్రమాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. నిధులు ఖర్చు తప్ప, వ్యాధుల కట్టడి లేదు. జ్వరాలు వచ్చిన వెంటనే గతంలో ప్రత్యేకంగా ఫీవర్ సర్వే నిర్వహించి, వ్యాధులు పెరగకుండా కట్టడి చేసేవారు. నేడు ఫీవర్ సర్వే అటకెక్కింది. టెలీ మెడిసిన్ పేరుతో గతంలో అన్ని రకాల వ్యాధులకు ముఖ్యంగా ఫీవర్లకు ఫోన్లో సమాచారం అందజేసి మందులు సైతం వైద్య సిబ్బంది ద్వారా ఇంటికి పంపించేవారు. నేడు టెలీ మెడిసిన్ వైద్యం ఊసేలేదు. వ్యాధుల పట్ల అవగాహన కల్పించి రోగులకు ధైర్యాన్ని కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఫీవర్ సర్వే, టెలీ మెడిసిన్ కార్యక్రమాలు నేడు కనుమరుగయ్యాయి. ఫీవర్ సర్వే చేయిస్తున్నాం జిల్లాలో కొద్దిరోజులుగా జ్వరాల కేసులు నమోదవుతున్న దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే చేయిస్తున్నాం. దోమల నియంత్రణ కోసం ఫాగింగ్, ఇతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక జ్వరాలతో ఆందోళన చెందుతున్న తురకపాలెంలో స్పెషాలిటీ వైద్యులను ప్రత్యేక బృందాలుగా తీసుకెళ్లి వైద్య శిబిరం నిర్వహించాం. రక్తపు నమూనాలు సేకరించాం. మూడు రోజుల అనంతరం ఆ రిపోర్టులు వస్తాయి. దాన్ని బట్టి పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తాం. – డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు నగరంలోనే ఎక్కువ కేసులు జిల్లాలో ఈ సీజన్లో ఇప్పటివరకు డెంగీ 60, మలేరియా 2, చికున్గున్యా 14 కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో పట్టాభిపురం, అరండల్పేట, ఎన్టీఆర్ స్టేడియం, లాలాపేట, చౌత్రా సెంటర్, ఎన్టీఆర్ నగర్, ఎన్జీవో కాలనీ, యాదవబజారు, నల్లచెరువు, శారదాకాలనీ, అమరావతి రోడ్డు, గుంటూరువారి తోట, లాలాపేట, మంత్రివారి బజారు, గుండారావు పేట, ఎల్ఆర్ నగర్, తదితర ప్రాంతాల్లో 33 కేసులు నమోదయ్యాయి. కేవలం గుంటూరు నగరంలోనే 33 డెంగీ కేసులు నమోదవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోనే కేసుల తీవ్రత ఇలా ఉంటే గ్రామాల్లో ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. చాలా మంది ప్రజలు జ్వరాలతో మంచం ఎక్కారు. పలువురు ప్రభుత్వ వైద్యులు అందుబాటులో లేక ఆర్ఎంపీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులను కట్టడి చేయాల్సిన వైద్య అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోవడం వల్లే జ్వరాల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కామిరెడ్డి నానిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్ కామిరెడ్డి నానిపై టీడీపీ గూండాల దాడి ఘటనను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నానితో ఆయన ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. నాని ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.తనపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, టీడీపీ గూండాలు ఎలా దాడిచేశారనేది కామిరెడ్డి నాని.. వైఎస్ జగన్కు వివరించారు. తనపై దాడి తర్వాత చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళితే అక్కడకు కూడా వచ్చి దాడి చేశారని నాని చెప్పారు. ప్రశాంతమైన దెందులూరు నియోజకవర్గంలో ఈ తరహా దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను దారుణంగా ఇబ్బందులు పెట్టడంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలను బలంగా తిప్పికొడదామని వైఎస్ జగన్ సూచించారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడడం దారుణమన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అర్థమై ఇలా కూటమి నేతలు భయోత్సాతం సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.ఈ అనైతిక కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీకి తగిన బుద్ది చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నానికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని భరోసానిచ్చారు. -
కమలమ్మ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కమలమ్మ మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో నాన్నతో పాటు మృతి చెందిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అద్దంకి సాల్మన్ కేరి వెస్లీ వర్ధంతి రోజునే ఆయన మాతృమూర్తి కమలమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.హెలికాప్టర్ ప్రమాదంలో నాన్నతో పాటు మృతి చెందిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అద్దంకి సాల్మన్ కేరి వెస్లీ వర్ధంతి రోజునే ఆయన మాతృమూర్తి కమలమ్మ మృతి చెందడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా.— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025 -
ఏపీ ఆదాయం.. అసలు వాస్తవం ఇదే: బుగ్గన
సాక్షి, తాడేపల్లి: గత నెలలో రాష్ట్ర ఆదాయాలు పడిపోవటంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. బుగ్గన తెలిపిన వివరాలను ఎక్స్లో వైఎస్సార్సీపీ పోస్టు చేసింది. గత ఆగస్టు నెలలో ఎస్.జీ.ఎస్.టీ. ఆదాయాలు భారీగా తగ్గిపోయాయి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికీ, వాస్తవ ఆదాయాలకు చాలా తేడా ఉంది. జీఎస్టీ ఆదాయాలు భారీగా తగ్గిపోవటానికి కూటమి ప్రభుత్వ బలహీన ఆర్థిక విధానాలే కారణం’’అని బుగ్గన పేర్కొన్నారు.‘‘గత ఆగస్టు 23న వైఎస్ జగన్ చేసిన ట్వీట్పై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్ర ఆదాయాలు, పెట్టుబడుల్లో క్షీణతపై జగన్ ప్రశ్నిస్తే ప్రభుత్వం మౌనంగా ఉంది. 2023 ఆగస్టు నుండి 2025 ఆగస్టు వరకు CAGR కేవలం 7.0 శాతం మాత్రమే ఉంది. నికర GST ఆదాయాల CAGR 6.94 శాతం మాత్రమే. ఈ ఏడాది కనిపిస్తున్న పెరుగుదల అనేది వాస్తవ వృద్ధి కాదు’’ అని బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.Note on SGST revenues for Augsut 2025 by Sri Buggana Rajendranath ( @BugganaRaja )Quite contrary to the narrative of the State Government, concerning the GST revenues growth during August, 2025, the year-on-year growth of GST revenues during August 2025 over August 2024 of 21%… https://t.co/gYGXjj11sM— YSR Congress Party (@YSRCParty) September 3, 2025‘‘మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ఆర్థిక వృద్ధి 15 శాతం CAGRతో ఉందని చెప్తున్నారు. వాస్తవంగా జీఎస్టీ ఆదాయాల వృద్ధి 7 శాతం మాత్రమే. ఇది చాలా నిరాశాజనకమైన ఫలితం. ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడటానికి చక్కని విధానాలను రూపొందించాలి. అది వదిలేసి జీఎస్టీ వృద్ధిని విజయంగా చూపించుకోవటానికి తాపత్రయ పడుతోంది’’ అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ దుయ్యబట్టారు. -
ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు.. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా..? అంటూ సీఎం నారా చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. రైతులను అన్ని విధాలా దగా చేశారని మండిపడ్డారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు పంటలకు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఏ రోజూ ఆదుకోలేదని నిప్పులు చెరిగారు. ఈ మేరకు బుధవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ⇒ చంద్రబాబు గారూ.. మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే యూరియా బస్తా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి రైతులు క్యూల్లో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారు? మరోవైపు తాజాగా ఉల్లి, చీనీ, మినుము ధరలు పతనమై రైతులు లబోదిబోమంటున్నారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా మీలో కనీస చలనం కలగడం లేదెందుకు? ⇒ ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి.. అందుకు అనుగుణంగా ఏమేరకు ఎరువులు పంపిణీ చేయాలి.. ఈ విషయాలపై ప్రతి ఏటా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. మరి యూరియా సమస్య ఎందుకు వచ్చింది? ఐదేళ్ల మా పాలనలో ఇలాంటి సమస్య ఎప్పుడూ లేదన్నది వాస్తవం కాదా? ఇవాళ మీరు వైఫల్యం చెందారంటే ప్రభుత్వం సరిగా పని చేయడం లేదనే కదా అర్థం? ⇒ ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారులు నల్ల బజారుకు తరలించి, వాటిని బ్లాక్ చేస్తున్నారు. బస్తా యూరియా రేటు రూ.267 అయితే, దీనికి మరో రూ.200 అధికంగా అమ్ముకుంటున్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు. ఎవ్వరి మీదా చర్యలు లేవు. పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు)లకు, ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లకు సరైన కేటాయింపులు లేవు. దీనికి కారకులు మీరే కదా చంద్రబాబు గారూ.. మా హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే పంపిణీ చేశాం. పీఏసీఎస్ల ద్వారా మార్కెట్ రేటు కన్నా రూ.50 తక్కువ రేటుకు రైతుకు అందించగలిగాం. మీరెందుకు ఆపని చేయలేకపోతున్నారు చంద్రబాబు గారూ? ఎందుకంటే బ్లాక్ మార్కెట్ నుంచి మీ కొచ్చే కమీషన్ల కోసం కాదా? ⇒ మరో వైపు పంటలకు గిట్టుబాటు ధరలు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వరుసగా పంటల ధరలు పతనమవుతున్నా, ఈ రెండేళ్లలో వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్క జొన్న, సజ్జ, రాగులు, అరటి, చీనీ, కోకో, పొగాకు ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, చిత్తశుద్ధితో ఏరోజూ రైతును మీ ప్రభుత్వం ఆదుకోలేదు. క్వింటా ఉల్లి సగటున క్వింటాలుకు రూ.400–500కు క్షీణించినా పట్టించుకునే నాథుడే లేడు. మరోవైపు ఇదే ఉల్లిని బహిరంగ మార్కెట్లో కిలో రూ.35తో అమ్ముతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఉల్లి క్వింటా రూ.4 వేల నుంచి రూ.12 వేలతో అమ్ముడయ్యేది. అంటే కేజీ రూ.40 నుంచి రూ.120 దాకా రైతులు అమ్ముకున్నారు. ⇒ ధరలు పతనమైనప్పుడు మా హయాంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించింది. మా ఐదేళ్ల కాలంలో, రైతులకు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు తోడుగా నిలబడ్డాం. చీనీ ధర కూడా ఇప్పుడు మీ హయాంలో పడిపోయి టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే పలుకుతోంది. మా హయాంలో టన్నుకు కనిష్టంగా రూ.౩౦ వేలు, గరిష్టంగా రూ.లక్ష ధర రైతులకు లభించింది. కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన సమయంలో రైతుల వద్ద చీనీ పంట ఉండిపోతే, ప్రభుత్వమే కొనుగోలు చేసి, ప్రత్యేక రైళ్లు పెట్టి.. ప్రభుత్వంగా రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు ఇంత సంక్షోభం వచ్చినా మీరు పట్టించుకోవడం లేదెందుకు చంద్రబాబు గారూ? నిద్ర నటించే వాళ్లని ఎవరైనా లేపగలరా?.@ncbn గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి… pic.twitter.com/McVux8ufFL— YS Jagan Mohan Reddy (@ysjagan) September 3, 2025⇒ మేం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. దీనికింద రూ.7,802 కోట్లు ఖర్చు చేసి మేం రైతులకు తోడుగా నిలబడితే మీరు ఆ విధానానికి మంగళం పాడారు. పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై రియల్ టైం డేటా సీఎంఏపీపీ (కాంప్రహెన్షివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్)ను మూలన పడేశారు. రైతులకు చేదోడుగా నిలిచే ఆర్బీకేల వ్యవస్థను నాశనం శారు. ఉచిత పంటల బీమాకు పాతర వేశారు. ఏ సీజన్లో పంట నష్టం వస్తే, అదే సీజన్ ముగిసేలోపు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, మరుసటి సీజన్లోగా ఇచ్చే క్రాప్ ఇన్సూరెన్స్ (పంట నష్టపరిహారం)ను అందించే పద్ధతినీ ధ్వంసం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ ఎత్తివేశారు. మేం క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాను ఎత్తివేసి, పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామని ఎన్నికల్లో మాట ఇచ్చి, వెన్నుపోటు పొడిచారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.5 వేలు మాత్రమే. అది కూడా సుమారు 7 లక్షల మంది రైతు కుటుంబాలకు ఎగ్గొట్టారు. అందుకే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. -
‘సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో వైఎస్ జగన్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడంలో ఐటీ వింగ్ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీలో టెక్నాలజీ ప్రాముఖ్యత, సులభంగా అర్థమయ్యే రీతిలో పార్టీ లైన్ క్యాడర్కు, ప్రజలకు వివరించడంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరగడం మంచి పరిణామంగా సజ్జల పేర్కొన్నారు. బుధవారం.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఐటీ వింగ్ సమావేశం జరిగింది. సజ్జలతో పాటు ఐటీ వింగ్ ప్రెసిడెంట్ పోశింరెడ్డి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ్ భాస్కర్ రెడ్డి, అన్ని జిల్లాల ఐటీ వింగ్ అధ్యక్షులు, పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, ఆలూరి సాంబశివారెడ్డి, తలారి రంగయ్య, టీజేఆర్ సుధాకర్ బాబు, దవులూరి దొరబాబు, పలువురు నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సాంకేతికతను వాడుకుంటూ ఏ విధమైన మెకానిజం ఉండాలన్న దానిపై కూడా మనం చర్చిద్దాం. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనే మెకానిజాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ను అనుసంధానించడం అనేది ఒక ముఖ్యమైన ఎజెండాగా మనం ముందుకెళ్ళాలి. అబద్దాన్ని నిజం అని చంద్రబాబు, టీడీపీ చేస్తున్న ప్రచారం బలంగా తిప్పికొట్టాలి...ఐటీ వింగ్లో క్రియాశీలకంగా ఉన్నవారినందరినీ ఒక గ్రిడ్ కిందకు తీసుకువచ్చి అందరినీ మమేకం చేయాలి. పార్టీలోని అన్ని కమిటీల నిర్మాణంపై సీరియస్గా దృష్టిపెట్టాలి, వారి బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన కల్పించాలి. మనమంతా ఒక ఆర్గనైజ్డ్ టీమ్గా ముందుకెళ్ళాలి. దానికి తగిన విధంగా మనం సిద్ధం కావాలి. రాష్ట్రస్థాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసుకుని అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలి. అందరూ ఫోకస్తో కష్టపడి పనిచేసి పార్టీ మెకానిజంలో భాగస్వాములవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
జిల్లావ్యాప్తంగా ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మరణం లేని మనిషి దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు కొనియాడారు. మహానేత వైఎస్సార్ వర్ధంతి పురస్కరించుకుని బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కోర్టు, అమరావతి రోడ్డు, ముత్యాలరెడ్డినగర్, కొరిటెపాడు, స్వామి థియేటర్ సెంటర్, లక్ష్మీనగర్, ఆదర్శనగర్, హౌసింగ్ బోర్డుతోపాటు, పలు ప్రాంతాల్లో పర్యటించి వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. పార్టీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ పేదల గుండెకు భరోసా కల్పించి, ఎంతటి ఖర్చు అయినా ఆరోగ్యశ్రీ ద్వారా వారికి మేలు చేకూర్చిన ఆరోగ్య ప్రదాత వైఎస్సార్ అని కీర్తించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.పొన్నూరు నియోజకవర్గంలో..వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. పొన్నూరు రూరల్ మండలం మామిళ్లపల్లిలో డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం, పొన్నూరు రూరల్ మండలం మునిపల్లె గ్రామం, పొన్నూరు రూరల్ మండలం పచ్చలతాడిపర్రు, పొన్నూరులోని పార్టీ కార్యాలయంలో, పొన్నూరులోని అంబేడ్కర్ సెంటర్ వద్ద, పొన్నూరు రూరల్ మండలం వెల్లలూరు, మంచాల, చేబ్రోలు, నారాకోడూరు, పెదకాకాని గ్రామాల్లో డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో కార్యకర్తలు, నేతలు, అభిమానులు పాల్గొన్నారు.మంగళగిరి నియోజకవర్గంలో..తాడేపల్లి రూరల్, తాడేపల్లి టౌన్, మంగళగిరి టౌన్, మంగళగిరి రూరల్, దుగ్గిరాలలో దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొని డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల స్థాయి, గ్రామస్థాయి నేతలు, అభిమానులు పాల్గొన్నారు.తాడికొండ నియోజకవర్గంలో..బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు తెలిపారు. మంగళవారం డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా పేరేచర్ల డొంక రోడ్డులో వద్దగల డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లూరు వంశీకృష్ణ, పేరేచర్ల గ్రామ అధ్యక్షుడు షేక్ సుభాని, ముత్యాల బాలస్వామి, గండికోట రసూలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.తెనాలి నియోజకవర్గంలో..తెనాలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కొల్లిపరలో బొంతు వారి గుడి వద్ద వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొల్లిపర మాయాబజార్ సెంటర్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తూములూరు గ్రామంలో సెంటర్లోని హైస్కూల్ దగ్గర వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. తూములూరు అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. వల్లభపురం గ్రామంలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో శివకుమార్ పాల్గొని వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.ప్రత్తిపాడు నియోజకవర్గంలో..ప్రత్తిపాడు, ఏటుకూరు బైపాస్లోని నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ మాతృమూర్తి మణెమ్మ, తనయుడు కౌశిక్ కిరణ్లు పాల్గొని డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రూరల్ మండలంలో నల్లపాడు, చల్లావారిపాలెం, మల్లవరం గ్రామాల్లో ఎంపీపీ ఇంటూరి పద్మావతి, అంజిరెడ్డిలు పాల్గొని డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండల కన్వీనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. -
చురుగ్గా రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
మంత్రి నాదెండ్ల మనోహర్ అత్తోట(కొల్లిపర): రాష్ట్రంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ చురుగ్గా కొనసాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. మంగళవారం గుంటూరు జిల్లా అత్తోటలో ఆయన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల మందికి స్మార్ట్ కార్డ్లు అందిస్తున్నట్లు చెప్పారు. చౌక దుకాణాల ద్వారా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు అందిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. చౌక దుకాణాలను రానున్న రోజుల్లో మినీ మార్ట్లుగా తీర్చిదిద్దుతామన్నారు. వీటి ద్వారా తక్కువ ధరకే ఆర్గానిక్, నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు. రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్నారు. త్వరలో సబ్సిడీపై టార్ఫలిన్ పట్టాలు అందిస్తామన్నారు. యూరియా అందడం లేదని రైతుల ఫిర్యాదు తమకు యూరియా అందడం లేదని అత్తోట గ్రామ రైతులు మంత్రి నాదెండ్లకు ఫిర్యాదు చేశారు. ఆయన స్పందిస్తూ.. ఎరువుల విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.