Editorial
-
జీరో మార్కుల ‘నీట్’!
ఉన్న ఊరునూ, అయినవాళ్లనూ వదిలి వేలాది రూపాయలు వెచ్చించి పట్టణాలు, నగరాలకొచ్చి రాత్రింబగళ్ల ధ్యాసే లేకుండా, తిండితిప్పలు పట్టించుకోకుండా ‘నీట్’ పోటీ పరీక్ష కోసం కోచింగ్ తీసుకోవటంలో తలమునకలైన లక్షలాదిమంది విద్యార్థులు మరోసారి దగా పడ్డారు. ఈ నెల 3న దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీకయిందంటూ ఆ పరీక్ష కాస్తా మంగళవారం రద్దుచేశారు. విద్యార్థులు ఈ వేసవిలో మళ్లీ తిప్పలుపడాలి... కోచింగ్ కోసం మరోసారి అవస్థలు పడాలి. పోటీ పరీక్ష రాశాక ఫలితాలకన్నా ముందు లీకయిందనే వార్తలొస్తాయేమో, మళ్లీ రాయకతప్పదేమోనని కంగారుపడేంతగా ఆ వ్యవస్థను నిర్వాహకులు భ్రష్టుపట్టించారు. పదే పదే ప్రశ్నపత్రాలు లీకవుతున్నా అదే నిర్లక్ష్యం, అదే నిర్లిప్తత! ఒకసారి జరిగిందంటే అనుకోకుండా జరిగిందిలే అని సర్దిచెప్పుకోవచ్చు. ఈసారి తగిన కట్టుదిట్టాలు చేస్తారని సరిపెట్టుకోవచ్చు. ప్రతియేటా ఇదే ప్రహసనమైతే ఏమనాలి? విద్యార్థులకు సక్రమంగా పరీక్షలు నిర్వహించటంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి ఎప్పుడూ సున్నా మార్కులే వస్తున్నాయి.ఈసారి 22 లక్షలమందిపైగా ‘నీట్’ యూజీ పరీక్ష రాశారు. పరీక్ష రోజున దేశ వ్యాప్తంగా జరిగే హడావుడికి అంతులేదు. తనిఖీ పేరిట గేటువద్ద నిర్వహించే శల్య పరీక్షలతోపాటు ఆడపిల్లల ముక్కుపుడకలు, దుద్దులు మొదలుకొని పట్టాలవరకూ అన్నీ తీయించిగానీ లోపలికి పంపరు. ఒకటి రెండు నిమిషాలు లేటయ్యారని వెనక్కిపంపడం షరా మామూలు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, 5జీ జామర్ల ఆర్భాటం సరేసరి. పరీక్షార్థుల లేత ముఖాల్లో కనబడే ఆదుర్దా, వారికి తల్లిదండ్రులిచ్చే భరోసా చూస్తుంటే ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారన్న వేదన కలుగుతుంది. మారుమూల అడవుల్లో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో సమాచారం రాబట్టుకునేంత సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగం ఉంది. అడుగడుగునా నిఘా నీడలు పరుచుకున్నాయని అర్థమ య్యేంతగా నిశితమైన చూపులు వెన్నాడుతుంటాయి. కానీ వాట్సాప్ మాధ్యమంలో వేలాదిమందికి ప్రశ్నపత్రం అందినా 28 రాష్ట్రాల్లో ఏ ఒక్కచోటా వెనువెంటనే ఏ ప్రభుత్వా నికీ ఉప్పందలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. అత్యధిక శాతంమంది హాజరయ్యే పరీక్షల్లో ఒకటైన ‘నీట్’ను స్వచ్ఛంగా, నిర్దుష్టంగా, అవినీతిరహితంగా నిర్వహించుకోలేక పోవటం ఎంత నామర్దా! మంచికో చెడుకో ప్రజాస్వామ్యంలో ‘మెరిట్’కుండే ప్రాధాన్యత, దానికుండే గౌరవా దరాలు అపారం. ‘పుట్టకవల్లే ప్రతిభ’ అనే భావన నిరాకరించి, డబ్బుకొద్దీ చదువన్న వాదన తిరస్కరించి అందరికీ సమానావకాశాలు కల్పించటం మంచిదే. కానీ కోచింగ్ పేరిట డబ్బులు దండుకునే వ్యవస్థ వచ్చిపడింది. హాజరైనవారిలో మెరికల్లాంటి వారిని ఎంపిక చేయటానికి చిక్కుముడులతో ప్రశ్నలుంటాయి. ఉండే సీట్లు తక్కువ, ఆశించే పిల్లలు ఎక్కువమంది ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవని సరిపెట్టుకున్నా... పరీక్ష నిర్వాహకులకూ, ప్రభుత్వాలకూ పరువుప్రతిష్ఠలపై పట్టింపు ఉండొద్దా? సమర్థవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకుందామన్న తాపత్రయం కలగొద్దా? దేశవ్యాప్తంగా దాదాపు 400 మెడికల్ కళాశాలలు నిర్వహించే 40 వరకూ ప్రవేశపరీక్షలు రాయటం, అందుకోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిరావటం సమస్యాత్మకమవుతున్నదని 2016లో ‘నీట్’ తెచ్చి నప్పుడు చెప్పారు. వివిధ పరీక్షలకు వేర్వేరుగా సంసిద్ధం కావటంకన్నా ఒక్క పరీక్షతో ముగుస్తుందని అనేకులు సంతోషించారు. పైగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తరహాలో ఏర్పడే సంస్థ నిర్వహించే పరీక్ష పకడ్బందీగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ జరుగుతున్నదేమిటి? ఎప్పుడు చూసినా లీకులు, మోసాలు, అవకతవకలు! పరీక్షకు పక్షంరోజులముందే ‘ఊహాజనితమైనవ’న్న పేరిట 410 ప్రశ్నలు రాజస్థాన్, ఉత్తరాఖండ్లలో చక్కర్లుకొట్టాయనీ, అటుతర్వాత దేశమంతా వ్యాపించాయనీ వస్తున్న వార్తలు నిజమైతే అంతకన్నా ఘోరం మరొకటుండదు. విద్యారంగంలో మాఫియా ముఠాల ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి తెలుస్తుంది. లక్షలాదిమంది జీవితాకాంక్షలను చిదిమేసే లీకుల్ని అరికట్టి తీరాలన్న సంకల్పం ఇప్పటికైనా పాలకుల్లో కలిగితేతప్ప సమస్యకు పరిష్కారం లభించదు. -
పొదుపు కాలం
ఎన్నికల హోరు సద్దుమణిగి, రాష్ట్రాలన్నిటా ప్రభుత్వాల ఏర్పాటు పూర్తికావస్తున్న దశలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దేశ పౌరులనుద్దేశించి ఒక హెచ్చరిక లాంటి హితోపదేశం చేశారు. పశ్చిమాసియా యుద్ధ పర్యవసానంగా ఏర్పడిన సంక్షోభాన్ని అధిగమించటానికి కోవిడ్ కాలంలో అనుసరించిన పొదుపు చర్యలు తప్పనిసరంటూ పౌరులకు సూచించారు. ఆయన చెప్పినవాటిల్లో వర్క్ ఫ్రం హోం, ప్రజారవాణా వ్యవస్థల వినియోగం, ఏడాదిపాటు బంగారం కొనుగోళ్ల నిలిపివేత, విదేశీ ప్రయాణాలు మానుకోవటం, రైతులు యూరియా వాడకాన్ని తగ్గించటం వంటివి ఉన్నాయి. ఇందులో చాలా వరకూ పాటించదగ్గవే. దీనికితోడు ‘పర్యావరణ పరిరక్షణ’ కోసం ప్రతి ఆదివారం పెట్రోల్ బంక్లు మూసేస్తారు. సోమవారం వెల్లడైన వివరాలనుబట్టి చమురు సంస్థలు రోజూ రూ. 1,700 కోట్లు నష్టపోతున్నాయని తెలుస్తోంది. గత పది రోజుల్లో మొత్తంగా నష్టాలు రూ. లక్ష కోట్ల మేర ఉన్నాయనీ దాని సారాంశం. నిజానికి ఎన్నికల ప్రచారపర్వం మధ్యలో మోదీ ఒకసారి చూచాయగా పరిస్థితి తీవ్రతను చెప్పారు. కానీ ఎన్నికల అనంతరం పెట్రో ధరలు భారీగా పెరుగుతాయనీ, పర్యవసానంగా అన్ని సరుకుల ధరవరలూ ఆకాశాన్నంటుతాయనీ విపక్షాలు ప్రచారం చేయటంతో బీజేపీ బెంబేలుపడి ఇక దాని జోలికిపోలేదు. దేశ ప్రజల్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది. పశ్చిమాసియా ఉద్రిక్తత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను బెంబేలెత్తిస్తోంది. హార్మూజ్ జలసంధిని ఇరాన్, అమెరికాలు దిగ్బంధించటంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. మన దేశం మాత్రమే వీటన్నిటికీ అతీతంగా మనుగడ సాగిస్తుందనీ, మన ఆర్థిక వ్యవస్థ అన్నిటినీ తట్టుకోగలదనీ భావించటం అమాయకత్వం. చైనా మొదలుకొని ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక తదితర దేశాలు ఇప్పటికే రక రకాల చర్యలు అమల్లోకి తెచ్చాయి. చమురు ఎగుమతులన్నీ ఆపేయాలని దేశంలోని చమురుశుద్ధి కర్మాగారాలను చైనా ఆదేశించటంతోపాటు పెట్రో ధరల్ని కూడా పెంచింది. జెట్ ఇంధనం ధరలు పెరగటంతో అక్కడి ఎయిర్లైన్స్ సంస్థలు పలు సర్వీసుల్ని నిలి పేశాయి. ఫిలిప్పీన్స్ మార్చిలోనే జాతీయ ఆత్యయిక స్థితిని ప్రకటించింది. వారానికి నాలుగు రోజుల పనిదినాల్ని ప్రకటించింది. ఆస్ట్రేలియాలో కొన్ని రాష్ట్రాలు ప్రజా రవాణా వ్యవస్థను ఉచిత సర్వీసుగా మార్చటం లేదా టికెట్ ధరలు తగ్గించటం వంటి చర్యలు తీసుకున్నాయి. సొంత వాహనాల వాడకం తగ్గించటమే దీని ఉద్దేశం. శ్రీలంక కూడా వారానికి నాలుగు రోజుల పనివిధానం ప్రకటించి, వారానికి ఒకరోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించటంతోపాటు ఇంధనంపై రేషన్ విధించింది. హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్, అమెరికా పంతాలకు పోవటంతో 1,500 నౌకలు నిలిచిపోయాయి. అందులో మన నౌకలు 13 వరకూ ఉన్నాయి. తాజాగా ఇరాన్ ప్రతిపా దనల్ని అమెరికా తోసిపుచ్చడంతో యుద్ధం ఇప్పట్లో సద్దుమణుగుతుందన్న ఆశ అడుగంటింది. ఉన్నకొద్దీ పరిస్థితి ముదరవచ్చు. అందుకే ప్రధాని చెప్పిన పొదుపు చర్యలు తక్షణ కర్తవ్యం. అయితే ఈ ఆచరణ ప్రభుత్వాలపరంగా మొదలుకావాలి. ఆర్భాటాల్లేకుండా శంకుస్థాపనలూ, ప్రారంభోత్సవాలూ ముగించటం, సాధ్యమైనంతవరకూ ప్రత్యేక విమానాల వాడకం ఆపేయటం, సీఎంలు, మంత్రుల కాన్వాయ్లలో పదులకొద్దీ వాహనాల వినియోగం వంటివి విరమించుకోవాలి. ఇక ఏపీ వరకూ చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ల నివాసాలు హైదరాబాద్లో ఉన్నాయి. వారాంతంలో ప్రత్యేక విమానాల్లో వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి దుబారా అవసరమా? మన దిగుమతుల్లో బంగారం, చమురు సింహభాగం ఆక్రమిస్తాయి. 2025–26లో బంగారం దిగుమతుల విలువ 7,200 కోట్ల డాలర్లు. మనకు అవసరమైన చమురులో 90 శాతంమేర దిగుమతి చేసుకుంటున్నాం. మొన్న ఏప్రిల్ 24కు మన విదేశీ మారకద్రవ్య నిల్వలు 69,000 కోట్ల డాలర్లయితే, ఒక్క వారంలో అంటే... ఈనెల 1 నాటికి అందులో 779 కోట్ల డాలర్లమేర హరించుకుపోయాయి. ఇదే వరస కొనసాగితే సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. అయితే ఏమేరకు పొదుపు అవసరమనేది కూడా చూసుకోవాలి. అది మితిమీరినా ఆర్థికవ్యవస్థకు చేటు తప్పదు. కనుక సమతుల్యత అత్యవసరం. -
చక్రభ్రమణం
ఆశ, నిరాశ, దురాశ, అత్యాశ... ఓహ్, ఆశకెన్ని రూపాలో! అవన్నీ మనిషిలోనే ఉన్నాయి, మనిషిని శాసిస్తూనే ఉన్నాయి; మనిషి చరిత్రను కొత్త మలుపు తిప్పుతూనే ఉన్నాయి. మనిషిలోని దురాశ హఠాత్తుగా యుద్ధవిధ్వంసాలవైపు నడిపిస్తుంది; అదే మనిషిని తిరిగి నిరాశ ఆవహిస్తుంది, అందులోంచి మళ్ళీ ఆశ మొలకెత్తుతుంది. ఇలా ఆశ,నిరాశ, దురాశ, అత్యాశల చక్రం తిరుగుతూనే ఉంటుంది. తన నిరాశను, ఆశతో జయించే ప్రయత్నంలో ఆ నిరాశకు కారణమైన వ్యక్తిని కడతేర్చడం, తిరిగి అవతలి పక్షాన్ని నిరాశ లోకి నెడుతుంది. ఏ యుద్ధంలోనైనా జరిగేది అదే. ఒకరి ఆశ, ఇంకొకరికి నిరాశ! సీతను కోల్పోయి శోకంలో మునిగిన అంతటి రామునిలోనూ ఆశాభావం నింపే బాధ్యతను తమ్ముడు లక్ష్మణుడు తీసుకున్నాడు. ‘ఉత్సాహమే బలం, ఉత్సాహవంతుడికి లోకంలో సాధించలేనిదేమీలే’ దన్నాడు. అలా మేలుకున్న ఆశతో రాముడు సాధించిన విజయం, అవతల మండోదరితో సహా రావణుని పరివారం మొత్తాన్ని శోక, నిరాశల్లో ముంచింది. అంతిమంగా జరిగింది, శోకనైరాశ్యాలు చోటు మారడమే. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిందీ అదే. అయితే, తన ఆశావిజయం ధర్మరాజు శేషజీవితాన్ని శోకమయం చేసింది తప్ప ఊరటనివ్వలేదని, అదే మహాభారతం చెబుతోంది. రెండో ప్రపంచయుద్ధం సృష్టించిన జీవనకల్లోలం మహాకవి శ్రీశ్రీని నిరాశలోకి తోసింది; ‘నిజంగానే నిఖిలలోకం నిండు హర్షం వహిస్తుందా/మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా/దారుణద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా/ బానిసల సంకెళ్ళు బిగిసే పాడుకాలం లయిస్తుందా’ అన్న సందేహాల సందోహంలోకి నెట్టింది; ‘బతుకు వృథా, చదువు వృథా, కవిత వృథా; లేదు సుఖం, చేదువిషం జీవఫలం’ అంటూ ‘చేదుపాట’ పాడించింది. అంతలోనే ఆశ పుంజుకుని మరో ప్రపంచ మహావిష్కారం దిశగా మరో ప్రస్థానం ప్రారంభించింది. తొమ్మిది దశాబ్దాలు కావస్తున్నా, ఆ మరోప్రస్థాన గమ్యం చూపు మేరలో లేదు. జీవఫలం చేదువిషం నింపుతూనే ఉంది; దురాశ వికటించి మనిషి ప్రపంచాన్ని యుద్ధవిలయాలవైపు నడిపిస్తూనే ఉన్నాడు. ‘కాలం బందీ అయి నెత్తురోడే/ కాలం కాని ఈ కాలాల్లో కొంచెం వేచి ఉండు/ ఈ మురుగు ప్రవాహాన్ని ఇప్పుడే ఆపలేవు/ నెమ్మదిగా, నిశ్శబ్దంగా, సహనంగా/ రహస్యంగా, ధైర్యంగా, నమ్మకంగా/ మిగిలి ఉండు, వేచి ఉండు/ తప్పులను లెక్కించి లెక్కించి/ వెక్కి వెక్కి ఏడ్చి ఏమి లాభం/లే, చావులేని నూతన స్వప్నాన్ని పిలువు’ (విమల) అంటూ, ఊపిరి కడంటుతున్న ఆశకు శ్వాసపోసే కవియత్నం ఇప్పటికీ నిరవధికమవుతూనే ఉంది. ఆశల కాగడా పుచ్చుకుని నైరాశ్యపు చీకటిని తరించడానికి మనిషి స్థలకాలాలకు అతీతంగా పోరాడుతూనే ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా కవి, కథకులెందరో అక్షరాల నేలలో ఆశల సేద్యం చేస్తూనే ఉన్నారు. ఓ.హెన్రీ ‘చివరి ఆకు’ కథ గుర్తుందా! ఓ దారుణ శీతర్తువులో తీవ్రంగా జబ్బుపడిన జాన్సీ అనే ఒక యువచిత్రకారిణి తన గది కిటికీ లోంచి ఓ గోడమీద పాకిన లతనే చూస్తూ, రోజురోజుకూ రాలిపోయే దాని ఆకులతో తన రోజుల్ని ముడిపెట్టుకుని ఆందోళన చెందుతుంది. చివరికి ఒక్క ఆకు మాత్రమే మిగులుతుంది. అంతలో పెద్ద గాలివాన వచ్చి వెలుస్తుంది. ఆశ్చర్యం, మరునాడు చూసేసరికి ఆకు అలాగే ఉంటుంది; దాంతో ఆమె జీవనోత్సాహాన్ని పుంజుకుంటుంది. వాస్తవంగా జరిగింది ఏమిటంటే, బెయిర్మన్ అనే ఓ వృద్ధ కళాకారుడు, జాన్సీలో జీవితాశ రగిలించే బాధ్యతను మీద వేసుకుని ఆ గోడమీద వాస్తవికత ఉట్టిపడే ఒక ఆకుబొమ్మ చిత్రిస్తాడు. ఆ ప్రయత్నంలో అతను గాలివాన ప్రభావానికి గురై జబ్బుపడి మరణించడం– కథ తిరిగిన ఓ విషాదకరమైన మలుపు. మోడువారిన చెట్లు చిగురించడం; వసంతం వెంటే గ్రీష్మం అడుగుపెట్టడం చూపించి ఆశ, నిరాశల చక్రభ్రమణం ప్రకృతిలోనే ఉందికదా, మనిషి ఎంత అనవచ్చు. కానీ ఎన్ని రంగాలలో మనిషి ప్రకృతిపై జయకేతనం ఎగురవేయడం లేదు! ఈ చక్రభ్రమణాన్ని ఛేదించలేడా? రేపటికి వాయిదా వేయకుండా ఈ రోజే ఈ ప్రపంచాన్ని పూర్తిగా ఆశావహం చేయలేడా?! -
కోల్కతా టూ చెన్నయ్!
బెంగాల్ విజయంతో బీజేపీ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం పూర్తయినట్టే. జాతీయోద్యమ కాలంలో సమున్నతంగా రెపరెప లాడిన సాంస్కృతిక పతాకం బెంగాల్! ‘ఇవాళ బెంగాల్ ఏమని ఆలోచిస్తుందో రేపు మిగతా భారతదేశం అదే ఆలోచిస్తుంద’ని గోపాలకృష్ణ గోఖలే చేసిన ప్రశంస చరిత్ర ప్రసిద్ధమైనది. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం కూడా బెంగాలే. బీజేపీ తీవ్రంగా ద్వేషించే కమ్యూనిస్టు భావ జాలానికి దేశంలో ఒక దిక్సూచి మాదిరిగా దాదాపు అర్ధ శతాబ్దం పాటు బెంగాల్ నిలబడింది. అటువంటి బెంగాల్లో అఖండ విజయాన్ని సాధించినందున ఆ విజయానందం బీజేపీ శ్రేణుల్లో తొణికిసలాడుతున్నది. సువేందు అధికారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం వేదికపైనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగాలీ ప్రజలకు సాష్టాంగ ప్రణామం చేశారు. ఎన్డీఏ దిగ్గజాలతో పాటు, ఆ కూటమికి చెందిన అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు హాజరై ఈ కార్యక్రమాన్ని ఒక జాతీయ పర్వదినంగా మార్చారు.బెంగాల్ సరే, బీజేపీది చారిత్రాత్మకమైన విజయమే. మరి ఒక్క సీటే గెలిచిన తమిళనాడులో ఏ ప్రయోజనాన్ని ఆశించి బీజేపీ హైటెన్షన్ డ్రామాను నడిపించింది? అత్యధిక సంఖ్యా బలం కలిగిన విజయ్ ఐదు రోజులపాటు గవర్నర్ కటాక్షం కోసం ఎందుకు నిరీక్షించవలసి వచ్చింది? ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పక్షం నేతను గవర్నర్ ఆహ్వానించాలనీ, శాసనసభ వేదికపై బలాన్ని నిరూపించుకునే అవకాశాన్నీయాలనీ గతంలో సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. మెజారిటీ బలపరీక్ష జరగాల్సింది శాసనసభలో తప్ప, రాజ్భవన్ (లోక్ భవన్)లో కాదని కూడా సర్వోన్నత న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటైన సర్కారియా, పూంఛీ కమిషన్లు కూడా ఇదే మాటను చెప్పాయి. సంప్రదాయాలు కూడా అవే సంకేతాలు ఇస్తున్నాయి. 1996లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 161 స్థానాలను గెలుచుకొని ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. 140 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. లోక్సభలో మెజారిటీ సీట్ల కంటే బీజేపీకి 111 సీట్లు తక్కువున్నాయి. అయినప్పటికీ సంప్రదాయాన్ని అనుసరించి నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ బీజేపీ నేత వాజ్పేయిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు.మెజారిటీ నిరూపించుకోలేక 13 రోజుల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. దేశ ఆర్థిక గమనాన్నే ఒక మలుపు తిప్పిన పీవీ నరసింహారావు కూడా మైనారిటీ ప్రభుత్వాన్నే చాలా కాలంపాటు నడిపారు. 240 సీట్లే గెలిచిన కాంగ్రెస్ పార్టీ 1991లో పెద్ద పార్టీగా అవతరించడంతో, మెజారిటీకి 32 సీట్లు తక్కువ ఉన్న ప్పటికీ నాటి రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ ప్రభుత్వ ఏర్పాటుకు పి.వి. నరసింహారావును ఆహ్వానించారు. 2018లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యడ్యూరప్ప కూడా ఇదే పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి, ప్రస్తుత తమిళనాడు తాత్కాలిక గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కు ఎందుకింత ధర్మం మీమాంస ఏర్పడిందో, ఎందుకు విజయ్ను పడిగాపులు పడేలా చేశారో తెలుసుకోవడం అసాధ్యమేమీ కాదు.బెంగాల్ మాదిరిగానే తమిళనాడు కూడా ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద కలిగిన రాష్ట్రం. వర్తమాన చరిత్రలో ఆర్థిక పారిశ్రామిక రంగాల్లో ముందంజలో ఉన్న ఘనత దానిది. సంప్రదాయాలూ– హేతుబద్ధమైన ఆలోచనలూ సహజీవనం చేసే గతిశీలత కలిగిన ప్రాంతం. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాడులో బీజేపీకి అడుగు మోపే అవకాశం చాలా కాలంగా చిక్కడం లేదు. జయలలిత మరణం తర్వాత ఆమె పార్టీ అన్నాడీఎంకేను లొంగదీసుకుని ఎన్డీఏ కూటమిలో చేర్చు కున్నా కూడా బీజేపీకి ఆశించిన ఫలితం రావడం లేదు. ఇప్పుడు రెండు ద్రవిడ పార్టీలను వెనక్కు నెట్టి దళపతి విజయ్ అత్యధిక స్థానాలు సాధించడంతో తమిళ రాజకీయాలు బీజేపీకి మరింత పజిల్గా మారాయి.పూర్తి మెజారిటీకి కేవలం 10 సీట్లు మాత్రమే తక్కువ గెలిచిన విజయ్, గవర్నర్ నిర్ణయం కోసం ఐదు రోజులుగా నిరీ క్షించవలసి వచ్చింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల మద్దతు తర్వాత పూర్తి మెజారిటీకి కేవలం ఒకే ఒక్క సీటు తక్కువున్నప్ప టికీ, మూడుసార్లు గవర్నర్ను విజయ్ కలిసి శాసనసభలో తన మెజారిటీని నిరూపించుకుంటానని చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు నాలుగోసారి శనివారం సాయంత్రం 121 మంది మద్దతుదారుల జాబితాతో, వివిధ పార్టీల మద్దతు లేఖలతో కలిసిన తర్వాత ఆయనకు ప్రమాణ స్వీకారం చేసే అనుమతి లభించింది. బీజేపీ వ్యూహం ప్రకారమే గవర్నర్ ఈ నాటకాన్ని నడిపారనే అభిప్రాయం జనసామాన్యంలో సహజంగానే వ్యాపించింది. తమిళగ వెట్రి కళగం (విజయ్ పార్టీ)తో కలిసి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం తొలుత ఆ పార్టీ నాయకుడు పళని స్వామి ప్రయత్నాలు చేశారు. అది కుదరకపోవడంతో డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాద నతో ప్రయత్నాలు చేశారని వార్తలు వచ్చాయి. దీనికి స్టాలిన్ అంగీకరించలేదని తెలుస్తున్నది. బీజేపీ ఆశీస్సులు లేకుండా పళని స్వామి ఇటువంటి ప్రయత్నాలు చేస్తారని ఊహించలేము. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ సహకారం లేకుండా రాజ కీయాలు నడపడం అంత తేలిక కాదని విజయ్ గ్రహించడం కోసమే బీజేపీ ఈ సాగదీత డ్రామాను నడిపించినట్టు కూడా మరో వాదన ఉన్నది.పళని స్వామి ప్రయత్నాలేమో గానీ, ఆయన పార్టీకే ఎసరు పెట్టే పరిణామాలు శనివారం నాడు జరిగాయి. ఆయన నిర్వ హించిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు గైర్హాజర య్యారు. అన్నాడీఎంకేలో మరో సీనియర్ నాయకుడు ఆర్వీ షణ్ముగం నాయకత్వంలో 36 మంది ఎమ్మెల్యేలు సమావేశ మయ్యారనే వార్తలు వెలువడ్డాయి. అసెంబ్లీలో మెజారిటీ నిరూ పించుకునే అవకాశం విజయ్కిస్తే అన్నాడీఎంకేకు ఉన్న 47 మందిలో మెజారిటీ సభ్యులు విజయ్కు అనుకూలంగా ఓటేస్తా రనే ఆంతరంగిక సమాచారం బీజేపీకి ఉన్నందువల్లనే అటువంటి పరిస్థితి రానీయకుండానే ఈ తాత్సారాన్ని గవర్నర్ కొన సాగించారనే అభిప్రాయం ఉన్నది. తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించడం కోసమే ప్రభుత్వాన్ని తాము ఏర్పాటు చేయబోతు న్నామనే డ్రామాను పళని స్వామి నడిపిస్తున్నట్టు తెలుస్తున్నది.అన్నాడీఎంకేను అవమానకర పరిస్థితి నుంచి గట్టెక్కించ డానికి గవర్నర్ ద్వారా బీజేపీ సేఫ్ గేమ్ ఆడితే మరో రకమైన పాజిటివ్ గేమ్ను డీఎంకే నడిపించింది. డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టాలిన్తో మాట మాత్రమైనా చెప్పకుండానే విజయ్కు మద్దతు ప్రకటించి కూటమి ధర్మాన్ని గంగలో కలిపింది. నిజానికి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి స్టాలిన్ వ్యతిరేకం కాదు. పెద్ద పార్టీగా గెలిచిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని గవర్నర్కు కూడా సూచించారు. అయితే ఈ వ్యవహారాన్ని భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి స్టాలిన్ ప్రయత్నించారు. స్టాలిన్తో సంబంధం లేకుండా విజయ్కి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్తో తెగదెంపులు చేసు కున్నారు. మరోసారి మిత్రద్రోహానికి పాల్పడిన అపకీర్తిని కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకున్నది.స్టాలిన్ సలహా మేరకే సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూ ఎంఎల్ పార్టీలు ఒకరి తర్వాత మరొకరు టీవీకేకు మద్దతు ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వంలో అన్నాడీఎంకే ఏ రూపంలోనూ భాగస్వామి కాకుండా ఉండేందుకే స్టాలిన్ ఈ ఎత్తుగడను అవలంబించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రభుత్వంలోనూ వీసీకేకు కీలక పదవి లభించేలా పావులు కదిపి పరోక్షంగా తన పలుకుబడిని కొనసాగించేందుకు ప్రయత్నించారనే వాదన కూడా ఉన్నది. వీసీకే ఉపముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తున్నదనే వార్తలు కూడా శనివారం వెలువడ్డాయి. అయితే చివరకు బేషరతుగానే వీసీకే మద్దతు లేఖను సమర్పించింది. లోపాయికారి షరతులు ఏమైనా ఉన్నాయేమో తెలి యదు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆలస్యంగానైనా విజయ్కు లైన్ క్లియర్ అయింది.ప్రస్తుతానికైతే తమిళనాడులో బీజేపీ పాచిక పారినట్టు కనిపించడం లేదు. అన్నాడీఎంకేను ముందు పెట్టుకొని వేసిన ఎత్తులు స్టాలిన్ అప్రమత్తత వల్ల ఫలించలేదు. ఇకముందు ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. పదేళ్లపాటు విరామమెరుగని పోరాటం చేసి బెంగాల్ను గెలుచుకున్న బీజేపీ తమిళనాడుపై ఆశలు వదులుకుంటుందని భావించలేము. శనివారం కోల్కతాలో జరిగిన సువేందు ప్రమాణ స్వీకార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ సోమవారం నాడు సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ జరిగిన 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడికి వెళుతున్నారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం చాలా ప్రాధాన్యతనిస్తున్నది. సరిగ్గా వెయ్యేళ్ల కింద భారత్ పైకి దండెత్తి వచ్చిన మహమ్మద్ గజనీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ భద్రపరిచిన అపార ధనరాశిని కొల్లగొట్టాడని చరిత్ర చెబుతున్నది. మహమ్మదీయ దాడులు ఈ ఆలయంపై పలుమార్లు జరిగాయని కూడా చరిత్ర లిఖించింది.మత దురహంకారాలు, విద్వేషాలు చెలరేగిన మధ్య యుగాల నాటి పరిస్థితికి సోమనాథ్ ఆలయ విధ్వంసం ఒక ప్రతీక. ఈ గజనీల లక్ష్యం కేవలం సంపద లూటీ మాత్రమే కాదనీ, ప్రజల విశ్వాసాలను దెబ్బతీయటం కూడా వాటి ధ్యేయ మనీ అల్బెరూనీ అనే పర్షియన్ పండితుడు తన రచనల్లో విశ్లే షించాడు. ఇదంతా వెయ్యేళ్లనాటి మాట. మతమౌఢ్యాలు రాజ్య మేలిన నాటి పరిస్థితి. ఈ వెయ్యేళ్లలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మన దేశం లౌకిక రాజ్యాంగాన్ని రచించుకున్నది. ఈ నేపథ్యంలో సోమనాథ్ ఆలయం పునరుద్ధరణ 75వ వార్షికోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం భుజానికి ఎత్తుకొని దేశవ్యాప్తంగా అన్ని మీడియా మాధ్యమాల్లో భారీ ప్రకటనలను గుప్పించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే సోమనాథ్ ఆలయానికి హిందూ సమాజంలో విశిష్ట స్థానం ఉన్నది.దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆది జ్యోతిర్లింగంగా సోమనాథ్ ప్రసిద్ధి చెందింది. బెంగాల్లో విజయం అనే ఒక చారిత్రకమైన మైలురాయిని బీజేపీ దాటిన వెంటనే సోమనాథ్ ఆలయ సందర్భం రావడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ జాతీయతను, మతాన్ని కలగా పులగం చేసే బీజేపీ రాజకీయ వ్యూహానికి ఉపకరించే విధంగానే ఈ సందర్భాన్ని బీజేపీ మలుచుకుంటున్నది. రాజ్యాంగ లౌకిక స్వభావాన్ని బలహీనపరచడంతో పాటు తన సైద్ధాంతిక విరో ధులైన కమ్యూనిస్టుల భావజాలాన్ని కూడా తుడిచేశామన్న ఆనందం బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తున్నది. ఈ ఏడాది మార్చి 31 డెడ్లైన్ పెట్టి మరీ బుల్లెట్ కమ్యూనిస్టులను అణచివేశామనీ, కేరళలో ఎల్డీఎఫ్ ఓటమితో బ్యాలెట్ కమ్యూనిస్టులు కూడా అంతరించినట్టేననీ వారు భావిస్తున్నారు. ప్రధాని కూడా తన మనోగతాన్ని దాచుకోలేదు. ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పు ఫలితంగానే ప్రపంచంలోనూ, దేశంలోనూ, అడవుల్లోనూ కమ్యూనిస్టులు అంతరించారని మొన్నటి విజయోత్సవ సభలో ప్రకటించారు. బహుశా ఈ సంగతి డోనాల్డ్ ట్రంప్కు తెలిసినట్టు లేదు. మమ్దానీ వంటి సోషల్ డెమోక్రాట్లను చూసి కూడా కమ్యూనిస్టులున్నారని ఆయన కంగారు పడుతున్నారు. కోల్ కతా, చెన్నయ్ నగరాల్లో శనివారం నాడు ఆవిష్కృతమైన రెండు సన్నివేశాలు బీజేపీ రాజకీయ వ్యూహానికి అద్దం పడుతున్నాయి. కోల్కతాలో అంతా అంగరంగ వైభోగం. చెన్నయ్లో విజేతకు ఆఖరి నిమిషం దాకా అంతులేని టెన్షన్. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
విజయారోహణలో ట్విస్టులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రివాజుకు భిన్నంగా ప్రధాన ద్రవిడ పార్టీలు రెండింటినీ రెండంకెలకు పరిమితం చేసి, రాజకీయ తెరపైకి విజేతగా దూసుకొచ్చిన సినీ నటుడు విజయ్కి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ రూపంలో చివరి నిమిషంలోనూ అవరోధాలు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రిగా శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేస్తారని తొలుత అనుకున్నా వీసీకే, ఐయూఎంఎల్ లేఖలు రాలేదని అంటున్నారు.దాంతో విజయ్ వరసగా మూడోరోజు గవర్నర్ని కలిసినా ఫలితం లేకపోయింది.సొంతంగా 108 స్థానాలు సాధించి అత్యధిక స్థానాలున్న పార్టీగా ఆవిర్భవించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తామని అయిదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ప్రకటించగా, తాజాగా రెండేసి స్థానాలున్న సీపీఐ, సీపీఎంలు అంగీకారం తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 118 అవసరం కాగా, రెండుచోట్లనుంచి గెలిచిన విజయ్ ఎటూ ఒక స్థానం నుంచి తప్పుకోవాలి గనుక టీవీకే నికర బలం 107. రాజీనామా చేసే స్థానం తమకిస్తేనే లేఖ ఇస్తామని వీసీకే పట్టుబట్టగా, ఐయూఎంఎల్ అసలు లేఖే ఇవ్వలేదంటున్నారు. ఈ అంకెల ఆట ఎలావున్నా, ఆర్లేకర్ తీరు సంప్రదాయాలకు విరుద్ధం. ఈనెల 6న విజయ్ తొలిసారి గవర్నర్ను కలిసినప్పుడే ఆ వ్యవహారం ముగియాల్సి ఉండగా ఎందుకనో దీన్నింకా సాగదీస్తున్నారు.ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ‘ప్రభుత్వాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్ భవన్లలో కాద’ని తెలిపింది. ఉన్నవాటిలో మెజారిటీ పొందిన పక్షమేదో గమనించుకుని ఆహ్వానించటం, బల నిరూపణకు గడువీయడం తప్ప గవర్నర్కు మరే ప్రత్యామ్నాయమూ లేదు. అందుకు భిన్నంగా వ్యవహరించటం ఎలా చూసినా ధర్మం కాదు. ఇది అనవసర అపోహలు, అనుమానాలకు తావిచ్చింది. కేంద్రం రాష్ట్రంలో అస్థిరత కోరుకుంటున్నదనీ, రాష్ట్రపతి పాలన విధిస్తారనీ వదంతులు వ్యాపించాయి. కొన్ని గంటలపాటు డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలుస్తాయన్న పుకార్లు షికార్లు చేశాయి. అలా కలిసినా ఆ పక్షాలు విజయ్ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం ఉండదు.ఈ ఊహాగానాలకు తావిచ్చేలా జాప్యం చేయటం అవసరమా? బలనిరూపణలో విఫలమైతే విజయ్ సర్కారు తప్పుకోవాల్సిరావొచ్చు. దానివల్ల కలిగే కష్టనష్టాలు ఆయన చూసుకుంటారు. ఆ పరిస్థితి ఏర్పడితే టీవీకే తర్వాత స్థానంలోవున్న పార్టీని ఆహ్వానించాలి.అంతేతప్ప లోక్భవన్లో లెక్కలు వేస్తూ కూర్చోవటం సరికాదు. విజయ్ తమ లేఖతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ కూడా ఇవ్వటమే సమస్య తెచ్చిందని కొందరు వాదిస్తు న్నారు. ప్రజల మనోభీష్టం నెరవేర్చేందుకు సాంకేతికపరమైన అంశాలు అభ్యంతరం కావటం సరికాదు.పొరుగునున్న కర్ణాటకలో కొన్నేళ్లక్రితం బీజేపీకి తక్కువ స్థానాలొ చ్చినా మెజారిటీ స్థానాలున్నాయి గనుక దాన్నే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ నిర్ణయాన్నెవరూ తప్పుబట్టలేదు. సర్కారియా కమిషన్ సైతం 1988నాటి నివేదికలో ఎన్నికల ముందు ఏర్పడిన కూటములనూ, లేనట్టయితే ఉన్న పక్షాల్లో అత్యధిక స్థానాలొ చ్చిన పార్టీనీ పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ రెండేళ్లలో విజయ్ సాధించిన రాజకీయ అనుభవం సంగతేమోగానీ... ఈ మూడు నాలుగు రోజుల్లో ఆయనకది దండిగానే దక్కింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ తీరు జుగుప్సాకరంగావుంది. జాతీయస్థాయిలో ఇండియా కూటమికి నాయ కత్వం వహిస్తూ తన భాగస్వామ్యపక్షం తమిళనాట ఓడిపోగానే చేతులు దులుపుకొని బయటకు పోవటం ఏం నీతి? అందువల్ల విజయ్కి వీసమెత్తు ప్రయోజనం లేకపోగా, విపక్ష కూటమికి అది చేటు తెస్తుంది. కనీసం సహ భాగస్వామ్యపక్షాలు డీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎంలనైనా సంప్రదిస్తే మర్యాదగా ఉండేది.చివరకు సీపీఐ, సీపీఎం వచ్చి చేరాయిగానీ... రాజ్యాంగసంక్షో¿¶ నివారణకే ఆ పనిచేశాయి. ఆ మాత్రం వేచిచూడాలన్న ఇంగితజ్ఞానం లేకపోగా, భవిష్యత్తు ఎన్నికలన్నిటికీ ఈ కొత్త పొత్తు వర్తిస్తుందని ప్రకటించి కాంగ్రెస్ మరింత చులకనైంది. ఒంటరిగా బరిలోదిగి తన సత్తాతో జనాభిమానం చూరగొని మెజారిటీ స్థానాలు పొందిన విజయ్కి అవకాశమీయకుండా మీనమేషాలు లెక్కించటం సరికాదు. అది అప్రజాస్వామికం. అన్ని అడ్డంకులూ తొలగి ఆయన ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని, ప్రజాభీష్టం నెరవేరుతుందని ఆశించాలి. -
కల్లోల కాలంలో శిఖరాగ్రం!
ప్రపంచం పెనుసంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో ఫిలిప్పీన్స్లోని సెబూ నగరంలో శుక్రవారం ఆగ్నేయాసియా దేశాల సంస్థ (ఏసియాన్) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కాబోతోంది. దీనికి ముందు గురువారం ఏసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న వారంతా ఈ సంక్షోభ స్థితి గురించీ, దాన్ని అధిగమించటానికి గల మార్గాల గురించీ స్థూలంగా చర్చించారు. అమెరికా అనుసరిస్తున్న వైఖరి కారణంగా పశ్చిమాసియాలో ప్రతిష్టంభన ఏర్పడి, ఇంధన సంక్షోభం చుట్టుముడుతోంది. ఈ సంస్థలోని 11 సభ్య దేశాలూ ఇంధన దిగుమతులపై ఆధారపడినవే. ఈ ప్రతిష్టంభన వల్ల ఆహార సరఫరా మార్గాలు సైతం మూసుకుపోయాయి. వీటి జనాభా మొత్తంగా 70 కోట్లు. సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతోపాటు ఆహార పదార్థాల, సరుకుల లభ్యత గణనీయంగా పడిపోతుందనీ, ప్రాణావసర ఔషధాలు దొరక్క జనం తీవ్ర ఇబ్బందులకు లోనవుతారనీ ఆసియాన్ దేశాలు భయాందోళనలు చెందుతున్నాయి. అర్థరహితమైన ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో తన తొలి ఏలుబడిలోనే డోనాల్డ్ ట్రంప్ స్వీయరక్షణ చర్యలు మొదలెట్టారు. రెండోసారి దాన్ని మరింత ముమ్మరం చేయటంతో పాటు స్వపర భేదం లేకుండా అదనపు సుంకాలతో ప్రపంచ దేశాలన్నిటినీ బెంబేలెత్తించారు. దాన్ని తట్టుకోవటం ఎలాగన్న మీమాంసలో అందరూ పడిన తరుణంలో గ్రీన్ ల్యాండ్ సొంతం చేసుకుంటామనీ, కెనడాను విలీనం చేసుకుంటామనీ బెదిరింపులు ప్రారంభించారు. కెనడాలో నిరుడు ఎన్నికల తర్వాత ప్రధానిగా వచ్చిన మార్క్ కెర్నీ ‘త్వరలోనే మా 51వ రాష్ట్ర గవర్నర్ అవుతారు’ అంటూ ట్వీట్ చేశారు. ఇక వెనెజులా వ్యవహారం అత్యంత దారుణమైనది. ఆ దేశాధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అపహరించి తీసుకొచ్చి అమెరికాలో తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి విచారిస్తు న్నారు. ఇక ఇరాన్పై 68 రోజుల క్రితం అకారణంగా యుద్ధానికి దిగారు.ఇరాన్కు ఒకే ఒక పేజీలో తాజా ప్రతిపాదనలు పంపామనీ, దానిపై ఆ దేశం తీసుకునే నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలుంటాయనీ అమెరికా చెబుతోంది. ఇది కేవలం ఏసియాన్ శిఖరాగ్ర సదస్సును దృష్టిలో ఉంచుకుని, దాన్ని మభ్యపెట్టేందుకు సాగిస్తున్న కపట నాటకమా లేక చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నమా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ తాజా ప్రతిపాదనలన్నీ ఒబామా హయాంలో 2015 జూలైలో ‘ఉమ్మడి సమగ్ర కార్యాచరణ’ పేరిట ఇరాన్తో కుదిరిన అణు ఒప్పందంలోని అంశాలకు దగ్గరగా ఉన్నాయంటున్నారు. గత ఏలుబడిలో అది పనికిమాలిన ఒప్పందమంటూ బుట్టదాఖలా చేసింది ట్రంపే. సుదీర్ఘ ప్రతిష్టంభన వల్ల ప్రపంచ దేశాలతో పాటు అమెరికా కూడా దివాలా తీస్తుందన్న భయంతో కాళ్లబేరానికొస్తే మంచిదే. ఏసియాన్ దేశాల ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3,80,000 కోట్ల డాలర్లు. ఇది కాస్తా దిగజారడం మొదలైందంటే... పొదుపు చర్యల అమలు తప్పనిసరైతే ఎక్కడి కక్కడ ప్రజాగ్రహం వెల్లువెత్తి ప్రభుత్వాలు కుప్పకూలే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే చాన్నాళ్లుగా ఫిలిప్పీన్స్ ప్రాంతీయ చమురు పంపకం ప్రతిపాదన చేస్తోంది. అన్ని ఆర్థిక వ్యవస్థలూ ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి గనుక ఇలాంటి సహకారం సంక్షోభాన్ని నివారిస్తుందన్నది ఆ ప్రతిపాదన సారాంశం. కానీ పశ్చిమాసియాలో తిరిగి ప్రశాంతత నెలకొనడం తప్ప మరేదీ పరిష్కారం కాదు. మిగిలినవన్నీ తాత్కాలిక ఉపశ మనాలే. దీర్ఘకాలం కొనసాగించటానికి పనికొచ్చేవి కాదు. అమెరికా చాటున అణిగి మణిగి ఉండే పాత రోజులు అంతరించాయనీ, గట్టిగా నిలబడి స్వరం పెంచితేనే ఏదో మేరకు ఆ దేశం దిగొస్తుందనీ ఏసియాన్ గుర్తించాలి. అదే సమయంలో ఆహారం,ఇంధనం, వాణిజ్యం అంశాల్లో ఇతర ప్రాంతీయ బృందాలతో సమన్వయం చేసుకోవాలి. వాటి సహకారం పొందాలి. తమ వంతు సాయం అందించాలి. ఏసియాన్తో భారత్ వాణిజ్యం సరిగా లేదు. ఆ దేశాలనుంచి వచ్చే దిగుమతులతో పోలిస్తే, అక్కడికి మన ఎగుమతులు చాలా తక్కువున్నాయి. ఈ వాణిజ్యలోటు 2023 నాటికి 4,400 కోట్ల డాలర్లుంది. ఇలాంటి లోటుపాట్లన్నిటినీ సరిచేసుకుంటేనే ఏసియాన్ అన్ని రకాల సంక్షోభాలనూ దృఢంగా ఎదుర్కొనగలుగుతుందని శుక్రవారం జరగబోయే దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు గుర్తించాల్సి ఉంది. -
నివ్వెరపరిచే ఆదేశాలు!
కొన్ని ఉదంతాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. వింటున్నది నిజమేనా అనిపిస్తాయి. ఒరిస్సా హైకోర్టు కొన్ని బెయిల్ దరఖాస్తుల విషయంలో వెలువరించిన ఆదేశాలు అటువంటివే. నిరుడు ఏప్రిల్–సెప్టెంబర్ల మధ్య ఆ హైకోర్టు 50 బెయిల్ దరఖాస్తుల్ని అంగీకరించింది. కానీ అందుకు సంబంధించి విధించిన షరతులు అందరినీ నివ్వెరపరిచాయి. ఆ నిందితులంతా రెండు నెలలపాటు పోలీస్స్టేషన్లు, గుడులు, ఆసుపత్రులు, గ్రామీణ రహదారులు, చెరువులు ప్రతిరోజూ ఉదయం మూడు గంటలపాటు శుభ్రం చేయాలన్నది వాటి సారాంశం. మైనింగ్ కార్యకలాపాలు నిలిపేయాలంటూ ఉద్యమించిన వారితోపాటు దొంగతనం, హత్య తదితర క్రిమినల్ కేసుల్లో ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు. నిందితుల్లో అత్యధికులు దళిత, ఆదివాసీ వర్గాలకు చెందినవారు కావటం గమనించదగ్గది. ఇలాంటి పారిశుద్ధ్య పనుల కేటాయింపులో న్యాయమూర్తి కులం కోణాన్ని మించి చూడలేకపోయారని ఈ బెయిల్ ఆదేశాలు తేటతెల్లం చేస్తున్నాయి. సాధారణంగా సామాజిక ఉద్యమకారులెవరైనా ఫిర్యాదు చేస్తేనే ఇలాంటి ఉదంతాలు న్యాయస్థానం దృష్టికి పోతాయి. కానీ ‘ఆర్టికల్ 14’ అనే డిజిటల్ మీడియాలో గత నెల 27న వచ్చిన కథనాలను సర్వోన్నత న్యాయస్థానం తనంత తానే గమనించటం, ఆ షరతులు చెల్లబోవని వెనువెంటనే ఉత్తర్వులీయటం కొంతలో కొంత ఊరట. ‘కులం పునాదుల మీద మీరు దేన్నీ సాధించలేరు. ఒక జాతినీ నిర్మించలేరు. ఒక నీతినీ నిర్మించలేరు’ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. వచ్చే ఏడాదితో మన దేశం స్వాతంత్య్రాన్ని సాధించుకుని ఎనభైయ్యేళ్లవుతుంది. కానీ దళితులకు, ఇతర అట్టడుగు వర్గాలకూ అడుగడుగునా కులవివక్ష ఎదురవుతూనే ఉంది. కేలండర్లు మారుతున్నా, సాంకేతికత విస్తరించి అభివృద్ధి జరుగుతున్నా ఆ మనస్తత్వం మారటం లేదు. కుల వివక్ష, దానిపేరిట సాగుతున్న హింస దేశాభివృద్ధికే ఆటంకంగా ఉన్నదనీ, అది మనుషులను వేరు చేస్తోందనీ, మనసుల్ని సంకుచితపరుస్తోందనీ స్వామి వివేకానంద ఏనాడో ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మార్పు ఎక్కడ?ఇతర వ్యవస్థల్లో ఇలాంటి జాడ్యాలు కనబడినప్పుడు సరిదిద్దాల్సిన న్యాయవ్యవస్థ సైతం ఆ తానులో ముక్కగా మారితే...? ఒరిస్సా హైకోర్టు ఆదేశాలు చూసి రాయగడ అదనపు సెషన్స్ న్యాయస్థానం, మరో ఆరు కింది కోర్టులు ఈ మాదిరి ఆదేశాలే జారీ చేశాయి. ‘ఒడిశా న్యాయవ్యవస్థ వ్యక్తీకరించిన ఈ తిరోగమన మనస్తత్వం మమ్మల్నెంతో కలవరపరుస్తోంది. ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించటమేకాక నిందితుల గౌరవాన్ని దెబ్బతీసే చర్య’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జయ్మాలా బాగ్చీ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్మొహమాటంగా తెలిపింది. విచారణకు ముందే నేరం చేసినట్టు నిర్ణయానికొచ్చి ‘శిక్షించటం’ అమల్లోవున్న చట్టాల ప్రకారం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది.బాక్సైట్ మైనింగ్ కోసం వేదాంత గ్రూప్ సంస్థలకు రాయగడ, కలహండి జిల్లాల్లో ఇచ్చిన లీజులవల్ల తూర్పు కనుమల్లోని 1560.40 హెక్టార్ల అటవీభూమి నాశనం కాబోతోంది. రెండు జిల్లాల్లోని రెండు గ్రామాలు అదృశ్యమవుతాయి. ఆదివాసీ, దళిత వర్గాలు ఈ లీజుల రద్దుకు 2023 నుంచి ఉద్యమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం సైతం విశాఖ ఏజెన్సీలో ఇలాగే లీజుకీయటం, ఉద్యమాలు చెలరేగటం ఎవరూ మరిచిపోరు. అటు తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ అనుమతుల్ని రద్దు చేసింది. ప్రకృతి విధ్వంసానికి దారితీసే, స్థానికుల జీవికను దెబ్బతీసే ఇలాంటి చర్యను ఒడిశా సర్కారు విరమించుకోకపోగా, ఉద్యమకారుల్ని నిర్బంధిస్తోంది. సకాలంలో జోక్యం చేసుకోకుండా వ్యవస్థలు నిర్లిప్తంగా మిగిలితే ఉద్యమాలు హింసాత్మక రూపం ధరిస్తాయి. వాటిని ప్రభుత్వాలు శాంతిభద్రతల సమస్యగా పరిగణించి అణచ టానికి చూస్తాయి. నక్సలైటు ఉద్యమాల తీవ్రత, పర్యవసానాలు చూశాకైనా ఈ పోకడలు మానుకొని, స్థానికుల ఆకాంక్షల్ని గౌరవించే సంస్కృతిని వ్యవస్థలు అలవర్చుకోవాలి. ఈ విషయంలో ఒరిస్సా హైకోర్టు తీరు ఆందోళన కలిగించే అంశం. ఈ సమస్యపట్ల సుప్రీంకోర్టు ప్రదర్శించిన అప్రమత్తత, దిద్దుబాటు చర్యలు నిస్సహాయ పౌరులకు వ్యవస్థలపట్ల విశ్వాసాన్ని పెంచుతాయి. -
దీదీ ధిక్కార స్వరం!
తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విలక్షణ నాయకురాలు. పదిహేనేళ్లపాటు అవిచ్ఛిన్నంగా రాష్ట్రాన్ని పాలించి తొలిసారి ఓటమి చవిచూసిన ఆమె దీన్ని తేలిగ్గా వదలదల్చుకోలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ‘ఎన్నికల సంఘం(ఈసీ) ఆసరాతో మా గెలుపు కొల్లగొట్టారు. మేం ఓడిపోలేదు. కాబట్టి రాజీనామా చేసే ప్రసక్తే లేద’ని ఆమె బాంబు పేల్చారు. ఆమె అయిదేళ్ల పదవీకాలం ఎటూ ఈ నెల ఏడుతో ముగుస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ఈలోగానే ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేస్తారా... లేక గడువు ముగిశాక ఆమెను సచివాలయంలోకి రాకుండా అడ్డుకుంటారా అన్నది చూడాల్సి ఉంది. ఓడిపోయినవారు ప్రత్యర్థి ఎన్నికను న్యాయస్థానంలో సవాలు చేసే ప్రత్యా మ్నాయం ఉంటుంది. అవన్నీ తేలటానికి ఏళ్లూ పూళ్లూ పడుతుంది. సీనియర్ నాయకు రాలు గనుక ఇవన్నీ ఆమెకు సంపూర్ణంగా తెలిసే ఉంటాయి. కానీ అక్కడితో ఆగిపోతే ఆమెకూ, ఇతర నాయకులకూ తేడా ఉండేది కాదు. వైదొలగక తప్పదని తెలిసినా తగినంత రచ్చచేసి నిష్క్రమించటం ఆమె ఎత్తుగడ కావొచ్చు. యూత్ కాంగ్రెస్ నాయకు రాలిగా పనిచేసినప్పటినుంచి మమత స్ట్రీట్ ఫైటర్. వామపక్ష ఫ్రంట్ ప్రభుత్వంపై సాగిస్తున్న పోరాటంలో పార్టీనుంచి సరైన సహకారం అందటం లేదన్న ఏకైక కారణంతో ఆమె కాంగ్రెస్ను విడిచిపెట్టారు. సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు. ఆ తర్వాత ఆమెదంతా అలుపెరగని పోరాట చరిత్ర.ఇంత రగడకు ఏకైక కారణం ఎన్నికల సంఘం(ఈసీ). స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట బిహార్లో అమలైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాక కూడా ఇతర రాష్ట్రాల్లోనైనా సజావుగా పూర్తి చేయాలన్న ఇంగిత జ్ఞానం ఆ సంస్థకు లేకపోయింది. బెంగాల్లో దాన్ని మరింత అధ్వాన్నం చేసింది. తొలగింపు ల్లోనూ, చేర్పింపుల్లోనూ అవకతవకలకు అంతూ దరీ లేకుండా పోయింది. ఫాం–7 కింద ఊరూ పేరూలేని వారు దాఖలు చేసిన ఫిర్యాదుల్ని ఆసరా చేసుకుని తాఖీదులు పంపడం, కావలసిన పత్రాలన్నీ ఇచ్చాక నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ కాలేదంటూ తొలగించటం వంటివి చోటుచేసుకున్నాయి. పేర్లలో అక్షర క్రమంలో స్వల్ప తేడాలొచ్చినా ‘తార్కిక వ్యత్యాసం’ పేరిట అనర్హులుగా జమేయటం మరో దాష్టీకం. ఏతావాతా 91 లక్షలమంది ఓటర్లు మాయమయ్యారు. పైగా ఏడు లక్షలమంది రహస్యంగా వచ్చిచేరారని మమత ఆరోపిస్తున్నారు. అజ్యుడికేషన్లో మాత్రం కేవలం 1,607 మందికి మాత్రమే ఓటుహక్కు పునరుద్ధరించారు. మిగిలిన లక్షలాది దరఖాస్తులు తేలడానికి ఎన్నేళ్లు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఓటుహక్కు ప్రసాదించే సంస్థ అనే ముద్రనుంచి దాన్ని తొలగించటమే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థగా ఈసీ పరివర్తన చెందటంలో మతలబేమిటి?సర్పై దాఖలైన పిటిషన్ను విచారించిన సందర్భంగా గత నెల 13న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం, ఓటర్ల జాబితాల్లో భారీస్థాయి తొలగింపులు జరిగితే అది ఎన్నికల ఫలితాలపై ‘గణనీయమైన ప్రభావం’ కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. ఆ పరిస్థితే వస్తే ఏం చేయాలో ఆలోచిస్తామని కూడా చెప్పింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎటూ విపక్షాలు సుప్రీంకోర్టు తలుపుతట్టే అవకాశం ఉంది. విచారకరమైన సంగతేమంటే... ఈ ఎన్నికల్లో తానూ ఒక అభ్యర్థినే అన్నట్టు ఈసీ ప్రవర్తించింది. వచ్చిన కేంద్ర పరిశీలకులు సైతం అందుకు తగినట్టే ఉన్నారు. మరి ‘ఓట్ చోరీ’ ఆరోపణలు రావటంలో వింతేముంది?ఆంధ్రప్రదేశ్లో 2024 నాటి ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఇంతవరకూ ఈసీ చేష్టలుడిగినట్టు ఉండిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులకు అతీ గతీ లేదు. నిమిషానికి నలుగురు చొప్పున ఓటేయటం గురించీ, సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేయటం గురించీ పరకాల ప్రభాకర్ వంటి సామాజికవేత్తలు ప్రశ్నిస్తుంటే మన్నుతిన్న పాములా కూర్చుంది. ఏ సంస్థా ఇంత సిగ్గుమాలినతనాన్ని ప్రదర్శించిన వైనం దేశ చరిత్రలో ఎన్నడూ లేదు. కనీసం ఇప్పుడు సర్ ప్రారంభించబోయే రాష్ట్రాల్లోనైనా సక్రమంగా ప్రవర్తించటం ఈసీ నేర్చుకోవాలి. లేనట్టయితే అక్కడ కూడా ఇలాంటి ఛీత్కారాలే ఎదురవుతాయి. -
ఓటర్లు చాటుతున్నదేమిటి?
ప్రజలేమనుకుంటున్నారో పట్టకుండా స్వోత్కర్షలతో, ప్రచారార్భాటాలతో పొద్దుపుచ్చే అధికార పార్టీలకు ఓటర్లు గుణపాఠం నేర్పారు. సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మొదలు బెంగాల్లో బీజేపీ అప్రహతిహతంగా దూసుకెళ్లి, డబుల్ సెంచరీ ఖాయం చేసుకుంది. ఆ పార్టీకి 208 రాగా, టీఎంసీ 79 దగ్గర ఆగిపోయింది. ఆ రాష్ట్రంలో మూడు దఫాలు విజయకేతనం ఎగరేసి అధికారంలో కొనసాగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీ పూర్లో గెలుపోటముల మధ్య ఊగిసలాడుతూ ఉత్కంఠ రేపారు. మెజారిటీ క్రమేపీ కోల్పోతూ చివరకు ఓడారు. అటు తమిళనాడులో వరసగా రెండుసార్లు అధికార పీఠం కైవసం చేసుకున్న డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా తమిళ హీరో విజయ్ కొత్తగా స్థాపించిన తమిళ వెట్రి కళగం(టీవీకే) ప్రభంజనం ముందు నిలబడ లేకపోయారు. బెంగాల్లో మమత మాదిరే ఓటమిపాలయ్యారు. ఆయన కుమారుడు, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి గెలుపు ఉన్నంతలో ఊరట. కేరళలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమిపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతి రేకతను కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ సొమ్ముచేసుకోగలిగింది. అస్సాంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి విజేతలుగా నిలిచాయి. అయితే కర్ణాటక మినహా దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ పాగావేయని బీజేపీని కేరళ, తమినాడు మళ్లీ నిరాశ పరిచాయని చెప్పాలి. తృణమూల్ పాలన అధ్వాన్నంగా ఉన్నదని సంకేతాలు వస్తూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా... అంతకుమించి అవినీతి, దౌర్జన్యం కట్టుదాటాయి. జనంనుంచి వసూలు చేసిన లంచాల సొమ్ము తక్షణమే వెనక్కివ్వాలంటూ 2019లో మమత సొంత పార్టీ నేతలకు బహిరంగంగా అల్టిమేటం ఇవ్వటం పెను సంచలనం. ఆ పిలుపు ఫలించింది. జనం సైతం పార్టీలో అవినీతిపరులకూ, ఆమెకూ మధ్య విభజన రేఖ గీసుకున్నారు. కానీ ఆపై అవినీతిని ఆమె చూసీచూడనట్టు వదిలేశారు. దాని పర్యవసానమే ఈ ఫలితాలు. బెంగాల్లో ఎన్నికల సంఘం(ఈసీ) ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓవరాక్షన్ చేయపోయినా కొంత అటూ ఇటూగా ఇవే ఫలితాలొచ్చేవి. జాబితాలకు కోతలు పెట్టడం లేదా కొత్త పేర్లు చేర్చడం అనే రెండు ప్రక్రియల్లోనూ తనది అసమర్థతే నని ఈసీ నిరూపించుకుంది. ఏదో యుద్ధం జరుగుతున్నదన్న స్థాయిలో రెండున్నర లక్షలమంది భద్రతా బలగాలను దించటంవల్లా, 91 లక్షలమంది ఓట్ల తొలగింపువల్లా దేశానికి అప్రతిష్ఠ మిగిలింది. కేరళలో యూడీఎఫ్ 100కు పైగా స్థానాలు తన ఖాతాలో వేసుకుంది. 44 యేళ్ల తర్వాత అధికారంలోవున్న పార్టీ తొలిసారి వరసగా రెండుసార్లు గెలిచిన రికార్డు దక్కించుకుని గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. బహుశా పార్టీలో అసమ్మతి లేనట్టయితే, అవినీతి ఆరోపణలు రానట్టయితే ఈ రికార్డు కూడా బద్దలయ్యేది. కానీ రెబెల్స్ బెడదతో సీపీఎం ఆ అదృష్టాన్ని చేజార్చుకుంది. స్వతంత్రులుగా బరిలోకి దిగి యూడీఎఫ్ మద్దతుపొంది గెలిచిన ముగ్గురూ పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తికి అద్దంపట్టారు. రెబెల్స్ లేవనెత్తిన అంశాలు ప్రభుత్వ పని తీరును ప్రశ్నార్థకం చేశాయి. 1957లో దేశంలోనే తొలిసారి వామపక్ష ప్రభుత్వం ఆవిర్భ వించటానికి దోహద పడిన రాష్ట్రమే దానికి చరమగీతం పాడటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో మరెక్కడా వామపక్షాలు అధికారంలో లేవు సరిగదా... అత్తెసరు స్థానాలతో అవి వెలవెలబోతు న్నాయి. వచ్చేసారైనా కేరళ మళ్లీ ఆదరిస్తుందా అన్నది ప్రశ్నార్థకం.అయితే ఎన్నికల్లో గెలుపు వేరు, పాలన వేరు. భావోద్వేగాల ఆసరాతోనో, ఆల్ ఫ్రీ వాగ్దానాలతోనో అధికారం దక్కించుకోవచ్చు. కానీ ప్రజల ఆకాంక్షలు తీర్చటం, సమర్థవంతమైన పాలన అందించటం ఆ గెలుపంత సులభం కాదు. ఈ సంగతిని కొత్తగా పార్టీ పెట్టి అధికారానికి చేరువలో ఉన్న విజయ్ అయినా, బెంగాల్లో బీజేపీ అయినా తెలుసుకోవాలి. స్థానికంగా మమతకు దీటైన నాయకులు లేకపోయినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల వ్యూహం, వారి ప్రచార హోరు పనికొచ్చాయి. ఈ గెలుపు నిరంతరం కావాలంటే స్థానికంగా నాయకత్వం ఎదగాలి. ఇచ్చిన హామీలు తీర్చాలి. విద్వేషపూరిత వాతావరణం అంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. -
అందమైన నివాసం
మనిషికి ఆకాశంలోకి ఎగరాలన్న కాంక్ష పుట్టించేది పక్షి కాదు, తారలు కూడా కాదు, చదమామ! కథలు వినాలన్న ఆసక్తి పుట్టించడంలో నానమ్మ పాత్ర ఎంతో చందమామదీ అంతే. చందమామే ఒక కథ. ఒక కవిత కూడా. ఒక అందమైన స్త్రీ ఎలాంటి కవితావేశాన్ని కలిగిస్తుందో, నిండు చందమామ అలాంటి భావావేశాన్ని పుట్టిస్తుంది. అందుకే చందమామను తన అక్షరాల్లోకి ఒడిసిపట్టని భావకవులు ఉండరు. అసలు ఏ కవికైనా తన తొలి కవితకు సరంజామా ఇవ్వగలిగేది చందమామ కాక ఇంకేమిటి? అది మనిషికి ఎంత దూరమో అంత దగ్గర. ఈ నట్టనడి ఎండల్లో చంద్రుడి తలంపే మనకు చల్లని గొడుగు. ‘నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అని తిలక్ అన్నప్పుడు ఈ వాక్యానికి అందం అందమైన ఆడపిల్లల వల్లే రాలేదు; వాళ్లు వెన్నెల్లో ఆడుకోవడం వల్ల వచ్చింది. చంద్రుడిని తలుచుకుంటేనే ఒక నెమ్మది, ఒక ప్రశాంతత, ఒక రహస్యోద్వేగం. అని మనిషిని మెలకువలోంచి కలల్లోకి మేలుకొలిపే మార్మిక మంత్రదండం. ఒంటరి ప్రయాణీకుడికి చందమామే దారి దీపం. అనంత చీకటిమయ ఆకాశాన్ని సజీవ మూర్తిగా నిలబెట్టేది దానికి రెండో కన్నుగా ఉండే చందమామే. పౌర్ణమికి దినదిన ప్రవర్ధమానమవుతూ, అమవసకు అంతా కోల్పోయినట్టవుతూ మనిషి జీవిత చక్రాన్ని ఇది గుర్తుచేస్తుంది. అన్ని మతాల్లోనూ, సంస్కృతుల్లోనూ చంద్రుడి చుట్టూ ముడివడి ఎన్నో పండుగలున్నాయి. అసలు శరదృతువులో పౌర్ణమిని చూడటమే ఒక పండుగ!చైనా భావకవితోద్యమానికి మార్గదర్శిగా చెప్పే లీ తై–పో క్రీ.శ. 699–705 ప్రాంతంలో జన్మించాడు. పదేళ్లకే కన్ఫ్యూసియస్ పుస్తకాలన్నీ చదివేశాడు. దేశమంతా తిరిగాడు. రాజప్రాసాదాల్లోనూ జీవించాడు, గుహల్లోనూ నిద్రించాడు. మద్యం, మగువ, కవిత్వం ఆయనకు ప్రాణాధారం. వెనుక సంచీలో పుస్తకాలు, అంగీ మడతలో గుప్తంగా పిడిబాకు, అరచేతిలో సిద్ధంగా కవిత– ఇదీ ఆయన వేషం. ఒకరోజు తాగిన మత్తులో సరస్సులోని చంద్రుడి బింబాన్ని కౌగిలించుకోబోయి మరణించాడని చెబుతారు. ఎలాంటి భావకవి! ర్యోకన్ తైగు అనే జెన్ గురువు గుడిసెలోకి ఒక దొంగ వచ్చాడట. తన దుస్తులు సహా దొంగకు ఒలిచి ఇచ్చేశాడు గురువు. దొంగ వెళ్లిపోయిన తర్వాత, ఒంటి మీద నూలుపోగైనా లేకుండా నిండుగా వెలుగుతున్న చందమామను కిటికీలోంచి చూస్తూ కూర్చున్న గురువు, అంతటి అందమామను దొంగకు ఇవ్వలేకపోయినందుకు నొచ్చుకున్నాడట! దొంగలు మన దగ్గరినుంచి ఎత్తుకెళ్లలేనిది మన విద్య, వివేకాలనే కాదు, మనకున్న చందమామను కూడా! ఒక్క చంద్రుడుని నిండుగా ఆనందించగలిగే హృదయముంటే ఎన్ని పూటల భోజనానికి పడే ఆరాటం తప్పుతుంది! ఇటాలో కాల్వీనో కథా ప్రపంచంలోనైతే చందమామ మీదికి నిచ్చెన వేసుకుని ఒక్క గెంతులో ఎక్కేయొచ్చు. అక్కడి మీగడ చిక్కదనపు పాలను లోడుకోవచ్చు. దానికి చేయవలసిందల్లా పొక్కులుగట్టిన చందమామ ఉపరితలం మీదుండే పొలుసులను కొద్దిగా జరిపి అక్కడ గరిట పెట్టడమే!గ్రీకు ప్రకృతి దేవత మీదుగా నామకరణం చేసి, చంద్రుడి మీదకు ‘నాసా’ పంపిన వ్యోమనౌక ఆర్టెమిస్–2 ఏప్రిల్ 1–11 వరకు తిరుగాడి భూమ్మీదకు తిరిగొచ్చింది. భూమి నుంచి అంతరిక్షంలోకి సుదూరం పయనించి గతంలోని ‘అపోలో’ రికార్డును ఇది బద్దలుకొట్టింది. అన్నట్టూ అపోలో, ఆర్టెమిస్ గ్రీకు పురాణంలో కవల సోదరీమణులు. మొదలైనప్పటినుంచీ తిరిగొచ్చేదాకా 6,95,081 మైళ్లు ప్రయాణించిన ఆర్టెమిస్–2 అంతరిక్షంలోకి సుదూరంగా వెళ్లే వ్యోమగాములకు అవసరమైన వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదోనని నిర్ధారించేందుకు ఉద్దేశించినది. వస్తూవస్తూ సాక్ష్యంగా కొన్ని ఫొటోలను తెచ్చింది. వాటిని చూస్తే, చంద్రుడి మీద వెన్నెల మీగడలు ఏమీ లేవని తెలియడం ఒకింత కాల్పనిక నిరాశ. ఇది మామూలు భూమిలానే ఉందని తెలియడం ఒక వాస్తవం. కానీ చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలంగా నివసించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు కావడం సాంకేతిక సంభ్రమం. -
బెంగాల్లో ‘ఎగ్జిట్’ డెమోక్రసీ?
బెంగాల్ను గెలవడానికి బీజేపీ వాళ్లు సర్వశక్తుల్నీ ధారపోశారు. రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని మమతా బెనర్జీ చేస్తున్న వాదన అరణ్య రోదనగా మారిపోయింది. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక సూపర్వైజర్గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని తప్పనిసరిగా నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఒక తాఖీదును పంపించింది. ఈ తాఖీదు బెంగాల్కు మాత్రమే వర్తిస్తుందట! తృణమూల్ వర్గాలు ఇస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 2023లో ఇటువంటి నిబంధనను ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చింది. లెక్కింపు కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులుగా కేంద్ర ఉద్యోగుల్ని నియమించాలన్నది ఆ నిబంధన. ఇది దేశవ్యాప్తంగా అమల్లోనే ఉన్నది. దీనికి అదనంగా ఒక సూపర్వైజర్ను కూడా విధిగా కేంద్ర ఉద్యోగినే నియమించాలని బెంగాల్ కోసం మరో ఆదేశం జారీ అయింది.ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తృణమూల్ పార్టీ హైకోర్టు మెట్లెక్కింది. అక్కడ దానికి ఓదార్పు దొరకలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లింది. శనివారం నాడు సుప్రీంకోర్టు కూడా పిటీషన్ను డిస్మిస్ చేసింది. ఎన్నికల సంఘం విధివిధానాల్లో జోక్యం చేసుకోకూడదన్న యాంత్రిక వైఖరికి అనుగుణంగా న్యాయవ్యవస్థ స్పందించింది. అంతే తప్ప పిటీషనర్ల ఆందోళనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదని భావించాలి. ఒక నిర్దిష్ట సమయంలో అప్పటి సమాజంలోని ఆధిపత్య శక్తుల భావజాలం ప్రభావం అన్ని వ్యవస్థల మీదా అంతో ఇంతో పడుతుందేమో. అటువంటి సందర్భాల్లో ఆయా వ్యవస్థల్లో సృజనశీలత స్థానాన్ని యాంత్రికత ఆక్రమించవచ్చు. ఆరాధనా మందిరం మారితే దళితుల ఎస్సీ హోదా పోతుందని ఇటీవలే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇదే కోణంలో అర్థం చేసుకోవలసి ఉంటుంది. జస్టిస్ కృష్ణయ్యర్, ఓ. చిన్నపరెడ్డి, హెచ్ఆర్ ఖన్నా, పిఎన్ భగవతి వంటి న్యాయమూర్తులు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు.ఇప్పుడు ప్రణయ్రాయ్ వంటి జర్నలిస్టులు, యోగేంద్ర యాదవ్ వంటి సెఫాలజిస్టులు కూడా గుర్తుకొస్తున్నారు. దేశ మీడియా రంగంలో టీవీ వార్తల శకం ప్రారంభమైన తర్వాత ఆ తొలితరం అందించిన ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎంత సూపర్ హిట్ అయ్యేవో చాలామందికి గుర్తుండే ఉంటుంది. వ్యవస్థలకు లొంగని నిక్కచ్చితనం, కచ్చితత్వం నాటి సెఫాలజీని ముందుకు నడిపించాయి. మీడియా రంగాన్ని ఆధిపత్య శక్తులు తమ ఉక్కు పిడికిట్లోకి తీసుకోవడం ప్రారంభించిన తర్వాత ప్రణయ్రాయ్ వంటి వాళ్లు తాము స్థాపించిన సంస్థల నుంచే నిస్సహాయంగా బయటకు నడవాల్సి వచ్చిన విషాద దృశ్యాలను చూడవలసి వచ్చింది. అయినా, ప్రణయ్రాయ్లోని పాత్రికేయుడు ఓడిపోలేదు. మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో డెబ్బయ్ ఆరేళ్ల ‘ఆ యువకుడు’ ఒక సాధారణ క్షేత్రస్థాయి రిపోర్టర్ మాదిరిగా సెల్ఫోన్ చేతిలో పట్టుకొని ప్రజలను ఇంటర్వ్యూ చేస్తున్న దృశ్యాలకు సోషల్ మీడియాలో వేలాదిమంది జేజేలు పలికారు.మీడియా రంగం విస్తరించింది. టెక్నాలజీ పెరిగింది. గతంతో పోలిస్తే ప్రజాభిప్రాయాన్ని మదింపు వేయడంలో మరింత కచ్చితత్వం ఉండే అవకాశాలు ఇప్పుడే ఎక్కువున్నాయి. కానీ ఆధిపత్య శక్తుల ఆదేశాల మేరకు మీడియా సంస్థలు రాజీపడుతున్నాయనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఫలితంగా ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో సక్సెస్ రేట్ కూడా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడున్న సర్వే సంస్థల్లో ‘యాక్సిస్ మై ఇండియా’కు సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువ. ఈ సంస్థ ‘ఇండియా టుడే’తో కలిసి తన సర్వే ఫలితాలను వెల్లడిస్తుందనే సంగతి తెలిసిందే. బెంగాల్ రెండో దశ పోలింగ్ పూర్తికాగానే అన్ని ఛానెళ్ళు, అన్ని సర్వే సంస్థలూ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించాయి. ఇండియా టుడే కూడా యాక్సిస్ మై ఇండియా చేసిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. దేశంలో ఇంకే సర్వే సంస్థ గానీ, మీడియా సంస్థగానీ ఊహించని విధంగా తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచే అవకాశముందని ప్రకటించి యాక్సిస్ మై ఇండియా సంచలనం సృష్టించింది. ఒక్క బెంగాల్ ఎగ్జిట్ పోల్ను మాత్రం మరుసటి రోజుకు వాయిదా వేశారు.మరుసటి రోజు కూడా ఆశాభంగమే మిగిలింది. బెంగాల్ ఎగ్జిట్ ఫలితాలను ప్రకటించబోవడం లేదని సర్వే సంస్థ ఎమ్డీ ప్రదీప్ గుప్తా ప్రకటించారు. ఇదొక అనూహ్యమైన పరిణామం. బెంగాల్పై అస్త్రసన్యాసానికి ఆయన చెప్పిన కారణం నమ్మశక్యంగా లేదు. మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పకపోవడం వల్ల ఫలితాన్ని అంచనా వేయలేకపోతున్నామని ఆయన చెప్పారు. ఇదే అసలు కారణమైతే ముందురోజే ఈ సంగతిని చెప్పి ఉండవచ్చు. తొలిదశ ఎన్నికలు అంతకు వారం రోజుల ముందే జరిగాయి. తొలిదశ జరిగిన ప్రాంతంలో ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పి రెండో దశలో చెప్పకుండా ఉన్నారా? తాము క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మాట్లాడినందువల్ల ఎవరికీ చిక్కని విధంగా తమిళనాడు నాడి తమకు చిక్కిందని చెప్పుకున్న యాక్సిస్ మై ఇండియా, కీలకమైన బెంగాల్ నాడిని ఎందుకు పట్టుకోలేకపోయిందో వివరణ ఇవ్వాల్సి ఉన్నది. ఎవరి ఒత్తిడికో లొంగి ప్రదీప్ గుప్తా బెంగాల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించకుండా దాచారనే అభిప్రాయం బలపడుతున్నది. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఒక సంస్థ ఎగ్జిట్ ఫలితాలను ఆపేసినంత మాత్రాన ఆ ‘బలమైన’ పార్టీకి కలిగే లాభం ఏముంటుంది? ప్రజాభిప్రాయానికి భిన్నమైన ఫలితాలు కౌంటింగ్ రోజు వెలువడే అవకాశముంటుందా?.. ఉంటే, ఎలా సాధ్యం?ఒక్క బెంగాల్కు మాత్రమే కౌంటింగ్ సూపర్వైజర్లు కూడా కేంద్ర సిబ్బందే ఎందుకు కావాల్సి వచ్చిందో? ఒక్క బెంగాల్ ప్రజల నాడిని పసిగట్టడంలోనే తన అశక్తతను ఆఖరి నిమిషంలో మాత్రమే ప్రదీప్ గుప్తా ఎందుకు వ్యక్తం చేశారో? ఒక్క బెంగాల్లోనే ‘సర్’ కార్యక్రమంతో 91 లక్షల ఓట్లు ఎందుకు గల్లంతయ్యాయో? తమ పేరు తొలగింపును పునఃపరిశీలించాలని దరఖాస్తులు పెట్టుకున్న లక్షలాది మందిలో కేవలం వెయ్యిమందికి మాత్రమే ఊరట లభించడానికి కారణమేమిటో? ఎన్నికలు ముగిసిన తర్వాతనే మిగిలిన దరఖాస్తులు పరిశీలిస్తామని చెప్పడమేమిటో? ఇటువంటి పలు సందేహాలు తలెత్తడం సహజం. ఎట్టి పరిస్థితుల్లోనైనా బెంగాల్లో గెలిచి తీరాల్సిందేనని బీజేపీ చేస్తున్న విశ్వప్రయత్నాల్లో ఇవన్నీ భాగమని తృణమూల్ భావిస్తున్నది. బెంగాల్ గెలుపునకు బీజేపీ ఒక చారిత్రాత్మకమైన ప్రాధాన్యాన్ని ఆపాదించుకుంటున్నది. ఇటీవలనే అధికారం చేపట్టిన బిహార్కు తోడు బెంగాల్ను కూడా గెలుచుకుంటే ఆర్యావర్త కాషాయీకరణ పూర్తవుతుంది. బీజేపీ మాతృసంస్థ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం బెంగాల్ గెలుపుతో ఈ చారిత్రక పరిణామం పూర్తవుతుంది. ఇక మిగిలేది దక్షిణాపథమే.కొన్ని వర్తమాన కీలక పరిణామాలు చారిత్రక సందర్భాలను స్ఫురణకు తెస్తాయి. పోలికలు కనిపిస్తాయి. పద్దెనిమిదో శతాబ్దం ఉత్తరార్ధంలో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాపై బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ సేనలు ప్లాసీ యుద్ధంలో విజయం సాధించడంతో భారత్లో ఇంగ్లిష్ పాలనకు తొలి అడుగు పడింది. బెంగాల్లో గెలిస్తే ఆర్యావర్త కాషాయీకరణలో బీజేపీ తుది అడుగు పూర్తవుతుంది. బలీయమైన బెంగాల్ నవాబును ఓడించడానికి ఈస్టిండియా కంపెనీ సేనాని రాబర్ట్ క్లైవ్ మోసపూరితమైన ఎత్తుగడలు వేశాడనీ, అతని సుపీరియర్ ఆయుధ టెక్నాలజీ కూడా అందుకు తోడ్పడిందనీ చరిత్ర చెబుతున్నది. బెంగాల్లో గెలవడానికి బీజేపీ కూడా మోసపూరితమైన ఎత్తుగడలు వేస్తున్నదని తృణమూల్ ఆరోపిస్తున్నది. ఆరోపణల్లో ఎంతో కొంత నిజముండదని చెప్పలేము. అంతమాత్రాన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పదిహేనేళ్లు బెంగాల్ను పవిత్రంగా పరిపాలించిందని కూడా చెప్పలేము. గూండా గ్యాంగులు, అరాచక శక్తులు పాలక పార్టీ నీడలో వ్యవస్థీకృత రూపం దాల్చాయనీ, ఎన్నికల సందర్భాల్లో అవి పార్టీ తరఫున పని చేస్తున్నాయన్న విమర్శల్లో నిజం లేకపోలేదు.అరాచక శక్తులు రాజకీయ సైన్యంగా పనిచేయడం మమతా బెనర్జీతోనే ప్రారంభం కాలేదు. నక్సల్బరీ అలజడి సద్దుమణుగుతున్న కాలంలో డెబ్బయ్యవ దశకం తొలి రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి సిద్ధార్ధ శంకర్ రే హయాంలోనే ఈ రౌడీ రాజకీయ ముఠాలు ప్రారంభమయ్యాయని చెబుతారు. అన్నిరకాల వామపక్ష శక్తుల మీద, ముఖ్యంగా సీపీఎం శ్రేణుల మీద దాడులకు ఈ ముఠాలను ప్రేరేపించేవారు. సీపీఎం అగ్రనాయకుడు జ్యోతిబసు మీద కూడా ఆ రోజుల్లో హత్యాప్రయత్నం జరిగింది. ముప్పయ్ నాలుగేళ్లపాటు నిరాటంకంగా సాగిన వామపక్ష కూటమి పాలనలో కూడా రౌడీ ముఠాలను రాజకీయ అవసరాలకు వాడుకున్నారనే విమర్శ ఉన్నది. కాకపోతే, సమర్ధవంతంగా భూసంస్కరణలు అమలు చేయడం, పాలనా వికేంద్రీకరణ, అవినీతి రాహిత్యం, నాయకత్వ నిరాడంబరత వంటి కారణాల వలన ఈ వ్యవహారం పెద్దగా వివాదాస్పదం కాలేదు. మమతా బెనర్జీ పాలన మళ్లీ సిద్ధార్ధ శంకర్ రే వారసత్వాన్ని స్వీకరించిందనే విమర్శలున్నాయి.మమతా బెనర్జీ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత కూడా జనంలో ఉన్నది. కాకపోతే బెంగాల్ను గెలవాలనే ‘చారిత్రక కర్తవ్యం’ ఊపులో బీజేపీ నాయకత్వం ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం, డజన్లకొద్దీ కేంద్ర మంత్రులూ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మోహరించడం, బెంగాల్పై యుద్ధం మాదిరిగా ఎన్నికల ప్రచారాన్ని మార్చడం వల్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ‘బెంగాలీ అస్మిత’ (బెంగాల్ ఆత్మగౌరవం) ను ముందుకు తోసింది. బెంగాలీ అస్మితపై హిందూ పరిచయ్ (హిందూ భావజాలం)తో దాడి చేస్తున్నారని విస్తృతంగా ప్రచారం చేసింది. తమ భాషా సంస్కృతులకు బెంగాలీలు, తమిళులు ఎంత ప్రాధాన్యతనిస్తారో మనకు తెలిసిన విషయమే. తమ పార్టీ బెంగాలీ బెటాలియన్తోనే మమతపై ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ పోరాడి ఉంటే మమత ఖాయంగా ఓడిపోయేదేమో! కానీ వ్యవస్థల మాటున నిలబడి అప్రజాస్వామిక పద్ధతులతో, మోసపూరితమైన ఎత్తుగడలతో బెంగాలీ అస్మితను ఒకవేళ గెలిస్తే, ఇకముందు దేశ భవిష్యత్తు ఎటువంటి దారిలో పయనిస్తుందోనన్నదే ప్రజాస్వామ్య శక్తుల ఆందోళన!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
అక్షరాలా నిప్పుల కొలిమి
ప్రతియేటా ఇంచుమించు మే నెల మొదటి వారానికిగానీ ఉగ్రరూపం దాల్చని మార్తాండుడు ఈసారి ఫిబ్రవరి నెలాఖరునాటికే చెలరేగడం మొదలెట్టాడు. ముందే రావటం, దీర్ఘకాలం తిష్టవేయటం కొన్నాళ్లుగా కనబడుతున్నా ఈ స్థాయిలో ఎండలు మండిపోవటం ఇదే తొలిసారి. మన దేశంలో రుతువులు గతి తప్పి చాన్నాళ్లయింది. గతంలో పొద్దుటిపూట ఒక రకం, రాత్రికి మరో రకం వాతావరణం దర్శనమిచ్చేవి. ఎంత ఎండాకాలమైనా రాత్రికి ఎటునుంచో వచ్చి చల్లని గాలులు తాకేవి. సేదతీర్చేవి. ఇప్పుడు రాత్రింబగళ్లు తేడా లేదు. వేడిగాలుల వెనకే హఠాత్తుగా వాతావరణం మారి, జల్లులు మొదలై వడగళ్లు పడటం రివాజుగా మారింది. అటు తర్వాత కాసేపటికే ఉక్కబోత మొదలవుతోంది. ప్రకృతికి సంబంధించినంతవరకూ ఉత్తర దక్షిణాలన్న తేడా... మధ్య, పశ్చిమ భారత్లన్న వ్యత్యాసం లేదు. వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నదాన్నిబట్టి ప్రస్తుతం 23 రాష్ట్రాలకు వడగాడ్పుల తాకిడి ఉంది. అందులో డజనుకుపైగా తీవ్ర వడగాడ్పులను చవిచూస్తున్నాయి.వందలాది నగరాలు భరించలేనంత ఉక్కబోతతో విలవిల్లాడుతున్నాయి. అయితే దక్షిణ ద్వీపకల్ప ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలూ ఇప్పటికైతే ఈ సమస్యకు దూరంగా ఉంటున్నాయి. కానీ పర్యావరణంలో వస్తున్న మార్పుల పర్యవసానంగా భవిష్యత్తులో ఇవి సైతం భానుడి ప్రతాపాన్ని చవిచూడకతప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు జోస్యం చెబుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలకన్నా కనీసం 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువుంటే, అది వరసగా రెండ్రోజులు కొనసాగితే వడగాడ్పులు వీస్తున్నట్టు లెక్కేస్తారు. అది 7 డిగ్రీల సెల్సియస్కి మించి పెరిగితే తీవ్ర వడగాడ్పులుగా పరిగణిస్తారు. ఒక ప్రాంతం మైదానమా, కొండలతో ఉందా అనే అంశాన్ని కూడా ఈ విషయంలో పరిగణనలోకి తీసుకుంటారు. బొంబాయి ఐఐటీ ఇటీవల చేసిన అధ్యయనంలో గంగా–సింధు మైదానం (ఉత్తర భారతం)లో వేడిగాలులకు స్థానిక నేలలు, ఇతర వాతావరణ పరిస్థితులు కారణమని తేల్చింది. వెలుపలినుంచి వచ్చే వేడిగాలులే ఇందుకు దోహదపడుతున్నాయన్న అభిప్రాయాన్ని తోసిపుచ్చింది. వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల సాంద్రత పెరగడంతో వేడిగాలులు భూ ఉపరితలానికి దగ్గరగా ఉండిపోతున్నాయి. నగరాల్లోని కాంక్రీట్ కట్టడాలు, తారురోడ్లు పగలంతా తీవ్ర ఉష్ణోగ్రతను స్వీకరించి, రాత్రికి సైతం సెగలు కక్కుతూనేవుంటున్నాయి. అందుకే ఇంతచేటు తీవ్రత!వరదలు, తుపానులు, భూకంపాల్లాగే వడగాడ్పులు కూడా ప్రకృతి వైపరీత్యమే. కానీ ప్రభుత్వాలు ఒప్పుకోవు. వడగాడ్పులవల్ల ఏటా వందలాది మరణాలు సంభవిస్తున్నా, ఆ విధంగా లెక్కేయటానికి తగిన విధానం రూపొందలేదు. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారన్హీట్ లేదా అంతకన్నా ఎక్కువకు చేరి, శరీరంలో చెమట పట్టడం ఆగిపోయి చర్మం పొడిబారి ఎర్రగా మారితే, స్పృహ కోల్పోవటం లేదా మతిస్థిమితం తప్పడం, మూర్ఛరావడం వంటివి కనబడితే వడగాడ్పు మరణమని చెబుతారు.వీటికితోడు బాధితుడున్న ప్రాంతంలో వడగాలుల హెచ్చరిక ఉందా, అతను మరణించటానికి ముందు ఎండలో పనిచేశాడా లేదా అనేవి కూడా చూస్తారు. ఆ తర్వాతే వడగాడ్పు మరణంగా నిర్ధారిస్తారు. గుండెజబ్బు వగైరాలున్నా, వృద్ధాప్యంలో ఉన్నా ఆ జాబితాలో లెక్కేయరు. ఈ విషయంలో ప్రభుత్వాల వైఖరి మారాలి. వేసవిలో మరణాల రేటు గత కొన్నేళ్లలో ఎలావుందో చూసే విధానాన్ని అంతర్జాతీయంగా అనుసరిస్తున్నప్పుడు మనం మాత్రం ఎందుకు ఆ కొలమానాన్ని తీసుకోవటం లేదు?పదహారో ఆర్థిక సంఘం నిరుడు ఇచ్చిన నివేదికలో వడగాడ్పుల్ని, పిడుగుపాటుల్ని కూడా ప్రకృతి విపత్తులుగా పరిగణించాలని కోరింది. చాలా రాష్ట్రాలు ఎన్నో ఏళ్లుగా ఈ విషయంలో డిమాండ్ చేస్తున్నాయి. అలా లెక్కేస్తే అందుకు సంబంధించిన నిధుల్ని సహాయ కార్యక్రమాల కోసం వ్యయం చేయటానికి, బాధితులకు తక్షణ సాయం అందించటానికి వీలవుతుంది. వడగాడ్పులున్న ప్రాంతాల్లో భవన నిర్మాణం, సాగుపనుల సమయాలను మార్చటానికి, విద్యాసంస్థలు, కార్యాలయాల పనివేళల్ని సవరించటానికి వీలవుతుంది. అందుకే ప్రభుత్వాలు తక్షణం కదలాలి. అవసరమైన కార్యాచరణ రూపొందించాలి. జనం ప్రాణాలు కాపాడాలి. -
బీటలువారిన ఒపెక్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒకటి తలిస్తే జరిగేది ఎప్పుడూ మరోటి. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపిస్తే అది నాలుగురోజుల్లో పాదాక్రాంతమవుతుందని అంచనావేసుకుని ప్రారంభించిన యుద్ధం కాస్తా వికటించి ఆయన ఆ ఊబిలో కూరుకుపోయారు. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియని తరుణంలో పశ్చిమాసియాలో ఆయన ఉద్దేశించని పరిణామం సంభవించింది. మే 1 నుంచి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్)నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. దాన్నుంచి మాత్రమే కాదు... 2016లో ఏర్పడిన ‘ఒపెక్ ప్లస్’నుంచి కూడా వైదొలగనున్నట్టు తెలిపింది. ఒపెక్లో సభ్యత్వం తీసుకోని రష్యావంటి ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో ఈ గ్రూప్ ఏర్పడింది. ఒపెక్ ప్రపంచ చమురు ఉత్పత్తుల పరిమాణాన్నీ, ఎగుమతుల్నీ, వాటి ధరల్నీ నిర్దేశిస్తున్న కీలక సంస్థ. ప్రపంచ ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులు దానిపైనే ఆధారపడతాయి. ప్రపంచ పెట్రో ఉత్పత్తుల్లో ఒపెక్ వాటా మూడోవంతుకన్నా ఎక్కువ. ఒపెక్ నుంచి తప్పుకోవాలన్న యూఏఈ ఆలోచన చాలా పాతది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చింది. కానీ ఇరాన్ యుద్ధంతో అది తుది నిర్ణయానికొచ్చింది.ఒపెక్ సంస్థ ఆవిర్భావానికీ, విస్తరణకూ పాశ్చాత్య బహుళజాతి సంస్థల నిర్వాకం కారణం. చమురు దేశాలు ఎంత ఉత్పత్తి చేయాలో, ఏ ధర నిర్ణయించాలో అవి నిర్దేశించేవి. వాటి చెప్పుచేతల్లో ఉండటం ఇక సాధ్యంకాదన్న నిర్ణయానికొచ్చిన చమురు దేశాలు 1960 సెప్టెంబర్లో బాగ్దాద్లో సమావేశమై ఒపెక్ ఏర్పాటుకు తీర్మానించాయి. ఇరాన్, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా, వెనెజులా దేశాలు ఇందులో భాగస్వాములు. 1967లో యూఏఈ చేరింది. 1973లో అరబ్–ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ను వెనకేసుకొస్తున్న అమెరికా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, పోర్చుగల్ తదితర దేశాల వైఖరిపై ఆగ్రహించిన ఒపెక్... చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తూ, ఆ దేశాలకు ఎగుమతుల్ని నిషేధించింది. దాంతో పెను సంక్షోభం ఏర్పడింది. అనంతరకాలంలో ఈ దేశాలన్నీ అమెరికాకు సాగిలబడ్డాయి. అది వేరే కథ!ఒపెక్లో రాజుకుంటున్న అసంతృప్తికి సౌదీ పెద్దన్న పాత్ర పోషిస్తుండటం ఒక కారణం. ఏ దేశం ఎంత ఉత్పత్తి చేయాలో అదే నిర్ణయించటంవల్ల తమకు అన్యాయం జరుగుతున్నదని సభ్యదేశాల్లో ఎప్పటినుంచో అసంతృప్తి ఉంది. అందుకే 2019లో ఖతార్, ఆ మరుసటి ఏడాది ఈక్వెడార్, 2024లో అంగోలా సంస్థనుంచి వైదొలగాయి. ఆ వరసలో యూఏఈ నాలుగో దేశం. అంతర్జాతీయ చమురు ధరల్ని బట్టి ఉత్పత్తిని నియంత్రించుకుంటూ, అది కోరుకున్న ధరలో ఉండేలా చూసుకోవటం ఒపెక్ అలవాటు. తన తొలి ఏలుబడిలో ఒపెక్ దేశాలపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడిన సందర్భాలున్నాయి. చమురు ధరలు పెంచుతూ ప్రపంచ ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. అయితే 2020లో కోవిడ్ సమయంలో పాతాళానికి పడిపోయిన చమురు ధరలతో దివాలా స్థితికి చేరిన అమెరికన్ సంస్థల్ని కాపాడుకునేందుకు ఉత్పత్తిని తగ్గించమని ఒపెక్ను వేడుకున్నది కూడా ఆయనే. సౌదీ తీరుపై యూఏఈ ఆగ్రహంతో ఉండటానికి కారణం ఉంది. అది ప్రస్తుతం రోజుకు 35 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. తనకున్న సామర్థ్యంతో అంతకన్నా ఎక్కువ చేయగలిగినా, సౌదీ అరేబియా నిర్దేశిస్తున్న కోటా ఆటంకంగా ఉంది. వచ్చే ఏడాదికల్లా దాన్ని 50 లక్షల బ్యారెళ్లకు పెంచాలంటే తప్పుకోవటమే ఉత్తమమని అది భావిస్తోంది. ఈలోగా ఇరాన్ యుద్ధం దాని సమస్యల్ని పెంచింది. గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడుల్లో ఆ దేశమే అధికంగా నష్టపోయింది. కనుకనే ఈ బాదరబందీని వదుల్చుకోవాలని నిర్ణయించుకుంది. పర్యవసానంగా వెనువెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర మూడు శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా, దీర్ఘకాలంలోగానీ దాని అసలు ప్రభావం కనబడదు. యూఏఈ మిత్రదేశంగా భారత్కు ఈ పరిణామం లాభదాయకమే. కానీ ఒపెక్ ఎలాంటి ఆంక్షలు పెడుతుందో చూడాలి. మొత్తానికి ఇన్నాళ్లూ కలిసికట్టుగా ఉన్నట్టు కనబడిన గల్ఫ్, ఒపెక్ బీటలువారుతున్నాయి. ఈ పరిణామం పశ్చిమాసియాలో అమెరికా పలుకుబడిని తగ్గిస్తుంది. ఇరాన్ పాదాక్రాంతం మాటేమో గానీ... అమెరికాకు మున్ముందు ఇది సమస్యాత్మకం. -
ముగిసిన ఎన్నికల రణం
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏప్రిల్లో ఎన్నికలుంటాయని గత నెల 16న ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది మొదలు అలుముకున్న ఒక రకమైన యుద్ధ వాతావరణం పరిసమాప్తమైంది. పశ్చిమ బెంగాల్లో బుధవారం ముగిసిన రెండో దశ పోలింగ్లో అనుకున్నట్టే భారీ స్థాయి ఓటింగ్ జరిగింది. సాయంత్రానికల్లా వెలువడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలవరకూ చూస్తే దాదాపు అన్ని సర్వే సంస్థలూ కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, పుదుచ్చేరిలో ఎన్డీయే విజయం ఖాయమని తెలిపాయి. తమిళనాడులో కొత్త పార్టీ టీవీకే ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతూనే డీఎంకే తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని అయిదు సంస్థల్లో మూడు అంచనా వేయగా, ఒక సంస్థ అన్నాడీఎంకే–బీజేపీ కూటమివైపు మొగ్గింది. బెంగాల్లో తృణమూల్, బీజేపీలు హోరాహోరీగా తలపడ్డాయని సర్వేలు తేల్చాయి. ఆరు సంస్థల్లో రెండు తృణమూల్వైపు, మిగిలిన సంస్థలు బీజేపీవైపు మొగ్గాయి. వాస్తవ ఫలితాలకు ఇవి ఏమేరకు దగ్గరగా ఉంటాయన్నది వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాతగానీ తెలియదు. పోలింగ్ వరకూ చూస్తే మిగిలినచోట్ల దాదాపు ప్రశాంతంగానే ముగిసినా పశ్చిమ బెంగాల్ ఎప్పటిలాగే తనదైన ముద్ర మిగిల్చింది. రెండు దశల్లోనూ హింసాత్మక ఘటనలు తప్పలేదు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగిన హింస చాలా తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. కావొచ్చు... కానీ శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో దాదాపు రెండున్నర లక్షలమంది బలగాలను మోహరించటం, ముఖ్యంగా రెండో దశ పోలింగ్ జరిగిన దక్షిణ బెంగాల్ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో భద్రతా బలగాలు అతిగా ప్రవర్తించిన తీరు సబబు కాదు. ఒకరి హింసకు మరొకరి హింస ప్రత్యామ్నాయం కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) పేరిట ఏకంగా 91 లక్షలమంది ఓటర్ల పేర్లు గల్లంతు కావటం, ఎక్కడెక్కడికో పనుల కోసం వలసపోయినవారు తిరిగొచ్చి కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా తగిన పత్రాలు సంపాదించలేకపోవటం, దాఖలు చేసినవారు సైతం భంగపడటం ఎందరినో కలవరపెట్టింది. చివరకు తొలి దశలో 139 మంది, మలి దశలో 1,468 మంది మాత్రమే న్యాయసమీక్షలో ఓటుహక్కు పొందారు. ఇక ఈసీ వివాదాస్పద పాత్ర సరేసరి. ముఖ్యంగా బెంగాల్లో ఎన్నికలు సక్రమంగా నిర్వహించటం కోసం తాను తటస్థంగా వ్యవహరించాలన్న సంగతిని అది మరిచింది. ఈ ఎన్నికల బరిలో తానూ ఉన్నానన్నట్టు వ్యవహరించింది. నిజానికి 2024 ఎన్నికల సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ పోకడలు కనబడ్డాయి. అధికారుల బదిలీలు మొదలుకొని అనేక అంశాల్లో విపక్షం చెప్పినట్టల్లా ఈసీ ఆడిందని అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు బెంగాల్లో అది మరింత బాహాటంగా జరిగింది. కేంద్ర పరిశీలకులుగా వచ్చిన ఒకరిద్దరు బెదిరింపు ధోర ణిలో మాట్లాడటం ఆశ్చర్యపరిచింది. అందులో ‘ఎన్కౌంటర్ స్పెషలిస్టు’గా మీడియా చెబుతున్న యూపీకి చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు. ఏ అభ్యర్థి అయినా సక్రమంగా వ్యవహరించకపోతే, డబ్బు పంచుతుంటే లేదా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తుంటే చట్టం అనుమతించిన మేరకు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ బహిరంగ సవాళ్లు దేనికి? ఇది మంచి సందేశాన్ని పంపదు. ఇతరచోట్ల గణనీయమైన విజయాలు సాధిస్తున్నా... బీజేపీకి మాతృసంస్థ అనదగ్గ జనసంఘ్కు నారూ నీరూ పోసిన స్వర్గీయ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్వస్థలమైన బెంగాల్లో అది సాధించలేకపోతున్నామని మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి ఒక దశలో ఆవేదన వ్యక్తం చేశారంటారు. ఆయన తొలినాళ్లలో ముఖర్జీకి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనైనా అదెంతవరకూ సాకారమవుతుందన్న విషయంలో ఎవరి అంచనాలు వారివి. ‘స్ట్రీట్ ఫైటర్’గా పేరున్న ముఖ్యమంత్రి మమతకు దీటుగా నిలబడగల స్థానిక నాయకులు ఇంతవరకూ బీజేపీకి తారసపడలేదు. అందుకే ప్రచార బాధ్యతల్ని స్వయంగా నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు మోయాల్సివచ్చింది. అక్కడొచ్చే ఫలితాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పాలక, విపక్షాల వ్యూహాలపై రానున్న రోజుల్లో తీవ్ర ప్రభావం చూపగలవనటంలో సందేహం లేదు. -
ఫిరాయింపులు... ప్రశ్నలు!
ఆప్ నుంచి నిష్క్రమించిన ఏడుగురు రాజ్యసభ సభ్యులతో ఏర్పడిన ఎంపీల బృందం బీజేపీలో విలీనం కావడాన్ని గుర్తిస్తూ రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నిర్ణయం తీసుకోవటంతో ఫిరాయింపుల చట్టం ప్రహసనప్రాయమని మరోసారి తేలిపోయింది. బహుశా ఎన్నికల ముంగిట్లోవున్న పంజాబ్లో రేపో మాపో ఆప్ ప్రభుత్వానికీ ఇలాంటి గండం తప్పకపోవచ్చు. ఆప్ పుట్టుక, ఎదుగుదల భిన్నమైనవి. 2011–12 మధ్య దేశంలో హోరెత్తిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన కొద్దిమంది రాజకీయేతర నేతల్లో కేజ్రీవాల్ ఒకరు. ఆయన మాదిరే పూర్వాశ్రమంలో ఉన్నతోద్యోగ వర్గంలో, భిన్న సామాజిక రంగాల్లో పనిచేసి కొన్ని ఆదర్శాలు నమ్మి వచ్చినవారు చాలామంది ఉన్నారు. ఆదర్శాల్లో పుట్టి, వైవిధ్యాలతో ఎదిగి, స్వల్పకాలంలోనే మధ్యతరగతిలో పాతుకుపోయిన ఆ పార్టీ అచిరకాలంలోనే సంక్షోభంలో కూరుకుపోయింది. పార్టీ సారథుల్లో భిన్నాంశాలపై అప్పటికే ఉన్న మౌలిక విభేదాలు పలు నిష్క్రమణలకు దారితీశాయి. శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, అడ్మిరల్ రాందాస్ వంటి లబ్ధప్రతిష్టులైనవారిని కీలక పదవులనుంచి తప్పించారు. కొందరు వారికై వారు తప్పుకున్నారు. అటు తర్వాత మధ్యలో అడపా దడపా ఒకరిద్దరు నేతలు నిష్క్రమించినా ఇప్పుడు రాఘవ్ చడ్డా కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు. ఒక సమస్య విషయంలో పార్టీ వైఖరితో ఏకీభావం లేనప్పుడూ, దాని సిద్ధాంతాలు దారితప్పుతున్నాయనుకున్నప్పుడూ బయటకుపోతే ఎవరూ తప్పుబట్టరు. కానీ పెద్ద మాటలు మాట్లాడుతూ, గంభీరమైన ఉపన్యాసాలిస్తూ కాస్తయినా నైతికత పాటించాలన్న స్పృహ లేనివారిని జనం చీదరించుకుంటారు. ఒక సాధారణ గుమాస్తా సంస్థ నుంచి తప్పుకుంటే మూణ్ణెల్ల నోటీసు ఇవ్వాలన్న నిబంధన ఉంటుంది. లేకుంటే సంస్థలు వాటి పద్ధతిలో అవి చర్య తీసుకుంటాయి. ప్రజానీకం సమస్యల్ని చర్చిస్తూ వారి సంక్షేమానికీ, భద్రతకూ అవసరమైన చట్టాలు తీసుకొచ్చే కర్తవ్యంలో నిమగ్నమై ఉండాల్సినవారికి మాత్రం ఏ నిబంధనా ఉండొద్దా? వారి ప్రవర్తన నలుగురికీ ఆదర్శప్రాయం కావొద్దా?రాజీవ్ గాంధీ హయాంలో 1985లో ఈ ఫిరాయింపుల జాడ్యాన్ని వదిలిస్తామంటూ 52వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి రాజ్యాంగంలో పదో షెడ్యూల్ చేర్చారు. కానీ అది ఎందుకూ కొరగాకుండా పోయిందని తేలిన చాన్నాళ్ల తర్వాత 2003లో 91వ రాజ్యాంగ సవరణ వచ్చింది. అందులో కేవలం లెజిస్లేచర్ పార్టీలో మూడింట రెండొంతుల మంది తప్పుకుని వేరే పార్టీలో విలీనమైతే సరిపోదనీ, ఆ చీలిక, విలీనం పార్టీ స్థాయిలో కూడా కనబడాలనీ నిర్దేశించింది. దురదృష్టమేమంటే... ఈ ప్రాతిపదికన ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని మన న్యాయస్థానాలు తీర్పులిచ్చిన సందర్భాలు లేవు. ఫిరాయింపు సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని సభాధ్యక్షుల దగ్గర ఫిర్యాదులైతే దాఖలవుతున్నాయి. కానీ వాటిపై వేగంగా నిర్ణయం తీసుకున్న ఉదంతాలు లేవు. సుప్రీంకోర్టు గడువు విధించటంతో తెలంగాణ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇటీవల నిర్ణయం తీసుకోక తప్పలేదు. కానీ బీఆర్ఎస్ వినతుల్ని ఆయన తోసిపుచ్చారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ లోక్సభలోనూ, ఏపీ అసెంబ్లీలోనూ చేసిన ఫిర్యాదులు తేలకుండానే ఆ సభల పదవీకాలం ముగిసిపోయింది. ఫిరాయించటానికి సృజనాత్మక మార్గాలు ఎంచుకోవటం నేతలకు వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. ఏపీలో ఆ మధ్య వైఎస్సార్ కాంగ్రెస్కు చెందిన కొందరు రాజ్యసభ సభ్యులు ఏకంగా అయిదేళ్లకు మించి గడువున్న ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసి పోయారు. ఆ తర్వాత వారిలో కొందరు బీజేపీ, టీడీపీల పంచన ‘ఎన్నికయ్యారు’. నైతిక విలువలు లేకపోవటమే పెద్ద అర్హతగా మారిన వర్తమానంలో ఇలాంటి వెర్రిమొర్రి పోకడలు కనబడటం వింతేం కాదు. రాఘవ్ చడ్డా నిష్క్రమించదల్చుకున్నప్పటి నుంచీ మధ్యతరగతి పెను సమస్యలుగా భావించేవాటిని సభలో ప్రస్తావించటం, వాటిల్లో కొత్తేం లేకపోయినా అవి వైరల్ కావటం వెనకున్న సారాంశం చాలామంది గ్రహించకపోలేదు. ఏదేమైనా ఫిరాయింపులకు కళ్లెం పడనంత కాలమూ, ఈ గోడ దూకుళ్లు ఆగనంత కాలమూ మన ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం ఉండదు. -
ఏపీలో ‘పెట్రో’ కటకట!
స్వోత్కర్షలకూ, చేదు వాస్తవాలకూ మధ్య తేడా ఎంత ఉంటుందో తెలియజెప్పే వైనమిది. ‘మా రాష్ట్రానికి రండి... పెట్టుబడులు పెట్టండి. మా సంస్కరణలు ఎలా పనిచేస్తున్నాయో స్వయంగా మీరే తెలుసుకోండి’ అంటూ శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబై నగరంలో జరిగిన ఒక అవార్డుల ఉత్సవంలో గప్పాలు కొట్టుకున్న క్షణానికే రాష్ట్రం మొత్తం ఇంధన కొరతతో అల్లాడిపోయింది. అన్ని జిల్లాల్లోనూ బంకులముందు ఆ రోజు ఉదయానికే ‘నో స్టాక్’ బోర్డులు ప్రత్యక్షమై జనం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెట్రోల్, డీజిల్ దొరక్క వేలాది ట్రావెల్ బస్సులు, లారీలు, ఇతర వాహనాలు రోడ్లపై నిలిచాయి. అనేకచోట్ల ట్రాఫిక్ స్తంభించిందని సమాచారం. వందలాదిమంది పిల్లలు, వృద్ధులు ఎటూపోలేక మండుటెండల్లో మలమలమాడారు. ఇప్పటికీ మారిందేమీ లేదు. ఇంత జరిగినా ఇదేమిటని ఆరా తీసే నాథుడు కరువయ్యాడు. కొందరు మంత్రులు పాలనలో పాఠాలు నేర్చుకొస్తామని దేశాలు పట్టిపోయారు. ముఖ్యమంత్రి అగమేఘాలపై మరో రాష్ట్రానికి వెళ్లారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పక్క రాష్ట్రంలో అస్వస్థత నుంచి కోలుకుంటున్నారు. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యక్తిగత విషాదంలో ఉన్నారు. మామూలు సమయాల్లో సర్వజ్ఞ సింగభూపాలుడి మాదిరి సకల శాఖల్లోనూ పెత్తనం చేసే ‘రెడ్బుక్’ మంత్రి లోకేశ్ మాత్రం ఆచూకీ లేకుండాపోయారు! రాష్ట్రంలో సంస్కరణల సంగతలావుంచి, పాలన ఎంత ముదనష్టంగా మారిందో చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం అవసరమా! సామాజిక మాధ్యమాలు తిరగేస్తే, చానెళ్లు వీక్షిస్తే ఈ అరాచకాన్ని అరక్షణంలో ‘స్వయంగా’ తెలుసుకునే సౌలభ్యం ఉండగా... ఎంత తెలివితక్కువవారైనా అందుకోసం పెట్టుబడి పేరుతో కోట్లాది రూపాయలు వదుల్చుకునే సాహసం చేస్తారా?అధికారంలోకి రావడానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా అరాచకానికి తెరలేపి, ఇప్పటికీ దాన్ని వదలకుండా కొనసాగిస్తున్న ఘనులకు ఇంధన కొరతపై కనీస జ్ఞానం కరువైందంటే దిగ్భ్రాంతికరం. ఆదివారం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం అధికారులతో చర్చించారనీ, మూడు రోజుల ముందే సమస్య వచ్చిపడుతోందని తెలిసినా పట్టించుకోలేదేమని ప్రశ్నించారనీ మీడియాలో కథనాలు ప్రత్యక్షమయ్యాయి. మారుమూల ప్రాంతాల్లో సైతం ఏం జరుగుతున్నదో స్వయంగా తెలుసుకుంటున్నానని చెప్పుకునే సీఎంకు ఇలా ప్రశ్నించటానికి సిగ్గుండాలి. వారు విఫలమయ్యారు సరే... కానీ తనలోని ‘హైటెక్ నిపుణుడు’ ఏమైనట్టు? పోనీ ఈ సమీక్ష తర్వాతైనా పరిస్థితి మారిందా? లేదే!సమస్య మూలాలపై సీఎం మొదలుకొని ఎవరికీ సరైన అవగాహన లేదని వారి మాటలు చూస్తే అర్థమవుతుంది. మూడు రోజుల కిందటే సమస్య ఉందని బాబు అంటే... రాష్ట్రంలో కావలసినంత స్టాక్ ఉందని మంత్రి నాదెండ్ల చెబుతున్నారు! కేవలం వదంతులవల్ల జనం ఒక్కసారిగా రావటంతో ‘సరఫరా లోపం’ ఏర్పడిందని కొట్టిపారేస్తున్నారు. ఎవర్ని నమ్మాలి? వీరి అయోమయం కారణంగా సాధారణ జనం మాత్రమే కాదు... రైతులు సైతం అగచాట్లు పడుతున్నారు. వ్యవసాయం, రవాణా, ఆక్వా రంగాలు కూడా డీజిల్ లభించక గుడ్లు తేలేస్తున్నాయి. కోల్డ్ స్టోరేజిలు సరేసరి. ఉత్పత్తులు నాశనమై, రైతులు నష్టపోతే ఈ పాలకులకు వారిని ఆదుకునేపాటి ఉదారతైనా ఉండదు. నిజానికి ఏపీ మెరుగైన స్థితిలో ఉండాలి. కర్ణాటకలోని పాదూరు, మంగళూర్లతో పాటు విశాఖలో కూడా వ్యూహాత్మక చమురు నిల్వలుంటాయి. విశాఖకు 13 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. అంతర్జాతీయంగా సమస్యలొచ్చినా ఈ నిల్వలవల్ల పదిరోజులపాటు దేశం నిశ్చింతగా ఉండొచ్చంటారు. ఇక విశాఖ చమురు శుద్ధి కర్మాగారానికి రోజుకు 3 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉంది. అంటే ఏడాదికి కోటీ 50 లక్షల మెట్రిక్ టన్నులు. పైగా మాది ‘డబుల్ ఇంజన్ సర్కార’ని చెప్పుకుంటారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు వీరి దయాదాక్షిణ్యాలపైనే సాగుతోంది. మరి ఏ రాష్ట్రంలోనూ లేని కొరత ఏపీకే ఎందుకొచ్చినట్టు? పాలన మరిచి అరాచకాన్నే నమ్ముకుంటే, స్వోత్కర్షలకూ, స్తోత్రపాఠాలకూ అలవాటుపడితే జరిగేది ఇదే. ఈ బాపతు పాలకుల్ని ఏం చేయాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో జనం గ్రహిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. -
ఉబుసుపోని పనులు
ఉబుసుపోని మనుషులు రకరకాల పనులు చేస్తారు. ఉబుసుపోని పనులకు అర్థం, పరమార్థం ఉండవు. ఉబుసుపోని మనుషులు నలుగురూ ఒకే చోటుకు చేరితే పోసుకోలు కబుర్లతో కాలక్షేపం చేస్తారు. కుదిరితే చతుర్ముఖ పారాయణాన్ని ప్రారంభిస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఉబుసుపోని మనుషులు– అభిరుచి మేరకు పుస్తక పఠనంలోనో, కళాసాధనలోనో నిమగ్నమవుతారు. అంతటి అభిరుచులేవీ లేకుంటే, ఊరకే పడక్కుర్చీలో కూర్చునో, మంచంమీద వాలిపోయో పగటికలలు కంటారు. ఉబుసుపోని మనుషులకు పొరపాటున అదృష్టం బాగుండని అర్భక శ్రోతలెవరైనా దొరికితే, ఆవకాయ నుంచి అంతర్జాతీయ వ్యవహారాల వరకు అనర్గళంగా ప్రసంగించి, మేధాప్రదర్శన చేస్తారు. ఉబుసుపోని మనుషులు ఇది చేస్తారు, అది చేయరని నియమాలేమీ లేవు. ఉబుసుపోని సందర్భాల్లో మనుషులు తమ బుద్ధికి తోచిన పనులు చేస్తారు.ఉబుసుపోనితనం, దానివల్ల కలిగే విసుగు మనిషిని కుదురుగా ఉండనివ్వవు. రోజులు రొడ్డగొట్టుడుగా మారిపోయినప్పుడు; దినచర్యలో మార్పు లేనప్పుడు; జీవితంలో ఉత్తేజం లోపించినప్పుడు; బతుకు బొత్తిగా నిరర్థకంగా మారిపోయిందని అనిపించినప్పుడు– మనిషికి ఉబుసుపోనితనం ఏర్పడుతుంది. దానివల్ల విసుగు పుడుతుంది. విరామ సమయాలను అర్థవంతంగా గడపలేని దుఃస్థితి తటస్థిస్తుంది. విశ్రాంతి మనశ్శాంతిని ఇవ్వలేని పరిస్థితి వాటిల్లుతుంది. ఉబుసుపోనితనం గురించి తత్త్వవేత్తలు, మనస్తత్త్వవేత్తలు, సాహితీవేత్తలు అనేక నిర్వచనాలను ఇచ్చారు. కొందరు ఉబుసుపోనితనంలోని సానుకూలతలను చూశారు. ఇంకొందరు ఉబుసుపోనితనాన్ని బూచిలా చూశారు. ఆధునిక మానసికశాస్త్ర పరిశోధకులు ఉబుసుపోనితనం మీద ఇప్పటికీ పరిశోధనలు సాగిస్తున్నారు. ‘ఉబుసుపోనితనం నైతికవాదులకు ఒక గడ్డు సమస్య. నిజానికి లోకంలో జరిగే సగానికి సగం పాపాలు ఉబుసుపోనితనం పట్ల భయం వల్ల జరిగేవే’ అన్నాడు ఇంగ్లిష్ తత్త్వవేత్త బెర్ట్రాండ్ రసల్. ‘ఉబుసుపోనితనం: కోరికల కోసం కోరిక’ అన్నాడు సుప్రసిద్ధ రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్. ‘ఉబుసుపోనితనం– అనుభవం గుడ్డు పెట్టే కలల పక్షి’ అన్నాడు జర్మన్ తత్త్వవేత్త వాల్టర్ బెంజమిన్. ‘ఉబుసుపోనితనం మీద కాస్తంత దృష్టి పెడితే, అది నమ్మశక్యం కానంత ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నాడు అమెరికన్ వైద్య నిపుణుడు జాన్ కాబత్జిన్. బహుశా, ఈ మేధావులంతా తమ తమ జీవితాల్లోని ఉబుసుపోనితనంతోనే ఇన్నిన్ని పరిశోధనలు సాగించి ఉంటారు. ఉబుసుపోని స్థితిలో ఖాళీగా ఉన్న మనిషి బుర్రను ‘దయ్యాల కార్ఖానా’తో పోల్చాడు ఇంగ్లిష్ రచయిత జాన్ బున్యన్. ఉబుసుపోని ఖాళీ సమయాన్ని పనికిమాలిన సమయంగా చాలామంది పరిగణిస్తారు. కానీ, ఉబుసుపోనితనానికి కూడా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది ఆధునిక మనస్తత్త్వ శాస్త్రం. ఉబుసుపోని స్థితిలోనే మనిషిలోని సృజనాత్మకత రెక్కలు తొడుక్కుంటుందని ఇంగ్లండ్లోని సెంట్రల్ లాంకషీర్ వర్సిటీకి చెందిన మనస్తత్త్వ శాస్త్రవేత్తలు శాండీ మాన్, రెబెక్కా కాడ్మన్ కనుగొన్నారు. ఉబుసుపోని స్థితిలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం సహా పలు అద్భుత ఆవిష్కరణలు చేశాడని చెబుతారు. ‘మనిషిలోని జిజ్ఞాసకు, సృజనశీలతకు ఉబుసుపోనితనమే ఉత్ప్రేరకం’ అని ‘యాపిల్’ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చెబుతుండేవాడు. ఉబుసుపోనితనం గురించి డేనిష్ తత్త్వవేత్త సోరెన్ కీర్కగార్డ్ దాదాపు రెండు శతాబ్దాల కిందటే ‘ద పవర్ ఆఫ్ నథింగ్నెస్’లో చర్చించాడు. ఇందులో ఆయన ‘ఉబుసుపోనితనం అన్ని దుర్మార్గాలకూ మూలం’ అని అభిప్రాయపడ్డాడు.ఉబుసుపోనితనంతో చాలామంది అర్థంలేని పనులు చేస్తుంటారు. అక్కడక్కడా కొందరు అనర్థకరమైన పనులు కూడా చేస్తుంటారు. ఇటీవల థాయ్లాండ్లో మాటినా అనే ఇరవై రెండేళ్ల ఉబుసుపోని కుర్రాడు ఏమీ తోచక అడవికి నిప్పుపెట్టి, కార్చిచ్చును రగిల్చాడు. ఉబుసుపోనితనం మనిషితో ఎంతటి పనైనా చేయిస్తుంది. అంతమాత్రాన ఉబుసుపోనితనం అనర్థాలకు హేతువు అని నిర్ధారణకు రావడం మాత్రం నిర్హేతుకమే అవుతుంది. ఉబుసుపోనితనమే లేకుంటే, ఐన్స్టీన్ వంటి శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఉండేవేనా?! -
రాజకీయ కవితావేశం!
అంగ వంగ కళింగ రాజ్యాలను ఏకకాలంలో వచ్చేనెల నుంచి బీజేపీ పరిపాలించబోతున్నదని ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా చెప్పారు. ఇప్పటికే అంగ (బిహార్), కళింగ (ఒడిషా) రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. మొన్న తొలివిడత పోలింగ్ జరిగిన వంగ (బెంగాల్) రాష్ట్రంలో కూడా తాము అధి కారంలోకి రాబోతున్నామని ఆయన తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీస్తుపూర్వం కాలంలో తూర్పు భారతాన ప్రవర్ధిల్లిన మూడు ముఖ్య రాజ్యాలను ఉటంకిస్తూ చారిత్రక కోణంలో ఆయనీ వ్యాఖ్యానం చేసి ఉంటారు. కళింగ యుద్ధంలో రక్తపుటే రులు పారించిన అనంతరం అశోక చక్రవర్తి తన దండయాత్రలకు స్వస్తిపలికి బౌద్ధ ధర్మ బోధనకు అంకితమయ్యారు. రికార్డు స్థాయిలో ఓట్ల వరద పారించిన వంగ యుద్ధంలో ఒకవేళ గెలిస్తే రాష్ట్రాలపై బీజేపీ దండయాత్రలు ముగిసిపోతాయా? అటువంటి అవకాశం ఏమాత్రం లేదని చెప్పవచ్చు.దక్షిణ భారతావని ఇంకా కాషాయ ఛత్రఛాయలోకి పూర్తిగా చేరనేలేదు. ఒక్క కర్ణాటకలో మాత్రమే బీజేపీ గెలుస్తూ, ఓడుతూ వస్తున్నది. ఈసారి తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఆ కూటమిలో బీజేపీ జూనియర్ భాగస్వామి మాత్రమే. పైగా ఆ కూటమి గెలిచే అవకాశాలు కూడా అంతంతమాత్రమే. ఏపీ కూటమి సర్కార్లో కూడా బీజేపీది చిన్న వాటానే. తొలిదశలో పోలింగ్ జరిగిన కేరళం ఈసారి కూడా బీజేపీకి కొరుకుడు పడలేదని వార్తలొస్తున్నాయి. మహా అయితే ఒకటి రెండు సీట్లు గెలవవచ్చనే అభిప్రాయం వినబడుతున్నది. బీజేపీ టార్గెట్ లిస్ట్లో అంగ వంగ కళింగల తర్వాత త్రిలింగ రాష్ట్రమున్నదనే వార్తలు చాలాకాలంగా వినిపి స్తున్నాయి. తెలంగాణకు ఆ పేరు ఎలా వచ్చిందనే అంశంపై ఉన్న రకరకాల వాదనల్లో త్రిలింగ వాదన కూడా ఒకటి కావడం తెలిసిన విషయమే.దక్షిణాన తెలంగాణతో పాటు, ఉత్తరాన పంజాబ్ కూడా ఇప్పుడు బీజేపీకి తక్షణ లక్ష్యాలు. పంజాబ్లో బీజేపీ ఆపరేషన్ నిన్ననే బయటపడింది. అక్కడి పాలక పక్షమైన ఆప్ రాజ్యసభ సభ్యులకు గంపగుత్తగా గాలం వేసి లాగేసింది. తెలంగాణ ఆపరేషన్ ఏ రూపంలో ఉంటుందో ఇంకా తేలవలసి ఉన్నది. సరిగ్గా ఇదే సందర్భంలో ఈరోజు (శనివారం) కేసీఆర్ కుమార్తె కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ పరిణామానికీ, బీజేపీ తెలంగాణ వ్యూహానికీ ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు. కానీ కవిత పార్టీ కారణంగా బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకైనా నష్టం జరిగితే అంతవరకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు బీజేపీకి మెరుగవుతాయి. కొత్త పార్టీ ప్రారంభ కార్యక్రమాన్ని కవిత ఘనంగానే నిర్వహించారు. ప్రారంభం రోజున అన్ని ప్రధాన దినపత్రికల్లో భారీ ప్రకటనలు కనిపించాయి. ముఖ్యమైన వార్తా ఛానెళ్లన్నీ ఆమె ప్రసంగాన్ని లైవ్గా కవర్ చేశాయి. ఎక్కడా పార్టీకి వనరుల కొరత ఉన్నట్టు అనిపించలేదు. బలమైన వ్యవస్థలే ఆమె వెనుక ఉండవచ్చన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేసీఆర్తో రాజకీయ విరోధంతోపాటు వ్యక్తిగత వ్యతిరేకత ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేము. శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్లకోసం డబ్బులిస్తూ వీడియో సాక్షిగా రేవంత్, ఆడియో సాక్షిగా చంద్రబాబు దొరికిపోయిన ఉదంతం పాఠకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తన ఏకైక కుమార్తె వివాహ నిశ్చితార్థం రోజున రేవంత్ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్పై పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును వదిలేసుకొని చంద్రబాబు కరకట్ట నివాసానికి పరుగు పెట్టవలసి వచ్చింది. మధ్యవర్తుల మంత్రాంగంతో ఆ కేసు అప్పటితో ముగిసిపోయిందనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం జరిగిన అవమానాన్ని మరిచిపోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా రాహుల్ గాంధీతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కర్ణాటక, గుజరాత్ ఎన్నికల సమయాల్లో కాంగ్రెస్కు ఆర్థిక సహాయం చేశారన్న వార్తలు కూడా వచ్చాయి.ఓటుకు నోటు కేసు చల్లబడిన కొన్నాళ్లకే చంద్రబాబుకు తెలంగాణ సహచరుడుగా ఉన్న రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్రెడ్డిని ఇరుకున పెట్టడం కోసం ఆయన చెల్లెలు షర్మిల ఆశలను అవకాశంగా తీసుకొని తొలుత తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేయించి, కేసీఆర్ను నానాతిట్లు తిట్టించిన తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రతిష్ఠించారనీ, జగన్మోహన్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయించారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. రేవంత్రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, తదనంతరం ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ఇన్నాళ్లకు కేసీఆర్ కూతురు తండ్రితో విభేదించి సొంతంగా పార్టీని ప్రకటించింది. ఈ పరిణామాన్ని రేవంత్ సర్కార్ సహజంగానే రాజకీయ అవకాశంగా మలుచుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలనిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు సగం పుణ్యకాలం పూర్తయింది. గ్రామ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని వార్తలొస్తున్నాయి. అదే సందర్భంలో కేసీఆర్ పట్ల సానుభూతి కూడా వ్యక్తమవుతున్నదని చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో కవిత సొంత పార్టీని స్థాపించి తండ్రిపైనే నేరుగా విమర్శలను ఎక్కుపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. తాను రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన తండ్రిపైనే కవిత చేస్తున్న విమర్శలపై జనం ఎలా స్పందిస్తారనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. కవితకు మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించాయి. ఇవే లక్షణాలు కేటీఆర్లో కూడా పుష్కలంగా ఉన్నాయి. కేసీఆర్ మేనల్లుడు హరీశ్రావు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. తన కుటుంబం నుంచి ఇంతమంది సమర్థులైన నాయకులు రావడం కేసీఆర్కు లాభమా నష్టమా అనేసంగతి తేలవలసి ఉన్నది.ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చి సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రకటించడం, తన లక్ష్యాలను వివరించడం అభినందించదగ్గ విషయమే. ఈ పరిణామాన్ని ఆహ్వానించ వలసిందే. ఆమె పార్టీ స్థాపన వెనుక రహస్య ఎజెండా ఉన్నదా, ఆమె వెనుక ఎవరున్నారనే చర్చ ముందుగానే చేయడం అనవసరం. అటువంటివేమైనా ఉంటే కాలక్రమంలో అవే బయటకొస్తాయి. అయితే ఆమె ప్రకటించిన ఎజెండా అంశాల మీద, వాటి ఆచరణ సాధ్యాసాధ్యాల మీద చర్చ జరగవలసిందే. ఆమె తన తొలి ప్రసంగంలోనే అధికార పార్టీపై కంటే తన తండ్రి పార్టీపైనే ఎక్కువ దాడిని ఎందుకు చేశారనే విషయంలో విశ్లేషణలు చేయవచ్చు. బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తే ఆ స్థానం తన పార్టీకి దక్కుతుందని ఆమె విశ్వసిస్తున్నారా? అదే స్థానం కోసం పావులు కదుపుతున్న బీజేపీకి ఆమె కళ్లెం వేయగలరా? ప్రతి పక్షాల మూడు ముక్కలాటలో అధికార పార్టీకి లాభం జరగడం ఆమెకు సమ్మతమేనా? కవిత జనంలోకి వెళ్తున్న క్రమంలో నెమ్మదిగా ఇటువంటి సందేహాలకు సమాధానాలు దొరకవచ్చు.ఇప్పుడు ప్రతిపక్షం మనమే, రెండేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది కూడా మనమేనని పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రక టించారు. తన పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా నిర్ణయించడంలోనే ఆమె టార్గెట్ ఎవరో అర్థమవుతున్నది. పాత టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, ఉద్యమ రథం దారి తప్పిందని, కేసీఆర్ ఇప్పుడు మరమనిషిగా మారిపోయారని ఘాటు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పేరు పెట్టుకోవడం వల్ల గత ఉద్యమ ఉత్తేజంతో కొత్త పార్టీ బలం పుంజుకుంటుందని ఆమె నమ్ముతుండవచ్చు. ఎవరి నమ్మకాలు వారివి! ప్రజలను నమ్మించడంలోనే ఆమె రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.తన లక్ష్యాలను వివరిస్తూ ఆమె పాంచజన్యం పూరించారు. తాను చేసిన ఐదు ప్రధాన హామీలకు ఆమె ‘పాంచజన్యం’ అనే పేరు పెట్టుకున్నారు. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం,ఒక్క నోటిఫికేషన్తో యువకులకు నాలుగు లక్షల ఉద్యోగాలు,అందులో ఉద్యమకారులకే లక్ష ఉద్యోగాలు, సామాజిక న్యాయంతో సబ్బండ వర్ణాల సంక్షేమం, వ్యవసాయంలో రైతునే రాజుగా చేయడం... ఆమె ప్రకటించిన పాంచజన్యంలోని ఐదు హామీలు. బీజేపీని రిమోట్ కంట్రోల్తో నడిపించే ఆరెస్సెస్ సిద్ధాంత గ్రంథం పేరు కూడా పాంచజన్యమే. వారి గురువు గోల్వాల్కర్ రాసిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ తెలుగు అనువాదం పేరు పాంచజన్యం. ఇప్పుడు బీఆర్ఎస్ను ఫినిష్ చేసి ఆ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్న బీజేపీ పాంచ జన్యాన్ని మించి కవిత పాంచజన్య శంఖారావం వినిపించవలసి ఉంటుంది.ఐదు హామీలూ ఆకర్షణీయంగానే ఉన్నా వాటిని ఏరకంగా ఆచరణ సాధ్యం చేయగలరో వివరించి చెప్పవలసిన బాధ్యత కొత్త టీఆర్ఎస్ అధ్యక్షురాలిపై ఉంటుంది. రైతుబంధు, మిషన్ కాకతీయ వంటి కేసీఆర్ పథకాలను తెలంగాణ రైతాంగం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. వాటి కంటే మిన్నగా ఏరక మైన ప్రతిపాదనను ఆమె ముందుకు తీసుకొని వస్తారో ఎదురు చూడవలసి ఉన్నది. సామాజిక న్యాయం అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడొక అరిగిపోయిన రికార్డుగా మారింది. తెలంగాణలో అత్యధిక జనాభా గల కులంగా ఉన్న మాదిగ వర్గానికి చెందిన విశారదన్ మహారాజ్ తన ఎజెండాతో ఇప్పుడు ఎస్సీ లతోపాటు, ఎస్టీ, బీసీ యువతను విశేషంగా ఆకర్షించగలుగు తున్నారు. విశారదన్ కంటే విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని కవిత రూపొందించగలిగితేనే ఆమె సామాజిక న్యాయ నినాదం సార్థకమవుతుంది. ఇటువంటి ఎన్నో సవాళ్లకు వెరవకుండా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన కవితకు శుభాకాంక్షలు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘డిజిటల్’ కేసులో పరిహారం!
జేబులు కొట్టడం, దారి దోపిడీలు చేయడం, దొంగతనాలకు పాల్పడటం, నమ్మించి మోసగించటం... ఇవన్నీ పాతకాలపు నాటు పద్ధతులు. 2016లో పెద్దనోట్ల రద్దుతర్వాత దేశంలో ఆన్లైన్ చెల్లింపులు మొదలై వీటన్నిటినీ మరపించేలా కొత్త కొత్తదోపిడీ విధానాలు రంగప్రవేశం చేస్తున్నాయి. అందులో తాజాగా వచ్చిచేరిన ‘డిజిటల్ అరెస్టు’ వీటన్నిటినీ తలదన్నింది. ఈ మార్గాల్లో పౌరులు కోల్పోతున్న సొమ్ము వందల్లోంచి వేలల్లోకి... అక్కడి నుంచి లక్షలు దాటి ఇప్పుడు కోట్లాది రూపాయలకుచేరటంతో మన వ్యవస్థల్లో చలనం వచ్చినట్టుంది. అందుకే కావొచ్చు... ఇటీవల రిజర్వ్ బ్యాంకు స్వతంత్ర ప్రతినిధి (ఆంబుడ్స్మన్) ఈ తరహాలో రూ. 22.93 కోట్లు పోగొట్టుకున్న నరేష్చంద్ర అనే బాధితుడికి కోటీ 31 లక్షల పరిహారం చెల్లించాలని అయిదు బ్యాంకుల్ని ఆదేశించింది. ఆన్లైన్ లావాదేవీల్లో లక్షలాది రూపాయలు నష్టపోతున్న బాధితులు తమ మూర్ఖత్వాన్నీ, తెలివితక్కువతనాన్నీ తిట్టుకుని రోదిస్తు న్నారు. ‘డిజిటల్ అరెస్టు’లో రూ. 8 కోట్లు కోల్పోయిన ఉదంతంలో పంజాబ్ మాజీ ఐజీ అమర్సింగ్ చాహల్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఫిర్యాదులిచ్చినా తిరిగి రాబట్టుకునే సొమ్ము అంతంతమాత్రంగానే ఉంటున్నది. సైబర్ క్రైమ్ విభాగాలకు ఫిర్యాదు చేయ టానికి వెళ్తే ‘ఆ మాత్రం తెలియదా?’ అంటూ ఎదురయ్యే చీవాట్లను భరించటంఅదనపు కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంబుడ్స్మన్ నిర్ణయం బాధితులకు ఉపశమనంకలిగిస్తుంది. ఈ మోసాలు పౌరులకు పెద్ద తలనొప్పిగా మారాయి. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే ‘మన్ కీ బాత్’లో ‘డిజిటల్ అరెస్టు’ మోసాల గురించి ప్రస్తావించాక, మీడియాలో రిజర్వ్ బ్యాంకు తరఫున భారీ ప్రకటనలివ్వటం మొదలైనాక జనంలో ఏదోమేరకు చైతన్యం వచ్చిన సంగతి వాస్తవమే. అయితే ఇంకా మోసపోయేవారిసంఖ్య తగ్గటం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మోసాల కారణంగా జనం రూ. 34,771 కోట్లు కోల్పోయారని రిజర్వ్ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కేవలం ‘డిజిటల్ అరెస్టు’ల వాటాయే రూ. 1,900 కోట్లు ఉంది. 2022లో 10.29లక్షలున్న కేసులు 2024 నాటికి 22.68 లక్షలకు చేరాయి. గత మూడేళ్లలో జనం నుంచి మాయగాళ్లు కొట్టేసిన సొమ్ము 1.25 లక్షల కోట్లు! సిబ్బంది కొరత మాటెలావున్నా, పోలీసు విభాగాల్లో సైబర్ నేరాల దర్యాప్తు, ఆచూకీ రాబట్టడం వగైరాల్లో చాలామందికి పకడ్బందీ శిక్షణ లేదు. ఈ మాదిరి నేరాలకు పాల్పడేవారు వేరే రాష్ట్రాలకూ, వేరే దేశాలకూచెందినవారు కావటం, దర్యాప్తు చేయటానికి పెద్ద ఆటంకంగా మారింది.నియంత్రణ వ్యవస్థలు ఈ మోసాలను అరికట్టడానికి కొత్త ఉపకరణాలు కనుక్కొనే లోగానే నేరగాళ్లు ఏఐతో, ఇతరేతర మార్గాల్లో జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. 2000 సంవత్సరంలో వచ్చిన ఐటీ చట్టం, 2023 నాటి డేటా పరిరక్షణ చట్టం వంటివి మధ్యస్తంగా ఉండే సంస్థలపై బాధ్యత మోపాయి. కానీ ఆచరణలో పెద్దగా ప్రయోజనం లేదు.ఆంబుడ్స్మన్ నిర్ణయం ఈ నేరాలను అరికట్టడంలో ముందడుగు. అసలు ఖాతాదార్లకు తెలియకుండా దొంగసొమ్ము రాకపోకలకు నేరగాళ్లు వాడుకునే ‘మ్యూల్ అకౌంట్ల’ పనిబట్టేందుకు ఇటీవల ప్రయత్నాలు మొదలయ్యాయి. బ్యాంకుల నిష్క్రియాపరత్వం కావొచ్చు... సిబ్బంది కుమ్మక్కుకావటం వల్ల కావొచ్చు ఇవిఇన్నాళ్లూ నిర్నిరోధంగా సాగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో నేరగాళ్లకు సహకరించేబ్యాంకు సిబ్బందిని పోలీసులు ఈమధ్యే అరెస్టు చేశారు. ఈ మార్గంలోనే ఆంబుడ్స్మన్ సైతం ఖాతాదారు వివరాలు సేకరించటానికి, ద్రవ్య అక్రమ చలామణిని అరికట్టడానికి ఉన్న నిబంధనల్ని పాటించటంలో అలసత్వం ప్రదర్శించినందుకు నరేష్చంద్ర కేసులో పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే దీంతో ఆయన సంతృప్తిపడదల్చుకోలేదు. రిజర్వ్బ్యాంకు మార్గదర్శకాలు పాటించని ఆ బ్యాంకులనుంచి తాను కోల్పోయిన మొత్తం రూ. 22.93 కోట్లు ఇవ్వటంతోపాటు నష్టపరిహారం, వడ్డీ, క్యాపిటల్ గెయిన్స్ పన్నుకయ్యే ఖర్చుతో సహా వెనక్కి ఇప్పించాలని నరేష్చంద్ర పోరాడతానంటున్నారు. ఆన్లైన్ మోసాల్లో బాధితులుగా మారుతున్నవారు పోలీసు కేసులు పెట్టడంతోపాటు, బ్యాంకుల అలసత్వం ఉన్నపక్షంలో వాటిపై కూడా న్యాయపోరాటం చేయటానికినరేష్చంద్ర కేసు స్ఫూర్తిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. -
మణిపూర్ చక్కబడేదెన్నడు?
మణిపూర్లో తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగి మూడేళ్లు కావస్తున్నా అక్కడింకా పరిస్థితులు చక్కబడలేదని తాజా ఉదంతాలు నిరూపిస్తున్నాయి. 2023 మే నెలలో హింసకు దారితీసిన వదంతులే ఇప్పటికీ ఆ రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి. బీరేన్ సింగ్ నాయ కత్వంలోని బీజేపీ ప్రభుత్వం పోయి రాష్ట్రపతి పాలన వచ్చింది. అది ఏడాది కొనసాగాక మొన్న ఫిబ్రవరిలో ఆ పార్టీకి చెందిన ఖేమ్చంద్ సింగ్ ఆధ్వర్యాన కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కానీ పరస్పర అపనమ్మకం, జాతి విద్వేషాలు ఆగిందిలేదు. వందలాదిమంది ఆయుధాలు ధరించి గుంపులుగా బయల్దేరి ఊళ్లమీద పడి నిర్విచక్షణగా హత్యాకాండకు, అత్యాచారాలకు పాల్పడటం, ప్రార్థనా స్థలాలు, ఆవాసాలు తగలబెట్టడం ఇప్పుడు లేక పోవచ్చుగానీ... అవతలి పక్షంపై ఆగ్రహావేశాలు తగ్గలేదు. తరచుగా నిరసన ప్రదర్శనలు జరగటం, రహదారులను స్తంభింపజేయటం ఆగలేదు. కేంద్ర బలగాల సంఖ్యను పెంచటం, నిరంతర పహారా వంటివి హింసాత్మక ఉదంతాలను గణనీయంగా కట్టడి చేశాయి. కానీ ఇప్పటికీ విద్వేషాన్ని రెచ్చగొట్టే సందేశాలూ, తప్పుడు సమాచారం వ్యాప్తిలోనే ఉన్నాయి. ఈ నెల మొదటివారంలో ఒక ఇంటిపై బాంబుపడి ఇద్దరు పసిపిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. ఆ బాంబు కుకీలు నివసిస్తున్న ప్రాంతంనుంచి వచ్చిపడిందనీ, వారికి భద్రతా బలగాలు కొమ్ముకాస్తున్నా యనీ ప్రచారం వెల్లువెత్తడంతో జనం ఒక సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి చేశారు. అటుగా వాహనంలో వెళ్తున్న అస్సాం రైఫిల్స్కు చెందిన అధికారిని గుంపు చుట్టుముట్టి దౌర్జన్యం చేసింది. ఆయనను హతమార్చేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా బలగాలు రక్షించగలిగాయి. మొన్న మంగళవారం ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ముఖ్య మంత్రిని ఆందోళనకారులు అడ్డుకున్నప్పుడు లాఠీచార్జి చేసినా, బాష్పవాయు గోళాలు ప్రయోగించినా ఫలితం లేకపోయింది. చివరకు హెలికాప్టర్ తెప్పించుకుని అక్కడినుంచి ఆయన బయటపడాల్సి వచ్చింది. అంతకుముందు ఒక మాజీ సైనికుడితో సహా ఇద్దరు నాగా జాతీయుల్ని మిలిటెంట్లు హతమార్చారు. మూడేళ్ల క్రితం మెయితీలకూ, కుకీలకూ మధ్య వైరం హింసకు దారితీయగా ఇప్పుడు మెయితీల గురి నాగాలపై కూడా పడింది. ఒక పద్ధతి ప్రకారం వదంతులు వ్యాప్తిచేయటం, ప్రజల్లో భయాందోళనలు సృష్టించటం ఇంకా ఆగలేదు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమంటే... ఆ వదంతుల్ని ఖండిస్తూ పోలీసులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. కానీ ఉద్రిక్తతల్ని ఆపటంలో అవి పెద్దగా ఉపయోగపడటం లేదు. గతంలో బీరేన్ సింగ్ ప్రభుత్వ హయాంలో మెయితీలకు చెందిన సాయుధ మిలిటెంట్ సంస్థ ఆరంబాయ్ టెంగోల్ను చూసీచూడనట్టు వదిలేశారు. కుకీల ‘దురాక్రమణల్ని’ అడ్డుకునే పేరిట ఏర్పడిన ఆ సంస్థ కుకీలకూ, నాగాలకూ మాత్రమే కాదు, వారిని ప్రశ్నించే మెయితీలకు సైతం పెద్ద బెడదగా పరిణమించింది. బెదిరించటం, దౌర్జన్యం చేయటం, బలవంతంగా వసూళ్లకు పాల్పడటం ఆ సంస్థకు నిత్యకృత్యమైంది. మూడేళ్లనాటి ఉదంతాలతో పోలిస్తే హింసాత్మక ఘటనలు తగ్గివుండొచ్చు. కానీ ఇప్పటికీ సమాజం చీలికలు, పేలికలుగా ఉంది. మెయితీలూ, కుకీలూ ఒకరి ప్రాంతంలోకి ఒకరు వెళ్లలేకపోతున్నారు. పనిచేయగలిగిన సత్తావుండి అది దొరుకుతుందన్న భరోసా ఉన్నచోటకు పోలేకపోవటం, పై చదువులకు అర్హతలున్నా ఊరు కదల్లేక పోవటంకన్నా మించిన హింస ఏం ఉంటుంది? పరిమిత వనరులు, ఉపాధి లేమి, భిన్న తెగలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవటంవంటి కారణాలవల్లే అసంతృప్తి అవధులు దాటుతోంది.యువతకు ఉపాధి కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం, వారికి మెరుగైన అవకాశాలు రావటానికి తగిన ప్రణాళికలు రూపకల్పన చేయటంవంటి ప్రయత్నాలు ఎక్కడా కనబడవు. కనుకనే మిలిటెంట్ సంస్థల ఆధిపత్యం సాగుతోంది. మౌలిక సమస్యల్ని పరిష్కరించలేని రాజకీయ నేతలు ఓట్లు రాబట్టుకోవటానికి మాత్రం ఆయా తెగల్ని శాసించగల మిలిటెంటు సంస్థలకు సహకరిస్తున్నారు. ఇది కొనసాగినంత కాలమూ మణిపూర్ నెత్తురోడుతూనే ఉంటుంది. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిస్తేనే ఆ రాష్ట్రం తెరిపిన పడుతుంది. -
కీలక పోరుకు సిద్ధం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ల భవితవ్యాన్ని తేల్చబోయే పోలింగ్కు అంతా సిద్ధమైంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బెంగాల్లో గురువారం తొలి దఫాలో 152 స్థానాలకు పోలింగ్ జరగబోతుండగా, ఈ నెల 29న మరో 142 స్థానాలకు పోలింగ్ ఉంటుంది. తమిళనాట మాత్రం మొత్తం 234 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్ పూర్తవుతుంది. తమిళనాడులో చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల పర్వం ఎప్పుడూ ప్రశాంతమే. బెంగాల్లో మాత్రం మహోద్రిక్త వాతావరణమే అలుముకుంటుంది. పార్టీల వైరం సరేగానీ... ఎన్నికల సంఘం(ఈసీ) సైతం ఈ ఉద్రిక్తతలకు దోహదపడటం కొత్త పరిణామం. జనం తమవెంటే ఉన్నారా లేదా... వ్యూహం, ఎత్తుగడలూ కుదిరాయా లేదా అని పార్టీలు ఆత్ర పడటం సహజం. సాధారణ జనంలో సైతం కాబోయే విజేతలెవరు, పరాజితులెవరన్న ఆత్రుత ఉండితీరుతుంది. కానీ బిహార్ అనుభవం తర్వాతైనా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను లోపరహితంగా పూర్తిచేద్దామన్న ఆత్రుత ఈసీలో లేకుండా పోయింది. అందువల్లే బెంగాల్లో 91 లక్షలమంది, తమిళనాడులో 70 లక్షలమంది ఓటర్లలో ఈసారి ఓటు వేయగలమా లేదా అన్న ఆందోళన ఏర్పడింది. బెంగాల్లో ట్రిబ్యునళ్లలో అప్పీల్ దాఖలు చేసి విజయం సాధించినవారికి ఓటేసే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చినా ఇంత తక్కువ వ్యవధిలో ఎందరికి ఆ వరం దక్కుతుందో అనుమానమే. ‘స్వచ్ఛమైన’ ఎన్నికల జాబితాతో పోలింగ్ జరిపితీరాలన్న ఈసీ దృఢ నిశ్చయాన్ని తప్పుబట్టాల్సిన పని లేదు. అందుకోసం ‘సర్’ తీసుకొచ్చారు. కానీ పోలింగ్ తేదీలు ప్రకటించే నాటికి సైతం ఒక కొలిక్కి రాకపోవటం, సాధారణ జనం నానా హైరానా పడటం ఈసీ అసమర్థతకు అద్దం పట్టింది. పోలింగ్కు 48 గంటల ముందు కూడా ఓటుహక్కు ఉంటుందో, ఊడుతుందో తెలియనివారు అనేకులు. ఓటర్లకూ, వారి తల్లిదండ్రులకూ వయసు వ్యత్యాసం 15 ఏళ్లకన్నా తక్కువ లేదా 50 ఏళ్లకు మించి ఉంటే... ఒకే జంటకు ఆరుగురు, అంతకన్నా ఎక్కువమంది సంతానం ఉంటే... ఇంగ్లిష్లో ఉన్న పాత రికార్డుల్లోని పేర్లకూ, ఇప్పుడు నమోదైన పేర్లకూ మధ్య అక్షరం తేడా ఉంటే... ఓటరు వయసుకూ, వారి తాత, నాయనమ్మ లేదా అమ్మమ్మ వయసులకూ మధ్య 40 ఏళ్లకన్నా తక్కువుంటే ఈసీ వాడిన క్రమసూత్ర పద్ధతి (అల్గోరిథిమ్) పొరపాటుగా పరిగణించింది. ఇది మానవ తప్పిదమైనా ఎప్పుడూ లేనట్టు ‘తార్కిక విరుద్ధత’ అనే కొత్త విధానంతో ఈ పేర్లన్నిటినీ తొలగించారు. చాలా ఆలస్యంగా వెల్లడికావటంవల్ల అనేకులు ట్రిబ్యునల్స్ను ఆశ్రయించలేకపోయారు. ఇలాంటివారు ఎన్ని లక్షలమందో తీరిగ్గా వెల్లడవుతుంది. అప్పటికల్లా పుణ్యకాలం కాస్తా ముగుస్తుంది!ఆంధ్రప్రదేశ్లో 2024లో యథేచ్ఛగా సాగిన ఎన్నికల వైపరీత్యాల గురించి వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకూ ఈసీ నుంచి ఉలుకూ పలుకూ లేదు. లోక్సభకూ, అసెంబ్లీకీ ఒకేసారి జరిగిన పోలింగ్లో నిమిషానికి నలుగురు ఓటేశారన్నా దానికి పట్టదు. కానీ తగుదునమ్మా అంటూ మొన్న బిహార్లో, ఇప్పుడు ఎన్నికలు జరిగిన, జరగబోతున్న రాష్ట్రాల్లో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా పేరుతో ‘సర్’ ప్రక్రియ మొదలెట్టింది. ఏపీ విషయంలో ఈ ‘స్వచ్ఛ సంకల్పం’ ఏ గంగలో కలిసినట్టు? తమిళనాట చాలా దశాబ్దాల తర్వాత డీఎంకే, అన్నా డీఎంకేలకు సినీ హీరో విజయ్ నెలకొల్పిన టీవీకే పార్టీ రూపంలో పెను సవాలు ఎదురైంది. ఇందువల్ల ఎవరి లెక్క తారుమారువుతుందన్నది చూడాల్సి ఉంది. ఆయన సభలకు భారీయెత్తున జనం రావటం గమనించదగింది. బెంగాల్లో రెండు దశాబ్దాలనాడు భూసేకరణ విధానంపై పోరాడి ఏకంగా లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికే ఎసరు తెచ్చిన నందిగ్రామ్ ఇప్పుడు కొత్త దోవ తొక్కటం గమనార్హం. ఆనాడు మొత్తం సమాజానికి జరిగిన అన్యాయంపై ఒక్కటై ప్రశ్నించిన నందిగ్రామ్ ఇవాళ ఏ దేవుడు గొప్ప – రాముడా, జగన్నాథుడా అనే అంశం చుట్టూ తిరుగుతోంది. తొలి దశ పోలింగ్లో ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ రామనామాన్ని, టీఎంసీ తన ఆధ్వర్యంలో నిర్మాణమైన జగన్నాథ్ ఆలయాన్ని తెగ ప్రచారం చేశాయి. ఏదేమైనా పోలింగ్ ప్రశాంతంగా ముగియాలని అందరూ కోరుకుంటారు. -
ద.కొరియాకు దగ్గరగా...
ఎన్నికల ప్రచారపర్వం ఊపందుకున్నప్పుడు మన దేశంలో విదేశీ అధినేతల పర్యటనలకు ప్రాముఖ్యత తగ్గిపోతుంది. దానికితోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియాలో సృష్టించిన అనిశ్చితి సరేసరి. ఇలాంటి వాతావరణంలో ఆదివారం భారత్కొచ్చి మూడు రోజులు పర్యటించి వెళ్లిన దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్కు ఇది అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆ పర్యటనకు మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతంతమాత్రమే. ఆ మాటెలా ఉన్నా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇరు దేశాల మధ్యా ప్రస్తుతం ఉన్న 2,700 కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని 2030 నాటికి 5,000 కోట్ల డాలర్లకు చేర్చాలని అధినేతలిద్దరూ సంకల్పించారు. ఇందుకోసం 2010లో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా)ను మరింత విస్తృతపరచాలని నిర్ణయించారు. భారత్లో విదేశీ పెట్టుబడుల్లో దక్షిణ కొరియా అయిదో స్థానంలో ఉంది. మ్యూంగ్ తనతోపాటు 200 మంది వ్యాపార వేత్తలూ, సీఈవోలతో కూడిన భారీ ప్రతినిధి బృందాన్ని వెంట బెట్టుకుని వచ్చారు. కృత్రిమ మేధ(ఏఐ), రక్షణ, షిప్పింగ్, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, క్రీడలు, సాంస్కృతిక రంగం వగైరాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్యా సాంస్కృతిక బంధానికి ఎంతో చరిత్ర ఉందంటారు. క్రీస్తుశకం 48లో అయోధ్యకు చెందిన యువతి హియోహాంగ్కు అప్పటి కొరియా రాజు సురోతో వివాహమైందని 13వ శతాబ్దంనాటి ఒక బౌద్ధ సన్యాసి రచించిన పుస్తకంలో ఉంది.అందులో ప్రస్తావించిన ‘అయుత’ ఇప్పటి అయోధ్య అయివుంటుందని అనేకులు భావిస్తారు. కొరియా చరిత్రలో ఆమె యువరాణి సురిరత్నగా నమోదైంది. అయోధ్యలో సరయూ నది ఒడ్డున రాణి హియోహాంగ్ స్మృతిలో ఒక పార్క్ నిర్మించారు. 2019లో ఆమె స్మారకార్థం రెండు దేశాలూ కలిసి ఒక స్టాంపు విడుదల చేశాయి. నాలుగో శతాబ్దంలో బౌద్ధం ఆ దేశంలో ప్రవేశించింది. 1973లో తొలిసారి దౌత్య సంబంధాలు ఏర్పడినా... అంతకు చాన్నాళ్లముందే 1950–53 నాటి కొరియా యుద్ధకాలంలో మన దేశంనుంచి వైద్య బృందాలు అక్కడికెళ్లి పనిచేశాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలం ముగిశాక తొలిసారి 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆ దేశంలో పర్యటించారు. ప్రత్యేకించి ఎలాంటి కారణాలూ లేకపోయినా 2018లో అప్పటి దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే–యీ తర్వాత దౌత్య సంబంధాల్లో స్తబ్ధత ఆవరించింది. అప్పుడూ, అంతకుముందూ కుదిరిన ఒప్పందాలు ఆచరణలో కొనసాగుతున్నా ఇరు దేశాల వాణిజ్య లోటుపై మన దేశానికి కొంత అసంతృప్తి ఉంది. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం 2,700 కోట్ల డాలర్లున్నా, అక్కడినుంచి మనకొచ్చే దిగుమతుల విలువ దాదాపు 2,100 కోట్ల డాలర్లు. మన ఎగుమతుల విలువ 600 కోట్ల డాలర్లు మించదు. ఇందులో సమతౌల్యత సాధించాలని మన దేశం ఎప్పటినుంచో భావిస్తోంది. ఆరోగ్య కారణాలు చూపి, చీడపీడలు చూపి మన సాగు ఉత్పత్తులను దక్షిణ కొరియా అడ్డుకుంటోంది. నౌకా నిర్మాణంలో దక్షిణ కొరియా సాంకేతికతకు ప్రపంచవ్యాప్తంగా మంచిపేరుంది. పర్యావరణ హితమైన, అత్యాధునిక నౌకల నిర్మాణంలో, ఇతర నౌకాసంబంధ కార్యకలాపాల్లో మన దేశానికి సహకరించేందుకు అంగీకరించింది. నౌకాశ్రయాలను సాంకేతికంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లటంతోపాటు ఓడల మరమ్మతుకు, అతి పెద్ద ఓడల నిర్మాణానికి తోడ్పడే భారీ డ్రై డాక్ల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ముందుకొచ్చింది. రక్షణ రంగంలో ఇప్పటికే ఉన్న బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాలూ నిర్ణయించాయి. విమాన విధ్వంసక ఫిరంగులు, క్షిపణి వ్యవస్థలు ఇక్కడే అభివృద్ధిపరచడానికి, అందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతల్ని బదిలీ చేయటానికి దక్షిణ కొరియా అంగీకరించింది. యుద్ధక్షేత్రంలో చురుగ్గా కదిలి, శత్రుసైన్యాన్ని దీటుగా ఎదుర్కొనగలిగే సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్ కె9 వజ్ర కొరియా సహకారంతోనే ఇక్కడ ఉత్పత్త వుతోంది. ఇవిగాక సెమీ కండక్టర్లు, ఫార్మా, జౌళి, ఐటీ రంగాలకు సైతం సహకారం విస్తరించటానికి సంకల్పించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి అలుముకున్న వర్తమానంలో భిన్న రంగాల్లో మరింత దగ్గరయ్యేందుకు దక్షిణ కొరియా అధినేత పర్యటన దోహదపడుతుంది. -
చల్లారని పశ్చిమాసియా!
పశ్చిమాసియా మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా–ఇరాన్ల మధ్య కుదిరిన రెండు వారాల అరకొర కాల్పుల విరమణకు ఆదినుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అది కాస్తా మంగళవారం అర్ధరాత్రి ముగియబోతుండగా, ఇరుపక్షాల మధ్యా పాకిస్తాన్లో జరగాల్సిన రెండో విడత చర్చలకు అమెరికా దుందుడుకు చర్యవల్ల గండిపడింది. అరేబియా సముద్రం వైపునుంచి హార్మూజ్ జలసంధిలో ప్రవేశించబోతున్న ఇరాన్ రవాణా నౌకపై సోమవారం వేకువజామున దాడిచేసి, ధ్వంసం చేసి చర్చల విషయంలో తనకు చిత్తశుద్ధి లేదని ఆ దేశం మరోసారి నిరూపించుకుంది. కనుక రెండో విడత చర్చలకు పోదల్చుకోలేదని ఇరాన్ ప్రకటించటంలో వింతేమీ లేదు. శత్రుత్వంతో రగిలిపోయే వైరిపక్షాలమధ్య ఏకాభిప్రాయ సాధన అంత సులభం కాదు. ఇరుపక్షాలూ నిజాయితీగా వ్యవహరిస్తే ఏదోమేరకు అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. కానీ ఒప్పందం కుదిరిన మరుక్షణంనుంచీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పొంతనలేని ప్రకటనలు చేస్తూ ఇరాన్ను రెచ్చగొట్టారు. మరోపక్క ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్కు ప్రతినిధి బృందాన్ని పంపారు. విట్కాఫ్, తన అల్లుడు జేడీ కుష్నెర్లాంటి రియలెస్టేట్ ఏజెంట్లున్న ఈ ప్రతినిధి బృందానికి కాల్పుల విరమణ గురించి ఏం అవగాహన ఉంటుంది? అసలు హార్మూజ్ జలసంధిని ఇకపై తామే పర్యవేక్షిస్తామనీ, రాకపోకలకు ఎవరినీ అనుమతించబోమనీ గతవారం ట్రంప్ ప్రకటించినప్పుడే ఆ ఒప్పందం కాస్తా అర్థరహితంగా మారింది. ఇరాన్ను చుట్టుముట్టి దిగ్బంధిస్తే, దాని ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే పాదాక్రాంత మవుతుందని ఇప్పటికీ ట్రంప్ కలలుగంటున్నారు. నష్టపోకతప్పని స్థితి ఏర్పడితే అది తనతో ఆగకుండా ప్రపంచం మొత్తానికి అంటుకునేలా ఇరాన్ ప్రత్యామ్నాయాన్ని సిద్ధపరిచే ఉంచింది. తాజా పరిణామాలతో సోమవారం ముడి చమురు ధర ఒక్కసారిగా 7 శాతం పెరిగి బ్యారెల్ చమురు 89 డాలర్లకు చేరుకోవటం జరగబోయేదేమిటో సూచిస్తోంది. గత నెల్లాళ్ల చమురు ధరలు గమనిస్తే ఇప్పటికీ ఆ ధరలు దాదాపు 10.4 శాతంమేర తక్కువగానే ఉన్నాయి. కానీ నిరుటితో పోల్చిచూస్తే 41.01 శాతం అధికం! అసలు గతవారం ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ సంయమనం పాటించకపోతే ఈపాటికే ఆ ప్రాంతం ఘర్షణలతో అట్టుడికేది. ఎక్కడో వేలమైళ్ల దూరంనుంచి వచ్చి, నావికా దళాలను మోహరించి దిగ్బంధిస్తామని హెచ్చరిస్తే ఏ దేశమైనా సహించగలదా? సమర్థవంతంగా వ్యవహరించగలిగితేనే మధ్యవర్తి పాత్ర పోషించాలని పాకిస్తాన్కు ఈ పరిణామాల తర్వాతైనా అర్థమైవుండాలి. మధ్యవర్తిత్వమంటే పోస్టుమాన్ పని కాదు. భిన్న వాదనల్ని వినిపిస్తున్న ఇరుపక్షాలూ వాస్తవ పరిస్థితులేమిటో గ్రహించేలా చేసి, తన తర్కంతో ఒప్పందానికి ఒప్పించే నేర్పుండాలి. వెనకుండి ప్రోత్సహించిన చైనా ఏం చెప్పిందోగానీ... తనకు హఠాత్తుగా దక్కిన ఈ నడమంత్రపు కీర్తితో పాకిస్తాన్ అన్నీ మరిచినట్టు కనిపిస్తోంది. తమ వద్ద యురేనియం ఉండాలో లేదో నిర్ణయించటానికి అమెరికా ఎవరన్న ఇరాన్ తాజా ప్రశ్నకు ట్రంప్ ఏం జవాబివ్వగలరు? అమెరికా దగ్గర దండిగా అణ్వాయుధా లున్నాయి. దశాబ్దాల క్రితమే తన మిత్రదేశం ఇజ్రాయెల్కు సైతం వాటిని చేరేసింది. అది అమెరికా అవలక్షణాలను పుణికిపుచ్చుకుని పశ్చిమాసియా దేశాలను బెదిరిస్తూ, అకారణంగా దాడులకు పాల్పడుతూ ఈ ప్రాంత శాంతికి విఘాతం కలిగిస్తోంది.ఇలాంటి స్థితిలో తన ఆత్మరక్షణకు ఇరాన్ సైతం అదే బాట పడితే ఆశ్చర్యమేముంది? జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, కాల్పుల విరమణ పేరిట మాయచేసి ఇరాన్ను లొంగదీసుకోవాలన్నదే ట్రంప్ ఆంతర్యంగా కనబడుతోంది. ఇప్పటికిప్పుడు యుద్ధ విరమణ ప్రకటించినా అమెరికాలో ఇప్పటికే 3.3 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం కనీసం మరో ఏడాది వరకూ దిగిరాదు. 38 సభ్యదేశాలున్న ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) పరిధిలో ద్రవ్యోల్బణం 4 శాతం దాటొచ్చన్న అంచనాలున్నాయి. కనుక ఇప్పటికైనా అమెరికా తన వైఖరి మార్చుకోవాలి. ఓటమిని అంగీకరించి గౌరవప్రదంగా తప్పుకోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదని గ్రహించాలి. -
నీటి గుడి
కాశీలోని ఒక ముసలామెకు రోజులు ముగిశాయి. యమభటులు వచ్చి ‘అవా... బయలుదేరు...’ అంటే ఆమె అందుకే కాచుకుని ఉన్నట్టు ఒకటీ అరా వస్తువులు ముల్లె కట్టుకొని ‘పదండి నాయనా’... అని కదలబోయింది. విష్ణుభటులు ప్రత్యక్షమయ్యారు. ‘మీరెందుకు వచ్చారు’ అన్నారు యమభటులు ఆశ్చర్యపోయి. ‘ఈ అవ్వ మా కేండేటు. స్వర్గానికి పిల్చకపోవడానికి వచ్చాము’ అన్నారు. ‘అంత ఘనకార్యం ఏం చేసిందీ అవ్వ. కొంపదీసి యజ్ఞాలుగానీ చేసిందా’ అన్నారు యమభటులు. ‘అంతకు మించే చేసింది. అవ్వకు కొడుకూ బిడ్డా ఎవరూ లేరు. ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసి ఈ కాశీలో చలివేంద్రం పెట్టింది. ఇక్కడ రోజూ వచ్చే భక్తులు, బైరాగులు ఈమె పెట్టిన కుండల్లోని నీళ్లు తాగి దప్పిక తీర్చుకున్నారు. ఒక్క దప్పిక తీరిస్తే నూరు అశ్వమేధ యాగాల పుణ్యం. మరి ఈమె పుణ్యం లెక్కవేయడానికి మీ చిత్రగుప్తుడి చిట్టాపద్దులు సరిపోతాయా’ అని అవ్వను పల్లకీ ఎక్కించి, పూలవానలో స్వర్గలోకానికి తోడ్కొని వెళ్లారు. ఈ ఎండల్లో వినదగ్గ కథే ఇది.అదేమిటో యుగాలు గడిచినా రంతిదేవుణ్ణి తలదన్నే ఉదారపురుషుడే కానరావడం లేదు. దానాలకు అన్నీ పోగా 48 రోజులు ఉపవాసం ఉన్న రంతిదేవుడికి కొంత జావా, కొన్ని నీళ్లు దక్కాయి. జావ తాగబోతే ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘ఆకలి’ అన్నాడు. ఇచ్చేశాడు. నీళ్లు తాగబోతుంటే ఒక శూద్రుడు వచ్చి ‘దప్పిక’ అన్నాడు. ఇచ్చేశాడు. పాత్రలో ఉన్న చివరి నీటి చుక్కలను తాగుదామనుకునేలోపు ఒక పంచముడు వచ్చి ‘అయ్యా... దప్పికతో చచ్చేలా ఉన్నాను’ అనంటే ఆ చివరి నీటి చుక్కలతో పంచముడి పెదవులు తడిపాడు. అప్పుడు ఆగలేక విష్ణువు ప్రత్యక్షమై ‘నీ త్యాగం ముందు నా వైకుంఠం దిగదుడుపు’ అన్నాడు. ‘నీకేం కావాలో కోరుకో’ అనీ అన్నాడు. ‘నాకేం వద్దు. ఈ లోకంలో ఎవరినీ దప్పికతో ఉంచొద్దు’ అన్నాడు రంతిదేవుడు. ‘తథాస్తు’ అన్నాడు విష్ణువు. ఈ భగభగమండే ఎండల్లో అలా రోడ్డు మీద వెళితే ఈ ‘తథాస్తు’ ఏ మేరకు సిద్ధించిందో తెలుస్తుంది.పనుల మీద ఊరుగాని ఊరుకు వస్తారు చాలామంది. ఉన్న ఊళ్లోనే రెక్కాడితేగాని డొక్కాడని బతుకుకై బయలుదేరుతారు చాలామంది. జనుల ఆకలి తీర్చడానికి తిండి బుట్టలు వీపున కట్టుకుని తిరిగేవారు వేలమంది. ఇక ఈ దేశంలో కోట్ల మందికి ట్రంకు రోడ్డే ఆఫీసు, మెయిన్రోడ్డే షాపు. కాసింత చెట్టు నీడ కూడా దొరకని ఈ పొడవైన, నిర్దాక్షిణ్యమైన, నల్లటి రోడ్డు మీద వేసవిలో బతుకులు వెళ్లమార్చే వారంతా ఉష్ణాన్ని తట్టుకోగలరేమోగానీ దప్పికను తట్టుకోగలరా? ఏం కావాలి వీరికి? మన మనసు చల్లదనం. అది మన చేత పెట్టించే చలివేంద్రం. తడి గుడ్డ కట్టిన, చూడగానే ప్రాణం లేచి వచ్చే చల్లని మంచినీరు!‘అప ఏవ ససర్జాదౌ’ స్మృతివాక్యం. అంటే ‘పరమాత్ముడు మొదట నీరు సృష్టించాడు’. నారము– నీరును, ఆయనము– నివాసము చేసుకున్నవాడు నారాయణుడు. ‘నీటిలో రుచిని నేను’ అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. నీళ్లతో సేవ చేయడమంటే దేవునికి పూజ చేయడమే. ‘పానీయం పరమం దానం’. నీటిదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పది. పామరులు ఈ మాటనే ‘కుండలో నీళ్లు పోస్తే పుణ్యం వాగు పారినట్టు’ అన్నారు. ‘దాహం అన్నవాడికి లేదనకు. లక్ష్మి ఇల్లు కదలుతుంది’ అని హెచ్చరించారు. ఉత్తర భారతాన ‘ప్యావూ’ అని పిలిచే చలివేంద్రాల సంస్కృతి ఉంది. ఇంటి బయట, వీధి చివర ఎవరో అజ్ఞాతవ్యక్తులు పెద్ద పెద్ద రజాయిలు పెట్టి నీళ్లు నింపుతుంటారు. ఎండన పడి వెళ్లేవాళ్లంతా తాగుతుంటారు. అజ్ఞాతంగా ఎందుకు? దప్పిక తీర్చి చెప్పుకోకూడదు. దప్పిక తీర్చామని అహానికి పోకూడదు. దప్పిక తీరినవారు ఫలానా వారికి రుణపడ్డామని అనుకోకూడదు. నీరు దైవసొత్తు. మనిషి సృష్టించింది కాదు. దైవసొత్తును మరో మనిషికి చేరవేయడంలో మన ఘనకార్యం ఏముంది? మరైతే మన దేశంలో చలివేంద్రాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? కేరళ. గతంలో తెలుగునాట ఎండలు వస్తే పోటీలు పడి చలివేంద్రాలు పెట్టేవారు. ఇప్పుడు రీల్స్ చూడటంలో పడి బిజీగా ఉంటున్నారు. గ్లాసెడు నీరు ముంచి ఇచ్చి పోగేసుకునే సంతృప్తికి కౌంటింగ్ మెషీన్ లేదని వీరికి తెలిసేదెలా? ఎండాకాలంలో పుణ్యయాత్రలకు రెడీ అవుతుంటారు చాలామంది. మంచిదే. కాని మన ఇంటి ముందే ఒక గుడి కట్టే వీలుండే ఈ కాలాన్ని మిస్ చేసుకోవద్దు. నీటి గుడి కట్టండి. నీరున్న కుండలో దేవుడు ఉన్నాడు! -
ఎక్కాల్సిన రైలు ఎప్పుడొస్తుంది?
131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకోసమే ప్రతిపాదించిందని ప్రతిపక్షం ఆరోపించింది. నిజమే కావచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజనతో కలిపేయడం వెనుక రాజకీయ కుట్ర దాగున్నదని ప్రతిపక్షం విమర్శించింది. ఇది కూడా నిజమే కావచ్చు. నియోజకవర్గాల పెంపును అన్ని రాష్ట్రాల్లో సమాన నిష్పత్తిలో పెంచుతామని ప్రధాని ఇచ్చిన హామీ బిల్లులో లేకపోవడం మోసపూరిత చర్యగా విపక్షం అభివర్ణించింది. అలా అనుమానించడంలో కూడా తప్పు లేదు. కనుక రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన సంఖ్యాబలాన్ని అందివ్వకుండా అది వీగిపోయేలా చేసింది. అయితే బిల్లును ఓడించడం ద్వారా ప్రతిపక్షం సాధించిన ఘనకార్యమేమిటన్నదే అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోతున్నది.మన దేశంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో పురుషులతో సమానంగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా సందర్భాల్లో పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొంటూ తమ రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులుగా పురుషులతో సమానస్థాయిలో రాణించగలుగుతున్నారు. చారిత్రక కారణాల వలన ఆర్థిక స్వాతంత్య్రంలో గానీ, వనరుల అజమాయిషీలో గానీ పురుషులతో పోలిస్తే వారు పోటీ పడలేరు. విస్తృత ప్రజా సంబంధాలను నెరపడంలో కూడా కుటుంబ బాధ్యతలు, సామాజిక బంధనాల వల్ల పురుషుల కంటే వెనకబడుతున్నారు. ఫలితంగా పురుష పుంగవులతో పోటీపడి గౌరవ ప్రదమైన సంఖ్యలో చట్టసభలకు ఎన్నిక కాలేకపోతున్నారు. సగం జనాభాకు ప్రాతినిధ్యం వహించేవారి ప్రాతినిధ్యం పది నుంచి పదిహేను శాతం దాటడం లేదు. వారిలో కూడా తండ్రి చాటు బిడ్డలు, భర్త నీడలోని భార్యలే ఎక్కువ!ఆందోళనకరమైన ఈ అసమానతను అధిగమించాలంటే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అవసరమనే ప్రతిపాదన చాలాకాలం కిందనే రాజకీయ వేదికపైకి వచ్చింది. ముప్ఫయ్ సంవత్సరాల కిందట 1996లో మహిళా బిల్లు తన ప్రయాణానికి సిద్ధమై స్టేషన్లో కూర్చున్నది. ‘నువ్వు ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అని అభ్యుదయ కవి ఆరుద్ర చెప్పిన మాట మహిళా బిల్లులో నిజమైంది. రాజకీయ నేతలు కుంటిసాకులు చెప్పకుండా అప్పుడే ఆమోదించి వుంటే చట్టసభల్లో మూడో వంతు మహిళలు మూడు దశాబ్దాల కిందనే ప్రవేశించి ఉండే వారు. బహుశా వారిలో చాలామంది రంగంలోంచి తప్పుకొని రెండో తరానికి మార్గమిచ్చి ఉండేవారు. నిజంగానే ఒక తరం మహిళలు ఎక్కాల్సిన రైలు వారి జీవితకాలం లేటయ్యింది.ఇంకో మూడేళ్లలో రెండో తరం ఎక్కడానికి అవకాశం ఉందను కున్న రైలును స్టేషన్కు చేరకముందే ప్రతిపక్షం చైన్ లాగి నిలిపే సింది. అది ఎప్పటికొస్తుందో!డీలిమిటేషన్ బిల్లుతో మహిళా రిజర్వేషన్ బిల్లును లింక్ చేయడమేమిటని ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు ప్రారంభ మైన జనగణన పూర్తయిన తర్వాత, ఆ నివేదికను ప్రచురించిన తర్వాత రాజ్యాంగ విధిగా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టవలసి ఉన్నది. ఈ ప్రక్రియ ద్వారా లోక్సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 850 వరకు పెంచాలని కేంద్రం భావిస్తున్నది. కనుక ఆ నిష్పత్తి ప్రకారమే మహిళా సీట్లను పెంచి తాజా జనగణనతో సంబంధం లేకుండా 2011 లెక్క ప్రకారమే పునర్విభజన చేయడానికి బిల్లును రూపొందించినట్టు కేంద్రం చెబుతున్నది. అయితే తాజా జనగణన ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నేప థ్యంలో దాని రిపోర్టు వచ్చేవరకు ఆగకుండా ఆదరాబాదరాగా పదిహేనేళ్ల కిందటి లెక్కలతో డీలిమిటేషన్ చేపట్టవలసిన అవసరమేమిటన్నది హేతుబద్ధమైన ప్రశ్న. ఇప్పుడున్న 543 సీట్లలోనే మహిళలకు మూడో వంతు కేటాయించి అమలు చేయడానికి దానికోసం ప్రత్యేక చట్టం చేయడానికి ఉన్న అభ్యంతరమేమిటో, రాజ్యాంగపరమైన అవాంతరాలేమిటో అర్థం కాని ప్రశ్న. కేంద్రం కూడా ఈ సందేహాలను తీర్చలేదు.డీలిమిటేషన్ ప్రక్రియ పట్ల ప్రతిపక్షాలకు అభ్యంతరాలు న్నాయి. కానీ, రాజ్యాంగంలోని 82వ అధికరణం ప్రకారం పదేళ్ల కోసారి జరిగే ప్రతి జనగణన తర్వాత చట్టసభల స్థానాలను పునర్విభజన చేయడానికి పార్లమెంట్ ఒక అథారిటీని నియమించవలసి ఉన్నది. అట్లాగే 170వ అధికరణం ప్రకారం రాష్ట్రాల్లో కూడా! 1971 దాకా ఈ పద్ధతే కొనసాగింది. జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ నియంత్రణ విజయవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గుతున్నదనే వాదన ముందుకొచ్చింది. దాంతో 1976లో అప్పటికి ఉన్న సీట్ల గరిష్ఠ సంఖ్యను స్తంభిం పచేసేలా చట్ట సవరణ జరిగింది. మొదట 2002 వరకు, ఆ తర్వాత 2026 వరకు ఈ గరిష్ఠ పరిమితిని విధించడం జరిగింది. ఈ పరిమితికి లోబడే ఇప్పటివరకు జరిగిన పునర్విభజనలన్నీ మార్పులు, చేర్పులకు మాత్రమే పరిమితమయ్యాయి.చట్టసభల్లో సీట్ల సంఖ్యను స్థిరీకరించి యాభై ఐదేళ్లు గడిచిపోయాయి కనుక ఇప్పుడు సీట్ల సంఖ్యను పెంచుతామని ఎన్డీఏ సర్కార్ చెబుతున్నది. రాజ్యాంగ నిబంధన కూడా పదేళ్ల కోసారి జరిగే జనగణన తర్వాత సీట్ల పునఃపంపిణీ జరగాలని ఆదేశిస్తున్నది. జనాభా పెరిగితే సీట్ల సంఖ్య పెరగాలని రాజ్యాంగంలో లేకపోవచ్చు. కానీ ఎక్కువమంది ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావడమే 82 అధికరణం అంత స్సూత్రం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించి ఎన్నాళ్లిలా గరిష్ఠ సంఖ్యను స్తంభింపజేయగలరు? మల్కాజిగిరి లోక్సభ నియో జకవర్గంలో 38 లక్షలమంది ఓటర్లున్నారు. ఇక్కడి నుంచి ఎన్ని కైన ప్రజాప్రతినిధి ఎంతమందికి అందుబాటులో ఉండగలరు? అసలీ సీట్ల పెంపును విపక్షం ఎందుకు వ్యతిరేకిస్తున్నది?డీలిమిటేషన్ ప్రక్రియను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతి పక్ష కూటమి చెప్పడం లేదు. పాలకపక్షం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నది. డీలిమిటేషన్ జరిగే ప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకు కొంత లాభం జరుగుతుందనే అపోహ రాజకీయ పార్టీల్లో ఉన్నది. ఎన్నికల సమయంలో ఏ గాలీ లేకపోతే కొద్దిమేరకు ఇది ఉపయోగపడవచ్చేమో! కానీ పాజిటివ్ లేదా నెగెటివ్ ధోరణులు బలంగా ఉన్నప్పుడు ఇదేమీ ఉపకరించదు. అయినా ఈ అభిప్రాయాన్ని రాజకీయ పార్టీలు బాహాటంగా అంగీకరించవు కనుక స్పష్టాస్పష్టమైన కొన్ని భావనలను వారు ముందుకు తెస్తున్నారు. అభ్యంతరాల్లో ముఖ్యమైనది... కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలుచేసిన రాష్ట్రాలు జనాభా లెక్క ప్రకారం జరిగే పునర్విభజనలో నష్టపోతాయి. యాభయ్యేళ్ల తర్వాత కూడా ఇదే వాదన. ఈ వాదన ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. అంటే హిందీ రాష్ట్రాలకు లాభం, హిందీయేతర రాష్ట్రాలకు నష్టం. దీనికితోడు నార్త్ – సౌత్ వాదన. దక్షిణాది రాష్ట్రాలపై పెత్తనం చేయడానికి, హిందీభాషను బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదనే అభిప్రాయం కూడా బలంగా ఉన్నది. బీజేపీ సర్కార్కు హిందీ – హిందూ ఎజెండా ఉన్నదనే సంగతిని ఎవరూ దాచలేరు. ఆ పార్టీ గత కొంతకాలంగా తన ఎజెండాను బలంగా జనంలోకి తీసుకొనిపోతున్నది. దేశంలోనే సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించి నిలబడలేకపోతున్నది. అసమర్థ నాయకత్వం ఆ పార్టీ పాలిటి శనిగా దాపురించింది. బీజేపీ ఎజెండాను ఎదిరించే ప్రాంతీయ పార్టీలు కొన్ని సమర్థంగా నిలబడగలుగుతున్నాయి.ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన ఆవశ్యకత. మహిళా రిజర్వేషన్లు దేశ ప్రజల చిరకాల వాంఛితం. ఇప్పుడు ప్రారంభమైన జనగణన ముగిసి తుది రిపోర్టు 2028 నాటికి అందుబాటులోకి వస్తుందని చెబు తున్నారు. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ను వేయాలి. అది తన రిపోర్టును ఇవ్వటానికి ఐదు సంవత్సరాల కంటే తక్కువ సమయాన్ని ఎప్పుడూ తీసుకోలేదు. కేంద్రంలోనూ, రాష్ట్రా ల్లోనూ ఇప్పుడు సీట్ల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో మరింత ఎక్కువ సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. అంటే 2033 కంటే ముందు ఈ ప్రక్రియ పూర్తికాదు. 2029 ఎన్నికల నాటికే ముందుకు తెస్తామని ఎన్డీఏ సర్కార్ చెప్పిన మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ఇంకో ఐదేళ్లు వెనక్కు పోతాయి.ఇప్పుడు ప్రతిపక్షం కోరుకుంటున్నదేమిటి? ఐదేళ్ల తర్వాత రాజ్యాంగబద్ధ ప్రక్రియ ప్రకారం జరిగే డీలిమిటేషన్ వారి అభీష్టానికి అనుగుణంగా జరుగుతుందా? 2028లో మోదీ ప్రభుత్వమే ఉంటుంది. డీలిమిటేషన్ కమిషన్ను నియమించడానికీ, దాని విధివిధానాలు రూపొందించడానికీ పార్లమెంట్లో సాధారణ మెజారిటీ చాలు. అప్పుడు మోదీ మనస్సులో ప్రతిపక్షం ఆశిస్తున్న మార్పేమైనా వస్తుందా? ‘ఇదే బిల్లులో జనాభాతో నిమిత్తం లేకుండా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం వంతున సీట్లను పెంపుదల చేసే విషయాన్ని బిల్లులో పొందుపరుస్తాం... ఓ గంట టైమివ్వండ’ని అమిత్ షా సభలో అడిగినప్పుడు ప్రతి పక్షాలు ముక్తకంఠంతో ఎందుకు అంగీకరించలేదు? గంట కాదు, రెండు గంటలు కాదు రేపటి వరకైనా సరే, మార్చి తీసుకురమ్మని ఎందుకు కోరలేదు? అలా స్పందించి ఉంటే ఎన్డీఏ సర్కార్ చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయేది కదా! ఇప్పుడు ప్రతి పక్షాల చిత్తశుద్ధిపైనే ప్రజలకు అనుమానాలు కలిగేలా వ్యవహరించారు.ఇక్కడ 50 శాతం సీట్ల చొప్పున పెంపుదల అనేది ఏ ప్రాతిపదికపై చేస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వ ప్రాతిపదిక ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనకు జనాభాయే ప్రాతిపదిక కావాలి. అందుకే పదేళ్లకోసారి జరిగే జనగణన అనంతరం అందుకు అనుగుణంగా సీట్ల పునఃపంపిణీ చేయాలని రాజ్యాంగంలో 82వ అధికరణం ఆదేశించింది. దాంతో నిమిత్తం లేకుండా 50 శాతం సీట్ల సమాన పెంపు అంశం న్యాయసమీక్షకు నిలబడుతుందా అన్నది కూడా సందేహాస్పదమే. లోక్సభ అనేది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది తప్ప ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించదు.లోక్సభ అనే పేరులోనే ‘హౌస్ ఆఫ్ ద పీపుల్’ అనే అర్థం ఉన్నది. రాజ్యసభను మాత్రం ‘కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్స్’ అంటారు. రాష్ట్రాల లెజిస్లేటర్లే దాని సభ్యుల్ని ఎన్నుకుంటారు. శాసన ప్రక్రియలో ఏ ప్రాంతానికీ అన్యాయం జరక్కుండా ఉండాలంటే రాజ్యసభలో సమాన ప్రాతినిధ్యాన్ని డిమాండ్ చేయవచ్చు. న్యాయ సమీక్షకు ఇది లోబడే ఉంటుంది. కొన్ని దేశాల్లోని ఎగువ సభల్లో రాష్ట్రాల జనాభాలతో నిమిత్తం లేకుండా సమాన సంఖ్యలో ప్రాతినిధ్యం ఇప్పటికే ఉన్నది. కొన్ని ప్రాంతాలకు నష్టం కలిగించగల రాజ్యాంగ సవరణలను ఎగువ సభలు అడ్డుకోగలవు కూడా! అసలు విషయాలను పక్కదారి పట్టించి సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షం సాధించిందే మిటి! మహిళల మూడు దశాబ్దాల నిరీక్షణను మరో పదేళ్లు పొడిగించడం తప్ప!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చారిత్రక తప్పిదం
ఎప్పటిలాగే మహిళలు ఓడిపోయారు. వారికి లోక్సభలో, శాసనసభల్లో 33 శాతం కోటా కల్పించాలన్న ప్రయత్నం మరోసారి వీగిపోయింది. ఈసారి నియోజకవర్గాల పునర్వి భజనకూ, మహిళల కోటాకూ ముడిపెట్టడం అందుకు ప్రధాన కారణ మైంది. ఈ వ్యవహారం అంత తేలిగ్గా గట్టెక్కేది కాదని అందరూ భావిస్తూనే వచ్చారు. లోక్సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 850కి పెంచటం, శాసనసభల్లోనూ గణనీయంగా సీట్లు పెంచటమే లక్ష్యంగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపొందించారు. అయితే ఈ పునర్విభజన అనంతరం మహిళలకు కోటా లభిస్తుందన్న మెలిక పెట్టడంవల్లే తాము వ్యతిరేకించక తప్పలేదని విపక్షాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న 543 స్థానాల్లోనే 33 శాతం కోటా కల్పించటంలో కేంద్రానికి అభ్యంతరమేమిటన్నది వాటి ప్రశ్న. ఏమైతేనేం శుక్రవారంనాటి రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండు వంతుల మెజారిటీ లభించాల్సి ఉండగా... బిల్లుకు మద్దతుగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటువేశారు. దీంతో ముడిపడివున్న మరో రెండు బిల్లుల్ని కేంద్రం ఉపసంహరించుకుంది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభమయ్యాక 2023 సెప్టెంబర్లో మహిళా కోటా బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు సభ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతగా ఏకాభిప్రాయం సాధించాక కూడా ఆ మరుసటి సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అది అమలు కాలేదు!జనాభా లెక్కల సేకరణ ముగిసి, దాని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ముగించాకే కోటా అమలు వీలవుతుందని అప్పట్లో కేంద్రం తెలిపింది. జనాభా లెక్కల వ్యవహారం తేలేసరికి 2029 కూడా దాటొచ్చన్న సంశయాలున్న నేపథ్యంలో 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజనను తేల్చాలనీ, దానికి అనుగుణంగా మహిళల కోటాకు కూడా వీలు కల్పించాలనీ పునరాలోచన చేసి తాజా బిల్లుల్ని రూపొందించింది. అదేమిటో... మహిళల కోటాకు ఏదోక రూపంలో ఎప్పుడూ అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. తొలిసారి 1996లో అప్పటి ప్రధాని దేవేగౌడ నాయకత్వంలోని ప్రభుత్వం, అటుతర్వాత ఐకె గుజ్రాల్ ప్రభుత్వం ప్రయత్నాలు చేశాయి. వాజ్పేయి హయాంలోని ఎన్డీయే ప్రభుత్వమైతే వరసగా 1998 మొదలుకొని 2003 వరకూ నాలుగుసార్లు కోటా బిల్లుకు ప్రయత్నం చేసింది. ఇక యూపీయే ప్రభుత్వం 2008, 2010ల్లో ప్రయత్నించింది. కానీ ప్రతిసారీ బిల్లు ప్రతుల్ని చించేయటం, కూటమి నుంచి తప్పుకుంటామని బెదిరించటం వగైరాలతో అన్ని రకాల ప్రయత్నాలూ వీగిపోయాయి. అయితే అప్పు డొచ్చిన డిమాండ్లు న్యాయమైనవి. ఎస్పీ, బీఎస్పీ వంటివి ‘కోటాలో కోటా’ ఇచ్చితీరా లని అడ్డుకున్నాయి. స్వాతంత్య్రంవచ్చి ఇన్ని దశాబ్దాలవుతున్నా ఓబీసీలకు చట్టసభల్లో కోటా లేదని, మహిళల విషయంలోనైనా ఆ సంగతి తేల్చి తీరాలని ఆ పక్షాలు కోరాయి. ఈసారి పునర్విభజన ప్రక్రియ మహిళల కోటా విషయంలో సైంధవ పాత్ర పోషించింది. గతంతో పోలిస్తే మన దేశంలో మహిళలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఎంతో రాణిస్తున్నారు. దాదాపు అన్ని రంగాల్లోనూ వారి పాత్ర గణనీయంగా పెరిగింది. కానీ మన చట్టసభల్లో ఇదెక్కడా ప్రతిబింబించకపోవటం సిగ్గనిపించదా? జనాభాలో సగం ఉన్నా కనీసం మూడోవంతు ఇవ్వటానికి కూడా సంసిద్ధత చూపకపోవటం మన ప్రజా స్వామ్యం తీరుతెన్నుల్ని ప్రశ్నార్థకం చేస్తోంది. మనతో పోలిస్తే ఎంతో వెనకబడిన దేశాలు సైతం ఈ విషయంలో విశాల దృక్పథంతో వ్యవహరిస్తున్నాయి. ఇరుపక్షాలూ దీన్నెక్కడా పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలా కనబడదు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో అధికారంలోకొచ్చాక అన్నిచోట్లా మహిళల ప్రాధాన్యాన్ని పెంచింది. అమ్మ ఒడి మొదలుకొని ఇళ్లస్థలాలపంపిణీ వరకూ... సచివాలయ ఉద్యోగాలు మొదలుకొని పంచాయతీరాజ్ సంస్థలవరకూ అన్నిచోట్లా మహిళలకు 50 శాతం కోటా ఉండేలా చూసింది. ఆఖరికి నామినేషన్ల పనుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ దాన్నే పాటించింది. కొన్ని సందర్భాల్లో ఆ శాతంకన్నా అధికంగానే ఇచ్చింది. చిత్తశుద్ధివుంటే చట్టం వచ్చేలోగానే చేయగలిగినంతా చేయొచ్చని నిరూపించింది. ఏదేమైనా శుక్రవారంనాటి పరిణామాలు విచారకరమైనవి. అటు మహిళల కోటాకూ, ఇటు దక్షిణాది రాష్ట్రాలకూ తమ పోకడలవల్ల ఒరిగిందేమీ లేదని విపక్షాలు గుర్తించటం మంచిది. -
రుతుపవనాల దగా?
ఒక్కోసారి కష్టాలు కూడబలుక్కుని వస్తాయంటారు. అసలే అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్ధాలతో ఏటికి ఎదురీదుతున్న ప్రపంచంపై ఈసారి ప్రకృతి కూడా పగబట్టినట్టు కనబడుతోంది. రాగల కాలంలో వాతావరణ పరిస్థితుల గురించి భారత వాతావరణ విభాగం(ఐఎండీ), ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించిన అంచనాలు భయపెడుతున్నాయి. భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్ర జలాల్లో అత్యంత తీవ్రమైన ఎల్ నినో ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరగటంతోపాటు అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించగా, మన దేశంలో రుతుపవనాలు బలహీనపడి సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ప్రకటించింది. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ సైతం ఇదేవిధంగా చెబుతోంది. వైద్య పరిభాష మాదిరే వాతావరణానికి సంబంధించిన పరిభాష కూడా సామాన్యులకు కొరుకుడు పడదు. ‘సాధారణంకన్నా తక్కువ’ వర్షపాతం ఉంటుందంటే– తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడతాయని. మన దేశంలో 60 శాతంమంది రైతులు ఖరీఫ్ సీజన్లో పూర్తిగా రుతుపవనాల వర్షాలపైనే ఆధారపడతారు. శాస్త్రవేత్తల అంచనా నిజమైతే ఇప్పటికే అనేకచోట్ల వడగళ్లుపడి, వర్షాలు కురిసి నష్టపోయిన రైతులకు ఇది సహజంగానే గోరుచుట్టుపై రోకటి పోటువంటి దవుతుంది. ఒకప్పుడు ‘వాన రాకడ... ప్రాణం పోకడ’ ఎవరికీ తెలియదనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కనీసం మూడురోజులముందే వాన ఎక్కడెక్కడ పడే అవకాశం ఉన్నదో, దాని తీవ్రత ఎలావుంటుందో అంచనా వేస్తున్నారు. తుపాన్లు, ఉప్పెనలు, సునామీలు వంటివి ముందస్తుగా పసిగట్టి వాటివల్ల కలిగే నష్టాన్ని కనిష్ఠ స్థాయికి ఉంచగలుగుతున్నారు. అలాగని అన్నీ కచ్చితంగా చెప్పటం ఇంకా సాధ్యపడటం లేదు. ప్రకృతిని అంచనా వేయటం జూదంలాంటిది. అది అర్థమైనట్టే కనబడుతుంది. తీరా కొన్ని సందర్భాల్లో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. అలాగని ఏమరుపాటుతో ఉంటే ముంచేస్తుంది. అందుకే సమస్యలొస్తాయన్న అంచనాలతో ముందస్తు చర్యలు ఎప్పుడూ తప్పనిసరవుతాయి.అయితే ప్రస్తుత అంచనాలు ప్రాథమికమైనవి. వచ్చే నెలాఖరు నాటికి మరికొంత స్పష్టత వస్తుంది. ఎల్ నినో ఏర్పడటానికీ, రుతుపవనాలు బలహీనపడటానికీ మధ్య బలమైన సంబంధం ఉంది. గత 70 ఏళ్లలో 17 సార్లు ఎల్ నినో ఏర్పడితే అయిదుసార్లు సాధారణం లేదా అంతకన్నా ఎక్కువ వర్షాలు కురిశాయి. మిగిలిన సంవత్సరాల్లో తక్కువ వర్షపాతమే నమోదైంది. గ్రామీణ భారతంలో మెజారిటీ ప్రజానీకం వ్యవసా యంపై ఆధారపడతారు. అందువల్లే వర్షాలుపడక కరువుకాటకాలు ఏర్పడితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్వంటి ఒకటి రెండు రాష్ట్రాల్లో వానలు లేకపోవడం లేదా అకాల వర్షాలు పడటం కారణంగా పంటలు దెబ్బతిన్నాయిగానీ... దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా వర్షపాతం బాగానే ఉంది. సాగు దిగుబడి పెరిగింది. ఆహార ధరలు అదుపులో ఉన్నాయి. అందువల్లే రిజర్వ్బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించింది. కానీ ఇదంతా తారుమారైతే ఆహార ద్రవ్యోల్బణం పెరిగి, వడ్డీరేట్లు మళ్లీ పైపైకి పోతాయి. నిజానికి ఇరాన్ యుద్ధంవల్ల ఇప్పటికే ఆ పరిస్థితి ఉంది. మన దేశానికి సంబంధించి కేవలం ఎల్ నినో ఒక్కటే నిర్ణాయక శక్తి కాదు. హిందూమహాసముద్రంలో పశ్చిమ(ఆఫ్రికా వైపు), తూర్పు(ఇండొనేసియా వైపు) ప్రాంతాలమధ్య ఉండే ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల అనుకూల, ప్రతికూల, తటస్థ ద్విధ్రువ (డైపోల్) స్థితులు ఏర్పడవచ్చు. అనుకూల స్థితి ఎల్ నినోవల్ల ముందుకు కదల్లేని రుతుపవనాలకు బలం చేకూర్చి భారత్ వైపు వచ్చేలా చేస్తుంది. మిగిలిన రెండూ అందుకు భిన్నమైన ఫలితాలనిస్తాయి. దానికితోడు యురేసియా ప్రాంతంలో ఈసారి మంచుకవచం తక్కువుందంటున్నారు. దాన్ని పరిగణనలోకి తీసుకుంటే రుతుపవనాలు మెరుగ్గానే ఉంటాయనుకోవచ్చు. ఏదేమైనా ఈసారి రుతుపవనాలపై ఏ ప్రభావాలు బలంగా పనిచేస్తాయో, వాటి ఫలితాలెలా ఉంటాయో పెద్ద సస్పెన్స్. అంతా సవ్యంగా ఉండాలని కోరుకోవటం మినహా ఎవరైనా చేయగలిగిందేమీ లేదు. -
బిహార్కు బీజేపీ సారథ్యం!
మండల్ రాజకీయాలకు పుట్టిల్లుగా మారి, రెండున్నర దశాబ్దాలుగా జాతీయ రాజకీయ పక్షాలకు నిలువనీడ లేకుండా పోయిన బిహార్లో బుధవారం తొలిసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. ఆ పార్టీ నాయకుడు సమ్రాట్ చౌధరి నేతృత్వంలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం కొన్నేళ్ల క్రితం ఊహించని పరిణామం. అయితే కింగ్మేకర్గా లేదా జూనియర్ భాగస్వామిగా జేడీ(యూ) అధినేత నితీశ్కుమార్ నాయకత్వంలోని ప్రభుత్వాల్లో కొనసాగుతూ వచ్చిన బీజేపీ... ఎంతో సహనంతో, ఓపికతో సుదీర్ఘకాలం ఈ రోజు కోసం వేచిచూసింది. ఆఖరికి 2020లోనూ, నిరుడు జరి గిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన భాగస్వామ్య పక్షం జేడీ(యూ)కు మించి స్థానాలొ చ్చినా సీఎం పదవి కోసం పట్టుబట్టకుండా ఉండిపోయింది. ఎలా ఒప్పించిందో, ఏం చేసిందో... ఆర్నెల్లు కాకుండానే ఆయన్ను రాజ్యసభకు పంపి, ఆ పదవి కైవసం చేసుకుంది. అసలు నిరుడు నవంబర్లో జరిగిన బిహార్ ఎన్నికల సందర్భంలోనే ఈసారి నితీశ్ను సీఎం పదవినుంచి తప్పించి, బీజేపీయే పగ్గాలు చేపడుతుందన్న ప్రచారం జరిగింది. కానీ అది విజయావకాశాలను దెబ్బతీయొచ్చన్న ఉద్దేశంతో రెండు పార్టీలూ కొట్టిపారేశాయి. బహుశా తనను తప్పిస్తారని నితీశ్ కూడా ఊహించివుండరు. ఎందుకంటే కుమారుడికి రాజ్యసభ సీటు ఇవ్వాలంటూ ఆయన ఫిబ్రవరిలో బీజేపీ అగ్రనేతలను కలిసి పట్టుబట్టారు. చివరికి తానే ఆ సీటు తీసుకుని, సీఎం పదవి బీజేపీకి అప్పగించాలని నితీశ్ నిర్ణయించటంతో కుమారుడితోపాటు పార్టీ అగ్ర నేతలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగారు. పదకొండేళ్లనాడు అప్పటి పార్టీ నేత జితన్రాం మాంఝీని తొమ్మిది నెలలపాటు సీఎం పదవిలో కూర్చోబెట్టడం మినహా దాదాపు 21 ఏళ్లపాటు బిహార్ ఏలికగా నితీశ్ కొనసాగారు. మధ్యలో కూటములు మార్చినా, జనం మాత్రం ఆయన వెనకే దృఢంగా నిలబడ్డారు. మునుపటితో పోలిస్తే పార్టీ అధినేతగా నితీశ్ అంత ఆత్మవిశ్వాసంతో లేరని స్థానిక మీడియా చెబుతూవచ్చింది. ఇది వయసు పైబడటంవల్లనా, పార్టీలోని అంతఃకలహాలా అన్న విషయంలో ఎవరి విశ్లేషణలు వారివి. మండల్ రాజకీయాలు బలంగా వేళ్లూను కున్న రాష్ట్రాన్ని జాతీయపక్షం చేతుల్లో పెట్టడంపైనా నితీశ్పై విమర్శలొచ్చాయి. కానీ బీజేపీ ఆ రాజకీయాలకు భంగం వాటిల్లకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించింది. ఉత్తరప్రదేశ్ తరహాలో బిహార్లో కూడా ఆదినుంచీ సంఘ్ పరివార్ను నమ్ముకున్నవారికే పగ్గాలు అప్పగించాలని ఒత్తిళ్లు వచ్చినా అధిష్టానం వాటిని అంగీకరించలేదు. మొదటి నుంచీ పార్టీలో కొనసాగినవారిని కాదని, ఎనిమిదేళ్లనాడు వచ్చిన సమ్రాట్వైపే మొగ్గు చూపటానికి కారణం ఆయన బాగా వెనకబడిన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన వారు కావటమే. బిహార్ ప్రత్యేక పరిస్థితులరీత్యా ఇది తప్పదని అధిష్టానం భావించింది. లాలూ సతీమణి రబ్డీదేవి ప్రభుత్వంలో ఉంటూ 26 యేళ్ల క్రితం బీజేపీ కారణంగానే మంత్రి పదవి పోగొట్టుకున్న సమ్రాట్... 2018లో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంటరీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు... కేవలం శాశ్వత ప్రయోజనాలే ఉంటాయంటారు. కానీ ప్రయోజనాలు మాత్రమే చూసుకున్నా ఎదగటం కష్టమే. తనేంటో నిరూపించుకోవాలి. పార్టీ నాయకత్వానికి నమ్మకం కలిగించాలి. ఆ పని సమ్రాట్ సమర్థవంతంగా చేయబట్టే ఇవాళ సీఎం పదవి అందుకో గలిగారు. యాదవేతర కులాల్లో పట్టు సంపాదించుకోవాలన్న బీజేపీ వ్యూహానికి ఆయన సమర్థత, కులం తోడ్పడ్డాయి.అయితే బిహార్కు సమస్యలు తక్కువేం లేవు. ఇప్పటికీ అది దేశంలోని నిరుపేద రాష్ట్రాల్లో ఒకటి. బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిపోయిందంటూ ఎంత గొప్పలుపోయినా బిహార్లో రోడ్లు, ఆరోగ్యరంగం, విద్యారంగం సక్రమంగా లేవు. లాలూ హయాంతో పోలిస్తే మెరుగ్గానే ఉండొచ్చుగానీ... శాంతిభద్రతలు ఇంకా పూర్తిస్థాయిలో చక్కబడలేదంటారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, పారదర్శకత, జవాబుదారీతనం తన ప్రాముఖ్యతలని ప్రమాణస్వీకారం చేశాక ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సమ్రాట్ ప్రకటించటం గమనిస్తే ఎక్కడెక్కడ మరమ్మతు అవసరమో ఆయన సక్రమంగానే గుర్తించారని అర్థమవుతుంది. మొత్తానికి బీజేపీ నేతృత్వంలో బిహార్ పయనం ఎలా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది. -
మళ్లీ యుద్ధ మేఘాలు!
చరిత్రాత్మకం అన్నారు. ఉన్నతస్థాయి చర్చలన్నారు. దౌత్యం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. శాంతికి పశ్చిమాసియా చేరువలో ఉందన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామా బాద్లో 21 గంటలపాటు కొనసాగిన అమెరికా–ఇరాన్ ప్రతినిధి బృందాల చర్చలపై ఎప్పటికప్పుడు మీడియాలో వచ్చిన సమాచారం సారాంశమిది. తీరా బయటికొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు విఫలమయ్యాయని ప్రకటించి నిష్క్రమించారు. ఆ వెంటనే ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బెదిరింపు భాష మొదలైంది. అమెరికా ఏకపక్ష వైఖరివల్ల 47 సంవత్సరాల తర్వాత ఆ రెండు దేశాలమధ్యా నేరుగా సాగిన చర్చలు చివరికిలా నీరుగారాయి. వచ్చేవారం మరోసారి చర్చలుంటాయని చెబుతున్నారు. కానీ అమెరికా వైఖరి మారకపోతే ప్రయోజనం శూన్యం. ట్రంప్ వచ్చాక చర్చల అర్థమే మారిపోయింది. చర్చలంటే ఆయన శాసిస్తే ఎదుటిపక్షం శిరోధార్యంగా స్వీకరించటం తప్ప మరేంకాదు. అసలు ఈ యుద్ధంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వాన్స్ నాయకత్వాన ప్రతినిధి బృందాన్ని పంపటంలోనే ఆయన నిజాయితీలేమి వెల్లడైంది. ఏ అధికారమూ లేని, సొంతంగా ఎలాంటి చొరవా తీసుకోలేని ఆ అశక్త బృందం చివరకు ఉత్త డొల్లగా మిగిలిపోయింది. ట్రంప్ తీరు 90వ దశకం మొదట్లో సోవియెట్ యూనియన్ కుప్పకూలిననాటి పరి స్థితుల్ని తలపిస్తోంది. అంతవరకూ సోవియెట్ భాగస్వామ్య రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సమావేశాలు జరగటం, దేశంనుంచి విడిపోతున్నట్టు ప్రకటించటం రివాజై పోయింది. నిజంగా అలా ప్రకటించేవారి బలాబలాలేమిటో, ఆ తీర్మానాలు అమలయ్యే అవకాశం ఉందో లేదో తెలియని స్థితి. ఇలాంటి అనిశ్చితే ఇప్పుడు అమె రికాను ఆవరించింది. నరమేథాన్ని సాగిస్తూ ఘనవిజయాలుగా ప్రకటించుకోవటం, ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతం కాబోతున్నదని ప్రకటించటం, అంతలోనే చర్చలకు రావాలంటూ బెదిరించటం ట్రంప్ అలవాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్తోపాటు ఈ యుద్ధానికి లోపాయికారీగా మద్దతిచ్చిన దేశాలన్నీ ఇరాన్నుంచి శరపరంపరగా వచ్చి పడుతున్న క్షిపణుల ధాటికి బెంబేలెత్తినా, అక్కడ పెనువిధ్వంసం చోటుచేసుకుంటున్నా ట్రంప్ బడాయి మాటలు ఆగలేదు. ఆయన ప్రకటనలకు భిన్నమైన స్థితిగతులున్నాయని సైనికా ధికారులే మీడియాకు రహస్యంగా చెప్పటం అమెరికాలో కుప్పకూలుతున్న వ్యవస్థలకు ఆనవాలు. సోవియెట్ కనుమరుగయ్యే ముందు కూడా ఇలాంటి ధోరణులే కనబడ్డాయి. ఇతర దేశాల సహకారంతో హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటలకే, అందుకు తాము అంగీకరించబోమని నాటో భాగస్వామ్య దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్లు ప్రకటించి గాలి తీశాయి. ‘హార్మూజ్ దిగ్బంధం’ అంటూ చేసిన ప్రకటనకు అర్థం ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధమని అమెరికా సైన్యం ఆ వెంటనే తెలిపింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని కూడా ప్రకటించారు. కానీ గల్ఫ్ దేశాలే దీన్ని నిరసిస్తున్నాయి. ట్రంప్ చర్య ఈ ప్రాంతం మొత్తాన్ని శాశ్వతంగా యుద్ధ ఊబిలోకి దించేస్తుందని సౌదీ అరేబియాతోసహా చాలా దేశాలు ఆందోళనపడుతున్నాయి. సౌదీ చమురు ఎగుమతులు యుద్ధానికి ముందు మాదిరే రోజుకు 70 లక్షల బ్యారెళ్లకు చేరు కున్నాయి. అవి ఎర్ర సముద్రం గుండా వెళ్తున్నాయి. కానీ అమెరికా దుందుడుకు చర్యకు దిగితే యెమెన్లోని హౌతీలు ఆ ఎగుమతుల్ని దెబ్బతీస్తారు. తన నాయకత్వాన ఇన్ని దశాబ్దాలుగా సాగిన ఏకధ్రువ ప్రపంచం కళ్లముందు కుప్పకూలుతున్న వైనాన్ని అమెరికా గ్రహించకపోతే పోయిందిగానీ... చైనా నాయకత్వంలో కొత్త అమరిక మొగ్గతొడుగుతోందన్న సంగతైనా అది తెలుసుకోవాలి. ఈ యుద్ధం తనకూ, ఇరాన్కూ మధ్య పంచాయతీ కాదు. అది పశ్చిమాసియాకు పరిమిత మైంది అంతకన్నా కాదు. ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని క్రమేపీ బలహీనపరుస్తున్న ఒక నిరర్థక యుద్ధం. అది చైనా నాయకత్వాన కొత్త కూటమికి పురుడు పోస్తున్న ప్రమాదకర యుద్ధం. ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలోనే తాము సర్వశక్తిమంతులమని ఇరాన్తో చర్చలకు చాన్నాళ్లముందు జేడీ వాన్స్ అన్నారు. ట్రంప్ ప్రభావం ఆయనపై ఎక్కువే ఉన్నట్టుంది. ఆ దృశ్యం మారుతున్న సంగతిని అమెరికా నాయకత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. -
హంగేరిలో కొత్త గాలి
పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచం నలుమూలల నుంచీ దుర్వార్తలే వింటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఇది మరో పిడుగుపాటు. పదహారేళ్లుగా హంగేరిని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న కన్సర్వేటివ్ జాతీయవాది, ప్రధాని విక్టర్ ఒర్బాన్ ఘోరంగా ఓటమిపాలయ్యారు. 199 స్థానాలున్న పార్లమెంటుకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఫిడెస్కి కేవలం 55 స్థానాలు మాత్రమే రాగా, ఆయన్నుంచి విడిపోయి, మధ్యేవాద మితవాద పక్షం టీసా పార్టీని స్థాపించిన పీటర్ మాజార్కు అనూహ్యంగా 138 స్థానాలు లభించాయి. తీవ్ర మితవాద పక్షం అవర్ హోంల్యాండ్కు 6 దక్కాయి. తుది ఫలితాలు అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఎన్నికల సంఘం మొదలుకొని న్యాయవ్యవస్థ, మీడియా వరకూ అన్నిటినీ అధీనంలోకి తెచ్చుకుని తిరుగులేని అధికారం చలాయిస్తున్న ఒర్బాన్ ఓటమిని ఎవరూ ఊహించలేదు. ఆయనపై ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని స్వతంత్ర సర్వే సంస్థలు చెప్పినా ఎవరూ నమ్మలేదు. టీసా పార్టీ దాదాపు 6 శాతం పాయింట్ల ఆధిక్యత తెచ్చుకుంటేనే కనీసం సాధారణ మెజారిటీ కూడా అసాధ్యమని కొన్ని మీడియా సంస్థలు చెప్పగా... అధికార పార్టీకన్నా టీసా పది పాయింట్లు వెనకబడివుందని ప్రభుత్వ అనుకూల మీడియా ఢంకా బజాయించింది. ఈ ఎన్నికల సందర్భంగా హంగేరి ఏమాత్రం పొంతనలేని రెండు భిన్న ప్రపంచాలు చూసింది. అధికారపక్షం వైపు మొగ్గే ప్రపంచం ఒర్బాన్ మరో నాలుగేళ్లు ఏలబోతున్నారంటూ మోత మోగించింది. అందులో మీడియా సంస్థలూ, సామాజిక మాధ్యమాలూ, ‘సాధారణ పౌరులూ’ ఉన్నారు. అటు పీటర్ మజార్ను సమర్థించే ప్రపంచం అందుకు భిన్నమైన విశ్లేషణలు చేసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ‘నిజమైన ప్రపంచం’ అయివుంటుందని అందరికీ తెలుసు. సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత ‘నకిలీ ప్రపంచం’ బట్టబయలైంది. ఒర్బాన్ హంగేరికి మాత్రమే పరిమితమైన సాధారణ నాయకుడు కాదు. ఆయన్ను అధికార పీఠం ఎక్కించిన ఫార్ములా దేశదేశాల నాయకులకూ శిరోధార్యంగా మారింది. సంప్రదాయవాదాన్నీ, జాతీయవాదాన్నీ నెత్తికెత్తుకుని ప్రజల భావోద్వేగాలను ఉచ్ఛస్థితికి తీసుకెళ్లటం ఎలాగో ఒర్బాన్ నేర్పారు. అమెరికాకు మాత్రమే కాదు... ప్రపంచానికంతకూ పెను సమస్యగా మారిన ట్రంప్ ఆయన స్ఫూర్తితోనే మాగా (మళ్లీ అమెరికాను మహోన్నతం చేద్దాం) ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ఒర్బాన్కు ట్రంప్, పుతిన్ సన్నిహితులు. వారిద్దరి మాదిరే ఈయూతో వైరం. ఒర్బాన్ మార్కు ఏలుబడికి ఇంటా బయటా శత్రువులు అవసరం. వారు– ఈయూ, కమ్యూనిస్టులు, వలసదారులు, శతకోటీశ్వరుడు, దాత జార్జి సోరోస్– ఎవరైనా కావొచ్చు. అభద్రతా భావన కూ. విదేశీ బెడదకూ, సమాజంలోని నైతిక పతనానికీ, ఇతరత్రా ప్రమాదాలకూ సర్వరోగ నివారిణి తాను మాత్రమేనని ఒర్బాన్ పదహారేళ్లపాటు నమ్మించగలిగారు. ‘సూపర్ మెజారిటీ’ వచ్చినా పాలనపై పూర్తిస్థాయి పట్టు సంపాదించటం టీసా పార్టీకి అంత సులభం కాదు. ఎందుకంటే సకల అధికార వ్యవస్థలూ ఒర్బాన్ అనుకూలురతో నిండివున్నాయి. ఆర్థిక సంస్థలూ, అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం, అవినీతి నిరోధక విభాగం వగైరాలన్నీ ఆయన మనుషుల చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. ఈయూ నుంచి బయటికొస్తేనే సకల సమస్యలూ పరిష్కారమవుతాయని ఆయన చెప్పిన మాటలు విశ్వసించబట్టే ఆర్థికంగా అధోగతిలోవున్నా జనం నమ్మారు. ఒర్బాన్ అనుకూల వ్యాపార సంస్థలు మాత్రమే లాభార్జనతో కళకళలాడాయి. నిరుద్యోగం పదేళ్ల రికార్డును అధిగమించింది. నిరుడు ఆర్థిక వృద్ధి 0.4 శాతం. కొన్నేళ్లుగా కష్టాల్లోవున్న పోలెండ్ సైతం 3.6 వృద్ధి రేటు సాధించగా... బల్గేరియా, రుమేనియా సైతం మెరుగ్గా ఉన్నాయి. ఇక అవినీతిలో హంగేరిది అగ్రస్థానం. ఇరాన్ శాంతి చర్చలకన్నా ముందు, ఒర్బాన్ గెలుపుకోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హంగేరి వెళ్లి ప్రచారం చేశారు. కానీ ఇరాన్ శాంతి చర్చల మాదిరే, ఒర్బాన్ కూడా కుప్పకూలారు. ఆయన ఓటమితో ఈయూ దేశాలు పండగ చేసుకుంటున్నాయి. హంగేరి ప్రజలు తమతోనే ఉన్నారని సంబరపడుతున్నాయి. కానీ అధోగతిలోవున్న హంగేరికి అందరూ ఆపన్న హస్తం అందించటం అత్యవసరం. -
హద్దులెరుగని జ్ఞానం
‘మాకు గోడలు లేవు, గోడలు పడగొట్టడమే మా పని’ అంటాడు శ్రీశ్రీ. మానవ జీవనప్రస్థానం గోడలు లేని దశ నుంచి గోడలు కట్టుకునే దశకు చేరుకుని ప్రస్తుతానికి అక్కడే స్థిరపడింది. గోడలు లేని దశ గురించిన స్పృహ మనిషిలో అంతరించి గోడలు కట్టుకోవడమే స్వాభావికమూ, స్థిరమూ, సత్యమనే భావన బలపడింది. గోడలు కట్టుకో వడం రకరకాల రూపాలలో జరుగుతుంది. వర్ణం, కులం, ప్రాంతం, దేశం, భాష మొదలైనవి కొన్ని మాత్రమే! దేశాల విషయానికి వస్తే, గోడలను సరిహద్దుల పేరుతో పిలుచుకుంటాం. కానీ, ప్రకృతినే గమనిస్తే, సరిహద్దులు లేనిదే ప్రకృతి అనీ, సరిహద్దులు గీసు కోవడం వికృతి అనీ ఇట్టే బోధపడుతుంది. భూమి, నీరు, వెలుగు, గాలి, ఆకాశమనే పంచ భూతాలు సరిహద్దులనెరుగవు; ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిరాఘాటంగా వ్యాపిస్తాయి. మొదట్లో మనిషి కూడా అలా వ్యాపించినవాడే. కాలగతిలో సరిహద్దులు నిర్మించు కోవడానికి అలవాటుపడ్డాడు. ఆ విధంగా సరిహద్దులు లేని దశ నుంచి సరిహద్దుల దశకు చేరుకోవడం మనిషి భౌతిక, బౌద్ధిక వికాసంలో మెరుపులీనే మైలురాయి కావడం విచిత్రం; అదే అతని చరిత్రలో ఒక విరోధాభాస. అదే సమయంలో, తన మేధనూ, మేధాగతమైన జ్ఞానాన్నీ సరిహద్దులను దాటించి పరస్పరం పంచుకున్న, పంచుకుంటున్న అనుభవమూ మనిషికి ఉంది. అయినాసరే, తనే కల్పించుకున్న కృత్రిమ సరి హద్దులే నిజమని నమ్మి ఆ ఇరుకులో కూరుకుపోవడమే అతనిలోని వైరుద్ధ్యం. ‘జ్ఞాన’మనే మాటనే తీసుకోండి. తెలుగులో ఎరుక, తెలివి, తెలివిడి మొదలైన పర్యాయపదాలు ఉన్నప్పటికీ, వాటికన్నా ఎక్కువగా జ్ఞానమనే మాటే ప్రాచుర్యంలోకి వచ్చింది. నిజానికి ఈ మాట నేటి మనదేశపు సరిహద్దులకు బయట ఆరువేల సంవత్స రాల క్రితం మాట్లాడిన ప్రోటో–ఇండో యూరోపియన్ భాష నుంచి పుట్టింది. వ్యుత్పత్తి పదనిఘంటువు ప్రకారం, ‘తెలుసుకోవడ’మనే అర్థమిచ్చే ‘గ్నో’ అనే ప్రోటో–ఇండో యూరోపియన్ మూలపదం నుంచి ‘టు నో’, ‘నాలెడ్జ్’, ‘ఎకనాలెడ్జ్’, ‘కాగ్నిషన్’, ‘డయో గ్నొసిస్’, ‘ఇగ్నొరెంట్’, ‘ఇగ్నోర్’, ‘నొబిలిటీ’ వంటి మాటలు రూపొందాయి. ఇదే సంస్కృతంలో ‘జ్ఞ’గా మారి ‘జ్ఞాన’మనే మాటను పుట్టించింది. పర్షియన్ల అవెస్తాలో జ్ఞానమనే అర్థంలో ‘జయింతి’గా, ఓల్డ్ చర్చి స్లవోనిక్లో గుర్తించడమనే అర్థంలో ‘జ్ఞన్టి’గా, తెలుసుకోవడమనే అర్థంలో రష్యన్లో ‘నాట్’గా, గ్రీకులో ‘నాత్స్’గా, తెలిసినదనే అర్థంలో ఐరిష్లో ‘గనాత్’గా మారింది. అలాగే, అతి ప్రాచీనకాలం నుంచీ, ఆధునిక కాలం వరకూ జ్ఞానప్రసారం కూడా అన్ని రకాల సరిహద్దులనూ దాటి జరుగుతూనే ఉంది. మనదేశానికి సంబంధించే చెప్పు కుంటే, సున్నాను, జ్యోతిశ్శాస్త్రాన్ని ఇచ్చిన ఆర్యభట్టు; శస్త్రచికిత్సలో మార్గదర్శి అయిన సుశ్రుతుడు, రామన్ ఎఫెక్ట్ ద్వారా ప్రసిద్ధుడైన సీవీ రామన్ మొదలుకొని – ప్రాచీన గ్రీసుకు చెంది, తర్కాన్ని, శాస్త్రవిజ్ఞానాన్ని ఇచ్చిన అరిస్టాటిల్; క్షేత్రగణితాన్ని ఇచ్చిన పైథాగరస్; వైద్యశాస్త్రాన్ని ఇచ్చిన హిపోక్రటెస్ – యునైటెడ్ కింగ్డమ్కు చెంది, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని, కలన గణితా(కేల్క్యులస్)న్ని ఇచ్చిన న్యూటన్, పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చాల్స్ డార్విన్, కంప్యూటింగ్ను ఇచ్చిన అలాన్ ట్యూరింగ్– జర్మనీకి చెంది, సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆల్బర్ట్ ఐన్స్టీన్, క్వాంటమ్ సిద్ధాంతాన్ని ఇచ్చిన మాక్స్ ప్లాంక్ వరకూ, సరిహద్దులకు అతీతంగా యావత్ప్రపంచ దీప స్తంభాలుగా నిలిచి జ్ఞానకాంతిని విశ్వవ్యాప్తం చేసిన మేధాభాస్కరులు ఎందరెందరో! అత్యాధునిక శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన ఫలితాలు, పరికరాలతో సహా అన్ని రంగాలలో అన్ని దేశాలవారూ ప్రసాదించిన జ్ఞానభిక్షను అందుకుంటూ, పంచుకుంటూ జీవితాన్ని అన్నివిధాలా తేజోవంతం చేసుకుంటూనే; అనేకానేక సరిహద్దుల సంకెళ్ళతో తనను తాను బంధించుకుంటూ సరిహద్దులెరుగని ప్రాపంచిక జ్ఞానానుభవాన్ని గుర్తించలేక పోవడమూ మనిషికే చెల్లింది. ప్రకృతి మరే జీవజాలానికీ ఇవ్వని వరాలను మనిషి కిచ్చింది; కానీ వాటికి తనవైన శాపాలను జోడించుకుంటూ జీవితాన్ని ముళ్ళకంపగా మార్చుకునే అవివేకతలో కూడా మనిషికి మరే జీవీ సాటిరాదు. ప్రకృతి గీసిన హద్దుల్లో జీవించడమే తప్ప స్వయంగా హద్దులు గీసుకోవడం చేతకాని జీవులే మనిషి కన్నా సుఖంగా జీవిస్తున్నాయనిపిస్తుంది. సరిహద్దులెరుగని వసుధైక భావన దిశగా మనిషి పునఃప్రస్థానం ఇంకా ఎప్పటికి?! -
కొత్త ప్రపంచం వైపు అడుగులు?
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే ట్రంప్ నినాదం ఆచరణలో తల్లకిందులు కాబోయే కాలం తరుముకొస్తున్నదా? ప్రపంచ వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్నది. ఇప్పటికీ అమెరికా సూపర్ పవర్ హోదాను అనుభవిస్తూనే ఉన్నది. అమెరికా ఆజ్ఞలు ఖండాంతరాల్లో ఇంకా చెల్లుబాటు అవుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మధ్యతరగతి యువతీ యువకులకు అమెరికా ఒక ఆశల పందిరిగా దర్శనమిస్తూనే ఉన్నది. తానా అంటే తందానా అనేందుకు పాకిస్తాన్ వంటి తొత్తు దేశాలు కూడా అమెరికాకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో అమెరికా అతి పెద్ద వాటాదారుగానే కొనసాగుతున్నది. దాని మిలిటరీ బడ్జెట్ ఒక్కటే భారతదేశపు మొత్తం బడ్జెట్కు రెట్టింపు.అయినప్పటికీ భవిష్యత్తులో అమెరికాకు దిగే మెట్లు తప్ప ఎక్కే మెట్లు లేవనే వాదన బలంగా వినిపిస్తున్నది. అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా అమెరికా డాలర్ పెత్తనం కారణంగా 39 ట్రిలియన్ డాలర్ల అప్పును అది మేనేజ్ చేయగలుగుతున్నది. కానీ డాలర్ పెత్తనానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ‘బ్రిక్స్’ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి చేరితే అమెరికాకు గడ్డు కాలమే! ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడి ఫలితాలు ప్రమాదకరమైన ఫలితాలనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్మూజ్ను ‘విముక్తం’ చేయకుండా, ఇరాన్ పాలనా వ్యవస్థను మార్చకుండా యుద్ధం నుంచి తప్పుకొంటే డాలర్ పెత్తనానికి పునాది వంటి పెట్రో డాలర్ వ్యవస్థ విచ్ఛిన్నం కావచ్చు. యుద్ధం కొనసాగిస్తే రోజులూ, నెలల్లో అది ముగిసే అవకాశం లేదు. మోయలేని భారంగా మారుతుంది.వాణిజ్య రంగంలో ట్రంప్ స్వీయ రక్షణాత్మక చర్యలు చేపట్టారు. దేశాల వారీగా వాణిజ్య లోటును సవరించుకునే పేరుతో ఎడాపెడా ట్యారిఫ్లు విధిస్తూ పోతున్నారు. ఈ చర్యలు అంతిమంగా అమెరికాకు నష్టం చేస్తాయని నిపుణులు చెబు తున్న మాటలను ఆయన చెవికెక్కించుకోవడం లేదు. ట్యారిఫ్ దాడులతో ఆయన అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక గమనాన్ని సంపూర్ణంగా మార్చే సామర్థ్యం గల ఏఐ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో చైనా భారీయెత్తున పెట్టుబడులు పెట్టింది. ఈ రేస్లో రెండు దేశాల మధ్య దూరం పెద్దగా లేదు. త్వరలో చైనావాళ్లు అమెరికాను ఓవర్టేక్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదనే అంచనాలు వెలువడుతున్నాయి.దౌత్యపరంగా కూడా ట్రంప్ దారుణమైన వైఫల్యాలను మూటగట్టుకుంటున్నారు. ఎనిమిది దశాబ్దాలుగా అమెరికాకు కుడిభుజంగా ఉంటున్న ‘నాటో’ కూటమిని ఆయన స్వయంగా విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. గ్రీన్ల్యాండ్ రచ్చ, క్యూబాకు బెదిరింపులు, వెనుజువేలా అధ్యక్షుని కిడ్నాప్ వంటివన్నీ అంత ర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చాయి. యుద్ధరంగంలో వస్తున్న సాంకేతికపరమైన మార్పులు అమెరికా భారీ మిలిటరీని కలవరపెడుతున్నాయి. చౌకరకం డ్రోన్లు, సైబర్ తంత్రాలు, ఉపగ్రహ విధ్వంసక దాడులు పైచేయి సాధిస్తున్నాయి. ఇరాన్ ఘర్షణలో ఈ పరి ణామం అనుభవంలోకి వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలను చిన్న సినిమాలు అల్లాడించాయి.ఈ రకమైన పరిణామాలన్నీ అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యా నికి క్రమక్రమంగా ఎసరు పెట్టే స్వభావం కలిగినవే! కాకపోతే ఈ క్రమాన్ని ఇరాన్ యుద్ధం వేగిరపరిచిందనే అంచనాలు వెలు వడుతున్నాయి. ఈ సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు నికోలస్ స్పీక్మాన్ ప్రతి పాదించిన రిమ్ల్యాండ్ థియరీని గుర్తుచేస్తున్నారు. యూరే షియా ప్రధాన భూభాగానికి అంచు మాదిరిగా ఉండే తీర ప్రాంతాన్ని ‘రిమ్ల్యాండ్’ అన్నారు. స్పీక్మాన్ లెక్క ప్రకారం పశ్చిమ యూరప్ నుంచి మొదలుకుని పశ్చిమాసియా, దక్షిణా సియా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలు ఈ రిమ్ల్యాండ్ పరిధిలోకి వస్తాయి. ఇరవయ్యో శతాబ్దం అట్లాంటిక్ దేశాలదైతే, ఇరవై ఒకటో శతాబ్దం మాత్రం ఈ రిమ్ల్యాండ్దేననీ, ఈ ప్రాంతంపై ఎవరు ఆధిపత్యం సాధిస్తే వారిదే ప్రపంచాధిపత్య మని ఆయన ప్రతిపాదించారు.తర్వాత కాలంలోని అమెరికన్ అంతర్జాతీయ నిపుణులు రిమ్ల్యాండ్ థియరీ నుంచి పశ్చిమ యూరప్ను తొలగించి ఆఫ్రికా కొమ్ము దగ్గర నుంచి అరబ్ ద్వీపకల్పం, పర్షియా పీఠ భూమి, భారత ఉపఖండం మీదుగా తూర్పున చైనా కోస్తా ప్రాంతం దాకా, ఆగ్నేయంగా ఇండోనేషియా ద్వీప సముదాయం దాకా ఈ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. కైరో నుంచి జకార్తా దాకా అనవచ్చు. లేదా ఎర్ర సముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రం (తూర్పు), జావా సముద్రం (ఆగ్నేయం) దాకా అని కూడా చెప్పవచ్చు. హిందూ మహాసముద్ర ప్రాంత మని కూడా పిలవవచ్చు. ‘ఇది ఇండియన్ ఓషన్ సెంచరీ’ అని పిలవడంలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులకు ఏకాభి ప్రాయం ఉన్నది.యూరప్ దేశాల వలసల వేటలకు ముందు ఈ ప్రాంత వాణిజ్యాన్ని భారత్, చైనాలు శాసించాయి. భూమార్గం ద్వారా యూరేషియా ప్రాంతాలలో చైనా వర్తకం జరిగితే సముద్రమార్గ వాణిజ్యంలో భారత్ ఆధిపత్యం వహించింది. భారత నావికా దళాలు ఆగ్నేయాసియా దేశాల్లో హిందూ సామ్రాజ్యాలను నెల కొల్పిన చరిత్ర మనకు తెలిసిందే. హార్మూజ్ జలసంధి ద్వారా ఇప్పుడు పెట్రోలియం తెచ్చుకుంటున్నాం కానీ, పూర్వకాలంలో ఎక్కువగా అరబ్బీ గుర్రాలను ఇక్కడినుంచే తీసుకొచ్చేవారట! ప్రాచీన తెలుగు సాహిత్యంలో హురుమంజి (హార్మూజ్) ప్రస్తా వన చాలా సందర్భాల్లో వచ్చిందని చెబుతున్నారు.అత్యధిక జనాభా, అందులోనూ యువతరం, వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, విస్తారంగా సహజ వన రులు, ప్రపంచ వాణిజ్యంలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న నేపథ్యం దృష్ట్యా ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని అమెరికా విదేశాంగ నిపుణులు ప్రత్యేక దృష్టితోనే చూస్తూ వచ్చారు. ఇక్కడ ఆధిపత్యాన్ని కోల్పోతే ప్రపంచాధిపత్యానికి కూడా నూకలు చెల్లినట్టే అనే అవగాహన వారికి మొదటి నుంచి ఉన్నది. అందుకే డిగోగార్షియా దీవిలో అతిపెద్ద మిలిటరీ స్థావ రాన్ని అమెరికా ఏర్పాటు చేసుకున్నది. వివిధ దేశాల్లో ఉన్న స్థావరాల కంటే ఇది చాలా పెద్దది. ముఖ్యంగా పశ్చిమాసియా వ్యవహారాలను అదుపు చేయడం దీని బాధ్యత. తూర్పున ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తన బలిష్ఠమైన సప్తమ నౌకాదళాన్ని (సెవెంత్ ఫ్లీట్) చాలాకాలం నుంచే మోహరించింది. అయినప్పటికీ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి అమెరికాకు గట్టి పోటీనే ఎదురుకానున్నది. ఇరాన్ యుద్ధ ఫలి తంగా పశ్చిమాసియాలో అమెరికా తన పట్టును కోల్పోతే ఒక సరికొత్త నూతన అధ్యాయానికి స్వాగతం పలకడానికి ప్రపంచం సిద్ధంగా ఉంటుంది.ఇరాన్పై ‘ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో మహా విధ్వంసకరమైన దాడికి ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఎందుకింత హఠాత్తుగా ఒడిగట్టిందో అమెరికా అధికార వర్గాలే అర్థం చేసుకోలేకపోతు న్నాయి. బిలియన్లకొద్దీ డాలర్లను ఏ ప్రయోజనాన్ని ఆశించి తగ లేస్తున్నారని అమెరికన్లు నిలదీస్తున్నారు. ఆరు వారాల యుద్ధం తర్వాత ఈరోజు (శనివారం) పాకిస్తాన్లో ఇరాన్ – అమెరికాలు చర్చలకు ఉపక్రమించాయి. ఆరు వారాల యుద్ధంలో అమెరికా సాధించిందేముంది? అలీ ఖమేనీని, ఉన్నత స్థానాల్లోని మరి కొందరినీ హతం చేశారు. కానీ పాలనా వ్యవస్థ మారలేదు. ఇరాన్ పాలనా వ్యవస్థను మార్చడమన్నది అమెరికా పెట్టుకున్న ప్రధానమైన మూడు యుద్ధ లక్ష్యాల్లో ఒకటి. అది నెరవేరలేదు.అణుశుద్ధి కార్యక్రమాలను పూర్తిగా నిర్మూలించడం మరో లక్ష్యం. అదీ నెరవేరలేదు. పైగా ఇరాన్ ఇప్పటికే అణ్వస్త్రాలను సమకూర్చుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నదని ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త థియోడర్ పోస్టల్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పలు టెలివిజన్లు శనివారం నాడు ఆయన ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. హార్మూజ్ మార్గాన్ని ఇరాన్ చెర నుంచి విముక్తి చేస్తామని పలికిన బీరాలు కూడా నీరుగారిపోయాయి. ఇరాన్ దర్జాగా తన కరెన్సీలో టోల్ వసూలు చేసుకుంటున్నది. చివరికి చర్చల ప్రారంభానికి ముందు కూడా ట్రంప్ తన హూంకరింపులను ఆపలేదు. ఇరాన్ ఒప్పందానికి రాకపోతే భారీ విధ్వంసం ఉంటుందనీ, నౌకల్లోకి ఆయుధాలను లోడ్ చేస్తున్నామనీ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అదేదో తెలుగు సినిమాలో ‘రమణా లోడెత్తాలిరా, టోల్గేట్ పడుతుందీ’ అనే పాపులర్ డైలాగ్ ఉంటుంది.ఆరు వారాల్లో ట్రంప్ రకరకాల మాటలు విన్నవారికి అదే గుర్తొస్తుంది. నాలుగైదు రోజుల కింద ‘ఈ రాత్రితో ఒక నాగరికత అంతం కాబోతోందం’టూ ట్రంప్ చేసిన హెచ్చరికపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నాగరికతలను అంతం చేసే విప రీత బుద్ధి ఏమిటని ప్రశ్నించారు. పర్షియా (ఇరాన్) చరిత్రలో ప్రసిద్ధుడెన సైరస్ ది గ్రేట్ చక్రవర్తి ఆదర్శాలు తనకు స్ఫూర్తి నిచ్చాయని అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను రూపొందించిన థామస్ జెఫర్సన్ ప్రకటించారు. 2500 సంవత్సరాలకు పూర్వం సైరస్ ది గ్రేట్ బాబిలోన్ను జయించినప్పుడు అక్కడి బానిస లందరికీ, అలాగే ఖైదీలకూ విముక్తి ప్రసాదించారు. వీరిలో పెక్కుమంది యూదులు. తన సామ్రాజ్యంలో మత స్వేచ్ఛనూ, జాతి సమానత్వాన్నీ ఆ రోజుల్లోనే ప్రబోధించారు. అటువంటి నాగరికతను ట్రంప్ అంతం చేయడానికి సిద్ధమయ్యాడు.పాక్లో ప్రారంభమైన చర్చలు ఒకటి రెండు రోజుల్లో ముగిసే అవకాశం లేదు. అమెరికాకు మెసెంజర్గా ప్రారంభ మైన పాకిస్తాన్ పాత్ర చర్చల్లో మధ్యవర్తి స్థాయికి మారింది. ఇరాన్ ఇప్పటికీ పాక్ను పూర్తిగా నమ్మడం లేదు. యుద్ధంలో అమెరికాతో పాటు భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్కు చర్చల్లో ఏ పాత్రా లేదు. పాకిస్తాన్ మిలిటరీ అధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్పై ట్రంప్కు అవ్యాజమైన అనురాగం ఉన్నది. ట్రంప్ శాంతికాముకతకు నోబెల్ బహుమతి ఇవ్వాలని మునీర్ బహిరంగంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు ఏజెంట్గా పనిచేసే వ్యక్తిని ఇరాన్ మధ్య వర్తిగా అంగీకరించడానికి చైనా సలహానే కారణమనే అభిప్రాయం ఉన్నది.పేరుకు పాకిస్తాన్లో ఎన్నికైన ప్రభుత్వం ఉన్నా అన్ని వ్యవహారాలూ మునీర్ చేతుల మీదుగానే నడిచిపోతున్నాయి. మరో ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ మాదిరిగా పాక్ పాలనా పగ్గాలను అందిపుచ్చుకోవాలని మునీర్ ఉవ్విళ్లూరుతున్నారు. అమెరికా, చైనాల సహకారం ఉన్నది కనుక అతని కోరిక నెరవేరే అవకాశం ఉండవచ్చు. భారత్పై విపరీతమైన వ్యతిరేకత ఉన్న వ్యక్తి మునీర్. కశ్మీర్ కోసం వెయ్యేళ్లయినా యుద్ధం చేస్తామన్న భుట్టో మాటల్ని పదేపదే వల్లెవేస్తుంటాడు. ఆయన ఏర్పాట్లతో జరుగుతున్న చర్చల ఫలితంపై ఆయనకే ఆసక్తి లేదు. ప్రజల్లో తన ప్రతిష్ఠ పెరగడం, అమెరికా ఆజ్ఞలు పాటించడమే ఆయనకు కావాల్సింది! పరస్పర విరుద్ధమైన డిమాండ్లపై కాలయాపన కోసమే రెండు దేశాలూ చర్చలకు సిద్ధమయ్యాయన్న అభిప్రాయం ఉన్నది.ఇరాన్కు లోపాయకారీ సహాయం చేయడం తప్ప యుద్ధం విషయంలో చైనా బహిరంగంగా మాట్లాడడం లేదు. శత్రువు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నప్పుడు, అందులో తలదూర్చ వద్దనేది యుద్ధనీతి. తప్పిదం ఫలితాన్ని శత్రువు అనుభవిస్తాడు. ఇంకో నెలరోజుల్లో ట్రంప్ – షీ జిన్పింగ్ల మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. ఈ లోపల ఇరాన్ యుద్ధంలో చేతులు కాల్చుకొని బలహీనపడే ట్రంప్ తన ఎదురుగా కూర్చుంటే గట్టిగా బేరమాడే శక్తి షీకి లభిస్తుంది. చైనా వాళ్లకు వ్యాపార కిటుకులు బాగా తెలుసు. ట్రంప్ ఇరాన్ యుద్ధంలో నిజంగానే చేతులు కాల్చుకుంటే ఇరాన్ ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఎదుగుతుంది. ఇప్పటికే రిమ్ల్యాండ్ తూర్పున ఉన్న చైనా ఒక బలమైన శక్తి. దృఢమైన నాయకత్వం ఉంటే భారత్ కూడా ప్రభావ శీల శక్తిగా ఎదిగేందుకు చాలా అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో ప్రాంతీయ శక్తుల ఆవిర్భావం జరిగి, బహుముఖీన ఒప్పందాలతో అంతర్జాతీయ సంబంధాలు కొనసాగవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఈ మరక పోయేదెలా?
నిరుడు మార్చిలో కోట్లాది రూపాయల కరెన్సీ కట్టలు తగలబడిన ఉదంతంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని, అలహాబాద్ హైకోర్టుకు బదిలీపై వెళ్లిన ఢిల్లీ హైకోర్టు అప్పటి న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ శుక్రవారం ఎట్టకేలకు పదవి నుంచి తప్పుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ రాజీనామాను ఆమోదిస్తే జస్టిస్ వర్మకు రిటైర్మెంట్ ప్రయోజ నాలు, పెన్షన్ యథావిధిగా వస్తాయి. ఈ ఉదంతం జరిగినప్పటి నుంచీ ఆయన వితండ వాదం చేశారు. కరెన్సీ కట్టలు కాలిన ఉదంతం జరిగింది న్యాయమూర్తుల నివాసప్రాంగణంలోని తన ఇంటికి వెలుపలవున్న స్టోర్ రూంలోననీ, అందరూ వచ్చిపోయే చోట ఉన్న సొమ్ము తనదేనని ఎలా చెబుతారనీ ప్రశ్నించారు. రాజీనామా చేసి నిష్క్రమించటం ఉత్తమమని సహచర న్యాయమూర్తులు చెప్పినా ఆయన అంగీకరించలేదు. అభిశంసన వరకూ వెళ్తే ఆయనతోపాటు మొత్తం న్యాయవ్యవస్థపైనే చర్చ జరుగుతుందనీ, ఇది వ్యవస్థ గౌరవ ప్రతిష్ఠలపై ప్రభావం చూపుతుందనీ చెప్పినా ఆయన తలకెక్కలేదు. పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ మొదలైన దశలో జస్టిస్ వర్మ రాజీనామా చేశారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలనదగ్గ మూడు వ్యవస్థలు – కార్యనిర్వాహకవర్గం, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థలు సమానమైనవని చెబుతారు. కానీ మన రాజ్యాంగం న్యాయవ్యవస్థకు మాత్రమే ఆ మూడింటి పరిధులనూ నిర్ణయించగల అధికారాన్నిచ్చింది. తనకు దఖలుపరిచిన బరువుబాధ్యతలకు తగ్గట్టుగా న్యాయవ్యవస్థ ఉండటంలేదన్న విమర్శలు, ఆరోపణలు చాన్నాళ్ల నుంచి ఉన్నాయి. అవి కేవలం బయటి నుంచి మాత్రమే కాదు... లోపలి నుంచీ వస్తున్నాయి. మొన్న ఫిబ్రవరి నెలాఖరున లోక్సభలో ఒక ప్రశ్నకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ జవాబిస్తూ గత పదేళ్ల కాలంలో సిట్టింగ్ జడ్జీలపై సుప్రీంకోర్టుకు 8,630 ఫిర్యాదులందాయని తెలిపింది. కానీ అతి స్వల్ప కేసుల్లో మాత్రమే అంతర్గత కమిటీల ద్వారా విచారణలు జరిగాయి. తీవ్ర ఆరోపణలొచ్చిన కేసుల్లో అనేకం కనీసం నామమాత్ర విచారణ వరకూ పోలేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆరేళ్ల క్రితం కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా అప్పటి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, న్యాయవ్యవస్థలోని అవినీతిపై గతంలో తొమ్మిదిమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడారనీ, వారిలో సర్వీసులో ఉండగా మాట్లాడినవారు ఇద్దరనీ ధర్మాసనానికి చెప్పారు. డబ్బు తీసుకోవటం ఒక్కటే అవినీతి అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఆశ్రిత పక్షపాతం, హోదా దుర్వినియోగం, విచక్షణాయుత అధికారాన్ని స్వప్రయో జనాలకు వినియోగించుకోవటం వగైరాలు సైతం దాని కిందికే వస్తాయి. రైతులకు రావాల్సిన బ్యాంకు రుణాలను ఒక చక్కెర కర్మాగారం దారిమళ్లించి సొంతానికి వాడు కున్న కేసులో 2010లో సీబీఐ దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ దాఖలు చేసినప్పుడు అందులో జస్టిస్ వర్మ ఆ సంస్థ నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదో నిందితుడిగా ఉన్నారు. తర్వాత కాలంలో ఆ కేసు ముందుకు సాగలేదు. ఆయనపైనా చర్యలు లేకుండా పోయాయి. ఇటీవల అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ విశ్వహిందూ పరిషత్ సదస్సుకు పోయి మతతత్వ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలనీ, వివరణ ఇవ్వాలనీ సుప్రీంకోర్టు కొలీజియం తీర్మానించింది.కానీ అవేమీ జరగలేదు. గతంలో అరడజను మంది న్యాయమూర్తులపై ఆరోపణ లొచ్చాయి. వారిలో ఒకరిద్దరిపై అభిశంసన వరకూ వెళ్లింది. విధాన సంబంధమైనసంక్లిష్టతల వల్ల ఆ ప్రక్రియ వీగిపోయింది. కొందరు తమంత తామే రాజీనామా చేసి వెళ్లటంతో నిలిచిపోయాయి. ఇలాంటి ఉదంతాలన్నీ న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నార్థకం చేస్తాయి. తీర్పునిచ్చే స్థానంలో ఉండటం వల్ల న్యాయమూర్తులపై దురుద్దేశంతో ఆరోపణలు చేసేవారు కూడా ఉంటారు. ఆ బెడద నుంచి వారిని కాపాడటానికి కట్టుదిట్టమైన చట్టాలు అవసరమే. కానీ అవినీతిపరులకు అవి కవచంగా ఉపయోగపడే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఫిర్యాదులను స్వీకరించి, దర్యాప్తు చేయించి నిజా నిజాలను నిర్ధారించటానికి సర్వస్వతంత్రమైన వ్యవస్థ ఒకటి అవసరం. ఆ దిశగా ప్రయత్నిస్తేనే అవినీతి జాడ్యం అంతమవుతుంది. -
‘కాల్పుల విరమణ’కు తూట్లు!
ప్రపంచమంతా ఎంతో ఆశగా, ఆత్రంగా ఎదురుచూసిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకుండానే ముగిసిపోయే ప్రమాదం కనబడుతోంది. తీవ్ర వైషమ్యాలతో కాలుదువ్వుకునే వైరిపక్షాలు యుద్ధ క్షేత్రాన్ని విడిచిపెట్టడం అంత సులభమేమీ కాదు. అందుకే ఒప్పందం కుదిరాక కూడా అక్కడక్కడ పరస్పర దాడులు తప్పవు. కానీ పశ్చిమాసియా పరిస్థితి కాస్త భిన్నమైనది. కాల్పుల విరమణపై తొలుత అమెరికా, ఆ తర్వాత ఇరాన్ ధ్రువీకరించాక, మధ్యవర్తి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ప్రకటన చేశారు. ఎప్పుడూ లేనిది ఇజ్రాయెల్ కూడా ఒప్పందాన్ని అంగీక రిస్తున్నట్టు తెలిపింది. కానీ 24 గంటలు గడవకుండానే అందరిదీ తలోమాట అయింది. మధ్యవర్తి పాత్ర పోషించే దేశం దృఢమైన స్వరం వినిపించగలగాలి. అవసరమైతేశాసించగలగాలి. కానీ అమెరికా అప్పులపై ఆధారపడే పాక్ ఆ పని చేయగలదా? ఘర్షణలు నివారించిన ఖ్యాతిని కూడా ‘త్యాగం’ చేసి, తెరవెనకుండి పాకిస్తాన్ ద్వారా కథ నడిపిస్తున్న చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే అమెరికా, ఇజ్రాయెల్ ఈ మాదిరి డ్రామాలకు సాహసించేవి కాదు. అసలు పశ్చిమాసియాకు సంబంధించి ఏ ఒప్పందం కుదరాలన్నా అమెరికాను సంతృప్తిపరిస్తే సరిపోదు. ఆ దేశం ఒకటి కాదు... రెండు! అవిభాజ్య కవలల మాదిరిగా వ్యవహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఒప్పుకుంటే తప్ప ఏదీ సాధ్యపడదు. ఒక్కోసారి ఆ రెండూ కావాలని భిన్న స్వరాలు వినిపిస్తాయి. దీన్ని వ్యూహం అనాలో, చవకబారు ఎత్తుగడగా భావించాలో ఎవరికీ తెలియదు. అమెరికా అవునంటుంది... కాసేపటికి ఇజ్రాయెల్ కాదంటుంది. పర్యవసానంగా అనుకున్నది అమలుకాక అవతలి పక్షం అయోమయంలో పడుతుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకమయ్యాక ఆయన అల్లుడు జేర్డ్ కుష్నెర్ ద్వారా ఇజ్రాయెల్కు చుట్టరికం కలవడంతో పట్టపగ్గా ల్లేకుండా పోయాయి. అందుకే వైట్హౌస్లో, ట్రంప్కు బాగా దగ్గరగావుండే వ్యక్తుల్లో కలకలం మొదలైంది. ఇప్పుడు తోకే కుక్కను ఆడిస్తోందన్న రీతిలో వ్యవహారం ముదిరింది. కనుకనే ఒప్పందంపై తొలుత ప్రకటించిన ట్రంప్ లెబనాన్పై దాడులు సాగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. అటు తర్వాత ఒప్పందంలో లెబనాన్ ప్రస్తావన లేదని బుకాయించటం మొదలుపెట్టారు. ఇరాన్ 10 అంశాల ముసాయిదా కొత్తదేమీ కాదు. దురాక్రమణకు ముందే ఇరాన్ దాన్ని ప్రతిపాదించింది. అప్పట్లో అది ట్రంప్కు నచ్చలేదు. ఇక ఇరాన్ ఎంతకూ లొంగకపోవటం, చమురు ధరలు ఆకాశాన్నంటడంతో కొంపమునుగుతుందని అర్థమై అది ఆచరణయోగ్యమేనని అంగీకరించక తప్పలేదు. తన కూటమిలోని ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేయరాదంటున్న ట్రంప్... ఆ దేశానికి మద్దతుగా నిలబడిన లెబనాన్లో మాత్రం ఇజ్రాయెల్ ఊచకోత కొనసాగించటం సబబేనంటున్నారు. ఇది మర్కట తర్కం కాదా? కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఉత్సవం చేసుకుంటున్న జనంపై పది నిమిషాలపాటు ఏకధాటిగా సాగించిన కాల్పుల్లో 250 మందికిపైగా మరణించారు. మరో 1,000 మంది గాయపడ్డారు. కాల్పుల విరమణ ప్రకటించాక అంతవరకూ 119 డాలర్లుగావున్న బ్యారెల్ ముడి చమురు ధర 94 డాలర్లకు చేరింది. కానీ ఇజ్రాయెల్ హంతక దాడులతో అదికాస్తా మళ్లీ 97కు పెరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ కపట నాటకాలు కట్టిపెడితే తప్ప ప్రపంచం ప్రశాంతంగా మనుగడ సాగించలేదు. అది జరగాలంటే ఆ రెండు దేశాల్లోని ప్రజలతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావాలి. ప్రపంచం సంక్షోభం అంచుల్లో ఉంది. ఇరాన్ ఇప్పటికే యుద్ధంవల్ల సమస్తం కోల్పోయింది. 3,000 మంది పౌరులు మరణించగా, లక్షలాది జనావాసాలు శిథిలాలుగా మారాయి. మౌలిక సదుపాయాలన్నీ ధ్వంస మయ్యాయి. ఇరాన్ శక్తిమేరకు ప్రతీకార దాడులు చేస్తూ దురాక్రమణకు దిగిన ఆ రెండు దేశాలతోపాటు, వాటికి సహకరిస్తున్న ఇరుగు పొరుగు దేశాలను సైతం దెబ్బతీయగలిగింది. పశ్చిమాసియాలో ఇంతకుమించి మరేం జరగకూడదకునే దేశాలు ఇక తటస్థ అవతారాలు చాలించి నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఎన్ని లోటుపాట్లున్నా ఈ ఒప్పందం కొనసాగేలా చూడాలి. శుక్రవారం జరిగే చర్చలు ఫలవంతం కావాలి. లేనట్టయితే చరిత్ర క్షమించదు. -
‘తాత్కాలిక సంధి’ దశ!
నలభై రోజులుగా ఇరాన్ పౌరుల్ని భీతావహుల్ని చేస్తూ, ప్రపంచాన్ని సైతం అల్లకల్లోల పరుస్తున్న యుద్ధం తాత్కాలికంగా నిలిచింది. రెండు వారాలపాటు కాల్పుల విరమణ పాటించటానికి అమెరికా, ఇరాన్లు అంగీకరించటంతోపాటు దాన్ని పూర్తిస్థాయి విరమణగా మార్చటానికి వీలుగా పరస్పరం చర్చించుకోవాలని నిర్ణయించాయి. పాకిస్తాన్ దౌత్యం వల్లే అంతా సాధ్యపడినట్టు కనిపిస్తున్నా ఇరాన్ను బలంగా ప్రభావితం చేయగల చైనా జోక్యమే ఫలించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఇరుపక్షాల మధ్యా శుక్రవారం జరగబోయే చర్చల ఫలితం ఎలా ఉండబోతుందో అంచనా వేయటం అంత సులభం కాదు. ఎందుకంటే, చర్చలకు ప్రాతిపదికగా అమెరికా విడుదల చేసిన 15 అంశాలకూ, ఇరాన్ ప్రతిపాదిస్తున్న 10 అంశాలకూ మధ్య చాలా విషయాల్లో పొసగటం లేదు. భూమిలో పాతిపెట్టిన 60 శాతం శుద్ధిచేసిన 440.9 గ్రాముల యురేనియంను ఇరాన్ తవ్వి తీయాల్సిందేనని అమెరికా కోరుతుండగా, ఆ విషయంలో రాజీపడబోమంటున్నది ఇరాన్. తమపై ఇన్నేళ్లుగా విధిస్తూవచ్చిన మౌలిక ఆంక్షలనూ, సెకండరీ ఆంక్షలనూ ఎత్తి వేయాలనీ, పశ్చిమాసియా నుంచి అమెరికా సేనలు వైదొలగాలనీ, స్తంభింపజేసిన తమ ఆస్తుల్ని వెనక్కివ్వాలనీ, శాంతి ఒప్పందానికి భద్రతామండలి గ్యారెంటీ ఉండాలనీ ఇరాన్ కోరుతోంది. కాల్పుల విరమణలో లెబనాన్పై దాడుల్ని నిలిపేయటం భాగమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెబుతుండగా, అమెరికా తాజా వైఖరిని అంగీక రిస్తూనే ఇజ్రాయెల్ ఆ దాడులు ఆగబోవంటున్నది. రెండుపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు రావటం, అవి ఘర్షణలకు దారితీయటం అసాధారణమేమీ కాదు. ఆ ఘర్షణలు తెచ్చే తీవ్ర ఉద్రిక్తతల వల్ల సంధి కుదరటం ఓ పట్టాన సాధ్యపడదు. కాల్పుల విరమణ ప్రకటన వెలువడి ఏడెనిమిది గంటలు గడిచినా పశ్చిమాసియాలో క్షిపణి దాడులు, బాంబుల మోతలు ఆగకపోవటం ఇందుకు తార్కాణం. కొన్ని దేశాలు మధ్యవర్తి పాత్ర పోషిస్తేనే, ఘర్షణల్లోని నిరర్థకతను వైరి దేశాలకు గుర్తుచేసి ఒప్పిస్తేనే ఆ దిశగా అడుగులు పడతాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. పెను మారణహోమాన్ని సృష్టిస్తాననీ, ఇరాన్ నాగరికత మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాననీ ట్రంప్ చేసిన హెచ్చరిక చర్చలకు దారులు పరిచింది. యుద్ధనేరాల్లో అగ్రభాగాన ఉండే ‘మారణహోమం’ బెదిరింపు చర్చల సాధనంగా మారటం అత్యంత ప్రమాదకర పరిణామం. ఇవాళ ఇరాన్కి ఎదురైన పరిస్థితే రేపన్నరోజు వేరే దేశాలకూ ఎదురుకావొచ్చు. తాను వేరే దేశాధ్యక్షుణ్ణి అపహరించవచ్చు... కానీ ఇరాన్ మాత్రం ఆత్మరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదన్నది ట్రంప్ నీతి. అమెరికాతో దాదాపు సమవుజ్జీలుగా ఉండి కూడా చైనా, రష్యాలు అమెరికా వైఖరిని నిర్ద్వంద్వంగా ఖండించలేకపోయాయి. భద్రతా మండలిలో ఒత్తిడి చేయలేకపోయాయి. ఉక్రెయిన్ చేస్తున్న దాడులకు అమెరికా సాయం చేస్తున్నది గనుక తాము ఇరాన్కు సహకరిస్తున్నామని మాత్రం రష్యా చెప్పింది. బాధిత దేశంగా తనను తాను చిత్రించుకుంటూ రెండేళ్ల పాటు గాజాను ఇజ్రాయెల్ వల్లకాడు చేస్తున్నా నోరు మెదపని దేశాలు... ఇరాన్ విషయంలోనూ మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయాయి. అన్ని మర్యాదలూ మంటగలిపి, మతి చలించినట్టు ప్రవర్తిస్తున్న ట్రంప్ ఇరాన్పై అణ్వస్త్ర దాడికి తెగబడతారన్న భయంతోనే చివరి నిమిషంలో చైనా కదిలింది. అది నచ్చజెప్పనట్టయితే ఇరాన్ అంగుళమైనా వెనక్కి తగ్గేది కాదు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ తమను ప్రాథేయపడిందని అమెరికా యుద్ధశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్వోత్కర్షకు పోతున్నారు. ట్రంప్ ఇరాన్ విషయంలో చాలా అసహనంగా ఉన్నారని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటున్నారు. కానీ ట్రిగ్గర్పైన వేళ్లతోనే ఈ ఒడంబడికకు సిద్ధపడ్డామనీ, శత్రువు వైపు చిన్న పొరపాటు జరిగినా సర్వశక్తులూ ఒడ్డి ప్రతిఘటిస్తామనీ ఇరాన్ ప్రకటించింది. కనుక ఈ స్వల్పకాల శాంతిపై ఎవరూ భరోసా పెట్టుకోనవసరం లేదు. ఏ క్షణంలోనైనా అది నీటి బుడగలా మటుమాయం కావొచ్చు. ఇంటా బయటా పెద్ద వినాశకారిగా పరిణమించిన ట్రంప్ను అభిశంసన ద్వారా అమెరికా సాగనంపే వరకూ శాంతి, సంధి వంటివి క్షణభంగురాలు! -
‘తొలగింపుల’ జాతర!
పశ్చిమ బెంగాల్లో ఈ నెల 23న జరగబోయే తొలి దశ పోలింగ్కు సంబంధించి తాజాగా 27 లక్షల 17 వేలమంది ఓటర్లు జాబితాల నుంచి కనుమరుగైనట్టు సోమవారం అర్ధరాత్రి దాటాక ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన తుది జాబితా వెల్లడిస్తోంది. దీంతో ఇప్పటివరకూ జాబితాల్లో పేర్లు లేనివారి సంఖ్య దాదాపు 91 లక్షలకు చేరింది. రెండో దశకు సంబంధించి తొలగింపులు కూడా కలుపుకొంటే ఇది కోటికన్నా ఎక్కువే ఉండొచ్చు. న్యాయ నిర్ణయ పరిధి (అజ్యుడికేషన్) ప్రక్రియ గత నెలలో మొదలయ్యాక ఈసీ విడుదల చేసిన అనుబంధ జాబితా ఇది. సహజంగానే ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షీదాబాద్లో అత్యధికుల పేర్లు తొలగించారు. అక్కడ అజ్యుడికేషన్ పరిధిలోకెళ్లిన 11,01,145 మందిలో 4,55,137 మంది అనర్హులుగా తేలారు. ‘స్వచ్ఛమైన’ జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలన్న దృఢ నిశ్చయంతోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు శ్రీకారం చుట్టామని బిహార్లో ఏరివేతలు మొదలెట్టినప్పుడే ఈసీ చెప్పింది. ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ బిహార్ అనుభవం తర్వాతైనా ఆ ప్రక్రియకు పట్టే సమయంపై అంచనా ఉండాలి. అది లేకపోబట్టే లక్షలాదిమంది ఓటర్లు ఈసారి ఓటింగ్కు దూరం కాబోతున్నారు. వారి అప్పీళ్లపై ట్రిబ్యునళ్ల విచారణ జరుగు తోంది. వారిలో విశ్వసనీయమైన ఓటర్లుగా నిర్ధారణయ్యేవారు కూడా ఉండొచ్చు. కానీ 2031 అసెంబ్లీ ఎన్నికలకు తప్ప వారు ఓట్లేయటం సాధ్యపడదు. న్యాయ నిర్ణయ ప్రక్రియకు సమయం పడుతుంది గనుక అంతవరకూ ఓటర్ల జాబితాలను ఆపటం సాధ్యపడదని సోమవారం సుప్రీంకోర్టు చెప్పటంతో అలాంటి ఓటర్లకు ప్రస్తుతానికి తలుపులు మూసుకుపోయాయి. ఈ నెల 23న పోలింగ్ జరగబోయే 152 నియోజక వర్గాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదలైంది. 29న రెండో దశలో 142 నియోజకవర్గాల్లో జరగబోయే పోలింగ్కు సంబంధించిన జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదలవుతుంది. వ్యవధి తక్కువున్న తరుణంలో సుదీర్ఘ సమయం పట్టే ఇంత పెద్ద ప్రక్రియను ఒక అంచనా లేకుండా ఈసీ చేపట్టడాన్ని ధర్మాసనం తప్పుబట్టకపోవచ్చు గానీ, సాధారణ పౌరుల దృష్టిలో ఈసీది దోషమే అవుతుంది. ఎందుకంటే వారు బాధితులు. నిజానికి బిహార్ ‘సర్’ బెంగాల్తో పోలిస్తే ఎంతో మెరుగు. ఎన్నికల షెడ్యూల్కు ముందే తొలగింపులు పూర్తికావటం వల్ల ఫామ్–6 ద్వారా తిరిగి జాబితాలోకెక్కడానికి చాలామందికి అవకాశం వచ్చింది. బెంగాల్లో ఆ అదృష్టం దక్కలేదు. తమ పేరుందనుకునే లోగానే ఎవరో ఫామ్–7 కింద ఫిర్యాదు చేశారన్న కారణంతో ఓటర్లకు తాఖీదులు పోయాయి. పనులన్నీ మానుకుని కార్యాలయాల చుట్టూ తిరిగి అవసరమైన పత్రాలు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం అనుమానమే. నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ లేని (అన్మ్యాప్డ్) సంగతి బయటపడినా, పేర్లలో అక్షర క్రమంలో స్వల్ప తేడాలొచ్చినా అనర్హులుగా జమవేయటం పెను సమస్యగా మారింది. తాజా జాబితాలో పేర్లు లేని వారిలో అనేకులు అడిగిన పత్రాలన్నీ ఇచ్చినా ఫలితం లేకపోయిందని బావురు మంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పెద్దయెత్తున అందజేసే ఫామ్–7 పత్రాలను తీసుకుని, వాటి ఆధారంగా తొలగింపులు చేపడుతున్నారన్న ఆరోపణలు వాస్తవం అనటానికి ఒక బీజేపీ నాయకురాలి పేరిట దాఖలైన ఫిర్యాదులే తార్కాణం. ఆ సంగతే తనకు తెలియదని ఆమె చెప్పటం గమనించదగ్గ అంశం.ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారి సమస్య ఎన్నికల్లో ఓటేయలేకపోవటం మాత్రమే అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన దొంగ ఓటర్ల జాతర మాదిరి ఉదంతాల్లో తప్ప చాలా సందర్భాల్లో పోలింగ్ 65 శాతానికి మించదు. కానీ ఈ ‘సర్’ వల్ల గల్లంతైన వారికి భవిష్యత్తులో కష్టాలు చుట్టుముడతాయి. వారి పౌరసత్వమే సంశయాస్పదంగా మారి దేశం నుంచి గెంటేసే ప్రమాదం ఏర్పడుతుంది. బెంగాల్లో పార్టీల మధ్య ఉన్న కలహాలు సాధారణ ఓటర్ల భవితవ్యాన్ని అగమ్యగోచరం చేస్తున్నాయి. ఈసీ సక్రమంగా వ్యవహ రించివుంటే, ఎన్నికల షెడ్యూల్కు ముందే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటే సమస్యలు తలెత్తేవి కాదు. ఆ సంస్థ చేతగానితనం సామాన్యుల బతుకుల్ని అయోమయంలోకి నెట్టింది. -
ప్రమాదపుటంచుల్లో దేశాలు
ఇజ్రాయెల్తో కలిసి ఏకపక్షంగా ఇరాన్పై యుద్ధం ప్రారంభించింది మొదలు అది ఇవాళో, రేపో పూర్తికాబోతున్నదని చెప్పడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు అలవాటైపోయింది. తాజాగా ప్రకటించిన సోమవారం డెడ్లైన్ కూడా ఆ ప్రస్తావనే లేకుండా ముగిసిపోయింది. కావలసినట్టుగా కథనాలను వండివార్చిపెట్టే ఒక వార్తాసంస్థ ద్వారా మాత్రం అమెరికా, ఇరాన్లు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ‘ఇస్లామాబాద్ ఒడంబడిక’ కుదుర్చుకున్నాయనీ, రెండంచెల ఈ పథకంలో తక్షణ కాల్పుల విరమణ, అనంతరం కుదరబోయే సమగ్ర ఒప్పందం భాగమనీ సోమవారం లీక్ వదిలారు. కాల్పుల విరమణ 45 రోజులపాటు అమల్లో ఉంటుందని కూడా ఆ కథనం చెబుతోంది. కానీ 38వ రోజుకూడా యథావిధిగా దాడులు జరిగి, ఇరాన్కు చెందిన ఒక సహజవాయు క్షేత్రం ధ్వంసమైంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇక ఇరాన్లోని సమస్త మౌలిక సదుపాయాలనూ మంగళవారం ధ్వంసం చేయబోతున్నానని ట్రంప్ ప్రకటించినా అటునుంచి రాజీ స్వరం వినబడలేదు. పైపెచ్చు ఆయన వ్యాఖ్యలు తూగుతప్పిన మాటలని ఇరాన్ ప్రతిస్పందించింది. ‘మీ ప్రతిపాదనను పరిశీలించటానికి తగిన సమయం తీసుకుంటాం. ఈలోగా ఏ ఒత్తిడికీ లొంగేది లేదు. హార్మూజ్ను తెరిచేదిలేద’ ని కటువుగా సమాధానమిచ్చింది.నిఘా సంస్థలూ, రక్షణ దళాల ముఖ్యులూ హెచ్చరిస్తున్నా యుద్ధానికి కాలుదువ్విన ట్రంప్ దాన్నుంచి బయటపడే మార్గం కోసం తెగ తాపత్రయపడుతున్నారు. ఏ విధంగా చూసినా బలాబలాల విషయంలో తమతో సరిపోలని ఇరాన్ వంటి ఒక చిన్న దేశాన్ని పోరాడక తప్పని స్థితిలోకి నెట్టడం ద్వారా ప్రచార యుద్ధంలో దానిదే పైచేయి అయ్యేలా చూసిన ఘనత ట్రంప్కే దక్కుతుంది. సమవుజ్జీలు కాని ఇద్దరి మధ్య పోరు జరుగు తున్నప్పుడు సహజంగా బలహీనుడికే సహానుభూతి దక్కుతుందన్న ఇంగిత జ్ఞానం ఆయన మరిచారు. విద్యుదుత్పాదన ప్లాంట్లు, రోడ్లు, వంతెనలు, నిర్లవణీకరణ ప్లాంట్లు మంగళవారం ధ్వంసం చేస్తామనటం అంటే యుద్ధనేరాలకు పాల్పడతానని చెప్పడమే! అమెరికా అధ్యక్షుడొకరు ఇలా బాహాటంగా ప్రకటించటం మునుపెన్నడూ లేదు. యుద్ధంవల్ల పౌరజీవితాలకు నష్టం వాటిల్లకూడదని, వారి ప్రాణాలకు ముప్పు రాకూడదని జెనీవా ఒప్పందాలూ, హేగ్ ఒడంబడికలూ, న్యూరెంబర్గ్ నియమాలూ, ఐక్యరాజ్యసమితి అధికారిక పత్రమూ ఘోషిస్తున్నాయి. ట్రంప్ వర్తమాన స్థితి నియంత్రణ లేని ట్రెడ్మిల్ ఎక్కిన మనిషిని పోలి ఉంది. అది నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది, దిగటానికి ప్రయత్నిస్తే బొక్కబోర్లాపడే ప్రమాదం ఉంటుంది. యూదు జాతీయుడైన ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నెర్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కుమ్మక్కై ఇరాన్ రెండ్రోజులకే పాదాక్రాంతమవుతుందని ట్రంప్ను నమ్మించిన పర్యవసానమే ఈ యుద్ధమని ‘మాగా’ శిబిరంలో అందరికీ తెలుసు. అమె రికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మొదలుకొని ‘మాగా’ సిద్ధాంతవేత్త స్టీవ్ బేనన్ వరకూ అందరిలోనూ వైట్హౌస్ను ‘ఇజ్రాయెల్ లాబీ’ శాసిస్తోందన్న ఆగ్రహావేశాలున్నాయి. ట్రంప్ బలమైన మద్దతుదారు చార్లీ కిర్క్ హత్య ఇలాంటి గొడవల పర్యవసానమేనని వదంతులున్నాయి. దానిపై దర్యాప్తు సాగుతున్న తరుణంలోనే మరో ‘మాగా’ మద్దతు దారు, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ నిష్క్రమించాల్సి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో పడినందువల్లే యుద్ధంలో పాలుపంచుకోవాలంటూ యూరప్ దేశాలపై ట్రంప్ ఒత్తిళ్లు తెచ్చారు. అవి ఫలించకపోవటంతో శాపనార్థాలు పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక్క 70వ దశకంలో తప్ప ప్రపంచానికెప్పుడూ ఈ స్థాయిలో ‘ఆయిల్ షాక్’ తగల్లేదు. అసలే ఆర్థిక వ్యవస్థలు కష్టాల్లో ఉన్నాయి. అప్పుడప్పుడు మాత్రమే లోటు బడ్జెట్లుండే కాలం గతించి, అవి రివాజుగా మారిన ఈ వర్తమానంలో ‘పులి మీద పుట్ర’లా ట్రంప్ తీసుకొచ్చిన ఈ యుద్ధంతో... ఇజ్రాయెల్, అమెరికాలను గుడ్డిగా సమర్థించే దేశాలు సైతం కష్టాల్లో కూరుకుపోయాయి. సగటు లోటు జీడీపీలో 2 శాతం మించని దేశాల్లో ఇప్పుడది 20 శాతానికి ఎగబాకే ముప్పు ముంచుకొస్తోంది. ఈ దశలో కూడా ట్రంప్ కళ్లు తెరవకపోతే ప్రపంచం మరింత సంక్షోభంలో పడుతుంది. -
విప్లవ స్వరూపాలు
ఆంధ్ర పంచకావ్యాలలో వసుచరిత్ర ఒకటి. ఇందులో తెలుగు పద్యరచన పరాకాష్ట పొందినదని చెబుతారు. 16వ శతాబ్దానికి చెందిన రామరాజ భూషణుడు ఈ కావ్యకర్త. ఈయనకే భట్టుమూర్తి అని మరోపేరు. ఆ పేరుతో నరస భూపాలీయం రచించాడు. రామరాయల ఆశ్రయంతో రామరాజ భూషణుడయ్యాడు. ఈయన చిత్రకవితా నిపుణుడు కూడా. అష్టావధానానికీ ఈయనే మూల పురుషుడని పెద్దల మాట. పదము, క్రమము, ఘన, జట మొదలైన అష్ట విధాలుగా వేద పండితులు వేదావధానము చేస్తున్నప్పుడు, తానూ ఆ ప్రజ్ఞను చూపాలని ఉత్సాహపడి, ద్విజుడు కానందువల్ల సాహిత్యపరంగా ఆ ప్రక్రియను అవలంబించాడట.ఇంగ్లీషు చదువుకుంటే ‘స్వధర్మభ్రంశం తటస్థిస్తుందన్న’ భయం ఉన్న ఇంట్లో జన్మించాడు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆ ఇంగ్లీషు నేర్చుకోలేనందుకు ఎంతో బాధపడతాడు కూడా. కానీ ఆ ఇంగ్లీషు ఆహార్యాన్ని ఆనందంగా స్వీకరించాడు. అప్పట్లో చదువుకున్న కొంతమంది అబ్బాయిలు పిలకలు కత్తిరించుకొని క్రాపింగ్ చేయించుకోవడం మొదలుపెట్టారు. వారిని చూసి శ్రీపాదకూ అలాంటి కోరిక కలిగింది. ఒకరోజు క్షురకుడి దగ్గరకు వెళ్లి పిలకను పూర్తిగా కత్తిరించి క్రాపింగ్ చేయించుకున్నాడు. ఇంటికి రాగానే తండ్రి గమనించాడు. తలపై పిలక కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయి ‘అయ్యో! పిలక కత్తిరించేశావా?’ అన్నాడట. కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక సంస్కర్త, సూతపురాణం కర్త త్రిపురనేని రామస్వామి తన పేరు చివరి ‘చౌదరి’ అనే కులచిహ్నాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేశాడు. కమ్యూనిస్టు భావజాల ప్రభావంతో పుచ్చలపల్లి సుందరయ్య తన పేరులో రెడ్డిని తొలగించుకోవడమే కాకుండా, ఉద్యమ జీవితానికి పూర్తిగా అంకితమవ్వాలనే నిర్ణయంతో సంతానం లేకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. అలా సంతానం లేకుండా ఉండే నిర్ణయాన్ని ఆయన భార్య లీల కూడా అంగీకరించారు. 1942లో భూస్వామ్య సమాజంలోని స్త్రీల జీవితంలోని ఉక్కపోతనూ, వాళ్ల మధ్య ఏర్పడే అనివార్య సాన్నిహిత్యాన్నీ చూపిన ‘లిహాఫ్’ కథ రాసిన ఇస్మత్ చుగ్తాయి లాహోర్ కోర్టు మెట్లు ఎక్కడానికీ వెనుకాడలేదు.అదంతా పెద్ద మనుషుల కాలం. పెద్ద త్యాగాలకు సమాజాలు సిద్ధపడిన కాలం. పెద్ద పోరాటాలకు తగినంత దృఢ సంకల్పం ఉన్న కాలం. ముందు సమాజం, ఆ తర్వాతే నేను అనుకున్న కాలం. మనుషులు అలాంటి విలువల్ని నెత్తిన పెట్టుకున్న సత్యకాలం. ఇప్పుడు కాలం మారింది. విలువలు అలాగే ఉన్నాయి కానీ వాటి మీద అభిప్రాయాలు మారిపోయినై. తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం అనే వ్యవహారం సరిగ్గా సరిపోయే కాలం. కానీ ఎంత శుద్ధి చేసినా పోని మురికిలా సంఘంలో సమస్యలు చాలానే ఉన్నాయి. ఈ కాలానికి తగినట్టుగా, చిన్న చిన్న విప్లవాలు ఇప్పటి అవసరమని చెబుతాడు ఒక కథలో ఉణుదుర్తి సుధాకర్. కాలనీ పార్కులో మూత్రం పోయించే కుక్క యజమానిని నిలదీయడం, పెద్ద శబ్దంతో అపరాత్రి మోగే మైకు మీద ఫిర్యాదు చేయడం, సైలెన్సర్ తొలగించిన బైకును అడ్డుకోవడం, పొగ చిమ్మకుంటూ పోతున్న ఆటోను ఫొటో తీయడం, సీట్లో లేని ఉద్యోగిని ప్రశ్నించడం, ఆహార కల్తీ మీద ఉప్పందించడం, నోటీసు ఇవ్వకుండా ఇంటిమీదికొచ్చే బుల్డోజర్కు ఎదురునిలవడం... అన్నీ చిన్న చిన్న విప్లవాలు. పెద్ద త్యాగాలు చేయకుండానే చిన్న మార్పునైనా సాధ్యం చేసే విప్లవాలు. 2026 మార్చి వరకు మావోయిస్టు ఉద్యమాన్ని లేకుండా చేస్తామన్న మాటకు గడువు దాటిపోయింది. సాంకేతికంగా అది అంతమైపోయిందా? రూపం మార్చుకుంటుందా? ఆ మనుషులు ఇంకే దారుల్లో వ్యక్తమవుతారు? సిద్ధాంత ఆచరణలు రూపు మార్చుకుంటాయేమోగానీ సమస్యలు ఉన్నంతవరకూ ప్రజాగ్రహం ఉంటూనే ఉంటుంది. ప్రజాగ్రహం ఉన్నచోట ఏదో ఒక చిరు విప్లవం మొలుస్తూనే ఉంటుంది. తార్కిక హేతువుకు అందినంతవరకూ, వద్దన్నది వదలకుండా చేయడం కూడా విప్లవమే. సంక్షుభిత కల్లోల సమయాల్లో సాటివాడి మీద కరుణ చూపడం కూడా మేలైన విప్లవ చర్యే! -
ఆచరణ పథమా? అవినీతి మార్గమా?
అమరావతి అనే పేరుతో ఒక ఎమోషనల్ డ్రామాను రక్తి కట్టించడానికి చంద్రబాబు ప్రభుత్వం చెమటోడ్చి పనిచేస్తున్నది. ఇప్పుడు మాత్రమే కాదు, ఈ పాలక కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ నాటకాన్ని ప్రదర్శించింది. అప్పటి జగన్ ప్రభుత్వం పాలనాపరమైన విజయాలను మసకబార్చడానికి ‘అమరావతి’ పేరుతో, శోకరస ప్రధానమైన ఇతివృత్తంతో ప్రదర్శించారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతిపై కురుస్తున్న ప్రశ్నల వర్షాన్ని తప్పించుకోవడానికీ, పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించ డానికీ, అదే నాటకంలో మరిన్ని భావోద్వేగాలను దట్టించడానికి తీవ్రంగా ప్రయత్నించారు.రాష్ట్ర విభజన జరిగిన పన్నెండేళ్ల తర్వాత, ప్రధానమంత్రిని రెండుసార్లు రప్పించి శంకుస్థాపన చేసిన తర్వాత... అమరావతే రాజధాని అంటూ మరోమారు అసెంబ్లీ తీర్మానం ఎందుకు? అసెంబ్లీలో అంతర్భాగమైన ఎగువ సభను ఉపేక్షించి ‘అర్ధాంగీ కారం’తోనే పార్లమెంట్కు పంపడానికి వేగిరపడిందెందుకు? రాజధాని నిర్ణయం రాష్ట్రాల పరిధిలోని అంశమేనని గతంలోనే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన తర్వాత... ఈ విషయంలో అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఆమోదించడమనేది చాలా సహజమైన క్రతువు.కేంద్రంలో ఉన్నది కూడా కూటమి సర్కారే కనుక మొహ మాటం కొద్దీ ఏపీ రాష్ట్ర విభజన (సవరణ) బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి సహకరించింది. ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఆ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానా నికి విరుద్ధంగా ఇతర రాష్ట్రాలకు, ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు వ్యవహరించరు... ఏవో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప! అయినా, సమాజ్వాది సభ్యుడు ధర్మేంద్ర యాదవ్ అమరావతి ఎంపికపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొద్దిపాటి ఖర్చుతోనే సహజసిద్ధంగా ఎదిగే అవకాశమున్న విశాఖను వదిలి అమరావతి పేరుతో మోయలేని భారాన్ని ఎంచుకోవడం పట్ల విస్మయాన్ని ప్రకటించారు.ఈమాత్రం తతంగానికి శత్రురాజ్యం మీద యుద్ధం చేసి గెలిచినంత హడావిడి చేసింది చంద్రబాబు సర్కార్. ‘కట్టండి తోరణాలు, ఎత్తండి జెండాలు, చేయండి ఉత్సవాలు’ అంటూ కిందిస్థాయి కార్యకర్తలకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం. అయితే ఆ స్థాయిలో కేడర్ స్పందించలేదన్న సంగతి ఇక్కడ మనకు అనవసరం. అది వారి ఆంతరంగిక విషయం. ‘అమరా వతి ఇక శాశ్వత రాజధాని. దాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ చంద్రబాబు మాట్లాడారు. దేశంలోని సమస్త పార్టీలూ ఒక్క తాటిపై నిలిచి అమరావతికి మద్దతు తెలిపాయని చెబుతూ ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందని బాబు తప్పుబట్టారు.ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నామని ఉభయ సభల్లో వైసీపీ సభ్యులు చెప్పారు. అమరావతిని వ్యతిరేకిస్తున్నా మని చెప్పలేదు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ ఆమోదించిన బిల్లులో పెట్టలేకపోయినా అప్పటి ప్రధాని ప్రభుత్వం తరఫున ఏపీకి ‘ప్రత్యేక హోదా’ను హామీ ఇచ్చారు. ఆ ‘ప్రత్యేక హోదా’ అనేది ఏపీకి సంజీవని వంటిదని జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయ పడ్డారు. మొన్న పార్లమెంట్ ఆమోదించిన బిల్లు 2014 నాటి విభజన చట్టానికి సవరణ కనుక ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చడానికి ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది?వైసీపీ సభ్యులు అదే ప్రస్తావించారు. ప్రత్యేక హోదాను బిల్లులో ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. రాజధాని భూసమీకరణకు సహకరించిన రైతుల గురించి బిల్లులో ఎందుకు లేదని అడిగారు. ఇంకెన్నాళ్లకు వారికి న్యాయం జరుగు తుందని కడిగేశారు. రాజధాని నిర్మాణ పనుల పేరుతో ఆమో దించిన టెండర్లలో కనిపిస్తున్న కనీవినీ ఎరుగని అవినీతి వ్యవహారాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఢిల్లీలో చదరపు అడుగుకు నాలుగు వేలున్న నిర్మాణ వ్యయం అమరావతిలో పన్నెండు వేలు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నను గతంలో పలుమార్లు స్వయంగా ప్రతిపక్ష నేత కూడా వేసినా, ప్రభుత్వం స్పందించలేదు.ఈ అవినీతిని ఎత్తిచూపకుండా పార్లమెంట్లో అమరావతి బిల్లుకు మద్దతునిస్తే రాష్ట్ర సర్కార్కు క్లీన్చిట్ ఇచ్చినట్టు కాదా? బేషరతుగా బిల్లుకు మద్దతునిచ్చి ఉంటే ప్రతిపక్ష బాధ్యతలో వైసీపీ విఫలమైనట్టు భావించవలసి వచ్చేది. అందుకే సవరణ బిల్లును ఈ రూపంలో వ్యతిరేకిస్తున్నామని చెప్పి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ఒక సెంటిమెంటల్, ఎమోషనల్ డ్రామాగా మార్చి ప్రచారం చేయడానికి కూటమి పార్టీల నేతలు, యెల్లో మీడియా వారు వీరకంకణాలు ధరించారు. అమరావతి నిర్మాణాన్నీ, అభివృద్ధినీ వైసీపీ అడ్డుకుంటున్నదని ప్రచార సంరంభాన్ని ప్రారంభించారు. రాజధాని పేరుతో ఎంత విచ్చలవిడిగా అవినీతి చెలరేగినా ప్రశ్నించ కూడదా? ప్రత్యేక హోదా డిమాండ్కు పాలక కూటమి మంగళం పాడితే ప్రతిపక్షం కూడా కోరస్ పాడాలా? చట్టబద్ధత అనేది అమరావతికి మాత్రమే ఉండాలా? అందుకోసం భూములిచ్చిన రైతులకు చట్టపరమైన రక్షణ అవసరం లేదా?... ఇవి కదా ఇప్పుడు చర్చ జరగవలసిన ప్రధానాంశాలు!అసలీ చట్టబద్ధత అనేదే పెద్ద బోగస్. దీన్నేమీ రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చలేదు కదా, మార్చకుండా ఉండ టానికి? చట్ట సవరణ కోసం ఏపీ శాసనసభ ఎంత సులభంగా మొన్న తీర్మానం చేసిందో, కావాలనుకుంటే ఇంకో ప్రభుత్వం అంతే సులభంగా ఇంకో తీర్మానాన్ని కూడా చేసి కేంద్రానికి పంపించగలదు. తమకిచ్చిన హామీలు నెరవేరక, చూపెట్టిన రంగుల చిత్రాలు నిజం కాక నిరాశతో ఉన్న రైతులను మరి కొంతకాలం మభ్యపెట్టడానికీ, రెండో విడత భూసేకరణకు సిద్ధపడని రైతులను బుజ్జగించడానికీ, నిర్మాణ పనుల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాల నుంచి దృష్టి మళ్లించడానికీ పన్నిన వ్యూహం తప్ప ఈ చట్టసవరణకు ఇంతకు మించిన ప్రాధాన్యంలేదు.విభజన చట్టం సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, ముఖ్యమంత్రి తన ఆనందాన్నీ, ప్రతిపక్షం మీద ఆక్రోశాన్నీ వెలిబుచ్చుతున్న సందర్భంలో ఒక కీలకమైన అంశం ఆయన మాటల్లోంచి దొర్లిపడింది. ‘రాజధాని నిర్మాణం నిరంతర ప్రక్రియ, ఒక్కరోజులో పూర్తయ్యేది కాద’ని చంద్రబాబు చెప్పారు. రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మాణం కాలేదన్న నానుడి చంద్రబాబు దాకా చేరేసరికి శతాబ్దాల కాలం పట్టిందన్నమాట! ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజన్ లాంటి నగరంగా అమరావతిని నిర్మించాలన్నది తన లక్ష్యమని కూడా ఆయన పలుమార్లు చెప్పారు. రెండో విడత, మూడో విడత భూసమీకరణ సంగతిని పక్కన పెడదాం. మొదటి విడత 50 వేల ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకే బాబు లెక్క ప్రకారం లక్ష కోట్లు కావాలి.ఇప్పటివరకు రాజధాని పేరుతో చేసిన రూ. 47 వేల కోట్ల అప్పుల్లో చాలాభాగం ఐకానిక్ బిల్డింగ్ల ఖాతాల్లోకి మళ్లింది. తొలివిడత మౌలిక వసతులను పూర్తిచేయడానికి ఇంకెన్ని వేల కోట్లు కావాలి? ఎప్పటికి సమకూరాలి? ఓ దశాబ్దానికో, రెండు దశాబ్దాలకో మౌలిక వసతుల్ని, ప్రభుత్వ భవనాలను, ప్రైవేట్ సంస్థల భవనాలను పూర్తి చేసినా, జనసమ్మర్దం నివసించే నగరంగా మారే అవకాశాలు అమరావతికి చాలా తక్కు వని నిపుణులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లోని నయా రాయ్ పూర్గానో, మలేసియాలోని పుత్రజయగానో చీకటి పడగానే నిర్మానుష్య నగరంగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువని సాధికారికంగా వివరిస్తున్నారు. ఇటువంటి నగరం ఎన్ని తరాలు గడిస్తే గ్రోత్ ఇంజన్గా ఎదగగలుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.ఈ నేపథ్యంలోనే గతంలో జగన్మోహన్రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనను పరిశీలించాలి. హైదరాబాద్లో అభివృద్ధి కేంద్రీకృతమైన కారణంగా మిగిలిన ప్రాంతాలు వెనుక బడ్డాయనీ, విభజిత రాష్ట్రంలో అటువంటి పొరపాటు చేయ వద్దనీ రాజధానిపై కేంద్రం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సూచించింది. అభివృద్ధి వికేంద్రీకరణతోపాటు పాలనా వికేంద్రీ కరణ కూడా ప్రజాస్వామ్యం బలపడేందుకు దోహదపడుతుంది. దీనితోపాటు మరో ముఖ్యమైన విషయం– రాష్ట్రాభివృద్ధికి దోహదపడే గ్రోత్ ఇంజన్ లాంటి నగరం కూడా ఈ మూడు రాజధానుల ప్రతిపాదనలో అంతర్లీనంగా ఉన్నది.విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం. షిప్యార్డ్, తూర్పు నావికాదళం, స్టీల్ ఫ్యాక్టరీ వగైరాల ఏర్పాటుతో కాస్మొ పాలిటన్ స్వరూపాన్ని సంతరించుకున్నది. బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఒరిస్సాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తున్న పర్యాటక కేంద్రంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది. తక్కువ ఖర్చుతో, తక్కువ కాలంలో విశాఖను గ్రోత్ ఇంజన్గా అందుబాటులోకి తీసుకొని రావచ్చు. దాంతో పాటు కర్నూలు న్యాయ రాజధాని విషయం కూడా!మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో కర్నూలులో రాజధాని ఏర్పాట యింది. మూడేళ్ల తర్వాత రాయలసీమ ప్రాంతం తన రాజధాని హోదాను త్యాగం చేసి దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పా టుకు శ్రీకారం చుట్టింది. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విచ్ఛిన్నమై పాత ఆంధ్ర రాష్ట్రమే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. న్యాయం ప్రకారం రాయలసీమ తన పాత హోదాను అడిగి తీసుకోవాలి. కనీసం హైకోర్టునైనా అక్కడ ఏర్పాటు చేయడం సముచితమన్న ఉద్దేశంతోనే జగన్ మూడు రాజధానుల ప్రతి పాదన తీసుకొచ్చారు. దీన్ని మూడు ముక్కల ఆటంటూ టీడీపీకి ఉన్న ప్రచార బలంతో, మీడియా దన్నుతో అవహేళన చేసి, ప్రజలను ఏమార్చారు.ఇప్పుడు అమరావతి నిర్మాణం రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతున్నది. రాజధాని నిర్మాణం ఒక్క రోజులో పూర్తి కాదనే గ్రహింపు కూడా చంద్రబాబుకు ఉన్నది. కొన్ని దశాబ్దాలు గడిచినా అది గ్రోత్ ఇంజన్ మాదిరిగా ఉపయోగపడే అవకా శాలు తక్కువే. అయినా ఇతరేతర కారణాలేవో ఆయన్ను అమరావతి చుట్టే తిప్పుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రగతి కోసం తక్కువ కాలంలో గ్రోత్ ఇంజన్గా అందుబాటులోకి వచ్చే మరో ప్రత్యామ్నాయ సూచన కూడా జగన్ చేశారు. మచిలీ పట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు 110 కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజధాని గ్రోత్ కారిడార్గా ప్రకటించ వచ్చని సూచించారు. ఇందుకోసం ఆయన ఉపయోగించిన ‘మావిగన్’ పేరు నచ్చకపోతే ఇంకే పేరైనా పెట్టుకోవచ్చని కూడా అన్నారు.తక్షణమే యాభై లక్షల జనాభా గల నగరంగా ఇది అవతరిస్తుంది. మచిలీపట్నం పోర్టు, దేశంలో ప్రముఖమైన విజయవాడ రైల్వే జంక్షన్, గన్నవరం అంతర్జాతీయ విమానా శ్రయం రెడీమేడ్గా అందుబాటులోకి వస్తాయి. అమరావతికి రెండో విడత భూ సమీకరణ అవసరముండదు. తొలి విడత సమీకరించిన భూమిలోనే కేటాయింపులు పోగా మిగిలిన భూమి అమ్మకాలతోనే ఈ కారిడార్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయవచ్చు. మచిలీపట్నం రాష్ట్రంలోని తొలి మునిసిపా లిటీల్లో ఒకటి. నిజాంల కాలంలోనే హైదరాబాద్ నుంచి బందరు రేవుకు రహదారి నిర్మాణం (ప్రస్తుత ఎన్హెచ్ 65) జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడే ఏకైక రేవుపట్టణం కూడా మచిలీపట్నమే! ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమలు పెద్దఎత్తున ప్రారంభించడానికి తక్షణం ఉపయోగ పడే ప్రాంతం. రాష్ట్ర పురోగతికి ఆచరణాత్మకమైన మార్గాన్ని అనుసరించాలనుకుంటే ఈ ప్రతిపాదనను పరిశీలించవచ్చు. అసాధ్యమైన అమరావతి బాటనే ఎంచుకుంటే అది రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కాదు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పోలీసుల అత్యుత్సాహం
మన దేశానికి సంబంధించినంతవరకూ అధికారం దైవదత్తమేమీ కాదు. అదిరాజ్యాంగం ద్వారా సమకూడిన బాధ్యత. అధికారమైనా, విధులైనా నిర్వర్తించేవారు ఈ సంగతి మరిస్తే దేశంలో అరాచకం రాజ్యమేలుతుంది. పాలకులు మొదలు సామాన్య ప్రభుత్వోద్యోగి వరకూ అందరూ దీన్ని పాటించి తీరాల్సిందే. మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు ఈమధ్య వరసబెట్టి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొందరు యువకుల్ని ‘నేరగాళ్లు’గా చిత్రిస్తూ వారిని తాళ్లతోకట్టి పబ్లిగ్గా నడిరోడ్లపై నడిపిస్తున్నారు. ఒకటి రెండు సందర్భాల్లో మోకాళ్లపై పాకించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి తమ ఘనకార్యాలను చాటుతున్నారు. ఈ ‘పేరుప్రఖ్యాతులు’ చూసి ఆ రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా కొందరు ఇలాంటి పనులకే దిగారు. పోలీసుల మతిమాలిన చేష్టలకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి వైపరీత్యాలు తక్కువేం కాదు. తెనాలిలో నిరుడు మే నెలలో దళిత వర్గాల యువకులు ముగ్గుర్ని నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో మోది హింసించారు. ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పడానికి వారి దగ్గర సమాధానాలు సిద్ధంగా ఉంటాయి. కోడిని కోశారని కేసు పెట్టవచ్చు... గ్రహస్థితి బాగో లేకపోతే డ్రగ్స్ విక్రయిస్తున్నారని అభాండం వేయొచ్చు. ఆ ఉదంతాన్ని నిరసిస్తూగుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో న్యాయవాదులు కోర్టులు బహిష్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అయినా ఆ మాదిరి ఘటనలు ఆగింది లేదు. ఆ మరుసటి నెలలో నెల్లూరు పోలీసులు సైతం మరో అయిదుగురు యువకులను నడిరోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు.చేతిలో లాఠీ ఉంటే చాలు... తాము సర్వం సహాధికారులమన్నట్టు ప్రవర్తించే పోలీ సుల తీరు గర్హనీయమైనది. ఉద్యోగులకైనా, సాధారణ పౌరులకైనా చట్టాలు, రాజ్యాంగం ఒక్కలాగే వర్తిస్తాయి. అధికారంలో ఉన్నవారు తమ కర్తవ్య నిర్వహణలో భాగంగా తీసుకునే ఏ చర్య అయినా వాటికి లోబడే ఉంటుంది. పోలీసులు సభ్యసమాజ పోకడలకు విరుద్ధంగా పోకూడదని షీలాబార్సే దాఖలు చేసిన ఒక కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. డీకే బసు కేసులో సైతం నిందితులతో ఎలా మెలగాలో నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. అసలు పోలీసు మాన్యువల్స్లోనే నిందితులతో ఎలా వ్యవహరించాలన్న విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలున్నాయి. సాధారణ పౌరుల విషయంలో చిన్న చిన్న అంశాల్లో కూడా చెలరేగిపోయేపోలీ సులు... బడా బాబులు పెద్ద నేరాలు చేసినప్పుడు మాత్రం ‘శవాసనం’ వేసిన చందాన మిన్నకుండిపోతారు. ఏపీలో రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనీ, బలవంతంగా అబార్షన్ చేయించాడనీ ఒక మహిళా ప్రభుత్వోద్యోగి ఆరోపిస్తే నెలలు గడుస్తున్నా చర్యలు లేవు. పైగా ఆమె బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారంటూ ఎదురు కేసులు పెట్టారు. మరో మహిళా మంత్రి పీఏపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అయినా జరిగింది శూన్యం. 60వ దశకంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ నారాయణ్ ముల్లా పోలీసులుసంఘటిత నేరగాళ్ల గుంపుగా తయారయ్యారని వ్యాఖ్యానించారు. వినడానికి అవి కటువుగా ఉన్నా, ఆయనన్నది నిజమే అన్నట్టు ప్రవర్తించే పోలీసులకు మన దేశంలో ఎప్పుడూ కొదవలేదు. ప్రజాస్వామ్యంలో వ్యక్తులైనా, వ్యవస్థలైనా ఇష్టానుసారం ప్రవర్తించటానికి లేదు. ఒక వ్యక్తి నిజంగా తప్పుచేసినా వారి చర్యను న్యాయస్థానంలో నిరూపించి తగిన శిక్ష పడేలా చూడటమే పోలీసుల కర్తవ్యం. ప్రతి నేరానికీ గతంలో ఐపీసీలోనూ, ఇప్పుడు భారతీయ న్యాయసంహితలోనూ నిర్దిష్టమైన శిక్ష ఉంటుంది. నేరగాళ్లు సిగ్గుపడేలా చేయటమనే శిక్ష ఎక్కడా లేదు. తెనాలి ఉదంతంలో విచిత్రమేమంటే... ఒక పోలీసు ఫిర్యాదు చేశాడు. దాని ఆధారంగా అతగాడి సహోద్యోగులు శిక్ష అమలు చేశారు. మరి న్యాయస్థానాలెందుకున్నట్టు? చవకబారు సినిమాలు చూసి, ‘రెడ్బుక్’ రాజ్యాంగంలో ఏదైనా చెల్లుతుందనుకుని చిత్తం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఈ బాపతు అత్యుత్సాహపరులు ఏదో ఒకరోజు చట్టానికి చిక్కక తప్పదు. -
ఆగిపోయిన ‘ఆంక్షల’ బిల్లు
దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నివిధాల కలిసొస్తుందో వివరించటానికి దాన్ని సమర్థించేవారు అనేకానేక కారణాలు ఏకరువు పెడతారు. కానీ ఆ ప్రతిపాదన వెనకున్న అసలు కారణమేమిటో బుధవారం హఠాత్తుగా లోక్సభలో ఆగిపోయిన విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లు చెప్పకనే చెబుతోంది. ఎన్నికల బెడద వల్ల తమకిష్టమైనవి అమలుచేయటం అసాధ్యం కావటమే ఆ అసలు కారణం. ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని మరింత కఠినం చేస్తూ తీసుకురాదల్చిన ఈ బిల్లుపై కాంగ్రెస్, సీపీఎంలు కేరళ ఎన్నికల సభల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నందువల్ల తాత్కాలికంగా ఆపామని బుధవారం కేంద్రమంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. క్రైస్తవ ఓటర్లు గణనీ యంగావున్న కేరళలో తమ పార్టీ ప్రాబల్యం పెరిగిందని బీజేపీ భావిస్తోంది. ఆ మత విశ్వాసాలను అనుసరించే స్వచ్ఛంద సేవాసంస్థ (ఎన్జీవో)ల కార్యకలాపాలు కూడా అక్కడ ఎక్కువే. కనుక ఈ బిల్లుపై చర్చ జరిగితే అది నష్టం తెస్తుందని పాలకపక్షం భావించినట్టు కనబడుతోంది. కేవలం ‘దుష్ప్రచారం’ వల్లనే తాత్కాలికంగా ఆపామన్న కారణం సహేతుకంగా లేదు. సాగు చట్టాల బిల్లు మొదలుకొని లేబర్ కోడ్, నిన్న మొన్నటి జీరాం జీ వరకూ ఇలాంటి ‘దుష్ప్రచారా’నికి కొదవలేదు. కానీ అవి ఆగింది లేదు.అందరినీ ఒకే గాటన కట్టవలసిన అవసరం లేదు. ఎంతో నిజాయితీగా, అంకిత భావంతో పనిచేసే ఎన్జీవోలున్నట్టే... పేరు ప్రతిష్ఠల కోసం, సాధారణ జనాన్ని ప్రభా వితం చేయటం కోసం పనిచేసే సంస్థలు కూడా ఉంటాయి. యూరప్లో ఎక్కడో మారు మూల పుట్టి మన దేశంలో అట్టడుగు వర్గాలకు ఎన్నదగిన సేవలందించిన మదర్ థెరీసాను ఆ వర్గాల ప్రజలు ‘అమ్మ’గా పిల్చుకున్నారు. అలాగే ఎప్పుడూ కరవు వాతబడే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో దాదాపు అరవైయ్యేళ్లుగా నిరుపేద ప్రజానీకానికి భిన్నరంగాల్లో విశేష సేవలందిçస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఖ్యాతి అందరికీ తెలుసు. ఇదే ఎఫ్సీఆర్ఏ కింద నిరుడు ఏప్రిల్లో కేంద్రం ఆ సంస్థ అనుమ తులు నిలిపివేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పల్లె నుంచి ఢిల్లీ వరకూ నిరసనలు సాగించింది. ప్రధానికి లక్ష పోస్టు కార్డులు పంపే ఉద్యమాన్ని చేపట్టింది. చివరకు గత నెలాఖరున అనుమతులు పునరుద్ధరించారు. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును ఇప్పుడంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నది గానీ... దాన్ని మొదట తెచ్చిందీ, కాలానుగుణంగా కఠినతరం చేసిందీ ఆ పార్టీ ప్రభుత్వాలే. 1976లో ఎమర్జెన్సీ చీకటిచాటున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారి ఈ చట్టాన్ని తెచ్చారు. అందుకు విదేశీ శక్తుల్ని కారణంగా చూపారు. దాన్ని 2010లో మరింత కఠినతరం చేసింది కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే. రష్యా సహకారంతో పూర్తికావస్తున్న కూదంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టుపై అమెరికా నిధులతో నడిచే స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ఇక ఎన్డీయే సర్కారు వచ్చాక 2016, 2018, 2020లలో ఆ చట్టానికి సవరణలొచ్చాయి. అయినా సరిపోలేదని భావించి ఈ బిల్లు తెచ్చారు. ముఖ్యంగా లైసెన్స్ రద్దయిన సంస్థల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించే అధికారం కేంద్రా నికిచ్చేలా సెక్షన్ 15కి చేసిన సవరణే వివాదాస్పదంగా మారింది. దానిపై సంబంధిత వర్గాలతో, పార్టీలతో చర్చించి వారిలో ఉన్నాయంటున్న అపోహలను తొలగించ టానికి ఎలాంటి ప్రయత్నం జరగకుండానే బిల్లు తీసుకురావటమే సమస్య అయింది.ఎఫ్సీఆర్ఏకు 2020 సవరణల అనంతరం ఎన్జీవోలకు విరాళాలు గణనీయంగా తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రూపేణా రూ. 16,490 కోట్లురాగా, 2019–20నాటికి అది కాస్తా రూ. 2,190 కోట్లకు పడిపోయింది. ఒక అంచనా ప్రకారం గత నెలాఖరు నాటికి 21,933 ఎన్జీవోల లైసెన్సులు రద్దయ్యాయి. ప్రభుత్వాలనుంచి సాయం అందని అనేక వర్గాలు ఈ సంస్థల ద్వారా లీగల్ ఎయిడ్, వైద్యసాయం, విద్య, మౌలిక సదుపాయాలు పొందుతున్నాయి. స్వచ్ఛంద సంస్థల నిర్వహణ పారదర్శకంగా ఉండాల్సిందే. ప్రమాదకర సంస్థలని రుజువైతే వాటి కార్యకలాపాలు నిలిపేయటం కూడా తప్పు కాదు. కానీ అన్నిటినీ ఒకే గాటనకట్టి పీక నొక్కాలనుకోవటం మాత్రం సహేతుకం కాదు. -
ఒంటరి మానవుడు ట్రంప్!
ఇరాన్తో యుద్ధం ముగిసే సమయానికి అమెరికా సర్వభ్రష్టమయ్యే సూచనలు కనబడు తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సలహాను శిరసావహించి యుద్ధంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఆయనతో చెడినట్టు కథనాలొస్తున్నాయి. గత ఏలుబడిలోనూ, రెండోసారి వచ్చాక అవకాశం దొరికినప్పుడల్లా నాటోను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ తాజాగా ఆ సంస్థ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. ఇన్నేళ్లుగా తమను బహిరంగంగా దూషిస్తున్నా మౌనంగా ఉండిపోయిన దేశాలు, ఆయన మాట విని ఇరాన్తో అనవసర కయ్యానికి దిగదల్చు కోలేదని గత నెల రోజులుగా వాటి ప్రవర్తన చెబుతోంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధాన్ని బద్దలు కొడదాం రమ్మని పిలుపునిస్తే ఎవరూ కదలకపోగా... దీంతో మాకేమిటి సంబంధమని స్పెయిన్ నిలదీసింది. మొదట్లో సిద్ధపడినట్టే కనిపించిన జర్మనీ, ఫ్రాన్స్ చివరకు మౌనం పాటించాయి. డీగోగార్షియా సైనిక స్థావరాన్ని ఇవ్వబోమని యుద్ధం తొలినాళ్లలో తిరస్కరించిన బ్రిటన్ అటుతర్వాత అంగీకరించినా, ఇప్పుడు అది సైతం యుద్ధ నౌకలను పంపేదిలేదని చెబుతోంది. సైనిక విమానాలు ఇంధనం నింపు కోవటానికి అనుమతించబోమని ఇటలీ చెప్పగా, ఇజ్రాయెల్కు ఆయుధాలతో వెళ్లే విమా నాలను తమ గగనతలంలోకి రానీయబోమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఇలా ఎవరికి వారు మొహం చాటేస్తుండగా నాటో నుంచి తప్పుకోవటం తప్ప దిక్కులేదని ట్రంప్ భావించ టంలో ఆశ్చర్యం లేదు.నాటో ఆవిర్భవించి 77 యేళ్లు కావస్తోంది. స్థాపిత ఉద్దేశాలు మరిచి ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల అమెరికా ప్రయోజనాలు నెరవేర్చటానికి ముందుకురికిన ఆ సంస్థ వల్ల గతమంతా నెత్తుటితో తడిసింది. ఇన్ని దశాబ్దాల్లోనూ చోటుచేసుకున్న యుద్ధాల చిట్టా తీస్తే చాలావరకూ నాటోయే దోషిగా తేలుతుంది. పూర్వపు సోవియెట్ యూనియన్ నుంచి ముప్పు ముంచుకురాబోతున్నదని బెదిరి స్థాపించిన ఈ కూటమికి ఇన్నేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ వైపునుంచి బెడద ఏర్పడింది లేదు. 1989లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అప్పటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వార్సా కూటమిని రద్దుచేశాం గనుక, నాటోను కూడా రద్దు చేయమని కోరగా అందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు అంగీకరించలేదు. కనీసం దాన్లో తమను కూడా చేర్చుకోవాలని ప్రతిపాదించినా అవి తిరస్కరించాయి. పైపెచ్చు నాటోను ‘ఒక్క అంగుళం’ కూడా విస్తరించబోమని, రష్యా సరిహద్దు దేశాలను చేర్చుకునేది లేదని ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించాయి.ప్రపంచంలో పనికిమాలిన సంస్థ ఏమైనా ఉన్నదంటే అది నాటోయే. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక దాన్ని శాంతిస్థాపక సంస్థగా మారిస్తే ప్రపంచంలో సహజ వనరుల వినియోగం గరిష్ఠంగా పెరిగి సైనిక వ్యయానికయ్యే ఖర్చంతా ఆదా అయి అవిద్య, నిరు ద్యోగం, అధిక ధరలు, ప్రాణాంతక వ్యాధులు సమసిపోయేవి. ఐక్యరాజ్యసమితికయ్యే వార్షిక వ్యయంతో పోలిస్తే నాటో ఖర్చు 400 రెట్లు ఎక్కువ! ఇందులో అత్యధిక శాతం సొమ్ము మారణాయుధాలకూ, సైనిక స్థావరాల నిర్వహణకూ ఖర్చవుతుంది. నాటో పేరు చెప్పి వివిధ యూరప్ దేశాల్లో తిష్టవేసిన సైన్యంలో అమెరికా సైనికుల సంఖ్యే దాదాపు 20 లక్షలు! మిగిలిన దేశాలకు చెందినవారి సంఖ్య అందులో సగం కూడా ఉండదు. నాటో నుంచి వైదొలగుతామని ట్రంప్ చెబుతున్న కబుర్లు ఉత్త బడాయి మాటలు. అదే అమలైతే ఇంటిదారిపట్టిన లక్షలాదిమంది సైనికుల్ని పోషించలేక అమెరికా ఆర్థిక వ్యవస్థ చతికిల బడుతుంది. అది సజావుగా సాగాలంటే, డాలర్ పచ్చగా కళకళలాడాలంటే ప్రపంచంలో ఏదో మూల మారణాయుధం పేలాల్సిందే!‘ఒక దశ దాటాక యుద్ధంలో నీకు ఆసక్తి లేకపోయినా, యుద్ధానికి నీపై ఆసక్తి తగ్గదు’ అని రష్యా విప్లవ సారథుల్లో ఒకరైన మార్క్సిస్టు సిద్ధాంతకర్త ట్రాట్సీ్క అంటాడు. కొరివితో తలగోక్కున్న చందంగా ఇరాన్పై అనవసర యుద్ధానికి దిగిన ట్రంప్కు దాన్నుంచి బయటపడటం ఎలాగో తెలియటం లేదు. అయినా రోజురోజుకూ పడిపోతున్న స్టాక్ మార్కెట్లను మాయజేయటం కోసం యుద్ధ విరమణ తథ్యమంటూ ప్రకటించటానికి ఆయన అలవాటుపడ్డారు. ఆ మాటెలా ఉన్నా ట్రంప్ బెదిరింపు నిజమై నాటో కనుమరుగైతే ప్రపంచం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. -
నేపాల్లో మారిందేమిటి?!
తిరుగుబాటు గాలి ఒకచోట పుట్టి చప్పున చల్లారిపోదు. అది సమస్య ఉన్నచోటకల్లా పోయి నిప్పు రాజేస్తుంది. శ్రీలంకలో ప్రజా ఉద్యమానికి జడిసి పాలకులు పదవులూ, ప్యాలెస్లూ వదిలి నిష్క్రమించిన తరహాలోనే బంగ్లాదేశ్లో కూడా యువజనం ధాటికి 2024 ఆగస్టులో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి హుటాహుటీన న్యూఢిల్లీకి చేరుకుని ఆశ్రయం తీసుకోక తప్పలేదు. ఈ రెండింటినీ చూసి కావొచ్చు... నేపాల్లో సైతం జెన్ జీ తరం నిరుడు సెప్టెంబర్లో అధికార పీఠాలను కదిలించారు. అక్కడ జరిగిన ఎన్నికల్లో శ్రీలంక, బంగ్లాదేశ్లకు భిన్నంగా యువతరం రాజకీయాల్లోకొచ్చి విజయం సాధించారు. ప్రముఖ ర్యాపర్, కఠ్మాండు మేయర్ బాలేంద్ర షా ప్రధాని అయ్యారు. ఆయనతోపాటు అనేక కొత్త ముఖాలు పార్లమెంటులోకి అడుగుపెట్టాయి. ఆ రకంగా నేపాల్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కానీ మాజీ ప్రధాని, సీపీఎన్(యూఎంఎల్) అధినేత కేపీ శర్మ ఓలిని శుక్రవారం అరెస్టు చేయడాన్ని గమనిస్తే శ్రీలంక, బంగ్లాదేశ్ల మాదిరి కాకుండా గత పాలకుల్ని వేధించటమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనబడుతోంది. శ్రీలంకలో మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను నిరుడు అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసిన సంగతి నిజమే అయినా, ఆ వెంటనే ఆయన బెయిల్పై విడుదలయ్యారు. బంగ్లాదేశ్లో అయితే వేధింపు రాజకీయాలకు తాను వ్యతిరేకమని కొత్త ప్రధాని తారిక్ రెహ్మాన్ ప్రకటించి ఇంతవరకూ విపక్ష నేతల జోలికి పోలేదు. హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ఇప్పటికీ భారత్ను కోరుతున్న మాట వాస్తవమే అయినా, అదే పనిగా పేచీకి దిగే ఉద్దేశం ప్రస్తుతానికైతే దానికి ఉన్నట్టు కనబడదు. నేపాల్లో నిరుడు సెప్టెంబర్లో జరిగిన నిరసనోద్యమంలో 77 మంది ప్రాణాలు బలిగొన్న భద్రతా బలగాల కాల్పులకు కారణమన్న కేసులో శర్మ ఓలిని, అప్పటి హోంమంత్రి రమేష్ లేఖక్లను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన నేపాల్ కొత్త కేబినెట్ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రత్యేక కోర్టు మాజీ న్యాయమూర్తి గౌరీ బహదూర్ కార్కీ నేతృత్వంలోని విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. నిజానికి ఆ కమిషన్ ఓలి అపరాధాన్ని నిర్ధారించలేదు. కానీ కాల్పులను ఆయనగానీ, లేఖక్గానీ ఆపలేకపోయారని తెలిపింది. నేపాల్లో ఉద్యమకాలంలో జరిగిన హింస తక్కువేమీ కాదు. పార్లమెంటు ఆవరణలో, కోర్టుల్లో గుంపులు జొరబడి విధ్వంసానికి దిగాయి. 65 మంది రాజకీయ నాయకుల, పలు వ్యాపారవేత్తల ఇళ్లు, అన్ని పార్టీల కార్యాలయాలు, జైళ్లు ఉద్యమకారుల ధాటికి దెబ్బతిన్నాయి. అలాంటి సందర్భాల్లో ఏ దేశంలోనైనా భద్రతాదళాలు మౌనంగా ఉండగలవా? అయితే ప్రదర్శకులను చెదరగొట్టే ఉద్దేశంతోకాక వారి ప్రాణాలు తీయ టానికే కాల్పులు జరిపారన్న ఆరోపణలపై అన్ని కోణాల్లోనూ విచారణ జరిపి కారకుల్ని శిక్షించాల్సిందే. కానీ కక్ష తీర్చుకోవటమే ముఖ్యమన్నట్టు ప్రవర్తిస్తున్న తీరే ఆశ్చర్యం కలిగిస్తుంది. రిపబ్లిక్ గా ఏర్పడ్డాక నేపాల్లో జరిగిన పరిణామాలకు అన్ని పార్టీల నేతలూ బాధ్యులే. రాచరికాన్ని ప్రజలెందుకు తరిమికొట్టారో గ్రహించక ఫిరాయింపులతో ప్రభుత్వాలను పడగొట్టడం, అవినీతికి పాల్పడటం అక్కడి నాయకులకు రివాజయింది. వీటన్నిటినీ చూసి తీవ్రంగా కలతచెందబట్టే జెన్ జీ తరం జూలు విదిల్చింది. అదొక్కటే కారణం కాదు. యువత ఉపాధి లేమితో తీవ్ర ఇబ్బందులకు లోనవుతోంది. కొలువులు దొరక్క నైరాశ్యంలో కూరుకుపోతోంది. ఇక ఆశ్రిత పక్షపాతం, అవినీతి, ఆర్థిక వ్యత్యాసాలు సరేసరి. అత్యధిక శాతం యువత పిడికెడు మెతుకుల కోసం భారత్ సహా పలు దేశాలకు వలసపోవటం, ఎంతోకొంత మిగిల్చి కుటుంబాలకు పంపటం మామూలే. అలా పంపుతున్న డబ్బే నేపాల్ జీడీపీలో అధిక శాతం ఆక్రమిస్తోందంటే ఆశ్చర్యం కలుగుతుంది. తయారీరంగ పరిశ్రమలపైనా, ఇతర ప్రాజెక్టులపైనా దృష్టి కేంద్రీకరిస్తే తమ పిల్లలు ఇక్కడే స్థిరపడటానికి అవకాశం ఉంటుందని అనేకులు ఎదురు చూస్తున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవటానికి బదులు కక్ష రాజకీయాలతోనే పాలనకు శ్రీకారం చుట్టి తాను గత పాలకులకు భిన్నమేమీ కాదని బాలేంద్ర షా నిరూపించారు. తిరుగుబాటు స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుంది. -
యుద్ధంపై రణభేరి!
రాత్రింబగళ్లు నిప్పులు కురుస్తున్నా భూగోళంపైనున్న జనారణ్యాలన్నీ నిశ్చలన చిత్రాలై నిర్లిప్తంగా ఉండిపోతున్నాయన్న నిరాశ సర్వత్రా ఆవరించిన తరుణంలో అమెరికా వ్యాప్తంగా శనివారం ఒక మానవ మహాసముద్రం పోటెత్తింది. దశాబ్దాలనాటి వియత్నాం యుద్ధ వ్యతిరేక ర్యాలీలను తలపిస్తూ, అంతకన్నా మరిన్ని రెట్లు ఎక్కువగా నగరాలు, పట్టణాలు, మారుమూల పల్లెలన్న వ్యత్యాసం లేకుండా– అమెరికాలోని అన్ని వర్గాలూ ఏకమై 3,300 నిరసన ప్రదర్శనలు నిర్వహించి ముక్తకంఠంతో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధాన్ని ఖండించిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంటా, బయటా తన అరాచకంతో ప్రజాస్వామ్యానికీ, మానవతకూ మహాపచారం చేస్తున్నారని ప్రదర్శకులు మండిపడ్డారంటే ఏడాది పాలనలో వారెంత విసిగిపోయారో అర్థమవుతుంది. ఖర్గ్ ద్వీపాన్ని బుగ్గి చేస్తానని, ఇరాన్ ఇంధన క్షేత్రాలకూ, విద్యుదుత్పాదన ప్లాంట్లకూ నిప్పెడతాననీ ట్రంప్ బెదిరిస్తున్న తరుణంలో ‘నో కింగ్స్’ పేరిట ఇంత పెద్దయెత్తున నిరసనలు ఎగిసిపడటం అసాధారణం. ఉత్తర ధ్రువప్రాంత అలస్కాలో కేవలం 3,000 మంది జనాభా నివసించే కోట్జెబు మొదలుకొని కరేబియన్ ద్వీపంలోని ప్యూర్టోరికో... న్యూయార్క్, వాషింగ్టన్, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో తదితర మహా నగరాల వరకూ ప్రదర్శకులు భారీయెత్తున పాల్గొనగా, యూరప్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియాల్లో సైతం ‘నో కింగ్స్’ ర్యాలీలు జరిగాయి. ‘నో కింగ్స్’ ఒక్క ట్రంప్ పైన మాత్రమే కాదు... ఆయనకు అపరిమితమైన అధికా రాలు కట్టబెట్టిన, చట్టపరమైన రక్షణలిచ్చిన వ్యవస్థలన్నిటిపైనా మోగించిన రణభేరి. అధికారం అహంకరించినప్పుడూ, న్యాయం సైతం దానితో కుమ్మక్కయినప్పుడూ నడి వీధులే న్యాయస్థానాలవుతాయి. శనివారంనాటి నిరసనల సారాంశం అదే. రాచరిక, భూస్వామ్య వ్యవస్థలపై శతాబ్దాల క్రితం పోరాడి నిర్మించుకున్న ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ కలిసి మరో ‘రాజు’ను ప్రతిష్ఠించటానికి పూనుకోవడంపై ‘నో కింగ్స్’ ఒక తిరుగుబాటు. స్వదేశంలో నియంతగా మారిన పాలకుడు ప్రపంచానికి సైతం శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నదని ట్రంప్ పోకడలు చాటుతున్నాయి. నియంతృత్వం రాజ్యమేలేచోట అరాచకాలు పెరిగినప్పుడు మౌనప్రేక్షకులుగా మిగిలే సాధారణ జనంలో సైతం ఆలోచనలు రేకెత్తించడానికీ, కార్యోన్ముఖుల్ని చేయటానికీ ఈ నిరసనలు పుట్టు కొస్తాయి. రిపబ్లికన్ల ఆధిక్యతగల రాష్ట్రాలూ, ‘మాగా’ ఉద్యమ ప్రాబల్యంగల ప్రాంతాలూ సైతం ఈసారి నిరసనలతో హోరెత్తటం గమనించదగ్గది. జనహననం కోసం పశ్చిమాసియాకు ట్రంప్ తరలించిన మెరైన్ల తల్లులు కూడా ఇందులో పాల్గొన్నారు. నెలక్రితంతో పోలిస్తే... వారం రోజులుగా ఇరాన్ ప్రతిదాడుల సంఖ్య తగ్గిందనీ, రోజుకు 30 మించటం లేదనీ అంటున్నారు. కానీ అవి నేరుగా లక్ష్యాన్ని గురి చూస్తున్నాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ప్రత్యర్థి పక్షాలు నిలువరిస్తున్నా అది కిందపడుతూ పదుల బాంబులై పేలటం, జననష్టంతోపాటు ఆస్తి నష్టం తీసుకురావటం కనబడుతూనే ఉంది. ఎదురుదాడుల క్రమంలోనే అంచనాలు పదు నెక్కించుకుని, నిఘా కార్యకలాపాలను సమన్వయపరుచుకుని ఇరాన్ దళాలు వ్యవహ రిస్తున్నాయని ఇది తేటతెల్లం చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయెల్లో లక్షలాదిమంది పౌరులు ఇప్పటికీ బాంబు షెల్టర్లలో తలదాచుకొనక తప్పని స్థితి ఉంది. ప్రత్యర్థి పక్షాల ప్రాంతాల్లో ఒకసారంటూ అస్థిర పరిస్థితుల్నీ, అభద్రతా భావాన్నీ తీసుకొచ్చాక దాడుల సంఖ్య గణించదగ్గది కాదు. గత జూన్లో 12 రోజుల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ విశ్రమించలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజల జీవితాలనూ అస్తవ్యస్తం చేస్తోంది. వారి జీవికను దెబ్బతీస్తోంది. ఇరాన్పై యుద్ధం ఆపకుండా, హార్మూజ్ జలసంధి మాత్రం ప్రశాంతంగా ఉండాలనీ, ఇంధన రవాణా నిరాటంకంగా జరగాలనీ ట్రంప్ కోరుకోవటం దురాశ. ఇంధన ధరలు మిన్నంటితే తన కొలువుకు ఎసరొస్తుందన్న ఏకైక భయంతోనే పశ్చిమాసియాలో ప్రస్తుతం ఆయన వేలాదిమంది మెరైన్లను మోహరించారు. అమెరికా ప్రజల అభీష్టమేమిటో తెలిసింది గనుక ఇకనైనా ట్రంప్ తన దుష్ట పోకడలకు స్వస్తి చెప్పాలి. -
తిరోగాముల పురోగమనం
మన దేశానికి గల ఘనతలు ఎన్నైనా చెప్పుకోవచ్చు; సనాతన సంప్రదాయ పరంపరను ఎంతైనా కొనియాడుకోవచ్చు. అలాగని గతవైభవ సంకీర్తనలతోనే కాలం వెళ్లబుచ్చడం ఏమాత్రం వివేకమున్న పని కాదు. వర్తమానంలో చెప్పుకోదగినది ఏదీ లేనప్పుడు; భవితవ్యం అగమ్యగోచర అయోమయంగా మారినప్పుడు బుద్ధి పనిచేయక చాలామంది తమ గత వైభవాన్ని పదే పదే చెప్పుకుంటూ తన్మయంలో మునిగిపోతుంటారు. వర్తమా నంలోని వేగాన్ని అందుకోలేక, భవితవ్యంలోని అభివృద్ధిని అంచనా వేయలేక ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని వలపోస్తూ ఉంటారు. ఇలాంటి వారిది తిరుగులేని తిరోగమన ధోరణి.గత వైభవ స్తోత్రాలు వల్లించేవారు దాదాపు అన్ని రంగాల్లోనూ ఉంటారు కాని, పదవులకు శాశ్వతంగా దూరమైన రాజకీయ నాయకుల్లోను; తెరమరుగైపోయిన సినీ ప్రముఖుల్లోను; పాఠకులు పట్టించుకోని రచయితలు, కవులలోను; ఆధ్యాత్మిక ప్రవచన కర్తల్లోను తిరోగమనవాదులు ఎక్కువగా కనిపిస్తారు. బహిరంగ వేదికల మీద మైకులు దొరికితే వీరి వాగ్ధారకు మాత్రమే కాదు, వాగ్దాష్టీకాలకు కూడా అంతు ఉండదు. ఇటీవలి కాలంలో ఇలాంటి వాగ్దాష్టీకాల ఉదంతాలే వార్తలకెక్కుతున్నాయి; ప్రసార మాధ్యమాల కార్యక్రమాల్లో ప్రధాన చర్చాంశాలవుతున్నాయి; సామాజిక మాధ్యమాల్లో రణగొణలవు తున్నాయి.గత వైభవ గాథలను మితిమీరి ఊదరగొడుతుంటే, జనాలకు విసుగు పుడుతుంది. ఒక్కసారి చరిత్రను తరచి చూసుకుంటే, ‘గతమంతా తడిసె రక్తమున/ కాకుంటే కన్నీళులతో’ అని శ్రీశ్రీ ఎందుకన్నాడో ఎవరికైనా సులువుగానే బోధపడుతుంది. గతం నుంచి పాఠాలు నేర్చుకోని వర్తమానానికి భవిష్యత్తు ఉండదు. గతంతో పోల్చి చూసు కున్నప్పుడు వర్తమానం సాధించే ఎలాంటి పురోగతినైనా స్వాగతించాల్సిందే! గతంలో జరిగిన పొరపాట్లకు వర్తమానంలో జరిగే ఎలాంటి దిద్దుబాటునైనా హర్షించాల్సిందే! సమీప గతం పట్ల ఎరుక కలిగిన సామాన్య ప్రజానీకం వర్తమానంలో చోటుచేసుకునే ఎలాంటి సానుకూలతనైనా ఆమోదిస్తుంది. కాని, తిరోగాములకు వర్తమాన సానుకూలతలు ఇనుపగుగ్గిళ్లలా మింగుడుపడవు. తమ ఘనతకు ఎక్కడ భంగం వాటిల్లుతుందోననే భయంతో నోటికి పని చెబుతారు. ఏ వేదిక దొరికినా, సమయ సందర్భాలతో, ఉచితానుచితాలతో నిమిత్తం లేకుండా తమ లోలోపలి అక్కసునంతా వెళ్లగక్కుతారు.జనాభాలో తిరోగాములు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్లేమీ కాదు. పురాణకాలంలోని పురాతన రాజ్యాలలోనూ ఇలాంటి కురచబుద్ధుల తిరోగాములు ఉండే వారు. వీళ్లు నిత్యదుఃఖితులు. ఇలాంటి వాళ్ల గురించే ‘ఈర్షా్యళు ఘృణీ నసంతుష్టః క్రోధనో నిత్యశంకితః/ పరభాగ్యోపజీవీ చ షడతే నిత్యదుఃఖితాః’ అని విదురనీతి చెబుతుంది. ఇతరుల పట్ల ఈర్ష్యపడేవారు; ఇతరులను నిష్కారణంగా అసహ్యించు కునే వారు; నిత్యం అసంతృప్తితో రగిలిపోయేవారు; ఉత్తపుణ్యానికే కోపంతో చిర్రుబుర్రు లాడేవారు; ప్రతి విషయాన్నీ అనుమానించేవారు; ఇతరుల భాగ్యంపై ఆధారపడి జీవించే పరాన్నభుక్కుల వంటివారు నిత్యం దుఃఖంతోనే కొట్టుమిట్టాడుతుంటారు.అంతటితోనే ఆగరు. తమ పరిసరాల్లోని మనుషుల సంతోషాన్ని కూడా హరించేస్తారు. సామాజిక వేదికలను అధిరోహిస్తే, యావత్ సమాజంలోని సుఖశాంతులకే భంగం కలిగిస్తారు. ‘వివేక తిరోగమనే మూర్ఖత్వ పురోగమనం’ అని రష్యన్ రచయిత తామెర్లాన్ కుజ్గోవ్ ఇలాంటి బాపతు తిరోగాముల గురించే వ్యాఖ్యానించాడు. సమాజానికి చేటు కలిగించే తిరోగాములను కనీసం సామాజిక వేదికలకు దూరంగా ఉంచడం మంచిది. లేకుంటే, వాళ్లు మూర్ఖత్వ పురోగమనాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తారు. వారి కృషిని సమాజం భరించలేదు. ఇటీవలే ప్రభుత్వ బిరుదాంకితుడైన ఒక ప్రవచనకర్త ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసే మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు పోషకాహారంగా గుడ్లు పెట్టడం మీద నోరుపారేసుకుని కలకలం రేపిన ఉదంతం ఈ కృషికి తాజా ఉదాహరణ. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం పురోగామి సమాజం బాధ్యత. -
సూపర్ ‘పవర్గేమ్’లో భారత్ డైలమా!
డామిట్, కథ అడ్డం తిరిగింది. ట్రంపూ, నెతన్యాహూ కలిసి రాసుకున్న స్క్రిప్టులో లేని సన్నివేశం ఎదురైంది. ఈ యాంటీ క్లైమాక్స్ వాళ్లు ఊహించింది కాకపోవచ్చు. వ్యూహం ప్రకారమే దాడులు జరిగిన తొలిరోజున ఇరాన్ ఆధ్యాత్మిక అధినేత అలీ ఖమేనీని హతం చేశారు. ఈ దెబ్బకు ఇరాన్ జావకారిపోయి ఉండాలి. మత పాలనను వ్యతిరేకించే ఇరాన్ ప్రజలు లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ట్రంపు మహాశయునికి జైకొట్టి ఉండాలి. మహా అయితే నాలుగు రోజుల్లో ఇరాన్ సర్కార్ను పీక పట్టుకొని మోకాళ్ల మీద కూర్చోబెట్టి అవమానకరమైన షరతుల మీద సంతకం పెట్టించి ఉండాలి. ఇదీ వ్యూహం. నాలుగు రోజులు కాదు. నాలుగు వారాలు గడిచిపోయాయి. ఏమైంది?హార్మూజ్ అనే ఒక సముద్రపు ఇరుకు సందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పీకను దొరకబుచ్చుకొని దాని కణత మీద తుపాకీ గురిపెట్టి కూర్చున్న ఇరాన్ దృశ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపి స్తున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా ఇరాన్ మీద ఆర్థిక ఆంక్ష లను అమెరికా అమలు చేస్తున్నది. దాని చమురు అమ్మకాలను నిషేధించింది. తాజా పరిణామాలతో, చమురు నౌకల రవా ణాకు ఆటంకాలను తొలగించాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ఇరాన్ కూడా అమ్ముకోవచ్చంటూ తాత్కాలిక ‘అనుమతి’ని ప్రసాదించింది. ఇదేమీ ట్రంప్ ‘కరుణ’ కాదు, కాళ్ల బేరమని అర్థమవుతూనే ఉన్నది. ఇరాన్పై యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంపై ప్రపంచ దేశాలు తనను వేలెత్తి చూపకుండా ఓ నెలరోజుల సడలింపును ఆయన ప్రకటించారు. గతంలో చాటుమాటుగా చైనాకు చమురు సరఫరా చేసి, దాన్నుంచి వస్తు–సేవలను పొందుతున్న ఇరాన్ ఇప్పుడు రైట్ రాయల్గా రోజుకు 140 మిలియన్ డాలర్ల విలువైన చమురు అమ్మకాలను ప్రారంభించింది. దాడుల్లో ఇరాన్కు జరిగిన ఆస్తి నష్టంపై స్పష్టమైన అంచనాలు ఇంకా రాలేదు గానీ, చమురు విక్రయం ద్వారా బహిరంగంగా రోజుకు సుమారు 1400 కోట్ల రూపాయలను (ఇండియన్ కరెన్సీలో) ఇరాన్ ఆర్జిస్తున్నది. అమె రికా మాత్రం చేతి చమురును బాగానే వదిలించుకుంటున్నదని ఆ దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు సగటున ఒకటిన్నర బిలియన్ డాలర్ల చొప్పున యుద్ధ జ్వాలలకు అమెరికా ఆహుతిస్తున్నదని లెక్కలు తేలుతున్నాయి. మొదటి మూడు వారాల్లో 30 బిలియన్ డాలర్లను అర్పించు కోవలసి వచ్చింది. ఇరాన్ దాడుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అమె రికా సైనిక స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయి. వాటి పున రుద్ధరణ పేరుతో ఇంకో 200 బిలియన్ డాలర్లను కేటాయించాలని అమెరికా కాంగ్రెస్ను పెంటగన్ (రక్షణ శాఖ కేంద్రం) కోరుతున్నది.పెంటగన్ అభ్యర్థనపై ప్రతిపక్ష డెమోక్రాట్లే కాదు, కొందరు పాలక రిపబ్లికన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా ప్రజల జీవన ప్రమాణాలను ఫణంగా పెట్టి ఏం సాధించాలని ఇరాన్ యుద్ధంలో ఇంత పెద్దమొత్తంలో తగలేస్తున్నారని వారు ట్రంప్ సర్కార్ను నిగ్గదీస్తున్నారు. ఇప్పటికే 39 ట్రిలియన్ డాలర్ల అప్పులతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ నిరర్థక యుద్ధ ఖర్చు మోయలేని భారాన్ని మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్పై హఠాత్తుగా ఇజ్రాయె ల్తో కలిసి దాడులకు తెగబడటానికి స్పష్టమైన కారణాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పలేకపోయింది. అణ్వస్త్ర బూచీ అనే అరిగిపోయిన రికార్డునే అది ఇప్పటికీ ప్లే చేస్తున్నది.ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం ఆరోపణలపై ఇప్పటికే అంత ర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఏఐఈఏ) అక్కడ తనిఖీలు చేసింది. అణ్వాయుధాలను తయారుచేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్న దనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసీ స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ అమెరికాకు, ఇజ్రాయెల్కు మాత్రం ఇరాన్ అణుబూచీ కనిపి స్తూనే ఉన్నది. ఇరాన్ను నిర్వీర్యం చేస్తే పశ్చిమాసియాలో పెత్తనం చేసే అవకాశం ఇజ్రాయెల్కు లభిస్తుంది. ఇరాన్ దన్నుతో ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా తయారైన టెర్రరిస్టు గ్రూపులు హెజ్బుల్లా (లెబనాన్), హూతీ (యెమెన్), హమాస్ (పాలస్తీనా)లు కూడా తోక ముడుస్తాయి. ఇదీ ఇజ్రాయెల్ ఆలోచన. మరి అమెరికాకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి?1979లో జరిగిన ఇస్లామిక్ రివల్యూషన్లో పదవీ చ్యుతుడైన రాజు రెజా పహ్లవీ. ఆయన అమెరికా కీలుబొమ్మ. ఆ కాలంలో ఇరాన్ నుంచి కారుచౌకగా అమెరికా చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడింకో కీలుబొమ్మను కూర్చోబెడితే మళ్లీ ఆ అవకాశం ఉండొచ్చు. కానీ, యుద్ధానికి అదేమంత పెద్ద కారణం కాదు. అమెరికా ఇంధన భద్రతకు అంత ప్రమాదమేమీ లేదు. పైగా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెను జువేలా దేశం అమెరికాకు కూతవేటు దూరంలోనే ఉన్నది. దాని అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని కిడ్నాప్ చేసి ఆ దేశాన్ని అమెరికా తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నది. వెనుజువేలా కూడా ఇరాన్లాగే చైనాకు మిత్రదేశం కావడం ఇక్కడ గమనార్హం.భారత్ లాగే చైనా కూడా ఇంధన భద్రత గల దేశం కాదు. పైగా దాని ఇంధనావసరాలు చాలా ఎక్కువ. వెనుజువేలా, ఇరాన్ దేశాలు అమెరికా ఆంక్షల నేపథ్యంలో మలేసియా, రష్యా వంటి దేశాల ద్వారా క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేసి చైనాకు పంపి స్తాయి. చైనాకు ప్రధాన చమురు సరఫరాదారైన రష్యా కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నదే కావడం విశేషం. ప్రపంచ చమురు రవాణాలో ఇరవై శాతానికి పైగా సాగే హార్మూజ్ జలసంధిని యుద్ధ నేపథ్యంలో ఇరాన్ తన పూర్తి నియంత్రణలోకి తీసుకున్నది. అక్కడి నుంచి చమురు రవాణా చేసే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఒక లీక్ను ఇరాన్ వదిలింది. అంతేకాదు, ఆ ఫీజు అమెరికా డాలర్లలో కాకుండా చైనా యువాన్లలో వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే ట్రంప్ ఐదు రోజుల దాడుల విరామాన్ని ప్రకటించాడు. దాన్ని తర్వాత ఏప్రిల్ 6 దాకా పొడిగించాడు. ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగలేదు.డాలర్కు సవాల్ ఎదురైతే అమెరికా తట్టుకోలేదు. అందు లోనూ డాలర్ ఆధిపత్యానికి ఊపిరిపోసిన చమురు రంగంలో పోటీ ఎదురైతే చేటుకాలం దాపురించినట్టే. యాభయ్యేళ్ల కింద చమురు ఎగుమతి చేసే గల్ఫ్ దేశాల రక్షణ బాధ్యతను అమెరికా తీసుకున్నది. ప్రతిగా చమురు కొనుగోలు చేసే దేశాలు అందుకు చెల్లించాల్సిన సొమ్మును అమెరికా డాలర్లలో చెల్లించాలి. ఇంధన అవసరాలు అన్ని దేశాలకూ ఉంటాయి కనుక డాలర్ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నుంచి వెనక్కు తగ్గి అమె రికా తోక ముడిస్తే, ఇరాన్ దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న అరబ్ దేశాల రక్షణ బాధ్యత నుంచి అమెరికా వైదొలగి నట్టవుతుంది. అప్పుడు చమురు అమ్మకాన్ని డాలర్లలోనే కొనసాగించవలసిన అవసరం ఈ దేశాలకు ఉండదు. యువాన్, రూబుల్, యెన్ దేన్నయినా వాళ్లు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిణామం సంభవిస్తే అమెరికా శిరస్సు మీద నుంచి అగ్రరాజ్యం అనే కిరీటం ఊడి కిందపడ్డట్టే!విరామం తాత్కాలికమే. ఇరాన్ పూర్తిగా లొంగిపోయి, తమ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించే దాకా దాడులు చేయాలని అమెరికా తొలుత భావించింది. అలా జరగాలంటే ఇరాన్ గడ్డమీద తన సేనలను దించాల్సి ఉంటుంది. ఇరాన్ భౌగోళిక స్వరూపం దృష్ట్యా దాంతో భూతల యుద్ధం సాధ్యం కాదని రక్షణ నిపుణులు చెబుతారు. ఉత్తర దక్షిణ సరిహద్దుల్లో సహజమైన కోట గోడగా ఉన్న పర్వత శ్రేణులే ఇందుకు కారణం. మధ్యేమార్గంగా ఇరాన్ చమురు నిల్వచేసే ఖార్గ్ దీవినో, పర్షియన్ గల్ఫ్లో ఉన్న దీవుల్లో మరోదాన్నో ఆక్రమించాలని అమెరికా భావిస్తున్నది. ఆ దీవి ద్వారా హార్మూజ్ నుంచి చమురు కంటెయినర్లు సజావుగా వెళ్లేలా పర్యవేక్షించి యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించుకోవాలని భావిస్తున్నది.పర్షియన్ గల్ఫ్ దీవుల ఆక్రమణ కూడా అమెరికా – ఇజ్రాయెల్ ఊహిస్తున్నంత సులభం కాదు. ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటననే ఎదుర్కోవలసి ఉంటుంది. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్షియా దీవులపైకే క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ పట్టుమని పది కిలోమీటర్ల దూరం లేని దీవుల్లో అమెరికా సైన్యం దిగితే మిన్నకుంటుందా? పర్షియల్ గల్ఫ్లో పెనుమంటలు చెలరేగవచ్చు. దుబాయ్, అబుధాబీ, దోహా, రియాద్ నగరాల వైభవోజ్వల కాంతులు మసక బారవచ్చు. అన్నిటినీ మించి ప్రపంచ ఆర్థిక గమనం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనుకావచ్చు. మన దేశం సంగతి సరేసరి. ఇరాన్ మన దేశం పట్ల కొంత ఉదారంగా ఉన్నప్పటికీ నాలుగు వారాల ఘర్షణే దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతున్నది. ఈ ఘర్షణ వారాల్లోంచి నెలల్లోకి మారితే తీవ్ర సంక్షో భాన్ని చవిచూడవలసి రావచ్చు. మన రాజకీయ నాయకత్వ దీక్షా దక్షతలకు, ప్రజా సమూహాల సమైక్యతకు ఇది పరీక్షా కాలం.ప్రపంచాన్ని ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఈ అంతర్జాతీయ పరిణామాల్లో ఒక ప్రముఖ దేశంగా, అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న భారత్ పోషించవలసిన పాత్ర ఏమిటన్నది కూడా చర్చించుకోవలసిన సందర్భం. తన సూపర్ పవర్ హోదాను, తన ఆధిపత్యంలోని ఏకధ్రువ ప్రపంచ గమనాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఆర్థికంగా – సాంకేతిక పరంగా అనూహ్యమైన ప్రగతిని సాధించిన చైనా ఈ తరహా ప్రపంచ గమనపు దిశను మార్చాలని సహజంగానే భావిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తొలిరోజు నుంచీ నేటి దాకా దాదాపు ఎనభయ్యేళ్ల శత్రుత్వం అమెరికా – రష్యాలది. నలభయ్యేళ్లుగా ఇరాన్ పట్ల అమెరికా అసహనంగా ఉన్నది. ఇజ్రాయెల్ అమెరికాకు అనుబంధ సంస్థ. పశ్చిమాసియాలో దాని బ్రాంచి ఆఫీసు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ తదితర చమురు ఎగుమతి దేశాలన్నీ అమెరికాకు మిత్రులుగానే మనుగడ సాగిస్తున్నాయి.ప్రస్తుత సంక్షోభంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ దేశాలన్నీ పాత్రధారులు. ఇరాన్తో సరిహద్దును పంచుకునే మరో ఇస్లామిక్ దేశం పాకిస్తాన్. అమెరికా తరఫున బ్రోకరేజి చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఈ దేశానికి సౌదీ అరేబియాతో ఈమధ్యనే ఒక రక్షణ ఒడంబడిక కుదిరింది. దాని ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా తన మీద దాడి జరిగినట్టే రెండో దేశం భావించి స్పందించాలి. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ ఎక్కుపెట్టిన దాడులు సౌదీ అరేబియాను కూడా వదల్లేదు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రాన్ని టార్గెట్ చేసి డ్రోన్ దాడులు చేసింది. అయినా పాకిస్తాన్ కిమ్మనలేదు. దీంతో పాక్ ప్రతాపమేమిటో తేలి పోయింది.రెండు శిబిరాలుగానో, మూడు శిబిరాలుగానో ప్రపంచ దేశాలు చీలిపోయి ఆ శిబిరాల తరఫున వకాల్తా పుచ్చుకునే రోజులు ఎప్పుడో గతించాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో జాతీయ ప్రయోజనాలే గీటురాయి. మన ప్రయో జనాలను కాపాడుకోవడానికి ఏకకాలంలో రెండు శత్రు దేశా లతో రెండు రకాల ఒడంబడికల్లో భాగస్వామిగా ఉండటం ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. గల్ఫ్ సంక్షోభంలో భాగస్తులుగా ఉన్న అమెరికా, ఇజ్రా యెల్, యూఏఈ దేశాలతోపాటు ఇండియా కూడా ఐ2యూ2 ఒప్పందంలో భాగస్వామి. ఇండియా మినహా మిగిలిన మూడు దేశాల మీద దాడులు చేస్తున్న ఇరాన్తో మనకు వేల సంవ త్సరాల సాంస్కృతిక బంధం ఉన్నది. భారత ప్రజల పట్ల స్నేహ పూర్వకంగా, భారత సంస్కృతిపై అభిమానపూర్వకంగా పర్షియన్లు ఉంటారనేది కూడా వాస్తవమే. ఇరాన్కు మిత్ర దేశంగా ఉండే రష్యాతో మనది కాలపరీక్షలో నిలబడి నిగ్గుదేలిన స్నేహం.ఈ పరిస్థితిలో మనం ఎవరి పక్షం వహించాలి? అమెరికా, గల్ఫ్ దేశాలు భారత్తో అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. కోటిమంది భారతీయులు గల్ఫ్లో, 50 లక్షలమంది అమెరికాలో జీవిస్తున్నారు. ఎన్నారైలు సాలీనా మాతృభూమికి పంపిస్తున్న పన్నెండు లక్షల కోట్ల రూపాయల్లో గల్ఫ్, అమెరికాలదే సింహ భాగం. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్కు ఈ విషయంలో నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్. రక్షణ, సాంకే తిక, వ్యవసాయ రంగాల్లో మనకు సహకరిస్తున్నది. కనుక భారత్ ఎవర్నీ దూరం చేసుకోలేదు. ఆచితూచి వ్యవహరించడంతోపాటు ఉద్రిక్తతల ఉపశమనానికి శక్తి మేరకు ప్రయత్నించడమే భారత్ ముందున్న మార్గం. మోదీ ప్రభుత్వం ఇదే దిశలో పయనిస్తున్నది. కనుకనే ఇప్పటిదాకా చమురు సంక్షోభాన్ని తట్టుకొని నిలబడగలిగింది.కాకపోతే తన స్థాయికి తగ్గట్టుగా కొన్ని విషయల్లోనైనా గొంతు విప్పాల్సిందనే అభిప్రాయం కూడా బలపడుతున్నది. అప్పుడే ప్రపంచ వేదికపై మనం నాయకత్వ స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి కవ్వింపు లేకుండా అమెరికా – ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సూత్ర ప్రాయంగానైనా భారత్ ఖండించి ఉండవలసింది. దాడుల్లో చనిపోయిన ఖమేనీకి సంతాపం ప్రకటించడంలో మీనమేషాలు లెక్కించకుండా ఉండవలసింది. ఇరాన్ పాఠశాల మీద దాడి చేసి 165 మంది విద్యార్థుల చావుకు కారణమైన అమెరికా చర్యను ఖండించి ఉండవలసింది. భారత్ ఆహ్వానం మేరకు వైజాగ్కు వచ్చి నౌకా విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న ఇరాన్ నౌకపై దాడి చేసి 150 మందిని హతం చేసిన అమెరికా చర్యను ఖండించి ఉండ వలసింది. అంతర్జాతీయ సంబంధాల్లో జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేయవలసిందే. దాంతోపాటు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా కూడా వ్యవహరించాలి. అప్పుడే విశ్వగురు హోదాకు అర్హత పొందగలం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘మాయ’ఫెస్టోలు!
రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మానిఫెస్టోలు ఆర్థిక, రాజకీయ, సామాజిక సమసల్యపై వాటి వైఖరిని తేటతెల్లం చేయాలి. ఆ క్రమంలో వాగ్దానాలుంటే ఉండొచ్చు. కానీ చాలా పార్టీలకు గెలుపే లక్ష్యంగా అసంబద్ధమైన, ఆచరణ సాధ్యంకాని హామీలు గుప్పించి ఓటర్లను మాయచేసి అధికారంలోకి రావాలనే యావ తప్ప మరేమీ ఉండటం లేదు. ఈమధ్యే సుప్రీంకోర్టు ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించటానికి పార్టీలు చేసే వాగ్దానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తాయన్నది. అయితే రాజ్యాంగ ఉల్లంఘనలు లేనంత కాలమూ వాటిలో జోక్యం చేసుకోవటం సాధ్యం కాదని తెలిపింది. ఈ విషయంలో చట్టం చేయటం ప్రభుత్వాల బాధ్యతేనని తేల్చిచెప్పింది. నిజానికి అతిగా వాగ్దానాలు చేయటం ఎన్నికల రంగంలో ఉండాల్సిన సమానావకాశాలను దెబ్బతీయడం కిందికి వస్తుంది. అన్నా డీఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన మానిఫెస్టో గత రికార్డులను తలదన్నింది. అందులో 2.22 కోట్లమందికి ఉచితంగా రిఫ్రిజిరేటర్లు పంచడం, వ్యవసాయ రుణాల మాఫీ, అన్ని కుటుంబాలకూ ‘కారుణ్య భత్యం’ కింద రూ. 10,000 చొప్పున ఇవ్వటం, మహిళలతో పాటు మగవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం వగైరాలున్నాయి. అధికార డీఎంకే ఇప్పటికే రెండు దఫాలుగా 1.31 కోట్లమంది మహిళల ఖాతాల్లోకి రూ. 8,000 చొప్పున బదిలీ చేసింది. తిరిగి అధికారంలోకొచ్చాక నెలకు రూ.2000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.జన సంక్షేమాన్ని ఉద్దేశించి చేసే వాగ్దానాలకూ, సహేతుకత లేని ఉచితాలకూ వ్యత్యాసం ఉంటుంది. ఎన్నికల ముందు వాగ్దాన కర్ణులుగా మారడం, తీరా అధికారం రాగానే వాటిని మరిచి, ప్రశ్నించినవారిని బెదిరించటం అలవాటైపోయింది. ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్లో గత రెండేళ్లుగా బాహాటంగా కనబడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికల్లో ఇంటికొక కలర్ టీవీతో మొదలుపెట్టి చంద్రబాబు ఇచ్చిన హామీలకు లెక్కే లేదు. 2011లో డీఎంకే, అన్నాడీఎంకే పోటాపోటీగా చేసిన వాగ్దానాలు వేలంపాటల్ని తలపించాయి. ఇక 2014లో మరోసారి ఏపీలో చంద్రబాబు మహా వాగ్దాన కర్ణుడి అవతారం ఎత్తారు. ఆ హామీల గురించి అడిగేవారు ఎక్కువవుతుండటంతో అధికారంలోకొచ్చిన కొన్నాళ్లకే మేనిఫెస్టోను కాస్తా పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించారు. 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల గతి ఎలావుందో కనబడుతూనే ఉంది. ఇందుకుభిన్నంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ మానిఫెస్టో ఆచరణ సాధ్యమైన హామీలనే పొందుపరిచింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల అమలు సంగతి అందరికీ గుర్తుండేలా సెక్రటేరియట్లో ప్రముఖంగా కనబడేలా అమర్చారు. ఫలితంగా 99 శాతం హామీలు నెరవేరాయి. సంక్షేమ రాజ్యంలో పేదవర్గాలకు విద్య, వైద్యం, ఆహారం అందుబాటులో ఉండేలా చూడటం రాజ్యం కర్తవ్యం. అందుకే వాటిని నెరవేరుస్తామంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. వీటితోపాటు ఆ వర్గాలు స్వశక్తిపై ఎదిగేందుకు అనువైన పథకాల రూపకల్పన వైపు ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కానీ మానిఫెస్టోలంటే వేలం వెర్రిగా మారింది. కలర్ టీవీలు, గ్రైండర్లు ఇస్తామనటం నుంచి ఏకంగా రిఫ్రిజిరేటర్లు ఉచితంగా పంచిపెడ తామనే వరకూ వచ్చింది. గెలిచి అధికారంలోకొచ్చాక ఇవ్వలేకపోతే లేదా ఏవో సాకులు చూపి కొంతమందికే పరిమితం చేస్తే వీటిని న్యాయస్థానాలు ప్రశ్నించజాలవన్న ధైర్యమే పార్టీలకు ఇలాంటి బూటకపు వాగ్దానాలు చేసే సాహసాన్నిస్తోంది.పార్టీలు విడుదల చేసే మానిఫెస్టోలను నమ్మడం ‘న్యాయబద్ధమైన ఆశ’గా పరిగణించలేమనీ, కనుక వాటిని నెరవేర్చాలని ప్రభుత్వాలను ఆదేశించటం సాధ్యం కాదనీ 1995లో ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే 2013లో తమిళనాడుకు చెందిన పౌరుడు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ వాగ్దానాలు చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన పార్టీకి మానిఫెస్టో హామీలను అమలు చేయాలంటూ ఆదేశాలివ్వజాల మని తెలిపింది. అయితే ఈ విషయంలో కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. అటుతర్వాత అవి రూపొందినా రాజకీయ పక్షాలపై వాటి ప్రభావం శూన్యం. కనుక మోసగాళ్లెవరో, నిజాయితీపరులెవరో... ఎవరు జవాబుదారీ తనంతో ఉంటారో గ్రహించటం ప్రజల కర్తవ్యం. -
నిర్లక్ష్యం తెచ్చిన విషాదమిది!
రోడ్డు ప్రమాదాలను నివారిస్తామనీ, సురక్షిత ప్రయాణానికి అనువైన చర్యలు తీసుకుంటామనీ ప్రభుత్వం చెప్పే కబుర్లు ఉత్త గాలి మాటలేనని ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా రాయవరం గ్రామ సమీపంలో గురువారం వేకువజామున 5.40 ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాద ఘటన నిరూపించింది. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొనడంతో జరిగిన ఈ విషాదంలో 14 మంది చనిపోగా, మరో 20 మంది వరకూ గాయపడ్డారని చెబుతున్నారు. మరికొంతసేపట్లో గమ్యస్థానం చేరతామని ప్రయాణికులు అనుకుంటున్న తరుణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాల్లో తేలిపోతున్నట్టుగా పరుగులెత్తే ప్రైవేటు బస్సులను పాలకులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. ఆ వాహనాలకు ఫిట్నెస్ ఉందా? నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్న వ్యక్తికి అసలు లైసెన్సుందా? రహదారి నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అనే సంగతులులేవీ వారికి అక్కరలేదు. వాహనం సక్రమంగా లేదని బస్సెక్కినప్పటి నుంచి తాము చెబుతూనే వచ్చామనీ, చివరకు స్టీరింగ్ మొండికేయటంతో ప్రమాదం జరిగిందనీ ప్రయాణికులంటున్న మాట! ఇన్ని వందల కిలోమీటర్ల ప్రయాణంలో ఏ ఒక్క అధికారి బస్సును గమనించలేదని ఈ ఉదంతం నిరూపిస్తోంది.దాదాపు రెండేళ్లనుంచి హింస, దౌర్జన్యాలు, అక్రమ కేసులు మినహా ఏపీలో మరేదీ సక్రమంగా చేయడం రాని చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం ఎంతటిదో ఈ ప్రమాదం తేటతెల్లం చేసింది. ప్రమాదం జరిగాక ఏదోరకంగా బయటపడిన ప్రయాణికులు తేరు కోవటానికే కొంత సమయం పట్టింది. ఆ తర్వాత 108 వాహనానికి డజనుసార్లకు పైగా ఫోన్ చేస్తే గానీ ఎవరి నుంచీ స్పందన లేదు. వేకువజాము వేళకు ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి బస్సులు వేగంగా వస్తుంటాయి. ఆ సమయంలో భారీ వాహనాలు సైతం అదే రహదారిపై వెళ్లటం ప్రమాదాలకు దారి తీయదా? ముఖ్యంగా క్వారీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలుంటాయి. ప్రమాదాలకు ఆస్కారం ఉండే ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేయటం, వేగాన్ని నియంత్రించటం కోసం స్పీడ్గన్ల నిరంతర పర్యవేక్షణ అవసరం. ప్రమాదకరమైన మలుపులున్నచోట చాలా ముందుగానే హెచ్చరిక బోర్డులు అమర్చాలి. ఏవీ సక్రమంగా లేనప్పుడు ఇలాంటి ఉదంతాలను ప్రమాదాలుగా భావించ గలమా? క్వారీ వాహనాలు ట్రాఫిక్ అధికంగా ఉండే సమయంలో జాతీయ రహదార్లపైకి రాకుండా కట్టడి విధించే నిబంధనలున్నాయి. క్వారీలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ మాత్రమే పని చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. మరి అంత వేకువజామున భారీ లోడ్ వాహనం ఎలా వచ్చింది? అంటే రాత్రంతా అక్కడ మైనింగ్ కార్యకలాపాలు జరిగాయన్న మాట! స్థానికంగా జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధి కారులంతా ఉంటారు. కానీ ఏం లాభం? జిల్లాల పరిధి పెద్దగా ఉంటే పర్యవేక్షణ కష్ట మవుతుందని భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిన్న జిల్లాలు ఏర్పాటు చేసింది. అయినా ప్రజలకు దిక్కూ మొక్కూ లేని స్థితి ఉన్నదంటే చంద్రబాబు సిగ్గు పడాలి. రాష్ట్రంలో ఏ మూల ఏం జరుగుతున్నదో క్షణంలో తెలిసే టెక్నాలజీ వాడుతున్నా నని ఆయన స్వోత్కర్షలకు పోతుంటారు. కానీ ఈ లోటుపాట్ల విషయం మాత్రం ఆయనకు తెలియదు! వైద్యవిద్యలో పేదవర్గాల పిల్లలకు అవకాశాలు రావాలనీ, అదే సమయంలో ప్రజ లకు మెరుగైన, ప్రామాణికమైన వైద్య సదుపాయాలు అందాలనీ భావించి జగన్ ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన 17 మెడికల్ కళాశాలల్లో మార్కాపురం కాలేజీ కూడా ఒకటి. అందులో ఏడెనిమిది కాలేజీలు ప్రారంభం కాగా, తుది దశలో వున్న వాటిలో మార్కాపురం కాలేజీ కూడా ఉంది. ఈలోగా కూటమి సర్కారు వచ్చిపడి దాన్ని కాస్తా పక్కన పెట్టింది. పర్యవసానంగా జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు రాలేదు. అది అందుబాటులోకి వచ్చివుంటే బస్సు ప్రమాదం బారినపడిన వారిలో మరికొందరి ప్రాణాలు నిలబడేవి. తమ నిర్వాకంతో బాధిత కుటుంబాలకు చేసిన నష్టంతో పోలిస్తే, ప్రకటించిన పరిహారం రూ. 5 లక్షలు ఏ మూలకు? ప్రభుత్వ చేతగాని తనం, నిర్లక్ష్యం ఇంతమంది మరణానికి దారి తీశాయని బాబు ఇప్పటికైనా గుర్తిస్తారా? -
మహిళల కోటాపై కదలిక
వచ్చే నెలలో జనగణన తొలి దశ ప్రారంభం కాబోతుండగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, అందరూ చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలకు సంబంధించిన పనులు ప్రారంభం కావాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గది. ఈ రెండింటికీ 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారు. వాస్తవానికి 2023లో మహిళా కోటా బిల్లును ఆమోదించినప్పుడు ఆ మరుసటి సంవత్సరంలో జరిగే లోక్సభ ఎన్నికలకే దాన్ని వర్తింపజేయాలని విపక్షాలు కోరాయి. కానీ 2026 జనగణనకు ముందుగా ఇది సాధ్యంకాదని అప్పట్లో కేంద్రం చెప్పింది. నియోజకవర్గాల పునర్విభజనకూ దీన్నే కారణంగా చూపింది. ఈ హఠాత్ పునరా లోచనకు గల కారణమేమిటో కేంద్రం వివరించలేదు. అలాగే మహిళల కోటా నిర్ణయంలో ఎలాంటి విధానాన్ని అనుసరిస్తారన్నది కూడా చెప్పలేదు. వీటికి సంబంధించిన విధి విధానాలు పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. పునర్విభజన ప్రక్రియపై రాజకీయ పక్షాల మధ్య స్పర్థలున్నా మహిళల కోటా విషయంలో అన్ని పక్షాలూ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయి. అయినా ఆ చట్టం అమలు వాయిదా పడింది.కొన్ని అభివృద్ధి చెందిన దేశాలూ, మనకన్నా వెనకబడివున్న దేశాలూ కూడా మహిళలకు దశాబ్దాల క్రితమే చట్టసభల్లో కోటా ఇచ్చి గౌరవించాయి. రువాండాలో రాజ్యాంగం ప్రకారం 30 శాతం కాగా, ఆచరణలో దాదాపు 64 శాతం మంది మహిళలున్నారు. క్యూబాలో 55.7 శాతం, ఫ్రాన్స్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, బొలివియా, మెక్సికోల్లో 50 శాతంవరకూ రిజర్వేషన్లున్నాయి. నేపాల్లో 33 శాతం కోటా అమలవుతోంది. మన ఎంపీల్లో మహిళలు 14 శాతం మించిలేరు. ఈ గణాంకాలు గమనిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థమవుతుంది. ఈ ఏడాది జనగణన ప్రక్రియ మొదలైనా, తుది గణాంకాలకు ఏడాది పడుతుంది. స్వాతంత్య్రం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు కావస్తున్నా జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు కోటా దక్కలేదు. ఇంకా ఆలస్యం చేయొద్దనుకోవటం మంచి నిర్ణయమే. అయితే నియోజకవర్గాల పునర్విభజన వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల సంఖ్య నిర్ణయించటమే ఇందుకు కారణం. 2011 గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవటంవల్ల లోక్సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలూ 816కు ఎగబాకుతాయనీ, ఇందులో 273 స్థానాలు మహిళలకు లభిస్తాయనీ ఒక అంచనా. 2029 సార్వత్రిక ఎన్నికలకు దీన్ని వర్తింపజేస్తారు. తెలంగాణలో ఇప్పుడున్న 17 ఎంపీ స్థానాలు 26కు... 119 అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగు తాయంటున్నారు. ఏపీకి ఇప్పుడున్న 25 ఎంపీ స్థానాలు దాదాపు 38కి, ప్రస్తుత 175 అసెంబ్లీ స్థానాలు 263కి చేరుతాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిన మహిళలు చదువుల్లో, వృత్తి ఉద్యోగాల్లో ముందుండటం, కుటుంబ నియంత్రణ వంటి కారణాలవల్ల జనాభా పెరుగుదల రేటు తగ్గింది. ఉదాహరణకు 1951లో తమిళనాడు జనాభా బిహార్కన్నా కొంత ఎక్కువ కాగా... ఆరు దశాబ్దాల తర్వాత బిహార్ జనాభా తమిళనాడుకన్నా ఒకటిన్నర రెట్లు అధికం. జనాభా ప్రాతిపదిక కాక, రాష్ట్రాల్లోని స్థానాలపై కొంత శాతం అధికంగా సీట్లిచ్చే విధానం ఉండాలని తమిళనాడు సీఎం స్టాలిన్ సూచిస్తున్నారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాష్ట్రాలకు లోక్సభలో ప్రాతినిధ్యం ఉండాలన్న రాజ్యాంగ అధికరణానికి ఇది విరుద్ధం. దేశంలో ప్రతి ఒక్కరి ఓటు విలువా ఒకేవిధంగా ఉండాలన్నది దీని ఆంతర్యం. కానీ జనాభారీత్యా యూపీ ఓటరు ఓటుకుండే విలువకన్నా తమిళనాడు లేదా కేరళ ఓటరు విలువ ఎక్కువుంది. ఈ వ్యత్యాసం కొనసాగనీయటం సమర్థనీయ మేనా అన్న సందేహం తలెత్తుతుంది.ప్రతి జనగణన తర్వాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరగాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నా, ఇందులో ఇమిడివున్న సమస్యలను పసిగట్టి గత పాలకులందరూ వాయిదాల్లో గడిపారు. 2000 సంవత్సరం వరకూ స్తంభింపజేస్తూ 1976లో... దాన్ని 2026 వరకూ పొడిగిస్తూ 2001లో రాజ్యాంగ సవరణలు తెచ్చారు. మొత్తానికి ఈ భారం ప్రస్తుత పాలకులపై పడింది. ఎవరికీ అన్యాయం జరగకుండా, ఉత్తర–దక్షిణాల వ్యత్యాసం రాకుండా సమస్యను పరిష్కరించగలిగితే దేశ సమైక్యతకు అది దోహదపడుతుంది. -
సంక్షోభ సమయం
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగానే ఉండబోతున్నదనీ, అది దీర్ఘకాలం కొనసాగుతుందనీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సంకేతాలు సహజంగానే అందరినీ కలవరపెడతాయి. ఆయన సోమవారం లోక్సభలో, మంగళవారం రాజ్యసభలో చేసిన ప్రసంగాల్లో ఆరేళ్ల క్రితం కోవిడ్ రోజుల నాటి పరిస్థితులతో వర్తమాన స్థితిని పోల్చారంటే దేశం మున్ముందు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 23 రోజుల క్రితం ఇరాన్పై ప్రారంభించిన యుద్ధం ట్రంప్ తాత్కాలిక విరామం ప్రకటన తర్వాత ఆగిన సంకేతాలు కనబడినా, యుద్ధ విరమణ ఉండబోదన్న ఇజ్రాయెల్ తీరు చూస్తే అందరిలోనూ సందేహాలు కలుగుతున్నాయి. అంతేకాదు... అటు ఇరాన్ సైతం అమెరికాతో చర్చించలేదని చెబుతోంది. చివరకు అదేమవుతుందన్న సంగతలా ఉంచితే, ఇప్పటికే ప్రపంచంతోపాటు మనమూ సంక్షోభంలో చిక్కుకుపోయామని తెలుస్తూనే ఉంది. క్షణక్షణం మాట మార్చే ట్రంప్ను ఇరాన్తోపాటు ప్రపంచ ప్రజానీకం కూడా పెద్దగా విశ్వసించలేదుగానీ... స్టాక్ మార్కెట్లు మాత్రం నమ్మదల్చుకున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. మార్కెట్లన్నీ మంగళవారం ఉత్సాహంతో ఉరకలెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 10 శాతం పడిపోయాయి. కానీ ఈ ధోరణి దీర్ఘకాలం కొనసాగటం అనుమానమే. యుద్ధంపై కేంద్రం నుంచి వెలువడిన ఈ తొలి ప్రకటన సాధారణ జనంలో కొద్ది రోజులుగా ఉన్న భయాందోళనలు నిర్హేతుకం కాదని సూచిస్తోంది. ఆర్థిక, జాతీయ భద్రతా రంగాలతోపాటు మానవతారంగంలోనూ పెను సవాళ్లను ఎదుర్కొనబోతున్నామని ప్రధాని చెబుతున్నారు. మన ఆర్థిక ప్రగతికి ప్రధానంగా తోడ్పడే చమురు, సహజవాయువుల్లో సింహభాగం పశ్చిమాసియా నుంచే రావాలి. ఆ ప్రాంతం మామూలు స్థితికి చేరేదాకా ఆ రెండు దిగుమతులపైనా అనిశ్చితి కొనసాగుతుంది. గల్ఫ్ దేశాల్లో భిన్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్న కోటిమంది భారతీయుల్లో 3 లక్షల మంది ఇప్పటికే వెనక్కొచ్చారు. ఇరాన్ ప్రతిదాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. చమురు, గ్యాస్ ఎగుమతులు నిలిచిపోవటం వల్ల అవి గడ్డు పరిస్థితుల్లో పడ్డాయి. జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. తమ గ్యాస్ ఉత్పాదక క్షేత్రాన్ని చక్కదిద్దటానికి చాలా ఏళ్లు పట్టవచ్చని ఖతార్ అంటున్నది. కనుక గల్ఫ్లో ఉపాధి కల్పన మళ్లీ పట్టాలెక్కడం అంత సులభం కాదు. గల్ఫ్ సంక్షోభంతో రాబోయే ఖరీఫ్ సీజన్కు అవసరమైన స్థాయిలో ఎరువులు అందుతాయా అన్న సందేహాలున్నాయి. సాగుకు లోటురానీయబోమని మోదీ హామీ ఇవ్వడం అందుకే. ఆయన చెబుతున్న ప్రకారం కొన్ని శక్తులు ఈ సంక్షోభాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకునే ప్రయత్నం చేస్తాయి. అది ఆంతరంగిక భద్రతపై ప్రభావం చూపుతుంది. దేశం ఐక్యంగా ఉండి ఈ సంక్షోభాన్ని అధిగమించాలని ఆయన పిలుపునిచ్చారు. సాధారణ సమయాల్లో పెద్దగా చర్చకు రాని విదేశాంగ విధానం సంక్షోభ కాలంలో ముందుకొస్తుంది. మనది మోదీ వ్యక్తిగత విధానంగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. తమ కాలంలో ఎప్పుడూ ఇలా లేదని కూడా చెబుతున్నారు. కానీ నాటి ద్విధ్రువ ప్రపంచం ఏకధ్రువ ప్రపంచంగా మారింది. అప్పుడు అలీన విధానం అని చెప్పుకున్నామేగానీ సోవియెట్కు సన్నిహితంగా మెలిగాం. అప్పట్లో అమెరికాపై దూకుడు ప్రదర్శించటం అందులో భాగమే. నిజంగా తటస్థంగా ఉన్నట్టయితే హంగేరీ (1956), జెకొస్లోవేకియా(1968), అఫ్గాన్(1979)లపై సోవియెట్ దురాక్రమణకు దిగినప్పుడు ఖండించి ఉండేవాళ్లం. మారిన పరిస్థితుల్లో భిన్న దేశాలపై వేర్వేరు అంశాల్లో ఆధారపడి ఉన్నామన్నది కాదనలేని సత్యం. నిజానికి అన్ని దేశాల పరిస్థితీ అదే. చైనా, రష్యాలు ఇరాన్కు గట్టి మద్దతుదార్లుగా నిలిచినా ఆపత్సమయంలో అవి తటస్థంగానే ఉండిపోక తప్పలేదు. ఉక్రెయిన్కు అమెరికా సాయం చేయటాన్ని చూపి, కనీసం రష్యా ఇరాన్కు నిఘా సమాచారాన్ని ఇచ్చింది. పరిస్థితులు మున్ముందు మరింత సంక్లిష్టంగా మారినా మారొచ్చు. ఈలోగా మన రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే మెరుగైన విదేశాంగ విధానం రూపుదిద్దుకుంటే మంచిది. -
ట్రంప్కు జ్ఞానోదయం!
‘నీ గురించి నీకు తెలిసి, శత్రువు గురించి కూడా తెలిస్తే వంద యుద్ధాల్లోనైనా ఓటమి ఉండదు. నీ గురించి నీకు తెలిసినా, శత్రువు గురించి తెలియకపోతే మాత్రం ప్రతి విజయం తర్వాతా ఒక ఓటమి తప్పదు’ అంటాడు పురాతన చైనా యుద్ధరంగ నిపుణుడు సన్–జూ. శత్రువు గురించి తెలియటం సంగతలా ఉంచి తన గురించి తనకే తెలియని అయోమయంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు గెలుపు రమ్మంటే ఎలా వస్తుంది? ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ల మధ్య సాగుతున్న చర్చలు ఫలప్రదమయ్యే దశకు చేరాయని ఒమన్తో పాటు సాక్షాత్తూ అమెరికా ప్రతినిధి బృందం ప్రకటించిన కొన్ని గంటల్లోనే గత నెల 28న ఉన్నట్టుండి ఇరాన్పై యుద్ధ ప్రకటన చేసిన దుస్సాహసి ట్రంప్. తీరా ఇరాన్తో రెండురోజులుగా చర్చలు సాగుతున్నాయని, అందు వల్ల యుద్ధానికి అయిదు రోజుల విరామం ఇవ్వదల్చుకున్నామని సోమవారం ఆయన ప్రకటించారు. హార్మూజ్ దిగ్బంధాన్ని 48 గంటల్లో ముగించకపోతే ఇరాన్ మౌలిక సదుపాయ వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తామని శనివారం ప్రకటించిన ట్రంప్ ఇలా యూటర్న్ తీసుకోవటం ఆశ్చర్యకర పరిణామం.ఇరాన్ మతాచార్యుడు అలీ ఖమేనీని హతమార్చటంతో మొదలుపెట్టి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు గత 23 రోజులుగా నరమేధానికి పాల్పడ్డాయి. అన్నిటికన్నా అత్యంత ఘోరమైన ఉదంతం– పసిపిల్లలు చదువుకుంటున్న బడిపై క్షిపణి దాడి చేసి 170 మంది ప్రాణాలు తీయడం. ఇక్కడితో ఆగలేదు. ఆ రెండు దేశాలూ క్షిపణులతో పెనువిధ్వంసాన్ని సృష్టించాయి. కొన్ని లక్షల జనావాసాలు ధ్వంసం చేశాయి. ఇరాన్ త్వరలోనే దాసోహం అంటుందని యుద్ధభేరి మోగించే ముందు అవి అంచనా వేసుకున్నాయి. అసలు ఇరాన్ అమ్ములపొదిలో ఆయుధాలేమిటన్న విషయంలోనే వాటికి స్పష్టత లేదు. అది అణ్వాయుధాల తయారీ దిశగా ముందుకెళ్తున్నదని చెప్పిన కారణం బూటకం. అదే నిజమైతే, అసలు దాని జోలికెళ్లడానికే వణికేవారు. ఉత్తర కొరియాను ఏం చేయగలుగుతున్నారు? అసలు ఇరాన్ దగ్గర 4,000 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులున్నాయన్న సంగతి అది గురిచూసి కొట్టేదాకా తెలియదు. పశ్చిమాసియా కొరివితో తలగోక్కోవటం ట్రంప్తోనే మొదలు కాలేదు. ఇరాన్లో 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మహమ్మద్ మొసాదిఘా ప్రభుత్వాన్ని బ్రిటన్తో కుట్రపన్ని పడగొట్టిన ఘనుడు నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్హోవర్. ఆ దురంతం తర్వాత ఇరాన్ ప్రజలతో అమెరికాకు సత్సంబంధాలు లేవు. మొసదిఘా స్థానంలో వచ్చిన మహమ్మద్ రెజా షా పహ్లావి 25 ఏళ్ల పాటు ఇరాన్ సంపద దోచిపెట్టగా 1979లో ఆ నియంతను జనం తరిమికొట్టారు. నాటి అమెరికా అధినేత జిమ్మి కార్టర్ తమవారిని చెర నుంచి విడిపించటానికి చేసిన యత్నం బెడిసికొట్టింది. ఇక ఇరాక్లో 2003లో జార్జి బుష్... 2011లో లిబియా, సిరియాల్లో ఒబామా తలలు బొప్పికట్టించుకున్నారు. పశ్చిమాసియాలో ఏకైక పెత్తందారుగా ఆవిర్భవించాలన్న ఇజ్రాయెల్ కల చాలా పాతది. గత అధ్యక్షులంతా దీన్ని తోసిపుచ్చగా తొలిసారి ట్రంప్ తన సలహాదారుల మాటనూ, నిఘా వర్గాల హెచ్చరికలనూ బేఖాతరుచేసి ఈ దుస్సాహసానికి దిగారు. పర్యవసానంగా అమెరికా కల్పిస్తామంటున్న భద్రత ఉత్త డొల్ల అని గల్ఫ్ దేశాలు గ్రహించాయి. చరిత్రలో ట్రంప్కు సాటిరాగల ఒకే ఒకడు నెపోలియన్ బోనపార్టే. యూరొప్ను జయించి, రష్యాను సైతం దురాక్రమించాలని 1812లో వెళ్లిన నెపోలియన్ అక్కడి భౌగోళిక స్థితిగతులపై అంచనా లేక ఏకంగా 6 లక్షలమంది సైన్యాన్ని కోల్పోయాడు. అతడి పతనానికి అదే నాంది. ఇంతకూ తాజా ప్రకటనకైనా ట్రంప్ కట్టుబడతారా లేదా అన్నది చెప్పలేం. ఇరాన్ మాత్రం ససేమిరా అంటున్నది. అక్కడ నాయకత్వాన్ని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తుడిచి పెట్టడంవల్ల ఈ దుఃస్థితి ఏర్పడింది. అయినా ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని ఒక మెట్టు దిగడానికి ఇరాన్ సిద్ధపడాలి. ఆ దిశగా మధ్యవర్తులు ప్రయత్నించాలి. అటు ట్రంప్ భేషజాలు కట్టిపెట్టాలి. ఇరాన్ దాడుల్లో నష్టపోయిన గల్ఫ్ దేశాలకు నష్టపరిహారం చెల్లించటంతో పాటు, ఇరాన్కు కలిగిన నష్టాన్ని కూడా భర్తీ చేస్తేనే ఆ దేశాన్ని ఒప్పించటం సాధ్యమని గ్రహించాలి. ఇప్పటికైనా ఆయన తెలివి తెచ్చుకోవాలి. -
రక్త బేహారులు
బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో రక్తం నల్లరంగులో ఉండేది. హీరోకో, హీరోయిన్కో నుదుటిన దెబ్బ తిగిలి రక్తం కారితే ‘కెవ్వు’మని కేక వేసి కళ్లు తిరిగి పడిపోయే పాత్ర ఒక్కటైనా ఉండేది. పాత సినిమాల ఫైటింగులన్నీ రక్తం కానరాని తుపాకీ మోతలే. ఢామ్మంటే ఒకడు పడేవాడు. ఢమామంటే మరొకడు. కత్తి యుద్ధాలన్నీ చుక్క నెత్తురు కారని కమ్మని కాలక్షేపాలే. కలర్ సినిమాలు వచ్చాక రక్తం రంగు తెర మీద ఎర్రగా కనిపించడం మొదలయ్యింది. అది కూడా ఆస్పత్రిలో బెడ్ పక్కన సీసాలో వేళ్లాడుతూ. హీరో తల్లికో, హీరోయిన్ తండ్రికో రక్తం కావాల్సి వస్తే ప్రేక్షకులు అప్పుడు రక్తం చూసేవారు. చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకు పెద్దయ్యి తానెవరో తెలియకనే తల్లికి రక్తం ఇవ్వడమనే సన్నివేశం మన సినిమాకు మాత్రమే సాధ్యమైన ఫార్ములా ఎమోషన్. దీనిని దర్శకుడు మన్మోహన్ దేశాయ్ సైన్స్కు అతీతంగా ఎత్తులకు చేర్చాడు. ‘అమర్ అక్బర్ ఆంథోని’లో హాస్పిటల్లో ఉన్న తల్లికి ఆమె తప్పిపోయిన ముగ్గురు కుమారులు ఒకేసారి రక్తం ఇస్తారు మూడు విడివిడి ట్యూబుల నుంచి. ఎమోషన్ పండి గల్లాపెట్టె నిండింది. ఇలాంటి అతి తార్కిక దర్శకుల మధ్యే, రక్తం అమ్మి రూమ్రెంట్ కట్టక తప్పని 1980ల నిరుద్యోలను చూపిన వేజెళ్ల సత్యనారాయణ వంటి గతితార్కిక దర్శకులు కూడా ఉండేవారు.మన సినిమాల్లో చాలా రోజులకుగానీ రక్తం పౌరుషానికి గుర్తుగా మారలేదు. హీరో చాలాసేపు మామాలుగా ఫైట్ చేశాక ఒక దెబ్బ పడి అతని పెదవి చిట్లుతుంది. అప్పుడు హీరో పాజ్ ఇచ్చి చిట్లిన పెదవి నుంచి కారే రక్తాన్ని చూపుడు వేలితో చూసుకుంటాడు. అలా చూశాడంటే హీరో చెలరేగిపోతాడని ప్రేక్షకులు ఈలల మోత మోగించేసేవారు. ఈ ధోరణి సాగుతుండగానే రక్తం సత్తా ఏమిటో ‘ప్రేమ్నగర్’లో వాణిశ్రీ చాలా గట్టిగా తెలుగు ప్రేక్షకులకు చెప్పారు. తాగుడుకు బానిసైన అక్కినేని ఎదుట, తన నుదుటి నుంచి కారిన రక్తాన్ని గ్లాసులో పట్టి, పెట్టి ‘ఊ.. తాగండి’ అంటే అక్కినేనికే కాదు ప్రేక్షకులకూ జుగుప్స కలుగుతుంది. అవును... రక్తమంటే జుగుప్స. భీతి. బీభత్సం. ఏవగింపు. రోత. ఏహ్యత. అసహ్యం.ఎన్ని మాటలనుకున్నా మన కమర్షియిల్ దర్శకులు మెచ్చదగినవారు. ఉత్తుత్తి ఫైటింగులన్నీ ఉత్తుత్తివే అన్నట్టు చూపేవారు. హీరోలు కెమెరా ముందు నిలబడి కెమెరాపై ముష్టిఘాతాలు విసిరి సరిపెట్టుకునేవారు. అయితే నిజంగా రక్తం వచ్చేలా ఒక హత్య చేస్తే ఎలా ఉంటుందో మొదటిసారి రామ్గోపాల్ వర్మ తెర మీద ఉలికిపాటుతో చూపించారు. ‘శివ’ సినిమాలో రక్తం పైకి కనిపించకపోయినా కథలో, ప్రేక్షకుడి మానసిక ఆవరణలో అంతటా వ్యాపించి ఉంటుంది. రక్తంతో చెలగాటం ప్రాణాంతకం అని ఈ సినిమా చూసిన తెలివైనవారు గ్రహిస్తారు.అయితే దేశమంతా ఏ భాషకు ఆ భాష ఉన్నా అందరికీ అర్థమయ్యే భాష ‘రక్తభాష’ అని దర్శకులు మెల్లగా కనిపెట్టారు. సినిమాను పాన్ ఇండియా చేస్తూ హీరోకొక ఆయుధం చేతికిచ్చారు. ఒక సినిమా ముగిసేలోపు కనీసం వంద మందిని ఊచకోత కోయకపోతే అతను హీరో కాదు ఆ సినిమా పాన్ సుపారీ కాదు అని బాక్సాఫీసు సాక్షిగా తేల్చారు. ప్రతి సినిమా విడుదల సమయంలో హీరో చేతికి ఉన్న సరికొత్త ఆయుధాన్ని చూస్తే ప్రేక్షకులకు ఉద్రేకం వచ్చి బుక్ మై షో వైపు వేళ్ల కదలికలు సాగుతున్నాయి. నెత్తురు అలవాటు చేశారు. నెత్తురు చూడటం అలవాటుగా మారింది. నెత్తురును చూస్తే భీతి, ఏహ్యత, అసహ్యం కలగడంలేదు. నెత్తురు ఇప్పుడు ప్రేక్షకుడి పాలిట డోపమైన్.యుద్ధంలో చిట్టచివరి నైచ్యం స్త్రీలను, పిల్లలను, రోగులను చంపడం. యుద్ధం వస్తే ఇప్పుడు మొదట వాళ్లనే చంపడాన్ని ‘నార్మలైజ్’ చేశారు. అత్యంత దారుణాలన్నీ ‘సాధారణ విషయాలు’గా మార్చే కొద్దీ, మారే కొద్దీ ఏమవుతుంది? ప్రతిస్పందన మాయమవుతుంది. నిరసన, ప్రతిఘటన, తిరుగుబాటు... అన్నీ మనకెందుకులే అని మంచినీరు తాగి పడుకుంటాయి. మనిషిలోని మృగ నిష్పత్తి పెరుగుతుంది. తెర మీద ఎంత రక్తం కనపడితే అంత హిట్ చేస్తున్న యువత ఏ వెలుతురుకు పురోగమిస్తుందో ఎవరైనా ఆలోచిస్తున్నారా? పిల్లల వేలు తెగితే తల్లడిల్లే తల్లిదండ్రులు తెర మీద డ్రమ్ముల కొద్దీ నెత్తురు చూస్తున్న పిల్లల గూర్చి ఏమనుకుంటున్నారో! ఇలాంటివి తీస్తున్న దర్శకుల ఇంటి ముందు రోజూ లోటాడు నెత్తురక్కర్లేదు ఎర్రరంగు ప్రత్యక్షమైతే రంజుగా ఉంటుందంటారా? రక్తం ప్రచండ శక్తి. అందుకే ప్రకృతి దానిని ఒంట్లో దాచి ఉంచింది. అట్లాగే ఉండనివ్వండి. -
అజేయం... ఆ వ్యక్తిత్వం!
సీనియర్ పాత్రికేయులు మోతడక సుధాకర్ శనివారం నాడు ఫోన్ చేసి ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అన్న మీద షర్మిల చెరిగిన అవాకులు, విజయమ్మ లేఖ నేపథ్యంలో ఆయనీ సంగతిని పంచుకున్నారు. ఆయన రెండు దశాబ్దాలకు పైగాకాంగ్రెస్ వ్యవహారాలు కవర్ చేసిన సీనియర్ రిపోర్టర్. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకు మర్యాదపూర్వకంగా ఆయన్ను కలవడానికి మరో సీనియర్ పాత్రికేయుడు, దివంగతులైన కృష్ణారావుతో కలిసి వెళ్లారట!మాటల సందర్భంలో జగన్ ప్రస్తావన వచ్చిందట! జగన్ చాలా చిన్న వయసులోనే విజయవంతమైన వ్యాపార వేత్తగా రాణిస్తున్నారనీ, తనకు అండగా నిలబడ్డారనీ వైఎస్సార్ చాలా గర్వంగా వారితో చెప్పారట! కొడుకు ప్రయోజకత్వంపట్ల ఆ తండ్రి కనబరిచిన పుత్రోత్సాహాన్ని తాము అప్పట్లోనే పలువురు మిత్రులతో పంచుకున్నామని సుధాకర్ చెప్పారు.వైఎస్సార్ 1999లో పీసీసీ అధ్యక్షునిగా ఉండి శాసనసభ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటికి జగన్ వయసు 27 సంవత్సరాలు కూడా నిండలేదు. అంతకుముందు పదేళ్లపాటు వైఎస్సార్ ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో తన సహచరుడు, మిత్రుడైన రాజంపేట ఎంపీ సాయిప్రతాప్తో మాట్లాడుతూ ‘నా కొడుకు వ్యాపార రంగంలో యోగ్యుడయ్యాడు, ఆర్థికంగా ఇబ్బందిపడే పరిస్థితి ఉండ’దని అన్నారట! ఈ సంగతిని స్వయంగా ఏబీఎన్ రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిప్రతాప్ వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అందుబాటులోనే ఉన్నది. జగన్ మోహన్రెడ్డి చిన్న వయసులోనే సమర్థుడైన వ్యాపారవేత్తగాతన కాళ్లపై తాను నిలబడటమే కాకుండా తండ్రికి కూడాఅండగా నిలబడ్డాడనేందుకు ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.చంద్రబాబు చాలాకాలంగా నిర్వహిస్తున్న జగన్ వ్యక్తిత్వ హనన హవనంలో తాజాగా షర్మిల మరో సమిథను విసరడం, దరిమిలా విడుదలైన విజయమ్మ లేఖ, అది రాజేసిన ఆస్తుల రచ్చ నేపథ్యంలో ఈ పూర్వరంగాన్ని గమనంలో ఉంచుకుంటే మరింత స్పష్టత వస్తుంది. ఆస్తుల పంపకం పూర్తికాలేదంటూ విజయమ్మ లేఖలో పేర్కొనడంపై ఆ కుటుంబ వ్యవహారాలు తెలిసినవారు అవాక్కయ్యారు. శత్రువు చేతిలో పావులా మారి అన్న మీద షర్మిల విషం కక్కుతున్నదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. ‘అటువంటి పావుకోసం కన్న కొడుకు మీదే అభాండాలు వేస్తావా తల్లీ’ అని విజయమ్మను ఆయన ప్రశ్నించారు. 2009లో వైఎస్సార్ జీవించి ఉండగానే షర్మిలకు పంచి రిజిస్టర్ చేసిన ఆస్తుల చిట్టాను రాచమల్లు చదివి వినిపించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్2 లోని ఇల్లు, ఇడుపులపాయ ఎస్టేట్లో 51 ఎకరాలు సహా తొమ్మిది ఆస్తుల జాబితాను ఆయన చదివారు. షర్మిల పేరు మీద ఈ ఆస్తులన్నీ రిజిస్టర్ అయ్యాయన్న విషయాన్ని అంగీ కరిస్తూనే, పంపకాలు పూర్తికాలేదన్న విజయమ్మ లేఖలోని డొల్లతనాన్ని ఆయన ఎండగట్టారు.షర్మిలకు పంచినట్టే జగన్కు కూడా కొన్ని ఆస్తులను వైఎస్సార్ పంచి ఇచ్చారనీ, జగన్ సొంతగా సంపాదించుకున్న ఆస్తులను అవి జగన్ ఆస్తులుగానే వైఎస్ పరిగణించినందువల్లనే వాటిలో వాటాలను కూడా షర్మిలకు పెట్టలేదనీ రాచమల్లు వివరించారు. అయినా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లెలి మీద ప్రేమతో సొంత ఆస్తి సరస్వతీ పవర్లో తల్లి పేరుపై పెట్టుకున్న 51 శాతం షేర్లు భవిష్యత్తులో షర్మిలకు చెందేలా (ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కారణంగా) ఎమ్ఓయు రాసిచ్చారని గుర్తుచేశారు. జగన్ మీద కాంగ్రెస్ – టీడీపీలు జాయింటుగా బనాయించిన తప్పుడు కేసుల ఫలితంగా సరస్వతీ పవర్ సహా జగన్ ఆస్తులన్నీ ఈడీ అటాచ్మెంట్లోకి వెళ్లాయి. ఈ ఆస్తులను అమ్మినా, షేర్లు బదలాయించినా జగన్ బెయిల్ రద్దవుతుంది. ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ సంగతి తెలిసినా తల్లి పేరుతో ఉన్న షేర్లను బదలాయించేందుకు షర్మిల వెనుకాడలేదు. ఒరిజినల్ సర్టిఫి కెట్లు జగన్ వద్దనే ఉన్నా తప్పుడు అఫిడవిట్ సమర్పించి మరీ షేర్లను బదలాయించారంటే షర్మిల ఉద్దేశమేమిటో స్పష్టంగా తెలుస్తున్నదని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.ఈ కుట్రపూరిత వ్యవహారం తెలిసిన వెంటనే అనివార్య పరిస్థితుల్లో జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించవలసి వచ్చింది. దీని మీద యెల్లో మీడియా, కూటమి పార్టీలు నానా రాద్ధాంతం చేశాయి. తల్లి మీద, చెల్లి మీద జగన్ కోర్టుకెక్కారని విషప్రచారం చేశాయి. జగన్ను మరోమారు జైలుకు పంపాలన్న కుట్ర విఫలమైనందుకు వారి ఏడుపును ఆర్థం చేసుకోవచ్చు. మరి చెల్లెలికేమైంది? తెలిసి తెలిసి ఈ కుట్రలో ఎందుకు భాగస్వా మయ్యారు? బాబాయి హత్యను కూడా అన్న మెడకు చుట్టాలని చూస్తున్న శత్రువు ప్రయత్నాలకు తందానా అనే చెల్లెళ్లు ఏం చేసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదేమో!షర్మిలకు వివిధ సందర్భాల్లో జగన్ స్వార్జితంలోంచి 230 కోట్ల రూపాయలు ఇచ్చారని రాచమల్లు చెప్పారు. ఆమె ఎన్నికల అఫిడవిట్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినట్టున్నారు. ఆమె తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఖర్చులకు ఈ నిధులను ఉపయోగించారేమో తెలియదు కానీ, ఇప్పుడు ఒక అనుమానం బలంగా కలుగుతున్నది. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టాలన్నది ఆమె స్వతంత్ర నిర్ణయం కాదేమో! అప్పటికే ఆమె చంద్రబాబు ప్రభావంలోకి వెళ్లి ఉండాలి. తెలంగాణలో కొంతకాలం ప్రాక్టీస్ చేయించి, తనకు గిట్టని కేసీఆర్నునానా తిట్లు తిట్టించి, ఆ తర్వాత ఇచ్చిన హామీ మేరకు ఆంధ్ర కాంగ్రెస్ నాయత్వాన్ని చంద్రబాబు ఆమెకు కట్టబెట్టించిఉండవచ్చు. తెలంగాణ, ఆంధ్ర కాంగ్రెస్ ఫ్రాంచైజీలు చంద్ర బాబు చేతిలోనే ఉన్నాయనేది విశ్వసనీయ సమాచారం. ఆయన కనుసన్నల్లోనే ఈ రెండు రాష్ట్రాల పార్టీ యూనిట్లు పని చేస్తున్నా యని కొందరు కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారు.జగన్ బలం ఆయన క్యారెక్టర్. ఆ బలాన్ని బలహీన పరచకుండా ఆయన్ని ఎదుర్కోవడం కష్టం. కుటుంబ విలువలను పాటించడంలో గానీ, ఆడిన మాటపై నిలబడటంలో గానీ, మానవీయ విలువల్లో గానీ, బడుగు జన పక్షపాతంలో గానీ, ఔదార్యంలో గానీ, దాతృత్వంలో గానీ, విలువలు – విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు నడపడంలో గానీ జగన్కు సాటిరాగల నాయకుడు సమకాలీన రాజకీయరంగంలో ఎవ్వరూ లేరు. జగన్ను సన్నిహితంగా చూసిన వాళ్లెవరైనా చెప్పే మాట ఇదే! ఇందులో రెండో అభిప్రాయానికి తావే లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ నెలలోనే పదిహేనేళ్లు నిండాయి. పార్టీ స్థాపించవలసి రావడానికి దారితీసిన పరిస్థితులేమిటి? ఆ ఘడియల్లో ఆవిష్కృతమైన సన్నివేశాలు ఎటువంటివి? ఎంత ఉద్వేగం... ఎంత ఉత్తేజం ఉరకలెత్తిందో! ఎన్ని లక్షల హృదయ స్పందనలు వినిపించాయో! ఎన్ని దోసిళ్ల కన్నీళ్లు ఆ క్షణాలను అభిషేకించాయో!ముప్ఫయ్యేడేళ్లు ఇంకా నిండని యువకుడు, మేరు నగధీరుడైన తండ్రి హఠాన్మరణంతో తల్లడిల్లిపోయాడు. ఈ మేరుపర్వతం ఇక లేదని తెలిసిన వందలాదిమంది గుండెపగిలి చనిపోయారు. ఈ పరిణామం జగన్ను మరింత శోకమూర్తిని చేసింది. అతని హృదయం ద్రవించింది. ఆ చనిపోయిన వాళ్లంతా తన ఆత్మబంధువులని ప్రకటించు కున్నాడు. వారి కుటుంబాల వద్దకు వెళ్లి వారి బాధను పంచుకుంటానని ప్రతిన బూనాడు. ఓదార్పు యాత్రను ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అడ్డుచెప్పింది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశమివ్వాలని కుటుంబంతో సహా వెళ్లి అధినేత్రిని ఆ యువకుడు అభ్యర్థించాడు. ఆమె ససేమిరా అన్నది. అప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీకి ఆమె తిరుగులేని నాయకురాలు. ఆ సమయంలో ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరైన అధినేత్రి ఆజ్ఞను ఆమె పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనాఉల్లంఘించగలడా? ఉల్లంఘించి నిలబడగలడా? ఒక్క జగన్ మోహన్రెడ్డి తప్ప!ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్రెడ్డికి ఈ బలం. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న విశ్వసనీయతలోంచి! తమకోసం దుఃఖిస్తున్న బాధితుల కన్నీళ్లు స్వయంగా తుడవడం బాధ్యతని భావించే విలువల్లోంచి! విలువలు – విశ్వసనీయత పునాదిగా ఏర్పడిన ఆ సంకల్పం ఆ క్షణాల్లోనే వెయ్యేనుగుల బలాన్ని సంతరించుకున్నది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా నిలబడితే ఐదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో రికార్డులు బద్దలు చేసిన ఆ శబ్దం దేశమంతటా ప్రతిధ్వనించింది. సొంత పార్టీ స్థాపిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరికలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే అప్పుడో ఇప్పుడో ముఖ్యమంత్రిని చేస్తామనే బుజ్జగింపులు వినిపించాయి. బెదిరింపులూ, బుజ్జగింపులూ ముఖ్యం కాదు. ఇచ్చిన మాటను నిల బెట్టుకోవడమే ముఖ్యమనే సంకల్పంతోముందడుగు వేశాడు. ఆ సంకల్పానికి ఉన్న బలం వల్ల కొన్ని వేల జతల కాళ్లు ఆయన్ను అనుసరించాయి. కొన్ని వేళ గళాలు ఆయన గొంతుకతో శ్రుతి కలిపాయి. ఈ పదిహేనేళ్ల ప్రస్థానం గురించి తెలిసిందే! మొదటి ఎన్నికల్లోనే ఒంటరిగా తలపడిన నాయకుడు జగన్మోహన్రెడ్డి. తలపండిన చంద్రబాబు మోదీతో, పవన్ కల్యాణ్తో చేతులు కలిపి వచ్చినా ఎదిరించిన వ్యక్తి జగన్. చంద్రబాబు చేసిన అలవికాని హామీలకు పోటీగా నెరవేర్చలేని హామీలు ఇవ్వలేననీ, అంతకన్నా ఓడిపోవడానికైనా సిద్ధమేననీ ప్రకటించిన నాయకుడు సమకాలీన భారత రాజకీయ చరిత్రలో ఇంకెవరైనా ఉన్నారా? ఒక్క జగన్మోహన్రెడ్డి తప్ప? గద్దెనెక్కగానే ఎన్నికల హామీలను బుట్టదాఖలు చేసే రోజుల్లో మేనిఫెస్టోకు పట్టాభిషేకం చేసి, అనునిత్యం దానిలో ఎన్ని హామీలు అమలు చేశామో, ఎన్ని మిగిలి ఉన్నాయోనని లెక్కలు వేసుకున్న పాలకుడిని ఇంకెవరినైనా చూశామా? ఒక్క జగన్మోహన్రెడ్డిని తప్ప. మహిళల సాధికారతకోసం తపించి, ఎక్కడా లేని పథకాలు ప్రవేశపెట్టి, వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంలో జగన్ కంటే మిన్నగా నిలబడిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా? కష్టజీవుల బిడ్డలు కూడా కోటీశ్వరుల పిల్లలతో సమానమైన చదువులు చదవాలని తపించి సీబీఎస్ఈ, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ ఎడ్యుకేషన్, బడుల ఆధునీకరణ వంటి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వాధినేతను ఇంకెవరినైనా చూశామా? ఒక్క జగన్మోహన్రెడ్డిని తప్ప! బీదా–బిక్కీ ఇళ్లకు కూడా ఫ్యామిలీ డాక్టర్ ఉండాలని కలలుకని ప్రణాళికను రచించిన ముఖ్యమంత్రిని మరొకరెవరినైనా చూశామా, జగన్మోహన్రెడ్డిని తప్ప! ఇదీ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ వ్యక్తిత్వం ఒక శత్రు దుర్భేద్యమైన కవచం. ఆ కవచాన్ని ఛేదించడానికి పదిహేనేళ్లుగా టీడీపీ కూటమి కుట్రలు చేస్తూనే ఉన్నది. కష్టాల కొలిమిలో కాలమే సానబట్టిన ఖడ్గం జగన్. అధర్మ యుద్ధాలతో ఎల్లకాలం దాన్ని ఓడించలేరు. అగ్ని సరస్సున వికసించిన వజ్రపు కాంతిని పిడికిట్లో ఎంతోకాలం దాచి ఉంచలేరు. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ప్రమాదకర పోకడలు
అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ల మధ్య సాగుతున్న యుద్ధంలో రోజూ వందల సంఖ్యలో అమాయక పౌరులు మరణిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రపంచ దేశాధినేతలు పశ్చిమాసియాలో గత రెండు రోజుల పరిణామాలతో మేల్కొన్నట్టు కనబడుతోంది. చమురు, సహజవాయు క్షేత్రాలపై పరస్పరం చేసుకుంటున్న దాడుల్లో అయిదు దేశాల్లోని ఆరు క్షేత్రాలు తీవ్రంగా దెబ్బతినటమే అందుకు కారణం. దక్షిణ ఇరాన్లోని సహజ వాయు క్షేత్రం పార్స్ను ఇజ్రాయెల్ గురిచూసి కొట్టిన వెంటనే ప్రపంచంలోనే అతి పెద్ద ఖతార్ సహజవాయు క్షేత్రం రస్ లఫాన్పైనా, దాంతోపాటు సౌదీ అరేబియా, కువైట్, ఇజ్రాయెల్ చమురుశుద్ధి కర్మాగారాలపైనా ఇరాన్ దాడులకు దిగింది. ఈ దాడుల వల్ల ఒక్క ఖతార్ సహజవాయు క్షేత్రం రస్ లఫాన్లోని 17 శాతం నిక్షేపాలు ఆవిరయ్యాయి. యుద్ధం పరిసమాప్తమయ్యేవరకూ దాన్ని చక్కదిద్దటం అసాధ్యం. ఆ పనులకు దాదాపు అయిదేళ్లు పడుతుందంటున్నారు. అంటే అయిదేళ్ల ఖతార్ ఆదాయం 10,000 కోట్ల డాలర్లు మాయమైనట్టు! దీనివల్ల మన దేశంతో సహా ఆసియా, యూరప్ దేశాలు తీవ్రసంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 116 డాలర్లను దాటింది. అది 130కి చేరిందంటే అమెరికాతోపాటు అందరికీ కష్టాలు మొదలవుతాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో నవ్వులపాలవుతున్నారు. ఇరాన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ ఇక దాడి చేయబోదని ఆ దేశం తరఫున ఆయన హామీ ఇచ్చారు. మరికొన్ని గంటలకే హార్మూజ్ దిగ్బంధాన్ని ఛేదించేందుకు ఇరాన్కు చెందిన ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకునే పథక రచన సాగిస్తున్నట్టు లీకులిచ్చారు. అసలు ఇజ్రాయెల్ తన ఆదేశం పాటిస్తుందని నిజంగా ట్రంప్ భావిస్తున్నారా? అది ఎప్పుడో ఆ స్థితిని దాటిపోయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ శక్తిమంతమైన సేవకుడిగా మారితే, అమెరికా బలహీనమైన యజమానిగా మిగిలిపోయింది. పశ్చిమాసియాలో ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ ఆవిర్భవించటానికి వీలుగా చుట్టూవున్న ముస్లిం దేశాల్ని పాదాక్రాంతం చేసుకోవాలని 1996లోనే ఇజ్రాయెల్ పథక రచన చేసింది. గత అమెరికా అధినేతల దగ్గర దాని ఎత్తులు పారలేదు. తెలిసీ తెలియని ట్రంప్ ఆ కొరతను తీర్చారు. తమకు క్షిపణులకు కొరతేమీ లేదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనిపై ఇజ్రాయెల్ దాడిచేసి హతమార్చింది. ఇలాంటి చర్యలు యుద్ధ విరమణను జటిలం చేస్తాయి తప్ప సాధించేదేమీ ఉండదు. యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన దశలో కూడా ఆ రెండు దేశాలూ అతిగా అంచనా వేసుకుంటూ, ఇరాన్పై తప్పుడు లెక్కలు కడుతున్నాయి. చట్టవిరుద్ధ మైన ఈ యుద్ధానికి మరో 20,000 కోట్ల డాలర్లు కావాలంటూ అమెరికన్ కాంగ్రెస్ను పెంటగాన్ అభ్యర్థించింది. ఇప్పటికే అమెరికన్ కుబేరులకు కోట్లాది డాలర్ల పన్ను రాయితీలిచ్చిన ప్రభుత్వం, సాధారణ ప్రజానీకానికి అందే అరకొర సదుపాయాలకు సైతం కోత పెడితే తప్ప ఈ నిధులు సమకూర్చుకోలేదు. ఈ అకారణ యుద్ధానికి ఇన్ని వేల కోట్లు దుర్వినియోగం చేయటం అవసరమా?వీటి సంగతలా ఉంచి అత్యంత అమానవీయ పద్ధతుల్లో కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ప్రాణాలు తీస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దుశ్చర్యల పర్యవసానాలేమిటో కనబడుతూనే ఉన్నాయి. ఓపెన్ ఏఐ, పాలంటీర్ కలిసి ఆంత్రోపిక్ రూపొందించిన క్లాడ్ ఆసరాతో మారణహోమానికి తోడ్పడుతున్నాయి. పదేళ్లుగా పాఠశాల నడుస్తున్న ఒక ఆవరణను ఏఐ ఇరాన్ సైనిక స్థావరంగా అర్థం చేసుకుని చూపితే, దాని ఆధారంగా అమెరికా క్షిపణి దాడికి పాల్పడి ఒకేసారి 170 మంది బాలబాలికల ప్రాణాలు తీసింది. సైనిక దాడులకోసం తమ సాఫ్ట్వేర్ ఇచ్చేది లేదని ట్రంప్కు చెప్పిన ఆంత్రోపిక్ అయినా, ఆ కాంట్రాక్టును చేజిక్కించుకుని లాభపడిన ఓపెన్ ఏఐ అయినా సారాంశంలో ఈ ప్రాణాంతక దాడులకు వ్యతిరేకం కాదు. ఆంత్రోపిక్ అభ్యంతరమల్లా ఆ సాఫ్ట్వేర్మరింత పదునుదేరాలన్నదే. ఆ తర్వాతే అందుబాటులోకి తీసుకురావాలని దానిఉద్దేశం. ప్రపంచ మనుగడ ఎంత ప్రమాదకరంగా మారిందో దీన్నిబట్టే గ్రహించవచ్చు. -
హక్కుల హరణం అన్యాయం
సమస్య ఉందని గుర్తించటం, దానికి పరిష్కారం అన్వేషించటం ఒక ఎత్తయితే అందుకు సంబంధించి చట్టం తీసుకురావటం మరో పెద్ద పని. మన దేశంలో చాలా సందర్భాల్లో అందుకు దశాబ్దాలు పడుతుంది. తీరా ఆ చట్టాన్ని కాస్తా నీరుగారిస్తే...? ట్రాన్స్జెండర్ వ్యక్తుల (హక్కుల పరిరక్షణ), చట్టం 2019కి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సవరణలు వారికి దక్కిన అరకొర హక్కుల్ని కాస్తా హరించేలా ఉన్నాయి. సృష్టి ఒక గీత గీసిందనీ, ఎవరైనా దానికి అటో, ఇటో ఉండాలి తప్ప వేరేవిధంగా ఉండటానికి వీల్లేదన్నది కాలం చెల్లిన భావన. మన దేశంలో తొలిసారి 2014లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల్ని గుర్తించి,వారికి కూడా ఇతరుల్లాగే ప్రాథమిక హక్కులుంటాయని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఏ సమాజంలోనైనా అత్యధిక సంఖ్యాకుల అభిప్రాయాలే విలువలుగా చలామణిలోకొస్తాయి. ఆడ, మగ కలిసి ఉండటం సహజమనీ, ఇతరమైన సంబంధాలు అసహజమనీ భావించే ధోరణి అటువంటిదే.ప్రభుత్వాలు సైతం ఆ దోవనే పోవటంతో దశాబ్దాలుగా ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్) వర్గాల వారు అడుగడుగునా వివక్ష, అవమానాలు ఎదుర్కోవడం సాధారణ విషయాలుగా మారాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన అయిదేళ్లకు 2019లో ఎట్టకేలకు ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది. ఆ చట్టం కింద జిల్లా కలెక్టర్కు ట్రాన్స్జెండర్నని దరఖాస్తు చేసుకున్నవారికి ధ్రువీకరణ పత్రం జారీ అయ్యేది. కొత్త సవరణ అలా కుదరదంటోంది. ప్రధాన వైద్యాధికారి లేదా ఉప వైద్యాధికారి ఆధ్వర్యంలో మెడికల్ బోర్డులు ఏర్పడాలనీ, వాటి సిఫార్సుల ఆధారంగానే కలెక్టర్లు ధ్రువీకరణ పత్రాలు జారీచేయాలనీ తాజా సవరణ చెబుతోంది. దీంతోపాటు ట్రాన్స్జెండర్ వ్యక్తులపై జరిగే హింస, భిక్షాటన చేయించటం నేరాలుగా పరిగణిస్తూ, కఠిన శిక్షలు నిర్దేశిస్తూ నిబంధనలు పొందుపరిచారు. అసలు జిల్లా కలెక్టర్ స్థాయిలో ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవటమే పెద్ద సమస్యగా పరిణమిస్తున్నదనీ, ఈ క్రమంలో వేధింపులు ఎదురవుతున్నాయినీ ఆ వర్గాలవారు ఆవేదన పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా ధ్రువీకరణ ఇవ్వాలన్న నిబంధన ఉన్నా 2023 డిసెంబర్ నాటికి దరఖాస్తుల్లో 65 శాతం మాత్రమే పరిష్కారమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈలోగా దాన్ని మరింత జటిలం చేసే సవరణలు వచ్చిపడ్డాయి. చట్టం రూపొందించేటపుడూ లేదా దానికి సవరణలు తీసుకురాదల్చుకున్నప్పుడూ సంబంధిత వర్గాలతో చర్చించటం, అవసరమైన మార్పులు చేర్పులకు సిద్ధపడటం ఒక ప్రజాస్వామిక సంప్రదాయం. సాగు చట్టాలు మొదలుకొని చాలా విషయాల్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దాన్ని పక్కనబెడుతోంది. పుట్టుకతో అందరూ గుర్తించిన జెండర్కు భిన్నమైన లైంగిక భావనలుండటం ప్రకృతి విరుద్ధం కాదని చెబుతూ స్వలింగసంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 277 రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2018లో తీర్పునిచ్చింది. ఆ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ‘స్వీయ వ్యక్తీకరణకు అవకాశం లేకపోవటం చావుతో సమానం’ అని వ్యాఖ్యానించారు. ఆ వర్గాలవారు అసలే దారుణ వివక్ష ఎదుర్కొంటున్నారు. జాతీయ మానవ హక్కుల నివేదిక, 2018 ప్రకారం వారిలో 92 శాతం మంది ఆర్థిక వెలికి గురవుతున్నారు. అక్షరాస్యత కూడా 56.1 శాతం. జాతీయ సగటు 74 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. నిరుద్యోగం 48 శాతం. బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా అడ్డంకులు. ఇక ఆర్థిక సాయం పొందటం గురించి చెప్పేదేముంది?స్వలింగ సంపర్కం నేరం కాదని మొదటిసారి గుర్తించింది 1791 నాటి ఫ్రెంచ్ విప్లవం సమయంలో. లెనిన్ ఆధ్వర్యంలోని సోవియెట్ ప్రభుత్వం 1920లో స్వలింగసంపర్కుల హక్కుల్ని గుర్తించి చట్టం తీసుకొచ్చింది. ఆ మాత్రం మార్పు రావటానికి ప్రపంచ దేశాల్లో ఎంతకాలం పట్టిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ దాన్ని మహాపాపంగా, నేరంగా పరిగణించే దేశాలు ఎన్నో! ఈ బిల్లుపై పార్లమెంటు చర్చించేలోగా ట్రాన్స్జెండర్ వర్గాలను సంప్రదించాలి. చట్టాన్ని మరింత సరళం చేయటం అవసరమని భావిస్తున్న తరుణంలో వారికి వ్యవస్థ ఆమోద ముద్రను తప్పనిసరి చేయటం ధర్మం కాదు. -
ఇరాన్ ఊబిలో ట్రంప్!
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దురాక్రమణ యుద్ధం పద్దెనిమిదో రోజుకు చేరుకున్నా ఆ రెండు దేశాలకూ దారీతెన్నూ తోచడం లేదు. మంగళవారం కీలకమైన ఇద్దరు ఇరాన్ నేతలు అలీ లారిజానీ, సులేమానీలనూ, బుధవారం మరో అగ్రశ్రేణి నేత ఇస్మాయిల్ ఖతీబ్నూ హతమార్చామని అమెరికా, ఇజ్రాయెల్ ఘనంగా చెప్పుకున్నా ఈ పరిణామాల తక్షణ ప్రభావం పెద్దగా లేదని ఇరాన్ సాగిస్తున్న ప్రతిదాడులే నిరూపిస్తున్నాయి. యుద్ధకాలంలో ఎవరి ఆదేశాల కోసమూ ఎదురుచూడకుండా ఏయే దశల్లో ఎలా స్పందించాలో దేశం నలుమూలలా మోహరించి ఉన్న సైనిక దళాలకు ముందే నిర్దేశించి ఉండటం ఇందుకు కారణం. యుద్ధరంగంలో సాధిస్తున్న విజయాల గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చెప్పుకుంటున్నా ఆయనకు ప్రతికూలతలే ఎదురవుతున్నాయని మంగళవారం నాటి రెండు పరిణామాలు చాటుతున్నాయి. హార్మూజ్ జలసంధి విముక్తికి యుద్ధ నౌకలతో, విమానాలతో తరలి రావాలన్న ట్రంప్ పిలుపును నాటో దేశాలు తిరస్కరించాయి.‘మీ యుద్ధంతో మాకేమిటి సంబంధమ’ంటూ ఎదురు ప్రశ్నించాయి. దానికితోడు అమెరికా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం (ఎన్సీటీసీ) చీఫ్ జో కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా భద్రతకు ఏమాత్రం ముప్పులేని ఇరాన్పై యుద్ధం ప్రకటించటం అనైతికమని ఆయన ప్రకటించారు. జో కెంట్ మొదటి నుంచీ ట్రంప్కు గట్టి మద్దతుదారు. ‘మాగా’ ఉద్యమ సూత్రధారుల్లో ఒకరు. ట్రంప్ చుట్టూ చేరిన పాలనా వ్యవస్థలోని ఇజ్రాయెల్ అనుకూలురు, ప్రధాన మీడియా ఆయన్ను పక్కదోవ పట్టించాయన్నది కెంట్ అభియోగం. ట్రంప్ది అమాయకత్వమా, మూర్ఖత్వమా అన్న సంగతలా ఉంచి అమెరికా అధ్యక్షులుగా ఎవరున్నా ఇజ్రాయెల్ మాటే చెల్లుబాటవుతున్నదని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అయితే ప్రస్తుత యుద్ధం ఇజ్రాయెల్ కోసమే అయినా రెండు దేశాలూ సమాన స్థాయిలో ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. అమెరికా ఇంతవరకూ 7,000 లక్ష్యాలపై విరుచుకుపడగా, ఇజ్రాయెల్ 7,600 దాడులు చేసిందని సోమవారం అమెరికా సెంట్రల్ కమాండ్ లెక్కలు చెబుతున్నాయి. సైనికంగా ఇరాన్ను బలహీనపరచటం శక్తిమంతమైన అమెరికాకు పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇరాన్ దగ్గరున్న డ్రోన్లూ, క్షిపణులూ కాలం గడుస్తున్నకొద్దీ తగ్గిపోవచ్చు. అదే పరిస్థితి కాస్త వెనకో ముందో ఇజ్రాయెల్, అమెరికాలకు కూడా ఎదురవుతుంది. కానీ దీర్ఘకాలం ఈ యుద్ధాన్ని సాగదీయటం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థనూ, ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ కోలుకోలేని విధంగా దెబ్బతీసే శక్తి ఇరాన్కుంది. గత నెల 24న జాతినుద్దేశించి ట్రంప్ ప్రసంగించినప్పుడు అందులో ఎక్కడా ఇరాన్ ప్రస్తావన లేదు. ఆకాశాన్నంటుతున్న గ్యాస్ ధరలు, ద్రవ్యోల్బణం గురించే ఆయన ఏకరువు పెట్టారు. ఇప్పుడు హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించటంతో అవి పట్టపగ్గాల్లేకుండా విజృంభిస్తున్నాయి. మున్ముందు మరింత ఉగ్రరూపం దాలుస్తాయి. అందుకే ట్రంప్ విజయాలేవీ అమెరికన్లను రంజింప జేయలేక పోతున్నాయి. కనుకనే అందరిపైనా ట్రంప్ ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. మాట వినని నాటో మాత్రమే కాదు... నిలదీస్తున్న రిపబ్లికన్లు, యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న ‘మాగా’ ఉద్యమ కారులు ఆయన్ను కుదురుగా ఉండనీయటం లేదు. ఆయన చేస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలే అందుకు రుజువు. తొలుత బ్రిటన్ సాయాన్ని అర్థించి, ఆ తర్వాత హార్మూజ్ విముక్తికి సహకరించమని నాటోతోపాటు చైనాను కూడా వేడుకుని, వారంతా నిరాకరించాక ఇరాన్ను ఒంటరిగానే ఎదుర్కొంటామంటూ ఆర్భాటంగా ప్రకటించడం ఆయన మానసిక స్థితిని వెల్లడిస్తోంది. నాటోను కోరడంలో వింతేమీ లేదు. కానీ ఆర్థిక రంగంలో సవాలుగా మారిన చైనాను అర్థించటం ట్రంప్ బలహీనతను బయటపెడుతోంది. 2003 నాటి ఇరాక్ దురాక్రమణ అమెరికాను ఆర్థికంగా దెబ్బతీస్తే, ఆ మేరకు చైనా లాభపడింది. ఇప్పుడు సైతం చైనా అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తుండగా, అది సాయ పడుతుందని ట్రంప్ ఎలా అనుకున్నారో అనూహ్యం. మొత్తానికి ఆయన ఇరాన్ అనే ఊబిలో దిగబడ్డారు. దాన్నుంచి బయటపడటం సులభమేం కాదు. -
డ్రగ్స్ మాఫియా అరాచకం
హైదరాబాద్ శివారులో ఒక పెద్ద ఫాంహౌస్... అక్కడొక ఈత కొలను...దాని పక్కనే ఆశీనులైన బడాబాబులు... ముందున్న టేబుళ్లపై ఖరీదైన మద్యం సీసాలు, మాదక ద్రవ్యాలు... జర్మన్ తయారీ రివాల్వర్తో పోలీసులపై కాల్పులు, బెదిరింపులు, వాగ్వాదాలు– క్రైమ్ కథాచిత్రాన్ని తలదన్నే శనివారం నాటి ఈ దృశ్యం మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే కించిత్తు ఆశ్చర్యం కలుగుతుంది. మొన్న జనవరిలో కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పట్టుబడితే, తాజాగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్తోపాటు మరికొందరు దొరికిన వైనం దీన్ని రుజువు చేస్తోంది. వేయి తలల విషనాగు లాంటి మాదక ద్రవ్య మహమ్మారి ఆనుపానులు రాబట్టడానికి, దాన్ని అంతమొందించటానికి పోలీసులు నానా తంటాలూ పడుతున్నారు. కానీ బడి పిల్లలు మొదలుకొని ఆడ మగ తేడా లేకుండా అందరినీ కాటేస్తున్న ఈ విషనాగు వెనక రాజకీయ పలుకుబడి గల కుటుంబాలున్నాయనీ, కనుకనే దాని అదుపు అసాధ్యమవుతున్నదనీ ఈ పరిణామాలు తెలియజెబుతున్నాయి. ఒకరా ఇద్దరా... తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మ, ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ వగైరా 11 మంది ఈ డ్రగ్స్ దందాలో దొరికారు. రెండేళ్ల నాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల ప్రసంగాలను గుర్తుంచుకుని ఇప్పుడు వెల్లడవుతున్న పరిణామాలతో బేరీజు వేసుకుంటే ఆ నేతల వంచన ఏపాటిదో అర్థమవుతుంది. మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందంటూ వారు పెడబొబ్బలు పెట్టారు. ‘మేం వస్తే వంద రోజుల్లో అరికడతామ’ంటూ ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకొచ్చాక అంతవరకూ సాధించిన విజయాలను గుల్లచేశారు. అది మళ్లీ తలెత్తి విస్తరించటానికి అవకాశమిచ్చారు. అప్పటి దుష్ప్రచారమంతా గెలుపు కోసం మాత్రమే కాదు... మాదక ద్రవ్యాలను అరికట్టడం వల్ల కలుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం కోసమని ఆ కూటమి పీఠం ఎక్కింది మొదలు జరుగుతున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇసుక మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నాయి. ‘గంజాయి వద్దు బ్రో...’ అంటూనే మాదక ద్రవ్యాలకు తలుపులు బార్లా తెరిచారు. ఏపీలో మాదక ద్రవ్య చీడను అంతమొందించటానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆపరేషన్ పరివర్తన్ను రెండు దశల్లో విజయవంతంగా అమలు చేసింది. దానికితోడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)ను ఏర్పాటు చేసింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఉండే 11,500 ఎకరాల్లోని గంజాయి సాగును ధ్వంసం చేయడంతోపాటు, గిరిజనులు ఇతర పంటల వైపు మళ్లేలా రూ. 500 కోట్లతో ప్రోత్సాహకాలందించింది. విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ కృషినంతా కూటమి పాలన నీరుగార్చింది. పర్యవసానంగా విద్యాసంస్థల్లో చిల్లరగా... ఫామ్హౌస్ పార్టీలకు టోకుగా గంజాయి, కొకైన్, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వగైరాలు చేరిపోతున్నాయి. ఏడాదికి రూ.5,000 కోట్లు వెనకేసుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దందాకు మూలవిరాట్టులు చంద్రబాబు చుట్టూ ఉండే సీనియర్ నేతల కుటుంబాలవారు కావటంతో ఏపీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మాదక ద్రవ్యాల వ్యాప్తిపై వెల్లడవుతున్న గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి. నిరుడు దేశవ్యాప్తంగా భద్రతా విభాగాలకు రూ. 25,330 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. అంతక్రితంతో పోలిస్తే ఇది 55 శాతం కన్నా అధికం. ఏపీలో వీటికి అలవాటుపడిన వారిలో 10–17 ఏళ్ల మధ్య గలవారి సంఖ్య 3.19 లక్షలు ఉన్నట్టు చెబుతున్నారు. వీటి వెనక డబ్బాశ మాత్రమే కాదు, దాని ఆసరాతో రాజకీయాలను శాసించటం అసలు లక్ష్యం. మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో తెలంగాణ పోలీసులకు అంతో ఇంతో మంచి పేరుంది. కానీ తాజా కేసు తీవ్రత తెలిసి కూడా, నిందితుడిగా ఉండాల్సిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వ్యవహరిస్తేనే ఉగ్రవాదాన్ని మించిన ఈ మహమ్మారి దుంపనాశనం సాధ్యం. -
ఎన్నికల బాజా!
ఈసారి ఏప్రిల్ అధిక ఉష్ణోగ్రతలతోపాటు ఎన్నికల వేడిని కూడా చవిచూడబోతోంది. నాలుగు రాష్ట్రాలు– తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం ప్రకటించింది. బెంగాల్లో రెండు దఫాలుగా ఏప్రిల్ 23, 29ల్లో పోలింగ్ జరగనుండగా, మిగిలినచోట్ల 9న ఒకే దఫాతో ముగుస్తుంది. అన్నింటి ఫలితాలూ మే 4న వెలువడతాయి. 2006 నుంచి చూస్తే వేలంపాట మాదిరి అయిదు నుంచి ఎనిమిది దఫాలుగా పోలింగ్ సాగిన చరిత్రగల బెంగాల్లో ఈసారి కేవలం రెండు దఫాలతో సరిపెట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరిపి 60.06 లక్షల మంది ఓటర్లను త్రిశంకు స్వర్గంలో ఉంచిన ఈసీ... ఆ విషయం తేలకుండానే బెంగాల్ ఎన్నికలు నిర్వహించబోతోంది. ఆ విషయంలో వచ్చిన ఫిర్యాదులను హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఏర్పడే అప్పిలేట్ ట్రిబ్యునళ్లు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే 705 మంది ఆ పనిలో ఉన్నారు. రోజుకు లక్ష ఫిర్యాదుల్ని పరిష్కరిస్తున్నారు. అలా చూసుకుంటే నామినేషన్ల ఘట్టం ముగిసే ఏప్రిల్ 9 నాటికి 39 లక్షలమంది వినతులు పరిష్కారమవుతాయి. వారిలో ఎందరికి ఓటేసే భాగ్యం దక్కుతుందోగానీ... ఎటూ తేలకుండా 20 లక్షల మందికిపైగా మిగిలిపోతారు. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం 23(3) ప్రకారం నామినేషన్ల గడువు ముగిశాక ఎన్నికల జాబితా మారకూడదు. అధికారంలో ఉండగా ఏం చేసినా, ఎన్నికల సీజన్ వచ్చేసరికి వాగ్దానాలు వరదలై పారటం మనకు రివాజైంది. అధికారంలో ఉన్న వెసులుబాటు ఉపయోగించుకుని ఏదో పథకం పేరిట మహిళా ఓటర్ల ఖాతాలకు డబ్బు పంపిణీ సంప్రదాయం నిరుడు నవంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ ఎన్డీయే కూటమి మొదలెట్టింది. దానికింద 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున పంపిణీ అయ్యాయి. దీనికి మలి దశ కూడా ఉంటుందని చెప్పడం మరింత లాభించింది. మహిళలంతా ఎన్డీయేకు నీరాజనాలు పట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా ఆ బాటలోనే 1.31 కోట్లమంది మహిళల ఖాతాలకు రూ. 5,000 చొప్పున గత నెలలో బదిలీ చేశారు. ఇవిగాక రాబోయే రోజుల్లో పార్టీలు విడుదల చేయబోయే మేనిఫెస్టోల నిండా ఎటూ ఉచితాల మోత మోగుతుంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఒక్క అస్సాంలో తప్ప మరెక్కడా బీజేపీ అధికారంలో లేదు. పుదుచ్చేరిలో మాత్రం ప్రాంతీయ పక్షం ఎన్నార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. ఓట్ల శాతం క్రమేపీ పెరుగుతూ వస్తున్న బెంగాల్లో ఈసారి నిర్ణయాత్మక పాత్ర పోషించగలమని ఆ పార్టీ విశ్వసిస్తోంది. కానీ వచ్చిన ఏ అవకాశాన్నయినా అంత తేలిగ్గా వదలని తృణమూల్ అధినేత, సీఎం మమతా బెనర్జీ ముందు ఎవరి ఎత్తుగడలైనా ఫలించటం అంత తేలిక కాదు. సినీ నటుడు విజయ్ కొత్తగా ప్రారంభించిన టీవీకే పార్టీతో పొత్తు ఖరారైతే తమిళనాడు తమ జోలెలో పడుతుందని బీజేపీ ఆశిస్తోంది. మిత్రపక్షం అన్నా డీఎంకేపై పెద్దగా ఆశలేమీ లేవు. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేను ఢీకొనడం కష్టమే. కేరళలో వరసగా పదేళ్లు సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ఏలుబడి సాగింది గనుక అక్కడ కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్లో బాగా ఆశలున్నాయి. 2014 నుంచి వరసగా అధికారంలోకొస్తున్న అస్సాంలో బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. 2023 నాటి నియోజకవర్గాల పునర్విభజనతో ముస్లిం ప్రాతినిధ్యం ఉండే స్థానాలు 23కి పడిపోవడం, మొన్నటి బడ్జెట్లో మహిళలకూ, యువతకూ ప్రకటించిన రూ. 5,000 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాలు ఆ ఆత్మవిశ్వాసానికి మూలం. కాంగ్రెస్ సంస్థాగత బలహీనతలు సరేసరి. ఈ ఎన్నికలు ఈసీ విశ్వసనీయతకు కూడా పరీక్ష. లోక్సభలో అభిశంసన తీర్మానం ఎదుర్కొనబోతున్న తరుణంలో ఈసారైనా తటస్థత పాటిస్తుందని అందరూ ఆశిస్తున్న తరుణంలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ, హోం కార్యదర్శినీ మార్చింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై రెండేళ్లు దాటుతున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న ఆ సంస్థ వైఖరి ఈ ఎన్నికల విషయంలో మారకపోతే మరిన్ని ఛీత్కారాలు తప్పవు. మొత్తానికి ఏ పార్టీ జాతకం ఏమిటో తెలియడానికి మే నాలుగో తేదీ వరకూ ఆగక తప్పదు. -
యుద్ధమంటే...
యుద్ధమంటే... పరిగెడుతున్న రైలు హఠాత్తుగా పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోవడం; నడుస్తూ నడుస్తూ ఉన్న దారి అకస్మాత్తుగా మూసుకోవడం; ఏళ్ల తరబడిగా సాఫీగా సాగుతున్న జనజీవితం రోజుల వ్యవధిలో సంక్షోభాల ఊబిలోకి దిగబడిపోవడం; యుద్ధ మంటే గతంతో ఒక్కసారిగా లంకె తెగిపోయి భవిష్యత్తు అంధకారబంధురమైపోవడం! మనిషి ఎక్కువకాలం శాంతికి దగ్గరగానూ, యుద్ధానికి దూరంగానూ ఉంటూ వివేకాన్ని చాటుకునేవాడే; కానీ ఏ దుర్ఘడియలోనో ఆ వివేకం నుంచి జారిపోయి విధ్వంసం వైపు అడుగు వేస్తాడు. మానవ స్వభావంలోని వక్రత అదే; మనిషిని పట్టి పీడించే శాపమూ అదే! యుద్ధంలో విజితులూ, విజేతలూ ఉండరనీ, చివరికి అందరూ పరాజితులే అవుతా రనీ అతనికి తెలియదా, తెలుసు! రెండువైపులా చచ్చినవాళ్ళ కోసం ఏడ్చే బంధువుల దుఃఖం ఒక్కలానే ఉంటుందనీ తెలుసు. కానీ ఉన్మాదం... ఉన్మాదం... తాజా పశ్చిమాసియా యుద్ధంలో పిల్లలతో సహా ఇప్పటికే వందల సంఖ్యలో చనిపోయారు. అమెరికా చేరికతో అది మినీ ప్రపంచ యుద్ధంగా మారింది ఆర్థిక, వాణిజ్య సంబంధాలూ, వలసలూ, రవాణా సదుపాయాలూ, శాస్త్రసాంకేతికవృద్ధీ దేశాలను దగ్గరగా ముడివేసి ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన దశలో... మంచైనా, చెడైనా త్రుటిలో ప్రపంచస్థాయి నందుకుంటాయి. ఆ క్రమంలోనే పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలు కుగ్రామ దశను కూడా దాటి నేరుగా వంటింట్లోకి అడుగుపెట్టి సాధారణ గృహిణులలో కూడా అలజడీ, ఆందోళనా రేపుతున్నాయి. సహజవాయు లభ్యతకు అంత రాయం ఏర్పడి, వంటగ్యాస్ సరఫరా మందగించడంతో హాహాకారాలు చెలరేగు తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే పొయ్యిలో పిల్లి లేవని పరిస్థితిని ఊహించుకుని కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. ప్రభుత్వాలు అభయమిస్తున్నా పరిస్థితి వాటి చేయి కూడా దాటిపోతే ఏమిటి గతన్న ప్రశ్న గుండెల్ని గునపంలా గుచ్చుతోంది. చిన్నా, పెద్దా హోటళ్ళు మూతపడి సిబ్బంది వీథిన పడుతున్నారు. వాటిపై ఆధారపడే జనాలు తిండికి కటకటలాడే దుఃస్థితి భయపెడుతోంది. కొరతను అడ్డుపెట్టుకుని పెరిగిపోయే వంట గ్యాస్ ధరలు జనాల జేబులను కొల్లగొట్టి మరిన్ని కష్టాలలోకి నెట్టే ప్రమాదమూ తలెత్తింది. అలాగని, వెనకటి కట్టెల అడితీలు, బొగ్గుల దుకాణాల రోజులకు వెళ్ళ గలమా, కాలాన్ని వెనక్కి తిప్పగలమా, ఇన్నేళ్ళ గతినీ ప్రగతినీ కొన్ని రోజుల్లోనే యుద్ధం తుడిచిపెడితే ఏమిటి చేయడం?! ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. యుద్ధమంటే చావుబతుకులు చెట్టపట్టాలు వేసుకుని ఏకకాలంలో చేసే విలయ తాండవం. చావుకీ, బతుక్కీ తేడా కనిపించని నిర్లిప్తక్షణం. ప్రియకౌగిలికీ, మృత్యు ఆలింగనానికీ మధ్య నిత్యసంచారం. లియో తొలుస్తాయ్ ‘వార్ అండ్ పీస్’ అనే తన ఐతిహాసిక నవలలో యుద్ధానికీ, శాంతికీ మధ్య జరిగే ఎడతెగని పెనుగులాటను మహాద్భుతంగా కళ్ళకు కడతాడు. ఆపైన రామాయణ, మహాభారతాల ఉదాహరణాలూ మన ముందు ఉన్నాయి. ‘తపస్సుతో ఇంద్రియాలను జయించిన నీ మీద ఆ ఇంద్రియాలే పగబట్టాయా, సీత పట్ల కామాన్ని జయించలేక ఈ యుద్ధమెందుకు కొనితెచ్చుకున్నావు; భర్తా, కొడుకూ, బంధువులూ చచ్చిన తర్వాత జీవచ్ఛవంలా ఎలా బతక’నంటూ రావణుడి మీదపడి మండోదరి గుండెలవిసేలా రోదిస్తుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా అంతే! యుద్ధప్రారంభంలో పురుషుడు చూపిన శౌర్యప్రతాపాలు యుద్ధాంతంలో స్త్రీల శోకవిహ్వ లత ముందు నీరుగారిపోతాయి. మహాభారత కథకుడు ‘స్త్రీపర్వం’ పేరిట తల్లుల శోకా నికి ఒక ప్రత్యేక పర్వరూపమే ఇస్తాడు; అందులో, నూరుగురు కొడుకుల్ని కోల్పోయి కడుపుకోత పడుతున్న గాంధారిని నాయిక స్థానంలో ప్రతిష్ఠిస్తాడు. దుఃఖవివశ అయిన ఆమె ముందుకు రావడానికి అంతటి భీముడూ వణికిపోతాడు. ‘తల్లీ! నీ కొడుకుల్ని చంపించిన పాపాత్ముణ్ణి నేనే! నన్ను శపించు!! ’ అంటూ ధర్మరాజు చేతులు జోడిస్తాడు. తల్లి మనసుతో అతణ్ణి మన్నిస్తూనే, పాండవపక్షానికి చెందిన అభిమన్యుడి మరణానికి సైతం భోరున విలపించిన గాంధారిని యావత్ సృష్టిలోని మాతృత్వానికి ప్రతీకగా మలచిన ఆ ఘట్టం ప్రపంచ సాహిత్యంలోనే నిరుపమానం. అయినా యుద్ధం కలిగించే మోహ, దాహాల ముందు మనిషి ఓడిపోతూనే ఉన్నాడు; ఆత్మవిధ్వంసాన్ని కొని తెచ్చుకుంటూనే ఉన్నాడు; నేటి పశ్చిమాసియా యుద్ధం రేపు ఎన్ని శోకపర్వాలకు రూపుదిద్దబోతోందో! ఈ అగ్నిగుండం ఎప్పటికి ఆరనుందో!! -
అధిక సంతానంపై ప్రేమ!
ఈమధ్య జనాభా పెంచండంటూ పిలుపునిచ్చే నాయకులు దేశంలో ఎక్కువయ్యారు. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ‘ఇద్దరు లేక ముగ్గురు చాలు’, ‘మేమిద్దరం... మాకిద్దరు’ వంటి నినాదాలు హోరెత్తిన దేశంలో ఇలా కోరటం కాస్త వింతగానే ఉంటుంది. ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భాగవత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు తరచూ బహిరంగ సభల్లో ఇలాంటి పిలుపునిస్తున్నారు. వాస్తవానికి మన దేశ జనాభా తక్కువేం లేదు. జనగణన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు గనుక నికరంగా ఆ సంఖ్య ఎంతన్నది తెలియకపోయినా అది 145 కోట్ల వరకూ ఉండొచ్చని వివిధ నివేదికలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా దాన్నే ధ్రువీకరించింది. అంటే ప్రపంచంలో జనాభారీత్యా మనదే ప్రథమస్థానం. అయినా అధిక సంతానం అవసరమంటున్నారు నేతలు. జనాభా తగ్గించటం కోసం పది పదిహేనేళ్ల క్రితం వరకూ ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటించేవి. ఉచితంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, నగదు బహుమతి, ఇళ్ల కేటాయింపు వంటి నజరానాలుండేవి. వైద్యులకు సైతం ప్రోత్సాహకాలుండేవి. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారు పంచా యతీరాజ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ చాలా ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. అయిదేళ్ల క్రితం కూడా అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ఇద్దరికి మించి పిల్లలుంటే సంక్షేమ పథకాలు వర్తించబోవని, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల్ని చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగిగా మారాక సంతానం పెరిగినా కొలువుండదని చెప్పారు.ఇప్పుడు గాలి మళ్లింది. నాయకుల స్వరం మారింది. అయితే వీరందరి ఉద్దేశాలూ ఒకటి కాదు. కొందరి పిలుపు వెనక హిందూ జనాభా తగ్గుతోందన్న ఆందోళన ఉంది. స్టాలిన్ వంటి వారైతే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల జనాభా వ్యత్యాసం వల్ల పార్లమెంటులో సీట్ల సంఖ్య మొదలుకొని వనరుల కేటాయింపు వరకూ అన్నిటా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆదుర్దా పడుతున్నారు. అయితే చంద్రబాబు ఆంతర్యమేమిటో ఎవరూ చెప్పలేరు. స్టాలిన్తో ఏకీభవిస్తున్నట్టు తెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీకి ఆగ్రహం వస్తుందని భయం. జనాభా పెంచమని ఆమధ్య ఒకటి రెండుసార్లు ముసిముసి నవ్వులతో చెప్పిన ఆయన... ఇటీవల నజరానాలు ప్రకటించారు. ఇద్దర్ని లేదా ముగ్గుర్ని కనే తల్లిదండ్రులకు రూ. 25,000, జంటలకు అవసరమైతే ఉచిత సంతాన సాఫల్య (ఐవీఎఫ్) చికిత్స, మూడో సంతానాన్ని కంటే... వారికి అయిదేళ్లు వచ్చేవరకూ నెలకు రూ. 1,000, పద్దెనిమిదేళ్ల వరకూ ఉచిత ప్రభుత్వ విద్య వంటివి అందులో ఉన్నాయి. ఎటూ అమలు చేసే అలవాటు లేదు గనుక ఇలాంటి వాగ్దానాలు ఆయన ఎన్నయినా చేయగలరు. దేశంలో సంతానోత్పత్తి (టీఎఫ్ఆర్) జాతీయ సగటు 2000 సంవత్సరం నాటికి 3.2. అంటే సగటున ఒక మహిళకు ముగ్గురు సంతానం. అదిప్పుడు దాదాపు 2కు చేరుకుంది. తాజా లెక్కల ప్రకారం ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల సగటు 1.5 నుంచి 1.6 వరకూ ఉంది. టీఎఫ్ఆర్ 2.1 ఉంటే జనాభా స్థిరంగా ఉంటుందని, తగ్గితే జనాభా క్షీణిస్తూ వృద్ధుల సంఖ్య పెరుగుతుందని, 2.1 కన్నా హెచ్చితే పెరుగుదల వేగం హెచ్చుగా ఉంటుందని అంచనా. అక్షరాస్యత పెరగటం, మహిళలు ఉద్యోగాలు చేయటం, కుటుంబాల్లో వారి మాట చెల్లుబాటు కావటం, అస్థిర జీవితాలు, వలసలు వగైరాలన్నీ ఒకరి తోనో, ఇద్దరితోనో సరిపెట్టుకునేలా చేస్తున్నాయి. కారణాలు ఏమైనా ఉండొచ్చు... అవి సహేతుకమైనవే కావొచ్చు. కానీ ఇలాంటి ఉద్బోధల వల్ల కుటుంబాల్లో స్త్రీలు ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొనాలో, వారికెదురయ్యే ఆరోగ్య సమస్యలేమిటో చంద్రబాబు గమనించారా? ఎన్నికల్లో ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అంటూ సంతకం చేసి గుప్పించిన వాగ్దానాలకే దిక్కు లేకుండా పోయాక ఇలాంటి హామీలు మహిళలు ఎలా నమ్మాలి? మద్యపానంతో మగవాళ్లు ఇల్లు గుల్ల చేస్తుంటే ఏం పెట్టి పిల్లల్ని పెంచాలి? సంతానం విషయంలో స్త్రీకి స్వయంప్రతిపత్తి ఉంటుందని గుర్తుందా? అసలు విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో చేస్తున్నదేమిటి? ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్డీజీ) సాధనపై శ్రద్ధవుందా? వీటన్నిటినీ నిజాయతీగా సమీక్షించుకుని సంతానం పెంచటం గురించి బాబు మాట్లాడాలి. -
‘కారుణ్య మరణానికి’ ఊపిరి!
అచేతన లేదా అర్ధ చేతన స్థితిలో జీవచ్ఛవాల్లా బతుకీడుస్తూ మనుగడ సాగించే రోగుల విషయంలో ఏం చేయాలన్న అంశంలో స్పష్టత కొరవడిన నేపథ్యంలో బుధవారం సర్వోన్నత న్యాయస్థానం ఉత్తరప్రదేశ్కు చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా అనే యువకుడి పరోక్ష కారుణ్య మరణానికి అనుమతిస్తూ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చావు బతుకుల పొలిమేరల్లో కొట్టుమిట్టాడేవారి విషయంలో ఏం చేయాలన్న మీమాంస మన దేశానికే పరిమితమైనది కాదు. దాదాపు అన్ని సమాజాల్లోనూ దశాబ్దాలుగా ఎడతెగని చర్చ కొనసాగుతోంది. 27 దేశాలు మాత్రమే కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చట్టాలు చేశాయి. వీటిలో ‘క్రియాశీల కారుణ్య మరణానికి’ కొన్ని మొగ్గు చూపగా, ‘పాక్షిక కారుణ్య మరణానికి’ మరికొన్ని అనుమతించాయి. 1973లో ముంబై కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేఈఎం) ఆసుపత్రిలో నర్స్గా పనిచేస్తున్న అరుణా రామచంద్ర శాన్బాగ్ అనే యువతి లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడి, మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి కోమాలోకి వెళ్లిన ఉదంతం అనంతరం ఈ విషయమై దేశంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఆమెను నాలుగు దశాబ్దాల పాటు ఆసుపత్రి సహ సిబ్బంది కంటికి రెప్పలా చూసుకున్నారు. ఈ పరిస్థితుల్లో 2009లో ఆమె స్నేహితురాలు పింకీ విరానీ... అరుణా శాన్బాగ్కు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చివరకు అసాధారణ పరిస్థితుల్లో కారుణ్య మరణానికి అనుమతినీయటం రాజ్యాంగబద్ధమేనని 2011లో న్యాయస్థానం అభిప్రాయపడింది. కానీ రోగి తరఫు బంధువులు కోరనందున ఈ తీర్పు బాధితురాలికి వర్తించబోదని తెలిపింది. ఎన్నో పరిమితులు విధించినా 2011 నాటి తీర్పు ఎన్నదగింది. అయితే 2018లో ‘కామన్ కాజ్’ దాఖలు చేసిన పిటిషన్ తర్వాత ‘జీవించే హక్కు’కు పూచీపడే రాజ్యాంగంలోని 21వ అధికరణంలో ‘హుందాగా మరణించే హక్కు’ కూడా ఇమిడి ఉన్నదని తెలిపింది. దీనికోసం ఒక చట్టం చేయాలని కేంద్రానికి సూచిస్తూ, ఈలోగా వర్తింప జేయటం కోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. కానీ ఇప్పటివరకూ ఆ చట్టం జాడలేదు. ఆచరణలో ఆ మార్గదర్శకాల వల్ల ఎదురవుతున్న ప్రతిబంధకాలపై ఒక స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేశాక 2023లో అవి మరింత సరళమయ్యాయి. కానీ వాటి అమలుకు అనుమతించటం ఇదే ప్రథమం.పరోక్ష కారుణ్య మరణాన్ని అనుమతించటం విషయంలో నైతిక పరమైన సమస్యలు తలెత్తుతాయన్నది వాస్తవం. ఎందుకంటే గుండె, లేదా మెదడు ‘సజీవంగా’ ఉన్నట్టు వైద్యులు చెప్పాక చూస్తూ చూస్తూ అలాంటి రోగి మరణాన్ని ఎవరూ కోరుకోరు. ఏ క్షణమైనా కోలుకోవచ్చని ఆశిస్తారు. ప్రస్తుత కేసులో రోగి 13 ఏళ్లుగా అలాంటి స్థితిలోనే కొనసాగాడు. దీనిపై ఢిల్లీ హైకోర్టు అనుమతి నిరాకరించాక అతని తల్లితండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. తీర్పు వెలువరించినప్పుడు స్వయానా న్యాయమూర్తే కంటతడి పెట్టారంటే ఆయనలో సాగిన అంతస్సంఘర్షణ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇక కన్నవారి గురించి చెప్పేదేముంది? తీర్పు వెలువరించిన రోజే మీడియాలో యూపీ ఉదంతం ఒకటి వచ్చింది. దాన్ని గమనిస్తే ఈ తరహా రోగుల స్థితిని అంచనా వేయటం ఎంత సంక్లిష్టమో తెలుస్తుంది. ‘బ్రెయిన్ డెడ్’ అయి కోమాలోకి వెళ్లిన 50 ఏళ్ల మహిళ కొద్ది నిమిషాల్లోనే మరణిస్తుందని వైద్యులు చెప్పటంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుని వెనక్కి తీసుకెళ్తుండగా రోడ్డుపై లోతైన గుంతలో అంబులెన్స్ చిక్కుకుంది. దాన్ని కదల్చటానికి ఇంజిన్ను హెచ్చించటంతో వాహనం కుదుపునకులోనై ఆ మహిళలో శ్వాస సాధారణ స్థాయికి చేరి, మాట్లాడటం మొదలైంది. అందుకే అత్యంత జాగరూకత అవసరం. ‘మరణించడానికి గల హక్కు’ కాస్తా కొందరు స్వప్రయోజనపరుల వల్ల ‘బాధ్యత’గా మారిపోయే ప్రమాదం ఉంది. ఆస్తులపై కన్నేసి, లేదా చాకిరీ తప్పించుకునేందుకు అంతిమ దశలో ఉండేవారి చేత బలవంతంగా కారుణ్య మరణానికి అనుమతించాలన్న పత్రాలపై సంతకాలు చేయించే ప్రబుద్ధులు కూడా అక్కడక్కడ ఉంటారు. కనుక అన్ని కోణాల్లోనూ పరిశీలించాకే అనుమతి మంజూరు చేయటం అవసరం. -
బెంగాల్ ‘సర్’ తేలేదెప్పుడు?
నిరుడంతా బిహార్లో కలకలం సృష్టించి, బెంగాల్లో అంతకుమించిన వివాదాలతో గత నెల 28న ముగిసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియలో మొత్తానికి 8.09 శాతం మంది ఓటర్లు... అంటే 60.06 లక్షల మంది జాబితాల నుంచి కనుమరుగై, నికరంగా 7.04 కోట్ల మంది అసలైన ఓటర్లుగా తేలారని ఎన్నికల సంఘం(ఈసీ) చెబుతోంది. జాబితాలో లేనివారు న్యాయనిర్ణయ పరిధి(అజ్యుడికేషన్)లో ఉన్నట్టు లెక్క. ఇలాంటి వారి వినతులను పరిష్కరించటానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో అప్పిలేట్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్ను మంగళవారం కోరింది. ఈ ప్రక్రియ ముగిశాకే బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలుంటాయా... ముందే పూర్తవుతాయా అన్నది చెప్పేవారు లేరు. సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమారే ఆ విషయంలో స్పష్టత ఇవ్వటానికి నిరాకరించారు. చాలా అంశాల్లో ఇలా మౌనంగా ఉండిపోవటం ఆయనకు అలవాటే కనుక అందులో ఆశ్చర్యమేమీ లేదు. మన దేశంలో మంచికో చెడుకో అట్టడుగు ప్రజానీకంలో దృఢమైన విశ్వాసం ఒక టుంటుంది. ఓటు హక్కు లేకపోతే మనిషి బతికున్నా చనిపోయినవాళ్లతో సమానమని వారు నమ్ముతారు. నిజానికి అంత నమ్మకం ఉండబట్టే... పార్టీలు దొంగ హామీలిచ్చి నెగ్గుతూ, అటుపై అధికారం వెలగబెడుతూ వంచిస్తున్నా మరో దఫా ఎన్నికల్లో ఓటేయటానికి ఎంతో నిబద్ధతతో క్యూలో నిలబడతారు. సామాన్యుల్లో ఉన్న ఈ అచంచల విశ్వా సమే మన ప్రజాస్వామ్యాన్ని ఈ మాత్రంగానైనా నిలబెడుతోంది. బిహార్లో ‘సర్’ ప్రక్రియకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లోనే ప్రధాన పోరాటం సాగింది. బెంగాల్ పరిస్థితి భిన్నం. అక్కడున్నది మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక నిరసనలు, ఇతరత్రా ఉద్యమాలు జోరుగానే కొనసాగాయి. అలాగని న్యాయస్థానా లను విస్మరించలేదు. స్వయానా మమత సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఎంతో ఊరటనిచ్చేవి. ఎందుకంటే ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారు గోడు చెప్పుకోవటానికి హైకోర్టు పర్యవేక్షణలో అప్పిలేట్ ట్రిబ్యునళ్లు ఏర్పడతాయి. నిర్ణయాధికారం అధికారులకే అప్పగిస్తే ఇష్టానుసారం చేస్తారన్న భయం ఉండేది. కానీ ట్రిబ్యునళ్లు ఈ సమస్య లేకుండా చేశాయి. నిజానికి ఈ వివాదానికి మూలం ఈసీ తీరులో ఉంది. ఫలానా ప్రాంతంలో ఓటరుగా నమోదైన వ్యక్తి ఇక్కడ ఉండటం లేదనో, దొంగ ఓటరనో ఫిర్యాదు చేయడానికి ‘ఫామ్–7’ వెసులుబాటు ఉంది. అయితే అలా ఫిర్యాదు చేసినవారి వివరాలు చాలా సందర్భాల్లో సక్రమంగా లేవు. ఎదుటి పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోని ఓటర్లు నకిలీలని వచ్చిన ఫిర్యాదులు కోకొల్లలు. దాదాపు అన్ని పార్టీలూ ఈ పనిచేశాయి. వాటి ఆధారంగా ఓటర్లకు నోటీసులీయటం, పత్రాలు తీసుకురావాలని ఆదేశించటం, తీరా నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ లేని (అన్మ్యాప్డ్) సంగతి బయటపడటం, పేర్లలో అక్షరక్రమం కొంచెం తేడావచ్చినా అనర్హులుగా జమవేయటం సాధారణ ఓటర్లకు తలనొప్పిగా మారింది. చిత్రమేమంటే ఒక బీజేపీ నాయకురాలి పేరుమీద దాఖలైన ఫిర్యాదుల సంగతి అధికారులు చెబితేగానీ ఆమెకు తెలియలేదు. దొంగ ఫిర్యాదులపైనా, వాటి ఆధారంగా నిర్ణయం తీసుకున్న వారి పైనా వెనువెంటనే చర్యలుంటే ఈ అరాచకం ఆగేది. కానీ దానికి సమయం పడుతుంది. బంగ్లాదేశ్కు పొరుగున ఉండటం బెంగాల్ ముస్లింలకు తలనొప్పిగా మారింది. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినవారు కూడా అక్రమ వలసదారులన్న ఫిర్యాదులతో అందు కవసరమైన పత్రాలు సేకరించలేక, పత్రాలున్నా పరిశీలనలో పేర్లలో కనబడిన స్వల్ప తేడా వల్ల జాబితాల నుంచి గల్లంతైనవారు అనేకులు. ఇలాంటి సమస్యలుంటాయని ఎన్నికల సంఘం ముందే అంచనా వేసి, తరుణోపాయం సూచిస్తే ప్రజలు న్యాయ స్థానాలకెక్కే అవసరం ఉండకపోయేది. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయి రెండేళ్లు కావస్తున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులపై ఇంతవరకూ ఉలుకూ పలుకూ లేకుండా మిగిలిపోయిన ఎన్నికల సంఘం ఇంతకన్నా మెరుగ్గా ఎలా ఉంటుంది? నిజమైన ఓటర్లకు సత్వరన్యాయం లభించాలని కోరుకోవటం మినహా ఎవరూ చేయగలిగింది లేదు. -
తిప్పలు తప్పని యుద్ధం
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మొదలెట్టిన దురాక్రమణ యుద్ధం పదకొండో రోజుకు చేరుకోగా ‘ఇంకెంత... త్వరలోనే అది పరిసమాప్తమవుతుంద’ంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూలు మంగళవారం చేసిన ప్రకటనల్ని ఇరాన్ పరిహసించింది. కాల్పుల విరమణకూ, లేదా చర్చల పునఃప్రారంభానికీ అవకాశమే లేదని తేల్చిచెప్పింది. చరిత్ర చెప్పే పాఠం గ్రహించకుండా దుందుడుకు పోకడలకు పోయిన ట్రంప్... మరిన్ని భీకర దాడులకు దిగితే ఇరాన్ సాష్టాంగపడుతుందని భ్రమపడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్లోని ఫెయిర్ఫోర్డ్ స్థావరానికి అరివీర భయంకర యుద్ధ విమానంగా అమెరికా చెప్పుకుంటున్న బి–52 బాంబర్లు చేరుకున్నాయని బ్రిటన్ మీడియా పతాక శీర్షికలతో గొంతు చించుకుంటోంది. కనుక అది చేసే విధ్వంసం కూడా అసాధారణమైనదే కావొచ్చు. కానీ సంకల్ప బలం దండిగా ఉన్న పక్షాన్ని ఇలాంటి విధ్వంసక శక్తి ఏమాత్రం లొంగదీయలేదు. జయాపజయాలను అంతిమంగా నిర్ణయించేది మనుగడ కోసం పోరాడే మనుషులే తప్ప యుద్ధక్షేత్రంలోని ఆయుధాలు కాదు. రెండు వేల ఏళ్ల క్రితం మధ్యధరా సముద్రంపై ఆధిపత్యం కోసం రోమ్ సామ్రాజ్యం ఆర్థికంగా ఎదుగుతున్న అప్పటి కార్తేజ్ నగరాన్ని ధ్వంసం చేయటానికి సాకులు వెతికేది. అది క్షీణించినా... అప్పటి రోమన్ సెనెటర్ కాటో ఏ సమస్యపై చర్చ మొదలెట్టినా కార్తేజ్పై.. కత్తిదూయటం అవసరమంటూ ప్రసంగం ముగించేవాడంటారు. కనీసం కార్తేజ్కు రోమ్పై దండయాత్ర చేసిన చరిత్రయినా ఉంది. కానీ ఇరాన్కు కనీసం ఆ నేపథ్యమైనా లేదు. అయినా అమెరికా, దాని మిత్ర దేశం ఇజ్రాయెల్ అకారణంగా దానిపై విరుచుకుపడటం అలవాటుగా చేసుకున్నాయి. నిరుడు అధికారంలోకొచ్చిన ఆర్నెల్లకే ట్రంప్ అకారణంగా ఇరాన్పై 12 రోజులపాటు యుద్ధం సాగించారు. ఈసారి ఒప్పందానికి చేరువలో ఉన్నామని అమెరికా బృందం ప్రకటించిన మర్నాడే దురాక్రమణకు పూనుకున్నారు. ఇరాన్ తదుపరి అధినేతను తానే నిర్ణయించగలనంటూ ట్రంప్ ప్రకటించిన రెండు రోజులకే అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని ఎంపిక చేసినట్టు ఆ దేశం ప్రకటించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయటం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు కష్టం కాకపోవచ్చు. కానీ అవి రెండూ యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతినటం ఖాయం. యుద్ధం దుష్ప్రభావం స్టాక్ మార్కెట్ పల్టీలు దాటి సాధారణ జనజీవనంపై పడటం మొదలైంది. మన దేశంలో అనేక నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా మూతబడ్డాయని వార్తలందుతున్నాయి. బాస్మతి బియ్యం, పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయి రైతాంగం నానాకష్టాలూ పడుతోంది. పశ్చిమాసియా దేశాల్లోని దాదాపు కోటిమంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమాత్రం వెసులుబాటు దొరికినా స్వస్థలాలకు చేరుకోవాలని ఆత్రుత పడుతున్నారు. హోర్మూజ్ జలసంధి దిగ్బంధంతో వందలాది చమురు, గ్యాస్ రవాణా నౌకలు నిలిచిపోగా, సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిపై కోత విధించటంతో బ్యారెల్ చమురు ధర దాదాపు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి... అంటే వంద డాలర్లకు చేరుకుని భయపెడుతోంది. అది 120 డాలర్లకు చేరుకుంటే తప్ప దేశంలో చమురు ధరలు పెరగబోవని కేంద్రం చెప్పటం స్వల్ప ఊరట.యుద్ధానికి ముందే ట్రంప్ విధానాల పర్యవసానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ గుడ్లు తేలేయటం మొదలుపెట్టింది. ఈ యుద్ధం దాన్ని మరింత కుంగదీస్తుంది. పాశ్చాత్య దేశాలతో ఇప్పటికే దానికున్న పొరపొచ్చాలు పెరగటంతోపాటు పశ్చిమాసియ దేశాలు సైతం మునుపటి మాదిరి అమెరికాకు ‘బ్లాంక్ చెక్’ ఇచ్చే అవకాశం లేదు. తమ దగ్గరున్న అమెరికా స్థావరాల పరిధులేమిటో, పరిమితులెలా ఉండాలో అవి నిర్ణయిస్తాయి. తాను శత్రువనుకున్న దేశంపై ఏకపక్షంగా దాడులు చేయటానికి అనుమతించబోవు. ‘ఇరాన్తో యుద్ధం అంతులేనిదీ, దీర్ఘకాలం సాగేదీ కాదు...’ అంటూ అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ ఆయనకు తెలియాల్సింది ఏమంటే... దాన్ని మొదలెట్టింది తామే అయినా ముగింపు నిర్ణయించేది ఇరాన్ మాత్రమే! -
నేపాల్పై యువకేతనం
ఉవ్వెత్తున ఎగసిన నేపాల్ యువ తరంగంలో ఆర్నెల్లు దాటుతున్నా ఆగ్రహాగ్ని చల్లారలేదని, దాని సంకల్పం చెదరలేదని గత గురువారం నాటి పార్లమెంటు ఎన్నికలు నిరూపించాయి. నేరుగా ఎన్నికలు జరిగిన 165 స్థానాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్ఎస్పీ) 125 సొంతం చేసుకుని ప్రజాస్వామ్యంతో ఇన్నాళ్లూ చదరంగమాడిన ప్రధాన పక్షాలన్నిటినీ తీవ్రంగా దెబ్బతీసింది. మరో 110 మందిని ఆ యా పార్టీలకొచ్చిన ఓట్ల శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. ఏ పార్టీకీ తిరుగులేని మెజారిటీ ఉండరాదన్న ఆలోచనతో నేపాల్ దేశ రాజ్యాంగంలో ఈ ప్రాతినిధ్య నిష్పత్తి విధానాన్ని పొందుపరిచారు. తీరా ఆర్ఎస్పీ దాన్ని సైతం అధిగమించి మూడింట రెండొంతుల మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. గెలుపు కోసం ప్రచార పటాటోపం, విచ్చలవిడి వ్యయం అవసరం లేదని, కేవలం హ్యాష్టాగ్లే ప్రత్యర్థులను మట్టికరిపిస్తాయని ఆర్ఎస్పీ నిరూపించింది. కీలకమైన అంశం ఏమంటే పట్టణాలు, పల్లెల వ్యత్యాసం లేకుండా అన్నిచోట్లా వామపక్షాలు, నేపాలీ కాంగ్రెస్ పార్టీ గల్లంతయ్యాయి.నేపాల్ మాదిరే శ్రీలంక, బంగ్లాదేశ్లలో కూడా యువత తిరగబడి పాలకులు పదవులు వదిలి పారిపోయేలా చేసింది. కానీ ఆ రెండుచోట్లా ఎన్నికల సమయానికల్లా సంప్రదాయ పక్షాలు ప్రత్యక్షమయ్యాయి. శ్రీలంకలో 1960లో ఏర్పడిన జనతా విముక్తి పెరుమున(జేవీపీ), బంగ్లాలో 1980లో ఆవిర్భవించిన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) విజేతలయ్యాయి. అక్కడ ఉద్యమంలో ముందుండి పనిచేసిన యువతకు అధికారంలో చోటు దక్కలేదు. కానీ నేపాల్ పరిస్థితి వేరు. సామాజిక మాధ్యమాల నిషేధంతో ఆగ్రహించి వీధుల్లోకొచ్చిన యువతకు ఆర్ఎస్పీకి చెందిన 35 ఏళ్ల బాలేంద్ర షా, ఇతర నేతలు మార్గదర్శనం చేశారు. వారితోపాటే నడిచారు. వారికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇచ్చారు. పర్యవసానంగా ఈసారి ఎన్నికల్లో పార్టీల, నాయకుల కంచుకోటలు అనుకున్నవి తునాతునకలయ్యాయి. వీటన్నిటా గతానుభవం లేని యువత విజేతలయ్యారంటే సాధారణ ప్రజానీకం పాత తరంతో ఎంత విసుగెత్తిపోయారో అర్థం చేసుకోవచ్చు. అజేయుడనుకున్న మాజీ ప్రధాని కేపీ ఓలిశర్మ... బాలేంద్ర షా చేతిలో అవమానకరమైన రీతిలో ఓటమి పాలయ్యారు. ఒకప్పుడు విప్లవ వీరుడిగా నీరాజనాలందుకున్న మావోయిస్టు సెంటర్ నాయకుడు ప్రచండ అతి కష్టం మీద గట్టెక్కారు. ఆయన పార్టీకి ఒక డజను స్థానాలు మించి వచ్చే అవకాశం లేదు.అయితే ప్రధాని కాబోతున్న బాలేంద్ర షా ముందు ఎవరెస్టు శిఖరాన్ని తలపించేలా సమస్యలున్నాయి. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆర్థిక వ్యత్యాసాలు ఆ దేశాన్ని పీడిస్తున్నాయి. ఉద్యోగాలు లేక జనాభాలో మూడోవంతు మంది చిన్నా చితకా ఉద్యోగాల కోసం భారత్ సహా పలు దేశాలకు వలస పోతున్నారు. వారు ప్రతి నెలా కుటుంబాలకు పంపే డబ్బే నేపాల్ ఆర్థిక వ్యవస్థకు ఆలంబన. నేపాల్ జీడీపీలో ఇది 28 శాతం. జలవిద్యుదుత్పాన మినహా ఖజానా కళకళలాడటానికి తోడ్పడే సహజ వనరులు లేవు. లోటు ఆర్థిక వ్యవస్థ, అరకొర వేతనాలు నేపాల్కు శాపాలు. మన దేశం తోడ్పాటునిస్తే ఉపాధి కల్పనకు బాటలు పరిచే ప్రాజెక్టులు వస్తాయని యువత ఆశిస్తోంది. అందుకే కావొచ్చు... ప్రతి ఎన్నికల్లోనూ రివాజుగా కనబడే భారత వ్యతిరేకత ఈసారి దాదాపు కనుమరుగైంది. సుస్థిర పాలన వుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారు. అది లేకపోవటమే నేపాల్ ఎదుగుదలకు ఇన్నాళ్లూ ఆటంకంగా మారింది. పాలన అంటే నిరసనోద్యమాలు నడపటమంత సులభం కాదు. ఉద్యమకారుడి గెటప్ నుంచి సమర్థ పాలకుడిగా బాలేంద్ర పరివర్తన చెందాల్సి ఉంది. అసలే కోవిడ్ మహమ్మారితో విదేశాల్లో కొలువులు కొడిగడితే, వర్తమాన పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆ సమస్యను మరింత పెంచాయి. లుంబినీ వనం, ఎవరెస్టు శిఖరం ఉన్నా పర్యాటక రంగం ఎదుగుదల లేదు. ఇవన్నీ మళ్లీ పట్టాలెక్కాలంటే పారదర్శక పాలన, నిపుణుల తోడ్పాటు, ఇరుగుపొరుగు ఆపన్న హస్తం అవసరం. మూణ్ణెల్లు గడిస్తే చాలు... జనం నిలదీయటం మొదలుపెడతారు. గత పాలకుల కన్నా భిన్నమైనవాడినని నిరూపించుకోవటం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలన అందించటం బాలేంద్రకు తక్షణ సవాళ్లు. -
పేరు మాయని మనిషి
అసలైన సాహిత్యజీవికి వర్తమానం ఎలాంటి కిరీటమూ పెట్టకపోవచ్చు, కానీ చరిత్ర అతడిని తగిన విధంగా ఆశీర్వదిస్తుందనడానికి ఐజాక్ బేబెల్ జీవితమే ఉదాహరణ. అయితే ఆ వర్తమానపు విషాదం చరిత్ర ఎప్పటికీ తుడుచుకోలేని మచ్చ. ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగమైన ఉక్రెయిన్లో జన్మించిన ఈ యూదు తన మాతృభాష యిడ్డిష్ను కాదని రష్యన్ను రచనా భాషగా ఎంచుకున్నాడు. సోవియట్ రష్యా ఆకాంక్షలకు అనుగుణంగా నిలిచాడు. పోలిష్–సోవియట్ యుద్ధ సమయంలో రచయిత గోర్కీ సూచన మీద పాత్రికేయుడిగా పనిచేసిన బేబెల్ ఆ యుద్ధం తాలూకు చీకటి, బీభత్సాల చేదు వాస్తవికతను ‘రెడ్ కావల్రీ’ కథలుగా అందించాడు. 1926లో తొలిసారి ప్రచురితమైన ఈ కథలకు ఇది శతాబ్ది సంవత్సరం.అత్యంత సంక్షిప్తంగా రాయడం, ఉన్నట్టుండి కథను మరో తలంలోకి కొనిపోవడం, ‘సాల్ట్’ కథ గురించి బోర్హెస్ అన్నట్టు– కవిత్వానికే సాధ్యమై మననానికి వీలుండే లయను కథలో సాధించడం బేబెల్ గొప్పతనం. రెడ్ కావల్రీ, తను పుట్టి పెరిగిన ఒడెస్సా పట్టణం నేపథ్యంలో ‘ఒడెస్సా స్టోరీస్’, ఇంకా రెండు నాటకాలు, ఒక సినిమాకు స్క్రీన్ప్లే మాత్రమే రాసిన బేబెల్(1894–1940) వచనంలో కరుణ, కాఠిన్యం కలగలసి మనసును మెలిపెడతాయి. యుద్ధభూమి తాలూకు బహుముఖ పార్శా్వలనూ, అత్యంత సున్నితమైన మనిషి కూడా అనూహ్య కార్యాలకు సిద్ధమయ్యే విపరిణామాలనూ ఆయన చిత్రించాడు. సాధారణ జీవితం గడపాలని కోరుకుంటూ రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్న నిస్సహాయ మానవులు అందులో కనబడతారు. చావు వాసన వేసే కథలు ఆయనవి! యుద్ధం అనేది యుద్ధ క్షేత్రానికే పరిమితమై ఉండదని కూడా ఈ కథలు చెబతాయి.కమ్యూనిస్టు వ్యతిరేకి కాకపోయినా బేబెల్ ప్రాపగాండా వ్యతిరేకి. దాంతో విమర్శను తట్టుకోలేని రాజ్యం ఆయన్ని సోవియట్ యూనియన్లో ‘నాన్–పర్సన్’ చేయడానికి పూనుకుంది. 1933 నుంచే ఆయన పుస్తకాలను ఉపసంహరించడం మొదలైంది. స్టాలిన్ హయాంలోని ‘సామ్యవాద వాస్తవికత’కు తగ్గట్టుగా రచయితలు తమ పాత రచనలను తిరగరాస్తున్న వేళ, తనను తాను సరిచేసుకోవడం ఇష్టంలేని బేబెల్ మౌనం అనే కొత్త సాహిత్య ప్రక్రియలో రాణిస్తున్నానని చెప్పుకొన్నాడు. ఇక ‘ప్రజా శత్రువు’గా అరెస్టయిన తర్వాత బేబెల్ మీద ట్రాట్స్కీయిస్టు, ఉగ్రవాదం, గూఢచర్యం లాంటి కేసులు పెట్టారు. ఆయన పేరును సాహిత్య నిఘంటువుల్లోంచీ, ఎన్సైక్లోపీడియాలోంచీ తొలగించారు. ఆయన గురించి ఏ సాహిత్య కార్యక్రమంలోనూ ఎత్తడానికి లేదు. బేబెల్ అనే మనిషి లేనట్టుగానే వ్యవహరించారు. ఆధునిక సోషల్ మీడియా యుగంలో జడలు విప్పిన ‘క్యాన్సిల్ కల్చర్’ అనేదానికి ఆ కాలంలో బీజాలున్నాయి. 1940 జనవరి 16న పార్టీకీ, సోవియట్ ప్రభుత్వానికీ శత్రువులైన 457 మంది జాబితా స్టాలిన్కు అందింది. అందులో బేబెల్ సహా 346 మందిని కాల్చేయాలన్న సిఫారసు ఉంది. జనవరి 27న మధ్యాహ్నం 1:30కు 45 ఏళ్ల బేబెల్కు కాల్చివేత శిక్ష అమలైంది. బేబెల్ సమగ్ర రచనలను ఆంగ్లంలోకి అనువదించిన పీటర్ కాన్స్టంటీన్ ఈ మరణ శిక్షను ‘ఇరవయ్యో శతాబ్ద సాహిత్యపు అతి దారుణ విషాదాల్లో ఒకటి’గా అభివర్ణించారు. 1954లో కృశ్చేవ్ పాలనలో బేబెల్ను నిరపరాధిగా ప్రకటించిన తర్వాతగానీ ఆయన రచనలు మళ్లీ వెలుగు చూడలేదు.రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ తన గతాన్ని పునఃసమీక్షించుకుంటూ, కొత్త చరిత్రను లిఖించకుంటున్న వేళ, అక్కడి మేధావర్గంలో బేబెల్ మీద సంక్లిష్ట స్పందన ఉంది. కానీ ’(ఉక్రెయిన్) అంధత్వం, అశక్తత, ఆ ఆశక్తత లోంచి పుట్టిన తెలియని కఠినత్వం’ గురించి రాసిన బేబెల్ సృజన విస్మరించలేనిదని పొలిటికల్ సైంటిస్ట్ వాలెంటీన్ బుషాన్స్కీ అంటారు. ఒక దిశ లేకుండా పుస్తకాలు చదువుతున్న భార్య ఆంటోనినా పీరుష్కోవాకు అనవసర పుస్తకాల మీద సమయం వృథా చేసుకోకుండా ముఖ్యమైన క్లాసిక్స్ ఏవి చదవాలో ఒక జాబితా ఇస్తాడు బేబెల్. చదవడం ఎంత ముఖ్యమో, ఏవి చదవాలో తెలియడం అంతకన్నా ముఖ్యం. ఆ జాబితాలో మనం బేబెల్ను కలుపుకోవచ్చు. -
ఏపీ సర్కార్ రాజ్యాంగ ఉల్లంఘన
చంద్రబాబు నాయుడు రాజకీయ ఎజెండాలోకి ఇప్పుడు కొత్త మాటలు కావాలి. రికార్డులు అరిగేలా పదేపదే పాడేసిన పాత పాటలు ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. ఇరవై మాసాల్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకుందామంటే ‘క్రెడిట్ చోరీ’ దొంగాట వెక్కిరిస్తున్నది. ‘సంపద సృష్టి’ అనే మాటకు యెల్లో నిఘంటువు అర్థం ‘రుణ సమీకరణ’ అని తేలిపోయింది. తన రాజకీయ వారసత్వం కొనసాగాలంటే తుప్పు పట్టిన అస్త్రతూణీరం అక్కరకు రాబోదని అర్థమైంది. కొత్త బాణాలు కావాలి. అరువు తెచ్చుకున్న నయా తత్వాలు పాడేందుకు సరికొత్త బాణీలు కావాలి. వాటినెలా సాధించాలి? కిం కర్తవ్యం అన్న ప్రశ్నకు ఒకే ఒక మార్గాంతరం ఆయనకు కనువిప్పు కలిగించినట్టుంది.‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అంటూ మతాన్ని పులిమేసుకోవడం మొదలుపెట్టారు. మతాన్ని రాజ కీయాలతో ముడిపెట్టకూడదన్న రాజ్యాంగ స్ఫూర్తినీ, సర్వోన్నత నాయ్యస్థానాల ఆదేశాలనూ ఆయన గణించదలుచుకోలేదు. మనుగడకు మరో మార్గం లేదేమో! ‘ఉదర పోషణార్థం బహుకృత వేషం’ అన్న నానుడి చందంగా అవసరార్థం మత వేష ధారణ. ఆషాఢభూతిని ఆదర్శంగా తీసుకునేవారికి మతమైనా, రాజకీయమైనా ఒకటే. మతం కూడా రాజకీయమే. ఈ కొత్త వేషంలో ఆయనకింకో సౌలభ్యం ఉన్నది. తాను ప్రవచించే తాజా తాత్విక ధారలో కరిగి, జనం ఐహిక విషయాలు వదిలేయాలి. ఆ ట్రాన్స్లో మైమరిచిపోవాలి. ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేశానంటే తలలూపాలి. ఇరవై మాసాల్లో ఆరు లక్షల ఉద్యోగాలిచ్చేశానంటే నమ్మేయాలి. తన పేరును పఠించ గానే ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులుగా పరుగెత్తుకొని వచ్చా యంటే నిజమే అనుకోవాలి. ఇంకో ఇరవై లక్షల ఉద్యోగాలను చిటికేసి ఇచ్చేస్తానంటే మహాప్రసాదమని మురిసిపోవాలి.చంద్రబాబు, ఆయన పార్టీ, కూటమి కలిసి మత ఎజెండాను ముందు పెట్టుకొని రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తు న్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపం మీద గతంలో ఎన్నడూ లేని విధంగా దాడి చేస్తున్నారు. అందుకోసం చట్టసభలను కూడా వేదికలుగా చేసుకోవడానికి తెగించడం తీవ్రంగా ఆందో ళన కలిగిస్తున్నది. ‘‘... శాసనము ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతా చూపుతాననీ...’’ అంటూ ప్రమాణాలు చేసి చట్టసభల్లో ప్రవేశించిన నేతలు ఒట్టు తీసి గట్టుమీద పెట్టి రాజ్యాంగం పట్ల విద్రోహపూరితంగా మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ ఉభయ సభల్లో ఈవారం చోటు చేసుకున్నాయి. శాసన మండలిలో గౌరవ సభాధ్యక్ష స్థానాన్ని ఉద్దేశించి రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు విజ్ఞులందరికీ దిగ్భ్రాంతిని కలిగించాయి. ‘మీరు క్రిస్టియన్! మీ నాయకుడు క్రిస్టియన్. వెంకటేశ్వర స్వామిపై కక్ష కట్టారు. యేసు మాత్రమే దేవుడా... వెంకటేశ్వరస్వామి కాదా?’... ఈ రక మైన వాచాలతతో ఆయన చెలరేగి పోయారు. శాసనసభలో మంత్రులు మాట్లాడే మాటలను ప్రభుత్వ వాణిగానే పరిగణిస్తారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. తాను ఒక మతానికి ప్రతి నిధి అన్నట్టుగా వకాల్తా పుచ్చుకొని మాట్లాడినట్టుగా ఆయన భాషావేశం, భావాభినివేశం తేటతెల్లం చేస్తున్నాయి. ఇది సంపూ ర్ణంగా రాజ్యాంగ సూత్రాల ఉల్లంఘన. శాసనసభ్యునిగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా రాజ్యాంగానికి ఆయన అవిధేయతను ప్రకటించినట్టే పరిగణించాలి.భారత్ను లౌకిక (సెక్యులర్) రిపబ్లిక్గా మన రాజ్యాంగ పీఠిక ప్రకటించింది. లౌకికత్వమనేది రాజ్యాంగ మౌలిక స్వరూ పంలో భాగమనీ, అది అనుల్లంఘనీయమైన ప్రాథమిక హక్కు అనీ సర్వోన్నత న్యాయస్థానం వివిధ తీర్పుల్లో ప్రకటించింది. ఏ మతాన్నీ అధికారిక మతంగా రాజ్యాంగం గుర్తించలేదు. అన్ని మతాల పట్ల సమాన గౌరవాన్నీ, సమాదరణనూ ప్రకటించింది. మత, కుల, ప్రాంత, లింగభేదాల ఆధారంగా ఎటువంటి వివక్షా లేదని ప్రాథమిక హక్కుల్లోని 15వ అధికరణం స్పష్టం చేసింది. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఒక మతం పట్ల ప్రత్యేక అభిమానంతో వ్యవహరిస్తే అది రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినట్టేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై 356వ అధిక రణం కింద చర్య (ప్రభుత్వ బర్తరఫ్) తీసుకోవచ్చునని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మతాన్ని రాజకీయాలతో ముడి వేయడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.గౌరవ సభాధ్యక్షులు తాను క్రిస్టియన్ కాదు, హిందువునని చెప్పినందువలన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని అచ్చెన్నాయుడు మండలిలో చెప్పారు. అంటే సభాధ్యక్ష స్థానంలో హిందూయేతర వ్యక్తి కూర్చుని ఉంటే అతని మీద నిందలు మోపవచ్చునా? సభాధ్యక్షుడు క్రిస్టియన్ అయ్యుంటే తన మాటలను వెనక్కు తీసుకునేవాడిని కాదనే అర్థం ఆయన స్పందనలో ధ్వనించింది. ఇది కచ్చితంగా మత విద్వేష ప్రకటన. మత విషయాల్లో రాజ్యాంగ యంత్రాంగం తటస్థ పాత్ర పోషించాలన్న రాజ్యాగ స్ఫూర్తిని అవహేళన చేశారు. శాసన సభ్యునిగా తాను చేసిన ప్రమాణాన్ని గాలికొదిలి రాజ్యాంగ అవిధేయతకు ఆయన పాల్పడ్డారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానాల తీర్పులను కూడా ఆయన ఖాతరు చేయలేదు.శాసన మండలిలో అచ్చెన్నాయుడు ప్రహసనం గురువారం నాడు చోటుచేసుకున్నది. శుక్రవారం నాడు శాసనసభలో స్వయానా ముఖ్యమంత్రే అచ్చెన్న పాటకు కోరస్ అందు కున్నారు. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక భారతదేశ చరిత్రలో బహుశా పార్లమెంట్లో గానీ, రాష్ట్రాల శాసనసభల్లో గానీ ఏ ప్రధానీ, ఏ ముఖ్యమంత్రీ ఈ తరహాలో మాట్లాడి ఉండరు. ‘ఏసుక్రీస్తుకయితే క్షమాపణ చెబుతారా... వెంకటేశ్వర స్వామికి మాత్రం చెప్పరా’’ అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తిరుమలలో ఆధ్యాత్మికవేత్తలూ, వేద పండితులూ వద్దువద్దని వారిస్తున్నా వినకుండా వేయికాళ్ల మండపాన్ని కూల్చేసిన చంద్రబాబే ఈ ప్రశ్న వేశారు. ఆధ్యాత్మిక సుధలను అనుదినం ప్రవర్ధితం చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్ ప్రభుత్వం ప్రారంభించిన ఎస్వీబీసీ భక్తి ఛానల్ ఎందుకూ, డబ్బులు దండ గని ఈసడించుకున్న చంద్రబాబే వెంకన్నకు క్షమాపణ చెప్పరా అని ప్రశ్నిస్తున్నారు. ‘50 కోట్ల ఖర్చుతో భగవద్గీత పుస్తకాలు అచ్చేశారు. ఏముంది అందులో, ఆ పుస్తకాలను చూస్తే మొహాన ఉమ్మేస్తార’ని చెబుతున్న టీటీడీ బోర్డు అధ్యక్షుని మీద ఈగ వాలకుండా కాపుకాస్తున్న ముఖ్యమంత్రే ఈ ప్రశ్న వేస్తున్నారు.దేవుని మీద నిజమైన భక్తి విశ్వాసాలు ఉన్నవారు ఎవరైనా తనకు తెలిసో, తెలియకో తన వల్ల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అపచారం జరిగిందని భావిస్తే తప్పనిసరిగా క్షమాపణ కోరు తారు. దేవుడిపై నమ్మకం ఉండేవారు శివుడూ, వేంకటేశ్వరుడూ, ఏసుక్రీస్తూ, అల్లా అనే తేడాలు చూడరు. అన్ని రూపాల్లోని అన్ని విశ్వాసాల్లోని దైవత్వాన్ని ఆరాధిస్తారు. ‘మీ దేవుడూ, మా దేవుడూ’ అనే మీమాంస భక్త వేషధారులకుంటుందేమో గానీ భక్తి విశ్వాసాలు కలవారికి ఉండదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి శాసనసభ సాక్షిగా ఒక మతం తరఫున వకాల్తా పుచ్చుకొని రాజ్యాంగం నిర్దేశించిన ‘రాజ్య తటస్థత’ నియమాన్ని బాబు ఉల్లంఘించారు.రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే కాదు... సత్యదూరమైన విషయాన్ని ప్రశ్నగా సంధించి ఆయన సభను తప్పుదోవ పట్టించారు. ఏడుకొండల స్వామికి క్షమాపణ చెప్పవలసింది ఎవరు? ప్రభుత్వం ప్రచారం చేసినట్టు జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ స్పష్టం చేసినా కూడా ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని వాదిస్తున్నారు కదా! ఆ నెయ్యి శాంపుల్స్ ఎప్ప టివి? చంద్రబాబు ముఖ్యమంత్రయిన కొన్నాళ్ల తర్వాత టీటీడీ నాణ్యతా పరీక్షలో విఫలమైన నాలుగు ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలివి. పరీక్ష ఫెయిలైన ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. ఆ శాంపిల్స్ను పరీక్ష కోసం బాబు నియమించిన ఈవో శ్యామలరావు ఎన్డీడీబీకి పంపించారు. వెనక్కు మళ్లిన ట్యాంకర్లు ఎన్నడూ లేని విధంగా బాబు ఏలుబడిలోనే తొలి సారిగా డెయిరీ లేబుళ్లు మార్చుకొని తిరుమలకు వెళ్ళాయి.కూటమి పాలనా కాలంలో, కూటమి నియమించిన ఈవో పంపించిన నెయ్యి శాంపిల్స్లో కల్తీ జరిగి ఉంటే అందుకు ఎవరు బాధ్యత వహించాలి? నాణ్యతా పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు మళ్లీ తిరుమలలోకి ప్రవేశించాయంటే అందుకు ఎవరిని నిందించాలి? వైసీపీ పాలనా కాలం నుంచే టీడీడీలో నాణ్యతా పరీక్షలకు ఏర్పాట్లున్నాయి. అప్పుడు కూడా చాలా సార్లు పరీక్షలో విఫలమైన ట్యాంకర్లు వెనక్కు మళ్లాయని రికార్డులు చెబుతున్నాయి. అయినా, 2024 జూలై తర్వాత వచ్చిన శాంపిల్స్ను పరీక్షించి అంతకుముందు కాలంలో కల్తీ జరిగిందని తీర్పులు చెప్పడం ఎలా కుదురుతుంది? ఈ ఆరోపణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? ‘మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మా మూతులు వాసన చూడండి’ అన్నాడట వెనుకటికి ఒకాయన! కూటమి తీరు ఆ విధంగానే ఉన్నది.ఆదాయ వనరుల్లేని వేలాది చిన్న దేవాలయాల్లో దీప ధూప నైవేద్యాలకు నిధులనూ, అర్చక స్వాములకు భృతినీ ఏర్పాటు చేసిన రాజశేఖరరెడ్డి మీద, తిరుమలేశుని వైభవానికి దిగంతాల దాకా ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో వేలాది ఆలయాలను నిర్మించిన జగన్మోహన్రెడ్డి మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి కూటమి సర్కార్ పడరాని పాట్లు పడుతున్నది. ‘బట్ట కాల్చి మీదేస్తాం’ అనే బరితెగింపు ధోరణి ఇది. ఏడు కొండలూ తిరుమలేశునికే చెందుతాయని వైఎస్సార్ సర్కార్ ఇచ్చిన జీవోను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పిందెవరు? ఆ వీడియోలు బహుళ ప్రచారంలో ఉన్నాయి. అవి ఫేక్ వీడియోలని ఇంకా ప్రకటించలేదెందుకో? ఏ హిందూ పీఠాధి పతులు చెప్పారని తిరుమలలోని వేయికాళ్ల మండపాన్ని కూల్చి వేశారు? వెంకటేశ్వరుని సేవకు ఆధ్యాత్మిక ఛానల్ ఎందుకు, డబ్బులు దండగన్నది ఎవరు? హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతలో ఏమున్నదని ఎవరి హయాంలోని టీటీడీ అధ్యక్షుడు హేళన చేశారు? ‘దళిత గోవిందం’ పేరుతో శ్రీవేంకటేశ్వర మహాత్మ్యాన్ని దళితవాడల్లో వినిపించిన పాలకు లపై హిందూ వ్యతిరేక ముద్ర వేయాలని చూడటం ఎంత దిగజారుడుతనం?... ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్లు!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
బిహార్లో ‘జాతీయ’ గీతం!
ఊహించని నిర్ణయాలతో తరచు అందరినీ ఆశ్చర్యపరిచే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈసారి మాత్రం దిగ్భ్రాంతిలో ముంచెత్తారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుని గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయటంతో జేడీ(యూ) అగ్రనాయకులే ఖిన్నులయ్యారు. వారికి కేవలం కొన్ని గంటలముందు మాత్రమే తెలిసింది మరి. పదేళ్లుగా తన పదునైన వ్యూహాలతో దేశంలో బీజేపీ ఎదుగుదలకు చక్రం తిప్పుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాయే ఈ ఊహించని పరిణామానికి కూడా బాధ్యులని మీడియా కథనాలు చెబుతున్నాయి. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నితీశ్ వాస్తవానికి తన కుమారుడికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని నెల్లాళ్లుగా బీజేపీ అగ్రనేతలను అడుగుతూ వస్తున్నారు. తీరా ఆయన హఠాత్తుగా స్వరం మార్చారు. మధ్యమధ్య కొత్త పొత్తులతో జనం ముందుకెళ్తున్నా మెజారిటీ కాస్త అటూ ఇటూఅయింది తప్ప గత 20 సంవత్సరాలుగా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగారు. తాను రాష్ట్రంలో ఉభయ సభలతోపాటు లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేశాననీ, రాజ్యసభకు వెళ్లలేదన్న అసంతృప్తిని పోగొట్టుకోవటానికే తాజా నిర్ణయం తీసుకున్నాననీ ఆయన చెబుతున్న మాటల్ని మద్దతుదారులు విశ్వసించటం లేదు. పార్టీలో అంతఃకలహాలు, సహకరించని ఆరోగ్యం ఆయన తాజా నిర్ణయానికి కారణమన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.బిహార్ రాజకీయాలపై నితీశ్ ముద్ర చెరగనిది. 1974 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమ నేతగా ముందుకొచ్చిన విద్యార్థి నాయకుల్లో నితీశ్ ఒకరు. 90వ దశకం నుంచీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనదే కీలక భూమిక. తనతోపాటు రాజకీయాల్లో అడుగుపెట్టిన లాలూ ప్రసాద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్లతో పోలిస్తే నితీశ్ వ్యూహ చతురత గలిగినవారు. అందుకే ‘సామాజిక న్యాయ’ రాజకీయాల ప్రభావం గణనీయంగా ఉన్న రాష్ట్రంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో లేని కుర్మీ సామాజిక వర్గం నుంచి వచ్చినా అందరినీ ఆకట్టుకోగలిగారు. అత్యంత వెనుకబడిన కులాలకూ(ఈబీసీ), దళితుల్లో అట్టడుగు వర్గాలకూ పదవుల పంపకంలో ప్రాధాన్యమీయటంతోపాటు తన కుర్మీ సామాజిక వర్గాన్నీ, కుష్వాహాలనూ ఏకం చేశారు. ఆయన విజయాలకు ఈ సమీకరణాలొక్కటే కాదు... వాటితోపాటుæరాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించి ‘మంచి పాలన’ అందిస్తున్నా రన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించగలిగారు. ఆయనకు ‘సుశాసన్ బాబు’ అనే పేరు వచ్చింది అందుకే!కూటమిలో జూనియర్ భాగస్వామిగా చేరినా, అచిరకాలంలోనే అగ్రభాగానికి ఎగబాకుతుందని బీజేపీపై ఇప్పటికే ముద్రపడింది. మహారాష్ట్రలో జరిగింది ఇదే. ఇప్పుడు బిహార్లోనూ ఇదే కొనసాగుతోంది. కేంద్రంలో ఎన్డీయే మనుగడకు జేడీ(యూ) మద్దతు తప్పనిసరైనా, రాష్ట్రంలో ఆ పార్టీ సారథ్యాన్ని తప్పించటం చిన్న విషయమేమీ కాదు. 2020 ఎన్నికల్లో తొలిసారి జేడీ(యూ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో బీజేపీ కన్నా తనకు అదనంగా ఒక్క స్థానమైనా కావాలని పట్టుబట్టి తీసుకున్న ఆ పార్టీకి తీరా 43 మాత్రమే లభించాయి. బీజేపీకి ఆ ఎన్నికల్లో వచ్చినవి 74. అందుకే సీఎం పదవి నిలుపుకోవటంపై సంశయం ఏర్పడి నితీశ్ మధ్యలో ఆర్జేడీ వైపు వెళ్లారు. ఆ చెలిమి ఎన్నాళ్లో కొనసాగలేదు. తిరిగి ఎన్డీయే గూటికి చేరారు. మొన్న నవంబర్లో జేడీ(యూ)కు 85 లభించగా, బీజేపీ గెల్చుకున్నవి 89. అధిక స్థానాలున్న పక్షంగా సీఎం పదవి అడగాల్సి ఉన్నా తాత్కాలికంగా బీజేపీ వెనక్కుతగ్గింది. అదును చూసి నాలుగు నెలల్లో సాధించింది. పార్టీకి ప్రధాన వనరైన మహిళలు, రైతులు బీజేపీ వైపు మొగ్గుతున్నారన్న సమాచారంతో జేడీ(యూ) నేతలు అప్రమత్తమవుతున్నట్టు కథనాలు వచ్చాయి. అందుకే ఇక ఆలస్యం చేయరాదని బీజేపీ భావించినట్టు కనబడుతోంది.నితీశ్ నిష్క్రమణ, బీజేపీ ఆగమనంతో బిహార్ రాజకీయాల్లో సోషలిస్టు నేపథ్యంగల ప్రాంతీయ పార్టీల పాత్ర కొడిగడుతుంది. రాజ్యసభకు వెళ్లినా బిహార్లో తన ముద్రఉంటుందని నితీశ్ చెబుతున్నా అది ఆచరణలో సాధ్యపడదు. ఒకటి నిజం – ఇప్పటికీ బిహార్ నిరుపేద రాష్ట్రాల్లో ఒకటిగానే ఉంది. తన ఏలుబడిలో బీజేపీ దాని ముఖచిత్రాన్ని ఏ మేరకు మార్చగలదో వేచిచూడాలి. -
అక్షరాలా ఉగ్రవాద చర్య
ఒకపక్క చర్చలు సాగుతుండగా అన్ని రకాల నీతి నియమాలనూ కాలదన్ని ఇరాన్పై దండయాత్ర ప్రారంభించిన అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దిగజారుడుతనం ఉన్నకొద్దీ మితిమీరుతోంది. మంగళవారం రాత్రి శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్ర జలాల్లో 130 మంది నావికులతో ప్రయాణిస్తున్న ఇరాన్ యుద్ధనౌక ‘ఐఆర్ఐఎస్ దేనా’పై జలాంతర్గామి ద్వారా దొంగదెబ్బ తీసి 92 మంది నావికుల మృతికి కారణం కావటం ఆ వరస లోనిదే. భారత నావికాదళం ఆహ్వానంపై విశాఖలో ‘మిలన్–2026’ నావికాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెడుతుండగా ఈ దాడి జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి అణు జలాంతర్గామి ద్వారా టార్పెడోను ప్రయోగించి నౌకను ధ్వంసం చేశామని అమెరికా సంబరంగా ప్రకటించుకుందిగానీ... ఈ చర్య అనేక విధాల ఖండనార్హమైనది. భద్రతా మండలిలో రష్యా, చైనాలు చెప్పినట్టు ‘అంతర్జాతీయ ఉగ్రవాద చర్య’. ఆ రెండు దేశాల వల్లా ఉద్రిక్తతలు పెరగటం ఒక్కటే కాదు... ఆ బాంబులు, క్షిపణుల్లో వాడే రసాయనాల వల్ల పర్యావరణానికి పెను ముప్పు కలుగుతుంది. ధ్వంసమైన నౌక నుంచి లీకవుతున్న చమురు వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని శ్రీలంక వ్యక్తం చేస్తున్న ఆందోళన కూడా సహేతుకమైనది. ఘర్షణ జరుగుతున్న ప్రాంతానికి ఆ నౌక వేలాది కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశాలకుండే సార్వభౌమత్వం వాటికి సంబంధించిన నౌకలకు సైతం వర్తిస్తుంది. ముఖ్యంగా ఘర్షణ ప్రాంతాల్లో కాక ప్రశాంత జలాల్లో పయనించే సైనిక నౌకలను ‘నిరపరాధ’ నౌకలంటారు. ముందస్తు సమాచారంతో వెళ్లే ఆ నౌకలపై ఎవరూ దాడి చేయరు. ప్రాదేశిక సముద్ర ప్రాంతం, దాని చేరువ ప్రాంత జలాల్లో వెళ్లే యుద్ధ నౌకల విషయంలో పాటించాల్సిన నీతిపై 1958లో అంతర్జాతీయ ఒడంబడిక కుదిరింది. దానిపై అందరితోపాటు అమెరికా కూడా సంతకం చేసింది. దాన్ని బేఖాతరు చేయటం దానికదే పెద్ద నేరం. ఇదెక్కడి రణనీతి? మన ఆహ్వానంపై వచ్చి వెడుతున్న అతిథి వంటిది ఆ నౌక. మన మిత్రదేశంగా ఉంటూ మన సంప్రదాయాలను ఉల్లంఘించి దానిపై దాడి చేయటం అమెరికా అమిత్ర చర్య. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని శాంతి మండలంగా ఉంచాలని దశాబ్దాలుగా మన దేశం చేస్తున్న కృషికి తూట్లు పొడవటం కూడా! మనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అణు జలాంతర్గామిని ఇటువైపు పంపడం ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం ఒడంబడిక రీత్యా కూడా అత్యంత దారుణమైనది. 2021లో కూడా ఎలాంటి సమాచారమూ లేకుండా లక్షద్వీప్ సమీపంలో అమెరికా నావికా విన్యాసాలకు తెగబడింది. అందుకే భారత నావికాదళ మాజీ అధిపతి అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ చెప్పినట్టు ఇది మన సరిహద్దుల్లోకి యుద్ధాన్ని విస్తరింపజేయటంతో సమానం. కనుక అమెరికాకు మన అసంతృప్తిని తెలియజేయటం అత్యంత అవశ్యం. మిలన్ అంటే స్నేహపూర్వక కలయిక లేదా సమ్మేళనం. అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు మన దేశం ఆ పేరు పెట్టడంలోనే సుహృద్భావం, సహకారం, ఐక్యత ధ్వనిస్తున్నాయి. అంతర్జాతీయ నిబంధనలు పాటిస్తూ సముద్ర జలాల భద్రత కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలన్నది ఈ సమ్మేళనం ఆంతర్యం. అన్నిటికన్నా ముఖ్యం– ప్రశాంత జలాల్లో ఇటువంటి దాడి జరిగితే గాయాల పాలైన నావికాదళ సభ్యుల్ని కాపాడటానికి ప్రయత్నించాలన్నది అన్ని దేశాల నావికా దళాలు పాటించే అలిఖిత నియమం. ఈ ఘనకార్యం తర్వాత అమెరికా జలాంతర్గామి కనీసం అక్కడ అర క్షణమైనా నిలబడే ప్రయత్నం చేయకుండా పరారైన తీరు సిగ్గుచేటైనది.అంతర్జాతీయ చట్టాలతోపాటు స్వదేశీ చట్టాలను కూడా ఉల్లంఘించి యుద్ధం మెదలెట్టిన ట్రంప్ తాను ఎవరికీ జవాబుదారీ కాదనుకుంటున్నారు. దీన్నెవరూ అంగీకరించకూడదు. అమెరికా, ఇజ్రాయెల్ల తప్పుడు చర్య వల్ల పశ్చిమాసియా రణరంగంగా మారి ఎగుమతులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరో నెల్లాళ్లవరకే వంటగ్యాస్ నిల్వలున్నాయంటున్నారు. దీనికితోడు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఆ రెండు దేశాల తప్పుడు చర్యను ఖండించటానికి ప్రభుత్వాలు సంశయిస్తున్న వేళ ఆ దేశాల ప్రజలతో సహా ప్రపంచమంతా ముక్తకంఠంతో నిరసిస్తే తప్ప ఈ దుండగం ఆగదు. -
మళ్లీ బలపడిన బంధం
దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఒకసారి దెబ్బతింటే అతుక్కోవటం అంత సులభం కాదు. అందుకు సుదీర్ఘ కాలం పడుతుంది. గత రెండేళ్లుగా అందుకోసం తెర వెనుక సాగిన ప్రయత్నాలన్నీ ఫలించి కెనడా ప్రధాని మార్క్ కార్నీ మన దేశంలో నాలుగు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన ఒప్పందాలు కూడా కుదిరాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రూ. 4.65 లక్షల కోట్లకు చేరుకునేలా ఇరుదేశాలూ కృషి చేయాలన్న నిర్ణయం జరిగింది. అలాగే అణు విద్యుదుత్పాదన కోసం ఇప్పుడు సరఫరా చేస్తున్న యురేనియంను మరింత పెంచటానికి కెనడా అంగీకరించింది. దీని విలువ రూ. 17,403 కోట్లు. ఇవిగాక పునరుత్పాదక ఇంధన వనరులతో సహా పలు అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు... రెండూ అకారణంగా ఇరాన్పై విరుచుకుపడుతున్న పర్యవసానంగా పశ్చిమాసియాతో పాటు ప్రపంచమంతా అలుము కున్న అస్థిర వాతావరణం నేపథ్యంలో భారత్, కెనడా తమ సంబంధాలను మెరుగు పరుచుకోవటం మంచి సందేశం పంపుతుంది.ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జార్ను గుర్తు తెలియని వ్యక్తులు 2023లో హతమార్చాక భారత్, కెనడాల సంబంధాలు దెబ్బతినటం నిజమే కావొచ్చు గానీ... అంతకు చాన్నాళ్లముందే అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో అనుసరించిన విధానాలు ఇరుదేశాల మధ్యా పొరపొచ్చాలు పెంచాయి. కెనడాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న సిక్కుల ఓటుబ్యాంకు కోసం ఆయన వేర్పాటువాదులను ప్రోత్సహించారు. భారత్లో నేరాలు చేసి వచ్చిన వేర్పాటువాదులను అప్పగించేందుకు ఆయన ప్రభుత్వం నిరాకరించేది. అందుకే 2018లో ట్రుడో మన దేశం పర్యటనలో ఘనమైన స్వాగత సత్కారాలు లభించలేదు. ట్రుడోను భారత్ అవమానించిందంటూ కెనడా మీడియా వ్యాఖ్యానించింది కూడా! నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నదంటూ కెనడా ఆరోపించటం, అక్కడి మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావటం అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత క్షీణించటానికి దోహదపడ్డాయి. వేర్పాటువాదులను ఆదరిస్తే జరిగేదేమిటో ట్రుడోకు నిరుడు ఏప్రిల్లో జరిగిన ఎన్నికలకు ముందే తెలిసొచ్చింది. ట్రుడో నాయకత్వం కొనసాగితే లిబరల్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు తేల్చటంతో ఆయన రాజీనామా చేయకతప్పలేదు. అనంతరం వచ్చిన మార్క్ కార్నీ స్వల్పకాలంలోనే సమర్థుడిగా పేరుతెచ్చుకుని పార్టీ విజయావ కాశాలు పెంచగలిగారు. మెరుగ్గా కనబడిన విపక్ష కన్జర్వేటివ్ పార్టీ వెనకబడటం మొదలైంది. ఈలోగా అమెరికాలో ట్రంప్ ఏలుబడి మొదలైనాక ఆయన కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేసుకుంటామనటంతో పాటు ఏకపక్షంగా సుంకాలు విధించటం ట్రంప్కు సన్నిహితంగా మెలిగిన ఆ మితవాద పార్టీ ప్రాభవాన్ని దెబ్బతీసింది.నిరుడు కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లాక దౌత్యసంబంధాలు చిగురించటం మొదలైంది. అంతక్రితం నిజ్జార్ వ్యవహారంలో ఆరోపణలు, దౌత్యవేత్తల పరస్పర బహిష్కరణ వంటివి జరగ్గా, నిరుడంతా ఇరుదేశాలూ హైకమిషనర్లను నియమించుకోవటం, రెండు దేశాల మధ్యా వివిధ మంత్రిత్వశాఖల స్థాయిలో సమన్వయం సాధించటం వంటివి చోటుచేసుకున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ పల్టీలు కొడుతుండగా, ట్రంప్ అధ్యక్షుడయ్యాక విధిస్తున్న సుంకాలు మరింత కుంగదీస్తున్నాయి. కెనడా కూడా చాలావిధాల దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో వాణిజ్యాన్ని విస్తరించుకోవటం ఆ దేశానికి తప్పనిసరైంది. ఇటు మన దేశం కూడా రాగల కాలంలో విద్యుదుత్పాదనను విశేషంగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం మన అణువిద్యుదుత్పాదన 6,780 మెగావాట్లు మాత్రమే. వచ్చే దశాబ్ది ప్రారంభానికి ఇది 22,500 మెగావాట్లకు చేరాలి. 2047 నాటికి 100 గిగావాట్లు విద్యుత్ ఉత్పత్తయితే తప్ప మన అవసరాలు తీరబోవన్న అంచనాలున్నాయి. పదేళ్లపాటు యురేనియం ఎగుమతి చేసేందుకు కెనడాతో కుదిరిన ఒప్పందం ఇందుకు దోహద పడుతుంది. అయితే ఇరు దేశాల మధ్యా ఇంకా అపోహలు లేకపోలేదు. కలిసి కదలటం మొదలుపెడితే, స్నేహసంబంధాలు మెరుగవుతుంటే అలాంటివి పటాపంచలవుతాయి. ఆ దిశగా కార్నీ పర్యటన ఒక ముందడుగు. -
వేట్లపాలెం దోషులెవరు?
అంటించి వదిలేస్తే చాలు నింగిలోకి దూసుకెళ్తూ, ఆ వెంటనే ఆకాశాన్ని దేదీప్యమానం చేస్తూ, నక్షత్రాలు రాలుస్తూ, రంగురంగుల పొగలు కక్కుతూ, చిత్రమైన ధ్వనులు చేస్తూ అబ్బురపరిచే బాణాసంచా తయారీ ప్రాణాంతకమైన పరిశ్రమ. అక్కడ పనిచేయటం నిప్పుతో చెలగాటం. చిన్న ఏమరుపాటు సైతం పెను నష్టానికి కారణమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలో శనివారం మిట్టమధ్యాహ్నం ఒక బాణాసంచా గోడౌన్లో రెండు గంటల పాటు నిరంతరాయంగా జరిగిన పేలుళ్ల పర్యవ సానంగా ఇంతవరకూ 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం భద్రత, పర్యవేక్షణల్లో మరోసారి మన డొల్లతనాన్ని చాటింది. పేలుడు ధాటి ఏ స్థాయిలో ఉందంటే... శరీర భాగాలు ఛిద్రమై విసిరేసినట్టు పడ్డాయి. కేవలం నలుగురు మాత్రమే ఉండాల్సిన ఘటనాస్థలిలో పేలుడు సమయంలో 45 మంది ఉన్నారని అంటున్నారు. ఈ ఉదంతంలో మరో 11 మందికి గాయాలయ్యాయి. ఇంత జరిగాక అక్కడకు పోయిన మంత్రులు నమోదైన సంఖ్యకు మించి పనివారిని అక్కడుంచారనీ, పరిమితి కన్నా ఎక్కువగా పేలుడు పదార్థాలు నిల్వ చేశారనీ, అధికారుల పర్యవేక్షణ లేనేలేదనీ చెబుతున్నారు. ఇవన్నీ తమ పాలన నిర్వాకమేనని... జరిగిన విషాదంలో తమకూ నైతిక బాధ్యత ఉంటుందనీ వారికెవరు చెప్పాలి? కార్మిక శాఖ పట్టించుకోదు. పోలీసు నిఘా ఉండదు. అగ్నిమాపక విభాగానికి అసలే పట్టదు. ఆ రోడ్డు పక్కనుంచి తరచూ మంత్రులు, వారి అనుచరగణం రాకపోకలు సాగిస్తున్నా, పొలాల మధ్యలో అక్కడ సాగుతున్న కార్యకలా పాలేమిటన్న ఆరా ఉండదు. కనీసం అధికారుల్ని అడిగి తెలుసుకుందామన్న స్పృహ కూడా ఉండదు. ఇక ఇటువంటి ఘోరాలు చోటుచేసుకోవటంలో ఆశ్చర్యమేముంది? ఇలాంటి ఘటనల్ని ప్రమాదాలంటాం గానీ... నిజానికి అవి ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం కారణంగా దాపురించే ఘోరాలు. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు వాటి అమలును పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అందుకే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయటం, పర్యవేక్షించటంలో విఫలమైన ఉన్నతాధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవటం వంటివి తప్పనిసరి చేయాలి. కానీ అలాంటివేమీ జరగటం లేదు. నిబంధనలకేం... చాలా ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలనీ, ఆ కేంద్రంలో నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, తేమ ఉండాలనీ, షెడ్ల నిర్మాణానికి వినియోగించే సామగ్రి కనీసం రెండు గంటలపాటు అగ్నిని నిరోధించగలగాలనీ, బాణసంచా పనిలో ఉండేవారు ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలనీ, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిందేమిటో అవగాహన కలిగి ఉండాలనీ నిబంధనలు చెబుతున్నాయి. ఇంకా ప్రాథమిక వైద్య సదుపాయం, అగ్నిమాపక సిలెండర్లు, అయిదు ట్రక్కుల పొడి ఇసుక, నీరు నింపిన బకెట్లు అందుబాటులో ఉంచాలి. కానీ ఇవన్నీ అమలవుతున్నాయో లేదో చూసేదెవరు? దేశంలోని బాణసంచా పరిశ్రమల్లో చిన్నవో, పెద్దవో తరచు ప్రమాదాలు జరుగు తూనే ఉన్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో, కార్మికుల భద్రత గురించి శ్రద్ధ చూపటంలో నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. ప్రమాదం జరిగినప్పుడల్లా ప్రదర్శించే హడా విడి మరికొన్ని రోజులకే కనుమరుగవుతుంది. మళ్లీ మరొకటి జరిగేవరకూ అంతా సవ్యంగానే ఉందన్న భ్రమ ఆవరిస్తుంది. సాధారణ సమయాల మాటెలా ఉన్నా కనీసం పండు గలు, శుభకార్యాల సమయాల్లోనైనా బాణసంచా పరిశ్రమలపై దృష్టిపెట్టాలన్న ఇంగిత జ్ఞానం అధికార యంత్రాంగంలో లోపిస్తోంది. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు రోజుకు దాదాపు 12 గంటలసేపు పనిచేయిస్తారు. కార్మికులు ఊపిరి తీసుకోవటానికి కూడా వ్యవధి చిక్కనంతగా పనిలో ఉంటారు. సరిగ్గా అప్పుడే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.వేట్లపాలెం ఉదంతమైనా పాలకుల కళ్లు తెరిపించాలి. అధికారులు నిర్ణీత వ్యవధిలో క్రమం తప్పకుండా బాణసంచా తయారీ కేంద్రాలను సందర్శించేలా, లోటుపాట్లు గుర్తించినప్పుడు కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు ఏర్పరచాలి. కార్మిక శాఖ, పోలీసు, అగ్నిమాపక, విభాగాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి. వాటిమధ్య సమన్వయం ఉండాలి. ఇవేమీ లేకుండా మీడియా కోసం ఆగ్రహావేశాలు నటించటం వల్ల ప్రయోజనం ఉండదు. -
పశ్చిమాసియా మంటలు!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూల బాధ్యతారహిత చర్యతో ఒక్కసారిగా పశ్చిమాసియా నిప్పులకొలిమైంది. శనివారం ఉదయం ఒక పథకం ప్రకారం ఇజ్రాయెల్, అమెరికా సైనిక బలగాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా అనేక నగరాలు, పట్టణాలపై బాంబులతో, క్షిపణులతో విరుచుకుపడి ఆరంభంలోనే ఇరాన్ మత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీతోపాటు ఆయనతో చర్చిస్తున్న కీలకమంత్రులు, రక్షణరంగ బాధ్యులతో సహా దాదాపు 30 మందిని హత మార్చాయి. పర్యవసానంగా యుద్ధం ఆరంభమైన మూడో రోజుకే ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా దేశాలన్నీ భగ్గున మండుతున్నాయి. అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులతో కోట్లాదిమంది ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టు కుని ఉన్నారు. మంగళవారం విమాన రాకపోకలు మొదలెడతామని దుబాయ్ అంటు న్నది. సాధ్యాసాధ్యాలపై సంశయాలున్నాయి.సాధారణంగా యుద్ధం తొలి దశలో దేశాధినేతలు, ఇతర కీలక బాధ్యుల జోలికి పోరు. చర్చలకు రప్పించటం, రాజీ తప్ప మరే మార్గమూ లేదన్న అభిప్రాయం కలిగించడం దీని వెనకుండే వ్యూహం. కానీ ట్రంప్, నెతన్యాహూల దుందుడుకుతనం ఆ అవ కాశానికి శాశ్వతంగా తలుపులు మూసింది. అందుకే యుద్ధం ఎడతెగకుండా సాగుతుందన్న అభిప్రాయం బలపడుతోంది. బాలలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ ఎప్స్టీన్తో ఉన్న నీతిబాహ్య సంబంధాలు బట్టబయలు కావటం, స్వీయ తప్పిదాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దివాలా స్థితికి చేరుకుని సాధారణ ప్రజానీకం దుర్భరమైన స్థితిలో బతుకీడ్వటంవంటి పరిణామాల నేపథ్యంలో వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి ట్రంప్ ఈ దుస్సాహసానికి తెగించారు. అటు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి పదవీభ్రష్టత్వం, జైలు తప్పవని బెంగటిల్లుతున్న నెతన్యాహూ సరిజోడీ అయ్యారు. ఇద్దరికిద్దరూ ప్రపంచాన్ని ప్రమాదపుటంచుల్లోకి నెట్టారు. అంతక్రితం మాటెలా ఉన్నా పశ్చిమాసియాకు సంబంధించి అమెరికా మూడున్నర దశాబ్దాలుగా కట్టుకథలతో కాలక్షేపం చేస్తోంది. అకారణంగా దాడులకు దిగుతూ, జనహననానికి పాల్పడుతూ తప్పుడు సాకులు వెదుకుతోంది. మొదట ఇరాక్–కువైట్ల మధ్య చిచ్చురగిల్చి, ఆ తర్వాత ఇరాక్ను అదుపు చేయడానికంటూ 1990–91లో ‘ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్’ పేరిట అమెరికా విరుచుకుపడింది. కనీసం అప్పుడు భద్రతా మండలి అనుమతి తీసుకుంది. 35 దేశాలను తోడుతెచ్చుకుంది. అసత్యాలే చెప్పినా దేశ ప్రజలనుద్దేశించి సీనియర్ బుష్ నాలుగు దఫాలు ప్రసంగించారు. కానీ చివరకు అదంతా అమెరికా మాయోపాయం వల్లే జరిగిందని ఆలస్యంగా గ్రహించిన చాలా దేశాలు సీనియర్ బుష్ కుమారుడు జార్జి డబ్ల్యూ బుష్ ఆధ్వర్యంలో సాగిన 2003 నాటి ‘ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్’ యుద్ధానికి మొహం చాటేశాయి. ‘జీవ రసాయన ఆయుధాల’ సాకుతో జరిపిన ఆ యుద్ధానికి బ్రిటన్, పోలెండ్, ఆస్ట్రేలియాలు మాత్రమే సహకరించాయి. భద్రతామండలి ఆమోదం దక్కలేదు. 2015 నాటికి ‘జీవ రసాయన ఆయుధాలు’ కూడా బూటకమని తేలింది. అందుకే కావొచ్చు... ట్రంప్ భద్రతామండలి సంగతలా ఉంచి, కనీసం చట్ట ప్రకారం అమెరికా ప్రతినిధుల సభ అనుమతి సైతం తీసుకోకుండా ఇప్పుడు చిచ్చు రగిల్చారు. ప్రపంచంలో జరిగే ఏ యుద్ధంలోనూ తలదూర్చబోనని హామీ ఇచ్చి ట్రంప్ గద్దెనెక్కారు. తీరా అందుకు విరుద్ధమైన పోకడలుపోతున్నారు. వాస్తవానికి అమెరికా–ఇరాన్లు ఒప్పందానికి చేరువలోవున్నాయని మధ్యవర్తి ఒమన్ ప్రకటించింది. కానీ 24 గంటలు గడవకుండానే ఏకపక్షంగా ట్రంప్ ఈ దుస్సాహసానికి తెగబడ్డారు. ఇరాన్తో స్నేహం నటిస్తూనే సౌదీ ద్రోహం చేసిందనీ, ఖమేనీపై దాడి వెనక దాని పాత్ర ఉన్నదనీ మీడియా కథనం. తమ సైనిక స్థావరాలుంటే ఇరుగుపొరుగు కన్నెత్తి చూడరని చెబుతూ 80వ దశకం నుంచి గల్ఫ్ దేశాలన్నిటా అమెరికా వాటిని నెలకొల్పింది. ఇరాన్ ప్రతీకార దాడులు అదంతా భ్రమగా తేల్చాయి. ఇప్పుడు హోర్మూజ్ జలసంధి మూతబడింది. ట్రంప్– నెతన్యాహూ ద్వయం కదిలించిన ఈ తేనెతుట్టె ఇంకెన్ని పరిణామాలకు దారి తీస్తుందో,ఎంత జన నష్టానికీ, విధ్వంసానికీ కారణమవుతుందో చూడాల్సి ఉంది. -
రంగుల కల
ప్రకృతి వర్ణభరితంగా ఉంటుంది. వసంతాగమన వేళ చెట్టు చేమలు హరితహాసాలు చిందిస్తాయి. చెట్లకు, మొక్కలకు పూచే పువ్వులు రకరకాల రంగులతో కనువిందు కలిగిస్తాయి. నేల మీద మట్టిలోనూ రకరకాల వన్నెలు కనిపిస్తాయి. ప్రతిరోజూ పొద్దుపొడుపు నుంచి పొద్దుగూకే లోపు నీలాకాశం కూడా వన్నెలు మారుతూ ఉంటుంది. నింగిలో ఎగిరే పక్షులు, నేల మీద సంచరించే జీవులు నానా రంగుల్లో ఉంటాయి. వర్షర్తువులో ఆకాశంలో మెరిసే ఇంద్రచాపం సప్తవర్ణాలతో అలరిస్తుంది. దేశదేశాల్లోని మనుషుల్లోనూ వర్ణవైవిధ్యం కనిపిస్తుంది. జీవవైవిధ్యమే కాదు, అందులోని వర్ణవైవిధ్యమూ ప్రకృతి సహజ లక్షణం. నేలకూ నింగికీ నడుమ కనిపించే వన్నెచిన్నెలే ప్రకృతి చేవ్రాలు.ఒకవేళ రంగులే లేకుంటే, ప్రకృతి ఎంత నిస్సారంగా ఉండేది! ఒకవేళ అన్నీ ఏకవర్ణంలోనే ఉంటే, ప్రకృతి ఎంత నిర్లిప్తంగా ఉండేది! వర్ణహీనత అయినా, ఏకవర్ణ పరివ్యాప్తి అయినా ప్రకృతికి స్వభావ విరుద్ధాలు. వర్ణవైవిధ్యాన్ని పండుగ చేసుకోవడానికి వసంతోత్సవం లాంటి వేడుకలు మొదలయ్యాయి. ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకోవడం ఒక సామూహిక వినోదమే కాదు, వైవిధ్యానికి ఆమోదం కూడా! రుతువులు మారినప్పుడల్లా ప్రకృతి తన వర్ణాలను మార్చుకుంటుంది. ప్రకృతి తన భావోద్వేగాలను వర్ణలిపిలో వ్యక్తం చేస్తుంది. ‘రంగులు కూడా స్వభావాల మాదిరి గానే భావోద్వేగాలను అనుసరిస్తాయి’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో. రంగుల మర్మం చిత్రకారులకెరుక, కవులకెరుక!‘కాలమనియెడు చిత్రకారుండు గీచినవి / ఆరు ఋతువుల శబల చిత్రాల వృత్త / నర్తనమ్మిది ఋతువైభవ శ్రేణి దీప్తు / లలర చక్రమాగక నిరతము తిరుగుచుండు’ అన్నారు సాంధ్యశ్రీ. వైవిధ్యం ప్రకృతి స్వభావం. వైవిధ్యం ప్రజాస్వామిక లక్షణం. ‘వైవిధ్యంతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. నిరంకుశత్వం వైవిధ్యాన్ని వ్యతిరేకిస్తుంది’ అని అమెరికన్ దౌత్యవేత్త సామ్ బ్రౌన్బ్యాక్ అన్నారు. ప్రకృతిలో మనుషులూ భాగమే! ప్రకృతిలోని వైవిధ్యమంతా మనుషుల్లోనూ ఉంటుంది. అందుకే ప్రపంచంలో లెక్కకు మిక్కిలి భాషలు ఉన్నాయి; రకరకాల సంస్కృతులు ఉన్నాయి; మనుషులు సృష్టించిన కళలలో అనేకానేక శైలీభేదాలు ఉన్నాయి. వైవిధ్యమే లేకుంటే, మానవ సృజనకు ఆస్కారమెక్కడ? వైవిధ్యమే లేకుంటే మన జీవితాలు ఎంత నిస్సారంగా మారిపోతాయో ఊహించు కోగలమా?అనాదిగా మానవాళి వైవిధ్యాన్ని ఆమోదిస్తూనే ఉంది. అందుకు నిదర్శనమే హోలీ వంటి వసంతోత్సవాలు. హోలీ పండుగ గురించిన పురాణగాథలు ఎలా ఉన్నా, ఇది వైవిధ్యాన్ని వేడుక చేసుకునే రంగుల పండుగ. హోలీ వంటి పండుగలు ఇతర దేశాల్లోనూ ఉన్నాయి. గ్రీస్ దేశంలో జరుపుకొనే ‘ఫ్లోర్ వార్’ తీరు దాదాపు హోలీ మాదిరిగానే ఉంటుంది. ఈ వేడుకలో జనాలంతా వీథుల్లోకి చేరి, రంగులు కలిపిన పిండిని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఇరాన్లో జరుపుకొనే ‘చహార్శంబే సూరీ’ పండుగలో కూడా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. గ్రీస్, ఇరాన్ దేశాల్లో కూడా ఈ రంగుల పండుగలను వసంతారంభంలోనే జరుపుకొంటారు.ప్రకృతిలోనే వైవిధ్యం ఉన్నప్పుడు మనుషుల్లోని వైవిధ్యాన్ని ఆమోదించడానికి శషభిషలు పడటంలో అర్థంలేదు. అయినా, కొందరికి వైవిధ్యం నచ్చదు. ప్రపంచమంతా తమ తీరులోనే ఉండాలనే మంకుపట్టు వారిది. ఇలాంటి మొండిశిఖండులకు దేశాధి కారం చేతికొస్తే, ప్రజలకు నిత్యనరకం తప్పదు. ఉదాహరణకు ఉత్తర కొరియానే తీసు కుందాం. కిమ్ జాంగ్ ఉన్ పాలనలో అక్కడ నెత్తిమీద జుట్టు కత్తిరించుకునే తీరుకూ పరిమితులు ఉన్నాయి. ప్రభుత్వామోదానికి భిన్నమైన తీరులో నెత్తిమీద జుట్టు పెంచుకుంటే, అక్కడ అంతే సంగతులు! వైవిధ్య వ్యతిరేక ధోరణులు ఇప్పుడు ప్రపంచ మంతటా ప్రబలుతున్నాయి. ఆహార, ఆచార, ఆలోచనా వైవిధ్యాలను విభేదాలుగా పరిగణించి, అసహనానికి ఆజ్యంపోసే శక్తులు కల్లోలాలను రెచ్చగొడుతున్నాయి. జీవ వైవిధ్యాన్నే కాదు, మానవాళిలోని సమస్త వైవిధ్యాలను కాపాడుకుంటేనే అది అసలైన వసంతోత్సవం కాగలదు; అదే అసలైన రంగుల పండుగ కాగలదు. -
అవినీతి ఊబిలో ఏపీ పాలన!
ఊపిరాడనివ్వని అవినీతి కంపు నేడు ఆంధ్రావనిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. పాలనా యంత్రాంగం లంచాల మత్తులో జోగుతున్నదని కూటమి నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. చిన్నాచితకా పనులు కూడా చేతులు తడపందే కావడం లేదని లోకవాణి కోడై కూస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, కాణీ ఖర్చు లేకుండా ప్రభుత్వ సేవలను ఇంటికి చేర్చిన సచివాలయ వ్యవస్థ ఇప్పుడు కోమాలోకి జారి పోయింది. రెండున్నర లక్షల మంది వలంటీర్లను నమ్మించి గొంతులు కోసింది కూటమి ప్రభుత్వం. సర్వేల పేరుతో పనిభారం పెంచి సచివాలయ సిబ్బందిని ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారు. ఉద్యోగాలు వదిలేసి పారిపోయేలా ప్రేరేపిస్తు న్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో వారి ఆత్మహత్యలు, అకాల మరణాలు రికార్డయ్యాయి.నిస్సంకోచంగా, యథేచ్ఛగా, బరితెగించి సాగుతున్న లంచ గొండి దర్బార్లకు ప్రజాప్రతినిధులే గాడ్ఫాదర్లుగా వ్యవహ రించడం సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతున్నది. కీలక శాఖల్లో పనిచేసే అధికారులను ఏరికోరి నియమించుకొని వారి నుంచి నెలవారీ వాటాలను ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారన్న వార్తలు పదేపదే వినవస్తున్నాయి. అందుకు సంబంధించి కొందరు అధికారుల ఆడియోలు కూడా అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహార శైలితో ప్రజాప్రతినిధులే స్వయంగా ఉద్యోగస్వామ్యాన్ని అనినీతి మేత కోసం ఉసిగొల్పు తున్నారు. ఈ పని చేస్తున్న సదరు ప్రజాప్రతినిధులకు నదురూ లేదు... బెదురూ లేదు. ‘ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా?’ అన్న సామెతను వారు శిరోధార్యంగా స్వీకరిస్తున్నారు.‘ఉద్యోగాల కల్పన’ అనే దేవతావస్త్రం పేరు చెబుతూ ఉర్సా, లుల్లూ అండ్ అదర్స్కు ఖరీదైన భూముల్ని కట్టబెడు తున్న ప్రభుత్వ పెద్దల దూకుడు నుంచి ప్రజాప్రతినిధులు స్ఫూర్తి పొందుతున్నారు. పెద్దల కనుసన్నల్లోనే నడుస్తున్న కల్తీ మద్యం కార్ఖానాల నుంచి పారుతున్న కరెన్సీ చూసి ఉత్తేజం పొందుతున్నారు. అధినాయకుడు తమ బంధుత్వాలను గౌరవించి వేలకోట్ల విలువైన భూముల్ని చుట్టబెట్టడం క్షేత్రస్థాయి నాయకత్వాన్ని పులకింపజేస్తున్నది. సొంత పాల కంపెనీ, దాని అనుబంధ సంస్థల లాభాల కోసం దేవదేవుడినే రాజకీయాల్లోకి లాగగలిగిన ఆ లాఘవం జూనియర్ నాయకులకు నిజంగా ఒక పాఠ్యాంశమే!పై స్థాయి నుంచి పొంగిపారిన స్ఫూర్తిని కింది స్థాయి కూడా అందిపుచ్చుకోవడంతో అవినీతి ప్రవాహం రాష్ట్ర మంతటా కట్టలు తెంచుకున్నది. దాని ఫలితమే కల్తీ పాల చావులు, కలుషిత జలాల మరణాలు, కృత్రిమ మద్యపు మరణ మృదంగం! పోషక బలాన్నిచ్చే పాలే కాటేస్తాయని ఎప్పుడైనా ఊహించామా? ప్రాణావసరమైన మంచినీళ్లే ప్రాణాలు తీస్తా యని కలగన్నామా? పాలూ, నీళ్లే కాదు. నేడు ఆంధ్ర రాష్ట్రంలో తింటున్నదీ, తాగుతున్నదీ సమస్తం కల్తీయేనని పాలక కూటమి నేతలే చెబుతున్నారు. గుంటూరు జిల్లా ‘జనసేన’ అధ్యక్షుని వీడియో ఒకటి ఈ మధ్యనే సంచలనం సృష్టించింది. ‘‘ఉద్యోగులు భయంకరంగా లంచాలు వసూలు చేస్తున్నారు. ఊహించని స్థాయిలో అవినీతి పెరిగింది. పాస్బుక్కులో పొరపాట్లు సరిదిద్దడానికి కూడా వేల రూపాయలు సమర్పించుకోవలసి వస్తున్నది. చిరంజీవి ఠాగూర్ సినిమాను మించి ఇవాళ ఆంధ్ర ప్రదేశ్లో లంచావతారాలున్నాయి. అవినీతి అధికారుల నుంచి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారని చెప్పడానికి సిగ్గేస్తు న్నది. అసలీ రాష్ట్రంలో కల్తీ లేకుండా ఏదైనా తింటున్నామని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలమా?’’ పాలక కూటమి లోని ఓ పార్టీ జిల్లా స్థాయి అధ్యక్షుని మాటలివి!రాజకీయ నాయకులు – అధికారులు లంచాల కోసం కుమ్మక్కు కావడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ తినేదీ తాగేదీ సమస్తం కల్తీ అయిందనే అభిప్రాయం జన సామాన్యంలో బలపడింది. అదే అభిప్రాయాన్ని జనసేన నాయకుడు బహిరంగంగా ప్రకటించారు. పైస్థాయిలో అవినీతి ఉండకపోతే కింది స్థాయిలో ఇంత బరితెగింపు ఉండేది కాదు. అవినీతి వాటాల ఫలితంగా పాలనా యంత్రాంగంలో జవాబుదారీతనం అట కెక్కింది. ప్రభుత్వ పాలన పూర్తిగా పట్టాలు తప్పింది. శాంతి– భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి దనిపిస్తుంది. రక్షక భటులు పొలిటికల్ పోలీసింగ్కు మాత్రమే పరిమితం కావడంతో సంఘ విద్రోహ శక్తులు చెలరేగు తున్నాయి. ఈ శక్తులకు రాజకీయ నాయకత్వం అండ దండిగా లభిస్తున్నది.‘పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో...’ అంటూ మురిసిపోయాడు ఒక కవి. ఆ భవితవ్యాన్ని పసితనంలోనే మసి చేస్తున్న కీచకసేనల పదఘట్టనలు పలుచోట్ల వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గంలో ఓ మైనర్ దళిత బాలికను బెదిరించి 14 మంది యువకులు కొన్ని నెలలపాటు అత్యాచారాలు చేసిన ఘటన రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. తండ్రి లేని ఆ బాలిక బయటికి చెబితే చంపేస్తారన్న భయంతో నోరు మెదపలేకపోయింది. బయటపడిన తర్వాత కూడా అధికార పార్టీ మద్దతుదారులైన నిందితులను పట్టుకోవడానికి చట్టం తటపటాయించింది. కర్నూలు జిల్లాలో చిన్నారి బాలికలను బెదిరించి మద్యం తాగించి పాలక పార్టీ యువకులు అత్యా చారాలు చేసి వీడియోలు కూడా తీశారు. చిన్నారులపై జరిగిన ఇటువంటి అత్యాచారాలే డజన్కు పైగా ఇప్పటివరకు వెలుగు చూశాయి. అత్యాచారాలు సగటున రెండు రోజులకొకటి జరుగుతున్నాయని అధికారిక గణాంకాలే చెబు తున్నాయి.హత్యలైతే సగటున రోజుకొకటి. రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులు, రెడ్ బుక్ అరాచకాలు నేడు జగమెరిగిన సత్యాలు. జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ డెలివరీ పథకాన్ని బాబు సర్కార్ ఎత్తివేసింది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కోరుకున్న చోటుకి, కోరుకున్న సమయంలో డ్రగ్స్, మద్యం డోర్ డెలివరీ చేసే విధానం అమల్లో ఉందట! డబ్బులు వెదజల్లితే జరగని పాడు పని ఏదీ లేదని చెప్పుకుంటున్నారు. పైనున్న అధినేతల స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకూ ఈ దురవస్థకు అందరూ బాధ్యులే. తిలాపాపం తలా పిడికెడు! నిరాటంకంగా సాగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, భూదందాలు, అవినీతి, అసాంఘిక కార్యక్రమాలు దాచేస్తే దాగేవి కాదు. అందుకని వాటిని అంగీకరిస్తూనే అందుకు బాధ్యతను అధికార యంత్రాంగంపైనో, కొందరు ప్రజాప్రతినిధులపైనో నెట్టేయడానికి యెల్లో మీడియా పడరాని పాట్లు పడుతున్నది. అధినేత హెచ్చరించినా అనుచరులు దారికి రావడం లేదంటూ వాపోతున్నది. అసలు అధినేత సుద్దపూసైతే కదా! ఎవరైనా దారిలోకి వచ్చేది.ఆవు పాలు, గేదె పాలే కాదు... రాష్ట్రంలో ‘మిక్సీ పాలు’ అనే మాట కూడా బాగా పాపులరైంది. అంటే పాలే లేకుండా పాలను తయారు చేయడమన్నమాట! పాల తయారీకి రసాయ నాలను ఉపయోగించడమన్నది విచ్చలవిడిగా జరుగుతున్నదనీ, అవి మోతాదు మించడం వల్లనే రాజమండ్రి దుర్ఘటన జరిగిందనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. అధికార యంత్రాంగం చిత్తశుద్ధి చూపెడితే వీటిని నియంత్రించడం అసాధ్యమేమీ కాదు. కానీ, వ్యవస్థీకృతమైన అవినీతి అందుకు అవకాశమివ్వదు. ఐదుగురు ప్రాణాలు కోల్పోవడానికీ, పలువురు అస్వస్థతకు గురి కావడానికీ ఈ వ్యవస్థీకృత అవినీతే కారణం. మంచినీటి పైపులైన్లు మురుగు నీటితో కలుషితమై, డయేరియా ప్రబలి శ్రీకాకుళంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా ఆందోళన కలిగించింది. రెండొందల మంది వరకు అస్వస్థులయ్యారు. ఇటువంటి దుర్ఘటనలను నివారించే ప్రయత్నం చేయకపోగా ఈ విషాద తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కల్తీ పాలు, కలుషిత నీటి విషాద ఘటనలపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘మీ నిర్లక్ష్యంతో ఇంకెంత మంది ప్రాణాలు తీస్తార’ని ఆయన ‘ఎక్స్’లో ప్రశ్నించారు. పరిపాలనపై ముఖ్యమంత్రి పట్టుకోల్పోవడం వల్లనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరో పించారు. కలుషిత నీరు, ఆహారం కారణంగా పలుమార్లు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, గురుకుల పాఠశాలల్లో వందలాది మంది అస్వస్థులయ్యారు. కురుపాంలో ఇద్దరు విద్యార్థినులు చనిపోయిన విషయాన్ని, రాష్ట్రవ్యాప్తంగా 900 మందికి పైగా అస్వస్థులైన సంగతిని కూడా జగన్ ప్రస్తావించారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడానికి కారణం రాజకీయ నాయకులు – కొందరు అధికారుల అవినీతి మిలాఖతే!విచ్చలవిడి అవినీతి కారణంగా పాలనా యంత్రాంగానికి పక్షవాతం సోకినా, పైకి మాత్రం బాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదనే భజనను యెల్లో మీడియా యథాశక్తి కొనసాగిస్తూనే ఉన్నది. అభివృద్ధికి బ్రాండ్ అంబాసి డర్ తానేనంటూ సెల్ఫ్ ప్రమోషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అభివృద్ధి పేరుతో తన ఖాతాలో వేసుకున్న చాలా కార్యక్రమాలు ‘క్రెడిట్ చోరీ’ ద్వారా జగన్ ఖాతాలోంచి తెచ్చుకున్నవేనని జనానికి కూడా బాగా అర్థమైంది. రాష్ట్రం అభివృద్ధి పథంలో కాదు తిరోగమనంలో ఉన్నదని పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తే నిరూపిస్తున్నది. ‘కాగ్’ లెక్కల ప్రకారమే రాష్ట్ర జీఎస్టీ రాబడి నానాటికీ తగ్గుతున్నది. ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీల్లో అత్యంత ముఖ్యమైన, అధిక వ్యయమయ్యే రెండు పథకాలను (నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి) పూర్తిగా ఎగవేసి మిగతా వాటిని అరకొరగా అమలుచేసి... ‘సూపర్ సిక్స్’ను సూపర్ హిట్ చేశారని పదేపదే చెప్పుకోవడం ముఖ్యమంత్రికే చెల్లింది. అత్యున్నత స్థాయిలో జరుగుతున్న అవినీతి కారణంగా పాలనా యంత్రాంగంలో అవినీతి పెచ్చ రిల్లింది. ప్రజాపాలన పడకేసింది. కనీసావసరాల కోసం,వైద్యం కోసం, మెరుగైన విద్య కోసం పేద ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. లేని అభివృద్ధి పేరుతో భజన బృందం చేస్తున్న కృత్రిమ సందడిలో వారి ఆర్తనాదాలు వినిపించక పోవచ్చు. కానీ సరైన సమయంలో అవి దీర్ఘశ్రుతితో శంఖా రావమై వినపడవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
స్కామ్ కథ కంచికేనా?
కథలన్నీ కంచికి చేరతాయో లేదోగానీ... రాజకీయ ప్రయోజనాలనాశించి పెట్టే కేసులన్నీ, సీబీఐ, ఈడీల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం గాలికి కొట్టుకుపోతున్నాయి. ఆ వరసలో ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు తాజా ఉదాహరణ. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాలతోపాటు 23 మందిపై అవినీతి, కుంభకోణం ఆరోపణలు చేస్తూ 2022లో సీబీఐ దాఖలు చేసిన కేసులో అందరూ నిర్దోషులని ఢిల్లీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సీబీఐకి చెంపపెట్టు. పనిలో పనిగాతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆయన కుమార్తె, తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవితను కూడా నిందితురాలిగా చేర్చారు. ఆమె సైతం ఇప్పుడు నిర్దోషిగా తేలారు. 2021లో ఢిల్లీ ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూరేలా మద్యం విధానం తీసుకొచ్చిందంటూ ఈ కేసు అల్లారు. అధికారంలో కొచ్చిన ఏ రాజకీయ పక్షమైనా అమల్లో ఉన్నవాటిని కాదని, తమ ఆలోచనలకు అనుగుణంగా కొత్త విధానాలు ప్రవేశపెడుతుంది. అవన్నీ సరైనవి కాకపోవచ్చు. వాటి వెనక స్వీయ ప్రయోజనాలుండొచ్చు. ఆ నిర్ణయాల పర్యవసానంగా ఖజానా నష్టపోతే, ప్రజల ప్రయో జనాలు దెబ్బతింటే చర్యలు తీసుకోవాల్సిందే. వాటినెవరూ ప్రశ్నించరు. కానీ అందుకు తగిన మౌలిక ఆధారాలు, ప్రాతిపదిక ఉండాలి. విధానం మార్చడం దానికదే ఒక కుంభ కోణంగా చిత్రించటం, ఆ పేరిట కేసులు, అరెస్టులతో వేధించటం, ఏళ్ల తరబడి దర్యాప్తు, చివరకు నిరూపించలేక న్యాయస్థానాలతో చీవాట్లు తినడం ఏం మర్యాద? ఇందువల్ల దర్యాప్తు సంస్థల విశ్వసనీయత దెబ్బతినడం లేదా? తాత్కాలికంగా మీడియాలో భారీ యెత్తున ప్రచారం జరగొచ్చు. నిప్పు లేనిదే పొగ రాదని జనం అభిప్రాయపడేలా చేయొచ్చు. ఎన్ని చేసినా ఆరోపణల్ని రుజువు చేయటం అంతిమంగా దర్యాప్తు సంస్థ బాధ్యత. పత్రికల్లో రోజుల తరబడి పతాక శీర్షికలు ఆక్రమించి, టీవీ చానెళ్లలో గంటల తరబడి చర్చలకు కారణమైన కేసులు చివరకు దూదిపింజెల్లా తేలిపోవటం, గాలి పోగేయటం తప్ప ఇందులో ఆవగింజంతైనా వాస్తవం లేదని తేలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక ఈ కేసుల్ని ఆధారం చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ఎవరికివారు ఇష్టానుసారం వ్యాఖ్యా నాలు చేయటం, అవమానించేలా శీర్షికలు పెట్టడం మరో ప్రహసనం. ఎవరికీ తెలియని ‘సౌత్ గ్రూప్’ను సృష్టించి, దానికి లబ్ధి కలిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త మద్యం విధానం తెచ్చిందని, ఇందులో రూ. 100 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తూ అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించారు. 2023 ఫిబ్రవరిలో మనీశ్ సిసోడియానూ, 2024 మార్చిలో కవితనూ, కేజ్రీవాల్నూ అరెస్టు చేశారు.అన్ని కేసుల్లో మాదిరే ఇక్కడ కూడా మనీశ్ సన్నిహితుడు దినేశ్ అరోరా, ఏపీకిచెందిన మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి వంటివారిని అప్రూవర్లుగా మార్చుకున్నారు. ఈ ముగ్గురూ పూసగుచ్చినట్టు చెప్పారంటూ లీకులిచ్చారు. కానీ అలా అంటే సరిపోదు... వాటిని ధ్రువపరిచే సాక్ష్యాలుండాలి. కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తే కాదు... అంత మొత్తం ఎలా ప్రయాణించిందో, ఏయే ఖాతాలకు మళ్లిందో చూపాలి. అడుగడుగునా ఆధారాలుండాలి. ఫలానా అంశాలు రాబట్టామని ఏకరువు పెట్టినంత మాత్రాన కుదరదు. వాటిమధ్య పరస్పర సంబంధాన్ని సందేహాతీతంగా రుజువు పరచాలి. ఆ సంగతలా ఉంచి కనీసం అవినీతి నిరోధకచట్టం సెక్షన్ 7, 13 కింద ఆరోపించిన లంచం ఆరోపణల్ని కూడా సీబీఐ ప్రాథమికంగా నిరూపించలేకపోయింది. అందుకే కాబోలు దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యకు కోర్టు ఆదేశించింది.అయితే ఈ కేసులో సీబీఐ అప్పీలుకెళ్లింది. అంటే ఈడీ దర్యాప్తు ఇంకా సాగుతూనేఉంటుందనుకోవాలి. కాకపోతే ఇందులో అవినీతిపరుడిగా ముద్రపడిన కేజ్రీవాల్నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. నిందితులంతా కారాగారవాసంతో సహా మూడున్నరేళ్లపాటు నానా కష్టాలు పడ్డారు. బహుశా వారిని ఆర్థికంగా కూడాకుంగదీసి ఉండొచ్చు. కానీ దర్యాప్తు పేరిట ప్రజాధనం, న్యాయస్థానాల విలువైన సమయం వృథా కావటం మాటేమిటి? ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణులు కొనసాగనీయటం అవాంఛనీయం, ప్రమాదకరం. -
పాఠం – గుణపాఠం
పాఠ్యపుస్తకాల్లో కొన్నిటిని తొలగించటం, మార్చటం... అవి వివాదాస్పదం కావటం గత కొన్నేళ్లుగా కనబడుతోంది. కానీ ఈసారి జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సీబీఎస్ఈ ఎనిమిదో తరగతి పిల్లల కోసం కొత్తగా విడుదల చేసిన సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకం ఏకంగా న్యాయవ్యవస్థపై బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకుంది. ఈ వైనంపై మీడియాలో కథనం రావటం, వెనువెంటనే సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహించి నోటీసులు జారీచేయటం వంటి పరిణామాలతో ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు సంస్థ హడావిడిగా ప్రకటించింది. అసలు దీన్ని వెలువరించటంలోనే బోలెడంత బాధ్యతా రాహిత్యం కనబడుతుంది. ఈ పుస్తకం తాలూకు తొలి భాగం గత జూలైలో విడుదలైంది. వివాదాస్పదమైన ఈ రెండో భాగం విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటుండగా తీరిగ్గా సోమవారం విడుదలైంది. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తిచేయటమైనా, స్వల్ప వ్యవధిలో అవగాహన చేసుకుని పిల్లలు పరీక్ష రాయటమైనా ఎలా సాధ్యమన్న ఇంగిత జ్ఞానం లేదు. ఇప్పుడున్న పాఠ్య పుస్తకాలు జాతీయ పాఠ్య ప్రణాళిక అమరిక(ఎన్సీఎఫ్) మార్గదర్శకాల పరిధిలో రూపొందగా, కొత్త పాఠ్య పుస్తకాలకు 2020లో కేంద్రం విడుదల చేసిన జాతీయ విద్యావిధానం(ఎన్ఈపీ) ఆధారం. పాఠ్య పుస్తకాల రచన తాడుపై నడక వంటిది. ఆ విన్యాసం తొట్రు పడకుండా,తొందర లేకుండా, అడుగడుగూ అంచనా వేసుకుంటూ లక్ష్యం దిశగా సాగాలి. సమ తౌల్యత దెబ్బతినకుండా చూసుకోవాలి. సమాచారాన్ని పోగేయటం పాఠ్యరచన అనిపించుకోదు. తాము ఏ తరగతి పిల్లల కోసం రచిస్తున్నామో, వారి వయసెంతో, మానసిక స్థాయి ఏమిటో అవగాహన ఉండాలి. నిష్పాక్షికత దాని ప్రాణం కావాలి. వాస్తవాన్ని ప్రతిబింబించే గణాంకాలను ఆధారంగా చేసుకోవాలి. మతం, కులం, జెండర్ వగైరా అంశాల్లో సున్నితంగా ఆలోచించాలి. సందర్భ శుద్ధి లేని ఉటంకింపులు తప్పుడు అభిప్రాయం కలిగిస్తాయన్న ఎరుక ఉండాలి. కానీ ఈ పాఠ్యాంశ రచనలో అపరిమితమైన స్వేచ్ఛ తీసుకున్నట్టు కనబడుతోంది. అది చదివితే వస్తునిష్ఠ కన్నా స్వీయ ఆలోచనలకూ, అభిప్రాయాలకే ప్రాధాన్యమిచ్చారన్న సంశయం కలుగుతుంది. అన్ని వ్యవస్థల్లోనూ లోపాలున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి జాడ్యాలు న్నాయి. అదే సమయంలో వాటిని ప్రక్షాళన చేసేందుకు అంతర్గత దిద్దుబాటు యంత్రాంగాలు పనిచేస్తున్నాయి. తమ ప్రతిష్ఠ మసకబారకుండా చర్యలు తీసుకోవటం కన బడుతుంది. అవి చాలినంతగా లేకపోవచ్చు. వాటిని నిష్పాక్షిక దృష్టితో చర్చిస్తే వేరుగా ఉండేది. కానీ కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మాటెత్తకుండా న్యాయ వ్యవస్థ మాత్రమే ఇలాంటి క్లేశాలతో నిండివున్నదని చెప్పడం విద్యార్థుల్లో ఎలాంటి అభిప్రాయం కలగ జేస్తుందన్న ఆలోచన పాఠ్య రచయితలకు లేకుండా పోయింది. రాజ్యం ఏ విధంగా పని చేస్తుంటుందో, భిన్న వ్యవస్థలు ఏ పరమార్థం కోసం ఏర్పడ్డాయో పన్నెండేళ్ల పిల్లలకు చెప్పవలసి ఉండగా న్యాయవ్యవస్థ ఒక్కదాని గురించే చర్చిస్తూ అది అవినీతిమయం అయిందనీ, దిద్దుబాటు చర్యలు లేనేలేవన్న అభిప్రాయం కలగజేస్తే పిల్లల్లో ఒక విధమైన నిరాశకు దారితీయదా? ఆ పుస్తకాన్ని పిల్లలు మాత్రమే కాదు... వారి కుటుంబ సభ్యులు సైతం చదువుతారు. ఇష్టానుసారం రచించిన ఇలాంటి పాఠ్యాంశాలు అంతిమంగా ప్రజల్లో న్యాయవ్యవస్థపై అపనమ్మకాన్నీ, అవిశ్వాసాన్నీ కలిగిస్తాయని ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించటం ఇందువల్లనే! ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ పనితీరైనా పరిశీలనకూ లేదా విమర్శకూ అతీతం కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా, పథకం ప్రకారం కించపరచాలని చూడటం క్షమార్హం కాదు. నిజానికి న్యాయవ్యవస్థకు సంబంధించి ఇంతవరకూ ఉన్న పాఠ్యాంశం అది పనిచేసే తీరునూ, ప్రాథమిక హక్కుల్ని కాపాడటానికి అది చేస్తున్న కృషినీ అందుకుసంబంధించిన కేసుల ప్రస్తావనతో అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది. ఆ వ్యవస్థకెదురవుతున్న సవాళ్లను వివరించింది. దాన్ని అపభ్రంశం చేయటం తప్ప కొత్త పాఠ్యాంశం సాధించిందేమిటి? జవాబుదారీతనం లేకుండా, చిత్తశుద్ధి కలికానికైనా కనబడకుండా చేసే రచనలు అనర్థదాయకమని ఇప్పటికైనా ఎన్సీఈఆర్టీ తెలుసు కోవటం మంచిది. -
ఇవి పాలకుల పా‘పాలు’
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడే ఉండే తిరుమ లేశుని లడ్డూ ప్రసాదంపై ఏ ముహూర్తాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తప్పుడు ఆరోపణలకు దిగారో గానీ... అప్పటి నుంచి రాష్ట్రంలో జరగని అనర్థాలంటూ లేవు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై, కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు, అరెస్టులు వగైరాలతో ముఖ్యమంత్రి మొదలుకొని అందరి కందరూ బిజీగా ఉంటే రాజమండ్రి సమీపంలోని లాలాచెరువు చుట్టుపట్ల కల్తీ పాల బారినపడి ఆరుగురు మరణించారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. గత ఆదివారం దీని తీవ్రత వెల్లడైనా, అంతక్రితం వారం నుంచి అనేకమంది ఆసుపత్రుల్లో చేరుతూనే ఉన్నారు. కాస్త ఆలస్యంగా స్థానిక అధికారులైనా మేల్కొన్నారేమోగానీ... అమరావతిలో కొలువుదీరిన యంత్రాంగం నిద్ర లేవడానికి మరికొన్ని రోజులు పట్టింది. తీరిగ్గా ఇప్పుడు రాష్ట్రవ్యాప్త తనిఖీలు మొదలయ్యాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో శాసనసభలో పచ్చి అబద్ధాలు వల్లెవేయటానికి కావలసిన సరంజామా సిద్ధం చేసుకుని, ఎవరు ఏ అసత్యాలతో రక్తి కట్టించాలో తేల్చుకుని, స్క్రిప్టులు బట్టీ పట్టడంలో కూటమి నేతలు తంటాలు పడుతుంటే, అడిగిందల్లా అందించటంలో యంత్రాంగమంతా తరించింది. ఇక కల్తీ పాలపై, కలుషిత నీటిపై పట్టించుకొనే నాథుడేడి? చివరకు కుప్పంకేంద్రంగా సాగే కల్తీ పాల దందాను కూడా కర్ణాటక పోలీసులు వచ్చి బట్టబయలు చేయాల్సి వచ్చింది.పాలకుల పాపాలు, వారి అసమర్థత ప్రజలకు శాపాలెలా అవుతాయో తెలియాలంటే 2024 సెప్టెంబర్లో లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణ మొదలుకొని సాగుతున్న వరస పరిణామాలు గమనించాలి. నిరుడు జనవరిలో తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టోకెన్లు జారీ సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. అటుతర్వాత ఏప్రిల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో చందనోత్సవం కోసం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణంపాలయ్యారు. నిరుడు నవంబర్లో కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు మరణించారు. ఈ ఉదంతాలకు సాటిరాగలది 2015 పుష్కరాల్లో రాజమండ్రిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన. అందులో 25 మంది మహిళలు సహా 29 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన సమ యంలో బాబు కుటుంబసమేతంగా అక్కడ ఉండటమే కాదు... తన షూటింగ్ కోసం భక్తుల్ని గంటల తరబడి ఆపటం వల్లే ఇలా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.ఎంతో ఆరోగ్యంతో నిక్షేపంలా ఉండే సామాన్య పౌరులు ఒక్కసారిగా అస్వస్థులు కావటం, వారికి రోజుకు రెండుసార్లు డయాలసిస్ చేసే పరిస్థితి తలెత్తటం ఎంత విషాద కరం! అన్నిటికన్నా ఘోరమేమంటే... రాజమండ్రికి చెందిన ఆరేళ్ల బాలుడికి ఆరు రోజుల్లో ఏకంగా 63 సార్లు డయాలసిస్ అవసరమైంది. ఆ లేత ప్రాణం దీన్నితట్టుకోలేక కన్నుమూసింది. డయాలసిస్ సాగుతున్న పిల్లల్లో మూడేళ్లలోపు వారు కూడా ఉన్నారంటే ఉదంతం తీవ్రతేమిటో తెలుస్తుంది. పాలలో కలిపిన ఇథిలీన్ గ్లైకాల్ అనే పదార్థం వల్లే బాధితుల రక్తంలో ప్రమాదకర స్థాయిలో యూరియా, క్రియాటిన్లు ఉన్నాయని చెబు తున్నారు. రక్తంలో గరిష్ఠంగా 24 మిల్లీగ్రాములు ఉండాల్సిన యూరియా దాదాపు 140 మిల్లీ గ్రాములు... గరిష్ఠంగా 1.3 మిల్లీగ్రాములు ఉండాల్సిన సీరమ్ క్రియాటిన్ ఏకంగా 9 మిల్లీ గ్రాములు ఉందంటే యంత్రాంగం కళ్లు ఎంతగా మూసుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇదింకా సద్దుమణగక ముందే గత అయిదు రోజులుగా శ్రీకాకుళం నగరంలో కలుషిత నీరు తాగి భారీ సంఖ్యలో ప్రజలు డయేరియా వాతబడ్డారు. నగరంలోని సగం ప్రాంతానికి కలుషిత నీరు సరఫరా కావటమే ఇందుకు కారణమంటున్నారు. 2024 జూలైలోనే అక్కడి బీసీ హాస్టల్లో ఇలాంటి కారణంతోనే పలువురు విద్యార్థులకు డయేరియా సోకింది. అప్పుడు కాస్తయినా శ్రద్ధపెట్టి ఉంటే ఇప్పుడు ఇది పునరావృత మయ్యేది కాదు. కల్తీ మాటలతో అధికారంలోకొచ్చి, ఆ బాణీనే కొనసాగిస్తున్న పాలకుల అసమర్థత అన్నిటినీ కల్తీమయం చేస్తోంది. ఇప్పటికైనా పాలించటం మొదలెడతారో లేదో బాబు అండ్ కో తేల్చుకోవాలి. -
చిగురాశలపై పిడుగుపాటు
సమాజంలో ఉండే అసమానతలకూ, అంతరాలకూ చట్టాల ద్వారా, మధ్యవర్తిత్వంతో సహా ఇతరేతర మార్గాల ద్వారా సామరస్యపూర్వకమైన పరిష్కారం సాధించటం రాజ్యం చేయాల్సిన పని. అందుకు రాజ్యాంగం, దాని ద్వారా ఏర్పడే భిన్న వ్యవస్థలు పనిచేస్తుంటాయి. కుటుంబాల్లో తరాల మధ్య తలెత్తే సమస్యలకు కూడా ఆ పరిధిలోనే పరిష్కారాలుంటాయి. ఇతరత్రా సమస్యల మాటేమో గానీ, పెళ్లి విషయంలో మాత్రం అదేం కుదరదంటున్నది గుజరాత్ ప్రభుత్వం. వివాహం గురించి తల్లిదండ్రులకు చెప్పి, వాళ్ల అనుమతి తీసుకోవాలని ఆంక్షలు విధించటానికి సిద్ధపడుతోంది. ఇందుకోసం 2006 నాటి వివాహ నమోదు చట్టాన్ని సవరించదల్చుకున్నట్టు ప్రకటించింది. పరస్పరం ఇష్టపడి పెళ్లాడాలనుకునే జంటలకు ఇప్పటికే అనేకానేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆర్థిక అసమానతలు అందులో కొన్ని. ఈ గోదాలోకి తాను కూడా జొరబడి గుజరాత్ సర్కారు ఏం సాధించదల్చుకున్నదో అనూహ్యం. ప్రజాస్వామ్యంలో 18 ఏళ్ల వయసు నిండినవారు ఓటేయటానికి, పోటీ చేయటానికి అర్హులు. ప్రభుత్వాలను మార్చవచ్చు. జనం ఆమోదం పొంది ఎన్నికైతే ప్రభుత్వంలో భాగమై విధానాలు రూపొందించవచ్చు. కానీ ఆ వయసువారు తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకోవటానికి వీల్లేదని, అందుకు మరొకరి ఆమోదముద్ర తప్పనిసరని అనటం ఆశ్చర్యకరం. ఇలాంటి తలకిందుల ఆలోచనలు చేయటం గుజరాత్తోనే మొదలు కాలేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లు ఈ పనే చేశాయి. ఎనిమిదేళ్ల క్రితం కేరళకు చెందిన హదియా అనే యువతి కేసులో... తనకు నచ్చిన జీవితభాగస్వామి ఎవరో నిర్ణయించుకునే స్వేచ్ఛ మైనారిటీ తీరిన ప్రతి ఒక్కరికీ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ బంధంలో తల్లిదండ్రులు గానీ, కుల మత పెద్దలు గానీ జోక్యం చేసుకోవడం చెల్లదని చెప్పింది. నచ్చిన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవటం రాజ్యాంగం 21వ అధికరణం ద్వారా ప్రసాదించిన జీవించే హక్కులో భాగమని కూడా తెలిపింది. 2021లో అలహాబాద్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టులు సైతం ఈ సంగతినే స్పష్టం చేశాయి. గత వారం గుజరాత్ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి వివాహ నమోదు చట్టాన్ని సవరించాలనుకోవటానికి చూపిన కారణాలు హాస్యాస్పదమైనవి. పెళ్లిళ్ల నమోదు నిబంధనల్ని కఠినతరం చేయాలని వివిధ సామాజిక సంస్థల నాయకుల నుంచి వినతులొచ్చాయట. బాధ్యతాయుతమైన ప్రభుత్వమైతే అది అసాధ్యమని వారికి నచ్చజెప్పాలి. వివాహాల నమోదు చట్టం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది. దాన్ని సవరించే హక్కు కూడా ఉంటుంది. కానీ అది రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అసలు ఇప్పుడు తీసుకురాదల్చుకున్న సవరణల్లో స్పష్టత లేదు. పెళ్లి గురించి తల్లిదండ్రులకు చెప్పారా లేదా అని అడగటం, వారికి చెప్పాలని నిబంధన విధించటం తప్ప వారు అంగీకరించని పక్షంలో చట్టం ఏం చేస్తుందో, పర్యవసానాలెలా ఉంటాయో చెప్పటం లేదు. పెళ్లి నమోదు చేస్తారా లేదా అన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇది అతి తెలివి. ఏదో రకంగా పెళ్లి సంగతి తల్లిదండ్రుల చెవినబడితే చాలు... ఆ తర్వాత వాళ్లూ వాళ్లూ పడతారని చేతులు దులుపుకోవటం! ఇలాంటి సందర్భాల్లో మన దేశంలో ఏమవుతున్నదో కనబడుతూనే ఉంది. తమ కులంవాడు కాదని, ‘తక్కువ’ కులస్థుడని అనుకున్న మరుక్షణం హంతకులుగా మారు తున్న తల్లిదండ్రులు కోకొల్లలు. కనీసం ఇప్పుడైతే కొంత కాలం గడిచాకనో, బిడ్డ పుట్టాకనో ఆవేశం తగ్గించుకుని అక్కున చేర్చుకుంటున్నవారు అక్కడక్కడ కనబడు తున్నారు. ఈ చట్టం కనీసం అందుకు కూడా అవకాశం ఇవ్వదల్చుకున్నట్టు లేదు. కొన్నేళ్ల క్రితం ‘లవ్ జిహాద్’ మాట తెగ ప్రచారం చేశారు. ప్రేమ పేరిట మతాంతీకరణ జరుగుతున్నదని భూమ్యాకాశాలు ఏకం చేశారు. ‘కేరళ ఫైల్స్’ చిత్రం దాని ఆధారంగానే నిర్మించారు. కానీ ఆ వంకన మతాంతర వివాహాలను వివాదాస్పదం చేయటం తప్ప సాధించిందేమీ లేదు. రాజకీయపక్షాలు తమ ప్రయోజనాల కోసం ఏమైనా చెబుతాయి. రాజ్యం అలాంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉన్న సమస్యల్ని పెంచకూడదు. తానే సమస్యగా మారకూడదు. -
ట్రంప్ అరాచకానికి బ్రేక్
‘అరాచకం సద్దుమణిగింది... దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు కళ్లెం పడింది’ అని అమెరికా ప్రజలంతా ఊపిరి పీల్చుకుని 24 గంటలు గడవకముందే మళ్లీ సమస్య మొదటికొచ్చింది. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) కింద నిరుడు ఏప్రిల్ నుంచి సుంకాలు విధిస్తున్న ఆయన చర్యలు చెల్లబోవని అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం 6–3 మెజారిటీతో తీర్పునివ్వగా, దాన్ని వమ్ము చేస్తూ ట్రంప్ కొత్తగా అన్ని దేశాలపైనా 15 శాతం అదనపు సుంకాలు విధించారు. తీర్పునిచ్చిన న్యాయమూర్తుల్ని మూర్ఖులుగా, దేశభక్తి లోపించిన వారిగా నిందించారు. పలు వ్యాపార సంస్థలతోపాటు 12 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై వెలువడిన ఈ తీర్పువల్ల ధరలు తగ్గి జనం లబ్ధి పొందుతారు. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ట్రంప్కు అనుకూలంగా తీర్పులిస్తూ వచ్చింది. ఏడాది కాలంలో అది మొత్తం 26 తీర్పులు వెలువరించగా, అందులో 21 ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించేవే. ఇందులో అత్యధికం అప్పీళ్ల రూపంలో వచ్చినవి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు ప్రజల తీర్పును వమ్ముచేయటానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో నమోదైన కేసు నుంచి ట్రంప్కు తొలి ఉపశమనం దొరికింది. నిరుడు మార్చిలో వలసదారులను బలవంతంగా వెనక్కి పంపే నిర్ణయాన్ని కింది కోర్టులు కొట్టివేయగా, సుప్రీంకోర్టు సమర్థించింది. మొన్న డిసెంబర్లో మాత్రం ఇల్లినాయీస్ నేషనల్ గార్డును స్వాధీనంలోకి తీసుకోవటం, షికాగో అభీష్టానికి భిన్నంగా అక్కడికి పంపటాన్ని తప్పుబట్టింది. నిజానికి గత వారం ట్రంప్కు ‘అన్నీ మంచి శకునములే...’ అన్నట్టు మొదలైంది. అమెరికాలో 3,600 కోట్ల డాలర్ల పెట్టుబడులకు అనుమతిస్తూ జపాన్ గత మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అధిక సుంకాలను 35 శాతానికి పరిమితం చేయటానికి అమెరికా అంగీకరించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అధిక సుంకాలను 32 శాతం వద్దే ఆపుతామన్న ట్రంప్ హామీకి కృతజ్ఞతగా గురువారం ఇండొనేసియా అధ్యక్షుడు దేశంలోని కీలక రంగాల్లో అమెరికా సంస్థల ప్రవేశానికి మార్గం సుగమం చేస్తూ ఉత్తర్వు నిచ్చారు. వెంటనే ‘అమెరికా మళ్లీ గెలుస్తోంది’ అంటూ ట్రంప్ ట్రూత్ మాధ్యమం ద్వారా తెగ సంబరపడ్డారు. తీరా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సుంకాలు కాస్తా రద్దయ్యాయి. ఆ తీర్పు అనంతరం ట్రంప్ పెంచిన సుంకాలు కేవలం 15 శాతం కావటంతో ఆ రెండు దేశాలూ తమ నిర్ణయాలకు సహజంగానే పశ్చాత్తాప పడుతున్నాయి. మన దేశం సైతం పునరాలోచనలో పడిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. సోమవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు మన ప్రతినిధి బృందం అమెరికా అధికారులతో జరపవలసిన చర్చలు వాయిదా పడ్డాయి. వియత్నాం 20 శాతం అదనపు సుంకా లకు అంగీకరించగా, ఇప్పుడది 15 శాతానికి తగ్గింది. ఇంకా దక్షిణ కొరియా, తైవాన్, మలేసియా వంటి దేశాలతోపాటు అమెరికా మిత్రదేశాలు కూడా తలపట్టుకుంటున్నాయి. కాకపోతే ఒప్పందాల్ని రద్దుచేసే సాహసానికి దిగలేదు. నిరుడు 27 దేశాల యూరోపియన్ యూనియన్(ఈయూ) 15 శాతం సుంకాలకు అంగీకరిస్తూ ఒప్పందం కుదుర్చుకోగా, ట్రంప్ వాటిపై సైతం కొత్తగా 15 శాతం అదనపు సుంకాల భారం మోపారు. తన అరాచక నిర్ణయాలను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని ట్రంప్ గట్టిగా నమ్మారు. అందుకే వీలుచిక్కినప్పుడల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పొగుడుతూ వచ్చారు. అమెరికాలో న్యాయమూర్తుల నియామకాల్లో అధికార పక్షం ముద్ర బహిరంగ రహస్యం. ఆ రకంగా చూస్తే మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో ప్రధాన న్యాయమూర్తి, మరో అయిదుగురు రిపబ్లికన్ అనుకూలురు. ముగ్గురు మాత్రమే డెమాక్రాటిక్ పార్టీకి చెందినవారు. ఏదేమైనా ట్రంప్ తాజా సుంకాలు 150 రోజులు మాత్రమే అమల్లో ఉంటాయి. ఈలోగా ప్రతినిధుల సభ ద్వారా తన పంతం నెగ్గించుకోవటం ఆయనకు కష్టమే. ట్రంప్ రేటింగ్ పడిపోయి, వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికల్లో పార్టీ ఊడ్చిపెట్టుకుపోవటం ఖాయం అన్న సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో రిపబ్లికన్లు ఏం చేస్తారన్నది చూడాలి. మొత్తానికి సుప్రీంకోర్టు చెప్పినా సరే... దేశాన్ని అనిశ్చితిలో పడేసే తన ధోరణి మారబోదని ట్రంప్ తేల్చిచెప్పారు. -
ముత్యాలూ సజ్జలూ
అమ్మ పాలేరుకు అన్నం పెడుతుంది. కూర పెడుతుంది. అంత పచ్చడి కూడా! తిన్నంత తింటే విసుక్కోకుండా పెడుతుంది. కాని మజ్జిగ మాత్రం పోయదు. అప్పుడే హైస్కూ లుకు వచ్చిన కొడుకు ‘ఎందుకమ్మా మజ్జిగ పోయవు’ అంటే జవాబు చెప్పదు. పాలేరు ఇంట్లోకి రాకూడదు. బయటే కూచోవాలి. తినాలి. వెళ్లిపోవాలి – మజ్జిగ ముఖం చూడకుండా! ఇంట్లో కుండ నిండా మజ్జిగే! అమ్మ ఇరుగూ పొరుగుకు ఇస్తుంది. ఎండనబడి వచ్చిన వాళ్లకు ఇస్తుంది. పాలేరుకు తప్ప. అప్పటికి పాలేరు కులం ఏమిటో మూలం ఏమిటో కొడుకుకు తెలియదు. ‘ఎందుకమ్మా మజ్జిగ పోయవు?’... ‘పోయకూడదు నాయనా... పోస్తే వెన్నలో పురుగులు పడతాయి’. పాలేరుకు మజ్జిగ పోస్తే వెన్నలో పురుగులు పడతాయా? చూద్దాం అని అమ్మ లేనప్పుడు పాలేరు బెదిరిపోతున్నా కొడుకు అతని కంచెంలో మజ్జిగ వొంపేశాడు. మరికొన్ని రోజులకు అమ్మ వెన్న కాచి నెయ్యి చేస్తోంది. కొడుకు తొంగి తొంగి చూస్తున్నాడు. ’ఏమిట్రా?’... ‘పురుగులేమైనా పట్టా యేమోనని’... పకపకా నవ్వాడు.ఒక పిల్లాడిది అడవి దాపు పల్లె. స్కూలుకు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తాడు. రెండు చేతులు, రెండు కాళ్లు... పుస్తకాలున్నాయా... లేవు... నోట్బుక్కులు... అయ్యబాబోయ్. అయ్యవారు దయదలిచి పాతవేవో సంపాదించి ఇస్తారు. నోట్ బుక్కులు మాత్రం కొనుక్కోవాల్సిందే! పిల్లాడి దగ్గర అడవి ఉంది తప్ప డబ్బులు లేవు. ప్రతి సంవత్సరం బడి తెరిచాక నోటు బుక్కుల కోసం ఆ పిల్లాడు ఒకటే పని చేస్తాడు. రోజూ అడవికి వెళ్లి రేగుపండ్లు కోసి సంచీ నిండా వేసుకొని వస్తాడు. స్కూల్లో ఆ రేగు పండ్లకు మారుబేరం పెడతాడు. గుప్పెడు రేగుపండ్లు ఇస్తే పిల్లలు తమ నోటు బుక్కులో సెంటర్ పిన్ను దగ్గర ఒక టావు తీసి ఇవ్వాలి. రేగుపండ్లు ఖాళీ అయ్యే కొద్దీ టావులు పోగవుతాయి. ఇంకేమిటి? రేగుపండ్ల నోట్బుక్ తయార్!కానుకలు అందరూ ఇస్తారు. పుచ్చుకుంటారు. కాని కొన్ని కానుకలు జీవితాంతం వెంటాడుతాయి. ఆ టీచరు పాఠాలు చెప్తుంటే ఒక ముసలామె మనవణ్ణి చేత్తో పట్టుకుని వచ్చి బడిలో వదిలింది. ‘ఈ ముసలి ప్రాణం తప్ప వీడికి ఎవరూ లేరు టీచరమ్మా! నాలుగు అక్షరాలు నేర్పించు’... ఆ టీచరు పిల్లాడిని దగ్గరగా పొదువుకుంది. తల నిమిరింది. పాఠాలు ఏం చెప్పిందో కాని తన బాక్స్లోని నాలుగు మెతుకులు పెట్టింది. ఆకు కూరలమ్మే ముసలామె తన మనవడికి టీచరమ్మ దొరికినందుకు ఎంతో సంతోషపడింది. మనవడు మాత్రం సిగ్గుతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. అప్పుడు ‘టీచర్స్ డే’ వచ్చింది. స్కూల్లో అందరూ టీచరమ్మకు గ్రీటింగ్ కార్డులు, ఆపిల్స్, గులాబీ పూలు ఇస్తున్నారు. అందరూ వెళ్లిపోయాక ఆ పిల్లాడు ఒక్కడే మిగిలాడు. ఏదో కానుక తెచ్చినట్టే ఉన్నాడు. ‘ఏంట్రా అది?.. ఇవ్వు’... చాలా బిడియపడుతూ వీపు వెనుక ఉన్న చేతిని ముందుకు సాచాడు. ఆకుకూర! వాడి చిట్టిచేతిలో జీవస్పందన వంటి పచ్చటి ఆకుకూర గుచ్ఛం!జీవితాల్లో గాలికిపోయే ఊకలాంటి ఘటనలు ఎన్నో జరుగుతాయి. కొన్ని ఇలా స్వాతిచినుకుల్లా రాలి, కుదురును కదిలించి, ముత్యాలుగా మారతాయి. వాటిని సాహిత్యంగా చేసినప్పుడు మిలమిలమని మెరుస్తూ వేల చేతులు మారి అదే అనుభూతితో తాకుతాయి. ‘నేను రాసింది ఏ.ఐ.కి ఫీడ్ చేస్తాను. అది వెంటనే అర్థం చేసుకొని విడమ ర్చిందంటే రాసింది సాహిత్యం కాదని చించేస్తాను’ అన్నాడు రచయిత గురుచరణ్దాస్. సరళరేఖలు, తెలిసిన గీతలు టక్కున తెలిసిపోతాయి. ఏ.ఐ.కి చిటికెలో పని. కాని సాహిత్యం సరళం కాదు... ఉపరితలమూ కాదు. అది స్పందనల పరావర్తనలు పడే పెరడు. భావోద్వేగాలు నర్తించే ఎరీనా. తుది ఘట్టాన సాక్షాత్కారాలను ఒసగే యుద్ధ క్షేత్రం. సాహిత్యం మనిషికొక అర్థం... మనసుకొక తాత్పర్యం. అంతేతప్ప ఏ.ఐ. చెప్పే మూసకట్టు చిలకజోస్యం కాదు.రాసినదంతా ఏ.ఐ. దగ్గర ఉంది! రాయవలసినదంతా మనిషి వద్ద ఉంది!! మనిషి రాయకపోతే ఏం చేసినాగాని ఏ.ఐ. పైన చెప్పిన మూడు ఘటనలను సృష్టించలేదు. అవి మనిషికే తెలుసు. మనిషి చెయ్యే వాటిని రాయాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ.ఐ. మీద చర్చ జరుగుతోంది. రచన, ప్రచురణల్లో ఏ.ఐ. పాత్ర ఏమిటనేది శోధనగా ఉంది. ఏ సాంకేతికతైనా సృజనకు సాయం మాత్రమే! అదే సృజన కాబోదు. రచయితలు జీవన పేటికల మీటలు నొక్కినంత కాలం ముత్యాలకు కొదవలేదు. సజ్జలతో సరిపెడదామను కుంటే ఏ.ఐ. ఉంది పదండి!! -
జగన్ వర్సెస్ డర్టీ డజన్!
ఒక లక్ష్యం, దాన్ని సాధించడానికి అనుసరించే మార్గం... ఈ రెంటినీ చెట్టూ, విత్తుతో పోల్చారు మహాత్మాగాంధీ. మంచి విత్తు నాటితే ఆరోగ్యకరమైన చెట్టు ఎదుగుతుంది. విషపూరిత విత్తనం నాటితే ఆ చెట్టూ విషపు కాతే కాస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ ప్రధాన లక్ష్యమైనా అధికార సాధనే కావచ్చు. దాన్ని సాధించే ప్రయత్నం కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉండాలి. అడ్డదారిలో అధికారాన్ని అందుకునే ప్రయత్నాలను సహిస్తే కుక్క మూతి పిందెల పాలన చవిచూడవలసిన పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పుడీ దౌర్భాగ్యానికి ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద ఉదాహరణ ఇంకేదీ లేదు!అప్పటివరకూ తాము బండబూతులు తిట్టిన రాజకీయపక్ష నేతల చరణకమలాలనే కళ్లకద్దుకొని అవకాశవాద కూటమిని ఏర్పాటు చేసుకున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అంతటితో ఆగలేదు. అమలు చేయడం సాధ్యం కాదని తెలిసికూడా మోస పూరిత హామీలతో ‘సూపర్సిక్స్’ మేనిఫెస్టో ప్రకటించడం, ప్రజలను నమ్మించడం కోసం వీధివీధినా, గడపగడపనా గారడీ విద్యలు ప్రదర్శించడం కూడా తెలిసిన విషయాలే. వీటికంటే ఇంకో అతి భయంకరమైన విషయం కూడా ఉన్నదనే ఆరోపణలు, సహేతుకమైన అనుమానాలు క్రమక్రమంగా వెలుగు చూస్తున్నాయి.ఓట్ల పండుగ నాటి నిశిరాత్రి చీకటిలో ప్రజాస్వామ్యంపై క్రూరమైన అత్యాచారం జరిగిందనడానికి తార్కికమైన ఆధారా లను ఎన్నికల సంఘం సమాచార స్రవంతిలో నుంచే విశ్లేషకులు వెలికి తీస్తున్నారు. పోలింగ్ రోజు ప్రకటించిన ఓట్ల శాతం కంటే ఆ తర్వాత అసాధారణంగా ఓట్ల శాతం పెరగడంలోని అసంగతత్వాన్ని ‘వోట్ ఫర్ డెమోక్రసీ’ (వీఎఫ్డీ) అనే స్వచ్ఛంద సంస్థ అప్పుడే ప్రశ్నించింది. ఈ ఓట్ల తేడా అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా 12.5 శాతంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉండటాన్ని గురించి కూడా ప్రశ్నించింది. అంతేకాదు, మరో స్వచ్ఛంద సంస్థ ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్’ (ఏడీఆర్)తో కలిసి ఢిల్లీలో ఒక సెమినార్ను కూడా నిర్వహించి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది.‘ఓట్ చోరీ’ అనే పేరుతో అడపాదడపా ప్రతిపక్ష పాత్ర పోషించే రాహుల్ గాంధీ కూడా వీఎఫ్డీ సమాచారంతో ఒకటి రెండుసార్లు హడావిడి చేశారు. అయితే ఆయన ‘పోరాటం’ నుంచి ఏపీని మాత్రం మినహాయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాహుల్ గాంధీకి బలమైన బంధం ఉన్న కారణంగానే ఆయన ఓట్ చోరీ ఉద్యమంలోంచి ఏపీని డిలీట్ చేసి ఉంటారనే బలమైన అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువైన బీజేపీ కూటమిలో భాగస్వామిగా కొనసాగుతూనే కాంగ్రెస్ అధినేతతో చుట్టరికం కొనసాగిస్తూ అవకాశవాదాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన వ్యక్తి చంద్రబాబు.వీఎఫ్డీ వెలికి తీసిన పోలింగ్ నాటి విడ్డూరాలపై ప్రముఖ రాజకీయ–ఆర్థిక వ్యవహారాల నిపుణుడు పరకాల ప్రభాకర్ మరింత లోతైన అధ్యయనం చేశారు. ఆయన పరిశీలనలో వెల్లడైన దిగ్భ్రాంతికరమైన అంశాలతో ‘ది వైర్’ అనే స్వతంత్ర వెబ్సైట్కు ఒక వ్యాసం రాశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వ్యాసాన్ని బలపరిచే విధంగా ప్రఖ్యాత జర్నలిస్ట్ కరణ్ థాపర్ అదే వెబ్సైట్ కోసం పరకాల ప్రభాకర్ను ఇంటర్వ్యూ చేశారు. తాను ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనల్లోంచి తీసుకున్న సమాచారం ఆధారంగానే ఆనాటి ఎన్నికల విజయం సందేహాస్పదమైనదనే నిర్ధారణకు వచ్చినట్లు ప్రభాకర్ చెప్పారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల సంఘా నికి లేఖ రాసినప్పటికీ అక్కడ నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదని ఆయన వెల్లడించారు.పరకాల ప్రభాకర్ విశ్లేషించిన విషయాలు ఇలా ఉన్నాయి. 2024 మే 13వ తేదీన ఏపీలోని 25 లోక్సభ స్థానాలకు, 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పది గంటల వ్యవధిలో 68.04 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. 6 గంటలకు పోలింగ్ గడువు ముగిసింది. ఈ లోపల అంటే 5 గంటల 59 నిమిషాలు, అంతకంటే ముందే పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో క్యూలైన్లో నిలబడిన వారికి స్లిప్పులు ఇచ్చి ఓటు ఓసే అవకాశాన్ని కల్పిస్తారు. రాత్రి 8 గంటల వరకు 68.12 శాతానికి పోలింగ్ పెరిగిందని ఈసీ ప్రకటించింది. ఇది 0.08 శాతం పెరుగుదల! ఓట్ల సంఖ్యలో చూస్తే 33,064 ఓట్లు. సాధారణంగా రాత్రి 8 గంటల తర్వాత ప్రకటించిన ఓట్ల శాతం దాదాపుగా ఫైనల్గా ఉంటుంది. మహా అయితే ఒకటీ, అర శాతం ఓట్ల పెరుగుదలతో మరుసటి రోజు ప్రకటించేవాళ్లు. కానీ, ఐదూ, ఎనిమిది గంటల మధ్య మహా మందకొడిగా అతి స్వల్పంగా ఓట్లు నమోదైనప్పటికీ ఇంకా పోలింగ్ కొనసాగుతున్నదని ఈసీ ప్రకటించింది.రాత్రి 11.45 నిమిషాల వరకు ఓట్ల శాతం 76.50 శాతానికి పెరిగినట్టు చెప్పారు. అంటే, 8.38 శాతం. 34,63,767 ఓట్లు. ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్లో ఉన్నప్పుడు 8 గంటల లోపల ఓట్లు వేయకుండా ఏ ముహూర్తం కోసం ఎదురుచూసి ఒకేసారి ఎగబడ్డారో ఎన్నికల సంఘం వివరించలేదు. ఇంకా విడ్డూరమేమిటంటే ఆ తర్వాత కూడా 3,500 పోలింగ్ బూతుల్లో ఓటర్లు బారులు తీరి ఉన్నారట! ఒక్కో నియోజక వర్గానికి 20 బూత్ల చొప్పున లెక్క వేసుకొని ఓటర్లు బారులుతీరి నిలబడ్డారనుకోవాలి. ఈ బూత్లలో చివరి ఓటు 2 గంటలకు రికార్డయిందట! రెండు గంటల 15 నిమిషాల వ్యవధిలో 17,19,482 మంది ఓటేశారట! ఈ ఓటర్లందరూ సాయంత్రం 6 గంటలలోపే పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఉండాలి. ఆ తర్వాత అనుమతించరు కనుక!ఆ లెక్కన చివరి ఓటర్లు ఒకపూట ఉపవాసాన్ని పాటిస్తూ లఘుశంక కూడా తీర్చుకోకుండా 8 గంటలపాటు నడిరాత్రివేళ నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి వీరి వివరాలనూ, ఫొటోలనూ విడుదల చేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించేందుకు ఎన్నికల సంఘం ఎందుకు ప్రయత్నించలేదో తెలియదు. చివరి రెండు గంటల పదిహేను నిమిషాల పాటు పోలింగ్ జరిగిన 3500 పోలింగ్ బూత్లలో సగటున 491 ఓట్లు పోలయ్యాయి. మొత్తం అన్ని బూత్లలో చూసుకుంటే సగటున 892 ఓట్లు పడ్డాయి. ఈ బూత్లలో నాలుగు వందల మంది ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.45 నిమిషాల మధ్యన ఓటు హక్కు వినియోగించుకుని 16 గంటల 45 నిమిషాల వ్యవధిలో ఓట్లు వేస్తే, 491 మంది మాత్రం నడిరేయి దాటిన తర్వాత రెండు గంటల పదిహేను నిమిషాల్లోనే ఓటేశారు. ఈ గారడీ లెక్కల్ని చూసిన తర్వాత కూడా ఎన్నికలు సక్రమంగానే జరిగాయని విశ్వసిద్దామా?సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పది రోజుల్లోనే వీవీ ప్యాట్లను ఎందుకు ధ్వంసం చేసినట్టు? ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటలదాకా, 11.45 వరకు, కొన్నిచోట్ల రాత్రి 2 గంటల వరకూ పని చేసినా కూడా వోటింగ్ మిషన్ల బ్యాటరీ కౌంటింగ్ రోజున 90 నుంచి 99 శాతంగా ఎందుకు మిగిలినట్టు? ఈ సందేహాలపై స్పందించకుండా ఎన్నికల సంఘం ఎందుకు మడి కట్టుకున్నట్టు? భారత ప్రజాస్వామ్యానికి అతి ప్రమాదకర మైన మంత్రాంగం ఏదో ఆనాటి అర్ధరాత్రి ప్రధానంగా ఏపీలోనే కేంద్రీకృతమై నడిచిందనడానికి ఇవన్నీ ఆధారాలు.ఈ మంత్రాంగానికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరై నప్పటికీ లబ్ధిదారులు మాత్రం ఏపీ కూటమి పార్టీలే! ఆ విషయం కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. ఆ రోజు రాత్రి 8 గంటల తర్వాత పోలైన 51,83,249 ఓట్లను 175 నియోజక వర్గాల నడుమ సమానంగా విభజిస్తే ఒక్కో సీటుకు 29,618 ఓట్లవుతాయి. ఇంతకంటే తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ దాదాపు 80 సీట్లను కోల్పోయింది. వీటికి తోడు గెలిచిన సీట్లు 11. అన్ని నియోజక వర్గాల్లో ఇలా సమాన విభజన జరిగి ఉండకపోవచ్చు. అగ్ర నాయకులకు భారీ మెజారిటీల కోసం కొన్నిచోట్ల ఎక్కువ ఓట్లు, బాగా నమ్మకమున్న సీట్లలో తక్కువ ఓట్లు పడి ఉండ వచ్చు. సీట్లు తక్కువైనా సరే, స్ట్రయిక్ రేట్ ఎక్కువ వుండా లనుకున్న సీట్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఉండవచ్చు. మొత్తంగా ఈ గణాంకాలు చెప్పేదేమిటంటే కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నట్టుగా వారికి ప్రజలు చరిత్రాత్మకమైన విజయాన్ని కట్టబెట్టలేదనీ, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తిరస్కరించలేదనీ! సందేహాలు నివృత్తి చేసే బాధ్యత నుంచి ఎన్నికల సంఘం తప్పించుకోవడం అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తున్నది.తాము ఓటమిని రుద్దినప్పటికీ జనంలో జగన్ మోహన్రెడ్డి బలంగానే ఉంటాడన్న అంచనాతోనే అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే కూటమి సర్కార్ ఒక త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో పాయింట్ నెంబర్ వన్ – జగన్ మోహన్రెడ్డి వ్యక్తిత్వ హననం. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే ఆటోమేటిక్గా పార్టీ బలహీనపడుతుందని ఈ వ్యూహం. ఆయన పార్టీ పెట్టిన తొలిరోజు నుంచి గడచిన పదిహేనేళ్లుగా దీన్ని అమలు చేస్తూనే ఉన్నారు. రెండో అంశం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. దీని ద్వారా పార్టీ నాయకత్వం, కార్యకర్తల నైతికబలాన్ని దెబ్బతీసే ప్రణాళిక. ఈ ఇరవై మాసాల్లో రెండు డజన్ల మంది పార్టీ అభిమానులు రాజకీయ హత్యలకు గురయ్యారు. కీలక నాయ కులతో సహా అనేక డజన్ల మంది జైళ్లకు వెళ్లారు. అనేకమంది పోలీసుల టార్చర్కు గురయ్యారు. వందలాది మంది అక్రమ కేసులను ఎదుర్కొంటున్నారు. ‘సాక్షి’ మీడియా సైతం నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నది.ఇక మూడో అస్త్రం – మతాన్నీ, దేవుడినీ రాజకీయ అవస రాలకు వాడుకొని మెజారిటీ ఓటర్లను జగన్కు దూరం చేయాలనే దిక్కుమాలిన ఎత్తుగడ. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలకు సరఫరా చేస్తూ అక్కడి నాణ్యతా పరీక్షలో విఫలమై వెనక్కు వెళ్లిన నెయ్యి ట్యాంకర్లను మళ్లీ రప్పించి వాటి శాంపిళ్ల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి వాడారని చేసిన అతి తెలివి ప్రచారం నెమ్మదిగా జనానికి అర్థమైంది. టీటీడీకి స్వయంగా నాణ్యతను పరీక్షించే యంత్రాంగం ఉన్నదనే సంగతి తెలిసినా, ఆ పరీక్షలో నెగ్గితేనే ట్యాంకర్లను అనుమతిస్తారని తెలిసినా రాజకీయ ప్రయోజనం కోసం పవిత్రమైన తిరుమల లడ్డూను వివాదా స్పదం చేశారు. మరీ దారుణంగా పంది కొవ్వు కలిసిందనే నీతిబాహ్య ప్రచారానికి పాల్పడ్డారు. వ్యూహం బెడిసికొట్టింది. బాణం ఎదురు తిరిగి ముఖ్యమంత్రి ‘హెరిటేజ్’ కాంపౌండ్లోకే వెళ్లింది. ఇంకేయే విషయాలు బయటపడతాయో చూడాలి. దైవదూషణ ఫలితం మామూలుగా ఉండదు కదా! ముంబైలో కూడా ఏవో ‘హెరిటేజ్’ పేలుళ్లు వినబడుతున్నాయి.జగన్ మీద ఈ త్రిముఖ వ్యూహ దుష్ప్రచారంలో మూడు కూటమి పార్టీలు, ఒక పెంపుడు కాంగ్రెస్, నాలుగు ఛానెళ్లు,రెండు పత్రికలు, ఒక పెయిడ్ సోషల్ మీడియా, ఒక పేటీఎమ్ విశ్లేషణ బృందం చురుగ్గా పాల్గొంటున్నాయి. ఈ పన్నెండు శక్తుల దాడులను జగన్మోహన్ రెడ్డి నిబ్బరంగా ఎదుర్కొంటున్న తీరు వైసీపీలో నూతనోత్తేజాన్ని నింపుతున్నది. రెండు గంటలైనా సరే, అంతకంటే ఎక్కువైనా సరే! ఎక్కడా అలసట లేకుండా తొట్రుపడకుండా డాక్యుమెంటరీ సాక్ష్యాలతో కూటమి కుట్రలను ఆయన తుత్తునియలు చేయగలుగుతున్నారు. మొన్న ఒక్కరోజే త్రిముఖ వ్యూహపు పన్నాగాలతో పాటు బడ్జెట్ డొల్లతనాన్ని, మేనిఫెస్టో మోసాన్ని ఆయన ఎండగట్టారు. ఈమధ్య లడ్డూ బాణం ఎదురు తిరిగిన తర్వాత యావత్తు మంత్రిమండలి కొలువు తీరి ఏర్పాటుచేసిన మీడియా సమా వేశంలో కనిపించిన విషణ్ణవదనాలను, ఆత్మవిశ్వాసంతో కూడిన జగన్ ప్రెస్మీట్లతో జనం పోల్చి చూస్తున్నారు. ఈ పోలిక చాలు... రాష్ట్ర రాజకీయాలు ఏ దిశలో పరుగు తీస్తున్నాయో తెలుసుకోవడానికి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇరాన్పై కయ్యానికి సై
గాజా ఇంకా తల్లడిల్లుతూనే ఉంది. ఉక్రెయిన్ వాసులు ఎప్పుడేమి ఉపద్రవం ముంచు కొస్తుందో తెలియక భయం భయంగా బతుకీడుస్తున్నారు. ఇవి సద్దుమణగకుండానే ఇరాన్పై సైనిక దురాక్రమణకు దిగి పశ్చిమాసియాలో మరో యుద్ధక్షేత్రాన్ని తెరవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు. మరో పదిరోజుల్లో యుద్ధం తప్పదని బెదిరిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ను పశ్చిమాసియా దిశగా తరలిస్తున్నారు. ఇది 75 యుద్ధ విమానాలతో, అయిదువేలమంది బలగాలతో మధ్యశ్రేణి క్షిపణుల్ని ప్రయోగించటానికి అనువుగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే అరేబియా సముద్ర జలాల్లోని ఒమన్ తీరంలో మరో నౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇరాన్ వైపు క్షిపణులు గురిపెట్టిసిద్ధంగా ఉంది. అమెరికాను ప్రతిఘటించటానికి ఆర్నెల్ల నుంచే ఇరాన్ సన్నాహాలు చేసు కుంటోంది. ఈ యుద్ధం దీర్ఘకాలంగా సాగటానికి అంచెలంచెల వ్యూహాన్ని సిద్ధం చేసిఉంచింది. ప్రపంచం దీన్నంతటినీ మౌనంగా వీక్షిస్తూ ఉండగలదా? ఇది అమెరికా సొంత వ్యవ హారం కాదు. యుద్ధం వల్ల నష్టపడేది కేవలం ఇరాన్ ఒక్కటే కాదు. యుద్ధానికి అమెరికా చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇరాన్ దగ్గర అణ్వాయుధానికి తోడ్పడే శుద్ధి చేసిన యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నది అందులో ఒకటి. ఇది ప్రపంచ శాంతికి ముప్పు తెస్తుందని అమెరికా వాదన. ఇజ్రాయెల్ దగ్గర అమెరికా మోహరించిన అణ్వాయుధాలున్నాయి. అది ఇరుగు పొరుగు దేశాలపై కోరుకున్నప్పు డల్లా దాడులు చేస్తోంది. గాజాను వల్లకాడు చేసింది చాలక, అక్కడి వార్తలు బయటి ప్రపంచానికి తెలియకుండా వందల సంఖ్యలో పాత్రికేయులను హతమార్చింది. అందుకే అక్కడేం జరుగుతున్నదో ప్రస్తుతం తెలియటం లేదు. ఇరాన్ వల్ల కనీసం గత పదేళ్లుగా పశ్చిమాసియాలోని ఏయే దేశాలకు ముప్పు వాటిల్లిందో, అదే కాలంలో ఇజ్రాయెల్ ఏమేం చేసిందో అమెరికా వెల్లడించాలి. ఇక మానవ హక్కుల ఉల్లంఘన సాకు అర్థరహిత మైంది. తాను అక్రమ వలసదారుల పేరిట నిత్యం మానవ హక్కులను ఉల్లంఘిస్తూ, వేరెవరో ఆ పని చేస్తున్నారనే నైతిక హక్కు ఎక్కడిది? తన చెప్పుచేతల్లోని సౌదీ, యూఏఈ, ఖతార్ వంటి దేశాల మాటేమిటి? అక్కడ ప్రజాస్వామిక వ్యవస్థలు ఉనికిలో ఉన్నాయా? ఆ సంగతలా ఉంచి ఆ సాకుతో జోక్యం చేసుకోవటానికి అమెరికాకున్న అధి కారం ఎక్కడిది? ఇరాన్ ప్రజలు యాభయ్యేళ్ల క్రితమే మహ్మద్ రెజాపెహ్లవీ వంటి నియంతను కూలదోసిన చరిత్ర గలవారు. ప్రస్తుత ఖమేనీ పైనా తిరగబడగల సత్తా ఉన్నవారు.జెనీవాలో ఒకపక్క ఒప్పందం కోసం ఇరాన్తో చర్చలు సాగిస్తూ బలగాల మోహరింపు నీతిమాలినతనం. అలా చేస్తే పాదాక్రాంతమవుతుందని ట్రంప్ భ్రమపడు తున్నారు. నిత్యం యుద్ధాల్లో, ఆంక్షల్లో బతుకీడుస్తున్న ఇరాన్ కొత్తగా భయపడేదేమీఉండదు. గత ఏడాది 12 రోజుల యుద్ధంలో తేటతెల్లమైంది ఇదే. చివరకు అమెరికాయే కాల్పుల విరమణకు సిద్ధపడాల్సి వచ్చింది. యుద్ధమంటూ జరిగితే, అది దీర్ఘకాలం కొనసాగేలా ఇరాన్ చూస్తే ఇజ్రాయెల్ సహా అమెరికా మిత్రదేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని విధంగా దెబ్బతింటాయి. హోర్ముజ్ జలసంధి మూతపడితే బ్యారెల్ చమురు ధర ఒక్కసారిగా 80 డాలర్ల నుంచి దాదాపు 200 డాలర్లకు చేరువై, ప్రపంచ దేశాలన్నీ అధిక దరలతో సతమతమవుతాయి. చమురు ఉత్పత్తులపై ఆధారపడే ప్లాస్టిక్, ఎరు వులు, ఫార్మా రంగాల ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుంది. వాటి ధరలు ఆకాశాన్నంటుతాయి. స్టాక్ మార్కెట్ల పతనం సరేసరి. ఇరాన్పై దాడులకు తన సైనిక స్థావరం వాడుకోవద్దని బ్రిటన్ చెప్పింది. గల్ఫ్ దేశాలు, వేరే దేశాలు సైతం ఆ మాటే చెప్పాలి. రష్యా, చైనాలు సైతం ఇరాన్కు అనుకూలంగా ఈ వివాదంలోకి దిగితే మున్ముందు ఇది ప్రపంచయుద్ధంగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే అమెరికా ప్రతినిధుల సభ మౌనం వహించ కూడదు. దాని అనుమతి లేనిదే ట్రంప్ అడుగు ముందుకేయలేరు గనుక ఇది చాలా అవసరం. కాగల కార్యం ట్రంప్ నెరవేరుస్తారని కలగంటున్న డెమాక్రాట్లు మౌనం వీడకపోతే చరిత్ర క్షమించదు. -
బిల్ గేట్సూ... మన నైతికత!
దాదాపు 48 గంటల ఊగిసలాట తర్వాత ఎట్టకేలకు ఢిల్లీలో భారీ యెత్తున జరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) శిఖరాగ్ర సదస్సులో గురువారం కీలక ప్రసంగం చేయాల్సిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెనక్కి తగ్గారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణలొచ్చి, ఒక కేసులో శిక్ష కూడా పడి జైల్లో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్తో సాన్నిహిత్యం ఉందని వెల్లడైనప్పటి నుంచి గేట్స్పై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకే ఈ భంగపాటు. గురువారం నాటి ఏఐ సదస్సు కార్యక్రమం గురించి నిర్వాహకులు వెబ్సైట్లో మంగళవారం ఉంచిన జాబితాలో గేట్స్ పేరు లేదు. ఇక అక్కడినుంచి మొదలైంది ప్రహసనం! ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రస్తావన ఉంది గనుక ఆయన హాజరు కాబోరని ప్రభుత్వ వర్గాలు చెప్పడం, అదేం కాదు... వస్తున్నారంటూ గేట్స్ ఫౌండేషన్ వివరణ, ఆ వెంటనే వెబ్సైట్లో మళ్లీ ఆయన పేరు దర్శనమీయటం, కేంద్ర సమాచార మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం తప్పించుకునే ధోరణిలో జవాబీయటం పెద్ద చర్చకు దారితీసింది. తెరవెనుక ఏం జరిగిందోగానీ... గేట్స్ హాజరు కాబోరని చివరి నిమిషంలో నిర్ధారణ అయింది. చిత్రమేమంటే... ఈలోగా సోమవారం ఆయన విశిష్ట అతిథిగా అమరావతిలో ప్రత్యక్షం కావటం, చంద్రబాబు పాలనను చూసి పొంగిపోయి ఉదారంగా ప్రశంసలు కురిపించటం పూర్తయిపోయింది. ఆయన్ను ‘తీసుకు రాగలినందుకు’ కూటమి పక్షాలన్నీ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్న తరుణంలోనే పిడుగుపాటులా ఏఐ సదస్సు ఎపిసోడ్ వెల్లడై పరువు పాతాళానికి పడిపోయింది. అలాంటి వ్యక్తిని ఆహ్వానించినందుకు సామాజిక మాధ్యమాల్లో చీవాట్లు మొదలయ్యాయి. ఆయన నేపథ్యాన్ని గమనించకుండా తీసుకొచ్చి పొగిడించుకున్నంత మాత్రాన భ్రమల్లో పడేదెవరు? ‘అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక...’ అన్న నానుడి బాబు మరిస్తే ఎలా?అయిదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నా, ఇప్పటికీ ఎప్స్టీన్ ప్రేతాత్మ అనేకుల్ని వెన్నాడుతోంది. 30 లక్షల పేజీలున్న ‘ఎప్స్టీన్ ఫైల్స్’ను అమెరికా న్యాయశాఖ గత నెలలో బట్టబయలు చేసినప్పటినుంచీ పీఠాలు కదులుతున్నాయి. శిఖరాలు కూలు తున్నాయి. ఇందులో ఆడ, మగ కూడా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధినేత క్లింటన్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ తదితరుల పేర్లున్నాయి. బ్రిటన్ రాజు చార్లెస్ సోదరుడు ప్రిన్స్ ఆండ్రూ గురువారం అరెస్టయ్యారు. బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మాన్ శాక్స్ న్యాయ సలహాదారు క్యాథరిన్ రుమెల్లర్ పదవికి రాజీనామా చేశారు. ఎంతో అయిష్టంగా ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నానన్నందుకు ఆ సంస్థ చీఫ్ డేవిడ్ సోలొమాన్కు చీవాట్లు పడుతున్నాయి. ప్రముఖ నౌకా రవాణా నిర్వహణ సంస్థ డీపీ వరల్డ్ చీఫ్ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయమ్ తప్పుకున్నారు. అమెరికా ప్రముఖ న్యాయ సహాయ సంస్థ పాల్వీస్ చీఫ్ బ్రాడ్ కార్ప్ రాజీనామా చేశారు. ఇంకా బ్రిటన్ మాజీ రాయబారి, ఎంపీ లార్డ్ పీటర్ మాండెల్సన్, శత కోటీశ్వరురాలైన బ్యాంకర్ అరియానే డి రోత్స్, ఆర్థికవేత్త లారీ సమ్మర్స్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ వగైరాల పేర్లున్నాయి. ఆఖరికి మన కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురి అమెరికాలో రాయబారిగా ఉండగా ఆయనతో సంభాషించినందుకు ఈ ఫైల్స్లోకెక్కారు. వీరంతా ఎప్స్టీన్ నేరాల్లో భాగస్వాములని కాదు. ఈ మెయిళ్లలో అతన్ని ‘విలాస పురుషుడి’గా ప్రశంసించినవారు మొదలుకొని, అతగాడు అడిగిన పనులు చేసిపెట్టినవారి వరకూ ఎందరో ఉన్నారు. ఎవరినుంచి అయినా సమాజం నైతిక విలువలు ఆశిస్తుంది. అవి లోపించాయని గ్రహిస్తే ఎంతటివారినైనా తృణీకరిస్తుంది. బిల్ గేట్స్కు ఏపీలో నీరాజనాలు పట్టడం చూసినా, ఏఐ సదస్సులో ఆయన పాల్గొనటంపై బాహాటంగా బయటపడిన ఊగిసలాట గమనించినా ఈ విషయంలో మనం పాశ్చాత్య దేశాలకన్నా వెనకబడి ఉన్నామా అన్న సంశయం ఏర్పడి విచారం కలిగిస్తుంది. మన పురాణాలు, ఇతిహాసాలు మాత్రమే కాదు... మన రాజ్యాంగం సైతం మహిళల పట్ల ఎంత బాధ్యతాయుతంగా మెలగాలో చెబుతుంది. కానీ బిల్ గేట్స్ ఎపిసోడ్ ఆ విషయంలో మనకంతగా పట్టింపులేదన్న అభిప్రాయం కలిగిస్తుంది. -
పదునెక్కిన బంధం
అంతర్జాతీయంగా అవాంతరాలు ఎదురైన ప్రతి సందర్భంలోనూ మనకు అండగా నిలబడిన ఫ్రాన్స్తో మన అనుబంధం మరింత బలపడింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారత పర్యటన సందర్భంగా రక్షణ, ఆరోగ్యం, అత్యంతా ధునాతన సాంకేతికత, సంప్రదాయేతర ఇంధన వనరులు, అరుదైన ఖనిజాలు సహా పలు అంశాల్లో ఇరు దేశాలకూ లబ్ధి చేకూర్చే 21 ఒప్పందాలపై మంగళవారం సంతకాలు కావటంతోపాటు ఇప్పుడున్న ద్వైపాక్షిక బంధాన్ని ప్రత్యేక ప్రపంచ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యానికి విస్తరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, మెక్రాన్లు నిర్ణయించటం చరిత్రాత్మకం. పరస్పర గౌరవం, ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉంటే దేశాల మధ్య స్నేహం చిగురించటం, విస్తరించటం కష్టమేమీ కాదు. కానీ చుట్టూ గడ్డు పరిస్థితులున్నా, అనిశ్చితి ఆవరించినా కూడా ఆ బంధం మరింత దృఢపడటం గొప్ప విషయం. మోదీ అన్నట్టు ఇరు దేశాల మధ్యా దశాబ్దాలుగా ఉన్న ‘సరిహద్దులు లేని’ చెలిమి వల్లనే ఇదంతా సాధ్యమైంది. 1988లో పోఖ్రాన్లో అప్పటి వాజ్పేయి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అణుపరీక్ష నిర్వహించినప్పుడు ఏం జరిగిందో అందరికీ గుర్తుంది. అప్పటికే తమ అమ్ములపొదిలో వందల సంఖ్యలో అణుబాంబులు పెట్టుకున్న అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాలన్నీ మనపై విరుచుకుపడ్డాయి. సుద్దులు చెప్పేందుకు సిద్ధమ య్యాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) శిఖరాగ్ర సదస్సు ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. అప్పుడు భారత్ను గట్టిగా సమర్థించి, ఆంక్షలు విధించే తీర్మానాన్ని ‘వీటో’ చేస్తామని ఫ్రాన్స్ హెచ్చరించటంతో అది కాస్తా సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా అణు రియాక్టర్ల సాంకేతికత మొదలు అధునాతన ఆయుధాలు అందించటం వరకూ ఆ దేశం మనకెంతో తోడ్పాటునందించింది. ప్రపంచ దేశాలను బతిమాలి, ఒత్తిడి తెచ్చి మూడు దశాబ్దాల క్రితం తానే తీసు కొచ్చిన ప్రపంచీకరణ విధానాలకు హఠాత్తుగా తిలోదకాలిచ్చిన అమెరికా... ఇప్పుడు ఒంటెత్తు పోకడలతో, బెదిరింపులతో, దబాయింపులతో అందరినీ పాదాక్రాంతం చేసుకోవాలని చూస్తోంది. అంతర్జాతీయ దౌత్య సంప్రదాయాలకూ, మర్యాదలకూ ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెల్లుచీటీ ఇచ్చారు. ఈ కల్లోల స్థితిలో భారత్–ఫ్రాన్స్ల మధ్య ఇప్పుడు కుదిరిన ఒప్పందాలు ఏదోమేర సుస్థిరత ఏర్పడటానికి దోహద పడతాయి. వర్తమాన ప్రపంచ పరిణామాలపై ఇరు దేశాల వైఖరులూ ఒకటే. అన్ని దేశాలూ నిబంధనలకు కట్టుబడి ఉన్నప్పుడే అందరూ సమానంగా అభివృద్ధి సాధించగల మెరుగైన ప్రపంచం ఏర్పడుతుందని రెండు దేశాలూ విశ్వసిస్తాయి. ఇలాంటి సారూప్యతల కారణంగానే ప్రగాఢమైన సాన్నిహిత్యం సాధ్యమైంది. మన రక్షణ కొనుగోళ్లలో రష్యా తర్వాత ఫ్రాన్స్దే రెండో స్థానం. ఆ రంగంలో మనం స్వావలంబన సాధించాలనీ, విదేశాలపై ఆధారపడటం తగ్గాలనీ అందరూ కోరుకుంటున్నదే. కానీ ఈలోగా మన భద్రతకూ, రక్షణకూ విశ్వసించదగ్గ భాగస్వాములు ఎంతో అవసరం. రష్యాతోపాటు ఫ్రాన్స్ దాన్ని నెరవేర్చగలుగుతోంది. మన వైమానిక దళానికీ, నావికాదళానికీ మరిన్ని రఫేల్ యుద్ధ విమానాల కోసం మనం ఒప్పందం కుదుర్చుకోగా, వాటిలో కొన్నిటిని ఇక్కడే ఉత్పత్తి చేసేందుకు ఫ్రాన్స్ అంగీకరించింది. అలాగే ఎవరెస్టు శిఖరం కన్నా ఎత్తులో ఎగిరే ఎయిర్బస్ హెచ్ 125 హెలికాప్టర్ల తయారీ సైతం మొదలైంది. వాటిని ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తామని మోదీ ప్రకటించారు. ప్రపంచం తూర్పు, పడమరలుగా... ఉత్తర, దక్షిణాలుగా విడివడి ఉంది. మనం పాశ్చాత్య దేశాలుగా పిలుచుకునే వాటిలో సైతం భిన్న ధోరణులు కనబడుతున్నాయి. ఇలాంటి ప్రపంచంలో పరస్పర సహకారం, గౌరవం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఏ రెండు పక్షాల మధ్యనైనా అవగాహన కష్టం కాదని ఇప్పుడు ఫ్రాన్స్తో కుదిరిన ఒప్పందాలైనా, ఇంత క్రితం బ్రిటన్, ఈయూలతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలైనా రుజువు చేశాయి. ఎప్పటికీ ఏకధ్రువ ప్రపంచమే కొనసాగాలనీ, తమ ఆధిపత్యమే శాశ్వతంగా వర్ధిల్లాలనీ, అన్యులెవరూ ఎదగరాదనీ భావిస్తున్న అమెరికా... బహుళ ధ్రువ ప్రపంచం తన కళ్లముందే నిర్మాణమవుతున్న వైనాన్ని ఇకనైనా గ్రహించటం మంచిది. -
అ‘భద్రతా’ సదస్సు!
అమెరికా, యూరప్ దేశాలు భిన్న ధ్రువాలని మరోసారి రుజువైంది. భూగోళం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలపై ఆ రెండు పక్షాల అధినేతలూ పరస్పరం అభిప్రాయాలు పంచుకునే వార్షిక మ్యూనిక్ భద్రతా సదస్సు (ఎస్సీఓ) మరోసారి దీన్ని చాటింది. ఏడాదిగా అవకాశం దొరికినప్పుడల్లా యూరప్ దేశాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకిపారేస్తున్నారు. అయినా తిరిగి జవాబివ్వలేని నిస్సహాయత వాటిని ఆవరించింది. మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఈ సదస్సుకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియేల్ మెక్రాన్ పిలుపునిచ్చారు. జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ యూరప్ రాజ్యాలు స్వతంత్ర పంథాను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. నిరుడు జరిగిన సదస్సుకు హాజరైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ‘మీరు పాటిస్తున్న విలువలేమిటి... స్వేచ్ఛాయుత గళాలను అణిచేస్తారా?’ అంటూ నిప్పులు చెరిగినప్పుడు సదస్సులోని యూరప్ దేశాల అధినేతలు నిర్ఘాంతపోయారు. సమాజ సామరస్యతకు భంగం కలిగిస్తున్న అతి మితవాద పక్షాలను యూరప్ దేశాలు అదుపు చేస్తుండటం వాన్స్కు నచ్చలేదు. అలాగే తమ మాదిరే యూరప్ దేశాలు కూడా వలస నిబంధనలు కఠినం చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఈసారి సదస్సుకు అమెరికా ప్రతి నిధిగా వచ్చిన విదేశాంగ మంత్రి మార్కో రుబియో... వాన్స్ మాదిరి గద్దిస్తూ మాట్లాడక పోయినా అవే అభిప్రాయాలను ప్రకటించారు. ‘మీతో మాకు గాఢమైన అనుబంధం ఉంది. మన ఇద్దరి భవితవ్యాలూ పెనవేసుకుని ఉన్నాయి. అవి కొనసాగాలనే మా ఆకాంక్ష కూడా! కానీ అవసరమైతే ఒంటరి ప్రయాణానికి మేం సిద్ధం’ అంటూ మెత్తగా హెచ్చరించారు. ఒకప్పుడు మ్యూనిక్ భద్రతా సదస్సు అంటే అమెరికా డాబూ దర్పం ప్రదర్శించే సందర్భం. స్వేచ్ఛాయుత ప్రపంచాధినేతగా అమెరికా అధ్యక్షుడికి నీరాజనాలు పట్టే వారు. పెద్దన్నగా భావించి సలహాలూ, సూచనలూ స్వీకరించేవారు. తొలి సదస్సు నాటి నుంచీ ఇదే స్థితి. కానీ ట్రంప్ ఆగమనంతో అంతా తలకిందులైంది. ఈ సదస్సులకు అమెరికా ప్రతినిధుల సభలోని పాలక, విపక్ష సభ్యులు కూడా హాజరవుతారు. తాము అధికారంలోకొస్తే విదేశాంగ విధానంలో చేసే మార్పులేమిటో విపక్ష ప్రతినిధులు ఏకరవు పెడతారు. వీరిలో మున్ముందు అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడదల్చుకున్నవారే అధికంగా వస్తారు. ఈసారి కూడా ఇరుపక్షాల సెనెటర్లూ వచ్చారు. కానీ వామపక్ష భావా లున్న డెమాక్రటిక్ పార్టీ సెనెటర్ ఒకాసియో కోర్టెజ్ తప్ప ఇతరులెవరూ ట్రంప్ ప్రవచిస్తున్న విధానాలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించలేకపోయారు. డెమాక్రాట్ల అయోమయానికి కారణం ఉంది. 2016లో తొలిసారి ట్రంప్ ఎన్నికై నప్పుడు అది యాదృచ్ఛిక ఘటనగా ఆ పార్టీ భావించింది. యూరప్ అధినేతల అంచనా కూడా అదే! కానీ రెండో దఫా ఎన్నిక వారిలో జ్ఞానోదయాన్ని కలిగించింది. అందుకే ఇది మొత్తంగా అమెరికన్ సమాజ ధోరణిలో వచ్చిన మార్పునకు సంకేతం కావొచ్చన్న నిర్ణయానికొచ్చారు. ట్రంప్ అనంతరం ఎవరు అధికారంలోకొచ్చినా కొంత హెచ్చు తగ్గులతో ఈ విధానాలే తప్పక పోవచ్చని డెమాక్రాట్లు భావిస్తున్నారు. ట్రంప్ కారణంగా విచ్ఛిన్నమైన అమెరికా–యూరప్ బంధాన్ని ఏదో మేరకు మరమ్మతు చేయగలిగినా పూర్వపు స్థితి రావటానికి కొన్ని తరాలు పడుతుందని అరిజోనా సెనెటర్ మార్క్ కెల్లీ వ్యాఖ్యానించటంలోని అంతరార్థం అదే.ఈసారి భద్రత మాట అటుంచి... మ్యూనిక్ సదస్సు యూరప్ దేశాల అరణ్య రోదనగా మిగిలింది. ఉక్రెయిన్ యుద్ధంపై నిర్వహించిన చర్చకు రుబియో గైర్హాజరయ్యారు. ఆ దేశానికి అమెరికా నుంచి అదనంగా వచ్చిపడేదేమీ లేదని ఉక్రెయిన్ అధ్య క్షుడు జెలెన్స్కీకి అర్థమై ఉండాలి. ‘నాటో సభ్యత్వం వద్దు... కనీసం రెండు దశాబ్దాల పాటు మా భద్రతకు పూచీ పడతామని అమెరికా హామీ ఇస్తే రష్యాతో రాజీ పడతామని ఆయనన్నారు. కానీ వినేవారేరి? యూరప్దీ అదే స్థితి. గ్రీన్ల్యాండ్ విషయంలో రుబియోతో ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం వచ్చినా డెన్మార్క్, గ్రీన్ల్యాండ్ అధి నేతలకు ఎలాంటి హామీ దొరకలేదు. మొత్తానికి తమది ఇకపై ఒంటరి పయనమేనని తెలి సింది గనుక స్వీయ ప్రయోజనాలపై యూరప్ దృష్టి సారించాలి. అమెరికా కీలుబొమ్మగా వ్యవహరించటం విరమించుకోవాలి. -
వడివడిగా ఏఐ దిశగా...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సృష్టించిన అనిశ్చితి సకల రంగాలనూ ఆవరించిన వేళ కృత్రిమ మేధ (ఏఐ) శిఖరాగ్ర సదస్సు సోమవారం దేశ రాజధాని నగరంలో ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో భారత్ ‘బాధ్యతాయుత ఏఐ’ అనే భావన నుంచి కోట్లాదిమంది వినియోగదారులు నేరుగా, భద్రంగా వాడుకునే పూర్తిస్థాయి ఏఐ వినియోగంలోకి తెచ్చే స్థాయికి ఎదిగింది. భారత్–విస్తార్ పేరిట 24 గంటలూ అన్ని ప్రాంతాల రైతులకూ వారి భాషల్లోనే సాగు రంగ సమస్యలపై సమాధానాలిచ్చే ఏఐ ‘డిజిటల్ సాగు నిపుణుడు’ రాబోతున్నాడు. ఇంకా ఆరోగ్య రంగంతో పాటు ఆరు కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అక్కరకొచ్చే ఏఐ మోడళ్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ సదస్సు ద్వారా దేశ ఏఐ రంగంలో 20,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా, బ్లాక్స్టోన్ తదితర సంస్థలు 12,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ట్రంప్ సృష్టించిన అనిశ్చితి సంగతలా ఉంచి, ఏఐ రంగంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న సమస్యలు సైతం పెట్టుబడుల విషయంలో ఊగిసలాటకు తావిస్తున్నాయి. భవిష్యత్తు ఏఐదే అనే భరోసా ఉన్నమాట నిజమే అయినా... హఠాత్తుగా ఊహించని రీతిలో దూసుకొస్తున్న సరికొత్త ఆవిష్కరణలు అప్పటికే నిలదొక్కుకున్న సంస్థల్ని అయోమయంలో పడేస్తున్నాయి. భారీ పెట్టుబడులతో తీసుకొస్తున్న ఆవిష్కరణలు కాస్తా, అంతకన్నా చవగ్గా తయారవుతుంటే... వినియోగదారులు అటువైపు పరుగులు పెడుతుంటే ఆ సంస్థలకు దిక్కుతోచటం లేదు. 1,300 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి శ్రమించి చాట్ జీపీటీ మోడల్ను తీసుకొచ్చిన సామ్ ఆల్ట్మాన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ఏఐ... నిరుడు జనవరిలో డీప్సీక్ ఉరుములేని పిడుగులా వచ్చిపడేసరికి బెంబేలెత్తిపోయింది. దాంతోపాటు దిగ్గజ సంస్థలు అనేకం నిరాశలోకి జారుకున్నాయి. కానీ ఆ వెంటనే డీప్సీక్పై భారీ స్థాయి సైబర్ దాడి జరగటం, పైగా అది చైనా నియంత్ర ణలకు లోబడి ఉంటుందని తెలియడం పర్యవసానంగా అనేక దేశాలు పలు నియంత్రణలు విధించాయి. దాంతో డీప్సీక్ దూకుడుకు కాస్త కళ్లెం పడింది. ఇటీవల ఆంత్రోపిక్ సృష్టించిన ప్రకంపనలు సామాన్యమైనవి కాదు. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు దాని ధాటికి విలవిల్లాడాయి. అది తీసుకొచ్చిన క్లాడ్ 3.5 సానెట్, క్లాడ్ 3 ఓపస్ మోడళ్లు చాట్ జీపీటీని తలదన్నేలా ఉండటమే అందుకు కారణం. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకుని, అందులో నాయకత్వ పాత్ర పోషించాలని మన దేశం నిశ్చయించుకుంది. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు రెండు దశాబ్దాలపాటు పన్ను మినహాయింపునిస్తామని ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ప్రకటించటం అందులో భాగమే. కనుకనే భిన్న దిగ్గజ సంస్థలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కొస్తున్నాయి. ఏఐ రంగంలో 90 శాతం పేటెంట్లు అమెరికా, యూరప్, చైనాలవే. 2024లో అమెరికా నుంచి వచ్చిన ఏఐ మోడళ్లు 40 కాగా, 15తో చైనా రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న యూరప్ ఖాతాలో మూడే ఉన్నాయి. దాన్నిబట్టి మనం మరెంతగా ఎదగాలో అర్థం చేసుకోవచ్చు. పరిశోధన, అభివృద్ధికి భారీ కేటాయింపులు చేస్తేనే అందులో మన కంటూ మెరుగైన స్థానం దక్కుతుంది. మన జీడీపీలో ఇందుకోసం కేటాయిస్తున్నది అక్షరాలా 0.7 శాతం మాత్రమే. అమెరికా 3.5 శాతం,చైనా 2.7 శాతం వెచ్చిస్తున్నాయి. ట్రంప్ వ్యవహార శైలి వల్ల అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయత దెబ్బతింది. అది హఠాత్తుగా సహాయ నిరాకరణ చేస్తే సర్వం స్తంభించిపోయే స్థితి ఏర్పడుతుందని తెలిసిరావటం వల్ల చాలా దేశాలు సార్వభౌ మత్వాన్ని కాపాడుకునే స్థాయి ఏఐ కావాలని కోరుకుంటున్నాయి. మనం మెరుగైన వ్యూహంతో, అందుకు తగిన ఆచరణతో ముందుకెళ్తే ఏఐ రంగంలో నాయకత్వ స్థాయికి ఎదగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పరిణామాలు చెబుతున్నాయి. ఏఐ నుంచి అచ్చం మనిషిలా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో గలిగిన ఏజీఐ (కృత్రిమ సాధారణ మేధ) స్థాయికి సాంకేతికత చేరుకోబోతున్న ఈ దశలో ఢిల్లీ శిఖరాగ్ర సదస్సు తీసుకోబోయే నిర్ణయాలు భారత్ను ఈ రంగంలో అగ్రగామిగా నిలబెట్టగలవని ఆశించాలి. -
గజేంద్ర ‘మోక్షం’
‘ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపలనుండు లీనమై’ అనే పోతన గారి పద్యం సుప్రసిద్ధం. ఇప్పటి సంగతేమో కానీ, ఇటీవలి వరకూ ఈ పద్యం విననివారు ఉండరు. దాని వెనక కథేమిటంటే, ఓ ఏనుగు మడుగులోకి దిగింది. ఓ మొసలి దాని కాలు పట్టు కుంది. విడిపించుకోడానికి ఏనుగు హోరాహోరీ పోరాడింది. ఆ పోరాటం ఏళ్ళ తరబడి సాగింది. ప్రాణం కడతేరే దశలో ఏనుగు ఈశ్వరునికి మొర పెట్టుకుంది. ఆ క్రమంలో ఏకంగా విశ్వమూలాల్లోకి వెళ్ళిపోయింది; ఈ జగత్తు ఎవరివల్ల పుట్టిందో, ఎవరిలో ఉంటుందో, ఎవరిలో లయమైపోతుందో, పరమేశ్వరుడెవరో, అనాది మధ్య లయుడెవరో, అంతా తనే అయినవాడెవరో– అతని నుంచి పుట్టిన ఈశ్వరుని శరణువేడుకుంటు న్నానంటుంది. అప్పుడు ఈశ్వరుడు వచ్చి మొసలిని చంపి ఏనుగును రక్షిస్తాడు! ఈ క్షణాన ఛత్తీస్గఢ్ అడవుల్లో ఏనుగులు ఇలాగే మొరపెట్టుకుంటున్నాయి; ఈసారి అక్కడి అటవీ గ్రామాల వాళ్ళు కూడా ఆ మొరలో గొంతు కలుపుతున్నారు. మనుషులకీ, ఏనుగులకీ మధ్య అక్కడ పతాక స్థాయిలో జీవన సమరం జరుగుతోంది. ఉభయులనూ రక్షించగల ఈశ్వరుడే కనుచూపు మేరలో కానరావడం లేదు. గత పన్నెండేళ్ళలోనే 68 ఏనుగులతోపాటు, 698 మంది మనుషులు మరణించారు. కొద్దిరోజుల క్రితమే ఓ 70 ఏళ్ళ వృద్ధుని ఏనుగులు తొక్కి చంపేశాయి. భారత వన్యప్రాణి సంస్థవారూ, జంతు సంక్షేమ సంఘం వారూ రంగంలోకి దిగి చేస్తున్న రోదనలు అక్షరాలా అరణ్యరోదనే అయి నట్టు కనిపిస్తున్నాయి. మరీ క్రూర జంతువులను మినహాయిస్తే, ఏనుగులు సహా వన్యప్రాణులతో మనిషి సహజీవనం చేయని దశ చరిత్రలో కనిపించదు. ఇప్పుడు సహజీవనం చేయలేని దశకు చేరుకున్నాడు. అందుకు తనే బాధ్యుడు తప్ప వన్యప్రాణులు కావు. ఈ భూమండలం మీద జీవించే హక్కు అన్ని ప్రాణులకూ ఉన్న సంగతి మరచిపోయి తన సర్వం సహాధిప త్యాన్ని స్థాపించుకోడానికి పూనుకున్నాడు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నరికేసి జనావాసాలను సృష్టిస్తున్నాడు, గనులు తవ్వేస్తున్నాడు, అడవుల్లో ఎక్కడబడితే అక్కడ విద్యుత్తంత్రులను వేలాడదీస్తున్నాడు. దాంతో వన్యప్రాణులకు సంచార భూమి కుదించుకుపోయి ఊళ్ళమీద పడుతున్నాయి. ఇటీవలి వరకూ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఏనుగుల సంఖ్య నామమాత్రం. ఇప్పుడు మూడు వంతుల మేరకు, అంటే దాదాపు 400కు వాటి సంఖ్య పెరిగిపోయింది. అభివృద్ధి పేరిట జరుగుతున్న తవ్వకాల వల్ల అలవాటుపడిన దారులు మరచిపోయి అవి జనావాసాల్లోకి వచ్చిపడుతున్నాయి. 90 శాతం ఏనుగుల మరణానికి విద్యుదాఘాతాలే కారణమంటున్నారు. ఆ పైన గోతులు, బురద నేలలు వాటి ప్రాణాలు హరిస్తున్నాయి. అడవి జంతువులను మచ్చిక చేసుకుని వాడుకోవడంలో ఎంతో తెలివి కనబరచిన మనిషి, చివరికి వాటితోనే పోరాడి ప్రాణాల మీదికి తెచ్చుకునే తెలివి హీనతకు దిగ జారడం ఆశ్చర్యం కలిగిస్తుంది. స్వార్థం వికటించి ప్రకృతి విధించిన అన్ని రకాల హద్దులనూ, సహజీవన ధర్మాన్నీ ఉల్లంఘించడమే అందుకు కారణం. పురాణ, ఇతిహాస కాలంతో మొదలుపెట్టి, చరిత్ర కాలం వరకూ మనిషికీ, ఏనుగుకీ ఉన్న అనుబంధం అనేక రూపాల్లో అక్షరబద్ధమైంది. ఏనుగు ముఖంతో ఉన్న గణపతిని కొలవడం సరేసరి; ‘ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవు’డని పిల్లలు పాడుకోవడం మనకు తెలుసు. ధర్మరాజు వాకిట్లో ఏనుగుల నుంచి స్రవించే మదం బురద కట్టగా, కిక్కిరిసిన సామంత రాజులు ధరించిన ఆభరణాల నుంచి జారిన రజం ఆ బురదను కప్పేసిందంటూ ధర్మరాజు గజ సంపదనూ, సామంత రాజుల బలగాన్నీ కూడా – ‘ఎవ్వాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు’ అనే పద్యంలో అద్భుతంగా వర్ణిస్తాడు తిక్కన. యుద్ధంలో ఓడిన తర్వాత, ఏనుగునెక్కి, రెండు వైపులా అనేక ఏనుగులు వెంట రాగా పురవీథుల్లో ఎలా విహరించగలవంటూ, చక్కని మరో తిక్కన పద్యంలో అర్జునుడు దుర్యోధనుని ఆక్షేపిస్తాడు. ‘ఏనుగునెక్కినాము ధరణీంద్రులు మొక్కగ నిక్కినాము’ అంటూ తిరుపతి వెంకటకవులు సగర్వంగా చెప్పుకుంటారు. ఏనుగునెక్కి యుద్ధాలు చేసిన మనిషి ఏనుగుతో యుద్ధం చేయవలసి రావడమే అతని వివేక భ్రష్టతకు పరాకాష్ఠ. ఛత్తీస్గఢ్ అడవులు ఘోషిస్తున్న సత్యం అదే! -
రాజులు వారే... తరాజులు వారే!
తెలంగాణకు సంబంధించినంతవరకు ‘నేనే రాజును, నేనే మంత్రిన’ని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించుకున్నారు. మునిసిపాలి టీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటించ డానికి సరిగ్గా ఒకరోజు ముందు ఢిల్లీలో ఆయనీ ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలే రాజులనేది ఒక ప్రాథమిక అవగాహన. భారత రాజ్యాంగాన్ని ప్రకటించుకున్నది కూడా ప్రజల పేరుతోనే కదా! ఈ కోణం నుంచి చూసినప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనలో స్వాతిశయం మోతాదు మించినట్టే కనిపిస్తుంది. మరుసటి రోజు ప్రకటించబోయే ఎన్నికల ఫలితాల్లో భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నామనే జోష్ ఇందుకు కారణం కావచ్చు.ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే భారీ విజయం దక్కినట్టు ఎలా భావిస్తారు? అదంతే! మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ తలచుకుంటే స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగానే ఉంటున్నాయి. అర్థబలం, అంగబలం అధికార పార్టీకి దండిగా ఉండడం ఒక కారణం. అధికార యంత్రాంగం పూర్తిగా చెప్పుచేతల్లోఉంటుంది. అంకితభావంతో ఒక పార్టీకి జెండా మోసే కార్య కర్తల ప్రభావం ఇప్పుడు అన్ని పార్టీల్లో తగ్గుముఖం పట్టింది. వారి స్థానాన్ని నాలుగురాళ్లు వెనకేసుకున్నవారు, పైరవీకార్లు ఆక్రమిస్తున్నారు. అంకితభావంతో ఉండే కార్యకర్తల మాదిరిగా తెగించి పోరాడే తత్వం ఈ నయా శ్రేణులకు తక్కువ. లెఫ్ట్, బీజేపీల్లో ఈ జాడ్యం కొంత తక్కువ కావచ్చు కానీ, మిగిలిన పార్టీలేవీ మినహాయింపు కాదు. దానికితోడు ఇంకో రెండు మూడేళ్లు అధికారంలో ఉండే పార్టీనే గెలిపిస్తే కొద్దోగొప్పో అభివృద్ధి జరుగుతుందనే ఆశాభావం కూడా ఓటర్లలో ఉండే అవకాశం ఉన్నది.ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఓట్ల లెక్కింపునకు ముందే భారీ విజయాన్ని ముఖ్యమంత్రి ఊహించడం, 90 శాతం మునిసిపాలిటీలు గెలవబోతున్నామని ప్రకటనలు చేయడం అసహజమేమీ కాకపోవచ్చు. ఇంతకుముందు 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి పాలక పార్టీ 93 శాతం మునిసిపాలిటీలను గెలుచుకున్న ఉదాహరణ కూడా ఉన్నది. కాకపోతే ఆ స్థాయి ఫలితాల్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధించిందా అనేదే ప్రశ్న. 116 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత 66 చోట్ల లభించింది. అంటే 57 శాతం. 36 మునిసిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ 36 త్రిశంకు కౌన్సిళ్లలో 13 చోట్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించింది. ఇవి కూడా పార్టీ ఖాతాలో పడితే సంఖ్య 79కి, శాతం 68కి చేరుతుంది.ఇంకో ఆరు మునిసిపాలిటీల్లో రెండు పార్టీలకు చెరి సమానంగా సీట్లు వచ్చాయి. ఐదుచోట్ల కాంగ్రెస్ – బీఆర్ఎస్కు మధ్య, ఒకచోట బీఆర్ఎస్ – బీజేపీకి నడుమ ఈ టై ఏర్పడింది. 12 హంగ్ మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ పెద్దపార్టీగా గెలిచింది. నాలుగు మునిసిపాలిటీల్లో బీజేపీ, ఒకచోట ఎమ్ఐఎమ్లు పెద్దన్నలుగా ఉన్నాయి. ఈ మొత్తం 23 చోట్ల అధికార దన్నుతో సగానికి సగం కాంగ్రెస్ లాక్కోగలిగినా గరిష్ఠంగా దాని బలం 90 మునిసిపాలిటీలకు చేరుతుంది.స్ట్రయిక్ రేట్ 80 శాతాన్ని దాటే అవకాశం లేదు. అయినా, ఇదేమీ చిన్న విజయం కాదు. ఐదింట నాలుగొంతుల మునిసిపాలిటీలను కాంగ్రెస్ స్వాధీనం చేసుకుంటుంది. కాకపోతే ఐదేళ్ల కింద అప్పటి అధికార బీఆర్ఎస్ ఇంతకంటే పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మూడేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ గుణపాఠాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని ‘నేనే రాజు, నేనే మంత్రి’ ప్రకటన స్పష్టం చేసినట్లయింది. 2020లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు మునిసిపాలిటీలే దక్కాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 13 మునిసి పాలిటీలను స్పష్టమైన మెజారిటీతో గెలుచుకున్నది. ఇంకో పన్నెండు హంగ్ పట్టణాల్లో పెద్ద పార్టీగా గెలిచింది. ఐదుచోట్ల కాంగ్రెస్తో, ఒకచోట బీజేపీతో సమాన వార్డులు గెలవడంతో అక్కడ టై ఏర్పడింది. మొత్తంగా 31 మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ తన బలాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీ తన ‘దర్బార్ సంస్కృతి’ నుంచి బయటపడి ఉన్నట్లయితే మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని క్షేత్రస్థాయి రిపోర్టులు సూచిస్తు న్నాయి. పార్టీకి కేంద్రంలో మాదిరిగానే నియోజకవర్గాల స్థాయిలో కూడా దర్బార్ సంస్కృతి అలవాటైంది. అక్కడ పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్ఛార్జిలే పార్టీకి కేరాఫ్ అడ్రస్!పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్యేలకు సమాంతరంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బీఆర్ఎస్ చేపట్టలేక పోయింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో తెగించి పోరాడే కార్యకర్తలు కరువయ్యారు. ఈ పరిణామం నగర కార్పొ రేషన్లలో, పెద్ద పట్టణాల్లో స్పష్టంగా కనిపించింది. పార్టీ అధినేత మీద జనసామాన్యంలో ఉండే అభిమానం ఇక్కడ పోలైన ఓట్లలో ప్రతిఫలించలేదు. ఎన్నికలు జరిగిన ఏడు నగర కార్పొ రేషన్లలో పెద్దవైన నిజామాబాద్, కరీంనగర్లలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని అదిదక్కించుకోవచ్చు. నిజామాబాద్లో బీజేపీ గణనీయంగా 28 డివిజన్లు దక్కించుకున్నప్పటికీ, కాంగ్రెస్ – ఎమ్ఐఎమ్ కలిసి ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టే అవకాశాలున్నాయి. ఈ రెండు పట్టణాల్లోనూ బీజేపీకి గట్టి పునాదే ఉన్నది. రెండు పార్లమెంట్ స్థానాలు కూడా ఆ పార్టీవే. బీజేపీ విస్తృత ప్రచార వ్యూహాలతో వోటర్లలో పోలరైజేషన్ సృష్టించి లాభపడింది. ఈ ట్రెండ్కు ఎదురీదేంత సంస్థాగత బలం, నాయకత్వం లేక బీఆర్ఎస్ ఆ మేరకు నష్టపోయింది.కొత్తగూడెం ఫలితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. కాంగ్రెస్తో పొత్తులో కొత్తగూడెం శాసనసభ్యునిగా ఎన్నికైన సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు తన నాయకత్వ ప్రతిభను ఈ ఎన్నికల్లో చాటుకున్నారు. కాంగ్రెస్తో సమానంగా 22 సీట్లను సీపీఐ గెలిచింది. ఆ పార్టీ మేయర్ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికార చాతుర్యం ప్రదర్శించి అడ్డుపుల్లలు వేయకపోతే సీపీఐకి మేయర్ పీఠం ఖాయం. అదే జరిగితే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అదొక శుభసూచకం. ఎందుకంటే, అన్యాయాన్ని ఎదిరించే శక్తులకూ, ప్రశ్నించే గొంతులకూ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా కమ్యూనిస్టు పార్టీలు ఆదర్శమే కనుక! మిగిలిన నాలుగు కార్పొరేషన్లు నల్లగొండ, మహబూబ్నగర్, రామగుండం,మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై విజయం సాధించింది.మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఎవరికెన్ని, ఎంత శాతం అనేదానికన్నా వార్డులు, డివిజన్ల సంఖ్య కీలకం. ఎందుకంటే, జనం ప్రత్యక్షంగా ఓటేసి గెలిపించేది వార్డు/ డివిజన్ సభ్యులనే! మునిసిపల్ వార్డుల్లో కాంగ్రెస్కు 1,347, బీఆర్ఎస్కు 716, బీజేపీకి 261, ఇతరులకు 257 లభించాయి. కార్పొరేషన్ల డివిజన్లలో కాంగ్రెస్ 191, బీఆర్ఎస్ 63, బీజేపీ 76, ఇతరులు (సీపీఐ సహా) 83 చోట్ల గెలిచారు. ఇక ఓట్ల శాతానికి వస్తే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కలిపిన లెక్క అందుబాటులో ఉన్నది. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సుమారు 40 శాతం ఓట్లు, బీఆర్ఎస్కు 29 శాతం, బీజేపీకి 16 శాతం, ఇండిపెండెంట్లకు 8 శాతం, ఎంఐఎంకు 3 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం లభించినట్టు సమాచారం.స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలు ఏకపక్షంగా గెలవడం రివాజుగా మారిన ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రభావం కాంగ్రెస్ చెబుతున్నంత బలహీనంగా ఏమీ లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీ సంస్థాగతమైన బలహీనతలను అధిగమించగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎంపీపీ, జడ్పీపీ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలనే సాధించే అవకాశాలను కొట్టి పారేయలేము. కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ మంచి విజయాన్ని సాధించినప్పటికీ రెండు కమ్యూ నిస్టు పార్టీలకూ కలిపి రాష్ట్రవ్యాప్తంగా రెండు శాతం ఓట్లుకూడా రాకపోవడం ఒక విషాదం. ఒకప్పుడు మిలిటెంట్ పోరాటాలకు పెట్టింది పేరైన సీపీఎం పార్టీ కేవలం అరశాతం ఓట్లకు మాత్రమే పరిమితం కావడం దాని స్వయంకృతాపరాధమే! ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మాత్రంకాంగ్రెస్ పార్టీ వృద్ధ సింహం తాటిపర్తి జీవన్రెడ్డి గురించే! జగిత్యాలలో ఫిరాయింపు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసి ఆయన అనుచరులకే ఎక్కువ భాగం టిక్కెట్లను కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ, జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఆయన దృఢంగా నిలబడిన తీరు రాష్ట్రవ్యాప్తంగా అందరిదృష్టిని ఆకర్షించింది. డబ్బూ, అధికారం తోడు లేకున్నా జీవన్ రెడ్డి చేసిన ఒంటరి పోరాటానికి జగిత్యాల జనం జైకొట్టారు. టికెట్ దొరికిన కార్యకర్తలతో పాటు ఇండిపెండెంట్లుగా నిల బెట్టిన వారితో సహా మొత్తం 18 మందిని గెలిపించుకొని రేస్లో నంబర్ వన్గా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ జీవన్రెడ్డి అనుచ రునికి ఛైర్మన్ పదవిని ఇస్తుందా? లేక అధికారం అండతో మేనేజ్ చేసి ఎమ్మెల్యే మనిషినే ఛైర్మన్ చేస్తుందా అనేది వేరే సంగతి. కానీ జగిత్యాల విన్నర్ మాత్రం జీవన్రెడ్డే!‘నేనే రాజు, నేనే మంత్రి’ అని ముఖ్యమంత్రి ప్రకటించు కోవడం దర్బార్ సంస్కృతి ప్రవేశిస్తుందనడానికి ఒక సూచికే! ఈ ప్రకటనతో ఎంతమంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏకీభవిస్తు న్నారో, ఎంతమంది విభేదిస్తున్నారో తెలియదు. భిన్నాభిప్రా యాలు ఇప్పటికైతే పెదవులు దాటడం లేదు. నాలుగు దశాబ్దాలకాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డున్న జీవన్రెడ్డి తరఫున ఒక్క గొంతు కూడా వినిపించకపోవడం నిజంగా విచిత్రమే. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సరికొత్త సామరస్యమో, తుపాను ముందరి ప్రశాంతతో కొంతకాలం ఆగితే తప్ప తెలియదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా ప్రజలే రాజులన్న సత్యాన్ని గ్రహించక పోతే 2023లో బీఆర్ఎస్కు ఎదురైన అనుభవమే ఎవరికైనా తప్పదు. రాజులూ ప్రజలే! వాళ్లు ఓటేసి కుర్చీలో కూర్చోబెట్టిన ప్రభుత్వ పనితీరును తూకం వేసే తరాజులూ వారే!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఛాందసవాదులకు చావుదెబ్బ
తరాలు మారినంత మాత్రాన గాయాలు తొలగిపోవు. నెత్తుటి చరిత్రను అంత సులభంగా చెరిపేయడం సాధ్యపడదు. బంగ్లాదేశ్ తాజా ఎన్నికల ఫలితాలు దీన్నే బలంగా చాటుతున్నాయి. బంగ్లాదేశ్లో అవినీతికీ, ఆశ్రిత పక్షపాతానికీ, అణచివేతకూ వ్యతిరేకంగా ఉద్యమించిన జెన్–జీ తరాన్ని అడ్డుపెట్టుకుని దేశాన్ని ఛాందసవాదం ఊబిలోకి నెట్టాలని, యాభై అయిదేళ్ల క్రితం బంగ్లా ప్రజానీకాన్ని ఊచకోత కోసిన పాక్తో అంట కాగాలని తహతహలాడిన మతతత్వ శక్తులు గురువారం నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలయ్యాయి. ఫలితాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సే ఉన్నా 300 స్థానా లున్న పార్లమెంటులో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) ఆధ్వర్యంలోని కూటమి 216 స్థానాలు గెల్చుకుందని వార్తలు వస్తున్నాయి. జమాతే ఇస్లామీ నేతృత్వంలోని కూటమికి 76 స్థానాలు లభించాయి. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న చాలా స్థానాల్లో బీఎన్పీ కూటమి ఆధిక్యతలో ఉన్నదని సమాచారం. పెద్ద మనిషిలా కనబడే ఆర్థిక నిపుణుడు మహ్మద్ యూనస్ను తాత్కాలిక ప్రభుత్వా నికి ప్రధాన సలహాదారుగా నియమిస్తే, ఆయన కాస్తా మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమే ధ్యేయమన్నట్టు ప్రవర్తించారు. మైనారిటీ హిందూ పౌరులపైనా, అవామీ లీగ్ నేతల పైనా, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలపైనా ఉన్మాద గుంపులు దాడులు చేస్తుంటే, హతమారుస్తుంటే పట్టనట్టు ప్రవర్తించారు. మతాచారాలు పాటించటం లేదంటూ నడి రోడ్లపై మహిళలను హింసిస్తుంటే కళ్లు మూసుకున్నారు. వాటిని అతిగా చిత్రిస్తున్నారని మీడియాపై విరుచుకుపడ్డారు. హసీనా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిని చేరదీసి, నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ)ని ఏర్పాటు చేయించిందీ, జమాతేతో సర్దుబాటు చేయించిందీ ఆయనే. దేశంలో కొత్త పొద్దు పొడవబోతోందని గురువారం నాటి యూనస్ హుషారు మాటల అర్థం వేరు. జమాతే, ఎన్సీపీ మెజారిటీ స్థానాలు సాధిస్తాయని ఆయన విశ్వసించారు. అవామీ లీగ్పై ఎటూ నిషేధం ఉంది. బీఎన్పీ గత చరిత్ర సైతం అవినీతిమయమే. కనుక రెండు పార్టీల కథ ముగిసినట్టేనని అంచనా కొచ్చారు. కానీ బంగ్లా ప్రజలు వివేకవంతమైన తీర్పునిచ్చి ఆయనకూ, ఆ బాపతు శక్తు లకూ చెంప ఛెళ్లుమనిపించారు. దేశంలో సుస్థిరమైన, స్వతంత్రమైన ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాలని జనం కోరుకుంటున్నట్టు రాజకీయ నిపుణులు ముందే చెప్పారు. అయితే ఎన్నికలతోపాటు రాజ్యాంగ సంస్కరణలపై నిర్వహించిన రిఫరెండమ్ విషయంలో ప్రజాస్వామిక శక్తులు అప్రమత్తంగా ఉండకతప్పదు. వాటిల్లో అవాంఛనీయమైన అంశాలు చొరబడే ప్రమాదం లేకపోలేదు. చూడటానికి వాటి సారాంశం మెరుగ్గానే ఉంది. ప్రధాని పదవికి రెండు దఫాల పరిమితి, స్వతంత్ర న్యాయవ్యవస్థ, మహిళలకూ, యువతకూ పటిష్టమైన ప్రాధాన్యత, పార్లమెంటుకు రెండు సభల ఏర్పాటు అందులో ఉన్నాయి. ఈ సంస్కరణల అమలు బాధ్యత జనం బీఎన్పీకి కట్టబెట్టారు. భావోద్వేగాలతో ముడిపడే ఎన్నికలతో, ఎంతో ఆలోచించి ఓటేయాల్సిన రిఫరెండమ్ను జత చేయటం సరికాదు. పైగా బీఎన్పీ గత చరిత్ర ఘనమైనదేమీ కాదు. కాబోయే ప్రధాని తారిఖ్ రెహ్మాన్ తల్లి ఖలీదా జియా రెండు దఫాల ఏలుబడిలో మతతత్వ, భారత వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహాన్నందించారు. ఇప్పటికైతే రెహ్మాన్ ఆలోచనా ధోరణి భిన్నంగా ఉన్నట్టు ఆయన ప్రసంగాలు చెబుతున్నాయి. బంగ్లా విముక్తి యుద్ధానికి కొత్త భాష్యాలు చెప్పినవారికీ, పాక్ పాలకులను నెత్తి నెక్కించుకున్నవారికీ ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. నిషేధంలోవున్న అవామీలీగ్ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో పోటీచేయలేదన్న మాటేగానీ, ఆనాటి పాక్ దుష్కృత్యాలను ప్రజానీకానికి గుర్తుచేయటంలో విజయం సాధించారు. హసీనా అవినీతి పాలన పుణ్యమా అని జెన్–జీ తరానికి దేశ చరిత్ర గురించి తెలియకుండా పోయింది.భారత్ అనుకూలతకు దూరంగా ఉండాలని, హసీనాను వెనక్కి రప్పించే యత్నం చేయాలని, నీటి వాటాలపై రాజీ పడొద్దని రెహ్మాన్పై జమాతే పార్టీ ఒత్తిళ్లు తెస్తుంది. వ్యర్థ వివాదా లతో కాలక్షేపం చేయకుండా, నిజాయితీగా పాలిస్తే రెహ్మాన్ రాజకీయంగా నిలదొక్కుకుంటారు. లేనట్టయితే ఇప్పుడు ఓటమిపాలైన శక్తులు మున్ముందు బలపడే ప్రమాదంఉంటుంది. -
‘కృత్రిమ’ ధోరణులపై కొరడా
డిజిటల్ ప్రపంచంలో కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా వేషం మార్చుకుని మోసగిస్తున్న మాయగాళ్ల పనిపట్టడానికి కేంద్రం నడుం బిగించింది. 2021లో తెచ్చిన సమాచార సాంకేతికత(ఐటీ) నిబంధనల్ని సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకప్పుడు వదంతులుగా, లేదా తప్పుడు ప్రచారంగా చలామణీ అయిన ప్రతిదీ ఇప్పుడు అసలుగా భ్రమింపజేసే వీడియోలు, ఆడియోలుగా మారిపోతోంది. ఏది నిజమో, ఏది కాదో తెలుసుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఎన్నికల్లో సామాన్య జనాన్ని ఏమార్చటానికి ప్రయత్నించటం దగ్గర నుంచి... మనుషుల్లో క్రౌర్యాన్నీ, హైన్యాన్నీ, నీచప్రవృత్తినీ ప్రేరేపించే, భావోద్వేగాలను రెచ్చగొట్టే ధోరణి గలవన్నీ డిజిటల్ ప్రపంచంలో స్వైరవిహారం చేస్తున్నాయి. వాటి ప్రభావంతో మనుషులు స్వీయనియంత్రణను కోల్పోయి, మానసిక దుర్బలులవుతున్నారు. కొందరు వ్యామోహాలకు లోనై నిలువుదోపిడీ ఇచ్చుకుంటున్నారు. ఆనక లబోదిబోమంటున్నారు. నిత్యజీవిత ఆచరణ ద్వారా, అధ్యయనం ద్వారా, అనుభవాల ద్వారా ఒక క్రమపద్ధతిలో రావలసిన జ్ఞానాన్ని కృత్రిమ మేధ అడ్డుకుని, వారిలోని విచక్షణను ఆవిరి చేస్తోంది.లింగవివక్ష అధికంగా ఉన్న సమాజాల్లో సహజంగానే మహిళలు ఈ సాంకేతికతల వల్ల బాధితులవుతున్నారు. ప్రపంచమంతటా ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. బుడి బుడి నడకల్లో ఉన్న బుడతల దగ్గర్నుంచి, వృద్ధుల వరకూ అందరికందరూ దీని ప్రభావం నుంచి తప్పించు కోలేకపోతున్నారు. ఇందులో పొంచివున్న ప్రమాదాన్ని అందరి కన్నా ముందు పసిగట్టింది యూరోపియన్ యూనియన్(ఈయూ). అది రెండు మూడేళ్లపాటు శ్రమించి 2024లో తెచ్చిన ఈయూ కృత్రిమ మేధ(నియంత్రణ) చట్టం ఉన్నంతలో సమగ్రమైనది. అయితే ఆ చట్టం వచ్చేనాటికి డీప్ లెర్నింగ్ సాంకేతికత బీజప్రాయంలో ఉంది. దాంతో తయారయ్యే నకిలీ(ఫేక్)ని చెప్పడానికి ‘డీప్ఫేక్’ పదం ఇటీవల వాడుకలోకొచ్చింది. సామాజిక మాధ్యమాల్లోని కంటెంట్ వల్ల ఏర్పడగల ప్రమాదతీవ్రత ఆధారంగా ఆ చట్టం వాటిని నాలుగు రకాలుగా – అంగీకారయోగ్యం కానివి, అధిక ప్రమాదంతో కూడుకున్నవి, పరిమితంగా ప్రమాదకరమైనవి, కనిష్ఠ ప్రమాదం ఉన్నవిగా వర్గీకరించింది. మన ప్రభుత్వం ఇప్పుడు రూపొందించిన నిబంధనలు వినియోగదారుడి రక్షణ, దేశభద్రతనూ ప్రధానంగా దృష్టిలో పెట్టుకున్నాయి. ఈ నెల 20 నుంచి అమల్లోకొచ్చే ఆ నిబంధనలు ఇకపై ఏఐ ఆధారంగా రూపొందే ఎలాంటి కంటెంట్కైనా ఆ విషయాన్ని స్పష్టంగా సూచించటం తప్పనిసరి చేశాయి. అలాగే అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, తప్పుడుగా ఉన్నాయని ప్రభుత్వాలు, లేదా న్యాయస్థానాలు నిర్ధారించి తొలగించమని ఆదేశిస్తే... మూడు గంటల్లో శిరసావహించాలి. పాక్షిక లేదా పూర్తి నగ్నంగా చిత్రించే ఫొటోలు, వీడియోలు, శృంగార సంబంధిత కంటెంట్పై అభ్యంతరాలు వ్యక్తమైన రెండు గంటల్లోనే తొలగించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 36 గంటల గడువును వాటి తీవ్రతను బట్టి తగ్గించారు. హానికరమైన, చట్టవిరుద్ధమైన కంటెంట్ ఉన్నపక్షంలో అది తయారు చేసిందెవరో, అప్లోడ్ చేసిందెవరో కూపీలాగే ఉపకరణాలను సామాజిక మాధ్యమాలు రూపొందించుకోవటం తప్పనిసరి చేశారు.అయితే మన ప్రభుత్వం రూపొందించిన విధానం ప్రతిస్పందన ప్రాతిపదికగా ఉంది. రూపొందే కంటెంట్ ఏ పరిమితుల్లో ఉండాలన్నది ఈయూ చట్టం ముందస్తుగా నిర్దేశిస్తోంది. ఏ సామాజిక మాధ్యమమైనా ఉల్లంఘించిన పక్షంలో మన నిబంధనలు క్రిమినల్ కేసులకు మొగ్గుచూపుతుండగా, ఈయూ చట్టం నిర్లక్ష్యం వహించిన సామాజిక మాధ్యమానికి దాని ప్రపంచవ్యాప్త టర్నోవర్లో 7 శాతం వరకూ జరిమానా విధిస్తోంది. మారుతున్న సాంకేతికతల్ని ఆసరాగా చేసుకుని ప్రతిరోజూ, ప్రతి నిమిషమూ వచ్చి పడుతున్న కంటెంట్ను అరికట్టడానికి నిబంధనలు ఏర్పర్చటం, చట్టాలు రూపొందించటం ఏ దేశంలో పాలకులకైనా పెను సవాలు. అంతకన్నా ముఖ్యం... అవి దుర్విని యోగం కాకుండా చూడటం! కుల, మత, రాజకీయ వివక్షతో సద్విమర్శలను నేరపూరితం చేసే ధోరణులు భావప్రకటనా స్వేచ్ఛను దెబ్బతీస్తాయి. సద్భావంతో చేసే సృజనాత్మ కతకు శాపంగా పరిణమిస్తాయి. బహుపరాక్! -
‘స్టార్ట్’కి చెదలు!
అడిగేవారు లేకపోతే, జవాబుదారీతనం కొరవడితే... ఎక్కడైనా ఇష్టారాజ్యం తప్పదు. అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాలు అలాగే వ్యవహరిస్తున్నాయి. ఎవరేమనుకుంటే ఏమిటన్నట్టు రెచ్చిపోతున్నాయి. అణ్వాయుధాల వల్ల భూగోళానికి పెను ముప్పు ఏర్పడుతుందని ప్రపంచ ప్రజానీకం దశాబ్దాల పాటు ఒత్తిళ్లు తెచ్చిన పర్యవసానంగా ఆ రెండింటి మధ్యా 1991లో మొదటిసారి వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు(స్టార్ట్)–1 ఒప్పందం కుదిరింది. దాని స్థానంలో 2010లో ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం సాకారం కాగా, దానికి ఈనెల 5తో నూకలు చెల్లాయి. ఆ విషయంలో మళ్లీ చర్చలు మొదలెట్టాలని, సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి రావాలని రెండేళ్లుగా పలువురు నిపుణులు, ప్రపంచ శాంతిని కాంక్షించేవారు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. కానీ అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. ఆయన స్థానంలో నిరుడు జనవరిలో వచ్చిన డోనాల్డ్ ట్రంప్కు సైతం ఈ సంగతి తెలుసు. దాన్ని గురించి మీడియా ప్రశ్నిస్తే ‘ముగిసిపోతుందా...పోనీయండి. దాని స్థానంలో మరొకటి కుదుర్చుకుంటాం’ అన్నారే తప్ప ఇంతవరకూ ఆ దిశగా చర్చల కోసం చేసిందేమీ లేదు. కొత్త ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అడపా దడపా చెప్పకపోలేదు. కానీ ఉక్రెయిన్లో ఆయన సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ఆ మాటల్లోని చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేసింది. అమెరికా పోకడలూ దానికి భిన్నంగా ఏమీలేవు. ‘న్యూ స్టార్ట్’ ముగియటంతో ఇరుపక్షాలనూ కట్టిపడేసే అంతర్జాతీయ ఒప్పందమేదీ ఉనికిలో లేకుండా పోయింది. ఇకపై రెండు అగ్రరాజ్యాలూ ఆయుధాలు పోగేసుకున్నా, పరస్పరం కయ్యానికి కాలు దువ్వుకున్నా, అణ్వాయుధాల్ని ప్రయోగించే సాహసం చేసినా... ప్రపంచమంతా నిస్సహాయంగా చూస్తూ ఉండక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాలకూ, వాటిని సమర్థిస్తున్నవాటికీ జవాబుదారీతనం, భయభక్తులు, వెరపు వంటివి మాయ మయ్యాయి. ఒకప్పుడు ప్రపంచం ఇంతకన్నా కాస్తయినా మెరుగ్గా ఉండేదనటానికి వ్యూహాత్మక ఆయుధాల పరిమితి ఒప్పందం(సాల్ట్) గురించిన చర్చలే ఉదాహరణ. ఆ ఒప్పందం సాకారం కాలేదు. ఒకవేళ అలా అయినా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఎందుకంటే అప్పటికే ఇరు దేశాలూ పోగేసుకున్న ఆయుధాలు ఇక పెరగకుండా చూడటం తప్ప ఆ చర్చలు సాధించేది పెద్దగా ఏమీ ఉండేదికాదు. కానీ అంతకన్నా మెరుగైన ‘స్టార్ట్–1’ కుదిరింది. అణ్వాయుధం, లేదా వేరే బాంబును మోసుకేళ్లే సామర్థ్యమున్న క్షిపణులను (వార్హెడ్లను) 6,000కు తగ్గించటం, వాటి లాంచర్ల (వాహనాల) సంఖ్యను 1,600కు కుదించటం అది సాధించిన ఘనవిజయం. 2010లో కుదిరిన ‘న్యూ స్టార్ట్’ కూడా చెప్పుకోదగ్గ ముందడుగు. దానివల్ల వార్హెడ్ల సంఖ్య 1,550కి, లాంచర్ల సంఖ్య 700కు తగ్గాయి. పరస్పరం డేటా మార్పిడి, నోటిఫికేషన్ల విడుదల, క్షిపణుల్ని మోహరించిన ప్రాంతాల తనిఖీలకు అనుమతించటం అందులో ఉన్నాయి. నిజానికి ఈరెండింటికీ మధ్య 1993లో ‘స్టార్ట్–2’ గురించి చర్చలు సాగాయి. బహుళ సంఖ్యలో వార్హెడ్లను ప్రయోగించగల క్షిపణులను నిషేధించాలన్నది ఈ చర్చల ఆంతర్యం. కానీ ఎలాంటి ఫలితమూ లేకుండా ముగిసిపోయాయి. ఇప్పటికే అమెరికా, రష్యాల మధ్య చడీచప్పుడూ లేకుండా ఆయుధ పోటీ సాగుతోంది. తమదగ్గరున్న అణ్వాయుధాలకు కృత్రిమ మేధ(ఏఐ)ను జతచేసి, వాటి శక్తిని అనేక రెట్లు పెంచుకుంటున్నాయి. గంటకు 6,437 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగల రకరకాల క్షిపణులు వచ్చేశాయి. వాటిని విడివిడిగా గురిచూసి కొట్టడం అసాధ్యమని తేలాకే ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’ పేరుతో కొత్త పాట అందుకున్నారు. ఆ ‘బంగారు గుమ్మటం’ అమెరికాను ఎంతవరకూ రక్షిస్తుందో నిజంగా ఏమైనా జరిగితే తప్ప ఎవరికీ తెలియదు. మొత్తానికి ఇద్దరి వద్దా అటూ ఇటూగా చెరో 5,000 అణ్వాయుధాలున్నాయి. మిగతా దేశాలన్నిటి వద్దా అందులో సగం కూడా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ప్రపంచ ప్రజానీకం, ముఖ్యంగా ఆ రెండు దేశాల్లోని ప్రజలూ తీవ్రంగా ఒత్తిళ్లు తీసుకురావాలి. లేనట్టయితే ప్రపంచం క్షణక్షణ గండంగా బతుకీడ్చక తప్పదు. -
బంగ్లాకు పరీక్షా సమయం
ఏణ్ణర్థంక్రితం విద్యార్థి ఉద్యమం ధాటికి మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారాన్నీ, దేశాన్నీ వదిలిపెట్టిన నాటినుంచీ రాజకీయ, సామాజిక అస్థిరతలో కూరుకుపోయిన బంగ్లాదేశ్లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ఆర్థిక నిపుణుడు అయిన మహ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఉన్న వైషమ్యాలను మరింత పెంచి పోషించింది. జవాబుదారీతనం లేని అధికారంతో ఆయన తీసుకుంటున్న వరస నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై, తక్షణం ఎన్నికలు నిర్వహించాలని ఒత్తిళ్లు పెరగటంతో ఇవి తప్పనిసరి అయ్యాయి. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ) గెలుపుగుర్రంగా కనబడటమే గత ఎన్నికలకూ, ప్రస్తుత ఎన్నికలకూ కొట్టొచ్చి నట్టు కనబడుతున్న తేడా. పదిహేనేళ్లపాటు దేశాన్నేలిన షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్పై నిషేధం విధించటంతో ఆ పార్టీ జాడలేదు. పాకిస్తాన్ నుంచి విడివడి 1971లో స్వతంత్ర ప్రయాణం ప్రారంభించిననాటి నుంచీ బంగ్లాదేశ్కు ఆటుపోట్లు తప్పడం లేదు. సైనిక కుట్రలు, మత ఛాందసవాదం షరా మామూలైన పాకిస్తాన్ చీడ దానికి కూడా అంటి, ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉంది. 17 కోట్ల 30 లక్షల జనాభాతో ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉన్న బంగ్లా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలు ప్రశంసిస్తూ ఉండేవి. అదే జరిగుంటే హసీనా పదవికి ముప్పు వచ్చి ఉండేది కాదు. కానీ ఆర్థిక అసమానతలకు తోడు పేదరికం, అవినీతి, కక్షసాధింపు ఆమెను దెబ్బతీశాయి. 2022 నుంచి బంగ్లా ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ల నుంచి వందలకోట్ల డాలర్ల రుణాలు తీసు కొస్తున్నా మారిందేమీ లేదు. ఆ డబ్బంతా పాలకపార్టీని ఆశ్రయించుకున్నవారి జేబుల్లోకి పోయింది. అధిక ధరలు, ఉపాధిలేమి సగటు మధ్యతరగతి, దిగువతరగతి కుటుంబా లను తీవ్రంగా దెబ్బతీశాయి. బీఎన్పీయే విజేతగా నిలుస్తుందని సర్వేలు చెబుతున్నా ఆ పార్టీకి అంత మంచి పేరేమీ లేదు. తూర్పు పాకిస్తాన్గా ఉన్నకాలంలో అప్పటి పాక్ పాలకులు తీవ్ర అణచివేత చర్యలకు పాల్పడినా, అనంతరకాలంలో అధికారంలోకొచ్చిన బీఎన్పీ ఆ దేశంతో అంట కాగిందనీ, అవినీతిలో కూరుకుపోయిందనీ జనం గుర్తు చేసుకుంటున్నారు. అందుకే రెహ్మాన్ కొత్త బాణీ అందుకుని అన్ని సభల్లోనూ గత తప్పులకు క్షమాపణ కోరుతున్నారు. 1971 విముక్తి పోరాటంలోనూ, 2024 ప్రజాస్వామ్య ఉద్యమంలోనూ మరణించిన వారికి నివాళులర్పిస్తున్నారు. బీఎన్పీ మాదిరే పాకిస్తాన్ అనుకూల పార్టీగా పేరున్న జమాతే ఇస్లామీ(జేఈఐ)కు ఉన్న అనుకూలాంశమల్లా ఆ పార్టీ ఎప్పుడూ అధికారంలో లేకపోవ టమే! మహిళల హక్కుల విషయంలో ఆ పార్టీది ఛాందసవాద ధోరణి. దీన్ని బీఎన్పీ తనకు అనుకూలంగా మలుచుకుని, తమ పాలనలో లింగవివక్ష ఉండబోదంటోంది. అయితే యూనస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హిందువులపై పెరిగిన దాడుల్ని తామే దృఢంగా ఎదిరించి, రక్షణగా నిలిచామని జేఈఐ చెప్పుకుంటోంది. కానీ ఆ దాడులు ఆగింది లేదు. ఎన్నికల ప్రకటన వెలువడ్డాక అవి మరింత ఎక్కువయ్యాయి. మంగళవారం హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్ను ఆయన దుకాణంలోనే దుండగులు కాల్చిచంపారు. బంగ్లాలో ఎవరు పాలకులైనా చైనా, పాకిస్తాన్ల ప్రభావం దండిగానే ఉంటుంది. బీఎన్పీ ఈ విషయంలో బహిరంగంగా ఏమీ చెప్పకపోయినా, జేఈఐ తన పాక్ అనుకూలతను చాటుకోవటంతో పాటు ఇటీవల చైనా దౌత్యవేత్తలతో భేటీ అయింది. విషాదమేమంటే, హసీనాను పదవీచ్యుతురాలిని చేయటంలో కీలకపాత్ర పోషించిన జెన్ జీ తరానికి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యం లేదు. విద్యార్థుల నాయకత్వంలోని నేషనల్ సిటిజెన్ పార్టీకి ఆశించినంత మద్దతు లభిస్తున్న దాఖలా లేదు. నిరుడు తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధులతో పాటు 30 రాజకీయ పార్టీలు పాల్గొన సదస్సు ఆమోదించిన ‘జూలై ఛార్టర్’పై కూడా గురువారం రిఫరెండమ్ జరగబోతోంది. ప్రస్తుత రాజ్యాంగాన్ని మార్చేందుకే, చరిత్ర వక్రీకరించేందుకే దీన్ని తీసుకొచ్చారని వామపక్షాల విమర్శ. మొత్తానికి బంగ్లాదేశ్ భవితవ్యం ఎలా ఉండబోతున్నదో ఈ ఎన్నికలూ, రిఫరెండమ్ తేల్చబోతున్నాయి. -
సాహసోపేతమేగానీ...
సహనం, ఓర్పు, సంయమనం, ప్రయామం, నిగ్రహం... ఎదుటివారు ఎంతగా రెచ్చ గొడుతున్నా మాట తూలకుండా ప్రశాంతంగా ఉండే స్థితిని చెప్పటానికి ఇలా బోలెడు పదాలున్నాయి. కనీసం ఆర్నెల్లుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరిపోయినట్టేనని తరచు చెబుతూవచ్చారు. అందుకు మన దేశంనుంచి ఆశాజనకమైన స్పందన రానప్పుడల్లా రెచ్చిపోయి మాట్లాడారు. పాకిస్తాన్ పౌర, సైనిక అధినేతల్ని నెత్తినెక్కించుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. జమ్మూ–కశ్మీర్ భౌగోళిక చిత్రపటాన్ని పాకిస్తాన్ సంబరపడేలా మార్చేశారు. ఎన్ని చేసినా మన ప్రభుత్వం మౌనంగా ఉండిపోవటం, లేదా ఆచితూచి మాట్లాడటం పనికొచ్చినట్టుంది. ఎట్టకేలకు మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి భారత–అమెరికాల మధ్య ఒక అవగాహన కుదిరిందని మొన్న శనివారం అధికారికంగా ఉమ్మడి ప్రకటన వెలువడింది. అందుకు సంబంధించిన ఒక అమరిక (ఫ్రేమ్వర్క్) కూడా రూపొందింది. అంతే... వెనువెంటనే 25 శాతం అదనపు సుంకాలు రద్దయ్యాయి. ఇకపై సుంకాలు 18 శాతానికి మాత్రమే పరిమితమవుతాయని అమెరికా ప్రకటించింది. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి అలముకున్న తరుణంలో మన దేశం ఈ మాదిరి ఒప్పందానికి సంసిద్ధం కావటం ఒక సాహసోపేతమైన చర్య. అయితే ‘ఇల్లలకగానే పండగ కాద’న్నట్టు ఈ ఒప్పందం వాస్తవ రూపం దాల్చేవరకూ ఒకింత ఉత్కంఠ, సంశయం తప్పవు. అటు తర్వాత కూడా దిన దిన గండం ఉండనే ఉంటుంది. అక్కడున్నది ట్రంప్ గనుకే ఈ సమస్య. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు గమనిస్తే ఇది తెలుస్తుంది. ‘భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనడం ఆపేసి, ఆ ఉత్పత్తులను అమెరికా నుంచే కొంటుందని ఆశిస్తున్నామ’ని అందులో ఉంది. భారత– రష్యా చమురు వాణిజ్యంపై తమ నిఘా ఉంటుందని కూడా అంటున్నది. ఈ విషయంలో మన దేశం అధికారికంగా ఏమీ చెప్పలేదు. ఉమ్మడి ప్రకటనలోనూ ఆ ప్రస్తావనలేదు. కానీ జాతీయ ఇంధన ప్రయోజనాలే మన గీటురాయి అని గతంలో మోదీ అన్నారు. మన వ్యవసాయ, పాడి రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రశ్నే లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ చెబుతున్నారు. అలాగే అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు సుంకాలు తగ్గించబోమంటున్నారు. అయితే ఉమ్మడి ప్రకటనలో అమెరికాకు సంబంధించిన అన్ని పారిశ్రామిక సరుకులు, విస్తృతశ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు లేదా రద్దు చేయటానికి భారత్ అంగీకరించిందని ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేనట్టయితే భారత్ వెనక్కి తగ్గిందని ట్రంప్ యాగీ చేయటంతోపాటు, అదనపు సుంకాలకు సాకుగా ఉపయోగించుకుంటారు.ప్రస్తుత భారత–అమెరికా వాణిజ్యం 13,000 కోట్ల డాలర్ల మేర ఉంది. ఇందులో అమెరికాకు మన ఎగుమతులు 8,500 కోట్ల డాలర్ల వరకూ ఉంటే, అమెరికా నుంచి దిగుమతులు 4,500 కోట్ల డాలర్ల వరకూ ఉన్నాయి. అంటే మనం 4,000 కోట్ల డాలర్ల వాణిజ్య మిగులులో ఉన్నాం. దీన్ని మార్చాలన్నదే ట్రంప్ తాపత్రయం. అందుకే వచ్చే అయిదేళ్లలో అమెరికా నుంచి 50,000 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులుండేలాఒప్పందం నిర్దేశిస్తోంది. ఇంధనం ఉత్పత్తులు, విమానాలు, విమాన విడిభాగాలు,సాంకేతిక ఉత్పత్తులు, అరుదైన లోహాల వంటివి ఉంటాయంటున్నారు. అంటే ఆ దేశంనుంచి ఏటా అదనంగా వందకోట్ల డాలర్ల అదనపు ఉత్పత్తులు వస్తాయి. అప్పుడు మన వాణిజ్య మిగులు ఆవిరై, లోటులో పడుతుంది. దీన్ని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు?కార్మికుల అవసరం ఎక్కువుండే మన ఉత్పత్తులకు ఒప్పందం వల్ల భారీ ప్రయోజనం కలిగే అవకాశమైతే ఉంటుంది. ఆ రకంగా దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగవు తాయి. ఇక జన్యుమార్పిడి ఆహారం అనారోగ్యహేతువని, ఆ విత్తనాల వల్ల దిగుబడి భారీగా వచ్చినా, అవి వాడిన పంటపొలాల్లో భవిష్యత్తులో దేశీయ విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉండదని గతంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ విషయంలో సందే హాలన్నీ నివృత్తి చేయాలి. అలాగే తుది ఒప్పందం సమయానికి అవసరమైన మార్పులు, చేర్పులకు ఇరుపక్షాలూ సిద్ధపడే షరతుపైనే ఏ ఒప్పందంపైనైనా సంతకం చేయాలి. -
సహజ గుణం
తెలుగులో ఇటీవల అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’. దీనికంటే ముందు ‘నా ఇష్టం’, ‘విజయానికి ఐదు మెట్లు’ లాంటివి బెస్ట్ సెల్లర్స్. అత్యధిక పునర్ముద్రణలు పొందినవాటిల్లో ‘మహాప్రస్థానం’, ‘వేయి పడగలు’ లాంటివి ఉంటాయి. పోటీ పరీక్షలకు చదవాల్సి వచ్చేవో, ఉపవాచకాలుగా నిర్దేశించినవో కూడా మంచి అమ్మకాలే సాధిస్తాయి. కానీ ఇవన్నీ మినహాయింపులు మాత్రమే. సాధారణంగా తెలుగు సాహిత్యంలో బాగా అమ్ముడైన పుస్తకాలంటే వేసిన వెయ్యి కాపీలు మిగలకుండా పోయినవే! ఇప్పుడా వెయ్యీ లేకుండా ఐదొందలు, మూడొందలు, ఆఖరికి వంద కాపీలు ముద్రించుకునే అవకాశం వచ్చింది. లక్ష కాపీలు అమ్ముడుపోవడం అనేది ఏ తెలుగు రచయితైనా కనే పగటి కల మాత్రమే. నిజంగానే లక్ష కాపీలు అమ్ముడైనా ఆ రచయితను మొత్తం తెలుగు జనాభాలో ఎంతమంది చదివినట్టు? సుమారు 0.1 శాతం! ఇలాంటి లెక్కల్నే ఆంగ్ల రచయితలకు అన్వయిస్తూ, ‘‘మీ పుస్తకాన్ని ఎవరూ చదవరు. ఇది అవమానించడం కాదు. ఇది లెక్కలపరమైన వాస్తవం’’ అంటారు పబ్లిషర్ స్టీఫెన్ స్పార్క్స్. ఆయన ప్రకారం, ఏ రచయిత వ్యాప్తి అయినా నామమాత్రమే. అందుకే గొప్పగా రాసివుండీ ఎవరూ చదవని రచయితల గురించి ‘రైటర్స్ నో వన్ రీడ్స్’ పేరుతో టంబ్లర్ పేజీ నడుపుతున్నాడు విల్ షొఫీల్డ్. ఈ రచయితలు గొప్ప రచయితలయ్యింది వాళ్ల అమ్మకాల వల్ల కాదు, వాళ్లది ఎంత ఒరిజినల్ రైటింగ్ అన్నదాన్నిబట్టి! ‘‘మరిచిపోయిన, నిర్లక్ష్యానికి గురైన, వదిలివేయబడిన, మరుగున పడిన, తక్కువగా అనువదింపబడిన రచయితలను వెలుగులోకి తేవడం...’’ అని షొఫీల్డ్ చెప్పింది తెలుగులోనూ చాలామంది రచయితలకు వర్తిస్తుంది. ‘మహా వేధ’ నవల రాసిన చివుకుల పురుషోత్తంను ఎవరైనా తలుచుకుంటున్నారా? కథకుడు అల్లం శేషగిరిరావుకు.. స్థాయికి తగిన గుర్తింపు ఉందా? తొలితరం యాక్టివిస్టు–రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మకు ఎన్ని విగ్రహాలు పెట్టారు? దళిత ఉనికితో కాకుండా నాగప్పగారి సుందర్రాజును గుర్తుచేసుకోవడం జరుగుతోందా? ‘చెంఘిజ్ఖాన్’ను తెలుగు నేల మీద నిలబెట్టిన తెన్నేటి సూరికి ఎవరైనా హారతులు పడుతున్నారా? గుర్తింపు ఉన్న రచయితలు అనుకునేవాళ్లకు కూడా పెద్దలెక్కల్లో ఏ గుర్తింపూ లేనట్టే! ఇక అచ్చుకే ‘నోచుకొని’ రచయితల సంగతి? ప్రపంచ వ్యాప్తంగా విస్మరించలేని రచయిత అయిన ఫ్రాంజ్ కాఫ్కా రచనలు అతడు బతికివుండగా పెద్దగా అచ్చుకాలేదు. ఎమిలీ డికిన్సన్ కవిత్వమూ అంతే. ‘నువ్వు లేని అద్దం’ నవల ద్వారా కొత్త ఆసక్తికి కారణమైన చిత్రకొండ గంగాధర్ పుస్తకాలేవీ అతడు తన నలభైల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అచ్చుకాలేదు. మరి చదువుతారన్న గట్టి హామీ లేనప్పుడు కూడా రచయితలు ఎందుకు రాస్తున్నారు? వాళ్లను నడిపించే ఆ జీవలక్షణం ఏమిటి? ‘‘నా రచనకు ఆరంభ బిందువు ఎల్లప్పుడూ ఒక పక్షపాతం, ఒక అన్యాయ భావనే... నేను రాస్తాను– ఎందుకంటే బయటపెట్టవలసిన ఏదో అబద్ధం ఉంటుంది, చూపించ వలసిన ఏదో నిజం ఉంటుంది’’ అంటాడు జార్జ్ ఆర్వెల్. ‘‘ప్రతి వ్యక్తి ఆత్మ తాలూకు వైశిష్ట్యాన్ని స్పష్టంగా చూపించటం నవలాకారుడి బాధ్యత అని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అంటాడు హరూకీ మురకామి. ‘‘రచన నా శరీరానికి పొడిగింపు’’ అంటారు నటాలీ డయాజ్. ‘‘మనిషిగా ఉండే ఒక పార్శా్వన్ని చూపించడం’’ కోసం రాస్తానంటాడు కజువో ఇషిగురో. కీర్తి కోసం అని విలియమ్ ఫాక్నర్ బోల్డుగా చెప్పేయొచ్చు; నాలుగు డబ్బుల కోసం అని ఇంకో రచయిత ఒప్పేసుకోవచ్చు. కానీ ప్రతి రచయితకూ భిన్న కారణం ఉంటుంది. అసలు ఏ కారణమూ ఉండకపోవచ్చు. ‘సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?’ అని కృష్ణశాస్త్రి అన్నట్టుగా– రాయడం అనేది రచయిత సహజ లక్షణం. వాళ్లు రాయగలుగుతారు కాబట్టి రాస్తారు. రాయకుండా ఉండలేరు గనుక రాస్తారు. లోకం మీది ప్రేమతో దాన్ని జనానికి కానుక చేస్తారు. -
కూటమి కోరల్లో కాలకూటం!
‘‘ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ’’. చిత్తం శివుడి మీద – భక్తి చెప్పుల మీద నిలుపుకొనే దొంగ భక్తుల ముసుగుల్ని మహాకవి వేమన ఏనాడో తొలగించాడు. ఇప్పుడు సమస్య కొందరు వ్యక్తులు, కొందరు భక్తులు వేసుకునే ముసుగుల గురించి కాదు. ఏకంగా ప్రభుత్వ వ్యవస్థే వేసుకున్న ప్రమాదకరమైన ముసుగు గురించి! ముసుగులు వేసుకున్న ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం కంటే దారుణమైన చెత్తబుద్ధి తాపంతో బుసకొడుతున్నది. రాజకీయంగా స్థిరపడటానికి మతాన్ని అస్త్రంగా మలుచుకోవాలనే నిశ్చయానికి కూటమి వచ్చేసిందని మొన్నటి కూటమి ప్రెస్మీట్, అందులో ముఖ్య నేత మాటలు రుజువు చేస్తున్నాయి. ఎన్నికల హామీలు వెక్కిరిస్తున్నాయి. పాలనా వైఫల్యం వెన్నాడుతున్నది. అప్పుల పర్వతం పెరిగిపోతున్నది. అభివృద్ధి పేరుతో జపిస్తున్న తూతూమంత్రానికి తుప్పిళ్లు తప్ప చింత కాయలు రాలడం లేదు. అదానీ – గూగుల్ డేటా సెంటర్కు మనం ఇరవై వేల కోట్లు రాయితీలిస్తే గూగుల్ వాళ్లు బెంగ ళూరులో 20 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఒకటి రెండు పెద్ద కంపెనీల పేర్లు చెప్పి అదే వరసలో ఊరూ పేరూ లేని ‘ఉర్సా’లకు భూసంతర్పణ చేస్తున్నాం. దానివల్ల సాధించబోయే అభివృద్ధి దృశ్యం త్వరలోనే ముందుకు రాబోతున్నది. అమరావతి పేరుతో తలపెట్టిన లక్షల కోట్ల జూదం ఒక ‘మాన్యుమెంటల్ ఫెయిల్యూర్’గా అల్లంత దూరంలో భయపెడుతున్నది. ఈ పరిస్థితుల్లో కూటమి సర్కార్కు కిం కర్తవ్యం? ‘‘లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె.... రావే ఈశ్వరా కావవే వరద’’. ఇక దేవుడే దిక్కని కూటమి నిర్ణయానికి రావడంలో ఆశ్చర్యమేమున్నది!‘పరిత్రాణాయ సా«ధూనాం... సంభవామి యుగేయుగే’ అన్నాడు కృష్ణపరమాత్ముడు. సన్మార్గులను రక్షించడానికీ, దుర్మా ర్గులను శిక్షించడానికీ తాను వస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని సన్మార్గులూ విశ్వసిస్తారు. దుర్మార్గులూ నమ్ముతారు. కూటమి సర్కార్కు ఇక్కడ దేవుడు దిగిరావలసిన అవసరం లేదు. దేవదేవుని పేరు, ఆ పేరు చుట్టూ ఉండే మతవిశ్వాసాలను కబ్జా చేసుకుంటే చాలు! కూటమి సర్కార్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నది. తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా చంద్రబాబు వ్యాఖ్యానాలు చేశారు. పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేశారని మొదట ఆరోపించారు. ఆయన ఆరోపణపై అప్పట్లోనే సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పింది. ఒకవైపు ‘సిట్’ను ఏర్పాటు చేసి, దాని దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే నిరాధారమైన ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. కోట్లాదిమంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని ఇలా రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం మంచిది కాదని మందలించింది.ముఖ్యమంత్రి రాజకీయ ఉద్దేశాలను గ్రహించిన సర్వోన్నత న్యాయస్థానం నిష్పాక్షిక దర్యాప్తునకు స్వతంత్ర బృందమే మేలని భావించింది. సీబీఐ పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతి నిధులు కూడా ఉండే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియ మించింది. ఈ బృందం దర్యాప్తు చేసి ఈమధ్యనే అభియోగ పత్రాన్ని (ఛార్జిషీట్) న్యాయస్థానం ముందుంచింది. చంద్ర బాబు, ఇతర కూటమి పెద్దలు, యెల్లో మీడియా కలిసి భువన భువనాంతరాల్లో చాటింపు వేయించినట్టుగా జంతు కొవ్వు కలవలేదని తమ దర్యాప్తులో తేలినట్టు ‘సిట్’ స్పష్టం చేసింది. అయినా సరే, జంతు కొవ్వు కలిసినట్టు తేలిందనే ప్రచారాన్ని కూటమి ఆపలేదు. పైగా ఊరూరా, వాడవాడనా ఫ్లెక్సీలు కూడా వేసింది. ఇది నూటికి నూరుపాళ్లు కోర్టు ధిక్కరణ! వేంకటేశ్వర స్వామినే రాజకీయాల్లోకి లాగడానికి భయపడనివాళ్లు కోర్టు ధిక్కరణకు భయపడతారా? తాజాగా ఆ నెయ్యిని బాత్ రూమ్లు కడిగే కెమికల్తో తయారు చేశారనే ప్రచారాన్ని చంద్ర బాబు ప్రారంభించారు. ఆ దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడే పద్ధతి ఈ విధంగానే ఉంటుందా?సుప్రీంకోర్టు నియమించిన ‘సిట్’ తన ఆకాంక్షల మేరకు ఛార్జిషీట్ వేయలేదు కనుక ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం మరో కమిషన్ వేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు, దాంతోపాటు బాత్రూమ్లు కడిగే కెమికల్ కలిసిందనే రిపోర్టు వచ్చేవరకు చంద్రబాబు కమిషన్లను, కమిటీలను నియమిస్తూనే ఉంటారన్న మాట! అయితే ఇప్పుడు వివాదానికి కారణమైన నెయ్యి శాంపిల్ మాత్రం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసు కున్నదే! అదే విచిత్రం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన నెయ్యి శాంపిల్ను పరీక్షిస్తే జగన్ కాలంలో జరిగిన కల్తీ కనిపించాలని కూటమి సర్కార్, యెల్లో మీడియా కోరుకుంటున్నాయి.వివాదానికి కేంద్ర బిందువైన భోలేబాబా డెయిరీ వాళ్లు అంతకుముందు చంద్రబాబు సర్కార్ ఉన్నప్పటి నుంచే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో (ఇతర డెయిరీల ద్వారా) తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఇది ఆన్ రికార్డ్! చంద్రబాబు కాలంలో కిలో నెయ్యికి రూ. 297 వసూలు చేసే వాళ్లు. ప్రభుత్వం మారిన తర్వాత 319 నుంచి 348 రూపాయల వరకు ధర పెరిగింది. ఇంత తక్కువ ధరకు నెయ్యి ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. నెయ్యి ట్యాంకర్లు తొలుత తిరుమలకు వెళ్లకుండా తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్కు చేరుకుంటాయి. మార్కెటింగ్, విజిలెన్స్, ప్రొక్యూర్మెంట్ అధికారుల సమక్షంలో శాంపిల్ తీస్తారు. ఈ శాంపిల్ను తిరుమలలోని నాణ్యతా పరీక్ష కేంద్రానికి పంపిస్తారు. వారు ఓకే అన్న తర్వా తనే నెయ్యి ట్యాంకర్ తిరుమలకు బయల్దేరుతుంది. నాణ్యత లేదని తేలితే ట్యాంకర్ను వెనక్కు పంపిస్తారు. చాలాకాలంగా ఇటువంటి పకడ్బందీ విధానం అక్కడ అమల్లో ఉన్నది.వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి ట్యాంకర్లను నాణ్యత లేని కారణంగా 16 సార్లు వెనక్కు పంపి నట్టు రికార్డులు చెబుతున్నాయి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓ నాలుగు ట్యాంకర్లను తిరస్కరించి వెనక్కు పంపారు. దర్యాప్తులో తేలిన ఆందోళనకరమైన విషయం ఏమిటంటే – ఇలా వెనక్కు వెళ్లిన నాలుగు ట్యాంకర్లు ఒకచోట మాటువేసి ఉండి, కంపెనీ పేరు మార్చుకొని ‘పరీక్షలు’ నెగ్గి తిరుమలకు చేరుకున్నాయి. ఈ ట్యాంకర్లలో తీసిన శాంపిల్సే ఇప్పుడు దేశవ్యాప్త సంచలనాలకు కారణమయ్యాయి. చంద్రబాబు తొలిదఫా అధికారంలో ఉన్న సమయంలోనే బోలేబాబా టెండర్ను అనిల్ సింఘాల్ అనే ఐఏఎస్ అధికారి ఖాయం చేసుకొచ్చారు. అయనప్పుడు టీటీడీ ఈవోగా పని చేశారు. ఈ శాంపిల్స్ వివాదాస్పదమైన నేపథ్యంలో కూడా మరోసారి ఆయన్నే ఈవోగా నియమించారు. దీని భావమేమి తిరుమలేశా? వైసీపీ సర్కార్ హయాంలో తిరస్కరించిన 16 ట్యాంకర్లలో ఏ ఒక్కటీ తిరిగి కంపెనీ పేరు మార్చుకొని వచ్చిందనే దాఖలా లేదు. అప్పుడు లడ్డూల్లో వాడిన నెయ్యి శాంపి ల్స్ను పరీక్షించకుండానే మరి ఆ కాలమంతా కల్తీ జరిగిందని ఎలా చెబుతారు?చంద్రబాబు హయాంలో భోలేబాబా టెండర్ ఖరారైంది. ఈ టెండర్ను ఖరారు చేసిన అధికారి అప్పుడు ఈవోగా పని చేశారు. అప్పుడు కేవలం 297 రూపాయలకే ఆ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను వైసీపీ హయాంలో 16 సార్లు వెనక్కు పంపించారు. చంద్రబాబు హయాంలో శాంపిల్ తీసి వెనక్కి పంపిన ట్యాంకర్లు మళ్లీ వచ్చి తిరుమలకు వెళ్లాయి. దాని శాంపిల్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన తర్వాత అప్పుడు టెండర్ ఖరారు చేసిన అధికారే మళ్లీ ఈవోగా వచ్చారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఏమర్థమవుతుంది? చూపుడు వేలు ఏ వైపు తిరుగుతుంది? తిరుమల లడ్డూను వివాదాస్పదం చేయడం ద్వారా ప్రతిపక్షానికి బురద పూయాలనే సంకల్పం తప్ప మరోటి కన్పించడం లేదు. మొన్న గురువారం నాటి ఓ శుభముహూర్తాన, కూటమి నేతలంతా కొలువుదీరిన మీడియా సమావేశంలో ఎటువంటి దాపరికం లేకుండా ఈ సంకల్పాన్ని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు.తిరుమల క్షేత్రం పవిత్రతను దెబ్బతీయడానికి ఒక మహాకుట్ర జరిగిందని, అందులో భాగంగానే లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ చేశారని తాను కనిపెట్టినట్టుగా ఆయన చెప్పుకున్నారు. దీన్ని హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిగా ఆయన భావించారు. తిరుమల పవిత్రతను, హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యతను స్వయంగా శ్రీవేంకటేశ్వరస్వామే తనకు అప్పగించారని ఆయన చెప్పారు. ఖతమ్. బారా ఖూన్ మాఫ్. అఖిలాంధ్ర జనులారా... చంద్రబాబు నుంచి ఇంకేమీ ఆశించకండి. ఆయన స్వామివారి ఆదేశాల మేరకు తిరుమల పవిత్రతను, హిందూ ధర్మాన్ని కాపాడే పనిలో నిమగ్నమై ఉంటారు. హిందూ ధర్మాన్ని ప్రస్తావిస్తూ ఈ సమావేశంలో ఆయన ఒకే ఒక్క నిర్వచనాన్ని ప్రవచించారు. ‘‘మన ధర్మం ప్రకారం పెళ్లిళ్లు స్వర్గంలో జరుగు తాయి. మనకు కుటుంబ విలువలుంటాయి. పెళ్లయిన తర్వాత విడాకులివ్వడం మన ధర్మం ప్రకారం సరైంది కాదు’’ అంటూ మాట్లాడారు. ఈ నిర్వచనానికి కూటమిలో ఏకాభిప్రాయం ఉన్నదో లేదో తెలియదు.తిరుమల పవిత్రతపై, హిందూ ధర్మంపై ప్రతిపక్ష పార్టీ కుట్ర చేస్తున్నదని ఆయన సారాంశం. దానికి వ్యతిరేకంగా కూటమి తోడ్పాటుతో పోరాటం చేస్తారట! ఎనభై ఐదు శాతం మంది హిందువులున్న రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే, హిందూ దేవుళ్ల పవిత్రతను దెబ్బతీయడానికి పనిచేస్తుందా? ఇంగిత జ్ఞానమున్నవాళ్లెవరైనా ఇలా మాట్లాడతారా? మాట్లాడితే నమ్ము తారా? ప్రతిపక్ష నేతకు లభిస్తున్న జనాదరణను తట్టుకోలేక నిస్పృహతో కూడిన మాటలుగానే వాటిని భావించాలి. ఈ నిస్పృహలో ఆయన ప్రజాస్వామిక విలువల్నీ, రాజ్యాంగ ధర్మాన్నీ తుంగలో తొక్కుతున్నారు.విజయవాడ నగరంలో డజన్లకొద్దీ ఆలయాలను చంద్ర బాబు కూల్చివేస్తే వాటిని పునర్నిర్మించిన ధార్మికుడు, దేశ వ్యాప్తంగా వందలాది శ్రీవారి ఆలయాలను నిర్మించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి. వేలాది గోవుల్ని అక్రమ రవాణా చేస్తుంటే, వాటిని వధించి గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే, ఈ వ్యాపారంలో ఆయన పార్టీ వారే భాగస్థులుగా ఉన్నా కఠిన చర్యలకు పూనుకోని వ్యక్తి చంద్రబాబు. వివిధ ప్రాంతాల నుంచి దేశవాళీ గోసంపదను సమీకరించి తిరుమ లలో గోశాలను ఏర్పాటు చేసి, స్వయంగా తన నివాసంలోనే గోవుల్ని పోషించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఆలయ రథం కాలిపోతే పట్టించుకోని పాలకుడు చంద్రబాబు. అంతర్వేదిలో ఓ రథాన్ని ఎవరో దుండగులు తగలబెడితే, వెంటనే సరికొత్త రథాన్ని తయారు చేయించడమే కాక, ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు కోసం సీబీఐకి లేఖ రాసిన పారదర్శక పాలన జగన్ది. ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ ధర్మం విషయంలో జగన్ చిత్తశుద్ధిపై డజన్కిపైగా ఉదాహరణలివ్వవచ్చు. చంద్రబాబు పోటీయే కాదు.ఒక దేవుడిని విశ్వసించేవాడు, నమ్మేవాడు అందరు దేవుళ్లనూ ఆరాధిస్తాడు. ఇది ప్రాథమిక సూత్రం. అన్యమత స్థులెవరూ ఇతరుల ఆరాధనా స్థలాలపై దాడులు చేయరు. ఎక్కడో నూటికో కోటికో ఒక్కరుండే ఉన్మాదులు తప్ప! ఆకతాయిలు తప్ప! దొంగలు తప్ప!! ఇటువంటి వాళ్లు అన్ని చోట్లా, అన్ని మతాల్లో, అన్ని సమూహాల్లో ఉండవచ్చు. వాళ్లు చేసే చెదురుమదురు ఘటనల్ని గుదిగుచ్చి మతంపై దాడిగా ప్రచారం చేయడం దుర్మార్గమైన రాజకీయం. ప్రజల్ని రెచ్చగొట్టి లాభం పొందాలనే ఎత్తుగడ. రాజకీయ మనుగడ కోసం విసిరే ఆఖరి పాచిక. ఇటువంటి ఎత్తులకు ఆంధ్ర ప్రజలు పడిపోతా రనుకోవడం అవివేకం.అన్యమతస్థుల ఆలయ ప్రవేశానికి ఆంక్షలుండాలనీ, షరతులుండాలనీ, అన్య మతస్థులెవరూ అక్కడ పనిచేయకుండా చూస్తామనీ కూడా చంద్రబాబు చెప్పారు. ఇదేం గొప్ప విషయమా? సుప్రసిద్ధ షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్కు కాశీ విశ్వేశ్వరునితో ఉన్న అనుబంధం లోకానికి తెలిసిందే కదా! ‘అమెరికాలో స్థిరపడితే జీవితాంతం సకల సౌక ర్యాలు కల్పిస్తాన’ని ఓ సంపన్నుడు బిస్మిల్లా ఖాన్ను అడిగాడట! ‘సరే, గంగానదిని, విశ్వనాథుడినీ కూడా ఇక్కడికి తేగలవా? అలా అయితే ఇక్కడే ఉంటా’నని చెప్పాడట! సిరిసంపదల కంటే విశ్వనాథుడే మిన్నగా ఆయన భావించాడు. మన తెలుగు వాడు నాదస్వర బ్రహ్మ షేక్ చిన మౌలానాను శ్రీరంగం దేవ స్థానం ఆస్థాన విద్వాంసుడిగా గౌరవించిన సంగతి మరిచి పోదామా? గంధర్వ గాయకుడు యేసుదాసు ‘హరివరాసనం స్వామి విశ్వమోహనం’ అని పాడుతుంటే తన్మయత్వానికి లోనుకాని హిందూ భక్తులుంటారా? గంగా – యమునా తెహ జీబ్... భారతీయ సంస్కృతి. దాన్ని కాపాడుకోవడంలోనే దేశ పురోగతి దాగి ఉన్నది. దీన్ని ధ్వంసం చేయడానికి స్వయంగా పాలకులే ప్రయత్నిస్తే అది క్షమించరాని నేరమే అవుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సభాపర్వం నిరాశాజనకం
‘మీ స్వరాన్ని పెంచకండి... చట్టసభల్లో మెరుగుపరుచుకోవాల్సింది మీ వాదనను మాత్రమే’ అన్నారు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా హక్కుల యోధుడు డెస్మండ్ టుటు. దేశంలో చట్టసభల తీరుతెన్నులు చూస్తున్నవారికి ఎప్పుడూ ఖేదమే మిగులుతోంది. చట్టసభల పేరుచెబితే వాగ్యుద్ధాలూ, వాకౌట్లూ గుర్తుకొస్తున్నాయి. ఎప్పటిలాగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కూడా ఆ ధోరణిలోనే సాగుతున్నాయి. ఈసారి పార్లమెంటు లోపలే కాదు, వెలుపల కూడా ఆధిక్యతా ప్రదర్శన కనబడుతోంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కావొచ్చు, అధికార విపక్షాలు ప్రత్యర్థుల్లాకాక శత్రుపక్షాల్లా పోట్లాడుకుంటున్నాయి. చివరకు ఎక్కడివరకూ పోయిందంటే... కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ పట్ల అవాంఛ నీయ చర్యకు పాల్పడే అవకాశం ఉందంటూ తనకు సమాచారం అందటంతో ఆయన్ను సభకు రావొద్దంటూ తానే సూచించానని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అదంతా అబద్ధమన్నది కాంగ్రెస్ వాదన. నిజానిజాల సంగతలా ఉంచి లోక్సభ స్పీకర్ ప్రధానిని సభకు రావద్దని సూచించటం ఊహకందనిది. ఇలాంటి పరిణామాలు ప్రపంచం దృష్టిలో మన ప్రజాస్వామ్యాన్ని పలచబారుస్తాయి. కాంగ్రెస్ తీరుచూస్తే సభను సాగనివ్వకపోవటమే దాని ఏకైక వ్యూహంగా కనబడు తోంది. దీనిద్వారా ఆ పార్టీ ఎలాంటి సందేశం పంపదల్చుకున్నదోగానీ, కీలకమైన బిల్లులు ఎలాంటి చర్చా లేకుండా మూజువాణి ఓటుతో ఆమోదం పొందుతున్నాయి. పద్దులు గిలెటిన్ అవుతున్నాయి. పాలక పక్షం పని సులభమవుతోంది. సభలో మెజారిటీయే దేన్నయినా నిర్ణయిస్తుంది. విపక్షాలు దాన్ని అడ్డుకోలేవు. కనీసం అర్థవంత మైన చర్చంటూ జరిగితే ఎలాంటి బిల్లులు వస్తున్నాయో, వాటి లోటుపాట్లేమిటో,అందువల్ల కలిగే పరిణామాలేమిటో సామాన్యులు అర్థం చేసుకునే వీలుంటుంది. తమ వ్యూహం సామాన్య పౌరులకు ఆ అవకాశాన్ని నిరాకరిస్తున్నదని కాంగ్రెస్ గ్రహించటం లేదు. యూపీఏ హయాంలో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. దాన్నే తామూ ప్రయోగించి పైచేయి సాధించాలని చూడటం ద్వారా కాంగ్రెస్ ఆశిస్తున్న ప్రయోజనమేమిటో అర్థంకాదు. తోచింది చేసుకుంటూ పోవటం, జరిగే ఘటనలపై అప్పటికప్పుడు అనాలోచితంగా స్పందించటం తప్ప కాంగ్రెస్కు పకడ్బందీ వ్యూహం ఉన్నట్టు కనబడదు. బుధవారం పార్లమెంటు మకరద్వారం వద్ద జరిగిన ఘటనే ఇందుకు తార్కాణం. కేంద్ర మంత్రి రవనీత్సింగ్ బిట్టూతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జగడం నివారించదగింది. బిట్టూ అక్కడ ధర్నాకు కూర్చున్న కాంగ్రెస్ ఎంపీలనుద్దేశించి అవహేళనగా వ్యాఖ్యానించి ఉండొచ్చు. కానీ అవి యథాలాపంగా అన్న మాటలు కాదు. ఇరుపక్షాల మధ్యా యుద్ధం సాగుతున్న వేళ వ్యూహాత్మకంగా మాట్లాడినవి. రాహుల్ గాంధీ ఆయన్ను కాస్తా ద్రోహి అంటూ నిందించటం ద్వారా బీజేపీకి పదునైన ఆయుధం ఇచ్చారు. పార్టీ మారటం ద్రోహమైతే, అలాంటివారు కాంగ్రెస్లో లేరా? అసలు పార్టీని నమ్ముకుని ఉన్నవారి పట్ల అధినేతలుగా తాము చేసిన, చేస్తున్న ద్రోహం మాటేమిటి? అవసరార్థం పక్క పార్టీలతో కుమ్మక్కవుతూ మొత్తంగా పార్టీలో ఉన్నవారందరికీ చేస్తున్న ద్రోహమెంత? రాహుల్గాంధీ ఆలోచించారా? పరిస్థితులు మళ్లీ చక్కబడితే బిట్టూ లాంటివారు తిరిగి కాంగ్రెస్ లోకి రారనీ, రాహుల్ తీసుకోబోరనీ ఎవరైనా చెప్పగలరా?ఎందుకో ఈసారి పార్లమెంటులోనూ, వెలుపలా ‘పుస్తక ప్రదర్శన’ జరిగింది. చైనా నుంచి ముప్పు ముంచుకొస్తున్నవేళ బాధ్యతంతా రాజకీయ నాయకత్వం అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ నరవణేపై వదిలేసి, చేతులు దులుపుకొన్నదని రాహుల్ ఆరోపించారు. జనరల్ నరవణే పుస్తక సారాంశాన్ని సభలో చెబుతానన్న భయంతోనే తనను అడ్డుకున్నారని అన్నారు. దీనికి పోటీగా బీజేపీ సభ్యులు సభలో పుస్తకాలు ప్రదర్శించారు. ఈ దఫా పుస్తకాల ప్రస్తావన రావటం బాగున్నా, వాటిని ప్రదర్శించటంతో సరిపెట్టక ఇరుపక్షాలవారూ ఎవరికివారు చదువుకోవాలి. అప్పుడు మన చట్టసభల తీరు ఇంత అధ్వాన్నంగా అయితే ఉండదు. కనీసం సభల నిర్వహణకయ్యే వ్యయాన్నయినా దృష్టిలో ఉంచుకుని సమావేశాలను వృథా కానీయరాదని రెండు పక్షాలూ గ్రహించటం అవసరం. -
మణిపుర్ చక్కబడేనా!
రెండున్నరేళ్లపాటు కనీవినీ ఎరుగని హింసతో అట్టుడికి, నిరుడు ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలనలో కొచ్చిన మణిపుర్లో ఎట్టకేలకు బుధవారం ముమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కుకీ, నాగా తెగలకు చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే మెయితీ తెగకు చెందినవారే అయినా ఖేమ్చంద్కు మధ్యేవాదిగా ముద్ర ఉంది. మణిపుర్ సమాజంలో తీవ్రస్థాయి విద్వేషాలు ప్రబలిన వర్తమానంలో ఆగ్రహావేశాలు అంత త్వరగా సమసిపోవు. అందుకే కుకీ–జో తెగలకు చెందిన పదిమంది ఎమ్మెల్యేల్లో ఎవరూ ‘మెయితీ ప్రభుత్వం’లో చేరొద్దంటూ ఆ తెగలకు చెందిన సంస్థలు హెచ్చరించాయి. దాన్ని బేఖాతరు చేసి, ఢిల్లీలోని మణిపుర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ వేదికగా ప్రమాణం చేసిన మహిళా ఎమ్మెల్యే నెమ్చా కిప్జెన్పై నిప్పులు చెరిగారు. రాజధాని ఇంఫాల్లో ఆమె ప్రమాణం చేయలేకపోవటానికి రెండు కారణాలున్నాయి. మెయితీల ఆధిక్యత గల ఇంఫాల్ మణిపుర్ లోయలో ఉంది. వారినుంచి సమస్య ఎదురయ్యే అవకాశం ఉండటంతోపాటు, కుకీలు కూడా దాడిచేసే ప్రమాదం ఉంటుంది. సమస్య ఎంత జటిలంగా మారిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ వ్యవహార శైలి మెరుగ్గావుంటే, ఇలాంటి సమస్యలు త్వరలోనే సర్దుకుంటాయి. అయితే సమాజంలో సామరస్యతకు ముందు సొంతింటిని చక్కదిద్దుకోవటానికి బీజేపీ కృషి చేయాల్సి ఉంది. అధిష్ఠానం మాటవినే సంస్కృతికి భిన్నంగా అప్పటి ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఇష్టారాజ్యం సాగించారు. పరిస్థితి క్షీణిస్తోందని ఢిల్లీ పెద్దలు హెచ్చరిస్తున్నా ధోరణి మార్చుకోలేదు. రాజీనామా చేయమని ఆదేశిస్తే శిరసావహించి నట్టు కనబడి, పెద్ద డ్రామా సృష్టించి జనం అడ్డుకున్నారని ఆగిపోయారు. ఎట్టకేలకు నిరుడు ఫిబ్రవరి 9న ఆయనతో రాజీనామా చేయించి, రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. అప్పటికే ఆయన తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు. ఏకపక్షంగా వ్యవహరించి కుకీల్లో అసంతృప్తి రెచ్చగొట్టారు. వారితో కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం నుంచి తప్పుకొని ఆగ్రహావేశాలను పెంచారు. వారిని గంజాయి పండించేవారిగా, మాదకద్రవ్య పంపిణీదార్లుగా, అక్రమ వలసదారులకు ఆశ్రయమిచ్చేవారిగా చిత్రించారు. మణిపుర్లో హింస చెలరేగే నాటికే అక్కడ ఇరుపక్షాల్లోనూ ప్రభుత్వంపై అవిశ్వాసం ఏర్పడింది. 2023 మే నుంచి హత్యలు, లూటీలు, గృహదహనాలు, పార్థనా స్థలాలకు నిప్పెట్టడ యథేచ్ఛగా కొనసాగాయి. 260 మంది హత్యకు గురయ్యారని, 1,000 మంది గాయపడ్డారని, 32 మంది అదృశ్యమయ్యారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 60,000 మందికి పునరావాస శిబిరాలే శాశ్వత చిరునామాలయ్యాయి. అంతా సవ్యంగా ఉన్నందువల్లే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిందని అనుకోనవసరం లేదు. రాష్ట్రపతి పాలన ఏడాదికి మించి పొడిగిస్తే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. అందుకే ప్రభుత్వ ఏర్పాటు తప్పలేదు. ఇప్పటికీ మెయితీలు, కుకీ–జోలు ఒకరి ప్రాంతంలోకి మరొకరు పోయే పరిస్థితి లేదు. తమ ప్రాంతాలకు స్వయంపాలన హక్కు ఇచ్చేందుకు అంగీకరించి, అందుకు నిర్దిష్ట కాల పరిమితిని లిఖిత పూర్వకంగా ప్రకటిస్తేనే ప్రస్తుతానికి ప్రభుత్వంలో పాలుపంచు కునేందుకు సిద్ధపడతామని కుకీ–జో తెగలు ఇప్పటికే తెలిపాయి. ఆ విషయంలో ఏమీ తేల్చి చెప్పలేదన్న ఆగ్రహంతోనే కొత్త సర్కారులో ఎవరూ భాగస్వామ్యం తీసుకోవద్దని వారు పిలుపునిచ్చారు. ఆ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికే కేంద్రం విడిచిపెట్టదల్చుకున్నదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఆ నిర్ణయం సంగతలా ఉంచి ముందు సంయమనం పాటించటం, అందరినీ కలుపుకొని వెళ్లటం వంటివి అవసరమని ఖేమ్చంద్ తెలుసుకోవాలి. ఎన్నికైన ప్రభుత్వం వస్తే కనీసం సమస్యలు చెప్పుకునే వీలుంటుందని జనం అనుకుంటారు. అలాగని ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్షణ పరిష్కారాలపై పెద్ద ఆశలేమీ ఉండవు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్న విశ్వాసమైతే కలగాలి. ఆ విశ్వాసాన్ని ఖేమ్చంద్ ప్రభుత్వం పొంద గలిగితే కొంతమేర విజయం సాధించినట్టే! -
పాక్కు బలూచ్ సవాలు!
బలూచిస్తాన్ స్వాతంత్య్ర కాంక్షను ఉక్కుపాదాల కింద తొక్కివుంచాలని ఏడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ పాలకులకు యథాప్రకారం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. గత వారం చివరిలో తొమ్మిది జిల్లాల్లో కొనసాగించిన ఆత్మాహుతి దాడుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) 84 మంది పాక్ సైనికుల్ని హతమార్చి, మరో 18 మందిని అపహరించింది. ప్రతీకారంగా తాము జరిపిన దాడుల్లో 133 మంది బీఎల్ఏ మిలిటెంట్లు చనిపోయారని పాక్ సైన్యం ప్రకటించింది. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ భాషనూ, సంస్కృతినీ విస్మరించిన పర్యవసానంగా అది విడివడి బంగ్లాదేశ్గా ఆవిర్భవించిన సంగతి తెలిసి కూడా దేశంలో 40 శాతం భూభాగం గల బలూచిస్తాన్ను పాక్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. కోటిన్నరమంది జనాభా నివసించే ఆ ప్రాంతానికి ఒకపక్క అఫ్గానిస్తాన్, మరోపక్క ఇరాన్, మూడోవైపు అరేబియా సముద్రం ఉండగా వర్షాభావ పరిస్థితుల కారణంగా అత్యధిక భూభాగంలో భూగర్భ జలాలే ఆధారం. అక్కడ పండే యాపిల్స్, ద్రాక్ష, బాదం, ఖర్జూరం వగైరాలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. పాక్ పండ్ల ఎగుమతుల్లో 90 శాతం వాటా బలూచిస్తాన్ ప్రాంతానిదే. నీటి పారుదల సదుపాయం పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో గోధుమ, వరి, బార్లీ, ఆలుగడ్డ పండుతాయి. ఇంతగా దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నా బలూచిస్తాన్ అభివృద్ధిని పాలకులు పూర్తిగా మరిచిపోయారు. అక్కడి భూపొరల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. రాగి, సీసం, క్రోమైట్, గ్రానైట్, జింకు వగైరాలున్నాయి. చమురు, సహజ వాయువు, బొగ్గు, బంగారం ఉన్నాయి. వీటిల్లో బంగారం, రాగి గనుల నిర్వహణ చైనా చేతుల్లో ఉంది. అది పెట్టుబడి పెట్టి నిర్మించిన గ్వాదర్ నౌకాశ్రయం బలూచిస్తాన్ ప్రాంతం లోనిదే. 6,500 కోట్ల డాలర్లతో చైనా నిర్మించతలపెట్టిన చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చైనాలోని షిన్జియాంగ్ నుంచి గ్వాదర్ వరకూ ఉంటుంది. చైనా దోపిడీ చాలలేదన్నట్టు నిరుడు సెప్టెంబర్లో అమెరికా కూడా వచ్చింది. ఆ దేశానికి చెందిన బహుళ జాతి సంస్థ స్ట్రాటజిక్ మెటల్స్తో పాక్ సైన్యం అనుబంధ సంస్థ 50 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇదంతా ఆ ప్రాంత అభివృద్ధి కోసమేనంటూ ప్రభుత్వం చెబుతున్నదంతా బూటకమనీ, గ్వాదర్ నౌకాశ్రయం తర్వాత తమ మత్స్యకారులు జీవిక కోల్పోయారనీ, గుక్కెడు మంచినీళ్లు దొరకడం కూడా కష్టమవుతున్నదనీ బీఎల్ఏ ఆరోపణ. పాకిస్తాన్ ఆవిర్భవించాక 1948లో బలూచిస్తాన్ను బలవంతంగా విలీనం చేసుకుంది. అప్పటి నుంచి తిరుగుబాట్లు సాగుతూనే ఉన్నాయి. అణిచేద్దామని చూసిన ప్రతి సారీ అవి మరింత తీవ్రంగా పోటెత్తుతున్నాయి. పాక్ సంస్కృతి, సంప్రదాయాలతో తమకేమాత్రం పోలిక ఉండదని, ఒక దేశంగా ఉంటేనే అస్తిత్వ పరిరక్షణ, అభివృద్ధి సాధ్యమని ఆ ప్రాంతవాసుల వాదన. ఇందుకోసం వామపక్ష భావాలతో ప్రభావితుడైన మీర్ గౌస్ బిజెంజో ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిధిలో పోరాటాలు జరిగాయి. పాక్ పరిధిలోనే స్వయంపాలనకు హామీ ఇవ్వాలన్న డిమాండ్తో నేషనల్ అవామీ పార్టీ (ఎన్ఏపీ) ఏర్పాటు చేసి, 1970 ఎన్నికల్లో బలూచిస్తాన్, ప్రస్తుత ఖైబర్ ఫఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ మరో మూడేళ్లకే అప్పటి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం సైనిక చర్య ద్వారా ఆ రెండు ప్రభుత్వాలనూ కూలదోసింది. ఈ అప్రజాస్వామిక చర్యే అనంతర కాలంలో మిలిటెన్సీకి బీజం వేసింది. బలూచిస్తాన్లో పాక్ సైన్యం చేయని దురాగతం లేదు. బలూచ్ యూనివర్సిటీలోనూ, వెలుపలా యువతను అపహరించటం, హతమార్చటం దానికి అలవాటైన విద్య. 2011 నుంచి ఇంతవరకూ 10,000 మంది మాయమయ్యారంటే ఇదెంతగా ఉందో అంచనా వేయొచ్చు. 2018 తర్వాత బలూచ్ మిలిటెంట్ సంస్థలు ఏకం కావటంతో పోరాటాలు ఉద్ధృతమయ్యాయి. నిరుడు మార్చిలో జాఫర్ఖాన్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేయటం మొదలుకొని పాక్ సైన్యంపై సాగిస్తున్న నిరంతర దాడులు పాలకుల్ని ఊపిరాడకుండా చేస్తున్నాయి. చారిత్రక ఆకాంక్షలను అణగదొక్కి, అభివృద్ధిని విస్మరించే ఏ పాలకులకైనా ఇదే దుఃస్థితి ఎదురవుతుంది. తప్పు తెలుసుకోకుండా, గుణపాఠం నేర్చుకోకుండా, మిలిటెంట్లకు భారత్ మద్దతుందని అనవసర యాగీ చేయటం పాక్ పాలకుల నిస్సహాయతకు అద్దం పడుతోంది. -
హింసన చణ... ధ్వంస రచన!
సుప్రసిద్ధ కథా, నవలా రచయిత రావి శాస్త్రి అయిదు దశాబ్దాల క్రితం ‘సొమ్మలు పోనాయండి’ అనే నవలిక రాశారు. ఊరి ప్రెసిడెంట్ కుట్రలకు బలైన ఒక సామాన్యుడి స్వీయ కథనమది. అతని కుటుంబాన్ని కడతేర్చిన ప్రెసిడెంట్ను వదిలి, వ్యవస్థలన్నీ ఏకమై ఆ సామాన్యుడికే నరకం చూపిన వైనం అందులో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఏణ్ణర్థంగా అచ్చం అదే రీతిలో సాగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన దుష్ప్రచారం బూటకమని సీబీఐ నివేదిక తేల్చినప్పటి నుంచీ ఆ అరాచకం మరిన్ని రెట్లు పెరిగింది. ఎప్పటిలాగే లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉన్నదనీ, కొవ్వెక్కిన ఈ మాయగాళ్ల పుర్రెలే వికృత పోకడలకు పోయాయనీ ప్రజలకు తేటతెల్లమైనప్పటి నుంచీ అధికార ముఠాకు కాళ్లూ చేతులూ ఆడటం లేదు.ఆ పర్యవసానంగానే రోడ్లపైకొచ్చి దుర్భాషలతో, దుశ్చేష్టలతో రెచ్చిపోతున్నారు. హంతక దాడులకు తెగిస్తున్నారు. గృహ దహనాలకు పాల్పడుతున్నారు. ‘మళ్లీ మళ్లీ వస్తాం... అంతు తేలుస్తామ’ంటూ సవాళ్లు విసురుతున్నారు. సీబీఐ నివేదికను వక్రీ కరిస్తూ ఫ్లెక్సీలతో జనాన్ని ఏమార్చాలనుకుంటున్నారు. గుంటూరు నడిబొడ్డున తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యే, ఆమె భర్త వందలాది మంది గూండాలను పోగేసి కర్రలు, రాడ్లతో వీధిన పడి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబటిరాంబాబు ఇంటిపై దాడికి దిగిన వైనం మీడియా సాక్షిగా ప్రపంచమంతా చూసింది.రక్షక భటులు భయభక్తులతో వారికి కాపలాగాసిన సంగతినీ అందరూ గమనించారు. ఆ మర్నాడు ఇబ్రహీంపట్నంలో అదే పునరావృతమైంది. తొలినాడు ఎంత విధ్వంసం చేసినా, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం తగలబెట్టడానికి కష్టపడాల్సి వచ్చిందని కాబోలు... ఇబ్రహీంపట్నంలో మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైకి పెట్రోల్ బాంబులతో వచ్చారు. బండరాళ్లు విసిరారు. నిప్పుపెట్టారు. గుంటూరు నగర పోలీసుల మాదిరే ఇక్కడా ఈ కిష్కింధకాండకు పోలీసులు రక్షణగా నిలబడ్డారు.ఇదా ప్రజాస్వామ్యం?! పిల్లనిచ్చిన మామ పాలిటే కాదు... ఆంధ్రప్రదేశ్కు కూడా దశమ గ్రహంలా దాపురించి, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు వయసుడిగిన ఈ కాలంలో కూడా బాహాటంగా తన వికృత నైజాన్ని ప్రదర్శించటం చూసి జనం విస్తుపోతున్నారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్, కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా తదితరుల మరణాలకు కారకులెవరో... ఇప్పుడు టీడీపీలోనే ఉన్న సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణపై ఒకానొకప్పుడు హంతక దాడికి తెగించిందెవరో... అందరికీ తేటతెల్లమే. సాక్షాత్తూ మాజీమంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావే తోడల్లుడి హింసన చణనూ, ధ్వంస రచననూ పూసగుచ్చినట్టు వివరించారు. కొన్నేళ్ల క్రితం తగలబడిన వందలాది ఆర్టీసీ బస్సులు, పదేళ్లనాడు అమరావతిలో దగ్ధమైన అరటి తోటలు ఆ ప్రావీణ్యాన్ని కథలు కథలుగా చెబుతాయి.అవిభక్త ఏపీలో 1995 తర్వాత సకల వ్యవస్థలూ భ్రష్టుపట్టడానికి కారకులెవరో అందరికీ తెలుసు. కెమెరా లేదనుకుని సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్నే ‘వాడూ...వీడూ’ అని తూలనాడిన ఘనుడు బాబు నుంచి పుత్రరత్నమైనా, మరొకరైనా నేర్చుకునే సంస్కృతి ఏముంటుంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు. అందుకే గుడికెళ్లి వస్తున్న అంబటిపై బూతులు లంకించుకొని రెచ్చగొట్టి, ఆయన తిరిగి తిట్టారని రెచ్చిపోయింది టీడీపీ ముఠా. సంస్కారం ఉంది గనుక క్షమించమని అడిగారాయన. ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానన్నారు. కానీ పాపం పెరిగినట్టు పెరిగిన ఆ ముఠా అర్ధరాత్రి దాకా అల్లకల్లోలం సృష్టించింది. చివరకు అంబటినే ఖైదు చేయించింది. ఎంత విడ్డూరం?! ఏం జరుగుతోంది ఏపీలో? ప్రశ్నించే తత్వాన్ని హత్యాయత్నాలతో, విధ్వంసాలతో చంపేస్తారా? ఈవీఎంల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకున్న అరాచకులు ఇక మారరా? ఇదే వారి నిర్ణయమైతే జనమే తొక్కి నార తీస్తారు. అదునుచూసి గుణపాఠం చెబుతారు. ప్రజాస్వామ్యంలో నారావారైనా, వేరేవారైనా ఇందుకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. -
అనిశ్చితిలో ఆచితూచి...
ప్రపంచమంతటా అనిశ్చితి అలుముకున్న తరుణంలో పెద్దగా జనాకర్షణల జోలికి పోకుండా, ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీట వేసే గత సంప్రదాయాలకు భిన్నంగా, ఆచితూచి వేసిన అంచనాలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026–27 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించిన ఆమె... స్థిరంగా ముందుకు సాగుతున్న ఆర్థిక వృద్ధిని అదే స్థాయిలో ముందుకు నడిపించేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకూ, తయారీరంగ పరిశ్రమల పెంపునకూ తోడ్పడే ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో కూడా ఏవో అద్భుతాలుంటాయని ఎప్పటిలాగే మధ్యతరగతి, వ్యాపార వర్గాలు ఆశించిన మాట వాస్తవమే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేల విడిచి సాము మంచిది కాదన్న ధోరణినే కనబరిచారు. అవసరమైనచోట్ల వెసులుబాట్లకు కూడా చోటిచ్చారు. 17 రకాల క్యాన్సర్ ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయటం అందులో ఒకటి. వ్యక్తిగత వినియోగానికి దిగుమతి చేసుకునే వస్తువుల కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం మేర తగ్గించటం కూడా మంచి నిర్ణయం. మూలధన వ్యయం ఈసారి రూ. 12.22 లక్షల కోట్ల వరకూ ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. నిరుటి ప్రతిపాదన రూ. 10.96 లక్షల కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువే. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో దీన్ని వ్యయం చేయటానికి సంకల్పించారు. పర్యవసానంగా హైవేలూ, సరుకు రవాణా కారిడార్లూ, ఓడరేవులు, జాతీయ జల రవాణా మార్గాలు, పట్టణప్రాంత ప్రజా రవాణా తదితర రంగాలు బహుముఖంగా విస్తరిస్తాయి. ఇదంతా దక్షిణాది రాష్ట్రాల్లో పరిశ్రమల విస్తరణకూ, ఉద్యోగాల కల్పనకూ ఎంతగానో దోహద పడుతుంది. పెంచిన ఈ మూలధన వ్యయాన్ని రాష్ట్రాలు వడ్డీరహిత రుణాలు పొంది, పెట్టుబడులు పెట్టడానికి వినియోగిస్తామని చెప్పారు. దానికే పరిమితమైతే లక్ష్యసాధనకు ఎంతమాత్రం సరిపోదు. తయారీ రంగంలో ఫార్మా, సెమీ కండక్టర్లు, రసాయనాలు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, భారీ యంత్రాలు, క్రీడా పరికరాలు, రసాయనాలు తదితరాల ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు చేసిన ప్రతిపాదనలు సైతం మెచ్చదగ్గవే. అయితే ప్రస్తుతం అన్ని రంగాలనూ ఏలుతున్న ఏఐ ఆధారిత సాంకేతికత ఇక్కడ కూడా గణనీయంగా ఉంది. అందువల్ల ఈ రంగాలు తీసుకు రాబోయే ఉద్యోగకల్పనపై మరీ ఆశ పెట్టుకోనవసరం లేదు. విచక్షణారహితంగా సుంకాలు విధించే అమెరికా ధోరణి వల్ల ప్రైవేటు మదుపుదారులు ఉత్సాహంగా ముందుకొచ్చే అవకాశాలు తక్కువ.ఈ బడ్జెట్లో మెచ్చదగ్గ ప్రతిపాదన కర్బన ఉద్గారాల నియంత్రణకు దోహదపడే సాంకేతికతలకై వచ్చే అయిదేళ్లలో రూ. 20,000 కోట్ల వ్యయం చేస్తామని చెప్పటం! స్వచ్ఛ ఇంధనానికి తోడ్పడే ఈ ప్రతిపాదనకు మరింత కేటాయిస్తే బాగుండేది. అలాగే కార్బన్ డై ఆక్సైడ్ తొలగింపునకూ, దాన్ని నిల్వ చేసి ఉత్పత్తులకు తోడ్పడటానికీ అవసరమైన పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వటంపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మన వృద్ధి రేటు దాదాపు 7 శాతం ఉంది. ద్రవ్యోల్బణం సైతం అదుపులో ఉంది. విదేశీ మారక నిల్వలకు కూడా లోటు లేదు. కానీ దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ పడుతూ లేస్తూ సాగుతున్న క్రమంలో, అంతర్జాతీయంగా అంత సానుకూల వాతా వరణం కనబడని స్థితిలో జాగ్రత్తగా అడుగులేయటం మంచిదే. ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతం మించనీయరాదన్న గత బడ్జెట్ లక్ష్యాన్ని సాధించటంలో విజయం సాధించి నట్టేనని గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత తగ్గించి 4.3 శాతానికి పరిమితం చేస్తామని నిర్మలా సీతారామన్ చెబుతున్నారు. కానీ అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు మంత్రాన్ని పఠించటం అంత సులభం కాదు. తయారీరంగ పరిశ్రమల విస్తరణ ఉపాధి కల్పనకు తోడ్పడి,ప్రజల్లో కొనుగోలుశక్తిని పెంచుతుంది. ఆ దిశగా ప్రయత్నించటానికి ఈ బడ్జెట్ ప్రతిపాద నలు దోహదపడతాయనే చెప్పాలి. ఎంతో ఆచితూచి, జాగ్రత్తగా అడుగులేసిన ఈ బడ్జెట్ చూడటానికి నిరాశ కలిగించవచ్చుగానీ... ఈ అనిశ్చితిలో దూకుడుగా పోకుండా భయ భక్తులతో మెలగటమే క్షేమదాయకం. -
బాబు కుట్రకు శిక్ష ఉండొద్దా?
‘ఆత్రగాడికి బుద్ధి మట్టు...’ అనే నానుడి ఉత్తపుణ్యాన రాలేదు. ప్రత్యర్థులపై బురద జల్లడం కోసం, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం ఎంతకైనా దిగజారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్మాదం ఆవహించిన చందాన 2024 సెప్టెంబర్లో ఒక మహాపరాధానికి పాల్పడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ఆరోపణకు సాహసించి ప్రపంచవ్యాప్తంగావున్న కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. నిజం నిలకడ మీద తేలుతుందన్నట్టు ఇన్ని నెలల తర్వాత ఇదంతా పచ్చి బూటకమని సీబీఐ దర్యాప్తు నిగ్గుతేల్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీబీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి లడ్డూకు వాడిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలో ఆవగింజంతైనా నిజం లేదని నిర్ధారించింది. హరియాణాలోని ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)లు వేర్వేరుగా ఆ నెయ్యి నమూనాలను పరీక్షించి వెల్లడించాయని సీబీఐ తన చార్జిషీటులో తెలియజేసింది. ఈ నమూనాలు నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి సేకరించామని వివరించింది. చిత్రమేమంటే తమ కుట్ర భళ్లున బద్దలైనా టీడీపీ నాయకు లకూ, వారి వందిమాగధ మీడియాకూ బుద్ధి రాలేదు. కిందపడ్డా తమదే పైచేయి అని చెప్పటానికి నానా తంటాలూ పడుతున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మరిన్ని వేల అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ఇలాంటి వంచకులను ఆ భగవంతుడు క్షమిస్తాడా? ప్రత్యర్థులపై పైచేయి సాధించ టానికి ఎత్తులు, పైయెత్తులేయటం... ఎలాగైనా గెలిచితీరాలని ఆత్రపడటం రాజకీ యాల్లో సర్వసాధారణం. కానీ మనిషి జన్మ ఎత్తినందుకు కనీసంగానైనా ఇంగితంఉండొద్దా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ప్రసాదంపైనే నదురూ బెదురూలేకుండా విషం చిమ్మటం మహాపచారమన్న స్పృహ ఉండనవసరం లేదా? ఈ కుట్ర వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయి. అప్పటికి ఎడతెరిపి లేని వానలతో పొంగి ప్రవహిస్తున్న బుడమేరును కనీస ముందస్తు హెచ్చరిక లేకుండా, చడీచప్పుడూ కాకుండా వదలటం వల్ల విజయవాడ లోతట్టు ప్రాంతాలు మునిగాయి. 50 మందికి పైగా దుర్మ రణం పాలయ్యారు. అది సర్కారీ జలప్రళయమని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు తన కొంప కాపాడుకునేందుకే ఇలా చేయించారన్న విమర్శలూ వచ్చాయి. అంతేకాక ఎన్నికల సంఘం ఎంతో తాత్సారం చేసి, నిబంధనలు కాలరాసి ఏపీలో ఎన్నికలు జరిగిన 108 రోజుల తర్వాత బూత్ల వారీగా ఎవరికెన్ని ఓట్లు వచ్చాయన్న వివరాలతో కూడిన ఫామ్–20ని సెప్టెంబర్ 19న ఆన్లైన్లో పెట్టడానికి నిర్ణయించుకుంది. సరిగ్గా ఈ రెండు ఉపద్రవాలనుంచీ కాపాడుకోవటం కోసం అర్జెంట్గా జనందృష్టిని మళ్లించాలన్న ఆత్రుతలో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు కూతలు మొదల య్యాయి. ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పక్కతాళం వేశారు. అయోధ్యకు జంతువుల కొవ్వు కలిసిన లక్ష లడ్డూలు వెళ్లాయంటూ వదిరారు. ఇరు పార్టీలూ ఇలా దుష్ప్రచారం చేస్తున్నా, అదే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. సొంత మనుషులతో సిట్ వేసే ప్రయత్నం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్తో బెడిసికొట్టింది.అవకాశం దొరికినప్పుడల్లా ‘నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువున’ని స్వోత్కర్షలకు పోయే చంద్రబాబుకు వాస్తవంగా అలవాటైన ఏకైక విద్య అబద్ధాలాడటం. దాని సాయంతోనే తన మామ ఎన్టీఆర్ నుంచి కుట్రపూరితంగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అంతకు ముందూ తర్వాతా కూడా తన ఎదుగుదల కోసం ఆయన చేయని పాపమంటూ లేదు. వీటన్నిటికీ పరాకాష్ఠ లడ్డూ ప్రసాదంపై సాగించిన దుష్ప్రచారం. ఇదే నేరాన్ని మరెవరైనా చేసివుంటే వ్యవస్థలు ఊరుకుంటాయా? కేసులు, శిక్షలూ లేకుండా వదులుతాయా? అందలాలెక్కినవారికి మాత్రం ఎందుకు మినహాయింపులుండాలి? ఇన్నేళ్ల పాపాలను ఈ అవసాన దశలోనైనా కడిగేసుకుందామనీ, ఇక బుద్ధెరిగి ప్రవర్తిద్దామనీ చంద్రబాబు అనుకోకపోవటం తెలుగు ప్రజల దురదృష్టం. -
సర్వేలో ఆశావహ స్వరం
ప్రపంచవ్యాప్తంగా అలముకున్న అనిశ్చితికి తోడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న అదనపు సుంకాలు, పడిపోతున్న రూపాయి విలువ, ఉపాధి లేమి తదితరాలు హడలెత్తిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో దేన్నయినా అంచనా వేయటమంటే కత్తి మీద సాము. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటుకు ఆర్థిక సర్వే సమర్పించారు. ముగియబోతున్న ఆర్థిక సంవత్సరంలో మన స్థితిగతులెలా ఉన్నాయో వివరించి, ఇకముందు రాగల సవాళ్లేమిటో... వాటిని అధిగమించటానికి ప్రభుత్వానికున్న ఆలోచనేమిటో స్థూలంగా వివరించటం ఆర్థిక సర్వేల లక్ష్యం. నిజానికి ఆర్థిక సర్వేకు ముందురోజు పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో సంస్కరణలు మరింత వేగవంతం కాబోతున్నాయని సూచనప్రాయంగా చెప్పారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన జీడీపీ 6.8–7.2 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రపంచ దేశాలన్నిటా ఆర్థికంగా మందగమనం కొనసాగుతున్నా మన దేశం ‘వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ’గా కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలా ఆశించటానికి కారణం ఉంది. వృద్ధి రేటు బలంగా ఉండటం, మునుపెన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఇటువంటి ఆర్థిక వ్యవస్థను ఆర్థిక నిపుణులు ‘గోల్డీలాక్స్ ఎకానమీ’ అంటారు. దేశం ఏదైనా, పాలకులు ఎంతగానో కోరుకునే సమతౌల్య స్థితి ఇది. స్వేచ్ఛగా ప్రాథమ్యాలను ఎంచుకోవటానికీ, దూకుడుగా ముందుకు పోయేందుకూ అనువైన బడ్జెట్ను రూపొందించుకొనేందుకు ఇది వీలు కల్పిస్తుంది. కానీ ఒడుదొడుకులు ఉన్నా యని ఆర్థిక సర్వే గమనిస్తే అర్థమవుతుంది. 2025–26 సంవత్సరానికి గణాంకాల మంత్రిత్వ శాఖ లోగడ అంచనా వేసిన వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.4 శాతంకాగా, అది అంతకన్నా తక్కువే ఉంటుందని సర్వే చెబుతోంది. పన్ను వసూళ్లలో 11 శాతం వృద్ధి ఉండొచ్చని నిరుడు అంచనా వేస్తే అది 8 శాతం మించలేదు. నిరుడంతా విదేశీ మదుపుదారులు 1,900 కోట్ల డాలర్లమేర వెనక్కి తీసుకోగా, ఈ జనవరిలోనే 400 కోట్ల డాలర్ల ఈక్విటీలు విక్రయించారు. సంస్కరణలు మొదలయ్యాక ఇలా జరగటం ఇదే ప్రథమం. అయితే విదేశీ మారక నిల్వల్లో మనం ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నామని సర్వే వివరిస్తోంది. ఈ నిల్వలు 701.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని చెబుతోంది. అలాగే ప్రవాస భారతీయుల ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యం కూడా భారీగా పెరిగింది. ముగుస్తున్న సంవత్సరంలో ఇది 135.4 బిలియన్ డాలర్లు. దేశ ఆర్థిక వ్యవస్థను పీడిస్తున్న సమస్యలకు మూలం ప్రపంచ స్థితిగతుల్లో ఉంది తప్ప అది అంతర్గతమైంది కాదని సర్వే ప్రకటించింది. అయితే తయారీ రంగ పరిశ్రమలు విస్తరించి, ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలా చూడటం మన బాధ్యతే. కృత్రిమ మేధ(ఏఐ)తో ఉద్యోగాలు పోతాయన్న భయాలు అవాస్తవమనీ, పైపెచ్చు తగిన మార్పులు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనీ సర్వే అంటున్నది. డిజిటల్ ప్లాట్ఫాంల ద్వారా, యాప్ల ద్వారా దేశంలో శరవేగంతో విస్తరిస్తున్న ‘గిగ్ ఎకానమీ’పై ఈ సర్వే దృష్టి సారించటం ప్రశంసనీయం. 2021లో ఈ రంగంలో 77 లక్షల మంది ఉండగా, వారి సంఖ్య ప్రస్తుతం కోటీ 20 లక్షలు. కానీ దాదాపు 40 శాతం మంది నెలకు రూ. 15,000 కన్నా తక్కువే సంపాదిస్తున్నారని చెబుతూ... గంటకు నిర్ణీత మొత్తం ఇచ్చేలా, లేక నిర్దేశించిన లక్ష్యానికి ఫలానా మొత్తం అనే విధంగా ఉంటే మెరుగైన ఆర్జన సాధ్యమవుతుందని సర్వే భావించింది. వారి పని పరిస్థితులు మెరుగయ్యేలా చూస్తామని వాగ్దానం చేస్తోంది. అయితే సామాజిక రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని మరింత పెంచితే తప్ప, ఉగ్రరూపం దాలుస్తున్న ఉపాధి లేమిని సరిచేస్తే తప్ప వాస్తవ అభివృద్ధి సాధ్యపడదు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ వ్యయం చాలా తక్కువుంది. ఆ రంగాలపై శ్రద్ధ పెట్టనంతకాలం నాసిరకం చదువులు, అనారోగ్యం, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు పీడిస్తూనే ఉంటాయి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నదేమిటో రెండు రోజుల్లో రాబోయే బడ్జెట్ తేటతెల్లం చేస్తుంది. -
వివక్ష వద్దంటే ఆందోళనా!
ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష అంతం కావటానికీ, సమానత్వం సిద్ధించటానికీ అనుసరించాల్సిన విధానాలను సూచిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసిన మార్గదర్శకాలను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీల్లో విద్యార్థుల ఆందోళనలు సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో బరేలీ మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి కొలువుకు రాజీనామా చేయగా, దాన్ని నిరాకరించిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. బీజేపీ నాయకులు ఒకరిద్దరు యూజీసీ తీరును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. విద్యార్థుల ఆందోళనకు ఆధిపత్య కుల సంఘాలు మద్దతు పలుకుతున్నాయి.కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యూజీసీ (UGC) ఇటువంటి మార్గదర్శకాలు జారీచేయటాన్ని బీజేపీలోని ఆధిపత్య కులాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ వర్గాలను సైతం ఈ పరిధిలోకి తీసుకురావటం వారికి ఆగ్రహం కలిగిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలవుతున్నా కులాన్ని అంతం చేయటం సంగతలా ఉంచి, కుల వివక్షను రూపుమాపేందుకు జరిగే ప్రయత్నాలకు సైతం వ్యతిరేకత ఎదురు కావటం వర్తమాన స్థితిగతులకు అద్దం పడుతుంది. వివక్ష ఎంతగా బాధిస్తుందో, పర్యవసానాలెలా ఉంటాయో దాన్ని అనుభవించేవారికి తప్ప అన్యులకు తెలిసే అవకాశం లేదు. అందుకే కుల వివక్షయినా, లింగ వివక్షయినా అవేమంత పెద్ద విషయాలు కాదన్నట్టు వాదించేవారు కనబడతారు. చదువు సంస్కారాన్ని నేర్పుతుందనీ, జ్ఞానం పరిధి విస్తరించేకొద్దీ అందరూ కుల, మతాల పరిమితులు అధిగమిస్తారనీ సంస్కర్తలు ఆశించారు. విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లవలసిన ఉన్నత విద్యాసంస్థల్లో కులవివక్ష రూపుమాపటం సంగతలా ఉంచి, దాన్ని ప్రోత్సహించే ధోరణులు కనబడటం చేదు నిజం. యూజీసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే ఇటీవలి కాలంలో క్యాంపస్లలో కుల వివక్ష పెరిగింది. మొత్తంగా అయిదేళ్లలో 704 విశ్వవిద్యాలయాల నుంచి, 1,553 కళాశాలల నుంచి 1,160 ఫిర్యాదులు అందాయి. మొత్తంగా అంతక్రితం సంవత్సరాలతో పోలిస్తే అయిదేళ్లలో ఇలాంటి ఫిర్యాదుల శాతం 118.4 శాతం పెరిగింది. విద్యాసంస్థలు మాత్రమే కాదు, ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందని ఓబీసీ ఉద్యోగ సంఘాలు ఆరోపించటం కనబడుతూనే ఉంది. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కుల వివక్ష అవాస్తవమని వాదించటం ఆత్మవంచన.యూజీసీ తనకు తానుగా ఈ మార్గదర్శకాలు రూపొందించలేదు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 2016 జనవరిలో ఆత్మహత్య చేసుకున్న యువ దళిత విద్యార్థి రోహిత్ వేముల (Rohith Vemula) తల్లి రాధిక, 2019లో ముంబైలో పీజీ చేస్తూ ప్రాణం తీసుకున్న డాక్టర్ పాయల్ తాడ్వీ అనే ఆదివాసీ యువతి తల్లి అబేదా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇవి వెలువడ్డాయి. వాస్తవానికి 2012లోనే ఇలాంటివి రూపొందినా, అవి సలహాపూర్వకమైనవి మాత్రమే! ఉల్లంఘనలకు ఎటువంటి చర్యలుండాలో అందులో లేదు. వివక్ష, వేధింపులకు దీటుగా శిక్ష ఉండాలని ఆ తల్లులిద్దరూ పిటిషన్లో అభ్యర్థించారు. తాజా మార్గదర్శకాలు పాటించని సంస్థలను యూజీసీ ప్రోగ్రాంల నుంచి దూరం పెట్టడం, కేంద్ర గ్రాంట్లు నిలిపేయటం వంటి చర్యలున్నాయి. ఫిర్యాదుల విషయంలో ఎలా వ్యవహరించాలో నిర్దేశించారు. వివిధ స్థాయుల్లో కమిటీల ఏర్పాటును సూచించారు. ఫిర్యాదులపై వెనువెంటనే దర్యాప్తు చేయటం తప్పనిసరి చేశారు.ఈ మార్గదర్శకాల వల్ల జనరల్ క్యాటగిరీ విద్యార్థులు వేధింపులకు గురవుతారన్నది ఆందోళన చేస్తున్నవారి వాదన. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే కావొచ్చు... ఆర్థికంగా బలహీన వర్గాలకూ, అంగవైకల్యం ఉన్నవారికీ కూడా వివక్ష, వేధింపుల నుంచి రక్షణ కల్పించారు. ఈ మార్గదర్శకాలపై ఉన్న అపోహల్ని తొలగిస్తామనీ, ఇవి దుర్వినియోగమయ్యే అవకాశమే లేదనీ కేంద్రం చెబుతోంది. ఏదేమైనా కుల, మత, లింగ వివక్షలు ఉండరాదంటున్న రాజ్యాంగ అధికరణం 15కు ఈ మార్గదర్శకాలు అనుగుణంగానే ఉన్నాయి. వివక్ష, దాని ఆధారంగా వేధింపులు కళ్లెదుట కనబడుతుండగా ఇలాంటి నిబంధనల్ని వ్యతిరేకించటం, దుర్వినియోగమవుతుందన్న సాకు చెప్పటం ధర్మం కాదు. ఆచరణలో లోటుపాట్లుంటే చక్కదిద్దటానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. -
చిరకాల ఆకాంక్ష
ఆలోచనకూ, అది సాకారం కావటానికీ మధ్య ఇరవై రెండేళ్ల సుదీర్ఘకాలం పట్టిందంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. భారత్, యూరోపియన్ యూనియన్(ఈయూ)ల మధ్య మంగళవారం సంతకాలైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) వెనక ఇలాంటి ఆశ్చర్య పోయే సంగతులు చాలానే ఉన్నాయి. బహుశా ‘నియమాల ఆధారిత’ అంతర్జాతీయ క్రమాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధ్వంసించటం మొదలెట్టకపోతే ఈ ఎఫ్టీఏకు మరికొంత సమయం పట్టేదేమో! ఈయూతో ఒప్పందమంటే ఆర్థిక స్థోమత పుష్కలంగా ఉన్న 27 యూరోప్ దేశాలతో బహువిధ రంగాల్లో ప్రగాఢమైన అనుబంధం ఏర్పడటమే! అందుకే ఈ ఒప్పందాన్ని ‘సకల ఒప్పందాలకూ తల్లిలాంటిద’ని చెప్పటంతో పాటు, దీన్ని కేవలం వాణిజ్య ఒప్పందంగా కాక, ఉమ్మడి శ్రేయస్సు కోసం రూపొందించిన ‘బ్లూ ప్రింట్’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్, ఈయూలు రెండూ ప్రపంచ జీడీపీలో 25 శాతం, వాణిజ్యంలో మూడోవంతు వాటా కలిగివున్న రెండు ప్రధాన ఆర్థికవ్యవస్థలు. విడిగా చూస్తే మన దేశం ప్రపంచంలో నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. కూటమిగా ఈయూ రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఉక్రెయిన్ యుద్ధం వంటి ఆటుపోట్లు... అమెరికా, చైనాల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా ఈయూ ఆర్థిక వ్యవస్థ నిలబడగలుగుతోంది. మన డెయిరీ రంగానికి ఎఫ్టీఏలో మినహాయింపు ఇచ్చేందుకు ఈయూ అంగీకరించింది. అయితే చిన్న, మధ్యతరహా సంస్థల ప్రవేశానికీ, సర్వీసుల రంగానికీ మన దేశం వెసులుబాటు నిచ్చింది. కార్ల దిగుమతిపై ఉన్న 110 శాతం సుంకాలు పది శాతానికి పడిపోతాయి. ఎన్నడో 2004లో ఒక ఆలోచనగా బయల్దేరిన ఎఫ్టీఏ జాప్యం కావటంలో ఈయూ మొండి వైఖరే ప్రధాన కారణం. అసలు దానిపై చర్చల ప్రారంభానికే మూడేళ్లు పట్టింది. అప్పట్లో ఈయూకు చైనాయే ఇష్టసఖి. అందుకే భారత్ను పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ అమెరికాతో మనకు కుదిరిన పౌర అణు ఒప్పందం ‘123’ దాని కళ్లు తెరిపించింది. 2013లో ఎఫ్టీఏ కోసం ఈయూ విధించిన షరతులు లీకైనప్పుడు నిరస నలు వెల్లువెత్తాయి. మేధాసంపత్తి హక్కుల పేరిట తన ఫార్మా రంగాన్ని రక్షించుకోవ టానికి ఎఫ్టీఏలో ఈయూ పెట్టిన నిబంధన మన ప్రజారోగ్య రంగానికి చేటు తెస్తుందని, జెనెరిక్ మందుల ఉత్పత్తి నిలిచిపోతుందని ఆక్స్ఫావ్ు వంటి సంస్థలు హెచ్చరించాయి. సాగు రంగంపై అది చూపగల ప్రభావంపైనా భయాందోళనలు వ్యక్తమ య్యాయి. ఇవి గాక అనంతర కాలంలో కశ్మీర్కు స్వయంప్రతిపత్తినిచ్చే 370వ అధికరణం రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వగైరాలు ఈయూకు అభ్యంతరకరం అనిపించాయి. ఈమధ్య పలు దేశాలతో మనకు ఎఫ్టీఏలు కుదిరాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్, మారిషస్, యూఏఈలతోపాటు ఐస్ల్యాండ్, లిచెన్స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్లతో కూడిన యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం(ఈఎఫ్టీఏ)తో సైతం ఎఫ్టీఏలపై సంతకాలు చేసింది. ఈయూతో సంబంధంలేని కూటమి ఈఎఫ్టీఏ. ఉభయపక్షాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ నిరుడు మార్చి ఆఖరునాటికి 13,600 కోట్ల డాలర్లు. ఈయూ సరుకుల ఎగుమతుల జాబితాలో భారత్ది అగ్రస్థానం. అయితే తాజా ఎఫ్టీఏ అమల్లోకి రావటానికి కొన్ని అవరోధాలున్నాయి. ఈ నెల 1 నుంచి కార్బన్ బోర్డర్ అడ్జెస్ట్మెంట్ మెకానిజం(సీబీఏఎం) పేరిట ఈయూ అమల్లోకి తెచ్చిన ‘పర్యా వరణ పన్ను’ ప్రధాన అవరోధం. ఉక్కు, సిమెంట్, అల్యూమినియం, ఎరువుల వంటివి చవగ్గా ఉత్పత్తి చేయటానికి కర్బన ఉద్గారాల ముప్పును భారత్ పట్టించుకోవటం లేదని, అందుకే ఇది అవసరమని ఈయూ వాదన. దీన్ని మన దేశం ఖండిస్తోంది. కేవలం తమ ఉత్పత్తుల్ని రక్షించుకోవటానికి ఇదొక సాకు మాత్రమేనన్నది మన వాదన. సీబీఏఎం నుంచి భారత్కు మినహాయింపు ఇస్తుందా, అసలు దాని అమలునే ఈయూ వాయిదా వేస్తుందా అన్నది చూడాలి. ఇవిగాక ఆరోగ్యం, భద్రత ప్రమాణాలు... కార్మిక హక్కులు, పర్యావరణ పరిరక్షణ, లింగ సమానత్వం వంటివి కూడా ఉన్నాయి. కానీ ట్రంప్ దూకుడు నుంచి కాపాడుకోవాలంటే ఇలాంటి సాకులు వదులుకోక తప్పదు. మొత్తానికి 27 యూరోప్ దేశాల చట్టసభలతోపాటు ఈయూ పార్లమెంటు, మన పార్లమెంట్ ధ్రువీకరించాక ఎఫ్టీఏ అమలు మొదలవుతుంది. దానికెంత కాలం పడుతుందో చూడాలి. -
సడలిన అమెరికా వైఖరి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న టీం సభ్యులు సైతం అచ్చం ఆయన తరహాలోనే రోజుకో రీతిన మాట్లాడటంలో ఆరితేరారు. అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్ చేస్తున్న ప్రకటనలు దాన్నే నిరూపిస్తున్నాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరబోతున్నదని, తమ షరతులన్నిటికీ తలొగ్గటానికి ఆ దేశం సిద్ధపడిందని పలుమార్లు ఏకపక్షంగా ప్రకటించటం, అంతలోనే ఏదో సాకుతో అదనపు సుంకాలు విధించటం ట్రంప్ అలవాటు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేయనందు వల్ల భారత్పై విధించే సుంకాలు 500 శాతానికి కూడా చేరుకోవచ్చని పదిరోజులనాడు కూడా ట్రంప్ బెదిరించారు. స్కాట్ బిసెంట్ సైతం ఆ తోవనే పోయారు. కానీ ఇప్పుడు బెదిరింపుల పర్వం ఉపశమించినట్టు కనబడుతోంది. భారత్పై విధించిన అదనపు సుంకాల్లో 25 శాతాన్ని తగ్గించబోతున్నామని బిసెంట్ ప్రకటించారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లు పడిపోయినందు వల్ల ఈ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. చమురు కొనుగోళ్లు తగ్గిన మాట వాస్తవమే అయినా, దాన్ని అసలు గుర్తించనట్టు ఎప్పటికప్పుడు కొత్త డిమాండ్లు పెట్టడం అలవాటు చేసుకున్న అమెరికా వైఖరి మార్చుకోవటం వెనక వేరే మతలబు ఉంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో మన దేశం రేపో మాపో వాణిజ్య ఒప్పందం కుదురుతుండటమే ఇందుకు కారణం. ఉక్రెయిన్పై 2022లో రష్యా దాడి తర్వాత అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆదేశంతో సంబంధాలు తెంచుకున్నాయి. అటు తర్వాత మన రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు పెరిగాయి. ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో మనం రెండో స్థానంలో ఉన్నాం. ప్రపంచం మునుపటిలా లేదు. ఏకపక్షంగా, అనాలోచితంగా ఆంక్షలు విధిస్తే స్వీయ నష్టాలు కూడా తప్పవు. ప్రపంచ దేశాలపై విధించిన ఆంక్షల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో పడింది. తాజాగా డాలర్ విలువ నాలుగు నెలల కనిష్ఠస్థాయికి పడి పోయింది. అమెరికా బెదిరింపులకు దిగిన మొదట్లో మన దేశానికి చెందిన ప్రైవేటు సంస్థలు రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు తగ్గించిన మాట వాస్తవం. అప్పటికి రోజూ సగటున 17 లక్షల బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేస్తుండగా, మొన్న డిసెంబర్ నాటికి అది 12 లక్షల బ్యారెళ్లకు తగ్గింది. అమెరికా సంస్థలతో లావాదేవీలున్న కొన్ని భారత్ కంపెనీలు ఆంక్షలకు తలొగ్గటమే మంచిదని నిర్ణయించుకోవటం ఇందుకు కారణం. కానీ రష్యా ప్రముఖ చమురు కంపెనీలైన రోజ్నెఫ్ట్, లుకోయిల్ నుంచి చమురు కొనుగోలు చేయరాదన్నది అమెరికా పెట్టిన ఆంక్షల్లో ఒకటి. దానికి విరుగుడుగా రష్యా వేరే కంపెనీలను రంగంలోకి దించి వాటిద్వారా భారత్కు ముడి చమురు ఎగుమతులు మొదలుపెట్టింది. వీటి ప్రభావం ఒకటి రెండు నెలల్లో కనబడుతుందనీ, అటుతర్వాత రష్యా నుంచి వచ్చే ముడిచమురు కొనుగోళ్లు యథాప్రకారం ఉంటాయని నిపుణుల అంచనా. చవగ్గా వచ్చే రష్యా ముడి చమురును వదులుకోవటం ఎవరికైనా అంత సులభం కాదు. రష్యా చమురుకూ, సౌదీ అరేబియా నుంచి కొనే చమురుకూ మధ్య బ్యారెల్కు దాదాపు 10 డాలర్ల వ్యత్యాసం కనబడుతున్నప్పుడు ఆంక్షలకు తలొగ్గాలని ఎవరూ అనుకోలేరు. తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుపరంగా మార్పుచేసిన ఆహారధాన్యాలనూ భారత్ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని అమెరికా ఒత్తిడి చేస్తున్నందు వల్లే వాణిజ్య ఒప్పందం కుదరటంలో ఆలస్యం అవుతోంది. ఏదో వంకతో ఆంక్షలు విధిస్తే భారత్ దారికొస్తుందని అమెరికా భావన. ఈలోగా ఈయూ–భారత్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదిరే అవకాశాలు కనబడటం అమెరికా జీర్ణించు కోలేకపోతోంది. అందుకే ఒకపక్క ఎఫ్టీఏను దృష్టిలో పెట్టుకున్నందు వల్లే భారత్ పట్ల ఈయూ మెతకవైఖరి ప్రదర్శించిందని విమర్శిస్తూనే, తాను విధించిన అదనపు సుంకాల్లో కోతకు సిద్ధపడుతోంది. అమెరికాతో ఒప్పందం కుదరటం మాటెలావున్నా, ప్రపంచ దేశాలన్నిటితో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకునే ప్రస్తుత విధానాన్ని మన దేశం కొనసాగించటమే ఉత్తమం. ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడే ధోరణి ఎప్పుడూ ప్రమాదకరమే! -
సహనమే శరణ్యం
సహనం, ఓరిమి, క్షమ – ఉత్తములైన మనుషుల సహజ లక్షణాలని వేద పురాణేతి హాసాలు, వివిధ మత గ్రంథాలు, నీతిశాస్త్రాలు చెబుతున్నాయి. ‘క్షమా భూమిః క్షమా సర్వం/ క్షమయా ధార్యతే జగత్’ అని అధర్వణ వేదం చెబుతోంది. ‘క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః/ క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్’ అని వాల్మీకి రామాయణం చెబుతోంది. ‘క్షమా ధర్మః క్షమా యజ్ఞః/ క్షమా వేదః క్షమా శ్రుతిః/ క్షమయా ధార్యతే లోకః క్షమయా కిం న సాధ్యతే’ అని వ్యాస మహాభారతం చెబుతోంది. క్షమను మించిన సుగుణం లేదు, క్షమతో సాధ్యం కానిది లేదు అని ఈ శ్లోకాల సారాంశం. ‘ఖంతీ పరమం తపో తితిక్ఖా’ అని బుద్ధుని ధమ్మపదం చెబుతోంది. అంటే, సహనమే అత్యున్నత తపస్సు అని అర్థం. ‘సహన శీలః సజ్జనః/ కోపహీన సదా భవేత్/ కోపోహి శత్రురత్యంతం/ తస్మాత్ క్షమైవ శ్రేయసీ’ అని భర్తృహరి నీతి శతకం చెబుతోంది. ఇదే నీతిని ‘తన కోపమె తన శత్రువు/ తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ/ తన సంతోషమె స్వర్గము/ తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ’ అని సుమతీ శతకం చెబుతోంది.‘గర్విష్ఠుల కంటే సహనము గలవాడు మేలు’ అని బైబిల్ చెబుతోంది. ‘నిశ్చయంగా అల్లాహ్ సహనశీలురతో ఉంటాడు’ అని ఖురాన్ చెబుతోంది.పురాణేతిహాసాలు, వివిధ మతాల పవిత్ర గ్రంథాలు, నీతిశాస్త్రాలు చెప్పిన ఈ మాటలను ప్రవచనాల్లోను, ఉపన్యాసాల్లోను తరచు ఉట్టంకిస్తుంటారు. అయితే, వీటిని ఆచరించడాన్నే మనుషులు మరచిపోతుంటారు. ఎదుటి మనిషి తమకు నచ్చని అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తే చాలు, ఒక్కసారిగా సహనం నశించి, కోపం కట్టలు తెంచుకుంటుంది. అప్పటి వరకు వల్లించిన నీతులన్నీ ఒక్కసారిగా మరపు మరుగున పడిపోయి, బూతుల ప్రవాహం వరదలా పోటెత్తుతుంది. తగవు మొదలై బాహాబాహీ సిగపట్ల వరకు వ్యవహారం ముదురుతుంది. మనుషుల్లో సహనం నశించినప్పుడే సమాజంలో నేరాలు, ఘోరాలు జరుగుతుంటాయి. పౌరుల్లో సహనం నశించి, తప్పటడుగులు వేస్తే, చక్కదిద్దే పనిని పాలనా వ్యవస్థలు చేపడతాయి.దురదృష్టవశాత్తూ పాలనా వ్యవస్థలు కూడా సహనం కోల్పోయి, కక్ష సాధింపులకు తెగబడుతున్న రోజులు దాపురించాయి. సత్యం పట్ల అసహనం, ప్రశ్న పట్ల అసహనం, ధిక్కారం పట్ల అసహనం, భిన్నాభిప్రాయం పట్ల అసహనం పెచ్చుమీరిన పాలకులు సత్యాన్ని ప్రకటించే పాత్రికేయుల పట్ల, ప్రశ్నించే పౌరుల పట్ల, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే విపక్ష నేతల పట్ల కక్ష సాధింపు చర్యలకు తెగబడే ధోరణి పెరుగుతోంది. ధిక్కార స్వరాలను వినిపించే వారిని కటకటాల్లోకి నెట్టే వైఖరి ప్రబలుతోంది. పట్టించుకోవలసిన అనేక సమస్యలను పట్టించుకోకుండా, భిన్నస్వరాలపై కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్య మిస్తున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇవన్నీ ఇటీవలి కాలంలో మన దేశంలో కనిపిస్తున్న పరిస్థితులు.ప్రపంచ పరిస్థితులు కూడా ఏమంత భిన్నంగా లేవు. ఆర్థికబలం, ఆయుధ బలగం దండిగా కలిగిన అగ్రరాజ్యాలు బలహీన దేశాలపై అసహనంతో యుద్ధాలకు తెగబడు తున్నాయి. బలహీన దేశాల అధినేతలను చెరబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు దేశాలు ప్రత్యక్షంగా యుద్ధాలను ఎదుర్కొంటున్నాయి. సుమారు మరో ఇరవై దేశాలు అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్నాయి. ఇంకో పదిహేను దేశాలు ప్రచ్ఛన్న యుద్ధాలతోను, చొరబాట్లు, సైనిక హింస తదితర సమస్యలతో సతమతం అవుతున్నాయి. ఈ దారుణ దుర్భర పరిస్థితులకు మూలకారణం అసహనం. ప్రపంచంలో యుద్ధాలు సద్దుమణగాలన్నా; దేశాల్లో పౌరుల స్వేచ్ఛకు భద్రత దొరకాలన్నా; విభిన్న మతాలు, జాతుల మధ్య సామరస్యం పెరగాలన్నా సహనమే కీలకం. ‘క్షమా బలమశక్తానాం/ శక్తానాం భూషణం క్షమా’ అని మహాభారతం చెబుతోంది. బలహీనులకు క్షమే బలం; బలవంతులకు అది అలంకారం. మనుషుల్లో క్షమ, ఓరిమి, సహనం వంటి సహజ సుగుణాలు పెరిగినప్పుడే ప్రపంచంలో శాంతి పరిఢవిల్లుతుంది. మన గణతంత్రం ‘ఘన’తంత్రమవుతుంది. -
కాంగ్రెస్ రంగు మారిందా?
సింగరేణిపై ఏ గద్దలనూ, ఏ పెద్దలనూ వాలనీయబోనని భట్టి విక్రమార్క ఘంటాపథంగా చెబుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణ తన మీద చేసిన ఆరోపణలపై ఈ శనివారం కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై ఇదేవారంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన రెండో మీడియా సమావేశం ఇది. రాబందుల ప్రయోజనాలను కాపాడటానికే రాధాకృష్ణ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని భట్టి విమర్శించారు. ‘పెట్టుబడికీ కట్టుకథకూ పుట్టిన విషపుత్రిక’గా ఆ పత్రికను అభివర్ణిస్తూ ‘ఎవరి కళ్లలో ఆనందం చూడటానికి నాపై తప్పుడు వార్తలు రాస్తున్నావ’ని రాధాకృష్ణను ఆయన ప్రశ్నించారు.సింగరేణి యాజమాన్యం కింద ఉన్న నైనీ బ్లాక్ బొగ్గు తవ్వకాల కాంట్రాక్టును ఎన్టీవీ యజమాని బంధువుకు ఇప్పించడం కోసమే ఎక్కడా లేని ‘సైట్ విజిట్’ నిబంధనను భట్టి విక్రమార్క తీసుకొచ్చారని ఆ వ్యాసంలో రాధాకృష్ణ ఆరోపించారు. అదే కాంట్రాక్టు మీద కన్నేసిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుతగలడంతో ఆయన మీద ఎన్టీవీలో ఒక అభ్యంతరకరమైన కథనం ప్రసారమైందని రాధాకృష్ణ ఆరోపించారు. ‘సైట్ విజిట్’ నిబంధనను తను తీసుకొని వచ్చానన్న ఆరోపణ శుద్ధ అబద్ధమని తేలుస్తూ శనివారం నాడు భట్టి డాక్యుమెంటరీ సాక్ష్యాలను విడుదల చేశారు.నలభయ్యేళ్లుగా రాజకీయ నిబద్ధతతో నిర్మించుకున్న తన వ్యక్తిత్వాన్ని హననం చేయడం పట్ల భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లో ఎదిగినందుకే తనను రాధాకృష్ణ టార్గెట్ చేశారని కూడా మొదటి సమావేశంలో ఆయన ఆరోపించారు. నిజంగానే భట్టిది నిబద్ధతతో కూడిన రాజకీయ జీవితమే! దళిత కుటుంబం నుంచి ఎదిగిన విద్యాధి కుడు. హైదరాబాద్ యూనివర్సిటీలో ఎం.ఏ. చదివారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొంతకాలం ఎమ్మెల్సీగా పని చేసి, తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి వరసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికై కమ్యూనిస్టు నేత బోడేపూడి వెంకటేశ్వరరావు రికార్డును బద్దలు కొట్టారు. గడచిన అసెంబ్లీలో తన సహచర పార్టీ ఎమ్మెల్యేలు వరుసకట్టి పార్టీ ఫిరాయిస్తున్నా చలించకుండా పార్టీకే కట్టుబడిన వ్యక్తి. అనంతరం పార్టీ గెలుపు కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశమున్న వారిలో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అటువంటి తన కెరీర్పై మీడియాలో బురద చల్లడం పట్ల సహజంగానే ఆయనకు ఆవేదన కలిగి ఉంటుంది.భట్టితో పాటు అదే వ్యాసం మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా బజారున పెట్టింది. మంత్రి పదవిలో ఉండి సొంత పనికోసం తన పలుకుబడిని ఉపయోగించుకున్నారనే మరకను ఆయనకు అంటించారు. పేర్లు ప్రస్తావించకుండా మంత్రి మీద, మహిళా అధికారుల మీద ఎన్టీవీ ప్రసారం చేసిన ‘ఆఫ్ ది రికార్డు’ కథనం అభ్యంతరకరమైనదే! కాకపోతే మాజీ గవర్నర్, వయోవృద్ధుడైన ఎన్.డి. తివారీ మీద రాసలీలల పేరుతో కథనాలు వండివార్చిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక మరో మీడియా ఛానల్ను ఎత్తిచూపడమే వింతగొలుపుతున్నది. మీడియాలో అభ్యంతరకరమైన వార్తలు వచ్చినప్పుడు ఆ మీడియా సంస్థ ముఖ్యబాధ్యులకు నోటీసులివ్వడం, పరువు నష్టం కేసులు, సివిల్ కేసులు వేయడం ఒక సంప్రదాయం. కానీ ఎకాయెకిన క్రిమినల్ కేసులు పెట్టి, ఎంపిక చేసుకున్న ముగ్గురు బీసీ, ఎస్సీ జర్నలిస్టులను (దొంతు రమేశ్, పరిపూర్ణాచారి, సురేశ్) అరెస్టు చేశారు. గత కొంతకాలంగా పాత కాంగ్రెస్ నేతల మీద రకరకాల లీకులు, ఆరోపణలు అటు యెల్లో మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో వరసగా కనిపిస్తున్నాయి. దీని వెనుకనున్న అదృశ్య హస్తం ఎవరిదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. కాంగ్రెసులోనే పుట్టి పెరిగిన బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడైన మంత్రి మీద కూడా సోషల్ మీడియాలో విప రీతంగా వ్యతిరేక ప్రచారం జరిగింది. నాలుగు దశాబ్దాలుగా జగి త్యాల ప్రాంత కాంగ్రెసుకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన సీనియర్ నేత, నిబద్ధత గల నాయకుడిగా పేరున్న జీవన్రెడ్డికి పార్టీలోనే పొగబెట్టడం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. గాంధీ భవన్లో జరిగిన తమ పార్టీ ప్రాంతీయ సమావేశంనుంచి కూడా ఆయన వాకౌట్ చేసి బయటకు రావలసిన దుఃస్థితి పాత కాంగ్రెస్ నేతల పరిస్థితికి ఇప్పుడు అద్దం పడుతున్నది.కాంగ్రెస్ వ్యవహారాల్లో ఈ లీకులు, ఆరోపణలు, యెల్లో మీడియా ద్వారా వెలువరిస్తున్న కథనాలు, కుంభకోణాలు వగైరాలన్నీ ఉపకథలు మాత్రమే. అసలు కథ అంతర్లీనంగా జరుగుతున్న రాజకీయ మార్పు. కొద్ది రోజుల కిందట ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన రాజకీయ ప్రసంగం తెలంగాణ సమాజంలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీని ఎన్టీఆర్ అభిమా నులూ, చంద్రబాబు అనుయాయులూ కలిసి బొందపెట్టాలని, బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలను కూల్చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ముఖ్య భాగ స్వామి. రేవంత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి. మరి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను ఓడించడానికి ఎన్డీఏ అభిమానులను ఆహ్వా నించడమేమిటి? రాష్ట్ర కాంగ్రెస్లో కాంగ్రెస్ రక్తమే ఉన్నదా? లేక ‘క్రమశిక్షణ కలిగిన రక్తకణాలు’ ఏవైనా బయట నుంచి ప్రవేశించాయా? ‘మా రక్తాన్ని ఎక్కించుకుంటే చిరంజీవి ఎన్నికల్లో గెలిచే వాడ’ని వెనుకటికి ఒక ‘కులోత్తుంగ’ చోళుడు నుడివిన పలుకులు ఎవరూ మరిచిపోయేవి కావు. తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక మార్పయితే జరుగుతున్నదనే అభిప్రాయం కార్యకర్తల్లో ఈమధ్య బాగా వినిపిస్తున్నది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొందపెట్టిందెవరు? బీఆర్ఎస్సా? ఎంత మాత్రం కాదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ‘తెలుగుదేశం’ను భూస్థాపితం చేసింది. ‘మహాకూటమి’ని ఏర్పాటు చేసుకున్నా కూడా 2009లో అది లేవలేకపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మోదీతో, పవన్తో జోడీ కట్టి అలవికాని హామీలిచ్చి టీడీపీ పునరుజ్జీవం పొందగలిగింది. కానీ తెలంగాణలో రెండు దశాబ్దాలు దాటినా ఇంకా అది సమాధి స్థితిలోనే ఉన్నది.కేసీఆర్ హయాంలో జరిగిందేమిటంటే, ‘ఓటుకు నోటు’ బాగోతంలో దొరికిపోయినందువల్ల ‘పదేళ్ల రాజధాని’ హైదరా బాద్ను వదిలేసుకుని చంద్రబాబు సర్కార్ పలాయనం చిత్తగించింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొందపెట్టింది మాత్రం 2004లో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలే! ముఖ్యమంత్రి సందేశాన్ని అందుకొని తెలుగుదేశం అభిమానులు పగ సాధించ వలసింది ఎవరిపైన? కాంగ్రెస్పైనే కదా! నాటి కాంగ్రెస్ – నేటి కాంగ్రెస్ అని విభజించి యాక్షన్ ప్లాన్ అమలుచేయాలా? ఏమిటిప్పుడు తెలుగుదేశం అభిమానుల తక్షణ కర్తవ్యం?‘ఎవరి కళ్లలో ఆనందం చూడటం కోసం నా మీద అసత్య వార్తలు రాస్తున్నావు రాధాకృష్ణా?’ అని భట్టి ప్రశ్నిస్తున్నారు. ఆ కళ్లు ఎవరివై ఉంటాయి? ఏ రాబందుల ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. ఆ రాబందులు ఎక్కడివై ఉంటాయి? భట్టి మీద, ఆయనతో సహా పాత తరం కాంగ్రెస్ నేతల మీద ఆ కళ్లు ఎందుకని నిప్పులు పోసుకుంటున్నాయి? జీవన్రెడ్డి వంటి నీతిమంతులైన నేతలను ఎందుకని మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రొటో కాల్ను పక్కనపెట్టి ‘ఆంధ్రజ్యోతి’ రాధాకృష్ణను కలిసిరావడం కాంగ్రెస్ శ్రేణుల్లో కింది నుంచి పైస్థాయి వరకు చాలామందికి మింగుడుపడడం లేదు. బీఆర్ఎస్ను తరిమికొట్టే పేరుతో తెలుగుదేశం అభిమానులకు స్నేహహస్తం చాచడం కూడా పార్టీ కార్యకర్తలు జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇరవై రెండేళ్ల కింద తామే స్వయంగా సమాధి చేసిన పార్టీ ఆత్మను ఇప్పుడు ఆవాహన చేయవలసిన అవసరమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో నిట్టనిలువునా ఒక సైద్ధాంతిక విభజనైతే ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ శ్రేణుల దౌర్భాగ్యం ఏమిటంటే స్వయానా ఆ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్గాంధీకి చంద్రబాబుతో అంతుచిక్కని చెలిమి ఏదో ఏర్పడి ఉండటం! ఫలితంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల జాతీయ పార్టీకి నియంత్రణ లేకుండా పోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందువల్ల, బీజేపీ మీద బలమైన సైద్ధాంతిక పోరాటం ఆ పార్టీ చేయాలని కాంగ్రెస్ నాయకులు గానీ, లౌకికవాదులు గానీ ఆశిస్తారు. కానీ ఇక్కడ ఎన్డీఏ ముఖ్య భాగస్వామి కనుసన్నల్లో జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి.వ్యూహాత్మకంగానే రెండు రాజకీయ పరిణామాలు తెలంగాణలో నిశ్శబ్దంగా జరిగిపోతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఒకటి – కాంగ్రెస్ పార్టీలో పాత కాంగ్రెస్ లేదా సైద్ధాంతిక కాంగ్రెస్వాదులు పూర్తిగా పట్టు కోల్పోయేలా చేయడం! రెండు – రాష్ట్రంలో ప్రతిపక్షంగా బీజేపీ బలపడాలంటే బీఆర్ఎస్ నిర్వీర్యం కావాలి... అందుకు అవసరమైన భూమికను తయారుచేయడం! గత కొంత కాలంగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు, విచారణలు వగైరాలన్నీ ఈ కోణంలోంచి చూసినప్పుడే అర్థం చేసుకో గలుగుతాము. ఫోన్ ట్యాపింగ్ పేరుతో జరుగుతున్న దర్యాప్తులో వేగం పెంచాలని బీజేపీ నేతలు ఒత్తిడి చేయడం, ‘ఫార్ములా–ఇ’ రేసు కేసులో ఈడీ రంగప్రవేశం, ఆగమేఘాల మీద బొగ్గు వ్యవహారంపై కేంద్ర కమిటీ దర్యాప్తు ప్రారంభించడం వగైరాలన్నీ తెలంగాణలో తెర వెనుక జరుగుతున్న విచిత్ర రాజకీయ మైత్రీబంధాల సంకేతాలుగానే భావించాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఈ మండలి శాంతికేనా?!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన మనోభీష్టాన్ని నెరవేర్చుకున్నారు. గాజాలో ‘శాంతి నెలకొల్పడమే’ లక్ష్యంగా 19 సభ్యదేశాలతో ‘శాంతిమండలి’ ఏర్పాటై నట్టు గురువారం ప్రకటించారు. అర్జెంటీనా మొదలుకొని వియత్నాం, పాకిస్తాన్ వరకూ పోటీ పడి ఇందులో సభ్యత్వం తీసుకోగా, ఈ అర్థరహిత విన్యాసానికి మన దేశందూరంగా ఉండి మంచి పని చేసింది. అమెరికా చిరకాల సన్నిహిత దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, స్లొవేనియాలు ఇందులో చేరబోమని ప్రకటిస్తే, మనతోపాటు రష్యా, చైనా, జర్మనీ, యూరోపియన్ యూనియన్(ఈయూ), సింగపూర్ వగైరాలు తటస్థంగా ఉండి పోయాయి. అమెరికా ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలతో రెండేళ్ల పాటు గాజాలో నరమేధం సాగించిన ఇజ్రాయెల్ సైతం ‘తగుదునమ్మా’ అంటూఇందులో చేరటం కొసమెరుపు. ‘నాకు నోబెల్ శాంతి బహుమతి రాలేదు గనుక, ఇకపై శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని ప్రకటించిన ట్రంప్, వారం తిరిగేసరికల్లా అంత ర్జాతీయ శాంతిదూత అవతారం ఎత్తడం ఒక వైచిత్రి.భద్రతామండలి తన 70 ఏళ్ల చరిత్రకు కళంకం తెచ్చుకునే విధంగా గత నవంబర్లో గాజా శాంతికి అగ్రరాజ్యాలు చొరవచూపాలని కోరుతూ ఆమోదించిన తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని ట్రంప్ ఈ చర్యకు సాహసించారు. రష్యా, చైనాలు వీటో చేసివుంటే ఆ తీర్మానానికి ఆమోదముద్ర పడేదికాదు. కానీ గైర్హాజరుతో సరిపెట్టి ఈ వైపరీత్యానికి వారూ తోడ్పడ్డారు. దురాక్రమణలు, నరమేధాలు, ఊచకోతలు, సైనిక కుట్రలు తదితరాలను ఎదుర్కొనటానికి అంతర్జాతీయంగా ఆమోదించిన అనేక చట్టాలున్నాయి. వాటిల్లో ఏ చట్టాలు విఫలమైనాయని, ఎలాంటి ప్రయత్నాలు చేసిందని నవంబర్ తీర్మానాన్ని ఆమోదించాల్సి వచ్చిందో భద్రతామండలి చెప్పాలి. గాజాలో అకారణంగా, అన్యాయంగా వేలాదిమందిని హతమారుస్తుంటే, విధ్వంసకాండను కొనసాగిస్తుంటేకంటితుడుపు ప్రకటనలు చేయటం మినహా, ఆ సంస్థ పక్షాన జరిగిన యత్నాలేమీ లేవు. కానీ అకృత్యాలకు పాల్పడినవారికే దాన్ని ఉద్ధరించేందుకు లైసెన్సునిచ్చింది. ఈ‘శాంతిమండలి’ అమెరికా కోసం కాదు... ఏకంగా ప్రపంచ ఉద్ధరణకేనని దావోస్ లోట్రంప్ ఘనంగా ప్రకటించుకున్నారు. గాజాలో శాంతి నెలకొల్పగానే అది ప్రపంచంలోని ఇతర ఘర్షణలపై దృష్టిసారిస్తుందని కూడా ఆయన చెబుతున్నారు.ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి ఎంతగా విఫలమైనా, వాటికి ఉజ్జ్వలమైన చరిత్ర ఉంది. రెండో ప్రపంచయుద్ధం మానవాళికి తెచ్చిపెట్టిన లాంటి ఉత్పాతం భవిష్యత్తులో ఎన్నడూ సంభవించనీయబోమని వాగ్దానం చేస్తూ అవి ఆవిర్భవించాయి. కానీ ఇప్పుడు పుట్టుకొచ్చిన ‘శాంతిమండలి’ ట్రంప్ అల్లుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి జేర్డ్ కుష్నెర్ మానసపుత్రిక. 3,000 కోట్ల డాలర్ల వ్యయంతో గాజా సాగరతీరాన కళ్లు చెదిరే భవంతులు, రిక్రియేషన్ క్లబ్లు, క్యాసినోలు నిర్మించాలని ఆయనగారి తపన. తరతరాలుగా పేదరికంలో మగ్గిన పాలస్తీనియన్లు ఈ అభివృద్ధి చూసి మూర్ఛపోతారని ట్రంప్ చెబుతున్నారు. శాంతిమండలిలో చేరిన నెతన్యాహూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో యుద్ధనేరారోపణలు ఎదుర్కొంటున్నారు. స్విట్జర్లాండ్లో అడుగుపెడితే అరెస్టవుతానని తెలిసి ఈ సంబరానికి దూరంగా ఉండిపోయారు. నిర్మానుష్యమైన తూర్పు జెరూసలేంలోని ఐక్యరాజ్యసమితి సహాయసంస్థ భవనాన్ని బుల్డోజర్లతో నేలమట్టం చేయించిన మర్నాడే ఆయన ‘శాంతిమండలి’లో చేరటం గమనార్హం. ఇంతవరకూ ట్రంప్కు అంటిన మరకలు ఇకపై శాంతిమండలి సభ్యులకూ తప్పవు. వెనిజులాపై సైనిక దాడి చేసి ఆ దేశాధ్యక్షుణ్ణి అపహరించటం, అక్కడి ముడిచమురుపై తమ ఆధిపత్యాన్ని ప్రకటించుకోవటం, గ్రీన్ల్యాండ్ను కాజేయాలని ఆత్రపడటం, మాట వినని దేశాలపై భారీ సుంకాలు విధించటం, ప్రపంచం నలుమూలలా సైనిక స్థావరాల ఏర్పాటు యత్నాలు వంటి ట్రంప్ అనాలోచిత చర్యలకూ, ఆయన బెదిరింపు ధోరణు లకూ ఇకపై ఈ మండలి సైతం సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సమితికి సంబంధించిన కర్తవ్యాలు శాంతిమండలి స్వీకరిస్తుందని ట్రంప్ చెప్పటంతోపాటు భవిష్యత్తులో సమితికి కాలం చెల్లుతుందనటాన్ని గమనిస్తే ఇదంతా చివరకు ఎటుపోతుందో... ఏమవు తుందో సులభంగానే గ్రహించవచ్చు. -
పొంచివున్న పెనుముప్పు
గుక్కెడు మంచినీళ్ల కోసం మున్ముందు ప్రపంచ ప్రజానీకం ఇక్కట్లు పడాల్సి ఉంటుందని నిపుణులు ఎప్పటినుంచో చేస్తున్న హెచ్చరికలు రేపో మాపో నిజం కాబోతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక హెచ్చరిస్తున్నది. మనిషికే కాదు... సమస్త జీవకోటికీ గాలి తర్వాత నీరే ప్రాణాధారం. కానీ మారుతున్న పర్యావరణం, పెరిగిపోతున్న కాలుష్యంతో పాటు మితిమీరిన వినియోగం కారణంగా నీరు శరవేగంతో అడుగంటి పోతున్నదని ఆ నివేదిక చెబుతోంది. ముంచుకురానున్న ఈ ప్రమాద తీవ్రతను తెలియ జెప్పేందుకు నివేదిక కొత్త పదాన్ని ఎంచుకుంది. జల సంక్షోభం, జలగండం వంటివి అలవాటైన పదాలు. సంక్షోభం అనడంలో దాన్ని అధిగమించగలమన్న భరోసా కూడా ఏదో ఒక మూల ఉంటుంది. గండం అని చెప్పడంలో గట్టెక్కగలమన్న విశ్వాసం ఎంతో కొంత ధ్వనిస్తుంది. కానీ ముంచుకురాబోయే ముప్పు ఇంకెంత మాత్రమూ సాధారణ మైనది కాదు. అందుకే ఆ ముప్పును ‘జల దివాళా’ అంటోంది నివేదిక.ప్రకృతి మనకు వాన రూపంలో, మంచురూపంలో ప్రసాదించే జలరాశి ఆదాయంతో సమానమని, కానీ పొందుతున్న జలరాశిని మించి... చెప్పాలంటే అవసరాలను మించి నదులు, సరస్సులు, చిత్తడి నేలలు, భూగర్భ జలాశయాలు వగైరాల నుంచి మానవాళి పీల్చేస్తున్నదని నివేదిక రూపొందించిన ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీకి చెందిన జల, పర్యావరణ, ఆరోగ్యసంస్థ డైరెక్టర్ కావే మదానీ అంటున్నారు. ఆదాయాన్ని మించి వ్యయం చేస్తే సర్వస్వం కోల్పోయిన విధంగానే కుంచించుకుపోతున్న నదీనదాలూ, సరస్సులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు జీవకోటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయని ఆయన భావన. కనీసం ఈ దశలోనైనా మేల్కొంటే ఆ దివాళాను నివారించటం సాధ్యమేనని ఆయన చెబుతున్నారు.నివేదికను గమనిస్తే ప్రపంచీకరణకూ, ఆవిరైపోతున్న నీటి వనరులకూ ఉన్న అవినాభావ సంబంధం తెలుస్తుంది. ప్రపంచంలోని అతి పెద్ద సరస్సుల్లో 1990 తర్వాతే నీరు అడుగంటుతున్నదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాన భూగర్భ జలాశయాల్లో 70 శాతం క్షీణత కనబడుతోంది. యూరోపియన్ యూనియన్(ఈయూ) భూభాగంతో సరిసమానమైన చిత్తడి నేలలు గత 50 ఏళ్లలో అంతరించగా, 1970 దశకం నుంచి చూస్తే హిమానీనదాలు 30 శాతం మేర కొడిగట్టాయి. నీటి వ్యవస్థపై అంతగా ఒత్తిడి లేని ప్రాంతాల్లో సైతం కాలుష్యం వల్ల మంచినీటి కొరత ఏర్పడటాన్ని ఈ నివేదిక ఎత్తిచూపు తోంది. నీటి కోసం భవిష్యత్తులో దేశాల మధ్యా, దేశాల్లో ప్రాంతాల మధ్యా వైషమ్యాలు పెచ్చరిల్లే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తోంది. నీటి వనరుల క్షీణత దాదాపు అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది. ప్రతియేటా కనీసం ఒక నెలరోజులపాటు 400 కోట్లమంది ప్రజానీకం దాహార్తితో ఉంటున్నారు. అఫ్గాన్ రాజధాని కాబూల్ నగరం నీటి లభ్యతను పూర్తిగా కోల్పోనున్న తొలి ప్రపంచ నగరం కాబోతున్నదని నిపుణులంటున్నారు. మెక్సికో నగరమైతే ఏడాదికి 20 అంగుళాల చొప్పున నీరు కోల్పోతోందని చెబుతున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్, లాస్ వేగాస్ నగరాలు, ఇరాన్ రాజధాని తెహ్రాన్లలో నీటి పంపిణీకి పరిమితులు విధించక తప్పని స్థితి ఏర్పడినా పాలకులు మాత్రం వాటి విస్తరణను ఆపడం లేదు. 2003–2019 మధ్య ఇరాన్ 200 ఘున కిలోమీటర్ల (7,062 శతకోటి ఘనపుటడుగుల) నీటి నిల్వను కోల్పోయిందని అంచనా. పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. దక్షిణాసియాలో పెరుగుతున్న పట్టణీకరణ నీటి వనరుల్ని దెబ్బతీస్తోంది. మన దేశం సంగతికొస్తే ప్రపంచ జనాభాలో మనం 18 శాతం. కానీ ప్రపంచ స్వచ్ఛనీటిలో మన వాటా 4 శాతం. అమెరికా, చైనాల తర్వాత అత్యంత భారీగా భూగర్భ జలాలను వాడుతున్న దేశం మనది. గంగ, యమున, సబర్మతి నదుల్లో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీరు వచ్చి కలుస్తున్నాయి. 56 శాతం జిల్లాల భూగర్భ జలాల్లో నైట్రేట్లు కలగలిసివుంటున్నాయని తేలింది. విచ్చలవిడి నీటి వినియోగం, జలకాలుష్యం నివారించటంతోపాటు భూగర్భజలాల పెంపునకు చర్యలు తీసుకుంటేనే సమితి నివేదిక చెప్పిన ‘జల దివాళా’ నుంచి మనల్ని మనం రక్షించుకోగలం. ముప్పు ముంచుకొచ్చే వరకూ పట్టనట్టు ఉండటం క్షేమం కాదు. -
మళ్లీ గవర్నర్ల పంచాయతీ!
జవాబుదారీతనం కొరవడినచోట ఇష్టారాజ్యం నెలకొంటుంది. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే చెప్పినా సమస్య ఎప్పటిలానే మిగులుతుంది. వార్తల్లో వ్యక్తులుగా ఉండా లనుకుంటారో, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను తిప్పలు పెట్టాలనుకుంటారో... కొందరు గవర్నర్ల తీరు మాత్రం మారడం లేదు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మంగళవారం కొత్త తగువులు తీసుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో చేయాల్సిన ప్రసంగాన్ని కాదని రవి వాకౌట్ చేస్తే, కేంద్రాన్ని విమర్శించే ప్రస్తావనలున్న భాగాలను అర్లేకర్ చదవకుండా వదిలిపెట్టారు. రవి వివాదాలకు కొత్తగాదు. ప్రభుత్వం పంపిన పది బిల్లుల్ని దీర్ఘకాలం సమ్మతి తెలపకుండా, అలాగని అభ్యంతరాలేమిటో చెప్పకుండా తన దగ్గరే ఉంచుకున్న ఘనుడాయన. అందులో 2020 నాటి బిల్లు కూడా ఉంది! అందుకే రవి తీరును నిరుడు సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు బట్టింది. బిల్లుపై నిర్ణీత వ్యవధిలో గవర్నర్ ఏ మాటా చెప్పని పక్షంలో దాన్ని ఆమోదించి నట్టుగా భావించాలని కూడా తీర్పునిచ్చింది. రాష్ట్రపతి పరిశీలనకు పంపదల్చుకున్న బిల్లుల్ని గరిష్ఠంగా మూడు నెలలు మించి తమవద్ద ఉంచుకోరాదని, పునఃపరిశీలన కొచ్చిన బిల్లునైతే వెంటనే లేదా గరిష్ఠంగా నెలరోజుల్లోపల సమ్మతి తెలపాలని ధర్మాసనం తెలిపింది. అటు తర్వాత రాష్ట్రపతికిచ్చిన సలహాపూర్వక అభిప్రాయంలో బిల్లును ‘ఆమోదించినట్టుగానే పరిగణించాల’న్న భావన సరికాదని మరో ధర్మాసనం తెలిపింది. కానీ అందులో సైతం ‘దీర్ఘకాలం బిల్లును పెండింగ్లో ఉంచటం’ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయటమేనని స్పష్టం చేసింది. గవర్నర్ల వ్యవస్థ ఆది నుంచీ వివాదాస్పదమే. స్వర్గీయ ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయంలో విపక్షాలను కూడగట్టి కేంద్రంపై రణభేరి మోగించారు. రాజకీయాలకు అతీతంగా ఆ వ్యవస్థ మనుగడ సాగించ లేకపోవటం ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపంగా పరిణమించింది. రాజ్యాంగ నిర్ణాయక సభలో గవర్నర్ వ్యవస్థకు సంబంధించిన అధికరణాలపై జరిగిన చర్చ సందర్భంగా పలువురు సభ్యులు కేంద్రం నామినేట్ చేస్తే వచ్చే గవర్నర్కూ, రాష్ట్ర ప్రభుత్వానికీ అనవసర ఘర్షణలు ఏర్పడతాయని అభిప్రాయపడ్డారు. అయితే గవర్నర్గా వచ్చేవారు రాజ్యాంగపరిధిలో తమంత తాము నిర్వర్తించే కర్తవ్యాలు ఏమీ ఉండబోవనీ, రాష్ట్ర కేబినెట్ సలహా మేరకే వారు పనిచేస్తారనీ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వారికి నచ్చజెప్పారు. ఇన్ని దశాబ్దాలు గడిచాక ఇప్పుడు జరుగు తున్నదేమిటి?వాకౌట్ చేయటానికి రవి చెబుతున్న కారణాలు సహేతుకమైనవి కాదు. సమా వేశాలను తమిళ రాష్ట్రగీతంతో మొదలుపెట్టి గవర్నర్ ప్రసంగం పూర్తయ్యాక చివరగా జాతీయగీతాలాపన ఉంటుందని ప్రభుత్వం చెప్పినా ఆయనకు రుచించలేదు. ఇతరేతర ఆరోపణలు రాజకీయ స్వభావం ఉన్నవి. వాటిని ఎటూ ప్రజాక్షేత్రంలో విపక్షాలు లేవనెత్తుతాయి. ఎన్నికల సమయంలో జనం తీర్పునిస్తారు. ఆ విషయంలో గవర్నర్గా రవి ఆత్రపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిందని ఆరోపించే ముందు గవర్నర్గా తన నిర్వాకమేమిటో ఆయన సమీక్షించుకోవద్దా? బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్లో ఉంచటం రాజ్యాంగ ఉల్లంఘనేనని గతంలో సుప్రీంకోర్టు చెప్ప లేదా? కేరళ గవర్నర్ రాజేంద్ర తీరు సైతం అలాగే ఉంది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ప్రసంగపాఠంలో తనకు నచ్చని భాగాలు వదిలేయటం ఆశ్చర్యకరం. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వానిదే పైచేయి కావాలి. అది రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడి, ప్రజల భద్రతకు ముప్పుగా మారితే వేరే విషయం. అలాంటపుడు కేంద్రానికి నివేదిక పంపి చర్య తీసుకోవాలని కోరవచ్చు. కానీ తమకు నచ్చని పార్టీ ఏలుబడి ఉన్నచోట చీటికీ మాటికీ రచ్చ ఏం సబబు? ఇటువంటి కీచులాటల్లో గవర్నర్దా... రాష్ట్ర ప్రభుత్వానిదా, ఎవరిది పైచేయి అని జనం చూడరు. మొత్తంగా వ్యవస్థ పట్లే అపనమ్మకం పెంచుకుంటారు. అందుకే హద్దులు గుర్తెరిగి ప్రవర్తించాలనీ, జవాబుదారీతనంతో వ్యవహరించాలనీ గవర్నర్లు తెలుసుకోవాలి. -
డీజీసీఏ మెతకవైఖరి
విమానయాన సంస్థ ఇండిగో లోటుపాట్లన్నిటినీ సరిదిద్దుకోవటంతో దాని నిర్వహణ మెరుగై, సాధారణ స్థాయికి చేరుకుందని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) విభాగం మంగళవారం తెలిపింది. మంచిదే! అత్యధిక శాతం మంది ప్రయాణికులు ఆధారపడే సంస్థ సవ్యంగా ఉండటం సంతోషించదగ్గదే. కానీ సమస్యకు మూలకారణం వెతకటంలోనూ, తగిన పెనాల్టీ విధించటంలోనూ డీజీసీఏ ఇంకా మెతకవైఖరే అవలంబిస్తోందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. గత నెలలో ఇండిగో సృష్టించిన సంక్షోభంతో పోలిస్తే దానికి విధించిన పెనాల్టీ రూ. 22.2 కోట్లు ఏపాటి? ఆ సంక్షోభం అనుకోకుండా సంభవించిందేమీ కాదు. డీజీసీఏ నియంత్రణలు నచ్చక, వాటిని అనుస రించటం ససేమిరా ఇష్టంలేక ఉద్దేశపూర్వకంగా సృష్టించిన పెను తుపాను అది. దాని ప్రభావం వల్ల దాదాపు వారంరోజుల పాటు విమానయాన సర్వీసులకు తీవ్ర అంత రాయం ఏర్పడింది. దాదాపు 3,000 సర్వీసులు రద్దయి, కొన్ని సర్వీసుల్లో జాప్యం ఏర్పడి లక్షలాదిమంది ప్రయాణికులు ఎన్నో అగచాట్లు ఎదుర్కొనవలసి వచ్చింది. పరీక్షలకూ, ఇంటర్వ్యూలకూ హాజరు కావలసిన వారు మొదలుకొని కోట్లాది రూపాయల విలువైన ఒప్పందాలు కుదుర్చుకునే వారి వరకూ ఈ సంక్షోభం వల్ల నష్టపోయారు. మనోవేదన అనుభవించారు. ప్రాణాపాయంలో ఉన్న ఆప్తుల చివరిచూపు దక్కనివారూ, వైద్యచికిత్స కోసం బయల్దేరినవారూ రోదించారు. ప్రత్యామ్నాయాలు వెదుక్కుందామనుకున్నా లగేజి గల్లంతై అల్లాడిపోయారు. ఇంతమంది ఇన్నివిధాల నష్టపోగా అందుకు తగిన మూల్యం చెల్లించవద్దా? వేరే దేశాల్లో ఇదే జరిగితే ఏమయ్యేది?ఇండిగో సంక్షోభం వచ్చిపడ్డాక డీజీసీఏ మేల్కొంది. డిసెంబర్ మొదటివారం నుంచి నెలాఖరు వరకూ ఆ సంస్థ రోజువారీ నిర్వహణపై నివేదికలు తెప్పించుకుంది. విమా నాలు రద్దయినా, ఆలస్యమైనా అందులో పేర్కొనాలని, సిబ్బంది వివరాలివ్వాలని,ఎందరు సెలవులో ఉన్నారో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమిటో కూడా చెప్పాలని కోరింది. సర్వీసుల నిర్వహణ తీరును, సామర్థ్యాన్ని మదింపు వేశారు. ఈ క్రమంలో డీజీసీఏ కూడా తన లోపాలు సవరించుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రెండేళ్ల క్రితమే ఏర్పరిచిన నిబంధనలను విమానయాన సంస్థలు బేఖాతరు చేస్తున్నా ఆ సంస్థ సరిగా పట్టించుకోలేదు. అందునా ఇండిగోను చూసీచూడనట్టు వదిలేశారు.ఆ నిబంధనలు నిజానికి భద్రతను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి. లాభార్జన కోసం తక్కువమందితో అధికపని చేయించటం ప్రమాదకరమన్న ఉద్దేశంతో నిర్దేశించిన ప్రమాణాలవి. వారంలో పైలెట్లకు ఉండే విశ్రాంతిని 36 గంటల నుంచి 48 గంటలు చేయటం, రాత్రి పనివేళల్ని గరిష్ఠంగా 10 గంటలకు పరిమితం చేయటం, ఒక పైలెట్ వారానికి రెండుసార్లు మించి నైట్ ల్యాండింగ్ చేయకూడదని నిబంధన విధించటం వంటివి అందులో ఉన్నాయి. వీటిని అమలు చేయాల్సిందేనని చెబుతున్నా ఇండిగో మొండికేసింది. ‘మాపై ఒత్తిడి తెస్తే చివరికి జరిగేది ఇదే’ అని తెలియజెప్పేందుకే అడ్డగోలుగా సర్వీసుల రద్దు మొదలెట్టిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మొదట్లోనే సరైన పర్యవేక్షణతో, సమస్యాత్మకంగా ఉండేవారిపై చర్యలు తీసుకుంటే కథ వేరుగా ఉండేది. డీజీసీఏలో ఇది లేకపోబట్టి ఇండిగో ఇలా చేయగలిగింది. ఇంత సంక్షోభాన్ని సృష్టించిన సంస్థ నిర్వాహకులకు గుణపాఠం చెప్పే రీతిలో చర్యలుంటే మరే సంస్థా ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయటానికి సాహసించేది కాదు. ఇండిగో భారత్లో నిర్వహించే కార్యకలాపాల వల్ల వచ్చే ఆదాయం తక్కువేం కాదు. 2024–25లో ఇండిగో సంస్థ లాభార్జన రూ. 7,253 కోట్లు. ఆ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఇన్ని లక్షలమంది నష్టాలు, కష్టాలకు లోనయినప్పుడు కఠినమైన చర్యలుండొద్దా? నష్టపోయిన వారికి మెరుగైన పరిహారం చెల్లించేలా చూడొద్దా? డీజీసీఏలో కింది స్థాయిలో ఇండిగో వంటి సంస్థలతో లాలూచీ పడినవారు ఉంటే ఉండొచ్చు. అలాంటి వారిపైనే కావొచ్చు... ఆ సంస్థ చర్యలు కూడా తీసుకుంది. కానీ పై స్థాయిలో కూడా మెతకవైఖరే ఉన్నదని ఆ సంస్థ తాజా వైఖరి చూస్తే అర్థమవుతోంది. ‘నియంత్రణకు సంబంధించి తగిన సంసిద్ధత లేనందు వల్లే’ సంక్షోభం తలెత్తిందని డీజీసీఏ నిర్ధారణ చేయటం దేన్ని సూచిస్తోంది? ఇలాంటి ధోరణి మంచిది కాదు. -
ట్రంప్ ప్రమాదకర పోకడ
వారానికో, పదిరోజులకో తన విధ్వంసక ప్రకటనలతో ప్రపంచాన్ని హడలెత్తించటం అలవాటు చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు దాన్ని నిత్యకృత్యంగా మార్చుకున్నట్టు కనబడుతోంది. డెన్మార్క్లో భాగమైన కీలకదీవి గ్రీన్ల్యాండ్ దురాక్రమణకు సమాయత్తమవుతూ, అందుకు అభ్యంతరం చెప్పిన యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలపై వచ్చే నెల 1 నుంచి పదిశాతం సుంకాలు విధిస్తానని బెదిరించి కయ్యానికి కాలుదువ్వారు. మరోపక్క గాజా పునర్నిర్మాణం కోసమంటూ తన ఆధ్వర్యంలో ‘శాంతిమండలి’ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఆ మండలిలో ‘ఖరీదైన’ సభ్యత్వాన్ని ఇస్తానని భారత్తో సహా 60 ప్రపంచ దేశాలకు వర్తమానం పంపారు. ఎనిమిది దశాబ్దాల క్రితం హిట్లర్ రూపంలో తలెత్తి ప్రపంచాన్ని చాప చుట్టేయాలని చూసిన నియంతను వదుల్చుకోవటానికి ఎంత మారణహోమం చవి చూడాల్సి వచ్చిందో, ఎన్ని కోట్లమంది బలిదానాలు చేయాల్సి వచ్చిందో తెలిసి కూడా ఏడాదిగా బుజ్జగింపు ధోరణితో పొద్దుపుచ్చిన దేశాలకూ, ఐక్యరాజ్యసమితికీ తాజా పరిణామాలు ఒక పెద్ద షాక్. తాను ఆశించినట్టు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు గనుక ఇక శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం ట్రంప్కు లేదట. అమెరికాకు ఏది ప్రయోజనకరమో అదే చేస్తారట!గాజాపై ఏర్పాటు చేయదల్చుకున్న శాంతి బోర్డుకు తలాతోకా లేదు. అది గాజాకే పరిమితమై ఉండదట. భవిష్యత్తులో వేరే దేశాల వివాదాల్లో తలదూరుస్తుందట! బోర్డుకు ట్రంప్ జీవితకాల అధ్యక్షుడు. అందులో ‘రా రమ్మ’ని పిలిచిన దేశానికి మూడేళ్లపాటు సభ్యత్వం ఇస్తారు. శాశ్వత సభ్యత్వానికైతే వందకోట్ల డాలర్లు చెల్లించాలి. గాజాలో అంతంతమాత్రంగా అందుతున్న సాయాన్ని కూడా ఆపటానికీ, అక్కడ ఉంటున్నవారి కడుపుమాడ్చి వెళ్లగొట్టడానికీ, నరమేధం ఆనవాళ్లు చెరిపేయటానికీ తోడ్పడటమే ఈ బోర్డు ఏర్పాటు ఆంతర్యం. నిజానికి ఈ బోర్డు ఆలోచన భద్రతామండలిది. 2027 చివరి వరకూ ఈ బోర్డు గాజా ఘర్షణలపై దృష్టి సారిస్తుందని ద్రతామండలి మొన్న నవంబర్లో ప్రకటించింది. గాజాలో రెండేళ్లపాటు మారణహోమం సాగించిన ఇజ్రాయెల్నూ, దానికి ప్రత్యక్షంగా సహకరించిన అమెరికానూ పల్లెత్తు మాట అనని మండలి... దొంగ చేతికి తాళం చెవులు అప్పగించినట్టు గాజాను ఉద్ధరించటానికి పూనుకోవాలని అగ్ర రాజ్యాలను కోరుతూ తీర్మానించింది. ఇంతకూ ట్రంప్ బోర్డూ, ఐక్యరాజ్యసమితి బోర్డూ వేర్వేరా... ఒకటేనా అనేది ఎవరికీ తెలియదు. దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేకపోవటం వల్ల కావొచ్చు... సమితి కూడా అస్పష్టంగా మాట్లాడుతోంది. ‘సభ్యదేశాలు ఎవరికి నచ్చిన గ్రూప్లో వారు చేరొచ్చ’ని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ చేతులు దులుపుకొన్నారు. అమెరికా అధ్యక్ష పదవే ఇంకో మూడేళ్ల ముచ్చట కాగా,శాంతి బోర్డుకు యావజ్జీవ అధ్యక్షుడెలా కాగలరో అనూహ్యం. ఒక దేశంగా ఇందులో అమెరికా ప్రమేయం కూడా ఉండదా? ఇది ట్రంప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? ఏమైనా కావొచ్చు. అమెరికా సుంకాలతో బెదిరించినా... ఏ సార్వభౌమాధికార దేశమైనా ఇందులో భాగస్వామ్యానికి అంగీకరించగలదా? బలహీనంగా కనబడే దేశాలను కించపరచటం, పాదాక్రాంతం చేసుకునేందుకు ప్రయత్నించడం ట్రంప్ నైజం. అమెరికా స్వప్రయోజనాల కోసం నాటో తీసుకొస్తే, భద్రతకు పూచీపడుతుందని నమ్మి అందులో చేరిన ఈ దేశాలు ఇప్పుడు అమెరికాయే దండ యాత్రకు పూనుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. డెన్మార్క్లో స్వయంప్రతిపత్తి గల గ్రీన్ల్యాండ్ పేరుకు ప్రపంచంలోనే పెద్ద దీవి. జనాభా 60,000 మించదు. వివాదం ఎందుకని అప్పగిస్తే అమెరికా హిరణ్యాక్షుడు శాంతిస్తాడన్న నమ్మకం లేదు. అలాంటి హిరణ్యాక్షులు ఇంకా ఇద్దరున్నారు. చైనా తైవాన్నూ, రష్యా ఉక్రెయిన్నూ కబళించే యత్నం చేస్తాయి. ఇలా కండబలంతో ఎవరికి వారు చెలరేగితే ఈ ప్రపంచం మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కనుక ఇన్నాళ్ల బుజ్జగింపులకూ స్వస్తిచెప్పి యూరప్ దేశాలు ఇకనైనా దృఢంగా నిలబడాలి. 75 ఏళ్ల చరిత్రలో ఎందుకూ కొరగాని ‘నాటో’ ఉన్నా ఊడినా ఒకటేనన్న తెలివి తెచ్చుకుని, ప్రతీకార సుంకాలతో జవాబీయాలి. గాజా శాంతిబోర్డు పైనా ఛీత్కారాలు వెల్లువెత్తాలి. అప్పుడు మాత్రమే ట్రంప్ దారికొస్తారు. -
కరుణ ముఖ్యం
ఒక రైతు పెంచుకుంటున్న కుక్క ఆ రోజు కనపడలేదు. ఇంటికి రాలేదు. రైతు వెతకబోయే వేళకు చీకటి పడిపోయింది. రైతు విలవిలలాడిపోయాడు. రైతుకూ కుక్కకూ ఉన్న అనుబంధం గ్రామస్థులకు తెలుసు. రాత్రంతా జాగారం చేస్తున్న రైతు బాధ గమనించి తెల్లవారుతూనే రైతుకు సాయంగా కుక్కను వెతక బయలుదేరారు. వెళ్లగా వెళ్లగా వంతెన కింద మట్టిలో కుక్క పడుకుని కనిపించింది. వంతెన మీద నుంచి గ్రామస్థులు ఎంత పిలిచినా అది లేచి రాలేదు. ఏమై ఉంటుందా అని గ్రామస్థులు వంతెన దిగి కుక్క దగ్గరకు వెళితే అక్కడ కుక్క కుక్కలా లేదు. వెచ్చటి రగ్గులా ఉంది. ఎవరిదో తెలియని కుక్కపిల్ల చలికి వణుకుతూంటే దాని ఒళ్లు వెచ్చబెట్టేందుకు రాత్రంతా ఇంటికి రాకుండా కరుణతో కాపాడుతూ ఉంది. గ్రామస్థులు ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డారు. దీనికి ఉన్న కరుణ మనిషికి ఎందుకు లేదు?దేశంలో ఈ గడ్డకట్టే చలిగాలుల్లో, నెత్తి మీద కాసింత నీడ లేక, ఉత్తబిత్తల ఆకాశం కింద, తోచిన గుడ్డ కప్పుకుని వేలాదిమంది అభాగ్యులు రాత్రుళ్లు దయనీయంగా పడు కుని ఉన్న దృశ్యాలు మీడియాలో వస్తున్న వేళ – ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో నోబెల్ శాంతి విజేత ‘లైమా గ్బవీ’ తమ ఆఫ్రికా దేశపు కథను చెప్పడం కేవలం యాదృచ్ఛికం. ఆమె చెప్పిన కథకు కొనసాగింపుగా మరో నోబెల్ శాంతి విజేత కైలాశ్ సత్యార్థి తన జీవితంలో ఎదురైన ఘటనను చెప్పుకొచ్చారు – చాలా ఏళ్ల కిందటి మాట. ఒక తండ్రి నా తలుపు తట్టాడు. అయ్యా... నా కూతురిని రక్షించు అన్నాడు. అప్పుడు చిన్న పత్రికను నడుపుతున్నాను. ఉత్తరప్రదేశ్ నుంచి పంజాబ్కు 30 కుటుంబాలు పనికి వెళితే వారిని కట్టు బానిసలుగా చేశారనీ, మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారనీ, తన కూతురు వయసుకు రావడం చూసి అమ్మేయబోతున్నారనీ, పోలీసులు సాయానికి రాకపోవడం వల్ల పత్రికలో రాస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందని వచ్చాననీ ఆ తండ్రి నాతో ఏడుస్తూ చెప్పాడు. పత్రికలో ఆ విషయం రాయడానికి కూచుని వెంటనే పెన్సిల్ పక్కన పడేశాను. అక్కడ ఉన్నది నా కూతురో, చెల్లెలో అయితే ఇలా వ్యాసం రాస్తూ కూచుంటానా? అనుకున్నాను. ఆ తర్వాత నా తల పగిలి ఉండొచ్చు. వెన్నుపూసను విరిచినంత పని చేసి ఉండొచ్చు. నా కాలిని విరగ్గొట్టి ఉండొచ్చు. కాని ఇప్పటికి లక్షా ముప్పై వేల మంది అలాంటి పిల్లలను కాపాడాను. వారి ఆనంద బాష్పాలలో నేను దేవుణ్ణి చూశాను. కరుణే నాకు ఇంత శక్తి ఇచ్చిందని అనుకుంటున్నాను.‘మనిషి మంచివాడే. నాగరికత వల్ల చెడిపోయాడు’ అన్నాడు రూసో. నాగరికత అంటే గాలి కూడా పీల్చడానికి వీల్లేనంతగా అభివృద్ధి చెందడం కాబోలు! మరి చెడి పోవడం అంటే? కరుణ అడుగంటిన వాడు అవడమే! కరుణ లేకపోతే ఏమవుతుంది? పీడన, పెత్తనం, చెడు, దుర్మార్గం, నిస్సహాయత, హింస, దౌర్జన్యం... కళ్ల ముందు కని పిస్తున్నా చలించని జడత్వం వస్తుంది. జడత్వం రాయి. కరుణ జల. తల్లిదండ్రులకు తమ పిల్లల ఐ.క్యూ (ఇంటెలిజెన్స్ కోషియెంట్) బాగుండాలని ఉంటుంది. కాని పిల్లల్లో చూడాల్సింది, పాదుకొనేలా చేయాల్సింది సి.క్యూ. అంటే ‘కంప్యాషన్ కోషియెంట్’. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత సంతోషపడాలి. చీకట్లో నల్లపూస దొరకగలదేమోగానీ నేటి మనిషిలో కరుణ దొరకడం దుర్లభం అవుతోంది.అందుకే మనిషికి ఇంకో మనిషి, వర్గం, ప్రాంతం, కులం, మతం... అన్నింటి పట్లా విరోధభావం, శత్రుత్వం. తుదకు పశుజాలం పట్ల కూడా మనిషి కరుణ చూపడం లేదు. మనిషికి కరుణ ఉంటే నదులు, పర్వతాలు, అడవులు ఇలా ఉండేవా? అన్నారు కైలాశ్ సత్యార్థి. అందుకే మనిషిలో ‘సి.క్యూ’ కొలవగలిగే యాప్ను కనిపెట్టాలి. అది ఎక్కువ కలిగిన వారినే వివాహానికి, ఉద్యోగానికి, రాజకీయ పదవులకి ఎన్నుకోవాలి. స్కిల్స్ పెంచుకోవడానికి శిక్షణ ఇచ్చినట్టే కరుణ పెంచుకోవడానికి శిక్షణ ఇవ్వాలి అన్నారు సత్యార్థి.జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన తాజా పుస్తకం ‘కరుణ: ది పవర్ ఆఫ్ కంప్యాషన్’ ఆవిష్కరణ వేడుకలో ఇంటిని, కుటుంబాన్ని, సరిహద్దులను దాటి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చేరగల కరుణ అవసరం గురించి ఇలాంటి మాటలెన్నో సాగాయి. ‘త్రుంచ బోకుము... తల్లికి బిడ్డకు వేరు చేతువే’ అని విలపించిన కరుణశ్రీ నడిచిన తెలుగు నేలకు కరుణ తెలియదా ఏమి? కాకుంటే కాస్త మరుగున పడి ఉంటుంది, మరుపున అణిగి ఉంటుంది అంతే! -
విద్యాహక్కుకు చికిత్స!
జన సంక్షేమ చట్టాల్ని నీరుగార్చటంలో మనకెవరూ సాటిరారని పదహారేళ్ల నాడు సాకార మైన విద్యాహక్కు చట్టం నిరూపించింది. 6–14 మధ్యవయసు పిల్లలకు ప్రాథమిక విద్య తప్పనిసరి చేసే ఆ చట్టాన్ని అమలుచేసే రాజ్యాంగ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేయాల్సి వచ్చింది. ఇతర ప్రాథ మిక హక్కులకూ, 21ఏ అధికరణం కింద వచ్చి చేరిన విద్యాహక్కుకూ మౌలికంగా వ్యత్యాసం ఉంది. ఇతర హక్కులన్నీ పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకూ, జీవించే హక్కుకూ ముడిపడినవైతే, ఇదొక్కటీ ప్రాథమిక విద్యను పిల్లల హక్కుగా పేర్కొంటు న్నది.విద్యాహక్కు చట్టం, 2009 ప్రకారం అణగారిన వర్గాల కుటుంబాల పిల్లలు తమ పొరుగునున్న గుర్తింపు పొందిన ఏ పాఠశాలలోనైనా ఉచితంగా విద్య పొందవచ్చు. అలాంటి వారి కోసం ప్రతి విద్యాసంస్థా 25 శాతం సీట్లు అందుబాటులో ఉంచాలి. ఆ వర్గాల పిల్లలు దరఖాస్తు చేస్తే, ఫీజులు చెల్లించరన్న సాకుతో ప్రవేశం నిరాకరించకూడదు. వారి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాలి. చూడటానికీ, వినటానికీ ఎంత బాగుంది! కానీ సంకల్పమే కొరవడింది.దీని అమలు 2010 ఏప్రిల్ 1న మొదలైనప్పుడు కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అందరూ వేనోళ్ల కొనియాడారు. అప్పటికే ప్రాథమిక విద్యను హక్కుగా చేసిన 137 దేశాల సరసన మనం కూడా చేరామని సంబరపడ్డారు. ఏడాది తిరిగేసరికే దాని వాలకం తెలిసి పోయింది. విద్యారంగ నిపుణులు ఎప్పటికప్పుడు ఈ విషయంలో హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలకు పట్టలేదు. ‘ఎవరికి పుట్టిన బిడ్డో...’ అన్నట్టు అనాథగా మారిన ఆ చట్టంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సమాజ పురోగతిలో విద్యాసంస్థలు బలమైన ఉపకరణాలు.అందుకే అణగారిన వర్గాలకు మాత్రమే కాదు... కుల,మత, ఆర్థిక స్థోమతలతో సంబంధం లేకుండా పీజీ వరకైనా అందరూ ఉచితంగా చదువుకునే అవకాశం ఉండాలి. పాశ్చాత్య దేశాల్లో పీహెచ్డీ స్థాయిలో సైతం అందరికీ ఉచితంగా ప్రవేశాలిస్తున్నారు. అందువల్లే అక్కడ ప్రపంచాన్ని శాసించే సంస్థలు ఆవిర్భ విస్తున్నాయి. సృజనాత్మకతలు వెల్లివిరుస్తున్నాయి. విద్యపై చేసే వ్యయాన్ని ఖర్చుగా కాక, అది భవిష్యత్ సమాజ నిర్మాణానికి పెట్టే పెట్టుబడిగా పరిగణించాలి. అదంతా దురాశ అవుతుందేమోగానీ... కనీసం ఒకటి నుంచి ఎనిమిదో తరగతిలోపు అట్టడుగు వర్గాల పిల్లలకు కూడా ఉచిత విద్య అందించలేక పోవటం తలదించుకోవా ల్సిన విషయం కాదా? అమలు చేతగానప్పుడు ఘనంగా కనబడేలా చట్టం చేయటం ఎందుకు? దాన్ని ప్రాథమిక హక్కు చేశామన్న చాటింపు దేనికి? మహారాష్ట్రకు చెందిన ఒక పౌరుడు తన పిల్లలకు దగ్గర్లోని ప్రైవేటు విద్యాసంస్థ ప్రవేశం కల్పించటం లేదని, ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకుందని సుప్రీంకోర్టు తలుపుతట్టడంతో ఈ సమస్య చర్చకొచ్చింది.ఇది ఆయనొక్కరి సమస్య మాత్రమే కాదు... దేశంలోని పలువురు తల్లిదండ్రులది కూడా! గత్యంతరంలేని స్థితిలో చేర్చుకున్నా అలాంటి పిల్లల్ని ‘వెలి’ వేసి, విడిగా చదువు చెబుతున్న ఘనులు కూడా ఉన్నారు. ఇందుకు కారణం కార్పొరేట్ విద్యా మాఫియాల పలుకుబడి ప్రభుత్వాల్లో పెరగటమా లేక పిల్లల తరఫున ప్రభుత్వాలు చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టడమా? ఈ రెండూ కారణాలైనా ఆశ్చర్యం లేదు. లాభార్జనపై పెద్దగా దృష్టిపెట్టకుండా తక్కువ ఫీజులతో విద్యాసంస్థలు నడిపే వారే ప్రభుత్వాలకు జడిసి అంతో ఇంతో ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. లేకుంటే తమ సంస్థ గుర్తింపు ఏదో సాకుతో రద్దుచేస్తారన్న భయం వారిని నిరంతరం వెంటాడు తుంటుంది.ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ చట్టం అమలుకు రూపొందించిన మార్గదర్శకాలు ప్రశంసించదగ్గవి. అన్ని స్థాయుల అధికారుల ప్రమేయాన్ని పెంచి, లోటుపాట్లు కనబడిన మరుక్షణం వాటిని నివారించగలిగే వ్యవస్థను ధర్మాసనం సూచించింది. అందుకు అనుగుణంగా నియమ నిబంధనలు రూపొందించి సక్రమంగా అమలు చేయటం ప్రభు త్వాల బాధ్యత. పైచదువుల్లో ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలు ఆచరణలో అటకెక్కిస్తున్న ప్రభుత్వాలు... చిన్నపిల్లలైనా సక్రమంగా చదివేలా చూడలేకపోతున్నాయంటే క్షమార్హం కాదు. -
ముంబైని గెలిచేదెవరు?
దాదాపు దశాబ్ద కాలం తర్వాత బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి గురువారం ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు కోట్లమంది జనాభాతో, కోటి మూడు లక్షలమంది ఓటర్లతో ఉండే ఆ మహానగరం మొగ్గు ఎటువైపుందోనన్న ఉత్కంఠ సామాన్యుల్లో మాత్రమే కాదు... రాజకీయపక్షాల్లో సైతం నెలకొనివుంది. ఇన్నాళ్లూ కరోనా మహమ్మారి, ఓబీసీ కోటాపై నడిచిన కోర్టు కేసులు ఎన్నికలకు ఆటంకంగా నిలిచాయి. దేశంలోనే అత్యంత సంపన్నవంతమైన కార్పొరేషన్గా, దాదాపు రూ. 60,000 కోట్ల బడ్జెట్తో ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాలను ముంబై మించిపోయింది. అధికార మహాయుతి కూటమిలో ఉంటూ కీచులాడుకుంటున్న పార్టీలను ఏకం చేయటంతోపాటు, రెండు దశాబ్దాల నుంచి దూరదూరంగా ఉంటున్న దాయాదులు ఠాక్రే సోదరుల్ని సైతం కలిపిన ఘనత ఈ ఎన్నికలదే. ఇంతవరకూ తనతో కలిసి నడిచిన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు దూరం జరగటంతో గత్యంతరం లేని కాంగ్రెస్ ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ)తో పొత్తు పెట్టుకుంది. 1998 నాటి లోక్సభ ఎన్నికల్లో తమ రెండు పార్టీలూ మహారాష్ట్రలో మెజారిటీ స్థానాలు గెల్చుకున్నాయని గుర్తుచేస్తోంది. బీఎంసీ అనగానే కాంట్రాక్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మహానగర పాలనాధికారం వగైరాలుంటాయి గనుక ఈ ఎన్నికల్లో విజేతగా ఆవిర్భవించే పార్టీ అదుపులో పుష్కలంగా నిధులు, దండిగా రాజకీయ పలుకుబడి, అస్మదీయులకు పంచి పెట్టేందుకు రకరకాల ప్రాజెక్టులు సిద్ధంగా ఉంటాయి. రాష్ట్రాన్నేలుతున్న బీజేపీ–షిండే శివసేన–అజిత్ పవార్ ఎన్సీపీలతో కూడిన మహాయుతి ఇప్పటికే బీఎంసీ తమ చేతి కొచ్చినంత ఆత్మవిశ్వాసంతో ఉంది. తమ రాజ్యాధికార శక్తి, సంస్థాగత నిర్మాణం అందుకు తోడ్పడగలవని భావిస్తున్నాయి. శివసేన పేరునూ, గుర్తునూ ఏక్నాథ్ షిండే కైంకర్యం చేయగా బలహీనపడిన ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన(యూబీటీ) గత్యంతరం లేక ఇరవయ్యేళ్ల క్రితం వేరుపడిన దాయాది రాజ్ ఠాక్రేకు సన్నిహితమై ఆయన పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)తో పొత్తు పెట్టుకుంది. ఎప్పటిలా ముంబైలో యూపీ, గుజరాత్, బిహార్ల నుంచి వలసొచ్చేవారితో మరాఠీలకు అన్యాయం జరుగుతున్నదంటూ ఆ సోదర ద్వయం నిప్పులు చెరుగుతోంది. త్రిభాషా సూత్రాన్ని మహాయుతి సర్కార్ ఆ మధ్య అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం మరాఠీ ప్రజల్ని దెబ్బతీయటానికేనన్నది వారి అభియోగం. అయితే బీఎంసీ పరిధిలో మరాఠీ మాట్లాడే వారు 30 శాతం మించరు. 1960ల్లో శివసేన ఎదుగుదలకు తోడ్పడిన ప్రాంతీయత, అస్తిత్వవాదం ఇప్పుడేమాత్రం పనికొస్తాయన్నది పెద్ద ప్రశ్న. అందుకే కావొచ్చు... ఇళ్లల్లో పనిచేసే మహిళలకు నెలకు రూ. 1,500; 700 చదరపు అడుగుల వరకూ ఉండే ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు వగైరా హామీలిస్తున్నారు.ముంబైకి పెట్టుబడుల వరద పారించామంటూ ఎన్నికల ప్రచారం మొదలెట్టిన బీజేపీ ప్రత్యర్థుల దూకుడు చూసి పంథా మార్చుకుంది. నగరంలో ‘బెస్ట్’ బస్సుల్లో మహిళలకు 50 శాతం రాయితీ, వచ్చే అయిదేళ్లూ మున్సిపల్ చార్జీల పెంపుపై మారటోరియం, నిరుపేదలకు ఇళ్లు వగైరాలు మాట్లాడుతోంది. ఆ పార్టీ వలసొచ్చినవారి ప్రయోజనాలకే పాటుబడుతున్నదన్న అనుమానాలున్నా, మరాఠీ మధ్యతరగతి వర్గానికి దగ్గరయ్యామని బీజేపీ భావిస్తోంది. ఆ సంగతలా ఉంచి ఈ ఎన్నికల్లో కూడా ఉచితాలు వినబడటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రభుత్వాలతో పోలిస్తే రుణ సేకరణకు పరిమితులుండే కార్పొరేషన్లలో ఇలాంటి రాయితీలు, వాగ్దానాలు ఆచరణ సాధ్యమేనా అని చూడటం లేదు. దేశంలో అన్ని కార్పొరేషన్ల మాదిరే బీఎంసీకి... ఆమాటకొస్తే దాంతోపాటే ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్రలోని మరో 28 కార్పొరేషన్లకూ ఎన్నో సమస్యలున్నాయి. ఉపాధి లేమి, ప్రాథమిక సదుపాయాల లేమి, అస్తవ్యస్త రహదారులు వగైరాలు అందులో కొన్ని. అయితే భావోద్వేగాలూ... లేకుంటే తాయిలాలూ తప్ప ఏ పార్టీ దగ్గరా భవిష్యత్తుకు పనికొచ్చే పథకాలున్నట్టు కనబడదు. దేశ ఆర్థిక రాజధానిగా ఉంటున్న ముంబై ఎటు మొగ్గినా దానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని ఎన్నికల ప్రచారం తంతు చూస్తే అనిపిస్తుంది. -
వీధికుక్కల బెడద తీరేదెలా?
మనిషికి ఎప్పుడు మచ్చికైనాయో, ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేం గానీ మహాభారత కాలం నుంచి శునకాల ప్రస్తావన ఉంది. ఆ కథాప్రారంభంలోనూ, ముగింపులోనూ అవి తారసపడతాయి. వీధి కుక్కల్ని అక్కున చేర్చుకుని, వాటికి ఆహారపానీయాలు అందించే వారూ, కుక్కల జోలికి ఎవరైనా పోతే ఆగ్రహించి కేసు పెట్టే జంతుప్రేమికులూ ఎప్పుడూ ఉన్నారు. కానీ ఈమధ్య అలాంటివారు ఏటికి ఎదురీదాల్సి వస్తోంది. గతంలో మాదిరి సానుభూతితో అర్థం చేసుకునేవారూ, ఆ సమస్యపై మౌనంగా ఉండిపోయేవారూ తగ్గారు. జంతు ప్రేమికుల్ని ఇరకాటంలో పెట్టేలా, వారిని సవాలు చేసేలా నిలదీస్తున్న వారి స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో వీధికుక్కల బెడదపై సాగుతున్న విచారణలో త్రిసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు సంధించిన ప్రశ్నలు ఆలోచించదగినవి. వీధికుక్కలపై ప్రేమతో వాటికి ఆహారం పెట్టే వారు తమ ఇళ్లకు తీసుకుపోయి ఆ పని ఎందుకు చేయరని ధర్మాసనం ప్రశ్నించింది. కేవలం కుక్కలపైనే అంతగా భావోద్వేగాలు ఎందుకుంటాయని అడిగింది. వీధికుక్కలు హఠాత్తుగా దాడి చేస్తే ఆ బాధ్యత ఎవరిదని నిలదీసింది.మనిషి పోయినచోటికల్లా, వారి ఆవాసాలున్న చోటల్లా సహజంగానే కుక్కలు వచ్చి చేరుతాయి. పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా వీధి కుక్కల బెడద ఉండదు. వెనకబడిన దేశాల్లో మాత్రమే అవి మనుషులతో సహజీవనం సాగిస్తుంటాయి. కుక్కల జనాభా ఎంతో, అవి తామరతంపరగా పెరిగితే తలెత్తే సమస్యలేమిటో ప్రభుత్వాలు ఎప్పుడూ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. 2023లో తొలిసారి యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనలు రూపొందాయి. వాటి అమలు బాధ్యత పురపాలక సంస్థలూ, పంచాయతీలదే! కానీ ఎక్కడా పట్టించుకోరు. అదేమని అడిగేవారూ లేరు. ఒక పసికందునో, రోడ్డున పోయే మరొకరినో దాడి చేసి కరిచినప్పుడూ... ప్రాణాలు కోల్పోయే స్థితి ఏర్పడినప్పుడూ మాత్రమే మీడియాలో ప్రముఖంగా వస్తుంది. ఆ వెంటనే ఒకటి రెండు రోజులు కుక్కల్ని బంధించే స్థానిక సంస్థల సిబ్బంది కనబడతారు. మళ్లీ మరొకటి జరిగేవరకూ అది మరుగునపడుతుంది.మనుషుల పట్ల కుక్కల ప్రవర్తనే వాటి విషయంలో ఏమేం చర్యలు తీసుకోవాలో చర్చించే సందర్భం కావటమే అసలు సమస్య. మహానగరాలు మొదలుకొని మారుమూల పల్లెటూళ్ల వరకూ అన్నిచోట్లా కుక్కలున్నప్పుడు వాటిపై ఒక విధానం అవసరమని, నియంత్రణలో పెట్టడం మంచిదని పాలకులకు తోచదు. మీడియాలో అతి ప్రచారం వల్లే ఈ సమస్య జటిలంగా కనిపిస్తున్నదని ఒక న్యాయవాది చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు...’అని జర్నలిజంలో నానుడి ఉంది. అందుకైనా కాకపోయినా రేబిస్ మరణాల వల్లనో, కుక్కల కారణంగా ద్విచక్రవాహనదారుడు మరణించినప్పుడో, ఒక పసికందును నోట కరుచుకు పోయినప్పుడో మీడియాకు వార్తలవుతాయి. మామూలు కుక్కకాట్లు వార్తలకెక్కవు. దాదాపు పదిహేనేళ్ల క్రితం ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక మన వీధికుక్కల ప్రతాపంపై పెద్ద కథనం ప్రచురించింది. ఏటా లక్షలాదిమందిని అవి కరుస్తుంటాయని, వాటివల్ల ప్రతియేటా 20,000 మరణాలు సంభవిస్తాయని దాని సారాంశం. ‘పశ్చాత్తాపం ఏ కోశానా లేని ఈ శునకరూప హంతకులతో సహజీవనం ఎలా?’ అని వాపోయింది. రేబిస్ వ్యాధిగ్రస్థుల సంఖ్య ఆధారంగా వీధి కుక్కల గణాంకాలు కష్టమే. ఎందుకంటే ఇందులో పెంపుడు కుక్కల వల్ల వ్యాధిబారిన పడినవారూ ఉంటారు. ఏదేమైనా వీధి కుక్కల బెడద విషయంలో సుప్రీంకోర్టు ఉదాసీనంగా ఉండదల్చు కోలేదని ధర్మాసనం చేసిన వ్యాఖ్యల్నిబట్టి గ్రహించవచ్చు. వీధికుక్క కాటుకూ, అందువల్ల సంభవించే మరణానికీ మూల్యం చెల్లించక తప్పదని కేంద్రాన్నీ, రాష్ట్ర ప్రభుత్వాల్నీ ధర్మాసనం హెచ్చరించింది. వీధికుక్కలకు ఆహారం అందించేవారు సైతం వాటి దాడులకు బాధ్యులవుతారని తెలిపింది. సమస్య ఉన్న సంగతిని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ పరిష్కారమే సాధ్యపడటం లేదు. ఏబీసీ నిబంధనలు అమలైతే ఇబ్బందే ఉండదని జంతు ప్రేమికుల వాదన. కానీ వాటిని అమలు చేయాల్సిందెవరు? అందుకు మూల్యం చెల్లిస్తున్నదెవరు? ఆలోచించాలి. -
అష్టదిగ్బంధంలో ఇరాన్!
సమస్యలున్నచోట నిప్పురాజేయటం సులభం. నిన్న మొన్నటివరకూ అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులతో ఊపిరాడని ఇరాన్ ఇప్పుడు నిరసనలతో అట్టుడుకుతోంది. భవనాలు, బస్సులు, దుకాణాలు తగలబడుతున్నాయి. రాజధాని తెహ్రాన్ నగరం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. అదొక్కటే కాదు...దేశంలోని 31 ప్రావిన్సుల్లో ఉన్న 180 నగరాలు, పట్టణాలు ఇప్పుడు ఆగ్రహావేశాలతో రగులుతున్నాయి. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతూ, కరెన్సీ విలువ పడిపోతూ దుర్భర దారిద్య్రాన్ని ఎదుర్కొంటున్న జనం గత రెండువారాలుగా రోడ్లపై వెల్లువెత్తుతుండగా, ఇంతవరకూ సైన్యం, పోలీసులు జరిపిన కాల్పుల్లో 538 మంది మరణించారు. పదివేలమందిని జైళ్లలోపెట్టారు. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులాలో సాధించలేనిది ఇరాన్లో సునాయాసంగా చేయగలిగారు. వెనిజులాలో ఇదే మాదిరి ప్రేరేపించి, ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందన్న సాకుతో అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దించాలని ట్రంప్ ఏడాదిగా ప్రయత్నించారు. అది అసాధ్యం కావటంతో నేరుగా సైన్యాన్ని పంపి మదురో దంపతుల్ని అపహరించారు. ప్రస్తుతం ఇరాన్పై దాడులు చేయటానికి అమెరికా సంసిద్ధమవుతోంది.దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అమెరికా, పాశ్చాత్యదేశాలు పగబట్టి అమలు చేస్తున్న ఆర్థిక ఆంక్షలతో ఇరాన్ తీవ్రంగా దెబ్బతింది. నిత్యావసరాలు దొరక్క ప్రజలు సతమతమవుతున్నారు. ప్రాణావసర ఔషధాల కొరత వేధిస్తోంది. తగిన వైద్య సదుపా యాలు కరవై రోగాల బారిన పడిన చిన్నపిల్లలు కన్నుమూస్తున్నారు. ఇలాంటి పరిస్థి తుల్లో ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు పెల్లుబకటం, నిరసనలు వెల్లువెత్తడంలో ఆశ్చర్య మేమీ లేదు. ఇటీవల ఆందోళనకారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్లో విదేశీ మహిళగా భావిస్తున్న ఒకామె అరెస్టయినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి ప్రకటన లివ్వాలో చెప్పే వీడియో బయటికొచ్చింది. తమ వెనుక ఎవరూ లేరని... దుర్భర పరిస్థి తుల్ని తట్టుకోలేక నిరసనల్లో పాలుపంచుకుంటున్నట్టు చెప్పాలన్న హితబోధ ఉంది. ఇరాన్కు ఇలాంటి నిరసనలు కొత్తగాదు. 1979లో ఇరాన్ షా మహమ్మద్ రెజా పెహ్లవీని గద్దెదించిన ఇస్లామిక్ విప్లవం అనంతరం పాశ్చాత్య దేశాలు సమయం కోసం కాచుక్కూర్చున్నాయి. 2022లో మహిళల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం, ఉనికి కోసం అంటూ సాగిన ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచేయగలిగింది. ఇక అడపా దడపా ఏదో ఒక వంకతో ఇరాన్పై క్షిపణుల్ని ప్రయోగించటం, దేశ సైన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని, అణు శాస్త్రవేత్తలనూ హత్యలు చేయించటం ఇజ్రాయెల్కు రివాజు. ఇలా జరిగిన ప్రతిసారీ ద్రోహుల్ని పట్టుకున్నామని ప్రభుత్వం ప్రకటించి, బహిరంగంగా ఉరిశిక్షలు అమలు చేస్తోంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి ఆందోళనల తీవ్రత ఎక్కువుంది. దిగువ తరగతి ప్రజలతో పాటు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా ఈ నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. నిరసనలు చల్లార్చటానికి ప్రభుత్వం ప్రయత్నించకపోలేదు. దుకాణదారుల డిమాండ్లకు స్పందనగా సెంట్రల్ బ్యాంకు గవర్నర్ను మార్చారు. ప్రతి ఇంటికీ నెలకు ఏడు డాలర్ల మొత్తం ఇచ్చేందుకు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అంగీకరించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఉద్యమకారులు వెనక్కి తగ్గేది లేదన్నారు. సాధారణ ప్రజానీకం సమస్యల్ని పరిష్కరిస్తానని, ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తానని అధికారంలోకొచ్చిన మసూద్ పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వంలో పెచ్చరిల్లిన అవినీతిని అరికట్టలేక పోయారు. ప్రజల్లో అసంతృప్తి కనబడుతున్నా నాయకత్వం నిస్తేజంగా ఉండిపోయింది. పైపెచ్చు నిరసనల్లో పాల్గొంటున్న వారిని ‘దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం సాగిస్తున్నార’ంటూ కేసులు పెట్టడం, అరెస్టులు చేయటం ప్రజల్ని మరింత రెచ్చగొట్టింది. ఈ నేరారోపణ కింద ఉరిశిక్షతో సహా కఠినమైన శిక్షలు విధించటానికి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. అమెరికాలో స్థిరపడిన ఒకప్పటి నియంత ఇరాన్ షా కుమారుడు రెజా పెహ్లావి తానొచ్చి దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నారు. ఛాందసవాద ధోర ణుల్ని తగ్గించుకుని ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పితే తప్ప బలప్రయోగంతో నిరసనలు అణిచేయటం అసాధ్యమని ఇరాన్ పాలకులు గుర్తించాలి. -
శీతకాలం కోత పెట్టగ...
చల్లదనం గురించీ, వేడి గురించీ ఒక్కోసారి మన ఊహల్ని తలకిందులు చేస్తూ, మాటలకు మనమిచ్చే అర్థాలను సవరించుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ శీత ఋతువులో అదే జరుగుతోంది. శీతవాయువు కోతకత్తిగా మారి శరీరాన్ని నిలువునా కోసి చలికారం అద్దుతోంది. మండువేసవిని మించి, రోజంతా చలి దహిస్తోంది. బతుకైనా, బాగైనా మితిలోనే ఉందనీ, అతి అన్నిటా అనర్థానికే దారి తీస్తుందనీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తోంది. ఈ ఏడాది దేశంలో అనేకచోట్ల సాధారణ ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోయి చలిగాలుల ఊపేస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. భూమి చరిత్రలోనే కానీ, మానవ చరిత్రలోనే కానీ ఋతుగమనం హఠాత్తుగా తూకం తప్పి బతుకులను తలకిందులు చేసిన ఘట్టాలు అసంఖ్యాకం. చరిత్రకెక్కినవి కొన్నే. సాధారణ శకం 536లో అగ్నిపర్వతాలు బద్దలై యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియా లలో ఆకాశాన్ని అంధకారంతో కప్పేసి అతి శీతల వత్సరాలను సృష్టించాయి. అది అసాధారణ స్థాయిలో హిమపాతానికీ, కరవు కాటకాలకూ, మానవ, జంతు మరణాలకూ దారితీసింది. యూరప్తో సహా పలుచోట్ల 1300–1850 మధ్యకాలాన్ని చిన్నపాటి మంచుయుగంగా లెక్కించారు. 1709లో యూరప్లో విస్తారమైన ప్రాంతాలు మంచు భూములుగా మారిపోయి, అనేక ప్రాణాలకు సమాధులయ్యాయి. 1783–84లో ఉత్తర అమెరికాలో విపరీత శైత్యం తీవ్ర దుర్భిక్షానికీ, చివరికి ఫ్రెంచి విప్లవానికీ దారితీసింది. 1816లో వేసవే లేకుండా పోయింది. 1963లో బ్రిటన్లో, 1972లో ఇరాన్లో, 2008లో అఫ్గానిస్తాన్లో హిమపాతాలూ, చలిగాలులూ పెద్ద సంఖ్యలో ప్రాణాలు హరించాయి. శిశిరం శివతాండవం చేస్తూ కరవు కాటకాలతో జీవజాలాన్ని ఆకుల్లా రాల్చి వేయడం గమనిస్తే శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’ కవిత గుర్తొస్తుంది. అంతా తన ప్రయోజకత్వమే అనుకుంటూ మనిషి స్థాపించిన సామ్రాజ్యాలు... ‘ఇతరేతర శక్తులు’ లేస్తే పేకమేడల్లా పడిపోయా యంటాడాయన. అలాగే, మౌర్య సామ్రాజ్యంలో తలెత్తినట్టు చెబుతున్న పన్నెండేళ్ళ దుర్భిక్షానికి అతిశీతల వాతావరణమో, లేదా అలాంటి మరేదైనా ‘ఇతరేతర’ శక్తో కారణం కావచ్చు. అప్పుడు భద్రబాహుడనే జైనముని జైన సంఘాన్ని వెంట బెట్టుకుని దక్షిణ భారతానికి తరలివచ్చాడనీ, చక్రవర్తి చంద్రగుప్తుడు కూడా సింహా సనాన్ని త్యజించి దక్షిణాపథానికి వచ్చాడనీ చరిత్ర చెబుతోంది. సమతూకపు ఋతుగమనానికీ, భూమ్మీద జీవజాలం మనుగడకూ ఉన్న పీటముడి ఎలాంటిదో – ఆ తూకం హఠాత్తుగా తారుమారైనప్పుడే తెలిసి వస్తుంది. శీతర్తువు కరుణించి తగినంత వెచ్చదనాన్ని జోడించినప్పుడు, పోతన భాగవతంలో వర్ణించినట్టు మన్మథుడు విరహులకు హేమంతం అడుగుపెట్టినట్టు గబ్బున తోపించి అదేపనిగా వేధిస్తూ అర్ధాంగి నులివెచ్చని ఆలింగన సౌఖ్యం వైపు నడిపిస్తాడు. హాలుడు ‘గాథాసప్తశతి’లో అభివర్ణించినట్టు, ఆ భరోసాతోనే భర్త పశువులను కొనుక్కోడానికి పైబట్టను అమ్ముకుంటాడు. ‘చలి వడి కించే శైశిర కాలం వస్తూపోతూ దాగుడుమూతల క్రీడలాడుతవి మీ నిమిత్తమే’నంటూ మహాకవి శ్రీశ్రీ శైశవగీతిని ఆలపిస్తాడు. అదే శీతర్తువు ఒకింత గతి తప్పిందా... అస్తిత్వమే అల్లకల్లోలమైపోతుంది. చలిగాలుల విజృంభణకు శాస్త్రవేత్తలిప్పుడు వివిధ కారణాలు ఎత్తి చూపుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే వాతావరణ పరిస్థితులూ, మధ్యధరా సముద్ర ప్రాంతంలో సంభవించే అలజడులూ చల్లని ఉత్తరపు గాలుల్ని సృష్టించి హిమాలయాల మీదుగా వ్యాపింపజేస్తాయంటున్నారు. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం కూడా ఉష్ణోగ్రతను కట్టడి చేసి శీతల వాయువులను సృష్టిస్తోందట. శాస్త్రజ్ఞులు చెప్పిన కారణాలు కొన్ని భాగవత కవికి అనుభవపూర్వకంగా తెలుసు. ఉత్తరపు గాలి విసురుతోందనీ, తామరలు తరిగి అంతటా మంచు నెలకొందనీ అంటాడు. సూర్యుడు శక్తిహీనుడు కావడం వల్ల హిమాలయాల నిండా మంచు పేరుకుని ఆ పేరును సార్థకం చేస్తోందని రామాయణ కవి అంటాడు. వందల కోట్ల సంవత్సరాల అస్తిత్వంలో పుడమితల్లి ఇలాంటి పురిటినొప్పులు ఎన్ని పడిందో! ఎన్ని మంచు యుగాలను చూసిందో! మన మేరకు మనం చేజేతులా వాతావరణ విధ్వంసానికి పాల్పడకుండా జాగ్రత్త పడటమే చేయవలసినదీ, చేయగలిగినదీ! -
శాపనార్థాలే సమాధానాలా?
‘వినదగు నెవ్వరు చెప్పిన...’ అన్నాడు సుమతీ శతకకారుడు. విన్న తర్వాత అందులోని నిజానిజాలేమిటో నిర్ధారించుకొని ఒక నిర్ణయం తీసుకోవాలంటాడు. సంఘ జీవనంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెప్పిన హితోక్తి ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడిన ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించవలసిన నీతిపాఠం. ప్రభుత్వ చర్యలను, నిర్ణయాలను ప్రజల తరఫున ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. అది వాటి బాధ్యత. ఆ ప్రశ్నలకు ప్రభుత్వాలు సూటిగా సమాధానాలు చెప్పి తీరాలి. అలా చెప్పకుండా దాటవేయడం మొదలుపెడితే ఆ ప్రభుత్వాలు ఏదో దాచిపెడుతున్నట్టు లెక్క. ప్రస్తుత ఏపీ సర్కార్ దాటవేసే దశను కూడా దాటిపోయింది. ఎదురు దాడినే ఆయుధంగా ప్రయోగిస్తున్నది. అందులోనూ పూనకాల దశకు చేరుకున్నది. జరగరానిదేదో జరుగుతున్నదని దీని అర్థం. చేయగూడని తప్పులేవో ప్రభుత్వం చేస్తున్నదని అర్థం. ప్రజలకు బాధ్యత వహించ వలసిన పవిత్ర కర్తవ్యాన్ని ఏపీ సర్కార్ ఈ రకంగా ఎగతాళి చేస్తున్నది. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి గురువారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ అంశాల మీద ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. అంతే, మిడతల దండు దాడి చేసినట్టు, తోడేళ్ల మంద దండెత్తి వచ్చినట్టుగా ఉన్నది కూటమి రియాక్షన్. కనీసం పదిమంది మంత్రులు జగన్పై ఎదురుదాడికి దిగారు. అందులో ఒక వయసు మళ్లిన మంత్రి స్థిమితం కోల్పోయి మాట్లాడారు. యెల్లో మీడియా ఛానల్స్ అన్ని రకాల మర్యాదల్నీ అతిక్రమించాయి. యెల్లో పత్రికలు యథావిధిగా వక్రీకరణకు పూనుకున్నాయి. కానీ, ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పే సాహసాన్ని ప్రభుత్వం కానీ, దాని తాబేదార్లు కానీ చేయలేదు. అసలు విషయాన్ని దాచేసి కొసరు సంగతులపై షాడో బాక్సింగ్ చేసే సంస్కృతిని యెల్లో కూటమి బాగా వంటపట్టించుకున్నది. విషయ పరిజ్ఞానం లేని పదిమంది తుత్తురుగాళ్లతో మాట్లాడించి, గత్తరలేపే వ్యూహాన్ని ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తున్నది.ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. తాను ఏపీ ముఖ్యమంత్రితో ఒక క్లోజ్డ్ డోర్ మీటింగ్లో మాట్లాడి ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ పను లను ఆపేయించాననీ, కావాలంటే ఎవరైనా సరే చెక్ చేసుకో వచ్చనీ ఆయన అన్నారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సున్నిత మైన అంశం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఎత్తిపోతలపై తెలంగాణకు అభ్యంతరాలున్నాయి. కానీ రాయలసీమ అవసరాల రీత్యా ఏపీకిది వరదాయిని. ఇటువంటి అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో వైసీపీ సహా మరికొన్ని రాజకీయ పక్షాల ఏపీ ప్రభుత్వ స్పందనను డిమాండ్ చేశాయి. జగన్మోహన్రెడ్డి కూడా తన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎవరూ అడక్కుండానే ప్రభుత్వం ఈ అంశంపై ఒక ప్రకటన చేసి ఉండవలసింది. కానీ, ఇప్పటివరకూ ఈ వ్యవహారం మీద ఏపీ ప్రభుత్వం సూటిగా స్పందించలేదు. రేవంత్రెడ్డి, తాను క్లోజ్డ్ డోర్ మీటింగ్లో ఈ విషయం మాట్లాడుకున్నారా లేదా అనే సంగతి తప్ప అనేక ఇతర విషయాలు చంద్రబాబు మాట్లాడారు. ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్పింది తప్పయితే దాన్ని ఖండించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కాని విషయం. రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అయితే, అటువంటి రహస్య నిర్ణయం తీసుకోవలసి రావడం వెనుక కీలకమైన జాతీయ భద్రతా అంశాలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. కానీ అసలు విషయాన్ని వదిలేసి ఉపవాచకాలను పఠించడం, ఉక్రోషాన్ని ప్రదర్శించడం యెల్లో కూటమి బలహీనతల్ని ఎత్తి చూపింది.అదే మీడియా సమావేశంలో అమరావతి వ్యవహారంలో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కూడా జగన్ ఎత్తిచూపారు. బాధ్యత కలిగిన ప్రభుత్వమైతే వాటికి సమాధానం చెప్పాలి. కానీ, ఆయన మాట్లాడిన మిగిలిన అన్ని విషయాలను వదిలేసి, ఈ ఒక్క అంశాన్నే పట్టుకుని అమరావతి మీద జగన్మోహన్రెడ్డి విషం కక్కుతున్నారంటూ ఒక చౌకబారు ప్రచారాన్ని దిగజారుడు భాషలో వండి వార్చి వడ్డించడం మొదలుపెట్టారు. ఒక్క జగన్మోహన్రెడ్డికే కాదు, అమరావతి విషయంలో ప్రభుత్వం వేస్తున్న కుప్పిగంతులపై చాలామంది మేధావులకూ, స్థానిక ప్రజలకూ పలురకాల అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయకుండా నిందారోపణలు చేయడం వల్ల పవిత్రులమై పోతామనుకుంటే పప్పులో కాలేసినట్టే!వరద ముంపునకు అవకాశముండే ప్రాంతంలో నగర నిర్మాణం పట్ల నిపుణులందరికీ అభ్యంతరాలున్నాయి. వెయ్యి కోట్ల ఖర్చుతో రెండు ఎత్తిపోతల పథకాలను పెట్టి, రెండు రిజర్వాయర్లు నిర్మించి అమరావతిని వరద ముప్పు నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సంగతి నిజమే కదా! ఇంత ఆయాసం దేనికి, వరదముప్పు లేని ప్రాంతంలో నిర్మించు కోవచ్చు కదా! అక్కడ ముందుగానే పాలక పెద్దల అనుయా యులు భూములు కొనుగోలు చేసినందువల్లనే ఎంత ప్రయా సైనా సరే అక్కడనే రాజధాని ఉండాలని ఆరాటపడుతున్నారని అనుమానం రావడంలో తప్పేముంది! వరదముప్పు పొంచి ఉన్నచోటనే నగర నిర్మాణం ఎందుకన్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం ఉన్నదా?మొదట సేకరించిన 54 వేల ఎకరాల్లోనే అభివృద్ధి పనులు ప్రారంభం కాకుండా ఇంకో 50 వేల ఎకరాలు కావాలని అడగడం దేనికి? అందులో తక్షణమే 20 వేల ఎకరాల సమీ కరణకు రంగం సిద్ధం చేయడంలో పారదర్శకత ఏమైనా వున్నదా? ఎవరూ అడగకుండానే ప్రభుత్వం దీని మీద వివరణ ఇవ్వవలసింది. కానీ, అడిగినవారి మీద ఎదురుదాడికి దిగడం వెనుక ఏదో గూడుపుఠాణీ ఉన్నదనే కదా అర్థం? సీఆర్డీఏ వెబ్సైట్లో పొందుపరిచిన వివరాల ప్రకారం తొలి దశ 54 వేల ఎకరాల్లో పార్కులు, రోడ్లు, చెరువులు వగైరాలు తీసేసిన అనంతరం 29 వేల పైచిలుకు భూములు అందుబాటులో ఉంటాయి. రైతులకు అభివృద్ధి చేసి ఇవ్వాల్సిన ప్లాట్లు, ఇప్పటి వరకు జరిపిన కేటాయింపులు, ప్రభుత్వ భవనాల అవసరాలు తీసివేసినా ఇంకా 18 వేల ఎకరాలకు పైగా సీఆర్డీఏ చేతిలో ఉన్నాయి. మరి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను చెరువుల్లో, శ్మశానాల్లో ఎందుకు వేస్తున్నారు? ఈ కారణం వల్లనే రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయిన ఉదంతాన్ని విస్మరించగలమా? అమ్ముకోవడానికి ప్రభుత్వం చేతిలో 18 వేల ఎకరాలు స్థిరంగా ఉండగా ఇంత ఆదరా బాదరాగా ఇంకో 20 వేల ఎకరాల సేకరణలోని ఔచిత్యాన్ని ఎవరైనా అడిగితే వాళ్ల మీద ‘అమరా వతి ద్రోహులు’, ‘అభివృద్ధి నిరోధకులు’ అనే ముద్రలు వేయ డానికి యెల్లో కూటమి సర్వసన్నద్ధంగా ఉన్నది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అవుతుందనీ, ప్రభుత్వం పైసా ఖర్చు చేయనవసరం లేదనీ చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఏడాది న్నరలోనే అమరావతి ఖాతాలో 50 వేల కోట్ల అప్పును ఎందుకు చేయవలసి వచ్చిందో వివరించాలని అడిగితే కూడా అమరావతి ద్రోహులవుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పవలసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. కానీ వాటిని అడిగిన వారి మీద శాపనార్థాలు ప్రయోగిస్తూ బండి లాగిస్తున్నారు. పద్దెనిమిది నుంచి అరవయ్యేళ్లలోపు వయసున్న మహిళలందరికీ నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించరాదు. నిరుద్యోగులకు నెలకు మూడువేల రూపాయల భృతి సంగతి ఏమిటని అడగరాదు. అడిగితే అభివృద్ధికి అడ్డుపడినట్టు. ఏపీ అంటే... ‘ఏ ఫర్ అమరావతి’, ‘పీ ఫర్ పోలవరం’ అని ప్రచారం చేసుకున్న బాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టుకు చేసిన ద్రోహాన్ని కూడా ఎవ్వరూ ప్రశ్నించకూడదు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించే విధంగా స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తి చేయకుండా, ఏవో ప్రయోజనాల కోసం పునాది డయా ఫ్రమ్ వాల్ వేసి, వరద కారణంగా అది దెబ్బతినడానికి కారణమయ్యారని వారిని అధిక్షేపించరాదు. ఈ చారిత్రక తప్పిదం వల్ల ఆ ప్రాజెక్టు ఇంకెంతకాలం కుంటుతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పైగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతలతో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును కేవలం తమ వారికి కాంట్రాక్టు పనిని అప్పగించడం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ నెత్తినెత్తుకున్నారన్న అభియోగం నిజం కాదని నిరూపించగలరా? చివరికి కేంద్రం ఒత్తిడికి లొంగిపోయి, దాని ఎత్తు తగ్గించి బరాజ్ స్థాయికి కుదించలేదా? ఈ విషయం నిజమా... కాదా?ఏ ఫర్ అమరావతి. పీ ఫర్ పోలవరం... ఈ రెండింటిలోనూ పారదర్శకత కనిపించడం లేదు. ఈ రెండింటిలోనూ గోల్మాల్ జరుగుతున్నదనే ఆరోపణలు నిజమైతే విభజిత రాష్ట్రానికి అంతకంటే పెద్ద ద్రోహం ఇంకేమన్నా ఉంటుందా? ఇవే కాదు, రాష్ట్రంలో కూటమి సర్కార్ అమలు చేస్తున్న విధా నాలు పేదలు, మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఇవాళ రాష్ట్రంలో ఎవరిని కదిలించినా చెబుతున్నారు. ఏ ప్రయోజనాల్ని ఆశించి ప్రైవేట్ పెట్టుబడికి ఊడిగం చేసే పాత్రను పోషిస్తున్నారు? విశాఖ నగరానికి ఇంతకాలం ఆయువుపట్లుగా నిలిచిన విశాఖ ఉక్కు, విశాఖ పోర్టులను దెబ్బతీయడం కోసమే మిట్టల్ స్టీల్స్కు సముద్రతీరం వెంబడి మూడు కిలోమీటర్ల పొడవునా ప్రైవేట్ పోర్టును కేటాయించారనీ, క్యాప్టివ్ మైన్స్ ఇప్పించడం కోసం కేంద్రం దగ్గరికి ఎంపీలను పంపించారనీ వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? సూటిగా సమాధానం చెప్పగలరా? ప్రపంచంలోని నాగరిక దేశాలన్నీ విద్య, ఆరోగ్య రంగాలను ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం అంగడి సరుకుగా మార్చిందనడానికి ఈ పందొమ్మిది నెలల పాలన రుజువు కాదా? ప్రజల మనసుల్లో ఇటువంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇందులో దేనికీ కూటమి సర్కార్ సూటిగా సమాధానం చెప్పే అవకాశం లేదు. కనుక ఈ శేష కాలాన్ని శాపనార్థాలతోనే వారు గడిపేస్తారని భావించవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
నిష్పూచీ నిష్క్రమణలు
‘అంతర్జాతీయ న్యాయం నాకు అవసరం లేదు. అధ్యక్షుడిగా నా అధికారానికి పరిమితులు విధించేదీ, దాన్ని నిరోధించేదీ నా నైతికత మాత్రమే’ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించాక ప్రకటించారు. ఇప్పటికే ఆయన నైతికత ఎలాంటిదో రుజువైంది గనుక భిన్నరంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగుతున్నామని తాజాగా ఆయన చెప్పటం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఈ నిర్ణయం కారణంగా మొత్తం 66 సంస్థల నుంచి అమెరికా తప్పుకుంటుంది. ఇందులో ఐక్యరాజ్యసమితికి చెందినవి 31 కాగా, ఇతర సంస్థలు 35. భావోద్వేగాలకు లోనుకావటం వల్లనో, ప్రలోభాలకు ఆశపడటంవల్లనో అనర్హుల్ని అందలం ఎక్కించిన దేశం కష్టాల్లో పడుతుంది.కానీ అమెరికా ప్రజలు చేసే తప్పు ప్రపంచాన్ని కకావికలు చేస్తుందని ఏడాది కాలంగా అందరికీ అర్థమవుతోంది. తనకు తోచిందే న్యాయం, తాను చెప్పిందే ధర్మంగా ఇంటా బయటా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని సరే... అమెరికాను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి బయటకు రావటానికి ఆయన చెబుతున్న కారణాలు చిత్రమైనవి. ఆ సంస్థలు అమెరికా ప్రయోజనాలను నెరవేర్చటం లేదట! నిరుడు అధికారంలోకొచ్చిన వెంటనే 2015 నాటి పారిస్ ఒప్పందం నుంచి వైదొలగారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి బయటికొచ్చారు. నిబంధనల ప్రకారం ఈనెల 20 నుంచి అది అమలవుతుంది. తాజా నిర్ణయం వల్ల అధికంగా సమస్యలెదుర్కొనే సంస్థలు వాతావరణ పరిశోధనలకు సంబంధించినవి. వాతావరణం గురించి, అది క్షీణిస్తున్న తీరు గురించి ఎవరైనా మాట్లాడినప్పుడల్లా అమెరికాకు చిర్రెత్తుకొస్తుంటుంది. ఇది ట్రంప్తోనే మొదలు కాలేదు. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1997లో కుదిరిన క్యోటో ప్రోటోకాల్కు అమెరికా దూరంగా ఉండిపోయింది. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం ప్రతి దేశమూ ఉద్గారాల తగ్గింపునకు లక్ష్య నిర్దేశం చేసుకోవాలి. దాన్ని సాధించటానికి ప్రయత్నించినట్టు చూపాలి. ప్రపంచాన్ని కాలుష్యభరితం చేయటంలో ముందువరసలో ఉండే అమెరికాకు ఇలాంటి ఆంక్షలు నచ్చుతాయా? కనుకనే దాన్ని పూర్తిగా బేఖాతరు చేస్తూ ఆ ప్రోటోకాల్ వెలుపలే ఉండిపోయింది.నిజానికి క్యోటో ప్రోటోకాల్ను నీరుగార్చటానికీ, తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు చెప్పుకోవటానికీ 2015లో అందరినీ మభ్యపెట్టి ప్యారిస్ ఒడంబడికకు దోహదపడింది. కానీ ఆ మరుక్షణం నుంచీ అటకెక్కించింది. ఎంతో వెనకబడిన దేశాలనుకున్నవి సైతం తమ శక్తి మేరకు ఆ ఒప్పందం అమలుకు చర్యలు తీసుకోగా, అమెరికా చేసింది దాదాపు శూన్యం. ఉద్గారాలను పరిమితం చేయగల హరిత సాంకేతిక తపై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నా, వాటి పర్యవసానంగా ప్రభావ వంతమైన ఆవిష్కరణలు సాధ్యమైనా సక్రమంగా ఆచరణలో పెట్టింది లేదు. పోనీ దాన్ని బడుగు దేశాలకు చవగ్గా అందించాలని కోరినా ఉలుకూ పలుకూ లేదు. పాలకుడెవరైనాఅమెరికా తీరు ఇంతే! కాకపోతే ట్రంప్ వారిని మించిన ఘనుడు. అసలు వాతావరణ మార్పు అనేదే బూటకమని ఆయన వాదన. భూగోళం మరింత వేడెక్కకుండా ఉండాలంటే 2030 నాటికి అన్ని దేశాలూ 2005 నాటి కర్బన ఉద్గారాల పరిమాణంలో 33 నుంచి 35 శాతం మేర తగ్గించాలని ప్యారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది. కానీ ట్రంప్ మూర్ఖత్వం కారణంగా ఆ లక్ష్యసాధన ఇక అసాధ్యం. ఆయన హరిత ఇంధన సాంకేతికతల్ని పూర్తిగా పక్కకు పెట్టడమే కాదు... చమురు వాడకాన్ని మరింత పెంచే చర్యలు తీసుకుంటున్నారు.ట్రంప్ తాజా నిర్ణయం వల్ల ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఇతర ముఖ్య సంస్థలు సైతం నిధుల కొరతతో నీరసిస్తాయి. ఘర్షణాత్మక ప్రాంతాల్లో పిల్లల బాగోగుల కోసం పని చేయటం, అటువంటి ప్రాంతాల్లో చోటుచేసుకునే లైంగిక నేరాల్ని అరికట్టడం వంటి అంశాల్లో పనిచేసే ప్రతినిధుల్ని అమెరికా ఉపసంహరించుకుంటుంది. భారత్, ఫ్రాన్స్ల చొరవతో ఏర్పాటైన అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) కూడా ఈ జాబితాలో ఉంది. ప్రపంచానికి తన వంతుగా లేశమాత్రమైనా మంచిచేసేది లేదని ట్రంప్ చాటుతున్నారు. కనుక ఇకపై ఈ ధూర్తదేశంతో ఎలా వ్యవహరించాలో ప్రపంచ దేశాలు నేర్చు కోక తప్పదు. -
కాలుష్యం కోరలు తీసేదెలా?
సంకల్పం ఉంటే దేన్నయినా సాధించవచ్చంటారు. అది కొరవడటం దేశ రాజధాని నగరానికి శాపంగా మారింది. కనుకనే కాలుష్యం అక్కడి నుంచి కదలనంటున్నది. ఈ సంగతి తెలిసే సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం)ను తీవ్రంగా తప్పుబట్టింది. ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించి, ఏయే పరమాణువులు ఏ మేరకు కారణమవుతున్నాయో, వాటిని అరికట్టడానికి ఏం చేయాలో చెప్పాలని కోరింది. మనం పీల్చే గాలితోపాటే నైట్రేట్లూ, సల్ఫేట్లూ, కర్బనాలు, కాడ్మియం, పాదరసం వంటి అత్యంత ప్రమాదకర పరమాణువులు ఊపిరితిత్తుల్లో ప్రవేశిస్తున్నాయి. నెత్తురుతోపాటే శరీరమంతటా ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, నవజాత శిశు మరణాలూ తదితర దారుణాలకు కారణమవు తున్నాయి. అయినా అన్ని వ్యవస్థలూ కాలుష్యాన్ని ఆషామాషీగా తీసుకుంటున్నాయి. వివిధ అధ్యయనాలు చెబుతున్న దాన్నిబట్టి ఢిల్లీ వరకూ చూస్తే వాహనాల కాలుష్యమే అధికం. ఆ తర్వాత వరసగా పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణరంగం వల్ల వెలువడే ధూళి, పంట వ్యర్థాలు తగలబెట్టినందువల్ల వచ్చే పొగ ఉంటాయి. కానీ నిర్దిష్టమైన డేటా లేనందువల్ల అరికట్టడం విషయంలో వెనకబడిపోతున్నాం.రెండు దశాబ్దాల క్రితం చైనా రాజధాని నగరం బీజింగ్ పరిస్థితి ఇదే. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ జరుగుతున్న సందర్భంగా ఆ దేశం తొలిసారిగా కాలుష్యంపై రణభేరి మోగించింది. పలు తాత్కాలిక చర్యలు ప్రారంభించారు. అటుతర్వాత అయిదేళ్లపాటు అధ్యయనాలు నిర్వహించారు. వాటితోపాటే ప్రయోగాత్మకంగా వివిధ రకాల విధానాలు అమల్లోకి తెచ్చారు. ప్రధాన కాలుష్య కారకాలను గుర్తించారు. వాటి తీవ్రత ఆధారంగా వర్గీకరించారు. వాతావరణంలో అతి సూక్ష్మ ధూళి కణాల(పీఎం 2.5)ను సాధ్యమైనంత మేర తగ్గించాలని సంకల్పించారు. అటు తర్వాత 2013లో అయిదేళ్ల జాతీయ కార్యాచరణ పథకం రంగప్రవేశం చేసింది. బొగ్గు ఆధారిత బాయిలర్లను మూసివేయాలని నిర్ణయించటంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను అంచెలంచెలుగా మెరుగుపరిచారు. వివిధ పరిశోధనల ద్వారా కొత్త సాంకేతికతల్ని ఆవిష్కరించారు. హరిత ఇంధన వాడకమే వీటన్నిటి ధ్యేయం. కనుకనే అత్యంత కాలుష్య ప్రాంతాలుగా గుర్తించినవి కాస్తా నాలు గేళ్లలో గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ మెరుగుదల 35 శాతంపైగా ఉంది. మధ్యలో కరోనా మహమ్మారి విరుచుకుపడినా కాలుష్యంపై పోరు ఎక్కడా తగ్గలేదు. చైనా మాత్రమే కాదు... మనకన్నా బాగా వెనకబడిన ఫిలిప్పీన్స్, పెరూ, ఉరుగ్వే వంటి దేశాలు సైతం కాలుష్యాన్ని అరికట్టడంలో మెరుగైన విజయాలు సాధించాయి. ఒక్క ఢిల్లీ అనేమిటి... హైదరాబాద్ మొదలుకొని పది నగరాల వరకూ దాదాపు ప్రతిచోటా ఏడాది పొడవునా కాలుష్యం బుసలు కొడుతోంది. ఢిల్లీలో గురువారం సాయంత్రానికి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 328 (విపత్కరం)గా ఉన్నదని వెల్లడైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో ఊహించుకోవచ్చు. 2022 జూలైలో సీఏక్యూఎం వెలువరించిన నివేదిక రవాణారంగం, పారిశ్రామిక ఉద్గారాలు, విద్యుత్ ప్లాంట్లు, వ్యర్థాల్ని తగలబెట్టడం, నిర్మాణరంగ పనుల వల్ల వెలువడే ధూళి వగైరాలు ప్రధానంగా కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తించింది. కానీ వాటిని అరికట్టడానికి లేదా వాటి తీవ్రత తగ్గించటానికి జరిగిన కృషేమీ లేదు. ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటో సూచించాలంటూ గత నెల 17న సీఏక్యూఎంను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు మళ్లీ మరోసారి చెప్పాల్సివచ్చింది. సీఏక్యూఎం ఒక్కటే దీన్ని సాధించటం సాధ్యంకాదు. అన్ని విభాగాలూ కలిస్తేనే సమస్యపై పోరాడటానికి వీలవుతుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సీఏక్యూఎం పర్యవేక్షణలో ట్రాఫిక్ పోలీస్, రవాణా విభాగం, మున్సిపాలిటీలు, కాలుష్య నియంత్రణ సంస్థలు సమన్వయంతో పనిచేసేలా నిర్దిష్టమైన విధానం రూపొందించాలి. పకడ్బందీ కార్యాచరణ ఉండాలి. పొరుగునున్న చైనా నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టుకుని లక్ష్యాన్ని సాధించగలిగినప్పుడు... మనకన్నా వెనకబడిన దేశాలు సైతం చేసి చూపిస్తున్నప్పుడు మనం ఎందుకు విఫలమవుతున్నామని ప్రశ్నించుకోవాలి. ఎక్కడ లోటుపాట్లున్నాయో సమీక్షించుకుని సరిచేసుకోవాలి. -
ట్రంప్ అసంతృప్తి లోగుట్టు!
పరాయి దేశాల్లో సైనిక కుట్రలు, కుయుక్తుల మాటెలావున్నా అగ్రరాజ్యం హోదాలో అమెరికా నాగరికంగా, గంభీరంగా ఉన్నట్టు కనబడేది. తాను ఏం చేసినా ప్రపంచశాంతి కోసమే, అది సురక్షితంగా ఉండటానికేనని ప్రవచించేది. నిరుడు ఆ దేశాధ్యక్షపీఠాన్ని అధిరోహించిన డోనాల్డ్ ట్రంప్కు ఇలాంటి డొంకతిరుగుడు నచ్చదు. బాహాటంగా బెదిరింపులకు దిగటం ఆయన నైజం. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తనను ఆనందడోలికల్లో ముంచెత్తడానికి భారత్ ప్రయత్నిస్తోందట. అయితే తాను సంతోషంగా లేని విషయం మోదీకి తెలుసట. మరో రెండు రోజులకు దాన్ని కాస్త మార్చి, తనతో మోదీ సంతోషంగా లేరంటూ మరో ప్రకటన చేశారు. ఇలా మాట్లాడుతూనే రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు నిలిపేయకపోతే సుంకాలు మరింత పెంచుతామని హెచ్చరించారు. రెండు దేశాల దౌత్యసంబంధాలు లేదా వాణిజ్యసంబంధాల్లో ఏకాభిప్రాయం కుదరనప్పుడు పరస్పరం చర్చించుకోవటం ఆనవాయితీ. ఇచ్చిపుచ్చుకునే ధోరణి చూపితే ఎక్కడో ఒకచోట సదవగాహన సాధ్యమవుతుంది. కానీ ఫలానాది మాత్రమే కావాలని పట్టు బట్టడం, మొండికేయటం వల్ల సమస్య ఎప్పటికీ అపరిష్కృతంగా ఉండి పోతుంది. మన దేశానికి మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్, ఒమన్లతో ఒప్పందాలు కుదిరాయి. అటు అమెరికాకు ఈయూ, జపాన్, థాయ్లాండ్, వియత్నాం, మలేసియాలతో ఇదే విధంగా ఒప్పందాలు ఏర్పడ్డాయి. ఇలా వేరే దేశాలతో ఈ రెండు దేశాలూ ఒప్పందాలు కుదుర్చుకోగలిగినప్పడు వాటి మధ్య మాత్రం ఒప్పందాలు ఎందుకు అసాధ్యమవుతున్నాయి? తమ భద్రత అమెరికా చేతుల్లో ఉండటంతో వేరే దేశాలు అమెరికా షరతులను శిరసావహించక తప్పదు. వ్యూహాత్మక అంశాల్లో స్వతంత్రత పాటించే వారిని ఒత్తిళ్లు ప్రభావితం చేయలేవు. అందువల్లనే భారత్ వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలు అంత తేలిగ్గా సాధ్యపడవు. ట్రంప్ను సంతోషపెట్టడం వేరే దేశాల బాధ్యత ఎందుకవుతుంది? అసలు ఆ బాధ్యత అమెరికా ప్రజలకే ఉండదు. అన్ని దేశాల పాలకుల మాదిరే తన దేశ ప్రజలు ఆనందంగా ఉండేలా చూసుకునే బాధ్యత ట్రంప్ది. ఆయన్ను అందుకు ఒప్పించటం రిపబ్లికన్ల బాధ్యత. లేనట్టయితే నష్టపోయేది ఆ పార్టీయే. భారత్–పాక్ యుద్ధాన్ని ఆపానని గప్పాలు కొట్టుకున్నట్టే భారత్ తనను సంతోషపరచటానికి ప్రయత్నిస్తోందని ట్రంప్ చెప్పారా? ఈ విషయంలో మన దేశంవైపు నుంచి ఖండనేమీ లేదు. వాణిజ్య ఒప్పందం అనేది చాలా సీరియస్ అంశం. బహిరంగ వేదికలపై దాన్ని చర్చించటం సాధ్యపడదు. తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారానో, ఎయిర్ఫోర్స్ వన్ విమానంలోనో కూర్చునో తోచింది చెప్పటం, అందుకు అనుగుణంగా అవతలి దేశం మారాలని, కాళ్లబేరానికి రావాలని భావించటం... అది సాధ్యపడనప్పుడు హెచ్–1బి వీసా ఫీజు పెంచటం, బహిరంగ విమర్శలకు దిగటం ట్రంప్ ఎన్నుకున్న తప్పుడు మార్గం.నిజానికి మన దేశం చాలావరకూ తగ్గిందనే చెప్పాలి. నిరుటితో పోలిస్తే అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు 80 శాతం పెరిగాయి. 1962లో వచ్చిన అణుశక్తి చట్టాన్ని ఇటీవల రద్దుచేసి ఆ రంగంలో ప్రైవేటు సంస్థల ప్రమేయానికి అనుమతిస్తూ మన దేశం ‘శాంతి’ పేరిట కొత్త చట్టం తెచ్చింది. అణువిద్యుత్ కర్మాగారాల్లో ప్రమాదం జరిగితే పరిహారం చెల్లింపు బాధ్యత ఆ పరికరాల సరఫరాదారుకు ఉండబోదన్న విషయంలోనూ అంగీకరించింది. ఇవి తనను సంతోషపరచటానికేనని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడుతోంది. అవి ఎంతమాత్రమూ సరిపోవని చెప్పడం కూడా ఆయన ఉద్దేశం కావొచ్చు. ఇక 95 శాతం అమెరికా ఎగుమతులపై సుంకాలు ఎత్తేయటానికి మన దేశం సిద్ధపడింది. బాదం, యాపిల్, అవకాడో వంటివాటిపై సుంకాలు తగ్గించటానికి ఒప్పు కున్నదంటున్నారు. కానీ డెయిరీ ఉత్పత్తులు, జన్యుమార్పిడి మొక్కజొన్న,సోయా బీన్స్ వగైరాలపై ఆంక్షలొద్దన్న ట్రంప్ షరతుకు అంగీకరించటం లేదు. మన రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేవి మాత్రమే ఆయనను సంతోష పరుస్తాయనుకుంటే ఆ విషయంలో చేయగలిగిందేమీ లేదని మన దేశం చెప్పటమేసరైంది. -
అగ్నిజ్వాల... శబ్దఘోష!
కోనసీమ గడ్డపై మళ్లీ మంటలు ఎగసిపడుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం ఉదయం మోరి–5వ నంబర్ బావి వద్ద బీభత్సమైన శబ్దంతో బ్లోఅవుట్ ఉబికి, గ్యాస్ ఎగదన్నుతూ భారీ ఎత్తున మంటలు వ్యాపించటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనల్లో పడ్డారు. మంగళవారం మధ్యాహ్నానికి బ్లోఅవుట్ తీవ్రత తగ్గినా మరికొన్ని రోజులు ఇది కొనసాగుతుందని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్న మాట. సహజ వాయువు వెలికితీత కోసం ఇనుప గొట్టాలతో డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు రాతిపొర తగిలితే ఆ గొట్టం ద్వారా బాంబింగ్ జరపడం అలవాటు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా సహజ వాయువు పెల్లుబికి ప్రమాదానికి దారితీస్తుంది. ఇది మొదటిసారేమీ కాదు. చిన్నవో, పెద్దవో ఇలాంటి ఉదంతాలు అడపా దడపా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. 1993లో కొమరాడలో తొలిసారి ప్రమాదం జరగ్గా 1995 జనవరిలో పాశర్లపూడి 19ఏ బావిలో డ్రిల్లింగ్ సమయంలో బ్లోఅవుట్ సంభవించి 65 రోజులపాటు కోనసీమను హడలెత్తించింది. 2014లో మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని గెయిల్ కంపెనీ పైపులైన్ పగిలి గ్యాస్ విడుదలై 22 మంది ప్రాణాలు కోల్పోగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిన్నవే కావొచ్చుగానీ... అటుతర్వాత కూడా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తూ ప్రస్తుత ఉదంతంతో సహా దాదాపు అన్నీ జనం అప్రమత్తంగా ఉన్న వేళ సంభవించినవే. కానీ ఆదమరిచి నిద్రిస్తున్నవేళ జరిగితే జనం ప్రాణాలు ఏం కావాలి? మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్క సారిగా సహజ వాయువు ఎగదన్నిందనీ, ఆకాశాన్నంటేలా మంటలు వ్యాపించాయనీ మీడియా కథనం. క్షణాల్లో ఆ ప్రాంతంలో గ్యాస్ అలుముకోవటంతో చుట్టూ ఉన్న గ్రామాల్లోనివారు ఇళ్లకు తాళాలేసి ప్రాణభయంతో పిల్లాపాపల్ని తీసుకుని పరుగులు పెట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులొచ్చినా ఓఎన్జీసీ సిబ్బంది మాత్రం గంటన్నర తర్వాతగానీ రాలేదని జనం చెబుతున్నారు. తరచు సమస్యలెదురవుతున్నా, ప్రమాదం జరిగే ప్రాంతాలు జనావాసాలకు దగ్గరగా ఉంటున్నా ఏటా వేలకోట్ల రూపాయల విలువైన చమురు, సహజ వాయువులను తోడేస్తున్న సంస్థలు భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సమస్య ఉత్పన్నమైనప్పుడు తక్షణం తీసుకోవాల్సిన వరస చర్యలేమిటో సిబ్బందికి కనీస అవగాహన ఉందా? అక్కడి నుంచి మాయంకావటం తప్ప ఇంకేమీ తెలియదా? వెంటనే ఎవరెవరికి సమాచారం అందించాలో, నిపుణులైనవారు అనుసరించాల్సిన విధివిధానా లేమిటో రూపొందాయా? అవసరమైన ఉపకరణాలేమైనా అక్కడ అందుబాటులో ఉన్నాయా? జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్)ను ఈ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలకు సమీపంగా ఉంచారా? స్థానికులకు ఎప్పటికప్పుడు తగిన సమాచారం ఇచ్చే వ్యవస్థలుండాలి. గోప్యత పాటిస్తే అనవసర వదంతులు వ్యాపిస్తాయి. ఒకప్పుడు ఓఎన్జీసీ ఆధ్వర్యంలోనే కార్యకలాపాలన్నీ సాగేవి. ఇప్పుడు ప్రైవేటు సంస్థల ప్రమేయం పెరిగింది. చేసేది ఎవరైనా నిర్లక్ష్యం సహించరానిది. కోనసీమ గర్భంలో అపురూపమైన సహజ వనరులు నిక్షిప్తమై ఉన్నాయని తెలిశాక స్థానికులు సంతోషించారు. ఉద్యోగావకాశాలతోపాటు, అభివృద్ధి పనులు కూడా చకచకా మొదలవుతాయని ఆశించారు. కానీ జరిగిందంతా వేరు. అంతంతమాత్రంగా ఉన్న రహదారులు భారీ వాహనాల రాకతో దెబ్బతిన్నాయి. సున్నితమైన పర్యావరణం కొంచెం కొంచెంగా దెబ్బతింటూ కొబ్బరి, వరి దిగుబడి తగ్గిపోయిందని రైతులు చెబుతున్న మాట. చమురు, గ్యాస్ వెలికితీశాక ఆ ఖాళీలోకి సముద్ర జలాల ఊట చేరి బావుల్లో నీరు ఉప్పగా మారిందంటున్నారు. జల, వాయు కాలుష్యాలు ప్రజారోగ్యంపై కలగజేస్తున్న ప్రభావం ఏమిటో ప్రభుత్వాలు ఆరా తీసినట్టు లేదు. తెలంగాణలోని సింగరేణిలో తవ్వే బొగ్గుపై వచ్చే ఆదాయంలో 50 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికిస్తుండగా చమురు, సహజవాయువుల నుంచి లభించే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నదెంత? కోనసీమకు దక్కుతున్నదేమిటి? ఈ బ్లోఅవుట్ చల్లారిన తర్వాతైనా ప్రభుత్వమూ, ప్రజాప్రతినిధులూ దీనిపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోకుండా చూడాలి. -
భారత ప్రజలమైన మేము...
1946 డిసెంబర్ 9న సరిగ్గా 11 గంటలకు న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ హాల్లో రాజ్యాంగ సభ మొదటి సారిగా సమావేశమైంది. ఈ సభలోని సుమారు 300 మంది సభ్యులు నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైనవారు కాదు. బ్రిటిష్ ఇండియా ప్రావిన్సుల్లోని శాసనసభలు ఎంపిక చేసినవారు. మూడేళ్లలో 5,546 పేజీల చర్చలు జరిపి, ఈ రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పుడు ఈ మొత్తానికైన ఖర్చు రూ.47 లక్షలు. అయితే ఈ రాజ్యాంగ సభకు వెలుపల రాజ్యాంగం కోసం పడిన భిన్న ఆరాటాలను వివరించే పుస్తకం: ‘అసెంబ్లింగ్ ఇండియాస్ కాన్స్టి ట్యూషన్’. ఈ 400 పేజీల పుస్తకం ఒకప్పుడు దేశాన్ని పట్టిన రాజ్యాంగ జ్వరాన్ని కళ్లకు కడుతుంది.రాజ్యాంగ ప్రక్రియలో కేవలం మేధావులు మాత్రమే పాల్గొనలేదనీ, ఇంకా ‘ఇండియా’గా రూపు దిద్దుకోని భారత నేల నలుమూలలలో ఉన్న సకల జనాలు చురుగ్గా పాలుపంచుకున్నారనీ చెబుతారు రచయితలు. స్వతంత్ర భారతంలో తామెలాంటి పాలన కోరుకుంటున్నారో బలూచిస్తాన్ నుంచి బెజ వాడ వరకు వేలాది మంది పౌరులుగా, సంఘాలుగా, పార్టీలుగా, అధికార ప్రతినిధులుగా, ట్రేడ్ యూనియ న్లుగా తమ సంతకాలతో, వేలిముద్రలతో పంపిన అభ్యర్థనలను, అభిప్రాయాలను తవ్వితీసి, ఈ ఉత్సాహపూరిత ప్రజా కోణాన్ని అంతే ఆసక్తికరంగా వెల్లడించారు రచయితలు. ఉదాహరణకు గౌహతి నుంచి నలిన్కాంత బర్కాకటి పంపిన చిన్న కాగితం రాజ్యాంగ సభ సచివాలయానికి 1947 జనవరి 8న అందింది. ‘రాజ్యాంగ విషయాల్లో తన అజ్ఞానాన్ని మన్నించమంటూనే’, ఏ శాసనసభ్యుడినైనా ఎప్పు డైనా ‘రీకాల్’ చేసే హక్కు ఓటర్లకు ఉండాలని అతడు రాశాడు. అంటరానితనాన్ని నిర్మూలించకుండా సమైక్య భారతదేశం సాధ్యం కాదని వజీరిస్తాన్లోని బన్నూ నుంచి ప్రజా ప్రతినిధి కోటూ రామ్ కోరాడు. మహిళలకు సమాన హక్కులు; మరణశిక్ష రద్దు; జైనులు, బేనె ఇజ్రాయెలీ యూదులతో సహా మైనా రిటీల హక్కులు; నగర బాలురతో సమానంగా గ్రామీణ పిల్లల హక్కుల లాంటివే కాదు, ‘చెవిటి మూగ’ వారికి ప్రత్యేక గ్యారంటీలు, విశ్వకర్మలకు ఫీజుల్లో రాయితీలు కోరుతూ కూడా లేఖలు అందాయి. విచిత్రంగా తమ లేఖల ద్వారా రాజ్యాంగ సభకు జనమే చట్టబద్ధత కల్పించారంటారు రచయితలు.‘ఆచరణాత్మక’ కారణాల వల్ల, తొలుతరాజ్యాంగ చర్చలను రహస్యంగానే ఉంచదలిచిన పెద్దలు ఈ ప్రజాబాహుళ్యపు ఒత్తిడితో రాజ్యాంగం ఏ రూపం తీసుకుంటుందో బహిరంగపరచదలిచారు. 1948 ఫిబ్రవరి 26న ప్రచురించిన డ్రాఫ్ట్ కాన్స్టిట్యూ షన్(ఆంగ్లం) బెస్ట్సెల్లర్గా నిలిచింది. వెల: ఒక్క రూపాయి. ఇది చెల్లించలేనివాళ్లు అణాతో 24 పేజీల సారాంశం చదువుకోవచ్చు. వారంలోనే దీన్ని దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించడానికి అనుమ తులు కోరుతూ లేఖలు రాసాగాయి. కె.జి.చౌబాల్ అనే మరాఠీ జర్నలిస్టు ‘మాతృదేశ సేవ’ కోసం తన సేవలను వాడుకోవాలని రాశాడు. ఈ పుస్తకం వెల్లడించే మరో కోణం, ‘ఇండియన్ యూనియన్’కు సమాంతరంగా, అప్పటికి స్వతంత్రంగానే ఉండదలిచిన సంస్థానాల్లో కూడా రాజ్యాంగ రచన ఎలా జరిగిందో వివరించడం. సంస్థానాలకు రాజ్యాంగ సభ 93 ప్రాతినిధ్య స్థానాలను ఇచ్చిన ప్పటికీ, తమను తాము ప్రజాస్వామీకరించుకోవడంలో భాగంగా అవి ఈ ప్రక్రియ చేపట్టాయి. రాంపూర్ పాలకుడు తన ప్రజలకు భావస్వేచ్ఛతో సహా తొమ్మిది ప్రాథమిక హక్కులను ప్రసాదించాడు. రత్లామ్ రాజ్యాంగం ఉచిత ప్రాథమిక విద్యను రాజ్య బాధ్యతగా పేర్కొంది. ‘మేము ఇప్పటివరకు తమ సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకున్న 75 సంస్థా నాలను గుర్తించాం’ అంటారు రచయితలు.ఇంకా న్యాయమూర్తులు ఎలా భాగమయ్యారు; ట్రూమన్తో సహా అమెరికా, యూకే, ఐర్లాండ్, కెనడా నాయకులు, న్యాయనిపుణుల ఫీడ్బ్యాక్ తీసు కోవడం ద్వారా రాజ్యాంగపు ఫస్ట్ డ్రాఫ్ట్ రూపొందించిన సర్ బి.ఎన్.రావు ఇండియా రాజ్యాంగాన్ని ‘ప్రపంచ వేదిక’కు ఎలా పరిచయం చేశారు; ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులు తమ హక్కుల కోసం ఎలా నిల బడ్డారు లాంటి అంశాలను విపులంగా చర్చించిన ఈ పుస్తకం రాజ్యాంగపు బహుముఖ పార్శా్వలను తెలుసు కోగోరేవారికి ఆసక్తి కలిగిస్తుంది. కోట్ల మంది ఆశలను ఒక దగ్గర గుదిగుచ్చడం ఎంత దుర్భరమో, అబ్బు రమో కూడా అర్థమవుతుంది. తర్వాతి రాజ్యాంగ సవరణలు ఈ ప్రజా చైతన్యపు కొనసాగింపే!ఎడిటోరియల్ టీమ్అసెంబ్లింగ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్: ఎ న్యూ డెమాక్రటిక్ హిస్టరీరచయితలు -
సామ్రాజ్యవాద దురహంకారం
తన దుందుడుకు చర్యతో, దుష్ట పోకడతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని సంక్షోభం ఊబిలోకి నెట్టేశారు. వెనిజులా రాజధాని కారకాస్తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి అమెరికా సైన్యం భీకర దాడులకు దిగి అధ్యక్షుడు నికోలస్ మదురోనూ, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్నూ కళ్లకు గంతలు కట్టి, బేడీలు వేసి అపహరించుకుపోయింది. ఆయన ‘మాదకద్రవ్య ఉగ్రవాదానికి’ పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు చేసి న్యూయార్క్లో బంధించింది. అమెరికా సామ్రాజ్యవాద దురహంకారం ప్రపంచానికి కొత్తగాదు. ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలు అనేకం దాని వాతబడ్డాయి. కుట్రలు చేసి దేశాధినేతల్ని హతమార్చటం, ప్రజాస్వామ్యం డ్రామాలు నడిపి వ్యవస్థల్ని కూల్చేయటం దానికి మంచినీళ్ల ప్రాయం. నాలుగు దశాబ్దాల నాడు తానే అధికారంలో ప్రతిష్ఠించిన పనామా అధ్యక్షుడు ఆంటోనియో నొరీగాను ఇదేవిధంగా దాడిచేసి అరెస్టు చేసింది. కానీ నొరీగా దాని కీలుబొమ్మ. అమెరికా చర్యల పర్యవసానంగా ఇటీవలి దశాబ్దాల్లో ఇరాక్, లిబియా, అఫ్గానిస్తాన్ నెత్తుటి ముద్దలయ్యాయి. ట్రంప్ తాజా చర్య వాటన్నిటినీ తలదన్నింది.వందలాది మంది సీఐఏ ఏజెంట్ల ద్వారా అధ్యక్షుడి భద్రతను చూస్తున్న దళాలను లోబరు చుకుని, అధ్యక్షుణ్ణి భార్యాసమేతంగా అపహరించటం నికృష్టం. ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రెజ్ను ‘మదురోను మించిన ప్రారబ్ధం చవిచూడాల్సి వస్తుంద’ని హెచ్చరించటం, ఆమె ఈ అవమానాన్ని దిగమింగు కుని ‘కలిసి పనిచేద్దామ’ని స్నేహహస్తం చాచడం ఈ విషాదానికి కొనసాగింపు.దేశాల మధ్య సమస్యలొస్తే శాంతియుతంగా పరిష్కరించుకోవటానికి సిద్ధపడకుండా ఏకపక్షంగా దాడులకు పాల్పడటం, దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి అధినేతను అపహరించటం ఉగ్రవాదం. అలాంటి చర్యలు ప్రపంచ శాంతిని భగ్నం చేస్తాయి. కానీ పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రధాన స్రవంతి మీడియా ఈ పరిణామాలను సాధారణ విషయంగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి. మదురో పెద్ద నియంతంటూ ప్రచారం లంకించుకున్నాయి. ట్రంప్ దరిదాపుల్లోకి రాగల నియంత ప్రపంచంలో ఉంటాడా? చావెజ్ వారసుడిగా 2013లో అధికారంలోకొచ్చిన మదురో నియంత అనటం పచ్చి బూటకం. 2019 ఏప్రిల్లో ‘తిరుగుబాటు’ చేసి అధికారంలోకొచ్చానని ప్రకటించుకున్న గెయిడో సాయుధ బృందం రక్షణలో రాజధాని కారకాస్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నా జనం నవ్వుకున్నారు. పోలీసులూ, సైనికులూ అతగాణ్ణి ఏమీ అనలేదు. చివరకు మదురో స్వయంగా పిలిచి నవ్వుతూ తలమీద ఒక్కటిచ్చి పొమ్మన్నారు. వేరే దేశంలో ఎక్కడైనా అది ఉరికంబం ఎక్కేంత తీవ్ర నేరం. కనీసం యావజ్జీవం జైల్లో మగ్గేంత అపరాధం.వెనిజులా ప్రజలు 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకొచ్చాక దశాబ్దాల దారిద్య్రం నుంచి విముక్తులయ్యారు. ఆయన హయాంలో దారిద్య్రం ఒక్కసారిగా 70 శాతానికిపైగా తగ్గింది. నిరుద్యోగం సగానికి సగం పడిపోయింది. పెన్షన్లు నాలుగు రెట్లు పెరిగాయి. అక్షరాస్యత వంద శాతానికి చేరుకుంది. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఆహారభద్రత అక్కడ ప్రాథమిక హక్కులు. దాదాపు వందేళ్లపాటు దేశ సంపదనంతా తరలించుకుపోయిన అమెరికా చమురు కంపెనీలను చావెజ్ స్వాధీనం చేసుకోవటంవల్లే ఇదంతా సాధ్యమైంది. అప్పటినుంచి అమెరికా కడుపుమంట మొదలైంది. అమెరికా ఆంక్షల వల్ల వెనిజులా దీర్ఘకాలంగా సమస్యలకు ఎదురీదుతోంది. ప్రాణావసర మందులు కరువై లక్షమంది ప్రజలు మరణించారు. దారిద్య్రాన్ని తట్టుకోలేక 80 లక్షల మంది దేశం వదిలిపోయారు. ఇటీవల మదురో చర్యలు వ్యాపార వర్గాల ప్రయోజనాలకు తోడ్పడుతున్నాయన్న విమర్శలున్నాయి. అయితే మదురో చైనా కరెన్సీ యువాన్లలో వాణిజ్యం నెరపడం, చైనా, రష్యా, ఇరాన్లతో జతకట్టడం, బ్రిక్స్లో చేరేందుకు సంసిద్ధం కావటం అమెరికాను కలవరపరిచాయి. అత్యధిక చమురున్న దేశం ఎదిగేలా కనబడటంతో డాలర్ను కాపాడుకోవటానికి అమెరికా ఈ తప్పుడు చర్యకు దిగింది. ఇవాళ వెనిజులా వంతు. రేపు మెక్సికో, క్యూబా, గ్రీన్ల్యాండ్... ఏదైనా కావొచ్చు. అందుకే అమెరికా చర్యను ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలి. ఆధునిక కాలంలో అనాగరిక పోకడలు చెల్లబోవని చాటాలి. -
నూటా నలభై
‘నేను బూడిదగానైనా మిగులుతానుగానీ మట్టిగొట్టుకుపోను’ అన్నాడు జాక్ లండన్. బతికినన్నాళ్లూ అగ్నిజ్వాలలా బతికాడు. లోకాన్ని మెరుపులా చుట్టాడు. చేయగలిగిన పనులన్నీ చేశాడు. యాక్టివిస్టు, సాహస యాత్రికుడు, యుద్ధక్షేత్రంలో విలేఖరి; నావికుడు, పేపర్ బాయ్, బొగ్గు గని కార్మికుడు, ఐసు బండి డ్రైవరు, వలస కూలీ, ఫొటోగ్రాఫర్, గోల్డ్ డిగ్గర్ లాంటి రెండు డజన్ల పనులు చేశాడు. నియమంగా రోజుకు వెయ్యి పదాలైనా రాసేవాడు. నవలలు, జ్ఞాపకాలు, కథలు, నాటకాలు, కవిత్వం, వ్యాసాలతో సుమారు 50 పుస్తకాలు వెలువరించాడు. తన కాలంలో అత్యంత ప్రభావశీల అమెరికా రచయితగా వెలిగాడు. కానీ నలభై ఏళ్లకే మరణించాడు. నిండు నూరేళ్లు జీవించాల్సిన మనిషి నలభై ఏళ్లకే కాలగర్భంలో కలిసిపోవడమేమిటి? కాలానికి ఏ కనికరమూ ఉండదేమో! లేదా, దాని లెక్కలు మనకు అర్థం కావేమో! ఏ లెక్కలూ పాటించని కాలాన్ని మన లెక్కల్లోకి తీసుకునే ప్రయత్నంలో దానికి లేని లక్షణాలను ఆపాదిస్తామేమో! ఫ్రాంజ్ కాఫ్కా, ఎడ్గార్ అలెన్ పో, కాథరీన్ మాన్స్ఫీల్డ్; జాన్ కీట్స్, ఎమిలీ బ్రాంటే, పి.బి.షెల్లీ, లార్డ్ బైరన్; స్వామి వివేకానంద; అలెగ్జాండర్; మొజార్ట్; బ్రూస్ లీ, మార్లిన్ మన్రో; మాల్కమ్ ఎక్స్, మార్టిన్ లూథర్ కింగ్; త్రిపురనేని శ్రీనివాస్, నాగప్ప గారి సుందర్రాజు, చిత్రకొండ గంగాధర్– వీళ్లంతా కూడా నలభై ఏళ్లు దాటకుండానే ఈ అవనీ తీరం దాటేసినవారు!నలభై ఏళ్లంటే మనిషి సరిగ్గా పక్వానికి వచ్చే వయసు. అన్ని బాల్య, యవ్వన చాపల్యాలను అధిగమించి నింపాదితనాన్ని సంతరించుకునే వయసు. జీవితాన్ని అత్యంత సమీపంగా దర్శించే వయసు. స్వీయ అనుభవాల వెలుతురులో గత చీకట్లను తరచి చూసుకునే వయసు. తాను నేర్చుకున్నదానికీ, తన జీవిత పాఠాలకూ మధ్యగల తేడాను నిశితంగా పట్టుకుని, తనదైన చింతనకు రూపు కట్టుకునే వయసు. ఉరుకులాటలు, వెంపర్లాటలు తగ్గి తనదైన స్థిమితాన్ని నెలకొల్పుకునే వయసు. అవసరం రీత్యా వేసుకున్న అన్ని మేకప్పులనూ కరిగించుకునే వయసు. స్పష్టమైన, స్థిరమైన గొంతును ఏర్పరుచుకునే వయసు. లోకానికి ఏదైనా కచ్చితంగా చెప్పగలిగే వయసు. కానీ వీళ్లెవరూ ఈ వయసుకు చేరకుండానే అంతకుమించిన పరిణతిని చూపారు, మహాద్భుతాలు చేశారు. కాలం కఠినాత్మురాలే కాదు, కరుణామయి కూడానేమో. వాళ్లకు పుట్టుకతోనే నూరేళ్ల వివేకాన్ని ఆశీర్వదించింది. అట్లా వాళ్లు నూటా నలభై ఏళ్లు బతికేసి వెళ్లారు.‘ద కాల్ ఆఫ్ ద వైల్డ్’, ‘ద సీ–వూల్ఫ్’, ‘వైట్ ఫాంగ్’, ‘ది ఐరన్ హీల్’ లాంటి నవలలు రాసిన జాక్ లండన్ 1876లో జన్మించాడు. ఈ జనవరి 12తో 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. కిడ్నీ ఫెయిలై, స్కర్వీతో ముందటి నాలుగు పళ్లు కోల్పోయి, ఇష్టపడి కట్టుకున్న ఇల్లు తుదిదశలో అగ్ని ప్రమాదంలో కాలిపోయి, డిసెంట్రీ, యురేమియా లాంటి అనారోగ్యాలతో బాధపడుతున్నప్పటికీ తాను చేయగలిగింది చేసిపోయాడు లండన్. గొగోల్, చెకోవ్, డి.హెచ్.లారెన్స్, ఎఫ్. స్కాట్ ఫిట్జ్గెరాల్డ్, సాదత్ హసన్ మంటో లాంటివాళ్లంతా కూడా నలభైల్లోనే వెళ్లిపోయారు. ఇంకా యుద్ధ క్షేత్రాల్లో, విప్లవ రణరంగంలో, సామాజిక కార్యాచరణలో తమ నిండు యవ్వనాల్ని బలిచ్చిన జ్ఞాత, అజ్ఞాత తేజోదివ్వెలు ఎన్నో! వీళ్లు ఇంకా కొన్నేళ్లు బతికివుంటే మరింత వెలుగు కురిసేదా? అసలు, కురిసినదే చాలినంతా? ఏ కారణాల వల్లయినా వీళ్లు లోకం వీడొచ్చుగాక! ఈ వెళ్లిపోవడంలో బాధతో పాటు, అబ్బురం కలగలిసి ఉండటం ఒక వైచిత్రి. పాతుకుపోతున్నకొద్దీ అంటే ఈ లోకపు మకిలిని పులుముకోకుండానే, ఇంకా లోకం వారిపట్ల సంభ్రమంగా కళ్లు విప్పార్చుతున్నప్పుడే వెళ్లిపోవడం ఇందులోని మరో పార్శ్వం. డాట్ బాల్స్ ఆడుతూ విసుగెత్తించకుండా, సిక్సులతో మైదానాన్ని హోరెత్తిస్తూ రిటైర్ కావడం లాంటిదది. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమిది నాటకము అని అన్నమయ్య ఏ అర్థంలో పాడినా, నాటకం లాంటి ఈ జీవిత రంగస్థలం మీద ఉజ్జ్వలంగా, ధగద్ధగాయమానంగా తమ పాత్రను వెలిగించి నిష్క్రమించారు. సెల్యూట్! -
ఇది పురోగమనమా... తిరోగమనమా?
ఇరవయ్యొకటో శతాబ్దంలో పాతికేళ్ల కాలం కరిగిపోయింది. ఇంకో ఇరవయ్యొక్క సంవత్సరాలు ఓపిక పట్టండి, భారత దేశాన్ని సూపర్ పవర్ చేసి చూపిస్తామని మన అధినేతలు అర చేతుల్లోనే వైకుంఠ దర్శనాలు చేయిస్తున్నారు. వైవిధ్య భారత దేశం వలస పాలన సంకెళ్లు తెంచుకొని అప్పటికి (2047) వందేళ్లు పూర్తవుతాయి. మనదేశం శతమాన స్వతంత్ర భారత మవుతుంది. అధినేతలు ‘అదివో అల్లదివో’ అంటూ ఆకాశం వైపు చూపెడుతున్నట్టు సూపర్ పవర్గా భారత్ ఆవిష్కృతమైతే ఆనందపడని పౌరుడెవరుంటారు? కానీ, ఆ గమ్యం చేరేందుకు ముందుగా స్వాతంత్య్రోద్యమం నాటి ఆకాంక్షలు నెరవేరవలసి ఉంటుంది. దేశ బహుళత్వ స్వభావంలోంచి ఒక ఏకత్వ భావనను పెంపొందింపజేయడం స్వతంత్ర భారతానికి తొలి సవాల్గా ఎదురైంది. అభివృద్ధి క్రమంలో హస్తిమశకాంతరాలున్న ప్రజలు, ప్రాంతాల మధ్య సమన్వయం కూర్చడం ఒక పెద్ద బాధ్యత. బ్రిటిష్ వాళ్ల ప్రత్యక్ష పరిపాలనలో కునారిల్లిన ప్రాంతాలు ఒక పక్కన, ఫ్యూడల్ దోపిడీకి నెలవైన వందలాది స్వదేశీ సంస్థానాలు మరో పక్కన! ఈ రెండింటినీ ఒకే చట్టంతో ముడివేసి ఒక దేశంగా ముందుకు నడవ్వలసిన సందర్భం అది. విభిన్న మతవిశ్వాసాలూ, భాషా సంస్కృతులూ చేతులు కలిపి గంగాయమునా సంగమ శ్రుతిలో ప్రవాహ గీతం పాడుకోవా లని బాస చేసుకున్న సన్నివేశమది. అమానవీయమైన స్థాయిలో ఏర్పడిన ఆర్థిక అంతరాలను తొలగించడానికి అందరికీ సమానా వకాశాలు లభించే విధంగా ఒడంబడిక చేసుకున్న ఓ అరుదైన ఘట్టం. కదిలే కాలంతో నాటి స్వరాజ్య భానూదయం ఒక చరిత్రాత్మకమైన ఒప్పందాన్ని చేసుకున్నది.మహాదార్శనికుడైన పండిత జవహర్లాల్ నెహ్రూ మాటల్లో అదొక ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’. ప్రపంచమే ప్రణమిల్లిన గాంధీ మహాత్ముని ఆశయాలకు అధికారిక హోదా కల్పించాలని నిర్ణయం తీసుకున్న ముహూర్తం. ఈ నేపథ్యంలో రూపుదిద్దు కున్నదే భారత రాజ్యాంగం. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 389 మంది రాజ్యాంగ సభ సభ్యుల మేధోశ్రమను మథించి, ప్రపంచంలోని ప్రజాస్వామ్య రాజ్యాంగాలను పరిశో ధించి, దేశ అభివృద్ధి క్రమానికి అవసరమైన రీతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియుల మాగ్నాకార్టాగా పరిగణన పొందిన పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని చేకూర్చాలనీ, భావ ప్రకటనతోపాటు విశ్వాస ఆరాధనా స్వేచ్ఛ అందరికీ ఉండాలనీ, అవకాశాల్లో, హోదాల్లో అందరి మధ్యన సమానత్వం పరిఢ విల్లాలనీ, వ్యక్తిగత గౌరవ మర్యాదలతో అందరి మధ్యన సౌభ్రా తృత్వం వెల్లివిరియాలనీ రాజ్యాంగం ఆకాంక్షించింది.ఈ రాజ్యాంగ లక్ష్యాలు పూర్తిగా సఫలమైన రోజున సుశిక్షితులూ, నిపుణులైన ప్రజలు దేశ జనాభాకు తగినట్టుగా అభివృద్ధి పథంలో కూడా దేశాన్ని నంబర్వన్ స్థాయిలో నిలబెట్ట గలుగుతారు. నూటా నలభై కోట్ల జనాభా ఉన్న దేశానికి సూపర్ పవర్ హోదా అసాధ్యమైనదేమీ కాదు. కావలసినదల్లా ప్రజల్లో సౌభ్రాతృత్వం, విశ్వాస – ఆరాధనా స్వేచ్ఛ, సమాన స్థాయిలో లభించే అవకాశాలు. ఈ రాజ్యాంగ లక్ష్యాలు నెరవేర్చే క్రమంలో మనం ఎక్కడున్నామనే విషయం తెలిస్తే సూపర్ పవర్ హోదా ఇంకెంత దూరంలో ఉన్నదో అర్థమవుతుంది. ప్రజల్లో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని నిరుపేదరికం తగ్గి వుండవచ్చు నేమో. కానీ, ఆర్థిక అసమానతలు నాటికంటే నేడు మరింత పెరిగాయి. అసమానతల పెరుగుదలలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉన్నదని నాలుగు రోజుల క్రితం విడుదలైన ప్రపంచ అసమానతల నివేదిక స్పష్టం చేసింది. రాజ్యాంగం అభిలషించిన సౌభ్రాతృత్వ భావన అంతరించే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నది. ‘హిందూ రాష్ట్ర’ సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన ఆరెస్సెస్ ప్రభుత్వ అండదండలతో దేశ ఆయువుపట్టు వంటి పార్శ్వాల్లోకి ఎలా పాకిందో వెల్లడిస్తూ వారం రోజుల క్రితం ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక పరిశోధనా కథనాన్ని బ్యానర్ స్టోరీగా ప్రచురించింది.‘బ్రిటిష్ రాజ్’ నాటి ఆర్థిక అసమానతల కంటే నేటి ‘బిలియనీర్ రాజ్’లో భారతదేశ ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నాయని అసమానతలపై ప్రపంచ నివేదిక – 2026 వ్యాఖ్యా నించింది. భారతదేశంపై నివేదికలను రూపొందించడంలో థామస్ పికెట్టీ వంటి ప్రసిద్ధ ఆర్థికవేత్తలు భాగం పంచు కున్నారు. వార్షిక ఆదాయాన్ని మాత్రమే లెక్కగట్టి రూపొందించే ప్రపంచ బ్యాంకు నివేదికలకు భిన్నంగా ఆదాయం, సంపదలతో పాటు అనేక ఆర్థిక కార్యకలాపాలపై విస్తృత అధ్యయనం చేసి రూపొందించిన నివేదిక ఇది. ‘బ్రిటిష్ రాజ్’తో పోల్చితే 1980వ దశకం నాటికి దేశంలో ఆర్థిక అసమానతలు బాగా తగ్గాయని ఈ నివేదిక వెల్లడించింది. సంఘ్ పరివార్ నిత్యం ఆడిపోసుకునే నెహ్రూ విధానాలు అమలైన కాలం కూడా ఇదే కావడం గమనించతగ్గది. దేశంలో ఆర్థిక అసమానతలు బాగా పెరగడం 2000 సంవత్సరం తర్వాత మొదలైంది. 2014–15 నుంచి 2022–23 మధ్యకాలంలో ఈ పెరుగుదల రాకెట్ వేగాన్ని అందుకున్నది. ప్రస్తుతం దేశ వార్షికాదాయాల్లో 22.6 శాతం ఒక్క శాతం జనాభా ఉన్న అగ్రశ్రేణి సంపన్నులే దక్కించుకున్నారు. అయితే జాతి సంపదలో వీరి దగ్గర పోగుపడిన సంపద 40.1 శాతం. ఒక్క శాతం కుబేరుల చేతిలో 40.1 శాతం సంపద కేంద్రీకృత మైంది. ప్రపంచంలో మరే దేశంలోనూ టాప్ ఒక శాతం కుబే రులు ఈ స్థాయిలో దండుకోలేకపోయారు. ఇందులో గోల్డ్ మెడల్ భారత్దే! దేశంలోని ఈ కుబేరుల మీద సంపద పన్ను వేసి ప్రభుత్వం ఆ సొమ్మును ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి రంగాల్లో పెట్టుబడిగా పెట్టాలని ఈ నివేదిక సూచించింది. దేశంలో కేవలం 167 మంది అగ్రశ్రేణి కుబేరుల మీద రెండు శాతం పన్ను వేసినా వచ్చే మొత్తం దేశ వార్షికాదాయంలో 0.5 శాతానికి సమానమట! దీన్ని విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వం ఖర్చు చేయాలని ఈ ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఖర్చుపెట్టి అభివృద్ధి చేసిన మెడికల్ కాలేజీలను ప్రోత్సాహకాలిచ్చి మరీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలంటున్న చంద్రబాబు ఆర్థిక విధానాలకూ, ఈ ఆర్థికవేత్తల సూచన పూర్తి విరుద్ధంగా ఉండడం మరో గమనించదగిన అంశం.ఈ నివేదిక ప్రకారం దేశంలోని టాప్ 10 శాతం సంపన్నుల చేతిలో 65 శాతం సంపద పోగైంది. కిందిస్థాయిలో ఉండే 50 శాతం మంది పేదల మొత్తం సంపద దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే. మధ్యశ్రేణిలో ఉండే 40 శాతం మంది స్థితిమంతుల వాటా 32 శాతం. భారతదేశంలో ఆర్థిక వ్యవహారా లకు సంబంధించిన గణాంకాలు సమగ్రంగా అందుబాటులో ఉండవనీ, వాస్తవానికి అసమానతలు తాము చెబుతున్నదానికంటే మరింత ఎక్కువ ఉండే అవకాశముందనీ ఈ నివేదిక అభిప్రాయపడింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ జమానాకు ‘బిలియనీర్ల రాజ్’గా అసమానతల నివేదిక నామకరణం చేసింది. ‘బ్రిటిష్ రాజ్’ జమానాలో ఏర్పడిన ఆర్థిక అసమానతల రికార్డును మన ‘బిలియనీర్ల రాజ్’ బద్దలు కొట్టింది.‘బిజినెస్’ చేయడం ప్రభుత్వాల బిజినెస్ కాదనే ఆకర్ష ణీయమైన కొటేషన్ల మాటున కీలకమైన ప్రభుత్వరంగ సంస్థ లను సైతం ప్రైవేట్ వ్యాపారులకు కట్టబెట్టడానికి ఎన్డీఏ సర్కార్ ఓ పాలసీని కూడా తీసుకొచ్చింది. ఆటమిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ రంగాల పరిశ్రమలు కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమం నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. చివరకు గత రెండు దశా బ్దాలుగా గ్రామీణ పేదలకు ఆసరాగా నిలిచి, వలసలకు కొంత మేర అడ్డుకట్ట వేసిన ‘నరేగా’ను సైతం సర్కార్ నిర్వీర్యం చేసింది. డిమాండ్ను బట్టి ఉపాధి కల్పించే కూలీల హక్కును ఈ పథకం నుంచి తొలగించింది. పథకం అమలుకయ్యే వ్యయంలో 40 శాతం రాష్ట్రాలే భరించాలనడంతో నిజస్వరూపం వెల్లడైంది. పథకాన్ని నామమాత్రం చేయడం ఎన్డీఏ ఆర్థిక ప్రాధాన్యతలకు అద్దం పడితే, పథకం పేరులోంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం దాని సైద్ధాంతిక విధానంగా పరిగణించవచ్చు. ఆరెస్సెస్ భావజాలం ప్రభావం వల్లనే మహాత్ముడిని గాడ్సే హత్య చేశాడన్న ఆరోపణను నాడు ఆరెస్సెస్ ఖండించింది. ఇప్పుడో కీలకమైన పథకం నుంచి ఆయన పేరును తొలగించడం వెనుక ఆ భావజాలం ప్రమేయం లేదని మాత్రం ఆరెస్సెస్ ఇప్పటి దాకా ఖండించలేదు. డిసెంబర్ 29వ తేదీనాడు ‘న్యూయార్క్ టైమ్స్’ బ్యానర్ స్టోరీగా ప్రచురించిన కథనం ప్రధానమంత్రి పంద్రాగస్టు అధికా రిక ప్రసంగాన్ని ఉటంకించడంతో మొదలైంది. ఆ ప్రసంగంలో ప్రధానమంత్రి ఆరెస్సెస్ను ఒక గొప్ప సేవా సంస్థగా ఆకాశాని కెత్తారు. మోదీ వంటి శక్తిమంతుడైన ప్రధానమంత్రి సుస్థిర పాలనను ఆసరా చేసుకొని ఆరెస్సెస్ బాగా బలపడిందని ఈ కథనం వ్యాఖ్యానించింది. పోలీసులు, రక్షణ శాఖ, ఉన్నతోద్యో గులు, వ్యాపారులు... ఇలా అన్ని రంగాల్లో చిన్న చిన్న ఉప సంఘాల పేరుతో ఆరెస్సెస్ చొచ్చుకొనిపోయిందనీ, దాదాపు రెండు వేల వరకు దాని ఉపసంఘాలు చురుగ్గా పని చేస్తున్నాయనీ, వీటి ప్రభావం వల్ల దేశంలో విద్వేష పూరిత వాతావరణం నెలకొన్నదనీ, దాడులు ముస్లిమ్ల వరకే పరి మితం కాలేదు... మతమార్పిడి బూచీని చూపెట్టి చర్చిల మీద, క్రైస్తువుల మీద, క్రిస్మస్ ఉత్సవాల మీద యథేచ్ఛగా దాడులు జరిగాయనీ పత్రికా కథనం ఆరోపించింది. పత్రిక ఆరోపణే కాదు, ఇవన్నీ మన అనుభవంలోకి వచ్చిన తాజా సంఘటనలే!ప్రజలందరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం అనే ఆశయం ఆచరణలో అభాసుపాలైంది. సమాజంలో సౌభ్రాతృత్వం స్థానాన్ని విద్వేషం ఆక్రమిస్తున్నది. అయినా మనం రాజ్యాంగబద్ధ పాలనలోనే ఉన్నామా అనే అనుమానం తొలుస్తు న్నది. అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నా, ఉపాధి – ఉద్యో గాలు కొరవడుతున్నా, జాతి సంపదలు ప్రైవేట్ కార్పొరేట్ శక్తు లకు కైంకర్యం అవుతున్నా, పేద, మధ్యతరగతి ప్రజలు నాణ్య మైన విద్యా, వైద్య సౌకర్యాలకు దూరమవుతున్నా, వ్యవసాయ రంగం కుదేలై రైతాంగం వధ్యశిలలపై నిలబడి ఉన్నా పాలక పక్షాలకు జనం సమ్మతి ఎలా లభిస్తున్నది? తమ పాలనపై నోరెత్తే వారిని దండించడానికి అధికార పక్షాలకు ఒక చేతిలో రెడ్ బుక్ ఉన్నట్టే, తటస్థులను సంతృప్తిపరచడానికి మరో చేతిలో ప్రవచనాల పుస్తకం కూడా ఉంటుంది. మతం పేరుతో,సంస్కృతి పేరుతో, ఆచారాల పేరుతో పౌర సమాజాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఇది అక్కరకొస్తుంది. దీన్నే ఆధిపత్య భావజాలం అంటారు. పౌర సమాజాన్ని ఆధిపత్య భావజాలం నియంత్రిస్తున్నంత కాలం పరిపాలన పురోగమనంలో ఉన్నదా తిరోగమనంలో ఉన్నదా అనే సంగతి జనానికి పట్టకపోవచ్చు. పౌర సమాజంలోని అన్ని పార్శ్వాలను దానికి అర్థమయ్యే భాషలో చైతన్యపరచకుండా మన జాతీయ ప్రతిపక్ష నాయకుడి మాదిరిగా అడపాదడపా స్వయం ప్రకటిత బాంబుల్ని ప్రయోగి స్తానంటే ప్రయోజనం ఉండదు. ఇప్పటికే ఆయన పేలని బాంబుల పేరయ్యగా మిగిలిపోయారు. ప్రగతిశీలమైన భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని అమలుచేసే శక్తులు సమీప భవిష్యత్తులో ముందుకు వస్తాయా? లేక ఆ రాజ్యాంగమే కొంత కాలానికి అదృశ్యమయ్యే రోజును చూస్తామా అనేదే నేడు మనముందున్న కీలకమైన మీమాంస!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
సంరక్షణ లేని ‘సంక్షేమం’!
నరదృష్టికి నాపరాళ్లయినా పగులుతాయంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏణ్ణర్ధం నుంచి ప్రజల్ని పాలించటం కాదు... వారిని బాధించటమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారువారి వక్రదృష్టి సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలపై కూడా పడింది. అందుకే 3,878 ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో చదువుకుంటున్న దాదాపు ఆరున్నర లక్షలమంది విద్యార్థులు అవస్థల పాలవుతున్నారు. వెన్నుపోటుతో అధికారానికి ఎగ బాకినా, కూటమి పేరుతో అందలం ఎక్కినా చంద్రబాబుకు సంక్షేమం పేరు వింటే తేళ్లూ జెర్రులూ పాకినంత పనవుతుంది. అందుకే ఆయన ఏలుబడిలో అరకొర వసతులు, అర్ధాకలి బతుకులతోనే పిల్లల చదువులు తెల్లారుతున్నాయి. ఈసారి కూడా మినహాయింపు లేదు.సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో ఇటీవలి కాలంలో 45 మంది పిల్లలు చనిపోయిన విషయమై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయటంతోపాటు ఈ విషయంలో సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజానికి ఇలాంటి ఆదేశాలివ్వటం ఇది మొదటిసారేమీ కాదు. నిరుడు జూలైలో హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన సందర్భంలో సైతం మౌలిక సదుపాయాల సమస్యను అధిగమించేందుకు మీ దగ్గరున్న ప్రణాళికేమిటో చెప్పాలంటూ ఇచ్చిన ఆదేశా లకు ఇంకా అతీగతీ లేదు. హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు శతాబ్దాలుగా విద్యాగంధానికి నోచుకోని బడుగు, బలహీనవర్గాలకు చెందినవారు. ఊరికి మాత్రమే కాదు, విద్యకు కూడా వెలిగా బతుకులు వెళ్లదీసిన ఆ వర్గాలవారికి ప్రామాణిక విద్యనందించటంతోపాటు మెరుగైన ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించటం ప్రభుత్వాల బాధ్యత కావాలి. పిల్లల మరణానికి దారితీస్తున్న అనారోగ్య సమస్యలు మరీ పెద్దవేమీ కాదు. జ్వరం, కడుపు నొప్పి, వివిధ సాంక్రమిక వ్యాధులు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, పౌష్టికాహారం అందించ గలిగితే, నిర్ణీత వ్యవధిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటే... ఈ వ్యాధులు దరిచేరే అవకాశం ఉండదు. ఆ మాత్రం చేయటం కూడా చేతగాని ప్రభుత్వం రేపటి పౌరుల ఉసురు తీస్తోంది. ఈ మరణాలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన రోజే అన్నమయ్య జిల్లా రాయవరం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 34 మంది పిల్లలు మధ్యాహ్న భోజనం తిని తీవ్ర అస్వస్థతకు లోనవటం బాబు నిర్వాకానికి అద్దం పడుతోంది. వెలుగూ వికాసమూ లేక చీకట్లో మగ్గిన తమ మాదిరిగా పిల్లలుండొద్దని, వారు మెరుగైన జీవితం గడపాలన్న ఆరాటంతో తల్లిదండ్రులు తమ కంటిపాపలను దూరమైనా పంపుతున్నారు. అలాంటివారిని ఎంత సున్నితంగా చూసుకోవాలో, ఎంత సురక్షితమైన సదుపాయాలు కల్పించాలో తెలియని చర్మం మందం సర్కారిది. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో మెరుగైన విద్యతోపాటు బడుల్లో, హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు నెల కొల్పారు. రుచికరమైన అల్పాహారం, భోజనం అందించారు. పరిశుభ్రమైన మరుగు దొడ్లు, స్నానపు గదులు నిర్మించారు. జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ప్రతి 15 రోజులకూ హాస్టళ్లు సందర్శించి రాత్రి బస చేయాలన్న నియమం పెట్టారు. అందుకే సమస్యలున్నా వెంటనే పరిష్కారమయ్యేవి. ఇప్పుడు అధికారుల సందర్శన మాట అటుంచి, అడిగే దిక్కూ మొక్కూ లేక హాస్టళ్లు బావురుమంటున్నాయి.ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల పప్పు, నాణ్యత లేని కూరగాయలతో వంట చేస్తుండటంవల్ల పిల్లల ఆరోగ్యం నాశనమై వారు అస్వస్థులవుతున్నారని ఆర్నెల్ల క్రితమే ‘సాక్షి’ కథనాలు వెల్లడించాయి. చాలామంది వార్డెన్లు సరుకులు అప్పు తెస్తున్నారని, సరైన స్నానపుగదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థినులు సైతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆ కథనాలు తెలిపాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ వంటి విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేశాయి. కానీ మారిందేమీ లేదు. మళ్లీ హైకోర్టు అక్షింతలు తప్పలేదు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న ఇంగితం కూడా కరవైంది. కార్పొరేట్లకూ, కాంట్రాక్టర్లకూ దోచిపెట్టే విధానాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలకాలి. హాస్టళ్లను సకల సదుపాయాలతో తీర్చిదిద్దాలి. లేనట్టయితే ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. -
ట్రంప్ అడుగుజాడల్లో చైనా
మంచేదైనా జరిగితే తమ ఖాతాలో వేసుకోవటానికి సిద్ధపడేవాళ్లు కోకొల్లలు. ఇది లోకో త్తర సత్యం. ఒకరకంగా అదొక వ్యాధి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఆ సమస్య ఉంది. తన ప్రమేయం లేకుండా ముగిసిన యుద్ధాలనూ, ఇంకా ముగియని యుద్ధాలనూ తానే ఆపానని చెప్పుకోవడంతోపాటు ఉనికిలో లేనివాటికి కూడా అడ్డుచక్రం వేశాననటం ఆయనకే చెల్లింది. ఆ బాణీ ఇంకా ఆపలేదు. ఇప్పుడు చైనా వంతు వచ్చినట్టుంది. 2025లో భారత్–పాక్ ఘర్షణలు నివారించటంతోపాటు అనేక ఇతర యుద్ధాలను ఆపిన ఘనత తమదంటూ తాజాగా వాంగ్–యీ ప్రకటించుకున్నారు. ఆ రెండు దేశాలూ అనేక రంగాల్లో పోటీపడుతున్నాయి. ఆర్థికంగా ఇప్పటికీ అమెరికాదే పైచేయి అయినా, రేపో మాపో దాన్ని చైనా అధిగమిస్తుందని ఎవరో కాదు... ఆర్థిక నిపుణులే దండోరా వేస్తు న్నారు. ఆ విషయంలో చైనాను ప్రశంసించాల్సిందే! అమెరికాతో పోలిస్తే ఎక్కడో అట్ట డుగునుండే దేశాన్ని 75 ఏళ్లలోనే ఈ స్థాయికి తీసుకురావటం మాటలు కాదు మరి. అంతమాత్రాన అమెరికా చెప్పే అబద్ధాలను కూడా వల్లెవేయటం వంటి చౌకబారు అనుకరణలు బెడిసికొడతాయని చైనా గ్రహించకపోవటం క్షమార్హం కానిది. కశ్మీర్లోని పెహల్గాంలో పాక్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు అనేకమంది అమాయ కులను పొట్టనబెట్టుకున్న వైనం తర్వాత గత ఏడాది మే మొదటివారంలో మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో అక్కడి ఉగ్ర స్థావరాలపై దాడులు చేయటం, దానికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మనపై దాడి చేసే ప్రయత్నం, మనం తిప్పికొట్టడం, ఎదురు దాడి చేయడం వంటివి జరిగాయి. చివరకు కుదిరిన కాల్పుల విరమణ వెనక రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్లు (డీజీఎంలు) ఉన్నారని మన దేశం చెబుతోంది. ఇలాంటి విషయాల్లో మూడో పక్షం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించ బోమని అప్పట్లోనే స్పష్టం చేసింది. నిజానికి ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా పాక్ సైన్యం వాడిన ఆయుధ సామగ్రిలో చైనా సరఫరా చేసినవి కూడా ఉన్నాయని అప్పుడే బయటపడింది. ఆ సామగ్రి 81 శాతం అని కూడా తేలింది. పాకిస్తాన్ మనపై ప్రయోగించిన ఆయుధ సామగ్రి చూశాక, ఈ ఘర్షణను ‘సజీవ ప్రయోగశాల’గా చైనా ఉపయోగించుకున్నట్టు కనబడుతోందని కూడా మన దేశం విమర్శించింది. అలాంటి దేశం ‘తగుదు నమ్మా...’ అంటూ ఇరుపక్షాల మధ్యా రాజీకీ దౌత్యం నెరపానని ఇప్పుడు గప్పాలు కొడుతోంది. లోపాయకారీగా ఘర్షణలను ఎగదోయటం, పైకి శాంతి వచనాలు వల్లించటం ఇటీవలి ధోరణేం కాదు. ఇలాంటి జిత్తులమారి ఎత్తుగడల్లో అమెరికా ఆరితేరింది. ఇజ్రా యెల్ సాగించే అన్ని దాడుల వెనకా ఆ దేశం ఉంటుంది. అవే దాడుల్ని ఆపినట్టు కనబడటంలో ముందుంటుంది. శాంతి సాధన కోసం ‘ఏ సమస్యనైనా వస్తునిష్ఠతో చూడటం, న్యాయమైన వైఖరి తీసుకోవటం’ తమ విధానమని... లక్షణాలనూ, మూల కారణాలనూ తొలగించటమే తమ ధ్యేయమని వాంగ్–యీ చెప్పుకున్నారు. డాలర్ ఇంకా శాసిస్తూనే ఉంది కనుక అమెరికా ఇలాంటి అబద్ధాలు చెప్పినా ఏదోమేరకు చెల్లు బాటవుతాయి. సుంకాలు పెంచుతామని బెదిరించానంటే ‘అవును కాబోలు...’ అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ చైనా సైతం ‘అన్నీ నేనే... అంతా నేనే’ అని అనటం ఎబ్బెట్టుగా ఉంటుంది. అదను చూసుకుని పక్కనున్న తైవాన్ను కబళించాలని ప్రయత్నిస్తూ, మనతో సరిహద్దుల్లో అకారణ వైరానికి దిగుతూ, అరుణాచల్ ప్రదేశ్లో గ్రామాల పేర్లు మార్చు కుని మురిసిపోతూ ఇలా తటస్థత నటించటం అనైతికత. చైనాకూ, తైవాన్కూ మధ్య రాజీ కుదర్చటానికి ప్రయత్నిస్తానని మన దేశం ముందుకొస్తే చైనా అంగీకరిస్తుందా? అధికారంలోకొచ్చిన నాటి నుంచీ నోబెల్ బహుమతి కోసం వెంపర్లాడటం ట్రంప్కు ఎక్కువైంది. బహుశా ఆయనకు మోకాలడ్డాలని చైనా ఏమైనా ప్రయత్నిస్తోందేమో! అలా చేయదల్చుకుంటే ట్రంప్ తప్ప వేరెవరూ చైనాను ఆటంకపరచరు. తామిచ్చే శాంతి బహుమతి సైతం ప్రతిష్ఠాత్మకమైనదిగా ఉండేలా చూసుకొనే బాధ్యత నోబెల్ కమిటీది. ఈలోగా లేని పెద్దరికాన్ని ప్రదర్శించటం వల్ల నవ్వులపాలు కావటం ఖాయమని అటు ట్రంప్, ఇటు చైనా తెలుసుకోవాలి. -
రాజకీయ రక్తబంధం
రాజకీయాల్లో శాశ్వత మిత్రులే కాదు... శాశ్వత శత్రువులు కూడా ఉండరు. అందులోనూ అధికారం విషయంలో రాజకీయాలను సైతం రక్తసంబంధాలు నిర్ణయిస్తాయని చరిత్ర చెప్పిన సత్యం. దేశంలోనే అత్యంత సంపన్న నగరపాలక సంస్థ ‘బృహన్ ముంబయ్ కార్పొరేషన్’ (బీఎమ్సీ) ఎన్నికలకు అతి కొద్ది వారాలే ఉన్న నేపథ్యంలో ఆ మహానగర రాజకీయ దృశ్యంలో అక్షరాలా అదే కనిపిస్తోంది. మహారాష్ట్రలోని రెండు అత్యంత శక్తిమంతమైన రాజకీయ కుటుంబాలు మళ్ళీ ఒక్కటయ్యాయి. చీలికలు పేలికలైన శివసేన, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లలో నిన్నటి దాకా కత్తులు దూసుకున్న పరస్పర ప్రత్యర్థి పవార్ కుటుంబ వర్గాలు, ఠాక్రే కుటుంబ వర్గాలు స్థానిక ఎన్నికలతో కలసి కాలు కదుపుతున్నాయి. దూరదృష్టి కన్నా రాజకీయ ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం, రక్తసంబంధం ఆసరాగా పొడిచిన ఈ కొత్త పొత్తులతో అధికార కూటమిలోని పార్టీలు, ప్రతిపక్షంలోని పార్టీలు తమలో తామే పోటీపడుతున్నాయి. చివరకు ఎవరు అధికార పక్షం, ఎవరు ప్రతిపక్షమనే స్పష్టత లేని పరిస్థితి. ఓటర్లే తికమకపడే దుఃస్థితి. ముందుగా ఉద్ధవ్ ఠాక్రే, శివసేన నుంచి 2006లో బయటకు వెళ్ళిపోయిన ఆయన సమీప బంధువు రాజ్ఠాక్రేలు దాదాపు రెండు దశాబ్దాల తమ శత్రుత్వానికి ఫుల్స్టాప్ పెట్టారు. ఇక, కొన్నేళ్ళుగా బాహాటంగా కత్తులు దూసుకున్న శరద్పవార్, ఆయన మేనల్లుడు అజిత్ పవార్కు మధ్య కూడా సంధి కుదిరింది. ఠాక్రేల విషయానికే వస్తే – ముందు నుంచి బాహాటంగా శుభాభినందనలతో మొదలుపెట్టి, ఉద్ధవ్ జన్మదిన సంద ర్భంగా 13 ఏళ్ళ తర్వాత మాతోశ్రీ నివాసానికి రాజ్ వెళ్ళడం దాకా ఓ పద్ధతి ప్రకారం రాజకీయ అడుగులు పడ్డాయి. అదేమంటే, మహారాష్ట్ర, మరాఠీ ప్రజల ప్రయోజనాల కోసమే ఈ పొత్తు అని నేతలిద్దరూ బల్లగుద్దారు. ఇప్పటికే మహారాష్ట్రపై పట్టు కోల్పోయిన ఠాక్రేలు ఉమ్మడి శివసేన కాలంలో కంచుకోట లాంటి ముంబయ్నైనా కాపాడుకోవడానికే ఒక లెక్కప్రకారం ఈ పనికి దిగారు. కొన్నేళ్ళ క్రితం ఏక్నాథ్ శిందే పార్టీని చీల్చి చావుదెబ్బ తీసి, బీజేపీతో దోస్తీ కట్టడంతో... పార్టీ పేరు, చిహ్నం సైతం కోల్పోయి, శివసేన (యూబీటీ) పేరిట ఆ మధ్య అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని నిలుపుకొనేందుకు ఉద్ధవ్ అస్తుబిస్తు అయ్యారు. మరోపక్క రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన సైతం అసెంబ్లీ ఎన్నికల్లో 1 శాతం చిల్లర ఓట్లే సంపాదించి, నామమాత్రావశిష్టమైంది. అందుకే, ఠాక్రేల కుటుంబానికి ఈ తాజా ఎన్నికల దోస్తీ రాజకీయ అనివార్యత. ముంబయ్, థానే, కల్యాణ్, ముంబయ్లోని ఇతర శివారు ప్రాంతాలతో పాటు పుణే, నాసికే, ఛత్రపతి శంభాజీ నగర్ తదితర ప్రాంతాల్లో నగరపాలిక ఎన్నికలు జరగ నున్నాయి. నిజానికి, ఇవంతా కలిపితే మొత్తం మహారాష్ట్రలో నాలుగోవంతు విస్తీర్ణం కూడా కాదు. కానీ, అనేక పరిశ్రమలకు నెలవైన అవి సంపన్న ప్రాంతాలు కావడంతో అన్ని పార్టీలకూ ఈ ఎన్నికలు కీలకమయ్యాయి. పవార్ల కుటుంబం సైతం కలిసింది అందుకే. రెండేళ్ళ క్రితం 2023లో పార్టీని చీల్చి, బహిరంగంగా వ్యక్తిగత విమర్శలకు దిగిన అజిత్ పవార్కు సైతం నిరుటి లోక్సభ ఎన్నికల్లో తలబొప్పి కట్టాక తత్వం బోధ పడింది. రాజకీయ ఆచరణవాదాన్ని ఆశ్రయించి, రానున్న పుణే, పింప్రీ – ఛింఛ్వాడీ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో శరద్ పవార్ పార్టీతో కలసి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండు పేరున్న రాజకీయ కుటుంబాల పునరేకీకరణ లక్ష్యం ఒకటే. బీజేపీ ప్రాబల్యానికి గండి కొట్టడమే. అది అంత సులభసాధ్యం అనిపించట్లేదు. చిత్రమేమంటే, బీజేపీ పాలిత రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉంటూనే బీజేపీపైన అజిత్ ఇలా పోటీకి దిగుతున్నారు. అలాగే శరద్ పవార్ తీర్చిదిద్దిన మహా వికాస్ అఘాడీలో ప్రధాన భాగమైన కాంగ్రెస్తో పవార్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. రాజకీయాలంటే అంతే. అక్షరాలా థ్రిల్లర్ సినిమా లాంటివి. అంతా సాఫీగా సాగుతోంద నుకున్నవేళ కథలో ఊహించని మలుపు చోటుచేసుకుంటుంది. అందులోనూ ఎన్నికల వేళ ఈ ట్విస్టులు నాటకీయతను పెంచుతాయి. కొత్త ఏడాది జనవరిలోనే వివిధ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున రానున్న రోజుల్లో ఇలాంటి పరిణామాలు మరిన్ని చోటుచేసుకోవడం ఖాయం. అటుపైన ఎన్నికల ఫలితాలను బట్టి మొత్తం కథే మారినా ఆశ్చర్యం లేదు. -
ఎవరు ప్రజాసేవకుడు?
కాలం మారుతుందనీ, రేగిన గాయాన్ని మాన్పుతుందనీ అనుకుంటాం. కానీ, అన్ని సార్లూ అది నిజం కాదు. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ ప్రాంత అత్యాచార కేసులో తాజా పరిణామాలు పాత గాయాన్ని మళ్ళీ రేపి, బాధితుల గుండెల్లో బడబాగ్నిని రగిలించాయి. సదరు కేసులో దోషి అని తేల్చి, మాజీ ఎమ్మెల్యే – బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్సింగ్ సెంగార్కు ఆరేళ్ళ క్రితం 2019లో ఢిల్లీలోని ఓ కోర్టు జీవిత ఖైదు విధిస్తే, వారం రోజుల క్రితం ఢిల్లీ హైకోర్ట్ ఆ శిక్షను సస్పెండ్ చేయడం గగ్గోలు రేపింది. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం కుల్దీప్ ‘ప్రజా సేవకుడు’ కిందకు రారనీ, కాబట్టి చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడినవారిపై ప్రయోగించే ‘పోక్సో’ చట్టంలోని కఠిన అంశాల కింద గతంలో ఆయనకు శిక్ష వేయడం సరికాదనీ హైకోర్ట్ మాట. ఇది అన్యాయ మంటూ నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో, సీబీఐ అప్పీలు చేయడం, హైకోర్ట్ ఉత్తర్వును డిసెంబర్ 29న సుప్రీంకోర్ట్ పక్కనపెట్టడం ఇప్పుడు ఒకింత ఊరట. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో జరిగిన 17 ఏళ్ళ మైనర్, దళిత బాలిక అత్యాచారం, ఆ తదుపరి సంఘటనలు తలుచుకుంటే ఇవాళ్టికీ గుండె బద్దలవుతుంది. ఉద్యోగం మిషతో రప్పించిన మైనర్ బాలికపై కుల్దీప్ తన నివాసంలో 2017 జూన్లో అత్యాచారం జరి పారు. బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించినా, కొన్ని నెలల పాటు అతీగతీ లేదు. పోరాటం చేసిన బాలిక తండ్రిని సైతం తప్పుడు కేసులో ఇరికించి, చావచితక కొట్టారు. ఆఖరికి 2018 ఏప్రిల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం ఎదుట బాలిక ఆత్మాహుతి యత్నానికి దిగేసరికి, ఉన్నావ్ కేసు జాతీయస్థాయి సంచలనమైంది. కనపడని పోలీసు దెబ్బలతో కన్నతండ్రి కస్టడీలోనే మరణించడం రచ్చ రేపేసరికి, కేసు సీబీఐకి చేరింది. అయినా తిప్పలు తప్పలేదు. కేసులో పోరాడుతున్న బాధిత కుటుంబం, లాయరుతో సహా వెళుతున్న కారును గుర్తు తెలియని వాహనం గుద్ది, బాధితురాలి కుటుంబసభ్యులిద్దరిని 2019 జూలైలో పొట్టనబెట్టుకుంది. బెదిరింపులకు తాళలేక ఆఖరికి భారత ప్రధాన న్యాయమూర్తిని రక్షణ కోరేసరికి, విషయం సుప్రీం దృష్టికి వెళ్ళింది. 2019 డిసెంబర్లో కుల్దీప్ను దోషిగా తేల్చి, శిక్ష వేసినా, చట్టంలోని లోటుపాట్లు ఆసరాగా బయటకు వచ్చే ప్రయత్నం హైకోర్ట్లో సాగింది. భారత ప్రధాన న్యాయమూర్తి సహా ముగ్గురు సభ్యుల తాజా మధ్యంతర ఉత్తర్వుల ఫలితంగా... ఇప్పటికైతే కుల్దీప్ను కస్టడీ నుంచి విడుదల చేయరు. కానీ ఆయన అప్పీలు పెండింగ్లో ఉంటుంది. బాధితులను కాపాడేందుకు ఉద్దేశించిన చట్టంలోని అసలు స్ఫూర్తిని అర్థం చేసు కోకుండా, కేవలం అందులోని మాటలను అడ్డం పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే కష్టమే నని తాజా ఘటనలో హైకోర్ట్ వ్యవహారశైలి రుజువు చేసింది. అదే సందర్భంలో రకరకాల ఆరోపణలతో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ మసకబారుతున్న వేళ హైకోర్ట్ జడ్జీల నిబద్ధతను సమర్థిస్తూనే, సుప్రీం ఇచ్చిన తీర్పు కొత్త ఆశలు రేపుతోంది. బాలికపై అత్యాచారం, ఆ పైన ఆమె తండ్రి మరణంలో దోషి అయిన మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకొస్తే, ప్రాణాపాయం తప్పదని బాధిత కుటుంబం బెంబేలెత్తుతున్న సమయంలో సుప్రీం తీర్పు మళ్ళీ ధైర్యం ఇచ్చింది. పైపెచ్చు, ఈ వ్యవహారంలో చట్టంతో ముడిపడిన అనేక కీలక ప్రశ్నలు ముందుకు వచ్చాయనీ, వాటిపై పూర్తిస్థాయిలో ఆలోచన జరపడం అవసరమనీ సుప్రీంకోర్ట్ పేర్కొనడం గమనార్హం. అంటే, రాబోయే రోజుల్లో పలు అంశాల్లో ఈ కేసులో కోర్ట్ ఇచ్చే స్పష్టత, దాని పర్యవసానాల ప్రభావం దీర్ఘకాలం ఉండనుంది. ‘ప్రజా సేవకుడు’ ఎవరనే అంశంలో హైకోర్ట్ చెప్పిన భాష్యం లోపభూయిష్ఠం. ఒక వేళ ఆ భాష్యాన్నే అనుసరిస్తే, తీవ్రమైన లైంగిక నేరాల పరిధి నుంచి చట్టసభల సభ్యులు ఇట్టే తప్పించుకొనే ప్రమాదం ఉంది. ‘ఈ లెక్కన పోక్సో చట్టం కింద కానిస్టేబులేమో పబ్లిక్ సర్వెంట్ కానీ, ఎమ్మెల్యే మాత్రం కాదన్నమాట’ అని సుప్రీం చేసిన వ్యాఖ్య చిన్నది గానే కనిపించినా, లోతుగా ఆలోచన రేపే చురకత్తి. దోషిగా తేలిన వ్యక్తిని సైతం సాంకేతిక కారణాలతో రక్షించాలనుకోవడం వకీళ్ళకు చెల్లుతుందేమో కానీ, చేసిన నేరాన్నీ, దాని తీవ్రతనూ వదిలేసి వ్యవహరించడం న్యాయమూర్తులకు పాడి కాదు. ఒకవేళ చేసిన చట్టంలోనూ, దానిలో ప్రొవిజన్లలోనూ స్పష్టత లోపిస్తే, వాటిని సరిదిద్దేలా కోర్టులు వివరణ ఇస్తేనే ధర్మం నిలబడుతుంది. దోషులకు శిక్ష పడి, బాధితులకు న్యాయం జరుగుతుంది. ఉన్నావ్ కేసులో తాజా సుప్రీం జోక్యం ఆ దిశగా అడుగులేయడమే ఇప్పుడు అవసరం. -
ఆరావళికి ఊపిరి
చరిత్రకు పూర్వమే కొన్ని నదులకు చిరునామాగా, వైవిధ్యభరిత ప్రకృతికి ఆలవాలంగా, రకరకాల జీవరాశులకు ఆలంబనగా నిలిచిన ఆరావళి ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నట్టే. ఆ పర్వత శ్రేణిపై గత నెల 20న తామిచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సుప్రీకోర్టు సోమవారం తీసుకున్న నిర్ణయం పర్యావరణ ఉద్యమకారులకూ, ఆ ప్రాంత ప్రజానీకానికీ ఉపశమనం కలిగించింది. 250 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించి వాయవ్య భారత్ను 670 కిలోమీటర్ల పొడవునా కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆరావళికి కష్టం వచ్చిందంటే జనం తల్లడిల్లారు. టేపు తీసుకుని కొలతలు కొలిచి, ఎన్ని డిగ్రీల కోణంలో వాలాయో గమనించి ఆ కొండల్ని కత్తిరించాలని చూసినవారి ఎత్తు గడలకు విస్తుపోయారు. అందుకే పర్యావరణ ఉద్యమకారుల నాయకత్వంలో పార్టీల కతీతంగా గొంతెత్తారు. చివరకు జనానిదే పైచేయి అయింది. ఈ అంశంలో మరిన్ని వివరణలు, భిన్న కోణాల్లో పరిశీలనలూ అవసరమవుతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడి ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ మరింత సమగ్రంగా,మరింత సంపూర్ణంగా దీన్ని పరిశీలించాల్సి ఉంటుందని భావించింది. ఎన్నో పురుటినొప్పులు పడి, ఎన్నెన్నో ఉత్పాతాలు చవిచూసి, ఎన్నో విధాల భౌగోళిక మార్పులు జరిగి ప్రకృతి సంపద ఈ రూపంలో మన కళ్లముందుంది. అధికారం ఉండొచ్చు, కుబేరుణ్ణి తలదన్నేంత ఐశ్వర్యం ఉండొచ్చు – కానీ ఈ సంపదను అవసరా లకు పొదుపుగా వినియోగించుకుంటూ సురక్షితంగా భవిష్యత్తరాలకు అప్పగించటం మనిషి జన్మెత్తినవారి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా పాలకులుగా ఉన్నవారూ, పారిశ్రామిక వేత్తలూ దీన్నెక్కడా గమనించుకుంటున్నట్టు లేరు. అందుకే అడవులు మటుమాయమవు తున్నాయి. కొండలు కరిగిపోతున్నాయి. నదులు ఇంకిపోతున్నాయి. జీవ వైవిధ్యం గతి తప్పుతోంది. కొన్ని రకాల జంతువులు, పక్షులు ఇప్పటికే అంతరించిపోయాయి. నదుల గమనాలు మారాయి. రుతువులు తీరు మార్చుకుంటున్నాయి. రకరకాల కాలుష్యం కాటేస్తోంది.ఆరావళి మాత్రమే కాదు... దేశంలో చిన్నా పెద్దా కొండలు, గుట్టలు దీనంగా వేడుకుంటున్నాయి. మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న తమ ఉసురు తీయ డానికి సిద్ధపడుతున్న వైనం చూసి దుఃఖిస్తున్నాయి. అయినా ఆగిందేమీ లేదు. బంగారం మొదలుకొని డోలమైట్, గ్రాఫైట్, మాంగనీస్, బొగ్గు, రాగి, బాక్సైట్ వంటి రకరకాల ఖనిజాలు వాటిల్లో నిక్షిప్తమై ఉండటమే అందుకు కారణం. అభివృద్ధికి అవసరమనుకుంటే పరిమిత స్థాయిలో వాటిని వినియోగించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రకృతి విపత్తులకు దారితీసే స్థాయికి అది చేరుకోవటం వల్ల అసలు అభివృద్ధి పరమార్థమే దెబ్బతింటోంది. ఆ ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల జీవిక ధ్వంసమవుతోంది.ఇన్ని దశాబ్దాలుగా మౌనంగా వీక్షించిన వాయవ్య భారతం ఇప్పుడైనా గొంతెత్తగలిగింది గనుకే ప్రస్తుతానికిది ఆగింది. ఆరావళి పర్వత పంక్తులు చంబల్, సబర్మతి, లూని వంటి నదులకు జీవం పోస్తున్నాయి. అక్కడ అడవులున్నాయి, గడ్డిభూములు న్నాయి. సారవంతమైన నేలలు సరేసరి. అపురూపమైన జంతు, వృక్షజాలాలున్నాయి. దేశ రాజధాని నగరం ఈ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతున్నదంటే అది ఆరావళి చలవే. అంతేకాదు... భూగర్భ జలాలు సమృద్ధిగా లభించేలా చేస్తున్నాయి. ఇప్పటికే కొన సాగుతున్న మైనింగ్ను నిలిపేయటంతోపాటు కొత్తగా మైనింగ్ లైసెన్సులు జారీ చేయకుండా చర్యలు తీసుకుంటేనే ఈ మాత్రమైనా మిగులుతాయి. ఆ దిశగా తీసుకోవా ల్సిన చర్యల్లో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు తొలి అడుగు కావాలి. ఆరావళిలో కోల్పో యింది కోల్పోగా ప్రస్తుతం మిగిలినదాన్నయినా ఎలా రక్షించుకోవాలన్న ఆర్తి ఉంటే తప్ప ఇదంతా సాధ్యపడదు. వాయవ్య భారతమే కాదు... దేశంలోని అన్ని ప్రాంతాలూ తమ గొంతు బలంగా వినిపించినప్పుడే కొనసాగుతున్న విధ్వంసానికి తెరపడుతుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. భూ ఆకృతి సంబంధిత అంశంగా చూసి కొలతలతో, కోణాలతో యాంత్రికంగా చూడక, మనిషి ఇరుసుగా ప్రకృతిని వీక్షించగలిగితే తరతరాల పాటు ఈ అపురూప సంపద మానవాళికి ఆసరా అందిస్తుంది. -
నవ కోలాహలం
మీరు మీ పుస్తకం గురించి రీల్ చేస్తారు. అది ఇన్స్టాలో ప్లే అవుతుంది. ఆ పుస్తకం మార్కెట్లోకి వచ్చేలోపు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఒకడు ఆ పుస్తకాన్ని చూపుతూ, అందులో ఏముందో రివ్యూ చేస్తూ రీల్ చేస్తాడు. తళతళమనే కవర్పేజ్ను చూపుతూ అతడు ఆ పుస్తకం గురించి చెప్పాడంటే అతన్ని ఫాలో అవుతున్న వారందరికీ సమాచారం చేరినట్టే. ఈ రీల్స్/వీడియోల కింద అమెజాన్ లింకులు ఉంటాయి. రీల్ చూసి ఇంప్రెస్ అయ్యి అమెజాన్ లింక్ క్లిక్ చేశామంటే పుస్తకం మన ముంగిట్లో ఉన్నట్టే. అలా అమ్మకాలు సాగుతున్నాయి ఇప్పుడు. అలా అమ్ముతూ రాయల్టీ చెక్కులు పొందుతున్నారు నేటి యువ రచయితలు. యువతరం వలన, యువతరం చేత, యువతరం కొరకు సాగుతున్న రచనా చమత్కృతి ఇది.‘తెలుగు కాపాడండి మొర్రో’ అనేవాళ్లు ప్రతి కాలంలో ఉన్నట్టే ఈ కాలంలోనూ ఉన్నారు. ఈ కుయ్యో మొర్రోల వల్ల తెలుగు నిలబడదు. కుయ్యో మొర్రో అనకపోతే నశించిపోదు. ప్రతి ఊళ్లో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఊరవతల ఇంజనీరింగ్ కాలేజీ ఉన్న ఈ కాలంలో తెలుగు బాగా మాట్లాడుతూ, చదువుతూ, రాయాలన్న అభిలాష ఉన్న వందల మంది తెలుగు యువతీ యువకులను చూస్తే ఒక మాతృభాష లేదా జీవభాష ఎలా పదేపదే పునరుత్థానం అవుతూ ఉంటుందా అని ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ‘హైదరాబాద్ బుక్ఫెయిర్’లో 30 ఏళ్ల లోపు యువతీ యువకులు రాసిన కనీసం 100 తెలుగు పుస్తకాలు ఉన్నాయంటే నమ్ముతారా? ప్రతి సాయంత్రం వారు తూనీగ రెక్కలతో అక్కడ వాలి, ఆటోగ్రాఫ్లు ఇవ్వడం చూస్తున్నారా? కథ, కవిత కాకుండా ఏకంగా మొదలట్టడమే నవల రాసేసి నవలా రచయితలుగా కాలు మీద కాలేసి కూచోవడం గమనిస్తున్నారా? తెలుగు భాషకు వీళ్లు నవ ప్రచారకర్తలు. సాహిత్యానికి అనేక పార్శా్వలు, లక్ష్యాలు ఉన్నాయి. సాహిత్యాన్ని ఎందుకు సాహిత్యం అంటామో, సాహిత్యం అనడానికి దానికి ఏం అర్హతలు ఉండాలో ప్రపంచవ్యాప్తంగా ప్రమాణాలు స్థిరపడి ఉన్నాయి. అలాగే వీటితో సంబంధం లేని కాలక్షేప సాహిత్యం ఎప్పుడూ చలామణీలో ఉంది. పాశ్చాత్య దేశాలలో ఈ కాలక్షేపాన్ని రాసి కోట్లు గడించినవారు ఉన్నట్టే... తెలుగులోనూ ‘కమర్షియల్’ నవలలు రాసి, నాటకీయ కల్పనలకు, కొద్దిపాటి తెలివి జోడించి, పామర పాఠకులే లక్ష్యంగా లక్షలు గడించి మేడలు కట్టుకుని స్థిరపడినవారు ఉన్నారు. అన్నిచోట్లా ఉన్నట్టే ఈ ‘కమర్షియల్’ రచయితలు, ‘సీరియస్’ రచయితలు ఒక వేదికపై కనిపించడం దుర్లభం. గత కాలపు ‘కమర్షియల్’ రచయితలకు తామేమి రాశారో, ఆ రచనల అంతస్థు ఏమిటో తెలుసు.అయితే ఇప్పటి ఈ యువ రచయితలు ఏమి రాస్తున్నట్టు? అవి కాలక్షేప రచనల కోవకు వస్తున్నాయా లేదా సాహితీ ప్రమాణాలకు నిలబడగలవా? కొన్ని రచనలు చేసి, సినిమా రంగాన్ని ఆకర్షించి ఆ రంగంలో స్థిరపడాలనుకునే రచయితలు వీరిలో ఉన్నారు. వారి దారి స్పష్టం. కేవలం అమ్మకాల ఆధారంగా డబ్బు సంపాదించాలనుకునేవారు ఉన్నారు. వారి దారీ స్పష్టం. అలా కాకుండా ‘మంచి రచనలు’ చేసి, సమకాలీన జీవనాలను ప్రతిబింబించి, సీరియస్ సాహిత్యకారులుగా ప్రయాణం సాగించాలనుకునేవారు ఉంటే వారి గురించి సాహితీ సమాజానికి బాధ్యత ఉన్నట్టే లెక్క. ఇప్పుడు హైదరాబాద్ బుక్ఫెయిర్లో ఈ కోవకు చెందిన వారూ తప్పక ఉన్నారు. వీరు సాహిత్యానికి ఆశాకిరణాలు.‘శ్రీశ్రీ ఏమి రాశాడనండీ’, ‘అబ్బే.. కాళీపట్నం కథల్లో గట్టిగా నిలిచేవి ఎన్ననీ’ అని వారి కాలంలో వారిని ధిక్కరించి మాట్లాడిన యువకులు ఉన్నారు. అయితే వారంతా వారిని క్షుణ్ణంగా చదివినవారు. కొత్తది వచ్చి పాతదాన్ని నిలదీయాల్సిందేగానీ పాతను తెలుసుకుంటేనే నిలదీయడం సాధ్యం. పాతను తెలుసుకునే కొద్దీ వినమ్రత కూడా చోటు చేసుకుంటుంది– తండ్రి గొప్పదనం ఒక వయసు వచ్చాకే తెలిసినట్టు. ఇప్పటి యువ రచయితలు పాతవి చదవకపోతే ఫరవాలేదుగానీ చదవక్కర్లేదు అనుకుంటేనే ప్రమాదం. ‘ఈ కొత్త పిల్లలు రాసే దాంట్లో ఏముంటుంది’ అనీ సీనియర్లు అనుకోవచ్చుగానీ అసలు వారిని చదవకుండా దూరం పెట్టాలనుకోవడం అవివేకం. ఈ కొత్త, పాతల ఇంటరాక్షన్ ఇప్పుడు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో నాలుగు గట్టితాళ్లు దొరికితే వారధులు నిర్మితమవుతాయి. కొన్ని కెరటాల్ని పసిగడితే జలధి ఏర్పడుతుంది.నేటి యువతర సాహిత్యం కేవలం పొంగు కారాదు. జాతరలో కుర్రాళ్ల సందడి భలే. కానీ వీరిని చిద్విలాసంగా పరికించే పెద్దలు ఉంటారు. వీరిద్దరూ కలిసి ఏం చేయబోతారనేది తెలుగు సాహిత్యానికి సిసలైన కోలాహలం అవుతుంది. -
ప్రజారోగ్యంపై ‘విషకీయం’
మెడికల్ కాలేజీల ‘పీపీపీ’ మీద ఈరోజు (శనివారం) రెండు ముఖ్యమైన దినపత్రికల్లోని ఎడిట్ పేజీల్లో స్పందనలు కనిపించాయి. ఇందులో ‘ఈనాడు’ దినపత్రికలో వచ్చిన ఎడిటోరియల్ కాలమ్ ఒకటి. ఈ కాలమ్లో వెలువడే అభిప్రాయాలు పత్రిక పాలసీ కింద లెక్క. వార్తా కథనాలకు భిన్నంగా ఈ సంపాదకీయ కాలమ్లో చేసే విమర్శలు సైతం నిర్మాణాత్మకంగా ఉండాలని పాఠకులు ఆశిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అదొక సంప్రదాయం కూడా! ఈ కట్టుబాటును ‘ఈనాడు’ చాలాసార్లు ఉల్లంఘించింది. ప్రతిపక్ష నేత మీద పగతో ఆ సంపాదకీయం ఈ రోజున రగిలిపోయింది. సంపాదకీయ ప్రమాణాలను పాటించడం విషయంలో అది చిట్టచివరి జారుడు మెట్టుపై నుంచి కూడాకిందికి దొర్లింది.ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదలైన మెడికల్ కాలేజీలను ‘పీపీపీ’ ముసుగులో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతి రేకిస్తూ ఏపీలో కోటీ నాలుగు లక్షల మందికి పైగా తమ అడ్రస్, ఫోన్ నంబర్లు వేసి మరీ సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో మీడియాతో జగన్ మాట్లాడిన మాటలు కూటమిని ఇరుకున పెట్టాయి. ‘పీపీపీ’ ముసుగులో పెద్ద స్కామ్ దాగుందని ఆయన తొలి నుంచీ వాదిస్తున్నారు. ఆయన వాదనను మేధావులతో పాటు సామాన్య జనం సైతం విశ్వసిస్తున్నారు. అందుకు రికార్డు స్థాయిలో నమోదైన సంతకాలే సాక్ష్యం. మీడియాతో మాట్లాడి నప్పుడు జగన్ అదే విషయాన్ని చెప్పారు. ఈ స్కామ్లో పాలు పంచుకొనేవారిని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచా రించి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇందులో అభ్యంతరకరమైన విషయం ఏమున్నది? జగన్ మాటలు కాదు, ఆ మాటల వెనకున్న జనాభి ప్రాయం కూటమిని భయపెడుతున్నట్లున్నది. ప్రైవేట్ విద్యా వ్యాపారులు కూడా జనాభిప్రాయానికే జంకుతున్నారేమో! ఐదు కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఒక్కదానికి కూడా పడలేదు. ముఖ్యమంత్రికి ఆంతరంగికుడైన మంత్రి నారాయణ స్వయానా అతిపెద్ద చదువుల బేహారి. ఆయన కూడా ముందుకు రాక పోవడం ఏమిటి? ఇది ముమ్మూర్తులా స్కామ్ కనుక, ఇందులో దొరకడం ఖాయమని భయపడ్డారేమో! ఆదోని కాలేజీకి ‘కిమ్స్’ యాజమాన్యం టెండర్ వేసిందని ముందు ప్రకటించారు. ఆస్పత్రి యాజమాన్యం ఖండించేసరికి, అందులో పనిచేస్తున్న దానయ్య ఎవరో దాఖలు చేశారని మాట మార్చారు. ఈ వ్యవహారం చూస్తుంటే ‘స్కిల్ కుంభకోణం’ గుర్తురావడం లేదూ? తొలుత సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఆ కంపెనీ రంగంలోకి వచ్చి ఖండించిన తర్వాత కాదు కాదు, అందులో పనిచేసే ఉద్యోగితో ఒప్పందం కుదిరిందని చెప్పుకొచ్చారు. అన్ని స్కామ్ల స్క్రిప్టూ ఒకే రకంగా ఉంటుందేమో?‘పీపీపీ’కి ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉండటానికి జగన్ కారణమని భావిస్తున్న కూటమి నేతలు ఆయనపై శివమెత్తి ఊగిపోయారు. ఇందులో డిప్యూటీ సీఎం, ఫోర్త్ టైమ్ సీఎం పోటీపడ్డారు. యెల్లో మీడియా పోషిస్తున్న పాత్రకు పరాకాష్ఠ ఇవాళ్టి ‘ఈనాడు’ సంపాదకీయం. ‘జగన్ విషరాజకీయాలు’ అనే శీర్షికతో కలంలో విషం పోసి దాన్ని కాలమ్ నిండా వెదజల్లారు. ఈ విషవాహినిలో కొన్ని అపురూప విషయాలను కూడా అది దొర్లించింది. భిన్న పార్టీల సభ్యులతో కూడిన పార్లమెంట్ స్థాయీ సంఘం కూడా ‘పీపీపీ’ పద్ధతిలో మెడికల్ కాలేజీలను నిర్వహించుకోవాలని సూచించిందనీ, దాన్ని కూడా జగన్ చెవి కెక్కించుకోలేదనీ ‘ఈనాడు’ వాపోయింది. ప్రభుత్వ రంగంలో ప్రారంభమై కొంతమేరకు పూర్తయిన కాలేజీలను కూడా ‘పీపీపీ’కే అప్పగించాలని కూడా స్థాయి సంఘం చెప్పిందా? ఇక చేపట్టబోయే వాటి గురించి చెప్పిందా? ఏడాదిన్నర కాలంలో2 లక్షల 70 వేల కోట్లకు పైగా చేసిన అప్పులో ఓ నాలుగు వేల కోట్లు కేటాయిస్తే పది కాలేజీలు పూర్తయ్యే అవకాశం ఉన్నా కూడా ‘పీపీపీ’కే అప్పగించాలని స్థాయీ సంఘం చెప్పిందా?అయినా దేశ వనరులన్నింటినీ ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసం కంకణం కట్టుకున్న ఎన్టీఏ ప్రభుత్వహయాంలో ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ ఏ సలహా ఇచ్చినా వేదవాక్కు అవుతుందా? యుగాల నాటి ఆరావళి పర్వతశ్రేణి ఎత్తు కొలతల్ని నిర్ణయించి, వాటిని తవ్వి పోసుకోవడానికి అనుమతులకు సిద్ధమైన ఎన్డీఏ సర్కార్ ‘పీపీపీ’లకు అనుకూలం కాకపోతే వ్యతిరేకంగా ఉంటుందా? ఈ పద్ధతిలో చేపట్టే వైద్య కళాశాలలూ, ఆరోగ్య సేవల ప్రాజెక్టులకు మూలధన వ్యయంలో 30–40 శాతం, నిర్వహణ వ్యయంలో పాతిక శాతం గ్రాంటుగా ఇస్తా్తమని కేంద్రం రాసిందట! కొత్త కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉంటే ఈ గ్రాంటు ఇవ్వబోమని కూడా కేంద్రం రాసిందా? ఆ విషయం కూడా చెప్పాలి కదా!జనం ఛీకొట్టి 11 సీట్లకే పరిమితం చేసినా జగన్ తనకు అలవాటైన బెదిరింపు భాషను మానుకోలేదట! అలా అని ‘ఛీనాడు’ చెబుతున్నది. నిజమే, 11 సీట్లకే వైసీపీ పరిమితమైందన్న మాట వాస్తవమే! 40 శాతం ఓట్లు వచ్చాయన్న మాట కూడా నిజమే కదా! పవన్ కల్యాణ్ పార్టీతోపాటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే తప్ప, ఈ కూటమికి కొన్ని ముదనష్టపు మీడియా సంస్థలు తోడైతే తప్ప టీడీపీ నిల బడలేకపోయిందన్న మాట కూడా నిజమే కదా! పోలింగ్ సమయం ముగిసిన తర్వాత అసాధారణ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలింగ్ పన్నెండున్నర శాతం పెరగడం అనుమానాలు రేకెత్తిస్తున్నదని కొన్ని జాతీయ సంస్థలు లెక్కలతో సహా వెల్లడించిన విషయం కూడా వాస్తవమే కదా! ఇటువంటి విషయాలన్నీ మరుగునపెట్టి జగన్ను 11 సీట్లకే పరిమితం చేశామంటూ రొయ్య మీసాలు తిప్పడం, సంపాదకీయాల్లో రంకెలు వేయడం చోద్యంగా లేదా? రాజధానికి భూమినిచ్చిన రైతు రామారావు నిన్న జరిగిన గ్రామ సభలో తనకు జరిగిన మోసాన్ని చెబుతూ మంత్రి సాక్షిగా గుండె పగిలి చనిపోతే ఆ వార్త వేయాలనేఇంగితం లేని పత్రిక సుద్దులు చెబితే ఎట్లా?జాతీయ ఆంగ్లపత్రిక ‘ది హిందూ’ ఎడిట్ పేజీలో కూడా ‘పీపీపీ’ల అంశంపై ఇవాళ ప్రధాన వ్యాసం అచ్చయింది. మాజీ ఐఏఎస్ అధికారి, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కూడా పనిచేసిన సుజాతారావు ఈ వ్యాసాన్ని రాశారు. ఆమె ఆంధ్ర ప్రదేశ్లో కూడా చాలాకాలం పనిచేశారు. ‘పీపీపీ’ విధానం ద్వారా ఆరోగ్య సేవలను అందజేయాలనుకోవడం వాంఛ నీయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ షరతులను కచ్చితంగా అమలుచేసే యంత్రాంగం లేకుండా ప్రజారోగ్యం వంటి కీలక రంగాల్లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం అవివేకమని ఆమె వ్యాఖ్యానించారు. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య సేవలను ముక్కల కింద విడగొట్టి అరడజన్ కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిందనీ, వాటి అజమాయిషీ చేయలేకపోవడంతో ప్రజారోగ్య సేవలుగందరగోళంలో పడ్డ సంగతినీ సుజాతారావు గుర్తుచేశారు. 70 శాతం బెడ్ల కేటాయింపు, ఔట్ పేషెంట్ సేవలు ఉచితంగాఅందజేయడం వంటి నిబంధనలను అమలు చేయడం సాధ్యం కాదని ఆమె కుండబద్దలు కొట్టారు.ఒక్క సుజాతారావే కాదు, ఎందరో విజ్ఞులు వైద్యరంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ‘పీపీపీ’ అంటే ప్రైవేటీకరణ కాదనే డొల్ల వాదనను ఖండిస్తున్నారు. ‘పీపీపీ’ మీద ఇటీవల ముఖ్యమంత్రి ఒక విచిత్ర వాదన ముందుకు తెచ్చిన సంగతి తెలిసిందే. ‘పీపీపీ పద్ధతిలో రోడ్లను అప్పగిస్తాం. వాళ్లు కొన్నాళ్లు వాటిని నిర్వహించి తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారు. అంటే అవి ప్రభుత్వ ఆస్తిగానే ఉంటాయ’ని ఆయన చెప్పారు. కానీ దశా బ్దాల తరబడి కాంట్రాక్టర్లు ఆ రోడ్లను నిర్వహించినంత కాలం జనం టోల్ ఫీజు కట్టాలనే సంగతిని మాత్రం ఆయన చెప్పలేదు. ప్రభుత్వం ఇప్పటికే మెడికల్ కాలేజీల కోసం విలువైన భూముల్ని కేటాయించింది. వివిధ దశల్లో నిర్మాణాలు కూడా పూర్తి చేసింది. ఇంకో 4,500 కోట్లు ఖర్చుపెడితే ఆ పది కాలేజీలు ప్రభుత్వపరమవుతాయి. ఈ దశలో వాటిని పలు రాయితీలతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి, రెండేళ్లపాటు సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లించేలా నిబంధనలు రూపొందించి, ఇదే పెద్ద అభివృద్ధి మార్గంగా కూటమి ప్రచారం చేసుకుంటున్నది.పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందకుండా, పేద విద్యార్థులకు వైద్యవిద్య అందకుండా చేసే ఈ విధానాన్ని జగన్ మోహన్రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఇందులో ఇమిడి ఉన్న అవి నీతిని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని కట్టబెట్టి, నిర్వహణ కోసం రాయితీలు ఇచ్చి, రెండేళ్లపాటు జీతాలు కూడా ఇచ్చే ఏర్పాటులో ఏ కుంభకోణం లేదని చెబితే ఎవరు నమ్ముతారు? జగన్ పిలుపుతో జనకోటి గళం కలపడంతో కూటమి నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. అందుకే జగన్ మీద దాడి చేస్తున్నారు.ఈ దాడి కేవలం జగన్ మీదనే అనుకోవడానికి వీల్లేదు. ఇది ప్రజావైద్యం మీద దాడి! పేద ప్రజల ఉన్నత విద్యా ఆకాంక్షల మీద దాడి!! రాజ్యాంగ ఆశయాల మీద దాడి!! వారు చేసే విమర్శలకు ఏ రకమైన ఆధారాన్ని చూపెట్టరు. ఏ లెక్కల ప్రకారం చెబుతున్నారో చెప్పరు. పుర్రెకు తోచింది చెబుతారు. నోటికి వచ్చింది మాట్లాడతారు. నిన్నగాక మొన్న పారిశ్రామిక ప్రగతిలో, వస్తూత్పత్తి రంగంలో జగన్ కాలంలో ఏపీ దక్షిణాది లోనే నంబర్ వన్గా ఉన్నదని రిజర్వ్ బ్యాంకు చెప్పినా ఈ కూటమి వినదు. అన్ని రంగాల్లో ఏపీని జగన్ గాఢాంధకారంలోకి నెట్టారని సంపాదకీయంలో ‘ఈనాడు’ రాసింది. ఎవరు చెప్పారు? ‘కాగ్’ చెప్పిందా? ‘నీతి ఆయోగ్’ చెప్పిందా? జీఎస్టీ లెక్కలు చెప్పాయా? అటువంటి సంస్థల్ని ఉటంకిస్తే కూటమి లెక్కలు తారుమారవుతాయి. కనుక వాటి జోలికి పోరు. ప్రజా ధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి కుట్రలు చేస్తున్న విషరాజకీయం, దానికి తాబేదారుగా ‘ఈనాడు’ ఒలకబోస్తున్న విష సంపాదకీయం – వెరసి ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్యంపై ఇదొక ‘విషకీయ’క్రీడ!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మానసిక స్వస్థతపై దృష్టి
మానసిక స్వస్థతపై దృష్టిమన దేశంలో ప్రభుత్వాలకూ, సమాజానికీ, కుటుంబానికీ – ఎవరికీ పట్టని అత్యంత కీలకమైన సమస్యల్లో మానసిక అనారోగ్యం ఒకటి. ఆ రోగులకు కూడా హక్కులుంటా యనీ, వాటినీ పరిరక్షించాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి చెప్పి రెండు దశాబ్దా లవుతోంది. మానసిక అస్వస్థుల కోసం ప్రత్యేక చట్టం చేయాలని 2007లోనే సూచించింది. వేరే దేశాల మాట అటుంచి పదేళ్లపాటు మన దేశమే ఆ సంగతి పట్టించుకోలేదు. 75 ఏళ్లుగా కొనసాగుతున్న కాలం చెల్లిన చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి2017లో పార్లమెంటు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ ఏం లాభం? అటుతర్వాత నుంచి దేశంలో మానసిక అస్వస్థతకు లోనవుతున్నవారి స్థితిగతులేమిటో, వారికి అందించాల్సిన సహాయ సహకారాలేమిటో కేంద్రానికీ, రాష్ట్రాలకూ కూడా అక్కర లేకపోయింది. ఈ నేపథ్యంలో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బెంగళూరులోని నిమ్హాన్స్ ఆధ్వర్యాన ద్వితీయ సర్వే జరగబోతోంది. 2015–16లో జరిగిన తొలి సర్వే వయోజ నుల్లో మానసిక అస్వస్థతపై దృష్టి పెట్టగా, ఈసారి పిల్లలు, మహిళలు, వలసదారులతో పాటు వృద్ధుల్లో సైతం మానసిక స్థితిగతులెలా ఉన్నాయో ఆరా తీయాలని ఆ సంస్థ నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మానసిక ఆరోగ్యం గురించి ఇచ్చిన నిర్వచనం సమగ్రమైనది. ఒక మనిషి తనకున్న శక్తి సామర్థ్యాలను సాకారం చేసుకోగల స్థితిలో ఉండి, జీవితంలో ఎదురయ్యే సాధారణ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ తన ఉత్పాదకతతో సమాజ పురోగతికి దోహదం చేయగల శ్రేయోస్థితిని మానసిక ఆరోగ్యంగా ఆ సంస్థ నిర్వచించింది. కేవలం మానసిక వైకల్యం లేదా అస్వస్థత లేకపోవటం మాత్రమే ఆరోగ్యకరమైన మానసిక స్థితిగా చూడలేమని ఈ నిర్వచనం చెబుతోంది. ఒక అంచనా ప్రకారం మన వయోజ నుల్లో 15 శాతం మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య అధికం. అక్కడ 13.5 శాతం మందికి మానసిక సమస్యలు, ఒత్తిళ్లు ఉండగా... పల్లెసీమల్లో ఇది 6.9 శాతం. శరవేగంతో సాగే పట్టణీకరణ, ఉద్యోగ అభద్రత, జీవన వ్యయం పెరగటం, వృత్తిలో నానాటికీ అధికమయ్యే పోటీ, సామాజిక మాధ్యమాలను అతిగా చూడటం, ఫోన్తో అధిక సమయం గడపటం, ఆన్లైన్ వేధింపులు వగైరాలు సమస్యకు కారణమవుతున్నాయి. దురదృష్టమేమంటే ఇతర సమస్యల్లా మానసిక అనారోగ్యాన్ని వెనువెంటనే గుర్తించటం సాధ్యం కాదు. తమను చిన్నచూపు చూస్తారనే భయంతో ఆ స్థితిలోకెళ్లినవారు ఎవరికీ చెప్పుకోరు. తొలి దశలో వారిని గుర్తించటం కూడా కష్టం. అలాంటివారు అప్పుడప్పుడు అస్వాభావికంగా, అసహజంగా లేదా విచిత్రంగా ప్రవర్తించినా అది ఆ క్షణంలో వచ్చిపడిన సమస్యకు తక్షణ స్పందనగా పరిగణిస్తారు. తీరా గుర్తించేసరికి అప్పటికే చేతులు దాటిపోయిన స్థితి ఏర్పడవచ్చు. అందుకే ఈసారి సర్వే మానసిక అనారోగ్యం విస్తృతి ఎలావుందో, దాని పర్యవసానంగా వచ్చే వైకల్యం, అందువల్ల సామాజికార్థిక స్థితిగతుల్లో మార్పు, అలాంటివారి సంరక్షణకు తోడ్పడే మార్గాలు, సేవల లభ్యత వగైరాలను కూడా పరిశీలించబోతోంది. సమాజంలో ఎక్కువగా ఏయే గ్రూపులు ఇలాంటి అనారోగ్య స్థితికి లోనవుతున్నాయో, వాతావరణ పరిస్థితుల ప్రభావం ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మన దేశంలో జనాభాకు తగినట్టు వైద్యులు లేరు. ఇక మానసిక అనారోగ్యానికి చికిత్స చేసేవారైతే చాలా అరుదు. లక్షమందికి కనీసం ముగ్గురు మానసిక వైద్యులుండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన. కానీ మనకు లక్షమందికి 0.75 శాతం మందే ఉన్నారు! 2022లో కేంద్రం టెలీ–మానస్ పేరుతో మానసిక ఆరోగ్య కార్యక్రమం మొదలుపెట్టింది. దానికి రోజుకు సగటున 2,500 ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే ఈ సమస్య ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఇకనైనా సమగ్ర విధాన రూపకల్పనపై దృష్టి సారించాలి. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకూ కౌన్సెలర్లు తగినంత మంది అందుబాటులో ఉండేలా, ప్రజల్లో దీనిపై అవగాహన పెరిగేలా చూడాలి. ఈ సమస్య వల్ల మన ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న నష్టంతో పోలిస్తే దానికి కేటాయించే నిధులు పెద్ద ఎక్కువేం కాదు. -
ఆరావళి ఆరాటం
ఆరావళి పర్వతశ్రేణి పరిరక్షణ కోసం అసాధారణ రీతిలో పలు రాష్ట్రాల ప్రజానీకం రోడ్డెక్కడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలెట్టింది. ఢిల్లీ, గుజరాత్, హరియాణా, రాజస్థాన్లలో ఆరావళి పర్వతాలకు సంబంధించి కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వొద్దని బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఇది పర్యావరణ పరిరక్షణ కోసమేనంటున్నది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ. మంచిదే! కానీ ఈ విజ్ఞత ముందేవుంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. గత ఆదివారం ఆరావళి గురించి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పిన కొత్త నిర్వచనమైనా, చుట్టుపక్కల భూమి కన్నా కనీసం వంద మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటేనే, మూడు డిగ్రీల ఏటవాలు కనబడితేనే ఆరావళిలో భాగంగా పరిగణించాలన్న ఆ మంత్రిత్వశాఖ సిఫార్సును ఆమోదిస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలైనా పర్యావరణ కార్యకర్తలను విస్మయానికి గురిచేశాయి. ఇప్పుడైనా కొత్త మైనింగ్ లీజులు ఇవ్వొద్దన్న ఆదేశాలు తప్ప, ఈ పర్వతాలను అమాంతం కబళించే ప్రమాదమున్న కొత్త నిర్వచనానికి స్వస్తి పలుకు తున్నామన్న భరోసా లేదు. ఈ నేలపై సమస్త జీవరాశి కన్నా కోట్లాది సంవత్సరాల ముందే ఆవిర్భవించిన పర్వతశ్రేణి ఆరావళి. వాటి వయసు 250 కోట్ల సంవత్సరాలంటారు. వాయవ్య భారత్లో 670 కిలోమీటర్ల పొడవునా, లక్షా 44వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి, నాలుగు రాష్ట్రాల్లోని 34 జిల్లాలను తాకుతూపోయే ఈ ఆరావళిని దశాబ్దాలుగా అధికార, అనధికార మైనింగ్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఆ పర్వతశ్రేణి పర్యావరణపరమైన ప్రయోజనాలను విస్మరించి, అవి మాయమైతే వచ్చే ఉత్పాతాలను బేఖాతరు చేసి కాసుల కక్కుర్తితో కొంచెం కొంచెంగా చిదిమేస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిర్వచనం చెప్పుకుంటూ ఇప్పటికే చాలా భాగాన్ని స్వాహా చేసిన వైనం కనబడుతూనే ఉంది. ఆ పర్వతశ్రేణిలో కేవలం 0.19 శాతంలో మాత్రమే మైనింగ్ లీజులు నడుస్తున్నాయని కేంద్రమంత్రి అంటున్నారు. అంటే 99 శాతానికిపైగా విస్తీర్ణం సురక్షితంగా ఉన్నట్టు లెక్క. కనుక మైనింగ్ ప్రాంతం తక్కువనిపిస్తుంది. కానీ అంకెల్లో చూస్తే అసలు సంగతి బోధపడుతుంది. అది ఏకంగా 68,000 ఎకరాలు! మైనింగ్ సంస్థలు గోరంత లీజుకు కొండంత తవ్వుకుపోవటం మన దేశంలో వింతేమీ కాదు. కనుక వాస్తవంలో ఇది మరింత ఉండొచ్చు. అసలు పర్యావరణ శాఖ కమిటీ సుప్రీంకోర్టుకు అందించిన నివేదిక గమనిస్తే అది ఆరావళిని రక్షించదల్చుకున్నదా... భక్షించే వారికి వంత పాడదల్చుకున్నదా అనే సందేహం తలెత్తుతుంది. ‘ఆరావళిలో ప్రతి భాగమూ పర్వతం కాదు, అలాగే ప్రతి పర్వతమూ ఆరావళిలో భాగం కాదు’ అని అనడంతోపాటు ‘కేవలం ఏటవాలే హద్దుల నిర్ణయానికి గీటురాౖయెతే చేర్పులకు సంబంధించి తప్పులు దొర్లే ప్రమాదం ఉంటుంద’ని చెప్పడంలో పర్యావరణహితం ఆవగింజంతైనా కనబడుతోందా? దశాబ్దాల తరబడి అక్కడి అక్రమ, ‘సక్రమ’ మైనింగ్ కార్యకలాపాల వల్ల పర్వతరహిత ప్రాంతాలుంటే ఉండొచ్చు. కానీ పర్యావరణ శాఖ కమిటీగా ‘చేర్చాలన్న’ ఆత్రుత కన్నా మినహాయింపుల వైపే మొగ్గటం సరైందేనా?మనిషి తాను ప్రకృతిలో భాగమన్న సంగతి మరిచి చాన్నాళ్లయింది. దాన్నుంచి వేరు చేసుకుంటే ఏం జరుగుతుందో ఆరావళి ఆవలున్న థార్ ఎడారి చూపుతోంది. అక్కడి ఇసుక తుపాన్లు మన వైపు రాకుండా అడ్డుపడుతున్నవీ, స్థానికంగా భూగర్భజలాలను పెంచుతున్నవీ, జనం జీవనోపాధికి అండగా నిలుస్తున్నవీ ఈ పర్వతాలే! ఇంతకూ ఆరా వళి ప్రాంతాన్ని మైనింగ్కు ఇవ్వబోమన్న హామీ వినబడుతోంది గానీ... జాతీయ రాజ ధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో రియల్ ఎస్టేట్ దందాను సాగనివ్వబోమన్న వాగ్దాన మైతే ఇంతవరకూ లేదు. నిజానికి వందమీటర్ల గీటురాయి ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి రూపొందించినట్టే కనబడుతోంది. ఎందుకంటే ఆరావళికి ఇటువైపున్న చిట్టచివరి ప్రాంతం ఎన్సీఆర్. అక్కడ కొండలు దాదాపు కనుమరుగయ్యాయి. కానీ ఇంకా చిన్న గుట్టలు, పొదలూ విస్తారంగా ఉన్నాయి. వీటిని సైతం కాపాడుకోవాల్సిందే! యునెస్కో అరుదైన ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఆరావళిలో అంగుళం కూడా నష్టపోకూడదు. -
శభాష్... ఇస్రో!
గగన వీధుల్లో మన అంతరిక్ష శాస్త్రవేత్తలు మరో అపురూపమైన రికార్డు నమోదు చేసుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఇంతవరకూ ప్రయోగిస్తూ వస్తున్న రాకెట్లలో అరుదైనదిగా, ‘బాహుబలి’గా చెబుతున్న ఎల్వీఎం3–ఎం6 బుధవారం ఉదయం నిప్పులు చిమ్ముకుంటూ ఏకంగా 6,100 కిలోల బరువుండే బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకుపోయి నిర్దిష్ట కక్ష్యలో ఉంచింది. ఎల్వీఎం3–ఎం6 సాదాసీదా రాకెట్ కాదు. దాని బరువు 6,40,000 కిలోలు. ఎత్తు 43.5 మీటర్లు. మన గడ్డపైనుంచి ఇంతవరకూ ప్రయోగించిన ఉపగ్రహాల్లో బ్లూబర్డ్ బ్లాక్–2 అత్యంత భారీ ఉపగ్రహం. ఈ ప్రయోగంలో మరో రికార్డు కూడా ఉంది. కేవలం 52 రోజుల వ్యవధిలో రెండు ఉపగ్రహాలను పంపటం ఇదే ప్రథమం. గత నెల 2న 4,400 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని ఎల్వీఎం3–ఎం5 భూ అనువర్తిత బదిలీ కక్ష్య(జీటీఓ)లో ప్రవేశపెట్టింది. తాజాగా ఎల్వీఎం3–ఎం6 కేవలం 15 నిమిషాల్లో నిమ్న భూకక్ష్య (లియో)లో ... అంటే 518 కిలోమీటర్ల ఎత్తులో బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని ఉంచింది. ఎల్వీఎం3 రాకెట్ మన శాస్త్రవేత్తలకు విశ్వసనీయమైనది. ప్రయోగాత్మకంగా పంపిన తొలి రాకెట్తో మొదలుపెట్టి ఇంతవరకూ ఈ రకం రాకెట్ ద్వారా ఎనిమిది ప్రయోగాలు విజయవంతం కాగా, ఇప్పుడు తొమ్మిదో ప్రయోగం సైతం భేషుగ్గా ఉండటం మన శాస్త్రవేత్తల ఘనతకు తార్కాణం. అంతరిక్షంలో సమర్థవంతమైన వాణిజ్య సేవలందించి దేశానికి కీర్తిప్రతిష్ఠలతోపాటు దండిగా ఆదాయాన్ని తెచ్చేవిధంగా ఇస్రో తనను తాను తీర్చిదిద్దుకుంది. ఈ రంగంలో ఎదురవుతున్న పోటీని అవలీలగా అధిగమించేలా మన శాస్త్రవేత్తలు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటున్నారు. వ్యయం అదుపు, లక్ష్యాన్ని సాధించగల నేర్పు ఇస్రో సొంతం. అందుకే 34 దేశాలు 434 ఉపగ్రహాలను ఇస్రో ద్వారా ప్రయోగించాయి. ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు సంస్థలు సైతం ఉపగ్రహ ప్రయోగాల కోసం దాన్ని ఆశ్రయిస్తున్నాయి. విదేశీ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని ఉపగ్రహాలను ప్రయోగించటం కోసం ఇస్రో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) సంస్థను ఏర్పర్చింది. దానికింద ఇంతవరకూ రెండు ఉపగ్రహాలను పంపింది. ఆ వరసలో బ్లూబర్డ్ బ్లాక్–2 మరో కలికితురాయి. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్తో కుదిరిన ఒప్పందం పర్యవసానమే తాజా ప్రయోగం.ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు దీటుగా సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతోంది. ఈ 5జీ యుగంలో పాత ఉపగ్రహాలు పెద్దగా ఉపయోగపడవు. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లకు నేరుగా హైస్పీడ్ సెల్యులర్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించటం వర్తమాన అవసరం. అందుకు బ్లూబర్డ్ బ్లాక్–2 సరిగ్గా తోడ్పడుతుంది. ఇప్పుడు ప్రయోగించిన ఉపగ్రహం ఇంతవరకూ అంతరిక్షం చేరుకున్న ఈ రకం ఉపగ్రహాల్లో మూడున్నర రెట్లు పెద్దది. స్టార్లింక్, వన్వెబ్ వంటి ఉపగ్రహాలు సైతం మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నా వాటితో పోలిస్తే బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహం సాంకేతికంగా ఉన్నతమైనది. దీనికున్న ప్రత్యేక యాంటెన్నాలు టవర్లు లేని మారుమూల ప్రాంతాల్లో సైతం స్మార్ట్ ఫోన్లకు నేరుగా హైస్పీడ్ డేటాను అందించగలవు. అలాగే ఎదురుగా కూర్చున్న మరో వ్యక్తితో మాట్లాడుతున్నామనిపించే విధంగా అవతలి గొంతును స్పష్టంగా వినిపించగలవు. నాణ్యమైన వీడియో కాల్స్కు తోడ్పడగలవు. అయితే మన దేశం నుంచి దీన్ని ప్రయోగించారన్న మాటేగానీ... ఇది అందించే సేవలు మాత్రం ఇక్కడ అందుబాటులో ఉండవు. కారణం మన నిబంధనలు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అనుమతించవు. అంతరిక్షంపై ఆధిపత్యం కోసం అగ్ర రాజ్యాలు పోటీపడుతున్నాయి. ఏ ప్రయోగా లైనా ఐక్యరాజ్యసమితి చెప్పినట్టు శాంతియుత ప్రయోజనాలకు, మానవాళి మేలుకు తోడ్పడాలి. ఆ దిశగా మన ఇస్రో ఎన్నదగిన కృషి చేస్తోంది. ప్రయోగాల్లో వంద శాతం సక్సెస్ రేటు సాధించటం, సంక్లిష్ట ప్రయోగాలను సైతం సునాయాసంగా చేయగల నేర్పును సొంతం చేసుకోవటం ఇస్రో ప్రత్యేకత. ఇప్పుడు సాధించిన విజయం భవిష్యత్తులో మరిన్ని ఘన విజయాలకు బాటలు పరుస్తుందనటంలో సందేహం లేదు. -
న్యూజిలాండ్తో ఎఫ్టీఏ
ఇది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్టీఏ) యుగం. మన దేశం ఈ ఏడాది ఇంతవరకూ బ్రిటన్, ఒమన్ దేశాలతో ఎఫ్టీఏలపై సంతకం చేసింది. తాజాగా న్యూజిలాండ్తో ఎఫ్టీఏపై అవగాహన కుదిరింది. మరో మూడు నెలల్లో సంతకాలు కాబోతున్నాయి. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక వాణిజ్య, వాణిజ్యేతర కారణాలతో మన దేశంపై ఎడాపెడా సుంకాలు విధించి తన షరతులకు తలొగ్గటమో, ఆర్థికంగా నష్టపోవటమో తేల్చుకోమని సవాలు విసురుతున్నారు. ఆ నష్టాలను వీలైనంత తగ్గించుకోవటానికి ప్రత్యామ్నాయాలు వెదుక్కునే క్రమంలోనే మన దేశం వివిధ దేశాలతో ఎఫ్టీఏలు కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. సరుకులు, సేవల్లో ఇరు దేశాల మధ్యా 130 కోట్ల డాలర్ల విలువైన వర్తమాన ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రాగల అయిదేళ్లలో 500 కోట్ల డాలర్లకు తీసుకెళ్లటం, వచ్చే పదిహేనేళ్లలో భిన్న రంగాల్లో న్యూజిలాండ్ 2,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడం భారత్–న్యూజిలాండ్ ఎఫ్టీఏ సారాంశం. దీని ప్రకారం మన సరుకులన్నిటిపైనా దాదాపు సుంకాలు విధించకుండా ఉండేందుకు న్యూజిలాండ్ అంగీ కరిస్తే, అక్కడినుంచి యాపిల్స్, కివీ పండ్లు, చెర్రీలు, నూలు ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు మన దేశం సుముఖత వ్యక్తం చేసింది. కార్మికుల అవసరం ఎక్కువున్న జౌళి, ఆభరణాలు, తోలు, ఆటోమొబైల్స్, ఇంజినీరింగ్, మెరైన్, హస్త కళలు వగైరా ఉత్పత్తులకు న్యూజిలాండ్ తక్కువ సుంకాలు విధిస్తుంది. కొన్నింటి విషయంలో అసలు సుంకాలే ఉండవు. అలాగే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) పట్టభద్రులకు న్యూజిలాండ్లో ఉద్యోగావకాశాలుంటాయి. అక్కడి వర్సిటీల్లో చదువుకొనేందుకూ, పరిశోధనలు సాగించేందుకూ మన విద్యార్థులకు వీలుంటుంది. మరో విశేషమేమంటే మన తరఫున ఈ ఒప్పందం సాకారానికి కృషి చేసింది మొత్తంగా మహిళా అధికారుల బృందమే.ఎఫ్టీఏలపై ఆరోపణలూ, విమర్శలూ కూడా లేకపోలేదు. ఆహారం, ఆరోగ్యం, కార్మిక వర్గం, పర్యావరణం తదితర అంశాలపై ఇవి తీవ్రంగా ప్రభావం చూపే అవకాశమున్నా అధిక శాతం ఎఫ్టీఏల చుట్టూ గోప్యత అలుముకుని ఉంటుందనీ, ఆచరణ మొదలయ్యాకే వాటి అసలు పర్యవసానాలేమిటో ప్రజలకు తెలుస్తుందనీ సామాజిక కార్యకర్తల ఆరోపణ. తొలి ఆధునిక సమగ్ర ఎఫ్టీఏ ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(నాఫ్తా) 1994లో కుదరగా, మన దేశం తొలిసారి 1999లో శ్రీలంకతో ఎఫ్టీఏ కుదుర్చుకుంది. అటుతర్వాత జపాన్, మలేసియా, దక్షిణ కొరియా, సింగపూర్, ఆగ్నేయాసియా దేశాల కూటమి ఆసియాన్ వగైరాలతో ఈ ఒప్పందాలు కుదిరాయి. వర్తమాన యుగంలో ఏ దేశమూ ఒంటరిగా మనుగడ సాగించలేదు. ఆత్మ నిర్భర భారత్, మేకిన్ ఇండియా వంటివి స్వావలంబనకు కొంతమేర తోడ్పడవచ్చుగానీ, వాటినే సర్వస్వంగా భావించటం సాధ్యం కాదు. చిత్రమేమంటే భారత్–న్యూజిలాండ్ ఎఫ్టీఏపై సామాజిక రంగాల కార్యకర్తలకన్నా ముందు న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ చిర్రుబుర్రులాడుతున్నారు. న్యూజిలాండ్ డెయిరీ ఉత్పత్తులకు మన మార్కెట్ను బార్లా తెరవకపోవటం ఆయనగారికున్న అభ్యంతరం. పార్లమెంటులో ధ్రువీకరణకొచ్చినప్పుడు ఒప్పందాన్ని ప్రతిఘటిస్తామని కూడా ప్రకటించారు. న్యూజిలాండ్ అధికార కూటమి ప్రభుత్వంలో ఆయన పార్టీ భాగస్వామి. ఈ ఏడాది ఇంతవరకూ 2,400 కోట్ల డాలర్ల డెయిరీ ఉత్పత్తులు పాలు, వెన్న, జున్ను వగైరాలు తాము ఎగుమతి చేయగా, ఒక్క భారత్ మాత్రమే అందుకు సమ్మతించటం లేదన్నది ఆయన అభ్యంతరం. అయితే కుదరబోయే ఈ ఒప్పందం ఒక వెసులుబాటునిస్తోంది. ముడి పదార్థాలు తీసుకొచ్చి ఉత్పత్తులు చేసి వంద శాతం ఎగుమతులు చేసుకునేందుకు న్యూజిలాండ్కు అవకాశం ఉంటుంది. డెయిరీ, సాగు ఉత్పత్తులకు అనుమతులిస్తే మన సాగు, పాడి రంగాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలోనే అమెరికా ప్రధానంగా పట్టుబడుతోంది. ఇప్పుడు న్యూజిలాండ్తో కుదిరిన అవగాహన చూశాక ట్రంప్ ఏమంటారో చూడాలి. మొత్తానికి మన ప్రయోజనాలు దెబ్బతినకుండా, లబ్ధి చేకూరేలా కుదుర్చుకునే ఏ ఒప్పందమైనా స్వాగతించదగిందే! -
యూనస్ కళ్లు తెరుస్తారా!
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న బంగ్లాదేశ్లో హింస ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కనబడటం లేదు. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో గతవారం దేశమంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. హింస చెలరేగింది. దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మైనారిటీ హిందూ యువకుణ్ణి మతాన్ని కించపరిచాడన్న ఆరోపణతో కొట్టి చంపారు. ‘ప్రథమ్ ఆలో’, ‘ద డైలీ స్టార్’ అనే రెండు ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాలకు నిప్పంటించారు. ఈలోగా సోమవారం మరో విద్యార్థి నాయకుడు, నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్సీపీ) స్థానిక నేత మొతలబ్ షిక్దర్ను దుండగులు కాల్చి చంపారు. బంగ్లాదేశ్ అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోవటం, ఎన్నికలను ప్రహసన ప్రాయంగా మార్చటం వగైరాలతో జనం ఆగ్రహించి నిరుడు జూలైలో ఉద్యమించారు. దాన్ని తమకు అనుకూలంగా మలచుకోవటంలో, హింసను రెచ్చగొట్టి మైనారిటీ హిందూ మతస్తులపై, మహిళలపై దాడులు చేయటంలో మతతత్వవాదులు విజయం సాధించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ వీటన్నిటినీ గుడ్లప్పగించి చూస్తున్నారు. ఉద్యమకారులు రోడ్లపైకొచ్చి విధ్వంసం సృష్టిస్తుంటే వాటిని అడ్డుకోవటానికి ప్రభుత్వపరంగా ఆయన చేసిందేమీ లేదు. అది చేతగానితనమా, వ్యూహాత్మకమా అన్నది తేలాల్సి ఉంది. హసీనా నిష్క్రమించాక చోటుచేసుకుంటున్న వరస పరిణామాలు అరాచకానికి బీజాలు వేశాయి. నేరగాళ్లను జైళ్లనుంచి విడిచిపెట్టడం, జమాత్–ఎ–ఇస్లామీ(జేఐ) వంటి పాక్ అనుకూల మతతత్వ సంస్థలకు స్వేచ్ఛనీయటం వగైరాలు ఎడతెగని హింసకు దారితీశాయి. హసీనా సొంత పార్టీ అవామీ లీగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పోటీచేసే అవకాశం లేకపోవటం, మరో ప్రధాన పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బీఎన్పీ) అధినేత ఖలీదా జియా తీవ్ర అస్వస్థత వల్ల ఆ పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారటం వగైరా పరిణామాలతో జేఐ వంటి మతతత్వ సంస్థలు తామే విజేతలమన్న భ్రమలో బతుకుతున్నాయి. భారత్ వ్యతిరేకతను ఇదే స్థాయిలో రెచ్చగొడుతూపోతే తమకే అధికారం దక్కుతుందని తలపోస్తున్నాయి. హదీ చురుకైన విద్యార్థి నాయకుడే. కానీ జేఐకి బద్ధ వ్యతిరేకి. ‘ఇంక్విలాబ్ మంచా’(ఐఎం) అనే మరో మతతత్వ సంస్థకు అధికార ప్రతినిధి. ఇటీవలే ‘ప్రథమ్ ఆలో’ పత్రిక సర్వే నిర్వహించి ఐఎం కన్నా జేఐకే ప్రజాదరణ ఎక్కువుందని తెలిపింది. బంగ్లాలో వరసబెట్టి ఆలయాలపై, దర్గాలపై సాగుతున్న దాడులపై అమెరికాలో పరిశోధక విద్యార్థిగా ఉన్న అసిఫ్ బిన్ అలీ రాసిన సవివరమైన వ్యాసాన్ని ప్రచురించింది. ఇదంతా కంటగింపుగా మారి ఐఎం మూకలు ఆ పత్రిక కార్యాలయానికి నిప్పెట్టాయి. పాక్ పాలకులు తమ సంస్కృతినీ, భాషనూ అణగ దొక్కాలని చూసిన పర్యవసానంగానే బంగ్లా ఆవిర్భవించిందన్న కనీస అవగాహన కూడా లేని ఈ మూకలు దేశాన్ని ఎటు తీసుకెళ్తాయో అనూహ్యం.భారత్ వ్యతిరేకత ఎంతగా ప్రదర్శిస్తే అంతగా తమకు జనాదరణ పెరుగుతుందని మతతత్వ సంస్థలు భావిస్తున్నాయి. దేశం ఎదుర్కొంటున్న అధిక ధరల సమస్య లేదా నిరుద్యోగాన్ని రూపుమాపటం, కనీసం అవినీతి అంతానికి ఏం చేస్తారో చెప్పటం వగైరాలు మరిచిన ఈ సంస్థలు భారత్ వ్యతిరేకత పైనే ఆశ పెట్టుకున్నట్టు కనబడుతోంది. హదీ భారత వ్యతిరేకి కావొచ్చుగానీ... అంతమాత్రాన ఆ హత్య వెనక భారత్ హస్తం ఉన్నదనీ, హదీ హంతకులకు అది ఆశ్రయమిచ్చిందనీ వదంతులు వ్యాపింపజేయటం, ప్రభుత్వం మౌనంగా ఉండిపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి వైఖరే అరాచకానికి దారితీస్తోంది. ప్రజాస్వామ్యం ఒక్కరోజులో కుప్పకూలదు. దీర్ఘకాలం కొనసాగే అరాచకం, హింస అందుకు తోడ్పడతాయి. హదీ సంస్మరణ సభలో మాట్లాడిన వారు భారత్కు హెచ్చరికలు జారీచేయటం, హసీనానూ, హదీ హంతకులనూ అప్పగించాలంటూ తేదీ ఖరారు చేయటం... ఎన్నికలు ముంచుకొస్తుండగా ప్రభుత్వం దీన్ని మౌనంగా వీక్షించటం బాధ్యతా రాహిత్యం. సకాలంలో ఈ అరాచకాన్ని నివారించకపోతే మున్ముందు తనను కూడా ఈ శక్తులు లక్ష్యంగా మార్చుకుంటాయని యూనస్ తెలుసు కోవటం మంచిది. -
అవార్డులూ... సాహిత్యమూ
సాహితీవేత్తలు, కళాకారుల ప్రతిభా వ్యుత్పత్తులను గుర్తించి, సత్కరించే సంప్రదాయం పురాతన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలలో ఉండేది. రాచరికాలు కొనసాగిన కాలంలో రసహృదయం కలిగిన రాజులు కవులు, కళాకారులకు సత్కారాలు చేసేవారు. అనితర సాధ్యమైన ప్రతిభాసంపదను ప్రదర్శించిన కవులు, కళాకారులకు కొందరు రాజులు గండపెండేరాలు తొడిగి, కనకాభిషేకాలు చేసిన ఉదంతాలు కూడా చరిత్రలో నమోదై ఉన్నాయి. ‘దీనార టంకాల దీర్థమాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల’ అంటూ శ్రీనాథుడు రాజుల నుంచి తాను పొందిన సత్కారాలన్నింటినీ ఏకరువు పెట్టాడు. ‘బిరుదైన కవి గండపెండేరమున కీవె తగుదని తానె పాదమును దొడిగె’ అని అల్లసాని పెద్దన –శ్రీకృష్ణదేవరాయలు తన కాలికి బంగారు గండెపెండేరాన్ని స్వయంగా తొడిగిన ఉదంతాన్ని చెప్పుకున్నాడు. తంజావూరు పాలకుడు విజయరాఘవ నాయకుడు తన ఆస్థాన కవయిత్రి రంగాజమ్మకు కనకాభిషేకం జరిపించాడు. సామాజిక స్థాయిని పెంచే రాజాశ్రయం కోసం; రాజులు ఇచ్చే బిరుదులు, పారితోషికాల కోసం; కనకాభిషేకాలు జరిపించుకుని, గండెపెండేరాలు తొడిగించుకోవాలనే ఉబలాటం తీర్చుకోవడం కోసం ఎందరో కవులు, కళాకారులు అర్రులు చాచేవారు. అలాంటి కాలంలోనే ‘ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్/ సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే/ సమ్మెట పోటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పె నీ/ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్’ అని ఘంటాపథంగా చెప్పి, రాజాశ్రయానికి దూరంగా మిగిలిన పోతనలాంటి వారు కూడా ఉండేవారు. భాగవతం రాసిన పోతనే కాదు, రామాయణం రాసిన మొల్ల కూడా రాజాశ్రయానికి దూరంగానే ఉంది. అంతమాత్రాన పోతన కవిత్వానికీ, మొల్ల కవిత్వానికీ వచ్చిన లోటేమీ లేదు. పోతన, మొల్ల మాత్రమే కాదు, రాజాశ్రయానికి దూరంగా ఉండి పోయిన కవులు ఎందరో! రాజాశ్రయంతోను, బిరుద సత్కారాలతోను నిమిత్తం లేకుండా కొందరి కవిత్వం మాత్రమే నేటికీ నిలిచి ఉంది. రాచరికాలు అంతరించడం మొదలవుతున్న కాలంలో– అంటే, ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలో సత్కారాలు ఆధునిక రూపాన్ని సంతరించుకున్నాయి. సాహిత్యం సహా వివిధరంగాలలోని ప్రతిభావంతులను గుర్తించి, ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా అవార్డులు, బిరుదులు ఇవ్వడం మొదలైంది. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమానాలు ఇవ్వడం 1901 నుంచి మొదలైంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఒలింపిక్స్లో క్రీడలకు మాత్రమే కాదు, 1912 నుంచి 1948 వరకు సాహితీ కళారంగాలలోని ప్రతిభ చూపిన వారికీ పతకాలను ఇచ్చేవారు. అవార్డులు, బిరుదుల వ్యవహారంలో సాహిత్యరంగాన్ని చూసుకుంటే, మన కేంద్ర ప్రభుత్వం 1954లో కేంద్ర సాహిత్య అకాడమీని ప్రారంభించింది. ఈ అకాడమీ 1955 నుంచి వివిధ భాషలకు చెందిన సాహితీవేత్తలకు అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ రాష్ట్రాల్లో సాహిత్య అకాడమీలను ఏర్పాటు చేసుకుని, సాహితీవేత్తలకు అవార్డులు ఇస్తున్నాయి. ఇవి కాకుండా ప్రైవేటు సంస్థలు ఇస్తున్న జ్ఞానపీఠ అవార్డు, సరస్వతీ సమ్మాన్ వంటివి సాహితీరంగంలోఅత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా గుర్తింపు పొందాయి. ఢిల్లీ స్థాయిలోని కేంద్ర సాహిత్య అకాడమీ సరే, గల్లీ స్థాయిలో అవార్డులిచ్చే చిల్లర మల్లర సంస్థలు ఇప్పుడు ఊరూరా ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక అవార్డుల కోసం పైరవీలు సాగించే ఘరానా సాహితీ వేత్తలతో పాటు సాహితీరంగంలో చిల్లర సంస్థలు ఇచ్చే అవార్డులు పుచ్చుకుని, సంబర పడిపోయే అల్పజీవులూ ఉన్నారు. అయితే, ఇటీవలి కాలంలో పసలేని రచనలకు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల పందేరం చేస్తోందని సాహితీరంగంలో విమర్శలు వినిపిస్తూ వచ్చాయి. తాజాగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన నిలిచిపోవడంతో అకాడమీ పనితీరుపై సాహితీరంగంలో రకరకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయినా, అమెరికన్ రచయిత, చిత్రకారుడు క్రిస్ వాన్ ఆల్సబర్గ్ చెప్పినట్లు ‘అవార్డులు ఒక పుస్తకం పసను మార్చలేవు’. అవార్డులు అవార్డులే, సాహిత్యం సాహిత్యమే! -
అసత్యాలు... అర్ధ సత్యాలు
సొంత శిబిరంలో విభేదాలూ, అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థ, కానరాని ఉపాధి కల్పన, మధ్యంతర ఎన్నికల్లో ఓటర్ల తిరస్కరణ వగైరాలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ఊపిరాడనీయటం లేదని వైట్హౌస్ వేదికగా ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగం తేటతెల్లం చేసింది. పాత సంవత్సరానికి వీడ్కోలుగా, అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా ఆయన చేసిన ఈ ప్రసంగం ఒకపక్క స్వోత్కర్షలతో, మరోపక్క సంజాయిషీలతో నిండిపోయింది. అసత్యాలు, అర్ధ సత్యాలు సరేసరి. తరచు వైట్హౌస్ వేదికగా జరిగే మీడియా సమావేశాల్లో ఆయన చేసే వ్యాఖ్యలకూ, ఈ ప్రసంగానికీ కాస్తయినా తేడా లేదు. స్వీయ వైఫల్యాలను నిష్క్రమించిన అధ్యక్షుడు జో బైడెన్ ఖాతాకు మళ్లించి... జరగని యుద్ధాలనూ, జరిగినా తన ప్రమేయం లేకుండా ముగిసిన యుద్ధాలనూ, ఆపినా మళ్లీ మొదలైన యుద్ధాలనూ సైతం తన విజయంగా ప్రకటించుకున్నారు. అందులో భారత్–పాక్ సంఘర్షణ ఒకటి. వలసదారులను దేశం విడిచి వెళ్లేలా చేసి అలా ఆదా చేసిన సొమ్మంతా అమెరికన్ పన్ను చెల్లింపుదారులకు ఉచితంగా వైద్యం, విద్య రూపంలో అందిస్తున్నామని ట్రంప్ చెప్పుకొన్నారు. ఇళ్ల అద్దెలు తగ్గాయనీ, ఉద్యోగాలు వచ్చిపడ్డాయనీ, పెట్టుబడులు రప్పించాననీ ప్రకటించుకున్నారు.నిజానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టడానికి వలసదారుల తోడ్పాటు ఎంతో ఉంది. దేశంలో అగ్ర సంస్థలుగా పేరొందిన వాటిలో 46 శాతం... అంటే 230 కంపెనీలు వలసదారులూ, వారి పిల్లలూ స్థాపించినవే. ఈ ఏడాది న్యూ అమెరికన్ ఫార్చ్యూన్–500లో చేరిన పది కంపెనీల్లో సగం వలసదారులవే. 2023 గణాంకాల ప్రకారమైతే ఆ ఏడాది వలసదారులు సృష్టించిన సంపద లక్షా 70 వేల కోట్ల డాలర్లు. వారు పన్ను రూపంలో చెల్లించిన మొత్తం 65,200 కోట్ల డాలర్లు. వాస్తవాలు ఇవి కాగా, చట్టవిరుద్ధంగా వచ్చినవారితోపాటు అమెరికా పౌరసత్వం పొందినవారిని సైతం ట్రంప్ ప్రభుత్వం రాచి రంపాన పెడుతోంది. వారిలో అనవసర భయాందోళనలను సృష్టిస్తూ, ప్రజల్లో అనైక్యత తీసుకురావటానికి అబద్ధాలను ప్రచారంలో పెడుతోంది. ఆయన వచ్చాక వలస వ్యవహారాల న్యాయమూర్తులుగా వున్న 100 మందిని తొలగించారు. టానియా నెమెర్ అనే మహిళా న్యాయమూర్తిని ఒక కేసు విచారిస్తుండగానే కారణం చెప్పకుండా బెంచ్ నుంచి, ఆ తర్వాత సర్వీసు నుంచి తొలగించారు. ప్రస్తుత వైఫల్యాలకు కారణం గతంలోని అస్తవ్యస్తతే కారణమని చెప్పడం ఇటీవల అన్ని దేశాల్లోనూ పాలకులకు అలవాటైన విద్య. ట్రంప్ సైతం ఆ పాటే పాడారు. నిజానికి జో బైడెన్ హయాంలో ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. వలసదారులను తరిమేయటం ద్వారా దాన్ని మరింత గొప్పగా మారుస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో ట్రంప్ పదే పదే చెప్పారు. కానీ జరిగిందంతా వేరు. ఇష్టానుసారం ప్రపంచ దేశాలపై సుంకాలు పెంచటం వల్ల దేశీయ వినియోగదారులు సగటున 16.8 శాతం అదనంగా పన్నులు చెల్లించాల్సి వస్తున్నదనీ, 1935 నుంచి చూస్తే ఇదే అత్యధికమనీ యేల్ బడ్జెట్ ల్యాబ్ అంచనా వేసింది. దిగుమతైన సరుకులపై ప్రభుత్వం విధించే అదనపు సుంకాలను అంతిమంగా భరించేది అమెరికా వినియోగదారులే. ట్రంప్ అనుకూల ఫాక్స్ న్యూస్ సర్వేలో 72 శాతం మంది గడ్డు ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటు న్నామని చెప్పగా, 58 శాతం మంది ఆయన అనుచిత విషయాలపై శ్రద్ధ పెడుతున్నారని అన్నారు. ఇక అక్టోబర్, నవంబర్ నెలల్లో 41,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగిత 4.6 శాతానికి ఎగబాకింది. 2021 తర్వాత ఈ స్థాయికి పోవటం ఇదే ప్రథమం. గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయటానికి ప్రయత్నిస్తూ మాదక ద్రవ్యాలపై పోరాడుతున్నానని చెప్పుకోవటం ట్రంప్కే చెల్లింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను చిత్తశుద్ధితో చర్చించి, వాటి పరిష్కారానికి తాను అనుసరిస్తున్న విధానాలేమిటో చెప్పి భవిష్యత్తు బాగుంటుందని చెప్పివుంటే కనీసం కొందరైనా నమ్మేవారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఒప్పుకొంటే, దానికి జవసత్వా లిచ్చేందుకు ఆయన ఏదో ఒకటి చేస్తారన్న ఆశయినా మిగిలేది. దానికి బదులు అంతా సవ్యంగా ఉందని చెప్పడం వల్ల ట్రంప్పై కొద్దో గొప్పో ఉన్న విశ్వాసం కూడా దెబ్బతింది. ఆయన రేటింగ్ పడిపోవటంలో ఆశ్చర్యమేముంది? -
వాయు కాలుష్యం ఎన్నాళ్లు?
మనం పీల్చే ప్రాణవాయువు కొంచెం కొంచెంగా మన ప్రాణాన్ని తోడేస్తున్నదంటే నమ్మబుద్ధి కాదు. ఈ సంగతి కొన్ని దశాబ్దాలుగా తెలుస్తూనే ఉన్నా ప్రతి ఏటా దేశ రాజధాని పౌరులు చలికాలం ఉన్నన్నాళ్లూ శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల ఏటికేడాదీ అది తప్పడం లేదు. కాకపోతే శీతకాలంలో మాత్రమే మన వ్యవస్థలన్నీ మేల్కొంటాయి.సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలూ, ప్రభుత్వాల నియమ నిబంధనలూ, విపక్షాల విమర్శలూ, సామాన్యుల అరణ్య రోదనలూ... అన్నీ అప్పుడే! బీసీసీఐ సైతం దేశంలో దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయన్న సంగతే మరిచి ఇదే సీజన్లో ఢిల్లీలో, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో క్రికెట్ సంబరాల నిర్వహణకు సన్నాహాలు చేస్తుంది.ఈసారి కూడా రివాజు తప్పకుండా ఇవన్నీ ఒకదాని వెంబడి మరోటి సాగుతున్నాయి. పొగమంచు కమ్మేస్తున్న పర్యవసానంగా ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. గురువారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 50 శాతం మంది ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ మొదలైంది. ఉద్యోగులు సొంత వాహనాల్లో కాక, ‘కార్ పూలింగ్’ ద్వారా వచ్చేలా ప్రోత్సహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రాజధాని వెలుపల రిజిస్టరై, బీఎస్–4 ప్రమాణాలు లేని వాహనాల రాకపోకల్ని నిషేధించారు. కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ లేని వాహనాలకు ఇంధనం విక్రయించరాదంటూ పెట్రోల్ బంకులకు ఆదేశాలు పోయాయి. 16 రోజుల పాటు అమల్లో ఉండేలా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)–3 విధించారు.ఈ సమయమంతా నిర్మాణ పనులు నిలిచిపోవాలి. బీఎస్–3 పెట్రోల్, బీఎస్–4 డీజిల్ వాహనాలను అనుమతించబోరు. ఇవి 12 లక్షల వరకూ ఉంటాయని లెక్కేస్తున్నారు. మొత్తంగా ఉండే కోటిన్నర వాహనాల్లో ఇవి ఏపాటి? నమోదు చేసుకున్న నిర్మాణ కార్మికులు ఆంక్షల కారణంగా పనులు కోల్పోతే రూ. 10,000 చొప్పున అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అలా నమోదైన వారు కేవలం 2.57 లక్షలమంది మాత్రమే.ఇంతకు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారని అంచనా. ఇవన్నీ మెచ్చదగ్గ చర్యలే. కానీ అసలు ఢిల్లీ సవ్యంగా ఉన్నదెప్పుడు? ఇటీవలికాలంలో అది నిరంతరం కాలుష్యంలోనే మునిగి తేలుతోంది. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పరస్పర విరుద్ధాంశాలన్నట్టు ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయి. కేంద్రీకృత నగర వ్యవస్థల వల్లనే ఈ అవస్థలన్నీ దాపురిస్తున్నాయని తెలిసినా వాటిని మానుకోవడం లేదు.ఢిల్లీలో వాయునాణ్యత అతి తీవ్ర స్థాయిలో... అంటే సగటు వాయునాణ్యతా సూచిక (ఏక్యూఐ) 400కు మించి ఉన్నదని తేలింది. ఇది వరుసగా మూడు రోజులుండగా, ఆ తర్వాత అది ‘దయనీయ స్థితి’(వెరీ పూర్)కి... అంటే ఏక్యూఐ 300–400 పరిధిలో కొచ్చింది. కాలుష్యం గురించి దీపావళి పండుగకు ముందో, పంజాబ్లో పంట కోతల సమయంలోనో గుర్తుకురావటం వల్లే ఈ సమస్యంతా!కొన్నాళ్లపాటు మొత్తంగా టపాసులు కాల్చటానికి వీల్లేదని నిషేధం విధిస్తే ‘మా పండుగకే ఇలాంటివి గుర్తొస్తాయా?’ అనే తర్కం తలెత్తదు. బ్యాంకుల ద్వారా వాయిదాల్లో వాహనాల కొనుగోలును కొన్నాళ్లు ఆపేస్తే ఇంత చేటు కాలుష్యం ఉండదు. అసలు ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ఠం చేస్తే అత్యధికులు వాహనాల జోలికిపోరు. పరిశ్రమలు వెదజల్లుతున్న ఉద్గారాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటే కాలుష్య భూతం అదుపులో ఉంటుంది.ఇవన్నీ పట్టన ట్టు నవంబర్– జనవరి మధ్య క్రికెట్ మ్యాచ్లకు బీసీసీఐ ఉత్తరాదిని ఎంచుకుని నగుబాటు పాలవుతోంది. లక్నోలో వాయునాణ్యత 400 మించటంతో శుక్ర వారం జరగాల్సిన మ్యాచ్ను రద్దుచేశారు. ఇప్పుడే కాదు... 2017లో ఢిల్లీలో భారత– శ్రీలంక మ్యాచ్ సమయంలో పలుమార్లు అంతరాయం ఏర్పడింది. ఆటగాళ్లకు శ్వాసకోశ సమస్య లొచ్చాయి. కొందరైతే ఆడుతూ వాంతులు చేసుకున్నారు.2019లో భారత–బంగ్లా మ్యాచ్ సమయంలోనూ ఇంతే! రెండేళ్ల క్రితం బంగ్లా–శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ చివరి నిమిషంలో రద్దయింది. కనీసం ఈ సమయంలోనైనా దక్షిణాదిని ఎంచుకుందా మని బీసీసీఐకి తోచదు. ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్రవర్తించకుండా ప్రభుత్వ విభాగా లన్నీ సమన్వయంతో పనిచేస్తే, ఏడాది పొడవునా అమలయ్యే చర్యలుంటే ఢిల్లీ కాస్త యినా మెరుగుపడుతుంది. కాలుష్య భూతాన్ని నియంత్రణలో ఉంచడం సాధ్యమవుతుంది. -
మళ్లీ కాటేసిన ఉగ్రవాదం
ప్రశాంతంగా ఉన్నంతకాలమూ అంతా సవ్యంగా ఉందనుకోవటమే తప్ప ఉగ్రవాదం తీవ్రత ఎక్కడా తగ్గలేదని గత ఆదివారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్లో చోటు చేసుకున్న ఉదంతం తెలియజేస్తోంది. హన్నూక సంబరాల్లో మునిగిన యూదు సమూహంపై తండ్రీకొడుకులిద్దరు తుపాకులతో దాడి చేసి 15 మందిని కాల్చిచంపటం, 40 మందిని గాయపర్చటం గమనిస్తే నిరంతర అప్రమత్తత ఎంత అవసరమో అర్థమవుతుంది. ప్రతిచోటా భద్రత కల్పించటం ప్రభుత్వాలకు సాధ్యం కాకపోవచ్చు. అందుకే వర్తమాన పరిస్థితుల్లో ఎవరికి వారు తమ చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో అనునిత్యం గమనించుకోవడం తప్పనిసరి. తుపాకీ చట్టాలు ఎంతో కఠినంగా ఉండే ఆస్ట్రేలియాలో ఈ మాదిరి ఘటన జరిగి మూడు దశాబ్దాలవుతోంది. 1996లో పోర్ట్ ఆర్తర్లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో 35 మంది మరణించారు. గత రెండేళ్లలో యూదులకు వ్యతిరేకంగా దాదాపు 2,000 ఘటనలు జరిగినట్టు పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుత ఉదంతం కూడా దానికి కొనసాగింపే! ఇలాంటి నేపథ్యంలో నిఘా మరింత పక డ్బందీగా ఉంటే బాగుండేది. ఉన్మాదులు హఠాత్తుగా ఎక్కడైనా దాడులకు తెగబడొచ్చని ఇది రుజువుచేస్తోంది. ఆస్ట్రేలియా భిన్న జాతుల నిలయం. చాలా దేశాలతో పోలిస్తే అది స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు పెట్టింది పేరు. దేశ జనాభాలో యూదుల శాతం 0.4 శాతం. అంకెల్లో చెప్పు కోవాలంటే అది 1,17,000. అందులో చాలా కుటుంబాలు నాజీ జర్మనీలో హిట్లర్ ఉన్మాదాన్ని అధిగమించి అదృష్టవశాత్తూ బతికి బయటపడినవారివే. ఇజ్రాయెల్ పాల కులు గాజాపై రెండేళ్లపాటు ఎడతెగకుండా సాగించిన హంతకదాడుల్లో వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ ఆ దాడులు ఆగింది లేదు. దాన్ని ప్రపంచ దేశాల ప్రజలంతా నిరసించారు. అందులో యూదులు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా సైతం తీవ్రంగా ఖండించింది. అంతేకాదు, మొన్న ఆగస్టులో పాలస్తీనాను గుర్తించింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న యూదులంతా ఇజ్రాయెల్ దుండగాన్ని సమర్థించారని కూడా చెప్పలేం. ఉగ్రవాద సంస్థ హమాస్ సాగించిన హత్యాకాండకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవటం సబబేనని భావించేవారు ఉంటే ఉండొచ్చు. అలాంటి వారిని సైతం ఒప్పించేలా, మార్చ గలిగేలా ఉద్యమాలు నిర్మించాలి తప్ప సంబంధం లేని అమాయక పౌరుల్ని చంపి ఇలాంటి ఉన్మాదులు ఏం సాధిస్తారు? ఇప్పుడు దాడికి పాల్పడిన తండ్రీకొడుకులకు గాజా ఉదంతం సాకు మాత్రమే. హైదరాబాద్ పాతబస్తీ నుంచి 27 ఏళ్ల క్రితం సాజిద్ అక్రం వలసపోగా, ఆరేళ్లక్రితమే అతని కుమారుడు నవీద్ ఫిలిప్పీన్స్లోని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలు పెట్టుకున్నాడని, అప్పటినుంచి వారిద్దరికీ ఉన్మాదం తలకెక్కిందని అంటు న్నారు. గత నెలలో వారిద్దరూ ఫిలిప్పీన్స్ వెళ్లి సైనిక శిక్షణ తీసుకున్నారని పోలీసుల కథనం. ఆర్నెల్లక్రితం కొడుకుపై అనుమానం వచ్చి నిఘా సంస్థ అధికారులు ప్రశ్నించా రట కూడా! కొడుకు పేరుతో రిజిస్టరైన వాహనంలో పేలుడు పదార్థాలు, ఐఎస్ పతా కాలు ఉన్నట్టు పోలీసు సోదాలో బయటపడింది. ఉదంతం జరిగిన రోజే తండ్రిని పోలీసు బలగం కాల్చిచంపగా, కొడుకు సాజిద్ను సమీపంలోనే ఉన్న చిరువ్యాపారి అహ్మద్ అల్ –అహ్మద్ చాకచక్యంగా పట్టుకోగలిగాడు. మృత్యువుకు ఎదురొడ్డి అతను చేసిన సాహస కార్యం వల్ల అనేకమంది ప్రాణాలు నిలబడ్డాయి. కానీ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ఉదంతంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ విచిత్రంగా స్పందించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ విధానాలు యూదు వ్యతిరేకతను ప్రోత్సహించే విగా ఉన్నందువల్లే ఈ ఉదంతం జరిగిందని వ్యాఖ్యానించారు. పాలస్తీనా రాజ్యం ఏర్ప డాలని కాంక్షించటం యూదు వ్యతిరేక చర్య ఎలా అవుతుందో నెతన్యాహూకే తెలియాలి. హమాస్ ఉగ్రవాదులు 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి 1,195 మంది ఆ దేశ పౌరుల్ని, విదేశీయులు కొందరిని చంపేశారు. 251మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఆ విషయంలో ప్రభుత్వ భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చటానికి నెతన్యాహూ గాజాపై విరుచుకుపడ్డారు. ఇప్పుడాయన ఆల్బనీస్ను తప్పుపట్టేందుకు సిద్ధపడ్డారు! ఏదేమైనా ఆస్ట్రేలియా ఉదంతం ప్రపంచ దేశాల కళ్లు తెరిపించాలి. అత్యంత అప్రమత్తంగా ఉండకపోతే ఉగ్రవాద భూతం ఎక్కడైనా విరుచుకుపడొచ్చని తెలుసుకోవాలి. -
‘ఉపాధి’కి కొత్త రూపు!
గ్రామీణ ప్రాంతాల్లో కాయకష్టం చేయగలిగేవారికి ఏడాదికి కనీసం వంద రోజుల పని దినాలు కల్పించేందుకు ఇరవయ్యేళ్ల క్రితం తీసుకొచ్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కనుమరుగు కావటానికి రంగం సిద్ధమైంది. దాని స్థానంలో తీసుకురాదల్చిన ‘వికసిత భారత్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీ–జీ రాం జీ) బిల్లు పార్లమెంటులో రంగప్రవేశం చేసింది. అమలులో ఉన్న పథకం కన్నా ఇది అనేక రెట్లు మేలైనదని కేంద్రం చెబుతోంది. ఆ మాటెలా ఉన్నా ప్రతి పథకమూ హిందీ భాషా పదాల మేళవింపుతో ఉండటం, పదాది అక్షరాలతో గుర్తుండిపోయే పదం వచ్చేలా రూపొందించటం ఎన్డీయే ప్రభుత్వ ప్రత్యేకత. ఈసారైతే గ్రామాల్లో ప్రతి పేద కుటుంబమూ ‘జీ రాం జీ’ అని స్మరించుకునేలా వాటంగా రూపుదిద్దారు. మహాత్మా గాంధీ పేరు తొలగించారు. పార్టీల మధ్య వాదప్రతివాదాల సంగతెలా ఉన్నా సాధారణ జనం పథకం పేరు కన్నా ప్రయోజనం ఏమేరకన్నదే ప్రధానంగా చూస్తారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన నేపథ్యం ఒకింత విషాదకరమైనది. ‘పల్లె కన్నీరు బెడుతుందో...’ అంటూ ప్రజాకవి గోరటి వెంకన్న రాసిన పాట అప్పటి పరిస్థితుల్ని ప్రభావవంతంగా చూపింది. వరస కరువులతో, ఆర్థిక సంస్కరణలతో కుదేలై గ్రామీణ భారతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న రోజులవి. రైతుల ఆత్మహత్యలు, ఉపాధి కరువై వలసపోవటాలు, చేతివృత్తులు దెబ్బతినటం రివాజయ్యాయి. దేశంలో అనేక జిల్లాలు ఆకలితో అలమటించాయి. అప్పుడు కేంద్రంలో అధికారంలోకొచ్చిన యూపీఏ ప్రభుత్వం ‘జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ తీసుకొచ్చింది. 2006 నుంచి దశలవారీగా అమలు ప్రారంభించింది. పని చూపాలని కోరితే పక్షం రోజుల్లో పని కల్పించటం లేదా నిరుద్యోగ భృతి కల్పించటం, ఉపాధిని దయాధర్మ భిక్షంగా కాక, హక్కుగా గుర్తించటం, కూలీల్లో మూడోవంతు మంది తప్పనిసరిగా మహిళలుండాలనే షరతు, నివాస స్థలానికి అయిదు కిలోమీటర్ల లోపునే పనిచూపటం, అంతకు మించితే అదనపు వేతనం చెల్లించటం దాని ప్రత్యేకతలు. ప్రపంచంలోనే అతి పెద్ద ఉపాధి కల్పనా పథకమది. పల్లెసీమల్లో ఈ పథకం కింద రహదారులు, చెరువుల్లో పూడిక తీయటం, భూసార పరిరక్షణ, నీటిపారుదల సదుపాయాల మెరుగు వగైరా పనులు చేయించటానికి వినియోగించారు.అయితే లోపాలు లేవని కాదు. ఈ పథకం వల్ల తమకు కూలీల లభ్యత తగ్గిందని రైతుల ఫిర్యాదు. అలాగే వేతనాల చెల్లింపులో ఆలస్యం, నిధుల అరకొర కేటాయింపు, అన్నిచోట్లా ఒకేలా అమలు చేయకపోవటం, బయటి రేట్లతో పోలిస్తే వేతనాలు తక్కువ ఉండటం వగైరాలు సమస్యలు. వీటిని ‘జీ రాం జీ’ పరిష్కరిస్తుందా? వంద రోజులు కాదు... 125 రోజులు ఉపాధి గ్యారెంటీ అంటున్నది కొత్త పథకం. సాగు పనులు జోరుగా ఉండే రెండు నెలలూ దీన్ని తాత్కాలికంగా నిలిపేస్తారు. ఈశాన్య రాష్ట్రాలూ, కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ వగైరాలు మినహా మెజారిటీ రాష్ట్రాలు ఈ పథకంలో 40 శాతాన్ని భరించాల్సి రావటం ఇందులోని ప్రధాన సమస్య. ఇంతవరకూ ఇది 10 శాతం మాత్రమే. ఇకపై రాష్ట్రాలు ఏటా కనీసం రూ. 50,000 కోట్లు వెచ్చించాలి. పైగా ప్రతి ఏటా నిర్దిష్ట మొత్తంలో నిధులు కేటాయించటం, అంతకుమించి పెరిగితే రాష్ట్రాలే భరించాల్సి రావటం అదనపు సమస్య. రాష్ట్రాల ఆదాయ వనరులకు గండికొడుతూ అదనంగా ఇంత పెద్ద భారాన్ని మోపటం సరైందేనా? ఎన్డీయేను భుజాలకెత్తుకున్న జేడీ(యూ), టీడీపీ ఏమంటాయి? ఈ పథకం కూడా గతంలో మాదిరే హక్కు ప్రాతిపదికగా ఉంటుందంటున్నా నిధుల లేమితో ఆచరణలో ఆవిరి కాదా? గత అయిదేళ్లలో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు తగ్గుతున్నది. ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ గణాంకాలు ఆ సంగతి చెబుతున్నాయి. రాష్ట్రాలపై అదనపు భారం మోపితే పథకం నీరసిస్తుంది. రాష్ట్రాలకు కేటాయింపుల్లో కేంద్రం అనుసరించబోయే గీటురాళ్లేమిటో ఇంకా తెలియాల్సి ఉంది. తమకేం అవసరమో రాష్ట్రాలు నిర్ణయించు కోవటానికి బదులు ఎక్కడెక్కడ ఖర్చు చేయాలో కేంద్రం నిర్దేశిస్తుంది. వికేంద్రీకరణ అవసరం నానాటికీ పెరుగుతుండగా అందుకు భిన్నమైన మార్గం సమర్థనీయం కాదు. మొత్తానికి దీనివల్ల ఒరిగేదేమిటో, కష్టనష్టాలేమిటో మున్ముందు తెలుస్తాయి. -
బీమాలో సంపూర్ణ ఎఫ్డీఐ
భారత బీమా రంగంలో విదేశీ సంస్థలు పూర్తి స్థాయిలో ప్రవేశించటానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈ విషయంలో రెండు దశాబ్దాలుగా ఎడతెగకుండా సాగుతున్న ప్రయత్నాలు ఒక కొలిక్కివచ్చాయి. ‘సబ్కా బీమా సబ్కీ రక్షా’ పేరిట పార్లమెంటులో రంగప్రవేశం చేయబోతున్న బీమా చట్టాల సవరణ బిల్లు... 1938నాటి బీమా చట్టానికీ, 1956నాటి జీవితబీమా కార్పొరేషన్ చట్టానికీ, 1999 నాటి బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) చట్టానికీ సమూలమైన మార్పుల్ని ప్రతిపాదిస్తోంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను ప్రస్తుతం వున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచటానికి ఈ బిల్లు అనుమతిస్తోంది. కేంద్రంలో పాలకులెవరైనా, వారి రాజకీయ విశ్వాసాలూ, నాయకత్వం వహిస్తున్న కూటములూ ఏవైనా ఎఫ్డీఐను పూర్తి స్థాయిలో అనుమతించాలన్న విషయంలో అందరిదీ ఒకటే స్వరం. బీమా రంగంలో విదేశీ సంస్థలకు తలుపులు బార్లా తెరవాలని సంపన్న దేశాల నుంచి ఎప్పటినుంచో ఒత్తిళ్లు ఉన్నాయి. మన బీమా రంగంలో ప్రైవేటు సంస్థలున్నా సామాన్య పౌరులు పబ్లిక్ రంగ సంస్థ జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)ను విశ్వసించిన స్థాయిలో వాటిని నమ్మరు. అందుకే మార్కెట్లో ఇప్పటికీ దాని భాగస్వామ్యం దాదాపు 65 శాతం. అలాగని చొరవగా దూసుకెళ్లటంలో అదింకా వెనకబడి వున్నదనీ ఆర్థిక రంగ నిపుణులంటారు. పోటీ పెరిగితే ఇది మారుతుందనీ, వినియోగదారులు లాభపడతారనీ వారి వాదన. మన జీవిత బీమా రంగం వాటా జీడీపీలో 3.2 శాతం. వాస్తవానికి ఇది 2023–24 ఆర్థిక సంవత్సరంలో మరింత కిందకు పోయి 2.8 శాతం దగ్గర ఆగింది. విదేశాల్లో ఈ రంగం వాటా 6.5 శాతం.విదేశీ సంస్థలను అనుమతించటాన్ని వ్యతిరేకించేవారు అవి లాభార్జన దృష్టితో ఉంటాయని విమర్శిస్తారు. దేశీయ పొదుపు దేశాభివృద్ధికి కాక విదేశీ సంస్థలకు పోతుందని... పేదరికం ప్రబలంగా ఉన్న మనలాంటి దేశంలో సంక్షోభ కాలంలో ఆసరాగా నిలబడకపోతే ఎలా అన్నది వారి ప్రశ్న. అనుకున్నట్టు లాభాలు రాకపోతే సంస్థలు దివాలా తీసే, నిష్క్రమించే అవకాశం ఉండదా అనే సందేహాలున్నాయి. ఐఆర్డీఏఐ వంటి నియంత్రణ సంస్థ ఉండగా ఆ భయాలు అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం డేటా చౌర్యం కూడా సమస్యే! ప్రైవేటు సంస్థల్లో తగిన నియంత్రణ లేని కారణంగా ఖాతాదారుల డేటా బయటకు పోతోందని, అందువల్ల మోసగాళ్ల బెడద ఎక్కువైందని బీమా రంగాన్ని ప్రైవేటీకరించటాన్ని వ్యతిరేకించే సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2047కల్లా పౌరుల్లో ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం చేరాలన్నది ఐఆర్డీఏఐ లక్ష్యం. అలాగే ఆరోగ్యం, ఆస్తి తదితరాలకు సైతం బీమా చేయించుకునేలా ప్రచారం చేయాలని ఆ సంస్థ కంకణం కట్టుకుంది. విదేశీ సంస్థల్ని అనుమతించటానికి చాన్నాళ్లుగా మన ప్రభుత్వాలు హైరానా పడుతున్నాయి. తొలిసారి వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 1999లో ఐఆర్డీఏఐ చట్టాన్ని తీసుకొచ్చి ఆ రంగంలో 26 శాతం ఎఫ్డీఐలకు తొలిసారి అనుమతించింది. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, 2004లో తన నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రాగానే దాన్ని 49 శాతానికి పెంచే ప్రయత్నం చేసింది. అప్పట్లో యూపీఏకు బాసటగా ఉన్న వామపక్షాలు ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. కారణం ఏమైతేనేం ఈ ప్రతిపాదన ముందుకు కదల్లేదు. వారితోపాటు విపక్షంలోఉన్న బీజేపీ సైతం గట్టిగా వ్యతిరేకించింది. కేంద్రంలో 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకొచ్చిన వెంటనే పాత ప్రతిపాదన దుమ్ము దులిపింది. ఏడాదికల్లా దాన్ని 49 శాతానికి, మరో ఏడేళ్లకు 74 శాతానికి విస్తరించింది. బీమా సంస్థల్లో విదేశీ భాగస్వాముల వాటా పరిమితమే గనుక భయాందోళనలు అనవసరమని ఇన్నాళ్లూ ప్రభుత్వాలు చెబుతూవచ్చాయి. ఇప్పుడది 100 శాతానికి చేరింది గనుక తగిన జాగ్రత్తలూ, నియంత్రణలూ అవసరం. బిల్లు పార్లమెంటు పరిశీలనకొచ్చినప్పుడు, అందులోని లోటుపాట్లేమిటో, ఇంకా చేయాల్సిందేమిటో చెప్పగలిగే దిశగా ఆరోగ్యవంతమైన చర్చ జరగాలి. దేశీయ పొదుపు కాస్తా అన్యుల చేతుల్లోపడితే, వారు సక్రమంగా నిర్వహించటంలో విఫలమైతే సామాన్యులకు తీరని నష్టం కలుగుతుంది. -
పది నీతులు, పది బూతులు
కుందవరపు చౌడప్ప పేరు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమే. ‘నీతులకేం కానీ, బూతాడక పోతే దొరకు నవ్వు పుట్టదు ధరలో’ అంటాడాయన. ‘సభలో పది నీతులూ, పది బూతులూ ఉన్న పద్యాలు చెప్పినవాడే అధికు’డంటూ నీతినీ, బూతునూ ఒకే గాటన కట్టిన తెంపరి ఆయన. అక్షరాన్ని సాక్షాత్తు ‘సరస్వతి’గా ఉపాసించారు కనుకనే పూర్వులు రచనను ‘సారస్వత’ మన్నారు. అలా అక్షరాన్ని పవిత్రంగా భావించేవారెవరైనా బూతు రాతలో రోతనే తప్ప నీతినీ, నవ్వునూ చూడలేరు. ఒకానొక విశ్వవిద్యాలయంలో తోటి ఆచార్యుని చర్మరోగాన్ని ఆక్షేపిస్తూ ఏకంగా పద్యాలే రాసి తనకు అబ్బిన పద్యవిద్యను బురదగుంటలో పొర్లించిన ఇటీవలి ఆచార్య పుంగవులూ లేకపోలేదు కానీ, తెలుగు సాహిత్యం అదృష్టం కొద్దీ బూతుకవిగా చౌడప్ప ఒక్కడే చరిత్ర కెక్కాడు. ఇప్పుడు లెక్కకు మిక్కిలిగా బూతుల బుంగల్ని సృష్టించి సామాజిక మాధ్యమాలు ఆ హేయచరిత్రకు వేల సంఖ్యలో కొత్తపుటలు జోడిస్తున్నాయి. నిజానికి మాధ్యమాలు సామాజికీకరణ చెందడం ఎంతైనా స్వాగతించదగినదే; అందువల్ల తమ భావాలను ఇతరులతో పంచుకునే అవకాశం కొత్తకొత్త వర్గాలకు అందు బాటులోకి వచ్చింది. దాంతోపాటే అవి అసభ్యతా, అశ్లీలం, బూతు, వ్యక్తిగతమైన వేధింపు వగైరాల రూపంలో చెప్పలేనంత మురికినీ తెప్పలుగా పారిస్తున్నాయి. డ్రైనేజీ స్కీములేక అది డేంజర్గా మారుతోంది. కాకపోతే, మనందరికీ తెలిసిన ‘బూతు’లాంటి మోటు మాటలతో కాకుండా ఎక్కువమందికి తెలియని ‘ట్రోలింగ్’ అనే నాజూకు పేరుతో ఇది చలామణీ అవుతోంది. స్కాండెనేవియా జానపద కథల్లోని రాక్షసులు, మరుగుజ్జు ల్లాంటి జగడాలమారి, అసాంఘిక శక్తులను సంకేతించడంతో ప్రారంభించి, చేపలకు వేసే ఎర వరకూ పదిహేనో శతాబ్ది నుంచి రకరకాల అర్థాల్లో వాడుతూ వచ్చిన ఈ ‘ట్రోల్’ అనే మాట ఇప్పుడు రకరకాల అసహ్యార్థాలలో అంతర్జాల సంస్కృతిలో స్థిరపడింది. భారతీయ సమాజంలో తిట్టుకూ, బూతుకూ స్త్రీలనే లక్ష్యం చేసుకోవడం మొదటి నుంచీ ఉన్నదే. సామాజిక మాధ్యమాలు ఇందుకు కొత్తగా అందివచ్చిన రొచ్చుబండ లయ్యాయి. అక్కడక్కడ స్వయంగా మహిళలూ ఇందులో భాగస్వాములవడం ఈ అధః పతనంలో కొత్త లోతు. సహజంగా స్త్రీల నుంచే దీనిపట్ల తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. బూతులకు, వేధింపులకు గురవుతున్న కొంతమంది మహిళా యూట్యూబర్లు ఈ మధ్య ఒక పోలీస్ ఉన్నతాధికారిని కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. అయినా దీనికి అడ్డుకట్టపడే సూచన కానీ, పడుతుందన్న ఆశకు ఆస్కారం కానీ కనిపించడం లేదు. ఫేస్బుక్ మాధ్యమంలో చురుగ్గా పనిచేస్తున్న ఒక గ్రూపు తన వంతుగా రంగంలోకి దిగి దీనిపై ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి, కొన్ని సందేశాత్మక వీడియోలను ప్రచారంలోకి తెచ్చింది. అయితే, సమస్య ఎన్నో శక్తుల భాగస్వామ్యంతో లోతుగా వేళ్లూనుకున్న స్థితిలో పై మెరుగుల చర్యల వల్ల ఫలితముంటుందా అన్న ప్రశ్నా ఎదురవుతుంది. ఉదాహరణకు, మహిళలు విద్యా, ఉద్యోగాల్లోనే కాక, ఆ యా సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలమవ డాన్ని కంటగించుకునే సాంప్రదాయిక శక్తులు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ తమ అసహనాన్నీ, అక్కసునూ వెళ్ళగక్కుతున్నాయి. ఇంకోవైపు, వివిధ భావ జాలాల మధ్య ఘర్షణ పతాకస్థాయికి చేరుకున్న నేటి దేశీయ వాతావరణంలో వాటికి నాయకత్వం వహించే రాజకీయ పక్షాలు సాంప్రదాయిక మాధ్యమాలకు అదనంగా సామాజిక మాధ్యమాలనూ యథేచ్ఛగా వాడుకుంటున్నాయి. అధికార బలంతోపాటు అర్థబలం, అంగబలం దండిగా ఉన్న శక్తులు ఈ బూతులూ, తిట్ల పంచాంగాన్ని వ్యవస్థీకృతం చేసి తెర వెనుక నుంచి నడిపిస్తున్న సూచనలూ పొడగడుతున్నాయి. దేవుళ్ళూ, మతమూ, సంస్కృతీ, సభ్యతా, సంస్కారాలతో సహా మనవనుకునే అన్ని టినీ ఆకాశానికెత్తే నోళ్లే బూతులూ, అశ్లీలాల మురికిని పుక్కిలించడం ఈ మొత్తంలో ఒక అపహాస్యభరితమైన అతిపెద్ద వైరుద్ధ్యం. తమవైన వ్యవస్థలకూ, విలువలకూ తమ చేతులతోనే చెరుపుకోలేనంత మసీ, మకిలీ అంటించి చెరుపు చేస్తున్నామన్న స్పృహ కూడా లోపించిన పరిస్థితి. అన్ని తేడాలకూ అతీతంగా అందరూ ఒక్కటై కడతేర్చవలసిన సామాజిక రుగ్మతగా గుర్తించడమే దీనికి ఏకైక పరిష్కారం. -
అమరావతి చిక్కుముళ్ళకు బాధ్యులెవరు?
అమరావతిపై ఏపీ సర్కార్లో ఏదో గందరగోళం కనిపిస్తు న్నది. చేస్తున్న పనుల్లో ఇసుమంతైనా పారదర్శకత లేదు. న్యాయమైన సందేహాలను కూడా కూటమి సహించలేక పోతున్నది. ప్రతిపక్షాలూ, మీడియా వేసే ప్రశ్నలే కాదు... తటస్థులూ, సానుభూతిపరుల సందేహాల పైన కూడా అసహనం వ్యక్తమవుతున్నది. ఈ ధోరణి కేవలం ప్రభుత్వ పెద్దల్లోనే కాదు, అనుబంధ మీడియాలో కూడా కనిపిస్తున్నది. తమకు నచ్చకపోతే నిఖార్సయిన వార్తలపై కూడా ఎల్లో మీడియా వీరంగం వేస్తున్నది. ఇక సర్కారు వారి సోషల్ మీడియాలోని ఎల్లో మెర్సినరీలను పట్ట వశం కావడం లేదు. అమరావతిపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేస్తే బూతుబాంబులతో చెలరేగిపోతున్నారు.‘అమరావతి బిల్లు వెనక్కి’ అనే వార్త ఇటీవల ‘సాక్షి’లో వచ్చింది. ఇది నూటికి నూరుపాళ్ళు నిజమైన వార్త. అమ రావతికి సంబంధించిన పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమైన వార్తలే! ఆ వార్తలను అందించడం మీడియా బాధ్యత. ఎల్లో మీడియా కూడా ఆ వార్తను అందించి ఉండాల్సింది. కేంద్రం ఆమోదానికి రాష్ట్రం పంపించిన బిల్లులో సాంకే తిక లోపాలను గుర్తించినందువల్ల వాటిని సరిచేసి పంపాలని వెనక్కి పంపారు. ‘సాక్షి’ మీడియా అదే సమాచారాన్ని ప్రజలకు చేరవేసింది. అంతే తప్ప అమరావతి బిల్లుకు ఇక మోక్షమే ఉండ బోదనీ, అమరావతి రాజధాని ప్రతిపాదనకు కేంద్రం తిరస్కరించిందనీ ఎక్కడా రాయలేదు. ఈమాత్రం దానికే ఎల్లో మీడియాకు, తెలుగుదేశం నేతలకు పూనకాలు వచ్చాయి. అమరావతి ఏర్పాటును సహించలేకపోతున్నారంటూ శాప నార్థాలు పెట్టారు. అసలు అమరావతిని ఒక నిష్ఫల ప్రయోగంగా మార్చుతున్నది ఎవరో పరిశీలించవలసిన అవసరం ఏర్పడింది. నిజంగానే ఈ బిల్లును ఆమోదించడంలో కేంద్రానికి కొన్ని చిక్కులున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం– 2014లో రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన రోజు (జూన్ 2, 2014) నుంచి 10 ఏళ్ల వరకు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు.అందువల్ల 2014 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తే, న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఉంటుందనికేంద్రం భావించింది. 2024 జూన్ 2 నుంచి రాజధానిగా గుర్తించడమనేది ఒక ప్రత్యామ్నాయ మార్గం. అయితే 2014 నుంచి 2024 మధ్యకాలంలో రాజధాని కోసం కేంద్రం చేసిన సహాయం మాటేమిటి? ఈ చిక్కుముడులు తొలగించి, బిల్లును మళ్లీపంపాలని కేంద్రం సూచించింది. ఆ పని చేస్తే సరిపోతుంది. ఇటువంటి చిక్కుముళ్ళన్నీ చంద్రబాబు సర్కార్ స్వయంకృతం. 2024 నుంచే అమరావతిని రాజధానిగా గుర్తిస్తే 34 వేల ఎకరాల భూ సమీకరణ ఏ పేరుతో చేసినట్టు? పైగా ఈ పదేళ్లపాటు రాజధాని లేని రాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్ కొనసాగిందా? రాష్ట్రం రాజధాని లేని అనాథగా మారిందని జగన్ హయాంలో దుష్ప చ్రారం చేసిందెవరు? 2024 నుంచే అమరావతిని రాజధానిగా గుర్తిస్తే చంద్రబాబు తొలి ఐదేళ్ల పాలన కూడా రాజధాని లేని రాష్ట్రంగా భావించవలసిందేనా?అమరావతి చుట్టూ వరుసగా చిక్కుముళ్ళు వేసుకుంటూ వెళ్ళిందే చంద్రబాబు సర్కార్. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని పునర్విభజన చట్టం స్పష్టం చేసింది. కేవలం అసెంబ్లీ, సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యా లయాలకు మాత్రమే ఈ ఉమ్మడి రాజధాని పరిమితం కాదు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి మొత్తం ఉమ్మడి రాజధాని ప్రాంతంగానే ఉంటుందని చట్టంలో పేర్కొ న్నారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని అంశాన్ని ఉపయోగించుకోకుండా, ఏదో చేయకూడని పనిచేస్తూ దొరికిపోయినందువల్ల బాబు సర్కార్ హైదరాబాదుపై హక్కుల్ని వదిలేసుకుని వెళ్లి పోయిందని విమర్శలు వచ్చాయి.పదేళ్ల తర్వాత ఏపీకి రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని సూచించడం కోసం ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలనీ, ఆ కమిటీ ఆరు మాసాల్లోగా నివేదిక ఇవ్వాలనీ కేంద్రాన్ని చట్టం ఆదేశించింది. చట్ట ప్రకారం కేంద్రం ‘శివరామకృష్ణన్ కమిటీ’ని నియమించింది. ఆ కమిటీ పలు ప్రాంతాల్లో పర్యటించి, వివిధ రంగాల ప్రజలతో సంభాషించి, ఒక నివేదికను అందజేసింది. నిపుణుల కమిటీ చేసిన సూచన లకు నూటికి నూరుపాళ్ళు వ్యతిరేకంగా చంద్రబాబు అమరా వతిని ఎంపిక చేశారు. రాజధాని ఏర్పాటు కారణంగా అక్కడ పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా చూడాలనీ, వాగులు, వంకలు, చెరువుల వంటి జల వనరులను కాపాడాలనీ, వరదలు – భూకంపాలు – తుఫాన్లు వచ్చే అవకాశం లేని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలనీ, పెద్ద సంఖ్యలో ప్రజలు నిర్వాసితులు కాకుండా చూడాలనీ కమిటీ ప్రతిపాదించింది. రాజధాని నిర్మాణ వ్యయం – భూ సేకరణ వగైరాలు వీలైనంత తక్కువ ఖర్చుతో పూర్తయ్యేలా ఉండాలని కూడా కమిటీచెప్పింది. కొత్త రాజధాని హైదరాబాద్ వంటి ‘సూపర్ సిటీ’గా కాకుండా ప్రభుత్వ శాఖల్ని వేర్వేరు ప్రాంతాలకు తరలించివికేంద్రీకరణ సూత్రాన్ని పాటించాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది.నిపుణుల కమిటీ నివేదికను చంద్రబాబు పక్కన పడేశారు. కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, పాలసీ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయనతో పాటు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ డైరెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ సభ్యుల కంటే పిల్లల చదువుతో వ్యాపారం చేసే నారాయణ మెరుగైన నిపుణుడని మనసారా చంద్రబాబు నమ్మారు. అందుకే ఆ కమిటీ నివేదికను గిరాటేసి, ‘నారాయణ కమిటీ’ వేసుకున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియా’ చట్టం పేరుతో ఓ చట్టాన్ని ఆమోదించారు. విచిత్రం ఏమిటంటే ఈ చట్టంలో ఎక్కడా కూడా ‘క్యాపిటల్ రీజియన్’గా అమరావతి ప్రాంతం ఉంటుందనే ప్రస్తావన లేదు. ఈ దాపరికం వెనుక ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ అనే ఆర్థిక కుతంత్రం దాగి ఉందని అప్పట్లోనే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అటువంటిదేమీ లేదని నిరూపించుకునే ప్రయత్నం ఈ పదేళ్ళలో చంద్రబాబు ఎప్పుడూ చేయలేదు.నిపుణుల కమిటీ నివేదికను పక్కన పడేయటం, ప్రపంచంలో ఏ నిపుణుడూ అంగీకరించని ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడం, దాన్ని గోప్యంగా ఉంచి చట్టం చేసు కోవటం, చట్టపరంగా పదేళ్లపాటు హైదరాబాదుపై ఉన్న హక్కుల్ని వదిలేసుకోవడం, 34 వేల ఎకరాల సారవంతమైన భూముల్ని రైతుల నుంచి నయానో భయానో సమీకరించడం, వారికి చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవడంతో పాటు సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు వరుసగా ఇప్పుడు చిక్కుముళ్ళుగా మారాయి. సింగపూర్ తరఫున అమ రావతిలో ఉత్సాహం ప్రదర్శించిన మంత్రి ఈశ్వరన్ అవినీతి కథలు బయటపడటంతో సింగపూర్ కంపెనీలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. చిక్కుముళ్ళ పరంపర ఇంతటితో ఆగి పోలేదు. రైతుల దగ్గర సమీకరించిన భూమితో పాటు, ప్రభుత్వ భూమి కూడా కలిపితే 53 వేల ఎకరాలు అమరావతి కోసం సిద్ధంగా ఉన్నది.ఇప్పుడు ఈ భూమి చిన్న మునిసిపాలిటీకి మాత్రమే సరిపోతుందని బాబు చెబుతున్నారు. ఇంకో రెండు దశల్లో మరో 40 వేల పైచిలుకు ఎకరాలను సేకరిస్తే తప్ప కలల రాజధాని సాకారం కాదట. రెండు కోట్లకు పైగా జనాభా ఉన్న ముంబై మహానగరమే (కార్పొరేషన్ ఏరియా) లక్షా పదివేల ఎకరాల్లో ఉందట! ఇంచుమించు అంత స్థలం ఉంటే తప్ప అమరావతి వెంచర్ ప్రారంభం కాదని ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడున్న 53 వేల ఎకరాల్లోనే ‘నవ నగరాల’ పేరుతో మాస్టర్ ప్లాన్ గతంలోనే రూపొందించారు. అందులో 4 వేల ఎకరాలతో కూడిన స్పోర్ట్స్ సిటీ కూడా ఉన్నది. ఇప్పుడు అదనంగా స్టేడియాల కోసం, అంతర్జాతీయ విమానాశ్రయం కోసం, రెండో విడత భూసేకరణ కావాలని అడగటానికి కారణం ఏమిటో తెలియదు.సీఆర్డీఏ వెబ్సైట్లో పొందుపరిచిన అమరావతి భూముల లెక్కలు పరిశీలిస్తే అదనపు భూములు అవసరం ఏమిటన్న సందేహం మరింత పెరుగుతుంది. రైతులిచ్చిన భూములు ప్లస్ ప్రభుత్వ భూములు కలిసి సీఆర్డీఏ దగ్గర 53,747 ఎకరాల భూమి ఉన్నది. రోడ్లు, పార్కులు, చెరువులు వగైరాలు తీసేస్తే 29,220 ఎకరాలు మిగులుతాయి. ఇందులో 9,500 ఎకరాలు రైతులకు ఇవ్వాలి. 1,100 ఎకరాలు ఇప్పటికే వివిధ సంస్థలకు ఇచ్చారు. 300 ఎకరాల పైచిలుకు ప్రభుత్వసంస్థలకు కావాలి. ఇంకా 18 వేల పైచిలుకు ఎకరాల భూమి సీఆర్డీఏ దగ్గర ఉంటుంది. ఇవన్నీ దాని లెక్కలే! ఇంకా అదనపు భూమి దేనికోసం? అభిజ్ఞ వర్గాల నుంచి అందుతున్న సమా చారం ప్రకారం ఈ మొత్తం లేఅవుట్లో 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమికి చెందిన సరిహద్దులు చెదిరిపోయాయి, రికార్డులు చిరిగిపోయాయి. కేటాయింపులకు గాని, అమ్మకాలకు గాని ఆ భూమి సీఆర్డీఏకి అందుబాటులో ఉంటుందో ఉండ దోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను చెరువుల్ని పూడ్చేసి, చదును చేసి ఇస్తున్నారట! న్యాయ వివాదాలు తలెత్తితే ఇవి చెల్లుబాటు అవుతాయా? అసలు చెరువులను పూడ్చి, ప్లాట్లు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది?రెండో దశ, మూడో దశ భూ సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కొందరు భారీగా భూములు కొను గోలు చేశారట! ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు పేరుతో వారు భూములు అమ్ముకోవాలి. అందుకోసం కాగితాలు మీదనే నగర విస్తరణ అక్కడిదాకా పాకాలి. ఈ లోగుట్టు అర్థమైనందు వల్లనే ఎంతోమంది తటస్థులతో పాటు, తెలుగుదేశం మద్దతుదారులు సైతం అమరావతి వ్యవహారాలను ప్రశ్నిస్తున్నారు. ఆలూ లేదు చూలూ లేదు... ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన ఇప్పుడుఎందుకని ప్రశ్నిస్తున్నారు. పక్కనే గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా, మరో అంతర్జాతీయ విమానాశ్రయం దేనికని నిలదీస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి దేనికీ సమా ధానం లేదు. సరిగ్గా గమనిస్తే ఇంకో కోణం కనిపిస్తున్నది. మొదటి దశ సమీకరణలో చురుగ్గా కనిపించిన దేవినేని, ప్రత్తిపాటి, యరపతినేని, ధూళిపాళ్ల, శ్రీధర్ వగైరాలు ఇప్పుడు ఛూమంతర్ అన్నట్టుగా మాయమయ్యారు. రెండో దశ కోసం యవనిక ముందుకు పెమ్మసాని, భాష్యం, చిన్న కేశినేని వంటి వారు రంగప్రవేశం చేశారు. మొదటి టీమ్కు సారాంశం బోధపడినందువల్లనే పక్కన పెట్టి ఉంటారా?పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రంలో మంత్రి. పని చేస్తున్నది మాత్రం రాష్ట్రంలో అమరావతి శాఖ కోసం! త్రీ మెన్ కమిటీ ముసుగులో ఆయన పూర్తి సమయం అమరావతి వ్యవహారాలనే చూస్తున్నారని తెలుగుదేశం వారే చెబుతున్నారు. అందుకు ప్రధానమంత్రి కూడా అంగీకరించారేమో తెలియదు. అంతకు ముందు పూర్తి బాధ్యతగా అమరావతి సంగతులు సర్దుబాటు చేసిన నారాయణ ఇప్పుడూ ఉన్నారు. కాకపోతే ఆయన పెమ్మసాని పక్కన జూనియర్ ఆర్టిస్టుగానే కనిపిస్తున్నారు. అమరావతి చుట్టూ చిక్కుముళ్ళు చాలా పడ్డాయి. ప్రజల మదిలో చాలా సందేహాలు ఉన్నాయి. అవి లేవనెత్తిన వారిపై బీపీ పెంచుకొని విరుచుకుపడటం పరిష్కారం కాదు. భూముల సమీకరణతో సహా మొత్తం అమరావతి వివరాలను పబ్లిక్ఆడిట్ కోసం విడుదల చేయాలని డిమాండ్ చేయాలి. శ్వేత పత్రం కావాలని అడగాలి. ఇది బాధ్యతాయుతమైన మీడియా స్థానాల్లో, రాజకీయ పదవుల్లో ఉన్నవారు చేయవలసిన పని. ఎన్నికలకు ముందు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పిన బాబు, దానికోసం ఇప్పటికే 47 వేల కోట్లు అప్పుఎందుకు చేయవలసి వచ్చిందో ప్రజలకు తెలియజెప్పడం ప్రభుత్వ కనీస బాధ్యత. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ట్రంప్ ‘శాంతి’కి గ్రహణం
ఎనిమిది యుద్ధాలను ఆపానని స్వోత్కర్షకు పోతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువు తీసేలా ప్రపంచంలో రెండుచోట్ల మళ్లీ కుంపట్లు రాజుకున్నాయి. సుంకాలు విధిస్తానంటూ బెదిరించి రెండునెలల క్రితం ఆయన ఆగ్నేయాసియా దేశాలైన థాయ్లాండ్ – కంబోడియాల మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఆపి సఖ్యత కుదిర్చారు. ఆ రెండింటి మధ్యా సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం కుదిరిందని ఆర్భాటంగా ప్రకటించారు. తీరా అయిదురోజుల నాడు కంబోడియా మందుపాతరకు తమ సైనికుడు తీవ్రంగా గాయపడటంతో థాయ్ వైమానిక దళం దాడులు ప్రారంభించింది. ఈసారి దాదాపు పదిమంది మరణించగా వేలాదిమంది జనం ప్రాణభయంతో గ్రామాలు విడిచి పెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. కంబోడియా సైన్యం ప్రతీకార దాడులతో థాయ్ గ్రామాల ప్రజలు కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. మొత్తానికి అటూ, ఇటూ 5 లక్షలమంది నిరాశ్ర యులయ్యారు. ఆఫ్రికాలో పరస్పరం తలపడుతున్న కాంగో–రువాండాల మధ్య కేవలం వారం క్రితం ట్రంప్ శాంతి ఒప్పందం కుదిర్చారు. కానీ అది కూడా విఫలమైంది. పర్యవ సానంగా కాంగోలోని సరిహద్దు గ్రామాలను 2 లక్షల మంది ఖాళీ చేయాల్సి వచ్చింది. రువాండా తిరుగుబాటు సంస్థ ఆ గ్రామాల్లోకి ప్రవేశించిందంటున్నారు.సమస్య మూలమేమిటో తెలుసుకోకుండా, ఇరుపక్షాలూ ఎలాంటి పరిష్కారాన్ని కోరుకుంటున్నాయో గ్రహించకుండా, అందుకు ఏర్పడుతున్న అడ్డంకులేమిటో అర్థం చేసుకోకుండా... ఒక ఫోన్ కాల్తో, ఒకటి రెండు బెదిరింపులతో అంతా సమసిపోతుంద నుకుంటే అవి మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి. ట్రంప్ దౌత్యం విఫలం కావటానికి కారణం ఇదే. ఇరుగు పొరుగు దేశాల మధ్య భూభాగం గురించే ప్రధానంగా ఘర్షణలుంటాయి. థాయ్లాండ్–కంబోడియాల సమస్య కూడా అదే! రెండు దేశాలకూ 817 కిలోమీటర్ల పొడవునా సరిహద్దు ఉంది. ఫ్రాన్స్ దురాక్రమణలో కంబోడియా ఉండగానే వందేళ్ల క్రితం థాయ్లాండ్తో పేచీ ఏర్పడింది. 1953లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దాన్ని పరిష్కరించుకుందామని కంబోడియా ప్రయత్నిస్తోంది. కానీ రెండువైపులా పుట్టు కొచ్చే జాతీయవాద ధోరణులు అందుకు అడ్డంకిగా మారాయి. 2008లో వివాదాస్పద భూభాగంలోని 11వ శతాబ్దం నాటి హిందూ దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వార సత్వ సంపదల జాబితాలో చేర్చినప్పుడు అది తమదేనని కంబోడియా ప్రకటించు కోవటంతో ఘర్షణలు తలెత్తాయి. వాస్తవానికి 1962లోనే ఆ భూభాగం కంబోడియా దేనని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది. కానీ అందుకు థాయ్ లాండ్ ససేమిరా అంటున్నది.మొన్న జూలైలో ఇరువైపులా 50 మంది మరణానికి దారితీసిన ఘర్షణలు రాజు కున్నప్పుడు అప్పటి థాయ్ ప్రధాని పెటోంగ్టార్న్ షినవత్రా, కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్తో జరిపిన ఫోన్ సంభాషణలు లీక్ అయ్యి ఆమె పదవి పోగొట్టు కున్నారు. తమ సైన్యం కూడా సరిగా వ్యవహరించటం లేదని ఆమె అంగీకరించటం దేశంలో పెద్ద దుమారం లేపింది. నాలుగు దశాబ్దాలు దేశాన్నేలిన హున్ సేన్ ఇప్పటికీ ప్రస్తుత ప్రధాని, తన కుమారుడు హున్ మానెట్ను తెర వెనక ఉండి నడిపిస్తుంటారు. ఆయనతో మాట్లా డితే తప్ప సమస్య పరిష్కారం కాదని షినవత్రా అనుకోవటం కొంప ముంచింది. తాజా వివాదం పర్యవసానంగా కంబోడియా పౌరులను దేశంలోకి రానీయ కుండా థాయ్లాండ్ సరిహద్దుల వద్ద అడ్డుకుంటుండగా, థాయ్ సినిమాల ప్రసారం, అక్కడి పండ్లు, కూరగాయలు, గ్యాస్, ఇంధనం రాకుండా కంబోడియా నిలిపేసింది.థాయ్–కంబోడియా ఘర్షణలైనా, కాంగో–రువాండాల కొట్లాట అయినా ప్రత్యర్థి దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించినప్పుడే పరిష్కారమవుతాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ అధికారం కోసం జాతీయవాద ధోరణులు రెచ్చగొట్టడం వల్ల సమస్య లొచ్చిపడుతున్నాయి. థాయ్లాండ్లో వచ్చే ఫిబ్రవరి 6న ఎన్నికలు జరగబోతున్నాయి. గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, దేశాన్ని రక్షించేది తామేనని చెప్పటానికి కంబో డియాపై యుద్ధభేరి మోగించటంతో పాటు పాలకపక్షం శుక్రవారం పార్లమెంటును రద్దు చేసింది. మళ్లీ ఇరుపక్షాల మధ్యా రాజీ కుదురుస్తానని ట్రంప్ చెబుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
విద్వేష భాషపై పంజా!
దేశంలోనే తొలిసారి విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. కోస్తా కర్ణాటకలో మొన్న ఏప్రిల్లో మతపరమైన హత్య చోటు చేసుకున్నాక జరిగిన పరిణామాల పరంపర తర్వాత ఇలాంటి చట్టం తెస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. మన రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూనే దానికి సహేతుకమైన పరిమితులు విధించింది. సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇతర రకాల చర్యల్ని అరికట్టడానికి గతంలో ఐపీసీలో, ఇప్పుడు బీఎన్ఎస్లో నిబంధనలున్నాయి. కానీ దురదృష్టమేమంటే అవి అసమ్మతిని అణచడానికి పనికొచ్చినట్టు విద్వేష ప్రసంగాలను అదుపు చేయటానికి తోడ్పడటం లేదు. కనుక ప్రత్యేక చట్టం తీసుకు రావటం హర్షించదగ్గదే. ‘విద్వేషం ప్రతి ఒక్కరినీ ప్రమాదంలోకి నెడుతుంది. అందుకే దానిపై పోరాడటం అందరి బాధ్యతా కావాలి’ అన్నారు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్. నిజానికి విద్వేషపూరిత ప్రసంగాలు మనుషుల ఉసురు తీస్తాయని, మత, కుల ఘర్షణలకు కారణ మవుతాయని పదిపదిహేనేళ్ల క్రితం ఎవరూ ఊహించి ఉండరు. సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగాక ఇలాంటి ప్రసంగాలూ, సందేశాలూ సమాజ మనుగడకు పెను సవాలుగా మారాయి. ఎక్కడో కాదు... కర్ణాటకలోనే విద్వేషపూరిత ప్రసంగాలు, సందే శాల ప్రభావంతో దుండగులు 2015లో ప్రముఖ రచయిత, హేతువాది, కన్నడ యూని వర్సిటీ మాజీ వైస్చాన్సలర్ ఎంఎం కల్బుర్గిని, 2017లో ప్రముఖ సంపాదకురాలు, రచయిత్రి గౌరీ లంకేష్ను పొట్టనబెట్టుకున్నారు. భావప్రకటనాస్వేచ్ఛ ముసుగులో ఇష్టానుసారం మాట్లాడటం, తమకు నచ్చని అభిప్రాయాలున్న వారిపై ఉసిగొల్పేలా ప్రసంగాలు చేయటం ఉన్మాదం. కర్ణాటక విద్వేష ప్రసంగాలూ, విద్వేష నేరాలు (నివారణ, నియంత్రణ) బిల్లు ఈ మాదిరి చర్యల్ని సరిగానే గుర్తించింది. కేవలం ప్రసంగాలే కాదు...సమాజ గమనానికి ముప్పు కలిగించే రాతలు, చిత్రాలు, దృశ్యాలు వగైరాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయటం కూడా ఈ బిల్లు శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. మతం, కులం, భాష, జెండర్, జాతి, ప్రాంతం, అంగవైకల్యం తదితరాల పేరిట వ్యక్తులపై లేదా బృందాలపై విద్వేషాన్ని ప్రేరేపిస్తే వివిధ రకాల శిక్షలు నిర్దేశించింది. మొదటి నేరానికి ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ, అనంతర నేరాలకు రెండునుంచి పదేళ్ల వరకూ శిక్ష, జరిమానా వేయొచ్చు. ఈ నేరాలను శిక్షార్హమైన, బెయిల్కు వీలుకాని నేరాలుగా పరిగణించటం దీని తీవ్రతను తెలియ జేస్తోంది. సంస్థల పేరిట నేరాలకు పాల్పడిన పక్షంలో వాటి నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తారు. ఆన్లైన్లో ప్రచారంలో ఉండే విద్వేషపూరిత అంశాలను తొలగించమని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ప్రజా ప్రయోజనార్థం విద్యాసంబంధ, కళాత్మక, సాహిత్య, శాస్త్రీయ దృష్టితో చేసే ప్రసంగా లకూ, ఇతరేతర సందేశాలకూ ఇది మినహాయింపును ఇచ్చింది. బాధితులకు నష్టపరి హారం ఇచ్చేందుకు కూడా ఇందులో ఏర్పాటుంది.అయితే ఇలాంటి బిల్లుల రూపకల్పనలో అస్పష్టతకు తావుండటం వల్ల పోలీసులకు అపరిమిత అధికారాలు దక్కుతాయి. అవి దుర్వినియోగమయ్యే ప్రమాదం కూడా ఎక్కువే. గతంలో టాడా చట్టం, ఇప్పుడు యూఏపీఏ విషయంలో ఈ ఆరోపణ లున్నాయి. హిందూ మతసంస్థల అణచివేతకే ఈ చట్టం తీసుకు రాబోతున్నారని బీజేపీ విమర్శిస్తుండగా, పౌర సమాజ కార్యకర్తలు సైతం బిల్లులోని అంశాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా మానసికంగా గాయ పరచటం అనే భావనకు చోటున్నందు వల్ల దుర్వినియోగానికి అవకాశాలెక్కువ. వాస్తవంగా ఫలానా ప్రసంVýæం సమాజంలో ఘర్షణలకు కారణమని ధ్రువపడటం, దాని కారణంగా హత్య జరిగిందని నిర్ధారణ కావటం వంటి సందర్భాల్లో చట్టం తోడ్పడాలి. కానీ విస్తృత భాష్యం చెప్పగలిగే వాటిని చేర్చటంవల్ల చట్టం ఉద్దేశమే దెబ్బతింటుంది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు మార్గదర్శకాలున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు కనబడదు. దుర్వినియోగానికి తావు లేని రీతిలో చట్టం ఉన్నప్పుడే నిజమైన నేరగాళ్లకు శిక్షపడుతుంది. ఆ దిశగా ఆలోచించటం అవసరం. -
దిక్కుతోచని ఉక్రెయిన్
నెలలు గడుస్తున్నా రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విరమణకు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రాకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అసహనం కట్టలు తెంచుకున్నట్టు కనబడుతోంది. మధ్యవర్తిగా తన ప్రతిపాదనలకు ససేమిరా అంటున్న ఉక్రెయిన్తోపాటు, దానికి దన్నుగా నిలబడిన యూరప్ దేశాలను కూడా ఆయన తూర్పార బడుతున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతున్నదనీ, యూరప్ దేశాలు బలహీనంగా మారి క్షీణదశకు చేరుకున్నాయనీ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. వైరి పక్షాలు ఎటూ నువ్వా నేనా అన్నట్టు ఉంటాయి. మధ్యవర్తిత్వం వహించే దేశం ఓపిగ్గా వాస్తవ పరిస్థితులను అర్థం చేయించి ఏదోమేరకు తగ్గేలా చేయటం అవసరం. కానీ అలా చేయాలంటే మధ్యవర్తిత్వం వహించే దేశానికి విశ్వసనీయత, ప్రతిష్ఠ ఉండాలి. ట్రంప్ ఆగమనం తర్వాత అమెరికాకు ఆ రెండూ తగ్గాయి. ఏ విషయంలోనూ ఆయన నిలకడగా లేకపోవటం, ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తూ అయోమయాన్ని సృష్టించటం కారణం. జో బైడెన్ హయాంలో అమెరికా ప్రాపకంతోనే యూరప్ దేశాలు ఉక్రెయిన్ను రష్యాపైకి ఉసిగొల్పాయి. కానీ ట్రంప్ వచ్చాక అంతా తలకిందులయి యూరప్ దేశాలకు దిక్కుతోచడం లేదు. అంతేకాదు, ఇటీవల జాతీయ భద్రతా వ్యూహం పేరిట అమెరికా విడుదల చేసిన విధాన పత్రం కూడా వాటికి మింగుడుపడటం లేదు. అట్లాస్ మాదిరిగా ఒంటరిగా భూగోళాన్ని మోయటం ఇకపై ఉండబోదనీ, యూరప్ స్వీయరక్షణ బాధ్యత చూసుకోవాలనీ ఆ పత్రం స్పష్టం చేసింది. ప్రపంచాధిపత్యం కోసం పోటీపడటం పర్యవసానంగా అమెరికా బలహీనపడిందనీ, అందుకే పాత విధానానికి అవసరమైన దిద్దుబాట్లు తప్పనిసరనీ తేల్చింది. ఇప్పటికి ఎనిమిది యుద్ధాలు ఆపానని తరచు చెప్పే ట్రంప్ జాబితాలో నిజానికి ఇప్పటికైతే ఉక్రెయిన్ లేదు. కానీ ఆయన అధికార పగ్గాలు చేపట్టిననాడే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని శపథం చేశారు. 2014కు ముందున్న సరిహద్దుల సంగతి ఉక్రెయిన్ మర్చిపోవాలని చెబుతూ వచ్చారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ భూభాగాన్ని వదులుకోవటానికి ససేమిరా అంటున్నారు. నిజానికి 2022లో ఉక్రెయిన్కూ, ఆయనకు మద్దతునిస్తున్న యూరప్ దేశాలకూ బంగారం లాంటి అవకాశం వచ్చింది. టర్కీ మధ్యవర్తిత్వంలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో రష్యా తనకు తానే రాజీకి సిద్ధపడింది. ఉక్రెయిన్ తటస్థంగా ఉంటాననీ, నాటోలో చేరబోననీ హామీ ఇస్తే దురాక్రమించిన భూభాగం నుంచి వైదొలగుతామని రష్యా ప్రతినిధి బృందం ప్రతిపాదించింది. యూరప్ నుంచి కూడా దీనిపై హామీ కావాలని కోరింది. అప్పటికి రష్యా పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టి కొన్ని నెలలు మాత్రమే అయింది. కానీ బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హుటాహుటీన ఉక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి రాజీకి ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవద్దని నచ్చజెప్పారు. నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాతోనే జాన్సన్ ఈ సైంధవపాత్ర పోషించారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ మొండికేస్తున్నారు. ఆయనకు శాంతియుత పరిష్కారం ఆలోచనే లేదు. ఆధిపత్య స్థాపనే లక్ష్యం. భారత్ వచ్చేముందు ఈ సంగతి నిర్మొహమాటంగా చెప్పారు. ‘ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వైదొలగితే సరే... లేదా దాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటాం’ అని ఆయన ప్రకటించారు. వైరిపక్షాలు చర్చలంటూ మొదలుపెడితే వాటి వైఖరులు ఏదోమేరకు చల్లారుతాయి. కానీ ఆ చర్చలు ఫలించాలంటే తొలుత కాల్పుల విరమణ పాటించాలి. రష్యా, ఉక్రెయిన్ రెండూ అందుకు సిద్ధపడటం లేదు. యుద్ధ వాతావరణంలో చర్చలు ప్రశాంతంగా సాగబోవన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి రష్యా ప్రతిపాదనలకు అంగీకరించమంటూ ఉక్రెయిన్పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో అమెరికాతో నేరుగా మాట్లాడే ధైర్యంలేని యూరప్ దేశాలు... ట్రంప్ను ఖాతరు చేయొద్దని ఉక్రెయిన్కు నూరిపోస్తున్నాయి. అవకాశం వచ్చినప్పుడు కాలదన్నుకుంటే, అగ్రరాజ్యాల చదరంగంలో పావుగా మారితే ఏమవుతుందో ఉక్రెయిన్ ఈ దశలోనైనా గుర్తెరగాలి. దీన్నుంచి బయటపడాలంటే సొంత గొంతు వినిపించటం ప్రారంభించాలి. -
ఇండిగో బ్లాక్మెయిలింగ్
ప్రయాణికులపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తరచు వార్తల్లోకెక్కే ‘వివాద’యాన సంస్థ ఇండిగో... తనకు నచ్చని నిబంధనలు అమల్లోకి రావటాన్ని జీర్ణించుకోలేక వారం రోజులపాటు దేశంలో పౌర విమానయానాన్ని దాదాపు స్తంభింపజేసింది. కనీవినీ ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయి, వేలాదిమంది ప్రయాణికులు దారీతెన్నూ తోచక ఇబ్బందులు పడ్డారు. కనీసం ప్రత్యామ్నాయాలు వెదుక్కుందామన్నా లగేజీ ఆచూకీ దొరక్క నరకయాతన అనుభవించారు. వారం గడుస్తున్నా యథాపూర్వ స్థితి ఇంకా ఏర్పడలేదు. కాకపోతే కాస్త మెరుగైంది.ఈ పాపంలో కేంద్ర ప్రభుత్వానికీ వాటా ఉంది. ఇండిగో ధిక్కరణను పసిగట్టలేని అమాయకత్వం క్షంతవ్యమేనా? తక్కువ చార్జీలతో ప్రయాణికులను ఆకట్టుకుని, సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటూ, ఎవరికీ అందని స్థాయిలో విస్తరించుకుంటూ పోయిన ఇండిగో ఆ రంగంలో గుత్తాధిపత్యాన్ని నెలకొల్పింది. గత పాతికేళ్లలో మూతబడిన జెట్ ఎయిర్వేస్, ఎయిర్ సహారా, ఎయిర్ డెక్కన్, కింగ్ఫిషర్ వగైరా 9 సంస్థలు ఇండిగో చకచకా ఎదగటానికి దోహదపడ్డాయి. పర్యవసానంగా పౌర విమానయాన రంగంలో ఇండిగో 61 శాతం వాటాను సాధించగలిగింది. మరో సంస్థ ఎయిరిండియా 30 శాతం దగ్గర నిలిచింది.పోటీదారులందరినీ దాటుకుని శరవేగంతో దూసుకుపోవటం, లాభార్జన అదే స్థాయిలో పెరగటం, స్వల్ప కాలంలోనే సమర్థవంతమైన సంస్థగా పేరు తెచ్చుకోవటం, ఏటా పది కోట్ల మంది ప్రయాణికులను చేరేయటం ప్రశంసించదగ్గ విజయమే కావొచ్చు. కానీ గగనతలంలో 35,000 అడుగుల ఎత్తున ఎగిరే విమానాలతోపాటే దాని అహంకారమూ పడగలెత్తింది. విమానయాన రంగాన్ని శాసిస్తున్న తనకు విధివిధానాలు నిర్దేశించటానికి పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ఎవరన్న స్థాయికి చేరుకుంది. అందుకే ఉద్దేశపూర్వకంగా ధిక్కారాన్ని ప్రదర్శించింది. ‘కేవలం అవగాహన లేమి వల్లా, ప్రణాళికల రూపకల్పనలో జరిగిన లోటుపాట్ల వల్లా’ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందన్న ఇండిగో ప్రకటన ఉత్త వంచన. ఎందుకంటే దేశీయ విమాన సర్వీసుల్ని ఎడా పెడా రద్దు చేసిన ఆ సంస్థ... అంతర్జాతీయ సర్వీసుల్లో కేవలం 10 శాతానికి మాత్రమే కోతపెట్టింది. ఆ సర్వీసులు ఇష్టానుసారం రద్దు చేస్తే భారీ మొత్తాల్లో జరిమానాలుంటాయి మరి.డీజీసీఏ ఏర్పరిచిన నిబంధనలు ఇప్పటివి కాదు. గత ఏడాది మొదట్లోనే... అంటే దాదాపు రెండేళ్లనాడే ఆ ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. లాభార్జన కోసం తక్కువ మందితో ఎక్కువ సర్వీసులు నడిపే ధోరణి ప్రమాదకరమన్న ఉద్దేశంతో విధించిన పరిమితులవి. వారంలో పైలెట్లకుండే విశ్రాంతి సమయాన్ని 36 గంటలనుంచి 48 గంటలకు పెంచటం, రాత్రి వేళల్లో పైలెట్లు పనిచేసే సమయాన్ని 10 గంటలకు పరిమితం చేయటం, ఒక పైలెట్ వారానికి రెండుసార్లకు మించి నైట్ ల్యాండింగ్లు చేయరాదన్న నిబంధన అందులో భాగమే. ఇవన్నీ గత నెల 1 నుంచి అమలు చేయాలని కోరింది.ఈ ఏడాది కాలంలో ఇండిగో ఇందుకోసం సాగించిన కసరత్తేమీ లేదు. పైగా ఒకరి పైలెట్లను మరొకరు తీసుకోరాదని వేరే సంస్థలతో లాలూచీకి దిగి పనిగంటలు పెంచింది. సిబ్బంది వేతనాలను స్తంభింపజేసింది. ఇతర సంస్థలన్నీ దారిలోకి వచ్చినప్పుడు ఇండిగోకు మాత్రమే ఏమిటి సమస్య? గండం గట్టెక్కటానికి గత్యంతరం లేక డీజీసీఏ తన నిబంధనలు సడలించుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఏర్పరిచిన నిబంధనలకే దిక్కులేకపోవటం విషాదం కాదా? బ్లాక్మెయిలింగ్కు లొంగటం కాదా? ప్రతిదానికీ ప్రైవేటు మంత్రం జపించే పాలకులకు ఇండిగో వ్యవహారం కనువిప్పు కావాలి.సంక్షోభ సమయాల్లో టిక్కెట్ ధరలు పెంచి ప్రయాణికుల జేబులు కొల్లగొడు తున్నా పట్టనట్టుండే ధోరణి ఇండిగో వంటి సంస్థలకు కొమ్ములూ కోరలూ తెచ్చింది. ధిక్కరణకు పురిగొల్పింది. ఉన్న రెండు ప్రధాన విమానయాన సంస్థల్ని సరిగా పర్యవేక్షించలేని కేంద్ర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు చేతగానితనం ఈ పర్యాటక సీజన్లో దేశం పరువు తీసింది. ఈ వ్యవహారంలో జవాబుదారీతనాన్ని నిగ్గు దేల్చి కేంద్రమంత్రితో సహా బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలి.


