Editorial
-
దీనావస్థలో యూరప్ దేశాలు
కళ్లముందు ప్రమాదకర సంకేతాలు కనబడుతున్నా అమెరికాను గుడ్డిగా అనుసరిస్తూ పోవటం అలవాటు చేసుకున్న యూరప్కి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక వరస షాక్లు తప్పడం లేదు. గతవారం జర్మనీలో జరిగిన మ్యూనిక్ భద్రతా సదస్సుకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ‘వాక్ స్వాతంత్య్రానికీ, ప్రజాస్వామ్యానికీ మీవల్లే ముప్పు ముంచుకొస్తున్నద’ని యూరప్ దేశాలపై విరుచుకుపడ్డారు. దాన్నుంచి తేరుకోకముందే ఆ దేశాల ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ యుద్ధం నిలుపుదలపై రష్యాతో సౌదీ అరేబియాలోని రియాద్లో అమెరికా భేటీ అయింది. యూరప్ వరకూ ఎందుకు... రష్యాతో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో శిథిలావస్థకు చేరిన ఉక్రె యిన్నే ఆ చర్చలకు ఆహ్వానించలేదు. యుద్ధం ఆపడానికి అవకాశాలున్నాయా, ఆ విషయంలో తొలి అడుగువేయటం అసలు సాధ్యమేనా అనే అంశాలను నిర్ధారించుకోవటానికే రియాద్ సమా వేశం జరిగిందని అమెరికా విదేశాంగశాఖ సంజాయిషీ ఇస్తున్నా దాని వ్యవహారశైలి యూరప్ దేశా లకు మింగుడు పడటం లేదు. ఆ విషయంలో నిజంగా చిత్తశుద్ధి వుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడటానికి ముందు ట్రంప్ యూరప్ దేశాల అధినేతలను సంప్రదించేవారు. దాదాపు ఎనభైయ్యేళ్లుగా యూరప్ దేశాలన్నీ అమెరికా అడుగుజాడల్లో నడిచాయి. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ సేనలు తూర్పు యూరప్ దేశాల తర్వాత తమవైపే చొచ్చుకొస్తాయని, తాము బలికావటం ఖాయమని పశ్చిమ యూరప్ దేశాలు వణికిపోయాయి. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జత కట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. అమెరికా–సోవియెట్ల మధ్య సాగే పోటీలో యూరప్ దేశాలు అవసరం లేకున్నా తలదూర్చాయి. ఆర్థికవ్యవస్థలు అనుమతించక పోయినా తమ తమ జీడీపీల్లో రెండు శాతం నాటో కోసం వ్యయం చేశాయి. యూరప్ భూభాగంలో అణ్వాయుధాల మోహరింపు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, మారణాయుధాలు జోరందుకున్నాయి. యూరప్ దేశాలకు ఆనాటి సోవియెట్ నుంచి లేదా ప్రస్తుత రష్యా నుంచి ఎన్నడూ ముప్పు కలగలేదుగానీ... నాటోవల్ల లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా తది తర దేశాలు అస్థిరత్వంలోకి జారుకుని ఉగ్రవాదం వేళ్లూనుకుంది. సిరియావంటి దేశాల్లో ప్రభుత్వా లను కూలదోసేందుకు విచ్చలవిడిగా ఆయుధాలందించటంవల్ల ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. ఉక్రెయిన్ దురాక్రమణకు రష్యాను రెచ్చగొట్టింది కూడా యూరప్ దేశాలే. 2013లో అమెరికా ప్రోద్బలంతో ఉక్రెయిన్తో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకోవటంతోపాటు ఐఎంఎఫ్ రుణం పొందేందుకు సహకరించింది ఈయూ దేశాల కూటమే. అయితే ఐఎంఎఫ్ కఠిన షరతులను తిరస్కరించి రష్యా ఇచ్చే 1,500 కోట్ల డాలర్ల రుణం తీసుకోవటానికి అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ నిర్ణయించటంతో దేశంలో ప్రజా ఉద్యమం పేరిట తిరుగుబాటుకు అంకు రార్పణచేసి అస్థిరపరచటంలో అమెరికా, ఈయూల పాత్ర వుంది. ఈ పరిణామాలే పుతిన్ను క్రిమియా ఆక్రమణకు పురిగొల్పాయి. ఎన్నికల్లో చట్టబద్ధంగా గెలిచిన యనుకోవిచ్ను ఈ వంక చూపి 2019లో కూలదోసి, సినీ నటుడు జెలెన్స్కీని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడం, పర్యవసానంగా మూడేళ్లక్రితం పుతిన్ ఉక్రెయిన్పై దండెత్తటం వర్తమాన చరిత్ర.యుద్ధంపై తమ ప్రమేయం లేని చర్చల్ని గుర్తించబోనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యూరప్ దేశాలకు కనీసం ఆ మాత్రం ధైర్యం కూడా లేదు. తాజా పరిణామాల నేప థ్యంలో ఏం చేయాలో చర్చించటానికి ఫ్రాన్స్ చొరవతో సోమవారం పారిస్లో జరిగిన అత్యవసర భేటీకి అరడజను దేశాలు హాజరయ్యాయి. అవి కూడా కింకర్తవ్య విచికిత్సలో పడ్డాయి. ఉక్రెయిన్కు శాంతి సేనలను పంపటానికి తాను సిద్ధమని ప్రకటించిన బ్రిటన్... ఆ వెంటనే ‘అమెరికా అందుకు అనుమతిస్తేనే’ అని ముక్తాయించింది. ఈలోగా జర్మనీ, పోలాండ్, స్పెయిన్లు దాన్ని అసందర్భ ప్రతిపాదనగా కొట్టిపారేశాయి. అమెరికా తాజా వైఖరితో యూరప్ స్వీయరక్షణ కోసం సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనపై సైతం అనుకూల స్వరాలు వినబడటంలేదు.ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాతో యూరప్ దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం అందరిలో ఏర్పడింది. దీనికితోడు ట్రంప్ అనుచరగణం యూరప్లో తీవ్ర మితవాద పక్షాలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం వివిధ దేశాధినేతలకు ఉంది. ట్రంప్ వైఖరి ఎలా వుంటుందన్న అంశంలో ఆయన తొలి ఏలుబడిలో యూరప్ దేశాలకు తగి నంత అవగాహన వచ్చింది. కానీ దశాబ్దాల తరబడి అమెరికా అనుసరిస్తున్న విధానాలను రెండో దఫాలో మెరుపువేగంతో ఆయన తిరగరాస్తారని ఆ దేశాలు ఊహించలేదు. ఈసారి ట్రంప్ వెనకున్న ఎలాన్ మస్క్, స్టీవ్ బానన్, మార్కో రుబియో తదితరులతోపాటు సమర్థుడైన దూతగా పేరున్న విట్కాఫ్లే అందుకు కారణం కావొచ్చు. పర్యవసానంగా ట్రంప్ రంగప్రవేశం చేసి నెల తిరగకుండానే యూరప్ దేశాలకు ప్రపంచం తలకిందులైన భావన కలిగింది. స్వతంత్రంగా ఎదగటానికి ప్రయత్నించక కీలుబొమ్మల్లా వ్యవహరించిన ఆ దేశాలు ఇప్పటికైనా వివేకం తెచ్చుకోవాలి. సొంత ఆలోచనతో, స్వీయప్రయోజనాల కోసం పనిచేయటం నేర్చుకోవాలి. రోజులు ఎప్పుడూ ఒకేలా వుండవని గ్రహించాలి. -
ఆత్మావలోకనం అవసరం
విశ్వసనీయతను కాపాడుకునే విషయంలో, విలువలు పాటించే అంశంలో పట్టింపు ఉన్నట్టు కనబడకపోతే వ్యక్తులైనా, వ్యవస్థలైనా విమర్శలపాలు కాకతప్పదు. తన రిటైర్మెంట్కు ఒక రోజు ముందు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ రాజీవ్ కుమార్ తమపై వస్తున్న విమర్శలకూ, ఆరోపణలకూ ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఓడిన వారు ఫలితాలను జీర్ణించుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నది ఆయన అభిప్రాయం. దీనికి మూలం ఎక్కడుందో, తామెంత వరకూ బాధ్యులో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకునివుంటే సమస్య మొత్తం ఆయనకే అర్థమయ్యేది. ఈసీకి ఇప్పటికీ ఏదోమేర విశ్వసనీయత ఉందంటే అది మాజీ సీఈసీ టీఎన్ శేషన్ పెట్టిన భిక్ష. అంతకుముందు ఈసీ ఉనికి పెద్దగా తెలిసేది కాదు. అది రాజ్యాంగ సంస్థ అనీ, దానికి విస్తృతాధికారాలు ఉంటాయనీ ఎవరూ అనుకోలేదు. శేషన్ తీరు నియంతను పోలివుంటుందని, తానే సర్వంసహాధికారినన్నట్టు ప్రవర్తిస్తారని ఆరోపణలొచ్చిన మాట వాస్తవమే అయినా ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించటంలో, అవసరమైతే ఎన్నికలను రద్దు చేయటం వంటి కఠిన చర్యలకు వెనకాడకపోవటంలో ఆయనకెవరూ సాటిరారు. అనంతరం వచ్చిన సీఈసీల్లో అతి కొద్దిమంది మాత్రమే శేషన్ దరిదాపుల్లోకొచ్చే ప్రయత్నం చేశారు. గత కొన్నేళ్లుగా అసలు ఆ ఊసే లేకుండా కాలక్షేపం చేసినవారే అధికం. శేషన్ నెలకొల్పిన ప్రమాణాలను అందుకోకపోతే పోయారు... కనీసం ఆ సంస్థ ఔన్నత్యాన్ని దిగజార్చకపోతే బాగుండునని కోరు కోవటం కూడా అత్యాశేనన్న చందంగా పరిస్థితి మారింది. దాని స్వతంత్రత, తటస్థత, విశ్వస నీయత ప్రశ్నార్థకమయ్యే రోజులొచ్చాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించటానికి రాజ్యాంగం సృష్టించిన సంస్థ ఈసీ. అది తనకు ఎదురయ్యే అనుభవాలతో తన అధికారాలను పునర్నిర్వచించుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తే, దానిద్వారా రాజ్యాంగం ఆశించిన ఉద్దేశాలు నెరవేరేవి. ఈసీ ఏక సభ్య సంఘంగా మొదలై త్రిసభ్య సంఘమైంది. కానీ ఉన్న అధికారాలనే సక్రమంగా వినియోగించుకోలేని అశక్తతకు లోబడుతుండటం చేదు వాస్తవం. రాజ్యాంగం ఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినా దాన్ని వినియోగించుకోవటంలో ఆసక్తి కనబరుస్తున్న దాఖలా లేదు. పార్టీలను నమోదు చేసుకునే అధికారం 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం ఈసీకి ఇస్తోంది. ఆ నమోదును రద్దు చేసే లేదా ఆ పార్టీనే రద్దుచేసే అధికారం మాత్రం లేదు. మరింత స్వతంత్రంగా, మరింత దృఢ సంకల్పంతో వ్యవహరించమని వేర్వేరు తీర్పుల్లో సుప్రీంకోర్టు చేసిన సూచనలకు అనుగుణంగా ఈసీ వ్యవహరించివుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో! గెలిచిన పార్టీలకు ఆరోపణలు చేసే అవసరం తలెత్తదు. అంతటి త్యాగధనులు కూడా ఎవరూ లేరు. కానీ మాజీ సీఈసీ ఎస్వై ఖురేషీ చేసిన ఆరోపణల మాటేమిటి? వాటినీ కొట్టిపారేస్తారా? కనీసం ఆయన వ్యాఖ్యలపైన స్పందించలేని అచేతన స్థితికి ఈసీ చేరుకోవటాన్ని రాజీవ్ ఏరకంగా సమర్థించుకోగలరు? రోజులు గడిస్తే తప్పులు సమసిపోతాయా? ఇంత అమాయకత్వాన్ని నటిస్తున్న రాజీవ్ నిరుడు మేలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల తంతుపై వచ్చిన విమర్శలకు ఈ ఎనిమిది నెలల్లో ఒక్కసారైనా జవాబిచ్చారా? పోలింగ్ జరిగినరోజు రాత్రి 8 గంటలకు వోటింగ్ శాతాన్ని 68.12 అని ప్రకటించి, మరో మూడు గంటలు గడిచాక దాన్ని ఏకంగా 76.50 శాతమని చెప్పటం, మరో నాలుగు రోజులకు మళ్లీ గొంతు సవరించుకుని 80.66గా మార్చటంలోని మర్మమేమిటి? ఈ పెంపు ఏకంగా 12.5 శాతం. దాన్ని అంకెల్లోకి మారిస్తే 49 లక్షలు! ఈ మాయా జాలం ఏమిటో, కొత్తగా పుట్టుకొచ్చిన ఈ 49 లక్షలమంది కథాకమామీషు ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉండనవసరం లేదా? తమకై తాము ప్రజలను అయోమయంలోకి నెట్టి, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి రాజకీయపక్షాలపై బండరాళ్లు వేయటం ఏ రకమైన నీతి? మహారాష్ట్ర ఎన్నికలు సైతం ఈ బాణీలోనే సాగాయి. పోలింగ్ ముగిసిన సాయంత్రం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని చెప్పిన ఎన్నికల సంఘమే రాత్రికల్లా 65.02 శాతమని మార్చింది. కౌంటింగ్కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. అంటే వోటింగ్లో 7.83 శాతం పెరుగుదల. అంకెల్లో చూస్తే స్థూలంగా 76 లక్షలు. ఇలాంటి దుఃస్థితి అఘోరించినప్పుడు సందేహాలు రావా? ఆరోపణలు వెల్లువెత్తవా?రాజీవ్ మీడియా సమావేశం రోజునే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ను ఎంపిక చేసింది. ఇది సరికాదంటూ విపక్ష నేత రాహుల్గాంధీ అసమ్మతి నోట్ అందజేశారు. ఇలా వివాదాస్పద ఎంపికలోనే సమస్యకు బీజం ఉంటుందని, అటుపై ఈసీ నడతను నిశితంగా పరిశీలించటం మొదలవుతుందని రాజీవ్ గుర్తిస్తే మంచిది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఈసీ విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతున్నదని ఖురేషీ విమర్శిస్తే ఇదే రాజీవ్ నొచ్చుకుని ‘ఎంతమంది సీఈసీలు ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ఫిర్యాదులు అందుకున్నారో, వాటి ఆధారంగా ఎందరిపై చర్య తీసుకున్నారో మేం ఆరా తీశాం’ అని గంభీరంగా ప్రకటించారు. అదేమిటో బయటపెట్టాలని ఖురేషీ సవాలు చేస్తే ఈ ఆరేళ్లుగా మౌనమే సమాధానమైంది. ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించటం లేదని చెప్పటానికి ఇది చాలదా? -
జనం ప్రాణాలంటే విలువేది?
వెల్లువలా వచ్చిపడుతున్న ప్రయాణికులు, రివాజు తప్పకుండా ఆలస్యంగా వచ్చిపోయే రైళ్లు, ఉన్న గందరగోళాన్ని ఒకింత పెంచే అనౌన్స్మెంట్లు, ఏమూలకూ సరిపోని మౌలిక సదుపాయాలు... ఇవన్నీ ఏకమై 45 నిమిషాలపాటు ఏకధాటిగా సృష్టించిన తీవ్ర గందరగోళ స్థితి శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు దారితీసి 18 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మరణాలకు సంతాపం ప్రకటించటం, బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేయటం సరే... జరిగిన ఘోర ఉదంతానికి నైతిక బాధ్యత వహించాల్సిందెవరు? ఇలాంటివి పునరావృత్తం కానీయ బోమని చెప్పేదెవరు? మన దేశంలో ఎప్పుడు జనసమ్మర్దం అధికంగా ఉంటుందో, ఏ చర్యలు అవసరమో అధికార యంత్రాంగానికి తెలియక కాదు. అందుకు సంబంధించి ఇప్పటికే బోలెడు చేదు అనుభవాలున్నాయి. కానీ ఎన్ని జరుగుతున్నా గుణపాఠం నేర్వని మనస్తత్వమే ఈ విషాద ఘటనకు దారితీసింది. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట చోటు చేసుకుని 30 మంది ప్రాణాలు బలై పక్షం రోజులు కాలేదు. అదే ప్రయాగ్రాజ్కు బయల్దేరిన భక్తులకు ఢిల్లీ రైల్వే స్టేషనే ఈసారి మృత్యుఘంటిక మోగించిందంటే నేరం ఎవరిదనుకోవాలి? తొక్కిసలాట జరిగిన అజ్మీరీ గేట్ టెర్మినల్ గురించి ఉత్తరాదిలో పనిచేసే రైల్వే ఉన్నతాధికారులకూ, ప్రత్యేకించి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అధికారులకూ తెలియంది కాదు. సాధారణ దినాల్లో సైతం ఆ టెర్మినల్ కిక్కిరిసివుంటుంది. ఢిల్లీ మెట్రో రైల్ను నేరుగా అనుసంధానం చేసే ప్రాంతమది. పైపెచ్చు వాహనాల పార్కింగ్కు అనువైనది. యూపీ మీదుగా వెళ్లాల్సిన రైళ్లు ఆగే అయిదు ప్లాట్ ఫాంలు అజ్మీరీ గేట్ టెర్మినల్ ప్రాంతంలోనే ఉన్నాయి. దానికితోడు ఇప్పుడు కుంభమేళా సంరంభం కొనసాగుతోంది. తగిన ప్రణాళిక రూపొందించుకుని, అదనపు జాగ్రత్తలు తీసుకోవడా నికి ఈ కారణాలు చాలవా? సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలలోపు బయల్దేరే రైళ్లను అందు కోవటానికి వచ్చే జనరల్ కంపార్ట్మెంట్ ప్రయాణికులకు అక్కడ రోజూ 7,000 టిక్కెట్లు విక్రయి స్తారు. కానీ శనివారం రోజు కేవలం రెండు గంటల వ్యవధిలో అదనంగా మరో 2,600 మందికి టిక్కెట్లు విక్రయించారు. అంటే రిజర్వేషన్లేని ప్రయాణికుల సంఖ్య దాదాపు పదివేలు! ఇంత మంది టికెట్ల తనిఖీ అసాధ్యం. కనుక టికెట్ లేకుండా ప్రయాణించేవారు ఇంతకు మూడు నాలుగు రెట్లు అధికంగా ఉంటారని ఒక అంచనా. అందుబాటులో ఉన్న బోగీలెన్నో, జారీ చేయాల్సిన టికెట్లెన్నో కనీస అంచనాకు రాకపోవటం... అవసరమైన పోలీసు బలగాలను సమకూర్చుకోవాలన్న స్పృహ లోపించటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 20 మంది పోలీసులు మాత్రమే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారు సైతం ఈ తొక్కిస లాట సమయంలో ‘బతుకుజీవుడా’ అనుకుంటూ పక్కకుపోయారు. పర్యవసానంగా ‘రక్షించండి...’ అంటూ ఆర్తనాదాలు చేస్తున్నవారి కోసం పోర్టర్లే రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వారే గనుక ఆపద్బాంధవుల్లా రాకపోతే మరింతమంది మృత్యువాత పడేవారు. కుంభమేళా సందర్భంగా డిమాండ్ ఎక్కువుంది గనుక ఉన్న రైళ్లను సమయానికి నడిపుంటే ఇంత జనసమ్మర్దం ఉండేది కాదు. ఎంతో జాప్యం జరిగి ఒకదాని వెనక మరొకటిగా వరసపెట్టి మూడు రైళ్లుండటం వల్ల 14, 15 నంబర్ ప్లాట్ఫాంలపై వేలాదిమంది పడిగాపులు పడుతున్నప్పుడే ప్రయాగ్రాజ్ వెళ్లే ప్రత్యేక రైలుపై వెలువడిన అనౌన్స్మెంట్ తీవ్ర గందరగోళానికి దారితీసి తొక్కిసలాట జరగిందంటున్నారు. మన దేశం వరకూ చూస్తే తొక్కిసలాటల్లో దాదాపు 80 శాతం మతపరమైన పవిత్ర దినాల్లో, తీర్థయాత్రల్లో ఎక్కువగా జరుగుతున్నట్టు 2013లో ఒక అధ్యయనం తేల్చిచెప్పింది. భారీగా వచ్చి పడే ప్రజానీకాన్ని నియంత్రించటానికి జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ ఆ ఏడాదే సవివరమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పుడు సాంకేతికత మరింత విస్తరించి సీసీ కెమెరాలు, డ్రోన్ల వంటివి అందుబాటులోకొచ్చాయి. వీటి సాయంతో ఎప్పటికప్పుడు కంప్యూటర్ మానిటర్ లలో పర్యవేక్షిస్తూ అవసరమైన చోటకు బలగాలను తరలించటానికి, చర్యలు తీసుకోవటానికి పుష్క లంగా అవకాశాలున్నాయి. ఎక్కడో మారుమూల అడవుల్లో నక్సలైట్లను అణచడానికి వినియోగి స్తున్నామంటున్న సాంకేతికత దేశ రాజధాని నగరంలో కొలువుదీరిన రైల్వే స్టేషన్లో ఎందుకు ఆచూకీ లేకపోయిందో పాలకులు చెప్పగలరా?విషాదం చోటుచేసుకున్నప్పుడల్లా దాన్ని తక్కువ చేసి చూపటానికి, అంతా నియంత్రణలో ఉందని చెప్పటానికి పాలకులు తెగ తాపత్రయపడుతుంటారు. 2015లో రాజమండ్రిలో తన కళ్ల ముందే పుష్కరాల్లో 29మంది భక్తులు ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు ఎంతటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో ఎవరూ మరిచిపోరు. మొన్నటికి మొన్న తిరుపతి తొక్కిసలాట జరిగినప్పుడూ ఆయనది అదే వైఖరి. ఇప్పుడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఉదంతంలోనూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ట్వీట్ల ప్రహసనం సైతం అలాగే వుంది. శ్రావణబెళగొళ, స్వర్ణాలయం వంటి చోట్ల ఇంతకు మించి ఎన్నో రెట్లు అధికంగా భక్తులు తరలివస్తారు. కానీ ఎప్పుడూ ఎలాంటి అపశ్రుతులూ చోటు చేసుకో లేదు. ఇందుకు వారు అనుసరిస్తున్న నియంత్రణ చర్యలేమిటో అధ్యయనం చేయాలన్న స్పృహ కూడా ఎవరికీ ఉన్నట్టు లేదు. ఈ విషాదం చెప్పే గుణపాఠాన్ని గ్రహించకపోతే, తప్పు తమది కానట్టు ప్రవర్తిస్తే మళ్లీ మళ్లీ ఇలాంటివే చోటు చేసుకుంటాయి. కమిటీలు, విచారణల తంతు సరే... నిర్దిష్టంగా తాము గ్రహించిందేమిటో, ఇకపై తీసుకోబోయే చర్యలేమిటో ప్రకటిస్తే జనం సంతోషిస్తారు. -
‘పెన్షన్’ పత్రిక
ఆ జ్ఞానము అచట ఉన్నది. పండిన అనుభవాల రాశి పోగుబడి ఉన్నది. వేళ్లకు వయసు వచ్చినది కాని కలానికి కాదు సుమా. విశాలమైన తలపులు చెప్పవలసిన సంగతులు ఒకటా రెండా? మేము విశ్రాంతిలో లేము. అక్షరాల ఆలోచనల్లో ఉన్నాం. గత యాత్రకు కొనసాగింపులో ఉన్నాం. మేము నడవవలసిన దారి తెరిచిన పుటల మీదుగా సాగుతుంది. పాఠకుల మనోరథాల మీదుగా విహరిస్తుంది. ఊహలకు ఊపిరి పోస్తే మాకు ఆయువు. పాత్రలతో సంభాషిస్తే మాకు ఉత్సాహం. మేమెవరమో మీకు తెలుసా? మా లోపల ఏముందో మీకు ఎరుకేనా?‘మా నాన్న అదృష్టవంతుడు. చనిపోయే వరకూ రాస్తూనే ఉన్నాడు. రాసిన దాని కోసం పత్రికలు ఎదురు చూశాయి. ప్రచురించి మర్యాద చేశాయి. ఆయన రచయితగా జీవించి రచయితగా మరణించాడు. నేనూ ఉన్నాను. కథ రాస్తే ఎక్కడ ఇవ్వను. రాయకుండా ఎలా బతకను?’ పెన్షనర్ వయసున్న ఒక రచయిత అన్న మాటలు ఇవి. నేటి తెలుగు రాష్ట్రాల్లో యాభైలు దాటి, రచనాశక్తితో ఉన్న వారి ఆవేదనంతటికీ ఈ మాటలు శోచనీయమైన ఆనవాలు.ఒక రచయిత పరిణతి యాభైల తర్వాతే రచనల్లో వ్యక్తమవుతుంది. అనుభవాల సారము, వాటి బేరీజు, వాటిపై వ్యాఖ్యానం, వాటితో నేటి తరానికి చెప్పవలసిన జాగరూకత, వాటి నమోదు, తద్వారా బలపడే సారస్వత సంపద... ఏ జాతికైనా పెను పెన్నిధి. దురదృష్టం, కాలమహిమ తెలుగు రాష్ట్రాల్లో పత్రికలు కనుమరుగైపోయాయి. సాహిత్య పత్రికలు, చిన్న పత్రికలు, వీక్లీలు.... ఎంత రాసినా వేసే మంత్లీలు... బైమంత్లీలు... క్వార్టర్లీలు.... ఏ బస్టాండ్ బడ్డీకొట్టులోనో అందుకునే అపరిచిత పాఠకుడికై వాటి అందుబాటు... ఎక్కడ... ఎక్కడా? ‘మీ రచనను ప్రచురణకు స్వీకరించాం’ కార్డు ముక్క, దానికి ఫలానా చిత్రకారుడు వేసే గొప్ప బొమ్మ, పోస్టులో పత్రిక అందడం, మరికొన్ని రోజులకు సంబరంగా సంతకం చేసి తీసుకునే పారితోషికపు మనీఆర్డర్... ఎక్కడ... ఎక్కడా? కంప్యూటర్ స్క్రీన్ కో, సెల్ఫోన్ కురచదనానికో సంతృప్తి పడే నేటి పాఠకులు ఉండుగాక. కాని పెద్దలు ఉన్నారు. కాగితపు వాసనను పీల్చి, అక్షరాలను వేళ్లతో తడిమిగాని సంతృప్తి పడని ప్రాణాలున్నాయి. కట్టె కొట్టె తెచ్చేలా కాకుండా, అరచేత్తో లోడేదే లోతు అనుకునే రచయితల్లా కాకుండా, తమ రచనలతో చెరువులనూ, కడలి కెరటాల సంచలనాత్మలనూ సృష్టించిన చేతులు ఉన్నాయి. వారి సంగతి ఏమిటి? వారికేదైనా పెన్షన్ కావాలని ఎవరైనా ఆలోచించారా?1970–90ల మధ్య కాలంలో కథ అంటే కనీసం ఐదారు పేజీలు ఉండేది. పెద్దకథలు ఉండేవి. నవలికలు, సీరియల్ నవలలు, గల్పికలు, ప్రహసనాలు, ఆత్మకథలు, జ్ఞాపకాలు, సంవాదాలు, అనువాదాలు, ఇంటర్వ్యూలు... ఇవన్నీ రాసినవారు, ఇచ్చినవారు ఇంకా ఉన్నారు. జనాభా లెక్కల్లో గల్లంతై పోలేదు. వీరు రాయగా చదివి అభిమానులు అయినవారు ఉన్నారు. బండలై పోలేదు. ఈ రాసే వారు రాయడానికీ... ఈ చదివేవారు అనుసంధానమై చదవడానికీ... అవసరమైన వేదికలే తెలుగునాట లేవు. ఈ రచయితలకు, పాఠకులకు ఒక పెన్షన్ స్కీమ్ కావాలి. వీరి అనుభవాన్ని, ఆత్మగౌరవాన్ని మన్నిస్తూ వీరి రచనలకు చోటు కల్పించడం కోసం ఒక పథకం కావాలి. కొత్త తరాలతో పోటీ పడుతూ డిజిటల్ క్యూలలో దూరి బుకింగ్ కోసం వీరు చేయి దూర్చరని గ్రహించడం అత్యవసరం. అదొక్కటేనా? పునఃపఠనం సంగతో? ఎంతో రాసి, ఎన్నో క్లాసిక్స్ ఇచ్చిన రచయితలను రీవిజిట్ చేయడానికి ఒక్క కాగితపు పుట ఇంత పెద్ద జాతికి లేకపోవడం విషాదమా, కాదా?‘ఏజ్లెస్ ఆథర్స్’... 65 ఏళ్లు ఆపైన వయసున్న వారి రచనలనే క్రమం తప్పకుండా వెలువరించే సంకలనాల వరుస ఇది. ‘క్రోన్ : విమెన్ కమింగ్ ఆఫ్ ఏజ్’... ఇది అరవైలు దాటిన స్త్రీల రచనలు ప్రచురించే పత్రిక. ‘పాసేజర్’... యాభై ఏళ్ల తర్వాత రాసిన వారివే ఈ పత్రిక వేస్తుంది. ‘ఎనభై ఏళ్లు పైబడిన వారు రాయట్లేదే అని చింతించాం. కాని ఇప్పుడు ఆ వయసు వారూ వచ్చి రాస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని ఆ పత్రిక పేర్కొంది. ‘రీ ఇన్వెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్’... స్లోగన్తో యాభైలు దాటిన రచయితల రచనలు మాత్రమే వేసే పత్రికలు పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. వారి మానసిక ఆనందానికి అవి అవసరం అని ఆ యా దేశాలు భావిస్తున్నాయి. మన దేశంలో ఇతర భాషల్లో పత్రికలు సజీవంగా ఉన్నాయి కాబట్టి వారికి ఈ బెడద తెలియదు. తెలుగు సీనియర్స్కే సమస్య అంతా! వీరు చదివిన వందల పుస్తకాల నుంచి విలువైన మాటలు చెప్పాలా, వద్దా? వేయిదీపాల మనుషులు వీరు అనే సోయి మనకు ఉందా?‘రాయాలంటే ఎక్కడ రాయాలి’ అనుకునే కవులు, రచయితలు, ఆలోచనాపరులు, విమర్శకులు, నాటకకర్తలు, వ్యంగ్య విన్యాసకులు నేడు ఎందరో నిశ్శబ్దంగా ఉన్నారు. లోపలి వెలితితో ఉన్నారు. వీరి సృజన సన్నగిల్లలేదు. మరింత విస్తరణను కోరుకుంటోంది. వీరిని నిర్లిప్తంగా ఉంచడమంటే కనబడని గోడల జైలులో పెట్టడమే! సాంస్కృతిక ఆస్తిపత్రాలు గల్లంతు చేసుకోవడమే. ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఇద్దరు సంపాదక సిబ్బందితో ఏ రాష్ట్ర సాంస్కృతిక శాఖ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఏ బాధ్యత గల్ల సంస్థైనా ప్రతి నెలా ‘పెన్షన్ పత్రిక’ నడపవచ్చు. పెన్షన్లు వ్యక్తిగత హితానికైతే ఇది సామాజిక హితానికి! అమరావతి, మూసీల ఖర్చులో దీనికై వెచ్చించవలసింది 0.0000001 పైసా. ఈ కొత్త పెన్షన్ కోసం డిమాండ్ చేద్దాం! -
బలపడిన మైత్రీబంధం!
ఎవరి అంచనాలకూ అందని తన ఆచరణతో, మాటలతో దిగ్భ్రమపరిచే డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి స్వీకరించి నెల్లాళ్లు కాకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాన్ని సందర్శించారు. మోదీ రెండు రోజుల అమెరికా పర్యటనపై మన దేశంలో మాత్రమే కాదు, అనేక దేశాల అధినేతలు సైతం ఎంతో ఉత్కంఠ కనబరిచారు. అందుకు కారణం ఉంది. వేరే దేశాలు తమ ఉత్పత్తులపైఎంత సుంకం విధిస్తాయో తామూ వారి ఉత్పత్తులపై అదే స్థాయిలో ప్రతిచర్యాత్మక సుంకం వసూలు చేస్తామని ట్రంప్ చెబుతున్నారు. అదే అమలైతే అన్ని దేశాల వ్యాపార, వాణిజ్యాలుతీవ్రంగా ప్రభావితమవుతాయి. ట్రంప్ తొలి ఏలుబడిలో ఆయనతో మోదీకున్న సాన్నిహిత్యం ఎవరికీ తెలి యనిది కాదు. చర్చల్లో ఆయన సుంకాల విషయంలో ట్రంప్ను ఒప్పిస్తే, తాము కూడా భారత్ కిచ్చిన వెసులుబాట్లను చూపి గండం నుంచి గట్టెక్కవచ్చని వారి ఆశ. ప్రమాణస్వీకారం చేసింది మొదలుకొని సన్నిహిత మిత్రులా... ‘నువ్వా నేనా’ అని పోటీపడే ప్రత్యర్థులా అనే విచక్షణ లేకుండా అందరికీ సుంకాల వడ్డింపు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ఈ అంశంపై ఇరుదేశాల మధ్యా అధికారుల స్థాయి చర్చలు జరిగితే గానీ స్పష్టత రాదు. అధినేతలిద్దరూ నాలుగు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం నిర్వహించిన మీడియా సమావేశం గమనిస్తే వారిద్దరి మధ్యా గతం మాదిరే సౌహార్ద సంబంధాలున్నాయని అర్థమవుతుంది. మోదీ ‘చాలా ప్రత్యేకమైన వ్యక్తి’ అని అభివర్ణించటంతో పాటు 2020లో భార్యాసమేతంగా భారత్ వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన ఆతిథ్యం మరువలేనని ట్రంప్ అన్నారు.మోదీ సైతం ‘మీతో ఉన్న అతి గొప్ప స్నేహబంధాన్ని ఇప్పటికీ మా ప్రజలు గుర్తు చేసుకుంటార’ని చెప్పారు. బైడెన్ హయాంలో రెండు దేశాల సంబంధాలకూ నష్టం కలిగే రీతిలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకున్నాయని ట్రంప్ అనటం గమనించదగ్గది. అయితే మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందే సుంకాల పెంపుదల ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. దీన్నిబట్టే అంచనాలకు దొరకని ట్రంప్ మనస్తత్వాన్ని గ్రహించవచ్చు. ప్రతిచర్యాత్మక సుంకాలపై ట్రంప్ అభీష్టం నెరవేరితే సంపన్న రాజ్యాల మధ్య అవగాహన ఫలితంగా దాదాపు 80 ఏళ్ల నుంచి ప్రపంచ వ్యాపార, వాణిజ్యాల్లో కొనసాగుతూ వస్తున్న విధానాలకు తిలోదకాలిచ్చినట్టవుతుంది. మధ్యలో ప్రపంచ దేశాల మధ్య సుంకాలు, వాణిజ్యాలపై కుదిరిన గాట్ ఒప్పందం, అటు తర్వాత ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల కింద వర్థమాన దేశాలకు సుంకాల విషయంలో వెసులుబాట్లు లభించాయి. ఫలితంగా వాటి ఉత్పత్తులపై సంపన్న దేశాల్లో తక్కువ సుంకాలున్నాయి. అదే సమయంలో సంపన్న దేశాల ఉత్పత్తులపై వర్ధమాన దేశాలు అధిక సుంకాలు విధించగలిగాయి. ఇందువల్ల అమెరికా, ఇతర సంపన్న దేశాలకు కలిగిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆ దేశాల కంపెనీలకు పరిశ్రమల స్థాపన కోసం నామమాత్ర ధరకు భూములు, అనేక ఇతర సదుపాయాలు లభించాయి. వాటి యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇతరేతర రక్షణ ఉత్పత్తులు వర్ధమాన దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒకచోట కనిపించే లోటు మరోచోట భర్తీ అవుతోంది. వాటి వ్యాపార వాణిజ్యాలు వందల రెట్లు పెరుగుతున్నాయి. కానీ ట్రంప్కు ఇవేం పట్టవు. అమెరికాలోని సంపన్న రైతులకు భారీ సబ్సిడీలిస్తున్న కారణంగా వారి సాగు ఉత్పత్తులు కారుచౌకగా ఉంటాయి. ఆ ఉత్పత్తులు భారత్ మార్కెట్లో అడుగుపెడితే మన ఉత్పత్తు లకు గిరాకీ పడిపోతుంది. అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ట్రంప్ తరచు చెప్పే అత్యంత ఖరీదైన హార్లీ–డేవిడ్ సన్ బైక్కి కూడా ఇది వర్తిస్తుంది. చవగ్గా లభించే విదేశీ ఆహారోత్పత్తులూ, విలాసవంతమైన వస్తువులూ కొనడానికి జనం ఎగబడితే మన విదేశీ మారకద్రవ్యమూ కరిగిపో తుంది. మన ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుంది. కనుకనే మనం భారీ సుంకాలు విధించాల్సి వస్తుంది.సుంకాల సంగతలా వుంచితే ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భావసారూప్యత ఉంది. ఉమ్మడి లక్ష్యాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అదుపు చేయటం, చైనా దుందు డుకు పోకడలను నియంత్రించటం అందులో ముఖ్యమైనవి. మన దేశం నుంచి చట్టవిరుద్ధంగా 7,25,000 మంది అమెరికాకు వలస పోయారని గణాంకాలు చెబుతున్నాయి. వీరందరినీ వెనక్కి పంపితే తమకు అభ్యంతరం లేదని మోదీ అమెరికాకు స్పష్టంగా చెప్పారు. ఇక మన ప్రయోజ నాలకు ఎంతగానో తోడ్పడే ఇరాన్లోని చాబహార్ పోర్టుతో తెగతెంపులు చేసుకోవాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. పాకిస్తాన్తో ప్రమేయం లేకుండా అఫ్గాన్కు చేరడానికి, పశ్చిమాసియా దేశా లతో వాణిజ్యం నెరపడానికి దోహదపడుతుందని చాబహార్ పోర్టు నిర్మాణంలో మన దేశం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇరాన్ తమ శత్రువు గనుక ఆ పోర్టును వదులుకోవాలని ట్రంప్ చెబుతున్నారు. ఇన్నాళ్లుగా భారత్కి స్తున్న మినహాయింపు రద్దు చేశారు. ఇదెక్కడి న్యాయం! మోదీ పర్యటన వల్ల అమెరికా తయారీ ఎఫ్–35 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు, చమురు, సహజవాయు కొనుగోళ్లు, కృత్రిమ మేధ, ఇతర సాంకేతికతలు, అంతరిక్ష అన్వేషణ, అణు ఇంధనం వగైరా అంశాల్లో సహకారం పెంపుపై అవగాహన కుదిరింది. పరస్పర ప్రయోజనకరంగా ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకోవటం, ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరగనుండటం బల పడుతున్న మైత్రీబంధానికి చిహ్నం. అయితే అసంబద్ధమైన సుంకాలతో, అడ్డగోలు విధానాలతో ఈ బంధాన్ని దెబ్బ తీయరాదని అమెరికా గ్రహించాలి. మోదీ పర్యటన అందుకు దోహదపడాలని అందరూ కోరుకుంటారు. -
‘సుప్రీం’ బోనులో ఈసీ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భాల్లో తప్ప వినబడని ఎన్నికల సంఘం(ఈసీ) పేరు ఇటీవలి కాలంలో తరచు వార్తల్లోకెక్కుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకొని ప్రచారం వరకూ... ఆ తర్వాత ఎన్నికల్లో పోలైన వోట్ల శాతం, వాటి లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకూ అన్ని దశల్లోనూ ఈసీపై నిందలు తప్పటం లేదు. తాజాగా ప్రజాతంత్ర సంస్కరణల సంఘం (ఏడీఆర్) దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం విచారిస్తున్న సందర్భంగా ఈవీఎంల పరిశీలన ప్రక్రియ అమల వుతుండగా వాటి డేటాను తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. నిరుడు ఏప్రిల్లో ఈ విషయమై ఇచ్చిన ఆదేశాలను సరిగా అర్థం చేసుకుని, సక్రమంగా పాటిస్తే ఇలా చెప్పించుకోవాల్సిన స్థితి ఈసీకి ఉండేది కాదు. ఈవీఎంలనూ, దానికి అనుసంధానించి వుండే ఇతర యూనిట్లనూ భద్రపరిచే విషయమై సుప్రీంకోర్టు అప్పట్లో కీలక ఆదేశాలిచ్చింది. అవి సరిగా పాటించటం లేదని ఏడీఆర్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల్లో పరాజితులై 2, 3 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు కనుక ఆ ఎన్నికను సవాలు చేసిన సందర్భాల్లో తనిఖీ చేయడానికి అనువుగా ఈవీఎంలతోపాటు, వాటిలో పార్టీల గుర్తులను లోడ్ చేయటానికి ఉపయోగించే సింబల్ లోడింగ్ యూనిట్ (ఎస్ఎల్యూ)లను సైతం 45 రోజులపాటు భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ఎన్నికల ఫలితంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయటానికి పరాజిత అభ్యర్థులకుండే 45 రోజుల వ్యవధిని దృష్టిలో పెట్టుకుని ధర్మాసనం ఇలా ఆదేశించింది. అసెంబ్లీ నియో జకవర్గ పరిధిలోని 5 శాతం ఈవీఎంలు, ఎస్ఎల్యూలను ఇంజనీర్ల, ఉత్పత్తిదారుల సమక్షంలో తనిఖీకి అనుమతించవచ్చని సూచించింది. వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించే యంత్రాలు సమకూర్చు కునే ఆలోచన చేయాలని కూడా ఆ సందర్భంగా కోరింది. ఈ ఆదేశాల ఆంతర్యమేమిటో సుస్పష్టం. ఎన్నికలు న్యాయబద్ధంగా జరగడమే కాదు... అలా జరిగినట్టు కనబడాలంటే అంతా పారదర్శకంగా ఉండాలన్నది ధర్మాసనం ఉద్దేశం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల అనంతరం ఈవీఎంలూ, వీవీప్యాట్లూ, ఎస్ఎల్యూల పరిశీలన విషయంలో ఈసీ కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసింది. న్యాయస్థానం ఆదేశాలకూ, ఆ నియమ నిబంధనలకూ ఎక్కడా పొంతన లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనూ 5 శాతం ఈవీఎంలు తనిఖీ చేయాలని ధర్మాసనం ఇచ్చిన ఆదేశానికి ఈసీ వేరే రకమైన భాష్యం చెప్పింది. వినియోగించిన ఈవీఎంలలో ఏ పార్టీకి ఎన్ని వోట్లు లభించాయో చూసి, వీవీ ప్యాట్ స్లిప్లు దానికి అనుగుణమైన సంఖ్యలో ఉన్నాయా లేదా అన్నది తేలిస్తే వేరే రకంగా ఉండేది. కానీ ఈసీ చేసిందల్లా ఇతరత్రా గుర్తులతో మళ్లీ నమూనా పోలింగ్ నిర్వహించి ఈవీఎంల డేటాకూ, వీవీప్యాట్ స్లిప్ల సంఖ్యకూ మధ్య తేడా లేదని నిరూపిస్తే చాలని భావించింది. అంతేకాదు... ఆ నమూనా పోలింగ్ కోసం ఈవీఎంలలోని డేటాను ఖాళీ చేసింది! ఈవీఎంలు సరిచూడాలని అభ్య ర్థులు కోరటం అంటే తమ సమక్షంలో ఈవీఎంలలో ఉన్న సాఫ్ట్వేర్నూ, హార్డ్వేర్నూ ఇంజనీర్లు పరిశీలించాలని... వీవీ ప్యాట్ స్లిప్ల సంఖ్య ఈవీఎంల డేటాతో సరిపోయిందో లేదో చూడాలని అడగటం. ఈసీ అనుసరించిన ప్రక్రియకూ, అభ్యర్థులు కోరుకునేదానికీ పొంతన ఎక్కడైనా ఉందా? ఈ మాత్రానికే అభ్యర్థులనుంచి ఈవీఎంకు రూ. 40,000 చొప్పున వసూలు చేయటం సిగ్గనిపించ లేదా? చిత్రమేమంటే... ఒక్కో ఈవీఎం తయారీకి ఖర్చయ్యేది కేవలం రూ. 30,000! గత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి 11 మంది అభ్యర్థులు ఈవీఎంలూ, వీవీప్యాట్ స్లిప్ల పరిశీలన కావాలన్నారని, అంతా పూర్తయ్యాక ఎక్కడా తేడా కనబడలేదని ఈసీ తేల్చింది. దేశవ్యాప్తంగా చూస్తే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇటువంటి అభ్యర్థనలే 83 వరకూ రాగా, అంతా సవ్యంగానే ఉన్నదని నిర్ధారణ అయిందని వివరించింది. ఆంధ్రప్రదేశ్లో 45 రోజులలోపు ఈవీఎంల డేటా తొలగించరాదన్న నిబంధనను సైతం ఈసీ ఉల్లంఘించింది. ఒకపక్క ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతుండగా ఇలా చేయటం అనుమానాలను మరింత పెంచుతుందన్న ఇంగితజ్ఞానం దానికి లేకపోయింది.మేమిచ్చిన ఆదేశాలేమిటో, మీరు అనుసరించిన ప్రక్రియేమిటో వివరిస్తూ వచ్చే నెల 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఈసీని ఆదేశించటం హర్షించదగ్గది. అసలు 45 రోజుల్లోపే డేటాను ఎందుకు తొలగించాల్సివచ్చిందో కూడా ఈసీనుంచి సంజాయిషీ కోరాలి. ఇక పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు మరింత చిత్రంగా ఉన్నాయి. ఏడు దశల్లో జరిగిన పోలింగ్లో 3.2 శాతం నుంచి 6.32 శాతం వరకూ వోట్లు పెరిగినట్టు ఈసీ తేల్చింది. ఈ పెరిగిన వోట్ల శాతం ఆంధ్రప్రదేశ్లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం ఉంది. పోలింగ్ ముగిసిన రాత్రి ఏపీలో 68 శాతం వోట్లు పోలయ్యాయని ప్రకటించగా, తుది ప్రకటనలో అది కాస్తా 81 శాతానికి ఎగబాకింది. ఈవీఎంల చార్జింగ్ పెరగటం మరో కథ! ఈ మార్పుల వెనకున్న మంత్రమేమిటో చెప్తే అందరూ విని తరిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంతో నిష్ఠగా నిర్వహించాల్సిన క్రతువు. ఒక రాజ్యాంగ సంస్థ అయివుండి, నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన ఈసీ అందుకు భిన్నమైన పోకడలను ప్రదర్శించటం దానికి ఎంతమాత్రమూ గౌరవప్రదం కాదు. ఈసీ తీరు గమనించాక చాలామంది మళ్లీ బ్యాలెట్ పత్రాలకు మళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఈసీ బాణీ మారకపోతే చివరకు బ్యాలెట్ పత్రం విధానం కోసం జనం ఎలుగెత్తే రోజులు రావటం ఖాయం. -
కుంటిసాకులు
ఇప్పటికే సమస్త జీవన రంగాలనూ అల్లుకుపోయిన కృత్రిమ మేధ (ఏఐ)పై పారిస్లో వరసగా రెండురోజులపాటు కొనసాగి మంగళవారం ముగిసిన మూడో శిఖరాగ్ర సదస్సు ఆశించిన ఫలితాలు అందించలేకపోయింది. సరిగ్గా రెండేళ్ల క్రితం బ్రిటన్లోని బ్లెచ్లీ పార్క్లో జరిగిన తొలి ఏఐ శిఖరాగ్ర సదస్సు (సేఫ్టీ సమ్మిట్) పూర్తిగా భద్రతాపరమైన అంశాలపై దృష్టిపెట్టింది. నిరుడు దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగిన రెండో శిఖరాగ్ర సదస్సు ప్రముఖ ఏఐ సంస్థల నుంచి భద్రతకు సంబంధించి నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటామన్న వాగ్దానాలు పొందగలిగింది. దానికి కొనసాగింపుగా పారిస్ శిఖరాగ్ర సదస్సును ‘ఏఐ యాక్షన్ సమ్మిట్’గా నామకరణం చేశారు. ఏఐ పరిమితు లేమిటో, అంతర్జాతీయ స్థాయిలో అందుకు పాటించాల్సిన నిబంధనలేమిటో ఈ శిఖరాగ్ర సదస్సు నిర్దేశిస్తుందని అందరూ ఊహించారు. కానీ బ్లెచ్లీ సదస్సు సాధించిన కొద్దిపాటి విజయాలనూ పారిస్ సదస్సు ఆవిరి చేసింది. దాపరికం లేని, సమ్మిళిత ఏఐ సాధనకు సమష్టిగా కృషి చేయాలన్న పిలుపునైతే ఇచ్చిందిగానీ, ఈ డిక్లరేషన్పై సంతకం చేసేది లేదని అమెరికా, బ్రిటన్లు మొరాయించాయి. మనతోపాటు 60 దేశాలు అంగీకరించిన ఈ డిక్లరేషన్ను అగ్రరాజ్యాలు కాదన్నాయంటే ఈ రంగం తీరుతెన్నులు ఎలా వుండబోతున్నాయో అంచనా వేయొచ్చు. ‘కొన్నేళ్ల క్రితం చర్చించిన ఏఐ భద్రత గురించి మాట్లాడటానికి ఇక్కడకు రాలేదు. ఏఐలో వెల్లువలా వచ్చిపడే అవకాశాలే నావరకూ ప్రధానాంశం’ అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. ఆయన ప్రస్తావించిన ఏఐ భద్రత అనేది నిజానికి 2023లో బ్రిటన్ చొరవతో బ్లెచ్లీ పార్క్ శిఖరాగ్ర సదస్సులో లోతుగా చర్చించిన అంశం. కానీ సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆ సంగతే గుర్తులేనట్టు వ్యవహరించి అమెరికా తోకపట్టుకుపోయారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశాల వైఖరులు మారితే అంతర్జాతీయంగా వాటికి విశ్వసనీయత ఏముంటుంది? ఇప్పటికే అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పారిస్ వాతావరణ ఒడంబడిక నుంచి బయటికొస్తున్నట్టు ప్రకటించారు. లక్షల కోట్ల పెట్టుబడితో ప్రధాన ఏఐ సంస్థలన్నీ సాగిస్తున్న పరిశోధనలు భవిష్యత్తులో ఎటువంటి కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ చేస్తాయో, అవి ప్రపంచ పౌరుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపగలవోనన్న ఆందోళన అగ్రరాజ్యాలకు లేశమాత్రమైనా లేదని తేలిపోయింది. ఏఐతో ఉద్యోగాలకు ముప్పు వచ్చిపడుతుందని, భవిష్యత్తు అగమ్యగోచరమవుతుందని అన్ని దేశాల్లోనూ భయాందోళనలున్నాయి. వందమంది గంటలో చేయగల పని ఏఐ కొన్ని క్షణాల్లో చేసి చూపటాన్ని గమనిస్తే అవి సహేతుకమైనవేనన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే శిఖరాగ్ర సదస్సుకు సహాధ్యక్షత వహించిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఉద్యోగాల స్వభావం మారు తుంది తప్ప ఉద్యోగాలు పోవు. కొత్త సాంకేతికతలు అడుగుపెట్టినప్పుడు ఆ నైపుణ్యతలను పెంచు కోలేనివారికి ఇబ్బందులుంటాయి. ఆ సాంకేతికతల్ని లొంగదీసుకోవటమే ఇందుకు పరిష్కారం. ఏఐ ఇప్పుడు దాదాపు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా వైద్య, వైజ్ఞానిక రంగాల్లో చోటుచేసుకుంటున్న పరిశోధనలు పూర్తి స్థాయిలో అందుబాటులోకొస్తే ఊహకందని వినూత్న ఆవిష్కరణలు రంగప్రవేశం చేస్తాయి. చికిత్సకు లొంగని మొండివ్యాధులు పలాయనం చిత్తగిస్తాయి. ఆయుఃప్రమాణాలు పెరుగుతాయి. అయితే రక్షణ, యుద్ధతంత్ర, అంతరిక్ష రంగాల్లో ఇది సృష్టించగల ఉత్పాతాలు చిన్నవేమీ కాదు. ఇందుకు కొత్త తరం ఏఐ మోడల్స్ ఉదాహరణ. తాజా మోడల్ ఒకటి సవరణలకు అవకాశం లేకుండా తన సృజనకర్తనే పక్కదారి పట్టించేలా తనను తాను కాపీ చేసుకుందని ఆ రంగంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వచ్చే అయిదేళ్లలో సూపర్ హ్యూమన్ స్థాయి ఏఐ రూపొందటం ఖాయమని వారంటున్నారు. భద్రతకు సంబంధించి ఏఐలో సాగుతున్న పరిశోధనల్లో తలెత్తే ప్రశ్నలకు పరిష్కారం కనుగొనకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయన్నది వారి హెచ్చరిక. కానీ అమెరికా తప్పుడు సూత్రీకరణలు చేస్తోంది. భద్రత గురించిన జాగ్రత్తలను సెన్సార్షిప్గా వక్రీకరిస్తోంది. యూరప్ యూనియన్ (ఈయూ) రూపొందించిన నియంత్రణ చట్టాలు ఆ రంగం పీకనొక్కడానికే పనికొస్తాయని వాన్స్ భాష్యం చెబుతున్నారు. ఏఐ విషయంలో సైద్ధాంతిక పక్షపాతాలకు అతీతంగా వ్యవహరించాలని, స్వేచ్ఛనీయాలని ఆయన డిమాండ్. తప్పుడు సమాచార వ్యాప్తిని గుర్తించి తొలగించటానికి ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాలు రూపొందించుకున్న ఉపకరణాలను (ట్రంప్ వస్తారనగానే ఆ సంస్థలు స్వచ్ఛందంగా వాటిని ఉపసంహరించుకున్నాయి) సెన్సార్షిప్గా వక్రభాష్యం చెప్పినవారు ఇంతకుమించి ఆలోచించగలరా? ఏఐ రంగంలో ఇప్పట్లాగే భవిష్యత్తులోనూ తన ప్రాబల్యమే కొనసాగుతుందని, దాన్ని గుప్పెట్లో పెట్టుకుని లక్షల కోట్ల లాభాలు ఆర్జించవచ్చని అమెరికా కలగంటోంది. కానీ ఇటీవల చైనా నుంచి వచ్చిన డీప్సీక్ దూకుడు గమనిస్తే ఈ రంగం ఎవరి జాగీరూ కాదని స్పష్టమవుతోంది. ఇలా నిరంతరం ఊహాతీతంగా చక చకా ఎదుగుతున్న రంగానికి బాధ్యతాయుతమైన మార్గాన్ని నిర్దేశించకపోతే దానివల్ల మానవాళికి ముప్పు కలిగే అవకాశం లేదా? సురక్షిత, హేతుబద్ధ, పారదర్శక ఏఐ రూపొందటానికి దేశాలన్నీ సమష్టిగా కృషి చేయకపోతే, సాధించే అభివృద్ధిని ఇచ్చిపుచ్చుకునే సంస్కృతి నెలకొల్పనట్టయితే అది స్వీయ వినాశనానికే దారితీస్తుందని అన్ని దేశాలూ గుర్తించాలి. -
ఘర్షణాత్మక ఆలోచన
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకొచ్చినప్పటినుంచీ మీడియాకు కావలసినంత మేత దొరుకుతోంది. వలసదారులను తిప్పిపంపటంలో ఆ దేశం ఎంత అమానుషంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నదో అందరూ చూశారు. అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండటానికి సిద్ధపడాలంటూ కెనడాను కోరటం, గ్రీన్ల్యాండ్ ప్రాంతాన్ని తమకు అమ్మేయాలని డెన్మార్క్ను అడగటం, పనామా కాల్వను అప్పగించాలని తాఖీదు పంపటం వగైరాలన్నీ తెలిసీ తెలియక మాట్లాడే మాటలుగా అందరూ కొట్టిపారేశారు. గాజాను స్వాధీనం చేసుకుని దాన్ని ఒక గొప్ప రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో కలిసి గత బుధ వారం మీడియాకు చెప్పడాన్ని సైతం అలాగే భావించారు. సాక్షాత్తూ వైట్ హౌస్ ప్రతినిధే ట్రంప్ వ్యాఖ్యల్ని మీడియా తప్పుగా అర్థం చేసుకున్నదంటూ తోసిపుచ్చారు. అదంతా తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్నారు. కానీ ట్రంప్ మరోసారి జూలు విదిల్చారు. గాజా స్ట్రిప్ అమెరికాకు కూడా చెందదట. తానే సొంతం చేసుకుంటారట. గాజా పౌరులు నివాసం ఉండటానికి చుట్టూ ఉన్న జోర్డాన్, ఈజిప్టు, సౌదీ, టర్కీ తదితర పశ్చిమాసియా దేశాల్లో ఆరుచోట్ల మెరుగైన కాలనీలు నిర్మిస్తారట. గాజా పౌరులకు ఇక తిరిగొచ్చే హక్కే లేదట. విధ్వంసం తప్ప నిర్మాణం సంగతి తెలియని దేశానికి ఇలాంటి ఆలోచన రావటం వెనకున్న వ్యూహం చిన్నదేం కాదు. తనకు 7,000 కిలోమీటర్ల ఆవల దాదాపు 25 లక్షలమంది నివసించే ఒక ప్రాంతాన్ని ‘సొంతం’ చేసుకోదల్చుకున్నట్టు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన అధినేత ఒకరు ప్రకటించారంటే అదెంత వైపరీత్యమో, అంతకుమించి మరెంత దుస్సాహసమో అర్థం చేసుకోవచ్చు. 2023 అక్టోబర్ మొదలుకొని గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేవరకూ ఇజ్రాయెల్ సైన్యాలు అక్కడ టన్నులకొద్దీ బాంబులు జార విడిచినా... దారుణ హింసను చవిచూపినా, పసిపిల్లలూ, స్త్రీలతో సహా 47,000 మంది పౌరులను హతమార్చినా, లక్షలమందిని గాయపరిచినా ఆ ప్రాంతం లొంగిరాలేదు. హమాస్ ఆనుపానులన్నీ తెలిశాయని ఇజ్రాయెల్ చెప్పుకున్నా, ఆ సంస్థ అపహరించిన పౌరులందరినీ విడిపించటంలో అది పూర్తిగా విఫలమైంది. చివరకు హమాస్తో కుదిరిన ఒడంబడికతోనే వారంతా దశలవారీగా విడు దలవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఎంత మతిమాలినదో అమెరికా పౌరులు గ్రహించాలి. యుద్ధాలన్నిటినీ అంతం చేస్తానని వాగ్దానాలిచ్చి పీఠం అధిష్టించిన అధినేత కొత్త కుంపట్లు రాజేయటంలోని మర్మమేమిటో నిలదీయాలి. అమెరికాతో చెట్టాపట్టాలేసుకున్న పశ్చిమాసియా దేశాలు మాత్రమే కాదు... భద్రతామండలి దేశాలన్నీ ట్రంప్ ప్రతిపాదనను ఖండించాయి. సుతిమెత్తగానే అయినా ‘ఇది యుద్ధాల యుగం కాద’ని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. 1948లో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కు ప్రాణప్రతిష్ఠ చేసి పాలస్తీనా పేరిట వదిలిన ఒక చిన్న ప్రాంతాన్ని సైతం ఇప్పుడు ట్రంప్ ఆక్రమిద్దామని చూస్తు న్నారు. అంతరంగంలో ఏమనుకున్నా ‘రెండు దేశాల’ ఏర్పాటే సమస్యకు పరిష్కారమని పైకి చెబుతూ వచ్చిన అమెరికా... ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తన నైజాన్ని బయటపెట్టుకుంది. పాలకులెవరైనా, పైకి ఏం చెప్పినా అమెరికా విధానాలు యుద్ధాలకూ, ప్రత్యేకించి ఇజ్రాయెల్కు అనుకూలమైనవే. చరిత్ర వరకూ పోనవసరం లేదు. గత 15 నెలలుగా గాజాలో ఇజ్రాయెల్ సాగించిన నర మేథం అమెరికా ఆశీస్సులు లేకుండా జరిగే అవకాశం ఉందా? రష్యాను కవ్వించి కయ్యా నికి కాలు దువ్వమని ఉక్రెయిన్ను ప్రోత్సహించి ఓడిపోక తప్పని యుద్ధంలోకి దాన్ని దించిన ఘనత గత పాలకుడు జో బైడెన్ది. ఒకప్పుడు సోవియెట్ బూచిని చూపి ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలకు దిగిన అమెరికా ఇవాళ ప్రపంచ దేశాలన్నిటినీ శత్రువులుగా చూస్తోంది. వేరే దేశాల సరుకులపై భారీ సుంకాలు మోపుతూ, వాటిని దివాలా తీయించటం ఒకవైపు... ‘నచ్చిన ప్రాంతం’ సొంతం చేసుకుంటానంటూ మరోవైపు ప్రపంచాన్ని ట్రంప్ అస్థిరతలోకి నెడుతున్నారు. ఈ సంస్కృతినే రష్యా, చైనాలు కొనసాగిస్తే ఏం జరుగుతుందో ఆయనకు అర్థమవుతున్నట్టు లేదు. ప్రపంచ దేశాలన్నీ తన జాగీరుగా ఆయన భావిస్తున్నారు. పొట్టచేతబట్టుకు వచ్చిన వలసదారులను అమెరికాలో నేరస్తు లుగా పరిగణించే ట్రంప్ తన విస్తరణవాద కాంక్షను ఏమనాలో, అందుకు శిక్షేమిటో చెప్పాలి. అమెరికా దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన జోర్డాన్, ఈజిప్టులు రెండూ ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కానీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 ట్రంప్ హుంక రింపులను తట్టుకుని నిలబడగలరా? అనుమానమే. ఎందుకంటే అమెరికానుంచి సైనిక, ఆర్థిక సాయం పొందుతున్న దేశాల్లో జోర్డాన్ది మూడో స్థానం. ఆ దేశానికి ఏటా 1,700 కోట్ల డాలర్ల ప్యాకేజీ అందుతుంది. 1,500 కోట్ల డాలర్లతో తర్వాతి స్థానం ఈజిప్టుది. అమెరికా నుంచి 17,200 కోట్ల డాలర్ల సాయం పొందుతూ ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రథమస్థానంలో వున్నా అదెంతో కాలం సాగకపోవచ్చు. 3,300 కోట్ల డాలర్లతో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉంది. ట్రంప్కు మోకరిల్లితే ఈజిప్టు, జోర్డాన్ ప్రజలు మౌనంగా ఉండరు. ఇప్పటికే గాజా శరణార్థులతో నిండివున్న ఆ దేశాల్లో మరింతమందిని తీసుకొస్తామంటే ఆగ్రహజ్వాలలు మిన్నంటుతాయి. అందుకే అక్కడి పాలకుల స్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిగా ఉంది. గాజాను పునర్నిర్మించాల్సిందే. సర్వం శిథిలమైన చోట మెరుగైన ఆవాసాలు ఏర్పాటు కావాల్సిందే. కానీ అదంతా అక్కడి పౌరుల చేతుల మీదుగా జరగాలి. అమెరికాతో సహా బయటి దేశాలకు అక్కడ కాలుమోపే హక్కులేదు. -
మణిపూర్ శాంతిస్తుందా?
ఎట్టకేలకు మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు రెండేళ్లనాడు హత్యలూ, అత్యాచారాలూ, గృహదహనాలతో అట్టుడికి ప్రపంచవ్యాప్తంగా మన దేశ పరువు ప్రతిష్ఠలను మంటగలిపిన ఆ రాష్ట్రం 649 రోజులైనా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. 2023 మే 3న రాష్ట్రంలో ప్రధాన తెగలైన మెయితీలకూ, కుకీలకూ మధ్య రాజుకున్న ఘర్షణలు చూస్తుండ గానే కార్చిచ్చులా వ్యాపించగా అధికారిక లెక్కల ప్రకారమే 260 మంది ప్రాణాలు కోల్పోయారు. 60,000 మంది ఇప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లలేక సహాయ శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. భద్రతా బలగాల పహారా కొనసాగుతున్నా మెయితీలు, కుకీలు ఒకరి ప్రాబల్య ప్రాంతాల్లోకి మరొకరు ప్రవేశించే సాహసం చేయటం లేదు. అందువల్ల నిరుపేదల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింది. మణిపూర్ హింసాకాండ సాధారణమైనది కాదు. అనేకచోట్ల మహిళలను వివస్త్రలను చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన ఉదంతాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి. పోలీసు స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి తుపాకులు, మందుగుండు ఎత్తుకుపోయిన ఉదంతాలు కోకొల్లలు. ఈ మొత్తం హింసాకాండలో బీరేన్ సింగ్కు కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు... నేరుగా ఆయన ఒక వర్గానికి వత్తాసుగా నిలిచారని అనేకులు ఆరోపించారు. ఇటీవల బయటపడి, ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న సంభాషణల ఆడియో క్లిప్ ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.కొందరి మతిమాలిన చర్యలవల్లా, పాలకులకు సరైన అంచనా లేకపోవటంవల్లా శాంతి భద్రతలు చేజారే ప్రమాదం ఉంటుంది. కానీ మణిపూర్లో జరిగింది వేరు. ఘర్షణలను కుకీ మిలి టెంట్లకూ, కేంద్ర భద్రతా బలగాలకూ మధ్య సాగుతున్న లడాయిగా మొదట్లో బీరేన్ సింగ్ కొట్టి పారేశారు. కానీ దాన్ని అప్పటి రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఖండించారు. అవి రెండు తెగలమధ్య కొనసాగుతున్న ఘర్షణలేనని తేల్చిచెప్పారు. ఆ తర్వాత దశలో ఘర్షణలను ఆపడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర భద్రతా బలగాలు ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా యంటూ బీరేన్ నిందించారు. విషాదం ఏమంటే 21 నెలలు గడిచినా ఈనాటికీ పరిస్థితి పెద్దగా మారింది లేదు. వాస్తవానికి ఘర్షణలు చెలరేగిన కొన్ని వారాల తర్వాత 2023 జూన్లో బీరేన్సింగ్ రాజీనామాకు సిద్ధపడ్డారు. కానీ రాజ్భవన్ కెళ్లే దారిలో ఆయన మద్దతుదార్లు పెద్దయెత్తున గుమి గూడి అడ్డంకులు సృష్టించి వెనక్కు తగ్గేలా చేశారు. ఇన్నాళ్లకు తప్పుకున్నారు. ఈ పని మొదట్లోనే జరిగుంటే ఈపాటికి పరిస్థితులు మెరుగుపడేవి. సకాలంలో తీసుకోని నిర్ణయం ఊహించని విష పరిణామాలకు దారితీసే ప్రమాదమున్నదని చెప్పటానికి మణిపూర్ పెద్ద ఉదాహరణ. ఇంతకూ బీరేన్ రాజీనామాకు కారణం ఏమిటన్నది మిస్టరీయే. సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీల నలో వున్న ఆడియో టేప్ అందుకు దారితీసి వుండొచ్చని కొందరంటున్నా... మణిపూర్ అరాచకంలోకి జారుకున్నప్పటినుంచీ ఆయనకు సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతూ వచ్చిందన్నది వాస్తవం. కేబినెట్ సైతం రెండుగా చీలింది. ఒక వర్గం మణిపూర్ను విభజించి తాముండే ప్రాంతా లను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న కుకీల డిమాండ్ను సమర్థించగా, మరో వర్గం మణిపూర్ సమగ్రత కాపాడాలంటూ కోరుతూ వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రతసింగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇంఫాల్ హోటల్లో సమావేశమై బీరేన్ను సాగనంపటానికి వ్యూహం రచించగా, సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ సమావేశాల్లో సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నోటీసులిచ్చింది. బీరేన్ తప్పుకున్నాక అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దుచేశారు. బీజేపీ అధిష్టానం అండదండలుంటే అవిశ్వాస తీర్మానానికి బీరేన్ జడిసేవారు కాదు. ఎందుకంటే తొలి ఏలుబడిలో మూడుసార్లు అవిశ్వాస తీర్మానం వచ్చిపడినప్పుడు అసెంబ్లీలో తగినంత బలం లేకున్నా సునాయాసంగా బయటపడిన చరిత్ర బీరేన్ది. దేశానికి బలమైన రాజ్యాంగం ఉన్నా మణిపూర్లో కొనసాగుతున్న దారుణ హింసను అన్ని వ్యవస్థలూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. అది మన దేశంలో అంతర్భాగమని, అక్కడి ప్రజలు కూడా ఈ దేశ పౌరులేనని గుర్తించనట్టే ప్రవర్తించాయి. గవర్నర్ మొదలుకొని న్యాయవ్యవస్థ వరకూ అందరికందరూ మౌనంగా మిగిలారు. ఇలాంటి సమయాల్లో జోక్యం చేసుకోవాల్సిన కేంద్రం తన కర్తవ్యాన్ని మరిచింది. పార్లమెంటులో ఈ సమస్య ప్రస్తావనకొచ్చినప్పుడల్లా అధికార, విపక్ష సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకోవటం మినహా జరిగిందేమీ లేదు. కనీసం ఇప్పుడైనా అందరూ కదిలి క్షతగాత్రగా మిగిలిన మణిపూర్లో ఉపశమన చర్యలు తీసుకుంటారా?మాయమైన మనుషులు, ధ్వంసమైన ఇళ్లు, ఛిద్రమైన బతుకులు, మానప్రాణాలు తీసే మృగాళ్లు, జీవిక కోల్పోయి ఎలా బతకాలో తెలియక కుమిలిపోతున్న కుటుంబాలు – మణిపూర్ వర్తమాన ముఖచిత్రం ఇది. అందుకే ఆయుధాలు సమకూర్చుకుని అధికారంలో ఉన్నవారి అండదండలతో ఇన్నాళ్లనుంచీ రెచ్చిపోతున్న ముఠాల ఆటకట్టించటం తక్షణావసరం. అసెంబ్లీని సస్పెండ్ చేసి తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధిస్తారో, మరెవరినైనా ముఖ్యమంత్రి పీఠంపై ఎక్కిస్తారో ఇంకా తేలాల్సేవుంది. ఏం జరిగినా ముందు చట్టబద్ధ పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవటం అధికార యంత్రాంగం కర్తవ్యం. అప్పుడే శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి. సంక్షుభిత మణిపూర్ మళ్లీ చివురిస్తుంది. -
‘తెలివి’ తెల్లారకూడదు!
‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’– పొడి అక్షరాలలో ‘ఏఐ’ – ఇంతింతై వటుడింతౖయె అన్నట్టుగా రోజు రోజుకూ విశ్వరూపాన్ని సంతరించుకుంటోంది. ‘కృత్రిమ మేధ’గా మనం అనువదించుకుంటున్న ఆ మాట చూస్తుండగానే మన నిత్య వ్యవహారంలో భాగమైపోతోంది. అమెరికా అభివృద్ధి చేసిన ‘చాట్ జీపీటీ’ అనే ఏఐ లాంగ్వేజ్ నమూనాకు పోటీగా చైనా అభివృద్ధి చేసిన ‘డీప్ సీక్’ కొన్ని రోజులుగా చర్చనీయమవుతోంది. చాట్ జీపీటీ కన్నా ఇది మెరుగైన సాంకేతికత అనీ, ఏఐ రంగంలో చైనా పురోగమనాన్ని ఇది చాటి చెబుతోందనీ అంటున్నారు. ఇప్పటికే ఏఐ రంగంలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా; చైనా, బ్రిటన్ రెండు, మూడు స్థానాలలో ఉన్నాయని సమాచారం. కృత్రిమమేధా రంగంలో ముందున్నవారే ప్రపంచాన్ని ఏలగలరని ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్య, ఈ సాంకేతికాద్భుతం ప్రపంచాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయబోతోందో స్పష్టం చేస్తోంది. ఇంతటి కీలకరంగంలో మనదేశం ఏ స్థానంలో ఉందన్న ప్రశ్న తలెత్తడం సహజమే. మరీ వెనకబడి లేము కానీ, చైనా మొదలైన దేశాలతో పోల్చితే వెళ్లవలసినంత ముందుకూ వెళ్లలేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా వేగాన్ని పెంచుకుని పోటాపోటీగా మన ఉనికిని స్థాపించుకోగల సత్తా మనకుందన్న భావన వ్యక్తమవుతోంది. అదలా ఉంచితే, ఏఐ సాంకేతికత సృష్టించే అద్భుతాలను సామాజిక మాధ్యమాల తెరపై ఇప్ప టికే చూస్తున్నాం. ఇటీవలి కుంభమేళాలో కొందరు విదేశీ ప్రముఖులు కాషాయవస్త్రాలు ధరించి పవిత్ర స్నానాలు చేసినట్టు చూపే చిత్రాలు సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఏఐ సాంకేతికతతో సృష్టించినవని చెప్పకపోతే నిజమని నమ్మేసే ప్రమాదం ఉండనే ఉంటుంది. ఇలాగే, తను కుంభమేళాలో స్నానం చేస్తున్నట్టు చూపించే ఏఐ చిత్రం ఒకటి చక్కర్లు కొడుతుండటం గమనించి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రకరకాల మాధ్యమాలలో హోరెత్తుతున్న నకిలీ సమాచారానికి తోడు ఇప్పుడు నకిలీ చిత్రాలు కూడా అడుగు పెట్టాయనీ, వీటికి వ్యతిరేకంగా తన వంతు పోరాటంగా పోలీసులకు ఫిర్యాదు చేశాననీ ఆయన చెప్పుకొచ్చారు. నిక్కమైన సమాచారానికి నకిలీ వార్తల బెడద విడుపులేని రాహుగ్రహణంగా మారిన మాట నిజం. మంచి, చెడులు రెంటికీ పనికొచ్చే రెండంచుల కత్తి లాంటి సాంకేతిక సాధనాల జాబితాలో ఏఐ కూడా ఇలా చేరిపోతోంది. ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేయడం, ఏఐలో పురోగతిని సాధించడాన్ని మించిన సవాలు కాబోతోంది. ఇంకోవైపు, ఆకాశమే హద్దుగా ఏఐ సాంకేతికత సాధించగల అద్భుతాలను ఊహించుకున్న కొద్దీ, అది అచ్చంగా మాయల ఫకీరు చేతిలోని మంత్రదండాన్ని గుర్తుచేస్తుంది. తలకాయలను, వేషభాషలను మార్చడమే కాదు; స్త్రీ, పురుషుల రూపాలను కూడా అది తారుమారు చేయగలదు. ఆ విధంగా మంత్రాలూ, మహిమలతో నిండిన పౌరాణిక మాయాప్రపంచాన్ని కొత్తరూపంలో కళ్ళముందు ఆవిష్కరించగలదు. ఉదాహరణకు రామాయణంలోనే చూడండి, యుద్ధరంగంలో రాముని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఇంద్రజిత్తు ఒక మాయాసీతను సృష్టించి తన రథం మీద యుద్ధభూమికి తీసుకొచ్చి అందరూ చూస్తుండగా ఆమెను నరికి చంపుతాడు. రాముడంతటివాడు కూడా ఆమెను నిజ సీత అనుకుని దుఃఖంతో మూర్ఛపోతాడు. వినాయకుడికి ఏనుగు తలను, మరో పౌరాణిక పాత్రకు గుర్రం తలను అతికించడమూ పురాణాలలో కనిపిస్తాయి. ఒక రాకుమారుడు వేటకెళ్లి ఓ వనంలోకి ప్రవేశించగానే స్త్రీగా మారిపోయినట్టు చెప్పే కథ ఒకటి మహాభారతంలో ఉంది. అభిమన్యుని వధకు కారణమైన సైంధవుని సూర్యాస్తమయంలోగా చంపి తీరుతానన్న అర్జునుని ప్రతిజ్ఞను నిజం చేయడానికి కృష్ణుడు కృత్రిమ సూర్యాస్తమయాన్ని సృష్టి స్తాడు. ఏఐ సాంకేతికత ఇటువంటి అనేకానేక ఉదంతాలను తలపించి మరిపించే ఒక సరికొత్త మాంత్రిక ప్రపంచాన్ని సృష్టించి ఏది నిజమో, ఏది అబద్ధమో పోల్చుకోలేని ద్వైదీస్థితిలో మనిషిని నిలబెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. మనిషి సృష్టించిన సాంకేతికత తిరిగి ఆ మనిషినే పునఃçసృష్టి చేయడం మానవ చరిత్ర పొడవునా జరుగుతూ వచ్చింది. రాతియుగంలో మనిషి కనిపెట్టిన శిలాసాధనాలే అన్నసంపాదనలో కొత్త మార్గాలు తెరచి భద్రమైన మనుగడ దిశగా అతణ్ణి ముందడుగు వేయించాయి. అతను కనిపెట్టిన ధనుర్బాణాలే ఆ అడుగుకు మరో పదడుగులు జమచేశాయి. ఆ తర్వాత అతనే కనిపెట్టి విడిచిపెట్టిన చక్రం వందల వేల సంవత్సరాలలో వేనవేల రూపాల్లోకి మారి, అతణ్ణి కూడా మార్చి ప్రపంచ యాత్ర చేయిస్తూ అప్రతిహతంగా తిరుగుతూనే ఉంది. ఆహార సేకరణ, పెరటి సాగు దశలను దాటి మనిషి సృష్టించిన వ్యవసాయ సాంకేతిక జ్ఞానమే, తిరిగి అతడికి నాగరికుడిగా కొత్త అవతారాన్ని సంతరించి సరికొత్త యుగావిష్కరణ వైపు నడిపించింది. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, మనిషి తను సృష్టించిన సాంకేతికతను తన అదుపులో ఉంచుకున్నప్పుడే అది ఉపయుక్తంగా మారి అతని మనుగడను ఎవరెస్టు ఎత్తుకు తీసుకెడుతుంది; కళ్లేలు వదిలేస్తే సమస్యలు, సంక్షోభాల లోయల్లోకి పడదోస్తుంది. ఏఐ లాంటి ఎంతటి అత్యాధునిక సాంకేతికత అయినా ఇందుకు మినహాయింపు కాదు. మనిషి సృష్టించిన కృత్రిమ మేధ మనిషి మేధనే కృత్రిమంగా మార్చివేయకుండా చూసు కోవాలి; ప్రపంచాన్నే మయసభగా మార్చి మాయావుల పరం చేయకుండా జాగ్రత్తపడాలి. -
‘కారుణ్యం’ శాపం కారాదు!
వైద్య కారణాల రీత్యా ఎప్పటికీ కోలుకోలేని అచేతన స్థితికి చేరుకుని, మరణం తప్ప మరో దారిలేని రోగులకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించే నిబంధనలు దేశంలోనే తొలిసారి కర్ణాటకలో అమల్లో కొచ్చాయి. వాస్తవానికి కేరళ, గోవా, మహారాష్ట్రలు ఇప్పటికే ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కర్ణాటక మరో అడుగు ముందుకేసి సవివరమైన న్యాయ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ విషయంలో 2018లోనూ, 2023లోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వాలు తగిన చట్టాలు చేసేవరకూ ఇవి అమల్లో వుంటాయని ప్రకటించింది. ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాలు ఇందుకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయి. సమస్య చాలా జటిలమైనది. మంచానికి పరిమితమైపోయిన రోగులు లోలోపల ఎంత నరకం చవి చూస్తున్నారో బయటి ప్రపంచానికి తెలియదు. నిత్యం సేవలందించే వైద్య సిబ్బందికి, నిరంతరం కనిపెట్టుకుని వుండే కుటుంబ సభ్యులకు సైతం ఆ రోగుల అంతరంగం, వారు పడుతున్న యాతనలు అర్థంకావు. వ్యాధి నయమయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని, వైద్య ఉపకరణాల సాయంతో కోమాలో మంచంపై వెళ్లదీయటం తప్ప మరో మార్గం లేదని తెలిశాక వారిని ఆ స్థితి లోనే ఉంచటం సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకు విరుద్ధంగా ప్రాణం పోసే శక్తిలేని మనిషికి ప్రాణం తీసే హక్కు ఎక్కడిదన్న వాదనలూ ఉన్నాయి. ఒక మానవ మృగం సాగించిన లైంగిక హింస పర్యవసానంగా కోమాలోకి వెళ్లి ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రి బెడ్పై దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి 2015లో కన్నుమూసిన అరుణా రామచంద్ర శాన్బాగ్ కేసు ఉదంతంలో తొలిసారి ఈ కారుణ్య మరణం అంశం చర్చ కొచ్చింది. ఆమె దశాబ్దాల తరబడి జీవచ్ఛవంలా రోజులు వెళ్లదీయటం చూడలేకపోతున్నానని,ఇంకా ఎన్నాళ్లపాటు ఆమె ఇలా కొనసాగాల్సి వస్తుందో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారని జర్న లిస్టు పింకీ విరానీ సుప్రీంకోర్టు ముందు 2009లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ప్రశాంత మరణా నికి అవసరమైన ఆదేశాలివ్వాలని విరానీ విన్నవించుకున్నారు. కానీ ఆమె శాన్బాగ్ కుటుంబ సభ్యు రాలు కాకపోవటంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. ఇలాంటి స్థితికి చేరుకున్న రోగుల కారుణ్య మరణానికి చట్టబద్ధతను కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అయితే ఆ తీర్పు అరుణకు ‘పునర్జన్మ’నిచ్చిందంటూ ఆమెకు సేవలు చేస్తున్న నర్సులంతా మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకున్నారు. రిటైరవుతున్నవారి స్థానంలో వచ్చే కొత్త నర్సులు సైతం ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవారు. కారుణ్య మరణంపైనే కామన్ కాజ్ దాఖలు చేసిన మరో పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 2018లో తొలిసారి మార్గదర్శకాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలను మరింత సరళం చేస్తూ 2023లో మరో తీర్పునిచ్చింది. హుందాగా జీవించటం మాత్రమే కాదు... హుందాగా మరణించటం కూడా రాజ్యాంగంలోని 21వ అధికరణం పరిధిలోకి వస్తుందని చెప్పింది. అయితే కారుణ్య మరణం కేసుల్లో ఇమిడివుండే జటిల సమస్యలేమిటో, వాటిని స్వప్రయోజన పరులు ఎలా ఉపయోగించుకునే ప్రమాదమున్నదో న్యాయమూర్తులు గుర్తించే వుంటారు. అందుకే ఆ మార్గదర్శకాలు అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. తిరిగి కోలుకునే అవకాశం లేదని, కేవలం వైద్య సాయంతో జీవచ్ఛవాల్లా బతుకీడ్చక తప్పదని గుర్తించిన రోగులకు ఇది వర్తిస్తుందని ధర్మా సనం తెలిపింది. అలాగే చికిత్స తీసుకునేముందే రోగి ఆ ప్రక్రియలో ఎదురుకాగల ప్రమాదాన్ని గుర్తించి, ఆ పరిస్థితి ఏర్పడిన పక్షంలో వైద్యాన్ని నిలిపేయటానికి అంగీకారం తెలిపే ముందస్తు ఆదేశం(ఏఎండీ)పై సంతకం చేసి ఇవ్వొచ్చు. దాన్ని ‘లివింగ్ విల్’గా పరిగణించాల్సి వుంటుంది. ఒకవేళ అది రోగి ఇవ్వలేని పక్షంలో వైద్యానికి ముందు ఆయన తరఫున కుటుంబంలోని పెద్ద ఎవరైనా ఏఎండీని అందజేయొచ్చు. దాని ఆధారంగా రోగికి అమర్చే ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్, ఇతరేతర ఉపకరణాల వంటి ప్రాణావసర వ్యవస్థల్ని తొలగిస్తారు. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా సాగడానికీ, ఎలాంటి లొసుగులకూ ఆస్కారం లేకుండా ఉండటానికీ ప్రతి ఆసుపత్రిలోనూ ముగ్గు రేసి సీనియర్ డాక్టర్లతో రెండు బోర్డులు ఏర్పాటుచేయాలి. ప్రాథమిక స్థాయి బోర్డు తన అభిప్రాయం చెప్పాక, సెకండరీ బోర్డు మరోసారి పరిశీలించాలి. జిల్లా వైద్యాధికారి ఈ నిర్ణయ ప్రక్రియలో పాలుపంచుకోవాలి. దీన్ని ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆమోదించిన పక్షంలో ఆ సంగతిని హైకోర్టు రిజిస్ట్రార్కి తెలపాలి. ఇలాంటి అంశాల్లో కుటుంబ సభ్యుల మధ్యే ఏకాభిప్రాయం కుదరక పోవచ్చు. అందుకే విడివిడిగా అందరితో మాట్లాడటం, వారిఅంగీకారం విషయంలో ఇమిడి వున్న సమస్యలేమిటో చెప్పటం ఎంతో అవసరం.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. డబ్బు కోసం, ఆస్తుల కోసం ఆరాటపడుతూ ఎంతకైనా తెగించే లోకంలో స్వపరభేదాలుండవు. ఇది గాక వైద్యానికి తడిసి మోపెడవుతుందన్న భయంవల్ల లేదా త్వరగా ‘వదుల్చుకోవాలన్న’ తొందర వల్ల వైద్యులను పక్కదోవ పట్టించే ప్రబుద్ధులుంటారు. కనుక ఈ సమస్య చుట్టూ అల్లుకుని వుండే చట్టపరమైన అంశాలు సరే... నైతిక, సామాజిక, ఆర్థిక అంశాలను సైతం తరచి చూడక తప్పదు. సమాజ పోకడలు ఎలా వుంటున్నాయో గమనించుకోక తప్పదు. ‘హుందాగా మరణించటం’ హక్కే కావొచ్చు... కానీ అది ‘మరణించటానికి గల హక్కు’గా పరిణమించకూడదు. ఈ ‘హక్కు’ నిస్సహాయ రోగుల పాలిట శాపంగా మారకూడదు. -
అమెరికా అమానుషత్వం
సహజ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలపై కన్నేసి వాటిని నయానో భయానో ఒప్పించి అక్కడి ప్రాంతాలను దురాక్రమించాలని చూస్తున్న అమెరికా... పొట్టకూటి కోసం తనను ఆశ్రయించినవారి పట్ల మాత్రం అమానుషంగా, హేయంగా ప్రవర్తిస్తున్నదని రుజువైంది. సైనిక విమానంలో అమృత్ సర్ చేరుకున్నవారి కథనాలు వింటుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి, కూర్చోవటానికి కూడా అసౌకర్యంగా ఉండే సైనిక విమానంలో పశువుల్ని తరలించిన చందాన మనవారిని తీసుకొచ్చారు. ఇందులో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు కూడా ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. గత నెలలో కొలంబియా, మెక్సికో దేశాలవారిని ఈ పద్ధతిలోనే పంపటానికి ప్రయత్నించినప్పుడు వాటినుంచి నిరసన వ్యక్తమైంది. అమెరికా సైనిక విమానాలకు అనుమతినీయబోమన్నాయి. చివరకు కొలంబియా తలొగ్గినా మెక్సికో మాత్రం తమ విమానాన్ని పంపి వలసదారులను వెనక్కు తెచ్చుకుంది. బ్రెజిల్ సైతం తమవారిపట్ల అమానుషంగా వ్యవహరించటాన్ని ఖండించింది. భారతీయులకు జరిగిన అవమానంపై సహజంగానే పార్లమెంటులో గురువారం ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారిని గుర్తించి వెనక్కు పంపటం ఏ దేశంలోనైనా జరిగేదే. పార్లమెంటులో విదేశాంగమంత్రి జైశంకర్ చెప్పినట్టు అక్రమ వలసదారులను వెళ్లగొట్టడం కొత్తేమీ కాదు. ఏ దేశమూ అలాంటివారిని సమర్థించదు. అక్రమ వలసల్ని ప్రోత్సహించదు. కానీ వెనక్కు పంపే క్రమం మానవీయంగా, నాగరికంగా ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. చట్టబద్ధంగానో, చట్టవిరుద్ధంగానో తమ భాష, తమ ప్రాంతం కానివారు ప్రవేశిస్తే సహజంగానే స్థానికుల్లో అనేక సంశయాలు కలుగుతాయి. తెలియని భయాందోళనలుంటాయి. ప్రభుత్వాలకుండే ఇతరేతర అనుమానాలు సరేసరి. అమెరికాలో రిపబ్లికన్ల ఏలుబడివున్నా, డెమాక్రాట్ల ప్రభుత్వం నడిచినా అక్రమ వలసదారులను కనికరించింది లేదు. కాకపోతే ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో దాన్నొక బూచిగా చూపారు. శ్వేతజాతీయులు ఎదుర్కొంటున్న సకల సమస్యలకూ మూలం వలసదారులేనన్న భ్రమ కలగజేయటంలో, వారికి డెమాక్రటిక్ పార్టీ మద్దతునిస్తున్నదని నమ్మించడంలో విజయం సాధించారు. తాను అధికారంలోకొచ్చాక అలాంటి వారందరినీ గుర్తించి పంపేస్తానని పదే పదే చెప్పారు. ఆ ప్రచారం ఆయనకు గణనీయంగా వోట్లు రాల్చింది. కానీ తమది ప్రపంచంలోనే పురాతన ప్రజా స్వామ్య వ్యవస్థ అని స్వోత్కర్షకు పోయే దేశం వలసదారులను పశువులకన్నా హీనంగా పరిగణించటం, వారి కనీస మానవహక్కులను బేఖాతరు చేయటం సబబేనా? వలసదారులు తిరుగుబాటు చేయడానికి రాలేదు. వారి దగ్గర మారణాయుధాలుండవు. ఏజెంట్లను నమ్మి, వారికి లక్షలకు లక్షలు అర్పించుకుని నిజంగా అమెరికా చాన్సు వచ్చిందేమోనన్న భ్రమలో కొందరు నిర్భాగ్యులు విమానం ఎక్కుతారు. వారిని ఇటలీ, బ్రెజిల్, మెక్సికో, పెరూవంటి దేశాల్లో దించి ‘మీ చావు మీరు చావండ’ని గాలికొదిలేస్తారు. తమ దగ్గరున్న కాగితాలు నిజమైన వేనన్న భ్రమలో ఉన్న వలసదారులకు అప్పుడిక ఏం చేయాలో పాలుపోదు. చివరకు దేవుడిపై భారంవేసి ముందుకు పోవటానికే నిర్ణయించుకుని కొండలూ, గుట్టలూ, నదులూ దాటుకుంటూ తిండీతిప్పలూ లేక నీరసించి అమెరికా సరిహద్దులకు చేరుకుంటారు. అదృష్టం ఉంటే అక్కడి భద్రతా బలగాల కళ్లుగప్పి ఆ దేశంలోకి ప్రవేశిస్తారు. లేదా దొరికిపోయి జైళ్లపాలవుతారు. భ్రమ లన్నీ అడుగంటి, అక్కడ ఉండలేక, వెనక్కొచ్చే దారి దొరక్క జైళ్లలో మగ్గుతారు. సవ్యంగా పంపితే ‘బతుకు జీవుడా’ అనుకుంటూ అక్కడినుంచి నిష్క్రమించటానికే అత్యధికులు సిద్ధంగా ఉంటారు. అలాంటివారిపైనా ట్రంప్ ప్రతాపం! అప్పుడెప్పుడో వియత్నాం మొదలుకొని వర్తమానంలో గాజా వరకూ అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేర్వేరు దేశాల్లో సాగించిన అకృత్యాల మాటేమిటి? వాటికి పడాల్సిన శిక్షేమిటి? ఏనాడైనా ఆత్మసమీక్ష చేసుకుందా? ఎడ్వర్డ్ స్నోడెన్, చెల్సియా మానింగ్ వంటివారు బట్టబయలు చేసిన రహస్య పత్రాలను ఒకసారి అమెరికా చదువుకుంటే మంచిది. అక్రమ వలసదారులను సమర్థించాలని ఎవరూ చెప్పరు. కానీ అమెరికా వ్యవహరించిన తీరును మన ప్రభుత్వం ఖండించాల్సిన అవసరం లేదా? గతంలో యూపీఏ హయాంలో అమెరి కాలో మన దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై వచ్చిన ఆరోపణలు ఆసరా చేసుకుని ఆమెకు సంకెళ్లు వేసి, వివస్త్రను చేసి తనిఖీ చేసినప్పుడు మన ప్రభుత్వం అప్పటి అమెరికా రాయబారి నాన్సీ పావెల్ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. భారత్లో పర్యటిస్తున్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల్ని కలుసుకునేందుకు మన నాయకులు నిరాకరించారు. అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందికిచ్చే అనేక రాయితీలనూ, సౌకర్యాలనూ ఉపసంహరించారు. దౌత్యరంగంలో రెండు దేశాల మధ్యా విడ దీయరాని అనుబంధం ఉండి వుండొచ్చు. అది మనకు మిత్ర దేశమే కావొచ్చు. వలస దారులను సవ్యంగా పంపి వుంటే సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు. కానీ జరిగింది అందుకు భిన్నం. ఈ విషయమై పార్లమెంటులో వ్యక్తమైన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. తప్పును తప్పని చెప్పితీరాలి. వలసదారుల విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పే అంతర్జాతీయ ఒడంబడిక లున్నాయి. అగ్రరాజ్యమైనంత మాత్రాన వాటిని బేఖాతరు చేస్తానంటే కుదరదు. మున్ముందు ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోకూడదనుకుంటే మన నిరసనను తెలియజేయటమే ఉత్తమం. -
చెదిరిన డాలర్ డ్రీమ్స్
అక్రమ వలసల్ని సహించేది లేదనీ, అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి వెనక్కి పంపేవరకు నిద్రపోయేది లేదనీ చెబుతూ వస్తున్న అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చేతల్లోకి దిగారు. సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో ఉంటున్న భారత్కు చెందిన అక్రమ వలసదారుల్లో కొందరిని తొలి విడతగా వెనక్కి పంపేశారు. అమెరికాలోని టెక్సాస్లో శాన్ ఆంటోనియో నుంచి బయలు అమెరికన్ యుద్ధవిమానం బుధవారం మధ్యాహ్నం మన అమృత్సర్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో కొత్త అంకం ఆరంభమైంది. ఆ ఖరీదైన సీ–17 అమెరికా యుద్ధ విమానం నుంచి 104 మంది భారతీయ అక్రమ వలసదారులు వెనక్కి వచ్చినట్టు కథనం. వచ్చిన వారి పత్రాలనూ పరిశీలించి, ప్రాథమికంగా ప్రశ్నించి, వైద్యపరీక్షలు సైతం చేసి, ఎలాంటి నేర చరిత్రా లేదని నిర్ధరించుకున్నాక వారిని స్వరాష్ట్రాలకు పంపే పనిలో భారత పాలనా యంత్రాంగం నిమగ్నమైంది. గడచిన బైడెన్ హయాంలో 2024లో అమెరికాతో మన సంబంధాలు కొంత అడుగంటాక, తాజా ట్రంప్ ఏలుబడిలో వాటిని మళ్ళీ బలోపేతం చేసుకోవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ అక్రమ వలసల అంశం కొంత చీకాకు పరిచేదే అయినా, అనివార్యతల్ని గ్రహించి, సహనంతో సమస్యల్ని చక్కదిద్దుకోవడమే భారత్ ముందున్న మార్గం. పత్రాలు లేకుండా ఉంటున్నవారిని సహించేది లేదని హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్ జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాంటివారిని ఏరి ఏరి మరీ భారత్కు వెనక్కు పంపడం ఇది తొలిసారి. గతంలో, గ్వాటెమలా, పెరూ, హాండూరస్ల నుంచి చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిని తిరుగు టపాలో పంపేందుకు అమెరికా సైనిక విమానాన్ని వినియోగించింది. ఇప్పుడు మన విషయంలోనూ అదే చేసింది. వెనక్కి పంపేందుకు సిద్ధం చేసిన 15 లక్షల మంది జాబితాలో భారతీయులు 18 వేల మంది దాకా ఉన్నారట. అంటే, రానున్న నెలల్లో ఇలాంటి మరిన్ని విమానాల్లో వందల సంఖ్యలో మనవాళ్ళు వెనక్కి రానున్నారన్నది చేదు నిజం. అంటే, ఎంత స్నేహమున్నా అసలు సంగతికొచ్చే సరికి అగ్ర రాజ్యాధినేత భారత్తోనూ ముక్కుసూటిగానే ఉంటారన్నది సుస్పష్టం. నిజానికి, మెక్సికో, ఎల్సాల్వడార్ల తర్వాత అమెరికాలో అక్రమ వలసదారుల్లో అధిక సంఖ్యాకులు భారతీయులే. అక్కడ అలాంటి భారతీయుల సంఖ్య దాదాపు 7.25 లక్షలని ఓ లెక్క. తాజాగా వెనక్కివచ్చినవారిలో పంజాబ్ (30 మంది), హరియాణా (33), గుజరాత్ (33), తదితర రాష్ట్రాల వారున్నారు. వీరిలో పిల్లలు, మహిళలు కూడా ఉండడం గమనార్హం. ఆ మాటకొస్తే, అమె రికా ఇలా అక్రమ వలసదారులైన భారతీయుల్ని వెనక్కిపంపడం కొత్తేమీ కాదు. గత అక్టోబర్లోనూ వంద మంది పంజాబ్కు తిరిగొచ్చారు. 2023 అక్టోబర్ నుంచి నిరుడు సెప్టెంబర్ ఆఖరు వరకు మొత్తం 1100 మంది ఇలా ఇంటి ముఖం పట్టినవారే! అగ్రరాజ్యాన్ని కలలస్వర్గంగా ఊహించుకుంటూ, అక్కడ జీవనం బాగుంటుందనే ఆశతో, డాలర్ల సంపాదనపై ఆకర్షణతో అక్కడకు సక్రమంగానో, అవసరమైతే అక్రమంగానో వెళ్ళి, స్థిరపడాలనే ధోరణి చాలాకాలంగా ఉన్నదే. ఒక లెక్క ప్రకారం ప్రపంచపు పెద్దన్న పంచన చట్టప్రకారమే దాదాపు 50 లక్షల మంది భారత జాతీయు లున్నారంటే మన అమెరికా మోజు ఎంతో అర్థం చేసుకోవచ్చు. దీర్ఘకాలంగా మన భారతీయుల్లో అంతకంతకూ అధికమవుతూ వచ్చిన ఆ మోజు ఫలితమే – అధికసంఖ్యలోని అక్రమ వలసలు. ముఖ్యంగా, పంజాబ్ లాంటి ప్రాంతాల నుంచి అలా వెళ్ళేవారు మరీ ఎక్కువ. స్థానిక పంజాబీ జాతీయంలో చెప్పాలంటే ‘డాంకీ రూట్స్’లో (వాహనాలు మారుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతూ) అమెరికా చేరుకుంటారు. విదేశాల్లో బతుకు తెరువుకై తపిస్తున్న వ్యక్తుల ఆశల్ని సొమ్ము చేసుకుంటూ, ట్రావెల్ ఏజెన్సీలు భారీగా లక్షల్లో డబ్బు గుంజి, దొంగ వీసాలతో వారిని ఇలా దేశాల హద్దుల్ని దాటిస్తుంటాయి. సగటున ఏటా 90 వేల పైచిలుకు భారతీయులు ఇలా అక్రమంగా అమెరికాలో ప్రవేశించబోయి, పట్టుబడుతున్నారు. తల తాకట్టుపెట్టి, సరైన పత్రాలు లేకుండానే అందరి కళ్ళుగప్పి అలా హద్దులు దాటి వెళ్ళిన పలువురికి ఇప్పుడు కల చెదిరింది. ట్రంప్ రాకతో వారి కథ మారింది. చాలామందికి కన్నీరే మిగిలింది. తగిన పత్రాలు లేకుండా అమెరికాలోనే కాదు, ఏ దేశంలోనైనా ఏ జాతీయులు నివసించినా అది తప్పే. శిక్షార్హమైన నేరమే. ఇంతకాలం చూసీచూడనట్టు చెల్లిపోయినా, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానంటూ ఇప్పుడు రెండోసారి పగ్గాలు చేపట్టిన ట్రంప్ ఖడ్గప్రహారం చేయడాన్ని తప్పుపట్టలేం. అందుకే, బాధితులు భారతీయులైనా మన దేశం మారుమాట్లాడ లేకపోతోంది. ఆ మాటకొస్తే, వ్యవస్థీకృత నేరాలకు దారి తీస్తున్నట్లు భావిస్తున్న అక్రమ వలసలకు భారత్ వ్యతిరేక మని మన విదేశాంగ శాఖ నొక్కి వక్కాణించాల్సి వచ్చింది. అదే సమయంలో భారతీయుల పునరా గమనానికి వీలు కల్పిస్తామనీ చెప్పాల్సి వచ్చింది. వాణిజ్య సుంకాల విధింపు సహా అనేక విష యాల్లో ట్రంప్ దూకుడు మీదున్న తరుణంలో అమెరికాతో దీర్ఘకాలిక స్నేహసంబంధాలకు ఇబ్బంది కలగకుండా మన దేశం ఆచితూచి వ్యవహరించక తప్పదు. ఆ కోణం నుంచి చూసినప్పుడు భారత్ వైఖరి సమంజసమే కాదు సహజం కూడా! అయితే, ఈ అక్రమ వలసల్ని ఆపాలంటే, అమాయకుల ఆశను సొమ్ము చేసుకొనే అక్రమార్కుల పనిపట్టాలి. అంతకన్నా ముఖ్యంగా, ఆశల పల్లకీలో అగ్రరాజ్యం వైపు ఉరికే మనవాళ్ళకు గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగావకాశాలిక్కడే కల్పించడంపై పాలకులు దృష్టిపెట్టాలి. చిత్తశుద్ధితో అది చేయనంతకాలం ఈ డాలర్డ్రీవ్స్ు కథలు కంచికి చేరవు! -
ఆసక్తి రేపుతున్న అగ్నిపరీక్ష
దేశ రాజధాని ప్రాంతం ఎన్నికల సమరానికి సిద్ధమైంది. నేడు జరగనున్న ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఉత్కంఠ ఇంత చలిలోనూ వేడి పుట్టిస్తోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోటీలో 70 స్థానాల్లోని 699 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.56 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ సమరమిది. సోమవారం సాయంత్రం గడువు ముగిసేవరకు హోరాహోరీగా సాగిన ప్రచారంలో పార్టీల పరస్పర నిందారోపణలు పతాక స్థాయికి చేరాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశి తమ పాలన నమూనాను ఆదర్శంగా చూపితే, ఆ పాలనంతా అవినీతిమయమంటూ, అగ్రేసర కమలనాథులు మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు శాంతి భద్రతల సమస్యను సైతం లేవనెత్తారు. గత రెండు ఢిల్లీ ఎన్నికల్లో కనీసం ఖాతా అయినా తెరవలేకపోయిన కాంగ్రెస్ పక్షాన రాహుల్, ప్రియాంకలు మిగతా రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారిక నివాసాలకు ఆప్ ప్రజాధన దుర్వినియోగం, యమునా నది నీటి నాణ్యత, ఓటర్ల జాబితాలో అవకతవకల ఆరోపణలు పతాకశీర్షికలకు ఎక్కితే, ప్రతి పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన ఉచిత కానుకలు ప్రజాకర్షణకు పోటీలు పడ్డాయి. నేటి ఓటింగ్, శనివారం నాటి కౌంటింగ్లతో కానీ రానున్న రోజులకు కానున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరో తేలనుంది. ఏకోన్ముఖంగా సాగిన గడచిన 2015, 2020 నాటి ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఉత్కంఠభరిత పోరాటం సాగనుంది. ముచ్చటగా మూడోసారి ఆప్ విజయం నల్లేరుపై బండి నడక కాదని కేజ్రీవాల్కూ తెలుసు. అయితే, ప్రస్తుతం ఎక్సైజ్ పాలసీతో అనుచిత లబ్ధి కేసులో బెయిల్పై ఉన్న కేజ్రీ వాల్ ఇప్పటికీ కాషాయ పార్టీకి బలమైన ప్రత్యర్థే. చిత్రమేమిటంటే... ఓటర్లను కుదిపేస్తాయనుకున్న అనేక అంశాలు క్షేత్రస్థాయిలో ఏమంత ప్రభావం చూపడం లేదట. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా సహా పలువురు ‘ఆప్’ అగ్ర నేతల్ని జైలుకు పంపిన ఎక్సైజ్ కుంభకోణం కానీ, ప్రజాధన దుర్వినియోగంతో కేజ్రీవాల్ ఆర్భాటంగా ‘శీష్ మహల్’ కట్టుకున్నారన్న ఆరోపణలు కానీ ఓటరుల్ని పెద్దగా ఆకర్షించడం లేదని వార్త. కూటి కోసం, కూలీ కోసం దేశ రాజధానికి వచ్చి కష్టాలు పడుతున్న బడుగు వర్గాలు కాస్తంత ఊపిరి పీల్చుకొనేందుకు ఎంతో కొంత చేయడంలో ఆప్ సఫలమైంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఉచిత మంచినీరు, ఉచిత ఆస్పత్రి – వైద్యం లాంటి ప్రభుత్వ సౌకర్యాలు అన్నీ అందరికీ సక్రమంగా అందకున్నా, ఎంతో కొంత లబ్ధి చేకూరడంతో ఆ వర్గాల్లో పార్టీ కొంత బలంగా ఉందని ఓ విశ్లేషణ. అదే సమయంలో ‘ఇండియా’ కూటమిలోని ఆప్, కాంగ్రెస్లు ఢిల్లీలో పరస్పరం అస్త్రాలు సంధించుకోవడం చిత్రమైన స్థితి. 2024 హరియాణా ఎన్నికల్లో తమ మధ్య పోరు చివరకు బీజేపీకి లాభించిన చేదు నిజం నుంచి ఈ భాగస్వామ్య పక్షాలు పాఠం నేర్చుకున్నట్టు లేదు. గతంలో ఏకధాటిగా 15 ఏళ్ళు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. పోగొట్టుకున్న ఇమేజ్ను కూడగట్టుకొనేందుకు హస్తం పార్టీ తంటాలు పడుతోంది కానీ, పరిస్థితి ‘అప్ప ఆరాటమే కానీ... బావ బతికే మార్గం లేదు’ అన్నట్టుంది. గమ్మత్తేమిటంటే, దశాబ్దిన్నర క్రితం కాంగ్రెస్పై కోపంతో మార్పు కోరిన మధ్యతరగతి జనాభా సైతం ప్రస్తుతం ఆప్ ఉచిత హామీలు, అంతంత మాత్రపు అభివృద్ధితో కినిసినప్పటికీ మళ్ళీ మార్పు కావాలనీ, మళ్ళీ కాంగ్రెస్ రావాలనీ కోరుకోవట్లేదు. వెరసి, పోటీ అంతా బలమైన ఆప్కీ, బీజేపీకీ మధ్యనే! హరియాణాలోని బీజేపీ సర్కార్ ఢిల్లీకి వచ్చే యమునా జలాల్ని విషతుల్యం చేస్తోందన్న కేజ్రీవాల్ బాధ్యతారహిత ఆరోపణ ఎన్నికల సంఘం (ఈసీ) తాఖీదుకు దారి తీసినా, వివరణతో ఆయన దాన్ని అధిగమించారు. బీజేపీని ఆత్మరక్షణ ధోరణిలో పడేసి, ఆరోపణలకు జవాబివ్వడంలోనే ఆ పార్టీకి పుణ్యకాలం గడిచిపోయేలా చేశారు.స్థానిక ఢిల్లీ పీఠంపై ఆప్ 11 ఏళ్ళు గడపడంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజం. అదే సమయంలో కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టినప్పటికీ, 27 ఏళ్ళుగా ఢిల్లీ అసెంబ్లీపై జెండా ఎగరేయలేకపోయిన బీజేపీ ఈసారి చరిత్ర తిరగరాయాలని బలంగా సంకల్పించింది. దిగువ శ్రేణి జనం ఆప్కు అండగా నిలబడితే, ఆదాయపు నిచ్చెనలో పైకి పోయినకొద్దీ అవకాశాలను అందుకుంటున్న ప్రజానీకం మాత్రం మోదీ మార్కు బీజేపీ అభివృద్ధి మాటల వైపు మొగ్గుతున్నారు. ఈ సంకుల సమరంలో బీజేపీ సైతం ఓటర్ల కోసం ఉచితాల బాట తొక్కక తప్పలేదు. పనిలోపనిగా ఇంతకాలంగా భారం మోస్తున్న మధ్య తరగతి వర్గానికి తాజా కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్ను నుంచి భారీ ఊరట అందించింది. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఢిల్లీకి ప్రత్యేకించే ఏదీ చేయరాదంటూ నెల క్రితం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) హూంకరించినా, జరిగింది వేరు. పన్ను మినహాయింపు ‘ఢిల్లీకి మోదీ సర్కార్ కానుక’ అంటూ పత్రికల్లో మొదటి పేజీలో బీజేపీ భారీ ప్రకటనలు గుప్పించినా ఈసీ కిమ్మనలేదు. గత పదేళ్ళలో అధికారాలతో బలోపేతుడైన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, ఓటర్ల జాబితాల్లో గోల్మాల్ ఆరోపణలు సహా అనేక అంశాల్లో ఇప్పుడు ఈసీ కానీ నిష్పక్షపాతంగా ఉన్నట్టు నమ్మించలేకపోయారు. ఈ నెలలోనే రిటైర్ కానున్న సీఈసీపై ఆప్ ఆరోపణల నేపథ్యంలో ఈసీ వివరణనిచ్చుకోవాల్సి వచ్చిన దుఃస్థితి. ఆరోపణలు, అనుమా నాల నేపథ్యంలో ‘ఢిల్లీలో కేజ్రీవాల్... కేంద్రంలో మోదీ’ అన్న మాట మారిపోయే అవకాశమూ లేక పోలేదు. అందువల్లే, ఈసారి ఢిల్లీ ఎన్నికలు ఆప్కు అగ్నిపరీక్షయ్యాయి. ఈ ఏటి బిహార్ ఎన్నికలపై, వచ్చే ఏటి బెంగాల్ ఎన్నికలపైనా ఈ ఫలితాల ప్రభావం తధ్యం గనక ఆసక్తి రేపుతున్నాయి. -
అగ్రరాజ్యపు వాణిజ్య యుద్ధం
అగ్రరాజ్యం కొత్త యుద్ధానికి తెర తీసింది. అయితే, ఇది ఆయుధాలతో కూడిన యుద్ధం కాదు... ఆర్థికపరమైన యుద్ధం. అధ్యక్షుడు ట్రంప్ తన అత్యవసర అధికారాలను ఉపయోగిస్తూ... కెనడా, మెక్సికోల నుంచి దిగుమతులపై 25 శాతం మేర, అలాగే చైనా నుంచి దిగుమతులపై ఇప్పటికే ఉన్న భారానికి అదనంగా మరో 10 శాతం మేర సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కెనడా నుంచి దిగుమతి చేసుకొనే చమురు, సహజ వాయువుపై మాత్రం 10 శాతం వడ్డింపుతో సరి పెట్టారు. ఇది అమెరికాకూ, దాని అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు మూడింటికీ మధ్య వాణిజ్య యుద్ధాల శకానికి శ్రీకారం చుట్టింది. చైనాను పక్కనబెట్టినా, సాక్షాత్తూ పొరుగుదేశాలపైనే ట్రంప్ ఇలా ఆర్థికంగా కత్తి దూయడం విడ్డూరమే. అదేమంటే... పెరుగుతున్న నేరాలనూ, డ్రగ్స్ సరఫరానూ అడ్డుకోవడానికే ఈ చర్య అంటూ సమర్థించుకోవడం మరీ విచిత్రం. ఈ సంచలనాత్మక చర్యకు ప్రతిచర్యగా మెక్సికో సైతం ఎదురు సుంకాలు వేయగా, త్వరలో జాతీయ ఎన్నికలున్న కెనడా కూడా అమెరికాకు దీటుగా 25 శాతం సుంకాల వడ్డింపుతో ఎదురుదాడికి దిగింది. అమెరికా తప్పుడు విధానాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు వేయనున్నట్టు చైనా ప్రకటించింది. కడపటి వార్తలు అందుతున్న సమయానికి అమెరికా – మెక్సికోల మధ్య మాత్రం సయోధ్య కుదురుతోందనీ, ఆ దేశంపై సుంకాలను అమెరికా నెల రోజులు వాయిదా వేసిందనీ సమాచారం. ఆ మాట ఏమైనా, విశ్వవేదికపై ట్రంప్ ఆరంభించిన వాణిజ్య పోరు రసకందాయంలో పడింది. ఇప్పటికే పరాయి దేశాలకు 36 లక్షల కోట్ల డాలర్ల మేర అప్పులున్న అగ్రరాజ్యం వాటి నుంచి బయటపడేందుకు సుంకాలు పెంచినట్టనిపిస్తున్నా, ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు స్వయంకృత గాయమే. పెరిగిన సుంకాలతో అమెరికాకు సరఫరా తగ్గి, సరుకుల ధరలు పెరిగి, సామాన్యులపై భారం పడుతుంది. ఈ సుంకాల వల్ల ఈ ఏడాది అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పు డున్న 2.9 శాతం నుంచి మరో అర శాతం దాకా పెరుగుతుందట. ఇక, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 1.5 శాతం మేర పడిపోతుందని విశ్లేషణ. సగటు అమెరికన్ కుటుంబంపై ఏటా వెయ్యి నుంచి 1200 డాలర్ల మేర భారం పడుతుందని లెక్క. మొత్తం మీద అక్రమ వలసలు, ఫెంటానిల్ తరహా మందుల లాంటి ప్రధాన సమస్యలపై ట్రంప్ దృష్టి పెట్టడం బానే ఉన్నా, దిగుమతి సుంకాలు పెంచడమనే తప్పుడు విధానం వల్ల అమెరికన్లకే నష్టమనే భావన ఉంది. సరుకుల ధరలు తగ్గిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తీరా అందుకు వ్యతిరిక్తంగా వ్యవహరిస్తున్నా రని ప్రతిపక్ష డెమోక్రాట్లు ధ్వజమెత్తుతున్నారు. గత ట్రంప్ హయాంలోని చైనాతో వాణిజ్య యుద్ధాన్నే తమ పాలనలో కొనసాగించిన డెమోక్రాట్లు ఇప్పుడు భిన్న వైఖరి తీసుకుంటారేమో చూడాలి. ప్రధాన ఆర్థిక వ్యవస్థలపై ఇంతగా సుంకాల విధింపు ఆలోచనను దశాబ్దం క్రితం చేస్తే దాన్ని వెర్రిమొర్రి ఆలోచనగా చూసేవారు. కానీ, ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఆ పనే చేసింది. మెక్సికో, కెనడా, చైనాలతో ఇది ఆగుతుందా, లేక రానున్న రోజుల్లో యూరోపియన్ యూనియన్, భారత్ సహా ఇతర దేశాలపైనా ట్రంప్ ఈ అస్త్రం ప్రయోగిస్తారేమో చూడాలి. నిజానికి, వలసలను ఆపి, అధిక దిగుమతులకు ముకుతాడు వేయాలంటే, తగినంత సమయం వెచ్చించి, విధానపరమైన అంశాలపై లోతుగా దృష్టి పెట్టాలి. వలసజీవుల్ని పెద్దయెత్తున వెనక్కి పంపడంతో అమెరికాలో చౌకగా దొరికే శ్రామికులు తగ్గి, వేతనాలు పెరిగి, ద్రవ్యోల్బణం హెచ్చుతుంది. కానీ, ఎవరు చెప్పినా ఒక పట్టాన వినే ఘటం కాని ట్రంప్ సమస్త వాణిజ్య, ఆర్థికేతర సమస్యలకూ ఈ సుంకాల విధింపే సర్వరోగ నివారిణి అని భావిస్తున్నారు. చమురు మొదలు సరుకుల దాకా ఏవీ పొరుగుదేశాల నుంచి అమెరికాకు అక్కర్లేదని హూంకరిస్తున్నారు కానీ, దిగుమతులేవీ చేసుకోకుండా, సమస్తం స్వదేశంలోనే సిద్ధం చేసుకొని, ఎవరితోనూ ఏ వాణిజ్య సంబంధాలూ అవసరం లేని బంధిత ఆర్థిక వ్యవస్థగా అమెరికాను తీర్చిదిద్దడం సాధ్యమేనా? దేశాల ద్వారాలన్నీ తెరుచుకొని, ప్రపంచమొక కుగ్రామంగా మారిన వర్తమాన కాలంలో ఈ రకమైన విధానంతో మనగలగడం అగ్రరాజ్యానికైనా సరే కుదురుతుందా?ట్రంప్ తాజా చర్యతో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి, గందరగోళం నెలకొన్నాయి. ప్రపంచమంతటా దీని ప్రకంపనలూ తప్పవు. భారత్ అనేక విడిభాగాల కోసం దిగుమతులపై ఆధారపడినందున మన వస్తూత్పత్తి రంగం పైన, అలాగే డాలర్ బలపడి, విదేశీ మదుపరులు విక్రయాల్ని కొనసాగించడంతో మార్కెట్ పైన ప్రభావం కనిపించనుంది. అలాగే, అమెరికా భారీ సుంకాల బారిన పడ్డ ఆర్థిక వ్యవస్థలు ఇక తమ వస్తువుల్ని ఇతర దేశాల్లో కుమ్మరించాలి గనక భారత పరిశ్రమలకు బెత్తం చూపే ప్రమాదం ఉంది. కాబట్టి, ఇప్పటికైతే సుంకాల విధింపు జాబితాలో మన పేరు లేకున్నా భారత్ తగిన జాగరూకతతో వ్యవహరించాలి. ఈ నెలలోనే అమెరికాలో పర్యటించ నున్న భారత ప్రధాని ఇరుదేశాల బలమైన బంధాన్ని మనకు సానుకూలంగా మలుచుకోవాలి. అయితే, ఒకటి మాత్రం నిజం. కోర్టులు బరిలోకి దిగి, ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధమని తీర్మానిస్తే తప్ప... ప్రజాభిమతంతో గద్దెనెక్కిన ట్రంప్ ఆలోచనలకూ, అనుసరించే విధానాలకూ అడ్డులేదు. కనుక ట్రంప్ మార్కు వ్యవహారశైలికి ఇవాళ్టికి ఇవాళ బ్రేకులు పడవు. అదేసమయంలో దిగుమతి సుంకాల వల్ల అమెరికా సంపద్వంతమై, బలోపేతమవుతుందన్న ఆయన ఆలోచన మాత్రం ఆచరణలో వాస్తవరూపు దాల్చడమూ కష్టమే! -
దేవభూమి
గతేడాది డిసెంబర్ 25న మరణించిన మలయాళ మహారచయిత ఎమ్.టి.వాసుదేవన్ నాయర్ తన సాహిత్య జీవితంలో తనను బాగా కదిలించిన ఒక అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన 1976లో తీవ్రమైన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడో పల్లెటూరతను వచ్చి, ఆయనంటే అభిమానమని చెప్పడమే కాదు, ‘మీరు జబ్బుతో ఉన్నారని తెలిసి సేవ చేయడానికి వచ్చాను. కొన్ని పనులు మగ నర్సులే చేయాల్సి ఉంటుంది. మీకు నయమయే దాకా ఆ పనులు చేస్తాను’ అన్నాడట. మనిషి మానసిక ఘర్షణల మీద ఎక్కువ దృష్టి పెట్టిన ఎమ్టీ విస్తారంగా రాశారు. కథలు, నవలలు, యాత్రా రచనలు, బాల సాహిత్యం, విమర్శతో పాటు సినిమాలకు స్క్రీన్ ప్లే రచనలు చేయడమే కాకుండా, అత్యుత్తమ చిత్రాలు అనదగ్గవాటికి దర్శకత్వమూ వహించారు. కేరళ సంస్కృతి మీద ఆయన ప్రభావం ఎనలేనిది. ఆ పల్లెటూరి మనిషి ఎమ్టీ రచనలు చదవడమే కాదు, ఆయన కోసం తన వ్యవసాయ పనులను ఆపుకొని మరీ వచ్చాడు. ఏ రచయితకైనా తన రచనా ప్రయాణంలోని కష్టాల బరువు దిగిపోయే ఘట్టమిది. సహజంగానే ఆ స్పందనకు వాసుదేవన్ నాయర్ కళ్లు చెమ్మగిల్లాయి. ఇది ఒక గొప్ప రచయితగా వాసుదేవన్ నాయర్కు జరిగిన ఒక విడి అనుభవమే కావొచ్చు; కానీ మలయాళీయుల సాహిత్య సంపన్నతకు అది గుర్తు. పామరులను కూడా సాహిత్యం ఎలా పెనవేసుకుపోయిందో చెప్పడానికి నిదర్శనం. ఎందుకంటే, ఇదే వాసుదేవన్ నాయర్ మరో సందర్భంలో ఒక గ్రామీణుడు ఆయన దగ్గర ఉచితంగా పుస్తకం తీసుకోవడానికి నిరాకరించి, అతడి దగ్గరున్న ముడుతలు పడిన నోట్లు బలవంతంగా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ నేల అలాంటిది. దోస్తోవ్స్కీ లాంటి రష్యన్ రచయిత మీద కూడా ఒక సాధారణ ఆటోడ్రైవర్ తనదైన అభిప్రాయాన్ని కలిగివుంటాడని మురిసిపోయే మలయాళీ సాహిత్యజీవులు ఎందరో! ‘స్వర్గాన్ని నేను ఎప్పుడూ ఒక రకమైన గ్రంథాలయంలా ఊహిస్తాను,’ అంటారు అర్జెంటీనా రచయిత జార్జ్ లూయీ బోర్హెస్. పుస్తకాలను మించిన పెన్నిధి ఏముంది! గ్రంథాలయం అనేది ఒక ఆశ. ఒక దారిదీపం. ఎమ్టీ సహా చాలామంది రచయితలు తాము రచయితలు కావడానికి ఒక కారణంగా ‘ఎక్కువ సమయం లైబ్రరీలో గడపడం’ అని చెబుతారు. అత్యంత ప్రకృతి రమణీయత వల్ల కాబోలు కేరళను దేవభూమి అని పిలుస్తుంటారు. కానీ అక్కడి గ్రంథాలయాల వల్ల కూడా అది దేవభూమి అవుతోంది. రాష్ట్రంలో ఎనిమిది వేలకు పైగా లైబ్రరీలు ఉండటమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ముప్పైకి పైగా పెద్ద సాహిత్య ఉత్సవాలు జరుగుతుంటాయి. దేశంలో ప్రతి పంచాయితీలో దాదాపు ఎనిమిది గ్రంథాలయాలున్న ఏకైక రాష్ట్రం కేరళ. దేశంలో అత్యధిక పబ్లిక్ లైబ్రరీలున్న రాష్ట్రం మహారాష్ట్ర (12,191). తర్వాతి స్థానంలో ఉన్న కేరళ (8,415)తో పోల్చితే మహారాష్ట్ర విస్తీర్ణం సుమారు ఎనిమిదింతలని గ్రహిస్తే కేరళ గొప్పదనం అర్థమవుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా కూడా కేరళ సంఖ్యలో నాలుగో వంతైనా లేవు. అక్కడి గిరిజన గ్రామాల్లోనూ కొత్తగా 630 గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలని గతేడాది నిర్ణయించారు. కేరళ గ్రంథాలయోద్యమ పితామహుడు పీ.ఎం.పణిక్కర్ వర్ధంతి అయిన జూన్ 19ని అక్కడ ‘రీడింగ్ డే’గా జరుపుతుంటారు. చదవడాన్నీ, చదివే వాతావరణాన్నీ మలయాళీయులు ఎంతగా ప్రోత్సహిస్తున్నారనడానికి ఇది రుజువు. ఈమధ్య ‘కేరళ లెజిస్లేచర్ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్–2025’ ప్రారంభిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా తిరువనంతపురంను ‘యునెస్కో’ గుర్తించాలని కోరింది అందుకే. తమ రాజధాని నగరం ఆ గౌరవానికి పూర్తిగా అర్హమైనదేనని ఆయన ధీమా!గతేడాదే ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో కేరళలోని మరో నగరమైన కోళిక్కోడ్ను ‘సాహిత్య నగరం’గా గుర్తించిన సంగతి ఇక్కడ గుర్తుచేసుకోవాలి. భారత్లో యునెస్కో గౌరవం దక్కించుకున్న తొలి నగరం ఇదే. ఒక్క కోళిక్కోడ్లోనే 600 గ్రంథాలయాలు, రీడింగ్ రూములు ఉన్నాయి. వాసుదేవన్ నాయర్, వైకోం మహమ్మద్ బషీర్, పి.వత్సల లాంటి ఎందరో రచయితలకు కోళిక్కోడ్తో అనుబంధం ఉంది. యునెస్కో మొదలైన 1945లోనే కేరళలో ‘సాహిత్య ప్రవర్ధక సహకార సంఘం’ ఏర్పాటుకావడం ఆ రాష్ట్ర ఘన సాహిత్య వారసత్వాన్ని గుర్తుచేస్తోంది. పుస్తకాల ప్రచురణ కోసం కొంతమంది రచయితలు కలిసి ఏర్పాటుచేసిన ఈ సంఘం సుమారు 8,400 పుస్తకాలను ప్రచురించింది. మలయాళ సినిమా అంతగా వర్ధిల్లుతుండటానికి కూడా ఈ సాహిత్య దన్నే కారణం. అందుకే ప్రముఖ సినీ జర్నలిస్ట్ అనుపమా చోప్రా నవతరం మలయాళ దర్శకులను ఇంటర్వ్యూ చేస్తూ, ‘అసలు మీరు ఏంచదువుతారు? ఏం చూస్తారు?’ అని ప్రశ్నించారు.పుస్తక ప్రేమికులుగా వ్యక్తులు ఉండటం దానికదే విశేషమే. కానీ వ్యవస్థలు పుస్తకాన్ని ప్రేమిస్తే దాని ప్రభావం వేరే ఉంటుంది. ‘పర్వతము ఎంత ఎత్తయి గగన భేద్యమయినా దాని విశాలమైన వక్షస్థలము నుండి చిన్న సెలయేరుగాని ప్రవహించకపోతే ఆ ప్రకృతి సౌందర్యం అసమగ్రంగా ఒంటరిగా శుష్కంగా గోచరిస్తుంది, ’ అంటారు తన ‘జీవనలీల’ పుస్తకంలో కాకాసాహెబ్ కాలేల్కర్. ఒక ఇల్లు ఎంత ఘనంగా నిర్మించినా దానిముందు ఒక పూలచెట్టో, ఒక ఊరు ఎంత పెద్దదయినా దాని మధ్యన ఒక గ్రంథాలయమో లేకపోతే అవి అసంపూర్ణం అవుతాయి. పువ్వులు (ప్రకృతి), పుస్తకాలు (వివేకం) ఉన్న ప్రతిచోటూ దేవభూమే! -
వృద్ధి సాధనకు ఊతం ఏదీ?
ప్రపంచవ్యాప్తంగా చాలామేరకు ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నా, ఉపాధి కల్పన మెరుగ్గా కనబడు తున్నా వాణిజ్య వ్యవహారాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దేశాల మధ్య పెరుగుతున్న పోటీ ఒక రకమైన అనిశ్చిత వాతావరణానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్థిక సర్వే విడుదల చేసింది. పరస్పర ఆధారిత వర్తమాన ప్రపంచంలో ఏ దేశమూ సమస్యలనూ, సంక్షో భాలనూ తప్పించుకోలేదు. అలాగే వాటి పరిష్కారానికి సాగే కృషిలో భాగస్వామి కాకుండా ఒంట రిగా దేన్నీ అధిగమించలేదు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే దీన్నంతటినీ ప్రతిబింబించింది. మనది ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ఇతర దేశాలతో పోలిస్తే మనది చురుకైన ఆర్థిక వ్యవస్థే. కానీ ఇటీవలి కాలంలో అది కొంత మంద గమనంతో కదులుతోంది. 2023లో 8.2 శాతంగా ఉన్న వృద్ధి రేటు నిరుడు 6.5 శాతానికి క్షీణించింది. ఇది 2026 వరకూ ఈ స్థాయిలోనే వుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ఈ నెల 17న అంచనా వేసింది. పట్టణ ప్రాంత వినియోగంలో క్షీణత, ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల, వేతన స్తంభన, అంతంతమాత్రంగా ఉన్న ఉపాధి కల్పన, ప్రైవేటు రంగ పెట్టుబడుల మందకొడితనం స్పష్టంగా కనబడుతోంది. ఒక్క కర్ణాటక, మహారాష్ట్రల్లో మాత్రమే వినియోగిత పెరి గింది. ఆంధ్రప్రదేశ్లో అంతక్రితం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మెరుగ్గా ఉన్న వినియో గిత ఎన్డీయే సర్కారు వచ్చాక క్షీణించింది. ‘మొత్తంమీద ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయ’ని సర్వే అంగీకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండగా, అదిప్పుడు 4.9 శాతానికి చేరుకుంది. ఆహారేతర, ఇంధనేతర సరుకుల ధరల తగ్గుదల ఇందుకు కారణం. వాస్తవానికి పంపిణీ మెరుగుకావటం, వాతావరణం అనుకూలించటం వంటి కారణాల వల్ల చాలా దేశాల్లో ఆహార సరుకుల ధరలు తగ్గాయి. మన దేశమూ, చైనా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఇందుకు భిన్నమైన పోకడ కనబడుతోంది. నిరుడు 7.5 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం 8.4 శాతానికి చేరుకుంది. పంపిణీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా కూరగాయలు, పప్పులు వగైరా ధరల్లో పెరుగుదల నమోదవుతున్నదని నిపుణుల అభిప్రాయం. రాగల రోజుల్లో కూరగాయల ధరలు తగ్గుతాయని, ఖరీఫ్ పంటలు మార్కెట్లో అడుగుపెడితే ఇతర ధరలు కూడా సర్దుకుంటాయని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అదంతా ప్రపంచ స్థితిగతులపై ఆధారపడి వుంటుంది. మున్ముందు ప్రపంచ సాగుపంటల ధర వరలు పెరుగుతాయని, వాతావరణ మార్పులు కూడా అనుకూలించకపోవచ్చని అంచనాలు న్నాయి. అదనంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండనే ఉన్నాయి. ఎదగదల్చుకున్నవారికి ఆశావహ దృక్పథం అవసరం. స్వాతంత్య్రం వచ్చి 2047కి వందేళ్లవు తాయి కాబట్టి అప్పటికల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దుకోవాలని ఎన్డీయే సర్కారు కోరుకుంటోంది. కానీ వరసగా రెండు దశాబ్దాలపాటు 8 శాతం నిలకడైన జీడీపీ కొనసాగితేనే ఇది సాధ్యం. ప్రస్తుత జీడీపీలో పెట్టుబడుల వాటా 31 శాతం. దీన్ని కనీసం 35 శాతానికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా తయారీరంగం వృద్ధి చెందాలి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బయోటెక్నాలజీరంగాల్లో విస్తరిస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ‘వికసిత్ భారత్’ సాకారమవుతుంది. అందుకు భూసంస్కరణలు, కార్మికరంగ సంస్కరణలు అత్యవసరం అంటు న్నది ఆర్థిక సర్వే. కానీ కార్మిక రంగ సంస్కరణలను ట్రేడ్ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. బ్రిటిష్ వలస పాలకుల కాలంనుంచి ఇంతవరకూ పోరాడి సాధించుకున్న అనేక హక్కుల్ని లేబర్ కోడ్ హరిస్తున్నదని వాటి ఆరోపణ. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును కష్టతరం చేయటం, ఇప్పటికేవున్న ట్రేడ్ యూనియన్ల గుర్తింపు రద్దుకు వీలు కల్పించటం, సమ్మె హక్కును కాలరాయటం, మధ్యవర్తిత్వ ప్రక్రియకు ప్రతిబంధకాలు ఏర్పర్చటం, లేబర్ కోర్టుల మూసివేత, ట్రిబ్యునల్ ఏర్పాటు వంటివి ఉన్నాయంటున్నారు. వీటిపై కార్మిక సంఘాలతో చర్చించటం, పార దర్శకత పాటించటం, అవసరమైన మార్పులకు సిద్ధపడటం వంటి చర్యలద్వారా అపోహలు తొల గించటానికి కేంద్రం కృషి చేస్తే కార్మిక రంగ సంస్కరణల అమలు సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చటానికి సంస్కరణలు అవసరం అనుకున్నప్పుడు ఇదంతా తప్పనిసరి. వాస్తవాలను గమనంలోకి తీసుకుని జాగురూకతతో అడుగులేయకపోతే లక్ష్యసాధన కష్ట మవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం నిరుడు లిస్టెడ్ కంపెనీల లాభార్జన22.3 శాతం పెరిగింది. చెప్పాలంటే ఆర్థిక, ఇంధన, ఆటోమొబైల్ రంగాల కార్పొరేట్ సంస్థలకు లాభాలు వచ్చిపడ్డాయి. కానీ ఆ రంగాల్లో ఉపాధి కల్పన పెరిగింది లేదు. వేతనాలు స్తంభించాయి. పరిస్థితులిలా వుంటే వినియోగిత పెరుగుతుందా? తగినంత డిమాండ్ లేనప్పుడు తయారీరంగంలో పెట్టుబడుల వృద్ధి సాధ్యమవుతుందా? ఈ వ్యత్యాసాలపై దృష్టి పెట్టనంతకాలమూ ఆర్థిక రంగ స్వస్థత సులభం కాదు. వృద్ధికి ఊతం ఇచ్చేందుకు వీలుగా రుణాల వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వ్బ్యాంకును నిర్మలా సీతారామన్తోపాటు కేంద్ర వాణిజ్యమంత్రి పీయుష్ గోయల్ కూడా కోరుతున్నారు. మంచిదే. తమవంతుగా ఉద్యోగకల్పన, వేతనాల పెంపుపై కూడాకేంద్రం దృష్టి సారించాలి. శనివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అందుకు తగిన ప్రతిపాదనలుంటాయని ఆశిద్దాం. -
శతప్రయోగ విజయసీమ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది. బుధవారం ఉదయం జరిపిన నూరవ రాకెట్ ప్రయోగంతో చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్)లో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి ఎగసిన భూ సమకాలిక ఉపగ్రహ ప్రయోగవాహక నౌక (జీఎస్ఎల్వీ–ఎఫ్15) ఎన్వీఎస్–02 ఉపగ్రహాన్ని విజయ వంతంగా నిర్ణీత కక్ష్య అయిన జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ – జీటీఓలోకి చేర్చింది. ఈ కొత్త ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం నిర్విఘ్నంగా సాగడం శాస్త్రవేత్తల్లో ఆనందం పెంచింది. రోదసిలో చేరిన ఈ తాజా శాటిలైట్తో మన ‘నావిక్’ (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్)లో విధులు నిర్వహిస్తున్న ఉపగ్రహాల సంఖ్య 4 నుంచి 5కు పెరిగింది. దీని వల్ల మన దేశంతో పాటు మన పొరుగు దేశాలకూ మొబైల్ ఫోన్లలో జీపీఎస్ సహా అనేక సేవల్లో కచ్చితత్వం పెరగనుంది. ఇతర దేశాలన్నీ అమెరికా తాలూకు జీపీఎస్పై ఆధారపడితే, భారత్ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్లో సొంత కాళ్ళపై నిలబడేందుకు చేస్తున్న ఈ కృషి సగటు భారతీయుడి ఛాతీ ఉప్పొంగే క్షణం. సైకిళ్ళు, ఎడ్లబండ్లపై రాకెట్ విడిభాగాలను తరలించిన కాలం నుంచి ఇటీవలే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించే (డాకింగ్ చేసే) స్థాయికి ఇస్రో చేరడం చిరకాలం చెప్పుకోవా ల్సిన స్ఫూర్తిగాథ. విక్రమ్ సారాభాయ్, సతీశ్ ధవన్ లాంటి దిగ్గజాల తొలి అడుగులతో ఆరంభించి, ఆపైన కలామ్ లాంటి వారి మేధను వినియోగించుకొని అయిదు దశాబ్దాల పైగా సాగించిన ప్రస్థానం చిరస్మరణీయం. 1962లో అణుశక్తి విభాగం కింద ఏర్పాటైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రిసెర్చ్ ద్వారా ఇస్రోకు బీజం పడింది. చంద్రుడి మీదకు అమెరికా మానవుణ్ణి పంపిన 1969లోనే ఇప్పుడు మనం చూస్తున్న ఇస్రో స్థాపన జరిగింది. 1972లో ప్రత్యేకంగా అంతరిక్ష శాఖ ఏర్పాటైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేక రాకెట్లకు పురుడు పోయడమే కాక, ఇతర దేశాల ఉపగ్రహ ప్రయోగాలలోనూ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగింది. మన ఇస్రో 1979 ఆగస్ట్ 10న తొలిసారిగా ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎస్ఎల్వీ–3 ఈ10) ద్వారా ప్రయోగాత్మకంగా రోహిణీ టెక్నాలజీ పేలోడ్ను నింగిలోకి పంపిన క్షణాలు ఆ తరంలో చాలామందికి ఇప్పటికీ గుర్తే. అప్పట్లో ఇస్రోతో పనిచేస్తున్న అబ్దుల్ కలామే ఆ ప్రయోగానికి డైరెక్టర్. సదరు ప్రయోగం పాక్షికంగానే విజయం సాధించింది కానీ, ఆ తర్వాత కాలగతిలో అంతరిక్ష ప్రయోగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా ఆరితేరాం. అంకెల్లో చెప్పాలంటే, ఇప్పటి వరకు ఇస్రో 548 ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాదాపు 120 టన్నుల పేలోడ్ను నింగిలోకి పంపింది. అందులో 433 విదేశీ ఉపగ్రహాలకు చెందిన 23 టన్నులూ ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో షార్ కేంద్రం ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికైంది. మూడు చంద్రయాన్లు, ఒక మార్స్ ఆర్బిటర్ ప్రయోగం, ఆదిత్య ఎల్1 ప్రయోగం లాంటివి గణనీయమైనవి. కక్ష్యలో పరిభ్రమించే వ్యోమనౌకను భూవాతావరణంలోకి ప్రవేశింపజేసి... భూమి పైకి క్షేమంగా తెచ్చి రికవరీ చేసే ‘స్పేస్ క్యాప్సూల్ రికవరీ ప్రయోగం’ (ఎస్ఆర్ఈ), అలాగే ఒకే రాకెట్తో 104 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం వగైరా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇస్రో ప్రయోగించినవాటిల్లో కమ్యూనికేషన్ శాటిలైట్లు, భూ పరిశీలన ఉపగ్రహాలు, మార్గనిర్దేశక (నావిగేషనల్), ప్రయోగాత్మక శాటిలైట్లు అనేకం. ఆ వివరాలు సగర్వంగా తోస్తాయి. రానున్న రోజుల్లోనూ మరిన్ని చారిత్రక ఘట్టాలకు ఇస్రో చోదకశక్తి కానుంది. గగన్యాన్లో భాగంగా మానవరహిత జి1 ప్రయోగం తొలిసారి చేయనున్నారు. అలాగే, నెక్స్›్ట జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్జీఎల్వీ), చంద్రయాన్, శుక్రయాన్ జరగనున్నాయి. ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగాలకు సైతం వేదికగా నిలిచి, అంతరిక్ష వాణిజ్యంలో తగిన వాటా కోసం ప్రయత్నిస్తున్న ఇస్రో మరో రెండేళ్ళలో శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ను నిర్మించనుండడం విశేషం. అలాగే, తమిళనాడులోని కులశేఖరపట్నంలో రెండో ఉపగ్రహ ప్రయోగ కాంప్లెక్స్ సైతం సిద్ధమవుతోంది. భారీ పేలోడ్ లను రోదసిలోకి తీసుకెళ్ళగలిగే ఎన్జీఎల్వీల రూపకల్పనకూ, మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికీ దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుంది. అంత మొత్తం వెచ్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన, ప్రయోగ రంగానికి ఇది పెద్ద ఊతం. ఇవన్నీ ప్రైవేట్ రంగ రోదసీ ప్రయోగాల్లో ఇస్రో సింహభాగం దక్కించుకోవడానికి ఉపకరిస్తాయి. ఒకప్పుడు అగ్రరాజ్యాలు సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి నిరాకరించినప్పుడు స్వశక్తితో దేశీయంగా బుడిబుడి అడుగులతో మొదలుపెట్టిన భారత్ దాదాపు అయిదు పదుల ఏళ్ళలో శత రోదసీ ప్రయోగాలు సాగించింది. రానున్న అయిదేళ్ళలోనే రెండో శతం పూర్తి చేసి, మొత్తం 200 ప్రయోగాల మైలురాయికి చేరుకోవడానికి ఉరకలు వేస్తోంది. ఇన్నేళ్ళుగా మన అంతరిక్ష పరిశోధ కులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చూపుతున్న అచంచలమైన నిబద్ధత, అంకితభావానికి మచ్చుతునక ఈ ఇస్రో విజయగీతిక. విశ్వవేదికపై అగ్రరాజ్యాల సరసన అంతరిక్షంలో భారత్ సూపర్ పవర్గా ఎదిగిందనడానికీ ఇది ప్రతీక. అనేక ఆర్థిక, సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ సృజనాత్మకంగా ఆలోచించి, పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మలుచుకొంటే గణనీయ విజయాలు సాధ్యమే అనడానికి ఇదే తిరుగులేని రుజువు. 1975లో తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం నుంచి ఆ మధ్య మంగళ్యాన్ వరకు ప్రతిసారీ తక్కువ ఖర్చుతో, అంచనాలకు అందని విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల ఘనతకు భవిష్యత్తులోనూ ఆకాశమే హద్దు. -
డీప్ సీక్ నేర్పుతున్న పాఠం
సాంకేతిక రంగంలో, అందులోనూ కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఇది సరికొత్త విప్లవం. కేవలం 200 మంది ఉద్యోగులతో, కోటి డాలర్లు వెచ్చించి, చైనాకు చెందిన చిన్న స్టార్టప్ కంపెనీ డీప్ సీక్ చేసిన మేజిక్ అగ్రరాజ్యపు బడా సంస్థల్ని సైతం ఆలోచనలో పడేసింది. డీప్ సీక్ ఇటీవల విడుదల చేసిన రెండు ‘స్వేచ్ఛా వినియోగ’ (ఓపెన్ సోర్స్) ఏఐ ప్రోగ్రామ్లు, ఛాట్బోట్లు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, ఈ 27న అప్డేట్ వచ్చిన డీప్ సీక్ గురించే చర్చ. భారత్లోనూ యాపిల్ యాప్ స్టోర్లలో ఛాట్ జీపీటీ, గూగుల్ జెమినీలను దాటేసి, అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్ ఇవాళ ఇదే. ఆర్1, వీ3 అల్గారిథమ్లను తక్కువ ఖర్చుతోనే తీర్చిదిద్దినట్టుగా చెబుతున్న డీప్సీక్ ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యంలో ఛాట్ జీపీటీ, గ్రోక్, క్లాడ్, లామా లాంటి తోటి ప్రత్యర్థుల సరసన పెద్ద గీతగా నిలబడింది. భారీగా పెట్టుబడులు పెడితే తప్ప, ఏఐలో సంచలనాలు సాధ్యం కావన్నది భ్రమ అనీ, ఆలోచన, ఆచరణ ఉంటే అద్భుతాలు అసాధ్యమేమీ కాదనీ నిరూపించింది. ట్రంప్ అధ్యక్షపీఠమెక్కిన వారం రోజులకే అమెరికా ఆభిజాత్యానికి డీప్ సీక్ దెబ్బకొట్టినట్టయింది. ఆగ్నేయ చైనాలోని హాంగ్జౌకు చెందిన అనామక ఇంజనీర్ల బృందం తమ సాంకేతికతతో ఈ స్థాయి విజయం సాధించడం అనూహ్యం. అనేక అత్యుత్తమ అమెరికా సంస్థలు అపారమైన పెట్టుబడులు, వనరులతో రూపొందించిన ఏఐ నమూనాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో, పరి మిత వనరులతో చైనాకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఇలా ప్రపంచాన్ని కుదిపేయడం విశేషం. ఆవిష్కృతమైన వారం రోజుల్లోనే డీప్ సీక్ సరికొత్త వెర్షన్ వీ3 అనేక సంక్లిష్టమైన, సూక్ష్మమైన ప్రశ్నలకు ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీ కన్నా మెరుగ్గా జవాబులివ్వడం గమనార్హం. సందర్భో చితంగా, కచ్చితత్వంతో, అంతకు మించి సృజనాత్మకంగా అప్పటికప్పుడు సమాధానాలివ్వడంలో డీప్ సీక్ ముందంజలో ఉంది. వివిధ భాషల్లోకి నిర్దుష్టమైన అనువాదాలు అందించడంలోనూ అగ్ర రాజ్యపు బడాబాబుల యాప్లన్నిటినీ అధిగమించేసింది. డీప్ సీక్ ఛాట్ బోట్ జవాబుల నాణ్యతను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రశంసిస్తున్నారంటే అది చిన్న విజయమేమీ కాదు.లెక్కతీస్తే డీప్ సీక్ సాధించిన విజయాలు అనేకం. ఓపెన్ ఏఐ కొన్ని వందల కోట్ల డాలర్ల ఖర్చు చేస్తే, కేవలం 60 లక్షల డాలర్లతో డీప్ సీక్ తన ఏఐ వేదికను అభివృద్ధి చేసిందని కథనం. అలాగే, అత్యాధునిక ఎన్విడియా ఏ100 చిప్స్ను చైనాకు విక్రయించడంపై షరతులున్న నేపథ్యంలో, వాటిపై ఆధారపడకుండా చౌక రకం, తక్కువ శ్రేణి వాటితోనే ఇంతటి విజయం సాధించింది. పైపెచ్చు, ఓపెన్ ఏఐకి పూర్తి భిన్నంగా డీప్ సీక్ అనేది... డెవలపర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా వాడు కొని, దాన్ని తమ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకొని, మరింత పెంపొందించుకోవడానికీ వీలున్న ‘స్వేచ్ఛా వినియోగ’ సాఫ్ట్వేర్. ఇన్ని ప్రత్యేకతలున్నందున డీప్ సీక్ ప్రభావం తక్షణమే విస్తృతంగా కనిపించింది. అమెరికాలోని ఏఐ సంస్థల స్టాక్ మార్కెట్ ప్రపంచం తలకిందులైపోయింది. ఓపెన్ ఏఐ తాలూకు ఛాట్ జీపీటీని సైతం రెండో స్థానానికి నెట్టి, యాపిల్ వాళ్ళ యాప్ స్టోర్ జాబితాలో ఈ చైనీస్ యాప్ ఏకంగా అగ్రేసర స్థానాన్ని అధిష్ఠించడం గణనీయమైన అంశం.మొత్తానికి ఈ స్టార్టప్ తన ‘డీప్ సీక్–ఆర్1’ మోడల్తో ప్రపంచ ఏఐ చిత్రాన్నే మార్చేసింది. ఏఐకి సంబంధించిన ఆర్థిక, సాంకేతిక చలనసూత్రాలను తిరగరాసింది. అదే సమయంలో రాజకీ యంగా, మరీ ముఖ్యంగా చైనాకు సున్నితమైన 1989 నాటి తియానన్మెన్ స్క్వేర్ ఊచకోత ఘటన, అరుణాచల్ ప్రదేశ్ లాంటి అంశాలపై జవాబిచ్చేందుకు ఇది నిరాకరించడం విచిత్రం. అంటే, ఆధునిక ప్రపంచంలో ఒకరకంగా సాంకేతిక పురోగతితో పాటు జనానికి ఏది చెప్పాలి, ఏది చూపాలి,ఎంత వివరించాలనే అంశాన్ని ఈ కొత్త సాధనాలతో నిర్ణయించేలా సెన్సార్షిప్లూ పెరగనున్నాయన్న మాట. పారదర్శకత, ఏఐ వ్యవస్థల్లో సిసలైన స్వేచ్ఛ ఎంత అన్న నైతిక ప్రశ్నలకు ఇది తావి స్తోంది. ఇంతటి సంచలనాత్మక ఏఐ మోడల్ సైతం చైనా ప్రభుత్వ సెన్సార్షిప్ సంకెళ్ళలో బందీగా, ప్రభుత్వ నియంత్రణలో పాలక వర్గాల ప్రచారానికే పరిమితమనే భావన కలుగుతోంది. ఏమైనా, పదే పదే ‘ఆత్మనిర్భర భారత్’ అంటూ పెడబొబ్బలు పెట్టే మన పాలకులకు డీప్ సీక్ విజయం కళ్ళెదుటి పాఠం. ప్రపంచానికి పెద్దన్నగా భావిస్తూ, అమెరికా అనేక ఆంక్షలు పెట్టి, సుంకాలు విధించినా చైనా తన సొంత కాళ్ళపై నిలబడడం ఎవరికైనా స్ఫూర్తిదాయకం, ఆదర్శం. అవరో ధాలను అధిగమించి, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఏఐ, పర్యావరణ సానుకూల టెక్నాలజీ లాంటి అనేక అంశాల్లో డ్రాగన్ సాధించిన విజయం అసామాన్యం. దూరదృష్టితో కూడిన విధాన నిర్ణయాలు, వాటి సమగ్ర ఆచరణ వల్లనే పొరుగునున్న చైనాకు ఇది సాధ్యమైంది. ఆ మార్గాన్ని మనమూ ఇప్పటికైనా చిత్తశుద్ధితో అనుసరించాలి. భారత్లోనూ ప్రతిభకు కొదవ లేదు. మన విద్యార్థులు, ఐటీ రంగ నిపుణులు అందరూ పొలోమని అమెరికా వైపు చూడడానికీ, ఆ సంస్థల వైపు ఆకర్షితులు కావడానికీ కారణాలను అన్వేషించాలి. ప్రతిభావంతుల్ని ఇక్కడే స్థిరపడేలా చేసి, వారి సేవలను జన్మభూమికి ఉపకరించేలా చూసుకోవాలి. హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ను మంచి చేసుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్న మనం డీప్ సీక్ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అదే సమయంలో నియంత్రణ, సెన్సార్లకు అతీతంగా సరికొత్త సాంకేతికతల్ని ఎదగనిచ్చేలా చైతన్యవంతమైన చట్టాలు చేయాలి. నైతికత, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పునాదిపై నూతన శకానికి దారులు వేయాలి. -
ప్రయోగాత్మక పౌరస్మృతి
దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు శ్రీకారం చుట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో చట్టసభ ఆమోదించిన యూసీసీని ఉత్తరాఖండ్ ఆచరణలోకి తెచ్చింది. ఆ రాష్ట్ర సీఎం సోమవారం డెహ్రాడూన్లో యూసీసీ నియమావళి ప్రకటించి, పోర్టల్ను ప్రారంభించడంతో కొత్త కథ మొదలైంది. వివాదాస్పద యూసీసీ అమలు ‘దేవభూమి’ నుంచి ఆరంభమైందన్న మాటే కానీ, వివాదాల పెనుభూతం మాత్రం ఇప్పుడప్పుడే వదిలిపెట్టడం కష్టం. ఇదంతా చూపులకు... మతాలకు అతీతంగా అందరికీ ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలుండేలా ప్రమాణీకరించే ఉద్దేశంతో చేపట్టిన ప్రయత్నంగా, సమానత్వం – సమన్యాయ సిద్ధాంతాలకు అనుగుణంగా గొప్పగా అనిపించవచ్చు. ఆధునిక విలువలకూ, లైంగిక సమానత్వ – న్యాయాలకూ జై కొట్టినట్టు కనిపించవచ్చు. కానీ, లోతుల్లోకి వెళితే – ఆచరణలో ఇది కీలకాంశాలను అందిపుచ్చుకోలేదు. అనేక లోటుపాట్లూ వెక్కిరిస్తాయి. ముఖ్యంగా... చట్టసభలో సమగ్ర చర్చ లేకుండానే, ఏకాభిప్రాయం సాధించకుండానే హడావిడిగా యూసీసీ తేవడం బీజేపీ పాలకుల తెర వెనుక ఉద్దేశాలకు ప్రతీకగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్లో ఇకపై పెళ్ళిళ్ళు, విడిపోవడాలు, భరణాలు లాంటివన్నిటికీ అన్ని మతాలకూ ఒకే చట్టం వర్తించనుంది. ఆ రాష్ట్రంలో పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. చేయకపోతే, జరిమానాతో పాటు, వివాహాల రిజిస్ట్రేషన్ కానివారు ప్రభుత్వ ప్రయోజనాలకు పూర్తిగా అనర్హులు. అలాగే, విడాకుల కేసుల్లో భార్యాభర్తలకు ఒకే నియమావళి వర్తిస్తుంది. బహుభార్యాత్వంపై నిషేధమూ విధించారు. అదే సమయంలో, భిన్న సంస్కృతి, సంప్రదాయాలను అంటిపెట్టుకొని ఉండే షెడ్యూల్డ్ ట్రైబ్లను మాత్రం నిషేధం నుంచి మినహాయించారు. ప్రభుత్వ కొత్త ప్రతిపాదనలో కొన్ని అంశాలు నైతిక నిఘా అనిపిస్తున్నాయి. పెళ్ళి చేసుకున్నవారే కాదు, సహజీవనం చేస్తున్నవారూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనడం, అలా చేయకపోతే జైలుశిక్ష, జరిమానా అనడం బలవంతంగా అందరినీ దారికి తెచ్చుకోవడమే తప్ప, న్యాయపరిరక్షణ అనుకోలేం. అసలు విభిన్న మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో పెళ్ళి, విడాకులు, దత్తత, వారసత్వం, పిత్రార్జితం లాంటి అంశాల్లో అందరినీ ఒకే తాటిపైకి తీసుకు రావాలని సమష్టి వ్యక్తిగత చట్టాలు చేయడం సరైనదేనా అన్నది మౌలికమైన ప్రశ్న. ఎవరి మత ధర్మం వారికి ఉండగా, అందరినీ ఒకే గాటన కట్టి, మూకుమ్మడి పౌరస్మృతిని బలవంతాన రుద్దడ మేమిటని జమైత్ ఉలేమా ఇ–హింద్ లాంటివి అభ్యంతరం చెబుతున్నాయి. షరియాకూ, మతానికీ విరుద్ధమైన చట్టాన్ని ముస్లిమ్లు ఆమోదించలేరని కుండబద్దలు కొడుతున్నాయి. ఇలా ఉత్తరాఖండ్ యూసీసీపై ఒకపక్క దేశవ్యాప్తంగా వాడివేడి చర్చలు జరుగుతుండగానే, మరోపక్క గౌరవ ఉపరాష్ట్రపతి హోదాలోని వారు మాత్రం ‘ఇలాంటి చట్టం దేశమంతటా త్వరలోనే రావడం ఖాయమ’ని ఢంకా బజాయించడం విడ్డూరం. నిజానికి, ఉత్తరాఖండ్ యూసీసీలో లోటుపాట్లకు కొదవ లేదు. అందరూ సమానమే అంటున్నా, స్వలింగ వివాహాల ప్రస్తావన లేదేమని కొందరి విమర్శ. అలాగే, దత్తత చట్టాలపైనా యూసీసీ నోరు మెదపలేదని మరో నింద. అందరూ సమానం అంటూనే కొందర్ని కొన్ని నిబంధనల నుంచి మినహాయించడమేమిటని ప్రశ్న. ఎస్టీలకు సహేతుకంగా వర్తించే అదే మినహాయింపులు ఇతర వర్గాలకూ వర్తించాలిగా అన్న దానికి జవాబు లేదు. 44వ రాజ్యాంగం అధికరణం యూసీసీని ప్రస్తావించిందన్నది నిజమే. దీర్ఘకాలంగా యూసీసీపై అందరూ మాట్లాడుతున్నదీ నిజమే. కానీ, అది ఏ రకంగా ఉండాలి, లేదా ఉండకూడదన్న దానిపై ఇప్పటికీ ఎవరికీ స్పష్టత లేదు. పైగా, గందరగోళమే ఉందన్నదీ అంతే నిజం. ఆది నుంచి ఉమ్మడి పౌరస్మృతిని తారకనామంగా జపిస్తున్న కమలనాథులు ఇప్పుడు ఉత్తరాఖండ్లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారనుకోవాలి. యూసీసీ వల్ల జరిగే మంచి మాట దేవుడెరుగు, అసలిది చేయగలిగిన పనే అని ప్రపంచానికి చాటాలనుకున్నారు. అయితే, ఈ ఉత్తరాఖండ్ యూసీసీ రాజ్యాంగబద్ధత పైనా సందేహాలున్నాయి. ఒక రాష్ట్ర చట్టసభలో చేసిన చట్టాలు ఆ రాష్ట్ర పరిధికే వర్తిస్తాయని 245వ రాజ్యాంగ అధికరణ ఉవాచ. కానీ, రాష్ట్రం వెలుపల ఉన్న ఉత్తరాఖండీయులకూ యూసీసీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది హాస్యాస్పదం. అలాగే, సహజీవనాల రిజిస్ట్రేషన్ తప్పదంటున్నారే తప్ప, అలా చేసుకుంటే చట్టపరంగా ఆ భాగస్వాముల పరస్పర హక్కులకు రక్షణ లాంటివేమీ కల్పించ లేదు. వారి ప్రైవేట్ బతుకులు వ్యవస్థలో నమోదై నడిబజారులో నిలవడమే తప్ప, నిజమైన ప్రయో జనమూ లేదు. పైగా 21వ అధికరణమిచ్చిన గోప్యత హక్కుకు విఘాతమే! నిజానికి, గోప్యత హక్కులో సమాచార గోప్యత, స్వతంత్ర నిర్ణయాధికారం కూడా ఉన్నాయని జస్టిస్ పుట్టస్వామి కేసులో తొమ్మండుగురు న్యాయమూర్తుల సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం ఏనాడో తేల్చి చెప్పింది. ఇప్పుడీ యూసీసీ నిబంధన అచ్చంగా దానికి విరుద్ధమే. అలాగే, కులాంతర, మతాంతర వివాహాలపై విచ్చుకత్తులతో విరుచుకుపడి, ప్రాణాలు తీసే స్వభావం నేటికీ మారని సమాజంలో ఈ తరహా నిబంధనలు ఏ వెలుగులకు దారి తీస్తాయి? వెరసి, ఉత్తరాఖండ్ సర్కారు వారి యూసీసీ పైకి పెను సంస్కరణగా కనిపించినా, ఆఖరికి వేర్వేరు చట్టాల్లోని అంశాల్ని అనాలోచితంగా కాపీ చేసి అతికించిన అతుకుల బొంతగా మిగిలింది. ఇది ఏకరూపత పేరిట ప్రభుత్వం బల ప్రయోగం చేయడమే అవుతుంది. ఉత్తరాఖండ్ బాటలోనే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలూ పయనించి, ఆఖరికి యూసీసీని దేశవ్యాప్తం చేస్తారన్న మాట వినిపిస్తున్నందున ఇకనైనా అర్థవంతమైన చర్చ అవసరం. -
బలమైన బంధం దిశగా..!
భౌగోళికంగానే కాదు... సంస్కృతి, నాగరికతల్లోనూ శతాబ్దాలుగా సన్నిహితమైన రెండు దేశాల మధ్య సహకారం సహజం. ఉమ్మడి ప్రయోజనాలూ అనేకం. ప్రయాణ, వాణిజ్యాలు చిరకాలంగా ఉన్నా, ఇప్పటి దాకా ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడ్డ భారత, ఇండొనేసియాలు దాన్ని చక్కదిద్దుకొనే పనిలో పడ్డాయి. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 4 రోజులు భారత్లో పర్యటించి, భారత 76వ గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం బలమైన బంధానికి పునరంకితమయ్యే వీలు కల్పించింది. అన్నీ సాకల్యంగా చర్చించు కొనే విలువైన అవకాశం వచ్చింది. మొత్తం 55 పేరాల తాజా ఉమ్మడి ప్రకటనలో ఇరుపక్షాలూ విస్తృత ద్వైపాక్షిక, అంతర్జాతీయ సహకారంపై ఏకస్వరంతో మాట్లాడడం అందుకు నిదర్శనం. భౌగోళికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా భారత్తో ఇండొనేసియా అను బంధం బలమైనది. చిత్రమేమిటంటే చిరకాలంగా బలమైన బంధమున్నా అది భారీ స్థాయిలో ప్రతి ఫలించినట్లు కనిపించదు. అగ్రరాజ్యాల అధికార రాజకీయాలకు వ్యతిరేకతతో, అలీనోద్యమంతో ఆది నుంచి ముడిపడిన ఈ ఉభయ దేశాలూ వలస పాలనానంతర ఆసియా ఖండంలో ద్వైపాక్షికంగానూ, నాయకత్వంలోనూ కలసి అడుగేయాల్సింది. అయితే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఢిల్లీ, జకార్తాలు దూరం జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తాజా ఢిల్లీ పర్యటన ఆశావహ పరిణామం. ఉభయదేశాల మధ్య అనుబంధానికి అవసరమైన వ్యూహాత్మక ప్రేరణను ఈ పర్యటన అందించింది. భారత గణతంత్ర దినోత్సవ కవాతుకు ముఖ్య అతిథిగా ఇండొనేసియా అధ్యక్షులు హాజరవడం ఇది నాలుగోసారి. భారత్ తొలిసారి జరుపుకొన్న రిపబ్లిక్ డే వేడుకలకు 1950లో సైతం ఇండొనేసియా అధ్యక్షుడే (సుకర్ణో) ముఖ్య అతిథి. ఆపైన సుసిలో బమ్బాగ్ యుధొయోనో (2011), జోకో విడోడో (2018), ఇప్పుడు సుబియాంటో! గమనిస్తే, ఆగ్నేయాసియా దేశాలతో బలమైన స్నేహం 1990ల నుంచి భారత ప్రయత్నం.అందులో భాగంగా జకార్తా, ఢిల్లీల మధ్య దూరం క్రమంగా తగ్గసాగింది. చైనా వ్యూహాత్మక ప్రాబల్యానికి పగ్గం వేసేలా ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవాలని భారత్ ‘ప్రాచ్యానికి ప్రాధాన్య విధానం’ (యాక్ట్ ఈస్ట్ పాలసీ) చేపట్టింది. ఇండో – పసిఫిక్ ప్రాంతం కీలకమని గుర్తించింది. అయినా, ఇరు దేశాల భాగస్వామ్యం ఉండాల్సినంత లేదు. సుమత్రా, జావా... ఇలా 17 వేలకు పైగా ద్వీపాలతో కూడిన ఇండొనేసియా 28 కోట్లకు పైగా ప్రజలతో జనసంఖ్యలో ప్రపంచంలో నాలుగోది. దాదాపు 1.4 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థతో వచ్చే 2030 నాటి కల్లా ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి ఎకానమీల్లో ఒకటిగా నిలవడానికి ఉరకలు వేస్తోంది. ఈ దేశ వేలాది ద్వీపాలు హిందూ, పసిఫిక్ మహా సముద్రాల మధ్య వారధుల లాంటివి. ఇండొనేసియా సముద్ర జలాలు భారత్ సహా ఈ ప్రాంతంలో పలు దేశాల ప్రపంచ వాణిజ్యానికి ఆయువుపట్టు. సహజ వనరులు పుష్కలంగా ఉండే ఈ అతి పెద్ద ద్వీపసమూహ దేశంతో బంధం భారత ఆర్థికప్రగతికి కీలకమనీ, బంధాన్ని బలోపేతం చేసుకోవాలంటున్నది అందుకే!అధ్యక్షుడి తాజా పర్యటనలో ఆరోగ్యం, సాంప్రదాయిక వైద్యం, సముద్రయాన భద్రత, డిజిటల్ అభివృద్ధి, సాంస్కృతిక సహకారంపై 5 అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుది రాయి. అలాగే, రక్షణ సహకారాన్ని పటిష్ఠం చేసుకోవాలన్న మాట ఉమ్మడి ప్రకటనలోనూ ప్రస్తావించారు. అయితే, భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను ఇండొనేసియా కొననున్నదంటూ పర్యట నకు ముందు వార్తలు గుప్పుమన్నా, ఆ రకమైన ఒప్పందమేదీ జరగలేదు. ఇండో– పసిఫిక్లో అమెరికా– చైనా శత్రుత్వం, దక్షిణ– తూర్పు చైనా సముద్రాల్లో చైనా బిగిస్తున్న పట్టు లాంటి సున్నిత అంశాలు, వాటి భౌగోళిక రాజకీయ ప్రభావాలు చర్చకు వచ్చిందీ, లేనిదీ తెలియలేదు. ఆర్థికాభివృద్ధిలోనూ ఇరుపక్షాలూ చేయాల్సింది చాలా ఉంది. ప్రస్తుతం 3 వేల కోట్ల డాలర్లే ఉన్న రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని ద్విగుణం, బహుళం చేయాలి. రెంటి మధ్య రాకపోకలు, ఆదానప్రదానాల పెంపుదల, పారిశ్రామిక భాగస్వామ్యాలను పెంచుకోవాలి. అధ్యక్షుడి వెంట దాదాపు 100 మంది సభ్యుల వ్యాపార బృందం వచ్చినందున ఆ రంగంలో పురోగతి కనిపిస్తుందని ఆశించవచ్చు. ఇండో–పసిఫిక్ ప్రపంచ వివాదానికి కేంద్రమవుతున్న వర్తమాన పరిస్థితుల్లో ద్వైపాక్షిక,ప్రాంతీయ సహకారానికి ఉభయ దేశాలూ నడుంకట్టాలి. గత అక్టోబర్లో ఇండొనేసియా అధ్యక్షు డిగా పదవీ బాధ్యతలు చేపట్టి, ప్రస్తుతం ఆ దేశంలో అమితమైన ప్రాచుర్యం ఉన్న సుబియాంటో గద్దెనెక్కిన కొద్దికాలానికే భారత్లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలకు ఉత్ప్రేరకమే. ఇరు దేశాలు సన్నిహిత మిత్రులుగా, భాగస్వాములుగా కొనసాగాలని ఆయన అభిలషించడం గమనార్హం. ‘ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య’కు మూలస్తంభమైన ఇండొనేసియా ప్రాంతీయ ఆర్థిక సమన్వయానికి, రాజకీయ, భద్రతా అంశాలకూ ముఖ్యమైనది. ఆ సంగతి భారత్ గమనంలో ఉంచుకోవాలి. బీజింగ్ కళ్ళతో, భౌగోళిక రాజకీయాల కోణం నుంచే జకార్తాతో బంధాన్ని చూడరాదు. ఇండొనేసియా సైతం ఆది నుంచీ అగ్ర దేశాలతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆ సంగతి గుర్తించి, ఆ దేశంతో ద్వైపాక్షిక సహకారం వెల్లివిరిసేలా భారత్ కృషి చేయాలి. ఆసియాలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనేలా చూడాలి. పర్యటనతో రాజకీయ నాయకత్వం చొరవ చూపినందున ఇప్పుడిక అధికార యంత్రాంగం, దౌత్యవేత్తలు, పారిశ్రామిక భాగస్వాములు ఆచరణలో ముందుకు తీసుకుపోవాలి. -
ఇంగితం సంగతేంటి?
ఇంగితజ్ఞానం ఇంగితజ్ఞానమే, చదువులు చదువులే! చదువు పరమావధి జ్ఞానమే అయినా, చదువుకున్న వారందరూ జ్ఞానులు కాలేరు. అత్యంత దురదృష్టకరమైన విషయమేమిటంటే, చదువు కున్న వారిలో కొందరు కనీసం ఇంగితజ్ఞానులు కూడా కాలేరు. విపరీతంగా చదువుకుని, బహు పట్టభద్రులై, పాఠాలు బోధించే స్థాయిలో ఉన్నా, ఇలాంటివారు ఎప్పటికప్పుడు తమ ఇంగితజ్ఞాన రాహిత్యాన్ని బయటపెట్టుకుంటూ జనాలను విభ్రాంతికి గురిచేస్తుంటారు. ‘విద్యలేనివాడు వింత పశువు’ అంటూ నిరక్షరాస్యులను ఎద్దేవా చేసే పెద్దలు – అతి విద్యావంతులైన ఇంగితజ్ఞాన రహితులను ఏమంటారో!‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్/ బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/ పొదవెడు నుప్పు లేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని శతకకారుడు వాపోయాడు. రసజ్ఞత లేని చదువును ఉప్పులేని కూరతో పోల్చాడు. బహుశా, ఎంత చదువు చదువుకున్నా, కాస్తంతైనా ఇంగితజ్ఞానం లేనివారు ఆయనకు తారసపడి ఉండరు. అలాంటి అతి చదువరులే తారసడితే ఆయన ఇంకెంతలా వాపోయేవాడో! ఈ రోజుల్లో చదువుకున్న వాళ్లలో రసజ్ఞత సంగతి దేవుడెరుగు, ఇంగితజ్ఞానం కూడా కొరవడు తోందంటే, మన చదువులు ఎలా అఘోరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అసలు మన చదువులు ఇలా ఎందుకు అఘోరిస్తున్నాయో, అందుకు గల కారణాలను అన్వేషించే వాళ్లు బహు అరుదు. ‘చాలామందికి, పిల్లల్ని చదువంటే బెదరగొట్టడం చాతనయినంత బాగా వాళ్లకి చదువు మీద ఇష్టం కలిగించడం చాతకాదు’ అంటారు కొడవటిగంటి కుటుంబరావు. ‘చదువు’ నవలలో ఆయన వెలి బుచ్చిన అభిప్రాయం ఇది. బెదరగొట్టి మరీ పిల్లలకు చదువు చెప్పే బడిపంతుళ్ల ధోరణి కూడా చదువుకున్న వాళ్లలో ఇంగితజ్ఞాన లోపానికి ఒక కీలక కారణం. బెదరగొట్టి పిల్లలకు చదువు చెప్పే దండోపాయ నిపుణులు పురాణకాలం నుంచే ఉన్నారు. ప్రహ్లాదుడికి చదువు చెప్పిన చండా మార్కుల వారసత్వాన్ని కొందరు నేటికీ కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో చండా మార్కుల వారసులకే గిరాకీ ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి గురువులు పిల్లల బుర్రల్లోకి పాఠాల నైతే ఎక్కించగలరేమో గాని, చిటికెడు ఇంగితజ్ఞానాన్ని మాత్రం అలవరచలేరు. ‘ఇంగితజ్ఞానం మరీ అంత సర్వసాధారణమైనది కాదు’ అంటాడు ఫ్రెంచ్ తత్త్వవేత్త వోల్టేర్. ఇంగితజ్ఞానాన్ని ఇంగ్లిష్లో ‘కామన్సెన్స్’ అంటారు. అలాగని, ఇది మనుషులందరికీ ఉండే లక్షణ మని అనుకుంటే పొరపాటే! ‘మనుషులందరిలోనూ ఇంగితజ్ఞానం ఉందనే నమ్మకంతో కొన్నిసార్లు మనం ప్రమాదంలో పడుతుంటాం’ అన్నాడు ఐరిష్ సంగీతకారుడు హోజీర్.ఒకప్పుడు సమాజంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు అక్షరాస్యులు బాగా పెరిగారు. అక్షరాస్యత పెరిగితే, జనాల్లో బుద్ధి జ్ఞానాలు, తెలివితేటలు పెరగడం సర్వసహజ పరిణా మమనేది ఒక అమాయకపు అంచనా. సమాజంలో అక్షరాస్యత పెరిగింది, నిజమే! తత్ఫలితంగా మూర్ఖత్వం తగ్గిందనుకుంటే పారపాటే! ‘చదవేస్తే ఉన్న మతి పోయింద’నే నానుడి ఉంది. ఇప్పటి చదువులను చూస్తే, పరిస్థితి అలాగే ఉందనిపిస్తుంది. ఈ చదువులతో కొందరిలో ఇంగితజ్ఞానం లోపిస్తుంటే, ఇంకొందరిలో చావుతెలివి పెచ్చుమీరుతోంది. బొటాబొటి చదువుల సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నత విద్యావంతులు సైతం బోల్తాపడుతున్న ఉదంతాలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకవైపు శాస్త్రవేత్తలు కృత్రిమ మేధతో కుస్తీలు పడుతున్న రోజులు వచ్చిపడ్డాయి గాని, మనుషుల్లో ఇంగితాన్ని పెంచే చదువులే కరవవుతున్నాయి. ‘నడవడికను చక్కబరచడానికి ఉత్త పాఠ్య పుస్తకాల చదువు చాలదు’ అని గాంధీజీ చెప్పిన మాటలను నేటి కార్పొరేట్ విద్యావ్యవస్థ పట్టించు కుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. గాంధీజీ ‘హింద్ స్వరాజ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పాఠ్యపుస్తకాల విద్య మానవుల నైతికోన్నతికి ఇంచుకైనా సహకరించదని; చదువు వేరు, సద్గుణం వేరని స్వానుభవంతో తెలుసుకున్నాను’ అన్నారు. ఆయన దేశానికి స్వాతంత్య్రం రాకముందు చెప్పిన మాటలివి. ఇప్పటికీ మన చదువులు పూర్తిస్థాయిలో చక్కబడకపోవడం విచారకరం.చదువులు చెప్పడానికి ఎన్నో బడులు ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేక నైపుణ్యాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయి. పుట్టల నుంచి చీమలు పుట్టుకొచ్చినట్లు వీటి నుంచి ఏటా పట్టభద్రులు పుట్టుకొస్తున్నారు. వాళ్లలో చాలామంది సమాజంలో మేధావులుగా చలామణీ అవుతున్నారు. అంతమాత్రాన, వాళ్లంతా ఇంగితజ్ఞాన సంపన్నులనుకోవడానికి ఆస్కారం లేదు. ‘మీ డిగ్రీ ఒక కాగితం ముక్క మాత్రమే. మీ చదువేమిటో మీ ప్రవర్తనలోను, ఆలోచనా ధోరణిలోను, సౌశీల్యంలోను ప్రతిఫలిస్తుంది’ అన్నాడు అమెరికా మూడో అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. ప్రవర్తనను, ఆలోచనా ధోరణిని మార్చలేని డిగ్రీలు ఉత్త కాగితం ముక్కలు మాత్రమే! ‘కొన్ని ఆలోచనలు చాలా మూర్ఖంగా ఉంటాయి. వాటిని మేధా వులు మాత్రమే నమ్ముతారు’ అని ఇంగ్లిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ అన్నాడు. గోమూత్రపానంతో జ్వరాలు తగ్గుతాయని ఇటీవల ఐఐటీ–మద్రాసు డైరెక్టర్ మహాశయుడు సెలవిచ్చారు. ఆయనను బహుశా మేధావులే నమ్ముతారు కాబోలు! -
లాంగ్ లివ్ ద రిపబ్లిక్
డెబ్బయ్ ఐదు సంవత్సరాలు. కాలగమనంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఆనాడు భారత ప్రజలు ప్రకటించుకున్న ప్రజా స్వామ్య రిపబ్లిక్ నేడు ఈ మజిలీకి చేరుకున్నది. ఈ ప్రయాణ మంతా సాఫీగానే జరిగిందని చెప్పలేము. ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎటుచూస్తే అటు చీకటి ముసిరిన చేటు కాలాన్ని కూడా దాటవలసి వచ్చింది. దారి పొడుగునా ఎగుడు దిగుళ్లూ, ఎత్తుపల్లాలూ ఇబ్బందులు పెట్టాయి. అయినా మన రిపబ్లిక్ రథం వెనుదిరగలేదు. వెన్ను చూపలేదు. రాజ్యాంగ దీపం దారి చూపగా మున్ముందుకే నడిచింది.సుదీర్ఘ ప్రయాణం ఫలితంగా మన రిపబ్లిక్ ఎంతో పరిణతి సాధించి ఉండాలి. అందువల్ల ఇకముందు సాగే ప్రయాణం నల్లేరుపై బండిలా సాగుతుందని ఆశించాలి. ప్రతిష్ఠాత్మకమైన శతాబ్ది మైలురాయిని తాకేందుకు ఉరకలెత్తే ఉత్సాహంతో సాగిపోతామనే ధీమా మనకు ఏర్పడి ఉండాలి. కానీ, అటువంటి మనో నిబ్బరం నిజంగా మనకున్నదా? మన రిపబ్లిక్కు ఆయువు పట్టయిన రాజ్యాంగం ఇకముందు కూడా నిక్షేపంగా ఉండగలదనే భరోసా మనకు ఉన్నట్టేనా? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలన్నీ ఆశించిన విధంగానే పనిచేస్తున్నాయని గుండెల మీద చేయి వేసుకొని చెప్పుకోగలమా?మన స్వాతంత్య్రం ఎందరో వీరుల త్యాగఫలం. ఆ స్వాతంత్య్రానికి సాధికార కేతనమే మన గణతంత్రం. స్వాతంత్య్ర పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ ఒక ప్రధాన స్రవంతి మాత్రమే! ఇంకా అటువంటి స్రవంతులు చాలా ఉన్నాయి. ఆ పార్టీ పుట్టకముందు కూడా ఉన్నాయి. మహాత్మాగాంధీ ఆ పోరాటాన్ని ఫైనల్స్కు చేర్చిన టీమ్ క్యాప్టెన్ మాత్రమే. రెండొందల యేళ్లలో అటువంటి క్యాప్టెన్లు చాలామంది కనిపిస్తారు. ఈస్టిండియా కంపెనీ రోజుల్లోనే బ్రిటీషర్ల దాష్టీకంపై తిరగబడిన వీర పాండ్య కట్టబ్రహ్మన, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి పాలె గాళ్ల వీరగాథలు మనం విన్నవే.ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందుగా, ఆ తర్వాత కూడా బ్రిటీష్ పాలనపై ఎందరో గిరిజన యోధులు తిరగ బడ్డారు. బిర్సాముండా, తిల్కా మాఝీ, సిద్ధూ–కన్హూ ముర్ములు, అల్లూరి దళంలోని సభ్యులు వగైరా అటవీ హక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ధారపోశారు. తొలి స్వాతంత్య్ర పోరుకు నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వేలాదిమంది ముస్లిం స్వరాజ్య యోధుల దిక్సూచి. బ్రిటీషర్ల ఆగ్రహానికి గురై బర్మాలో ప్రవాస జీవితం గడిపిన జాఫర్ కనీసం తాను చనిపోయిన తర్వాతైనా తన మాతృదేశంలో ఖననం చేయాలని పాలకులను అభ్యర్థించారు.స్వాతంత్య్ర పోరాటంలో అంతర్భాగంగా, సమాంతరంగా దేశవ్యాప్తంగా ఎన్నో రైతాంగ పోరాటాలు జరిగాయి. అందులో కొన్ని సాయుధ పోరు రూపాన్ని తీసుకున్నాయి. జమీందారీ, జాగీర్దారీ దోపిడీ పీడనకు వ్యతిరేకంగా రైతులు తిరగబడ్డారు. ఈ విధంగా భిన్నవర్గాల, విభిన్న తెగల ఆకాంక్షలు, ఆశలూ ఈ పోరాటంలో ఇమిడి ఉన్నాయి. వేరువేరు భాషలు, విభిన్నమైన సంస్కృతులు, ఆచార వ్యవహారాలతో కూడిన సువిశాల భారత దేశ ప్రజల మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని స్వాతంత్య్రోద్యమం సాధించగలిగింది. ఆ ఉద్యమాన్ని నడిపిన జాతీయ నాయకత్వా నికి ఈ భిన్నత్వంపై అవగాహనా, గౌరవం ఉన్నాయి.స్వతంత్ర దేశంగా అవతరించడానికి కొన్ని గంటల ముందు పండిత్ నెహ్రూ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఆ రోజునే ఆయన దేశ ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం అందవలసి ఉన్నదనీ, సమాన అవకాశాలు కల్పించవలసి ఉన్నదనీ స్పష్టం చేశారు. మత తత్వాన్ని, సంకుచిత మనస్తత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించరాదని ఆనాడే ఆయన నొక్కిచెప్పారు. ఆ తర్వాత మూడేళ్లపాటు జరిగిన రాజ్యాంగ సభ చర్చల్లోనూ ఇదే విచారధార ప్రధాన భూమికను పోషించింది. స్వేచ్ఛ, సమా నత్వం, సౌభ్రాతృత్వం పునాదులుగా డాక్టర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది.ప్రపంచంలోని లిఖిత రాజ్యాంగాలన్నింటిలో విపుల మైనది, పటిష్ఠమైనది భారత రాజ్యాంగమే. భవిష్యత్తులో దేశం నియంతృత్వంలోకి జారిపోకుండా చెక్స్అండ్ బ్యాలెన్సెస్లతో కూడిన రాజ్యాంగ వ్యవస్థలకు రూప కల్పన చేశారు. భారత్తోపాటు అదే కాలంలో స్వాతంత్య్రం సంపాదించుకున్న అనేక దేశాలు అనంతరం స్వల్పకాలంలోనే సైనిక పాలనల్లోకి, నిరంకుశ కూపాల్లోకి దిగజారిపోయాయి. వాటన్నింటి కంటే పెద్ద దేశమైన భారత్ మాత్రం కాలపరీక్షలను తట్టుకొని ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టుకోగలిగింది.ఇందుకు మనం మన అద్భుతమైన రాజ్యాంగానికీ, దాని రూప కర్తలకూ ధన్యవాదాలు సమర్పించుకోవలసిందే! మన పాలకుడు ఎంత గొప్ప మహానుభావుడైనప్పటికీ సర్వాధికారాలను అతనికే అప్పగిస్తే చివరికి మిగిలేది విధ్వంసమేనని జాన్ స్టూవర్ట్ మిల్ చేసిన హెచ్చరికను రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేడ్కర్ ప్రస్తావించారు. ఇందిరాగాంధీపై మొదలైన వ్యక్తి పూజ ‘ఇందిరే ఇండియా’ అనే స్థాయికి చేరి పోయిన తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలిసిందే! మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ అనేది ఒక మచ్చగా ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఇందిర తర్వాత ఆ స్థాయిలో ప్రస్తుత నరేంద్ర మోదీ వ్యక్తి పూజ కనిపిస్తున్నది. ఒక సందర్భంలో ఆయనే స్వయంగా ‘అయామ్ ది కాన్స్టిట్యూషన్’ (నేనే రాజ్యాంగం) అని ప్రకటించుకోవడం ఈ వీరపూజ ఫలితమే! ఫ్రెంచి నియంత పధ్నాలుగో లూయీ చేసిన ‘అయామ్ ది స్టేట్’ ప్రకటనకు ఇది తీసిపోయేదేమీ కాదు.ఈ దేశంలో ప్రజాస్వామ్యం చిరకాలం వర్ధిల్లడం కోసం రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేసిన కొన్ని వ్యవస్థలు బీటలు వారుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అధినాయకుని వీరపూజల ముందు వ్యవస్థలు నీరుగారుతున్న వైనాన్ని మనం చూడవచ్చు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, ఫెడరల్ తరహా పాలననూ రాజ్యాంగం ఆకాంక్షించింది. ఫెడరల్ అనే మాటను వాడకపోయినా ‘యూనియన్ ఆఫ్ ది స్టేట్స్’ అనే మాటను వాడారు. ఈ మాటలో రాష్ట్రాలకే ప్రాదేశిక స్వరూపం ఉన్నది తప్ప కేంద్రానికి కాదు.కేంద్ర ప్రభుత్వం కూడా బలంగానే ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ఆకాంక్షించిన మాట నిజమే. దేశ విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో బలహీన కేంద్రం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడ్డారు.అందువల్ల కేంద్రానికి కొన్ని అత్యవసర అధికారాలను కట్ట బెట్టారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఈ అధికారాలను చలా యించడానికి కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. కేంద్రం పెత్తనం ఇప్పుడు మరీ పరాకాష్ఠకు చేరు కున్నది. అసమంజసమైన ద్రవ్య విధానాలతో రాష్ట్రాలను బల హీనపరిచే ఎత్తుగడలు ఎక్కువయ్యాయి.మొత్తం జీఎస్టీ వసూళ్లలో అన్ని రాష్ట్రాలకూ కలిపి మూడో వంతు లభిస్తుంటే, కేంద్రం మాత్రం రెండొంతులు తీసుకుంటున్నది. మోయాల్సిన భారాలు మాత్రం రాష్ట్రాల మీదే ఎక్కువ. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేని సుంకాలు, సర్ ఛార్జీల వసూళ్లు ఏటేటా పెరుగుతున్నాయి. పార్లమెంటరీ ప్రజా స్వామ్యం మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సర్వోన్నత న్యాయస్థానం వివిధ సందర్భాల్లో ప్రకటించింది. కానీ పార్లమెంట్ చర్చలు పలు సందర్భాల్లో ఒక ప్రహసనంగా మారుతున్న వైనం ఇప్పుడు కనిపిస్తున్నది. అసలు చర్చలే లేకుండా కీలక బిల్లుల్ని ఆమోదింపజేసుకున్న ఉదాహరణ లున్నాయి.స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని రాజ్యాంగం ఆకాంక్షించిన ఎన్నికల సంఘం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈ వ్యవస్థ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్నది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో అది పాతాళానికి పడిపోయింది. పోలయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువ ఉన్నాయో తెలియదు. తొలుత ప్రకటించిన పోలయిన ఓట్ల శాతాన్ని నాలుగైదు రోజుల తర్వాత సవరించి అసాధారణంగా పెరిగినట్టు చెప్పడం ఎందువల్లనో తెలియదు. వాటిపై ప్రశ్నించిన స్వతంత్ర సంస్థలకూ, రాజకీయ పక్షాలకూ ఇప్పటి దాకా ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయింది. ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోవడమంటే ప్రజాస్వామ్యం శిథిలమవుతున్నట్లే లెక్క.రిజర్వు బ్యాంకు స్వతంత్రంగా వ్యవహరించవలసిన సంస్థ. కరెన్సీకి సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకోవలసిన బాధ్యత దానిదే. కానీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసాధారణ నిర్ణయాన్ని కొన్ని గంటల ముందు మాత్రమే ఆర్బీఐకి తెలియజేసి, బహి రంగ ప్రకటన చేశారు. ఆర్బీఐ పాలక మండలిని కనుసన్నల్లో పెట్టుకొని, దాన్ని అనుబంధ సంస్థగా మార్చేసుకున్నారనే విమ ర్శలు వస్తున్నాయి. ఇక సీబీఐ, ఆర్టీఐ, సీవీసీ వంటి ‘స్వతంత్ర’ సంస్థలు పంజరంలో చిలకలుగా మారిపోయాయనే విమర్శ సర్వత్రా వినబడుతూనే ఉన్నది.తమకు గిట్టని రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థను వాడుకున్నాయి. అయితే కొందరు గవర్నర్ల విపరీత ప్రవర్తన గతంతో పోల్చితే ఎక్కువైంది. విపక్ష ముఖ్యమంత్రులున్న రాష్ట్రాలకు ‘ట్రోజన్ హార్స్’ను పంపించినట్టే ఇప్పుడు గవర్న ర్లను పంపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు తెచ్చిన ‘ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్’ (ఓఎన్ఓఈ) విధానానికి పార్లమెంటరీ ప్రజా స్వామ్యాన్ని మరింత బలహీనపరిచే స్వభావమున్నది.ప్రాంతీయ రాజకీయ పార్టీలనూ, రాజ్యాంగ ఫెడరల్ స్వభా వాన్నీ ధ్వంసం చేయడానికే దీన్ని తీసుకొస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే చేయవలసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరింత బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వ భావన అనేవి మన రాజ్యాంగానికి పునాది వంటివి. పార్లమెంట్లో ఎంత మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం మాత్రం లేదని కేశవానంద భారతి (1973) కేసులో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అడుగులన్నీ అధ్యక్ష తరహా పాలనకు దారితీస్తున్నా యనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లక్ష్యసాధనకు ప్రస్తుత రాజ్యాంగం ఉపయోగపడదు.ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని ఆధారం చేసుకొని తమకు పట్టున్న ఉత్తరాదిలో సీట్లు పెరిగేలా, బలహీనంగా ఉన్న దక్షిణాదిలో సీట్లు తగ్గేవిధంగా బీజేపీ ప్రయత్నిస్తున్నదనే అనుమానాలు కూడా విపక్షాలకు ఉన్నాయి. ఇదే నిజమైతే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇదంతా రాజకీయ భాగం మాత్రమే! అంబేడ్కర్ చెప్పినట్టు రాజ్యాంగం అభిలషించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు కేవలం రాజకీయపరమైనవే కాదు. సామాజిక ఆర్థికపరమైనవి కూడా! ఈ రంగాల్లో ఇంకా ఆశించిన లక్ష్యం సుదూరంగానే ఉన్నది. ఇప్పుడు రాజకీయ అంశాల్లోనే మన రిపబ్లిక్ సవాళ్లను ఎదుర్కో వలసి వస్తున్నది. ఈ సవాళ్లను అధిగమించి ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా నిజమైన స్వాతంత్య్రం సిద్ధించాలంటే మన రాజ్యాంగం, మన రిపబ్లిక్ చిరకాలం వర్ధిల్లాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ట్రంప్ ‘వాణిజ్య యుద్ధభేరి’
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలుకొని నాలుగు రోజులుగా డోనాల్డ్ ట్రంప్ వరసపెట్టి జారీచేస్తున్న ఉత్తర్వులు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికనుద్దేశించి గురువారం ఆయన చేసిన ప్రసంగం కూడా ఆ కోవలోనిదే. అది ఒకరకంగా ‘వాణిజ్య యుద్ధభేరి’. తమ దేశంలో పెట్టుబడులు పెడితే ప్రపంచ దేశాలన్నిటికన్నా తక్కువ పన్నులు విధిస్తామనీ, కాదంటే ట్యారిఫ్ల మోత మోగిస్తామనీ ఆయన హెచ్చరించారు. భారత్, చైనాలపై ఆయనకు మొదటినుంచీ ఆగ్రహం ఉంది. ఈ రెండు దేశాలూ వర్ధమాన దేశాల ముసుగులో అనేక వెసులుబాట్లు పొందుతూ అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయని గతంలో ఆయన విరుచుకుపడ్డారు. అనంతర కాలంలో దక్షిణాఫ్రికా, ఇండొనేసియాలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వల్ల అమెరికా బాగా నష్టపోతున్నదని చీటికీ మాటికీ ఆరోపించేవారు. నిజానికి డబ్ల్యూటీవో అమెరికా మానసపుత్రిక. వాణిజ్య ప్రపంచంలో హద్దులుండరాదని, కనీసం వాటిని తగ్గించాలని, హేతుబద్ధమైన ట్యారిఫ్లు అమలయ్యేలా చూడా లని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వర్ధమాన దేశాలకు సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ (జీఎస్పీ) కింద దిగుమతి చేసుకునే కొన్ని సరుకులపై సుంకాలు తగ్గుతాయి. ఇతర దేశాల ఉత్పత్తులను సైతం సమానంగా చూసే దేశాన్ని అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్)గా పరిగణించే సూత్రం డబ్ల్యూటీవో పాటిస్తోంది. ఇవన్నీ ట్రంప్కు కంటగింపుగా ఉన్నాయి. సంస్థ నిబంధనల్లో ఉన్న లొసుగులు అమెరికాను దెబ్బతీస్తూ వేరే దేశాలకు తోడ్పడుతున్నాయని ఆరోపించటం అందుకే! ఇంతకూ ట్రంప్ నిజంగానే అన్నంత పనీ చేస్తారా? అలాచేస్తే అమెరికా వాణిజ్యం ఏమవు తుంది? ట్రంప్ హెచ్చరించి 24 గంటలు కాకుండానే పొరుగునున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గట్టి జవాబే ఇచ్చారు. కెనడా, మెక్సికోల ఉత్పత్తులపై 25 శాతం ట్యారిఫ్ విధించే ఆలోచన చేస్తున్నా మని, బహుశా ఫిబ్రవరి 1 నుంచి అది అమలుకావచ్చని ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ అదే జరిగితే తమ నుంచి కూడా ప్రతీకారం ఉంటుందని, అమెరికా వినియోగదారులు భారీయెత్తున నష్ట పోవాల్సి వస్తుందని ట్రూడో హెచ్చరించారు. కెనడా నుంచి అమెరికా 34 అత్యవసర ఖనిజాలు, లోహాలు దిగుమతి చేసుకుంటున్నది. అలాగే అమెరికా నుంచి భారీ యంత్రాలూ, సహజవాయువు, విద్యుత్, ముడి చమురు, పండ్లు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు కొనుగోలు చేస్తోంది. నిత్యం 270 కోట్ల డాలర్ల విలువైన సరుకులు, సేవలు అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ వెళ్తుంటాయి. భిన్న వాతావరణ పరిస్థితులున్నప్పుడు కావలసిన సమస్తాన్నీ ఏ దేశమూ సొంతంగా ఉత్పత్తి చేసు కోవటం సాధ్యం కాదు. ఈ సంగతి ట్రంప్కు తెలియదనుకోలేం. క్రితంసారి అధ్యక్షుడిగా ఉన్న ప్పుడు అమెరికా ఉత్పత్తి చేస్తున్న ఖరీదైన హార్లీ–డేవిడ్సన్ బైక్లపై సుంకాలు తగ్గించాలని మన దేశంపై ఒత్తిళ్లు తెచ్చారు. తీరా తగ్గించాక చాలదని పేచీ పెట్టారు. ప్రతీకారంగా మన ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం అదనపు టారిఫ్లు విధించారు. దీనికి ప్రతిగా మన దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలు పెంచింది. ట్రంప్ అక్కడితో ఆగలేదు. జీఎస్పీ నిబంధనలు భారత్కు వర్తింపజేయొద్దని డబ్ల్యూటీవోకు లేఖ రాశారు. మనం భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ దేశాలపై మరింతగా ట్యారిఫ్ వడ్డింపులు ఉంటాయని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. బ్రిక్స్లో ఉన్న రష్యా, చైనాలు దానివల్ల దండిగా లాభపడతాయని, శక్తి మంతంగా రూపుదిద్దుకుంటాయని ఆయన ఆందోళన. ఉన్నంతలో మనను ఆ సంస్థకు దూరం చేయాలన్నది ట్రంప్ లక్ష్యంగా కనబడుతోంది. అయితే తెగేదాకా లాగే ధైర్యం ట్రంప్కు ఉందా అన్నది సందేహమే. ఎందుకంటే 2019లో చైనా ఎగుమతులపై 30 వేల కోట్ల డాలర్ల సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించిన వెంటనే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడం ఆపేయాలని తమ పబ్లిక్రంగ సంస్థలకు చైనా సూచించింది. ఆ వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. మళ్లీ ట్రంప్ రంగంలోకి దిగి చైనాపై సుంకాల పెంపు ఇప్పట్లో ఉండబోదని ప్రకటించాకగానీ పరిస్థితి కుదుటపడలేదు. తన ప్రకటనల పర్యవసానం ఎలావుంటుందో ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. 1930లో అమెరికా తీసుకొచ్చిన టారిఫ్ చట్టానికి ప్రతీకారంగా ఎవరికి వారు వాణిజ్య ఆంక్షలు అమలు చేయటం పెను సంక్షోభానికి దారితీసిన సంగతి ట్రంప్ గుర్తుంచుకోవాలి. ఈ పరస్పరహననం వల్ల ఎన్నో దేశాల జీడీపీలు భారీయెత్తున పడిపోవటం పర్యవసానంగానే అప్పట్లో అన్ని చోట్లా అశాంతి, అపనమ్మకం ప్రబలాయి. దీన్ని హిట్లర్ వంటి నియంతలు చక్కగా వినియోగించు కున్నారు. జాతి విద్వేషాలు, జాతీయ దురభిమానాలను రెచ్చగొట్టారు. సహజ వనరుల వినియోగం పెరగటం, సాంకేతికతల అభివృద్ధి జరగటం తదితర కారణాల వల్ల కొంత హెచ్చుతగ్గులతో చాలా దేశాలు అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో వంటి సంస్థల వెనకుండి ప్రపంచ వాణి జ్యాన్ని శాసించినవారే, లాభపడ్డవారే ఇప్పుడు ‘అమెరికా ఫస్ట్’ అంటూ స్వరం మారిస్తే ఇతర దేశాలు సాగిలపడాలా? ‘అమెరికా మితిమీరినా డబ్ల్యూటీవో ద్వారా వివాద పరిష్కారానికి గల అవకాశాలను వినియోగించుకోండి. తీవ్ర చర్యలొద్దు’ అని ఇతరేతర దేశాలకు డబ్ల్యూటీవో సంస్థ డైరెక్టర్ జనరల్ గోజీ ఒకాంజో ఇవేలా హితవు చెబుతున్నారు. మంచిదే! మరి ట్రంప్కు చెప్ప గలవారెవరు? ఆయనను నియంత్రించగలిగేదెవరు? -
రసవత్తరంగా ఢిల్లీ రణం
శీతలగాలులు కమ్మేసిన సమయంలోనూ దేశ రాజధాని ఎన్నికల హంగామాతో వేడెక్కుతోంది. ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ పక్షాల ‘ఉచిత హామీల’ వ్యూహం ఊపందుకుంది. మహిళా ఓటర్లను కేంద్రంగా చేసుకొని ఎన్నికల మేనిఫెస్టోలలో పార్టీలు పోటా పోటీగా వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. 2012 నుంచి ఢిల్లీలో ఆధిపత్యం చూపుతున్న అధికార ఆప్, దాని ప్రధాన ప్రత్యర్థి బీజేపీలు రెండూ ఏక తీరున ఎడాపెడా హామీలిస్తుంటే, పోగొట్టుకున్న పట్టును వెతుక్కుంటూ కాంగ్రెస్ కొత్త ఉచితాల ప్రకటనలతో ఊపిరి పీల్చుకోవాలని చూస్తోంది. ఆప్ తన మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్లందరికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యచికిత్స, ఆటోడ్రైవర్లకు 5 గ్యారెంటీలు, అద్దెకున్నవారికి సైతం ఉచిత విద్యుత్, నీటి పథకం వర్తింపు లాంటివి ప్రకటించింది. బీజేపీ తన మేనిఫెస్టోలో హోలీ, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు, గర్భిణు లకు రూ. 21 వేలు, ప్రతి నెలా మహిళలకు రూ. 2.5 వేలు సహా పలు హామీలిచ్చింది. ఇప్పటికే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని బీజేపీ తోసిపుచ్చకపోవడం ఢిల్లీ నమూనాను సమర్థించ డమేనని ఆప్ ఎద్దేవా చేస్తుంటే... బీజేపీ మాత్రం ఆప్ మాటలు ధయాధర్మం చేస్తున్నామన్నట్లున్నా యనీ, తమది మాత్రం సమాజ సమగ్రాభివృద్ధికై సాగిస్తున్న సంక్షేమ వాగ్దానమనీ వాదిస్తోంది. వెరసి, మాటల యుద్ధంతో 70 స్థానాల ఢిల్లీ పీఠానికి పోటీ రసవత్తరంగా మారింది. 1993 నవంబర్లో తొలి ఢిల్లీ శాసనసభ ఏర్పాటైంది. అప్పటి నుంచి గమనిస్తే, ప్రజా ఉద్య మాలు పెల్లుబికిన ప్రతిసారీ జాతీయ రాజధానిలో అధికారం చేతులు మారిందని విశ్లేషణ. 1998లో షీలా దీక్షిత్ అధికారంలోకి వచ్చినా, 2013లో ఆమెను గద్దె దింపి అరవింద్ కేజ్రీవాల్ పీఠమెక్కినా... ప్రతి అసెంబ్లీ ఎన్నిక ముందు ఏదో ఒక ప్రజాందోళన జరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తుంటారు. 1998 నవంబర్లో ఎన్నికలైనప్పుడు అంతకంతకూ పెరుగుతున్న ధరలు సహా ప్రజల కోపకారణాలే ఊతంగా షీలా అధికారంలోకొచ్చారు. అంతకు కొద్దినెలల ముందు లోక్సభ ఎన్నికల్లో మంచి విజయం సాధించిన బీజేపీ తీరా ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, 2013లో నిర్భయ కేసులో ప్రజ్వరిల్లిన ప్రజాగ్రహం, అవినీతి అంశాల ఆసరాతో, ఉచిత విద్యుత్, నీటి సరఫరా హామీలు అండగా కేజ్రీవాల్ జయకేతనం ఎగరేశారు. సంక్షేమ పథకాలతో 2015, 2020లోనూ గట్టెక్కారు. పదేళ్ళ పైగా ‘ఆప్’ అధికారంలో ఉన్నందున ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత సహజమే. దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలూ వాడుతోంది. కాంగ్రెస్ సైతం తానేమీ తక్కువ కాదన్నట్టు వ్యవహరిస్తోంది. చిత్రమేమిటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంతున్నా అదేమీ పట్టనట్టు ఆప్, దాని అధినాయకత్వం ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఢిల్లీ ఓటర్ల మనసెరిగి ప్రవర్తించడంలో ఆరితేరిన అధికార పక్షం గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంక్షేమ పథకాలు, తాయిలాలతో వారిని ఆకట్టుకోగలిగింది. ఈసారి కూడా పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్య బీమా అందిస్తామంటూ ఆప్ భారీ వాగ్దానమే చేసింది. నిజం చెప్పాలంటే, ఇతర పార్టీలు సైతం తన దోవ తొక్కక తప్పని పరిస్థితిని కల్పించడంలో కేజ్రీవాల్ విజయం సాధించారు. ఒకప్పుడు ‘ఎన్నికల ఉచిత మిఠాయిలు’ అంటూ ఈసడించిన ప్రధాని మోదీ సైతం చివరకు ఢిల్లీలో వాటికే జై కొట్టడం గమనార్హం. ఆప్ మళ్ళీ పగ్గాలు పడుతుందా, లేక పొరుగున హర్యానాలో అనూహ్య విజయంతో ఆశ్చర్యపరిచిన బీజేపీ ఢిల్లీలోనూ ఆ మ్యాజిక్ చేస్తుందా అన్నది ఆసక్తికరం. చిరకాలంగా లోక్సభలో బీజీపీకీ, అసెంబ్లీలో ఆప్కూ అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న ఓటర్లు ఈసారీ అలాగే చేస్తారా అన్నది ప్రశ్న. ఆప్కు ఒకప్పుడున్న అవినీతి రహిత ఇమేజ్, సామా న్యులకు సానుకూలమనే పేరు ఇప్పుడు దెబ్బతిన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల వలలో పార్టీ నేతలు చిక్కగా, కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్తో ఘర్షణతోనే పుణ్యకాలం హరించుకు పోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే. ప్రతి ఎన్నికనూ జీవన్మరణ సమస్యగానే భావించే బీజేపీ ఎప్పటిలానే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో ముందుకొచ్చింది. నిరుటి లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి భాగస్వాములుగా సీట్ల పంపిణీతో చెట్టపట్టాలేసుకున్న ఆప్, కాంగ్రెస్లు ఈసారి పరస్పరం కత్తులు దూసుకోవడమూ విడ్డూరమే. మరోపక్క భుజాలపై పార్టీ కండువాలు మార్చిన నేతలు పలువురు కొత్త జెండాతో బరిలో అభ్యర్థులుగా నిలవడం కార్యకర్తలకూ, పార్టీ నేతలకే కాదు... ఓటర్లకూ చీకాకు వ్యవహారమే. ఇలాంటి 20 మంది నేతల భవితవ్యం ఢిల్లీ కొత్త పీఠాధిపతిని నిర్ణయిస్తుందని అంచనా. అవన్నీ ఎలా ఉన్నా ప్రధాన చర్చనీయాంశం మాత్రం ఉచిత హామీలే.సమాజంలో అంతరాలు అంతకంతకూ అధికమవుతున్న పరిస్థితుల్లో అణగారిన వర్గాల సముద్ధరణకు చేయూత నివ్వడం సమంజసం. అయితే, విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి రంగాల్లో పెట్టుబడులు పెంచి, అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడం దూరదృష్టి గల పాలకులు చేయాల్సిన పని. అవసరం లేని ఉచితాలపై మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల జాతరలో తాత్కాలికంగా పైచేయి అనుచితమైన ఉచితాలను పార్టీలు ప్రకటిస్తే, ఆ మాటలు నీటి మీది రాతలుగా మిగిలిపోతాయి. అథవా అమలు చేసినా, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, పాలనారథం తలకిందులయ్యే ప్రమాదమూ ఉంటుంది. అభివృద్ధి మంత్రానికీ, అధికారం కోసం పప్పుబెల్లాలు పంచాలనుకొనే ఉచితాల తంత్రానికీ నడుమ పోటీలో ఢిల్లీ జనం ఎటు మొగ్గుతారన్నది ఓట్ల లెక్కింపు జరిగే ఫిబ్రవరి 8న చూడాలి. -
ఆశయాన్ని దెబ్బతీసే ఆచరణ?
రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన విద్యారంగానికీ రంగులు అంటుకున్నాయి. కేంద్రం ఇటీవల జారీ చేసిన ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు – 2025’ ముసాయిదా చర్చ నీయాంశమైంది. విశ్వవిద్యాలయ ఉపకులపతుల ఎంపిక ప్రక్రియను సమూలంగా మార్చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెలువరించిన ఈ ముసాయిదా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో రచ్చ రేపుతోంది. ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యారంగంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పెత్తనం చేయాలనుకుంటున్నదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. తాజా యూజీసీ ముసాయిదా అందుకు నిదర్శనమన్నది వాటి భావన. రాష్ట్ర గవర్నర్ నిర్వాకమా అని ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో వీసీలు లేకుండా పోయిన తమిళనాడు ఈ ముసాయిదాను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతూ చట్టసభలో తీర్మానం చేయడం గమనించాల్సిన అంశం. వీసీల పదవీ కాలాన్ని మూడు నుంచి అయిదేళ్ళకు పెంచడం మంచిదే అయినా, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట కాషాయ భక్తుల్ని వీసీలను చేస్తారన్న అనుమానాలకు జవాబు దొరకడమే కష్టంగా ఉంది. ముసాయిదా ప్రకారం వైస్ఛాన్సలర్ల (వీసీల) నియామకం కోసం ముగ్గురు సభ్యుల అన్వేషణ, ఎంపిక కమిటీని నియమించే అధికారాన్ని ఛాన్సలర్లకు, అంటే కేంద్రసర్కార్ నియమించే ఆ యా రాష్ట్రాల గవర్నర్లకు కట్టబెట్టారు. ఒకవేళ మార్గదర్శకాలను గనక అమలు చేయకుంటే... సదరు విద్యా సంస్థను యూజీసీ పథకాల నుంచి, లేదంటే అసలు డిగ్రీ కోర్సులు చెప్పడానికైనా వీలు లేకుండా బహిష్కరించవచ్చు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు, సామాన్య ప్రజలు నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చెప్పాలని కేంద్రం కోరుతోంది. వైస్–ఛాన్సలర్ మాట అటుంచి, పాఠశాల నుంచి కాలేజ్లు, విశ్వవిద్యాలయాల దాకా విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ హోదానైనా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి (గవర్నర్)కి అసలెలా కట్టబెడతారన్నది తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురి ప్రాథ మిక ప్రశ్న. సమాఖ్య స్ఫూర్తినే దెబ్బ తీసేలా ఉన్న తాజా ముసాయిదాను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు చట్టసభల్లో తీర్మానాలు చేయాలని ఆయన ఏకంగా పిలుపునివ్వడం విశేషం. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా అనేక రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వా లకూ, పై నుంచి వచ్చిన గవర్నర్లకూ మధ్య నిత్య ఘర్షణ చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర సర్కార్లు నడిపే పలు విశ్వవిద్యాలయాల్లో సదరు గవర్నర్లే ఛాన్సలర్లు. వీసీల నియామకంపై వాళ్ళు రాష్ట్ర ప్రభు త్వాల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటి వరకు వీసీల నియా మక అన్వేషణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటుచేసేవి. తాజా ముసాయిదా ప్రకారం ఆ కమిటీల నియామకం సైతం ఛాన్సలర్లయిన గవర్నర్ల చేతిలోకి వెళ్ళిపోనుంది. ఢిల్లీ నుంచి తాము పంపే రబ్బరు స్టాంపులతో రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్ని సైతం తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ప్రయత్నమిది అని ప్రతిపక్షాల ఆరోపణ. కేంద్ర పాలకులు ఆ ఆరోపణల్ని నిజం చేయరాదు. నిజానికి, నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) అమలు చేస్తామంటూ కేంద్రం ప్రకటించి మూడున్నరేళ్ళు దాటినా, ఉన్నత విద్యాసంస్థల సంస్కరణ నేటికీ నత్తనడక నడుస్తోంది. దీర్ఘకాల లోపాల్ని సవరించి, ఆధునిక కాలానికీ, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ అవసరాలకూ తగ్గట్లు యూనివర్సిటీలను తీర్చిదిద్దాల్సి ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి నియంత్రణ వ్యవస్థయిన యూజీసీది అందులో ప్రధాన బాధ్యత. అతిగా నియంత్రిస్తోందంటూ గతంలో విమర్శలను ఎదుర్కొన్న యూజీసీ వైఖరి తాజా ముసాయిదాలో కొంత మారినట్టు కనిపిస్తోంది కానీ, కొత్త విమర్శలకు తావిచ్చింది. ఫలానా అంశం బోధించాలంటే అందులో పీజీ చేసి ఉండాల్సిందేనన్న అర్హత ప్రమాణాల్ని సడలించడం, వీసీ పదవికి పరిశ్రమలోని సీనియర్లు, ఉన్నతాధికారులకు సైతం వీలు కల్పించడం లాంటివి కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా,సంస్థాగత స్వతంత్రత ఎన్ఈపీ ప్రధానోద్దేశమైతే... తద్విరుద్ధంగా వీసీల నియామకంలో గవర్నర్లకు పెద్దన్న పాత్ర కల్పించడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ‘నీ ఎడమ చేయి తీయి... నా పుర్ర చేయి పెడతా’ అన్నట్టు ఇక వీసీల ఎంపికలో రాష్ట్రం బదులు కేంద్రం పట్టు బిగుస్తుందన్న మాట. పార్లమెంట్ చేసిన 1956 నాటి చట్టం ప్రకారం తన పరిధిలోకే రాని వీసీల ఎంపిక, నియామకాన్ని యూజీసీ నియంత్రించాలనుకోవడం సమస్యే కాదు రాజ్యాంగపరమైన చిక్కులు తెస్తుంది. గతంలో శాస్త్రవేత్త నాయుడమ్మ లాంటి వారిని వీసీలుగా నియమించినప్పుడు, వారి విజ్ఞానం విద్యాలయాలకు వన్నె తెచ్చింది. అలా చూస్తే, అధ్యాపక వర్గానికి ఆవల ఉన్న వృత్తి నిపుణులకు సైతం తలుపులు తెరవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో ప్రతిభావంతుల సమూహం పెరగడం మంచిదే. యూనివర్సిటీల్లో నియామక నిబంధనల్ని సరళం చేయడం స్వాగతించాల్సిందే. కానీ, ఇప్పుడైనా, అప్పుడైనా వీసీ పదవిని రాజకీయ నియామకంగా మార్చడంతోనే అసలు సమస్యంతా! వీసీల నియామకాల్లో రాజ్భవన్ను కీలకంగా మార్చడమన్నది అసలు ఎన్ఈపీ లక్ష్యాలకే విరుద్ధం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ మధ్య నలిగి పోతున్నాయి. వీసీల ఎంపిక సైతం గవర్నర్ల చేతికొచ్చాక పరిస్థితేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉన్నత విద్యాలయ ప్రాంగణాన్ని నడిపే ఉత్తముడి ఎంపిక ఇటు రాష్ట్రం, అటు కేంద్రాల రాజకీయ ఒత్తిళ్ళకు అతీతంగా ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. -
భవిష్యత్తు బంగారమేనా?
అనుకున్నదే అయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూనే డొనాల్డ్ ట్రంప్ తన మాటలు, చేతలు, చేష్టల ద్వారా సంచలనాలు సృష్టించారు. గతంలో దేశానికి 45వ అధ్యక్షుడిగా పనిచేసి, తాజాగా 47వ అధ్యక్షుడిగా సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే ‘ఇక నుంచి అమెరికాకు స్వర్ణయుగం’ అంటూ అమెరికన్లలో ఆశలు, ఆకాంక్షలు పెంచారు. అయితే, ‘అమెరికాను మళ్ళీ ఘనమైన దేశంగా తీర్చిదిద్దాల’ని (మాగా) నినదిస్తూ ఆయన ప్రకటించిన కొన్ని చర్యలు ఆధిపత్య, విస్తరణవాదానికి ప్రతీకగానూ ప్రతిధ్వనించాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని మార్చివేసే పలు చర్యలకు నడుం బిగి స్తున్న తీరు, అలాగే కోవిడ్, చైనాలను సాకుగా చూపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, అలాగే పర్యావరణ రక్షణపై ప్యారిస్ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం పైకి సాదాసీదా అధికార మార్పిడిగా అనిపించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులు సైతం చిరునవ్వులు చిందిస్తూ సౌహార్దం చూపుకుంటున్నట్టు కనిపించవచ్చు. అంతమాత్రాన అంతా మామూలే అనుకొంటే పొరపాటు. పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో దర్శనమిచ్చిన ఐక్యతకు భిన్నంగా ప్రత్యర్థులపై తుపాకులు ఎక్కుపెట్టిన తీరు ఆయన ప్రసంగంలో స్పష్టంగా వినిపించింది. కునారిల్లిన దేశాన్ని తాను మాత్రమే మళ్ళీ పునరుత్తేజితం చేయగలనన్న భావన కలిగించడంతో పాటు ఆయన ఒకటికి రెండు జాతీయ ఎమర్జెన్సీలు ప్రకటించడం పెను పర్యవసానమే. అలాగే, చైనా నుంచి పనామా కాలువను వెనక్కి తీసుకోవాలని పిలుపునివ్వడమూ వివాదాస్పదమే. బలప్రయోగం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అలాంటి పనుల ప్రస్తావన నిప్పుతో చెలగాటానికి సిద్ధమని స్పష్టం చేయడమే. ఇక, గద్దెనెక్కిన తొలిరోజునే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా ట్రంప్ ప్రకటించడంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా మరెన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్విగ్నత నెలకొంది. పదవి చేపడుతూనే ట్రంప్ చకచకా సంతకాలు చేసిన పదుల సంఖ్యలోని కార్యనిర్వాహక ఆదేశాలు ఆసక్తికరం. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేయడం, జన్మహక్కుగా సంక్రమించే పౌర సత్వంపై అమెరికా రాజ్యాంగాన్ని సైతం తోసిపుచ్చడం లాంటివి ఇట్టే మింగుడుపడే అంశాలు కావు. జాతీయతతో సంబంధం లేకుండా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి పుట్టినబిడ్డలకు సైతం 150 ఏళ్ళ పైచిలుకుగా అమెరికా పౌరసత్వం దక్కుతూ వచ్చింది. కానీ, నెల రోజుల్లో అమలులోకి రానున్న తాజా ఆదేశం ఫలితంగా ఇప్పుడిక అలాంటి పిల్లలకు పౌరసత్వ పత్రాలివ్వరు. అదేమంటే, 1868లో చేసిన 14వ సవరణ కింద అమెరికా గడ్డపై పుడితేచాలు ఆ పిల్లలకు మారుమాట లేకుండా పౌరసత్వమివ్వాలనేమీ లేదనీ, సవరణను తప్పుగా వ్యాఖ్యానించారనీ ట్రంప్ వాదన. తాత్కాలిక వీసాలతో అమెరికాలో నివసిస్తూ, ఉద్యోగాధారిత గ్రీన్కార్డ్కై దీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న 10 లక్షల పైచిలుకు మంది భారతీయులకు ఈ కొత్త నిర్ణయం అశనిపాతమే. ఇప్పటికే కొన్నిచోట్ల ఇమ్మిగ్రేషన్ లాయర్లు కోర్టుకెక్కిన ఈ ఆదేశం గనక అమలైతే, తాత్కాలిక వర్క్ వీసాలు, టూరిస్ట్ వీసాలపై అగ్రరాజ్యంలో ఉంటున్నవారి సంతానానికి అక్కడి పౌరసత్వ ఆశలు అడుగంటినట్లే. 2022 నాటి అమెరికా జనాభా లెక్కలపై ప్యూ రిసెర్చ్ విశ్లేషణ ప్రకారం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లుంటే, వారిలో మూడింట రెండొంతుల మంది వలసజీవులే. కేవలం 34 శాతం, మరో మాటలో 16 లక్షల మంది మాత్రం అగ్రరాజ్యంలోనే పుట్టారు. ఇక, చట్టవిరుద్ధమైన వలసల్ని అడ్డుకుంటాననీ, సరైన పత్రాలు లేని లక్షలాది వలస జీవుల్ని దేశం నుంచి పంపివేస్తాననీ ట్రంప్ చేసిన గర్జన కూడా లక్షలమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ జాబితాలో మెక్సికో (40 లక్షలు), ఎల్ సాల్వడార్ (7.5 లక్షలు) తర్వాత 7.25 లక్షల మంది భారతీయులదే మూడో స్థానం. ఫలితంగా, ట్రంప్ ప్రతి మాట, ప్రతి అడుగు మనవాళ్ళలో ఆదుర్దా పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ కొత్త ఏలుబడిలో భారత్తో బంధం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. మరోపక్క డెమోక్రాట్లను జనం బాధలు పట్టని కులీనులుగా చిత్రించి, సామాన్య పౌరుల సంరక్ష కుడిగా ఎన్నికల్లో తనను తాను చూపుకొన్న ట్రంప్ను అతిగా నమ్మి మోసపోయామనే భావన రేకెత్తడం సహజమే. చేతిలోని నియంత్రణ నిర్ణయాలే అండగా ఇటీవలే ఓ బ్రాండెడ్ క్రిప్టో టోకెన్ ద్వారా ఆయన వందల కోట్ల డాలర్ల లబ్ధి పొందాడనే విమర్శలూ గుప్పుమంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ళ తర్వాత కీలక సమయంలో పగ్గాలు చేపట్టిన ట్రంప్ తన మద్దతుదారులకై ఏమైనా చేసేలా ఉన్నారు. 2021లో అమెరికా అధ్యక్ష భవనంపై దాడి చేసిన దాదాపు 1500 మంది దుండగులకూ ఆయన తక్షణం సామూహిక క్షమాభిక్ష ప్రసాదించడమే అందుకు తార్కాణం. నాలుగేళ్ళు విచారించి, శిక్షలు వేసిన న్యాయవ్యవస్థను అలా నూతన అధ్యక్షుడు పరిహసించినట్టయింది. ఆశ్రితులు, ఆర్థిక దాతలు, బంధు మిత్రులకై క్షమాభిక్ష వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో నిన్నటి బైడెన్ నుంచి నేటి ట్రంప్ దాకా అందరూ ఒకే తాను గుడ్డలన్న మాట. కాలు మోపిననాడే కాపురం చేసే లక్షణం తెలిసిందన్నట్టు ట్రంప్ 2.0 హయాం ఆరంభమవు తూనే రోజులు ఎలా ఉండనున్నాయో తేటతెల్లమైంది. బహుళ ధ్రువ ప్రపంచం వైపు అంతర్జాతీయ అధికార క్రమం అడుగులేస్తున్న కాలంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో ట్రంప్ ఆధిపత్యభావ నిర్ణయాలు రానున్న నాలుగేళ్ళలో ప్రపంచాన్ని కుదిపేయడం ఖాయం. -
తప్పు ఎవరిది? శిక్ష ఏమిటి?
దేశాన్ని అట్టుడికించిన కేసులో కోర్టు తీర్పు వెలువడింది. తీరా తీర్పు సైతం ఆ కేసులానే చర్చకు దారి తీస్తోంది. కోల్కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలోని సెమినార్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ డాక్టర్పై గత ఆగస్ట్ 9న జరిగిన దారుణ హత్యాచార ఘటనపై తాజా తీర్పు సహేతుకం కాదనే విమర్శ వినిపిస్తోంది. ఆస్పత్రిలో వాలంటీరైన సంజయ్ రాయ్ భారతీయ న్యాయ సంహిత లోని వివిధ సెక్షన్ల కింద నేరస్థుడంటూ శనివారమే కోర్ట్ ప్రకటించేసింది. కానీ, ఈ కేసులో అతనికి ఉరిశిక్ష బదులుగా యావజ్జీవ కారాగారవాస శిక్ష మాత్రమే విధిస్తున్నట్టు సియాల్డాలోని అడిషనల్ జిల్లా, సెషన్స్ కోర్ట్ సోమవారం తీర్పు చెప్పేసరికి మళ్ళీ తేనెతుట్టె కదిలింది. బెంగాల్లోని మమతా బెనర్జీ సర్కారే కాక, అటు కేంద్ర నేరదర్యాప్తు సంస్థ (సీబీఐ), ఇటు బాధితురాలి కుటుంబం సైతం నేరస్థుడికి ఉరిశిక్ష విధించాలంటూ వాదించింది. కానీ, అంతటి తీవ్ర శిక్ష విధించేందుకు హేతుబద్ధత లేదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం గమనార్హం. దాంతో, మహిళా లోకంలో, బాధిత, వైద్య వర్గాల్లో అసహనం కట్టలు తెంచుకుంది. సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలే అందుకు నిదర్శనం.హత్యాచారానికి గురైన ఆడకూతురు, ఆమె కుటుంబం బాధను ముగ్గురు ఆడపిల్లలకు తల్లినైన తాను అర్థం చేసుకోగలనంటూ నేరస్థుడి తల్లే స్వయంగా అనడం గమనార్హం. కన్నకొడుకైనా సరే నేరం రుజువైతే, శిక్ష పడాల్సిందేనని ఆ మాతృమూర్తి అన్న మాటలు జరిగిన ఘటన రేపిన భావోద్వేగాలను గుర్తు చేస్తుంది. పైపెచ్చు, ఆగస్ట్ 9 తర్వాత బెంగాల్లో అయిదు హత్యాచార ఘటనల్లో, మైనర్లపై దారుణానికి పాల్పడ్డ నేరస్థులకు ‘పోక్సో’ కోర్టులు ఏకంగా మరణశిక్షే విధించాయి. అందుకే, ఈ కేసులోనూ నేరస్థుడికి ఉరిశిక్ష పడుతుందనీ, పడాలనీ బలమైన భావన వ్యాపించింది. అయితే జరిగింది వేరు. బెంగాల్నే కాక అప్పట్లో భారత్ మొత్తాన్నీ కదిలించిన ఈ ఘటనలో బాధిత కుటుంబానికి రూ. 17 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ ఘటన ఉరిశిక్ష విధించాల్సినంత అత్యంత అరుదైన కేసు ఏమీ కాదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. బెంగాల్ ఏలిక మమతా బెనర్జీ సైతం తీర్పుతో సంతృప్తికరంగా లేమంటూ కుండబద్దలు కొట్టేసి, తీర్పుపై హైకోర్టుకు వెళతామని తేల్చేశారు. సర్వసాధారణంగా నేరం తాలూకు తీవ్రత, సమాజంపై దాని ప్రభావం, నేరస్థుడి గత చరిత్ర, ప్రవర్తన లాంటివన్నీ మరణశిక్ష విధింపునకు ప్రాతిపదిక అవుతాయి. అయితే, గౌరవ న్యాయస్థానం తన ముందున్న సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే ఎలాంటి తీర్పునైనా ఇస్తుంది. తీర్పు చెబుతూ న్యాయమూర్తి సైతం ఆ మాటే అన్నారు. అంతేతప్ప, మీడియాలో సాగుతున్న ప్రచారం సహా ఇతరేతర కారణాలను బట్టి శిక్షపై నిర్ణయం తీసుకోవడం జరగదు. కాబట్టి, తగినంత బలమైన సాక్ష్యాధారాలు లేనందు వల్లనే ఈ కేసులో నేరస్థుడికి కోర్ట్ మరణశిక్ష విధించలేదా అన్నది ఆలోచించాల్సిన అంశం. తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ ఆ అంశంపై మరింత స్పష్టత రాదు. ఆస్పత్రి సిబ్బంది భద్రత కోసం పనిచేయాల్సిన వాలంటీర్ రాయ్ అసలు తన ఉద్యోగ ధర్మాన్నే మంటగలిపి, కాపాడాల్సిన డాక్టర్నే కాటేశాడన్నది చేదు నిజం. అతడు చేసిన నేరం ఘోరం, హేయమన్నదీ నిర్వివాదాంశం. అయితే, హత్యాచారానికి పాల్పడ్డ సదరు నేరస్థుడు జీవితంలో మారే అవకాశం లేదంటూ ప్రాసిక్యూషన్ బలంగా వాదించలేక పోయింది. ఆ మాటను నిరూపించలేక పోయింది. అది కూడా శిక్ష విషయంలో నేరస్థుడికి కలిసొచ్చిందని నిపుణుల మాట.కోల్కతా కేసు దర్యాప్తు ఆది నుంచి అనుమానాలకు తావివ్వడం దురదృష్టకరం. నిజానిజా లేమో కానీ, అత్యంత హేయమైన ఈ ఘటనలో శిక్షపడ్డ నేరస్థుడే కాక, ఇంకా పలువురి హస్తం ఉంద నేది అందరి నోటా వినిపిస్తున్న మాటే. స్థానిక పోలీసుల నుంచి చివరకు సీబీఐ చేతుల్లోకి దర్యాప్తు వెళ్ళినా జనంలో అనుమాన నివృత్తి కాలేదన్నది నిష్ఠురసత్యం. సీసీ టీవీ దృశ్యాల్లో 68 దాకా రాకపోకలు కనిపించినా, రాయ్ ఒక్కరినే గుర్తించారన్న ఆరోపణలే అందుకు సాక్ష్యం. పనికి మాలిన రీతిలో దర్యాప్తు జరిగిందనీ, పలుకుబడి గల బడాబాబులు తప్పించుకున్నారనీ, ఆఖరికి ఒకడే నేర స్థుడని తీర్మానించి యావజ్జీవ ఖైదుతో సరిపెట్టారనీ విమర్శలు వెల్లువెత్తడానికి కారణమూ అదే. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సహా పలువురి వ్యవహారశైలి, ఆశ్రిత పక్ష పాతం, అవినీతి ఆరోపణలు, ఆస్పత్రి యంత్రాంగం పనితీరు, వగైరా... ఎన్నో ప్రశ్నల్ని ముందుకు తెచ్చాయి. సాక్ష్యాధారాల తారుమారు యత్నంలో ప్రిన్సిపాల్ను సీబీఐ అరెస్ట్ చేసినా, నిర్ణీత 90 రోజుల వ్యవధిలో ఛార్జ్షీట్ దాఖలు చేయకపోయే సరికి నిష్పూచీగా ఆయన బయటకొచ్చారంటే మన నిఘా, దర్యాప్తు సంస్థలు ఎంత ఘనంగా పనిచేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కీలకమైన మరో విషయం – ఈ ఘటనకు కారణమైన పరిస్థితులు. ప్రగతి బాటలో ముందున్నా మనే దేశంలో... పనిప్రదేశాల్లో సైతం మహిళలకు రక్షణ కొరవడడం, ఉద్యోగస్థలాలు స్త్రీలకు సురక్షితంగా లేకపోవడం శోచనీయం. కోల్కతా ఘటనతో పార్టీలు, ప్రజలు కదం తొక్కిన మాట నిజమే కానీ, ఇప్పటికైనా ఈ పరిస్థితుల్ని సమూలంగా మార్చాల్సిన అవసరం పాలకులకుంది. అవినీతి పంకిలమై, లోపభూయిష్ఠంగా నడుస్తున్న అనేక వ్యవస్థల్ని చక్కదిద్దాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనే కోర్టులు ఉన్నంతలో సత్వర న్యాయం అందించడం, ప్రజాభిప్రాయం కన్నా ప్రత్యక్ష సాక్ష్యాలే ప్రాతి పదికగా తీర్పులివ్వడం ఆహ్వానించదగ్గదే. అయితే, చాలా సందర్భాల్లో న్యాయం చెప్పడమే కాదు... న్యాయమే చేస్తున్నట్టు కనిపించడం ముఖ్యం. ఈ కేసులో అది జరిగిందా అన్నదే పలువురి ప్రశ్న. -
పనీ – పాటా
పనీ–పాటా అనే నుడికారం ఊరికే పుట్టలేదు; శ్రామిక సంస్కృతిలో పని లేకుండా పాటా, పాట లేకుండా పనీ ఉండవు; అవి అన్యోన్యాలు. పాడుకుంటూ పనిచేస్తే పనిభారం తగ్గుతుందంటారు; అందుకే, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపూసొలుపేమున్నదని ఓ సినీకవి అన్నాడు. అసలు పాట రూపంలో కవిత్వమే కానీ, అభినయ రూపంలో నృత్య, నాటకాలే కానీ, ఆమాటకొస్తే ఇతర కళారూపాలే కానీ పుట్టింది పనితోనేనని పండితులు తేల్చారు. వైయక్తిక, సామూహిక శ్రమలో భాగమైన శారీరక చర్యలను కళారూపాలు అంటిపెట్టుకునే ఉండేవన్నారు. పనినీ, పాటనూ విడదీసి చూడడం నాగరికత ముదిరిన తర్వాతే వచ్చింది. పాట అనేది పనిలేనప్పుడు పాడుకునే వ్యాపకమైంది. రానురాను పాటను పక్కన పెట్టి పనికి మాత్రమే పట్టం కట్టే స్థితికి దారితీసి; తాజాగా వారానికి 70 గంటలు పనిచేయాలని ఒకరంటే, కాదు 90 గంటలు పనిచేయాలని మరొకరు అనే వరకు వెళ్లింది. కొన్నిరోజులుగా ఇదే పెద్ద చర్చనీయాంశం. మనిషితో సహా సమస్త జీవరాశితోనే పని కూడా పుట్టింది; అది కర్మగా మారి కర్మయోగంగా తాత్విక శిఖరానికీ చేరింది; దాంతోపాటు కలలూ, కన్నీళ్ళ చరిత్రనూ మూటగట్టింది. వేల సంవత్సరాల వెనకటి వేట–ఆహార సేకరణ జనాల జీవనంలోకి తొంగి చూస్తే, వారు వారానికి పదిహేను గంటలే పనిచేసేవారని మానవశాస్త్ర నిపుణులంటారు. వారిది మొరటుదనం, అజ్ఞానం మూర్తీభవించిన దుర్భర జీవితమని కొందరంటే; కాదు, ఆ తర్వాతి కాలానికి చెందిన వ్యవసాయ జీవనంతో పోల్చితే వేట–ఆహారసేకరణ జనాలది అత్యున్నత సంస్కృతికి చెందిన సంపన్న సమాజమనీ, తగినంత తీరిక ఉండడమే అందుకు కారణమనీ మరికొందరు అన్నారు. ప్రకృతిని అధ్యయనం చేయడానికీ, చంద్రుడి వృద్ధిక్షయాలపై ఆధారపడిన కాలగణనాన్ని కూర్చడానికీ, కళారూపాల అభివృద్ధికీ ఆ తీరిక తోడ్పడిందనీ, వారే తొలి శాస్త్రవేత్తలూ, కళాకారులనీ – అప్పటి అనేక గుహా చిత్రాలు, కుడ్యచిత్రాల ఆధారంగా నిపుణులు నిరూపించారు. వ్యవసాయ జీవనం నుంచీ ఆ తీరిక అడుగంటి పారిశ్రామిక యుగానికి వచ్చేసరికి వారానికి 80 నుంచి 100 గంటలు పనిచేయవలసిన దుఃస్థితి దాపురించి, ఆ నిర్బంధ శ్రమకు వ్యతిరేకంగా ఉద్యమాలు తలెత్తడంతో వారానికి 40 గంటల పని ప్రామాణిక కొలమానంగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది. నిజానికి పనీ–తీరికా అనేవి ఏదో ఒక నిర్ధారణకో, ఒకే ఒక్క నిర్వచనానికో అందని సంక్లిష్ట అనుభవాలు. ప్రతిసారీ పనిభారాన్ని దాని పరిమాణంతోనూ, గంటలతోనూ తూచలేం. ఇష్టంతో స్వచ్ఛందంగా చేసే పని అలాంటి కొలతలనూ, శ్రమనూ కూడా అధిగమిస్తుంది. నిర్బంధంగా విధించే పని తక్కువ పరిమాణంలో ఉండి, తక్కువ సమయాన్ని తీసుకునేదైనా భారంగానే తోస్తుంది. స్వతంత్రంగా కొయ్యపని చేసుకుంటూ అందులో కళాత్మకతనూ, తృప్తినీ ఆస్వాదించిన ఒక వడ్రంగి ఒక ఫ్యాక్టరీ కార్మికుడిగా మారడంతోనే వాటిని కోల్పోయి ఎలా నిరాసక్తంగా మారాడో కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో చిత్రిస్తారు. పనిగంటలు పెరిగితే ఉత్పాదకత పెరుగుతుందనుకోవడమూ సత్యదూరమేనని చెప్పి, ఐస్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్ లాంటి దేశాల అనుభ వాన్ని ఉటంకించేవారూ ఉన్నారు. వారానికి 30–35 గంటల పనితోనే ఈ దేశాలు ఉత్పాదకత లోనూ, సంతోషభరిత జీవనంలోనూ అగ్రస్థానం వహించడాన్ని వారు ఉదాహరిస్తున్నారు. పనీ–తీరికలలో ఏది ఎక్కువైనా జీవనశకటం ఒకవైపే ఒరిగిపోయి జీవితమే అస్తవ్యస్తమవుతుంది. జీవిక కోసమే మొత్తం సమయాన్ని వెచ్చిస్తే, జీవించడమే మరచిపోతామని ఒక సూక్తి. అన్నిటా సమతూకం పాటించడంలోనే సంతోష రహస్యం ఇమిడి ఉందన్నది మరొక ఉద్బోధ.అందుకే, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నారు; అదే అన్ని సందర్భాలకూ వర్తించే సార్వకాలిక సూత్రం. నిజానికి పనికీ–తీరికకీ మధ్య అన్యోన్యతా, పరస్పరతా ఉన్నాయే తప్ప వైరుద్ధ్యం లేదని, దేని విలువ దానిదేనని అనేవారూ ఉన్నారు. కుటుంబ సభ్యులతోనూ, విందు వినోదాలతోనూ ఆహ్లాదంగా గడిపే తీరిక సమయం పనిలో నిమగ్నతకూ, నాణ్యతకూ, ఉత్పాదకత పెరగడానికే తోడ్పడుతుందంటారు. పనిలో ఇతర దేశాలతో పోటీ, అభివృద్ధీ అనేవి కొత్తగా వచ్చాయి. దేశాభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించడానికి పని గంటలు పెంచాలనడం పూర్తిగా కొట్టిపారవేయవలసినదేమీ కాదు. కాకపోతే, ఇతర అనేకానేక దృష్టికోణాలను, వాస్తవాలను విస్మరించి ఏకపక్షంగా అలాంటి అభిప్రాయానికి రావడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది ఒక విమర్శ. అభివృద్ధిలో పోటీ పడవలసిందే కానీ, ఇక్కడి మానవవనరుల అందుబాటునూ, వాటి అభివృద్ధినీ కూడా పరిగణనలోకి తీసుకుని తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలనే వాదన వినిపిస్తోంది. వివిధ రంగాలలో ఇప్పటికే పెరిగిన పని భారం ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందనీ, అందువల్ల ఉత్పాదకత మందగిస్తోందనీ ఆయా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇంకోవైపు దేశంలో నిరుద్యోగం రేటు పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కనుక, పని గంటలను పెంచడం కన్నా పని చేసే చేతుల సంఖ్యను పెంచి పనిని పంచడమే అత్యుత్తమ పరిష్కారమనీ; అందుకు అవసర మైన అన్నిరకాల శిక్షణ సదుపాయాలనూ అభివృద్ధి చేయాలనే వాదన ముందుకు వస్తోంది. పని నుంచి పాటను వేరు చేసినప్పుడు చిన్న పని కూడా పెనుభారమే అవుతుంది. పనికి పాటను జోడించడమే దానిని తేలికచేసే మార్గం. పనీ–పాటా కలిసినప్పుడు... పనే పాటవుతుంది! -
అప్పారావు చిటికెల పందిరి!
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఏడు మాసాలు పూర్తి చేసు కొని ఎనిమిదో నెలలో ప్రవేశించి ఓ వారం గడిచిపోయింది. అష్టమంలోకి బుధుడు ఎంట్రీ ఇచ్చినట్టున్నాడు. గణాంకాలూ, లెక్కలూ వగైరా సబ్జెక్టులు బుధ గ్రహం పోర్టుఫోలియోలని చెబు తారు. అవసరమున్నా లేకపోయినా సరే ఈ మధ్య ముఖ్య మంత్రి సంపద సృష్టి లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. ఇలా ఆర్థిక శాస్త్ర అధ్యాపకుని అవతారం ఎత్తడం వెనుక ఆయన మనో భావాలేమిటో గ్రహించాలి.కొత్త ప్రభుత్వ పనితీరును మొదటి ఆరు మాసాలపాటు జనం పెద్దగా పట్టించుకోరని మన రాజకీయ నాయకులు అభిప్రాయపడతారు. ఏడో నెల నుంచి మాత్రం నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. అందుకే కొత్త ప్రభుత్వాలకు తొలి ఆరు నెలలు ‘హనీమూన్ పీరియడ్’ అనే ముద్దుపేరును తగిలించుకున్నారు. ఆ మురిపాల కాలం కరిగిపోయి ఐదు వారాలైంది. జనం ప్రశ్నించడం మొదలైంది. వీధుల్లోకి రావడం కూడా ప్రారంభమైంది. జనం దృష్టి మళ్లింపు ఎత్తుగడలతో నెట్టుకురావడం ఇక కుదరదు. ఏదో ఒకటి చెప్పాలి. ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలి. ఎందుకు ఇంకా అమలు చేయడం లేదో విడమర్చి వివరించాలి.ఎన్నికలకు ముందు మూడు పార్టీల కూటమి ఎడాపెడా చేసిన వాగ్దానాల సంగతి తెలిసినదే! వాటిలో ఓ ఆరింటిని అతి ప్రధానాంశాలుగా గుర్తించి ‘సూపర్ సిక్స్’ పేరుతో తక్షణం అమలు చేస్తామని ఊదరగొట్టిన వైనమూ తెలిసినదే! ‘సూపర్ సిక్స్’లో భాగంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామనీ, నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామనీ హామీ ఇచ్చారు. ఒక ఇంటిలోంచి ఎంతమంది విద్యార్థులు బడికెళ్తే అంతమందికీ ఏటా రూ.15 వేలు ఇచ్చి ఆ తల్లికి వందనం చేస్తామన్నారు. ప్రతి రైతుకూ ఏటా ఇరవై వేల పెట్టుబడి సాయం అందజేస్తామన్నారు. ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లన్నారు. మహిళలందరికీ ఉచి తంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ నెలకు 15 వందల రూపాయలిస్తామన్నారు.ఎనిమిదో నెల వచ్చినా ఇందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఆరింటిలో ఆర్థిక భారం పెద్దగా పడని గ్యాస్ సిలిండర్ల హామీని తీసుకొని పాక్షికంగా అమలు చేశారు. మూడుకు బదులు ఒకే సిలిండర్ను తొలి ఏడాదికి పరిమితం చేశారు.రెండో సంవత్సరం నుంచైనా మూడు సిలిండర్లిస్తారో ఒక్కదాని తోనే సరిపెడతారో చూడాలి. మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాల్లో అతి ప్రధానమైనవిగా ఎంపిక చేసుకున్న ‘సూపర్ సిక్స్’కే ఈ గతి పడితే మిగిలిన వాటి సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు.ఎకనామిక్స్ పాఠాల ప్యాకేజీలో భాగంగా ఎన్నికల హామీలను తాము అమలు చేయబోవడం లేదనే సంగతిని నర్మగర్భంగా చంద్రబాబు చెప్పేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) తొలి అంచనాల పేరుతో మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు ఓ క్లాస్ తీసుకున్నారు. పవర్ పాయింట్ ద్వారా ఓ పది పదిహేను గణాంకాల టేబుళ్ళను ప్రదర్శించారు. ఈ సంవ త్సరం జీఎస్డీపీ పెరుగుదల రేటు 12.94 శాతంగా ఉండ బోతున్నదని జోస్యం చెప్పారు. ఈ అంచనాకు ఆధారమేమిటో ఆయన చెప్పలేదు.ఈ జోస్యం ఇంతటితో ఆగలేదు. ఆయన వేసిన చిటికెల పందిరి ఆకాశం దాకా ఎగబాకింది. ఏటా పదిహేను శాతం చొప్పున జీఎస్డీపీ పెరుగుతూ పోతే 2047 నాటికి 2.74 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందనీ, తలసరి ఆదాయం 58,14,916 రూపాయలకు పెరుగుతుందనీ చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఎదిగినా డాలర్ కూడా ఇంకా బలపడుతుందట! అది కూడా ఆయనే చెప్పారు. 2047 నాటికి డాలర్ విలువ 127 రూపాయలుగా ఉండ బోతున్నదట! వచ్చే సంవత్సరం తమ పిల్లల్ని అమెరికా చదువులకు పంపించాలనుకునే వాళ్లు అప్పటికి డాలర్ రేటు ఎంతుంటుందోనని కంగారుపడే అవసరం లేదు. చంద్రబాబు సర్కార్ను సంప్రదిస్తే తెలిసిపోతుంది. వారికి డాలర్ జ్యోతిషం తెలుసు.ఈవిధంగా ఏటా 15 శాతం చొప్పున జీఎస్డీపీ పెరుగుతూ పోతే ఈ ఐదేళ్లలో 4 లక్షల 35 వేల కోట్ల రూపాయల కొత్త అప్పులు చేయవచ్చట! వాటి ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చనే చావు కబురు చల్లగా చెప్పారు. ‘ఈ సంవ త్సరం మంచి వర్షాలు కురవాలి. అతివృష్టి, అకాల వర్షాలు ఉండరాదు. పశు, పక్ష్యాదుల దాడి ఉండకూడదు. పంట తెగుళ్ల బారిన పడకూడదు. మంచి దిగుబడి రావాలి. అద్భుతమైన ధర మార్కెట్లో పలకాలి. అప్పుడు తప్పకుండా విందు చేసుకుందాం’ అనే సందేశాన్ని ఆయన సంక్షేమ పథకాల అమలుకు వర్తింపజేశారు.ఇటువంటి పాలకులను ఉద్దేశించే కావచ్చు – వందేళ్ల క్రితమే సుప్రసిద్ధ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ చెప్పిన ఒకమాట ప్రసిద్ధ కొటేషన్గా మారింది. ‘‘ఇన్ ద లాంగ్ రన్ వి ఆర్ ఆల్ డెడ్’’. సుదూర భవిష్యత్తులో మనమంతా విగత జీవులమే అనే మాటను తక్షణ సమస్యల పరిష్కారం అవసరాన్ని పాలకులకు చెప్పడం కోసం వాడారనే అభిపాయం ఉన్నది. ఇప్పుడు పరి ష్కారం కావలసిన ఆర్థిక సమస్యలను భవిష్యత్ మార్కెట్ పరిస్థితులు పరిష్కరిస్తాయని నమ్మేవారిపై కీన్స్ వేసిన సెటైర్గా దాన్ని చెబుతారు. ఇది మన ఏపీ సర్కార్కు బాగా నప్పుతుంది.చంద్రబాబుకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రపంచ బ్యాంకు ఇచ్చే నివేదికలను సైతం ఆయన లెక్కలోకి తీసుకోవడం లేదని పిస్తున్నది. గ్లోబల్ ఎకానమీ మీద ఈ జనవరిలోనే ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ శతాబ్దపు తొలి క్వార్టర్ (2000–2025) ఇచ్చినంత ఉత్తేజం ఆర్థిక రంగానికి రెండో క్వార్టర్ (2026–2050) ఇచ్చే అవకాశం లేదని ఈ నివేదిక అభిప్రాయపడింది. గ్లోబల్ జీడీపీ పెరుగుదల రేటు 2.7 శాతంగానే ఉండబోతున్నట్టు ఇది అంచనా వేసింది. రెండు ఖండాల్లో యుద్ధాలు, పెద్ద దేశాలు అవలంబిస్తున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతున్నాయి. మిగతా ప్రాంతాలతో పోలిస్తే లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, దక్షిణాసియా ప్రాంతాల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండొచ్చనీ, ఆ యా ప్రాంతాల్లోని స్థానిక విని మయ మార్కెట్లు బలపడడం అందుకు కారణమనీ ఈ నివేదిక పేర్కొన్నది.దక్షిణాసియా దేశాల్లో స్థానిక వినిమయ మార్కెట్లు బలపడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఆ అవకాశం లేకుండా చంద్ర బాబు హరించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి ఆరు మాసాల్లో తగ్గిపోయిన జీఎస్టీ వసూళ్లే అందుకు నిదర్శనం. ఏటికేడు పెరుగుతూ వస్తున్న జీఎస్టీ వసూళ్లు చంద్రబాబు తొలి ఆరు నెలల కాలంలో తొలిసారిగా నేల చూపులు చూస్తూ వచ్చాయి. లిక్కర్ అమ్మకాల పుణ్యమా అని ఒక్క అక్టోబర్ మాసంలోనే కొంత ఎదుగుదల నమోదైంది. ఈ జీఎస్టీ లెక్కలు చంద్రబాబు చెబుతున్న ఆకాశ రామన్న లెక్కలు కావు. స్వయానా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే లెక్కలివి. ఒకపక్క ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో సాక్ష్యాధారాలతో కనిపిస్తున్నది. కానీ జీఎస్డీపీ పెరుగుదల మాత్రం తారాజువ్వలను తలదన్నేలా ఉంటుందని చంద్రబాబు విడుదల చేసిన ఆకాశ రామన్న లెక్కలు చెబుతున్నాయి. ఇదెలా సాధ్యమవుతుందో చెప్పడం తలపండిన ఆర్థికవేత్తలకు కూడా సాధ్యం కాకపోవచ్చు.చంద్రబాబు తొలి ఆరు మాసాల కాలంలో రాష్ట్ర ప్రభు త్వానికి తన సొంత ఆదాయ మార్గాల ద్వారా వచ్చే ఆదాయంలో 1.69 శాతం క్షీణత నమోదైంది. అక్టోబర్లో లిక్కర్ వేలంపాటల ఆదాయం ఆదుకోకపోయి ఉంటే ఈ క్షీణత ఇంకా ఎక్కువే ఉండేది. అంతకుముందు సంవత్సరం (2023) అదే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 12.19 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలంటే ఏముంటాయి? జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సేల్స్ ట్యాక్స్ (పెట్రోలియం ఉత్పత్తులు ఈ కేటగిరీలో వస్తాయి), మైనింగ్ వగైరా పన్నేతర ఆదాయం... ప్రధానంగా ఇవే! ఈ వసూళ్లు క్షీణించడమంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నట్టు అర్థం. ఈ వసూళ్లలో వృద్ధి కనిపిస్తేనే జీఎస్డీపీలో ఎదుగుదల కనిపిస్తుంది.చంద్రబాబు మొదటి ఐదేళ్ల (2014–19) కాలంలో దేశ జీడీపీలో ఏపీ వాటా 4.45 శాతంగా ఉంటే వైఎస్ జగన్ హయాంలో (2019–24) 4.82 శాతంగా నమోదైంది. ఈ లెక్కలను చంద్రబాబు ప్రెజెంటేషన్లో కూడా దాచిపెట్ట లేకపోయారు. వాస్తవాలు ఇలా ఉంటే జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందనే దగుల్బాజీ ప్రచారాన్ని ఇంకా కొనసా గిస్తున్నారు. ఒకపక్క పరిపాలనా వైఫల్యం, దివాళా తీస్తున్న ఆర్థిక రంగం, మరోపక్క ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను దారుణంగా వంచించడం... వీటి నుంచి దృష్టి మళ్లించడానికి తప్పుడు ప్రచారాలనూ, హెచ్చుల ‘విజన్’లనూ బాబు సర్కార్ ఆశ్రయిస్తున్నది.ఏడు మాసాల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులను రప్పించామని డప్పు వేసుకోవడం ఒక వంచన. 1 లక్షా 85 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చంద్రబాబు చెబుతున్న ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందాలపై జగన్ ప్రభుత్వ హయాంలోనే సంతకాలు పూర్తయ్యాయి. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కథ కూడా ఇంతే! కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఆ ఘనతను తన ఖాతాలోనే వేసుకొని ప్రచారం చేసుకుంటున్నది. తాజాగా విశాఖ ఉక్కు విషయంలోనూ ఇదే తంతు. కేంద్రం చేత 11 వేల కోట్లు విడుదల చేయించి తాము ఘనకార్యం చేశామనీ, ప్రైవేటీకరణ ఆగిపోయిందనీ కూటమి నేతలు ప్రచారం చేసు కుంటున్నారు. కానీ ఈ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి కుమార స్వామి చెప్పిన విషయాన్ని మాత్రం యెల్లో మీడియా మరుగున పడేసింది. జగన్మోహన్రెడ్డి అడ్డుకున్నందు వల్లనే ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఆయన మీడియా సమక్షంలోనే కుండబద్దలు కొట్టారు.కేంద్రం ఆర్థిక సాయాన్నయితే ప్రకటించింది గానీ ప్రైవేటీ కరణను ఆపేస్తామని ఎక్కడా చెప్పలేదు. కార్మిక సంఘాల ఇతర ప్రధాన డిమాండ్లయిన సొంత గనుల కేటాయింపు, ‘సెయిల్’లో విలీనంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవేమీ లేకుండా 26 వేల కోట్ల అప్పులున్న సంస్థకు 11 వేల కోట్లు సాయం చేస్తే అప్పులూ, బకాయిలూ తీర్చి, సామర్థ్యాన్ని పెంచుకొని భారీ ఉత్పత్తులు సాధించి లాభాల బాటలో పయనిస్తుందా? పోలవరం, బనకచర్ల వంటి అంశాల్లోనూ మోసపూరితమైన తప్పుడు ప్రచారాలే! ఇటువంటి నయవంచనను ప్రతిఘటించవలసిన బాధ్యత కేవలం ప్రతిపక్ష రాజకీయ పార్టీలదే కాదు – విద్యాధి కులు, మేధావులు, ప్రజా సంఘాలది కూడా! అప్పుడే మన ప్రజాస్వామ్యం పరిణతి చెందినట్టు! లేకపోతే అప్పుల అప్పా రావులు వేసే చిటికెల పందిళ్లు ఎప్పటికి పూర్తవుతాయోనని కళ్లప్పగించి చూస్తూ ఉండాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఉద్యోగులకు తీపి కబురు
ఏడాదిగా కేంద్ర ప్రభుత్వోద్యోగులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎనిమిదో వేతన సంఘం సాకారం కాబోతోంది. ఆ సంఘం రూపురేఖలూ, దాని గడువు, మార్గదర్శకాలు వగైరా వివరాలు ఇంకా తెలియాల్సేవున్నా తమ జీతభత్యాలు పెరగబోతున్నాయన్న కబురు సహజంగానే ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. కేంద్ర వేతన సంఘం సిఫార్సులకు కొంచెం అటూ ఇటూగా రాష్ట్రాల్లో వేతన సవరణ సంఘాలు కూడా సిఫార్సులు చేస్తాయి గనుక రాష్ట్రప్రభుత్వాల సిబ్బందికి సైతం ఇది సంతోషించే సందర్భమే. పదేళ్లకోసారి నియమించే వేతన సంఘాల గురించిన ప్రకటన లెప్పుడూ లోక్సభ ఎన్నికల ముందు వెలువడటం రివాజు. అందుకే నిరుడంతా ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ప్రకటన వెలువడింది. మరో మూడు వారాల్లోఅసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న ఢిల్లీలో గణనీయంగావున్న కేంద్ర సిబ్బంది ఓటుబ్యాంకునుదృష్టిలో ఉంచుకునే తాజా ప్రకటన వెలువడిందన్న విమర్శలు లేకపోలేదు. మన దేశంలో ప్రభుత్వో ద్యోగులు సంఘటిత శక్తి, పటిష్ఠమైన ఓటుబ్యాంకు కూడా! కనుక వారిని నిరాశపరచాలని ఏ ప్రభు త్వమూ చూడదు. ఇందుకు ఒకే మినహాయింపు వుంది. 2003లో కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని అప్పటి ఎన్డీయే సర్కారు వేతన సంఘం డిమాండ్ను తిరస్కరించింది. అటు తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం 2005లో వేతన సంఘం ఏర్పాటు చేసి, ఆ మరుసటి ఏడాది జనవరి 1 నుంచి దాని సిఫార్సులు అమలుచేయటం మొదలుపెట్టింది. అంతేకాదు... 2013లో ఏడో వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. దేశంలో రక్షణ, రైల్వే విభాగాల సిబ్బందిని కూడా కలుపుకొంటే 49 లక్షల మందికి పైగా కేంద్రప్రభుత్వోద్యోగులున్నారు. వీరుగాక పింఛన్ అందుకునే 65 లక్షల మంది రిటైర్డ్ సిబ్బంది ఉన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలనూ, ప్రభుత్వరంగ సిబ్బందికి ఇచ్చే బోనస్నూ వేతన సంఘం సిఫార్సు చేస్తుంది. అలాగే పింఛన్దార్లకు నెలనెలా చెల్లించాల్సిన మొత్తం, కరువుభత్యం కూడా నిర్ణయిస్తుంది. అది చేసే సిఫార్సులను యథాతథంగా ఆమోదించటం లేదా ఉద్యోగుల కోర్కె మేరకు దాన్ని మరింత పెంచటం, తనకున్న వనరులను దృష్టిలో ఉంచుకుని ఆ సిఫార్సులకు కోతపెట్టడం కేంద్రం చేసే పని.కేంద్రంలోనైనా, రాష్ట్రాల్లోనైనా రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య రానురాను తగ్గిపోతోంది.కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవటం, తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవటంగతంతో పోలిస్తే పెరిగింది. ఏతావాతా, రిటైరవుతున్న సిబ్బంది స్థానంలో కొత్త రిక్రూట్మెంట్లు బాగా తగ్గాయి. ఆరో వేతన సంఘం ఏర్పాటు సమయానికి దేశంలో 55 లక్షలమంది కేంద్రసిబ్బంది ఉన్నారని అంచనా వేశారు. ఇప్పుడు నిండా 50 లక్షల మంది కూడా లేరు. మరో మాటలో – సర్వీసులో ఉన్న సిబ్బంది కన్నా పింఛన్దార్లే ఎక్కువున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాల్లో సంపూర్ణంగా కంప్యూటరీకరణ జరగటంతోపాటు ఇంటర్నెట్ అందుబాటులోకొచ్చింది కనుక మును పటితో పోలిస్తే ఎక్కువమంది సిబ్బంది అవసరం ఉండకపోవచ్చన్న వాదనలో నిజముంది. కానీ మనతో పోలిస్తే అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో ప్రతి లక్షమంది పౌరులకూ దాదాపు ఏడువేల మంది ప్రభుత్వ సిబ్బంది ఉన్నారు. మన దేశంలో అది 1,500 మించదు. అమెరికాలో తమ ఏలుబడి మొదలయ్యాక ప్రభుత్వ సిబ్బంది సంఖ్యలో భారీగా కోత పెడతామని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ బాహాటంగానే చెప్పారు. ఫలితాలొచ్చిన వారం రోజు ల్లోపునే ప్రభుత్వ సామర్థ్య విభాగం పేరిట వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్లతో ఆయన ఒక కమిటీని కూడా నియమించారు. తాము విడివిడిగా ఉరిశిక్షలు వేయబోమని, ఒకేసారి ఊచకోతఉంటుందని వివేక్ రామస్వామి చమత్కరించారు కూడా! కనుక అక్కడ కూడా ప్రభుత్వ సిబ్బంది తగ్గుతారు. చాలా యూరప్ దేశాల్లో రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో కోతపెట్టే ప్రయత్నాలు చేయటం, దాన్ని ఉద్యోగులు ప్రతిఘటించటం కనబడుతూనే ఉంది. ప్రభుత్వ పథకాలను ప్రజానీకానికి చేర్చటంలో ప్రభుత్వ సిబ్బంది పాత్ర కీలకమైనది. గతంతో పోలిస్తే కొత్త సాంకేతికతలు అందుబాటులోకొచ్చి ఉండొచ్చుగానీ అందుకు తగ్గట్టే సూక్ష్మస్థాయివివరాల సేకరణ పెరిగింది గనుకా, రిటైరవుతున్నవారి స్థానంలో కొత్త నియామకాలు లేవు గనుకా వారి పని భారం పెరిగింది. పని మీద శ్రద్ధలేనివారూ, అవినీతికి పాల్పడేవారూ అన్నిచోట్లాఉంటారు. వారి వల్ల సహజంగానే అందరికీ చెడ్డపేరు వస్తుంది. ప్రభుత్వోద్యోగులపైనా అలాంటి నింద ఉంది. ఉద్యోగ భద్రత వరకూ చూస్తే ప్రైవేటు రంగంలో కన్నా ప్రభుత్వరంగంలో అది ఎక్కువ. ఒకసారంటూ ప్రభుత్వ ఉద్యోగం వస్తే చీకూచింతా ఉండబోదని అనుకుంటారు గనుకేఅందుకోసం చాలామంది అర్రులు చాస్తారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో విఫలమవుతున్నందున వేతనాలు పెంచాలన్న ప్రభుత్వ సిబ్బంది డిమాండ్కు ప్రభుత్వాలు తలొగ్గక తప్పడం లేదు. కొన్ని లోటుపాట్లున్నా ప్రభుత్వోద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వాలు శ్రద్ధ పెడుతున్నాయి. నిర్ణీత కాలంలో జీతభత్యాలు పెంచుతున్నాయి. కానీ వారితో పోలిస్తే ఎంతో ఎక్కువున్న ప్రైవేటురంగ సిబ్బందినీ, రెక్కాడితే గానీ డొక్కాడని అసంఘటిత రంగ కార్మికులనూ, వారి సంక్షేమాన్నీ విస్మరిస్తున్నాయి. పాశ్చాత్యదేశాల్లో ఇంత చేటు అసమానతలుండవు. ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీతనాన్నిఆశించే పాలకులు ఈ రంగాల పట్ల తాము ఎలా వ్యవహరిస్తున్నామో ఆలోచించుకోవాలి. ఈ అసమానతల్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. -
గాజాలో శాంతి సాధ్యమేనా!
బాంబుల మోత ఆగుతుందంటే... తుపాకులు మౌనం పాటిస్తాయంటే... క్షిపణుల జాడ కనబడదంటే... ఇనుప డేగల గర్జనలు వినబడవంటే... నిత్యం మృత్యువు వికటాట్టహాసం చేస్తున్నచోట హర్షాతిరేకాలు వ్యక్తం కావటం సహజమే. అందుకే 15 నెలలుపైగా... అంటే 467 రోజులుగా రాత్రింబగళ్లు ప్రాణభయంతో కంటి మీద కునుకు లేకుండా గడిపిన గాజా ప్రజానీకం వీధుల్లోకొచ్చి పండుగ చేసుకున్నారు. అటు హమాస్ చెరలో మగ్గుతున్నవారి కుటుంబసభ్యులు సైతం ఆనందో త్సాహాలతో ఉన్నారు. ఇజ్రాయెల్–మిలిటెంట్ సంస్థ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని మధ్యవర్తులుగా వ్యవహరించిన అమెరికా, ఖతార్ ప్రతినిధులు బుధవారం రాత్రి ప్రకటించగానే ప్రపంచం, ప్రత్యేకించి పశ్చిమాసియా ఊపిరి పీల్చుకున్నాయి. ‘నేను దేశాధ్యక్షపదవి స్వీకరించబోయే జనవరి 20 నాటికి బందీలకు స్వేచ్ఛ లభించకపోతే సర్వనాశనం ఖాయమ’ని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పక్షం రోజుల నాడు ప్రకటించారు. ‘నా హెచ్చరిక ఫలించబట్టే కాల్పుల విరమణ ఒప్పందం సాకారమైంద’ని ఇప్పుడు ఆయన అంటుంటే... ‘నా అనుభవంలోనే అత్యంత కఠినమైన ఈ చర్చల ప్రక్రియను మొత్తానికి సుఖాంతం చేయగలిగాన’ని ప్రస్తుత అధ్య క్షుడు జో బైడెన్ చెబుతున్నారు. ఈ ఘనత ఎవరి ఖాతాలో పడాలన్నది తేలకముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మొండికేస్తున్నారు. తొలుత ఒప్పందాన్ని స్వాగతించిన ఆయనే ఇంకా తేలాల్సినవి ఉన్నాయంటున్నారు. ఒప్పందంపై ఆమోదముద్ర వేసేందుకు నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని నిలిపివేశారు. ఈలోగా నిన్న, ఇవాళ గాజాపై ఇజ్రాయెల్ సాగించిన బాంబు దాడుల్లో 19మంది పిల్లలు సహా 80 మంది చనిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుందా లేదా, ఈ ప్రాంతంలో తాత్కాలికంగానైనా శాంతి నెలకొంటుందా అన్న అంశంలో సందిగ్ధత ఏర్పడింది. సుదీర్ఘకాలం ఘర్షణలతో అట్టుడికినచోట సాధారణ పరిస్థితులు ఏర్పడటం అంత సులభమేమీ కాదు. అందునా ఇజ్రాయెల్తో వైరమంటే మామూలుగా ఉండదు.ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 2023 అక్టోబర్ 7న విచ్చలవిడిగా కాల్పులు జరిపి 1,200 మంది పౌరులను హతమార్చటంతో పాటు, 251 మందిని బందీలుగా తీసు కెళ్లటంతో ఇదంతా మొదలైంది. హమాస్ మతిమాలిన చర్య తర్వాత ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో గాజా, వెస్ట్బ్యాంక్లపై సాగించిన దాడుల పర్యవసానంగా ఇంతవరకూ కొందరు హమాస్ కీలకనేతలతో పాటు 46,700 మంది పౌరులు చనిపోయారు. ఇందులో అత్యధికులు పిల్లలు, మహి ళలే. ఇతరులు నిత్యం చావుబతుకుల మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం జారవిడిచే కరపత్రాలు సూచించిన విధంగా ఎటు పొమ్మంటే అటు వలసపోతూ అష్టకష్టాలు పడుతున్నారు.తిండీ, నీళ్లూ కరువై, అంతంతమాత్రం వైద్య సదుపాయాలతో జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఒక్కోటి 42 రోజులు (ఆరు వారాలు)ఉండే మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలవుతుందా, మధ్యలో తలెత్తగల సమస్యలేమిటి అన్న ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానాల్లేవు. హమాస్ చెరలో ఇంకా 94 మంది బందీలు మిగిలారని, వారిలో 34మంది మరణించివుండొచ్చని ఇజ్రాయెల్ అంచనా. తొలి దశ అమల్లోవుండగా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగాలి. ఆ తర్వాత పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా 33 మంది బందీలను హమాస్ విడుదల చేస్తుంది. ఒకసారంటూ ఒప్పందం అమలు మొదలైతే ఇరువైపులా ఉన్న బందీలను దశలవారీగా విడుదల చేస్తారు. గాజాకు భారీయెత్తున సాయం అందటం ప్రారంభమవుతుంది. ఒప్పందం ప్రకారం తొలి దశ కొనసాగుతున్న దశలోనే ఇజ్రాయెల్ రెండోదశ కోసం హమాస్తో చర్చించటం మొదలెట్టాలి. రెండో దశకల్లా బందీలతోపాటు దాడుల సందర్భంగా హమాస్కు చిక్కిన ఇజ్రాయెల్ ఆడ, మగ సైనికులు పూర్తిగా విడుదలవుతారన్నది అంచనా. అప్పుడు మొదలుకొని తొలి దశలో వున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వత కాల్పుల విరమణగా మారుతుంది. మూడో దశ అంతా పునర్నిర్మాణంపై కేంద్రీకరిస్తారు. హమాస్ బందీలుగా ఉంటూ మరణించినవారి మృత దేహాలను అప్పగించాలి. కేవలం మొదటి దశకు మాత్రమే ప్రస్తుత ఒప్పందం పరిమితమనీ... కొత్తగా చర్చలు జరిగాకే రెండు, మూడు దశలకు సంబంధించి తుది నిర్ణయం ఉంటుందనీ ఇప్పటికే నెతన్యాహూ ప్రకటించారు. తొలి దశ పూర్తయ్యాక మళ్లీ యుద్ధం తప్పదన్న హామీ ఇవ్వకపోతే తమ ఆరుగురు మంత్రులూ తప్పుకుంటారని తీవ్ర మితవాదపక్ష నాయకుడు, జాతీయ భద్రతా మంత్రి బెన్గివర్ హెచ్చరించటం తీసిపారేయదగ్గది కాదు. లెబనాన్లోని హిజ్బొల్లాతో ఉన్న రెండు నెలల కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. అక్కడ ఇరువైపులా కాల్పులు జరగని రోజంటూ లేదు. ఆ ఒప్పందం కూడా ఈనెల 26తో ముగుస్తుంది. ఇప్పుడు హమాస్తో కుదిరిన ఒప్పందం గతి కూడా అలాగే ఉంటుందా అన్నది ప్రశ్నార్థకం.సిరియాలో అసద్ నిష్క్రమణ, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమైవుండటం, ఇరాన్ బల హీనపడటం, ట్రంప్ ఆగమనం వంటి పరిణామాలతో హమాస్లో పునరాలోచన మొదలయ్యాకే ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఎనిమిదినెలల నాడు దాదాపు ఇవే షరతులు ప్రతిపాదిస్తే ఆ సంస్థ తిరస్కరించటం గమనార్హం. మొత్తానికి పశ్చిమాసియా తెరిపిన పడటానికి అన్ని పక్షాలూ చిత్తశుద్ధి ప్రదర్శించటం అవసరం. దాడులతో ఎవరినీ అణిచేయలేమని ఇన్నాళ్ల చేదు అనుభవాల తర్వాతైనా ఇజ్రాయెల్ గుర్తిస్తే మంచిది. ఎన్ని లోటుపాట్లున్నా ఘర్షణలు అంతరించాలి. శాంతి చిగురించాలి. -
కచ్చితత్వం దిశగా...
పక్షుల, పాముల, జంతువుల ప్రవర్తనను చూసీ...ఆకాశం తీరుతెన్నులు గమనించీ, గాలివాటు, దాని వేగం గ్రహించీ వాతావరణాన్ని అంచనా కట్టే గతకాలపు రోజుల నుంచి ఇవాళ ఏం జరుగుతుందో, వచ్చే నాలుగైదు రోజుల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతున్నదో, రాగల సంవత్సరమంతా ఎలాంటి స్థితిగతులుంటాయో స్పష్టంగా వివరించే సమాచారం అందరికీ అందుబాటులో కొచ్చింది. గత నూట యాభయ్యేళ్లుగా అవిచ్ఛిన్నంగా ఈ పనిలోనే నిమగ్నమై కోట్లాది పౌరులకు చేదోడువాదోడుగా నిలిచిన భారతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) తన వార్షికోత్సవాన్ని మంగళ వారం ప్రధాని మోదీ సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంది. ఒక దేశ విజ్ఞాన శాస్త్ర అవగాహన ఆ దేశంలోని వైజ్ఞానిక సంస్థల ప్రగతిలో ప్రతిఫలిస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పిన మాట అక్షరసత్యం. ఈ నూటయాభయ్యేళ్లలో ఐఎండీ సాధించిన ప్రగతి ఇందుకు సాక్ష్యం. ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనే నానుడి నుంచి మనం చాలా దూరం వచ్చాం. ఇక పోవటం ఖాయమనుకున్న ప్రాణాన్ని నిలబెట్టడానికీ, పునర్జన్మ ఇవ్వడానికీ అధునాతన వైద్య సదుపాయాలు విస్తృతంగా అందుబాటులోకొచ్చాయి. అలాగే వాన ఎక్కడ కురుస్తుందో, దాని తీవ్రత ఏపాటో అంచనా వేయగలుగుతున్నాం. తుపాను ఏర్పడే అవకాశాలు, దాని గమ్యం, గమనం, అది మోసుకు రాగల విపత్తు గురించీ హెచ్చరించటంతో పాటు కరవుకాటకాల ప్రమాదాన్ని తెలియజెప్పటం ఆ రంగంలో సాధించిన ప్రగతికి తార్కాణం. మూడు రోజుల వరకూ వాతావరణం ఎలా ఉండబోతు న్నదో చెప్పే స్వల్పకాలిక అంచనాలు, పదిరోజుల వరకూ వాతావరణ పోకడల్ని వివరించగల మధ్య శ్రేణి అంచనాలు, నెల పాటు ఏ వారమెలా వుంటుందో తెలియజేయగల సామర్థ్యం ఇప్పుడు మన సొంతం. ఇంకా స్థానిక వాతావరణాలను అంచనా వేయగలిగే దిశగా ఐంఎండీ ముందుకెళ్తోంది.పేరులో తప్ప జనాభా రీత్యా, సంపద రీత్యా, లేదా విస్తీర్ణం రీత్యా ఏ రకంగానూ ‘గ్రేట్’ అనే పదానికి అర్హత లేని బ్రిటన్ నుంచి వచ్చిన వలస పాలకులు ఈ దేశంలోని వాతావరణ తీరుతెన్నులు చూసి అయోమయంలో పడ్డారు. వీటిని సక్రమంగా అంచనా వేసే సాధనాలు లేకపోతే సరిగా పాలించటం అసాధ్యమన్న నిర్ణయానికొచ్చిన ఫలితంగానే 1875లో సర్ చార్లెస్ చాంబర్లేన్ నేతృత్వంలో ఐఎండీని నెలకొల్పారు. అంతవరకూ రైతులు సంప్రదాయంగా అనుసరిస్తూ వచ్చిన విధానాలన్నీ క్రమేపీ కనుమరుగై వాతావరణ అధ్యయనం కొత్త పుంతలు తొక్కటం ప్రారంభించింది. కేవలం బ్రిటన్ వాతావరణాన్ని పోలి వుంటుందన్న ఏకైక కారణంతో తమ వెసులుబాటు కోసం సిమ్లాలోని పర్వత ప్రాంతంలో మొదలెట్టిన ఐఎండీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని గ్రహించాక 1928లో పుణేకు తరలిరావటం, ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఢిల్లీకి వెళ్లటం తప్పనిసరైంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్గా వచ్చిన గిల్బర్ట్ వాకర్ 1904–1924 మధ్య రెండు దశాబ్దాల సమయంలో భారత వాతావరణంలో చోటుచేసుకున్న అసాధారణతలపై అధ్యయనం చేయటంతో అనేక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంత పసిఫిక్ మహా సముద్ర జలాలపై ఉండే వాయుపీడనంలో వచ్చే హెచ్చుతగ్గులే ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ స్థితిగతులను ప్రభావితం చేస్తున్నాయని ఆ అధ్యయనం తేల్చాక వాతావరణాన్ని అర్థంచేసుకునే తీరే మారిపోయింది. పసిఫిక్ జలాలపై ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతలో మైనస్ 17 డిగ్రీల సెల్సియస్ మేరకు హెచ్చితే లాæనినో... ఆ ఉష్ణోగ్రత మైనస్ 17 డిగ్రీల కన్నా తగ్గితే లానినా ఏర్పడు తుందని తేలింది అప్పుడే. ఇదంతా అర్థమయ్యాక రాగల కాలంలో వాతావరణమెలా వుండనున్నదో అంచనా వేయటం సులభమైంది. వాతావరణంలో విడిచిపెట్టే బెలూన్లు గాలిలో తేమనూ, ఉష్ణోగ్రతనూ ఇట్టే చెప్పగలుగుతుండగా ఉపగ్రహాలు నేల పరిస్థితుల గురించి సమాచారం ఇస్తున్నాయి.స్వాతంత్య్రానంతరం వాతావరణాన్ని కొలవటానికి రాడార్ల వంటి ఉపకరణాలు అందుబాటు లోకొచ్చాయి. 1971లో తొలి తుపాను హెచ్చరిక కేంద్రం ఏర్పాటైతే, 1990ల్లో ఇస్రో ఉపగ్రహాలు పంపే డేటాతో వాతావరణ అంచనాల కచ్చితత్వం పెరిగింది. సెకనుకు కొన్ని లక్షల గణనలను చేయగలిగిన అధునాతన సూపర్ కంప్యూటర్ వినియోగం మొదలయ్యాక రుతుపవనాలు, తుపానుల గురించి మాత్రమే కాదు... వడగాల్పులు, వరదల వంటి వైపరీత్యాల గురించి కూడా చెప్పగలుగుతున్నారు. మన దేశంలో సాగుకు యోగ్యమైన భూమిలో 60 శాతం కేవలం వర్షాధారం కావటం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి జీవనాధారం వ్యవసాయమే కావటం వల్ల ఐఎండీ చెప్పే అంచనాలు ఎంతో అవసరం. అందుకే వర్షాలు సరిగ్గా ఎక్కడ పడతాయో, ఏ ప్రాంతంలో వడగాడ్పులు వీచవచ్చో, ఎక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నదో కూడా పదేళ్లుగా చెప్పగలుగుతోంది. కృత్రిమ మేధ దీన్ని మరింత పదునెక్కించింది.ఐఎండీ అంచనాల వల్ల ప్రభుత్వాలు అప్రమత్తమై లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వేలాది ప్రాణాలను కాపాడుకోవటం సాధ్యమవుతోంది. ఇది మున్ముందు ఇంకా విస్తరించి కనీసం అయిదురోజుల ముందు 90 శాతం కచ్చితత్వంతో చెప్పగలిగే విధానాలను అభివృద్ధి చేసుకోవాలనీ, ఆఖరికి భూకంపాల రాకడను సైతం పసిగట్టగలగాలనీ ఐఎండీ 2047 విజన్ డాక్యుమెంటు విడుదల సందర్భంగా మోదీ చేసిన సూచన శిరోధార్యం. ఈ అంచనాలు మన దేశానికి మాత్రమే కాదు...ఆసియా ప్రాంత దేశాలకు సైతం ఎంతో మేలుచేస్తాయి. పంటల దిగుబడిపై, ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులపై మరింత మెరుగైన అంచనాలకు తోడ్పడతాయి. -
చైనా దాగుడుమూతలు!
సాధారణంగా దౌత్య సంబంధాల్లో అనూహ్యతకు తావుండదు. అవతలి దేశం మనతో చెలిమి కోరుకుంటున్నదో లేదో... అది మనవైపో, వేరేవాళ్లవైపో ఊహించటం పెద్ద కష్టం కాదు. కానీ చైనా మటుకు ఇందుకు విరుద్ధం. ‘నేనేంటో చెప్పుకోండి చూద్దాం’ అన్నట్టు వ్యవహరిస్తుంటుంది. నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్న చందాన ప్రవర్తిస్తుంటుంది. రష్యాలో మూడు నెలల క్రితం బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్లు కలుసుకున్నారు. అంతకు రెండు రోజుల ముందు వాస్తవాధీన రేఖ ప్రాంతాలైన డెస్పాంగ్, దెమ్ చోక్లలో ఇరు దేశాల సైన్యాల గస్తీపై అవగాహన కుదిరింది. ఆ ప్రాంతంలో ఇకపై సైనిక విన్యాసాలకు చోటీయరాదనీ, ఉద్రిక్తతలను ఉపశమింపజేయాలనీ దాని సారాంశం. అంతేగాదు... రెండు దేశాలూ దీనిపై వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. చాన్నాళ్లుగా నిలిచిపోయిన ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం గత నెలలో జరిగింది కూడా. తీరా తాజాగా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం అధునాతన సాంకేతికతలతో, అన్నిరకాల నేలల్లోనూ పనికొచ్చే వాహనాలతో, డ్రోన్లతో, మానవరహిత విమానాలతో విన్యాసాలు నిర్వహించినట్టు బయటపడింది. తన సైనిక సామర్థ్యాన్ని, కొండప్రాంతాల్లో యుద్ధ సంసిద్ధతలను అంచనా వేసుకోవటానికి షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ రెజిమెంట్ ఈ విన్యాసాలు నిర్వహించిందంటున్నారు. అంతక్రితం మాటెలావున్నా 2020 ఏప్రిల్లో గాల్వాన్ లోయలో మన సైన్యంతో గిల్లికజ్జాలకు దిగటం ద్వారా చైనా తన కవ్వింపు చర్యల జోరు పెంచింది. అప్పుడు జరిగిన ఘర్షణల్లో మన జవాన్లు 21 మంది చనిపోగా, చైనా కూడా గణనీయమైన నష్టాలు చవిచూసింది. ఆ ఘర్షణల్లోనే బిహార్ రెజిమెంట్లో 17వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అయిన తెలంగాణకు చెందిన బి.సంతోష్బాబు వీర మరణం పొందారు. అనంతర కాలంలో ఇరు దేశాల మధ్యా సైనిక అధికారుల స్థాయి చర్చలు జరిగాయి. కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఆ ఏడాది ఆగస్టులో రెండు దేశాల విదేశాంగమంత్రులూ భేటీ అయ్యారు. అందులో భారత్–చైనాల మధ్య పంచసూత్ర పథకం కుదిరింది. ఇకపై సామరస్యంగా మెలగాలన్నది ఆ పథకం సారాంశం. దానికి కొనసాగింపుగా రక్షణ మంత్రులు కూడా సమావేశమయ్యారు. ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతాల్లో సైనికుల ఉపసంహ రణ కూడా మొదలైంది. కానీ సమస్య ఎక్కడిదక్కడే ఉంది. డెస్పాంగ్, దెమ్చోక్ ప్రాంతాల విషయం మొదటి నుంచీ జటిలమే. అందువల్లే ప్రస్తుతానికి ఇరు దేశాల సైన్యాలూ ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలని, ఉద్రిక్తతలు ముదిరే విధంగా ఎవరూ సైన్యాలను మోహరించ రాదని మూడు నెలలక్రితం నిర్ణయించారు. కానీ చైనాకు ఏమైందో కానీ దాన్ని బేఖాతరు చేస్తూ తాజాగా విన్యాసాలు మొదలుపెట్టింది. వారంరోజుల క్రితం షిన్జియాంగ్లోని వీగర్ స్వయంపాలిత ప్రాంతంలో ఉన్న హోటాన్ నగరానికి సమీపంలో చైనా కొత్తగా రెండు కౌంటీలను ఏర్పాటు చేసిందన్న కథనాలు వెలువడటం గమనించదగ్గది. ఈ రెండూ కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లోని ఆక్సాయ్చిన్కు సమీపంలో ఉన్నాయి. దానిలోని కొంత భూభాగం ఈ రెండు కౌంటీల్లోనూ ఉన్నదంటున్నారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఇది చాలదా? ఇక బ్రహ్మపుత్ర నదిపై ఒక మెగా డ్యామ్ను నిర్మించటానికి చైనా సన్నాహాలు చేస్తున్నదన్న వార్త కూడా ఇటీవలి పరిణామమే. ఎగువ ప్రాంతాల్లో ఆనకట్టలు కట్టినప్పుడు దిగువ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందక ఇబ్బందులు తలెత్తు తాయి. భారీవర్షాల సమయంలో దిగువకు నీరు వదలటం వల్ల ఆ ప్రాంతాలు మునుగుతాయి.అందువల్లే దేశాలమధ్య ప్రవహించే నదులపై నిర్మాణాలకు పూనుకున్నప్పుడు పరస్పరం చర్చించుకుంటాయి. అందరికీ ప్రయోజనం కలిగేలా ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. కానీ మెగా డ్యామ్ నిర్మాణాన్ని చైనా ఏకపక్షంగా ప్రకటించింది. దీనిపై మన దేశం తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇక అరుణాచల్ప్రదేశ్కు మన నాయకులు వెళ్లినప్పుడల్లా చైనాకు ఆగ్రహావేశాలొస్తాయి. అక్కడి ఊళ్లకు సొంత పేర్లు పెట్టుకుని మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం చైనాకు చాన్నాళ్లుగా దురలవాటు. అందుకే చైనా వ్యవహారశైలి తెలిసినవారెవరూ దాని మాటలు విశ్వసించరు. చెప్పే మాటలకు భిన్నమైన ఆచరణ ప్రదర్శించటం చైనాకు అలవాటైన విద్య. ఇరుగు పొరుగు దేశాలన్నాక సమస్యలు సహజంగా వస్తాయి. వాటిని చర్చించుకోవటం, పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించటం వివేకవంతమైన చర్య. సమస్యలను దశాబ్దాల తరబడి అలాగే వదిలేస్తే అవి జటిలంగా మారి చివరకు శత్రుత్వానికి దారితీస్తాయి. మనతో ఉన్న వివాదాల విషయంలో చైనా మొదటినుంచీ దాగుడుమూతలు ఆడుతోంది. వివాదాలను పక్కనబెట్టి వ్యాపార వాణిజ్యాలను విస్తరించుకుంటే ఇరు దేశాలూ అభివృద్ధి చెందుతాయని ఊరించి 70వ దశకం చివరిలో మనకు మైత్రీ హస్తం అందించింది మొదలు చైనా తీరుతెన్నులు ఎన్నడూ సక్రమంగా లేవు. సరిహద్దు పరిణామాలపై మన దేశం అప్రమత్తంగానే ఉన్నదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ సోమవారం చేసిన ప్రకటన సూచిస్తోంది. వివాదాస్పద ప్రాంతాల్లో ప్రస్తుతానికి ప్రతిష్టంభన ఉన్నదని ఆయనంటున్నారు. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్ట నిర్మాణం విషయంలోనైనా, లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం కదలికల విషయంలోనైనా మన దేశం దృఢంగా వ్యవహరించాలి. దేశ రక్షణకు అది తప్పనిసరి. కరచాలనం చేస్తూనే కత్తులు దూయటం ఏమైనా కావొచ్చుగానీ దౌత్య కళ కాదని చైనాకు తెలియచెప్పటం అవసరం. -
సంక్రాంతి జరీచీర
ఏదో తప్పదు కావున పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారనీ, సంక్రాంతికి పిన్నీ బాబాయిలు పుట్టింటి హోదాలో తననూ భర్తనూ పిలిచేదేమీ లేదనీ తేలిపోయాక చిన్నబుచ్చుకుంది ఆ కొత్త పెళ్లి కూతురు. భర్త గమనించాడు. వాళ్లు రాసినట్టే పిలిచినట్టే ఒక కార్డుముక్క సృష్టించాడు. పండక్కు ముందు భార్యను బయల్దేరదీశాడు. పట్నానికి తీసుకెళ్లి దర్జాగా హోటల్లో దించాడు. ‘ఇదేమిటండీ’ అని ఆశ్చర్యపోయింది భార్య. ‘మరేటనుకున్నావోయ్. ఇంతకు మించిన పుట్టిల్లు లేదు. కోరిన టిఫెను, భోజనం గదిలోకే వస్తాయి. సాయంత్రమైతే సినిమాలు షికార్లు బోలెడన్ని. ఇదే నీ పుట్టిల్ల నుకొని సంతోషపడు’ అంటాడు. మనసుంటే పండగ ఉండదా? మధురాంతకం రాజారాం ‘పండగ అల్లుడు’ కథ ఇది.చార్జీలు, పండగ ఖర్చులు తలచి పాపం ఆ పేద తల్లిదండ్రులు పెద పండుగ ఊసే ఎత్తలేదు కూతురి సంగతే మరిచినట్టు. అల్లుడు అది గమనించాడు. పండక్కు తన భార్య కొత్తచీర కట్టుకుంటే ఆ మురిపెం వేరు. సింగారమూ వేరు. కోర్టు గుమాస్తా అతను. చిన్న జీతమే. కాని పెద్ద మనసు. రిక్షా ఎక్కడం మానేశాడు. బయట టిఫెన్లు కాఫీలు మానేశాడు. నాటకాలు చూడ్డం మానేశాడు. పుస్త కాలు కొనడమున్నూ. ప్రతి పైసాను పొదుపు చేసి తెచ్చాడు ఆఖరుకు ‘పుల్లంపేట జరీచీర’! పది హేను మూరల ఆ జరీచీర కట్టుకుని కళకళ్లాడిన భార్య ‘ఇంత కష్టం చేసి నా కోసం తెచ్చారా’ అని భర్త కంఠార తల ఆన్చి బాష్పాలు రాలుస్తుంది. సయోధ్య ఉంటే కాపరం పండగే. శ్రీపాద కథ ఇది.కరువు రోజుల్లో పండగంటే ఎంత కష్టం. ఇంటి పెద్ద మనసు కష్టపెట్టుకుంటూనే ఎక్కడ ఏది సర్ది చెప్పాలా అని ఆగమవుతూ ఉంటాడు. పిల్లలకిది పడుతుందా? పండగ మరో నెలుందనగానే తట్టలు పట్టి ఎక్కడి పేడంతా సేకరించి పిడకలు కొట్టి ఆరబెట్టారు. ‘ఎన్నర్రా’ అని తండ్రి అడిగితే ‘300’ అన్నారు గర్వంగా. తండ్రికి ఎన్నో ఆలోచనలు. వాటిని పొయ్యిలోకి వాడితే కట్టెలైనా మిగిలి నాలుగు పైసలు ఆదా అవుతాయి గదా అని. ‘ఇవ్వండ్రా’ అనంటే ‘ఊహూ’. భోగి మంటలేసి ఎగిసే మంటలను చూసి పక్కింటివాళ్లను ఓడిస్తేనే పిల్లలకు ఆనందం. పేదవాడికి పండగంటే ‘సర్దుబాటే’. సాక్షాత్తూ ఆరుద్ర రాసిన కథ ఇది. అయితే ‘ఇప్పటి భోగిమంటలు ఒక మంటలేనా’ అంటారు ముళ్లపూడి వెంకట రమణ. జగన్నా థుని రథమంత ఎత్తున లేసేలా వేస్తేనే వేసినట్టట. ‘ఒరే ఫ్రెండూ... వెళ్లి రెండు బైండింగ్ అట్టలైనా పట్టుకురారా మంట పెంచుదాం’ అనంటే ఎవరింట ఉన్నాయట బైడింగ్ అట్టలూ పుస్తకాలూనూ. కోళ్లగంపలూ తాటాకు బుట్టలూ తప్ప. కావున జానెడు ఎత్తు మంటే జగన్నాథుడితో సమానం. అయితే పిల్లకారుకు చిన్న సరదా ఉందిలే. ఆ చిరుచీకట్లలో ప్లీడరు శేషయ్యగారి బోర్డు ఊడబెరికి మంటల్లో వేసి గోడ ఖాళీ ఎందుకని భోజనం తయార్ బోర్డు తెచ్చి అక్కడ వేళ్లాడదీశారు. పండగంటే పిల్లల అల్లరిది. జీవితాంతం చెప్పుకునేటందుకు జ్ఞాపకమై గూడుకట్టేది. ముళ్లపూడి ‘భోగి మంటలు’ బలే సరదా కథ. అయితే స్త్రీగళాన్ని ఎలా వదిలేస్తాం? ఒక సింగిల్ ఉమన్కు అందరూ గది అద్దెకిస్తారుగాని ఒకటే షరతు... రోజూ ఇంటి ముందర ముగ్గేయాలని. ఆ సింగిల్ ఉమన్ మంచి జర్నలిస్టు. ఆలోచనాశీలి. సమాజానికి పనికొచ్చే పనులు చేయగలిగినది. మించి తన జీవి తాన్ని తాను నిర్మించుకోగలిగేది. అయినా సరే. ముగ్గేయాల్సిందే. ‘నాకు రాదు... వచ్చినా వేయను’... ‘పనిమనిషితోనైనా వేయించు’... పండుగ నెల వచ్చిందంటే ఆమెకు గండం. ముగ్గు లేని వాకిలిగా ఆమె ఇల్లే కనపడుతుంది. ఆ నెల్లో యజమాని ఖాళీ చేయించడం ఖాయం. మరో గదికి చలో. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలట. ఇల్లాలి చదువు, జ్ఞానం, వికాసం వీటి వల్ల కాదా దేశానికి పండగ వచ్చేది? పి.రామకృష్ణారెడ్డి కథ ‘ముగ్గు’.సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండగ. యుగాంతం వరకూ నిలిచే పండగ. సంస్కృతిని ఎప్పటికీ కాపాడుకోవాల్సిందే. కాని సందర్భాలలోని అంతరాలను చూసి సరిచేసి పండుగ అర్థాన్ని విశాలం చేసుకోవాలి కూడా. ‘గుమ్మం ముందు బొబ్బిలిపాట గాళ్లేమిటి... బుడబుక్కల వాళ్లేమిటి... తందానపదం వాళ్లేమిటి... గంగిరెడ్ల వాళ్లేమిటి... పగటి వేషగాళ్లేమిటి... తోలు బొమ్మలాళ్లేమిటి... ఎరకలాళ్లేమిటి... చెంచులాళ్లేమిటి... జంగాలేమిటి... సన్నాయి వాళ్లేమిటి... వీళ్లంతా నిమిష నిమి షానికి వచ్చేవాళ్లే’ అని రాస్తారు కవికొండల వేంకటరావు ‘మా ఇంట సంక్రాంతి’ కథలో. పండగ ఒకరు చేసుకునేదిగా... మరొకరు వారింటి ముందుకు వచ్చి ఇనాము అడిగేదిగా ఎందుకు ఉండాలి? ఇనాము ఇచ్చే స్థాయిలో ఒకరు, పొందే స్థాయిలో ఒకరు ఉంటే అది న్యాయమైన సమాజమేనా? జన్మ అంతరాలు, ఆర్థిక అగాథాలనే కాబోలు భోగిజ్వాలల్లో పడేయాల్సింది. గాయకుడు పుట్టా పెంచల్దాసు ‘యేటంబిడ యేడుచ్చా పోయా’ అనే కథను రాశాడు. భోగి రోజు పండగ చేసుకోనీకుండా, ఇల్లు గడిచేందుకు భత్యాలు తీసుకురమ్మని తల్లి పోరుపెడితే, చీకటితో బయల్దేరి ఇంటింటా పాటలు పాడి గింజలు, వడ్లు తీసుకుని చీకటి పడ్డాక ఇల్లు చేరి, అప్పుడు కొత్త బట్టలు కట్టుకుని ఎవరికి చూపించుకోవాలో తెలియక దిగాలు పడే పసివాడి కథ అది. దుఃఖం వస్తుంది. సంక్రాంతి ఎంతో సంబరమైన పండగ. కాని సమకాంతికై అది చేసే వాగ్దానాన్ని మనం ఇంకా అందుకోవలసే ఉంది. సామాజికంగా అందరూ అడుగు పెట్టగలిగేదే ఉత్తరాయణం అంటే. క్రాంతి రావడమే సరైన సంక్రాంతి. అటువంటి సంక్రాంతిని కాంక్షిస్తూ గుమ్మడి పూల, పసుపు చేమంతుల శుభాకాంక్షలు! -
ఏడు చేపల కథ!
‘‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డమొచ్చింది. మోపూ మోపూ ఎందుకు అడ్డమొచ్చావ్? ఆవు మేయలేదు’’. ఈ చేప సాకుల కథ తెలుగు వారందరికీ సుపరిచితమే. ఏడు మాసాల కింద ఏపీలో ఏర్పడిన కిచిడీ సర్కార్ పరిపాలనకూ, ఈ సాకుల కథకూ కొంత సాపత్యం కుదురుతుంది. ఒకపక్క జనానికి షాకుల మీద షాకులిస్తూనే మరోపక్క తన వైఫల్యాలకు సాకుల మీద సాకులు వెతుకుతున్న తీరు న భూతో న భవిష్యతి! పరిపాలన చేతగానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. రూల్ ఆఫ్ లా స్థానాన్ని రూళ్లకర్ర పెత్తనం ఆక్రమించింది. విద్యారంగం గుండెల మీద విధ్వంసపు గునపాలు దిగు తున్నాయి. ప్రజా వైద్యరంగాన్ని ప్రైవేట్ బేహారుల జేబులో పెట్టబోతున్నారు. సాగునీటి గేట్ల తాళాలు కంట్రాక్టర్ల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అప్పులు చింపిన విస్తరిలా తయారైంది. ఇదీ కిచిడీ సర్కార్ ఏడు మాసాల సప్తపది.ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలైన ప్రతి సందర్భంలో దాన్నుంచి జనం దృష్టిని మళ్లించడం కోసం గోబెల్స్ ప్రచారాలను చేపట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది. అవినీతికీ, అసమర్థతకూ ఏపీ కిచిడీ సర్కార్ను కేరాఫ్ అడ్రస్ అనుకోవచ్చు. కొద్దిపాటి సమీక్షా ప్రణాళికలతో నివారించగలిగిన విజయవాడ వరద ముంపును ముందుచూపు లేక పెను ప్రమాదంగా మార్చారు. సాకును మాత్రం పాత ప్రభుత్వం మీదకు నెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. తిరుపతిలో జరిగిన తాజా విషాదంలోనూ అధినేతది అదే ధోరణి. కనీస ముందస్తు సమీక్షలు చేయకపోవడం, ఏర్పాట్లు లేకపోవడం, వ్యూహ రాహిత్యం, సమన్వయ లోపం, పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి సేవలోనే తరించడం... ఈ దుర్ఘటనకు ప్రధాన కారణాలు.తమది రియల్టైమ్ గవర్నెన్సనీ, ఎక్కడేమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తన కంప్యూటర్ దుర్భిణి ద్వారా తెలిసిపోతుందనీ చంద్రబాబు చెప్పుకుంటారు. లక్షలాదిమంది తరలివచ్చే వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమానికి ఏర్పాట్లు సరిగ్గా జరగ లేదని ఎందుకు కనిపెట్టలేకపోయారో మరి! తీరా దుర్ఘటన జరిగిన తర్వాత సాకు వెతుక్కోవడానికి ఆయనకు జగన్ సర్కారే కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎదురులేని రోజుల్లో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా, ప్రభుత్వ వైఫల్యం బయటపడ్డా వెంటనే ‘విదేశీ హస్తం’ మీదకు నెట్టేసేవారు. ఇప్పుడు చంద్ర బాబుకు జగన్ సర్కార్లో ఆ విదేశీ హస్తం కనిపిస్తున్నది.వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను తిరుమలకు బదులుగా తిరుపతిలోనే అందజేసే కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్ ప్రారంభించిందనీ, అందువల్లనే తొక్కిసలాట జరిగిందనేది ఆయన ఉవాచ. తిరుపతిలోనే టిక్కెట్లివ్వడమనేది పనికిమాలిన కార్య క్రమం అయితే, దివ్యదృష్టీ – దూరదృష్టీ... రెండూ కలిగిన చంద్రబాబు సర్కార్ ఎందుకు దాన్ని రద్దు చేయలేదనేది సహ జంగా ఉద్భవించే ప్రశ్న. రద్దు చేయకపోగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా అస్మదీయ పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించి భక్తకోటిని ఎందుకు ఆహ్వానించినట్టు? పైగా మూడు రోజుల టిక్కెట్లు ఒకేసారి ఇస్తామని ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు దండోరా వేయించినట్టు?వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే తిరుమలలోని ఒక కేంద్రంతోపాటు తిరుపతిలో తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేసి, వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు అందజేసిన మాట వాస్తవం. కానీ అప్పుడెటువంటి తొక్కిసలాటలూ, దుర్ఘటనలూ జరగ లేదు. సాఫీగా జరిగిపోయింది. ఎందుకని? వైకుంఠ ద్వార దర్శనం సదవకాశాన్ని స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకొని పది రోజులపాటు ఏర్పాటు చేశారు. తిరుపతికి వెలుపల ఎక్కడా ఎటువంటి ప్రకటనలూ ఇవ్వలేదు. స్థానికులు తీసుకోగా మిగిలితేనే ఇతర ప్రాంత ప్రజలు అడిగితే ఇచ్చే ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల వారికి ఆన్లైన్లో బుక్ చేసుకుని వచ్చే సౌకర్యం ఉండేది.ఈసారి రాష్ట్రంతో పాటు వెలుపల కూడా ‘రండహో’ అంటూ దండోరా వేయించిన పెద్దమనుషులు... చేయాల్సిన ఏర్పాట్లను మాత్రం గాలికొదిలేశారు. ఎనిమిది కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎనిమిదో తేదీ మధ్యాహ్నానికే లక్షల సంఖ్యలో భక్తులు కౌంటర్ల దగ్గరకు చేరుకున్నారు. వాళ్లకు ఏ రకమైన వసతులూ కల్పించలేదు. మంచినీళ్లిచ్చే దిక్కు కూడా లేదు. ఎని మిది కేంద్రాలకు గాను బైరాగిపట్టెడ, శ్రీనివాసం, రామచంద్ర పుష్కరిణి, విష్ణు నివాసం అనే నాలుగు కేంద్రాల దగ్గర భక్తుల సంఖ్య పెరిగిపోయి తొక్కిసలాట జరిగింది. బైరాగిపట్టెడ పరిస్థితి మరీ ఘోరం.అంతకంతకూ భక్తుల సంఖ్య పెరగడంతో కౌంటర్కు ఎదురుగా ఉన్న పార్కులోకి వారిని మళ్లించి తాళాలు వేశారు. అన్నపానీయాలు లేకుండా, కనీస వసతులు లేకుండా దాదాపు పది గంటలు ఉగ్గబట్టుకొని ఉండాల్సి వచ్చింది. మహిళలూ,వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతం. శత్రు దేశాల ప్రజల్ని, సైనికుల్ని నిర్బంధించడానికి నాజీలు ఏర్పాటుచేసిన కాన్సంట్రేషన్ క్యాంపులకు ఈ పార్కు జైలు భిన్నమైనదేమీ కాదు. ఇన్ని లక్షల మందిని నిర్బంధ శిబిరాల్లో కుక్కి మానవ హక్కులను హరించి నందుకు టీటీడీ అధికారులే కాదు ప్రభుత్వ పెద్దలు కూడా శిక్షార్హులే!ప్రజలను గంటల తరబడి నిర్బంధంగా అన్న పానీయాలకూ, కనీస అవసరాలకూ దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇటువంటి నిర్బంధ శిబిరాల గేట్లను హఠాత్తుగా తెరిచినప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని, ప్రమాదాలు జరుగుతాయని ఊహించడానికి ‘డీప్ టెక్’ పరి జ్ఞానం అవసరం లేదు కదా! కామన్సెన్స్ చాలు. ప్రజల ప్రాణా లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిసి కూడా ఎటువంటి ప్రకటనలూ చేయకుండా, అప్రమత్తం చేయకుండా అకస్మాత్తు చర్య ద్వారా తొక్కిసలాటకు దారితీయడం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే!ఈ నేరానికి పెద్ద తలలే బాధ్యత వహించవలసి ఉంటుంది. మొక్కుబడిగా ఎవరో ఇద్దర్ని సస్పెండ్ చేసి, మరో ముగ్గుర్ని బదిలీ చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అందు లోనూ వివక్ష. ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా బాధ్యత లేని వారిపై చర్యలు తీసుకొని, కీలక బాధ్యుల్ని వదిలేశారన్న విమ ర్శలు వెంటనే వెలువడ్డాయి. కీలక బాధ్యులు ప్రభుత్వ పెద్దలకు బాగా కావలసినవారు. వెంటనే తరుణోపాయాన్ని ఆలోచించిన చంద్రబాబు బంతిని పవన్ కల్యాణ్ కోర్టులోకి నెట్టారు. అధినేత మనసెరిగిన పవన్ ఓ గంభీరమైన సూచన చేశారు.జరిగిన ఘటన విషాదకరమైనదనీ, తనకు బాధ్యత లేకపోయినా క్షమాపణలు చెబుతున్నాననీ, అలాగే టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల జేఈవోలు కూడా క్షమాపణలు చెప్పాలనీ సూచించారు. అంటే ఇంత తీవ్రమైన నేరానికి క్షమాపణలు చెబితే సరిపోతుందన్న సూచన. బారా ఖూన్ మాఫ్! వారిపైన ఎటువంటి చర్యలూ లేకుండా క్షమాపణలతో సరిపెడతారన్నమాట! వారి శిరస్సుల మీద పవన్ కల్యాణ్ చేత మంత్ర జలం చల్లించి పాప ప్రక్షాళనం చేయించారనుకోవాలి. ఈ ఘటనతో ఏ సంబంధం లేని, కేవలం అడ్మినిస్ట్రేషన్ పనులకు మాత్రమే పరిమితమయ్యే తిరుపతి జేఈవో ఎందుకు బదిలీ అయ్యారో, ప్రధాన బాధ్యత తీసుకోవలసిన తిరుమల జేఈవో, ఈవో, టీటీడీ ఛైర్మన్లకు పాప విమో చనం ఎందుకు లభించిందో ఆ దేవదేవుడికే తెలియాలి.పాప విమోచనం దొరికిన ముగ్గురిలో కూడా ఇద్దరు మాత్రమే ప్రభుత్వాధినేతకు కావలసిన వారట! ఈవో శ్యామల రావుపై మాత్రం కత్తి వేలాడుతున్నదనీ, త్వరలోనే ఆయనను తప్పించడం ఖాయమనీ సమాచారం. ఇప్పుడే చర్య తీసుకుంటే తమకు కావలసిన వారిపై కూడా తీసుకోవలసి ఉంటుంది. కనుక కొంతకాలం తర్వాత ఆయనకు స్థానచలనం తప్పదంటున్నారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, దీనికి జగన్ సర్కారే బాధ్యత వహించాలనీ ఆమధ్య చంద్ర బాబు ఒక ప్రహసనాన్ని నడిపిన సంగతి తెలిసిందే. ఆ నాట కాన్ని రక్తి కట్టించడంలో ఈవో శ్యామలరావు విఫలమయ్యారనీ, ఫలితంగానే నాటకం రసాభాసగా మారిందనే అభిప్రాయం అధినేతకు ఉన్నదట!గత సెప్టెంబర్ మాసంలో విజయవాడ వరదల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం దారుణ వైఫల్యం దరిమిలా ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుపతి లడ్డుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, ఇందుకు జగన్ పాలనలోనే బీజం పడిందనే ప్రచారాన్ని కిచిడీ సర్కార్తోపాటు యెల్లో మీడియా కూడా పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. చివరకు అదంతా బోగస్ ప్రచారంగా తేలడానికి రెండు మాసాలు కూడా పట్టలేదు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరు మల దేవస్థానం ప్రతిష్ఠ జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఇనుమడించింది. టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాల నిర్మాణం జరిగింది. స్వల్పకాలంలో ఇన్ని ఆలయాల నిర్మాణాన్ని ఇంకెవరి హయాంలోనూ టీటీడీ చేపట్టలేదు. హిందువులకు పవిత్రమైన గోమాత సంరక్షణ కోసం వందల సంఖ్యలో గోశాలల నిర్మాణం కూడా జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు దేశదేశాల్లో వైభవంగా జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉన్నది.తిరుమలను అపవిత్రం చేస్తున్నారనే ప్రచారాన్ని ఈ కిచిడీ గ్యాంగ్ ఆ రోజుల్లోనే ప్రారంభించింది. కానీ, ఎవరూ దాన్ని విశ్వసించలేదు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ కల్తీ పేరుతో మరోసారి బురద చల్లాలని ప్రయత్నించి భంగ పడ్డారు. ఇప్పుడు తమ బాధ్యతా రాహిత్యానికి ఆరుగురు భక్తులు బలైతే... దాన్ని వైసీపీ ప్రభుత్వానికి చుట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం, ప్రజల విజ్ఞతపై ఆయనకున్న చిన్న చూపుకు నిదర్శనం. అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల్లో ఆయన ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదు. పైగా అన్ని రంగాల్లో వైఫల్యం! వాటినుంచి దృష్టి మళ్లించేందుకు నెలకోసారైనా ఒక పెద్ద డైవర్షన్ స్కీమ్ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటివరకు ఏడు మాసాల్లో ఎండబెట్టిన ఏడు డైవర్షన్ చేపల్లో ఒక్కటీ ఎండలేదు. చీమ కుట్టడంతోనే చేపల కథ ముగుస్తుంది. ఈ డైవర్షన్ చేపల కథ ముగింపు కూడా అలాగే ఉండనుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బాధ్యత లేని బాల్యచాపల్యం
బాల్యావస్థ చిత్రమైనది. ఆ దశలో కంటిముందు కనబడేవన్నీ తన సొంతం అనుకునే మనస్తత్వం ఉంటుంది. మరో పదిరోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న డోనాల్డ్ ట్రంప్ ఈ మాదిరి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతోంది. అధికారంలోకి రాకముందే ఆయన వరసబెట్టి పొరుగు దేశాలకు తాఖీదులు పంపుతున్నారు. ‘మీరంతా నా దారికి రండి’ అన్నదే వాటి సారాంశం. అమెరికాలో 51వ రాష్ట్రంగా స్థిరపడటానికి కెనడా సిద్ధంగా ఉండాలట. డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్ల్యాండ్ ప్రాంతాన్ని ఆ దేశం వదిలేసుకోవాలట. అలాగే పనామా అధీనంలోని పనామా కాల్వపై అమెరికాకు పూర్తి హక్కున్నదట. తన అభీష్టం నెరవేరటానికి ఆ దేశాలపై టారిఫ్ మోత మోగి స్తారట. ఫలితం రాకపోతే దురాక్రమణకు సిద్ధపడతారట. సోవియెట్ యూనియన్ దురాక్రమణకు పాల్పడే అవకాశం ఉన్నదని బెదరగొట్టి 1949లో నాటో కూటమిని ఏర్పాటుచేసింది అమెరికాయే. దాని స్థానంలో వచ్చిన రష్యావల్ల కూడా ముప్పు ముంచుకురావచ్చని ఒప్పించి నాటోను కొన సాగిస్తున్నదీ అమెరికాయే. తీరా ట్రంప్ ప్రకటనల తీరు చూశాక నిజమైన ముప్పు అమెరికానుంచే ఉండొచ్చన్న భయాందోళనలు యూరప్ దేశాల్లో కలుగుతున్నాయి. ఏడెనిమిదేళ్లుగా అమెరికా ‘నియమాల ఆధారిత’ ప్రపంచం గురించి మాట్లాడుతోంది. చైనా ప్రాబల్యాన్ని అడ్డగించటమే లక్ష్యంగా అమెరికా వాడుకలోకి తెచ్చిన ఇండో–పసిఫిక్ వ్యూహానికి ప్రాతిపదిక ‘నియమాల ఆధా రిత’ ప్రపంచమే. ట్రంప్ ప్రకటనలకూ, ఈ వ్యూహానికీ పూర్తిగా చుక్కెదురు. అమలులో ఉన్న నియ మాలను ధిక్కరించి, అంతర్జాతీయ న్యాయానికి భిన్నంగా ప్రవర్తించి ఏ దేశాన్నయినా ఆక్రమించు కోవాలనుకునే మనస్తత్వం దేనికి దారితీస్తుంది? అందుకే యూరప్ దేశాలన్నీ ట్రంప్ ప్రకటనపై విరుచుకు పడుతున్నాయి. సభ్యదేశాల్లో ఎవరిపై దాడి జరిగినా మిగిలిన దేశాలన్నీ అండగా నిలవాలన్నది నాటో నియమం. దానికి అనుగుణంగానే జర్మనీ, ఫ్రాన్స్ మొదలు అన్ని దేశాలూ ట్రంప్ తీరును ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్ దురాక్రమణకు పాల్పడిన రష్యాను ఖండిస్తూ, తైవాన్ను సొంతం చేసుకోవాలనుకునే చైనాను హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తానే దురాక్రమణదారుగా మారుతుందా అన్నది చెప్పలేం. పూర్వాశ్రమంలో రిపబ్లికన్ పార్టీకే చెందిన నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఇలాంటి బెదిరింపులకే పాల్పడేవారు. తానొక ప్రమాదకారినన్న భావన కలిగిస్తే చాలు... ప్రపంచమంతా పాదాక్రాంతమవుతుందన్న భ్రమ ఆయనకు ఉండేది. దాన్ని ‘మ్యాడ్మ్యాన్ థియరీ’గా పిలిచేవారు. చివరకు ఆయన హయాంలోనే ఎంతో అప్రదిష్టపాలై ఉత్తర వియత్నాం నుంచి అమెరికా సైనికులు వైదొల గాల్సి వచ్చింది. ట్రంప్ మాటలు ‘మ్యాడ్మ్యాన్ థియరీ’వంటివేనా... నిజంగా ప్రమాదకరమైనవా అనే విచికిత్సలో పడ్డాయి యూరప్ దేశాలు. దౌత్యరంగంలో ఎవరైనా సరే... మరో దేశాధినేత వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమకేం చెప్పారన్నది కాక, వారి బహిరంగ ప్రకటనలనూ, వారి ఆచరణనూ పరిగణనలోకి తీసుకుంటారు. తొలి ఏలుబడిలో సైతం ట్రంప్ ఇలాంటి హెచ్చరికలు చాలా చేసేవారు. ఉత్తర కొరియాపై నిప్పుల వాన కురిపించబోతున్నట్టు ప్రకటనలు చేయటం, చివరకు ఆ దేశానికి అతిథిగా వెళ్లి ఒప్పందం కుదుర్చుకురావటం అందరూ చూశారు. చైనా పైనా అదే తరహాలో చిందులు తొక్కేవారు. కానీ ఎప్పుడూ దాని జోలికిపోలేదు. అయితే ఇరాన్ విషయంలో అలా కాదు. ఆ దేశ అగ్రనేతల్లో ఒకరైన కాసిం సొలేమనిని హత్య చేయించారు. వేరే దేశాల నేతలపై దాడులకు పాల్పడటం, దాన్ని అధికారికంగా ప్రకటించటం అసాధారణం. కనుకనే ట్రంప్ రెండో ఏలుబడిపై అందరిలోనూ ఆందోళన నెలకొన్నది. విస్తరణవాద చాపల్యం అమెరికాకు మొదటినుంచీ ఉన్నదే. కానీ అదంతా మృదువైన భాష వెనక నడిచేది. వేరే దేశాల్లో పాలకుల్ని మార్చకుండానే తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకునేది. నేరుగా బెదిరింపులకు దిగటం ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త ధోరణి. ఏటా కెనడా రక్షణకు రెండువేల కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నామని, అందువల్ల ఒరిగేదేమీ లేదన్నది ఆయన అభిప్రాయం. 51వ రాష్ట్రంగా కలుపుకొంటే అదంతా ఆదా అవుతుందని ట్రంప్ అంటున్నారు. కెనడా వాదన భిన్నంగా ఉంది. అమెరికా–కెనడా సంబంధాల వల్ల ఇరు దేశాలూ బాగుపడుతున్నాయని ఆ దేశం చెబుతోంది. తమనుంచి అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఇంధనం మార్కెట్ ధరకన్నా తక్కువకు అమెరికాపొందుతున్నదని, వేలకోట్ల డాలర్ల విలువైన అమెరికా సరుకులు కెనడాలో అమ్ముడవుతున్నాయని, అమెరికా చేసే యుద్ధాలకు కోట్ల డాలర్ల ధనం వెచ్చిస్తున్నామని కెనడా విపక్ష నేత పియే పొలియేరా గుర్తుచేశారు. దండిగా ఖనిజ వనరులున్న గ్రీన్ల్యాండ్పై ట్రంప్ కన్నుపడింది. పద్దెనిమిదేళ్ల ట్రంప్ కుమారుడు ఆ ప్రాంతానికెళ్లి అది తమ సొంత జాగీరన్న అర్థం వచ్చేలా ప్రకటించాడు. నిజానికి గ్రీన్ల్యాండ్ డెన్మార్క్ అధీనంలో కూడా లేదు. 57,000 మంది నివసించే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఉంది. కేవలం సైనిక, ఆర్థిక వ్యవహారాలు మాత్రమే డెన్మార్క్ చూస్తుంది. పనామా కాల్వపై హక్కు వదులుకోవటానికి పనామా దేశం కూడా సిద్ధంగా లేదు. ట్రంప్ ఒక తేనెతుట్టె కదిల్చి తమాషా చూడదల్చుకున్నారా... నిజంగానే దురాక్రమణకు సిద్ధపడతారా అన్నది మున్ముందు తేలుతుంది. దురాక్రమణకు సిద్ధపడితే ఇప్పుడు పుతిన్కు ఉక్రెయిన్లో ఎదురవుతున్న పరాభవమే అమెరికాకు తప్పకపోవచ్చు. అంతకన్నా కీలకమైనదేమంటే... అమెరికా విశ్వసనీయతతో పాటు మిత్రులనూ కోల్పోతుంది. ఏకాకిగా మారుతుంది. -
క్షమార్హం కాని నేరం!
కోరి కొల్చినవారికి కొంగు బంగారమై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తిరుపతిలో బుధవారం ఒక మహాపరాధం జరిగిపోయింది. కేవలం పాలకుల చేతగానితనంవల్ల ఆరు నిండు ప్రాణాలు బలికావటం, 43 మందికి పైగా గాయపడటం చరిత్ర ఎరుగని విషాదం. శతాబ్దాలుగా ఏడుకొండలవాడి సన్నిధిలో ఎన్నడూ ఇటువంటి దారుణ ఉదంతం చోటుచేసుకున్నట్టు నమోదు కాలేదు. రాచరికం మొదలు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ వరకూ ఎందరెందరో పాలకులొచ్చారు. కానీ ఎప్పుడూ ఎవరూ ఇంత చేటు నిర్లక్ష్యం ప్రదర్శించిన దాఖలా లేదు. ఇదే దారుణమనుకుంటే... దుర్ఘటన జరిగింది మొదలుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరసబెట్టి బాహాటంగా ప్రదర్శిస్తున్న అతి తెలివితేటలు ప్రజలను దిగ్భ్రాంతి పరుస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా గురువారం బైరాగిపట్టెడ దగ్గర కెమెరాల కోసం ‘ప్రజాకోర్టు’ నిర్వహించి అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడటమైనా... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్నారని తెలిసి క్షతగాత్రులు కోలుకోకుండానే ఆదరాబాదరాగా ఆస్పత్రినుంచి వారిని పంపటానికి ప్రయత్నించిన తీరైనా బాబు వంచనాత్మక విన్యాసాలకు పరాకాష్ట. ఇవే కాదు... జరిగిన ఘోరంపై టీటీడీ చైర్మన్ మొదలుకొని మంత్రుల వరకూ ఒక్కొక్కరు వినిపిస్తున్న కథలు విస్తు గొలుపుతున్నాయి. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే సమాచారం ఉన్నదని చైర్మన్గిరీ వెలగ బెడుతున్న బీఆర్ నాయుడు చెబుతున్నారు. మరి వీరంతా కలిసి చేసిందేమిటి?అసలు ఏమైంది ఈ ప్రభుత్వానికి? ఎందుకింత చేష్టలుడిగిపోయింది? వైకుంఠ ఏకాదశి పర్వ దినం మొదలు వరసగా పదిరోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి మాత్రమేకాదు... దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారని తెలుసు. అందుకోసం సీఎం కార్యాలయం మొదలుకొని టీటీడీలో అట్టడుగు సిబ్బందివరకూ పకడ్బందీ సమన్వయంతో ముందుకు సాగాలనీ తెలుసు. అంతక్రితం కేవలం రెండురోజులు మాత్రమే ఉండే వైకుంఠద్వార దర్శనాన్ని భక్తుల సంఖ్య నానాటికీ పెరగటాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పదిరోజులకు పెంచింది. భక్తులు సజావుగా దర్శనం చేసుకుని తరించటానికి వీలుగా 9 కేంద్రాల్లో పదేసి కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించింది. 24 గంటలముందే తెల్లారుజామున అయిదు గంటలకు టోకెన్ల జారీ మొదలయ్యేది. కానీ దీన్నంతటినీ తలకిందులు చేసి ముందురోజు అర్ధరాత్రి నుంచీ వేచి వున్న భక్తులను ఒకచోట చేర్చి రాత్రి ఎప్పుడో టోకెన్లు ఇవ్వటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెల్లారుజాము నుంచి రాత్రి వరకూ సిబ్బంది ఏం చేసినట్టు? కనీసం టోకెన్ల కోసం ఆరుబయట పడిగాపులు పడుతున్న భక్తుల్లో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకూ ఉన్నారన్న స్పృహ... వారికి తిండీ నీళ్లూ అందించాలన్న ఇంగితజ్ఞానం ఉండొద్దా? వచ్చిన వారిని వచ్చినట్టుగా క్యూలైన్లలో పంపి, వెంటవెంటనే టోకెన్లు జారీ చేయొద్దా? ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకొచ్చాయి గనుక జిల్లాల్లోనే ఆన్లైన్లో టోకెన్లు అందించే ప్రక్రియ అమలుచేయొచ్చు. అదే జరిగితే భక్తులందరూ స్వామివారిని తనివితీరా వీక్షించి, సురక్షితంగా తమ తమ ఇళ్లకు చేరుకునేవారు. కానీ పక్షవాతం వచ్చిన చందంగా ఎవరికివారు చేష్టలుడిగి ఈ ఘోర ఉదంతానికి కారకులయ్యారు.దీన్నంతటినీ కప్పిపుచ్చుకోవటానికి జిల్లా ఎస్సీని బదిలీ చేశారు. ఒక డీఎస్పీని సస్పెండ్ చేశారు. ఈవో, జేఈవోను వదిలేశారు. మరి శాంతిభద్రతల విభాగం దగ్గరుంచుకుని బాబు చేసిందేమిటి? ప్రమాణస్వీకారానికి ముందే తమ కనుసైగలతో ఊరూ వాడా దాడులూ, దౌర్జన్యాలూ, సామాన్య పౌరుల ఇళ్లు నేలమట్టం చేయించి మాఫియాలను తలపించే పాలనకు శ్రీకారం చుట్టిన పర్యవసానం కాదా ఈ ఉదంతం? తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని తప్పుడు ప్రచా రానికి పాల్పడలేదా? ఈ నేపథ్యంలో ఏ జిల్లాలోనైనా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించగలుగుతున్నారా? ఎన్ని కేసులుంటే అంత గొప్పగా నెత్తెక్కించుకుంటామని అధికారంలోకి రాకముందు టీడీపీ శ్రేణుల్లో నేరస్వభావాన్ని పెంచిన ఘనత వీరిది. ఇప్పుడు పోలీసులకూ అదే రంధి పట్టుకుంది. ఎంతమందిపై అక్రమ కేసులు పెడితే అంతగా నజరానాలు పొందొచ్చన్న దురాశ పుట్టింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతోపాటు, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో ఈమూలనుంచి ఆ మూలకు తిప్పుతున్నారు. ఇక శాంతిభద్రతలు ఎటుపోతేనేం... పర్వదినాలకు వచ్చే భక్తులు ఏమై పోతేనేం! దేవుడంటే భయ భక్తుల్లేవు... ప్రజలంటే వెరపు లేదు! ఈ దుఃస్థితికి ఎన్డీయే కూటమి పాలకులు సామూహికంగా సిగ్గుపడాలి. విశాఖలో స్టీల్ప్లాంట్ భవిష్యత్తుపై ఒక్క మాటైనా మాట్లాడని ప్రధాని మెప్పు పొంద టానికి బాబు, పవన్, లోకేశ్లు అగచాట్లు పడితే... అక్రమ కేసుల పరంపరతో ఆ ముగ్గురి దగ్గరా మార్కులు కొట్టేద్దామని అధికార యంత్రాంగం పాట్లు పడుతోంది. వెరసి ఇలాంటి దారుణాలు రివాజయ్యాయి. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడినవారి కుటుంబ సభ్యులు చెబుతున్న విషయాలు వింటే గుండె తరుక్కుపోతుంది. 2015లో తన ఏలుబడిలో, తన వల్ల, తన సమక్షంలో గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తుల మరణానికి దారితీసిన ఉదంతాన్ని బాబు సోమయాజులు కమిషన్తో కప్పెట్టటాన్ని ఎవరూ మరిచిపోరు. కనుక తిరుపతి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. టీటీడీ చైర్మన్తో సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. -
గౌరవం నిలపాలి!
తమిళనాడు సర్కారుకూ, ఆ రాష్ట్ర గవర్నర్కూ పొసగడం లేదన్నది కొన్నేళ్ళుగా జగమెరిగిన సత్యమే. ఆ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నూతన సంవత్సరంలో తమిళనాడు శాసనసభ తొలిసారి సమావేశమైనప్పుడు సభను ఉద్దేశించి గవర్నర్ చేయాల్సిన ప్రారంభ ప్రసంగం వరుసగా మూడో ఏడాది సైతం రచ్చ రాజేసింది. శాసనసభలో ప్రసంగించకుండానే గవర్నర్ ఆర్.ఎన్. రవి నిష్క్రమించడం వివాదాస్పదమైంది. రాష్ట్రాల యూనియనైన భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్రపై ఇది మళ్ళీ చర్చకు తావిచ్చింది. అత్యంత గౌరవాస్పదమైనదైన గవర్నర్ పదవి, ఇటీవల గవర్నర్లు కొందరు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టవశాత్తూ చర్చనీయాంశమవుతోంది. రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టాక రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలతో కయ్యానికి కాలుదువ్వుతూ, రాజ్యాంగ పరిధిని మించి ప్రవర్తిస్తున్నారన్నదీ నిష్ఠురసత్యమే. గవర్నర్ హోదా దుర్వినియోగం కావడం కొత్త ఏమీ కాదు. అదో సుదీర్ఘ చరిత్ర. ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పిన రోజుల్లో గవర్నర్లు వట్టి రబ్బరు స్టాంపులనే పేరుండేది. కేంద్రం పనుపున రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను ఒక్క కలం పోటుతో బర్తరఫ్ చేశారనే దుష్కీర్తికీ కొదవ లేదు. ఢిల్లీ గద్దెపై పార్టీ జెండా మారినా... ఇప్పుడూ అదే రకమైన దుర్వినియోగం వేరొక పద్ధతిలో కొనసాగుతోందని వాపోవాల్సి వస్తోంది. గతంలో కాంగ్రెస్ పాలకులు చేశారు కాబట్టి ఇప్పుడు మేమూ ఆ రకంగానే ప్రవర్తిస్తామని ప్రస్తుత పాలకులనుకుంటే అది సమర్థనీయం కాదు. రాజ్యాంగ విధినిర్వాహక పదవుల దుర్వినియోగం వ్యక్తులకే కాక, వ్యవస్థకూ మాయని మచ్చవుతుంది. ‘టీమ్ ఇండియా’ అంటూ కేంద్ర పాలకులు తరచూ ఆదర్శాలు పైకి వల్లె వేస్తున్నా, ఆచరణలో జరుగుతున్నది వేరు. బీజేపీయేతర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని, రాజ్భవన్ను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారనే ఆరోపణ... కొన్నేళ్ళుగా కేరళ నుంచి కశ్మీర్ దాకా అనేకచోట్ల వినిపిస్తున్నది. తమిళనాట డీఎంకే సర్కారుతో గవర్నర్ రవికి మొదటి నుంచీ ఉప్పూ నిప్పే! ఏళ్ళ తరబడి పాటిస్తూ వస్తున్న వ్యవస్థీకృత సభా సంప్రదాయాలను తోసిరాజనడమే కాదు... లౌకికవాదం సహా పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సాక్షాత్తూ రాజ్యాంగమే లౌకికవాదాన్ని ఔదలదాల్చిన దేశంలో... రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నరే... అది వట్టి యూరోపియన్ సిద్ధాంతమనీ, భారతదేశంలో దానికి చోటులేదనీ వ్యాఖ్యానించారు. అది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ మధ్య ప్రసారభారతి కార్యక్రమంలో, ఇప్పుడు చట్టసభలో జాతీయ గీతాలాపనపై ఆయన రగడ చేశారు. నిజానికి, తమిళనాట అధికారిక కార్యక్రమాలన్నిటా ‘తమిళతల్లి స్తుతి’ (తమిళ్తాయ్ వాళ్తు)ని ప్రార్థనా గీతంగా పాడడం 1970 నుంచి ఉన్నదే. 2021 డిసెంబర్లో దాన్ని రాష్ట్ర గీతంగానూ ప్రకటించారు. తమిళ ప్రభుత్వ కార్యక్రమాలన్నిటినీ తమిళ్తాయ్ వాళ్తుతో ఆరంభించి, జాతీయ గీతాలాపనతో ముగించడం దశాబ్దాల సంప్రదాయం. ఆ సంగతే ముందుగానే ప్రభుత్వం చెప్పినప్పటికీ, దాన్ని గౌరవించాల్సిన గవర్నర్ పదేపదే విభేదించడం, అంతటితో ఆగక ‘ద్రావిడనాడు’ భావనపైనే అభ్యంతరాలు చెప్పడం, ఒక కార్యక్రమంలో అధికారిక గీతం నుంచి ద్రావిడనాడు ప్రస్తావన అనుమానాస్పద రీతిలో తొలగింపునకు గురికావడం... అన్నీ వివాదాలే. సభాసమావేశాల ప్రారంభ ప్రసంగంలో ప్రభుత్వ విధానప్రకటనను సభ్యుల ముంగిట ప్రతిపాదించడం గవర్నర్ రాజ్యాంగ విధి. కానీ, 2023లోనూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రసంగ పాఠంలో ‘ద్రావిడ నమూనా పాలన’ సహా కొన్ని అంశాలను రవి ఉద్దేశపూర్వకంగానే వదిలేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయన్నదీ చదవలేదు. అదేమంటే, ప్రసంగపాఠంలో కొన్ని అంశాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ తీవ్రమైన వ్యాఖ్యే చేశారు. పెరియార్ రామసామి, కామరాజ్, అణ్ణాదురై, కరుణానిధి, అంబేడ్కర్ లాంటి పేర్లను చదవడానికి నిరాకరించడం, ‘తమిళనాడు’ బదులు ‘తమిళగం’ అనాలనడం రవిపై గతంలోనే విమర్శల వేడి పెంచాయి. ఇలా రాజ్యాంగ పరిధిని పదేపదే ఉల్లంఘించి, వివాదాలకు కేంద్రమవడం సరికాదు. ఆ మాటకొస్తే ప్రజలెన్నుకున్న ప్రభుత్వంతో కేంద్ర పాలకులు కూర్చోబెట్టిన గవర్నర్లు తలపడడం, ప్రభుత్వ అధికారిక బిల్లుల్ని ఆమోదించకుండా తాత్సారం చేయడం, వైస్ ఛాన్సలర్ల నియామకానికి మోకాలడ్డడం, బాహాటంగా పాలనను విమర్శించడం... ఇవన్నీ పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక సహా పలుచోట్ల కొద్దికాలంగా చూస్తున్నదే. రాజ్భవన్లు రాజకీయ కేంద్రాలవుతున్నాయన్న విమర్శకు ఇలాంటివే కారణం. ప్రాథమిక హక్కుల్లో భాగంగా వ్యక్తిగత హోదాలో ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా తప్పు లేదు. భావప్రకటన స్వేచ్ఛను తప్పుపట్టనూ లేము. కానీ, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తుల నుంచి ఆశించేది వేరు. సదరు హోదా తాలూకు గౌరవానికి భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తీకరించినా, ప్రజా ప్రభుత్వ పాలనకు రాజ్యాంగహోదాతో అభ్యంతరం చెప్పినా అది హర్షణీయం కాదు. ఒక విధంగా అది రాజ్యాంగ విధులకే ఉల్లంఘన. రాష్ట్ర మంత్రిమండలి సలహా సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలంటూ 1974లోనే ఏడుగురు సభ్యుల సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం చెప్పిన మాట శిరోధార్యం కావాలి. కేంద్రంలో రాష్ట్రపతి లాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఆలోచనకు అద్దం పట్టాల్సిన గవర్నర్లు ఆ రాజ్యాంగ విధిని విస్మరించ లేరు. వన్నె తగ్గించే పనుల్ని మానుకుంటేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి గెలుస్తుంది. రాజ్యాంగ రూపకర్తల సదాశయం నిలుస్తుంది. -
భయం వద్దు... జాగ్రత్త ముద్దు!
మాస్కులు... చేతుల పరిశుభ్రత... తదితర జాగ్రత్తలు మళ్ళీ బలంగా వినిపిస్తున్నాయి. హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ) వల్ల చైనాలో వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, మన దేశంలోనూ కేసులు కొన్ని బయటపడడంతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా పాత కరోనా జ్ఞాపకాలు ముప్పిరిగొంటున్నాయి. చైనా వార్తలతో సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 1.5 శాతం పైగా పడిపోవడం గగ్గోలు రేపుతోంది. ఉత్తరాన చైనాకు సమీపంలో ఉన్నందున ప్రజా సంబంధాలు, ఆర్థిక సంబంధాల రీత్యా స్వైన్ఫ్లూ, ఏవియన్ ఫ్లూ, కోవిడ్ల లానే ఇది కూడా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ అనారోగ్యాలపై ఓ కన్నేసి ఉంచాలనీ, వేయికళ్ళతో పరిస్థితిని కనిపెట్టాలనీ, ఒకరి నుంచి మరొకరికి హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రజల్లో చైతన్యం తేవాలనీ రాష్ట్రాలకు కేంద్ర సర్కార్ తాజాగా సూచనలు జారీ చేయడం గమనార్హం. హెచ్ఎంపీవీ సహా అలాంటి అనేక ఇతర వైరస్ల వల్ల చైనాలో ఇప్పటికే భారీ సంఖ్యలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలాయి. ఆ దేశంలో జనం మాస్కులు ధరించి ఆస్పత్రుల్లో, బయట సంచ రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ సహా ప్రపంచమంతటా ఈ కేసులపై దృష్టి పెరిగింది. హెచ్ఎంపీవీ వైరస్ వ్యవహారం చర్చనీయాంశమైంది. కోవిడ్ సృష్టించిన భయోత్పాతం రీత్యా, వైరస్లు, మహమ్మారుల పేరు చెప్పగానే జనం సహజంగానే బెంబేలెత్తిపోతున్నారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ భయాందోళనలు అర్థం చేసుకోదగినవే. నిజానికి, హెచ్ఎంపీవీ కొత్త వైరస్ ఏమీ కాదు. శాస్త్రవేత్తలు 2001లోనే తొలిసారి దీని జాడ గుర్తించారు. వైరస్ స్వభావం, అది సోకినప్పటి లక్షణాల గురించి అవగాహన కూడా వచ్చింది. అయిదేళ్ళ లోపు చిన్నారులకూ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికీ, వృద్ధులకూ ఈ వైరస్ సోకే ప్రమాదం అధికం. అందువల్లే, హెచ్ఎంపీవీతో తంటా చాలాకాలంగా ఉన్నదేననీ ఓ వాదన. అసలు మన దగ్గర తాజాగా ఈ కేసులు చాలా గమ్మత్తుగా బయటపడ్డాయి. అంతకంతకూ చలి ముదురుతున్న ఈ శీతకాలంలో శ్వాసకోశ అనారోగ్యాలను పసిగట్టి, వాటిపై నిఘా ఉంచేందుకు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ (ఐసీఎంఆర్) ఎప్పటిలానే చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఈ వైరస్ బాధిత కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, దేశంలో శ్వాసకోశ వ్యాధి పీడితుల్లో అనూహ్యమైన పెరుగుదల ఏదీ ఇప్పటికీ కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేయడం ఒకింత ఊరటనిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉన్నామన్నది ఆ శాఖ ఆశ్వాసన. ఆ మాటకొస్తే, దేశంలో శ్వాసకోశ, సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండడం ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం చేసేదే. ఇప్పుడు హెచ్ఎంపీవీ పరిస్థితిపై ఒక్క సారిగా గగ్గోలు రేగడంతో అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రతిస్తున్నట్టు అధికారిక కథనం. కరోనా మొదలు నేటి హెచ్ఎంపీవీ దాకా అన్నీ చైనా కేంద్రంగా వార్తల్లోకి రావడంతో అనేక అనుమానాలు, భయాలు తలెత్తుతున్నాయి. చైనా సర్కార్ మాత్రం పౌరులతో పాటు తమ దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల ఆరోగ్యాన్ని సైతం కాపాడతామంటూ భరోసా ఇస్తోంది. బీజింగ్ ఎన్ని మాటలు చెప్పినా, గత చరిత్ర కారణంగా ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. చిత్రమేమిటంటే, ప్రస్తుత ఇన్ఫెక్షన్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎలాంటి ప్రకటన, మార్గదర్శకాలు విడుదల చేయనేలేదు. విదేశీ ప్రయాణాలు చేయనివారికి సైతం హెచ్ఎంపీవీ సోకినట్టు వార్తలు రావడంతో, ఇది సీజనల్ సమస్యే తప్ప మరేమీ కాకపోవచ్చనే అభిప్రాయమూ ఉంది. చలికాలంలో ఇన్ఫెక్షన్లు సాధారణమే. అయితే, సరైన సమాచారం లేనప్పుడు పుకార్లు షికార్లు చేసి, లేనిపోని భయాలు సృష్టించి, ఆర్థిక, సామాజిక నష్టానికి దారి తీసే ముప్పుంది. జనవరి 13 నుంచి 45 రోజులు ప్రయాగలోని కుంభమేళాకు 40 కోట్ల పైగా భక్తులు హాజరవు తారని అంచనాలున్న వేళ అప్రమత్తత అవసరం. వైరస్ల విహారానికి ముకుతాడు వేయడం ముఖ్యం. కోవిడ్–19 కాలంలో లానే తరచూ చేతులను సబ్బునీళ్ళతో కడుక్కోవడం, చేతులు కడుక్కోకుండా కళ్ళు–ముక్కు–నోటిని తాకకపోవడం, వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలగక పోవడం, దగ్గు – తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు – నోటికి అడ్డు పెట్టుకోవడం, మాస్కులు ధరించడం ఉత్తమం. అసలు కరోనా, హెచ్ఎంపీవీ లాంటి వాటితో సంబంధం లేకుండా ఈ ఖర్చులేని సర్వసాధారణ జాగ్రత్తలను మన నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ఆరోగ్య పరిరక్షణకు మరీ ఉత్తమం. కోవిడ్ అనుభవం ప్రపంచానికి నేర్పిన పాఠం – అప్రమత్తత. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దనీ, ఎట్టి çపరిస్థితుల్లోనూ స్వీయరక్షణ చర్యలను వదిలిపెట్టవద్దనీ తేల్చిచెప్పింది. దేశంలో 78 శాతం మేర చొచ్చుకుపోయిన మొబైల్ ఫోన్లనూ, 65 కోట్ల మందికి పైగా వీక్షకులున్న దూరదర్శన్నూ ప్రజాహిత సమాచార ప్రచారానికి వినియోగించాలి. అంతేకాక, ఇలాంటి వివిధ రకాల వైరస్లు, వ్యాధులకు దేశంలో టెస్టింగ్ సౌకర్యాలను విస్తరించాలి. ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకుంటేనే అవాంఛనీయ పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం సిద్ధిస్తుంది. వైరస్ల తీవ్రత తక్కువ, ఎక్కువలతో సంబంధం లేకుండా పాలకులు పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంపై శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యాధులు ప్రబలాక చికిత్సకు శ్రమించే కన్నా, వైరస్లను ముందే పసిగట్టి, వాటి విజృంభణను నివారించేందుకు సర్వసన్నద్ధం కావడం అన్ని విధాలా ఉపయుక్తం, శ్రేయస్కరం. -
సురక్షిత డిజిటల్ ప్రపంచం కోసం!
కాలం మారుతున్నకొద్దీ, సాంకేతికతలు విస్తరిస్తున్నకొద్దీ కొత్త భయాలు పుట్టుకొస్తాయి. తమ పిల్లలు సోషల్ మీడియా వ్యామోహంవల్ల చెడిపోతున్నారని కొన్నాళ్లుగా తల్లిదండ్రుల్లో బెంగ పట్టు కుంది. అక్కడ తారసపడే విశృంఖల పోకడలు, తప్పుడు భావాలు పిల్లల మెదళ్లపై దుష్ప్రభావం కలగ జేస్తున్నాయి. వారి బాల్య, కౌమార దశలను కొల్లగొడుతున్నాయి. పిల్లలకు మాదకద్రవ్యాలు అల వాటు చేయడంలో సామాజిక మాధ్యమాల పాత్ర కాదనలేనిది. నిజానికి సోషల్ మీడియా దుర్వ్యసనంగా మారిన వైనమూ, దాని పర్యవసానాలూ చెదురుమదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వచ్చినప్పుడు కొత్త తలనొప్పులు సహజమే. ఈ నేపథ్యంలో 18 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరవటానికి తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి చేస్తూ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం ముసాయిదా నిబంధనలను కేంద్రం రూపొందించింది. అభ్యంతరాలు, సూచనలు వచ్చే నెల 18లోగా తెలియజేయాలని కోరింది.డేటా పరిరక్షణ కోసం, వ్యక్తిగత గోప్యత భద్రత కోసం ఒక చట్టం అవసరమన్న సంగతిని మన పాలకులు గ్రహించటంలో అలవిమాలిన జాప్యం చోటుచేసుకుంది. పౌరుల వేలిముద్రలు, బ్యాంకు ఖాతాలతో సహా సమస్త వివరాలనూ సేకరించే ఆధార్ వ్యవస్థ తీసుకొచ్చిన ఏడెనిమిదేళ్ల వరకూ ఆ డేటా పరిరక్షణకు ఎలాంటి కట్టుదిట్టాలు అవసరమన్నది ఎవరికీ తట్టలేదు. 2017లో జస్టిస్ పుట్టస్వామి పిటిషన్పై ఇచ్చిన తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యక్తిగత గోప్యతను తొలిసారి ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మరో ఆరేళ్ల తర్వాత 2023 ఆగస్టులో డీపీడీపీ చట్టం వచ్చింది. దాని అమలుకు సంబంధించిన నిబంధనల రూపకల్పనకు మళ్లీ ఇన్ని నెలలు పట్టింది. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్న వర్త మానంలో ఈ అంశంపై ఇప్పటికైనా ముసాయిదా నిబంధనలు రావటం హర్షించదగ్గది. ప్రస్తుతం ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని వాతావరణంలో ప్రపంచం మనుగడ సాగిస్తోంది. గోడలకు చెవులుంటాయన్నది పాత సామెత. స్మార్ట్ ఫోన్లకు చెవులే కాదు... కళ్లు కూడా ఉంటున్నాయి. మనం పక్కవారితో సాగించే పిచ్చాపాటీని సైతం వినే సదుపాయం ఆ ఫోన్లలో ఉంటున్నదని, మన ఇష్టాయిష్టాలు తెలుసుకోవటం, వాటి ఆధారంగా డేటా రూపొంది క్షణాల్లో ఎవరెవరికో చేరిపోవటం రివాజైందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఫోన్లు వినియోగించనప్పుడు సైతం వాటి కెమెరాలు కళ్లు తెరిచే సాంకేతికత ఉన్నదంటున్నారు. ఇలాంటి ఫోన్లు తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లలకు ఎంత చేటు తీసుకురాగలవో ఊహించటానికి కూడా భయం వేస్తుంది. అందువల్లే ఎప్పుడెప్పుడు తగిన నిబంధనలు వస్తాయా అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. తమ డేటా, బ్యాంకు ఖాతాల సమాచారం బయటకెలా పోతున్నదో తెలియక పెద్దలు కంగారు పడుతుంటే సామాజిక మాధ్యమాల్లో దుండగుల బారినపడి పిల్లలు తల్లడిల్లు తున్నారు. వినియోగదారుల డేటా సేకరణలో పారదర్శకతనూ, ఎందుకోసం సేకరిస్తున్నారో వెల్ల డించటాన్నీ నిబంధనలు తప్పనిసరి చేస్తున్నాయి. ఒకవేళ సంస్థల అజాగ్రత్త వల్ల లేదా ఉద్దేశపూర్వక చర్యవల్ల డేటా లీకైతే ఫిర్యాదు చేయటానికి కూడా ఏర్పాట్లున్నాయి. అలాగే సంస్థల్లో డేటా సేకర ణకు అనుసరిస్తున్న విధానాలను సవాలు చేయటానికి, వివరణ కోరటానికి అవకాశం ఉంది. నిబంధనల అమలును పర్యవేక్షించటానికి ప్రభుత్వం డేటా పరిరక్షణ బోర్డు (డీపీబీ) ఏర్పాటు చేస్తుంది. ఇదిగాక ప్రతి సంస్థా తమ ఖాతాదార్ల గోప్యత దెబ్బతినకుండా చూసేందుకు, వినియోగదారుల నుంచి అవసరమైన అనుమతులు పొందేందుకు డేటా పరిరక్షణ ప్రత్యేక అధికారిని నియమించు కోవటం, నిఘా పెట్టడం తప్పనిసరవుతుంది. డేటా లీక్ను అరికట్టడంలో విఫలమయ్యే సంస్థకు రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధిస్తారు. మొత్తంగా మనం పౌరుల డేటా పరిరక్షణలో వెనకబడినట్టే, సామాజిక మాధ్యమాల దుష్ప్ర భావాల నుంచి పిల్లల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న విషయంలోనూ వెనకబడ్డాం. ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల్లో 137 దేశాలు చాన్నాళ్ల క్రితమే డేటా పరిరక్షణ చట్టాలు తెచ్చాయి. అమెరికాలో పదమూడేళ్లలోపు పిల్లలు ఆన్లైన్ వీక్షణపై కఠిన నిబంధనలున్నాయి. యూరప్లో పదహారేళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఆస్ట్రేలియా సామాజిక మాధ్యమాల్లో పదహారేళ్లలోపు పిల్లల ప్రవేశంపై ఇటీవలే పూర్తి నిషేధం విధించింది. మన దేశంలో లేదుగానీ... టిక్టాక్ వల్ల విదేశాల్లో ఎన్నో సమస్యలొస్తున్నాయి. టీనేజ్ పిల్లల్లో 58 శాతంమంది దాన్ని చూస్తు న్నారని ఒక సర్వే చెబుతోంది. పసిహృదయాలకు ఉండాల్సిన అమాయకత్వం మాయమై అవాంఛ నీయ పోకడలు ప్రవేశించి వారిలో విషబీజాలు నాటుతున్నాయి. తప్పుడు భావాలూ, అభిప్రా యాలూ వ్యాపిస్తున్నాయి. పిల్లల సంగతలావుంచి... పెద్దలే వాటి మాయలో పడి తప్పుడు నిర్ణ యాలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా కలిగే నష్టం నేరుగా కనబడుతుంది. కానీ మానసికంగా అది కలగజేసే ప్రభావం లెక్కకు అందనిది. ఇప్పుడు ఏఐ సైతం వచ్చి ప్రమాద తీవ్రతను పెంచింది. పిల్లల ముచ్చట కాదనకూడదని కార్లు, టూ వీలర్లు అందించి కొందరు తల్లిదండ్రులు పరోక్షంగా వారి చావుకు కారణమవుతున్నారు. ప్రజలకు ముప్పు కలిగిస్తున్నారు. అందువల్ల సామాజిక మాధ్య మాల్లో పొంచి వుండే ప్రమాదాలపై ముందు తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. పిల్లల సంరక్షణకు ఇది తప్పనిసరి. -
జీవితపు తాళంచెవి
‘‘ఉదయం నాలుగు కాళ్లతో, మధ్యాహ్నం రెండు కాళ్లతో, సాయంత్రం మూడు కాళ్లతో నడిచేది ఏమిటి?’’ క్రీస్తు పూర్వ కాలపు గ్రీకు విషాదాంత నాటక రచయిత సోఫోక్లిస్ రాసిన ‘ఈడిపస్ రెక్స్’ నాటకంలో ‘స్ఫింక్స్’ అడిగే ఈ చిక్కుప్రశ్న పాశ్చాత్య సాహిత్యంలో శ్రేష్ఠమైనది. థీబ్స్ నగరంలోకి ప్రవేశించాలంటే– మనిషి ముఖం, సింహం శరీరం, గద్ద రెక్కలుండే స్ఫింక్స్ ప్రశ్నలకు సమాధానం చెప్పే తీరాలి. లేదంటే మరణం తప్పదు. చివరకు రాజు ఈడిపస్ వాటికి జవాబు చెప్పి, ఆ విచిత్ర జీవి పీడను వదిలిస్తాడు. పాకే బాలుడిగా నాలుగు కాళ్లతో, నిటారుగా నిలబడే యువకుడిగా రెండు కాళ్లతో, వృద్ధుడిగా కర్ర ఊతంగా మూడు కాళ్లతో నడిచే ‘మనిషి’ దీనికి సమాధానం. ఇందులోదే మరో ప్రశ్న. ఇద్దరు అక్కాచెల్లెళ్లు. అక్క చెల్లికి జన్మనిస్తే, తిరిగి చెల్లి అక్కకు జన్మనిస్తుంది. ఏమిటి ఇందులోని మర్మం? ఆ అక్కాచెల్లెళ్లు రాత్రీ పగలూ అని తెలిస్తే, ఆ రోజు ఎంత బాగుంటుంది!ఇలాంటి చిక్కు ప్రశ్నలు సాహిత్యంలో లెక్కకు మిక్కిలిగా కనబడతాయి. కూట ప్రశ్న, పొడుపు కథ, ప్రహేళికగా అర్థం ఉన్న ‘రిడిల్స్’ ఆబాలగోపాలాన్నీ అలరిస్తాయి. ‘పొడుపు కథల’ రూపంలో చెప్పినప్పుడు పిల్లలు వాటికోసం చెవులు అప్పగిస్తారు; పెద్దలకు జ్ఞానచక్షువులు తెరుచుకుంటాయి. ఏ స్థాయిలో వారికి ఆ స్థాయి కఠినత్వం, విస్తృతి వీటిల్లో కలగలిసి ఉంటాయి. అందుకే ఇవి సాహిత్యంలో ఒక మనోహరమైన అంశంగా ప్రత్యేకంగా కనబడతాయి. జీవితంలోని సంక్లిష్టతలను తేలిగ్గా విడమరిచి చెప్పడానికి పనికొస్తాయి.నాలుగు వేల ఏళ్ల క్రితం నుంచే జనం తమ మేధాశక్తిని, విశ్లేషణా సామర్థ్యాలను చిక్కుప్రశ్నలతో సాన పట్టుకున్నారు. ప్రపంచానికి తెలిసిన తొట్టతొలి చిక్కుప్రశ్నల్లో ఒకటి ఒకప్పటి సుమేరియన్ (ఇప్పటి ఇరాక్ ప్రాంతం) నాగరికతా సాహిత్యంలో కనిపిస్తుంది. ‘అక్కడొక ఇల్లుంది. అందులోకి ఒకరు గుడ్డివాడిగా ప్రవేశించి, చూపుతో బయటికి వస్తారు. ఏమిటది?’ ప్రపంచానికి రాత రూప పలకలను పరిచయం చేసిన సుమేరియన్ నాగరికత మనిషి విజ్ఞానానికి అమితమైన ప్రాధాన్యతను ఇచ్చింది. అందుకే పై ప్రశ్నకు ‘బడి’ సమాధానం కావడంలో ఆశ్చర్యం లేదు. అజ్ఞానం అనేది అంధత్వమే కదా! చదువుతో వచ్చే జ్ఞానం మనిషికి ఒక కొత్త చూపునిస్తుంది కదా! ‘‘పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి, చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘రాజా, శ్రమ తెలియకుండా ఉండటానికి’’ అంటూ ప్రారంభించి ఒక కథ చెప్పడమూ, ఆ కథ చివర పలు ప్రశ్నలు సంధించడమూ, ఆ కథలోని ప్రశ్నలకు ‘సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల వేయి ముక్కలుగా పగిలిపోతుంది’ అని షరతు విధించడమూ, విక్రమార్కుడు జవాబు చెప్పి ‘మౌనభంగం కాగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరిగి చెట్టెక్క’డమూ తెలుగు బాల కథా సాహిత్యంలో ఒక అరుదైన ధారావాహిక వేడుక. మూలంలోని భట్టి విక్రమార్క కథల్లో బేతాళుడు అడిగిన 23 ప్రహేళిక ప్రశ్నల నమూనాలోనే ‘చందమామ’ పత్రిక ఎన్నో ప్రశ్నలను సంధించింది. అయితే, అసలు మూలంలో విక్రమార్కుడంతటివాడు కూడా జవాబు ఇవ్వలేని ప్రశ్న ఏమిటి? ఇరువురికీ భార్యలు లేని ఓ తండ్రి కొడుకులు తోవలో పాదముద్రలను చూసి, పెద్ద పాదాలావిడను తండ్రీ, చిన్న పాదాలావిడను కొడుకూ పెళ్లాడాలనుకుంటారు. తీరా పెద్ద పాదాలావిడ కూతురుగానూ, చిన్న పాదాలావిడ తల్లిగానూ తేలుతుంది. అయినా ఇచ్చుకున్న మాట ప్రకారమే వాళ్లు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఆ ఇద్దరికీ చెరొక కొడుకు పుడితే, వాళ్లు వరుసకు ఏమవుతారు? బేతాళుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం లేక, విక్రమార్కుడు సహేతుక మౌనం వహించడంతో బేతాళుడు ఆయన వశమవుతాడు. కాలగమనంలో సడలనున్న నైతిక నియమావళికి ఈ ప్రశ్నొక ముందుచూపు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘వడ్లగింజలు’ కథలోని ఇతివృత్తం ఒక ప్రశ్న కాకపోయినా చిక్కుతో ముడిపడినదే. ‘‘చదరంగానికి అరవై నాలుగు గదులు. మొదటి గదిలో వొక వడ్లగింజ వుంపించండి. తరవాత రెండో గదిలో రెండు, మూడో గదిలో నాలుగు, నాలుగో గదిలో యెనిమిది– యిలాగా వెళ్లినకొద్దీ రెట్టింపు చేయిస్తూ నాకు వడ్లగింజలు దయచేయించండి మహాప్రభూ’’ అంటూ తాను చదరంగంలో గెలిస్తే ఏమివ్వాలో తన ప్రత్యర్థి అయిన ‘శ్రీ వత్సవాయి చతుర్భజ తిమ్మజగపతి మహారాజులు’ గారికి తంగిరాల శంకరప్ప సవినయంగా విన్నవించుకుంటాడు. తీరా ఆటలో మహారాజును కట్టడి చేశాక, ‘‘మహాప్రభూ! వారి కోరిక తీర్చాలంటే పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగ దేశం అంతటా వరాసగా నూరు సంవత్సరాలు పండిన ధాన్యం అయినా చాలదు’’ అని తేలినప్పుడు అందరూ నోరెళ్లబెట్టవలసి వస్తుంది. సాహిత్యంలో ఇలాంటి చిక్కుప్రశ్నలు మాటల ఎత్తుగడలను, భాషాపటిమను చాటుతాయి. పాత్ర లక్షణాలను బహిర్గతం చేయడానికీ, వాటి తెలివితేటలను తెలియజెప్పడానికీ, కథను ముందుకు నడపడానికీ కూడా రచయితలు వాటిని ఉపయోగించుకున్నారు. ఈ చిక్కుప్రశ్నలు తరచుగా జ్ఞానం, అవగాహన కోసం మానవుడు చేసే అన్వేషణను సూచిస్తాయి. జీవితం అనేది ఒక తాళం అయితే, దాన్ని తెరిచే తాళంచెవి ఒక కూటప్రశ్న. అదే సమయంలో అది ఒక మనోవ్యాయామం, ఒక భాషావినోదం, ఒక తాత్విక పరిమళం, ఒక జీవిత రహస్యం కూడా! -
సాగునీళ్లూ షాక్ కొడతాయా?
‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్ ‘ఏక్ నంబర్ స్టేటస్’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్ నంబర్ స్టేటస్’ వస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్లో అటువంటి ప్రస్తావన లేదు.చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్ డాక్యుమెంట్’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్)ను జగన్ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల సాగర్ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్ మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్ను సమర్పించింది.అదిగో అదే డీపీఆర్ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్ ఛేంజర్ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్ సర్కార్ డీపీఆర్ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్ 2020’ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్కు కొనసాగింపే ‘విజన్ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్ భారత్–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్.చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్లో పీపుల్ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ అడ్రస్ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్వారు ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మానవాళికి ప్రకృతి శాపం!
‘వాతావరణం కూడా ప్రభుత్వాల వంటిదే. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది’ అంటాడు బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్. అది ముమ్మాటికీ నిజం. దేశంలో గత 123 ఏళ్లలో కనీవినీ ఎరగనంత స్థాయి ఉష్ణోగ్రతలు నిరుడు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చేసిన ప్రకటన హడలెత్తిస్తోంది. అంతేకాదు... వచ్చే ఏడాది సైతం రికార్డులు బద్దలయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. మనదేశం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుటి ఉష్ణో గ్రతలు అధికంగానే ఉన్నాయని వివిధ దేశాల వాతావరణ విభాగాల ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. మన పొరుగునున్న చైనాలో 1961 నుంచీ పోల్చిచూస్తే గత నాలుగేళ్ల ఉష్ణోగ్రతలు చాలా చాలా ఎక్కువని అక్కడి వాతావరణ విభాగం తెలియజేసింది. నిజానికి 2024లో ప్రపంచ ఉష్ణో గ్రతల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఇంకా అధికారిక నివేదిక విడుదల చేయలేదు. అందుకు మార్చి వరకూ సమయం ఉంది. కానీ ఈలోగా కొన్ని కొన్ని అంశాల్లో వెల్లడైన వాతావరణ వైపరీత్యాలను అది ఏకరువు పెట్టింది. అవి చాలు... మనం ఆందోళన పడటానికి! వాటి ప్రకారం– నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ నెలలమధ్య ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు కాలం నాటికంటే సగటున 1.54 డిగ్రీల సెల్సియస్ అధికం. అలాగే అంటార్కిటిక్ సముద్రంలో మంచు పలకలు మునుపటితో పోలిస్తే అధికంగా కరుగుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన వాతావరణం వల్ల నిరుడు మరణాలు, ఆర్థిక నష్టాలు కూడా బాగా పెరిగాయి. సాగర జలాల ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. సముద్ర మట్టాలు ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డయిన 29 వాతావరణ ఘటనలను విశ్లేషిస్తే అందులో 26 కేవలం వాతావరణ మార్పులవల్ల జరిగినవేనని తేలిందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ ఉదంతాల్లో 3,700 మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వివరించింది.స్వర్గనరకాలు మరెక్కడో లేవు... మన ప్రవర్తన కారణంగా ఆ రెండూ ఇక్కడే నిర్మితమవుతా యంటారు. వాతావరణం విషయంలో ఇది ముమ్మాటికీ వాస్తవం. మానవ కార్యకలాపాలే వాతా వరణ వైపరీత్యాలకు మూలకారణం. నూతన సంవత్సర సందేశంలో గత దశాబ్దకాలపు వార్షిక ఉష్ణోగ్రతలన్నీ రికార్డు స్థాయివేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ వినాశకర దోవ విడనాడాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం విస్తరిస్తోంది. వినూత్న ఆవిష్కర ణలు అందుబాటులోకొస్తున్నాయి. కానీ వీటిని చూసి విర్రవీగి, ప్రకృతి చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టిన పర్యవసానంగా అది ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రకృతి చెప్పినట్టు వింటూ అది విధించిన పరిమితులను శిరసావహించాలి తప్ప దాన్ని నిర్లక్ష్యం చేస్తే వినాశనం తప్పదని ఏటా వెలువడే నివేదికలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వినేదెవరు? లాభార్జనే తప్ప మరేమీ పట్టని పరిశ్రమలు, అభివృద్ధి పేరిట ఎడాపెడా అనుమతులు మంజూరు చేస్తున్న పాలకులు, వాతావరణం నాశనమవు తున్నదని గ్రహించే చైతన్యం లోపించిన ప్రజలు పర్యావరణ క్షీణతకు దోహదపడుతున్నారు. అయి దేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పర్యావరణ పరిరక్షణ అంశం ఏనాడూ ప్రస్తావనకు రాదు. మన దేశంలోనే కాదు... ప్రపంచంలో వాతావరణ శిఖరాగ్ర సదస్సుల వంటివి నిర్వహించినప్పుడు తప్ప మరెక్కడా పర్యావరణం గురించి చర్చ జరగటం లేదు. ఇది ప్రకృతి విధ్వంసానికి పాల్పడే పారిశ్రామికవేత్తలకూ, పాలకులకూ చక్కగా ఉపయోగపడుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాల్సిందే. అందుకవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అభివృద్ధి అవసరాల కోసం పర్యావరణాన్ని బలిపెట్టే విధానాలు మొత్తంగా మానవాళికే ప్రమాదకరం. పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నదనే విషయంలో ఎవరూ పెద్దగా విభేదించటం లేదు. కానీ దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలే నత్తనడకన ఉంటున్నాయి. ప్రపంచంలో కర్బన ఉద్గా రాల తగ్గింపునకు 2015 పారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. చెప్పాలంటే ఆ దిశగా ఎంతోకొంత అడుగులేస్తున్నది మనమే. ఆ శిఖరాగ్ర సదస్సు 2050 నాటికి భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నిలువరించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. అయితే దాన్ని చేరుకోవటానికి వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఏమాత్రం సరిపోవన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణానికి తూట్లు పొడవటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంపన్న రాజ్యాలు బడుగు దేశాలకు హరిత ఇంధన సాంకే తికతలను అందించటంలో, అందుకవసరమైన నిధులు సమకూర్చటంలో ముఖం చాటేస్తున్నాయి. వాతావరణ మార్పుపై చెప్తున్నదంతా బోగస్ అనీ, పారిస్ ఒడంబడిక నుంచి తాము వైదొలగు తున్నామనీ అమెరికాలో క్రితంసారి అధికారంలోకొచ్చినప్పుడే ప్రకటించిన ట్రంప్... ఈసారి కూడా ఆ పనే చేస్తారు. ప్రపంచ దేశాల మాటెలావున్నా ఈ ఏడాది సైతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావొచ్చన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలూ అట్టడుగు స్థాయివరకూ తగిన వ్యూహాలు రూపొందించుకోవాలి. మండే ఎండలు మాత్రమే కాదు... జనావాసాలను ముంచెత్తే వరదలు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను గరిష్ట స్థాయిలో ఉంచటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. బాధిత ప్రజానీకానికి సాయం అందించటానికి అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. -
ట్రంప్ శిబిరంలో వీసా చిచ్చు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయానికి దోహదపడిన అంశాల్లో కీలకమైన వలసల వివాదం... తిరిగి తిరిగి ఆయన శిబిరంలోనే చిచ్చు పెడుతున్న వైనం కనబడుతోంది. ఆయన ప్రమాణ స్వీకారానికి చాలాముందే అనుచరగణం పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అమెరికాను మళ్లీ అగ్రస్థానానికి తీసుకెళ్లాలన్న ట్రంప్ ‘మాగా’ ఉద్యమ మూలపురుషుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్కూ, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్కూ మధ్య హెచ్1బి వీసాల విషయంలో తాజాగా తలెత్తిన లడాయి ఇప్పట్లో చల్లారడం కష్టమే. తొలిసారి ట్రంప్ విజేతగా నిలిచిన 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హెచ్1బి వీసాలపై ఆయన దూకుడుగా మాట్లాడటం వెనక మిల్లర్ వ్యూహం ఉంది. స్థానికులను నిర్లక్ష్యం చేసి తక్కువ వేతనాలకు పరాయి దేశాలవారిని ఉద్యోగాల్లో నియమించుకునే సంస్కృతిని సాగనివ్వబోనని అప్పట్లో ట్రంప్ చెప్పేవారు. తమ ఉద్యోగాలన్నీ బయటి దేశాల పౌరులు తన్నుకుపోతున్నారని ఆగ్రహంతో ఊగిపోయిన శ్వేతజాతి అమెరికన్లు ఆయనకు ఎగబడి ఓట్లేశారు. ట్రంప్ ప్రసంగాల రచయిత మిల్లరే. ఈ దఫా సైతం ఆయన ట్రంప్ ఆంతరంగిక బృందంలో ముఖ్యుడిగా ఉండబోతున్నారు. వలసల విషయంలో ట్రంప్ అనుచరగణంలో స్పష్టత లోపించిందన్న సంగతి ప్రచార సమయంలోనే బట్టబయలైంది. అక్రమ వలసదారులే పెద్ద సమస్యని ట్రంప్ సన్నిహితుడు వివేక్ రామస్వామి అభిప్రాయపడుతున్నారు. ఆయన్ను ఈమధ్యే ప్రభుత్వ సిబ్బందిలో అత్యధికుల్ని సాగనంపేందుకు ఏర్పాటైన ప్రభుత్వ సామర్థ్య విభాగానికి ట్రంప్ ఎంపికచేశారు. ఆ విభాగంలో ఆయనతోపాటు పనిచేయబోయే మస్క్ సైతం వివేక్ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. కానీ మిల్లర్తోపాటు, తీవ్ర మితవాది అయిన లారా లూమర్, స్టీవ్ బానన్ వంటివారు దీన్ని అంగీకరించటం లేదు. అసలు హెచ్1బి వీసా విధానాన్నే పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికన్ సంస్కృతి, జీవన విధానం వైపు చర్చ మళ్లడం దీని తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికన్లలో అనేకులు సమర్థత నుంచి నాసిరకం సంస్కృతికి మళ్లి చాన్నాళ్లవుతోందని వివేక్ రామస్వామి వ్యాఖ్యానిస్తే... అమెరికన్లు తెగువ, ఆత్మవిశ్వాసం దండిగా ఉన్నవారంటూ 2020లో ట్రంప్ చేసిన ప్రసంగం వీడియోను మిల్లర్ ఎక్స్ వేదికపై వదిలారు. ఇంతకూ ట్రంప్ ఏమనుకుంటున్నారు? మాకు చురుకైనవాళ్లు, సమర్థులు కావాలని నూతన సంవత్సర వేడుకల సమావేశంలో ట్రంప్ చెప్పడం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరిచింది. తానెప్పుడూ హెచ్1బి వీసాల విధానాన్ని వ్యతిరేకించలేదని అనటం అర్ధ సత్యమే అయినా ట్రంప్ వైఖరి మారిందని, ఆయనపై మస్క్ ప్రభావం బలంగా ఉన్నదని రిపబ్లికన్లలో బలమైన మితవాద వర్గం గుసగుసలు పోతోంది. ఎవరెలా అనుకున్నా హెచ్1బి వీసాల సంగతలా వుంచి అక్రమ వలసదారుల్ని గెంటేయటం అంత తేలిక కాదు. వారిపై ముందు వలస వ్యవహారాల న్యాయ స్థానంలో కేసు దాఖలు చేయాలి. వారు రకరకాల వాదనలతో ముందుకొస్తారు. విచారణ వాయి దాల్లో నడుస్తుంటుంది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసులు తేలాలంటేనే 2029 చివరివరకూ పడుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కొత్తవారిని గుర్తించి కేసులు పెడితే ఆ భారం మరింత పెరుగుతుంది. చట్టాన్ని సవరిస్తే తప్ప ఇది అంత సులభంగా తేలదు. దానికితోడు అక్రమ వలస దారులను గుర్తించే ఐసీఈ ఏజెంట్లు 6,000 మందికి మించిలేరు. దానికి కేటాయించే నిధులు సైతం ఏ సమయంలోనూ 40,000 మందిని మించి నిర్బంధించేందుకు సరిపోవు. ఒకవేళ అక్రమ వలస దారులందరినీ సాగనంపడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినా, లక్షలమంది తరలింపునకు విమానాలు సమకూర్చడం అసాధ్యం. ఇక డెమాక్రాట్ల ఏలుబడిలో ఉన్న న్యూయార్క్, షికాగో, లాస్ఏంజెలస్, డెన్వర్ వంటి నగరాలు అక్రమ వలసదారుల ఏరివేతకు సహకరించవు. అక్రమ వలసదారుల్ని వెనక్కిపంపిన గతకాలపు అధ్యక్షుడు ఐసెన్ హోవర్ తనకు ఆదర్శమని ట్రంప్ అంటున్నారు. కానీ ఆకాలంలో మెక్సికో మినహా మరే దేశంనుంచీ పెద్దగా వలసలు లేవు. ఇప్పుడలా కాదు... చైనా, భారత్, మారుటేనియా, ఉజ్బెకిస్తాన్ దేశాలనుంచి రికార్డు స్థాయి అక్రమ వలసలున్నాయి. ఇందులో ఎన్ని దేశాలు ట్రంప్కు సహకరిస్తాయన్నది ప్రశ్న. సమస్యలు సృష్టించటం సులభం. కానీ వాటి పరిష్కారం అన్ని సందర్భాల్లోనూ అంత తేలిక కాదు. తగిన అర్హతలున్నవారు స్థానికంగా దొరక్కపోతే బయటి దేశాలనుంచి ఆ నైపుణ్యం ఉన్న వారిని తీసుకురావటం కోసం రూపొందించిన హెచ్1బి వీసాను బడా సంస్థలు ఖర్చు తగ్గించు కోవటానికి వాడుకుంటున్న మాట వాస్తవం. దాన్ని ట్రంప్ తనకు అనుకూలంగా సొమ్ము చేసు కోవటం సైతం నిజం. కానీ ఆ సమస్యే పార్టీలో చిచ్చుపెడుతుందని ఆయన ఊహించి వుండరు.ఇంతకూ ఆయన ఎవరి పక్షమన్న విషయంలో వైరి వర్గాల్లో ఎవరికీ స్పష్టత లేదు. ఎందుకంటే వివేక్, మస్క్, శ్రీరాం కృష్ణన్వంటి గతకాలపు వలసదారుల్ని తీసుకున్న ట్రంప్ మరోపక్క వలసలకు పక్కా వ్యతిరేకి అయిన స్టీఫెన్ మిల్లర్తోపాటు ఆయన భార్య కేటీ మిల్లర్ను సైతం తన బృందంలో చేర్చు కున్నారు. ఏదేమైనా హెచ్1బి వీసాలు పొందినవారిలో అత్యధికులు మనవాళ్లే కనుక వారి మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుంది. అలాగే ట్రంప్ను మించిన శ్వేతజాతి చాంపియన్ అమెరికా రాజకీయాల్లో ఆవిర్భవించే అవకాశం కూడా లేకపోలేదు. -
మణిపూర్ చల్లారుతుందా?
ఇరవై నెలల నుంచి మహోగ్రంగా మండుతున్న మణిపూర్లో తొలిసారి ఒక చల్లని సాంత్వన వాక్యం వినబడింది. రాష్ట్రంలో ఇంతవరకూ జరిగిన హింసాకాండకు క్షమాపణ కోరుతున్నానని నూతన సంవత్సర ఆగమనవేళ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ప్రకటించారు. అనుకోనిది చోటు చేసుకున్నప్పుడు క్షమాపణ కోరటంవల్ల వెంటనే అంతా చక్కబడుతుందని అనుకోనవసరం లేదు. కానీ నేరగాళ్లపై చర్య తీసుకుంటారన్న విశ్వాసం కలిగినప్పుడు బాధిత పక్షంలో ప్రతీకార వాంఛ సన్నగిల్లుతుంది. వారిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునేవారి ఆటలు సాగవు. కానీ ఇన్నాళ్లుగా మణిపూర్లో జరిగింది వేరు. 2023 మే నెలలో ఘర్షణలు రాజుకున్నప్పుడు బీరేన్ సింగ్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రెండు ప్రధాన తెగలు మొయితీ–కుకీలు ఘర్షణ పడుతున్నారన్న సంగతిని గుర్తించటానికే నిరాకరించారు. ‘ఇదంతా కుకీ ఉగ్రవాదులకూ, భద్రతా దళాలకూ సాగు తున్న ఘర్షణ’ అంటూ భాష్యం చెప్పారు. మొయితీకి చెందిన నేతగా కుకీల తీరుపై ఎలాంటి అభి ప్రాయాలైనా, అభ్యంతరాలైనా ఆయనకు ఉండొచ్చు. కానీ సీఎం హోదాలో అలా మాట్లాడరాదన్న సంగతిని బీరేన్ గ్రహించలేకపోయారు. ఆ వెంటనే రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ముఖ్యమంత్రి ప్రకటనను తోసిపుచ్చారు. అవి స్పష్టంగా తెగల ఘర్షణలేనని చెప్పారు. మణిపూర్ హింసకు ఇంతవరకూ 260 మంది బలి కాగా, 60,000 మంది ఇప్పటికీ రక్షణ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. రాష్ట్రం రెండు తెగలమధ్యా చీలిపోయింది. ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు వెళ్లే పరిస్థితి లేదు. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నివేదిక గమనిస్తే మణిపూర్ ఎంత అధ్వాన్నంగా ఉన్నదో తెలుస్తుంది. అక్కడ మొయితీ, కుకీ, జోమీ తెగల పరస్పర ఘర్షణలవల్ల హింసాకాండ రాజుకుందనీ, మిలిటెంట్ల ప్రాబల్యం పెరిగిందనీ నివేదిక సారాంశం. మొత్తంగా ఈశాన్య ప్రాంతంలో అశాంతికి 77 శాతం మణిపూర్ పరిణామాలే కారణమని తెలిపింది. మొయితీ తెగను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సమస్యకు మూల కారణం. 2023 మే 3న ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మణిపూర్లోని ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూని యన్ నిర్వహించిన ర్యాలీపై మొయితీల దాడి, దానికి ప్రతిగా కుకీలు రెచ్చిపోవటం పరిస్థితిని దిగజార్చింది. చివరకు మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా ఊరే గించి అత్యాచారాలకు తెగబడటం యధేచ్ఛగా సాగాయి. ఇక గృహదహనాలు, ఇతర ఆస్తుల ధ్వంసం వంటివి సరేసరి. పోలీస్ స్టేషన్లపై, సాయుధ రిజర్వ్ బెటాలియన్ స్థావరాలపై దాడులకు దిగి వేలాది తుపాకులు, రాకెట్ లాంచర్లు, లక్షల తూటాలు అపహరించారు. వేలాదిమంది కొంపా గోడూ వదిలి చెట్టుకొకరు పుట్టకొకరయ్యారు. ఆఖరికి ఇవి మత ఘర్షణలుగా కూడా పరిణమించాయి. వాస్తవానికి ఒక తెగవారంతా ఒకే మతంవారని చెప్పటానికి వీల్లేదు. అయితే కుకీల్లో అత్య ధికులు క్రైస్తవులుకాగా, హిందువులు కూడా ఉంటారు. మొయితీల్లో కూడా క్రైస్తవ మతాన్ని అనుస రించేవారున్నా వారి సంఖ్య తక్కువ. అత్యధికులు హిందువులు. ఈ పరస్పర వైషమ్యాల పర్యవ సానంగా చర్చిలను ధ్వంసం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. నూతన సంవత్సర వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకూ, ప్రధాని నరేంద్ర మోదీకీ సమర్పించిన వినతిపత్రంలో 2023 నుంచి ఇంత వరకూ మణిపూర్లో 360 చర్చిలను ధ్వంసం చేశారని 400 మంది సీనియర్ క్రిస్టియన్ నాయకులు తెలియజేశారు. క్రైస్తవులపై దాడులు జరిగిన ఉదంతాలు 720 ఉన్నాయని వారంటున్నారు.ఘర్షణలు అడపా దడపా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అపహరించిన ఆయుధాలు అప్ప గించమని పోలీసులు చేసిన వినతి పెద్దగా పనిచేయలేదు. ఇప్పటికీ మొయితీ, కుకీ తెగలవద్ద కుప్ప లుగా ఆయుధాలున్నాయి. ఇందులో అపహరించిన వాటితోపాటు పొరుగునున్న మయన్మార్నుంచి వచ్చిపడుతున్న ఆయుధాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. మణిపూర్తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలు ఎంతో వైవిధ్యభరితమైనవి. అక్కడ 400కు పైగా తెగలున్నాయి. భిన్న సంస్కృతులు, విశ్వాసాలకు చెందిన వీరంతా కొన్ని మినహాయింపులతో శతాబ్దాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే పరిమిత వనరులను ఇంతమందితో పంచుకోవాల్సి రావటంవల్ల అందరిలోనూ భయాందోళనలున్నాయి. ఇది సాయుధ బృందాలకు ఊపిరిపోస్తోంది. తమకు స్వయం పాలిత ప్రాంతాలు కావాలన్న డిమాండ్ బయల్దేరుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎంతో జాగ్రత్తగా అడుగు లేయాల్సి వుండగా ఇన్నాళ్లూ మణిపూర్ నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు బీరేన్ సింగ్ ప్రకటన తర్వాతైనా వాస్తవాల ఆధారంగా నిర్దిష్ట చర్యలు ప్రారంభం కావాలి. సమస్య బయల్దేరినప్పుడు కిందిస్థాయిలో తగిన చర్యలు తీసుకోవటంలో విఫలమైనప్పుడే అవి పెరిగి పెద్దవై పరిష్కారానికి అసాధ్యంగా పరిణమిస్తాయని అమెరికా మాజీ రక్షణమంత్రి రాబర్ట్ గేట్స్ ఒక సందర్భంలో అంటారు. మొన్న జూన్లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమస్య ఉగ్రరూపం దాల్చిందని చెప్పిన సంగతి మరిచిపోరాదు. బాధిత పక్షాలకు భరోసా కల్పించే విధంగా అడుగులేస్తే, ఉపాధి కల్పనకు నడుం బిగిస్తే క్రమేపీ అంతా సర్దుకుంటుంది. ఏ తెగ హక్కులకూ భంగం కలగనీయబోమని, మారణకాండ కారకులను కఠినంగా శిక్షిస్తామని సంకేతాలు పంపితే ఉద్రిక్తతల ఉపశమనానికి ఆ వాగ్దానాలు తోడ్పడతాయి. రాజకీయ పక్షాలు సైతం ఈ సమయంలో బాధ్యతాయుతంగా మెలగాలి. -
అభివృద్ధా? అంతరమా?
సాధారణంగా కనిపించే లెక్కలు అసాధారణమైన అనేక అంశాలను మనకు పట్టి ఇస్తాయి. మన దేశ ప్రజలు దేని మీద ఎంత ఖర్చు చేస్తున్నారు లాంటి లెక్కలు చూసినప్పుడు సమాజంలో వచ్చిన అనేక మార్పులు కళ్ళకు కడతాయి. అతి విస్తృత స్థాయిలో దాదాపు 2.61 లక్షల గృహాలను సర్వే చేసి సేకరించిన సమాచారంతో గణాంకాలంటే ఇక వేరే చెప్పేది ఏముంది! ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. 2023 ఆగస్ట్ నుంచి 2024 జూలై మధ్య ప్రజల వినియోగాన్ని ఈ తాజా సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. సర్వసాధారణంగా అయిదేళ్ళకోసారి జరిపే ఈ సర్వేను వరుసగా గత ఏడాది, ఈ సంవత్సరం కూడా నిర్వహించడం విశేషమే. ప్రజా క్షేమం కోసం ప్రభుత్వం చేపట్టాల్సిన పథకాలు, అనుసరించాల్సిన విధానాలకు ఇలాంటి సర్వే ఫలితాలు దిక్సూచి. అలాగని వాస్తవాల సమగ్ర స్వరూపాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని అనుకోలేం. అనేక ఇతర అంశాలు ఈ గృహవినియోగ వ్యయం లెక్కలను ప్రభావితం చేస్తాయన్న సంగతి విస్మరించి, వీటిని బట్టి జనజీవన ప్రమాణాల స్థాయిని నిర్ధారిస్తే అది సరికాదు. వేతనాలతో సహా అనేక ఇతర అంశాలపై సమాచారంతోనూ బేరీజు వేసుకోవాలి. 2023–24కి గాను కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ గత వారం విడుదల చేసిన ఈ హెచ్సీఈఎస్ సర్వే అనేక అంశాలను విశ్లేషకుల దృష్టికి తెచ్చింది. దేశ ఆర్థిక రంగంలో వినియోగదారుల డిమాండ్ ఏ మేరకుంది, మరీ ముఖ్యంగా మహానగరాల్లో ఎలా ఉంది, దాన్నిబట్టి మన ఆర్థిక వ్యవస్థ ప్రస్థానాన్ని ఎలా అంచనా వేయాలనే దానిపై కొంతకాలంగా అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా హెచ్సీఈఎస్ సర్వే ఫలితాల పట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. నిజానికి, దాదాపు 11 ఏళ్ళ విరామం తర్వాత గడచిన రెండేళ్ళుగా ఈ సర్వేలు వెలువడడం విశేషం. గడచిన ఏడాదితో పోలిస్తే 2023–24లో ఆహారపదార్థాలపై జనం వెచ్చించే మొత్తం పెరిగినట్టుగా తాజా సర్వేలోని గణాంకాలు చెబుతున్నాయి. గ్రామీణ కుటుంబాలు చేసే మొత్తం ఖర్చులో సైతం... తిండికి వెచ్చించేది మునుపు 2022–23లో 46.4 శాతం ఉండేది. ఇప్పుడు 2023–24లో అది 47.04కి పెరిగింది. పట్టణప్రాంత నివాసాల్లోనూ ఇలాంటి పరిస్థితే. ఆహారంపై జనం ఎక్కువ వ్యయం చేస్తున్నా, ఇప్పటికీ ఇంటి బడ్జెట్లో ఆహారేతర అంశాలదే సింహభాగం. ఆహారం మీద చేస్తున్న ఖర్చు ఏటేటా పెరుగుతున్నదన్నది మాత్రం స్పష్టం. అంత మాత్రం చేత ప్రజలందరి జీవన ప్రమాణాలు, పౌష్టికాహారం పట్ల శ్రద్ధ, ఆహార భద్రత అధికమయ్యాయని అనుకోలేం. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో తిండిపై జనం చేయాల్సి వస్తున్న ఖర్చు కూడా అనివార్యంగా పెరిగిందన్నది విస్మరించలేం. ఇంకా చెప్పాలంటే, ఈ 2023–24లో గృహవినియోగ వ్యయం 8 – 9 శాతం దాకా పెరిగింది కానీ, అందుకు కూడా ద్రవ్యోల్బణమే ప్రధాన కారణం. దాన్ని గనక తీసేస్తే, అసలు సిసలు లెక్కల్లో వినియోగం ఏ మేరకు పెరిగిందన్నది తేలుతుంది. ఆ రకంగా చూస్తే, గృహవినియోగ వ్యయం కేవలం 3.5 శాతమే పెరిగిందట. ఆ పెరుగుదల కూడా 2024 ఆర్థిక సంవత్సరంలోని వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 8.2 శాతం కన్నా చాలా తక్కువ. అదీ విశ్లేషకులు తేలుస్తున్న మాట. అంటే, సర్వే గణాంకాలు పైకి ఏమి చెప్పినా, అసలు సిసలు వినియోగ వ్యయ వృద్ధి నత్తనడకనే సాగుతోందని అర్థం. దీనికీ మళ్ళీ కారణం – ద్రవ్యోల్బణం, అందులోనూ ఆహార ద్రవ్యోల్బణమే. ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలి. సర్కారు సైతం ఈ సంగతి గ్రహించకపోలేదు. ఆహార సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ప్రయత్నం కూడా చేసింది. ఆహార నిల్వలు, అలాగే కొన్ని ఆహార పదార్థాలు – కూరగాయల ఎగుమతులపై నిషేధం, వంట నూనెల లాంటి వాటిపై దిగుమతి సుంకాల తగ్గింపు తదితర చర్యలు చేపట్టింది. ఈ చర్యల వల్ల కొంత ఫలితం వచ్చింది. ఆహార ద్రవ్యోల్బణానికి ఒక మేర ముకుతాడు వేయగలిగారు. కానీ, ఇవన్నీ శాశ్వత పరిష్కారం చూపలేవు. ఇవాళ్టికీ మనం వ్యవసాయాధార దేశం కావడం, అందులోనూ మన వ్యవసాయమంతా ప్రధానంగా వర్షాధారమైనది కావడం ప్రధానమైన అవరోధం. ఇక, తాజా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో తలసరి నెలవారీ గృహ వినియోగ వ్యయం నిరుటి రూ. 3,773 నుంచి రూ. 4,122కు పెరిగింది. పట్టణాల్లో అది రూ. 6,459 నుంచి రూ. 6,996కు హెచ్చింది. ఖర్చు విషయంలో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య అంతరం అంత కంతకూ వేగంగా తగ్గుతోందని ఈ సర్వే డేటా చెబుతోంది. పుష్కరకాలం క్రితం 2011–12లో ఆ వ్యత్యాసం 83.9 శాతం. నిరుడు అది 71.2 శాతం. ఇప్పుడు 69.7కు తగ్గాయని సర్వే మాట. ఖర్చుల్లో అంతరాలు తగ్గినట్టు పైకి కనిపిస్తున్నా, అది వేతనంలో గణనీయమైన పెరుగుదల వల్ల వచ్చినవని చెప్పలేం. ఎందుకంటే, 2023–24తో ముగిసిన అయిదేళ్ళ కాలంలో గ్రామీణ వేతనాలు నామమాత్రంగా 5.2 శాతమే పెరిగాయి. పైగా, వాస్తవ వేతన వృద్ధి మైనస్ 0.4 శాతమే. అంటే, ఇవాళ్టికీ గ్రామీణ – పట్టణ, ధనిక – పేద అంతరాలు గణనీయంగానే ఉన్నాయన్నది నిష్ఠుర సత్యం. ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారన్నది సర్వేల సారమైనా, చాలీచాలని జీతాలతో, బతుకు బండి ఈడుస్తున్న బడుగుల మాట ఏమిటి? అసలు ఖర్చే పెట్టలేని సగటు ప్రాణుల స్వరాలను ఈ సర్వేలు సరిగ్గా పట్టుకోగలుగుతున్నాయా? ఆ అసమానతలు తొలగించగలిగితేనే ప్రయోజనం. తొలగించడానికి తోడ్పడగలిగితేనే ఈ లెక్కలకు సార్థకత. -
స్ఫూర్తిదాయక విజయాలు
చదరంగంలో భారత దేశానికి ఇది స్వర్ణయుగం. న్యూయార్క్లో జరుగుతున్న ‘ఫిడే’ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ పోటీల్లో భారత క్రీడాకారిణి కోనేరు హంపీ ఆదివారం సాధించిన ఘన విజయం అందుకు మరో తాజా నిదర్శనం. న్యూయార్క్లో మొత్తం 110 మంది పాల్గొన్న ర్యాపిడ్ చెస్ టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి, ఛాంపియన్ అయ్యారు. అంతకు ముందు సింగపూర్లో క్లాసికల్ వరల్డ్ ఛాంపియన్షిప్లో గుకేశ్ విజయం, అంతకన్నా ముందు ఈ ఏడాది సెప్టెంబర్లో బుడాపెస్ట్లోని చెస్ ఒలింపియాడ్లో ఓపెన్, ఉమెన్స్ కేటగిరీలు రెంటిలోనూ కనివిని ఎరు గని రీతిలో భారత్ రెండు స్వర్ణాలు సాధించడం... ఇవన్నీ ఈ 2024ను భారత చదరంగానికి చిరస్మరణీయ వత్సరంగా నిలిపాయి. మంగళవారం నుంచి జరగనున్న ‘ఫిడే’ వరల్డ్ బ్లిట్జ్ ఛాంపి యన్షిప్ పైనా కన్నేసి, గ్రాండ్డబుల్ సాధించాలని హంపీ అడుగులేస్తుండడం విశేషం. గతంలో 2019లో జార్జియాలో తొలిసారి మహిళల వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలిచిన కోనేరు హంపీకి తాజా విజయం రెండో ప్రపంచ టైటిల్. చైనాకు చెందిన జూ వెన్జున్ తర్వాత ఈ టైటిల్ను ఒకటికి రెండుసార్లు గెలిచింది హంపీయే! నిరుడు పెళ్ళి తరువాత మాతృత్వం కోసం కొన్నాళ్ళు ఆటకు దూరం జరిగిన హంపీ 2018లో చదరంగపు పోటీలకు తిరిగి వచ్చాక కూడా తన హవా కొనసాగిస్తూ వచ్చారు. 2019లో టైటిల్ సాధించారు. గత ఏడాది కూడా ఆమె గెలవాల్సింది. టై బ్రేక్లో త్రుటిలో ప్రపంచ టైటిల్ను కోల్పోయారు. అయితేనేం, పట్టుదలతో కృషిని కొనసాగించి మళ్ళీ ఇప్పుడు ఆటలో కిరీటం గెల్చుకొని, తనలో సత్తా చెక్కుచెదరలేదని నిరూపించారు. సామాన్యులతో పాటు ఆటలోని వర్ధిష్ణువులకు సైతం ఇది స్ఫూర్తి మంత్రం. నిజానికి, ఈ భారత నంబర్ 1 చదరంగ క్రీడాకారిణే అన్నట్టు, కచ్చితంగా సరికొత్త టైటిల్ విజయం మన దేశంలోని యువతరాన్ని చదరంగ క్రీడ వైపు మరింతగా ఆకర్షిస్తుంది. అదే సమయంలో పలువురు చెస్ ప్రొఫెషనల్స్గా తయారవడానికి ప్రేరణ కూడా అవుతుంది. ఫస్ట్ రౌండ్లో ఓటమి పాలైనా, 11వ, ఆఖరి రౌండ్లో గెలవడంతో 8.5 పాయింట్లతో పట్టికలో హంపీ అగ్రస్థానానికి చేరారు. ఇండోనేసియాకు చెందిన ఇరీన్ సుకందర్ను ఓడించి, వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుపుతో 2024కు ఘనంగా వీడ్కోలు పలికారు. చెస్లో ఆరితేరిన గ్రాండ్ మాస్టర్ అయినా బిడ్డకు తల్లి అయ్యాక, ఎన్నో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాక, 37 ఏళ్ళ వయసులో హంపీ ఈ అరుదైన విన్యాసం సాధించడం అబ్బురం. అంతేకాదు... అభినందించాల్సిన అంశం. వయసు, బాధ్యతలు మీద పడుతున్నప్పటికీ పట్టు వదలకుండా, నిత్య కృషితో ముందుకు సాగడం, ఆటలో అదే నైశిత్యాన్ని ప్రదర్శించడం ఆషామాషీ కాదు. ఈ 2024 అంతా ఆశించిన ఆటతీరు కనబరచలేక, ఆత్మవిశ్వాసం కుంటుబడిన హంపీ ఒక దశలో అసలీ ఛాంపియన్షిప్లో పోటీ పడకూడదనీ అనుకున్నారట. ఆట నుంచి రిటైరవుతారన్న అనుమానాల నుంచి ఆఖరికి అగ్రపీఠాన్ని అధిష్ఠించే దాకా ఆమె ప్రస్థానం చిరస్మరణీయం. అందుకే, హంపీ గెలిచిన ఈ కొత్త కిరీటం మునుపటి విజయాల కన్నా ఎంతో ప్రత్యేకమైనది. చిన్నారి కూతురును చూసుకోవడంలో ఆమె తల్లితండ్రులు, భర్త పోషించిన పాత్ర మరెందరికో స్ఫూర్తిపాత్రమైనది. అంతర్జాయ యవనికపై భారత క్రీడాకారులు, అందులోనూ తెలుగువాళ్ళు కొన్నాళ్ళుగా సాధి స్తున్న ఘనతలు అనేకం. తాజా ఘటనలే తీసుకుంటే, తెలుగు మూలాలున్న చెన్నై కుర్రాడు గుకేశ్ ఇటీవల ప్రపంచ చదరంగ ఛాంపియన్గా అవతరించాడు. అంతకన్నా ముందు ఆ వెంటనే ఇప్పుడు హంపీ ర్యాపిడ్ చెస్లో రెండోసారి వరల్డ్ టైటిల్ సాధించారు. మరోపక్క భారత క్రికెట్ జట్టులో విశాఖకు చెందిన 22 ఏళ్ళ నవ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి ఆస్ట్రేలియాలో సంచలనం రేపాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న 4వ టెస్టులో ప్రతికూల పరిస్థితుల్లో క్రీజులో పాతుకుపోయి, అద్భుత మైన తొలి శతకం సాధించి, జట్టు పరువు నిలిపాడు. విదేశీగడ్డపై తొలి టెస్ట్ సిరీస్ ఆడుతూ, 8వ నంబర్ ఆటగాడిగా బరిలో దిగి సెంచరీ చేసిన తీరు యువతరంలోని క్రీడాకౌశలానికి నిదర్శనం. ఇవన్నీ భారత జాతి, మరీ ముఖ్యంగా మన తెలుగువాళ్ళు గర్వించాల్సిన క్షణాలు. అయితే, ఇవి సరి పోవు. మన 140 కోట్ల జనాభాలో ఇంతకు మించి శక్తి సామర్థ్యాలు, ఇంకా ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారినీ సరైన రీతిలో ప్రోత్సహించి, ప్రాథమిక వసతి సౌకర్యాలు అందిస్తే ఇలాంటి విజయాలు అనునిత్యం మన సొంతమవుతాయి. తాజా ఘటనలు అదే రుజువు చేస్తున్నాయి. అయితే, మన దేశంలో ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా క్రీడల్లో కెరీర్ను నిర్మించుకోవడం ఇప్పటికీ కష్టసాధ్యంగానే ఉందన్నది నిష్ఠురసత్యం. ఆటల్లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న పలువురు ఆనక కూలీనాలీ చేసుకుంటూ, కష్టంగా బతుకీడుస్తున్న ఉదంతాలు నేటికీ కళ్ళ ముందుకొస్తూ, కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్ది, క్రీడల మీద ఆసక్తిని పెంచాల్సింది పాలకులు, ప్రభుత్వాలే. ఆ పని చేయకుండా... పతకాలు, టైటిళ్ళ మీదే ధ్యాసతో, ఆటగాళ్ళను నిందించి ప్రయోజనం లేదు. ఇంట్లో తల్లితండ్రులు, పాఠశాలలో అధ్యాపకుల స్థాయి నుంచి అందుకు తగ్గట్టు వాతావరణం కల్పించడం ముఖ్యం. అదే సమయంలో క్రీడా సంఘాలు, ప్రభుత్వ ప్రాధికార సంస్థల లాంటి వాటిని రాజకీయాలకు అతీతంగా నడపడం అంతకన్నా ముఖ్యం. అప్పుడే క్రీడాకారుల కలలు ఫలిస్తాయి. క్రీడాభిమాన లోకం ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఒలింపిక్స్కు సైతం ఆతిథ్య మివ్వాలని ఆశపడుతున్న మన పాలకులు అంత కన్నా ముందు సరిదిద్దుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టడం అవసరం. -
ఆత్మావలోకనం
మానవ అస్తిత్వాన్ని గురించిన చర్చ ప్రపంచంలో చిరకాలంగా ఉంది. మానవ దేహం సజీవంగా ఉన్నంత వరకు అందులో చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్నే ప్రాణం అంటున్నాం. శరీరాన్ని విడిచి ప్రాణం పోవడమే మరణం. మరణించిన తర్వాత శరీరాన్ని దహనం చేయడమో, పూడ్చిపెట్టడమో చేస్తారు. మరణం తర్వాత ప్రాణం ఏమవుతుందనే దానిపై రకరకాల ఊహలు ఉన్నాయి; దీనిపై రకరకాల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఉన్నాయి; రకరకాల మత విశ్వాసాలు ఉన్నాయి. శరీరాన్ని సజీవంగా నిలిపి ఉంచే చైతన్యాన్నే ఆధ్యాత్మికవేత్తలు ఆత్మ అంటారు. ‘నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః/ న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః’ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఆత్మను ఆయుధాలు ఖండించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. గీతాసారం ప్రకారం ఆత్మ సమస్త ప్రకృతి శక్తుల ప్రభావానికీ అతీతమైనది. జీర్ణవస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని తొడుక్కున్నట్లే, జీర్ణశరీరాన్ని విడిచిన ఆత్మ తిరిగి కొత్త శరీరాన్ని వెతుక్కుని వెళుతుందనే నమ్మకం కూడా ఉంది. ‘పునరపి జననం పునరపి మరణం/ పునరపి జననీ జఠరే శయనం’ అని ఆదిశంకరుడు చెప్పాడు. శరీరం మరణించినా, ఆత్మకు మాత్రం జనన మరణ పరిభ్రమణం తప్పదని ఆయన సారాంశం. ఆత్మకు మరణం లేదనే నమ్మకం ప్రపంచంలోని చాలా మతాల్లో ఉంది. ఆత్మ మరణం లేనిదే కాదు, ఆద్యంత రహితమైనది కూడానని జైనుల సిద్ధాంతం. సమస్త సృష్టిలోని సూక్షా్మతి సూక్ష్మ క్రిమి కీటకాలు మొదలుకొని మనుషులు సహా భారీ జంతువుల వరకు సమస్త జీవుల్లోనూ ఆత్మ ఉంటుందని జైనుల విశ్వాసం.చైనాకు చెందిన తావో మతమైతే– ప్రతి వ్యక్తిలోనూ ‘హున్’, ‘పో’ అనే రెండు రకాల ఆత్మ ఉంటుందని, ఈ రెండు రకాలు ‘యాంగ్’, ‘యిన్’ అనే సానుకూల, ప్రతికూల శక్తులతో నిండి ఉంటుందని చెబుతుంది. తావో మతం కూడా పునర్జన్మలను నమ్ముతుంది. ఆధునికుల్లో చాలా మంది మతాలకు అతీతంగా ఆత్మ అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి, దానిని నిర్వచించడానికి ప్రయత్నించారు. ‘నేను’ అనే స్పృహ ఆత్మకు మూలమని, అలాగని ఆత్మ అస్తిత్వాన్ని నిరూపించడం గాని, ఖండించడం గాని సాధ్యం కాదని జర్మన్ తత్త్వవేత్త ఇమ్మాన్యుయేల్ కాంట్ చెప్పాడు.ఆత్మ అస్తిత్వాన్ని గురించి ఎన్నో సిద్ధాంతాలు, కల్పనలు, విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ పదార్థమా, కాదా అనే సంగతి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. ఒకవేళ పదార్థమే అయితే, అది ఏ స్థితిలో ఉంటుందో కూడా చెప్పలేదు. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త డంకన్ మెక్డూగల్ ఆత్మకు బరువు ఉంటుందని, ఆ బరువు ఇరవై ఒక్క గ్రాములని ఒక ప్రయోగం చేసి మరీ చెప్పాడు. ఆ తర్వాతి కాలంలో రాబర్ట్ ఎల్ పార్క్, బ్రూస్ హుడ్ వంటి శాస్త్రవేత్తలు మెక్డూగల్ ప్రయోగంలో శాస్త్రీయత లేదంటూ కొట్టి పారేశారు. మరణానంతరం ఆత్మ ఏమవుతుందనే దానిపై మత సిద్ధాంతాలు ఎలా ఉన్నా, దీనిపై చాలామందికి తీరని సందేహాలు ఉన్నాయి. మరణంతోనే ఒక జీవి చరిత్ర పరిసమాప్తమైపోతుందని, ఆత్మ అనేది ఏదీ ఉండదని హేతువాదులు అంటారు. ఆధ్యాత్మికవేత్తల్లోనే కాదు, సాహితీవేత్తల్లోనూ ఆత్మ అస్తిత్వానికి సంబంధించిన పరిపరి విధాల అభిప్రాయాలు ఉన్నాయి. ‘మరుజన్మ ఉన్నదో లేదో/ ఈ మమతలప్పుడేమవుతాయో’ అన్నారు ఆత్రేయ. ‘చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో/ ఏమి యగునో ఎవరికెరుగ రాదు/ ఎరుకలేని వారలేమేమొ చెప్పగా/ విని తపించువారు వేన వేలు’ అన్నారు అబ్బూరి రామకృష్ణారావు. ఆయన తన జీవిత చరమాంకంలో చెప్పిన పద్యమిది. ఆత్మ గురించి, ‘ఆత్మజ్ఞానం’ గురించి వివిధ మతాల్లో అనేకానేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆత్మ అస్తిత్వంపై అనేక విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ ఉందనేందుకు శాస్త్ర సాంకేతిక నిరూపణలు లేకున్నా, ఆత్మ అనే భావన సహస్రాబ్దాలుగా మానవాళిపై ప్రభావం చూపుతోంది. ఆత్మ భావన ప్రభావం మత సిద్ధాంతాలతో పాటు తత్త్వశాస్త్రంలోను, సాహిత్యంలోను, ఇతర సృజనాత్మక కళలలోను కనిపిస్తుంది. ‘ఆత్మ’ భావన చాలావరకు ఆస్తికుల ప్రవర్తనను నియంత్రిస్తూ వస్తోంది. కర్మ సిద్ధాంతానికి, పాప పుణ్యాల విచక్షణకు, పాపభీతికి మూలం ‘ఆత్మ’ భావనే! ఆత్మ అస్తిత్వాన్నే గుర్తించనివారు ప్రపంచ జనాభాలో అతి తక్కువమంది మాత్రమే ఉంటారు. కృత్రిమ మేధ మనుషుల రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తున్న వర్తమాన కాలంలో కూడా ఆత్మ అస్తిత్వాన్ని నమ్మేవాళ్లే ఎక్కువ.ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసి ఆధునిక శాస్త్రవేత్తలెవరూ ఆత్మ అస్తిత్వాన్ని గురించి పెద్దగా పరిశోధనలు సాగించలేదు. అయితే, అమెరికా రక్షణశాఖ ప్రధాన కేంద్రం ‘పెంటగాన్’ ఈ అంశంపై 1983లోనే పరిశోధన చేసింది. మనిషి మరణించినా ఆత్మ మరణించదంటూ లెఫ్టినెంట్ కల్నల్ వేయన్ మెక్డోనల్ తన పరిశోధన పత్రంలో రాశారు. అమెరికా గూఢచర్య సంస్థ ‘సీఐఏ’ 2003లో బహిర్గతపరచిన రహస్య పత్రాల్లో ఇది కూడా ఉంది. అయితే, ఇటీవలే ఇది వెలుగులోకి రావడంతో పాశ్చాత్య పత్రికలు, ప్రసార సాధనాల్లో పలు వ్యాఖ్యానాలతో కూడిన కథనాలు వెలువడ్డాయి. ధ్యానస్థితిలో సూక్ష్మశరీరయానం అనుభవాల గురించి ఆధ్యాత్మికవేత్తలు, యోగసాధకులు చెబుతుంటారు. దీనినే ‘ఔటాఫ్ బాడీ ఎక్స్పీరియెన్సెస్’ అంటున్నారు. గూఢచర్యంలో ఇలాంటి అనుభవాలను ఉపయోగించుకోవడం ఎలా అనేదానిపైనే మెక్డోనల్ పరిశోధన చేశారు. దీనిపై శాస్త్రవేత్తలు ఏమేరకు ఆత్మావలోకనం చేసుకుంటారో చూడాలి. -
విభాత సంధ్యల ప్రభాత గీతం!
‘తారీఖులు, దస్తావేజులు... ఇవి కావోయ్ చరిత్రకర్థం’ అన్నారు శ్రీశ్రీ. కావచ్చు. కానీ, వాటికి ఉండే ప్రాధాన్యత వాటికున్నది. కొన్ని ముఖ్యమైన తేదీల శతాబ్దులూ, అర్ధ శతాబ్దుల సందర్భాలూ చాలా ప్రత్యేకమైనవి. అవి ఇప్పటి పరిస్థితులనూ, పరిణామాలనూ అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. నేర్చుకోవాలనుకుంటే పాఠాలు కూడా చెబుతాయి. ఇప్పుడు బలంగా ఊడలు దిగి కనిపిస్తున్న భావజాలాలపై అవగాహన కుదరాలంటే నాడు వాటికి నారుపోసి నీరు పెట్టిన తొలి కాపుల లక్ష్యాలేమిటో, స్వప్నాలేమిటో తెలుసుకోవాలి. ఈ సందర్భాలు అందుకు పనికొస్తాయి.కొన్నిసార్లు ఇటువంటి చారిత్రక సందర్భాలు ఒకదాని వెంట ఒకటి వరుసకట్టి వచ్చిపడతాయి. ఈ డిసెంబర్ ఆఖరి వారం కూడా అటువంటి ఓ అరుదైన క్రమాన్ని ఆవిష్కరించింది. జాతిపిత మహాత్మాగాంధీ ఒకే ఒక్కసారి 1924 డిసెంబర్ 24వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. మేధావుల సమ్మేళనంలా ఉండే కాంగ్రెస్ పార్టీని ఆయన జనసామాన్యుల పార్టీగా, ఉద్యమ పార్టీగా పరుగులు పెట్టించారు. ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని అదే బెళగావి (కర్ణా టక)లో నేటి శిథిల కాంగ్రెస్ పార్టీ కూడా దాని వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నది. మీడియా ద్వారా వెల్లడైన సమాచారాన్ని గమనిస్తే ఇది మొక్కుబడి సమావేశంగానే అనిపించింది. దూరమైన ప్రజాశ్రేణుల దరిజేరే ఉపా యాన్ని గాంధీ స్ఫూర్తి నుంచి గ్రహించినట్టు కనిపించలేదు.స్వాతంత్య్రం సిద్ధించిన తొలి దశాబ్దాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ కూడా డిసెంబర్ 26న వందో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అప్పటికే వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఏర్పడిన కమ్యూనిస్టులను ఐక్యం చేసి ఆ రోజున కాన్పూర్లో జాతీయ పార్టీగా ప్రకటించారు. అయితే ఈ తేదీపై ఒక డజన్కు పైగా ఉన్న కమ్యూనిస్టు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. 1920లోనే నాటి సోవియట్ యూనియన్లోని తాష్కెంట్ (నేటి ఉజ్బెకిస్తాన్)లో ఎమ్.ఎన్.రాయ్ తదితరులు పార్టీని ప్రకటించారు గనుక ఆ తేదీనే ఆవిర్భావ దినంగా భావించాలని కొందరి అభిప్రాయం. ముఖ్యంగా బిగ్ బ్రదర్ సీపీఎం తాష్కెంట్ తేదీకే కట్టుబడి ఉన్నది. పుట్టిన తేదీ వంటి ఒక సాధారణ సాంకేతిక అంశంపైనే రాజీ పడటానికి సిద్ధంగా లేని కమ్యూనిస్టులు క్లిష్టమైన సైద్ధాంతిక విషయాల్లో ఐక్యత సాధించగలరని ఆశించే వారి సహనాన్ని అభినందించ వలసినదే!ఈ డిసెంబర్ 25నే ఆరెస్సెస్ కూడా తన వందో ఏడాదిలోకి అడుగుపెట్టింది. హిందూ రాష్ట్ర స్థాపన, హిందూ జాతీయ తావాదం లక్ష్యాలుగా కేశవ బలిరామ్ హెడ్గేవార్ ఈ సంస్థను స్థాపించారు. సంస్థను స్థాపించిన తొలి రోజుల నుంచి సాంస్కృతిక రంగంపైనే ప్రధానంగా గురిపెట్టి ఈ సంస్థ పనిచేయడం ప్రారంభించింది. స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా జరుగు తున్న రోజుల్లో పుట్టినప్పటికీ రాజకీయ రంగంలో అది పరిమిత పాత్రనే పోషించింది. కానీ, ఈరోజున భారత రాజకీయాలను తన గుప్పెట్లో పెట్టుకొని ప్రభావితం చేయగలిగే స్థాయికి ఎదిగింది. ఆ సంస్థ స్థాపించిన పలు అనుబంధ సంఘాలు శాఖోపశాఖలుగా విస్తరించి వివిధ రంగాల్లో పనిచేస్తున్నాయి. దాని రాజకీయ వేదికైన భారతీయ జనతా పార్టీ దాదాపు పదికోట్ల మంది సభ్యులతో దేశంలో అతి బలీయమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. అధికార పార్టీగా ఆ పార్టీ అనుస రిస్తున్న, అనుసరించబోయే విధానాలను ఆరెస్సెస్ వ్యవస్థాప కుల సిద్ధాంతాలు, ఆశయాలు ప్రభావితం చేయడం పెద్దగా ఆశ్చర్యపోయే విషయమైతే కాదు.ఈ సంవత్సరమే అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి పూర్తి కావడం యాదృచ్ఛికమైనప్పటికీ ఆసక్తికరం కూడా! ఆరెస్సెస్ కంటే సరిగ్గా ఒక సంవత్సరం ముందు డిసెంబర్ 25వ తేదీనే అటల్ జీ జన్మించారు. ఆరెస్సెస్ తొలి రాజకీయ వేదిక జనసంఘ్లో కూడా ఆయన ప్రముఖ నాయకుడుగా ఉన్నారు. కొంతకాలం అధ్యక్షునిగా పనిచేశారు. జనసంఘ్ పార్టీ భార తీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత పాతికేళ్ల పాటు దాని ముఖపత్ర చిత్రంగా వాజ్పేయి ఉన్నారు. మతతత్వ పార్టీగా ముద్రపడి ఉన్న బీజేపీని మధ్యేవాదులకు కూడా ఆమోదయోగ్యం చేయడంలో వాజ్పేయి బొమ్మ పనికొచ్చింది. ఆయనకున్న ఉదారవాద టైటిల్ సాయంతో తొలిసారి ఢిల్లీ సర్కార్ను ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏర్పాటు చేయగలిగింది. ఆ కాలానికి వాజ్పేయి ఉపయోగపడ్డారు. ఈ కాలానికి కాదు! ఇప్పుడు మోదీయే అవసరమని సంఘ్ అభిప్రాయపడింది. కాలానుగుణంగా కవర్ పేజీ చిత్రాలను ఎంపిక చేయడంలోనే ఆరెస్సెస్ విజయ రహస్యం ఇమిడి ఉన్నది. అంతే తప్ప వాజ్పేయి వేరు, మోదీ వేరూ కాదు! ఈ రెండు రూపాల్లోని సారం ఒక్కటే!!డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మనుస్మృతిని దహనం చేసిన చారిత్రక ఘటనకు కూడా వందేళ్లు కావస్తున్నది. 1927లో సరిగ్గా డిసెంబర్ 25వ తేదీనే అంబేడ్కర్ ఈ పని చేశారు. వర్ణ వ్యవస్థ లేదా నేటి కులవ్యవస్థను మనుస్మృతి బలంగా సమర్థించింది. కుల వ్యవస్థ ముసుగులో జరిగిన దారుణమైన సామాజిక అణచితవేతకు గురైన బలహీన వర్గాల్లోని చైతన్యవంతులైన ప్రజల మనోభావాలకు అంబేడ్కర్ చర్య సాంత్వన కలిగించింది. అప్పటికంటే ఇప్పుడు అంబేడ్కరిజానికి మద్దతు మరింత పెరుగుతున్నది.స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం అనేవి ఆధునికమైన ప్రజాస్వామిక భావనలుగా ప్రపంచవ్యాప్తంగా పరిగణన పొందాయి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనలో ఈ భావనలకే పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఉన్న నాటి రాజ్యాంగ సభ ఈ ముసాయిదాకు ఆమోదముద్ర వేసింది. ఈ దేశంలోని కమ్యూ నిస్టులకు కూడా సిద్ధాంతపరంగా ఈ ఆధునిక భావనలతో పేచీ లేదు. మరి దేశంలోనే పెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ మాటేమిటి?భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను పరిశీలిస్తే కాలాను గుణమైన ఎత్తుగడలను అమలుచేస్తూ ఆరెస్సెస్ మూల సిద్ధాంతాలను హిడెన్ ఎజెండాగా పెట్టుకొని అవసరాన్ని బట్టి ఒక్కొక్కదాన్ని వెలికి తీస్తున్న పద్ధతి కనిపిస్తున్నది. భారత రాజ్యాంగం పట్ల ఆరెస్సెస్ వ్యతిరేకత రహస్యమేమీ కాదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తొలిరోజే దాని అధికార పత్రిక వ్యతిరేక వ్యాసం రాసిన సంగతి అందరికీ తెలిసినదే. సంఘ్ సిద్ధాంతకర్త గురు గోల్వాల్కర్ రాజ్యాంగాన్ని ‘పలు దేశాల నుంచి అరువు తెచ్చుకున్న అతుకుల బొంత’గా వ్యాఖ్యానించడం కూడా రహస్యం కాదు. రాజ్యాంగ సభలో చర్చలు జరుగుతున్న రోజుల్లోనే పలువురు సంఘ్ ప్రముఖులు, హిందూ మహాసభ నాయకులు మనుస్మృతిని మన దేశ రాజ్యాంగంగా మలుచుకోవాలని కోరిన విషయాన్ని గుర్తు చేసుకోవడం అవసరం. రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఆలోచన బీజేపీకి ఉన్నట్టు పలు వార్తలు వచ్చాయి. పీఠికలో ఉన్న ‘లౌకిక’, ‘సామ్యవాద’ పదాలను తొలగించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు ప్రచారం జరిగింది. తన హిడెన్ ఎజెండాలోని అంశాలనుముందుగా ప్రచారంలోకి వచ్చేలా చూడటం, పెద్దగా వ్యతిరేకత కనిపించకపోతే ఆచరణలో పెట్టడం బీజేపీకి కొత్త వ్యూహమేమీ కాదు. ఆధునిక భావనలైన స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వాలకు మనుస్మృతికి సాపత్యం కుదురుతుందంటే నమ్మడం కుదరదు. బీజేపీ ఎటువైపున నిలబడుతుందో చూడాలి. బీజేపీ తన గమ్యాన్ని చేరే యాత్రలో అడ్వాణీ రథయాత్ర ఒక మజిలీ, వాజ్పేయి అధికారం ఒక మజిలీ, నరేంద్ర మోదీ మరో రెండు మూడు మజిలీలు దాటి ఉంటారు. రేపటి జమిలి ఎన్నికలు మరో మజిలీ అని పలువురి భావన. ఈ యాత్ర నిర్నిరోధంగా ఇలాగే సాగుతుందా? దీన్ని నిలువరించే శక్తులున్నాయా? అనేదే నేటి ప్రధాన రాజకీయ చర్చ.సిద్ధాంత పరంగా చూస్తే బీజేపీ హిందూయాత్ర(?)ను ఎదిరించే బలం అంబేడ్కరిజానికి ఉన్నదని కొందరి అభి ప్రాయం. కానీ దానికి ఒక సంస్థాగత రూపం లేదు. అందుకే ‘లాల్–నీల్’æఅనే కొత్త నినాదం ముందుకొచ్చింది. అంబే డ్కరిస్టులు, కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలని దీని భావం. కానీ, చిన్నచిన్న పట్టింపులతోనే చీలికలు పీలికలైన లాల్వాలాల్లో ఇంకా ఆ సామర్థ్యం మిగిలి ఉందని నమ్మేవారి సంఖ్య స్వల్పం. ఇక వ్యూహ రాహిత్యం, నాయకత్వ వైఫల్యంతో కాంగ్రెస్ పార్టీ కునారిల్లిపోయిన స్థితి. ‘ఇండియా’ కూటమి పక్షాల దన్నుతో 99 లోక్సభ సీట్ల దాకా నెట్టుకొచ్చిన ఆ పార్టీని ఇప్పుడు కూటమి పక్షాలే గెటౌట్ అనే పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి వందేళ్ల నాటి భావాలూ, సంస్థలూ ఇంకా మన రాజకీయ యవనికపై కదలాడుతుండటం ఒక విశేషం. ఈ ప్రయాణంలో బలమైన శక్తులు బలహీనంగా మారడం, బలహీన శక్తులు బలంగా మారడం మరో విశేషం.చారిత్రక ఘటనలు పునరావృతం అవుతున్నట్టు కనిపించడం కూడా మరో ఆసక్తికర పరిణామం. వెన్నుపోటు ఉదంతంతో తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఆ తర్వాత వాజ్పేయి అండతో ‘కార్గిల్ గాలి’లో మరోసారి అధికారంలోకి వచ్చారు. ఇది జరిగి పాతిక సంవత్సరాలు. అప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాది కూడా గడవకముందే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఆయన కొనితెచ్చుకున్నారు. అడ్డగోలుగా బాదిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మొదలైన ఆందోళనలు ఆయన పదవీకాలమంతా జరుగుతూనే ఉన్నాయి. చివరికి తిరుపతిలో మందుపాతర ప్రమాదం నుంచి బయటపడ్డ సానుభూతి కూడా ఆయన్ను గట్టెక్కించలేకపోయింది.ఇప్పుడూ అదే పరిస్థితి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ను అటకెక్కించడంతోనే తాము మోసపోయామన్న అభిప్రాయం జనంలో వచ్చేసింది. దానికితోడు పరిపాలనా వైఫల్యాలు, కక్షసాధింపు రాజకీయాలు, ప్రజావైద్యం పడకేయడం, నాణ్యమైన ప్రభుత్వ విద్యకు పాతరేయడం, వాడవాడనా పారుతున్న మద్యం కంపు, అంతకుమించి కంపు కొడుతున్న రాజకీయ నాయకుల అవినీతి బాగోతాలు, వెరసి ఆరు మాసాల్లోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా శుక్రవారం నాడు వైసీపీ పిలుపు మేరకు జరిగిన ప్రదర్శనల్లో పది లక్షలమందికి పైగా పాల్గొనడం ప్రజాగ్రహానికి ఒక శాంపిల్ మాత్రమే! పులివెందుల నియో జకవర్గంలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి జరిపిన పర్యటన జనసముద్రాన్ని చీల్చుకొని వెళ్తున్నట్టుగా కనిపించింది. అభిమాన సందోహం నడుమ పాతిక కిలోమీటర్ల ప్రయాణానికి ఏడు గంటల సమయం! పులివెందుల నుంచి బెంగళూరు వరకు ఆయన చేసిన రోడ్డు ప్రయాణం కూడా అంతే! దారి పొడవునా ఊళ్లు కాదు, జన జాతరలే దర్శనమిచ్చాయి. ఈ పరిస్థితి చూస్తుంటే కూడా గతమే గుర్తుకొస్తున్నది. మందుపాతర సాను భూతితో మళ్లీ గెలుస్తామని భావించిన బాబు నాలుగు మాసాలు ముందుగానే ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నారు. ఆయనతోపాటు కేంద్రంలోని ఎన్టీయే సర్కార్ను కూడా తీసుకెళ్లి వాజ్పేయి పుట్టి ముంచారు. ఇప్పుడు కూడా ముందుగానే జమిలి వార్తలు వస్తున్నాయి. ఈ జమిలిలో మోదీ పుట్టిని కూడా ముంచుతాడేమో!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
దేశం మరువలేని దార్శనికుడు
చరిత్ర సృష్టించటం, దాన్ని తిరగరాయటం, వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టడం అందరివల్లా కాదు. ప్రపంచాన కోట్లమందిలో ఒక్కరికి కూడా ఆ అవకాశం అంత సులభంగా దక్కదు. కొన్ని తరాలకు ఒకరైనా అలాంటివారు ఉద్భవిస్తారంటే నమ్మలేం. అలాంటి అరుదైన విశిష్ట వ్యక్తుల్లో గురువారం రాత్రి కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. పేదింట పదిమంది సంతానంలో ఒకరిగా, కిరోసిన్ లాంతరు దగ్గర చదువుకున్న మన్మోహన్ జీవితంలో అధిరోహించిన శిఖరాలు ఉన్నతమైనవి. 1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ఆర్థికమంత్రిగా ప్రకటించినప్పుడు అందరూ విస్తుపోయారు. ఆయనే నమ్మలేదు. అప్పటికే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనా మిక్స్లో అధ్యాపకుడిగా పనిచేశారు. జెనీవా కేంద్రంగా పనిచేసే స్వతంత్ర ఆర్థిక మేధావుల బృందం సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, రిజర్వ్బ్యాంక్ గవర్నర్గా ఉన్నారు. యూజీసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో మనుగడ సాగించటానికి అవసరమైన వాగ్ధాటి, సులభంగా చొచ్చుకుపోయే తత్వంలేని ఒక విద్యావేత్త, ఆర్థిక నిపుణుడు దేశానికి ఆర్థికమంత్రేమిటని ఆశ్చర్యపోయారు. కానీ అందరూ అనుకున్నట్టు ఆయన సాధారణ వ్యక్తి కాదని త్వరలోనే అర్థమైంది. దేశాన్ని ప్రగతి పట్టాలెక్కించి శరవేగంతో పరుగులెత్తించగల నూతన ఆర్థిక విధానాలను సృజించటంలో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు గలవాడని సర్వులూ గ్రహించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వతంత్ర భారతంలో ఎన్నడూ ఎరుగనిది. ఫేబియన్ సోషలిజం భావనల ఆధారంగా నెహ్రూ విరచించిన సామ్యవాద ఆర్థిక విధానాల నుంచి లేశమాత్రం వైదొలగినా దేశం అధోగతి పాలవుతుందని అప్పట్లో కాంగ్రెస్ విశ్వసించేది. మరోపక్క రకరకాల నియంత్రణలతో ‘లైసెన్స్ రాజ్’గా అపకీర్తి పాలైంది మన వ్యవస్థ. ఎన్నో ఆర్థిక క్లేశాలతో, మరెన్నో ఒడుదొడుకులతో ఉన్న ఆ వ్యవస్థకు తన వినూత్న బడ్జెట్తో సంపూర్ణ జవసత్వాలిచ్చినవారు మన్మోహన్. అన్యుల కీర్తిని అపహరించటానికి ససేమిరా ఇష్టపడని పీవీ... ఆర్థిక సంస్కరణల కర్త, కర్మ, క్రియ కూడా ఆయనేనని చాటారు. అందువల్లే సారథిగా పీవీయే ఉన్నా సంస్కరణల ఆద్యుడిగా మన్మోహన్నే గుర్తిస్తారు. ఆయన విధానాల పర్యవసానంగా అంతవరకూ నిలువెల్లా ఆవరించిన నిర్ణయ రాహిత్యత కనుమరుగైంది. ఒక్కుమ్మడిగా ప్రైవేటు పెట్టుబడి రెక్కలు విప్పుకుంది. లాభార్జన మాత్రమే ధ్యేయంగా భావించే విదేశీ పెట్టుబడులు వెల్లు వెత్తాయి. పబ్లిక్ రంగ సంస్థలు సైతం పోటీలో దీటుగా నిలిస్తే తప్ప మనుగడ లేదని గ్రహించాయి.‘చరిత్ర అయినా నన్ను దయతో గుర్తుపెట్టుకుంటుందని ఆశిస్తాను’ అని ఒక సందర్భంలో అన్నారాయన. తనపై వచ్చిపడుతున్న విమర్శల జడికి ఆ హృదయం ఎంతగా తల్లడిల్లిందో చెప్పే మాట అది. నిజం... ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడైనా, పార్టీలోనూ వెలుపలా వచ్చిన అవాంతరాలను అధిగమించి దృఢంగా అమలు చేసినప్పుడైనా ఆయనకు శాపనార్థాలు ఎదుర య్యాయి. సొంత పార్టీలోనే వ్యతిరేకులు తయారయ్యారు. తొలినాళ్లలోనే ఏదోరకంగా పక్కకు తప్పించాలన్న ప్రయత్నాలూ జరిగాయి. మన రహస్యాలను ఐఎంఎఫ్కు చేరేస్తున్నారనీ, ఆ సంస్థ కనుసన్నల్లో విధానాలు రూపొందిస్తున్నారనీ ఎలాంటి ఆధారాలూ లేకుండానే కొందరు వండి వార్చారు. పార్లమెంటులో అలజడి ఖాయమనుకున్నారు. కానీ అప్పటికే మన్మోహన్ నిజాయితీ, నైతిక నిష్ఠ, నిష్కాపట్యత, సచ్ఛీలత అందరికీ అర్థమయ్యాయి గనుక అవన్నీ దూదిపింజñ ల్లా తేలిపోయాయి. వాటిని విపక్షం సభలో ప్రస్తావించినా పెద్దగా పట్టుబట్టలేదు. ఆ తర్వాత పీవీ సహచర మంత్రుల్లో కనీసం 20 మందిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా మన్మోహన్ను వేలెత్తిచూపే సాహసం ఎవరూ చేయలేదు. ఆ సుగుణాలే మన్మోహన్ను అనంతర కాలంలో ప్రధానిగా ఎంచుకునేందుకు దోహదపడ్డాయి. దేన్నయినా సాధించటంలో ఆయన పట్టుదల ఎంత టిదో చెప్పటానికి అమెరికాతో కుదిరిన అణు ఒప్పందమే ఉదాహరణ. మద్దతునిస్తున్న వామ పక్షాలూ, ఇతర పార్టీలూ ససేమిరా కాదన్నా ఆ ప్రతిపాదనను పార్లమెంటు ముందుంచి ఆమోదింపజేసుకున్న సాహసి ఆయన.మన్మోహన్ అత్యున్నత స్థాయి ఆర్థిక నిపుణుడు కావొచ్చు... ఆ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారం విప్పిచెప్పిన అనేకానేక విశ్లేషణాత్మక గ్రంథాల రచయిత కావొచ్చు. కానీసిద్ధాంత రాద్ధాంతాల్లో కూరుకుపోకుండా కళ్లెదుటి వాస్తవాలను ఆచరణీయ దృక్పథంతో పరిశీలించి సరిగా స్పందించగల విశాల దృక్పథం ఉన్న నాయకుడు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ఉచిత విద్యుత్ ప్రతిపాదన చేసినప్పుడు మొదట్లో దాన్ని ఇష్టపడకున్నా సాగు సంక్షోభాన్ని అధిగమించటానికి అది తోడ్పడిన తీరు గుర్తించాక మన్మోహన్ దాన్ని స్వాగతించిన తీరు మరువలేనిది. ప్రజాజీవన రంగంలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టం, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించే విద్యాహక్కు చట్టం, రెక్కాడితేగానీ డొక్కాడని బడుగుజీవులకు కరువురోజుల్లో పని కల్పన కోసం ఉపాధి హామీ చట్టం వంటివి తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినా ఏనాడూ ఆయన కీర్తిప్రతిష్ఠలను ఆశించలేదు. తన విధానాలతో దేశాన్ని వైభవోజ్జ్వల శకానికి తీసుకెళ్లినా చివరివరకూ నిగర్విగా, వినమ్రుడిగా జీవించిన దార్శనికుడు మన్మోహన్ను ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదు. ఆ అసాధారణ, అపురూప విజ్ఞాన ఖనికి ‘సాక్షి’ నివాళులర్పిస్తోంది. -
బెళగావి దోవ చూపుతుందా?
ఎన్నికలొచ్చినప్పుడల్లా భంగపాటు రివాజైన కాంగ్రెస్కు ఈసారి ఢిల్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే అవమానం ఎదురైంది. ‘ఇండియా’ కూటమి నుంచి ఆ పార్టీని తక్షణం సాగనంపాలని ఆప్ పిలుపునివ్వటం వర్తమాన రాజకీయాల్లో కాంగ్రెస్ దయనీయస్థితిని వెల్లడిస్తోంది. వాస్తవానికి పార్టీ అధ్యక్ష హోదాలో గాంధీ మహాత్ముడు బెల్గాం (ప్రస్తుతం బెళగావి) కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా గురువారంనాడు రెండురోజుల శత వార్షిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశాలు జరుగు తున్నాయి. సైద్ధాంతిక వైరుద్ధ్యాలతో పరస్పరం కలహించుకునే పక్షాలు ఒక దరి చేరి కూటమిగా చెప్పుకున్నంత మాత్రాన అవి కలిసి కాపురం చేస్తాయన్న నమ్మకం ఎవరికీ ఉండదు. అందువల్లేఇండియా కూటమికి ప్రారంభంలోనే పగుళ్లొచ్చాయి. కూటమిలో ఉంటాను గానీ బెంగాల్ వరకూ ఎవరికీ ఒక్కటంటే ఒక్క సీటివ్వనని తొలుతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెగేసి చెప్పారు. అనంతరకాలంలో ఆమె దూరం జరిగారు. ఢిల్లీ వరకూ ఆప్ సైతం ఇంచుమించు అదే వైఖరి తీసుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుకు అంగీకరించినా ఈ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు వెళ్తామన్నది. ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈలోగా ఆప్పై రాజకీయంగా పైచేయి సాధించటం కోసం కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. తాము గెలిస్తే మహిళా సమ్మాన్ పేరుతో ఇప్పటికే ఇస్తున్న రూ. 1,000ని రూ. 2,100కు పెంచుతామని ఆప్ వాగ్దానం చేయడాన్ని కాంగ్రెస్ ప్రధానంగా తప్పుబడుతోంది. ఆప్ ఇస్తున్న సంక్షేమ హామీలు ప్రజలను మోసగించడమేనని, ఇది శిక్షార్హమైన నేరమని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై, ముఖ్యమంత్రి అతిశిపై కాంగ్రెస్ కేసులు పెట్టింది. ఆయన్ను జాతి వ్యతిరేకిగా అభివర్ణించింది. ఆప్ వైఫల్యాలపై శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఇటీవల జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేసినా ఇంతగా వైషమ్యాలు లేవు. బెళగావి సమావేశాల్లో కాంగ్రెస్ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. అయితే దేనిపైనా తనకంటూ స్పష్టమైన వైఖరి లేకుండా గాలివాటుకు కొట్టుకుపోయే విధానాలను అవలంబించినంత కాలమూ ఇలాంటి కార్యాచరణలు ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది సందే హమే. ఆర్నెల్లక్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న ఆప్పై ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం హఠాత్తుగా స్వరం మార్చి విమర్శలు లంకించుకోవటం వెనకున్న అంత రార్థాన్ని జనం గ్రహించలేరని కాంగ్రెస్ భావిస్తున్నదా అన్న సందేహం వస్తుంది. ఢిల్లీని వరసగా మూడు దఫాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ తనకెదురవుతున్న చేదు అనుభవాలకు కారణ మేమిటో లోతైన అధ్యయనం చేస్తే ఎంతో కొంత ఫలితం ఉంటుంది. దానికి బదులు బీజేపీ మాదిరే ఆప్పై విమర్శలు చేస్తే చాలన్నట్టు కాంగ్రెస్ పోకడ ఉంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ కాంగ్రెస్ హెచ్కేఎల్ భగత్, జగదీష్ టైట్లర్ గ్రూపులుగా విడిపోయి అంతర్గత కలహాలతో సతమతమవుతున్న తరుణంలో దాదాపు బయటి వ్యక్తిగా ముద్రపడిన షీలా దీక్షిత్కు ఢిల్లీ పీసీసీ చీఫ్ పదవి అప్పగించారు. ఆ తర్వాతే అక్కడ కాంగ్రెస్ గట్టెక్కింది. ఇప్పుడు ఆ మాదిరి వ్యూహం ఉన్నట్టు కనబడదు. ఈసారి మౌలికస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి నడుం బిగించామని, ఢిల్లీలో తమకు మంచిస్పందన ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే బస్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా కాలుష్యంపై ఆ పార్టీ దృష్టి సారించాలి. పార్టీ అంతర్గత నిర్మాణం చక్క దిద్దుకోవాలి. కానీ జరుగుతున్నది వేరు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ పొరపాటే చేసింది. ఆ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ పొత్తు మెరుగైన ఫలితాలనిస్తుందని అందరూ భావించారు. కానీ అప్పటి పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీతోసహా కీలక నేతలు పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశారన్నది విశ్లేషకుల అంచనా. అరవింద్ సింగ్ ఇప్పుడు బీజేపీలో చేరారు. పేరుకు ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్నా భాగస్వామ్య పక్షాల నుంచి కాంగ్రెస్కు సూటిపోటి మాటలు తప్పడం లేదు. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర పక్షాలు కాంగ్రెస్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తున్నాయి. వీరితో ఆప్ సైతం గొంతు కలపటం కాంగ్రెస్ దయనీయ స్థితిని తెలియజేస్తున్నాయి. కార్యాచరణ మాట అటుంచి ముందు మిత్రులతో కలిసి ప్రయాణించలేని పరిస్థితులు ఎందుకేర్పడ్డాయో ఆత్మవిమర్శ చేసుకో వాల్సిన అవసరం కనబడుతోంది. ఒక విపక్షంగా ఎటూ సమస్యలు వచ్చిపడుతుంటాయి. కానీ తెచ్చిపెట్టుకుంటున్న సమస్యలు కోకొల్లలని ఆ పార్టీ గ్రహించలేకపోతున్నది. ఎంతసేపూ పార్టీ వైఫల్యాలకు స్థానికంగా ఉండే నేతలను వేలెత్తి చూపటం మినహా తమ వ్యవహార శైలి ఎలాఉంటున్నదన్న స్పృహ అగ్ర నాయకత్వానికి కరువైంది. స్థానికంగా పార్టీని బలోపేతం చేస్తున్న వారిని అనుమానదృక్కులతో చూడటం, చురుగ్గా పనిచేస్తున్నవారికి వ్యతిరేకంగా ముఠాలను ప్రోత్సహించటం, విశ్వాసపాత్రులనుకున్న నాయకులకే అంతా కట్టబెట్టడం ఇంకా తగ్గలేదు. హరియాణాలో ఓటమికి ఇలాంటి పోకడలు కూడా కారణం. ఇప్పుడు ఢిల్లీ పార్టీలో ఉన్న అంతర్గత లోటుపాట్లను సవరించి బలోపేతం చేయటంపై దృష్టి సారించక ఆప్పై ఆరోపణతో కాలక్షేపం చేయటం కాంగ్రెస్ బలహీనతను సూచిస్తుంది. బెళగావిలోనైనా ఆ పార్టీకి జ్ఞానోదయమవుతుందా? -
ఈ మార్పు మంచికేనా?!
విద్య–సమాజం విడదీయలేనివి. అవి ఏకకాలంలో పరస్పరాశ్రితాలు, పరస్పర ప్రభావితాలు కూడా. ఒక సమాజంలో పిల్లలకు అందే విద్య ఆ సమాజ స్థాయికి ప్రతిబింబంగా ఉంటుంది. క్రమేపీ ఆ సమాజాన్ని మెరుగుపరుస్తుంది. తిరిగి ఆ ప్రభావంతో విద్య ఉచ్చస్థితికి వెళ్తుంటుంది. అందువల్లే సమాజ స్థితిగతుల అధ్యయనం ఆధారంగా విద్యావిధాన నిర్ణయాలుండాలంటారు. పాఠశాల విద్యలో ప్రస్తుతం అమలవుతున్న ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేయటంపై లోతైన చర్చే సాగుతోంది. కేంద్రీయ విద్యాలయాలూ, నవోదయా విద్యాలయాలూ, సైనిక్ స్కూళ్లతోపాటు కేంద్రం నడిపే మరో 3,000 పాఠశాలల్లో తక్షణం ఈ విధానం అమల్లోకొచ్చింది. పర్యవసానంగా ఇకపై అయిదు, ఎనిమిది తరగతుల వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేనివారికి రెండు నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రెండోసారి కూడా ఫెయిలైతే వారు తిరిగి అవే తరగతులు చదవాలి. వాస్తవానికి ఈ విధానం రద్దు కోసం 2019లోనే విద్యాహక్కు చట్టాన్ని కేంద్రం సవరించింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది కనుక రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. అప్పట్లో 16 రాష్ట్రాలూ, 2 కేంద్రపాలిత ప్రాంతాలూ కేంద్ర విధానానికి అంగీకారం తెలిపాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకించాయి. నిర్ణయం తీసుకున్న అయిదేళ్ల తర్వాత తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ‘నో డిటెన్షన్’ విధానంపై అనుకూల వాదనలు ఎన్ని వున్నాయో, ప్రతికూల వాదనలు కూడా అంతకు మించే ఉన్నాయి. అనుకూల వాదనలు తీసిపారేయదగ్గవి కాదు. ఈ విధానంవల్ల డ్రాపౌట్ల శాతం గణనీయంగా తగ్గిందని, ఉత్తీర్ణత సాధించలేమన్న భయాన్ని విడనాడటంవల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నదని, అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక విద్యార్థిని ఫెయిల్ చేసినంత మాత్రాన నైపుణ్యం పెరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదని, పైగా తనతో చదివినవారంతా పై తరగతులకు పోవటంవల్ల ఆత్మ న్యూనతకు లోనై, ఒత్తిడి పెరిగి విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని కూడా ‘నో డిటెన్షన్’ సమర్థకులు చెబుతున్నారు. విద్యాహక్కు చట్టం ‘నో డిటెన్షన్’ విధానం పెట్టి ఊరుకోలేదు. అందులోని 29(2)(హెచ్) నిబంధన విద్యాబోధన తీరుతెన్నులనూ, పిల్లల అధ్యయన నైపుణ్యాలనూ మెరుగుపరిచేందుకు సమగ్ర, నిరంతర మూల్యాంకన(సీసీఈ) విధానం ఉండాలని సూచిస్తోంది. సంప్రదాయ పరీక్ష విధానానికి బదులుగా నిర్దేశించిన ఈ విధానం ఆచరణలో ఎలా అమలవుతున్నదో ఎవరైనా పరిశీలించారా? ఇది సక్రమంగా అమలైతే ఎప్పటికప్పుడు పిల్లల గ్రాహకశక్తిని అంచనా వేసి చదువుల్లో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటానికి అవకాశం ఉండేది. కానీ ఉపాధ్యాయులకు అప్పజెప్పే ఇతరేతర పనులవల్ల కావొచ్చు... వారిలోని అలసత్వం వల్ల కావొచ్చు– పిల్లలపై శ్రద్ధ తగ్గిందన్నది ‘నో డిటెన్షన్’ విధానం రద్దు అనుకూలుర మాట. ‘ఎలాగైనా’ ఉత్తీర్ణులమవుతామన్న ధైర్యంతో పిల్లలు చదవటం లేదని, అలాంటివారి విషయంలో ఉపాధ్యా యులు కూడా నిర్లిప్తంగా ఉండిపోతున్నారని, ఇందువల్ల ఇతర పిల్లలపై కూడా ఆ ప్రభావంపడి మొత్తంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని వారి వాదన. చాలా రాష్ట్రాల్లో పాలకులు పాఠశాల విద్యపై సమగ్ర దృష్టి సారించటం లేదు. ఈ విషయంలో కేరళ తర్వాత ఢిల్లీ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర ప్రదేశ్లో విద్యారంగ ప్రక్షాళన ఒక యజ్ఞంలాగే నడిచింది. ఒకపక్క సకల సదుపాయాలతో పాఠశాల భవనాలను తీర్చిదిద్దటంతోపాటు పిల్లల చదువులను మెరుగుపరిచేందుకు వీలుగా తరగతి గదుల్లో ఎన్నో బోధనోపకరణాలు ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. విద్యాబోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ల అమలుకు అంకురార్పణ చేశారు. ఈ తరహా సిలబస్లు ప్రవేశపెట్టిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి ట్యూషన్ ఫీజు కింద రూ. 14 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని ఈమధ్య మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రభుత్వాలు పాఠశాల విద్యను నిరంతరం పర్యవేక్షించి తగినంతమంది టీచర్లను నియమిస్తే, సదుపాయాలు మెరుగుపరిస్తే, ప్రామాణికమైన సిలబస్లు ప్రవేశపెడితే పిల్లల నైపుణ్యాలు పెరుగు తాయి. ప్రైవేటు విద్యలో ఎల్కేజీ నుంచే పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచే అనారోగ్యకర విధానాలు అమలవుతున్నాయి. కాన్సెప్ట్ స్కూళ్లు ఈ పోటీని మరింత పెంచాయి. ‘పిండికొద్దీ రొట్టె’ అన్నట్టు డబ్బు పారేస్తే తమ పిల్లలు అమాంతం ఎదుగుతారన్న భ్రమల్లో తల్లిదండ్రులున్నారు. మరి సర్కారీ బడుల్లో పిల్లల్ని చదివిస్తున్న పేద తల్లిదండ్రులు ఏం కావాలి... వారి పిల్లలకు మెరుగైన విద్య ఎలా అందాలి? గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పుడున్న ‘నో డిటెన్షన్’ విధానం రద్దయితే పేద పిల్లలు ఎప్పటికి మెరుగుపడాలి? ఎదిగాక ఏం చేయాలి? కేంద్రం ఏ విధానం అమలు చేయదల్చుకున్నా దానికి ముందు బావురుమంటున్న ప్రభుత్వ బడులను ఉద్ధరించాలి. అక్కడి పిల్లలకు కడుపునిండా తిండి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బోధన ఉంటున్నాయో లేదో గమనించాలి. ఉపాధ్యాయుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించాలి. వారిని బోధనకే పరిమితం చేయాలి. ‘నాణ్యత అనేది యాదృచ్ఛికంగా ఊడిపడదు. అది నిరంతరం కొనసాగే వేనవేల బౌద్ధిక చర్యల సమాహారం’ అన్నారు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్. పాలకులు దాన్ని గుర్తెరగాలి. -
హసీనా అప్పగింత సాధ్యమేనా?
బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ మన దేశానికి తలెత్తుతున్న దౌత్య సమస్య లకు తాజాగా మరొకటి వచ్చిచేరింది. గత ఆగస్టు నుంచీ భారత్లో ఆశ్రయం పొందుతున్న తమ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని సోమవారం బంగ్లా విదేశాంగ శాఖ దౌత్య సందేశం పంపింది. హసీనా అవినీతి పాలనను వ్యతిరేకిస్తూ విద్యార్థుల నాయకత్వంలో జనాగ్రహం వెల్లువెత్తి ఆమె ఆ దేశం నుంచి నిష్క్రమించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మైనారిటీలకూ, హసీనా హయాంలో బాధ్యతలు నిర్వర్తించిన నేతలకూ, ఉన్నతాధికారులకూ గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడులూ, దౌర్జన్యాలూ, నిర్బంధాలూ తప్పడం లేదు. ఆఖరికి న్యాయమూర్తుల్ని సైతం వెంటాడుతున్నారు. భయోత్పాతంలో ముంచెత్తుతున్నారు. చాలామంది అజ్ఞాతంలోకి పోయారు. దీన్నంతటినీ ఆపాలనీ, మైనారిటీలకు రక్షణ కల్పించాలనీ మన దేశం ఇప్పటికే బంగ్లా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ కక్షపూరిత చర్యలు ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. పైగా భారత మీడియా ఉన్నవీ లేనివీ కల్పించి తప్పుడు ప్రచారం చేస్తున్నదని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతేకాదు... దానికి సమాంతరంగా అంతా బాగానే ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తోంది. ‘న్యూయార్క్ టైమ్స్’లో వచ్చిన కథనమే ఇందుకు ఉదాహరణ. విద్యార్థి బృందాలు దేశాభివృద్ధికి, అవినీతి అంతానికి ప్రణాళికలు వేస్తున్నట్టు ఆ కథనం సారాంశం. మైనారిటీలు సురక్షితంగా ఉన్నట్టు ఆ వర్గాలతోనే చెప్పించారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనస్ పాలన తీరుతెన్నులు గమనిస్తే పరిస్థి తులు ఆయన నియంత్రణలో ఉన్నట్టు కనబడదు. మైనారిటీల సంగతలావుంచి అసలు ముస్లిం మహిళలకే ఇబ్బందులు తప్పడం లేదు. మత ఛాందసవాదులు రంగంలోకి దిగి బురఖా ధరించని బాలికలనూ, మహిళలనూ నడిరోడ్లపై పంచాయతీలు పెట్టి హింసిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. హసీనా ఏలుబడిలో అవినీతి పెరిగిందనటంలో సందేహం లేదు. పదవి కాపాడుకొనేందుకు ఎన్నికల ప్రక్రియను ఏమార్చారన్న ఆరోపణల్లో కూడా నిజం వుంది. కానీ దానికి విరుగుడు ఈ అరాచకమా?!ప్రభుత్వాలను కూలదోసిన సందర్భాల్లో పాలకులు పరారీ కావటం, వేరేచోట ఆశ్రయం పొందటం అసాధారణమేమీ కాదు. హసీనా ఢిల్లీకి ఆదరా బాదరాగా వచ్చినా ఇక్కడినుంచి లండన్ వెళ్లాలని ప్రయత్నించారు. కానీ బ్రిటన్ ఆమె వినతిని తోసిపుచ్చింది. బంగ్లాలో హఠాత్తుగా బయ ల్దేరిన ఉద్యమానికి అమెరికా ఆశీస్సులున్నాయని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో బ్రిటన్ ఆమె వినతిని తిరస్కరించటంలో వింతేమీ లేదు. కానీ ఆమెను అప్పగించాలని కోరిన వెంటనే మన ప్రభుత్వం అందుకు అంగీకరించటం సాధ్యమేనా? చట్టబద్ధ పాలన ఆనవాళ్లు లేవు సరికదా... ఎడాపెడా కక్షపూరిత విధానాలు అమలవుతున్నప్పుడు కోరిన వెంటనే ఒక మాజీ అధినేతను అప్ప గిస్తారని బంగ్లా ఎలా అనుకుంది? ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు వీలుగా రెండు దేశాలూ 2013లో నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తగిన సాక్ష్యాధారాలు అందజేశాకే నేరస్తుల్ని అప్పగించాలని ఉన్న నిబంధనను కాస్తా వారెంటు జారీ అయితే చాలు అప్పగించవచ్చని సవరిస్తూ 2016లో ఆ ఒప్పందాన్ని సరళం చేశారు. కానీ తనపై పెట్టిన కేసులు న్యాయసమ్మతమైనవి కాదని, అందువల్ల అప్పగింత వినతిని తిరస్కరించాలని హసీనా మన ప్రభుత్వాన్ని కోరుకోవచ్చు. రాజ కీయ కారణాలతో అప్పగించాలని కోరితే తిరస్కరించొచ్చని ఒప్పందంలోని నిబంధనలే చెబుతున్నాయి. సంక్లిష్టమైన ఈ ప్రక్రియంతా పూర్తికావటానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హసీనా విషయంలో అక్కడి న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా వ్యవహరిస్తుందన్న విశ్వాసం తమకు లేదని మన ప్రభుత్వం చెప్పే అవకాశం కూడా ఉంది. ఒకవేళ మన దేశం అందుకు సంసిద్ధత చూపినా హసీనా మన కోర్టుల్ని ఆశ్రయించి ఉపశమనం పొందుతారు. బ్రిటన్తో మనకు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ రుణాలు తీసుకుని బ్యాంకులను వేలాది కోట్ల రూపాయల మేర మోసగించి పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా వంటివారిని రప్పించటం అసాధ్యమవుతున్నది. మన దేశంలో ఉగ్రవాద ఘటనలకు పాల్పడి పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టి అప్పగించటానికి కొన్ని యూరప్ దేశాలు నిరాకరిస్తున్నాయి. మన న్యాయవ్యవస్థ, జైళ్లు ప్రామాణికంగా లేవన్న కారణాలు చూపుతున్నాయి. అసలు తన ప్రస్థానం ఏ విధంగా కొనసాగించదల్చుకున్నదో బంగ్లాదేశ్ నిర్ధారించుకోవాలి. ఆ దేశ ఆవిర్భావానికి మూలకారణమైన ‘బెంగాలీ భావన’కు తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోంది. బంగ్లా విముక్తిని తాము గుర్తించబోమని చెప్పే ఘనులు తయారవుతున్నారు. అడుగడుగునా మత ఛాందసుల ప్రాబల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మన దేశంతో సంబంధాల పునరుద్ధరణకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకొనేందుకు బంగ్లా ఇంతవరకూ సిద్ధపడలేదు. పైగా పాకిస్తాన్తో అంటకాగేందుకు ఉత్సాహపడుతోంది. 53 యేళ్ల క్రితం ఒక దేశంగా ఆవిర్భవించటానికి ముందు పాక్ సైనిక పాలకులు తమను ఎంత దారుణంగా అణచేశారో ఈ తరం మరిచిపోయి ఉండొచ్చు. 30 లక్షలమందికి పైగా ప్రజల బలిదానాలతో ఏర్పడిన దేశం కళ్లముందు కుప్పకూలుతుంటే నిశ్చేష్టులై ఉండిపోవటం విషాదకరం. అత్యంత విషమ పరిస్థితుల్లో కూడా ఎంతో అప్రమత్తతతో, వివేకంతో వ్యవహరించిన శ్రీలంక పౌరులను ఆదర్శంగా తీసుకుంటేనే దేశానికి మెరుగైన భవిష్యత్తు సాధ్యమవుతుందని బంగ్లా ప్రజలు తెలుసుకోవాలి. -
పారదర్శకతకు పాతర
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారశైలిపై, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్న వేళ... అవి మరింత పెరిగే ప్రమాదం తాజాగా తలెత్తింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్ని మారుస్తున్నట్టు కేంద్ర సర్కార్ శుక్రవారం ప్రకటించింది. నిబంధనల్లో సరికొత్త సవరణ వల్ల ఇకపై ఎన్నికలకు సంబంధించిన అన్ని పత్రాలనూ పరిశీలించే అవకాశం ప్రజలకు ఉండదు. సీసీ టీవీ, వెబ్కాస్టింగ్ ఫుటేజ్, అభ్యర్థుల వీడియో రికార్డింగుల లాంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు ఇకపై అందుబాటులో ఉండవు. అదేమంటే, అలాంటివన్నిటినీ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచితే వాటిని దుర్వినియోగం చేస్తారనీ, అసలు ఓటరు భద్రతకే ప్రమాదకరమనీ పాలక వర్గాల వాదన. సోషల్ మీడియా యుగంలో, పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్ల దృశ్యాలు విస్తృతంగా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అది వట్టి డొల్ల వాదనే. ఎన్నికల నిబంధనల్లో మార్పుపై దేశ వ్యాప్తంగా అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నది అందుకే!‘‘ఎన్నికకు సంబంధించిన మిగిలిన అన్ని పత్రాలనూ ప్రజాక్షేత్రంలో పరిశీలించేందుకు వీలుండాలి’’ అని 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్ 93(2)(ఎ) చెబుతోంది. దానికే ఇప్పుడు సవరణ చేశారు. ఈసీ సిఫార్సు మేరకు, కేంద్ర న్యాయశాఖ ఈ మార్పును నోటిఫై చేసింది. దాంతో, ఇప్పుడిక నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొన్న పత్రాలను మాత్రమే జనం పరిశీలించవచ్చన్న మాట. అంతేకాదు... ఎన్నికల పత్రాలన్నిటినీ కోరినవారికి ఇవ్వాలంటూ ఈసీని ఇక కోర్టులు ఆదేశించడానికి వీలుండదు. చిత్రమేమంటే, ఇటీవలి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లకు సంబంధించిన పత్రాల కాపీలు, సెక్యూరిటీ కెమెరాలోని ఫుటేజ్, వీడియోలను ఓ పిటిషనర్కు అందించాల్సిందిగా పంజాబ్ – హర్యానా హైకోర్ట్ సరిగ్గా ఈ నెల 9వ తేదీనే ఆదేశా లిచ్చింది. అక్టోబర్ నాటి ఎన్నికల్లో అభ్యర్థి కాదు గనక సదరు పిటిషనర్ ఆ పత్రాలు కోరరాదని ఈసీ వాదించింది. హైకోర్ట్ మాత్రం అభ్యర్థికైతే ఉచితంగా, ఇతరులకైతే రుసుముపై పత్రాలివ్వాలన్న పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. కోర్టు ఆదేశాన్ని తప్పక పాటించాల్సిన పరిస్థితి. కానీ, తద్భిన్నంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని సవరించడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తున్నప్పుడే, సామాన్య ఓటర్లకున్న తిరుగులేని సమాచార హక్కును సుప్రీమ్ కోర్ట్ నొక్కి వక్కాణించింది. రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే వ్యక్తుల, సంస్థల వివరాలు తెలుసుకొనే హక్కు ప్రజలకుందని తేల్చి చెప్పింది. వివాదాస్పద బాండ్ల పథకాన్ని సమర్థించిన సర్కారుకు అది ఎదురుదెబ్బ. నిజానికి, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, నిజాయతీలో రాజీకి తావు లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అప్పుడే స్పష్టం చేసినట్టయింది. అయినా సరే, ప్రభుత్వం చెవికెక్కించుకోకుండా ఇప్పుడు ఈసీ సిఫార్సు పేరు చెబుతూ, నిబంధనల సవరణకు దిగడం ప్రజాస్వామ్యవాదులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఓటర్లే స్వయంగా తమ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా సాక్షిగా పంచుకుంటున్న రోజుల్లో సీసీ టీవీ దృశ్యాల పట్ల ఈసీ ఇంత హంగామా ఎందుకు చేస్తోందో అంతుపట్టదు. సీసీ టీవీ ఫుటేజ్ అందుబాటులో ఉంటే కృత్రిమ మేధతో దుర్వినియోగం చేసే ముప్పుందన్న ఈసీ వాదన కొంత నిజమైనా, డిజిటల్ యుగంలో అన్ని వీడియోలపై నిషేధం పెడతామా? సవాలుకు అది పరిష్కారం కాదు కదా!ఎన్నికల సంఘం సారథ్యంలో నిఖర్సుగా సాగాల్సిన ఎన్నికల ప్రక్రియ తాలూకు నైతిక నిష్ఠ శరవేగంగా హరించుకుపోతోందంటూ ప్రతిపక్షాలు అసలే గొంతు చించుకుంటున్న సమయంలో నిబంధనల్లో ఈ కొత్త సవరణలు చేయ డాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎన్నికల రికార్డులనూ, డేటాను ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంచాలన్న జ్ఞానోదయం హఠాత్తుగా పాలకులకూ, ఈసీకీ ఎందుకు కలిగినట్టు? జనం దృష్టి నుంచి ఏం దాచాలని చూస్తున్నారు? ప్రతిపక్షాలనే కాదు... పౌరులనూ వేధిస్తున్న ప్రశ్నలివి. పైగా విస్తృత స్థాయి చర్చ జరగకుండానే చేపట్టిన ఈ తొందరపాటు చర్య ఎన్నికల ప్రక్రియపై మరిన్ని అనుమానాలు పెంచేలా పరిణమిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అది మరింత విషాదం. వాస్తవానికి భిన్న భౌగోళిక పరిస్థితులు, భాషలు, సంస్కృతులు, సమస్యలున్న సువిశాల దేశంలో అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియగా ఇన్నేళ్ళుగా విజయవంతంగా ఎన్నికలను నిర్వహిస్తూ రావడం గొప్పే. అందుకు మన రాజ్యాంగం ఏర్పరచిన సుస్థిర వ్యవస్థనూ, గత దశాబ్దాల్లో ఈసీ పాత్రనూ తప్పక ప్రశంసించాల్సిందే. కానీ ఏ ఎన్నికల ప్రక్రియకైనా పారదర్శకత ప్రాణాధారం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికీ అదే కీలకం. తీరా ఆ పారదర్శకతే ఇప్పుడు రానురానూ తగ్గుతూ పోతుంటే ఏమనాలి? ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంగా గొప్పలు చెప్పుకొనే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నట్టు? అందులోనూ ఆంధ్రప్రదేశ్, హర్యానా సహా అనేక చోట్ల ఎన్నికల్లో ఈవీఎంలపై, వీవీప్యాట్లపై నీలినీడలు కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో... ఈ తరహా కొత్త నిబంధనతో పాలకులు ఏ రకమైన సూచన ఇవ్వదలిచినట్టు? ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసం పాదుకొనాలంటే, ఈ సరికొత్త నిబంధనల మార్పును పునఃపరిశీలించాలి. స్వతంత్రంగా సాగాల్సిన ఈసీ పాలకుల చేతిలో మరబొమ్మగా మారిపోతున్నట్టు విమర్శలు పెల్లుబుకుతున్న సందర్భంలో అది అత్యవసరం. -
దేశం పాడిన గాయకుడు
కిశోర్ కుమార్ మీద సంజయ్ గాంధీ కినుక వహించాడు. ‘ఇరవై సూత్రాల పథకం’ ప్రచారం కోసం దూరదర్శన్ లో మొదలెట్టిన ‘గీతోం భరీ షామ్’లో పాడమని కిశోర్ని సంజయ్ గాంధీ ఆదేశించాడు. డబ్బులు లేకుండా కిశోర్ పాడడు. ఆదేశిస్తే అసలు పాడడు. దాంతో కిశోర్ గొంతుకు రేడియోలో తాళం పడింది. సినిమాల్లో పాడిస్తే ఏం గొడవోనని నిర్మాతలు వెనక్కి తగ్గారు. ‘ఆరాధన’ సూపర్ హిట్ తర్వాత కిశోర్కు వచ్చిన తిప్పలు ఇవి. అప్పుడు కొంతమంది రఫీ దగ్గరకు వచ్చి ‘కిశోర్కు శాస్తి జరిగింది. ఈ కాలాన్ని ఉపయోగించుకోండి’ అన్నారు. రఫీ ఏం మాట్లాడలేదు. ఢిల్లీ వెళ్లి సంజయ్ను కలిశాడు. ‘మీరు కిశోర్ మీద బ్యాన్ ఎత్తేయండి. అందుకు బదులుగా ఒకటి కాదు పది ప్రోగ్రామ్లు చేసిస్తాను’ అన్నాడు. ఆ వెంటనే నౌషాద్ను వెంటబెట్టుకుని దూరదర్శన్లో ప్రోగ్రామ్ ఇచ్చాడు. కిశోర్ బ్యాన్ పోయింది.పత్రికలు కూడా కిలాడీవి. రాజేష్ ఖన్నా స్టార్డమ్తో కిశోర్ గొంతు గిరాకీలోకి రాగానే ‘రఫీ పని అయిపోయింది’ అని రాయడం మొదలెట్టారు. రికార్డింగులు లేక రఫీ గోళ్లు గిల్లుకుంటున్నాడని రాశారు. కిశోర్ తైనాతీలు ఇవన్నీ తెచ్చి కిశోర్కి చూపించారు. కిశోర్ సంతోషించాడా? ప్రెస్మీట్ పెట్టి ‘ఇలాంటి వెధవ రాతలు మానండి. ఆయనంటే నాకు చాలా గౌరవం. మీరు ఎవర్ని గెలిపించి ఎవర్ని ఓడిస్తారు?’ అన్నాడు. ఈ ఇద్దరిని కొంతమంది ఫలానా మతం అనుకుంటారు. ఈ ఇద్దరు మాత్రం ఈ దేశవాసులు. రామ్, రహీమ్ల సన్మతి ఎరిగినవారు.రంజాను మాసంలో రికార్డింగుకు వచ్చి ‘హుక్కే మే ధువా’ (హుక్కా పొగ) అనే పదం చూసి పాడనన్నాడు రఫీ ఉపవాసానికి భంగమని. మతం అంటే అంత నిష్ఠ. సాటి మతం పట్ల? అంతే నిష్ఠ. ‘మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్’.... ‘బైజూ బావరా’లో రఫీ పాడితే కన్నీరు ఆగదు వినేవారికి. ఆ కాలంలో అనేక ఆలయాల్లో ఇది ప్రభాతగీతం. దీనిని పాడింది, రాసింది, స్వరం కట్టింది... రఫీ, షకీల్ బదాయునీ, నౌషాద్. ‘నా గొంతు రొటీన్ అవుతోంది. నాకు భజనలు పాడాలని ఉంది’ అని రఫీ వస్తే ఖయ్యాం ఆ కోరిక మన్నించి భజనలు పాడించి అపురూపమైన రికార్డు విడుదల చేశాడు. ‘రఫీ గొంతులో దేవుడు ఉన్నాడు’ అని అందరూ అనేవారే. ఆ దేవుడు అల్లాయా, ఈశ్వరుడా వెతకడం అల్పుల పని.1950–70ల మధ్య మన దేశ సినీ సంగీతం దాదాపు అన్ని భాషల్లో స్వర్ణయుగం చూసింది. సినిమా – దేశవాసులను కలిపే కొత్త మతం అయ్యింది. కళాకారులు వినోద ఉల్లాసాలకే కాదు సామ రస్య, సౌభ్రాతృత్వాలకు ప్రవక్తలుగా మారారు. దేశ విభజన చేదు నుంచి జనాన్ని బయట పడేయడానికి గుర్తెరిగి బాధ్యతగా నడుచుకున్నవారే అందరూ! ‘తూ హిందు బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్సాన్ కీ ఔలాద్ హై ఔలాద్ బనేగా’... (నువ్వు హిందువువి కావద్దు, ముసల్మానువి కావద్దు, మనిషిగా పుట్టినందున మనిషిగా మిగులు) అని సాహిర్ రాయగా రఫీ పాడి చిరస్మరణీయం చేశాడు. మదన్ మోహన్ ట్యూన్ చేసిన ‘కర్చలే హమ్ ఫిదా’... రఫీ పాడితే నేటికీ సరిహద్దు సైనికులకు తేజోగీతమే. గాంధీజీని బలిగొన్నారన్న వార్త తెలియగానే సంగీత దర్శకులు హన్స్లాల్–భగత్రామ్, గీతకర్త రాజేంద్ర కిషన్ కలిసి ఆయనకు నివాళిగా ‘సునో సునో అయ్ దునియావాలో బాపు కీ ఏ అమర్ కహానీ’ రూపొందిస్తే ఇంకెవరు పాడతారు రఫీ తప్ప! బాపు పాదాల ఎదుట పారిజాతాల కుప్ప గదా ఈ పాట.సరళత్వము, తీయదనము, స్వచ్ఛత... వీటిని ప్రదర్శించడం ద్వారా ముప్పై ఏళ్ల పాటు పాడి కోట్ల మంది అభిమానులను పొందిన అమృత గాయకుడు రఫీ. ‘సుహానీ రాత్ ఢల్ చుకీ, ‘చౌద్వీ కా చాంద్ హో’, ‘బహారో ఫూల్ బర్సావో’, ‘ఓ దునియా కే రఖ్వాలే’, ‘ఖోయా ఖోయా చాంద్’, ‘దీవానా హువా బాదల్’, ‘క్యా హువా తేరా వాదా’... ఈ పాటలకు అంతూ పొంతూ ఉందా? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు... ఏ ప్రాంతమో ఏ భాషో... అందరూ రఫీ అభిమానులు. రోజువారీ పనిలో, కాయకష్టంలో, సేద తీరే వేళ, వేడుకల్లో రఫీ.. రఫీ... రఫీ! కూతురిని అత్తారింటికి సాగనంపేటప్పుడు ప్రతి తండ్రి తలుచుకుని ఉద్వేగాశ్రువులు రాల్చే పాట ‘బాబుల్ కి దువాయే లేతీ జా’... షంషాద్ బేగం, గీతాదత్, లతా, ఆశా... అందరూ రఫీకి జోడీలే. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, అమితాబ్... అందరూ అభినయకర్తలే. రఫీ పాడటంతో సగం నటన. మిగిలిన సగమే వీరు చేయాల్సి వచ్చేది.55 ఏళ్లకు మరణించాడు రఫీ. రేపటి డిసెంబర్ 24కు శత జయంతి. అయినా ఇన్నాళ్లకూ కాసింత కూడా మరపునకురాని సుర గాయకుడు. పాటనూ, ప్రేమనూ పంచి అందరి చేత ‘రఫీ సాబ్’ అనిపించుకున్నవాడు. ఆయన మృతదేహం ఆస్పత్రిలో ఉంటే ‘భూపిందర్ సింగ్ – రఫీ తమ్ముడు’ అని సంతకం పెట్టి ఇంటికి చేర్చిన గాయకుడు భూపిందర్ది ఏ మతం? చనిపోయిన అన్న రఫీది ఏ మతం? ఆ రోజు ఆకాశం నుంచి ఆగని వర్షం. ఇసుక వేస్తే రాలని జనం. గాంధీ గారు మరణించినప్పుడు ఇంత జనం వచ్చారట. రఫీ శత జయంతి ముగియనున్న ఈ వేళ అందరం వెలికి తీయవలసింది, జాగృత పరచవలసినది ఆయన పంచిన ఈ ప్రేమనే, ప్రేమమయ గీతాలనే! విద్వేష గీతాన్ని ఎవరు ఆలపించాలనుకున్నా కావలించుకుని వినిపిద్దాం రఫీ గీతం – జిందాబాద్ జిందాబాద్ అయ్ మొహబ్బత్ జిందాబాద్. జీతే రహో రఫీ సాబ్! అభీనా జావో ఛోడ్కర్ కె దిల్ అభీ భరా నహీ... -
ఇదేనా అంబేడ్కర్ వారసత్వం!
అనుకున్నట్టే పార్లమెంటు శీతాకాల సమావేశాలు పరస్పర వాగ్యుద్ధాలతో మొదలై ఘర్షణలతో ముగిశాయి. పార్లమెంటు ముఖద్వారం వద్ద అధికార, విపక్ష సభ్యులు ఒకరినొకరు తోసుకోవటం, ఒకరిద్దరు గాయడటం, పోలీసు కేసుల వరకూ పోవటం వంటి పరిణామాలు అందరికీ దిగ్భ్రాంతి కలిగించాయి. తమ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముకేశ్ రాజ్పుత్లు గాయపడ్డారని బీజేపీ అంటున్నది. కాదు... వారే తమను పార్లమెంటులోకి వెళ్లకుండా అడ్డగించారని, ఆ తోపులాటలో కిందపడ్డారని కాంగ్రెస్ చెబుతున్నది. వారు అడ్డగించటం వల్ల తమ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా గాయపడ్డారని, ముగ్గురు బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీపై భౌతికదాడికి పాల్పడ్డారని వివరి స్తున్నది. రెండు వర్గాలూ అటు స్పీకర్కూ, ఇటు పోలీసులకూ ఫిర్యాదులు చేసుకున్నాయి. నాగా లాండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ సభ్యురాలు కోన్యాక్ తనతో రాహుల్ గాంధీ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ విషయంలో రాహుల్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నదంటున్నారు. అసెంబ్లీ సమావేశాలప్పుడు ఏదో వివాదం రేకెత్తి ఒకరిపైకొకరు లంఘించటం, ఘర్షణపడటం, కుర్చీలు విసురుకోవటం, దుర్భాషలాడుకోవటం రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కానీ ఇదేమిటి... దేశమంతటికీ ప్రాతినిధ్యం వహించే అత్యున్నత చట్టసభ ఇంత చట్టుబండలు కావటం ముందూ మునుపూ విన్నామా? సమావేశాల ప్రారంభంలోనే అదానీ వ్యవహారంపై విపక్షాలు పెద్ద రగడ సృష్టించాయి. ఆయనపై అమెరికాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అరెస్టు చేస్తారని వచ్చిన వార్తలు నిజం కావని ప్రముఖ న్యాయవాదులు చెప్పాక అది సద్దుమణిగింది. వివాదాలు ఉండొచ్చు... విధానాల విషయంలో విభేదాలుండొచ్చు. కానీ చట్టసభ అనేది అధి కార, విపక్షాలు ప్రజలకు గరిష్టంగా మేలు చేయటానికి గల అవకాశాలను అన్వేషించే వేదిక. తమ నిర్ణయాల పర్యవసానం గుర్తెరగకుండా పాలకపక్షం ప్రవర్తిస్తున్నప్పుడు విపక్షాలు నిరసన గళం వినిపిస్తాయి. అందువల్ల పాలకపక్షం తనను తాను సరిదిద్దుకునే ఆస్కారం కూడా ఉంటుంది. అది లేనప్పుడు కాస్త ఆలస్యం కావొచ్చుగానీ... అధికార పక్షానికి ప్రజలే కళ్లు తెరిపిస్తారు. ఇందిరాగాంధీ ఏలుబడిలో ఎమర్జెన్సీ విధించినప్పుడేమైంది? ఆ తర్వాత వచ్చిన జనతాపార్టీ ప్రభుత్వం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా రద్దుచేసినప్పుడు భంగపాటు తప్పలేదు. ఏకంగా 400 మంది సభ్యుల బలం ఉన్న రాజీవ్గాంధీ ఏకపక్షంగా వ్యవహరించినప్పుడు కూడా ఆయనకు చేదు అను భవాలే ఎదురయ్యాయి. 2020లో వచ్చిన సాగుచట్టాలు కూడా ఎన్డీయే సర్కారు ఉపసంహరించు కోక తప్పలేదు. ఏ విషయంలోనైనా తక్షణమే అమీతుమీ తేల్చుకోవాలనుకునే మనస్తత్వం వల్ల ఉన్న సమస్య కాస్తా మరింత జటిలమవుతున్నది. ఇటీవలి కాలంలో చట్టసభలు బలప్రదర్శన వేదికలవు తున్నాయి. సమస్య ఎదురైనప్పుడు దాని ఆధారంగా అవతలి పక్షం అంతరంగాన్ని బయటపెట్టి ప్రజలు గ్రహించేలా చేయటం అనే మార్గాన్ని వదిలి బాహాబాహీ తలపడటం అనేది దుష్ట సంప్రదాయం. అందువల్ల చట్టసభ అంటే సాధారణ పౌరుల్లో చులకన భావం ఏర్పడటం తప్ప సాధించే దేమీ ఉండదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను ఎవరు అవమానించారు... ఎవరు నెత్తిన పెట్టుకున్నారన్న విషయమై ఏర్పడిన వివాదం కాస్తా ముదిరి పరస్పరం క్రిమినల్ కేసులు పెట్టుకోవటం వరకూ పోవటం విచారకరం. బీజేపీ ఎంపీలు అప్పటికే బైఠాయించిన ప్రధాన ద్వారంవైపునుంచే పార్లమెంటులోకి ప్రవేశించాలని కాంగ్రెస్ అనుకోవటం వల్ల బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి వేరే ద్వారంనుంచి వెళ్లమని భద్రతా సిబ్బంది చేసిన సూచనను రాహుల్ గాంధీ బేఖాతరు చేశారని, పైగా ఇతర సభ్యులను రెచ్చగొట్టారని బీజేపీ ఫిర్యాదు సారాంశం. దేశంలో ఏదో ఒకమూల నిత్యమూ సాగిపోతున్న విషాద ఉదంతాలు గమనిస్తే డాక్టర్ అంబే డ్కర్ నిజమైన వారసులెవరన్న అంశంలో భౌతికంగా తలపడిన రెండు పక్షాలూ సిగ్గుపడాల్సి వస్తుంది. ఒకపక్క పార్లమెంటులో ఈ తమాషా నడుస్తుండగానే తన పెళ్లికి ముచ్చటపడి గుర్రంపై ఊరేగుతున్న ఒక దళిత యువకుడిపై ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో ఆధిపత్య కులాలవారు దాడిచేసి కొట్టారన్న వార్త వెలువడింది. ఇది ఏదో యాదృచ్ఛికంగా కులోన్మాదులు చేసిన చర్య కాదు. దశాబ్దాలుగా ఇలాంటి ఘోరాలు సాగుతూనే ఉన్నాయి. తాము ఉపయోగించే బావిలో లేదా చెరువులో దప్పిక తీర్చుకున్నారన్న ఆగ్రహంతో దళితులపై దాడులు చేసే సంస్కృతి ఇంకా పోలేదు. చాలాచోట్ల రెండు గ్లాసుల విధానం ఇంకా సజీవంగా ఉంది. మన రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చర్చిస్తుండగానే... డాక్టర్ అంబేడ్కర్ వారసత్వం గురించి పార్టీలు పోటీపడుతుండగానే వాస్తవ స్థితిగతులు ఇలా ఉన్నాయి.సైద్ధాంతిక విభేదాలను ఆ స్థాయిలో మాట్లాడుకుంటే, ఆరోగ్యకరమైన చర్చల ద్వారా అన్ని విషయాలనూ ప్రజలకు తేటతెల్లం చేస్తే మెరుగైన ఫలితం వస్తుంది. నిజానిజాలేమిటో అందరూ గ్రహిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ తన జీవితకాలమంతా రాజీలేని పోరాటం చేశారు. మెజారిటీ ప్రజానీకం ప్రయోజనాలను దెబ్బతీసే భావాలనూ, చర్యలనూ అడుగడుగునా తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు నిర్వహించారు. అంతేతప్ప అవతలిపక్షంపై హింసకు దిగలేదు. ఆయన వారసత్వం తమదేనంటున్నవారు వాస్తవానికి తమ చర్యల ద్వారా ఆ మహనీయుడి స్మృతికీ, ముఖ్యంగా ఆయన నాయకత్వంలో రూపొందిన రాజ్యాంగానికీ అపచారం చేస్తున్నామని గుర్తిస్తే మంచిది. -
కుదుపు రేపే నిర్ణయం
భారత క్రికెట్ రంగంలో బుధవారం ఉరుము లేని పిడుగు పడింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు అయిదు టెస్ట్లు ఆడుతుండగా సిరీస్ మధ్యలోనే అగ్రశ్రేణి భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ ప్రకటించడం అనేకమందిని ఆశ్చర్యపరిచింది. ఆస్ట్రేలియాలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్లోని మూడో టెస్ట్తో పాటు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ సైతం ముగిసింది. సంచలనం రేపిన ఈ వార్త పలు అనుమానాలు, ఊహాగానాలకు కూడా తెర తీసింది. తాజాగా పెర్త్, బ్రిస్బేన్ మ్యాచ్లలో తుది జట్టులో స్థానం దక్కకపోవడంతో అశ్విన్ స్వచ్ఛందంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించారు. ‘సిరీస్లో ఇప్పుడు నా అవసరం లేనట్టయితే, ఆటకు గుడ్బై చెప్పేస్తాను’ అంటూ రిటైర్మెంట్కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ఆయన తేల్చిచెప్పేశారు. ‘ఆడే సత్తా నాలో ఇంకా మిగిలే ఉంది. బహుశా, (ఐపీఎల్ లాంటి) క్లబ్–స్థాయి క్రికెట్లో దాన్ని చూపుతాను. భారత జట్టు తరఫున ఆడడం మాత్రం ఇదే ఆఖరి రోజు’ అన్న అశ్విన్ ప్రకటన క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని విషయమే. మొత్తం 106 టెస్టుల్లో 537 వికెట్లు సాధించిన అశ్విన్ అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత క్రికెటర్. 132 మ్యాచ్లలో 619 వికెట్లు సాధించిన నిన్నటి తరం అగ్రశ్రేణి స్పిన్నర్ అనిల్ కుంబ్లే తరువాత అలా ద్వితీయ స్థానంలో నిలిచారు అశ్విన్. బంతితోనే కాదు... బ్యాట్తోనూ అరడజను శతకాలు, 14 అర్ధ శతకాలతో 3,503 పరుగులు సాధించిన ఘనత ఆయనది. ఇంకా చెప్పాలంటే, గత 14 ఏళ్ళ పైచిలుకు కాలంలో స్వదేశంలో భారత జట్టు తిరుగులేని శక్తిగా ఎదగడం వెనుక ఈ తమిళ తంబి కీలక పాత్రధారి. ఈ ఏడాది బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆయన ఏకంగా 11వ సారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికై, ప్రపంచ రికార్డును సమం చేశారు. బరిలో ఓర్పు, బంతి విసరడంలో నేర్పు, ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో నైపుణ్యం ఉన్న తెలివైన ఆటగాడాయన.అందుకే, ఆటలో ఈ అగ్రశ్రేణి ఆఫ్ స్పిన్నర్ చూపే ప్రతిభకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ప్రస్తుత భారత జట్టు బౌలర్లలో ప్రత్యేకంగా నిలిచారు. ఏ క్రికెటరైనా విదేశాల్లో కాకుండా సొంతగడ్డపై ఆటకు స్వస్తి పలకాలనుకుంటారు. అది సర్వసాధారణం. ఎందుకంటే, స్వదేశంలో సొంత క్రీడాభిమానుల జయజయ ధ్వానాల మధ్య ఘనంగా వీడ్కోలు పలకవచ్చని భావిస్తారు. కానీ, అశ్విన్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. దానికి కారణాలు లేకపోలేదు. ఆడే సత్తా ఉన్న ఏ క్రీడాకారుడైనా బరిలో ఉండాలనుకుంటాడే తప్ప, అవకాశం కోసం నిరీక్షిస్తూ బెంచ్ మీద కూర్చొనే జాబితాలో చేరాలనుకోడు. అది ఎవరికైనా బాధాకరమే. అలాంటిది... టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆరు టెస్ట్ సెంచరీలు, 500కు పైగా వికెట్లు తీసుకొన్న ఏకైక క్రికెటర్కు తరచూ అలాంటి అనుభవం ఎదురైతే? అది మరింత బాధ కలిగిస్తుంది. 38 ఏళ్ళ వయస్సులో, కెరీర్లో కాలం కరిగిపోతున్న వేళ... అశ్విన్కు అది అవమానమూ అనిపించింది. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా సిరీస్లో మధ్యలో ఆయన హఠాత్తుగా తన రిటైర్మెంట్ ప్రకటించారనుకోవాలి. సరిగ్గా పదేళ్ళ క్రితం 2014 డిసెంబర్లో మరో అగ్రశ్రేణి భారత క్రికెటర్ ధోనీ సైతం ఇలాగే ఆటకు అల్విదా చెప్పారు. ఈ వాస్తవ పరిణామాలన్నీ గమనిస్తూ, క్షేత్రస్థాయి అంశాలను గమనంలోకి తీసుకున్న వారికి మాత్రం అశ్విన్ నిర్ణయం మరీ దిగ్భ్రాంతికరంగా తోచదు. అదే సమయంలో జీవితంలో, ఆటలో అత్యంత కఠినమైన ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కూడా విమర్శల జోలికి పోకుండా, పక్కా జెంటిల్మన్గానే వ్యవహరిస్తూ అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం చెప్పుకోదగ్గ విషయం. ఆస్ట్రేలియా సిరీస్లోని తొలి మూడు టెస్టుల్లో అడిలైడ్లోని రెండో టెస్ట్లో మాత్రమే అశ్విన్కు జట్టులో స్థానం దక్కింది. ప్రతిభావంతుడైన పాతికేళ్ళ వాషింగ్టన్ సుందర్ అంతకంతకూ ముందు కొస్తూ, అశ్విన్ను పక్కకు జరిపి జట్టులో చోటు సంపాదించుకుంటూ పోతున్నారు. ఫలితంగా అశ్విన్ హుందాగానే పక్కకు తప్పుకున్నారు. వికెట్లు పడగొట్టడంలో పేరున్న ఈ స్పిన్నర్ నిర్ణయం ‘వ్యక్తిగతం’ అని రోహిత్ శర్మ చెప్పారు కానీ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం విలేఖరుల ప్రశ్నలు వద్దని అశ్విన్ సున్నితంగానే తప్పుకోవడంతో కంటికి కనిపించని కథలున్నాయనే వాదనకు బలం చేకూరింది. అయితే, అశ్విన్ ఆది నుంచి జట్టు సమష్టి ప్రయోజనాలకై ఆడినవారే. అనేక సందర్భాల్లో సెలెక్టర్ల బంతాటలో వైట్ బాల్ గేమ్స్లో స్థానం దక్కించుకోకున్నా, పట్టుదలతో ఆడుతూ తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ కనీసం మరో రెండేళ్ళ పాటు అంతర్జాతీయ స్థాయిలో ఆడగల సత్తా ఆయనకుంది. అయినా పక్కకు తప్పుకున్నారు. గతంలో ధోనీ ఆస్ట్రేలియాతోనే మెల్ బోర్న్ టెస్ట్లో హుందాగా టెస్ట్ క్రికెట్ నుంచి పక్కకు తప్పుకొని, యువకులకు దోవ ఇచ్చారు. కార ణాలేమైనా, అశ్విన్ ప్రస్తుతానికి పెదవి విప్పి పెద్దగా చెప్పకుండానే పదవీ విరమణ ప్రకటించారు. పేరు ప్రతిష్ఠలు, డబ్బు అన్నీ కెరీర్లో భాగమైన ఆటగాళ్ళు వాటన్నిటినీ వదులుకొని, రిటైరవుతున్నట్టు చెప్పడం నిజానికి ఎప్పుడూ కష్టమే. అశ్విన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. కాకుంటే, పైకి గంభీరంగా కనిపిస్తూ భావోద్వేగాల్ని ప్రదర్శించకపోవడం విశేషం. అశ్విన్ వ్యక్తిగతం మాటెలా ఉన్నా, ఆయన నిష్క్రమణతో భారత క్రికెట్ ఇప్పుడో చిత్రమైన సంధి దశలో నిలిచింది. బహుశా, ఈ ప్రతిభావంతుడి తాజా నిర్ణయంతో ఒకప్పటి ఫామ్ కోల్పోయి, తడబడుతున్న రోహిత్ శర్మ, కోహ్లీలు సైతం ఆత్మపరిశీలనలో పడాల్సి రావచ్చు. ఎంతైనా ఆర్ట్ ఆఫ్ ‘లీవింగ్’ కూడా ఆర్ట్ ఆఫ్ ‘లివింగ్’లో భాగమే కదా! వెరసి, అశ్విన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం అన్వేషణతో పాటు ఆయన నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులపై చర్చ చాలాకాలం కొనసాగడం ఖాయం. -
మైత్రీబంధంలో శుభ పరిణామం
ఇది కొంత ఊహించని పరిణామమే కావచ్చు. కానీ కొత్త ఆశలు చిగురింపజేసిన సంఘటన.శ్రీలంక నూతన అధ్యక్షుడు అరుణ కుమార దిసనాయకె తన తొలి విదేశీ పర్యటనకు భారతదేశాన్ని ఎంచుకోవడం, ఢిల్లీ రావడం ఇరుదేశాల మధ్య సత్సంబంధాలకు సానుకూల సూచన. శ్రీలంకలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ కూటమిలో ప్రధాన భాగస్వామి, సైద్ధాంతికంగా మార్క్సిస్టు భావజాలం వైపు మొగ్గుచూపే రాజకీయ పక్షమైన జనతా విముక్తి పెరుమున (జేవీపీ), దానికి సారథిగా దిసనాయకె చైనా పక్షం వహిస్తారని భావించారు. పైగా రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులు సహా అనేక అంశాలలో ఆధారపడ్డ కొలంబోపై బీజింగ్ ప్రభావమూ తక్కువేమీ కాదు. మరోపక్క, 1980లలో ద్వీపదేశంలో తమిళ వేర్పాటువాదులతో శ్రీలంక అంతర్యుద్ధ వేళ సైన్యాన్ని పంపడం ద్వారా భారత జోక్యం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, జేవీపీ ఆది నుంచి భారత వ్యతిరేక వైఖరితో వ్యవహరించేది. పైపెచ్చు కొంత కాలంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాబల్యం కోసం చైనా దూకుడుగా సాగుతూ, మనకు గుబులు పుట్టిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక భూభాగాన్ని వినియోగించుకొనేందుకు అనుమతించేది లేదంటూ భారత పర్యటనలో శ్రీలంక అధ్యక్షుడు ఇచ్చిన హామీ మండువేసవిలో పన్నీటిజల్లు లాంటిది. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలు, పరస్పర విశ్వాసం, పారదర్శకతతో క్రమం తప్పకుండా జరపా ల్సిన చర్చలను ఉభయ దేశాల సంయుక్త ప్రకటన ప్రతిఫలించడం విశేషం.ద్వీపదేశాధ్యక్షుడికీ, భారత ప్రధాని మోదీకీ మధ్య భేటీ ఉత్సాహజనకంగా సాగడం చెప్పు కోదగ్గ అంశం. భారత విదేశీ విధానానికి దీన్ని ఓ విజయ సూచనగానూ భావించవచ్చు. రాజపక్స లాంటి శ్రీలంక నేతలు భారత్ను అనుమానిస్తూ, ఉద్దేశపూర్వకంగానే చైనా గాఢపరిష్వంగంలోకి చేరిన సందర్భంలో... నూతన అధ్యక్షుడు తన తొలి పర్యటనకు చైనాను కాక భారత్ను ఎంచు కోవడం మళ్ళీ పల్లవిస్తున్న స్నేహరాగం అనుకోవచ్చు. వెరసి, చైనాకు స్వల్పంగా దూరం జరిగి, మళ్ళీ భారత్తో చిరకాల బంధాలను పునరుద్ధరించుకోవడానికి శ్రీలంక ముందుకు రావడం మారు తున్న ఆలోచనా సరళికి సంకేతం. నిజానికి, కరోనా అనంతర కాలంలో ఆర్థికవ్యవస్థ కుప్ప కూలి పోయి, చేదు అనుభవాలు ఎదురుకావడంతో కొలంబో మార్పు వైపు చూసింది. దానికి తోడు అక్కడ మునుపటి వంశపారంపర్య, కుటుంబపాలిత రాజకీయ పార్టీల స్థానంలో కొత్త రాజకీయ నాయకత్వ ఆవిర్భావం మరింత తోడ్పడింది. అలాగే, ఇరుగుపొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్య మంటూ భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం లంకేయుల్ని ఆకట్టుకుంది. 2022లో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయినప్పుడు 500 కోట్ల డాలర్ల పైచిలుకు మేర భారత్ సాయంమరువరానిది. ఇవన్నీ కొలంబో ఆలోచనలో మార్పుకు దోహదం చేశాయి. హంబన్తోట నౌకాశ్రయాన్ని 99 ఏళ్ళ లీజు మీద చైనాకు కట్టబెట్టడం సహా అనేక తప్పులు శ్రీలంకను వెంటాడాయి. అప్పటి రాజపక్సే సర్కారు వైఖరితో దేశం అప్పుల కుప్పయింది. అలాగే, నిన్నటి దాకా చైనా నౌకలు తమ గూఢచర్య యాత్రలు సాగిస్తూ, నడుమ శ్రీలంక నౌకాశ్రయాల్లో నిష్పూచీగా లంగరు వేసేవి. కానీ, ఇప్పుడు దిసనాయకె తాజా ఆశ్వాసనతో పరిస్థితి మారింది. చైనా నౌకలకు అది ఇక మునుపటిలా సులభమేమీ కాదు. ఇంతమాత్రానికే శ్రీలంకపై చైనా పట్టు సడలిందనుకోలేం. ఢిల్లీ, కొలంబోల మధ్య పాత కథలకు తెరపడి, కొత్త అధ్యాయం మొదలైందనుకో వచ్చు. లంకకు నిధుల అందజేతలో చైనాతో పోటీ పడలేకున్నా, రక్షణ సహా అనేక అంశాల్లో భారత – శ్రీలంకల మధ్య ఒప్పందాలు కలిసొస్తాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సౌరశక్తి – పవన విద్యుత్ శక్తి, డిజిటల్ కనెక్టివిటీ లాంటివి ఉపకరిస్తాయి. అలాగే, అభివృద్ధి చెందని దేశాలతో దౌత్య పరంగా ముందుకు సాగేందుకు... భారత్ కొంతకాలంగా రుణసాయం నమూనా నుంచి పెట్టుబ డుల ఆధారిత భాగస్వామ్యాల వైపు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదీ కలిసొస్తోంది. అన్ని అంశాలకూ తాజా భేటీ ఒక్కటే సర్వరోగ నివారణి కాకున్నా, చేపల వేటకై శ్రీలంక జలాల్లోకి ప్రవేశిస్తున్న భారతీయ మత్స్యకారులకు ఆ దేశ నౌకాదళం నుంచి ఎదురవుతున్న ఇక్కట్లు, శ్రీలంకలోని తమిళుల ఆకాంక్షల లాంటివి కూడా తాజా భేటీలో ప్రస్తావనకు రావడం సుగుణం. అలాగే, భారత భద్రత, ప్రాంతీయ సుస్థిరత కీలకమని కూడా లంక గుర్తించిందనుకోవాలి. మొత్తం మీద, దిసనాయకె తాజా పర్యటన చిరకాల భారత – శ్రీలంక మైత్రీబంధానికి ప్రతీకగా నిలిచింది. అనేక సంవత్సరాల ఆర్థిక, రాజకీయ సంక్షోభం తర్వాత ద్వీపదేశం పునర్నిర్మాణ బాటలో సాగుతూ, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవడంపై శ్రద్ధ పెట్టడం సంతోషకరమే కాక శ్రేయోదాయకం. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కొలంబో పర్యటన జరిపి, ఆ దేశ ఆర్థిక పునరుజ్జీవానికి మనం కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేయడం లాంటివి ఉపకరించాయి. ఫలప్రదమైన చర్చలకు బలమైన పునాది వేశాయి. సమీప సముద్రయాన పొరుగు దేశంగా వాణిజ్యం నుంచి ప్రాంతీయ భద్రతా పరిరక్షణ వరకు అనేక అంశాల్లో వ్యూహాత్మకంగా భారత్కు శ్రీలంక కీలకం. అదే సమయంలో విదేశాంగ విధానంలో దిసనాయకె ఆచరణాత్మకదృక్పథమూ అందివచ్చింది. మొత్తం మీద ఆయన తాజా పర్యటన, భారత – శ్రీలంకల మధ్యసంబంధాలు కొంత మెరుగవడం ఇరుపక్షాలకూ మేలు చేసేవే. పరస్పర ప్రయోజనాలను అది కాపాడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలకూ కావాల్సింది అదే! -
‘జమిలి’కి వేళయిందా?!
మొత్తానికి బీజేపీ చిరకాల వాంఛ నెరవేరటంలో తొలి అడుగుపడింది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు ముసాయిదా బిల్లులు మంగళవారం లోక్సభలో ప్రవేశించాయి. అందరూ అనుకున్నట్టే ఈ బిల్లులకు విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వచ్చినంత వేగంగా రెండు బిల్లులూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు వెళ్లబోతున్నాయి. తరచు జరిగే ఎన్నికల వల్ల పాలనా నిర్వహణలో అస్థిరత నెలకొంటున్నదని, కీలకమైన ప్రాజెక్టుల సాకారంలో అంతులేని జాప్యం చోటుచేసుకుంటున్నదని, ఎన్నికలకు తడిసి మోపెడు వ్యయం అవుతున్నదని ప్రభుత్వ పెద్దలు చాన్నాళ్లుగా వాదిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై స్పష్టత వుంటే పాలన కుంటు పడదని, అధికార యంత్రాంగంపైనా, ఖజానాపైనా భారం తగ్గుతుందని, వోటింగ్ శాతం పెరుగు తుందని వారి వాదన. ఈ విషయమై కేంద్రం మాజీ రాష్ట్రపతి రావ్ునాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన బృందం సైతం పాలకుల వాదనకు అనుకూలంగా సిఫార్సులు చేసింది. జమిలి ఎన్నికల వల్ల సుస్థిరత ఏర్పడి పెట్టుబడులు పెరుగుతాయని, ఆర్థికాభివృద్ధికి వీలవుతుందని, వనరుల కేటాయింపు సమర్థంగా చేయొచ్చని వివరించింది. మతపరమైన ఉద్రిక్తతలు తగ్గి భద్రతా బలగాల వినియోగం పెద్దగా ఉండబోదన్నది ఆ బృందం అభిప్రాయం. జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని 83, 172, 324 అధికరణాలను సవరించాల్సి వుంటుంది. అందుకోసమే ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. వోటర్ల జాబితాకు సంబంధించి రాజ్యాంగంలోని 325 అధికరణను సవరించే మరో బిల్లు అవసరమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆధ్వర్యంలో లోపరహితమైన జాబితా రూపొంది లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. అంటే జమిలి కేవలం ఈ రెండు సభలకు సంబంధించిందే. ఈ ఎన్నికలు పూర్తయిన వందరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయి.మొత్తానికి ఎన్నికల జాతర అయిదేళ్లకోసారి మాత్రమే ఉంటుంది. మధ్యలో ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం కుప్పకూలి అసెంబ్లీ ఎన్నికలు తప్పనిసరైతే వాటిని జరుపుతారట. కానీ ఆ కొత్త ప్రభుత్వాల ఆయుష్షు ఆ మిగి లిన సంవత్సరాలకు మాత్రమే పరిమితమవుతుందట. అంటే అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వం మూడేళ్లకే పతనమైతే... కొత్తగా ఎన్నికలై వచ్చే పాలకులకు కేవలం రెండేళ్లు మాత్రమే పదవీయోగం దక్కుతుందన్నమాట! సారాంశంలో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ఆదర్శం కాస్తా అట కెక్కినట్టే అవుతుంది. మరి ఈ బిల్లులు సాధించదల్చుకున్నదేమిటి? ఈ బిల్లులు గట్టెక్కటం అంత సులభమేమీ కాదు. ఏ రాజ్యాంగ సవరణ బిల్లుకైనా మూడింట రెండువంతుల మెజారిటీ తప్పనిసరి. ఆ రకంగా చూస్తే 543 మంది సభ్యులున్న సభలో ఈ బిల్లు లకు మద్దతుగా కనీసం 362 మంది వోటేయాలి. కానీ ఎన్డీయే బలం 293. అంటే మరో 69 మంది మద్దతు అవసరమవుతుంది. రాజ్యసభ వరకూ చూస్తే 163 మంది బిల్లులకు అనుకూలంగా వోటే యాలి. కానీ ఎన్డీయే బలం 121. ఆ తర్వాత రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా తప్పనిసరి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చట్టాలు మార్చాలంటే కనీసం సగం అసెంబ్లీలు అందుకు అంగీ కరించాలి. కోవింద్ కమిటీ ముందు 47 రాజకీయ పక్షాలు తమ అభిప్రాయాలు వినిపించాయి. 32 పార్టీలు అనుకూలం కాగా, 15 పార్టీలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’కు వ్యతిరేకమని తేలింది. ప్రజాస్వామ్యమంటే కేవలం అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికలు మాత్రమే కాదన్న సంగతి పాలకులు మరిచిపోయి చాన్నాళ్లయింది. ఎన్నికల్లో చెప్పేది ఒకటైతే, గెలిచాక చేసేది మరొకటి.కేంద్రంలో మాత్రమే కాదు... ఏపీలోని ఎన్డీయే పాలన చూసినా ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. ఏపీలో నదురూ బెదురూ లేకుండా ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ ఎగనామం పెట్టారు. ఇక ఎక్కడ ఎన్ని కలు జరిగినా ఈవీఎంలపై అనుమానాలు మొదలవుతున్నాయి. ఏపీలో ఎన్నికలు పూర్తయినవెంటనే ఈసీ ప్రకటించిన ఓట్లకు లెక్కించినప్పుడు అదనంగా మరో పన్నెండున్నర శాతం ఓట్లు వచ్చిచేరాయి. దేశంలో అత్యధిక నియోజకవర్గాల్లో సగటున వెయ్యి ఓట్లు ఇలా అదనంగా చేరినట్టు బయటపడింది. దీనిపై సంజాయిషీ ఇవ్వాలన్న కనీస సంస్కారం ఈసీకి లేకపోగా... ఈవీఎంలలో పోలైన ఓట్లనూ, వీవీ ప్యాట్ స్లిప్లనూ సరిపోల్చాలన్న వినతుల్ని బుట్టదాఖలా చేసింది. పైగా అతి తెలివి ప్రదర్శించి డమ్మీ పోలింగ్ నిర్వహణకు దిగింది! ఏపీకి సంబంధించినంతవరకూ అయితే గడువుకు ముందే వీవీ ప్యాట్ స్లిప్లను ధ్వంసం చేశారు. ఈవీఎంల డేటా తొలగించారు. ఈ వైపరీ త్యాలపై తామేం చేయాలన్న స్పృహ, వివేకం కేంద్ర పాలకులకు లేకపోగా... ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ లోనే దేశ భవిష్యత్తు సర్వం ఆధారపడి వున్నట్టు భూమ్యాకాశాలు ఏకం చేస్తున్నారు.పైగా ఈ మాదిరి ఎన్నికలు ప్రాంతీయ ఆకాంక్షలనూ, అవసరాలనూ పాతరపెడతాయన్న ఆరోపణలకు సరైన జవాబు లేదు. ఈ విధానం దేశ ఫెడరల్ స్వభావాన్ని దెబ్బతీస్తుందన్న విమ ర్శను బేఖాతరు చేస్తున్నారు. అసలు 140 కోట్ల జనాభా... 30 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతా లున్న దేశాన్నీ... లెక్కకు మిక్కిలివున్న పార్టీలనూ ‘జమిలి’ చట్రంలో బిగించి ఒక్క వోటుకి కుదించాలన్న ప్రతిపాదనే వింతై నది. దానిపై బిల్లులు పెట్టేముందు విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయం సాధించాలన్న కనీస ఇంగితజ్ఞానం కొరవడితే ఎలా? అగ్రరాజ్యమైన అమెరికాలోనే నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుపుతూ, రాష్ట్రాల సెనేట్లకూ, స్థానిక సంస్థలకూ, ప్రతినిధుల సభకూ నిర్ణీత కాలంలో విడివిడిగా ఎన్నికలు నిర్వహిస్తుండగా దాదాపు 97 కోట్లమంది వోటర్లున్న ఈ అతి పెద్ద దేశంలో జమిలికి తహతహలాడటంలోని మర్మమేమిటి? -
చర్చ జరగాలి కానీ, ఇలాగా..?
పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఈ సోమవారంతో ఆఖరి వారం వ్యవధిలోకి ప్రవేశించాయి. దేశంలో చలి పెరుగుతుంటే, సభలో వాతావరణం మాత్రం వేగంగా వేడెక్కుతోంది. మొన్న నవంబర్ 26న 75 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం చూస్తే ఆ భావనే కలుగుతుంది. లోక్సభలో గత శుక్ర, శనివారాలు రాజ్యాంగ చర్చ జరిగితే, ఈ సోమ, మంగళవారాలు రాజ్యసభలో అది కొనసాగుతోంది. ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ బిల్లుకు కావాల్సిన రాజ్యాంగ సవరణ మాట అటుంచితే, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కాక గాంధీల కుటుంబ శ్రేయానికై కాంగ్రెస్ నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని సవరిస్తూ పోయిందని ఆర్థిక మంత్రి ఆరోపించడం తాజాగా అగ్గి రాజేసింది. అనేక జటిల సమస్యలకు రాజ్యాంగ సవరణలే ఏకైక పరిష్కారం అంటూ నెహ్రూకు సాక్షాత్తూ సర్దార్ పటేలే లేఖ రాశారంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టాల్సి వచ్చింది. వెరసి, భారత గణతంత్రానికి ఆత్మ లాంటి రాజ్యాంగంపై చర్చ పక్కదోవ పట్టి, పార్టీలు బురదజల్లుకొనే ప్రక్రియగా మారిపోయింది. నిజానికి, స్వాతంత్య్రానంతరం భారతదేశ భవితవ్యమెలా ఉంటుందన్న దానిపై బోలెడన్ని అనుమానాలు, జోస్యాలు వెలువడినా, మన రాజ్యాంగం పటాపంచలు చేసింది. నిజానికి, నవ యువ గణతంత్ర రాజ్యంగా మనం అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ తట్టుకొని నిలవడంలోనూ విజయవంతమయ్యాం. భారత రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచి, దేశానికి మూలస్తంభంగా నిలిచింది. ఇవాళ అనేక దేశాల్లో, చివరకు సోకాల్డ్ ప్రజాస్వామ్యాల్లోనూ అధికార బదలాయింపులో పలు సమస్యలను ఎదుర్కొంటున్నా, భారత్లో మాత్రం ప్రజాభీష్టాన్ని ప్రతిఫలించే అధికార బదలీ శాంతియుతంగా సాగిపోవడం మన రాజ్యాంగం వేసిన పటిష్ఠమైన పునాదికీ, చూపిన ఆచరణాత్మకమైన మార్గానికీ తార్కాణం. ఈ ఏడున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో వేర్వేరు రాజకీయ పార్టీలు, కూటములు దేశాన్ని పాలించాయి. 1975లో ఎమర్జెన్సీ విధింపు లాంటి అశనిపాతాలు అడపాదడపా ఎదురైనా, ప్రభుత్వాలన్నీ దేశాన్ని ముందుకే నడిపాయి. క్రియాశీలక సజీవపత్రంగా రాజ్యాంగ రూపకర్తలు సంభావించిన భారత రాజ్యాంగం అంతర్గత సంకల్పబలం, స్థితిస్థాపక చైతన్యంతో నవ భారత అవసరాలకు తగ్గట్టుగా మార్పులతో నిత్య నూతనంగా నిలుస్తూ వచ్చింది. దానికి తగ్గట్టే రాజ్యాంగాన్ని ఇప్పటికి శతాధిక పర్యాయాలు సవరించడం జరిగింది. దేశ సామాజిక, ఆర్థిక ప్రయోజనాలకు తగ్గట్టు దేశం ముందుకు పోయేందుకు అనేక ఏళ్ళుగా భారత రాజ్యాంగం వీలు కల్పిస్తూనే వచ్చింది. అనేక పార్ష్వాలున్న ఈ రాజ్యాంగ ప్రస్థానాన్ని పార్లమెంట్లో చర్చిస్తున్నారంటే, భవిష్యత్తుపై దృష్టి సారిస్తారని భావించాం. రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాలు, లక్ష్యాలు సాకారమయ్యేందుకు పథ నిర్దేశం జరుగుతుందని ఆశించాం. భారత స్వాతంత్య్ర శతవర్ష సమారోహం సాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై మేధా మథనం జరపాలని ఆకాంక్షించాం. ఆ దిశలో సామాన్యుల జీవితాలు మెరుగయ్యేలా లక్షించాల్సింది పోయి విమర్శల పర్వానికే చర్చ పరిమితమైపోవడం శోచనీయం. నిజానికి, ఎవరూ విమర్శలకు అతీతులు కారు. గాంధీ, నెహ్రూలైనా అంతే. వారిని విమర్శించ దలుచుకుంటే నేరుగా విమర్శించవచ్చు. అంతేకానీ, రాజ్యాంగంపై చర్చ పేరిట పరోక్షంగా కొంద రిపై బురద జల్లడం ఏమిటన్నది ఒక వాదన. తాజా చర్చ సందర్భంలో అధికార ఎన్డీఏ వర్గీయులు ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలను తప్పుబడుతున్నారని కూడా ఆరోపణ. అయితే, అసలు భావప్రకటనా స్వేచ్ఛపై సహేతుకమైన పరిమితులు పెట్టవచ్చంటూ తొలి రాజ్యాంగ సవరణ తెచ్చింది కాంగ్రెసే అని బీజేపీ ఎత్తిచూపుతోంది. స్వేచ్ఛ ఉండాలి నిజమే కానీ, అన్ని సమయాల్లోనూ అది నిర్నిబంధమైతే కష్టం గనక సహేతుకమైన పరిమితులు విధించవచ్చని అలా ప్రథమ సవరణతో రాజ్యాంగ రూపకర్తలే దిద్దుబాటు బాట పట్టారన్నది కాంగ్రెస్ వర్గీయుల ప్రతివాదన. రాజ్యాంగ అమలుకు అమృతోత్సవ వేళ చర్చ దాని అమలు తీరుతెన్నులు, భవిష్యత్ సవాళ్ళపైనే సాగాల్సింది. సామూహిక ఆత్మపరిశీలనకు దీన్ని అవకాశంగా మలుచుకోవాల్సింది. కానీ, జరుగుతున్నది వేరు. చర్చంతా రాజకీయ రంగు పులుముకొని, నెహ్రూ కుటుంబం, ఎమర్జెన్సీ, మోదీ సర్కార్ చుట్టూ సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవిశ్వాస తీర్మానంపై చర్చ ఫక్కీలోకి జారిపోయింది.1975 ఎమర్జెన్సీలోనైనా, ఇప్పుడు ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఉందంటున్నా... రెండు సందర్భాల్లో పాలకుల చేతిలో నలిగిపోయింది రాజ్యాంగానికి గుండె లాంటి పౌరుల ప్రాథమిక హక్కులే అని విస్మరించరాదు. ఏళ్ళు గడుస్తున్నకొద్దీ సవాళ్ళు అధికరిస్తున్నాయి. లౌకికవాదం, సమాఖ్య వాదం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, దుర్విచక్షణ లేకపోవడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ లాంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలపైనే ప్రశ్నార్థకాలు పొడసూపుతున్నాయి. సమాన అవకాశాల మాట దేవుడెరుగు, ఆర్థికంగా– సామాజికంగా– లింగపరంగా సమానత్వం సైతం నేటికీ పూజ్యం. అంత రాలు పెరుగుతున్న సమాజంలో అసమానతల నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామా? అన్ని పక్షాలూ ఆత్మావలోకనం చేసుకోవాలి. రాజకీయ పత్రం, దేశ రాజకీయాలకు పునాది అయినప్పటికీ, రాజ్యాంగమనేది అదే సమయంలో రాజకీయాలకు అతీతమైనది. దానిపై చర్చలో ప్రధాని సహా అందరూ సంకుచిత రాజకీయాలకే చోటిస్తే ఇంకేమనాలి? ఈ ధోరణి మారాలి. రాజ్యాంగం ఇన్నేళ్ళుగా జాతికి దిక్సూచిగా నిలిచింది. ప్రభుతకూ, పౌరులకూ ప్రజాస్వామ్య ఫర్మానాగా వెలిగింది. ఆ ఉజ్జ్వల స్ఫూర్తికి కట్టుబడడమే సమస్త సమస్యలకూ పరిష్కారం. సామాన్యుల హక్కులకు శ్రీరామరక్ష. -
మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ జదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల జదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుకుకు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతకకర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తల మీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతిరోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దారులు మూస్తున్నట్టే!ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం– రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి. -
అర్జునా... ఫల్గుణా... పార్థా... కిరీటీ!
పిడుగులు పడే సమయంలో మన పూర్వీకులు అర్జునుడి పేరును తలుచుకునేవారు. ఆయనకున్న పది పేర్లనూ గటగటా చదివేస్తే ఆ పిడుగుల్ని అర్జునుడు ఆకాశంలోనే బంధిస్తాడని ఓ నమ్మకం. ప్రకృతి కురిపించే పిడుగుల భయం పోగొట్టడానికి ప్రజలకు ఈ అర్జున నామస్మరణ ఉపకరించింది. మరి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే పిడుగులు కురిపిస్తే... ఎవరి నామ స్మరణ చేయాలి? నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ జంటలోని నరుడే అర్జునుడు. కనుక ఇప్పుడు కూడా నరుడే మనకు దిక్కు! పిడుగులు కురిపించే ప్రభుత్వాలను ఎదిరించే శక్తి ప్రజలకే ఉన్నది.తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రభుత్వాలు కూడా జనం మీద వరసగా పిడుగుల్ని కురిపిస్తున్నాయనే అభిప్రాయం బలపడుతున్నది. రెండింటి మధ్య కొంచెం తేడా ఉన్నది. తెలంగాణలోని రేవంత్ సర్కార్ సర్జికల్ స్ట్రయిక్స్ తరహాను ఆశ్రయిస్తుంటే, ఏపీలో ఉన్న బాబు సర్కార్ కార్పెట్ బాంబింగ్ నమూనాను ఎంచుకున్నది. నిన్నటి తాజా ఉదంతాలు ఈ తరహా ఆపరేషన్కు గట్టి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చేమో! జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించిన మన తెలుగు నటుడు అల్లు అర్జున్ను అరెస్టు చేయడం టార్గెటెడ్ సర్జికల్ స్ట్రయిక్గానే చాలామంది భావిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న ‘స్వర్ణాంధ్ర–2047’ పేరుతో ఓ విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించారు.కార్పెట్ బాంబింగ్పాతికేళ్ల కింద చంద్రబాబు ప్రకటించిన ‘విజన్–2020’కి కొనసాగింపే ‘స్వర్ణాంధ్ర–2047’. అంతేకాకుండా గతేడాది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ‘వికసిత భారత్– 2047’ పత్రానికి అనుబంధ పత్రంగా ఇది తయారైంది. ప్రపంచ బ్యాంకు ప్రవచించే అభివృద్ధి నమూనాకు నకళ్లు కావడమే ఈ పత్రాలన్నింటిలో ఉన్న ఉమ్మడి లక్షణం. ఈ నమూనా ఫలితంగా సాధించిన ఆర్థికాభివృద్ధి సమాజంలో అసమానతలను కనీవినీ ఎరుగనంత స్థాయిలో పెంచిందనేది ఒక వాస్తవం! ఆర్థికవృద్ధి లెక్కల్లో కనిపించింది. బహుళ అంతస్థుల భవంతుల్లో కనిపించింది. పెరుగుతున్న విమానయానాల్లో కనిపించింది. అదే సంద ర్భంలో చితికిపోతున్న బతుకుల్లో కూడా కనిపించింది. వేలాది మంది రైతులూ, చేతివృత్తిదారుల బలవన్మరణాలకు సాక్షి సంత కాలు పెట్టిన ఉరితాళ్లలో కూడా కనిపించింది.భారతీయ వ్యవసాయ రంగాన్ని, చేతివృత్తులను దారుణంగా దెబ్బతీసిన బ్రిటిష్ హయాంతో పోల్చినా కూడా ‘విజన్–2020’ తొలి ఐదారు సంవత్సరాల్లో ఈ రంగాల్లో ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి. మెజారిటీ ప్రజల ఆదాయా లను పెంచే చర్యలు తీసుకోకుండా వస్తు, సేవల లభ్యతను పెంచడాన్ని ప్రోత్సహించే ఆర్ఢిక విధానాలను అనుసరించడమే ఈ నియో లిబరల్ – ప్రపంచ బ్యాంకు ఆర్థిక మోడల్. దీన్నే ‘సప్లై సైడ్ ఆఫ్ ఎకనామిక్స్’ అంటారు. దీని కారణంగా గడచిన మూడు దశాబ్దాల్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగి పోయాయి. ఈ రకమైన ఆర్థిక ధోరణి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందని ఈమధ్యనే కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వ యిజర్ అనంత నాగేశ్వరన్ హెచ్చరించారు. నిఫ్టీలో లిస్టయ్యే టాప్ 500 కంపెనీల ఆదాయం గత పదిహేనేళ్లుగా పెరుగుతూనే ఉన్నది. కానీ ఆ సంస్థలు సిబ్బందిపైన చేసే ఖర్చు మాత్రం తగ్గిపోతున్నది. ఈ ధోరణి వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గి పోతుందనీ, ఫలితంగా పారిశ్రామికవేత్తలు కూడా నష్టపోవలసి వస్తుందనీ ఆయన చెప్పారు. ఈ ఆర్థిక మోడల్ పరిధిలోనే కొద్దిపాటి సర్దుబాటు చేసుకోవాలని పెట్టుబడిదారులకు ఆయన హితవు చెబుతున్నారు. ఇది ఎంతమంది చెవికెక్కుతుందో చూడాలి. జగన్మోహన్రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమ యంలో డీబీటీ ద్వారా జనం చేతిలో డబ్బు పెట్టడం సత్ఫలి తాలనిచ్చింది. కోవిడ్ వంటి క్లిష్ట సమయంలో దేశమంతటా జీఎస్టీ వసూళ్లు తగ్గిపోగా ఏపీలో పెరుగుదల నమోదైంది. ఈ రకంగా డిమాండ్ సైడ్ను సిద్ధం చేయకుండా ప్రపంచ బ్యాంకు నమూనాను గుడ్డిగా అనుసరిస్తే కొద్దిమంది సంపద పోగేసుకుంటారే తప్ప ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం తథ్యం.చంద్రబాబు కొత్తగా ప్రకటించిన ‘స్వర్ణాంధ్ర–2047’ పత్రంలో కూడా విశాల ప్రజానీకపు కొనుగోలు శక్తిని పెంచే కార్యక్రమం ఒకటి కూడా లేదు. వట్టి పడికట్టు పదజాలం మాత్రమే ఉన్నది. ‘సూపర్ సిక్స్’ మేనిఫెస్టో కంటే మిన్నగా అరచేతిలో వైకుంఠాన్ని చంద్రబాబు సర్కార్ ఈ పత్రం ద్వారా చూపెట్టింది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రాసుకున్నారు. ఇది సువిశాలమైన బ్రెజిల్ దేశ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ. రెండు మెగా పోర్టులను నిర్మిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికే జగన్మోహన్రెడ్డి నాలుగు పోర్టుల నిర్మాణం ప్రారంభించారని మాత్రం చెప్పలేదు. ఏఐ, డీప్ టెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తామనే ఊకదంపుడు సరేసరి! రైతుల ఆదాయాలు పెంచుతూ, ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని కూడా చెప్పారు. పనిలో పనిగా అప్పటికి నూరు శాతం అక్షరాస్యతను సాధిస్తామని కూడా చెప్పారు. ఈ నాలుగైదేళ్లలో నూరు శాతం అక్షరాస్యతను సాధించి, 2047 నాటికి నూరు శాతం డిజిటల్ లిటరసీని సాధిస్తే తప్ప ఈ డాక్యు మెంట్లోని గొప్పలు సాధ్యం కావు.పేదవర్గాల ప్రజలు నూటికి నూరు శాతం డిజిటల్ లిటరసీ సాధించగల విద్యావిధానానికి తాను వ్యతిరేకం కనుకనే అక్షరాస్యత రంగంలో తాబేలు నడకను ఎంచుకుని, మిగతా అంశాల్లో ఆకాశానికి నిచ్చెనలు వేశారనుకోవాలి. దేశంలో అత్యధిక ప్రజానీకం ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగం, చిన్న, సూక్ష్మ పరిశ్రమల్లోని వారిలో కొనుగోలు శక్తి పెరగకుండా వీరు చెప్పుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఎలా సాధ్యమవుతుంది? జగన్ ప్రభుత్వం అమలుచేసిన ‘రైతు భరోసా’ను ఎగరగొట్టారు. ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. కనీస మద్దతు ధర గురించి ఊసే లేదు. ఇవేమీ లేకుండా రైతుల ఆదాయాలు ఏ రకంగా పెరగగలవో వివరించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. టెక్నా లజీని విరివిగా వినియోగించడం వలన ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ వైరుధ్ధ్యాన్ని ఎలా అధిగమించగలమన్న వివరణ జోలికి పోలేదు.‘నేను ’95 మోడల్ చంద్రబాబున’ని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించుకున్నారు. అంటే ప్రపంచ బ్యాంకు పోస్టర్ బాయ్ మోడల్! పారిశ్రామికవేత్తలకూ, పెట్టుబడిదారులకూ వనరులన్నీ కట్టబెట్టాలి. ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలి. సామాన్య ప్రజలకు మాత్రం ఉచితంగా ఏదీ ఇవ్వకూడదు. సబ్సిడీలు ఇవ్వకూడదు. ఇది ప్రపంచ బ్యాంకు విధానం. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) అనే మూడు సూత్రాలు దీని వేద మంత్రాలు. ప్రజల్లో చైతన్యం పెరుగు తున్నకొద్దీ సామాజిక పెన్షన్ల లాంటి ఒకటి రెండు విషయాల్లో కొద్దిగా మినహాయింపులు ఇచ్చారు. చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఏ ఒక్కదాన్నీ అమలుచేయకపోవడానికి కారణం ఆర్థిక పరిమితులు కాదు. ఆయన అవలంబించే ఆర్థిక సిద్ధాంతం అసలు కారణం. తెచ్చే అప్పులు అమరావతి కోసం, అంత ర్జాతీయ కాంట్రాక్టర్ల కోసం, అందులో కమిషన్ల కోసం ఖర్చు పెడతారే తప్ప సామాన్య ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ఖర్చుపెట్టరు. ‘స్వర్ణాంధ్ర–2047’ పేద ప్రజలపై జరగబోయే కార్పెట్ బాంబింగ్ లాంటిది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల వాతలతో ప్రారంభమైంది. ఇకముందు అన్ని రంగాలకూ విస్తరించ నున్నది.రేవంత్ సర్కార్ సర్జికల్ స్ట్రయిక్స్!ఏడాది కింద తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద జనం భారీగానే ఆశలు పెట్టుకున్నారు. హామీ ఇచ్చిన రైతు రుణమాఫీలో మూడింట రెండొంతుల మేరకు పూర్తి చేయగలిగారు. ఇంకా ఒక వంతు మిగిలే ఉన్నది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. ఇక మిగిలిన గ్యారెంటీలన్నీ గ్యారెంటీగా అటకెక్కినట్టే! పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లయితేనేమీ, కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్లయితేనేమి 50 వేల వరకు ఉద్యోగాలను భర్తీ చేసినట్టు ప్రకటించారు. అయినప్పటికీ ఏడాది పూర్తయ్యేసరికి కేసీఆర్ ప్రభుత్వమే మేలన్న అభిప్రాయం జనంలో ఏర్పడుతున్నదనే వార్తలు వస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలుండవచ్చు. ప్రధాన కారణాల్లో ఒకటి ఎంపిక చేసుకున్న టార్గెట్లపై చేస్తున్న సర్జికల్ స్ట్రయిక్స్. ఇది కాకతాళీయమో, వ్యూహాత్మకమో తెలియదు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతున్నది.నిన్నటి అల్లు అర్జున్ అరెస్ట్ సంగతే చూద్దాం. సంధ్య టాకీస్ దగ్గర జరిగిన దుర్ఘటనపై బాధపడని వారుండరు. ఖండించని వారుండరు. ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉన్నదో నిర్ధారణకు రాకుండానే ఎకాయెకిన అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం, అదీ బెయిల్ దొరక్కుండా వారాంతంలో చేయడం, బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఒక్క రాత్రయినా సరే జైల్లో ఉంచాలన్న పంతం ఈ మొత్తం వ్యవహారంలో కనిపించింది. అనేక సందర్భాల్లో సెలబ్రిటీలు అనేవాళ్లు తప్పుచేసి దొరికి పోవడం జరిగింది. అటువంటి వాళ్లు కూడా జైలుకెళ్లిన సంద ర్భాలు తక్కువ. అల్లు అర్జున్ పాత్ర ఈ వ్యవహారంలో ఉన్నద నేందుకు తగిన కారణాలు కూడా కనిపించడం లేదు. ఉన్నా నిర్ధారణ కాలేదు. ఎందుకని అంతగా టార్గెట్ చేశారో తెలియదు. ఈ ఘటన వల్ల అల్లు అర్జున్కు సానుభూతి మాత్రం పెరిగింది.చట్టం తన పని తాను చేసుకొని పోవాల్సిందే! సెలబ్రిటీలు అయినంతమాత్రాన నేరం చేసిన వారికి మినహాయింపులు ఉండకూడదు. అట్లాగే సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారు టార్గెట్ కాకూడదు. చట్టం తన పనిని తాను ఎటువంటి వివక్ష లేకుండా చేసుకొనిపోవాలి. అసలెందుకు తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ టార్గెట్ కావలసి వచ్చింది. అందుకు బయ టకు కనబడే కారణాలైతే ఏవీ కనిపించడం లేదు. ఉంటేగింటే ఏపీ ప్రభుత్వానికి ఓ ఆవగింజంత కారణం ఉండాలి. ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడైన రవిచంద్ర కిశోర్రెడ్డికి మద్దతుగా అర్జున్ నంద్యాలకు వెళ్లారు. ప్రచారం చేయలేదు గానీ, ఆ సమయంలో వెళ్లడం, ఆ మిత్రుడు వైసీపీ అభ్యర్థి కావడం వల్ల కూటమి పార్టీలకు కంటగింపు కలిగించి ఉండ వచ్చు.ఆ ప్రభుత్వం కళ్లల్లో ఆనందం చూడటానికి వీళ్లు, ఈ ప్రభుత్వం కళ్లల్లో ఆనందం చూడటానికి వాళ్లు పనిచేసేంత సాపత్యం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నదా? లేకపోయినా అటువంటి ఊహాగానాలు చేయడానికి అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం అవకాశం కల్పించింది. అక్రమ నిర్మాణాలు కూల్చే పేరుతో ‘హైడ్రా’ను రంగంలోకి దించడం ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారింది. ఆ కూల్చివేతల్లో కూడా అక్కినేని నాగార్జున వంటి కొందరిని టార్గెట్ చేయడం, మిగతా వాళ్లను వది లేయడం ప్రశ్నార్థకంగా మారింది. ‘హైడ్రా’ భయంతో హైద రాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నగదు చలామణీ మందగించడం వలన ఇతర వ్యాపార రంగాలపై, చుట్టుపక్కల జిల్లాలపై దాని ప్రభావం పడింది. అవసరాలకు భూము లమ్ముకుందామనుకున్న రైతులు కొనే నాధుడు కనిపించక అవస్థలు పడుతున్నారు. అక్రమ నిర్మాణాల తాట తీయవలసిందే! ఇకముందు జరగకుండా గట్టి హెచ్చరికలు పంపవలసిందే! కానీ, ఈ మంచి కార్యక్రమాన్ని దుందుడుకుగా ప్రారంభించడం, కొందరినే టార్గెట్ చేయడం వ్యవస్థలో దుష్ఫలితాలకూ, ప్రభుత్వంపై నెగెటివ్ ఇమేజ్కూ కారణమైంది. ఇటు వంటి సర్జికల్ స్ట్రయిక్స్ను ఏడాది కాలంలో ఒక డజన్ దాకా ఉదాహరించవచ్చు. ఈ ధోరణి వదులుకొని, చేసిన పనులు చెప్పుకునే పాజిటివ్ మార్గంలో వెళ్తేనే ప్రభుత్వానికీ, ప్రజలకూ క్షేమకరం!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జాతికి గర్వకారణం
పది, పన్నెండేళ్ళుగా కంటున్న కలను నెరవేరిన తరుణం ఇది. చిన్నప్పుడు ఆడడం మొదలుపెడు తూనే మనసులో నాటిన లక్ష్యాన్ని సాధించిన చేరుకున్న దిగ్విజయ క్షణాలివి. అత్యంత పిన్నవయ స్కుడైన ప్రపంచ చదరంగ ఛాంపియన్గా నిలవడంతో పద్ధెనిమిదేళ్ళ దొమ్మరాజు గుకేశ్కు చిర కాలపు స్వప్నం సాకారమైంది. చరిత్రలో నిన్నటి వరకు గుకేశ్ కేవలం పిన్నవయస్కుడైన మూడో గ్రాండ్ మాస్టర్. కానీ, సింగపూర్లో జరుగుతున్న ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో గురువారం సాయంకాలపు విజయంతో ఈ టీనేజ్ కుర్రాడు చదరంగ చరిత్రలో కొత్త అధ్యాయం రచించాడు. సుదీర్ఘ కాలం తరువాత మనవాడు ఒకడు ఇలా భారత ఘనవారసత్వ సంప్రదాయ ప్రాచీనక్రీడ చదరంగంలో జగజ్జేతగా నిలిచి, జాతికి గర్వకారణమయ్యాడు.చైనాకు చెందిన ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్పై చిరస్మరణీయ విజయంతో, అంచనాల్ని అధిగమించి, కాస్పరోవ్, మ్యాగ్నస్ కార్ల్సెన్ సరసన తన పేరు లిఖించాడు. గతంలో కాస్పరోవ్ పేరిట ఉన్న అత్యంత పిన్నవయస్కుడైన ప్రపంచ ఛాంపియన్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇది ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే క్షణం. మన చదరంగ క్రీడాలోకంలోనే కాదు... క్రీడాకారులందరిలోనూ ఉత్సాహం ఉరకలెత్తించే సందర్భం. నిజానికి, ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో కొన్నిసార్లు గుకేశ్ తడబడకపోలేదు. మొత్తం 14 గేమ్ల ఈ ఛాంపియన్షిప్లో గుకేశ్ ప్రస్థానం అతని పట్టుదల, వ్యూహచతురతకు నిదర్శనం. మొదట్లో తడబడి, ఓపెనింగ్ రౌండ్లో ఓటమి పాలయ్యాడు. కానీ, కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో విజృంభించాడు. విమర్శలను విజయసోపానాలుగా మలుచుకున్నాడు. పట్టువదలని విక్రమార్కు డిలా ఆటలో పైచేయి సాధించాడు. మొదటి నుంచి గుకేశ్ బృందం వేసుకున్న వ్యూహం ఒకటే. గుకేశ్ తన లాగా తాను ఆడాలి. అంతే! పక్కా ప్రణాళికతో ఈ యువ ఆటగాడు, అతని క్రీడాశిక్షకుడు, మిగతా బృందం పడ్డ శ్రమ ఫలించింది. కొన్నిసార్లు ఆట ఆరంభపుటెత్తులను ఆఖరి నిమిషంలో నిర్ణయిస్తే, మరికొన్నిసార్లు వాటి మీద వారాల తరబడి కసరత్తు చేస్తూ వచ్చారు. ఆ సాధన ఉపకరించింది. డింగ్తో ప్రతి గేమ్లోనూ తన ఓపెనింగ్స్ ద్వారా ప్రత్యర్థిని గుకేశ్ ఆశ్చర్యపరిచాడు. 14 గేమ్ల మ్యాచ్లో 13 గేమ్లు ముగిసినా, చెరి రెండు విజయాలతో టై నెలకొంది. ఆ పరిస్థితుల్లో గురువారం నాటి 14వ గేమ్ ఒక దశలో డ్రా దిశగా వెళుతున్నట్టు అనిపించినా, ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్ అనూహ్యంగా దిద్దుకోలేని తప్పు చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకొని, గుకేశ్ తన ప్రత్యర్థి ఆట కట్టించాడు. 2.5 మిలియన్ డాలర్ల బహుమతి నిధిలో సింహభాగాన్నిసంపాదించాడు. గతంలో ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన విశ్వనాథన్ ఆనందన్ తర్వాత మళ్ళీ ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడు అయ్యాడు.ఎప్పుడూ గంభీరంగా కనిపించే ఈ చెన్నై చిన్నోడు ఈ విజయంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టిన క్షణాలు, బయటకు వస్తూనే తండ్రిని గాఢంగా హత్తుకొని మాటల కందని భావా లను మనసుతో పంచుకున్న దృశ్యాలు ఇప్పుడిప్పుడే ఎవరికీ మరపునకు రావు. గుకేశ్ ఇప్పుడు చద రంగ ప్రపంచానికి సరికొత్త రారాజు. లెక్కల్లో చూస్తే, ప్రపంచ చదరంగానికి 18వ చక్రవర్తి. చదరంగంలో గుకేశ్ ప్రస్థానం ఇప్పుడొక పూర్తి ఆవృత్తం పూర్తి చేసుకుందనుకోవచ్చు. 2013లో 7 ఏళ్ళ గుకేశ్ చెన్నైలో ప్రేక్షకుల మధ్య కూర్చొని, విశ్వనాథన్ ఆనంద్కూ, మ్యాగ్నస్ కార్ల్సెన్కూ మధ్య జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూశాడు. ఆ మ్యాచ్లో గెలిచిన కార్ల్సెన్ అప్పటి నుంచి గత ఏడాది వరకు ప్రపంచ ఛాంపియన్గా పట్టు కొనసాగించారు. నిరుడు డింగ్ ఆ పట్టం గెలిచారు. చిన్న నాటి నుంచి అలా సౌండ్ప్రూఫ్ గ్లాస్ బూత్లో కూర్చొని, ఆటలో గెలవాలని కలలు గన్న గుకేశ్ ఎట్టకే లకు ఆ స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు. అయితే, ఇంత త్వరగా తన ఆకాంక్ష నెరవేరుతుందని అతనూ ఊహించలేదు. కార్ల్సెన్ నంబర్ 1 ర్యాంకులో ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ తాను ప్రపంచ అత్యుత్తమ ఆటగాణ్ణి కాదని వినయం ప్రదర్శిస్తున్నాడు. ఏదో ఒక రోజున కార్ల్సెన్లా చెస్ ప్రపంచాన్ని ఏలాలని తమిళనాట పెరిగిన ఈ తెలుగు మూలాల టీనేజ్ కుర్రాడు ఆశిస్తున్నాడు. గతంలో 22 ఏళ్ళ వయసుకే గ్యారీ కాస్పరోవ్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్ సాధించారు. అప్పట్లో ఆయన అనటోలీ కార్పోవ్ను ఓడించి, ఆ టైటిల్ సాధించి, అతి పిన్నవయస్కుడిగా రికార్డు సృష్టించారు. కేవలం పన్నెండేళ్ళ ఏడు నెలల వయసుకే గ్రాండ్ మాస్టరైన గుకేశ్ ఇప్పుడు 18వ ఏట ఆ ఘనత సాధించడం ఎలా చూసినా విశేషమే. గుకేశ్ బాటలోనే మన దేశ కీర్తిపతాకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగల సత్తా ఉన్న ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇటీవల బుడాపెస్ట్లో జరిగిన ఒలింపియాడ్లో ఓపెన్ గోల్డ్, ఉమెన్స్ గోల్డ్... రెంటినీ భారత చదరంగ జట్లు విజయవంతంగా గెలిచాయి. ప్రస్తుతం దాదాపు 85 మందికి పైగా గ్రాండ్ మాస్టర్లు భారత్లో ఉన్నారనేది ఆశ్చర్యపరిచే గణాంకం. పైగా, వారిలో చాలామంది ఇప్పటికీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రానంతటి పిన్న వయస్కులు. అంటే ఈ విశ్వక్రీడలో భారత్కు ఎంతటి బంగారు భవిష్యత్తు ఉందో అర్థం చేసుకోవచ్చు. రాగల రోజుల్లో ప్రజ్ఞానంద లాంటి పలువురు ప్రపంచ ఛాంపియన్లుగా ఎదగగల సత్తా పుష్కలంగా ఉన్నవారు. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ శిష్యరికంలో ఈ స్థాయికి ఎదిగిన గుకేశ్ ఇప్పుడు అలాంటి ఎందరికో సరికొత్త ప్రేరణ. సుదీర్ఘ క్రీడా జీవితం ముందున్న ఈ టీనేజర్ భవిష్యత్ ప్రయాణంలో ఈ కొత్త ప్రపంచ కిరీటం ఓ మైలురాయి మాత్రమే. రానున్న రోజుల్లో ఇలాంటివి అనేకం కైవసం చేసుకొని, మరింత మంది గుకేశ్ల రూపకల్పనకు ఈ కుర్రాడు స్ఫూర్తి కిరణంగా భాసించడం ఖాయం. -
‘వేధింపుల’ చట్టానికి కళ్లెం?
మానసిక ఒత్తిళ్లకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాన్ కెస్లర్ చాన్నాళ్ల క్రితం ఒక అధ్యయనం సందర్భంగా తేల్చారు. మహిళలు ఆ ఒత్తిళ్ల పర్యవసానంగా విషాదంలో మునిగితే మగవాళ్లూ, పిల్లలూ ఆగ్రహావేశాలకు లోనవుతారని చెప్పారు. ఒత్తిళ్లకు స్పందించే విషయంలో పిల్లలూ, మగవాళ్లూ ఒకటేనని ఆమె నిశ్చితాభిప్రాయం. ఈ ధోరణికామె ‘ఇరిటబుల్ మేల్ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. అయితే ప్రతి ఒక్కరూ ఇలాగే ఉంటారని చెప్పలేం. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ తన భార్యతో వచ్చిన తగాదాకు సంబంధించిన కేసుల్లో తనకూ, తన తల్లిదండ్రులకూ ఎదురైన చేదు అనుభవాలను ఏకరువు పెడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దానికి ముందు విడుదల చేసిన 90 నిమిషాల వీడియో, 24 పేజీల లేఖ ఇప్పుడు న్యాయవ్యవస్థలో సైతం చర్చనీయాంశమయ్యాయి. తనపైనా, తనవాళ్లపైనా పెట్టిన 8 తప్పుడు కేసుల్లో, వాటి వెంబడి మొదలైన వేధింపుల్లో యూపీలోని ఒక ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఉన్నారన్నది ఆ రెండింటి సారాంశం.బలహీనులకు జరిగే అన్యాయాలను నివారించటానికీ, వారిని కాపాడటానికీ కొన్ని ప్రత్యేక చట్టాలూ, చర్యలూ అవసరమవుతాయి. అలాంటి చట్టాలు దుర్వినియోగమైతే అది సమాజ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే ఆ వంకన అసలైన బాధితులకు సకాలంలో న్యాయం దక్కదు సరికదా... బలవంతులకు ఆయుధంగా మారే ప్రమాదం ఉంటుంది. మహిళలపై గృహ హింస క్రమేపీ పెరుగుతున్న వైనాన్ని గమనించి 1983లో భారతీయ శిక్షాస్మృతిలో సెక్షన్ 498ఏ చేర్చారు. అనంతర కాలంలో 2005లో గృహహింస చట్టం వచ్చింది. 498ఏ సెక్షన్ గత ఏడాది తీసు కొచ్చిన భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్)లో సెక్షన్ 84గా ఉంది. అయితే అటుతర్వాత కుటుంబాల్లో మహిళలపై హింస ఆగిందా? లేదనే చెప్పాలి. సమాజంలో కొనసాగే ధోరణులకు స్పందన గానే ఏ చట్టాలైనా వస్తాయి. ఎన్నో ఉదంతాలు చోటుచేసుకున్నాక, మరెన్నో ఉద్యమాలు జరిగాక, నలుమూలల నుంచీ ఒత్తిళ్లు పెరిగాక మాత్రమే ఎంతో ఆలస్యంగా ఇలాంటి చట్టాలు వస్తాయి. బల హీనులకు ఉపయోగపడే అటువంటి చట్టాల్ని దుర్వినియోగం చేసే వారుండటం నిజంగా బాధాకరమే.జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం 498ఏ వంటి చట్టాలు ఈమధ్యకాలంలో దుర్వినియోగమవుతున్న ఉదంతాలు పెరగటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత కక్షతో అత్తింటివారిపైనా, భర్తపైనా తప్పుడు కేసులు పెట్టే తీరువల్ల వివాహ వ్యవస్థ నాశన మవుతున్నదని వ్యాఖ్యానించింది. ఇప్పుడే కాదు... 2014లో కూడా సుప్రీంకోర్టు ఒక సంద ర్భంలో ఇలాంటి వ్యాఖ్యానమే చేసింది. ‘భర్తలపై అలిగే భార్యలకు సెక్షన్ 498ఏ రక్షణ కవచంగా కాక ఆయుధంగా ఉపయోగపడుతోంద’ని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇకపై శిక్షాస్మృతిలోని సెక్షన్ 41కి అనుగుణంగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కూడా సూచించింది. నిజమే... ఎలాంటి చట్టాలైనా నిజమైన బాధితులకు ఉపయోగపడినట్టే, అమాయకులను ఇరికించడానికి కూడా దోహదపడుతాయి. చట్టాన్ని వినియోగించేవారిలో, అమలు చేసేవారిలో చిత్తశుద్ధి కొరవడితే జరిగేది ఇదే. ఆ తీర్పు తర్వాత గత పదేళ్లుగా వేధింపుల కేసులు నత్తనడక నడుస్తున్నాయి. అందులో నిజమైన కేసులున్నట్టే అబద్ధపు కేసులు కూడా ఉండొచ్చు. మనది పితృస్వామిక సమాజం కావటంవల్ల పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయి కుటుంబ బాధ్యతలు మీద పడేవరకూ ఏ దశలోనూ ఆడవాళ్లపై హింస మటుమాయమైందని చెప్పలేం. వాస్తవానికి ఇందులో చాలా రకాల హింసను మన చట్టాలు అసలు హింసగానే పరిగణించవు. ఆర్థిక స్తోమత, సమాజంలో హోదా వంటివి కూడా మహిళలను ఈ హింస నుంచి కాపాడలేకపోతున్నాయన్నది వాస్తవం. ఒకనాటి ప్రముఖ నటి జీనత్ అమన్, భారత్లో మొట్టమొదటి లేడీ ఫిట్నెస్ ట్రైనర్గా గుర్తింపు సాధించిన నవాజ్ మోదీలు ఇందుకు ఉదాహరణ. వీరిద్దరూ తమ భర్తల నుంచి తీవ్రమైన గృహహింసను ఎదుర్కొన్నారు. జీనత్కు కంటి కండరాలు దెబ్బతిని కనుగుడ్డు బయటకు రాగా, దాన్ని య«థాస్థితిలో ఉంచటానికి గత నలభైయేళ్లలో ఎన్ని సర్జరీలు చేయించుకున్నా ఫలితం రాలేదు. నూతన శస్త్ర చికిత్స విధానాలు అందుబాటులోకొచ్చి నిరుడు ఆమెకు విముక్తి దొరికింది. ఒకప్పుడు కట్టుబాట్లకు జడిసి, నలుగురిలో చులకనవుతామన్న భయంతో ఉండే మహిళలు ఉన్నత చదువుల వల్లా, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం రావటం వల్లా మారారు. వరకట్న వేధింపులు, ఇతర రకాల హింసపై కేసులు పెడుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అదే సమయంలో కొందరు దుర్వినియోగం చేస్తున్న మాట కూడా వాస్తవం కావొచ్చు. అలాంటివారిని గుర్తించటానికీ, వారి ఆట కట్టించటానికీ దర్యాప్తు చేసే పోలీసు అధికారుల్లో చిత్తశుద్ధి అవసరం. ఈ విషయంలో న్యాయస్థానాల బాధ్యత కూడా ఉంటుంది. లోటుపాట్లు తప్పనిసరిగా సరిచేయాల్సిందే. కానీ ఆ వంకన అలాంటి కేసుల దర్యాప్తులో జాప్యం చోటు చేసు కోకుండా ఇతరేతర మార్గాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఏటా ప్రతి లక్షమంది మహిళల్లో దాదాపు ముగ్గురు వరకట్న హింసకు ప్రాణాలు కోల్పోతున్నారని నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం. వరకట్న నిషేధ చట్టం వచ్చి 63 ఏళ్లవుతున్నా ఇదే స్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుత చట్టాలను నీరగార్చకుండానే ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఆలోచించాలి. -
సరైన దిశలో ఒక ప్రయత్నం
ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు పడింది. బంగ్లాదేశ్లోని పరిస్థితి పట్ల తన మనోభావాలను భారత్ స్పష్టంగా పంచుకోగలిగింది. బంగ్లాదేశ్లోని మధ్యంతర సర్కారుకు ప్రధాన సలహాదారైన మహమ్మద్ యూనస్, బంగ్లా విదేశాంగ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్ తదితరులతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఢాకాలో సమావేశమవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత్ నుంచి తొలిసారిగా ఓ ఉన్నతాధికారి బంగ్లా వెళ్ళడం, దౌత్య భేటీ జరపడం విశేషమే. ఇటు హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం, అటు బంగ్లాలో అల్పసంఖ్యాక హిందువులపై దాడులతో ద్వైపాక్షిక సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో తాజా భేటీలో ఇరుపక్షాలూ నిర్మొహమాటంగా పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడం సరైన దిశలో పడిన అడుగు. హసీనా హయాంతో పోలిస్తే, భారత్ పట్ల పెద్ద సానుకూలత లేని సర్కారు బంగ్లాలో ప్రస్తుతం నెలకొన్నందున తాజా దౌత్యయత్నాలు కీలకం. చారిత్రకంగా మిత్రత్వం, పరస్పర ప్రయోజనాలున్న పొరుగు దేశాలు అపోహలు, అనుమానాలు దూరం చేసుకోవడానికి ఇవి ఏ మేరకు ఉపకరిస్తాయో చూడాలి. బయట ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో జరిగిన ఈ చర్చలు మైనారిటీలపైన, హిందూ ఆలయాలపైన దాడులు, రాజద్రోహ నేరంపై హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు సహా అనేక వివాదాస్పద అంశాలపై దృష్టి సారించాయి. రెండు కోట్ల పైగా హిందువులున్న ముస్లిమ్ మెజారిటీ దేశంలో మైనారిటీల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తే, ఆ ఘటనలు రాజకీయమైన వంటూ బంగ్లా వాదించింది. ప్రజల భావోద్వేగాలు, రాజకీయ ప్రయోజనాలు కలగలిసినప్పుడు పరస్పర భిన్న వాదనల మధ్య రాజీ కుదర్చడం కష్టమే. కానీ, విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీతో చిరు ప్రయత్నమైనా సాగడం విశేషం. బంగ్లాదేశ్ సైతం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, జరుగుతున్నదే మిటో గ్రహించి, అసలంటూ సమస్య ఉన్నదని గుర్తించడానికి ఈ భేటీ ప్రేరేపిస్తే మంచిదే. 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరులో భారత్ పాత్ర మరపురానిది. అదే సమయంలో స్వాతంత్య్రం ముందు నుంచి చారిత్రకంగా ఉన్న అనుబంధం రీత్యా సాహిత్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ పరంగా ఆధునిక భారతావని రూపుదిద్దుకోవడంలో బంగాళ ప్రాంతపు భాగ స్వామ్యం అవిస్మరణీయమే. బ్రిటీషు కాలం నుంచి భౌగోళిక రాజకీయాలు, సామాజిక సాంస్కృతిక కారణాలతో ముడిపడిన భారత – బంగ్లా బంధం ఇటీవలి ఉద్రిక్తతల నడుమ నలిగిపోతోంది. ఇరుదేశాల మధ్య 4,096 కి.మీల ఉమ్మడి సరిహద్దుంది. ప్రపంచంలోనే సుదీర్ఘమైన అయిదో సరిహద్దు ఇది. పైగా, చాలా ప్రాంతంలో పూర్తిస్థాయిలో సరిహద్దుల గుర్తింపు జరగనేలేదు. సరిహద్దులో నెలకొన్న పశ్చిమ బెంగాల్లోని ఒక్క పెట్రాపోల్ వద్దనే రెండు దేశాల మధ్య భూమార్గ వాణిజ్యంలో 30 శాతం జరుగుతుంది. ఏటా సుమారు 23 లక్షల మంది సరిహద్దులు దాటి, భారత్కు వైద్య చికిత్సకు వస్తుంటారు. కాబట్టి, ఇటీవలి ఉద్రిక్తతల్ని దాటి వాణిజ్యం, ఇంధనం, సహకారం, సామర్థ్యాల పెంపు దలను బంగ్లా చూడగలగాలి. ఇరుదేశాలూ చేతులు కలిపి అడుగులు వేస్తేనే అభివృద్ధి సాధ్యం. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, వెల్లుల్లి లాంటి నిత్యావసర వస్తువుల విషయంలో ఢిల్లీ పైనే ఢాకా ఆధారపడి ఉంది. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశం దేశీయ ఉత్పత్తిని పెంచుకొని, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇక, బంగ్లా రోగులకు శస్త్రచికిత్స చేసేది లేదంటూ కొన్ని భారతీయ ఆస్పత్రులు అమానవీయంగా, మూర్ఖంగా వ్యవహరించడం సమర్థనీయం కాదు. ఈ చర్యల వల్ల బంగ్లా దేశీయులు ఇప్పుడు మలేసియాను ఆశ్రయిస్తున్నట్టు వార్త. ఇలాంటివన్నీ దీర్ఘకాలంలో భారత ప్రయోజనాలకే దెబ్బ. అసలు మిగతా ప్రపంచంతో భారత వాణిజ్యంతో పోలిస్తే, సరుకుల్లో భారత – బంగ్లాల ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా వృద్ధి చెందింది. అనేక అంశాలు ముడిపడి ఉన్నందున తెగేదాకా లాగడం ఇరుపక్షాలకూ మంచిది కాదు. కొత్త వాస్తవాలను గుర్తించక ఒకవేళ మనం ఇదే వైఖరితో ముందుకు సాగితే చివరకు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవులు, మయన్మార్ వరుసలోనే బంగ్లాదేశ్ సైతం ఢిల్లీకి దూరమవుతుంది. పొరుగున మిత్రులెవరూ లేని దుఃస్థితి భారత్కు దాపురిస్తుంది. యూనస్ సారథ్యంలోని ప్రస్తుత బంగ్లా సర్కార్ పాక్కు చేరువవుతోంది. ఇటీవల రెండు దేశాల మధ్య వీసాల ఎత్తివేత, రక్షణ ఒప్పందాలు, కరాచీ నుంచి పాకిస్తానీ సరుకుల రవాణా నౌకను చిట్టగాంగ్ వద్ద లంగరేసుకునేందుకు అనుమతించడం లాంటివి చూస్తే అదే అనిపిస్తోంది. దాదాపు 47 ఏళ్ళ తర్వాత రెండు దేశాల మధ్య నేరుగా సముద్ర నౌకాయాన సంబంధాల పునరుద్ధరణకు ఇది ఒక సూచన. వ్యూహాత్మకంగా సుస్థిర దక్షిణాసియాకు కట్టుబడ్డ భారత్ జాగ్రత్తగా అడుగులు వేయాలి. బంగ్లా అంతర్గత రాజకీయాల్లోకి అతిగా జొరబడి, ప్రస్తుత హయాం నమ్మకాన్ని పోగొట్టు కోరాదు. ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగ కార్యదర్శి ఢాకా పర్యటన ఇరుగుపొరుగు బాంధవ్యం, భాగస్వామ్యాల ప్రాధాన్యాన్ని గుర్తించినట్టే అనిపిస్తోంది. బంగ్లా సైతం ముందుగా తన అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలి. ఆ దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటే, మైనారిటీలు సురక్షితంగా ఉంటే, పాత బంధం మళ్ళీ మెరుగవుతుంది. వెరసి, భారత్ – బంగ్లాలు ప్రస్తుతం నాలుగురోడ్ల కూడలిలో నిలిచాయి. మనసు విప్పి మాట్లాడుకొని, పరస్పర ప్రయోజనాల్ని కాపాడుకుంటే మేలు. అలాకాక సహకార మార్గం బదులు సంఘర్షణ పథాన్ని ఎంచుకుంటే ఇరువురికీ చిక్కే! -
అసమ్మతి... అనైక్యత...
ఆరు నెలల క్రితం లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అనతికాలంలోనే నాలుగు రోడ్ల కూడలిలో దిక్కుతోచని పరిస్థితిలో పడినట్టు కనిపిస్తోంది. జార్ఖండ్, జమ్ము – కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుబాటలో పయనించినా, హర్యానా, మహారాష్ట్రల్లో ఎదురైన దిగ్భ్రాంతికరమైన పరాజయాలు ఇప్పుడు కూటమి భాగస్వామ్యపక్షాల మధ్య విభేదాల కుంపటిని రాజేస్తున్నాయి. హర్యానా ఎన్నికల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేజేతులా కాంగ్రెస్ ఓటమి కొనితెచ్చుకుంటే, మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) సోదిలో లేకుండా పోవడమూ స్వయంకృతమేనన్న భావన అసమ్మతిని పెంచింది. ఖర్గే సారథ్యంలోని ‘ఇండియా’ కూటమిలో ప్రధానపాత్ర కాంగ్రెస్దే గనక మహారాష్ట్రలో దెబ్బతో అనూహ్యంగా నాయకత్వ మార్పు అంశం తెర మీదకొచ్చింది. సారథ్యానికి సిద్ధమంటూ మమత ముందుకు రావడంతో కథ మలుపు తిరిగింది.కూటమి ఆశించిన ఫలితాలు రావడం లేదన్న అసంతృప్తి పెరుగుతున్న పరిస్థితుల్లో అసలీ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించినదే మమతా బెనర్జీ గనక ఇప్పుడీ కూటమికి ఆమే సారథ్యం వహించాలనీ, అందుకామె సిద్ధంగా ఉన్నారనీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ ముందుగా గళం విప్పారు. ఆ తర్వాత కొద్ది రోజులకే దీదీ ఓ ఇంటర్వ్యూ ఇస్తూ, ‘కూటమిని వారు నడిపించ లేకపోతే, నేనే నడిపిస్తాను’ అని కుండబద్దలు కొట్టేశారు. బెంగాల్ను వీడకుండా,అక్కడ నుంచే కూటమి సాఫీగా నడిచేలా చేస్తాననీ వ్యాఖ్యానించారు. దానికి కొనసాగింపుగా జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అగ్రనేత శరద్ పవార్ సైతం జాతీయ నేతగా మమత సమర్థురాలనడంతో తేనెతుట్టె కదిలింది. కూటమిలోని లుకలుకలు, కాంగ్రెస్ పట్ల ఇతర భాగస్వామ్య పక్షాల అసంతృప్తి, అసమ్మతి స్వరాలు బయటపడ్డాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అలాగే రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ సహా పలువురు కోరస్ కలపడంతో విషయం వీథికెక్కింది. సీపీఐ సైతం సీట్ల సర్దు బాటులో వామపక్షాలకు కూటమి చోటివ్వడం లేదంటూ, కాంగ్రెస్ ఆత్మశోధన చేసుకోవాలనేశారు.నిజానికి, ఈ ఏటి లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి కొంత ఊపు వచ్చినా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బలతో అంతా నీరుగారింది. ఆ మధ్య హర్యానాలో దెబ్బ తినడమే కాక, తాజా మహారాష్ట్ర ఎన్నికల్లో కూటమి తుడిచిపెట్టుకుపోవడం అశనిపాతమైంది. ఆశలు క్షీణించడంతో హస్తం పార్టీ సారథ్యంపై అసమ్మతి స్వరం పెరిగింది. ఆ మాటకొస్తే తృణ మూల్ చాన్నాళ్ళుగా కాంగ్రెస్కు దూరంగా ఉంటోంది. ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు సరికదా పార్లమెంట్ సమావేశాల్లోనూ అంటీముట్టని వైఖరి. ఇటీవల ఎస్పీది సైతం అదే ధోరణి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో హస్తం పార్టీతో కలవడానికి ఇష్టపడకపోగా, పార్లమెంట్లో రాహుల్ ముందుండి నడుపుతున్న అదానీ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లోనూ తృణమూల్ లానే పాలు పంచు కోవట్లేదు. ఇది చాలదన్నట్టు రానున్న ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ఆప్ ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు విడతల వారీగా విడుదల చేసేస్తూ, చర్చలకు తావు లేకుండా చేసేసింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలనీ, ప్రతిపక్ష ఐక్యతకు చర్యలు ఆలోచించాలనీ శివ సేన (ఉద్ధవ్ బాల్ఠాక్రే) పేర్కొన్నదంటే వ్యవహారం ఎందాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలోని కాంగ్రెస్ శైలిపై అసంతృప్తి బాహాటమవుతున్న వేళ... ప్రతిపక్ష కూటమి భవిష్యత్ నేత ఎవరు, భవిష్యత్ దిశ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమిని దీదీ నడిపితే అభ్యంతరం లేదంటూనే, ఈ బీజేపీ వ్యతిరేక కూటమిలో పలువురు సీని యర్ నేతలు ఉన్నందున కూర్చొని చర్చించి, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇప్పటికే సన్నాయి నొక్కులు నొక్కారు. అసలు బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ కలసి ‘ఇండియా’ కూటమిగా జట్టు కట్టినా, వాటికి సరైన సైద్ధాంతిక భూమికే కాదు... నేటికీ సమ న్వయ సంఘం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, భవిష్యత్ మార్గదర్శనం లాంటివేమీ లేవు. అందు కోసం గడచిన ఏణ్ణర్ధం పైగా ప్రత్యేకించి కసరత్తులు చేసిన దాఖలాలూ లేవు. నిన్నగాక మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ గొడుగు కింద అందరూ కలసి పోటీ చేసినా... బాబ్రీ మసీదు కూల్చివేతను శివసేన (యుబీటీ) నేత ఒకరు సమర్థించడంతో యూపీలో ముస్లిమ్ ఓట్లపై ఆధార పడ్డ ఎస్పీ తాజాగా ఎంవీఏ నుంచి బయటకొచ్చేసింది. దీన్నిబట్టి ఎన్నికల కోసం కలవడమే తప్ప ‘ఇండియా’ పక్షాల మధ్య సహాయ సహకారాలే కాదు సమన్వయం కూడా లేదన్నది స్పష్టం.కాంగ్రెస్కు కానీ, కూటమికి కానీ సారథ్య బాధ్యతలు తీసుకోకున్నా చక్రం తిప్పడంలో ముందున్న రాహుల్ పరివారానికి ఇప్పుడిది కొత్త పరీక్ష. పార్లమెంట్లో సోనియా, రాహుల్, తాజాగా గెలిచొచ్చిన ప్రియాంక – ముగ్గురున్నా కూటమికి బలిమి చేకూరుతున్న దాఖలాలు లేవు. పెద్దన్న పాత్రలో అత్యుత్సాహం చూపుతున్న హస్తం పార్టీ కార్యకర్తలకు కానీ, ఇతర పార్టీలకు కానీ స్ఫూర్తినివ్వడంలో పదే పదే విఫలమవుతోంది. ఇకనైనా సాటిపక్షాల మాటలకు అది చెవి ఒగ్గాలి. పరస్పర గౌరవంతో అందరినీ కలుపుకొనిపోవాలి. తాజా గందరగోళంతో త్వరలోనే ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమని బీజేపీ జోస్యం చెబుతోంది. కాషాయపార్టీపై సమైక్యంగా పోరు సాగించడమే ధ్యేయంగా పురుడు పోసుకున్న ప్రతిపక్ష కూటమి ఇలా అనైక్యతా రాగం ఆలపిస్తూ పోతే చివరకు అదే జరుగుతుంది. నాయకత్వచర్చ చివరకు కూటమి ఎన్నికల అజెండాపై కారుమబ్బుల్ని కమ్మేస్తేనే కష్టం. అధికారపక్ష అంచనా తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రతిపక్షాలదే! -
ముందున్న సవాలు
21వ శతాబ్దంలో అత్యంత దీర్ఘకాలం సాగిన యుద్ధం... లక్షలాది ప్రజల ప్రాణాలు తీసి, మరెందరినో వలస బాట పట్టించి, శరణార్థులుగా మార్చిన యుద్ధం... ఎట్టకేలకు ఒక ముగింపునకు వచ్చింది. సంక్షుభిత సిరియా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. అధ్యక్షుడు బషర్ – అల్ – అసద్ పాలనకు ఆదివారం ఆకస్మికంగా తెరపడడంతో సిరియాలో అంతర్యుద్ధం కొత్త మలుపు తిరిగింది. అలెప్పో, హమా, హామ్స్ల తర్వాత డమాస్కస్ సైతం తిరుగుబాటు శక్తుల వశం కావడంతో సిరియా రాజకీయ, సైనిక దృశ్యం సమూలంగా మారిపోనుంది. ఈ పరిణామాల ప్రభావం ఆ ప్రాంతమంతటా కనిపించనుంది. దాదాపు 53 ఏళ్ళ పైచిలుకు నిరంకుశ కుటుంబ పాలన పోయినందుకు సిరియన్లు సంబరాలు చేసుకుంటున్నా, తరువాతి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. తిరుగుబాటు తర్వాత డమాస్కస్లో సాగుతున్న విధ్వంసం, లూటీ దృశ్యాలు 2021లో అఫ్ఘానిస్తాన్లో జరిగిన సంఘటనల్ని తలపిస్తున్నాయి. అక్కడ తాలిబన్ల లానే ఇక్కడ ఇస్లామిస్ట్ బృందాలు సైతం గద్దెనెక్కాక వెనకటి గుణం మానక నిజ స్వభావం చూపిస్తాయని భయాందోళనలు రేగుతున్నాయి. వెరసి, అసలే రగులుతున్న పశ్చిమాసియా కుంపటికి కొత్త సెగ వచ్చి తోడైంది. చరిత్ర గమనిస్తే, ప్రజాగ్రహ ఉద్యమం 2011 మార్చిలోనే సిరియాను తాకింది. ఎప్పటికప్పుడు కూలిపోవడం ఖాయమని భావించినా, అసద్ ఏలుబడి వాటన్నిటినీ తట్టుకొని, దాటుకొని వచ్చింది. జనాగ్రహాన్ని ఎదుర్కొనేందుకు ఆయన తీవ్ర హింసకు పాల్పడ్డారు. స్వదేశీయులపైనే ఒక దశలో రసాయన ఆయుధాలు వాడినట్లు ఆరోపణలూ వచ్చాయి. సిరియాకు ఆయన పీడ ఎప్పుడు వదులుతుందా అని ఎదురుచూస్తున్న పరిస్థితి తెచ్చాయి. దాదాపు దశాబ్ద కాలం దూరం పెట్టాక, అరబ్ ప్రపంచం గత ఏడాది మళ్ళీ చేరదీయడం అసద్కు కలిసొస్తుందని భావించారు. అయితే, అరబ్ రాజ్యాలు తమ స్వలాభం కోసమే ఆ పని చేశాయి. అసద్ పోతే వచ్చే తెలియని దేవత కన్నా తెలిసిన దయ్యం మేలని భావించాయి. వారం రోజుల క్రితం దాకా ఈ పాలనకు చరమగీతం తథ్యమని ఎవరూ ఊహించ లేదు. రష్యా, ఇరాన్, హెజ్బుల్లాల అండతో అసమ్మతిని అణచివేస్తూ, అసద్ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. అయితే, కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా మళ్ళీ తిరుగుబాటు బృందాలు విజృంభించడంతో నాటకీయంగా కథ అడ్డం తిరిగింది. ఒక పక్క ఉక్రెయిన్తో పోరాటం నేపథ్యంలో రష్యా వైమానిక సాయం ఉపసంహరించుకోగా, మరోపక్క ఇజ్రాయెల్తో యుద్ధం వల్ల హెజ్బొల్లా వనరులు క్షీణించాయి. ఇదే అదనుగా ఇస్లామిస్ట్ గ్రూప్ హయత్ – తహ్రీర్ అల్ – షామ్ (హెచ్టీఎస్) సారథ్యంలోని తిరుగుబాటుదారులు చకచకా ముందుకు చొచ్చుకువచ్చారు. అసద్కు పట్టున్న ప్రాంతాలన్నీ కైవసం చేసుకుంటూ, ఆఖరికి అధికార పీఠానికి ప్రతీక అయిన డమాస్కస్ను చేజిక్కించుకోవడంతో ఏళ్ళ తరబడి సాగుతున్న నియంతృత్వానికి తెరపడింది. పదవీచ్యుతుడైన అధ్యక్షుడు విమానంలో పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. అసద్ పదవీచ్యుతి ప్రభావం ప్రాంతీయంగా గణనీయమైనది. ఆ ప్రాంతంలో ఇంతకాలంగా స్నేహంగా మెలిగిన కీలక దేశం సిరియాలో అనుకూల పాలన పోవడం ఇరాన్కు వ్యూహాత్మకంగా ఇబ్బందికరమే. మరోపక్క హెజ్బుల్లా భవిష్యత్తూ అనిశ్చితిలో పడింది. తిరుగుబాటుదారులకు తెర వెనుక అండగా నిలిచిన టర్కీ ఇప్పుడిక అక్కడ చక్రం తిప్పే సూచనలున్నాయి. అయితే, టర్కీ ప్రయోజనాలకూ, ప్రాంతీయ శక్తులకూ మధ్య వైరుద్ధ్యం తలెత్తితే ఉద్రిక్తతలు పెరుగుతాయి. మానవ హక్కులను సైతం కాలరాస్తున్న నియంతృత్వంపై పోరాటం ఎవరు, ఎక్కడ చేసినా అది సమర్థనీయమే. ప్రపంచం సంతోషించాల్సిన అంశమే. నియంతృత్వం పోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తాం. కానీ, అసద్ పాలన స్థానంలో రానున్న పాలన ఏమిటన్నది ప్రశ్న. ఒకటికి పది సంస్థలు ఈ సాయుధ తిరుగుబాటును నడిపాయని విస్మరించలేం. అసద్ను గద్దె దింపడం సరే కానీ, అనేక వైరుద్ధ్యాలున్న ఇవన్నీ ఒకతాటిపైకి రావడం, రేపు సజావుగా పాలన సాగించడం సాధ్య మేనా అన్నది బేతాళప్రశ్న. తీవ్రవాద అల్ఖైదాకు ఒకప్పటి శాఖ అయిన హెచ్టీఎస్ లాంటి తీవ్ర వాద సంస్థలు తమను తాము జాతీయవాద శక్తులుగా చెప్పుకుంటున్నా, అవి తమ వెనకటి స్వభా వాన్ని వదులుకుంటాయా అన్నదీ అనుమానమే. అదే గనక జరగకపోతే... దశాబ్దాలుగా అల్లాడు తున్న సిరియా, అక్కడి సామాన్యుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది. ఒకప్పటి సంపన్న సిరియా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురై, అంతర్యుద్ధంలో మగ్గుతూ శిథిలాల కుప్పగా మారింది. అసద్ హయాంలో దాదాపు 1.2 కోట్లమంది దేశం విడిచి పోవాల్సి వచ్చింది. ఉద్రిక్తతా నివారణ జోన్లలో అతి పెద్దదైన ఒక్క ఇడ్లిబ్ ప్రావిన్స్లోనే సుమారు 20 లక్షల మంది శరణార్థులుగా బతుకీడుస్తున్నారు. తాజా పరిణామాలతో ఆ దేశాన్ని రాజకీయంగా, సామాజికంగా ఒక గాడిన పెట్టాల్సిన తరుణమిది. స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న సిరియన్లు సైతం ఈ భగీరథ ప్రయత్నంలో భాగస్వాములవ్వాలి. అలాగే, ఆంక్షల విధింపుతో అసద్ పతనానికి దోహద పడ్డ పాశ్చాత్య దేశాలు సైతం సిరియా వాసుల కష్టాల తొలగింపుపై దృష్టి పెట్టాలి. తద్వారా వేలాది సిరియన్ శరణార్థులు స్వచ్ఛందంగా స్వదేశానికి వచ్చి, దేశ పునర్నిర్మాణంలో భాగమయ్యే వీలు చిక్కుతుంది. అసద్ పదవీచ్యుతితో సిరియా పునర్నిర్మాణానికి అవకాశం అంది వచ్చినా, అందుకు సవాలక్ష సవాళ్ళున్నాయి. మితవాద, అతివాద బృందాల సమ్మేళనమైన ప్రతిపక్షం సైనిక విజయం నుంచి సమర్థమైన పరిపాలన వైపు అడుగులేయడం ముఖ్యం. అందులో జయాపజయాలను బట్టే సిరియా భవితవ్యం నిర్ణయం కానుంది. అందుకే, రానున్న కొద్ది వారాల పరిణామాలు కీలకం. -
లెక్కలు, చిక్కులు
లెక్కల్లో ఎంత పండితుడైనా ఓడిపోయే చిక్కులెక్కలు ఉంటూనే ఉంటాయి; లెక్క తప్పే సందర్భాలు మనిషికి ఎదురవుతూనే ఉంటాయి. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘వడ్లగింజలు’ కథే చూడండి; అందులో శంకరప్ప అనే చదరంగ నిపుణుడు అంతే ప్రవీణుడైన ‘శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మజగపతి మహారాజులుంగారి’ ఆట కట్టిస్తాడు. అప్పుడా మహారాజు, తన పెద్దాపురం రాజ్యంలో ఉన్నదేదైనా సమర్పించుకుంటాను, సెలవివ్వండని అడుగుతాడు. ఒక వడ్లగింజతో మొదలుపెట్టి చదరంగంలోని అరవై నాలుగు గడుల్లోనూ గింజల్ని రెట్టింపు చేస్తూపోతే ఎన్ని గింజలవుతాయో అన్ని ఇప్పించండని శంకరప్ప అడుగుతాడు. ఓస్, అంతేకదా అనుకున్న రాజుగారు లెక్క కట్టమని షరాబును ఆదేశిస్తాడు. పెద్దాపురం రాజ్యంలోనే కాదు, త్రిలింగదేశం మొత్తంలో నూరేళ్లపాటు పండించిన ధాన్యం కూడా ఆయనకు ఇవ్వడానికి సరిపోదని అతను సెలవిస్తాడు. మన లెక్కలనూ, అంచనాలనూ చిత్తు చేస్తున్నవాటిలో జనాభా సమస్య ఒకటి. ఆ లెక్క కూడా దాదాపు ఇలాగే మనల్ని చిక్కుల కీకారణ్యంలోకి తీసుకెళ్ళి విడిచిపెడుతుంది. ప్రపంచం మహాజనసాగరంగా మారుతున్న వైనాన్ని గమనించి దానిని ఎలా ఈదాలో ప్రణాళికలు వేయడం డెబ్బై ఏళ్లక్రితం మొదలుపెట్టాం. ఏవో కొండ గుర్తులు పెట్టుకుని, సంకల్పాలు చెప్పుకుని ఈదడమైతే ప్రారంభించాం కానీ, జనసముద్రం విస్తరిస్తూనే ఉంది. ఒక జంటకు ఇద్దరనే నినాదంతో ప్రారంభించి చివరికి ఒక్కరే చాలనుకోవడానికి అలవాటుపడ్డాం. ఇంతలోనే ఈ లెక్క మారిపోతోంది; ఒకరూ, ఇద్దరితో సరిపెడితే ప్రమాదంలో పడతాం, ముగ్గురు, నలుగురిని కని తీరాలన్న నినాదం మన దగ్గర ఇప్పుడిప్పుడే శ్రుతి పెంచుకుంటోంది. దీనికి ఎవరి కారణాలు వారికే ఉన్నాయి. ఉదాహరణకు, ఒకరూ, ఇద్దరితో సరిపెడితే క్రమంగా వృద్ధుల సంఖ్య పెరిగి, యువకుల సంఖ్య తగ్గి అభివృద్ధికి తోడ్పడే విలువైన మానవ వనరుకు కొరత వస్తుందన్నది ఒక కారణం. పెరిగిన జనాభాను బట్టి లోక్ సభ, శాసన సభల్లోని స్థానాల సంఖ్యను పెంచుకోవలసి ఉంటుంది కనుక, అందువల్ల జననాలను నియంత్రించని ఉత్తరాది రాష్ట్రాలలో స్థానాల సంఖ్య పెరిగి, అన్నింటిలోనూ వారిదే పై చేయిగా మారుతుందనీ; దానితో జననాలను నియంత్రించిన రాష్ట్రాలకు అన్యాయం జరిగి, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నది మరో కారణం. నియంత్రణను పాటించిన అధిక సంఖ్యాక మతస్థులను మించి నియంత్రణను పాటించని అల్పసంఖ్యాక మతస్థుల సంఖ్య పెరిగిపోతుందన్నది మరికొందరు ముందుకు తెచ్చే కారణం. కారణమేదైనా నినాదం మారుతుండడం నిజం. రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో ‘హోమో సేపియన్స్’ అనే ఆధునిక మానవుడు అవతరించడంతో మొదలుపెట్టి ఇప్పటివరకూ వస్తే జనాభా గణాంకాలు చిక్కులెక్కలుగానే కాదు చిత్రవిచిత్రాలుగానూ రూపుకడతాయి. హోమోసేపియన్స్ తొలి వృద్ధి రేటు కేవలం 0. 011 శాతం అయితే, ఆ శాతం ఏ కొంచెమైనా పెరుగుతూ 19వ శతాబ్ది ప్రారంభానికి వందకోట్లకు చేరడానికి వేల సంవత్సరాలు పట్టింది. అప్పటి నుంచి అది పెరుగుతూనే ఉండి, అతి స్వల్ప కాలంలోనే ఏడువందల కోట్లకు చేరింది. మరో ఇరవయ్యేళ్లలో తొమ్మిది వందల కోట్లకు చేరుతుందని అంచనా. సమస్యను ఐక్యరాజ్యసమితి తన చేతుల్లోకి తీసుకుని పరిష్కరించడానికి ఎన్ని ప్రణాళికలు వేసి, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా సమస్య ఎందుకు విషమిస్తూనే ఉందంటే, అభివృద్ధిలో దేశాల మధ్య తేడాలు, పేద, ధనిక వ్యత్యాసాలు మొదలైనవి కారణం. పారిశ్రామిక విప్లవానికి లానే జనాభావృద్ధికీ, క్షీణతకూ కూడా యూరప్ తొలి ప్రయోగశాల అయింది. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధీ, దానితోపాటే ఆహార పుష్కలత్వం, చదువూ సంధ్యా పెరగడంతోనే యూరప్ లో జనాభా పెరిగి క్రమంగా క్షీణిస్తూనూ వచ్చింది. సరిగ్గా ఇవే కారణాలతో వర్ధమానదేశాలలో కూడా జనాభా పెరగడం, ఆ తర్వాత క్షీణించడం మొదలైంది కానీ వృద్ధి రేటుకు ఆ క్షీణత రేటు తులతూగడం లేదు. యూరప్ తర్వాత ఆసియాదేశాలు జనాభావృద్ధిలో అగ్రస్థానానికి వస్తే, ఇప్పుడా ఘనతను ఆఫ్రికా దేశాలు చేజిక్కించుకోబోతున్నాయి. ఇక్కడొక ఆసక్తికర వివరం ఏమిటంటే, 1950లలో మొత్తం ఆసియా దేశాల జనాభా 140 కోట్లు అయితే ఇప్పుడు దానిని కూడా మించిన జనాభా ఒక్క మన దేశంలోనే ఉంది. అభివృద్ధికీ, ఆహార పుష్కలత్వానికీ, జనాభా వృద్ధికీ ఉన్న పీటముడిని మన ప్రాచీనులు సైతం గుర్తించారనడానికి మహాభారతమే సాక్ష్యం. పెరిగిన జనాభా భారాన్ని మోయలేకపోతున్నానని భూదేవి మొరపెట్టుకున్నప్పుడు, ఆహార లభ్యత వల్ల జనాభా పెరిగిందని, త్వరలోనే కురుపాండవుల మధ్య యుద్ధమొచ్చి పెద్ద ఎత్తున జననష్టం జరిగి నీ భారం తగ్గుతుందని చెప్పి బ్రహ్మ ఆమెను ఊరడిస్తాడు. విశేషమేమిటంటే, 18వ శతాబ్ది చివరినాటికి యూరప్ అనుభవాన్ని గమనించిన థామస్ రాబర్ట్ మాల్తస్ అనే ఆర్థికవేత్త కూడా ఆహార లభ్యతకూ జనాభావృద్ధికీ ఉన్న సంబంధాన్ని నొక్కి చెప్పి, రోగాలు, కరవు కాటకాలు, యుద్ధాలే దానిని నియంత్రిస్తాయంటాడు. అలాంటి విధ్వంసక మార్గంలో కాకుండా విద్యా, విజ్ఞానాల ఊతతో జనమహాసాగరాన్ని ఈదడానికి మనం ఉపక్రమించి ఇంకా అందులోనే మునిగితేలుతున్నాం. ఇంతలోనే నినాదం మారిపోయి సమస్యను మళ్ళీ మొదటికి తెస్తోంది; అదీ సంగతి! -
సీజ్ ద పోర్ట్
ఎన్నికల హామీలను అమలు చేయడం మాట దేవుడెరుగు. ప్రజల దైనందిన సమస్యలను కూడా పెడచెవిన పెడుతున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రాశులు పోసుకున్న రైతుల కళ్లల్లో దైన్యాన్ని చూస్తున్నాము. మద్దతు ధర లభించక దారుణంగా నష్టపోతున్న రైతన్నల దుఃస్థితి ప్రతి గ్రామానా కనిపిస్తున్నది. ప్రభుత్వం మాత్రం రైతును దగా చేస్తున్న దళారుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నట్టున్నది. రైతు సేవా కేంద్రాలు ఆచరణలో దళారీ సేవా కేంద్రాలుగా మారాయని రైతులు విమర్శిస్తున్నారు.నిబంధనలకు తిలోదకాలిచ్చి తేమ శాతాన్ని అధికంగా చూపెట్టి బస్తాకు 400 నుంచి 500 రూపాయల వరకు దళారులు లాగేస్తున్నారని సమాచారం. రైతుకు లభించవలసిన మద్దతు ధరలో టన్నుకు కనీసం 6 వేల రూపాయల చొప్పున దళారులు మింగేస్తున్నారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ సంవత్సరం 37 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది. రైతులు పండించిన మొత్తం ధాన్యం 84 లక్షల టన్నులని అంచనా.ప్రభుత్వం చెప్పుకున్న లక్ష్యం ప్రకారం 37 లక్షల టన్నుల లెక్కనే తీసుకుందాం. టన్నుకు ఆరువేల చొప్పున ఈ మొత్తం ధాన్యంలో దళారీల దోపిడీ విలువెంత? 2,200 కోట్లు! రైతు సేవా కేంద్రాల్లోనే తిష్ఠవేసిన గాదె కింది పందికొక్కులు అప్పనంగా 2,200 కోట్ల రూపాయల రైతుల శ్రమ ఫలాన్ని లాక్కుంటూ ఉంటే మన సర్కార్ వారు ఏం చేస్తున్నారో తెలుసా?ఉపముఖ్యమంత్రి, మరో మంత్రి కలిసి రేషన్ బియ్యం అక్రమ రవాణా దొంగలను పట్టుకుంటామంటూ సముద్రంలోకి వెళ్లి ‘సీజ్ ద షిప్’ అని గర్జిస్తున్నారు. ఇంతకూ ఆ మంత్రివర్యులు సీజ్ చేయమన్న షిప్పులో ఏమున్నది? 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్చేసి ఉన్నాయట! అందులో మన రేషన్ బియ్యం మాత్రం 640 టన్నులేనని తెలుస్తున్నది.ఈ రేషన్ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేయడానికి కిలోకు 40 రూపాయలు పడుతుందని ఓ లెక్క. టన్నుకు 40 వేలు. ‘సీజ్ ద షిప్’లో ఉన్న 640 టన్నుల విలువ దాదాపుగా రెండున్నర కోట్లు! పెద్ద లెక్కే. ఆ ఓడతోపాటు మరో ఓడలో ఇండోనీషియాకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని మరో మంత్రిగారి వియ్యంకుడు తరలించారనీ, దాని జోలికి మాత్రం మన డిప్యూటీ వెళ్లలేదని వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు. ప్రజాపంపిణీ కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యం అక్రమ మార్గం పడితే అరికట్టవలసినదే! అభ్యంతరం లేదు. అందుకు మన వ్యవస్థలను సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుంది. ఇంత పెద్ద ఛేజింగ్ సినిమా అవసరం లేదు. ఒకపక్క రైతుల జేబులు కొట్టి వేల కోట్లు లాగేసుకునే పనిలో ఉన్న దళారులను పట్టించుకోని ప్రభుత్వం కాకినాడ రేవుకాడ ఈ డ్రామా వేయడం వెనుక మరేదో మతలబు ఉందనిపించడం లేదా? నిజంగానే చాలా మతలబు ఉన్నది. కాకినాడ రేవు ఇతివృత్తంతో చాలా సన్నివేశాలను వరసగా నడిపించారు. ‘సీజ్ ద షిప్’ ఓ డైలాగ్ మాత్రమే! సినిమా టైటిల్ ‘సీజ్ ద పోర్ట్’ కావచ్చు!!నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన వియ్యంకుడి ఇంట్లో ఫంక్షన్ కోసం పెద్దాపురం వెళ్లారు. ఆ వెంటనే ఓ మంత్రిగారు కాకినాడ పోర్టుకు వెళ్లారనీ, అక్కడ పోర్టు అధినేత కేవీ రావునూ, సీఈఓ మురళీధరన్నూ కలిసి వచ్చారనీ విశ్వసనీయ సమాచారం. అయితే ఈ వివరాలను గోప్యంగా ఉంచారు. నవంబర్ 27న కాకినాడ జిల్లా కలెక్టర్ యాంకరేజి పోర్టులో లోడింగ్ జరుగుతున్న నౌకను తనిఖీ చేశారు. అందులో లోడ్ చేసిన బియ్యంతో 640 టన్నుల పీడీఎస్ బియ్యం కూడా ఉన్నట్టు గుర్తించారు.మరో రెండు రోజులకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు ఢిల్లీ నుంచి వచ్చీరావడంతోనే కాకినాడ పోర్టుకు వెళ్లారు. ‘సీజ్ ద షిప్’ సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ఈ పోర్టు ఎవరిది, ఇక్కడ అధికారులెవరంటూ పవన్ ప్రశ్నించారు. వాస్తవానికి బియ్యం ఎగుమతి జరుగుతున్న యాంకరేజీ పోర్టు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదే! పోర్టు ప్రభుత్వానిదే, రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల అధికారులపై పెత్తనం ప్రభుత్వానిదే!మరి పౌర సరఫరా బియ్యం అక్రమ రవాణా జరిగితే బాధ్యులు ఎవరవుతారు? ఈ మౌలికమైన అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పక్కనబెట్టి హడావిడి చేశారు. ఆయన సహచరుడు నాదెండ్ల మనోహర్ మరో అడుగు ముందుకువేసి కాకినాడ పోర్టు యాజమాన్యంలో 41 శాతాన్ని బలవంతంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు లాగేసుకుని ‘అరబిందో’కు కట్టబెట్టారని ఆరోపించారు.ఇక్కడ అసలు కథ ప్రారంభమైంది. బియ్యం ఎగుమతులు జరుగుతున్న యాంకరేజి పోర్టు వేరు. అరబిందో కంపెనీ వాటాలు కొనుక్కున్న డీప్ వాటర్ పోర్టు వేరు. కాకినాడ పోర్టు అనే పేరుతో ఈ రెండు పోర్టుల మధ్య తేడా తెలియకుండా గందరగోళ పరచడం ఉద్దేశపూర్వకమే. ఎందుకంటే ‘కాకినాడ సీపోర్ట్స్’ పేరుతో ఉన్న డీప్ వాటర్ పోర్టులో అరబిందో కంపెనీ వాటాలు కొనుగోలు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఉన్నారు. డీప్ వాటర్ పోర్టు వాటాల కొనుగోలుకూ, యాంకరేజీ పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతి వార్తలకూ లంకె బిగించే వ్యూహం కావచ్చు. చేతిలో మీడియా ఉన్నది కదా!నాదెండ్ల మనోహర్ కథను ప్రారంభించిన మరుసటి రోజే కేవీ రావు అనే సదరు పోర్టు యజమాని వైసీపీకి చెందిన ముఖ్యులపై ఫిర్యాదు చేయడం, ఆ కేసును సీఐడీ చేపట్టడం చకచకా జరిగిపోయాయి. అరబిందో అనేది సుమారు పది బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన ఒక మల్టీనేషనల్ కంపెనీ, ప్రతిష్ఠాత్మక సంస్థ. కాకినాడ సీపోర్ట్స్లో 495 కోట్ల రూపాయలు చెల్లించి 41 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఒకవేళ ప్రభుత్వంలోని ప్రముఖుల్ని ఉపయోగించుకొని బెదిరించి ఉంటే అంత సొమ్ము ఎందుకు చెల్లించాలనేది మొదటి కామన్సెన్స్ ప్రశ్న. ఇంకో పది శాతం రాయించుకుంటే పోర్టు మీద పెత్తనం వారికే వచ్చేది కదా! ఎందుకని వదిలేశారన్నది రెండో కామన్సెన్స్ ప్రశ్న! భయంతో గజగజ వణికిపోయి వాటాలు రాసిచ్చేసిన వ్యక్తే ఇంకా ఆ పోర్టుకు అధిపతిగా, ఆయన నియమించుకున్న మనిషే సీఈవోగా ఎలా కొనసాగుతున్నారనేది ఇంగితజ్ఞానం వేసే ఇంకో ప్రశ్న. ఒక సాధారణ రైస్ మిల్లు యజమాని స్థాయి నుంచి ఎకాయెకిన ఓడరేవు యజమానిగా ఎదగగలిగిన నేర్పరి కేవీ రావు. అటువంటి వ్యక్తి ఓ యువకుడు వచ్చి బెదిరించగానే ఆస్తులు రాసిచ్చేటంతటి అర్భకుడని ఎవరు నమ్మగలుగుతారు? ఒకవేళ అటువంటి బెదిరింపులు ఎదురైవుంటే కేసు పెట్టలేనంత అమాయకుడేం కాదు కదా! సెబీకో, ఎన్సీఎల్టీకో ఫిర్యాదు చేయాలని కూడా తెలియని వ్యక్తి కాదుగదా? కనీసం యెల్లో మీడియా చెవిలో ఊదాలనీ, తనను పోర్టు యజమానిని చేసిన చంద్రబాబుకు చెప్పుకోవాలని కూడా తోచలేదా? ఆ పని చేసివుంటే వాళ్లు అప్పుడే ఒక బడబానలాన్ని సృష్టించి ఉండేవారు కాదా? వాటాలను అమ్మేసిన ఐదేళ్ల తర్వాత మంత్రులు పెట్టిన ముహూర్తానికే కేవీ రావు నిద్ర లేవడం వెనకనున్న రహస్యం గురించి విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోలేరా?వైసీపీలోని ప్రముఖులను ఏదోరకంగా కేసుల్లో ఇరికించాలి. కాకినాడ సీపోర్టును మళ్లీ కాజెయ్యాలి, జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠకు ఇంకొంచెం మసి పూయాలి. ఇదే కదా వ్యూహం? అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడుస్తున్నా ప్రభుత్వం వారి ఏకసూత్ర కార్యక్రమంగా ఈ వ్యూహం మారిపోయింది. అసలు కాకినాడ సీపోర్టు కూడా ప్రభుత్వానిదే! ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తెచ్చి మరీ నిర్మించారు. దీన్ని అప్పనంగా పప్పుబెల్లాలకు కేవీ రావుకు కట్టబెట్టింది చంద్రబాబే! పోర్టు పరిసర ప్రాంతాల్లోని భూములను కూడా దేశంలో ఎక్కడా లేనంత కారుచౌకగా ఆయనకు కట్టబెట్టారు. కేవీ రావు మీద ఎందుకింతటి అవ్యాజమైన ప్రేమ? రైస్ మిల్ యజమాని హఠాత్తుగా పోర్టు యజమాని ఎలా అయ్యారు? ఆయన చట్టబద్ధంగా అమ్మేసుకున్న వాటాలను మళ్లీ కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇంతకూ కేవీ రావు పోర్టు సొంతదారేనా లేక ఎవరికైనా బినామీగా ఉన్నారా? అనే అనుమానాలు కూడా జనంలో ఉన్నాయి. ‘సీజ్ ద పోర్ట్’ సినిమా పూర్తయితే తప్ప యథార్థాలు బయటకు రావేమో!పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కాకినాడ సెజ్ భూములపై కూడా యెల్లో మీడియా పచ్చి అసత్యాలను ప్రచారం చేస్తున్నది. పరిశ్రమలు ప్రారంభించకుండా వదిలేసిన కారణంగా తమ భూములను తమకిచ్చేయాలని దీర్ఘకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ రైతులను అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోర్కెను గౌరవించి 2180 ఎకరాల భూములను తిరిగి ఇచ్చేశారు. భారతదేశ చరిత్రలో సేకరించిన భూములను తిరిగి రైతులపరం చేసిన ఏకైక సందర్భం ఇది. వాస్తవాలు ఇలా ఉంటే సెజ్ భూముల్లో జగన్ హయాంలో గోల్మాల్ జరిగిందని యెల్లో మీడియా కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది. ఈ వైఖరిని ఆ ప్రాంత రైతు ప్రతినిధులు శనివారం నాడు సమావేశమై మీడియా సమక్షంలో నిర్ద్వంద్వంగా ఖండించారు. కాకినాడ సెజ్ భాగోతాన్ని 2003లో బాబే ప్రారంభించారు. లాభాల్లో ఉన్న పోర్టును 1999లో ఆయనే కేవీ రావుకు కట్టబెట్టారు. ఆ రోజుల నుంచి విచారణ జరిగితే తప్ప దొరలెవరో, దొంగలెవరో వెల్లడి కాదని విజ్ఞుల అభిప్రాయం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
దిక్కులు చూస్తున్న ఫ్రాన్స్!
యూరప్ దేశాల్లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలిగిపోతున్న ఫ్రాన్స్ సంక్షోభం నుంచి సంక్షోభానికి ప్రయాణిస్తున్నది. దేశాన్ని చుట్టుముట్టిన అనిశ్చితి పోవాలంటే ఎన్నికలొక్కటే మార్గమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియెల్ మేక్రాన్ ఆర్నెలల క్రితం భావించి పార్లమెంటు రద్దుచేశారు. కానీ మొన్న జూలైలో నిర్వహించిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాకపోవటంతో సమస్య మొదటికొచ్చింది. దిక్కుతోచని స్థితిలో రెండు నెలల అనంతరం మైకేల్ బార్నియర్ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. కానీ అది మూడునెలల ముచ్చటైంది. ఆరు దశాబ్దాల చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పతనమైన తొలి ప్రభుత్వం బార్నియర్ దే. అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన అప్రదిష్ట కూడా ఆయనదే. ఫ్రాన్స్ పెద్ద ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్యోగాల కోత, పరిశ్రమల మూత రివాజుగా మారాయి. అసలే పడిపోయిన నిజ వేతనాలతో, నిరుద్యోగ బెడదతో బతుకులు ఎలా నెట్టుకు రావాలో తెలియక పౌరులు కొట్టుమిట్టాడుతున్నారు.ప్రజల కొనుగోలు శక్తి క్షీణించటంతో రెస్టరెంట్లు, చిన్నా పెద్దా దుకాణాలు మూసేస్తున్నారు. ఈ దశలో పులి మీద పుట్రలా ప్రభుత్వ వ్యయాన్ని అదుపుచేసే పేరిట బార్నియర్ భారీ కోతలకు దిగారు. ఇది ప్రతిఘటనకు దారితీసింది. పబ్లిక్ రంగ సంస్థల సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పటికే సమ్మెకు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి విరుచుకుపడక ముందు యూరప్ దేశాల్లో అగ్రగాములుగా వెలిగిన జర్మనీ, ఫ్రాన్స్లు రెండూ 2021నుంచి ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆర్థిక స్వస్థతకు తీసుకున్న చర్యలు ఫలించ బోతున్నాయన్న సంకేతాలున్న తరుణంలోనే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వచ్చిపడి ఆర్థిక వ్యవస్థలను మరింత దెబ్బతీసింది. జర్మనీ కొంతవరకూ దీన్ని తట్టుకోగలిగినా ఇంధన సంక్షోభంతో, భారీ వడ్డీ రేట్లతో ఫ్రాన్స్ కుదేలవుతోంది. ఒకపక్క ఊపిరాడనీయని రుణ భారం, మరోపక్క ద్రవ్యలోటు ఆ దేశాన్ని పీడిస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో సజావుగా నడిచేందుకు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకూ పరిశ్రమలకు ప్రభుత్వం ఉదారంగా పంచిన 15,000 కోట్ల యూరోలు ఆవిరైపోయాయి. సరిగదా... ఇంధన ఆధారిత సంస్థలు ఉత్పత్తిని తగ్గించి వేలాదిమందిని తొలగించబోతున్నామని గత నెలలో ప్రకటించాయి. నెక్సిటీ వంటి భారీ నిర్మాణరంగ సంస్థ సైతం తడిసి మోపెడవుతున్న వడ్డీ రేట్ల కారణంగా కొత్త పెట్టుబడులకు వెళ్లటం లేదని తెలిపింది. పర్యవసానంగా వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోక తప్పని స్థితి ఏర్పడింది. ప్రభుత్వ రుణాలు కనీవినీ ఎరుగని రీతిలో 3 లక్షల 20 వేల కోట్ల యూరోలకు చేరాయి. ఇది దేశ జీడీపీ కన్నా 112 శాతం అధికం. గ్రీస్, స్పెయిన్ వంటి దేశాలను మించి ప్రభుత్వ లోటు 6.1 శాతం చేరుకుంది. సంపన్నులకూ, కార్పొరేట్ సంస్థలకూ ఇచ్చిన పన్ను రాయితీల వల్ల కాస్తయినా ప్రయోజనం లేకపోగా, వచ్చే ఏడాది కనీసం 6,000 కోట్ల యూరోలు పొదుపు చేయటానికి తాత్కాలికంగా పన్నులు పెంచుతామని మొన్న అక్టోబర్లో ప్రతిపాదించగానే అంతంత మాత్రంగా నడుస్తున్న సంస్థలు అంతెత్తున లేచాయి. కొత్త పెట్టుబడులకు ఆస్కారమే లేని స్థితిలో ఈ పన్నుల మోతేమిటని ప్రశ్నించాయి.ఫ్రెంచి పౌరులు గర్వపడే పారిస్లోని 860 యేళ్లనాటి పురాతన భవంతి నోటర్డామ్ కేథడ్రిల్కు 2019లో నిప్పంటుకుని చాలా భాగం ధ్వంసమైనప్పుడు సంక్షోభంలో కూరుకుపోయిన వర్తమాన ఆర్థిక స్థితికి అది అద్దం పడుతోందని అనేకులు వ్యాఖ్యానించారు. అయిదేళ్లలో దాన్ని పునర్నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన మేక్రాన్ జయప్రదంగా ఆ పని పూర్తిచేయగలిగారు. కానీ ఆర్థికవ్యవస్థ మాత్రం ఆయనకు చుక్కలు చూపిస్తోంది. మామూలుగా అయితే శనివారం 50మంది ప్రపంచాధినేతలు, కాబోయే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వగైరాల సమక్షంలో ఆ భవంతి ప్రారంభం కాబోయే వేళ మేక్రాన్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. కానీ తాజా రాజకీయ సంక్షోభం ఎదుర్కొనటం ఎలాగో తెలియక ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.577మంది సభ్యులుండే దిగువసభ ‘అసెంబ్లీ నేషనల్’లో ప్రభుత్వం ఏర్పాటుచేసే పక్షానికి కనీసం 289 స్థానాలు కావాలి. కానీ వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్కు 182, మేక్రాన్కు చెందిన ఎన్సెంబుల్కు 168 ఉన్నాయి. తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్)కి 143 సీట్లున్నాయి. వామపక్ష ఫ్రంట్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరచటం ద్వారా ఆర్ఎన్ ఇప్పుడు బార్నియర్ ప్రభుత్వ పతనానికి కారణమైంది. తన బడ్జెట్ పార్లమెంటులో నెగ్గే స్థితి లేదని తెలిసి రాజ్యాంగంలోని అధికరణ ఉపయోగించి బార్నియర్ దాన్ని అమల్లోకి తెచ్చారు.పర్యవసానంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనక తప్పదని అర్థమైనా ఆయన ఈ మార్గం ఎంచుకున్నారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏడాది గడిస్తే తప్ప... అంటే వచ్చే ఏడాది జూలై వరకూ మళ్లీ ఎన్నికలు జరపకూడదు. కనుక అప్పటివరకూ ఫ్రాన్స్కు ఆపద్ధర్మ ప్రభుత్వమే గతి. ఈలోగా తన వైఫల్యాలను అంగీకరించి మేక్రాన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిరావొచ్చు. ఫలితంగా దేశానికి మరిన్ని ఇక్కట్లు తప్పవు. అంతంతమాత్రంగా ఉన్న తమ బతుకులు ఆర్ఎన్ నిర్ణయంవల్ల మరింత అధోగతికి చేరాయని జనం అనుకుంటే అధ్యక్ష ఎన్నికల్లో ఆ పదవి దక్కించుకోవాలని తాపత్రయ పడుతున్న ఆర్ఎన్ అధినాయకురాలు మెరిన్ లీ పెన్ ఆశలు అడుగంటినట్టే. ఫ్రాన్స్ సంక్షోభం మరింత వికటిస్తే అది మొత్తం యూరప్ దేశాల ఆర్థికవ్యవస్థలను అనిశ్చితిలో పడేస్తుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతోసహా అన్ని సంక్షోభాలూ ఆగితేనే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం యూరప్కు సాధ్యమవుతుంది. -
నియంతకు పరాభవం
‘ప్రభుత్వం ప్రజలకు భయపడినంతకాలం స్వేచ్ఛ ఉంటుంది...ప్రజలు ప్రభుత్వానికి భయపడితే నియంతృత్వం తప్పదు’ అని ఒక రాజనీతిజ్ఞుడు అంటాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సెక్–యోల్ మంగళవారం హఠాత్తుగా దేశంలో విధించిన సైనికపాలన కాస్తా జనం తిరగబడేసరికి కేవలం ఆరు గంటల్లో తోకముడిచిన తీరు దాన్ని మరోసారి అందరికీ గుర్తుచేసింది. వచ్చే నెలనుంచి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిని చవిచూడబోతున్న అమెరికా ప్రజానీకం మొదలు దేశదేశాల పౌరులూ ఈ ప్రహసనం నుంచి చాలా నేర్చుకోవచ్చు. ‘రాజ్య వ్యతిరేక శక్తుల్ని సాధ్యమైనంత త్వరగా ఏరిపారేసి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి’ ఎమర్జెన్సీ విధింపు, సైనిక పాలన తప్పనిసరయినట్టు రాత్రి పొద్దుపోయాక యూన్ ప్రకటించారు. పొరుగునున్న శత్రు దేశం ఉత్తరకొరియాకు చెందిన కమ్యూనిస్టు పాలకులతో కుమ్మక్కయిన విపక్షాలు దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయని ఆరోపించారు. కానీ రోడ్లపైకొచ్చిన సైనికులకు దేశమంతా ప్రతిఘటన ఎదురవుతున్నట్టు, నిరసనోద్యమాలు తారస్థాయికి చేరినట్టు అందిన సమాచారంతో బెంబేలెత్తిన ఆయన సైనికపాలనను ఎత్తేస్తున్నట్టు తెల్లారుజామున నాలుగుగంటలప్రాంతంలో తెలియజేయాల్సివచ్చింది. పార్లమెంటు భవనంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించిన సైనికులను జనం తరిమికొట్టడంతో ఆయనకు తత్వం బోధపడింది. విపక్షం తీసుకురాబోతున్న అవిశ్వాస తీర్మానంతో తనకు పదవీభ్రష్టత్వం తప్పదనుకుని హడావిడిగా వేసిన సైనిక పాలన ఎత్తుగడ కాస్తా వికటించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పూర్తిగా తలుపులు మూసేసింది. 2027 వరకూ ఉండాల్సిన అధ్యక్షపదవి మరికొన్ని రోజుల్లో ఊడటం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మితవాద పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) తరఫున 2022 ఎన్నికల్లో పోటీచేసేనాటికి యూన్ అనామకుడు. అప్పటికి హద్దులు దాటిన ద్రవ్యోల్బణం, ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడ్డ తీవ్ర అసంతృప్తి ఆసరాగా చేసుకుని ఆయన అధ్యక్షుడిగా విజయం సాధించాడు. అయితే ప్రత్యర్థి డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే–మ్యుంగ్ కన్నా ఆయనకు కేవలం ఒక శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. మ్యుంగ్ సఫాయి కార్మికుడి కుమారుడు.సంపన్నవంతమైన దక్షిణ కొరియాకు అసలు సమస్యలేమిటన్న సందేహం అందరికీ వస్తుంది. దాని తలసరి ఆదాయం 36,000 డాలర్లు. పొరుగునున్న చైనాతో పోల్చినా ఇది మూడు రెట్లు అధికం. అంతర్జాతీయ మార్కెట్లో మెరిసిపోయే బ్రాండ్లకు అది పుట్టినిల్లు. శామ్సంగ్, హ్యుందయ్, కియా, పోక్సో, ఎల్జీ, ఎస్కే... ఒకటేమిటి రకరకాల సంస్థల స్థావరం ఆ దేశం. వీటిలో 600 కంపెనీల వరకూ మన దేశంతోసహా చాలా దేశాల్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. దక్షిణ కొరియా ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఎగుమతిదారు. ఆసియాలో అది నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. 2009నాటి ఆర్థికమాంద్యాన్ని దక్షిణకొరియా తన దరిదాపులకు రానీయలేదు. అయినా ఏదో తెలియని వెలితి ప్రజలను నిరాశానిస్పృహల్లో ముంచింది. వృద్ధుల శాతం క్రమేపీ పెరగటం, జననాల సంఖ్య పడిపోవటం సమస్యగా మారింది. అధిక పనిగంటల వల్ల మానసిక ఒత్తిళ్లు అధికం కావటం, పెళ్లిళ్లు వాయిదా వేసుకోవటం, దంపతులు సైతం కలిసుండే గంటలు తగ్గిపోవటం వంటివి ఇందుకు కారణాలు. కానీ యూన్ దీన్ని మరో కోణంలో చూశారు. ఫెమినిస్టు ఉద్యమాలే ఈ స్థితికి కారణమంటున్న ఉద్యమాలను వెనకేసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా స్త్రీ ద్వేషాన్ని చాటుకున్నారు. అధికారం చేతికి రాగానే లింగ సమానత్వాన్ని పర్యవేక్షించే సంస్థను రద్దుచేశారు. మహిళలకుండే వెసులుబాట్లు కొన్ని రద్దుచేశారు. పైగా వారానికి 52 గంటల పనిని కాస్తా పెంచే ప్రయత్నం చేశారు. వైద్యరంగ ప్రక్షాళన పేరిట దాన్ని అస్తవ్యçస్తం చేశారు. పర్యవసానంగా దేశం సమ్మెలతో హోరెత్తింది. దీనికితోడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎడాపెడా అవినీతికి పాల్పడ్డారు. కనుకనే మొన్న ఏప్రిల్లో 300 స్థానాలుగల నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిపినప్పుడు భారీ స్థాయిలో 67 శాతంమంది పోలింగ్లో పాల్గొన్నారు. విపక్షమైన డెమాక్రటిక్ పార్టీకి 180 స్థానాలు రాగా, అధికారపక్షం 108 స్థానాలకు పరిమితమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కూడా గత సైనిక పాలకుల్ని కీర్తించటం యూన్ ఒక అలవాటుగా చేసుకున్నారు. వారివల్లే దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని ఆయన నిశ్చితాభిప్రాయం. ఇందుకు భిన్నంగా ప్రజలంతా ఆనాటి నియంతృత్వాన్ని మరిచిపోలేకపోయారు. 1987కు ముందున్న సైనిక పాలన తెచ్చిన అగచాట్లు గుర్తుండబట్టే యూన్ ప్రకటన వెలువడిన వెంటనే జనం వరదలై పోటెత్తారు. ప్రజల మద్దతు గమనించినందు వల్లే అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంటుకు బారులు తీరారు. ప్రధానద్వారాన్ని సైనికులు మూసేయగా జనం సాయంతో స్పీకర్తో సహా అందరూ గోడలు దూకి, కిటికీలు బద్దలుకొట్టి భవనంలోకి ప్రవేశించారు. సైనిక పాలన వెనక్కు తీసుకోవాలంటూ అధ్యక్షుణ్ణి కోరే తీర్మానాన్ని హాజరైన 190మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. శత్రు దేశాలను చూపించి, కమ్యూనిస్టుల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే శకం ముగిసిందని దక్షిణ కొరియా ఉదంతం చెబుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలుండటం తప్పనిసరి. కానీ వాటిని సాకుగా చూపి అందరినీ మభ్యపెట్టి అధికారంలోకొచ్చాక నియంతృత్వ పోకడలకు పోతే చెల్లదని జనం చాటారు. యూన్ ఏలుబడి ఎప్పుడు ముగుస్తుందన్న సంగతి అలావుంచితే, ప్రజలు ఇదే చైతన్యాన్ని కొనసాగించగలిగితే భవిష్యత్తులో అక్కడ ఏ పాలకుడూ నియంతగా మారే ప్రమాదం ఉండదు. -
అకాలీల ప్రస్థానం ఎటువైపు?
పంజాబ్లో అవసానదశలో పడిన అకాలీదళ్కు కాయకల్ప చికిత్స చేసి రక్షించటానికి చేసిన ప్రయత్నం కాస్తా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రాణానికి ముప్పు తెచ్చింది. బుధవారం ఆయనపై కాల్పులు జరపబోయిన ఖలిస్తానీ మిలిటెంట్ నారాయణ్ సింగ్ చౌరాను అక్కడున్నవారు సకాలంలో నిరోధించకపోయివుంటే పంజాబ్లో మరో నెత్తుటి అధ్యాయం మొదలయ్యేది. గత తప్పిదాలకు బాదల్నూ, ఇతర నేతలనూ సిక్కు అత్యున్నత పీఠం అకల్తఖ్త్ మతద్రోహులుగా ప్రకటించి విధించిన శిక్షలు అమలవుతుండగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. పంజాబ్ స్థితిగతులు ప్రత్యేకమైనవి. మతమూ, రాజకీయాలూ కలగలిసి పోవటాన్ని వ్యతిరేకించేవారు సైతం ఈ ప్రత్యేకతను గమనించబట్టే అక్కడ అకాలీదళ్ వంటి మధ్యేవాద పక్షం అవసరమని భావిస్తారు. లేనట్టయితే మతాన్ని తలకెక్కించుకున్న అతివాదులది అక్కడ పైచేయి అవుతుందని వారి వాదన. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అకాలీదళ్ను బలహీనపరచటానికి భింద్రన్వాలే వంటి మిలిటెంట్లకు మొదట్లో అందించిన పరోక్ష ప్రోత్సాహం పంజాబ్కు శాపంగా మారింది. పరిస్థితి చేయిదాటాక అమృత్సర్ స్వర్ణాలయంలో తలదాచుకున్న భింద్రన్వాలేను, అతని ముఠాను అదుపు చేయటానికి సైన్యంతో నిర్వహించిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కాస్తా వికటించి చివరకు ఇందిర ప్రాణాలనే బలితీసుకుంది. ఆ హత్యకు ప్రతీకారమన్నట్టు ఢిల్లీతోసహా దేశంలో అనేకచోట్ల కాంగ్రెస్ నేతలు వెనకుండి సిక్కులపై సాగించిన హత్యాకాండ పర్యవసానంగా ఉగ్రవాద గ్రూపులు పుట్టుకొచ్చాయి. దశాబ్దంపాటు పంజాబ్ కనీవినీ ఎరుగని కల్లోలం చవిచూసింది. వేలాదిమంది అమాయక పౌరులు ఆహుతయ్యారు. ఉగ్రవాదాన్ని అదుపుచేయటం కోసమంటూ భద్రతా బలగాలు సాగించిన ఎన్కౌంటర్లు, అపహరణలు, అదృశ్యాలు సరేసరి. మన దేశంలో నామరూపాల్లేకుండా పోయిన ఆ ఉద్యమం ప్రస్తుతం కెనడాలో సాగిస్తున్న కార్యకలాపాల పర్యవసానమేమిటో కనబడుతూనే వుంది. అయిదుగురు సిక్కు మత పూజారుల అత్యున్నత పీఠం అకల్తఖ్త్ సుఖ్బీర్ సింగ్ బాదల్ను స్వర్ణాలయ ప్రధానద్వారం వద్ద సాధారణ సేవాదార్గా పనిచేయాలని తీర్మానించింది. ఆయన తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నానని తెలిపే పలకను మెడలో ధరించారు. ఇతర అకాలీ నేతలకు స్వర్ణాలయంలో అంట్లు తోమటం నుంచి మరుగుదొడ్లు శుభ్రం చేయటం వరకూ వేర్వేరు శిక్షలు విధించింది. ఈ శిక్షలకు 2007–17 మధ్య పంజాబ్లో ఆ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగిన కూటమి సర్కారులోని భాగస్వామ్య పక్షమైన బీజేపీ అత్యుత్సాహం కారణం. పంథ్ కోసం ప్రాణత్యాగాలు చేసిన వ్యక్తులను విస్మరించి, సిక్కులను అనేకవిధాల హింసించి చంపిన రిటైర్డ్ పోలీసు అధికారుల కుటుంబ సభ్యులకు పదవులు పంచిపెట్టడం అకాలీదళ్ నేతలు చేసిన ‘ప్రధాన నేరం’. వీరిలో చాలామంది బీజేపీవారు కాగా, అకాలీ తరఫున ఎంపికైనవారు కూడా ఉన్నారు. అలాగే మతాన్ని అపవిత్రం చేసిన దేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీంపై ఉన్న కేసుల్ని ఆయన కోరకుండానే రద్దుచేయటం, దాన్ని సమర్థించుకోవటానికి తమకు అనుకూలంగా ప్రకటన ఇవ్వాల్సిందిగా జతేదార్లను పిలిపించి ఒత్తిడి చేయటం వంటివి ఇతర ఆరోపణలు. అధికారంలో ఉండగా చేసిన పనులకు అకాలీదళ్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. 1920లో ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రైతాంగం దూరమైంది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. దానికితోడు సాగు సంక్షోభం, ఉపాధి లేమివంటì సమస్యలు మధ్యతరగతిని, ఇతర వర్గాలవారినీ అసంతృప్తిలో ముంచెత్తాయి. అందుకే అకాలీలను వరస ఓటములు వెంటాడాయి. పర్యవసానంగా అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రంగప్రవేశం అకాలీని నిలువునా ముంచింది. ఆ పార్టీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో అభ్యర్థుల్ని కూడా నిలబెట్టలేకపోయింది. తన భాగస్వామ్య పక్షాన్ని బలహీనపరిచి ఎదగాలని చూసే బీజేపీ ఎత్తుగడలు ఆ రాష్ట్రంలో ఫలించలేదు. అందుకే అకాలీ నేతల ‘తప్పుల’కు తగిన శిక్ష విధించి, వారికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశమీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖడ్ గత నెలలో అకల్తఖ్త్కు విజ్ఞప్తి చేశారు. అయితే ఉగ్రవాదం విస్తరిస్తుందన్న సాకుతో రాజకీయాల్లో మత సంస్థల ప్రాబల్యం పెంచటం ఎంతవరకూ సబబన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఆప్ ఆగమనం, అది అధికార పీఠాన్ని కైవసం చేసుకోవటం విశ్లేషిస్తే మత రాజకీయాల ప్రాబల్యం బలహీన పడిందన్న అభిప్రాయం కలుగుతుంది. అకాలీదళ్ 1977 తర్వాత బాదల్ కుటుంబ ప్రాబల్యంలోకొచ్చాక రాష్ట్రంలో సిక్కు–నిరంకారీ ఘర్షణలు పెరిగాయి. అటూ ఇటూ పదులకొద్దీ మంది మరణించారు. ఇందిర పుణ్యమా అని ఉగ్రవాదం విస్తరించింది. ఈ అయోమయ పరిస్థితుల్లో 1996లో బీజేపీతో కలిసి ప్రయాణించటానికి నిర్ణయించుకుని మోగాలో జరిగిన పార్టీ సమావేశాల్లో సిక్కు మత మూలాలున్న అకాలీదళ్ను సెక్యులర్ పార్టీగా మారుస్తూ తీర్మానించటం పంథ్ అనుకూల ఓటర్లను క్రమేపీ పార్టీకి దూరం చేసింది. బీజేపీ ఆ పని చేయకపోవటాన్ని అందరూ వేలెత్తి చూపారు. అకాలీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ జోషి పార్టీ తిరిగి పంథ్ అనుకూల వైఖరి తీసుకుని శిక్షలకు తలొగ్గటాన్ని నిరసిస్తూ అకాలీదళ్కు రాజీనామా చేశారు. ఈ అంతర్మథనం బాదల్పై జరిగిన తాజా దాడితో ఏయే మలుపులు తీసుకుంటుందో, అకాలీదళ్ ప్రస్థానం ఎలా కొనసాగుతుందో మున్ముందు చూడాలి. -
బైడెన్ పుత్రవాత్సల్యం
చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండటం, తలకెత్తుకున్న విలువలను చివరివరకూ శిరోధార్యంగా భావించటం అంత తేలిక కాదు. అధికార వైభోగాల్లో మునిగితేలేవారికి అది ప్రాణాంతకం కూడా. ఇందుకు మినహాయింపు ఎవరని జల్లెడ పడితే ప్రపంచవ్యాప్తంగా వేళ్లమీద లెక్కబెట్టేంత మంది మిగులుతారేమో! అధికార పీఠం నుంచి మరో నెలన్నరలో తప్పుకోబోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్కు క్రిమినల్ కేసుల నుంచి విముక్తి కలిగించే ఉత్తర్వులపై ఆదివారం సంతకం చేసిన ఉదంతం ఇప్పుడు అమెరికాలో పెద్ద చర్చనీయాంశమైంది. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ అధికార పీఠం అధిష్ఠించాక ఒక్కొక్కరి సంగతీ చూస్తానంటూ వీలైనప్పుడల్లా హూంకరిస్తున్నారు. ప్రత్యేకించి హంటర్ బైడెన్ గురించి కూడా చెప్పారు. మన అధమస్థాయి నేతల్లా ‘రెడ్ బుక్’ అని పేరేమీ పెట్టుకోలేదుగానీ వేధించదల్చుకున్నవారి పేర్లన్నిటినీ ఒక చిట్టాలో రాసుకున్నట్టే కనబడుతోంది. కత్తికి పదును పెట్టుకుంటున్న వైనం కళ్ల ముందే కనబడుతోంది. 2021 జనవరి 6న వాషింగ్టన్లో కీలక వ్యవస్థలన్నీ కొలువుదీరిన కాపిటల్ హిల్లోకి చొరబడి కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించిన మూకకు క్షమాభిక్ష పెట్టడం ఆయన తొలి ప్రాధాన్యం. ఆ కేసుల్ని దర్యాప్తు చేసినవారినీ, కేసులు దాఖలు చేసిన న్యాయవాదులనూ, వీరి వెనకున్న డెమాక్రటిక్ నేతలనూ జైళ్లపాలు చేయటం ట్రంప్ ఎజెండా. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అయితేనేమి... ఇతర సందర్భాల్లో అయితేనేమి తాను విలువలకు మారు పేరని బైడెన్ ఒకటికి పదిసార్లు చెప్పుకున్నారు. క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని విచారణ ఎదుర్కొంటున్న తన కుమారుడు హంటర్ బైడెన్కు అధ్యక్షుడిగా విశేషాధికారాలను వినియోగించి క్షమాభిక్ష పెట్టే యోచన లేదని చెప్పారు. నిరుడు హంటర్ను వివిధ అభియోగాల్లో నేరస్తుడని ప్రకటించి, శిక్షాకాలాన్ని తర్వాత ప్రకటిస్తామని న్యాయస్థానం చెప్పినప్పుడు ‘తుది నిర్ణయం ఏదైనా శిరసావహిస్తాను. న్యాయవిచారణ ప్రక్రియను గౌరవిస్తాను’ అని బైడెన్ ప్రకటించారు. ఆర్నెల్ల క్రితం ఇటలీలో జీ–7 సమావేశాల సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సైతం ఆయన దీన్నే చెప్పారు. మరేమైంది? తన మాటల్ని తానే ఎందుకు మింగేశారు? సరిగ్గా 82 ఏళ్ల వయసులో పదవి నుంచి నిష్క్రమించే వేళ తన డెమాక్రటిక్ పార్టీని ఎందుకని ఇరుకున పడేశారు? తమది పురాతన పరిణత ప్రజాస్వామ్యమని అమెరికన్లు గొప్పలు పోతారు. ఎవరైనా– సామాన్య పౌరులైనా, ఉన్నతస్థాయి నేతలైనా–తమ దేశంలో చట్టం ముందు సమానులేనని చెప్పుకుంటారు. అయితే అదంతా నిజం కాదని అడపా దడపా రుజువవుతూనే ఉంటుంది. పైపైన చూస్తే ఇప్పుడు బైడెన్ చర్య కూడా ఆ తానులో ముక్కేనని అందరూ భావిస్తారు. కానీ ఆయన అందర్నీ మించిపోయాడన్నది డెమాక్రాట్లలోనే వినిపిస్తున్న విమర్శల సారాంశం. ఎందుకంటే ఇంతక్రితం అధ్యక్షులు తమ సన్నిహితులకు క్షమాభిక్ష పెట్టారు తప్ప సంతానానికి ఇలాంటి వెసులుబాటు కల్పించే స్థితి ఏర్పడలేదు. గతంలో జార్జి డబ్లు్య బుష్ అమెరికా రక్షణ మంత్రిగా పనిచేసిన కాస్పర్ వీన్బెర్గర్నూ, మరికొంతమంది అధికారులనూ ఇరాన్–కాంట్రా వ్యవహారంలో నేరారోపణల నుంచి విముక్తం చేశారు. బిల్ క్లింటన్ తన సవతి సోదరుడిని మాదకద్రవ్యాల కేసు నుంచి తప్పించారు. ట్రంప్ మాత్రం 2016–20 మధ్య ఎడాపెడా క్షమాభిక్షలు ప్రకటించారు. అందులో తన అల్లుడు జేర్డ్ కుష్నెర్ తండ్రి చార్లెస్ కుష్నెర్ ఒకరు. ఆయనకు పన్ను ఎగవేత కేసులో రెండేళ్ల శిక్షపడగా క్షమాభిక్ష పెట్టారు. అతన్నిప్పుడు ఫ్రాన్స్ రాయబారిగా కూడా ప్రకటించారు. హంటర్కు క్షమాభిక్ష పెట్టాక విడుదల చేసిన ప్రకటనలో బైడెన్ తన కుమారుణ్ణి కావాలని అన్యాయంగా ఇరికించి విచారణ తంతు సాగించారని ఆరోపించారు. అతణ్ణి జైలుపాలుచేసి మానసికంగా తనను ఛిద్రం చేయాలని చూస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. ‘ఇది ఇక్కడితో ఆగుతుందనుకోవటానికి లేద’ని ప్రకటించారు. హంటర్ కేసుల్ని గమనిస్తే జో బైడెన్ది పుత్ర ప్రేమ తప్ప మరేం కాదని సులభంగా తెలుస్తుంది. ఆయన మాదకద్రవ్యాల వినియోగంలో ఒకప్పుడు మునిగి తేలేవాడు. దశాబ్దం క్రితం ఆయనది చీకటి జీవితం. ఒబామా హయాంలో తన తండ్రి ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయానికి హంటర్ కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. అతని ప్రవర్తన బైడెన్కు చాలా తలనొప్పులు తెచ్చిపెట్టింది. తుపాకీ కొనుగోలు చేశాక దాన్ని తన దగ్గర కేవలం 11 రోజులే ఉంచుకుని తిరిగి అధికారులకు అప్పగించి ఉండొచ్చు. కానీ దరఖాస్తు చేసినప్పుడు తన నేర చరిత్ర దాచిపెట్టాడు. మాదక ద్రవ్యాలు వాడుతున్న సంగతిని చెప్పలేదు. పన్ను ఎగవేత కేసు సరేసరి. మొత్తానికి రెండు రకాల న్యాయం అమలవుతున్న వైనం కళ్ల ముందు కనబడుతుండగా అనవసర స్వోత్కర్షలకు పోరాదని ఇకనైనా అమెరికన్లు గుర్తించాల్సివుంది. నిజానికి ఇలాంటి అసమ వ్యవస్థే ట్రంప్ వంటివారి ఆవిర్భావానికి దారితీసింది. ఏదేమైనా విలువల గురించి మాట్లాడే నైతికార్హత డెమాక్రాట్లు కోల్పోయారు. ట్రంప్ మున్ముందు ఏం చేయబోతారో ఎఫ్బీఐ డైరెక్టర్గా కాష్ పటేల్ నియామకమే చెబుతోంది. దాన్ని చూపించి బైడెన్ చర్య హేతుబద్ధమైనదని డెమాక్రాట్లు చెప్పలేరు. పైపెచ్చు వచ్చే నాలుగేళ్లలో తాను చేసే ప్రతి అక్రమాన్నీ సమర్థించుకోవటానికి డోనాల్డ్ ట్రంప్ బైడెన్ను ఉదాహరిస్తుంటే వారు మౌనంగా మిగిలిపోక తప్పదు. -
సుంకాల బెదిరింపు
పదవీ బాధ్యతలు పూర్తిగా చేపట్టక ముందే అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దూకుడు పెంచారు. ‘అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం’ (అమెరికా ఫస్ట్) మంత్రాన్ని పదే పదే వల్లె వేస్తున్న ఆయన పదవీ బాధ్యతలు చేపడుతూనే చైనా పైనే కాక ఇతర దేశాలపైనా సుంకాలు విధిస్తానని ఇప్పటికే ప్రకటించారు. పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలూ ఆంక్షల పాలయ్యే జాబితాలో ఉన్నాయి. అమెరికా వాణిజ్య, విదేశాంగ విధానంలో రానున్న పెనుమార్పుకు ఇది ఓ సూచన అనీ, రానున్న ట్రంప్ పదవీకాలంలో ఈ జాబితా మరింత పెరగడం ఖాయమనీ విశ్లేషణ. దానిపై చర్చోపచర్చలతో వారమైనా గడవక ముందే కాబోయే అగ్రరాజ్యాధినేత మరో బాంబు పేల్చారు. ‘బ్రిక్స్’ దేశాలు గనక అమెరికా డాలర్కు ప్రత్యర్థిగా మరో కరెన్సీని సృష్టించే ప్రయత్నం చేస్తే ఆ దేశాలపై 100 శాతం సుంకాలు వేస్తామంటూ హెచ్చరించారు. ఆయన తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’పై చేసిన ఈ తాజా ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాకూ, వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకూ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణానికి ఇది ప్రతీక. అంతేకాదు... ఈ హెచ్చరికే గనక అమలు అయితే, ప్రపంచ వాణిజ్యం రూపురేఖలనే మార్చివేసే అనూహ్య పరిణామం అవుతుంది. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌతాఫ్రికాలతో కూడిన కూటమిగా ముందు బ్రిక్స్ ఏర్పాటైంది. ఆపైన ఈజిప్ట్, యూఏఈ, ఇథియోపియా, ఇరాన్లు సైతం ఆ బృందంలో చేరాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా డాలర్ సాగిస్తున్న గుత్తాధిపత్యానికి ముకుతాడు వేయాలనేది కొంతకాలంగా బ్రిక్స్ దేశాల్లో కొన్నిటి అభిప్రాయం. డాలర్ను రాజకీయ అస్త్రంగా వాడకుండా నిరోధించగల ప్రత్యామ్నాయ అంతర్జాతీయ చెల్లింపుల విధానం అవసరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ అక్టోబర్లో ప్రస్తావించడం గమనార్హం. బ్రిక్స్ దేశాలు డాలర్ స్థానంలో మరో కరెన్సీకి గనక మద్దతునిస్తే మొత్తం కథ మారిపోతుంది. అయితే, డాలర్ నుంచి పక్కకు జరగడం వల్ల అమెరికాతో, ఇతర పాశ్చాత్య దేశాలతో సంబంధాలు దెబ్బతిని దారుణ పర్యవసానాలుంటాయని మరికొన్ని బ్రిక్స్ దేశాల భయం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరిక వెలువడింది. ప్రతీకారంగా అమెరికా 100 శాతం సుంకం వేస్తే, సరుకుల ధరలు పెరిగిపోతాయి. ప్రపంచ వాణిజ్య ప్రవాహాలు అతలాకుతలమవుతాయి. నిజానికి, విదేశీ దిగుమతులపై కఠినంగా సుంకాలు విధించి, అమెరికా ఉత్పత్తులకు కాపు కాస్తానని వాగ్దానం చేయడం కూడా తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి దోహదపడిందని విస్మరించలేం. ‘అమెరికా ఫస్ట్’ ఆర్థిక విధానానికి అనుగుణంగానే ట్రంప్ తాజా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రపంచ వాణిజ్యంలో మార్పులతో అమెరికా ఆర్థిక సార్వభౌమాధికారం పునఃప్రతిష్ఠితమవుతుందనేది ఆయన వ్యూహం. ఇప్పుడీ సుంకాల పర్వం మొదలైతే, అది చివరకు ప్రపంచ వాణిజ్య యుద్ధంగా పరిణమిస్తుంది. ఈ సుంకాలన్నీ అమెరికా ప్రయోజనాల్ని కాపాడేందుకు సాహసోపేత నిర్ణయంగా కనిపించవచ్చు కానీ, వాటి తక్షణ ప్రభావం పడేది అమెరికా వినియోగదారులు, వ్యాపారాల మీదనే. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, వ్యావసాయిక ఉత్పత్తులు సహా రోజు వారీ అవసరాలైన అనేక సరుకుల ధరలు పెరుగుతాయి. ఇతర దేశాల విడిభాగాలపై ఆధారపడినందు వల్ల అమెరికా వ్యాపార సంస్థలు చేసుకొనే దిగుమతులపై భారం పడుతుంది. ఆ సంస్థల లాభాలు తగ్గుతాయి. అమెరికా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో పోటీపడలేకపోతాయి. అమెరికాను అప్పుల నుంచి బయటపడేసేందుకు ట్రంప్ మాత్రం మిత్రదేశాలతోనూ కఠినంగా వ్యవహరించడానికి వెనుకాడకపోవచ్చు. వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు తమ ఆదాయానికి అమెరికాపై అతిగా ఆధారపడుతుంటాయి. ఇక, ఎగుమతులపై ఎక్కువగా నడిచే బ్రెజిల్, సౌతాఫ్రికా ఆర్థిక వ్యవస్థలూ మందగిస్తాయి. కొత్త సుంకాల బాధిత దేశాలు గనక ప్రతిచర్యలకు ఉపక్రమిస్తే పరిస్థితి దిగజారుతుంది. గతంలో ఈ తరహా వాణిజ్య వివాదాలు తెలిసినవే. వాటిని నివారించడానికే అమెరికా సైతం అనేక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు అంగీకరించింది. ఇప్పుడీ సుంకాలతో వాటికి అర్థం లేకుండా పోతుంది. దౌత్య పర్యవసానాలూ తప్పవు. అక్రమ వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా లాంటివి అరికట్టడానికి పొరుగు దేశాలపై సుంకాలు పనికొస్తాయని ట్రంప్ టీమ్ చెబుతున్నా, ఆశించిన ఫలితాలు దేవుడెరుగు... ఉద్రిక్తతలు పెరిగి, దేశాలతో సంబంధాలు, దీర్ఘకాలిక సహకారం దెబ్బతింటాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ వాణిజ్య యుద్ధంతో మరింత అనిశ్చితిలో పడుతుంది. ఈ ప్రతిపాదిత సుంకాలను బూచిగా చూపి, బ్రిక్స్ సహా ఇతర దేశాలనూ చర్చలకు రప్పించడమే అమెరికా ధ్యేయమైతే ఫరవా లేదు. అలా కాని పక్షంలో అనేక దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయ అన్వేషణను ముమ్మరం చేయవచ్చు. ట్రంప్ కఠిన వైఖరితో వర్ధమాన దేశాలు, అలాగే బ్రిక్ సభ్యదేశాలు మరింత దగ్గరవుతాయి. అది చివరకు అగ్రరాజ్యానికే నష్టం. అయితే, ప్రపంచమంతా వ్యతిరేకించినా సరే తాను అనుకున్నదే చేయడం ట్రంప్ నైజం. పర్యావరణం, వాణిజ్యం, సైనిక దండయాత్రలపై గతంలో ఆయన చేసిందదే. తాత్కాలికంగా ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం పెద్ద పెద్ద మాటలు చెప్పడం బాగుంటుంది. వాటిని ఆచరణలో పెట్టాలన్నప్పుడు దీర్ఘకాలిక పర్యవసానాల్ని ఆలోచించకపోతే కష్టమే. అమెరికా కొత్త ప్రెసిడెంట్ అది గ్రహించి, ఆచితూచి వ్యవహరించాలి. కానీ, ఆకస్మిక, అనూహ్య నిర్ణయాలకే పేరుబడ్డ ట్రంప్ నుంచి అంతటి ఆలోచన ఆశించగలమా అన్నది ప్రశ్న. అనాలోచితంగా వ్యవహరిస్తే, అది అమెరికాకే కాదు... యావత్ ప్రపంచానికీ తంటా! -
మానని గాయం
ఆధునిక కాలంలో మనిషి అంతరిక్షాన్ని అందుకోగలిగాడు; చంద్రమండలం మీద అడుగు మోప గలిగాడు; సహజ మేధకు పోటీగా కృత్రిమ మేధను సృష్టించాడు; విశ్వామిత్ర సృష్టిని తలపించేలా మనుషులకు దీటైన మరమనుషులను సృష్టించాడు. ఇంతటి మహత్తర ఘనతలను చూసినప్పుడల్లా ‘మానవుడే మహనీయుడు/ శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు... జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే!’ అనుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోతాం. రేపో మాపో అంగారక గ్రహం మీద ఆవాసాలను ఏర్పాటు చేసే దిశగా మనుషులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్నప్పుడు ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతాం. మనిషి సాధించిన ఘన విజయాలను ఏకరువు పెట్టాలంటే, ఎన్ని గ్రంథాలైనా చాలవు.చరిత్రలో ఇన్ని ఘన విజయాలు సాధించిన మనిషికి అనాది పరాజయాలు కూడా ఉన్నాయి. ఆధునికత సంతరించుకుని, అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్న మనిషి–అమరత్వాన్ని సాధించే దిశగా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే, ఆకలి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని నేటికీ కనుక్కోలేకపోవడం మాత్రం ముమ్మాటికీ మనిషి వైఫల్యమే! యుద్ధాలలో ఉపయోగించ డానికి అధునాతన ఆయుధాలను ఎప్పటికప్పుడు తయారు చేయగలుగుతున్న మనిషి – అసలు యుద్ధాల అవసరమే లేని శాంతియుత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం కూడా వైఫల్యమే! ప్రపంచంలో మనిషికి క్షుద్బాధను మించిన దుర్భర బాధ మరొకటేదీ లేదు. పురాణ సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు ఆకలి ప్రస్తావన మనకు విరివిగా కనిపిస్తుంది. తాను ఆకలితో అలమటిస్తున్నా, అతిథికి అన్నం పెట్టి పుణ్యలోకాలకు వెళ్లిన రంతిదేవుడి కథ తెలిసినదే! ఆకలికి తాళలేక కుక్కమాంసం తిన్న విశ్వామిత్రుడి కథ పురాణ విదితమే! ఆకలి బాధ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది.అందుకు విశ్వామిత్రుడి కథే ఉదాహరణ. పురాణాల్లో అక్షయపాత్రలు పుణ్యాత్ముల ఆకలి తీర్చిన గాథలు ఉన్నాయే గాని, సామాన్యుల ఆకలి తీర్చిన ఉదంతాలు లేవు. ఆకలితో అలమ టిస్తున్నా, త్యాగం చేయడం గొప్ప సుగుణమని చెప్పే పురాణాలు – ఆకలికి శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చెప్పలేదు.ఆధునిక సాహిత్యంలో ఆకలి ప్రస్తావనకు కరవు లేదు. స్వాతంత్య్రోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అని ఎలుగెత్తిన గరిమెళ్ల – ఆ పాటలోనే ‘పన్నెండు దేశాలు పండుతున్నాగాని/ పట్టెడన్నమె లోపమండీ/ ఉప్పు పట్టుకుంటే దోషమండీ/ నోట మట్టి కొట్టుకుపోతామండీ/ అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండీ’ అంటారు. స్వాతంత్య్రం రాక ముందు మన దేశంలోని ఆకలి బాధలు అలా ఉండేవి. ప్రపంచమంతా ఆర్థికమాంద్యంతో అతలా కుతలమైన హంగ్రీ థర్టీస్ కాలంలో కలాలతో కవాతు చేసిన కవులందరూ ఆకలి కేకలు వినిపించిన వారే! ‘ఆకలి ఆకలి తెరిచిన/ రౌరవ నరకపు వాకిలి/ హృదయపు మెత్తని చోటుల గీరే జంతువు ఆకలి/... ఈ ఆకలి హోరు ముందు/ పిడుగైనా వినిపించదు/ ఆకలి కమ్మిన కళ్లకు/ ప్రపంచమే కనిపించదు’ అన్న బైరాగి ‘ఆకలి’ కవిత పాఠకులను విచలితులను చేస్తుంది. ‘అన్నపూర్ణ గర్భగుడిని/ ఆకలి గంటలు మ్రోగెను/ ఆరని ఆకలి కీలలు/ భైరవ నాట్యము చేసెను/ ఘోర పరాజ యమా ఇది?/ మానవ మారణ హోమం/ తల్లీ! ఆకలి... ఆకలి!’ అంటూ సోమసుందర్ ఆకలి కేకలు వినిపించారు.‘నేను ఆకలితో ఉన్నాను/ నువ్వు చంద్రుడి వద్దకు వెళ్లావు... నేను తిండిలేక నీరసిస్తున్నాను/ నాకు వాగ్దానాలు మేపుతున్నావు’ అంటూ ఆధునిక శాస్త్ర సాంకేతిక పురోగతి ఒకవైపు, ఆకలి బాధలు మరోవైపుగా ఉన్న ఈ లోకంలో పాలకుల తీరును శ్రీశ్రీ ఎత్తిపొడుస్తారు. ఇప్పటికీ లోకం తీరు పెద్దగా మారలేదు. మానవుడు పంపిన ఉపగ్రహాలు అంగారకుడి వద్దకు వెళ్లినా, ఆకలి బాధలు సమసి పోలేదు; ఆకలి చావులు ఆగిపోలేదు.మనిషి ఘన విజయాల చరిత్రలో ఆకలి, అశాంతి– రెండూ మాయని మరకలు. ఈ రెండు మరకలూ పూర్తిగా చెరిగిపోయేంత వరకు మనిషి ఎన్ని విజయాలు సాధించినా, అవేవీ మానవాళికి ఊరటనూ ఇవ్వలేవు; మానవాళిని ఏమాత్రం ఉద్ధరించనూ లేవు. ఆకలికి, అశాంతికి మూలం మను షుల్లోని అసమానతలే! ప్రపంచంలో అసమానతలు తొలగిపోనంత వరకు ఆకలిని రూపుమాపడం, శాంతిని నెలకొల్పడం అసాధ్యం. నిజానికి సంకల్పం ఉంటే, సాధ్యం కానిదంటూ ఏదీ లేదు గాని, అసమానతలను రూపుమాపే సంకల్పమే ఏ దేశంలోనూ పాలకులకు లేదు. అందువల్లనే ఆకలి, అశాంతి మనుషులను తరతరాలుగా పట్టి పీడిస్తున్నాయి. అకాల మరణాలకు కారణమవుతున్నాయి. ఆకలి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు పాతికవేల నిండు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అంటే, ఏడాదికి సగటున ఏకంగా తొంభై లక్షల మంది ఆకలికి బలైపోతున్నారు. ఆకలితో మరణిస్తున్న వాళ్లలో పసిపిల్లలు కూడా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న శిశుమరణాల్లో దాదాపు యాభై శాతం ఆకలి చావులే! నాణేనికి ఇదొకవైపు అయితే, మరోవైపు వంద కోట్లమందికి ఆకలి తీర్చడానికి తగినంత ఆహారం ప్రతిరోజూ వృథా అవుతోంది. ఈ పరిస్థితిని గమనించే ‘అన్నపు రాసులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట’ అని కాళోజీ వాపోయారు.ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఐదో స్థానంలో ఉన్న మన దేశం– ఆకలి సూచిలో నూట ఐదో స్థానంలో ఉండటం ఒక కఠోర వాస్తవం. అమృతోత్సవ భారతంలో ఆకలి సమస్య ఒక మానని గాయం! -
వ్యక్తిత్వాన్ని దహించలేరు!
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిట్టనిలువునా దహించడానికి,అడ్డంగా నరికివేయడానికి చాలాకాలంగా కొందరు వ్యూహకర్తలు పడుతున్న ఆపసోపాలను గమనిస్తున్నాము. విషపు కత్తుల్ని విసురుకుంటూ జాగిలాలను విదిలిస్తూ పదమూడేళ్లుగా వారు పడుతున్న ప్రయాసను చూస్తున్నాము. కానీ ఏమైనది? వ్యక్తిత్వం మీద నీలాపనిందలు మోపగలరేమో! బురద చల్ల గలరేమో! మసి పూయగలరేమో! వెలుగు రేకను మబ్బులు కాస్సేపు మాయం చేయగలవేమో! అది త్రుటికాలం మాత్రమే! నిక్కమైన వ్యక్తిత్వాన్ని కూడా మబ్బులు శాశ్వతంగా మాయం చేయలేవు.ఘంటసాల గాత్ర మాధుర్యం కారణంగా భగవద్గీతలోని శ్లోకాలు కొన్ని తెలుగు వారికి బాగా పరిచయమైపోయాయి. ‘‘నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః! ...’’ అనే శ్లోకం కూడా అందులో ఒకటి. ‘ఆత్మ ఎట్టి ఆయుధము చేతనూ ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుప బడదు, వాయువుచే ఎండిపోదు’ అని దాని తాత్పర్యం. వ్యక్తిత్వం కూడా అటువంటిదే! ఎటువంటి ఆయుధం చేతనూ ముక్కలు చేయబడదు. అగ్నిచే కాల్చబడదు.జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని ఒక ధారావాహికగా కొనసాగిస్తున్న తీరును గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. తెలుగు నేలపైనున్న ఒక బలమైన వర్గం చాలా ముందుచూపుతో మీడియా రంగంలో బ్రూటల్ డామి నెన్స్ను ఏర్పాటు చేసుకోగలిగింది. ట్రెజర్ హంట్ చేయాలన్నా, పవర్ హంట్ చేయాలన్నా మీడియా కంటే పదునైన ఆయుధం లేదనే సంగతిని ఈ వర్గం గుర్తించింది. ఆయుధం మీద ఆధిపత్యాన్ని సంపాదించగలిగింది. ఎన్టీ రామారావును అధికార పీఠంపై ప్రతిష్ఠించగలిగింది. ఆయన వల్ల తమ వర్గానికి అనుకున్నంత మేలు జరగడం లేదన్న గ్రహింపు కలగగానే చంద్రబాబును ప్రత్యామ్నాయంగా నిలబెట్టిన వైనం సరిగ్గా మూడు దశాబ్దాల కిందటి చరిత్ర.మీడియా తుపాకీ ట్రిగ్గర్ను చంద్రబాబు నొక్కగానే ఎన్టీ రామారావు కుప్పకూలిపోయాడు. అప్పటి నుంచి చంద్రబాబు, ఆయన మిత్ర మీడియా తోడూనీడలా కలిసిపోయారు. ‘నీకింత – నాకింత’ అనే డ్యూయెట్ పాడుకుంటూ రాజ్యాధికారాన్ని వారు అనుభవించసాగారు. ఎదురు నిలబడేవారి మీద మీడియా వెపన్ను గురిపెట్టారు. ఎన్టీ రామారావే వీరి ముందు నిలబడలేకపోవడంతో చాలామంది భయపడ్డారు.ఒక్క రాజశేఖరరెడ్డి మాత్రమే వారిని ధిక్కరించి నిల బడ్డారు. చాలాకాలం పాటు వారిని ఎదిరించారు. విజయాలు సాధించారు. కానీ దురదృష్టం. ఆయన అకాల మరణంతో బాబు కూటమి మళ్లీ బుసలుకొట్టింది. వైఎస్ఆర్ మరణించిన రోజునే తమకు భవిష్యత్తులో దీటైన ప్రత్యర్థి కాగల యువకుడిని వారు గుర్తించగలిగారు. ఆరోజు నుంచే జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం మొదలైంది. ఇప్పటికి పదిహేనేళ్లు దాటింది.చంద్రబాబు పార్టీ, యెల్లో మీడియాగా పేరుపడ్డ ఆయన మిత్ర మీడియా జగన్మోహన్రెడ్డిపై నిరంతరాయంగా దాడులు జరుపుతూనే ఉన్నది. దేశాల మధ్య జరిగే భీకర యుద్ధాల్లో కూడా కొన్ని నియమాలుంటాయి. శత్రు దేశాల మీద రసాయన బాంబులు వేయడం, విషవాయువుల్ని వెదజల్లడం వంటివి నిషిద్ధం. కానీ యెల్లో మీడియాకు ఇటువంటి విధినిషేధాలేమీ లేవు. జగన్ మోహన్రెడ్డిపై ప్రయోగించని అస్త్రం లేదు. చేయని ప్రచారం లేదు. కానీ జగన్ తట్టుకొన్నారు. తట్టుకొని జనబలంతో నిల బడ్డారు. ఘన విజయాలను నమోదు చేయగలిగారు. ‘అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె’ అనుకుంటూ యెల్లో కూటమి నిర్వేద స్థితిలోకి జారిపోయింది. బీజేపీని బతిమాలు కొని వారి అండతో బాబు కూటమి ఒక ‘సాంకేతిక విజయా’న్ని సాధించగలిగింది.సాంకేతిక విజయంతో గద్దెనెక్కిన ఈ ఆరు మాసాల్లో అరడజనుకు పైగా దారుణమైన నిందల్ని జగన్పై మోపి, తమ ‘సూపర్ సిక్స్’ వైఫల్యాన్ని చర్చలోకి రాకుండా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు. అరడజన్ నిందారోపణలు – ‘సూపర్ సిక్స్’ వైఫల్యాలుగా ఈ ఆరు మాసాల పుణ్యకాలం గడిచిపోయింది. తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఎల్లో మీడియా దేవతా వస్త్రాలతో ఊరేగుతూ ఎంత కంపరం పుట్టిస్తున్నదో ఇప్పుడు చూస్తున్నాము. ‘సెకీ’ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో! అదీ వ్యవసాయ రంగానికి నాణ్య మైన, నికరమైన, ఉచిత విద్యుత్ను అందజేయడం కోసం! జగన్ కంటే ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సౌర విద్యుత్ కోసం ప్రైవేట్ సంస్థలతో ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ సంస్థలకు ఆయన సగటున యూనిట్కు రూ. 5.90 కట్ట బెట్టారు.జగన్మోహన్రెడ్డి ‘సెకీ’తో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ ధర రూ.2.49. ఎక్కువ ధర చెల్లిస్తూ ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందంలో స్కామ్ ఉండే అవకాశం ఉంటుందా? సగానికంటే తక్కువ రేటు పెట్టి ప్రభుత్వ సంస్థతో చేసుకునే ఒప్పందంలో స్కామ్ ఉంటుందా? అదనపు ఛార్జీలంటూ దీనికేదో మెలికపెట్టే ప్రయత్నాన్ని యెల్లో మీడియా కొనసాగిస్తున్నది. కానీ దీనికి అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీ లను వర్తింపచేయడం లేదని ‘సెకీ’ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగానే పేర్కొన్నది. పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వ్యవసాయ విద్యుత్ కోసం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ అందుకు సహాయకంగా ఈ ఒప్పంద ప్రతిపాదన చేసింది.ఈ ఒప్పందంలోని మూడు కీలక అంశాలను పరిశీలించాలి. మొదటిది: ఇది కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మధ్య జరిగిన ఒప్పందం మాత్రమే! ఇందులో ఎక్కడా థర్డ్ పార్టీ ప్రమేయం లేదు. రెండు: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత తక్కు వగా రూ.2.49కే యూనిట్ సరఫరా చేస్తామని ప్రతిపాదించడం. మూడు: ప్రత్యేక ప్రోత్సాహకం కింద ఈ ఒప్పందానికి అంత ర్రాష్ట్ర రవాణా ఛార్జీలను మినహాయిస్తున్నట్టు చెప్పడం. ఇంత స్పష్టత, పారదర్శకత ఉన్న ఒప్పందం మధ్యలో స్కామ్ ఏ రకంగా దూరుతుంది?‘సెకీ’తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవ డానికి ముందు అదానీ అప్పటి ముఖ్యమంత్రిని కలిశారని అమెరికా దర్యాప్తు సంస్థ చెప్పిందట! యెల్లో మీడియాకు ఇది చాలదా? కోతికి కొబ్బరిచిప్ప దొరికినంత సందడి. జగన్ మోహన్రెడ్డికి అదానీ ముడుపులు అందాయంటూ పతాక శీర్షికలు పెట్టి వార్తలు వేశాయి. ఇంతకంటే నీతిబాహ్యత వేరే ఉంటుందా? అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక ప్రముఖ వ్యక్తి ప్రతిష్ఠతో ఆటలాడుకోవడం కాదా? ‘సెకీ’తో ఒప్పందం, సీఎంను అదానీ కలవడం... రెండూ వేరువేరు విషయాలు. సౌరవిద్యుత్ ఒప్పందానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు ఈ ఒప్పందం కుదిరింది. రవాణా ఛార్జీల మినహాయింపు బోనస్. ఇది రాష్ట్రానికి విజయం – లాభదాయకం!ఇక అదానీ గానీ, అంబానీ గానీ, ఇతర పారిశ్రామిక వేత్తలెవరైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని కలవడం సర్వసాధారణమైన విషయం. పధ్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా పనిచేసిన చంద్రబాబును అందరికంటే ఎక్కువమందే పారిశ్రామికవేత్తలు కలిసి ఉంటారు. ఆ భేటీలన్నీ స్కామ్ల కోసమే అనుకోవాలా? ఒక వ్యక్తి పట్ల గుడ్డి వ్యతిరేకత, ద్వేషం, పగ పేరుకొనిపోయి ఉంటే తప్ప ఇంత దిగజారుడు ప్రచారం సాధ్యం కాదు.ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకో కష్టం వచ్చిపడింది. గద్దెనెక్కి ఆరు మాసాలు కావస్తున్నా ఎన్నికల ముందు వారు హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ఒక్కడుగు కూడా ముందుకు పడలేదు. నిరుద్యోగ యువతకు నెలకు 3 వేల రూపా యల భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు సరిగదా ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేదు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ నెలకు 15 వేలు (నీకు పదిహేను, నీకు పదిహేను ఫేమ్) ఇస్తామ న్నారు. ఇప్పుడు దాని ఊసెత్తడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ‘అమ్మ ఒడి’ని ఎత్తిపారేశారు. ప్రతి రైతుకూ ఏటా 20 వేల సాయం చేస్తామన్నారు. ‘రైతు భరోసా’ను ఎత్తేశారు తప్ప కొత్త సాయం గురించిన ఆలోచనే చేయలేదు. ప్రతి మహిళకూ నెలకు 1500 రూపాయలిస్తామన్నారు. అదీ మరిచి పోయారు. ప్రతి మహిళకూ ఉచిత బస్సు ప్రయాణం అదుగో ఇదుగో అనడం తప్ప ఆ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీకి గాను ఈ యేడాదికి ఒక్క సిలిండర్తో సరిపెట్టారు. ‘సూపర్ సిక్స్’లోని ఐదు హామీలను అటకెక్కించి ఒక్క దాంట్లో మూడో వంతు నెరవేర్చారన్నమాట!హామీల అమలులో ఈ దారుణ వైఫల్యం పట్ల సహజంగానే ప్రజల్లో అసంతృప్తి బయల్దేరింది. ఇంత కీలకమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం జగన్ వ్యక్తిత్వ హనన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు జరుగుతున్న ఘటనల ద్వారా అర్థమవుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగానే తాజాగా ‘సెకీ’ ఒప్పందంపై ఓ కపట నాటకాన్ని ప్రదర్శించారు. ఇంతకుముందు తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసి విజ్ఞుల చేత చీవాట్లు తిన్న తర్వాత తోక ముడిచారు. విజయవాడ వరదల సందర్భంగా పాలనాపరమైన వైఫల్యాన్ని కప్పిపుచ్చి ప్రకాశం బ్యారేజీలో వైసీపీవాళ్లు బోట్లు అడ్డంపెట్టి నగరాన్ని ముంచేశారని హాస్యపూరితమైన ఆరోపణ చేశారు. అప్పుల గణాంకాలపై ఇప్పటికీ పిల్లిమొగ్గలు వేస్తూనే అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చిన లెక్కలకు విరుద్ధంగా అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి ప్రజల ఆశలకు ఆలంబనగా నిలబడి రెండు లక్షల డెబ్బయ్ మూడు వేల కోట్ల రూపా యలను వారి అకౌంట్లలోకి బదిలీ చేసిన ‘నవరత్న’ పథకాలను అవహేళన చేస్తూ స్కీములన్నీ స్కాములేనని ప్రచారం చేశారు.జగన్ ఐదేళ్ల పాలననూ, కూటమి సర్కార్ తాజా ఆరు మాసాల పాలననూ జనం బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి, జనం ముందు జవాబుదారీ తనాన్ని నిలబెట్టుకున్న జగన్ వ్యక్తిత్వాన్నీ, ఎన్నికల హామీలన్నీ హుష్ కాకీ అంటున్న చంద్రబాబు వ్యక్తిత్వాన్ని జనం పోల్చి చూసుకుంటున్నారు. పేదబిడ్డల బంగారు భవిష్యత్తు కోసం వారి నాణ్యమైన చదువులపై వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టిన జగన్ విజన్కూ, పేదలకు ఇంగ్లిష్ మీడియం అవసరం లేదని ఎత్తిపారేసిన చంద్రబాబు విజన్కూ మధ్యనున్న తేడాలోని రహస్యమేమిటో తెలుసుకుంటున్నారు. ప్రజలందరి సాధికార తకు పెద్దపీట వేసిన జగన్ ఫిలాసఫీని, కొద్దిమందికి కొమ్ముకాసే చంద్రబాబు ఫిలాసఫీని ఆమూలాగ్రంగా పరిశీలిస్తున్నారు. ఎల్లకాలం జనం కళ్లకు గంతలు కట్టడం సాధ్యం కాదు. ప్రత్యర్థి వ్యక్తిత్వహననంతో పబ్బం గడుపుకోవాలంటే ప్రతిసారీ కుద రదు. ఇప్పుడు యెల్లో మీడియాకు జగన్ లీగల్ నోటీసులు పంపించారు. ఇక జనంలో చర్చ మొదలవుతుంది. ఇద్దరి వ్యక్తిత్వాల మీద ఆ చర్చ జరగాల్సిందే!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మౌనం ప్రమాదకరం!
ఎవరు చికాకు పడినా, ఎంతగా అయిష్టత ప్రదర్శించినా ఈవీఎంలపై సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. అడుగుతున్న వారిని తప్పుబట్టి, వారిపై ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంటే ఇది సమసి పోదు. ఎందుకంటే సమస్య ఒకటే కావొచ్చుగానీ... దాని సారాంశం, స్వభావం మారుతు న్నాయి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్వై ఖురేషీ వ్యాఖ్యలతో ఈవీఎంలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. నాయకులు ఈ సమస్య లేవనెత్తితే ఓటమి నెపం ఈవీఎంలపై నెడు తున్నారని ఆరోపించవచ్చు. కానీ సీఈసీ బాధ్యతలు నిర్వర్తించిన ఖురేషీ వంటివారు సందేహ పడటాన్ని ఏమనుకోవాలి? చిత్రమేమంటే ఎన్నికల సంఘం (ఈసీ) ఈ సంశయాల విషయంలో మూగనోము పాటిస్తున్నది. ఇందువల్ల తన తటస్థ పాత్రకు తూట్లు పడుతున్నదని, అందరూ తనను వేలెత్తిచూపే రోజొకటి వస్తుందని ఈసీ పెద్దలకు తెలిసినట్టు లేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంల అవకతవకలు మాత్రమే కాదు...ఈసీ చేతగానితనం కూడా బయటపడుతోంది.ఈనెల 13–20 మధ్య రెండు దశల్లో జార్ఖండ్లోనూ, 20న ఒకేసారి మహారాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్లో ఇండియా కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కానీ మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన రోజున పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిశాక మొత్తం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని ప్రకటన వెలువడింది. అదే రోజు రాత్రికల్లా దీన్ని సవరించి 65.02 శాతమని తెలిపారు. ఆ తర్వాత కౌంటింగ్కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. మొత్తంగా చూస్తే ఓటింగ్లో 7.83 శాతం పెరుగుదల కనబడింది. దీన్ని ఓటర్ల సంఖ్యలో చూస్తే ఈ పెరుగుదల స్థూలంగా 76 లక్షల మేర ఉన్నట్టు లెక్క. జార్ఖండ్ది మరో కథ. అక్కడ తొలి దశ పోలింVŠ కూ, మలి దశ పోలింగ్కూ మధ్య 1.79 శాతం పెరుగుదల కనబడింది. రెండో దశలో ఈ పెరుగుదల 0.86 శాతం మాత్రమే. మహారాష్ట్రలో చూపించిన పెరుగుదల శాతానికీ, జార్ఖండ్ పెరుగుదల శాతానికీ ఎక్కడైనా పొంతన వుందా? ఓటర్ల సంఖ్య చూస్తే జార్ఖండ్ తొలి దశలో 2,22.114మంది పెరగ్గా, రెండో దశలో ఆసంఖ్య 1,06,560. మహారాష్ట్ర పెరుగుదలతో దీనికెక్కడైనా పోలికుందా? ఓటింగ్ పూర్తయ్యాక ప్రక టించే అంకెలకూ, చివరిగా ప్రకటించే అంకెలకూ మధ్య వ్యత్యాసం ఉండటం సర్వసాధారణం. కానీ ఇదెప్పుడూ ఒక శాతం మించలేదని మేధావులు చెబుతున్నారు. దీనికి ఈసీ సంజాయిషీ మౌనమే! ఇప్పుడున్న విధానంలో పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పోలైన ఓట్ల సంఖ్య ఎంతో తెలిపే డేటా తయారవుతుంటుంది. అలాంటపుడు కొన్ని గంటలకూ, కొన్ని రోజులకూ ఇది చకచకా ఎలా మారి పోతున్నది? అందులోని మర్మమేమిటో చెప్పొద్దా?మొన్న మే నెల 13న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో సైతం ఇదే తంతు కొనసాగింది. ఆరోజు రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రాత్రి 11.45కి దీన్ని సవరించి మొత్తం 76.50 శాతమని తెలిపింది. మరో నాలుగు రోజులకల్లా తుది పోలింగ్ శాతం 80.66 అని గొంతు సవరించుకుంది. అంటే మొదట చెప్పిన శాతానికీ, మరో నాలుగు రోజుల తర్వాత ప్రకటించిన శాతానికి మధ్య 12.5 శాతం ఎక్కువన్నమాట! సాధారణ అంకెల్లో చూస్తే 49 లక్షలమంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చినట్టు లెక్క. కొన్ని నియోజక వర్గాల్లో తెల్లారుజామువరకూ పోలింగ్ సాగుతూనే వుంది. సాయంత్రం గడువు ముగిసే సమయానికి ఆవరణలో ఉన్న ఓటర్లకు స్లిప్లు ఇచ్చి గేట్లు మూసేయాలన్న నిబంధనవుంది. అంతేకాదు. క్యూలో చిట్టచివర గేటు దగ్గరున్న ఓటరుకు ఒకటో నంబర్ స్లిప్ ఇచ్చి అక్కడినుంచి క్రమేపీ పెంచుకుంటూపోయి బూత్ సమీపంలో ఉన్న వ్యక్తికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్లు సేకరించి భద్రపరచాలి. సీసీ కెమెరా డేటా జాగ్రత్త చేయాలి. ఇదంతా జరిగిందా? వాటి మాట దేవుడెరుగు... పరాజితులు న్యాయస్థానంలో సవాలు చేసిన సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీ ప్యాట్ స్లిప్లను ధ్వంసం చేశారు. ఈవీఎంలలో నమోదైన చార్జింగ్ మరో ప్రహసనం. భద్రపరిచినప్పుడు ఈవీఎంలో వున్న చార్జింగ్కూ, కౌంటింగ్ రోజున తెరిచినప్పుడున్న చార్జింగ్కూ పోలికే లేదు. రోజులు గడిచేకొద్దీచార్జింగ్ తగ్గటమే అందరికీ తెలుసు. కొన్ని ఈవీఎంలలో పెరుగుదల కనబడటాన్ని ఏమనుకోవాలి?తిరిగి బ్యాలెట్ విధానం అమలుకు ఆదేశించాలంటూ కె.ఏ. పాల్ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చుతూ ఓడినవారే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తుంటారని ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజమే కావొచ్చు. గెలిచినవారికి ఆ అవసరం ఉండకపోవచ్చు. కానీ ఆమధ్య ఒక స్వచ్ఛంద సంస్థ, ఇప్పుడు మాజీ సీఈసీ ఆధారసహితంగా ఆరోపించటాన్ని ఏమనాలి? నిజమే... గతంలోనూ ఈ మాదిరి ఆరోపణలు వచ్చివుండొచ్చు. ఓటమి జీర్ణించుకోలేకే టీడీపీ, బీజేపీ, అకాలీ దళ్ ఆరోపించాయని భావించటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలు తగిన ఆధారాలు చూప లేకపోయాయి. ఇప్పుడింత బాహాటంగా కళ్లముందు కనబడుతున్నా, డేటా వేరే కథ వినిపిస్తున్నా, ఈసీ తగిన సంజాయిషీ ఇవ్వలేకపోతున్నా మౌనంగా ఉండిపోవాలా? పరాజితులది అరణ్యరోదన కావటం ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడటా నికి దారితీసే వైపరీత్యం. అందుకే వ్యవస్థలన్నీ నటించటం మానుకోవాలి. ఏం జరిగివుంటుందన్న దానిపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలి. లేదా తప్పు జరిగిందని అంగీకరించాలి. ఇందులో మరో మాటకు తావులేదు. -
కోర్టులు కదిపిన తేనెతుట్టెలు
దేవుడు అంతటా, అందరిలో ఉన్నాడని నమ్మే గడ్డపై... ఆయనను నిర్ణీత స్థల, కాలాలకే పరిమితం చేసే సంకుచిత రాజకీయ స్వార్థాలు చిచ్చు రేపుతూనే ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య విద్వేషాగ్ని రగిలిస్తున్న ఈ ప్రయత్నాలకు తాజా ఉదాహరణ – యూపీలోని సంభల్ జామా మసీదు వివాదం, దరిమిలా అక్కడ రేగిన హింసాకాండ, ఆస్తి, ప్రాణనష్టం. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనతో మందిరం – మసీదు వివాదాలు ముగిసిపోతాయని ఎవరైనా ఆశపడితే అది వట్టి అడియాసని మరోసారి తేలిపోయింది. మత రాజకీయాలకూ, వర్గ విభేదాలకూ ప్రార్థనా స్థలాలు కేంద్రాలు కారాదనే సదుద్దేశంతో చేసిన ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం–1991 స్ఫూర్తికే విఘాతం కలిగింది. ప్రార్థనా మందిరాల నిర్మాణమూలాలను తెలుసుకోవాలన్న ఒక వర్గం ఉత్సాహం తప్పేమీ కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఒక దశలో అదాటున చేసిన వ్యాఖ్యలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. వివాదం వస్తే చాలు... దేశంలో ప్రతి చిన్న కోర్టూ అనాలోచితంగా సర్వేలకు ఆదేశించేలా ఊతమిచ్చాయి. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం. తాజా ఘర్షణలకు కేంద్రమైన సంభల్లోని షాహీ జామా మసీదు 16వ శతాబ్దికి చెందిన రక్షిత జాతీయ కట్టడం. వారణాసిలోని జ్ఞానవాపి, యూపీలోని మథురలో నెలకొన్న ఈద్గా, మధ్యప్రదేశ్ లోని ధార్లో ఉన్న కమాల్ మౌలా మసీదుల్లో లానే దీనిపై రచ్చ మొదలైంది. అక్కడ కేసులు వేసినవారే ఇక్కడా కోర్టుకెక్కారు. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టిన 3 మసీదుల్లో (పానిపట్, అయోధ్య, సంభల్) ఇదొకటి. ప్రాచీన హరిహర మందిర్ స్థలంలో ఈ మసీదును నిర్మించారని పిటిషనర్ల వాదన. జిల్లా కోర్టులో ఈ నెల 19న కేసు వస్తూనే జడ్జి మసీదులో ఫోటో, వీడియో సర్వేకు ఆదేశిస్తూ, 29వ తేదీ కల్లా నివేదిక సైతం సమర్పించాలన్నారు. తొలి సర్వే ప్రశాంతంగా సాగినా, నవంబర్ 24 నాటి రెండో సర్వే భారీ హింసకు దారి తీసింది. సర్వేకు వచ్చినవారిలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారనీ, దాంతో నిరసనకారులు రాళ్ళురువ్వారనీ వార్త. కాల్పుల్లో అయిదుగురు మరణించారు. అమాయకుల ప్రాణాలు, పట్నంలో సామరస్య వాతావరణం గాలికెగిరి పోయాయి.శతాబ్దాల తరబడి అన్ని వర్గాలూ కలసిమెలసి జీవిస్తున్న చోట విద్వేషాగ్ని రగులుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అయోధ్య, వారణాసి వివాదాలకు భిన్నంగా సంభల్ కథ చిత్రంగా ఈ ఏడాదే తెర మీదకొచ్చింది. పశ్చిమ యూపీలో సంభల్ జిల్లా మూడు దశాబ్దాలుగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)కి కంచుకోట. 1980ల నుంచి అక్కడ అధికారం కోసం బర్ఖ్, మెహమూద్ కుటుంబాలు వేర్వేరు పార్టీల పక్షాన పరస్పరం తలపడుతూ వచ్చాయి. తర్వాత 1990ల నుంచి రెండు వర్గాలూ ఎస్పీతోనే అనుబంధం నెరపుతున్నాయి. అధికారంలో పైచేయి కోసం ఒకే పార్టీలోని ఈ రెండు వర్గాల మధ్య పోరాటమే తాజా హింసకు కారణమని బీజేపీ ప్రచారం చేస్తోంది. హిందూ – ముస్లిమ్ల తర్వాత, ఇక ముస్లిమ్లలోని ఉపకులాల మధ్య చీలికలు తీసుకురావడానికే కాషాయ ధ్వజులు ఈ ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఖండిస్తోంది. మొఘల్ శిల్పనిర్మాణ శైలికి ఈ మసీదు ప్రతీకైతే, ఈ సంభల్ ప్రాంతం విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి వచ్చే ప్రదేశమని హిందువుల నమ్మిక. భిన్న విశ్వాసాల మధ్య సొంత లాభం చూసుకొనే కొందరి రాజకీయంతో సమస్య వచ్చి పడింది. నిజానికి, 1947 ఆగస్ట్ 15కి ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారమే అన్ని ప్రార్థనా ప్రదేశాలూ కొనసాగాలి. ఒక్క అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదమే దానికి మినహాయింపని దీర్ఘకాలం క్రితమే కేంద్ర సర్కార్ చేసిన 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం. అయోధ్య తరహాలో మరిన్ని సమస్యలు రాకూడదన్నది దాని ప్రధానోద్దేశం. ఏ ప్రార్థనా స్థలాన్నీ పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ ఒక మతవిశ్వాసం నుంచి మరోదానికి మార్పిడి చేయరాదనీ, చర్చ పెట్టరాదనీ చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టంగా నిషేధించింది. అయితే, ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపమేమిటో నిర్ధారించడం చట్టవిరుద్ధం కాదంటూ 2002 మేలో జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు సందు ఇచ్చాయి. అనేకచోట్ల చిన్న కోర్టులు మందిర– మసీదు వివాదాలపై విచారణ చేపట్టి, పర్యవసానాలు ఆలోచించకుండా హడావిడిగా సర్వేలకు ఆదేశిస్తున్నాయి. సంభల్ ఘటన తర్వాతా అజ్మీర్లోని ప్రసిద్ధ షరీఫ్ దర్గాను గుడిగా ప్రకటించాలంటూ దాఖలైన కేసును రాజస్థాన్ కోర్ట్ అనుమతించడం ఓ మచ్చుతునక. సమస్యల్ని తేల్చాల్సిన గౌరవ కోర్టులే ఇలా తేనెతుట్టెల్ని కదిలించడం విషాదం.ప్రార్థనాస్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీమ్లో ఇప్పటికే నాలుగు పిటిషన్లున్నాయి. దానిపై నిర్ణయానికి కేంద్రం, కోర్ట్ తాత్సారం చేస్తుంటే ఆ లోగా వారణాసి, మథుర, ధార్, సంభల్, తాజాగా అజ్మీర్... ఇలా అనేక చోట్ల అత్యుత్సాహం వ్యక్తమవుతోంది. ఇది శాంతి, సామరస్యాలకు పెను ప్రమాదం. ఈ ప్రయత్నాలను ఆపేందుకు సర్కారు కానీ, సర్వేలపై జోక్యానికి సుప్రీమ్ కానీ ముందుకు రాకపోవడం విడ్డూరం. ఒక వివాదాస్పద స్థలపు ధార్మిక స్వభావ అన్వేషణ చారిత్రక నిర్ధారణ, పురాతత్వ అన్వేషణతో ఆగుతుందనుకుంటే పొరపాటు. అది మత పరంగా, రాజకీయంగా రావణకాష్ఠమవుతుంది. కాశీ, మథురల్లో, ఇప్పుడు సంభల్ జరుగుతున్నది అదే. ‘ప్రతి మసీ దులో శివలింగాన్ని అన్వేషించాల్సిన పని లేద’ంటూ ఆరెస్సెస్ అధినేత రెండేళ్ళ క్రితం అన్నారు కానీ జరుగుతున్నది వేరు. అధికార వర్గాల అండదండలతోనే ఈ విభజన చిచ్చు రగులుతోందన్నదీ చేదు నిజం. 2019 నవంబర్లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించిన సుప్రీమ్ మరోసారి గట్టిగా ఆ పని చేయకుంటే కష్టమే. ఓ హిందీ కవి అన్నట్టు, మసీదులు పోనివ్వండి... మందిరాలు పోనివ్వండి... కానీ రక్తపాతం మాత్రం ఆపేయండి. మతాలకు అతీతంగా మనిషినీ, మానవత్వాన్నీ బతకనివ్వండి! -
దారుణ విద్వేష క్రీడ!
అయిదు నెలలుగా బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాకులపై అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న పెను సవాళ్ళకు తాజా ఉదాహరణ. మైనారిటీల హక్కుల కోసం బలంగా గళం విప్పే దాస్ బంగ్లాదేశీ జాతీయ పతాకాన్ని అవమానించారంటూ రాజద్రోహ నేరం మోపడం విడ్డూరం. ఆయనను మంగళవారం అరెస్ట్ చేసి, బెయిలివ్వకుండా, పది రోజుల కస్టడీకి పంపడంతో నిరసనలు చెలరేగాయి. సందట్లో సడేమియాగా దుష్టశక్తులు అల్లర్లు రేపి, పొరపాటున ఓ ముస్లిమ్ లాయర్ మరణానికి కారణమై, ఆ పాపం మైనా రిటీల నెత్తిన వేయడంతో ఢాకా మరోసారి భగ్గుమంది. ఆలయాలపై దాడులు, ప్రాణనష్టంతో... మైనారిటీలనూ, భావప్రకటనాస్వేచ్ఛనూ కాపాడాలంటూ బంగ్లాను భారత్ అభ్యర్థించాల్సొచ్చింది.ఇస్లామ్ అధికారిక మతమైనా, లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంగా, సమానత్వానికి రాజ్యాంగ బద్ధులమని చెప్పుకొనే బంగ్లా ఆ మాటకు తగ్గట్టు వ్యవహరించడం మానేసి, చాలాకాలమైంది.అందుకు తగ్గట్టే తాజాగా ‘ఇస్కాన్’ను ర్యాడికల్, మత ఛాందసవాద సంస్థ అని బంగ్లా అటార్నీ జనరల్ బుధవారం అభివర్ణించడం ఆందోళనకరం. ‘ఇస్కాన్’ను నిషేధించాలని బంగ్లా యోచిస్తు న్నట్టు వార్త. ఆధ్యాత్మిక చైతన్యం, పీడిత జన సముద్ధరణ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో పనిచేస్తున్న ఒక సంస్థపై అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడం అక్షరాలా బుద్ధిహీనతే. దేశంలోని విభిన్న వర్గాల మధ్య సౌహార్దం పెంపొందించి, బాధితులకు న్యాయం చేసి, మానవ హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏ శక్తుల ప్రోద్బలంతో ఇలా మాట్లాడుతోందన్నది ఆశ్చర్యకరం. జూలై నాటి ప్రజా ఉద్యమంతో ఢాకాలో ప్రభుత్వ మార్పు జరిగిపోయింది కానీ, అల్పసంఖ్యాక వర్గాలపై సాగుతున్న దాడులు మాత్రం అప్పటి నుంచి ఆగడం లేదు. మైనారిటీలను పూర్తిగా తరిమేసి, బంగ్లాను హిందూ రహిత దేశంగా మార్చాలనే పన్నాగం దీనికి వెనక ఉందని స్థానిక స్వతంత్ర విశ్లేషకుల మాట. ఈ అల్లర్లు, అల్పసంఖ్యాక హిందువులపై దాడుల వెనుక మత ఛాందస జమాతే ఇస్లామీ ఉందనేది స్పష్టం. హసీనా సర్కారు కాలంలో నిషేధానికి గురైన ఈ ర్యాడికల్ గ్రూపు, అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)లు యూనస్ యంత్రాంగంలో భాగమే. అసలు ఈ ప్రయత్నమంతా ఇస్లామిక్ షరియత్ను ప్రవేశపెట్టి, బంగ్లాదేశ్ను ప్రజాస్వామ్య ఎన్నికలు, పార్ల మెంట్తో పని లేని దేశంగా మార్చాలనే వ్యూహంలో భాగమని ఒక వాదన వినిపిస్తోంది. అదే గనక నిజమైతే, అత్యంత ప్రమాదకర పరిణామం. పౌరసమాజం, రాజకీయ నేతలు, ప్రజలు కలసి కట్టుగా అలాంటి వ్యూహాలను భగ్నం చేసి, కష్టించి సంపాదించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి. అసలు అఫ్ఘన్ లాగానే బంగ్లాను తమ ప్రయోగశాలగా చేసుకోవాలని పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్నట్టుంది. అప్పుడిక బంగ్లా మరో తీవ్రవాద కేంద్రంగా మారే ప్రమాదముంది. అది భారత్కే కాదు... యావత్ ప్రపంచానికి నష్టం. నిజానికి, ఆసియా – పసిఫిక్ కూటమిలో బంగ్లాను భాగం చేసుకొని, లబ్ధి పొందాలని అమెరికా భావించింది. నిరుటి హసీనా సర్కార్ నో చెప్పడంతో అది కుదరలేదు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలిచి ఉంటే ఏమో కానీ, ట్రంప్ గెలవడంతో బంగ్లా మధ్యంతర సర్కార్ సారథి – ట్రంప్ ద్వేషి ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ట్రంప్ పగ్గాలు చేపట్టాక బంగ్లాపై కఠినవైఖరి అవలంబిస్తారని యూనస్కు తెలుసు. అందుకే, ఆలోగా మైనారిటీలపై అల్లర్లను ఆఖరి అస్త్రంగా చేసుకున్నారట. బంగ్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణకు అయిదు దశాబ్దాల పైచిలుకు క్రితం భారత్ అండగా నిలిచింది. కానీ, ఇప్పుడు అదే గడ్డపై భారత వ్యతిరేకత, మైనారిటీలపై ద్వేషాలను స్వార్థపరులు పెంచిపోషించడం విషాదం. దాదాపు 14 ఏళ్ళ పైగా షేక్ హసీనా ఏలుబడిలో నియంత పోకడల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత సాగిందని ఆరోపణలొస్తే, కొత్త హయాం కూడా తక్కువేమీ తినలేదు. విజృంభిస్తున్న విద్వేషం, విధ్వంసం ఢాకాలో పత్రికా స్వాతంత్య్రానికి సైతం ముప్పుగా మారాయి. ‘ప్రథమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’లాంటి స్వతంత్ర పత్రికా రచనకు పేరుపడ్డ పత్రికలపై దాడులు అందుకు ఓ మచ్చుతునక. బాధితు లకు సత్వర న్యాయం కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్ళ ఏర్పాటు సహా మైనారిటీల కనీసపాటి ఆకాంక్షల్ని నెరవేర్చడానికి బంగ్లా సర్కార్కు ఉన్న కష్టమేమిటి? హసీనా సర్కార్ను గద్దె దింపినప్పటి నుంచి ఇప్పటికి బంగ్లాలో మైనారిటీలపై 2 వేలకు పైగా దాడులు జరిగాయి. హిందూ, బౌద్ధ, క్రైస్తవ సోదరులపై జరుగుతున్న ఈ దౌర్జన్యకాండను మతపరంగా కాక మానవ హక్కుల పరంగా చూడాలి. అప్పుడే సమస్య తీవ్రత అర్థమవుతుంది. 1930లో బంగ్లాలో 30 శాతం పైగా ఉన్న హిందువులు ఇప్పుడు కేవలం 8 శాతం చిల్లరకు పడిపోయారన్న నిష్ఠుర సత్యం అక్కడ జరుగుతున్నదేమిటో ఎరుకపరుస్తుంది. విద్యుత్ సహా, బియ్యం, పత్తి, చమురు లాంటి అనేక సరుకుల విషయంలోనూ మనపై భారీగా ఆధారపడ్డ బంగ్లా సర్కార్పై ఇకనైనా భారత్ కఠినవైఖరిని అవలంబించాలి. పొరుగు దేశంలో బతుకు భయంలో ఉన్న హిందువులను కాపాడేందుకు క్రియాశీలంగా వ్యవహరించాలి. కేవలం మాటలకు పరిమితం కాకుండా, దౌత్య, వాణిజ్య రంగాల్లో చేయగలిగినదంతా చేయాలి. పేరుకు మాత్రం లౌకికవాదం ముసుగు వేసుకొని, మైనారిటీలకు వ్యతిరేకంగా, తెర వెనుక శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మిగిలిన అసమర్థ యూనస్ సర్కార్పై అంతర్జాతీయంగానూ ఒత్తిడి తేవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది.