breaking news
Editorial
-
ట్రంప్ ‘శాంతి’కి గ్రహణం
ఎనిమిది యుద్ధాలను ఆపానని స్వోత్కర్షకు పోతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువు తీసేలా ప్రపంచంలో రెండుచోట్ల మళ్లీ కుంపట్లు రాజుకున్నాయి. సుంకాలు విధిస్తానంటూ బెదిరించి రెండునెలల క్రితం ఆయన ఆగ్నేయాసియా దేశాలైన థాయ్లాండ్ – కంబోడియాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఆపి సఖ్యత కుదిర్చారు. ఆ రెండింటి మధ్యా సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం కుదిరిందని ఆర్భాటంగా ప్రకటించారు. తీరా అయిదురోజుల నాడు కంబోడియా మందుపాతరకు తమ సైనికుడు తీవ్రంగా గాయపడటంతో థాయ్ వైమానిక దళం దాడులు ప్రారంభించింది. ఈసారి దాదాపు పదిమంది మరణించగా వేలాదిమంది జనం ప్రాణభయంతో గ్రామాలు విడిచి పెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. కంబోడియా సైన్యం ప్రతీకార దాడులతో థాయ్ గ్రామాల ప్రజలు కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. మొత్తానికి అటూ, ఇటూ 5 లక్షలమంది నిరాశ్ర యులయ్యారు. ఆఫ్రికాలో పరస్పరం తలపడుతున్న కాంగో–రువాండాల మధ్య కేవలం వారం క్రితం ట్రంప్ శాంతి ఒప్పందం కుదిర్చారు. కానీ అది కూడా విఫలమైంది. పర్యవ సానంగా కాంగోలోని సరిహద్దు గ్రామాలను 2 లక్షల మంది ఖాళీ చేయాల్సి వచ్చింది. రువాండా తిరుగుబాటు సంస్థ ఆ గ్రామాల్లోకి ప్రవేశించిందంటున్నారు.సమస్య మూలమేమిటో తెలుసుకోకుండా, ఇరుపక్షాలూ ఎలాంటి పరిష్కారాన్ని కోరుకుంటున్నాయో గ్రహించకుండా, అందుకు ఏర్పడుతున్న అడ్డంకులేమిటో అర్థం చేసుకోకుండా... ఒక ఫోన్ కాల్తో, ఒకటి రెండు బెదిరింపులతో అంతా సమసిపోతుంద నుకుంటే అవి మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి. ట్రంప్ దౌత్యం విఫలం కావటానికి కారణం ఇదే. ఇరుగు పొరుగు దేశాల మధ్య భూభాగం గురించే ప్రధానంగా ఘర్షణలుంటాయి. థాయ్లాండ్–కంబోడియాల సమస్య కూడా అదే! రెండు దేశాలకూ 817 కిలోమీటర్ల పొడవునా సరిహద్దు ఉంది. ఫ్రాన్స్ దురాక్రమణలో కంబోడియా ఉండగానే వందేళ్ల క్రితం థాయ్లాండ్తో పేచీ ఏర్పడింది. 1953లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దాన్ని పరిష్కరించుకుందామని కంబోడియా ప్రయత్నిస్తోంది. కానీ రెండువైపులా పుట్టు కొచ్చే జాతీయవాద ధోరణులు అందుకు అడ్డంకిగా మారాయి. 2008లో వివాదాస్పద భూభాగంలోని 11వ శతాబ్దం నాటి హిందూ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వార సత్వ సంపదల జాబితాలో చేర్చినప్పుడు అది తమదేనని కంబోడియా ప్రకటించు కోవటంతో ఘర్షణలు తలెత్తాయి. వాస్తవానికి 1962లోనే ఆ భూభాగం కంబోడియా దేనని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది. కానీ అందుకు థాయ్ లాండ్ ససేమిరా అంటున్నది.మొన్న జూలైలో ఇరువైపులా 50 మంది మరణానికి దారితీసిన ఘర్షణలు రాజు కున్నప్పుడు అప్పటి థాయ్ ప్రధాని పెటోంగ్టార్న్ షినవత్రా, కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్తో జరిపిన ఫోన్ సంభాషణలు లీక్ అయ్యి ఆమె పదవి పోగొట్టు కున్నారు. తమ సైన్యం కూడా సరిగా వ్యవహరించటం లేదని ఆమె అంగీకరించటం దేశంలో పెద్ద దుమారం లేపింది. నాలుగు దశాబ్దాలు దేశాన్నేలిన హున్ సేన్ ఇప్పటికీ ప్రస్తుత ప్రధాని, తన కుమారుడు హున్ మానెట్ను తెర వెనక ఉండి నడిపిస్తుంటారు. ఆయనతో మాట్లా డితే తప్ప సమస్య పరిష్కారం కాదని షినవత్రా అనుకోవటం కొంప ముంచింది. తాజా వివాదం పర్యవసానంగా కంబోడియా పౌరులను దేశంలోకి రానీయ కుండా థాయ్లాండ్ సరిహద్దుల వద్ద అడ్డుకుంటుండగా, థాయ్ సినిమాల ప్రసారం, అక్కడి పండ్లు, కూరగాయలు, గ్యాస్, ఇంధనం రాకుండా కంబోడియా నిలిపేసింది.థాయ్–కంబోడియా ఘర్షణలైనా, కాంగో–రువాండాల కొట్లాట అయినా ప్రత్యర్థి దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించినప్పుడే పరిష్కారమవుతాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ అధికారం కోసం జాతీయవాద ధోరణులు రెచ్చగొట్టడం వల్ల సమస్య లొచ్చిపడుతున్నాయి. థాయ్లాండ్లో వచ్చే ఫిబ్రవరి 6న ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, దేశాన్ని రక్షించేది తామేనని చెప్పటానికి కంబో డియాపై యుద్ధభేరి మోగించటంతో పాటు పాలకపక్షం శుక్రవారం పార్లమెంటును రద్దు చేసింది. మళ్లీ ఇరుపక్షాల మధ్యా రాజీ కుదురుస్తానని ట్రంప్ చెబుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
విద్వేష భాషపై పంజా!
దేశంలోనే తొలిసారి విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. కోస్తా కర్ణాటకలో మొన్న ఏప్రిల్లో మతపరమైన హత్య చోటు చేసుకున్నాక జరిగిన పరిణామాల పరంపర తర్వాత ఇలాంటి చట్టం తెస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. మన రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూనే దానికి సహేతుకమైన పరిమితులు విధించింది. సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇతర రకాల చర్యల్ని అరికట్టడానికి గతంలో ఐపీసీలో, ఇప్పుడు బీఎన్ఎస్లో నిబంధనలున్నాయి. కానీ దురదృష్టమేమంటే అవి అసమ్మతిని అణచడానికి పనికొచ్చినట్టు విద్వేష ప్రసంగాలను అదుపు చేయటానికి తోడ్పడటం లేదు. కనుక ప్రత్యేక చట్టం తీసుకు రావటం హర్షించదగ్గదే. ‘విద్వేషం ప్రతి ఒక్కరినీ ప్రమాదంలోకి నెడుతుంది. అందుకే దానిపై పోరాడటం అందరి బాధ్యతా కావాలి’ అన్నారు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్. నిజానికి విద్వేషపూరిత ప్రసంగాలు మనుషుల ఉసురు తీస్తాయని, మత, కుల ఘర్షణలకు కారణ మవుతాయని పదిపదిహేనేళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరు. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగాక ఇలాంటి ప్రసంగాలూ, సందేశాలూ సమాజ మనుగడకు పెను సవాలుగా మారాయి. ఎక్కడో కాదు... కర్ణాటకలోనే విద్వేషపూరిత ప్రసంగాలు, సందే శాల ప్రభావంతో దుండగులు 2015లో ప్రముఖ రచయిత, హేతువాది, కన్నడ యూని వర్సిటీ మాజీ వైస్చాన్సలర్ ఎంఎం కల్బుర్గిని, 2017లో ప్రముఖ సంపాదకురాలు, రచయిత్రి గౌరీ లంకేష్ను పొట్టనబెట్టుకున్నారు. భావప్రకటనాస్వేచ్ఛ ముసుగులో ఇష్టానుసారం మాట్లాడటం, తమకు నచ్చని అభిప్రాయాలున్న వారిపై ఉసిగొల్పేలా ప్రసంగాలు చేయటం ఉన్మాదం. కర్ణాటక విద్వేష ప్రసంగాలూ, విద్వేష నేరాలు (నివారణ, నియంత్రణ) బిల్లు ఈ మాదిరి చర్యల్ని సరిగానే గుర్తించింది. కేవలం ప్రసంగాలే కాదు...సమాజ గమనానికి ముప్పు కలిగించే రాతలు, చిత్రాలు, దృశ్యాలు వగైరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయటం కూడా ఈ బిల్లు శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. మతం, కులం, భాష, జెండర్, జాతి, ప్రాంతం, అంగవైకల్యం తదితరాల పేరిట వ్యక్తులపై లేదా బృందాలపై విద్వేషాన్ని ప్రేరేపిస్తే వివిధ రకాల శిక్షలు నిర్దేశించింది. మొదటి నేరానికి ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ, అనంతర నేరాలకు రెండునుంచి పదేళ్ల వరకూ శిక్ష, జరిమానా వేయొచ్చు. ఈ నేరాలను శిక్షార్హమైన, బెయిల్కు వీలుకాని నేరాలుగా పరిగణించటం దీని తీవ్రతను తెలియ జేస్తోంది. సంస్థల పేరిట నేరాలకు పాల్పడిన పక్షంలో వాటి నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తారు. ఆన్లైన్లో ప్రచారంలో ఉండే విద్వేషపూరిత అంశాలను తొలగించమని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ప్రజా ప్రయోజనార్థం విద్యాసంబంధ, కళాత్మక, సాహిత్య, శాస్త్రీయ దృష్టితో చేసే ప్రసంగా లకూ, ఇతరేతర సందేశాలకూ ఇది మినహాయింపును ఇచ్చింది. బాధితులకు నష్టపరి హారం ఇచ్చేందుకు కూడా ఇందులో ఏర్పాటుంది.అయితే ఇలాంటి బిల్లుల రూపకల్పనలో అస్పష్టతకు తావుండటం వల్ల పోలీసులకు అపరిమిత అధికారాలు దక్కుతాయి. అవి దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా ఎక్కువే. గతంలో టాడా చట్టం, ఇప్పుడు యూఏపీఏ విషయంలో ఈ ఆరోపణ లున్నాయి. హిందూ మతసంస్థల అణచివేతకే ఈ చట్టం తీసుకు రాబోతున్నారని బీజేపీ విమర్శిస్తుండగా, పౌర సమాజ కార్యకర్తలు సైతం బిల్లులోని అంశాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా మానసికంగా గాయ పరచటం అనే భావనకు చోటున్నందు వల్ల దుర్వినియోగానికి అవకాశాలెక్కువ. వాస్తవంగా ఫలానా ప్రసంVýæం సమాజంలో ఘర్షణలకు కారణమని ధ్రువపడటం, దాని కారణంగా హత్య జరిగిందని నిర్ధారణ కావటం వంటి సందర్భాల్లో చట్టం తోడ్పడాలి. కానీ విస్తృత భాష్యం చెప్పగలిగే వాటిని చేర్చటంవల్ల చట్టం ఉద్దేశమే దెబ్బతింటుంది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు మార్గదర్శకాలున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు కనబడదు. దుర్వినియోగానికి తావు లేని రీతిలో చట్టం ఉన్నప్పుడే నిజమైన నేరగాళ్లకు శిక్షపడుతుంది. ఆ దిశగా ఆలోచించటం అవసరం. -
దిక్కుతోచని ఉక్రెయిన్
నెలలు గడుస్తున్నా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విరమణకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అసహనం కట్టలు తెంచుకున్నట్టు కనబడుతోంది. మధ్యవర్తిగా తన ప్రతిపాదనలకు ససేమిరా అంటున్న ఉక్రెయిన్తోపాటు, దానికి దన్నుగా నిలబడిన యూరప్ దేశాలను కూడా ఆయన తూర్పార బడుతున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతున్నదనీ, యూరప్ దేశాలు బలహీనంగా మారి క్షీణదశకు చేరుకున్నాయనీ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. వైరి పక్షాలు ఎటూ నువ్వా నేనా అన్నట్టు ఉంటాయి. మధ్యవర్తిత్వం వహించే దేశం ఓపిగ్గా వాస్తవ పరిస్థితులను అర్థం చేయించి ఏదోమేరకు తగ్గేలా చేయటం అవసరం. కానీ అలా చేయాలంటే మధ్యవర్తిత్వం వహించే దేశానికి విశ్వసనీయత, ప్రతిష్ఠ ఉండాలి. ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాకు ఆ రెండూ తగ్గాయి. ఏ విషయంలోనూ ఆయన నిలకడగా లేకపోవటం, ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తూ అయోమయాన్ని సృష్టించటం కారణం. జో బైడెన్ హయాంలో అమెరికా ప్రాపకంతోనే యూరప్ దేశాలు ఉక్రెయిన్ను రష్యాపైకి ఉసిగొల్పాయి. కానీ ట్రంప్ వచ్చాక అంతా తలకిందులయి యూరప్ దేశాలకు దిక్కుతోచడం లేదు. అంతేకాదు, ఇటీవల జాతీయ భద్రతా వ్యూహం పేరిట అమెరికా విడుదల చేసిన విధాన పత్రం కూడా వాటికి మింగుడుపడటం లేదు. అట్లాస్ మాదిరిగా ఒంటరిగా భూగోళాన్ని మోయటం ఇకపై ఉండబోదనీ, యూరప్ స్వీయరక్షణ బాధ్యత చూసుకోవాలనీ ఆ పత్రం స్పష్టం చేసింది. ప్రపంచాధిపత్యం కోసం పోటీపడటం పర్యవసానంగా అమెరికా బలహీనపడిందనీ, అందుకే పాత విధానానికి అవసరమైన దిద్దుబాట్లు తప్పనిసరనీ తేల్చింది. ఇప్పటికి ఎనిమిది యుద్ధాలు ఆపానని తరచు చెప్పే ట్రంప్ జాబితాలో నిజానికి ఇప్పటికైతే ఉక్రెయిన్ లేదు. కానీ ఆయన అధికార పగ్గాలు చేపట్టిననాడే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని శపథం చేశారు. 2014కు ముందున్న సరిహద్దుల సంగతి ఉక్రెయిన్ మర్చిపోవాలని చెబుతూ వచ్చారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ భూభాగాన్ని వదులుకోవటానికి ససేమిరా అంటున్నారు. నిజానికి 2022లో ఉక్రెయిన్కూ, ఆయనకు మద్దతునిస్తున్న యూరప్ దేశాలకూ బంగారం లాంటి అవకాశం వచ్చింది. టర్కీ మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో రష్యా తనకు తానే రాజీకి సిద్ధపడింది. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటాననీ, నాటోలో చేరబోననీ హామీ ఇస్తే దురాక్రమించిన భూభాగం నుంచి వైదొలగుతామని రష్యా ప్రతినిధి బృందం ప్రతిపాదించింది. యూరప్ నుంచి కూడా దీనిపై హామీ కావాలని కోరింది. అప్పటికి రష్యా పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టి కొన్ని నెలలు మాత్రమే అయింది. కానీ బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటీన ఉక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి రాజీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని నచ్చజెప్పారు. నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాతోనే జాన్సన్ ఈ సైంధవపాత్ర పోషించారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ మొండికేస్తున్నారు. ఆయనకు శాంతియుత పరిష్కారం ఆలోచనే లేదు. ఆధిపత్య స్థాపనే లక్ష్యం. భారత్ వచ్చేముందు ఈ సంగతి నిర్మొహమాటంగా చెప్పారు. ‘ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వైదొలగితే సరే... లేదా దాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటాం’ అని ఆయన ప్రకటించారు. వైరిపక్షాలు చర్చలంటూ మొదలుపెడితే వాటి వైఖరులు ఏదోమేరకు చల్లారుతాయి. కానీ ఆ చర్చలు ఫలించాలంటే తొలుత కాల్పుల విరమణ పాటించాలి. రష్యా, ఉక్రెయిన్ రెండూ అందుకు సిద్ధపడటం లేదు. యుద్ధ వాతావరణంలో చర్చలు ప్రశాంతంగా సాగబోవన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి రష్యా ప్రతిపాదనలకు అంగీకరించమంటూ ఉక్రెయిన్పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో అమెరికాతో నేరుగా మాట్లాడే ధైర్యంలేని యూరప్ దేశాలు... ట్రంప్ను ఖాతరు చేయొద్దని ఉక్రెయిన్కు నూరిపోస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు కాలదన్నుకుంటే, అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారితే ఏమవుతుందో ఉక్రెయిన్ ఈ దశలోనైనా గుర్తెరగాలి. దీన్నుంచి బయటపడాలంటే సొంత గొంతు వినిపించటం ప్రారంభించాలి. -
ఇండిగో బ్లాక్మెయిలింగ్
ప్రయాణికులపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తరచు వార్తల్లోకెక్కే ‘వివాద’యాన సంస్థ ఇండిగో... తనకు నచ్చని నిబంధనలు అమల్లోకి రావటాన్ని జీర్ణించుకోలేక వారం రోజులపాటు దేశంలో పౌర విమానయానాన్ని దాదాపు స్తంభింపజేసింది. కనీవినీ ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయి, వేలాదిమంది ప్రయాణికులు దారీతెన్నూ తోచక ఇబ్బందులు పడ్డారు. కనీసం ప్రత్యామ్నాయాలు వెదుక్కుందామన్నా లగేజీ ఆచూకీ దొరక్క నరకయాతన అనుభవించారు. వారం గడుస్తున్నా యథాపూర్వ స్థితి ఇంకా ఏర్పడలేదు. కాకపోతే కాస్త మెరుగైంది.ఈ పాపంలో కేంద్ర ప్రభుత్వానికీ వాటా ఉంది. ఇండిగో ధిక్కరణను పసిగట్టలేని అమాయకత్వం క్షంతవ్యమేనా? తక్కువ చార్జీలతో ప్రయాణికులను ఆకట్టుకుని, సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటూ, ఎవరికీ అందని స్థాయిలో విస్తరించుకుంటూ పోయిన ఇండిగో ఆ రంగంలో గుత్తాధిపత్యాన్ని నెలకొల్పింది. గత పాతికేళ్లలో మూతబడిన జెట్ ఎయిర్వేస్, ఎయిర్ సహారా, ఎయిర్ డెక్కన్, కింగ్ఫిషర్ వగైరా 9 సంస్థలు ఇండిగో చకచకా ఎదగటానికి దోహదపడ్డాయి. పర్యవసానంగా పౌర విమానయాన రంగంలో ఇండిగో 61 శాతం వాటాను సాధించగలిగింది. మరో సంస్థ ఎయిరిండియా 30 శాతం దగ్గర నిలిచింది.పోటీదారులందరినీ దాటుకుని శరవేగంతో దూసుకుపోవటం, లాభార్జన అదే స్థాయిలో పెరగటం, స్వల్ప కాలంలోనే సమర్థవంతమైన సంస్థగా పేరు తెచ్చుకోవటం, ఏటా పది కోట్ల మంది ప్రయాణికులను చేరేయటం ప్రశంసించదగ్గ విజయమే కావొచ్చు. కానీ గగనతలంలో 35,000 అడుగుల ఎత్తున ఎగిరే విమానాలతోపాటే దాని అహంకారమూ పడగలెత్తింది. విమానయాన రంగాన్ని శాసిస్తున్న తనకు విధివిధానాలు నిర్దేశించటానికి పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ఎవరన్న స్థాయికి చేరుకుంది. అందుకే ఉద్దేశపూర్వకంగా ధిక్కారాన్ని ప్రదర్శించింది. ‘కేవలం అవగాహన లేమి వల్లా, ప్రణాళికల రూపకల్పనలో జరిగిన లోటుపాట్ల వల్లా’ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందన్న ఇండిగో ప్రకటన ఉత్త వంచన. ఎందుకంటే దేశీయ విమాన సర్వీసుల్ని ఎడా పెడా రద్దు చేసిన ఆ సంస్థ... అంతర్జాతీయ సర్వీసుల్లో కేవలం 10 శాతానికి మాత్రమే కోతపెట్టింది. ఆ సర్వీసులు ఇష్టానుసారం రద్దు చేస్తే భారీ మొత్తాల్లో జరిమానాలుంటాయి మరి.డీజీసీఏ ఏర్పరిచిన నిబంధనలు ఇప్పటివి కాదు. గత ఏడాది మొదట్లోనే... అంటే దాదాపు రెండేళ్లనాడే ఆ ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. లాభార్జన కోసం తక్కువ మందితో ఎక్కువ సర్వీసులు నడిపే ధోరణి ప్రమాదకరమన్న ఉద్దేశంతో విధించిన పరిమితులవి. వారంలో పైలెట్లకుండే విశ్రాంతి సమయాన్ని 36 గంటలనుంచి 48 గంటలకు పెంచటం, రాత్రి వేళల్లో పైలెట్లు పనిచేసే సమయాన్ని 10 గంటలకు పరిమితం చేయటం, ఒక పైలెట్ వారానికి రెండుసార్లకు మించి నైట్ ల్యాండింగ్లు చేయరాదన్న నిబంధన అందులో భాగమే. ఇవన్నీ గత నెల 1 నుంచి అమలు చేయాలని కోరింది.ఈ ఏడాది కాలంలో ఇండిగో ఇందుకోసం సాగించిన కసరత్తేమీ లేదు. పైగా ఒకరి పైలెట్లను మరొకరు తీసుకోరాదని వేరే సంస్థలతో లాలూచీకి దిగి పనిగంటలు పెంచింది. సిబ్బంది వేతనాలను స్తంభింపజేసింది. ఇతర సంస్థలన్నీ దారిలోకి వచ్చినప్పుడు ఇండిగోకు మాత్రమే ఏమిటి సమస్య? గండం గట్టెక్కటానికి గత్యంతరం లేక డీజీసీఏ తన నిబంధనలు సడలించుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఏర్పరిచిన నిబంధనలకే దిక్కులేకపోవటం విషాదం కాదా? బ్లాక్మెయిలింగ్కు లొంగటం కాదా? ప్రతిదానికీ ప్రైవేటు మంత్రం జపించే పాలకులకు ఇండిగో వ్యవహారం కనువిప్పు కావాలి.సంక్షోభ సమయాల్లో టిక్కెట్ ధరలు పెంచి ప్రయాణికుల జేబులు కొల్లగొడు తున్నా పట్టనట్టుండే ధోరణి ఇండిగో వంటి సంస్థలకు కొమ్ములూ కోరలూ తెచ్చింది. ధిక్కరణకు పురిగొల్పింది. ఉన్న రెండు ప్రధాన విమానయాన సంస్థల్ని సరిగా పర్యవేక్షించలేని కేంద్ర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు చేతగానితనం ఈ పర్యాటక సీజన్లో దేశం పరువు తీసింది. ఈ వ్యవహారంలో జవాబుదారీతనాన్ని నిగ్గు దేల్చి కేంద్రమంత్రితో సహా బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలి. -
నిర్లక్ష్యం మంటలు!
ఎక్కడ ఎలాంటి ఉపద్రవాలు చోటుచేసుకుంటున్నా నిర్లిప్తంగా, నిమిత్తమాత్రంగా మిగిలిపోతున్న వ్యవస్థలున్నచోట మరో ఘోరం జరిగిపోయింది. గోవాలోని అర్పోరా గ్రామ సమీపంలో ఆదివారం వేకువజామున ఒక నైట్ క్లబ్లో చెలరేగిన మంటల్లో చిక్కు కుని, పొగతో ఊపిరాడక 25 మంది కన్నుమూశారు. మరో ఆరుగురు గాయపడ్డారు.రెండేళ్లుగా ఎలాంటి అనుమతులూ, లైసెన్సులూ లేకుండా అక్కడ వ్యాపారం సాగు తున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రభుత్వం ఇప్పుడు సంతాపం ప్రకటించి, నష్టపరిహారం వాగ్దానం చేసింది. ఈ క్లబ్ నిర్మాణాన్ని గ్రామ పంచాయతీ సకాలంలో పసిగట్టి 2023 డిసెంబర్లో నోటీసులు జారీచేసింది. పర్యావరణపరంగా అది అత్యంత సున్నితమైన ప్రాంతం గనుక అక్కడ ఎలాంటి నిర్మాణాలూ జరపరాదని తెలిపింది. 2024 ఏప్రిల్లో దాన్ని కూల్చేయాలంటూ నోటీసులిచ్చింది. అటుతర్వాత ఏం జరగాలో అదే జరిగింది. స్థల యజమాని పంచాయతీరాజ్ డిప్యూటీ డైరెక్టర్ వద్ద అప్పీల్ చేశాడు. ఆ వెంటనే స్టే జారీ అయింది. మొన్న ఆగస్టులో బీజేపీ సభ్యుడు సంకల్ప్ అమోంకర్ దీన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. ఉప్పు మడులు, పంటపొలాలు ఉన్నచోట యథేచ్ఛగా, చట్టవిరుద్ధంగా నైట్ క్లబ్లు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. కానీ జరిగిందేమీ లేదు. అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అంటున్నారు. మంచిదే. కానీ శాసనసభలో ప్రస్తావనకొచ్చి మూణ్ణెల్లు దాటుతున్నా చేసిందేమిటి?మంటలు ఆర్పడానికొచ్చిన అగ్నిమాపక వాహనాలు 400 మీటర్ల అవతలే నిలిచి పోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో ఊహించవచ్చు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకున్నా చాలాసేపు నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. శనివారం రాత్రి 11.30 ప్రాంతంలో డీజేల హోరుమధ్య బెల్లీ డ్యాన్స్ కార్యక్రమం సాగు తుండగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో బాణాసంచా కాల్చడం, అలంకరణ కోసం పైకప్పుపై వెదురు, ఫైబర్, గడ్డి వగైరాలతో చేసిన నిర్మాణంపై ఆ నిప్పు రవ్వలు పడటం వల్ల ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ఆ సమయానికి బయటకు పోయేందుకు ఉన్న ఒకే ఒక తోవ ఇరుగ్గా ఉండటంతో బయటపడటం కష్టమైందనీ, దాంతో కొందరు బేస్మెంట్వైపున్న మెట్లు దిగార నీ, అటు వెళ్లినవారంతా దట్టమైన పొగ వ్యాపించటంతో ఊపిరాడక చనిపోయారనీ ప్రత్యక్ష సాక్షుల కథనం. క్లబ్ నిర్మించాక అగ్నిమాపక సిబ్బంది, ఇతర అధికారులు దాన్ని సందర్శించి ఉంటే ఇలాంటి విషాదాన్ని ముందే ఊహించేవారు. ఎక్కడెక్కడ వెలుపలికి పోయే మార్గాలుండాలో, మంటలు ఆర్పటానికి తోడ్పడే పరికరాలను ఎక్కడ అందుబాటులో ఉంచాలో సూచించేవారు.మంటల కారణంగా విద్యుత్ నిలిచిపోయాక ఆ ప్రాంతమంతా గాఢాంధకారం అలుము కుని తొక్కిసలాట చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గోవాలో క్లబ్ల కొచ్చేవారిలో అత్యధిక శాతం యువత. విదేశీయులతోపాటు వేర్వేరు రాష్ట్రాల్లో కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేవారు వారాంతంలో బృందాలుగా గోవాకు వస్తుంటారు. ఎంతో బంగారు భవిష్యత్తుగల ఈ యువత కారణంగా కోట్లాది రూపాయల వ్యాపారం సాగించే క్లబ్లు కనీస రక్షణ చర్యలు తీసుకోవటంలో విఫలం కావటం, పన్నుల రూపంలో ఆదాయాన్ని ఆర్జించే ప్రభుత్వం కూడా పట్టనట్టు వ్యవహరించటం దుర్మార్గం. ఇలాంటి క్లబ్బుల్లో అడపా దడపా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ఉదంతాలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో బయటపడుతున్నాయి. అయినా ముందు జాగ్రత్తలు లేవు.పాశ్చాత్య విష సంస్కృతిని అరువు తెచ్చుకుని వ్యాపారం సాగించటం ఈ బాపతు క్లబ్బుల బతుకుతెరువు. మద్యం ఏరులై పారే, జూదం చోటుచేసుకునే ఇలాంటి వాటిని నడవనీయరాదన్న ఉన్నతాశయం ప్రభుత్వాలకు ఎటూ ఉండటం లేదు. కనీసం వాటిని నియంత్రించటమైనా తమ బాధ్యతగా భావించకపోవటం విషాదకరం. క్లబ్బులే కాదు... ఆకాశాన్ని తాకే భవంతులు సైతం ఎలాంటి ప్రమాణాలూ పాటించకుండానే నిర్మాణ మవుతున్నాయి. అసలు మన దేశంలో అగ్నిమాపక వ్యవస్థ అత్యంత నాసిరకమైనది. అగ్నిమాపక కేంద్రాలు తక్కువ. అక్కడి సిబ్బంది వాడే పరికరాలు, వాహనాలు చాలా భాగం కాలం చెల్లినవి. కనీసం తాజా ఉదంతమైనా పాలకుల కళ్లు తెరిపిస్తుందా? ఆ రంగం సమూల ప్రక్షాళనకు పురిగొల్పుతుందా? -
కార్పొరేట్ ‘స్వర్గం’
‘‘నేను ఎప్పుడూ స్వర్గం అనేది ఒక గ్రంథాలయంలా ఉంటుందని ఊహిస్తాను’’ అన్న అర్జెంటీనా రచయిత జార్జ్ లూయీ బోర్హెస్ ప్రసిద్ధ వ్యాఖ్యానపు స్ఫూర్తిని స్వీకరిస్తూ, పబ్లిక్ లైబ్రరీలకు శ్రీకారం చుట్టింది ‘కోఫోర్జ్’ సంస్థ. మూడు దశాబ్దాల క్రితం ‘నిట్’ పేరుతో ప్రారంభమై, 2020లో ‘కోఫోర్జ్’గా రీబ్రాండ్ అయిన ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ తన ‘కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబిలిటీ’లో భాగంగా దేశవ్యాప్తంగా గొలుసుకట్టు గ్రంథాలయాలకు నడుం బిగించింది. 2024 ఫిబ్రవరిలో నోయిడాలో, 2025 జూన్లో గురుగ్రామ్లో ప్రారంభమైన ఈ గ్రంథాలయపు మూడో శాఖ 15,000 పుస్తకాలతో ఈ అక్టోబర్లో హైదరాబాద్లోని కొండాపూర్లో ప్రారంభమైంది. ఉదయం 9 నుంచి రాత్రి 8 దాకా సంవత్సరంలో 365 రోజులూ తెరిచి ఉండటం వీటి ప్రత్యేకత.ఫిక్షన్, హిస్టరీ, సెల్ఫ్ హెల్ప్, రెలిజియన్ అండ్ స్పిరిచ్యువాలిటీ, సైకాలజీ, ఫిలాసఫీ, సైన్స్, పాలిటిక్స్, మేనేజ్మెంట్, రిఫరెన్స్ లాంటి విభాగాలతో ప్రధానంగా ఆంగ్ల పుస్తకాలతోపాటు కొద్దిస్థాయిలో హిందీ, తెలుగు విభాగాలను కూడా హైదరాబాద్లో ఏర్పాటుచేశారు. ఉర్దూ విభాగానికి కూడా డిమాండ్ వస్తోందని చెబుతున్నారు. కావాల్సిన పుస్తకపు అందుబాటును అక్కడ ఏర్పాటుచేసిన రెండు పెద్ద టచ్ స్క్రీన్స్ మీద వెతుక్కోవచ్చు. ‘చిల్డ్రెన్స్ సెక్షన్’ విడిగా ఉండటం చిన్నారులను ఉత్సాహపరుస్తుంది. ది ఇల్లూమినేటెడ్ రూమి; డేనియల్స్ ఇండియా: వ్యూస్ ఫ్రమ్ ద ఎయిటీన్త్ సెంచరీ; ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా; ద లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ వాన్ గో; బిబేక్ దేబ్రాయ్ పది వాల్యూముల మహాభారతం; హాన్ కాంగ్ ‘ద వైట్ బుక్’తో పాటు ‘బిగ్ ఐడియాస్ ఎక్స్ప్లెయిన్డ్ సిరీస్’లో ద మూవీ, ద హిస్టరీ, ది ఎకనామిక్స్, ది ఆర్ట్ లాంటివెన్నో అందుబాటులో ఉన్నాయి.‘యోచన ముఖ్యమైనదే కానీ అసలు ప్రాధాన్యం ఉన్నది ఆచరణకే’ అని సంస్థ సీఈఓ సుధీర్ సింగ్ నమ్మకం. అందుకే కాబోలు, మనకు అనుభవంలో ఉండే గ్రంథాలయాల ముతకదనానికి భిన్నంగా కార్పొరేట్స్కే సాధ్యమయ్యే ఒక సోఫిస్టికేషన్ ఇక్కడ కనబడుతుంది. చదవడానికి తగినంత నిశ్శబ్దం, తీర్చిదిద్దినట్టున్న ర్యాకులు, పుస్తకాలను గుట్టలుగా పోయకుండా తగినంత డిస్ప్లేకు ఇచ్చిన అవకాశం– బయట వేగంగా పరుగెడుతూ అద్దాల్లోంచి దూరంగా కనబడుతున్న వాహనాల హడావిడి ప్రపంచానికి భిన్నంగా, రెండు అరచేతుల్లో నెమ్మదిగా విప్పారే అక్షరాలు చూపించే లోకాలను ఇక్కడ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ‘విద్య వలన వినయం పుట్టును, వినయం వలన యోగ్యత కలుగును’ అని వేమన; ‘పదవులు, సంపదలు నశించును గాని జ్ఞానమనే సంపద నశించదు’ అంటూ పోతన; ‘పుస్తకాలు చదివే అలవాటులేనివాడికి అక్షర జ్ఞానం లేనివాడిమీద అదనపు అడ్వాంటేజీ ఏమీ ఉండ’దనే మార్క్ ట్వెయిన్ కవ్వింపు, ‘ఒక పాఠకుడు చనిపోయేలోపు వెయ్యి జీవితాలు జీవిస్తాడు, అదే ఎప్పుడూ చదవనివాడు ఒక్క జీవితమే జీవిస్తాడు’ అనే ఆర్.ఆర్. మార్టిన్ ఉడికింపు బోర్డులు గ్రంథాలయ సందర్శకులను ఇట్టే పుస్తకం పట్టేలా ప్రేరేపిస్తాయి.కృత్రిమ మేధ సృష్టించిన కవర్ పేజీల వాడకం వల్ల ఈ నవంబర్లో రెండు పుస్తకాలు ఒక పోటీకి అనర్హత పొందడం సాహితీ ప్రపంచంలో సంచలనానికి కారణమైంది. 65,000 డాలర్ల నగదు బహుమతితో కూడిన న్యూజిలాండ్ ప్రతిష్ఠాత్మక ‘ఆక్హామ్ అవార్డ్’ కోసం వచ్చిన ఆబ్లిగేట్ కార్నివోర్ (స్టెఫానీ జాన్సన్ కథల సంపుటి), ఏంజిల్ ట్రెయిన్(ఎలిజబెత్ స్మితర్ నాలుగు గొలుసు నవలికలు) పుస్తకాలకు ఏఐ గీసిన ముఖచిత్రాలను వాడినట్టు గుర్తించడంతో నిర్వాహకులు వాటిని పోటీ నుంచి తప్పించారు. సాహిత్య లోకంలోకి కూడా ఏఐ చొచ్చుకువచ్చి, అంతటా డిజిటల్ జపం జరుగుతున్న కాలంలో, ప్రత్యేకించి ఒక కార్పొరేట్ సంస్థ భౌతిక పుస్తకాలను అందుబాటులోకి తేవడానికి పూనుకోవడం అభినందనీయం. మున్ముందు ఢిల్లీ, పుణె, బెంగళూరు నగరాలకూ లైబ్రరీని విస్తరించే యోచన జరుగుతోంది. సాంకేతిక పరిణామాలు, వ్యాపార నమూనాలు మారినా ఎప్పటికీ నిలబడి ఉండే దీర్ఘకాలిక సామాజిక మౌలిక వసతులుగా ప్రజా గ్రంథాలయాలను చూస్తున్నామని ‘కోఫోర్జ్’ చెబుతోంది. శుభం. -
తెగిపడుతున్న జీవితాలు
జన జీవితాల పెనుహననం యథేచ్ఛగా సాగిపోతున్నది. భద్రం అనుకున్న బతుకులకు సైతం భరోసా లేని పీడకాలం క్రీడిస్తున్నది. కంచే చేను మేస్తున్నది. కాపాడవలసిన వ్యవస్థలే కబళిస్తున్నాయి. విజయవాడలోని భవానీపురం బాధితుల ఆక్రోశం టీవీలో ప్రసారమైంది కనుక లోకం దృష్టికి వచ్చింది. అయినా న్యాయం జరగలేదు. జనారణ్యంలో ఇంకా వారు రోదిస్తూనే ఉన్నారు. అసలు లోకం దృష్టికే రాని సైలెంట్ కిల్లింగ్ ఫీల్డ్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్నో... ఎన్నెన్నో! భవానీ పురంలో 42 మధ్యతరగతి కుటుంబాలు వారి కష్టార్జితంతో స్థలాలు కొనుక్కొని చాలా కాలంగా నివసిస్తున్నారు. కొందరైతే పాతికేళ్లుగా అక్కడే ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మధ్యతర గతి ప్రజలు ఇల్లు కట్టుకోవడం అంటే తమ జీవిత కాలాన్ని ధార పోయడమే! కోరికలకు పగ్గాలు వేసి, కడుపు కట్టుకొని పైసా పైసా కూడబెడితే దశాబ్దాల తర్వాత ఆ ఇల్లు సొంతమవుతుంది.అటువంటి 42 కుటుంబాల లైఫ్ టైం అఛీవ్మెంట్ను తెల్లారే సరికల్లా కూల్చి పడేశారు. ఈ రాక్షసకాండకు రక్షకభటులే రక్షణగా నిలబడ్డారు. ప్రభుత్వ పెద్దల కనుసైగలతోనే పిశాచ గణాలు నర్తించాయనడానికి ఇదే నిదర్శనం. ఇదేమీ రహస్యం కాదు, ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఆ ‘పై వాడి’కెవడికో ఈ భూమిపై మనసైందట! ఘోరంగా మరులు గొన్నాడట! ద్రౌపదిని ఈడ్చుకు రమ్మని దుర్యోధనుడి ఆజ్ఞాపన మరి! సైరంధ్రి తన సరసకు రావాలని కీచకుడు వేసిన శాసనం. తప్పదు కదా! ఆ పైవాడి ఆదేశాన్ని భృత్యులు శిరసావహించారు. వారి ‘కర్తవ్య పరాయణత’ ఎంతటిదంటే, సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఉన్నదని బాధితులు నెత్తీ నోరూ బాదుకున్నా అక్కడికి వచ్చిన అధికార ఖాకీ గులాములు ఖాతరు చేయలేదు.భవానీపురం బాధితులు ఇళ్ళు కట్టుకున్న స్థలం గత మూడు, నాలుగు దశాబ్దాలుగా వివాదంలో ఉన్నదట! కోర్టులో కేసు నడుస్తున్నది. ఈ వివాదం సంగతి బాధితులకు తెలియదు. భూ యజమానికి డబ్బులు చెల్లించి, ఈ 42 మంది ఇంటి స్థలాలు కొనుక్కున్నారు. కార్పొరేషన్కు డబ్బులు కట్టారు. అనుమతులు వచ్చాయి. బ్యాంకులు రుణాలిచ్చాయి. కరెంటు, నీటి కనెక్షన్లు వచ్చాయి. బాధితులకు స్థలాలను అమ్మడానికి పూర్వం సుమారు 40 ఏళ్ల కింద భూ యజమాని ఒక హౌసింగ్ సొసైటీకి ఒప్పందం చేశారట! కొంత డబ్బు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. కానీ, సొసైటీకి రిజిస్ట్రేషన్ చేయకుండా కోర్టులో వివాదం నడిపిస్తూ, ప్రస్తుత బాధితులకు ప్లాట్లుగా విభజించి అమ్ముకున్నాడు. ఈ మధ్యనే కోర్టు తీర్పు సొసైటీకి అను కూలంగా వచ్చింది. ఈ సొసైటీ వారు భూ యజమానికి చెల్లించిన మొత్తం ఒక లక్ష 70 వేల రూపాయలు. ప్రస్తుతం ఆ భూమి విలువ 100 కోట్లని చెబుతున్నారు.కోర్టు తీర్పును అమలు చేయకుండా నిలుపుదల చేయాలని కోరుతూ బాధితులు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆర్డర్ కాపీ అందలేదన్న మిషతో 200 మంది పోలీసుల సమక్షంలో గంటల వ్యవధిలోనే 42 గృహాలను నేలమట్టం చేశారు. ఆ బాధితులు ఎవరూ అక్రమంగా ఇళ్లను నిర్మించుకోలేదు. కష్టార్జితంతో స్థలాలు కొనుక్కొని, ఫీజులు చెల్లించి, అన్ని అనుమతులతో బ్యాంకులు ఇచ్చిన రుణాలతో ఇళ్లు నిర్మించుకున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో బాధితులు వీధిన పడకుండా సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. కానీ, పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరింపచేసి కూల్చివేతకు దన్నుగా నిలబడిందంటేనే ఈ కథలో ఇంకో మతలబు ఏదో ఉన్నదని అర్థం. స్వయంగా ఒక అక్రమ నిర్మాణంలో నివసిస్తున్న ముఖ్యమంత్రి పాలనలో 42 సక్రమ నివాసాలను కూల్చివేయడాన్ని ఏమనుకోవాలి? విజయవాడ నగరంలో ఎన్నో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కూడా అక్రమ నిర్మాణాల్లో కొనసాగుతున్నాయి. వాటి జోలికి ఈ ప్రభుత్వం వెళ్లగలదా? వెళ్లలేదు! ఎందుకంటే, సంపన్నులు, వ్యాపారవేత్తల రక్షణ, పేదలూ–మధ్యతరగతి ప్రజల భక్షణ ఈ ప్రభుత్వ పాలసీ కనుక!విశాఖలో రోడ్ల పక్కన చిరు వ్యాపారం చేసుకొనే పదివేల బడ్డీ దుకాణాలను తొలగించారు. వీరిలో చాలామంది మునిసిపల్ కార్పొరేషన్కు ఫీజు చెల్లించి, అనుమతి పత్రాలు తీసుకున్నవారే! ఎటువంటి హెచ్చరికలూ, నోటీసులూ లేకుండా ఎకాయెకిన పిడుగుపడ్డట్టుగా పదివేల బడ్డీలను తొలగించారు. పదివేల కుటుంబాల జీవనోపాధిని తెగనరికారు. అంటే 30 నుంచి 40 వేల మంది ప్రజలకు విశాఖ వీధుల్లో శిరచ్ఛేదన చేశారనుకోవాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 20 వేల మంది కార్మికుల జీవితాలపై ఇప్పటికే కత్తి వేలాడుతున్నది. విశాఖ ఉక్కును ఉద్దేశించి ఇటీవల మాట్లాడిన ఎకసెక్కపు మాటలు గమనిస్తే – దాన్నేం చేయబోతున్నారో అర్థం చేసుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్కు వెన్నెముక వంటి వ్యవసాయ రంగంలో కోటి మందికి పైగా ఉన్న రైతులు, కూలీల బాధామయ గాథలు వర్ణనాతీతం. రైతుకు ప్రభుత్వం చేసే పెట్టుబడి, బీమా సాయాల సంగతి దేవుడెరుగు. పండించిన పంటను అమ్మబోతే రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాని దైన్య పరిస్థితులు వెక్కిరించాయి. ఉల్లి రైతులు రోడ్డున పడ్డారు, క్వింటాల్కు కనీసం రెండున్నర వేలన్నా వస్తేనే పెట్టిన ఖర్చులు వస్తాయంటున్నారు. ప్రతిపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే 1,200 చొప్పున ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నది. అరటి రైతుల అవస్థలు, ఆక్వా రంగం ఆవేదన, మామిడి రైతు వెతలు, ధాన్యం రైతు కళ్ళల్లోదైన్యం.. వంటి కథనాలు ఇప్పటికే రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తున్నాయి.జగన్ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం వల్ల, ఎప్పటికప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకొని, ఈ స్థాయిలో ధరలు పతనం కాకుండా కాపాడగలిగింది. ఏడాదిన్నర కాలంలో రెండున్నర లక్షల కోట్లకు పైగా అప్పులు తెచ్చిన సర్కార్, ఐదారు వేల కోట్లను ధరల కంట్రోల్ కోసం వెచ్చించలేదా? వెచ్చించ లేకపోవడం అనేది సమస్య కాదు... వ్యవసాయ రంగం, రైతు క్షేమం బాబు సర్కార్ ప్రాధాన్యతా క్రమంలో లేవు. అందువల్లనే ఈ సంక్షోభం! కోటి కుటుంబాల్లో ఆందోళన. జీవచ్ఛవాలుగా మారుతున్న పేద రైతు కూలీలు!! పేద సమూహాల జీవన విధ్వంసకాండ ఏ ఒక్క రంగానికో, రెండు రంగాలకో పరిమితం కాలేదు. ఇది సర్వవ్యాపితం. ఉపాధి హామీ పథకంలో ఊరట పొందుతున్న వారిలో 18 లక్షల మంది జాబ్ కార్డులను రాష్ట్ర సర్కారు తొలగించింది.అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 1,500 చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు మూతపడి 20 వేల మంది ఉపాధి కోల్పోయారని కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పేదల సంక్షేమం, ఆ సమూహాల అభివృద్ధి అనే రాజ్యాంగ బాధ్యతలను గాలికొది లేసి, సంపన్న వర్గాలకు వనరులన్నీ ధారపోసే ప్రైవేటీకరణ క్రతువు నిరాటంకంగా సాగిపోతున్నది. పేదలు, మధ్యతరగతి సమూహాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారి పిల్లల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన విద్యా విప్లవాన్ని కూటమి సర్కార్ నీరుగార్చింది. పట్టణ ధనిక సమూహాల పిల్లలు కొనుగోలు చేయగలిగే నాణ్యమైన విద్య పేద, మధ్యతరగతి పిల్లలకు ఉచితంగా అందజేసే ప్రయత్నాన్ని జగన్ ప్రభుత్వం ఉద్యమంగా ప్రారంభించింది.కూటమి సర్కార్ ఆ ఉద్యమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరు గార్చింది. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్ను ఎత్తివేసింది. ఇంగ్లీష్ మీడియం బోధన తొలగించింది. సబ్జెక్టు టీచర్ల విధానాన్ని తొలగించింది. స్కూళ్లను కుదించింది. మధ్యాహ్న భోజనాన్ని నాసిరకంగా మార్చింది. కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో అటు కాలేజీలు, ఇటు విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ‘వసతి దీవెన’ బకాయిలు పేరుకుపోతున్నాయి. ‘నాడు–నేడు’ కార్యక్రమం ఆగిపోయింది. ప్రభుత్వ ఉద్దేశపూర్వక చర్యల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య మూడున్నర లక్షలు తగ్గింది. వారిలో కొందరిని ప్రైవేట్ స్కూళ్లకు పంపించి ఉండవచ్చు. అత్యధికులు డ్రాప్ అవుట్లుగా మిగిలి ఉంటారు.వాస్తవాలు ఇట్లా ఉంటే, జగన్ పాలనలో విద్యారంగంలో విధ్వంసం జరిగిందనీ, తాము ఇప్పుడు చక్కదిద్దుతున్నామనీ కూటమి పెద్దలు చెప్పుకుంటున్నారు. జగన్ చేసిన విధ్వంసం ఏమిటో, తాము చేస్తున్న ఉద్ధరణ ఏమిటో మాత్రం ససేమిరా చెప్పరు. వ్యాఖ్యానాలు చేయడమే తప్ప వివరాలు, లెక్కలు చెప్పడం వారి నిఘంటువులోనే లేదు. ‘పేరెంట్–టీచర్’ మీటింగ్లనేవి జగన్ హయాంలో సలక్షణంగా జరిగాయి. ఇంత హడావిడి లేదు. తల్లితండ్రులకు బదులు వైసీపీ కార్యకర్తలు వచ్చి కుర్చీల్లో కూర్చోలేదు. ఇప్పుడు ఈ తరహా మీటింగ్ను తామే కనిపెట్టినట్లు కూటమి చేసుకుంటున్న ప్రచారం వెగటు పుట్టించే విధంగా ఉన్నది. కాకపోతే ‘పేరెంట్–టీచర్ మీటింగ్’లను రాజకీయ వేదికలుగా మార్చుకోవడం మాత్రం ఇప్పుడే జరుగుతున్నది. ‘మోడల్ అసెంబ్లీ’లను ప్రతి ఏటా అన్ని పెద్ద స్కూళ్లలో కళాశాలలో నిర్వహించే అలవాటు అనాదిగా ఉన్నది. బహుశా చంద్రబాబు పాఠశాల విద్యార్థిగా ఉన్న రోజుల నుంచి ఉన్నది.వైద్యరంగం గురించి మాట్లాడకపోవడమే మేలు. జగన్ ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ‘పీపీపీ’ ముసుగులో ప్రైవేటీకరించడంతోపాటు, ప్రాంతీయ వైద్య సేవలను కూడా ప్రైవేట్ మార్గం పట్టించే ప్రయత్నాలు సాగుతున్నాయి. చంద్రబాబు సర్కార్ మొత్తం కార్యక్రమాల్లో ఒక క్రమం తప్పని విధానం మాత్రం కనిపిస్తున్నది. అదే... కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే విధానం! పెత్తందారీ అనుకూల పాలన. పేదల కోసం ఆయన చేసిన మహత్తర ఆలోచన ‘పీ–4’. ఒక్కో ధనవంతుడి దగ్గర పదిమంది పేదలని తాకట్టు పెట్టడం, అందుకోసం వనరులన్నీ ధనవంతులకు కట్టబెట్టడం. ఈ దుర్మార్గ విధానాన్ని కప్పిపుచ్చడానికి కోటలు దాటే మాటలతో అభివృద్ధి కబుర్లను అర్థం కాని భాషలో చెప్పడం. పరిగెత్తు కొస్తున్న లక్షల కోట్ల పెట్టుబడుల గురించి చంద్రబాబు పోచికోలు ఉపన్యాసాలు చెప్పడం!చంద్రబాబును ఓ సూపర్ మ్యాన్గా, లోకేశ్ బాబును చిన్న సూపర్ మ్యాన్గా ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా ఉండనే ఉన్నది. ఇప్పుడు ఈ బాధ్యతలను కూటమి అధికారిక ప్రతినిధులకు కూడా పంచినట్టున్నారు. ఓ జాతీయ మీడియాలో అధికార ప్రతినిధి ఒకరు చిన్న సూపర్ మ్యాన్ను ఆకాశానికి ఎత్తబోయి, బొక్క బోర్లా పడ్డారు. ఇండిగో విమానాల నిలిపివేత అంశంపై రిపబ్లిక్ టీవీలో జరిగిన చర్చలో – విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ఆర్ణబ్ గోస్వామి ప్రశ్నించారు.అందుకు టీడీపీ ప్రతినిధి బదులిస్తూ లోకేశ్ కూడా ఈ సమస్యను సమీక్షిస్తున్నారని చెప్పాడు. అసలు లోకేశ్ ఎవరు? ఆయనకేం పని?? అంటూ ఆర్ణబ్ గోస్వామి నిలదీయడంతో టీడీపీ ప్రతినిధి నీళ్లు నమలాల్సి వచ్చింది. పాపం ఆ ప్రతినిధి ఏం చేస్తాడు? చిన్నబాబు–పెద్దబాబుల భజన బాధ్యత ఆయనపై కూడా పార్టీ మోపినట్టుంది. మీడియా సామ్రాజ్యంలో అత్యధిక భాగాన్ని టీడీపీ కూటమి ఆక్రమించు కుంటున్న నేపథ్యంలో, అవి బాబుల భజనలకే ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ‘క్రెడిట్ చోరీ’ కితాబులకు దొంగ సాక్ష్యాలు చెప్పవచ్చు. కానీ, కూలిపోతున్న కోట్లాది జీవితాలను, దిగజారుతున్న జీవన ప్రమాణాలను దాచడం సాధ్యం కాదు. పేదలు, మధ్యతరగతి ప్రజలు నాణ్యమైన జీవితాన్ని నానాటికీ కోల్పోతున్నారు. జీవచ్ఛవాల సంఖ్య రోజురోజుకూ పెరుగు తున్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
'మేధే' మనిషి భవిష్యత్తు!
ఏఐ, రోబోటిక్స్ కారణంగా ఎవరికీ పని చేసే అవసరం ఉండని సౌలభ్యం 20 ఏళ్లలో మానవాళికి కలగవచ్చని అంటున్నారు ఎలాన్ మస్క్. ఆయన నిఖిల్ కామత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భవిష్యత్ పరిణామాలను అంచనా వేశారు. మస్క్ మాటల్లోని ముఖ్యాంశాలు:భారతీయులు ‘ద బెస్ట్’‘‘ప్రతిభావంతులైన భారతీయుల నుండి అమెరికా అపారమైన ప్రయోజనం పొందిందని నేను భావిస్తు న్నాను. నా సొంత టెస్లా, ఎక్స్, ఎక్స్–ఏఐ, స్పేస్ ఎక్స్లో ఉన్న అత్యంత తెలివైన నిపుణులంతా భారతీయులే. వలసదారులు అమెరికన్ల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారన్నది ఎంతవరకు వాస్తవమో నాకు తెలి యదు. నా ప్రత్యక్ష పరిశీలన ఏమిటంటే, మెరికల కొరత ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు హెచ్–1బి వీసాలతో అమెరికన్ వ్యవస్థతో ఆడుకుంటున్నాయన్నది నిజం. అలాగని, హెచ్–1బి వీసాలను నిలిపివేయాలనే ఆలోచనతో ఏకీభవించను.పని అభిరుచి అవుతుంది!‘‘నా అంచనా ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనుషులకు పని చేసే అవసరమే ఉండదు. అంటే సంపాదన అవ సరం తగ్గుతుంది. ఎందుకు, ఏ పని చేయాలన్నది కూడా వారి ఇష్టాన్ని బట్టే ఉంటుంది. పని చేయటం అన్నది దాదాపు ఒక అభిరుచిలా మారిపోతుంది. ఈ మాట మీకు నవ్వు తెప్పించవచ్చు. కానీ అది నిజమవుతుందని నేను నమ్ముతున్నాను. ఏఐ, రోబోటిక్స్లోని నిరంతర పురోగతి మనకు విధిగా పని చేయవలసిన అవసరం లేకుండా చేస్తుంది. ఏఐ, హ్యూమనాయిడ్ రోబోలు పేదరికాన్ని తొలగిస్తాయి. ప్రజలు కోరుకునే ఏ వస్తువులు, సేవలనైనా పరమ చౌకగా లభించేలా చేస్తాయి. బహుశా 10 లేదా 15 ఏళ్ల లోపే ఏఐ, రోబో టిక్స్ రంగాల అభివృద్ధి... మనిషికి పని చే సి తీరవలసిన అవసరాన్ని తగ్గిస్తాయి. లేదా తప్పిస్తాయి.డిజిటల్ ఫ్రీ... ‘లైవ్’ కాస్ట్లీ‘‘ఏఐ మనం అనుకున్న దాని కంటే చాలా వేగంగా పరు గులు పెడుతోంది. ఈ ప్రభావం ఏఐ జనరేటెడ్ రియల్ –టైమ్ సినిమాలు, పాడ్కాస్ట్లు, వీడియో గేమ్లపై విపరీతంగా ఉండబోతోంది. తత్ఫలితంగా సంప్రదాయ మీడియా భూస్థాపితం కాబోతోంది. కృత్రిమ మేధ... మానవ అనుభవాలను, ఉద్వేగాలను సైతం దాదాపు దీటుగా అనుకరించగలదు. డిజిటల్ మీడియా సర్వ వ్యాప్తమై, విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఉచితం అవుతాయి. వాటి కోసం మనం పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా ‘లైవ్ – ఈవెంట్’లకు విలువ పెరిగి, అవి ఖర్చుతో కూడుకున్న వినోదాలు అవుతాయి. మానవ అనుభూతులకు ఏఐ అన్నది పూర్తిస్థాయి ప్రత్నామ్నాయం కాలేదు కాబట్టి!వితరణలకు పెను సవాళ్లు‘‘దాతృత్వం తేలికైనదేమీ కాదు. ఉదారంగా కనిపించటం కంటే ఉదారంగా ఇవ్వటానికి తగిన కారణాలను నిర్ధారించుకోవటం కష్టమైన పని. మీ విరాళం నిజంగా ఒక సమస్యను పరిష్కరిస్తుందని మీరు గుర్తించగల గాలి. ఆ ప్రయత్నంలోనే మీరు అనేకమైన సవాళ్లను అవాస్తవాల (అపాత్ర దానాల) రూపంలో ఎదుర్కొన వలసి వస్తుంది. ‘మస్క్ ఫౌండేషన్’ నిధుల పరంగా బలిష్ఠమైనది. కానీ ఏదీ నా పేరు మీద ఉండదు. ఏ ఫౌండేషన్కైనా అతిపెద్ద సవాలు–డబ్బును ఇచ్చేందుకు యోగ్య మైన అవసరాలను కనిపెట్టడం!అంతిమ కరెన్సీగా ‘ఎనర్జీ’‘‘ఇది కొంత వింతగా అని పిస్తుంది. కానీ భవిష్యత్తులో అందరికీ అన్నీ ఉన్నప్పుడు విలువల కొలమానాలకు భౌతికమైన డబ్బు అవసరం ఉండదు. అదొక భావనగా అదృశ్యమైపోయి, ‘ఎనర్జీ’ అనేది నిజమైన కరెన్సీగా స్థిరపడుతుంది. మీరు కావాలనుకుంటే కొన్ని ప్రాథమిక కరెన్సీలు (డాలర్లు, యూరోలు, పౌండ్లు) ఉంటాయి కానీ, ఎనర్జీ అనేది దేశాల స్థాయిలో కరెన్సీగా చలా మణీలోకి వస్తుంది. బిట్ కాయిన్ నిర్వహణ ఎనర్జీపైనే కదా ఆధారపడి ఉన్నది! భవిష్యత్తులో ఏదో ఒక సమ యంలో డబ్బు ఒక ప్రమాణంగా ప్రాధాన్యాన్ని కోల్పో తుంది. ఇంధన శక్తి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది. - ఎడిటోరియల్ టీమ్ -
శిఖరాగ్ర బంధం!.. రష్యాతో అనుబంధం
సంక్లిష్ట సమయాల్లో సైతం నమ్మకమైన నేస్తంగా నిరూపించుకున్న రష్యాతో అనుబంధం మరింత దృఢతరమైంది. గురువారం భారత పర్యటన కోసం వచ్చిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జరిపిన శిఖరాగ్ర సమావేశమైనా, ఆపై ఇరు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాలైనా ఈ సంగతిని నిరూపిస్తున్నాయి. వర్తమాన ప్రపంచ స్థితిగతులు సజావుగా ఏమీ లేవు. ఉక్రెయిన్తో రష్యా నాలుగేళ్లుగా యుద్ధంలో తలమునకలైంది.గడియకో మాట మాట్లాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంగతెలా ఉన్నా యూరప్ దేశాలు ఈ విషయంలో రష్యాపై కత్తులు నూరుతున్నాయి. ఉక్రెయిన్ సమస్యను శాంతియుతంగా పరిష్కరించటానికి మధ్యమధ్యలో ట్రంప్ ప్రయత్నిస్తున్నా యూరప్ దేశాలు... ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఎట్లాగైనా రష్యా మెడలు వంచాలని చూస్తున్నాయి. పుతిన్ భారత పర్యటనకు ముందు ‘మా భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించండి’ అంటూ భారత్లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) రాయబారి హెర్వ్ డెల్ఫిన్ మనకు చెప్పటం గమనించదగ్గది.రష్యా చమురు కొంటున్నందకు ఇప్పటికే అమెరికా ఆగ్రహించి, మనపై 25 శాతం అదనపు సుంకాలు విధించింది. ఇతరత్రా వాణిజ్య ఒప్పందాలకు బ్రేక్ వేయాలంటూ ఒత్తిళ్లు తెస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానంగా నాలుగేళ్ల నుంచి రష్యాకు పాశ్చాత్య బ్యాంకింగ్ వ్యవస్థతో లింక్ తెగిపోయింది. వాణిజ్య సంబంధాలూ అంతే. ఇదే సమయంలో మనతో రష్యా ఆర్థిక సంబంధాలు మెరుగయ్యాయి. మన దేశం నిరుడు 5,600 కోట్ల డాలర్ల విలువైన ముడిచమురు కొనుగోలు చేసింది. అమెరికా ఒత్తిడి పర్యవసానంగా ఇటీవల ఆ కొనుగోళ్లు తగ్గినా ఇరు దేశాల వార్షిక వాణిజ్యం 6,870 కోట్ల డాలర్లకు చేరుకుంది. దీన్ని 10,000 కోట్ల డాలర్లకు చేర్చాలని ఇరుదేశాల లక్ష్యం. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక పుతిన్ ఒక దేశంలో అధికారిక పర్యటనకు రావటం ఇదే తొలిసారి.ఈసారి సైనిక సామగ్రి, ఆయుధాలకు సంబంధించికాక ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలపైనే ఇరు దేశాలూ కేంద్రీకరించాయి. ఇరు దేశాధినేతల సమక్షంలో సంతకాలైన ఆర్థిక సహకార ఒప్పందం 2030 వరకూ షిప్పింగ్, కెమికల్స్, ఆరోగ్యం వగైరారంగాల్లో పరస్పర సహకారానికి మార్గం సుగమం చేస్తుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా కలిసి పనిచేయాలని కూడా ఇరు దేశాలూ నిర్ణయించాయి. అయిదో తరం సుఖోయ్ ఎస్యూ–57 యుద్ధ విమానాల అమ్మకానికి రష్యా సుముఖత చూపడమేకాక, వాటిని భారత్లోనే ఉత్పత్తి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే రష్యా రియాక్టర్లతో రెండో అణువిద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పే అవకాశాన్ని పరిశీలించాలని రెండు దేశాలూ నిర్ణయించాయి. ఈ సమావేశం కోసం మోదీ, పుతిన్లిద్దరూ ఈ ఏడాది అయిదుసార్లు ఫోన్లలో సంభాషించుకోవటంతోపాటు చైనాలోని తియాన్జిన్లో మొన్న సెప్టెంబర్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్రం సందర్భంగా కలుసుకున్నారు. ఈ పర్యటనలో కుదరబోయే ఒప్పందాలపైనా, ప్రస్తావనకు రాబోయే భిన్న అంశాలపైనా గత ఆర్నెల్లుగా రెండు దేశాలమధ్యా ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. మొన్న ఆగస్టులో విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాను సందర్శించి పుతిన్ను కలిశారు. అంత క్రితం మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్లారు. ఇవన్నీ శిఖరాగ్ర సమావేశం విజయవంతం కావటానికి దోహద పడ్డాయి.ఎవరితోనైనా తాము కుదుర్చుకునే ద్వైపాక్షిక ఒప్పందాలు మూడో దేశానికి వ్యతిరేకం కాదని మన దేశం మొదటినుంచీ చెబుతోంది. రష్యాతో సంబంధాల విషయంలో అమెరికా, యూరప్ దేశాల ఒత్తిళ్లు పనిచేయబోవని ఈ శిఖరాగ్ర సమావేశం నిరూపించింది. చైనా–రష్యా సంబంధాలు ప్రస్తుతానికి బాగున్నా, ఆసియాలో తన ప్రయోజనాలను విడనాడుకోవటానికి రష్యా సిద్ధంగా లేదు. అలాగే అమెరికా–చైనా సన్నిహితమవుతున్న తీరును కూడా రష్యా గమనించకపోలేదు. ఎవరెవరితో కలుస్తారో, ఏ కూటములు ఎన్నాళ్లు మనుగడలో ఉంటాయో తెలియని అయోమయ స్థితిలో స్వతంత్ర విదేశాంగ విధానమే సర్వవిధాలా మేలైనదని మన దేశం చాటిచెప్పింది. -
రచ్చ బదులు చర్చ!
పార్లమెంటు శీతకాల సమావేశాలు ఈసారి కూడా వాయిదాల్లోనే ముగిసిపోతాయని నిరాశపడినవారికి మంగళవారం పాలక, ప్రతిపక్షాలు ఒక అంగీకారానికి రావటం ఊరట నిచ్చింది. ఎన్నికల సంఘం(ఈసీ) వివిధ రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే (సర్) పేరిట కొనసాగిస్తున్న ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టడం, అందుకు కేంద్రం సిద్ధపడకపోవడం పర్యవసానంగా సమావేశాల తొలి రోజు నుంచే ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ‘సర్’ను చర్చిద్దామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు విపక్షం అంగీకరించింది. దేశ ప్రజల సార్వభౌమా ధికారానికి పార్లమెంటు ప్రతీక అంటారు. ప్రజా సమస్యలపై చర్చకు, దేశ ప్రగతికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, చట్టాల రూపకల్పనకు అది ప్రధాన వేదిక. పాలకపక్ష జవాబుదారీతనాన్ని పెంచటం, ప్రజల గొంతుక వినిపించటం విపక్షాలు చేసే పని. కానీ ఆచరణలో అదంతా ఎటో కొట్టుకుపోతోంది. లోక్సభ చరిత్ర గమనిస్తే దాని వర్తమాన స్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. 1952–70 మధ్య అది ఏడాదికి సగటున 121 రోజులు సమావేశమయ్యేది. అంటే అయిదేళ్లలో సగటున 605 రోజులు సమావేశాలుండేవి. అటు తర్వాత నుంచి ఏడాది సగటు 68 రోజులకొచ్చింది. అయిదేళ్ల సగటు 340 రోజులకు తగ్గింది. దాదాపు సగానికి పడిపోయిన పని దినాలైనా సజావుగా సాగుతున్న జాడలేదు. సమావేశాలు మొదలవుతున్నాయంటే ప్రతిష్టంభన సృష్టించటమే విపక్షాల ఏకైక వ్యూహంగా మారింది. సభలో ఆందోళనలు నిర్వహించటం, ముందుకు సాగనీయకపోవటం తమ ప్రజాస్వామిక హక్కని విపక్షాలు భావిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు ఔన్నత్యం గురించి, ప్రజా స్వామ్యం గురించి గంభీరోపన్యాసాలివ్వటం... విపక్షంలో ఉంటే సమావేశాలకు ఆటంకం కలిగించటం రివాజైంది. ఆ తర్వాత చానెళ్లకొచ్చి మహోద్రేకంతో ఊగిపోతూ ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవటం దానికి అదనం. ఈ మొత్తం వ్యవహారంలో సామాన్య పౌరులకు పనికొచ్చేది ఒక్కటీ ఉండదు. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా సాగకపోవటం వల్ల ప్రజలకు జరిగే అన్యాయం సాధారణమైనది కాదు. ఎంతో కీలకమనుకున్న బిల్లులు సైతం ప్రవేశపెట్టిన కొన్ని రోజుల్లోనే ఆమోదం పొంది చట్టంగా మారుతున్నాయి. వాటిని అధ్యయనం చేయ టానికీ, అభ్యంతరాలు చెప్పటానికీ, సవరణలు ప్రతిపాదించటానికీ సమయం ఎక్కడ? కొన్ని బిల్లులైతే నిండా గంట పాటైనా చర్చించిన దాఖలా ఉండటం లేదు. చాలా బిల్లులు విపక్షాల ఆందోళనల మధ్యే ఆమోదం పొందినట్టు ప్రకటించటం ఇటీవలి కాలంలో పెరి గింది. బడ్జెట్ ప్రతిపాదనలూ, ద్రవ్యబిల్లులు కూడా ఏ చర్చా లేకుండానే సునాయాసంగా గట్టెక్కుతున్నాయి. పార్లమెంటులో ఎంతో ప్రాధాన్యం ఉండే ప్రశ్నోత్తరాల సమయం వాయిదాల కారణంగా కుంచించుకుపోతోంది.‘సర్’ చాటున తనకు సంబంధం లేని పౌరసత్వ నిర్ధారణ బాధ్యతను ఈసీ భుజాన కెత్తుకుంది. ఇందువల్ల ఓటర్గా నమోదు కావాలంటే ముందు ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత జనం పైనే పడింది. అందుకోసం గడువులోగా దాఖలు చేయాల్సిన పత్రాలు అందరి వద్దా అప్పటికప్పుడు లభ్యమయ్యేవి కాదు. తల్లితండ్రుల పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన పత్రాలు సైతం తెచ్చివ్వాలంటే కూలీ నాలీ చేసుకునే పౌరులు ఎక్కడికని, ఎంతకని తిరుగుతారు? ఈ స్థితిలో బిహార్లో ఓటుహక్కు కోల్పోయిన 47 లక్షల మందిని ‘విదేశీయులు’గా ముద్రేయటం సాధ్యమేనా? చిత్ర మేమంటే ఇంతటి కీలకమైన నిర్ణయంపై ముందుగా పార్లమెంటు చర్చించలేదు. ప్రస్తుతం ఆ అంశాన్ని సుప్రీంకోర్టు విచారిస్తుండగా సభలో చర్చకు రాబోతోంది! ఇది కూడా మొత్తంగా ఎన్నికల సంస్కరణలపై కావటం వల్ల ఆ చర్చ కాస్తా ఎటు మళ్లుతుందో తెలియదు. ఇటీవలి కాలంలో ఈవీఎంల వింతలూ, ఎన్నికలైనాక ప్రకటించే పోలింగ్ శాతం పెరుగుతూ పోవటం వంటి అంశాల్లో ఈసీ మౌనమే సమాధానమవుతోంది. ఎన్నికల సంస్కరణల కన్నా ముందు ఈసీ పనితీరు ప్రక్షాళన, ఆ సంస్థ జవాబు దారీతనం పెంచటం వగైరాల అవసరం ఉంది. వీటన్నిటినీ పార్లమెంటు సమగ్రంగా చర్చిస్తుందా? పరస్పర నిందారోపణలతో కాలం గడుస్తుందా? ఈ నెల 9న జరగబోయే చర్చను దేశమంతా ఆసక్తితో గమనిస్తుంది. -
వెనక్కి తగ్గిన ‘సాథీ’!
ఉద్దేశాలు మంచివైనప్పుడు దాపరికాలు అవసరం లేదు. జనానికి మేలు చేయటమే ధ్యేయమైనప్పుడు చాటుమాటు చర్యలు సరికాదు. రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘సంచార్ సాథీ’ యాప్ మూణ్ణెల్లలో ఫోన్లలో ఉండితీరాలంటూ కేంద్రం మొబైల్ ఉత్పత్తిదారులకు మొన్న శుక్రవారం చడీచప్పుడూ లేకుండా ఇచ్చిన ఆదేశాలు తీవ్ర వివాదాస్పదం కావటం ఇందువల్లే. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన విమర్శలకు జడిసి ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఉత్పత్తవుతున్న, దిగుమతవుతున్న ఫోన్లకు వర్తించటంతోపాటు ఇప్పటికే వినియోగదారుల దగ్గరున్న ఫోన్లకు సాఫ్ట్వేర్ ద్వారా ఈ యాప్ను చేరేయాలని టెలికమ్యూనికేషన్ల విభాగం మూడు రోజుల క్రితం మొబైల్ ఉత్పత్తిదారుల్ని ఆదేశించింది. తాజాగా అది తప్పనిసరి కాదంటూ ప్రకటించింది. పౌరుల శ్రేయస్సును ఆశించి, వారు మోసగాళ్ల బారిన పడకుండా చూసేందుకు ఇది రూపొందించామనీ, ఇందులో గూఢచర్యం లేదా ఫోన్ సంభాషణల పర్యవేక్షణ ఉద్దేశం లేనేలేవనీ కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సంజాయిషీ ఇచ్చారు. దాదాపు కోటిన్నరమంది దీన్ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందుతున్నారనీ, 41 లక్షల మోసపూరిత మొబైల్ నంబర్లను గుర్తించి నిరోధించామనీ, అపహరించిన దాదాపు 26 లక్షల మొబైల్ సెట్ల జాడ కనిపెట్టి 7 లక్షల సెట్లను వాటి యజమానులకు అందించా మనీ సింధియా చెబుతున్నారు. ఈ గణాంకాలతో విభేదించాల్సిన అవసరం లేదు. కానీ యాప్ ద్వారా ప్రయోజనాలు వెల్లువెత్తుతుంటే ఆ మాటే చెప్పి, మరింతమందిని ప్రోత్స హించవచ్చు. తదుపరి చర్యలు అవసరమనుకుంటే వెల్లడించవచ్చు. ఇదేం లేకుండా రహస్య చర్య ఆంతర్యమేమిటి? దాదాపు నలభయ్యేళ్ల క్రితం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ‘పోస్టల్ బిల్లు’ తీసుకొచ్చి నప్పుడు జరిగిందేమిటో పాలకులు గ్రహించివుంటే వ్యక్తిగత గోప్యతను పౌరులు ఎంత ప్రాణప్రదంగా పరిగణిస్తారో అర్థమై ఉండేది. కనీవినీ ఎరుగని స్థాయిలో 400 స్థానాలకు పైగా కైవసం చేసుకుని, తిరుగులేదనుకున్నవేళ పౌరులకు తెలియకుండా వారి ఉత్తరా లను చదివేందుకుద్దేశించిన బిల్లు తీసుకొచ్చి ఆయన అభాసుపాలయ్యారు. జస్టిస్ పుట్టస్వామి కేసులో 2017లో సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుల్లో చేర్చింది. జాతీయ భద్రత లేదా సముచిత ప్రజాప్రయోజనం ఉన్నదని ప్రభుత్వం భావిస్తే గోప్యత నియంత్రణకు తగిన చట్టం తీసుకురావొచ్చని స్పష్టం చేసింది. అప్పుడు ప్రజల్లో, పార్లమెంటులో విస్తృత చర్చ జరుగుతుంది. ఇవేమీ లేకుండా ఒక నోటీసు ద్వారా పనికానిచ్చేద్దామనుకోవటం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా?అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినా మన దగ్గర డిజిటల్ వినియోగం బాగా పెరిగింది. క్రయవిక్రయాలు, చెల్లింపులు, వసూళ్లు, ఆన్లైన్ నమోదులు ముమ్మర మయ్యాయి. వాటితోపాటే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. డిజిటల్ అరెస్టు పేరుతో మోసగాళ్లు కోట్లు కాజేస్తున్నారు. ఆ నేరగాళ్లను పట్టుకోవటానికీ, పోగొట్టుకున్న ఫోన్లు పొందేందుకూ ‘సంచార్ సాథీ’ తోడ్పడటం నిజమే కావొచ్చు. కానీ గుప్పెడుమంది నేరగాళ్లను పట్టుకోవడానికి కోట్లాదిమందిని నిఘా నీడలోకి తెస్తామనటం ఏం తర్కం? ఉత్పత్తిదారులకు తప్పనిసరంటూ ఆదేశాలిచ్చి, ఇష్టపడకపోతే వినియోగదారులు తొలగించుకోవచ్చని చెప్పడంలో మర్మమేమిటి?వ్యక్తిగత గోప్యత విషయంలో పౌరులకు ఎంత పట్టింపు ఉంటుందో నిత్యజీవితంలో చూస్తుంటాం. తల్లిదండ్రులు తమ ఫోన్లు గమనిస్తున్నారంటే పిల్లలకు కోపం. ప్రాణ స్నేహితుడైనా చాటుగా ఫోన్ చూస్తే సహించరు. భార్యాభర్తలే ఒకరి ఫోన్లు మరొకరు చూశారని తెలిస్తే దుమ్మెత్తిపోసుకుంటారు. అలాంటిది ప్రభుత్వ నిఘాకు అవకాశమిచ్చే యాప్ను జనం అంగీకరించగలరా? కాల్స్ వినేందుకూ, ఎస్సెమ్మెస్లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు వగైరాలన్నిటినీ చూసేందుకూ... ఆఖరికి మనకు తెలియకుండా కెమెరా వినియోగానికి కూడా ఈ యాప్ అవకాశమిస్తుందన్నది నిపుణుల మాట. బహుశా ‘1984’ రచయిత జార్జి ఆర్వెల్ కూడా ఇంత చేటు నిఘా ఊహించలేదు. ఏదేమైనా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అది వివేకవంతమైన చర్య. -
వైద్యచరిత్రను మలుపు తిప్పిన రోజు.. తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఇదే
నేడు ప్రపంచ వైద్య చరిత్రను మలుపు తిప్పిన రోజు. మొదటి సారిగా ఒక మనిషి గుండెను మరో మనిషికి అమర్చిన దినం! మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ చికిత్స దక్షిణా ఫ్రికాలోని కేప్టౌన్లో జరిగింది. ఆపరేషన్ నిర్వహించింది అమె రికాలో శిక్షణ పొందిన డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. రోడ్డు ప్రమాదంలో తలకు గాయం తగిలి బ్రెయిన్ డెడ్ అయిన డెనిస్ డెర్వల్ అనే 25 ఏళ్ళ యువతి గుండెను లూయిస్ వాష్కా¯Œ స్కీ అనే 53 ఏళ్ళ వ్యాపారికి అమర్చారు. అతనికి గుండె జబ్బు తీవ్రంగా ఉండి, ఏ మందులతోనూ బతక లేడని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ ఆపరేషన్ జరిగింది (1967 డిసెంబర్ 3). ఆపరేషన్ సక్సెస్ అయ్యింది కానీ 18 రోజులకే పేషెంట్ మరణించాడు. రోగ నిరోధక వ్యవస్థను అణచడానికి ఇచ్చిన మందులు సరిగా పని చేయకపోవడంతో న్యుమోనియా వచ్చి అతడు మరణించాడు. ఈ ఘటన తర్వాత ప్రపంచం మొత్తం హార్ట్ సర్జరీ, అవయవ మార్పిడి, వైద్యపరమైన నైతికత, మరణానికి నిర్వచనం, రోగుల హక్కుల వంటి అనేక విషయాలను కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టింది. 1960వ దశకంలో గుండె శస్త్రచికిత్సలు చాలా అభివృద్ధి చెందాయి. హార్ట్–లంగ్ మెషీన్, బైపాస్ టెక్నిక్, మూత్రపిండ మార్పిడి అనుభవాలు గుండె మార్పిడి దిశగా వైద్య రంగాన్ని తీసు కెళ్లాయి. అయినా కూడా ‘మనిషి గుండెను తీసి మరొకరి గుండె పెట్టడం’ అనేది ఆశ్చర్యకరమైన, ధైర్యంతో కూడిన, భయానక మైన ఆలోచన. గుండెను ఒక మనిషి ప్రాణంగా; భావాలు, వ్యక్తిత్వం వంటివాటికి ప్రతిరూపంగా చూడటం వల్ల గుండె మార్పిడి పెద్ద సవాలుగా మారింది. ఈ సర్జరీ మానవ వైద్య చరిత్రలో విప్లవం అనడం అతిశ యోక్తి కాదు. జంతువులపై చేసిన ప్రయోగాలన్నీ మానవ శరీరంపై కూడా చేసి విజయం సాధించవచ్చని స్పష్టం అయింది. ఇమ్యూనాలజీని అభివృద్ధి చేయడం, అవయవ నిరాకరణ వంటివి ఆనాటి పెద్ద సమస్యలు. వాష్కాన్స్కీ కేసు తర్వాత మంచి ఇమ్యూ నోసప్రెషన్ మందుల అవసరం పెరిగింది. ఇది తర్వాత సైక్లోస్పో రిన్ వంటి శక్తిమంతమైన మందుల అభివృద్ధికి దారితీసింది. ఈ కేసు తర్వాత బ్రెయిన్ డెత్ను లీగల్గా అంగీకరించడం ప్రారంభ మైంది. ఇది అవయవ దానం అభివృద్ధికి కీలకంగా మారింది. ఈ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ హృదయ మార్పిడి ప్రయత్నాలు జరిగాయి. వైద్య కళాశాలల్లో ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్కు ప్రత్యేక శిక్షణ మొదలైంది. అయితే నైతికపరమైన ప్రశ్నలు కొన్ని తలెత్తాయి. అప్పట్లో ‘బ్రెయిన్ డెడ్’ అనే నిర్వచనం ఇప్పటిలా లేదు. వెంటిలేటర్ తీసేసి, పొటాషియం ఇంజెక్షన్ ఇచ్చి డెనిస్ గుండెను ఆపేశారు. ఇది చాలా మంది డాక్టర్లకు ‘దాతను చంపి గుండె తీసినట్టు’ అని పించింది. రోగి, దాత కుటుంబాలకు శస్త్రచికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పలేదనే విమర్శ ఉంది. ముఖ్యంగా రోగికి ‘మీరు బతికే ఛాన్స్ చాలా తక్కువ’ అని స్పష్టంగా చెప్పలేదనీ అంటారు. ప్రచారం కోసం రోగి జీవితంతో ఆటలాడారనీ అన్నారు. అమెరికా కంటే తామే ముందు ఇటువంటి శస్త్రచికిత్స చేశామనే ప్రచారం కోసం అప్పట్లో జాతి వివక్ష అమలులో ఉన్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ సర్జరీని వాడుకోవడమూ గమనార్హమే. విమర్శలు ఎన్ని వచ్చినా, గుండెమార్పిడి శస్త్ర చికిత్సలో అద్భుత మైన ప్రగతి సాధించడానికి బర్నార్డ్ ధైర్యంగా నిర్వహించిన సర్జరీ పునాదిగా నిలిచింది. ఇప్పుడు ఈ చికిత్స చేయించుకున్నవారు 20 నుంచి 30 ఏళ్లు బతకడం ఇందుకు నిదర్శనం. -
విజయానికి వైఫల్యమే ఇంధనం
అమెరికా రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతకాలు, ‘ఫీఫా’ వరల్డ్ కప్ సాధించడంలో అబీ వోమ్బాక్ కీలక పాత్ర వహించారు. 2015లో మహిళల ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రిటైరయ్యారు. న్యూయార్క్లోని బర్నార్డ్ మహిళా కళాశాల పట్టభద్రులను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం.. విద్యార్థినులారా! దీన్ని అథ్లెట్లు బాగా అర్థం చేసుకోగలరు. వైఫల్యానికి సిగ్గు పడనవసరం లేదు. అదొక శక్తినిచ్చే సాధనం. ఆవిరి యంత్రానికి అవసరమైన బొగ్గు లాంటిది. నేను జాతీయ యువ జట్టులో ఉన్నపుడు ‘నా హీరో’ మియా హ్యామ్తో కలసి ఆడాలని కలలు కనేదాన్ని. ఒకసారి జాతీయ జట్టు లాకర్ రూమును చూసే అవకాశం లభించింది. అపుడు నన్ను ఆకట్టుకున్నది ఆమె చేసిన ప్రాక్టీసును పట్టి చూపే ఆమె షూల కింది భాగానికి అతుక్కున్న గడ్డి పరకలు కావు. లాకర్ల పైనున్న వారి పేర్లు, వేలాడుతున్న నంబర్లు కూడా కాదు. అది ఎవరో తలుపు పక్కన టేపుతో అతికించిన పోస్టరు. మైదానంలోకి వెళ్ళే ప్రతి క్రీడాకారిణి దృష్టినీ ఆకర్షించే విధంగా దాన్ని అమర్చారు. అది వారి కడపటి ఘన విజయాన్ని చూపే చిత్రమని మీరు అనుకోవచ్చు. లేదా పోడియంపై నిలుచుని స్వర్ణ పతకాలు స్వీకరించినదని అనుకోవచ్చు. కానీ అది వారి చిరకాల ప్రత్యర్థి నార్వే జాతీయ జట్టు 1995 ప్రపంచ కప్లో అమెరికాను ఓడించిన తర్వాత చేసుకున్న సంబరాన్ని చూపే పోస్టరు. ఆనాడే గ్రహించాను: మైదానంలోనైనా, జీవితంలోనైనా విఫలమైనపుడు అది రేకెత్తించిన భావాలను, వైఫల్యం నేర్పిన పాఠాలను నా శక్తిగా మలచుకుంటూ ముందుకు సాగిపోవాలని! విజయంలో వైఫల్యం పాత్రవిద్యార్థినులారా! బాగా గుర్తు పెట్టుకోండి. ఒకసారి విఫల మైనందుకు తదుపరి అవకాశాలను చేజార్చుకోకండి. మనల్ని పక్కన పెట్టినంత మాత్రాన పరువు పోయినట్లు కాదు. మనం అత్యధిక సంఖ్యలో గోల్స్ చేసినవాళ్ళం అనుకుందాం. ఇంచుమించు ప్రతి కేటగిరీలోనూ జాతీయ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాం అనుకుందాం. కానీ, ఒకానొక సందర్భంలో, ప్రపంచకప్ లాంటి పెద్ద పోటీలో మనకు ఆడే అవకాశం ఇవ్వకపోవచ్చు. అది మనల్ని బాధిస్తుంది. అంతటితో మన పని అయిపోలేదని గుర్తుంచుకోవాలి. జీవితం మిమ్మల్ని ఒక్కోసారి పక్కన కూర్చోబెడితే కూర్చోండి. కానీ, అక్కడ నుంచి నేతృత్వం వహించే అవకాశాన్ని చేజార్చుకోవద్దు. కడచిన ప్రపంచ కప్ గెలవడానికి ‘బెంచి నుంచి’ నేనిచ్చిన మద్దతు, చాంపియన్ షిప్ గెలవడానికి అవసరమైన విశ్వాసాన్ని ఇచ్చాయని జట్టులో తోటి సభ్యులు నాతో అన్నారు.బెంచి మీద ఉన్నపుడు మీరు వారితో కెప్టెన్గా వ్యవహరించకపోతే, మైదానంలో తమ నాయకురాలిగా అంగీకరించరు. ప్రతిచోటా నాయకురాలిగా ఉండాలి. మీరు ఎక్కడ ఉన్నా, అక్కడే అగ్ర భాగాన నిలవండి. తొంభై నిమిషాలపాటు సాగే ప్రతి ఫుట్ బాల్ మ్యాచ్లోనూ అద్భుతమైన క్షణాలు కొన్ని ఉంటాయి. బంతి కీపర్ను దాటి నెట్ను తాకితే గోల్ కొట్టినట్లు! గోల్ కొడితే అన్నీ సక్రమంగా కుదిరినట్లు లెక్క. బంతి ఒకరి నుంచి ఒకరికి సక్రమంగా పాస్ అవ్వాలి. దాన్ని తన్నుకుంటూ గుర్రంలా పరుగెత్తాలి. ప్రతి క్రీడాకారిణీ సరైన సమ యానికి సరైన చోట ఉండాలి. పడిన ఆ ఒక్క గోల్ వెనుక జట్టులో ప్రతి సభ్యు రాలు, కోచ్, చేసిన ప్రతి ప్రాక్టీసు, ప్రతి పరుగు, ప్రతి సందేహం, చివరకు ప్రతి వైఫల్య ప్రభావం కూడా ఉందని మరచి పోకూడదు. అందరికోసం అందరం!ప్రతి మహిళా చాంపియన్గా అవతరించే విధంగా మనం ఒకరి కొకరం తోడ్పడాలి. అది మనకు కష్టమే కావచ్చు. జట్టులో చోటు కోసం మనం మరో మహిళతోనే పోటీపడవలసి వస్తుంది. అలా తలపడటం సృష్ట్యాది నుంచీ ఉంది. కొరతను మన లోపల, మన మధ్యన సృష్టించారు. ఈ కొరతకు మనం బాధ్యులం కాము. కానీ, అది మన సమస్య. కొరత ఉన్న చోటల్లా మహిళలకు అవకాశాలు పుష్కలంగా సృష్టించగలిగిన శక్తి మన చేతుల్లోనే ఉంది. ప్రపంచంలోకి అడుగిడబోతున్న మీరు ఒకరి గొంతును ఒకరు బిగ్గరగా విని పించండి. నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో మహిళలకు, ముఖ్యంగా అన్ని వర్ణాల మహిళలకు, బడుగు వర్గాల నుంచి వచ్చినవారికి స్థానం కోసం డిమాండ్ చేయండి.అమెరికాలో ఒక శ్వేతజాతి పురుషుడు చేసే పనికి ఒక డాలర్ దక్కుతున్నప్పుడు, దానితో పోల్చితే మహిళకు దక్కేది 80 సెంట్లే! అదే నల్లజాతి మహిళకైతే 63 సెంట్లే!! ఇక లాటిన్ అమెరికన్లకు వచ్చేది కేవలం 54 సెంట్లు. ఈ అంతరం గురించి ప్రశ్నించాలి. చరిత్రలో ఈ క్షణం మన నాయకత్వాన్ని కోరుకుంటోంది. అవకాశాన్ని ఇవ్వాలని అడగండి. జాబ్ కోసం డిమాండ్ చేయండి. పక్కనున్న అబ్బాయి కిస్తున్న పారితోషికంతో సమానమైన పారితోషికం కోసం పట్టుబట్టండి. పదో న్నతి, మైక్రోఫోన్లను అడగండి. నేను గడించుకున్న గౌరవాన్ని నాకివ్వమని డిమాండ్ చేయండి. వ్యక్తిత్వమే మనం!చివరగా, సాకర్ నుంచి నిష్క్రమించిన తర్వాత, నేను నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన పాఠాన్ని మీకు చెప్పదలచు కున్నాను. రిటైరైనపుడు, నన్ను స్పాన్సర్ చేస్తూ వచ్చిన గేటరేడ్ ఒక వాణిజ్య ప్రకటనకు ప్లాన్ చేసి, నన్ను ఆశ్చర్యపరచింది. ‘నన్ను మరచిపోండి’ అన్నదే దాని సారాంశం. నేను నా జీవి తాన్ని ఏ క్రీడకు అంకితం చేశానో, నా వారసత్వం ఆ క్రీడ భవిష్యత్ విజయాలకు పూచీ నివ్వాలని కోరుకుంటున్నానని వారికి తెలుసు. నన్నే తలచుకుంటూ కూర్చోకుండా ఉంటేనే, నా వెనుక వచ్చిన క్రీడాకారిణులు రికార్డులను బద్దలు కొడతారు. చాంపియన్ షిప్లు గెలుస్తారు. క్రీడను కొత్త శిఖరాలకు తీసుకువెళతారు. ఆ కమర్షియల్ షూటింగ్లో పాల్గొన్నప్పుడు నా కళ్ళు చెమర్చాయి. రిటైరైన తర్వాత, కొత్త జీవితానికి శ్రీకారం చుట్టాను. గ్లెనాన్ను పెళ్ళి చేసుకున్నాను. ముగ్గురు పిల్లలకు తల్లినయ్యాను. వ్యాపారసంస్థకు యజమానినయ్యాను. ఉద్యమకారిణిగా మారాను. నా పదేళ్ళ కూతురు ఉన్న జట్టుకు కోచింగ్ ఇచ్చి, వారిని విజేతలుగా తయారు చేశాను. కానీ, నేను ఇప్పటికీ అబీ వోమ్బాక్నే! చేపట్టిన పనిలో 100 శాతం అంకిత భావాన్ని కనబరుస్తాను. తదుపరి తరానికి మెరుగైన భవిష్యత్తును అందించేందుకు ప్రతి రోజూ పోరాడతాను. సాకర్ నన్ను తీర్చిదిద్దలేదు. నేను సాకర్కు నా వ్యక్తిత్వాన్ని అద్దాను. మనం చేసే పని మనల్ని ఎన్నడూ నిర్వచించదు. మన వ్యక్తిత్వమే మనల్ని ఎల్లప్పుడూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీకు ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండండి, కానీ మీరు అర్హమైనదాన్ని కచ్చితంగా డిమాండ్ చేయండి. -
వెనిజులాపై ట్రంప్ పంజా
మొన్నటివరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం తెగ తాపత్రయపడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యుద్ధవీరుడి అవతారమెత్తారు. మాదకద్రవ్యాల అడ్డాగా మారి అమెరికా వినాశనానికి కంకణం కట్టుకున్నదని ఆరోపిస్తూ దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై కత్తులు నూరుతున్నారు. అక్కడ ‘కార్టెల్ ఆఫ్ సన్స్’ అనే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఉన్నదని ప్రకటించి, దాన్ని నిషేధించారు. అదంతా అబద్ధమని వెనిజులా చెబుతోంది. మొన్న ఆగస్టు నుంచి కరీబియన్ దీవులకు 10,000 మంది సైనికులనూ, అతి పెద్ద విమాన వాహక నౌకనూ, క్షిపణులు వగైరా ఆయుధ సామగ్రినీ తరలించిన అమెరికా ఆ మరుసటి నెల 2న వెనిజులా నుంచి పోతున్న పడవలపై దాడి చేసి 11 మందిని హతమార్చింది. ఇవి మాదకద్రవ్యాలు తరలిస్తున్నాయని ఆరోపించింది. ఆ సాకుతోనే 22 దాడుల్లో 83 మంది ప్రాణాలు తీసింది. ఇందులో ఏ ఉదంతానికీ అమెరికా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. ఈమధ్య వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు ట్రంప్ ఫోన్ చేసి అధికారం వదిలిపెట్టి దేశం వదిలి పారిపోవాలని హెచ్చరించారు. వెనిజులా గగనతలాన్ని మూసివేసినట్టు ప్రకటించారు. తాజాగా బయటపడిన వీడియో ట్రంప్ ప్రభుత్వ హంతక మనస్తత్వాన్ని తెలియ జేస్తోంది. దాడిలో పడవలోని 9 మంది ప్రయాణికులు చనిపోగా, ఇద్దరు బతికి బయట పడ్డారు. వెనువెంటనే మళ్లీ దాడిచేసి ఆ ఇద్దర్నీ కూడా చంపేశారు. మొదట్లో ఆ దాడి గురించి అతిశయోక్తులు చెప్పిన ట్రంప్, వీడియో బయటపడగానే స్వరం మార్చారు. పడవలోని వారందరినీ చంపేయమని రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించటం వల్లే ఇలా చేశామని సైనికాధికారులు చెబుతుండగా, అలా చెప్పలేదని హెగ్సెత్ అంటున్నారు. అది తప్పేనన్నట్టు ట్రంప్ సంజాయిషీ ఇస్తున్నారు. ఈ ఉదంతంపై రిపబ్లికన్లలోనే విభేదాలు బయల్దేరాయి. ప్రతినిధుల సభ అనుమతి లేకుండా దండయాత్రకు అసలు ఎలా దిగుతారంటూ డెమోక్రాట్లు, రిపబ్లికన్లు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు మొదలుకాబోతోంది.సంక్షోభాన్ని సృష్టించటం, ఒక సార్వభౌమాధికార దేశం ప్రమాదకరంగా పరిణమించిందని ఆరోపించటం, ఆ సాకుతో దురాక్రమణకు ప్రయత్నించటం అమెరికాకు అలవాటు. వేరే దేశం గగనతలాన్ని మూసేసినట్టు చెప్పటం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం. సమస్యలుంటే, సాక్ష్యాధారాలుంటే దౌత్యపరంగా పరిష్కరించు కోవటానికి ప్రయత్నించాలి. నిజానికి వెనిజులాపై అమెరికా కడుపుమంట ఈనాటిది కాదు. అక్కడి భూగర్భంలో చమురు, సహజవాయు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం వగైరాలున్నాయి. బహుళజాతి సంస్థల ద్వారా వాటిని కైంకర్యం చేస్తూ వచ్చిన అమెరి కాకు 1999లో తొలిసారి హ్యూగో చావెజ్ రూపంలో ఆటంకం ఎదురైంది. ఆయన అధికారంలోకొచ్చిన వెంటనే దాన్నంతటినీ ఆపేశారు. అప్పటినుంచి ఏదో వంకన వెనిజులాను హస్తగతం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. చావెజ్ అనారోగ్యంతో మరణించాక 2013లో అధికారంలోకొచ్చిన మదురోను ఇబ్బందిపెట్టని రోజంటూ లేదు. క్రితంసారి ఏలుబడిలో ట్రంప్, వెనిజులా నుంచి పారిపోయివచ్చిన జువాన్ గైదోను దేశాధ్యక్షుడిగా ప్రకటించి భంగపడ్డారు. అక్కడ జరిగిన ఎన్నికలు అప్రజాస్వామికమంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ గైదో ఏమయ్యాడో తెలియదు. ఈసారి మాదక ద్రవ్యాల సాకుతో కత్తిగట్టారు. ట్రంప్కు మాదకద్రవ్యాలు అరికట్టే ఉద్దేశం ఉందా? ఉంటే కొకైన్ తరలింపు కేసులో నిరుడు అమెరికా కోర్టు 45 ఏళ్ల శిక్ష విధించిన హోండురస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండోకు క్షమాభిక్ష పెడతామని గతవారం ట్రంప్ ఎలా చెప్పగలిగారు? వెనిజులాపై సైనిక చర్యకు 70 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకమని సీబీఎస్ సర్వే వెల్లడించింది. సైనిక జోక్యం పేరిట ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థ గుల్లయిందని, వాటి జోలికి పోవద్దని మెజారిటీ అమెరికన్లు కోరుకుంటున్నారు. నిజానికి అలాంటి హామీతోనే ట్రంప్ అధికారంలోకొచ్చారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదల చేస్తానంటూనే మరో యుద్ధానికి అంకురార్పణ చేస్తున్న ట్రంప్ పోకడ ప్రమాదకరం. అమెరికాకు మాత్రమే కాదు, ప్రపంచానికే ఇది పెను ముప్పు. దీన్ని తక్షణం కట్టిపెట్టాలి. -
ఒడిశా మేల్కొనాలి!
వలస జీవులపై విషం కక్కే సంస్కృతి ఒడిశాలో ఇంకా పోలేదని అక్కడ జరుగుతున్న దాడులు తెలియజేస్తున్నాయి. ఒకప్పుడు పిల్లల్ని అపహరించడానికొచ్చారనో, మహిళలపై అఘాయిత్యానికి పాల్పడబోయారనో బెంగాల్ నుంచి వలసవచ్చి చిన్నా చితకా పనులు చేసుకుంటున్నవారిపై దాడులు జరిగాయి. ఇప్పుడు ‘విదేశీయుల’ పేరిట ఆ వేలంవెర్రి కొనసాగుతోంది. ఒడిశాలోని గంజాం జిల్లాలో బెంగాల్ నుంచి ఉన్ని దుస్తులు అమ్ముకోవటానికి వచ్చిన యువకులపై అయిదారు నెలలుగా మూకలు దాష్టీకం చేస్తున్నాయి. ఎవరూ అకారణంగా ఉన్న ఊరునూ, అయినవారినీ వదిలి వలసలకు సిద్ధపడరు. సరైన జీవిక దొరక్క తప్పనిసరై వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతారు. కొన్ని వలసలు సీజనల్గా ఉంటాయి. తొలకరి సమయంలో పంట పొలాల్లో పనులు దొరుకుతాయని వచ్చేవారుంటారు. శీతకాలం సమీపించే సమయానికి ఉన్ని దుస్తులు, దోమతెరలు వగైరాలు అమ్ముకోవడానికి పోతారు. అదేమీ భద్రమైన జీవితం కాదు.సంపాదనపై అనిశ్చితి. వచ్చిన తృణమో, పణమో రక్షించుకోవటం కూడా సమస్య. స్థానికుడు కాదని తెలిశాక రౌడీ మూకల ఆగడాలుంటాయి. పోలీసులు సరేసరి. వలస పోయేవారికి శాశ్వత చిరునామా ఉండదు గనుక స్వరాష్ట్రంలోనూ, వలసపోయే రాష్ట్రంలోనూ కూడా తిప్పలే. వారు ఎక్కడా ఓటు బ్యాంకు కాదు. కనుక సంక్షేమం ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటుంది. ఇప్పుడు వలస జీవులను అకారణంగా వేధించటానికి ‘విదేశీయులు’ అనే ఆయుధం అక్కరకొస్తోంది. పార్టీలు తమకు రాలిపడతాయనుకున్న ఓట్ల కోసం ఈ ఆయుధాన్ని నిర్విచక్షణగా ఉపయోగిస్తుంటే రౌడీ మూకలకూ అదే ఆదర్శం! నాలుగు రోజుల క్రితం రాహుల్ ఇస్లాం అనే యువకుడిపై గంజాం జిల్లాలోని గ్రామంలో మూక విరుచుకుపడి తీవ్రంగా దాడిచేసి, అతని దగ్గరున్న రూ. 6,000 అపహరించింది. ఆధార్ కార్డు అడగటం, అది నకిలీదని ఆరోపిస్తూ కొట్టడం సరే.... అతని పేరునుబట్టి వేరే మతం వాడని తెలిశాక ‘జై శ్రీరాం’ అని బలవంతంగా అనిపించి సమస్తం ఊడ్చి పంపారు. అంతకు నాలుగు రోజుల ముందు బెంగాల్ నుంచి వెళ్లిన మరో ఇద్దరు యువకులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ ఉదంతాలపై పశ్చిమ బెంగాల్ వలస కార్మికుల సంక్షేమ సంఘం ఒడిశా డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఫలితం ఉంటుందా? ఫిర్యాదు చేయడానికి పోతే ‘బతకాలని ఉంటే ఇటువైపు వచ్చే ప్రయత్నం చేయొద్ద’ని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారట. కొన్ని వారాల క్రితం బెంగాల్ నుంచి పోయిన ముగ్గురు కూలీలు పోలీసుల నుంచి ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నారు. వారిపై బంగ్లాదేశీయులన్న ముద్రవేసి మూడు రోజులపాటు పోలీసు స్టేషన్లో నిర్బంధించగా, చివరకు పశ్చిమబెంగాల్ పోలీసుల జోక్యంతో బయటపడ్డారు. కేంద్రపారా, ఝార్సుగూడ, జగత్సింగ్ పూర్ జిల్లాల్లో బెంగాల్ నుంచి వచ్చిన 500 మందికి పైగా వలస కార్మికులను పోలీసులు నిర్బంధించి పలు విధాలుగా వేధించారు.ఏడేళ్ల క్రితం గుజరాత్లో ఒక పసిపాపపై బిహార్కు చెందిన యువకుడు లైంగిక నేరానికి పాల్పడ్డాడని ఆరోపణ వచ్చినప్పుడు మూకలు చెలరేగి ‘బయటి వ్యక్తుల’ని అనుమానం వచ్చినవారిని తీవ్రంగా కొట్టి, వారి గుడిసెలకు నిప్పంటించారు. దాంతో బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది ప్రాణభయంతో స్వస్థలాలకు తరలిపోయారు. ఆలస్యంగానైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని భరోసా ఇచ్చాకే పరిస్థితి చక్కబడింది. ఒడిశాలో రౌడీ మూకల ఆగడాలపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండటమే కాదు... తనవంతుగా వేధింపులకు దిగుతోంది. ఇది సరికాదు. వలసలు నిజానికి జనాగ్రహం నుంచి పాలకుల్ని కాపాడే రక్షాకవచాలు. కడుపు మండిన వారు ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా, తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ వేరేచోటకు వలసపోవడంలో అభ్యంతరం ఎందుకుండాలి? దేశభక్తి గురించి లెక్చెర్లిస్తూ పక్క రాష్ట్రం నుంచి వచ్చినవారిని విదేశీయులుగా ముద్రేయటం సిగ్గనిపించటం లేదా? ఒడిశా నుంచి కూడా లక్షల మంది వలసపోతుంటారు. ఈ చీడ విస్తరిస్తే అన్ని రాష్ట్రాల వారికీ పరాయి రాష్ట్రాల్లో ఇదే దుఃస్థితి తలెత్తదా? ఈ పోకడలు సమైక్య భారత్ భావనకు ముప్పు కలిగించవా? ఒడిశా పాలకులు ఆలోచించాలి. -
చిరంజీవి మానవుడు!
అమృతం తాగిన దేవతలకు మరణం ఉండదు. అందుకే దేవతలను అమర్త్యులన్నారు. మానవులకు మరణం తప్పదు. అందుకే మానవులను మర్త్యులన్నారు. మానవులే కాదు, భూమ్మీద పుట్టిన ప్రతిజీవి కాలం తీరాక కాలధర్మం చెందక తప్పదు. దేవతల మాదిరిగానే జరామరణాలను జయించాలనే కోరిక మానవులకు చిరకాలంగా ఉంది. అయితే, అది ఇప్పటి వరకు నెరవేరని కలగానే మిగిలి ఉంది. అమరత్వ సాధన అసాధ్యమని ఎందరో శాస్త్రవేత్తలు, తత్త్వవేత్తలు కొట్టిపారేసినా, దీని కోసం మానవులు తరతరాలుగా కలలు కంటూనే ఉన్నారు. మానవాళికి గల ఈ చిరకాల స్వప్నానికి దేశవిదేశాల పురాణాలే నిదర్శనం. ప్రపంచంలోనే తొలి పురాణంగా చెప్పుకోదగిన ‘గిల్గమేష్’లో రాజైన ఉరుక్ తన మిత్రుడు ఎంకిడు మరణం తర్వాత అమరత్వ సాధన కోసం విఫలాన్వేషణ సాగించాడు. మన పురాణాల్లో శుక్రాచార్యుడి శాపం వల్ల అకాల వార్ధక్యం పొందిన యయాతి– తన కొడుకు పురుడి వల్ల పునర్యవ్వనం పొందిన ఉదంతం మనకు తెలిసినదే!పురాణ గాథలలో మినహా వాస్తవ జీవితంలో జరామరణాలను శాశ్వతంగా జయించిన వారెవరూ లేరు. సగటు మనిషి నూరేళ్లు బతకడమే గగనం. నిండు నూరేళ్లు బతకమనే కోరికతోనే ‘శతాయుష్మాన్ భవ’ అని పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చాక మానవుల సగటు ఆయుర్దాయం ఇదివరకటి కంటే బాగా పెరిగింది. వైద్యశాస్త్రం చెప్పుకోదగిన పురోగతి సాధించిన ఇప్పటికాలంలోనూ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనుషుల సగటు ఆయుర్దాయం డెబ్బయి మూడేళ్ల పైచిలుకు మాత్రమే! సంపన్న దేశాల్లో శతాయుష్కుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. జపాన్లో శతాయుష్కుల సంఖ్య ఇటీవలే లక్షను దాటింది. పంతొమ్మిదో శతాబ్ది చివరినాళ్లలో పరమపదించిన త్రైలింగస్వామి దాదాపు మూడు వందల ఏళ్లు జీవించి నట్లుగా చెబుతారు. అయితే, అందుకు నిర్దుష్టమైన ఆధారాలేవీ లేవు.చరిత్రకెక్కిన ఆధారాల ప్రకారం చెప్పుకోవాలంటే, ఫ్రాన్స్కు చెందిన జాన్ కాల్మన్ అనే మహిళ నూట ఇరవై రెండేళ్ల నూట అరవై నాలుగు రోజులు బతికింది. ఇప్పటి వరకు ఆమె రికార్డును అధిగమించిన వారెవరూ లేరు. ‘ఎవడు బతికాడు మూడు యాభైలు’ అని మనకొక నానుడి ఉంది. నిండు నూరేళ్లు బతికిన వారున్నారే గాని, నూటయాభై ఏళ్లు బతికిన మనుషులెవరూ ఇప్పటి వరకు లేరు.కరవు కాటకాలు, మహమ్మారులు, మాయరోగాలు, ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, యుద్ధాలు, అలజడుల వంటివి మనుషుల అకాల మరణాలకు కారణమవుతున్న నేపథ్యంలో మనిషి నిండు నూరేళ్లు బతకడమే ఘనత! అలాగని, ఇంతటితోనే మనుషులు సరిపెట్టుకోవడానికి మనుషులు సిద్ధంగా లేరు. యవ్వనాన్ని, జీవితకాలాన్ని వీలైనంతగా పొడిగించుకునే ప్రయత్నాలను, అంతిమంగా అమరత్వాన్ని సాధించే ప్రయత్నాలను విరమించుకోవడం లేదు. ఇలాంటి ప్రయత్నాలను సాగిస్తున్న వాళ్లలో అమెరికన్ సంపన్నుడు బ్రయాన్ జాన్సన్ను ‘కలియుగ యయాతి’గా చెప్పుకోవచ్చు. ఇతగాడి వయసు నలభై ఎనిమిదేళ్లు. యవ్వనాన్ని పొడిగించుకునేందుకు బ్రయాన్ తన పదిహేడేళ్ల కొడుకు నెత్తురును ఎక్కించుకోవడం సహా నానా చికిత్సలు పొందుతూ కొన్నేళ్లుగా వార్తలకెక్కుతున్నాడు. బ్రయాన్ మహాశయుడు వ్యాపారవేత్తే గానీ, శాస్త్రవేత్త కాదు. అందువల్ల ఇతగాడి ప్రయత్నాలను జనాలు వెర్రిమొర్రి చేష్టలుగానే చూస్తున్నారు. అయితే, ఇటీవల ‘లోన్వి బయోసైన్స్’ అనే చైనీస్ కంపెనీ ఒక అద్భుత మాత్రను రూపొందించింది.దీనిని తీసుకుంటే, మనుషులు నిక్షేపంగా మూడు యాభైలు బతకగలరనీ, అనతికాలంలోనే దీనిని జనాలకు అందుబాటులోకి తీసుకు వస్తామనీ సదరు కంపెనీ సీఈవో ఇప్ ఝు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, మరణించిన వారిని పునర్జీవితులను చేసే సాంకేతికత భవిష్యత్తులో అందుబాటులోకి రాగలదనే నమ్మకంతో ‘క్రయోనిక్స్’ ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అలాంటి సాంకేతికత అందుబాటులోకి వచ్చేంత వరకు మృతదేహాలను అతిశీతల వాతావరణంలో భద్రపరుస్తున్నారు. ఇదే గనుక సాధ్యమైతే రేపటి మానవుడు చిరంజీవి కాగలడేమో! -
అవినీతి పునాదులపై అమరావతి
‘‘అమరావతిలో 25 బ్యాంకులను ప్రారంభిస్తున్నారు. బాగానే ఉన్నది కానీ... వాటిని ఉపయోగించుకోవడానికి అంతమంది అక్కడున్నారా?’’ ఈ అపశకునం పలికిన వ్యక్తి ప్రతిపక్షి కాదు. అధికార పక్షానికి పరమభక్తుడు. చంద్రబాబుకు నిత్యం స్తోత్ర పారాయణం చేసే ఎల్లో మీడియా వంశీకుడు. నిజమే కదా, ఎవరున్నారక్కడ? 29 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూములిచ్చి జీవనాధారం కోల్పోయి, ప్రభుత్వం ఇస్తానన్న ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న త్యాగరాజుల కుటుంబాలు తప్ప! సర్కారిచ్చే ప్లాట్లు అమ్ముకుంటే గదా వారికి బ్యాంకులతో పని. ఆ భూము లపై ఆధారపడి పొట్టబోసుకున్న వ్యవసాయ కూలీ కుటుంబాలు ఇప్పుడు ఎక్కడున్నాయో? భూసేకరణ ఫలితంగా సుమారు లక్ష కుటుంబాలు భుక్తిని కోల్పోయిన ఇచ్చోటనే నిన్న (శుక్రవారం) అమరావతి ఆర్థిక నగరానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ముఖ్య భాగస్వామి కావటం మూలాన ఆయనకు ఆనందం కలిగించే విధంగానే కేంద్ర మంత్రి మాట్లాడారు. హైదరాబాదులో ఆయన స్థాపించిన ఆర్థిక నగరం ఎంతో అభివృద్ధి చెందిందనీ, ఇది కూడా అలాగే అభివృద్ధి సాధించాలనీ ఆమె ఆకాంక్షించారు. హైదరా బాదులో ‘ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్’కి 2004 నవంబర్లో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాని ఉజ్జ్వల ప్రస్థానం ప్రారంభమైంది. ‘క్రెడిట్ చౌర్యం’ అనేది బాబు బలహీనత. ఆ బలహీనతలో భాగంగా ఐటీ విప్లవం దగ్గర నుంచి హైదరాబాద్ నిర్మాణం దాకా అనేక చరిత్రాత్మక ఘట్టాలు ఆయన ఖాతాలో చేరిపోతుంటాయి. అసలైన సమాచారం కంటే నకిలీ సమాచారమే ఎక్కువగా అందుబాటులో ఉన్నందువల్ల కేంద్ర మంత్రి కూడా పొరపాటు పడి ఉండవచ్చు. బౌద్ధ తాత్వికుడు, రసాయన శాస్త్ర పితామహుడైన ఆచార్య నాగార్జునుని పేరును కూడా నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ ప్రాంతం వాడైన నాగార్జునుని గురించి టిబెట్ విద్యార్థులకు కూడా తెలుసన్న సంగతిని తాను అక్కడికి వెళ్లినప్పుడు గమనించానని ఆమె చెప్పారు. దేవతల రాజధానయిన అమరావతిని అల నుంచి ఇలకు దించిన అపర భగీరథుడి గురించి కూడా ప్రపంచ ప్రజలకు తెలుసని ఆమె చెప్పకపోవడం గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. ఎందుకంటే గతంలో ‘స్కిల్ కుంభకోణం’ కేసులో చంద్రబాబు అరెస్టయి నప్పుడు 55 దేశాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి హాహాకారాలు చేశారని ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ప్రచారం ప్రభావం అంతో ఇంతో ఉంటుందేమోననే అను మానం సహజం.అట్టి దేవతల రాజధాని అమరావతికి ఇప్పుడున్న 54 వేల ఎకరాలు సరిపోవని, అర్జెంటుగా ఇంకో 20 వేల పైచిలుకు ఎకరాల భూముల సమీకరణకు సర్కార్ సైరన్ మోగించింది. ఇంతటితో ఆగదట! ఇంకో పాతిక వేల ఎకరాల కోసం మూడో రౌండ్ సమీకరణ కూడా సిద్ధంగా ఉన్నదని విశ్వసనీయ సమా చారం. ఏతావతా రాజధాని పేరుతో లక్ష ఎకరాల సారవంత మైన పంట భూమికి సర్కార్ టెండర్ పెట్టింది. ఇప్పుడీ లక్ష ఎకరాల్లో నివసించడానికి లక్షల సంఖ్యలో నర నారీ జనసందోహం ఎక్కడ నుంచి వెల్లువెత్తి రావాలి? ప్రభుత్వ కార్యాల యాల్లో పనిచేసే వారు లేదా ప్రైవేటు కంపెనీలు వస్తే వాటిలో పని చేసేవారు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకునే పరిస్థితులు ఉంటాయా? రియల్ ఎస్టేట్ మోడల్లో కార్పొరేట్ రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత అద్దెలు గాని, అమ్మకాలు గాని మధ్యతరగతి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయా? పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల పిల్లలు చదువు కోవడానికి ఎన్ని పాఠశాలలు, ఎన్ని కళాశాలలు పెట్టబో తున్నారు? ప్రైవేట్ విద్యాసంస్థలకు భూ పందేరాలు చేయడం తప్ప, ప్రభుత్వ విద్యాసంస్థలను ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదు? వగైరా ప్రశ్నలు సహజంగానే పుట్టుకొస్తాయి. విజయ వాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి అన్ని వసతు లున్న పట్టణ ప్రాంతాలు చేరువలో ఉండగా అమరావతిలోనే ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎంతకాలం పడు తుందో చెప్పడం కష్టం. నాలుగొందల ముప్పయ్యేళ్ల్ల కిందట గోల్కొండ రాజైన ఖులీ కుతుబ్షా హైదరాబాద్ నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా దైవాన్ని ప్రార్థిస్తూ ‘‘సముద్రాన్ని చేప లతో నింపినట్టు ఈ నగరం కూడా ప్రజలతో నిండి ఉండేట్టు ఆశీర్వదించమ’’ని అర్థించాడు. తాను మహారాజు గనుక ఆదే శాలు జారీ చేసినంత మాత్రాన ప్రజలు నివసించబోరనీ, సరైన ఉపాధి, నివాసయోగ్య పరిస్థితులు ఏర్పడితేనే నగరం అభివృద్ధి చెందుతుందనీ గ్రహింపు ఉన్నవాడు కనుకే అటువంటి పరిస్థితు లను కల్పించాలని అల్లాను అభ్యర్థించాడు. అప్పటికే గోల్కొండ అంతర్జాతీయ వజ్రాల వ్యాపారానికి కేంద్రమైనప్పటికీ దైవంపైనే ఖులీ భారం వేశాడు. ఏ నగరం అభివృద్ధి చెందాలన్నా అటువంటి నివాసయోగ్య పరిస్థితులు, ఉపాధి అవకాశాలు ముఖ్యం.గాంధీనగర్ను గుజరాత్ రాజధానిగా నిర్మించి 50 ఏళ్లు దాటినా అది ఇప్పటికీ అహ్మదాబాద్ నీడలోంచి బయటకు రాలేదు. మహానగరంగా మారలేదు. భువనేశ్వర్ ఇప్పటికీ కటక్ కొంగు పట్టుకునే నడుస్తున్నది. నయా రాయ్పూర్ కథ కూడా అంతే! మలేసియా రాజధానిగా ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ‘పుత్రజయ’ ఇప్పటికీ కౌలాలంపూర్కు అనుబంధ నగరమే. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ‘గ్రోత్ ఇంజన్’ వంటి నగరాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం వేరు, అది రాజధాని నగరమే కావాలను కోవడం వేరని నిపుణులు చెబుతున్నారు. ‘గ్రోత్ ఇంజన్’గా అభి వృద్ధి చెందడానికి మానవ సంకల్పంతో పాటు కొన్ని సహజమైన అనుకూలతలు కూడా ఆ నగరానికి ఒనగూడి ఉండాలి. అటువంటి అనుకూలతలు అమరావతితో పోల్చితే విశాఖపట్నానికి దండిగా ఉన్నాయనే అభిప్రాయం ఉన్నది. విశాఖను ‘గ్రోత్ఇంజన్’గా మార్చుకొని, అమరావతిని పాలనా రాజధానిగా కొనసాగించాలంటే లక్ష ఎకరాల భూమి, లక్షల కోట్ల రూపా యల అప్పు అవసరం లేదు.ఒక రాష్ట్రానికి గాని, దేశానికి గాని అభివృద్ధి ప్రణాళికలను రచించే ముందు ఆ ప్రాంత బలాబలాలను గమనంలోకి తీసు కుంటారు. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్కున్న సహజ బలాల్లో మూడు ముఖ్యమైనవి – ఒకటి సముద్రతీరం, రెండు వ్యవసాయ రంగ మయితే, మూడోది బహుళ పట్టణ వ్యవస్థ. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా 15 ప్రగతిశీలమైన పట్టణాలు ఏపీలో ఉన్నాయి. అభివృద్ధిని వికేంద్రీకరించి, దృష్టి పెడితే విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలకుతోడు మరో 10 పట్టణాలు ఒక్కోటి పది లక్షల జనాభాకు ఉపాధినీ, ఆశ్రయాన్నీ ఇవ్వ గలవు. అమరావతి కోసం ఇప్పుడు సేకరించిన భూమే రాజ ధాని అవసరాలకు సమృద్ధిగా సరిపోతుంది. మరింత భూసేక రణ, మరింత రుణ సేకరణ వంటి వృథా ప్రయాసలు తప్పు తాయి. పట్టణీకరణ నిపుణులు చెబుతున్న మాటలివి. ప్రతి పక్షాల విమర్శలు కావు.రాజధాని అప్పులు కాకుండా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసింది. రాజధాని కోసం 40 వేల కోట్లు చేశారు. మొదటి దశలోని 53 వేల ఎకరాలను దృష్టిలో పెట్టుకొని రాజధానికి 77 వేల కోట్లు కావాలని చంద్ర బాబు స్వయంగా అన్నారు. ఇప్పుడిది లక్ష ఎకరాలకు మారింది. ఇంకెంత కావాలి? కేవలం రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకే ఎకరాకు రెండు కోట్ల చొప్పున లక్ష ఎకరాలకు రెండు లక్షల కోట్లు అవసరమవుతాయని నిర్మాణ రంగం నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, ఇతర అవస రాల కోసం ఇంకో లక్ష కోట్లు. మొత్తం మూడు లక్షల కోట్ల అప్పును ఎక్కడ తెస్తారు? దానిని ఎవరి నెత్తిన రుద్దుతారు? రాజధానితో సంబంధం లేకుండా ఏడాదిన్నరలోనే రెండు లక్షల కోట్లు దాటిన మిగతా అప్పు ఐదేళ్లలో ఎంత కావాలి? ఈ భార మంతా ఎవరు మోయాలి? ప్రజలే కదా! అమరావతిని రాజ ధానిగా కొనసాగిస్తూనే, సింగిల్ గ్రోత్ ఇంజన్ మోడల్ (విశాఖ), మల్టిపుల్ గ్రోత్ ఇంజన్ల మోడల్ (డజన్ నగరాలు) వంటి ప్రత్యామ్నాయాలు ఉండగా, లక్ష ఎకరాలు, మూడు లక్షల కోట్లు, పర్యావరణ సమస్యలు వంటి ఎన్నో రిస్కులతో కూడిన బాటలోనే పయనించాలని ఎందుకు ఉబలాటపడుతున్నారో కనిపెట్టడం కష్టసాధ్యం కాదు.నదులు ఉప్పొంగి నగరాలను ముంచెత్తిన వార్తలు విన్నాము. కానీ నగరంలోంచి నీళ్లను నదిలోకి ఎత్తిపోసే విడ్డూ రాన్ని మనం కేవలం అమరావతిలోనే చూస్తున్నామని ఒక నిపు ణుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నదులకైనా, వాగులువంకలకైనా వాటి సహజ ప్రవాహ గతి వాటికి ఉంటుంది. కృత్రి మంగా దారి మళ్లింపు ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రకృతి ఉగ్రరూపం దాల్చినప్పుడు వాటి సహజ మార్గాలను వెతుక్కుంటూ, బీభత్సాన్ని సృష్టిస్తాయి. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో చూస్తున్నాము. కొండవీటి వాగు కృష్ణలో కలిసే సహజ మార్గంలో మహానగర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. దాని వరద నీటి ఎత్తిపోత అనే రిస్కును తలకెత్తుకోవడానికి కారణం నిధుల ఎత్తిపోత అనే మహద్భాగ్య అవకాశమేనని వస్తున్న విమర్శలను కాదనగలరా? రాజధాని నగరంలో నిర్మాణాలకు చదరపు అడుగుకు తొమ్మిది వేల నుంచి పదివేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఎంత వైభవోపేతంగా కట్టినా నాలుగున్నర వేలు దాటదని నిర్మాణరంగంవాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఆరు వరుసల జాతీయ రహదారులను నిర్మించడానికి ‘నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా’ కిలోమీటర్కు 25 కోట్లు ఖర్చు పెడుతున్నదట! మన అమరావతిలో దాన్ని 53 కోట్లుగా డిసైడ్ చేశారు. ఇటువంటి అవినీతి వ్యవహారాల మీద ‘సాక్షి’ మీడియాలో సవివరంగా కథ నాలు వచ్చినా, నిపుణులు ఎందరో సోషల్ మీడియా వేదికపై గొంతు విప్పినా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు. అంటే, అందులో ఖండించడానికి ఏమీ లేదని అర్థం చేసుకోవాలి. ఈ లెక్కన ప్రభుత్వం అప్పులు తెచ్చి రాజధాని కోసం మూడు లక్షల కోట్లు ఖర్చుపెడితే అందులో సగభాగం కైంకర్యాలకే సరిపోతుందన్నమాట! బలమైన ఆధా రాలు, అనుమానాలతో వస్తున్న ఈ విమర్శకు ప్రభుత్వం ముఖం చాటేస్తున్నది కనుకనే పెద్ద ఎత్తున అవినీతి జరుగు తున్నదని జనం నమ్ముతున్నారు.పాలక కూటమి కార్యకర్తలు, ఛోటానేతలు కూడా రాజధాని అవినీతిని నమ్ముతున్నారు. అందువల్లనే క్షేత్రస్థాయిలో వారు చెలరేగిపోతున్నారు. ‘‘మంత్రిగారి కొడుక్కి నీ మీద మనసైంది. రా వచ్చెయ్’’మంటూ ఒంటరి మహిళలకు మంత్రిగార్ల పీఏలు బరితెగించి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఛోటామోటా నాయ కులు నిరుపేద హాస్టల్ బాలికలను నిర్జన ప్రదేశాలకు లాక్కెళ్తు న్నారు. ‘‘నీ ఉద్యోగం మాకు కావాలి, నువ్వు రాజీనామా చేసెయ్’’ అంటూ బలహీనవర్గాల చిరు మహిళా ఉద్యోగులను జుట్టు పట్టి ఈడ్చుకుంటూ కీచక పర్వాలను సృష్టిస్తున్నారు. ఇసుక మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, పేకాట మాఫియా చెలరేగిపోతున్నాయంటూ ఒక పోలీస్ హోమ్ గార్డ్ నిస్సహాయ ఆవేదనతో ఎస్పీకి పంపిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. విధి నిర్వహణ కోసం అక్రమార్కుల ఆచూకీ తీస్తే లాఠీలతో తొక్కి చంపుతామన్నారట! తన పై అధికారులు కూడా ఈ మాఫియా ముఠాలకు భయపడుతున్నారని ఆ హోంగార్డు ఆవేదన వెలిబుచ్చారు. ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి.ఇక సాధారణ పరిపాలనను చాప చుట్టేశారు. ‘ఓన్లీ అమరా వతి’! ఇదే సర్కారు వారి తిరుమంత్రం! గిట్టుబాటు ధరల్లేక, రవాణా ఖర్చులు కూడా రాని దుఃస్థితిలో పంట పొలాలను దున్నేస్తున్న రైతుల కన్నీటి గాథలు అన్ని ప్రాంతాల్లోనూ వినిపి స్తున్నాయి. ధాన్యం సేకరణ మాట అటుంచి దాచుకునేందుకు గోనె సంచుల్ని కూడా అందివ్వలేని జుగుప్సాకరమైన పరిస్థి తుల్లో ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. మార్కెట్లో ఏ పంటకూ మద్దతు ధర దక్కని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఒక్కవ్యవసాయ రంగమే కాదు, అన్ని రంగాల్లోనూ ప్రభుత్వయంత్రాంగం నిస్తేజంగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జన జీవితం గాలిలో దీపం. కోనసీమ కొబ్బరికి తెలంగాణ వాళ్లు దిష్టి పెట్టారని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారట! ఇక ఆ రైతాంగం ఆయనకు సమస్యల గురించి ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు తమ పాలనా వైఫల్యాలపై ముఖ్యమంత్రి ఏం చెబు తారో? న్యూయార్క్, లండన్ నగరాలు మన అమరావతికి దిష్టి పెట్టాయని ఆయన అనకుండా ఉండుగాక!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మళ్లీ క్రీడా సంరంభం
ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావించే కామన్వెల్త్ శతవార్షిక క్రీడా సంరంభం 2030లో నిర్వహించే అవకాశం లాంఛనంగా మన దేశానికి దక్కింది. గత నెలలో కామన్వెల్త్ క్రీడల కార్యనిర్వహణా బోర్డు ఈ క్రీడోత్సవాలకు అహ్మదాబాద్ వేదికైతే బాగుంటుందని సిఫార్సు చేసింది. మనతోపాటు నైజీరియా కూడా పోటీపడినా ఇంత పెద్ద ఉత్సవాన్ని నిర్వహించగల సామర్థ్యం భారత్కే ఉన్నదని మెజారిటీ సభ్యులు భావించారు. కామన్వెల్త్ క్రీడల్లో దాదాపు వంద దేశాలకు చెందిన వేలాది మంది మెరికల్లాంటి క్రీడాకారులు, క్రీడాకారిణులు పాల్గొంటారు. బహుళ మాధ్యమాల ప్రభావం ఎంతగానో పెరిగిన వర్తమానంలో ఈ క్రీడలు యువతపై చూపే ప్రభావం అపారం. అయితే అట్టహాసంగా నిర్వహించటం, పరమాద్భుతమని ప్రపంచం మెచ్చటంతోనే సంతృప్తిపడకూడదు. 2036లో ఒలింపిక్ క్రీడోత్సవాల నిర్వహణకు సైతం భారత్ సంసిద్ధంగా ఉన్నదని ప్రపంచం గుర్తించే స్థాయికి తీసుకెళ్లాలి. ఈ సందర్భంలో 2010 నాటి కామన్వెల్త్ క్రీడోత్సవాల్లో మనకెదురైన చేదు అనుభవాలు, తత్కారణంగా మన దేశం అభాసుపాలైన వైనమూ దృష్టిలో పెట్టుకోవాలి. అప్పటికే మనకు పలు క్రీడోత్సవాలు నిర్వహించిన నేపథ్యం ఉంది. 1951, 1982 సంవత్సరాల్లో ఆసియా క్రీడోత్సవాలు నిర్వహించాం. 2003లో ఆఫ్రో–ఆసియన్ క్రీడలకు భారత్ వేదిక పరిచింది. ఇక క్రికెట్ టోర్నమెంట్లు, హాకీ ప్రపంచ కప్ ఈవెంట్లు దేశంలో పలు నగరాల్లో నిర్వహించిన అనుభవం ఉంది. అయినా 2010 కామన్వెల్త్ క్రీడోత్సవాల నిర్వహణ అసమర్థంగా, కుంభకోణాలమయంగా మారడం, అందరూ మనల్ని వేలెత్తి చూపే దుఃస్థితి ఏర్పడటం ఎవరూ మరిచిపోలేరు. భారీ మొత్తాలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం, నాసిరకం నిర్మాణ పనులు, అవి కూడా సమయానికి పూర్తికాకపోవటం, ఆర్థిక అవకతవకలు, విధానపరమైన ఉల్లంఘనలు దిగ్భ్రాంతిపరిచాయి. సీబీఐ దర్యాప్తు, అప్పటి కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షుడు సురేష్ కల్మాడీ అరెస్టు కావటం, నిర్మాణ పనుల్లో ఏమాత్రం అనుభవం లేనివారికి కాంట్రాక్టులు అప్పగించారనీ, లంచాలు మెక్కి నాసిరకం ఉపకరణాలు కొన్నారనీ సీవీసీ తేల్చటం ఎవరూ మరిచిపోరు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రీడా బృందాలకు అద్భుతమైన సదుపాయాలున్న వసతి కల్పించి, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన బృందాలకు నాసిరకం వసతినిచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తమపై జాతివివక్ష చూపారని ఆ దేశాల క్రీడాకారులు తీవ్ర విమర్శలు చేయటం దేశ ప్రతిష్ఠను మట్టిపాలు చేసింది. భారీ క్రీడోత్సవాలు జరగబోయే నగరాల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తాయి. సరికొత్త స్టేడియాలు నిర్మాణమవుతాయి. ఆతిథ్యం ఇచ్చే దేశం గనుక ప్రతి ఈవెంట్లోనూ విజయం సాధించేలా క్రీడా బృందాల నైపుణ్యాలకు పదును బెడతారు. అథ్లెట్లకు మంచి సదుపాయాలతోపాటు మెరుగైన పారితోషికాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామస్థాయి వరకూ యువతలో క్రీడలపై ఉత్సాహాన్ని పెంచేలా చేయగలిగితే, ప్రాథమిక పాఠశాలలు మొదలుకొని విద్యా సంస్థ లన్నీ పిల్లల్లో క్రీడాసక్తిని పెంపొందిస్తే, క్రీడా ఉపకరణాల కొనుగోలుకూ, ఈవెంట్ల నిర్వహణకూ, విజేతలకు ప్రోత్సహకాలిచ్చేందుకూ ఇతోధిక కేటాయింపులు చేస్తే భవిష్య త్తరాలు పదునైన క్రీడాకారులను చూడగలుగుతాయి.స్టేడియంలో గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థి పక్షాల ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టు తలపడటం ఒక్కటే కాదు క్రీడలంటే. అవి యువతకు శారీరక, మానసిక దృఢత్వాన్ని స్తాయి. క్రమశిక్షణను నేర్పుతాయి. నిబంధనల పరిమితుల్లోనే ప్రత్యర్థిని మట్టి కరిపించి పైచేయి సాధించటానికి ఏం చేయాలన్న వ్యూహ రచనా నైపుణ్యాన్ని పెంచుతాయి. ఓటమిని సైతం అంగీకరించగల స్థైర్యాన్నందిస్తాయి. ఒక టీమ్గా కలిసి పనిచేయటం, ఆ క్షణమే దాని ఫలితాలు కళ్లెదుట కనబడటం క్రీడల్లోనే చూడగలం. అవి అహంభావం స్థానంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రతిష్ఠిస్తాయి. తనలోని దార్ఢ్యమెంతో, పరిమితులేమిటో గుర్తించటానికి క్రీడలే తోడ్పడతాయి. ఈసారి కుంభకోణాల క్రీనీడ పడకుండా నిర్వహించి శభాష్ అనిపించుకుంటామని మన ప్రతినిధులు హామీ ఇచ్చివచ్చారు. చూద్దాం... ఎంతవరకూ నిలబెట్టుకుంటారో! -
చైనా వింత పోకడ!
భారత–చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం కనబడుతున్నప్పుడల్లా ఏదో ఒక పేచీకి దిగటం చైనాకు అలవాటైపోయింది. ఇటీవల అరుణాచల్ప్రదేశ్కు చెందిన యువతి ప్రేమా వాంగ్జోమ్ థోంగ్డాక్ను షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు నిర్బంధించిన వైనం ఇటువంటిదే. భారతీయ కాన్సులేట్ అధికారి జోక్యం చేసుకోబట్టి ఆమె విడుదలయ్యారు. లేకుంటే మరెంతసేపు వేధించేవారో తెలియదు. ఇది యథా లాపంగా జరిగిన ఉదంతం కాదు. అరుణాచల్ప్రదేశ్ విషయంలో ఉద్దేశపూర్వకంగా దశాబ్దాలుగా ఇలా చేస్తోంది. ఆమె ఉద్యోగరీత్యా బ్రిటన్లో స్థిరపడిన భారతీయ వనిత. సెలవుల్లో గడపటానికి జపాన్ వెళ్తూ విమానం మారటానికి షాంఘైలో దిగాల్సి వచ్చింది. మరో మూడు గంటల్లో జపాన్ విమానం ఎక్కాల్సి ఉండగా చైనా అధికారులు తమ వింత ప్రవర్తనతో ఆమెను ఇబ్బంది పెట్టారు. ఆమె దగ్గర చట్టబద్ధమైన వీసా ఉంది. భారత పాస్పోర్ట్ ఉంది. కానీ స్వస్థలం అరుణాచల్ అనేసరికి చైనా అధికారులకు చిర్రెత్తుకొచ్చినట్టుంది. జపాన్ వెళ్లటానికి చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్ విమానం టిక్కెట్ కొంటేనే పాస్పోర్టు వెనక్కిస్తామని షరతు పెట్టారు.అరుణాచల్ తమ భూభాగంలోనిదని వితండవాదనకు దిగటం చైనాకు ఎప్పటి నుంచో అలవాటు. అది దక్షిణ టిబెట్ అనీ, దాని పేరు జంగ్నాన్ అనీ చెప్పుకోవటం, దాన్ని ‘వివాదాస్పద ప్రాంతం’గా అభివర్ణించటం, తరచుగా అరుణాచల్ పరిధిలోని గ్రామాల పేర్లు మార్చి, మాండరిన్ భాషలో ఏదో ఒక పేరు పెట్టుకుని మురియటం కూడా పాత కథే. ఇలా వివాదానికి దిగిన ప్రతిసారీ మన దేశం కూడా అరుణాచల్ భారత్లో అంతర్భాగమని చెప్పక తప్పడం లేదు. అరుణాచల్ ఒక్కటే కాదు... ఇరు దేశాల సరిహద్దుల్లో పలు ప్రాంతాలు తన ఖాతాలో వేసుకోవటం చైనా తరచూ చేసే పని. ఇరుగు పొరుగుతో సఖ్యతతో మెలగటం, ఇచ్చిపుచ్చుకోవటం వంటి సంస్కృతి చైనాకు అలవడలేదు. బలహీనంగా ఉన్న దేశాలను రుణ ఊబిలోకి లాగటం, తనపై ఆధారపడక తప్పని స్థితి కల్పించటం చైనా తీరుకు నిదర్శనం. చివరకు ఆ దేశాలు సంక్షోభాల్లో చిక్కుకుని విలవిల్లాడటం దాని పుణ్యమే. ఇందుకు మన ఇరుగుపొరుగునున్న శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వగైరాలు ఉదాహరణ.చాన్నాళ్ల తర్వాత ఇటీవలే చైనా తీరుతెన్నులు మారిన జాడలు కనబడ్డాయి. ఏడేళ్ల తర్వాత తొలిసారిగా మొన్న సెప్టెంబర్ మొదటివారంలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. అంతకుముందు నిరుడు అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో మోదీ సమావేశమయ్యారు. ఇరు దేశాల సంబంధాలనూ మళ్లీ పూర్వస్థితికి తీసుకెళ్లాలన్న ఆకాంక్షను వారిద్దరూ వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్యా విమాన రాకపోకలు ప్రారంభమై నెల్లాళ్లు కూడా కాలేదు. ఇందువల్ల టూరిజం, వ్యాపారం, ప్రజల మధ్య సంబంధాలు మెరుగవుతాయని చైనా కూడా భావిస్తోంది. కానీ అంతా బాగుందనుకుంటున్న తరుణంలో అందుకు భిన్నమైన ప్రవర్తన తో దిగ్భ్రాంతిపరచటం దానికే సాధ్యం.ఇలా మైత్రి ఒకడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి అన్నట్టు ఊగిసలాట ధోరణిలో ఉండిపోవటానికి చైనా తీరే ప్రధాన కారణం. ఆమెను ఒత్తిడి చేయటం, నిర్బంధించటం, వేధించటం వంటివి లేనేలేవని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ బుకాయిస్తున్నారు. మరి భారత పాస్పోర్టు ఉన్న యువతిని 18 గంటల పాటు కదలనివ్వక పోవటాన్ని ఏమంటారో ఆమె చెప్పాలి. ఇది జరిగి అయిదారు రోజులు గడుస్తున్నా ఈ ఉదంతంలో తమ అధికారుల తీరు గురించి సరైన సంజాయిషీ ఇవ్వటంలో చైనా విదేశాంగ శాఖ విఫలమైంది. తమ దేశంలో విమానం మారదల్చుకుంటే 24 గంటల లోపు వీసా అవసరమే లేదన్న స్వీయ నిబంధనను సైతం చైనా ఉల్లంఘించింది. దీంతో పాటు అంతర్జాతీయ పౌర విమానయాన నిబంధనల్ని సైతం బేఖాతరు చేసింది. ఇలాంటి ఉదంతాల వల్ల తన విశ్వసనీయత దెబ్బ తినటం మినహా మరే ప్రయోజనమూ లేదని ఇప్పటికైనా చైనా గ్రహించాలి. హుందాగా ప్రవర్తించటం నేర్చుకోవాలి. -
దడ పుట్టిస్తున్న ‘సర్’
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్లో ప్రకంపనలు సృష్టించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ డజను రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల 4న మొదలైంది. వచ్చే నెల 4తో ముగిసే ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారి(బీఎల్ఓ) పాత్ర కీలకమైనది. ఓటర్ల ఇళ్లకు పోయి ఓటర్ నమోదు పత్రాలు అందించటం, వెనక్కి తీసుకోవటం, అవసరమైన పత్రాలు జతచేశారో లేదో చూడటం వారి బాధ్యత. ఫలానా వ్యక్తి అర్హుడైన ఓటరో కాదో ప్రాథమికంగా తేల్చేది వీరే. అదే వారి చావుకొస్తోంది.బిహార్కు భిన్నంగా ఈ ప్రక్రియ చాలా రాష్ట్రాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. మరణాలు, బలవన్మరణాలు, అస్వస్థులు కావటం, భయాందోళనలతో అప్పగించిన పని వదిలి అదృశ్యం కావటం వంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. బిహార్లో బీఎల్ఓలకు ఈ స్థాయిలో సమస్యలున్న దాఖలా లేదు. నిజానికి అక్కడ బీఎల్ఓలతోనే ఓటర్లకు సమస్యలెదురైన ఉదంతాలున్నాయి. బీఎల్ఓలకు వెరిఫికేషన్లో సహకరించేందుకు పార్టీలు తమ కార్యకర్తలను బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ)గా నియమించుకునేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ) అవకాశమిచ్చింది. సహజంగానే వారు పరిష్కారంలో కాక సమస్యలో భాగమవుతున్నారు. ఓటర్ల ఎదుటే బీఎల్ఓలతో వాదులాటలకు దిగటం, బెదిరించటం చాలాచోట్ల కనబడే దృశ్యాలు.పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ తదితర చోట్ల బీఎల్ఓలు ‘సర్’ ప్రక్రియలో తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో చేతికి ఎముక లేకుండా భారీ వాగ్దానాలు చేయటం, అధికారం వచ్చాక ఎగనామం పెట్టడం మన దేశంలో దశాబ్దాలుగా సాగిపోతున్న ఒక దుస్సంప్రదాయం. ఈ విషయంలో న్యాయ స్థానాలకెళ్లినా ఫలితం ఉండదు. కడుపు మండి నిలదీస్తే జైలుపాలు చేయటం, కార్య కర్తలను పంపించి దౌర్జన్యం చేయించటం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలాచోట్ల కనబడుతోంది.ఇంత జరుగుతున్నా, ఈవీఎంలు ఏమార్చి ఓట్లు కొల్లగొడుతున్నారన్న ఆరోపణలు మిన్నంటుతున్నా, ఎన్నికల సంఘం పట్టనట్టు వ్యవహరిస్తోంది. అయినా ఎన్నికల వ్యవస్థపై ఉండే అచంచల విశ్వాసమే ప్రజాస్వామ్యాన్ని ఈమాత్రంగానైనా బతికిస్తోంది. ఓటు పోతే జీవచ్ఛవంతో సమానమన్న అభిప్రాయం జనంలో ప్రబలంగా ఉంది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి తెలపాలన్నా, ఆగ్రహావేశాలు వ్యక్తంచేయాలన్నా సామాన్యు లకు ఓటును మించిన ఆయుధం మరేదీ లేకపోవటం ఇందుకు కారణం కావచ్చు.బీఎల్ఓలు ఒత్తిడికి లోనవటం వెనక ఇతరేతర సమస్యలు కూడా ఉన్నాయి. గతంలో ఓటేసే రోజునే తమ ఓటు గల్లంతైందని తెలిసేది. కానీ ఇప్పుడలా కాదు. ఓటరు తన వివరాలతోపాటు అవసరమైన పత్రాలన్నీ అందజేసిన క్షణానే అది చూచాయగా తెలిసి పోతుంది. నెల రోజుల తర్వాత పేరుందో లేదో రూఢి అవుతుంది. లేకపోవటానికి గల కారణమేమిటో అందులో ప్రస్తావిస్తారు. ఆ చిరునామాలో ఓటరు లేడనో, మరణించా డనో, తగిన పత్రాలు అందించలేదనో వెల్లడిస్తారు.దానిపై మళ్లీ పంచాయతీ. నమోదు సమయంలో బీఎల్ఏల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఒకపక్క, వాటిని తట్టుకోలేక ఏదైనా చేస్తే ప్రభుత్వం నుంచి చర్యలు మరోపక్క వారిని బాధిస్తున్నాయి. బీఎల్ఓల్లో 90 శాతం టీచర్లే. గుజరాత్ వంటిచోట్ల సాయంత్రం వరకూ విద్యాబోధనలోనూ, అటుతర్వాత రాత్రి 9వరకూ ఫీల్డ్లోనూ తలమునకలు కావాలి. మళ్లీ ఇంటికొచ్చి సేకరించిన పత్రాలన్నీ డిజిటల్ ఫామ్లోకి మార్చి పంపాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు కాకపోతే పై అధికారుల హెచ్చరికలు. సారాంశంలో ఓటర్ మొదలుకొని అందరికందరూ పెత్తనం చలాయించే వారే. ఈసీకి ఇవి పట్టవు. ‘సబ్ ఠీక్ హై’ అంటోంది.గౌరవ ప్రదమైన జీవితం వెళ్లదీయదల్చుకున్నవారు ఉద్యోగాలు చేస్తారు. అందుకు జీతంతోపాటు గౌరవ మర్యాదలూ ఆశిస్తారు. కానీ అదనపు భారాలు మోపి, వెట్టి కార్మికుల కన్నా హీనంగా చూస్తూ, బెదిరింపులకు దిగటం వల్ల వారు సమాజంలో ఆత్మ గౌరవంతో బతకగలుగుతారా? పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారా? గర్భిణులనూ, 45 ఏళ్లు దాటినవారినీ, అంగవైకల్యం ఉన్నవారినీ ఈ బాధ్యతల నుంచి తప్పించాలని గుజరాత్లో ఒక ఉపాధ్యాయ సంఘం కోరినా ఫలితం లేకపోయిందట! ఈ ధోరణి సరికాదు. దీన్ని వెంటనే చక్కదిద్దటం ఈసీ, కేంద్రం బాధ్యత. -
బేలగా మిగిలిన బెలేమ్!
నిర్ణయాత్మకంగా వ్యవహరించలేని సదస్సులు చివరాఖరికి నిరర్థకంగా మిగులుతాయి. బ్రెజిల్లోని బెలేమ్లో శనివారం ముగిసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)–30 ముచ్చటదే. ఐక్యరాజ్యసమితి ఛత్రఛాయలో ఏటా జరిగే కాప్ సదస్సులు ఎప్పుడూ పెద్దగా ఒరగబెట్టింది లేదు. 2015 నాటి ప్యారిస్ ఒడంబడికలో అంగీకరించిన లక్ష్యాలను ఏ దేశం ఏ మేరకు నెరవేర్చిందో చూసి, ఆ విషయంలో చేయాల్సిందేమిటో నిర్దేశించటం దీని ఉద్దేశం. బెలేమ్లో ఈసారి అన్ని దేశాల నుంచీ ఆ లక్ష్యాల సాధనకు అవలంబించ బోయే కార్యాచరణేమిటో తెలుసుకోవటమే ధ్యేయమన్నట్టు చెప్పారు. తీరా సాధించింది స్వల్పమే.వాతావరణ మార్పులు, పర్యావరణం అంటేనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు కంపరం. ప్యారిస్ ఒడంబడిక నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ముందే ప్రకటించారు గనుక ఆ దేశం నుంచి ఆశించటానికేం లేదు. ప్రపంచ కాలుష్య కారక దేశాల్లో అగ్రభాగాన ఉన్న అమెరికా ఎగవేత ధోరణి సౌదీ అరేబియా వంటి చమురు ఉత్పత్తి దేశాలకు ధైర్యాన్నిచ్చింది. ఇదే అదనని చైనా మందకొడిగా మిగిలిపోయింది. పాశ్చాత్య దేశాల పాత్ర అంతంత మాత్రం. శిలాజ ఇంధనాల వినియోగాన్ని అంచెలంచెలుగా తగ్గించటానికుద్దేశించిన మార్గనిర్దేశనాన్ని కాప్ ప్రకటించాల్సి ఉండగా చమురు దేశాలు, రష్యా, భారత్ తదితర దేశాలు ఒత్తిళ్లు తెచ్చి దాన్ని వమ్ముచేశాయి.భూగోళం వేడెక్కడానికి దారితీసే కారణాల్లో ప్రధానమైన శిలాజ ఇంధన వాడకంపైనే ఏమీ సాధించలేని స్థితిలో ఐక్యరాజ్యసమితి పరిధి వెలుపల వాటి తగ్గింపు కృషి కొనసాగుతుందనీ, ఇందుకు కొలంబియా, మరో 90 దేశాలూ సమష్టిగా ప్రణాళిక రచనకు పూనుకుంటా యనీ బ్రెజిల్ ప్రతినిధి ప్రకటించారు. వచ్చే ఏప్రిల్లో జరిగే ‘సమ్మతి కూటమి’ దేశాల శిఖరాగ్ర సదస్సు ఈ విషయంలో ప్రగతి సాధిస్తుందంటున్నారు. బెలేమ్ సదస్సు గురించి చెప్పుకోదగ్గదల్లా వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే దేశాలకు చేసే ఆర్థిక సాయాన్ని మూడు రెట్లు పెంచుతామని సంపన్న దేశాలిచ్చిన హామీ మాత్రమే!అందువల్ల ఏటా 12,000 కోట్ల డాలర్లు సమకూరుతాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది 30,000 కోట్ల డాలర్లకు పెంచితే తప్ప ఏ మూలకూ చాలదని పర్యావరణ సంస్థలంటున్నాయి. అభివృద్ధి పేరుతో, ప్రగతి పేరుతో సంపన్న దేశాలు అనుసరించే విచ్చలవిడి పోకడల వల్ల కర్బన ఉద్గారాలు వ్యాపించి, వాతావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. సముద్ర మట్టాలు పెరిగి, లేదా కార్చిచ్చులు వ్యాపించి జనావాసాలు నాశనమవుతున్నాయి.పునరావాసం కల్పించటానికి అవసరమైన నిధులు ఆ పేద దేశాల వద్ద లేవు. శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆపడం మాట అటుంచి, తగ్గించటానికి కూడా సంపన్న దేశాలు ముందుకు రావటం లేదు. కాప్–30 సదస్సును బ్రెజిల్ అమెజాన్ అటవీప్రాంతం ముంగిట్లో నిర్వహించటంలో ఉద్దేశం అడవుల నిర్మూలన వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పటం కోసమే! 92 దేశాలు దీన్ని సమర్థించాయి. కానీ ఒక్క దేశం కూడా అడవుల నిర్మూలన నివారణకు తమ వంతు ఏం చేస్తామన్నది చెప్పింది లేదు.వాతావరణ క్షీణత వల్ల మన దేశం సైతం ప్రమాదకర స్థితిలో ఉంది. సదస్సులో రెండు సంస్థలు సమర్పించిన నివేదికలే ఈ సంగతి చెబుతున్నాయి. గత దశాబ్ద కాలంలో వివిధ రాష్ట్రాల్లో ఏటా 0.1 డిగ్రీ సెల్సియస్ నుంచి 0.5 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆ నివేదికలు వివరించాయి. నిరుడు ఈ పెరుగుదల 0.65 డిగ్రీల సెల్సియస్కు చేరిందని తేలింది. మన దేశంలో ఉత్తరాదిన ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో దేశం తీవ్ర వాతావరణ పరిస్థితులు చవిచూసిందని మరో సంస్థ గణాంక సహితంగా తెల్పింది.వడగాడ్పులు, చలిగాలులు, పిడుగుపాట్లు, పెనుగాలులు, భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటాలు వగైరాల వల్ల 4,064 మంది మరణించగా, దాదాపు 95 లక్షల హెక్టార్ల పంట దెబ్బతింది. 99,533 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా కాప్–30 సదస్సు మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోయిందంటే అది మానవాళి దురదృష్టమనుకోవాలి. కాప్–30 విఫలం కానీయరాదన్న సంకల్పంతో ప్రకటించిన అరకొర చర్యలు తప్ప బెలేమ్ సాధించిందేమీ లేదు. -
జీ20 సరికొత్త మార్గం
దేశాల మధ్య సహకారం పెంపొందించటం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరత సాధించాలన్న సంకల్పంతో పదిహేడేళ్ల క్రితం ఏర్పడిన జీ20 తొలిసారి అమెరికాను ధిక్కరించింది. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్లో వరసగా రెండు రోజులు కొనసాగి ఆదివారం ముగిసిన సంస్థ శిఖరాగ్ర సదస్సుకు అమెరికా ముఖం చాటేయగా, దాన్ని బతిమాలటా నికీ, నచ్చజెప్పి ఒప్పించటానికీ ఒక్కరంటే ఒక్కరు ప్రయత్నించిన దాఖలా లేదు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తన విపరీత పోకడలతో ఇంటా బయటా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు.శ్వేతజాతి అమెరికన్లకు ఏదో ఒరగబెడుతున్నట్టు కనబడటం కోసం ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పర్యావరణ క్షీణత పెద్ద బోగస్ అని వాదించటమేగాక, బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను వినియోగించే పరిశ్రమలకు రాయితీలిస్తున్నారు. వేరే దేశాలు కూడా తన బాటలోనే నడవాలంటూ ప్రోత్సహి స్తున్నారు. మానవ కార్యకలాపాల పర్యవసానంగా భూగోళం వేడెక్కుతున్నదని, ఇది ధరిత్రి మనుగడకే పెను ముప్పని శాస్త్రవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్నా మొండిగా వ్యవహరిస్తున్నారు.అంతర్జాతీయంగానూ అదే బాణీ అందుకున్నారు. జొహాన్నెస్బర్గ్ సదస్సు ప్రధాన ధ్యేయమే వాతావరణ మార్పులపై చర్చించి తగు చర్యల కోసం ప్రపంచ దేశాలకు పిలుపునివ్వటం గనుక ట్రంప్ గుర్రుగా ఉన్నారు. సదస్సు ఎజెండాను మార్చమంటూ గత కొన్ని వారాలుగా ఒత్తిడి తెచ్చారు. అది సాధ్యపడక పోవడంతో శ్వేత జాతి మైనారిటీల పట్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని, అందుకు నిరసనగానే సదస్సుకు గైర్హాజరు కాదల్చుకున్నట్టు ప్రచారం లంకించు కున్నారు. ట్రంప్కు వంతపాడే అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలీ కూడా సదస్సుకు రాలేదు.కావడానికి జీ20 సంపన్న రాజ్యాల సంస్థే అయినా దక్షిణాఫ్రికా వంటి వెనకబడిన దేశంలో సదస్సు జరిగింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలపై ఉమ్మడి అవగాహ నకు రావాలన్న ధ్యేయంతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఇందులో వర్ధమాన దేశాలకు సైతం భాగస్వామ్యం కల్పించారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల జనాభా గల దేశా లకూ, ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపు 85 శాతం వాటా ఉన్న ఆర్థిక వ్యవస్థలకూ ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సదస్సు నుంచి దూరం జరిగితే ప్రపంచంలో ఏకాకిగా మిగులుతామన్న స్పృహ ట్రంప్కు లేకపోయింది.‘నేను లేకుండా శిఖరాగ్ర సదస్సు డిక్లరేషన్ను విడుదల చేయొద్దని ట్రంప్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా సదస్సు బేఖాతరు చేసింది. అంతేగాక సంప్రదాయానికి భిన్నంగా తొలి రోజునే డిక్లరేషన్ను ఆమోదించింది. తన గైర్హాజర్ అయోమయాన్ని సృష్టించి, డిక్లరేషన్ ఆమోదానికి అధినేతలు తటపటా యిస్తారని ట్రంప్ అనుకున్నారు. కానీ ‘అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగద’ని జీ20 తేల్చిచెప్పింది. వాస్తవానికి సంస్థ అధ్యక్ష పదవి అమెరికాకు రావాలి. కానీ సదస్సుకుట్రంప్ గైర్హాజరు కావటం, కనీసం ఉన్నతాధికారులనైనా పంపక, జూనియర్ అధికారితో సరిపుచ్చటానికి నిరసనగా అధ్యక్ష పదవి బదిలీకి దక్షిణాఫ్రికా నిరాకరించింది.అది ఎప్పుడుంటుందో, అసలు జీ20లో అమెరికా కొనసాగుతుందో లేదో చెప్పలేని స్థితి ఏర్పడింది. అమెరికాలోని మియామిలో వచ్చే ఏడాది జరగాల్సిన తదుపరి సదస్సుపైనా అనిశ్చితి అలుముకుంది. భారత, చైనా, రష్యాలేకాక అమెరికా శిబిరంలో ఉండాల్సిన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, కెనడాలు సైతం ఈ సదస్సులో పాల్గొని వాతావరణ సమస్యలపైనా, ప్రపంచ అసమానతలపైనా దృష్టిపెట్టిన డిక్లరేషన్ను ముక్తకంఠంతో ఆమోదించాయి.పునరుత్పాదక ఇంధన వనరులపై, నిరుపేద దేశాల రుణవిమోచనపై కూడా అవగాహన కుదిరింది. భారత్ సూచించిన విధంగా ఉగ్రవాదంపైనా, మాదకద్రవ్యాలపైనా సమష్టిగా తలపడటానికి ఆమోదం తెలిపాయి. వాతావరణ సమస్యలపై శిఖరాగ్ర సదస్సు అంగీ కారానికి రావటం ట్రంప్ జీర్ణించుకోలేనిది. సదస్సు ఆమోదించిన అంశాల్లో మెజా రిటీ పేద దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించినవే. తనది ఇక గత వైభవమేనని, ఇటువంటి సదస్సులకు దూరంగా ఉంటే అంతిమంగా తన ప్రతిష్ఠ మరింత మసకబారుతుందని అమెరికా గ్రహించాలి. -
పసిడి రేఖలు విసిరి....
బాఫూ గారికి భయభక్తులతో ఉత్తరం రాసి మనవి చేస్తే భక్త సులభుడైన దేవునికి మల్లే టకాలున బొమ్మ గీసి పంపించేవారు. ‘చంద్ర గారూ... బొమ్మ కావాలండీ’ అనంటే తన సిగ్నేచర్ మందహాసంతో ‘అలాగే’ అని, మనకు కావాల్సిన టైము లోపల కన్నా తాను ఇవ్వాల్సిన టైము లోపు ఇచ్చేసేవారు. హైదరాబాద్ పంజగుట్టలో ఆఫీసు పెట్టుకుని ఉండే కరుణాకర్ ధోరణి పూర్తిగా వేరే. కథో, నవలో, సీరియల్ భాగమో ఇప్పుడు ఇస్తే మధ్యాహ్నానికి బొమ్మ రెడీ. వెళ్లి తీసుకోవడమే.బాలీ గారు, గోపీ గారు, శీలా వీర్రాజు గారు పాత కాపులుగా ఉండి తమ రెగ్యులర్ పద్దుల్లో కొత్త బొమ్మలను జమ చేసుకుంటూ వెళ్లేవారు. ఇక ఆర్టిస్ట్ మోహన్ స్కూలు వేరే. ఈ క్షణమే కుంభవృష్టి కురవనూ వచ్చు... లేదా ఎప్పుడు కురుస్తుందా అని ఎదురు చూసేలా చేయనూ వచ్చు. మోహన్ బొమ్మలు అనూహ్య కటాక్షానికి తార్కాణాలు. ఇడ్లీ కంటే చట్నీ బాగున్నట్టు ఈలోపు మోహన్తో కంపెనీయే ఎక్కువ మందికి ఇష్టంగా ఉండేది. కవులకు, రచయితలకు తెలుగునాట రెమ్యూనరేషన్ మీద ఏ కోశానా ఆశ లేదు.ఎందుకంటే అది ఇవ్వరు. ఇచ్చినా అల్లరి చేసే పిల్లాడికి బెల్లమ్ముక్క పెట్టినట్టే. కాని వారు ఆశించే, ఆనందించే సంగతొకటి ఉంది. తాము రాసిన కవితకో, కథకో మెరుగైన దృశ్యరూపం ఇచ్చే చిత్రాన్ని చూడగలగడం. ఒక ఉత్తమమైన కవి, రచయిత తాను రాసింది పాఠకులకు అర్థమై స్పందన పొందేలోపు తమ రచనలోని అంతరార్థాన్ని ఎక్సె›్టండ్ చేస్తూ చిత్రకారుడు బొమ్మ గీస్తే, ఆ బొమ్మతో రచన అచ్చయితే ఇక ఆ పూటకు భోజనం చేయరు.అదే వారి సంబరపు విందు. అద్దో అలాంటి చిత్రకారులు గత కాలంలో ఎక్కువ శాతం ఉండేవారు. సాహిత్యం తెలిసి, రేఖలు తెలిసి, సాహితీ రేఖలు గీయగలిగిన వారు. పత్రికలు తెరిచినా, పుస్తకాల ముఖచిత్రాలు చూసినా ఆయా రచనల వైపు పాఠకులను ఆకర్షించేలా ఎంతో మేలిమి చిత్రాలను తీర్చిదిద్దేవారు. సినిమాలకు పోస్టర్ మల్లే రచనలకు వీరి బొమ్మ.ఆర్థిక ఇబ్బందులుండి, ప్రచురణకు సాంకేతిక సహాయం అంతగా లేని రోజుల్లో కవులూ, రచయితలకు చిత్రకారుల బొమ్మలే పెద్ద ఊరట. ఫలానా చిత్రకారుడు నా కథకు బొమ్మ వేశాడు తెలుసా అని రచయిత గర్వంగా చెప్పుకుంటే, ఫలానా రచయిత కథకు నేను బొమ్మ వేశాను తెలుసా అని చిత్రకారుడు గొప్పగా చెప్పుకునే సందర్భాలు ఉండేవి. పరస్పర ప్రోత్సాహకరంగా తెలుగు సాహిత్యం వర్ధిల్లిన కాలం అది. ఇప్పుడు కవులకు, రచయితలకు పుస్తకాలు ప్రచురించడం అతి సులువు.పిండి కొద్ది రొట్టె అన్నట్టు డబ్బు కొద్ది కాపీలు ఇచ్చే ‘ప్రింట్ ఆన్ డిమాండ్’ వచ్చాక పూర్తి ఆటే మారిపోయింది. వారానికి పది పుస్తకాలు అచ్చేయ్యే చోట వంద పుస్తకాలు అచ్చవుతున్నాయి. ఒకటీ అరా పబ్లిషర్ల సంఖ్య నుంచి ప్రతి నవ కవీ, యువ రచయితా పబ్లిషర్గా మారే సన్నివేశం అరుదెంచింది. తెలుగు పబ్లికేషన్ రంగం ఇంత కళగా ఎప్పుడూ లేదు. కాకుంటే ఒకటే వెలితి. పసిడి రేఖలు విసిరి కనుమరుగైపోయిన ఆ చిత్రకారులు ఎక్కడా? ఉన్న కొద్దిమంది చాలా బిజీ.డిసెంబర్ నుంచి బుక్ ఫెయిర్ల సీజన్. ఎందరో సాహితీకారులు, పబ్లిషర్లు వందల కొలది పుస్తకాలను అచ్చెత్తించే పనిలో ఉన్నారు. అయితే తమ పుస్తకాల్లోని సారాన్ని అర్థం చేసుకుని అర్థవంతమైన బొమ్మ ఇచ్చే చిత్రకారుల కొరతతో బాధ పడుతున్నారు. తోట తరణి అంటారు– సెట్ను గీసి చూపే ఆర్ట్ డైరెక్టర్ వేరు, చేసి చూపే ఆర్ట్ డైరెక్టర్ వేరు అని. కేవలం బొమ్మ వేసే వారికి డిజైన్ పరిమితి... డిజైన్ చేయగలిగే వారికి బొమ్మ పరిమితి... ఈ రెండూ వచ్చిన వారికి సమయ పరిమితి విపరీతంగా ఉంది. దాంతో ఈ సీజన్ అంతా కృత్రిమమైన ఏఐ బొమ్మలతో తెలుగు పుస్తకాలు కిటకిటలాడబోతున్నాయి. మల్లెలూ, కాగడాపూలూ ఒకలాగే ఉన్నా రెండూ ఒకటి కాబోవు.మంచి రచనకు మేలిమి చిత్రకారుడి కుంచెపోటు తెచ్చే బలం కావాలి. సముద్రం ఉన్న చోట లైట్హౌస్ వెలగాలి. నేడు మన వద్ద లిటరేచర్ ఫెస్టివల్స్, యూత్ ఫెస్టివల్స్ బాగా జరుగుతున్నాయి. కాని జరగాల్సింది ‘ఇలస్ట్రేటర్స్ ఫెస్టివల్’. కొత్తతరం రేఖాచిత్రకారుల కోసం ఏం చేయవచ్చో ఆలోచించాలి. బాపూ రమణీయం వలే తెలుగు రాత, తెలుగు రేఖ జమిలిగా వర్ధిల్లాలి. -
అటు విధ్వంసం... ఇటు విషప్రచారం!
చంద్రబాబు పెంపుడు మీడియా అవాకుల గురించీ, ఆయన ఆస్థానంలోని పెయిడ్ చిలుకల చెవాకుల గురించీ తెలుగు నాట తెలియనివారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాల పుట్ట పగులుతున్నకొద్దీ... యెల్లో మీడియా దురద రోగం మరింత ముదిరి వికృతరూపం దాలుస్తున్నది. రాజకీయ రంగుటద్దాలను తొలగించి నిష్పాక్షిక దృష్టితో ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులను గమనించండి. ఎటు చూస్తే అటు చీకటి. వికసిత జీవితాల విధ్వంసం. రాష్ట్రానికి జీవనాడి వంటి వ్యవసాయ రంగం కకావికలైన దృశ్యం కనిపిస్తుంది.అపురూపంగా పెంచుకున్న అరటి తోటల్ని దున్నేస్తున్నారు రైతులు. ఏం చేస్తారు మరి? టన్నుకు పది పన్నెండు వేలన్నా వస్తేనే... పెట్టిన ఖర్చు గిట్టుబాటవుతుంది. వెయ్యి రూపాయల కంటే ధర పలకని దుర్మార్గ పరిస్థితి నేడు దాపురించింది. జగన్ హయాంలో ఇరవై నుంచి ముప్ఫై వేలు పలికిన స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఆ రోజుల్లో రాయలసీమ నుంచి ఢిల్లీ నగరం దాకా పరుగెత్తిన ప్రత్యేక అరటి రైళ్ల దృశ్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసి లాభాలార్జించిన నాటి వైభవం ఇంకా వారి మనోఫలకాల్లో మెరుస్తూనే ఉన్నది. ఇప్పుడెందుకీ దుర్గతి?పత్తి పంటనూ దున్నేస్తున్నారు. పలనాటి రైతు విలవిల్లాడు తున్నాడు. సర్కారు నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాల జమిలి దాడితో పత్తి రైతులు చిత్తయిపోయారు. అధిక వర్షాలు, తుపాను దెబ్బకు తేమ శాతం పెరిగింది. కొనుగోలుదారులెవరూ ముందుకు రావడం లేదు. కాటన్ కార్పొరేషన్ కళ్లప్పగించి చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి దూది పువ్వుల దుఃఖం చెవి కెక్కడం లేదు. ఈ సీజన్లో అన్ని పంటల పరిస్థితీ అంతే. గిట్టుబాటు ధరల్లేక ఉల్లి పంటను దున్నేసిన వార్తలను చదవాల్సి వచ్చింది. గుండెజారిన ఉల్లి రైతుల ఆత్మహత్యలు కూడా రిపోర్టయ్యాయి.టమాటా రైతుల కన్నీటి పాట ఈ యేడు కూడా కర్నూలు జిల్లా నుంచి వినపడుతూనే ఉన్నది. ధరలు పతనమై మామిడి, చీనీ రైతులు కష్టాల పాలయ్యారు. జగన్ హయాంలో అమలు చేసిన పంటల బీమా పథకాన్ని కూటమి సర్కార్ ఎగరగొట్టింది. ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వ్యవసాయరంగాన్ని వదిలేసింది. ధరల స్థిరీకరణ నిధి, మార్కెట్లో సర్కార్ జోక్యం వంటి మాటలే ఇప్పుడు వినిపించడం లేదు. తుపానుతో దెబ్బతిన్న వరి రైతుల బాధ అరణ్య రోదన. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది లేదు. రంగుమారిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నదీ లేదు. పెట్టుబడి సాయాన్ని ఒక సంవత్సరం ఎగవేసి రెండో సంవత్సరానికి అత్తెసరుతో సరిపెట్టారు.వ్యవసాయ రంగం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారయ్యా అనే అనుమానం రాకుండా ఉండదు. ఆయనేం ఖాళీగా లేరు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ తాను వ్యవసాయరంగం గురించి ఆలోచనలు చేస్తూనే ఉన్నానని కడప జిల్లాలో రైతులతో జరిపిన ముఖా ముఖిలో ఆయన చెప్పుకున్నారు. రాష్ట్రంలో వీస్తున్న గాలులు ఏ దిశలో ప్రయాణిస్తున్నాయో, ఆ గాలుల క్వాలిటీ ఏమిటో, అందులో ఏమేమి తెగుళ్లున్నాయో, అవి ఎంత దూరం ప్రయాణిస్తాయో, ఏ పంటల మీద దాడి చేస్తాయో అనే విషయాన్ని తాను ఎనలైజ్ చేస్తున్నట్టు రైతులకు అభయమిచ్చారు.ఆ తెగుళ్ల సంగతి, పురుగుల సంగతి తెలిస్తే రైతుకు ఏ భయం ఉండదని చెప్పారు. అంతేగాక భూమిలో తేమ ఎంత ఉంది, ఎండ ఎంత తగులుతుంది అనే విషయాలను కూడా ఆయన అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఈ రకమైన టెక్నాలజీ డెవలప్మెంట్పై తాను దృష్టి పెట్టినందువల్ల పంటల బీమా గురించి, మార్కెట్ జోక్యం గురించి, పెట్టుబడి సాయం గురించి, ఇన్పుట్ సబ్సిడీ వంటి చర్యల గురించి అడగొద్దనేది ఆయన ఉద్దేశం కాబోలు! రాష్ట్ర రైతాంగంతోపాటు భూవసతి లేని వ్యవసాయ కూలీలను కూడా ప్రభుత్వం కష్టాల కొలిమిలోకి నెట్టింది.ఈ–కేవైసీలు లేవన్న నెపంతో దాదాపు 16 లక్షల మంది ఉపాధి కూలీల జాబ్ కార్డులను రద్దు చేసింది. ఇది ఆ పథకం నిబంధనలకు విరుద్ధం. గ్రామసభలో నిర్ధారణ చేసుకోకుండా జాబ్ కార్డులను రద్దు చేయడానికి వీల్లేదు. అయినా ఎడాపెడా రద్దు చేస్తున్నారు. అటు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా, ఇటు ఉపాధి హామీ ఆసరా లభించకుండా ఉద్దేశపూర్వకంగా చేసి ఒక విస్తారమైన చీప్ లేబర్ మార్కెట్ను రైతు–కూలీల్లో సృష్టించే కుతంత్రంతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తున్నది.ప్రైవేటీకరణ ఖడ్గాన్ని యథేచ్ఛగా ప్రయోగిస్తున్న బాబు సర్కార్ ఇప్పుడు పేదలకు అసైన్ చేసిన 34 లక్షల ఎకరాల భూములపై కూడా కన్నేసింది. పేదల దగ్గర నుంచి ఆ భూముల్ని లాక్కొని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కోసం ఆదరాబాదరా ఆర్డినెన్స్ను జారీచేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. నిరుపేదలైన అసైనీలకు ఉపయోగపడే విధంగా ఇరవయ్యేళ్ల తర్వాత వారు ఆ భూముల్ని అవసరార్థం అమ్ము కునే విధంగా జగన్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ ఇచ్చింది. దీనివల్ల తొమ్మిదిన్నర లక్షలమంది అసైనీలకు లబ్ధి జరిగింది. పేద రైతులకు లబ్ధి జరిగితే పెత్తందారీ సర్కార్కు నిద్రపట్టదు కదా! కాకుల్ని కొట్టి గద్దల్ని మేపడం దాని పాలసీ. అందుకే అధికారంలోకి వచ్చీరావడంతోనే యెల్లో మీడియా బాకా ద్వారా ఫ్రీహోల్డ్ స్కీమ్పై దుష్ప్రచారాన్ని ఊదరగొట్టి, ఆ భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టారు.ప్రభుత్వ రంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ‘పీపీపీ’ ముసుగేసి ప్రైవేటీకరించ డానికి ఇప్పటికే బాబు సర్కార్ తెగబడింది. దీనిపై జనంలో తీవ్ర వ్యతిరేకత మొదలయ్యాక మాట మార్చి ప్రైవేట్ వాళ్లకు అప్పగించినా నియంత్రణ మాత్రం సర్కారుకే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, అదెలా సాధ్యమో తెలియదు. ఇక ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన సేవలను కూడా ప్రైవేటీ కరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ సేవలు ఏవీ ఉచితం కాదని గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పేవారు.ఇప్పుడు దాన్ని అమల్లోకి తెచ్చే సన్నాహాల్లో ఉన్నారు. ఇక విద్యా, వైద్య రంగాల్లో జగన్ సర్కార్ తెచ్చిన సంస్కరణలు, వెచ్చించిన నిధులు పేద, మధ్యతరగతి వర్గాల్లో ఎన్నో ఆశలు నింపాయి. వారి ఆశల్ని కూటమి సర్కార్ అడియాసలు చేసింది. అక్కడా ప్రైవేటీకరణ మంత్రాన్నే జపిస్తున్నది. నాణ్యమైన విద్యను ఎంత ఖరీదైనా సరే కొనుక్కోవాల్సిందే. అవసరమైన వైద్యం అంగడి సరుకు మాత్రమే! ఇదీ బాబు విధానం.విశాఖ ఉక్కుపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు బాబు మాట్లాడుతున్నదేమిటి? విశాఖ ఉక్కు తెల్ల ఏనుగుగా మారిందని ఆయనీ మధ్యనే ఈసడించుకున్నారు. కార్మికులు పనిచేయట్లేదని అభాండాలు వేశారు. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లోకి రావడానికి అవసరమైన సొంత గనుల కేటాయింపు విషయాన్ని దాటవేశారు. ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు మాత్రం మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించేందుకు రాయ బారాలు నడుపుతున్నారు. అంతేకాదు విశాఖ పోర్టును దెబ్బ తీసే విధంగా ఆ స్టీల్ ఫ్యాక్టరీ సొంత రేవును కూడా నిర్మించుకుంటోంది. మిట్టల్ స్టీల్ కోసమే ఉద్దేశపూర్వకంగా ఆంధ్రుల సెంటి మెంట్తో ముడిపడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దెబ్బ తీస్తున్నారని వస్తున్న ఆరోపణలు నిజమేనని నమ్మవలసి వస్తున్నది.ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా ‘పీ–4’ అనే పేరుతో ప్రైవేటీకరించే విపరీత చర్యకు కూటమి సర్కార్ తెగబడింది. ఈ దేశ సంపదలో పేద ప్రజలు హక్కుదారులు కాదు, కేవలం యాచకులు మాత్రమేననేది ఈ ‘పీ–4’ పథకంలో అంతర్లీనంగా ప్రవహించే ఫిలాసఫీ. ఇది కచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేక ఆలోచన. బలహీన వర్గాల మహిళల ఆత్మ గౌరవాన్ని నిల బెట్టడం కోసం వారి పేర్లతో 30 లక్షల ఇళ్ల పట్టాలు కేటాయిం చింది జగన్ ప్రభుత్వం. అందులో తొమ్మిది లక్షల పైచిలుకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించింది.చివరి దశ నిర్మాణంలో ఉన్న 3 లక్షల ఇళ్లను పూర్తిచేసి చంద్రబాబు సర్కార్ తామే వాటిని నిర్మించినట్టు ప్రచారం చేసుకొని మొన్ననే లబ్ధిదారులకు అప్పగించింది. ఈ పదిహేడు మాసాల పాలనలో ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వకుండా మూడు లక్షల ఇళ్లను పూర్తిచేయడం నిజంగా ప్రపంచ వింతే! అంతటితో ఆగ లేదు. ఇరవై లక్షల ఇళ్లను ఇవ్వాలనుకుంటున్నామని, అందులో మూడు లక్షలు ఇప్పటికే అప్పగించామని కూడా చంద్రబాబు చెప్పారు. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? జగన్ సర్కార్ భూమిని సేకరించి ప్లాట్లు వేసి, పట్టాలిచ్చి నిర్మాణాలను ప్రారంభించినవి కావా?రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. పదిహేడు మాసాల్లో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇది జాతీయ రికార్డు. ఒకపక్క విద్యా, వైద్య రంగాలతో సహా సమస్తాన్ని ప్రైవేటీకరిస్తూ ప్రజల కిచ్చిన హామీలను ఎగవేస్తున్న సర్కార్ ఈ సొమ్మునంతా ఏం చేస్తున్నట్టు? రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు దిగజారాయి. అమ్మకం పన్ను వసూళ్లు తగ్గడమంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గు తున్నట్టు! ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నట్టు! పోలీసింగ్పై కేంద్రం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అట్టడుగున 36వ స్థానం ఏపీకి దక్కింది. కారణం తెలిసిందే. పొలిటికల్ గవర్నెన్స్ మన పోలీసింగ్ను పక్కదారి పట్టించింది. ఉద్యోగాల కల్పనలో కూడా ఏపీ అధమ స్థానంలోనే ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. ఇవేమీ యెల్లో మీడియాకు కనిపించవు. ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదని వారికి తెలుసు. దాని నుంచి చంద్రబాబును రక్షించడానికి ప్రతిపక్ష నేతపై దిగజారుడు విమర్శలకు ఈ మీడియా తెగబడుతున్నది. 2014–19 మధ్య కాలంలో అధికారంలో ఉండి చేసిన అవినీతిపై విచారణ జరిపి పలు ఛార్జిషీట్లు వేశారు. స్కిల్ కుంభకోణంలో జైలుకు కూడా ఆయన వెళ్లి వచ్చారు.ఇప్పుడా కేసుల నుంచి బయటపడేందుకు బాబు సర్కార్ ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఈ వ్యవహారం నుంచి కూడా దృష్టి మళ్లించాలి. కనుక జగన్ ప్రభుత్వ హయాంలో అవినీతి పేరుతో, ‘సిట్’ చెప్పిందన్న సాకుతో యెల్లో మీడియా నిండా అవే వార్తలు. పెట్టుబడులు తరలివస్తున్నాయంటూ పోచికోలు ప్రచారం. అమరావతిలో అంతస్థులు లేస్తున్నాయనే ప్రచారం. ఈ ప్రచార ఆర్భాటాలతో ఎంతకాలం రాష్ట్ర దైన్యస్థితిని దాచి పెట్టగలరు! విశాఖ సదస్సు ద్వారా పది లక్షల కోట్లు వస్తున్నా యని క్రితంసారి ప్రకటించుకున్నారు.కానీ పది శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదన్న నిజాన్ని దాచగలిగారా? ఇంకెంత కాలం జగన్ వ్యక్తిత్వ హననంతో సమాచార భ్రష్టత్వానికి పాల్పడగలరు! జగన్ హైదరాబాదు కోర్టుకు హాజరైనా తప్పేనా? చాలాకాలం తర్వాత హైదరాబాదుకు వచ్చారు కనుక పెద్దసంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. యెల్లో మీడియాకు, కూటమి సర్కార్కు మింగుడుపడినా, పడక పోయినా జాతీయ స్థాయిలోనే జగన్ అతిపెద్ద పొలిటికల్ క్రౌడ్ పుల్లర్. కోర్టు హాజరుపై సైతం యెల్లో టీవీలు మరో వార్త లేకుండా రోజంతా విషాన్ని ఎగజిమ్మాయి.ఒక ఎల్లో విశ్లేషకు డైతే ఏకంగా హిడ్మా మాదిరిగా జగన్ను కూడా ఎన్కౌంటర్ చేయాలని ఊగిపోయాడు. కొత్తగా చేయడమేమిటి? పదహా రేళ్లుగా ఆయన వ్యక్తిత్వంపై ఎన్కౌంటర్లు చేస్తూనే ఉన్నారు కదా! హిడ్మా ప్రజాస్వామ్యాన్ని పరిహసించాడట! రాజ్యాంగాన్ని వ్యతి రేకించాడట! జగన్ కూడా అదే పని చేశాడట. అదీ ఆ విశ్లేషకుని రీజనింగ్. సరే, హిడ్మా చనిపోతే వందలాది గిరిజన గూడేలు గుండె పగిలేలా ఎందుకు రోదించాయో, దండకారణ్యం కడుపు కోతతో ఎందుకు కుదేలైందో కాలమే సమాధానం చెబుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిలబెట్టి, ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని అణువణువునా నింపుకొని అడు గడుగునా అమలుచేసిన జగన్ రాజ్యాంగ వ్యతిరేకా? ఆ రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెల్లా తూట్లు పొడుస్తున్న కూటమి సర్కార్ రాజ్యాంగ వ్యతిరేక శక్తా? తేల్చడానికి ఇదేమంత క్లిష్టమైన సమస్య కాదు.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
మారిన విలువలు
కాస్త ఆలస్యం కావొచ్చు గానీ... పుష్కలంగా డబ్బూ, కండబలం ఉన్నవాడు ఎన్ని నేరాలు చేసినా మర్యాదస్తుడిగా మారడం కష్టమేం కాదని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్కు బుధవారం అమెరికాలో లభించిన స్వాగత సత్కారాలు చూస్తే తెలుస్తుంది. ఏడేళ్ల క్రితం ఆయన అంతర్జాతీయంగా అంటరానివాడు. సల్మాన్ను ఆహ్వానించటానికి అమెరికా జంకింది. సౌదీలో జరిగే పెట్టుబడుల సదస్సును పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించాయి. కానీ ఇప్పుడంతా మారింది.సల్మాన్కు 21 శతఘ్నుల వందనం, అశ్వారూఢులైన నావికాదళ పటాలం మేళతాళాలు, యుద్ధ విమానాల పరేడ్... ఒకటేమిటి ఆయన రాకే పెద్ద వేడుకన్నట్టు అధికార వ్యవస్థ సమస్తం పులకించిపోయింది. అమెరికాలో సల్మాన్ షాపింగ్ తక్కువేం లేదు మరి. దొంగచాటుగా వెళ్లి శత్రు స్థావరంపై దాడిచేయగలిగిన ఎఫ్–35 యుద్ధ విమానాలు, అణుశక్తి సాంకేతికత, చిప్లు, అరుదైన ఖనిజాల వేటలో సహకారం వగైరాలన్నీ అందులో ఉన్నాయి. వీటి విలువ అక్షరాలా లక్ష కోట్ల డాలర్లు. అదిగాక ట్రంప్ కుటుంబానికి గల్ఫ్ దేశాల్లో వందల కోట్ల డాలర్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అండదండలందించేందుకు సౌదీ ఇప్పటికే అంగీకరించింది.వీటన్నిటి పర్యవసానంగానే ఈ మర్యాదలు! నిజానికి ఆయనతో మళ్లీ సాన్నిహిత్యం కావాలని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రయత్నించకపోలేదు. జెడ్డాలో 2022లో పర్యటించినప్పుడు ఆయన్ను ‘భవిష్యత్తు రాజు’గా కీర్తించారు. కానీ ప్రజాభిప్రాయానికి జడిసి అమెరికా ఆహ్వానించటానికి సందేహించారు. బిన్ సల్మాన్ దుష్కృత్యం సాధారణమైనది కాదు. రాజ కుటుంబానికి సన్నిహితు డిగా, ‘వాషింగ్టన్ పోస్ట్’ కాలమిస్టుగా ఉన్న జమాల్ ఖషోగ్గీ తనపై తరచు చేసే విమర్శలు ఆయన తట్టుకోలేకపోయాడు. సల్మాన్ బతకనీయడని తెలిసి ఖషోగ్గీ అమెరికా వెళ్లి పోయారు. తన ప్రియురాల్ని పెళ్లాడటానికి అమెరికాలో దాఖలు చేయాల్సిన పత్రాల కోసం సౌదీ వెళ్లాల్సివున్నా, ముప్పు తప్పదన్న ఉద్దేశంతో టర్కీలోని ఇస్తాంబుల్లో ఉన్న సౌదీ కాన్సులేట్కు వెళ్లారు. తీరా సౌదీ నుంచి వచ్చిన 15 మంది హంతక ముఠా అంతకుముందే అక్కడ మాటువేసి ఆయన్ను మట్టుబెట్టింది.మామూలుగా కాదు... మనిషిని హతమార్చి, ముక్కలుగా కోసి ఎముకలన్నీ యాసిడ్లో కరిగిపోయేలా చేశారు. సల్మాన్ ఆదేశాలతోనే ఆ దారుణానికి ఒడిగట్టారని అప్పట్లోనే అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తేల్చింది. కాన్సులేట్ వద్దగల సీసీ కెమెరాల్లో ఖషోగ్గీకి ముందే 15 మంది సభ్యులు లోపలికెళ్లటం, కొన్ని గంటల తర్వాత వారంతా నిష్క్రమించటం రికార్డయింది. అంత ర్జాతీయ పాత్రికేయుల్లో ప్రతిష్ఠగల ఖషోగ్గీ హత్య అమెరికా, పాశ్చాత్య దేశాల ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిల్చింది. అందుకే తన తొలి ఏలుబడిలో సల్మాన్ను ట్రంప్ దూరం పెట్టారు. హత్యలో ఆయన ప్రమేయం రుజువైందని వ్యాఖ్యానించారు.కానీ ఇన్నేళ్లు గడిచాక ట్రంప్ తీరు మారింది. ‘మీపై సీఐఏ నివేదిక గురించి ఏమంటార’ని ఏబీసీ చానెల్ మహిళా ప్రతినిధి ఒకరు సల్మాన్ను అడిగేసరికి ట్రంప్ మండి పడ్డారు. ‘అదంతా ఏం లేదు... ఖషోగ్గీ వివాదాస్పదుడు. ఈ ప్రశ్న వేసి అతిథిని అవమానిస్తావా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏబీసీ ‘ఫేక్ న్యూస్’ అంటూ దూషించారు. ఆయనతో పోలిస్తే సల్మాన్ నాగరికంగా మాట్లాడారు. తన ప్రమేయం లేదని వివరించారు. నిజానికి సౌదీ పెట్టుబడుల రాక అంత సులభం కాదు. ఇప్పటికే ఎఫ్–35లను వినియోగిస్తున్న ఇజ్రాయెల్ అభ్యంతరాలను కాదని సౌదీకి ఇవ్వటం అసాధ్యం. పైగా ఆ విమానాల కోసం 20 దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నా అమెరికన్ కాంగ్రెస్ వాటిని ఖరారు చేయలేదు. అణుశక్తి సాంకేతికత కూడా అంతే. సౌదీకి ఎఫ్–35లిస్తే వాటి సాంకేతికత చైనాకు చేరే ప్రమాదం ఉన్నదని ఇటీవలే అమెరికా రక్షణ గూఢచార సంస్థ హెచ్చరించింది.ఇన్ని అవరోధాలున్న ఒప్పందాల ద్వారా వేలాది ఉద్యోగాలు వచ్చిపడతాయని ట్రంప్ జనాన్ని మభ్యపెడుతున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదవుతున్నా ట్రంప్ తాను ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాననుకుంటున్నారు. దేశాల మధ్య సంబంధాలకు లాభాలు, లోపాయికారీ ప్రయోజనాలే తప్ప విలువలు ఎవరికీ అక్కర్లేదని వర్తమాన ప్రపంచంలో కనబడుతూనే ఉంది. సల్మాన్ అమెరికా పర్యటన దాన్నే మరోసారి రుజువు చేసింది. -
మళ్లీ మొదటికి!
రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ తలెత్తే వివాదాల విషయంలో చివరకు కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అయింది. శాసనసభలు ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లుల్ని నెలల తరబడి పెండింగ్లో ఉంచుకోవటాన్ని తప్పుబడుతూ మొన్న ఏప్రిల్లో తమ ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును గురువారం సర్వోన్నత న్యాయస్థానపు రాజ్యాంగ ధర్మాసనం తప్పుబట్టింది. రాష్ట్రపతికీ, గవర్నర్లకూ గడువు విధించటం చెల్లదని అభిప్రాయపడింది.ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును నేరుగా ప్రస్తావించకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నల రూపంలో సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరిన మీదట రాజ్యాంగ ధర్మాసనం తన ఉద్దేశాన్ని తెలియజేసింది. రాజ్యాంగ విధులు నిర్వర్తించే సందర్భంగా ఆచరణలో తలెత్తే సమస్యల విషయంలో ఏ పక్షానికీ గెలుపోట ములుండవు. మూడు వ్యవస్థల్లో ఏ ఒక్కటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన ఆచరణ కనబరచకపోయినా అంతిమంగా నష్టపోయేది ప్రజలే. అలా చూస్తే రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయం కొంత నిరాశ కలిగిస్తుంది.గవర్నర్లకూ, ప్రభుత్వాలకూ తలెత్తే వివాదాలు జటిలమైనవి. ఎన్నికల సమయంలో పలు వాగ్దానాలు చేసి అధికారంలోకొచ్చిన పక్షం తన వాగ్దానాలు నెరవేర్చటం కోసం లేదా ప్రజల ప్రయోజనాల కోసం బిల్లులు తెస్తాయి. చట్టసభల్లో అవి ఆమోదం పొందు తాయి. తీరా గవర్నర్ల దగ్గర నెలల తరబడి పెండింగ్లో ఉండిపోతున్నాయి. మరి ప్రజలిచ్చిన రాజకీయాధికారం ఏమై పోవాలి? కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ లేదా కూటమి పాలిస్తుంటే ఇలాంటి సమస్య తలెత్తదు. భిన్నమైన పరిస్థితులున్నప్పుడే ఇబ్బందులేర్పడుతున్నాయి.కేంద్రంలో యూపీఏ ఉన్నా, ఎన్డీయే ఉన్నా ఇదే ధోరణి. రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ సంగతిని గమనించింది. బిల్లుల్ని పరిశీలించటంలో రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే వ్యవధికి ఒక స్థాయి ‘స్థితిస్థాపకత’ ఉంటుందని అంగీకరి స్తూనే దీర్ఘకాలం బిల్లును పెండింగ్లో పెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పడం కొంతవరకూ రాష్ట్రాలకు ఊరట.రాష్ట్రపతి సంధించిన ప్రశ్నలపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాం తప్ప ద్విసభ్య ధర్మాసనం లోగడ వెలువరించిన తీర్పుతో దీనికి సంబంధం లేదని రాజ్యాంగ ధర్మాసనం చెప్పడం గమనార్హం. గవర్నర్లు ఏళ్ల తరబడి బిల్లుల్ని పెండింగ్లో పెట్టి ప్రజల ద్వారా ఎన్నికైన చట్టసభల్ని నిరర్థకంగా మార్చడం సరికాదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో గవర్నర్లకు హితవు చెప్పింది. కానీ మారిందేమీ లేదు.అందుకే కావొచ్చు... ద్విసభ్య ధర్మాసనం రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద తనకు దఖలు పడిన అధికారాలను వినియోగించుకుంటూ బిల్లు ఆమోదానికి గవర్నర్లకూ, రాష్ట్రపతికీ మూడు నెలల గడువు విధించి, ఆ తర్వాత ఆమోదం పొందినట్టే భావించాలన్నది. ఇది సరి కాదని, ఇలా చేయటమంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ మరో రాజ్యాంగ వ్యవస్థ అధికారాలను చేతుల్లోకి తీసుకోవటమే అవుతుందని ధర్మాసనం తెలిపింది.అదే సమయంలో గవర్నర్లు బిల్లులపై ఏదో ఒకటి చెప్పటానికి ‘హేతుబద్ధమైన వ్యవధి’కి మించి తీసుకుంటే మాత్రం సమీక్షించే అధికారం ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం చెప్పటం రాష్ట్రాలకు కొంత వరకూ ఉపశమనం. రాష్ట్రపతికిచ్చిన ప్రత్యుత్తరంలో ‘హేతుబద్ధమైన వ్యవధి’ అనడం తప్ప, దాన్ని ఎలా నిర్ధారించాలన్నది చెప్పలేదు. అదే జరిగుంటే గవర్నర్ల పెత్తనానికి కాస్తయినా అడ్డుకట్ట పడేది. రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయంలో మౌనంగా ఉండి పోవటం వల్ల ఎప్పటిలాగే బిల్లు ఆగిపోయినప్పుడల్లా న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదు.రాజ్యాంగ అధికరణం 200 ప్రకారం తన ఆమోదం కోసం వచ్చిన బిల్లుపై గవర్నర్ ముందు మూడు ప్రత్యామ్నాయాలుంటాయి. ఆమోదించటం, రాష్ట్రపతి పరిశీలనకు పంపటం, వెనక్కి తిప్పిపంపటం. ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవాలన్నది గవర్నర్కుండే విచక్షణాధికారం. కానీ ఇదంతా సవ్యంగా సాగకపోవటమే సమస్య. గవర్నర్ల నియామకాలు రాజకీయపరమైనవి అయినప్పుడు వారి నిర్ణయాలపైనా ఆ ప్రభావం పడుతుంది. చట్టం చేయటమే ఇందుకు పరిష్కారమని రాజ్యాంగ ధర్మాసనం అన్నది. కానీ అది జరిగే పనేనా?! -
నియామకాల వైకుంఠపాళీ!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్సీ) గ్రూప్–2 పోస్టులకు 2015–16లో చేసిన ఎంపికలు రద్దయ్యాయి. తప్పుడు మూల్యాంకనంతో చేసిన ఎంపికలు చెల్లవని మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిల్చింది. జీవితంలో నిరుద్యోగ పర్వం సంక్లిష్టమైనది. ఎవరో కొందరు అదృష్టవంతులకు తప్ప దాన్నుంచి తప్పించుకోవటం సులభమేం కాదు. ఎలాగోలా దాటామనుకున్నంతలోనే, ఉద్యోగం వచ్చిందని సంబరపడేలోగానే అవకతవకలో, అవినీతో బయటపడి నియామకాలు రద్దుకావటం ఇటీవలి ధోరణి.పశ్చిమ బెంగాల్లో 2016లో పాఠశాల సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో కుంభకోణం చోటుచేసుకోవటంతో దాదాపు 26,000 మంది టీచర్ల నియామకాలు రద్దయ్యాయి. తొమ్మిదేళ్లపాటు ఉపాధ్యాయులుగా పనిచేసినవారు తిరిగి నిరుద్యోగులు కావటం ఎంత వైపరీత్యం! తప్పు చేసిన వారిని శిక్షించాలి తప్ప తమనెలా ఇళ్లకు పంపుతారని కొందరు చేసిన వినతిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే సక్రమంగా ఎంపికైనవారు కొత్త ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకూ కొనసాగవచ్చని వెసులుబాటిచ్చింది.అంటే అందరికందరూ నిరుద్యో గులై మళ్లీ తమ సత్తా చాటుకోవాలి. తెలంగాణ హైకోర్టు తీర్పు కొంతమేర నయం. గ్రూప్–2 పరీక్ష రద్దు కాలేదు. పునర్మూల్యాంకనం మాత్రమే జరుపుతారు. అయితే ఇన్నాళ్లూ ఉద్యోగస్తులుగా ఉన్నవారికి మళ్లీ ఫలితాలు వెలువడేవరకూ ఏం జరుగు తుందోనన్న గుబులు వెన్నాడుతుంది. అటు అప్పట్లో అవకాశాలు చేజారిన వారిలో ఆశలు చిగురిస్తాయి. నియామక బాధ్యతలు చూసే సంస్థలు అత్యంత జాగరూకతతో మెలగకపోతే, నిబంధనలను పాటించకపోతే యువతకు ఇలాంటి కష్టాలు తప్పవు.1,032 పోస్టులకు 2016 నవంబర్లో జరిగిన పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీ 2017లో సిఫార్సులు చేసింది. వాటిని శ్రద్ధగా అమలు చేస్తే వివాదమే తలెత్తేది కాదు. ఆ విషయంలో మొదట సింగిల్ జడ్జి బెంచ్, అటుతర్వాత ద్విసభ్య ధర్మాసనం తీర్పులిచ్చినా అందుకు విరుద్ధంగా జరగటం వల్లే పునర్మూల్యాంకనం చేయాలని జస్టిస్ భీమపాక నగేశ్ ధర్మాసనం ఆదేశించాల్సి వచ్చింది.శ్రద్ధగా చదువుకుని పట్టభద్రులైనా ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో సైతం కృతార్థులైతే తప్ప నిరుద్యోగ పర్వాన్ని దాటడం అసాధ్యం. ఇందుకోసం అమ్మానాన్నల్ని వదిలి, నగరాల్లో ఉండే కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తారు. స్థోమతకు మించి వేలాది రూపాయలు వెచ్చించి, తినీ తినకా రాత్రింబగళ్లు కష్టపడతారు. తీరా ఆ పరీక్షలు లాటరీ లాంటివి. శ్రద్ధపెట్టి చదివిన అంశాలు రాకపోవచ్చు. అంత ముఖ్యం కాదనుకున్నవి పరీక్ష పత్రంలో ప్రత్యక్షమై సవాలు చేస్తాయి. వీటికి నియామక సంస్థల నిర్లక్ష్యం తోడైతే చెప్పేదేముంది? ఇస్తున్న ప్రశ్నపత్రం, దానికి జోడించాల్సిన ఓఎంఆర్ షీట్లపై నిర్వాహకులకే అవగాహన కొరవడితే అభ్యర్థులకూ, ఇన్విజిలేటర్లకూ ఏం చెబుతారు?అప్పటికప్పుడు పరీక్ష హాల్లో ఏదో ఒకటి నిర్ణయించి అమలు చేయించటం వల్ల అంతిమంగా నష్టపోయేదెవరు? అభ్యర్థి వ్యక్తిగత వివరాల విషయంలో చిన్న చిన్న పొరపాట్లుంటే మన్నించవచ్చని, పార్ట్ట్–బిలోని ప్రశ్నలకు సంబంధించి జవాబులకు వైట్నర్ వాడినా, తుడిచే ప్రయత్నంచేసినా మూల్యాంకనం చేయొద్దని కమిటీ చేసిన సిఫార్సునే పాటించాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం చెప్పినా బేఖాతరు చేయటం సరైందేనా? తమ ఇష్టానుసారం మూల్యాంకనం కానిచ్చి, నియామకాలు పూర్తి చేయటం సమస్యాత్మకమవుతుందని, అర్హులైనవారికి అన్యాయం జరుగుతుందని కమిషన్కు తెలియదా? నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నవారు కమిషన్ నిర్వాకం వల్ల నియా మకాలు రద్దయి, అయోమయంలో పడ్డారు. దిద్దుబాట్లకూ, వైట్నర్ వినియోగానికీ, డబుల్ బబ్లింగ్కూ పాల్పడినవారూ మళ్లీ పరీక్షల సాగరంలో ఈదక తప్పదు. మొదటే అన్నీ సక్రమంగా పాటించి మూల్యాంకనం పూర్తిచేసి ఫలితాలు ప్రకటించివుంటే ఇంతమంది నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేవారు కాదు. కమిషన్లో జవాబుదారీ తనం కొరవడటం వేలాది మందికి శాపం. -
చరిత్ర తెలియని అజ్ఞానం
ఎంత ఉన్నత విద్యాశాఖ చూస్తున్నా అన్నీ తెలుసుననుకోవటం ఎంత పెద్ద తప్పో మధ్యప్రదేశ్ మంత్రి ఇందర్సింగ్ పర్మార్కు జ్ఞానోదయమైనట్టుంది. బ్రహ్మసమాజ వ్యవస్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ ‘బ్రిటిష్ ఏజెంటు’ అంటూ మొన్న శనివారం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సామాజిక మాధ్యమాల విస్తృతి బలంగా ఉన్న వర్తమానంలో ఇష్టానుసారం మాట్లాడితే ఆ మరుక్షణం నుంచే విమర్శల జడి మొదలవుతుంది. అందుకే 24 గంటలు తిరగకుండా ‘నోరు జారాను... తప్పయి పోయింద’ంటూ ఆయన ఒక వీడియో విడుదల చేయాల్సివచ్చింది. ఈ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్లోనే కాదు... దేశదేశాల్లో ఉన్న బెంగాలీ పౌరులంతా ఒక్కటై ఆగ్రహా వేశాలు వ్యక్తం చేశారు. తక్షణం దీన్ని చల్లార్చకపోతే పెను సమస్య అవుతుందని భయపడిన పశ్చిమ బెంగాల్ బీజేపీ విభాగం, పార్టీ అధిష్ఠానం రంగంలోకి దిగి ఆయనతో పశ్చాత్తాప ప్రకటన చేయించాయి. బెంగాల్ మేధాచరిత్ర గర్వించదగ్గది.‘బెంగాల్ ఇవాళ ఏం ఆలోచిస్తుందో... దేశం రేపు అదే ఆలోచిస్తుంది’ అన్న నానుడి ఒకప్పుడు జోరుగా వినబడటానికి కారణం 19వ శతాబ్దిలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యారంగాల్లో అక్కడ పెల్లుబికిన సంస్కరణలే! వీటన్నిటి వెనుకా రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నారు. 1857లో ఆయన స్థాపించిన బ్రహ్మసమాజం హిందూ మతానికి వ్యతిరేకం కాదు. ఆయన నిరీశ్వరవాది అంతకన్నా కాదు. కుల వ్యవస్థ, ఆ వ్యవస్థలోని అంతరాల దొంతరలూ, సతీ సహగమనం, బాల్య వివాహాలు వగైరా దురాచారాలూ, మూఢనమ్మకాలూ ఆ మతవ్యాప్తికి, దాంతోపాటు సమాజ గమనానికి అడ్డంకిగా ఉన్నాయని ఆయన విశ్వసించారు. తన భావాల వ్యాప్తికి ప్రిన్స్ ద్వారకానాథ్ టాగూర్, ఆయన కుమారుడు దేబేంద్రనాథ్ టాగూర్, కేశబ్చంద్రసేన్ వంటివారితో కలిసి బ్రహ్మసమాజాన్ని స్థాపించారు. తన వాదనలకు వేదాలూ, ఉపనిషత్తులూ ఆధారం చేసుకున్నారు. ఏకేశ్వరోపాసన ఆయన సిద్ధాంతం. పట్టువదలని విక్రమార్కు డిలా రామ్మోహన్ రాయ్ పోరాడినందు వల్లే సతి దురాచారాన్ని నిషేధిస్తూ చట్టం వచ్చింది. స్వాతంత్య్రానికి వందేళ్ల క్రితమే సమాజం మూఢ నమ్మకాల ఉచ్చు నుంచి బయటపడాలనీ, దురాచారాలు సమసిపోవాలనీ, మహిళలకు సైతం విద్య అందాలనీ తపించినవారాయన.ఆయన స్ఫూర్తితో పంజాబ్లో ఆర్య సమాజ్, మహారాష్ట్రలో ప్రార్థనా సమాజ్ వంటివి ఆవిర్భవించాయి. వీటి దారులు వేరైనా మత సంస్కరణలే ఈ సంస్థల ధ్యేయం. చిన్ననాడే బెంగాలీ భాషతోపాటు సంస్కృతం, పర్షియన్, అరబిక్, హిందూ స్తానీ భాషల్లో నిష్ణాతుడై ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారులతో పనిచేశారు. 1814లో ఆ ఉద్యోగాన్ని వదిలి ఆత్మీయ సభ పేరిట సంఘాన్ని స్థాపించి 1821లో వారపత్రిక ‘సంబాద్ కౌముది’ని ప్రచురించటం మొదలుపెట్టారు. ఆ రకంగా ఆయన దేశ పత్రికారంగానికి ఆద్యుడు. దేశంలో మొదటగా 1823లో ఈస్టిండియా కంపెనీ అధికారులు కలక త్తాలో స్థాపించిన కళాశాల సంప్రదాయ సంస్కృత విద్యాబోధనకే పరిమితమైనప్పుడు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేయటంతోపాటు విద్యార్థులకు సైన్సు, రేఖాగణితం, రసాయన శాస్త్రం, అనాటమీ వంటివి బోధించాలని అప్పటి గవర్నర్ జనరల్ అమ్హెస్ట్కు లేఖ రాశారు. సాధించారు. నిరుడు బెంగాల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళా సాధికారతకు తాము తీసుకుంటున్న చర్యల వెనకున్న స్ఫూర్తి రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పిన సంగతి పర్మార్కు గుర్తులేదనుకోవాలి. వర్తమాన ప్రయోజనాలు నెరవేర్చుకోవటం కోసం చరిత్రను వక్రీకరించటం పర్మార్తోనే మొదలు కాలేదు. గతంలోనూ కొందరు నాయకులు ఇదే బాపతు మాటలతో విమర్శలు ఎదుర్కొన్నారు. దేశంలో ఇతర చోట్ల కన్నా బెంగాల్లో సామాజిక, సాంస్కృతిక ప్రతీకలుగా వెలుగులీనినవారు అధికం. వారిపై ఆరాధనా భావం, గౌరవ ప్రపత్తులు కూడా ఎక్కువ. వారి జోలికిపోతే, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే వచ్చే ఏడాది జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టి మునుగుతుందని బీజేపీ గ్రహించినట్టుంది. తెలిసీ తెలియకుండా నోరు పారేసుకోవటం మంచిది కాదు. -
విశ్వసనీయత లేని విచారణ!
అందరూ అనుకున్నట్టే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశంలోని ‘అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్’ సోమవారం మరణశిక్ష విధించింది. ఆమెతోపాటు అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు సైతం ఇదే శిక్ష పడింది. నిరుడు ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డాక ఆమె బంగ్లా వదిలి మన దేశంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడామెను తమకు అప్పగించాలంటూ తాత్కాలిక ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కోరింది. అధికారంలో కొనసాగాలన్న లక్ష్యంతో హసీనా అనేక అవకతవకలకు పాల్పడటం, వ్యతిరేకుల్ని జైలుపాలు చేయటం, న్యాయమైన ఉద్యమాలను సైతం ఉక్కుపాదంతో అణిచేయటం వాస్తవం. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నవారి తీరుతెన్నులు కూడా ఏమంత మెరుగ్గా లేవు. ‘పేదవాళ్ల బ్యాంకర్’గా పేరు తెచ్చుకుని 2006లో నోబెల్ బహుమతి సాధించిన ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా ఉంటున్నారు. కానీ ప్రభుత్వ పగ్గాలు ఆయన చేతుల్లో ఉన్న దాఖలా కనబడదు. తాత్కాలిక ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వంలో మతతత్వ వాదుల ప్రాబల్యం పెరిగింది. మైనారిటీ హిందువులకూ, మహిళలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులేర్ప డ్డాయి. ఆఖరికి న్యాయమూర్తులుగా పనిచేసినవారిని సైతం వేధించి, రాజీనామాలు చేయించారు. ఆరోపణలొచ్చినప్పుడల్లా అవి అవాస్తమని ప్రకటించటం తప్ప యూనస్ చేసిందేమీ లేదు. బహుశా ఇలాంటి పరిణామాల వల్ల కావొచ్చు... యూనస్కు హోంశాఖ ప్రత్యేక సహాయకుడిగా ఉన్న ఖుదాబక్ష్ చౌధురి సెలవు పేరిట ఇటీవల దేశం వదిలిపోయారు. హసీనాకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంపై జరిగిన కాల్పుల్లో ఐక్యరాజ్యసమితి లెక్క ప్రకారమే 1,400 మంది మరణించారు. వేలాదిమంది గాయపడ్డారు. కానీ వాటిపై విచా రణ జరిపి శిక్షించటానికి తాత్కాలిక ప్రభుత్వానికి హక్కూ, అధికారం ఉన్నాయా? బంగ్లా రాజ్యాంగంలో తాత్కాలిక ప్రభుత్వం అనే ఏర్పాటే లేదు. పోనీ హఠాత్తుగా ప్రధాని దేశం విడిచిపోయారు గనుక ఆపద్ధర్మంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనుకున్నా, ఏడాదిలోగా ఎన్నికలు ఎందుకు జరపలేకపోయారు? అసలు హసీనాపై తీర్పు సందర్భమే కక్షపూరిత మైనది. ఈ నెల 14న తీర్పు ఇవ్వబోతున్నట్టు పక్షం రోజుల క్రితం ‘ట్రైబ్యునల్’ ప్రకటించింది. తర్వాత దాన్ని 17కు మార్చారు. ఆ తేదీ ఆమె పెళ్లి రోజు కావటం తప్ప మరేమీ కారణం లేదు. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో సాధించదల్చుకున్నదేమిటో?!తూర్పు పాకిస్తాన్... బంగ్లాదేశ్గా ఏర్పడి 54 ఏళ్లవుతోంది. ఆ సందర్భంగా పాక్ పాలకులపై సాగిన పోరాటంలో పాలుపంచుకుని, బంగ్లాదేశ్ ఆవిర్భావ అనంతరం తొలి ప్రధాని ముజిబుర్ రెహ్మాన్తో సన్నిహితంగా పనిచేసిన యూనస్ ఇప్పుడు పాక్ అను కూల శక్తులతో చేతులు కలిపారు. పాక్ నేతలకూ, సైనికాధికారులకూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అచ్చం వారిలానే మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. నిజానికి హసీనా, యూనస్ 2007 వరకూ కలిసి పనిచేశారు. ఆ సంవత్సరం అప్పటి అధ్యక్షుడు లాజుద్దీన్ అహ్మద్ ఆత్యయిక స్థితి ప్రకటించినప్పుడు సైన్యం తిరగబడి ఆయన్ను తొలగించింది. ఆ తర్వాత అవినీతిపై పోరాటం చేస్తామన్న సైనిక పాలకులకు యూనస్ మద్దతు పలకటంతో ఇద్దరి మధ్యా చెడింది. అటు తర్వాత ఏర్పడిన హసీనా ప్రభుత్వం యూనస్ను ఇబ్బందుల పాలు చేసింది. 172 కేసుల్లో విచారణను ఎదుర్కొనటం, ఒక కేసులో శిక్ష కూడా పడి బెయిల్పై ఉండటం వగైరాలు సాగాయి. పదవీ భ్రష్టత్వం ప్రాప్తించింది గనుక హసీనా ప్రభుత్వ అణచివేత చర్యలన్నీ ఆమెకు చుట్టుకున్నాయి. ఆ ఉద్యమం విఫలమైతే ఇవాళ విద్యార్థి నాయకులు, కొందరు రాజకీయ నాయకులు దోషులుగా నిలబడవలసి వచ్చేది. బంగ్లాలో అవామీ లీగ్ ప్రాబల్యం తగ్గి నట్టు లేదు. తీర్పు వెలువడటానికి ముందే అక్కడక్కడ హింస చోటుచేసుకుంది. సోమవారం ఢాకా పూర్తిగా స్తంభించింది. హసీనాపై వచ్చిన ఆరోపణల విషయంలో విచారణ జరగాల్సిందే. కానీ ఆ పని ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ద్వారా జరగాలి. దేశంలో ప్రజా స్వామిక వాతావరణం ఏర్పడాలి. ఇవేమీ లేని విచారణలు, శిక్షలు ప్రజల్లో విశ్వసనీయత కలిగించలేవు. -
మాయమైపోతున్న మనిషి
మనిషి నడక చిత్రంగా ఉంటుంది. అతను ముందుకు వెడుతున్నాననుకుంటాడు, కానీ అతనికి తెలియకుండానే అడుగులు వెనక్కి పడుతూ ఉంటాయి. అది తెలుసుకునే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకే చూడండి: మనిషి పుడుతూనే మనిషి కాలేదు. ఇతర జంతుజాలంలానే తనూ పుట్టాడు; తనలాంటివాళ్ళతో గుంపు కట్టాకే మనిషయ్యాడు, పదిమందిలో ఒకడిగా ఉంటేనే తనకూ, పదిమందికీ కూడా భద్రత అని తెలుసుకున్నాడు. గణంగా మారాడు, సమాజంగా ఎదిగాడు, రాజ్యంగా అవతరించాడు, సామ్రాజ్యంగా విస్తరించాడు. మళ్ళీ తనే దేశంగా మారే క్రమంలో సరిహద్దులు గీసుకుని సాటి మనుషుల్ని దూరం పెట్టే తిరోగమనమూ చిత్తగించాడు. మనిషి హోమోసేపియన్స్ పేరిట ఆధునిక మానవుడిగా అవతరించే నాటికే ఈ భూగోళం సువిశాలం. భూమ్మీద మానవ జనాభా లక్షల సంఖ్యకు చేరడానికి కూడా చాలా కాలం పట్టిందని శాస్త్రవేత్తలు అంటారు. మనుషుల గుంపుల మధ్య అనంతమైన దూరం ఉండేది. ఆ దూరాన్ని తరించడానికి కాలాన్ని జయించవలసివచ్చేది. ఆయుర్దాయం ముప్పై, నలభయ్యేళ్ళను మించేది కాదు కనుక, అందుకొక జీవితకాలం కూడా చాలేది కాదు. గణాల మధ్య అల్లుకున్న బంధుత్వాలు, ప్రేమలు, స్నేహాలు దూరాల్ని చెరిపి మనుషులను మానసికంగా దగ్గర చేసేవి. పసిఫిక్ మహాసముద్రంలోని టోబ్రియాండ్ దీవిజనం నౌకల మీద వెళ్ళి వెయ్యి మైళ్ళదూరంలో ఉన్న గణబంధువుల్ని కలిసి వాళ్ళకు కానుకలు ఇచ్చి రావడాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలా ఎలా జరిపేవారో ప్రముఖ మానవ శాస్త్రవేత్త బోనిస్లా మలినోవ్స్కీ రాస్తాడు. విచిత్రంగా, వాటికి ‘కులయాత్ర’లని పేరు. తరగని దూరాలు ఉన్నప్పుడు మానసికంగా మమతలు పెంచుకుంటూ దగ్గరగా ఉన్న మనుషులు, దూరాలు మాయమై భౌతికంగా దగ్గరగా ఉన్నా కూడా దూరమయ్యే స్థితికి చేరుకున్నారు. మహానగరాలు, పట్టణాలలో బహుళ అంతస్తుల గృహ సము దాయాల్లో ఏళ్ల తరబడిగా కలసి ఉంటున్నా ఒకరికొకరు తెలియని పరిస్థితికి వచ్చారు. తమ ఉమ్మడి భద్రత కోసం, తమను కలిపి ఉంచడం కోసం తమే సృష్టించుకున్న వ్యవస్థలే తమను విడదీసేవయ్యాయి. బ్రిటిష్ ఏలుబడిలో న్యాయస్థానాల ఏర్పాటు జరిగిన తర్వాత చిన్నాచితకా వివాదాలపై కూడా కోర్టుకు వెళ్ళడం ఎలా వేలంవెర్రిగా మారిందో, చివరికది కుటుంబ సభ్యుల్లోకి కూడా పాకి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఎలా ఛిద్రం చేసిందో ఆ కాలపు ఉదంతాలు కళ్ళకు కట్టిస్తాయి. ఓ కుటుంబంలో ఆస్తి తగాదా పుట్టి ఏకంగా తల్లీ, కొడుకులే కోర్టు కెక్కారట. వాయిదాకు పొరుగూరు వెళ్లవలసి వచ్చి నప్పుడు ఇద్దరూ కలిసే వెళ్ళేవారట. ఒకే సత్రంలో దిగేవారట. కొడుకు బయట ఎక్కడా భోజనం చేయడు కనుక తల్లే వండిపెట్టేదట! రాను రాను, శాస్త్రసాంకేతిక విజ్ఞానాల చేతిలో మనుషులు మరబొమ్మలయ్యారు. బంధుత్వాలూ, స్నేహాలూ ముఖాముఖీ అభివ్యక్తికి దూరమై మొబైల్ తెరకు పరిమితయ్యే పలకరింపులవుతున్నాయి. సాహిత్య రంగానికే వస్తే, ‘పాట’ దశను దాటి ‘రాత’ దశకు చేరడాన్ని పురోగమనంగా చెప్పుకోవడం పరిపాటి అయింది. కానీ నిజానికి పాటే కాదు, ఆట కూడా సమూహ చింతన నుంచి, సమష్టి చైతన్యం నుంచి పుడితే; రాత వైయక్తిక స్పందన నుంచి పుట్టింది. సమూహం నుంచి విడివడి మనిషి ఒంటరి అయ్యే ఆ పరిణామాన్ని పురోగమనమనాలో, తిరోగమనమనాలో తేల్చుకోలేక పోవడమే మానవ జీవనంలోని మహా వైచిత్రులలో ఒకానొకటి. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ/మచ్చుకైనా లేడు చూడూ’ అనే పాట కొద్ది రోజులుగా తెలుగునాట వాడవాడలా వినిపిస్తూ, గుండె గుండెనూ తట్టిలేపడం చూశాం. తనే నిలువెత్తు పాటగా మారి, జనంలోకి వెళ్ళి, మనిషి మనిషిలో మోగి హఠాత్తుగా మన మధ్య నుంచి మాయమైన మనకాలపు పాటల గంధర్వుడు అందెశ్రీ కట్టిన పాట అది. ‘ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా... అవసరాలకు మనిషి సృష్టించిన రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా... కదిలె విశ్వం తనా కనుసన్నలో నడువా, కనుబొమ్మ లెగరేసి కాలగమనం లోన’ మనిషి మాయమై పోతున్నడమ్మా అని హెచ్చరిస్తున్న ఆ పాట నిజానికి సందేశ పరంగా మానవ జాతీయ గీతాలలో ఒకటి కాదగినదీ, విశ్వవేదిక మీద వినిపించవలసినదీ. -
అంకగణితం ప్లస్ అనైతికత!
ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లను గెలుచుకుంటేనే గొప్ప విజయంగా పరిగణించడం మీడియాలో ఒక సంప్ర దాయం. ఇక ఆరింట ఐదొంతుల సీట్లు గెలిస్తే చెప్పేదేముంది! బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సరిగ్గా అటువంటి విజయం లభించింది. భారత జాతీయ బడా మీడియా సంస్థలన్నీ కాషాయ దీక్షను స్వీకరించాయన్న సంగతి జగమెరిగిన సత్యం. మరి కాషాయ పార్టీ నాయకత్వంలోని కూటమి అంతటి భారీ గెలుపును నమోదు చేస్తే భజించకుండా బజ్జోవు కదా! శరభ నాట్యాన్ని ప్రదర్శించాయి. అసోయ్ దూలాకు అసలు తగ్గలేదు. మొత్తం 243 స్థానాలున్న సభలో 202 స్థానాలను కైవసం చేసు కోవడమంటే మాటలు కాదు.ఈ అంక గణితంలో ఇంకో పార్శా్వన్ని కూడా గమనించాలి. ప్రతిపక్ష కూటమికి క్యాప్టెన్గా వ్యవహరిస్తున్న ఆర్జేడీ పార్టీకి 23 శాతం ఓట్లు పోలయ్యాయి. ఐదేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో కూడా దాదాపు ఇంతే శాతం ఓట్లను ఆ పార్టీ దక్కించుకున్నది. ఈసారి పెద్దగా తగ్గిందేమీ లేదు. బీజేపీకి ఇప్పుడు 20 శాతం ఓట్లు పడ్డాయి. ఐదేళ్ల కింద కూడా అంతే! 19.8 శాతం ఓట్లను సాధించింది. గణనీయమైన పెరుగుదలేమీ కాదు. జేడీ (యు)కు అప్పుడు 16 శాతం, తాజాగా 19 శాతం ఓట్లు లభించాయి. మూడు శాతం పెరుగుదల! మహాగuЇబంధన్ (ఎంజీబీ) కూటమికి వైస్ క్యాప్టెన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడూ ఇప్పుడూ కూడా కూటమికి గుదిబండగానే మారింది. కాకపోతే దాని ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదు. అప్పుడు తెచ్చుకున్న తొమ్మిది శాతం ఓట్లను దాదాపుగా కాపాడుకోగలిగింది.ఒక కూటమిగా ఎంజీబీకి 2020లో 37.23 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో అదే కూటమి సాధించిన ఓట్లు 37.5 శాతం. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్య క్రమం తర్వాత గతంతో పోలిస్తే బిహార్ ఓటర్ల సంఖ్య నికరంగా 47 లక్షలు తగ్గింది. అయినా ఎంజీబీ ఓట్లు తగ్గలేదు. కానీ, సీట్ల లెక్కల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకోవలసివచ్చింది. ఈ రకమైన ఫలితాల లోగుట్టు పెరిగిన పోలింగ్ శాతంలో ఉన్నది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి తొమ్మిది శాతం పైచిలుకు ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఈసారి ఎన్ని కల్లో తొమ్మిది శాతానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. పురుష ఓటర్ల కంటే తొమ్మిది శాతం అధికంగా మహిళలు ఈసారి ఓటేశారు. గత ఎన్నికల్లో 37.26 శాతం ఓట్లు సాధించిన ఎన్డీఏ ఈసారి తొమ్మిది శాతం అదనంగా 46.7 శాతం ఓట్లను సంపాదించింది. సాధారణంగా పురుషులు, స్త్రీల పోలింగ్ శాతాల్లో ఒకటి రెండు శాతం కంటే ఎక్కువ తేడాలుండవు. కానీ బిహార్లో ఈసారి మహిళల ఓటింగ్ శాతం పురుషులతో పోలిస్తే తొమ్మిది శాతం ఎక్కువగా ఉంది. గతంలో పోలైన ఓట్ల కంటే ఈసారి పెరిగిన ఓట్ల శాతంతో మహిళా ఓట్ల పెరుగుదల సమానంగా ఉండటం ఒక విశేషం. అంతేకాదు. ఎన్డీఏ కూటమి ఓట్ల పెరుగు దల కూడా ఇంతే స్థాయిలో ఉండటం మరో విశేషం. ఇక్కడొక విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. బిహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందట నితీశ్ కుమార్ ప్రభుత్వం ‘మహిళా రోజ్గార్’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద మహిళలందరికీ ఏటా పదివేల రూపాయలుఅందజేస్తారు. కేవలం ప్రకటించడమే కాదు. దాదాపు కోటి యాభై లక్షల మంది మహిళలకు పదివేల రూపాయల చొప్పున నగదు బదిలీ చేశారు. ఈ బదిలీ కార్యక్రమం షెడ్యూల్ విడుదలై ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత కూడా యథేచ్ఛగా కొనసాగిందని ప్రతిపక్షం చేసిన ఫిర్యాదు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లయింది.ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలను ఈ సంద ర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరం. ‘వైఎస్సార్ చేయూత’ అనే పథకాన్ని అప్పటికి నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఆ సంవత్సరం గడువు ప్రకారం విడదల చేసిన 4 వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతా లకు చేరకుండా ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే ఆ నిధులను విడుదల చేశారు. ఈ రెండు ఉదంతాలు ఎన్నికల సంఘం ‘నిష్పాక్షికత’కు నిలువెత్తు అద్దాల నుకోవాలి. మహిళల ఓట్లను ఇలా టోకున కొనుగోలు చేయడంతోపాటు మహిళల సాంస్కృతిక విశ్వాసాలను సైతం ఎన్డీఏ కూటమి బాగానే మార్కెటింగ్ చేసుకున్నది. ఛట్ పూజ అనేది ఉత్తరాదిన మరీ ముఖ్యంగా బిహార్లో మహిళలు చేసుకునే పూజా కార్యక్రమం. తమ భర్తల క్షేమం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం నదీ తీరాల్లో మహిళలు సూర్యదేవుడిని, ఆయన సోదరి ఛట్ దేవిని వేడుకుంటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పూజ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఏర్పాట్లు చేశాయి. చిత్తం పూజ మీద, భక్తి ఓట్ల మీద!ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఒక జాతీయ పార్టీగా తన ఆరోపణలకు తగిన ఆధారాలను సమర్పించవలసిన బాధ్యత కూడా ఆ పార్టీదే! లేకపోతే ‘ఆడలేక మద్దెల ఓడు’ అనే సామెత చందంగా ఆ పార్టీ పరిస్థితి మారుతుంది. ఆర్జేడీ హుందాగా ప్రజా తీర్పును అంగీకరించింది. ఓటమిలో విచారాన్ని, గెలుపులో గర్వాన్ని చూడబోమని ప్రకటించింది. నిరంతరం జనజీవితంతో మమేక మవుతామని వెల్లడించింది. ఎమ్జీబీలో ఆర్జేడీ మినహా మరో బలమైన పార్టీ లేకపోవడం ఆ కూటమికి పెద్ద బలహీనత. తన సంప్రదాయ ఓటు బ్యాంకుల్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ఓకుంటి గుర్రంగా మారింది. అయినా 64 సీట్లకు తగ్గేదే లేదని మొండికేసింది. ఆపైన మరికొన్ని సీట్లలో ‘స్నేహపూర్వక పోటీ’ పేరుతో కూటమిని ఇబ్బందులకు గురిచేసింది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 75 సీట్లకు పోటీచేసి కూటమి ఓటమికి కార ణమైంది. అప్పుడు దాదాపు విజయ తీరాలకు వచ్చిన తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ) కాంగ్రెస్ కారణంగా అధికారాన్ని కోల్పో యారు. ఇప్పుడు కూడా ఆ పార్టీ వైఖరిలో మార్పు రాలేదు.కూటమిలో భాగస్వాములైన లెఫ్ట్ పార్టీల పలుకుబడి కేవలం ఓ పాతిక సీట్ల వరకే పరిమితం. వాటిలో ఈసారి సీపీఎమ్ఎల్ (లిబరేషన్) పార్టీ రెండు సీట్లలో, సీపీఎం ఒక్క సీటులో గెలిచాయి. ఇండియన్ ఇన్క్లూజివ్ పార్టీ అనే మరో అల్పప్రాణి కూడా ఈ కూటమిలో ఉన్నది. దానికీ ఒక సీటు లభించింది. ఎమ్జీబీ అలయెన్స్ కూర్పు ఓ బలహీనత. ఇక తేజస్వీ యాదవ్ తన సాంప్రదాయిక ప్రాబల్యాన్ని దాటిమరింత విస్తరించలేకపోవడం మరో బలహీనతగా మారింది. ముస్లిం – యాదవ్ (ఎమ్వై) కాంబినేషన్ ముప్ఫయ్యేళ్ల క్రితం సత్ఫలితాలను ఇచ్చి ఉండవచ్చు. మిగిలిన బలహీన వర్గాలు కూడా జాగృతమైన ఈ పరిస్థితుల్లో తన పరిధిని విస్తరించు కోకుండా తేజస్వి తన ఆశయాన్ని నెరవేర్చుకోలేరు. లాలూ రాజకీయ చతురత ఇప్పటి కాలానికి సరిపోకపోవచ్చు. పైగా అనారోగ్యం, వయోభారం. ఆయనిక పొలిటికల్ గేమ్స్ ఆడ లేరు. ఆడవలసింది తేజస్వీ యాదవే! కొత్త తరానికి సరిపోయే ఆటను ఆయన నేర్చుకోకపోతే, ప్రత్యామ్నాయ శక్తులు రంగంలోకి రావచ్చు.ఎమ్జీబీ కూటమి కూర్పుకు పూర్తి భిన్నంగా ఎన్డీఏ వ్యవహరించింది. విజయానికి అవసరమైన అంకెలను దృష్టిలో పెట్టుకొని అలయెన్స్కు రూపకల్పన జరిగింది. గతంలో ఒంట రిగా 130 సీట్లలో పోటీచేసి, ఐదు శాతానికి పైగా ఓట్లు తెచ్చు కున్న చిరాగ్ పాశ్వాన్ పార్టీని కూటమిలోకి తెచ్చుకున్నారు. 29 స్థానాలు కేటాయిస్తే ఆయన పార్టీ అందులో 19 గెలిచింది. మిగిలిన సీట్లలో బీజేపీ, జేడీయూ అభ్యర్థులకు పాశ్వాన్ పార్టీ ఉపయోగపడింది. దళితుల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు మాజీ ముఖ్యమంత్రి మాంఝీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన పార్టీ ‘హిందూస్థానీ అవావ్ు మోర్చా’ కూడా భాగస్వా మిగా ఐదు సీట్లు గెలిచి కూటమికి ఉపయోగపడింది. వెనుక బడిన తరగతుల్లో కుష్వాహ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ఆర్ఎల్ఎమ్ కూడా ఎన్డీఏకు ప్లస్ పాయింట్గా మారింది. ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలోరంగంలోకి దిగిన ఎమ్ఐఎమ్ ఐదు సీట్లలో గెలవడమే కాక పలుచోట్ల ఎమ్జీబీ అభ్యర్థుల ఓటమికి కారణమైంది.సామాజిక సమీకరణాలను పక్కా లెక్కలతో కూర్పు చేసు కున్న ఎన్డీఏ కూటమికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంగబలం, అర్థబలంతోపాటు ఎన్నికల సంఘం ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయనేందుకు ‘మహిళా రోజ్గార్’ పథకమే ఉదాహరణ. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో ప్రతి ఏటా పదివేల పథకాన్ని ప్రకటించే నైతిక హక్కు ఏ విధంగా ఉంటుంది? దీనికి ఎన్నికల సంఘమే జవాబు చెప్పాలి. ఈ రకమైన అనైతికతకు తోడు అంకగణిత కూర్పులతో బిహార్ను ఎన్డీఏ గుప్పెట్లో పెట్టుకున్నది. అంతే తప్ప అక్కడ ఒక మహా ప్రభంజనం వీచి ఆర్జేడీని కూకటివేళ్లతో సహా పెకిలించిందేమీ లేదు. ఆ పార్టీ కొత్త శ్రేణు ల్లోకి విస్తరించలేకపోయింది. అంతే తప్ప తన పునాదిని పోగొట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి కొత్తగా జరిగిన శృంగభంగం కూడా ఏమీ లేదు. ఆ పార్టీ ముక్కూచెవులను బిహారీలు ఏనాడో కోసిపారేశారు.భారతీయ జనతా పార్టీ పచ్చి మితవాద పార్టీ. తన మతవాద ముద్రను కూడా దాచుకునే ప్రయత్నం చేయడం లేదు. ఆర్థిక, సామాజిక విషయాల్లో పచ్చి సోషలిస్టు వ్యతిరేకి. కానీ తన ప్రాబల్య విస్తరణ కోసం భావజాల సారూప్యత లేని పార్టీలతో సైతం చెలిమికి వెనకాడటం లేదు. నవభారత నిర్మాత పండిత్ జవహర్లాల్ నెహ్రూను, ఆయన సోషలిస్టు ఆర్థిక విధా నాలను రోజూ విమర్శించే బీజేపీ బిహార్లో అంటకాగుతున్నది ఎవరితో? భారతీయ సోషలిస్టు పార్టీ స్థాపకులైన రామ్మనో హర్ లోహియా విచారధార లోంచి ప్రవహించినవాడే నితీశ్ కుమార్. దిగ్గజ సోషలిస్టు జార్జి ఫెర్నాండెజ్ అడుగుజాడల్లోనే నితీశ్ కుమార్ రాజకీయ అడుగులు పడ్డాయి. నెహ్రూకూ, లోహియా వాదులకూ విభేదాలుండవచ్చు. అంతిమ లక్ష్యం సామ్యవాదమే కదా! అంతెందుకు బిహార్లోని ఆర్జేడీ, జేడీయూ... రెండూ ఒకే తాను ముక్కలు. నితీశ్ పార్టీకి ఆయన తర్వాత వారసత్వ నాయకత్వం లేదు. ఆయన ఆరోగ్యం కూడా అంతంతమాత్రం. ఇప్పుడు పెద్ద పార్టీగా గెలిచిన బీజేపీ నితీశ్ను మరికొంతకాలం కొనసాగనిచ్చి తర్వాత తానే పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నితీశ్ తదనంతరం ఆయన పార్టీని కూడా బీజేపీ తనలో లీనం చేసుకోవచ్చనే అభిప్రాయం ఉన్నది.హిందీ మాట్లాడే ‘కౌ బెల్ట్’ ప్రాంతంలో ఒక్క బిహార్ మాత్రమే పూర్తిస్థాయిలో బీజేపీకి చేజిక్కలేదు. అనతికాలంలోనే ఈ గోక్షేత్రమంతా కాషాయ ఛత్రఛాయలోకి రావడం ఖాయ మన్న ఆశాభావం బీజేపీలో ఇప్పుడు బలపడింది. ఇక మిగిలింది ఆర్యావర్త సంపూర్ణ కాషాయీకరణ! త్రివేణుల్లో ఒకటైన సరస్వతీ నది ఒకనాడు అదృశ్యమైనదని భావిస్తున్న నేటి రాజస్థాన్, గుజరాత్ ప్రాంతం నుంచి గంగా ప్రవాహపు ఆఖరి మజిలీ వంగభూమి వరకు విస్తరించిన ఆర్యావర్తంలో బీజేపీకి ఇప్పటిదాకా అందని రాష్ట్రం బెంగాల్ మాత్రమే. నిన్నటి విజ యోత్సవ ర్యాలీలో నరేంద్ర మోదీ బెంగాలే తమ తదుపరి లక్ష్యమని ప్రకటించారు. బీజేపీ విజయయాత్రను మమతా దీదీ నిలువరించగలరా... లేదా? ఇంకో ఏడాది వేచి చూడాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
విపక్ష కూటమికి బి‘హారర్’
అయిదేళ్ల క్రితం బిహార్లో అంతంతమాత్రంగా గెలిచి అధికారంలోకొచ్చిన ఎన్డీయే కూటమి ఈసారి అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంటున్న దాఖలా కనబడుతోంది. శుక్రవారం ఉదయం ఈవీఎంలు తెరిచినప్పటినుంచి ఆ కూటమి అప్రతిహతంగా పురోగ మించటం తప్ప వెనుకంజ లేదు. దాని ధాటికి దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ విపక్షాల కంచుకోటలనుకున్నవి కుప్పకూలుతున్నాయి. అంగప్రదేశ్, భోజ్పూర్, మగద్, మిథిలాంచల్, సీమాంచల్, తిరుత్ తదితర ప్రాంతాలన్నిటా ఎన్డీయే కూటమి విపక్షాలకు అందనంత దూరంలో ఉందంటే... విపక్ష మహాగఠ్బంధన్ (ఎంజీబీ)కి సారథ్యం వహించిన ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవే తన స్థానాన్ని నిలుపుకోవటానికి యాతన పడ్డారంటే ఇక ఇతరుల గురించి చెప్పేదేముంది? గత ఎన్నికల్లో ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ ఇప్పుడు కనుమరుగయ్యే స్థితికి చేరువైంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మధ్యలో కొన్నాళ్లు కూటమికి దూరమై... వెనక్కొచ్చినా ఎన్డీయేపై దాని ప్రభావం లేకపోవటం గమనించదగ్గది. 243 స్థానాలున్న అసెంబ్లీలో దాదాపు 200 స్థానాలకు ఎగబాకే దిశగా అది దూసుకెళ్తుండగా కనీసం 40 అయినా వస్తాయా అనే సందిగ్ధంలో ఎంజీబీ పడింది. తన ప్రాభవం గతించి దశాబ్దాలవుతుండగా ఎన్నిక లొచ్చి నప్పుడల్లా ‘తగుదునమ్మా...’ అంటూ అధిక స్థానాల కోసం పట్టుబట్టే కాంగ్రెస్ షరా మామూలుగా 61 తీసుకుని బొక్కబోర్లా పడింది. కూటమికి తాను పెద్ద గుదిబండనని రుజువు చేసుకుంది. గతంలో 70 సీట్లు తీసుకుని కేవలం 19 గెల్చుకున్న కాంగ్రెస్... ఇప్పుడు కేవలం 6తో సరిపెట్టుకునేలా కనబడుతోంది. సీమాంచల్లో ఎంఐఎం గతంలో గెల్చుకున్న అయిదు స్థానాలూ నిలుపుకోవటమేకాక రీ కౌంటింగ్ సాగుతున్న ఆరో స్థానంలోనూ నువ్వానేనా అన్నట్టుంది. వామపక్షాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే(సర్) పేరిట ఎన్నికల సంఘం(ఈసీ) ఆదరాబాదరాగా మొదలెట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై విపక్షాలు ఎంత హడావుడి చేసినా, సుప్రీంకోర్టుకెక్కినా... కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఓట్ చోరీ ప్రచారం చేసినా ఓటర్లు దాన్ని పెద్దగా పట్టించుకోలేదని ఫలితాల సరళి చెబుతోంది. అంతేకాదు... కుటుంబాని కొక సర్కారీ ఉద్యోగమిస్తామని ఆర్జేడీ చేసిన వాగ్దానం ఎన్డీయే నగదు బదిలీ ముందు వెలవెలబోయింది. 75 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే మహిళా రోజ్గార్ యోజన ద్వారా యేటా రూ. 10,000 ఇస్తామని చెప్పటమే కాక సెప్టెంబర్ 26న తొలి వాయిదాను అందించటం జనానికి నచ్చింది. బాగా వెనకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ వంటి చిన్న పార్టీలను కలుపుకొన్నా 2020 నాటి తన 37.23 శాతం ఓట్లనూ పెంచుకోవటంలో ఎంజీబీ విఫలమైంది. అదే సమయంలో ఎన్డీయే గతం కన్నా పది శాతం మేర పెంచుకుంది. గతం కన్నా మహిళలు ఎన్డీయే వైపు మొగ్గటం,గతంలో అలిగి విడిగా పోటీచేసిన ఎల్జేపీ తిరిగి వెనక్కురావటం బాగా కలిసొచ్చింది. పెద్దమాటలు చెబుతూ వచ్చిన ప్రశాంత్ కిశోర్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక తీసుకొచ్చి విపక్షాలను దెబ్బతీశారు.ఆధిపత్య కులాల్లో ఓటు బ్యాంకును నిలుపుకొంటూనే బాగా వెనకబడిన ఎంబీసీ కులాలు, మహాదళిత్ల ఆదరణ పొందటం ఎన్డీయేకు లాభించింది. ఆ వర్గాలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీలకు తగినన్ని సీట్లివ్వటమే ఇందుకు కారణం. దీని ముందు ఆర్జేడీ ముస్లిం–యాదవ్ కలయిక పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 87 స్థానాల్లో దాదాపు 20 శాతం మించి ముస్లిం ఓట్లున్నా అందుకు దీటుగా సీట్లు కేటాయించటంలో ఆర్జేడీ విఫలమైంది. కొద్దోగొప్పో సీమాంచల్లో ఇచ్చినా ముస్లింలు ‘గెలిచే సత్తా’ ఉన్న అభ్య ర్థుల వైపే మొగ్గారు. ఈ ఎన్నికల్లో ఈసీ వ్యవహార శైలి కూడా అధికార పక్షానికి కొంతమేర లాభించింది. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అయిదేళ్లుగా ఉన్న పథకాలను సైతం ఎన్నికల ముందు నిలిపేసిన ఈసీ... పెద్ద మనసు చేసుకుని బిహార్లో సరికొత్త మహిళా రోజ్గార్ యోజన జోలికి పోలేదు. ఎన్డీయే నెగ్గితే మళ్లీ నితీశ్ సీఎం అవుతారా లేదా అన్న సంశయం మొదట్లో ఉన్నా, ఫలితాల సరళి చూస్తే ఆ విషయంలో బీజేపీ పట్టుబట్టక పోవచ్చు. ఏదేమైనా ఇది ప్రధాని నరేంద్ర మోదీ, ‘సుశాసన్ బాబు’ నితీశ్ కుమార్ కలిసి సాధించిన ఘన విజయం. -
సిరియా దశ మారుతుందా?
అమెరికా అధ్యక్ష పీఠాన్ని డోనాల్డ్ ట్రంప్ దాదాపు పది నెలల క్రితం అధిరోహించాక ఎన్నో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఆ వరసలో సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా రాక కూడా ఒకటి. ఒక దేశాధ్యక్షుణ్ణి మీడియా సాక్షిగా తీవ్రంగా మందలించటం, ఆయనతో వాదులాటకు దిగటంతో ట్రంప్ ఏలుబడి మొదలైంది. కానీ ఆ ‘సత్కారం’ అందుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దాన్నంతటినీ దిగమింగుకుని అనంతర కాలంలో ట్రంప్తో చేతులు కలిపి, తమ ఖనిజ సంపద అప్పగించేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఆయన మెప్పు పొందారు. ఇప్పుడు షరాకు రెడ్ కార్పెట్ పరచటంలోని అంతరార్థం ఏమిటో మున్ముందు తెలుస్తుంది. పైకి చెబుతున్న కారణమైతే ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)పై పోరాటానికి సంఘటితమైన 88 దేశాలతో సిరియా చేతులు కలపటానికి సిద్ధపడటం. తాము ఏమనుకుంటే మిగతా ప్రపంచం కూడా అలాగే అనుకోవాలని అమెరికా భావిస్తుంటుంది. ఏడేళ్ల క్రితం అమెరికా దృష్టిలో అల్ షరా కరుడుగట్టిన ఉగ్రవాది. అతన్ని పట్టిస్తే కోటి డాలర్లు ఇస్తామంటూ ప్రకటించింది. నిరుడు డిసెంబర్లో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆ నజారానాను ఉపసంహరించుకున్నారు. మొన్న జూలైలో షరా ఆధ్వర్యంలోని హయత్ తహ్రీర్ అల్ షామ్ (హెచ్టీఎస్)పై ఉగ్రవాద సంస్థ ముద్రను రద్దుచేశారు. సిరియాపై ఉన్న ఆర్థిక ఆంక్షలను రద్దు చేస్తామని మే నెలలో ప్రకటించటంతోపాటు సౌదీ అరేబియాలో ట్రంప్ ఆయన్ను కలుసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో షరా అధ్యక్ష హోదాలో అమెరికా సందర్శిస్తారనగా మొన్న గురువారం ఆదరాబాదరాగా భద్రతా మండలి సమావేశమై నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. చైనా మినహా మిగిలిన 14 సభ్య దేశాలూ మరో మాట లేకుండా ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. అమెరికా తాజా నిర్ణయాలు తప్పని, గత వైఖరే సరైందని ఎవరూ అనరు. కానీ తల్చుకున్నదే తడవుగా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటం, వాటికి భద్రతా మండలి వంటి సంస్థలు సైతం ఎలాంటి ప్రశ్నలూ లేవనెత్తకుండా అంగీకరించటం ఆందోళన కలిగించే అంశం. అమెరికా ఆగ్రహించినంత కాలమూ ఆ దేశంతో సంబంధాలు కలిగి ఉన్నందుకు అమెరికా తీసుకున్న చర్యలతో నష్టపోయిన దేశాల మాటేమిటి? ఇప్పుడు ఇరాన్పైనా, రష్యాపైనా ఆంక్షలున్నాయి. వాటితో వాణిజ్య సంబంధాలు నెరపుతున్నందుకు మన దేశంపై ట్రంప్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందరూ తమకు తోకల్లా ఉండాలన్నది అమెరికా విధానం. సిరియాపై అమెరికా ఆంక్షలు ఈనాటివి కాదు. గత ఎనభైయ్యేళ్లుగా... అంటే 1946లో ఆ దేశం ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందినప్పటినుంచి కొనసాగుతున్నాయి. 1979లో రీగన్, అటుతర్వాత జార్జి బుష్, ఒబామా వాటిని మరింత పెంచారు. 2003లో అమెరికా ఇరాక్ను దురాక్రమించినప్పుడు షరా పట్టుబడ్డారు. ఆయన్ను 2011 వరకూ అమెరికా జైల్లో నిర్బంధించారు. అక్కడ పరివర్తన పొంది విడుదలయ్యాక సిరియా వెళ్లి అల్ కాయిదాతో, అటుతర్వాత ఐఎస్తో చేతులు కలపటం, హెచ్టీఎస్ స్థాపించటం, 2013లో అమెరికా ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించటం చరిత్ర. షరా పలుకుబడి ఉన్న ఉత్తర సిరియా ప్రాంతంలో ఐఎస్ చీఫ్ అబూ బకర్ బగ్దాదీని 2019లో అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఆ మాటెలా ఉన్నా ప్రస్తుతం ఆయన ఏలుబడిలో గత పది నెలలుగా సిరియాలోని మైనారిటీ వర్గాలైన అలావైట్లు, డ్రూజ్లు, క్రైస్తవులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. షరా అనుకూల మిలిటెంట్ సంస్థలు ఇళ్లల్లోకి చొరబడి కాల్చిచంపటం, ఎత్తయిన భవంతుల నుంచి దూకమని హుకుం జారీచేసి ప్రాణాలు తీయటం కొన సాగుతోంది. మొన్న మార్చిలో దాదాపు 2,000 మంది ఆ హింసాకాండకు బలయ్యారు. వాటి నివారణపై ట్రంప్, షరా ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ శిథిలాల దిబ్బగా ఉన్న సిరియాలో 90 శాతంమంది పౌరులు తీవ్ర దారిద్య్రంలో మగ్గుతున్నారు. దేశ పునర్నిర్మాణానికి కనీసం 20,000 కోట్ల డాలర్లు అవసరమవుతాయని ప్రపంచ బ్యాంకు అంచనా. ట్రంప్–షరా సమావేశం తర్వాతైనా సిరియాలో సాధారణ పరిస్థితులు నెలకొని, అది ఆర్థికంగా పుంజుకుంటే మంచిదే. -
మరి హంతకులెవరు?
తమ కంటి దీపాలు హఠాత్తుగా కనుమరుగైనప్పుడు తల్లితండ్రులకు ఒక్కసారిగా చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలినట్టవుతుంది. తమ పంచప్రాణాలనూ ఎవరో పిండేసినట్టు విలవిల్లాడిపోతారు. ఢిల్లీ శివారులో ఉన్న నోయిడా సమీపంలోని నిఠారి గ్రామంలో 19 ఏళ్ల క్రితం జరిగింది ఇదే. తప్పిపోయిన పిల్లలు ఇద్దరు దుర్మార్గుల చేతుల్లో కడతేరి పోయారని దర్యాప్తు అనంతరం సీబీఐ తేల్చి, న్యాయస్థానం ఉరిశిక్షలు కూడా విధించాక... దాదాపు రెండు దశాబ్దాలు గడిచాక కేసు వీగిపోతే? ఈ కేసులో ఒక దోషి వ్యాపారవేత్త మణిందర్ సింగ్ పంథేర్ లోగడే నిర్దోషిగా బయటపడగా... పదమూడు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొని 12 కేసుల్లో నిర్దోషిగా తేలి, ఒక కేసులో మాత్రం యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మరో దోషి సురేందర్ కోలీ సైతం నిరపరాధేనని తాజాగా సర్వోన్నత న్యాయస్థానం తేల్చింది. శిక్షలు పడినప్పుడు, మరీ ముఖ్యంగా ఉరిశిక్ష పడిన తీవ్రమైన కేసుల్లో కేవలం ఊహల ఆధారంగా దోషాన్ని నిర్ధారించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో కేవలం కోలీ ఒప్పుకోలు ప్రకటన, కూరగాయలకు ఉపయోగించే చాకు తప్ప సాక్ష్యాధారాలెక్కడని ప్రశ్నించింది. జాతీయ స్థాయిలో పతాకశీర్షికలకెక్కిన ఈ కీలక కేసు విషయంలో పేలవమైన దర్యాప్తు సాగిందంటే ఎవరిని నిందించాలి? 2006 చివరిలో వెల్లడైన ఈ ఉదంతం దేశం మొత్తాన్ని కుదిపేసింది. మొదట 8 మంది ఆడపిల్లలకు సంబంధించినవిగా భావించిన మానవ కంకాళాలు మురికి కాల్వలో లభ్యమైనప్పుడు అంతకు రెండు మూడేళ్ల ముందు మాయమైన తమ పిల్లలకు సంబంధించినవే కావొచ్చని పేద కుటుంబాలు తల్లడిల్లాయి. ఛానెళ్లు అంతంత మాత్రంగానే ఉన్న ఆ కాలంలో కూడా మీడియాలో వెలువడే కథనాలు చదివి, విని దేశం దిగ్భ్రాంతి చెందింది. పిల్లల్ని ప్రలోభపెట్టి తీసుకెళ్లి అత్యాచారాలు చేసి హతమార్చారని, అందులో ఒక టీనేజ్ యువతి కూడా ఉందని దర్యాప్తులో వెల్లడైంది. మొత్తంగా 22 మంది కంకాళాలు దొరికాయని అప్పట్లో చెప్పారు. తాను ఆరుగురు పిల్లలపై, ఒక యువతిపై అత్యాచారాలు జరిపి హతమార్చానని కోలీ తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారంతో ఇంటి సమీపంలో తవ్వినప్పుడు మృతదేహాలు లభ్యమయ్యాయన్నారు. ఈ వ్యవహారంలో అపహరణ, అత్యాచారం, హత్య, సాక్ష్యాధారాల ధ్వంసం మాత్రమే కాక నరమాంస భక్షణ, శరీరాంగాల కోత, శవసంభోగం వగైరాలున్నాయి.ఇందుకు ఒక డాక్టర్ సహకరించాడని అరెస్టు చేయగా, అతనిపై మొదట్లోనే కేసు వీగి పోయింది. హతమార్చటానికి ముందు ఈ పసిపిల్లలతో నీలిచిత్రాలు తీశారన్న కథనా లొచ్చాయి. పంథేర్ ఇల్లు ‘భయంకరమైన కొంప’గా ముద్రపడింది. 12 కేసుల్లో కోలీని దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించారు. వాటన్నిటినీ అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న మరో కేసులో సైతం ఇప్పుడు నిర్దోషిగా బయటపడ్డాడు. పదిహేనేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో పంథేర్ 2009లో విడుదలయ్యాడు.న్యాయస్థానాలు ఒక రకంగా నిస్సహాయమైనవి. దర్యాప్తు తీరును కూలంకషంగా పరిశీలించి, నిందితులపై ఉన్న సాక్ష్యాధారాలేమిటో చూసి తీర్పునిస్తాయి తప్ప మీడియా కథనాలనుబట్టో, దర్యాప్తు సంస్థల లీకుల ఆధారంగానో వ్యవహరించవు. ఈ కేసులో ప్రశ్నార్థక ఒప్పుకోళ్లు, వాటి ఆధారంగా మీడియా సంచలన కథనాలే తప్ప దర్యాప్తు సక్రమంగా జరగలేదని ధర్మాసనం వెలువరించిన తీర్పే చెబుతోంది. ఏమాత్రం పసలేని ఆరోపణల ఆధారంగా కోలీకి శిక్ష విధిస్తే న్యాయవిఘాతం చేసినవారమవుతామనీ, న్యాయప్రమాణాలకు ఈ ఆధారాలు ఏమాత్రం నిలబడలేవనీ న్యాయమూర్తులు అనటం గమనార్హం. నేర నిర్ధారణలో ఎంతో అభివృద్ధి సాధించిన ఈ దశలో కూడా దేశం మొత్తాన్ని కుదిపేసిన కేసులో వైఫల్యం చెందటం దురదృష్టకరం. పంథేర్, కోలీలిద్దరూ నిర్దోషులు సరే... మరి అసలు హంతకులెవరు? వారు ఇప్పటికీ చట్టానికి దొరక్కుండా తప్పించుకుంటున్నారనుకోవాలా? కనీసం దేశవ్యాప్తంగా దర్యాప్తు విభాగాలన్నీ ఈ ఉదంతాన్ని ఒక గుణపాఠంగా స్వీకరించి మున్ముందు మరింత జాగరూకతతో మెలగటం అవసరమని గుర్తిస్తే మంచిది. -
మళ్లీ ఉగ్రవాద పంజా!
సరిగ్గా పదమూడేళ్ల తర్వాత దేశ రాజధాని నగరంపై ఉగ్రవాదం పంజా విసిరిన ఆనవాళ్లు కనబడుతున్నాయి. చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన సోమవారం నాటి ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సే ఉన్నా, దాని తీరుతెన్నులు గమనిస్తే అది ఆత్మాహుతి దాడే కావొచ్చనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం దీని వెనక కుట్రఉండొచ్చని చెప్పడం గమనించదగ్గది. గత పక్షం రోజులుగా జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్లలో పోలీసులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసి, 2,913 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవటం... ఆ సంగతిని ప్రకటించిన కొన్ని గంటలకే ఢిల్లీ పేలుడు ఘటన సంభవించటం గమనిస్తే వీటిమధ్య పరస్పర సంబంధం ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. అరెస్టయిన ఉగ్రవాదుల్లో తమ సహచర వైద్యులు ముగ్గురున్న సంగతి తెలిశాక పోలీసుల చక్రబంధం నుంచి తప్పించుకుని పరారవుతూ కావాలని ఆత్మాహుతి దాడికి దిగారా, లేక మరో లక్ష్యాన్ని చేరుకోవటం కోసం వెళ్తుండగా అనుకోకుండా పేలుడు సంభవించిందా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 13కి చేరటం, గాయపడినవారిలో పలువురి పరిస్థితి ప్రమాదకరంగా ఉండటం పేలుడు తీవ్రతను చాటుతోంది. తమ చర్యల ద్వారా సమాజంలో భయోత్పాతాన్ని సృష్టించటం, అందుకోసం జన సమ్మర్దం గల ప్రాంతాలను ఎంచుకోవటం ఉగ్రవాదుల అలవాటు. తమ మతిమాలిన చర్య వల్ల ఏ వర్గాలవారు బలవుతారు, ఎన్ని కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతామన్న విచక్షణ ఉగ్రవాదుల కుండదు. వీరి ఉన్మాదానికి తోపుడు బళ్లు నడిపేవారు, ఆటో డ్రైవర్లు, పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని సొంతగూటికి చేరటం కోసం వెళ్తున్న సామాన్య పౌరులు, దగ్గర్లోని దుకాణదారులు బలయిపోయారు. పేలుడు తర్వాత ఎటుచూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలూ, తెగిపడిన కాళ్లూ చేతులూ కనబడ్డాయి. కొన్ని సెకన్ల క్రితం జీవంతో తొణికిసలాడిన మనుషులు ఛిద్రమైన శరీరాలతో ఆర్తనాదాలు చేస్తూ శోకించటం... కొందరు భయంతో పరుగులు పెట్టడం, అయినవారి జాడ కోసం మరికొందరు వెదుకులాడటం తలుచుకుంటేనే గగుర్పాటు కలిగించే భీతావహ దృశ్యం.ఏదైనా ఘటన జరిగినప్పుడు అది తమ పనేనని చెప్పుకోవటం అలవాటున్న ఉగ్రవాదులు 24 గంటలు గడిచినా కిమ్మనకపోవటం అయోమయాన్ని సృష్టించటానికే కావొచ్చనిపిస్తోంది. సాధారణంగా పేలుడు జరిగిన మూడు నాలుగు గంటల్లో ఘటన స్థలిలో లభ్యమయ్యేవాటి ఆధారంగా కారకుల విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకొస్తారు. కానీ ప్రస్తుత ఘటనలో కొంత సమయం తీసుకోకతప్పదని ఎన్ఐఏ భావించి ఉండొచ్చు. వాస్తవానికి మొదట్లో వాహనంలోని సీఎన్జీ ట్యాంక్ పేలివుండొచ్చనుకున్నా, ఆ వాహనం యజమాని పుల్వామా వాసిగా అర్ధరాత్రికి ధ్రువపడటం, క్రయవిక్రయాల సమయంలో తప్పుడు పత్రాలు దాఖలు చేశాడని తేలడం ఉగ్రవాద ప్రమేయాన్ని సూచిస్తోంది. కేంద్రం తీసుకున్న అనేక చర్యల పర్యవసానంగా ఉగ్రదాడులు దేశంలో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఢిల్లీలో 2012లో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం దగ్గర జరిగిన పేలుడు ఘటన తర్వాత మరేదీ చోటుచేసుకోలేదు. 2008 నాటి ముంబై పేలుళ్ల ఘటన తర్వాత ఎన్ఐఏను ఏర్పర్చటం, నిఘా వ్యవస్థను పటిష్ఠపరచటం, అందుకోసం ప్రత్యేకంగా జాతీయ నిఘా గ్రిడ్(నేట్గ్రిడ్) రూపకల్పన, అక్రమ ద్రవ్య చలామణీ నిరోధక చట్టాన్నీ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్నీ మరింత కఠినతరం చేస్తూ సవరణలు తీసుకురావటం ఉగ్రవాదం నియంత్రణకు గణనీయంగా తోడ్పడ్డాయి. అయితే ఎక్కడో ఒకచోట ఏర్పడే చిన్నపాటి ఉదాసీనత అయినా భారీ మూల్యం చెల్లించక తప్పదని తాజా ఉదంతం రుజువు చేస్తోంది. అరెస్టయిన ఉగ్రవాదుల్ని ప్రశ్నించాక పాకిస్తాన్ ప్రమేయం కనబడటాన్ని బట్టి ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత కూడా అది తన వెనకటి గుణాన్ని విడనాడలేదని అర్థమవుతోంది. అన్ని స్థాయుల్లోనూ మరింత అప్రమత్తత అవసరమని ఢిల్లీ పేలుడు ఘటనైనా, ఉగ్రవాదుల అరెస్టులైనా వెల్లడిస్తున్నాయి. -
‘మంచి’ వాతావరణమేది?
కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం పదేళ్ల క్రితం ప్యారిస్ వేదికగా కుదిరిన చరిత్రాత్మక ఒడంబడికను దాదాపు అన్ని దేశాలూ పోటీలు పడి మరీ ఉల్లంఘిస్తున్న తరుణంలో బ్రెజిల్ లోని బెలేమ్ నగరంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్–30) సదస్సు సోమవారం ప్రారంభమైంది. ప్యారిస్ ఒడంబడికలో దేశాల వాగ్దానమేమిటో, నెరవేర్చింది ఏ మేర కో చూసి లక్ష్య నిర్దేశం చేయటం కోసం ఏటా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ సదస్సు 10 రోజుల పాటు జరుగుతుంది. కానీ విషాదమేమంటే... పెద్దగా ఫలితం లేకుండానే అవి ముగిసిపోతున్నాయి. తీసుకున్న అరకొర నిర్ణయాలైనా అమలుపరిచే నాథుడు కనబడడు. అందువల్లే నిరుడు అజర్బైజాన్లోని బాకూలో కాప్–29 తరువాత పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఈసారి సదస్సుకు అనేక విధాల ప్రాముఖ్యం ఉంది. ఇంతవరకూ ఎక్కువగా యూరప్ లేదా పశ్చిమాసియా ప్రాంత దేశాల్లో ఈ సదస్సులు నిర్వహించటం రివాజు. అందుకు భిన్నంగా దక్షిణ అమెరికా ప్రాంత దేశాన్ని ఎంపిక చేసుకోవటం ఈసారి ప్రత్యేకత. అది కూడా భూగోళానికి శ్వాసకోశాలుగా పరిగణించే అమెజాన్ అడవుల ముంగిట కొలువుదీరిన నౌకాశ్రయ నగరం బెలేమ్ కావటం గమనించదగ్గది. వాతావరణ మార్పులపై చర్చించటానికి అదైతేనే ప్రతీకాత్మక వేదికవుతుందని నిర్వాహకులు అభిప్రాయపడి ఉండొచ్చు. అత్యంత దారిద్య్రం, వనరుల దుర్వినియోగం కొట్టొచ్చినట్టు కనబడే బెలేమ్ను దేశదేశాల నుంచీ వచ్చే ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షిస్తే సుస్థిరాభివృద్ధికి మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకతను అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందని కూడా వారు భావించి ఉండొచ్చు. ప్రపంచం ఇప్పుడు ప్రమాదకర వాతావరణంలోకి ప్రవేశించింది. పారిశ్రామికీ కరణకు ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 2 డిగ్రీల సెల్సియస్ లోపే పెరుగుదల ఉండేలా... వీలైతే అది 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితమయ్యేలా ప్రయత్నించాలన్నది ప్యారిస్ ఒడంబడిక కృతనిశ్చయం. కానీ 2024కే ఆ 1.5 డిగ్రీల పరిమితి దాటిపోయామని గణాంకాలు చెబుతున్నాయి. పది రోజులపాటు కొనసాగే ఈ సదస్సులో ఏదో అనుకోని అద్భుతం జరిగితే తప్ప ముంచుకురానున్న విపత్తును ఆపటం దుర్లభం. కానీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. మాట తప్పడం, సాకులు చెప్పడం అన్ని దేశాలకూ అలవాటైంది.గత ఏలుబడిలో ప్యారిస్ ఒడంబడిక నుంచి బయటికొచ్చినట్టే ఇప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తప్పుకున్నారు. ఇది ఒకరకంగా మేలేనని వివిధ దేశాలు భావిస్తున్నాయి గానీ, ట్రంప్ తన ‘బెదిరింపు దౌత్యం’తో మున్ముందు అందరినీ తన దారికితెచ్చే ప్రయత్నం చేస్తారు. గత నెలలో జరిగిన పరిణామమే ఇందుకు తార్కాణం. రవాణా నౌకల కాలుష్యాన్ని సంపూర్ణంగా అరికట్టేందుకు 100 దేశాల మధ్య అవగాహన కుదిరి, ఒడంబడికపై సంతకాలు కాబోతుండగా ట్రంప్ టీమ్ సైంధవ పాత్ర పోషించింది. సంతకాలు చేసే దేశాల నావికుల్ని అమెరికా తీరంలో అడుగు పెట్టనీయబోమని విదేశాంగ మంత్రి మార్కో రూబియో వివిధ దేశాలకు స్వయంగా ఫోన్లు చేసి బెదిరించారని ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం. ఇక సుంకాలు, ఆర్థిక ఆంక్షలు, వీసా బెదిరింపులు షరా మామూలే. దాంతో అది కాస్తా నిలిచిపోయింది. ఇప్పుడు కాప్–30కి ఆ బెడద తప్పదు.ట్రంప్ వచ్చాక అమెరికాలో హరిత ఇంధన ప్రాజెక్టులు అటకెక్కాయి. వాతావరణ మార్పు పెద్ద బోగస్ అంటూ శిలాజ ఇంధన ఆధారిత ప్రాజెక్టులకు అనుమతులిస్తున్నారు. వాతావరణ మార్పులపై గతంలో పెద్ద మాటలు మాట్లాడిన బిల్ గేట్స్ ప్లేటు ఫిరాయించారు. ‘మరీ అంత ప్రమాదమేమీ లేద’ంటూ నసుగుతున్నారు. యూరొప్ యూనియన్ డిటో. అక్కడ అందరిదీ తలో దోవ అవుతోంది. కర్బన ఉద్గారాల తగ్గింపులో మన దేశం రికార్డు కూడా ఏమంత మెరుగ్గా లేదు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా తీరాల సమీపంలోని వేడి నీటి పగడపు దిబ్బలు కనుమరుగు కావటం ప్రమాద సంకేతమని ఇటీవలే బ్రిటన్లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయం చెప్పిన నేపథ్యంలో కాప్–30 చిత్తశుద్ధితో, దృఢంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటేనే భూగోళం పది కాలాలు పచ్చగా ఉండగలదు. లేనట్టయితే ఇక సరిదిద్దుకోవటం సాధ్యపడని ప్రమాదకర స్థితికి చేరుకోవటం ఖాయం. -
బాలోత్సవం
కథ పుట్టడమూ, పిల్లల కథ పుట్టడమూ వేరుగా జరిగివుండదు. పిల్లల కంటే బాగా ‘ఊ’కొట్టగలిగేవారెవరు! పిల్లలను మైమరిపించడానికే పెద్దలు కథలు అల్లివుంటారు. ఆ వంకతో తమ చిన్నతనంలోకీ జారుకునివుంటారు! చిన్నతనానికీ పెద్దరికానికీ ఉన్న స్పష్టమైన తేడా: బాల్యంలో ఊహలకు సంకెళ్లుండవు. తార్కిక పరిమితి కలలను అణిచి వేయదు. ఎంత సాగితే అంత, ఎంత చూస్తే అంత, ఎంత కావాలనుకుంటే అంత. అక్కడ ఆశలు అనంతం. రెక్కలు అమాంతం. కప్పలు పకపకా నవ్వొచ్చు. కుందేళ్లు చకచకా మాట్లాడొచ్చు. కాకులు నీతులు చెప్పొచ్చు. జింకలు కోతలు కోయొచ్చు.పిల్లల కథ అనేది మబ్బుల్లోకి గెంతించే మాయా కిటికీ. సముద్రం అడుగుకు ఈదనిచ్చే గాలి పడవ. ప్రతి తరమూ తర్వాతి తరానికి అవసరమయ్యే వివేకపు రాశిని కథల రూపంలోనే బదిలీ చేస్తుంది. లోకాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే కాఠిన్యాన్ని అందులోనే కూరి ఉంచుతుంది. ఈసప్ కథలు, పంచతంత్రం కథలు, వెయ్యొన్నొక్క రాత్రుల అరేబియన్ కథలు, జంగిల్ బుక్, కాంచన ద్వీపం, గలివర్ సాహసయాత్రలు, ‘చందమామ’ కథల నుంచి; టామ్ శాయర్, నొప్పి డాక్టర్, లిటిల్ ప్రిన్స్, హాబిట్, హారీ పాటర్ దాకా పిల్లల మనో ప్రపంచపు ఎల్లలను విశాలపరిచినవే! కథల వల్ల పిల్లలకు ఊహాశక్తి పెరుగుతుంది, సమస్యా పరిష్కారం తెలుస్తుంది, భాష అబ్బుతుంది, వ్యక్తీకరణ అలవడుతుంది, లోకరీతి అర్థమవుతుంది, ప్రపంచపు భిన్నత్వం పట్ల అవగాహన కలుగుతుంది, సాటి జీవుల పట్ల సానుభూతి కలుగుతుంది, తమ సాంస్కృతిక వారసత్వపు గొప్పతనం అనుభవంలోకి వస్తుంది, అన్నింటికీ మించి అమితమైన ఆనందం దొరుకుతుంది. జీవితపు సంరంభంలోంచి వచ్చే ఆనందానికి అదనంగా, మనిషికి ఉన్న మరో ఆనందపు వనరు కథలు కాక మరేమిటి?అసలు పిల్లల కథలు పిల్లలకు కలిగించే ప్రయోజనాలన్నీ పెద్దలకు కూడా కలిగిస్తాయి. ఏం పెద్దల్లో మాత్రం పిల్లలు బజ్జునిలేరా? అంతెందుకు, ఆరిస్టాటిల్ లాంటి తత్వవేత్త కూడా నిజమైన మంచి జీవితం గడపడం కోసం కాల్పనికత అవసరాన్ని సమర్థించాడు. అసలు సాధ్యం కానిది కూడా ఊహించగలగడం అవసరమని ఆయన వాదించాడు. టాల్స్టాయ్ లాంటి మహారచయిత కూడా పిల్లల కోసం కథలు రాశాడు. కాకపోతే ఇదీ నీతి అంటూ ప్రత్యేకంగా చెప్పకూడదనీ, కథ ద్వారా పిల్లలు తమకు కావాల్సింది తాము తీసుకుంటారనీ అన్నాడు. మీరు ఎంతపెద్దవాళ్లయినా బాలసాహిత్యాన్ని చదవాలంటుంది కాథెరీన్ రండెల్ అనే బాలసాహిత్య రచయిత్రి. పిల్లల పుస్తకాలు మనం మర్చిపోయిన విషయాలనే కాదు, మనం మర్చిపోయామని మర్చిపోయిన విషయాలను కూడా గుర్తుచేస్తాయంటుందామె.లండన్లోని థేమ్స్ నదిలో పడవ షికారుకు పోయినప్పుడు తన వెంటున్న స్నేహితుడి ముగ్గురు కూతుళ్లకు ఓ కథ చెప్పాడట లూయిస్ కరోల్. అందులో అలీస్ లిడ్డెల్ అనే పదేళ్ల పాప కూడా ఉంది. ఒక రోజు నది ఒడ్డున విసుగ్గా కూర్చున్న ‘అలీస్’కు కోటు తొడుక్కుని, గడియారం పెట్టుకున్న ఒక తెల్ల కుందేలు కనబడటమూ, దానివెంట ఆమె ఆ కుందేలు బొరియలోకి పోవడమూ, అక్కడ్నుంచి వింతలూ విచిత్రాలూ... వాహ్! విన్నవెంటనే దాన్ని తనకోసం రాసిపెట్టమందట అలీస్. అట్లా ‘అలీస్(స్) అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్’ పుస్తకంగా రూపుదాల్చింది. 1865 నవంబర్లో తొలిసారి ప్రచురితమైన దీనికి ఈ నెలలోనే 160 ఏళ్లు వచ్చాయి. జంతువులు జంతువుల్లా ఉండకుండా, మనుషులు మనుషుల్లా కాకుండా ప్రవర్తించే సాహిత్యాన్ని ‘నాన్సెన్స్ లిటరేచర్’ అని వర్గీకరించడం ఉంది. దాన్ని నిరర్థకమైనదని కాకుండా, హేతువుకు అందని అర్థవంతమైన సాహిత్యం అన్న అర్థంలో చూడాలి. అందుకేనేమో, ఇకనుంచీ బాల సాహిత్యానికీ తమ అవార్డు ఇవ్వనున్నట్టు బుకర్ ఫౌండేషన్ ఇటీవలే ప్రకటించింది. 8–12 ఏళ్ల చిన్నారులను ఉద్దేశించి రాసే ఉత్తమ రచనకు ‘చిల్డ్రెన్స్ బుకర్ ప్రైజ్’ పేరుతో యాభై వేల పౌండ్లు ఇవ్వనున్నారు. బాలసాహిత్యం అనేది తీసేయదగినది కాదనీ, బాలసాహితీ వేత్తలు తక్కువ రచయితలేమీ కారనీ చెప్పే ఘనమైన వార్త ఇది. కాదామరి... నేటి బాలలే రేపటి ప్రపంచ నిర్మాతలు. -
అదానీ చెప్పిన అసలు ‘డేటా’
చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా... ఇకపై చెల్లవని మన మహాకవి ఏనాడో చెప్పారు. ఇప్పుడైనా అంతే! బూటకపు మాటలతో, నకిలీ క్రెడిట్లతో, నయవంచనలతో ఇంకెన్నాళ్లు చక్రం తిప్పు తారు? సమాచార గుత్తాధిపత్యాన్ని సాంకేతిక విప్లవం బద్దలు కొట్టిన తర్వాత వార్తలపై, వ్యాఖ్యలపై పెత్తనాలు ఇంకెంతో కాలం సాగబోవని అర్థమైంది. సంకెళ్లు తెంచుకున్న సమాచారం సోషల్ మీడియా అవతారమెత్తిన తర్వాత కూడా కొంతమంది ఆధిపత్యం కొంతకాలం సాగిందేమో! సాంకేతిక సవ్యసాచులైన నవయువతరం వాళ్లు సమాచార చైతన్యం సంతరించుకుంటున్న క్రమంలో పాత ఆధిపత్యం పలాయన మంత్రం పఠిస్తున్నది.అరబ్ వసంతపు చివుళ్లు, సోనార్ బంగ్లా మెరుపులు, నేపాల్ ప్రకంపనలు... ఇప్పటికే సోషల్ మీడియా పవర్ను చాటి చెప్పాయి. చివరకు ప్రపంచపు గుత్తాధిపతుల కంచుకోటను కూడా సోషల్ మీడియా కుదిపేసింది. విశ్వగురువులూ, విజనరీ వేషధారులూ కూడా ఇక సవాళ్లను ఎదుర్కోక తప్పకపోవచ్చు. అభివృద్ధికి పర్యాయపదంగా చంద్రబాబు పేరును మన గుత్తాధి పత్య మీడియా ఎంత దీక్షగా చిత్రించిందో మొన్నటివరకూ కొంతమందికే తెలుసు. ఇప్పుడాయన అభివృద్ధి ప్రచారం బలుపు కాదు వాపేనన్న సంగతి సోషల్ మీడియా కారణంగా చాలామందికి సాక్ష్యాధారాలతో తెలిసిపోతున్నది. చంద్రబాబును విజనరీగా చూపడం కోసం యెల్లో మీడియా పూనకంతో చేసిన ప్రచారం కారణంగా తానే హైదరాబాద్ నిర్మాత ననీ, సెల్ఫోన్ను తెచ్చింది తానేననీ, ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను ఎంపిక చేసింది కూడా తానేననీ ఆయనే స్వయంగా నమ్మే మానసిక స్థితిలోకి జారిపోయారు. ఈ రకమైన మానసిక రుగ్మతను ప్రతిపక్ష నేతకు అంటగట్టి చంద్రబాబు ఇమేజ్ను కాపాడాలనుకునే దుఃస్థితికి కూడా యెల్లో మీడియా దిగజారిపోయింది.జగన్మోహన్రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఈ తరహా ప్రగల్భాలు పలుకలేదు. ఐటీ విప్లవం తనవల్లే వచ్చిందని ఆయన చెప్పలేదు. బస్సులో కూర్చొని తుపాన్లను కంట్రోల్ చేశానని చెప్పలేదు. ఆయన సహచరులు, పార్టీ కార్య కర్తలు కూడా అలా మాట్లాడలేదు. వీలైతే, వచ్చే తుపాన్ను జుట్టు పట్టుకుని వెనక్కి పంపేవాడేనని టీవీల్లో కూర్చొని ఆయన గురించి ఎవరూ చెప్పలేదు. భారత క్రీడా జట్లు సాధించిన విజయాల వెనుక ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని ఆటగాళ్లు అక్కడక్కడా చెప్పుకుంటున్నారని కూడా ఎవరూ మాట్లాడలేదు. తదుపరి ఒలింపిక్స్ను రాష్ట్రంలోనే నిర్వహిస్తానని కానీ, నోబెల్ బహుమతులను పట్టుకొచ్చి యువతకు రివార్డు లిస్తానని కానీ జగన్మోహన్రెడ్డి ప్రకటించలేదు. జగన్ ప్రభుత్వం అమలుచేసిన ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సరైన ప్రచారం చేసుకోలేదనే ఇప్పుడాయనపై, ఆయన క్యాంపుపై వస్తున్న విమర్శ. అభివృద్ధి పనులైనా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలైనా ప్రభుత్వ బాధ్యతలే తప్ప కేవలం ప్రచారాంశాలుగా నాటి ప్రభుత్వం భావించలేదు. దీన్నే అలుసుగా భావించిన బాబు శిబిరం ప్రాపగాండా మిషనరీని మరింత అప్డేట్ చేసింది. మొన్నటికి మొన్న విశాఖ డేటా సెంటర్పై ఏ స్థాయిలో చెలరేగిపోయారో గమనించాము. స్వయంగా ప్రభుత్వాధినేతలే గూగుల్ కంపెనీ వారి చెవిలో మంత్రోపదేశం చేసి వారిని చేయిపట్టుకొని నడిపించి విశాఖకు తీసుకొచ్చినట్టు ప్రచారం చేశారు. 15 బిలియన్ డాలర్ల అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని తీసుకొచ్చామని ప్రకటించుకున్నారు. ఇందులో అదానీ సంస్థ ముఖ్య భాగస్వామి అనే సంగతిని మాత్రం పొరపాటున కూడా ఎక్కడా రానీయలేదు. అసలా పేరునే ప్రస్తావించలేదు. ప్రత్యక్షంగా గూగుల్తోనే తమ బంధుత్వమున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు.ఆ తర్వాత జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి అసలు సంగతి బయటపెట్టారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ సంస్థతో అప్పటి జగన్ ప్రభుత్వానికి 2020 నవంబర్లో అవగాహన కుదిరింది. డేటా సెంటర్లో కీలకమైన 3,900 కిలోమీటర్ల సబ్సీ కేబుల్ వేయడానికి సింగపూర్ ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభమయ్యాయి. దాంతో పాటు డేటా ల్యాండింగ్ స్టేషన్ ఏర్పా టుకు కూడా పూర్వరంగం సిద్ధమైంది. ఆ తర్వాత 2023 మే నెలలో డేటా సెంటర్కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈలోగా 2022లోనే ఈ రంగంలో గూగుల్కూ, అదానీ సంస్థకూ మధ్యన ఒక అవగాహన కుదిరింది. ఇప్పుడు తాజాగా జరిగింది ఆ డేటా సెంటర్ను మరింత విస్తరించడం మాత్రమే.డేటా సెంటర్ను విస్తరిస్తున్నప్పుడు అందుకు పూర్వ రంగాన్ని సిద్ధం చేసిన తమ ప్రభుత్వాన్ని గానీ, ఏర్పాటులో కీలక భాగస్వామి అయిన అదానీ సంస్థను గానీ ఎందుకు ప్రస్తా వించలేదు, ఎందుకు కృతజ్ఞతలు చెప్పలేదని జగన్ ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలెవరూ అధికారికంగా స్పందించలేదు. కానీ, గూగుల్ కంపెనీనే తాము విశాఖకు లాక్కొచ్చామనే ప్రచా రాన్ని మాత్రం ఆపలేదు. ఈ వ్యవహారంపై ఈ రోజున (శనివారం) ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో అదానీ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ ఒక ఎడిట్ పేజీ వ్యాసాన్ని రాశారు. భారత దేశాన్ని కృత్రిమ మేధ (ఏఐ)కు ప్రపంచ హబ్గా మార్చే లక్ష్యంతోనే తాము గూగుల్తో కలిసి విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని ఆ వ్యాసంలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఏఐ మిషన్’ లక్ష్యాల సాధనకు తోడ్పడే మౌలిక వ్యవస్థను తాము ఈ సెంటర్ ద్వారా ఏర్పాటు చేస్తున్నా మని ఆయన పేర్కొన్నారు.ఆ వ్యాసంలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రస్తా వన కానీ, చంద్రబాబు – లోకేశ్బాబుల వ్యవహార దక్షత గురించి కానీ ఒక్క మాట కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్రెడిట్ చోరీ వ్యవహారం గురించి తెలిసినందువల్లనే అదానీ రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదా? లేకపోతే అదానీ పేరును ప్రస్తావించకుండా సొంత డబ్బా కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం విశ్వాస రాహిత్యానికి పాల్పడినందువల్ల టిట్ ఫర్ టాట్ చందంగా అదానీ వ్యవహరించారా? చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా న భూతో న భవిష్యత్ అనిపించేలా ఈ ప్రాజెక్టుకు 22 వేల కోట్ల కిమ్మత్తు చేసే రాయితీలిచ్చి, 600 ఎకరాల భూసంతర్పణ చేసిన రాష్ట్రం గురించి అదానీ స్పందించకపోవడంపై ప్రభుత్వం ఏమనుకుంటున్నది? నేషన్ వాంట్స్ టు నో!ఒక్క అదానీ – గూగుల్ డేటా సెంటర్ విషయంలోనే కాదు... గత ముప్ఫయ్యేళ్లుగా ఇటువంటి క్రెడిట్స్ను తమ ఖాతాలో వేసుకోవడంలో బాబు శిబిరం, యెల్లో మీడియా నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నవి. సోషల్ మీడియా పుణ్యమా అని అప్పటి చాలా విషయాలలో లోగుట్టు కొంచెం కొంచెంగా బయటకు వస్తున్నది. ఇంకో మూడు రోజుల్లో ‘పార్ట్నర్షిప్ సమ్మిట్’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఒక భారీ ఈవెంట్ను నిర్వహించబోతున్నది. ఈవెంట్ మేనేజ్మెంట్లలో తెలుగుదేశం ప్రభుత్వాల సామర్థ్యాన్ని శంకించవలసిన పనిలేదు. కాకపోతే ఈవెంట్ల నిర్వహణే తప్ప ఆ తర్వాత అడుగు ముందుకు పడదనేదే మన విమర్శ. రెండు వేలమంది ప్రతి నిధులు హాజరవుతారనీ, 30 దేశాల వాణిజ్య మంత్రులు వస్తు న్నారనీ, భారీ ఎత్తున పెట్టుబడులొస్తాయనీ చెబుతున్నారు.గతంలో కూడా ఇటువంటి ఈవెంట్నే నిర్వహించి భారీ ఎత్తున పెట్టుబడులొస్తున్నాయని ప్రకటించారు. కానీ, ప్రకటించిన దానిలో పది శాతం కూడా కార్యరూపం దాల్చకపోవడం విషాదం. ఇప్పుడు కూడా ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం తక్కువ. ఈ పార్ట్నర్షిప్ ఈవెంట్ను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రధాన కారణం లోకేశ్బాబు ప్రమోషన్ కోసమే అనే మాట వినిపిస్తున్నది. తాజాగా శుక్రవారం జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో లక్ష కోట్ల పైచిలుకు పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్టు ముఖ్య మంత్రి చెప్పారు. వీటి ద్వారా 86 వేలమందికి ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క ఎమ్ఎస్ఎమ్ఈ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారానే 33 లక్షలమందికి ఉపాధి దొరికింది. కేవలం ఈ ఒక్క రంగంలో మాత్రమే. ఇందులో పెద్ద పరిశ్రమల ఉద్యోగాలు, ప్రభుత్వోద్యోగాలు కలపలేదు. అప్పటి పారిశ్రామిక విధానంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు, స్థానికులకు ఎక్కువ అవకాశాలు అనే అంశాల మీద ఫోకస్ ఉండేది. ఇప్పుడది లోపించింది.ఈవెంట్లలో కార్యకర్తలకు టైలు కట్టి, కోట్లు తొడిగి లెక్క పెంచడం వల్ల ఫలితముండదు. రాష్ట్రంలో పరిశ్రమలు నడిచే వాతావరణం ముఖ్యం. ఈ పదిహేడు మాసాల పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం అనిపించక మానదు. పారిశ్రామిక వేత్తలను వేధించి, భయపెట్టి డబ్బులు దండుకోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు పోటీలుపడ్డ ఉదంతాలు తొలి ఏడాదిలోనే డజన్లకొద్దీ రిపోర్టయ్యాయి. వసూల్ రాజాల ధాటికి భయపడి ఇండియా సిమెంట్స్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. బహుశా ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి ఘటన జరిగి ఉండదు. బూడిద సరఫరా కాంట్రాక్టు మాకంటే మాకే కావాలని నాయకులు రోడ్డున పడి తన్నుకున్న అసహ్యకరమైన పరిణామాలను చూడవలసి వచ్చింది.ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ను అక్రమ కేసులతో విసిగించి 3 లక్షల కోట్ల పెట్టుబడిని సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే మహారాష్ట్రకు తరిమేశారు. మామూళ్ల కోసం శ్రీకాకుళంలో యూబీ కంపెనీ బీర్ల రవాణాను తెలుగుదేశం నేతలు అడ్డుకుంటే కేంద్రం రంగంలోకి దిగి రాష్ట్ర నేతలకు తలంటాల్సి వచ్చింది. ఇటువంటి ఉదాహరణలు అనేకం. ఉన్నత స్థాయిలో జరుగుతున్న సంతర్పణలు, క్రెడిట్ చోరీలు పక్కనబెడితే, క్షేత్ర స్థాయిలో పారిశ్రామిక వాతావరణం ఇంత వైభవోజ్జ్వలంగా వెలిగిపోతున్నది. ఈ వెలుగు జిలుగుల్లో విశాఖలో జరగబోయే పెట్టుబడుల సమీకరణ సభలో లోకేశ్ అంతా తానై వ్యవహరించబోతున్నారట. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే కొత్త భావన లోకేశ్ మేధో శిశువనే సంగతిని కూడా ఆ సభలో ప్రకటిస్తారట! ఇంతకూ ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరో? ఎంతకూ ఆ పేరు గుర్తుకు రావడం లేదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
హక్కులకు ‘సుప్రీం’ ఛత్రం
‘మన పోలీసులకు తగినంత సామర్థ్యం లేదు. సంస్థాగతంగా, శిక్షణపరంగా ఎన్నో లోపాలున్నాయి. పోలీసు వ్యవస్థపై తగిన పర్యవేక్షణ కూడా లేదు’– ఇవి ఇటీవల ఏదో ఉదంతంలో ఎవరో చేసిన వ్యాఖ్యలు కాదు. సరిగ్గా నూట ఇరవై మూడేళ్ల క్రితం బ్రిటిష్ వలస పాలకుల హయాంలో ఫ్రేజర్ నేతృత్వంలోని రెండో పోలీస్ కమిషన్ నివేదికలోని మాటలు. దేశంలో తరచుగా జరిగే ఉదంతాలు వింటుంటే అప్పటికీ, ఇప్పటికీ పెద్దగా మారిందేమీ లేదని అర్థమవుతుంది. మిగిలినవాటి మాటెలా ఉన్నా పౌరుల్ని అరెస్టు చేయటం విషయంలో నిబంధనలు సక్రమంగా పాటించే సంస్కృతి పోలీసులకు అలవడ లేదు. అందుకే ఎవరినైనా అరెస్టు చేయదల్చుకున్నప్పుడు నిందితులకు అర్థమయ్యే భాషలో అందుకు గల కారణాలను వెంటనే తెలియజెప్పాలని, వారిని ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో... ఎందుకు చేస్తున్నారో... ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయో లిఖిత పూర్వకంగా చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఏజీ మసీహ్ల ధర్మాసనం గురువారం తేల్చిచెప్పింది. ఒకవేళ అందుకు వ్యవధి లేకపోతే కోర్టులో హాజరు పరచటానికి రెండు గంటల ముందైనా నెరవేర్చాలని నిర్దేశించింది. అలా చేయకపోతే ఆ అరెస్టూ, రిమాండ్ కూడా చట్టవిరుద్ధమే అవుతాయని స్పష్టం చేసింది.మన దేశంలో దాదాపు 40 శాతం అరెస్టులు స్వల్ప కారణాలపైనే జరుగుతాయి. వీరిలో అత్యధికులు అట్టడుగు వర్గాలవారు కనుక తమను ఎందుకు అరెస్టు చేశారో కూడా తెలియదు. పోలీసులు చెప్పరు. ‘కామన్ కాజ్’ సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా’ నివేదిక అరెస్టుల విషయంలో కులం, మతం, రాజకీయ అనుబంధాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పింది. 17 రాష్ట్రాల్లో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ల వరకూ వేలాది మందితో మాట్లాడి ఈ నివేదిక రూపొందించారు. అరెస్టుల విషయంలో నిబంధనలన్నీ తు.చ. తప్పకుండా పాటిస్తామని కేవలం 41 శాతం మంది చెప్పారు. ఒక మతం లేదా కులానికి చెందినవారు సహజంగా నేరగాళ్లన్న భావన నిలువెల్లా పాతుకుపోయింది. ఇలాంటివారి విషయంలో ఇక నిబంధనలేం పాటిస్తారు? ఈ నేపథ్యంలో తాజా తీర్పు ఒక ఊరట. నిజానికి సుప్రీంకోర్టు ఇలా చెప్పటం మొదటి సారేమీ కాదు. గత ఫిబ్రవరిలో జస్టిస్ అభయ్ ఎస్. ఓకా, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం సైతం విహాన్ కుమార్ కేసులో పోలీసులకు రాజ్యాంగం నిబంధనలను గుర్తు చేయాల్సి వచ్చింది. నిరుడు పంకజ్ బన్సాల్, ప్రబీర్ పురకాయస్థల కేసుల్లోనూ సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈ సంగతే చెప్పాయి. అరెస్టులకు సంబంధించి రాజ్యాంగం 22వ అధికరణంలోని నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏకపక్ష అరెస్టు లేదా నిర్బంధం నుంచి పౌరులకు రక్షణనిస్తున్నాయి. మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచటానికి ముందే అరెస్టుకు దారితీసిన కారణాలేమిటో నిందితులకు తెలియాలనీ, న్యాయవాదిని నియమించుకుని సమర్థించుకునే అవకాశం ఉండాలనీ, బెయిల్ కోరవచ్చనీ ఆ అధికరణం చెబుతోంది. గతంలో సీఆర్పీసీ (ఇప్పుడు బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 57, అరెస్టయినవారిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని నిర్దేశిస్తోంది. కానీ 22వ అధికరణానికి అనుగుణమైన చట్టాలు కొరవడటం పోలీసుల ఇష్టారాజ్యానికి దారితీస్తోంది. మన దేశంలో అరెస్టు చేయటానికి ‘సహేతుకమైన అనుమానం’ ఉంటే సరిపోతుంది. అమెరికాలో ‘సంభావ్యమైన కారణం’ చూపాలి. ఈ వ్యత్యాసం వల్లే అక్రమ అరెస్టులు రివాజవుతున్నాయి. ఫలితంగా ‘చట్టం నిర్దేశించిన విధానంలో తప్ప పౌరుల జీవితాన్నీ, వారి వ్యక్తిగత స్వేచ్ఛనూ హరించ రాద’ని చెప్పే రాజ్యాంగంలోని 21వ అధికరణం కూడా ఉల్లంఘనకు గురవుతోంది. అక్రమ అరెస్టు ఆ వ్యక్తిపైన మాత్రమేకాక అతనితో సంబంధం ఉన్న వారందరిపైనా ప్రభావం చూపుతుందనీ, వారి మానసిక సమతౌల్యాన్నీ, సామాజిక సంక్షేమాన్నీ దెబ్బతీస్తుందనీ సుప్రీంకోర్టు చేసిన తాజా హెచ్చరిక పాలకులకు కనువిప్పు కావాలి. నేరాలు పెరిగాయనో, చట్టాలంటే భయం లేకుండా పోయిందనో పోలీసులు చట్ట బాహ్యతను ఆశ్రయించటం నీతిమాలినతనం. పాలకులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. -
ట్రంప్కు ‘బ్యాలెట్’ షాక్!
తొమ్మిది నెలల క్రితం అధికారంలోకొచ్చింది మొదలు ఇంటా బయటా విపరీత పోకడలతో, వింత నిర్ణయాలతో బెంబేలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు తొలిసారి ఓటర్లు షాకిచ్చారు. ఆయన సోషలిస్టు, కమ్యూనిస్టు అంటూ ఈసడించుకున్న 34 ఏళ్ల యువకుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్గా మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. మరోపక్క నిరుడు అధ్యక్ష ఎన్నికల్లో డెమాక్రటిక్ పార్టీకి మొహం చాటేసిన వర్జీనియా, న్యూజెర్సీ రాష్ట్రాలు గవర్నర్ ఎన్నికల్లో తిరిగి ఆ పార్టీ వైపు మొగ్గాయి. ఆ రెండు చోట్లా డెమాక్రాట్ల తరఫున పోటీచేసిన మహిళా అభ్యర్థులు మికీ షెరిల్, అబిగైల్ స్పాన్బెర్గర్ ఘనవిజయం సాధించారు. క్యాలిఫోర్నియాలో ప్రతినిధుల సభకూ, సెనేట్ సీట్లకూ జిల్లాల హద్దులు నిర్ణయించే పోలింగ్లో సైతం డెమాక్రాట్లదే పైచేయి. ఈ లెక్కన వచ్చే ఏడాది ప్రతినిధుల సభకూ, సెనేట్లోని కొన్ని స్థానాలకూ జరగబోయే ఎన్నికలపై రిపబ్లికన్లు ఆశ వదులుకోవాల్సి రావొచ్చు. ట్రంప్ దూకుడుతో చేష్టలుడిగిన డెమాక్రటిక్ పార్టీకి ఓటర్లే ఊపిరి పోశారని ఫలితాల సరళి చెబుతోంది. న్యూయార్క్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో 20 లక్షల మందిపైగా ఓటు హక్కు వినియోగించుకోవటమైనా, వారిలో సగంమందికి పైగా మమ్దానీ పక్షాన నిలవటం అయినా అసాధారణం. న్యూయార్క్ వందేళ్ల చరిత్రలో ఆయనది ప్రత్యేకమైన రికార్డు. ముస్లిం కావటం, భారతీయ మూలాలున్న వ్యక్తి అయివుండటం, చిన్న వయసులో కీలక పదవికి చేరుకోవటం రికార్డు. విజేతలు ముగ్గురూ కావడానికి డెమాక్రాట్లే అయినా భిన్న దృక్పథాలున్నవారు. గవర్నర్లుగా ఎన్నికైన షెరిల్, స్పాన్బెర్గర్ మధ్యేవాదులు కాగా, మమ్దానీ వామపక్ష భావాలున్నవారు. నమ్ముకున్న మధ్యేవాదాన్ని విడనాడితే తప్ప ఉనికి ఉండబోదన్న ఆందోళనలో డెమాక్రాట్లున్న తరుణంలో మొన్న ఫిబ్రవరిలో మేయర్ అభ్యర్థిత్వం కోసం పార్టీలో జరిగిన పోటీలో మమ్దానీ నిలిచారు. అప్పటికి ఆయనకు నిండా ఒక శాతం ఓట్లు కూడా లేవు. పైగా పోటీపడింది పార్టీలో సంవత్సరాలుగా పాతుకుపోయి, గవర్నర్గా ఎంతో అనుభవం గడించిన ఆండ్రూ కూమోతో. కూమోకు ఐశ్వర్యవంతుల దన్నుంది. పైగా రిపబ్లికన్లకూ, డెమాక్రాట్లకూ అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నా యూదుల ఓటు బ్యాంక్ను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్నే సమర్థిస్తారు. అలాంటి పార్టీలో మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఊచకోతను వ్యతిరేకించటం, మానవ హక్కుల హననాన్ని నిరసించటం సామాన్యం కాదు. ఆ పని మమ్దానీ చేయగలిగారు. దీంతోపాటు వలసదారులపై ట్రంప్ కత్తిగట్టడాన్ని బాహాటంగా ఖండించారు. ఇదంతా పార్టీకి చేటు తెస్తుందని స్వపక్షంలోనే అనేకులు లబలబలాడారు. కానీ మమ్దానీ దృఢంగా నిలబడ్డారు. కనీస అవసరాలైన తిండిగింజలు, గూడు, ఆరోగ్యం అందుబాటు ధరల్లో ఉండాలన్న నినాదంతో ముందు కెళ్లారు. పార్టీలో తన రేటింగ్ను డబుల్ డిజిట్కు తీసుకెళ్లారు. సర్వేల్లో సైతం ముందంజలో ఉన్నారు. దీంతో ట్రంప్ బెదిరింపులకు దిగారు. న్యూయార్క్కు ఫెడరల్ నిధులు ఆపేస్తాననీ, నగరం సర్వనాశనమవుతుందనీ హెచ్చరించారు. కానీ జనం బేఖాతరు చేశారు. వలసలపై యుద్ధం చేస్తున్న ‘మాగా’ ఉద్యమకారులు, రిపబ్లికన్లకు వారిదైన ‘రెడ్ బుక్’ రాజ్యాంగం ఉంది. దాని సాయంతో విశ్వవిద్యాలయాల్లోనూ, రోడ్లపైనా చెలరేగిపోతున్నారు. ఈ ఎన్నికల్లో వారిది చిత్రమైన అవస్థ. ట్రంప్ నేరుగా స్పందించాలా లేదా అన్నది వారు తేల్చుకోలేకపోయారు. సంప్రదాయ ఓట్లు రాలాలంటే ట్రంప్ స్పందించి తీరాలి. తీరా ఓటమి పాలైతే ట్రంప్పై రిఫరెండమ్ అవుతుంది. చివరకు ఆయన మమ్దానీపై నిప్పులు చెరిగారు. సొంత పార్టీ అభ్యర్థి సిల్వాను కాదని కూమో వైపు మొగ్గారు. కానీ వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు. అందుకే ఈ ఓటమి పాపం ట్రంప్కి చుట్టుకుంది. అధికారం శాశ్వతమని విర్రవీగే దేశ దేశాల పాలకులకూ ఈ ఫలితాలు ఒక హెచ్చరిక. మందబలంతో చెలరేగితే చివరకు అధోగతేనని ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 30 రాష్ట్రాలు రిపబ్లికన్లకు నీరాజనం పట్టి ఏడాది కాలేదు. ట్రంప్ తన నియంత పోకడలతో దాన్నంతటినీ కాలదన్నుకున్నారు. చేసుకున్నవారికి చేసుకున్నంత! -
పాఠాలు నేర్వని ప్రభుత్వం
ఎంతో భక్తి ప్రపత్తులతో ఆలయ సందర్శనకొచ్చేవారికి కనీస రక్షణ చర్యలు తీసుకో వటం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వానికి చేతగాదని మరోసారి నిరూపణయింది. భక్తులందరూ పవిత్రంగా భావించే కార్తిక ఏకాదశి రోజైన శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో రెయిలింగ్ ఊడిపడి తొక్కిసలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన తీరు ఆయన ఏలుబడికి అద్దం పడుతోంది. ఈ విషాద ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. వెనువెంటనే ఘటనాస్థలికొచ్చిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కొన ఊపిరితో ఉన్న కొందరికి సీపీఆర్ చేయటంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన చొరవ కారణంగానే అంబులెన్స్లు వచ్చి గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించాయి. లేకుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేది. రాష్ట్రంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకొచ్చాక ఇలాంటి దుర్ఘటన జరగటం ఇది మూడోసారి. ఈ ఏడాది జనవరిలో పుణ్యక్షేత్రమైన తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ, ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయటంలో చూపిన నిర్లక్ష్యం పర్యవసానంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. మరో 43 మంది గాయ పడ్డారు. శతాబ్దాల చరిత్ర కలిగిన తిరుపతిలో ఇటువంటి దారుణం జరగటం అదే ప్రథమం. అటు తర్వాత మార్చిలో సింహాచల క్షేత్రంలో అక్షయ తృతీయ సందర్భంగా ఎంతో వేడుకగా జరిగే చందనోత్సవంలో తొక్కిసలాట చోటు చేసుకుని ఏడుగురు చనిపోయారు. 2015లో ఇదే చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన కారణంగా, ఆయన సమక్షంలో రాజమహేంద్రవరంలో పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది బలయిపోయారు. అనుకోని దుస్సంఘటనలు జరిగినప్పుడు వెనువెంటనే బాధ్యులెవరో గుర్తించి చర్య తీసుకోవటానికి పాలకులు ఉద్యుక్తులవుతారు. బాబు ఒక్కరు మాత్రం కబురు తెలిసిన వెంటనే సాకుల కోసం వెదుకుతారు. ఇలాంటివి సర్వసాధారణమేనన్న తర్కానికి దిగుతారు. పుష్కరాలు మొదలుకొని తిరుపతి, సింహాచలం తొక్కిసలాటల వరకూ ఆయన బాణీ అదే. ఇప్పుడు కూడా దాన్నే తు.చ. తప్పకుండా పాటించారు. కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తిదట. ఆ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని పోలీసులకు సమాచారం లేదట. ఇంకా నయం... కార్తిక ఏకాదశి రోజున ఆలయాలకు భక్తులొస్తారను కోలేదని అనలేదు! ఇంతకూ తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు చోటుచేసుకున్న ప్రాంగణాలు ఎవరి అధీనం లోనివి? చాలాముందుగా తెలిసినా అక్కడ బాబు సర్కారు ఒరగబెట్టిందేమిటి? పోలీసుల సంగతలా ఉంచి అనుకోనిది జరిగితే ముందుకు రికేందుకు అంబులెన్స్లూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలనైనా అందుబాటులో ఉంచగలిగారా? మరి ఎవరిని వంచించటానికి ఈ మాటలు? టీడీపీ వందిమాగధ మీడియా ఆయన్ను మించిపోయింది. ఫలానా రోజొచ్చే పర్వదినం మళ్లీ జన్మలో రాదని సోషల్ మీడియాలో ఊదరగొట్టేవారు పెరిగి పోవటం వల్లే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందట! పర్వదినాలేవో పంచాంగాలే చెబుతాయి. దేవదాయ శాఖ ఆలయమైనా, ప్రైవేటు ఆలయమైనా భక్తులు క్యూ కడతారు. చెప్పినా చెప్పకున్నా ఏర్పాట్లు చేయటం ప్రభుత్వ బాధ్యత. చంద్రబాబు గుర్తించారో లేదోగానీ, తెలియదు... చెప్పలేదు అనే రోగానికి మూలం మరోచోట ఉంది. ‘నలుగురు కూడిన కాడ నరలోకం యముడుండు’ అని గద్దర్ ఒక పాటలో అన్నట్టు పదిమంది జమయితే పోలీసులు అనుమానంగా చూస్తారు. అది నిరసనైనా, ఉత్సవమైనా, ఊరేగింపైనా వారి స్పందన ఒకేలా ఉంటుంది. అంతమంది గుమిగూడటానికి ముందస్తు అనుమతులున్నాయా అని ఆరా తీస్తారు. తగిన చర్యలు తీసుకుంటారు. ఇంటెలిజెన్స్ విభాగం నిమగ్నమయ్యేది అలాంటి సమాచార సేకరణ లోనే. మరి బాబు రక్షకభటులేం చేశారు? డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు సహాయచర్యల్లో పాల్గొంటుండగా ప్రత్యక్షమయ్యారు. రాజకీయ కక్ష సాధింపులకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేచోట, రెడ్బుక్ రాజ్యాంగం అమలయ్యేచోట ఇంతకన్నా మెరుగ్గా పోలీసులు వ్యవహరిస్తారని ఆశించలేం. ఇప్పటికైనా బాబు తెలివి తెచ్చుకుని సవ్యంగా పాలించటం మొదలెట్టాలి. జనం ప్రాణాలు అరచేత బట్టుకుని ఉత్సవాలకెళ్లే్ల దురవస్థ నుంచి తప్పించాలి. -
రహదారుల మృత్యువేగం
మళ్లీ నడిరోడ్డు నెత్తుటి మడుగైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో సోమవారం తెల తెలవారుతుండగా ఎదురుగా దూసుకొచ్చిన టిప్పర్ 19 మంది బస్సు ప్రయాణికుల నిండు జీవితాలను కబళించింది. చదువుల కోసం వస్తున్నవారూ, ఉద్యోగాల నిమిత్తం బస్సెక్కినవారూ, ఉపాధి ఆశించి బయల్దేరినవారూ, వైద్య చికిత్స కోసం ఎదురు చూస్తున్నవారూ... అందరికందరూ మృత్యుదాహంతో దూసుకొచ్చిన టిప్పర్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలవారు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అది పేరుకు జాతీయ రహదారే కానీ, అడుగడుగునా గుంతలు. స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు మచ్చుకైనా లేక జిల్లా రోడ్డు కన్నా ఘోరంగా ఉంటుంది. పర్యవసానంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినా జడత్వం వదుల్చుకోని అధికార యంత్రాంగం తీరువల్ల ప్రమాదాలు నిత్యకృత్య మయ్యాయి. తెలంగాణ ఆవిర్భవించిన ఈ పదకొండేళ్ల చరిత్ర చూసినా ఈ రహదారిపైనే 300 మంది జీవితాలు ముగిసిపోయాయంటే ఎవరిని నిందించాలి? వేగాన్ని అదుపు చేయలేని స్థితిలో టిప్పర్లోని కంకర లోడంతా బస్సు ప్రయాణికులను కమ్మేసింది.అందుకే మృతుల సంఖ్య భారీగా ఉంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ కేసు వల్ల రహదారి విస్తరణ పనుల ప్రారంభంలో జాప్యం చోటుచేసుకున్నదని అధికారులు చెబుతున్న మాట పాక్షిక సత్యం. పదేళ్ల క్రితం రహదారిని విస్తరించాలనుకున్నప్పుడే అక్కడ వందలాది ఊడలు దిగిన మర్రి చెట్లున్నా యనీ, వాటి తొలగింపు వివాదమవుతుందనీ అంచనా ఉండాలి. ఆ వృక్షాలకు ఇబ్బంది కలగని రీతిలో రహదారి కోసం ప్రత్యామ్నాయ స్థలమైనా చూడాలి లేదా వాటిని వేరే చోటుకు తరలించి విశాలమైన రహదారి నిర్మాణానికి పూనుకోవాలి. అది వారి బాధ్యత. ఆ విషయంలో ముందస్తు కసరత్తేమీ జరగలేదని జరిగిన పరిణామాలు గమనిస్తే అర్థమవుతుంది. అనాలోచితంగా విస్తరణ పనులకు పూనుకోవటం, సమస్యాత్మకం అయ్యేసరికి నిస్సహాయత ప్రదర్శించటం దారుణం.పర్యావరణ ప్రేమికులు జాతీయ హరిత ట్రైబ్యునల్ను ఆశ్రయించేవరకూ చెట్ల తొలగింపును అధికారులు నిజంగానే సమస్యగా పరిగణించలేదా? ఈ విషయంలో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పాలకవర్గం ఇప్పటికే ఎంతో అనుభవం గడించివుండాలి. రహదారి డిజైన్ సమయంలో అదంతా మంట గలిసిందా? పర్యావరణంపై చైతన్యం పెరిగిన వర్తమానంలో చెట్ల తొలగింపును ఎవరూ అడ్డుకోరన్న భరోసా ఎక్కడిది? ఈ విషయంలో సంజాయిషీ చెప్పాలి. ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటం, పనులకు ఆటంకం కలిగాక తీరిగ్గా హామీలిచ్చి ట్రైబ్యునల్లో స్టే తొలగింప జేసుకునే ప్రయత్నం చేయటం కారణంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో వారు గమనించుకున్నారా?ప్రమాదాలు జరిగినప్పుడల్లా పాలకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పరి హారం కూడా ప్రకటిస్తున్నారు. మంచిదే. కానీ దేశవ్యాప్తంగా వందలాది మంది ఉసురు తీస్తున్న ఈ వాహనాల అదుపు కోసం ఏం యోచిస్తున్నారు? ఇప్పుడొస్తున్న వాహనాల డిజైన్లన్నీ పాశ్చాత్య దేశాల రోడ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి. మన దేశంలో అసలే రోడ్లు అంతంత మాత్రం. జాతీయ రహదారులు కూడా ఇలా అక్కడక్కడ సమస్యా త్మకంగానే ఉంటున్నాయి. అటువంటి రోడ్లపై రాకెట్ వేగంతో దూసుకెళ్లే వాహనాలను అనుమతించటం సబబేనా? కనీసం పెద్ద పెద్ద బండరాళ్లు, కంకర వగైరా లోడ్ మోసుకెళ్లే టిప్పర్ల వేగాన్నయినా పరిమితం చేయాల్సిన అవసరం లేదా?సరిగ్గా చేవెళ్ల వద్ద ప్రమాదం చోటుచేసుకున్న రోజే రాజస్థాన్లోని జైపూర్లో ఒక టిప్పర్ పెనువేగంతో పోయి పలు వాహనాలను ఢీకొన్న ఉదంతంలో 14 మంది మరణించారు. మొన్న సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా ట్రక్కు రాంగ్రూట్లో పోయి కారును ఢీకొన్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇసుక, గ్రానైట్, కంకర, నాపరాళ్లు వగైరా వ్యాపారాల్లో టిప్పర్లు అవసరాన్ని మించి లోడ్ మోసుకెళ్లటం, పెనువేగంతో పోవటం తరచూ కనబడుతోంది. వీటి నియంత్రణకు నిబంధనలు రూపొందించకపోతే, ఈ అరాచకాన్ని నిలువరించకపోతే జనం క్షమించరు. -
కూసింత కళాపోషణ
కళలు మానవానుభూతుల అభివ్యక్తి సాధనాలు. కళలు మానవ నాగరిక ప్రస్థానానికి సాక్షీభూతాలు. కళలు మానవుల సౌందర్య పిపాసకు నిదర్శనాలు. కళలు మానవుల సృజన సామర్థ్యానికి తార్కాణాలు. కళలు సామాజిక సంస్కృతికి ప్రతిబింబాలు. కళలకు చోటు లేని సమాజం మరుభూమితో సమానం. ప్రపంచవ్యాప్తంగా నాగరికతలతో పాటే కళలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. రాజ్యాలు ఏర్పడ్డాక కళలకు ప్రోత్సాహం పెరిగింది. రాజాదరణ పొందిన కవులు, కళాకారులు లోటు లేని భద్రజీవితాలను గడుపుతూ, కళాసృజన చేసేవారు. కళల పట్ల అభిరుచి గల రాజులు కవులకు, కళాకారులకు కనకాభిషేకాలు సహా ఘన సత్కారాలు చేసేవారు. రాజులే కాక సమాజంలోని సంపన్న కులీనులు కూడా కళాకారులను ఆదరించేవారు. కళాపోషణ సమాజంలో ఒక హోదా చిహ్నంగా ఉండేది. తెలుగునాట కళాపోషణకు అనేక ఉదాహరణలు మన చరిత్రలో కనిపిస్తాయి. కవి సార్వభౌముడు శ్రీనాథుడు రాజాస్థానాలలో అనేక ఘనసత్కారాలను పొందాడు. ‘దీనార టంకాల తీర్థమాడించితి/ దక్షినాధీశు ముత్యాల శాల’ అని శ్రీనాథుడు స్వయంగా చెప్పు కున్నాడు. శ్రీనాథుడికి దీనార టంకాలతో కనకాభిషేకం చేసిన రాజు ప్రౌఢదేవరాయలు. శ్రీనాథుడి తర్వాత కనకాభిషేకం పొందిన మరో కవి అడిదం సూరకవి. శ్రీనాథుడికి శతాబ్దాల తర్వాతి వాడు అడిదం సూరకవి.విజయనగరం ఆస్థానానికి వెళ్లిన అడిదం సూరకవి ఆ రాజ్యానికి రాజైన పూసపాటి విజయరామరాజును పొగుడుతూ, ‘రాజు కళంకమూర్తి రతిరాజు శరీరవిహీను డంబికా/ రాజు దిగంబరుడు మృగరాజు గుహాంతర సీమవర్తి వి/ భ్రాజిత పూసపాడ్విజయ రామ నృపాలుడు రాజు కాక ఈ/ రాజులు రాజులా పెను తరాజులు కాక ధరాతలంబునన్’ అని పద్యం చెప్పాడు. విజయరామరాజు సూరకవి పొగడ్తకు మురిసి ముక్కలై, కనకా భిషేకం జరిపాడు. అయితే, ఈ కవిరాజుది మరీ విడ్డూరమైన కథ. ‘స్నానము చేసిన ఉదకమును పానము చేయలేను’ అని చెప్పి, కనకాభిషేకంలో వాడిన బంగారు నాణేలను తీసుకోవడానికి నిరాకరించాడు. అడిదం కవి ఆత్మాతిశయానికి మెచ్చిన విజయరామ రాజు తగురీతిలో ఘనసత్కారం జరిపి, ఆయనను సాగనంపాడట! తెలుగునాట కనకా భిషేకాల కాలం బహుశా అడిదం కవితోనే అంతరించింది.ఎందరో రాజులు రాజ్యాలను ఏలారు. వారిలో చాలామంది చరిత్రలో కలిసి పోయారు. ఆ రాజులలో కొద్దిమంది మాత్రమే ఇంకా జనాలకు గుర్తున్నారు. కారణం ఒక్కటే! వారి ఏలుబడిలో జరిగిన కళాపోషణ. కళాపోషణ బాగా ఉన్న రాజ్యాలలో ప్రశాంతత ఉండేది. నిత్యం అంతర్బహిర్ కలహాలతో అట్టుడికిపోయే రాజ్యాలలో కళలు ఉన్నా; వాటి ఆదరణకు, పోషణకు ఆస్కారం అతి తక్కువ. రాచరికాల కాలంలో కూడా రాజాదరణ పొందిన కళాకారులే సుభిక్షంగా జీవించగలిగేవారు. అయితే, రాజాశ్రయం పొందడం అంత తేలికగా ఉండేది కాదు. అప్పట్లోనూ అనేక రాజకీయాలు ఉండేవి.కృష్ణదేవరాయల ఆస్థానంలో చోటు పొందడానికి తెనాలి రామకృష్ణుడు అష్టకష్టాలు పడిన కథలు ఇంకా ప్రచారంలో ఉన్నాయి. యోగ్యులైన కవులు, కళాకారులకు ఇవ్వాలనే ఉద్దేశం రాజుకు ఉన్నా, అతడి ఈవిని సాగనివ్వని వారు చుట్టూ ఉండేవారు. వారు తమకు పోటీ రాగల ఇతరులను రానివ్వకుండా నిరోధించేవారు. ఇలాంటి వారి గురించే ‘ఇయ్యగ నిప్పించగల/ యయ్యలకే గాని మీసమందఱకేలా?/ రొయ్యకు లేదా బారెడు...’ అని చౌడప్ప నిరసించాడు.కళాపోషణ అంటే చాలామందికి ‘ముత్యాలముగ్గు’ సినిమాలోని రావు గోపాలరావు డైలాగు గుర్తుకొస్తుంది. ఆ మాదిరిగా కానీ ఖర్చులేని కళాపోషణ ఎవరైనా చేయగలరు గాని, ఖర్చుకు వెనుకాడకుండా కళాపోషణ చేయాలంటేనే కళాహృదయం ఉండాలి. వర్తమాన కాలంలో ఐర్లండ్ ప్రభుత్వానికి అలాంటి కళాహృదయమే ఉంది. అందుకే కవులు, రచయితలు, కళాకారుల ఆర్థిక సుస్థిరత కోసం నెలకు 1500 యూరోలు చెల్లించే పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికశక్తి అయిన మన దేశంలో ఇలాంటి పథకాన్ని కనీసం కలలోనైనా ఊహించగలమా! -
అన్నీ ఉన్నా... అరచేతిలో అలజడి!
అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో గెలవడం పెద్ద విశేషమేమీ కాదు. గెలవడానికి అవసరమైన వనరులన్నీ వారికి పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలకు ఇంకో రెండు మూడేళ్ల గడువు ఉన్న సందర్భాల్లో ఆ ప్రాంతంలో ఉండే ప్రభావశీల వర్గాలు కూడా అధికార పార్టీకి అనుకూలంగా మెలగడం చూస్తూనే ఉన్నాము. స్థానిక సమస్యల పరిష్కారానికి కదలిక వచ్చే అవకాశముంటుందన్న ఆశ సహజం కనుక అధికార పార్టీ వైపు కొంత మొగ్గు ఉంటుంది. అధికార దుర్వినియోగమనే ఆయుధాన్ని కూడా పాలకపార్టీలిప్పుడు యథేచ్ఛగా వాడేస్తున్నాయి.తెలంగాణలో మొన్నటి సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు మునుగోడు అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. అప్పటికే బీఆర్ఎస్ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం పరుచుకుంటున్న దశ అది. బీజేపీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్రెడ్డికి నియోజకవర్గంలో గణనీయమైన పలుకుబడి ఉన్నది. అర్థబలం, అంగబలం కూడా ఆయనకు దండిగానే ఉన్నాయి. అయినప్పటికీ అధికార పార్టీకి ఉండే వనరుల దన్నుతో బలమైన రాజగోపాల్రెడ్డిని బీఆర్ఎస్ ఓడించ గలిగింది.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీకాలం మిగిలే ఉన్న దశలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఎదుర్కొంటున్నది. పార్టీ తరఫున పదిమంది మంత్రులు, పలువురు ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలు నియో జకవర్గ వ్యాప్తంగా జాతర చేస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు, నేటి ప్రజా ప్రభుత్వాలు తలుచుకుంటే డబ్బులకు కరువేముంటుంది? బీసీ రిజర్వేషన్ల అంశం మీద రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న బలమైన బీసీ వర్గం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నట్లు రౌడీషీటరా? సంఘసేవకుడా? అనే మీమాంసను పక్కనబెడితే కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అక్కడ అంతో ఇంతో పలుకుబడి ఉన్న వ్యక్తే.సంఘ సేవకులకు మాత్రమే టిక్కెట్లిస్తామనే నియమాన్ని దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టుకోకపోవడం ఒక నయా వాస్తవి కత. రౌడీషీటర్, యాంటీసోషల్ వగైరా టైటిళ్లు బలహీన వర్గాలకు లభించినంత సులభంగా ఉన్నత వర్గాలకు లభించవు. అదేవిధంగా కొన్ని బిరుదులూ, సత్కారాలూ ఉన్నత వర్గాలకు లభించినంత తేలిగ్గా బలహీన వర్గాలకు దక్కవు. ఇదొక సామాజిక రీతి. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వలసవచ్చిన ప్రజలు నివాసం ఏర్పరచుకున్న ప్రాంతం కనుక, దాదాపు లక్షమంది అపార్టుమెంట్లలో నివసిస్తున్న భద్రలోకులు కనుక రౌడీషీటర్ ప్రచారం వల్ల తమకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి.మైసూర్ పాక్లో మైసూర్ ఉండదనే కుళ్లు జోకు తరహాలోనే హైదరాబాద్లోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ ఉండదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ, మధురా నగర్, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ వంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతోపాటు షేక్పేట, రహ మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ వంటి కార్మికులు, చిరుద్యో గులు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. మొత్తం ఓటర్లలో ఇరవై ఐదు శాతం మంది ముస్లిం మైనారిటీలు. మజ్లిస్ పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దించకుండా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించింది. హైదరాబాద్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యన ప్రధాన పోటీ ఉన్న సందర్భాల్లోనే ముస్లిం ఓటు కాంగ్రెస్కు పడే సంప్రదాయం ఉన్నది. రెండు సెక్యులర్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నప్పుడు ముస్లిం ఓటు ఏకపక్షంగా ఉండదు.జూబ్లీ హిల్స్లో బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్ల మధ్యనే నెల కొన్నట్టు ప్రచార పర్వంలో నిరూపితమైంది. ముస్లిం ఓటు కూడా ఏకపక్షంగా లేదని అర్థమైనందువల్లనే హఠాత్తుగా అజారుద్దీన్కు మంత్రిపదవి నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకున్నట్టు తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ముస్లిం మైనారిటీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ సంకల్పమైతే ఇంతకు ముందే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండేది. కొత్తగా ముగ్గుర్ని మంత్రివర్గంలోకి తీసుకున్న సందర్భంలోనే వారికే ప్రాతినిధ్యం కల్పించి ఉండేది. అలాకాకుండా ఉప ఎన్నిక పోలింగ్కు సరిగ్గా పది రోజుల ముందు అజారుద్దీన్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కచ్చితంగా అనైతిక చర్యగానే భావించవలసి ఉంటుంది.అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓటరు కాక పోవచ్చు. కానీ ఆ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్ని కల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా కూడా పార్టీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన పార్టీ ప్రచార రంగంలో మైనారిటీ ఓటుపై భరోసా కనిపించకపోవడం వల్లనే ఇప్పుడు ఆదరాబాదరాగా మంత్రి పదవి కట్టబెట్టిందనే వాదనలో ఔచిత్యం కనిపిస్తున్నది. క్రీడారంగంలో దేశానికి అజర్ చేసిన సేవకు గుర్తింపుగానే ఆయనకు మంత్రిపదవి ఇచ్చినట్టు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో పస లేదు. అటువంటి గ్రహింపు కేవలం పోలింగ్కు పది రోజుల ముందే కలగడమేమిటనే ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు.ఆరు మాసాల్లోగా అజర్ భాయ్ శాసనమండలికో, శాసనసభకో ఎన్నిక కావలసి ఉన్నది. లేకపోతే ఈ మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెటర్గా ఆయనపై జీవితకాల నిషేధం కొనసాగుతున్నది. హెచ్సీఏ అధ్యక్షునిగా ఉన్న కాలంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన క్రిమినల్ కేసును ఎదు ర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి కేంద్రం ఏ మేరకు సహక రిస్తుందనేది అనుమానమే. గడువులోగా ఏదో సభకు ఎన్నిక కానట్టయితే ‘దేశానికి అజర్ చేసిన సేవలకు’గాను ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అవమానించినట్టవుతుంది.మజ్లిస్ మద్దతు కారణంగా గుండుగుత్తగా పడే మైనారిటీ ఓట్లతో జూబ్లీ హిల్స్ గెలుపు తమకు నల్లేరుపై బండి నడకే కాగలదని కాంగ్రెస్ పార్టీ తొలుత భావించినట్టుంది. క్షేత్ర స్థాయిలో ఏదో తేడా కొట్టడంతోనే హడావిడిగా అసందర్భంగా అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారనే అభిప్రాయం బల పడుతున్నది. బీజేపీ అభ్యర్థిని ప్రధాన పోటీదారుగా నియోజక వర్గ ప్రజలు భావించడం లేదు. అందువల్ల అక్కడ మతపరమైన పోలరైజేషన్ ఏమాత్రం కనిపించడం లేదు. ప్రధాన పోటీ దార్లుగా కనిపిస్తున్న కాంగ్రెస్–బీఆర్ఎస్లు అభివృద్ధి ఎజెండానే ప్రచారం చేసుకుంటున్నాయి. ఓటర్లు కూడా ఇదే ప్రాతిపదికన చీలుతున్నారు. ఇందులో మైనారిటీ, మెజారిటీ అన్న తేడాలేమీ కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అజారుద్దీన్కు మంత్రిపదవి ఇవ్వడం వల్లనో, ముంబైలో సల్మాన్ఖాన్తో ముఖ్యమంత్రి దిగిన ఫొటోలను సీఎమ్ఓ విడుదల చేయడం వల్లనో మైనారిటీలు ప్రభావితులయ్యే అవకాశాలు తక్కువ.ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో సానుకూల స్పందనే ఉన్నది. అదే సందర్భంలో ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అక్కడక్కడా మహిళలే నిలదీస్తున్న వార్తలు కూడా మీడియాలో రిపోర్టవుతున్నాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండున్నర వేల గురించి అడుగుతున్నారు. తులం బంగారం సంగతేమిటని నిలదీస్తున్నారు. ‘మాకు స్కూటీలిస్తామన్నారు, ఇంకెప్పుడి స్తార’ని ఒకచోట పది మంది బాలికలు ప్రశ్నించారు. వృద్ధాప్య పెన్షన్ను పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు.ఉప ఎన్నికలకు ముందు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసింది. అందులో కొన్ని పనులు పూర్తి చేశారు కూడా! ఇది కాంగ్రెస్ అభ్యర్థికి మేలు చేసే అంశం. కానీ, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ముందు అక్కడ కాంగ్రెస్ వాళ్లు అనేక హామీలు గుప్పించి మోసం చేశారని ఆ ప్రాంతం నుంచి వచ్చిన మహిళల టీమ్ ఒకటి జూబ్లీ హిల్స్లో విస్తారంగా ప్రచారం చేస్తున్నది. ఇటువంటి ఉదంతాలు కొన్ని స్వచ్ఛందంగా జరిగి ఉండవచ్చు. కొన్ని ప్రతిపక్ష పార్టీ ఆర్గనైజ్ చేసి ఉండవచ్చు. ఎలా జరిగినా ఇవి కాంగ్రెస్ ప్రచారానికి ఇబ్బంది కలిగించే విషయాలే! కేసీఆర్ హయాంలో తమకు అందిన రంజాన్ తోఫా, షాదీ ముబారక్ల గురించి కూడా మైనారిటీ ప్రజలు గుర్తు చేస్తున్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నియోజకవర్గానికి జరిగిన లబ్ధిపై బీఆర్ఎస్ పార్టీ ఒక పత్రాన్ని విడుదల చేసింది. దానితోపాటు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఎగవేసిన అంశాలను ఉటంకిస్తూ ఒక బాకీ పత్రాన్ని కూడా ఆ పార్టీ ప్రచారంలో పెట్టింది. ఇవి జనంలో చర్చనీయాంశాలుగా మారాయి. సినీ రంగంలో పనిచేసే కార్మికులు దాదాపు పది హేను వేలమంది వరకు ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి స్వయంగా ముఖ్య మంత్రే ఒక సభకు హాజరై, వారికి అనేక హామీలిచ్చారు. కానీ ఆ కార్మికులు సంతృప్తి చెందినట్లయితే కనిపించలేదు. పదివేల మంది వరకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి.గడచిన రెండేళ్ళలో మార్కెట్లో ద్రవ్య చలామణీ బాగా తగ్గిందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. దాని ప్రభావం అన్ని రంగాల మీద కనిపిస్తున్నది. జీఎస్టీ వసూళ్లలో, స్థిరాస్తి రిజి స్ట్రేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అథోముఖయానం దీన్ని ధ్రువీక రిస్తున్నది. కేసీఆర్ కాలం నాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో జనం పోల్చి చూసుకుంటున్నారు. ఈ రకంగా క్షేత్రస్థాయి నాడి కాంగ్రెస్కు అంత సానుకూలంగా ఏమీ లేదు. కానీ అధికార పార్టీగా దానికుండే బలాలను కూడా తీసిపారేయలేము. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓట్ల కోసం ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం వేసిన ఎత్తుగడ మిస్ఫైరయినప్పటికీ అందులోంచి ప్రయోజనం పొందడం కోసం ప్రయత్నాలను మానలేదు. నియోజకవర్గంలో విస్తృత సంబంధాలున్న కుటుంబాన్ని బరి లోకి దింపింది. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం పంపిణీ చేయడం కూడా కలిసొస్తుందని ఆ పార్టీ ఆశిస్తున్నది. కొత్తగా నియోజకవర్గంలో నలభై వేల రేషన్ కార్డులు పంపిణీ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవాలు పరిశీలిస్తే వెయ్యికి మించి పంపిణీ చేయలేదని తెలిసింది. ఇక డబ్బులు వెద జల్లడం, ప్రలోభాలకు తెరలేపడం అధికార పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి అనుకూలాంశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్లో ఏదో తెలియని అలజడి కనిపిస్తున్నది. ఓడిపోతే తర్వాత పర్యవసానాలెలా ఉంటాయోనన్న కలవరం ఆ శిబిరంలో నెలకొన్నది. ఉపఎన్నిక పోలింగ్కు ఇంకా 9 రోజుల సమయం ఉంది. ఆలోగా అధికార పార్టీకి అనుకూలంగా ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘తాత్కాలిక సంధి’ కాలం!
ఎట్టకేలకు అమెరికా–చైనాల మధ్య తాత్కాలిక సంధి కుదిరింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లు దక్షిణ కొరియాలోని బూసాన్లో గురు వారం చర్చించాక ఇరు దేశాల మధ్యా తాత్కాలిక సంధి కుదిరింది. వాణిజ్య కీచులాట లకు రెండు దేశాలూ ఏడాది పాటు విరామం ప్రకటించాయి. చైనా దిగుమతులపై విధించిన సుంకాల్లో 10 శాతం తగ్గించాలని అమెరికా నిర్ణయించింది. అలాగే అపురూప ఖనిజాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని చైనా నిర్ణయం తీసుకుంది.దాంతోపాటు అమెరికా నుంచి సోయాబీన్స్ కొనుగోళ్లను పునరుద్ధరించటానికి అంగీకరించింది. రెండు దేశాల దోబూచులాట ట్రంప్ ఆగమనంతో మాత్రమే మొదలుకాలేదు. ఆ రెండింటి మధ్యా అంతకుముందే ఉన్న వాణిజ్య ఆధిపత్య పోటీ జో బైడెన్ హయాంలో తీవ్రతరమైంది. దాన్ని ట్రంప్ మరింత ఎగదోశారు. మొన్న ఏప్రిల్లో చైనాపై 145 శాతం సుంకాలు విధించారు. ఈ బ్లాక్మెయిల్కు తలొగ్గబోమనీ, తుదివరకూ పోరాడతామనీ చైనా జవాబిచ్చింది. ఈ పోటీ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలియక ప్రపంచ దేశాలన్నీ సతమతమయ్యాయి. కానీ తాజా చర్చల వల్ల తాత్కాలికంగానైనా అవి సద్దు మణగటం మంచి పరిణామం. ఈ చర్చలు మరిన్ని చర్చలకు దారితీసి వాణిజ్య సంధికి దారితీయొచ్చన్న ఆశాభావం కూడా అందరిలో వ్యక్తమవుతోంది. ఇద్దరు దేశాధినేతలు కలుసుకున్నప్పుడు చిరునవ్వులు రువ్వుకోవడం, ఎక్కువసేపు కరచాలనాలతో ఫొటోలకు పోజులివ్వటం రివాజే. ట్రంప్, జిన్పింగ్లిద్దర్నీ అంచనా వేయటం అంత సులభం కూడా కాదు. అందులోనూ ట్రంప్ 24 గంటలు తిరగకుండా మాట మార్చటంలో సిద్ధహస్తుడు. అందువల్ల బూసాన్ సమావేశంపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పైగా చర్చల అనంతరం ట్రంప్ ప్రకటించినంతస్పష్టంగా చైనా వైపు నుంచి వివరణ లేదు. ‘కీలక ఆర్థిక, వాణిజ్య అంశాలపై అధినేతలు పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరు దేశాల మధ్య దృఢమైన పునాది కోసం ట్రంప్తో కలిసి పనిచేయటానికి షి సంసిద్ధత చూపారు’ అని చైనా ప్రకటన చెబుతోంది. అపురూప ఖనిజాల సంగతేమీ అందులో లేదు. కాకపోతే చైనా వాణిజ్య శాఖ ప్రకటన ‘అక్టోబర్ 9 నాటి ఎగుమతుల నియంత్రణలను’ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలి పింది. అందులో అపురూప ఖనిజాలు కూడా ఉన్నాయి. కార్లు, సెమీ కండక్టర్లే కాక సైనిక ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు తేలినందువల్లే నియంత్రణ విధించామని చైనా లోగడ తెలిపింది.ట్రంప్ తగ్గించామంటున్న సుంకాల విషయంలోనూ తకరారు ఉంది. మాదక ద్రవ్యాల తయారీకి తోడ్పడే ఫెంటానిల్ రసాయనాన్ని చైనా ఎగుమతి చేస్తోందని ఆరో పిస్తూ చైనా సరుకులపై ట్రంప్ 20 శాతం సుంకాలు విధించారు. ఇప్పుడు 10 శాతం తగ్గించటమంటే దాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేదని అర్థం. తాము కూడా సుంకాలు సవరిస్తామని చైనా అంటున్నది. తమ ఎన్విడియా కంపెనీ చిప్లను చైనా కొనుగోలు చేయొచ్చని ట్రంప్ అన్నప్పటికీ బ్లాక్వెల్ చిప్ల విషయం చర్చకు రాలేదంటున్నారు.అంటే ఈ సంధిలోనూ అపరిష్కృత సమస్యలు దాగున్నాయి.రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలూ అగ్రభాగాన ఉన్నాయన్న మాటేగానీ మాంద్యంతో యాతన పడుతున్నాయి. ట్రంప్ సుంకాల యుద్ధంతో సోయాబీన్స్ను బ్రెజిల్ నుంచి చైనా కొనుగోలు చేయటం మొదలెట్టింది. దాంతో అమెరికా రైతులు దివాలా స్థితికి చేరారు. అది ట్రంప్ను ఊపిరాడకుండా చేస్తోంది. అందుకే జిన్పింగ్తో చర్చల్లో తైవాన్ సమస్య జోలికి పోలేదు. అటు చైనా 2021 నాటి స్థిరాస్తి మార్కెట్ సంక్షోభం నుంచి బయటపడలేదు. దేశంలో కొనుగోలు శక్తి పడిపోవటంతో సరుకు అమ్ముడు కాక మార్కెట్లు నేలచూపు చూస్తున్నాయి. 2035 నాటికి ఏఐలో అగ్రగామిగా మారి తిరిగి పుంజుకోవాలనుకుంటున్నా అమెరికా నియంత్రణలు అడ్డంకిగా మారాయి. విద్య, నైపు ణ్యాల్లో భారీగా వ్యయం చేయాలనుకుంటున్న చైనా అందుకవసరమైన పెట్టుబడుల కోసం చూస్తోంది. అపురూప ఖనిజాల నియంత్రణ ద్వారా ఇప్పటికైతే అమెరికాను దారికి తెచ్చుకుంది. వచ్చే ఏప్రిల్లో బీజింగ్ సందర్శిస్తానని ట్రంప్ అంటున్నారు గనుక ఆ లోగా ఈ ‘తాత్కాలిక సంధి’ సామరస్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
ఆపత్కాలంలో ఆసరా ఏది?
తెలుగు రాష్ట్రాలను కంటి మీద కునుకు లేకుండా చేసిన మొంథా తుపాను చివరకు ప్రశాంతంగా ముగిసినా ఎడతెరిపి లేని వర్షాలతో లక్షలాది ఎకరాల పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. రెండు చోట్లా నదులూ, వాగులూ, వంకలూ, గెడ్డలూ ఉద్ధృతంగా ప్రవహించి కట్టలు తెంచుకుని జనావాసాలను ముంచెత్తాయి. సముద్రంలో పెను తుపానుగా బలపడి ప్రళయ భీకర రూపంతో భయపెడుతూ వచ్చిన తుపాను, తీరానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఏర్పడిన ‘విండ్ షీర్’(గాలికోత) ధాటికి విచ్ఛిన్నమై శాంతించిందని వాతావరణ నిపుణులంటున్న మాట. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని తీరప్రాంతాల్లో 15 లక్షల ఎకరాల్లోని వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి విస్తీర్ణమే 11 లక్షలంటున్నారు. తెలంగాణలో దాదాపు 14 జిల్లాలు మొంథా ప్రభావంతో కుండపోత వర్షాలతో ఇక్కట్లపాలయ్యాయి. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతినటంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం సైతం నీట మునిగింది. ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లను ముందుగా గుర్తించే సాంకేతికత అందుబాటులో కొచ్చి తుపాను తాకిడి ప్రాంతాల్లోని ప్రజలను సహాయ శిబిరాలకు తరలించటం సులభ మవుతోంది. కానీ అది మాత్రమే సరిపోదు. విపత్తులొస్తే... పంట నష్టం ఏర్పడితే జరగ గల నష్టాన్ని అంచనా వేసుకుని పంటల బీమా పథకాలను అమలు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీలివ్వాలి. రైతులకు ఆసరాగా నిలిచే ‘రైతు భరోసా’ వంటి పథకాలుండాలి. ఆర్బీకేలు అన్ని విధాలా సాయపడాలి. పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలుండాలి. ఎన్నో తుపాన్లు చూశానని ఏపీ ముఖ్యమంత్రి స్వోత్కర్షకు పోతున్నారు. నిజమే... ఆయన వచ్చి నప్పుడల్లా అయితే తుపాన్లు లేదా కరువు కాటకాలు రివాజైన సంగతి తెలుసు. మరి ఎన్నో తుపాన్లు చూసిన నేతకు ఆపత్కాలంలో అక్కరకొచ్చే ముందస్తు చర్యలు తీసు కోవాలన్న స్పృహ ఎందుకు అడుగంటింది? అంతకుముందు జగన్ ప్రభుత్వ హయాంలో 85 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగేలా దాదాపు 70 లక్షల ఎకరాల్లో ఉచిత పంటల బీమా పథకం అమలు చేశారు. అందువల్ల విపత్తుల బారిన పడిన 54.5 లక్షలమంది రైతులకు రూ. 7,802 కోట్లు బీమా పరిహారం లభించింది. కానీ తన ఏలుబడి మొదల య్యాక బాబు వీటన్నిటినీ ఎలా విస్మరించగలిగారు? ఆర్బీకేలను భ్రష్టుపట్టించారు. ఇన్పుట్ సబ్సిడీలు అటకెక్కాయి. నిరుడూ, ఈ ఏడాదీ ఈ సబ్సిడీల రూపేణా ఒక్క రూపాయి అందించింది లేదు. బాబు సర్కారు నిర్వాకం వల్ల ఇప్పుడు పంట రుణాలు తీసుకున్న 19 లక్షల మంది రైతులకు మాత్రమే బ్యాంకులు కల్పించిన బీమా సదు పాయం ఉంది. మొంథా వల్ల తీవ్రంగా నష్టపోయిన మిగతా 66 లక్షల మంది రైతులు ఏం కావాలి? ‘రైతు భరోసా’ పేరు మార్చి ‘అన్నదాత సుఖీభవ’ అన్నారు. పేరేదైతేనేం... ఈ రెండేళ్లలో ప్రతి రైతుకూ ఇంతవరకూ రూ. 40,000 చొప్పున నగదు అందాలి. కానీ ఇచ్చిందెంత? కేవలం రూ.5,000! అనుభవశాలి చేయాల్సిన పనేనా ఇది?! ప్రభుత్వం నుంచి ఏదో రూపేణా సాయం అందుతుంటే, పంటలకు బీమా సదు పాయం ఉంటే, దిగుబడులకు గిట్టుబాటు ధరలు అందజేస్తే ఇలాంటి కష్టకాలంలో నిండా మునిగిపోయామన్న దిగులు రైతులను ఆవరించేది కాదు. అవన్నీ ఎగ్గొట్టినందుకు దోషిగా నిలబడాల్సింది పోయి రైతులతో ఆయన పరిహాసమాడుతున్నారు. ప్రచార యావ శ్రుతి మించి ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చుని తుపాను నిలువరించినట్టు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలు తిండి, నీళ్లు లేక అలమటిస్తున్నట్టు మీడియాలో వస్తున్న వార్తలు అసలు చూస్తున్నారా? అక్కడక్కడ తూ తూ మంత్రంగా సాయం చేసి చాటుకోవటం తప్ప బాధితులందరికీ అందజేయాలన్న సంకల్పం ఏదీ? కొన్నిచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ తదితర పక్షాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటం కొంత ఊరట. ఎన్టీఆర్ జిల్లాలో ఒక పునరావాస కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ అందించిన ఆహారం తీసుకున్నారన్న కక్షతో అక్కడివారిని టీడీపీ పెత్తందార్లు వెళ్లగొట్టిన వైనం తెలుసా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. డబుల్ ఇంజన్ సర్కారని చెప్పుకుంటున్నారు గనుక బాధిత రైతులందరికీ తక్షణ సాయం అందించాలి. నష్టం అంచనాలు పక్కాగా ఉండాలి. నష్టపోయినవారికి సాధ్యమైనంత త్వరగా పూర్తి పరిహారం అందేలా చూడాలి. -
అన్యాయానికి పరిహారం
ఒక పెత్తందారు కన్నెర్ర చేయటం వల్లనో, ఒక ఉన్నతాధికారి కక్షబూనటం వల్లనో, లేదా వ్యవస్థలు ఏకమై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టడం వల్లనో జైళ్లలో మగ్గి చివరకు నిర్దోషులుగా విముక్తులవుతున్నవారికి ఊరటనిచ్చే అంశమిది. అలాంటివారికి నష్టపరిహారం చెల్లించేందుకు అనువైన మార్గదర్శకాలు రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం సంకల్పించింది. అమాయకుల్ని కేసుల్లో ఇరికించటం, ఏళ్ల తరబడి వారు జైలు పాలవటం మన దేశంలో ఎప్పటి నుంచో రొటీన్గా సాగిపోతోంది. నిందితులు నిర్దోషులని తేలినప్పుడు న్యాయస్థానాలు దర్యాప్తు చేసినవారినీ, ప్రాసిక్యూషన్నూ తప్పుబట్టడం తరచూ కనబడుతుంది. కానీ అందువల్ల ఒరిగేదేమిటి? సమాజం వారిని అమాయకులుగా, సాధారణ పౌరులుగా పరిగణించి ఆదరిస్తుందా? అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో అలాంటివారు నష్టపరిహారం పొందేందుకు నిబంధనలున్నాయి. అమెరికాలో జైల్లో మగ్గిన కాలానికి ఏడాదికి 50,000 డాలర్ల చొప్పున పరిహారం చెల్లిస్తారు. బ్రిటన్లో దీర్ఘకాలం జైల్లో ఉన్న నిర్దోషులకు 10 లక్షల పౌండ్లు ఇస్తారు. జర్మనీలో ఇది రోజుకు 75 యూరోలు. మన దేశంలో అభాగ్యులు కేసుల నుంచి విముక్తి పొందటమే అదృష్టమన్నట్టు సరిపెట్టుకుంటున్నారు. పరిహారం సంగతలా ఉంచి వారికి ప్రభుత్వం నుంచి క్షమాపణైనా దక్కటం లేదు. శిక్ష పడుతున్న కేసులు మన దేశంలో ఏటా సగటున 54 శాతం మించటం లేదన్న గణాంకాల్ని గమనిస్తే ఇలాంటి అభాగ్యులెందరో అర్థమవుతుంది. పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు భావించిన కేసు పూర్వాపరాలు చూస్తే ఈ నిర్ణయం ఎంత సరైందో అర్థమవుతుంది. మహారాష్ట్రలో 2013లో ఒక మైనర్పై అత్యా చారం చేసి హతమార్చాడన్న కేసులో ఇరుక్కుని జైల్లో మగ్గుతూ, 2019లో ఉరిశిక్ష పడిన నిరుపేద పౌరుడి కథ ఇది. ఆయన పన్నెండేళ్ల కారాగారవాసంలో ఆరేళ్లు ఉరికంబం నీడన బతుకీడ్చాడు. అతణ్ణి అన్యాయంగా ఇరికించారనీ, దర్యాప్తు మొత్తం తప్పులతడకనీ సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఈ ఏడాది ఇంతవరకూ ఉరిశిక్ష పడిన ముగ్గురు ఖైదీల విషయంలో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. నిజానికి 2014లోనే ఒక కేసులో తీర్పునిస్తూ క్రిమినల్ కేసుల్లో నిందితులు నిర్దోషులుగా తేలితే దర్యాప్తు అధికారుల్ని బాధ్యులుగా పరిగణించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అది ఏ మేరకు అమలవుతున్నదో అనుమానమే. అమాయకులపై తప్పుడు కేసులు బనాయించటం వల్ల అనేక విధాల నష్టం. నిజమైన దోషులు తప్పించుకు తిరుగుతూ అవే నేరాల్ని పదే పదే చేస్తుంటారు. అమాయక పౌరులు నిస్సహాయంగా జైల్లో మగ్గుతారు. దోషులు తప్పించుకు తిరుగుతున్నా, చేయని నేరానికి నిర్దోషులు శిక్ష అనుభవిస్తున్నా ప్రజలకు చట్టబద్ధ పాలనపై విశ్వాసం పోతుంది. రాజ్యాంగంలోని 21వ అధికరణం జీవించే హక్కుకూ, వ్యక్తి స్వేచ్ఛకూ పూచీ పడుతున్నా దానికి అనుగుణంగా అక్రమ కేసుల వల్ల జైలు పాలైనవారికీ, ఆలస్యంగా న్యాయం దక్కినవారికీ పరిహారం చెల్లించే చట్టాలు లేవు. జీవితంలో విలువైన కాలాన్నీ, స్వేచ్ఛనూ, పరువు మర్యాదలనూ కోల్పోయి మానసికంగా కుంగిపోయినవారికి పరిహారం పొందే హక్కుండి తీరాలి. మానవీయ దృక్పథంతో న్యాయస్థానాలు కొన్ని కేసుల్లో పరిహారానికి ఆదేశిస్తున్నాయి. బాధితులందరికీ న్యాయం జరగాలంటే తగిన చట్టం అవసరం.తొంభై శాతం అంగవైకల్యం ఉన్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, మరికొందరు తప్పుడు కేసుల పర్యవసానంగా పదేళ్లు కారాగారంలో మగ్గటం, చివరకు నిర్దోషులుగా విడుదల కావటం ఇటీవలి వైనం. విడుదలైన కొన్నాళ్లకే ప్రొఫెసర్ సాయిబాబా తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారని ఆరోపిస్తూ 17 మందిపై దేశద్రోహ నేరంతో సహా పలు కేసులు పెట్టగా ఆరేళ్ల తర్వాత నిర్దోషులుగా బయటపడ్డారు. గూఢచర్యం, దేశద్రోహం కేసుల్లో ఇరుక్కున్న ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ రూ. 50 లక్షల పరిహారం పొందటానికి రెండు దశాబ్దాలు పట్టింది. ఇలాంటి పోకడలు ఆగాలంటే, తప్పుడు కేసుల పర్వానికి తెరపడాలంటే పరిహారం చెల్లించే విధానం రావాల్సిందే! -
మరిన్ని ప్రాంతాలకు ‘సర్’
బిహార్లో మూడు నెలలపాటు కొనసాగి, వివాదాలకు తావిచ్చి చివరకు సర్వోన్నత న్యాయస్థానం జోక్యం కూడా తప్పనిసరైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ– స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కొత్తగా 12 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవంబర్ 4 నుంచి ప్రారంభం కాబోతోంది. నెల రోజుల్లో ఇది పూర్తవుతుంది. ఇందులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలున్నాయి. ఎన్నికలు జరగబోయే మరో రాష్ట్రం అస్సాంను దీన్లోంచి మినహాయించారు. బిహార్ వరకూ చూస్తే ‘సర్’ పూర్తయ్యాక నికరంగా 47 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారు. ఇందుకు దారితీసిన కారణాలేమిటో ఎన్నికల సంఘం(ఈసీ) ఇంతవరకూ చెప్పలేదు. వారంతా ‘విదేశీయులా’, వలసపోయినవారా, మరణించినవారా అన్న వివరాలు ఇంత వరకూ ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో సాగుతున్న విచారణ సందర్భంలోనైనా ఇవి వెల్లడ వుతాయో లేదో తెలియదు. సరిగ్గా ఆ విచారణ జరగబోతున్న రోజే కొత్తగా ‘సర్’ మొదలుకానుండటం గమనార్హం. ఈసారి నిర్వహించనున్న ‘సర్’లో ఈసీ స్వల్పంగా మార్పులు చేసింది. దీని ప్రకారం తొలి దశలో ఓటర్ల ఇళ్లకు పోయి ఎన్యూమరేషన్ ఫామ్లు అందిస్తారు. ఓటర్ గుర్తింపు కార్డు నంబర్తో సహా వాటిని నింపి వెనక్కిచ్చాక క్రితంసారి... అంటే 2002–04 మధ్య కాలంలో నిర్వహించిన ‘సర్’లో వారి పేరుందో లేదో చూస్తారు. లేనిపక్షంలో తల్లిదండ్రులు లేదా బంధువుల గుర్తింపు నంబర్లు నింపాల్సి ఉంటుంది. అది లేనట్టయితే 11 పత్రాల్లో ఏదో ఒకటి దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏదీ ఇవ్వలేకపోతే ముసాయిదా జాబితాలో వారి పేరుండదు. అలాగే తీసుకున్న ఎన్యూమరేషన్ ఫామ్ వెనక్కివ్వనివారి గురించి ఆరా తీస్తారు. కారణం తెలుసుకుంటారు. వీరందరి పేర్లూ తొలగించిన ముసాయిదాను స్థానిక సంస్థల కార్యాలయాల్లో ఉంచుతారు. తొలగించిన కారణాలు కూడా పొందుపరుస్తారు.తాజా ప్రకటన కోసం నిర్వహించిన మీడియా సమావేశంలో స్వాతంత్య్రానంతరం ఇంతవరకూ 8 దఫాలు ‘సర్’ చేపట్టామని, ఇది తొమ్మిదవదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. పేరు వరకూ అది నిజమే కావొచ్చు. కానీ వాటికీ, ఇప్పుడు చేపడుతున్న ‘సర్’కూ పోలికే లేదు. అప్పుడు ఓటర్ల పేరు నమోదు చేసుకోవటమే తప్ప ఫామ్ పూర్తి చేసి ఇవ్వాలని కోరలేదు. వారినుంచి ఎలాంటి పత్రాలూ లేదా పౌరసత్వ ధ్రువీకరణ పత్రం అడగలేదు. చుట్టుపక్కలవారు అతని స్థానికతపై లేదా పౌరసత్వంపై సందేహాలు వ్యక్తం చేసిన సందర్భంలో మాత్రమే అటువంటివి కోరేవారు. ఫామ్ పూర్తి చేసి వెనక్కిస్తేనే పేరు నమోదు చేస్తామనటం వల్ల అక్షరాస్యత అంతంతమాత్రంగా ఉండే అట్టడుగు వర్గాల ప్రజలకూ, దివ్యాంగులకూ, వృద్ధులకూ, రోగులకూ అది సమస్యా త్మకం కావొచ్చు. క్రితంసారి పేరులేనట్టయితే అందుకు కారణాలు తెల్పాలి. తల్లిదండ్రులు లేదా బంధువులు అప్పట్లో నమోదు చేసుకునివుంటే వారి ఓటర్ నంబర్ తెల్పాలి. లేనిపక్షంలో వారి పేరు జాబితాకు ఎక్కదు. ఈ దశలో రాజకీయ పక్షాలు ఏ మేరకు శ్రద్ధ తీసుకుంటాయో, సాయపడతాయో లేదో తెలియదు. బీఎల్ఓలతోపాటు వలంటీర్లు ఇందుకు తోడ్పడతారని చెప్పటం కాస్త ఊరట. కానీ ఇన్ని రకాల నిబంధనల చట్రంలో... జరుగుతున్నది ఓటర్ల నమోదు ప్రక్రియా లేక తొలగింపు ప్రక్రియా అనే సందేహం తలెత్తే అవకాశం లేదా?బిహార్లో ‘సర్’ అమలైనప్పుడున్న నిబంధనలు చాలావరకూ ఇప్పుడు మారాయి. అప్పట్లో పలు నిబంధనలపై తలెత్తిన గందరగోళంపై స్పష్టత రాకుండానే ఆ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు వచ్చిన నిబంధనలపై కూడా అనేక సందేహాలుంటాయి. ఇక పౌరస త్వాన్ని ధ్రువీకరించేందుకు ఈసీకి వున్న అర్హతపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సే ఉంది. ఈ దశలో మళ్లీ అనేకులు న్యాయస్థానం తలుపు తట్టే అవకాశం లేకపోలేదు. ఈసీ తన స్థాయిలోనే సందేహ నివృత్తి చేస్తే వేరు. కానీ నిరుడు మేలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపైనా, ఈవీఎంల విశ్వసనీయతపైనా వైఎస్సార్ కాంగ్రెస్ దాఖలు చేసిన ఫిర్యాదులపై ఇంతవరకూ నిమ్మకు నీరెత్తినట్టున్న ఈసీ నుంచి అలాంటిది ఆశించగలమా? -
అమాత్యా... ఇది తగునా?
ఇతర విషయాల మాటెలా ఉన్నా మహిళలకు సంబంధించి బాధ్యతాయుతంగా మాట్లాడటం, నాగరికంగా వ్యవహరించటం మన నేతలకు ఇప్పట్లో చేతకాదని మధ్యప్రదేశ్ మంత్రి కైలాశ్ విజయ్వర్గియా నిరూపించారు. ఆ రాష్ట్రంలోని ఇండోర్లో గురువారం ఆస్ట్రేలియా క్రీడాకారిణులిద్దరి పట్ల ఒక దుండగుడు అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతంలో ఆయన స్పందన అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. అది అర్ధరాత్రో అపరాత్రో జరిగింది కాదు. పట్టపగలు 11 గంటలకు నడిరోడ్డుపై చోటుచేసుకుంది. తాము బస చేసిన హోటల్ నుంచి కేవలం కొన్ని మీటర్ల దూరంలోని కెఫేకు వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగుడు వారిపై ఈ అఘాయిత్యానికి పూనుకున్నాడు. సమీపంలోని వ్యక్తి ఆ వాహనం నంబర్ గుర్తుపెట్టుకుని పోలీసులకు చెప్పటంతో వెనువెంటనే దుండగుణ్ణి అరెస్టు చేశారు. అకిల్ ఖాన్ అనే ఆ యువకుడిపై పాత కేసులు కూడా ఉన్నాయని తేలింది. పోలీసులు తక్షణం స్పందించి చర్య తీసుకున్న తీరు ఉన్నంతలో ప్రశంసించదగ్గదే. కానీ దాన్నంతటినీ మంత్రి వ్యాఖ్యలు నీరుగార్చాయి. మన దేశంలో క్రికెటర్లపై చచ్చేంత మోజు ఉంటుందట. అందువల్ల వారు బయట తిరిగేటపుడు సెక్యూరిటీని తోడు తీసుకుని వెళ్లాలట. ఈ ఘటన ఆ క్రీడాకారిణులకు ఒక గుణపాఠమట. క్రికెటర్లంటే ఉన్న మోజు వల్లే ఈ ఉదంతం జరిగిందని ఆయన ఎలా అనగలిగారో అనూహ్యం. మన పర్యాటక రంగం గతంతో పోలిస్తే ఎంతో విస్తరించింది. మన సాంస్కృతిక వారసత్వ వైభవం, వైవిధ్యభరితమైన ప్రకృతి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ రంగం ద్వారా మన జీడీపీకి రూ. 20 లక్షల కోట్లు సమకూరుతున్నదనీ, ఏటా పర్యాటకం 25 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నదనీ ఇటీవలే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖవత్ ఆ రాష్ట్రంలో జరిగిన సదస్సులోనే ప్రకటించారు. పైగా ఈ రంగంలో 8.4 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది. నిజానికి పర్యాటకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామని నిపుణులు ఏనాటి నుంచో చెబుతున్నారు. నిరుడు మన దేశాన్ని కోటిమంది విదేశీ పర్యాటకులు సందర్శించగా, థాయ్లాండ్కు మూడు న్నర కోట్లమంది వెళ్లారు. మన దేశాన్ని సందర్శించేవారికి అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు జాగ్రత్తల పేరిట ఇచ్చే సలహాలు చదివితే ఆగ్రహం కలిగిస్తాయి. మనల్ని చిన్నచూపు చూస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. మహిళలకు భద్రత, రక్షణ ఉండేలా చర్యలు తీసుకోవటం ద్వారా అవి దురభిప్రాయాలేనని చూపవచ్చు. అది చేయకపోగా ఇష్టానుసారం మాట్లాడటం తగునా?ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో శాంతిభద్రతల విభాగం ఉంటుంది. రాష్ట్ర హోంమంత్రి ఇండోర్కు ఇన్ఛార్జి. స్థానికంగా ఉన్న హోల్కర్ స్టేడియంలో జరిగే అయిదు మ్యాచ్ల కోసం వేర్వేరు దేశాల టీమ్లు ఆ హోటల్లో బస చేశాయి. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలో ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటిపై అధికారుల స్థాయిలో చర్చించుకునే ఉంటారు. తీసుకున్న భద్రతా చర్యలేమిటో తెలి యదుగానీ ఈ సిగ్గుచేటైన ఘటన చోటుచేసుకుంది. ఇందుకు క్షమాపణ చెప్పి, ఇవి పునరావృతం కానీయబోమని మంత్రి చెప్పివుంటే హుందాగా ఉండేది. బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థినిపై దుండగుడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆందోళన చేస్తున్నవారితో ‘అసలు సాయంత్రం ఆరు తర్వాత ఆడపిల్లలు బయటికెందు కొస్తారు?’ అంటూ అప్పటి వీసీ త్రిపాఠీ చిందులు తొక్కారు. ఇలాంటి అనాగరిక, అనా రోగ్య అభిప్రాయాలు అన్ని వ్యవస్థల్లోనూ పాతుకుపోవటం వల్లే మహిళల పట్ల సమాజంలో చిన్నచూపు కొనసాగుతోంది. లైంగిక నేరాల విషయంలో మన ప్రభుత్వాలు ఉండాల్సినంత కఠినంగా ఉంటున్నాయా? మహిళలపై జరిగే ఇతర నేరాల సంగతలా ఉంచి అత్యాచారాల విషయంలో పడే శిక్షలే మూడు శాతం కన్నా తక్కువున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఏళ్ల తరబడి సాగే విచారణలు మరింతమంది నేరగాళ్లు పుట్టుకురావటానికి దోహదపడుతున్నాయి. ఇది మన వ్యవస్థల ఉదాసీనతను తేటతెల్లం చేస్తోంది. కనీసం ఈ కేసులోనైనా సత్వర విచారణ జరిగి, శిక్ష పడేలా చేయగలిగితే విదేశీ పర్యాటకులకు భరోసా ఇచ్చినట్టవుతుంది. -
అక్షరాల మండువా!
రచయితలు ఫోన్ కోసం ఎదురు చూస్తుంటారు. కవులు రావలసిన ఆ ఈ–మెయిల్ వస్తే బాగుండని అనుకుంటారు. విమర్శకులు ఫలానా విషయంపై తప్పక తమ పాయింట్ను అక్కడ ప్రెజెంట్ చేయాలనుకుంటారు. ఒక కొత్త పుస్తకందారు తన పుస్తకాన్ని ఆ చోటనే ఆవిష్కరించుకోవడం సంతసమైన సంగతిగా తలుస్తాడు. అసలు నలుగురినీ కలవడం, పలకరించుకోవడం, పరామర్శించుకోవడం... మనమంతా ఒకటి... మన బృందమే మనకు తోడు అనే భావన కల్పించుకోవడం... దానిని వేడుక అనండీ... సమ్మేళనం అనండి... అందరూ కలిసి చేసే సంబరం అనండి... సాహితీ సంబరం... లిటరేచర్ ఫెస్టివల్. ఇవి ప్రతి భాషలో జరుగుతుంటాయి. సాహిత్యాభిమానులకు ఇవి స్వాతిచినుకులు.తెలుగువారి సాహిత్యానికి ఉన్నంత చరిత్ర సాహితీ ఉత్సవాలకు లేదు. అవి చాలా పరిమితమైనవి. వారికి తెలిసినవి పుస్తక ఆవిష్కరణలు. ఇన్విటేషన్ ప్రచురించడం, నలుగురిని ఆహ్వానించి వచ్చిన యాభై, అరవై మంది సమక్షాన పుస్తకం గురించి మాట్లాడుకుని, అదే పండుగగా తలవడం. ఇక శతజయంతి సభలు, కొందరు సాహితీవేత్తలు తమ సాహిత్యంపై ఏర్పాటు చేసుకునే ఒక రోజు సదస్సులు, తమ సాహిత్యంపై ప్రయత్నపూర్వకంగా జరిపే వారోత్సవాలు... ఇవన్నీ అందరూ పాల్గొనే అందరినీ నిమగ్నం చేసేవి కావు. అందువల్ల జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్, కేరళ లిటరేచర్ ఫెస్టివల్, హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ తీరుతెన్నులు తెలిసినప్పుడు ఇక్కడ అలాంటివి ఎందుకు జరగవు... అని కవులు, రచయితలు అనుకోవడం పరిపాటి. అవి తాము పాల్గొనడానికే కాదు... అవి వదిలించగలిగే కొన్ని నిర్లిప్తతల కోసం, పెళ్లగించగలిగే మరికొన్ని జడత్వాల కోసం.కొన్నేళ్ల క్రితం తిరుపతిలో ఏటా సాగిన భాషా బ్రహ్మోత్సవాలు తెలుగు సాహిత్యావరణంలో పెద్ద సందడి, కదలిక సృష్టించగలిగాయి. అదే తిరుపతిలో, ఆపై హైదరాబాద్లో జరిగిన ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ దేశ విదేశ సాహితీకారులను తరలి వచ్చేలా చేసి ఇది మన జాతి, మన భాష, మన సృజన అని మురిసిపోయేలా చేయగలిగాయి. కాని ఎందుచేతనో ఆ తర్వాత ప్రభుత్వాల నిష్ఠ సన్నగిల్లింది. వాటిని పురిగొలిపే బయటి సంస్థలు, వ్యక్తులు కూడా ఊరికే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల వారికి సాహితీ ఉత్సవాలంటే బుక్ఫెయిర్సే శరణమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ బుక్ఫెయిర్స్... వీటినే లిటరేచర్ ఫెస్టివల్గా భావించి అదే చారనుకో, అదే మజ్జిగనుకో అనే చందంగా అక్కడే ఆవిష్కరణలు, సమ్మేళనాలు జరుపుకొని సరిపుచ్చుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా లిటరేచర్ ఫెస్టివల్స్ జరుపుకోవడం ఆ యా దేశాల జాతి సంస్కారంలో భాగం. నాగరికత వికాసాన్ని వ్యక్తపరిచగలిగే సభ్యత. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ముఖ్య నగరాల పేరుతో కూడా అదనంగా ఈ ఉత్సవాలు సాగుతున్నాయి. ఇవి ఎందుకు? సాహిత్యమే సంస్కారం కనుక. పుస్తకమే దిక్సూచి కనుక. కావ్యమే దీపం, అక్షరమే ఆలోచన కనుక. సాహిత్యం మనిషి ఇలా ఎందుకు ఉన్నాడో, ఇలా ఎందుకు ఉండకూడదో చెప్పగలిగే సృజనాత్మక రూల్బుక్. ఈ రూల్బుక్ను తరచి చూసుకోవడం కోసం, అప్డేట్ చేసుకోవడం కోసం, లిటరేచర్ ఫెస్టివల్స్ అవసరం. మూడు నుంచి ఐదురోజుల ఈ ఫెస్టివల్స్లో ఆ భాషలోని కథ, కవిత, నాటకం, సినిమా, విమర్శ, బాలసాహిత్యం, కళా ప్రదర్శనలు... ఎంత బాగుంటుంది. కాని తెలుగునాట ఆధ్యాత్మిక ఉత్సవాలు అందుకున్నంత ఊపును ఈ సాహితీ ఉత్సవాలు అందుకోవడం లేదు. ప్రభుత్వాలు పూనుకోకపోవడం ఒక కారణమైతే, ప్రయివేటు వ్యక్తులు చేయాలనుకున్నా స్పాన్సర్స్ పైసా రాల్చకపోవడం మరో కారణం. ఈ నేపథ్యంలో ఒకే సందర్భంలో విజయవాడలో అమరావతి లిటరేచర్ ఫెస్టివల్, హైదరాబాద్లో ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ జరగడం ఆహ్వానించదగ్గ విషయం. హైదరాబాద్లో అంబేద్కర్ యూనివర్సిటీ చేయూతతో జరిగిన ‘ఛాయా లిటరేచర్ ఫెస్టివల్’ ఒక పెద్ద ఆసక్తిని ఏర్పరచడమే గాక దానికి హాజరైన సాహితీప్రియుల సంఖ్యను చూసి ఇలాంటివి మనం కూడా చేయవచ్చే అన్న ఉత్సాహాన్ని మరెందరికో కలిగించగలిగింది. ఇది పెద్దవిషయం.నవంబర్ నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి వరకు లిటరేచర్ ఫెస్టివల్స్కు దేశంలో సీజన్. తెలుగువారికి ఎన్ని ముఖ్య నగరాలు... హైదరాబాద్, వరంగల్, విశాఖ, తిరుపతి, రాజమండ్రి... వీటిలో కనీసం రెండు రోజుల లిటరేచర్ ఫెస్టివల్స్ జరపడం స్థానిక ప్రజా ప్రతినిధులు, వదాన్యులు, సాహితీ సంస్థలు పూనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. వాటిని చేయవచ్చనీ, చేస్తే ప్రజలు మెచ్చుతారనీ తెలియడం ముఖ్యం. -
క్రెడిట్ చోరీ... డెబిట్ బదిలీ!
నిజాలపై నివురు కప్పడం, అసత్యాలకు అలంకారం చేయడం ఇప్పుడొక రాజకీయ క్రీడ. ఇందులో చంద్రబాబు, ఆయన బృందం ఆరితేరిన ఆటగాళ్లని ప్రశస్తి. ఈ ఖ్యాతిలో సింహభాగం యెల్లో మీడియాకు దక్కుతుంది. ఈ మీడియా గత మూడు దశాబ్దాలుగా ఊదరగొట్టిన ఫలితంగా, తెలుగునాట ప్రత్యామ్నాయ మీడియా నిలబడకుండా చేసిన కుట్రల కారణంగా నిజంగానే చంద్రబాబును ఒక ఐటీ నిపుణుడిగా, దూరదృష్టి గల విజనరీగా నమ్మేవారి సంఖ్య గణనీయంగానే ఉన్నది. సాంఘిక శాస్త్రాల అధ్యయనానికి దూరమై ప్రాపగాండా ప్రవాహంలో కొట్టుకుపోయే నవతరంలో కూడా ఇటువంటి అభిప్రాయాలున్నాయి.ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలేమిటో తెలిసిన వారు లేకపోలేదు. అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. కానీ నిజం నిద్ర లేచే సరికే అబద్ధం ఊరేగివస్తుందంటారు కదా! అదే జరుగుతున్నది. చంద్రబాబుకు విజనరీ వేషం వేయడానికి యెల్లో మీడియా పౌండ్రక వాసుదేవ పాత్రను కాపీకొట్టినట్టుంది. వసుదేవుని కుమారుడు గనుక శ్రీకృష్ణ పరమాత్మను వాసుదేవుడంటారు. ఆ వసుదేవునికి ఇంకో కొడుకుండేవాడట! ఆయనకు కొందరు ‘వాలతుల్యుల’తో కూడిన ఒక కోటరీ ఉండే దట! అసలైన వాసుదేవుడివి నువ్వేనంటూ ఈ కోటరీ ఉబ్బేయ డంతో ఆయన కూడా నెమలి పింఛం ధరించడం, పిల్లనగ్రోవి పట్టుకోవడం సహా కృష్ణ వేషధారణ వేయడం మొదలు పెట్టాడట! అంతటితో ఆగలేదు – తన వేషాన్ని వేసుకోవద్దని శ్రీకృష్ణుడినే బెదిరించేదాకా వెళ్లాడు.ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొన్నటి మీడియా సమావేశంలో ఇటువంటి పౌండ్రక వాసు దేవ ఇమేజ్నే చీల్చి చెండాడారు. నేటి తరం రాజకీయ నేతల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. ఆయన ప్రెస్మీట్లను గానీ, ఇతర కార్యక్రమాలను గానీ ఒక్క ‘సాక్షి’ యూ–ట్యూబ్ ప్లాట్ఫామ్ వీడియోల్లోనే 50 లక్షల మందికి పైగా వీక్షిస్తారు. ‘సాక్షి’ టీవీ, దాని డిజిటల్ ప్లాట్ ఫామ్లతోపాటు ఇతర దృశ్య మాధ్యమాలతో కలిపితే ఈ సంఖ్య ఒక్కరోజులోనే కోట్లలో ఉంటున్నది. దీనికి పత్రికా పాఠకులు, డిజిటల్ ఎడిషన్లలో చదివే వారి సంఖ్య తోడవుతుంది. ఆయన మెసేజ్లు ఈ స్థాయి విస్తృతికి చేరడమే కాదు, వాటికి విశ్వస నీయత కూడా ఎక్కువ. జగన్మోహన్రెడ్డి ప్రసంగాల్లో ఊకదంపుడు తక్కువ. సూటిగా తాను చెప్పదల్చుకున్న పాయింట్ను ప్రస్తావించడం, అందుకు సాక్ష్యంగా సాధికారికమైన లెక్కల్ని ఉటంకించడం, డాక్యుమెంట్లను ప్రదర్శించడం ఆయన అనుస రించే పద్ధతి. ఈ వైఖరి కారణంగా కూటమి సర్కార్ బండారాన్ని ఏడాదికాలంలోనే బట్టబయలు చేయగలిగారు.గురువారం జరిగిన మీడియా సమావేశంలో నాలుగు అంశాలపై జగన్ మాట్లాడారు. ముఖ్యంగా సర్కార్ ఆడుతున్న కల్తీ లిక్కర్ నాటకంపైనా, డేటా సెంటర్కు సంబంధించి చేస్తున్న క్రెడిట్ చౌర్యంపైనా సుదీర్ఘంగా మాట్లాడారు. ‘క్రెడిట్ చోరీ’ అనే మాటను కాయిన్ చేస్తూ, సైబర్ టవర్స్, ఔటర్ రింగ్రోడ్డు, ఎయిర్పోర్టు దాకా హైదరాబాద్ నిర్మాతగా బాబు తగిలించుకున్న నకిలీ మెడల్స్ను పీకిపారేశారు. ఆరెకరాల స్థలంలో లక్షా నలభైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ‘సైబర్ టవర్స్’కు ‘హైటెక్ సిటీ’ అని నామకరణం చేసి ప్రచారం చేసుకున్న వైనాన్ని ఆయన ఎండగట్టారు. ఆ భవనానికి కూడా అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించి, భూసేకరణతోపాటు తొలి దశ నిర్మాణం కూడా పూర్తిచేసుకున్న ఔటర్ రింగ్ రోడ్డు, ఆయన హయాంలోనే ప్రారంభమై పూర్తిచేసుకొని వినియోగంలోకి వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, 12 కిలోమీటర్ల ‘పీవీ ఎక్స్ ప్రెస్ వే’లు హైదరాబాద్ నగరాభివృద్ధికి వన్నెలద్దిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు.ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గద్దెదిగే నాటికి రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ.5,660 కోట్లు మాత్రమే. దేశంలో నాలుగో స్థానం. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల లోనే రాష్ట్రం రెండో స్థానానికి ఎగబాకింది. ఎగుమతుల విలువ రూ.32,500 కోట్లకు చేరింది. కేసీఆర్ పదేళ్ళ పాలన తర్వాత ఆ ఎగుమతులు రెండు లక్షల కోట్లకు చేరుకున్నాయి. తాను న్యూయార్క్లో ఉన్నానా, హైదరాబాద్లో ఉన్నానా అని హీరో రజనీకాంత్కు ఆశ్చర్యం కలిగించిన దృశ్యాలన్నీ కేసీఆర్ కాలంలోనే ఆవిష్కృతమయ్యాయి. ఇలాంటి వాస్తవాలతో పొంతన లేకుండా వందిమాగధ మీడియా బృందంచే బాబు వేయించు కున్న వీరతాళ్ల బాగోతాన్ని జగన్ విప్పిచెప్పారు. అన్నిటికంటే ముఖ్యం – తాజా డోల్బాజా విశాఖ డేటా సెంటర్.ఈ డేటా సెంటర్ మీద టీడీపీ యెల్లో మీడియా సృష్టించిన సంరంభాన్ని, జగన్ మీడియా సమావేశానికి ముందూ, వెనకగా విభజించాలి. గురువారానికి ముందు ఆ సందడే వేరు! సాక్షాత్తూ గూగుల్ సంస్థే ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ చంద్రబాబు అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సిద్ధమైందని ప్రచారం చేశారు. జరిగిన నేపథ్యాన్ని, అంతకుముందే పడిన పునాదిని మరుగునపెట్టారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే హోరు. చంద్రబాబంటే డేటా సెంటర్లు, అమరా వతి నిర్మాణాలు – జగనంటే మటన్ షాపులు, చికెన్ సెంటర్లని ప్రచారం చేశారు. జగనంటే పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, అందరికీ ఆరోగ్యశ్రీ, ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్, 30 లక్షలమంది ఇళ్లు – ఇళ్ల స్థలాలు, అధికార వికేంద్రీకరణ, రైతు భరోసా కేంద్రాలు అనే విషయాన్ని జనం మరిచిపోయి ఉంటారని వారి నమ్మకం కావచ్చు. గురువారం నాటి జగన్ సమావేశం తర్వాత టీడీపీ నేతలు, యెల్లో మీడియాల సందడి తేలు కుట్టిన దొంగల చందంగా మారింది.ప్రతిపక్ష నేత వెల్లడించిన వివరాల ప్రకారం 2020 నవంబర్లోనే విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. డేటా సెంటర్కు డేటా తీసుకురావడానికి వీలుగా సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్ల పొడవునా సబ్సీ (సముద్ర మార్గం) కేబుల్ వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సింగపూర్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 9నే లేఖ రాసింది. ఈ లేఖ కాపీని కూడా ఆయన విడుదల చేశారు. ఢిల్లీ సమీపంలోని నోయిడాలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్తో అదానీ సంస్థకు ఒప్పందం కుదిరింది. ఈమేరకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో అప్పుడే ప్రచురితమైన వార్తా కథనం కటింగ్ను జగన్ విడుదల చేశారు. అంటే మూడేళ్ళుగా ఈ రంగంలో అదానీ గ్రూప్, గూగుల్ కలిసి పనిచేస్తున్నాయి. 2023 మే నెలలో విశాఖలో డేటా సెంటర్కు శంకుస్థాపన జరిగింది. అంతకుముందటి రెండేళ్ళలో ఎక్కువకాలం కోవిడ్ పరిస్థితులు న్నాయని గమనంలో ఉంచుకోవాలి.ఇప్పుడు కూటమి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించుకున్న వెయ్యి మెగావాట్ల గూగుల్ సెంటర్, 2023లో జగన్ శంకు స్థాపన చేసిన 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ విస్తరణ మాత్రమే! ఈ డేటా సెంటర్కు అవసరమైన సబ్ సీ కేబుల్, డేటా ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన పూర్వరంగం జగన్ హయాంలోనే సిద్ధమైంది. కేవలం డేటా సెంటర్ మాత్రమే అయితే ఉద్యోగాల కల్పన పెద్దగా ఉండదు కాబట్టి దానికి అనుబంధంగా ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, పాతిక వేలమందికి ఉపాధి కల్పించాలని జగన్ సర్కార్ షరతు పెట్టింది. ఇప్పుడు ముందుకొచ్చిన విస్తరణలో అటువంటిదేమీ కనిపించలేదు. కేవలం డేటా సెంటర్ మాత్రమే. దాని ఏర్పాటుకు దోహదం చేసిన పూర్వరంగంలోని అదానీ– గూగుల్ గ్రూప్తో పాటు అప్పటి జగన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం పాత్రధారులే! పాత్రధారులందరినీ మరుగునపెట్టి, కేవలం గూగుల్కూ, చంద్రబాబుకూ మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగా వచ్చిన కొత్త ప్రాజెక్టుగా కూటమి సర్కార్ ప్రచారం చేసుకున్న తీరును జగన్ ప్రశ్నించారు.‘క్రెడిట్ చోరీ’ అనే పదబంధం కొత్తది కావచ్చు కానీ, ఇతరుల క్రెడిట్ను చంద్రబాబు కోసం యెల్లో మీడియా కొట్టేస్తుందనే విషయం చాలాకాలంగా తెలిసిందే. ఈ విధానా నికి ఇంకో పార్శ్వం కూడా ఉన్నది. అదే డెబిట్ బదిలీ. తాము తప్పు చేస్తూ, ఆ తప్పును ప్రత్యర్థుల ఖాతాలో వేయడం! మీడియా సమావేశంలో జగన్ ప్రస్తావించిన నకిలీ లిక్కర్ తయారీ అంశం ఈ కోవలోనిదే. రాష్ట్రవ్యాప్తంగా ఒక పరిశ్రమ మాదిరిగా విరాజిల్లుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాన్ని ఫోటోలతో సహా ఆయన మీడియా ముందు బహిరంగపరిచారు. ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం, పర వాడ, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరుల గురించే ఆయన ప్రస్తావించినప్పటికీ ఇటువంటి కార్ఖానాలు ఇంకా డజన్లకొద్దీ ఉన్నట్టు సమాచారం.నకిలీ మద్యం తయారీ – అమ్మకాలపై కూటమి ప్రభుత్వం ప్రారంభం నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపి స్తున్నది. ఈ రంగంలో అనుభవం ఉన్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి పోటీకి నిలిపారు. ఈ కార్యక్రమంలో మరో ‘నిపుణుడు’ జనార్దన్రావు కూడా పాల్గొన్నట్టు వార్తలు, ఫోటోలు బయటకు వచ్చాయి. జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మద్యం షాపుల వ్యవస్థ ఈ నకిలీ మద్యం ప్రవాహానికి అనుకూలించదు. అందువల్ల దాన్ని రద్దు చేయాలి. మద్యం అలవాటును నియంత్రించే ఉద్దేశంతో జగన్ ప్రైవేట్ వ్యాపారుల వ్యవస్థను తొలగించారు. బెల్ట్షాపులను, పర్మిట్ రూములను పూర్తిగా తొలగించారు. లైసెన్స్డ్ మద్యం షాపులను కూడా కుదించి, ప్రభుత్వ రంగంలోనే నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు సాగించారు.సామాజిక ప్రయోజనాల రీత్యా, ఆరోగ్యాల రీత్యా కూడా అది మంచి వ్యవస్థ. దాన్ని తొలగించి ప్రైవేట్ వ్యాపారాన్ని ప్రవేశపెట్టాలంటే ఉన్న వ్యవస్థ మంచిది కాదని ప్రచారం చేయాలి. కూటమి సర్కార్ అదే పని చేసింది. వ్యాపారాన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగించి అమ్మకాలను ప్రోత్సహించినట్లయితే, బెల్ట్ షాపులకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చినట్లయితే, మద్యం తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా అనుమతులిచ్చి నట్లయితే అందులో స్కామ్ ఉండేందుకు అవకాశం ఉంటుంద నేది కామన్సెన్స్. ఇవేమీ లేని వ్యవస్థలో స్కామ్ జరిగిందనేది ఏడాది కాలంగా సర్కార్ చేస్తున్న న్యూసెన్స్. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి డైలీ సీరియల్ మాదిరిగా ఈ కేసును నడుపుతున్నారు. జగన్ హయాంలో స్కామ్ జరిగిందని నమ్మించడానికి అనేకమంది ముఖ్యనాయకులను, ప్రముఖ వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకున్నా సరే, ఒకరిద్దరిని బెదిరించి తీసుకున్న వాఙ్మూలాల ఆధారంగా ఈ కేసు నడుస్తున్నది. ఈ దర్యాప్తు నిర్వా కాన్ని చూసి పలుమార్లు న్యాయస్థానం కూడా అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.అయితే అసలు ఉద్దేశం వేరు. ఈ కేసు పేరుతో రచించే బేతాళ కథలతో మీడియాను ముంచెత్తుతూ, నిశ్శబ్దంగా నకిలీ మద్యం వ్యాపారం – తయారీ రాష్ట్రమంతటా విస్తరించింది. కేవలం మూడువేల పైచిలుకు మద్యంషాపులు, అవి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మకాలు జరిగే వ్యవస్థ పాతది. ఇప్పుడు ప్రతి షాపుకూ ఓ బార్ లాంటి భారీ పర్మిట్ రూమ్ నడుస్తూ, అరవైవేల పైచిలుకు బెల్టు షాపుల్లో తాగిస్తున్నప్పుడు గతంతో పోలిస్తే అమ్మకాలు ఎన్ని రెట్లు పెరగాలి? కానీ, ఎక్సైజ్ ఆదా యాన్ని చూస్తే ఏటికేడు సహజంగా పెరగాల్సినంత కూడా పెరగడం లేదు. మరి ఇన్ని పర్మిట్ రూమ్లూ, బెల్ట్ షాపుల ద్వారా వస్తున్న రెండు మూడు రెట్ల ఆదాయం ఎక్కడికి పోతు న్నట్టు? ... నకిలీ మద్యం పాలవుతున్నట్టు లెక్క.ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం కార్ఖానాలు బయట పడకముందే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఏపీ సరిహద్దున ఉన్న మేళ్ళచెరువులో ఇటువంటి కార్ఖానా బయట పడింది. దర్యాప్తులో ఈ కార్ఖానాకు జనార్దన్రావుకు సంబంధా లున్నాయని వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. దుకాణా న్నయితే మూసేశారు కానీ, తెలంగాణ ఎక్సైజ్ సిబ్బంది ఇంకా ముందుకెళ్లి దర్యాప్తు చేయలేదు. జనార్దన్రావు పేరు బయటకు రాకుండా తెలంగాణ అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేయగల స్థితిలో ఉన్న ఆంధ్ర నేతలెవరు?... కనిపెట్టడం ఓ బ్రహ్మవిద్యేం కాదు గదా! రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బంధువైన చంద్రశేఖరనాయుడు ఎక్సైజ్ శాఖలో మాజీ అధికారి. జాయింట్ కమిషనర్గా పనిచేసి ఐదేళ్ల కిందనే రిటైరయ్యారు. అధికారికంగా ఆయన్ను ఈ ఫిబ్రవరి నెల నుంచి ఎక్సైజ్ శాఖలో ఓఎస్డీగా నియమించారు. రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు, బ్రూవరీ లన్నింటినీ ఆయన అజమాయిషీలోకి తెచ్చారని సమాచారం. అనధికారికంగా అంతకుముందు నుంచే ఆయన ఈ పనుల్ని చక్కబెడుతున్నారని ఆ శాఖలో ఉన్న టాక్. నకిలీ మద్యం తయారీదారులు మందుబాబుల్ని బురిడీ కొట్టించడం కోసం అసలు బ్రాండ్లకు సంబంధించిన ఫ్లేవర్ వచ్చేలా ఎసెన్స్ను కొంత కలుపుతున్నారని తెలుస్తున్నది. ఈ ఎస్సెన్స్ ఆ బ్రాండ్ కంపెనీల వద్ద గానీ, దాన్ని లీజుకు తీసుకున్న డిస్టలరీల వద్దగానీ ఉంటుంది. మరి నకిలీ కార్ఖానాలకు ఎలా చేరుతున్నాయనేది రాజకోట రహస్యమే! ఇప్పుడు జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారంలో కూడా వైసీపీ వాళ్లను ఇరికించడమెలా అనే అంశంపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. కొంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు. కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరనే నానుడి ఏమవుతుందో చూద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
డెత్ ట్రావెల్స్
గాల్లో తేలుతున్నదో... రోడ్డుపై ఉరకలెత్తుతున్నదో తెలియనంత పెనువేగంతో దూసుకు పోయే ట్రావెల్స్ బస్సు శుక్రవారం వేకువజామున కర్నూలు సమీపాన ప్రమాదంలో చిక్కుకుని 19 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఇటీవల ఈ రకం బస్సులు తరచూ ప్రమాదాలకు లోనవుతున్నాయి. పదిరోజుల క్రితం రాజస్థాన్లో కూడా ఇలాంటి బస్సే తగలబడి 20 మంది మరణించారు. ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో తాజా ప్రమాదం జరిగిందంటున్నారు. చూడటానికి భారీగా కనిపిస్తూ మెరిసే అద్దాలతో, సకల హంగులతో, స్లీపర్ కోచ్లుగా ఉండే ఈ బస్సులు తక్కువ వ్యవధిలో గమ్యాన్ని చేరుస్తా యని ఆశిస్తారు. అంత వేగంతో పోవటానికి అవసరమైన ఏర్పాట్లున్నాయో లేదో ఎవరూ గమనించుకోలేరు. ఇవి రోడ్డెక్కింది మొదలుకొని పాదచారుల నుంచి వాహనదారుల వరకూ అందరినీ హడలెత్తిస్తాయి. డిజైన్ రీత్యా చూసినా, బస్సు అంతర్నిర్మాణంఅందంగా కనబడటానికి వాడే మెటీరియల్ గమనించినా అవి ఏమాత్రం సురక్షితం కాదని తెలిసిపోతుంది. సీట్ల మధ్య తక్కువ స్థలం ఉండటంవల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు తప్పుకునే వ్యవధి ఉండదు. ఇవి ఎక్కువగా రాత్రివేళల్లో వెళ్తుంటాయి కాబట్టి ప్రయాణికులు నిద్రలోకి జారుకుంటారు. మెలకువ వచ్చి ఏదో జరిగిందనిగుర్తించేలోపే మంటలు చుట్టుముడతాయి. కనీసం పక్కవారిని అప్రమత్తం చేయటం మాట అటుంచి, గమనించినవారు తప్పుకోవటమే అసాధ్యమవుతుంది. గందరగోళం ఏర్పడి తోపులాట చోటుచేసుకుంటుంది. ఇక సురక్షితంగా బయటపడేదెక్కడ? సుదూర ప్రయాణాల్లో డ్రైవర్లకు తగిన విశ్రాంతికి సమయం చిక్కకపోతే, అలసటకు లోనయితే కునుకుతీసే ప్రమాదం ఉంటుంది. రాత్రివేళ ప్రమాదాలకు ఇదొక కారణం.దానికితోడు బస్సు లోపల సర్వసాధారణంగా బెర్త్ల కోసం వాడే ఫైబర్, రెగ్జిన్, తెరల కోసం ఉపయోగించే పాలియెస్టర్, సిల్క్ వగైరాలు మండే స్వభావం ఉండేవి. చిన్న నిప్పురవ్వ చాలు... సెకన్ల వ్యవధిలో భగ్గున మండటానికి! నిప్పంటుకున్నప్పుడు కేబుళ్లు దగ్ధమై ఎమర్జెన్సీ డోర్లు సైతం మొరాయిస్తాయి. అదృష్టవశాత్తూ తెరుచుకునే సందర్భా లున్నా కనీసం 8,9 అడుగుల ఎత్తులో స్లీపర్లపై ఉన్నవారు వాటివద్దకు చేరుకోవటం అయ్యే పనేనా? అద్దాలైనా అంత సులభంగా బద్దలుకావు. ఇవన్నీ ముప్పును మరింత పెంచేవే. ఈ రకం బస్సుల సంక్లిష్ట నిర్మాణం వల్ల ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు బయటి వారు సాయపడాలన్నా అసాధ్యమే. రోడ్డు ప్రమాదాలు సహజంగా జరిగేవికాదని, మనుషుల తప్పిదాల వల్లా, నిర్లక్ష్యంవల్లా అవి చోటుచేసుకుంటాయని గతంలో ఫార్ములా వన్ ఛాంపియన్షిప్ గెలిచిన వ్యాపారి మారియో గాబ్రియెల్ అన్నారు. తాజా ప్రమాదం విషయంలో కూడా అది అక్షరాలా నిజం. స్లీపర్ బస్సులు సాధారణంగా ఏసీ సదుపాయంతో ఉంటాయి. సాధా రణ బస్సులతో పోలిస్తే ఈ బస్సుల్లో అధిక విద్యుత్ అవసరమవుతుంది. ఏసీని కనీసం 24 డిగ్రీల వద్ద ఉంచాలి. కానీ అంతకన్నా తగ్గిస్తే చల్లదనం పెరగొచ్చుగానీ దానివల్ల విద్యుత్ వినియోగం ఎక్కువవుతుంది. ఆ మేరకు కేబుళ్లపై ఒత్తిడి పెరిగి అవి త్వరగా వేడెక్కుతాయి. కంప్రెసర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. దానికి మధ్యమధ్యలో విరామం ఇవ్వకపోతే పనితీరు దెబ్బతింటుంది. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు తనిఖీ చేసు కుంటూ అవసరాన్నిబట్టి మారుస్తుండాలి. లేనట్టయితే షార్ట్ సర్క్యూట్కు దారితీస్తుంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవారు వీటిని నిశితంగా గమనిస్తున్నారా? ప్రమాదానికి లోనయిన బస్సు ఫిట్నెస్ బాగానే ఉందని రవాణా అధికారులు చెబుతున్నారు. అందులోని నిజానిజాల సంగతటుంచి అంతటి పెనువేగంతో వెళ్లేందుకు అనువుగా మన రోడ్లు ఉంటున్నాయా? అధిక వేగంతో పోయే వాహనాలను నడిపేవారి సామర్థ్యాన్ని కొలిచేందుకు విడిగా పరీక్షలుంటున్నాయా? ఎంతో చురుగ్గా ఉండేవారు చోదకులుగా ఉంటే క్లిష్ట సమయాల్లో తక్షణం స్పందించగలుగుతారు. లేనట్టయితే పెను ప్రమాదాలకు కారణమవుతారు. అసలు ఈ మాదిరి బస్సులపై రెండు దశాబ్దాల క్రితంనుంచే చైనా, జర్మనీ వంటి దేశాల్లో నిషేధం అమలవుతోంది. మన దేశం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనట్టే ఉంది. -
టీచర్లపై ‘ఎన్నికల’ ఒత్తిళ్లు
సమస్య పాతదే. ఎన్నికల రుతువు సమీపించినప్పుడల్లా ఉపాధ్యాయులు ఓటర్ల జాబితా సవరణ మొదలుకొని పోలింగ్ నిర్వహణ విధుల వరకూ ఎన్నెన్నో నిర్వహించక తప్పదు. వారినుంచి ప్రతిసారీ అభ్యంతరాలు, నిరసనలు కూడా రివాజే. ఈసారి సమస్యాత్మకమైన బెంగాల్ వంతు వచ్చింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందున బిహార్ మాదిరిగా అక్కడ కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఎన్నికల సంఘం(ఈసీ) సన్నాహాలు చేస్తోంది. అందులో పాలుపంచుకొనేది లేదని రెండు నెలలుగా టీచర్లు చెబుతున్నారు. ఈసీ ఆదేశాలను పాటించి తీరాలని గత నెలలో కలకత్తా హైకోర్టు వారిని హెచ్చరించింది. అయినా దానివల్ల పెద్దగా ఫలితం కనబడలేదు. పైకి ఏం చెప్పినా సర్వసాధారణంగా ఉపాధ్యాయుల నిరాకరణకు రెండు కారణాలుంటాయి. అందులో ఒకటి– పార్టీల నుంచి వచ్చే ఒత్తిళ్లు. రెండోది విద్యా సంబంధమైనది. పార్టీలు తెచ్చే ఒత్తిళ్లు అన్నీ ఇన్నీ కాదు. ఫలానా పేర్లు తీసేయాలని కోరటం, లేదా ఫలానా డోర్ నంబర్ కింద పేర్లు చేర్చాలని ఒత్తిడి చేయటం మామూలే! ‘మా ఓటు గల్లంతైంద’ని పోలింగ్ రోజున పలువురు లబోదిబోమంటారు. నకిలీ ఓటర్లు జాబితాలోకెక్కిన సందర్భాల్లో ఫిర్యాదులుండవు. ఎందుకంటే తమ అడ్రస్తో నకిలీలు రిజిస్టరయ్యారన్న సంగతి ఇళ్ల యజమానులకు తెలియదు. పార్టీలు గమనించి ఫిర్యాదు చేసేసరికి సమయం మించిపోతుంది. ఈసారి వివాదాస్పదమైన ‘సర్’ అడుగుపెడుతున్నది గనుక సమస్య మరింత జటిలం కాబోతోంది. ఇన్నాళ్లూ పార్టీల నుంచి ఎదురైన ఒత్తిళ్లు వేరు. ఇది వేరు. కొత్త విధానం ప్రకారం నిర్దిష్టమైన పత్రాలుంటేనే ఓటర్లుగా గుర్తిస్తారు. ఆ పత్రాలు లేకుంటే అంతే సంగతులు. అందువల్లే ఈసారి జాబితా విడుదలైన వెంటనే ఓటు ఉందో ఊడిందో చూసుకునే ఓటర్లు ఎక్కువే ఉంటారు. తమవారి పేర్లున్నాయో లేదో వెంటవెంటనే నిశితంగా గమనించే పార్టీలూ ఉంటాయి. పేరు గల్లంతైతే రాజకీయ పక్షాల నేతలైనా, జనమైనా విరుచుకుపడేది బీఎల్ఓలపైనే! బిహార్లో ఎంతో పకడ్బందీగా ఓటర్ల జాబితాను సవరిస్తున్నామని ఈసీ చెబుతుండగానే అనేక లొసుగులు బయటపడ్డాయి. పెంపుడు కుక్కల పేర్లతో, సినీతారల పేర్లతో నమోదైన ‘ఓటర్లు’ కొందరుంటే... ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు కూడా జాబితాలో చేరి అందరినీ నిర్ఘాంత పరిచింది. బెంగాల్ తీరు వేరు. అధికారంలో ఉన్న తృణమూల్ అయినా, ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ అయినా ‘సర్’ ప్రక్రియ మొదలైనప్పటినుంచీ తమ సర్వశక్తులూ కేంద్రీకరిస్తాయి. నమోదు సమయంలోనే బీఎల్ఓలు ‘ఫలానా పత్రం ఇస్తే తప్ప కుదరద’ంటే ఒత్తిళ్లూ, బెదిరింపులూ తప్పవు. కొన్ని సందర్బాల్లో దాడులకు దిగేవారూ ఉంటారు. వాటికి జడిసి చూసీచూడనట్టు వెళ్తే ప్రత్యర్థి పార్టీలు రచ్చచేస్తాయి. తప్పని తేలితే బీఎల్ఓలపై క్రమశిక్షణ చర్యలుంటాయి. వారి సర్వీస్పై మచ్చ పడుతుంది. ఉపాధ్యాయులు మీవల్లే బీఎల్ఓ విధులు నిర్వర్తించేందుకు భయపడుతున్నారంటూ తృణమూల్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇక ఈసీ పక్షపాత వైఖరి గురించి వచ్చే ఆరోపణల సంగతి సరేసరి. ఈ బెడదంతా ఎందుకున్న ఉద్దేశంతోనే టీచర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని చూస్తున్నారు.టీచర్లకు ఎన్నికల సంబంధ విధులే కాదు... విద్యేతరమైనవి అనేకం చుట్టుకుంటున్నాయి. చదువు చెప్పటంతోపాటు పాఠశాలల్లో పర్యవేక్షించాల్సినవే అనేకం ఉంటున్నాయి. ఇన్నింటివల్ల సకాలంలో సిలబస్ పూర్తిచేయటం కష్టమవుతోందనీ, పిల్లల ప్రమాణాలు పడిపోతున్నాయనీ ఉపాధ్యాయులంటారు. ఈ రెండింటికీ తమనే బాధ్యుల్ని చేస్తున్నారన్నది వారి ఆవేదన. ఒకరో ఇద్దరో టీచర్లతో నడిచేచోట ఈ కష్టాలు అనేక రెట్లు ఎక్కువుంటాయి. ఈసీకి ఇదంతా అనవసరం. కేటాయించిన విధుల్ని పరిపూర్తి చేయాల్సిందేనంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొని తీరాలన్న ఈసీ ఆదేశాలపై 2014లో మహారాష్ట్ర ఎయిడెడ్ స్కూళ్ల టీచర్లు బొంబాయి హైకోర్టులో సవాలు చేసినప్పుడు విధులకు గైర్హాజరైనవారిపై కఠిన చర్యలు తీసుకోబోమని ఈసీ హామీ ఇచ్చింది. ఇప్పుడు బెంగాల్ టీచర్లకు ఉపశమనం దొరుకుతుందా లేదా అన్నది వేచిచూడాలి. -
జపాన్కు మహిళా సారథ్యం
వరస కుంభకోణాలూ, పడిపోతున్న రేటింగ్లతో నలుగురు ప్రధానులు వచ్చినంత వేగంగానూ నిష్క్రమించిన జపాన్లో తొలిసారి మహిళా నాయకురాలు సనే తకాయిచిని మంగళవారం ఆ దేశ పార్లమెంటు ప్రధానిగా ఎన్నుకున్నది. సంప్రదాయ, జాతీయవాద లిబరల్ డెమాక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)కి చెందిన తకాయిచి రాజకీయాల్లోనూ, ప్రభుత్వంలోనూ మహిళల ప్రాతినిధ్యం పెరగాలని వాదిస్తారు. కానీ విశ్వాసాల రీత్యా ఆమె ఫక్తు సంప్రదాయవాది. అదే ఆమెకు కలిసొచ్చింది. మొన్న జూలైలో ఎగువసభకు జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవటానికి సంప్రదాయ ఓటర్లు అతి మితవాద పక్షం సన్సిటో పార్టీవైపు మొగ్గటం వల్లేనని ఎల్డీపీ లెక్కేసింది. అంతక్రితం నామమాత్రంగావుండే ఆ పార్టీ ఆ ఎన్నికల్లో 15 స్థానాలు గెల్చుకుంది. ఈ పరిస్థితుల్లో తకాయిచి వైపు పార్టీ మొగ్గుచూపింది. అందుకే ఈ నెల మొదట్లో పార్టీలో ఆమె నలుగురు పురుష అభ్యర్థులను అధిగమించి ప్రధాని పదవికి ఎంపిక కాగలిగారు. అన్ని దేశాల్లోనూ అతి మితవాద పక్షాలకు స్ఫూర్తినిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జపాన్లోనూ తన ప్రభావం చూపారు. సన్సిటో ఎదుగుదల ఆయన పుణ్యమే! ‘మేక్ జపాన్ గ్రేట్ అగైన్’ నినాదాన్ని సన్సిటో వల్లించటం యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ పైపై కారణాలు. కానీ ఇందులో ఎల్డీపీ స్వయంకృతమే అధికం. గత ఏడు దశాబ్దాల్లో దేశాన్ని అత్యధిక కాలం పాలించింది ఆ పార్టీయే. అందువల్ల చాలా సమస్యలకు మూలం అక్కడేవుంది. 2023లో బద్దలైన అక్రమ నిధుల వ్యవహారంలో ఎల్డీపీ తీవ్రంగా దెబ్బతింది. ఈ వ్యవహారంలో నాటి ప్రధాని కిషిదా నలుగురు మంత్రులకు ఉద్వాసన పలకవలసి వచ్చింది. పర్యవసానంగా ఆ మరుసటి ఏడాది ఎన్నికల్లో తొలిసారి అత్తెసరు మెజారిటీ వచ్చింది. అటుతర్వాత కూడా వరస ఎదురుదెబ్బలు తప్పటం లేదు. దానికితోడు ఏళ్లు గడుస్తున్నకొద్దీ రుణభారం పెరుగుతూపోతోంది. ఆహారపదార్థాల ధరలు ఆకాశాన్నంటాయి. సరుకుల కొరత జనాన్ని పీడిస్తోంది. వీటన్నిటి వల్లా మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఇక ట్రంప్ సుంకాల బెదిరింపులు సరేసరి. వీటిని సరిచేసే మార్గం తోచక, జనంలో నానాటికీ పెరుగుతున్న అసంతృప్తిని నివారించలేక చివరకు తకాయిచి ఎంపికే సరైందని పార్టీ నాయకులు భావించారు. అతి మితవాద పక్షం బలం పుంజుకుంటుంటే, తాము సైతం అదే పరిభాషలో మాట్లాడి జనాన్ని బోల్తా కొట్టించవచ్చని ఇతర పార్టీలు చాలా దేశాల్లో భ్రమపడుతున్నాయి. మితవాద భాష అలవాటు చేసుకున్న ఎల్డీపీ ఆ తరహా భ్రమల్లోనే ఉన్నట్టు కనబడుతోంది.తకాయిచి వల్ల తాత్కాలికంగా మార్కెట్లు కోలుకున్న మాట వాస్తవమే అయినా వివిధ అంశాలపై ఆమె వైఖరి పార్టీ కొంప ముంచుతుందని వాదిస్తున్నవారూ లేకపోలేదు. కావటానికి దేశ తొలి మహిళా ప్రధానేగానీ ఆమె నుంచి మహిళలు పెద్దగా ఆశించటానికేం లేదు. పితృస్వామ్య భావనలు బలంగా వేళ్లూనుకున్న సమాజంలో ఆమె తీరు ఈ తరం మహిళలకు మింగుడుపడటం లేదు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే చాలా... సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం కోసం ఏమీ చేయలేరా అని కొందరు ప్రశ్నించటం అందుకే! పెళ్లయినంత మాత్రాన కన్నవారింటి పేరును మహిళలు ఎందుకు వదులుకోవాలని వాదించే వారితో ఆమె ఏకీభవించరు. పెళ్లయ్యాక ఏ మహిళైనా ‘ఆడ’ పిల్లేనని తకాయిచి అంటారు. కుటుంబ వారసత్వం మగవాళ్లకు దక్కటం న్యాయమేనని వాదిస్తారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు బద్ధ వ్యతిరేకి. అలాగే వలసలపైనా నిప్పులు కక్కుతారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమని మాత్రం ఆమె డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ వచ్చే 2028 ఎన్నికలనాటికి ఎల్డీపీని తకాయిచి గట్టెక్కించటం మాట అటుంచి ఇప్పుడున్న అత్తెసరు మెజారిటీతో సుస్థిర పాలన అందించగలరా అన్న సంశయం అందరినీ పీడిస్తోంది. దిగువసభలో కావలసిన మెజారిటీ కన్నా కేవలం నాలుగు ఓట్లు మాత్రమే అధికంగా సాధించిన తకాయిచికి విపక్షంలో ఉన్న అనైక్యత తోడ్పడింది. కానీ ఉభయసభల్లో తగిన మెజారిటీ కొరవడినందున ఏ చట్టం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా విపక్షాలను అర్థించకతప్పదు. కనుక ప్రభుత్వాధినేతగా తకాయిచి బలహీనురాలు. అందువల్ల తాను ఎంతగానో అభిమానించే బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ను అనుకరించాలని తకాయిచి ప్రయత్నించకూడదు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది! -
సంకట స్థితిలో యూరప్
తీరికూర్చుని ఉక్రెయిన్ ద్వారా రష్యాను రెచ్చగొట్టి అనవసర యుద్ధానికి కారణమైన యూరప్ దేశాలకు రెండేళ్లు గడిచాక ఆ ఊబి నుంచి గౌరవప్రదంగా బయటపడే మార్గం తెలియటం లేదు. ఎప్పుడేం మాట్లాడతారో, ఎలాంటి ప్రతిపాదన తెస్తారో తెలియని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యాక జరిగిన పరిణామాలతో ఆ దేశాలకు ఎటూ పాలుబోవటం లేదు. ట్రంప్ తాజా ప్రతిపాదన ప్రకారం రష్యా, ఉక్రెయిన్లు రెండూ పరస్పరం తలపడుతున్న ప్రాంతం వద్ద వెంటనే యుద్ధం నిలిపివేయాలి. ఆ తర్వాత ఎవరికి వారు విజయం తమదేనని ప్రకటించుకోవచ్చు. దీనర్థం ఏమంటే... తమ భూభాగంలో ఇంతవరకూ రష్యా చొచ్చుకువచ్చి ఆక్రమించిన డోన్బాస్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ మరిచిపోవాలి. ఆ తర్వాత కావాలనుకుంటే రెండు దేశాలూ చర్చించుకుని ఇతరేతర అంశాలపై అంగీకారానికి రావొచ్చు. జెలెన్స్కీకి ట్రంప్ వద్ద భంగపాటు ఎదురుకావటం ఇది మొదటిసారి కాదు. ఆయన అధ్యక్షుడైన కొన్నాళ్లకే వైట్హౌస్కు వెళ్లినప్పుడు అంతర్జాతీయ చానెళ్ల సాక్షిగా ట్రంప్ ‘ప్రపంచ కోర్టు’ నడిపారు. జెలెన్స్కీపై నిప్పులు చెరిగారు. తన ఆత్మగౌరవం కాపాడుకోవటానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఆయనకు రెట్టింపు చీవాట్లు పడ్డాయి. చివరకు ట్రంప్ ఇవ్వదల్చుకున్న విందును కూడా బహిష్కరించి వెనుదిరగాల్సి వచ్చింది. అటుపై ఏం జరిగిందో ఏమో... నేతలిద్దరూ సఖ్యంగా కనబడ్డారు. ఉక్రెయిన్ అడిగిన సాయమల్లా చేస్తానని హామీ ఇవ్వటమేకాక రష్యా అధ్యక్షుడు పుతిన్ను దారికితెస్తానని చెప్పారు. గత నెలలో కూడా ట్రంప్... జెలెన్స్కీకి పెద్ద వాగ్దానాలే చేశారు. పెను విధ్వంసాన్ని సృష్టించగల తోమహాక్ క్రూయిజ్ క్షిపణులు అందిస్తామని, వాటి సాయంతో కోల్పోయిన భూభాగాన్ని వెనక్కితీసుకోవటంతోపాటు మరింత ముందుకు చొచ్చుకుపోయి రష్యా భూభాగాన్ని ఆక్రమించవచ్చంటూ అభయం ఇచ్చారు. వీటిని నమ్మబట్టే గంపెడంత ఆశతో జెలెన్స్కీ మొన్న వాషింగ్టన్ వెళ్లారు. కానీ జరిగింది వేరు. తోమహాక్ ఇవ్వలేనని తేల్చి చెప్పారు.ట్రంప్ తాజా వైఖరి మారదన్న గ్యారెంటీ ఏమీ లేదు. కానీ ఇప్పటికైతే ఇది సరైనది. ఎందుకంటే సోవియెట్ యూనియన్ 15 దేశాలుగా విడిపోయి ప్రధాన భూభాగం రష్యాగా మిగలటంతో ప్రచ్ఛన్నయుద్ధ దశ ముగిసింది. నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ తమ ఆధ్వర్యంలోని ‘వార్సా’ కూటమి రద్దయిందని ప్రకటించారు. ‘నాటో’లో చేరడానికి సంసిద్ధత తెలిపారు. ఆ రోజుతో నాటో కూటమికి ప్రాతిపదిక లేకుండా పోయింది. దాన్ని రద్దుచేయాలి. కానీ అమెరికా, యూరప్ దేశాలు అందుకు అంగీకరించలేదు. నాటో విస్తరణ ఉండబోదనీ, కొత్తగా ఎవరినీ చేర్చుకోబోమనీ హామీ ఇచ్చాయి. జరిగిందంతా ఇందుకు విరుద్ధం. గత వార్సా కూటమిలోని పది దేశాలను చేర్చుకున్నాయి. ఈ నాటకంలో ఉక్రెయిన్ చివరి పావు.తోమహాక్ సాయంతో మాస్కోతో సహా రష్యా నగరాలన్నిటినీ ధ్వంసం చేయొచ్చు. దాని ప్రయోగానికి అమెరికా బలగాలు రంగంలోకి దిగుతాయి. కానీ ఆ తర్వాత? అది రష్యా–నాటో ఘర్షణగా మారుతుంది. పుతిన్ రెచ్చిపోయి తన పంతం నెరవేర్చుకోవటానికి అణ్వస్త్ర ప్రయోగానికి తెగించే ప్రమాదం ఉంటుంది. ఇది వెనువెంటనే యూరప్నూ, ఆపై అమెరికానూ... చివరకు ప్రపంచ దేశాలన్నిటినీ వినాశనం వైపు నెడుతుంది. దీనివల్ల ఒరిగేదేమిటి? నిజానికి, నాటోను అడ్డంపెట్టుకుని అమెరికా జూదమాడుతోంది. గత అమెరికా అధ్యక్షులంతా యూరప్ దేశాలను రష్యాపై ఉసిగొల్పటం, సమస్య జటిలమైనప్పుడు ట్రాక్–2 దౌత్యం ద్వారా రష్యాను చల్లబరచటం ఒక కళగా అభివృద్ధి చేసుకున్నారు. బైడెన్ వరకూ అది సజావుగా సాగింది. కానీ ట్రంప్కు దానిపై ఏ మేరకు అవగాహన ఉందన్నది ప్రశ్నార్థకం. ఒకవేళ తెలిసినా దాన్ని ట్రంప్ గుట్టుచప్పుడు కాకుండా చేయగలరన్న నమ్మకం లేదు. ఇన్నాళ్లూ అమెరికాతో అంటకాగి పొరుగునున్న రష్యాతో సొంతంగా దౌత్యం నెరపటం తెలియని యూరప్కు తగిన శాస్తి జరిగింది. ఇప్పటికైనా ఉక్రెయిన్ను వెనక్కులాగి, ట్రంప్ తాజా ప్రతిపాదన బాగుందని కీర్తిస్తే ఈ లంపటం నుంచి బయటపడటం ఆ దేశాలకు తేలిక. ఇంకా శ్రుతి మించితే మొదటికే మోసం వస్తుంది. -
చీకటి వెలుగుల రంగేళి
భాషలో అదో విచిత్రం. వ్యతిరేక పదాలు పక్కపక్కనే ఉంటాయి, జంటగా సాగుతూ ఉంటాయి; మంచి–చెడు, పాపం–పుణ్యం, కీర్తి–అపకీర్తి; అలాగే, వెలుగు–చీకటి! అసలు జగత్తులో ఉన్నదంతా చీకటే, వెలుగు రాగానే అది మాయమవుతుంది. వెలుగు నిచ్చేది దీపం. ప్రకృతి వెలిగించిన అతిపెద్ద దీపం సూర్యుడు. ఆయన సంచారానికి వెడుతూ వెడుతూ తన కాంతిని నింపి ఆకాశపు నట్టింట ఉంచే చిన్నా, పెద్దా ప్రమిదలే నక్షత్రాలూ, చంద్రుడూ. తెలతెల్లని సూర్యుడు ఉదయించగానే, నల్లని పెనుచీకటులన్నీ కాకుల్లా ఎగిరిపోయాయంటాడు ఓ కవి. మనిషి జీవితంతో పడుగూ పేకలా అల్లుకుపోయిన ఉపమానం ‘చీకటి వెలుగు’లను మించి మరొకటి లేదు. అందుకే, ‘చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి’ అంటాడొక సినీకవి. ‘దీపాలు బాగుంటాయి, పాపల్లాంటి దీపాలు, కనుపాపల్లాంటి దీపాలు, దీపం ఆసరాతో చీకటి నైజాన్ని తెలుసుకో, పాపం ఆసరాతో మానవుడి నైజాన్ని తెలుసుకో’ అంటాడు – కవి తిలక్. దీపోపమానం మహాకవి కాళిదాసుకు ఏకంగా దీపశిఖ అనే బిరుదునే తెచ్చిపెట్టింది. విదర్భ రాకుమారి ఇందుమతీదేవి స్వయంవర సభలో వరమాల పుచ్చుకుని ఒక్కొక్క రాజునే దాటివెడుతున్నప్పుడు అచ్చం దీపశిఖలా ఉందని తన రఘు వంశ కావ్యంలో వర్ణిస్తాడాయన. ఆమె తనను సమీపించగానే ఆశతో వెలిగిపోయిన రాజుల ముఖాలు, తమను దాటిపోగానే నిరాశతో నల్లబడిపోయాయంటాడు. రఘు మహారాజు కొడుకు అజుడు – ఒక దీపం వెలిగించిన మరో దీపంలా – రూపంలో, శౌర్యంలో, ఔన్నత్యంలో ముమ్మూర్తులా తండ్రి పోలికేనంటాడు. అంటుకున్న అడవి దీపాలతో రాత్రిళ్ళు చీకటిని జయించే తొలిపాఠాలు మనిషికి నేర్పింది కూడా ప్రకృతే. అప్పటినుంచి సంస్కృతీ, నాగరికతల మీదుగా మనిషి వెలుగుల ప్రస్థానం బహుముఖ దీపతోరణాలతో ముందుకు సాగుతూ జీవితాన్ని నిత్య దీపావళిగా మలుస్తూనే ఉంది. ‘ఆరని ఎర్రని దీపంగా, నిరంతర జీవన తాపంగా, తనను తాను కాల్చుకుని భస్మ మయే మోహన శాపం’గా కూడా తిలక్ అభివర్ణించిన దీపం, దేశ కాల మత భేదాలకు అతీతంగా సర్వత్రా మనిషికి దారిదీపమవుతూనే ఉంది. దీపాల వరుసలతో ఇళ్ళు, గుళ్ళు, రహదారులతో సహా సమస్త పరిసరాలనూ సముజ్వలం చేయడం పితృదేవతా హ్వానంలో భాగంగానే మొదలైందంటారు. మెక్సికోతో మొదలుపెట్టి, కంబోడియా, బర్మా, చైనా, జపాన్, ఈజిప్టు, రోమ్ సహా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక రూపంలో దివ్వెల పండుగ జరుపుకోవడం పరిపాటిగా వస్తోంది. మన దగ్గర దీపావళి పండుగ మూలాలు అతిప్రాచీన కాలంలోనే ఉన్నాయనీ, ‘ఉల్కాదానం’ పేరిట అది మన పురాణాలకు ఎక్కిందనీ, దీపాలు వెలిగించడంతోపాటు, సూరేకారం వంటివి ఉపయో గించి పేలుళ్లను సృష్టించడం కూడా అప్పటినుంచీ ఉందని అంటున్నవారూ ఉన్నారు.నింగీనేలా దద్దరిల్లే పెను శబ్దాలతో, ఆకసాన చిత్రవిచిత్ర కాంతులతో రంగుల రంగ వల్లులు తీర్చే బాణాసంచా వాడకం మాత్రం మనకు పదిహేనవ శతాబ్దిలోనే పరిచయ మైందనీ, బహుశా అది చైనా నుంచి వ్యాపించిందనీ, తుపాకీ మందు కనిపెట్టడం దానికి ప్రారంభమనీ అంటున్నారు. ఆ విధంగా తుపాకీ మందుతో జమిలిగా అల్లుకున్న బాణా సంచా రాజులకు యుద్ధ, వినోదాలు రెంటితోనూ అలరిస్తూ వచ్చిందనీ, పోర్చుగీసు వర్తకుల ద్వారా తమకు పరిచయమైన బాణాసంచా ధగధగలను, ఫెళఫెళలను విజయ నగర రాజులు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆస్వాదించేవారనీ చరిత్ర. అయితే, ‘చీకటి వెలుగుల’ మధ్య ఎడం లేకపోవడం భాషావైచిత్రే కాక, ప్రకృతి వైచిత్రి కూడా! పెద్ద ఎత్తున బాణసంచా జోడింపుతో రానురాను దీపావళి వెలుగులు పర్యావరణ, ప్రజారోగ్యపరమైన సమస్యల చీకట్లనూ వెంటబెట్టుకుని వస్తున్నాయి. సమస్య తీవ్రరూపం ధరించడంతో, ఢిల్లీలో బాణసంచా వాడకంపై పూర్తి నిషేధం విధించిన సుప్రీంకోర్టు తాజాగా కొన్ని ఆంక్షలూ, హెచ్చరికలతో ఆ నిషేధాన్ని సడలించింది. కాలుష్యాన్ని తగ్గించే బాణసంచా రకాల వాడకంతోపాటు నిర్దిష్ట సమయాల్లో, నిర్దిష్ట కాల పరిమితుల్లో మాత్రమే బాణసంచా వినియోగించాలని ప్రభుత్వాలూ చెవినిల్లు కట్టుకుని చెబుతున్నాయి. బాణసంచా కాల్పులకు ప్రత్యేక స్థలాలను కేటాయించడం ద్వారా అమెరికా లాంటి కొన్ని దేశాలు ఈ సమస్యను ఉభయతారకంగా పరిష్కరించుకున్నాయి. ఆ ఒరవడిని ఇప్పటికిప్పుడు మనం పూర్తిగా అనుసరించలేమనుకున్నా, ఇతోధిక జాగ్రత్తలు అత్యవసరం. కాటుక, కన్నే పోగొట్టకూడదు; వెలుగుల విస్ఫోటం చీకటి వాకిట మనల్ని నిలబెట్టకూడదు. అతి అనర్థం, మితిలోనే అందం, ఆనందం. -
ట్రంప్ అయోమయావస్థ!
తన పదవీకాలం చివరి దశలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తడబాటుకు లోనయి ఏదేదో మాట్లాడి దేశాన్ని ఇరకాటంలో పెట్టేవారు. అయినా తమ అధ్యక్ష అభ్యర్థిగా డెమాక్రటిక్ పార్టీ ఆయన్నే ఎంచుకోవటం, చివరికి ఆయన పోటీ నుంచి తప్పు కోవటం వంటి పరిణామాలు ఆ పార్టీ ఓటమికి గల పలు కారణాల్లో ఒకటనిఅంటారు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారం దక్కి ఏడాది కాకుండానే ఆ కోవలో చేరిపోయారు. ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అవగా హన లేకుండా తనకు తోచినట్టు మాట్లాడుతున్నారు. రష్యా వద్ద ముడిచమురు కొను గోలు ఆపేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఆయన గురువారం ప్రకటించారు. దీన్ని నేరుగా ఖండించటానికి మన దేశం మొహమాట పడినట్టుంది. అందుకే ఆ వెంటనే మీడియా సమావేశంలో మాట్లాడిన మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించకుండా అధినేతలిద్దరి మధ్యా ఫోన్ సంభాషణలు జరిగినట్టు సమాచారం లేదని తెలిపి ఊరుకున్నారు. ముడి చమురు విషయంలో మాత్రమే కాదు, వేరే అంశాల్లోనూ ట్రంప్ అయోమయంగా మాట్లాడారు. ఇరాన్, పాకిస్తాన్లు రెండూ ఘర్షణలకు దిగినప్పుడు 200 శాతం సుంకాలు విధిస్తానని ఇద్దరినీ హెచ్చరించానని,దాంతో వారు దారికొచ్చి తన ఆదేశాన్ని శిరసావహించారని ఆయన చెప్పుకున్నారు. ఆయన భారత్ బదులు ఇరాన్ అన్నారని అందరికీ అర్థమైంది. అలాంటి వారందరికీట్రంప్ ఇప్పటికే పలుమార్లు చేసిన ఈ మాదిరి ప్రకటనల్ని భారత్ ఖండించిందని కూడా తెలుసు. కానీ తెలియనిది లేదా మరిచిపోతున్నది ట్రంప్ మాత్రమే. అమలులో ఉన్న అంతర్జాతీయ నియమాల ప్రకారం ఒక దేశం నుంచి దిగుమతులు ఆపేయాలని, దానితో సంబంధ బాంధవ్యాలు నెరపరాదని ఆదేశించగల అధికారం భద్రతా మండలికి మాత్రమే ఉంటుంది. కానీ దురదృష్టమేమంటే కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆ అధికారాన్ని కబ్జా చేసి తాను గీసిన బరి దాటకూడదని దబాయిస్తోంది. రష్యా మన దేశానికి చిరకాల మిత్ర దేశం. సైనిక, వాణిజ్య, ఆర్థిక రంగాల్లో ఆ దేశంతో మన అనుబంధం దశాబ్దాల నాటిది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ఆ దేశం నుంచి చమురు కొనుగోలు నిలిపేయాలంటూ బైడెన్ హయాం నుంచే అమెరికా ఒత్తిళ్లు తీసుకురావటం మొదలెట్టింది. తన ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు ఎంతో అవసరమైనఇంధన అవసరాలకు అనుగుణంగా మాత్రమే నిర్ణయం తీసుకుంటామని మన దేశం పలుమార్లు చెప్పింది. అందుకు ఆగ్రహించి గత ఆగస్టులో అప్పటికే విధించిన 25 శాతం సుంకాలకు తోడు ట్రంప్ మరో 25 అదనంగా వడ్డించారు. ఈ ఏడాది తొమ్మిది నెలల్లో మన దేశం రష్యా నుంచి సగటున రోజుకు 17 లక్షల బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఈ నెల మొదటినుంచి అది మరో లక్ష బ్యారెళ్ల మేర పెరిగింది. నిజానికి ఇందులో ప్రైవేటు సంస్థల వాటా అధికం. అమెరికా ఒత్తిళ్లను మన ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొన్న జనవరితో పోలిస్తే చమురు దిగుమతుల్ని తగ్గించాయి. జనవరిలో కోటి బ్యారెళ్లకు పైగా దిగుమతి చేసుకున్న ఆ సంస్థ గత నెల 46 లక్షల బ్యారెళ్లకు కుదించింది. పోనీ రష్యా బదులు వెనిజులా లేదా ఇరాన్ నుంచి అదనపు చమురు కొనుగోలుకు మన దేశం ప్రతిపాదించింది. కానీ దానికి సైతం జవాబు లేదు. కనీసం అమెరికాతో ఉన్న 4,270 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు భర్తీ కోసం వంటగ్యాస్ దిగుమతికి ప్రతిపాదించింది. అందుకు కూడా సానుకూల స్పందన లేదు. ప్రస్తుతం అమెరికా నుంచి మన వార్షిక చమురు కొనుగోళ్ల విలువ 1,300 కోట్ల డాలర్లు.భారత్–అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం కావటానికి ముందు కొన్ని అంశాలను చక్కదిద్దాలని, ఆ దిశగా కృషి చేస్తున్నామని గత నెలలో విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ప్రస్తుతం ఆ పని మీదే అమెరికాలో ఉన్నారు. ఆ విషయంలో ఒక అవగాహన ఏర్పడేందుకు అమెరికా తనవంతు ప్రయత్నించాల్సి ఉండగా ట్రంప్ తన అర్థరహిత ప్రకటనలతో సమస్యనుమరింత జటిలం చేస్తున్నారు. ఇది సరికాదు. -
లొంగుబాట్ల పర్వం!
ఆవిర్భవించి దాదాపు అరవయ్యేళ్లు కావస్తుండగా నక్సలైట్ ఉద్యమం తొలిసారి కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అరెస్టులు, నిర్బంధాలు, ఎన్కౌంటర్లు ఆ ఉద్యమానికి కొత్త కాకపోయినా, ఈ స్థాయిలో బీటలు వారటం ఇదే ప్రథమం. మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావుతో సహా 61 మంది నక్సలైట్లు గడ్చిరోలిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ముందు బుధవారం లొంగిపోయారు. అస్త్ర సన్యాసం చేసినవారు అప్పగించిన ఏకే–47లు, ఇతర తుపాకులు స్వీకరించి అందుకు బదులుగా వారికి సీఎం రాజ్యాంగ ప్రతులు అందజేశారు. నక్సల్స్కు బలమైన స్థావరంగా భావించే అబూజ్మాడ్ పూర్తిగా భద్రతా బలగాల అదుపులోకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించి ఛత్తీస్గఢ్లో నిన్న, ఈ రోజు 197 మంది లొంగిపోయారని తెలిపారు. మొత్తం ఈ రెండు రోజుల్లో 258 మంది ఉద్యమానికి వీడ్కోలు చెప్పారు. ముఖ్యంగా ఉత్తర బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావం పూర్తిగా అంతరించింది. గత కొన్ని నెలలుగా ఛత్తీస్గఢ్లోని అబూజ్మాడ్, జార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లు జరిగాయి. బయటినుంచి వెళ్లిన క్యాడర్తోపాటు పలువురు ఆదివాసీలు కూడా వీటిల్లో మరణించారు. ఈ పరిణామాలు గమనిస్తే వచ్చే ఏడాది మార్చి 31 కల్లా మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేయాలన్న కేంద్ర సంకల్పం నెరవేరేలా కనబడుతోంది. పీపుల్స్ వార్గా 1980లో ఆవిర్భవించిన పార్టీ ఇరవయ్యేళ్లలో పెనువేగంతో విస్తరించింది. 2000వ సంవత్సరంలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ), 2004లో మావోయిస్టు పార్టీగా రూపుదిద్దుకున్న సమయానికి దేశంలోని 92,000 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 180 జిల్లాల్లో దాని ప్రభావం ఉన్నదని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. నక్సలైట్ ఉద్యమం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పని తెలిపింది. తాజాగా ఆ ఉద్యమ ప్రభావం 11 జిల్లాలకు పరిమితమైంది. వాటిల్లో కూడా ఛత్తీస్గఢ్లోని మూడు జిల్లాలు – బీజాపూర్, సుక్మా, నారాయణ్పూర్లలో మాత్రమే నక్సల్ తీవ్రత అధికంగా ఉన్నదని కేంద్ర హోంమంత్రిత్వ వర్గాల కథనం. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక మొదట్లో మందకొడిగా ప్రారంభమైన మార్పులు తర్వాత కాలంలో వేగం పుంజుకున్నాయి. పర్యవసానంగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాల నుంచి ఉద్యమంలోకి రిక్రూట్మెంట్ గణనీయంగా తగ్గింది. ఆదివాసీ యువత రాక కొంతమేర పెరిగిన మాట వాస్తవమే అయినా ఏదో సంచలనాత్మక ఘటనల సందర్భంలో తప్ప మావోయిస్టు స్వరం వినబడటం తగ్గింది. సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై ఆ పార్టీ వైఖరేమిటో తెలియని స్థితి నెలకొంది. ఇప్పటికీ ఆకలి, దారిద్య్రం ఉన్నా, గతంలో మాదిరి కాక వాటి నివారణకు ప్రభుత్వాలు ఏదో మేరకు పథకాలు రచించి అమలు చేస్తున్నాయి. తమ డిమాండ్లు అరణ్య రోదనగా మిగిలే గతకాలపు పరిస్థితి మారి, ఎవరో ఒకరు గొంతెత్తటం, వాటివల్ల సానుకూల ఫలితాలు రావటం సామాన్య ప్రజలకు ఊరటనిస్తోంది. అణచివేత, నిషేధాలతో అజ్ఞాత వాసంలో ఉండటం వల్ల కొద్దోగొప్పో బలం ఉన్న ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు వెనువెంటనే స్పందించే శక్తి లేకపోయింది. అంతక్రితం మాటేమోగానీ... మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావు ఎదురు కాల్పుల్లో మరణించిన తర్వాత పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అంతర్మథనం మొదలైనట్టు కనబడుతోంది. మొన్న ఆగస్టులో సాయుధ పోరుకు తాత్కాలిక విరామం ప్రకటిద్దామంటూ మల్లోజుల పేరిట లేఖ విడుదలైనప్పుడు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని అందరూ అనుకున్నా పార్టీలో పలు కమిటీల మద్దతు కూడా ఉన్నదని మీడియా కథనాలు తెలిపాయి. ఇప్పుడేర్పడిన సానుకూల స్థితిని ఆదివాసీ జీవితాల మెరుగుకు వినియోగించటంతో పాటు పర్యావరణానికీ, ఆదివాసీ సంస్కృతికీ విఘాతం కలగని అభివృద్ధి నమూనాల రూపకల్పనకు పాలకులు కృషి చేయాలి. మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలుచేస్తే సమస్యలు తలెత్తవు. ఆ వెంబడే వచ్చే సామాజిక, రాజకీయ ఉద్యమాలూ ఉండవు. లేకుంటే అసంతృప్తి రూపం మార్చుకుంటుంది తప్ప సమసి పోదు. -
ప్రశ్నలు రేపిన మరణాలు
వారం రోజుల వ్యవధిలో హరియాణా పోలీస్ విభాగంలో జరిగిన రెండు ఆత్మహత్యలు ఆ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇందులో ఒకరు ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన దళిత ఐపీఎస్ అధికారి, అదనపు డీజీపీ వై. పూరన్కుమార్ కాగా, ఏఎస్ఐ సందీప్ లాఠర్ మంగళవారం ప్రాణం తీసుకున్నారు. ఈ రెండు ఆత్మహత్యలూ పోలీస్ విభాగంలో నిలువెల్లా నెలకొన్న అవ్యవస్థకు అద్దం పడుతున్నాయి. పూరన్ తనకెదురవుతున్న కులవివక్ష గురించి ఆత్మహత్యకు ముందు తొమ్మిది పేజీల లేఖ రాశారు. అయితే మూడు పేజీల లేఖతో పాటు వీడియో విడుదల చేసి మరణించిన సందీప్, అదనపు డీజీపీ పూరన్పై అవినీతి ఆరోపణలు చేస్తూ, ‘నిజాన్ని’ బట్టబయలు చేయటానికి ప్రాణత్యాగం చేస్తున్నాననటం, ఈ కేసులో బదిలీ అయిన ఒక ఎస్పీ మంచివారంటూ చెప్పటం ఆశ్చర్యం కలిగించింది. సందీప్ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నవారే. పూరన్పై దర్యాప్తుచేస్తున్న బృందంలో సభ్యుడు. పూరన్ అవినీతిపరుడైతే పకడ్బందీ దర్యాప్తుతో ఆ సంగతిని బట్టబయలు చేయాలి తప్ప అందుకోసం ప్రాణత్యాగం ఎందుకు? సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులజాడ్యం విద్యాసంస్థలూ, ప్రభుత్వ విభాగాలూ మొదలుకొని సమస్త వ్యవస్థల్లోనూ వేళ్లూనుకున్నదని తరచూ జరుగుతున్న ఉదంతాలు నిరూపిస్తున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ప్రాంతీయ వివక్ష వంటివి సరేసరి. చిత్రమేమంటే అన్ని వ్యవస్థలూ ఇవేమీ లేనట్టు నటిస్తుంటాయి. అందుకే కావొచ్చు... ఈ జాడ్యాలు నిక్షేపంలా కొనసాగుతున్నాయి. 2016లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయంలో రోహిత్ వేముల, 2019లో ముంబైలోని ఒక వైద్య కళాశాలలో పీజీ చేస్తున్న డాక్టర్ పాయల్ తాడ్వి బలవన్మరణాలైనా, వివిధ ఐఐటీల్లో ఆత్మహత్యలు చేసుకున్న ఇతర దళిత విద్యార్థులైనా తమ బలిదానాల ద్వారా ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వాల దృష్టికీ, సమాజం దృష్టికీ తీసుకొచ్చారు. కానీ పాలకుల నుంచి ప్రతిస్పందనలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. హరియాణా కేడర్ ఐపీఎస్ అయిన పూరన్ ఉన్నత విద్యావంతుడు. కంప్యూటర్ సైన్స్లో పట్టభద్రుడై, అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. వివిధ జిల్లాల్లో ఎస్పీగా,అంబాలా ఐజీగా శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన కృషినీ, పోలీస్ విభాగాన్ని ఆధునికీకరించటంలో ఆయన పాత్రనూ అందరూ గుర్తుచేసుకుంటున్నారు. పాలనా పరమైన బాధ్యతల్లోనూ, కీలకమైన కేసుల దర్యాప్తులోనూ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. గత నెలలో రోహ్తక్ నుంచి ఒక పోలీస్ శిక్షణ కేంద్రానికి బదిలీ చేసేవరకూ ఆయనపై అవినీతి ఆరోపణలు లేవు. కానీ అక్కడి నుంచి నిష్క్రమించాక రోహ్తక్లో ఆయన దగ్గర పనిచేసిన హెడ్ కానిస్టేబుల్అవినీతి ఆరోపణలపై అరెస్టు కావటం అనుమానాలకు తావిస్తోంది. అవినీతికి పాల్పడినవారిని రక్షించాలని ఎవరూ కోరరు. కానీ ప్రశ్నలు లేవనెత్తే పూరన్ వంటి దళిత అధికారిని ఆ మాదిరి కేసుల్లో ఇరికించే అవకాశం లేదా? ఆయన పని చేసినచోటల్లా ఈ మాదిరే ఆరోపణలొస్తే వేరే విషయం. ఐఏఎస్ అధికారిణి అయిన ఆయన భార్య అమ్నీత్ కుమార్కు సైతం సర్వీసులో మంచి పేరుంది. కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయానికి ఆమె సీఎం నయబ్సింగ్ సైనీ వెంట జపాన్ వెళ్లిన అధికార బృందంలో ఉన్నారు. హరియాణా మాఫియా ముఠాలకు నిలయం. మీడియాలో మార్మోగే లారెన్స్ బిష్ణోయ్ ముఠా మొదలుకొని ఎన్నో గ్యాంగ్లున్నాయి. పూరన్ అంటే గిట్టని వారు మరో గ్యాంగ్స్టర్ ఇందర్జిత్ను అడ్డంపెట్టుకుని కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారా? ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన 16 మంది సీనియర్ ఐపీఎస్లకు ఏడాదిపైగా కాలం నుంచి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్న వైనం కళ్ల ముందే కనబడుతోంది. వీరిలో అత్యధికులు దళిత వర్గాలవారు. వీరి పేర్లు ‘రెడ్బుక్’లో ఉండటం తప్ప వేరే కారణం కనబడదు. దేశవ్యాప్తంగా ఇలా బాహా టంగా కులవివక్ష రాజ్యమేలుతుంటే పూరన్ వంటివారు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదనుకోవటంలో వింతేముంది? ఈ కేసులో పారదర్శకంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపించి హరియాణా ప్రభుత్వం తన తటస్థతను నిరూపించుకోవాలి. -
శాశ్వత శాంతికి నిరీక్షణ
గత రెండేళ్లుగా అపారమైన ప్రాణనష్టాన్నీ, కనీవినీ ఎరుగని విధ్వంసాన్నీ చవిచూసిన గాజా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇజ్రాయెల్–హమాస్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా సమకూరిన విజయాన్ని శాంతిగా మలచుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ ఇజ్రాయెల్ పార్లమెంటు కెన్సెట్నుద్దేశించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పటం... ఆయన గత కాలపు అధ్యక్షులందరికన్నా గొప్ప స్నేహితుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కీర్తించటం ప్రపంచ ప్రజానీకమంతా వీక్షించింది. హమాస్ చెరలో మిగిలిన 20మంది ఇజ్రాయెల్ పౌరులూ విడుదల కావటం, అటు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న దాదాపు 10,000 మంది పాలస్తీనా పౌరుల్లో 1,718 మందిని ఆ దేశం విడుదల చేయటం పూర్తయింది. విముక్తులై సొంతగడ్డపై అడుగుపెట్టిన బందీలకూ, ఖైదీలకూ లభించిన అపూర్వ స్వాగతాలు గమనిస్తే వారి కోసం అయినవారు ఎంత ఆత్రంగా నిరీక్షించారో అర్థమవుతుంది. బందీలది రెండేళ్ల చెర అయితే...ఖైదీలది అంతకన్నా చాలా ఎక్కువ. వారిలో మూడేళ్ల నుంచి ఇరవయ్యేళ్ల వరకూ జైళ్లలో మగ్గుతున్నవారున్నారు. పలువురికి తిరిగి పాలస్తీనాలో అడుగుపెట్టేందుకు అనుమతి లేదంటూ ఈజిప్టుకు తరలించారు. అసలు చాలామందికి వెళ్లి నివసించేందుకు కొంపా గోడూ లేవు. అవన్నీ క్షిపణి దాడుల్లో కుప్పకూలాయి. శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవటమో, కాల్పుల విరమణకు అంగీకరించ టమో కాదు. పశ్చిమాసియాకు సంబంధించినంతవరకూ అదెంత మాత్రమూ సరిపోదు. ఎందుకంటే అక్కడ ఎంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందో, అంత త్వరగానూ ఉల్లంఘనలు కూడా మొదలైపోతాయి. యుద్ధానికీ, యుద్ధానికీ మధ్య ఏర్పడే తాత్కాలిక ఉపశమనంగా అది మారిపోయింది. 1978లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జిమ్మీ కార్టర్ కాలంలో కుదిరిన క్యాంప్ డేవిడ్ ఒప్పందం మొదలుకొని ఇందుకు ఎన్ని ఉదాహరణలైనా చూపవచ్చు. చిత్రమేమంటే 1993లో కుదిరిన ఓస్లో–1 ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్ ఉనికిని పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్ఓ) గుర్తించగా, పాలస్తీనా ప్రజలకు ‘నిజమైన ప్రతినిధి’గా పీఎల్ఓను ఇజ్రాయెల్ గుర్తించింది. కానీ అందువల్ల పీఎల్ఓకు ఒరిగింది లేకపోగా, అది వలసవాద పోలీసు దళంగా మిగిలింది. దాన్ని నీరుగార్చేందుకు అనంతర కాలంలో హమాస్కు పురుడుపోసింది కూడా ఇజ్రాయెలే. 1995 నాటి ఓస్లో–2 ఒప్పందమూ ఇంతే. ఇలా ఇరుపక్షాల మధ్యా కుదిరిన మధ్య వర్తిత్వాలూ, రాజీలూ అసంఖ్యాకం. కానీ వైమానిక, క్షిపణి దాడులు వాస్తవం... శాంతి మిథ్య. ఇజ్రాయెల్కు నిరంతరాయంగా అమెరికా సైనిక సాయం అందుతూనే ఉంటుంది. హమాస్ ఉగ్రదాడి తర్వాత 2023 నుంచి ఇంతవరకూ ఇజ్రాయెల్కు లభించిన అమెరికా సైనిక సాయం విలువ 2,200 కోట్ల డాలర్ల పైమాటే.తాజా ఒప్పందం హమాస్ 72 గంటల్లో తన దగ్గరున్న బందీలందరినీ విడుదల చేయాలని, చనిపోయివుంటే మృతదేహాలు అప్పగించాలని నిర్దేశించింది. కానీ మొత్తం 20 అంశాల్లోనూ ఇజ్రాయెల్కు నిర్దిష్ట కాలపరిమితిని సూచించే ప్రతిపాదనలేవీ లేవు. అసలు స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుపై స్పష్టత లేదు. ధ్వంసమైన ఆవాసప్రాంతాల పునర్నిర్మాణం సంగతి, జవాబుదారీతనం ఊసు లేదు. ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా గాజాను తీర్చిదిద్దుతామని ఇప్పటికే ట్రంప్ చెప్పారు. దాని ప్రసక్తి ఇందులో లేకపోయినా చివరకు ఆ దిశగా పావులు కదిపేలా పరిణామాలు ఉండబోతాయన్నది స్పష్టం. అటు షర్మ్ అల్ షేక్లో ఆర్భాటంగా జరిగిన శిఖరాగ్ర శాంతి సదస్సుకు నెతన్యాహూ రాకపై తుర్కియే, ఇరాక్లు అభ్యంతరం చెప్పటంతో చివరి నిమిషంలో ఆయన ఆగిపోవటమైనా... ఈ సదస్సుకు ఆఖరి నిమిషంలో ఆహ్వానం అంది వచ్చిన పాలస్తీనా అధ్యక్షుడు మహ్ముద్ అబ్బాస్ ప్రేక్షకుడిగా మిగిలిపోవటమైనా జరగబోయేదేమిటో సూచిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చొరవ తీసుకుని ట్రంప్ దగ్గరకు ఆయన్ను తీసుకెళ్లటం, వారిద్దరూ కొన్ని సెకన్లు సంభాషించుకోవటం చిన్నపాటి ఓదార్పు. ఎన్ని లోటుపాట్లున్నా ఇప్పుడు కుదిరిన ప్రశాంతత శాశ్వతం కావాలని ఆశించనివారంటూ వుండరు. అది సాకారం కావాలంటే ప్రపంచ ప్రజాభిప్రాయం ఇంకా పదునెక్కాలి. దురాక్రమణలు కనుమరుగై స్వేచ్ఛాయుత పాలస్తీనా దిశగా అడుగులు పడాలి. -
బిహార్లో కొత్త ప్రయోగం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పరుగు పందెంలో తనది ముందంజేనని పాలక పక్షమైన ఎన్డీయే నిరూపించుకుంది. ఆదివారం చర్చోపచర్చల తర్వాత జేడీ(యూ), బీజేపీలు చెరో 101 సీట్లకూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. భాగస్వామ్య పక్షాల్లో ప్రధానమైన లోక్ జనశక్తి పార్టీకి 29 స్థానాలీయగా, మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందూస్తానీ అవామీ పార్టీ (సెక్యులర్), ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్మోర్చా (ఆర్ఎల్ఎం)కు ఆరేసి సీట్ల చొప్పున కేటాయించారు. సర్దుబాటు వ్యవహారం గమనిస్తే బిహార్ను గత నాలుగు దశాబ్దాలుగా శాసిస్తున్న మండల్ రాజకీ యాల ప్రభావం కొడిగట్టిందని బీజేపీతోపాటు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా భావిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. వేర్వేరు కారణాలతో ఈసారి బిహార్ పతాక శీర్షికలకెక్కింది. హడావిడిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు పూనుకోవటం వివాదాస్పదంగా మారింది. బీజేపీ వ్యతిరేక ఓటర్ల పేర్లు తొలగింపే దీని ఆంతర్యమని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగబోయే పోలింగ్ కూడా పెద్ద వార్తే. 2010లో ఆరు దశలలో పోలింగ్ జరిగిన ఆ రాష్ట్రంలో అది క్రమేపీ తగ్గుతూ వస్తోంది. క్రితంసారి దాన్ని మూడు దశలకు కుదిస్తే, ఈసారి రెండు దశలుగా మారింది. తొలి దశలో జరిగే 121 స్థానాల్లో అత్యధిక భాగం మధ్య బిహార్ లోనివి కాగా, కొన్ని ఉత్తరప్రదేశ్కు పొరుగు నున్నాయి. రెండో దశలోని 122 స్థానాలూ నేపాల్ సరిహద్దుల్లోనూ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల పొరుగున ఉన్నాయి.ఎన్డీయే సీట్ల పంపకమే అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి 1996 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు కుదిరినప్పటినుంచీ జేడీ(యూ) తనకు రావాల్సిన సీట్ల సంఖ్యపై పట్టుదలతో ఉండేది. తమదే పెద్ద పార్టీ గనుక అత్యధిక స్థానాలుండాలని కోరేది. కానీ 2020 ఎన్నికల్లో ప్రజలు జేడీ(యూ)ను బాగా దెబ్బతీశారు. అప్పుడు పట్టుబట్టి బీజేపీ కన్నా ఒక్క సీటైనా తనకు అధికంగా ఉండాల్సిందేనని కోరి 122 స్థానాలు తీసుకున్న జేడీ(యూ), ఒప్పందం ప్రకారం తన వాటా నుంచి మరో భాగస్వామ్య పక్షమైన హిందూస్తానీ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం)కు 11 ఇచ్చింది. 111 చోట్ల పోటీ చేయగా తీరా గెల్చుకున్నవి 43 మాత్రమే. 121 స్థానాలు రాబట్టుకున్న బీజేపీ, వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ)కి 11 కేటాయించింది. 110కి పోటీ చేసి 74 చోట్ల విజయం సాధించింది. అప్పుడు ఎన్డీయే నుంచి బయటకుపోయి 135 చోట్ల పోటీ చేసిన లోక్ జనశక్తి ఒక స్థానమే గెల్చుకున్నా 33 చోట్ల తమను దెబ్బతీయగలిగిందన్న బాధ జేడీ(యూ)ను పీడించింది. బీజేపీ లోపాయకారీ మద్దతు వల్లే ఇలా జరిగిందన్న అభిప్రాయం ఏర్పడింది. అందుకే సీఎంగా ఉన్నా మధ్యలోనే ఎన్డీయేకు గుడ్బై చెప్పి మహా కూటమి వైపు వెళ్లి సీఎం పదవిని పదిలం చేసుకున్నారు నితీశ్. కానీ అది కూడా ఎంతోకాలం సాగలేదు. తిరిగి ఎన్డీయే వైపు వచ్చారు. బిహార్ రాజకీయాల్లో నితీశ్ శకం ముగిసిందనీ, తన ప్రాభవం మొదలైందనీ బీజేపీ విశ్వసిస్తోంది. తాజా సర్దుబాటులో 29 స్థానాలు పొందిన ఎల్జేపీ పూర్తిగా తన చెప్పుచేతల్లో ఉంటుంది గనుక ఈసారి సీఎం పదవి సునాయాసంగా రాగలదని భావిస్తోంది. క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీశే తమ సీఎం అని చెప్పిన ఎన్డీయే ఇప్పుడు మౌనం వహించటాన్ని జేడీ(యూ) కూడా గమనించకపోలేదు. కానీ ఆ పార్టీకి వేరే గత్యంతరం లేదు. 2024 లోక్సభ ఎన్నికల్లోనే జేడీ(యూ) కన్నా ఒక స్థానం అధికంగా డిమాండ్ చేసి సాధించుకున్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సరళిని అనుసరిస్తుందని నితీశ్ ముందే గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీది పైచేయి అయితే అది నితీశ్కు మాత్రమే కాదు... మొత్తంగా మండల్ రాజకీయాలకే విఘాతం. ఎందుకంటే బీజేపీ అధికారం కైవసం చేసుకోవటమంటే విపక్ష ఆర్జేడీని కూడా వెనక్కి నెట్టినట్టే అవుతుంది. పైగా జాతీయ స్థాయిలో బీజేపీ బలం పుంజుకోవటానికి దోహదపడుతుంది. ఇంత కీలకమైన ఈ పోరులో తమ వైఖరి మారబోదని బిహార్ ఓటర్లు తేలుస్తారా... బీజేపీ కోరుకునే కొత్త దోవన పయనిస్తారా అన్నది వచ్చే నెల ఎన్నికల తర్వాత వెలువడబోయే ఫలితాలతో వెల్లడవుతుంది. -
యుగాంత రచయిత
ఆధునిక యూరప్ సాహిత్యంలోనైనా, ఏ తరపు యూరప్ సాహిత్యంలోనైనా విశిష్ట స్థానం ఉన్న హంగెరీ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైయేను ఈ యేటి సాహిత్య నోబెల్ పురస్కారం వరించింది. ‘ప్రళయ భయాల మధ్యలోనూ కళాశక్తిని తిరిగి ధ్రువీకరించే... ఆకర్షణీయమైన, దూరదృష్టి గల సాహిత్య కృతుల సమాహారానికిగానూ’ 1954లో జన్మించిన ఈ 71 ఏళ్ల ‘హంగేరియన్ రుషి’కి ఈ గౌరవం దక్కింది. తన తొలి నవల ‘సాటాన్టాంగో’(1985)కు మూడు దశాబ్దాల తర్వాత వెలువడిన ఆంగ్లానువాదానికిగానూ 2015లో ‘మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్’ అందుకున్న లాస్లో సరిగ్గా దశాబ్దం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడే ఆయన ‘ద మెలంకలీ ఆఫ్ రెసిస్టెన్స్’ (1989), ‘వార్ అండ్ వార్’ (1999), ‘బారన్ వెంక్హెయిన్స్ హోమ్కమింగ్’ (2016) లాంటి ఇతర పోస్ట్మాడర్న్ నవలలు రాశారు.కథకుడు కూడా అయిన లాస్లో క్రాస్నాహోర్కైయే ప్రధానంగా హంగేరియన్ భాషలోనూ, చాలాకాలంగా నివాసం ఉండటం వల్ల జర్మన్లోనూ రాస్తారు. ఆయన సాహిత్యంలో ప్రపంచం వల్ల గాయపడిన మనుషులు కనిపిస్తారు. భయ పీడనలను వాళ్లు తప్పించుకోలేరు. సామాజిక అభద్రత, అశాంతి, భరించలేని ఉక్కపోత, నియంతృత్వపు అరాచకాల ఈ అపసవ్య ప్రపంచంలో జరిగే కర్కశ పోరాటాలను ఆయన చిత్రించారు. అందానికీ అవినీతికీ, అమాయకత్వానికీ కపటానికీ, బలహీనతకూ మొరటు బలానికీ మధ్య జరిగే ఎడతెగని పోరు; ప్రతి ఎత్తునూ ఒక అగాథానికి లాగే, ప్రతి స్వర్గాన్నీ ఒక నరకానికి నేలకూల్చే దారుణాలు ఆయన వస్తువులు. అందుకే అమెరికన్ విమర్శకురాలు సూసన్ సోంటాగ్ ఆయన్ని యుగాంత సాహిత్యపు గురువుగా అభివర్ణించారు. ఆయన కళ ఎల్లప్పుడూ అసంబద్ధతకు ఆతిథ్యంగా నిలుస్తుంది– ప్రపంచం తానే ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని, దయలేని ప్రతిద్వంద్విగా మారే మార్గాలకు సదా తెరిచి ఉంటుందని వ్యాఖ్యానిస్తారు బ్రిటిష్ రచయిత ఆడమ్ థర్ల్వెల్.కాఫ్కా ‘ద క్యాజిల్’, దోస్తోవ్స్కీ ‘ది ఇడియట్’ను అభిమానించే లాస్లో ఎన్నడూ రచయిత కావాలని అనుకోలేదు. 1970ల్లో ఆయన పాస్పోర్టును కమ్యూనిస్టు అధికారులు జప్తు చేశారు. దానివల్ల బొగ్గు గని కార్మికుడిగా పనిచేశారు. ఆవుల కొట్టాలకు రాత్రుళ్లు కావలి కాశారు. బార్లలో పియానో వాయించారు. గ్రామాల్లో పేదలతో కలిసి బతికారు. వీధుల్లోని జన భాషను ఒంటబట్టించుకున్నారు. మూడు నాలుగు నెలలకోసారి కొత్త పనులు వెతుక్కుంటూ తిరిగారు. ఈ అశాశ్వత ప్రపంచానికి కళ ఒక్కటే అతివిశిష్టమైన ప్రతిస్పందన అని నమ్మి రచనా వ్యాసంగం వైపు మళ్లారు. లాస్లో లాగే రాజ్య వ్యవస్థ బాధితుడైన హంగెరీ దిగ్దర్శకుడు బేలా టార్ ఆయనతో జట్టు కట్టడం యావత్ ప్రపంచ సినిమాకే మేలు చేసింది. బేలా టార్ను బేలా టార్గా నిలబెట్టిన సినిమాల రచయితగా లాస్లో పనిచేశారు. ‘డామ్నేషన్’, ‘ద లాస్ట్ బోట్– సిటీ లైఫ్’, ‘వెర్క్మెయిస్టర్ హార్మనీస్’, ‘ద ట్యూరిన్ హార్స్’తో పాటు ఏడు గంటల నిడివుండే ‘సాటాన్టాంగో’ వీరి కాంబినేషన్లో వెలువడ్డాయి. నలుపు తెలుపుల్లో తీయడం,దీర్ఘ షాట్లు, మౌనం మాట్లాడటం, ఏమీ జరగకుండానే ఎంతో జరిగినట్టనిపించడం వీటి ప్రత్యేకత.లాస్లో వచనంలో అన్నీ గుక్క తిప్పుకోలేని దీర్ఘ వాక్యాలే. ఫుల్స్టాపులు దేవుడికి సంబంధించినవంటారాయన. గుర్రాలు, గ్రహణాలు, తిమింగళాలు, ఇంకా మానవ ఉనికితో సహా ఈ విశ్వంలోని ప్రతిదాన్నీ అందమైనదిగా, అద్భుతమైనదిగా విశ్వసించే సాధారణ మనుషులు ఆయన సాహిత్యంలో ఆశావహ ప్రపంచపు ప్రతినిధులుగా కనబడతారు. కానీ ఆ ఆశ అనేది ఎప్పటికీ భవిష్యత్తుకు సంబంధించినదే; అలాంటి భవిష్యత్తుతో మనల్ని మనం భ్రమింపజేసుకుంటాం, ఆ భవిష్యత్తు ఎప్పటికీ రాదు; ఉన్నది వర్తమానం మాత్రమే అంటారు బౌద్ధ తాత్విక చింతనను ఇష్టపడే లాస్లో. యుగాంతం ఎప్పుడో సంభవించేది కాదనీ, అది ఇక్కడే ఉంది; అది సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ప్రక్రియ అనీ పాఠకులను అప్రమత్తం చేస్తారు. ఈ చీకటి యుగంలో బతకడానికి చదవడం మరింత శక్తినిస్తుందంటారు. -
హాస్టళ్లా... నరక కూపాలా?
‘‘ప్రతి బాల్యంలోనూ ఓ నందనోద్యానం ఉంటుంది. అది మెరిసిపోయే రంగులతో అల్లుకున్న మంత్రముగ్ధ నగరి. పిల్ల తెమ్మెరలక్కడ మృదువుగా హత్తుకుంటాయి. ప్రతి ఉదయమూ అక్కడ పరిమళ భరితమే’’ – బాల్యం గురించి ఓ రచయిత్రి అలా వర్ణించారు. బాల్యం ఇలాగే ఉండాలి. ఈ విధంగానే ఎదగాలని చాలామంది కోరుకుంటారు. అందుకే ప్రతి నాగరిక దేశం బాలల హక్కులకు ప్రత్యేక రక్షణను ఏర్పాటు చేసింది. భారత రాజ్యాంగం కూడా అటువంటి ఏర్పాట్లు చేసింది. స్వయంగా తల్లిదండ్రులే తమ పిల్లల్ని స్వల్పంగా దండించినా సహించకుండా జైల్లో పెడతారు స్కాండినేవియన్ దేశాల్లో! ఏ జాతికైనా అమూల్య సంపద బాలలే కనుక మానవత్వం సున్నితత్వమున్న వ్యవస్థలన్నీ బాలల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాయి. ‘మనం చూడలేని కాలానికి మనం పంపించే సజీవ సందేశాలు పిల్లలే’! కనుక వారికా ప్రత్యేక హక్కులుంటాయి.ఆచరణలో ప్రతి బాల్యం నందనోద్యానంలా ఉంటున్నదా? ఏలుతున్నవారు అలా ఉండటానికి అనుమతిస్తున్నారా? అందమైన బాల్యాన్ని అంగడి సరుకుగా మార్చడానికి దోహద పడుతున్న ప్రభుత్వాలనిప్పుడు చూస్తున్నాము. పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే పేద పిల్లలకు కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరగాలని ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పుడు మోకాలడ్డే ప్రయత్నం చేసిందెవరు? ఆ ప్రయత్నం చేసిన చంద్రబాబు కూటమే ఇప్పుడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఎత్తివేసింది. విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతలు కావనేది ఆయన ఫిలాసఫీ. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. కనుకనే ఆయన మళ్లీ గద్దెనెక్కగానే కొనగలిగినవారికి నాణ్యమైన విద్య... లేనివారికి నాసిరకం విద్యావిధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానపు దుర్మార్గానికి పుట్టిన విషపు పుండే మొన్నటి కురుపాం ఘటన.పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థుల్లో కామెర్ల వ్యాధి ప్రబలిన నేపథ్యాన్ని గమనిస్తే ఒళ్లు జలదరిస్తుంది. లక్షలాదిమంది పేద తల్లిదండ్రులు వారి బిడ్డల భవిష్యత్తుపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏపీ సర్కార్ వమ్ము చేస్తున్న వైనం దిగ్భ్రాంతికరమైనది. కురుపాం ఆశ్రమ పాఠశాలలో ఉంటున్నది ఆరొందల పైచిలుకు బాలికలే కావచ్చు. అన్ని రకాల సంక్షేమ హాస్టళ్ళు, అన్ని రకాల ఆశ్రమ పాఠశాలలూ కలిపి ఏపీలో 3,800కు పైగా ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది పేదవర్గాల పిల్లలు ప్రభుత్వం మీద భరోసాతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటు న్నారు. ప్రస్తుత ప్రభుత్వపు విధానపరమైన వైఖరి ఫలితంగా కొద్దిపాటి తేడాలు తప్ప కురుపాం ఆశ్రమ పాఠశాలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఎక్కడా లేవు. కురుపాం దారుణానికి సంబంధించిన ప్రకంపనలు తగ్గకముందే గుంటూరు జిల్లాలో బీసీ హాస్టల్ విద్యార్థులు సామూహికంగా అస్వస్థులు కావడం నివ్వెరపరిచింది. గత ఏడాది కాలంగా ఈ తరహా వార్తలు అడపాదడపా వెలుగు చూస్తున్నా ఎటువంటి చర్యలూ తీసుకోక పోవడంతో పరిస్థితులిప్పుడు దారుణంగా దిగజారాయి.అసలేం జరిగింది కురుపాంలో? మరొకసారి పునరా లోకనం చేసుకోవాలి. కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరొందల పైచిలుకు విద్యార్థినులుంటున్నారు. సగటున ఇరవై మందికో మరుగుదొడ్డి. వాటి నిర్వహణ కూడా అంతంత మాత్రమే. డ్రైనేజీ ఏర్పాట్లు సరిగా లేక మురుగు నీరంతా ఒక పక్కకు చేరి అక్కడినుంచి బోర్ నీళ్లలో కలిసిపోతున్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దసరా సెలవులు ప్రకటించిన తర్వాత సొంత ఊరికి వెళ్లిన అంజలి అనే బాలిక కామెర్ల లక్షణాలతో సెప్టెంబర్ 25న చనిపోయింది. తోయక కల్పన అనే టెన్త్ క్లాస్ చదువుతున్న బాలిక పది రోజులపాటు స్థానిక జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకొని నయం కాకపోవడంతో వైజాగ్ కేజీహెచ్లో చేరింది. సెప్టెంబర్ 29న ఆ బాలిక కూడా కామెర్ల వ్యాధి (హెపటైటిస్ ఏ)తో ప్రాణాలు కోల్పోయింది. అంటే ఆశ్రమ పాఠశాలకు సెలవులు ఇవ్వకముందే కామెర్ల లక్షణాలు బయటపడినట్టు స్పష్టమవుతున్నది.కురుపాంలోనే మరో హాస్టల్లో చదువుతున్న ఇంకో ఇద్దరు బాలురు అక్టోబర్ 5, 6 తేదీల్లో ఇవే లక్షణాలతో చనిపోయారు. గిరిజన బాలికల గురుకులం నుంచి మొత్తం 170 మంది బాలికలకు కామెర్లు సోకి ఆస్పత్రుల పాలయ్యారు. వీరిలో యాభై మంది విశాఖ కేజీహెచ్ దాకా రావలసి వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో బాలికలకు సురక్షిత మంచినీటి కోసం ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం దానికి రిపేర్ రావడంతో పక్కన పడేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్న సమాచారం ప్రకారం డ్రైనేజీ వ్యవస్థ లేక మరుగుదొడ్ల మురుగు నీరు కలుస్తున్న బోర్ నీటినే బాలికల చేత తాగిస్తున్నారు. వంటకూ వాటినే వినియోగిస్తున్నారు. విద్యార్థుల మెడికల్ రిపోర్టులు కూడా దాన్నే నిర్ధారిస్తున్నాయి. మురుగుతో నీటి కాలుష్యం వల్లనే విద్యార్థులు ‘హెపటైటిస్–ఏ’ వ్యాధికి గురయ్యారని చెబుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నిర్వాహకులు ఏం చేస్తున్నట్టు? పిల్లల చేత మురుగునీళ్లు తాగిస్తూ ఉపాధ్యాయులు మాత్రం మినరల్ వాటర్ తెచ్చుకుని తాగేవారని గిరిజన పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.పిల్లలు తరచూ అస్వస్థతకు గురవుతుంటే నిర్వాహకులు వారిని ఇళ్ళకు పంపించి చేతులు దులిపేసుకోవడమేమిటి? పై అధికారులకు వీళ్లు రిపోర్టు చేయలేదా? చేసినా వారు పట్టించు కోవడం లేదా అన్నది తేలాల్సి ఉన్నది. యథా రాజా తథా ప్రజా అంటారు కదా! పేద పిల్లల ఆరోగ్యం సంగతి ప్రభుత్వానికే పట్టనప్పుడు తమకెందుకని అధికారులు అలక్ష్యంతో ఉంటు న్నారేమో తెలియదు. విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, ఐటీడీఏ, జిల్లా యంత్రాంగాలు, వాటి అధికార శ్రేణులు ఉన్నప్పటికీ ఇన్ని దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి?సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం కోసం అనుసరించ వలసిన ప్రోటోకాల్ను కూడా పాటించకపోవడం విస్మయం కలిగించే విషయం. ఆర్వో ప్లాంట్ చెడిపోతే వెంటనే ఎందుకు బాగు చేయించలేదు? నిర్ణీత కాలానికోసారి తాగునీటికి నాణ్యతా పరీక్షలు చేయడం లేదా? ఒకరిద్దరు పిల్లలు జబ్బుపడిన తర్వాత మిగిలిన పిల్లల విషయంలో వ్యాధి నిరోధక చర్యలు చేపట్టారా, లేదా? కనీసం తాగునీటిని క్లోరినేషన్ చేసినా ఇటువంటి ఘటనలు జరిగేవి కావు కదా!సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య, వసతి సమస్యలపై ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా వరసగా అనేక దుర్ఘటనలు ఈ ఏడాది కాలంలో రికార్డయ్యాయి. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన సంక్షేమ హాస్టళ్ల గురుకులాల్లోనే ఈ కాలంలో 11 మంది విద్యార్థులు అనారోగ్య కారణాలతో చనిపోయారు. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేడ్కర్ సంక్షేమ గురుకులంలో పాచిపోయిన ఆహారం పెట్టడం వల్ల వందమంది విద్యార్థులు అస్వస్థులయ్యారు. ఇటువంటి ఘటనే అదే జిలాల్లోని జ్యోతిబా ఫూలే బీసీ హాస్టల్లో జరిగింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం, అనకాపల్లి జిల్లా రాజగోపాలపురం, నూజివీడు ట్రిపుల్ ఐటీల్లో కూడా కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు జబ్బుపడిన ఘటనలు జరిగాయి. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని బీసీ హాస్టల్లో కలుషితాహారం తిని 50 మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారు. శనివారం నాడు వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగి తమ పిల్లల్ని హాస్టల్ నుంచి ఖాళీ చేయించారు. సంపన్నుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లలో మిగిలిపోయిన ఆహారాన్ని మర్నాడు తీసుకొచ్చి హాస్టల్ విద్యార్థులకు పెట్టడం ఏపీలో ఇప్పుడో ట్రెండ్గా మారింది. పాచిపోయిన ఆహారం తిని పిల్లలు అస్వస్థతకు గురైన ఘటనలు పలుచోట్ల జరిగాయి.తాజాగా కురుపాంలో జరిగిన ఘటన మానవత్వానికే సవాల్ విసురుతున్నది. ఆరొందల మందికి పైగా బాలికలు రోజుల తరబడి మురుగునీళ్లు తాగవలసిన పరిస్థితి ఎవరి పాపం? పక్కనే ఉన్న విశాఖ నగరంలో అతి ఖరీదైన భూముల్ని కారుచౌకగా లుల్లూ భయ్యాలకూ, లల్లూ భయ్యాలకూ కట్టబెడు తున్న సర్కార్, ఏజెన్సీ గిరిజన బిడ్డలకు శుభ్రమైన మంచినీటిని కూడా ఎందుకు నిరాకరిస్తున్నట్టు? చంద్రబాబును పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా పిలవడం ఇటువంటి కారణాల వల్లనే! పేదల సంక్షేమాన్ని ‘పీ–4’కు అప్పగించాలని ఆయన నిర్ణయించారు. సంపన్నుల ఫంక్షన్లలో మిగిలిపోయిన, పాచిపోయిన ఆహారాన్ని పేదలకు పంచడం లాంటిదే ‘పీ–4’ ఫిలాసఫీ. ఇదేనా మన రాజ్యాంగం చాటిచెప్పిన సమానత్వం? ఎటువంటి వివక్షా లేకుండా అన్ని వర్గాల పిల్లలందరూ ఉచితంగా విద్యను అభ్యసించడమే కాదు, వారి ఆరోగ్య సంరక్షణ కూడా ప్రాథమిక హక్కుల్లో భాగమే. కూటమి సర్కార్ హయాంలో సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న ఉదంతాలు కచ్చి తంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలే. జీవించే హక్కును కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తున్నట్టే!కామెర్ల వ్యాధి ప్రబలుతున్నదని తెలిసిన తర్వాత కూడా పాఠశాల నిర్వాహకులు, అధికారులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగానే ఉన్నది. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్లనే విద్యార్థులకు కామెర్ల వ్యాధి సోకిందని సాక్షాత్తూ ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించడం గిరిజన ప్రజానీకాన్ని అవమానించడమే! నలతగా ఉంటున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా వారిని ఇళ్లకు పంపించి పాఠశాల నిర్వాహకులు చేతులు దులుపుకొన్నారు. సరైన వైద్యం అందించకుండా కాలయాపన చేసి, రోజుల తరబడి స్థానిక ఆస్పత్రుల్లో తిప్పి చివరకు మాత్రమే కేజీహెచ్కు తరలించినందువల్లనే కల్పన అనే బాలిక చనిపోయింది. బాలిక మరణానికి కారణం సెరెబ్రల్ మలేరియా అని రాశారట! వైద్యులు చికిత్స చేసింది కూడా దానికేనా? అధికారుల ఒత్తిడికి లొంగి వైద్యులు అలా రాయ వచ్చునా? చనిపోయిన పిల్లలకు పోస్ట్మార్టమ్ ఎందుకు నిర్వహించలేదు? కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పిల్లల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారనే వార్తలు రాగానే వారిని బలవంతంగా డిశ్చార్జి చేయించడానికి అధికారులు ఎందుకు ప్రయాస పడినట్టు? దాచేస్తే సత్యం దాగుతుందా? విద్య, వైద్యం ఉచితంగా అందజేయడం ప్రభుత్వం విధానం కాదనేది కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు వైఖరి. అందువలన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఆయనకు ప్రాధాన్య రంగం కాదు. వారికి పోషకాహారం, వసతి సౌకర్యాలు వారి ఎజెండాలో ఉండవు. ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాడటమా? లేక మౌనంగా అవమానాలు దిగమింగి అన్యాయాలను సహించ డమా? ఏ మార్గం అనుసరించాలో పేద–మధ్యతరగతి వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్య – రాజ్యాంగవాదులు నిర్ణయించుకోవ లసి ఉంటుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ట్రంప్కు దక్కని నోబెల్!
ప్రకటించటానికి ముందే రివాజుకు భిన్నంగా అందరి నోళ్లలోనూ నానిన నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది వెనిజులా విపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకుదక్కింది. ఆ దేశంలో ప్రజాస్వామిక హక్కుల కోసమూ... నిరంకుశత్వం నుంచి ప్రజాస్వా మ్యానికి న్యాయమైన, శాంతియుతమైన పరివర్తన సాధించేందుకూ ఆమె చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా దీన్ని అందిస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ పురస్కారంపై బాగా ఆశలు పెట్టుకున్నారు గనుక సహజంగానే ఈ నిర్ణయాన్ని వైట్ హౌస్ తప్పుబట్టింది. శాంతికన్నా రాజకీయాలకే కమిటీ ప్రాధాన్యమిచ్చిందని విమర్శించింది. కమిటీపై ఈ మాదిరి విమర్శలు గతంలో చాలా వచ్చాయి. మేధావులూ, సామాజిక అధ్యయనకారులూ ఆ పని చేసేవారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రాధాన్యతా అంశంగా భావించే వైపు ప్రపంచ ప్రజల చూపు మర ల్చటం కోసం నోబెల్ కమిటీ ప్రయత్నిస్తున్నదని విమర్శించేవారు. ఇప్పటికే ట్రంప్ వెనిజులాను అష్టదిగ్బంధం చేశారు. గత నెల మొదట్లో వెనిజులా స్పీడ్ బోట్లు రెండింటిపై అమెరికా సైన్యం విరుచుకు పడటంతో 17 మంది మరణించారు. ఇంతవరకూ అవి మాదక ద్రవ్యాలున్న బోట్లని చెప్పే ఆధారాలేమీ అమెరికా ప్రకటించలేదు. ఇది కేవలం మొదటి దశ అని, రెండో దశ వెనిజులా గడ్డపై ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. అది సైనిక జోక్యం కావొచ్చన్న అంచనాలున్నాయి. అమెరికా ఆర్థిక ఆంక్షలతో ఆ దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. వీటన్నిటిపైనా మచాడో స్పందనేమిటో తెలియదు. నిజానికి ఈ ఏడాది సూడాన్లో అత్యవసర సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థ, ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ ఈ రేసులో ఉంటా యని పలువురు అనుకున్నారు. యుద్ధాన్ని వ్యతిరేకించటమో, కాల్పుల విరమణ సాధించటమో పురస్కారానికి అర్హత సాధించిపెడుతుందని ట్రంప్ అనుకున్నందుకు ఆయన్ను నిందించి ప్రయోజనం లేదు. అందుకు నోబెల్ కమిటీ బాధ్యత కూడా ఉంది. గతంలో కమిటీ ఇచ్చిన కొన్ని పురస్కారాలు గమనిస్తే ఈ సంగతి బోధపడుతుంది. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ పురస్కారం ప్రకటించే నాటికి ఆయన అధికారంలోకొచ్చి తొమ్మిది నెలలైంది. ‘విశ్వ మానవాళి ఆకాంక్షల పరిరక్షణలో అమెరికా నిర్ణయాత్మక పాత్రను ఈ పురస్కారం ధ్రువీకరిస్తున్నద’ని ఒబామా ఘనంగా చెప్పుకొన్నారు. కానీ ఆ బహుమతి తనకెందుకిచ్చారో ఇప్పటికీ తెలియటం లేదని 2016లో ఆయన నిజాయతీగా ఒప్పుకొన్నారు. బుష్ మొదలెట్టిన యుద్ధాలను ఆయన మరింత ముందుకు తీసుకుపోయారు. ఒబామా ఏలుబడిలో లిబియా, సిరియా, సోమాలియా, అఫ్గాన్లలో అమెరికా సైన్యం దాడుల్లో వేలాదిమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో నోబెల్ ఎంపిక కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన గీర్లెండ్స్టెడ్ అది ఘోర తప్పిదమని 2015లో అంగీకరించారు. వాస్తవానికి 1973లో నాటి అమెరికా విదేశాంగ మంత్రి హెన్రీ కిసింజర్కు శాంతి బహుమతి ప్రకటించినప్పుడు ప్రపంచం నివ్వెరపోయింది. 1971లో బొలీవియా, 1973లో చిలీ దేశాల్లో సైనిక తిరుగు బాట్లకు పథక రచన చేయటం, బంగ్లాదేశ్లో పాక్ సైన్యం సాగించిన నరమేధానికిఅండదండలీయటం, అనేక చోట్ల నియంతృత్వ ప్రభుత్వాలకు చేయూతనందించటం వగైరాల్లో ఆయన పాత్ర అత్యంత దారుణమైనది. నిరాయుధీకరణకూ, అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికీ చిత్తశుద్ధితో పనిచేసేవారికి మొదట్లో ఆ బహుమతి ఇచ్చేవారు. అటుతర్వాత ఇతరేతర ప్రయోజనాలూ, ఉద్దేశాలూ వచ్చిచేరాయి. వర్తమానంలో ఆయుధాలు పోగేసుకోవటం, బెదిరించటం, క్షిపణులూ, బాంబులతో విధ్వంసం సృష్టించటం ఘనకార్యాలుగా చలామణీ అవుతున్నాయి.అలాంటి అధినేతలు దృఢమైన నాయకులుగా నీరాజనాలందుకుంటున్నారు. ఆ దృక్ప థాన్ని మార్చి శాంతి అంటే యుద్ధం లేకపోవటం మాత్రమే కాదనీ, సమాజంలో సమానత్వ సాధనకు కృషి చేయటం, ప్రపంచ శాంతికి దోహదపడటం అని అందరూ గుర్తించేందుకు నోబెల్ కమిటీ తన వంతు ప్రయత్నించిన దాఖలా లేదు. మరి ఈ పురస్కారాల పరమార్థం ఏమిటో ఆ కమిటీయే ఆత్మవిమర్శ చేసుకోవాలి. -
గాజాలో శాంతివీచిక!
రెండేళ్ల నుంచి అవిచ్ఛిన్నంగా క్షిపణులు, బాంబుల వర్షంతో కంటిమీద కునుకు లేకుండా గడిపిన గాజా ఇకపై గుండెల నిండా ఊపిరి పీల్చుకోనుంది. హమాస్– ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందనీ, ఇరు పక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయనీ, శాంతి ప్రణాళికలో ఇది తొలి దశ అనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గమనిస్తే పూర్తిస్థాయి శాంతి స్థాపనకు మరికొంత సమయం పట్టొచ్చని స్పష్టంగానే తెలుస్తోంది. ఇంత హడావిడిగా సంధి కుదిరినట్టు ప్రకటించటం వెనక శుక్రవారం ప్రకటించబోయే నోబెల్ శాంతి బహుమతికి అర్హత సాధించటం కోసమేనని అందరికీ తెలుసు. ట్రంప్ అందుకు అర్హుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సిఫార్సు చేస్తున్నారు. తమ భూభాగంలోకి చొరబడి 2023 అక్టోబర్ 7న 1,100 మంది పౌరులను హతమార్చి, 251 మందిని అపహరించుకుపోయిన హమాస్ దుందుడుకు చర్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 24 నెలల పాటు గాజాపై నిప్పుల వాన కురిపించింది. ఏ క్షిపణి ఎక్కడ పడుతుందో, ఏ బాంబు ఎవరి ప్రాణం తీస్తుందో తెలియక గాజా వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. జనావాస ప్రాంతాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా క్షిపణులు ప్రయోగించటం, ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లు క్షణంలో కూలి శిథిలాల గుట్టగా మారటం ప్రపంచ ప్రజలంతా చూశారు. కనీసం ఇద్దరో ముగ్గురో మరణించని కుటుంబం లేదు. కొన్ని కుటుంబాలైతే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మధ్యలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు... ఇజ్రాయెల్ ఉల్లంఘనల వల్ల పెద్దగా ఉపశమనం ఇచ్చింది లేదు. దీన్ని యుద్ధం అనడం ఇజ్రాయెల్ సాగించిన నరమేధాన్ని కప్పిపుచ్చే యత్నమే అవుతుంది. బలాబలాల్లో ఎంత వ్యత్యాసం ఉన్నా రెండు దేశాల మధ్య పరస్పరం కొన సాగే ఘర్షణల్ని యుద్ధం అంటారు. ఇక్కడ జరిగిందంతా వేరు. ఇజ్రాయెల్ లోపాయకారీ మద్దతుతో ఎన్నికల ద్వారా అధికారం చేజిక్కించుకుని గాజా ప్రజలపై పెత్తనం సాగిస్తూ, పాలస్తీనా అథారిటీని బేఖాతరు చేస్తూ వచ్చిన హమాస్ ఉన్నట్టుండి ఉగ్రవాద దాడికి పూనుకొంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారమే 67,183 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,69,841 మంది గాయాల పాలయ్యారు. వైద్య సిబ్బంది, పాత్రికేయులన్న విచక్షణ లేకపోగా, చాలా సందర్భాల్లో వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యాలు హతమార్చటం ఆధునిక చరిత్రలో కనీవినీ ఎరుగనిది. దాడులు ఆగుతాయంటున్నారు గనుక శిథిలాల తొలగింపు మొదలవుతుంది. అప్పుడు గానీ మృతుల అసలు సంఖ్య ఎంతో తెలియకపోవచ్చు. ఇప్పటికీ ఆచూకీ తెలియనివారు వేలల్లో ఉన్నారు. ఇజ్రాయెల్ ఘాతుకాల వెనక జాత్యహంకారం స్పష్టంగా కనబడుతుండగా, ఆ దుండగాన్ని ధర్మబద్ధంగా వ్యతిరేకించినవారిని యూదులపై వివక్ష ప్రదర్శిస్తున్నవారిగా జమకట్టి వేధించటం, విశ్వవిద్యాలయాల్లోకి పోలీసులు చొరబడి అరెస్టులు చేయటం ట్రంప్ నైజానికి అద్దం పడుతుంది. గాజాలో హమాస్ ఒక్కటే లేదు. పాలస్తీనా విమోచన కోసం పోరాడే సంస్థలు డజను వరకూ ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి పోలేదు. గాజాలోనే ఒక హద్దు నిర్ణయించుకుని ఆగింది. ఇప్పుడు కుదిరిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఎంతవరకూ గౌరవిస్తుందో తెలియదనీ, ఒప్పందంలోని చాలా క్లాజులు అస్పష్టతతో ఉన్నా కేవలం ట్రంప్ హామీని నమ్మి సమ్మతించామనీ ఆ సంస్థల ప్రతి నిధులు చెబుతున్న తీరు గమనార్హం. ట్రంప్కు నోబెల్ వస్తే తప్ప ఈ ఒప్పందం సజావుగా ముందుకు పోదు. రెండో దశ చర్చల్లోనే అసలు అంశాలు ప్రస్తావనకొస్తాయి. అప్పుడు మరణమో, శరణమో పాలస్తీనా సంస్థలు తేల్చుకోక తప్పదు. ట్రంప్కు పురస్కారం లభిస్తే గాజా వాసులకు ఉన్నంతలో గౌరవప్రదమైన పరిష్కారం దొరకొచ్చు. రాకపోతే పరిణామాలు వేరుగా ఉండే అవకాశం ఉంది. అయితే నరమేధాన్ని కొనసాగించటం ఇక సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే హమాస్ చెరలోని బందీలంతా విడుదలయ్యారు. అటు ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా పౌరులు దాదాపు 2,000 మంది విడుదలవుతున్నారు. గాజా విషయంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా, ఇజ్రాయెల్ ఒంటరిగా మిగిలిపోయిన కొన్ని రోజులకే ఆ రెండు దేశాలూ తమకేం పట్టనట్టు ఈ శాంతి ఒప్పందం సాధించటం ఒక వైచిత్రి. -
తాలిబన్లతో సఖ్యత!
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులుండరన్న నానుడి దౌత్యానికి కూడా వర్తిస్తుంది. పైకి ఏం చెబుతున్నా, ఇతరేతర ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలను పరిశీలించటమనే ప్రక్రియ దౌత్యంలో నిరంతరం కొనసాగుతుంటుంది. పర్యవసానంగా ఒక్కోసారి అనూహ్య పరిణామాలు కూడా చోటుచేసుకోవచ్చు. తాలిబన్ల ఆధ్వర్యంలోని అఫ్గానిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ గురువారం అయిదు రోజుల భారత సందర్శనకు రావటం అటువంటిదే. ఇది దక్షిణ, మధ్య ఆసియా భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేసే పరిణామం. ప్రపంచ దేశాల్లో రష్యా మినహా మరే దేశమూ ఇంతవరకూ అఫ్గాన్ ప్రభుత్వాన్ని లాంఛనంగా గుర్తించలేదు. మన దేశం తొలిసారి ఆ దిశగా అడుగులేస్తున్నది. అమీర్ ఖాన్ రానున్న సందర్భంగా తాలిబన్ను ప్రాంతీయ బృందంలోని భాగస్వామిగా గుర్తించటానికి భారత్ సిద్ధపడింది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించటం ఇక లాంఛన ప్రాయం. భద్రతా మండలి ఉగ్రవాదులుగా గుర్తించి ఆంక్షలు విధించిన వారిలో అమీర్ ఖాన్ ఒకరు. దానికింద ఆయన తారసపడితే అరెస్టు చేయాల్సి ఉంటుంది. భారత్ చొరవతో ఈ విషయంలో తాత్కాలికంగా మినహాయింపు లభించింది.తొలిసారి 1996లో అఫ్గాన్ తాలిబన్ల వశమైనప్పుడు మనకు ఎన్ని విధాల సమస్య లొచ్చాయో ఎవరూ మరిచిపోరు. సోవియెట్ దురాక్రమణను ప్రతిఘటించి పాలనాధి కారాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు అనేకమంది మిలిటెంట్లను కశ్మీర్కు తరలించారు. పర్యవసానంగా అక్కడ నెత్తురుటేర్లు పారాయి. కేంద్రంలో వాజ్పేయి నాయ కత్వాన తొలి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక 1999లో ఉగ్రవాదులు ఖాట్మండు నుంచి న్యూఢిల్లీ వచ్చే విమానాన్ని హైజాక్ చేసి అఫ్గాన్లోని కాందహార్కు తరలించారు. ముగ్గురు ఉగ్రవాదుల్ని విడిపించుకున్నారు. ఈ చర్య వెనక నేరుగా తాలిబన్లు లేక పోయినా ఉగ్రవాదులు సురక్షితంగా వెళ్లటానికి సహకరించారు. తాలిబన్లతో చర్చలు గానీ, గుర్తింపుగానీ ఉండబోదని అప్పట్లో మన దేశం ప్రకటించింది. ఇంటా, బయటా వారు సాగిస్తున్న అరాచకాలను తీవ్రంగా ఖండించేది.ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అమెరికా 2001లో అఫ్గాన్ను దురాక్రమించాక ఏర్పడిన ప్రభుత్వాలకు మన దేశం మద్దతుగా నిలిచింది. 2021లో తాలిబన్ల పునరాగమనంతో అష్రాఫ్ ఘనీ ప్రభుత్వం పడిపోయేవరకూ మన దేశం పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టింది. రూ. 25,000 కోట్ల వ్యయంతో పార్లమెంటు భవనాన్నీ, సల్మా ఆనకట్టనూ, ఒక జాతీయ రహదారినీ నిర్మించింది. విద్యుదుత్పాదన ప్రాజెక్టులు, విద్య, వైద్యం తదితరాల్లో పాలుపంచుకుంది. ఇవన్నీ తాలిబన్లలో సద్భావన కలిగించటంతో పాటు పాకిస్తాన్తో వచ్చిన విభేదాలు కూడా వారిని భారత్వైపు మొగ్గేలా చేశాయి. పాక్– అఫ్గాన్ దీర్ఘకాల సంబంధాలూ, ఉజ్బెకిస్తాన్ ద్వారా సన్నిహితం కావటానికి పాక్ చేస్తున్న ప్రయత్నాలూ, చైనా వరస మంతనాలూ మన దేశంలో కూడా పునరాలోచన కలిగించాయి. మనం ముందడుగు వేయనట్టయితే ఏదోనాటికి తాలిబన్–పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడి, చైనా పలుకుబడి పెరిగి అది మన భద్రతకు ముప్పు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. పైగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా కీలకమైన అఫ్గాన్లోని బగ్రాం వైమానిక స్థావరాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు. ఇది కూడా మన భద్రతను ప్రశ్నార్థకం చేసే పరిణామం. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోబట్టే తాలిబన్లతో సత్సంబంధాలకు మన దేశం సిద్ధపడింది. ఏ దేశానికైనా స్వీయ ప్రయోజనాలు, భద్రత అత్యంత కీలకం. ఆ తర్వాతే మిగిలిన వన్నీ. గత నాలుగేళ్లుగా మన దేశం వేలాది టన్నుల గోధుమలు, వందల టన్నుల మందులు, వ్యాక్సిన్లు, భారీ మొత్తంలో పురుగుమందులు, అత్యవసర సరుకులు పంపింది. ఇటీవల భూకంపం వచ్చినప్పుడు టెంట్లు, మందులు, దుప్పట్లు, జనరేటర్లు అందించింది. కాబూల్లో పూర్తిస్థాయి దౌత్య కార్యాలయం కాకపోయినా సాంకేతిక కార్యాలయాన్ని తెరిచింది. తాలిబన్ ప్రభుత్వం ఢిల్లీలో రాయబార కార్యాలయం ప్రారంభించుకోవటానికి అనుమతినిచ్చింది. ఈ అనుకూల వాతావరణంలో అఫ్గాన్తో సత్సంబంధాలకు ప్రయత్నించటం అనేక విధాల శుభ పరిణామం. -
దిక్కుతోచని ఫ్రాన్స్
తీరి కూర్చుని సమస్యలు తెచ్చుకోవటంలో, ఉన్నవాటిని పెంచుకోవటంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్కు ఎవరూ సాటిరారు. స్వీయ సమర్థతపై అతిగా అంచనా వేసుకుని ఆయన తీసుకుంటున్న వరస నిర్ణయాలు ఫ్రాన్స్ను నిలువునా ముంచేశాయి. పీఠమెక్కి నిండా నెల రోజులు కాకుండానే ప్రధాని సెబాస్టిన్ లెకొర్నూ సోమవారం నిష్క్రమించటం వాటి పర్యవసానమే. లెకొర్నూ కేబినెట్ ఏర్పాటు ప్రయత్నంలో మెక్రాన్ తలదూర్చి, తన అనుకూలురకు పదవులు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కూటమిలోని ఇతర పక్షాలకు దీంతో ఆగ్రహం కలిగి బడ్జెట్కు మద్దతునీయబోమనీ, అవిశ్వాస తీర్మానం తెస్తామనీ చెప్పటంతో లెకొర్నూ రాజీనామా తప్పలేదు. మరో రెండు నెలల్లో బడ్జెట్ ఆమోదించకపోతే దేశం దివాలా స్థితిలో పడుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండగా, తదుపరి ఏం చేయాలన్నది మెక్రాన్కు సైతం బోధపడటం లేదు. కరోనా మహమ్మారి కాటేయకముందు యూరప్లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్సే. ఆ తర్వాత పల్టీలు కొట్టడం ప్రారంభమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దాన్ని మరింత దెబ్బతీసింది. జర్మనీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ ఏదోమేరకు సఫలీకృతమవుతుంటే, ఫ్రాన్స్ మాత్రం గుడ్లు తేలేస్తోంది. అక్కడ పాలన అసాధ్యమైన స్థితికి చేరుకుంది. సామాజిక అశాంతి పెరగటం, నిజ వేతనాలు పడిపోయి ఉద్యోగ వర్గాల ఆగ్రహావేశాలూ, ఉపాధి కొరవడి యువత నిరాశ, ఆకాశాన్నంటుతున్న ధరలూ, అంతంతమాత్రంగా ఉన్న మార్కెట్లూ ఫ్రాన్స్ను కుంగదీస్తుండగా పులి మీద పుట్రలా ఈ రాజకీయ సంక్షోభం ముంచుకొచ్చింది. ఫ్రాన్స్ చరిత్రలో ఇలాంటి పరిస్థితి రాలేదని కాదు. 1946–58 మధ్య ఆ దేశం 22 ప్రభుత్వాలను చూసింది. ఎవరికీ మెజారిటీ రాని దశలో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోవటమే అందుకు కారణం. పర్యవసానంగా అప్పటి అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ భవిష్యత్తులో ఇంకెప్పుడూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడకుండా నిరోధించేందుకు రాజ్యాంగాన్ని సవరించారు. అటుతర్వాత కూటమికి నాయకత్వం వహించే ప్రధాన పార్టీ మాటేచెల్లుబాటు కావటం రివాజైంది. ఇప్పుడు ఆయన్ను అనుకరించబోయి మెక్రాన్ బోర్లాపడుతున్నారు. ఫ్రాన్స్ కష్టాలకు కేవలం మెక్రాన్ ఒక్కరే కారణం కాదు. కానీ వాటిని మరిన్ని రెట్లు పెంచటంలో ఆయన పాత్ర కాదనలేనిది. 577 మంది సభ్యులుండే దిగువ సభ అసెంబ్లీ నేషనల్లో పాలక పక్షంగా అవతరించాలంటే కనీసం 289 మంది మద్దతు అవసరం. నిరుడు జూలైలో జరిగిన ఎన్నికల్లో వామపక్షాల సారథ్యంలోని న్యూ పాపులర్ ఫ్రంట్ 182 స్థానాలతో అగ్రభాగంలో ఉంది. మెక్రాన్ నాయకత్వంలోని మధ్యేవాద కూటమి ఎన్సెంబుల్కు 168 లభించాయి. వలసలను వ్యతిరేకించే తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ(ఆర్ఎన్) 143తో సరిపెట్టుకుంది. తొలి దశలో అందరికన్నా అత్యధిక శాతం ఓట్లు రాబట్టిన ఆర్ఎన్ను అధికారంలోకి రానీయకుండా రెండో దశలో వామపక్ష, మధ్యేవాద పార్టీలు అనుసరించిన సర్దుబాటు వ్యూహం ఫలించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మెక్రాన్ దీన్ని విస్మరించారు. తన విధానాలను వ్యతిరేకించే వామపక్షాలకు అధికారం అప్పగించరాదన్న కృతనిశ్చయంతో మధ్యేవాద పక్షాలతో ప్రయోగాలు మొదలుపెట్టారు. పర్యవసానంగా ఏడాదిలో ముగ్గురు ప్రధానులు వచ్చారు. పార్లమెంటు రద్దు చేయొద్దని అందరూ ఇచ్చిన సలహాను నిరుడు మెక్రాన్ బేఖాతరు చేశారు. ఎన్నికల తర్వాత మధ్యేవాద పక్షాలు పుంజుకుంటాయనీ, అప్పుడు తాననుకున్న రీతిలో పెన్షన్ల కోత, సంపన్నులకు రాయితీలు, ప్రభుత్వ వ్యయం అదుపు వగైరాలు అమలు చేయొచ్చనీ ఆయన భావించారు. కానీ అదంతా అడియాస అయింది. ఇప్పుడు నిజంగానే పార్లమెంటు రద్దు చేయక తప్పని స్థితి ఏర్పడింది. కానీ అలా చేస్తే ఆర్ఎన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి పుంజుకోవచ్చనీ, దాని ప్రభావం 2027లో జరిగే అధ్యక్ష ఎన్నికలపై పడుతుందనీ మెక్రాన్ ఆందోళన. తక్షణ కర్తవ్యమైన బడ్జెట్ ఆమోదానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఆయనకు స్పష్టత కొరవడింది. ఏతావతా ఫ్రాన్స్ కింకర్తవ్య విచికిత్సలో పడింది. -
బిహార్ ఎటువైపు?
కేంద్రంలోని పాలక పక్షం ఎన్డీయే, విపక్ష కూటమి ‘ఇండియా’ జీవన్మరణ సమస్యగా భావిస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దఫాలుగా పోలింగ్ జరగబోతోంది. 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. వీటితోపాటు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎనిమిది స్థానాలకు ఉప ఎన్నికలుంటాయి. వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఎన్నికల జాబితాను నవీకరించాక అది స్వచ్ఛంగా మారిందని జ్ఞానేశ్ ఇప్పటికే చెప్పారు. బిహార్లో ఇంతవరకూ సొంతంగా అధికారం చవిచూడని బీజేపీ ఈసారి ఎలాగైనా ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలని తహతహ లాడుతోంది. కానీ కేంద్రంలో మద్దతిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)తో ఎప్పటిలా కూటమి కట్టక తప్పలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాలను గుర్తుంచుకుంటే నవంబర్ 15 తర్వాత ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తం స్థానాల సంఖ్య 243 కాగా, అప్పట్లో జేడీ(యూ) 122, బీజేపీ 121 స్థానాలు పంచుకున్నాయి. తమకన్నా ఒక్కటి ఎక్కువిచ్చి కాబోయే సీఎం నితీశేనని బీజేపీ చాటాల్సివచ్చింది. తీరా ఎన్నికలైన రెండేళ్లలోనే... అంటే 2022 ఆగస్టులో నితీశ్ ప్లేటు ఫిరాయించి ఆర్జేడీ, కాంగ్రెస్ల మహా కూటమితో చేయి కలిపి మళ్లీ సీఎం అయ్యారు. అది ఎక్కువకాలం సాగలేదు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండగా ఇండియా కూటమిని నిరుడు జనవరిలో చావుదెబ్బతీసి మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు. ఫిరాయించిన ప్రతిసారీ సీఎం పదవికి రాజీనామా చేయటం, కొత్త కూటమి పక్షాన మళ్లీ దక్కించుకోవటం నితీశ్ ప్రత్యేకత. సాధారణ సమయాల్లో రాజకీయాలే ఊపిరిగా భావించే బిహార్ ప్రజానీకం పోలింగ్పై పెద్దగా ఆసక్తి చూపరంటే ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ సగటు పోలింగ్ శాతం ఎప్పుడూ 56 శాతం దాటలేదు. ఓటేసేవారిలో కూడా దాదాపు 60 శాతం మహిళలే. ఇది ప్రతిసారీ బీజేపీకి కలిసొస్తున్నది. క్రితంసారి ఎన్డీయేలో జేడీ(యూ) కేవలం 43 గెలుచుకుంది. బీజేపీ 74 సాధించింది. కానీ పొత్తు ధర్మానికి తలొగ్గి నితీశ్కే సీఎం పగ్గాలు అప్పగించింది. అప్పట్లో అలిగివెళ్లిన ఎల్జేపీ ఒక స్థానంమించి గెలవకపోయినా 33 చోట్ల అది జేడీ(యూ)ను దెబ్బ తీయగలిగింది. ఇప్పటికైతే ఆ పార్టీ ఎన్డీయే పంచన ఉంది.ఎంఐఎం వల్ల నష్టపోతున్నామన్నది విపక్షాల భావన. సీమాంచల్లో క్రితంసారి అది అయిదు గెల్చుకుంది. ఇక ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పార్టీ ఏ మేరకు ఓట్లు చీల్చగలదో చూడాల్సి ఉంది. బిహార్లో వామపక్షాలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీలు 16 స్థానాలు సాధించాయి. రాష్ట్రంలో నితీశ్తో కలిస్తేనే అధికారం దక్కుతుందన్న భావన అన్ని పార్టీల్లోనూ ఉంది. అందుకే ఆయన ఎటు దూకినా, తిరిగొస్తే అక్కున చేర్చుకోవటం ప్రధాన పక్షాలకు అలవాటైంది. నాలుగు దఫాలు సీఎంగా చేశాక ఇంకా ఆయనలో ఆ ‘మ్యాజిక్’ ఉందా అన్నది ఈ ఎన్నికలు తేల్చేస్తాయి. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బొత్తిగా జనాకర్షణ లేని పార్టీతో కలిసి వెళ్లినా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అద్భుతమైన పనితీరు కనబరిచారు. ఎన్డీయేతో పోలిస్తే కేవలం 16,825 ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యారు. ఈసారి ‘ఓట్ చోరీ’ ప్రచారం ప్రభావం వల్ల తన స్థితి మెరుగైందన్న భరోసాతో కాంగ్రెస్ స్వరం పెంచుతోంది. ఆర్జేడీకి అది గుదిబండగా మారుతుందా... లేక స్వీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా మెలగుతుందా అన్నది చూడాలి. సాధారణ సమయాల్లో జనాకర్షణ పథకాలు ప్రమాదమంటూ గంభీరంగా మాట్లాడే ఎన్డీయే, ఎప్పటిలాగే బిహార్లో చేతికి ఎముక లేకుండా తాయిలాలు ప్రకటించింది. గత నెలలో ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద 75 లక్షల మంది మహిళలకు రూ. 10,000 చొప్పున అందించారు. నెలకు రూ. 2,500 చొప్పున ఇస్తామన్న మహా కూటమి హామీకి ఇది విరుగుడు. ఏదేమైనా ఈసారి బిహార్ తీర్పుపై కేంద్రంలోని ఎన్డీయే కూటమి మనుగడ ఆధారపడి ఉంటుంది. అక్కడ బీజేపీ ప్రాభవం తగ్గితే జేడీ(యూ), టీడీపీలు తోకజాడించే ప్రమాదముంది. అదీగాక 2027 మార్చిలో జరిగే యూపీ ఎన్నికలపై కూడా దాని ప్రభావం పడుతుంది. ఇన్నివిధాల కీలకమైన బిహార్ ఎటు మొగ్గుతుందన్నది మరో నెల్లాళ్ల వ్యవధిలో తేలిపోతుంది. -
తవ్వుకుంటే తట్టెడు
తవ్వకం ఒక పురాతన ప్రక్రియ. నాగరికతలు మొదలైన నాటి నుంచే తవ్వకం ప్రక్రియ మనుషులకు తెలుసు. రకరకాల ప్రయోజనాల కోసం మనుషులు నేలను తవ్వుతారు. వ్యవసాయ అవసరాల కోసం; రక్షణ అవసరాల కోసం; విలువైన ఖనిజాల వెలికితీత కోసం – మనుషులకు తవ్వకం అలవాటైన పనే! చనిపోయిన మనుషుల మృతదేహా లను, జంతువుల మృతకళేబరాలను పాతిపెట్టడానికి కూడా నేలను తవ్వడం పురాతన కాలం నుంచి వస్తున్న అలవాటే!ఆధునిక కాలంలో తవ్వకాల తీరుతెన్నులు మారాయి. అమూల్య ఖనిజాల కోసమే కాదు, చారిత్రక అవశేషాల కోసం కూడా తవ్వకాలు జరపడం మొదలైంది. తవ్వకాల కారణంగానే అనేక చారిత్రక విశేషాలు బయటపడటం; ఒకప్పుడు భూమ్మీద జీవించి అంతరించిపోయిన జీవుల శిలాజాలు బయటపడటం మనకు తెలుసు. చారిత్రక, మానవ పరిణామ అవశేషాల కోసం శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. ఒక్కోచోట తవ్వుతుంటే లంకెబిందెల వంటి నిధినిక్షేపాలు బయటపడుతుంటాయి. మరొక్కోచోట తవ్వుతుంటే పురాతన కంకాళాలు బయటపడుతుంటాయి. ఏవి బయట పడినా, వాటితో పాటు చరిత్ర కూడా బయటపడుతుంటుంది. ఘనమైన కట్టడాలను నిర్మించాలంటే, పునాదుల కోసం నేలను తవ్వాలి. మృతులను పూడ్చిపెట్టాలంటే, సమాధుల కోసం తవ్వాలి. కొందరు పాలకులు సమాధులను అద్భుత నిర్మాణాలుగా తీర్చి దిద్దిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలు. అలాంటి వాటిలో ప్రపంచ వింతల్లో ఒకటిగా చెప్పుకొనే తాజ్మహల్ ఒకటి. అంతకంటే ముందు ఈజిప్టు సహా పలుచోట్ల సమాధుల మీద పిరమిడ్లు నిర్మించారు. పంటపొలాలకు నీరు పారించడం కోసం కాలువలు తవ్వుతారు. జలసమృద్ధి కోసం బావులు, చెరువులు నిర్మించడానికి కూడా నేలను తవ్వుతారు. రాతికోటలకు రక్షణ కల్పించడానికి చుట్టూ అగడ్తలను తవ్వుతారు. చరిత్రలో పేరు నిలిచిపోవాలనే కోరికతో కొందరు, మరణానంతరం పరలోకంలో అక్కరకొచ్చే పుణ్యాన్ని సంపాదించుకోవాలనే ఆశతో మరికొందరు రాజులు తమ తమ రాజ్యాలలో వాపీ కూప తటాకాదులను శక్తివంచన లేకుండా తవ్వించేవారు. సాధారణంగా నీటి అవసరాలు, రక్షణ అవసరాల కోసం మినహాయిస్తే; ఎక్కడైనా గోతులను తవ్వాక, పనులు పూర్తయిన వెంటనే వాటిని పూడ్చిపెడతారు. మన దేశంలోని పలు నగరాల్లో నగరపాలక సంస్థలు రకరకాల పనుల కోసం గోతులు తవ్వి, పనులు పూర్తయ్యాక వాటిని పూడ్చిపెట్టడం మరచిపోతుంటారు. ‘ఎవరు తవ్విన గోతిలో వారే పడతారు’ అనే సామెత ఉంది. కానీ, మన నగరపాలక సంస్థలు తవ్విపెట్టిన గోతుల్లో తరచుగా సామాన్య జనాలే పడుతుంటారు. కాబట్టి ఎవరు తవ్విన గోతిలో వారే పడతారు అనుకోవడాన్ని కేవలం ఒక అపోహగానే భావించాలి. అయితే, రాజకీయాల్లో మాత్రం గోతి కాడ నక్కల్లా మసలుకొనేవారే రాణిస్తుంటారు.చారిత్రక, శాస్త్ర పరిశోధనల్లోనే కాదు; గోతులకు, సమాధులకు భాషా సాహిత్యా ల్లోనూ ప్రాధాన్యం ఉంది. ‘అర్ధంతరంగా విప్లవాన్ని ముగించిన వాడు తన గోతిని తానే తవ్వుకున్నవాడు అవుతాడు’ అని జర్మన్ రచయిత జార్జ్ బుక్నర్ అన్నాడు. తన గోతిని తానే తవ్వుకోవడం కంటే అవివేకం మరొకటి ఉండదు. ‘గత వైభవ మార్గాలన్నీ సమా ధుల వైపే దారితీస్తాయి’ అన్నాడు ఇంగ్లిష్ కవి థామస్ గ్రే. సమాధులను తవ్వేటప్పుడే గత వైభవానికి చెందిన ఆనవాళ్లు బయటపడిన సందర్భాలు కోకొల్లలు.మానవ నాగరికత ప్రస్థానంలో ఇంతటి ప్రాశస్త్యమున్న గోతులు తవ్వే విద్యలో పోటీలు లేకపోవడాన్ని లోటుగా భావించిన హంగేరియన్లు– ఆ లోటు తీర్చడానికి సమాధుల కోసం గోతులు తవ్వే పోటీని ప్రారంభించారు. అలాగని ఇదేదో స్థానిక పోటీ కాదు, అంతర్జాతీయ పోటీ. హంగరీ శ్మశాన వాటికల నిర్వహణ సంఘం ఎనిమిదేళ్లుగా పోటీ నిర్వహిస్తూ వస్తోంది. ‘కరోనా’ కాలంలో రెండేళ్లు ఈ పోటీకి అవరోధం ఏర్పడినా, ఈ ఏడాది ఇటీవల జరిగిన పోటీల్లో లాజ్లో కిస్, రాబర్ట్ నేగీ అనే వారు శరవేగంగా నిర్ణీత కొలతల్లో సమాధి గోతిని తవ్వి విజేతలుగా నిలిచారు. -
సారీ చెప్పకుండా... సంబరాలా?
నవరాత్రి ఉత్సవాలు మొదలుకొని దీపావళి పండుగ ముగిసే వరకూ ఈ నెల రోజుల సీజన్ను ఎన్డీఏ సర్కార్ హైజాక్ చేసింది. జీఎస్టీ పేరుతో వసూలు చేస్తున్న పన్నులను హేతుబద్ధీకరణ చేయడం వల్ల పేద, మధ్య తరగతుల ప్రజలకు బాగా ఆదా అవుతుందనీ, అందువల్ల ఈ సీజన్ను పొదుపు ఉత్సవంగా పాటించాలనీ దేశ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలను కూడా ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ దీంతో పాటు మరో అంశాన్ని కూడా జోడించింది. అయితే దాన్ని అధికారిక కార్యక్రమాల్లో కలపకుండా పార్టీ వేదికల ద్వారా ప్రచారం చేసుకోవాలని సంకల్పించారు. వసూలు చేసిన కరెంటు బిల్లుల్లో యూనిట్కు 13 పైసల చొప్పున తిరిగి వినియోగదారులకు జమ చేస్తారట! దీన్నే ట్రూ–డౌన్ అంటున్నారు. ఇది చరిత్ర ఎరుగని మహత్కార్యం అన్నట్టు ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేశారు.నిజంగా ఇవి సంబరాలు చేసుకోదగిన సందర్భాలేనా? ఒంటినిండా వాతలు పెట్టి అక్కడక్కడా ఆయింట్మెంట్ రాస్తే ఉపశమనం లభించినట్టేనా! ఆ బాధితుడు అందుకు కృతజ్ఞతగా ఎగిరి గంతేసి పండుగ చేసుకోవాలా? జీఎస్టీని హేతుబద్ధం చేస్తున్నారంటే ఎనిమిదేళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం నిర్హేతు కమైనదని అంగీకరించినట్టే కదా! ఈ ఎనిమిదేళ్లుగా సాధారణ ప్రజల రక్తాన్ని తాము జలగల్లా పీల్చుకున్నామని పరోక్షంగా చెప్పినట్టే కదా! ఈ హేతుబద్ధీకరణ వలన ప్రజలకు రెండున్నర లక్షల కోట్ల మేరకు లబ్ధి జరుగుతుందని ప్రధానమంత్రి ప్రకటించారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇందులో మళ్లీ కొన్ని మెలికలున్నాయి. అందువల్ల ప్రభుత్వం చెబుతున్నంత స్థాయిలో ఉపశమనం కలుగదనే వాదన ఉన్నది. పాప్కార్న్ మీద జీఎస్టీ 5 శాతం మాత్రమే అన్నారు. కానీ బ్రాండెడ్ అయితే 12 శాతం, షుగర్ కోటెడయితే 18 శాతం జీఎస్టీ ఉంటుంది. జీవిత బీమా ప్రీమియం మీద జీఎస్టీ లేదన్నారు. కానీ అది వ్యక్తిగత బీమాలకు మాత్రమే వర్తిస్తుంది. గ్రూప్ బీమాకు జీఎస్టీ కట్టాల్సిందే. ఇలాంటివి చాలా ఉన్నాయి.స్థూలంగా పన్ను రేట్లు తగ్గడం వలన అదే నిష్పత్తిలో విని మయం కూడా పెరిగి ప్రభుత్వ ఖజానాకు వాటిల్లే నష్టం నామమాత్రంగానే ఉండబోతున్నదని ఎస్బీఐ ఇదివరకే అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే ఈ నవరాత్రి వేడుకల్లో వివిధ అంశాలవారీగా 25 శాతం నుంచి 100 శాతం వరకు గతంతో పోలిస్తే అమ్మకాలు పెరిగాయని అధికార వర్గాలను ఉటంకిస్తూ పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ ఎనిమిదేళ్లలో అమలు చేసిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధానం వల్ల ప్రజలకు జరిగిన నష్టమెంత అనేదానిపై మాత్రం ఎటువంటి సింహావలోకనం అధికారికంగా జరగలేదు. జీఎస్టీ అమలుకు ముందు సంవత్సరం అంటే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు జీఎస్టీ పరిధిలో ఉన్న పరోక్ష పన్నుల ద్వారా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వా లకు సమకూరిన ఆదాయం సుమారు 12 లక్షల కోట్లని అంచనా. ఇదే ఆదాయం 2024–25 నాటికి 22 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇందులో ఏటికేడు సహజంగా వుండే వృద్ధి కొంత ఉండవచ్చు. కాని సింహభాగం వృద్ధి మాత్రం జీఎస్టీ ద్వారా సాధ్యమైనదే.అయితే ఇంత భారీ పెరుగుదలకు కారణమెవరు? దేశంలో ఈ పదేళ్లలో శరవేగంగా పుట్టుకొచ్చిన బిలియనీర్లూ, మిలియ నీర్లా? కానేకాదు. సాధారణ పేద మధ్య తరగతి ప్రజలు కడుపు కట్టుకొని ఖజానాకు ముడుపు కట్టిన ఫలితమే ఈ అసాధారణ పెరుగుదల. ఆదాయాల్లో, ఆస్తిపాస్తుల్లో అట్టడుగున ఉండే 50 శాతం మంది పేద ప్రజలు జీఎస్టీలో 64 శాతం చెల్లిస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. వీరికంటే ఎగువన ఉండే 40 శాతం మంది జీఎస్టీ చెల్లింపుల వాటా 33 శాతం. ఇక అగ్రశేణి పది శాతం సంపన్నుల సంగతి. ఈ పదేళ్లలో వీరి సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని అనేక అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పది శాతం కుబేరులు సమష్టిగా మోస్తున్న జీఎస్టీ భారం కేవలం మూడు శాతం. యాభై శాతం మంది పేదలు 64 శాతం చెల్లిస్తుంటే 10 శాతం పెద్దలు 3 శాతం చెల్లిస్తున్నారనేది ఈ జీఎస్టీ రాజ్లో ఒక కఠిన వాస్తవం. అధికాదాయం కలిగిన వారు చెల్లించడానికి జీఎస్టీ కాకుండా వేరే పన్నులున్నాయని వాదించవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ పన్ను, అధికాదాయంపై సర్ఛార్జ్, కేపిటల్ గెయిన్స్ అంతా కలిపి సమకూరింది 11,56,000 కోట్లు. అదే సమయంలో 50 శాతం పేదలు జీఎస్టీ రూపంలో చెల్లించింది 22 లక్షల కోట్లలో 64 శాతం. అంటే సుమారు 14 లక్షల కోట్లు. మన సమాజంలో త్యాగమెవరిదో, భోగమెవరిదో చెప్పడానికి ఈ అంకెలు అద్దం పడతాయి. ఈ జీఎస్టీ కాలంలోనే దేశ ప్రజల ఆదాయాల్లో పెరుగుతున్న అసమానతలపై ఆక్స్ఫామ్ లాంటి సంస్థలు ఏటేటా సవివర మైన నివేదికలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ విష యాలకు మరో కొత్త పార్శ్వం తోడైంది. కార్తీక్ మురళీధరన్ అనే ఆర్థికవేత్త శనివారం నాటి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ఒక వ్యాసం రాస్తూ ఆదాయాల పరంగా ఇండియాను మూడు ఇండియా లుగా పేర్కొన్నారు. గతంలో లోహియా, ఫెర్నాండెజ్ వంటి సోషలిస్టులు గ్రామీణ భారత్, అర్బన్ ఇండియాలుగా రెండుగా విభజించి మాట్లాడేవారు. ఇప్పుడది మూడుకు చేరింది. ఇండస్ వ్యాలీ రిపోర్ట్ను ఉటంకిస్తూ కార్తీక్ మురళీధరన్ ఈ ప్రస్తావన చేశారు. ఇందులో ఒకటవ ఇండియా పది శాతం జనాభా గల సంప న్నులది. వీరి తలసరి ఆదాయం 15 వేల డాలర్లు. తర్వాత శ్రేణిలోని రెండో ఇండియా 20 శాతం మంది ప్రజలది. వీరి తలసరి ఆదాయం 3 వేల డాలర్లు. ఇక 70 శాతం మంది భారతీయుల ఆదాయం వెయ్యి డాలర్లు. వాళ్లే మూడో భారత్. ప్రపంచ బ్యాంకు వర్గీకరణ ప్రకారం 13,936 డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం వున్న దేశం అధికాదాయం గల దేశం కింద లెక్క. 14 కోట్లకు పైగా జనాభా ఉన్న మన ఫస్ట్ ఇండియా ఈ శ్రేణిలోకి వస్తుంది. 4,496 డాలర్ల నుంచి 13,935 డాలర్ల మధ్యన తలసరి ఆదాయం ఉండే దేశాలను అప్పర్ మిడిల్ ఆదాయం గల దేశంగా ప్రపంచ బ్యాంకు పరిగణించింది. మూడు ఇండియాల్లో ఒకటి కూడా ఈ శ్రేణిలోకి రాలేదు. లోయర్ మిడిల్ క్లాస్లోకి మన 20 శాతం జనాభా (సుమారు 30 కోట్లు) ఉన్న ఇండియా చేరింది. 1,136 డాలర్ల నుంచి 4,495 డాలర్ల తలసరి ఆదాయమున్న దేశాలు ఈ లోయర్ మిడిల్ క్లాసులోకి వస్తాయి. 1,135 డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయమున్న దేశాలు ప్రపంచ బ్యాంకు దృష్టిలో అల్పాదాయ దేశాలు, అంటే పేద దేశాలు. ఇందులోకి మన 70 శాతం (సుమారు వంద కోట్లు) జనాభా వస్తుంది. అంటే మన దేశంలోని వంద కోట్లమంది జీవన ప్రమాణాలు ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశాల ప్రజలతో ఇంచుమించు సమానమన్నమాట. ఇదిగో ఈ నిరుపేదలే గడచిన ఒక్క సంవత్సరంలో వసూలైన జీఎస్టీలో (22 లక్షల కోట్లు) అత్యధిక భాగాన్ని చెల్లించారు. ఈ ప్రజలకు ఇప్పుడు కొంత ఉపశమనం కలిగించడాన్ని స్వాగతించవలసిందే. కానీ ఈ ప్రభుత్వమే చెబుతున్నట్టు ఎనిమిదేళ్ల ‘నిర్హేతుక’ విధానానికి పేదలు చెల్లించిన మూల్యం సంగతి? కనీసం క్షమాపణలైనా చెప్పరా? పైగా పండుగ చేసుకోమనడం ఒక క్రూర పరిహాసం.ఇటువంటి పరిహాసాలు చేయడం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నాయకుడు చంద్రబాబుకు పరిపాటి. కరుడుగట్టిన పేద ప్రజల వ్యతిరేకిగా ఆయనది చెక్కుచెదరని ట్రాక్ రికార్డు. గడిచిన ఎన్నికలకు ముందు ఆయన చేసిన అనేక బూటకపు వాగ్దానాల్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తామనేది ఒకటి. కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 15,450 కోట్ల మేరకు ట్రూ–అప్ పేరుతో జనాన్ని బాదారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆమోదించిన దానికంటే విద్యుత్ కొను గోలు – పంపిణీ మీద ఎక్కువ వ్యయమైతే ఈఆర్సీ అనుమతితో పెరిగిన వ్యయానికి అనుగుణంగా ట్రూ–అప్ ఛార్జీలు వసూలు చేస్తారు. వివిధ కారణాల వల్ల ఆమోదించిన వ్యయం కంటే తక్కువ ఖర్చయినప్పుడు ఆ మిగులును వినియోగ దారులకు రీఫండ్ చేయవలసి ఉంటుంది. తొలి రోజుల్లో బాదేసిన 15,545 కోట్ల బాదుడుకు తోడు మరో విడత 2,700 కోట్ల బాదుడుకు ప్రతిపాదనలు పంపించారు. ట్రూ–డౌన్ చేయవలసిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో 1,800 కోట్ల బాదుడుకే ఈఆర్సీ అనుమతించింది. అ సొమ్మును అప్పటికే వసూలు చేసినందున 900 కోట్లు వినియోగదారులకు రీఫండ్ చేయాలని ఆదేశించింది.ఇప్పటికే వినియోగదారులపై ట్రూ–అప్ పేరుతో బాదేసి వసూలు చేస్తున్న మొత్తం 15,545 కోట్లు, ట్రూ–అప్కు అదనపు ప్రతిపాదన 2,700 కోట్లు. వెరసి 18 వేల కోట్ల పైచిలుకు. ఇందులో 900 కోట్లను రీఫండ్ చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. మొత్తం బాదుడులో ఇది ఐదు శాతం. వినియోగదారుని జేబు లోంచి రూపాయి లాగేసుకొని ఓ ఐదు పైసలు చేతిలో పెట్టి ఎంజాయ్ చేయాలని చెబుతున్నారు. మొదట్లో ఇదో గొప్ప వరంలాగా యెల్లో మీడియా, ‘దేశం’ పెద్దలు తెగ హడావుడి చేశారు. కానీ ఈఆర్సీ ఆదేశాల సంగతి బయటపడేసరికి జీఎస్టీ ఉత్స వాలలో కలపకుండా విడిగా పార్టీ వేదికల ద్వారా ఇదో అద్భుత చర్యగా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించారు. చంద్రబాబు స్వయంగా ఇది కనీవినీ ఎరుగని కార్యక్రమంగా వర్ణించు కున్నారు. ఎన్నికల హామీకి అనుగుణంగా చార్జీలను తగ్గిస్తు న్నామనీ, ఇది తమ సమర్థ నిర్వహణ ఫలితమనీ కూడా ఆయన చెప్పుకొన్నారు. వంద రూపాయలు పెంచి ఐదు రూపాయలు తగ్గించడమా ఎన్నికల హామీని నెరవేర్చడమంటే? దీన్ని సమర్థవంతమైన నిర్వహణగా పరిగణించాలా?ప్రజలకు ఇటువంటి షాకులివ్వడం పండుగ చేసుకో మనడం చంద్రబాబు సర్కార్కు అలవాటే. ఈ పదహారు మాసాల కాలంలోనే ఆయన సర్కార్ చేసిన గాయాలు పేద, మధ్య తరగతి ప్రజల నిలువెల్లా కనిపిస్తున్నాయి. చేసిన నమ్మక ద్రోహాలకు ఊరూరా శిలాఫలకాలు వేయవచ్చు. ఏటా సమారు 32 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ‘ఆడబిడ్డ’ పథ కాన్ని పూర్తిగా ఎత్తివేసి, ప్రతి నిరుద్యోగికి నెలకు 3 వేల రూపా యలు ఇస్తామన్న హామీని ఎగవేసి, మిగిలిన హామీలను అర కొరగా, అదీ ఏడాది ఆలస్యంగా ప్రారంభించి సూపర్ సిక్స్ను అమలుచేశామని చెప్పుకోగలిగిన ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది అనుకోవాలి.ఈ పదహారు మాసాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ కొలువులు తీసి ‘నరేగా’ పథకాన్ని నీరుగార్చి గ్రామీణ ఉపాధిని దెబ్బతీసినందువల్ల జరిగిన నష్టమెంత? పేద ప్రజలు కోల్పోయిన ఆదాయ మెంత? లెక్కతీయాలి కదా! ప్రజారోగ్యాన్ని పడకేయించిన కారణంగా, ఆరోగ్యశ్రీని కోమాలోకి పంపినందువల్ల, ఆరోగ్య ఆసరా గొంతు నులిమిన ఫలితంగా, అంబులెన్స్ సర్వీసులకు పెట్టిన పంచర్ల పాపం వలన పేద మధ్య తరగతి ప్రజలకు జరిగిన, జరుగుతున్న నష్టమెంత? వైద్య వ్యాపారులకు ఒన గూరిన లాభమెంత? విద్యారంగంలో గేమ్ ఛేంజర్ వంటి ‘నాడు–నేడు’ అనే బృహత్తర కార్యక్రమాన్ని నిలిపివేసి, పేద విద్యార్థులు అందుకున్న ఉన్నతమైన వసతులను ఊదిపారేసినందువల్ల ఐదున్నర లక్షలమంది పేద మధ్యతరగతి వర్గాల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లను వదిలేశారు. ఫలితంగా విద్యా వ్యాపారులకు కలిగిన లాభమెంత? పేద ప్రజలకు కలిగిన నష్టమెంత? జగన్ ప్రభుత్వం కొనసాగి వుంటే అప్పటికే పూర్తయిన పది లక్షల ఇళ్ళకు అదనంగా మరో పది లక్షలు పూర్తయ్యేవి. ఆ కుటుంబాల కలలను కాల్చేసినందుకు వారి గుండెల్లో గూడుకట్టుకున్న విషా దపు విలువెంత? 30 లక్షల మంది నడివయసు స్త్రీల చేయూతను లాగేసినందువల్ల ఆ మహిళలు చేస్తున్న ఆక్రందనను ఎలా ఉపశ మింపజేస్తారు! ఇటువంటి పర్యవసానాలు ఈ పదహారు మాసాల పాలన ఫలితంగా ఎన్నో ఉన్నాయి. అన్ని లెక్కలూ వేసి లాభపడ్డవాళ్ళను పండుగ చేసుకోమంటే బాగుంటుంది. గాయ పడిన వారితో గేమ్స్ ఆడటం అమానుషం!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎన్సీఆర్బీ చాటుతున్న నిజం
కేంద్ర హోం శాఖ పర్యవేక్షణలో జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) వెలువరించే నివేదికలు రెండు విధాల కీలకమైనవి. ఆ నివేదికలు మన సమాజం తీరుతెన్నులకు అద్దం పడతాయి. అదే సమయంలో పాలకుల సమర్థతకో, వైఫల్యాలకో ఆనవాళ్లుగా నిలుస్తాయి. మూడు రోజులనాడు విడుదల చేసిన 2023 నాటి ఎన్సీఆర్బీ నివేదికలోని గణాంకాలు దిగ్భ్రమ కలిగించేలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ జాతీయ నేర రాజధానిగా కూడా ఉన్నదని నివేదిక చెబుతోంది. అక్కడ ప్రతి లక్షమంది జనాభాకూ 1,508.9 నేరాలు జరుగుతున్నాయి. 721.7 నేరాలతో కేరళ రెండో స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో వరసగా హరియాణా, తెలంగాణ, ఒడిషా ఉన్నాయి. జాతీయ స్థాయిలో వివిధ నేరాల శాతం పెరిగితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2023లో అవి గణనీయంగా తగ్గాయని నివేదికను విశ్లేషిస్తే అర్థమవుతుంది. తాజా నివేదిక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏలుబడి సాగిస్తున్న ఎన్డీయే కూటమి పక్షాల నీతిబాహ్యతనూ, వంచననూ బజారుకీడ్చింది. జగన్ అయిదేళ్ల పాలనలో విపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనలు మైకు దొరికింది తడవుగా అబద్ధాలు వల్లెవేయటం అలవాటుగా చేసుకున్నాయి. ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకొని జనసేన నేత పవన్ కల్యాణ్, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి వగైరాలు గూడుపుఠాణి అయి ఒక పద్ధతి ప్రకారం ప్రజలను పక్కదోవ పట్టించారు. వీరికి యెల్లో మీడియా ఇతోధికంగా సహకరించింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయనీ, కల్తీ మద్యంమృతులు అపారంగా పెరిగిపోయారనీ, మహిళలు, బాలికల అదృశ్యం కేసుల సంఖ్యఆందోళనకర స్థాయిలో ఉన్నదనీ తప్పుడు లెక్కలు వల్లెవేశారు. వాలంటీర్లే మహిళలూ, బాలికలూ మాయం కావటానికి కారణమని కూడా పవన్ దుష్ప్రచారం చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు ఈ విషయం తనకు చెప్పాడని దబాయించారు. ఏకంగా 34,000 మంది ఆచూకీ లేకుండా పోయారని ఆయన చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవ మనీ, కల్తీ మద్యం మృతులు అసలు లేనేలేరనీ నివేదిక తేటతెల్లంచేసింది. ఏదో ఒకరోజు నిజానిజాలు నిగ్గుతేలుతాయనీ, అప్పుడు దోషులుగా మిగిలిపోతామనీ వీరిలో ఏ ఒక్కరికీ అనిపించలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పట్లాగే జాతీయ స్థాయిలో నేరాల సంఖ్య పెరిగిందని నివేదిక చెబుతోంది. ప్రతి లక్ష జనాభాకు 2022లో 422.2 నేరాలు జరిగితే, 2023కు అది 448.3కు ఎగబాకింది. సైబర్ క్రైం కేసులు 31.2 శాతం పెరిగితే, పిల్లలపై నేరాలు అంతక్రితంతో పోలిస్తే 9.2 శాతం మేరకు అధికమయ్యాయి. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలో అన్ని రకాల నేరాలూ గణనీయంగా తగ్గాయి. హింసాత్మక ఘటనలూ, హత్యలూ, అపహరణలూ మాత్రమే కాదు... మహిళలు, బాలికలపై నేరాలు తగ్గాయి. దేశవ్యాప్తంగా సైబర్ క్రైం కేసులు, ఆర్థిక నేరాలు పెరిగితే ఏపీలో అవి నియంత్రణలో ఉన్నాయి. అలిగివెళ్లిన లేదా అపహరణలకు గురైన బాల బాలికల కేసుల్లో 85.7 శాతం మందిని పోలీసులు సురక్షితంగా వారి వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చగలిగారు. జాతీయ స్థాయిలో ఇది 54 శాతం మాత్రమే. నేరాలకు పాల్పడేవారిపై సత్వరం తీసుకునే చర్యలవల్ల వాటి నియంత్రణ సాధ్యమవుతుందంటారు నిపుణులు. నేరం జరిగిన రెండు నెలల్లో న్యాయస్థానంలో చార్జిషీటు దాఖలు చేయటం పోలీసుల సమర్థతకు నిదర్శనం. ఆ పని జగన్ హయాంలో జరిగింది. 91.6 శాతం కేసుల్లో గడువులోగా చార్జిషీట్లు దాఖలు చేసి దేశంలోనే మూడో స్థానంలో ఉంది. జగన్ సర్కారు రూ. 15 లక్షల కోట్లు అప్పుచేసిందని బీజేపీ నేత పురందేశ్వరి చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని అప్పట్లోనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నేరాల విషయంలో సైతం వారివి తప్పుడు మాటలేనని తాజాగా రుజువైంది. నిజం బయటికొచ్చేలోగా అబద్ధం లోకాన్ని చుట్టేస్తుందని నానుడి. ఏణ్ణర్థం క్రితం అబద్ధాలు, వంచనలతో అధికారానికి ఎగబాకిన ఎన్డీయే కూటమి నిజ స్వరూపాన్ని ఇన్నాళ్లకు ఎన్సీఆర్బీ నివేదిక బట్టబయలు చేసింది. ముద్దాయిలుగా బోనులో నిలబడాల్సిన ఈ నేతలు ఇప్పుడు ‘తగుదునమ్మా’ అంటూ సైబర్ నేరాలకింద దాదాపు 2,000 మంది సామాన్యుల్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తుండటం ఒక వైచిత్రి. -
ఇప్పటికీ వీడని సందేహాలు
బిహార్లో వివాదరహితంగా, పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించాలన్న సదుద్దేశం ఎన్నికల సంఘానికి(ఈసీ)కి ఉందా? మంగళవారం విడుదల చేసిన బిహార్ ఓటర్ల తుది జాబితా గమనిస్తే ఈ విషయంలో ఎవరికైనా సంశయం కలుగుతుంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లని ఆ జాబితా ప్రకటిస్తోంది. వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట జూన్ 24న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభించే నాటికి బిహార్ ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు. అంతకు ఆర్నెల్ల ముందు ప్రకటించిన ఆ జాబితాను కాదని మళ్లీ ఆదరా బాదరాగా ఈ సవరణ దేనికని విపక్షాలు ప్రశ్నించాయి. 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, అటుపై జాబితాలోకి ఎక్కిన వారిని సంశయ ఓటర్లుగా పరిగణించి వారి నుంచి వివిధ రకాల పత్రాలు కోరటం కొత్తగా అమల్లోకి తెచ్చిన ప్రక్రియ సారాంశం. దాని ప్రకారం 1987 జూలై 1 లేదా అంతకు ముందు జన్మించినవారు జనన ధ్రువీకరణ పత్రం లేదా పుట్టిన ఊరు ధ్రువీకరణ పత్రం... లేదా రెండూ సమర్పించాలి. జూలై 1, 1987– డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు ఈ పత్రాలతో పాటు తల్లితండ్రుల్లో ఎవరో ఒకరి జనన లేదా ప్రాంత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఆ తర్వాత జన్మించిన వారు తమ ధ్రువీకరణ పత్రాలతో పాటు తల్లితండ్రులిద్దరివీ కూడా సమర్పించాలి. లేనట్టయితే జాబితాలో చోటుండబోదని ఈసీ ప్రకటించింది. సుప్రీంకోర్టు జోక్యంతో చివరకు ఆధార్ను చేర్చారు. ఆగస్టు 1న ప్రకటించిన తొలి ముసాయిదా జాబితా ఓటర్ల సంఖ్యను 7.24 కోట్లుగా ప్రకటించినప్పుడు విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆధార్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న ధర్మాసనం సూచన అమలు చేసి తాజాగా ప్రకటించిన ముసాయిదాలో కూడా సంశయాలు తప్పలేదు. 2020 జూలైలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ – జనాభా జాతీయ కమిషన్ సంయుక్తంగా విడుదల చేసిన జనాభా అంచనా నివేదిక ప్రకారం బిహార్లో 18 ఏళ్లు, అంతకుపైబడి వయసున్న జనాభా 8.18 కోట్లు. తాజా ఓటర్ల జాబితా గమనిస్తే ఇందులో 76 లక్షలమంది ఓటర్లుగా నమోదు చేసుకోలేదనుకోవాలి. అయిదేళ్లనాటి కేంద్ర నివేదిక కేవలం అంచ నాయే అనుకున్నా తాజాగా ప్రకటించిన ఓటర్ల జాబితాలోని సంఖ్య దానికి దరిదాపు ల్లోనైనా ఉండొద్దా? ఈసీ తీరుపై సంశయాలు వ్యక్తం కావటానికి మరో కారణముంది. సెప్టెంబర్ 1న గడువు ముగిసే సమయానికి ఓటర్ల జాబితాలో చేర్చమంటూ తమకు 16.93 లక్షల దరఖాస్తులు అందాయని సంస్థ స్వయంగా ప్రకటించింది. ఇకపై దరఖాస్తులు స్వీకరించేది లేదని కూడా చెప్పింది. మరి 21.53 లక్షలమంది కొత్త ఓటర్లు చేరారని ఇప్పుడెలా ప్రకటించారు? సెప్టెంబర్ 1 తర్వాత కూడా దరఖాస్తులు తీసుకున్నారనుకోవాలా?రెండింటి మధ్యా వ్యత్యాసం ఏకంగా 4.60 లక్షలుంది. మరి సంశయాలు రావా? దీనిపై వివరణనివ్వొద్దా? ఆ సంగతలా ఉంచి తొలగించిన 47 లక్షలమందిలో ఏయే కారణాలతో ఎంతమందిని తొలగించారన్న డేటా లేదు. ఈసీ అనుమానించినట్టు వాస్తవంగా ‘విదేశీయులు’గా ముద్రపడిన వారెందరు? ‘అనర్హులైన ఓటర్లు’గా పరిగణించి 3.66 లక్షలమందిని తొలగించామన్నారు. వీరంతా ‘విదేశీయులు’ అనుకోవాలా? ఏ పత్రమూ దాఖలు చేయలేని వారి మాటేమిటి? ఇక మృతులు, శాశ్వతంగా వలసపోయినవారు,రెండుచోట్ల నమోదైనవారు ఎందరన్న వర్గీకరణ కూడా లేదు. జిల్లాలవారీ డేటా సైతం ఇవ్వలేదు. పట్నా జిల్లాలో ఓటర్ల సంఖ్య 1.63 లక్షలు పెరిగిందని అక్కడి జిల్లా పాలనాయంత్రాంగం చెప్పింది. ఇతర జిల్లాల్లో తగ్గిందని చెప్పటం తప్ప వాటి వివరాలు లేవు.ఇది ఇక్కడితో ఆగిపోదు. తొలగించిన పేర్లు, కొత్తగా చేర్చిన పేర్లు విపక్షాలు జల్లెడపట్టి ఈసీ ప్రకటించిన తుది జాబితా దుమ్ము దులుపుతాయి. దేశమంతటా ‘సర్’ అమలు చేస్తామని సంబరంగా ప్రకటించటం కాదు... బిహార్లో తలెత్తుతున్న సందే హాలకు ఈసీ సమాధానం చెప్పాలి. పారదర్శకంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఈవీఎంలపై వచ్చిన సంశయాలను ఇంతవరకూ ఈసీ నివృత్తి చేయలేదు. ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను పెంచడానికి ఏం చేయబోతున్నారో చెప్పిందీ లేదు. ఈ దశలో ఈసీ చిత్తశుద్ధిని పార్టీలైనా, ప్రజానీకమైనా నమ్మగలరా? -
పాక్పై ట్రంప్ మోజు!
మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వైభవం పునరావృతమవుతుందని బహుశా పాకిస్తాన్ ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ ఊహించివుండదు. ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను స్వల్ప వ్యవధిలో మూడుసార్లు వైట్హౌస్కు ఆహ్వానించి గౌరవించటం, నాలుగు రోజుల నాడు మునీర్తోపాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాదరంగా హత్తుకోవటం పాకిస్తాన్ దృష్టిలో చిన్న విషయాలేమీ కాదు. పైగా వారిద్దరికీ ట్రంప్ నుంచి దండిగా ప్రశంసలు దక్కాయి. ఒక పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ణి కలుసుకుని మాట్లాడటం 2019 తర్వాత ఇదే తొలిసారి. అలాగని పాకిస్తాన్ను ఎప్పుడూ పూర్తిగా దూరం పెట్టింది లేదు. ప్రపంచం నలుమూలలా గాలిస్తున్న ఉగ్రవాది బిన్ లాడెన్కు పాక్ ఆశ్రయమివ్వటం వంటి ఉదంతాలు అమెరికాకు ఆగ్రహం కలిగించినా, ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి పాక్ సహకారాన్ని అమెరికా మరువదల్చుకోలేదు. అదే సమయంలో మనం నొచ్చుకోకుండా ఉండేందుకు ఆ దేశాన్ని కాస్త దూరం పెట్టినట్టు కనబడేది. ట్రంప్ తొలిసారి అధికారంలో కొచ్చినప్పుడు పాకిస్తాన్ పేరు చెబితే భగ్గుమనే వారు. అనంతరం వచ్చిన జో బైడెన్ సైతం పాకిస్తాన్ను తగినంత దూరంలోనే పెట్టారు. కానీ రెండోసారి అధికారంలో కొచ్చాక ట్రంప్ వైఖరి మారింది. భారత్ తన ఆదేశాలను శిరసా వహించటం లేదన్న అక్కసుతోపాటు స్వప్రయోజనాలపై దృష్టి పడింది. అందుకే పాకిస్తాన్కు అతిగా ప్రాధాన్యమిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.గత కాలపు చెలిమికీ, వర్తమాన సాన్నిహిత్యానికీ చాలా తేడా ఉంది. అప్పట్లో మన దేశం సోవియెట్ యూనియన్కు సన్నిహితంగా ఉండటం, తన ఒత్తిళ్లకు లొంగకపోవటం తదితర కారణాలతో ఆసియాలో అమెరికాకు పాకిస్తానే దిక్కయ్యేది. ప్రస్తుత పరిస్థితి వేరు. ట్రంప్కు ఇప్పుడు దేశ ప్రయోజనాల కన్నా స్వీయ ప్రయోజనాలే ముఖ్యం. మాజీ అధ్యక్షుడు ఒబామా మాదిరే తనకూ నోబెల్ బహుమతి వచ్చితీరాలని ఆయన పట్టు దలగా ఉన్నారు. భారత్–పాక్ యుద్ధంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఏడు ఘర్షణలు ఆపాననీ, అందువల్ల శాంతి బహుమతికి తాను అర్హుడిననీ ఆయన తరచూ చెప్పుకుంటు న్నారు. మధ్యమధ్యన మాట మార్చినా భారత్–పాక్లు రెండూ చర్చించుకోబట్టే యుద్ధం ఆగిందని ట్రంప్ స్వయంగా మూడు నాలుగు దఫాలు అన్నారు. మునీర్ సైతం ఘర్షణలు నిలపాలన్నది ఇరు దేశాల నిర్ణయమని తెలిపారు. ఇప్పుడు ట్రంప్ అబద్ధానికి పాక్ వంత పాడుతోంది. ట్రంప్ కోరుకుంటున్నవి ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఖనిజాలు ప్రధాన మైనవి. పాక్ భూగర్భంలో అపార ఖనిజ సంపద ఉంది. బంగారం, రాగి, మాంగనీస్, క్రోమైట్ వగైరా 92 రకాల ఖనిజాలు అక్కడ లభ్యమవుతాయని చైనా ఖనిజాభివృద్ధి సంస్థ పరిశోధనలు తేల్చిచెప్పాయి. ఇవిగాక ఏఐ, ఎలక్ట్రిక్ కార్లు వగైరాల్లో ఉపయోగపడే కీలక ఖనిజాలున్నాయి. ఇందులో అధికభాగం ఉగ్రవాదుల హవా సాగుతున్న బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తున్ఖ్వా ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకే ఖనిజ సంపద ద్వారా పాక్కు సమకూరే ఆదాయం 2 శాతం మించటం లేదు. నిరుడు పాకిస్తాన్ 521 ఉగ్రదాడులు ఎదుర్కొంది. అక్కడ విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఖనిజశుద్ధి పరిశ్రమలు స్థాపిస్తామంటేనే గనులు అప్పజెబుతామని పాక్ ఆశ చూపుతున్నా ఉగ్ర వాదం, విద్యుత్ సంక్షోభం కారణాలుగా చూపి ఏ దేశమూ ముందుకు రావటం లేదు. ఇప్పుడు ఆ ఖనిజ సంపదపై ట్రంప్ కన్నుపడింది. ఇదిగాక ట్రంప్ కుటుంబ భాగస్వామ్యం ఉన్న లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ నడిపే క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు పాక్ అనుమతులిచ్చింది. ఆ దేశంపై మోజు పెరగటంలో వింతేముంది?పాకిస్తాన్లో ప్రజా ప్రభుత్వం ఉండగా, ట్రంప్ దాన్ని బేఖాతరు చేసి సైనిక దళాల చీఫ్కు ప్రాధాన్యమిచ్చి వ్యవహారాలు చక్కబెట్టుకోవటం ఆందోళనకరం. పాక్ సైన్యం అమెరికా ఒత్తిడి పర్యవసానంగా గత రెండు దశాబ్దాల నుంచి ప్రభుత్వంలో ప్రత్యక్ష జోక్యాన్ని తగ్గించుకుంది. తెరవెనక మంత్రాంగానికే పరిమితమైంది. కానీ ట్రంప్ పుణ్యమా అని మళ్లీ సైన్యం ప్రభావం పెరుగుతోంది. ఇది ఆ దేశానికి మాత్రమే కాదు... పొరుగునున్న మనకు కూడా ప్రమాదకరమైన పరిణామం. మన ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు. -
కన్నీటి మడుగైన కరూర్
ఇరుకిరుకు రోడ్లు... లక్షలాదిమంది యువత ఆరాధించే తెరవేల్పు ఆగమనం... అంచనాలకు మించి వేలాదిగా తరలివచ్చిన జనం–ఒక హృదయవిదారక ఘటన చోటు చేసు కోవటానికి ఇంతకన్నా ఏం కావాలి? చరిత్ర ప్రసిద్ధిచెందిన నగరం మాత్రమే కాదు... వర్తమానంలో వేలాది కుటుంబాలకు జీవికనిస్తున్న పరిశ్రమలకు నిలయంగా కూడా ఉన్న తమిళనాడులోని కరూర్ నగరం శనివారం జరిగిన తొక్కిసలాట ఉదంతం తర్వాత పూర్తిగా విషాదంలో కూరుకుపోయింది. ఇంతవరకూ 41 మంది చనిపోగా, దాదాపు 80 మంది వరకూ గాయాలపాలయ్యారు. మృతుల్లో 10 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఉన్నారు. తల్లులు, బిడ్డలు, త్వరలో వివాహం కావలసిన రెండు జంటలు కూడా ఈ మృతుల్లో ఉండటం కలచివేసే విషయం. కొత్తగా ఏర్పాటైన తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. పదివేలమంది వస్తారంటే అనుమతినిచ్చామని, కానీ అది మూడురెట్లకు పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. జనాకర్షణ గల విజయ్ వంటి నటుడి ర్యాలీకి వచ్చే జనంపై తగిన అంచనాలు లేకపోవటం సరికాదు. మతపరమైన ఉత్సవాలు, క్రీడా సంరంభాలు, రాజకీయ పక్షాల ర్యాలీలు వగైరాల్లో అసంఖ్యాకంగా జనం పాల్గొనటం ఇటీవలికాలంలో తరచు కనబడుతోంది. ఈ ఏడాదిలో ప్రయాగ్రాజ్ కుంభమేళాతో మొదలై దేశవ్యాప్తంగా ఇంతవరకూ కనీసం అయిదారు విషాద ఉదంతాలు చోటు చేసు కున్నాయి. కానీ నిర్వాహకులు, ప్రభుత్వాలు, పోలీసులు వీటి నుంచి గుణపాఠం తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఉత్పాదక నగరమైన కరూర్లో ప్రతి శనివారం వందల సంఖ్యలో వచ్చే ట్రక్కుల ద్వారా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు సరుకు బట్వాడా అవుతుంటుంది. ఇవన్నీ ఆ ఇరుకు సందుల్లో ఆగకతప్పదు. వారాంతం గనుక కార్మికులకు వేతనాలిచ్చే రోజు కూడా అదే. అందుకోసం చేనేత, దోమతెరల పరిశ్రమల్లో, బస్సు నిర్మాణాల సంస్థల్లో పని చేసేవారు దాదాపు 50,000 మంది వస్తారు. ఇంతకుమించి జనం ఏమాత్రం పెరిగినా ఆ నగరం కిక్కిరిసిపోతుంది. టీవీకే పార్టీ స్థానిక నేతలకు దీనిపై అవగాహన ఉండకపోదు. అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీసులు సరేసరి. వారికి ఇది పూర్తిగా తెలిసి ఉండాలి. విజయ్ ప్రతి శని, ఆదివారాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు గనుక కరూర్కు ఆదివారం వస్తే మంచిదని సలహా ఇచ్చి ఉండాల్సింది. పైగా తమ అభిమాన నటుణ్ణి దగ్గర నుంచి చూడటం కోసం చుట్టుపక్కల నుంచి కూడా భారీయెత్తున ప్రజలు తరలి వచ్చారని చెబుతున్నారు. తొక్కిసలాటల ఉదంతాలు మన దేశానికి మాత్రమే పరిమితం కాదు. 2022లో దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హ్యాలోవీన్ ఫెస్టివల్లో జరిగిన తొక్కిసలాటలో 159 మంది కన్నుమూశారు. జర్మనీలోని డోజ్బర్గ్లో 2010నాటి లవ్ పెరేడ్ ఉత్సవంలో తొక్కిసలాట కారణంగా 21మంది చనిపోయారు. అయితే ఆ ఉదంతాలను లోతుగా అధ్యయనం చేసి, ఏ లోటుపాట్ల వల్ల ఆ ఘటనలు జరిగాయో నిర్ధారించుకుని వాటిని నివారించే, నియంత్రించే వ్యవస్థల్ని రూపొందించుకుంటారు. అందువల్లే అవి పునరావృతం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. కానీ మన దేశంలో ఇందుకు విరుద్ధం. జనసమ్మర్దం ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాట ఉదంతాలు ఎందుకు చోటుచేసుకుంటాయన్న అంశంపై జర్మనీకి చెందిన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అనా సీబెన్ చేసిన పరిశోధన అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఒక స్థాయి వరకూ గుంపులోని వారు వ్యక్తులుగాసంభాషణల అవసరం లేకుండానే ఇతరుల్ని అనుసరిస్తూ పోతారు. జనసమ్మర్దం పెరి గితే, అనుకోని ఘటన సంభవించేసరికల్లా భావోద్వేగాలపాలు అధికమై విచక్షణాజ్ఞానం నశిస్తుందని, తొక్కి సలాటల్లో జరిగేది ఇదేనని ప్రొఫెసర్ అనా సీబెన్ అంటారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు నటుడు విజయ్ కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఆప్తుల్ని కోల్పోయి విషాదంలో మునిగిన కుటుంబాలను ఇవేవీ ఊరడించలేకపోవచ్చు. ప్రభుత్వం పూనుకొని మృతుల కుటుంబాల్లో ఇంటికొకరికైనా శాశ్వత ఉపాధి కల్పించాలి. చిన్న చిన్న ముందస్తు జాగ్రత్తలతో ఈ మాదిరి విషాద ఘటనలను నివారించవచ్చు. ప్రభుత్వాలు ఆలోచించాలి. -
జయీభవ... విజయీభవ...
‘ఏదయా మీ దయా మా మీద లేదు... ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు’ అని స్కూలు పిల్లలు... అయ్యవార్లు తమవెంట రాగా ఇంటింటి ముందు పాడటం ముగించి, ‘జయీభవ... విజయీభవ’ అని గాఠ్ఠిగా నినదించి, సిద్ధంగా ఉంచుకున్న బాణాలను వాకిలి మీదకు సంధిస్తారు. ఆ బాణాలకు ఆకులు, పువ్వులు కట్టి ఉండటం వల్ల అవన్నీ రాలి వాకిలి ఆకుపచ్చటి కాంతులీనుతుంది. ఏ ఇల్లయినా పచ్చగా బతకడానికి మించిన విజయం ఏముంటుంది సంఘంలో? దసరా ఆకాంక్ష అది.తెలంగాణలో పండగనాడు ఆకులు నిండిన జమ్మికొమ్మను ఊరిలోకి తెచ్చి, నాటి, పూజ చేస్తారు. పూజ చాలాసేపు సాగినా ప్రజలు ఓపికగా ఉండి, ముగిశాక భక్తి ప్రపత్తులతో జమ్మి ఆకులను తీసుకుని, ఒకరికొకరు ఇచ్చుకుని అలాయి బలాయి చెప్పుకుంటారు. ఎంతో సంతోషభరితమైన సన్నివేశం అది. జమ్మి ఆకును ‘జమ్మి బంగారం’ అంటారు. పాండవులు తమ ఆయుధాలను దాచడానికి యోగ్యంగా భావించిన జమ్మిచెట్టు, జమ్మి ఆకు విజయానికీ, శుభానికీ చిహ్నం. జీవితంలో ఎదురయ్యే అపజయాలను ఎదుర్కొని జయం పొందడం, చెడును తరిమి శుభానికి స్వాగతం చెప్పడం దసరా ఆకాంక్ష.మనిషి పర్యావరణాన్ని కాపాడుకుంటే అది మనిషిని కాపాడుతుంది. భూతలం మీద ఇద్దరిదీ కదా హక్కు. దసరానాడు ఆకాశవాసం చేసే పక్షులకు కృతజ్ఞత చెప్పే ఆనవాయితీ ఉంది. తెలంగాణలో పాలపిట్టను దర్శించడం అత్యంత శుభసూచకం. పండుగ రోజు ఊరి యువకులు ఊరి చుట్టూ తిరుగుతూ, వాగులూ వంకల్లో, అడవుల వరకూ వెళ్లి కొమ్మలపై గుట్టుగా ఉన్న పిట్టలను ‘పాలా.. పాలా.. ’ అని పిలుస్తూ చప్పట్లు చరిచి ఎగిరేలా చేస్తారు. ఆ ఎగిరిన పక్షుల్లో పాలపిట్టను పోల్చి, దర్శించుకుని సంతోషపడతారు. కాని పాలపిట్ట కనపడటం అంత సులభం కాదు. విజయం మాత్రం సులభంగా దక్కుతుందా? ప్రయత్నం సాగించాలి. ఆశావహ దృక్పథంతో ప్రయత్నం సాగించమని చెప్పేది కూడా దసరా ఆకాంక్ష. తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరిస్తే ఆ పూల అమరికలోని సౌందర్యమే కడు శుభసూచకం. పూలు పూసే చెట్లున్నాయంటే ఊరిలో సజీవత, వర్ణాలు ఉన్నట్టే. ఇక బతుకమ్మ చుట్టూ తిరిగి పాటలు పాడటం జీవన భ్రమణాన్ని అంగీకరించి కొనసాగించడం. బృందం లేకుండా భ్రమణం సాగదు. సాటి మనిషిని తోడు చేసుకుని జీవనాన్ని జయించమనడం దసరా ఆకాంక్షే.‘స్త్రీలతో నాకు భయం లేదు. పురుషుడి చేతిలో మరణం లేని వరమివ్వు’ అని కోరాడు మహిషాసురుడు. ఈ పురుష అహమే మహిషత్వం. పశుత్వం. అందుకే శక్తి స్వరూపిణి అయిన జగన్మాత తొమ్మిది రోజులు పద్దెనిమిది బాహువులతో మహిషాసురుడిపై విరుచుకుపడింది. మహిషారుసురుడిని అంతమొందించడం అంటే పురుషాహంకారాన్ని అంతమొందించడం. కాని మనిషి గుణంలో మరుపు ఉంటుంది. వెనుకటి పాఠాలను మరచి పాత పాటనే పాడుతుంటుంది. అందుకే ప్రతి ఏటా నవరాత్రులు వస్తాయి. ప్రతి ఏటా స్త్రీ శక్తిని చాటుతాయి. ప్రతి ఏటా మనిషిలోని సకల అహాలను హెచ్చరిస్తాయి. ప్రకృతి ముందు మనిషి శక్తి ఏపాటి? కాస్తంత వినమ్రుడవై ఉండటం కూడా విజయమే అని చాటడం దసరా ఆకాంక్ష. పిల్లా పాప, చెట్టూ చేమా, గోడ్డూ గోదాలతో ఆకాశం నుంచి కురిసే వాన, భూమిన పండే పంట... వీటితో సుఖంగా బతకవలసిన మనిషి... అలా బతికేందుకు విశ్వగతులు, ప్రకృతి శక్తులు సకల సహకారాలు అందిస్తుండగా తల ఎగరేస్తూ తనకు తానే ఎన్నో మహిషాసురులను సృష్టించుకుంటున్నాడు. గిల్లికజ్జాలు, తకరార్లు, ఆధిపత్య ధోరణి, ఈర‡్ష్య, అసూయ, ఆడంబరం, విద్వేషం, తీవ్ర వ్యసనాలు, మూఢ విశ్వాసాలు, మూక స్వభావం... ఎన్నెన్ని ఇవాళ పచ్చటి ఇంటికి నిప్పు పెడుతున్నాయో, స్వీయ మనోదేహాలకు ఖేదం కలిగిస్తున్నాయో నిత్యం ప్రసార మధ్యమాలు చూపుతూనే ఉన్నాయి. అయినా సరే దున్నపోతు మీద వర్షం కురిసిట్టే ఉంటోంది. వివేచన లేని చోట అసురత్వం, అసురత్వం వెంట చీకటి, చీకటి నుంచి ఓటమి, ఓటమి నుంచి దుఃఖం ఈ జీవన భ్రమణమా? తీరొక్క పూల బతుకమ్మ పాట వంటి జీవన భ్రమణమా? ఏది కావాల్సింది? హేతువు కలిగిన హితంలోకి, వికాసానికి పాదుకొలిపే జ్ఞానంలోకి మనిషి జాగరూకుడై నడిచిననాడు, ఫుస్తకాన్ని జమ్మి బంగారంలా పంచుకున్ననాడు... ప్రతి జాతి ముంగిట్లోకి, ప్రతి ఇంటి వాకిట్లోకి విజయాలు పిల్లల నవ్వుల్లా వచ్చి పడతాయి. ధ్వానాలు వెల్లువెత్తుతాయి. జయీభవ... విజయీభవ! -
ఈ దుర్యోధన దుశ్శాసన పర్వంలో...
మహాభారత కథలోని గాంధారీ సుతుల్లో ఒకడికి దుశ్శాసను డనే పేరు పెట్టారు వేదవ్యాస మహర్షి. శాసనాన్ని ఖాతరు చేయనివాడని దాని అర్థం. విడమర్చి చెప్పాలంటే సంఘం కట్టుబాట్లను లెక్క చేయనివాడు, పరిపాలనా నియమాలంటే పట్టింపులేనివాడు. ఒక్క మాటలో సంఘ విద్రోహి. నేటి ప్రజా స్వామ్య వ్యవస్థలో ఇటువంటి దుశ్శాసనుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ‘గజానికో గాంధారీసుతుడు... గాంధీ పుట్టిన దేశంలో’ అనే డైలాగ్ చాలా కాలం నుంచే తెలుగునాట బాగా పాపులరయింది. ఇప్పుడీ తొండ ముదిరి ఊసరవెల్లిగా మారింది. శాసనాలు చేయవలసిన వారు, పాలకులుగా ఎన్నికైనవారు కూడా దుశ్శాసనావతారాలు ఎత్తుతున్నారు. రాజ్యాంగ నియమాలకూ, చట్టాల సంరక్షణకూ కాపుకాయవలసిన కంచే చేను మేస్తున్నది. ఈ పరిణామానికి కలత చెందినవారు ‘మన స్వాతంత్య్రం మేడిపండు, మన ప్రజా స్వామ్యం రాచపుండై’ందని కన్నీరు పెడుతున్నారు.పౌరుల ప్రాథమిక హక్కులకు అండగా నిలబడవలసిన రక్షకభటులే, వాటి భక్షక భటులుగా మారడంపై ఏపీ హైకోర్టు నిన్న ఒక అసాధారణ నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది. సవీందర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టును మఫ్టీ పోలీసులు అరెస్ట్ చేసి, తాము అరెస్టు చేయలేదని సాక్షాత్తూ ఉన్నత న్యాయ స్థానాన్నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. హైకోర్టులో ఆ విధంగా బుకాయించిన పోలీసులు అదే రోజు సాయంత్రం ఆయన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అది కూడా హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసే విధంగానే! రిమాండ్ రిపోర్టులోనూ అతని అరెస్ట్ సమయాన్ని రకరకాలుగా నమోదు చేసి హైకోర్టుకు అడ్డంగా దొరికి పోయారు. గడచిన సంవత్సర కాలంగా పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులపై కనీసం డజను సార్లు హైకోర్టు హెచ్చరికలు చేసింది. అయినా తీరు మారని పోలీసుల వైఖరిపై ఆగ్రహంతో ఉన్న న్యాయస్థానం సవీందర్ రెడ్డి సతీమణి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై చేసిన విచారణలో కూడా వారి దొంగాట తేటతెల్లమవడంతో తీవ్రంగా స్పందించింది. ఈ అరెస్ట్ వ్యవ హారంపై సీబీఐ జాయింట్ డైరెక్టర్ విచారణ జరపాలని ఆదేశించింది. రాజ్యాంగం 226వ అధికరణం కింద సంక్రమించిన అధికారం మేరకు ఈ ఆదేశాన్నిస్తున్నామని న్యాయస్థానం స్పష్టం చేసింది.పౌరుల ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం నుంచి గానీ, మరోవిధంగా గానీ ప్రమాదం వాటిల్లిందని హైకోర్టు భావించినప్పుడు జోక్యం చేసుకునే అధికారాన్ని అధికరణం 226 కల్పిస్తున్నది. దాన్ని ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో ప్రాథమిక హక్కులకు రక్షణ లేదనే అభిప్రాయం న్యాయ స్థానానికి కలిగిందని భావించవచ్చు. ఇటువంటి కేసులోనే గతంలో కేరళ ముఖ్యమంత్రి కరుణాకరన్ రాజీనామా చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎమర్జెన్సీ సమయంలో కేరళ పోలీసులు రాజన్ అనే యువకుడిని నక్సలైట్ సంబంధాలు న్నాయనే అనుమానంతో మఫ్టీలో వెళ్లి అపహరించారు. అరెస్ట్ చూపలేదు. చిత్రహింసలు పెట్టి అతడిని చంపేశారు. ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే రాజన్ తండ్రి కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు.హోంమంత్రి ఆదేశాలతోనే తన కుమారుణ్ణి పోలీసులు అపహరించారని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో కరుణాకరన్ హోంమంత్రిగా ఉన్నారు. రాజన్ను తాము అపహరించలేదని కోర్టులో పోలీసులు తప్పుడు అఫిడవిట్ వేశారు. అప్పటికే రాజన్ను చంపేసిన ఆధారాలు జన సామాన్యంలో ప్రచారంలో ఉన్నాయి. ఎమర్జెన్సీ తర్వాత ముఖ్యమంత్రి పీఠమెక్కిన కరుణాకరన్ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్లైన్ విధించి ఫలానా రోజులోగా రాజన్ను హాజరు పరచాలని ఆదేశించింది. చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేక పోవడం, ప్రజాగ్రహం వెల్లువెత్తడం, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో గద్దెనెక్కి నెల తిరక్కుండానే కరుణాకరన్ రాజీనామా చేయవలసి వచ్చింది. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన పోలీసు అధికారుల ప్రాసిక్యూషన్కు కూడా హైకోర్టు ఆదేశించింది. అదే తరహాలో ఇప్పుడు సవీందర్రెడ్డి కేసులో కూడా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం పోలీ సులు చేశారని స్పష్టమైంది.ఏపీ ప్రభుత్వం పోలీసుల్ని ఉసిగొల్పుతున్నది ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్టులపైనే కాదు, రాజకీయ ప్రత్యర్థులపైన మాత్రమే కాదు – ‘సాక్షి’ వంటి మీడియా సంస్థపై కూడా! దేశంలో మిలియన్ కాపీల సర్క్యులేషన్ దాటిన అగ్రశ్రేణి దినపత్రికల సంఖ్య అన్ని భాషల్లో కలిపి డజన్కు మించి లేదు. వాటిలో ‘సాక్షి’ ఒకటి. ఈ లెక్క ‘సాక్షి’ చెప్పేది కాదు. దిన పత్రికల సర్క్యులేషన్ల లెక్కలు తీసే ‘ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్’ (ఏబీసీ) అనే ప్రామాణిక సంస్థ చెప్పే లెక్క. అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థ కార్యాలయాల్లో అర్ధరాత్రి చొరబడి అల్లరి చేయడం, ఎడిటర్ ఇంట్లో దూరి సోదాలు చేయడం, ఎడిటర్తో సహా సీనియర్ సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టాలని చూడటాన్ని ఎలా అర్థం చేసు కోవాలి? ఈ వైఖరిని ఫాసిజమనాలా? నాజీయిజమనాలా? అధికారం తలకెక్కడమనుకోవాలా అనేది ప్రజలే నిర్ణయిస్తారు.ఇక పవిత్రంగా ఉండవలసిన శాసనసభల నిర్వహణ తీరు ఎంత శోభాయమానంగా ఉన్నదో కనిపిస్తూనే ఉన్నది. మార్గ దర్శకంగా ఉండవలసిన రూల్ బుక్ అమలులో ఉన్నదా అటక మీద ఉన్నదా అర్థం కాని పరిస్థితి. అన్ రూలీ కామెంట్స్ విశృంఖలతకు అడ్డు చెప్పే పరిస్థితే లేదు. గురువారం నాటి సభలో చంద్రబాబునాయుడు బావమరిదీ ప్లస్ వియ్యంకుడు, సినీ నటుడైన బాలకృష్ణ ఆంగిక వాచికాభినయాలు చూసిన వారికి దిగ్భ్రాంతి కలిగించాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడైన జగన్ను ఉద్దేశించి తూలిన మాట కేవలం అన్ పార్లమెంటరీ మాత్రమే కాదు. పత్రికల్లో రాయడానికి కూడా అభ్యంతరకరమైనది. ఆయనట్లా య«థేచ్ఛగా మాట తూలుతుంటే పాలకపక్ష సభ్యులు హర్షధ్వానాలు చేయడం, నవ్వడం, ముఖ్యమంత్రితో సహా పెద్దలెవరూ వారించకపోవడం, సభా ధ్యక్ష స్థానంలో ఉన్నవారు కూడా మిన్నకుండటం చూసిన తర్వాత మెదళ్లను తొలిచే మొదటి ప్రశ్న: రూల్ బుక్ ఎక్కడ?సభలో లేని ప్రతిపక్ష నేతనుద్దేశించి అవమానకరమైన రీతిలో కామెంట్లు చేస్తూ, వాటికి హర్షామోదాలు వ్యక్తం చేస్తున్న కూటమి సభ్యులు మరోపక్క ప్రతిపక్ష నేత హోదా లేకుండానే జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం వెనుక ఉన్న గూడుపుఠాణీ అర్థం కావడం లేదా? ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా రన్నింగ్ కామెంటరీతో అవమానించాలనే ఎత్తుగడ కాదా? లేకుంటే బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్ను రికార్డుల నుంచి తొలగించా లని సభ్యులెవరూ ఎందుకు కోరలేదు? స్వయంగా సభాధ్యక్షులే అప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేదు? అలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు గతంలో కోకొల్లలుగా లేవా?బాలకృష్ణ మాట్లాడటానికి ముందు బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసమే పనిచేసే నాయకులు కొందరున్నారని అందరికీ తెలిసిందే! వారిలో కామినేని శ్రీనివాస్ ముఖ్యులు. ‘సినిమా పరిశ్రమ నుంచి మాట్లాడటానికి వచ్చినవాళ్లను కలవకుండా జగన్ అవమానించారు, చిరంజీవి గట్టిగా అడగడంతో వచ్చి కలిశార’ని శ్రీనివాస్ ఆరోపించారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ జగన్పై అభ్యంతరకర పదప్రయోగం చేశారు. పనిలో పనిగా చిరంజీవిపై తనకున్న వ్యతిరేకతను కూడా బయటపెట్టుకున్నారు. ‘ఎవడూ’ గట్టిగా నిలదీయలేదంటూ ఆయన్ను కూడా అవమానించే విధంగా మాట్లాడారు. దీనిపై స్పందించిన చిరంజీవి... జగన్ తమను సాదరంగా ఆహ్వానించారనీ, ఆయనతో తాము జరిపిన చర్చల ఫలితంగానే అప్పట్లో తన సినిమా, బాలకృష్ణ సినిమాతోపాటు పరిశ్రమకు మేలు జరిగిందనీ ఒక లేఖ ద్వారా తెలియజెప్పారు. ఈ వివరణ తర్వాత విధిలేని పరిస్థితుల్లో కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్య లను రికార్డుల నుంచి తొలగించాలని శనివారం నాడు కోరవలసి వచ్చింది. కానీ, జగన్ను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ అలా కోరలేదు. సభా నాయకుడు గానీ, సభాధ్యక్షులు గానీ అటువంటి నిర్ణయం తీసుకోలేదు. జగన్ను అవమానించాలనే ఎత్తుగడతో పాలక కూటమి పని చేస్తున్నదనడానికి ఇవి నిదర్శనాలే కదా!ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే చిరంజీవిపైన బాలకృష్ణ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను జనసేన నేతలు ఎవ్వరూ ఖండించకపోవడం! పవన్ కల్యాణ్ జ్వరంతో విశ్రాంతి తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. మిగిలిన వారెందుకు మాట్లాడలేదని జనంలో చర్చ మొదలైంది. ఆ సమయంలో సభలో ఉన్న జనసేన పార్టీకి చెందిన మంత్రి కందుల దుర్గేశ్ కూడా ఏమీ స్పందించలేకపోయారు. పైగా ఎఫ్డీసీ ఆహ్వాన పత్రికలో తన పేరును తొమ్మిదో పేరుగా ‘ఎవడు’ వేశాడని దుర్గేశ్ పట్ల కూడా బాలకృష్ణ దురుసుగానే మాట్లాడారు. సినిమా రంగంలో స్వశక్తితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న చిరంజీవి ప్రస్థానంపై తొలినుంచీ బాలకృష్ణకు ఎంతో కొంత అసహనం ఉన్నదనే విషయం దాచేస్తే దాగేది కాదు.మహానటుడిగా విశ్వవిఖ్యాతి గాంచిన తండ్రిగారు ముఖ్య మంత్రి అయిన తర్వాతనే సోలో హీరోగా బాలకృష్ణ సినిమా కెరీర్ ప్రారంభమైంది. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినా అవి సోలో హీరో పాత్రలు కావు. దాదాపు బాలకృష్ణ నటజీవితంతో సమాంతరంగానే చిరంజీవి ప్రయాణం సాగింది. సినిమా పరిశ్రమలో ఎవరి అండాదండా లేకుండా, కేవలం స్వయం ప్రతిభతో దూసుకెళ్లి ఎనభయ్యో దశకం చివరి నాటికే అగ్రహీరోగా చిరంజీవి ఎదిగిపోయారు. అప్పటినుంచి ఆయన రాజకీయాల్లో ప్రవేశించే వరకు దాదాపు పదిహేను పదహారేళ్ల పాటు చిరంజీవికి గట్టి పోటీగా బాలకృష్ణే కాదు, మరే హీరో కూడా నిలవలేకపోయారు. కారణం ఏదైనాగానీ, చిరంజీవి ప్రస్తావన వచ్చిన సందర్భాల్లో వెటకారంగానో, అసహనంగానో, అతిశయంతోనో బాలకృష్ణ స్పందించడం జనం గమనించారు. ‘రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఏమయ్యాడు?’ ‘మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు’ అంటూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘లేపాక్షి ఉత్సవానికి చిరంజీవిని పిలుస్తున్నారా’ అని ఎవరో అడిగితే ‘ఎవర్నో తెచ్చి నెత్తిన పెట్టుకుంటామా?’ అని రుసరుస లాడారు. పవన్ కల్యాణ్ అభిమానుల్ని ‘అలగా జనం’గా సంబోధించడం కూడా వివాదాస్పదమైంది.అసెంబ్లీలో జగన్ను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన అభ్యంతర కరమైన వ్యాఖ్యల తర్వాత బాలకృష్ణ ‘సైకో సర్టిఫికెట్’ ఉదంతం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలకృష్ణ జరి పిన కాల్పుల్లో నిర్మాత బెల్లంకొండ సురేశ్, ఆస్థాన జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. ఆ కేసు సందర్భంగా తనకు మానసిక పరిస్థితి బాగాలేదనే ఒక ‘సైకియాట్రీ’ సర్టిఫికెట్ను కోర్టుకు సమర్పించారు. ఈ సర్టిఫికెట్ను ఏర్పాటు చేసిన డాక్టర్ కాకర్ల సుబ్బా రావును ఆ తర్వాత కాలంలో ఏబీఎన్ ఛానల్ అధిపతి రాధా కృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో బాలకృష్ణకు మీరు సాయం చేశారట గదా?’ అని రాధాకృష్ణ ప్రశ్నించారు. ‘అవును సాయం చేశాను. చాలా పెద్ద సాయం. అతడిని (బాలకృష్ణను) ఎలా బయటపడేయాలా అని ఆలోచిస్తే ‘సైకియాట్రీ’ ఆలోచన వచ్చింది. ఇద్దరు నిపుణులతో చర్చించి, ఆ సమయంలో అలా చేయకపోయి ఉంటే తనను తాను కాల్చుకునే పరిస్థితి ఉండేది అనే విధంగా సర్టిఫికెట్ ఇచ్చాం. లేకపోతే ఈ కేసులలో బయట పడేవాడు కాద’ని డాక్టర్ కాకర్ల స్పష్టం చేశారు.ఇప్పుడు ఇంకో సమస్య ముందుకు వస్తున్నది. బాలకృష్ణకు సైకో సర్టిఫికెట్ను వైద్యులు ఇచ్చిన మాట నిజం. దాన్ని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పరిగణనలోకి తీసుకొని వెంటనే బెయిల్ మంజూరు చేసిన సంగతి నిజం. భారత రాజ్యాంగం 326వ అధికరణం ప్రకారం మతిస్థిమితం లేని వాళ్లకు ఓటు హక్కును నిరాకరించవచ్చు. ఓటు వేసే హక్కే లేనప్పుడు పోటీచేసే అవకాశం ఎలాగూ ఉండదు. ఆర్టికల్ 102 (1బి) ప్రకారం మతిస్థిమితం లేని ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించవచ్చు. అయితే ఇందుకు మెడికల్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు. ఆమేరకు న్యాయస్థానం నిర్ధారించాలి. బాలకృష్ణ కేసులో మెడికల్ సర్టిఫికెట్ ఉన్నది. దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకున్న ఉదంతం కూడా ఉన్నది. ఆ తర్వాత కాలంలో చికిత్స అనంతరం ఆయన మానసిక స్థితి మెరుగైందని మళ్లీ ఓ మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నారా? అది న్యాయస్థానం దృష్టికి కూడా వెళ్లిందా అనే విషయాలపై సమాచారం లేదు. ఒకవేళ అటువంటిదేమీ జరక్కపోయుంటే ఎవరైనా పిటిషన్ వేస్తే బాలకృష్ణ శాసనసభ్యత్వం రద్దవుతుందా అనే విధంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. ఏదో అవసరార్థం సర్టిఫికెట్లు తప్ప బాలకృష్ణకు మతిస్థిమితం లేదని ఎవ్వరూ అనుకోరు. కాకపోతే ఆ ప్రచారంలో ఆయనకూ, ఆయన పార్టీ అధినేతలకూ ఓ సౌలభ్యం ఉన్నది. ఆ ముసుగులో ఎవరినైనా ఏమైనా అనేయవచ్చు. అధినేతలు అనలేని మాటలు బాలయ్య నోట అనిపించవచ్చు. ఇప్పుడు జరిగింది కూడా అదే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అసాధారణ ప్రయోగం
‘శాంతిని వాంఛించే వారు సమరానికి సర్వసన్నద్ధంగా ఉండాల’ని నాలుగో శతాబ్దంనాటి రోమన్ రచయిత వెజిటియస్ అంటాడు. రక్షణ అమ్ములపొదిలో పదునైన, శక్తిమంతమైన ఆయుధాలుంటే, అవసరం పడినప్పుడు వినియోగిస్తే శత్రువు ‘పాహిమాం’ అనక తప్పదని పాకిస్తాన్తో ఈమధ్య జరిగిన ఘర్షణలు కూడా నిరూపించాయి. ఈ నేపథ్యంలో మన రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) రూపొందించిన 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల మధ్యశ్రేణి అగ్ని ప్రైమ్ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా బుధవారం ప్రయోగించారు. అత్యాధునిక సాంకేతి కతల్ని జోడించటం, రైలు పట్టాల సదుపాయం ఉన్న ఎలాంటి మారుమూల ప్రాంతాల కైనా సులభంగా తీసుకువెళ్లగల వెసులుబాటు ఈ క్షిపణి ప్రత్యేకత. మన రక్షణ సన్నద్ధతపై చాన్నాళ్లుగా రక్షణరంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. యూపీఏహయాంలో అయితే కుదిరిన ప్రతి రక్షణ ఒప్పందంపైనా, కొనుగోళ్లపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. అప్పటి రక్షణ దళాల చీఫ్ జనరల్ వీకే సింగ్ నేరుగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ కూడా రాశారు. అప్పట్లో రక్షణరంగ పరిశోధనలూ, ఆవిష్క రణలూ లేకపోలేదు. ఆత్మనిర్భర్ భారత్ భావన తర్వాత ఇవి మరింత వేగంగా విస్తరించాయి. ఇప్పటికీ రక్షణ కొనుగోళ్లు తప్పడం లేదు. మన రక్షణ బడ్జెట్లో 36 శాతం విదేశీ కొనుగోళ్లకు వెచ్చిస్తున్నాం. కానీ అగ్ని ప్రైమ్ వంటి మెరికల్లాంటి ఆయుధాలు మన సత్తా చాటుతున్నాయి. మున్ముందు వేరే దేశాలపై మనం ఆధారపడే అవసరం ఉండబోదన్న భరోసానిస్తున్నాయి. యుద్ధాల తీరుతెన్నులు ఊహకందనివిధంగా మారాయి. ఒకప్పుడు భారీ ఆయు ధాలూ, పెనువేగంతో దూసుకెళ్లి శత్రువును దెబ్బతీయగలిగే యుద్ధ విమానాలూ ప్రధాన పాత్ర పోషించేవి. ఇప్పుడది మారింది. తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్కు ఆయుధాలు అనుసంధానించి, కృత్రిమ మేధ(ఏఐ) జోడిస్తే చడీచప్పుడూ లేకుండా శత్రు దేశంలో కీలక స్థావరాలను సునాయాసంగా ధ్వంసం చేయటాన్ని, భారీ నష్టం కలిగించ టాన్నీ ఉక్రెయిన్ యుద్ధంలో గమనించవచ్చు. ఏఐను జోడించటం వల్ల అవి పరస్పరం సమన్వయం చేసుకుంటూ గమ్యం చేరగానే తమను మోసుకెళ్లిన విమానం నుంచి వాటంతటవే విడివడి మిడతల దండులా శత్రులక్ష్యంపై దాడి చేయటం అసాధారణం. ఈ రంగంలో డీఆర్డీవో వంటి సంస్థలు ఇప్పటికే ఎంతో ముందుకెళ్లాయి. రోబోటిక్స్, సైబర్ వార్ఫేర్ తదితర రంగాల్లో సైతం ప్రగతి సాధించాయి. 2022 నాటికే మన దేశం ఏఐ ఉత్పత్తులు, సాంకేతికతలకు సంబంధించి 75 కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చింది. శత్రుదేశం నుంచి వచ్చిపడే డ్రోన్లూ లేదా విమానాలను మధ్యలోనే అడ్డగించే సాంకే తికత, ఏం జరుగుతున్నదో అంచనాకొచ్చి తగిన విధంగా స్పందించే వ్యవస్థలూ రక్షణా వసరాల్లో వినియోగంలోకొచ్చాయి. మానవరహిత యూఏవీలు గూఢచర్యం, దాడి చేయటం, అవసరమైన సామగ్రి మోసుకెళ్లడం వగైరాలు చేస్తున్నాయి. జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (ఎన్టీఆర్వో) ఎలక్ట్రానిక్స్ రంగంలో శత్రుదేశం కమ్యూనికేషన్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయగల సీ4ఐఎస్ఆర్ వంటి అత్యాధునిక సెన్సర్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. వాటిని ఆపరేషన్ సిందూర్లో రాఫెల్ యుద్ధ విమానాలకూ, తేజస్ విమానా లకూ అనుసంధానించటం వల్లనే మన సైన్యానిది పైచేయి అయింది. 2022–23తో పోలిస్తే 2023–24లో మన రక్షణ ఉత్పత్తుల విలువ రూ. 1.27 లక్షల కోట్లకు చేరింది. ఈ క్రమంలో అగ్ని ప్రైమ్ క్షిపణి కీలక మలుపు. యుద్ధ సమయాల్లో క్షిపణుల వికేంద్రీకరణకు అగ్ని ప్రైమ్ అక్కరకొస్తుంది. అయితే మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తేనే దీనికి సార్థకత. రైల్వే ట్రాక్లో 70,000 కిలోమీటర్లతో ప్రపంచంలో మనం నాలుగో స్థానంలో ఉన్నాం. దీన్నింకా విస్తరించాలి. చివరి నిమిషం వరకూ శత్రువు కంటబడకుండా ఈ క్షిపణుల కోసం సొరంగాలు అవసర పడతాయి. నిధుల లేమిని ఎదుర్కొంటున్న డీఆర్డీవో, ఇస్రో, ఎన్టీఆర్వో వగైరాలకు కేటాయింపులు పెంచితే మరిన్ని అద్భుతాలు సాధ్యమవుతాయి. మన రక్షణ రంగం మరింత బలోపేతమవుతుంది. -
లద్దాఖ్ జనఘోష
అలజడి రేగినప్పుడూ, అశాంతి జాడలు కనబడినప్పుడూ సకాలంలో దాన్ని చక్క దిద్దటమే పాలకుల ప్రథమ కర్తవ్యం కావాలి. వేరే దేశాలతో సరిహద్దులున్న ప్రాంతాల్లో ఇది మరింత అవసరం. ఆ దృష్టి లేకపోవటం వల్లే చైనా సరిహద్దుల్లో ఉన్న లద్దాఖ్లో సాగుతున్న ఉద్యమం అదుపు తప్పి హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయాన్ని దగ్ధం చేయటంతో పాటు కొన్ని వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. ఇళ్లు, దుకాణాలపై దాడులు చేశారు. సీఆర్పీఎఫ్ కాల్పుల్లో నలుగురు మరణించారు. కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. 2019లో జమ్మూ–కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, జమ్మూ, కశ్మీర్ను చట్టసభ గల కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్ను చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినప్పుడు ఈ ఆందోళనకు బీజం పడింది. లద్దాఖ్ను రాష్ట్రం చేసి చట్ట సభ ఏర్పాటు చేయాలని, ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ను తమకూ వర్తింప చేయాలని లద్దాఖ్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని 244వ అధికరణం కింద ఉన్న ఆరో షెడ్యూల్ పరిధిలోకి లద్దాఖ్ను తీసుకొస్తే శాసన, న్యాయ, పాలనాపరమైన నిర్ణయాలు తీసుకొనే స్వయంపాలిత జిల్లా మండళ్లు ఏర్పడతాయి. అవి లేనట్టయితే పరిశ్రమల స్థాపన పేరిట భూములు బయటివారికి పోతాయనీ, వారి ప్రాబల్యం పెరుగుతుందనీ ఉద్యమకారులు చెబుతున్నారు. గత అయిదేళ్లుగా ఎంతో శాంతియుతంగా ఉద్యమం కొనసాగుతోంది. దీనికి లేహ్ అపెక్స్ బాడీ (ఎల్ఏబీ), కార్గిల్ డెమాక్రటిక్ అలయెన్స్ (కేడీఏ) నాయకత్వం వహిస్తున్నాయి. ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాటిని స్వప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూసేవారు ఎప్పుడూ ఉంటారు. అలాంటి శక్తులకు అవకాÔ¶ మీయరాదనుకుంటే సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. లద్దాఖ్ ఉద్యమ డిమాండ్లు చూస్తే అవి గొంతెమ్మ కోరికలేమీ కాదని తెలుస్తుంది. ఈ ప్రాంత యువతకు ప్రభుత్వో ద్యోగాల్లో అన్యాయం జరగకూడదనుకుంటే లద్దాఖ్కు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జమ్మూ–కశ్మీర్లో భాగంగా ఉన్నప్పుడు అక్కడి సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలుండేవి. కేంద్రపాలిత ప్రాంతమైనాక అది కాస్తా పోయింది. మూడేళ్ల పాటు నిరుద్యోగులు ఆశగా ఎదురుచూశాక కేంద్ర సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) రంగంలోకి దిగింది. కానీ ఆ ప్రక్రియ ఒక కొలిక్కి రావటానికి ఎంతో సమయం పట్టింది. నిరుడు ఎస్సెస్సీ 797 పోస్టుల భర్తీకి ప్రకటనిస్తే 30,000 మంది దరఖాస్తు చేశారు. 2021–22, 2022–23 మధ్య పట్టభద్రుల్లో నిరుద్యోగిత ఒక్కసారిగా 16 శాతం పెరిగింది. పలువురికి వయఃపరిమితి దాటింది. దానికి తోడు స్వయంపాలిత మండళ్లు రెండున్నా... వాటిలో స్థానికేతర అధికారుల హవా నడుస్తోంది. సహజంగానే రాజకీయ వ్యవస్థకు చోటు లేదు గనుక పార్టీలు సైతం ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నాయి. లద్దాఖ్కు రాష్ట్ర ప్రతిపత్తితో పాటు దాని పరిధిలోని లేహ్, కార్గిల్లకు రెండు పార్లమెంటరీ స్థానాలు ఇవ్వాలని ఉద్యమకారులు కోరటం గమనించదగ్గది.భౌగోళికంగా పర్వతప్రాంతం, తీవ్ర వాతావరణ స్థితిగతుల వల్ల అక్కడ పరిశ్రమల స్థాపనకు వచ్చేవారు తక్కువ. 13 గిగావాట్ల సౌరశక్తి ప్లాంట్కు లేహ్లోని పాంగ్ ప్రాంతంలో అనుమతించారు. కానీ దానికి దాదాపు 80 కిలోమీటర్ల ప్రాంతం కావాలి. ఈ ప్రాజెక్టు వస్తే పశుపోషణపై, సంచారజాతుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుందనీ, జీవిక దెబ్బతింటుందనీ ఉద్యమకారుల ఆరోపణ. అసలే పర్యావరణం క్షీణించి అకాల వర్షాలూ, అత్యధిక ఉష్ణోగ్రతలతో హిమానీనదులు కొడిగడుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిశ్రమలు అవసరం లేదన్నది వారి వాదన. ఉద్యమకారుల డిమాండ్లలో హేతుబద్ధమైన వాటిని తక్షణం పరిష్కరించటం, మిగిలినవాటిపై పరిశీలనకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయటం అవసరమని ఇప్పటికైనా పాలకులు గ్రహించాలి. ఉద్యమ నాయకుడు సోనమ్ వాంగ్చుక్కు చెందిన స్వచ్ఛంద సంస్థపై వెంటనే చర్యలు మొదలుపెట్టడం సబబేనా? హింసకు ఆయనే కారకుడని తేలితే వేరే విషయం. తగిన విచారణ జరిగితే అన్నీ బయటికొస్తాయి. ఉద్యమం మరింత తీవ్రం కాకూడదనుకుంటే అంతవరకూ ఓపిక పట్టడం అత్యవసరం. -
ట్రంప్ అధికప్రసంగం!
అమెరికా అధ్యక్షుడై ఎనిమిది నెలలు దాటుతున్నా అధ్యక్ష ఎన్నికల మనఃస్థితి నుంచి డోనాల్డ్ ట్రంప్ ఇంకా బయటపడినట్టు లేరు. అడ్డగోలు హామీలూ, ఆర్భాటపు ప్రకటనలూ, స్వోత్కర్షలూ, శాపనార్థాలూ ఏ దేశ ఎన్నికల ప్రచార సభల్లోనైనా రివాజు. కానీ న్యూయార్క్లో మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ సందర్భంలో అవన్నీ ట్రంప్ నోట వినబడ్డాయి. 150 దేశాల అధినేతలూ, వారి ప్రతినిధులూ ఇందులో పాల్గొంటున్నారు. తనకిచ్చిన 15 నిమిషాల వ్యవధిని అతిక్రమించి ట్రంప్ దాదాపు గంటసేపు వారినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగం ఆద్యంతం గమనిస్తే ఆయన అమెరికా అధ్యక్షుడిగా కాక వ్యక్తిగత హోదాలో మాట్లాడారని, సభాసదులు ఓటర్లనే భావనలోనే ఆయనున్నారనిపిస్తుంది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వైఫల్యాలను ప్రస్తావించటం మొదలుకొని, తాను సాధించాననుకుంటున్న విజయాలను ఏకరువు పెట్టడం వరకూ ఆయన దేన్నీ వదల్లేదు. పర్యావరణం, పునర్వినియోగ ఇంధన వన రులు వగైరాలన్నీ మోసగాళ్ల పన్నాగమని ట్రంప్ నిశ్చితాభిప్రాయం. వాటిని అమలుచేసే వాళ్లంతా బుద్ధిహీనులని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతలను తగ్గించటంలో, యుద్ధా లను నివారించటంలో సమితిసహా అన్ని సంస్థలూ విఫలమైతే, తాను ఒంటిచేత్తో ఏడు యుద్ధాలను ఆపానని ప్రకటించుకున్నారు. యధావిధిగా భారత్–పాక్ యుద్ధం కూడా ఈ జాబితాలో వుంది. దీంతో సహా ఆయన ప్రస్తావించిన ఏ అంశానికీ ఆధారాల్లేవు.ఏటా సెప్టెంబర్లో సమితి సర్వసభ్య సమావేశాలు జరగటం, ధరిత్రి ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించటం ఆనవాయితీ. ఈసారి సంస్థ 80వ సంస్థాపక దినోత్సవం సమీపిస్తున్నందున ‘కలిసుంటేనే మెరుగ్గావుంటాం’ అనే అంశం ప్రాతిపదికగా ‘శాంతి, అభివృద్ధి, మానవహక్కులు’ తదితర విషయాలపై అధినేతలంతా ప్రసంగించాలి. ప్రాతి పదిక అంశం మొదలుకొని దేనిపైనా ట్రంప్కు ఏకీభావం లేదు. అసలు ఆయన వ్యవహరిస్తున్న తీరుకూ, అక్కడ చర్చిస్తున్న అంశాలకూ చుక్కెదురు. మానవ నాగరికతా ప్రస్థానానికి మూలకారణమైన వలసలంటేనే ఆయనకు ఏహ్యభావం. సరిహద్దుల్ని మూసివేసి, బయటివారు రాకుండా కట్టడి చేయాలని యూరప్ దేశాలకు ఆయన హితబోధ చేశారు. స్వాభిమానంగల దేశాలన్నీ తమ సంస్కృతి, సంప్రదాయాలతో, మతంతో సంబంధంలేనివారి నుంచి ప్రజలనూ, సమాజాలనూ రక్షించుకునే హక్కుండాలని ఆయన చెప్పిన మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఆయన పూర్వీకులు జర్మన్ సంతతివారు. అసలు అమెరికాయే వలసదారుల దేశం. ఆ వలసదారులు పొట్టపోసుకోవడానికి వచ్చిన వారు కాదు. మూలవాసులైన అనేక జాతుల వారిని సమూలంగా తుడిచిపెట్టినవారు. మొన్నీమధ్యే బ్రిటన్ వెళ్లి ఘనమైన రాజవంశ ఆతిథ్యం స్వీకరించి, ఆ దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్ సమితి ప్రసంగంలో మాత్రం దాన్ని దుయ్యబట్టారు. వలసలను అడ్డుకోలేక పోతున్నదని ఆ దేశంపై ట్రంప్ అభియోగం. చట్టబద్ధ వలసలను సైతం నేరంగా పరిగణించటం, వేరే దేశాల వారెవరూ వుండటానికి వీల్లేదన్న రీతిలో మాట్లాడటం ఆశ్చర్యకరం. ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ తాను హెచ్1బి వీసాతోనే వచ్చానని స్వయంగా ప్రకటించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ చీఫ్ సుందర్ పిచాయ్లు సైతం ఆ వీసాతో ప్రవేశించినవారే. ఈ ముగ్గురూ లక్ష కోట్ల డాలర్ల టర్నోవర్గల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. అమెరికా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. అయినా ట్రంప్కు వలసలు ససేమిరా ఇష్టం ఉండవు. గతకాలపు అమెరికా అధ్యక్షుల ఆచరణ ఎలావున్నా ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో వారి ప్రసంగాలు గంభీరంగా ఉండేవి. ఈ ప్రపంచానికి చోదకశక్తి తామేనన్న అభి ప్రాయం కలిగించటానికీ, తమతోనే భవిష్యత్తుందని చెప్పటానికీ ప్రయత్నించేవారు. ట్రంప్ అందుకు భిన్నం. ప్రపంచదేశాలపై నిందలేయటం, అమెరికా కష్టాలకు వారంతా కారణమన్నట్టు మాట్లాడటం ఆయనకు రివాజు. ఆయన తాజా ప్రసంగం కూడా ఆ కోవ లోనే సాగింది. తమ మాట చెల్లుబాటు కావటంలేదన్న ఉక్రోషంతో ఆయన సమితిని డొల్లసంస్థగా అభివర్ణించారుగానీ...నిజానికి దాని ఉన్నత లక్ష్యాలకు గండికొట్టి, ఆ సంస్థను నామమాత్రావశిష్టం చేసింది అమెరికాయే. -
పాలస్తీనాకు ప్రపంచం ఆసరా
‘అమెరికా సొమ్ముతో, బ్రిటన్ ఆయుధాలతో ఉగ్రవాదాన్ని ఆసరా చేసుకుని యూదులు పాలస్తీనా దేశంలోకి చొరబడి అక్కడ దేశాన్ని నిర్మించుకుంటామనటం ఏం న్యాయం? నాజీల చేతుల్లో అనుభవించిన దుర్దశ వారికి శాంతి పాఠాలు నేర్పితే సర్వులూ సంతోషించేవారు’ –ఇజ్రాయెల్ ఆవిర్భావానికి అగ్రరాజ్యాలు బాటలుపరుస్తున్నప్పుడూ, యూదు ఉగ్రవాదులు మానవబాంబులుగా మారి విధ్వంసం సృష్టిస్తున్నప్పుడూ మహాత్ముడు తన ‘హరిజన్’ పత్రికలో రాసిన వ్యాసంలోని వాక్యాలివి. ఏడున్నర దశాబ్దాలుగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న విధ్వంసం, జనహననం మరిన్ని దేశాల కళ్లు తెరిపించాయి. పాలస్తీనాను ప్రపంచపటం నుంచి తుడిచిపెట్టడానికి ఉవ్విళ్లూరుతూ గాజా స్ట్రిప్లో అమా నుష హత్యాకాండకు పాల్పడుతున్న ఇజ్రాయెల్కు చెంపపెట్టులా పాలస్తీనాను లాంఛనంగా గుర్తిస్తున్నట్టు పది దేశాలు ప్రకటించాయి. బ్రిటన్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియాలు ఆదివారం... ఫ్రాన్స్, మరో అయిదు దేశాలు ఆ మరునాడూ ఈ గుర్తింపు ప్రకటన చేశాయి. ఇప్పటికే భారత్ సహా 147 దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. దీంతో ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాల్లో 80 శాతం పాలస్తీనాను గుర్తించినట్టయింది. రెండు దేశాల ఉనికిని గుర్తిస్తూ, పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటూ సమితి నిర్వహించిన ఉన్నత స్థాయి అంతర్జాతీయ సదస్సులో 33 దేశాల ప్రతినిధులు ప్రసంగించారు. ఇప్పటికే 65,300 మంది పౌరులను హతమార్చి, గాజాను మరు భూమిగా మారుస్తున్న ఇజ్రాయెల్ ఆగడాలను ఖండించిన ఈ నిండు సభకు గైర్హాజరు కావటంద్వారా అమెరికా తన నైజాన్ని చాటుకోగా, ఇజ్రాయెల్కు మొహం చెల్లలేదు.పాలస్తీనాను గుర్తించటమంటే ఉగ్రవాద సంస్థ హమాస్కు బహుమతి ఇచ్చినట్టేనన్న ఇజ్రాయెల్, అమెరికాల తర్కం అర్థరహితమైనది. శాంతియుతంగా పాలస్తీనా కోసం పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఓ)ను బలహీనపరచటానికి 1987లో హమాస్ ఆవిర్భావానికి లోపాయకారీగా మద్దతునిచ్చింది ఇజ్రాయెలే! దాని కనుసన్న ల్లోనే జనంలో పలుకుబడి పెంచుకుని, మరో సంస్థ ఫతాపై పైచేయి సాధించి, చివరకు 2007లో గాజాలో పాలనా బాధ్యతలు చేపట్టిన హమాస్ ఉగ్రవాద విధానాలను మెజారిటీ ప్రజలు మొదటి నుంచీ వ్యతిరేకించారు. ఎంతో పకడ్బందీగా ఉండే ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థ కన్నుగప్పి 2023 అక్టోబర్ 7న 1,200 మంది పౌరులను కాల్చిచంపి, 240 మందిని అపహరించటం వెనక కూడా ‘ఏదో జరిగిందన్న’ అనుమానాలు అనేక మందిలో ఉన్నాయి. ఆ సంగతలా ఉంచి హమాస్ దాడిని ఆసరా చేసుకుని సాధారణ ప్రజానీకంపై బాంబుల వర్షం కురిపించి వేలాదిమందిని హతమార్చటం, ఆహార పదార్థాలూ, నీళ్లు అందకుండా చేసి ఆకలిమంటల్లో ఆహుతి చేయటం ఏ విధంగా సమర్థనీయం? ఇజ్రాయెల్ ఆగడాలను ప్రశ్నించినప్పుడల్లా అక్టోబర్ 7 ఘటన మాటేమిటని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమాయకంగా అడుగుతున్నారు. ఆయనకు ముందున్న జో బైడెన్ ఇదే తర్కంతో ఇజ్రాయెల్ దుర్మార్గాలకు మద్దతునిచ్చారు. అమెరికాలో ఉన్న యూదు ఓటుబ్యాంకుకు ఆశపడి అక్కడి పాలకులు ఇజ్రాయెల్ సాగిస్తున్న ఆగడాలకు డబ్బూ, ఆయుధాలూ సమకూరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో అమెరికా ఏకాకి అవుతున్నదని మరుస్తున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పని చేసి మానవ హక్కుల కోసం, ముఖ్యంగా మహిళల, పిల్లల హక్కుల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న నవీ పిళ్లై ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ అధ్యక్షురాలిగా ఇటీవల సమర్పించిన నివేదికలోని వివరాలు దిగ్భ్రాంతి గొలుపుతాయి. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, ప్రధాని నెతన్యాహూ, మాజీ రక్షణమంత్రి యోవ్ గాలెంట్, ఇజ్రాయెల్ సైన్యం నరమేధం అనదగ్గ చర్యలకు పాల్పడ్డారని ఈ కమిషన్ నిర్ధారించింది. దీని ఆధారంగా అంతర్జాతీయ న్యాయస్థానం నరమేధం జరిగిందని ప్రకటించాల్సి ఉంది. వచ్చే నెలలో 80వ వార్షికోత్సవం జరుపుకోబోతున్న ఐక్యరాజ్యసమితి నిస్సహాయంగా మిగిలిపోవటం ప్రపంచానికి పొంచివున్న పెనుముప్పును తెలియజెబుతోంది. దౌత్యపరంగా ప్రపంచ దేశాలన్నీ తీసుకొస్తున్న ఒత్తిళ్లు ఫలించి కనీసం ఈ దశలోనైనా ఇజ్రాయెల్ దుర్మార్గాలు నివారించలేకపోతే భవిష్యత్తరాలు క్షమించవు. -
ట్రంప్ తెచ్చిన తంటా!
ఎవరి అంచనాలకూ అందకుండా ప్రవర్తిస్తూ అయోమయానికి గురిచేయటంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధహస్తుడు. ఆర్నెల్లక్రితం రెండోసారి అధికారంలో కొచ్చింది మొదలు తీసుకుంటున్న విపరీత నిర్ణయాల మాదిరే హెచ్1బీ వీసా ఫీజు దాదాపు లక్ష డాలర్లు చేసి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల నిపుణుల ఆశలను భగ్నం చేశారు. ఈ వీసా లబ్ధిదారుల్లో అత్యధికులు భారతీయులని తెలిసే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతం హెచ్1బీ వీసాదారులు 7,30,000 మందిలో దాదాపు 71 శాతం మంది భారతీయులు. ఇప్పటికే మన సరుకులపై సుంకాల మోత మోగించి భిన్నరంగాల కార్మికుల పొట్టగొట్టిన ట్రంప్, ఇప్పుడు ఐటీ, ఫార్మా,సాంకేతిక రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న అత్యంత నైపుణ్యంగల ఇంజనీర్ల ఆశలు అడియాసలు చేశారు. మొదట ఫీజు పెంపుపై చేసిన అస్పష్ట ప్రకటన అమెరికాలోని భారతీయుల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. పండగ కోసం స్వస్థలాలకు చేరుకుంటున్న వేలాదిమంది మార్గమధ్యంలో వెనుదిరిగే ప్రయత్నం చేయగా, అలాంటివారిని మరింత ఇబ్బంది పెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ట్రంప్ కనుసన్నల్లో పనిచేసే ‘మాగా’ ఉద్యమకారులు విమానాల్లో భారీయెత్తున సీట్లు బ్లాక్ చేసి టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటేలా చేశారు. అసలు జరుగుతున్నదేమిటో అర్థంకాక అమెజాన్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలన్నీ ఆదివారం మధ్యాహ్నం గడువు ముగిసే వేళకు వచ్చితీరాలని సందేశాలు పంపటంతో స్వస్థలాలకొచ్చినవారంతా ఉన్నపాటున బయల్దేరారు. అంతా అయిన తర్వాత ఈ పెంపు కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందంటూ, అది కూడా వార్షిక ఫీజు కాదు... ఒక్కసారి కట్టాల్సిన రుసుమేనంటూ వైట్హౌస్ అధికార ప్రతినిధి తీరిగ్గా ప్రకటించారు. పైగా రెండు మూడేళ్లలో వీసాను నవీకరించుకోవాల్సినవారికి కూడా ఇది వర్తించబోదని చెప్పారు. కానీ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఛాంబర్ ఆఫ్ ప్రోగ్రెస్ సంస్థల ప్రతినిధుల ప్రకటనలు గమనిస్తే ఇప్పటికీ దిగ్గజ సంస్థల్లో ఏర్పడిన అయోమయం పోలేదని అర్థమవుతుంది. అసలు ఇప్పుడు చెప్పిన మాటకు ట్రంప్ కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ కూడా లేదు.తీరికూర్చుని నిందలేయటానికి తప్ప వలసదారుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కొచ్చిన నష్టం లేశమాత్రమైనా లేదు. అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలు కొల్లగొట్టిందీ లేదు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందన్న ఉద్దేశంతోనే ఆ కట్టుకథను మాగా ప్రచారంలో పెట్టింది. ప్రారంభంలో వలసదారులు తక్కువ వేతనానికి చేరినా త్వరలోనే తమ నైపుణ్యంతో, చురుకుదనంతో అక్కడివారితో సమానంగా వేతనం అందుకుంటున్నారు. నిజానికి ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల మాట అటుంచి చిప్ డిజైన్,క్లౌడ్ కంప్యూటింగ్, పెనువేగంతో విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) తదితర ప్రాజెక్టుల్లో సమర్థంగా పనిచేసే చాలినంతమంది స్థానిక నిపుణులు దొరకటం అక్కడి సంస్థలకు అసాధ్యం. ఏఐలో అమెరికాను చైనా దాటిపోతోందన్న వార్త ఇప్పటికే అక్కడి పరిశ్రమల్ని కలవరపెడుతోంది. దాన్ని మరింత పెంచటం, చివరకు అమెరికా వెనకబాటుకు కారకుడు కావటం మినహా ట్రంప్ సాధించేదేమీవుండదు. వలసదారుల వల్ల అమెరికా పొందిన లబ్ధి అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఎక్కడా లేనంత సంపద పోగు పడటానికి వలసదారులే కారణం. 1990–2000 మధ్య నోబెల్ సాధించిన శాస్త్రవేత్తల్లో 26 శాతంమంది వలసదారులు. ఇప్పుడు ప్రముఖ కంపెనీలుగా ఉన్న సంస్థల వృద్ధి వెనక 25 శాతం వలసదారులే ఉన్నారు. తన విపరీత నిర్ణయాలు అనుద్దేశిత పర్యవసానాలకు దారి తీస్తాయన్న ఎరుక ట్రంప్కు లేకుండా పోయింది. తాజా పెంపు నిర్ణయాన్ని న్యాయస్థానాలు తప్పుబట్టి తాత్కాలికంగా నిలిపేయవచ్చంటున్నారు. ఆ సంగతెలావున్నా ట్రంప్ సృష్టించిన అనిశ్చితి పర్యవసానంగా స్థానిక కంపెనీలు తమ కార్యక్షేత్రాలను వేరే దేశాలకు తరలిస్తాయి.దాంతోపాటు వృత్తిరంగ నిపుణులు, విద్యార్థులు ఇతర దేశాల వైపు దృష్టి సారిస్తారు. ఇదంతా అమెరికాకే నష్టం. మన ప్రభుత్వం మెరుగైన విధానాలతో ముందు కొస్తే, ఆ ప్రతిభా సామర్థ్యాలకు ఆసరాగా నిలిస్తే ఆ చర్య దేశాభివృద్ధికి దోహదపడుతుంది. -
దయనీయుడు కాకూడదు!
‘మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయు’డంటాడు కవి ఆరుద్ర ఒక సినీ గీతంలో! సందేహమేముంది? ఆయనే అన్నట్టు, మంచిని తలపెడితే మనిషికి అడ్డే లేదు, దివిజ గంగ భువి దించిన భగీరథుడు మానవుడే, సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే; చంద్రలోకమైన, దేవేంద్రలోకమైన బొందితో జయించి భువికి తిరిగి రాగలిగినవాడూ మానవుడే! కానీ, అంతటి మహనీయుడు కూడా ఒక్కోసారి దయనీయుడైపోతాడు. ఎంతో ముందుకు చూడగలిగి కూడా తరచూ హ్రస్వ దృష్టికి లోనవుతాడు. పదిమందికీ మంచిని తలపెట్టేవాడు కూడా స్వప్రయోజనాన్ని మరిగి చివరికి సొంతానికే చేటు తెచ్చుకుంటాడు. సర్వతోముఖ వికాసం మనిషికి వరమే కానీ, తనకు తనే చెరుపు చేసుకునే బహుముఖ వైఫల్యం పెనుశాపం. అసాధారణ వర్షాల కారణంగా హిమాలయ ప్రాంత రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. హఠాత్తుగా అతివృష్టి, మెరుపు వరదలు, మట్టిపెళ్ళలు విరిగిపడటం వగైరా ఉత్పాతాల కారణంగా ఈ సంవత్సరం ఇప్పటికి దాదాపు మూడు వేల మంది మరణించారు, లక్షల కోట్ల విలువైన ఆస్తినష్టం సంభవించింది. అడ్డూ అదుపూ లేని పట్టణాభివృద్ధి, అడవుల నిర్మూలన, రోడ్ల నిర్మాణం, విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అభివృద్ధి చర్యలను ఇందుకు కారణంగా పర్యావరణ వాదులు ఎత్తిచూపుతున్నారు. ఇటువంటివి లేని రోజుల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగిన సంగతిని కొందరు ఉదాహరిస్తున్నారు. కారణమేమైనా ప్రాణనష్టం, ఆస్తినష్టం కళ్లముందు కటిక నిజాలు. పటిష్ఠమైన ముందస్తు హెచ్చరిక యంత్రాంగాన్ని ఇప్పటికీ ఏర్పరచుకోలేక పోవడం – దీనంతటి వెనుకా మహనీయుడైన మానవుడి పరంగా చెప్పుకోవలసిన ఒకానొక వైఫల్యం. దీనికితోడు, దేశంలో ప్రకృతి విపత్తులకు గురికాగల ప్రాంతాల గురించిన గణాంకాలు గుండె గుభేలుమనిపిస్తాయి. ఏకంగా 27 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ఇందులోకి వస్తాయి. వ్యవసాయ యోగ్యమైన 68 శాతం భూమి ఏ క్షణంలోనైనా అనావృష్టికి గురికావచ్చు, 15 శాతం ప్రాంతంలో ఉన్నట్టుండి రాళ్ళవర్షం కురవచ్చు, 12 శాతం ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించవచ్చు. ఈ విపత్తులు ఏటా పెరగడమే తప్పే తగ్గే అవకాశం లేదట! శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిలో మానవుడి బుద్ధి ఎంతో చురుగ్గా పని పనిచేయడం ఎంతైనా శ్లాఘనీయమే; అభివృద్ధిని ప్రజలకు మరింత సుఖమయ జీవన యోగ్యంగా మలచే దిశగా శరవేగంతో కదలడమూ అభినందనీయమే; కానీ, దానిని అంటిపెట్టుకుని వచ్చే సమస్యల నివారణలో మాత్రం అతని అడుగు చురుగ్గా పడటం లేదు. దాంతో అభివృద్ధి అస్తవ్యస్తానికీ, అభద్రతకూ చిరునామా అవుతోంది. దేశంలోని మహా నగరాలలో రోడ్ల పరిస్థితే ఇందుకు మరో ఉదాహరణ. ఆయా నగరాలలో జనాభా పెరుగుదలా, కొత్త జనావాసాల విస్తరణా, రాకపోకల అవసరాలూ, వాహనాల పెంపూ విమాన వేగాన్ని అందుకున్నాయి; కానీ, ఆ దామాషాలో రోడ్ల నిర్వహణా, ఇతర వసతుల కల్పనలో ప్రభుత్వాల ప్రణాళికలు ఎడ్లబండి వేగంతో నడుస్తున్నాయి. అనేక నగరాలలో రాకపోకల రద్దీ ఎంతటి సమస్యాత్మక స్థాయికి చేరిందంటే, జనం గంటల తరబడి కాలాన్ని ట్రాఫిక్ జామ్ లోనే గడపవలసి వస్తోంది, ఎంతో విలువైన ఉత్పాదక సమయం రోడ్లపాలైపోతోంది. రకరకాల జీవనోపాధి పనుల మీద తిరిగే జనాలను అది మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురిచేసి ఆర్థిక సమస్యలతోపాటు ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది తొలి అయిదారు మాసాల్లోనే దేశవ్యాప్తంగా నగరాల రోడ్లపై సంభవించిన దుర్ఘటన మరణాలు వేలసంఖ్యను దాటిపోయాయి. అయినాసరే, పౌరరవాణా సదుపాయాల అభివృద్ధీ వగైరాలు కాగితాల దశను దాటి కార్యరూపం ధరించడానికి ఏళ్లూపూళ్లూ పట్టిపోతోంది. మొత్తంమీద కవి చెప్పినట్టు గ్రహరాశుల నధిగమించి ఘనతారల పథము తొక్కగలిగిన మహనీయుడే తన లోకాన్ని సర్వతోభద్రంగా మార్చుకోవడంలో విఫలమవుతున్నాడు. మనిషి జైత్రయాత్రలో ఎక్కడో అడుగు తడబడి అపజయపు దారి పడుతోంది. తనను దయనీయుడిగా రూపుకట్టే ఆ తడబాటును సరిదిద్దుకుని మహనీయుడన్న ఖ్యాతి నిలుపుకోవడం మనిషి తక్షణావసరం -
గద్దల రాజ్యం ప్రైవేట్ లిమిటెడ్!
‘‘నెహ్రూ ఒక ఫ్యూడల్. ఆయనకు బాగా డబ్బులున్నాయి. లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఆయన ఏ గేట్ దగ్గరికి వెళ్తే అక్కడికో కారు వచ్చేది. ఆయన అనుసరించిన విధానాల వలన సింగపూర్తో మనం పోటీపడలేక పోయాము. సింగపూర్ తొలి ప్రధాని లీ క్వాన్ యూ పోటీదారి ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి అభివృద్ధి చేశారు. నెహ్రూ వల్ల మనం సింగపూర్తో పోటీపడలేకపోయాము.’’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆయనకు బాకా ఊదే మీడియాలో రిపోర్టయింది.బ్రిటిష్ వలస పాలన సంకెళ్లు తెగగొట్టడానికి మొట్ట మొదటిసారిగా లాహోర్ కాంగ్రెస్ సభలో ‘పూర్ణ స్వరాజ్’ శంఖా రావం చేసినవాడు నెహ్రూ. తొలి ప్రధానిగా పంచవర్ష ప్రణాళి కలు వేసి నవభారత సౌధ నిర్మాణానికి ఇటుకలు పేర్చిన వాడాయన. అంతర్జాతీయ వేదికపై రష్యా – అమెరికా కూటము లకు దీటుగా ప్రవర్ధ స్వతంత్ర దేశాలను కూడగట్టి ‘అలీనోద్య మా’న్ని నిర్మించిన ప్రపంచస్థాయి నేత నెహ్రూ. అటువంటి నెహ్రూ గురించి ఐఏఎస్ శిక్షణ పొందిన వారికి తాను చెప్పేది తప్ప ఇంకేమీ తెలియకపోవచ్చనుకోవడం బాబు ఆత్మవిశ్వాసా నికి ఓ మచ్చుతునక అనుకోవాలి.ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అనేక గేట్లుంటాయి. ఆయన ఏ గేటులోంచి బయటికి వస్తారో తెలియదు గనుక ప్రతి గేటు దగ్గరా ఒక కారుండేదని బాబు చెబుతున్నారు. అంత డబ్బున్న వాడు గనుక ఆయన ‘ఫ్యూడల్’ అంటున్నారు. బాగా డబ్బున్న వాళ్లను ‘ఫ్యూడల్స్’ అనాలేమో! ఈ థియరీ ప్రకారం బోలెడంత డబ్బున్న ఎలాన్ మస్క్, అంబానీ వంటి వాళ్లంతా పెద్దపెద్ద ఫ్యూడల్స్ అనుకోవాలి. బాబు ప్రేమించే సింగపూర్లో పెద్దసంఖ్యలో బిలియనీర్లు, మిలియనీర్లు ఉన్నారు కాబట్టి అక్కడున్నది ఫ్యూడల్ వ్యవస్థేమో! సరే, ఈ జ్ఞానామృత సేవనాన్ని పక్కన బెడితే... నిజంగానే నెహ్రూ సంపన్నుడు. ఆయన తండ్రి మోతీ లాల్ నెహ్రూ ఒక విజయవంతమైన న్యాయవాదిగా రెండు చేతులా ఆర్జించారు. అలహాబాద్ (ప్రస్తుత ప్రయాగ్రాజ్)లో ప్యాలెస్ లాంటి ‘ఆనందభవన్’ను నిర్మించుకున్నారు. అనంతర కాలంలో ఆ ప్యాలెస్ స్వాతంత్య్రోద్యమానికీ, కాంగ్రెస్ కార్యకలా పాలకూ కేంద్ర స్థానంగా మారింది.లండన్లో నెహ్రూ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రతిష్ఠాత్మకమైన హారో స్కూల్లో జరిగింది. కాలేజీ చదువు ట్రినిటీ కాలేజీలో! ఇది కేంబ్రిడ్జి యూనివర్సిటీలో భాగం. ఆక్స్ఫర్డ్ కాదు. తర్వాత బారిస్డర్ శిక్షణ కూడా నెహ్రూ తీసుకున్నారు. చంద్రబాబు చెప్పిన ‘గేటుకో కారు’ అనే చందమామ కథను ఎక్కడి నుంచి సంగ్రహించారో తెలియదు. ప్రామాణిక గ్రంథాల్లో ఈ కథ ఎక్క డైనా ఉన్నదేమో అది చదివినవాళ్లే చెప్పాలి. బాబు జ్ఞానబోధ విన్న ఐఏఎస్లు, అధికారులంతా చరిత్ర ప్రసిద్ధిగన్న నెహ్రూ ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ పాఠాన్ని చదివే ఉంటారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి అర్ధరాత్రి జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ స్వాతంత్య్రో ద్యమ లక్ష్యాల సాధన కోసం భారత్ మేల్కొంటున్నది. పేదరికం లేని, అసమానతలకు తావు లేని, రోగాలు రొష్ఠులెరుగని, అజ్ఞా నాన్ని పారదోలే వ్యవస్థను నిర్మించుకోవడమే జాతి లక్ష్యమ’ని నెహ్రూ ప్రకటించారు. ఇందులో ‘ఫ్యూడలిజం’ ఎక్కడ ఉన్నదో, పెత్తందారీతనమెక్కడ ఉన్నదో అధికారులే వెతికి పట్టుకోవాలి. సువిశాలమైన, వైవిధ్యభరితమైన, బహుళ సంస్కృతుల నిలయ మైన, అత్యధిక జనాభా కలిగిన భారత్ అభివృద్ధి గమనాన్ని ఒక చిన్న సిటీ స్టేట్ సింగపూర్తో పోల్చడం ఏ రకంగా విధాయకమో విజ్ఞులైన అధికారులు గ్రహించే ఉంటారు.ప్రభుత్వ ఉద్దేశాలను వివరించడానికి, ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కార్యోన్ముఖులను చేయడానికి కలెక్టర్ల సమావేశాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇటువంటి అధికారిక సమావేశాలను రాజకీయ వేదికలుగా మార్చడం తగునా? దేశ తొలి ప్రధానిని కించపరిచే ఉపన్యాసాలు చేయడం సమంజసమేనా? నెహ్రూ అమలు చేసిన డెమోక్రటిక్ సోషలిస్టు విధానాలు ప్రైవేట్ వ్యాపా రులకు ఊడిగం చేసే నేటి పాలకులకు నచ్చకపోవచ్చు. కానీ, వారసత్వంగా వచ్చిన విలాసవంతమైన జీవితాన్ని కాలదన్ను కొని స్వాతంత్య్రోద్యమంలో ఒక ముఖ్య సేనానిగా పాల్గొని పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపిన త్యాగధనుడిగానైనా ఆయన్ను గుర్తించి గౌరవించాలి కదా! ‘సంఘ్ పరివార్’కు ఆది నుంచి నెహ్రూతో సిద్ధాంతపరమైన విభేదాలున్నాయి. చాలా కాలంగా అధికారంలో ఉండి అన్ని హంగులూ అమర్చుకున్నందువల్ల నెహ్రూ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని కేంద్ర సర్కార్ పెద్దయెత్తున చేపట్టింది.వాళ్లను సంతృప్తి పరిచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములు ఒకరితో ఒకరు పోటీపడు తున్నట్టున్నారు. బీజేపీ వాళ్లను మించి వీర సనాతనవాదిగా చలామణీ కావడానికి ఇటీవల పవన్ కల్యాణ్ పడిన పాట్లను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. నెహ్రూ విధానాల మీద నిందా ప్రచారం చేయడానికి బీజేపీ వాళ్లు రకరకాల వేదికల్ని ఉపయోగించుకున్నారే గాని, చంద్రబాబు మాదిరిగా ఐఏఎస్ల సమావే శాన్ని మాత్రం ఉపయోగించుకున్నట్టు లేదు. ఈ రకంగా బాబు వాళ్లకు ఓ కొత్త దారిని చూపించాడనుకోవాలి. చంద్రబాబు పార్టీతో అంటకాగే అలవాటున్న ఆంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండించకపోవడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.ఇంతకూ బాబు చెబుతున్నట్టు దేశంలో అభివృద్ధి రాహిత్యా నికి కారణమైన నెహ్రూ విధానాలేమిటి? రెండు శతాబ్దాల వలస దోపిడీ అనంతరం భారత్ ఆర్థికంగా చిక్కి శల్యమైంది. యూరప్ పారిశ్రామిక విప్లవం తర్వాత దేశంలో కొత్తగా పరిశ్రమలు రాకపోగా పాతకాలపు పరిశ్రమలు, చేతివృత్తులు మూల పడ్డాయి. బ్రిటన్కు ముడిసరుకుల పంపిణీ చేసే దేశంగా మిగిలి పోయింది. ఫలితంగా స్వదేశీ పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి చెందలేదు. అందువల్ల భారీ పరిశ్రమల్ని, రైల్వేలు, నీటిపారు దల ప్రాజెక్టుల వంటి వాటిని ప్రభుత్వమే తలకెత్తుకోవలసి వచ్చింది. స్వదేశీ పెట్టుబడిదారీవర్గం నిర్వహించగలిగిన పరిశ్ర మల స్థాపనకు వారికి అనుమతులివ్వడం జరిగింది. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం పక్కపక్కనే పనిచేయడం వల్ల ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రత పెరిగింది. మెరుగైన వేతనాలు, సౌకర్యాలు పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థల వల్ల ఒక కొత్త మధ్యతరగతి వర్గం తయారైంది.కాలక్రమంలో ప్రైవేట్ రంగంలో పరిశ్రమల స్థాపనకు లైసెన్స్రాజ్, రెడ్ టేపిజమ్ ఆటంకంగా మారాయనే విమర్శలు మొదలయ్యాయి. నిజంగానే ఆ కాలంలో (1947–1991) ఆర్ధిక వృద్ధి రేటు నాలుగు శాతానికి మించి పెరగలేదు. ఫలితంగా ఉద్యోగాల కల్పన మందగించింది. అయితే ఇందుకు ప్రభుత్వ రంగం కారణం కాదు. కాలానుగుణంగా ప్రభుత్వాలు వ్యవహ రించి ఎగుమతి దిగుమతుల్లో ప్రొటెక్షనిస్టు పద్ధతులను సంస్కరించి, కొంతమేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించి, లైసెన్స్ రాజ్ – రెడ్ టేపిజాలను నియంత్రించి ఉంటే సరిపోయేదనే అభిప్రాయాలున్నాయి. కానీ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన తర్వాత విచ్చలవిడిగా ప్రైవేటీకరణ చేయడమే అభివృద్ధి రహస్యమన్నట్టుగా కొందరు దళారీ రాజకీయవేత్తలు పరుగులు తీస్తున్నారు. వీళ్లకు చైనా విజయగాథ వినిపించదు. ప్రభుత్వ రంగమే ఆధిపత్యం వహిస్తూ ప్రభుత్వ నియంత్రణకు లోబడి ప్రైవేట్ పెట్టుబడి పనిచేస్తున్న ఈ ఆర్థిక వ్యవస్థ సృష్టించిన అద్భుతాలు చంద్రబాబు వంటి వారికి కనిపించవు.ప్రైవేటీకరణ అనేది భారీగా కమీషన్లు పిండుకునే కామ ధేనువుగా సంస్కరణానంతర కాలపు రాజకీయవేత్తల్లో కొందరికి కనిపించింది. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే (1995–2004) ఏకంగా 56 ప్రభుత్వ రంగ సంస్థ లను కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. ఇందులో 20 సంస్థల్లోనే 400 కోట్లు వెనకేసుకున్నారని ఆ రోజుల్లోనే సీపీఎం పార్టీ ఆధారాలతో సహా నిరూపించింది. ఇది పాతికేళ్ల కిందటి సంగతి. ఇప్పుడా విలువ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆల్విన్ భూములు, రిపబ్లికన్ ఫోర్జ్, నిజాం షుగర్స్ నాలుగు యూనిట్లు, మరో అరడజన్ షుగర్ మిల్లులు, నూలు మిల్లులు అస్మదీయులకు కారుచౌకగా కట్టబెట్టిన జాబితాలో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు వైఖరిలో ఏ మార్పూ రాలేదు. ఇప్పుడు ఏకంగా పది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఆయన తెగబడ్డారు.ఒక్కో కాలేజీకి ఖరీదైన 50 ఎకరాల స్థలంతోపాటు నిర్మా ణాలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఏటా ఐదువేల రూపా యల నామమాత్రపు ధరకు 66 ఏళ్లపాటు వాటిని బినామీలకు లేదా కమీషన్లకు కట్టబెట్టబోతున్నారు. ఇది ప్రైవేటీకరణ కాదు. పీపీపీ మోడల్ అని ప్రభుత్వ పెద్దలు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. పేరులోనే తేడా! సారం మాత్రం ఒకటే. ఆ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉన్నట్టయితే పేద, మధ్యతరగతి విద్యార్థులు వారి డాక్టర్ చదువుల కలను సాకారం చేసుకొని ఉండేవారు. ఇప్పుడు లక్షలు పోసి కొనగలిగిన వారికే మెడికల్ సీట్లు. అనుబంధంగా ఏర్పడే పెద్దాసుపత్రుల్లో పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా ఉన్నత స్థాయి వైద్యం లభించేది. ఇప్పుడా వైద్యాన్ని కూడా కొనుక్కోవాలి. ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యను కూడా ఎన్డీఏ ప్రభుత్వం, యెల్లో మీడియా అభివృద్ధికర చర్యగా ప్రచారం చేసుకోవడాన్ని బరితెగింపు వ్యవహారంగానే పరిగణించాలి.ఆర్థిక సంస్కరణల తర్వాత పెరిగిన జీడీపీ వృద్ధి రేటు గురించి, ఉద్యోగాల గురించి పుంఖానుపుంఖాలుగా ప్రచార సాహిత్యం అందుబాటులో ఉన్నది. నిజమే, జీడీపీ వృద్ధి రేటు అంతకుముందున్న 4 శాతం నుంచి 6 శాతానికి ఎగబాకింది. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం వల్లనే ఇది సాధ్యమైందనే దండోరా కూడా వేస్తున్నారు. మరి పెరుగుతున్న ఆర్థిక అసమాన తల సంగతి? అసమానతలు పెరగడం అభివృద్ధికి సూచిక అను కోవాలా? మానవాభివృద్ధి సూచీలో మనం ఎక్కడున్నాం? స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో, 1950 దశకం ఆరంభంలో మన దేశంలో ఉన్న అగ్రశ్రేణి 1 శాతం (జనాభాలో) శ్రీమంతుల సంపద మొత్తం జాతి సంపదలో 13 శాతంగా ఉండేది. మూడు దశాబ్దాల తర్వాత (1982) అది 5 శాతానికి పడిపోయింది. ఈ ఒక్కశాతం శ్రీమంతులకు వారి దిగువశ్రేణిలో మరో 10 శాతం సంపన్నులను కలిపితే జాతి సంపదలో వారి వాటా 37 శాతంగా (1952) ఉండేది. మూడు దశాబ్దాల తర్వాత అది 30 శాతానికి తగ్గింది. అదే సమయంలో జనాభాలోని అట్టడుగు 50 శాతం జనాభా వాటా స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో 5 శాతంగా ఉంటే ముప్పయ్యేళ్ల తర్వాత అది 9 శాతానికి ఎగబాకింది. ఇది అభివృద్ధి నిరోధక పరిణామం?!ప్రైవేటీకరణల కాలం లెక్కలు కూడా చూద్దాం. ఈ లెక్క లన్నీ ప్రపంచ అసమానతల డేటా బేస్ (డబ్ల్యూఐడీ)లోవి. ఇప్పుడు మన అగ్రశ్రేణి ఒక్క శాతం శ్రీమంతుల సంపద జాతి సంపదలో 40 శాతానికి చేరింది. ఇది కదా అభివృద్ధి! వీరికి తర్వాత శ్రేణిలోని పది శాతం సంపన్నులను కూడా కలిపితే వారి ఉమ్మడి సంపద 66 శాతానికి చేరుకున్నది. ఇక మిగిలిన అట్టడుగు 50 శాతం జనాభా ఉమ్మడి వాటా జాతి సంపదలో 3 శాతానికి పడిపోయింది. రెండు శతాబ్దాల బ్రిటిష్ వలస దోపిడీ అనంతరం ఈ వాటా 5 శాతంగా ఉండేది. ఈ పరిణామాన్ని కూడా అభివృద్ధే అందామా?తెలుగువారి సెంటిమెంట్స్తో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్ర సర్కార్ పూర్తిగా సహకరిస్తున్నది. తాజాగా 22 కీలక విభాగాలను ప్రైవేటీకరించడమే దానికి తార్కాణం. పాడి రైతులకు మేలు చేస్తున్న ‘అమూల్’కు పొమ్మనకుండా పొగబెట్టారు. ప్రభుత్వ రంగంలో ఉన్న 22 టూరిజం హోటళ్లను ప్రైవేటీకరిస్తున్నారు. ఆ శాఖ పరిధిలో ఉన్న పదివేల కోట్ల ఆస్తు లను కూడా కట్టబెడుతున్నారు. ఇకమీదట రాష్ట్ర పరిధిలోని రోడ్లను కూడా పీపీపీ మోడ్లో అభివృద్ధి చేస్తారట! అంటే పల్లె రోడ్ల మీద కూడా టోల్ కట్టాలన్నమాట. దేవాలయాల భూముల్ని కూడా వదిలిపెట్టడం లేదు. కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే సిద్ధాంతకర్తలు గద్దెలపై కూర్చున్నారు. జాతి సంపదలో నానాటికీ తమ వాటాను కోల్పోతున్న పేద ప్రజల కోసం ‘ఇంటికో జోలె’ పథకాన్ని అమలు చేస్తారట. దానికి ‘నాలుగు పీ’ల పథకంగా నామకరణం చేశారు. కొంతమంది సంపన్నుల ఇళ్లను వారికి కేటాయిస్తారు. కేటాయించిన ఇళ్ల ముందే పేదలు అడుక్కోవాలి. బౌండరీలు దాటకూడదు. పేదల జీవితాలను, ఆత్మగౌరవాన్ని కూడా ప్రైవేటీకరిస్తున్నారు. బహుజనులారా... బహుపరాక్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
నైపుణ్యానిదే భవిత
చాన్నాళ్ల క్రితం ‘మీ పిల్లల్ని ఏం చదివిద్దామనుకుంటున్నార’ని తల్లిదండ్రుల్ని అడిగితే వైద్య విద్యనో, సాంకేతిక విద్యనో సమాధానంగా వచ్చేది. 90వ దశకానికల్లా సాంకేతిక విద్యే తారక మంత్రమైంది. పట్టా రావటానికి ముందే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఖాయమయ్యేది మరి. ఇప్పుడంతా తారుమారైంది. సాంకేతిక విద్య కిక్కిరిసి అవకాశాలు అంతంత మాత్రం అయ్యాయి. చదువుతోపాటు సాంకేతిక నైపుణ్యాలగురించి అడగటం మొదలైంది. ప్రస్తుతం కృత్రిమ మేధ(ఏఐ)లో నైపుణ్యం ఏమిటన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. దశాబ్దం క్రితం నైపుణ్యాల విషయంలో మన సాంకేతిక పట్టభద్రులు వెనకబడి ఉన్న మాట వాస్తవమే అయినా ఇప్పుడంతా మారిందని తాజాగా విడుదలైన ‘ఇండియా స్కిల్స్ నివేదిక 2025’ చెబుతోంది. దాని ప్రకారం 54.8 శాతం మంది పట్టభద్రులు ఉద్యోగార్హులు. చూడటానికి ఇది ఎక్కువేం కాదన్న అభిప్రాయం కలగొచ్చు. కానీ పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 20 పాయింట్లు అధికం. గతేడాదితో పోల్చినా మూడు పాయింట్లు అధికం. విద్యారంగానికీ, పారిశ్రామిక రంగానికీ అనుసంధానం పెరగటం వల్ల ఇదంతా సాధ్యమైందని ఆ నివేదిక అంటున్నది. ముఖ్యంగాఇంటర్న్షిప్లు విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవాలనిచ్చి వారిని ఉద్యోగాలకుసంసిద్ధం చేస్తున్నాయని చెబుతోంది. కానీ ప్రభుత్వాలు విద్యకు ఇవ్వాల్సినంత ప్రాము ఖ్యత ఇస్తున్నాయా? ఫీజు రీయింబర్స్మెంటువంటి పథకాలను పకడ్బందీగా అమలు చేసి పేద పిల్లలకు సాంకేతిక విద్య అందుబాటులోకి తెస్తున్నాయా? మన సాంకేతిక విద్యారంగం ప్రపంచ శ్రేణితో పోటీ పడాలంటే మరింత వేగంగా కదలాల్సి ఉంటుంది. అందులో అన్ని వర్గాల భాగస్వామ్యం పెంచాల్సి ఉంది. ఈమధ్యే విడుదలైన నాల్స్కేప్ సంస్థ నివేదిక 2028 నాటికి తయారీ రంగ పరిశ్రమలో సాంకేతిక నైపుణ్య లేమి వల్ల ప్రపంచ వ్యాప్తంగా 24 లక్షల ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతాయని తెలిపింది. దీన్ని సరిదిద్దకపోతే 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం తప్పదని హెచ్చరించింది. తయారీ రంగంలో అత్యధిక పరిశ్రమలు ఉద్యోగార్థుల చదువుతోపాటు వారికున్న భిన్న రకాల నైపుణ్యాలేమిటని చూస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ ఆధారిత సామర్థ్యాలు, సీఎన్సీ ఆపరేషన్స్, ఆటోమేషన్ సిస్టమ్స్ ఇంటెగ్రేషన్, డేటా ఎనలిటిక్స్, డిజిటల్ ట్విన్ టెక్నాలజీస్, హ్యూమన్–మెషీన్ ఇంటర్ఫేస్ డిజైన్ వగైరాలకు అపారమైన డిమాండ్ ఏర్పడబోతోంది. సాఫ్ట్వేర్ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్ వగైరాలు అవసరమవుతాయి. సిబ్బందికుండే నైపుణ్యాలే విజయానికి బాటలు వేస్తాయి గనుక ఎంపికలో వాటినే ప్రధానంగా చూస్తామని 94 శాతం సంస్థలంటున్నాయి. అవసరాలకు అనుగుణంగా తగిన నైపుణ్యాలను పెంపొందించుకునే వారికే, ప్రపంచ స్థాయిలో పోటీపడగల వారికే ఏ పరిశ్రమల్లోనైనా ఉద్యోగాలు భద్రంగా ఉంటాయన్నది ఆ నివేదిక సారాంశం. కానీ మన సాంకేతిక విద్య ఈ స్థాయికి చేరుకుందా... విద్యాసంస్థలు ఇందుకనుగుణమైన సాంకేతికతను విద్యార్థులకు సమర్థంగా అందించగలుగుతున్నాయా అనే సందేహాలున్నాయి. మన దేశానికుండే ప్రత్యేకతేమంటే ప్రస్తుతం ఇక్కడ పనిచేయగలిగిన సత్తా గల (15–64 యేళ్ల మధ్య) జనాభా 99 కోట్ల 47 లక్షలకు చేరుకుంది. ఇది చైనాకన్నాఅధికం. 2030 వరకూ ఏడాదికి కోటి మందికి పైగా దీనికి జమ అవుతారు. భిన్నరంగాల్లో మెరుపు వేగంతో దూసుకొస్తున్న ఏఐకి సంబంధించిన బహుముఖ నైపుణ్యాలను ఒడిసిపట్టుకోవటంలో వెనకబడితే వీరందరికీ మెరుగైన ఉద్యోగాల కల్పన అసాధ్యమవుతుంది. ఐటీ, ఆరోగ్య రంగం, హరిత ఇంధన రంగం వగైరాల ద్వారా2030 నాటికి ప్రపంచ ఆర్థిక రంగానికి 50,000 కోట్ల డాలర్ల అదనపు సంపద జమవుతుందని అంచనా. ఈ సంపదలో మన వాటా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండాలంటే మెరికల్లాంటి నిపుణుల సైన్యం తయారు కావాలి. సాంకేతిక కళాశాలల తీరుతెన్నుల్నిసంపూర్ణంగా మార్చాలి. నిరుపేద గ్రామీణ విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి. ఊకదంపుడు ఉపన్యాసాలు కాదు, ప్రభుత్వాలు ఫీజురీయింబర్స్మెంట్ వంటివిసక్రమంగా అమలు చేయాలి. అప్పుడే అన్ని వర్గాల పిల్లలూ ఈ అభివృద్ధిలో భాగస్వాములవుతారు. -
ట్రంప్తో బ్రిటన్కు మేలేనా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల బ్రిటన్ పర్యటన గురువారం పూర్తయింది. ఇరు దేశాల మధ్యా సుదీర్ఘకాలంగా ఎంతో గాఢమైన అనుబంధం ఉన్నదని, ట్రంప్ హయాంలో అది మరింత విస్తరించిందని ఉమ్మడి మీడియా సమావేశంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కొనియాడారు. అది నిజమే. ఎందుకంటే వేరేచోట పెట్టుబడులు పెట్టొద్దని తమ దిగ్గజ సంస్థల్ని డిమాండు చేస్తున్న ట్రంప్ బ్రిటన్లో దాదాపు 15,000 కోట్ల పౌండ్ల విలువైన పెట్టుబడులకు సిద్ధపడ్డారు. ఇందుకు సంబంధించిన ఒప్పందా లపై ఇరు దేశాల మధ్యా సంతకాలయ్యాయి. అలాగే రక్షణ సాంకేతిక ఒప్పందం కూడా కుదిరింది. బ్రిటన్ తన డిమాండ్లన్నిటికీ తలొగ్గి అందరి కన్నా ముందు మొన్న ఫిబ్రవరి లోనే వాణిజ్యం ఒప్పందానికి సై అనటం, మరో మూడు నెలల్లో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవటం ట్రంప్కు నచ్చింది. దానికితోడు ప్రధాని కీర్ స్టార్మర్ అమెరికా వెళ్లినప్పుడు అధికారిక పర్యటనకు రావాలంటూ బ్రిటన్ రాజు చార్లెస్... స్టార్మర్ ద్వారా ఆహ్వానం పంపటం ఆయన్ను మరింత ఉక్కిరిబిక్కిరి చేసివుంటుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిని రాజసౌధం రెండోసారి అధికారిక పర్యటనకు ఆహ్వానించటం, ఘనమైన విందునీ యటం ఇదే తొలిసారి. గత ఏలుబడిలో ట్రంప్ 2019లో బ్రిటన్లో అధికారిక పర్యటన జరిపారు. జార్జి డబ్ల్యూ బుష్, ఒబామాలకు ఆ అదృష్టం మొదటి దఫాలో మాత్రమే దక్కింది. రెండోసారి నాటి బ్రిటిష్ రాణి నుంచి విందు ఆహ్వానాలు మాత్రమే అందాయి.కానీ ట్రంప్ షరతులన్నిటికీ తలొగ్గటం ద్వారా బ్రిటన్ ప్రయోజనాలను స్టార్మర్ దెబ్బతీశారని జనం ఆగ్రహించారు. వాణిజ్య ఒప్పందంలో అమెరికా సరుకులపై 10 శాతం మించి సుంకాలు విధించబోమని ఒప్పుకుని, తమ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే స్టీల్, అల్యూమినియంలపై మాత్రం 25 శాతం సుంకాలు విధించినా మౌనంగా ఉండిపోయారని ఆ విమర్శల సారాంశం. దీన్ని పునఃపరిశీలించాలని బ్రిటన్ కోరినా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పటం తప్ప 25 శాతం సుంకాలపై ట్రంప్ మరే హామీ ఇవ్వలేదు. బహుశా ఆయన దృష్టిలో ఆదుకోవటమంటే 15,000 కోట్ల పౌండ్ల పెట్టుబడులు పెట్టడం కావొచ్చు. వీటి ద్వారా దేశంలో 7,600 ఉద్యోగాలు వస్తాయని బ్రిటన్ ఆశిస్తోంది. ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నాటో, ఉక్రెయిన్, పశ్చిమాసియా, చైనా తదితర అంశాల్లో రెండు దేశాలకూ ఏకీభావం ఉన్నా విభేదాలు కూడా ఉన్నాయి. లోగడ స్టార్మర్ ప్రకటించిన ప్రకారం వచ్చేవారం పాలస్తీనాను బ్రిటన్ గుర్తించాల్సి ఉంది. ఆ పనిచేస్తే హమాస్ ఉగ్రవాదానికి మద్దతు పలికినట్టే అవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇటీవల హెచ్చరించారు. ట్రంప్ పర్యటనలో కూడా దీనిపై ఇరు దేశాధినేతల మధ్యా చర్చ జరిగింది. ఈ విషయంలో విభేదాలున్నాయని ఇద్దరూ అంగీకరించారు. బ్రిటన్ తాజా నిర్ణయమేమి టన్నది చూడాల్సి ఉంది. రెండు దేశాలూ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించేవి. ప్రపంచ సమస్యల పరిష్కార బాధ్యత భారం తమదేనని భావించేవి. కనీసం అలా చెప్పుకొనేవి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అవి సమష్టిగా పనిచేశాయి. ధిక్కరించిన దేశాలపై నాటో మాటున దాడులు కూడా చేశాయి. ప్రపంచంలోనే చైనా రెండో శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగాక పరిస్థితి తలకిందులైంది. పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచమంతటా ఎటుచూసినా విధ్వంసం, నిరాశా నిస్పృహలు ఆవరించాయి. యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు, వలసదా రులపై ఆంక్షలు, ప్రజాస్వామ్య దేశాల్లో నియంతల హవా తదితరాలు వర్తమాన దుఃస్థితికి అద్దం పడుతున్నాయి. సమస్యలొస్తే ఇప్పుడెవరూ అమెరికా, బ్రిటన్ల వైపు చూడటం లేదు. అవి చక్కదిద్దుతాయన్న భ్రమలేవీ లేకపోగా... చాలా సమస్యలకు అమె రికా కారణమైతే, బ్రిటన్ వైఖరి కూడా అందుకు దోహదపడుతోందన్న అభిప్రాయమే అనేకుల్లో ఉంది. పైగా నిలకడ లేని ట్రంప్కు విశ్వసనీయత తక్కువ. భారత్ తమకు అత్యంత సన్నిహితమని, ప్రధాని మోదీ కావాల్సినవారనీ మీడియా సమావేశంలో చెప్పిన ట్రంప్... ఉక్రెయిన్ విషయంలో ఆ దేశంతో కఠినంగా ఉండక తప్పడంలేదని గొప్పగా చెప్పుకొన్నారు. ఇలా మాట్లాడేవారిని ఏ దేశ ప్రజలైనా విశ్వసిస్తారా? మొత్తానికి ట్రంప్ తాజా పర్యటన వల్ల బ్రిటన్కు లాభించేది అంతంత మాత్రమేనని చెప్పాలి. -
మళ్లీ అమెరికాతో నెయ్యం
ఇది స్పీడ్ యుగం. కరచాలనాలైనా, కలహాలైనా ఎంత త్వరగా మొదలవుతాయో అంత త్వరగానూ కనుమరుగవుతాయి. భారత్–అమెరికాల సంబంధాల తీరు గమనిస్తే ఇది అర్థమవుతుంది. నెల్లాళ్ల క్రితం దాదాపు ఛిద్రమయ్యాయనుకున్న ఈ సంబంధాల్లో మళ్లీ సుహృద్భావం మొగ్గ తొడుగుతోంది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా సాకారం చేసుకోవాలని మంగళవారం న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య దూత బ్రెండాన్ లించ్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గంతో మన వాణిజ్య మంత్రిత్వ బృందం చర్చించాక అంగీకారం కుదిరింది. అంతేకాదు... ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ట్రంప్ ఆయనకు ఫోన్చేసి శుభాకాంక్షలు చెప్పటం, దాన్ని ఎక్స్లో మోదీ ప్రస్తావించి రష్యా–ఉక్రెయిన్ ఘర్షణలకు శాంతియుత పరిష్కారం కోసం ట్రంప్ చొరవ తీసుకోవటాన్ని ప్రశంసించటం గమనించదగ్గవి. సరిగ్గా నెల్లాళ్ల క్రితం పరిస్థితి వేరు. రష్యా దురాక్రమణ యుద్ధం కొనసాగటానికి భారత్ వైఖరే ప్రధాన కారణమంటూ ట్రంప్ నిందించారు. అంత క్రితం ఆగస్టు మొదటి వారంలో విధించిన 25 శాతం సుంకాలతో పాటు రష్యా ముడిచమురు కొంటున్నందుకు ఆ నెల చివరిలో మరో 25 శాతం అదనంగా వడ్డించి దాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. కేవలం భారత్పై విషం కక్కడం కోసం నియమితులైనట్టుగా వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మొదలుకొని వాణిజ్యమంత్రి హొవార్డ్ లుత్నిక్ వరకూ ఇష్టానుసారం మాట్లాడారు. వీరిలో నవారో మిగిలినవారికన్నా భిన్నం. ఆయన ఆశువుగా అబద్ధాలాడగలరు. ఆధారాలతోగానీ, ఇరు దేశాల చారిత్రక సంబంధ బాంధవ్యాలతో గానీ ఆయనకు పనిలేదు. ఫలానా కులానికి లబ్ధి చేకూర్చటం కోసం భారత ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతోందని వ్యాఖ్యానించగలరు. ఇరు దేశాల మధ్యా చర్చలు మొదలవుతున్న తరుణంలో కూడా భారత్ను ‘ట్యారిఫ్ల మహారాజు’ అనగలరు. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించగలరు. మన దేశం ఎంతో సంయమనం పాటించబట్టే అయిదో రౌండ్ తర్వాత ఆగిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. మధ్యలో అనవసరంగా పేచీకి దిగి విపరీతాలకు పోయింది అమెరికాయే!భారత్పై అదనపు సుంకాలు విధించటాన్ని సవాల్ చేస్తూ అమెరికా సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణలో భారత్ రష్యా చమురుకొనటాన్ని ట్రంప్ సర్కారు కారణంగా చూపింది. ఇప్పుడు సుంకాలను వెనక్కి తీసుకుంటే ఆ కేసు బలహీనపడుతుంది.ట్రంప్కు దౌత్యపరమైన మర్యాదలు తెలియవు. తన చర్యల వల్ల అవతలి దేశం స్థానికంగా ఎదుర్కొనక తప్పని ఒత్తిళ్లేమిటో అర్థం కావు. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే సుంకాల్లో 95 శాతం కోత పెట్టడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. కానీ 43 శాతం మంది గ్రామీణ ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్న సాగు రంగాన్ని పణంగా పెట్టడానికీ, చిన్న వ్యాపారుల, పాడిపరిశ్రమ రంగ ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలకూ తాము వ్యతిరేకమని మన ప్రభుత్వం కుండబద్దలు కొడుతోంది. జన్యుపరంగా మార్పిడి చేసిన మొక్కజొన్న మాకొద్దని చెబుతోంది. ఈ విషయంలో భారత్ మనోభావాలను అర్థం చేసుకోకుండా ఒక ధూర్త వ్యాపారిలా ట్రంప్ ప్రవర్తించారు. ఇప్పుడు తామే వెనక్కి తగ్గక స్థితిని సృష్టించుకున్నారు.తమ దయా దాక్షిణ్యాలపై ఆధారపడే దక్షిణ కొరియా, జపాన్లు సాగిలపడటాన్ని చూసి అందరిపైనా ఆ వ్యూహమే పనికొస్తుందని ట్రంప్ భావించటమే ఇందుకు కారణం. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో చెట్టపట్టాలేసుకున్నారు. ఆ దేశ ఆర్మీ చీఫ్ను నెత్తిన పెట్టుకున్నారు. ఈ పరిణామాలతో భారత్ బెంబేలు పడుతుందని భావించారు. కానీ షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సమావేశానికి మోదీ చైనా వెళ్లటం, అక్కడి పరిణామాలూ గమనించాక జరగబోయేదేమిటో ఆలస్యంగానైనా గ్రహించక తప్పలేదు. భారత్కు తాను తప్ప దిక్కులేదనుకోవటం ఘోర తప్పిదమని గ్రహించారు. పర్యవసానంగానే ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో వ్యాపారం తప్ప మరేం లేదన్న వైఖరిని ట్రంప్ విడనాడితేనే ప్రపంచంతో ఆయనకు సామరస్యం కుదురుతుంది. అలా కానట్టయితే నష్టపోయేది అమెరికాయే! -
ఉన్నంతలో ఉపశమనం
వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు సోమవారం జారీచేసిన మధ్యంతర ఆదేశాలు అటు పిటిషనర్లకూ, ఇటు కేంద్ర ప్రభుత్వానికీ పాక్షిక ఉపశమనం ఇచ్చాయి. చట్టంపై మొత్తంగా స్టే విధించకపోవటం కేంద్రానికి సంతృప్తి కలిగిస్తే, కొన్ని కీలకనిబంధనల అమలును నిలిపేయటం విపక్షాలకూ, పిటిషనర్లకూ సంతోషాన్నిచ్చింది. అయితే ఈ కేసులో పిటిషనర్ అయిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వంటివారు ఈ ఉత్తర్వులపై నిరాశ పడకపోలేదు. పిటిషనర్లలో ఒవైసీతోపాటు ఎంపీలు మహువా మొయిత్రా(టీఎంసీ), మనోజ్ కుమార్ ఝూ(ఆర్జేడీ), జియావుర్ రహమాన్(కాంగ్రెస్) ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ కూడా చట్టాన్ని సవాలు చేశాయి. మొన్న ఏప్రిల్లో పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టంపై మొత్తం 65 పిటిషన్లు దాఖలయ్యాయంటేనే ఇదెంత వివాదాస్పదమైనదో అర్థమవుతుంది. చట్టం రాజ్యాంగబద్ధమో కాదో ఈ ఉత్తర్వులు తేల్చలేదు. తుది తీర్పు ఆ అంశాన్ని పరిశీలిస్తుంది. వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగానికి గురవుతున్నాయనీ, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయనీ కేంద్రం భావించింది. వాటిని చక్కదిద్దే ఉద్దేశంతోనే సవరణలు తెచ్చామని చెప్పింది. ముఖ్యంగా రిజిస్టర్ కాకపోయినా నిరాటంకంగా వక్ఫ్ అధీనంలో ఉంటే ఆ ఆస్తులు దానికే చెందుతాయన్న (వక్ఫ్ బై యూజర్) భావనను ఈ చట్టం రద్దు చేసింది. ఇకపై వక్ఫ్ ఆస్తులకు లిఖిత పూర్వక దస్తావేజు ఉండి తీరాలని నిర్దేశించింది. సుప్రీంకోర్టు ఈ నిబంధనపై స్టే విధించేందుకు నిరాకరించింది. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నాయని చట్టసభ గుర్తించి, దాన్ని నివారించాలనుకోవటం ఏకపక్ష చర్య ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే వక్ఫ్ ఆస్తులకు 1995 నాటి చట్టం ఒక ప్రత్యేక ప్రతిపత్తినిచ్చింది. దాని ప్రకారం వక్ఫ్ ఆస్తి దురాక్రమణకు గురైందని ఏ దశలో గుర్తించినా దాని స్వాధీనానికి వక్ఫ్ బోర్డు చర్యలు తీసుకోవచ్చు. తాజా సవరణ దీన్ని రద్దు చేయటాన్ని ధర్మాసనం సమర్థించింది. ఇతర ఆస్తులతో సమానంగా పరిగణించటం వివక్ష తొలగింపే అవుతుందని భావించింది.అన్య మతస్థులు కనీసం అయిదేళ్లుగా ఇస్లాం ఆచరణలో ఉంటేనే వక్ఫ్కు ఆస్తులు దానం చేయొచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే విధించటం ఒక రకంగా ఊరట. ఇస్లాం ఆచరణంటే ఏమిటో చట్టం వివరించకపోవటం, దాన్ని గుర్తించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసే నిబంధనలు, అందుకోసం ఏర్పాటయ్యే వ్యవస్థ సంగతి తేలేవరకూ ఈ నిబంధన నిలిచిపోతుంది. పౌరులు తమ ఆస్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకునే హక్కు రాజ్యాంగంలోని 300వ అధికరణం ఇచ్చింది. అన్య మతస్థులు వక్ఫ్ బోర్డుకు ఆస్తులివ్వరాదన్న నిబంధన దీన్ని ఉల్లంఘించటం లేదా? తుది తీర్పులోనైనా దీన్ని పరిశీలించక తప్పదు. వివాదాస్పద ఆస్తులపై వక్ఫ్ బోర్డుకూ, ప్రభుత్వాలకూ తగువు ఏర్పడినప్పుడు కలెక్టర్ స్థాయి అధికారి నిర్ణయించవచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే ఇచ్చింది. ఈ నిబంధనలో మరో వైపరీత్యముంది. అసలు అలాంటి విచారణ మొదలైన మరుక్షణమే అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించటానికి వీల్లేదని చెబుతోంది. మొత్తానికి వివాదాలను ట్రైబ్యునల్స్ లేదా హైకోర్టులు మాత్రమే తేల్చాలనటం సరైన నిర్ణయం. అయితే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు స్థానం కల్పించాలన్న నిబంధనను కొంత మార్పుతో అలాగే ఉంచటం సబబు కాదు. హిందూ, సిక్కు, క్రైస్తవ మతాలకు చెందిన సంస్థల్లో అన్య మతస్థులకు చోటు లేనప్పుడు, వక్ఫ్ బోర్డుల్లో మాత్రం ఎందుకుండాలి?వక్ఫ్ చట్టంలో సమస్యలున్నాయి... సరిచేయమని కోరేవారిలో ఆ మతస్థులూ ఉన్నారు. అలా చేసే ముందు ముస్లిం మతాచార్యులతో, ముస్లిం పర్సనల్ లా బోర్డుతో మాట్లాడాలి. పార్టీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. పార్లమెంటులో అలజడి రేగాక బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఏర్పాటు చేశారు సరే... కానీ విపక్షాల అభ్యంతరాలను పట్టించుకున్నారా? సమర్థమైన, లోప రహితమైన విధానాలు తీసుకురాదల్చుకుంటే స్వాగతించాల్సిందే. కానీ ఆ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. అటువంటి చర్య ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. -
మణిపూర్కు సాంత్వన!
మానవీయ స్పర్శ లేశమాత్రం లేని మానవాకార మృగాలు రోజుల తరబడి సృష్టించిన బీభత్సం పర్యవసానంగా అయినవారినీ, ఆవాసాలనూ మాత్రమే కాదు... జీవిక కోల్పోయి చెట్టుకొకరు పుట్టకొకరై 28 నెలల నుంచి అనాథలుగా బతుకీడుస్తున్న మణిపూర్ పౌరులకు ఆలస్యంగానైనా సాంత్వన లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తొలుత చురాచాంద్పూర్ బహిరంగ సభలో బాధితులనుద్దేశించి మాట్లాడాక, రాజధాని ఇంఫాల్లో ఉన్న కాంగ్లా ఫోర్ట్ వద్ద జరిగిన సభలో పాల్గొన్నారు. సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించటానికి చేయాల్సిందంతా చేస్తామని ఆయన హామీ ఇవ్వటంతో పాటు వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని ప్రారంభించటం, మరికొన్నిటికి శంకుస్థాపన చేయటం హర్షించదగ్గవి. ఇవన్నీ రాగల కాలంలో సామరస్య వాతావరణానికి దోహదపడే అవకాశం ఉన్న మాట నిజమే అయినా, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మెజారిటీగా ఉన్న మెయితీలకూ, కుకీ–జో తెగలకూ మధ్య తలెత్తిన ఘర్షణల పర్యవసానంగా మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఆ తెగల మధ్య పరస్పర అవిశ్వాసం, ఘర్షణలు ఈనాటివి కాదు. వీటిని చక్కదిద్దటానికి ఏ ప్రభుత్వమూ పెద్దగా ప్రయత్నించింది లేదు. బీరేన్సింగ్ నేతృత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వమైతే మెయితీల అనుకూలమన్న ముద్ర పడేలా వ్యవహరించి ఆ ఘర్షణ వాతావరణాన్ని పెంచింది. 2023 మే 3 మొదలుకొని సాగిన దారుణాలు సిగ్గు చేటైనవి. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మెయితీలకూ, కుకీ–జో తెగలకూ తలెత్తిన ఘర్షణల్లో మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా ఊరేగించి అత్యాచారాలకు తెగబడటం వంటివి చోటుచేసుకున్నాయి. చురాచాంద్పూర్లో కుకీ–జో తెగలవారికి సహాయక శిబిరాలు నెలకొల్పగా, మెయితీ బాధితులు ఇంఫాల్ రక్షణ శిబిరాల్లో ఉంటున్నారు. దురదృష్టమేమంటే కుకీ–జో తెగలవారు ఇంఫాల్లో అడుగుపెట్టలేరు. మెయితీలు కొండప్రాంత జిల్లాలకు పోలేరు. ఇదంతా ఇప్పట్లో చక్కబడే అవకాశం లేదు. కుకీ–జో తెగల మండలి ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో తమకు ప్రత్యేక పాలనాధికార వ్యవస్థ కావాలని కోరింది.అటు మెయితీలకు ప్రాతినిధ్యం వహించే మణిపూర్ సమగ్రతా సమన్వయ కమిటీ (కొకొమీ) అందుకు ససేమిరా అంటున్నది. ఆ వ్యవస్థ ఏర్పాటైతే రాష్ట్ర ప్రతిపత్తి దెబ్బతింటుందనీ, పౌరసత్వాన్ని తెగల వారీగా గుర్తించి, రాష్ట్రాన్ని విభజించినట్టవుతుందనీ దాని వాదన. ‘చట్ట విరుద్ధ’ వలసలను అరికట్టాలని డిమాండ్ చేస్తోంది. పైగా మెయితీలు ఏనాటి నుంచో ఎస్టీ ప్రతిపత్తి కోరుతున్నారు. ఇదే జరిగితే భూహక్కులు కోల్పోతామని కుకీ–జో తెగల భయం. ఈ వాదనలూ, భయాందోళనలూ వర్తమాన సంక్లిష్టతకు అద్దం పడతాయి. రాష్ట్రాన్ని ఆవరించిన కల్లోలం ‘మన పూర్వీకుల స్మృతికి కళంకం మాత్రమే కాదు... భవిష్యత్ తరాలకు అన్యాయం చేయటం కూడా’ అని మోదీ సరిగానే అన్నారు. దీన్ని చక్కదిద్దటానికి ఇంఫాల్ లోయకూ, కొండ ప్రాంత జిల్లాలకూ మధ్య పటిష్ఠమైన వారధులు నిర్మించాల్సి ఉందన్న ఆయన అభిప్రాయం కూడా సబబైనదే. ఇది జరగాలంటే వైషమ్యాలను పెంచి పోషిస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. వదంతుల వ్యాప్తిని సహించకూడదు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను ప్రచారంలో పెట్టడంతోనే సమస్య మొదలైందనీ, ప్రధాన స్రవంతి మీడియా ‘మెయితీ మీడియా’గా మారి వీటిని పెంచిపోషిందనీ ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ కమిటీ గతంలో ఆరోపించింది. ఇందుకు నాటి మణిపూర్ ప్రభుత్వం ఆగ్రహించి కేసులు కూడా పెట్టింది. మణిపూర్ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో మయన్మార్తో 352 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. నిరవధిక ఉద్రిక్త వాతావరణం ఎంతమాత్రమూ మంచిది కాదు. బీరేన్సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయటంతో సహా చాలా విషయాల్లో ఎంతో జాప్యం జరిగింది. ఇప్పటికైనా నిర్దిష్ట కాల వ్యవధిలో అమలయ్యేలా చర్యలుండాలి. అభివృద్ధి జరిగేలా, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా, జన జీవనం మళ్లీ పట్టాలెక్కేలా చూడాలి. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న అపవాదు కలగని రీతిలో పాలనను చక్కదిద్దాలి. -
ఆదిమ నిద్రకళ
నిద్ర అనే మాటే ఒక మత్తు, మహత్తు. అలసిన శరీరానికి హాయి... నిద్ర. గడిచిన దినానికి తీపి వీడ్కోలు... నిద్ర. నిద్ర పోవడం అనే దశ నుంచే శిశువు జీవితం ఆరంభమవుతుంది. రోజులో పదహారు గంటలు నిద్రపోతూనే దినదిన ప్రవర్ధమానమవుతాడు. ఏ పాటా రాని తల్లి కూడా పసివాడిని నిద్రపుచ్చడానికి ‘ఉళుళుళు హాయి’ అని లాలి రాగం తీస్తుంది. ఆ లెక్కన ప్రతి తల్లీ ఒక గాయనే అనుకోవాలి. నిద్ర అనేది మనిషికి ప్రకృతి ప్రసాదించిన చవకైన విలాసం.నిద్ర అనేది నిజమైన సమవర్తి కూడా! ఏ మనిషైనా తన దగ్గర అన్ని కిరీటాలనూ పక్కన పెట్టాల్సిందే. కేవలం శ్వాసించే మాంసపు బంతులుగా ఆడాల్సిందే. ‘‘ఈ నీడల నాటకరంగం మీద జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్లందరూ ఒకే హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతినిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు. ఈ వాకిలి దగ్గరకు వచ్చినవాడెవ్వడూ ఉత్త చేతులతో తిరిగి వెళ్లడు’’ అంటాడు కథక కవి ఆలూరి బైరాగి. నిద్ర అనేది దివ్యలోకాలకు తలుపులు తెరిచే సాధనం. ఏ మనిషికా మనిషి సమాంతర ప్రత్యేక లోకాలను ఆవిష్కరించుకోగలిగే తరుణోపాయం. కలల రెక్కల మీద ప్రతి జీవీ అక్కడ ఎల్లలు లేకుండా తిరుగుతాడు. తెల్లారేసరికి ఏమీ ఎరగనట్టే మామూలుగా ఉండిపోతాడు.మనిషికి ఉన్నవి రెండే స్థితులు: పగలు పని, రాత్రి నిద్ర. అవి తారుమారవ్వడం ఆధునిక పరిణామం. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదంటారు. నిద్రలోంచి లేవడమంటే దాదాపు చచ్చి మళ్లీ బతికినట్టే! అందుకే కొందరు నిద్ర లేవగానే కృతజ్ఞతగా దేవుడికి దండం పెట్టుకుంటారు. కానీ అదంతా కాయకష్టం చేసిన రోజుల్లో! ఇప్పుడు మనిషి స్థానాన్ని యంత్రం ఆక్రమించాక, నడుం వంచడం అనేదే పెద్ద పనైపోయింది. లక్షల ఏళ్ల మనిషి నాగరికతా ప్రస్థానంలో 10,000 ఏళ్ల నుంచే మనుషులు నగరాల్లో జీవించడం మొదలుపెట్టారు. పంతొమ్మిదో శతాబ్దం చివరలోనే కరెంట్ మనిషి జీవితంలోకి వచ్చింది. 1970ల తర్వాతే కంప్యూటర్లు ఇళ్లల్లోకి ప్రవేశించాయి. వీటన్నింటికీ మనిషి మెదడు సర్దుకుపోతూ వచ్చింది.ఈ క్రమంలో చరిత్ర పూర్వ మనుషులు ఎలా నిద్దరోయారు అనేది ఒక ఆసక్తి. చెట్టు కొమ్మలనే పాన్పులుగా చేసుకుని అదే చెట్ల మీద పడుకోవడమూ ఉండేది. ఎటో జారిపోతున్న భావన కలిగి ఉన్నట్టుండి మనం ఇప్పుడు నిద్రలోంచి మేల్కొనడం అనేది మన పూర్వీకుల చెట్ల నిద్ర తాలూకు అవశేషం మన రక్తంలోకి ఇంకిపోవడం వల్ల జరుగుతున్నదని నిద్రా నిపుణులు చెబుతుంటారు. అలా జారిపోతున్న సంవేదన ఆ ఆదిమ మానవులకు ఒక రక్షాకవచంలా పనిచేసి, క్రూర మృగాల పట్ల అప్రమత్తతతో ఉంచింది. అయితే, రెండు లక్షల ఏళ్ల క్రితమే మనుషులకు ‘మంచం’ లాంటిది ఏర్పాటు చేసుకోవడం తెలుసు అంటారు ‘హౌ టు స్లీప్ లైక్ ఎ కేవ్మ్యాన్: ఏన్షియెంట్ విజ్డమ్ ఫర్ ఎ బెటర్ నైట్స్ రెస్ట్’ రచయిత డాక్టర్ మెరిజిన్ వాన్ డెలార్. పట్టు పాన్పు, మబ్బు దుప్పట్లు లేకపోయినా, మట్టిని బల్లపరుపుగా చేసుకొని, దాన్ని మరిన్ని పొరలుగా ఉబ్బుగా దిద్దుకుని, దాన్ని కొమ్మలు, గడ్డి, ఆకులతో మెత్తబరుచుకొని పడుకునేవాళ్లు. పురుగూ పుట్రను తరిమికొట్టే మొక్కలను అక్కడ ఉంచేవాళ్లు. పక్కనే క్యాంప్ ఫైర్ ఉండనే ఉంటుంది. అదే మంటతో ఆ మంచాన్ని నియమిత సమయాల్లో కాల్చుతుండేవాళ్లు. దానివల్ల కూడా పురుగూ పుట్రా ఆ దరికి చేరకుండా ఉండేవి. అవే మంచాలను బహుముఖంగా పని ప్రదేశాలుగానూ, పని ముట్లను సాఫుచేసుకోవడానికీ వాడుకునేవాళ్లు. అందుకే చరిత్ర పూర్వ మనుషులనగానే అనాగరికమైన ఊహ రావడాన్ని వ్యతిరేకిస్తారు వాన్ డె లార్. నిద్ర, తిండి విషయంలో వాళ్లు అత్యంత వివేకంతో వ్యవహరించారన్నది నెదర్లాండ్స్కు చెందిన ఈ ‘స్లీప్ సైంటిస్ట్’ వాదన. వ్యాయామం ఉండటం, తిండిలో చక్కెర లేకపోవడం అనే రెండు కారణాల వల్ల వాళ్లకు ఇట్టే నిద్రపట్టేది. ఆ రెండూ రివర్సు కావడం వల్ల ఇప్పుడు నిద్ర కరవవుతోంది. వీటినే సూచనలుగా స్వీకరిస్తే మనం కోల్పోతున్న నిద్రను మళ్లీ పొందొచ్చేమో! -
ప్రజారోగ్యం లూటీ!
వీళ్లు పాలకులేనా? భారత రాజ్యాంగం స్ఫూర్తితో ఎన్నికైన ప్రజా ప్రతినిధులేనా? ఇంతటి విశృంఖల అవినీతి గతంలో ఎప్పుడైనా ఉన్నదా? గజ్జెల మల్లారెడ్డి పద్యాన్ని కొద్దిగా మార్చి ‘తెలుగు నాట అవినీతి తెప్పలుగా పారుతోంది. డ్రైనేజీ స్కీము లేక డేంజర్గా మారింద’ని చదువుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పాలక కూటమి పల్లకీని మోసే డ్యూటీలో ఉన్న యెల్లో బోయీలు కూడా అవినీతి ప్రవాహంపై మాట్లాడక తప్పని దురవస్థ దాపు రించింది. కాకపోతే వారి ఎజెండా వేరు. వారికో డైవర్షన్ స్కీమున్నది. అవినీతి హెడ్క్వార్టర్స్పై ముసుగు కప్పి ప్రవహిస్తున్న మురుగంతా క్షేత్రస్థాయి, ద్వితీయ శ్రేణి నేతల మురికేనని చెప్పాలి. అదే చెబుతున్నారు. ‘ఎమ్మెల్యే సారూ... తగ్గాలి మీరు’ అనే పతాక శీర్షికలతో అవినీతి కథనాల సీరియల్స్ నడుపు తున్నారు. మంత్రుల పీఏలు, ఓఎస్డీలు తెగబడుతున్నారని రాస్తున్నారు. ప్రతి పనికీ రేటు పెట్టి వసూలు చేస్తున్నారని స్థానిక నేతలపై వాపోతున్నారు.జడలు విరబోసుకొని నడివీధుల్లో నర్తిస్తున్న అవినీతి భూతాన్ని దాచిపెట్టలేరు గనుక డైవర్షన్ వ్యూహాలపై తెలివి తేటల్ని ఖర్చు చేస్తున్నారు. సాధారణ పరిపాలన శ్రుతి తప్పితే అధికారుల తప్పు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే పోలీసుల తప్పు. ఇదీ, యెల్లో మీడియా వరుస. అదునులోగా రైతుకు అందవలసిన యూరియా ఎరువును కూడా అవినీతి భూతం పరపర నమిలేస్తుంటే గద్దె మీదనున్న పెద్దలకు ఏ పాపం తెలియదని యెల్లో బోయీలు నమ్మబలుకుతున్నారు. ఇతరుల ఖాతాల్లో పడేయడానికి వీలు కాని ముఖ్య భాగోతాలను మాత్రం అభివృద్ధి కోణంలో ఆవిష్కరిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లో పెట్టడంలో అవినీతి లేదట! అభివృద్ధికి అదే అర్థమట! జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి భూసేకరణ చేసి నిర్మాణాలు ప్రారంభించారు. ఆయన హయాంలోనే ఐదు కాలేజీలు ప్రారంభమయ్యాయి.ఎన్నికలు ముగిసిన వెంటనే పాడేరు కాలేజీ కూడా ప్రారంభమైంది. దాంతోపాటు అనుమతులొచ్చిన పులివెందుల కాలేజీకి మాత్రం బాబు అడ్డు చక్రం వేశారు. అడ్డుకోవడానికి అసలు కారణం, ఇప్పుడు తేటతెల్లమైంది. పులివెందుల కాలేజీతోపాటు పది కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీన్ని ప్రైవేటీకరణ అనగూడదని సర్కార్ వాదిస్తున్నది. పిల్లి కాదు మార్జాలమట! ఈ మార్జాలం మర్మమేమిటో తెలుసుకోవాలంటే ప్రభుత్వం తరఫున ఏపీఎమ్ఎస్ఐడీసీ తయారుచేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కొంతమేరకు ఉపయోగపడుతుంది. ఈ పది మెడి కల్ కాలేజీల్లో అసలు పనులేమీ జరగలేదనీ, కేవలం పునాదు ల్లోనే అవి ఆగిపోయాయని మంత్రులు, ముఖ్యమంత్రి వాదిస్తుండటాన్ని మనం చూస్తున్నాము.పులివెందుల కాలేజీని తీసుకుంటే అక్కడ ఇప్పటికే 418 కోట్ల 20 లక్షల రూపాయలను నిర్మాణం కోసం ఖర్చుపెట్టినట్టు ఆ పీపీటీలో ప్రభుత్వం అంగీకరించింది. క్యాంపస్ విస్తీర్ణం 47.58 ఎకరాలని అందులో పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉన్న కాలంలోనే అక్కడ ఎకరా రెండు కోట్ల దాకా ఉన్నదని సమాచారం. మెడికల్ కాలేజీ, అనుబంధ ఆస్పత్రి పని చేయడం ప్రారంభిస్తే ఈ భూమి ధర శరవేగంగా పెరిగే అవకా శముంటుంది. దీన్ని ఏటా ఎకరాకు 100 రూపాయల చొప్పున 66 ఏళ్లపాటు లీజుకు ఇస్తారు. అంటే పులివెందుల కాలేజీ లీజుకు తీసుకునేవారు ఏడాదికి 4,758 రూపాయలు చెల్లిస్తే చాలు.వందకోట్ల విలువైన (ప్రస్తుత ధర) భూమితోపాటు 420 కోట్లతో చేసిన నిర్మాణం 66 ఏళ్లపాటు వారికి సొంతమవుతుంది. ఈ కాలేజీకి కేటాయించిన 150 అండర్గ్రాడ్యుయేట్ సీట్లలో 50 శాతం మేనేజ్మెంట్ కోటా కింద కేటాయిస్తారు. 15 శాతం ఆలిండియా సీట్లు పోను 35 శాతం సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.జగన్మోహన్రెడ్డి సర్కార్ ప్రభుత్వరంగంలో ప్రారంభించిన కాలేజీల్లో సగం సీట్లను కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద పెట్టింది. అప్పటి ప్రతిపక్షం దీనిపై గగ్గోలు పెట్టి తాము అధికారంలోకి వస్తే ఆ కోటా ఎత్తివేస్తామని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లకు ప్రభుత్వం నిర్ధారించిన ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కానీ ప్రైవేట్ యాజమాన్యంలో అది కుదరదు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుతోపాటు దొడ్డిదారి డొనేషన్లు, డొంకదారి వసూళ్లు చాలా ఉంటాయన్న సంగతి మనకు అనుభవంలో ఉన్న విషయమే. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పులివెందుల కాలేజీని ఉదాహరణగా తీసుకున్నప్పటికీ మిగిలిన 9 కాలేజీల పరిస్థితి ఇంతే. వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఆదోని కాలేజీకి సేకరించిన స్థలం 58.44 ఎకరాలు. అక్కడ ఇప్పుడే ఎకరా 5 కోట్లు ధర పలుకుతున్నది. నిర్మాణం కూడా 70 శాతం పూర్తయింది. మదనపల్లె కాలేజీ స్థలం 95.5 ఎకరాలు. నిర్మాణం 30 శాతం పూర్తయింది. మిగిలిన కాలేజీలు కూడా 50 ఎకరాలకు తగ్గకుండా ఉన్నాయి. ఒకసారి కాలేజీ, ఆస్పత్రి పనిచేయడం ప్రారంభమైతే ఆ స్థలాల ధరలు అనూహ్యంగా పెరుగుతాయి.మరో ముఖ్యమైన అంశం – కాలేజీలకు అనుబంధంగా ఏర్పడే ఆస్పత్రులు! 650 పడకల ఆస్పత్రులను ప్రతిపాది స్తున్నారు. ఇందులో 30 శాతం పడకలకు ప్రైవేట్ మేనేజ్మెంట్ తన ఇష్టప్రకారం డబ్బులు వసూలు చేసుకోవచ్చు. మిగిలిన 70 శాతం పడకలపై మాత్రం నియంత్రణ ఉంటుంది. ప్రైవేట్ యాజమాన్యాలు ఈ నియంత్రణలను ఏమేరకు పాటిస్తాయన్నది తెలియంది కాదు. తెల్ల రేషన్ కార్డులున్న వారికి 5 శాతం ఉచిత వైద్యాన్ని రిజర్వు చేయాలన్న నిబంధనను కార్పొరేట్ ఆస్పత్రులు ఏమేరకు పట్టించుకుంటున్నాయో తెలిసిన సంగతే! అదే ప్రభుత్వరంగంలో ఉన్నట్లయితే ఇన్పేషెంట్లతో పాటు ఔట్ పేషెంట్లు కూడా ఉచిత ఉన్నతస్థాయి వైద్య సౌకర్యాలను పొందే అవకాశం ఉండేది. డబ్బులేని కారణంగా వైద్యవిద్యకు దూరమ వుతున్న ఆసక్తి గల విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావడం, పేద–మధ్యతరగతి ప్రజలకు చేరువలోనే ఉచితంగా స్పెషలిస్టు వైద్య సేవలను అందించడమనే జంట లక్ష్యాల సాధన కోసం జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ప్రారంభించింది. ఆ ఆశయాన్ని తుంగలో తొక్కుతూ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అందులో 10 కాలే జీలను ప్రైవేట్ రంగానికి కట్టబెడుతున్నది. వేల కోట్ల విలువ చేయబోయే ఆ స్థలాలను కారుచౌకగా ఏటా రూ. 5 వేలకే కట్టబెట్టడం వెనుక స్కామ్ కాకపోతే మరే కారణం ఉంటుంది? లక్షలాదిమంది పేద మధ్యతరగతుల ప్రజలను ఉన్నత స్థాయి ఉచిత వైద్యానికి దూరం చేస్తూ, వేలాదిమంది విద్యార్థులూ, వారి తల్లిదండ్రుల డాక్టర్ చదువు కలలను భగ్నం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు మెడికల్ కాలేజీలకు, పది ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రైవేట్రంగంలో అనుమతించినప్పుడు చంద్రబాబు చేసిన యాగీ, యెల్లో మీడియా పెట్టిన అల్లరి అప్పటివాళ్లకు గుర్తుండే ఉంటుంది. నాటి ముఖ్యమంత్రి జనార్దన్రెడ్డికి ‘ధనార్జనరెడ్డి’ అనే నామకరణం కూడా బాబు ముఠా చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే నిర్మించి ప్రైవేట్కు అప్పగిస్తున్న వ్యవహారాన్ని ఏమనాలి? ఈ ముఖ్యమంత్రికి ఏమని నామకరణం చేయాలి?ప్రభుత్వ ఆధ్వర్యంలో కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ బాగుండదని, ప్రైవేట్ యాజమాన్యమైతే సమర్థంగా ఉంటుందనే ఒక డొల్ల వాదనను కూడా ఈ ప్రభుత్వం ముందుకు తెస్తున్నది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్వహణ తీరుపై ఇప్పటికే మనకు పలు అనుభవాలున్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు దినసరి కూలీలను పేషెంట్ల రూపంలో పడుకో బెట్టడం, అద్దెకు తెచ్చిన వారికి డాక్టర్ల వేషాలు వేసి చూపించడం మీడియాలో చాలాసార్లు రిపోర్టయింది. సౌకర్యాలు లేక, సమర్థులైన సిబ్బంది లేక ప్రైవేట్ మెడికల్ కాలేజీల స్థాయి అథమస్థాయిలో ఉన్నదనే అధ్యయనాలు కూడా వచ్చాయి. వైద్యరంగంలో ప్రైవేట్ నిర్వాకం ఎట్లా ఉంటుందో తాజా ఉదాహరణను ఒకదాన్ని చెప్పుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో రక్తపరీక్షలు సరిగ్గా జరగడం లేదని, 2015లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం, ఆ విభాగాన్ని మెడాల్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఒక్కో పరీక్షకు 235 రూపాయలు సంస్థకు చెల్లించారు. 2016 నవంబర్ ఒక్క మాసంలోనే 53 వేల డెంగీ కేసులు నమోదైనట్టు లెక్క రాసి మెడాల్ బిల్లులు క్లెయిమ్ చేసింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో 7 వేల కేసులే నమోదైనట్టు చివరకు అంగీకరించవలసి వచ్చింది. ఈ రకమైన తప్పుడు లెక్కలతో మూడేళ్లలోనే 360 కోట్ల ప్రజాధనాన్ని ఆ సంస్థ లూటీ చేసింది. పైవారికి కమీషన్లు సమర్పిస్తున్నామన్న బరితెగింపుతో ఇటువంటి ప్రైవేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం మనకు కొత్త కాదు. పేదలకు అపర సంజీవనిగా భాసిల్లుతున్న ‘ఆరోగ్యశ్రీ’ని కూడా ఓ ప్రైవేట్ బీమా కంపెనీ చేతిలో పెడు తున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు ఎక్కడ ఫెయిలైంది? బీమా కంపెనీ ఏరకంగా అంతకంటే మెరుగు? కాదేదీ కమీషన్లకనర్హమా? మానవీయ కోణంలో చూడవలసిన ప్రజారోగ్యాన్ని కూడా కమీషన్ల కోణంలో చూసే దుఃస్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పడకేశాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’ ఎటో వెళ్ళిపోయాడు. 108, 104 సర్వీసులు కునారిల్లు తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యం కుప్పకూలింది. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో భాగమైన ఆర్టికల్ 47 ప్రకారం ప్రజారోగ్యం ప్రభుత్వాల ప్రాథమిక విధి. పౌరులందరికీ ఉచితంగానే విద్య, వైద్యాలను అందజేయడం ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యంగా నాగరిక ప్రపంచమంతా గుర్తించింది. కానీ, మనం మాత్రం విద్య, వైద్యాలను కొనుక్కోవాలనే అనాగరిక వ్యవస్థలోకి, రాజ్యాంగ విరుద్ధ పాలనలోకి జారిపోవడం మన అజ్ఞానమా... అమాయకత్వమా... ప్రశ్నించుకోవాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
విద్వేషాలను పెంచే హత్య
ఆయనేమీ అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి నిర్వహిస్తున్నవాడు కాదు. కనీసం రాజకీయ నాయకుడు కూడా కాదు. కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు సైద్ధాంతిక ఉపకరణాలు అందిస్తున్నవారిలో... ‘అమెరికాను మళ్లీ మహోత్కృష్టంగా మారుద్దాం’ (మాగా) ఉద్యమానికి తోడ్పడుతున్నవారిలో అతి ముఖ్యుడు. మూడు పదుల వయసు లోని మితవాద క్రియాశీల కార్యకర్త చార్లీ కిర్క్ను యూటా వ్యాలీ విశ్వవిద్యాలయంలో బుధవారం దుండగుడు కాల్చి చంపిన వైనం ఇప్పుడు అమెరికాను ఊపిరాడకుండా చేస్తోంది. ప్రముఖులను, ఉన్న పదవుల్లోని వారినీ భౌతికంగా నిర్మూలించాలని చూసే సంస్కృతి అమెరికాకు కొత్తగాదు. కానీ ఈమధ్య అది పెరిగింది. ట్రంప్ ఎన్నికల ప్రచార సభల్లో ఆయనపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. మిన్నెసోటా ప్రతినిధుల సభ స్పీకర్ ఎమెరిటా మెలిసానూ, ఆమె భర్తనూ ఇటీవలే కాల్చి చంపారు. అమెరికాలో తుపాకుల పరిశ్రమ పలుకుబడి అధికం. తుపాకి సంస్కృతిని రద్దుచేయటం మాట అటుంచి, కనీసం పరిమితులు విధించాలని చూసినా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తుపాకి కలిగివుండటం పౌరుల హక్కని, దాన్ని రద్దు చేయటమంటే జీవించే హక్కును కాలరాయటమేనని వాదిస్తారు. రిపబ్లికన్ పార్టీలో ఇలాంటివారు ఎక్కువున్నా, డెమాక్రటిక్ పార్టీలో కూడా తక్కువేం లేరు. కిర్క్ తుపాకులకు అనుకూలం. దానిపై ఒక విద్యార్థి ప్రశ్నకు జవాబు చెబుతుండగానే ఆయన హత్యకు గురయ్యారు. అమెరికాలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా అసహనం పెరిగింది. ఒక అంశంపై వాదం, ప్రతివాదం సంస్కృతి కనుమరుగవుతోంది. వినాలన్న యోచన లేదు. ఉన్నా వాదనకు జవాబు చెప్పలేక, అతనికి/ఆమెకు దురుద్దేశాలు అంటగట్టడం, అభాండాలేయటం, దౌర్జన్యానికి దిగటం పెరిగింది. ఏకీభవించకున్నా ఆ వాదనను గౌరవించాలన్న స్పృహ కొరవడింది.ఒక విశ్వాసాన్ని కలిగివున్న వ్యక్తిని హతమార్చినంత మాత్రాన ఆ విశ్వాసాన్ని నిర్మూలించటం అసాధ్యం. కానీ దురదృష్టవశాత్తూ దీన్ని నమ్ముకునే ధోరణి ప్రబలుతోంది. కిర్క్ డ్రాపౌట్ అన్న మాటేగానీ అసాధారణ ప్రతిభావంతుడు. కేవలం 18 యేళ్ల వయసులోనే ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ సంస్థ నెలకొల్పి తన మితవాద భావాలను బలంగా చెప్పగలిగే ఉపన్యాసకుడిగా రూపొందాడు. ఖజానా బాధ్యతాయుత నిర్వహణ, స్వేచ్ఛాయుత మార్కెట్లు, పరిమిత పాలనా వ్యవస్థ తదితర అంశాలపై విద్యాసంస్థల్లో ఉపన్యాసాలిచ్చాడు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడే 22 ఏళ్ల వయసులో ‘మాగా’ ఉద్యమానికి అంకితమై పనిచేశాడు. విద్యార్థులు అధిక సంఖ్యలో ఓటర్లుగా నమోదై రిపబ్లికన్లకు ఓటేయటం వెనక కిర్క్ కృషిని గురించి చెబుతారు. అరిజోనా వంటి డెమాక్రటిక్ ప్రభావిత ప్రాంతం రిపబ్లికన్ల వైపు మొగ్గటంలో అతనిపాత్ర ప్రధానమైనది. మహిళలు, గర్భస్రావాలు, ట్రాన్స్జెండర్లు తదితర అంశాల్లోఅతని వైఖరిని చాలామంది జీర్ణించుకోలేరు. జాతి, మత, వర్ణ, లింగ వివక్షను నిషేధించే 1964 నాటి పౌర హక్కుల చట్టం పెద్ద తప్పిదమని కిర్క్ భావన. భారతీయులకు కిర్క్ తీవ్ర వ్యతిరేకి. ‘శ్వేత జాతీయులకు ఉద్యోగాలు రావాలి... మీరంతా ఖాళీ చేసి పొండి’ అని పిలుపునిచ్చాడు.తన భావాలపై ప్రశ్నించవచ్చంటూ కాలేజీలు, వర్సిటీల సందర్శన మొదలు పెట్టాడు. ఆ భావాలను పూర్వపక్షం చేస్తే అతని వాదన బలహీనపడుతుంది. కానీ భౌతిక దాడికి దిగటం వల్ల కిర్క్ భావాల బలం పెరుగుతుంది. ఈ మరణం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో సామాజిక మాధ్యమాల్లోని వ్యాఖ్యలే చెబుతాయి. ‘మనది యుద్ధం. కిర్క్ నేలకొరిగిన యుద్ధ వీరుడు. వ్యక్తిగత భేదాలు పక్కనబెట్టి ఒక్కటై పోరాడాలి’ అని మితవాద వ్యూహకర్త స్టీవ్ బేనన్ పిలుపునిచ్చారు. ‘మనల్ని ప్రశాంతంగా బతకనీయకపోతే మనకున్న ప్రత్యామ్నాయాలు రెండే– పోరాడటం లేదా మరణించటం’ అని ఎలాన్ మస్క్ అన్నారు. ‘వామపక్షవాదులారా... మనం సంభాషించుకుందాం లేదా యుద్ధానికి దిగుదాం. మీ నుంచి మరో బుల్లెట్ బయటికొస్తే ఇక ఆఎంపిక మిగలదు’ అని నటుడు జేమ్స్ వుడ్స్ హెచ్చరించారు. ఏదేమైనా ఈ వాతావరణంలో అక్కడివారే కాదు... వలసపోయినవారూ అప్రమత్తంగా ఉండక తప్పదు. -
ఇజ్రాయెల్ ఘాతుకం
గాజాలో రెండేళ్లుగా తాను సాగిస్తున్న దుశ్చర్యలను చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయిన ప్రపంచానికి ఇజ్రాయెల్ ఊహించని షాక్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతార్ రాజధాని దోహాలో సమావేశమైన హమాస్ రాజకీయ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని మంగళవారం వైమానిక దాడులకు తెగబడి ఆరుగురిని హతమార్చింది. రాయబార కార్యాలయాలు, సూపర్ మార్కెట్లు, పాఠశాలలు ఉన్న కట్టుదిట్టమైన భద్రత గల ప్రాంతంలో దాడి జరపటాన్ని గమనిస్తే ఇజ్రాయెల్ దేన్నీ ఖాతరు చేయదల్చు కోలేదని స్పష్టమవుతోంది. కాల్పుల విరమణ సాకారమై, హమాస్ చెరలోని బందీలు విడుదల కావాలని ఇజ్రాయెల్ కూడా కోరుకుంటోంది. కనీసం పైకి అలా చెబుతోంది. ఒప్పందానికి హమాస్కు ఇదే చిట్టచివరి అవకాశమని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలోనే ఆ సంస్థ సమావేశమైంది. రెండేళ్లుగా ఇజ్రాయెల్, హమాస్ల మధ్య రాజీ కుదిర్చేందుకు ఖతార్ ప్రయత్నిస్తోంది. అందుకు అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుంది. హమాస్ను ఒప్పించాల్సిన అవసరం ఏర్పడినప్పుడల్లా ఆ రెండూ ఖతార్నే ఆశ్రయించేవి. పైగా అమెరికాకు అది అత్యంత సన్నిహిత దేశం. పశ్చిమాసియాలోని అతి పెద్ద అమెరికా సైనిక స్థావరం ఆ దేశంలోనే ఉంది. ఇటీవల ట్రంప్ ఖతార్ వచ్చినప్పుడు ఆయనకు అత్యంత విలాసవంతమైన బోయింగ్–747 జెట్ విమానాన్ని కానుకగా సమర్పించుకుంది. అమెరికాతో లక్ష కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇన్ని ‘మంచి లక్షణాలు’ గల దేశంపై ఇజ్రాయెల్ ఎట్లా దాడి చేయగలిగిందన్నదే గల్ఫ్ దేశాల రాజధానుల్లో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. గాజాలో శాంతి నెలకొనకుండా చూడటమే ఇజ్రాయెల్ ఉద్దేశంగా కనబడుతోందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ చేసిన వ్యాఖ్య నిజమే కావొచ్చుగానీ... అందుకు ఖతార్ సహా గల్ఫ్ దేశాల బాధ్యత కూడా ఉంది. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాద చర్యకు పాల్పడి 1,195 మందిని అమానుషంగా కాల్చిచంపి 250 మంది పౌరులను అపహరించింది. ప్రపంచ దేశాలన్నీ ఆ ఘాతుకాన్ని ఖండించాయి. ప్రతీకారం పేరుతో ఈ రెండేళ్లలో ఇజ్రాయెల్ 64,656 మంది పాలస్తీనా పౌరులను పొట్టనబెట్టుకుంది. రేపో మాపో పూర్తిగా గాజాను అధీనంలోకి తెచ్చుకోబోతోంది. ఈ కాలమంతా గల్ఫ్ దేశాలు చోద్యం చూశాయి. సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, యెమెన్లలో అది వైమానిక దాడులు సాగించినా మౌనంగా ఉండిపోయాయి. దాని పర్యవసానంగానే ‘మిత్రదేశం’గా ఉన్న ఖతార్పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. మరో దేశం సార్వభౌమ త్వాన్ని దెబ్బతీసేందుకు ఏ దేశమూ పూనుకోరాదని ఐక్యరాజ్యసమితి చార్టర్ నిర్దేశిస్తోంది. అలాచేస్తే అది దురాక్రమణే అవుతుందంటున్నది. కానీ తాను అన్నిటికీ అతీతమని ఇజ్రాయెల్ భావన.గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఏదో ఒకటి చేయాలని ఖతార్ ఇచ్చిన పిలుపుతో గురువారం సమావేశం జరిగింది. త్వరలో అరబ్–ఇస్లామిక్ శిఖరాగ్ర సదస్సు కూడా ఉంటుందంటున్నారు. అయితే ఆ ‘ఏదో ఒకటి’ సైనిక చర్య అయితే కాదు. కనీసం ఆ ఆలోచన చేసినా అమెరికా నొచ్చుకుంటుందని వాటికి తెలుసు. అమెరికా–గల్ఫ్ దేశాల బంధం ఉభయ తారకం. అమెరికా సైనిక సాయంపై గల్ఫ్ ఆధారపడి ఉండగా... పశ్చిమాసియాలో తన పలుకుబడి చెక్కుచెదరకుండా ఉండటానికి గల్ఫ్ దేశాల అవసరం అమెరికాకుంది. ఈ అమరికను మార్చటమే ఇజ్రాయెల్ ఆంతర్యం కావొచ్చు. ఎటూ గాజా హస్తగతం కాబోతున్నది కనుక, ఇదే అదునుగా ఈ ప్రాంతంలో తానే ప్రధాన కేంద్రంగా ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టు కనబడుతోంది. కానీ అదంత సులభం కాదు. సౌదీ, యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్, బహ్రెయిన్ల సమష్టి మదుపు నిధి 4 లక్షల కోట్ల డాలర్ల పైమాటే. ఈ సంపద ఆసరాతో గల్ఫ్ దేశాలు ప్రపంచ ఇంధన మార్కెట్లను శాసించగలవు. గణనీయంగా పలుకుబడి పెంచుకోగలవు. అందుకే ‘ఏదో ఒకటి’ చేయాలన్న ఖతార్ పిలుపుపై ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమ చాప కిందకు నీళ్లొస్తుంటే చూస్తూ ఊరుకోవటం ఆత్మహత్యా సదృశమని గల్ఫ్ దేశాలు ఇప్పటికైనా గుర్తించాలి. ఈ సంక్షోభ సమయంలో అమెరికాకు వంతపాడటం కాక, సొంత గొంతుక వినిపిస్తేనే మనుగడ ఉంటుందని తెలుసుకోవాలి. -
కూటమి సర్కారు బరితెగింపు
జనం పక్షాన నిలిచిన కలంపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కత్తిగట్టింది. గత పదిహేను నెలల పాలనలో వరస కుంభకోణాలూ, వంచనలూ తప్ప చేసిందేమీ లేదని బట్టబయలవుతున్నకొద్దీ దిక్కుతోచక ‘సాక్షి’పైనా, ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డిపైనా అక్రమ కేసులతో రెచ్చిపోతోంది. రాజ్యాంగానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన బాధ్యతను పక్కనబెట్టి రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మారుస్తోంది. పత్రికలపై కక్షగట్టడంలో ప్రభుత్వ నైచ్యం హద్దులు దాటింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే వెనువెంటనే కేసులు రిజిస్టర్ చేయాలంటూ కూటమి సర్కారు మౌఖిక ఆదేశాలిచ్చిందంటున్నారు. అందులో భాగంగానే సోమవారం ఏపీ పోలీసులు హైదరాబాద్లోని ‘సాక్షి’ కార్యాలయానికొచ్చి ఎడిటర్ ధనంజయరెడ్డికి నోటీసులు అందజేశారు. గత మే నెలలోనే కూటమి ప్రభుత్వం ఈ అరాచకానికి నాంది పలికింది. విజయవాడలో ధనంజయరెడ్డి ఇంట్లోకి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తప్పుడు సాకులతో అక్రమంగా చొరబడి,‘మద్యం కేసు నిందితులు మీ ఇంట్లో ఉన్నారేమో తెలుసుకోవటానికి వచ్చామంటూ మూడు గంటలపాటు హడావుడి సృష్టించింది. తలుపులు మూసి, సోదాలు చేసి, దౌర్జన్యంతో ఫోన్ లాక్కొనే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం వాస్తవాలను ఏ మాత్రం సహించే స్థితిలో లేదు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆఖరుకు వార్తలను, వ్యాఖ్యలను కవర్ చేసినా కూడా ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెడుతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాల్లోని వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే ఇలా కక్షగట్టింది. అసలే స్కాంలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడిదాకో ఎందుకు... 2015 మొదలుకొని 2019 వరకూ అధికారం వెలగబెట్టినప్పుడు ఏటా రూ. 1,300 కోట్ల చొప్పున అయిదేళ్లలో ఖజానాకు వేల కోట్ల రూపాయల మేర గండికొట్టిన ఘనుడాయన. ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు. కాగ్ ఆధ్వర్యంలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నిశితంగా గమనించి బట్ట బయలు చేసిన చేదు నిజం. దీన్నంతటిని వెలుగులోకి తెస్తున్నందునే ‘సాక్షి’పై సర్కారు వారి అక్కసు. ఇదొక్కటే కాదు... అక్రమ మార్గాల్లో అధికారాన్ని చెరబట్టింది మొదలు కూటమి పెద్దలు చేయని అరాచకం లేదు. ఇసుక దోపిడీ, భూకబ్జాలు, పేరూ ఊరూ లేని సంస్థలకు విలువైన భూముల్ని కారు చౌకగా కట్టబెట్టడాలూ, మహిళలపై అఘాయిత్యాలూ.... ఒకటేమిటి, కూటమి సర్కారు చేస్తున్న సమస్త అరాచకాలనూ ‘సాక్షి’ బయట పెడుతోంది. అందుకే తప్పుడు కేసులు బనాయించి నోరుమూయించాలని చూస్తోంది. మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ నిత్యం రాజకీయ చైతన్యంతో తొణికిసలాడే ప్రాంతం. ఇలాంటిచోట ఎంతకైనా బరితెగించి పాలిద్దామని, నిజాలు బయటపెడుతున్నవారి నోరు నొక్కుదామని చూడటం తెలివితక్కువతనం. దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా మీడియా పైనా, ఎడిటర్లపైనా ఈ స్థాయిలో కక్ష తీర్చుకున్న దాఖలాలు లేవు. గతంలో ‘సాక్షి’ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ మూకలు దాడులు చేశాయి. ఈమధ్య పోలీసులే ఆ బాధ్యత తీసుకుంటున్నారు. ఇటీవల విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలోకి అర్ధరాత్రి చొరబడి అరాచకం సృష్టించారు. ఇప్పుడిక వార్త ప్రచురించటాన్ని కూడా నేరంగా పరిగణించి నోటీసులు జారీ చేయటం, అక్రమ కేసులు బనాయించటం మొదలైందన్నమాట! ఒక పార్టీ నాయకుడు నిర్వహించిన మీడియా సమావేశం వివరాలు ప్రచురించటం నేరమెలా అవుతుందో సర్కారు చెప్పగలదా?మన రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో పత్రికా స్వేచ్ఛ అంతర్భాగం. పత్రికా స్వేచ్ఛ అంటే సమాచారాన్ని తెలుసుకోవటానికి ప్రజలకుండే హక్కు.దీన్ని కాలరాయాలని చూస్తే ప్రజాస్వామ్య శక్తులు సహించవు. ‘సాక్షి’ గొంతు నొక్కితే తమ అరాచకాలను ప్రశ్నించేవారుండరని కూటమి ప్రభుత్వం కలలుగంటోంది.అందుకే నోటీసులతో, తప్పుడు కేసులతో బెదిరిస్తోంది. పాలకుల అక్రమాలనూ, అన్యాయాలనూ, అరాచకాలనూ బట్టబయలు చేయటం, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం ‘సాక్షి’ కర్తవ్యం. పాలకుల చవకబారు ఎత్తుగడలకు భయపడి దీన్నుంచి వైదొలగే ప్రశ్నే లేదు. -
తిరగబడిన నేపాల్!
చిన్న నిప్పురవ్వ చాలు... పెనుమంటలు ఎగిసిపడటానికి! ఒక్క కారణమే చాలు... అసంతృప్తి పెల్లుబుకటానికీ, అధికార పీఠాల్ని కూలదోయటానికీ!! ఆ మధ్య శ్రీలంకలో, మొన్న బంగ్లాదేశ్లో, నెల క్రితం ఇండోనేసియాలో రోడ్లపైకి వెల్లువలా వచ్చిపడిన యువత శక్తేమిటో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి గ్రహించలేకపోయారు. నిరసనంటే తెలియని, ఉద్యమమంటే ఎరుగని ‘జెన్ జీ’ తరాన్ని తక్కువ అంచనా వేశారు. అందుకే అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలై 36 గంటలు కాకుండానే ఆయనకు పదవీ భ్రష్టత్వం తప్పలేదు. అధ్యక్షుడు రాంచంద్ర పౌడ్వాల్ సైతం రాజీనామా చేశారు. కానీ ఈలోగా హింస పెల్లుబికి పార్లమెంటుకు నిప్పంటుకుంది. అధ్యక్షుడు, ప్రధాని భవంతులు తగలడిపోయాయి. మంత్రుల నివాసాలూ, పార్లమెంటు ఉన్న సింఘా దర్బార్ ఆవరణ ఉద్యమకారుల లక్ష్యంగా మారింది. మంత్రుల్ని రక్షించటానికి ఆర్మీ హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేయాల్సివచ్చింది. మాజీ ప్రధాని, పాలకపక్షంలో భాగస్వామిగా ఉన్న నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్య విదేశాంగమంత్రి అర్జూరమా దేవ్బా, నేపాల్ మావోయిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని ప్రచండ తదితరుల ఇళ్లపై దాడులు చేయగా, దేవ్బా దంపతులపై దౌర్జన్యం చేసి, నెత్తురోడుతున్న దేవ్బాను ఈడ్చుకెళ్లారు. భద్రతా దళాల కాల్పుల్లో 19 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారని చెబుతున్నారు.చెప్పుకోదగిన నాయకుడు లేకున్నా సోమవారం ఉదయం వందల మందితో మొదలైన ఉద్యమం మధ్యాహ్నానికే వేలసంఖ్యకూ, అటు తర్వాత లక్షల్లోకి మారింది. దేశ రాజధాని కఠ్మాండూను దాటి జిల్లాలకు వ్యాపించింది. లాఠీచార్జి, బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు, చివరకు కాల్పులు ఫలితాన్నివ్వలేదు సరిగదా... ఆగ్రహించిన గుంపులు అధికార సౌధాలపై పడ్డాయి. హింసకు దిగొద్దన్న వినతులు బేఖాతరు కావటంతో ఉద్యమాన్ని విరమిస్తున్నామని నిర్వాహకులు ప్రకటించాల్సి వచ్చింది. మొదట ఉద్యమం శాంతియుతంగా ప్రారంభమైంది. దానికి ప్రభుత్వమే ఆజ్యం పోసింది. సామాజిక మాధ్యమాల ద్వారా పిలుపందుకుని వస్తున్న విద్యార్థులు, యువతతో ఆ ప్రాంతం నిండుతుండగానే ప్రభుత్వం యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర 26 వెబ్ సైట్లను నిలిపివేసింది. ఆ మాధ్యమాలు పన్నులు చెల్లించకపోవటం వల్లే నిలిపేశామని సంజాయిషీ ఇచ్చినా నిజమేమిటో అందరికీ తెలుసు. కనబడే కారణం మాధ్యమాల నిషేధమే అయినా అక్కడ నెలకొన్న ఆర్థిక సంక్షోభం అసలు హేతువు. సగటున రోజుకు రెండు వేలమంది పొట్టనింపుకోవటానికి దూర తీరాలకు వలసపోయే దుఃస్థితి నెలకొంది. దీన్ని సరిచేయకపోగా ప్రాజెక్టులన్నీ అవినీతి మయంగా మారాయి. సంపన్నుల పిల్లలు విదేశాల సందర్శనకు పోయి విలాసాల్లో గడుపుతూ సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు షేర్ చేయటం సహజంగానే నిరుద్యోగంతో దుర్భర జీవనం సాగిస్తున్న యువతలో ఆగ్రహాన్ని కలిగించింది. ఇందుకు ప్రస్తుత పాలక పక్షంలోని సీపీఎన్(యూఎంఎల్), నేపాలీ కాంగ్రెస్లతోపాటు అరకొర సీట్లతో కింగ్మేకర్గా మిగిలిపోయిన మావోయిస్టు పార్టీ సైతం సిగ్గుపడాలి. శ్రీలంకలో మూడేళ్ల క్రితం, నిరుడు బంగ్లాదేశ్లో, నేడు నేపాల్లో ఒకే మాదిరి దృశ్యాలు కనిపించటం యాదృచ్ఛికం కాదు. ఈ మూడు ఉద్యమాలూ యువత, విద్యార్థుల నాయకత్వంలోనే జరిగాయి. మూడింటి మధ్యా కనబడే మరో పోలిక ఏమంటే... వీటికి చైనాయే అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఆర్థికంగా కుంగదీసింది. ఉదాహరణకు నేపాల్ పౌర విమానయాన మౌలిక సదుపాయాల మెరుగు కోసమంటూ తలపెట్టిన పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయానికి చైనా ప్రధాన రుణదాత. 2,200 కోట్ల డాలర్ల ఈ ప్రాజెక్టు రెండేళ్ల క్రితం సాకారమైంది. కానీ అది వృథా వ్యయమని కొన్నాళ్లకే తేలిపోయింది. అందులో 10.5 కోట్ల డాలర్లకు పైగా అవినీతి జరిగిందని నిర్ధారణ అయింది. ఆ రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని నేపాల్ కోరుతున్నా చైనా ససేమిరా అంటోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టు కూడా కష్టాల్లో పడింది. సరిగ్గా ఆగ్రహ జ్వాలల్లో నేపాల్ మండుతుండగా ఓలి శర్మ చైనా పర్యటన ముగించుకుని రావటం గమనించదగ్గది. -
థాయ్లాండ్కు కొత్త ఏలిక
పేరుకు ప్రజాస్వామ్యమైనా రాచరిక వ్యవస్థ, దాని విధేయ సైన్యం, రాజ్యాంగ న్యాయస్థానం థాయ్లాండ్ రాజకీయాలను తెర వెనకుండి శాసించటం విడనాడలేదు. పర్యవసానంగా రెండేళ్ల వ్యవధిలో మూడో ప్రధాని రంగప్రవేశం చేశారు. ఇటీవల న్యాయస్థానం ఆదేశంతో పదవి నుంచి వైదొలగిన పేటోన్టాన్ షినవత్రా స్థానంలో బీజేటీ పార్టీ అధినేత అనుతిన్ చార్నివిరకుల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మధ్య థాయ్లాండ్–కంబోడియాల సైన్యాల మధ్య నాలుగు రోజులపాటు కొనసాగిన ఘర్షణలు థాయ్లాండ్లో రాజకీయ దుమారం రేపాయి. ఆ ఘర్షణల్లో ఇరువైపులా 30 మంది మరణించారు. సరిహద్దులపై తలెత్తిన ఈ యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు లొంగి ఇరు దేశాలూ విరమించాయి. ఆ వెంటనే థాయ్ జాతీయవాదులు ఆగ్రహోదగ్రులయ్యారు. షినవత్రా తప్పుకోవాలంటూ ఉద్యమం నడిచింది. ఈలోగానే కంబోడియా మాజీ అధినేత హూన్సేన్తో ఆమె ఫోన్ సంభాషణ లీక్ కావటంతో అంతా తలకిందులైంది. ఈ సంభాషణలో తమ దేశ సైనిక జనరల్ను ఆమె తప్పుబట్టడం, వివాదం పరిష్కారానికి చొరవ తీసుకోవాలని హూన్సేన్ను కోరటం నేరంగా పరిగణించి ఆమె వైదొలగాలంటూ కోర్టు ఆదేశించింది.ప్రధానిగా ఉంటూ, ప్రత్యర్థి దేశానికి చెందిన నాయకుడితో సంభాషించటం, సైనిక జనరల్ను కించపరచటం తప్పే అయినా న్యాయస్థానానికి ఏమంత గొప్ప చరిత్ర లేదు. రాచరిక వ్యవస్థకు అనుకూలమైన తీర్పులిస్తూ ఎన్నికైన ప్రభుత్వాలను ఏదో సాకుతో తొలగించి అస్థిరపర్చటం దానికి అలవాటు. అంతేకాదు... రాచరిక అనుకూల నేతలు హత్యలు చేసినా, అవినీతికి పాల్పడినా నిర్దోషులుగా తీర్పునివ్వటం రివాజు. 1932లోనే రాచరిక వ్యవస్థ అంతరించినా అదంతా నామమాత్రం. వ్యవస్థలన్నీ దాని చెప్పుచేతల్లోనే ఉంటాయి. సైనిక కుట్రల ద్వారా లేదా న్యాయస్థానం ద్వారా ప్రభుత్వాలను కూల దోయటం పరిపాటైంది. ఎన్నికైన ఏ ప్రభుత్వమూ పూర్తికాలం అధికారంలో లేదు.ఇందుకు షినవత్రా తండ్రి తక్సిన్ షినవత్రా ఒక్కరే మినహాయింపు. 2001లో అధికారంలోకొచ్చిన తక్సిన్ను పదవీకాలం చివర 2006లో సైనిక కుట్ర ద్వారా తొలగించారు.గత ఇరవయ్యేళ్లలో షినవత్రా కుటుంబం రెండు సైనిక కుట్రలనూ, మూడు కోర్టు తీర్పులనూ చవిచూసి మూడు ప్రభుత్వాలను కోల్పోయింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో అయిదుగురు ప్రధానులు మారారు. తక్సిన్ ఆధ్వర్యంలోని థాయ్ రక్ థాయ్ పార్టీని 2007లో అయిదేళ్లపాటు నిషేధించారు . అటుతర్వాత ఫ్యు థాయ్ పేరిట మరో పార్టీ స్థాపించారు. ఆయన కుమార్తె పేటోన్టాన్ పది నెలలపాటు కూటమి ప్రభుత్వాన్ని నడిపారు. పార్టీలనూ, అధినేతలనూ నిషేధించటం షినవత్రాతో ఆగిపోలేదు. 2020లో ఫ్యూచర్ ఫార్వర్డ్ పార్టీని, 2023లో మూవ్ ఫార్వర్డ్ పార్టీని ఇదేవిధంగా నిషేధించి ఆ పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ ఆంక్షలు విధించారు. ఒకరిద్దరు సీనియర్ నేతలపై దశాబ్దంపాటు ఏ పదవీ చేపట్టరాదని తీర్పులిచ్చారు. నిరుపేదల సంక్షేమాన్ని పట్టించుకుని, వారి జీవితాలను మెరుగుపర్చటానికి ప్రయత్నిస్తే రాచరిక వ్యవస్థకు కడుపుమంట. తక్సిన్ షిన వత్రానైనా, ఇతర అధినేతలనైనా కేవలం ఆ కారణంతోనే ముప్పుతిప్పలు పెట్టారు. 2006లో పదవి నుంచి తప్పించాక తక్సిన్ ప్రవాసానికి వెళ్లి పదిహేడేళ్ల తర్వాత 2023లో స్వదేశానికొచ్చారు. అటుపై అవినీతి, ఇతర నేరాల్లో ఆయన్ను అరెస్టు చేయగా అనారోగ్య కారణం చూపి ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన జైలుశిక్ష సక్రమంగా అనుభవించారా లేదా అన్న అంశంపై ఇప్పుడు తీర్పు రాబోతోంది. సైనిక జనరళ్ల నియామకాల్లో ప్రభుత్వ ప్రమేయాన్ని పెంచే ప్రతిపాదనను పేటోన్ టాన్ ప్రభుత్వం పరిశీలించింది. సైన్యం ఒత్తిళ్లతో దాన్ని విరమించుకున్నా ఆమెపై పగబట్టారు. అందుకే ఫోన్లపై నిఘాపెట్టి సాగనంపారు. దేశంలో అస్థిరత అలుము కోవటంతో విదేశీ మదుపుదార్లు 2,300 కోట్ల డాలర్ల మేర వెనక్కు తీసుకున్నారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న థాయ్ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత దిగజారింది. ఇలాంటి స్థితిలో కొత్త ప్రధాని అనుతిన్ దేశాన్ని గట్టెక్కించగలరా... అసలు సైన్యం సక్రమంగా పాలించనిస్తుందా అన్నది వేచిచూడాలి. -
అక్షరాల చదువులు
అన్నమే కాదు, అక్షరమూ పరబ్రహ్మ స్వరూపమే! బొందిలో ప్రాణాన్ని నిలుపు కోవడానికి అన్నం ఎంత అవసరమో; ఆలోచనలను పదును పెట్టుకోవడానికి, పదును పెట్టుకున్న ఆలోచనలను పదికాలాల పాటు పదిలపరచుకోవడానికి అక్షరం అంతే అవసరం. ‘అక్షరం బ్రహ్మ పరం స్వభావో అధ్యాత్మముచ్యతే/ భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః’ అని ‘భగవద్గీత’ చెబుతోంది. అంటే, నాశనం లేని అక్షరమే పరబ్రహ్మం. అక్షర స్వభావమే, తన ఆత్మరూపమే అధ్యాత్మం అని అర్థం. అక్షరం జ్ఞానకళిక. ప్రపంచం సాధించిన నేటి పురోగతికి అక్షరమే ఆలంబన. అక్షరమే లేకుంటే, నేటికీ ప్రపంచం అజ్ఞాన తమస్సమాధిలోనే కూరుకుని ఉండేది.అనంత జ్ఞానయానానికి అక్షరం తొలి అడుగు మాత్రమే! కేవలం అక్షరాస్యత వల్లనే ఎవరూ జ్ఞానఖనులు కాలేరు. ‘జీవితంలో విజయవంతం కావాలంటే అక్షరాస్యత, డిగ్రీలు మాత్రమే చాలవు; విద్య కావాలి’ అన్నారు ప్రఖ్యాత హిందీ రచయిత మున్షీ ప్రేమ్చంద్. ఆయన మాట అక్షరసత్యం. మన దేశంలో పట్టభద్రుల సంఖ్య పెరుగు తున్నంతగా విద్యావంతుల సంఖ్య పెరగడం లేదు. అక్షరాస్యత సాధించడమే ఘనకార్యంగా ప్రచారం చేసుకునే దశ నుంచి మన ప్రభుత్వాలు ఎంత త్వరగా బయటపడితే దేశానికి అంత మంచిది. మన దేశంలోని బడిపిల్లల్లో అక్షరాస్యత కూడా అరకొరగానే ఉంటోంది. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల్లో దాదాపు సగం మందికి ప్రాథమిక స్థాయి అంశాలపై కూడా అవగాహన లేదని; చిన్న చిన్న లెక్కలు చేయడానికి, సరళమైన వాక్యాలు రాయడానికి కూడా వీరు సతమతమయ్యే స్థితిలోనే ఉన్నారని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ పరిశీలనలో తేలింది. నేటి బడిపిల్లలే రేపటి పట్టభద్రులు. నేటి పునాదులే ఇంత చక్కగా ఉంటే, ఈ పునాదుల పైనే వెలిసే రేపటి భవంతులు ఎంత దృఢంగా ఉంటాయో ఊహించుకోవాల్సిందే! మన చదువుల తీరుతెన్నులపై ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆందోళన కాదిది. ఈ పరిస్థితి బ్రిటిష్ హయాంలోనూ ఉండేది. ‘ఇంగిలీషుతో పాటుగా నిపుడు సంస్కృ/ తమ్మునకు గూడ డిగ్రీల తంపి వచ్చె/ నట్లు ప్యాసగు వారలయందెవండొ/ తక్క దక్కినవారు శుద్ధ జడమతులె’ అని చెళ్లపిళ్లవారు అప్పట్లోనే వాపోయారు. బ్రిటిష్ పాలన ముగిసి, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా, మన అక్షరాస్యత డెబ్బయి ఐదు శాతానికి లోపే! అంటే, ఇంకా దాదాపు నాలుగో వంతు జనాభా అక్షరాస్య తకు దూరంగానే ఉంది. స్వాతంత్య్రం వచ్చే నాటితో పోల్చుకుంటే దేశంలోని పట్టభద్రుల సంఖ్య దాదాపు నూటయాభై రెట్లు పెరిగింది. డిగ్రీల మీద డిగ్రీలు సంపాదించుకుంటున్న బహుపట్టభద్రుల్లో ఎంతమంది వివేకం కలిగిన విద్యావంతులో నిగ్గుతేల్చడం అంత సాధ్యమయ్యే పనికాదు. అయినా, ఎవరి డిగ్రీలు వారి వ్యక్తిగతాలు. వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అక్షరాస్యత వలన విద్య; విద్య వలన వినయ వివేకాలు ఒనగూరుతాయనేది ఒక చిరకాల విశ్వాసం. విశ్వాసాలు విశ్వాసాలే! విశ్వాసాలన్నీ వాస్తవాలు కావాలనే నిబంధనేదీ లేదు. ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్/ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టక నేర్చునటయ్య భాస్కరా!’ అన్నాడు శతకకారుడు. ఎంత చదువు చదివినా, కాస్త రసజ్ఞత లేకుంటే ఆ చదువు నిరర్థకమే! గుణవంతులెవరూ అలాంటి చదువును మెచ్చరు అని మారవి వెంకయ్య కవిహృదయం. ‘చదువని వాడజ్ఞుండగు/ చదివిన సదసద్వివేక చతురత గలుగున్/ చదువగ వలయును జనులకు/ చదివించెదనార్యులొద్ద చదువుము తండ్రీ!’ అని పోతనా మాత్యుడు భాగవతంలో హిరణ్యకశిపుడి పాత్ర ద్వారా చెప్పారు. ప్రహ్లాదుడిని చండా మార్కుల గురుకులానికి పంపిస్తూ, ఎందుకు చదువుకోవాలో చెప్పాడు హిరణ్యకశిపుడు. మన పూర్వ కవులకు తెలిసిన చదువుల ప్రయోజనానికీ, నేటి జనాలకు తెలిసిన చదువుల ప్రయోజనానికీ నడుమ యోజనాల దూరం ఉంది. అక్షరాస్యత వలన డిగ్రీలు; డిగ్రీల వలన కొలువులు ఒనగూరుతాయనేదే నేటి విశ్వాసం. -
చైనా కండబల ప్రదర్శన
రెండో ప్రపంచ యుద్ధంలోనూ, జపాన్ దురాక్రమణను ప్రతిఘటించటంలోనూ విజయం సాధించి ఎనిమిది దశాబ్దాలవుతున్న సందర్భంగా బుధవారం తియనాన్మెన్ స్క్వేర్లో నిర్వహించిన సైనిక పరేడ్లో చైనా తన రక్షణ పాటవాన్ని ప్రదర్శించటం కన్నా బలప్రదర్శనకు ప్రాధాన్యమిచ్చింది. వ్యూహాత్మక అణ్వస్త్రాలు తన దగ్గరున్నాయని, ఇక రాబోయేదంతా తన యుగమేనని చాటదల్చుకున్నట్టుంది. 1949లో ప్రజా రిపబ్లిక్గా ఏర్పడింది మొదలు ఆ దేశం పదేళ్లపాటు ఏటా ఇలాంటి ఆర్భాటాన్ని ప్రదర్శించేది.ఎందుకో ఆ తర్వాత ఆపి, తిరిగి 1984లో పునరుద్ధరించింది. ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆ పరేడ్ను విక్టరీ డే ఉత్సవంగా మార్చారు. ఈ తరహా పరేడ్లకు విదేశీ అతిథుల్ని పిలవటం అందరూ పాటించే ఆనవాయితీ. అయితే చైనా ఒక్కసారి 1959లో మాత్రమే దాన్ని పాటించింది. మళ్లీ అరవై ఆరేళ్ల తర్వాత ఇన్నాళ్లకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. వారిద్దరే కాదు... చైనా సన్నిహితులుగా ముద్రపడిన ఇరాన్, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి కూడా అధినేతలు హాజరయ్యారు.ఈ పరేడ్ల సంప్రదాయం ఎవరు మొదలెట్టారోగానీ ఇందులో ప్రదర్శించేవన్నీ మారణాయుధాలు. ఈసారి పరేడ్లో చైనా వంద రకాల మారణాయుధాలను ప్రదర్శించింది. యుద్ధతంత్రాన్ని సమూలంగా మార్చగల ఆయుధాలే అందులో ఎక్కువ. సంప్ర దాయ యుద్ధంలోనూ, కొత్త తరహా యుద్ధంలోనూ తమ దరిదాపుల్లోకి రాగలవారెవరూ లేరని చైనా చెప్పదల్చుకున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. పొరుగునున్న తైవాన్ దురాక్రమణకు ఇదొక రిహార్సల్ కావొచ్చన్న అనుమానాలు అందరిలో ఉన్నాయి. తైవాన్ జోలికెళ్తే అమెరికా దాడికొస్తుందన్న సంశయం చైనాకుండేది. కానీ ఉక్రెయిన్పై కత్తిగట్టిన పుతిన్ ముందు అమెరికా, పాశ్చాత్య దేశాలు నిస్సహాయులుగా మిగిలిన వైనం చూశాక తానూ తైవాన్లో ఆ మాదిరి ప్రయత్నం చేయొచ్చని చైనా భావిస్తూండవచ్చు. ఈ పరేడ్ ద్వారా చైనా దాన్నే చెప్పదల్చుకుందా?పరేడ్లు చూసి తమ దేశం శక్తిమంతంగా తయారైందని, శత్రువులు వణుకు తున్నారని సంబరాలు చేసుకునేవారు అన్ని దేశాల్లోనూ కనబడతారు. కానీ క్షణాల్లో భూమండలాన్ని భస్మీపటలం చేయగల శక్తి తమకున్నదని చాటుకోవటంలో ఉండే ఆనందమేమిటో సామాన్యులకు అర్థం కాదు. అణ్వస్త్రాన్ని మొదటగా ఉపయోగించబోమని చైనా మొదటినుంచీ చెబుతోంది. కానీ అది ప్రదర్శించిన అణు జలాంతర్గామి తీరు చూస్తుంటే ఆత్మరక్షణ కాదు... ఎదురుదాడికి చైనా సంసిద్ధమైందన్న అభిప్రాయం కలుగుతుంది. చడీచప్పుడూ లేకుండా, అమెరికా గూఢచర్యానికి దొరకకుండా ఏ ఖండంలోని సాగర జలాల్లోనైనా దాన్ని మోహరించ వచ్చంటున్నారు. నీటి అట్టడుగున ఎంత దూరమైనా దూసుకెళ్లగల డ్రోన్లు, 2000 కిలోమీటర్ల శ్రేణిలోని విమాన వాహక నౌకలను ధ్వంసం చేయగల వైజె–21 హైపర్సోనిక్ క్షిపణి వగైరాలను పరేడ్లో ప్రదర్శించింది. శబ్దవేగం కన్నా పదిరెట్ల వేగం దీని సొంతం.ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు ముప్పు ముంచుకురాగలదన్న అనుమానంతో అమెరికా అతి జాగ్రత్తలు తీసుకునేది. ఇకపై దానికి జపాన్ రక్షణ బాధ్యత అదనం. ఇప్పటికే జపాన్ తీరం పొడవునా టైఫూన్, తోమహాక్, ఎస్ఎం–6 క్షిపణుల్ని మోహరించింది. ప్రపంచం గుర్తుపట్టలేనంతగా మారిపోతోంది. జరుగుతున్న పరిణామా లన్నీ ఉద్రిక్తతలను మరిన్ని రెట్లు పెంచేవే. చైనా పరేడ్ కూడా అటువంటిదే. ప్రపంచశాంతికి దోహదపడతామని ఒకపక్క చెబుతూ కండబలాన్ని ప్రదర్శించటం సరికాదన్న స్పృహ కూడా ఆ దేశానికి లేకపోయింది. ఆహ్వానించిన షీ జిన్పింగ్తోపాటు అతిథులుగా వచ్చిన పుతిన్, కిమ్లు కూడా నియంత లక్షణాలు పుణికిపుచ్చుకున్నవారు. ఎన్నికలు లేకుండానో... బూటకపు ఎన్నికల ద్వారానో అధికారంలోకొచ్చినవారు. వీరికి జనమన్నా, వారి భద్రతన్నా ఏం పట్టింపు ఉంటుంది? సుంకాల యుద్ధంలో తలమునకలై అన్నిటినీ గాలికొదిలిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... జిన్పింగ్, పుతిన్లు ఉమ్మడిగా అమెరికాపై కుట్ర సాగిస్తున్నారని ఆరోపించారు. కనుక రాగల రోజుల్లో అమెరికా కండబల ప్రదర్శన అందరూ చూడాల్సి రావొచ్చు. -
మారిన శ్లాబుల మురిపెం
ఎటు చూసినా నిరాశామయ వాతావరణమే అలుముకుని అంతటా నిర్లిప్తత ఏర్పడిన తరుణంలో బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన అందరిలోనూ ఉత్సాహం నింపింది. ఈ క్షణం కోసం సామాన్యులు మొదలుకొని రైతులూ, చిరు వ్యాపారులూ, చిన్నా చితకా పరిశ్రమలవారూ ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. సరుకులు, సేవల పన్ను (జీఎస్టీ)ను హేతుబద్ధీకరిస్తూ, సాధారణ ప్రజానీకం వాడే అనేకానేక నిత్యావసరాలకు పన్ను తగ్గించటం లేదా పూర్తిగా ఎత్తేయటం... ఆరోగ్య బీమాకు పన్నుపోటు నుంచి మినహాయించటం తదితరాలు ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో ఊరట నిస్తాయి. సామాన్యుల్లో జీఎస్టీ ‘గబ్బర్సింగ్ టాక్స్’గా అపకీర్తి పాలైందంటేనే వారిని ఎంతగా కష్టపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే పన్నుల హేతుబద్ధీకరణను అమలు చేయబోతున్నామని పదే పదే ప్రకటించటంతో జీఎస్టీ మండలి సమావేశమైనప్పుడల్లా అందరిలోనూ ఆశలు చిగురించేవి. తీరా మరిన్ని సరుకుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటంతో వారంతా బిత్తరపోయేవారు. ప్రధాన రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడూ, వార్షిక బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడూ జీఎస్టీ తగ్గింపుపై ఊహాగానాలు రావటం, చివరకు నిట్టూర్చటం రివాజైపోయింది. ఈ దశలో మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీని సరళీకృతం చేయబోతున్నామని వెల్లడించారు. మొత్తానికి ఇప్పుడిక 5 శాతం, 18 శాతం పన్నుల విధానం అమలు కాబోతోంది.ఆరంభమైన మొదలుకొని జీఎస్టీని ఎవరూ మెచ్చింది లేదు. తమ ఆదాయ వనరు లకు గండి కొట్టిందని రాష్ట్రాలూ, తమ జేబులు కత్తిరిస్తోందని మధ్యతరగతి జీవులూ,ఎంతో కష్టపడి సంపాదిస్తున్నది కాస్తా జీఎస్టీ పేరు మీద ప్రభుత్వం తన్నుకు పోతున్నదని వ్యాపారులూ ఆక్రోశిస్తూనే ఉన్నారు. జీఎస్టీ చిత్రవిచిత్రాలు పోయింది. వడాపావ్ వెన్నతో తింటే ఒక రకమైన పన్ను, అది లేకుండా తింటే వేరే రకం పన్ను వేయటాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు. ఆ మధ్య నిర్మలా సీతారామన్ సమక్షంలో ఒక వ్యాపారవేత్త జీఎస్టీపై వెటకారంగా వ్యాఖ్యానించటం, ఆ వీడియో కాస్తా వైరల్ కావటంతో ఆయన కంగారుపడి మంత్రిని కలిసి క్షమాపణలు చెప్పటం అందరికీ తెలుసు. జీఎస్టీ అరాచకం అంతా ఇంతా కాదు. సబ్బు, షాంపూలపై 18 శాతం, స్కూలు పుస్త కాలు, పెన్సిళ్లు, రంగు పెన్సిళ్లు తదితరాలపై 12 శాతం, ఆఖరికి కోచింగ్ తీసుకుంటే 18 శాతం పన్నులతో ఎడాపెడా బాదటం అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. అయినా కేంద్రంలో కదలిక రాలేదు. అమెరికా విధించిన 50 శాతం సుంకాల వల్ల ఎదురుకాగల సమస్యల్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రంలో కదలిక వచ్చిందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఆ సంగతలా ఉంచితే ప్రజల్లో వినిమయాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు తీసుకురావటానికి తాజా నిర్ణయాలు దోహదపడతాయి. ప్రభుత్వాలు ఆదాయాన్ని పెంచుకోవటానికి ఎంతసేపూ పరోక్ష పన్నులపైనే ఆధారపడతాయి. ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే నిజానికిది చాలా తక్కువ. కానీ పారిశ్రామికవేత్తలనూ, సంపన్నులనూ నొప్పించటం ప్రభుత్వాలకు ఇష్టం ఉండదు. వాళ్లంతా ఉపాధి కల్పనలో పాలుపంచుకుంటున్నారన్న కారణం చెబు తారు. పరోక్ష పన్నుల్ని ‘తిరోగమనం’గా అభివర్ణించేవారు కూడా ఉన్నారు. సినిమా టిక్కెట్లపై విధించే వినోదపు పన్నునే వారు ఉదాహరిస్తారు. సామాన్యుడికైనా, కోట్లకు పడగెత్తిన సంపన్నుడికైనా ఆ పన్ను ఒకేలా ఉంటుంది. అయితే పన్ను విధింపులో కాస్తంత హేతుబద్ధత చూపటం ద్వారా సామాన్యుల్ని కూడా సంతుష్టి పరచవచ్చు. అర్థశాస్త్రంలోని ‘లేఫర్ కర్వ్’ భావన అటువంటిదే. పన్నులు తక్కువగా ఉంటే సామాన్య జనం అధికంగా కొని ఖజానా ఆదాయాన్ని పెంచుతారని ఈ భావన చెబుతుంది.కానీ ప్రభుత్వాలు ఎంతసేపూ అధిక పన్నుల ద్వారా అధికాదాయం అనే ఆలోచనలోనే ఉంటాయి. అధిక పన్నులూ, వాటిని చెల్లించలేదంటూ వేధింపులూ వగైరాలను ‘ట్యాక్స్ టెర్రరిజం’గా కొందరు అభివర్ణిస్తున్నారు. ఈ సంస్కరణలు మైలురాయి వంటివా... కాదా అన్నది రానున్న కాలంలో తేలిపోతుంది. పనిలో పనిగా జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేసే యోచన కూడా చేస్తే దేశంలో ఫెడరలిజం వర్ధిల్లుతుంది. -
పరువుతీస్తున్న ‘ప్రక్షాళన’!
అనుకున్నదొకటైతే అయింది మరోటి. బిహార్లో ఆఖరి నిమిషంలో ఆదరాబాదరాగా ఎన్నికల సంఘం (ఈసీ) తలపెట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆ సంస్థ ప్రతిష్ఠను మరింత దెబ్బ తీసింది. ఓటర్లలో దొంగలున్నారన్న నిర్ణయానికొచ్చి, వారందరినీ ఏరిపారేయాలను కోవటం దీనంతటికీ కారణం. పోనీ అందుకు ప్రాతిపదికేమిటో ఎవరికీ తెలియదు. ఏడెనిమిది నెలల క్రితం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తానే రూపొందించిన జాబితాలో అవకతవకలున్నాయని అంగీకరించటమంటే తన పనితీరు సరిగా లేదని ఒప్పు కోవటమేనని ఆ సంస్థకు తోచలేదు. 2.74 కోట్ల మంది ఓటర్లలో 99.5 శాతం మంది తమ అర్హతలకు సంబంధించిన పత్రాలు సమర్పించారని ఈసీ సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పగా ముసాయిదా జాబితా అవకతవకలు ఒక్కోటే బయటపడి దిగ్భ్రాంతి కలిగి స్తున్నాయి. అర్హులైన ఓటర్లు ఈసీ అడిగిన 11 పత్రాల్లో ఏదో ఒకటైనా దాఖలు చేయటానికి తిప్పలు పడుతుంటే అనర్హులైనవారు, అనుమానాస్పద వ్యక్తులు దర్జాగా జాబితాలో చోటు దక్కించుకున్నారు. కేవలం 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీడియా సంస్థ ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ నిశితంగా పరిశీలిస్తే అనేక అవకతవకలు బయటపడ్డాయి. ఒకే పేరు,తండ్రి/భర్త పేర్లు ఉండి కనీసం రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాకెక్కిన 1,87,643 కేసుల్ని ఆ సంస్థ బయటపెట్టింది. కొందరైతే ఒక నియోజకవర్గంలోనే నదురూ బెదురూ లేకుండా ఆ పని చేశారు. మరికొందరు చిరునామాలు మార్చే శ్రమ కూడా తీసుకోలేదు.‘స్వచ్ఛమైన జాబితా’ రూపకల్పనే ధ్యేయమంటున్న ఈసీ ఈ దొంగ ఓటర్ల విజృంభణకు ఏం సంజాయిషీ ఇస్తుంది? కనీసం అలాంటి విపరీతాలకు కారణమైనవారిపై చర్య తీసుకుంటామని చెప్పటం లేదు. పైగా బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ వెల్లడించిన అంశాలను ఖండించారు. ఈ క్రమంలో వారు ఎక్కడెక్కడ పొరబడ్డారో చెప్పేందుకు కూడా ప్రయత్నించలేదు. తనకున్న పరిమిత వనరులతో కేవలం 39 చోట్ల ముసాయిదాలో ఒక సంస్థ ఇన్ని లోపాల్ని పసిగట్టగలిగితే, ఓటర్లు అందజేసిన అర్హతా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిగ్గుదేల్చే పనిలో తలమునకలైవున్న వేలాదిమంది ఎన్నికల సిబ్బంది ఏం పనిచేస్తున్నట్టు? వారిపై అధికార పక్షాల ఒత్తిళ్లు న్నాయా? ముసాయిదాలో తొలగించిన 65 లక్షల మందీ ఈసీ దృష్టిలో నకిలీ ఓటర్లు.అందుకోసమే వారి వినతుల్ని పరిశీలించటానికి మొదట్లో ఆ సంస్థ సిద్ధపడలేదు. అందు కోసం సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గడువు ముగిసిన సోమ వారం నాటికి కేవలం 33,000 మంది మాత్రమే పత్రాలు సమర్పించారని ఈసీ చెబుతోంది. పొట్ట చేతబట్టుకుని నలు మూలలకూ పోయే సాధారణ కూలీలు, కార్మికులు తమ చిరునామాల్లో ఉండటం, ఈసీ అడిగిన పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించటం అంత తేలికా? చిరునామాల్లో లేకపోతే మరణించినట్టు లేదా శాశ్వతంగా ఆ చిరునామా నుంచి నిష్క్రమించినట్టు ఎన్నికల సిబ్బంది రాసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే ‘ఓట్ చోరీ’ నినాదంతో ఉద్యమిస్తున్న విపక్షాలు సైతం ఆ సమస్య విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలి. సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్టు రాజకీయ పక్షాలు చురుగ్గా కదలాలి. తమ కార్యకర్తల సాయంతో అర్హులైనవారు ఓటర్ల జాబితాలకెక్కేలా సాయపడాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది పైచేయి అవుతుందన్న ప్రశ్న అర్థరహితం. ఎన్నికల నిర్వహణ క్రతువులో తలమునకలై ఉండాల్సిన ఈసీ జవాబుదారీతనాన్ని ప్రదర్శించాలి. నిలదీస్తున్నదెవరన్న విచికిత్సకు పోకుండా నిజాన్ని నిగ్గుతేల్చి తేల్చాలి.ఎందుకంటే రాగల కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ‘సర్’ అమలు ప్రారంభ మవుతుందని ఆ సంస్థే చెబుతోంది. ప్రతిచోటా ఇదే మాదిరి తప్పుల తడకలతో ఆ ప్రక్రియను సాగిస్తే ఈసీ దేశ ప్రజల దృష్టిలో మాత్రమే కాదు... ప్రపంచ దేశాల ముందు కూడా పలచనవుతుంది. ఓటర్ల జాబితాలో చేరటానికి విధించిన గడువును పొడిగించుకుంటూ పోతే మొత్తం ప్రక్రియ గందరగోళంగా తయారై, తుది జాబితా ఖరారు సమస్యా త్మకమవుతుందంటున్న ఈసీ వాదనల్లో నిజం లేకపోలేదు. కానీ అందుకు బాధ్యత వహించాల్సింది తాను కాదా? అసలు ఎవరూ కోరకుండానే చివరి నిమిషంలో ఈ పెనుభారాన్ని నెత్తిన వేసుకున్నదెవరు? ఈసీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. -
అఫ్గాన్కు ఆపత్సమయం
అంతరిక్షాన్ని దాటి గ్రహాలను పలకరించి, సూర్యుడిపై సైతం నిశితంగా చూపు సారించేందుకు తహతహలాడుతున్న మనిషి తన కాళ్లకిందనున్న నేలలో జరిగే కల్లోలం ఏమిటో, అది ఎప్పుడు ఎందుకు కంపించి పెను విపత్తుల్ని తెచ్చిపెడుతున్నదో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాడు. అంతా అయినాక భూకంప కేంద్రం ఎక్కడో, దాని తీవ్రత ఏపాటో చెప్పగలుగుతున్నా ముందుగా పసిగట్టడం అసాధ్యంగానే ఉంది. సోమవారం అఫ్గానిస్తాన్లో సంభవించిన భూకంపంలో ఇంతవరకూ 1,400 మందికి పైగా మరణించగా వేలాది మంది గాయపడ్డారు. ఆకలి, అనారోగ్యం, పేదరికం వంటి అనేకానేక క్లేశాలతో కొట్టుమిట్టాడుతున్న అఫ్గాన్ ప్రజలకు అక్కడి తాలిబన్ పాలకులు అదనపు సమస్య. వారి విధానాలను సాకుగా చూపి పలు దేశాలు ఇప్పటికీ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. భారత్ గుర్తించకపోయినా వివిధ రూపాల్లో దౌత్యం నెరపుతున్నది. ఇప్పుడు తక్షణ సాయం అందించింది. 2021 ఆగస్టులో తాలిబన్లు కూలదోసిన అష్రాఫ్ ఘనీ సర్కారే చాలా దేశాల దృష్టిలో ‘నిజమైన’ ప్రభుత్వం. చాలా దేశాల్లో ఘనీ ప్రభుత్వ రాయబార కార్యాలయాలే ఉన్నాయి. అఫ్గాన్కు ఆ దేశాలు అందించాల్సిన సాయమంతా ఐక్యరాజ్యసమితి సంస్థలకే వెళ్తుంది. వాటిని స్వచ్ఛంద సంస్థలు స్వీకరిస్తాయి. అఫ్గాన్ను 2001–21 మధ్య తన ఉక్కు పిడికిట్లో బంధించి, ఆ దేశాన్ని అనేక విధాల ధ్వంసం చేసి నిష్క్రమించిన అమెరికా... యూఎస్ఎయిడ్ కింద ఏటా అఫ్గాన్కిచ్చే 380 కోట్ల డాలర్ల మానవీయ సాయానికి ఈ ఏడాది జనవరి నుంచి కోత విధించింది. పర్యవసానంగా ఆ సాయం 76 కోట్ల డాలర్లకు పడిపోయింది. అందుకే ఇప్పుడు తక్షణమే అందాల్సిన వైద్యసాయం మొదలుకొని పునరావాసం వరకూ అన్నిటికన్నీ పడకేశాయి.ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రీతిలో క్రియాశీలంగా ఉన్న భూకంప ప్రాంతాల్లో అఫ్గాన్ ఉన్న హిందూకుష్ పర్వత శ్రేణి ప్రాంతం ఒకటి. ఇక్కడ భారత పలక, యూరేసియా పలకలు పరస్పరం ఢీకొంటున్నాయి. పర్యవసానంగా ఏర్పడే రాపిడి వల్ల శక్తి విడుదలై అది తరంగాల రూపంలో భూ ఉపరితలానికి చేరటంతో ప్రకంపనలు జనం అనుభవంలోకొస్తాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలానికి దగ్గర లో ఉంటే ఆ ప్రకంపనల తీవ్రత అధికంగా ఉండి పెను ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. తాజాగా సంభవించిన భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం 8 కిలోమీటర్ల లోతులో ఉందంటున్నారు.అందువల్లే తీవ్రత రిక్టర్ స్కేల్పై 6గా నమోదైనా, ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎక్కువున్నాయి. లోలోతు పొరల్లో సంభవించే భూకంపాల వల్ల విడుదలయ్యే తరంగాలు ఉపరితలానికి చేరేలోపే తమ శక్తిని చాలాభాగం కోల్పోతాయి. కనుకనే నష్టం తక్కువుంటుంది. ఉత్తర అఫ్గాన్లోని పామీర్–హిందుకుష్ ప్రాంతంలో భూకంపాల తీవ్రత ఎక్కువ. కానీ అవి దాదాపు 200 కిలోమీటర్ల లోతులో సంభవిస్తుంటాయి. ఇందుకు భిన్నంగా పశ్చిమ పాకిస్తాన్, ఆగ్నేయ అఫ్గాన్ ప్రాంతంలోని సులేమాన్ పర్వత శ్రేణి వద్ద భూ ఉపరితలానికి సమీపంగా భూకంప కేంద్రాలుంటాయి. భూకంపాలు వాటంతటవే ప్రమాదకరమైనవి కాదు. అవి సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే కట్టడాలు, ఆ విపత్తు విషయంలో అక్కడి పౌరుల్లో ఉండే అవగాహన నష్టం తీవ్రతను తగ్గిస్తాయి. భూకంపాల విషయంలో ఎంతో అనుభవాన్ని గడించి, ప్రాథమిక విద్యాస్థాయి నుంచీ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న జపాన్ ఇందుకు ఉదాహరణ. అక్కడ భూకంపాన్ని తట్టుకునే విధంగా భవంతులు నిర్మించటం తప్పని సరి. అందువల్లే భూకంప తీవ్రత ఎక్కువున్న సందర్భాల్లో సైతం జపాన్లో ప్రాణనష్టం కనిష్ఠంగా ఉంటున్నది. మెరుగైన, శాస్త్రీయమైన ఆవాసాల నిర్మాణానికయ్యే అధిక వ్యయాన్ని భరించే స్తోమత దారిద్య్రంలో కొట్టుమిట్టాడే అఫ్గాన్ ప్రజలకు లేదు. అందుకే స్థానికంగా లభించే మట్టి, రాళ్లు, ఇటుకలతో ఇళ్లు నిర్మించుకుంటారు. పైగా అవి పర్వత సానువుల్లో ఉంటాయి. విపత్తుల సమయాల్లో ఒక్కసారిగా కుప్పకూలి పౌరులకు బయట పడే వ్యవధినీయవు. ఈ ఆపత్సమయంలో అఫ్గాన్ను ఆదుకోవటం ప్రపంచ దేశాల బాధ్యత. సాధారణ సమయాల్లో ఏం చేసినా చెల్లుతుందిగానీ, విపత్తులు విరుచుకు పడినప్పుడు అందరూ ఏకం కావాలి. మానవీయతను చాటుకోవాలి. -
శుభ పరిణామం... త్రైపాక్షికం
ఏడేళ్ల అనంతరం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో జరిపిన పర్యటన అనేక విధాల సత్ఫలితాలనిచ్చింది. ఇది అంతర్జాతీయ పెత్తందార్లకు తగిన సందేశం పంపింది. పెహల్గామ్ ఉగ్రవాద దాడిపై మూణ్ణెల్లు గడిచినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండి పోయిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో)తో ఆ ఘటనను ఖండిస్తూ తీర్మానం చేయించింది. చైనా, రష్యాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రగతి సాధించింది. ఈ పరిణామాలన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదు.అంతర్జాతీయ సంబంధాల్లో అమెరికా సృష్టించిన సరికొత్త గందరగోళం వల్ల ఏర్పడిన అయోమయ వాతావరణాన్ని ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు ఒక కుదుపు కుదిపింది. ప్రపంచవ్యాప్త మీడియా ఈ శిఖరాగ్ర సదస్సు కన్నా మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు చర్చించుకుంటున్న వీడియోకూ, ఛాయాచిత్రాలకూ అత్యధిక ప్రాధాన్యమివ్వటం మోదీ చైనా సందర్శనలోని అంతరార్థాన్నీ, దాని పరిణామాలనూ అవగాహన చేసుకోవటం వల్లే. అయితే కేవలం ఈ పర్యటన వల్లే అంతా మారిపోతుందనీ, చైనా మనతో సవ్యంగా ఉంటుందనీ, అమెరికా తన తెలివితక్కువ విధానాలను సవరించుకుంటుందనీ అనుకోనవసరం లేదు. ఇప్పటికైతే యూరేసియాలోని మూడు అగ్ర దేశాల కలయిక అవసరార్థ బంధమే. బలపడాలంటే చేయాల్సింది చాలా ఉంటుంది. రష్యాకిది వర్తించదు. ఆ దేశంతో మన మైత్రి చిరకాలమైనది. దాన్ని నీరుగార్చడానికి అమెరికా ఎంత ప్రయత్నించినప్పటికీ అదేమంత తగ్గలేదు. కానీ పెరగాల్సినంత పెరగలేదు. ఈ మూడు దేశాల కలయికా ఈ దేశాల ప్రయోజనాలు నెరవేర్చుకోవటంతోపాటు ఈ ప్రాంత శాంతికీ, సుస్థిరతకూ, అభివృద్ధికీ దోహదపడుతుంది. దీని మూలాలు ప్రచ్ఛన్న యుద్ధానంతర పరిణామాల్లో ఉన్నాయి. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యాగా మిగిలిపోయిన 1990వ దశకంలో అప్పటి ఆ దేశ ప్రధాని యెవ్జెనీ ప్రైమకోవ్ ఈ భావనకు రూపుదిద్దారు. ఈ వ్యూహాత్మక కలయిక భవిష్యత్తులో అమెరికా ఆధిపత్యా నికి చెక్ పెట్టగలదని భావించారు. మంత్రుల స్థాయిలో, నిపుణుల స్థాయిలో పలు సమావేశాలు కూడా జరిగాయి. కానీ 2020లో గల్వాన్ ఉదంతం అనంతరం నిలిచిపోయాయి. చైనాతో మనకున్న సరిహద్దు తగాదాలూ, చేదు అనుభవాలూ తక్కువేం కాదు. నిజానికి మొన్నటికి మొన్న ఎస్సీవో మంత్రుల స్థాయి భేటీ అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో పెహల్గామ్ ప్రస్తావన లేకపోవటాన్ని నిరసిస్తూ మన దేశం దానిపై సంతకం చేసేందుకు నిరాకరించింది. ఇప్పుడు ఎస్సీవో తన తప్పు దిద్దుకోవటం శుభæపరిణామం.ఈ త్రైపాక్షిక కలయికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు గమనిస్తే ఆయనెంత కలవరపడుతున్నారో తెలుస్తుంది. ఇది ‘ఏకపక్ష విపత్తు’గా పరిణమిస్తుందట! ఆ దేశ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సరేసరి. రోజుకో రకంగా నోరు పారేసు కుంటున్నారు. మన దేశం సంయమనంతో అమెరికా 50 శాతం సుంకాలు ఎంత అర్థరహితమో చెప్తూ వస్తోంది. తాను తప్ప దిక్కులేదనే స్థితికి చేరిన అమెరికా కళ్లు తెరిపించటం ప్రస్తుతావసరం. దేశాల మధ్య పటిష్ఠమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్న కాలంలో తనకు అనుకూలమైన నిబంధనలతో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను అమల్లోకి తెచ్చింది అమెరికాయే. పర్యవనసానంగా ఎడాపెడా ఆర్జించి, స్వీయ తప్పిదాల కారణంగా సంక్షోభంలో పడిన ఆ దేశం అందుకు ఇతరులను నిందిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. భారత–చైనా సంబంధాలపై రెండు వైపుల నుంచీ వెలువడిన ప్రకటనలు ఒకే స్వరంతో ఉండటం గమనించదగ్గది. ఇరు దేశాలూ భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కారని ఆ ప్రకటనలు గుర్తుచేశాయి. చైనాతో మన సంబంధాలు బాగున్నప్పుడు పాకిస్తాన్ అణిగిమణిగి ఉండటం మొదటినుంచీ కనబడుతోంది. ఇకపై కూడా అదే జరిగితే మంచిదే. ఏదేమైనా పెత్తందారీ పోకడలు చెల్లబోవని చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. కాకపోతే భారత్–చైనా–రష్యా కలయిక వికసించాలంటే ఎంతో చిత్త శుద్ధితో, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుంది. అది జరగాలని ఈ మూడు దేశాలు మాత్రమే కాదు... ప్రపంచమే కోరుకుంటోంది. -
తొలి ఉపాధ్యాయుడు
ఆ సాయంత్రం ఎవరో అపరిచితుడు ఇంటి తలుపు ముందుకు వచ్చాడు. ‘నాన్నగారు ఉన్నారా?’ అని అడిగాడు. ‘లేరండీ... బయటకు వెళ్లారు’ అని చెప్పాడు ఇంటి బాలుడు. ఆ బాలుడి నాన్న ఆ చిన్న ఊరికి పంచాయితీ బోర్డు ప్రెసిడెంట్గా ఎన్నికై ఉన్నాడు. ‘ఈ కానుక ఇక్కడ పెట్టి వెళ్లనా?’ అని అడిగాడా అపరిచితుడు. అందుకు కనీసం తల్లి అనుమతి కావాలని బాలుడు తల్లిని అడిగాడు. ఆమె ఆ సమయానికి ప్రార్థనలో ఉండి బదులు ఇవ్వలేదు. ‘సరే... పెట్టి వెళ్లండి’ అన్నాడా బాలుడు. కాసేపటికి తండ్రి వచ్చాడు. కానుకను చూశాడు. ‘ఎవరిచ్చారు ఇది’ అని బాలుడిని అడుగుతూ కానుక తెరిచి చూశాడు. అందులో ఖరీదైన ధోతి, మిఠాయిలు, పండ్లు ఉన్నాయి. చిన్నచీటీ కూడా ఉంది ఆయన పేరున, కానుకిచ్చిన వ్యక్తి సంతకంతో. అందాక ఆ బాలుడు ఎన్నడూ చూడనంత కోపం వచ్చింది తండ్రికి. ‘ఎవరు తీసుకోమన్నారు నిన్ను’ గద్దించి అడిగేసరికి బాలుడు భయంతో ఏడుపు అందుకున్నాడు. ‘నిన్నూ’... ఒక దెబ్బ వేశాడు. తల్లి కొడుకును పొదువుకుంది. తండ్రి కళ్లల్లో సిగ్గుతో, అవమానంతో కన్నీరు ఉబికింది.‘చూడు... ఇది కానుక. నా నుంచి ప్రయోజనం పొందడానికి ఇచ్చి వెళ్లింది. నేను పదవిలో ఉండగా తరతమ భేదం లేకుండా చేయవలసిన సాయం అందరికీ చేస్తాను. ఇలా కానుక తీసుకుంటే చేయకూడని సాయం కూడా చేయాల్సి రావచ్చు. మన ధర్మంలో కానుకలు నిషిద్ధం. మనుస్మృతిలో కూడా కానుకలు మనిషిలోని దైవిక కాంతిని హరిస్తాయి అని ఉంది. కాబట్టి ఇలాంటి తప్పు జీవితంలో చేయకు’ అని కొట్టిన చేత్తోనే దగ్గరికి తీసుకున్నాడు. అబ్దుల్ కలామ్ అనే ఆ బాలుడు తర్వాత పెరిగి పెద్దవాడై భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు. తండ్రి నేర్పిన పాఠాన్ని పొల్లుపోకుండా పాటించినందువల్ల రాష్ట్రపతి భవన్ను వీడి వచ్చే సమయానికి ఆయన వద్ద ఉన్నవి కేవలం రెండు చిన్న సూట్కేసులలో పట్టే దుస్తులు. తన సొంత బంధువులు రాష్ట్రపతి భవన్కు వస్తే వారి ఆతిథ్యానికి ఎంతయ్యిందో లెక్కవేసి అక్షరాలా 3,52,000 రూపాయలు చెల్లించిన ఆ ఉన్నతుడు నేడు జాతి గౌరవం అందుకుంటున్నాడు. తండ్రి పాఠాలు సరిగా చేరితే పిల్లలు ఇలా ఉంటారు.ఐ.ఐ.టి.లో టాపర్గా వచ్చిన విదార్థిని ‘నీకు ర్యాంక్ రావడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంత?’ అనడిగితే ‘చాలా ఉంది. నాన్న నన్ను విద్యార్థిలా పెంచాడు... అమ్మ కొడుకులా పెంచింది.. రెండూ మేలు చేశాయి’ అన్నాడు. ఇల్లు అనే పాఠశాలలో తొలి ఉపాధ్యా యుడు తండ్రి. లాలనతో నిండిన తల్లి పాఠాలతో పాటు చూపులతోనే దండించగల తండ్రి పాఠాలు ఉంటేనే బాల్య, కౌమార సమయాల్లో లోకరీతులకు కొట్టుకుపోని విలువలను పాదుకొల్పవచ్చు. తండ్రి పిల్లల క్షేమం కోరతాడు, భవిష్యత్తుకై ఆరాటపడతాడు, అందుకై ఆర్థిక వనరుల కోసం రేయింబవళ్లు కష్టపడతాడు. నిజమే. కాని ఈ క్రమంలో అతడు తన ‘టీచరు పోస్టు’ను, బోధనా బాధ్యతను విస్మరించజాలడు. ‘నా పిల్లలకు ఏమి ఇస్తున్నాను’ అనే తపనలో ‘ఏమి’ అనే ప్రశ్నకు జవాబు ఆర్థికమే కానక్కర లేదు. వాత్సల్యమే కానక్కర్లేదు. వారసత్వమే కానక్కర్లేదు. నేర్పవలసిన పాఠాలు ఉంటాయి, ఇంట్లోని ఈ కొడుకు/కూతురు సమాజంలో పౌరులవుతారు. ఎలాంటి పౌరులవుతారనే స్పృహ ప్రతి తండ్రికీ ముఖ్యం. ‘ఇలా పెంచి వదిలారా’ అనే మాట ఎందుకు రావాలి?చైనాలో ‘యెన్ చువాన్ షెన్ జియొవ్’ అనే సంప్రదాయం ఉంది. తండ్రి తన చర్యలు, ప్రవర్తన, పాటించే విలువల ద్వారా పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలని దాని అర్థం. ‘నువ్వు ఏమిటో అదే నీ పిల్లలు’ అని తాత్పర్యం. ప్రతి ఆఫ్రికా తండ్రి పిల్లలకు బోధించే తొలిమాట ‘నీ పై నువ్వు ఆధారపడు’ అని. ప్రాదేశిక, సామాజిక, రాజకీయ కారణాల రీత్యా తండ్రులు చెప్పాల్సిన పాఠాలు స్వల్ప తేడాతో ఉంటాయిగానీ అన్నింటి అంతిమ లక్ష్యం విలువలతో కూడిన వ్యక్తిత్వమే. ఈ సిలబస్ను తండ్రులు పక్కనో గట్టునో పెట్టడం, సిలబస్ పూర్తి చేయడానికి సమయం లేదని వంక చెప్పడం ఒక సంగతి. అసలు సిలబసే లేదనుకోవడం మరో సంగతి.సెప్టెంబర్ 5–‘టీచర్స్ డే’ అంటే అందరూ బడిలో ఉండే టీచర్స్ వైపు చూస్తారు. ఈ టీచర్స్ డే నాడు ఇంట్లోని తొలి ఉపాధ్యాయుడికి మొదటి శుభాకాంక్షలు చెప్పాలి. పిల్లలు ఆశీస్సులు తీసుకోవాలి. వారి సమగ్ర వ్యక్తిత్వాన్ని బేరీజు వేస్తూ ప్రతి తండ్రి తనకు తాను మార్కులు వేసుకోవాలి. ర్యాంకులు అక్కర్లేదు. పాసైతే చాలు. హ్యాపీ టీచర్స్ డే. -
ఏనుగుపై తొడగొట్టిన ఎలుక!
భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న దశ అనూహ్యంగా మొదలైంది. ఏనుగు కుంభస్థలంపై ఎలుక పిల్ల ఓ మొట్టికాయ వేసిందట! రెండు దేశాలను ఉద్దేశించి ఓ ఆర్థిక నిపుణుడు చేసిన వ్యాఖ్యానం ఇది. అయితే ఇందులో ఏనుగెవరు? ఎలుకెవరు? గత పాతికేళ్లుగా డాలర్ డ్రీమ్స్ను పలవరిస్తూ వస్తున్న మన మిడిల్ క్లాస్ కుటుంబ రావులు ఈ ప్రశ్నకు ఠకీమని సమాధానం చెప్పగలరు. అపారమైన ఆర్థిక – సైనిక బలం, అగ్రరాజ్య హోదా ఉన్న అమెరికా ఎలుకెట్లా అవుతుంది? లక్షల సంఖ్యలో మన వంశోద్ధారకుల్ని కూడా ఉద్ధరిస్తున్న అమెరికా దేశం ఏనుగు కాకుండా ఎలుకవుతుందా అనే సందేహం వారికి ఉంటుంది. మరి నూటా నలభై కోట్ల జనాభా, అందులో 90 కోట్ల మంది యువత ఉన్న భారత దేశాన్ని కూడా ఎలుకతో పోల్చడం సాధ్యంకాదు కదా!వాణిజ్య ట్యారిఫ్లను ఆయుధాలుగా మార్చుకొని కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు పాల్పడటం, తదనంతర ప్రపంచ పరిణామాల నేపథ్యంలో రిచర్డ్ ఓల్ఫ్ అనే అమెరికన్ ఆర్థికవేత్త చేసిన విశ్లేషణ సంచలనంగా మారింది. భారతదేశంపై ట్రంప్ చేసిన 50 శాతం సుంకాల ‘యుద్ధ ప్రకటన’పై ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యానాన్ని విస్తారమైన అర్థంలో చేశార నుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కలిగే దీని పర్యవసానాలను దృష్టిలో పెట్టుకొని ఏనుగుపై ఎలుక మొట్టికాయ వేసినట్టేనని అన్నారు. ప్రపంచ జనాభాలో నాలుగున్నర శాతం లేని దేశం 95 శాతం ప్రజలను ఆజ్ఞాపించాలని చూసే పెత్తందారీతనం బెడిసి కొడుతుందని ఆయన జోస్యం చెప్పారు.అమెరికా ట్యారిఫ్ కొరడా ప్రయోగం భారత్పై ప్రభావం చూపబోదని దాని అర్థం కాదు. తక్షణ ఫలితంగా భారత్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. మొత్తం అంత ర్జాతీయ వాణిజ్యంలో 90 బిలియన్ డాలర్ల పైచిలుకు లోటును భారత్ ఎదుర్కొంటున్నది. ఈ లోటులో సింహభాగం చైనా వాణిజ్యంలోనే! ‘మేకిన్ ఇండియా’ సత్ఫలితాలిస్తే తప్ప ఈ లోటును అధిగమించడం సాధ్యం కాదు. ఒక్క అమెరికా వాణిజ్యంలోనే భారత్ మిగులు భాగస్వామిగా ఉంటున్నది. అమెరికాకు 87 బిలియన్ డాలర్ల సరుకుల్ని ఎగుమతి చేస్తున్న మన దేశం అక్కడి నుంచి 45 బిలియన్ డాలర్ల కిమ్మత్తు చేసే సరుకుల్ని దిగుమతి చేసుకుంటున్నది. 50 శాతం ట్యారిఫ్ ప్రభావం 70 శాతం వ్యాపారంపై పడుతుందని, ఫలితంగా వెనువెంటనే 20 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోతామని ఎగుమతిదార్ల సంస్థలు చెబుతున్నాయి. వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. తిరుపూర్, నోయిడా, సూరత్ వంటి పట్టణాల్లో అప్పుడే ఉద్యోగాల కోత, ఫ్యాక్టరీల మూత మొదలైంది.అమెరికా కొరడా ఝుళిపిస్తుంటే భారత్ చేతులు ముడుచు కొని కూర్చుంటుందా? కూర్చోలేదు కూడా! ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకూ భారత నాయకత్వం పరిణతితో, ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించిందనే చెప్పాలి. భారత్ – పాక్ల మధ్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతల సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. యుద్ధం మొదలుకావడం, రెండు రోజుల్లోనే పాక్ను భారత్ దారుణంగా దెబ్బతీయడం, ఆ వెనువెంటనే కాల్పుల విరమణ ప్రకటన రావడం జరిగింది. భారత్ – పాక్లు ప్రకటించకముందే తన వల్లనే యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ ప్రకటించుకున్నారు. దీన్ని భారత్ అధికారికంగా ఖండించ లేదు. ట్రంప్కు మోదీ భయపడ్డారని, ఆయన ఆదేశించగానే కాల్పుల విరమణ అమలు చేశారనే ప్రచారం జరిగింది. చాలా మంది నమ్మారు. తదనంతర పరిణామాలను గమనిస్తే అప్పటి అభిప్రాయం కేవలం అపోహ మాత్రమే కావచ్చనిపిస్తున్నది. గతంలో విధించిన 25 శాతం ట్యారిఫ్కు అదనంగా మరో 25 శాతం విధించడానికి కారణం తాము ఆంక్షలు విధించిన రష్యా నుంచి భారీఎత్తున చమురు కొనుగోలు చేయడమేనని ఇప్పుడు అమెరికా చెబుతున్నది. అసలు కారణం అది కాదన్న సంగతి అందరికీ తెలుసు.అమెరికాలోని వ్యవసాయ, పాల ఉత్పత్తి రంగాలను చిరకాలంగా భారత మార్కెట్ ఊరిస్తున్నది. అవి భారత్లో ప్రవేశించగలిగితే ఇబ్బడిముబ్బడిగా అమెరికా విత్తన కంపెనీలు, పాల ఉత్పత్తుల కంపెనీలు లాభాలు పోగేసుకోగలుగుతాయి. జన్యుమార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్నలను దిగు మతి చేసుకోవాలని అమెరికా భారత్ను డిమాండ్ చేస్తున్నది. వ్యవసాయ రంగాన్ని పరాధీనం చేయగలిగే జీఎమ్ పంటలను ఒక విధానంగా భారత ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లానే పాల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని అమెరికా షరతు పెట్టింది. ఈ షరతు అంగీకరిస్తే దేశవాళీ పాడి పరిశ్రమ లక్ష కోట్లకు పైగా నష్టపోతుందని ఒక అంచనా. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న దేశం పాల ఉత్పత్తులను చౌక సుంకాలకు దిగుమతి చేసుకోవడం ఏమిటి? ఇప్పటికీ 40 శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడిన దేశం విషతుల్యమైన జీఎమ్ పంటలను దిగుమతి చేసుకో వలసిన అవసరమేమిటి? ట్రంప్ సర్కార్ కోరిన ఈ హిరణ్యాక్ష వరాలకు భారత్ తలాడించలేదు.ఆయన నోబెల్ బహుమతి పిచ్చికి భారత ప్రభుత్వం సహకరించలేదన్న దుగ్ధ కూడా అమెరికా అధ్యక్షుడిని వేధిస్తున్న దట! ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లనే కాల్పుల విరమణకు ఒప్పు కున్నామని భారత్ ఒక మాట అధికారికంగా చెబితే తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ట్రంప్ ఆశ. భారత్ – పాక్ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని చాలాకాలంగా భారత్ అంగీరించడం లేదు. ఒక దేశాధినేత నోబెల్ పిచ్చిని తీర్చడం కోసం తన దేశ సార్వభౌమాధికారంతో రాజీపడడానికి భారత్ అంగీకరించలేదు. ఇటువంటి రాజీ పట్ల పాక్కు ఎటు వంటి అభ్యంతరమూ లేదు. ట్రంప్ కోరుకుంటున్న ప్రకటనను పాక్ మిలిటరీ చీఫ్ అసీఫ్ మునీర్ చేశారు. దాంతో మునీర్ను పొగడ్తల్లో ముంచడమే గాక ఆయన్ను వైట్హౌస్లో భోజనానికి ప్రత్యేకంగా ట్రంప్ ఆహ్వానించారు.ఏకధ్రువ ప్రపంచం నుండి బహుధ్రువ ప్రపంచం వైపు మానవాళి అడుగులు వేస్తున్న కీలకమైన మలుపులో భారతదేశం తన ప్రయోజనాల కోసం అనుసరించవలసిన విదేశీ విధానంపై కేంద్ర సర్కార్కు ఇప్పటికే ఒక స్పష్టత ఉన్నది. అంతర్జాతీయ సంబంధాల్లో సిద్ధాంతాల పాత్ర ప్రచ్ఛన్న యుద్ధంతోపాటే కరిగిపోయింది. భౌగోళిక రాజకీయ అవరోధాలున్న సందర్భా ల్లోనూ ఉభయతారకంగా నెగ్గుకురావడానికి అవసరమైన వ్యూహాలకు మన విదేశాంగ విధానం పెద్దపీట వేస్తున్నది. విదేశాంగ మంత్రిగా ఉన్న జైశంకర్ దీర్ఘకాలం పాటు దౌత్యవేత్తగా పనిచేశారు. ఆ అనుభవ సారాన్ని రంగరించి, ప్రభుత్వ ఆలోచనల్ని కూడా కలబోసి ‘ది ఇండియా వే’ (భారత్ మార్గం : అనిశ్చిత ప్రపంచంలో అనుసరణీయ వ్యూహాలు) అనే పుస్తకాన్ని రాశారు. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అనుసరించదగిన వ్యూహాలపై అందులో చర్చించారు. భారత విదేశాంగ విధానం ఇప్పుడీ తాజా పంథాలోనే కొనసాగు తున్నట్టు కనిపిస్తున్నది.ఇంకెంతోకాలం అగ్రరాజ్యంగా అమెరికా మనలేదని, డాలర్ పెత్తనానికి కూడా రోజులు దగ్గరపడినట్టేనని పలువురు ఆర్థిక నిపుణులు జోస్యం చెబుతున్నారు. ట్రంప్ చర్యలు ఈ పరిణామాన్ని వేగవంతం చేయగలవని అంచనా వేస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని ‘జీ–7’ దేశాల పాశ్చాత్య కూటమిని ఆర్థిక రంగంలో ‘బ్రిక్స్’ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) ఇప్పటికే అధిగమించడాన్ని ఇందుకు రుజువుగా వారు చూపెడుతున్నారు. వచ్చే ఏడాది ‘బ్రిక్స్’ కూటమికి భారత్ నాయకత్వం వహించబోతున్నది. భౌగోళిక రాజకీయాలతోపాటు పలు అంశాలపై వైరుద్ధ్యాలున్న రెండు అతిపెద్ద దేశాలను (భారత్ – చైనా) వ్యూహాత్మక స్నేహం వైపు నడిపించిన ఘనత ట్రంప్దేనని అమెరికన్ నిపుణులే విమర్శి స్తున్నారు. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తర ణను అడ్డుకోవడానికి అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా లతో కలిసి ఏర్పడిన ‘క్వాడ్’ కూటమి తాజా పరిణామాలతో నిర్వీర్యమైనట్టే! గల్వాన్ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్యన ఏర్పడిన ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి అవసరమైన కొన్ని చర్య లను రెండు దేశాలూ ఇప్పటికే తీసుకోవడం ఆరంభించాయి. మన విదేశాంగ మంత్రి జైశంకర్ జిన్పింగ్ను కలిశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి వచ్చి మంతనాలు జరి పారు. భారత యాత్రికుల కోసం మానస సరోవరం మార్గాన్ని చైనా తెరిచింది. చైనాకు విమానయానాలను భారత్ పునరు ద్ధరించింది. చైనాలోని తియాంజిన్లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. శనివారం నాడాయనకు చైనాలో ఆత్మీయ స్వాగతం లభించింది. భారతదేశపు శాస్త్రీయ సంగీత నృత్యా లతో చైనా యువతీ యువకులు ఆయన్ను అలరించారు. అమె రికా పెత్తందారీతనానికి వ్యతిరేక వేదికను ఈ సదస్సు బలో పేతం చేసే అవకాశం ఉన్నది.ఆదివారం నాడు చైనా అధ్యక్షుడు షీ–జిన్పింగ్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ద్వైపాక్షిక సమస్యలు, సంబంధాలపై వారి మధ్య చర్చలు జరగవచ్చు. ఎస్సీఓ శిఖ రాగ్ర సభకు అమెరికా బద్ధ శత్రువైన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా హాజరవు తున్నారు. ఈ నేతలతో కూడా మోదీ చర్చలు జరిపే అవకాశం ఉన్నది. రష్యాతో మనది చెక్కుచెదరని దశాబ్దాల స్నేహబంధం. ఇరాన్తో మనకున్న అనుబంధానికి శతాబ్దాల చరిత్ర ఉన్నది. ట్రంప్ ట్యారిఫ్ల నేపథ్యంలో భారత్ కొత్త మార్కెట్లకు విస్తరించడం కోసం అందివచ్చిన వేదికలన్నిటినీ ఉపయోగించుకుంటుంది. ఈ ప్రయాణంలో భారత్ వైఖరి వేగిర పడిన చందంగా కాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఎస్సీఓ సమావేశం ముగిసిన తర్వాత బుధవారం నాడు బీజింగ్లో మరో భారీ ర్యాలీని చైనా నిర్వహిస్తున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాద శక్తులను (ముఖ్యంగా జపాన్ సామ్రాజ్యవాదం) ఓడించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైనా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఎస్సీఓ సభకు హాజరయ్యే దేశాలన్నీ ఈ ర్యాలీకి హాజరవుతున్నా భారత్ మాత్రం జపాన్ పట్ల స్నేహభావంతో హాజరు కావడం లేదు. పైగా తియాంజిన్ సదస్సుకు ముందు రెండు రోజులపాటు ప్రధాని మోదీ జపాన్లో పర్యటించారు. రెండు దేశాల మధ్య టెక్నాలజీ రంగంలో పలు ఒప్పందాలు కుదిరాయి. జపాన్ కూడా భారత ప్రధానికి ఘనమైన స్వాగతాన్నే ఏర్పాటు చేసింది. జపనీయులు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ ఆయనకు ఆహ్వానం పలికి ఆకట్టుకున్నారు.ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి, ఒక అభివృద్ధి చెందిన దేశం హోదా వైపు అడుగులు వేయడానికి ఆచరణా త్మకమైన, వివేకవంతమైన విదేశాంగ విధానం ఒక్కటే సరి పోతుందా? దేశీయంగా అందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామా? అనే విషయాలను సమీక్షించుకోవలసిన సమయమిది. జీఎస్టీ శ్లాబుల కుదింపు, స్వదేశీ వాడకం ఉద్యమానికి ప్రధాని పిలుపు నివ్వడం ట్రంప్ ట్యారిఫ్ల నేపథ్యంలో తీసుకున్న చర్యలే కావచ్చు. వాటివల్లనే స్వదేశీ మార్కెట్ బలపడుతుందా? మన దేశ ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉంటే అమెరికా, ఐరోపా దేశాల ఉమ్మడి బలంతో సమానంగా ఉంటుంది. అటువంటి వ్యవస్థను సృష్టించుకోగలగడమే చైనా విజయ రహస్యంగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. చైనా ఆర్థికాభివృద్ధి పంథా ఒక హైబ్రిడ్ మోడల్. అది పూర్తిస్థాయి పెట్టుబడిదారీ విధానం కాదు. సోషలిస్టు విధానమూ కాదు. ప్రభుత్వ నియంత్రణకు లోబడిన పెట్టుబడి పూర్తి లాభాపేక్షతో కాకుండా సామాజిక వృద్ధికి కట్టుబడి ఉంటుంది. ఈ ఆర్థిక విధానం ఫలితంగా కోట్లాది మంది పేదరికం సంకెళ్ళను తెంచుకొని ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోగలిగారు. మనం మాత్రం సమాజంలో తీవ్ర అసమానతలకూ,పేదరికానికీ ఒక ముఖ్య కారణ మైన ప్రైవేటీకరణ బాట వెంటనే ఇంకా పరుగులు తీస్తున్నాము. ఈ బాట ఇంకెంతమాత్రమూ పేదరికాన్ని నిర్మూలించలేదనీ, అసమానతల్ని పోగొట్టలేదనీ ఇప్పటికే రుజువైంది. దేశీయంగా బలమైన మార్కెట్ను నిర్మించుకోగలిగినప్పుడే రాచవీధిలో పట్టపుటేనుగు నడిచినంత ఠీవిగా అంతర్జాతీయ సంబంధాల్లో నడవగలం. ఎలుకల మొట్టికాయలు అప్పుడు ఏమీ చేయలేవు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మిత్ర లాభం
అంతా సవ్యంగా ఉన్న రోజుల్లో భిన్న దేశాలతో దౌత్య సంబంధాలు సాఫీగా సాగి పోతాయి. కానీ సవాళ్లు ఎదురయ్యే కాలంలో వాటిని నిలబెట్టుకోవటం, కొత్త బంధాలు ఏర్పర్చుకోవటం సులభం కాదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి కారణంగా భారత్–అమెరికా సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్లో రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. ఈ నెల 31న, ఆ మర్నాడూ చైనాలోని తియాన్జిన్లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో కూడా ఆయన పాలుపంచుకుంటారు. జపాన్తో మనకు చిరకాల మైత్రి ఉంది. మన స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ)ని స్థాపించి పోరాడినప్పుడు అన్ని విధాలా చేయూతనందించింది జపానే. స్వాతంత్య్రానంతరం ఆ బంధం మరింత బలపడింది. రెండో ప్రపంచ యుద్ధ పరిసమాప్తి అనంతరం లాంఛనంగా 1951 సెప్టెంబర్ 8న శాన్ఫ్రాన్సిస్కో శాంతి ఒప్పందం కుదిరినప్పుడు జపాన్కు పాక్షిక సార్వభౌమత్వం మాత్రమే ఇవ్వాలన్న నిబంధనను మన దేశం తీవ్రంగా వ్యతిరేకించి సంతకం చేసేందుకు నిరాకరించింది. అందుకు జపాన్ ఈనాటికీ మన పట్ల కృతజ్ఞతగా ఉంటుంది. తొలిసారి 2014లో ఎన్డీయే సర్కారు ఏర్పడినప్పుడే మోదీ జపాన్ను సందర్శించారు. ఈ దశాబ్ద కాలంలో ఇరు దేశాల సంబంధాలూ మోదీ అన్నట్టు ఎన్నో రెట్లు పెరిగాయి. మన దేశంలో ప్రస్తుత జపాన్ పెట్టుబడుల విలువ 4,200 కోట్ల డాలర్లు. దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్కతా మెట్రో రైలు ప్రాజెక్టులు జపాన్ ఆర్థిక సహకారంతో సాకారమయ్యాయి. ఢిల్లీ–ముంబై పారిశ్రామిక వాడ, సెమీకండక్టర్లు తదితరాలపై జపాన్ ముద్ర బలంగా ఉంది. ముంబై–అహ్మదాబాద్ మధ్య సాకారం కానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అత్యాధునిక ఈ–10 రకం బుల్లెట్ రైలును అందించాలని జపాన్ నిర్ణయించింది. వచ్చే పదేళ్లలో మన దేశంలో జపాన్ పెట్టుబడుల్ని పది లక్షల కోట్ల యెన్ల(6,800 కోట్ల డాలర్ల) స్థాయికి తీసుకెళ్లాలని మోదీ, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా శిఖరాగ్ర సమావేశంలో నిర్ణయించటం, పెట్టుబడులతోపాటు నవీకరణ, పర్యావరణం, ఆరోగ్యం తది తరాల్లో కలిసి పనిచేయాలనుకోవటం... రాగల అయిదేళ్లలో భిన్న రంగాల నిపుణుల సేవలు పొందేందుకు పరస్పరం అయిదు లక్షల మందిని బదలాయించుకోవాలను కోవటం భారత్, జపాన్ల మైత్రి పటిష్ఠతకు నిదర్శనం. ఈ క్రమంలో సహజంగానే సవాళ్లుంటాయి. స్వేచ్ఛాయుత, శాంతియుత, సంపద్వంత ఇండో–పసిఫిక్ ఆవిర్భవించాలన్న నినాదం అమెరికా ఛత్రఛాయలో ఏర్పడింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంత సరిహద్దుల విషయంలో చైనాతో జపాన్కు తగాదా లేకున్నా, దాని దూకుడు పెద్ద సమస్యగా మారింది. చైనా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల జపాన్కు ఎగుమతుల సమస్య ఏర్పడుతోంది. చైనాను కట్టడి చేయాలన్న బృహత్తర పథకానికి ఈ వివాదం తోడ్పడుతుందని అమెరికా భావించి మనల్ని అందులో కీలక భాగస్వామిని చేసింది. సుంకాల వివాదంలో ఇది ఎటు పోతుందన్న ఆందోళన జపాన్కు సహజంగానే ఉంటుంది. అయితే తమ వైఖరి మారబోదని మోదీ చెప్పటం జపాన్కు ఊరటనిచ్చే అంశం. ఇండో–పసిఫిక్ విషయంలో మన వైఖరి చైనాకు కంటగింపుగానే ఉండొచ్చు. జపా న్తో సంబంధాలు సుహృద్భావంతో ఉండగా, చైనాతో సంబంధాలు అందుకు భిన్నం. సుంకాల వివాదం నేపథ్యంలో భారత్ దగ్గరవుతుందన్న అంచనా చైనాకుంది. ఎస్సీవో శిఖరాగ్ర సదస్సుకు మోదీ వెళ్తారా వెళ్లరా అనే సంశయం మొదట్లో ఉన్నా... రష్యా చొరవతో అది సాధ్యపడుతోంది. ఇది సాన్నిహిత్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాలి. చైనా ఇప్పటికే ఎరువులు, అరుదైన ఖనిజాలు, సొరంగాల తవ్వకంలో తోడ్పడే యంత్ర సామగ్రి ఎగుమతులపై ఉన్న నిషేధాలు తొలగించటానికి సూత్రప్రాయంగాఅంగీకరించింది. మోదీ చైనా పర్యటనలో ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుంది. చైనాతో మన సంబంధాలు బలపడే సూచనలుండగా, ట్రంప్ సైతం చైనాతో సన్నిహితమై దక్షిణాసియాలో పలుకుబడి పెంచుకోవాలనుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన వ్యూహాత్మక ఆధిక్యతను నిలబెట్టుకుంటూ జపాన్, చైనాలతో సఖ్యత కుదుర్చుకోవటం దౌత్యపరంగా మనకు పెను సవాలే. మోదీ దీన్ని ఎలా ఛేదించగలరో చూడాలి. -
సుంకాలపై ‘సమష్టి’ పోరు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. మన దేశంపై ఉన్న అదనపు సుంకాల భారాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకాలకూ బుధ వారం నుంచి మరో 25 శాతం చేరింది. క్షణానికో రకంగా, రోజుకో విధంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధహస్తుడైన ట్రంప్ చివరికి ఏం చేస్తారోనన్న ఉత్కంఠ అందరిలో ఉండేది. మూర్ఖత్వం విచక్షణను ఎరుగదు. తన ఆదేశాలను ధిక్క రిస్తూ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయటం వల్లే ఈ చర్య తీసుకున్నట్టు అమెరికా చెప్పుకొంటోంది. మనల్ని మించి ముడిచమురు కొంటున్న చైనాకు ఆ తర్కం ఎందుకు వర్తించదో ఇంతవరకూ అది సంజాయిషీ ఇవ్వలేకపోయింది. అసలు రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి అమెరికాకు తప్ప మరెవరికీ లేదు. ఎందుకంటే తెరవెనకుండి యూరప్ దేశాల ద్వారా ఉక్రెయిన్ను రష్యాపై ఉసిగొల్పిందీ, ఆ యుద్ధానికి అంకు రార్పణ చేసిందీ తానే. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం ద్వారా... లేక ఇక వెనక్కు తగ్గాలని ఉక్రెయిన్ను కోరటం ద్వారా శాంతికి దోహదపడాల్సింది కూడా తానే. కానీ ఆ పని చేయకపోగా ఆ యుద్ధం కొనసాగటానికి మనమే బాధ్యులమంటూ దబాయిస్తోంది. దాన్ని ‘మోదీ యుద్ధం’గా అభివర్ణిస్తూ వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో నోరు పారేసుకున్నారు. మనం చమురు కొనటం వల్లే రష్యా యుద్ధం కొనసాగుతోందని తప్పుడు భాష్యానికి దిగారు. ఏ రకంగా చూసినా ప్రపంచంలో సకల అవలక్షణాలకూ బాధ్యత వహించక తప్పని అమెరికాయే రష్యా– ఉక్రెయిన్ యుద్ధానికి కూడా కర్త, కర్మ, క్రియ. ఏకకాలంలో భిన్న సూచనల్ని పంపి అవతలి పక్షాన్ని గందరగోళపరచటం అమెరికాకు అలవాటైన విద్య. ఈ దబాయింపులకు ముందురోజే ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ‘చివరకు రెండు దేశాలూ ఒక్కటవుతాయి’ అని మాట్లాడారు. అందరికన్నా ముందు ఏప్రిల్లోనే వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలెట్టిన భారత్... మే 1 లేదా జూన్ 1 కల్లా దానిపై సంతకాలు చేయాల్సిందని ఆయన చెబుతున్నారు. చర్చించు కుని ఒప్పందంపై సంతకాలు చేస్తారు తప్ప, తమకు నచ్చినట్టు రాసుకుని, ఒప్పందం పూర్తయినట్టేనని చెబితే అంగీకరించేదెవరు? ఇలాంటివి మాఫియా సామ్రాజ్యాల్లో చెల్లుబాటవుతాయి. నాగరిక ప్రపంచంలో సాధ్యపడదు. భారత్–అమెరికా సంబంధాలు ఆదినుంచీ సంక్లిష్టమైనవే. ఇందుకు అమెరికా తనను తానే నిందించుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాకిస్తాన్కు సాయపడుతూ, మనల్ని చీకాకు పరిచేందుకు నిరంతరం ప్రయత్నించేది. ఆ దశ దాటి ఇరు దేశాల మధ్యా స్నేహం చిగురించి, దృఢమైన బంధంగా మారి దశాబ్దాలు దాటుతోంది. కానీ పాకిస్తాన్ను దువ్వటం ఆపలేదు. ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడల్లా మన దేశం డిమాండ్ చేస్తే తాత్కాలికంగా ఆర్థిక సాయం ఆపటం లేదా ఆయుధ సామగ్రి ఎగుమతి నిలిపినట్టు కనబడటం, ఆ తర్వాత పునరుద్ధరించటం అమెరికా దురలవాటు. మొన్నటికి మొన్న పెహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యపై ఒక్క మాట మాట్లాడటానికి నోరు పెగలని ట్రంప్, భారత్–పాక్ ఘర్షణల్ని ఆపానని స్వోత్కర్షకు పోవటం ఇప్పటికీ ఆపలేదు. సరిగదా పాక్ ఆర్మీ చీఫ్కు ఘన ంగా మర్యాదలు చేశారు. కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సు నుంచి రావాలన్న ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించటం, తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులనూ అనుమతించాలన్న ఒత్తిడికి అంగీకరించకపోవటం ట్రంప్ కడుపుమంటకు కారణం. కానీ ముడిచమురు సాకు చెబుతున్నారు. భారత్లో 46 శాతం మంది సాగు రంగంపై ఆధారపడతారు. అమెరికాలో ఇది ఒక్క శాతమే. ఆ ఒక్కశాతం కోసం దేశ జనాభాలో సగంమంది ఆధారపడే రంగాన్ని ధ్వంసం చేయాలట! ఏమైతేనేం తాజా సుంకాల భారం మన దేశంనుంచి పోయే 66 శాతం ఎగుమతులపై తీవ్ర ప్రభావమే చూపగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందువల్ల ఈ ఏడాది, వచ్చే ఏడాది మన వృద్ధిపై 0.8 శాతం కోత పడవచ్చంటున్నారు. రత్నాభర ణాలు, దుస్తులు, వాహనాల విడిభాగాలు, స్టీల్, రొయ్యలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనీ, ఈ రంగాల్లో అనిశ్చితి ఏర్పడుతుందనీ అంచనా. లక్షలాదిమంది కార్మికుల ఉద్యోగాలకు ముప్పు కలగవచ్చు కూడా. ఈ ఎగుమతుల్ని వేరే దేశాలకు మళ్లించగలిగితే నష్టాన్ని తగ్గించుకోగలం. అదృష్టవశాత్తూ మనది ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు. అందుకే దేశ ప్రజానీకమంతా ఒక్కటై పట్టుదలగా ఇక్కడి ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తే ఈ గండాన్ని గట్టెక్కడం కష్టం కాదు. -
క్షతగాత్ర గాజా
అంతర్జాతీయంగా ఏకాకి అవుతున్నకొద్దీ ఇజ్రాయెల్లో ఉన్మాదం ప్రకోపిస్తోంది. గాజాలో దాని దుర్మార్గాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచానికి చాటుతున్న పాత్రికేయులను గురిచూసి కాటేస్తూ, మరోపక్క గాజా వాసులను ఆకలితో మాడ్చి చంపుతున్న వైనం అమెరికాకు తప్ప అందరికీ ఆందోళన కలిగిస్తోంది. మనుషులు సృష్టించిన దుర్భిక్షంతో గాజా అల్లాడుతున్నదని ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను అంచనా వేసే ఐరాస అనుబంధ సంస్థ ఐపీసీ ప్రకటించిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. మర్యాదలు అడ్డువచ్చాయో, నిబంధనలు అనుమతించలేదో గానీ... గాజా దుర్భిక్షాన్ని మానవ మృగాల సృష్టిగా ప్రకటిస్తే వర్తమాన స్థితికి సరిగ్గా సరిపోయేది. ఇజ్రాయెల్ఇంతగా ఎందుకు దిగజారుతున్నదో తెలిసిందే. ఇన్ని దశాబ్దాలుగా ఆ దేశానికి గట్టి మద్దతు దార్లుగా నిలిచి, దాని దురాగతాలను సమర్థిస్తూ వచ్చిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియాలు వచ్చే నెలలో జరిగే ఐరాస సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను అధికారికంగా గుర్తించనున్నట్టు ప్రకటించాయి. దాంతో భారత్తో సహా 1988లోనే పాలస్తీనా ఆవిర్భావాన్ని గుర్తించిన 147 దేశాల సరసన అవి చేరనున్నాయి. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్యదేశాల్లో రష్యా, చైనాలు ఇప్పటికే పాలస్తీ నాను గుర్తించగా బ్రిటన్, ఫ్రాన్స్లు ఆ జాబితాలో చేరనున్నాయి. అంటే ఇజ్రాయెల్ నరమేధానికి మౌనంగా అంగీకారం తెలుపు తున్న అమెరికా ఇకపై మండలిలో ఏకాకి కానుంది. అందుకే ఇజ్రాయెల్ ఉన్మాదం ముమ్మరించింది. సమితిలోనూ, మండలిలోనూ పాలస్తీనాపై చర్చ వచ్చేనాటికల్లా పాలస్తీనా ఉనికినే తుడిచేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తాపత్రయపడుతు న్నారు. అది సాధ్యంకాదని గాజాను వదలబోమంటున్న ప్రజానీకం చాటుతోంది.రెండేళ్ల క్రితం పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్ గడ్డపై ఉగ్రవాద చర్యకు పాల్పడి 1,200 మంది పౌరులను హతమార్చటంతోపాటు 250 మందిని అపహ రించాక నెతన్యాహూ హమాస్పై చర్య నెపంతో ఈ నెత్తుటి హోమాన్ని మొదలుపెట్టారు. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ, వియత్నాం, అఫ్గాన్లలో అమెరికా సాగించిన దురాక్ర మణ యుద్ధాల్లోనూ మరణించిన మీడియా సిబ్బంది కన్నా అధికంగా గాజాలో 245 మంది పాత్రికేయులు ఇజ్రాయెల్ క్రౌర్యానికి బలయ్యారు. ఈ దురాగతాలు అమెరికా అధ్యక్షుడికి తెలియనే తెలియవట. ఈ పరిణామాలకు ఆయనేమీ సంతోషంగా లేరట! నటనలో ట్రంప్ను నెతన్యాహూ మించిపోతున్నారు. పాత్రికేయుల మరణం విషాదకర మనీ, వైద్యసిబ్బందికీ, పౌరులకూ తామెంతో విలువిస్తామనీ చెబుతున్నారు. సోమవారం ప్రాణాలు తీసిన పాత్రికేయులపై ఆయనగారు ఎందుకనో ఉగ్రవాద ముద్ర వేయలేదు.ఐపీసీ ఇరవయ్యేళ్ల చరిత్రలో కరవు కాటకాలను ప్రకటించింది నాలుగే సందర్భాల్లో. సోమాలియాలో 2011లో, దక్షిణ సూడాన్లో 2017, 2020లలో, సూడాన్లో నిరుడు ఆ సంస్థ దుర్భిక్షం నెలకొన్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఆ జాబితాలో గాజా చేరింది. గాజా దుర్భిక్షం ఫేజ్–5లో ఉన్నదని ఐపీసీ చెబుతోంది. పిల్లల్లో 30 శాతంమంది తీవ్రమైన పౌష్టికాహార లోపంతో ఉన్నారని, ప్రతి పదివేల మందిలో ముగ్గురు మరణిస్తున్నారని దానర్థం. ఇదే కొనసాగితే గాజా జనాభాలో మూడోవంతు మంది... అంటే 6,41,000 మంది ప్రమాదకర స్థితిలో పడతారని, అయిదేళ్లలోపు చిన్నారులు 1,32,000 మంది మృత్యువాత పడతారని అంచనా వేస్తోంది. ఇప్పటికే ఆకలితో 112 మంది పసివాళ్లతో సహా 271 మంది చనిపోయారు. ఇవిగాక పంపిణీ ట్రక్కుల వద్ద గుమిగూడుతున్నవారిని కాల్చి చంపటం నిత్యకృత్యమైంది. దిగ్బంధాలతో ఆహారం, సరుకులు, ఔషధాలు ప్రజానీకానికి చేరట్లేదు. గాజా వెలుపల 6,000 ట్రక్కులు అనుమతులకై ఎదురుచూస్తున్నాయి. నిత్యం క్షిపణులు, బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నా, ఈ మారణ హోమాన్ని మౌనంగా తిలకిస్తున్న ప్రపంచంలో అనాథలమయ్యామని తెలుస్తూనే ఉన్నా అత్యధిక జనాభా పాలస్తీనాను విడిచిపెట్టడానికి ససేమిరా అంటున్నది. ఆకలితో,హంతక దాడులతో మృత్యువాత పడతామని తెలిసినా వెరవట్లేదు. రెండో ప్రపంచ యుద్ధా నంతరం ఎక్కడా దిక్కులేక అగ్రరాజ్యాల అండతో ఒక దేశాన్ని ఆక్రమించుకున్న దురాక్ర మణదారుకేం తెలుసు... మాతృభూమిపై మమకారమంటే ఏమిటో?! ఇవాళ హంతకు లది పైచేయి కావొచ్చు, ప్రపంచ ప్రజానీకం మౌనంగా మిగిలిపోవచ్చు. కానీ ఈ నేరాలు సమసిపోవు... వాటికి శిక్షపడకా తప్పదు. అప్పుడు నటనలు చెల్లవు, ముసుగులు కుద రవు. ఆ రోజు ఆగమించేవరకూ పాలస్తీనా పంటి బిగువన ఈ కష్టాలు భరించక తప్పదు. -
ఈ మారణహోమం ఆగేదెలా?
‘భార్యాభర్తలన్నాక ఇదంతా మామూలే కదా...’ అన్నాడు గ్రేటర్ నోయిడాలో భార్యను హత్యచేసిన తర్వాత విపిన్ భాటీ అనే యువకుడు. బహుశా హైదరాబాద్లోని మేడిపల్లిలో గర్భిణిగా ఉన్న భార్యను గొంతు కోసి చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మూసీ నదిలో పడేసిన మహేందర్రెడ్డిని అడిగినా... భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రెండేళ్లపాటు భార్యను మానసికంగా, శారీరకంగా హింసించి తిండి కూడా పెట్టకుండా మాడ్చి ఆమె మరణానికి కారణమైన నరేశ్బాబును అడిగినా... పెళ్లయిన మూడు నెలలకే భార్యను ఊపిరాడకుండా చేసి చంపేసిన వరంగల్ జిల్లాలోని గణేశ్ను అడిగినా... మహబూబ్నగర్ జిల్లాలో భార్యను హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసిన శ్రీశైలంను అడిగినా ఇదే చెబుతాడు. కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనలు సమస్య తీవ్రతను చాటుతున్నాయి. అదనపు కట్నం కోసమో, అనుమానంతోనో, తమకన్నా అధికంగా సంపాదిస్తున్నదనో భార్యల్ని హింసించడం, హతమార్చటం సర్వసాధారణంగా మారింది. అందుకే ‘భార్యాభర్తలన్నాక ఇదంతా మామూలేగా...’ అనగలిగాడు విపిన్. ఈ ఉదంతాలన్నిటిలో మధ్యవర్తులు రాజీ చేశారని, అంతా బాగానే ఉందనుకున్నామని, ఇంతలోనే ఘోరం జరిగి పోయిందంటూ తల్లి తండ్రులు బావురుమనటం చూస్తాం. ఒకపక్క ఐపీసీ సెక్షన్ 498–ఏ దుర్వినియోగానికి గురవుతున్నదంటూ పదేళ్ల క్రితం మొదలైన అలజడి పర్యవసానంగా 2014లో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. అటు తర్వాత అరెస్టులు తగ్గిపోయాయనీ, ఇది బాధిత మహిళలకు మరింత సమస్యాత్మకంగా మారిందనీ మహిళా సంఘాలూ, హక్కుల సంఘాలూ అభ్యంతరాలు చెప్పినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు 498–ఏ భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లో సెక్షన్ 85గా వచ్చిచేరింది. జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికల్లో ప్రస్తావించే వరకట్నం వేధింపు కేసుల సంఖ్య, వాటిల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలవుతున్న వైనం చూపి రాజీకి వీలున్న నేరం (కాంపౌండబుల్ అఫెన్స్)గా మార్చాలని గతంలో ప్రయత్నాలు జరిగినా మహిళా ఉద్యమాలతో కేంద్రం వెనక్కి తగ్గింది. సమాజంలోనైనా, కుటుంబా ల్లోనైనా మహిళలపై ఇలాంటప్పుడు నలుమూలల నుంచీ వచ్చే ఒత్తిళ్లు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలుసు. భర్త పూర్తిగా మారిపోయాడనీ, ఇకపై జాగ్రత్తగా మసలుకుంటాడనీ ఒత్తిళ్లు తెస్తే సులభంగా కరిగిపోయే భార్యలు కోకొల్లలు. భర్తపై కేసు పెట్టిందని చిన్నచూపు చూసే సమాజం, ఎలాగోలా కాపురాన్ని నిలబెట్టుకోవాలని అయినవారు బతిమాలటం, చంటిపిల్లలతో కోర్టుల చుట్టూ తిరగకతప్పని స్థితి, ఒంటరి మహిళగా బతకటం కష్టమన్న భయాందోళనలూ స్త్రీలు రాజీపడక తప్పనిస్థితిని కల్పిస్తున్నాయి. విచారణ పూర్తవుతున్న దశలో మాట మార్చటంవల్ల కేసులు వీగిపోతున్నాయి. దారుణ మేమంటే... కన్నకూతురిని హతమార్చాడన్న కోపం కూడా లేకుండా కొన్నిసార్లు తల్లితండ్రులు రాజీ పడుతున్నారు. డబ్బుల వల్లనో, బెదిరింపుల వల్లనో వెనక్కి తగ్గుతున్నారు. దేశంలో సామాజిక కట్టుబాట్లూ, సంప్రదాయాలూ మహిళల్ని కట్టిపడేసినంతగా మగవాళ్లను పట్టించుకోవటం లేదు. పర్యవసానంగానే ఈ హింసాత్మక ఘటనలు పదే పదే జరుగుతున్నాయి. జరుగుతున్న హింసతో పోలిస్తే పోలీస్ స్టేషన్లకూ, కోర్టులకూ వెళ్లే ఉదంతాల సంఖ్య అత్యల్పం. కులం పేరిట, మతం పేరిట ‘పెద్దలు’ రంగంలోకి దిగి భర్తను మందలించినట్టుగా, అతడు మారాడన్నట్టుగా చూపించి ఇకపై సమస్యలు రావని హామీ ఇస్తున్నారు. ఇప్పుడు కన్నుమూసిన యువతుల్లో అనేకులు ఆ నరకకూపాల్లోకి మళ్లీ ప్రవేశించి ప్రాణాలు కోల్పోయినవారే. ఇలాంటివి జరిగినప్పుడు గతంలో రాజీకి ప్రయత్నించిన ‘పెద్దల్ని’ కూడా బాధ్యులుగా చేరిస్తే తప్ప ఈ మారణ హోమం ఆగదు. దౌర్జన్యం చేయటం, హింసించటం చట్టం దృష్టిలో నేరం. ఆ నేరాన్ని పోలీసుల వరకూ పోనీయకుండా చేసి, నోళ్లు మూయించి రాజీకి ప్రయత్నిస్తున్న వారు కూడా నేరంలో భాగస్వాములే అని గుర్తించాలి. అసలు 2022 తర్వాత ఎన్సీఆర్బీ నివేదికలు కేంద్రం వెలువరించటం లేదు. కనీసం పోలీసుల వరకూ వస్తున్న కేసుల గణాంకాలైనా తెలియక పోతే సమాజాన్ని పీడిస్తున్న సమస్యపై కఠిన చట్టాలతోపాటు ఇతరత్రా ఏం చేయాలో ఆలోచించటం ఎలా సాధ్యం? విపిన్ లాంటివాళ్లు భార్యల్ని హింసించడం మామూలే అన్న ధోరణికి పోవటాన్ని చూసైనా తీరు మార్చుకోవాలి. మౌనంగా ఉండిపోయి మనమంతా పరోక్షంగా ఆ నేరాల్లో భాగస్వాములమవుతున్నామని గుర్తుంచుకోవాలి. -
నేల విడిచిన సమరం
చిన్నపాటి ప్రాంతాన్ని ఏలిన రాజును సైతం భూమండలమేలినవాడిగా పేర్కొని ఆకాశానికెత్తడం మన ఇతిహాస, పురాణాల్లో కనిపిస్తుంది. మహాభారతంలో దుష్యంతుని గురించి నన్నయ రాస్తూ, అతడు మహాబలవంతుడనీ, దిక్కుల చివర ఏనుగులతో అలంకృతమైన భూమండలమంతా తన అధీనంలో ఉండగా; సూర్య కిరణాలు, గాలీ కూడా చొరలేని మహారణ్యాలను, దేశాలను అజేయ పరాక్రమంతో ఏలాడనీ అంటాడు. అన్ని రకాల బలాలూ, బలగాలూ కలిసొస్తే భూమి మొత్తాన్ని శాసించాలనే పాలకుల ఆకాంక్ష అలాంటి అభివర్ణనలలో తొంగిచూస్తుంది. యుద్ధాలనేవి భూమినింకా దాటని దశ అది. నేటి సాంకేతిక అభివృద్ధి పుణ్యమా అని యుద్ధాలు ఆకాశ మార్గం పట్టేశాయి. భూయుద్ధాలు గతస్మృతులై, యుద్ధం ఈ రోజున అక్షరాలా నేల విడిచిన సమరమైంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా మనం జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’ దానిని అత్యాశ్చర్య కరంగా కళ్ళకు కట్టింది. ‘అర్థశాస్త్రం’తో సహా ప్రాచీన గ్రంథాలు యుద్ధతంత్రంలో చెప్పిన అన్ని ఉపాయాలను, మాయోపాయాలను, పూర్తిగా సైనిక సాయంతో కాకుండా శాస్త్ర సాంకేతిక సాయంతో అందులో ప్రయోగించినట్టు చెబుతున్నారు. అంతర్జాల కేంద్రితంగా, కృత్రిమ మేధ సృష్టించిన సమాచారంతో, ద్రోణులపైనా, గ్రౌండ్ పొజిషనింగ్ సిస్టమ్స్(జీపీఎస్)పైనా, ఉపగ్రహాలపైనా ఆధారపడి చేసిన ఎలక్ట్రానిక్ యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. రష్యా సాయంతో మనం అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను, రఫేల్ వంటి యుద్ధ విమానాలను బరిలోకి దింపి విజయవంతంగా వాడుకున్న తీరు, నేటి యుద్ధాలు భూమ్యాకాశాల మధ్య పోరుగా మారడాన్ని ప్రత్యక్షంగా చాటాయి. సాంప్రదాయిక యుద్ధాలతో పోల్చితే, ఈ గగనతల యుద్ధాలు దేశాలకూ, జనాలకూ తెచ్చిపెట్టే కష్టాలూ అనేక రెట్లు ఎక్కువనీ; ఏ దేశానికాదేశం ఎప్పటికప్పుడు సాంకేతికంగా పై చేయిని సాధించడమే దీనికి పరిష్కారమన్న హెచ్చరికా వినిపిస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో వెలుగు చూసిన వివరాలు ఇలాంటి యుద్ధాలతో ముడి పడిన ప్రమాదాలను భయభ్రాంతంగా చూపిస్తున్నాయి. ఉక్రెయిన్ జనానికి టెలివిజన్ సేవలందించే ఒక ఉపగ్రహాన్ని రష్యా నిపుణులు హ్యాక్ చేసి వాటిలో యుద్ధ శకటాల తోనూ, ఆయుధ సంపత్తితోనూ తమ సైనికులు జరిపే విన్యాసాల దృశ్యాలను ప్రసారం చేశారు. ఒక్క గుండు కూడా పేల్చకుండా, ఉపగ్రహాలను నిర్వీర్యం చేయడం ద్వారా, సమాచార అంధకారాన్ని సృష్టించి ఒక దేశ భద్రతనూ, దాని ఆర్థిక వ్యవస్థనూ దెబ్బతీసే ప్రమాదాన్ని రూపుగడుతున్నారు. సాంకేతికతను మెరుగుపరచుకుంటూ అన్ని విధాలా పోటీకి సన్నద్ధమైతే తప్ప ఈ సవాలును ఎదుర్కోవడం కష్టమనీ, సాంకేతిక సంపత్తి దేశాల మనుగడకు గీటురాయి అయిందనీ అంటున్నారు. అంతేకాదు, యుద్ధాలు గగన సీమను దాటి గ్రహాంతరాలకు చేరుకోవడమూ పొడగడుతోంది. చంద్ర మండలం మీది ఖనిజాలను, ముఖ్యంగా అణు విచ్ఛేదానికి తోడ్పడే హీలియం–3ను కొల్లగొట్టే పోటీకి అగ్రదేశాలు సిద్ధమవుతూ, అక్కడ అణు రియాక్టర్లను నెలకొల్పే యత్నంలో ఉన్నాయట! మబ్బు చాటు మాయా యుద్ధాలను మన పూర్వులు ఊహించకపోలేదు. రాక్షసులు వాటిలో ప్రవీణులని మన ఇతిహాస, పురాణాలంటాయి. రామాయణంలో మారీచ సుబా హులు అలాంటివారే. రావణుని కొడుకు ఇంద్రజిత్తయితే, నింగి నుంచే కానీ, నేల మీద యుద్ధం చేయడు. మాయసీతను చూపించి నిజసీతగా భ్రమింపజేసి హత మార్చడం లాంటి మాయావి చేష్టలలో రావణుడు కూడా అతనికి చాలడు. సూర్యాస్తమ యంలోగా సైంధవుని చంపుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు సూర్యుడికి చక్రాన్ని అడ్డేసి సూర్యాస్తమయాన్ని సృష్టించడం నేటి కృత్రిమ సాంకేతిక విన్యాసాల్లాంటిదే. అప్పటివన్నీ ఊహలనుకుంటే, ఇప్పటి శాస్త్ర సాంకేతికత సృష్టించేవి నిండునిజాలు. యుద్ధాలు నేలనూ, నింగినీ దాటి గ్రహాంతరాలకు చేరుకునే పరిస్థితిలో శాంతి గతే మిటి; ఇది పురోగమనమా, తిరోగమనమా అన్న ప్రశ్నా వేసుకోక తప్పదు; యుద్ధమూ, శాంతి అనే జంటలో ఒకటి కాపురం కూల్చేసి గగనమార్గం పట్టిపోతే రెండవది నేల మీద కుమిలిపోతూ ఉండవలసిందేనా అన్న బాధకూ లోనవక తప్పదు. బాహ్యయుద్ధాల ఎండమావుల వేట నుంచి మనిషి వెనుదిరిగి అంతరంగ యుద్ధం వైపు ఎప్పుడు దృష్టి సారి స్తాడు?! లోకాలన్నీ జయించావు కానీ, అరిషడ్వర్గాలనే నీ లోపలి శత్రువులను ఎప్పుడు జయిస్తావని హిరణ్యకశిపుని ప్రహ్లాదుడు అడిగిన ప్రశ్న ఇప్పటికీ ఎంత ప్రాసంగికం!! -
పరిపాలన మహాపతనం!
‘సుపరిపాలన – తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. తమ తొలి ఏడాది పాలనా ఫలితాలు ఎంత రమ్యంగా ఉన్నాయో యెల్లో మీడియా కళ్లద్దాల్లోంచి లోకానికి చూపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ, ఆ రంగుటద్దాలను బద్దలు కొట్టుకొని మరీ రోజుకో యథార్థం బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా బయటకొస్తున్నది. ఆ చిత్రాల్లో కంచే చేను మేస్తున్న వంచనోదంతం కనిపిస్తున్నది. అండగా నిలబడవల సిన ప్రజా ప్రతినిధుల కళ్లలోంచి జారుతున్న కీచక కిరణాలు కనిపిస్తున్నాయి. వాటి కంపరాన్ని తట్టుకోలేని ఆడబిడ్డల నిస్స హాయత కన్నీటి బొట్టు రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నది. భూమినీ భూగర్భాన్నీ, యేటిలోని ఇసుకనూ, గట్టు మీది మట్టినీ కబళిస్తున్న కబంధ హస్తాలు కనిపిస్తున్నాయి.‘ధిక్కారముల్ సైతుమా’ అంటున్న కంసమామల హింస రచన ఊరూవాడల్ని దాటి అడవులూ, కొండల్లోకి పాకింది.మంత్రుల పేషీలకి మూటలు మోసే బ్రోకరేజి పనులు చేయలేన న్నందుకు తనను శంకరగిరి మాన్యాలు పట్టించారని ఓ అధికారి ఆవేదనతో రాసుకున్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది. ‘మా మంత్రిగారు పర్యటనకొస్తే స్టార్ హోటల్లో సేద దీరేందుకు ఏసీ రూమ్, పక్కనే ఇంకో రూమ్ పెట్టుకుని ఆ పనులకే పరిమిత మవుతార’ని సొంత పార్టీ నాయకుడే సర్కార్ వారి ఛానల్లో దండోరా వేశాడు. ఇలాంటి కథలింకెన్నో! వెలుగు చూసిన వాటిలో మంత్రుల లీలలూ, ఎమ్మెల్యేల విన్యాసాలూ, ఇతర నాయకుల కళలూ డజన్లకొద్దీ ఉన్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనేది మన పాత సామెత. ప్రభుత్వ యంత్రాంగంలోని దూడలన్నీ ఇప్పుడు చేలను చడతొక్కుతున్న దృశ్యమైతే అందరికీ కనిపిస్తున్నది. ఆవు గట్టున మేస్తే ఈ పరిస్థితి రాదు కదా! ఎమ్మెల్యేల మీద, నాయ కులు, మంత్రుల మీద జుగుప్సాకరమైన ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఆయన ఫలానా వారి మీద చాలా సీరియస్ అయ్యారనీ, గట్టిగా మంద లించారనీ యెల్లో మీడియాకు ‘విశ్వసనీయంగా’ తెలియవస్తుంది. కథ అంతటితో ముగిసిపోతుంది. ఒకరిద్దరు నేతలనైతే ‘వివరణ’ పేరుతో ముఖ్యమంత్రి పిలిపించినట్టున్నారు. వారు గట్టిగా ఎదురు తిరిగారనీ, దాంతో ఆయన... అయితే ఓకే అని పంపించారని మనకు కూడా విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఆ తదుపరి చర్యలేమీ లేకపోవడమే ఈ నిర్ధారణకు ఆధారం.నైతికంగా, పాలనాపరంగా, రాజకీయంగా ఇంతగా దిగ జారిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూసి ఉండలేదు. ఈ వైపరీత్యాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే యెల్లో మీడియా కూడా దాచిపెట్టలేకపోతున్నది. ముఖ్యమంత్రి సీరి యస్ అయ్యారని చెప్పడం కోసమైనా ఒకటి రెండు ఉదంతా లను వారే స్వయంగా వెలుగులోకి తెస్తున్న వింత పరిణామాన్ని చూస్తున్నాము. కూటమిలోని మూడు పార్టీలకు చెందిన కొందరు సీనియర్ నాయకులు సైతం దుర్గంధ భరితమైన ఈ ప్రభుత్వ పాలనపై బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పతనాన్ని స్థూలంగా మూడు భాగాలుగా మనం విభ జించవచ్చు. 1. నేతల విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవ ర్తన, 2. పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసం, 3. రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలు.విచ్చలవిడి అవినీతి – విశృంఖల ప్రవర్తన ఈ అంశంపై 14 నెలల కాలాన్ని సమీక్షించాలంటే ఓ గ్రంథమే రాయవలసి ఉంటుంది. ఒకటి రెండు వారాలుగా వెలుగు చూస్తున్న కొద్దిపాటి ఉదంతాలను పరికిస్తే చాలు. వ్యవ సాయ శాఖకు అనుబంధంగా ఉండే ఆగ్రోస్ జీఎమ్గా పనిచేసి బదిలీ అయిన అధికారి ఈమధ్య చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాశారు. మంత్రిగారి (అచ్చెన్నాయుడు) పేషీలోని అధికారి ఒకా యన తనను పిలిచి ఆగ్రోస్ కొనుగోళ్లకు సంబంధించిన కమీష న్లను తమకు మాట్లాడిపెట్టే మధ్యవర్తిత్వం చేయాలని సూచించా రని ఆయన ఉత్తరంలో ఆరోపించారు. ఈ పనికి తాను అంగీక రించకపోవడంతో తనను బదిలీ చేసి, అర్హత లేని ఒక జూనియర్ అధికారిని అక్కడ నియమించారని ఆయన సీఎస్కు ఫిర్యాదు చేశారు. కానీ, ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి చర్యా లేదు.తిరుపతి వాస్తవ్యుడైన సుధాకర్రెడ్డి అనే సీనియర్ టీడీపీ నాయకుడు ఈ మధ్య ఏబీఎన్ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొ న్నారు. తమ జిల్లాకు రెగ్యులర్గా వచ్చే మంత్రి ఫైవ్స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లలో దిగి తన రూమ్తోపాటు ఇంకో అనుబంధ రూమ్ను కూడా మెయిన్టెయిన్ చేస్తాడనీ, పార్టీ వారికి మాత్రం అందుబాటులో ఉండరని ఆరోపించారు. ఎమ్మెల్యేలను అదు పులో పెట్టవలసిన మంత్రులే ఇలా ప్రవర్తిస్తుంటే ఇక వారి సంగతి చెప్పడానికేముందని ఆయన వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన కరుడుగట్టిన రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్కు సంబంధించిన పెరోల్ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఆయనకు పెరోల్ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు – కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, పాశం సునీల్ ప్రభుత్వానికి లేఖలు రాశారట! జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి కొంతకాలం సమాజంలో గడపడానికి కాలపరిమితితో, షరతులతో కూడిన విడు దలనే ‘పెరోల్’ అంటాము. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే ఇస్తారు. ఈయనకు గతంలో జైలు నుంచి పారి పోయిన రికార్డు కూడా ఉన్నది. అందువల్ల హోంశాఖ అధికా రులు సిఫారసును తిరస్కరించారట! అయితే మంత్రిస్థాయిలో ఆమోదం లభించింది. ఎలా సాధ్యం? డబ్బులు చేతులు మారైనా ఉండాలి. మానవీయ కోణంతోనైనా ఆమోదించి ఉండాలి. లేదా అత్యున్నత స్థాయి ఆదేశాలైనా ఉండాలి. సుగాలి ప్రీతి మీద లేని మానవీయ కోణం రౌడీషీటర్ విషయంలో ఉంటుందా?మంత్రులకు సంబంధించిన పై మూడు ఉదంతాలు చాలా తీవ్రమైనవి. ఆరోపణలు నిజం కాకపోతే సాక్ష్యాధారాలతో కూడిన వివరణలు వారు స్వయంగా ఇచ్చి ఉండవలసింది. ఇక్కడ అర్ధాంగీకారాలు ఉండవు. కనుక ఈ మౌనాన్ని పూర్తి అంగీకారంగానే జనం భావిస్తారు. ఎమ్మెల్యేల కథలైతే బేతాళ కథల మాదిరిగా అనంతం. శ్రీశైలం ఎమ్మెల్యే పుణ్యక్షేత్రం చెక్ పోస్టు దగ్గర గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఇంత బరితెగింపు ఎలా వచ్చింది? ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. విసిగి వేసారిన ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. దాని మీద ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. కానీ, ఒక మహిళా ఉద్యోగికి ఎమ్మెల్యే రాత్రిపూట వీడియోకాల్స్ చేయవలసిన అవసరమేమిటనేదే కీలకమైన ప్రశ్న. చోడవరం ఎమ్మెల్యేపైనా, గుంటూరు ఎమ్మెల్యేపైనా వీడియోల సైతంగా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. రామాయంపేట పోర్టు పనుల కాంట్రాక్టర్ను కప్పం కోసం స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని యెల్లో మీడియానే రాసింది. ఇలా అనేకమంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారని కూడా ఆ మీడియానే రాసింది. కొస మెరుపుగా అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాయడం మాత్రం మరచిపోలేదు. అయినా ఈ దందాలు పెరుగు తున్నాయే తప్ప తగ్గడం లేదు.రాష్ట్రమంతటా మద్యం ఏరులై ప్రవహిస్తున్నది. నాలుగు వేలకుపైగా లైసెన్స్డ్ షాపులకు అనుబంధంగా భారీ పర్మిట్ రూమ్లకు ఈమధ్యనే అనుమతులిచ్చారు. 75 వేలకు పైగా బెల్టు షాపులు ఇప్పటికే గలగలలాడుతున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం 24 వేల కోట్లయితే, మిగిలిన నాలుగేళ్లు నలభై వేల కోట్ల చొప్పున ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం లక్షా 84 వేల కోట్లు. నాయకుల కమిషన్ బెల్ట్ షాపుల్లో 20 శాతం, లైసెన్స్డ్ షాపుల్లో 5 శాతం, పర్మిట్ రూమ్లు ఇచ్చిన నేపథ్యంలో 10 శాతంగా చెబుతున్నారు. సగటున 10 శాతం లెక్క వేసినా 18 వేల కోట్ల పైచిలుకు సర్కారు వారి కోటా. ఒక్కో ఎమ్మెల్యే సామ్రాజ్యంలో వంద కోట్లకు పైగానే మద్యం గిట్టుబాటనుకోవాలి.పాలనా వైఫల్యం – వ్యవస్థల విధ్వంసంవాగ్దాన భంగం కూడా పాలనా వైఫల్యం కిందకే వస్తుంది. దానికదే ఒక పెద్ద పరిశీలనాంశం. మేనిఫెస్టోలో అగ్ర ప్రాధాన్య తగా ‘సూపర్ సిక్స్’ను కూటమి ప్రకటించింది. ఈ ‘సూపర్ సిక్స్’ సూపర్ హిట్ అయింది. అన్నీ అమలు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది పూర్తిగా మోసపూరిత ప్రకటనగానే భావించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా వ్యయమయ్యే రెండు ప్రధాన హామీల జోలికి ఆయన అసలు వెళ్లలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున భృతిని అందజేస్తామని చెప్పారు. ఈ హామీని ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఉద్యోగాల సంగ తేమో కానీ ఉన్న ఉద్యోగాలకు అంటకత్తెర పడుతున్నది. మేని ఫెస్టో హామీ ప్రకారం నిరుద్యోగ భృతిని కనీసం కోటిమందికి (రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలున్నాయి) లెక్క వేసుకున్నా 14 నెలల్లో 42 వేల కోట్లు బకాయిపడ్డారు.మరో ముఖ్యమైన హామీ ‘ఆడబిడ్డ నిధి’. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరికీ నెలకు 1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. రాష్ట్రంలో ఈ వయసుల్లో ఉన్నవారు సుమారు ఒక కోటి 80 లక్షలమంది (ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం, 59 పై వయసు వారిని మిన హాయించగా) ఉన్నట్టు అంచనా. వీరందరికీ తొలి ఏడాది 18 వేల రూపాయల చొప్పున ఎగనామం పెట్టినట్టే! ఇప్పుడు ఈ హామీ ప్రస్తావన కూడా తేవడం లేదు. మిగిలిన నాలుగు హామీ లను అరకొరగా అమలు చేయడం తెలిసిందే. ‘అన్నదాత సుఖీ భవ’ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే గత సంవత్సరం 20 వేలు, ఈ సంవత్సరం అందులో తొలి భాగంగా సగమైనా ఈపాటికి జమ చేసి ఉండవలసింది. కానీ ఇంతవరకు జమ చేసింది 5 వేలు మాత్రమే! ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళ లకు 14 నెలలు ఎగవేసి అనేక మినహాయింపులతో వారం రోజుల కింద ప్రారంభించారు. ‘తల్లికి వందనం’ తొలి సంవ త్సరం రద్దు. రెండో సంవత్సరం కోతలతో అమలు చేశారు. హామీ ప్రకారం ఈపాటికి ప్రతి ఇంటికీ నాలుగు ఉచిత గ్యాస్ బండలు అంది ఉండాలి కానీ, చాలాచోట్ల ఒకటి మాత్రమే అందింది.ఒక బస్తా యూరియా సంపాదించడం కోసం రైతన్నలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఇంటి దగ్గరికి నడిచొచ్చిన జగన్ రోజులెక్కడ, ఈరోజులు ఎక్కడని జనం బేరీజు వేసుకుంటున్నారు. పెన్షన్ ఎగవేసి కడుపు కొట్టినందుకు ఆవేదనతో దివ్యాంగులు నడి రోడ్లపై ధర్నాలు చేయడం ఎప్పుడైనా చూశామా? కంటికి కనిపిస్తున్న అంగవైకల్యానికి సర్టిఫికెట్ ఇవ్వాలంటే లంచాలడుగు తున్న నికృష్టమైన అవినీతి వ్యవస్థ అమల్లోకి వచ్చింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్న దని విమర్శించి 14 నెలల్లోనే ఆయన 60 నెలల్లో చేసిన అప్పులో 56 శాతం చేసేశారు. ప్రాథమిక వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు. జగన్ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో సహా వైద్యరంగాన్ని ప్రైవేట్పరం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. పేద పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొంటున్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత లేదు. వాటిని లోతుగా పరిశీలించిన వారెవరికీ ఆ ప్రాజెక్టులు గట్టెక్కు తాయన్న నమ్మకం లేదు. మేము అధికారంలో ఉన్నంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం కానీయమని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆరు వేలమంది కార్మికు లను తొలగించారు. 32 విభాగాలను ప్రైవేట్పరం చేయడానికి టెండర్లు పిలిచారు. ముడి పదార్థాల సరఫరా నియంత్రణ, విద్యుత్ను అందజేసే థర్మల్ ప్లాంట్లలో 44 విభాగాలు, బ్లాస్ట్ ఫర్నేస్కు సంబంధించిన కీలక విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నవనాడుల్ని తెగ్గోసిన తర్వాత ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఊపిరి మిగిలి ఉంటుందా? ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజల పరిస్థితి దిగజారిపోయిందనడానికి జీఎస్టి వసూళ్లే పెద్ద సాక్ష్యం. ఇక వ్యవస్థల విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీసు యంత్రాంగాన్ని ఈ స్థాయిలో ప్రైవేట్ సేనగా మార్చేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఉన్నత న్యాయస్థానం కూడా ఈ ధోరణిపై పలు మార్లు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏరకంగా భ్రష్టుపట్టిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. ఐఏఎస్ అధికారులు తనకు ఎదురొచ్చి కుర్చీ వేయలేదని మండిపడ్డ ఒక ఎమ్మెల్యేను చూశాము. ప్రభుత్వ అధికారులను బండబూతులు తిడుతున్న నాయకులను చూస్తున్నాము. అధికా రులు తమకు కమీషన్ ఏజెంట్లుగా పనిచేయాలని డిమాండ్ చేస్తున్న మంత్రుల పేషీలను చూస్తున్నాము. ప్రభుత్వ యంత్రాంగాన్ని చివరకు ఎక్కడిదాకా నడిపిస్తారో తెలియని అగమ్య గోచరంగా పరిస్థితి మారింది.రాజకీయ అవకాశవాదం – రహస్య స్నేహాలుచంద్రబాబు రాజకీయ అవకాశవాదాన్ని గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఇతర రాజకీయ పార్టీలతో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన పెళ్లిళ్లు, తీసుకున్న విడాకులు న భూతో న భవిష్యతి. ఎన్డీఏ ప్రభుత్వాల్లో ఆయన ఇప్పటికి మూడుసార్లు చేరారు. మొదటిసారి విడాకులు ఇచ్చినప్పుడు బీజేపీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించారు. రెండో విడా కుల తర్వాత ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడటాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. తొలి రోజుల్లో కమ్యూనిస్టులతో స్నేహం చేసి ఉమ్మడి రాష్ట్రంలో వారిని నిర్వీర్యం చేసేదాకా ఆయన నిద్రపోలేదు. ఇలా జెండాలు మార్చడం ఒక భాగమైతే, ఒక కూటమితో కాపురం చేస్తూ మరో కూటమితో రహస్య స్నేహం చేయడం రాజకీయ విలువల పతనానికి పరాకాష్ఠ. జగన్మోహన్రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో టీడీపీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్తో రహస్య స్నేహం మొదలు పెట్టారు. 2012లోనే ఈ విషయంపై ‘రహస్య మిత్రులు?’ పేరుతో ‘ఇండియా టుడే’ కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది.అప్పుడు మొదలైన స్నేహం పుష్కరకాలం దాటినా అవిచ్ఛి న్నంగా కొనసాగుతూనే ఉన్నది. 2018 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా కూడా పనిచేశాయి. నేరారోపణకు గురై 30 రోజులు కస్టడీలో ఉన్న ప్రధాని, ముఖ్య మంత్రుల పదవులు కోల్పోయేలా రూపొందించిన బిల్లుపై ఈమధ్య పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబును పదవిలోంచి తొలగించేందుకే ఈ బిల్లు పెట్టారని ఆరోపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శత్రు కూటమిలో ఉన్న రహస్య మిత్రుడి కోసం ఇంకా కాంగ్రెస్ తాపత్రయపడుతూనే ఉన్నది. ఆ పార్టీ ఆంధ్ర, తెలంగాణా విభా గాలు ఇప్పటికే బాబు అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తున్నా యనేది ఆ రాష్ట్రాల ప్రజలకు తెలిసిన సంగతే. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బాబు ‘ఇండియా కూటమి’లో చేరిపోతారని ఇటీవల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా చేసిన ఉపన్యాసం కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాంగ్రెస్ ఎం.పి. మల్లు రవి ఈమధ్యన ఒక విచిత్రమైన వ్యాఖ్యానం చేశారు. పార్టీ గుర్తు కోసం ఎన్టీఆర్ – చంద్రబాబుల మధ్య జరిగిన వివాదంలో తీర్పు చెప్పిన బెంచిలో జస్టిస్ సుదర్శన్రెడ్డి కూడా ఉన్నారు కనుక అందుకు కృతజ్ఞతగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను బాబు సమర్థించాలని రవి విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తులు సాక్ష్యాలు, ఆధారాల ప్రాతి పదికన తీర్పులు చెబుతారు. అందుకు దశాబ్దాల తర్వాత కూడా కృతజ్ఞత చూపెట్టడం దేనికో... ఈ సందర్భంలో కాంగ్రెస్ నేతలు బాబుపై ఇలా కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే రాహుల్ – బాబుల మధ్యన హాట్లైన్ లేదంటే నమ్మశక్యమా?వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ముంబై చేస్తున్న హెచ్చరిక!
ప్రణాళికాబద్ధంగా లేని పట్టణీకరణను పరిహసిస్తూ తరచు ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడుతున్నా పాలకులు మేల్కొనటం లేదనటానికి మళ్లీ నీట మునిగిన ముంబై మహానగరమే సాక్ష్యం. ముంబై దక్షిణ ప్రాంతంలో గురువారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో ఏకధాటిగా 300 మి.మీ., పశ్చిమ శివారు ప్రాంతంలో 200 మి.మీ. వర్షం కురిసిందంటే కుంభవృష్టి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. నిన్నంతా దాదాపు ప్రశాంతంగానే ఉన్నట్టు కనబడిన ఆ మహానగరం, మళ్లీ భారీ వర్షాలుంటాయన్న హెచ్చ రికలతో బెంబేలెత్తుతోంది. ఏటా వర్షాకాలంలో కనీసం ఒక్కసారైనా వరదలు ముంబైని పలకరించటం ఆనవాయితీ. ఈసారి మే నెలలోనే ఒక రోజు నడుంలోతు వరదల్లో నగరం నానా యాతనలూ పడింది. ఆ నెలలో కొత్తగా ప్రారంభమైన వొర్లి మెట్రో స్టేషన్ భారీ వరదతో వణికిపోయింది. రెండు నెలలు గడిచాయో లేదో మళ్లీ నగరానికి కుంభవృష్టి తప్పలేదు. నిరుడు 21 దఫాలు 100 మి.మీ. వర్షం పడిందని గణాంకాలు చెబుతు న్నాయి. వాతావరణంలో పెనుమార్పులు విపత్తుల తీవ్రతను పెంచాయి. అస్తవ్యస్థ పట్టణీకరణ ఈ సమస్యను వందల రెట్లు పెంచింది. ఈసారి వర్షాలవల్ల సంపన్నులు, సినీతారలు నివసించే ప్రాంతాలు సైతం వరద నీటన మునిగాయి. ఇటీవలే ఆర్భాటంగా ప్రారంభించిన మోనోరైల్ సైతం భారీ వర్షాలతో విద్యుత్ సరఫరా అందక గంటసేపు నిలిచిపోయింది. చివరకు అద్దాలు బద్దలుకొట్టి వందమంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ముంబై తూర్పు శివారులోని మీథి నది ఆ మహానగరంపై విరుచుకుపడింది. అయిదు రోజులపాటు వరసగా కురిసిన వర్షాలతో ఆ నది కట్టు తెంచుకుని అటువైపుగల రైల్వే ట్రాక్లన్నిటినీ ముంచెత్తింది. అరేబియా సముద్రం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా ఉండటంతో దానిలో కలవాల్సిన మీథి వరద నీరు కాస్తా వెనక్కొచ్చి నగరంలోని అనేక ప్రాంతాలను జలమయం చేసింది. హైదరాబాద్ నగరంలో మూసీ మాదిరిగా ముంబైలో మీథి నదిని కూడా మురికిమయం చేశారు. అందులో 70 శాతం మురికినీరు కాగా, 30 శాతం చెత్తాచెదారం, 10 శాతం పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యా లుగా కనబడు తున్నవన్నీ సారాంశంలో మానవ తప్పిదాల పర్యవసానం. గత యేభైయ్యే ళ్లుగా నగరాన్ని విస్తరించుకుంటూ పోవటమే తప్ప అందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినవారు లేరు. అలాగని మీథి నది ప్రక్షాళనకు ప్రయత్నాలు జరగ లేదని కాదు. 2013–23 మధ్య బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) రూ. 2,000 కోట్లు వ్యయం చేసింది. కానీ చివరకు తాజా వర్షాల ధాటికి మురికి నీటితో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నివాస ప్రాంతాలన్నీ నిండిపోయాయి. 70వ దశకం వరకూ పరిశుభ్రంగా ఉండే ఆ నది మురికి కూపంగా మారిందంటే పాలకులు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం.భౌగోళికంగా ముంబై తీరం పశ్చిమ కనుమలకు దగ్గరలో ఉంది. వాటివల్ల నైరుతి రుతుపవనాల్లో గాలుల తీవ్రత హెచ్చుగా ఉంటుంది. అందుకే ఏటా భారీవర్షాలు, వరదలు తప్పవు. దేశ ఆర్థిక రాజధానిగా, ఢిల్లీ తర్వాత అత్యధిక జనసాంద్రత గల నగరంగా ముంబై మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రదమైనది. దేశ జీడీపీలో ఆ నగరం వాటా దాదాపు 7 శాతం. కానీ వరదలు ముంచుకొచ్చిన ప్రతిసారీ మౌలిక సదుపాయాలు దెబ్బతినటం, ఉత్పాదకత పడకేయటం రివాజైంది. పునర్నిర్మాణానికి ఏటా రూ. 550 కోట్ల వ్యయమవుతోంది. నిజానికి ఈ సంక్షోభం అక్కడే కాదు... దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాలకులనూ పునరాలోచనకు పురిగొల్పాలి. నగర నిర్మాణాల్లో ఎలాంటి మెలకువలు తీసుకోవాలో, పెద్ద నగరాల నిర్మాణంపై మోజువల్ల చివరకు జరిగేదేమిటో గ్రహించేలా చేయాలి. కానీ అదెక్కడా కనబడదు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి తాజా వర్షాలకు ఎంత దయనీయ స్థితిలో పడిందో కనబడుతూనే ఉంది. పెద్ద నగరాల నిర్మాణంవల్ల జనసాంద్రత పెరిగి మౌలిక సదుపాయాల కల్పన అసాధ్యమవుతుందనీ, పైగా అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకరించటం వల్ల ఇతర ప్రాంతాలు ఎప్పటికీ ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోతాయనీ నిపుణులు హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తలకెక్కటం లేదు. మన కోసం ప్రకృతి మారదు. మనమే దానికి అనుగుణంగా మారాలన్న స్పృహ పాలకులకు కలగాలి. మళ్లీ మళ్లీ మునుగుతున్న ముంబై మహానగరాన్ని చూసైనా గుణపాఠం నేర్వకపోతే భవిష్యత్తు క్షమించదు. -
సమాఖ్య వ్యవస్థకు తూట్లు!
రాజకీయ అవినీతిని అంతం చేయటానికి, దేశంలో రాజ్యాంగ నైతికతను నెలకొల్పటానికి అని చెబుతూ లోక్సభలో బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, అందుకు సంబంధించిన మరో రెండు బిల్లులపై దేశవ్యాప్తంగా సకారణంగానే నిరసనలు వ్యక్త మవుతున్నాయి. లోక్సభలో అయితే తీవ్ర వాగ్వివాదాలు, పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలి వరస నుంచి మూడో వరసకు వెళ్లి ప్రసంగించాల్సి వచ్చిందంటే... ఆయనకు రక్షణ వలయంగా పార్లమెంటరీ భద్రత సేవలో ఉండే 12 మంది గార్డులు మోహరించాల్సి వచ్చిందంటే... బిల్లు ప్రతులు చించి పడేశారంటే... సభలో ఆగ్రహావేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని మొదలుకొని ముఖ్యమంత్రులూ, మంత్రులూ అవినీతి ఆరోపణలపై అరెస్టయి, 30 రోజుల్లోగా బెయిల్పై విడుదల కాని పక్షంలో వెనువెంటనే పదవుల నుంచి తప్పించేందుకు ఉద్దేశించామని చెబుతున్న ఈ బిల్లులు చట్టాలైతే ప్రకటిత లక్ష్యాలను నిజంగా నెరవేరుస్తాయా అన్నది ప్రశ్నార్థకం. ఏ వ్యవస్థలోనైనా నేర న్యాయచట్టాలు పాలకుల అధికారాన్నీ, వారి రాజకీయ స్వప్రయోజనాలనూ ప్రతిఫలించినంతగా... న్యాయాన్ని ప్రతిబింబించవు. ఆచరణ సంగతి చెప్పనవసరమే లేదు. ఎక్కడి దాకానో ఎందుకు, ఆంధ్రప్రదేశ్లో తమ ఎన్డీయే కూటమి పాలన ప్రత్యర్థుల్ని వెంటాడి వేటాడి వేధిస్తున్న వైనం, తప్పుడు కేసులు బనాయిస్తున్న తీరు తెలియదా? కేవలం నిందగా, రుజువుకాని నేరంగా, ఒక ఆరోపణగా మాత్రమే ఉన్న దశలో బెయిల్ రాలేదన్న కారణంగా పదవులకు అనర్హులవుతారని చెప్పడం అంటే ప్రజల దృష్టిలో వారిని శాశ్వతంగా నేరం చేసిన వారుగా ముద్ర వేయటమే అవుతుంది. నేరం చేశారో లేదో తేలకుండా, శిక్షేమీ పడకుండా... విచారణ ప్రక్రియ దానికదే శిక్షగా మారటం మన దేశంలో కళ్లముందు కనబడుతున్న సత్యం. ఈ విషయంలో సీబీఐ, ఈడీ సంస్థలు అనేకసార్లు న్యాయస్థానాలతో చీవాట్లు తింటున్న వైనం తెలియంది కాదు. అలాంటపుడు ఈ సవరణ ద్వారా రాజ్యాంగాన్నే ఆయుధంగా మార్చాలని చూడటం ఎవరి ప్రయోజనాల కోసం?ఈ బిల్లులు కొందరంటున్నట్టు త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్న ‘వోట్ చోరీ’ నినాదాన్ని వెనక్కినెట్టి ‘అవినీతి నిర్మూలన’ ఎజెండాను అగ్రభాగాన నిలబెట్టి తాము మాత్రమే సచ్ఛీలురమనీ, ప్రత్యర్థులంతా అవినీతిపరులనీ ముద్రేయటానికా? నిజమే కావొచ్చు. ఆ మాటెలావున్నా ఇది దేశ ఫెడరల్ వ్యవస్థ అమరికను తీవ్రంగా దెబ్బ తీస్తుంది. రాష్ట్రాల్లో ఎన్డీఏ యేతర పక్షాల ప్రభుత్వాలను ఎన్నికల ముందు పడగొట్టడానికి ఈ చట్టాలను ఎడాపెడా దుర్వినియోగం చేసే వీలుంది. న్యాయసమీక్షకు అవకాశం ఉందనేది అర్థరహిత తర్కం. పెండింగ్ కేసులతో సతమతమవుతున్న న్యాయస్థానాల్లో కేసుల విచారణ పూర్తికావటానికి ఎంత సమయం పడుతున్నదో అందరికీ తెలుసు. సారాంశంలో నేరం రుజువయ్యేవరకూ ప్రతి ఒక్కరినీ నిర్దోషిగా పరిగణించాలన్న న్యాయశాస్త్ర సిద్ధాంతానికి ఇది తూట్లు పొడుస్తోంది.అవినీతి ప్రక్షాళనకు తొలి అడుగు వేయదల్చుకుంటే ముందు సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తినీయాలి. ఆ సంస్థల విశ్వసనీయతను పెంచాలి. అందుకోసం ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేమిటి? యూపీఏ హయాంలో సీబీఐకి ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అనే ముద్రపడింది. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే ‘పంజరంలో చిలుక’గా సంస్థను అభివర్ణించింది. గత పదకొండేళ్ల పాలనలో ఈ అపప్రథను తొలగించటానికి తీసుకున్న చర్యలేమిటో ఎన్డీఏ చెప్పగలదా? మొన్న మే నెలలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్పై ఈడీ దాడి చేసిన కేసులో ఆ సంస్థ అన్ని హద్దుల్నీ ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కటువుగా వ్యాఖ్యానించారు. నాలుగు నెలల క్రితం కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో వెల్లడించిన గణాంకాలు దిగ్భ్రాంతిపరుస్తాయి. గత పదేళ్లలో ఈడీ 193 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయగా, వారిలో కేవలం ఇద్దరికి శిక్ష పడింది. ఆప్ సర్కారులో మంత్రిగా ఉండి అరెస్టయిన సత్యేంద్ర జైన్పై సీబీఐ నాలుగేళ్లు దర్యాప్తు జరిపి చివరకు అంతా సవ్యంగానే ఉన్నట్టు తేల్చి కేసును మూసేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపింది. కానీ ఈలోగా ఆయన ఏడాదిన్నరపాటు జైల్లో మగ్గాల్సి వచ్చింది. అవినీతిని వ్యతిరేకించటమూ, ఈ బిల్లుల్ని సమర్థించటమూ ఒకటి కాదు. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ లేకుండా ఈ బిల్లులు తీసుకురావటం గమనిస్తే ఇది కేవలం విపక్షాలను అవినీతిపరులుగా ముద్రేయటానికే అని అర్థమవుతుంది. పాలకులెవరైనా దుర్వినియోగానికి విస్తృతంగా అవకాశమున్న ఈ బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ సంఘానికి (జేపీసీకి) పంపటం కాదు... పూర్తిగా వెనక్కి తీసుకోవాలి. -
మళ్లీ చివురించిన చెలిమి
ఏ దేశానికైనా ప్రథమ ప్రాధాన్యం స్వీయ ప్రయోజనాలు. ఆ తర్వాతే మిగిలినవన్నీ. గాల్వాన్ ఘర్షణల తర్వాత గత అయిదేళ్లుగా భారత్, చైనాల మధ్య ఏర్పడిన వివాదాలు అనేకానేక చర్చల పరంపర తర్వాత కూడా అసంపూర్ణంగానే ఉండిపోయిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మన దేశంలో రెండురోజులు పర్యటించటం, ఇరు దేశాల మధ్యా ఏదో మేరకు సదవగాహన కుదరటం హర్షించదగ్గ పరిణామం. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అంతకు ముందు విదేశాంగ మంత్రి జైశంకర్తో చర్చలు జరిపారు. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు ఉంటాయి. ఒకటి రెండు పర్యటనలతోనో, రెండు మూడు దఫాల చర్చల్లోనో అవి పరిష్కారం కావాలంటే సాధ్యం కాకపోవచ్చు. అందుకు ఎంతో ఓరిమి, తమ వైఖరిపై అవతలి పక్షాన్ని ఒప్పించే నేర్పు అవసరం. దీర్ఘకాలం ఆ వివాదాలను కొనసాగనిస్తే మూడో దేశం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిరుడు అక్టోబర్లో రష్యాలోని కజాన్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అప్పటికి నాలుగేళ్ల తర్వాత తొలిసారి కలుసుకున్నారు. ఇరు దేశాల సంబంధాలనూ సాధారణ స్థితికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మొన్న జూన్లో కైలాస– మానససరోవర్ యాత్రకు భక్తులను అనుమతించేందుకు చైనా అంగీకరించింది. భారత్ సందర్శించే చైనా యాత్రికులకు మన దేశం పర్యాటక వీసాలు పునరుద్ధరించింది. ఈనెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో వాంగ్ యీ వచ్చారు. ఆ సదస్సుకు మోదీ హాజరుకావాలంటే సుహృద్భావ సంబంధాలు అవసరమని కూడా చైనా భావించింది. ప్రధాని ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరైతే ఆయన ఏడేళ్ల అనంతరం చైనా సందర్శించి నట్టవుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్యా జరిగిన ఘర్షణల తర్వాత సైనికాధికారుల స్థాయిలో చాలా దఫాలు చర్చలు సాగాయి. అయినా సరిహద్దుల్లో ఏప్రిల్ 2020కి ముందున్న పరిస్థితులు ఏర్పడలేదు. ఆఖరికి కజాన్లో మోదీ–షీల మధ్య సమావేశం తర్వాత కూడా గత పది నెలల్లో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. వాంగ్ యీ పర్యటన సందర్భంగా ఇరుదేశాలూ 12 అంశాల్లో కీలక నిర్ణయాలు తీసు కున్నాయి. రెండు దేశాల మధ్యా విమాన రాకపోకలను పునరుద్ధరించుకోవాలనీ, వివాదాస్పద సరిహద్దు సమస్యపై చర్చించేందుకు మూడు వేర్వేరు బృందాలు ఏర్పాటు చేసుకోవాలనీ తీర్మా నించాయి. సరిహద్దు విషయంలో ఇప్పుడు పనిచేస్తున్న బృందంతో పాటు తూర్పు, మధ్య సెక్టార్లకు సంబంధించి వేర్వేరు బృందాలు ఏర్పడితే త్వరితగతిన పరిష్కారం సాధించవచ్చని ఇరు దేశాల విదేశాంగమంత్రులూ భావించారు. అలాగే వాణిజ్యాన్ని పెంచుకోవటానికి సరి హద్దుల్ని మళ్లీ తెరవాలని నిర్ణయించారు. లిపూలేఖ్ పాస్, షిప్కి లా పాస్, నాథూ లా పాస్ల గుండా ఈ వాణిజ్యం సాగుతుంది. అలాగే పరస్పరం పెట్టుబడుల ప్రవాహానికి కూడా అనుమ తిస్తారు. అన్నిటికన్నా ముఖ్యం – అరుదైన ఖనిజాల ఎగుమతులకు చైనా అంగీకరించటం. స్మార్ట్ ఫోన్ల నుంచి ఫైటర్జెట్ల వరకూ, విండ్ టర్బైన్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకూ ఉత్పాదన ప్రక్రియలో ఈ అరుదైన ఖనిజాలు అత్యవసరం. ఇవి ప్రపంచంలో 99 శాతం చైనాలోనే లభ్యమవుతాయి. వీటితోపాటు ఎరువుల ఎగుమతులపై లోగడ విధించిన నిషేధాన్ని తొలగించ టానికి చైనా అంగీకరించటం ఈ పర్యటనలో ప్రధానాంశం. మన రైతులు ఎక్కువగా మొగ్గు చూపే డీఏపీ ఎరువులు చైనాలో ఉత్పత్తవుతాయి. రెండుచోట్లా ప్రవహించే నదీజలాలపై డేటాను ఇచ్చిపుచ్చుకోవటానికి భారత్, చైనా అంగీకరించాయి. త్రీగోర్జెస్ డ్యామ్ను మించిన స్థాయిలో బ్రహ్మపుత్ర నదిపై 16,000 కోట్ల డాలర్ల వ్యయంతో భారీ ఆనకట్ట నిర్మించాలని చైనా తలపెట్టిన నేపథ్యంలో నదీ జలాల డేటాపై అంగీకారం కుదరటం హర్షించదగ్గది.చర్చల తర్వాత తాజా ప్రపంచ పరిణామాలపై వాంగ్ యీ విడుదల చేసిన ప్రకటనలో పరోక్షంగా అమెరికా వ్యవహారశైలిపై విమర్శలుండటం గమనార్హం. స్వేచ్ఛా వాణిజ్యాన్నీ, అంతర్జాతీయ సంబంధాలనూ భగ్నం చేసేలా కొందరు ఏకపక్షంగా బెదిరింపులకు దిగుతున్న పర్యవ సానంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన ప్రస్తావించారు. ఆధిపత్య ధోరణులు ఏ రూపంలో ఉన్నా గట్టిగా ప్రతిఘటించటం చాలా అవసరం. ఏదేమైనా ఇరుదేశాలూ సాధ్యమైనంత త్వరగా సరిహద్దు సమస్యకు పరిష్కారం అన్వేషించగలిగితే, ఉగ్రవాదం అంతానికి చేతులు కలిపితే... ప్రధాని మోదీ చెప్పినట్టు అది రెండు దేశాల మధ్య మాత్రమే కాదు, ఆసియా ఖండంలోనే కాదు... యావత్ ప్రపంచశాంతికీ, సౌభాగ్యానికీ దోహదపడుతుంది. సాధ్యమైనంత త్వరగా అది సాకారం కావాలని ఆశించాలి. -
సంధి సాధ్యమేనా?!
పరస్పరం కలహించుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ల మధ్య సంధి కుదర్చటానికీ, సామరస్యం సాధించటానికీ అలాస్కా శిఖరాగ్ర సమావేశానికి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చివరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అనధికార అధికార ప్రతినిధిగా మారి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. కాల్పుల విరమణకు రష్యా అంగీకరించకపోతే కఠినాతికఠినంగా వ్యవహరిస్తామని అలాస్కా సమావేశానికి ముందు హెచ్చరించిన ఆయన... కాల్పుల విరమణ వల్ల ప్రయోజనం లేదని, శాంతి ఒప్పందం కోసం చర్చలు జరగాలని చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం వైట్హౌస్లో తనను కలిసినప్పుడు సైతం ఇలాంటి సలహాయే ఇచ్చారు. దీన్ని ఏదో మేరకు సరిదిద్ది, ఉక్రెయిన్కు కనీస భద్రత గ్యారెంటీనైనా సాధించాలన్న ధ్యేయంతో ఆరుగురు యూరొప్ దేశాల నేతలు ట్రంప్తో భేటీ అయ్యారు. అమెరికాతో పాటు రష్యా, ఉక్రెయిన్లు పాల్గొనే త్రైపాక్షిక చర్చలకు సుముఖంగా ఉన్నామని ట్రంప్ చెప్పటం ఉన్నంతలో ఊరటనిచ్చే అంశం. కానీ ట్రంప్ దానికైనా కట్టుబడతారా లేదా... పుతిన్ను ఒప్పించగలరా లేదా అన్నది చెప్పలేం. జెలెన్స్కీకి మొన్న ఫిబ్రవరిలో వైట్హౌస్లో ఎదురైన చేదు అనుభవాలను నివారించి, ఆయన వెనక యూరప్ దేశాలన్నీ ఉన్నాయని చెప్పటానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడెరిక్ షుల్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తదితరులు కలిశారు. కానీ అందువల్ల ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్నార్థకం. ఉక్రెయిన్కు ‘నాటో తరహా’ భద్రత కల్పించటానికి ట్రంప్ అనుకూలమే గానీ అదంతా యూరప్ దేశాలే చూసుకోవాలట. తమ వంతుగా గగనతల రక్షణ విషయంలో సాయంగా నిలుస్తారట! అసలు యూరప్ దేశాలకు ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ఏం చేస్తారనే ఆదుర్దా కన్నా ఆయన నాటో పక్షాన ఉంటారా ఉండరా అనే బెంగ ఎక్కువైంది. జెలెన్స్కీతో మళ్లీ ఆయన లడాయికి దిగితే అటుతర్వాత తాము సైతం మాట్లాడే స్థితి ఉండకపోవచ్చన్న భయంతోనే యూరప్ అధినేతలు వైట్హౌస్కు వెళ్ళినట్టు కనిపిస్తోంది. కోల్పోయిన భూభాగాల గురించీ, నాటో సభ్యత్వం గురించీ మరిచిపోవాలని తొలుత తనను కలిసిన జెలెన్స్కీకి చెప్పటంతో పాటు యూరప్ దేశాధినేతల ముందు కూడా ట్రంప్ ఆ మాటే అనటం గమనించదగ్గది. ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన నాటి నుంచీ పుతిన్ చెప్పిన మాటల్నే ట్రంప్ ఇప్పుడు వల్లిస్తున్నారు. చాలా అంశాల్లో పుతిన్కూ, తనకూ ఏకాభిప్రాయం కుదిరిందని ఆ శిఖరాగ్ర సమావేశం అనంతరం ఆయన ఇప్పటికే ప్రకటించారు. పుతిన్ దాదాపు పన్నెండేళ్ల క్రితం ఆక్రమించిన క్రిమియాలో పలు పట్టణాలు, నదులూ, పర్వతశ్రేణులూ ఉన్నాయి. విలువైన పంటభూములున్నాయి. ఇవిగాక మూడున్నరేళ్లకు పైగా సాగుతున్న దురాక్రమణ యుద్ధంలో ఆక్రమించుకున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలున్నాయి. వీటిని వదులుకోవటమంటే జెలెన్స్కీకి ఆత్మహత్యా సదృశం. అయినా తమ కోసం ట్రంప్ ఎంతో చేస్తున్నారని ప్రశంసించి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సి వచ్చింది. జెలెన్స్కీకి అంతకన్నా గత్యంతరం లేదు. ఉక్రెయిన్కి ప్రస్తుతం అందుతున్న సాయంలో 47 శాతం వాటా అమెరికాదే. జర్మనీ 9, బ్రిటన్ 8, జపాన్ 6 శాతాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కెనడా, నెదర్లాండ్స్, స్వీడన్, ఫ్రాన్స్ వంటివి ఒకటి, రెండు శాతాలకు మించి ఇవ్వడం లేదు. అందుకే జెలెన్స్కీ నోరెత్తలేకపోతున్నారు.అమెరికా గత పాలకుల ప్రాపకంతో ఉక్రెయిన్ను రెచ్చగొట్టి, రష్యాతో గిల్లికజ్జాలకు దిగేలా చేసిన యూరప్ దేశాలకు ఇప్పుడు ఏం చేయాలో పాలుబోని దుఃస్థితి. నెలక్రితం ట్రంప్తో మాట్లాడాక అంతా సామరస్యంగా పరిష్కారమైందని, ఉక్రెయిన్ విషయంలో తమను సంప్రదించకుండా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోబోరని యూరప్ దేశాధినేతలు నమ్మారు. అలాస్కా శిఖరాగ్రానికి వారం రోజుల ముందు కూడా వారంతా ట్రంప్ను కలిశారు. ఆ భేటీకి జెలెన్స్కీని కూడా తీసుకెళ్లారు. ముందు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాలనీ, ఆ తర్వాతే ద్వైపాక్షికమో, త్రైపాక్షికమో చర్చలుండాలనీ ఆ భేటీలో అందరూ అభిప్రాయపడ్డారు. తాజాగా ట్రంప్ త్రైపాక్షిక చర్చల గురించి మాట్లాడుతున్నా పుతిన్ అందుకు సుముఖంగా ఉంటారా అన్న సంశయం అందరినీ పీడిస్తోంది. ఆ మాటెలా ఉన్నా అలాస్కా శిఖరాగ్రం భారత్కు ఎంతో కొంత మేలు చేసిందని చెప్పాలి. రష్యాపై ఆగ్రహంతో మనపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ ఆ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు చెబుతున్న మాటకు కట్టుబడి సాధ్యమైనంత త్వరలో త్రైపాక్షిక చర్చలకు ట్రంప్ చొరవ తీసుకుంటే... పుతిన్ను ఒప్పిస్తే అది శాంతికి దోహదపడుతుంది. -
జీఎస్టీ కొత్త రూపు
ఎనిమిదేళ్ల క్రితం అమల్లోకొచ్చిన సరుకులు, సేవల పన్ను (జీఎస్టీ) ఎట్టకేలకు వచ్చే దీపావళి నాటికి కొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. మొన్న శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుపై నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ చల్లని కబురందించారు. 2016లో లోక్సభ 122వ రాజ్యాంగ సవరణను ఆమోదించి జీఎస్టీకి మార్గం సుగమం చేయటానికి ముందు పదిహేనేళ్లపాటు ఈ ఏకీకృత పన్నుల వ్యవస్థపై చర్చోపచర్చలు జరిగాయి. రాష్ట్రాలను ఒప్పించేందుకు అంతకు ముందున్న ఎన్డీయే సర్కారు, తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఎడతెగని ప్రయత్నాలు చేశాయి. కానీ ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు 2017లో అమల్లోకి వచ్చినప్పుడు సైతం విపక్ష రాష్ట్రాలు రుసరుసలుపోయాయి. ఇంత పెద్ద సంస్కరణలో తన పాత్ర ఘనం అని చెప్పుకోవటానికైనా పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే ఉత్సవానికి వెళ్లాలని కాంగ్రెస్ అనుకుంది. కానీ చివరకు ముఖం చాటేసింది. జీఎస్టీ విషయంలో వివిధ వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదని, చిన్న వ్యాపారులూ వర్త కులూ దీనివల్ల అగచాట్లు పడతారని కారణాలుగా చూపింది. వామపక్షాలు సరేసరి. నిజాలు నిష్టూరంగానే ఉంటాయి. జీఎస్టీ రాకతో కేంద్రం విధిస్తున్న ఏడెనిమిది రకాల పన్నులు రద్దుకావటంతో పాటు రాష్ట్రాలు విధించే రకరకాల పన్నులకు స్వస్తి చెబుతామని, పన్ను వసూళ్లను హేతుబద్ధీకరిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇందువల్ల ఆదాయం కోల్పోతామన్న రాష్ట్రాల ఆందోళనను ఉపశమింపజేసేందుకు అయిదేళ్లపాటు ఆ లోటును పూడుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో సమస్యలెలా వస్తాయో తెలియాలంటే ఇటీవల కర్ణాటకలో చిన్న వ్యాపారులు పడిన అగచాట్లను ప్రస్తావించుకోవాలి. వివిధ రకరకాల యాప్ల ద్వారా వినియోగ దారుల నుంచి చెల్లింపులు స్వీకరిస్తున్న తోపుడు బండి వ్యాపారులనూ, వీధుల్లో చిన్నా చితకా దుకాణాలు నడుపుకునేవారినీ లక్ష్యంగా చేసుకుని జీఎస్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ అక్కడి వాణిజ్య పన్నుల విభాగం 13,000 నోటీసులు జారీచేసింది. వీటికి ఏం జవాబివ్వాలో, ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలియక, అందుకయ్యే ఖర్చు భరించలేక చాలామంది నగదు చెల్లించాలని వినియోగదారుల్ని కోరటం మొదలుపెట్టారు. వాజపేయి హయాంలో నాటి ఆర్థిక మంత్రి జశ్వంత్సింగ్కు సలహాదారుగా వ్యవహరించిన విజయ్ కేల్కర్ ఈ జీఎస్టీ ఆలోచనకు ఆద్యుడు. ఆయన ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ పలు దేశాల పన్ను వ్యవస్థలను అధ్యయనం చేసి దీన్ని రూపొందించింది. మధ్యతరగతి, అట్టడుగువర్గాలవారు పన్నుపోటు నుంచి ఉపశమనం పొందుతారని చెప్పింది. కానీ జరిగిందంతా వేరు. పరోక్ష పన్నులు చెల్లించేవారి నుంచి మరింత పిండుకోవడానికే జీఎస్టీ తీసుకొస్తున్నారని, ప్రత్యక్ష పన్నుల జోలికి వెళ్లాలన్న ఆలోచనే కేంద్రం చేయటం లేదని విమర్శలొచ్చాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.7 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లుండగా ఇప్పుడది దాదాపు రెట్టింప యింది. సగటున ప్రతి నెలా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ సాధారణ వర్గాల అవస్థలు అంతకంతా పెరిగాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, ఇంకా ఆ దిగువనుండేవారూ జీఎస్టీ కింద దాఖలు చేయాల్సిన రకరకాల పత్రాలు, వివాదాలు, ప్రభుత్వం నుంచి వెనక్కు రావలసిన సొమ్ము కోసం పడి గాపులు... వీటన్నిటితో విసిగిపోయారు. ఈ సంక్లిష్ట వ్యవస్థను సంతృప్తిపరిచే మార్గం దొరక్క అల్లాడిపోయారు. ఈ ప్రత్యక్ష పన్నుల వ్యవస్థ ద్వారా వసూళ్లు భారీగా పెరుగుతుంటే, ప్రత్యక్ష పన్నులు చెల్లించే కార్పొరేట్ల నుంచి రావాల్సిన ఆదాయం పడిపోవటం ఒక వైచిత్రి. 2023 –24లో వివిధ రకాల ప్రోత్సాహాల కింద దాదాపు లక్ష కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇచ్చామని ఇటీవల పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.జీఎస్టీ సరికొత్త రూపంలో రాబోవటం అన్ని వర్గాలకూ శుభవార్త. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతాలుగా ఉన్న నాలుగు స్లాబ్ల స్థానంలో ఇకపై రెండే... 5, 18 శాతాలు ఉంటాయని కేంద్రం చెబుతోంది. లగ్జరీ కార్ల వంటి విలాస వస్తువుల పైనా... పొగాకు, పాన్మసాలా, ఆన్లైన్ గేమింగ్ వంటి హానికారకాల పైనా మాత్రం 40 శాతం వరకూ ఉంటుంది. జీఎస్టీ వసూళ్లు స్థిరత్వంలో పడటం వల్ల సాధారణ ప్రజానీకాన్ని పన్నుపోటు నుంచి తప్పించాలని భావించినట్టు కనబడుతున్నా, ఇంతకాలమూ ఈ పరిధిలో లేని మద్యం, ఇంధనం వంటివాటిని చేర్చబోతున్నారని అంటున్నారు. సహజంగానే దీనిపై రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ప్రపంచమంతటా ఒకరకమైన మాంద్యం అలుముకున్న వర్తమానంలో జీఎస్టీ సంస్కరణలు మన ఆర్థికవ్యవస్థకు ఊతాన్నివ్వగలవనీ, ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలూ చాలావరకూ తగ్గుతాయనీ ఆశించాలి. -
కుక్క కథ
కుక్కల మీద మనిషికి ఎప్పుడూ సదభిప్రాయం ఉన్నట్టు లేదు. ‘కుక్క’ అనే మాటనే తిట్టుగా వాడగలడు. కుక్క బుద్ధి అని నిందించగలడు. కుక్కల కొట్లాట అని దూషించగలడు. కుక్క బతుకు అని బాధపడగలడు. కుక్క మూతి పిందెలు అని తూలనాడగలడు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని దెప్పిపొడవగలడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని వెక్కిరించగలడు. ‘కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి’ అని పాడగలడు. ఆఖరికి కుక్క చావును తనకు ఇష్టంలేని మనిషి జీవితయాత్రకు భరత వాక్యంగా జోడించగలడు.కుక్కలను వాటిమానాన వాటిని అడవిలో మననీయకుండా ఇంటిదాకా తెచ్చుకున్నది మనిషే. సుమారు 15,000 సంవత్సరాల క్రితమే మనిషి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. మానవులు తొట్టతొలిగా మచ్చిక చేసుకున్న జంతువు కుక్కేనంటారు. కాదు, గొర్రె అని మరో వాదన. ఏమైనా మనిషితో తొట్టతొలిగా స్నేహం చేసిన జంతువుల్లో కుక్క అగ్రభాగాన ఉందన్నది సత్యం. అప్పటినుంచీ అది మనిషికి వేటలో సాయపడింది. పంటలను కాపు కాసింది. మంచులో స్లెడ్జ్ బళ్లను లాగింది. దొంగలు, హంతకుల జాడను పసిగట్టింది. బాంబులను గుర్తించింది. ఒంటరి జీవులకు తోడుగా నిలిచింది. ‘దేవదాసు’లకు సాంత్వననిచ్చింది. తెగించి యజమానుల ప్రాణాలను కాపాడింది. మనిషి నాగరికతా ప్రస్థానంలో తనకు తెలియకుండానే విశ్వసనీయమైన పాత్రను పోషించింది. దాని తోక మాత్రమే వంకర కావొచ్చుగానీ దాని పనికి ఏ వంకా లేదు. అంతెందుకు! 1957లో రష్యన్లు ‘స్పుత్నిక్’లో తొట్టతొలిగా ఒక జీవిని అంతరిక్షంలోకి పంపాలనుకున్నప్పుడు వాళ్లు ఎంచుకున్నది కూడా ఒక కుక్కనే. అది మాస్కో వీధుల్లో తిరుగాడిన మూడేళ్ల ఆడ ఊరకుక్క. పేరు లైకా. అది ప్రాణాలతో తిరిగిరాదని దానికి తప్ప శాస్త్రవేత్తలందరికీ తెలుసు!జపాన్ లో హచికో కుక్కది మరో కథ. తన యజమాని టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవాడు. విధులు ముగించుకుని ఆయన సాయంత్రం షిబూయా రైల్వే స్టేషన్ లో రైలు దిగేవాడు. అప్పటికి రెండేళ్ల వయసున్న హచికో అతడి కోసం అక్కడ వేచివుండేది. ఒకరోజు ఉన్నట్టుండి ఆ ప్రొఫెసర్ విధుల్లోనే బ్రెయిన్ స్ట్రోక్తో కుప్పకూలి చనిపోయాడు. ఇదేమీ తెలియని హచికో రోజులాగే యజమాని కోసం స్టేషన్ కు వచ్చింది. తెల్లారీ వచ్చింది. మరునాడూ వచ్చింది. క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికిగానీ స్థానికులు దాన్ని గుర్తించలేదు. తనని ప్రేమించిన యజమాని కోసం, తాను ప్రేమించిన యజమాని కోసం 1925– 1935 కాలంలో అది చనిపోయేదాకా సుమారు పదేళ్లపాటు ఆ స్టేషన్ లో ఎదురుచూసింది. జపాన్ లో ఇప్పుడు హచికో ఒక సాంస్కృతిక చిహ్నం. కుక్క అంటే విశ్వాసం అనే పేరు దానికి ఊరకే రాలేదు. వేల ఏళ్లుగా లక్షలాది కుక్కలు సమష్టిగా సముపార్జించుకున్న ఘనత అది.ప్రపంచంలో సుమారు 360 రకాల కుక్కలున్నాయి. వీటన్నింటినీ తిరిగి ఇంటికుక్క, ఊరకుక్క అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ రెండింటికీ మధ్య ఉన్నది స్వల్ప భేదమే. ఇది జాతిపరమైనది కాదు. పెంచుకుంటే ఇంటి కుక్క. ఎవరికీ పట్టనిది ఊర కుక్క. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి కరిస్తే వార్త’ అని జర్నలిజంలో ఒక తొలి పాఠం చెబుతుంటారు. కానీ మనుషులను కుక్క కరిచినా వార్త అవుతుండటం కుక్క కాట్ల తీవ్రతను తెలియజేస్తోంది. ఇది అత్యంత ఆందోళనకరంగా పరిణమించడం వల్లే ఊరకుక్కలను ఊళ్లో ఉంచాలా వద్దా అనే చర్చ దేశమంతా నడుస్తోంది; వాటికి అనుగుణంగా, వ్యతిరేకంగా ఎన్నో వాదనలు వినబడుతున్నాయి.జాక్ లండన్ రాసిన ‘కాల్ ఆఫ్ ద వైల్డ్’ నవలలోని బక్ కుక్క ‘దుడ్డుకర్ర చేతగలవాడిది పైచేయి’ అని ఇట్టే అర్థం చేసుకుంటుంది. ఆ పాఠాన్ని జీవితంలో ఎన్నడూ మరవదు. మనిషి సాధారణంగా ద్వంద్వ జీవి. దుడ్డుకర్రతో కుక్కలకు ‘ఆటవిక శాసనాన్ని’ పరిచయం చేయగలడు; లైకా అంతరిక్షంలో విలవిల్లాడి చచ్చిపోయిందంటే జీర్ణం చేసుకోలేక దాన్ని గ్రహాంతరవాసులు కాపాడినట్టు ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృజించుకోగలడు (ఉదా: జూలియన్ మే రాసిన ‘ఇంటర్వెన్షన్ ’). ‘పాతాళ్ లోక్’ వెబ్సిరీస్లో హథోడా త్యాగీకి తన గురువు ఒక మాట చెబుతాడు: ఒక మనిషి మంచివాడా కాదా అన్నది తెలుసుకోవడానికి అతడు కుక్కలతో ఎలా ఉంటున్నాడో చూడమంటాడు. దేశంలో సుమారు ఆరు కోట్ల ఊరకుక్కలున్నాయట. మనం వద్దనగానే అవి మాయం కావు. ఈ భూమ్మీది నుంచి ఎక్కడికీ పోవు. వాటిని మననిస్తూ, మనం ఇబ్బందిపడకుండా ఏ శాస్త్రీయ మార్గాలున్నాయో అన్వేషించడమే ఉత్తమ మార్గం. ప్రతి కుక్కకూ ఒక రోజంటూ ఉండాలిగా! -
అధర్మం నాలుగు పాదాలపై...
శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి. ‘పరిత్రాణాయ సాధూనామ్, వినాశాయ చదుష్కృతామ్, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’ అనే సందేశాన్ని మన జనజీవన స్రవంతితో సమ్మేళన పరిచిన భగవానుడాయన. సన్మార్గులను రక్షించడానికీ, దుర్మార్గులను శిక్షించడానికీ ప్రతి యుగంలోనూ నేను అవత రిస్తూనే ఉంటానని ఆయన చేసిన గీతోపదేశాన్ని భారతీయ సమాజం ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉన్నది. ఇక జన్మాష్టమి సందర్భమైతే సరేసరి. పామరుల నుంచి పండితుల వరకు, సామాన్యుల నుంచి సర్కార్ పెద్దల వరకూ ఆ మహామహో పాధ్యాయుని సంస్మరణ అవిస్మరణీయమైన ఆచారంగా మిగిలి పోయింది.ఈ కృష్ణాష్టమి సందర్భంగా రాజకీయ నాయకులు ఇచ్చిన సందేశాల్లో ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ చేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఎక్కువగా ఆకర్షించింది. ‘అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్ళినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు. నిన్నమొన్నటి రాజకీయ పరిణామాలు ఈ ట్వీట్కు ప్రేరణ కావచ్చు. ఎన్నికలొక తతంగంగా – ప్రజాస్వామ్యం ఒక ప్రహసనంగా మారిన తీరు ప్రభావితం చేసి ఉండవచ్చు. కిందటేడాది జరిగిన సాధారణ ఎన్నికలపై పుంఖా నుపుంఖాలుగా ఆరోపణలు వస్తున్న విషయం విదితమే. ఆ ఆరోపణలకు తగిన ఆధారాలు సమకూరుతున్న తీరు కూడా తెలిసిన సంగతే.రెండు రోజుల కిందటే జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల తతంగం మరో రకమైన వంచన. నడిబజార్లలో ప్రజా స్వామ్యం బట్టలూడదీసి వివస్త్రగా నిలబెట్టిన దుశ్శాసన క్రీడగా దాన్ని వర్ణించవచ్చు. ఈ వికృత కేళికి బాధ్యులెవరంటే ఏమని చెబుతాం? కర్ణుడి చావుకు కారణాలేమిటో అర్జునుడికి కృష్ణపర మాత్మ తెలియజెప్పుతాడు. ‘నీ చేతను, నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధర చేత భార్గవు చేత నరయంగ కర్ణుడీల్గె నార్వురి చేతన్’ అని వివరిస్తాడు. ‘కర్ణుడు నీవల్లా నావల్ల మాత్రమే చనిపోలేదు. ఆయన చావుకు కుంతీదేవి,ఇంద్రుడు, భూదేవి, పరశురాముడు కూడా కారకులే’నని చెబుతాడు.అదేవిధంగా పులివెందుల, ఒంటిమిట్టల్లో కూడా రక్షకు లుగా ఉండవలసినవారే ప్రజాస్వామ్య హత్యాకాండకు ఒడి గట్టారు. ‘సత్యం వద’ (సత్యాన్ని మాట్లాడు), ‘ధర్మం చర’ (ధర్మాన్ని అనుసరించు) అని ఉపనిషత్తులు చేస్తున్న బోధనను మన సనాతన ధర్మ ప్రభుత్వం ‘సత్యం వధ’ (సత్యాన్ని చంపు), ‘ధర్మం చెర’ (ధర్మాన్ని నిర్బంధించు)గా అర్థం చేసుకున్నట్టుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ సత్యాన్ని వధించైనా ఓ గెలుపును కైవసం చేసుకోవాలని సంకల్పించింది. రాజ్యాంగ ధర్మాన్ని నిర్వర్తించవలసిన ఎన్నికల వ్యవస్థ ఈ సంకల్పానికి సహకరించింది. నిష్పక్షపాతంగా వ్యవహరించవల సిన అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ఈ సంకల్పానికి సాగిలబడింది. సత్యాన్ని మాట్లాడవలసిన నాలుగో స్తంభం (మీడియా) దాన్ని చంపేయడానికి తోడ్పాటు నిచ్చింది.రాజ్యాంగ ధర్మాన్ని నిలబెట్టవలసిన ప్రభుత్వం, ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం, మీడియా సమష్టిగా అధర్మ పతాకాన్ని ఎగరవేశాయి. అధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించాయి. ఆ నడక తీరు ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై జడ్పీటీసీ స్థానాలు ప్రాతినిధ్యం లేకుండా ఖాళీగా ఉన్నాయి. ఇందులో చాలా స్థానాలు పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు ఖాళీ అవకముందు నుంచే అలా ఉన్నాయి. అధికారం బాగా తలకెక్కిన వారికి చిత్రాతిచిత్రమైన కోర్కెలు కలుగుతుంటాయని చాలా కథల్లో చదువుకున్నాము. అటువంటి ఒక కోరిక ముఖ్యమంత్రికో, ఆయన కుమారునికో కలిగిందని సమాచారం. జగన్మోహన్రెడ్డికి బలమైన కోట వంటి పులివెందులలో ఆయన్నొకసారి ఓడించాలనేది ఆశ. ఆ కోర్కె తీరేలోగా పులివెందుల నియోజకవర్గం నుంచి ఓ తోకనో, ఒక ఈకనో గెలుచుకొచ్చి అదేం దుర్భేద్యమైన దుర్గం కాదని చాటేందుకు ఉబలాటపడ్డారు. అలా చేస్తే వైసీపీ నైతిక ధృతి దెబ్బతిని స్థానిక ఎన్నికల్లో తమకు ‘జీవన్టోన్’లా ఉపయోగ పడుతుందని ఆశించారు.పులివెందుల జడ్పీటీసీతోపాటు పక్కనే ఉన్న రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట స్థానానికి కూడా ఉపఎన్నికలు జరిపి ఏదోవిధంగా రెండూ గెలవాలని ఆలోచన చేశారు. అలా జరిగితే కడప జిల్లాలో జగన్ బలం కోల్పోయాడని ప్రచారం చేసుకోవాలనేది లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం కలిసివచ్చే కరి వేపాకుల్ని ఇంతకుముందే సేకరించి పెట్టుకున్నారు. ఈ రెండింటికి మాత్రమే ఎన్నికలు జరిపితే మిగిలిన 18 జడ్పీటీసీల సంగతి? ఇన్నిచోట్ల ఒకేసారి దుశ్శాసన ప్రయోగం మంచిది కాదు. వికటించినా వికటించవచ్చు – అని ఈ రెంటికి మాత్రమే ఎన్నిక జరిగే విధంగా జయరామిరెడ్డి అనే దేశం కార్యకర్తను కోర్టు మెట్లు ఎక్కించారు. కడప జడ్పీ ఛైర్మన్ ఎమ్మెల్యేగా గెలిచి నందువల్ల అప్పటికే ఆ పదవి ఖాళీగా ఉన్నది. రెండు జడ్పీ టీసీలు ఖాళీగా ఉండగా కొత్త ఛైర్మన్ ఎన్నిక కుదరదని, కనుక ఈ రెండు స్థానాలకు ముందుగా ఎన్నికలు నిర్వహించేవిధంగా ఆదేశించాలని జయరామిరెడ్డి న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. న్యాయస్థానం ఓకే చేసింది.రాజ్యాంగంలోని 243వ అధికరణాన్ని అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సంపూర్ణమైన అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానిదే! రెండు జడ్పీటీసీల ఎన్నికలకు కోర్టు ఆదేశించినప్పుడు ఖాళీగా ఉన్న మిగిలిన స్థానాలకు కూడా ఎన్ని కల నిర్వహణకు ఈసీ ఉపక్రమించి ఉండవచ్చు. అది దాని ధర్మం కూడా! కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మతం కాని పనిని చేయడానికి ఈసీ సాహసించలేదు. ఆరు మాసాలకు మించి ఖాళీగా ఉండకూడదన్న స్ఫూర్తిని కూడా విస్మరించింది. ఇక ఎన్ని కలు జరిగిన రెండు స్థానాలపై చాలాకాలం ముందునుంచే టీడీపీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం మొదలు పెట్టింది. వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఎన్నికలు సరిగ్గా వారం రోజుల ముందటే పులివెందుల నియోజకవర్గానికే చెందిన వైసీపీ కార్యకర్త సైదాపురం సురేష్ రెడ్డిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ మరుసటిరోజే శాసనమండలి సభ్యుడైన రమేశ్ యాదవ్పైనా, వైసీపీ నాయ కుడు వేల్పుల రాముపైన దాడి జరిగింది. రామును హత్య చేయ డానికే చూశారని సమాచారం. వైసీపీ కార్యకర్తలూ, నేతలూ ఎన్నికలయ్యేంతవరకు ఇళ్ళను వదిలి వెళ్లకపోతే ఇటువంటి ఘటనలే జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. పాలక కూటమి దాడుల పట్ల పోలీసుల స్పందన మరీ అన్యాయం. ఒక జడ్పీటీసీ ఎన్నిక కోసం వందలాదిమంది పోలీసులతో ఒక డీఐజీ స్థాయి అధికారే మోహరించారు. దాడులపై ఫిర్యాదులు చేసిన వారితో ఆయన వెటకారంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. ‘పక్క ఊరికి వెళ్లి పత్తాపారం చేస్తే ఇలానే ఉంటుంద’ని ఆయన వ్యాఖ్యానించారు. తామే లేకపోతే అక్కడ తలలు తెగిపడేవనే మాటలు కూడా వైరల్ అయ్యాయి.ఈ తరహా కామెంట్ల వల్ల తమకు పోలీసు రక్షణ లభించ దనే అభిప్రాయం సహజంగానే వైసీపీ కార్యకర్తలకు ఏర్పడుతుంది. ఏడాది మాత్రమే గడువున్న ఒక చిన్న ఎన్నిక కోసం గ్రామాల ప్రశాంతత ఎందుకు భగ్నం కావాలన్న ఆలోచన కూడా ఉండవచ్చు. వైసీపీ ముఖ్య కార్యకర్తలంతా మండలం నుంచి బయటికి వెళ్లారు. యెల్లో మీడియా మాత్రం వైసీపీ వాళ్లు ఓటుకు ఐదు వేలు, పదివేలిచ్చి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనీ యథావిధిగా వెకిలి రాతలే రాసింది. తలలు తెగిపడే పరిస్థితులు ఉన్నాయని డీఐజీ స్థాయి అధికారి చెప్పినప్పుడు ఎన్నికల సంఘం స్పందించి ఉండాల్సింది. పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేసి ఉండవలసింది. కానీ అటువంటివేమీ జరగలేదు.నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందు బయటి ప్రాంతాల వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలి. మంత్రి సవిత నాయకత్వంలో ఒకటి, జమ్మలమడుగు ఎమ్మెల్యే దండ నాయకునిగా మరొకటి, కమలాపురం ఎమ్మెల్యే నేతృత్వంలో ఇంకోటి, బీటెక్ రవి అధీనంలో ఒకటి చొప్పున అక్కడే తిష్ఠవేసి ఉన్న నాలుగు బెటాలియన్లు మాత్రం ఈ నిబంధన పాటించ లేదు. పోలింగ్ రోజున ఉదయం నాలుగు గంటలకే ఈ బెటా లియన్లు మొత్తం 15 పోలింగ్ బూతుల్ని చుట్టుముట్టాయి. పోలింగ్ బూత్లకు ఈ బెటాలియన్లు ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగా నిలబడితే పోలీసులు ఇన్నర్ రింగ్రోడ్డు మాదిరిగా పోలింగ్ బూత్ ప్రాంగణాల్లో ఉండిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వచ్చిన వారికి తొలుత కూటమి బెటాలియన్లే ఎదురుపడ్డాయి.ఓటేసేందుకు వచ్చిన ఓటర్ల దగ్గర స్లిప్పులు లాక్కుని కూటమి సైన్యం వారిని వెనక్కి పంపించింది. ఒక్క వైసీపీ ఏజెంట్ను కూడా బూతుల్లోకి ఈ కిరాయి సైన్యం అనుమతించలేదు. ఫిర్యాదు చేయడానికి ఏ ఒక్క పోలీసూ కనబడలేదు. అంతకు ముందే నాలుగు గ్రామాల పోలింగ్ బూత్లను ఎత్తివేసి పక్క గ్రామాలలో ఏర్పాటు చేశారు. ఆ గ్రామాల మధ్య మాత్రం పోలీసు చెక్పోస్టులు ఏర్పాటయ్యాయి. కాళ్లు పట్టుకున్నా పోలీ సులు కనికరించలేదు. ఓట్లు వేసేందుకు వెళ్లనీయలేదు. ఈ వార్తలు, ఫోటోలు ఒక సెక్షన్ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే కనిపించాయి. కానీ ఎన్నికల సంఘం స్పందించ లేదు. పోలింగ్ బూత్లను మార్చడమనే నిర్ణయాన్ని కూడా పాలక కూటమి సూచన మేరకే ఈసీ తీసుకున్నదనే విషయం బహిరంగ రహస్యం.ఒంటిమిట్ట మండలంలోనూ ఇదే ఫార్ములాను అమలు చేశారు. కాకపోతే తొలుత పోలింగ్ బూతుల్లోకి వైసీపీ ఏజెంట్లు ప్రవేశించగలిగారు. ఓ గంటన్నర తర్వాత రాష్ట్ర మంత్రి నాయ కత్వంలో ఓ పటాలం బయల్దేరి బూతుల్లో ఉన్న ఏజెంట్లను బయటకు తరిమేశారు. సాక్షాత్తూ ఒక రాష్ట్ర మంత్రి అక్రమంగా బూత్లో చొరబడ్డా, ఏజెంట్లపై దౌర్జన్యం చేసినా ఎన్నికల సంఘం కిమ్మనలేదు. కొన్ని బూతుల్లో కాసేపు ఏజెంట్లు కూర్చున్న ఫలితం ఓట్ల సంఖ్యలో కనిపించింది. అక్కడ వైసీపీకి 6 వేలకు పైగా ఓట్లు పడ్డాయి. నిజమైన ఓటర్లను అనుమతించని పులివెందులలో వైసీపీకి 683 ఓట్లు వచ్చాయి. అవి కూడా కూటమి సైన్యమే వేసి ఉంటుంది కనుక అందుకు వారికి ఓ వైసీపీ నాయకుడు వెటకారంగా ధన్యవాదాలు తెలియజేశారు.బూటకపు ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత కూటమికి వంత పాడుతున్న మీడియాలోని ఓ ప్రధాన సెక్షన్ స్పందన జుగుప్సాకరంగా ఉన్నది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందువల్ల టీడీపీ గెలిచిందట. ముప్పయ్యేళ్ల తర్వాత పులివెందుల ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించిందట! అందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ బ్యాలెట్ బాక్సుల్లో స్లిప్పులు వేశారట! స్లిప్పుల బండారాన్ని సోషల్ మీడియాలో ఓ యువకుడు ఎండ గట్టిన తీరు నవ్వు తెప్పిస్తున్నది. కామెంట్లు రాసిన కాగితాలను బ్యాలెట్ బాక్సుల్లో వేయాలంటే ఆ కాగితాన్ని మతడపెట్టి వేయాలి. కానీ ఆ కాగితాలపై మడతలు లేకపోగా ఇస్త్రీ చేసిన ట్టుగా ఉన్నాయంటూ వాటి ఫోటోలను జతజేశాడు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటేయడానికి క్యూలైన్లలో నిలబడిన కూటమి కార్యకర్తలను గుర్తించి, ఆ ఫోటోలను ఒక సెక్షన్ మీడియా ప్రచురించింది. అయినా ఈసీలో స్పందన లేదు. ఈరకంగా వ్యవస్థలన్నీ ప్రలోభాలకు లోనై ఏలినవారి ఎదుట సాగిలపడుతున్న తీరును చూస్తుంటే మన ప్రజాస్వామిక వ్యవస్థ పెనుప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నట్టు హెచ్చరికలు కనిపిస్తు న్నాయి. పౌరులారా బహుపరాక్!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పారదర్శకతకు ‘సుప్రీం’ పట్టం
ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ప్రత్యామ్నాయం ఏమీ ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతోనైనా అర్థమై ఉండాలి. బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ సంఘం ఆదరా బాదరాగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణ మొదలెట్టింది. ఎందరు ఎన్ని అభ్యంతరాలు చెబుతున్నా బేఖాతరు చేసింది. అసలు ఈ సవరణ తీరే వేరు. ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్లను నమోదు చేసుకోవటం, జాబితాలో అప్పటికే ఉన్నవారిని సరిపోల్చుకోవటం, చిరునామాలో లేనివారిని తొలగించటం సాగిపోయేది. కానీ ఇప్పుడు ఆఖరుసారి ఓటర్ల జాబితా పూర్తి స్థాయి సవరణ జరిగిన 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, ఆ తర్వాత జాబితాల్లోకి ఎక్కినవారిని ఈసీ సంశయ ఓటర్లుగా పరిగణిస్తోంది. వారినుంచి రకరకాల ధ్రువపత్రాలు అడుగుతోంది. ఇవన్నీ 1955 నాటి జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్ఆర్సీ)లో నిర్దేశించిన పత్రాలు. సారాంశంలో ఈ ఓటర్లంతా ముందుగా దేశ పౌరులమని నిరూపించుకోవాలి. తమ పుట్టుకకు సంబంధించిన ధ్రువీకరణ పత్రా లతోపాటు తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఆధార్, గతంలో ఈసీయే జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు కూడా పనికిరాదట. పనికొచ్చే పత్రాల్లో పాస్పోర్టు ఉంది. కానీ ఆ పాస్పోర్టు సాధించటానికి పౌరులు ఆధార్ కార్డే చూపుతారని ఈసీ మరిచింది. ఒకపక్కఆందోళనలు సాగుతుండగానే సాగిన ఈ ‘సర్’ ప్రక్రియ తర్వాత ప్రకటించిన ఓటర్ల జాబితా ముసాయిదాలో ఏకంగా 65 లక్షలమంది పేర్లు గల్లంతయ్యాయి. 22 లక్షలమంది మరణించారని తేలిందని, రెండు చోట్ల ఓటుహక్కున్నవారు 7 లక్షల మంది కాగా, వలసపోవటం వల్లనో, ఇతర కారణాల వల్లనో 35 లక్షలమంది జాడలేదని అంటున్నది. అలాంటివారి పేర్లు తొలగించామని చెబుతోంది. నోటీసులిచ్చి, వాదనలు విని తొలగించామంటోంది. నిరుడు జూలై నుంచి డిసెంబర్ వరకూ ఓటర్ల జాబితాలను సరిచూసి, అవసరమైన సవరణలు చేసి ఈ ఏడాది జనవరిలో ఈసీ తుది జాబితా ప్రకటించింది. అందులో 7.90 కోట్లమంది ఓటర్లుండగా, తాజా ముసా యిదాలో 7.24 కోట్లమంది పేర్లున్నాయి. ఈ ఆర్నెల్లలో 22 లక్షల మరణాలు, మరో 35 లక్షల మంది వలసలు లేదా ఆచూకీ లేకపోవటం మాయాజాలం అనిపించటం లేదా? పైగా ఈసారి కేవలం నెల్లాళ్ల వ్యవధిలో... అంటే జూన్ 24న మొదలై జూలై 25 వరకే ఈ ప్రక్రియ సాగింది. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్లమంది అర్హతల్ని తేల్చిపారేయటం ఎలా సాధ్యమైందన్న సంశయాలు చాలామందికొచ్చాయి. ఈ విషయంలో నిందలు పడుతున్నా ఈసీ గంభీర వదనంతో ‘మీ దగ్గర ఆధారాలున్నాయా?’ అని ఎదురు ప్రశ్నించటం మరిన్ని సంశయాలకు దారి తీసింది. ఇది ఈసీకీ, ఆరోపణలు చేస్తున్న నేతలకూ మధ్య పంచాయతీ కాదు. ఆ ఆరోపణలు అవాస్తమని రుజువు చేస్తే ఈసీ విశ్వసనీయతే పెరుగుతుంది. లేనట్టయితే విపక్షాలు చేసే ‘ఓట్ చోరీ’ ఆరోపణను జనం నమ్ముతారు. సుప్రీంకోర్టు గురువారం చెప్పింది కూడా ఇదే! తొలగించినవారి పేర్ల ఎదురుగా కారణమేమిటో పేర్కొంటూ జాబితా విడుదల చేయాలనీ, పేరు లేదా ఓటర్ క్రమ సంఖ్య టైప్ చేయగానే వివరాలు కనబడేలా ఆ జాబితా ఉండాలనీ ధర్మాసనం ఆదే శించింది. నిజానికి ‘ఓట్ చోరీ’ ఆరోపణ రాకముందు అలాంటి సదుపాయం ఉంది. అటు తర్వాత మాయమైందంటే ఏమనుకోవాలి? ఈ వివరాలతో పార్టీలకు జాబితా అందించామన్న ఈసీ వాదనలో పస లేదు. ఓటుహక్కు కోల్పోయినవారు కారణం తెలుసుకోవటానికి పార్టీల చుట్టూ తిరగాలా? జాబితా వెల్లడైతే ఓటర్ల గోప్యత హక్కుకు విఘాతం కలుగుతుందన్న సాకు అర్థరహితం. చనిపోయినవారి, ఆచూకీ లేనివారి హక్కులకై ఈసీకి ఎందుకంత తాపత్రయం?‘సర్’ వల్ల ఎలాంటి పర్యవసానాలుంటాయో ఆ సంస్థకు అర్థమైనట్టు లేదు. బిహార్లోని 40 లోక్సభ స్థానాల్లో ఒక మీడియా సంస్థ తాజా ముసాయిదా ఆధారంగా విశ్లేషించగా దిగ్భ్రాంతి కరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో 24 చోట్ల నెగ్గినవారి మెజారిటీ కన్నా ఇప్పుడు తొలగించిన ఓటర్ల సంఖ్య అధికం! ఉదాహరణకు బెగుసరాయ్లో విజేత మెజారిటీ 81,480. కానీ అక్కడ తొలగించిన ఓటర్లు 1,23,178 మంది. షోహర్ స్థానంలో తొలగించిన వారు 1,09,723 అయితే, ఆ ఎన్నికల్లో విజేత మెజారిటీ 29,143! ఏ ఎన్నికల్లోనైనా అధిక ధరలు, నిరుద్యోగం వంటివి చర్చకొస్తాయి. ఈసీ నిర్వాకంతో రాగల బిహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా తిరకాసే ప్రధాన అంశం కాబోతోంది. ఇది ఎన్డీయే కూటమికి మంచి పరిణామమైతే కాదు.ఓటర్ల జాబితాలో పేరు తొలగించటమంటే పోటీ చేయటానికిగల హక్కును నిరాకరించటం కూడా. ఇది బిహార్తో ఆగదు. ఎన్నికలు జరగనున్న కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళ నాడులకు కూడా విస్తరిస్తుంది. ఇంత అస్తవ్యస్తంగా, ఇంత గోప్యంగా ఉండే ప్రక్రియ ద్వారా ఇంతకూ ఈసీ సాధించదల్చుకున్నదేమిటి? -
వివాదంలో ‘గవర్నర్ కోటా’
రాష్ట్రాల్లో అసెంబ్లీలుండగా శాసన మండళ్ళు అవసరమా అన్న వాదనతోపాటే ఆ శాసన మండళ్ళకు కొందరు సభ్యుల్ని నామినేట్ చేయటానికి గవర్నర్లకుండే అధికారాలపై, ఆ కోటాలో ఎంపికైన అభ్యర్థుల అర్హతలపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంటుంది. తెలంగాణ శాసన మండలికి నిరుడు గవర్నర్ కోటాలో ఎంపికైన విద్యావేత్త ప్రొఫెసర్ కోదండరామ్, పాత్రికేయుడు అమేర్ అలీఖాన్ల సభ్యత్వాలు రద్దుచేస్తూ బుధవారం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలీయటంతో ఆ అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. రాష్ట్రాల్లో శాసన మండళ్ళ మాదిరే కేంద్ర స్థాయిలో ఉండే రాజ్యసభకు చేసే ఎంపికలు కూడా అందరిలో ఆసక్తి రేపుతాయి. అంతేకాదు... వివాదాలకూ, అభ్యంతరాలకూ దారితీస్తుంటాయి. పాలకులుగా ఎవరున్నా ఈ రివాజు మారదు. ఇప్పుడు ఎమ్మెల్సీ సభ్యత్వాలు రద్దయిన ప్రొఫెసర్ కోదండరామ్, అమేర్ అలీఖాన్ల నేపథ్యం చూస్తే గవర్నర్ కోటాలో ఎంపికకు వారికి అన్ని విధాలా అర్హతలున్నాయని అర్థమవుతుంది. తెలంగాణ సాధనలో జేఏసీ కన్వీనర్గా ప్రొఫెసర్ కోదండరామ్ పాత్ర తెలియనివారు లేరు. ఉర్దూ పత్రిక ‘సియాసత్’లో సీనియర్ పాత్రికేయుడైన అమేర్ అలీఖాన్ విద్యా, సంక్షేమ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే స్థానాలకు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను ఎంపిక చేసింది. వీరిద్దరికీ కూడా సామాజిక ఉద్యమాల్లో, సేవాకార్యకలాపాల్లో పాల్గొన్న చరిత్ర ఉంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ పాలిస్తున్నప్పుడు గవర్నర్ కోటా ఎంపికలపై రాష్ట్ర మంత్రివర్గ సిఫార్సులకు గవర్నర్ నుంచి దాదాపు అభ్యంతరాలు వినబడవు. వేర్వేరు ప్రభుత్వాలున్నప్పుడే సమస్యంతా! విపక్షాలు ఎటూ అన్ని వేళలా విమర్శిస్తాయి. అయితే గవర్నర్ కోటాకు వీలు కల్పించే రాజ్యాంగంలోని 171(5) అధికరణం స్ఫూర్తిని చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు బేఖాతరు చేస్తున్నాయనీ, ‘రాజకీయ నిరుద్యోగుల’ పునరావాసానికి దాన్ని వినియోగిస్తున్నారనీ ఆరోపణలున్నాయి. ఆ అధికరణం ప్రకారం సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళ, సహకారోద్యమం, సామాజిక సేవ తదితర రంగాల్లో పాటుబడినవారిని, ఆ రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, వ్యావహారిక అనుభవం ఉన్నవారిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయొచ్చు. మేధావులూ, కళాకారులూ, సేవాతత్పరత కలిగినవారూ నేరుగా పోటీచేసి నెగ్గే అవకాశం తక్కువ కాబట్టి శాసనాల రూపకల్పనలో, పాలనలో అటువంటివారి సేవలు పొందాలన్న ఉద్దేశంతో ఈ కోటా ఏర్పాటు చేశారు. ఇలాంటివారితో ఏర్పడే సభ కనుకే పెద్దల సభ అనీ, ఎగువసభ అనీ శాసన మండళ్ళకూ, రాజ్యసభకూ పేరుంది. రాజ్యాంగంలోని 80వ అధికరణం రాజ్యసభకు రాష్ట్రపతి కోటా కింద ఎంపిక చేసే వీలు కల్పిస్తోంది. అయితే దేశ చరిత్రలో కేబినెట్ సిఫార్సు లేకుండా గవర్నర్ తనంత తానే నామినేట్ చేసిన ఏకైక ఉదంతం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 1952లో సీనియర్ నాయకుడు చక్రవర్తి రాజగోపాలాచారిని నాటి గవర్నర్ శ్రీ ప్రకాశ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అప్పటి ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని కూటమి అధిక స్థానాలు గెల్చుకోవటం, కాంగ్రెస్ మైనారిటీలో పడటంతో నాటి ప్రధాని నెహ్రూ మంత్రాంగం నడిపి అనారోగ్యంతో ఉన్న రాజగోపాలాచారిని సీఎంగా రప్పించారు. అటుపై ఉప ఎన్నిక ద్వారా ఎమ్మెల్యే కావాలని ఆదేశించినా రాజగోపాలాచారి తిరస్కరించటంతో నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారంటారు. బల నిరూపణ సమయానికి రాజగోపాలాచారి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి పదవి నిలబెట్టుకున్నారు. శ్రీ ప్రకాశ తీరును మాత్రం ఇప్పటికీ ‘రాజ్యాంగ అనౌచిత్యం’గా రాజ్యాంగ నిపుణులు అభివర్ణిస్తారు.దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులైన మేధావులూ, కళాకారులూ, సాహితీవేత్తలూ లేకపోలేదు. అయితే ఆ యా రంగాల్లో ఎన్నదగిన వైశిష్ట్యం ఉన్నా, రాజకీయ అనుకూలతలు తోడైనప్పుడే వారికి పదవులు దక్కుతున్నాయి. పదవులిస్తామన్నా వద్దని తిరస్కరించినవారూ లేకపోలేదు. కర్ణాటక సీఎంగా దేవరాజ్ అర్స్ ఉన్నప్పుడు సీనియర్ పాత్రికేయుడు టీఎస్ రామచంద్రరావుకూ, రామకృష్ణ హెగ్డే సీఎంగా ఉన్నప్పుడు సాహితీవేత్త దేవనూర్ మహదేవకూ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అవకాశమిస్తామని చెప్పినా వారు తిరస్కరించారు. నిరుడు అక్టోబర్లో మహారాష్ట్రలో గవర్నర్ కోటా కింద 12 మందిని ఎంపిక చేసినప్పుడు కూడా వివాదం రాజుకుంది. వారిలో కొందరు రాజ్యాంగం నిర్దేశిస్తున్న నిబంధనలకు తగినవారే అయినా, కొందరు పూర్తిగా రాజకీయ ప్రాపకంతోనే ఎంపికయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. ఎటూ వచ్చే నెల 17న సర్వోన్నత న్యాయస్థానం తాజా వివాదంలో తదుపరి విచారణ కొనసాగిస్తుంది. దీనిలో వెలువడే తుది తీర్పు ప్రభుత్వాలకు మార్గదర్శకం కాగలిగితే మంచిదే! -
ప్రజాస్వామ్యం ఖూనీ
కళ్లు మూసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం సాక్షిగా, రౌడీమూకల్లా చెలరేగిన పోలీసుల సాక్షిగా మంగళవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల్లో పచ్చమందలు అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి. నిజమైన ఓటర్లు పోలింగ్ కేంద్రాల సమీపానికి రాకుండా అధికార పక్షం దౌర్జన్యాలకు దిగితే.... వాటిని ఎదిరించి వచ్చినవారిని పోలీసులు తరిమికొట్టారు. ఓటు వేసేందుకు అనుమతించాలంటూ కాళ్లావేళ్లా పడినవారిని సైతం కనికరించలేదంటే... ఓటర్ల దగ్గర స్లిప్లు గుంజుకుని, మీ దగ్గర స్లిప్లు లేవుగనుక ఓటేయటం కుదరదని పోలీసులు దబాయించారంటే ఏపీలో పరిస్థితేమిటో అర్థంచేసుకోవచ్చు. ఏనాడూ సవ్యంగా అధికారంలోకి రావటం చేతగాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రెండు స్థానాల్లో అక్షరాలా ప్రజాస్వామ్యాన్ని పాyð క్కించారు. దీన్ని కప్పిపుచ్చ టానికి బుధవారం రెండు కేంద్రాల్లో మాత్రం రీపోలింగ్ తంతు నిర్వహించి అయిందనిపించారు. తొలినాటి ఉదంతాలే మర్నాడూ పునరావృతమయ్యాయి. స్థానికేతర టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ చెలరేగిపోతుంటే చోద్యం చూసిన పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ స్థానిక నాయకుల్ని అరెస్టులతో, గృహనిర్బంధాలతో ఎటూ కదలనివ్వలేదు. అభ్యర్థులను తిరగనివ్వలేదు.అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం అక్రమంగా నాలుగు గ్రామాల పోలింగ్ కేంద్రాలను 2 నుంచి 4 కిలోమీటర్ల దూరాల్లోవున్న వేరే గ్రామాలకు తరలించటంతోనే ఈ ఉప ఎన్నికల ప్రహసనం మొదలైంది. అన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటేయటం వృద్ధులకూ, అనారోగ్యం బారినపడిన వారికీ అసాధ్యమని లెక్కేసుకుని ఈ మార్పు చేశారు. మహిళలు, వృద్ధులతోసహా సాధారణ ఓటర్లంతా ఇలాంటి మాయోపాయాలను బేఖాతరు చేశారు. కానీ వారికి రక్షణగా నిలబడాల్సిన పోలీసులే వృత్తి ధర్మానికి ద్రోహం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాలు మార్చటాన్ని హైకోర్టు తప్పుబట్టినా, చివరి నిమిషంలో సవరించటం అసాధ్యమని భావించింది. ఇదే అదునుగా జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు వంటి చోట్లనుంచి వచ్చిన రౌడీమూకలు ఎడాపెడా రిగ్గింగ్కు పాల్పడ్డాయి. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రంలో వుండగానే దొంగ ఓటర్లు బారులు తీరారంటే ఈ బరితెగింపు ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలిసో తెలియకో తమ ‘ఘనత’ను చాటుకోవటానికి జిల్లా కలెక్టర్ ఈ ఫొటోలనే సామాజిక మాధ్యమాల్లో వుంచి నగుబాటుపాలై తిరిగి వాటిని తొలగించాల్సి వచ్చింది. అధికారులకు వ్యక్తిగత స్థాయిలో ఇష్టాయిష్టాలుండొచ్చు. అధికార పార్టీకి పరిచారికలుగానో, పాలేళ్లుగానో మారాలని ప్రాణం కొట్టుమిట్టాడొచ్చు. అలాంటివారు రాజీనామా చేసి పోవాలితప్ప, జనం ఎంతో కష్టపడి పన్నుల రూపంలో చెల్లించే సొమ్మును నెలనెలా జీతాలుగా తీసుకుంటూ... కుటుంబాలను పోషించుకుంటూ కాలసర్పాల మాదిరిగా అదే జనాన్ని కాటేయాలని చూడకూడదు. సిగ్గూ లజ్జా, మానాభిమానాలు వున్నవారెవరైనా ఇలాంటి హీనస్థితికి దిగజారతారా? ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి తరమటం మాత్రమే కాదు... కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లను కూడా పోలింగ్ కేంద్రాల్లోకి రానీయకుండా నిర్వహించిన ఈ ఉప ఎన్నికలు ‘ప్రశాంతంగా’ జరిగాయని ప్రకటించటానికి అధికార యంత్రాంగానికి ఏమాత్రం సిగ్గనిపించకపోవటం విస్మయం కలిగిస్తుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో 15 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకం అని సాక్షాత్తూ రాష్ట్ర ఎన్నికల సంఘమే ప్రకటించింది. మరి అక్కడుండే వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? మంత్రి సమక్షంలోనే పోలింగ్ ఏజెంటును ఒక్కడిని చేసి అత్యంత దారుణంగా కొట్టారన్న సమాచారం ఆ సంఘానికి చేరిందా? అనేకచోట్ల ఏజెంట్లు లేకుండానే పోలింగ్ కొనసాగిన వైనం ఆ సంఘానికి తెలుసా? ఓటర్లెవరో, కానివారెవరో గుర్తించటానికి ఏజెంట్లుంటారు. పోలింగ్ పూర్తయ్యాక అంతా సవ్యంగా పూర్తయినట్టు వారినుంచి సంతకాలు తీసుకుంటారు. జరిగిన తంతు చూస్తుంటే ఆ సంతకాలను కూడా ఫోర్జరీ చేయదల్చుకున్నారా అనే సంశయం ఏర్పడుతోంది.పోయే కాలానికి కుక్కమూతి పిందెలని నానుడి. సాధారణ ఎన్నికలైనా, ఉప ఎన్నికలైనా అక్రమాలకు పాల్పడటం ఆదినుంచీ అలవాటైన బాబుకు ‘అతని కంటె ఘనుడ’న్నట్టు పుత్రరత్నం తోడయ్యాడు. అందుకే ఈసారి బరితెగింపు అవధులు దాటిన వైనం కనబడుతోంది. ఇలాంటి దుష్టపోకడల్ని చూస్తూ వూరుకుంటే ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టదు. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలి. ప్రహసన ప్రాయంగా మారిన ఈ ఉప ఎన్నికలను రద్దుచేయాలి. బాధ్యులైన అధికార్లను సాగనంపాలి. వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసినట్టు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి పోలింగ్ నిర్వహించాలి. -
మునీర్ మూర్ఖత్వం!
ఉగ్రవాదాన్ని దశాబ్దాలుగా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పాలకులకూ, సైన్యానికీ ఆత్మాహుతి భాష నిండా ఒంటబట్టినట్టుంది. మున్ముందు భారత్ దాడికి దిగితే అణ్వస్త్రాలు ప్రయోగించి సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని పాకిస్తాన్ సైనిక చీఫ్ మునీర్ బెదిరించటాన్ని గమనిస్తే ఆ దేశంలో మూర్ఖత్వం ఎంతగా ముదిరిందో అర్థమవుతుంది. పాకిస్తాన్ ఒక దేశంగా ఏర్పడిన నాటినుంచీ సక్రమంగా మాట్లాడటం, సవ్యంగా మసులుకోవటం దానికి చేతకావటం లేదు. అమెరికా, పాశ్చాత్య దేశాలు దాన్ని తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తూనే వచ్చాయి. అమెరికా ఈ విషయంలో ఒకడుగు ముందుంది. ఎదురుతిరిగిన పాలకుల్ని సైనిక కుట్రలో కూలదోయటం, కీలుబొమ్మను ప్రతిష్ఠించటం దానికి అలవాటైన విద్య. అమెరికా సాగు, పాడి రంగ ఉత్పత్తుల్ని భారత్లో అనుమతించాలన్న డిమాండ్ను మన ప్రభుత్వం అంగీకరించనందుకు ఆగ్రహంతో రగిలిపోతున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మన సరుకులపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆసిఫ్ మునీర్ అధిక ప్రసంగం కూడా ఆయనగారి పథక రచనే కావొచ్చన్న సంశయాలు తలెత్తుతున్నాయి. మొన్న జూన్లో మునీర్ను పిలిపించుకుని అయిదు రోజులపాటు ఇంటల్లుడి మర్యాదలు చేసిన వైనం మరవకముందే మరోసారి ఆయన అక్కడికి వెళ్లి వాలాడంటే దాన్ని సాధారణ విషయంగా తీసుకోకూడదు. తొలి పర్యటనలో ప్రోటోకాల్స్ పక్కనబెట్టి మునీర్కు దేశాధినేతలకిచ్చే స్థాయి ఘనమైన విందునిచ్చి, ముడి చమురు సహా పాకిస్తాన్తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ట్రంప్ ప్రకటించిన తీరు చూసి ప్రపంచం విస్మయపడింది. పాకిస్తాన్లో చచ్చో పుచ్చో... ఎన్నికైన ప్రభుత్వం అంటూ ఒకటుంది. అమెరికాతో సహా ఏ దేశంలోనైనా సైన్యం పని ప్రభుత్వాదేశాలు పాటించటం మాత్రమే. కానీ తోకే కుక్కను ఆడిస్తున్న చందంగా పాక్ పోకడ ఉంది. సైన్యం ఏం చేసినా అక్కడి పాలకులు కిక్కురుమనరు. అందువల్లే మునీర్ ట్రంప్తో సహకార ఒప్పందాలు కుదుర్చుకోగలిగాడు. ఈ విషయంలో ట్రంప్ను తప్పుబట్టాలి. తమ సైనిక దళాల చీఫ్ జనరల్ రాండీ ఏ. జార్జి ఏ దేశమైనా పోయి ఒప్పందాలు కుదుర్చుకొని వస్తే ఆయన శిరసావహిస్తారా? ఈసారి మునీర్ నాలుగు రోజులు అక్కడ తిష్ఠ వేశారు. నెల రోజుల్లోనే ఎందుకెళ్లాడో, ఆయన చేస్తున్న రాచకార్యమేమిటో తెలియదు. అటు అమెరికా ప్రభుత్వమూ బయటపెట్టదు. కానీ అమెరికాకు సంబంధించిన రాజకీయ నాయకులతోనూ, సైనిక నాయకత్వంతోనూ ఆయన భేటీలు జరిపాడు. అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ జనరల్ మైకేల్ ఈ.కురిలా రిటైర్మెంట్ సభలో పాల్గొనడానికి అక్కడికెళ్లినట్టు మీడియా కథనం. పాకిస్తాన్ సంతతి ప్రజలతోనూ సమావేశమయ్యారు. మునీర్ బెదిరింపులుగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నవన్నీ ఆ సమావేశంలో మాట్లాడినవేనని చెబుతున్నారు. అధికారికంగా అయితే మునీర్ లేదా పాకిస్తాన్ సైన్యం ఈ మాటల్ని ధ్రువీకరించటానికి సిద్ధపడటం లేదు. అణ్వస్త్ర దేశమని మిడిసిపడితే ఎవరు వూరకున్నా ఇరుగు పొరుగు దేశాలు మౌనంగా ఉండవు. మన విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పినట్టు ఈమాదిరి బాధ్యతా రాహిత్యాన్నీ, బ్లాక్మెయిలింగ్నూ మన దేశమైతే సహించదు. మునీర్ మాటల్ని భారత్ వక్రీకరిస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ అనటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయనేమీ కోడ్ భాషలో మాట్లాడలేదు. ఆ ప్రసంగానికి సంబంధించిన కథనాన్ని బయటపెట్టింది కూడా అమెరికా మీడియానే. పైగా పాకిస్తాన్ ఏలికలు ఇలా మాట్లాడటం మొదటిసారేమీ కాదు. ఇక వక్రీకరణకు చోటెక్కడ?! ఏదో ఉన్మాదంలో నోరు జారివుంటే ఆ మాట చెప్పి తప్పయిందని ఒప్పుకోవాలి. విషయం బయటికొచ్చాక వణుకుడు దేనికి? ఉగ్రవాద మూకల్ని పంపి కల్లోలం సృష్టిస్తే, అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తామని బెదిరిస్తే భారత్ హడలెత్తుతుందని పెహల్గాం అనంతర పరిణామాల తర్వాత కూడా పాకిస్తాన్ భ్రమల్లో ఉందంటే దాన్ని ఎవరూ రక్షించలేరు. అమెరికా సంపన్న రాజ్యమే కావొచ్చుగానీ మంచీ మర్యాదా పాటించటం నేర్చుకోవాలి. కొత్తగా వచ్చిన భుజకీర్తుల మత్తుతో అమెరికాలో వాలిన మరో దేశ సైనిక దళాల చీఫ్ మిత్రదేశంతోపాటు ప్రపంచాన్నే బెదిరిస్తున్న వైనం కనబడుతున్నా గుడ్లప్పగించి చూడటం సబబేనా? చీవాట్లు పెట్టి పంపాల్సిన బాధ్యత లేదా? ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ఈ మాదిరి వైఖరే ప్రదర్శించి అమెరికా భారత్కు దూరమైంది. ఆర్థిక సంస్కరణల అనంతరం క్రమేపీ చక్కబడుతూ వచ్చిన ద్వైపాక్షిక సంబంధాలు ఇలాంటి వింత చేష్టలతో ఛిద్రం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ట్రంప్దే! మునీర్ లాంటివాళ్లు ఇష్టానుసారం చెలరేగటాన్ని నిలువరించకపోతే తమకూ నష్టమేనని ఆయన గ్రహించాలి. -
చట్టసభలే సరైన వేదికలు
మన చట్టసభల వల్ల ప్రజలకూ, ప్రజాస్వామ్యానికీ ఏ మేరకు ప్రయోజనం కలుగుతోందన్న అంశంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నా... అక్కడి చర్చల సరళి ఇంకా మెరుగుపడాలని, ప్రభుత్వ జవాబుదారీతనం మరింత పెరగాలన్న విషయంలో అందరూ ఏకీభవిస్తారు. గత నెలాఖరున మూడు రోజులపాటు ‘ఆపరేషన్ సిందూర్’పై విస్తృత చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలోనూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలోనూ సమాధానమిచ్చారు. కానీ భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ శనివారం చేసిన ప్రసంగంలోనూ, అంతక్రితం ఈ నెల 4న సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది మద్రాస్ ఐఐటీలో చేసిన ఉపన్యాసంలోనూ కనబడిన స్పష్టత, వివరాలు చర్చ సందర్భంగా ప్రధాని, కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటనల్లో లేవు. ఇరు దేశాల మధ్యా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం వెనక ఏ ప్రపంచ నాయకుల ఒత్తిళ్లూ లేవని ఇద్దరూ నిర్ద్వంద్వంగా చెప్పటం హర్షించదగ్గదే అయినా, ఆ ఆపరేషన్లో మనం సాధించిన విజయాలనూ, ఆ క్రమంలో ఎదురైన సవాళ్లనూ వివరించకపోవటం, అసలు పెహల్గాం భద్రతా లోపాలూ, వాటిపై చర్యలూ వెల్లడించకపోవటం లోటే అనిపిస్తుంది. అనర్గళంగా మాట్లాడగలిగే శక్తివున్నవారెవరో, అవతలి పక్షాన్ని వ్యంగ్యంతో, వెటకారంతో గేలిచేసి చిన్నబుచ్చగలవారెవరో తెలుసుకోవటానికి ప్రజలు చట్టసభల ప్రత్యక్ష ప్రసారాలు చూడరు. వాస్తవాలు తెలుసుకోవా లనుకుంటారు. విపక్షాల సందేహాలకు ప్రభుత్వం సూటిగా, స్పష్టంగా జవాబిచ్చిందా లేదా అనేది గమనిస్తారు. కానీ పార్లమెంటులో జరిగింది వేరు. ఎప్పటిలా పరస్పరం నిందారోపణలు చేసుకోవటంతోనే చాలా సమయం గడిచింది. ‘సిందూర్’లో జరిగిందేమిటో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్కు చెందిన అయిదు యుద్ధ విమానాలను కూల్చటంతోపాటు మరో భారీ విమానాన్ని సైతం పడగొట్టామని, దాదాపు 90 గంటల వ్యవధిలో అనుకున్న లక్ష్యాలను సాధించామని ఆయన వివరించారు. మన గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయటంతో పాక్ సైన్యం పాచికలేమీ పారలేదని, వారి ఎఫ్–16లూ, డ్రోన్లూ, క్షిపణులనూ కూల్చేయటంతోపాటు రెండు కమాండ్ కంట్రోల్ కేంద్రాలనూ, ఒక వైమానిక స్థావరాన్నీ ధ్వంసం చేశామని ప్రకటించారు. జనరల్ ద్వివేది అయితే ప్రభుత్వం రాజకీయ స్పష్టతతో దిశానిర్దేశం చేయటం, విశ్వాసాన్నీయటం, నిర్ణయాన్ని తమకే వదిలేయటం తొలిసారి చూశామని చెప్పారు. ఇటువంటి ప్రకటనలు పార్లమెంటు వేదికపై ప్రభుత్వం వైపుగా వస్తే, వాటిపై విపక్షం ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెల్లడయ్యేవి. ముఖ్యంగా జనరల్ ద్వివేది ప్రసంగం వాస్తవ స్థితేమిటో చెప్పింది. శత్రువుతో ఇప్పుడు నాలుగు రోజుల్లోనే ఘర్షణలు సమసినా... త్వరలోనే మరో యుద్ధం జరిగినా ఆశ్చర్యం లేదని, ఈసారి ఒంటరిగా వస్తారా, వేరే దేశాలతో కలిసి వస్తారా అన్నది కూడా చెప్పలేమని ఆయన అనటం గమనించదగ్గది. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్జీత్, జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా ‘ఆపరేషన్ సిందూర్’ దేశాన్ని ఏకం చేయటం గురించి ప్రస్తావించారు. దేశ ప్రజానీకమంతా ఒక్కటై నిలబడటం సాధారణ విషయం కాదు. ఇందులో విపక్షాల పాత్రను కొట్టిపారేయలేం. పెహల్గాంలో భద్రతా లోపాలపై తీసుకున్న చర్యలేమిటో చెప్పకపోవటం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్–పాక్ ఘర్షణలు ఆగటం తన ఘనతేనని ప్రకటించటం విపక్షాలకు అభ్యంతరకరం అయింది. ట్రంప్ మధ్యలో స్వరం మార్చినా తిరిగి దాన్నే పదే పదే చెబుతున్నారు. అందువల్ల పార్లమెంటు వేదికగా దేశానికి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి జరిగిందేమిటో చెప్పాల్సిన బాధ్యత పాలకులపై పడింది. ప్రశ్నిస్తున్న విపక్షాలు పాకిస్తాన్తో కుమ్మక్కయ్యాయని ప్రత్యారోపణ చేయటం ఇందుకు ప్రత్యామ్నాయం కాదు. యుద్ధ రంగంలో వ్యూహాలూ, ఎత్తుగడలూ ఎలావుండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి వదిలిపెట్టినా, ఆ క్రమంలో ఏర్పడ్డ సమస్యలను తెలుసుకుని అవసరమైన సూచనలీయటం, జరిగిందేమిటో ప్రజలకు తేటతెల్లం చేయటం దేశ రాజకీయ నాయకత్వం బాధ్యత. మన రక్షణ దళాల చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్లో జూన్ నెలాఖరున మాట్లాడుతూ మన దళాలు చేసిన కొన్ని ‘వ్యూహాత్మక తప్పిదాల’ కారణంగా జెట్ విమానాలు కోల్పోయామని చెప్పటం వివాదాస్పదమైంది. పార్లమెంటులో దానిపై ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి వివరణా లేదు. ఇప్పుడు దళాధిపతుల ప్రసంగాల్లోనూ ఆ వివరాల్లేవు. ఈ విషయమై సందేహాలు పోగొట్టడానికి పార్లమెంటే సరైన వేదిక. దాన్నుంచి వెలువడే సందేశం దేశ ప్రజానీకాన్ని ఒక్కటి చేస్తుంది. ఆ సంగతిని అధికార పక్షంతోపాటు విపక్షం కూడా మరువరాదు. -
ఇది దేనికి సంకేతం?
శకునాలను భావి పరిణామాలకు సంకేతాలుగా భావిస్తారు. శకునాల మీద నమ్మకాలు పురాతన కాలం నుంచి ఉన్నాయి. ఈ నమ్మకాలు ఏ ఒక్క దేశానికో, మతానికో పరిమితమైనవి కావు. ప్రకృతిలో అనుకోని ఉత్పాతాలు సంభవిస్తే, వాటిని దుశ్శకునాలుగా భావిస్తారు. ఎలాంటి శకునాలకు ఎలాంటి ఫలితాలు సంభవిస్తాయో చెప్పే శకున శాస్త్రాలు కూడా ఉన్నాయి. శకునాలకు వ్యాఖ్యానాలు చెప్పి, భవిష్యత్తును అంచనా వేసే జ్యోతిషులు, కాలజ్ఞానులు కూడా ప్రపంచంలో ఉన్నారు. శకునాల మీద నమ్మకాలు పురాతన సమాజంలో ఎంతగా ఉండేవో, శకునాలన్నీ ఉత్తవేనని కొట్టిపారేసే హేతువాదులు పురాతన కాలం నుంచి ఉన్నారు. ‘దేశ ప్రయోజనాల కోసం కత్తి దూసే యోధుడు శకునాన్ని చూసుకోడు’ అన్నాడు గ్రీకు తత్త్వవేత్త, కవి హోమర్. క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దికి చెందిన ఆయన ఆనాటి హేతువాదానికి ప్రతినిధి. శకునాల మీద నమ్మకాలు బలంగా ఉన్న ప్రాచీన సమాజంలోనే హేతువాదం కూడా పురుడు పోసుకుందనేందుకు హోమర్ మాటలే ఉదాహరణ. ఆనాటికీ ఈనాటికీ కాలం ఎంతో మారింది. ఆధునికత పెరి గింది. అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ శరవేగంగా కమ్ముకొస్తోంది. అయినా ఇప్పటికీ శకు నాలను పట్టించుకోని హేతువాదుల కంటే శకునాలను నమ్మేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. మన పురాణాలను చూసుకుంటే, శకునాల వర్ణన దాదాపుగా ఒకే తీరులో కనిపిస్తుంది. లోకకంటకులైన దుర్మార్గులు భూమ్మీద పుట్టినప్పుడు ఆకాశంలోని చుక్కలు తెగి రాలిపడటం; నక్కలు ఊళలు పెట్టడం; కుక్కలు మొరగడం; గాడిదలు ఓండ్రపెట్టడం; సముద్రాలు ఘూర్ణిల్లడం; తుపానులు చెలరేగడం వంటి ఉత్పాతాలు సంభవించేవి. దుర్యోధనుడు పుట్టినప్పుడు ఇలాంటి దుశ్శకునాలే కనిపించాయట! ఆపదలు ఎదురయ్యే ముందు దుశ్శకునాలు గోచరిస్తాయని చాలామంది నమ్ముతారు. రామ రావణ యుద్ధంలో రావణుడి కొడుకు మేఘ నాదుడు లక్ష్మణుడి చేతిలో హతమయ్యాడు. చివరకు రావణుడే స్వయంగా రణరంగానికి బయలుదేరాడు. అప్పుడు నక్కలు ఊళలు పెట్టడం; గద్దలు రథం మీద గిరికీలు కొడుతూ తిరగడం; గుడ్లగూబలు వికృత రావాలు చేయడం; రథం మీది గొడుగు విరిగిపోవడం వంటి దుశ్శకునాలు ఎదురయ్యాయట! చివరకు ఆ యుద్ధంలో రావణుడు హతమైపోయాడు. రామాయణ, మహాభారతాలు సహా అనేక పురాణాల్లో ఉన్న ఇలాంటి కథల మూలంగా శకునాల మీద నమ్మకాలు జనాల్లో తరతరాలుగా నాటుకుపోయాయి. పురాణ కాలంలోనే శకున శాస్త్రాన్ని గర్గ మహాముని రాశాడట!‘స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితాగాన ఫణితౌ/ పురాణే మంత్రే వా స్తుతి హాస్యే ష్వచతురః/ కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే/ పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో’ అని ‘శివానంద లహరి’లో ఆదిశంకరాచార్యుడు అన్నాడు. అంటే, ‘శాస్త్ర పాండిత్యం లేదు. వైద్యం చేతగాదు. శకున శాస్త్రం రాదు. కవిత్వం చెప్పలేను. సంగీతం రాదు. పురాణం చెప్పలేను. మంత్రాలెరుగను. ఆటపాటలలో నేర్పు లేదు. హాస్యం చెప్పలేను. ఇలాంటి సామాన్యుడినైన నా మీద రాజులకు ఎలా దయ కలుగుతుంది? వారిచ్చే ఫలాలు నాకేల? సర్వజ్ఞా! నన్ను నేనే ఎరుగని పశువును. నువ్వు పశుపతివి కదా! నన్ను నువ్వే దయతో కాపాడు’ అని పరమశివుడిని వేడుకున్నాడు. ఈ శ్లోకంలోని పారమార్థిక తాత్పర్యం ఎలా ఉన్నా, ఆదిశంకరాచార్యుని కాలంలో రాజాశ్రయం పొందడానికి అవసరమైన కీలక విద్యలలో శకునశాస్త్రం కూడా ఒకటని మనకు అర్థమవుతుంది.తాజాగా గలిలీ సముద్రంలోని నీరు నెత్తుటిలా ఎర్రబడింది. బైబిల్లో ప్రస్తావించిన ఈ సముద్రం అకస్మాత్తుగా ఎర్రబడటంపై అక్కడి జనాలు ప్రపంచానికి ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఏసుక్రీస్తు గలిలీ సముద్రం మీద నడిచి, తుఫాను శాంతింపజేశాడని; ఆ సముద్రం ఒడ్డునే తన శిష్యులకు అనేక బోధలు చేశాడని; ఐదువేల మందికి రొట్టెలు, చేపలతో ఆహారం పెట్టాడని బైబిల్ కథనం. ఇదిలా ఉంటే, బానిసలుగా ఉన్న ఇజ్రాయెలీలను విముక్తులను చేసేందుకు ఈజిప్టు ఫారో అంగీకరించనందుకు ఆగ్రహించిన భగవంతుడు అందుకు హెచ్చరికగా నైలునదీ జాలాలను నెత్తుటిలా ఎర్రగా మార్చేశాడని పాత నిబంధన గ్రంథం చెబుతోంది. ఆ కథనమే ఇప్పటి ఆందోళనకు కారణం.మన దేశ పరిస్థితులను చూసుకుంటే, ఏడున్నర దశాబ్దాలకు పైబడిన స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దొంగ ఓట్ల వ్యవహారంలో ఎన్నికల కమిషన్ నిండా బురదలో మునిగింది. ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇంట నోట్ల కట్టలు దొరికిన ఉదంతం సుప్రీంకోర్టుకు చేరింది. రాజ్యాంగ వ్యవస్థలు ఇలా కళంకితం కావడం దేశానికి ఒక రకంగా దుశ్శకునాలు. ఇవి ఎలాంటి దుష్పరిణామాలకు సంకేతాలో కాలమే చెప్పాలి. -
మసిబారిన ఎన్నికల సంఘం!
పేరుకు మనది అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. ఇప్పుడది మేడిపండు చందంగా మారిపోయిందనడానికి రుజువులు చాలా కనిపిస్తున్నాయి. దాని పొట్ట విప్పి చూస్తే పురుగులు భయపెడుతున్నాయి. ప్రజాస్వామ్యానికి కాపు కాయవలసిన ఎన్నికల వ్యవస్థ అచేతనత్వంలోకి, నిష్క్రియాపరత్వంలోకి జారుకున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టి.ఎన్. శేషన్ వలె పులిలా గాండ్రించగల అధికారాన్ని ఎన్నికల సంఘానికి మన రాజ్యాంగం దఖలు పరిచింది. గాండ్రించవలసిన రాజ్యాంగ వ్యవస్థలు పెంపుడు చిలకలుగా మారిపోయి, పంజరాల్లోకి చేరిపోయాయి. సర్కారు వారి పాటకు అవి కోరస్లు పాడుతుంటే మన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్టా? మాయల ఫకీర్ల చెరలో మూలుగుతున్నట్టా?కుల, మత, జాతి నెపాలతో ఏ వ్యక్తికీ ఓటు హక్కును తృణీకరించడానికి వీల్లేదని రాజ్యాంగంలోని 325వ అధికరణం స్పష్టం చేసింది. కానీ ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందట బిహార్ ప్రజలు పౌరసత్వ శీల పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మాటమాత్రంగానైనా చెప్పకుండానే, ఆ తర్వాత ఓటర్ల జాబితాల ప్రత్యేక వడబోత (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రకటించారు. నెలరోజుల సమయం మాత్రమే ఇచ్చి ఓటర్లందరూ వారి శాశ్వత నివాసాన్ని నిరూపించుకునే ఆధారాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ఆధార్తో పాటు ఎన్నికల సంఘమే గతంలో జారీచేసిన వోటర్ ఐ.డి. కార్డులు పనికి రావని తేల్చారు.బిహార్ శ్రామికులు లక్షల సంఖ్యలో దినసరి ఉపాధి కోసం పలు ప్రాంతాలకు తాత్కాలికంగా వలస పోతారనే సంగతి తెలి సిందే. వీళ్లంతా హుటాహుటిన సొంతూరికి బయల్దేరి తమ ముల్కీని నిరూపించుకోవలసిన పరిస్థితి. అసలు ఎన్నికల సంఘం ఆదేశాల గురించే వారిలో చాలామందికి తెలిసి ఉండక పోవచ్చు. ఓటర్ల జాబితాను వడపోయాలనే ఆలోచన మంచిదే కావచ్చు. సమగ్రంగా సక్రమమైన రీతిలో ఓటర్ల జాబితాను తయారుచేయాలనుకున్నప్పుడు సరిగ్గా ఎన్నికల ముందే ముహూర్తం పెట్టుకోవడం అనుమానాలకు తావిచ్చింది. అది కూడా అఖిలపక్ష సమావేశంలో చూచాయగానైనా చెప్పకుండా ఆదేశాలు జారీ చేయడాన్ని బట్టి అనుమానాలు మరింత బలపడ్డాయి.ఎన్నికల నిర్వహణతోపాటు, ఓటర్ల జాబితా రూపకల్పన బాధ్యతను 324వ అధికరణం ప్రకారం ఎన్నికల సంఘంపైనే రాజ్యాంగం మోపింది. ఓటరుగా నమోదయ్యే బాధ్యతను పౌరునిపై రాజ్యాంగం పెట్టలేదు. ఓటును అతనికి ఒక హక్కుగా ప్రసాదించింది. పౌరులను ఓటరుగా నమోదు చేయవలసిన బాధ్యతను నిర్వహించవలసిన ఎన్నికల సంఘం అందుకు విఘ్నాలను కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమవుతుంది. గతంలో ఎన్నికల సంఘమే జారీచేసిన ఓటరు కార్డులు చెల్లు బాటు కావనడం ఆందోళనకరం. ఈ గుర్తింపు కార్డుల ఆధారంగా ఇప్పటివరకు జరిగినవన్నీ బూటకపు ఎన్నికలే అను కోవాలా?ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఎన్నికల సంఘం కొత్త ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. గత జాబితాలో ఉన్న 65 లక్షల మందిని తొలగించినట్టు ప్రకటించింది. ఇందులో 22 లక్షలు చనిపోయిన వారి పేర్లనీ, 36 లక్షలమంది శాశ్వతంగా వలస పోయారనీ పేర్కొన్నారు. శాశ్వ తంగా వలస పోయినట్టు ఎలా నిర్ధారణకొచ్చారో తెలియదు. ఆ మేరకు వాళ్లేమైనా అఫిడవిట్లు సమర్పించారా? పారదర్శకత ఎక్కడుంది? 22 లక్షలమంది ఏయే సమయాల్లో చనిపోయారో తెలియదు. ఐదేళ్ల కింద జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7.36 కోట్ల మందికి ఓటు హక్కు ఉన్నది. ఇప్పుడు వడబోత తర్వాత 7.24 కోట్లమందే నివాస పత్రాలను సమర్పించారని చెప్పారు. ఐదేళ్లలో చనిపోయేవారి సంఖ్యకు రెట్టింపు సంఖ్యలోనైనా కొత్త ఓటర్లు నమోదై ఉండాలి కదా! భారతదేశంలో ప్రతి వెయ్యి జనాభాకు జననాల రేటు 19.3 శాతంగా ఉంటే మరణాల రేటు 7.5 శాతంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వ హెల్త్ ప్రొఫైల్ నివేదిక తెలియజేస్తున్నది. ఈ లెక్కన ఐదేళ్ళలో ఓట్లు పెరగాలి. కానీ తగ్గడం ఆశ్చర్యాన్నీ, ఆందోళననూ కలిగిస్తున్నది.2024 సాధారణ ఎన్నికల తర్వాత గత ఏడాది కాలంగా ఎన్నికల సంఘం పనితీరు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలే కాదు, స్వచ్ఛంద సంస్థలు కూడా సంఘం పనితీరును ప్రశ్నిస్తున్నాయి. సాక్ష్యాధా రాలతో అనేక అవకతవకలను ఎత్తిచూపుతున్నాయి. కానీ, ఎన్నికల సంఘం స్పందించడం లేదు. బెల్లం కొట్టిన రాయిలా మౌనాన్నే ఆశ్రయిస్తున్నది. అడపాదడపా బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నది. యథా రాజా తథా ప్రజా అంటారు గదా! యథా కేంద్ర ఎన్నికల సంఘం తథా రాష్ట్ర సంఘం. ఆంధ్ర ప్రదేశ్లో జరుగుతున్న రెండు జడ్పీటీసీల ఉపఎన్నికలనే తీసు కుందాం. ఎన్ని అక్రమాలు చేసైనా ఈ రెండు స్థానాలను గెలుచు కోవాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నది. అధికారంలో ఉన్న పార్టీ రాజకీయ ఎజెండాకు పోలీసుయంత్రాంగంతోపాటు ఎన్నికల సంఘం కూడా తందానా అంటున్న తీరు విభ్రాంతికరం. మామూలుగానైతే జడ్పీటీసీ ఉపఎన్నికల్లో రాష్ట్ర నాయకులు జోక్యం చేసుకోరు. పార్టీల జిల్లాస్థాయి నాయకులే ప్రచారం చేస్తారు.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థానిక ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా జరిగినప్పుడు కూడా ఆయన ప్రచారానికి వెళ్ళలేదు. స్థానిక నాయకత్వానికే బాధ్యత అప్పగించారు. చంద్రబాబు మాత్రం విస్తృతంగానే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో బాబు సొంత నియోజకవర్గంలో ఉన్న నాలుగు జడ్పీ టీసీలు, నాలుగు మండల పరిషత్లు, ఒక మునిసిపాలిటీని కూడా గెలుచుకొని వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. బహుశా అప్పటి అవమానాగ్ని వారిని ఇప్పటికీ దహిస్తున్నట్టున్నది. ఇప్పుడు ఉపఎన్నికలు జరుగుతున్న రెండు స్థానాల్లో పులివెందుల మండల జడ్పీటీసీ కూడా ఒకటి. దీంతోపాటే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట స్థానం మరొకటి. ఈ రెండు స్థానాలనూ గెలవడం కోసం భూమ్యాకాశాలను ఏకం చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయాసపడుతున్నది.ప్రతిపక్ష పార్టీ అభిమానుల్లో, ఓటర్లలో భయోత్పాతం సృష్టించడానికి పాలక పార్టీ దాడులకు తెగబడటం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం యథేచ్ఛగా జరిగిపోతున్నది. ఒక ఎమ్మెల్సీ సహా వైసీపీ నాయకులను టార్గెట్ చేసి మరీ దాడులు చేశారు. మేం లేకపోతే వాళ్ల తలలు తెగిపడేవని సాక్షాత్తూ డీఐజీ ర్యాంకు పోలీసు ఉన్నతాధికారే ప్రకటించారు. వైసీపీ వాళ్లపై హత్యాప్రయత్నం జరిగిందని స్వయంగా డీఐజీయే సాక్ష్యం చెబుతుంటే అరెస్టు చేసింది మాత్రం వైసీపీ కార్యకర్తలనే! ఇంత దారుణం జరుగుతుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తు న్నట్టు? ఏదోరకంగా పాలక పార్టీని గెలిపించాలనే తాపత్రయంతో నాలుగు గ్రామాల పోలింగ్ బూత్లనే పక్క గ్రామాలకు మార్పించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఇటు వంటి మార్పులు అసాధారణం. ఈ గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో వైసీపీ అభిమానులుంటారనీ, పొరుగూరుకు వెళ్ళి ఓటెయ్యడానికి వృద్ధులూ, అనారోగ్యంతో ఉన్నవారు ఆసక్తి చూపకపోవచ్చుననీ, కనుక ప్రతిపక్షం ఓట్లు తగ్గించవచ్చనీ పాలక పార్టీ ఆలోచన కావచ్చు. స్వతంత్రంగా వ్యవహరించ వలసిన ఎన్నికల సంఘం పాలక పార్టీ ఆదేశాలకు తలూపి నిర్హే తుకమైన ఇటువంటి నిర్ణయాలను తీసుకోవడం శోచనీయం.ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు 2024లో జరిగిన సాధారణ ఎన్నికలు ఎంత ప్రహసనంగా ముగిశాయో, కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలి ఎంత అనుమానాస్పదంగా ఉన్నదో తెలియజేసే ఉదంతాలు ఒక్కొక్కటే బయటకు వస్తు న్నాయి. ఈ అంశాలపై ఇటీవల వైసీపీ ప్రతినిధి బృందం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక నివేదికను ఇచ్చింది. ఇందులో ప్రధానంగా ఈవీఎమ్ల పనితీరుపై అనుమానాలకు కారణాలను వివరిస్తూ, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ను పునరుద్ధరించే విషయాన్ని ఆలోచించాలని కోరారు. వైసీపీ బృందం ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వడానికి చాలాకాలం ముందటే ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్డీ) అనే స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా 2024 ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తీరు తెన్నులపై సునిశితమైన అధ్యయనం చేసి, 226 పేజీల నివే దికను విడుదల చేసింది. ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఆధారాలతో సహా వాటిని నివేదికలో పొందుపరిచింది. ఎన్నికల సంఘం అనుమానాస్పద వ్యవహార శైలిని కూడా ఈ నివేదిక దుయ్యబట్టింది. నివేదికను విడుదల చేయడమే కాకుండా, మరో స్వచ్ఛంద సంస్థ (ఏడీఆర్)తో కలిసి ఢిల్లీలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలను వీఎఫ్డీ వెల్లడించింది.వీఎఫ్డీ వంటి సంస్థల ఆరోపణలను ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఖండించలేకపోయింది. దానిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సాహసించలేకపోయింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలింగ్,కౌంటింగ్ తీరుతెన్నులపై ప్రముఖ సెఫాలజిస్టు ఆరా మస్తాన్ వంటి వాళ్లు కూడా నిశితమైన పరిశీలన చేసి తమ అనుమానాలను ప్రకటిస్తున్నారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనడానికి ఈ పరిశీలనలన్నీ కావలసినన్ని కారణాలను చూపెడుతున్నాయి. వాటన్నింటినీ క్రోడీకరించడం ఇక్కడ సాధ్యం కాకపోవచ్చు. కానీ నాలుగైదు ముఖ్యాంశాలను మాత్రం ప్రస్తావన చేయవచ్చు.పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు దేశవ్యాప్తంగా 4 కోట్ల 65 లక్షల పైచిలుకు ఎక్కువ ఉన్నాయనీ, దీని పర్యవ సానంగా దేశవ్యాప్తంగా 79 లోక్సభ స్థానాల ఫలితాలు తారు మారయ్యాయనీ వీఎఫ్డీ తేల్చింది. పోలింగ్ జరిగిన రోజు రాత్రి 8 గంటల తర్వాత ఈసీ విడుదల చేసిన తుది వోట్ల సంఖ్య కంటే కొన్ని రోజుల తర్వాత విడుదల చేసిన ఓట్ల సంఖ్య అసాధారణ రీతిలో పెరిగిపోవడంలోని ఔచిత్యాన్ని అది ప్రశ్నించింది. గతంలో ఎన్నడూ ఇటువంటి తేడా ఒక శాతాన్ని మించి రాలేదన్న విషయాన్ని గుర్తుచేసింది. వీఎఫ్డీ పరిశోధన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అనుమానాస్పద ఓట్ల పెరుగుదల 12.54 శాతం. 49 లక్షల పైచిలుకు ఓట్లని వీఎఫ్డీ తేల్చింది. వైసీపీ బృందం ఈసీకి సమర్పించిన నివేదికలో ఈ తేడా 51 లక్షలుగా పేర్కొంది. మొత్తం ‘లెక్కించిన’ ఓట్ల సంఖ్య నుంచీ, కూటమికి లభించిన మొత్తం ఓట్ల నుంచి ఈ ‘దొంగిలించిన’ ఓట్లను తీసివేసి లెక్కవేస్తే వైసీపీకి, కూటమికి చెరో 46 నుంచి 48 శాతం ఓట్ల వరకు వస్తాయి. 2014 ఫలితాలకు ఇది దగ్గరగా ఉన్నది. అప్పుడూ మూడు పార్టీలు కూటమిగా ఉన్నాయి. అప్పుడూ చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారు. ఇప్పుడు అంతకు మించిన హామీలను ఇచ్చారు. ఈ లెక్కలు కనీసం వాస్తవానికి కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాయి.పోలింగ్ ముగిసే సమయానికి 40–50 శాతంగా ఉన్న ఈవీఎమ్ల బ్యాటరీలు లెక్కింపు రోజున 99 శాతం ఉండటంపై చేసిన ఫిర్యాదుకు ఈసీ స్పందన విచిత్రంగా ఉన్నది. ఫిర్యాదు చేసిన ఈవీఎమ్ల జోలికి వెళ్ళకుండా కొత్త మెషీన్లతో మాక్ పోలింగ్ జరిపి చూసుకోమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినా మైక్రో కంప్యూటర్లలో నిక్షిప్తమైన అసలైన సమాచారాన్ని తనిఖీ చేయడానికి అంగీకరించలేదు. ఐదు శాతం వీవీ ప్యాట్ల లెక్కింపునకు అంగీకరించలేదు. పైగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని మార్చి, కౌంటింగ్ ముగిసిన నెలరోజుల తర్వాత సరికొత్త ఎస్ఓపీని విడుదల చేశారు. వీవీ ప్యాట్లనూ ధ్వంసం చేసి ఓడిపోయిన అభ్యర్థులు కోర్టును ఆశ్రయించకుండా వ్యూహా త్మకంగా ఈసీ వ్యవహరించింది. అన్నిటినీ మించి, బూత్ల వారీ ఓటింగ్ వివరాలతో అభ్యర్థులకు ఇవ్వవలసిన ఫామ్–20ని మూడున్నర నెలల వరకు ఎన్నికల సంఘం అప్లోడ్ చేయక పోవడం తీవ్రమైన అనుమానాలకు దారి తీసింది. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా జాతరను తలపించేవిధంగా ఓటర్లు బారులు తీరినందువల్లనే ఈ అసాధారణ పెరుగుదల అని నమ్ముదామంటే సీసీ టీవీ ఫుటేజిలను కూడా ఎన్నికల సంఘం అందుబాటులో లేకుండా చేసింది.కర్ణాటకలోని మహదేవ్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో తాము చేసిన పరిశీలన ఫలితాలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవలనే ప్రకటించారు. అవకతవకలపై పక్కా ఆధారాలను ఆయన మీడియాకు చూపెట్టారు. జరిగిన గోల్మాల్ వ్యవహారానికి ఈ అంశాలు కొత్త కోణాలు. పెద్ద ఎత్తున డూప్లికేట్ ఓట్లున్నాయనీ, ఫేక్ అడ్రస్లున్నాయనీ, ఒకే అడ్రస్పై డజన్లకొద్దీ ఓట్లున్నాయని ఆధారాలతో సహా ఆయన ప్రదర్శించారు. కొత్త ఓటర్ల నమోదుకు ఉద్దేశించిన ఫామ్–6 దుర్వినియోగంపై కూడా ఆయన సాక్ష్యాలను బయటపెట్టారు. ప్రతిపక్ష నేత ఆరోపణలపై సరైన రీతిలో స్పందించకపోగా, రాహుల్గాంధీని ప్రమాణం చేయాలని ఈసీ కోరడం ఒక విడ్డూరం. ఎన్నికల సంఘం అంపశయ్యపైకి చేరిందనీ, మన ప్రజాస్వామ్యానికి ప్రమాదం ముంచుకొస్తుందనీ అనడానికి ఈ పరిణామాలే నిదర్శనాలు. రాజకీయ వ్యవస్థలతోపాటు, ప్రజాస్వామ్య ప్రియులు, పౌర సమాజాలు గొంతెత్తి ప్రతిఘటించకపోతే మనం భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎట్టకేలకు అమెరికా–రష్యా భేటీ
ఎటుచూసినా యుద్ధాలూ, ఊచకోతలూ, దురాక్రమణలూ కనబడుతున్న వర్తమానంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర చర్చలు జరగబోతున్నాయన్న కబురు కాస్తంత ఉపశమనం కలిగిస్తుంది. అయితే అలవికాని డిమాండ్లు పెట్టడంలో, మొండి పట్టుదలకు పోవటంలో ఇద్దరికిద్దరే గనుక ఈ చర్చల వల్ల ఒరిగేదేమైనా ఉంటుందా అన్నది సందేహమే. చర్చల ఫలితం మాట అటుంచి, వాటి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ట్రంప్ ‘త్యాగం’ చేశారా అనే అనుమానాలు అందరిలో తలెత్తాయి. చర్చల తేదీలు ఖరారు కాకపోయినా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో వచ్చేవారం అధినేతలిద్దరూ సమావేశమవుతారని రెండు దేశాల అధికార వర్గాలూ ప్రకటించాయి. ఉక్రె యిన్తో కాల్పుల విరమణ పాటించాలంటూ రష్యాకు ట్రంప్ పెట్టిన గడువు శుక్రవారంతో ముగిసింది. చర్చలపై స్పష్టత వచ్చింది గనుక ఈ గడువు విషయంలో ట్రంప్ ఏం చేస్తారన్నది చూడాలి. మూడున్నరేళ్లుగా సాగిస్తున్న యుద్ధాన్ని విరమించమని అధికారంలోకొచ్చింది మొదలు తన సొంత సామాజిక మాధ్యమం ద్వారా రష్యాను బెదిరించటం తప్ప, ట్రంప్ నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టింది లేదు. ఆయన దూత స్టీవ్ విట్కాఫ్ రష్యా ఉన్నతాధికార బృందంతో నాలుగు దఫాలు చర్చించిన మాట వాస్తవమే అయినా ఒరిగిందేమీ లేదు. ట్వీట్ల ద్వారా ప్రపంచ సమస్యలు పరిష్కారం కావని ఆర్నెల్ల తర్వాత ట్రంప్కు అర్థమైనట్టుంది. అమెరికా విజ్ఞప్తి మేరకు చర్చలు జరుగుతున్నాయని రష్యా ప్రతినిధి చెప్పటం గమనించదగింది. మొన్న ఫిబ్రవరిలో వైట్హౌస్లో మీడియా సాక్షిగా ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఇష్టానుసారం మాట్లాడారు. అటు తర్వాత జెలెన్స్కీ ఉక్రెయిన్లోని విలువైన ఖనిజాలను అమెరికాకు దఖలుపరచటానికి అంగీకరించారు. ఆ తర్వాత నుంచి పుతిన్పై అమెరికా ఒత్తిళ్లు తీసుకురావటం మొదలెట్టింది. ట్రంప్లో అసహనం పెరుగుతున్నదని తెలిసినా రష్యా వెనక్కి తగ్గలేదు. పుతిన్ లక్ష్యాలు వేరు. ఉక్రెయిన్ను నాటో కూటమికి దూరంగా ఉంచటం, భవిష్యత్తులో నాటో విస్తరణ ఉండబోదన్న హామీ తీసుకోవటం వాటిల్లో ప్రధానమైనవి. రష్యా ఆగ్నేయభాగంలో పాక్షికంగా ఉక్రెయిన్ ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి వైదొలగాలని, దాంతోపాటు ఉక్రెయిన్ నుంచి తమ దళాలు చేజిక్కించుకున్న డొనెట్స్క్తో పాటు మరో నాలుగు ప్రాంతాలూ, 2014లో తాము ఆక్రమించిన దక్షిణ క్రిమియా ద్వీపకల్పం రష్యాకే చెందుతాయని గుర్తించాలని పుతిన్ కోరుకుంటున్నారు. మొత్తంగా ఉక్రెయిన్కి చెందిన 1,719 చదరపు కిలోమీటర్ల భూభాగం రష్యా ఆక్రమణలో ఉంది. పుతిన్తో సమావేశానికి ట్రంప్ ఎంత తహతహలాడుతున్నారో తాజా పరిణామాలు తెలియజెబుతున్నాయి. అమెరికా, రష్యాల మధ్య ద్వైపాక్షిక చర్చలు కాకుండా, జెలెన్స్కీని కూడా కలుపుకొని త్రైపాక్షిక చర్చలైతేనే సమస్య పరిష్కారం తేలికవుతుందని అమెరికా ప్రతిపాదిస్తూ వచ్చింది. అయితే ఇందుకు రష్యా సుముఖంగా లేదు. ముందు అమెరికా, రష్యాల మధ్య చర్చలు జరిగి, అవి సత్ఫలితాన్నిచ్చాకే త్రైపాక్షిక సమావేశం సంగతి చూడొచ్చని అది చెబుతోంది. కానీ ఇందుకు జెలెన్స్కీ మొదటి నుంచీ వ్యతిరేకం. రష్యా దాడుల పర్యవసానంగా నష్టపోయేది తామైతే... చర్చల్లో తమ ప్రమేయం లేకపోవడమేమిటన్నది ఆయన ప్రశ్న. కానీ నెలలు గడిచాక ఆయన వైఖరి మారింది. శిఖరాగ్ర సమావేశాన్ని స్వాగతిస్తూ తాజాగా జెలెన్స్కీ ట్వీట్ చేశారు. ఆయనకు అంతకన్నా గత్యంతరం లేదు.అమెరికా, రష్యాల మధ్య చివరిగా జో బైడెన్ హయాంలో 2021లో శిఖరాగ్రం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకే పుతిన్ దండయాత్ర మొదలైంది. ఆర్నెల్లుగా చర్చలకు ప్రయత్నాలు చేస్తున్నా ఫలించని నేపథ్యంలో ఇప్పుడెలా సాధ్యమైందన్న ప్రశ్నకు రెండు పక్షాల నుంచీ జవాబు లేదు.ఈ శిఖరాగ్ర సమావేశం తర్వాత ఉక్రెయిన్ను కూడా కలుపుకొని త్రైపాక్షిక చర్చలు సాగిస్తామనిఅంటున్నా అందువల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. ఘర్షణలకు మూలకారణం నాటో కూటమి, దాన్ని ప్రోత్సహించిన అమెరికా. ఉక్రెయిన్లో 2014లో ప్రజామద్దతుతో ఎన్నికైన అధ్యక్షుడు విక్టర్ యెనుకోవిచ్ రష్యాతో సన్నిహితంగా ఉండటాన్ని సహించలేని అమెరికా, నాటోలు... అక్కడ అల్లర్లు రెచ్చగొట్టి ప్రజావిప్లవం సాకుతో ఆయన దేశం విడిచిపోయేలా చేశాయి. అటు తర్వాత జెలెన్స్కీ దేశాధ్యక్షుడయ్యారు. నాటో ప్రాపకంతో రష్యాతో గిల్లికజ్జాలకు దిగింది జెలెన్స్కీయే. కనుక నాటో కూటమి, దాని ద్వారా కథ నడిపించిన అమెరికా తమ వైఖరులు మార్చుకోక తప్పదు. అధినేతగా దేశ ప్రయోజనాల కోసం పాటుబడాలి తప్ప అగ్రరాజ్యాల చేతుల్లో పావుగా మారకూడదని తాజా పరిణామాల తర్వాతైనా జెలెన్స్కీ గ్రహించాల్సి ఉంది. -
విచక్షణ మరిచిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు తన మాట వినని దేశాలపై తోచిన మోతాదులో సుంకాలు వేయటం నిత్యకృత్యమైంది. ఈ క్రమంలో న్యాయం, ధర్మం, విచక్షణ, హేతుబద్ధత వగైరాలు లేవు. రెండోసారి దేశాధ్యక్షుడైనా తమ దేశం ఎవరెవరితో ఏ స్థాయి వాణిజ్యం నెరపుతున్నదో తెలియని ట్రంప్... వేరే దేశాలు ఎవరితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకోవాలో, వద్దో నిర్ణయించటానికి తగుదునమ్మా అంటూ తయారయ్యారు. ఈనెల 1 నుంచి మన దేశంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు లోగడ ప్రకటించిన ట్రంప్, వారం తిరగకుండానే మరో 25 శాతం మేర సుంకాలుంటాయని తాజాగా నిర్ణయించారు. ఇవిగాక పరోక్ష సుంకాలు మొదలవు తాయట. ఇవన్నీ 250 శాతం దాటినా దాటొచ్చని లోగడే ఆయన సెలవిచ్చారు. తన మాట నెగ్గటానికి కనిపించిందల్లా విసిరికొట్టే అల్లరిపిల్లల మొండిధోరణికీ, ట్రంప్ చేష్టలకూ తేడా ఉందా? తనకు రష్యా నచ్చలేదు గనుక ఆ దేశం నుంచి ముడి చమురు కొనరాదని ఆయన శాసిస్తున్నారు. ఉక్రెయిన్తో జగడం ఆపేయాలని పదే పదే కోరుతున్నా వినని రష్యా అధ్యక్షుడు పుతిన్పై అక్కసుతో ఇవన్నీ చేస్తున్నట్టు అందరికీ కనబడుతోంది. కానీ అసలు కారణాలు వేరు. నిజానికి రష్యా చమురు కొని ప్రపంచమార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడమని గతంలో చెప్పింది అమెరికాయే!ప్రేమాభిమానాలను అపాత్రదానం చేయకూడదు. ట్రంప్ వ్యవహారశైలి చూచాయగా తెలుస్తున్నా, తొలి దఫాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారు. దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు సానుకూలత అవసరమే. కానీ దానికి కూడా అవధులుంటాయి. 2019 సెప్టెంబర్లో అమెరికాలోని టెక్సాస్లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమమైనా,ఆ మరుసటేడాది ట్రంప్ భారత్ సందర్శించినప్పుడు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ అయినా దౌత్య పరిమితులు దాటాయన్న విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం సంగతి సరే... పౌరులు కూడా ఆ మాదిరే ఉన్నారు. అమెరికాలోని కొందరు ఎన్నారైలు ఆయన దేశాధ్యక్షుడు కావాలని యజ్ఞయాగాదులు చేశారు. అంతేకాదు... ప్యూ రీసెర్చ్ సంస్థ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రపంచ వ్యవహారాల్లో ట్రంప్ వ్యవహారశైలిపై 24 దేశాల్లో 28,333 మందిని సర్వే చేస్తే సగం మంది భారతీయులు ఆయనపై విశ్వాసం వ్యక్తపరిచారట. ఆ సంగతి అప్పట్లో ఆ సంస్థ ప్రకటించింది. టర్కీ, జర్మనీ, మెక్సికో లాంటి దేశాల్లో మాత్రం అత్యధికులు (80 శాతం పైగా) ట్రంప్పై నమ్మకం లేదని తెలిపారు. ఈ ఫలితాల్లో మనం హంగేరి, ఇజ్రాయెల్, నైజీరియా, కెన్యాల సరసన చేరాం.అయితే ట్రంప్ వికృత విన్యాసాలు గమనించాక మోదీ ఆయన విషయంలో దృఢవైఖరి ప్రదర్శిస్తున్నారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అన్నదాతల, మత్స్యకారుల ప్రయోజనాలను విస్మరించే ప్రశ్నే లేదని గురువారం ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. ఇందుకు వ్యక్తిగతంగా మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధమేనన్నారు. మోదీ, ట్రంప్ల మైత్రి గురించి ఉన్న అభిప్రాయంతో సుంకాల ఒప్పందంలో అమెరికాదే పైచేయి అవుతుందనుకున్న మన విపక్షాలకు ఇది నిరాశ కలిగించే పరిణామమే. దేశంలో 70 కోట్లమంది ప్రజానీకం ఆధారపడి బతికే రంగాలను విదేశాలకు గంపగుత్తగా అప్పగించే దుస్సాహసం ఎవరైనా చేయగలుగుతారా? పైగా అవి జన్యుమార్పిడి చేసినవి. ఆ చెత్త మన మార్కెట్లను ముంచెత్తితే కలిగే దుష్పరిణామాల గురించి చాన్నాళ్లుగా పర్యావరణవాదులు చెబుతూ వచ్చారు. తమ సాగు, పాడి ఉత్పత్తులపై అసలు సుంకాలే విధించరాదన్నది ట్రంప్ ఆంతర్యం. ఆశపడటం సహజం... కానీ అది దురాశగా మార రాదని ఆయన గారికి చెప్పేదెవరు? ‘జీరో’ సుంకాల సంగతి బహిరంగంగా చెబితే నలుగురూ నోళ్లు నొక్కుకుంటారని ట్రంప్ భయపడి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ, రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలన్న రాగం అందుకున్నారు. ఏ సరుకు ధరైనా మార్కెట్ శక్తులు నిర్ణయించే వర్తమానంలో రష్యా నుంచి చవగ్గా కొనరాదని, దాన్ని హెచ్చు ధరకు అమ్మ రాదని ఆంక్షలు విధించాలని చూడటం ట్రంప్ తెలివితక్కువతనం. అమెరికా ఇన్నాళ్లూ ప్రవచించిన ప్రపంచీకరణకు వ్యతిరేకం. పైగా చైనాతో పోలిస్తే మన ముడిచమురు కొనుగోళ్లు తక్కువ. అయినా ఆ దేశంపై ట్రంప్ సానుకూలంగా ఉన్నారు.ట్రంప్ పాత, కొత్త సుంకాలు అమలైతే భారత్ జీడీపీపై 0.6 శాతం ప్రభావం పడుతుందని ప్రముఖ మదుపు సంస్థ గోల్డ్మాన్ శాక్స్ ప్రకటించింది. ఇదిగాక వాణిజ్య అనిశ్చితి వల్ల పరోక్ష ప్రభావం ఉండొచ్చని ఆ సంస్థ చెబుతోంది. మొత్తానికి ట్రంప్ ఇదే మంకుపట్టుతో ఉంటే మనకు ఏదోమేర సమస్యలుండక తప్పదు. ఈ వైరం మనం కోరుకున్నది కాదు. అయినా వచ్చి పడింది. కనుక కలిసికట్టుగా ఉండి ఎదుర్కొనటమే ఏకైక మార్గం. -
జలప్రళయం
ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, ఎంతగా ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తున్నా బేఖాతరు చేస్తున్న మనిషిపై ప్రకృతి మరోసారి తన విశ్వరూపాన్ని చూపింది. దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్లోని ధరాలీ గ్రామంపై మంగళవారం ఉవ్వెత్తున విరుచుకుపడిన వరద అక్కడి ఇళ్లూ, హోటళ్లూ, రెస్టారెంట్లూ, దుకాణాలూ వగైరాలను ఊడ్చిపెట్టేయగా దాదాపు వందమంది ఆచూకీ తెలియటం లేదని వార్తలొస్తున్నాయి. హార్సిల్ ప్రాంతంలో ఉన్న సైనిక శిబిరం కొట్టుకుపోగా అందులోని పదిమంది జవాన్ల ఆచూకీ తెలియటం లేదు. కుంభవృష్టితో ఖీర్గంగా నది పోటెత్తి ఇంత విలయానికి దారితీసింది. ఆకస్మిక వరదకు అరగంట ముందే ధరాలీ మార్కెట్ ప్రాంతానికి విరిగిపడ్డ కొండచరియలు, బురద కొట్టుకొచ్చాయనీ, అంతలోనే భారీయెత్తున వరదనీరు విరుచుకుపడిందనీ స్థానికుల కథనం. ఆత్మరక్షణ కోసం సమీపంలోని కొండపైకి ఎక్కినవారికి ఖీర్గంగ పెనుగర్జన వినబడిందంటే ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కేవలం 15 సెకన్ల వ్యవధిలోనే ఈ జలప్రళయం విరుచుకుపడింది. ప్రకృతి విలయం సంభవించినప్పుడల్లా ఎన్నో విషాద ఘట్టాలు ఆవిష్కృతమవుతాయి. ఇకపై అత్యంత జాగ్రత్తగా మెలగాలన్న సంకల్పమూ వినబడుతుంది. నెలలు కాదు... రోజులు గడిచేసరికే అదంతా మరుగునపడుతుంది. పర్యావరణాన్ని బేఖాతరు చేస్తూ నిర్మాణాలు మొదలవుతాయి. నదుల్ని దేవతలుగా కొలిచే సంప్రదాయం మనది. అయినా వాటికి అవరోధం కలిగించే నిర్మాణాలైనా, వాటిని కాలుష్యంలో ముంచే కర్మాగారాలనైనా అనుమతించరాదన్న గ్రహింపు పాలకులకు లేదు. గంగానదిని మాఫియాల బారి నుంచి కాపాడాలంటూ 2011లో ఉపవాసదీక్షకు పూనుకున్న స్వామి నిగమానంద ప్రాణత్యాగం చేసినా పాలకుల వైఖరిలో మార్పు లేదు. ఉత్తరాఖండ్కు విపత్తులు కొత్తగాదు. దశాబ్దాలుగా ఇంచుమించు ఏటా రివాజుగా వరదలొస్తాయి. గ్రామాలకు గ్రామాలు వరదనీటిలో చిక్కుకుంటాయి. కొన్నిసార్లు పెద్దగా సమస్యలేమీ లేకుండా ముగుస్తుంది. 2013లో సంభవించిన విలయం ఏకంగా 6,000 మందిని బలి తీసుకుంది. అంతకు ముందూ తర్వాతా కూడా పదుల నుంచి వందలమంది వరకూ మృత్యువాత పడిన సందర్భాలున్నాయి. అభివృద్ధి ముసుగులో ప్రకృతినీ, పచ్చటి ప్రాంతాలనూ ధ్వంసం చేయటం... వేర్వేరు ప్రాజెక్టులకు ఎడాపెడా అనుమతులీయటం మన దేశంలో పాలకులకు అలవాటైన జాడ్యం. ఇప్పుడు ఉత్తరాఖండ్లో వరదలొచ్చిన ప్రాంతం భాగీరథి పర్యావరణ జోన్ పరిధిలో ఉంది. దాన్ని అత్యంత జాగ్రత్తగా పరిరక్షించాల్సిన ప్రాంతంగా గుర్తించారు. 4,157 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఆ జోన్ను 2012లో నోటిఫైడ్ ప్రాంతంగా పరిగణించారు. అక్కడ జరిగే విచక్షణారహిత అభివృద్ధిని నియంత్రించటానికి ఉద్దేశించిన ఈ చర్య ఆచరణలో ఎందుకూ కొరగాకుండా పోయింది. నదులూ, ఉపనదుల సమీపంలో నిర్మాణాలు ఉండరాదన్న ఇంగితజ్ఞానం ఎవరికీ లేదు. ప్రతిష్ఠాత్మకమైన చార్ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టు సైతం ఆ ప్రాంతంలోనే ఉంది. పర్యావరణ ఉద్యమకారులు న్యాయ స్థానాల్లోనూ, వెలుపలా పోరాడినా... చివరకు ప్రభుత్వానిదే పైచేయి అయింది. ఏడాదిక్రితం 34వ జాతీయరహదారిపై హినా–టెక్లాల మధ్య నిర్మించతలపెట్టిన బైపాస్ రోడ్డు గురించి కూడా ఆందోళనలు జరిగాయి. ఆ ప్రాంతం ధరాలీకి దక్షిణంగా ఉంది.ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అమరికలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ధ్రువ ప్రాంతాల్లో, హిమపర్వతశ్రేణిలో మాత్రమే కుంభవృష్టి, ఆకస్మిక వరదలు ఉండేవి. అలాంటి రాతినేలలకు వరద నీటిని పట్టివుంచే గుణం తక్కువ. నిమిషాల వ్యవధిలో వరదలు పోటెత్తుతాయి. కొండచరియలు విరిగిపడి ముప్పును మరిన్నిరెట్లు పెంచుతాయి. పర్యావరణంలో వచ్చిన మార్పుల పర్యవసానంగా ప్రకృతి వైపరీత్యాలకు ఏ ప్రాంతమూ అతీతం కాని స్థితి వచ్చేసింది. వాతావరణాన్ని కొలవటానికి ఉపయోగించే నమూనాలు, ఉపకరణాలు ఒక్కోసారి విఫలం కావటానికి మారిన స్థితిగతులే కారణం. వేడిగాలులు ఎక్కువ తేమను పట్టి ఉంచుతాయి. ఒక డిగ్రీ ఉష్ణోగ్రత హెచ్చితే తేమ ఏడు శాతం పెరుగుతుందనీ, దీనికి అధికశక్తి ఉంటుందనీ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణంలో తేమ పెరిగినకొద్దీ వేడిగాలుల వల్ల ఆకస్మిక కుంభవృష్టికి అనువైన పరిస్థితులేర్పడతాయి. అందుకే ఉత్తరాఖండ్ వంటిచోట్ల మాత్రమే కాదు... అన్నిచోట్లా పర్యావరణాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటూ దానికి విఘాతం కలగనీయని రీతిలో ఆచరణ ఉండాలి. కానీ పట్టించుకునేదెవరు? అందుకే ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలు మారాలి. పర్యావరణానికి విఘాతం కలిగించే అవకాశమున్నదని భావించే ఎలాంటి ప్రాజెక్టునైనా నిస్సంకోచంగా తిరస్కరించాలి. ఇప్పుడొచ్చిన ఉత్పాతం ఆఖరిది కావాలి. -
ఈ సంక్షోభాన్ని దాటేదెలా?
రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలంటూ వరస బెదిరింపులతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ను లొంగదీసుకోవాలని చూస్తున్న తరుణంలో మన విదేశాంగ శాఖ తొలిసారి నేరుగా బదులీయటం కీలక పరిణామం. దీనికి రెండురోజుల ముందు స్థానిక తయారీ ఉత్పత్తుల్ని, సరుకుల్ని కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. అమెరికాలో గత కొన్ని దశాబ్దాలుగా అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చిన అస్తవ్యస్త విధానాల పర్యవసానంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి ట్రంప్ అమలుచేసిన తప్పుడు నిర్ణయాలు తోడై ఆర్థికవ్యవస్థను ఊపిరాడకుండా చేస్తున్నాయి. వాటి నుంచి బయటపడటం కోసం ఆయన ప్రపంచ దేశాలపై ఆర్థిక దండయాత్ర మొదలుపెట్టారు. చైనాపై 145 శాతం సుంకాల మోత మోగించటంతో మొదలుపెట్టి తన సన్నిహిత దేశాలపై సైతం దాదాపు 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించి, అనంతరకాలంలో వెనక్కితగ్గారు. ఈ దశలో ఆయన మన జోలికి రాలేదు. మోదీతో 2016 నుంచీ ఉన్న సాన్నిహిత్యంతో ఆయన తాను చెప్పినట్టు వింటా రని ట్రంప్ భ్రమపడ్డారు. తీరా కథ అడ్డం తిరిగేసరికి ఆగ్రహోదగ్రుడవుతున్నారు. అందుకే కావొచ్చు... జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండొనేసియాలపై 15–20 శాతంమధ్య సుంకాలు విధించిన పెద్ద మనిషి మన దగ్గరకొచ్చేసరికి ఇప్పటికే విధించిన 25 శాతం సుంకాలతోపాటు రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు ఆపకపోతే మరిన్ని రెట్లు పెంచుతానని హెచ్చరించారు. స్వదేశంలో సంపన్నులకూ, పారిశ్రామికవేత్తలకూ లక్షల కోట్ల డాలర్ల పన్ను రాయితీలు ప్రకటించి, ప్రపంచ దేశాలపై అదనపు సుంకాలు విధించటం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలన్నది ఆయన పథకం. దీన్ని చూసీచూడనట్టు వూరుకుంటే ఈ బాణీయే కొనసాగిస్తారు. అమెరికా పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఎవరికీ తెలియనివి కాదు. కానీ ట్రంప్ మరింత నిస్సిగ్గుగా వాటిని ఆచరిస్తున్నారు. ఒకపక్క తమ అణు పరిశ్రమలకు కావాల్సిన యురేనియం హెక్సాఫ్లోరైడ్ అయినా, విద్యుత్ వాహనాల తయారీలో అవసరమైన ప్లాటినం రకానికి చెందిన రసాయన మూలకం పలాడియం, ఎరువులు, రసాయనాలు వంటివి రష్యా నుంచి ఇప్పటికీ దిగుమతి చేసుకుంటూ... మనం మాత్రం ముడి చమురు కొనకూడదని శాసిస్తున్నారు. అందుకే మోదీ స్వదేశీ ఉత్పత్తుల్నీ, సరుకులనూ కొనటం అత్యవసరమని ప్రజలకు పిలుపునిచ్చారు. వర్తమాన తరుణంలో స్వదేశీ నినాదం సరైనది. అయిదేళ్లక్రితమే మోదీ ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చేసిందేం లేదు. అంతక్రితం ఉన్న యూపీఏ ప్రభుత్వం గురించి చెప్పనవసరం లేదు. గతంలో ప్రణాళికా సంఘం, ఇప్పుడు నీతి ఆయోగ్... అలాగే సాంకేతిక నిపుణుల మాట చెల్లుబాటవుతూ వచ్చింది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ ఈ విషయంలో ప్రభుత్వాన్ని గతంలో పలుమార్లు తీవ్రంగా తప్పుబట్టింది. కానీ మారిందేమీ లేదు.ట్రంప్ ఒక్కరే కాదు...బ్రిటన్, ఈయూలు సైతం తమ వినియోగవస్తువులపై, యంత్ర పరిక రాలపై సుంకాలు తగ్గించమంటున్నాయి. అందుకు తలొగ్గితే మన సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) దెబ్బతింటాయి. అమెరికా ఒత్తిళ్లకు లొంగితే మన సాగు రంగం, పాడి పరిశ్రమ రంగం ఇబ్బందుల్లో పడతాయి. ఆ రెండు రంగాలపైనా 70 కోట్లమంది ప్రజానీకం ఆధారపడతారు. ఇవిగాక జన్యుమార్పిడి చేసిన మొక్కజొన్న, సోయాబీన్స్ దిగుమతి చేసు కోవాలని అమెరికా కోరుకుంటోంది. ఇది ప్రమాదకరం. వాటి సంగతలావుంచి వర్తమాన అనిశ్చిత వాతావరణంలో మనమే కాదు...దేశాలన్నీ ఆత్మరక్షణ బాటపట్టాయి. తమ దేశానికొచ్చే విదేశీ సరుకుపై అధిక సుంకాలు విధించటం, విదేశాలకు ఎగుమతయ్యే తమ సరుకుకు తక్కువ సుంకాల కోసం ఒత్తిళ్లు తీసుకురావటం రివాజైంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండ క్టర్లు, రక్షణ, సౌరశక్తి రంగాలకు పెద్దయెత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాల్సివుంది. పెంచిన సుంకాల పరిధిలో ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు వగైరాలను ట్రంప్ మినహాయించారు. ‘జాతీయ ప్రయోజనాల రీత్యా’ ఈ నిర్ణయం తీసుకున్నారట. కానీ ఆ ఉత్పత్తుల ధరల్ని పెంచటం ద్వారా అదనపు రాబడికి వ్యూహరచన చేస్తే అమెరికా సృష్టించదల్చుకున్న సంక్షోభంనుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే వాటికి మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తేనే ఇదంతా సాధ్యం. ఇప్పటికే స్వావలంబన దిశగా అడుగులేసివుంటే వేరుగా వుండేది. ఇప్పటికిప్పుడు తీసుకునే చర్యల నుంచి వెంటనే ఫలితాన్ని ఆశించలేం. ఈలోగా అమెరికా కోరుతున్నదేమిటో, మన తిరస్కరణకు కారణమేమిటో పార్లమెంటు వేదికగా తేటతెల్లం చేయాలి. అది జరిగితేనే ప్రజలు మరింత దృఢంగా మద్దతిస్తారు. -
ప్రజ్వల్కు సరైన శిక్ష
డబ్బూ పలుకుబడీ జతగూడితే ఎన్ని నేరాలకు కారణమవుతుందో, ఎన్ని వికారాలకు ఆస్కార మిస్తుందో దాదాపు ఇరవయ్యేళ్లక్రితం అమెరికాలో ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టిన్ ఉదంతం రుజువు చేసింది. ఈ రెండింటికీ రాజకీయాధికారం తోడైతే ఏమవుతుందో కర్ణాటక జేడీఎస్ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ నిరూపించారు. ఒక మహిళపై అత్యా చారం చేసిన కేసులో ప్రజ్వల్కు యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజ్వల్ ఒక రాజకీయ నాయకుడే కాక మాజీ ప్రధాని దేవె గౌడకు మనుమడు కావటం, తండ్రి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవడం, అతని బాబాయ్ కుమార స్వామి లోగడ ముఖ్యమంత్రిగా పనిచేయటంతోపాటు ప్రస్తుతం కేంద్రమంత్రిగా వుండటం, తమ్ముడు ఎమ్మెల్సీ కావటం వంటివి ఈ సంచలనానికి కారణమైతే కావొచ్చు గానీ... అంతకన్నా ఎక్కువగా ప్రజ్వల్ దురంతాలు ప్రజల్ని దిగ్భ్రాంతిపరచటం అసలు కారణం. ఒకరు కాదు... ఇద్దరు కాదు, పదులకొద్దీ మంది ప్రజ్వల్ అఘాయిత్యాలకు బలైపోయారు. అతని ఘోరాలకు సంబంధించి 3,000 వీడియోలు ప్రచారంలోకొచ్చాయంటే అతని దుర్మార్గం ఎంతటిదో ఊహించవచ్చు. తమనేమీ చేయొద్దని, కనికరించి వదిలేయాలని బాధిత మహిళలు వేడు కోవటం వంటి హృదయవిదారక దృశ్యాలు ఈ వీడియోల్లో ఉన్నాయంటున్నారు. తన ఘన కార్యాన్ని తానే వీడియో తీసి బాధితుల్ని బ్లాక్మెయిల్ చేయటం ప్రజ్వల్కు అలవాటు. ఆ వీడియోలు, ఫొటోలు చూసి 70 మంది బాధిత మహిళలను గుర్తించగలిగినా వారిలో కేవలం అయిదుగురు మాత్రమే ఫిర్యాదులీయటానికి ముందుకొచ్చారు. అందులో ఒక కేసులో ప్రస్తుతం ప్రజ్వల్కు శిక్షపడింది. ఈ నేరాలు గుట్టుచప్పుడు కాకుండా జరగలేదు. కుటుంబంలో వీటికి సంబంధించి తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధాలవుతున్నాయని మీడియాలో కథనాలొచ్చాయి. కానీ ప్రజ్వల్ను చట్టానికి అప్పగించాలని కుటుంబంలో ఏ ఒక్కరూ భావించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతే కాదు... ప్రజ్వల్ తల్లిదండ్రులు బాధితుల్ని బెదిరించిన వైనం వెల్లడైంది. శిక్ష తప్పదనుకున్న ప్రజ్వల్ కొన్నాళ్లు విదేశాలకు పరారయ్యాడు. చిత్రమేమంటే ఇతర పార్టీలకు సైతం ఉప్పందినా అవి సైతం మౌనంగానే ఉన్నాయి. చివరకు ఒక మహిళా సంఘం ఫిర్యాదు చేయాల్సివచ్చింది. మరి పార్టీలున్నది దేనికి? ఆ ఫిర్యాదుపై రాష్ట్ర మహిళా కమిషన్ వేగంగా స్పందించి, డీజీపీకి ఆదేశాల్విటంతో అంతా బయటికొచ్చింది. రాజకీయంగా శక్తిమంతమైన కుటుంబంతో ఢీకొట్టి నట్టవుతుందని భయపడి బాధితుల్లో అత్యధికులు ఫిర్యాదు చేయటానికి ముందుకు రాలేదు సరి కదా... వారిలో చాలామంది ఏకంగా హసన్ నగరం నుంచి మకాం మార్చేశారు. ప్రఖ్యాత అమెరికన్ క్రిమినాలజిస్టు ఫ్రెదా అడ్లర్ ఒక సందర్భంలో బాధితులే దోషులుగా మారే ఏకైక నేరం అత్యాచారమేనన్నారు. బాధితులు ఎందుకంత భయపడ్డారో ఈ వ్యాఖ్యే చెబుతుంది. విచారణ పేరిట నిండు న్యాయస్థానంలో అవమానాలు పొంది, న్యాయమూర్తి నుంచే దుర్వా్యఖ్యానాలు ఎదురైన మహిళలు తక్కువేమీ కాదు. ఇందుకు మన దేశం కూడా మినహాయింపు కాదు.ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించి డీఎన్ఏ ఆధారాలతో సహా పకడ్బందీ సాక్ష్యాధా రాలు సేకరించినందుకు, త్వరితగతిన విచారణ పూర్తికావటానికి దోహదపడినందుకు కర్ణాటక పోలీసు విభాగాన్ని అభినందించాలి. ప్రజ్వల్ ఉదంతంలో వీడియోలను ప్రచారంలో పెట్టి బాధితుల్ని మరింతగా వేధించిన ఇతరులను సైతం బోనెక్కించాలి. డబ్బూ, పలుకుబడి గల నిందితు లకు శిక్ష పడేలా చేస్తే, సమాజంలో ఇతరులూ భయపడతారు. కర్ణాటకలో గతంలో కూడా కొందరు నాయకుల ఉదంతాలు వెల్లడైనా అవి పోలీసుల వరకూ రాలేదు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో అభ్యంతరకర వీడియోలు వీక్షిస్తూ ఎమ్మెల్యేలు లైవ్ కెమెరాలకు చిక్కిన సందర్భాలు న్నాయి. బలహీనులపై అధికారం చలాయించటం, వారిని కనీసం మనుషులుగా గుర్తించక పోవటం స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా మన దేశంలో యథేచ్ఛగా సాగిపోతోంది. ఆ బలహీనులు మహిళలైతే ఇక చెప్పేదేముంది? వందలమంది బాలికలపైనా, మహిళలపైనా లైంగిక నేరాలకు పాల్పడిన ఎపిస్టిన్ 2019లో న్యాయ విచారణ మొదలుకావడానికి ముందే నిర్బంధంలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతగాడికి ఒకప్పుడు సన్నిహితులైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటిష్ రాజవంశీకుడు ప్రిన్స్ ఆండ్రూ తదితరుల్ని ఆ పాపం ఇప్పటికీ వెన్నాడుతోంది. ట్రంప్ అయితే తరచూ సంజాయిషీ ఇచ్చుకోక తప్పడం లేదు. మన దేశంలో కూడా మహిళలపై నేరాలు చేసే బడాబాబులు కటకటాల వెనక్కిపోయినప్పుడే నిజమైన న్యాయం, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్టు లెక్క! -
యాభై ఏళ్ల షోలే
థియేటర్లోని ప్రేక్షకులు సీటు కిందకు తల ఒంచి అటూ ఇటూ వెతికారు... కాయిన్ ఇక్కడెక్కడైనా పడిందా అని. ‘షోలే’ క్లయిమాక్స్లో అమితాబ్ మరణించాక అతని చేతిలోని కాయిన్ చూసి ధర్మేంద్ర షాక్ అవుతాడు. ఆ కాయిన్ కు రెండు వైపులా ‘హెడ్స్’ ఉంటుంది. ఇంతకాలం తన ప్రాణమిత్రుడు దొంగటాస్ వేసి మోసం చేశాడని, ఇవాళ అదే టాస్తో తనను కాపాడితాను మరణించాడని గ్రహించి, ఆగ్రహంతో కాయిన్ ని విసిరి కొడతాడు. అది గల్గల్మంటూ థియేటర్లోనే ఎక్కడో పడుతుంది. ఒక క్షణం ప్రేక్షకులు దాని కోసం అటూఇటూ వెతుకుతారు. ఎందుకంటే అందాక వారికలాంటి అనుభూతి తెలియదు. స్టీరియోఫోనిక్ వల్ల వచ్చింది. షోలేను షోలే అభిమానులు స్టీరియోఫోనిక్ థియేటర్ వెతుక్కుంటూ నగరాలకు వెళ్లి చూశారు. 70 ఎం.ఎంలో చూశారు. స్కోప్లో చూశారు. 35 ఎం.ఎం.లో చూశారు. చిన్న ఊళ్లలో నిడివి కుదించి జయభాదురి ఫ్లాష్బ్యాక్ లేని వెర్షన్ రిలీజ్ చేస్తే అదీ చూశారు. దూరదర్శన్ లో చూశారు. కేబుల్ టీవీలో చూశారు. యూ ట్యూబ్లో చూశారు. ఓటిటిలో చూశారు. యాభై ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. షోలే అభిమానులది వేరే లెవల్.ఆడే సినిమాలు ఆడదగ్గ రీతిలో తీస్తే ఆడతాయి. సెట్స్ వల్ల, విఎఫ్ఎక్స్ వల్ల, భారీ బడ్జట్ వల్ల, ముహూర్తబలం వల్ల ఆడవు. ఆడదగ్గ రీతిలో కథ అనుకుని ఇవన్నీ కలిపితే ఆడొచ్చు. షోలే సినిమా తొలిషాట్ తీయడం కుదరలేదు. వాన. ముహూర్తం అప్సెట్ అయ్యింది. రెండోరోజు తెల్లచీర కట్టుకుని వితంతువు పాత్రలో ఉన్న జయభాదురి అమితాబ్కు ఇనప్పెట్టె తాళాలు ఇవ్వడం ఫస్ట్షాట్గా తీశారు. దక్షిణాది సినీచరిత్రలో నేటి వరకు వితంతువు పాత్రపై ముహూర్తం షాటు తీసిన దాఖలా లేదు. అలా తీస్తే ఫ్లాప్ అవుతుందా? అలా తీయకపోతే హిట్ ఏమైనా అయ్యిందా? తాము చేసే దుర్మార్గాలకు, దోపిడీలకు దైవబలాన్ని తోడు అడగడం కూడా షోలే తీసేసింది. గబ్బర్ సింగ్ ఒక్కనాడు కూడా కాళీమాత విగ్రహం ఎదుట ప్రమాణం చేసి దోపిడీకి బయలుదేరడు. అప్పటి వరకూ హిందీ సినిమాలలోని బందిపోట్లు అందరూ కాళీమాత బలాన్ని తోడు అడిగేవారే.సమాజం చెడ్డను భరించగలదుగానీ మరీ దారుణమైన చెడ్డను సహించలేదు. ఆ చెడ్డను పరిహరించడానికి మెరుగైన చెడ్డనైనా శరణుజొచ్చడానికి వెనుకాడదు. గబ్బర్ సింగ్ అఘాయిత్యాలు పట్టనలవి కానప్పుడు అంత చెడ్డవాణ్ణి నిర్మూలించడానికి కొంచెం చెడ్డవాళ్లను నియమిస్తారు. వీరు, జయ్ చిల్లర దొంగలే గాని వారిలో బహాదూరి ఉంది. మానవత్వం కూడా ఉంది. ఊరు వారిని ఆదరిస్తుంది. వర్తమానంలో కరడుగట్టిన నేరస్తుల శిక్షకు పోలీసులు ఎన్ కౌంటర్ అనే చెడ్డమార్గం ఎంచుకుంటే ప్రజలు ఆదరించడం ఇలాంటిదే కావచ్చు. వ్యక్తిగత ఆగ్రహాన్ని సామాజికస్థాయికి తీసుకెళ్లమని షోలే చెబుతుంది. గబ్బర్ సింగ్ వల్ల ఠాకూర్ తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయాడు. గబ్బర్ని శిక్షించడం వ్యక్తిగతమైన కక్షే... కాని అందులో సామాజిక న్యాయం ఉంది. ఇవాళ సగటు మనిషి తన నెత్తిన పన్నులు పడుతున్నా, తన ప్రమేయం లేకుండా కుల, మత, పార్టీల జంజాటంలో పడుతున్నా, తన సంపాదనను స్కూళ్లు, హాస్పిటళ్లు బట్టలిప్పించి దోచుకుంటున్నా, చిల్లర జీతాలతో సంస్థలు గాడిద చాకిరీ చేయిస్తున్నా, న్యాయం కోసం ఏళ్లకేళ్లు అంగలార్చాల్సి వస్తున్నా కిమ్మనడం లేదు... శాపనార్థాలు పెట్టుకోవడం తప్ప. ఎలుక శాపం పిల్లికి తగలదు. ఠాకూర్లా కార్యాచరణకు దిగితే, ఒకరొకరుగా కదిలి ఊరు మొత్తం గబ్బర్ అంతు చూసినట్టు సమస్య అంతు చూడొచ్చు. దురదష్టవశాత్తు జనంలో అది పూర్తిగా పోయింది.షోలేలోని మహిళలు ధీర వనితలు. గబ్బర్ను ధిక్కరించే బసంతి గాని, పరిస్థితులకు చలించక స్థైర్యం చూపే ఠాకూర్ కోడలుగాని ‘ఊ అంటావా మావా... ఉఊ అంటావా’ తరహా కాదు. షోలే కథ ‘రేప్’ సీన్ కు చోటివ్వలేదు. నేడులా బడ్జెట్లో సగాన్ని బకెట్ల బకెట్ల బ్లడ్కు కేటాయించే పని లేకుండా రక్తమే చూపలేదు. కొండలు, గుట్టలు, పచ్చదనం ఉన్న బెంగళూరు సమీపంలోని రామ్నగర్ అనే చోట షూటింగ్ చేయడం తప్ప షోలే చేసిన సర్కస్ ఏదీ లేదు. షోలే మానవ ఉద్వేగాల మేజిక్. కెమెరా, సంగీతం, మాట, పాత్ర, దర్శకత్వం... వీటిని ఎంత మేలిమి నైపుణ్యంతో వాడి ఈ మేజిక్ చేయవచ్చో చరిత్ర చెప్పుకునేలా చూపింది. 1975 ఆగస్టు 15న షోలే విడుదలైంది. ఈ ఆగస్టు 15కు యాభై ఏళ్లు. ఇప్పటికే దేశంలో చర్చలు, కార్యక్రమాలు, జ్ఞాపకాల రీవిజిట్లు సాగుతున్నాయి. తెలుగు అభిమానులు ఎలాగూ ఉత్సవాలు జరుపుతారు. మన పరిశ్రమ... ముఖ్యంగా సినీ రచయితలు, దర్శకులు షోలేకు ఎటువంటి స్మరణ, సత్కారం చేస్తారో చూడాలి. -
ఆ నోట్ల కట్టలు నోళ్లు తెరిస్తే..?
చాలా విషయాలు బయటకొస్తాయి. ఆ నోట్ల కట్టలపై నిజాయితీగా విచారణ జరిగితే మద్యం కేసు కడుపులో దాక్కున్న గుట్టు రట్టవుతుంది. కట్టు కథలు ఎవరు చెబుతున్నారో, పుక్కిటి పురాణాలను ఎవరు వల్లెవేస్తున్నారో తేలిపోతుంది. అంతేకాదు, అపవిత్ర రాజకీయ మైత్రీబంధాల బండారం కూడా బద్దలు కావచ్చు. పన్నెండు అట్టపెట్టెల్లోని 11 కోట్ల సంగతి ఇది.ఆంధ్రప్రదేశ్ పోలీసుల సిట్ బృందం చెప్పిన లెక్క. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీలో కుంభ కోణం ఉన్నదని దర్యాప్తు కోసం సీఐడీకి అప్పగించి ఏడాది పూర్తయింది. ‘సిట్’ రంగప్రవేశం చేసి ఆరు నెలలయింది. ఈ మధ్యనే ఒక అసంపూర్ణ ఛార్జిషీట్ వేశారు. ఆయన చెప్పాడని ఈయన పేరు, ఈయన చెప్పాడని ఆయన పేరు చొప్పున ఓ నలభై ఎనిమిది మందిని ఇందులో నిందితులుగా చేర్చారు.త్వరలో ఇంకో చార్జిషీట్ను వేస్తారట! అందులో ఇంకొంత మందిని చేరుస్తారేమో! ఈ కుంభకోణం ద్వారా ఆనాటి ప్రభుత్వం 3,500 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడిందని సిట్ ఆరోపిస్తున్నది. నిందితులుగా నమోదైన వారిలో కొందరి చేత నయానో భయానో తమ స్క్రిప్టుకు అనుకూలంగా చెప్పించుకుంటున్నారనీ, కొందరు చెప్పిన వాఙ్మూలాలకు విరుద్ధంగా రాసుకొని బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారనీ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ రకమైన వాఙ్మూలాల మీదనే కథ నడిపిస్తున్నారు తప్ప ఇంతవరకూ తమ ఆరోపణలకు బలం చేకూర్చే వస్తుగతమైన, సాంకేతికమైన, లిఖిత పూర్వకమైన ఆధారాలేవీ సిట్ సంపాదించలేక పోయిందనేది యథార్థం. ఇక తుది ఛార్జిషీట్ను వేయవలసిన దశలో 12 అట్టపెట్టెలు, 11 కోట్ల నోట్ల కట్టలు అనే వృత్తాంతాన్ని ముందుకు తెచ్చింది.వరుణ్ అనే నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్హౌస్లో ప్రధాన నిందితు డైన రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతో దాచిపెట్టిన 11 కోట్ల రూపాయలను గత బుధవారం సీజ్ చేసినట్టు న్యాయస్థానానికి సిట్ చెప్పింది. 2024 జూన్లోనే తాము ఈ డబ్బును అక్కడ పెట్టి నట్టు కూడా వరుణ్ చెప్పినట్టు సిట్ తెలియజేసింది. ఈ 11 కోట్లు కూడా లిక్కర్ కుంభకోణం డబ్బేనని సిట్ వాదన. దీనిపై స్పందిస్తూ రాజ్ కేసిరెడ్డి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. సిట్ సీజ్ చేసినట్టు చెబుతున్న ఫామ్హౌస్ తీగల విజయేందర్రెడ్డి అనే వ్యాపారవేత్తదని, ఆయన టర్నోవర్ కోట్ల రూపాయల్లో ఉంటుందని కూడా కేసిరెడ్డి తన పిటిషన్లో తెలిపారు. విజయేందర్రెడ్డికి చెందిన ఒక ఆస్పత్రిలో తన భార్య చిన్న భాగస్వామి మాత్రమేనని, అంతకుమించి ఆ ఫామ్హౌస్తో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వాదించారు. సీజ్ చేసిన సొమ్ముకూ, తనకూ ఎటువంటి సంబంధం లేదని చెబుతూ 2024 జూన్ నుంచి ఫామ్హౌస్లో ఉంచినట్టు చెబుతున్న నోట్లను వీడియో తీయించాలని, ఆ సీరియల్ నెంబర్ల ఆధారంగా ఆ నోట్లను ఎప్పుడు విడుదల చేశారో రిజర్వు బ్యాంకు ద్వారా సమాచారం తెప్పించుకోవాలని ఆయన అభ్యర్థించారు. 2024 జూన్ తర్వాత విడుదల చేసినట్టు తేలితే ప్రాసిక్యూషన్ కథనం తేలిపోతుందనీ, తనకు న్యాయం జరుగుతుందనీ ఆయన వాదించారు. దీనిపై జడ్జి స్పందిస్తూ ఆ నోట్ల కట్టలను ఫోటోలు తీయించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు. ఫోటోలు, వీడియోలు తీయకుండానే ఆ నోట్ల కట్టలను సిట్ బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నదని, దాన్ని అడ్డుకోవాలని, కోర్టు కమిషన్ ఆధ్వర్యంలో వీడియో తీయించాలని కేసిరెడ్డి న్యాయవాదులు శనివారం నాడు మరో పిటిషన్ వేశారు. తాము అప్పటికే కోర్టులో నగదు డిపాజిట్ చేశామని దర్యాప్తు అధికారి కోర్టుకు చెప్పారు. అలా చేసి వుంటే ఆ లావాదేవీ తాలూకు కౌంటర్ ఫాయిల్ చూపెట్టాలని కేసిరెడ్డి న్యాయవాదులు డిమాండ్ చేశారు. దర్యాప్తు అధికారి ఇప్పుడు తన దగ్గర లేదన్నారు. కనీసం వాట్సాప్లోనైనా పంపించాలని వారు కోరారు. చాలాసేపటి వరకు ఎటువంటి వాట్సాప్ సమాచారం రాలేదు. అంటే బ్యాంకులో డిపాజిట్ చేయకుండానే చేసినట్టు కోర్టులో సిట్ చెప్పి ఉండాలి. పిటిషన్ విచారించిన జడ్జి కీలకమైన ఆదేశాలను సిట్కు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు జారీ చేశారు. సదరు 11 కోట్లను ప్రత్యేకంగా ఉంచాలనీ, మిగతా డబ్బుతో కలపొద్దనీ చెప్పారు. అలాగే పంచనామా చేసి ఆ నోట్ల సీరియల్ నంబర్లను నమోదు చేయాలని, ఈ ప్రక్రియను వీడియో తీయాలని సిట్కు ప్రత్యేకంగా తెలిపారు.ఆ నోట్లను వీడియో తీయాలని ముందురోజు జడ్జి చెప్పినప్పటికీ, లెక్క చేయకుండా ఆ నోట్లను హడావిడిగా బ్యాంకులో డిపాజిట్ చేశామని ఎందుకు చెప్పినట్టు? ఒకసారి బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత, ఆ సొమ్ము మిగతా డబ్బులో కలిసిన తర్వాత దానిపై విచారణ కుదరదనే ఎత్తుగడను వేశారని అనుకోవాలా? సిట్ వ్యవహరించిన తీరు పారదర్శకంగా లేదు. న్యాయబద్ధంగా దర్యాప్తు చేస్తున్నట్టుగా లేదు. ఈ కేసులో ఇంతవరకూ ఒక్క సాక్ష్యాన్ని కూడా సమర్పించలేకపోయారని కోర్టు అక్షింతలు వేసినందువల్లనే ఈ గూడుపుఠాణీ జరిపినట్టు నిందితులు ఆరోపిస్తే దాన్ని పూర్వ పక్షం చేయగలరా? దర్యాప్తు సంస్థ నిష్పాక్షికంగా పని చేస్తున్నట్టయితే, కోర్టు కమిషన్ సమక్షంలో రిజర్వు బ్యాంకు ప్రతినిధుల సమక్షంలోనే వీడియో తీసి, నోట్ల సీరియల్ నెంబర్లను నమోదు చేసి అనంతరం బ్యాంకులో డిపాజిట్ చేసి ఉండేవారు. ఎవరూ అడగనవసరం లేదు. అది వారి కనీస బాధ్యత. ఈ నోట్ల కట్టల వ్యవహారంలో ఆది నుంచి అంతంవరకూ సిట్ వ్యవహారం తీరు పారదర్శకంగా లేదు. ‘విశ్వసనీయ’ సమాచారం మేరకు పక్క రాష్ట్రంలోకి వెళ్ళి డబ్బు సీజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వడమో, వారిని కూడా వెంటబెట్టుకుని వెళ్లడమో చేసి ఉండవలసింది. లేదంటే సీబీఐ లేదా ఈడీ వంటి కేంద్ర సంస్థలకు సమాచారం అందించి ఉండవలసింది. దొరికింది నల్లధనం కనుక ఆదాయం పన్ను శాఖకు కూడా సమాచారం ఇచ్చి ఉండవలసింది. దొరికిన నల్లడబ్బు ఒక పెద్ద కేసులో సాక్ష్యంగా చూపెడుతున్నారు కనుక ఈమాత్రం పారదర్శకత లేకపోతే అదొక కుట్రపూరిత వ్యవహారంగానే జనం భావిస్తారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు తాజా ఆదేశాల తర్వాత సిట్ వారి స్క్రిప్టు ఏ మలుపులు తిరుగుతుందో చూడవలసి ఉన్నది.పొరుగు రాష్ట్రానికి వెళ్లి కుట్రపూరిత వ్యవహారాలకు పురుడు పోయాలంటే అదీ, ఒక వాణిజ్య ప్రముఖుని ఫామ్హౌజ్ కేంద్రంగా జరిపించాలంటే స్థానిక వ్యవస్థల సహకారం లేకుండా సాధ్యపడుతుందనేది అనుమానమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యవస్థల మధ్య సహకార ధోరణి బాగా ఉన్నట్టే చెబుతున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని ప్రజలకు మేలు చేసే పనులు చేస్తే మంచిదే. కానీ ఒక ప్రభుత్వ స్వార్థ రాజకీయాలకు సాయపడే విధంగా వ్యవహరించడం, ఒక ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తికి మేలు చేయడం కోసం ఒట్టు తీసి గట్టున పెట్టడం ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ‘పుష్ప’ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు వగైరాలు తాజా సంఘటనలే. ఆ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక ప్రతిజ్ఞ చేశారు. తాను సీఎం కుర్చీలో కూర్చున్నంతకాలం సినిమా టిక్కెట్ల ధరలు పెంచడానికి, స్పెషల్ షోలు వేయడానికి అనుమతించబోనని ఖండితంగా చెప్పారు. జనం కూడా హర్షించారు. నాయకుడంటే ఈమాత్రం పట్టుదల ఉండాలని అభినందించారు. కానీ ఆరు నెలలు తిరిగే సరికి ఆ పట్టుదల పట్టు తప్పింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి, స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతులు లభించాయి. ఆ సినిమా హీరో పక్కరాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ, వ్యక్తిగత సహకా రాలపై పొలిటికల్ సర్కిల్స్లోనే కాదు, బ్యూరోక్రాట్లు, వ్యాపార వర్గాలు కూడా మాట్లాడుతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీల మధ్య సహకారం కొత్తదేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనే జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ స్థాపించుకున్న దగ్గర నుంచి ఈ పార్టీల బంధం కొనసాగుతున్నది. ఆయన మీద కేసులు వేయడం, జైలుకు పంపించడంలోనూ కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు, చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం – యెల్లో మీడియాలు సమష్టిగానే పనిచేశాయి. రాష్ట్ర విభజన తర్వాత 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెసు పార్టీ తన విజయావకాశాలను కాలదన్నుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ క్షేత్రస్థాయిలో కేసీఆర్కు మళ్లీ ఆదరణ పెరుగుతున్నదని సంకేతాలు అందుతున్న నేపథ్యంలో చంద్రబాబు సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ను అధికారానికి దూరంగా ఉంచడం కోసం ఏపీ మాదిరిగానే టీడీపీ, జనసేనలు బీజేపీ కూటమి (ఎన్డీఏ)గా పోటీ చేస్తే ప్రయోజనమా? లేక బీజేపీని ఒక్కదాన్నే పోటీలో నిలిపి తాము వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ప్రయోజనమా అనే అంశంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పార్టీ విభాగం ఆచరణలో ఎన్డీఏలో నాలుగో పార్టీగా వ్యవహరిస్తున్నదనే భావన సామాన్య ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా ఉన్నది. ఒకపక్క రాహుల్గాంధీ ఎన్డీఏపై రాజీలేని పోరాటానికి కసరత్తులు చేస్తు న్నారు. ఢిల్లీ గద్దె కోసం నాలుగో పానిపట్టు యుద్ధానికి సిద్ధమవు తున్నారు. బీజేపీపై సైద్ధాంతిక పోరాటాన్ని కూడా ప్రారంభించి అస్త్రశస్త్రాలను ఆవాహన చేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ ముసుగులో ఉన్న ఓ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ ముఖ్య మంత్రికి మద్దతుగా రంగంలోకి దిగి రెచ్చి పోవడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విషయమైతే కాదు. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 16 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చాడని బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఆరోపించారు. దాన్ని ఖండించడానికి, వివరణ ఇచ్చుకోవడానికి సిఎం రమేశ్కు ఉన్న హక్కును ఎవరూ కాదనలేరు.కానీ, ఆయన అంతటితో ఆగిపోకుండా బీఆర్ఎస్ బండారం బయటపెడతానని హెచ్చరించడం, బీజేపీలో తమ పార్టీని విలీనం చేయడానికి కేటీఆర్ తన సహాయాన్ని అర్థించాడని చెప్పడం బూమెరాంగయింది. కేసీఆర్ స్థాయి నేత తన పార్టీని ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాలని భావిస్తే సీఎం రమేశ్ లాంటి వాళ్ల సహాయం అవసరమా? ఇటువంటి నాసిరకం ఆరోపణను ఎవరూ విశ్వసించకపోగా ఒకరకంగా బీఆర్ఎస్కు మేలు చేసింది. బీజేపీ – బీఆర్ఎస్ల మధ్య అవగాహన ఉన్నదని నమ్మించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు రమేశ్ ప్రకటన గండి కొట్టింది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఫిరాయింపుల జాడ్యం ఆగేనా?!
చట్టాలు కాగితాలకూ... ఆదర్శాలు ఉపన్యాసాలకూ పరిమితమవుతూ రాజ్యాంగ విలువలకు గ్రహణం పడుతున్న వేళ సర్వోన్నత న్యాయస్థానం ఒక విలువైన తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్ను ఆదేశించింది. అదే సమయంలో అటువంటి ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కే ఉంటుందని తెలియజేసింది. పదో షెడ్యూల్ 6(1) పేరా చెప్తున్నదాని ప్రకారం ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకునేటప్పుడు స్పీకర్ ఒక ట్రిబ్యునల్గా వ్యవహరిస్తున్నట్టేనని, అందువల్ల రాజ్యాంగ అధికరణలు 226, 227 ప్రకారం హైకోర్టులూ, 136 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టూ స్పీకర్ చర్యల్ని సమీక్షించవచ్చని ధర్మాసనం చెప్పటం విశేషం. ఈ విషయంలో 122, 212 అధికరణల కింద స్పీకర్లకు రాజ్యాంగపరమైన రక్షణ ఉండబోదని కూడా తేల్చింది. అసెంబ్లీలు మొదలుకొని పార్లమెంటు వరకూ ఫిరాయింపుల జాడ్యం ఇటీవలి కాలంలో బాగా ముదిరింది. కమ్యూనిస్టులు, వైఎస్సార్ కాంగ్రెస్ వంటి ఒకటి రెండు పక్షాలూ తప్ప ఈ జాడ్యానికి దూరంగా ఉన్న పార్టీలు అతి స్వల్పం. స్వల్ప మెజారిటీతో గద్దెకెక్కినా, సంఖ్యాబలానికి అంతో ఇంతో తక్కువున్నా ఫిరాయింపుల్ని ప్రోత్సహించటం అలవాటైపోయింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకొచ్చింది. అయితే ఆచరణలో అది ప్రభావవంతంగా లేదని గ్రహించి 2003లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉండగా 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని పటిష్ఠపరిచారు. చిత్రమేమంటే దేశంలో మూడొంతుల ముప్పాతిక ఫిరాయింపులకు ఈ రెండు పార్టీలే కారణం. అందుకు మణిపుర్ మొదలుకొని కర్ణాటక, మహారాష్ట్రల వరకూ ఎన్నయినా ఉదాహరణలు చూపించొచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కేసు తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యే లకు సంబంధించింది. ఆ ఫిరాయింపుల్ని సవాలు చేసిన బీఆర్ఎస్, అధికారంలో ఉండగా తానూ అదే పని చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు తనాన్ని ప్రోత్సహించటంలో ఆరితేరినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక తెలంగాణలో తన పార్టీ తరఫున నెగ్గినవారిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులిచ్చా రని ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడిన బాబు... ఒకటి రెండు నెలలయ్యేసరికి ఏపీలో తానూ అదే పని నిస్సిగ్గుగా చేశారు. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నెగ్గిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈమధ్య వైఎస్సార్ కాంగ్రె స్కు చెందిన రాజ్యసభ, శాసనమండలి సభ్యులు కొందరిని లోబర్చుకుని పార్టీకీ, చట్ట సభల సభ్యత్వానికీ రాజీనామా చేయించారు. విలువల గురించి అతిగా మాట్లాడే అలవాటున్న బీజేపీ ఇందుకు తోడ్పడటమేకాక... తానూ లాభపడింది. ఏపీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతున్నదో అందరూ గమనిస్తూనే ఉన్నారు. చట్టసభలను కేవలం శాసనాలు చేసే వేదికలుగా మాత్రమే పరిగణించటం సరికాదు. అయి దేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు, వారి ఆకాంక్షలు ఆ చట్టసభల పనితీరులో ప్రతిఫలించాలి. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శప్రాయులుగా ఉండాలి. అధికారం వచ్చింది మొదలు ప్రతిపక్షాన్ని బలహీనపరచటం ఎలా, కక్ష తీర్చుకోవటం ఎలా అనే అంశాలే నిత్యకృత్యమైతే అందువల్ల అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది. ఈ విషయంలో సభాధ్య క్షుల పాత్ర ఎంతో కీలకమైనది. వారు తటస్థంగా, సమర్థంగా వ్యవహరిస్తే చాలావరకూ ఈ జాడ్యం పోతుంది. చట్టసభల ఔన్నత్యం పెరుగుతుంది. చాలా సందర్భాల్లో వారు పాలకపక్షాలకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు మొదలుకొని అసెంబ్లీల వరకూ సమా వేశాల ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో కొచ్చాయి గనుక ఇప్పుడేదీ రహస్యం కాదు. అధ్యక్ష స్థానంలో ఉన్నవారి వ్యవహార శైలి ఎలా ఉంటున్నదో అందరూ ఆ క్షణంలోనే పసిగడుతున్నారు. సభాధ్యక్షులు తలుచుకుంటే ఫిరాయింపుల సమస్య పరిష్కారం పెద్ద కష్టం కాదు. కానీ అది సజావుగా సాగటం లేదు. 2014లో తమ పార్టీ నుంచి ఫిరాయించినవారిపై అటు లోక్సభ లోనూ, ఇటు అసెంబ్లీలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే రెండు చోట్లా స్పందన ఒకేలా ఉంది. ఆ చట్టసభల గడువు ముగిసే సమయానికి కూడా స్పీకర్లు నిర్ణయం ప్రకటించలేక పోయారు. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు రాజ్యాంగ న్యాయస్థానాలు కళ్లు మూసుకుని ఉండ గలవా? ఫిరాయింపుదార్లపై చర్య తీసుకునే విషయంలో స్పీకర్లకున్న నిర్ణయాధికారాన్ని పార్లమెంటు సమీక్షిస్తే మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. కానీ ఆ చట్టంలోని లొసుగులతో అందరూ లాభపడుతున్నప్పుడు దీన్ని ఆశించటం అత్యాశేనేమో! -
సుంకాలు... శాపనార్థాలు!
రాక తప్పదనుకుంటున్న ముప్పు ముంగిట్లోకొచ్చింది. అమెరికా అధ్యక్షపీఠం అధిష్ఠించింది మొదలు నిలకడలేనితనంతో, పొంతనలేని వ్యాఖ్యలతో మిత్రుల్ని, వ్యతిరేకుల్ని కూడా సమానంగా ఇరకాటంలో పడేస్తున్న డోనాల్డ్ ట్రంప్... గతంలో హెచ్చరించినట్టే సుంకాల మోత మోగించారు. శుక్రవారం నుంచి భారత్ నుంచి వచ్చే సరుకులపై 25 శాతం సుంకాలు విధిస్తామని, ఇవిగాక రష్యా నుంచి ముడిచమురు, రక్షణ సామగ్రి కొంటున్నందుకు అదనంగా జరి మానా ఉంటుందని ప్రకటించారు. అది ఎంత శాతమో చెప్పకపోయినా రష్యాతో వాణిజ్యం సాగించే భారత్, చైనాలపై 500 శాతం వరకూ అదనపు సుంకాలుంటాయని ఆయన లోగడ ప్రకటించారు. కనుక ఈ సుంకాల కన్నా జరిమానా వాటాయే ఎక్కువుంటుందని అంచనా వేయొచ్చు. తన ఆదేశాలను ఔదలదాల్చనందుకు మన ఆర్థిక వ్యవస్థను ‘మృత ఆర్థిక వ్యవస్థ’గా దూషించారు. అనాల్సిన వన్నీ అన్నాక ‘ఇంకా భారత్తో చర్చలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం’ అని ముక్తాయించారు. ఆయన హుకుం అమలైతే వస్త్రాలు, రొయ్యలు, ఆభర ణాలు, వజ్రాలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై తీవ్ర ప్రభావం పడుతుందనీ, ఆ రంగాల్లో ఉపాధి దెబ్బతింటుందనీ నిపుణుల అంచనా. ఈ రంగాల్లో 8,700 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులుంటున్నాయి. ఈ ఏడాది జీడీపీ 6.5 శాతానికి మించి వుండొచ్చని అంచనాలున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అది బాగా తగ్గవచ్చంటున్నారు. ట్రంప్కు దౌత్య మర్యాదల సంగతి అటుంచి వ్యక్తిగా ఎలా మెలగాలో కూడా తెలియదు. బహిరంగ బెదిరింపులకు దిగటం, అన్యాయమని అందరికీ తెలిసేలా ప్రవర్తించటం ఆయన నైజం. బ్రెజిల్ సంగతే తీసుకుంటే అక్కడ ఆ మధ్య అధికారం కోల్పోయిన బోల్సొనారో ఆయ నకు ఇష్టుడు. కనుక అతనిపైవున్న నేరారోపణలు ఉపసంహరించి వదిలేయమని తాఖీదు పంపారు. అంగీకరించనందుకు అదనపు సుంకాలు విధించారు. దేశాలకు సార్వభౌమత్వం ఉంటుందనీ, దానికి లోబడి సంబంధాలు నెరపాలనీ ఆయన భావించరు. వాణిజ్య ఒప్పందాలు సాకారం కావాలంటే వాటిని కుదుర్చుకోదల్చుకున్న రెండు పక్షాలకూ పరస్పర విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఓపిగ్గా చర్చించాలి. బ్రిటన్తో మనకు ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే ఇందుకు ఉదాహరణ. దాదాపు మూడేళ్లపాటు ఆ ఒప్పందంపై చర్చలు సాగాయి. ఒప్పందం అన్నాక ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి. ‘మేం పుచ్చుకుంటాం... ఇవ్వం’ అంటున్నారు. ‘మాతో ఒప్పందానికి భారత్ సుముఖంగా వుంది... ఇక సంతకాలే తరువాయి’ అంటూ చాన్నాళ్ల క్రితమే మన ప్రభుత్వం తరఫున తానే ప్రకటించారు. ట్రంప్ ఆగ్రహావేశాలకు వేరే కారణాలున్నాయి. మన సాగు, పాడి రంగాలను పరిరక్షించేందుకు అమెరికా నుంచి వచ్చే ఆ ఉత్పత్తులపై మన దేశం అధిక సుంకాలు విధిస్తోంది. ఇందులో సహేతుకత ఉంది. అమెరికాలో ఆ రంగాలకు భారీ సబ్సిడీలుంటాయి. దాంతో తమ ఉత్పత్తుల్ని వేరే దేశాల్లో కారుచౌకగా అమ్ముకోవటానికి వీలుంటుంది. అమెరికాతో పోలిస్తే మన సబ్సిడీలు చాలా తక్కువ. అవి రైతులకు లాభదాయకం కాకపోగా, ఆ రెండు రంగాల్లోనూ వ్యయం విపరీ తంగా పెరిగింది. రైతులు అధిక వడ్డీకి బయట అప్పులు చే యాల్సి వస్తోంది. తీరా గిట్టుబాటు ధర లభించక, అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్టు అధిక సుంకాలు తొలగిస్తే ఈ సంక్షోభం మరింత పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా ఉన్న ఆ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నిజానికి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో చేరినప్పుడే మన పాలకులు నిక్కచ్చిగా ఉండాల్సింది. కానీ దాటవేత ధోరణి ప్రదర్శించారు. రష్యాతో వాణిజ్యంపైనా ఇంతే. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్నట్టు ఉంటే వేరుగా ఉండేది. కానీ మన దేశం వారి ఆదేశాలు పాటించింది. 2009–13 మధ్య మన ఆయుధ కొనుగోళ్లలో రష్యా వాటా 76 శాతం. అదిప్పుడు 36 శాతానికి పడిపోయింది. దీన్ని ఆపేయాలని, తన ఎఫ్–35 యుద్ధ విమానాలు, ఎంక్యూ–9బి డ్రోన్లు, పీ–81 సాగర ప్రాంత గస్తీ విమానాలు కొనితీరాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. నిజానికి భారత్కు ఆయుధ అమ్మకాలపై 1960 ప్రాంతాల్లో అమెరికా నిషేధం విధించబట్టే రష్యాపై ఆధారపడటం పెరిగింది. ముడి చమురు విషయానికొస్తే మొన్న ఫిబ్రవరికి రష్యా నుంచి కొనుగోళ్లు 25 శాతం మేర పడిపోయాయి. అదే సమయంలో అమెరికా నుంచి కొనుగోళ్లు వంద శాతం పెరిగాయి. తన అంధభక్త గణాన్ని సంతృప్తిపరచటం కోసం, ఓటుబ్యాంకు పెంచుకోవటం కోసం ట్రంప్ దశాబ్దాల తరబడి ఎంతో ఓపిగ్గా నిర్మించుకుంటూ వచ్చిన ఇరు దేశాల సంబంధాలపైనా గొడ్డలి వేటు వేశారు. దీని పర్యవ సానాలు మనపై ఉన్నట్టే, అమెరికాపైనా ఉంటాయి. ఆయన ధోరణి మారకపోతే మన ఆర్థిక వ్యవస్థ మాటేమోగానీ... అమెరికా ఆర్థిక వ్యవస్థ ‘మృతప్రాయం’ కావటం ఖాయం. -
సకాలంలో ఐసీజే హితవు
విజయం గ్యారెంటీగా దక్కుతుందంటేనే పోరాడాలన్న దృక్పథం ఉంటే ఈ ప్రపంచం ఇంతగా మారేది కాదు. ప్రగతి బాటన పయనించేది కాదు. యుద్ధాల్లో గెలిచేవీ ఉంటాయి, ఓటమికి తలవంచేవీ ఉంటాయి... పోరు మాత్రం ఆగొద్దని పసిఫిక్ మహాసముద్ర మారుమూల ప్రాంతంలో 300 ద్వీప సమూహాలతో కూడిన ఒక చిన్న దేశం ఫిజీలో సంకల్పం చెప్పుకున్న 27 మంది విశ్వ విద్యాలయ విద్యార్థులు రాజేసిన ఉద్యమం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఎన్నదగ్గ తీర్పు నివ్వటానికి దోహదపడింది. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ఫలితాల నివారణ బాధ్యత అన్ని దేశాలకూ ఉంటుందనీ, ఈ ధరిత్రిని పరిరక్షించటం సకల దేశాల చట్టబద్ధ కర్తవ్యమనీ ఐసీజే వెలు వరించిన ఈ తీర్పు అందరినీ ఆలోచింపజేస్తోంది. తమ తమ దేశాల న్యాయస్థానాలనే బేఖాతరు చేస్తున్న ఏలికలు తామర తంపరగా పెరిగిన వర్తమానంలో, ఒక అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఏ దేశమైనా పట్టించుకుంటుందని, అమలు చేస్తుందని భావించటం దురాశే కావొచ్చు. ఆ తీర్పు కేవలం సలహా పూర్వకమైనదే. కానీ బాధ్యతా రహితంగా వాతావరణానికి చేటు తెచ్చే నిర్ణయాలు తీసుకుంటూ భూగోళపు మనుగడకే ముప్పు తెస్తున్న దేశాలపై నైతిక ఒత్తిడికి అది దోహద పడుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రమాదపుటంచుల్లో జీవనం సాగి స్తున్న ద్వీపకల్ప దేశాల గోడు ప్రపంచమంతా వినటానికీ, పర్యావరణ ఉద్యమకారుల ఆందోళనల వెనకున్న వాస్తవ స్థితిగతుల్ని ప్రజానీకం అర్థం చేసుకోవటానికీ అది తోడ్పడుతుంది. ఈకృషిలో పాలుపంచుకున్న వన్నీ ద్వీపకల్ప దేశాలు. భూతాపోన్నతి హెచ్చితే సముద్ర మట్టాలు పెరిగి ముందుగా మునిగే పసిఫిక్ మహాసముద్ర ప్రాంతానివి. భూగోళాన్ని 2050 కల్లా ఉద్గారాల రహితంగా మార్చాలన్న సంకల్పంతో 2015లో కుదిరిన ప్యారిస్ ఒడంబడికను అమెరికా బేఖాతరు చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన తొలి ఏలుబడిలో ఒకసారి దీన్నుంచి బయటకొస్తున్నట్టు ప్రకటించగా, అటుతర్వాత వచ్చిన జో బైడెన్ ప్రభుత్వం మళ్లీ చేరింది. రెండోసారి వచ్చాక ట్రంప్ మళ్లీ ఒడంబడిక నుంచి నిష్క్రమించారు. బయటకు పోలేదన్న మాటేగానీ... ఒడంబడికపై సంతకాలు చేసిన ఇతర సంపన్న దేశాలు సైతం దాన్ని నీరుగార్చే విధంగానే ప్రవర్తిస్తున్నాయి. ఒడంబడిక నిర్దేశించిన లక్ష్యాలు ఉన్నతమైనవి. వాటిని చిత్తశుద్ధితో అమలుచేస్తే భూగోళం సురక్షితంగా ఉంటుంది. భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కే పరిమితం చేయాలని, 2050–100 మధ్య అన్ని దేశాలూ శిలాజ ఇంధనాల ప్రమేయం లేని ఆర్థిక వ్యవస్థల రూపకల్పనకు దోహదపడాలని ఒడంబడిక నిర్దేశిస్తోంది. ఉద్గారాల తగ్గింపు అంశంలో ఏ దేశం కార్యాచరణ ఏ విధంగా ఉన్నదో ప్రతి అయిదేళ్లకూ సమీక్షించాలని సూచించింది. ఆర్థిక స్తోమత అంతగా లేని దేశాలకు సంపన్న రాజ్యాలు చేయూతనివ్వాలని, హరిత ఇంధన సాంకేతికతలను చవగ్గా అందించాలని కూడా కోరింది. ఏం చేయాలో చెప్పిన ప్యారిస్ శిఖరాగ్ర సదస్సు ఎలా చేయాలో చెప్పలేదు. నిర్దిష్టమైన చర్యలకు కట్టుబడి ఉంటామని సంతకాలు చేసిన దేశాలు విఫలమైన పక్షంలో తీసుకోదగిన చర్యలేమిటో ప్రకటించలేదు. అందుకే ఆ ఒడంబడిక అమలు నత్తనడక నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీజే తీర్పు ప్రపంచ పౌరులందరిలో ఆలోచన రేకెత్తించి, తమ తమ దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావటానికి తోడ్పడుతుంది. ఎవరికీ పట్టని, ఎవరూ పరిగణనలోకి తీసుకోని ఈ సమస్య తీవ్రతను చాటడానికి తొలుత ఫిజీలోని దక్షిణ పసిఫిక్ విశ్వవిద్యాలయ విద్యార్థులు నడుం బిగించారు. ఒక తరగతి గదిలో చర్చగా మొదలైన ఈ అంశం వాతావరణ మార్పులపై పోరాడే పసిఫిక్ ఐలాండ్ స్టూడెంట్స్ ఫైటింగ్ క్లైమేట్ ఛేంజ్ (పీఐఎస్ఎఫ్సీసీ) అనే సంస్థ ఆవిర్భావానికి 2019లో అంకురార్పణ చేసింది. ఈ సంస్థ పసి ఫిక్ ద్వీపకల్ప దేశాలను ఒప్పించటంతోపాటు అలాంటి ప్రమాదం పొంచివుండే మరికొన్ని దేశాలు కూడా కలిసివచ్చేలా చేసింది. ద్వీపకల్ప దేశం వనౌతు ఇందుకు చొరవచూపింది. చూస్తుండగానే యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు సైతం ఇందులో భాగస్వామ్యం తీసు కున్నాయి. వివిధ దేశాలతో మూడు రౌండ్ల చర్చల తర్వాత ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టే తీర్మా నంపై 105 దేశాలు సంతకం చేశాయి. ఐసీజే అభిప్రాయాన్ని కోరుతూ 2023 మార్చిలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందటం, అది ఐసీజేకు చేరటం జరిగిపోయింది. నిజానికి ఒడంబడిక కుదిరేనాటికి వాతావరణ మార్పుల వల్ల పొంచివున్న ముప్పు గురించిన ప్రత్యక్షానుభవం ఈ స్థాయిలో లేదు. ఈ పదేళ్లలో ధనిక, బీద దేశాల తారతమ్యం లేకుండా అన్నిచోట్లా ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయి. లక్షలమంది ప్రాణాలు తీస్తున్నాయి. రుతువులు పూర్తిగా గతి తప్పాయి. ఏదోమూల అతివృష్టి, అనావృష్టి రివాజుగా మారాయి. తీవ్ర వాతావరణ మార్పుల వల్ల అంటురోగాల వ్యాప్తితోపాటు మానసిక వ్యాధులు సైతం పుట్టుకొస్తున్నాయని శాస్త్రవేత్తలు ఇటీవలే నిర్ధారించారు. కానీ సంపన్న దేశాల నిర్లక్ష్యం ఎలావుందో చెప్పుకోవటానికి నిరుడు అజర్బైజాన్ రాజధాని బాకూ నగరంలో జరిగిన ‘కాప్–29’ సదస్సే నిదర్శనం. ప్యారిస్ ఒడంబడికతో పడే ఆర్థిక భారాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న అంశంపై జరిగిన ఆ సదస్సుకు దాదాపు సంపన్న దేశాలన్నీ ముఖం చాటేశాయి. ఈ నేపథ్యంలో ఐసీజే వెలువరించిన తాజా తీర్పు ఈ బాపతు దేశాల కళ్లు తెరిపించటానికీ, వాతావరణం మరింత అధ్వాన్నం కాకుండా ఉండటానికీ దోహదపడుతుందని ఆశించాలి. -
యునెస్కోకు వెన్నుపోటు
‘సంస్కృతి అనే పదం విన్నప్పుడల్లా నా చేయి తుపాకీ కోసం వెదుకుతుంది’ అని జర్మన్ నాటక రచయిత, కవి హొన్స్ జాట్ విరచిత నాటకంలోని పాత్ర అంటుంది. హొన్స్ తొమ్మిది దశాబ్దాల క్రితమే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వంటి అధినేతను ఊహించారా అనిపించేలా ఆయన వరస నిర్ణయాలుంటున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్తో యునెస్కో నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన తాజా ప్రకటన ఆ కోవలోనిదే. రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతిని సాధించాలన్న లక్ష్యంలో భాగంగా ఐక్యరాజ్యసమితి ఛత్రఛాయలో ఏర్పడిన అనేకానేక సంస్థల్లో యునెస్కో ఒకటి. విద్య, శాస్త్ర విజ్ఞానం, సంస్కృతి అంశాల్లో ప్రపంచ దేశాల పరస్పర సహకారం కోసం ఆ సంస్థ ఆవిర్భవించింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి, ప్యారిస్ ఒడంబడిక వగైరాల నుంచి ఇప్పటికే అమెరికా తప్పుకుంది. ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక దేశంలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం వంటి అంతర్జాతీయ కీర్తిప్రతిష్ఠలు కలిగిన అగ్రశ్రేణి విద్యాసంస్థకే దిక్కు లేదు గనుక యునెస్కో నుంచి అది తప్పుకోవటం ఆశ్చర్యం కలిగించదు. ట్రంప్ గత ఏలుబడిలో కూడా 2017లో యునెస్కో నుంచి ఆ దేశం నిష్క్రమించింది. అసలు యునెస్కో పుట్టినప్పటి నుంచీ దానితో అమెరికాకు పేచీయే. అక్కడ ఎవరున్నారన్నదాంతో నిమిత్తం లేదు.ప్రపంచంలో గిట్టని ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూలదోస్తూ, దారికి రాని దేశాలపై సొంతంగా ఆంక్షలు విధిస్తూ తననే అందరూ అనుసరించాలంటూ ఒత్తిళ్లు తెచ్చే దేశానికి సంస్కృతితో ఏం పని? నిరాయుధ పాలస్తీనియన్ల ఊచకోతకు పాల్పడుతూ, ఆకలితో మాడ్చి చంపుతూ వీరంగం వేస్తున్న ఇజ్రాయెల్ను పల్లెత్తు మాట అనకుండా... భారత్–పాక్లను బెదిరించి యుద్ధం ఆపానని గప్పాలు పోయే ప్రభుత్వానికి విద్యాసంస్థల విలువ, శాస్త్ర విజ్ఞానం అవసరం తెలిసేదెలా? రోనాల్డ్ రీగన్ ఏలుబడిలో 1983లో తొలిసారి యునెస్కో నుంచి ఆ దేశం తప్పుకుంది. ప్రతి అంశాన్నీ యునెస్కో రాజకీయమయం చేస్తున్నదని, పాశ్చాత్య ప్రపంచానికి అది బద్ధ వ్యతిరేకి అని ఆరోపించింది. అటుపై జార్జి డబ్ల్యూ బుష్ వచ్చాక సంస్థ సంస్కరణలు సంతృప్తి కలిగించాయంటూ 2003లో తిరిగి చేరింది. రీగన్, జార్జి బుష్లిద్దరూ రిపబ్లికన్లు. డెమాక్రాటిక్ పార్టీ నుంచి అధ్యక్షుడైన బరాక్ ఒబామాకు సైతం యునెస్కో కంటగింపే అయింది. ఐక్యరాజ్యసమితి సభ్య దేశంగా అమెరికా ఇంకా లాంఛనంగా గుర్తించని పాలస్తీనాను యునెస్కోలో చేర్చుకోవటంపై ఆయన గారు ఆగ్రహించి ఆ సంస్థకు చెల్లించాల్సిన విరాళాన్ని నిలిపేశారు. 2023లో బైడెన్ హయాంలో తిరిగిఅందులో చేరినా 60 లక్షల డాలర్ల పైగా బకాయిల్ని చెల్లించనే లేదు. చిత్రమేమంటే బకాయి భారాన్నీ, ఇజ్రాయెల్ను దోషిగా చూపుతున్నారని కారణాన్నీ చూపించి ట్రంప్ తన తొలి ఏలు బడిలో దాన్నుంచి తప్పుకున్నారు. ట్రంప్కు ముందున్న అధ్యక్షులు నేరుగా చెప్పటానికి మొహ మాటపడ్డారు గానీ...ఇజ్రాయెల్ను పల్లెత్తు మాటన్నా, దాని ప్రయోజనాలకు కించిత్తు విఘాతం కలిగినా అమెరికా సహించలేదు. అలాచేస్తే యూదు వ్యతిరేకతగా పరిగణిస్తుంది. హిట్లర్హయాంలో యూదుల్ని ఊచకోత కోసిన వైనంపై బహువిధ మాధ్యమాల ద్వారా చైతన్యం కలిగిస్తున్న యునెస్కోపై యూదు వ్యతిరేక ముద్రేయటం అమెరికాకే చెల్లింది.పురావస్తు సంపద సమస్త మానవాళికీ చెందుతుందని, ఆ వారసత్వ సంపదను అపురూపంగా భావించి పరిరక్షించటం మనందరి కర్తవ్యమని 1945లో ఆవిర్భవించినప్పుడే యునెస్కో ప్రకటించింది. 200 దేశాలకు సభ్యత్వం, మరో 12 దేశాలకు సహ సభ్యత్వమిచ్చి 170 దేశాల్లోవున్న 1,248 చరిత్రాత్మక స్థలాలను సంరక్షించటానికి అది కృషి చేస్తోంది. ఇరాక్లోని యూప్రటీస్ నదీతీరంలో నిర్మితమైన నాలుగువేల ఏళ్లనాటి బాబిలాన్ నగరం, ఈజిప్టులోని క్రీ.పూ. 13 శతాబ్దంలో నిర్మించిన అబూసింబెల్ సూర్య దేవాలయం, బిహార్లోని క్రీ.పూ. మూడో శతాబ్దంనాటి నలందా విశ్వవిద్యా లయ ఆనవాళ్లు, ప్రస్తుత మెక్సికో, గ్వాటెమాలా, ఎల్సాల్వెడార్ ప్రాంతాల్లో వ్యాపించిన క్రీ.పూ. 2000నాటి మయన్ల సంస్కృతి, తొమ్మిదో శతాబ్దంలో యశోధరపురంగా వెలిగిన ఆంకోర్వాట్ లోని అపురూప దేవాలయాలు, ఇంకా... మన తాజ్మహల్, తెలంగాణలోని రామప్ప దేవాలయం తదితరాలు అందులో ఉన్నాయి. వాటిలో అమెరికాకు సంబంధించిన చారిత్రక స్థలాలే 26. ఈ వారసత్వ సంపద పరిరక్షణకు నిధులు వెచ్చించటం, ఆ పరిరక్షణకు తోడ్పడే ఉపకరణాల అభివృద్ధి, లోతైన పరిశోధన, వాటికి సంబంధించిన కచ్చితమైన శాస్త్రీయ ఆధారాల సేకరణ, ప్రమా ణాలు నిర్దేశించటం వగైరాలు యునెస్కో పనుల్లో అంతర్భాగం. ఇవే కాదు... జీవవైవిధ్య పరిరక్షణ, ప్రామాణిక విద్యనందించటం, అంతరిస్తున్న మాతృభాషలను బతికించటానికి అనువైన చర్యలు తీసుకోవటం, మన దేశంతో సహా ప్రపంచంలో అనేకచోట్ల అణగారిన వర్గాల్లో నైపుణ్యాభివృద్ధివంటివి, అందుకు కృత్రిమ మేధ సాయం తీసుకోవటం యునెస్కో చేపట్టిన పనుల్లో కొన్ని.రేపు అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలూ యునెస్కో నుంచి వైదొలగవచ్చు. విరాళాలు ఆగి సంస్థ నిర్వాహణ సంక్షోభంలో పడినా పడొచ్చు. సిబ్బందిని తగ్గించాల్సిరావొచ్చు. ప్రాచీన సంపద పరిరక్షణలో సమస్యలు తలెత్తవచ్చు. రేపటి తరాల భవిష్యత్తుకై కృషిచేస్తున్న సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో పడటం విచారకరం. ఈ లోటు పూడ్చేందుకు చైనా సాయం అందిస్తామంటోంది. కొందరు నేతల మూర్ఖత్వం కారణంగా యునెస్కో వంటి సంస్థలు కనుమరుగు కాకుండా కాపాడుకోవటం ప్రపంచ పౌరులందరూ బాధ్యతగా భావించినప్పుడే ఇలాంటి బెదిరింపుల బెడద విరగడవుతుంది. -
‘కార్పొరేట్’ విద్యపై కొరడా!
ప్రచండమైన పోటీ, పరిమిత అవకాశాలూ అందరినీ భయపెడుతున్నాయి. ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో ఏం చేస్తున్నామో, ఎటు పోతున్నామో... చివరికది ఎటు దారితీస్తుందో తెలియనంతగా తల్లిదండ్రులు భయాందోళనల్లో మునిగిపోతున్నారు. వాటిని పిల్లలకూ అంటిస్తున్నారు. విద్యావ్యాపారంలో తలమునకలైన సంస్థలు దీన్ని ఎంచక్కా ఉపయోగించుకుంటున్నాయి. పర్యవసానంగా పిల్లలపై ఒత్తిళ్లు పెరిగి, బెంగ ఎక్కువై ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. తరాలు మారుతున్నా వదలని ఈ జాడ్యంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టని నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఎన్నదగిన నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్ని పీకల దాకా పోటీలో ముంచి, వారిపై మానసిక ఒత్తిళ్లను పెంచి విద్యలోని ప్రాణధాతువునే వికృతీకరిస్తున్న తీరు ఇకపై కొనసాగనీయరాదంటూ శుక్రవారం కోచింగ్ కేంద్రాలతోసహా అన్ని విద్యాసంస్థలనూ హెచ్చరించింది. అవాంఛనీయమైన ఈ ధోరణిని అడ్డుకోవటానికి ప్రతి విద్యాసంస్థ తప్పనిసరిగా పాటించాల్సిన 15 అంశాలతో కూడిన మార్గదర్శకాలను జారీచేసింది. పిల్లల మార్కుల ఆధారంగా వర్గీక రించి బోధించే విధానాన్ని నిలిపివేయాలనటం మొదలుకొని కౌన్సెలర్లు, సైకాలజిస్టుల నియా మకం వరకూ అందులో విలువైనవెన్నో వున్నాయి.ఆత్మహత్యలనేవి అన్నివేళలా వ్యక్తుల నిర్ణయమే కావొచ్చు... కానీ వాటిని ప్రేరేపిస్తున్న వ్యవస్థ మాటేమిటని ప్రశ్నించాడు ఫ్రెంచ్ తత్వవేత్త, రచయిత ఆల్బర్ట్ కామూ. మూలాన్ని గుర్తించకుండా, దాన్ని దుంపనాశనం చేయకుండా ఏ సమస్యా దానంతటదే మాయం కాదు. కేంద్రంలో రాజీవ్ గాంధీ హయాంలో విడుదలైన నూతన జాతీయ విద్యావిధానం విద్య ప్రైవేటీకరణకు బీజం వేసింది మొదలు మన విద్యావ్యవస్థ వెర్రితలలు వేస్తోంది. చదువులో వెనకబడివున్నామనే ఆత్మ న్యూనతతో కొందరూ, తమకొచ్చిన మార్కుల్నీ/ర్యాంకునూ చూపించి తరగతి గదిలో టీచర్ ఎగతాళి చేశారనీ, దండించారనీ మరికొందరూ...పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలమో లేదో అనే ఆందోళనతో ఇంకొందరూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు కేసులు పెడతాయి. మళ్లీ మరొకటి జరగనంతవరకూ అంతా సవ్యంగా వున్నట్టే కనబడుతుంది. ఇది చర్వితచరణంగా కొనసాగుతూనేవుంది. యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలకు దారి తీసిన ఉదంతం విశాఖలోనే జరిగింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) కోసం విశాఖ విద్యా సంస్థలో చేరిన బెంగాల్ బాలిక భవనంపై నుంచి పడి మరణించిన ఉదంతంపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లో ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఆమె ప్రమాదవశాత్తూ మరణించిందని ఒకసారి, గుండెపోటుతో మరణించిందని మరోసారి, ఆత్మహత్య చేసుకుందని ఇంకోసారి ఆ విద్యాసంస్థ బుకాయించింది. ఈ రోగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచీ ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థకూ వుంది. కన్నవాళ్లకు కనీసం పిల్లల మరణకారణాన్ని నిజాయతీగా చెప్పాలని కూడా ఆ సంస్థలు అనుకోవు. ధర్మాసనం వెల్లడించిన గణాంకాలు విస్తుగొలుపుతాయి. 2022లో మన దేశంలో 1.7 లక్షలకుపైగా ఆత్మహత్యలు నమోదైతే అందులో ఏడు శాతంపైగా – అంటే 13,404 మరణాలు విద్యార్థులకు సంబంధించినవి. జీవితం రంగులమయ ప్రపంచంగా దర్శనమిచ్చి, ఆకాశమే హద్దుగా భావించి దూసుకుపోవాల్సిన వయసులో పిల్లలు ఇంత బేలగా, ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయి తనువు చాలిస్తున్న వైనం సమాజానికంతకూ సవాల్. చదువంటే తెలియనిది తెలుసుకోవటం, అవసరమైనప్పుడల్లా ప్రశ్నించి సందేహనివృత్తి చేసు కోవటం. సృజనాత్మకంగా ఆలోచించటం. నేటి విద్యావ్యవస్థ వాటన్నిటినీ చంపేసింది. పోటీ తత్వాన్ని ప్రతిష్ఠించింది. బట్టీపట్టడం మినహా మరేమీ లేకుండా చేసింది. పర్యవసానంగా ఎంతో ఇష్టంతో చదవాల్సిన విద్య కాస్తా పెను భారంగా, ఎంతకూ అర్థంకాని ప్రణాళికగా అఘోరిస్తోంది. తమను అన్నివిధాలా రుద్దుతూ, పరుగులు పెట్టిస్తూ బలవంతంగా మెదళ్లలోకి ఎక్కించి ‘మంచి ఫలితాలు’ రాబట్టి మున్ముందు మరింత వ్యాపారం చేసుకోవాలని తాపత్రయపడే విద్యాసంస్థలొక వైపూ... తమ ఎదుగుదలపై కోటి ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులొక వైపూ విద్యార్థులకు ఊపిరి సలపనివ్వట్లేదు. ఆ ప్రస్థానంలో ఓటమి ఎదురయ్యేసరికి ఆ లేత హృదయాలు తట్టుకోలేకపోతు న్నాయి. అర్ధంతరంగా తనువు చాలించటం మినహా మరే మార్గమూ లేదని నిర్ణయానికొస్తున్నాయి. అంతక్రితం వరకూ ఇంటర్ స్థాయి నుంచి మొదలయ్యే పోటీతత్వం కార్పొరేట్ సంస్థల పుణ్యమా అని ప్రాథమిక విద్యకు కూడా పాకింది. ఈ దుఃస్థితి మారాలన్నదే సుప్రీంకోర్టు సంకల్పం. అయితే కనీసం స్వేచ్ఛగా కదలటానికైనా సావకాశంలేనంతగా ఇరుకైన స్థలాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు నడవటానికి ఎడాపెడా అనుమతులిచ్చే చోట పిల్లలకు క్రీడల్లో, జీవన నైపుణ్యాల్లో, వ్యక్తిత్వవికసనంలో శిక్షణనివ్వాలన్న ధర్మాసనం మార్గదర్శకాలు సక్రమంగా అమలవుతాయా? లాభాపేక్షే ధ్యేయంగావున్నచోట అదనంగా కౌన్సెలర్లకూ, సైకాలజిస్టులకూ చోటిస్తారా? టీచర్లపై ఊపిరాడనీయనంత భారంవేస్తున్న సంస్థలు పిల్లలతో ఎలా మెలగాలో వారికి శిక్షణనిప్పిస్తాయా? పిల్లలు తమ బాధల్ని చెప్పుకోవటానికి అవసరమైన వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తాయా? డబ్బు ఎరవేసి ఎంతటి మహోన్నత ఆశయాలనైనా చాపచుట్టేయగలిగే కార్పొరేట్ సంస్థలు ఈ మార్గ దర్శకాలను ఉల్లంఘించిన పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో చెబితే తప్ప ఇదంతా చక్కబడదు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వాలి. -
వాదం – అనువాదం
స్వతంత్ర రచయితా, అనువాదకుడా – ఎవరు గొప్ప అని ప్రశ్నిస్తే; ఎవరైనా స్వతంత్ర రచయితే నంటారు, రచయిత లేకుండా అనువాదకుడు ఉండనే ఉండడు కనుక ఎప్పుడైనా స్వతంత్ర రచయితదే ప్రథమ స్థానం. ‘అనువాద’ మనడంలోనే ఆ సూచన ఉంది. ‘ఒకరు చెప్పిన దానిని వేరొక భాషలో తిరిగి చెప్పడ’మని ఆ మాటకు వ్యుత్పత్త్యర్థం. క్రియలో చూస్తే, అనువాదకుడు స్వతంత్ర రచయితకు సమవుజ్జీ అనే కాక, కొన్ని విషయాల్లో అతణ్ణి మించగలడని కూడా అనిపిస్తుంది. అయినాసరే, మూల రచనను అందించిన స్వతంత్ర రచయితదే ప్రథమ స్థానమూ, అనువాదకుడిది ద్వితీయస్థానమేనంటారా; అనువాదకుడిది మరీ తక్కువ స్థానమేమీ కాదని గుర్తిస్తే చాలు! స్వతంత్ర రచనా, అనువాదమూ సృష్టీ, పునఃసృష్టి లాంటివి. సృష్టి గొప్పదా, పునఃసృష్టి గొప్పదా అంటే; దేని గొప్ప, దేని కష్టాలు, దేని సౌలభ్యాలు దానికే ఉన్నాయి. సృష్టిలో సృజనశక్తి కీలకమవుతుంది కనుక ఆ మేరకు దాని స్థానం దానిదే, ఎంతైనా అనువాదం అనుçసృజన మాత్రమే. అయితే సృష్టిలో ఉన్న ఒక సౌలభ్యమేమిటంటే, అది ఇంకొకదాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు కనుక, ఏది ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో నిర్ణయించుకునే అపరిమిత స్వేచ్ఛ దాని కుంటుంది. అనువాదకునికి లేనిదదే; మూలరచన విధించిన హద్దులకు లోబడే తన అనుకృతిని తీర్చి ఒప్పించి మెప్పించవలసిందే. ఆ కోణంలో, అనువాదమనేది నెత్తిమీద కలశాలను పెట్టుకుని, పళ్ళెం అంచుల మీద చేసే నృత్య విశేషం లాంటిదైతే, మూలరచన నిర్నిబంధ, స్వేచ్ఛానర్తనం. అనువాదమంటే ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి తేవడమే కదా అనుకుంటాం; అందుకూ కొంత నేర్పూ, శ్రమా అవసరమే కానీ, ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ దానిని మరింత సులభ తరం చేసిందని కూడా అనుకుంటున్నాం. అయితే, అనువాదమంటే కేవలం భాషానువాదమే కాదన్న సంగతి అనువాదంలోకి తలదూర్చితేనే అర్థమవుతుంది. భాషానువాదం పైకి కనిపించే తొలిమెట్టు మాత్రమే; దానికి పైన కనిపించని మెట్లు చాలా ఉంటాయి. వాటిని కూడా మనోనేత్రంతో దర్శించి వాటి మీదుగా తన అనుకృతిని చివరి మెట్టు దాకా ఒడుపుగా నడిపించి మూలాన్ని మరిపించడంలోనే అనువాదకుడి ప్రతిభ పండుతుంది. అంటే, అతను భాషనే కాక మూలరచయిత శైలీ, శిల్పం, భావం సహా సమస్త రచనాంగాలనూ అనువదిస్తాడు; అంతిమంగా మూలరచయిత హృదయాన్నీ, మేధనూ అనువదిస్తాడు; అలా తనే మూల రచయిత అయి పోతాడు. ఇది మాంత్రికులు చెప్పే పరకాయ ప్రవేశానికేమాత్రం తక్కువ కాదు. ఎంత కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చినా ఈ సహజ మేధకు ప్రత్యామ్నాయమవుతుందా అన్నది సందేహమే. ఇంతకీ సారాంశమేమిటంటే, మూల రచయితది ఏకపాత్రాభినయమైతే, అనువాదకుడిది ద్విపాత్రాభినయం; అతని(లేదా ఆమె)లో అనువాదకుడు, మూల రచయితా ఇద్దరూ ఉంటారన్న మాట. అలా చూసినప్పుడు ప్రతిభలో అనువాదకుడు మూల రచయితకు దాదాపు సమానుడవుతాడు; అదే అతను పడే పరిశ్రమకు వస్తే, అది ద్విగుణితమూ, త్రిగుణితమూ కూడా అవుతుంది. ఆ విధంగా, స్వతంత్ర రచయిత ప్రథమ గణ్యుడే కానీ, అనువాదకుడు అగస్త్య భ్రాతేమీ కాదు.ఆధునిక కాలానికి వస్తే, దేశీయంగా, విదేశీయంగా కూడా బహు భాషా సాహిత్యాలు, సాహిత్య ప్రక్రియలతో పరిచయం పెరిగి, అనువాద రంగం బహుముఖాలుగా అభివృద్ధి చెందడం చూస్తు న్నాం. కాకపోతే, అనువాదంలో మెళకువలు, ప్రమాణాలు, ఎదుర్కొనే క్లిష్టతా మొదలైన విష యాల్లో ప్రాచీనులు, ఆధునికుల అవగాహనలో పెద్ద తేడా లేకపోవడం ఒక విధంగా ఆశ్చర్యకరమే. అసలు తెలుగు సాహిత్యం నన్నయ భారతానువాదంతో ప్రారంభమవడమే ఒక విశేషమనుకుంటే, అనువాదంలోని క్లేశాన్ని గుర్తించి చెప్పిన తొలి అనువాదకుడు కూడా నన్నయే కావడం మరో విశేషం. అనువాదమంటే కేవలం భాషానువాదం కాదు కనుకనే, ‘గహనమైన అర్థాలనే జలాలతో నిండిన భారతమనే మహాసముద్రాన్ని చివరిదాకా ఈదడం బ్రహ్మకైనా సాధ్యమవుతుందా? అయినా నాకు చేతనైన మేరకు ప్రయత్నిస్తా’నని చెప్పుకుని ముందే జాగ్రత్తపడతాడు. ఆ ఒరవడి లోనే తిక్కన, ‘నా నేర్చిన భంగి చెబుతా’నంటూనే, మహాభారత మూలకర్త వ్యాసమహర్షిని మనసు నిండా నిలుపుకొని మరీ ముందుకెడతానంటాడు. నన్నయ మిగిల్చిన అరణ్య పర్వ శేషాన్ని పూరించిన ఎఱా<ప్రగడ అయితే, అనువాదంతోపాటు, అచ్చం నన్నయలానే రచించాలనే మరో సవాలును మీదేసుకుంటాడు. భట్ట హర్షుని ‘నైషధ’ కావ్యాన్ని ‘శృంగార నైషధము’ పేరిట అనువదిస్తూ శ్రీనాథుడు నిర్దేశించిన ప్రమాణాలు త్రికాలాలలోనూ శిరోధార్యాలే. ‘శబ్దాన్ని అనుసరించి, అభి ప్రాయాన్ని గుర్తించి, భావాన్ని ఉపలక్షించి, రసాన్ని పోషించి, అలంకారాన్ని భూషించి, ఔచిత్యాన్ని ఆదరించి, అనౌచిత్యాన్ని పరిహరించి మూలానుసారంగా రచిస్తా’నంటాడాయన.అలా ‘మూలానుసారంగా’ అనువదించడం కూడా ఒక సార్వకాలికమైన ప్రాథమిక విధేనను కుంటే, ‘స్వేచ్ఛానువాదం’, ‘సంక్షిప్తానువాద’ మనేవి మూలాతిక్రమణలే కావచ్చు; సరే, అది వేరే ముచ్చట. ఏ రెండు భాషల నిర్మాణమూ ఒకేలా ఉండాలని లేదు కనుక ఒక్కోసారి మూలం నుంచి పక్కకు జరగడమూ అనివార్యమవుతుంది, నిజమే కానీ, అలాంటివి మినహాయింపులు మాత్రమే, నిబంధన మాత్రం మూలానుసరణమే! అసలు దేనికైనా తప్పనిసరి ముడిసరకు ప్రతిభే అనుకున్న ప్పుడు స్వతంత్రమా, అనువాదమా అన్న చర్చ పక్కకు తప్పుకుని అనువాదమే స్వతంత్ర రచన లానూ భాసించవచ్చు. -
రెండు కోహినూర్ కథలు!
నలభై యాభయ్యేళ్ల కిందటి దాకా తెలుగు నాటకరంగం బతికే ఉండేది. సినిమా, టీవీలు దాన్ని పూర్తిగా మింగేయకముందు నాటి సంగతి. 1970లలో సాంఘిక ఇతివృత్తంతో కూడిన నాట కాలు, నాటికలను విరివిగా ప్రదర్శించేవాళ్లు. ఆ రోజుల్లో వచ్చిన ఒక నాటిక పేరు ‘కోహినూర్ కావాలి’. రాజకీయాలపై అదొక సెటైర్. ఒక రాజకీయ నిరుద్యోగి తన గుర్తింపు కోసం చేసే ప్రయత్నం. కథ సరిగ్గా గుర్తులేదు కానీ, సింగిల్ లైన్లో దాని సారాంశాన్ని చెప్చొచ్చు. సదరు నిరుద్యోగి బాగా ఆలోచించి లండన్లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని విద్యార్థులను రెచ్చగొట్టి ఉద్యమం చేస్తాడు. కోహినూర్ రాదు కానీ, ఆ నిరుద్యోగి కోరిక మాత్రం తీరుతుంది. విద్యార్థులు పావులుగా మిగిలిపోతారు.ఇప్పుడున్న మన రాజకీయ నాయకులకు ఇటువంటి సెటైర్లను పేల్చకుండా రోజులు గడవని పరిస్థితి ఏర్పడింది. ఏపీలోని మన అగ్ర నాయకులు ఈ వారం తాజాగా పేల్చిన ఓ రెండు సెటైర్లను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా సీనియర్ మోస్ట్ నాయకుడైన చంద్రబాబు వంతు. ఆయన తనకు ప్రీతిపాత్రమైన సింగపూర్ యాత్రకు శనివారం బయల్దేరారు. అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం మరోసారి సింగపూర్ను ఒప్పించడం ఆయన ఉద్దేశం. తప్పేమీ లేదు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లాడనుకోవచ్చు. కానీ, ఆయనకో డౌటు కూడా ఉన్నది. ఈసారి సింగపూర్ వాళ్లు ఒప్పుకుంటారో లేదోననే గుంజాటన వ్యక్తం చేశారు. కుదరక పోతే, ‘‘... అద్దంకి వెళ్లనూ వెళ్లాడు, రానూ వచ్చాడనే’’ సామెత మనకు ఉండనే ఉన్నది.సింగపూర్ స్పందనపై ఆయన అనుమానానికి చెప్పిన కారణమే ఒక పెద్ద బుకాయింపు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుదిరిన స్టార్టప్ ఏరియా ఒప్పందాన్ని జగన్ సర్కార్ రద్దు చేయడమే గాక వారిని వేధించడం వల్లనే వెనకాడు తున్నారని చంద్రబాబు చెప్పారు. కానీ అసలు సంగతి దాచేస్తే దాగేది కాదు. అప్పటి స్టార్టప్ ఏరియా ఒప్పందంలో సింగపూర్ తరఫున మంత్రి ఈశ్వరన్ కీలక భూమిక పోషించారు. ఆయనతో చంద్రబాబుకు చిరకాల స్నేహముందనేది బహిరంగ రహస్యం. అవినీతి ఆరోపణలపై ఈశ్వరన్ను మంత్రివర్గం నుంచి తొలగించడమే గాకుండా సింగపూర్ ప్రభుత్వం ఆయనను జైలుకు కూడా పంపించింది. ఈమధ్యనే ఆయన విడుదలయ్యారు. అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో భాగస్వామ్యం పట్ల సింగపూర్కు అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈశ్వరన్ పాత్ర కారణంగా ఉండాలి.ముందుగానే మధ్యవర్తుల ద్వారా ఒక అవగాహన కుదరకుండా ఏ ప్రభుత్వాధినేతా విదేశాలకు వెళ్లి బేరం మొదలు పెట్టడు. చేతి నుంచి పైసా పెట్టుబడి పెట్టకుండా కేవలం బ్రాండ్ వాడుకునేందుకు భాగస్వామిగా ఉండి వేలకోట్లు సంపా దించే అవకాశాన్ని సింగపూర్ వాళ్లు కాదనకపోవచ్చు. ఇంతకు ముందు కుదిరిన స్టార్టప్ ఏరియా అభివృద్ధి ఒప్పందాన్ని పరిశీ లిస్తే దాని లోగుట్టు బోధపడుతుంది. ఒకవేళ ముందస్తు అవగాహనంటూ ఏదీ లేకపోతే ఆయన పర్యటన అసలు కారణం ఇంకేదైనా ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాధినేత కనుక సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో మర్యాద పూర్వక భేటీలు జరగవచ్చు. జగన్ నిర్వాకం కారణంగా భాగస్వామ్యానికి వాళ్లు ఒప్పు కోలేదని వచ్చిన తర్వాత బురద చల్లవచ్చు. ముందస్తు అవగా హన ప్రకారమే ఒప్పందం కుదిరితే చంద్రబాబు వెళ్లాడు గనుక వాళ్లు దిగొచ్చారని, సింగపూర్ బ్రాండ్ మనకు కోహినూర్ డైమండ్ కంటే విలువైనదని భాజా మోగించుకోవచ్చు. ఇలా ఉభయతారకంగా ఉండాలనే జగన్పై ఓ కామెంట్ విసిరి ఆయన సింగపూర్ వెళ్ళారు.గతంలో కుదిరిన స్టార్టప్ ఒప్పందం ఒక దోపిడీ పథకమని దాన్ని పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రాజధాని ప్రాంతం కోర్ ఏరియాలో 1,691 ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీల కన్సార్టియానికి అప్పగించారు. వారితో నామమాత్రపు భాగ స్వామిగా కేపిటల్ సిటీ డెవలప్మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ) ఉంటుంది. ఈ భాగస్వాములతో కలిసి ‘అమరావతి డెవలప్ మెంట్ పార్ట్ట్నర్స్’ పేరుతో వ్యవహారం నడుపుతారు. ఈ భూమిలో 250 ఎకరాలు ఉచితంగా సింగపూర్ కన్సార్టియానికి బహుమతిగా లభిస్తుంది. ఇక మిగిలిన 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే కన్సార్టియం పని. అభివృద్ధి చేయడానికయ్యే 5,500 కోట్ల రూపాయల ఖర్చును కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. స్నేహితుడైన ఈశ్వరన్ నేతృత్వంలో వచ్చిన సింగపూర్ కన్సార్టియానికి ఇలా దోచిపెట్టే ఒప్పందాన్ని స్కామ్ అనకుండా ఉండగలమా? గతంలో కూడా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందమని ప్రచారం చేశారు కానీ, జరిగింది మాత్రం కంపెనీలతోనే! ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.ఇక రెండో కోహినూర్ కథలో నిజంగానే కోహినూర్ డైమండ్ వృత్తాంతం ఇమిడి ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు సంబంధించిన వ్యవహారం. ప్రాథమికంగా పవన్ కల్యాణ్ సినిమా నటుడు. కేవలం నటుడు అంటే సరిపోదు. పుష్కలంగా అభిమానగణం ఉన్న పాపులర్ హీరో. ఆయన కొత్త సినిమా హరిహర వీరమల్లు మొన్ననే విడుదలైంది. విడుదలతోపాటు వివాదాలను కూడా మోసుకొచ్చింది. రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్లు సినిమాల్లో నటించకూడదన్న నియమం ఏమీ లేదు కాబట్టి ఆయన నటించడం మీద పేచీ ఏమీ లేదు. కాకపోతే ఉన్నతమైన ప్రభుత్వ బాధ్యతలో ఉన్న వ్యక్తి కనుక తను నటిస్తున్న సినిమా ఇతివృత్తం విషయంలోనూ, ఆ సినిమా విడుదలకు సంబంధించిన ఇతరత్రా విషయాల్లోనూ ఆదర్శంగా ఉంటారని ఎవరైనా ఆశిస్తారు.విడుదలైన తొలి వారం పది రోజుల్లో టికెట్ రేట్లు పెంచుకునే విషయంపై గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే ఏ సినిమా నిర్మాతైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని, తన సినిమాలకైనా ఇది వర్తిస్తుందని కొద్దికాలం కిందనే పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ కేవలం నిర్మాత విజ్ఞప్తి మేరకే టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇంత చిన్న విషయంపై కూడా పవన్ తన మాట మీద నిలబడలేకపోయారు. విడుదలకు ముందురోజు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు. మొఘల్ కాలంలో జరిగిన అక్రమాల గురించి మన చరిత్రలో చెప్పలేదనీ, విజయనగర సామ్రాజ్యం గొప్పతనం గురించి కూడా చెప్పలేదనీ ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా సత్యదూరం.విజయనగర సామ్రాజ్య కాలాన్ని స్వర్ణయుగంతో పోలుస్తూ కావల్సినన్ని చరిత్ర వ్యాఖ్యానాలు అందుబాటులో ఉన్నాయి. కృష్ణదేవరాయల దండయాత్రల గురించీ, ఆయన కళా సాహితీ రంగాల పోషణ గురించీ, సాహితీ సమరాంగణాన చక్రవర్తిగా ఆయన వాసికెక్కడం గురించీ బోలెడన్ని కథలూ, గాథలూ వ్యాప్తిలో ఉన్నాయి. ఈ అంశాలన్నీ చరిత్ర పాఠాల్లో కూడా ఉన్నాయి. విజయనగర వీధుల్లో రతనాలను రాశులుగా పోసి అమ్మేవారని కూడా చదువుకున్నాము. అశోకుడు చెట్లు నాటించెను, బాటలు వేయించెను, బావులు తవ్వించెను అనే పాఠం చదవకుండా ఎవరైనా ప్రాథమిక విద్యను పూర్తి చేస్తారా? ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం తనకంటే పెద్ద వాడైన దారా షికోను హత్య చేయించాడని, తండ్రిని చెరసాలలో పెట్టించాడనే అంశాలు కూడా మన చరిత్రలో లేవని పవన్ ఆరోపణ. అది కూడా నిజం కాదు. ఆ సాహిత్యం పుష్కలంగా అందుబాటులో ఉన్నది.కోహినూర్ వజ్రానికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానమున్నది. దానిది అంతర్జాతీయ ఖ్యాతి. కృష్ణా తీరంలో లభించిందని ప్రతీతి. అక్కడినుంచి కాకతీయల రాజధాని ఓరుగల్లుకు, అల్లా వుద్దీన్ ఖిల్జీ ద్వారా ఢిల్లీకి, నాదిర్షా ద్వారా పర్షియాకు, మహా రాజా రంజిత్సింగ్ వశమై లాహోర్కు, అక్కడి నుంచి బ్రిటిష్ వారితో లండన్కు ప్రయాణం చేసిన వజ్ర రాజం. ఆరొందల సంవత్సరాల ట్రావెలాగ్ కోహినూర్ది. అట్లాగే ఔరంగజేబు. 17వ శతాబ్దంలో భారతదేశాన్ని శాసించిన మొఘల్ చక్రవర్తి. ఈ చారిత్రక అంశాల మధ్య వీరమల్లు అనే కల్పిత పాత్రను ప్రవేశపెట్టి ఈ సినిమా తీశారట! ఈ కల్పిత వీరమల్లు ఔరంగజేబుతో పోరాడి గోల్కొండకు వజ్రాన్ని ఎలా తీసుకువస్తాడ నేది సినిమా కథగా చెబుతున్నారు. చారిత్రకాంశాలతో ఫాంట సీలు తీయొద్దని ఎవరూ చెప్పలేరు. సృజనాత్మక కళలపై ఆంక్షలు పెట్టడం, లక్ష్మణ రేఖలు గీయడం కూడా వాంఛనీయం కాదు. కాకపోతే ఫాంటసీ పేరుతో చరిత్రను వక్రీకరించడాన్ని, ఆ వక్రీకరణ ద్వారా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టాలని ఉద్దేశించడాన్ని మాత్రం సహించలేము.తనది సనాతన ధర్మ పథమని ఈమధ్యనే పవన్ కల్యాణ్ ప్రకటించుకున్న విషయం విదితమే. తన ధర్మపథ ప్రచారానికి తద్వారా తన రాజకీయ భవిష్యత్ ఉన్నతికి దోహదపడే ప్రచార చిత్రంగా దీన్ని ఉపయోగించుకోవాలని ఆయన భావించి ఉండ వచ్చు. ఈ కారణంగా కొంత భాగాన్ని డైరెక్ట్ చేసిన క్రిష్ అర్ధంతరంగా తప్పుకున్నారనే ప్రచారం కూడా ఉన్నది. అదెంతవరకు వాస్తవమో తెలియదు. ప్రచార చిత్రంగా వాడుకున్నా ఫరవా లేదు. కానీ, మొఘల్ చక్రవర్తుల కాలంలో అన్నీ అక్రమాలు, అకృత్యాలే జరిగాయా? ఇంకే గొప్పతనం లేదా?... వివిధ చారిత్రక దశల్లో ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులపై అధ్యయనం చేసిన నిపుణుల సమాచారం ప్రకారం క్రీస్తుశకం 16, 17 శతాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటాగా ఉన్నది. కొద్ది తేడాతో చైనా తర్వాత రెండో స్థానం. భారత ఉపఖండంలో విశాల భూభాగాన్ని ఐక్యం చేసి శాంతి, సుస్థిరతలను సాధించినందు వలన అక్బర్ చక్రవర్తి కాలంలో వ్యవసాయం, వస్త్ర పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెంది, బ్రిటిష్ వలస దోపిడీ మొదలయ్యేంతవరకూ భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నది.అశోక చక్రవర్తి కాలంలో జరిగిన సామ్రాజ్య విస్తరణ,శాంతి – సుస్థిరత స్థాపనల ఫలితంగా, ఆ కాలంలో విరాజిల్లిన బౌద్ధమతం వెలుగులో వ్యవసాయ వాణిజ్యాలతోపాటు శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో కూడా ముందంజ వేసింది. అనంతర కాలంలో రెండు మూడు శతాబ్దాల పాటు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో 35 శాతం వాటాను సొంతం చేసుకొని ఆర్థిక సూపర్ పవర్గా వెలుగొందిందని అంచనా వేశారు. అశోకా ది గ్రేట్, అక్బర్ ది గ్రేట్ అని ఊరికే అనలేదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారత నేత పనివాళ్ల వేళ్లను విరగ్గొట్టిందీ, భారత వ్యవసాయాన్ని ధ్వంసం చేసిందీ, భారతదేశ సంపదను కొల్ల గొట్టి తమ దేశానికి తరలించుకుపోయిందీ బ్రిటిష్వాళ్లే కాని, మొఘల్స్ కాదు. బాబర్ సెంట్రల్ ఏసియా నుంచి వచ్చి ఉండ వచ్చు. అనంతర మొఘల్సందరూ ఇక్కడే పుట్టారు. ఇక్కడే చనిపోయారు. ఈ దేశ చరిత్ర మీద తాజ్మహల్ వంటి సంత కాలను చేశారు. బ్రిటిష్ వలసదారులకు వ్యతిరేకంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి నాయకత్వం వహించింది ఆఖరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ కాదా? బ్రిటిష్ వాళ్ళు ఆయన్ను పట్టుకొని బర్మాలో ప్రవాస ఖైదు విధిస్తే, తాను చని పోయాక తన జన్మభూమి భారత్లో అంత్యక్రియలు చేయాలని చివరి రోజుల్లో ఆయన కోరుకున్న విషయం చరిత్రే కదా! బాధ్యత గల వ్యక్తులు చారిత్రకాంశాలతో కూడిన సినిమాలు తీసినప్పుడు ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసు కోవడం అవసరం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అరకోటి మంది ఓటర్లెక్కడ?
బిహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా నవీకరణ సుప్రీంకోర్టులో విచారణ దశలోనే వున్నా, పార్లమెంటులో అలజడి రేగుతున్నాఆ ప్రక్రియ తన దోవన తాను ముందుకెళ్తున్నది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ గురువారం ఆ వ్యవహారం గురించి వెల్లడించిన వివరాల ప్రకారం, లక్షమందికి పైగా ఓటర్ల ఆచూకీ లేదు. 21.6 లక్షల మంది మరణించారు. మరో 31.5 లక్షల మంది శాశ్వతంగా వేరే చోటుకు వలసపోయారు. పోలింగ్ కేంద్రం స్థాయి అధికారులు (బీఎల్ఓలు) అడుగుతున్నా, మరో ఏడు లక్షల మంది ఇంతవరకూ తమ పత్రాలు దాఖలు చేయలేదు. తాము ఫలానా చోట ఉంటు న్నామని రుజువులు చూపక పోయినా, బతికే ఉన్నామని చెప్పకపోయినా లేదా తగిన పత్రాలుఅందజేయక పోయినా ఈ 61 లక్షల మంది ఓటర్లు జాబితా నుంచి శాశ్వతంగా కనుమరుగవుతారు. రాష్ట్ర ఓటర్లలో వీరు 7.7 శాతం. శుక్రవారం సాయంత్రంతో వీరందరికీ గడువు ముగిసిపోయింది. సవరించిన ఓటర్ల జాబితా ఆగస్టు 1న విడుదలవుతుంది. అయితే సెప్టెంబర్ 1లోగా ఎవరైనా జాబితాలో తమ పేరు లేదని ఫిర్యాదు చేస్తే పరిశీలించి, తగిన పత్రాలున్న పక్షంలో వారిని చేర్చి తుది జాబితా విడుదల చేస్తారు. నకిలీ లేదా విదేశీయులుగా గుర్తించిన వారిని తొలగించటం కోసం ప్రారంభించిన ఈ ప్రక్రియ దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. ‘పరిశుద్ధమైన’ ఓటర్ల జాబితా రూప కల్పనే తమ లక్ష్యమని జ్ఞానేశ్ చెబుతున్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని స్వాగతించాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడవాలంటే మెజారిటీ ఆమోదం పొందిన ప్రభుత్వాలు ఏర్పడాలి.ప్రజల ఆదరణ ఉన్నవారే పాలకులు కావాలి. నకిలీ ఓటర్లు లేదా ఈ దేశ పౌరులు కానివారు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే స్థితి ఉంటే ఆ ఎన్నికలే ప్రహసన ప్రాయమవుతాయి. ఎన్నికలు సజావుగా పూర్తవుతున్నాయన్న భావన వల్లే ఫలితాలు వెలువడ్డాక అధికార మార్పిడి శాంతియుతంగా పూర్తవుతోంది. గత దశాబ్దాలతో పోలిస్తే ఎన్నికల హింస గణనీయంగా తగ్గింది. ఇలాంటి కారణాల వల్లే విదేశాల ఎన్నికలకు మన ఈసీ అధికారులు పరిశీలకులుగా వెళ్తున్నారు. వారు సూచిస్తున్న మార్పులకు ఎంతో విలువ ఉంటున్నది. కానీ గత ఏడాది, రెండేళ్లుగా ఈసీ వ్యవహార శైలిపై విమర్శలూ, ఆరోపణలూ వెల్లువెత్తు తున్నాయి. వాటిపై అసలే స్పందించకపోవటం లేదా మరిన్ని సందేహాలు కలిగే రీతిలో జవాబీ యటం రాజకీయ పక్షాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. బిహార్ ఎన్నికల జాబితా సంగతే తీసుకుంటే సుప్రీంకోర్టు సూచించిన ఆధార్, రేషన్ కార్డు వగైరాలు పరిశీలనకు పనికి రావని అది ఎందుకు తిరస్కరించిందో అంతుపట్టదు. ఆధార్ను ప్రారంభించినప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ కార్డే ఇకపై సర్వస్వమని, దాని ఆధారంగానే పథకాల వర్తింపు అయినా, పౌరుల గుర్తింపయినాఉంటుందన్నారు. కానీ జరుగుతున్నది అందుకు విరుద్ధం. మరి విశ్వసనీయత లేని ఆధార్ను అన్నిటికీ అనుసంధానం చేయటం ఎందుకు? ఇప్పటికీ ఆ కార్డు సంపాదించటానికి సాధారణ పౌరులు తలకిందులవుతున్నారు. పుట్టిన చోటే నవజాత శిశువులకు ఆధార్ అందేలా తాజాగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అటువంటి కార్డు ఓటరు గుర్తింపునకు పనికిరాదని ఈసీ ఎలా చెబుతుందో అర్థంకాని విషయం. పౌరుల్ని గుర్తించటమనే ప్రక్రియ అన్యులకు ఆసాధ్యమని, కేవలం తామే సమర్థులమని ఆ సంస్థ చెప్పదల్చుకుంటే దాన్నెవరూ అంగీకరించరు.ఎన్నికల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తటంపై ఆంధ్రప్రదేశ్ మొదలుకొని మహారాష్ట్ర, హరియాణాల వరకూ ఎన్ని ఉదాహరణలైనా చూపొచ్చు. ఏపీ సంగతే తీసుకుంటే... అక్కడ ఓటింగ్కు గడువు ముగిసి కేవలం ప్రాంగణంలో ఉన్న వారితో పోలింగ్ పూర్తి చేయటానికి అర్ధరాత్రి వరకూ సమయం పట్టింది. అలా వేచివున్నవారి సంఖ్య ఏకంగా 51 లక్షలు! ఇది నమ్మేలా ఉందా? ఇక పోలింగ్ శాతంపై మొదటి, చివరి ఈసీ ప్రకటనల్లోని అంకెల మధ్య 12.5 శాతం తేడావచ్చింది. ఇది గతంలో ఎప్పుడూ ఒక శాతం మించిలేదు. ఇందువల్ల సగటున ఒక్కో అసెంబ్లీ స్థానంలో అదనంగా 28,000 ఓట్లు, లోక్సభ స్థానంలో 1.96 లక్షల ఓట్లు అమాంతం పెరిగి పోయాయి. తటస్థ సంస్థల లెక్కల ప్రకారం ఇది 87 అసెంబ్లీ స్థానాల గెలుపోటముల్ని తారుమారు చేసింది! వేరే రాష్ట్రాల్లోనూ ఇలాంటి ధోరణే కనబడిందని అక్కడి విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ సందేహాలకు సక్రమమైన జవాబు చెబితే బిహార్లో చేపట్టిన ‘సర్’పై పెద్దగా అభ్యంతరాలు వచ్చేవి కాదేమో! కానీ ఆ సంస్థ తనకు తోచినప్పుడు మాట్లాడటం తప్ప జవాబుదారీతనాన్నీ, బాధ్యతాయుత వర్తననూ కనబరచటం లేదు. సందేహాలు పటాపంచలు చేద్దామన్న పట్టుదలను ప్రదర్శించటం లేదు. ఈసీ న్యాయబద్ధంగానే వ్యవహరిస్తున్నాననుకోవచ్చు. కానీ అలా అందరూ అనుకునేలా తన వ్యవహార శైలి వుండాలి. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థకైనా ఇది తప్పనిసరి.అందునా ప్రభుత్వాల తలరాతలను మార్చే కీలకమైన వ్యవస్థగా ఉన్న ఈసీకి ఇది మరింత ప్రాణప్రదం. దేశంలో ఉత్తరప్రదేశ్, బిహార్ల నుంచి వలసలు ఎక్కువుంటాయి. అలాంటిచోటఇంత తక్కువ వ్యవధిలో ఎక్కడెక్కడినుంచో పనులు మానుకుని వచ్చి ఓటర్లుగా నమోదు చేసు కోవటానికి అవసరమైన పత్రాలు సేకరించి సమర్పించటం బడుగు జీవులకు సాధ్యమేనా? అందుకే సర్వోన్నత న్యాయస్థానం సూచించిన ఇతర ప్రత్యామ్నాయాల గురించి కూడా ఈసీ పరిశీలించాలి. ఈ మాదిరి సవరణకు దేశవ్యాప్త ఆదరణ లభించాలంటే ఇది తప్పనిసరి. -
స్వేచ్ఛావాణిజ్యం కల సాకారం
దాదాపు నాలుగేళ్ల కాలం... పదహారు దఫాల చర్చలు... నలుగురు ప్రధానులు– ఎట్టకేలకు బ్రిటన్ అభీష్టం నెరవేరింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ల సమక్షంలో రెండు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయెల్, జొనాథన్ రేనాల్డ్స్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై లండన్లో సంతకాలు చేశారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని బ్రిటన్ పార్లమెంటు ధ్రువీకరించాల్సి వుంది. ఆ ప్రక్రియకు ఏడాది సమయం పడుతుందంటున్నారు. 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్య పరిమాణం 12,000 కోట్ల డాలర్లకు చేరుకోవాలన్నది ఎఫ్టీఏ లక్ష్యం. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతున్న భారత్తో ఎఫ్టీఏ సాకారం కావాలని ఆ దేశం ఎంతగానో ఎదురుచూసింది. అందుకు కారణముంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బయటికొచ్చాక సాగిస్తున్న ఒంటరి ప్రయాణం దాని ఆర్థిక వ్యవస్థను ఒడిదుడుకుల్లో పడేసింది. ఒకప్పుడు ప్రపంచంలో రవి అస్తమించని సామ్రాజ్యాన్నేలిన దేశం నేల చూపులు చూడటం మొదలైంది. అందుకే కన్సర్వేటివ్ పార్టీకి చెందిన బోరిస్ జాన్సన్ ప్రధానిగా వున్నప్పుడు 2022లో తొలిసారి ఎఫ్టీఏ కుదుర్చుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆయన స్థానంలో అదే పార్టీకి చెందిన లిజ్ ట్రస్ వచ్చారు. ఆమె 49 రోజుల్లోనే పదవి పోగొట్టుకున్నారు. తదనంతరం భారత్ మూలాలున్న రిషి సునాక్ ప్రధాని అయ్యారు. ఆయన కూడా నిష్క్రమించి ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించి ప్రస్తుత ప్రధాని స్టార్మర్ బాధ్యతలు స్వీకరించారు. వీరిలో అందరూ భారత్తో ఎఫ్టీఏ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినవారే. మొన్నటి ఎన్నికల్లో లేబర్ పార్టీ ప్రధాన వాగ్దానాల్లో భారత్తో ఎఫ్టీఏ కుదుర్చుకుంటామన్నది ఒకటి. మొత్తానికి అనేక రకాల అడ్డంకులూ, అపోహలూ అధిగమించి ఒప్పందం సాకారమైంది. ఎఫ్టీఏ వల్ల బ్రిటన్లో ఏటా కొత్తగా 2,200 ఉద్యోగాలొస్తాయని, దేశ జీడీపీ 480 కోట్ల పౌండ్ల (రూ. 56,150 కోట్లు) మేర పెరుగుతుందని అంచనా. అయితే రెండు దేశాల్లోనూ ఎఫ్టీఏపై అసంతృప్తి తక్కువేమీ లేదు. ఈ ఒప్పందం వల్ల ప్రధానంగా లాభపడేది స్కాచ్ విస్కీ, జిన్ ఉత్పత్తిదార్లు, బ్రిటన్ కార్ల పరిశ్రమలు. జిన్, స్కాచ్ విస్కీలపై ప్రస్తుతం 150 శాతం దిగుమతి సుంకాలుండగా, అవి 75 శాతానికి పడిపోతాయి. వచ్చే పదేళ్ల కాలంలో 40 శాతానికొస్తాయి. అలాగే బ్రిటన్ కార్లపై ప్రస్తుతం 100 శాతం సుంకాలున్నాయి. అవి పది శాతానికి పడిపోతాయి. ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలకు ఇది ఊరటనిచ్చే కబురు. మన ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు కూడా గిరాకీ ఏర్పడుతుంది. ఈ రంగంలో టాటాలకు డబుల్ ధమాకా అని చెప్పాలి. బ్రిటన్లో ఆ సంస్థ ఉత్పత్తి చేసే జాగ్వార్ ల్యాండ్ రోవర్లకు మన దేశంలో... ఇక్కడ ఉత్పత్తయ్యే టాటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు బ్రిటన్లో మార్కెట్ లభ్యత పెరుగుతుంది. మన దేశం నుంచి వెళ్లే 99 శాతం ఎగుమతులకు కూడా ఎఫ్టీఏ అమల్లోకొస్తే సుంకాల బెడద వుండదు. బ్రిటన్ నుంచి మనకొచ్చే దిగుమతులపై సుంకాలు 15 శాతం నుంచి ఒక్కసారిగా 3 శాతానికి పడిపోతాయి. చాలా సరుకులపై కస్టమ్స్ సుంకాలు తగ్గిపోతాయి. మన సాగు రంగానికి ఎఫ్టీఏ ఎంతగానో దోహదపడుతుందని వాణిజ్య నిపుణులంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్కు మన వార్షిక సాగు ఎగుమతుల విలువ కేవలం 81 కోట్ల డాలర్లు. ఈ ఒప్పందం వల్ల మన నుంచి తేయాకు, మామిడిపళ్లు, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు వగైరాల ఎగుమతులు అపారంగా పెరుగుతాయని అంచనా వుంది. సేవల రంగా నికి సంబంధించినంతవరకూ యోగా బోధకులు, సంగీతవేత్తలు, పాకశాస్త్ర ప్రవీణులకు డిమాండ్ పెరుగుతుంది. ఈ రంగాల్లో పనిచేసే వారికోసం ఏటా 1,800 వీసాలు జారీచేస్తారు. వాహన విడి భాగాలు, వస్త్రాలు, పాదరక్షలు, క్రీడోపకరణాలు, ఆటబొమ్మలు, బంగారం, వజ్రాభరణాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, ఇంజిన్లు వగైరాలపై దాదాపు 4 నుంచి 16 శాతం వరకూ సుంకాలు విధిస్తున్నారు. ఒప్పందం అమల్లోకొస్తే ఆ సుంకాలు కనుమరుగవుతాయి. కనుక ఎగుమతులు ఊపందుకుంటాయి. పర్యవసానంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.ఎఫ్టీఏపై రెండు దేశాల్లోనూ విమర్శలూ, ఆందోళనలూ వున్నాయి. ఇది అమల్లోకొస్తే స్వల్పకాలిక వీసాపై వచ్చే భారతీయ కార్మికులకూ, వారి యాజమాన్యాలకూ జాతీయ బీమా సంస్థ ఎన్ఐసీకి చేసే చెల్లింపుల నుంచి మూడేళ్ల మినహాయింపు ఇవ్వదల్చుకున్నారని, ఇందువల్ల దేశ ఖజానాకు ఏటా పది లక్షల పౌండ్ల నష్టంతోపాటు దేశీయ కార్మికుల ఉపాధికి గండిపడుతుందని కన్సర్వేటివ్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆ మినహాయింపు ఏడాది కాలానికి మాత్రమే వుంది. వలస విధానం మారదని, ఇప్పటికన్నా భారతీయ కార్మికుల సంఖ్య పెరిగే అవకాశం లేదని ప్రభుత్వం చెబుతోంది. తమ రంగాన్ని ఎఫ్టీఏ విస్మరించిందని, మేధోహక్కుల పరిరక్షణ సంగతి పట్టించుకోలేదని బ్రిటన్ ఫార్మా రంగం ఆరోపణ. ఒకవేళ పట్టించుకుని ఉంటే మన దేశంలో జెనెరిక్ ఔషధ పరిశ్రమ దెబ్బతింటుంది. ఆటోమొబైల్ విడిభాగాల రంగంలో బ్రిటన్ ప్రవేశిస్తే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రంగం నష్టపోతుంది. అందుకు ప్రతిగా మన ఎంఎస్ఎంఈలకు కూడా బ్రిటన్ చోటిస్తే వేరుగా వుండేది. ఇక 2027 నుంచి బ్రిటన్ అమలుచేయబోతున్న ‘కార్బన్ టాక్స్’ అంశాన్ని ఏం చేశారో వెంటనే తెలియలేదు. కార్బన్ టాక్స్ వల్ల మన ఇనుము, ఉక్కు, అల్యూమినియం, ఎరువులు, సిమెంట్ రంగాలు దెబ్బతినే అవకాశం వుంది. మొత్తానికి ఎఫ్టీఏ అమల్లోకొచ్చాకే దాని అసలు కథ ఏమిటన్నది తెలుస్తుంది. -
దర్యాప్తు ప్రశ్నార్థకం కారాదు!
అంతా ఎప్పటిలాగే గడిచిపోతున్నదనుకునే వేళ హఠాత్తుగా సంభవించిన పేలుడు జనాన్ని భయకంపితుల్ని చేస్తుంది. తేరుకున్న వెంటనే అది మిగిల్చిన ప్రాణనష్టాన్నీ, విధ్వంసాన్నీ కళ్లారా చూశాక ఆ భయాందోళనలు ఎన్నో రెట్లు పెరుగుతాయి. తీవ్ర గాయాలై కాళ్లూ చేతులూ తెగిపడినవారి ఆర్తనాదాలు మిన్నంటుతాయి. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతాయి. నేరగాళ్లను పట్టి బంధించాలన్న డిమాండు ఊపందుకుంటుంది. తీరా దీర్ఘకాలం గడిచాక నిందితులు నిర్దోషులనీ, దర్యాప్తు లోపభూయిష్టమనీ తేలితే ప్రజానీకంలో నిరాశా నిస్పృహలు ఆవరించవా? బాధిత కుటుంబాలు మరోసారి రోదించవా? 189 మంది మరణానికీ, 816 మంది క్షతగాత్రులు కావటానికీ కారణమైన 2006 నాటి పేలుళ్ల ఘటనల్లో బొంబాయి హైకోర్టు దాదాపు 20 యేళ్లు కావస్తుండగా వెలువరించిన తీర్పు అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. పోలీసులు ఈ కేసులో వెనువెంటనే 13 మందిని అరెస్టు చేశారు. వారంతా ప్రధాన నిందితులని, మరో 15 మంది పరారీలో వున్నారని తేల్చారు. నిషేధిత ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కి చెందిన ఈ నిందితులకు పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తొయిబాతో సంబంధ బాంధవ్యాలున్నాయని ఆరోపించారు. పేలుళ్ల ఘటనలు జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులను అరెస్టు చేయటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యేక కోర్టు 2015 సెప్టెంబర్లో ఒకరు మినహా మిగిలిన 12 మందినీ దోషులుగా నిర్ధారించింది. వారిలో అయిదుగురికి ఉరిశిక్ష, మిగిలినవారికి వేర్వేరు రకాల శిక్షలు పడ్డాయి. 2021లో ఒకరు కోవిడ్ వ్యాధితో మరణించారు. జనం కిక్కిరిసి ప్రయాణించే సాయంత్రం సమయాన్ని పేలుళ్లకు ఎంచుకుని ఏడు లోకల్ రైళ్లలో బాంబులుంచి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.తమ ముందు విచారణకొచ్చిన కేసుల్లో న్యాయస్థానాలు సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలిస్తాయి. నిందితులుగా చూపించిన వారికి ఆ ఘటనలతో వున్న సంబంధం ఏమిటో, ఏ ప్రాతిపదికన వారే కారకులని పోలీసులు నిర్ధారణకొచ్చారో తరచి చూస్తాయి. ఎంతమంది దోషులైనా తప్పించుకోవచ్చుగానీ, ఒక్క నిరపరాధికి కూడా శిక్షపడరాదన్న సూత్రమే దానికి మూలం. ఉగ్రవాదం మన దేశానికి కొత్తగాదు. దశాబ్దాలుగా అడపా దడపా ఏదో ఒక మూల అది తలెత్తుతూనే వుంది. వివిధ సంఘటనల్లో పదులకొద్దీ మంది మరణిస్తున్నారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికన్నట్టు కొత్త చట్టాలు వస్తున్నాయి. ఉన్న చట్టాలు మరింత కఠినతరమవుతున్నాయి. కానీ చాలా సందర్భాల్లో జరుగుతున్నదేమిటో 2006 నాటి ముంబై పేలుళ్ల ఉదంతమే తార్కాణం. 671 పేజీల తీర్పులో ముంబై హైకోర్టు ధర్మాసనం ప్రస్తావించిన లోటుపాట్లు గమనిస్తే ఇంత నాసిరకంగా దర్యాప్తు జరిగిందా అనిపిస్తుంది. నిందితుల ప్రమేయాన్ని సందేహాతీతంగా నిరూపించాలన్న కర్తవ్యం కన్నా, ఏదో అయిందనిపిద్దామన్న ధోరణే ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) దర్యాప్తులో కనబడిందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. పేలుళ్ల ఉదంతాలప్పుడు పౌరుల్లో ఆగ్రహావేశాలు కలుగుతాయి. ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతుంది. రాజకీయ పక్షాల, ఇతర సంస్థల ఆరోపణలు సరేసరి. అందువల్ల దర్యాప్తు చేసేవారిపై ఒత్తిళ్లు పెరుగుతాయన్నది కూడా వాస్తవం. కానీ ఇవేవీ వారిని ప్రభావితం చేయకూడదు. ఘటనాస్థలిలో దొరికిన చిన్న చిన్న ఆధారాలతో అల్లుకుపోతూ ఒక పెద్ద కుట్రను ఛేదించినప్పుడే, నిజమైన నిందితులను పట్టుకున్నప్పుడే సమాజం సురక్షితంగా వుంటుంది. ధర్మాసనం వ్యాఖ్యానించినట్టు నిందితులను పట్టుకున్నామని, అంతా పరిష్కరించామన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించటం వల్ల సమాజానికి ఒరిగేదేమీ వుండదు. తప్పించుకున్న అసలు నిందితులు మరో దురంతానికి పథక రచన చేస్తారు. నిందితులుగా ముద్రపడినవారి కుటుంబాలు దిక్కుతోచక అల్లాడతాయి. జనానికి కావాల్సింది ఆ దారుణానికి పాల్పడ్డ నేరగాళ్లను పట్టుకోవటం తప్ప ఆ పేరిట ఎవరో కొందరిని నిందితులుగా చూపటం కాదు. దేశం మొత్తాన్ని పట్టికుదిపిన కేసులో సాదాసీదా దర్యాప్తు సరికాదని పోలీసు ఉన్నతాధికారులకు అనిపించకపోవటం ఆశ్చర్యం. ఎన్నో కేసుల దర్యాప్తులో పాలుపంచుకొని, ఎంతో అనుభవాన్ని గడించిన వారంతా తమ స్థాయిలోనే ఈ లోటుపాట్లను పట్టుకోవటం అసాధ్యం కాదు. కనీసం న్యాయస్థానం ముందుకెళ్తే ఎలాంటి సందేహాలు ఎదురవుతాయోనన్న బెరుకు ఎవరిలోనూ లేకపోవటం విస్మయం కలిగిస్తుంది. సాంకేతిక కారణాలతోనే ఈ కేసు కొట్టేశారని, సుప్రీంకోర్టుకు వెళ్లి దోషులకు శిక్షపడేలా చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. సాంకేతిక కారణాల సంగతలా వుంచి నిందితుల ఒప్పుకోలు పత్రాలన్నీ దాదాపు ఒకే మాదిరి వుండటం, పొంతన లేని సాక్ష్యాలు నిందితుల అపరాధత్వంపై సందేహాలు కలిగించాయి. తాము నిర్దోషులమని నిరూపించుకునే బాధ్యత నిందితులపైనే వుండేలా చట్టాలు పదునెక్కాయి. కానీ పోలీసులు సక్రమంగా వ్యవహరించి నేరాంగీకారంతో సరిపోలే విధంగా తిరుగులేని సాక్ష్యాధారాలు చూపలేకపోతే ఆ నిబంధన కొరగానిదవుతుంది. దర్యాప్తు ప్రక్రియకు అవరోధంగా మారుతుంది. కనీసం పేలుళ్లలో వాడిన బాంబులేమిటో ఏటీఎస్ నికరంగా చెప్పలేకపోయింది. రేపు సర్వోన్నత న్యాయస్థానం ఏం నిర్ధారిస్తుందో చెప్పలేం. ఇప్పటికైతే బాధిత కుటుంబాలకు ఖేదం మిగిలింది. ఈ తీర్పు దర్యాప్తు సంస్థల తీరుతెన్నులను మరింత పదునెక్కించగలగాలి. నిజమైన నేరగాళ్లను బోనెక్కించాలి. -
కట్టుకథల కుట్ర సర్కార్!
కుట్రలు తప్ప తెలియనివాడికీ, వంచనతప్ప మరేదీ చేతగానివాడికీ మనుగడ కోసం కట్టుకథలను ఆశ్రయించటం తప్ప దిక్కులేదు. ఈవీఎంల మాయాజాలంతో ఏపీలో నిరుడు గద్దెనెక్కింది మొదలు కూటమి ప్రభుత్వం రౌడీలనూ, గూండాలనూ ప్రోత్సహించి హత్యలకూ, దౌర్జన్యాలకూ తెగబడటంతో పాటు తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. రెడ్ బుక్లో సరికొత్త అంకం లిక్కర్ స్కాం! ఆ పేరిట ఇప్పటికే కొంతమంది మాజీ అధికారులను జైలుపాలు చేసిన ప్రభుత్వం, తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చే సింది. విద్యార్థి రాజకీయాల నాటినుంచీ తనకు బద్ధ వ్యతిరేకి అయిన మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిపై కక్ష తీర్చుకోవటానికే ఆయన కుమారుడు మిథున్రెడ్డిని ఇందులో ఇరికించారన్నది బహిరంగ రహస్యం. 2014–19 మధ్య అధికారం వెలగబెడుతున్నప్పుడు తన బినామీలకూ, సన్నిహితులకూ నిబంధనలు కాదని డిస్టిలరీలు పెట్టుకోవటానికి, మద్యం ఉత్పత్తికి ఎడాపెడా అనుమతులిచ్చి చీకటి జీవోల సాక్షిగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుంభకోణానికి ఆస్కారమే లేనిచోట ఏదో జరిగిపోయిందంటూ ఊదరగొడుతున్నారు. ‘ఆత్రగాడికి బుద్ధి మట్టు’ అనే నానుడి ఉత్తపుణ్యాన రాలేదు. ఎదుటివారిపై బురద చల్లి ఏదోరకంగా వారికి అవినీతి మకిలి అంటి ద్దామని తండ్రీ కొడుకులు పడుతున్న తాపత్రయం వాస్తవాల ముందు బొక్కబోర్లా పడుతోంది.వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చిన మద్యం విధానంలో కొత్తగా ఒక్కటంటే ఒక్క డిస్టిలరీకి అనుమతినిచ్చిన వైనం లేదు. సరిగదా... అంతకుముందు టీడీపీ ఏలుబడిలో చెలరేగిన మద్యం మాఫియా నడ్డి విరగ్గొట్టి, మద్యం దుకాణాలన్నిటినీ ప్రభుత్వపరం చేశారు. వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించారు. మద్యం విక్రయ వేళల్ని కుదించారు. బాబు హయాంలో తామర తంపరగా పెరిగిపోయి, ఊరూవాడా జనం మూల్గులు పీల్చిన బెల్ట్ షాపుల జాడే లేకుండా చేశారు. పర్మిట్ రూమ్ల దందా అడ్డుకున్నారు. ఆ విధానం కారణంగా తమ అక్రమ సంపాదన నిలిచిపోగా లబోదిబోమని అప్పట్లో గగ్గోలు పెట్టింది తెలుగు దేశీయులే. మద్యపాన ప్రియుల్ని తగ్గించటానికి ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా రూ. 3,500 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందట! అందులో భారీమొత్తం డొల్ల కంపెనీల ద్వారా దుబాయ్కి తరలిపోయిందట!! ఇంగితజ్ఞానం వున్నవారెవరికైనా ఇందులోని కపట నాటకం అర్థమవుతుంది. బురద చల్లటానికి వీళ్లకంటూ ఒక పద్ధతుంటుంది. ముందు ఎల్లోమీడియాలో తప్పుడు కథనాలు వండివార్చుతారు. ఏదో జరిగిపోయిందంటూ ఆ మీడియా పెడబొబ్బలు పెడుతుంది. వాటిని ఆధారం చేసుకుని కేసులు రూపొందుతాయి. వాటిపై దర్యాప్తుకంటూ సీఐడీ ఆధ్వర్యాన సిట్ ఏర్పాటవుతుంది. ఏం చేయడానికీ పాలుబోని సిట్... ఎల్లోమీడియా తప్పుడు కథనాలనే రీసైక్లింగ్ చేసి చార్జిషీట్లుగా రూపొందిస్తుంది. అవి న్యాయస్థానం మెట్లెక్కకుండానే ఎల్లోమీడియాకు చేరతాయి. తమకు విశ్వసనీయంగా తెలిసిందంటూ ఆ మీడియా పతాక శీర్షికలతో పండగ చేసుకుంటుంది. ఇంతకూ జనంలో ఇసుమంతైనా విశ్వసనీయత లేని ఈ మీడియాకు ‘విశ్వసనీయంగా’ చెప్పేవారెవరు? ఇంకెవరు... తండ్రీకొడుకులూ, వారి అడుగులకు మడుగులొత్తే వీర విధేయ అధికారులూ! తమ కథనాలే చార్జిషీట్లుగా అవతారమెత్తాయని, అవే న్యాయస్థానాల పరిశీలనకు పోతున్నాయని తెలియనట్టు, కొత్తగా ఆ రోజే బయట పడినట్టు ఎల్లోమీడియా వికృత విన్యాసాలకు తెగబడుతుంది. 13 వేల ఫోన్కాల్స్ట, వందలాది వాట్సాప్ చాటింగ్లట. దుబాయ్లో జల్సాలట. జనం నవ్విపోతారన్న వెరపే లేదు. వారిపట్ల జవాబుదారీతనం అసలే లేదు.జనానికిచ్చిన వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఏడాదికాలం మాయమాటలతో కాలక్షేపం చేసిన కూటమి సర్కారు ప్రజల దృష్టి మళ్లించటానికి ఎంచుకున్న సరికొత్త డ్రామా లిక్కర్ కుంభకోణం. పనిలో పనిగా ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టడం దీని ఆంతర్యం. 2014–19 మధ్య అధికారం వెలగబెడుతుండగా తన అంతేవాసులకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి ఖజానాను కొల్లగొట్టింది చంద్రబాబే. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపణ కాదు. సాక్షాత్తూ రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విప్పిచెప్పిన లోగుట్టు. గుట్టుచప్పుడు కాకుండా స్వయంగా సంతకాలు చేసిన బాబు నిర్వాకం కారణంగా ఖజానాకు 2015–19 మధ్య రూ. 5,200 కోట్ల మేర గండి పడిందని ఆ సంస్థ బయటపెట్టింది. ఇదిగాక ఎంఆర్పీ కన్నా 20 శాతం అధిక ధరలకు విక్రయించి మరో రూ. 20,000 కోట్లు కొల్లగొట్టారని బయటపడటంతో 2023లో కేసు నమోదైన కారణంగా బాబు, ఆయన అనుచరగణం బెయిల్ కూడా తీసుకున్నారు. మళ్లీ అధికారంలోకొచ్చాక ఈ దోపిడీ మరింత విశృంఖలంగా పెరిగింది.తమ మద్యం కుంభకోణాన్ని చూసీచూడనట్టు వదిలేయకుండా కేసులుపెట్టి నడిబజారులో నిలబెట్టినందుకే బాబు కక్షతో రగిలిపోతున్నారు. పర్యవసానంగానే తాజా కేసు. జగన్ ప్రభుత్వ కొత్త మద్యం విధానంపై వాస్తవానికి 2021లోనే టీడీపీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు ఫిర్యాదుచేసింది. అందులో మొహం వాచేలా తీర్పు వెలువడింది. ఎలాంటి అవకతవకలూ జరగలేదని, మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా వున్నదని సీసీఐ తేల్చిచెప్పింది. ఒకసారి ఛీకొట్టించుకున్నా బుద్ధిరాని పార్టీ ఇప్పుడు అధికారంలోకి ఎగబాకి నిస్సిగ్గుగా ఒక పెద్ద డ్రామాకు తెర లేపింది. ఈ ప్రహసనాన్ని జనం నిస్సందేహంగా తిప్పికొడతారు. -
ఎన్నాళ్లీ జనహననం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ గాజాలో కొనసాగిస్తున్న మారణకాండను ఆపదల్చుకోలేదని తాజా అమానుష ఉదంతం రుజువు చేస్తోంది. నిరాయుధ పౌరులనూ, మరీ ముఖ్యంగా స్త్రీలనూ, పిల్లలనూ హతమార్చటం ఇజ్రాయెల్ సైన్యానికి గత ఇరవైయ్యొక్క నెలలుగా రివాజుగా మారినా... ఆదివారం జరిగిన ఘోరం అత్యంత హేయమైనది. ఐక్యరాజ్యసమితి సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్పీ) ఆధ్వర్యాన ఆహార పంపిణీ మొదలుపెట్టబోతుండగా పౌరు లను చుట్టుముట్టి శతఘ్నులతో, స్నైపర్లతో విరుచుకుపడి 90 మందికిపైగా పౌరుల్ని ఇజ్రాయెల్ సైన్యాలు పొట్టనబెట్టుకున్నాయి. 2023 అక్టోబర్ 7న తమ భూభాగంలోకి అడుగుపెట్టి 1,200 మంది పౌరులను కాల్చిచంపి, మరో 251 మందిని అపహరించిన మిలిటెంట్ సంస్థ హమాస్ను తుదముట్టించటానికి దాడులంటూ మొదట్లో చెప్పిన ఇజ్రాయెల్ ఆనాటినుంచి మారణకాండ కొనసాగిస్తూనే ఉంది. అధికారిక లెక్క ప్రకారం ఇప్పటికి 60,000 మంది పౌరులు మరణించారంటున్నా... అంతర్జాతీయ మేగజిన్ లాన్సెట్ నిరుడు జూన్లో ప్రకటించిన నివేదిక అది దాదాపు రెండు లక్షలంటోంది. మధ్యధరా సముద్ర తీరానవున్న గాజా స్ట్రిప్ అనే చిన్న ప్రాంతాన్ని వదిలి రావటానికి ససేమిరా అంటున్న స్థానికులను హతమార్చయినా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రయ త్నిస్తోంది. ఆ ప్రాంతాన్ని సైతం తమ దేశంలో విలీనం చేసుకోవాలన్నది దాని ఆంతర్యం. గతంలో పాలస్తీనాపై విరుచుకుపడినప్పుడల్లా ఐక్యరాజ్యసమితి చార్టర్లోని 51వ అధికర ణాన్ని ఇజ్రాయెల్ ప్రస్తావించేది. సాయుధ ముఠాలు దాడులకు దిగితే ఆత్మరక్షణ చేసుకునే హక్కు దేశాలకుంటుందని ఆ అధికరణ చెబుతోంది. కానీ పాలస్తీనాలో తనదికాని భూభాగాన్ని ఆక్రమించుకుని, దాన్ని విస్తరించాలనుకున్నప్పుడల్లా ఇజ్రాయెల్ ఈ అధికరణను సాకుగా చూపుతోంది. హమాస్ సంస్థ దాడుల్ని ఎవరూ సమర్థించరు. ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని చెబుతూ వారికే నష్టం కలిగించే ఆ సంస్థ చర్యల్ని మొదటినుంచీ అందరూ వ్యతిరేకి స్తున్నారు. కానీ గత 21 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ మాటేమిటి? కేవలం 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల చిన్న ప్రాంతంపై యుద్ధ విమానాలతో, బాంబులతో, క్షిపణులతో దాడులు సాగించటం ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం సబబవుతుంది?ఇజ్రాయెల్ మిత్ర దేశమన్న సాకుతో పెద్ద పెద్ద దేశాలే అది సాగిస్తున్న మారణకాండను విస్మ రిస్తున్న తరుణంలో ఇటీవల 12 చిన్న దేశాలు కొలంబియాలోని బగోటాలో అత్యవసర శిఖరాగ్ర సదస్సు నిర్వహించి కార్యాచరణకు దిగబోతున్నట్టు ప్రకటించటం ఉన్నంతలో వూరటనిచ్చే అంశం. బొలీవియా, కొలంబియా, క్యూబా, ఇండొనేసియా, ఇరాక్, లిబియా, మలేసియా, నమీ బియా, నికరాగువా, ఒమన్, సెయింట్ విన్సెంట్, దక్షిణాఫ్రికాలు వీటిలో వున్నాయి. ఈ సమావేశానికి హాజరైనా, అది విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై సంతకం చేయాలా వద్దా అన్న మీమాంసలో పడిన మరో 20 దేశాలు వచ్చే సెప్టెంబర్కల్లా ఏ సంగతీ తేల్చాలని సదస్సు గడువు విధించింది. ఇజ్రాయెల్పై దక్షిణాఫ్రికా ఇప్పటికే అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. తనదికాని ఒక ప్రాంతంపై దండెత్తి, అక్కడి పౌరులు ఎటువైపు కదలాలో హుకుం జారీ చేసే ఇజ్రాయెల్ ఆగడం నాగరిక ప్రపంచ ఉనికికే పెను సవాలు. ఇజ్రాయెల్ ఇష్టారాజ్యంగా మానవ హననానికి పాల్పడుతుంటే చూస్తూ కూర్చున్న దేశాలకు కూడా రేపన్నరోజు ఇదే గతి పట్టదన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే అంతర్జాతీయ చట్టాలకూ, ఐక్యరాజ్యసమితి చార్టర్లకూ, మానవ హక్కులకూ ఇజ్రాయెల్ పెనుముప్పుగా మారిందని 12 దేశాల సదస్సు వ్యాఖ్యానించింది.అయితే ఇజ్రాయెల్ ఏం చేసినా సమర్థించటం అలవాటైన అమెరికాను కాదని ఎన్ని దేశాలు ఈ సదస్సుతో గొంతు కలుపుతాయన్నది ప్రశ్నార్థకం. ఇప్పటికే ‘ఇంకా’ సంతకం చేయని దేశాలకు దూతల్ని పంపి ‘దారికి తేవాలని’ అమెరికా నిర్ణయించుకుంది. ఈ సదస్సుపై ట్రంప్ కారాలూ మిరియాలూ నూరుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఉనికిలోకొచ్చిన అంతర్జాతీయ సంస్థలు మొదటినుంచీ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తున్నాయి. అందరికీ ఒకే న్యాయం భావన వదిలి సంపన్న దేశాలతో ఒక విధంగా, బడుగు దేశాలతో మరో రకంగా ప్రవర్తిస్తున్నాయి. అందువల్లే ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి తదితర వేదికలపై ఇప్పుడెవరికీ పెద్దగా భ్రమలు లేవు. ఉన్నంతలో కొలంబియా సదస్సు ఒక ఆశాకిరణం.ఆహార పంపిణీ కేంద్రాలు ఐక్యరాజ్యసమితి సంస్థల కనుసన్నల్లోనే వుంటున్నా అవి పాలస్తీనా ప్రజల పాలిట ఉచ్చుగా మారుతున్నాయి. ఆసుపత్రులు, శరణార్థ శిబిరాలు మాత్రమే కాదు.. చివరకు ఆహార పంపిణీ కేంద్రాలు సైతం ఇజ్రాయెల్ సైనికుల దాడులకు లక్ష్యమవుతున్నాయి. ఆకలితో నకనకలాడుతూ తిండికోసం జనం ఒకచోట గుమిగూడినప్పుడు కాల్చి చంపితే గాజాను ఖాళీ చేయించాలన్న తమ పథకం పారుతుందని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టుంది. ఒకనాడు నాజీ జర్మనీ లక్షలాదిమంది యూదుల్ని చిత్రహింసల శిబిరాలకు చేర్చి అమానుషంగా అంతమొందించింది. ఆ తరహాలోనే పాలస్తీనాలో రఫా వంటి చోట్ల శిబిరాల నిర్మాణం మొదలైంది. మరో జనహననాన్ని నాగరిక ప్రపంచం సహిస్తుందా? ప్రపంచ ప్రజానీకం మేల్కొని తమ తమ దేశాల్లోని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తే తప్ప ఇజ్రాయెల్ దురాగతాలు ఆగవు. -
కృత్రిమ రచన
ఆత్మ అనేది కేవలం స్వర్గలోక సంబంధి కాదు. దానికి భౌతిక ఉనికి లేనంతమాత్రాన అది భావ వాదులకు మాత్రమే చెందినది కాదు. అదేంటో చూపలేకపోయినా, అది లేకపోవడమంటే ఏమిటో మనకు తెలుసు. ఈ మెటీరియలిస్టు ప్రపంచంలో ఆత్మగల్ల మనుషులను వెతికే ప్రయత్నం కాదిది. కృత్రిమ మేధ (ఏఐ) సందర్భంలో ఆత్మ ప్రాధాన్యతను అర్థం చేయించాలన్న ఆరాటం. మానవీయ సహజ మేధనూ, యాంత్రిక కృత్రిమ మేధనూ విడదీస్తున్నది ముఖ్యంగా ఆ ఒక్కటే!‘ఈ కంప్యూటర్ కాలంలో’ అని చెప్పడం నుంచి, ‘ఈ కృత్రిమ మేధ కాలంలో’ అనడం వరకు పయనించాం. మానవ నాగరికత ఒక క్రమ పరిణామమే అయినా, అది ఒక్కోసారి పెద్ద అంగ వేస్తుంది. నిప్పును పుట్టించడం, విద్యుత్ను కనుగొనడం, ఇంటర్నెట్ లాంటి మరో విప్లవాత్మకమైన మార్పు కృత్రిమ మేధ అని పండితులు అంటున్నారు. మనిషి తాను ఎదిగే క్రమంలో ఎన్నో ఉపకరణాలనూ, సాంకేతిక పరిజ్ఞానాలనూ రూపొందించుకున్నాడు. ఆ ఉపకరణాలు, పరిజ్ఞానాల ఊతంగా మరింత ఎదిగాడు. కానీ ఏఐ కేవలం మనిషి చేతిలో మరో పనిముట్టు కాదు, మరో అద నపు పరిజ్ఞానం అంతకన్నా కాదు. అంతకు మించి! పర్యావరణ పరిష్కారాలు సూచిస్తుందంటున్న ఏఐ టెక్నాలజీ నిజానికి అత్యధిక కార్బన్ ఫుట్ప్రింట్స్కు కారణమవుతోందనీ, జలవనరులను విపరీతంగా తోడేస్తోందనీ పర్యావరణవేత్తలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. కానీ ఇవేవీ ఏఐని వ్యతిరేకించడానికి తక్షణ కారణాలు కాదు. ఇతర పరిజ్ఞానాలు కనీసం మన అంచనాలో మనిషిని సుఖపెట్టడానికి రూపొందినవి. కానీ ఏఐ ఏం చేయనుందో మనకు ఏ అంచనా లేదు!సాహిత్య ప్రపంచంలో కొంతకాలంగా ఉన్న భయం ఈ మధ్య ఒక ‘ఓపెన్ లెటర్’ రూపం దాల్చింది. యంత్రాలు సృష్టించిన పుస్తకాలను విడుదల చేయకూడదంటూ ఈ జూన్ నెలలో పదుల కొద్దీ రచయితలు అమెరికాలోని పెంగ్విన్ రాండమ్హౌజ్, హార్పర్ కొలిన్స్ లాంటి ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. ఏఐ–కల్పిత పుస్తకాలను విడుదల చేయడానికి ‘రచయితల’ను సృష్టించ బోమనీ, ఒకవేళ మానవ రచయితలే అలాంటివి కల్పిస్తే వాటిని ‘మారుపేర్ల’తో అనుమతించ బోమనీ, ఈ ‘దొంగతనానికి’ ఏ విధంగానూ మద్దతివ్వబోమనీ ప్రచురణకర్తలు ప్రతిన బూనాలని వారు కోరారు. ఒక పుస్తకం తుదిరూపు వరకు భాగమయ్యే మనుషుల ఉద్యోగాలను ఏఐ టూల్స్కు బలిపెట్టకూడదనీ అడిగారు. ఘంటాలను దాటి, పెన్నుకు బదులుగా టైప్ రైటర్నో, కంప్యూటర్నో వాడటం లాంటి పరిణామం కాదిది. ఏకంగా రచయితనే పక్కకు తప్పించేది! అందుకే రచయితల అనుమతి లేకుండా, రాయల్టీలు చెల్లించకుండా రూపొందిన కృత్రిమ మేధను ప్రచురణకర్తలు వాడకూడదనే విన్నపం కూడా వీటిల్లో ఉంది. ఎటూ ‘దోపిడీ’కి గురవుతున్న శ్రమకు పరిహారం కోరుకోవడం ఇది! సాహిత్యం అంటేనే మానవ అనుభవం. లోలోపలి తరంగం, అంతరంగ జ్వలనం, ఆనంద చలనం. అవేమీ లేని ఏఐ ఎలా రాస్తుంది? ‘ఎలక్ట్రిక్ గొర్రెలను కలగంటుందా ఏఐ?’ అని అడుగు తాడు కవి డేవిడ్ స్టీర్. ‘ఒక రచన చేస్తున్నప్పుడు రచయిత రాస్తున్న ప్రతి పదాన్నీ తెలిసో, తెలియకో ఎంపిక చేసుకుంటాడు. పది వేల పదాల కథకు పది వేల ఎంపికలు. అలాంటి స్పృహ లేనందువల్ల కృత్రిమ మేధ ‘కళ’ను సృష్టించలేదంటాడు అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రచయిత టెడ్ చియాంగ్. ‘‘ఒక మనిషి మీకు ‘ఐ యామ్ సారీ’ అని చెప్పినప్పుడు, గతంలో ఇతర జనాలు క్షమాపణ కోరుకున్నా రన్నది విషయం కాదు; ‘ఐ యామ్ సారీ’ అనేది పరిగణించాల్సినంతటి అసాధారణమైన పదబంధం కాదన్నది విషయం కాదు. ఒకవేళ ఒకరు నిజాయితీగా చెబితే, ఆ క్షమాపణ విలువైనదీ, అర్థవంతమైనదీ అవుతుంది; అలాంటి క్షమాపణలు గతంలో చెప్పివున్నప్పటికీ.’’ ఒక రచయిత రాసేది అతడిదైన లోలోపలి వాక్యం. అది అతడికి మాత్రమే ప్రత్యేకం. అతడి అనుభవమే ఆ వాక్యం రాయడానికి పురిగొల్పుతుంది. యజమానిని చూడగానే కుక్క ప్రేమగా తోక ఊపుతుంది. దాని అన్ని కండరాలూ సంతోషంతో నర్తించడాన్ని ఆ తోక ఊపు సంకేతిస్తుంది. ఇలాంటి చిరు ఉద్వేగపు అనుభవం కూడా ఉండని ఏఐ ఏం రాయగలదు? ప్రదేశాలు, వస్తువులు మనిషి ఉనికితో ముడిపడి ప్రత్యేకమవుతాయి. ఏఐకి లేనిదే ఆ మహత్తర మానవీయ స్పర్శ. కేవలం అన్నింటినీ రుబ్బి, ‘అలాగరిథమ్’ వండివార్చే రచనలో ఆత్మ ఎలా ఉంటుంది? మరి, ఎటూ కళ కాకుండాపోయే ఆ ఏఐ కల్పిత కృత్రిమ రచనల పట్ల భయం దేనికి అనేది ప్రశ్న. సగటు పాఠకుడికి ఆ మీడియోకర్ రచనే బాగుందనిపించొచ్చు. ఇక అదే ప్రమాణం అయ్యి, ‘అసలు’ది తీర్పునకు లోనవుతుందేమో నని ఒక సృజనాత్మక భయం!త్రిపురనేని గోపీచంద్ నవల ‘పండిత పరమేశ్వర శాస్త్రి’లో ఒక పాత్రను ‘సజ్జలు సజ్జలు’ అని వెక్కిరిస్తారు అతడి సాహిత్య మిత్రులు. కోడి సజ్జలు తిని సజ్జలు విసర్జిస్తుంది, ఏమీ జీర్ణం చేసు కోకుండానే. ఎంతో మేధావిగా కనబడే ఆ రచయిత, ఏదీ తనలోకి ఇంకించుకోకుండానే మాటలు వల్లెవేస్తుంటాడని వారి ఉద్దేశం అనుకోవాలి. ఏఐ రచనలకు ఈ ఉదాహరణ బాగా పనికొస్తుంది. అయితే, అసలు ఇప్పుడు ఉన్నది ఇంకా ‘ఆదిమ’ ఏఐ మాత్రమేననీ, మున్ముందు ఇంకా ఆధునికం అవుతుందనీ చెబుతున్నారు. అప్పుడు అది ఏ రూపం తీసుకుంటుందో! ప్రస్తుత భయం రచ యితను పక్కనపెట్టడం గురించే. మున్ముందు మనిషినే పక్కన పెట్టడం అవుతుందేమో! అప్పుడు సమస్త మానవాళి మరొక బహిరంగ లేఖ రాసుకోవాల్సి ఉంటుంది! -
ఏదీ 'సునాయాసం' కాదు!
థాంక్యూ! హలో క్లాస్ ఆఫ్ 2024! నేనెంత ఉత్సాహంగా ఉన్నానో మీకెవరికీ తెలియదు. నేనొక కాలేజీ క్యాంపస్లో అడుగుపెట్టడం నా జీవితంలో ఇది రెండోసారి. కానీ, మీరు దేన్నో దృష్టిలో పెట్టుకుని నాకు డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేస్తున్నారు. నేనిక్కడ ప్రసంగించడానికి వచ్చాను. కానీ, ‘డాక్టర్ రోజర్’గా ఇంటికి తిరిగి వెళతాను. అది నాకు గొప్ప బోనస్ లాంటిది. ‘డాక్టర్ రోజర్’. ఇది నేను ఏమాత్రం ఊహించని విజయం! ఇది నాకు కొద్దిగా పరిచయం లేని వాతావరణం. ఇది నేను ఎప్పుడూ చూసే దృశ్యం కాదు... ఈ దుస్తులు కూడా నేను సాధారణంగా వేసుకునేవి కావు. ఈ పొడవాటి గౌను బరువుగా ఉంది. గత 35 ఏళ్ళుగా ఇంచుమించుగా ప్రతి రోజు నేను పొట్టి నిక్కర్లు, టీ షర్టులతోనే గడిపాను. నాలుగు పదాలే చెప్పగలిగాను!నేను ఇలాంటి ప్రసంగాలు చేసే వ్యక్తిని కూడా కాను. నేను స్విట్జర్లాండ్ జాతీయ జట్టులో చేరేనాటికి నాకు 17 ఏళ్ళు. అప్పట్లో నేను ఎంతగా కలవరపడ్డానంటే నాలుగు పదాలకు మించి మాట్లాడలేకపోయాను. ‘‘ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నానంతే. ఇప్పుడు ఇక్కడ 25 ఏళ్ళ తర్వాత, నాకు ఇప్పటికీ కొద్ది కలవరంగానే ఉంది. కాకపోతే ఇపుడు మీకు చెప్ప డానికి నా దగ్గర నాలుగు మాటలకు మించి చాలా ఉన్నాయి. ఈ స్థాయికి వచ్చేందుకు మీరెంతో కష్టపడి ఉంటారు. మీరంతా సాధించిన దానిపట్ల నాకెంతో గౌరవం ఉంది. ఎందుకంటే, పూర్తి స్థాయి టెన్నిస్ ఆటగాడిగా మారేందుకు నేను 16వ ఏటనే స్కూలు చదువుకు స్వస్తి చెప్పేశాను. కనుక, నేను కాలేజీలో అడుగు పెట్టింది లేదు. కానీ, నేను ఇటీవలే టెన్నిస్లో గ్రాడ్యుయేట్నయ్యా. ‘రిటైర్’ అనే మాట ఉపయోగించాలని నాకు తెలుసు. ‘‘రోజర్ ఫెదరర్ టెన్నిస్ నుంచి రిటైర్ అయ్యాడు.’’ రిటైర్ అవడమా? ఆ మాట వినడానికే బాగా లేదు. కాలేజీ నుంచి రిటైర్ అవుతున్నామని మీరు చెప్పలేరు. ఔనా? మీలాగే నేను కూడా ఒక పెద్ద పని పూర్తి చేసి మరో దానికి మరలుతున్నా. మీలాగే నేను కూడా తదుపరి ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నా. మీ బాధ నాకు అర్థమవుతోంది. చదువు పూర్తయిందిగా, ఏం చేయబోతున్నావు? అని అందరూ అడ గడం మొదలెడతారు. ఆ మాటకొస్తే, ‘‘ఇంక ఇపుడు నువ్వు వృత్తిపరమైన టెన్నిస్ ఆటగాడివి కాదు కదా! ఏం చేయ బోతున్నావు?’’ అని నన్నూ అడుగుతారు. ఏం చేయాలో నాకూ తెలియదు. తెలియకపోవడమూ మంచిదే. మరి నేను కాలాన్ని ఎలా వెళ్ళబుచ్చుతా? తండ్రిగా పిల్లల్ని స్కూల్లో దింపి రావచ్చు. ఎవరో అపరిచితులతో ఆన్లైన్లో చదరంగం ఆడవచ్చు. వాక్యూమ్ క్లీనర్తో ఇంటిని శుభ్రం చేయ వచ్చు. వాస్తవానికి, టెన్నిస్ పట్టభద్రునిగా జీవితాన్ని నేను ఇష్టపడతున్నా. నేను 2022లో టెన్నిస్లో గ్రాడ్యుయేట్నయ్యా. మీరు 2024లో పట్టభద్రులవుతున్నారు. ఈ పరిణామ క్రమంలో నేను ఆకళింపు చేసుకున్న కొద్ది పాఠాలను మీతో పంచుకోవా లనుకుంటున్నా. వాటిని మనం టెన్నిస్ పాఠాలు అనుకోవచ్చు.స్నేహపూరిత ప్రత్యర్థులు: రఫేల్ నదాల్తో రోజర్ ఫెదరర్ టెన్నిస్ పాఠాలుమొదటిది. ‘సునాయాసంగా’ అనే మాట ఒక భ్రమ! నేను సునాయాసంగా ఆడతానని అంటూంటారు. చాలా సందర్భాల్లో దాన్ని ఒక పొగడ్తగానే చెబుతారు. కానీ, ‘‘అతని దేహంపై ఒక్క స్వేద బిందువు కూడా లేదు చూడండి’’ లాంటి మాటలు వారి నుంచి విన్నప్పుడు నాకు అసహనంగా ఉండేది. సత్యం ఏమంటే, తేలిగ్గా ఆడినట్లు కనిపించడం వెనుక నేను చేసిన కఠోర శ్రమ ఉంది. నన్ను నేను తమాయించుకోవడం నేర్చుకోవడానికి ముందు చాలా ఏళ్ళు కోర్ట్లో విసుగు ప్రదర్శించేవాడిని, అనుచితమైన మాటలనేవాడిని, చేతిలో రాకెట్ను విసిరేసేవాడిని. కానీ, క్రీడా జీవితం ఆరంభంలోనే, వాటిని సరిదిద్దుకునే అవకాశం లభించింది. ఒకసారి ఇటాలియన్ ఓపెన్లో నా ప్రత్యర్థి ఒకరు నా మానసిక క్రమశిక్షణను బాహాటంగానే ప్రశ్నించాడు. ‘‘మొదటి రెండు గంటలు రోజర్ గెలుస్తాడనుకుంటారు. ఆ తర్వాత, నేను ఫేవరెట్గా మారతాను’’ అని వ్యాఖ్యానించాడు. మొదట, నాకు ఆ మాటలు అర్థం కాలేదు. తర్వాత, అతని మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించాను. మొదటి రెండు గంటలపాటు ప్రతి ఆటగాడు బాగానే ఆడతాడు. శారీరకంగా శక్తితో ఉంటారు. వేగంగా కదులుతారు. రెండు గంటల తర్వాత, కాళ్ళు పీకడం మొదలెడతాయి. మనసు ఏకాగ్రతను కోల్పోతుంది. నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ మాటలతో అర్థం చేసుకున్నా. ఆ దిశగా ప్రయాణం ప్రారంభించి, కోరుకున్న స్థితికి చేరుకున్నా. ఆ క్రమంలో నా తల్లితండ్రులు, కోచ్లు, ఫిట్ నెస్ కోచ్ నా ప్రవర్తనను సరిదిద్దుతూ వచ్చారు. నా ప్రత్యర్థి ఆటగాళ్ళు కూడా ఆ పని చేస్తున్నారు. ఈ విషయంలో, నాతోటి ఆటగాళ్ళకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.డార్ట్మౌత్లో మీరు దీన్ని మరో విధంగా గమనించి ఉంటారు. తోటి విద్యార్థులు ర్యాంకుల మీద ర్యాంకులు సాధించడాన్ని చూసి శాన్బర్న్ లైబ్రరీలో మీరు ఓ మూలన మౌనంగా రోదించి ఉంటారు. నా లాగానే మీరు కూడా ‘అప్రయత్నంగా’ అనే మాట ఒక భ్రమేనని తెలుసుకుని ఉంటారని భావిస్తున్నా. కేవలం ప్రతిభతోనే నేను ఈ స్థితికి చేరుకోలేదు. ప్రత్యర్థులకన్నా ఎక్కువసేపు, ప్రభావశీలంగా, కఠిన శ్రమకోర్చి ప్రాక్టీసు చేయ బట్టే ఈ స్థితికి చేరా. నిజంగా గర్వపడే విజయాలు అవే!మనం నిరాశతో చతికిలపడే సందర్భాలూ ఎదురవుతా యని గుర్తుంచుకోవాలి. వెన్ను, మోకాళ్ళు నొప్పి పుట్టవచ్చు. స్వల్పంగా అనారోగ్యం పాలుకావచ్చు లేదా ముందున్న లక్ష్యం భయపెట్టనూవచ్చు. అయినా, గెలుపొందడానికి మీరొక మార్గాన్ని కనుగొని తీరాలి. అలా సాధించిన విజయాల గురించి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, మీరు ఉత్తమమైన స్థితిలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా విజయాలు సాధించగలరని అవి నిరూపిస్తాయి. ఔను. ప్రతిభ కూడా ఉండి తీరాలి. దానితో పని లేదని చెప్పడానికి నేను ఇక్కడ నుంచో లేదు. కానీ, ప్రతిభ అనే మాటకు విస్తృతమైన నిర్వచనం ఉంది. చాలా సందర్భాలలో, దాన్ని వరంగా చూడకూడదని, వజ్ర సమాన సంకల్పంగా భావించాలని చెప్పదలచుకున్నాను. కానీ, జీవితంలో మాదిరి గానే... టెన్నిస్లో కూడా క్రమశిక్షణే ప్రతిభగా పరిణమిస్తుంది. ఓర్పు కూడా అంతే అవసరం. మీపై మీకు నమ్మకం ఉండటం కూడా ప్రతిభే. ఏ ప్రక్రియనైనా సరే స్వాగతించడం, ప్రేమించడం ప్రతిభ కిందకే వస్తుంది. మీ జీవితాన్ని, మిమ్మల్ని నడుపుకోవడం కూడా ప్రతిభ కోవలోకే వస్తుందేమో. కొందరికి పుట్టుకతోనే ఆ లక్షణాలు ఉంటాయి. మిగిలిన అందరూ వాటిని సంతరించుకునే కృషి చేయాలి.అదొక పాయింట్ అంతే!రెండవ పాఠం. అదొక పాయింట్ మాత్రమే! మీరు సాధ్యం అనుకున్నదానికన్నా ఎక్కువగానే శ్రమించి ఉంటారు... అయినా పరాజయం పాలయ్యారు. ఈ రోజు మీలో ఒక్కరే డిగ్రీ పొందా రని ఊహించుకుందాం. విజేతకు అభినందనలు తెలుపుదాం. మిగిలిన వెయ్యి మంది మాటేమిటి? తదుపరి విడతలో ఉత్తీర్ణులు కావచ్చు... నేనెప్పుడూ గెలుపొందడానికే ప్రయత్నించానని మీకు తెలుసు. కానీ, నేను ఓడిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు పెద్ద టోర్నమెంట్లలోనే ఓటమి చెందా. వింబుల్డన్ 2008 ఫైనల్స్ వాటిలో ఒకటి. నేను, రఫేల్ నదాల్ తలపడ్డాం. కొందరు దాన్ని చరిత్రలోనే మరపురాని మ్యాచ్గా అభివర్ణిస్తారు. రఫా మీద నాకు పూర్తి గౌరవం ఉంది. కానీ, ఆ మ్యాచ్లో నేను గెలుపొంది ఉంటే ఇంకా బాగుండేది. వింబుల్డన్లో ఓటమిని తేలిగ్గా తీసు కోలేం... ఏ టెన్నిస్ ఆటగాడికైనా వింబుల్డన్లో విజయమే సర్వస్వం. నేను 2008లో వరుసగా ఆరవసారి టైటిల్ సాధించేందుకు బరిలోకి దిగా. చరిత్రలో సుస్థిర స్థానం కోసం ఆడుతున్నా. ఆ మ్యాచ్లో ఒక్కో పాయింట్ మా ఇద్దరిలో ఎవరెవరికి ఎలా వచ్చిందీ నేను ఇపుడు వివరించబోవడం లేదు. అదంతా చెప్పా లంటే కొన్ని గంటలు పడుతుంది. సరిగ్గా చెప్పాలంటే, ఆ మ్యాచ్ దాదాపు ఐదు గంటలు సాగింది. రఫా రెండు సెట్లు గెలి చాడు. టై–బ్రేక్స్లో తదుపరి రెండు సెట్లు నేను గెలిచా. ఐదవ సెట్లో ఏడు పాయింట్లతో ఇద్దరం సమ స్థితిలో ఉన్నాం. ఆట చివరి భాగంపై అందరూ ఎందుకు అంత దృష్టి కేంద్రీ కరిస్తారో నాకు అపుడు అర్థమైంది... చివరి నిమిషాల్లో నాకు కళ్ళు బైర్లు కమ్మాయి. గ్రాస్ కోర్టుపై తెల్లని చారలు కూడా మసకగా కనిపించడం మొదలెట్టాయి. అన్నిసార్లూ గెలవలేము!ఇపుడు వెనుతిరిగి చూసుకుంటే... ఆ మ్యాచ్లో మొదటి పాయింట్ అప్పుడే నేను ఓటమి పాలయ్యాననిపిస్తుంది. ‘ఏయ్, నువ్వు ఐదు విడతలుగా గెలుస్తూ వస్తున్న డిఫెండింగ్ చాంపియన్వి! పైగా, ఆడుతున్నది గ్రాస్ కోర్ట్లో. ఇక్కడ ఎలా ఆడాలో నీకు బాగా తెలుసు’ అని నా అంతరంగంలో నేను గుర్తు తెచ్చుకోవడానికి మూడవ సెట్ దాకా సమయం పట్టింది. కానీ, ఆ ధైర్యం చాలా ఆలస్యంగా వచ్చింది. రఫా గెలుపొందాడు. దానికతను అన్ని విధాలా యోగ్యుడే!కొన్ని ఓటములు మిగిలినవాటికన్నా ఎక్కువ బాధిస్తాయి. వరుసగా ఆరవసారి టైటిల్ కోసం పోటీ పడే అవకాశం జీవితంలో మళ్ళీ లభించదని నాకు తెలుసు. వింబుల్డన్లో ఓడాను.నంబర్ వన్ ర్యాంకింగ్ కోల్పోయాను. టెన్నిస్లో పరిపూర్ణత అనేది అసాధ్యం. నా వృత్తి జీవితంలో నేను ఆడిన 1,526 సింగిల్స్ మ్యాచ్లలో దాదాపు 80% గెలుపొందా. కానీ, ఇక్కడ నేను మీకో ప్రశ్న వేయదలచుకున్నా. ఆ మ్యాచ్లలో, నేను గెలి చిన పాయింట్ల శాతం ఎంతనుకుంటున్నారు? కేవలం 54%. మరో విధంగా చెప్పాలంటే, అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాళ్ళు కూడా వారు అడిన మ్యాచ్ల పాయింట్లలో కేవలం సగంపైన మాత్రమే గెలిచి ఉంటారు. కొంపేం మునిగిపోయింది. అది ఒక పాయింట్ మాత్రమే అని మీకు మీరే నేర్చుకోవాలి. జీవితంలో మీరు ఏ ఆట ఆడినా... కొన్నిసార్లు ఓటమి తప్పదు. అది ఒక పాయింట్, ఒక మ్యాచ్, ఒక సీజన్, ఒక ఉద్యోగం కోల్పోవడం ఏదైనా కావచ్చు. జీవితం అనేక ఎత్తు పల్లాలున్న రోలర్ కోస్టర్. కుంగిపోయినపుడు మీ సామర్థ్యంపై మీకు సందేహాలు ఏర్పడటం సహజం. కానీ, మీ ప్రత్యర్థులకు కూడా వారి సామర్థ్యాలపై వారికి సందేహాలుంటాయని మరచి పోకండి. కానీ, నెగెటివ్ ఎనర్జీ వృథా ఎనర్జీ! ప్రపంచంలో ఉత్తములుగా పరిగణన పొందుతున్నవారు అన్నింటిలోనూ గెలవడం వల్ల అలాంటి హోదా ఏమీ పొందడం లేదు. ఓటమి పాలవుతామనీ, పరాజయాలు పదే పదే వెక్కిరి స్తాయనీ వారికి తెలుసు. వాటిని తట్టుకుని ఎలా నిలబడాలో వారు నేర్చుకుంటారు కాబట్టి గొప్పవారు అనిపించుకుంటారు. చేస్తున్న పనిని ఆనందించండి!మూడవ పాఠం. జీవితం కోర్ట్ కన్నా పెద్దది. టెన్నిస్ కోర్ట్ చిన్న ప్రదేశం. నిక్కచ్చిగా చెప్పాలంటే, 2,106 చదరపు టడుగులు. అది సింగిల్స్ మ్యాచ్లు ఆడే కోర్ట్ వైశాల్యం. ఒక సత్రం గదికన్నా మరీ పెద్దదిగా ఏమీ ఉండదు. ఆ చిన్న ప్రదేశంలోనే నేను ఎంతో శ్రమించాను. నేర్చుకున్నాను. ఎన్నో మైళ్ళు పరుగెత్తాను. కానీ, ప్రపంచం దానికన్నా చాలా చాలా పెద్దది. టెన్నిస్ లోకి అడుగు పెట్టినప్పుడే, టెన్నిస్ నాకు ప్రపంచాన్ని చూపిస్తుంది కానీ, టెన్నిస్సే ప్రపంచం కాదన్న సంగతి నాకు తెలుసు. టెన్నిస్ నుంచి నిష్క్రమించగానే నేను మాజీ టెన్నిస్ క్రీడాకారుడిని అయి పోయా. కానీ, మీరు దేనికీ మాజీలు కాదు. మీరు భవిష్యత్ రికార్డు బ్రేకర్లు. ప్రపంచ యాత్రికులు. భవిష్యత్ కార్యకర్తలు. దాతలు. విజేతలు, నాయకులు.ఈ గౌరవ డిగ్రీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ విజయో త్సవంలో నాకూ భాగం కల్పించినందుకు కృతజ్ఞతలు. మీలో ప్రతి ఒక్కరి తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏమిటో చూడాలని నాకు ఉత్సాహంగా ఉంది. మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా, మీ శక్తి మేరకు ప్రతిభను ప్రదర్శించండి. మీకు నచ్చిన రీతిలో ఆడండి. స్వేచ్ఛగా ఆడండి. అన్నింటిని ప్రయత్నించి చూడండి. అన్నింటికన్నా ముఖ్యంగా, పరస్పరం దయ కలిగి ఉండండి. చేస్తున్న పనిని ఆనందించండి. క్లాస్ ఆఫ్ 2024కి మరోసారి అభినందనలు. -
నాటో మొరటు భాష!
ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. కానీ ఆర్నెల్ల నిరీక్షణ తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో కొద్దో గొప్పో సయోధ్య కుదిరేసరికి నాటో కూటమి ఆయన లక్షణాలు పుణికి పుచ్చుకున్నట్టు కనబడుతోంది. రష్యాతో వాణిజ్యం సాగిస్తే వంద శాతం సుంకాలు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు చేసిన హెచ్చరిక దీన్నే చాటు తోంది. ట్రంప్తో నాలుగు రోజులక్రితం భేటీ అయ్యేవరకూ తన భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో నాటో దిగాలుగా, అయోమయంగా వుంది. ఎందుకంటే నాటో ఖర్చులో సింహభాగం అమెరికాదే. అది తప్పుకున్న మరుక్షణం సంస్థ కుప్పకూలుతుంది. ట్రంప్ ప్రసన్న వదనంతో పలక రించేసరికి పులకరించి తన స్థాయి ఏమిటన్నది నాటో మరిచిందని రూట్ మాటలు చెబుతున్నాయి. ఈ మూడు దేశాలూ యుద్ధం వద్దని రష్యాకు నచ్చజెప్పాలట. లేనట్టయితే ఆ పర్యవసానాలు ఈ దేశాలూ ఎదుర్కొనాల్సి వస్తుందట. ఇంకా వలస పాలన మాటున దోపిడీ సాగించిన నాటి రోజులే వున్నాయని రూట్ భ్రమపడుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఎవరూ సమర్థించరు. అలాగే గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం, ఇటీవల ఆ దేశమే ఇరాన్పై చేసిన దాడి, దానికి వత్తాసుగా అమెరికా సాగించిన దాడులు అంగీకరించరు. నాటో దన్నుతో ఉక్రె యిన్ కావాలని రష్యాతో గిల్లికజ్జాలకు దిగిన వైనం అందరికీ తెలుసు. తమ చేతికి మట్టి అంటకుండా రష్యాను దెబ్బతీసి, దాన్ని సర్వనాశనం చేయగలమన్న భ్రమలో యూరప్ దేశాలు ఉక్రె యిన్ను ఉసిగొల్పాయి. కానీ మూడేళ్లయినా ఆ యుద్ధం ఆగకపోవటంతో యూరప్ దేశాలకు దిక్కు తోచటం లేదు. ఆ నిరాశా నిస్పృహల పర్యవసానంగానే నాటో కూటమి అతిగా మాట్లాడుతోంది. అటువంటి బెదిరింపులకు దిగేందుకు తనకున్న అర్హతేమిటో నాటో గమనించుకోలేదు. 1949లో ఆవిర్భావం మొదలుకొని దాని చరిత్రంతా దురాక్రమణలు, యుద్ధాలే. నిక్షేపంగా వున్న లిబియాపై చమురు, సహజవాయు నిక్షేపాల్ని కొల్లగొట్టడానికి దండెత్తి, రసాయన ఆయుధాలున్నా యంటూ ఆరోపించి, పాలకుడు గడాఫీని దారికి తెచ్చుకుని, ఆయన నిరాయుధుడు కాగానే సాయుధ ముఠాలను ఎగతోసింది నాటోయే. ఆ ముఠాలతో ఆయన్ను అత్యంత అమానుషంగా హత్య చేయించింది కూడా నాటోయే. 2011 మొదలుకొని ఇప్పటివరకూ ఆ దేశం అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. బోస్నియా, హెర్జ్గోవినా, కొసావో, అఫ్గాన్, ఇరాక్, సోమాలియా తదితర చోట్ల అమెరికాతో కలిసి, విడిగా నాటో సృష్టించిన కల్లోలం సామాన్యమైంది కాదు. ఈ యుద్ధాల్లో లక్షలాది మంది పౌరులు మరణించారు. రష్యా–ఉక్రెయిన్ లడాయిలోఉక్రెయిన్కు సైనిక, ఆర్థిక సాయాన్నందిస్తూ ఈ యుద్ధం ఆరకుండా కాపాడుతున్నది కూడా నాటోయే. అలాంటి సంస్థ ఏ అర్హతతో మననూ, వేరే దేశాలనూ బెదిరిస్తుంది? నాటో అనేది పుట్టుకనుంచీ అమెరికా కోసం, దాని ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేస్తున్న పెద్ద పోలీస్. ఒక సైనిక కూటమిగా వుంటూ ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించటం సాధ్యమనే నాటో అనుకుంటున్నదా? ఆ పని యూరప్ దేశాలది. కానీ వాటికి హెచ్చరించటం సంగతలా వుంచి అడిగే ధైర్యం కూడా లేదు. ఒకనాడు సంపన్న రాజ్యాలుగా చలామణి అయిన యూరప్ దేశాలు ఇప్పుడు ఉత్పాదకతను పెంచటం ఎలాగో... అరకొర ఆర్థిక వ్యవస్థలతో ప్రజానీకంలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చటం ఎలాగో అర్థంకాక తలలు పట్టుకుంటున్నాయి. ఈ దేశాలతో కూడిన నాటో మాత్రం పెద్ద మాటలు మాట్లాడుతోంది. ఇన్నేళ్ల అమెరికా సాహచర్యంతో ఇష్టాను సారం బడుగు దేశాలపై బలప్రయోగం చేయటం అలవాటైన నాటోకు ఈ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి, భద్రతామండలి వంటి అంతర్జాతీయ వేదికలున్నాయని కూడా గుర్తున్నట్టు లేదు. ఆంక్ష లైనా, విధినిషేధాలైనా వాటిద్వారా అమలు కావాలి. అదనంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వంటివి వున్నాయి. రష్యాతో వ్యాపారం చేయాలో లేదో అమెరికా, యూరప్సొంతంగా నిర్ణయించుకోవచ్చు. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేరు. కానీ మేమే కాదు... ఎవరూ వ్యాపారం చేయకూడదంటే చెల్లదు. తన ఇంధన అవసరాలేమిటో, దాన్ని నెరవేర్చుకోవటానికి అనుసరించాల్సిన వ్యూహమేమిటో భారత్ ఆలోచించుకుంటుంది. రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినా మన దేశం బేఖాతరుచేసింది. రష్యా చవగ్గా అమ్మజూపిన ముడి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసింది.క్రితంతో పోలిస్తే 2023లో రష్యా నుంచి చమురు, సహజవాయు దిగుమతులు 1,500 శాతం పెరగటానికి ఇదే కారణం. చైనా, బ్రెజిల్ కూడా ఈ దోవనే వెళ్లాయి. రష్యాను ఏకాకిని చేయాలన్న పాశ్చాత్య ప్రపంచం కలల్ని బద్దలుకొట్టాయి. మన విదేశాంగ శాఖ నాటో ద్వంద్వ ప్రమాణాలను సరిగానే ఎత్తిచూపింది. ప్రజల ఇంధనావసరాలు మినహా తమకేదీ ప్రాముఖ్యంగల అంశం కాదని జవాబిచ్చింది. ఒకప్పుడు 27 దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు చేసిన మన దేశం, ఇప్పుడు 40 దేశాలనుంచి కొంటున్నది. రష్యాపై తీసుకొచ్చిన అభిశంసనపై ఓటింగ్ జరిగినప్పుడల్లా ఐక్యరాజ్యసమితిలో మన దేశం గైర్హాజరైంది. అదే సమయంలో యుద్ధాన్ని విరమించాలని రష్యా అధినేత పుతిన్కు నచ్చజెప్పింది. అదే సలహా ఉక్రెయిన్కు కూడా ఇచ్చింది. ఇవి తెలియకుండా ఇష్టానుసారం మాట్లాడటం, హెచ్చరికలు జారీ చేయటం తగదని నాటో గుర్తించాలి. తెలిసీ తెలియ కుండా తగుదునమ్మా అని జోక్యం చేసుకుంటే వున్న పరువు కాస్తా పోతుందని గుర్తెరగాలి. -
ఎన్నదగిన తీర్పు
తబ్లీగీ జమాత్తో సంబంధాలుండి, కరోనా మహమ్మారి వ్యాపించిన కాలంలో అక్రమంగా 190 మంది విదేశీయులకు వివిధ మసీదుల్లో ఆశ్రయం కల్పించిన కేసుల్లో మన పౌరులు 70 మందిపై దాఖలైన ఎఫ్ఐఆర్లనూ, తదుపరి విచారణలనూ, వివిధ కేసుల కింద వారిపై దాఖలైన చార్జి షీట్లనూ కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం వెల్లడించిన తీర్పు అనేక విధాల ఎన్నదగినది. 2020 మార్చిలో 24 తేదీ నుంచి 30 వరకూ 195 మంది విదేశీయులకు ఆశ్రయమిచ్చారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ. వాస్తవానికి విదేశీయుల్ని కూడా ఎఫ్ఐఆర్లలో ప్రస్తావించినా చార్జిషీట్లు దాఖ లైన సమయానికి వారి పేర్లు తొలగించారు. ఒక నేరానికి రెండుసార్లు శిక్షించరాదన్న సూత్రాన్ని ఆధారం చేసుకుని కొందరిపై చార్జిషీట్ల దాఖలు సమయంలోనే మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో వేలాది మందితో మార్చి మొదటివారంలో నిర్వహించిన మతపరమైన కార్యక్రమం సందర్భంగా ఈ కేసులు దాఖలయ్యాయి. అప్పుడున్న ప్రత్యేక పరిస్థితి వేరు. అది కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న సమయం. అందువల్ల వేలమంది కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఒకచోట గుమిగూడారన్నది ఆందోళనకరమే. చట్టవిరుద్ధమైనప్పుడు ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ అదేమీ రహస్య సమావేశం కాదు. ఆ కార్యక్రమానికి ప్రభుత్వ విభా గాల నుంచి నిర్వాహకులు ముందస్తు అనుమతులు పొందారు. మార్చి 24న రాత్రి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించగా, అంతకుముందు మార్చి 13న దేశవ్యాప్తంగా అంటురోగాల చట్టం అమలవు తుందని ప్రకటించారు. అప్పటికి కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కరోనా వైరస్ను ‘ఆరోగ్యపర మైన ఆత్యయిక స్థితి’గా ఇంకా పరిగణించటం మొదలుపెట్టలేదు. అంతక్రితం అనుమతులిచ్చినా వాటిని రద్దుచేయకపోవటానికి ప్రభుత్వ విభాగాల్లో వ్యాధి తీవ్రత, పెనువేగంతో వ్యాపించే దాని తీరుతెన్నులపై అవగాహన లేకపోవటమే కారణం. తబ్లీగీ నిర్వాహకులు చెబుతున్న కారణాలు కూడా వున్నాయి. వ్యాధి తీవ్రత అర్థమైన తర్వాత అందరినీ స్వస్థలాలకు పంపించాలని నిర్ణయించినా లాక్డౌన్ వల్ల సాధ్యపడక వివిధ మసీదుల్లో ఆశ్రయమివ్వక తప్పలేదని వారి సంజాయిషీ. కానీ ఈ కార్యక్రమాన్ని ప్రధాన స్రవంతి మీడియాతోపాటు సామాజిక మాధ్యమాలు ఒక భూతంలా చిత్రించాయి. కరోనా మహమ్మారిని వ్యాప్తి చేయటం కోసం కుట్రపూరితంగా ఈ కార్య క్రమాన్ని నిర్వహించారన్న అపవాదు వేశారు. తబ్లీగీ ఒక ‘సూపర్ స్ప్రెడర్’ అనీ, దానివల్ల 4,000 మంది కరోనా బారిన పడ్డారని ప్రచారం సాగించారు. వారు సక్రమంగా వీసాలు తీసుకుని వచ్చిన విదేశీయులనీ, ఆ కార్యక్రమానికి అన్ని అనుమతులూ ఉన్నాయనీ తెలియనట్టు నటించారు. వచ్చిన వారంతా నిబంధనల ప్రకారం తమ తమ దేశాల్లో, భారత్ గడ్డపై అడుగుపెట్టాక ఇక్కడ కరోనా పరీక్షలు జరిపించుకుని, ఆ వైరస్ లేదని నిర్ధారణ అయినవారు. కరోనా తీవ్రత దాఖలా కనబడ్డాక నిర్వాహకుల వద్దకెళ్లి వెంటనే నిలిపేయాలని ఉత్తర్వులిస్తే తప్పు బట్టాల్సిన పని లేదు. అది చేయ కుండా, విదేశాల నుంచి వచ్చినవారికి ప్రత్యామ్నాయ సదుపాయాలేమీ కల్పించకుండా మసీదుల్లో రహస్యంగా ఆశ్రయం పొందినట్టు చూపటం ద్వారా సాధించిందేమిటి? ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అది పూర్తయ్యాక ప్రచారం నిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు.అలాంటి వారిపై తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో సైతం కేసులు నమోదయ్యాయి. తబ్లీగీ కార్యక్రమాలు మన దేశానికి కొత్తగాదు. ప్రతి యేటా జరుగుతుంటాయి. ఢిల్లీకి సమీపంలోని మేవాత్లో మౌలానా మహమ్మద్ ఇలియాసి అనే ఆధ్యాత్మికవేత్త ముస్లిం మతానుయాయుల్లో ఆధ్యాత్మికత సన్నగిల్లుతున్నదని, స్వార్థం పెరిగి స్వప్రయోజనాలే పరమావధి అవుతున్నదని భావించి వారిలో కరుణ, దయ, నిరాడంబరత, ఆధ్యాత్మికత పెంపొందించటానికి తబ్లీగీని ప్రారంభించారు. దీనికి విదేశాల్లో సైతం ఆదరణ లభించటం, అక్కడినుంచి ఏటా వందల సంఖ్యలో హాజరై మతపరమైన మౌలిక విలువలు గ్రహించి, అటు తర్వాత ఆ మతస్థుల్లో వాటిని ప్రచారం చేయటం రివాజుగా వస్తోంది. తబ్లీగీ ప్రధాన కార్యాలయం మర్కజ్ మసీదులోనే వుంటుంది.బొంబాయి హైకోర్టు తబ్లీగీ అనుయాయుల విషయంలో పోలీసుల వైఖరిని 2021లో తీవ్రంగా తప్పు బట్టింది. మతపరమైన ఆదర్శాన్నీ, సంస్కరణనూ బోధించే యువకులను కోవిడ్ వ్యాప్తిచెందిన సమయంలో ఆదుకోవాల్సింది పోయి, వారిని జైలుపాలు చేయటం, అక్కడ దుర్భర పరిస్థితుల మధ్య వారు గడపాల్సి రావటం విచారకరమని వారిని విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పులో న్యాయ మూర్తులు వ్యాఖ్యానించటం గమనార్హం. మద్రాసు, కర్ణాటక హైకోర్టులు సైతం తబ్లీగీలపై కేసులు బనాయించటం, వారిని నిర్బంధించటం అహేతుకం, అన్యాయం అని దుయ్యబట్టాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు 70 మంది పౌరులను వివిధ కేసుల నుంచీ, ఎఫ్ఐఆర్ల నుంచీ, విచా రణల నుంచీ విముక్తుల్ని చేయటం హర్షించదగ్గది. తప్పుడు ప్రచారాలకు దిగి, విద్వేషాలను రెచ్చ గొట్టి తాత్కాలికంగా లబ్ధిపొందేవారు ఈ దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ వున్నదని, కొంత ఆలస్యం జరిగినా అంతిమంగా న్యాయం లభించటం ఖాయమని గుర్తించటం లేదు. సామాజిక మాధ్యమాల మాటెలా వున్నా, ప్రధాన స్రవంతి మీడియా సైతం వార్తలకు మతం రంగు పులిమి అపచారం చేస్తున్నదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు 2021 సెప్టెంబర్లో వ్యాఖ్యానించింది. తాజా తీర్పయినా అటువంటివారి కళ్లు తెరిపించాలి. బాధ్యతాయుత ప్రవర్తనా శైలినీ, జవాబుదారీ తనాన్నీ వారిలో పెంపొందించాలి. -
ట్రంప్ కొత్త రాగం!
చాలా తరచుగా మాటలు మార్చే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై కత్తిగట్టారు. 50 రోజుల్లోగా ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి రాకపోతే ‘కఠినాతి కఠినమైన’ సుంకాలు విధించటంతోపాటు, తీవ్రమైన ఆంక్షలు మొదలుపెడతానని హెచ్చరించారు. అంతేకాదు... ఉక్రెయిన్ కోసం నాటో దేశాలకు పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థనూ, ఇతరేతర ఆయుధాలనూ విక్రయిస్తారట. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడు రిపబ్లికన్ పార్టీ వైఖరికీ, ట్రంప్ అప్పట్లో చేసిన ప్రకటనలకూ తాజా హెచ్చరికలు పూర్తి విరుద్ధం. ఉక్రెయిన్ విషయంలో బైడెన్ ప్రభుత్వానికి మద్దతునిచ్చారంటూ తమ పార్టీకి చెందిన అప్పటి స్పీకర్ కెవిన్ మెకార్తీకి ఉద్వాసన పలికింది రిపబ్లికన్లే. అటు తర్వాత వచ్చిన మైక్ జాన్సన్ను సైతం ఇబ్బంది పెట్టారు. చిత్రమేమంటే అప్పట్లో ఉక్రెయిన్కు సాయం అందించటాన్ని గట్టిగా వ్యతిరేకించినవారంతా ఇప్పుడు ట్రంప్ మాదిరే అభిప్రాయాలు మార్చుకుని ఆయనకు మద్దతునిస్తున్నారు. ట్రంప్ విధానం అద్భుతమైనదంటూ పొగుడుతున్నారు. ఉక్రె యిన్కు అందించదల్చుకున్న ఆయుధాలను ట్రంప్ నాటోకు విక్రయిస్తున్నారని, అందువల్ల అమె రికా నష్టపోయేదేమీ వుండదని వీరి వాదన. యూరప్ దేశాలు ఇటీవల రక్షణ బడ్జెట్లను విపరీతంగా పెంచాయి. ఆ డబ్బంతా అమెరికా ఖజానాకు చేరుతుందన్నది రిపబ్లికన్ల అంచనా. ట్రంప్ అన్నంత పనీ చేస్తారని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇప్పుడున్న వైఖరి సెప్టెంబర్ నాటికి వుంటుందనటానికి లేదు. తాను అధ్యక్షుడయ్యాక కలవటానికొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని వైట్హౌస్లో తీవ్రంగా అవమానించి, యుద్ధోన్మాదిగా చిత్రించిన ట్రంప్ ఆర్నెల్లయ్యేసరికి ఆ పాత్ర తానే పోషించటానికి సిద్ధపడ్డారు. ట్రంప్ చెబుతున్న ప్రకారం రష్యా దారికి రాకపోతే ఆ దేశంతో వాణిజ్యం నెరపే దేశాలపై కూడా వంద శాతం సుంకాలు విధించాలి. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న మన దేశంతోపాటు ఏటా 25,000 కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటున్న చైనాపై కూడా చర్యలుండాలి. మన మాటెలావున్నా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో వున్న చైనాతో నేరుగా యుద్ధానికి దిగటంతో సమానం. పిపీలక ప్రాయమైన ఉక్రెయిన్ కోసం ట్రంప్ ఇంత వివాదానికి దిగుతారా అన్నది ప్రశ్నార్థకం. పైగా అమెరికా మిత్ర దేశాలైన ఈయూ, జపాన్ సైతం రష్యాతో ఇప్పటికీ గణనీయంగా వాణిజ్య లావాదేవీలు సాగిస్తున్నాయి. లక్ష్మణ రేఖల్ని గీయటంలో ట్రంప్ను మించినవారు లేరు. అధికసుంకాల విధింపు హెచ్చరిక ఏమైందో కనబడుతూనే వుంది. దాన్ని వరసగా పొడిగించుకుంటూ పోతున్నారు. ప్రస్తుతానికి వచ్చే నెల 1వ తేదీ తాజా డెడ్లైన్. అసలు పదవిలోకి వచ్చేముందే ‘నేను అధ్యక్షుడినైన రెండు వారాలకల్లా రష్యా–ఉక్రెయిన్ లడాయి ఆగితీరాలి’ అని హెచ్చరించిన విషయం ఎవరూ మరిచిపోరు. ఉక్రెయిన్ను అడ్డుపెట్టుకుని ఏదోవిధంగా రష్యాను అదుపు చేయటానికి శ్రమిస్తున్న నాటో కూటమి ఎలాగైతేనేం ట్రంప్ అంతరంగాన్ని పట్టుకుని, ఆయన అభిప్రాయాన్ని మార్చగలిగింది. మొన్నటివరకూ తిట్టిన నోరే మెచ్చుకునేలా చేసింది. కానీ ఇదెంత కాలం? నిజానికి ‘వేల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు నాటోకు అందిస్తాం. మొండికేస్తున్న రష్యాను దారికి తెస్తాం’ అంటూ ట్రంప్ సోమవారం చేసిన ప్రకటన నాటోను లోలోన వణికిస్తోంది. కొత్తగా తాము పెంచుకున్న రక్షణ కేటాయింపులన్నీ అమెరికా ఆవిరి చేస్తుందన్న భయం వాటిని వేధిస్తోంది. పైగా అవసరమైన ఆయుధాలు అందించటం రోజుల్లో, నెలల్లో పూర్తయ్యేది కాదు. అమెరికా, యూరప్ దేశాల దగ్గ రున్న ఆయుధాలన్నిటినీ వినియోగించినా రష్యాపై తక్షణ ఆధిక్యత అసాధ్యం. కొత్తగా ఆయుధాల ఉత్పత్తి మొదలై నాటో కూటమికి చేరటానికి సంవత్సరాలు పట్టొచ్చు. యూరప్ దేశాల్లో వున్న ఆయుధ పరిశ్రమ పరిమాణం చిన్నది. అమెరికా ఒక్కటే లక్ష్యాన్ని పూర్తి చేయటం అంత సులభం కాదు. వాణిజ్యం వరకూ చూస్తే రష్యా నుంచి అమెరికా దిగుమతులు ఎక్కువేమీ కాదు. అవి 300 కోట్ల డాలర్లు మించవని నిపుణులు చెబుతున్నారు. వాటిలో అమెరికాకు ఎంతో అవసరమైన ఎరు వులు, ఇనుము, ఉక్కు, యురేనియంలున్నాయి. ఇప్పటికే మూడేళ్లుగా ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా కొత్తగా నష్టపోయేది కూడా వుండదు. కానీ రష్యాతో వాణిజ్య లావాదేవీలున్న దేశాలను గణనీయంగా దెబ్బతీసేందుకు అవకాశం వుంటుంది. కానీ అది ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యలన్నీ అమలైతే రష్యా స్పందన గురించి ట్రంప్ ఆలోచించినట్టు లేరు. ఆ పర్యవసానా లను ఎదుర్కొనగలిగే శక్తిసామర్థ్యాలు అమెరికాకు లేవు. ఇప్పటికే పీకల్లోతు రుణ భారంతో కుంగు తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ యుద్ధంలో వేలుపెడితే మరింత దిగజారుతుంది. ఏరికోరి ఈ విపత్తు తెచ్చుకోవటానికి ట్రంప్ సిద్ధపడకపోవచ్చు. అయితే రష్యాకు ఆయన విధించిన గడువులో ఒక మతలబుంది. మరో యాభై రోజులకల్లా వేసవి ముగిసి, హిమ పాతం మొదలై రష్యాకు ఇబ్బందులెదురవుతాయి. ఇప్పటికే స్వాధీనమైన తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు నిలబెట్టుకోవటం మినహా అది చేయగలిగేది వుండదు. ఎటూ యుద్ధం జోరు తగ్గుతుంది గనుక దాన్ని తన ఘనతగా చెప్పు కోవటమే ట్రంప్ ఆంతర్యమని నిపుణులంటున్న మాట కొట్టివేయదగ్గది కాదు. యుద్ధాన్ని అంతం చేయటానికి దాన్ని మరింత తీవ్రతరం చేస్తామనటం తెలివితక్కువైనా కావాలి... మూర్ఖత్వమైనా కావాలి. ట్రంప్ వ్యవహార శైలి దేనికి దగ్గరగా వున్నదో త్వరలో తేలిపోతుంది. -
ఇకనైనా చైనా మారేనా?
గల్వాన్ లోయలో భారత, చైనాల మధ్య ఘర్షణలు జరిగిన అయిదేళ్లకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మంగళవారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను ఇతర దేశాల విదేశాంగమంత్రులతోపాటు కలవటమేకాక, చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్తో ముందు రోజు భేటీ అయ్యారు. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో కూడా విడిగా భేటీ అయ్యారు. ఇరుగుపొరుగన్నాక సమస్యలు రావటం సహజం. అందునా చైనా వంటి దేశం పొరుగున వుంటే ఇవి మరింత క్లిష్టం కావటం, అవి ఘర్షణలుగా రూపాంతరం చెందటంలో ఆశ్చర్యం లేదు. సరిహద్దుల్లో ఎవరి భూభాగం ఎంతవరకూ వుందన్న అంశంలో మాత్రమే కాదు... పాకిస్తాన్తో మనకు సమస్య తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని నెత్తిన పెట్టుకోవటం చైనాకు అలవాటైంది. ఉగ్రవాద దాడులకు కారణమైన సంస్థల్ని, ఉగ్రవాదుల్ని నిషేధ జాబితాలో చేర్చాలని భద్రతా మండలిలో కోరినప్పుడల్లా చైనా మోకాలడ్డుతోంది. ఇలాంటి సమస్యలెన్ని వున్నా సామర స్య వాతావరణంలో చర్చించుకుని పరిష్కరించుకోవటమే విజ్ఞత. అందుకే అయిదేళ్ల జాప్యం తర్వాతైనా ఈ పరిణామం చోటుచేసుకోవటం హర్షించదగ్గది. నిరుడు అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కలుసుకున్నారు. ఉభయ దేశాల సంబంధాలనూ మళ్లీ పూర్వ స్థితికి తీసుకెళ్లాలని ఆ సమావేశంలో నిర్ణయించు కున్నారు. అటు తర్వాత మధ్య మధ్యలో చైనా వ్యవహార శైలివల్ల ఇబ్బందులేర్పడినా ఇరు దేశాల మధ్య సంబంధాలూ ఎంతో కొంత మెరుగయ్యాయని చెప్పాలి. సరిహద్దుల్లోని డెమ్చోక్,డెస్పాంగ్ ప్రాంతాల్లో సైన్యాలను వెనక్కి పిలవాలని ఇరు దేశాలూ నిరుడు అక్టోబర్లో నిర్ణయించ టంతో పరిస్థితుల్లో గణనీయంగా మార్పు వచ్చింది. కానీ మొన్న ఏప్రిల్లో హఠాత్తుగా విద్యుత్ వాహనాల తయారీలో, ఏఐ సహా అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలక ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఒడంబడిక ప్రకారం ఇది సరైంది కాదని మన దేశం చెబుతూ వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటానికి కూడా ఇలాంటి ఆంక్షలు ప్రతిబంధ కమవుతాయి. ఈ సంబంధాలు మెరుగుపడటం, అభివృద్ధి చెందటం అంత సులభంగా సాధ్య పడలేదని, జాగ్రత్తగా వ్యవహరించి దీన్ని సుస్థిరపరుచుకోవాల్సిన అవసరం వున్నదని చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ అన్నట్టు అక్కడి మీడియా తెలిపింది. ఈ విషయంలో చైనా నిజంగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తే, కీలక ఖనిజాల ఎగుమతులపై వున్న నిషేధాన్ని తొలగిస్తే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో రెండూ అతి పెద్ద మార్కెట్లు. కానీ వృథా వివాదాల కారణంగా వాటిని వినియోగించుకోలేని నిస్సహాయత రెండు దేశాలనూ ఆవరిస్తోంది. ఈ ఏడాది చివరిలో ఎస్సీఓ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు చైనాలో జరగబోతోంది. దానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్నారు. కనుక ఈలోగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచు కోవటానికి కృషి చేయాల్సి వుంది. కశ్మీర్లోని పెహల్గాంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడిచేయటం, అనంతరం ‘ఆపరేషన్ సిందూర్’తో మన దేశం గట్టిగా జవాబీయటం వంటి పరిణామాల్లో చైనా, పాకిస్తాన్ వైపే నిలబడింది. ఇక దలైలామా వారసుడి నిర్ణయం తమ అంతర్గత వ్యవహారమంటూ చైనా వాదిస్తోంది. గత నెలలో బంగ్లాదేశ్, పాకిస్తాన్లతో కలిసి చైనా త్రైపాక్షిక సమావేశం నిర్వహించటాన్ని కూడా సాధారణ విషయంగా పరిగణించటానికి వీల్లేదు. ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతేమీ లేదని బంగ్లాదేశ్ చెప్పినా, పాకిస్తాన్ మాత్రం భవిష్యత్తు త్రైపాక్షిక సమావేశాలకు ఇది ఆరంభమని ప్రకటించింది. ఇదిగాక అమెరికాలో ట్రంప్ ఆగమనం తర్వాత ఆ దేశం బంగ్లాదేశ్ వ్యవహారాల్లో ఏ పాత్ర పోషిస్తుందనేది ఇంకా అస్పష్టంగా వుంది. చైనాకు వ్యతిరేకంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో మనతో కలిసి కూటమి కట్టిన అమెరికా, దానిపై కూడా తన వైఖరేమిటని చెప్పటం లేదు. తన మనసులోని మాట చెప్పకుండా ఈ మధ్య జపాన్, ఆస్ట్రేలియాలతో జరిపిన సమావేశంలో తైవాన్ విషయంలో చైనా దూకుడు నిర్ణయం తీసుకుంటే మీ చర్యలెలావుంటాయంటూ ట్రంప్ ఆరా తీశారు. అమెరికా ఏం చేస్తుందో, ఏ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలియకుండా హామీ ఇవ్వటానికి రెండు దేశాలూ నిరాకరించాయి. ఆస్ట్రేలియా అయితే నేరుగానే అది తన సమస్య కాదన్నట్టు మాట్లాడింది. కనుక స్వీయ ప్రయోజనాల రీత్యా చైనా విషయంలో మనం కూడా ఆచితూచి అడుగేయక తప్పదు.అయితే మన భద్రత విషయంలో రాజీ పడాల్సిన పనిలేదు. ఎస్సీఓలో మంగళవారం మాట్లాడిన జైశంకర్ నిర్మొహమాటంగానే మన వైఖరేమిటో చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటు వాదం, తీవ్రవాదం అనే మూడు దుష్టశక్తులతో పోరాడాల్సి వుంటుందని ఆయన ప్రకటించారు. పెహల్గాం దాడి జమ్మూ కశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు జరిగిన కుట్రని చెప్పటంతోపాటు ఎస్సీఓ తన ప్రకటిత లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ఎస్సీఓకు నేతృత్వం వహిస్తూ దాని లక్ష్యాలకు భిన్నంగా పాకిస్తాన్కు మద్దతీయటం సరికాదని చైనా గుర్తించక తప్పదు. స్నేహ సంబంధాలుంటే వాటిని పెంపొందించుకోవటానికి ఇతరేతర మార్గాలున్నాయి. అంతేతప్ప పాక్ తప్పులన్నిటినీ భుజాన మోసుకెళ్లటం తన ఎదుగుదలకు కూడా చేటు తెస్తుందని చైనా గుర్తించాలి. -
ఈ అరకొర నివేదిక దేనికి?!
ఒక పెను విషాదంపై జరిగే దర్యాప్తు ఎంతో బాధ్యతాయుతంగా వుండాలి. ఆ ఉదంతంలో అసలు జరిగిందేమిటో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అస్పష్టతకు తావీయకూడదు. ప్రాథమిక దర్యాప్తుకైనా, పూర్తిస్థాయి దర్యాప్తుకైనా ఇదే వర్తిస్తుంది. కానీ గత నెల 12న గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం విషయమై శుక్రవారం అర్ధరాత్రి వెలువరించిన ప్రాథమిక దర్యాప్తు ఆ నియమాలను ఉల్లంఘించింది. బాధిత కుటుంబాల్లో అయోమయాన్ని మరింత పెంచింది. ఆ ప్రమాదం వైమానిక ప్రమాదాల చరిత్రలో పెద్దది. ఆ విషాద ఘటన సమ యంలో విమానంలో 242 మంది ప్రయాణికులుండగా, ఒకరు క్షేమంగా బయటపడ్డారు. భవంతిపై కూలినందువల్ల అక్కడున్న 19 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానంలో ఇంధనాన్ని నియంత్రించే స్విచ్లు రెండూ ఆపివేసి వుండటం వల్లనే ప్రమాదం జరిగివుండొచ్చని దర్యాప్తు చేస్తున్న విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ప్రాథమిక నివేదిక భావించింది. ఇది కేవలం ప్రాథమిక నివేదికే గనుక వెంటనే నిర్ణయానికి రావటం తగదని కేంద్ర వైమానిక మంత్రిత్వ శాఖ అంటున్నది. మంచిదే. అటువంటప్పుడు ఏఏఐబీ నివేదిక స్విచ్ల విషయంలో మరింత సమాచారం అందాకే వాటిని ప్రస్తావించి వుండాల్సింది. పైలెట్ల సంఘం కూడా నివేదికను తప్పుబడు తోంది. పైలెట్ల తప్పిదమే కారణమని అర్థం వచ్చేలా నివేదిక వుండటం సరికాదని విమర్శిస్తున్నారు. దర్యాప్తులో తమ ప్రతినిధికి ఇప్పటికైనా చోటీయాలని వారు అంటున్నారు. ఈ అయోమయం ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో వున్న బాధిత కుటుంబాలను మరింత నొప్పించదా? అంతర్జాతీయ వైమానిక నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన ఏడాదిలోగా తుది నివేదిక రావాలి. ఈలోగా విడుదల చేసే ప్రాథమిక నివేదిక పైలెట్లను తప్పుబట్టే విధంగా వుండటం, ఆ తర్వాత దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదనటం న్యాయమేనా? ఘటనా స్థలంలో దొరికిన స్విచ్లున్న పరికరంలో అవి రెండూ ‘ఆన్’ చేసివున్నాయి. కానీ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలెట్ మరొకరితో ‘ఇంధనం ఎందుకు నిలిపివేశావ్’ అని అడగటం, అందుకు రెండో పైలెట్ ‘నేనలా చేయలేదే...’ అంటూ జవాబివ్వటం వినబడటాన్నిబట్టి స్విచ్లు ఆపివేసి వున్నట్టు దర్యాప్తు బృందం నిర్ధారణకొచ్చింది. కానీ రెండో పైలెట్ ఆ వెంటనే వాటిని సరిచేసి వుండొచ్చని, అందుకే అవి సక్రమంగా వున్న స్థితిలో లభించాయని నివేదిక అంటున్నది. ఈ సంభాషణల్లో అడిగిన వారెవరో, జవాబిచ్చిన వారెవరో దర్యాప్తు చేసినవారు గుర్తించారా?గుర్తించి వుంటే ఆ సంగతి వెల్లడించటానికి వారికున్న అభ్యంతరమేమిటి? ఒకవేళ అలాంటి అభ్యంతరం వున్నప్పుడు అసలు ఆ సంభాషణను బయటపెట్టడం దేనికి? విమానంలోని యాంత్రిక వ్యవస్థలు సంక్లిష్టమైనవి. విమాన గమనంలో మనుషుల జోక్యం దాదాపు అవసరం లేని ‘ఫ్లై బై వైర్’ వ్యవస్థ అందుబాటులోకొచ్చి దశాబ్దాలవుతోంది. ముఖ్యంగా విమానం టేకాఫ్ సమయంలోనూ, దిగే సమయంలోనూ ఆ వ్యవస్థ పూర్తిగా తనకు తానే అన్నిటినీ సరిచేసుకుంటుంది. పైకెగిరినప్పుడూ, కిందకు దిగినప్పుడూ అవసరమైన ఇంధనం సరఫరా అయ్యేలా చూసుకుంటుంది. ఇవి విఫలమైన పక్షంలో పైలెట్ అవసరమైన మార్పులు చేసుకోవ డానికే స్విచ్లుంటాయి. రెండు స్విచ్లకూ రెండువైపులా రింగ్లుంటాయి. వాటికి ప్రత్యేక లాకింగ్ వ్యవస్థ వుంటుంది. మనిషి ప్రత్యేకించి వాటిని స్విచాన్ చేయటానికైనా, స్విచాఫ్ చేయటానికైనా ముందు ఆ లాకింగ్ను తెరవక తప్పదు. రెండు స్విచ్లూ ఆగిపోవటానికి మధ్య సెకను వ్యవధి వుందని తేల్చారు. పైగా పైకెగురుతున్న సమయంలో ఎక్కువ ఇంధనం సరఫరా కావాల్సి వుండగా దాన్ని కావాలని ఏ పైలెట్ కూడా స్విచాఫ్ చేయడు. దానిపై దర్యాప్తు బృందం ఏ నిర్ధారణకూ రాలేదు. పైలెట్లుగా వ్యవహరించినవారి చరిత్ర చూసినా ఉద్దేశపూర్వకంగా ఆపివుంటారని ఊహించటం అసాధ్యం. ప్రధాన పైలెట్ సుమీత్ సభర్వాల్కు బోయింగ్ 787ను 8,600 గంటలు నడిపిన సర్వీస్ (మొత్తంగా 15,638 గంటల సర్వీస్) వుండగా, కో పైలెట్ క్లైవ్ కుందేర్కు బోయింగ్పై 1,100 గంటల అనుభవం, మొత్తంగా 3,403 గంటల అనుభవం వుంది. ఇద్దరూ ఈ విమానం నడపటానికి ముందు తగినంత విశ్రాంతి తీసుకున్నవారే. ప్రధాన పైలెట్ పర్యవేక్షణలో కో పైలెట్ ఇష్టానుసారం చేయటం సాధ్యపడదు. ఒకవేళ ఆ ప్రయత్నం జరిగివుంటే వాగ్వాదం చోటుచేసు కునేది. అది రికార్డయ్యేది. పూర్తి స్థాయి పారదర్శకతకు దర్యాప్తు సంస్థ ఎందుకు వెనకాడుతోంది? ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను కేవలం ఒక ప్రశ్న, జవాబు స్థాయికి కుదించటంలోని మర్మమేమిటి? అటు తర్వాత లేదా అంతకుముందు వారేం మాట్లాడుకున్నారు? ఇది చెప్పకపోతే పైలెట్లలో ఒకరు ఆత్మాహుతికి పాల్పడ్డారా అనే సంశయం బయల్దేరుతుంది. ఎయిర్లైన్స్ రేటింగ్స్ వెబ్సైట్ ప్రధాన సంపాదకుడు జెఫ్రీ థామస్ అడుగుతున్నది ఇదే. దర్యాప్తు ఫలితాల గురించి అంతర్జాతీయంగా అనేకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రకం విమానాలను బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ, వర్జిన్ అట్లాంటిక్ సంస్థ ప్రధానంగా వినియోగిస్తున్నాయి. ప్రాథమిక నివేదిక విడుదల చేయటం స్వాగతించదగిందే. కానీ ఇప్పటికే వున్న సంశయాలను మరింత పెంచేలా, అస్పష్టత అలుముకునేలా అది వుండటం సరికాదు. పైలెట్ల మధ్య జరిగిన సంభాషణ పూర్తి పాఠం విడుదల చేస్తే అటు పైలెట్ల సంఘం అభ్యంతరాలతోపాటు, ఇటు బాధిత కుటుంబాల సంశయాలు కూడా సమసిపోతాయి. -
భాషా ఘోష
ప్రపంచంలో ఇప్పుడు ఏడు వేలకు పైగా భాషలు మనుగడలో ఉన్నాయి. గడచిన శతాబ్ద కాలంలో దాదాపు రెండు వేల భాషలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇప్పటికి మనుగడలో ఉన్న ఏడు వేలకు పైగా భాషల్లోనూ సుమారు మూడు వేల భాషలు ప్రమాదం అంచుల్లో ఉన్నాయి. అంటే,ఆయా భాషల కోసం పరిరక్షణ చర్యలు చేపట్టకుంటే, కొన ఊపిరితో ఉన్న ఆ భాషలు కూడా కనుమరుగైపోవడానికి ఎంతోకాలం పట్టదు. భాషలు కనుమరుగైపోవడానికి సవాలక్ష కారణాలు. ఆ కారణాలలో ముఖ్యమైనది ప్రభుత్వాల అణచివేత ధోరణి. అల్పసంఖ్యాకులు మాట్లాడుకునే భాషలలో బోధనావకాశాలు కల్పించకుండా చేయడం వంటి బుద్ధితక్కువ చర్యలు భాషల ఉసురు తీస్తున్నాయి. ఒక భాష అంతరించిపోతే వాటిల్లే నష్టం ఏమిటో రాజకీయాల్లో మునిగితేలే పాలకులకు తెలియదు. ఒక భాష అంతరించిపోతే, కేవలం ఒక సమాచార మార్పిడి సాధనం మాత్రమే అంతరించిపోయినట్లు కాదు. ఒక భాష అంతరించిపోతే, దానితో పాటే ఆ భాష మాట్లాడే ప్రజల పరంపరాగతమైన పరిజ్ఞానం; వారి సాంస్కృతిక సంపద; వారి సంప్రదాయాలు; వారు చెప్పుకొనే కథలు; వారు పాడుకొనే పాటలు– ఇలా అన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి.ప్రపంచంలోనే అత్యధిక భాషలు మనుగడలో ఉన్న దేశం పాపువా న్యూగినీ. ఈ దేశంలో ముప్పయి మూడు భాషా కుటుంబాలకు చెందిన ఎనిమిది వందలకు పైగా భాషలు మనుగడలో ఉన్నాయి. పాపువా న్యూగినీ అధికార భాషలు ఇంగ్లిష్ సహా నాలుగే అయినా, స్థానిక సమూహాలు మాట్లాడుకునే భాషలను అక్కడి రాజ్యాంగం గుర్తించిందే తప్ప వాటి మనుగడను దెబ్బతీసే చర్యలేవీ చేపట్టలేదు. చాలా దేశాల కంటే విస్తీర్ణంలోను, జనాభాలోను, ఆర్థిక సంపదలోను పాపువా న్యూగినీ చిన్న దేశమే అయినా, భాషా బాహుళ్యానికి భరోసా కల్పించడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. పాపువా న్యూగినీ తర్వాత భాషా బాహుళ్యంలో మన దేశం రెండో స్థానంలో ఉంది. ‘ఎథ్నోలాగ్– లాంగ్వేజెస్ ఆఫ్ ద వరల్డ్’ జాబితా ప్రకారం మన దేశంలో నాలుగు వందల యాభై ఆరు భాషలు మనుగడలో ఉన్నాయి. వీటిలో పదివేల మందికి పైగా జనాభా మాట్లాడే భాషలు నూట ఇరవై రెండు ఉన్నాయి. పది లక్షల మందికి పైగా జనాభా మాట్లాడే భాషలు ముప్పయి ఉన్నాయి. మన రాజ్యాంగం ఇరవై రెండు భాషలను గుర్తించింది. మన దేశంలో అనేక భాషా కుటుంబాలకు చెందిన భాషలున్నాయి. ప్రధానంగా ఉత్తరాదిలో ఇండో–ఆర్యన్ కుటుంబానికి చెందిన భాషలు మాట్లాడేవారి జనాభా ఎక్కువ. దక్షిణాదిలో ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన భాషలు మాట్లాడేవారి జనాభా ఎక్కువ. ఇండో–ఆర్యన్, ద్రవిడ భాషా కుటుంబాలే కాకుండా; ఆస్ట్రో ఆసియాటిక్, సైనో–టిబెటన్, తాయ్ కడాయ్, అండమాన్ తదితర భాషా కుటుంబాలకు చెందిన భాషలు కూడా ఉన్నాయి.మన దేశంలో గడచిన యాభయ్యేళ్లలో రెండు వందల ఇరవై భాషలు అంతరించిపోయాయి. మరో నూట తొంభై ఏడు భాషలు ప్రమాదం అంచుల్లో ఉన్నాయని యూనెస్కో ప్రకటించింది. ప్రపంచీకరణ ఫలితంగా విపణికి అవసరమైన భాషల ప్రాబల్యం ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. నియంతలు ఏలిన దేశాల్లో ఆధిపత్య భాషల బలవంతపు రుద్దుడు ఫలితంగా ఎన్నో భాషలు కనుమరుగయ్యాయి. నాజీ నియంత హిట్లర్ ఏలుబడిలో జర్మన్ను బలవంతంగా జనాల మీద రుద్దే ప్రయత్నం జరిగింది. ఇప్పటికీ భారత్ సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్నా, పాలకుల రాజకీయ, ఆర్థిక ఆధిపత్య ధోరణుల కారణంగా అల్పసంఖ్యాకులు మాట్లాడుకునే భాషలకు ముప్పు వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూటనలభైకి పైగా భాషా కుటుంబాలు ఉన్నాయి. వీటి నుంచి విడివడి వేలాది భాషలు ఏర్పడ్డాయి. కాలగమనంలో వాటిలో అంతరించినవి అంతరించగా, కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి. వాటిలో కొన్ని భాషలు మిగిలిన భాషల మీద పెత్తనం చలాయిస్తుంటే, మిగిలిన భాషలు మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నాయి. ‘ఒక మనిషితో మనం అతడికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే, అది అతడి మస్తిష్కానికి చేరుతుంది. అతడి భాషలోనే మాట్లాడితే, అది అతడి హృదయానికి చేరుతుంది’ అని నెల్సన్ మండేలా అన్నారు. ఇదొక సామరస్య ప్రకటన. ‘ఒక సంస్కృతిని నాశనం చేయాలంటే, ముందుగా దాని భాషను, చరిత్రను చంపాలి’ అనేది జాత్యహంకార నియంతల విధానం. ఆధిపత్య ధోరణులు భాషారంగం సహా ఏ రంగంలో ఉన్నా, ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. ఏడు రంగులు హరివిల్లు ప్రత్యేకత అయినట్లే, భాషా బాహుళ్యమే మన దేశ సాంస్కృతిక ప్రత్యేకత. హరివిల్లుకు ఒకే రంగుపూసి, దాని వర్ణవైవిధ్యాన్ని రూపుమార్చాలని అనుకోవడం ఎంతటి వెర్రి ఆలోచనో, దేశంలోని భాషా బాహుళ్యానికి విఘాతం కలిగించే ప్రయత్నాలు చేయడం కూడా అంతటి వెర్రితనమే! భాషా బాహుళ్యంలోని వైవిధ్యాన్ని కాపాడుకోవడం, అల్పసంఖ్యాకుల భాషా సంస్కృతుల మనుగడకు భరోసాను ఇవ్వడం ప్రజాస్వామిక ప్రభుత్వాల బాధ్యత. దురదృష్టవశాత్తు మన దేశంలో భాషలకు కూడా రాజకీయాల చీడ సోకింది. భాషల నడుమ ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి కనీస అవగాహన లేకుండా ఏ భాష మరే భాషకు పెద్దమ్మ అవుతుందో, మరే భాష ఇంకే భాషకు అమ్మమ్మ అవుతుందో ప్రవచనాలు చెబుతుండటం మన దౌర్భాగ్యం. ఇలాంటి ప్రవచనాల్లో వాడే భాష దద్దమ్మ భాష తప్ప మరేమీ కాదు.


