breaking news
Ananthapur
-
పర్యవేక్షణ కరువై పెడదారి
వారం క్రితం అనంతపురం రూరల్ పరిధిలోని నారాయణపురం చెక్డ్యాం సమీపంలో తపోవనం హైస్కూల్ల్ పిల్లలు ఐదుగురు మద్యం తాగుతున్నారు. ఆ బ్యాచ్లోని ఓ విద్యార్థి తండ్రి వీరి తతంగాన్ని కనిపెట్టాడు. తన కుమారుడిని పట్టుకొచ్చి బాగా కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి అందరి పేర్లూ చెప్పాడు. విస్కీ తాగినట్టు వెల్లడించాడు. అనంతపురం నగరంలోని పొట్టిశ్రీరాములు పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేసిన విద్యారి్థ.. ఇటీవల స్కూల్లో టీసీ తీసుకుని 3వ రోడ్డులో ఉన్న ఓ హైస్కూల్ల్లో చేరాడు.బడిలో ఈ విద్యార్థి ఇటీవల గంజాయి తాగుతుండగా ఉపాధ్యాయుడు గుర్తించాడు. తల్లిదండ్రులను పిలుస్తా అని హెచ్చరిస్తే.. ‘‘పిలువు, నన్ను వాళ్లేం చేయగలరు’’ అంటూ విద్యార్థి ఎదురుతిరిగే సరికి ఉపాధ్యాయుడు భయపడి విషయాన్ని అంతటితో వదిలేశాడు. విద్యార్థుల్లో పెడ ధోరణలు ఎంతగా పెరిగాయో ఈ రెండు ఘటనల ద్వారా అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్న విపరీత ధోరణులు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ హైస్కూల్ళ్లలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులు కూడా తమకెందుకులే అని పట్టించుకోకపోవడం తదితర కారణాలతో పిల్లలు పెడదారి పడుతున్నట్లుగా తెలుస్తోంది. 14 ఏళ్లకే మద్య సేవనం... తపోవనం హైస్కూలు విద్యార్థులు మద్యం సేవించిన ఘటన అనంతపురం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ముగ్గురు, ఎనిమిదో తరగతి చదువుతున్న వారు ఇద్దరు ఉన్నట్లు తెలుసుకుని పలువురు విస్తుపోతున్నారు. మరోవైపు జిల్లాలో కొన్ని చోట్ల విద్యార్థులు పాఠశాలలకు గంజాయి తెచ్చుకుని సేవిస్తున్నారు. మరికొన్ని చోట్ల సెల్ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూస్తూ గడుపుతున్నారు. కో ఎడ్యుకేషన్ ఉన్నచోట బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ ప్రభుత్వ స్కూల్లో 9వ తరగతి బాలిక ఓ బాలుడికి ప్రేమలేఖ రాసిన ఉదంతం బయటపడింది. ఈ క్రమంలో పిల్లలను స్కూళ్లకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయుల్లో ఉదాసీన వైఖరి పిల్లలను ఏమంటే ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న భయంతో ఉపాధ్యాయులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది టీచర్లే క్రమశిక్షణ తప్పి క్లాసులకు వస్తున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. సమయానికి స్కూలుకు వెళ్లకపోవ డం, వెళ్లినా క్లాసులు తీసుకోకపోవడం విద్యార్థులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి కారణమవుతోంది. ఇక పిల్లల తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లి ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకుంటుండడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాలు లేక శాపంగా పరిణమిస్తోంది. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి పిల్లల్లో పెడధోరణులను కాండాక్ట్ డిజార్డర్ అంటారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన కారణం. తల్లిదండ్రు లకు మద్యం అలవాటు ఉన్నా ఇలా జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల కూడా పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రుల ద్వారానే పిల్లల్లో పరివర్తన రావాలి. –డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణులు, అనంతపురం -
అధినేతకు కృతజ్ఞతలు తెలిపిన ఆలూరు
శింగనమల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆలూరు సాంబశివారెడ్డి కలిశారు. తనకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల శిక్షణకు జేసీ అనంతపురం అర్బన్: ప్రాజెక్టులకు భూ సేకరణ అంశంపై మూడు రోజుల ఇన్సర్వీస్ శిక్షణకు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ముస్సోరి తరలి వెళ్లారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ శిక్షణలో పాల్గొననున్నారు. తిరిగి ఈనెల 19న విధులకు హాజరు కానున్నారు. భోజనం ప్లేటు కోసం గొడవ గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఎస్జేపీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన వేళ ప్లేటు కోసం ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. పదో తరగతి విద్యార్థి బి.రామన్న ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. పదో తరగతి చదువుతున్న రామన్న, రిహాన్ భోజనం ప్లేటు తనదంటే తనదంటూ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అప్పటికే డ్యామేజీ అయిన పదునైన ప్లేటు రామన్న ఎడమ చేతికి బలంగా తగిలింది. తీవ్ర గాయం కావడంతో ఆ విద్యార్థిని ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. సుమారు 12 కుట్లు పడ్డాయి. మధ్యాహ్న భోజన వేళ ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉన్నట్లయితే ఈ ఘటన జరిగేది కాదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలని డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సురేంద్ర కోరారు. ఖతార్లో వెల్డర్గా ఉద్యోగావకాశం అనంతపురం: ఖతార్ దేశంలో వెల్డర్ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధికారి పీవీ ప్రతాప రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 24 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు, ఐటీఐ లేదా ఐటీసీ విద్యార్హత కలిగి నాలుగేళ్ల అనుభవమున్న వారు అర్హులు. టిగ్/ఏఆర్సీ మల్టీ వెల్డర్ ఉద్యోగానికి నెలకు రూ.52 వేల నుంచి రూ.61,500, టిగ్/ఏఆర్సీ వెల్డర్ ఉద్యోగానికి నెలకు రూ.42,500 నుంచి రూ.52 వేలు జీతం చెల్లిస్తారు. రెండేళ్ల కాంట్రాక్ట్ పరిధిలో ఉచిత వసతి, భోజనం, వైద్యం, రవాణా, స్వదేశానికి ఒకసారి టికెట్ సదుపాయం కల్పిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 95502 15161, 91609 12690, 99888 53335లో సంప్రదించవచ్చు. బీటెక్ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో జూన్లో నిర్వహించిన బీటెక్ ఒకటో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, ఒకటో సంవత్సరం మొదటి సెమిస్టర్ (ఆర్–23), (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్నాయుడు మంగళవారం విడుదల చేశారు. ఫలితాలను జేఎన్టీయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ జి.రాజు, డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
బంగారు కుటుంబాలను దత్తత తీసుకోండి అనంతపురం అర్బన్: మండల, గ్రామస్థాయి అధికారులు ఒక్కో బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. పీ–4, ‘తల్లికి వందనం’, ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర’ తదితర అంశాలపై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి డ్వామా పీడీ, జెడ్పీ సీఈఓ, డీపీఓ, ఆర్డీఓలు, డీఎల్డీఓల, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైద్యులు, వ్యాపారులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా దత్తత తీసుకునేలా చూడాలన్నారు. సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు కంబదూరు మండలంలో 57 శాతమే ఉందని, అన్ని చోట్ల వందశాతం నమోదు కావాలని ఆదేశించారు. నష్టం జరిగితే కాంట్రాక్టర్దే బాధ్యత ‘పంప్హౌస్లో, పైప్లైన్లలో నీరులేకపోతే అవి పగిలిపోయే అవకాశం ఉంది. అలా జరిగేతే కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. వారి నుంచి ఆ నష్టాన్ని రికవరీ చేయాలి’ అని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. శ్రీరామిరెడ్డి నీటి పథకం కింద రూ.3.83 కోట్లు కాంట్రాక్టర్ ఖాతాలో జమయ్యాయని, కార్మికులకు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
నెట్టికంటుడి సన్నిధిలో అక్రమాలు
గుంతకల్లు: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. కొన్నేళ్లుగా చాపకింద నీరులా సాగుతూ వచ్చిన ఈ కుంభకోణం విలువ రూ.కోట్లలోనే ఉండడం గమనార్హం. చిరుద్యోగుల కష్టార్జితంపై కన్ను నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలోని వివిధ విభాగాల్లో భక్తులకు సేవలందించేందుకు 71 మందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించారు. వీరంతా ప్రస్తుతం విజయవాడ కనకదుర్గ ఏజెన్సీ కింద పని చేస్తున్నారు. దేవాలయంలో సెక్యూరిటీ, క్యూలైన్లు, వంటశాల తదితర విభాగాల్లో పనిచేస్తున్న వీరికి దేవస్థానం నిధుల నుంచి వేతనాలు మంజూరవుతాయి. ఒక్కొక్కరికి నెలకు రూ.20వేలు చొప్పున జీతం నిర్ణయించారు. ఇందులో పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ కింద రూ.6,600 మినహాయించుకుని నెలకు రూ.13,400 నికర జీతంగా చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఈ 71 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ పేరిట నెలకు రూ.4.68 లక్షలు చొప్పున ఏటా అరకోటికి పైగా కట్ చేసి మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ పద్దతిలో మరో 40 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరి జీతాల్లోనూ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరహాలోనే పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ కట్ చేసి, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు కుంభకోణానికి ఆలయ అధికారులు తెరలేపారు. 71 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకూ పీఎఫ్ ఖాతా, ఈఎస్ఐ కార్డులు లేవు. తమ జీతం నుంచి పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ కింద కట్ చేస్తున్న మొత్తాన్ని ఉద్యోగులకు తెలియకుండా తొక్కిపెట్టారు. ఈ మొత్తాన్ని ఆలయ అధికారులే స్వాహా చేస్తూ వచ్చారు. ఆడిట్లో గుర్తింపు.. నాలుగు రోజుల క్రితం కసాపురం ఆలయ జమ ఖర్చుల ఆడిట్ జరిగింది. పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ పేరుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసిన మొత్తం ఎక్కడ జమ అయిందో అర్ధం కాక ఆడిటర్లు తలలు బాదుకున్నా అంతు చిక్కలేదు. దీంతో ఇదే విషయంపై ప్రశ్నించడంతో ఆడిటర్లను ఆలయ అధికారులు బెదిరించినట్లు సమాచారం. చూసీచూడనట్లుగా వెళ్లాలని, లోతులోకి వెళితే ఇబ్బంది పడతారంటూ హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో తమ పని తాము చేసుకుంటామని ఆడిట్ అధికారులు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, మూడు నెలలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రాకపోకడంతో ఇబ్బందులకు గురువుతున్నారు. అసలే వచ్చే అరకొర జీతంలో కోతలు పెడుతుండటంతో భారంగా నెట్టుకొస్తున్నట్లు వాపోతున్నారు. ప్రతి నెలా 10వ తేదీకి జీతం వచ్చేదని, ఈ నెల 10తో మూడు నెలలు పూర్తయినా ఇప్పటి వరకూ జీతం వేయలేదని చిరుద్యోగులు వాపోతున్నారు. కాంట్రాక్టర్ చేతల్లోనే ఉంటుంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ కట్ చేసే అంశం కాంట్రాక్టర్ చేతల్లోనే ఉంటుంది. ఈ విషయమై కాంట్రాక్టర్ను పిలిపించి మందలించాం. గత ఏడాది ఈఎస్ఐ, పీఎఫ్ చేయించాం. అంతేకాక నోటీస్ ఇచ్చి కాంట్రాక్టర్ నుంచి డబ్బులు కట్టించాం. ఆడిట్ ఉద్యోగులు కొత్తగా వచ్చారు. వారికి ఇక్కడ పరిస్థితి, పాస్వర్డులు తెలియక జీతాలు వెనక్కు పంపుతున్నారు. – వాణి, ఆలయ ఈఓ, కసాపురం దేవస్థానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ నిధుల మళ్లింపు ఖాతాలకు జమ చేయకుండా స్వాహా చేసిన ఆలయ అధికారులు ఏళ్లుగా సాగుతున్న దందా విలువ రూ.కోట్లలోనే -
కూటమి ప్రభుత్వ మెడలు వంచుదాం
గార్లదిన్నె: కూటమి ప్రభుత్వ మెడలు వంచైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేలా చూడాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం గార్లదిన్నె మండలం కల్లూరులో నిర్వహించిన ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ రెడ్డి, శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్తో కలిసి ముఖ్య అతిథిగా అనంత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో అవినీతికి తావు లేకుండా పాలన సాగిందన్నారు. అర్హులకు ఏకంగా రూ.2.83 వేల కోట్లు అందించామన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. గత ఎన్నికల్లో ఒక్క వైఎస్సార్సీపీకే 42 శాతం ఓట్లు వచ్చాయని, టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలకు కలిపి 58 శాతం ఓట్లు వచ్చా యన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో రూ.81 వేల కోట్ల బకాయి పడిందన్నారు. ‘తల్లికి వందనం’ ఒక ఏడాది కట్ చేసి, ఈ ఏడాది కొంత మందికి మాత్రమే అందించారన్నారు. ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోనున్నాయని, వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి కూటమి ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీస్ శాఖ దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని విమర్శించారు. పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు దక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో సకాలంలో ఆయకట్టుకు నీరు అందించామని, ప్రస్తుతం జూలై ముగుస్తున్నా సాగు నీరు విడుదల చేయలేదన్నారు. ఈ నెల 20 నుంచి ఆగస్టు 4 వరకూ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. చంద్రబాబు పతనం ప్రారంభం.. శింగనమల నియోజకవర్గం నుంచే చంద్రబాబు పతనం ప్రారంభమవుతుందని సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. నార్పలలో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’కు అడ్డంకులు సృష్టించారని, దీంతో బస్టాండ్ సర్కిల్లో కార్యక్రమం నిర్వహించామన్నారు. వైఎస్సార్సీపీ వాళ్లకు పనులు చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. మాట తప్పని, మడమ తిప్పని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన నుంచి చంద్రబాబు పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి కూటమి పార్టీ నాయకులు దాడులు చేస్తే వారికి బెయిలబుల్, అదే వైఎస్సార్ సీపీ నాయకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు. రాబోయేది జగన్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో కరోనా కష్ట కాలంలో కూడా వైఎస్ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఎల్లారెడ్డి, అనంతపురం రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి, జంబులదిన్నె సొసైటీ మాజీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కుంచం రామ్మోహన్ రెడ్డి, శింగనమల నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు మంత్రి ఆంజనేయులు, బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, బుక్కరాయ సముద్రం జెడ్పీటీసీ భాస్కర్, మేధావుల ఫోరం అధ్యక్షుడు అనిల్కుమార్ రెడ్డి, ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు నాగరాజు, వైఎస్సార్సీపీ నాయకులు చీమల శీన, చితంబరరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు వైఎస్సార్ సీపీతోనే ఉన్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత చంద్రబాబు పతనం ప్రారంభం: మాజీ మంత్రి శైలజానాథ్ -
వసతుల్లేకుంటే.. విశ్రాంతి ధామాలా?
అనంతపురం మెడికల్: సర్వజనాస్పత్రిలో రోజురోజుకూ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. సౌకర్యాల కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించడకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలోని క్యాజువాలిటీ (ఎమర్జెన్సీ వార్డు), అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)కు వస్తున్న వారు ఇక్కడ చాలీచాలని మంచాల నడుమ ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఒకే మంచంపై పురుషులు, మహిళలను ఉంచి సేవలందిస్తున్న దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్తో పాటు పయ్యావుల కేశవ్, సవిత మంత్రులుగా ఉన్నా ఆస్పత్రిపై దృష్టి సారించకపోవడంపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు అత్యవసర విభాగాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా రూ.75 లక్షలతో విశ్రాంతి ధామం ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మాటలకే పరిమితం.. అనంతపురం నగరానికి చెందిన వ్యక్తి ఫిట్స్తో బాధపడుతూ మంగళవారం సర్వజనాస్పత్రికి వచ్చాడు.అదే సమయంలో అనంతపురం రుద్రంపేటకు చెందిన మహిళ జ్వరంతో ఆస్పత్రికి రాగా, మంచాలు లేకపోవడంతో వీరిద్దరినీ ఒకే మంచంపై ఉంచి సేవలందించారు. ఇలాగే, రాయదుర్గం పట్టణానికి చెందిన మహిళ, బెళగుప్ప మండలం అడవిబాపనపల్లి తండాకు చెందిన వ్యక్తిని ఒకే మంచంపై ఉంచి వైద్యం చేయడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. మంచాలు చిన్నవి కావడంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. క్యాజువాలిటీలో కేవలం 25 పడకలు ఉన్నాయి. నిత్యం ఈ విభాగంలో 600 నుంచి 800 మంది సేవలు పొందుతుంటారు. వివిధ సమస్యలతో వచ్చిన వారిని మొదట పీజీలు, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసిన తర్వాతనే వార్డులకు పంపుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో రోగి రోజుల తరబడి ఎమర్జెన్సీ వార్డులోనే ఉండాల్సి వస్తోంది. అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లోనూ అదే దుస్థితి. ఈ విభాగంలో మంచం ఎప్పుడెప్పుడు ఖాళీ అవుతుందా అంటూ రోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. సర్వజనాస్పత్రి అభి వృద్ధి కమిటీ సమావేశంలో క్యాజువాలిటీ, ఏఎంసీల విస్తరణ చేపట్టాలని నిర్ణయించినా మాటలకే పరిమితమైంది. సర్వజనాస్పత్రిలో మంచాలు లేక రోగుల అవస్థలు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టని ప్రజాప్రతినిధులు, అధికారులు రూ. 75 లక్షలతో విశ్రాంతి ధామం నిర్మిస్తుండడంపై సర్వత్రా విమర్శలు -
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
అనంతపురం కార్పొరేషన్: పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, గోరంట్ల మాధవ్ విలేకరులతో మాట్లాడారు. మాధవ్ మాట్లాడుతూ తాడిపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశానికి కూటమి ప్రభుత్వం డైరెక్షన్లో పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. వైఎస్సార్ సీపీకి 2019లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీ సీట్లు అందించి ప్రజలు ఆశీర్వదించారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు సమావేశాలు, సభలు, కార్యక్రమాలు నిర్వహించుకునే సౌలభ్యం కల్పించారన్నారు. కానీ అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. సమావేశం నిర్వహణకు పోలీసులు అవకాశం కల్పించాలన్నారు. గుడివాడలోనూ తమ పార్టీ నేత కొడాలి నాని కార్యక్రమానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ విప్లవాన్ని తీసుకువచ్చారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. అలవిగాని హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చి నేడు ప్రజలను మోసం చేశారన్నారు. గత ప్రభుత్వం చేసిన మేలును, కూటమి ప్రభుత్వ నయవంచనను ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ అధిష్టానం ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమానికి పిలుపునిచ్చిందని, కార్యక్రమంలో భాగంగానే తాడిపత్రిలో సమావేశం ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. ఈ నెల 18న ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ -
జిల్లా ఉద్యాన శాఖ పరిస్థితి అధ్వానంగా తయారైంది. కూటమి సర్కారు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు కాగితాల్లో చూపిస్తున్నా... అందులో సగం కూడా ఖర్చు చేయడం లేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
● కాగితాల్లోనే పథక నిర్దేశన, బడ్జెట్ కేటాయింపులు ● గతేడాది రూ.18.87 కోట్లకు గానూ రూ.7.98 కోట్లే ఖర్చు ● ఈ ఏడాది రూ.16.14 కోట్లలో సగం ఖర్చు కూడా అనుమానమే ● సర్కారు తీరుతో ఇబ్బందులు పడుతున్న రైతులు అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు ప్రభుత్వం ఒక చేత్తో బడ్జెట్ చూపించి మరో చేత్తో వెనక్కి లాగేసుకుంటూ రైతులకు ఫలాలు అందకుండా చేస్తోంది. 2024–25లో పథకాలు, బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు చేసిన సొమ్ము, సాధించిన ప్రగతి చూస్తే... కూటమి సర్కారు నిర్లక్ష్యం, ఉద్యానశాఖ పనితీరు స్పష్టంగా అర్థమవుతుంది. గతేడాది జిల్లాలో ఉద్యానశాఖ ద్వారా అమలు చేసే పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18.86 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది. అందులో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం (ఎంఐడీహెచ్) కింద 7,820 మంది రైతులకు సంబంధించి రూ.15.23 కోట్లు కేటాయించినా... ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.7.10 కోట్లు వెచ్చించి 3,950 మందికే ఫలాలు అందించారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్కేవీవై) కింద నాణ్యమైన కూరగాయల విత్తనాల పంపిణీకి రూ.1.30 కోట్లు కేటాయించగా ఖర్చు చేసింది మాత్రం రూ.8.50 లక్షలు కావడం గమనార్హం. ఆయిల్ఫాం కింద కణేకల్లు, కూడేరు, బొమ్మనహాళ్, ఉరవకొండ, వజ్రకరూరు, డీ.హీరేహాళ్ మండలాల్లో పామాయిల్ తోటల అభివృద్ధికి రూ.2.31 కోట్లు కేటాయించగా... కేవలం రూ.79 లక్షలు ఖర్చు చేశారు. ఎన్బీఎం, సీడీబీ కింద రూ.2.87 కోట్లు కేటాయించగా రూ.1.31 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇలా గతేడాది రూ.18.87 కోట్లు కేటాయించగా చివరకు రూ.7.98 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు వివిధ పథకాల కింద రూ.16.14 కోట్లు మేర బడ్జెట్ కేటాయించారు. ఈ సారి సగం కూడా ఖర్చు చేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. విస్తీర్ణంలో టాప్.. జిల్లాల విభజన జరిగిన తర్వాత కూడా ఉద్యాన తోటల విస్తీర్ణంలో ‘అనంత’ మొదటి స్థానంలో ఉంది. యాపిల్ లాంటి నాలుగైదు రకాలు మినహా మిగతా అన్ని రకాల ఉద్యాన తోటలకు నిలయంగా మారింది. జిల్లా నుంచి చీనీ, అరటి, దానిమ్మ, టమాట, గులాబీ తదితర ఉత్పత్తులు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీలో పేరున్న అజాద్పూర్ మండీలో ‘అనంత’ ఉద్యాన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. వేలాది మంది ఉద్యాన రైతులు, లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు, రూ.వేల కోట్ల టర్నోవర్ పరంగా జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వేలాది మంది రైతులు వ్యవసాయ పంటలను తగ్గించి అంతో ఇంతో నీటి వనరుల కింద పండ్లు, పూలు, కూరగాయలు తదితర ఉద్యాన పంటలు సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాజా నివేదికల ప్రకారం 3 లక్షల ఎకరాల్లో ఉద్యాన తోటలు ఉండగా... అందులో 1.80 లక్షల ఎకరాల్లో పండ్లతోటలు, 55 వేల ఎకరాల్లో కూరగాయ పంటలు, 40 వేల ఎకరాల్లో సుగంధం, ఔషధ పంటలు, పూలతోటలు సాగులో ఉన్నాయి. ఏకంగా 72 రకాల ఉద్యాన తోటలు సాగవుతున్నట్లు ఈ–క్రాప్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వాటి ద్వారా ఏటా 38 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫలసాయం వస్తోంది. రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు టర్నోవర్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు, తెగుళ్ల బెడద అధికంగా ఉంటోంది. అకాల వర్షాలు, ఈదురుగాలులు ఏటా దెబ్బతీస్తున్నాయి. అలాగే మార్కెటింగ్ సమస్య రైతులను వేధిస్తోంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యాన తోటలు సాగు చేస్తున్న రైతులకు బాసటగా నిలవాల్సిన కూటమి సర్కారు, ఉద్యానశాఖ కంటితుడుపుగా పథకాలు అమలు చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
ఇంకెంత కాలమీ దౌర్జన్యాలు?!
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. మంగళవారం ఆయన బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. అంతకుముందు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ర్యాలీగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ పుల్లయ్యను కలసి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో టీడీపీ నాయకులు చేసిన దాడిలో ఎనిమిది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. టీడీపీ నాయకులు మూకుమ్మడిగా కొడవళ్లు, కట్టెలతో దాడి చేశారని, తలలు పగిలేలా కొట్టారన్నారు. అయినా తిరిగి బాధితులపైనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. టీడీపీ నాయకులు ఇప్పటికై నా పద్ధతి మార్చుకోవాలని, లేదంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులకు ఽధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, నియోజక వర్గ మహిళా అధ్యక్షురాలు పార్వతి, నాయకులు బండ్లపల్లి ప్రతాప్రెడ్డి, పూల నారాయణస్వామి, నందినేని మల్లికార్జున, చికెన్ నారాయణస్వామి, ముత్యాలశీన తదితరులు పాల్గొన్నారు. దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టడం హేయం బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి శైలజానాథ్ నిరసన అండగా ఉంటామని బాధితులకు భరోసా -
రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల్లో ‘మజ్దూర్’ ప్యానెల్ విజయం
గుత్తి: రైల్వే ఇన్స్టిట్యూట్ కార్యవర్గ ఎన్నికల్లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్యానెల్లోని 9 మంది ఘన విజయం సాధించారు. గుత్తి ఆర్ఎస్లోని రైల్వే ఇన్స్టిట్యూట్ కార్యవర్గం ఎన్నికలు మంగళవారం జరిగాయి. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్ తరపున అభ్యర్థులు బరిలో నిలిచారు. సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి, ఆరుగురు డైరెక్టర్ల పదవులకు నిర్వహించిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. మొత్తం 790 మంది ఓటర్లు ఉండగా 747 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 నుంచి ఏడు గంటల వరకు కౌటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఎంప్లాయీస్ సంఘ్ అభ్యర్థులు 9 మంది పోటీ చేసినా ఒక్కరూ గెలవలేకపోయారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్యానెల్ తరపున సెక్రెటరీగా నయబ్ రసూల్ తన ప్రత్యర్థి వేణుగోపాల్పై 128 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జాయింట్ సెక్రెటరీగా ఎన్.విజయకుమార్ 150 ఓట్ల మెజార్టీ, కోశాధికారిగా పోటీ చేసిన కేఎస్ కృష్ణ 148 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డైరెక్టర్లుగా పోటీ చేసిన టి.కంబయ్య, పి.వెంకటేష్, టి.రామాంజనేయులు, పి.సుంకన్న, జ్ఞాన్సింగ్ మీనా, ఎం.బాలకృష్ణ ఘన విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా ఏడీఎంఈ నేత చంద్ర వ్యవహరించారు. -
ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంకండి
రాయదుర్గం టౌన్: కూటమి పాలనలో దగాపడిన ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. రాయదుర్గం ప్రాంతంలోని మురడి, నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయాల దర్శనం కోసం మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన ఆయన స్థానిక మెట్టు గోవిందరెడ్డి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథరెడ్డితో కలసి స్థానిక నాయకులతో కాసేపు మాట్లాడారు. ఏడాది కూటమి పాలన మొత్తం మోసాల మయమన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కు చెరిపితే చెరిగి పోయేది కాదన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సొంతంగా ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేని చంద్రబాబు... జగన్ ప్రవేశపెట్టిన పథకాలనే తమవిగా చెప్పుకునే దౌర్బగ్యస్థితికి దిగజారారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ మేకల శ్రీనివాసులు, చేనేత విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పొరాళ్ల శివకుమార్, కౌన్సిలర్లు పొరాళ్ల గోవిందరాజులు, వీరభద్రరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు శ్రీనివాసులు, మండల కోఆప్షన్ సభ్యుడు దిలావర్బాష, మైనారిటీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి తాశ బషీర్ అహ్మద్, పట్టణ కార్యదర్శులు, ఆంజనేయులు, సత్యనారాయణ, వార్డు ఇన్చార్జ్లు గౌని శ్రీరామిరెడ్డి, రామాంజనేయులు, గోనబావి నిజాముద్దీన్, కార్యవర్గ సభ్యుడు జిలాన్, బంగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి పిలుపు -
ఉద్యోగాల కల్పనే లక్ష్యం
● అధికారులకు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగం చేపట్టనున్న జాబ్మేళాలపై విస్తృత ప్రచారం కల్పించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్హాల్లో మంగళవారం జరిగిన జిల్లా నైపుణ్య కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించి ఎనిమిది జాబ్ మేళాలను ఏర్పాటు చేసి ప్రైవేటు, అవుట్ సోర్సింగ్ లేదా ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఉపాధి కల్పనాధికారిని ఆదేశించారు. ఈ నెల 18న కళ్యాణదుర్గం నియోజకవర్గం, 28న రాప్తాడు, ఆగస్టు 1న అనంతపురం అర్బన్, 16న గుంతకల్లు, 29న రాయదుర్గం, సెప్టెంబరు 12న శింగనమల, 19న తాడిపత్రి, 27న ఉవరకొండ నియోజకవర్గాల్లో జాబ్మేళాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి నెలా ప్లేస్మెంట్ నివేదిక అందించాలన్నారు. ఆగస్టు నాటికి డిగ్రీ కళాశాలల్లో స్కిల్ హబ్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శైలజ, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాపరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసయాదవ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముకుద, డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం, రూడ్సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జేఎన్టీయూ టీపీఓ శ్రీనివాసులు, ఎస్కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణుడు, జేడీఎం సూర్యనారాయణ, మెప్మా డీవైఎస్ఓ పద్మావతి, అధికారులు పాల్గొన్నారు. బ్యాంక్ ఖాతా ఉంటేనే ‘తల్లికి వందనం’ అనంతపురం రూరల్: ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు బ్యాంక్ లేదా పోస్టల్ ఖాతా ఉంటేనే తల్లికి వందనం పథకం నగదు జమ అవుతుందని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ (ఇన్ఛార్జ్) రామాంజినేయులు తెలిపారు. మంగళవారం బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సహాయ సంక్షేమశాఖ అధికారులు, హస్టల్ వార్డెన్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. త్వరలో రెండో విడత తల్లికి వందనం పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ విషయాన్ని వార్డెన్లు, సహాయ సంక్షేమశాఖ అధికారులు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు బ్యాంక్, లేదా పోస్టల్ ఖాతా చేయించి ఎన్పీసీఐ లింక్ చేయించాలన్నారు. -
విధుల్లోకి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు
కూడేరు: శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు సమ్మె విరమించి మంగళవారం విధుల్లోకి చేరారు. పీఏబీఆర్లోని శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్లో మోటర్ స్విచ్ ఆన్ చేసి తాగునీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు మాట్లాడారు. పెండింగ్లో ఉన్న వేతనాలు, పీఎప్ చెల్లించాలంటూ కార్మికులు సాగించిన 100 రోజుల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. కాంట్రాక్టర్ శివారెడ్డి తమతో జరిపిన చర్చల్లో బుధవారం సాయంత్రంలోపు కార్మికుల బ్యాంక్ ఖాతాల్లోకి వేతనలు, పీఎఫ్ జమవుతాయని హామీనిచ్చారన్నారు. ఇందుకు కార్మికులు సమ్మతించి విధుల్లోకి చేరారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేంద్ర కుమార్, ప్రాజెక్ట్ యూనియన్ నేతలు ఎర్రిస్వామి, రామాంజనేయులు, ఈశ్వరయ్య, నాగరాజు, చిక్కన్న తదితరులు పాల్గొన్నారు. పంటలకు బీమా తప్పనిసరి బుక్కరాయసముద్రం/రాప్తాడు: సాగు చేసిన పంటలకు బీమా తప్పని సరిగా చేయించుకోవాలని రైతులకు జిల్లా వ్యవసాయాధికారి (జేడీఏ) ఉమామహేశ్వరమ్మ సూచించారు. బీకేఎస్ మండలం కొర్రపాడు, రాప్తాడు మండలం మరూరు, హంపాపురం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. పత్తి, వేరుశనగ, దానిమ్మ, బత్తాయి, టమాట, అరటి సాగు చేసిన రైతులు పంటల భీమా ప్రీమియంను మీసేవా కేంద్రాల ద్వారా చెల్లించాలన్నారు. పత్తికి ఎకరాకు రూ.1,140, వేరుశనగకు రూ.640, దానిమ్మకు రూ.3,750, బత్తాయికి రూ.2,750, టమాటకు రూ.1,600, అరటికి రూ.3 వేలు చొప్పన ప్రీమియం చెల్లించాలన్నారు. కౌలు రైతులు పంటల సాగు హక్కు పత్రాలను తప్పనిసరిగా పొందాలన్నారు. పంట పొలాల్ని ఆశించే చీడపీడలు, వివిధ రకాల తెగుళ్లు, యాజమాన్య పద్ధతులను వివరించారు. రాయితీ విత్తనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేరుశనగ సాగు చేసే ప్రతి రైతూ అంతర పంట వేసుకోవాలన్నారు. కంది, ఆముదం సాగు విస్తీర్ణం పెంచుకుంటే మంచిదన్నారు. కార్యక్రమంలో బీకేఎస్, రాప్తాడు మండల వ్యవసాయాధికారులు శ్యాం సుఽందరరెడ్డి, కృష్ణచైతన్య, పట్టు పరిశ్రమ అధికారి రమాకాంత్, చంద్రశేఖర్, వీఆర్ఓ నాగరాజు, నరేంద్రరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
వర్సిటీలకు కొత్త కోర్సుల శోభ
అనంతపురం: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలల్లో నూతన కోర్సులు అమలులోకి వచ్చాయి. 2025–26 విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించనున్నారు. కంప్యూటర్ సైన్సెస్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిన ప్రస్తుత రోజుల్లో ఇంజినీరింగ్ విద్య స్వరూపమే మారిపోయింది. దీంతో కాలేజీ యాజమాన్యాలు సీఎస్ఈ సీట్లను ఏటా పెంచుకుంటూ వెళ్తున్నాయి. దీంతో ప్రభుత్వ వర్సిటీల్లోనూ కంప్యూటర్ సైన్సెస్ సీట్లు పెంచేలా గత వైఎస్సార్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కొత్త కోర్సులను ప్రవేశపెట్టడానికి ఏఐసీటీఈ అనుమతులు, పాలకమండలి ఆమోదం తదితర ప్రక్రియ పూర్తి చేసేలా అప్పటి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తాజాగా కొత్త కోర్సుల అమలుకు ఉన్నత విద్యామండలి అనుమతులు జారీ చేసింది. దీంతో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో రెండు, జేఎన్టీయూలో ఒక కోర్సును ప్రవేశపెట్టారు. ఎస్కేయూలో కొత్తగా 240 సీట్లు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో కొత్తగా రెండు బీటెక్లో కంప్యూటర్ సైన్సెస్ డేటా సైన్సెస్, కంప్యూటర్ సైన్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ప్రోగ్రామ్లను సెల్ఫ్ ఫైనాన్స్ కింద ప్రవేశపెట్టారు. ఒక్కో కోర్సులో 60 సీట్లు కేటాయించారు. ఇది వరకు ఉన్న ఈసీఈ, సీఎస్ఈ ప్రోగ్రాంలలో 60 నుంచి 120 సీట్లకు పెంపుదల చేశారు. ఈ 240 కొత్త సీట్లకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. జేఎన్టీయూలో 198 సీట్లు జేఎన్టీయూ (ఏ)లో కొత్త కోర్సుల అమలుకు 2023లోనే అప్పటి వర్సిటీ ఉన్నతాధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. కోర్సు అనుమతి, ఏఐసీటీఈ ఆమోదం, పాలకమండలి ఆమోదం తదితర ప్రక్రియలన్నింటినీ పూర్తి చేసుకున్న అనంతరం తాజాగా ఉన్నత విద్యామండలి ఈ ఏడాది అడ్మిషన్లకు అనుమతిచ్చింది. దీంతో జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ అనే కొత్త కోర్సును సెల్ఫ్ఫైనాన్స్ కింద ప్రవేశపెట్టారు. కోర్సు ఫీజు రూ.75 వేలుగా నిర్ధారించారు. కన్వీనర్ కోటాలో 66 సీట్లను కేటాయించారు. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. అలాగే కంప్యూటర్ సైన్సెస్లో ఇప్పుడు ఉన్న సీట్లకు అదనంగా 66 సీట్లు కొత్తగా కేటాయించారు. ఒక్కో సీటుకు రూ.1.50 లక్షలుగా ఫీజు నిర్ధారించారు. సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరిలో ఈ సీట్లు కేటాయిస్తారు. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ఈసీఈలోనూ ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా 66 సీట్లు కేటాయించారు. కోర్సు ఫీజు రూ.1.25 లక్షలుగా నిర్ధేశించారు. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందు చూపు కారణంగా ఫీజు రీయింబర్స్మెంట్తో 308 మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు కంప్యూటర్సైన్సెస్ కోర్సు అభ్యసించే అవకాశం దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే కొత్త కోర్సులు అందుబాటులోకి కంప్యూటర్ సైన్సెస్లో ఎస్కేయూలో రెండు, జేఎన్టీయూలో ఒక కోర్సు అమలు ఈసీఈ, సీఎస్ఈ బ్రాంచ్ల్లో సీట్ల పెంపు -
పెన్షనర్లపై ప్రభుత్వాల దాడి
అనంతపురం అర్బన్: ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లపై దాడి చేస్తున్నాయి. పెన్సనర్లను భారంగా భావిస్తున్నాయి. రావాల్సిన రాయితీలు, డీఆర్ వంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వడం లేదు. అధికారం చేపట్టి ఏడాదవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసంగా పట్టించుకోలేదు. వృద్ధులు వీరేమి చేస్తారనని అనుకోకండి. మేం తల్చుకుంటే మిమ్మల్ని గద్దెదింపుతాము’’ అంటూ కూటమి ప్రభుత్వంపై పెన్షనర్ల సంఘం నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న గౌడ్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సుదీర్ఘకాలం సేవలందించిన ఉద్యోగులకు పదవీ విరమణ చేసిన తరువాత రాయితీలు మంజూరు చేయకుండా ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన సాధించుకున్న వాటిని ఒక్కొక్కటిగా రద్దు చేయడం ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిదర్శమన్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.పెద్దన్న గౌడ్, శీలా జయరామప్ప మాట్లాడుతూ కూటమి గెలుపుకోసం గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం తిరిగామన్నారు. అధికారంలోకి వస్తే ప్రయోజనాలు చేకూరుస్తామని చంద్రబాబు మాటిచ్చి ఏడాదవుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. పెన్షనర్లకు రావాల్సిన మూడు డీఆర్లు, 11వ పీఆర్సీ బకాయిలు తక్షణం చెల్లించాలన్నారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలన్నారు. అనంతరం కలెక్టర్ వినోద్కుమార్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నాయకులు అందజేశారు. ధర్నాకు ఏపీఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, చంద్రమోహన్, నగర అధ్యక్షుడు మనోహర్రెడ్డి, ఇతర ఉద్యోగ సంఘాలు, సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో పెన్షనీర్ల సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రభాకర్, కోశాధికారి, సీనియన్ సిటిజన్ అధ్యక్షుడు రమణ, రామకృష్ణ, నియోజకవర్గాల నాయకులు, పెన్షనర్లు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
శింగనమల: ఇంటి రస్తా విషయంలో శింగనమల మండలం ఇరువెందలలో చోటు చేసుకున్న వ్యక్తి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. శింగనమల పీఎస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు వెల్లడించారు. ఇరువెందుల గ్రామానికి చెందిన మైలే శంకరయ్యకు వరుసకు మనవరాలైన శ్యామల ఈ నెల 3న మధ్యాహ్నం 1 గంటకు తన ఇంటికి వెనుక ఉన్న దారికి ముళ్ల కంప అడ్డు వేసింది. ఈ విషయంగా దాసరి ప్రభాకర్ భార్య సరస్వతి, తల్లి రత్నమ్మ గొడవపడ్డారు. సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకున్న ప్రభాకర్కు విషయాన్ని భార్య, తల్లి తెలపడంతో ఆగ్రహానికి గురైన ఆయన తన తమ్ముడు త్రినాథ్, బంధువులు రమేష్, శేఖర్, నాగేంద్ర, రామచంద్ర, శ్రీనివాసులు, సరస్వతి, రత్నమ్మతో కలసి కర్రలు, రాళ్లతో శంకరయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు. శ్యామల భర్త మల్లికార్జున ఎక్కడ అంటూ దుర్భాషలాడుతుండగా శంకరయ్య నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అంతలో ప్రభాకర్తో పాటు త్రినాథ్, రమేష్, శేఖర్, నాగేంద్ర, రామచంద్ర, శ్రీనివాసులు, సరస్వతి, రత్నమ్మ మూకుమ్మడిగా శంకరయ్య, బాలగంగిరెడ్డి, నాగేంద్ర, అమ్ములన్న, పెద్దరాజుపై రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఘటనలో శంకరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం పక్కా ఆధారాలతో నాయనపల్లి క్రాస్ వద్ద ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. విలేకరుల సమావేశంలో, సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ విజయ్కుమార్, ఎఎస్ఐ చితంబరయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
అందని ప్రయోజనాలు.. పెన్షనర్ల దిగాలు
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పెన్షనర్ల పరిస్థితి దయనీయంగా మారింది. వారిపై బాబు సర్కారు కనికరం చూపడం లేదు. ఉద్యోగ విరమణ తరువాత రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నెలలు గడుస్తున్నా అందించకపోవడంతో ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, ఎర్న్ లీవ్ వంటి ఆర్థిక ప్రయోజనాలు గత ఏడాది అక్టోబరు నుంచి పెండింగ్లో ఉంచారు. ఈ మొత్తం రూ.48 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. మట్టిఖర్చులూ పెండింగ్ పెన్షనర్ చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు తక్షణ సాయంగా మట్టిఖర్చుల (ఫ్యునరెల్ చార్జెస్) కింద రూ.25 వేలు ఇస్తారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ 100 మంది వరకూ పెన్షనర్లు మరణిస్తే వీరికి సంబంధించి మట్టి ఖర్చులను ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్లో ఉంచినట్లు తెలిసింది. 100 మందికి రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. మట్టిఖర్చుల కింద తక్షణ సాయంగా అందించాల్సిన డబ్బునూ పెండింగ్లో పెట్టడం ప్రభుత్వ కర్కశత్వానికి అద్దం పడుతోంది. గ్రాట్యూటీ, ఈఎల్కు ఎదురుచూపులు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యుటీ కింద గరిష్టంగా రూ.16 లక్షలు చెల్లి స్తుంది. జిల్లాలో గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు వివిధ హోదాల్లో దాదాపు 200 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసినట్లు సమాచారం. వీరికి సంబంధించి గ్రాట్యుటీ సగటున రూ.14 లక్షలుగా చూసినా రూ.28 కోట్లు రావాల్సి ఉంటుంది. ● సర్వీసులో ఉండగా ఉద్యోగులు మిగుల్చుకున్న ఎర్న్ లీవ్లను (ఈఎల్) ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చి వాటికి డబ్బులు తీసుకుంటారు. ఇలా ఒక్కో ఉద్యోగి దాదాపు 300 రోజులు (పది నెలలు) ఎర్న్ లీవులను వెనక్కి ఇస్తారు. ఒక్కో ఉద్యోగికి ఈఎల్కు సంబంధించి 10 నెలల వేతనం ప్రభుత్వం చెల్లించాలి. సగటున నెలకు రూ.లక్ష వేసుకున్నా పది నెలలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలుగా 200 మందికి రూ.20 కోట్లను ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా చెల్లించ కుండా పెండింగ్లో ఉంచిందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం (నేడు) కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పెన్షనర్లు ధర్నాకు పిలుపునిచ్చారు. ● మూడునెలలుగా మట్టి ఖర్చులనూ అందించని చంద్రబాబు సర్కారు ● పేరుకుపోయిన గ్రాట్యుటీ, ఈఎల్ బకాయిలు ● నేడు కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల ధర్నా ● రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న మల్లికార్జున (పేరు మార్చాం) గత ఏడాది నవంబరులో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు గ్రాట్యుటీ రూ.16 లక్షలు, ఈఎల్ (ఎర్న్ లీవ్) డబ్బు సుమారు రూ.10 లక్షలు నేటికీ అందలేదు. ఉద్యోగ విరమణ తరువాత పింఛను తప్ప ఇతర ఆర్థిక ప్రయోజనాలు నేటికీ తనకు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ● ఒక ఉపాధ్యాయుడు గత ఏడాది అక్టోబరులో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు గ్రాట్యుటీ రూ.16 లక్షలు, ఈఎల్ రూ.12 లక్షలు నేటికీ అందలేదు. ఉద్యోగ విరమణ చేసి తొమ్మిది నెలలు అవుతున్నా బెనిఫిట్లు అందించలేదని, ఇటీవల ఇంట్లో శుభకార్యం చేసేందుకు రూ.10 లక్షలు అవసరమైతే తెలిసిన వారి నుంచి వడ్డీకి డబ్బు తీసుకున్నానని వాపోయారు. -
తాగునీటి సమస్య తీర్చాలని నిరసన
కుందుర్పి: మండలంలోని బసాపురం గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మహిళలు సచివాలయానికి తాళం వేసి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులుగా గ్రామానికి తాగునీరు అందడం లేదని, అధికారులను అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని వాపోయారు. తాగునీరు అందించే వరకూ సచివాలయం తలుపు తీయరాదని భీష్మించారు. ఎంపీడీఓ లక్ష్మీశంకర్ స్పందించి 24గంటల్లో సమస్య పరిష్కరిస్తామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. రైతుల నగదు చోరీకి యత్నం కళ్యాణదుర్గం రూరల్: ముగ్గురు రైతులకు చెందిన నగదును చోరీ చేసేందుకు ఓ అగంతకుడు విఫలయత్నం చేసిన ఘటన కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. వివరాలు.. బెళుగుప్ప మండలం విరుపాపల్లికి చెందిన రైతు గోవిందప్పతో పాటు మరో ఇద్దరు రైతులు సోమవారం కళ్యాణదుర్గంలోని యూనియన్ బ్యాంక్ శాఖకు వచ్చారు. తమ పంట రుణాలను రెన్యూవల్ చేసిన అనంతరం ఖాతాలో నుంచి రూ.6 లక్షలు విత్డ్రా చేసి గోవిందప్పకు అప్పగించి, మిగిలిన ఇద్దరు పనిపై వెళ్లిపోయారు. నగదును గోవిందప్ప తన ద్విచక్ర వాహనం సైడ్ బ్యాగ్లో ఉంచి విద్యుత్ కార్యాలయం సమీపంలోని హోటల్లోకి వెళ్లి భోజనం చేస్తూ తన వాహనంపై నిఘా ఉంచాడు. కాసేపటికి ఓ యువకుడు ద్విచక్ర వాహనంలోని నగదును అపహరించే ప్రయత్నం చేయగా గట్టిగా కేకలు వేయడంతో నగదు అక్కడే పడేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. జేఎన్టీయూలో 1,935 సీట్ల తగ్గింపు అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల పరిధిలో సీట్ల ఖరారు పూర్తయింది. జేఎన్టీయూ (ఏ) పరిధిలో మొత్తం 69 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలకు గాను ఈ విద్యాసంవత్సరానికి 59,244 సీట్ల ఏఐసీటీఈ మంజూరు చేసింది. కళాశాలల నిజనిర్ధారణ కమిటీల సిఫార్సు మేరకు 1,935 సీట్లను తగ్తిస్తూ మొత్తం 57,309 ఇంజినీరింగ్ సీట్లను ఖరారు చేశారు. వీటిని ఏపీఈఏపీసెట్ –2025 వెబ్ ఆప్షన్ల ఎంపికకు అందుబాటులో తెచ్చేందుకు ఉన్నత విద్యామండలికి నివేదించారు. బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులకు సంబంధించి 77,296 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలపగా, 74,145 సీట్లను భర్తీ చేసుకునేందుకు వర్సిటీ తుది ఆమోదం తెలిపింది. -
పాలకుల అలసత్వం.. ఆటో డ్రైవర్ల శ్రమదానం
కళ్యాణదుర్గం రూరల్: ఓ బడా కాంట్రాక్టర్ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లను నిర్మిస్తానని అప్పట్లో ఆయన హామీనిచ్చారు. నియోజకవర్గ ప్రజలు నమ్మి ఓట్లేస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. 13 మాసాలు గడిచినా ఇప్పటి వరకూ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడే కానీ రోడ్డు నిర్మించిన పాపాన పోలేదు. దెబ్బతిన్న రోడ్లకు కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. దీంతో నియోజకవర్గంలోని పలు గ్రామాల రహదారులు గోతుల మయమయ్యాయి. ఇక తమ ఎమ్మెల్యే స్పందించరని ఆలస్యంగా తెలుసుకున్న కొందరు యువకులు శ్రమదానంతో రోడ్డుపై గుంతలను పూడ్చే పని చేపట్టారు. 20 గ్రామాలకు వెళ్లే రహదారికి మరమ్మతులు కళ్యాణదుర్గం నుంచి ముదిగల్లు, కోడిపల్లి, ముద్దినాయన పల్లితో పాటు సుమారు 20 గ్రామాలకు పైగా ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి పూర్తి అధ్వాన స్థితికి చేరుకుంది. ఎటు చూసిన గుంతలే కనిపిస్తుండడంతో మరమ్మతులు చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు అయా గ్రామస్తులు విన్నవించారు. అయినా ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆటో డ్రైవర్లు స్పందించారు. సోమవారం పలువురు ఆటో డ్రైవర్లు ఏకమై చందాలు వేసుకుని ట్రాక్టర్లో కంకర్ వేస్టును తీసుకెళ్లి పట్టణ సమీపంలోని ముదిగల్లు బైపాస్ రోడ్డు నుంచి దాదాపు ఒక కిలోమీటర్ మేర రోడ్డుపై గుంతలను పూడ్చి వేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ... ఆటోల్లో ఈ మార్గంలో ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లలు ప్రయాణం చేస్తుంటారన్నారు. కొన్ని రోజుల క్రితం ఆటోలో గర్భిణిని ఆస్పత్రికి తరలించే సమయంలో పరిస్థితి విషమించిందని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని వివిధ విభాగాల్లో బోధనకు అతిథి అధ్యాపకులుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను చరిత్ర, ఆర్కియాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, కామర్స్ అండ్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ నెల 16న ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆసక్తి, అర్హత ఉన్న వారు ఉదయం 10 గంటలకు కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో వివరాలు నమోదు చేసుకోవాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రూమ్ నంబర్ 14లో ఇంటర్వ్యూలు చేపడతారు. యూజీసీ నిబంధనలు అనుసరించి భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. పీహెచ్డీ, నెట్, స్లెట్, పీజీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు బయోడేటా, విద్యకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాలి. విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి యల్లనూరు: మండలంలోని తిమ్మంపల్లికి చెందిన కౌలు రైతు పెద్దారెడ్డి(50) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య రమాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్షుంపల్లికి చెందిన ఓ రైతు తోటను కౌలుకు తీసుకుని ఎనిమిది ఎకరాల్లో చీనీ పంట సాగు చేశాడు. ఆదివారం రాత్రి పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లినా ఆయన మోటారుకు అమర్చిన విద్యుత్ తీగల కొక్కీలను తగిలిస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భార్యాపిల్లలు అక్కడకు చేరుకుని విగతజీవిగా పడి ఉన్న పెద్దారెడ్డిని చూసి బోరున విలపించారు. కుమారుడు సాయిప్రతాపరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి అనుమానాస్పద మృతి బుక్కరాయసముద్రం: మండలంలోని గుత్తి రోడ్డు సమీపంలోని తడకలేరు వంకలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని బెంగళూరుకు చెందిన దేవరాజ్ (56)గా గుర్తించారు. అనంతపురానికి వచ్చిన ఆయన మూడు రోజుల క్రితం తడకలేరు వద్ద మృతి చెందినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని జీజీహెచ్లోని మార్చురీకి తరలించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయాలి
బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి.. ● తల్లిదండ్రుల వేడుకోలు కళ్యాణదుర్గం రూరల్: చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. వివరాలు.. శెట్టూరు మండలం ఐదుకల్లు గ్రామానికి చెందిన సతీష్, నందిని దంపతులు బతుకు తెరువు కోసం కళ్యాణదుర్గం పట్టణానికి వలసవచ్చి సిద్దప్ప వంక కాలనీలో నివాసం ఉంటున్నారు. సతీష్ బేల్దారి పనులకు వెళుతుండగా.. నందిని టైలరింగ్ చేస్తూ చేదోడుగా నిలిచింది. వీరి కుమార్తె శ్రీప్రియ ఐదో తరగతి చదువుతోంది. కొన్ని రోజుల క్రితం ప్రమాదశాత్తు కిందపడిన శ్రీప్రియ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించిన ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని సెయింట్జాన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇప్పటికే మూడుసార్లు బ్రెయిన్ సర్జరీ చేశారు. రూ.5లక్షలకు పైగా చికిత్స కోసం అప్పు చేశారు. మరో సర్జరీ కోసం రూ.7లక్షలు అవసరమని అక్కడి డాక్టర్లు తెలిపారు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద తల్లిదండ్రులు తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే మానవతావాదులు 83096 50726 నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. అనంతపురం అర్బన్: మహిళలపై లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధర్యంలో రూపొందించిన ప్రచార పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పని ప్రదేశాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, ఐసీడీఎస్ పీడీ నాగమణి, డీవీ విభాగం కౌన్సిల్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మినీ కాన్ఫరెన్స్ హాలులో కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సిబ్బందితో మాట్లాడుతూ... ‘రెవెన్యూ, ఇతర ప్రభుత్వ సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ‘అక్షర ఆంధ్ర’ను విజయవంతం చేయాలి జిల్లాలో 1,25,578 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ‘సేవ్ వాటర్– యూజ్ వాటర్’ అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టాలని ఆదేశించారు. సీఎస్ఆర్ కార్యక్రమాలు చేపట్టిండికార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని జిల్లాలోని భారీ, మెగా పరిశ్రమల యాజమాన్యాలకు కలెక్టర్ వి.వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సీఎస్ఆర్ కార్యక్రమాలపై కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో సోమవారం కలెక్టర్ సమీక్షించారు. పీ4, ప్రధానమంత్రి టీడీ ముక్త్ భారత్ అభియాన్, జల్ శక్తి అభియాన్, జన్ భాగీదరి కింద చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో సీపీఓ ఆశోక్కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాస్ యాదవ్, డీఎంహెచ్ఓ ఈబీదేవి, డ్వామా పీడీ సలీమ్బాషా, భూగర్భజల శాఖ డీడీ మల్లికార్జున, టీబీ నియంత్రణ అధికారి గంగాధర్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా – ఒకరి మృతి
● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు గుత్తి: ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. పామిడి మండలం ఎదురూరు గ్రామానికి చెందిన ఎరికలప్ప (70), వీరభద్రప్ప, తిమ్మప్ప కర్ణాటకలోని హోసపేటలో స్థిరపడ్డారు. వ్యక్తిగత పనిపై సోమవారం హోసపేట నుంచి రైలులో గుత్తి ఆర్ఎస్కు వచ్చిన వీరు, అక్కడి నుంచి ఎదురూరుకు ఆటోలో బయలుదేరారు. షేరింగ్ ఆటో కావడంతో వీరితో పాటు గుత్తికి చెందిన విజయలక్ష్మి, ఆర్ఎస్కు చెందిన రాజ్కుమార్, హరిజన రాజు కూడా అదే ఆటో ఎక్కారు. గుత్తి ఆర్ఎస్ రోడ్డులోని లక్ష్మమ్మ గుడి వద్దకు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను డ్రైవర్ తప్పించబోగా అదుపు తప్పి బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎరికలప్ప, విజయలక్ష్మి, రాజ్కుమార్ను అనంతపురంలోని జీజీహెచ్కు అంబులెన్స్లో తరలిస్తుండగా కాసేపల్లి టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే ఎరికలప్ప మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గిరినాథ్కు రూ.10 లక్షలు
అనంతపురం: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025 వేలం ప్రక్రియ విశాఖపట్నంలో సోమవారం రాత్రి ముగిసింది. ఏపీఎల్ సీజన్–4 కోసం 520 మంది క్రికెటర్లు వేలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో అనంతకు చెందిన 11 మంది క్రీడాకారులకు అవకాశం దక్కింది. అత్యధికంగా పి.గిరినాథరెడ్డిని రూ.10.05 లక్షలతో రాయల్స్ ఆఫ్ రాయలసీమ (ఆర్ఆర్) దక్కించుకుంది. రూ.7.50 లక్షలకు బి. వినయ్కుమార్ను అమరావతి రాయల్స్ సొంతం చేసుకుంది. రూ.4.20 లక్షలకు కోగటం హనీష్ వీరారెడ్డిని సింహాద్రి వైజాగ్ లయన్స్ కై వసం చేసుకుంది. పి.అర్జున్ టెండూల్కర్ను రూ.1.20 లక్షలకు కాకినాడ కింగ్స్, మచ్చా కె.దత్తారెడ్డిని రూ.60 వేలకు తుంగభద్ర వారియర్స్, జి.మల్లికార్జునను రూ.90 వేలతో అమరావతి రాయల్స్, సంతోష్కుమార్ను రూ.60 వేలతో అమరావతి రాయల్స్, ఎస్ఎం కమిల్ను రూ.50 వేలతో సింహాద్రి వైజాగ్ లయన్స్, ఎన్.మనోజ్కుమార్ను రూ.30 వేలతో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, డీబీ ప్రశాంత్ను రూ.2.20 లక్షలు, ఎం.దీపక్ను రూ.30 వేలతో తుంగభద్ర వారియర్స్ దక్కించుకున్నాయి. ఏపీఎల్లో అత్యధిక ధరతో వేలం జిల్లాకు చెందిన 11 మంది క్రికెటర్లకు అవకాశం -
జేఎన్టీయూలో కొత్త కోర్సు
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో కొత్త కోర్సు అమలు చేస్తున్నట్లు వీసీ హెచ్.సుదర్శనరావు సోమవారం వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలకు త్వరలో అటానమస్ హోదా దక్కనున్న నేపథ్యంలో క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. అయితే కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో జాప్యం నెలకొని పేద, మధ్య తరగతి విద్యార్థులు క్యాంపస్లో చదివే అవకాశం లేకుండా పోతోంది. ఈ అంశంపై ‘విశ్వ ఖ్యాతి.. అధోగతి’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై వీసీ స్పందించారు. ఉన్నత విద్యామండలితో ఫోన్లో సంప్రదించి కొత్త కోర్సు అమలుకు చర్యలు తీసుకున్నారు. ఏపీ ఈఏపీసెట్ –2025 వెబ్ ఆప్షన్లలో ఈ కొత్త కోర్సును ఎంపిక చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. కొత్త కోర్సు వివరాలు ఇలా: జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ అనే కొత్త కోర్సును సెల్ఫ్ ఫైనాన్స్ కింద ప్రవేశపెట్టారు. కన్వీనర్ కోటాలో 66 సీట్లను కేటాయించారు. కోర్సు ఫీజు రూ.75 వేలుగా నిర్ధారించారు. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. ● కంప్యూటర్ సైన్సెస్లో ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా 66 సీట్లు కొత్తగా కేటాయించారు. ఒక్కో సీటుకు రూ.1.50 లక్షలుగా నిర్ధారించారు. సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరిలో ఈ సీట్లు కేటాయిస్తారు. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ● ఈసీఈలో ఇప్పుడు ఉన్న సీట్లకు అదనంగా 66 సీట్లు కేటాయించారు. ఒక్కో సీటుకు కోర్సు ఫీజు రూ.1.25 లక్షలుగా నిర్ధేశించారు. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ఈ కోర్సులన్నింటినీ 2025–26 విద్యా సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు వర్తిస్తుంది. -
వీఆర్ఓ నుంచి ప్రాణహాని ఉంది
● గుంతకల్లు వన్టౌన్ పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ గుంతకల్లు టౌన్: వీఆర్ఓ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలంటూ గుంతకల్లు వన్టౌన్ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన మేరకు... పట్టణంలోని సోఫియా స్ట్రీట్లో నివాసముంటున్న షేక్ షమీమ్భాను తన మొదటి భర్తతో రెండేళ్ల క్రితం విడాకులు పొంది ఐదేళ్ల కుమారుడితో కలసి తల్లిదండ్రుల సంరక్షణలో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తన కుమారుడి పేరును రేషన్కార్డులో నమోదు చేయించేందుకు సచివాలయానికి వెళ్లిన ఆమెను వీఆర్ఓ మహమ్మద్ వలి మాయ మాటలతో లోబర్చుకున్నాడు. ఇంటి స్థలం, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె వద్ద రూ. లక్ష తీసుకున్నాడు. అనంతరం 2024, మే 22న అనంతపురంలో పెద్దల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. అయితే వీఆర్ఓకు ఇదివరకే వివాహమైన విషయాన్ని తెలుసుకున్న ఆమె నిలదీసింది. దీంతో మొదటి భార్య, ఇద్దరు బావమరుదులు షమీమ్భాను ఇంటికి చేరుకుని గొడవ చేసి, దుర్భాషలాడుతూ దాడికి తెగబడ్డారు.చంపేస్తామని బెదిరించారు. మహమ్మద్ వలి, ఆయన మొదటి భార్య, అతని బావమరుదుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు, తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమెక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి బి.సురేష్, తదితరులతో కలసి సోమవారం వన్టౌన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే ఆమె మౌఖికంగానే ఫిర్యాదు చేశారని, సమగ్ర వివరాలతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని సీఐ మనోహర్ తెలిపారు. -
తల్లిదండ్రుల్లో మార్పు రావాలి
● వారం క్రితం అనంతపురం రూరల్ పరిధిలోని నారాయణపురం చెక్డ్యాం సమీపంలో తపోవనం హైస్కూల్ పిల్లలు ఐదుగురు మద్యం తాగుతున్నారు. ఆ బ్యాచ్లోని ఓ విద్యార్థి తండ్రి వీరి తతంగాన్ని కనిపెట్టాడు. తన కుమారుడిని పట్టుకొచ్చి బాగా కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి అందరి పేర్లూ చెప్పాడు. విస్కీ తాగినట్టు వెల్లడించాడు. ● అనంతపురం నగరంలోని పొట్టిశ్రీరాములు పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి.. ఇటీవల స్కూల్లో టీసీ తీసుకుని 3వ రోడ్డులో ఉన్న ఓ హైస్కూల్లో చేరాడు.బడిలో ఈ విద్యార్థి ఇటీవల గంజాయి తాగుతుండగా ఉపాధ్యాయుడు గుర్తించాడు. తల్లిదండ్రులను పిలుస్తా అని హెచ్చరిస్తే.. ‘‘పిలువు, నన్ను వాళ్లేం చేయగలరు’’ అంటూ విద్యార్థి ఎదురుతిరిగే సరికి ఉపాధ్యాయుడు భయపడి విషయాన్ని అంతటితో వదిలేశాడు. విద్యార్థుల్లో పెడ ధోరణలు ఎంతగా పెరిగాయో ఈ రెండు ఘటనల ద్వారా అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్న విపరీత ధోరణులు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. చిన్న వయసులోనే ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ హైస్కూళ్లలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, ఉపాధ్యాయులు కూడా తమకెందుకులే అని పట్టించుకోకపోవడం తదితర కారణాలతో పిల్లలు పెడదారి పడుతున్నట్లుగా తెలుస్తోంది. 14 ఏళ్లకే మద్య సేవనం... తపోవనం హైస్కూలు విద్యార్థులు మద్యం సేవించిన ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ముగ్గురు, ఎనిమిదో తరగతి చదువుతున్న వారు ఇద్దరు ఉన్నట్లు తెలుసుకుని పలువురు విస్తుపోతున్నారు. మరోవైపు జిల్లాలో కొన్ని చోట్ల విద్యార్థులు పాఠశాలలకు గంజాయి తెచ్చుకుని సేవిస్తున్నారు. మరికొన్ని చోట్ల సెల్ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూస్తూ గడుపుతున్నారు. కో ఎడ్యుకేషన్ ఉన్నచోట బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ ప్రభుత్వ స్కూల్లో 9వ తరగతి బాలిక ఓ బాలుడికి ప్రేమలేఖ రాసిన ఉదంతం బయటపడింది. ఈ క్రమంలో పిల్లలను స్కూళ్లకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయుల్లో ఉదాసీన వైఖరి పిల్లలను ఏమంటే ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనన్న భయంతో ఉపాధ్యాయులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. చాలామంది టీచర్లే క్రమశిక్షణ తప్పి క్లాసులకు వస్తున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. సమయానికి స్కూలుకు వెళ్లకపోవ డం, వెళ్లినా క్లాసులు తీసుకోకపోవడం విద్యార్థులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి కారణమవుతోంది. ఇక పిల్లల తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లి ఎప్పుడో రాత్రికి ఇంటికి చేరుకుంటుండడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాలు లేక శాపంగా పరిణమిస్తోంది. విద్యార్థుల్లో వింత పోకడ ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులే ఎక్కువగా పక్కదారి వారం క్రితం నారాయణపురం వద్ద లిక్కర్ తాగుతూ దొరికిన ఐదుగురు మరో ప్రభుత్వ స్కూల్లో 9వ తరగతి విద్యార్థి గంజాయి సేవనం ఎక్కువగా అర్బన్ ప్రాంతాల్లో ఇలాంటి విపరీత ఘటనలు ఉదాసీనంగా ఉపాధ్యాయులు పిల్లల్లో పెడధోరణులను కాండాక్ట్ డిజార్డర్ అంటారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం ప్రధాన కారణం. తల్లిదండ్రు లకు మద్యం అలవాటు ఉన్నా ఇలా జరుగుతుంది. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల కూడా పెడదారి పడుతున్నారు. తల్లిదండ్రుల ద్వారానే పిల్లల్లో పరివర్తన రావాలి. –డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణులు, అనంతపురం -
కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
పుట్లూరు: ఏడాది కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. సోమవారం ఆయన పుట్లూరులో నిర్వహించిన ‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కోసం మాజీ సీఎం వైఎస్ జగన్వస్తే చంద్రబాబు అండ్ కోకు చెమటలు పట్టి వేలాది మంది పోలీసులతో పర్యటనకు అడ్డంకులు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. ‘అన్నదాత సుఖీభవ’, ‘నిరుద్యోగ భృతి’,‘బీసీలకు 50 ఏళ్లకే పింఛన్’, జాబ్ కేలండర్ అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన బాబు.. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా అమలు చేయలేదన్నారు. గత జగనన్న పాలన, ప్రస్తుత కూటమి పాలన తీరుపై చర్చకు సిద్ధమని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే దాడులు చేస్తూ, పోలీసు కేసులు పెడుతూ రాక్షస పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మద్యాన్ని సరసమైన ధరలకే అందిస్తామని చెప్పడం ఆయనకే చెల్లిందన్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం, ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. చంద్రబాబు దగా పాలనను ఇంటింటికీ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వనీర్ పి.మహేశ్వరరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పిదప సువర్ణ, భాస్కర్, ఎంపీటీసీ సభ్యుడు భూమిరెడ్డి నాగార్జునరెడ్డి, నాయకులు మడుగుపల్లి నాగేశ్వరరెడ్డి, జయరాంరెడ్డి, శివారెడ్డి, సుబ్బారెడ్డి, నారాయణస్వామి, రామాంజులరెడ్డి, రామమోహన్ తదితరులు పాల్గొన్నారు. ‘సూపర్ సిక్స్’ను గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తానని చెప్పిన ఘనత ఆయనదే మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ధ్వజం -
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
అనంతపురం కార్పొరేషన్: జిల్లాలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పోలీసు శాఖ వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా ఆంక్షలు విధించడం సరికాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం తాడిపత్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించబోతున్న తరుణంలో.. సమావేశాన్ని వాయిదా వేసుకోవాలంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి నోటీసు జారీ చేశారు. సోమవారం రాత్రి తాడిపత్రి సీఐ సాయిప్రసాద్, అనంతపురం టూటౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ ఏఎస్పీ ఇచ్చిన నోటీసును ‘అనంత’కు ఆయన నివాసంలో అందజేశారు. దీనిపై ‘అనంత’ లిఖిత పూర్వకంగా ఏఎస్పీకి లేఖ పంపారు. అందులో ఏమన్నారంటే.. ‘వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో భాగంగా తాడిపత్రిలోని పాత వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం 10 గంటలకు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు తెలియజేశాం. సమావేశానికి ముఖ్యఅతిథులుగా అనంతపురం పార్లమెంట్ పరిశీలకుడు నరేష్రెడ్డి, నేను హాజరుకానున్నాం. ఈ సమావేశాన్ని మూడు రోజుల పాటు వాయిదా వేయాలని మీరు సూచించారు. మీరు పేర్కొన్నదాని ప్రకారం ఇదే రోజు వీరాపురం గ్రామంలో నూతన పవర్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం ఉండబోతోంది. ఆ కార్యక్రమానికి మంత్రులు కేశవ్, టీజీ భరత్, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, తాడిపత్రి ఎమ్మెల్యే తదితరులు హాజరుకానున్నారు. గతంలో కూడా తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త పలుమార్లు అనుమతి కోరిన సందర్భాల్లో, మీ కార్యాలయం తరచూ వాయిదా వేయాలని రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం నేను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అనుమతి కోరిన విషయంపై కూడా అదే తరహాలో స్పందించారు. మేము నిర్వహించబోయే కార్యక్రమం హాలులో జరగబోయే ఇండోర్ సమావేశమే. ఇది ఎట్టి పరిస్థితుల్లో బహిరంగ సభ కాదు. ఈ తరహా కార్యక్రమాలకు కూడా అనుమతి నిరాకరించడం, రాజకీయ పార్టీలకు వారి హక్కులు ఉండనివ్వకపోవడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఇలాంటి చర్యలతో తాడిపత్రిని ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా భావించి ప్రతిపక్ష పార్టీలకు అనుమతులు తిరస్కరిస్తున్నారన్న అనుమానం మాకు కలుగుతోంది. మేము నిర్వహించే కార్యక్రమం హాలులో, శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని మేము హామీ ఇస్తున్నాం. మా కార్యక్రమానికి అనుమతిచ్చి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి’ అని ‘అనంత’ లేఖలో పేర్కొన్నారు. పోలీసుల తీరుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం తాడిపత్రి సమావేశానికి వెళ్లొద్దంటూ నోటీసులివ్వడంపై మండిపాటు -
హెచ్చెల్సీకి నవంబర్ నెలాఖరు వరకూ నీరు
● టీబీ డ్యాం ఎస్ఈ నారాయణ నాయక్ బొమ్మనహాళ్: హెచ్చెల్సీకి నవంబర్ నెలాఖరు వరకు తుంగభద్ర జలాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టీబీ డ్యాం ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. సోమవారం బొమ్మనహాళ్ మండలం ఆంధ్రా సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద కాలువను, రెగ్యులేటర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ టీబీ డ్యాంకు ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టిందన్నారు. ఇటీవల డ్యాం నుంచి 1,400 క్యూసెక్కుల నీటిని హెచ్చెల్సీకి వదిలామన్నారు. 105వ కిలోమీటర్ వద్దకు 500 క్యూసెక్కుల మేర వస్తున్నట్లు తెలిపారు. నవంబర్లో వర్షాలు వస్తే హెచ్చెల్సీకి నీటి వాటా పెంచుతామన్నారు. ఆంధ్రాలో అత్యవసర మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో నీటిని తీసుకునేందుకు ఆలస్యం కావొచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్డీఓ ప్రవీణ్కుమార్రెడ్డి, జేఈ రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పది, ఇంటర్ ప్రవేశాలకు 16న కౌన్సెలింగ్ అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సీట్ల భర్తీకి ఈనెల 16న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సమన్వయ అధికారి జయలక్ష్మీ తెలిపారు. కురుగుంట స్కూల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పదో తరగతికి సంబంధించి ఉరవకొండ స్కూల్లో ఎస్టీ–1, బీసీ–1, ఓసీ–1, హిందూపురం బాలికల పాఠశాలలో ఎస్సీ–7, అమరాపురంలో ఎస్టీ–1, ఓసీ–1, మలుగూరులో ఎస్సీ–2, ఎస్టీ–1 ఖాళీలున్నాయన్నారు. సీనియర్ ఇంటర్లో ఉరవకొండ ఎస్సీ– 48, ఎస్టీ–3, బీసీ–3, ఓసీ–2, నల్లమాడలో 55, కురుగుంటలో ఎస్సీ–1, ఎస్టీ–2, బీసీ–2, హిందూపురం (బాలికలు)లో ఓసీ–1, అమరాపురం ఎస్సీ–1, ఓసీ–1, మలగూరులో ఎస్సీ–19, బీసీ–1 సీటు ఖాళీ ఉందన్నారు. 16 ఎకరాల్లో పత్తి పంట దున్నేసిన రైతు యాడికి: వర్షాభావంతో పంట చేతికి అందకుండా పోతోందనే ఆవేదనతో ఓ రైతు 16 ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటను ట్రాక్టర్ సాయంతో దున్నేశాడు. యాడికి మండలం చిక్కేపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైతు బాదుల్లా తనకున్న 3 ఎకరాలతో పాటు సమీపంలోని రైతులకు చెందిన 13 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాడు. పెట్టుబడి కింద రూ.2 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. వర్షం జాడ లేకపోవడంతో పంట ఎదుగుదల లేకుండా పోయింది. దీంతో మనస్తాపానికి గురైన బాదుల్లా తన భార్యతో కలసి ట్రాక్టర్తో పత్తి పంటను తొలగించాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత వెంకట్రామిరెడ్డి, మండల కన్వీనర్ సంజీవరాయుడు, నాయకులు అక్కడకు చేరుకుని బాదుల్లాతో మాట్లాడారు. తహసీల్దార్ ప్రతాపరెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని విన్నవిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు సాంబశివుడు, ఆదినారాయణరెడ్డి, చిక్కేపల్లి గ్రామ నాయకులు అశోక్రెడ్డి నారాయణరెడ్డి, దేవనాథరెడ్డి, ఈశ్వరరెడ్డి, బయపురెడ్డి పాల్గొన్నారు. అవార్డుల దరఖాస్తు గడువు పొడిగింపు అనంతపురం ఎడ్యుకేషన్: ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ ఏడాది జాతీయస్థాయి అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 16 వరకు గడువు పొడిగించినట్లు డీఈఓ ఎం. ప్రసాద్బాబు తెలిపారు. పదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ పొందుపరిచిన మార్గదర్శకాలు డీఈఓ బ్లాగ్లో ఉంచినట్లు వెల్లడించారు. దరఖాస్తు కోసం nationalawardstoteacher. education. gov. in వెబ్సైట్ను పరిశీలించాలని సూచించారు. మ్యానువల్ దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసి ధ్రువీకరణ అధికారి ద్వారా హార్డ్కాపీలపై ధ్రువీకరించుకుని డీఈఓ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. -
వెల్లువెత్తిన వినతులు
అనంతపురం అర్బన్: సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలంటూ అధికారులకు ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’లో అర్జీలు వెల్లువెత్తాయి. వివిధ సమస్యలపై 800 వినతులు అందాయి. అధికంగా ‘తల్లికి వందనం’, గురుకుల పాఠశాలల్లో సీట్ల కేటాయింపుపై అర్జీలు సమర్పించారు. కలెక్టర్ వి. వినోద్కుమార్తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణారెడ్డి, ఆనంద్, రామ్మోహన్, తిప్పేనాయక్, జిల్లావ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపించడంతో పాటు ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ను సన్మానించిన అర్జీదారు సమస్యను పరిష్కరించారంటూ కలెక్టర్ వినోద్ కుమార్ను ఓ మాజీ సైనికుడి కుమార్తెలు సన్మానించారు. గుంతకల్లుకు చెందిన మాజీ సైనికుడు మహమ్మద్కు 1971లో ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించింది. అయితే ఈ భూమి కబ్జాకు గురికావడంతో కలెక్టర్కు ఆయన కుమార్తెలు విన్నవించారు. దీనిపై విచారణ చేసిన కలెక్టర్.. భూమిని కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించడంతో పాటు చుక్కల భూమి జాబితా నుంచి తొలగించి ఎన్ఓసీ జారీ చేశారు. తమ అర్జీని పరిష్కరించి న్యాయం చేశారంటూ కలెక్టర్ను మాజీ సైనికుడి కుమార్తెలు హబీబున్నీసాబేగం, సాహెబేగం సన్మానించారు. ఈ వృద్ధురాలి పేరు లక్ష్మిదేవి. వయసు 70 ఏళ్లు. అనంతపురం రూరల్ పరిధిలోని కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలోని కాలనీలో నివాసముంటోంది. పింఛను కోసం దరఖాస్తు చేసుకుని ఏడాదవుతున్నా మంజూరు కాలేదని వాపోయింది. తనకు ఎవరూ లేరని, తమ్ముడు మోహన్రెడ్డి ఇంట్లో ఉంటున్నానని చెప్పింది. పింఛను మంజూరు చేయించి ఆదుకోవాలని కలెక్టర్ను వేడుకుంది. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 800 అర్జీలు ‘తల్లికి వందనం’ అందలేదని, గురుకులాల్లో సీట్లు కేటాయించాలని అధికంగా వినతులు -
విశ్వ ఖ్యాతి.. అధోగతి
అనంతపురం: రాయలసీమకే తలమానికంగా భాసిల్లుతున్న జేఎన్టీయూ (అనంతపురం) క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. అనుబంధ కళాశాలలన్నీ అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా పొందుతుండడంతో వర్సిటీ పాత్ర పరిమితం కానుంది. అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలే వర్సిటీకి వెన్నుదన్ను. ఆయా కళాశాలల విద్యార్థులు చెల్లించే యూనివర్సిటీ కామన్ సర్వీసెస్ (యూసీఎస్) ఫీజులు వర్సిటీకి అతిపెద్ద ఆర్థిక వనరు. అయితే.. అనుబంధ కళాశాలల నుంచి స్వయం ప్రతిపత్తి కళాశాలలు (అటానమస్)గా మార్పు చెందుతున్నాయి. నూతన జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం ప్రతి ఇంజినీరింగ్ కళాశాల అటానమస్గా మార్పు చెందాలని నిర్దేశించడం ఇందుకు ఊతంగా నిలుస్తోంది. జేఎన్టీయూ (అనంతపురం) పరిధిలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలో మొత్తం 69 ఇంజినీరింగ్ కళాశాలలు అనుబంధంగా ఉండేవి. ఇందులో ఇప్పటికే 45 కళాశాలలు అటానమస్ హోదా దక్కించుకున్నాయి. మిగిలిన 24 ఇంజినీరింగ్ కళాశాలలు ప్రస్తుత (2025–26) విద్యా సంవత్సరానికి అనుబంధ కాలేజీలుగా వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నాయి. వచ్చే సంవత్సరం నుంచి ఇవి కూడా స్వయం ప్రతిపత్తి పొందనున్నాయి. న్యాక్లో ఏ రకమైన గ్రేడ్ ఉన్నా అటానమస్ హోదా వస్తుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకుంటే అటానమస్ హోదా ఇచ్చేస్తున్నారు. అనుబంధ కాలేజీలన్నీ అటానమస్ పొందితే జేఎన్టీయూ కేవలం క్యాంపస్ కళాశాల, పులివెందుల, కలికిరి, ఓటీపీఆర్ఐ కాలేజీలకే పరిమితం కానుంది. వర్సిటీ బాధ్యతలు నామమాత్రం.. అనుబంధ కాలేజీలన్నీ అటానమస్ పొందితే జేఎన్టీయూ(ఏ) కేవలం డిగ్రీలు అందించే కార్యాలయంలా మారిపోనుంది. సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, మార్కుల కేటాయింపులో అటానమస్ కళాశాలలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. మార్కులు వర్సిటీకి పంపితే స్నాతకోత్సవ డిగ్రీ మాత్రం అందజేస్తుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ బాధ్యతలు నామమాత్రం కానున్నాయి. ఒకప్పుడు ఏటా లక్ష మంది విద్యార్థులు వర్సిటీ కింద ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10 వేలకు పడిపోయింది. వచ్చే ఏడాది మరింత తగ్గి కేవలం మూడు వేలకు పరిమితం కానుంది. దీంతో యూసీఎస్ ఫీజులు కూడా వర్సిటీకి రావు. పురోగతికి కానరాని చర్యలు.. జేఎన్టీయూ (ఏ) పరిధిలో విద్యార్థులు లేని పరిస్థితి ఏర్పడనుంది. ఈ క్రమంలో క్యాంపస్ కళాశాలలో అడ్మిషన్లు గణనీయంగా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాలానుగుణంగా పరిశ్రమల అవసరాలకు తగిన మానవ వనరులను అందించే దిశగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు సరికొత్త కోర్సులు అమలు చేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. అయితే 78 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన జేఎన్టీయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకునే క్యాంపస్ కళాశాలలో కొత్త కోర్సుల అమలుకు యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ కోర్సును ప్రవేశపెట్టేందుకు 2023లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. పాలకమండలి ఆమోదం సైతం లభించింది. అయితే, ఇందుకు సంబంధించిన ఫైలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో పెండింగ్ పడిపోయింది. దీనిపై వర్సిటీ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం క్యాంపస్ కళాశాలలో బీటెక్ (ఏఐఎంఎల్) బ్రాంచ్ను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టాం. ఈ బ్రాంచ్ను ప్రవేశపెడితే పేద ,మధ్య తరగతి విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్తోనే చదువుకోవచ్చు. ఉన్నత విద్యామండలి అనుమతి కోసం నిరీక్షిస్తున్నాం. – ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, వీసీ, జేఎన్టీయూ (అనంతపురం) తగ్గిపోతున్న జేఎన్టీయూ(ఏ) ప్రాభవం ఇప్పటికే 45 కళాశాలలకు అటానమస్ వచ్చే ఏడాది అన్ని కళాశాలలకూ స్వయం ప్రతిపత్తి క్యాంపస్, పులివెందుల, కలికిరి కళాశాలలకే పరిమితం కానున్న వర్సిటీ -
● ప్రచార మత్తు..
ఎక్కడైనా కొత్త ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ‘ఏటీఎం వంద మీటర్ల దూరంలో ఉంది, పెట్రోల్ బంకు 50 మీటర్ల దూరంలో ఉంది, పోలీసు స్టేషన్ 30 మీటర్ల దూరంలో ఉంది’ అనే బోర్డులు రోడ్డు పక్కన కనిపించడం సర్వసాధారణం. అయితే ఇందుకు భిన్నంగా కళ్యాణదుర్గంలో మాత్రం టీడీపీ నేతలు ఏకంగా బళ్లారికి వెళ్లే రింగ్ రోడ్డు పక్కనే మద్యం దుకాణం 50 మీటర్ల దూరంలో ఉందంటూ బోర్డు పెట్టేశారు. దీనికి తోడు రింగ్ రోడ్డు సమీపంలో గతంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి మహాత్మాగాంధీ సర్కిల్గా నామకరణం చేశారు. మహాత్మునికి కూడా కనీస గౌరవం ఇవ్వకుండా విగ్రహానికి కేవలం 30 అడుగుల దూరంలోనే మద్యం దుకాణం తెరిచారు. ఇది చూసిన ప్రజాసంఘాల నాయకులు, సామాజిక వేత్తలు విస్తుపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – సాక్షి, టాస్క్ఫోర్స్: -
కంప్యూటర్ కోర్సులపై ఉచిత శిక్షణ
అనంతపురం అగ్రికల్చర్: కంప్యూటర్ కోర్సులపై నిరుద్యోగ యువతకు ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఆ ఫౌండేషన్ అడ్మిషన్స్ కో ఆర్డినేటర్ హరిప్రసాద్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 10 పాస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఫెయిల్ లేదా పాస్ అయి... 18 నుంచి 28 సంవత్సరాల వయసున్న వారు అర్హులు. బెంగళూరులో 35 రోజుల పాటు ఉచిత వసతి, భోజనంతో కూడిన శిక్షణను అందిస్తారు. కంప్యూటర్, ట్యాలీ కోర్సులతో పాటు స్పోకెన్ ఇంగ్లిషు, కంప్యూటర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్ప్లేస్ ఎథిక్స్ లాంటి అంశాలపై శిక్షణ ఉంటుంది. మరిన్ని వివరాలకు 90004 87423లో సంప్రదించవచ్చు. దళితులపై దాడి శెట్టూరు: మండలంలోని మాకోడికి గ్రామంలో దళితులపై అదే గ్రామస్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు. బాధితులు తెలిపిన మేరకు.. శనివారం రాత్రి గ్రామంలో పీర్ల పెద్ద సరిగెత్తు కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన దళితులు గంగాధర, మల్లెల గంగాధర, మహేష్, రామాంజనేయులు పానకాల కుండలతో పీర్ల స్వాముల ఆలయంలోకి వెళ్లారు. ఇది గమనించిన తలారి వన్నూరుస్వామితో పాటు మరికొందరు ఆలయం బయటకు తోసి దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న సీఐలు యువరాజు, వంశీకృష్ణ గ్రామంలో పర్యటించి శాంతి భద్రతలు పర్యవేక్షించారు. కాగా, ఘటనపై ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దళితులను ఎమ్మార్పీఎస్ నాయకులు టైలర్ వన్నూరుస్వామి, చెలిమప్ప తదితరులు ఆదివారం పరామర్శించారు. దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు నమెదు చేయాలని డిమాండ్ చేశారు. వర్షం కోసం కప్పలకు పూజలు గుత్తి రూరల్: వర్షాలు కురవాలని కోరుతూ గుత్తి మండలం టి.కొత్తపల్లిలో ఆదివారం కప్పలకు పూజలు చేశారు. కప్పలను జోలెలో వేసుకొని చిన్నారులతో కలసి గ్రామస్తులు ఇంటింటికీ తిరిగి పూజలు చేయించారు. నెల రోజలుగా వర్షాలు మొహం చాటేయడంతో విత్తు కోవడానికి అదను దాటి పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా వేసిన పంటలు సైతం చినుకు జాడలేక ఎండిపోతున్నాయి. దీంతో వరుణ దేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ కప్పలకు పూజలు చేశారు. -
దిగజారుతున్న విద్యా ప్రమాణాలు
● ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి రామాంజనేయులు అనంతపురం ఎడ్యుకేషన్: మెగా పీటీఎం, యోగాంధ్ర, ట్రైనింగులు తదితర బోధనేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను మళ్లించడంతో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ వేదికగా ఎస్టీయూ రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా నుంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి .రామాంజనేయులు మాట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో బోధన అభ్యసన కార్యక్రమాలు జరిగేలా విద్యాశాఖ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న మూడు డీఏలు, 12వ పీఆర్సీ వేసి వెంటనే ఐఆర్ ప్రకటించాలన్నారు. అలాగే సీపీఎస్ బకాయిలు చెల్లించాలని, సరెండర్ లీవ్ ఎన్క్యాస్మెంట్ మూడేళ్లయినా చెల్లించలేదన్నారు. పురపాలక, నగరపాలక పాఠశాలల్లో మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హత కలిగిన ఉపాధ్యాయులతో నెలవారీ ప్రమోషన్ల ద్వారా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. టిప్పర్ ఢీ – వృద్ధుడి మృతిముదిగుబ్బ: టిప్పర్ ఢీ కొనడంతో ముదిగుబ్బ మండలం రామస్వామినాయక్ తండాకు చెందిన శ్రీనివాసులునాయక్ను(62) దుర్మరణం పాలయ్యాడు. స్వగ్రామం నుంచి ముదిగుబ్బ–పుట్టపర్తి రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొంది. మృతునికి భార్య తులసీబాయి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
బస్సు ఢీకొని ఒకరి మృతి
● ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు గార్లదిన్నె: కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్ హుస్సేన్ (45) శనివారం రాత్రి ఆటోలో అనంతపురం మార్కెట్ మార్డుకు చేరుకుని మొక్క జొన్న కంకలు లోడు చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఆదివారం వేకువజామున గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సరిహద్దున పెన్నానది బ్రిడ్జి వద్దకు చేరుకోగానే టైర్ పంఛర్ అయింది. దీంతో రోడ్డు పక్కన ఆటోను నిలిపి టైర్ మారుస్తుండగా ఆటోలో ఉన్న ఖాజామొద్దీన్ సెల్ఫోన్ లైట్ వెలుతురులో వాహనాలను మళ్లీస్తున్నాడు. పని పూర్తి కాగానే జాకీ కిందకు దింపే సమయంలో బెంగళూరు నుంచి మంత్రాలయానికి వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు శరవేగంగా దూసుకువచ్చింది. త్రుటిలో ప్రమాదం నుంచి ఖాజామొద్దీన్ తప్పించుకున్నాడు. బస్సు నేరుగా వెళ్లి ఆటోను వెనుక నుంచి ఢీకొంది. ఆటో డ్రైవర్ మహమ్మద్ హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో వెనుక కూర్చొని ఉన్న మరియమ్మ, ఉమాదేవి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో అయిన శబ్ధానికి స్థానికులు నిద్ర మేల్కొని అక్కడకు చేరుకున్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి 108 అంబులెన్స్ ద్వారా క్షతతాత్రులను అనంతపురంలోని జీజీహెచ్కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు వైద్యులు రెఫర్ చేశారు. కాగా, మృతుడు మహమ్మద్ హుస్సేన్కు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్బాషా తెలిపారు. -
పి.నారాయణపురానికి జాతీయ స్థాయి గుర్తింపు
కూడేరు: మండలంలోని పి.నారాయణపురం గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఆ గ్రామ సర్పంచ్ హనుమంతరెడ్డి ద్వితీయ స్థానంలో విజేతగా నిలిచి, రూ.25 వేల పారితోషికాన్ని గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళితే... సర్పంచ్ సంవాద్ పేరిట భారత నాణ్యత మండలి సర్పంచులందరినీ ఒకే వేదిక పైకి తీసుకు వచ్చేందుకు ప్రత్యేకంగా యాప్ను తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే ఏమి చేస్తే బాగుంటుంది. అనుసరించాల్సిన విధానాలను వీడియో తీసి యాప్లో అప్లోడ్ చేయాలని కేంద్రం సూచించింది. ఈ ఏడాది జూన్లో సర్పంచ్ హనుమంతరెడ్డి ఓ వీడియో సందేశాన్ని పంపి తన ఆలోచనా విధానాన్ని పంచుకున్నారు. అధికారులను సమన్వయం చేసుకుని గ్రామంలో ఇంటింటికి స్వచ్ఛమైన నీరందించడం, బాధ్యతగా చెత్త సేకరణ, అందులో నుంచి తడి పొడి చెత్తను వేరు చేయడం, తద్వారా వర్మీ కంపోస్టు ఎరువు చేసి సంపద సృష్టించే అంశాలను వివరించారు. ఈ వీడియోను పరిశీలించిన భారత నాణ్యత మండలి... సర్పంచ్ ఆలోచన తీరును మెచ్చుకుంది. జాతీయ స్థాయిలో సర్పంచ్ హనుమంతరెడ్డిని రెండవ విజేతగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆయన ఆదివారం ‘సాక్షి’కి వెల్లడించారు. మారుమూల పంచాయతీకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం తనకెంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
● అ‘పూర్వ’ సమ్మేళనం
పామిడి: స్థానిక టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1981–82లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. 43 ఏళ్ల తర్వాత రెండో సారి కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి గురువులు ప్రభాకర్, వెంకరమణప్పను ఘనంగా సత్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఒకరి బాగోగులను ఒకరు అడిగి తెలుసుకున్నారు. సామూహిక భోజనాలతో సందడి చేశారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు డీఎస్ఎం వరప్రసాద్, ఆసిఫ్, వెంకన్నరావు, శ్రీనివాసరావు, రాధాకృష్ణ, నగేష్, ఆర్ఎంపీ మైనుద్ధీన్, రమేష్, భాస్కర్, ఖాజామొహిద్ధీన్, మస్తాన్, ప్రేమ, వహిద తదితరులు పాల్గొన్నారు. -
● ‘వజ్ర’ సంకల్పం
వజ్రకరూరు పరిసరాల్లో వజ్రాల వేట కొనసాగుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి వజ్రాల వేటలో మునిగారు. ఒక్క వజ్రం లభించినా తమ తలరాత మారుతుందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, తెలంగాణ, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి ప్రజలు ఆటోలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల్లో తరలివచ్చారు. చిన్నారుల మొదలు వృద్ధుల వరకూ వయో భేదం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లోనే వజ్రల కోసం అన్వేషించారు. వీరిలో చంటి బిడ్డల తల్లుల కూడా ఉన్నారు. – వజ్రకరూరు: -
కూటమి మోసాలను తిప్పికొడదాం
అనంతపురం కార్పొరేషన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను విస్మరించడం ద్వారా ఏడాదిలో రూ.81వేల కోట్లు ప్రజలకు చెల్లించకుండా సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త సమర్థవంతంగా పనిచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో మనం చేసిన మేలును చెబుతూనే.. కూటమి దుశ్చర్యలను తిప్పికొట్టాలని సూచించారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు నరేంద్రనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్టీకి సోషల్ మీడియా ఎంతో బలమన్నారు. మహిళలు, రైతులు, యువత, వివిధ వర్గాల వారు పడుతున్న ఇబ్బందులపై ప్రజలను చైతన్య పరిచేదిశగా పోస్టింగ్లు ఉండాలని సూచించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకతీతంగా రూ.2.80 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో నేరుగా అందించిన విషయాన్ని ప్రజలకు తెలియజేద్దామన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో కూటమి ప్రభుత్వ పెద్దలు బరితెగించి అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అయినా ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. కార్యకర్తలకు అండగా లీగల్, టాస్క్ఫోర్స్ టీంలను పార్టీ ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా అడుగులు ముందుకేయాలని పిలుపునిచ్చారు. రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమాన్ని అనంతపురంలో ఈ నెల 20 నుంచి ప్రారంభిస్తున్నామని, బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ క్యూ ఆర్ కోడ్కు సంబంధించి విస్తృత స్థాయి ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. అనంతపురం నియోజకవర్గంలో రూ.118 కోట్లు తెచ్చామని ప్రజాప్రతినిధులు గొప్పలు చెబుతున్నారని, ఇందుకు సంబంధించి ఏమైనా జీఓలు, ఉత్తర్వులను చూపమంటే కొంతమంది ఫస్ట్రేషన్తో విమర్శలు చేస్తున్నారన్నారు. అండగా ఉంటాం.. కూటమి ఆగడాలను నిర్భయంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని, రెడ్బుక్ రాజ్యాంగంతో దౌర్జన్యాలకు ఎవరూ భయపడాల్సిన పనిలేదని టాస్క్ఫోర్స్ సభ్యుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ పేర్కొన్నారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు నరేంద్రనాథరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎద్దుల అమర్నాథరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివరామిరెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబా సలాం, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, తదితరులు మాట్లాదారు. జెడ్పీటీసీ నీలం భాస్కర్, నాయకులు తనీష, కేశవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రీకాలింగ్ చంద్రబాబూ మేనిఫెస్టో ద్వారా ప్రజల్లో చైతన్యం తెద్దాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి -
అన్నదాత దుఃఖీభవ
అనంతపురం అగ్రికల్చర్: అన్నదాత సుఖీభవ ‘దుఃఖీభవ’గా మారింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా రైతులకు ఎలాంటి సాయం చేయకుండా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ సీఎం చంద్రబాబు కాలం వెళ్లదీస్తున్నారు. గత ఎన్నికల్లో రైతుల ఓట్లు కొల్లగొట్టి అధికారం చేపట్టిన వాస్తవాన్ని కూటమి నాయకులు విస్మరించారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. ఏడాది కాలంగా సరైన వర్షాలు లేవు, పంటలు పండలేదు, అరకొరగా వచ్చిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరా దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల బాగోగులు పట్టించుకోవాల్సిన చంద్రబాబు సర్కారు ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనలకే దిక్కులేకుండా పోయింది. మొదటి ఏడాది ఎగ్గొట్టి.. ‘సుఖీభవ’ ఇదిగో అదిగో అంటూ అన్నదాతలను ఏడాది కాలంగా ఊరిస్తూ వస్తున్నా ఇప్పటికీ అతీగతి లేదు. ఏటా రూ.20 వేలు ఇస్తామంటూ ప్రకటించినా.. జిల్లా రైతులకు మొదటి ఏడాది ఇవ్వాల్సిన మొత్తం రూ.580 కోట్ల పెట్టుబడి సాయం ఎగ్గొట్టేశారు. రెండో ఏడాదైనా ఇస్తారని ఆశలు పెట్టుకున్నా ఇవ్వడం లేదు. మే అన్నారు.. తర్వాత జూన్ 12.. 20 అన్నారు. ఆ తర్వాత జూన్ ఆఖరులోపు ఇస్తామన్నారు.. మళ్లీ జూలై మొదటి వారమని ఉసూరు మనిపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రకటనలకూ దిక్కులేకుండా పోయింది. ‘పీఎం కిసాన్’ కింద ఇచ్చే రూ.6 వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.14 వేలు ఇస్తామని ప్రకటించినా ఆచరణలోకి రాలేదు. కనీసం రూ.14 వేలు ఇచ్చినా గతేడాది జిల్లాలో ఉన్న 2.90 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.406 కోట్లు మేర జమ అయ్యేవి. ఈ సారి ‘పీఎం కిసాన్’ కింద మొదటి విడత ఇవ్వాల్సిన సొమ్ము కూడా జాప్యం చేస్తుండటంతో రైతులు కష్టాల్లో కూరుకుపోతున్న పరిస్థితి నెలకొంది. కరుణ ఏదీ..? అన్నదాత సుఖీభవతో పాటు పంటల బీమా పథకం కింద ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. మరోవైపు.. పంటలు పండక అప్పుల పాలై పిల్లల చదువులు, పెళ్లిళ్లు భారమై ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా చెల్లించలేదు. గత జూన్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు 47 మంది వరకు రైతులు వివిధ రూపాల్లో బలవన్మరణం పొందినట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా స్పందించకపోవడంతో బాధితుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక.. గత ఖరీఫ్, రబీలో పంటలు దారుణంగా దెబ్బతినడంతో కంటి తుడుపు చర్యగా కరువు మండలాలను ప్రకటించేసి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో పైసా ఇవ్వకుండా చంద్రబాబు రిక్తహస్తం చూపారు. అకాల వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న పంటలకు కూడా ‘ఇన్పుట్’ ఇవ్వకుండా దాటవేశారు. పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలావడ్డీ లేదు.. వడ్డీ రాయితీ కూడా ప్రకటించలేదు. ప్రభుత్వ సాయం కరువై అన్నదాత దిక్కులు చూస్తున్నా చంద్రబాబు కరుణించే పరిస్థితి కనిపించడం లేదు. అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్న కూటమి సర్కారు రైతు సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిన చంద్రబాబు బీమా పరిహారమూ, ఆత్మహత్య బాధిత రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా నిల్ వర్షాలు లేక, ‘గిట్టుబాటు’ దక్కక అల్లాడిపోతున్నా పట్టని వైనం -
కౌన్సెలింగ్లో పారదర్శకత ఏదీ..?
అనంతపురం మెడికల్: సచివాలయ ఏఎన్ ఎంల రీ కౌన్సెలింగ్లో పారదర్శకత లోపించిందని, నగరపాలక సంస్థ పరిధిలోని 74 సచివాలయాలతో పాటు వివిధ ప్రాంతాల్లో సీనియారిటీ జాబితాను చూపించలేదంటూ సచివాలయ ఏఎన్ఎంలు మండిపడ్డారు. ఆదివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో చేపట్టిన ఏఎన్ఎంల రీ కౌన్సెలింగ్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అప్పటికే డీఎంహెచ్ఓ కార్యాలయానికి లోపలి నుంచి తాళం వేయడంతో ఏఎన్ఎంలు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఏఎన్ఎంల రీ కౌన్సెలింగ్ జరపరాదంటూ నినాదాలు చేశారు. అధికారుల నుంచి సమాధానం రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. కలెక్టర్ పరిశీలన.. సచివాలయ ఏఎన్ఎంల రీ కౌన్సెలింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డిని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. సీనియారిటీ ప్రాతిపదికన రీ కౌన్సెలింగ్ చేపట్టాలని, ఏమైనా తేడాలొస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆదివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో రీ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆయన కాసేపు పరిశీలించారు. -
‘ఆశల్ని’ ఆపేశారు!
బొమ్మనహాళ్: రైతుల ఆశలపై అధికారులు నీళ్లు చల్లారు. ముందస్తుగా నీరొచ్చాయని పడిన సంతోషాన్ని ఆదిలోనే దూరం చేశారు. గంగపూజ నిర్వహించి స్వాగతించాల్సిన సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఈనెల 10న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రికి బొమ్మనహాళ్ సరిహద్దులోని 105–272 కిలోమీటర్ వద్దకు నీళ్లు చేరుకున్నాయి. అయితే, హెచ్చెల్సీలో మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతుండడంతో వాటికి ఇబ్బంది లేకుండా 105వ కిలోమీటర్ వద్ద రెగ్యులేటర్ గేట్లు కిందికి దించి నీరు ఆంధ్రాలోకి ప్రవేశించకుండా ఆపేశారు. పర్యవేక్షణ కరువై ఇష్టారాజ్యం.. కాంట్రాక్టర్ల అలసత్వం.. పర్యవేక్షణ ఇంజినీర్ల నిర్లక్ష్యం కారణంగా హెచ్చెల్సీలో మరమ్మతు పనులు అనుకున్నట్లుగా సాగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 115 నుంచి 138 కిలోమీటర్ వరకు లైనింగ్ పనులు, నాగలాపురం వద్ద, ఉద్దేహాళ్–మల్లికేతి మార్గంలో బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పనుల పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ నీటిని ఆంధ్రా సరిహద్దులోనే ఆపేయాల్సి ఉంటుంది. మరోవైపు రైతులు బోర్ల కింద వరి, మిరప నార్లు పోసుకున్నారు. తుంగభద్ర నీరు వచ్చి ఉంటే నారుకు బాగుండేదని, బోరు నీటికి నారు ఎర్రగా మారుతోందని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో మరమ్మతు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయించి తమకు సాంత్వన చేకూర్చాలని కోరుతున్నారు. అధికారుల అలసత్వం.. రైతులకు అశనిపాతం హెచ్చెల్సీలో పూర్తి కాని మరమ్మతు పనులు సరిహద్దులో ఆగిన తుంగభద్ర జలాలు -
క్రిప్టో మాటున లూటీ
అనంతపురం: మరో ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ‘లుక్’ యాప్ తరహాలోనే మాయగాళ్లు బురిడీ కొట్టించారు. క్రిప్టో మాటున రూ. కోట్లు లూటీ చేసినట్లు తెలిసింది. క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. ఇది ఏ దేశానికీ చెందింది కాదు. ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకి రాదు. ప్రభుత్వ నియంత్రణ కానీ, స్వతంత్ర సంస్థ అదుపులో కానీ ఉండదు. ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థల మధ్య నేరుగా బదిలీ చేసుకోగల డిజిటల్ కరెన్సీ మాత్రమే. ఈ కరెన్సీకి ఎలాంటి చట్టబద్ధత ఉండదు. కానీ కొన్ని రోజుల క్రితం విశాఖపట్నంకు చెందిన కొందరు వ్యక్తులు అనంతపురం నగరంలో పాగా వేసి వందలాది మందిని క్రిప్టో ముగ్గులోకి లాగారు. లక్ష నుంచి కోటి రూపాయల వరకు ఒక్కొక్కరి దగ్గర డిపాజిట్ చేయించుకున్నారు. రూ. లక్ష కడితే రోజూ 15 నుంచి 20 అమెరికన్ డాలర్లు ఇస్తామని నమ్మబలికారు. మాయగాళ్ల ఉచ్చులో పడిన పలువురు వారు చెప్పినట్లుగానే డిపాజిట్లు చేశారు. మొదట్లో లాభాలు బాగానే రావడంతో తెలిసిన వారు, బంధువుల నుంచి కూడా డబ్బులు డిపాజిట్ చేయించారు. నిర్వాహకులు కేవలం వెబ్సైట్లోనే లావాదేవీలు నిర్వహించారు. ఓ ‘ఫండ్’ పేరుతో మొదలైన దందా.. రెండు నెలలకే పేరు మార్చుకుంది. అదేంటంటే సాంకేతిక మార్పులు అని సర్దిచెప్పారు. ఈ క్రమంలో డబ్బు డిపాజిట్ చేస్తే రెట్టింపు అవుతాయని ఆశ చూపించి.. వారి నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. తర్వాత ఒక్కసారిగా దుకాణం ఎత్తేశారు. ఉమ్మడి జిల్లాలో వందల మంది అమాయ కులు మోసపోయినట్లు తెలిసింది. బాధితుల్లో అధికంగా చిరు వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. రిటైర్డ్ ఉద్యోగికి భారీ బురిడీ.. అనంతపురంలో ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఓ ఉద్యోగి క్రిప్టో కరెన్సీ మోజులో పడ్డారు. తొలుత భారీ ఆదాయం రావడంతో మరికొంత మందితో సభ్యత్వం కట్టిస్తే మరింత లాభం వస్తుందని ఆశ పడ్డాడు. బంధువులు, స్నేహితులు అందరికీ క్రిప్టో కరెన్సీ గురించి చెప్పాడు. ‘నేను కోటి రూపాయల వరకు చెల్లించా. మీరు కూడా పెట్టండి.. మంచి లాభాలు వస్తాయి. ఏడాదికే డబుల్ ఆదాయం సొంతమవుతుంది’ అని వివరించాడు. తనకు లాభాలు వచ్చాయని ఆధారాలు సైతం చూపించాడు. దీంతో స్నేహితులంతా కలిసి రూ.5 కోట్లు పోగేశారు. విశాఖపట్నంకు వెళ్లి మరీ ఓ వ్యక్తికి నగదు ముట్టజెప్పారు. తాజాగా మొదటికే మోసం రావడంతో లబోదిబోమంటున్నట్లు తెలిసింది. విశాఖపట్నం ఏజెంట్ ఫోన్ నంబరు పనిచేయకపోవడంతో లోలోపలే కుమిలిపోతున్నట్లు సమాచారం. క్రిప్టోలో చాలామంది పెట్టుబడులు.. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే.. డాలర్లలో సంపాదన ఉంటుందన్న ఆశ మధ్య తరగతి ప్రజలను ఆకర్షిస్తోంది. క్రిప్టో పేరుతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న వ్యాపారంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తమ వద్ద ఉన్న డబ్బుతో పాటు అప్పులు తెచ్చి మరీ ఇందులో పెట్టుబడులు పెట్టడంతో మొదటికే మోసం వస్తోంది. మొత్తం డబ్బు పోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక నరకయాతన అనుభవిస్తున్నారు. మోసపోయా మని చెబితే బంధువులు, సమాజంలో మర్యాద పోతుందని మిన్నకుండిపోతున్నారు. వెలుగులోకి మరో మోసం రూ.లక్ష కడితే రోజూ 20 యూఎస్ డాలర్లు అంటూ ఎర కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి మరీ కట్టిన అమాయకులు తాజాగా జెండా ఎత్తేయడంతో లబోదిబోమంటున్న వైనం -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. రెవెన్యూభవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమర్పించిన అర్జీల స్థితిని 1100 కాల్ సెంటర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలిపారు. నేడు యల్లనూరులో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ యల్లనూరు: శింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో సోమ, మంగళవారాల్లో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తెలిపారు. పార్టీ నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సోమవారం ఉదయం 10 గంటలకు యల్లనూరులో కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ఏడాది సీఎం చంద్రబాబు పాలనలో ఎన్ని హామీలు అమలయ్యాయి.. ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనే వివరాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తామన్నారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అరాచకాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మొదటి రోజు కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు తాడిపత్రిలో.. తాడిపత్రిటౌన్: పట్టణంలోని పాత వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ‘రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమావేశానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు నరేష్రెడ్డితోపాటు జిల్లాలోని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా స్థాయి నాయకులు హాజరవుతారన్నారు. తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కోర్టు సమన్లు
సాక్షి టాస్క్ఫోర్స్: ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం సివిల్ జడ్జి కోర్టు సమన్లు జారీ చేసింది. తన పరువుకు భంగం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తను ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని గతంలో హిందూపురం టూటౌన్ సీఐగా పనిచేసిన సీఐ రియాజ్ అహ్మద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.వ్యక్తిగత అంశాలను ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించి తన పరువుకు నష్టం కలిగించారంటూ సదరు సీఐ 2024లో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు శుక్రవారం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు స్థానిక విలేకరులకూ నోటీసులు పంపింది. ఆగస్టు 18న కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొంది.కాగా.. తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలున్నాయని, ఎన్నికల సమయంలో సహకరించేందుకే తనను హిందూపురం పంపించారని అబద్ధపు ప్రచారం చేసినట్టు సీఐ రియాజ్ అహ్మద్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను 2024 జూన్ 6న సస్పెండ్ కాగా, 3వ తేదీనే సస్పెండ్ అయినట్టు కథనాలు ప్రసారం చేశారని, దురుద్దేశ పూర్వకంగానే ఇలా ప్రసారం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. -
కి‘లేడీ’ల హస్తలాఘవం
● జ్యువెలరీ దుకాణంలో రూ. 50 వేల నెక్లెస్ చోరీ అనంతపురం: కి‘లేడీ’లు హస్తలాఘవం ప్రదర్శించారు. రూ. 50 వేల విలువైన నెక్లెస్ చోరీ చేసి ఉడాయించారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. అనంతపురం నగరంలోని కమలానగర్లో ఉన్న అన్నపూర్ణ జ్యువెలర్స్ దుకాణానికి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముగ్గురు మహిళలు వచ్చారు. కొద్దిసేపు నగలను పరిశీలిస్తున్నట్లు నటించారు. జ్యువెలరీ సిబ్బందిని ఏమార్చి ఒక గ్రాము గోల్డ్తో తయారైన రూ.50 వేల విలువ చేసే నెక్లెస్ బాక్స్ను తమ వెంట తెచ్చిన బ్యాగులో వేసుకుని బయటకు వెళ్లిపోయారు. దుకాణదారులు గుర్తించేలోపు కిలేడీలు అక్కడి నుంచి ఉడాయించారు. ఇదంతా అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు దుకాణ యజమానులు తెలిపారు. -
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
ఉరవకొండ: ఎదిగిన కొడుకులకు ఉద్యోగాలు రాకపోవడంతో కొంత కాలంగా తీవ్ర మనోవేదనకు గురైన ఓ వ్యక్తి అనారోగ్యం బారిన పడి శుక్రవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య రాజమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఉరవకొండ పట్టణంలోని మల్లేశ్వర టాకీసు వద్ద నివాసముంటున్న హజరతయ్య (53), రాజమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. అనంతపురం బైపాస్ వద్ద సిమెంట్ బ్రిక్స్, రింగులు విక్రయిస్తూ హజరతయ్య జీవనం సాగించేవాడు. వ్యాపారం చేస్తున్న పెద్దకుమారుడితో పాటు కుమార్తెకు హజరతయ్య వివాహం చేశాడు. అయితే ఇద్దరు కుమారులకు ఉద్యోగాలు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన హజరతయ్య అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో తాను వ్యాపారం చేసే షాపులోనే ఫ్యానుకు ఉరేసుకొని మృతి చెందాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు అనంతపురం రూరల్: విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీసీ సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూ కొఠారి అన్నారు. శనివారం నగరంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొఠారి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పట్ల విద్యార్థులు గౌరవంగా మెలగాలన్నారు. విద్యార్థి దశ నుంచే కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. బాలికలు ఆత్మస్థైర్యంతో మందుకెళ్లాలన్నారు. వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యార్థినులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఏబీసీడబ్ల్యూఓ సుభాషిణి, వార్డెన్లు పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని డ్రైవర్ మృతి గుత్తి రూరల్: మండలంలోని కరిడికొండ గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని బస్సు డ్రైవర్ మహమ్మద్ మునీర్ (48) మృతి చెందాడు. పోలీసుల వివరాలమేరకు.. హైదరాబాదులోని శివరాంపల్లి ఆదర్శనగర్కు చెందిన మునీర్... ట్రాన్స్ ఇండియా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా పని చేసేవాడు. ఈ క్రమంలో బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు శనివారం వేకువజామున కరిడికొండ శివారులోకి రాగానే టైరు పంక్చర్ అయింది. డ్రైవర్ మునీర్ బస్సును రోడ్డు పక్కన ఆపి మరో డ్రైవర్తో కలిసి టైరు మారుస్తుండగా అనంతపురం వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి కొట్టి వెళ్లిపోయింది. మునీర్ తీవ్రంగా గాయపడగా మరో డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. మునీర్ను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడ. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదేనా ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ? అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పిన ప్రజాప్రతినిధులు...అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కనీస సమస్యలు పరిష్కంచలేదు. ఇదేనా ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే? అని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాయకులు మండిపడ్డారు. శనివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీని నియమించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవులు, రిటైర్డ్ అయిన వారికి ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మెమో ప్రకారం 2003 డీఎస్సీ వారిని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య, సహాధ్యక్షురాలు సరళ తదితరులు పాల్గొన్నారు. -
నెట్టికంటుడి సేవలో కేంద్ర సహాయ మంత్రి
తకల్లు రూరల్: కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి కుటుంబ సభ్యుల పేరున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. నేడు ఏఎన్ఎం రీ కౌన్సెలింగ్ అనంతపురం మెడికల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సచివాలయ ఏఎన్ఎంలకు ఆదివారం రీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్ను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. సీనియారిటీ ప్రాతిపదికన కౌన్సెలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రేపు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’ అనంతపురం అర్బన్: ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’ జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఈనెల 14న సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు.రెవెన్యూభవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలని కోరారు. అర్జీల స్థితిని 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను meekosam. ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. ఆంధ్రా సరిహద్దుకు తుంగభద్ర జలాలు బొమ్మనహాళ్: తుంగభద్ర జలాలు జిల్లా సరిహద్దులోకి ప్రవేశించాయి. శనివారం రాత్రి 10 గంటలకు ఆంధ్రా సరిహద్దు 105–272 కిలోమీటర్ రెగ్యులేటర్ వద్దకు నీళ్లు చేరుకున్నాయి. ఈ నెల 10న హెచ్చెల్సీకి నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే, హెచ్చెల్సీలో మరమ్మతు, లైనింగ్, బ్రిడ్జిల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రా సరిహద్దులోని రెగ్యులేటర్ గేట్లను కిందకు దింపడంతో తుంగభద్ర జలాలు సరిహద్దులోనే నిలిచిపోయాయి. లీకేజీ కారణంగా 50 క్యూసెక్కుల వరకు వస్తుండడంతో పనులకు ఇబ్బంది లేకుండా అధికారులు హెచ్చెల్సీ ఒకటో డిస్టిబ్యూటరీ వద్ద మట్టితో అడ్డుకట్ట వేశారు. ఈ నెల 20లోపు మరమ్మతు పనులు పూర్తి చేసి తర్వాత నీటిని తీసుకోనున్నట్లు సమాచారం. -
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
బొమ్మనహాళ్: మండలంలోని కొలగానహాళ్లికి చెందిన అనంతరాజుపై హత్యాయత్నం ఘటనలో మైలాపురానికి చెందిన చింతకుంట విజయ్కుమార్రెడ్డిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొలగానహాళ్లికి చెందిన అనంతరాజు కొంతకాలంగా మైలాపురం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేత సంబంధం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై వివాదం తలెత్తి ఈనెల 7న అనంతరాజుపై చింతకుంట విజయ్కుమార్రెడ్డి దాడి చేసి గాయపరిచాడన్నారు. అనంతరాజు, ఆయన బంధువులు మైలాపురం చేరుకొని విజయ్కుమార్రెడ్డి ఇళ్లల్లోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు వరి గడ్డికి నిప్పు పెట్టి ఆస్తి నష్టం చేశారని పేర్కొన్నారు. ఆస్తి నష్టం చేసిన 21 మందిని అరెస్టు చేసి గురువారం రిమాండ్కు పంపించామన్నారు. అనంతరాజుపై దాడికి పాల్పడిన విజయ్కుమార్రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని వెల్లడించారు. శనివారం మైలాపురం గ్రామంలో విజయ్కుమార్రెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. సమావేశంలో ఏఎస్ఐ హనుమంతరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి యాడికి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని చందన – దైవాలమడుగు గ్రామాల మధ్య శనివారం చోటు చేసుకుంది. సీఐ ఈరన్న వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం మండలం చెర్లోపల్లికి చెందిన చెందిన విజయభాస్కర్రెడ్డి (40)కి భార్య అమరావతి, కుమారుడు చంద్రమౌళిరెడ్డి, కుమార్తె సుప్రజ ఉన్నారు. విజయభాస్కర్రెడ్డి 20 ఏళ్లుగా నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ప్యాపిలి సమీపంలో ఉన్న అరుణాచలం లారీ ట్రాన్స్పోర్టులో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 20 రోజులుగా డ్యూటీ చేసిన ఆయన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో డ్యూటీ దిగి తన ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలుదేరాడు. అయితే డోన్ రాయల చెరువు రోడ్డు మార్గంలో చందన గ్రామ సమీపంలో ఉన్న మూలుపుల దగ్గర వాహనం అదుపు తప్పి వ్యవసాయ తోటలో పడి విజయభాస్కర్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా శనివారం ఉదయం సమాచారం అందుకున్న సీఐ ఈరన్న సిబ్బందితో వెళ్లి మృతుడి సెల్ఫోన్ ద్వారా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతుడి భార్య అమరావతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులతో చెలగాటం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడారు. ఖరీఫ్, రబీ ఆరంభం కాగానే కచ్చితమైన విధి విధానాలు,ప్రీమియం, కటాఫ్ తేదీలు ప్రకటించలేదు. ఈ క్రమంలో పంటల బీమా పథకంపై రైతుల్లో గందరగోళం నెలకొంది. ఎటూ పరిహారం ఇచ్చేది లేదనే ఉద్దేశంతో చెలగాటమాడుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో అన్నదాతలకు ఇబ్బంది లేకుండా సాఫీగా అమలు చేసిన బీమా పథకంపై అంతులేని అలసత్వం ప్రదర్శిస్తూ చంద్రబాబు సర్కారు రైతులను దారుణంగా మోసం చేస్తోంది. పంటల బీమా పథకంపై గందరగోళం ● ఇప్పటికే 60 శాతం పూర్తయిన పంట రుణాల రెన్యూవల్స్ ● ప్రీమియం కట్టించుకున్న బ్యాంకర్లు ● కేవలం వేరుశనగకే వసూలు ● ఇటీవల పంటల వారీ బీమా ప్రీమియంపై వ్యవసాయశాఖ ప్రకటన ● ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహంఅనంతపురం అగ్రికల్చర్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు సర్కారు అటకెక్కించిది. ప్రీమియం కట్టాలంటూ రైతులపై అదనపు భారం మోపింది. ఏటా ప్రీమియం రూపంలో రూ.150 కోట్ల వరకు రైతుల నుంచి దండుకునేందుకు ఎత్తులు వేసింది. కానీ పరిహారం విషయానికి వచ్చే సరికి చేతులెత్తేస్తోంది. 2023కు సంబంధించి 2024లో ఎగ్గొట్టింది. 2024 ఖరీఫ్కు సంబంధించి పరిహారం ఇవ్వకుండా దాటవేస్తోంది. నేడు ఖరీఫ్ 2025 బీమా పథకం అమలులోకి తెచ్చింది. ఇలా పంటల బీమా పథకం ప్రయోజనాలు రైతులకు దక్కకుండా మొక్కుబడి తంతుగా మార్చేసింది. రెన్యూవల్స్ 60 శాతం పూర్తి.. పంట రుణాల రెన్యూవల్స్ సమయంలో రైతుల నుంచి పంటల వారీగా ప్రీమియం కట్టించుకోవాల్సి ఉంది. కానీ కొన్ని బ్యాంకుల్లో ప్రీమియం కట్టించుకోలేదు. మరికొన్ని బ్యాంకులు రైతుల నుంచి ప్రీమియం కట్టించుకుంటున్నా... ఎకరాకు రూ.640 ప్రకారం కేవలం వేరుశనగ పంటకు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. పంటలు చేసినట్లు ఈ–క్రాప్లో వేరుశనగ నమోదైతే బీమా పథకం వర్తిస్తుంది. వేరే పంట వేస్తే సాంకేతిక సమస్య ఉత్పన్నమవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 60 శాతం వరకు పంట రుణాల రెన్యూవల్స్ పూర్తయ్యాయి. ఇలా... 60 శాతం రెన్యూవల్స్ పూర్తయిన తర్వాత నాలుగు రోజుల క్రితం వ్యవసాయశాఖ పంటల వారీగా ప్రీమియం కట్టాలంటూ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా అటు కూటమి ఇటు వ్యవసాయశాఖ వ్యవహరిస్తుండటంతో రైతులకు పరిహారం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. 12 పంటలకు.. కాగా ఈ ఖరీఫ్లో పంట దిగుబడుల ఆధారంగా ప్రధానమంత్రి ఫసల్బీమా కింద కంది, వరి, జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండుమిరప పంటలకు బీమా పథకం వర్తింపజేశారు. ఇందులో కంది రైతులు ఎకరాకు 80 ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వరి రైతులు రూ.164, జొన్నకు రూ.84, మొక్కజొన్నకు రూ.132, ఆముదం రూ.80, ఎండుమిరప రూ.576 ప్రకారం ప్రీమియం చెల్లించాలి. ఇక వాతావరణ బీమా పథకం కింద వేరుశనగ, పత్తి, దానిమ్మ, బత్తాయి, టమాట, అరటికి వర్తింపజేశారు. ఇందులో వేరుశనగ ఎకరాకు రూ.640 ప్రకారం ప్రీమియం కట్టాలి. పత్తికి రూ.1,140, దానిమ్మ రూ.3,750, చీనీ, బత్తాయి రూ.2,750, టమాట రూ.1,600, అరటి రూ.3 వేల ప్రకారం ప్రీమియం కట్టాలంటూ ఇటీవల వ్యవసాయశాఖ ప్రకటన విడుదల చేసింది. పంట రుణాలు తీసుకోని రైతులు ప్రత్యేకంగా కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ), అలాగే నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎన్సీఐపీ)లో ప్రీమియం కట్టాలని సూచించారు. వాతావరణ బీమా కింద చేర్చిన పంటలకు ఈనెల 15వ తేదీలోపు ప్రీమియం కట్టాలని నాలుగు రోజుల కింద ప్రకటన విడుదల చేయడం గమనార్హం. రైతుల సంక్షేమం పట్ల కూటమి సర్కారు, వ్యవసాయ శాఖ ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనమేముంటుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
పంటల సాగులో మెలకువలు అవసరం
బుక్కరాయసముద్రం: పంటల సాగులో మెలకువలు ఎంతో అవసరం అని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త మల్లేశ్వరి పేర్కొన్నారు. శనివారం మండల పరిఽధిలోని రెడ్డిపల్లి కేవీకేలో అటారి, హైదరాబాద్ ప్రిన్సిపల్ సైంటిస్టు రెడ్డికి రైతులకు అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు, మెలుకువలు తప్పక పాటించాలన్నారు. కస్టమ్ హైరింగ్ సెంటర్ ప్రాముఖ్యతను వివరించారు. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలో భాగంగా కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు పనిముట్లను అందజేశారు. కార్యక్రమంలో కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి, సస్య ఉత్పత్తి శాస్త్రవేత్త శశికళ, డాక్టర్ మాధవి వెటర్నరీ శాస్త్రవేత్త, వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త చందన తదితరులు పాల్గొన్నారు. కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి -
కంప్యూటర్ పరిజ్ఞానంతోనే ఉద్యోగావకాశాలు
గుత్తి: ప్రపంచమంతా కంప్యూటర్ చుట్టే తిరుగుతోందని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ బోర్డు మెంబర్ విజయ్ ప్రతాప్ సింగ్ అన్నారు. గుత్తిలోని కర్నూలు రోడ్డులో ఉన్న జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో వెబ్ టెక్ కంపెనీ కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్ను విజయ్ప్రతాప్ సింగ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమన్నారు. కంప్యూటర్ జ్ఞానం ఉంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. రోజూ కనీసం గంట పాటైనా కంప్యూటర్ నేర్చుకోవాలన్నారు. కంప్యూటర్ జ్ఞానం ఉంటే కచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరువకావచ్చన్నారు. సాధారణ విద్యతో పాటు కంప్యూటర్ విద్యను కూడా నేర్చుకోవాలన్నారు. అనంతరం డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, వెబ్ టెక్ కంపెనీ ప్రతినిధి నిరంజనీస్, సీనియర్ డీఎంఈ ప్రమోద్, హెచ్ఎం సుంకన్న కంప్యూటర్ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వెబ్ టెక్ సిబ్బంది పాల్గొన్నారు. చెక్ డ్యామ్ ప్రారంభం గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెట్నేపల్లి వద్ద చెక్ డ్యామ్ను రైల్వే బోర్డు మెంబర్ విజయ్ ప్రతాప్ సింగ్ ప్రారంభించారు. అనంతరం డీజిల్ షెడ్ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏడీఎంఈ అశోక్ గౌడ్, ఎస్ఎస్ఈ మనోజ్ , గోవిందరాజులు, రాజేంద్రప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైల్వే ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం గుంతకల్లు: రైల్వే ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు రైల్వే బోర్డు అడిషన్ మెంబర్ విజయ్ప్రతాప్సింగ్ తెలిపారు. శనివారం ఆయన గుంతకల్లులో పర్యటించారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్ద ఉన్న రైల్ కోచ్ రెస్టారెంట్ను తనిఖీ చేశారు. విజయ్పత్రాప్సింగ్ గుంతకల్లు డీఆర్ఎంగా ఉన్న సమయంలో రైల్వేస్టేషన్, రైల్వే ఆస్పత్రి, రైల్వే క్రీడామైదనంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేసిన విషయాన్ని స్థానిక ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన డీజల్ షెడ్లోని నూతన బిల్డింగ్ను ప్రారంభించారు. ఆవరణలో మొక్కలు నాటారు. రన్నింగ్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేలో కీలకమైన రన్నింగ్ విభాగం సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ బోర్డు మెంబర్ విజయ్ ప్రతాప్ సింగ్ -
ఇంటికి వస్తూ.. తిరిగిరాని లోకాలకు..
బుక్కరాయసముద్రం: కుమారుడిని ఉన్నత స్థానంలో చూడాలని ఆ తల్లిదండ్రులు కలగన్నారు. అందుకే పెద్ద చదువులు చదివించారు. మంచి ఉద్యోగం సాధించేలా కుమారుడి వెన్నంటే ఉండి ప్రొత్సహించారు. అతనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. అయితే దేవుడు చిన్నచూపు చూడటంతో వారి సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు. రోడ్డు ప్రమాదంలో కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాల్లోకెళితే.. చలపతి, జయమ్మ తాడిపత్రి పట్టణంలో నివాసం ఉంటున్నారు. చలపతి ఓ గ్రానైట్ షాపులో రైటర్గా పని చేస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేశారు. కుమారుడు కడవ బాలాజీ (26) బెంగళూరులోని టెక్ మహేంద్రలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 15 రోజులు ఆఫీసులో.. 15 రోజులు వర్క్ఫం హోం చేసేవాడు. ఇందులో భాగంగా శనివారం తెల్లవారు జామున బెంగళూరు నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్) బైక్పై ఇంటికి బయలు దేరాడు. అయితే బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో అనంతపురం – తాడిపత్రి జాతీయ రహదారిపై కుక్క అడ్డువచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో బాలాజీ తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తలకు హెల్మెట్ ఉన్నా ప్రాణాలను కాపాడలేక పోయింది. విషయం తెలుసుకున్న తండ్రి చలపతి సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, ఇంకా కొన్ని రోజులు ఆగండి నాన్నా... మంచి జీతం వస్తుందని చెప్పేవాడని , ఏదీ జరగకుండానే అప్పుడే నూరేళ్లు నిండాయా అని రోధించడం పలువురిని కంటతడి పెట్టించింది. సీఐ పుల్లయ్య ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు -
రైతు ఆత్మహత్యాయత్నం
గుత్తి రూరల్: మండలంలోని వన్నేదొడ్డికి చెందిన గొల్ల వెంకటనారాయణ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాలమేరకు.. వన్నేదొడ్డికి చెందిన వెంకటనారాయణ కొన్ని నెలలుగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన వెంకటనారాయణ గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి వేరుశనగ పంటలకు పిచికారీ చేసే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పక్క పొలాల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పొలంలో అపస్మారకస్థితిలో పడి ఉన్న వెంకటనారాయణను వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు అనంతపురంకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పులబాధ తాళలేక మరొకరు.. గుత్తి రూరల్: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మిద్దె తండాకు చెందిన సోమ్లానాయక్ అనే రైతు అప్పుల బాధ తాళలేక శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాలమేరకు.. సోమ్లా నాయక్ పంటల సాగుతో పాటుగా కుటుంబ పోషణకు అప్పులు చేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండక పోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. అక్రమంలో అప్పులు ఇచ్చిన వారు చెల్లించాలని ఒత్తిడి అధికమైంది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సోమ్లానాయక్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు డబ్బాతో అపస్మారక స్థితిలో పడి ఉన్న సోమ్లానాయక్ను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్సలకు కర్నూలుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారుల వేధింపులు తాళలేక..
గుంతకల్లు/టౌన్: అధికారుల వేధింపులు తాళలేక విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుని బంధువులు, తోటి ఉద్యోగులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని బ్యాంక్ కాలనీలో నివాసముంటున్న అన్సూర్ గతంలో గుత్తి ట్రాన్స్కో పరిధిలోని ఆర్టీఎస్ఎస్ (220కె.వి)లో కాంట్రాక్ట్ హెల్పర్గా పనిచేసేవాడు. పరస్పర బదిలీల్లో భాగంగా తకల్లులోని ఆలూరు రోడ్డులో ఉన్న 132కేవీ సబ్స్టేషన్కు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న రమేష్ను గుత్తికి బదిలీ చేశారు. అయితే ఈ బదిలీల్లో తనకు అన్యాయం జరిగిందని ఓ సహోద్యోగి ఎస్సీ కమిషన్ను ఆశ్రయించాడు. దీంతో సంబంధిత ట్రాన్స్కో అధికారులు అన్సూర్ను తిరిగి గుత్తికి వెళ్లిపోవాలని తీవ్రంగా ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన ఆయన శుక్రవారం విధుల్లో ఉన్న సమయంలోనే పురుగుల మందు తాగాడు. గమనించిన తోటి ఉద్యోగులు వెంటనే 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. తాము ఆస్పత్రికి వెళ్లేలోపు అతడిని రెఫర్ చేశారని, ఆత్మహత్యాయత్నానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉందని వన్టౌన్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై సంబంధిత ట్రాన్స్కో అధికారిని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. -
ప్రాణాలు బలిగొన్న చేపల వేట సరదా
గుమ్మఘట్ట: చేపల వేట సరదా ఇద్దరి ప్రాణాలు బలిగొంది. స్థానికులు తెలిపిన మేరకు.. రాయదుర్గం పట్టణానికి చెందిన మన్సూర్ బాషా (34), కర్ణాటకలోని రాంపుర గ్రామానికి చెందిన జబీవుల్లా (28) ఇద్దరూ మంచి స్నేహితులు. మన్సూర్బాషాకు భార్య టబూ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. టైలరింగ్తో కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలాగే జబీవుల్లాకు భార్య గుల్జార్భాను, ఇద్దరు కుమారులు ఉన్నారు. డ్రైవింగ్ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. చేపల వేట అంటే ఎంతో ఆసక్తి ఉన్న ఇద్దరూ గురువారం గాలాలు తీసుకుని ద్విచక్ర వాహనంపై బీటీ ప్రాజెక్ట్కు చేరుకున్నారు. గాలం వేసే సమయంలో మన్సూర్బాషా నీటిలో పడిపోవడంతో కాపాడేందుకు తనకు ఈత రాకపోయినా జబీవుల్లా దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ నీట మునిగి పోయారు. శుక్రవారం ఉదయం నీటిలో మృతదేహాలు తేలియాడుతుండడం గమనించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీయించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పీహెచ్సీలో తనిఖీలు వజ్రకరూరు: స్థానిక పీహెచ్సీని జాతీయ ఆరోగ్యమిషన్ కార్యక్రమ అధికారి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు, వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి తేజశ్వి, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఫీజు’ కోసం కదం తొక్కిన విద్యార్థులు
అనంతపురం అర్బన్: ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలంటూ విద్యార్థులు కదం తొక్కారు. పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. కాదూకూడదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలంటూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యార్థులు ఆందోళనకు ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకుడు రమణయ్య సంఘీభావం ప్రకటించారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డితో పాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి కుళ్లాయిస్వామి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడదుల చేసి విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ఎన్నికల సమయంలో నారా లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది దాటినా పీజు రీయింబర్స్మెంట్ ఎందుకు జమ చేయలేదంటూ ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన ఫీజు రీయింబర్స్మెంట్ కేవలం ప్రకటనలకే పరిమతం చేశారంటూ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ చేయకపోవడంతో డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులకు పేద విద్యార్థులను దూరం చేసే జీఓ 77ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియేట్ ఫలితాలు వెల్లడై మూడు నెలలు అవుతున్నా నేటికీ డిగ్రీ ప్రవేశాలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమయాన్ని పాత విధానంలోనే కొనసాగించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను ఆయన చాంబర్లో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, కోశాధికారి ఆంజనేయులు, నాయకులు వెంకట్నాయక్, నరసింహయాదవ్, మంజునాథ్, వంశీచంద్, ఉమమహేష్, మౌళి, వినోద్, నానీ, సమీర్, రాజేష్, రాజు, పవన్, తరుణ్, బాబ్జాన్, దిలీప్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దని కూటమి సర్కార్కు హితవు ఫీజు రీయింబర్స్ చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక -
టీడీపీ కార్యకర్తల బాహాబాహీ
బ్రహ్మసముద్రం: ఉపాధి కూలీల పొట్టకొడుతూ యంత్రాలతో పని పూర్తి చేయించి బిల్లులు చేసుకునేందుకు ఓ టీడీపీ నేత అండగా నిలవగా.. అదే పార్టీకి చెందిన సీనియర్లు వ్యతిరేకించారు. దీంతో రెండు వర్గాల కార్యకర్తల ధర్నాలతో ఎంపీడీఓ కార్యాలయం దద్ధరిలిల్లింది. వివరాలు.. బ్రహ్మసముద్రం మండలం బైరసముద్రం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వర్గానికి చెందిన మండల టీడీపీ కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు అండతో ఆయన అనుచరులు ఇటీవల ఉపాధి పనులను జేసీబీతో పూర్తి చేయించారు. ఈ అంశంపై అధికారులకు అదే పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. అక్రమాలు కప్పిపుచ్చే ప్రయత్నం ఉపాధి పనులపై విచారణ చేసేందుకు డ్వామా పీడీ సలీంబాషా శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్న విషయం తెలుసుకున్న శ్రీరాములు తన వర్గం వారితో కలసి అక్కడకు చేరుకుని అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పార్టీ సీనియర్ నేతలు, పలువురు కార్యకర్తలు సైతం కార్యాలయానికి చేరుకున్నారు. క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని సీనియర్లు డిమాండ్ చేశారు. ఆ సమయంలో వారిని శ్రీరాములు వర్గం అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో సీనియర్ల వర్గం కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధం కావడంతో శ్రీరాములు వర్గీయులు ప్రతిఘటించారు. ఒకానొక దశలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. పరిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణకు సిద్ధమయ్యారు. పీడీకి సహకరించని క్షేత్ర సిబ్బంది యంత్రాలతో పూర్తి చేసిన పనులను డ్వామా పీడీ సలీంబాషా పరిశీలించి, కొలతలు సిద్ధమయ్యారు. ఆ సయయంలో రికార్డులు, టేప్ తీసుకురావాలని ఉపాధి ఈసీ జయప్రకాష్ బీఎఫ్టీ వన్నూరుస్వామి సూచించినా వారు పట్టించుకోలేదు. విచారణను పెడదోవ పట్టించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. దీంతో పీడీ అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి అధికారుల సమక్షంలో మరోసారి వాగ్వాదానికి దిగారు. ఈ ఏడాదిలో ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో చేపట్టిన ప్రతి పనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద రెండు వర్గాల తోపులాట -
రైల్వే స్టేషన్లో యువకుడి మృతి
గుత్తి: స్థానిక రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాంపై గురువారం అర్ధరాత్రి ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ నాగప్ప అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం బిదనంచెర్లకు చెందిన హిటాచీ డ్రైవర్ జగదీశ్వరరెడ్డి (32)గా గుర్తించారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన గుత్తి రైల్వే స్టేషన్లో మృతి చెందినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. అనారోగ్యమే మృతికి కారణంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
పేదలకు విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు
● మాజీ మంత్రి సాకే శైలజనాథ్ అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో పేద పిల్లలకు విద్య దూరమవుతోందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు విద్యావ్యవస్థ అభివృద్ధికి చేసిన మంచి పని అంటూ ఏ ఒక్కటీ లేదని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అభూత కల్పన చేస్తున్న సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్ జగనన్న తీసుకువచ్చిందేనన్నారు. సత్యసాయిజిల్లా కొత్త చెరువు ప్రభుత్వ హైస్కూల్లో తల్లిదండ్రులకు టీచర్స్ మీటింగ్లో పిల్లలకు పాఠాలు బోధించిన మీరు రెండు నెలల క్రితం అదే జిల్లాలో ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థినిపై మృగాళ్లు దాడి చేస్తే ఇంత వరకు బాధితురాలి గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అక్కడ బాధింపబడిన కుటుంబం మీ పార్టీకి చెందిన వారే అని ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన కిరాతకులు మీవారేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఓ బాధిత బాలికలకు భరోసా కల్పించలేని మీరు రాష్ట్రంలోని పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా కల్పిస్తారో చెప్పాలన్నారు. కుమారుడు లోకేష్ భవిష్యత్తుపై ఉన్న భరోసా పేద ప్రజలపై సీఎం చంద్రబాబుకు లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి చంద్రబాబు అసమర్థ పాలనే కారణమన్నారు. -
ఆక్రమణలో 2,903 ఎకరాల ఆలయ భూములు
●భూముల పరిరక్షణకు చర్యలు: కలెక్టర్ అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా 2,903 ఎకరాల దేవాలయ భూములు ఆక్రమణలకు గురయ్యాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆలయ భూముల పరిరక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి కలెక్టర్ జిల్లాస్థాయి ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేవాలయ భూములు కౌలుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ ధూప, దీప, నైవేద్యాలకు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అలాంటి భూములు ఆక్రమణకు గురికావడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు. జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలోని ఆలయ భూములు ఎన్ని ఉన్నాయి.. అందులో ఎన్ని సాగులో ఉన్నాయి అనేది నిర్ధారించుకోవాలన్నారు. ఆక్రమణ గురైన వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు భూములన్నీ మండల ఇన్చార్జి ద్వారా కౌలుకు ఇచ్చి సాగులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేవాలయ భూములను సాగు చేసే కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని చెప్పారు. జాతీయ రహదారులకు సంబంధించి దేవాలయ భూములను సేకరిస్తూ అందుకు పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ మలోల, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ తిరుమలరెడ్డి, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, శ్రీనివాస్, భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్దీన్, ఆలయాల ఈఓలు, ఏఈఓలు పాల్గొన్నారు. -
మార్గదర్శకులను గుర్తించాలి
అనంతపురం అర్బన్: పేదరిక నిర్మూలన కోసం పీ4 కార్యక్రమం కింద మార్గదర్శకులను గుర్తించాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం క్యాంపు కార్యాలయం నుంచి జీరో పావర్టీ పీ4 కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా, డివిజన్, నియోజకవర్గ, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీ4 కార్యక్రమం కింద జిల్లాలో 68,316 బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. వారి భవితకు భరోసా కల్పించేందుకు దాతలను (మార్గదర్శకులు) గుర్తించాలని చెప్పారు. ఇప్పటి వరకు 20 మంది మార్గదర్శకులు లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. వారు 813 మందిని దత్తత తీసుకున్నారన్నారు. మార్గదర్శకుల గుర్తింపునకు అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని పరిశ్రమల యాజమానులు, పాఠశాలలో చదివి ఉన్నతస్థాయిలో ఉన్నవారిని, ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఈలు, బడా వ్యాపారులు, తదితర సంస్థలు, సంఘాలతో ఈ నెల 15లోగా సమావేశం నిర్వహించాలన్నారు. అధికారులు దత్తత తీసుకోవాలి జిల్లా అధికారులందరూ ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద లక్ష్యాని ఆగస్టు 15 నాటికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించాలన్నారు. ఎంపిక చేసిన బంగారు కుటుంబాల వద్దకు వెళ్లి వారికి ఏ రకమైన సహాయం కావాలనే వివరాలపై ఈ నెల 21 నుంచి ఆగస్టు 6 వరకు సర్వే నిర్వహించాలన్నారు. కాన్ఫరెన్స్లో సీపీఓ ఆశోక్కుమార్, డీఐసీ జెడ్ఎం శ్రీనివాస్యాదవ్, డీఈఓ ప్రసాద్బాబు, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, డీపీఓ నాగరాజునాయుడు, డీఎంహెచ్ఓ దేవి, డీటీసీ వీర్రాజు, ఆర్డీఓలు, తదితరులు పాల్గొన్నారు. -
బండారు శ్రావణికి మళ్లీ భంగపాటు!
శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి మరోసారి భంగపాటు ఎదురైంది. తన వర్గీయులకు మండల కన్వీనర్ల పదవులు ఇప్పించేందుకు ఆమె ప్రయత్నించగా.. సీనియర్లు పలువురు అడ్డుపడ్డారు. దీంతో అక్కడి టీడీపీ వర్గపోరు మళ్లీ తెర మీదకు వచ్చింది.సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో టూమెన్ కమిటీ అక్కడి ఎమ్మెల్యే బండారు శ్రావణికి కొరకరాని కొయ్యగా మారింది. తన వర్గీయుల కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలకు వరుసగా చెక్ పెడుతూ వస్తోంది. తాజాగా.. మండల కన్వీనర్ల ఎంపికలో ఈ వర్గపోరు మరోసారి బయటపడింది. తన వర్గం వాళ్లకు పదవులు ఇప్పించాలని శ్రావణి ప్రయత్నించగా.. సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇటు శ్రావణి వర్గం, అటు మరో వర్గం గొడవకు దిగింది. టీడీపీ నేతల బాహా బాహీతో పంచాయితీ రోడ్డుకెక్కింది. ఎన్నికలకు ముందు నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సమయం నుంచే టూమెన్ కమిటీకి, బండారు శ్రావణికి వైరం మొదలైంది. అటుపై ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన శ్రావణి.. నియోజకవర్గ వ్యవహారాల్లో తన వర్గీయులకు ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. అయితే.. మంత్రి నారా లోకేష్ అండ చూసుకుని ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ఎలాగైనా ఆమె ఆధిత్యానికి పుల్స్టాప్ పెట్టాలని సీనియర్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. -
ఘర్షణ కేసులో 21 మంది అరెస్ట్
రాయదుర్గం: వివాహేతర సంబంధ కారణంగా ఆస్తి విధ్వంసాలకు పాల్పడిన 21 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. బొమ్మనహాళ్ మండలం కొలగానహళ్లికి చెందిన అనంతరాజు కొంత కాలంగా అదే మండలం మైలాపురం గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేత సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంగా వివాదం తలెత్తి సోమవారం రాత్రి అనంతరాజుపై దాడి చేశారు. దీంతో కోపోద్రిక్తులైన అనంతరాజు, ఆయన బంధువులు మైలాపురం చేరుకుని లోకేష్, విజయ్ ఇళ్లల్లోకి చొరబడి తలుపులు, టీవీ, రెండు ద్విచక్రవాహనాలు, కారు ధ్వంసం చేయడంతో పాటు పది ట్రాక్టర్ల ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవిబాబు నేతృత్వంలో ఇరు గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ఆస్తి నష్టానికి కారకులైన 21 మంది యువకులను గురువారం అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా, ఇదే కేసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనంతరాజును డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే అనంతరాజుపై దాడికి కారకులైన మైలాపురం గ్రామానికి చెందిన వారిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ నబీరసూల్, బొమ్మనహాళ్ పోలీసులు పాల్గొన్నారు. వివాహేతర సంబంధం కారణంగా వ్యక్తిపై గత సోమవారం దాడి ప్రతి దాడిలో ఆస్తుల విధ్వంసం -
యువతి మిస్సింగ్ కేసులో వీడిన మిస్టరీ
పెద్దవడుగూరు: మండలంలోని క్రిష్టిపాడు గ్రామానికి చెందిన యువతి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఆచూకీ పసిగట్టి తల్లిదండ్రుల చెంతకు యువతిని పోలీసులు సురక్షితంగా చేర్చారు. వివరాలను ఎస్ఐ ఆంజనేయులు గురువారం వెల్లడించారు. పామిడి మండలం గజరాంపల్లి వద్ద 44వ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఓ గార్మెంట్స్లో పనిచేస్తున్న సదరు యువతి... అక్కడే పనిచేస్తున్న బిహార్కు చెందిన యువకుడితో సన్నిహితంగా ఉండేది. ఈ నేపథ్యంలో అతని మాయమాటలతో ఆకర్షితురాలైన ఆమె మంగళవారం సదరు యువకుడితో కలసి వెళ్లిపోయింది. ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బుధవారం మిస్సింగ్ కేసు నమోదు చేసిన పెద్దవడుగూరు పోలీసులు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కర్ణాటకలోని హాసన్లో ఉన్నట్లుగా తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. గురువారం యువతిని పిలుచుకొచ్చి సాయంత్రం తహసీల్దార్ ఉషారాణి సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. కేజీబీవీలో కోతుల హల్చల్ కూడేరు: స్థానిక కేజీబీవీలో కోతుల బెడదతో విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. గదుల్లోకి చొరబడి ట్రంక్ పెట్టెల్లోని దుస్తులు, ఇతర వస్తువులను లాగి పడేస్తున్నాయి. స్టోర్ గదిలోకి వెళ్లి వంట సామగ్రిని చెల్లాచెదురు చేస్తున్నాయి. తరగతి గదుల్లోకి చేరి బాలికలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. భోజనం సమయంలో తరిమేందుకు ప్రయత్నిస్తే దాడికి యత్నిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది కోరుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఎస్పీకి సెల్ఫీ వీడియో గుత్తి: ఓ అమ్మాయి వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గుత్తి మండలం రజాపురం గ్రామానికి చెందిన నారాయణస్వామి గురువారం ఉదయం సెల్ఫీ వీడియో తీసి ఎస్పీ కార్యాలయానికి పోస్టు చేశాడు. డీపీఓ నుంచి సమాచారం అందుకున్న గుత్తి పోలీసులు రైలు పట్టాల వెంబడి విస్తృత తనిఖీలు చేపట్టారు. యువకుడి సెల్ఫోన్ పామిడి వద్ద స్విచ్ఛాఫ్ అయినట్లు గుర్తించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గాలించినా యువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. -
సుడి‘గండం’లో ఏరువాక
అనంతపురం అగ్రికల్చర్: వరుణదేవా... నీ జాడెక్కడ అంటూ ‘అనంత’ అన్నదాత ఆకాశం వైపు చూస్తున్నాడు. ఖరీఫ్ ఆరంభమై 40 రోజులవుతున్నా పదును వర్షం పడకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. పంటలు విత్తుకునేందుకు కీలక సమయం దగ్గర పడుతున్న కొద్దీ రైతు ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనెల 15 వరకు పంటలు విత్తుకునేందుకు మంచి అదనుగా చెబుతున్నారు. ఒకవేళ కొంచెం ఆలస్యమైనా నెలాఖరు వరకు ఇబ్బంది లేదని శాస్త్రవేత్తలు, అధికారులు ప్రకటించారు. కానీ... ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే తేలికపాటికే పరిమితమవుతున్నాయి. ఒక్క మంచి వర్షం కూడా నమోదు కాలేదు. సీజన్ ఆరంభంలోనే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ ఏరువాక మందగించిపోయింది. రెండే రెండు రోజులు.. ఆశల నైరుతి ఈ సారి మే 26న ప్రవేశించడంతో అన్నదాత హర్షాతిరేకం వ్యక్తం చేశారు. రుతుపవనాల ప్రవేశానికి ముందు మంచి వర్షాలు నమోదయ్యాయి. నైరుతి వచ్చాక వర్షాలు ఆగిపోయాయి. జూన్ 8, 11 తేదీల్లో మాత్రమే మోస్తరుగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత నెల రోజులు కావస్తున్నా మంచి పదను వర్షం పడలేదు. జూన్ 1 నుంచి నేటి వరకు 40 రోజులకు గానూ కేవలం రెండంటే రెండే రోజులు వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావడం గమనార్హం. దాదాపు 20 మండలాల్లో 30 రోజులు సుదీర్ఘ వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) నమోదు కావడం వర్షాభావ తీవ్రతకు అద్ధం పడుతోంది. జూన్లో 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ నమోదైంది. కీలకమైన జూలై అయితే మరీ ధారుణంగా ఈ పది రోజుల్లో కేవలం 5.9 మి.మీ వర్షం కురిసింది. ఓవరాల్గా చూస్తే... ఈ సీజన్లో 76.7 మి.మీ గానూ 30 శాతం తక్కువగా 53.8 మి.మీ వర్షం కురిసింది. 30 మండలాల్లో వర్షాభావం: శెట్టూరు మండలంలో మాత్రమే ఈనెలలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక మిగిలిన 30 మండలాల్లో సాధారణం కన్నా చాలా తక్కువగానూ, అందులో రాప్తాడు మండలంలో కనీసం తేలికపాటి కూడా నమోదు కాకపోవడం గమనార్హం. దీంతో ఖరీఫ్ ఏరువాక మందకొడిగా ‘సాగు’తోంది. జిల్లా సాధారణ పంటల సాగు విస్తీర్ణం 3.40 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 15 శాతంతో 50 వేల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో వేరుశనగ 15 వేల హెక్టార్లు, కంది 12 వేల హెక్టార్లు, పత్తి 7,500 హెక్టార్లు, మొక్కజొన్న 5 వేల హెక్టార్లు, ఆముదం 3,500 హెక్టార్లు... ఇలా చాలా తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. అదను దాటిపోతుందనే ఆందోళనతో అక్కడక్కడ కురుస్తున్న తేలికపాటి వర్షాలకు అరతేమలోనే పంటలు వేస్తున్న పరిస్థితి నెలకొంది. పంటలు విత్తుకునేందుకు ఆరుద్రతో పాటు పునర్వసు కార్తెలు మంచి అదనుగా చెబుతున్నారు. ఆరుద్ర ముగిసిపోగా... ప్రస్తుతం పునర్వసు నడుస్తోంది. అది కూడా ఈనెల 20న ముగుస్తుంది. అంతలోపు పంటలు విత్తుకుంటే మంచి పంట దిగుబడులు వస్తాయని రైతుల్లో నమ్మకం ఉన్నా... వర్షం జాడ లేక ఆందోళన నెలకొంది. వర్షాకాలంలోనూ పెరగని భూగర్భజలం పేరుకు వర్షాకాలమే అయినా జిల్లాలో అనుకున్న మేరకు భూగర్భజలాలు పెరగ లేదు. జూన్, జూలైలో సాధారణం కన్నా 30 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో ప్రస్తుతం జిల్లాలో ఉన్న 97 ఫిజోమీటర్ల నుంచి తీసుకున్న గణాంకాల ప్రకారం భూగర్భజలాలు సగటున 11.28 మీటర్లుగా నమోదైంది. 12 మండలాల్లో సగటు కన్నా జలాలు లోతుకు వెళ్లినట్లు గుర్తించారు. ఇందులోనూ యాడికి మండలంలో 25.45 మీటర్లు, శెట్టూరులో 24.87 మీటర్లు, పుట్లూరులో 21.81 మీటర్లుగా నమోదు కావడంతో ఈ మూడింటినీ డేంజర్ జోన్లో పెట్టారు. ఇవి కాకుండా కళ్యాణదుర్గం, తాడిపత్రి, డి.హీరేహాళ్, బ్రహ్మసముద్రం, కుందుర్పి, కణేకల్లు, పామిడి, గుమ్మఘట్ట, బెళుగుప్ప మండలాలు నీటి ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఈ మండలాల్లో నీటి వాడకం అధికంగా ఉన్నందున క్రిటికల్, సెమీక్రిటికల్ జాబితాలో పెట్టారు. 40 రోజులకు గానూ రెండే వర్షపు రోజులు 30 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు సీజన్ మొదట్లోనే సుదీర్ఘ డ్రైస్పెల్స్ నమోదు 15 శాతం సాగుతో పడకేసిన ఖరీఫ్ ఏరువాక -
నకిలీ బంగారంతో బురిడీ
గుంతకల్లు: నకిలీ బంగారంతో ఫైనాన్స్ కంపెనీలను బురిడీ కొట్టిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఇందుకు సంబంధించిన వివరాలను కసాపురం పోలీసుస్టేషన్లో గురువారం ట్రైనీ డీఎస్పీ అష్రఫ్ ఆలీ వెల్లడించారు. గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రనగర్కు చెందిన తిమ్మయ్య గారి భార్గవ్కుమార్, తెల్ల శివానంద్ బుధవారం 4 బంగారు గాజులు తీసుకుని పట్టణంలోని కరూర్ వైశ్య బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు వెళ్లారు. అవి నకిలీవిగా గుర్తించిన బ్యాంకు అప్రైజర్ ద్వారా విషయం తెలుసుకున్న అసిస్టెంట్ మేనేజర్ వెంకటరెడ్డి నిలదీయడంతో వారు ఉడాయించారు. దీనిపై అసిస్టెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కసాపురం ఎస్ఐ వెంకటస్వామి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. గురువారం కసాపురం రోడ్డులోని ఎస్బీఐ బజార్ బ్రాంచ్లో మరోసారి నకిలీ బంగారం కుదువ పెట్టడానికి భార్గవ్కుమార్, శివానంద్ రాగా.. అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే మొత్తం ముఠా గుట్టు రట్టయింది. క్రాంతి కుమార్, వేణుగోపాల్ సూత్రధారులు నకిలీ బాగోతంలో గుంతకల్లులోని ఫక్కీరప్ప కాలనీకి చెందిన చాగంటి క్రాంతి కుమార్, కమ్మర వేణుగోపాల్ సూత్రధారులుగా తేలింది. బంగారం వ్యాపారం చేసే వీరు 70 శాతం సిల్వర్పై 30 శాతం బంగారు కోటింగ్ వేసి ఉంగరాలు, గాజులు తదితర వాటిని తయారు చేసేవారు. స్థానిక మోమినాబాద్కు చెందిన జావేద్తో నకిలీ బంగారంపై హాల్మార్క్ గుర్తు వేయించాక.. ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం, ఇతర ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లక్షలాది రూపాయల రుణం తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. కర్నూలుకు చెందిన ఎరుకల శ్రీనివాసులు, పులిపాటి నరేంద్ర, మేకల శ్రీనివాసులు, మల్లెమాల నరేష్కు కూడా నకిలీ బంగారం తక్కువ రేటుకు అమ్మేవాళ్లని తేలింది. నిందితులు 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 39 గ్రాముల నాలుగు బంగారు గాజులు, 13 నకిలీ బంగారు ఉంగరాలు, 5 వెండి ఉంగరాలు, 145 గ్రాముల కాపర్వైర్, 15 గ్రాముల వెండి కడియం, 4 వెండి కాళ్ల పట్టీలతోపాటు రూ.4 లక్షలు విలువ చేసే వెయింగ్ మిషన్ (హాల్మార్క్ ముద్ర వేసే)తోపాటు రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు ట్రైనీ డీఎస్పీ వివరించారు. నిందితుల అరెస్టులో ప్రతిభ చూపిన కానిస్టేబుల్స్ జాఫర్, కిషోర్కుమార్, ఓబులేసు, మహబుబ్బాషా, అశోక్, నజీర్లను అఽభినంచించారు. ‘ఆర్థో’లో మృతిపై విచారణ అనంతపురం మెడికల్: ఈ నెల 9న ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని ఆర్థో విభాగంలో చోటు చేసుకున్న యువకుడి మృతిపై ఆస్పత్రి అధికారులు విచారణ చేపట్టారు. ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామానికి చెందిన రాజేష్ (22) కాలు నొప్పితో బాధపడుతూ తొలుత ఓ ప్రైవేట్ నర్శింగ్ హోంలో, అనంతరం సర్వజనాస్పత్రిలో చికిత్స పొంది మృతి చెందిన అంశంపై ‘మేడా’లో అడ్మిషన్.. ‘జీజీహెచ్’లో డెత్’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం స్పందించారు. మృతిపై విచారణకు ఆదేశించారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మరో ఇద్దరు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్తో కమిటీను ఏర్పాటు చేశారు. మృతి గల కారాణాలపై నివేదిక సమర్పించాలని కోరారు. ఇదిలా ఉండగా స్వయంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం తన సొంత మేడా నర్సింగ్ హోం నుంచి జీజీహెచ్కు బదిలీ చేసిన కేసులో రోగి మృతి చెందిన అంశంపై విచారణలో పారదర్శకత లోపించే అవకాశముందనే చర్చ జీజీహెచ్లో జోరుగా సాగుతోంది. -
ట్రోలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
అనంతపురం: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి, నిరసనలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రాముడు, ట్రెజరర్ వెంకట రఘుకుమార్, సంయుక్త కార్యదర్శి జుబేర్, మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బడా నారాయణరెడ్డి, శ్రీకాంత్, అవ్వా సురేష్, ప్రణీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం అనంతపురం: నగరంలోని ఓ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు... గుంతకల్లు మండలానికి చెందిన ఓ విద్యార్థిని నగరంలోని అరవిందనగర్లోని బీసీ హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. గురువారం ఆమెను కలిసేందుకు వచ్చిన తండ్రి సరిగా చదవడం లేదని మందలించాడు. అయితే అందరి ముందు మందలించడంతో మనస్తాపానికి లోనైన ఆమె తన గదిలోకి వెళ్లి విషపూరిత ద్రావకం తాగింది. తోటి విద్యార్థినిలు గమనించి వెంటనే సర్వజనాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. -
జేసీ ఇలాకాలో దాహం కేకలు
యాడికి: జేసీ ప్రభాకరరెడ్డి ఇలాకాలో తాగునీటి కోసం ప్రజలు విలవిల్లాడుతున్నారు. గుక్కెడు నీరు లభ్యం కాక పోవడంతో దాహం తీరడం లేదని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు మరిచి గ్రామాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు ఇవ్వండి మహాప్రభో అంటూ తరచూ మహిళలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నా.. అటు ప్రజాప్రతినిధులు కానీ, ఇటు అధికారులు కాని పట్టించుకోకపోవడంతో ఇప్పట్లో తాగునీటి ఇక్కట్లు దూరమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా పిన్నేపల్లిలో.. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి పంచాయతీ పరిధిలోని పిన్నేపల్లి గ్రామ మహిళలు గురువారం తాగునీటి కోసం రాస్తారోకో చేపట్టారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెలల తరబడి తమకు తాగునీరు అందడం లేదని వాపోయారు. పలుమార్లు ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో చివరకు ఇలా మండల కేంద్రానికి చేరుకుని నిరసన తెలపాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ వెంకటేసు, పంచాయతీ ఇన్చార్జ్ ఈఓ శశికళ అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని స్పష్టమైన హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. -
టన్ను చీనీ రూ.18 వేలు
అనంతపురం మార్కెట్ యార్డులో గురువారం టన్ను చీనీకాయలు గరిష్టంగా రూ.18 వేలు, కనిష్టం రూ.3 వేల ప్రకారం ధర పలికాయి. రంగయ్య పర్యటనకు పోలీసుల అడ్డంకులు కళ్యాణదుర్గం: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలను వివరించేందుకు వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య శెట్టూరులో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఉదయం రంగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమా మహేశ్వర నాయుడులు పార్టీ శ్రేణులతో కలిసి కళ్యాణదుర్గం నుంచి శెట్టూరుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే ఎమ్మెల్యే ఆదేశాలతో సిద్ధంగా ఉన్న పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరుకుని రంగయ్యను హౌస్ అరెస్టు చేసేందుకు యత్నించారు. తాను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే వెళ్తున్నానని రంగయ్య పోలీసులకు సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే అమిలినేని కార్యక్రమం ఉందని బుకాయిస్తూ అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే శెట్టూరుకు వెళ్లేందుకు బయలుదేరుతుండగా రూరల్ సీఐ వంశీకృష్ణ తన సిబ్బందితో రంగయ్య వాహనాలను అడ్డుకున్నారు. పోలీసుల అత్యుత్సాహం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. -
మెగా.. మొక్కుబడిగా..
● గ్రామీణ ప్రాంతాల్లో ఆసక్తి చూపని తల్లిదండ్రులు ● ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేసేందుకే ప్రాధాన్యత అనంతపురం ఎడ్యుకేషన్: మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లకు జిల్లాలో స్పందన కరువైంది. వారం రోజులుగా కలెక్టర్ మొదలు విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. డీవైఈఓలు, ఎంఈఓలు, హెచ్ఎంల మెడపై కత్తిపెట్టి ఒత్తిళ్లు చేశారు. ఇంతచేసినా తల్లిదండ్రుల నుంచి స్పందన తూతూమంత్రంగానే వచ్చింది. గురుపౌర్ణమి కావడం, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది రైతులు, కూలీ చేసుకునే వారు ఉండడంతో పనులు మానుకుని వచ్చేందుకు తల్లిదండ్రులకు ఆసక్తి చూపలేదు. చాలా ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ ఫొటోలు తీయించి మమ అనిపించారు. ఫొటోల అప్లోడ్పైనే ఆసక్తి కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఫొటోల కోసం తల్లిదండ్రులను బలవంతంగా పిలిపించి వివిధ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల అభివృద్ధి, పురోగతిపై చర్చ కంటే కూడా కార్యక్రమం నిర్వహించామా...ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేశామా.. పని అయిపోయిందా అనే విధంగా జరిగాయి. ప్రభుత్వ ప్రచారం కోసం తప్ప విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం లేదంటూ తల్లిదండ్రులు నిట్టూర్చారు. ‘నాడు–నేడు’ పనులు నిలిచి ఎక్కడికక్కడ ఆగిపోయిన తరగతి గదుల గురించి కనీసం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ‘మెగా పీటీఎం’ నిర్వహణకు ప్రభుత్వం చాలీచాలని నిధులు కేటాయించడంతో అవి సరిపోక తమ జేబు నుంచి పెట్టుకోవాల్సి వచ్చిందని పలువురు హెచ్ఎంలు వాపోయారు. 2,395 స్కూళ్లల్లో మెగా పీటీఎంలు జిల్లా వ్యాప్తంగా 2,395 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పండుగ వాతావరణంలో మెగా పీటీఎం వేడుకలు జరిగాయని డీఈఓ ప్రసాద్బాబు, సమగ్ర శిక్ష ఏపీసీ టి.శైలజ తెలిపారు. తొలుత తరగతుల వారీగా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారన్నారు. ప్రజా ప్రతినిధులు ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మెగా పీటీఎంలకు హాజరయ్యారన్నారు. మెగా పీటీఎంల నిర్వహణలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అత్యుత్సాహం.. అయోమయం తాడిపత్రి మండలం సజ్జలదిన్నె జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన పీటీఎంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనుచరుల అత్యుత్సాహంతో అయోమయం నెలకొంది. ఎంపీ వెంట తాడిపత్రికి చెందిన టీడీపీ నాయకుడు రామాంజినేయులు, బుల్లెట్ లింగమయ్య వచ్చారు. రామాంజి సభావేదికపై ఆశీనులు కాగానే లింగమయ్య రాజకీయ ప్రసంగం చేస్తూ ‘జై వాల్మీకి’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడికి వచ్చిన వారంతా అవాక్కయ్యారు. పాఠశాలలో కుల రాజకీయాలు ఏంటంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ● పిల్లలకు యూనిఫాం క్లాత్ ఇవ్వకుండా హెచ్ఎం, ఉపాధ్యాయులు దాచి పెద్ద సైజులో పరదా కుట్టించడం విమర్శలకు తావిచ్చింది. కూడేరులోని హైస్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ పిల్లలకు యూనిఫాం క్లాత్ ఇవ్వకుండా పరదా తయారు చేశారా అంటూ పలువురు తల్లిదండ్రులు చర్చించుకోవడం కనిపించింది. సత్ప్రవర్తనతో మెలగాలి ఉరవకొండ: విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలిగి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పిలుపు నిచ్చారు. గురువారం ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో మెగా పీటీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేశవ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యావ్యవస్థను గాడిన పెట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారన్నారు. కలెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు. -
హింసాత్మకంగా బాబు పాలన
బుక్కరాయసముద్రం: రాష్ట్రంలో చంద్రబాబు పాలన హింసాత్మకంగా సాగుతోందని వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. గురువారం మండల కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శైలజానాథ్ మాట్లాడారు. బీకేఎస్ మండలంలోని చెన్నంపల్లిలో తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడడం పిరికపంద చర్య అన్నారు. 8 మందిపై కొడవళ్లు, గొడ్డళ్లతో దాడులకు పాల్పడడం దారుణమని, వైఎస్సార్ సీపీ పాలనలో మండలంలో ఎక్కడా దాడుల ఘటనలు జరగలేదన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనూ హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు. నేడు ప్రశాంతంగా ఉండే పల్లెల్లో టీడీపీ నాయకులు ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగం రాజకీయాలకు అతీతంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి, ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, సర్పంచ్ పార్వతి, పూల నారాయణస్వామి, చికెన్ నారాయణస్వామి, నరేష్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి అనంతపురం అర్బన్: ‘సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. న్యూస్రీల్ -
జోరుగా ‘ఆశల పరవళ్లు’..
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు గురువారం బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. తుంగభద్ర బోర్డు సెక్రటరీ రామకృష్ణారెడ్డి, డ్యాం ఎస్ఈ నారాయణ నాయక్, హెచ్చెల్సీ ఈఈ చంద్రశేఖర్ డ్యాం వద్ద స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలను లాంఛనంగా ప్రారంభించారు. అంతకు ముందు బోర్డు అధికారులు డ్యాంపై పూజలు చేశారు. సంప్రదాయబద్ధంగా వాయనం వదిలారు. ఈ సందర్భంగా బోర్డు సెక్రటరీ రామకృష్ణా రెడ్డి, డ్యాం ఎస్ఈ నారాయణ నాయక్ మాట్లాడుతూ తుంగభద్ర ఎగువ కాలువకు తొలుత 100 క్యూసెక్కుల నీరు వదిలి తరువాత ప్రతి రెండు గంటలకోసారి నీటి విడుదలను పెంచుతామని తెలిపారు. మొత్తంగా 500 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రా, కర్ణాటక కోటా కలిపి నీరు విడుదల చేస్తున్నామన్నారు. ఖరీఫ్లో పంటల సాగుకు ఈ నెల 10 నుంచి నవంబర్ 30 వరకూ దాదాపు 1,300 క్యూసెక్కులు వదులుతామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోనే డ్యాం నుంచి నదికి నీటిని విడుదల చేశామన్నారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ఇటీవల 80 టీఎంసీలకు కుదించామన్నారు. 12వ తేదీ సాయంత్రం 6 గంటలకల్లా ఆంధ్రా సరిహద్దుకు తుంగభద్ర జలాలు చేరుతాయని అధికారులు తెలిపారు. విషయాలు తెలియవంట.. గతంలో హెచ్చెల్సీకి నీరు విడుదలయ్యే సమయంలో స్థానిక అధికారుల్లో హడావుడి ఉండేది. ఎక్కడైనా కాలువలు దెబ్బతిన్నాయా అని పరిశీలించడంతో పాటు నీటి వినియోగంపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఈసారి మాత్రం ఆ పరిస్థితులే కనిపించడం లేదు. ఇన్చార్జ్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి తనకేమీ పట్టనట్లు ఉన్నారు. గురువారం నీటి విడుదలపై ఆయనను వివరణ కోరగా... హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసినట్లు ఉన్నారని, మిగిలిన విషయాలు తనకు తెలియవని, బోర్డు అధికారులతో మాట్లాడి కనుక్కోమని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే హెచ్చెల్సీ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
హద్దుల్లేని ఇసుక దందా
హగరి.. హరీ ● డీ హీరేహాళ్ మండలం నుంచి రోజూ వందల టిప్పర్లు కర్ణాటకకు ● రూ. కోట్లు కొల్లగొడుతున్న టీడీపీ నేతలు ● మైనింగ్ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంసాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇసుక మాఫియాకు రాయదుర్గం నియోజకవర్గం అడ్డాగా మారింది.ఎలాంటి దొంగ సరుకై నా సరే సరిహద్దు ఆవలకు వెళితే ఇక అడిగేవారుండరు. దీన్ని ఆసరాగా చేసుకుని రోజూ వందలాది టిప్పర్ల ఇసుక, మట్టి కర్ణాటకకు తరలిస్తున్నారు. ఏపీలో లభ్యమయ్యే ఇసుక నాణ్యతగా ఉండడంతో కర్ణాటకలో భారీ డిమాండ్ ఉంటుంది. దీంతో హగరి నదిలో 15 మీటర్ల వరకూ తవ్వి ప్రొక్లైన్ల ద్వారా టిప్పర్లలో ఎత్తి పంపిస్తున్నారు. టీడీపీ నేతల పాత్ర.. ఇసుక దందాలో టీడీపీకి చెందిన ముఖ్య నేతలు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలు స్తోంది. నేతల హస్తం లేకుండా రోజుకు 200కు పైగా టిప్పర్లు వెళ్లలేవు. దందాలో వచ్చే సొమ్ములో స్థానిక నేతలు, ముఖ్య నేతలు 50ః50 పద్ధతిలో పంచుకుంటున్నట్టు తెలుస్తోంది. రాత్రింబవళ్లు టిప్పర్లు జాతరను తలపిస్తున్నా అడిగేవారు కరువయ్యారు. స్థానిక నేతల భయానికి గ్రామస్తులు కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. మొలకల్మూరు కేంద్రంగా అక్రమాలు.. ఏపీ నుంచి వెళ్లే ఇసుకను కర్ణాటకలోని మొలకల్మూరు నియోజకవర్గంలో నిల్వ చేస్తున్నారు. డి.హీరేహాళ్ మండలంలోని కాదలూరు, బాదనహాళ్ నుంచి ఇసుక తీసుకుని మొలకల్మూరులో డంప్ చేస్తున్నారు. బాదనహాళ్ నుంచి 200 మీటర్ల లోపే ఏపీ బార్డర్ ముగుస్తుంది. మొలకల్మూరులోకి ఇసుక వెళ్లిందంటే ఇక ఏపీ పోలీసులు ఏమీ అనలేరు. అక్కడ నుంచి బళ్లారి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక టిప్పర్ ఇసుక ధర ఏపీలో రూ.20 వేలు ఉంటే కర్ణాటకలో రూ.70 వేల వరకూ అమ్ముతున్నారు. ఏడాదిగా వేదవతి హగరి నదుల్లో ఇసుకను తోడేళ్లలా తవ్వేస్తున్నా అడిగే నాథుడే లేరు. టీడీపీ నేతలకు ఇసుక వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరుగా మారిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. కర్ణాటక పోలీసుల దాడులు విచిత్రమేమంటే ఏపీ నుంచి తరలిపోయే ఇసుక టిప్పర్లను మన పోలీసులు పట్టుకోవడం లేదు. అయితే, కర్ణాటకలో ఇసుక రీచ్ల లైసెన్సులు తీసుకున్న వారు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఏపీ–కర్ణాటక సరిహద్దులో ఇసుక లారీలను పట్టుకున్నారు. కొన్నింటిపై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. ఏపీ నుంచి వచ్చే ఇసుకను నియంత్రించాలంటూ ఇక్కడి పోలీసులను కర్ణాటక పోలీసులు కోరినట్టు తెలిసింది. దీంతో రాయదుర్గం పోలీసుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇసుక దందాను నియంత్రిస్తే ‘పచ్చ’ నేతలకు కోపం.. మరోవైపు కర్ణాటక పోలీసుల ఒత్తిడి.. మధ్యలో ఏం చేయాలో తోచక తీవ్ర ఆలోచనలో పడినట్లు తెలిసింది. -
నైట్ డ్యూటీకి వెళ్లి.. మిస్టరీగా నర్స్ మృతి
అనంతపురం: నగరంలోని సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు దివ్య (22) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన వడ్డె దివ్య.. మూడేళ్లుగా సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అదే ఆస్పత్రికి చెందిన హాస్టల్లోనే ఉంటున్నారు. ఆరోగ్యం బాగోలేదని మంగళవారం రాత్రి తోటి నర్సులకు తెలిపి ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రించారు. బుధవారం మధ్యాహ్నమైనా ఆమె లేవలేదు. మధ్యాహ్నం షిఫ్ట్ నర్సులు వచ్చి పలుకరించినా స్పందన లేకపోవడంతో పల్స్ పరిశీలించారు. నాడి చిన్నగా కొట్టుకుంటుండడంతో వెంటనే సవేరా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, దివ్య మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
దళితులపై దాడి చేసిన వారిని శిక్షించండి
● వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆంజనేయులు డిమాండ్ గార్లదిన్నె: మండలంలోని పాత కల్లూరులో దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మంత్రి ఆంజనేయులు డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై బాధితులు, దళిత సంఘాల నాయకులతో కలసి బుధవారం గార్లదిన్నె పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న పాత కల్లూరులో మొహర్రం వేడుకలు సందర్భంగా దళిత సోదరులు అభి, సంతోష్ అలావ్ తొక్కుతుండగా అదే గ్రామానికి చెందిన కొందరు అడ్డుకుని దుర్భాషలాడారు. దళితులు తమ ముందు అలావ్ తొక్కరాదంటూ బెదిరింపులకు దిగారు. ఆ సమయంలో గ్రామపెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం రాత్రి చర్చల పేరుతో నాగార్జున, రాజు, రామయ్యతో పాటు మరో 8 మంది పాత కల్లూరులో ఉన్న అభి, సంతోష్ను పిలుచుకెళ్లి దాడి చేశారు. అడ్డుకోబోయిన సంతోష్ తల్లి సుగుణమ్మపై కూడా దాడి చేశారు. గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకుని క్షతగాత్రులను అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో శింగనమల నియోజకవర్గ ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు నాగరాజు, జైభీమ్ రామాంజనేయులు, పాత కల్లూరు ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు. కాగా, ఘటనకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ గౌస్మహమ్మద్ బాషా తెలిపారు. -
తేనె కోసమెళ్లి..
అమరాపురం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు. వివరాలు.. అమరాపురంలోని గాడి దొడ్డయ్య ఇంటి సమీపంలో ఉన్న చింత చెట్టులో ఉన్న తుట్టె నుంచి తేనెను సేకరించేందుకు బుధవారం అదే గ్రామానికి చెందిన యువకులు తిప్పేస్వామి (35), గిరీష్ సిద్ధమయ్యారు. చెట్టు ఎక్కి తేనె తుట్టె వైపుగా సాగుతుండగా చెట్టు మధ్యలో నుంచి వెళ్లిన విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలి షాక్కు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే తిప్పేస్వామి మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయపడిన గిరీష్కు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. -
ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజల పక్షమే
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అనంతపురం కార్పొరేషన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి వెళ్లనివ్వ కుండా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీసులను అడ్డంపెట్టుకుని వివాదాలకు తెరతీస్తోందని, ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మామిడి రైతులను పరామర్శించేందుకు వెళితే.. పోలీసులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, రైతులపై లాఠీచార్జ్ చేయడాన్ని బుధవారం ఓ ప్రకటనలో ఆయన ఖండించారు. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయని, ధాన్యం, పొగాకు, మిర్చి రైతులు..ఇప్పుడు మామిడి రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్నారని వాపోయారు. ఇలాంటి తరుణంలో మామిడి రైతుల పక్షాన నిలబడేందుకు వైఎస్ జగన్ వెళితే.. పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్నారు. పక్కా ప్లాన్తోనే ప్రభుత్వం, పోలీసులు జగన్ పర్యటనల్లో వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ వస్తున్నారని తెలియగానే రైతులు, నాయకులను బెదిరించారని, నోటీసులు జారీ చేశారని, జగన్ను కలిస్తే రౌడీషీట్లు తెరుస్తామని సాక్షాత్తు ఎస్పీ స్థాయి అధికారి బెదిరించడం చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలగకమానదన్నారు. తన వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదన్న ధోరణిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. ఎంత మందిపై కేసులు పెట్టినా ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. -
పెరటి కోళ్ల పెంపకంతో ఆదాయం
శింగనమల: పెరటి కోళ్ల పెంపకంతో మెరగైన ఆదాయాన్ని పొందవచ్చునని రైతులకు కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ మాధవి సూచించారు. శింగనమల మండలం సోదనపల్లిలో పెరటి కోళ్ల పెంపకంపై బుధవారం రైతులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేవికే ఆధ్వర్యంలో పంటల సాగు, కోళ్ల పెంపకం, పనిముట్లు, విలువ ఆధారిత పదార్థాల తయారీపై ఇస్తున్న శిక్షణ కార్యాక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువైద్యాధికారి డాక్టర్ కిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. పశు పోషణ, పశువుల ఆరోగ్యం కాపాడుకోవడం తదితర అంశాలపై చైతన్య పరిచారు. గొర్రెల సంరక్షణ చర్యలను వివరించారు. గొర్రెల పెపంకం దారులు మందలో పొట్టేలు మార్పిడి చేస్తుండడం వల్ల బ్రుసెల్లోసిస్ వ్యాధిని ఆధిగమించవచ్చునన్నారు. కార్యక్రమంలో పశు వైద్యులు శ్రీహర్ష, తిరుపాలరెడ్డి, రైతులు పాల్గొన్నారు. ఆగస్టు 21న స్టార్టప్ పోటీలు అనంతపురం: దివ్యాంగుల ఇంక్యుబేటర్ డీ హబ్ ఆధ్వర్యంలో హైడియాథన్ స్టార్టప్ పోటీలు నిర్వహించనున్నారు. ఆగస్టు 21న జరిగే ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్లను బుధవారం ఎస్కేయూలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ సి. చంద్రమౌళి, వీవ్ మీడియా ఈవెంట్ మేనెజ్మెంట్ కంపెనీ సీఈఓ కొప్పుల వసుంధర, డి హబ్ ఇంక్యుబేటర్ ప్రతినిధి సతీష్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులు, ఇన్నోవేటర్స్, స్టార్టప్ ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చునన్నారు. పోటీల్లో గెలిచిన వారికి ఫ్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డుతో పాటు రూ.లక్ష నగదు పురస్కారం, అఫ్ స్కిల్లింగ్, మెంటర్షిప్తో పాటు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు సూచించారు. ఓనర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు కొత్తచెరువు: యువకుడి మృతికి కారణమైన ఐచర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు కొత్తచెరువు పోలీసులు తెలిపారు. వివరాలను బుధవారం వెల్లడించారు. అనంతపురంలోని రాణినగర్లో నివాసముంటున్న పచ్చిపాల రామాంజినమ్మ కుమారుడు పి. రాజశేఖర్ (34).. అదే నగరానికి చెందిన ఐచర్ యజమాని అశోక్ వద్ద డ్రైవర్గా పనిచేసేవాడు. పోతలకుంట గ్రామ సమీపంలో జరుగుతున్న హంద్రీనీవా కాలవ పనులకు అవసరమైన జనరేటర్ను తన ఐచర్ వాహనంలో అమర్చి అశోక్ ఆద్దెకు ఇచ్చాడు. వాహనంతో పాటు డ్రైవర్ రాజశేఖర్ ఉన్నాడు. జనరేటర్ నిర్వహణకు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణుడిని ఏర్పాటు చేయాలిఉండగా ఇందుకు విరుద్ధంగా రాజశేఖర్తోనే ఆ పనులూ చేయిస్తూ వచ్చాడు. గత నెల 22న సాయంత్రం 5 గంటలకు జనరేటర్లో నీళ్లు పోయాలని రాజశేఖర్ను అశోక్ పురమాయించాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి జనరేటర్ రింగ్కు తగలడంతో రాజశేఖర్ కుడికాలు బొటన వేలు తెగిపడింది. చికిత్స కోసం తొలుత అనంతపురానికి అనంతరం కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 7న రాజశేఖర్ మృతి చెందాడు. ఘటనపై బుధవారం మృతుడి తల్లి రామాంజినమ్మ ఫిర్యాదు మేరకు ఐచర్ యజమాని అశోక్పై కేసు నమోదు చేసి,, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
‘మేడా’లో అడ్మిషన్.. జీజీహెచ్లో డెత్
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం సొంతం నిర్వహిస్తున్న మేడా నర్సింగ్ హోం నుంచి జీజీహెచ్కు రెఫర్ అయిన యువకుడు ఆర్థో వార్డులో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందంటూ మృతుడి కుటుంబీకులు దాదాపు ఆరు గంటలకు పైగా ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. వివరాలు.. ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్, లక్ష్మీదేవి దంపతులకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్న రెండో కుమారుడు రాజేష్ (22) బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో తన ఎడమ కాలు నొప్పిగా ఉందంటూ 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 3న మేడా నర్సింగ్ హోంకు వెళ్లి డాక్టర్ ఆత్మారాంను సంప్రదించారు. ఆ రోజు అడ్మిషన్లో ఉంచుకున్న అనంతరం ఇక్కడైతే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని, జీజీహెచ్కు వెళితే అక్కడ ఉచితంగా వైద్యం చేస్తారని డాక్టర్ ఆత్మారాం తెలిపి, సిఫారసు చేయడంతో 4న ఆగమేఘాలపై జీజీహెచ్లోని ఆర్థో విభాగంలో వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. ఎంఆర్ఐ స్కాన్ తీయించిన అనంతరం ఎడమ కాలులో చీము ఉన్నట్లు నిర్ధారించి, ఈ నెల 7న శస్త్రచికిత్స చేశారు. అనంతరం వైద్యులు కానీ, సిబ్బంది కాని పట్టించుకోక పోవడంతో రెండు రోజుల పాటు నొప్పి తాళలేక రాజేష్ విలవిల్లాడినట్లు తల్లి లక్ష్మీదేవి కన్నీటి పర్యతమయ్యారు. నొప్పి వచ్చినప్పుడల్లా పీజీ వైద్యులు పరీక్షించి ఓ టాబ్లెట్, ఇంజెక్షన్న్ఇచ్చి పడుకోబెట్టేవారని వివరించారు. బుధవారం ఉదయం టిఫిన్ తింటున్న సమయంలో రాజేష్ ఒక్కసారిగా కుప్పకూలాడు. విషయాన్ని వెంటనే డాక్టర్లకు తెలపడంతో వారు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారని వాపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు, కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే రాజేష్ మృతి చెందాడంటూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న అనంతపురం రెండో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని సర్ది చెప్పడంతో ఆందోళనను విరమించారు. మధ్యాహ్నం 2 గంటలకు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. సాయంత్రం పోస్టుమార్టం చేసి మృతుడి కుటుంబీకులకు అప్పగించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వివాదాస్పదంగా మారిన జీజీహెచ్ ఆర్థో వార్డులో యువకుడి మృతి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ 6 గంటలకుపైగా కుటుంబీకుల ఆందోళన దరిదాపులకు రాని సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం -
నేడు హెచ్చెల్సీకి నీటి విడుదల
బొమ్మనహాళ్: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి గురువారం ఎగువ కాలువ (హెచ్చెల్సీ)తో పాటు దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు టీబీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేయనున్నారు. దీనిపై గత నెల 27న బెంగళూరులోని విధానసౌధలో జరిగిన 124వ నీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్లో పంటల సాగుకు ఈ నెల 10 నుంచి నవంబర్ 30 వరకూ ఏపీ, కర్ణాటక ఇరు రాష్ట్రాల కోటా నీరు కలిపి దాదాపు 1,300 క్యూసెక్కులు వదలనున్నారు. కొత్త క్రస్టు గేట్ల ఏర్పాటు నేపథ్యంలో ఖరీఫ్కు మాత్రమే నీరివ్వనున్నారు. కొనసాగుతున్న ఇన్ఫ్లో బుధవారం కూడా తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో కొనసాగింది. ఈ క్రమంలో డ్యాం 16 గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి 45,280 క్యూసెక్కులు నదికి, మరో 7,400 క్యూసెక్కుల మేర కాలువలకు వదులుతున్నారు. మొత్తంగా ఇన్ఫ్లో 51,955 కూసెక్కులు, అవుట్ఫ్లో 52,678 క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయం ఎగువ పరివాహక ప్రాంతాలైన వరనాడు, శివమొగ్గ, మలేనాడు, ఆగుంబే, శృంగేరి, తీర్థనహళ్లి, కొప్పి, చిక్ మగళూర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. ప్రస్తుతం డ్యాంలో 1,633 అడుగులకు గాను 1,624.80 అడుగుల వద్ద 105.788 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను 75.837 టీఎంసీల నీరు ఉంది. ఉపాధ్యాయుడి బలవన్మరణం అనంతపురం సిటీ: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ఉపాధ్యాయుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... తాడిపత్రి సమీపంలోని బొడాయిపల్లికి చెందిన కుమ్మెత అంకిరెడ్డి (45)కి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పాక్షిక అంధత్వం కోటా కింద ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన ఆయన మొన్నటి వరకూ బుక్కరాయసముద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో తెలుగు పండిట్గా పనిచేశారు. గత నెల జరిగిన బదిలీల్లో భాగంగా అదే మండలం సిద్ధరాంపురం జెడ్పీహెచ్ఎస్కు బదిలీ అయ్యారు. అనంతపురంలోని విద్యుత్ నగర్ సర్కిల్ 3వ క్రాస్లో నివాసముంటూ రోజూ పాఠశాలకు విధులకు వెళ్లి వచ్చేవారు. మొదటి కుమారుడు జ్ఞానదీపరెడ్డి ఇంటర్ పూర్తి చేశాడు. రెండో కుమారుడు హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చదివించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మానసిక క్షోభకు గురైన అంకిరెడ్డి బుధవారం తెల్లవారుజామున ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యగా భావించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కాసేపటి తర్వాత కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అంకిరెడ్డిగా నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
కుదరని బేరం.. అంతులేని జాప్యం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిపై పీటముడి వీడటం లేదు. ఇటీవల నామమాత్రంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టిన చంద్రబాబు సర్కారు.. అనంతపురం మార్కెట్ యార్డు చైర్మన్గిరీని మాత్రం ఎవరికీ కట్టబెట్టలేదు. ఇదే క్రమంలో వారికీ, వీరికీ అంటూ పేర్లు లీక్ అవుతుండడంతో ‘తమ్ముళ్ల’లో అసంతృప్తి జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. చైర్మన్ రేసులో ఉన్నారంటూ తొలుత బల్లా పల్లవి పేరు తెరమీదకొచ్చింది. ఈమెను అధిష్టానం తిరస్కరించడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుడు కోనంకి గంగారాం పేరును పంపారు. ఈయన పేరునూ ఓకే చేయలేదు. తాజాగా నాగభూషణం పేరు వినిపిస్తోంది. ఈయన రెండేళ్ల క్రితం కమ్యూనిస్టు పార్టీ నుంచి టీడీపీలో చేరారు. ఇలాంటి వ్యక్తికి చైర్మన్గిరీ అప్పగిస్తున్నారంటూ ఊహాగానాలు వెలువడడంపై అసంతృప్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. టీడీపీలో అభ్యర్థులే కరువయ్యారా? అనంతపురం టీడీపీలో 20 ఏళ్లుగా జెండా మోస్తున్న వారున్నారు. వీళ్లను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులిస్తారా అంటూ ‘తమ్ముళ్లు’ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కొత్త అభ్యర్థిని తెరమీదకు తెచ్చినా తామందరం కష్టపడి పనిచేశామని, నేడు నామినేటెడ్ పోస్టులనూ వెలకట్టి అమ్ముకుంటున్నారని సీనియర్ టీడీపీ నాయకుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నాళ్లు జెండా మోసినా గుర్తించనప్పుడు పార్టీలో ఉండి ఏం చేయాలి అంటూ నిట్టూర్చారు. ‘స్థానిక’ ఎన్నికల వేళ గ్రూపుల గోల.. రాయలసీమలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుగా అనంతపురం మార్కెట్కు పేరుంది. అతిపెద్ద చీనీ మార్కెట్ కూడా ఇదే. వారం వారం వేలాదిగా పశు వుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అలాంటి మార్కెట్ యార్డు చైర్మన్ పోస్టు దక్కించుకోవాలని ఎంతోమంది ఆశగా ఉంటారు. కానీ డబ్బు ఎవరు ఎక్కువగా ఇస్తే వారికే పోస్టు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. దీంతో ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొన్ని నెలల్లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వేళ టీడీపీలో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. చాలామంది సీనియర్లు తమకు గుర్తింపు దక్కక పోవడంతో ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే శింగనమల ఎమ్మెల్యేపై మండల స్థాయి నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. అనంతపురం అర్బన్లో తాజాగా రెండు గ్రూపులు అయ్యాయి. రోజూ నువ్వా నేనా అంటూ కత్తులు దూసుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన ‘తొలి అడుగు–ఇంటింటికీ సుపరిపాలన’ కార్యక్రమం నామమాత్రంగా కూడా సక్సెస్ కాలేదు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలు ఎలా ఉంటాయో అంచనా వేయడానికే కష్టమంటూ ‘తమ్ముళ్లు’ వాపోతున్నారు. అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిపై పీటముడి ఆరు మాసాలుగా కాలయాపన పేర్ల లీక్తో తమ్ముళ్లలో పెల్లుబుకుతున్న అసంతృప్తి జ్వాలలు -
రైతన్నలపైనే రౌడీషీట్ తెరుస్తారా బాబూ?
అనంతపురం కార్పొరేషన్: సీఎం చంద్రబాబు రైతు వ్యతిరేకి అని, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో రైతులపై లాఠీచార్జ్ చేసిన ఘటనతో మరోసారి బాబు వికృత రాజకీయ క్రీడ బహిర్గతమైందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. రైతన్నలపైనే రౌడీషీట్ ఓపెన్ చేస్తారా చంద్రబాబూ? ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. బుధవారం అనంతపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మామిడికి గిట్టుబాటు ధర లేదని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన చేపడితే పోలీసులను అడ్డం పెట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తోతాపురి మామిడి కిలో రూ.22తో కొనుగోలు చేసేలా అప్పటి సీఎం జగన్ చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. చేతనైతే వైఎస్ జగన్తో పోటీ పడి మామిడి కిలో రూ.50 ధరతో కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టండి బాబూ అని సూచించారు. అంతేకానీ రైతులపై ఆంక్షలు విధిస్తే..వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అన్నం పెట్టే రైతులను బాధపెట్టే దుర్మార్గపు పాలనను కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మరచిపోవద్దన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చారో చెప్పాలన్నారు. వైఎస్ జగన్తో గేమ్స్ ఆడొద్దు బాబూ.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు సాకే శివశంకర్, ఓబులేసు పాల్గొన్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ -
బ్రిడ్జి నాణ్యత ప్రశ్నార్థకమే!
కణేకల్లు: హెచ్చెల్సీ ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. కొందరు కాంట్రాక్టర్లు నిబంధనలు తుంగలో తొక్కి పనులు చేస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే సెంట్రింగ్ పనులు నిబంధనలకు విరుద్ధంగా పూర్తి చేశారు. హెచ్చెల్సీకి నీరు వస్తే బ్రిడ్జిలు కూలిపోక తప్పదనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. మట్టి పరిచి.. స్లాబ్ వేసి కణేకల్లు మండలం నాగేపల్లి గ్రామ సమీపంలో 155 కిలోమీటర్ వద్ద శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జి గత ఏడాది కుప్పకూలిన విషయం తెలిసిందే. హెచ్చెల్సీ ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.20 కోట్లను మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించేలా చూడాల్సిన హెచ్చెల్సీ అధికారులు ఇందుకు విరుద్ధంగా కాలయాపన చేశారు. దీంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మరో వైపు పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయి. హెచ్చెల్సీకి నీటివిడుదల సమయం దగ్గరపడడంతో పనులు తొందరగా పూర్తి చేయాలంటూ అధికారులు ఒత్తిళ్లు మొదలు పెట్టారు. దీంతో కాంట్రాక్టర్ నిబంథనలకు పాతర వేస్తూ పనులు చేపట్టినా నోరు మెదపడం లేదు. బ్రిడ్జి స్లాబ్ వేయాలంటే ముందుగా సెంట్రింగ్ వర్క్ చేయాలి. స్కాఫ్ ఫోల్డింగ్ సెంట్రింగ్ వర్క్ చేసిన తర్వాత ఐరన్ వర్క్ చేయాల్సి ఉంది. అయితే ఇవేవీ చేయకుండానే స్కాఫ్ ఫోల్డింగ్ సెంట్రింగ్ స్థానంలో బ్రిడ్జికి మట్టి పరిచి సోమవారం స్లాబ్ కాంక్రీట్ పని పూర్తి చేశారు. ఏ స్లాబ్కై నా 28 రోజులు సెంట్రింగ్ ఉండాల్సిందే ఇళ్లయినా, ప్రభుత్వ భవనాలైనా స్లాబ్ వేస్తే టెక్నికల్గా 28 రోజులు సపోర్ట్గా సెంట్రింగ్ ఉంచాలి. మరీ అత్యవసరమైతే కనీసం 21 రోజులైనా సెంట్రింగ్ ఉంచాలి. అయితే ఇందుకు విరుద్ధంగా నాగేపల్లి బ్రిడ్జి సెంట్రింగ్ స్కాఫ్ ఫోల్డింగ్ సెంట్రింగ్ కాకుండా మట్టితో ఫిల్లింగ్ చేసి స్లాబ్ వేశారు. హెచ్చెల్సీకి 10వ తేది నీరు విడుదల చేస్తే కణేకల్లు ప్రాంతానికి 12వ తేదీ చేరుతాయి. ఈ క్రమంలో నీటి సరఫరాకు సెంట్రింగ్ కోసం వేసిన మట్టి అడ్డంకిగా మారనుంది. దీంతో అధికారులు మట్టిని కచ్చితంగా తొలగించాలి. మట్టి తొలగిస్తే సెంట్రింగ్ సపోర్ట్ లేక బ్రిడ్జి కూలిపోయే ప్రమాదముంది. ప్రస్తుతం ఈ అంశం రైతుల్లో చర్చనీయాంశమైంది. సెంట్రింగ్ తీసేస్తే... వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని 35 మీటర్ల పొడవు, 8.5 మీటర్ల వెడల్పుతో బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. 35 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జికి మధ్యలో పిల్లర్లు కూడా ఉన్నాయి. ఈ పిల్లర్లపై ఐరన్ బీమ్ వేశారు. సెంట్రింగ్ మట్టి తీసేస్తే ఐరన్బీమ్ సపోర్ట్తో స్లాబ్కు ఎలాంటి ముప్పు ఉండదని అధికారులు పేర్కొంటున్నా.. కచ్చితంగా బ్రిడ్జికి ముప్పేనని పలువురు సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 12 ఇంచుల (ఒక అడుగు) మందంతో వేసే కాంక్రీట్ స్లాబ్కు కనీసం సెంట్రింగ్ సపోర్ట్ 21 రోజులైనా ఉండాలని అంటున్నారు. అంతకు తక్కువ వ్యవధిలో సెంట్రింగ్ మట్టి తీసేస్తే బ్రిడ్జి వంగి పోతుందని పేర్కొంటున్నారు. డబ్బు మిగిల్చుకునేందుకేనా? స్కాఫ్ ఫోల్డింగ్ సెంట్రింగ్ వర్క్కు నిర్వాహకులు రూ.10లక్షలు అడిగినట్లు తెల్సింది. అంత ఖర్చు పెట్టే యోచన లేని కాంట్రాక్టర్ తన స్వలాభం కోసం స్కాఫ్ ఫోల్డింగ్ సెంట్రింగ్ను కాదని మట్టితో ఫిల్లింగ్ చేసి బ్రిడ్జి సెంట్రింగ్ పనులు పూర్తి చేశారు. ఈ విషయం తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సెంట్రింగ్ పనులు స్కాఫ్ ఫోల్డింగ్ మట్టితో కాలువ నింపి నాలుగు రోజుల క్రితం బ్రిడ్జి స్లాబ్ వేసిన వైనం నేడు హెచ్చెల్సీకి నీరు విడుదల అవకాశం ఇదే జరిగితే రెండు రోజుల్లో కణేకల్లు ప్రాంతానికి నీరు మట్టి తొలగిస్తే తప్ప ముందుకు సాగని నీరు మట్టి సపోర్ట్ తొలగిస్తే కూలనున్న బ్రిడ్జి -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి
బుక్కరాయసముద్రం: మండలంలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడి భయానక వాతావరణం సృష్టించారు. బుధవారం రాత్రి బీకేఎస్ మండలం చెన్నంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన మేరకు.. గ్రామంలో పీర్ల పండుగతో పాటు వైఎస్సార్ జయంతిని మంగళవారం అందరూ సంతోషంగా జరుపుకున్నారు. అయితే వైఎస్సార్ జయంతి వేడుకలను ఓర్వలేని టీడీపీ నాయకుడు మల్లికార్జునరెడ్డి, ఆయన అనుచరులు 25 మంది బుధవారం రాత్రి కట్టెలతో, కొడవళ్లతో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లపైకి దాడికి తెగబడ్డారు. దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు లక్ష్మీరెడ్డి, వెంకటరమణ, వెంకటస్వామి, నారాయణస్వామి, ఈశ్వరయ్య, వెంకటేశ్వరమ్మ, దాసన్నగారి బాబు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంనటే 108 అంబులెన్స్ ద్వారా అనంతపురంలోని జీజీహెచ్కు తరలించారు. విషయం తెలుసుకున్న శింగనమల నియోజవకర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ శైలజ నాథ్, పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంతరెడ్డి... జీజీహెచ్కుచేరుకుని బాధితులను పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
యువతి అనుమానాస్పద మృతి
అనంతపురం: నగరంలోని సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు దివ్య (22) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన వడ్డె దివ్య.. మూడేళ్లుగా సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అదే ఆస్పత్రికి చెందిన హాస్టల్లోనే ఉంటున్నారు. ఆరోగ్యం బాగోలేదని మంగళవారం రాత్రి తోటి నర్సులకు తెలిపి ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రించారు. బుధవారం మధ్యాహ్నమైనా ఆమె లేవలేదు. మధ్యాహ్నం షిఫ్ట్ నర్సులు వచ్చి పలుకరించినా స్పందన లేకపోవడంతో పల్స్ పరిశీలించారు. నాడి చిన్నగా కొట్టుకుంటుండడంతో వెంటనే సవేరా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, దివ్య మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు యాడికి: స్థానిక పంచాయతీ పరిధిలోని కొట్టాలపల్లిలో రెండు కుటుంబాల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకున్న ఘర్షణలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన మల్లికార్జున, రమేష్ ఎదురెదురుగా ఉన్న ఇళ్లలో నివాసముంటున్నారు. చిన్నపాటి గొడవ కారణంగా మంగళవారం ఇద్దరి మధ్య మాటామాట పెరిగి మల్లికార్జునపై రమేష్, సురేష్, ప్రశాంత్ దాడి చేశారు. గాయపడిన మల్లికార్జున ఫిర్యాదు మేరకు ముగ్గురిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పశువులు తరలిస్తున్న కంటైనర్ పట్టివేత రాయదుర్గం టౌన్: పశువులను తరలిస్తున్న కంటైనర్ను గోరక్షకదళ్, వీహెచ్పీ నాయకులు అడ్డుకుని పోలీసుకలు అప్పగించారు. బుధవారం సాయంత్రం ఓ కంటైనర్లో దాదాపు 20కి పైగా పశువులను అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించిన గో రక్షకదళ్ అధ్యక్షుడు ప్రశాంత్యాదవ్, వీహెచ్పీ నేతలు రాజేష్, మల్లికార్జున తదితరులు అనంతపురం ప్రధాన రహదారిలో రైల్వేగేటు వద్ద అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కంటైనర్ను స్వాధీనం చేసుకుని పీఎస్కు తరలించారు. బళ్లారి నుంచి అనంతపురానికి పశువులను తరలిస్తున్నట్లు డ్రైవర్ పేర్కొన్నట్లు తెలిపారు. చట్టవిరుద్దంగా తరలిస్తున్నందున కేసు నమోదు చేయాలని వీహెచ్పీ నాయకులు డిమాండ్ చేశారు. యువతి అదృశ్యం పెద్దవడుగూరు: మండలంలోని క్రిష్టిపాడు గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి మంగళవారం నుంచి కనిపించడం లేదు. పామిడి మండలం గజరాంపల్లి గ్రామం వద్ద ఉన్న గ్రీన్ గార్మెంట్స్లో పనిచేస్తున్న ఆమె.. మంగళవారం ఉదయం విధులకు బస్సుల్లో వెళ్లింది. సాయంత్రం ఇంటికి చేరుకోకపోవడంతో తల్లితండ్రులు ఆరా తీశారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
పనిముట్టును ఆయుధంగా చూపి కేసులా?
● పోలీసుల తీరుపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిటౌన్: పొలాల్లో ఉపయోగించే పనిముట్టును ఆయుధంగా చూపి వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు నమోదు చేస్తారా అని పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ అరెస్ట్లు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. మూడు రోజుల క్రితం పెద్దపప్పూరు మండలం వరదాయపల్లికి చెందిన ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు తాడిపత్రిలో కోర్టుకు హాజరయ్యేందుకు వస్తే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 3 రోజులు నిర్బంధించారన్నారు. పొలాల్లో ఉపయోగించే పనిముట్టును ఆయుధంగా పేర్కొని మారణాయుధం లభించిందంటూ కేసు నమోదు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సజ్జలదిన్నెలో వైఎస్సార్సీపీ కార్యకర్త సాయి లేకపోతే అతని ఆచూకీ తెలపాలని అతని బంధువును పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి నిర్బంధించినట్లు ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రాజేష్ను మారణాయుధం కలిగి ఉన్నాడని పోలీసులు నిర్బంధించారని పేర్కొన్నారు. జేసీ ప్రోద్బలంతోనే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇబ్బందులు పడుతున్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, బాధిత కుటుంబ సభ్యులతో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ఎవరి మెప్పు కోసమో పోయి భవిష్యత్తులో తిప్పలు పడొద్దని పెద్దారెడ్డి హితవు పలికారు. -
జిల్లా కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ
అనంతపురం: ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోలింగ్ను నిరసిస్తూ అనంతపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా అశోక స్థూపం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రాముడు, ఉపాధ్యక్షుడు ధర్మసింగ్ నాయక్, ట్రెజరర్ వెంకట రఘుకుమార్, సంయుక్త కార్యదర్శి జుబేర్, మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బడా నారాయణరెడ్డి, శ్రీకాంత్, భరత్ భూషణ్ రెడ్డి, అవ్వా సురేష్ తదితరులు మాట్లాడుతూ.. ట్రోలింగ్తో న్యాయ వ్యవస్థపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సైతం జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించనున్నట్లు తెలిపారు. -
ప్రభుత్వాలపై కార్మికుల కన్నెర్ర
అనంతపురం అర్బన్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని ఐక్య కార్మిక సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కార్మికులను బానిసలుగా చేస్తున్నాయని దుమ్మెత్తి పోశారు. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు, ఎనిమిది గంటల పని హక్కును కూటమి ప్రభుత్వం హరించే ప్రయత్నం చేస్తోందని విరుచుకుపడ్డారు. బుధవారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు కదం తొక్కారు. ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనంతపురంలోని కృష్ణ కళామందిర్ నుంచి టవర్క్లాక్, సప్తగిరి సర్కిల్, అంబేడ్కర్ విగ్రహం మీదుగా నగర పాలక సంస్థ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజారెడ్డి, నాగేంద్రకుమార్, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుసేన్పీరా, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, ఎస్యూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, అంగన్వాడీ వర్కర్ల సంఘం జిల్లా కార్యదర్శి రమాదేవి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పార్వతిప్రసాద్, పద్మావతి మాట్లాడారు. దేశ సంపదను కొల్లగొట్టిన 29 మంది కార్పొరేట్లలో 28 మంది గుజరాత్ వారేనని, వారంతా నరేంద్ర మోదీకి దత్తపుత్రులని విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులకు నష్టదాయకమైన నాలుగు కార్మిక్ కోడ్లను తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఎనిమిది గంటల పనివిధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానం, రాత్రి షిఫ్ట్ల్లోనూ మహిళలు పనిచేయాలని నిర్ణయించిందన్నారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్గౌడ్, సీఐటీయూ జిల్లా కోశాధికారి గోపాల్, వైఎస్సార్టీయూ నాయకులు అనిల్కుమార్ యాదవ్, సంపంగి రామాంజినేయులు, ప్రకాష్, రాజారత్నం తదితరులు పాల్గొన్నారు. -
హైరిస్క్ కేసులపై జాగ్రత్త వహించండి : డీఎంహెచ్ఓ
గార్లదిన్నె: హైరిస్క్ గర్భిణుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య సిబ్బందిని డీఎంహెచ్ఓ ఈ. భ్రమరాంబదేవి ఆదేశించారు. గార్లదిన్నె పీహెచ్సీని బుధవారం ఆమె తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. హైరిస్క్ గర్భిణులకు ప్రతి నెలా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ మంజుల, సీహెచ్ఓ లోక్నాథ్, హెల్త్ సూపర్వైజర్ నరసమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇరువర్గాలపై కేసు నమోదు
బొమ్మనహాళ్: మండలంలోని రెండు గ్రామాల్లో చోటు చేసుకున్న దాడులకు సంబంధించి ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు తెలిపారు. దాడులకు కేంద్రమైన బొమ్మనహాళ్ మండలం కొలగానహళ్లి, మైలాపురం గ్రామాల్లో రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహాళ్, కణేకల్లు, డి.హీరేహాళ్ ఎస్ఐలు నబీరసూల్, నాగమధు, గురుప్రసాద్రెడ్డితో కలసి మంగళవారం డీఎస్పీ పర్యటించారు. కొలగానహళ్లికి చెందిన అనంతరాజుపై జరిగిన దాడితో పాటు మైలాపురంలో, విజయకుమార్రెడ్డి ఇంటిపై జరిగిన దాడిపై స్థానికులతో ఆరా తీశారు. అనంతరాజుపై దాడి చేశారని ఆయన కొడుకులు, బంధువులు సోమవారం రాత్రి మైలాపురంలో తన ఇంటిపై దాడి చేశారని, ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు, కారు, ఇంట్లోని టీవీ, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని, గడ్డివామికి సైతం నిప్పు పెట్టారంటూ డీఎస్పీకి విజయ్కుమార్రెడ్డి కుటుంబ సభ్యులు వివరించారు. దాదాపు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం కలిగించారని వాపోయారు. విచారణ అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. మైలాపురంలో అనంతరాజుపై దాడికి పాల్పడిన విజయ్కుమార్రెడ్డి, లోకేష్రెడ్డిపై హత్యాయత్నం కేసు, విజయకుమార్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడి, ఆస్తి నష్టం కలిగించినందుకు అనంతరా , ఆయన కొడుకులు, బంధువులు దాదాపు 38 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రెండు గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రైల్వే రక్షణ కవచం
గుంతకల్లు: రైలు ప్రమాదాలు చోటు చేసుకునేందుకు ప్రధాన కారణం సిగ్నలింగ్ సమస్య. ఇప్పటి వరకూ జరిగిన ప్రమాదాల్లో అత్యధికంగా ఒకే లైనుపై రెండు రైళ్లు ఎదురెదురుగా దూసుకురావటం వల్ల చోటు చేసుకున్నవే ఉండడం బాధాకరం. ఈ తరహా ప్రమాదాలను నియంత్రించగలిగి ప్రయాణికుల భద్రతకు భరోసానిచ్చే దిశగా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రూపొందించిన ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఈఎస్)ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకువచ్చింది. కవచ్ అనే పేరుతో పిలువబడే టీసీఈఎస్ పనితీరును ఇప్పటికే క్షేత్ర స్థాయిలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజయవంతంగా పరీక్షించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం గుంతకల్లు–డోన్ సెక్షన్లో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దశల వారీగా గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. రక్షణ కవచం పని చేస్తుంది ఇలా.. కవచ్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా రైళ్లలో మెక్రో ప్రాసెసర్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ (జీపీఎస్), యాంటీ కొలిజన్ పరికరాలను రైలు ఇంజన్లో ఏర్పాటు చేస్తారు. వీటిని రైల్వే ట్రాక్లకు అనుసంధానిస్తారు. ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రతి స్టేషన్లో ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా రైలింజన్లోని కవచ్ యాంటీనాలు రేడియో ఫ్రీక్వెన్సీల స్వీకరిస్తూ వాటికి అనుగుణంగా పనిచేస్తుంటాయి. ప్రయాణంలో ఉండగా లోకో పైలెట్ రెడ్ సిగ్నల్ గుర్తించకపోవడం... సిగ్నల్ దాటి ముందుకెళ్లడం... పరిమితికి మించిన వేగంతో రైలు ప్రయాణించడం, రైలు వేగాన్ని లోకో పైలెట్ నియంత్రించలేకపోవడం తదితర సమస్యలు ఎదురైనప్పుడు కవచ్ వ్యస్థ స్వతంత్రంగా పనిచేయడం మొదలు పెడుతుంది. సిగ్నల్ జంప్ కాగానే వెంటనే లోకో పైటెల్ను అప్రమత్తం చేస్తుంది. బ్రేయ్లను నియంత్రిస్తుంది. నిర్ణీత దూరం లోపు అదే లైనులో మరో రైలును గమనించినప్పుడు స్వయం చాలకంగా రైలు కదలికను నిలిపివేస్తుంది. కి.మీ రూ.50 లక్షలు వ్యయం.. గుంతకల్లు డివిజన్ దాదాపు 1450 కి.మీ మేర విస్తరించి ఉంది. ఇందులో వాడి–రేణిగుంట, గుత్తి–ధర్మవరం, ధర్మవరం–పాకాల. పాకాల–కాట్పాడి, నంద్యాల–యర్రగుంట్ల, గుంతకల్లు–బళ్లారి సెక్షన్లలో దశల వారీగా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రసుత్తం గుంతకల్లు–డోన్ మధ్య ఉన్న 69 కి.మీలకు కి.మీకు రూ.50 లక్షలు చొప్పన దాదాపు రూ.345 కోట్లను రైల్వే శాఖ ఖర్చు చేసింది. ఈ మార్గంలో తిరిగే దాదాపు 20 నుంచి 30 రైలింజన్లో కవచ్ పరికరాలను ఏర్పాటు చేశారు. అలాగే వాడి–రేణిగుంట మధ్య 538 కి.మీల పరిధిలో ఉన్న 60 స్టేషన్లతో పాటు 200కు పైగా రైలింజన్ల్లో కవచ్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగా ఒకే లైనుపై ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రైళ్లు ఢీకొన్న ఘటనలు గతంలో చాలా చోట్ల జరిగాయి. ఆయా ఘటనల్లో పలువురు ప్రయాణికులు చనిపోవడంతో పాటు రైల్వేకు భారీ నష్టాలూ చేకూరాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతా చర్యల్లో భాగంగా రైళ్లు పరస్పరం ఢీకొనకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే శాఖ సమకూర్చుకుంది. దాని పేరే ‘కవచ్’. కవచ్ వ్యవస్థతో ఆటోమేటిక్గా ఆగిపోనున్న రైళ్లు ప్రస్తుతం గుంతకల్లు–డోన్ సెక్షన్ మార్గంలో ఏర్పాటు త్వరలో గుంతకల్లు డివిజన్లోని అన్ని సెక్షన్లలో ఏర్పాటుకు చర్యలు ప్రయాణికుల భద్రతే లక్ష్యం ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రైలు ప్రమాదాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగా కవచ్ లాంటి అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చాం. ప్రస్తుతం గుంతకల్లు – డోన్ సెక్షన్లో కవచ్ను ఏర్పాటు చేశాం. త్వరలో గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా అన్ని సెక్షన్లలో ఈ పరికరాలను ఏర్పాటు చేయనున్నాం. – చంద్రశేఖర్, సీనియర్ డీఎస్టీఈ, గుంతకల్లు -
వేపలపర్తిలో ప్రబలుతున్న అతిసారం
రాయదుర్గం టౌన్: బ్రహ్మసముద్రం మండలం వేపలపర్తి గ్రామంలో అతిసార వ్యాధి విజృంభిస్తోంది. గ్రామానికి చెందిన నలుగురు మహిళలు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ సోమవారం ఇద్దరు మహిళలు, మంగళవారం సాయంత్రం మరో ఇద్దరు మహిళలు రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి చేరారు. బాధితుల్లో లీలావతి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. నీట మునిగి ఇద్దరు రాజస్థానీల మృతి కళ్యాణదుర్గం రూరల్: ప్రమాదవశాత్తు నీట మునిగి రాజస్థాన్కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజస్థాన్కు చెందిన జుట్టూ(22), భగత్సింగ్(25), సురేష్ బతుకు తెరువు కోసం కళ్యాణదుర్గం వలస వచ్చి ఉడ్వర్క్ షాప్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం కళ్యాణదుర్గం మండలం పాపంపల్లిలోని వెంకటేష్ బాబు తోటలోకి వెళ్లి, అక్కడ బొప్పాయి పండ్లను ఆరగించిన అనంతరం చేతులు శుభ్రం చేసుకునేందుకు నీటి ట్యాంక్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు జుట్టూ కాలు జారి ట్యాంక్లో పడ్డాడు. గమనించిన భగత్సింగ్ వెంటనే ట్యాంక్లోకి దిగాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగిపోయారు. సురేష్, స్థానిక రైతుల నుంచి సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి యువకుల మృతదేహాలను వెలికి తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పంచాయతీల పురోగతి సూచికపై నేడు శిక్షణ అనంతపురం సిటీ: పంచాయతీల పురోగతి సూచిక 2.0 అంశంపై అనంతపురంలోని డీపీఆర్సీ భవన్లో ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణా తరగతులకు ఉమ్మడి జిల్లాలోని అధికారులు హాజరు కానున్నారు. ఒక్కో మండలం నుంచి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ శిక్షణకు హాజరు కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పటికే అన్ని మండలాల అధికారులకు పంపినట్లు జెడ్పీ వర్గాలు వెల్లడించాయి. -
చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్ట్
అనంతపురం: ఇళ్లలోకి ప్రవేశించి బంగారు నగలు, సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు అపహరిస్తున్న విక్కీ అలియాస్ షామీర్తో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేస్తున్న ఫరూక్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం రెండో పట్టణ పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ శ్రీకాంత్ యాదవ్ వెల్లడించారు. గుజరాత్లోని సూరత్కు చెందిన సలీం కుమారుడు మాదిరి కర్రి విక్కీ అలియాస్ షామీర్ (20) తన ఆరేళ్ల వయసులోనే పారిపోయి అనంతపురానికి చేరుకున్నాడు. అప్పట్లో విజయనగర కాలనీలోని అనాథ ఆశ్రమంలో ఉంటూ రాజేంద్ర మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఈ క్రమంలోనే చిల్లర దొంగతనాలు చేస్తూ రాత్రి సమయాల్లో ఇళ్లలోకి చొరబడి చోరీలు చేయడం ప్రవృత్తిగా మార్చుకుని, చివరకు దొంగతనాల్లో రాటుదేలాడు. 2024, నవంబర్లో అనంతపురంలోని విద్యుత్ నగర్ సర్కిల్లో ఉన్న ఇంట్లోకి వారం వ్యవధిలో రెండు సార్లు చొరబడి రెండు బంగారు గాజులు అపహరించాడు. అలాగే ఈ ఏడాది జూన్లో ఓ యమహా బైక్, గోవాలో ఐ ఫోన్, ఆపిల్ ల్యాప్టాప్ను అపహరించాడు. ఆయా కేసుల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ప్రనస్నాయపల్లి రైల్వే గేటు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న షామీర్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వరుస చోరీలు వెలుగుచూశాయి. గతంలో చోరీ చేసిన సొత్తుతో పాటు పలు సందర్భాల్లో అపహరించిన 8 సెల్ఫోన్లు, రెండు ల్యాప్టాప్లను రికవరీ చేశారు. అలాగే నాలుగు సెల్ఫోన్లను కొనుగోలు చేసిన ఫరూక్ అరెస్ట్ చేసి నాలుగు సెల్ఫోన్లను రికవరీ చేశారు. ఇద్దరి నుంచి రికవరీ చేసిన మొత్తం ఆరు తులాల బంగారు గాజులు, 12 సెల్ఫోన్లు, రెండు ల్యాప్టాప్లు, ఒక స్కూటీ విలువ రూ.12 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీసీఎస్ సీఐ వలిబాషా, జయపాల్రెడ్డి, టూ టౌన్ సీఐ శ్రీకాంత్యాదవ్, ఎస్ఐ రుష్యేంద్రబాబును ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. నిందితుల్లో ఒకరు గుజరాత్లోని సూరత్ నివాసి ఆరేళ్ల వయసులోనే అనంతకు చేరుకున్న వైనం రూ.12 లక్షల విలువైన సొత్తు రికవరీ -
టీడీపీ ట్రోల్స్పై న్యాయవాదుల ఆగ్రహం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిని లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సాగిస్తున్న ట్రోల్స్పై జిల్లా న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ట్రోల్స్ను ఖండిస్తూ బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షుడు గురుప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిపై జరుగుతున్న ట్రోలింగ్ను న్యాయవ్యవస్థపై దాడిగా అభి వర్ణించారు. సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తిపైనే ట్రోలింగ్ చేస్తే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రోలింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రెండు రోజుల పాటు న్యాయవాదులు విధులు బహిష్కరించాలని బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బడా నారాయణరెడ్డి, శ్రీకాంత్, భరత్భూషణ్ రెడ్డి, అవ్వా సురేష్ తదితరులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు బార్ అసోసియేషన్ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో బుధ, గురువారం న్యాయవాదులు విధులు బహిష్కరించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు విధుల బహిష్కరణ -
జిల్లా అంతటా సంబరంగా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు
అనంతపురం కార్పొరేషన్: రైతు బాంధవుడు, మహానేత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు మంగళవారం జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాడవాడలా వేడుకలు నిర్వహించారు. ‘జోహార్ వైఎస్సార్’ అంటూ నివాళులర్పించారు. రక్తదానం, అన్నదానం, దుస్తుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి నిర్వహించారు. మొదట వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పార్టీ కార్యాలయ ఆవరణలోనే యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ చొరవతో 135 మంది రక్తదానం చేశారు. అనంతరం జెడ్పీ కార్యాలయ ఆవరణలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆరోగ్య శ్రీ, 108, 104, పావలా వడ్డీ తదితర పథకాలను ప్రవేశపెట్టి పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచారని కొనియాడారు. ఫీజు రీయింబర్స్మెంట్తో పేద కుటుంబాల్లో విద్యా వెలుగులు నింపారన్నారు. మైనార్టీలకు రిజర్వేషన్ అందించి వారి జీవితాలను బాగుపరిచారన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, పార్టీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యుడు రమేష్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు అశ్వర్థ నాయక్ పాల్గొన్నారు.● శింగనమల నియోజకవర్గంలో మాజీ మంత్రి, పార్టీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల గుండెచప్పుడు వైఎస్సార్ అని, విద్య, వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించారన్నారు. ఇవాళ ఎంతో మంది ఉన్నత కొలువులు సాధించారంటే అది వైఎస్సార్ చలువేనన్నారు. కార్యక్రమంలో మాజీ సమన్వయకర్త వీరాంజినేయులు, నాయకులు పూల ప్రసాద్, వంశీ గోకుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.● కళ్యాణదుర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్ మెమోరియల్ పార్క్లో మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తలారి రంగయ్య మాట్లాడుతూ పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేలా వైఎస్సార్ చర్యలు చేపట్టారన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్సీ మంగమ్మ, మునిసిపల్ చైర్మన్ తలారి రాజ్కుమార్, పార్టీ నాయకులు తిప్పేస్వామి, ఉమామహేశ్వర్ నాయుడు పాల్గొన్నారు.● రాయదుర్గంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.● తాడిపత్రిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత, నాయకులు ఫయాజ్బాషా తదితరులు పాల్గొన్నారు.● గుంతకల్లులో నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి (వైవీఆర్) ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేసుకున్నారని వైవీఆర్ కొనియాడారు. మునిసిపల్ చైర్పర్సన్ భవాని, వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వర బాబు తదితరులు పాల్గొన్నారు.● ఉరవకొండలో వైఎస్సార్ సీపీ నాయకుల ఆధ్వర్యంలో రాజన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.● రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఐడీసీ మాజీ చైర్మన్ బుక్కచెర్ల నల్లప్పరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కురుబ నాగిరెడ్డి, గోపాల్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి లింగారెడ్డి తదితరులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.వెఎస్సార్ జయంతి సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యుడు రమేష్గౌడ్ ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి ముందు 108, 104 ఉద్యోగులకు దుస్తులు పంపిణీ చేశారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ కాలనీ సమీపాన ఉన్న రాకేష్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేశారు. గుత్తి ప్రభుత్వాసుపత్రికి పార్టీ జిల్లా నేత బళ్లారి రాజ్కుమార్రెడ్డి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను వితరణ చేశారు. అనేక చోట్ల రక్త, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. -
అక్కడ చదివి ఉంటే ఇక్కడ కష్టమే!
అనంతపురం: హరిత అనే విద్యార్థినికి ఏపీఈఏపీ సెట్లో ఎనిమిది వేల ర్యాంకు వచ్చింది. సర్టిఫికెట్ల అప్లోడ్లో నాన్ లోకల్గా నమోదు చేశారు. పొరపాటున నాన్లోకల్గా నమోదు చేశామని, లోకల్గా మార్పు చేయాలని జేఎన్టీయూ (అనంతపురం) హెల్ప్లైన్ సెంటరుకు వచ్చారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని నారాయణ జూనియర్ కళాశాలలో చదివినందున నాన్లోకల్ కిందకే వస్తారని, తెలంగాణలో ఇంటర్ చదివిన వారిని నాన్లోకల్గా పరిగణించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు ఇచ్చిందని తెలిపారు. ఈ నిబంధన వల్ల మంచి కళాశాలలో ఇంజినీరింగ్ సీటు కోల్పోవడమే కాక.. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత లేదని తెలుసుకుని హరిత ఆవేదనతో వెనక్కి వెళ్లిపోయారు. ఇలా వేలాది మంది విద్యార్థులు తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీఈఏపీ సెట్–2025లో గణనీయమైన ర్యాంకులు సాధించిన వారికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిబంధనలు శాపంగా మారాయి. మంచి కళాశాలలో సీటు రాని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన ఏపీ విద్యార్థులను నాన్లోకల్గా పరిగణించడమే ఇందుకు కారణం. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆంధ్రప్రదేశ్లో చదివినప్పటికీ, ఇంటర్మీడియట్ ఒక్కటి తెలంగాణలో చదివినా నాన్ లోకల్గా పరిగణిస్తున్నారు. దీంతో మంచి కళాశాలలో సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. నాన్ లోకల్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వర్తించదు. ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్లో చదివిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. దీంతో హైదరాబాద్లో ఇంటర్ చదివిన వేలాది మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏపీ విద్యార్థులు హైదరాబాద్లో ఏటా 50 వేల నుంచి 70 వేల మంది దాకా ఇంటర్ పూర్తి చేస్తుండడం గమనార్హం. ఇందులో ఉమ్మడి జిల్లా విద్యార్థులు మూడు వేల మంది దాకా ఉంటున్నారు. టాప్ 15లోపు ఉంటేనే సీటు! నాన్లోకల్ కేటగిరీలోకి వస్తే మంచి కళాశాలలో సీటు పొందడం కష్టమే. ఒక కళాశాలలో వంద ఇంజినీరింగ్ సీట్లు ఉంటే 50 శాతం ఓపెన్ కేటగిరీకి కేటాయిస్తారు. ఇందులో నాన్లోకల్ అభ్యర్థులు టాప్ 15లోపు ఉంటేనే సీటు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణలో ఇంటర్ చదివి ఏపీ ఈఏపీసెట్ రాస్తే నాన్లోకల్ కింద సీటు ఇస్తారు. తెలంగాణ ఈఏపీసెట్ రాసిన ఏపీ విద్యార్థులకూ అక్కడ ఇదే నిబంధన వర్తిస్తోంది. ఇటు ఆంధ్రాలోనూ.. అటు తెలంగాణలోనూ నాన్ లోకల్ కిందే పరిగణిస్తుండడంతో తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులు నష్టపోతున్నారు. 2024 వరకు ఇబ్బంది లేని పరిస్థితి ఏపీ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని, ఉమ్మడి విద్యా వ్యవస్థ ఉండేవి. తెలంగాణలో చదివినా, ఏపీలో చదివినా లోకల్గానే పరిగణించేవారు. 2024 నుంచి ఈ నియమం తొలగించారు. దీంతో తెలంగాణలో చదివిన ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య ఏర్పడింది. వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివించారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ రాకుండా పోతే ఇంజినీరింగ్ చదివించడం కష్టం అవుతుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఏపీలో ఇంజినీరింగ్ అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేలా చూడాలని తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణలో ఇంటర్ చదివిన ఏపీ విద్యార్థులను ఇక్కడ నాన్ లోకల్గా పరిగణింపు ఏపీఈఏపీసెట్లో గణనీయమైన ర్యాంకు వచ్చినా.. మంచి కళాశాలలో సీటు కష్టసాధ్యమే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రాని పరిస్థితి ఏటా 70 వేల మంది దాకా ఏపీ విద్యార్థులు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ పూర్తి -
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
తాడిపత్రి టౌన్: స్థానిక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాల్గొనే అవకాశముందని, పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ కార్యకర్తలు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న పోలీసులు యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో పెద్దారెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఇందుకు సంబంధించిన నోటీసును ఆయనకు యల్లనూరు ఎస్ఐ రామాంజనేయులు రెడ్డి అందజేశారు. దీంతో తన ఇంట్లోనే వైఎస్సార్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళలర్పించారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ.. బూటకపు హమీలతో అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు.. రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తాడిపత్రిలో అధికారపార్టీ నాయకులు విచ్చలవిడిగా దొంగతనాలు, గంజాయి, మట్కా దందా జోరుగా సాగిస్తున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలతో గత ప్రభుత్వం పేదలకు వెన్నుగా నిలిచిందన్నారు. సంక్షేమ పథకాలంటే ఇప్పటికీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డినే ప్రజలు గుర్తుకు చేసుకుంటారన్నారు. ఏడాది కూటమి పాలనపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. ఫలితంగా రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్సీసీ విజయం ఖాయమని, సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఈశ్వరరెడ్డి, మల్లికార్జునరెడ్డి, వెంకటేష్, భాస్కరరెడ్డి, రాజకుళ్లాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తన నివాసంలోనే వైఎస్సార్కు నివాళులర్పించిన కేతిరెడ్డి -
రెక్కీ నిర్వహించి.. గొలుసు అపహరణ
రాప్తాడు రూరల్: రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించిన అనంతరం ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును యువకుడు లాక్కొని ఉడాయించాడు. వివరాలు.. శింగనమల మండలం శివపురం గ్రామానికి చెందిన రమణయ్య, పద్మావతి దంపతులు కక్కలపల్లికాలనీ పంచాయతీ పరిధిలోని నందమూరినగర్లో స్థిరపడ్డారు. సొంతూరిలో ఉన్న భూముల్లో భర్త వ్యవసాయం చేస్తున్నాడు. పద్మావతికి గుండె శస్త్రచికిత్స జరగడంతో వ్యవసాయ పనులకు వెళ్లలేక కళ్యాణదుర్గం ప్రధాన రహదారి పక్కనే ఓ బంకు ఏర్పాటు చేసుకుని కూల్డ్రింక్స్, స్నాక్స్ విక్రయిస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఓ యువకుడు వచ్చి బంక్ వద్ద దాదాపు గంట పాటు కూర్చొని వెళ్లాడు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో అదే యువకుడు మరోమారు వచ్చి సిగరెట్ తీసుకుని తాగాడు. 2.30 గంటల వరకు అక్కడే కూర్చున్నాడు. అనంతరం నీళ్లు అడగడంతో ఇచ్చేందుకు పద్మావతి ఫ్రిజ్ తెరుస్తుండగా ఒక్క ఉదుటన వెనుక నుంచి నోటిని గట్టిగా అదిమపెట్టి మెడలో ఉన్న బంగారు చైనును లాక్కొని, ఆమెను గిరాటేసి వెళ్లిపోయాడు. ఈ హఠత్పరిణామంతో కాసేపటి వరకూ ఆమె కోలుకోలేక పోయింది. చైన్స్నాచింగ్కు పాల్పడిన యువకుడు ఎలాంటి బెదురు లేకుండా నింపాదిగా నడుచుకుంటూ వెళ్లడం విశేషం. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
టీడీపీ నాయకుల బరి తెగింపు
● వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై వేటకొడవళ్లతో దాడి ● విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు గోపి తలకు లోతైన గాయం బ్రహ్మసముద్రం: మండలంలో టీడీపీ నేతలు బరితెగించారు. కక్షకట్టి ఎర్రప్ప దొడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు గొల్ల గోపి, కార్యకర్త బాలకృష్ణపై వేటకొడవళ్లతో దాడి చేశారు. బాధితుడు గోపి తెలిపిన మేరకు... మంగళవారం సాయంత్రం తన పొలంలో మొక్కజొన్న పంటకు నీరు పెడుతుండగా టీడీపీకి చెందిన డీలర్ కృష్ణమూర్తి, అతని అనుచరులు గోవిందు, నాగరాజు, తిప్పేస్వామి, రాజప్ప, ఎర్రిస్వామి, మైలారీ తదితరులు వేటకొడవళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఘటనలో గోపి తలకు లోతైన గాయమైంది. బాలకృష్ణకూ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుటుంబ సభ్యులు హుటాహుటి కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలించారు. -
వైఎస్సార్సీపీ నేత సోదరి కట్టడం కూల్చివేత
తాడిపత్రి రూరల్: స్థానిక పెన్నానది ఒడ్డున వైఎస్సార్సీపీ నాయకుడు అయూబ్ బాషా సోదరి చేపట్టిన ఇంటి నిర్మాణాన్ని అనధికార కట్టడం పేరుతో మంగళవారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అన్ని అనుమతులు ఉన్నా... కేవలం అన్న వైఎస్సార్సీసీ నాయకుడనే అక్కసుతోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా తాడిపత్రిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మంగళవారం తెల్లవారుజాము 6 గంటలకే హిటాచీతో అక్కడకు చేరుకున్న టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత, ఇతర అధికారులు, సిబ్బంది దౌర్జన్యంగా కట్టడాన్ని కూల్చివేశారు. టౌన్ప్లానింగ్ అధికారి సుజాత మాట్లాడుతూ... రోడ్డును 5 మీటర్లు ఆక్రమించారని, సెట్బ్యాక్ లేకపోవడం, ప్లాన్కు వ్యతిరేకంగా నిర్మాణం చేపట్టినందుకు కట్టడాన్ని కూల్చివేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని అయూబ్ బాషా వాపోయారు. జలధి ఉత్సవంలో ఘర్షణ గుంతకల్లు రూరల్: మండలంలోని తిమ్మాపురంలో సోమవారం రాత్రి జరిగిన పీర్ల జలధి ఉత్సవంలో ఘర్షణ చోటు చేసుకుని ఇద్దరు గాయపడ్డారు. గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన మేరకు.. పీర్లను జలధికి తరలిస్తున్న సమయంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో పది నిమిషాల్లో ఉత్సవం ముగుస్తుందనగా.. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు యువకుల మధ్య చిన్నపాటి గొడవ మొదలైంది. ఒకరికొకరు తోడవడంతో గొడవ పెద్దదైంది. ఆంజనేయులు గౌడ్, నాగరాజు గౌడ్ తాలూకు యువకుడు గొడవలో ఉండటంతో వారు సర్ధి చెప్పేందుకు మధ్యలోకి వెళ్లారు. అదే సమయంలో మాటామాట పెరిగి యువకులు బొజ్జయ్య, అనిల్, ఆనంద్, కుమార్ నేరుగా ఆంజనేయులు గౌడ్, నాగరాజు గౌడ్పై దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రులను కుటుంబ సభ్యులు వెంటనే గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
సచివాలయ బది‘లీలలు’
● న్యాయం కోసం కలెక్టర్కు ఉద్యోగుల ఫిర్యాదు ● వ్యవసాయ, పోలీసు శాఖల్లో అడ్డగోలు వ్యవహారం ● వ్యవసాయ శాఖలో తారస్థాయిలో అక్రమాలు ● వారమవుతున్నా ఫిర్యాదుపై ఎటూ తేల్చని వైనం ● సత్వర పరిష్కారంతోనే బాధితులకు ఊరట అనంతపురం అర్బన్: ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మెరిట్ (ర్యాంక్) ఆధారంగా బదిలీలు నిర్వహించాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా రాజకీయ సిఫారసులకు తలొగ్గారు. ఫలితంగా స్థానాల కేటాయింపులో అర్హులైన ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగింది. దీంతో బాధిత ఉద్యోగులు న్యాయం కోసం కలెక్టర్ వినోద్కుమార్కు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారిలో అత్యధికంగా వ్యవసాయ శాఖ పరిధిలోని అగ్రికల్చర్ అసిస్టెంట్లు, పోలీసు శాఖ పరిధిలోని మహిళ సంరక్షకులు (మహిళ పోలీసు) ఉన్నారు. సిఫారసులకే పెద్దపీట వ్యవసాయశాఖలో సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఓ ప్రహసనంలా సాగిందనే అరోపణలున్నాయి. బదిలీల ప్రక్రియలో అగ్రికల్చర్ అసిస్టెంట్లకు మెరిట్ ఆధారంగా కాకుండా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు తొలి ప్రాధాన్యతనివ్వడం విమర్శలకు తావిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలో 2వ ర్యాంకు, ఉమ్మడి జిల్లాలో 5వ ర్యాంక్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ సుస్మితకు, అదే జిల్లాలో 3వ ర్యాంకు, ఉమ్మడి జిల్లాలో 6వ ర్యాంక్ ఉన్న జనార్ధన్కు.. దివ్యాంగుల కోటా కింది శిరీష్.. వారు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కాకుండా అధికారులకు తమకు ఇష్టమొచ్చిన చోటికి పోస్టింగ్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. వీరు కోరిన ఆప్షన్లను వీరి తర్వాతి ర్యాంకు వారికి కట్టబెట్టినట్లుగా తెలిసింది. ఇదే తరహాలో చాలా మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లకు అధికారులు ఇష్టానుసారంగా పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఎటూ తేల్చని అధికారులు బదిలీల ప్రక్రియలతో తమకు అన్యాయం జరిగిందంటూ కలెక్టర్కు ఈ నెల 2న అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతే కాక కలెక్టర్ను వారు ఇప్పటికి మూడుసార్లు కలసి న్యాయం చేయాలని కోరారు. ఇక 4న కలెక్టర్కు మహిళ సంరక్షకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వారం రోజులవుతున్నా అధికారులు ఎటూ తేల్చలేదని బాధిత అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిలీవ్ కావాలని మరోవైపు అధికారుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమయ్యాయని వాపోతున్నారు. సత్వర పరిష్కారంతోనే ఊరట అందిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. సత్వర పరిష్కారంతోనూ బాధితులకు న్యాయం చేకూరుతుంది. అయితే సచివాలయ ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఆ దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం. -
నెల్లూరుపై కడప విజయం
అనంతపురం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడామైదానం వేదికగా అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సీనియర్ మల్టీ డే క్రికెట్ మ్యాచ్లో నెల్లూరుపై కడప జట్టు విజయం సాధించింది. అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య మ్యాచ్ డ్రా అయింది. వివరాలు.. మూడో రోజు ఓవర్నైట్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులతో బ్యాటింగ్కు వచ్చిన అనంతపురం జట్టు 90 ఓవర్లలో 377 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో రంజీ క్రీడాకారుడు మచ్చా దత్తారెడ్డి 196 బంతుల్లో 9 సిక్సర్లు, 16 ఫోర్లతో 164 పరుగులు చేశారు. చిత్తూరు రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. జట్టులో బ్యాటర్ ధ్రువ 48 బంతుల్లో రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 81 పరుగులు, మరో బ్యాటర్ మోనిష్ 64 పరుగులు సాధించారు. కాగా, అనంతపురం జట్టుపై మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యత ప్రదర్శించిన చిత్తూరు జట్టుకు మూడు పాయింట్లు, అనంతపురం జట్టుకు ఒక పాయింటు దక్కింది. రెండో మైదానంలో నెల్లూరు జట్టుతో తలపడిన కడప జట్టు 5 వికెట్లతో విజయం సాధించి ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 179 పరుగులు ఆరు వికెట్ల నష్టానికి బ్యాటింగ్ చేపట్టిన నెల్లూరు జట్టు 215 పరుగులకు ఆలౌట్ అయింది. నెల్లూరు బ్యాటర్ రేవంత్ రెడ్డి 76 పరుగులు సాధించాడు. 259 పరుగుల లక్ష్యాన్ని కడప జట్టు సునాయసంగా ఛేదించింది. కేవలం 43.1 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. కడప బ్యాటర్లు ధ్రువ 103 బంతుల్లో మూడు సిక్సర్లు, 10 ఫోర్లతో 101 పరుగులు చేసి విజయానికి తోడ్పాటునందించాడు. కడప బౌలర్లు శ్రీకాంత్ 5 వికెట్లు, ఆశిష్ రెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. అనంతపురం, చిత్తూరు మ్యాచ్ డ్రా -
జన హృదయ నేత వైఎస్సార్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఒక పథకం దేశం కాదు ప్రపంచం దృష్టినే ఆకర్షించడం సామాన్య విషయం కాదు. ఏకంగా ప్రపంచబ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వంటి సంస్థలు ఆరోగ్యశ్రీని పొగిడాయంటే ఈ పథకం ఎలాంటిదో అంచనా వేయొచ్చు. ఆరోగ్యశ్రీ.. ఈ పథకం పేరు వినగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి గుర్తుకు వస్తారు. దేశవ్యాప్తంగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా పథకాల రూపకర్తగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీ పురుడు పోసుకుంది అనంతలోనే 2004 సంవత్సరానికి ముందు ఉమ్మడి అనంతపురం జిల్లా అత్యంత కరువు ప్రాంతం. పదిరూపాయలు పెట్టి వైద్యం కూడా చేయించుకోలేని దుస్థితి. ఇలాంటి సమయంలో మొదటి దశలో అనంతపురం జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఇక్కడే పథకం పురుడు పోసుకుంది. అనంతపురంతో పాటు మహబూబ్నగర్, శ్రీకాకుళంలో ఒకేరోజు ఈ పథకాన్ని ప్రారంభించారు. 168 వ్యాధులతో ప్రారంభమైన ఈ పథకం తర్వాత 958 చికిత్సలకు వైద్యం అందించింది. ఈ పథకం ద్వారా పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం పొందారు. పుట్టుకతోనే చెవిటి మూగ ఉన్న పిల్లలకు ఒక్కొక్కరికి రూ.6 లక్షలు వెచ్చించి కాక్లియర్ ఇంప్లాంట్స్ వేయించిన ఘనత వైఎస్సార్దేనని అందరికీ తెలిసిందే. 108, 104 పథకాలు... ఆపదలో నేనున్నానంటూ కుయ్ కుయ్మంటూ వచ్చే 108 వాహనాల రూపకర్తా వైఎస్సారే. ప్రమాదంలో గాయపడి నిస్సహాయ స్థితిలో ఉండే వేలాదిమందికి ఈ వాహనాలే ప్రాణభిక్ష పెట్టాయి. రాత్రనకా పగలనకా ఏ సమయంలో పిలిచినా పలికే ఈ వాహనాల పథకాన్ని వైఎస్సార్ సృష్టించారు. ఈ పథకం ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ అమలు చేశాయి. వైద్య సలహాల కోసం 104 పథకాన్నీ రూపొందించారు. 104కు ఫోన్ చేస్తే చాలు వైద్య సలహాలు అందేవి. వైఎస్సార్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్, పంట రుణాల మాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రజలు ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. దార్శనికుడు వైఎస్సార్ జిల్లాలో కరువు నివారణలో భాగంగా సాగు – తాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. 2004లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక తాగునీటి పథకంగా ఉన్న హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టును సాగునీటి ప్రాజెక్టుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లోనే ఫేజ్–1కు రూ.1,305 కోట్లు, ఫేజ్–2కు రూ.1,880 కోట్లు విడుదల చేశారు. ఆయన హయాంలోనే ఫేజ్–1 పనులను పూర్తి చేశారు. ఫేజ్–2 పనులు 60శాతం మేర పూర్తి చేశారు. 2008 నుంచి ఏటా హంద్రీ–నీవా ద్వారా కృష్ణాజలాలు జిల్లాకు వస్తున్నాయి. అలాగే తుంగభద్ర ఎగువ కాలువ ప్రాజెక్టు ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాలోని కణేకల్లు వరకు కర్ణాటక పరిధిలో హెచ్చెల్సీ ఉంటుంది. అక్కడి నుంచి హెచ్ఎల్ఎంసీ, జీబీసీ, మిడ్పెన్నార్ సౌత్, నార్త్ కెనాల్ ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఇదిలా ఉంటే ఆనాడు కరువు పరిస్థితులతో తాగునీళ్లో రామచంద్రా అనే పరిస్థితులు జిల్లాలో ఉండేవి. కిలోమీటర్ల మేర దూరంలోని వ్యవసాయబోర్ల నుంచి తాగునీటిని తెచ్చుకునే వారు. నేడు జిల్లాలో శాశ్వతంగా తాగునీటి ఇబ్బందులు తొలగిపోయావంటే అది మహానేత వైఎస్సార్ చలవే అని చెప్పుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీఏబీఆర్ రిజర్వాయర్ నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా ఉరవకొండ నియోజకవర్గం నుంచి హిందూపురం వరకు తాగునీటిని అందించారు. అనంతపురం నగరానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తాగునీటి పథకాన్ని తీసుకొచ్చారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారానే జిల్లాలో 60 శాతానికి పైగా జనాభాకు నేడు తాగునీటి సరఫరా జరుగుతోంది. భవిష్యత్లో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పీఏబీఆర్కు తుంగభద్ర జలాశయం నుంచి 10 టీఎంసీలు ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేశారు. తుంగభద్ర నుంచి కేసీ కెనాల్ వాటా నీటిని పోతిరెడ్డి పాడు నుంచి తీసుకుంటూ... కేసీ కెనాల్ వాటా పీఏబీఆర్కు మళ్లించారు. దామాషా ప్రకారం ఏటా సగటున 4 టీఎంసీలకు పైగా అదనపు జలాలు వస్తున్నాయి. లక్షలాది మందికి పునర్జన్మనిచ్చిన ఆరోగ్యశ్రీ అనంతరం 108, 104 పథకాలు అమల్లోకి తెచ్చిన మహానేత కరువుతో అల్లాడుతున్న సమయంలో అనంతకు వైఎస్ ఆసరా జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చింది వైఎస్సారే రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో ఊరట అద్భుత పథకాల ఆవిష్కర్త డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి నేడు జన హృదయ నేత వైఎస్సార్ ప్రజల మనిషి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన మరణించినా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు. కష్ట కాలంలో రుణమాఫీతో పాటు రుణాలు సరిగా చెల్లించిన తమలాంటి వారికి చేయూతనిచ్చారు. మా కుటంబానికి రూ.లక్ష దాకా అప్పట్లో రుణ ఉపశమనం లభించింది. కృష్ణా జలాలను అందించి కరువును పారదోలారు. ప్రతి నీటి బొట్టులోనూ వైఎస్ కనిపిస్తారు. – మేడాపురం గాండ్ల అశ్వర్థనారాయణ, చిన్నబోయనపల్లి, కొత్తచెరువు మండలం -
ఈఏపీ సెట్ అభ్యర్థులకు ‘హెల్ప్లైన్’
అనంతపురం: ఏపీ ఈఏపీ సెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థుల సందేహాల నివృత్తికి అనంతపురంలోని జేఎన్టీయూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జేఎన్టీయూలో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ సురేష్ బాబును, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ జయచంద్రా రెడ్డిని సంప్రదించవచ్చు. రెండు వేల ఎకరాల్లో ఉద్యాన మొక్కలు నాటాలి అనంతపురం అర్బన్: ఈ నెలాఖరులోగా జిల్లావ్యాప్తంగా రెండు వేల ఎకరాల్లో ఉద్యాన మొక్కలు నాటాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. హార్టికల్చర్ ప్లాంటేషన్, పీటీఎం 2.0పై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్లాంటేషన్ లక్ష్యం మేరకు ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ నెల 10న చేపట్టనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 2.0లో సాక్షులుగా సచివాలయ సిబ్బంది రిజిస్ట్రేషన్, విద్యాసంస్థలకు కావాల్సిన మొక్కల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డ్వామా పీడీ సలీమ్బాషా పాల్గొన్నారు. వెల్లువెత్తిన వినతులు పామిడి: పట్టణంలోని జగన్నాథ పద్మావతి కన్వెన్షన్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రీసర్వే సమస్యలు, పేదల ఇళ్ల స్థలాల ఆక్రమణ, టిడ్కో ఇళ్ల రద్దు, భూవివాదాలు, విద్యుత్ సమస్యలు తదితర వాటిపై 567 అర్జీలు అందాయి. టిడ్కో ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల బ్యాంకు రుణాలు రద్దు చేయించాలని, పేదలకు మూడు సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలు ఇవ్వాలని, రూ.5 లక్షల యూనిట్ వ్యయంతో ఇళ్లు నిర్మించాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేసు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కే రహీమ్తో పాటు పలువురు పేదలు కలెక్టరుకు విన్నవించారు. విద్యుత్ చార్జీల తగ్గింపుతో పాటు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును విరమించుకోవాలన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ స్థలం, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. పామిడి కమ్యూనిటీ ఆసుపత్రికి 50 పడకలను కేటాయించాలన్నారు. బదిలీల కౌన్సెలింగ్ త్వరగా చేపట్టాలని సచివాలయ నర్సులు అర్జీ సమర్పించారు. ఇక్కడ అందిన వినతులను గడువులోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివన్నారాయణశర్మ, డీఆర్వో మలోల, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సి.షర్మిల పాల్గొన్నారు. -
పంటల బీమా ప్రీమియం చెల్లించండి
అనంతపురం సెంట్రల్: ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోకుండా 2025 సంవత్సరానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) పునర్మించిన వాతావరణ పంటల బీమా (ఆర్డబ్ల్యూసీఐఎస్) పథకాలను అమలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. ఖరీఫ్లో సాగు చేసిన ఆహార, నూనె గింజల పంటలన్నింటికీ బీమా వర్తిస్తుందన్నారు. ఖరీఫ్లో ప్రీమియం 2 శాతం, రబీ కాలంలో ప్రీమియం 1.5 శాతం మాత్రమే రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాణిజ్య ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలన్నారు. రైతు కట్టగా మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సగం సగం చొప్పున భరిస్తాయని పేర్కొన్నారు. దిగుబడి ఆధారంగా కంది పంటను గ్రామం యూనిట్గా, వరి జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండు మిరప పంటలను మండలం యూనిట్గా పరిగణిస్తారని తెలిపారు. వేరుశనగ, పత్తి, ఉద్యాన పంటలైన దానిమ్మ, బత్తాయి, టమోట, అరటి పంటలకు మండలాన్ని యూనిట్గా తీసుకొని వాతావరణ బీమాను లెక్కిస్తారని చెప్పారు. కంది పంటకు హెక్టారుకు రూ.200, వరికి రూ.410, జొన్నకు రూ.210, మొక్కజొన్నకు రూ.330, ఆముదంకు రూ.200, ఎండు మిరప రూ.1400 చెల్లించాలన్నారు. అలాగే రైతులు వేరుశనగకు హెక్టారుకు రూ.1600, పత్తి రూ.1600, దానిమ్మకు రూ.9,375, చీనీకి రూ. 6,875, టమాట రూ.4 వేలు, అరటికి హెక్టారుకు రూ.7,500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వ్యక్తిపై హత్యాయత్నం బొమ్మనహాళ్: మండలంలోని మైలాపురంలో కొలనగాహళ్లికి చెందిన అనంతరాజు అనే వ్యక్తిపై సోమవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. గ్రామస్తుల వివరాలమేరకు.. అనంతరాజు మైలాపురానికి సోమవారం రాత్రి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన లోకేష్, విజయ్.. అనంతరాజు బైక్ను ధ్వంసం చేసి అతనిపైనా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అనంతరాజును బళ్లారి విమ్స్కు తరలించారు. పరిస్ధితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే బాధితుని బంధువులు మైలాపురానికి చేరుకోవడంలో ఉద్రిక్తత నెలకొంది. లోకేష్, విజయ్ల ఇళ్లలోకి వెళ్లి తలుపులు, టీవీ, సామగ్రిని పగలకొట్టి, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక కారును ధ్వంసం చేసి గడ్డివాముకు నిప్పు పెట్టారు. పోలీసులు గ్రామంలో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బత్తలపల్లిలో పీర్ల భేటీ తిలకించేందుకు విచ్చేసిన ప్రజలుబత్తలపల్లిలో పీర్ల భేటీ ● నలుమూలల నుంచి తరలివచ్చిన జనం ● పీర్ల భేటీని తిలకించి పరవశించిన వైనం -
నీట్లో ప్రతిభ
అనంతపురం: నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ )– 2025 రాష్ట్రస్థాయి ర్యాంకులు సోమవారం ప్రకటించారు. అనంతపురం నగరానికి చెందిన సునీత, బిక్షంరెడ్డి దంపతుల కుమారుడు బానాల చేతన్రెడ్డి నీట్లో గణనీయమైన ర్యాంకు సాధించాడు. జాతీయస్థాయిలో 1615వ ర్యాంకు, స్టేట్ ర్యాంకు 83 దక్కించుకున్నాడు. మంచి ర్యాంకు సాధించిన చేతన్రెడ్డిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అభినందించారు. తల్లిదండ్రుల సహకారంతోనే నీట్లో రాణించినట్లు చేతన్రెడ్డి తెలిపారు. అలాగే అనంతపురం నగరానికి చెందిన సురేష్, పద్మ సువర్ణ దంపతుల కుమారుడు అవ్వా సాయి వంశీ నీట్లో జాతీయస్థాయి 3,780వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 170వ ర్యాంకు సాధించారు. సురేష్ అనంతపురంలో సీనియర్ న్యాయవాది. డాక్టర్ పద్మ సువర్ణ జేఎన్టీయూ అనంతపురంలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. మంచి డాక్టర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నదే తన లక్ష్యమని సాయి వంశీ తెలిపారు. -
ఉపాధి, ఇసుకలో ‘తమ్ముళ్ల’ దోపిడీ
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే..టీడీపీ నాయకులు మాత్రం ఉపాధి హామీ పథకంలో అవినీతి, ఇసుక అక్రమ రవాణాతో రెండు చేతులా అక్రమార్జనకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ విమర్శించారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆయన సోమవారం అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకంలో పని చేసిన కూలీలకు అన్యాయం జరుగుతోందన్నారు. ‘శ్రామికుల శ్రమ’ అని పలికే పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం తదితర ప్రాంతాల్లో ఫొటోలను మార్పులు చేసి ఉపాధి పథకంలో అవినీతికి పాల్పడ్డారంటూ అందుకు సంబంధించి ఆధారాలను మీడియాకు చూపారు. ఈ అక్రమాలను గ్రామ సర్పంచ్ ప్రశ్నిస్తే గతంలో చేసిన పనులను పెండింగ్లో ఉంచి టీడీపీ నాయకులు పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మస్టర్లలో లేని వారికి ఫీల్డ్ అసిస్టెంట్ల కనుసన్నల్లో డబ్బులిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. విచారణ చేస్తున్నామని బుక్కరాయసముద్రం ఎంపీడీఓ చెబుతున్నారని, అందులో ఏ మేరకు నిజాలు నిగ్గు తేలుతాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఉపాధి పథకంలో జిల్లా అంతటా అవినీతి జరుగుతోందని, పాత పనులకే అడ్డగోలుగా బిల్లులు చేస్తున్నారని, వీటిపై కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. యథేచ్ఛగా ఇసుక దోపిడీ అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, యల్లనూరు, రాయదుర్గం, ఉల్లికల్లు, కళ్యాణదుర్గం, శింగనమల తదితర ప్రాంతాల్లో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోందన్నారు. చిన్న జలాలపురం, నిదనవాడలో టీడీపీ నాయకులు సవాళ్లు విసురుతూ ఇసుకను తోడేస్తున్నారన్నారు. ఇసుకను ఇలా తోడేస్తూ పోతే భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడిందన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను, న్యూట్రల్ గొంతులను అణచి వేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందని విమర్శించారు. మిర్చి, మొక్కజొన్న, పసుపు, వరి, పొగాకు, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆ పార్టీకి చెందిన వ్యక్తినే హత్య చేయాలని చూసినట్లు వారే చెబుతున్నారన్నారు. అదేవిధంగా కళ్యాణదుర్గం స్టాంపు డ్యూటీ కుంభకోణంలో అధికార పార్టీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారని గుర్తు చేశారు. కలెక్టర్, ఎస్పీ ఆలోచించాలి జిల్లాలో దళితులపై అకృత్యాలు పెరిగాయని, అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయని, వీటిపై కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, ఎస్పీ జగదీష్ ఆలోచించాల్సిన అవసరం ఉందని శైలజానాథ్ సూచించారు. ఏడుగుర్రాలపల్లిలో సామూహిక అత్యాచారానికి గురైన మైనర్ బాలికకు న్యాయం జరగడం లేదన్నారు. జిల్లాలో మద్యం బెల్టుషాపు లేని ఊరంటూ లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు దాదు, నాయకులు ఉదయ్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకుల అక్రమాలపై విచారణ చేపట్టాలి మాజీ మంత్రి సాకే శైలజానాథ్ -
పరిశోధనా కేంద్రానికి స్థల పరిశీలన
తాడిపత్రి రూరల్: 50 ఎకరాల్లో అరటి టిష్యూకల్చర్ పరిశోధన కేంద్రం ఏర్పాటుపై సోమవారం మండలంలోని తలారి చెరువు, భోగసముద్రం గ్రామాల పరిధిలోని స్థలాలను కలెక్టర్తో పాటు బీబీఎస్ఎస్ఐ టీం ప్రతినిధులు పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న భారతీయ బీచ్ సహకారి సమితి (బీబీఎస్ఎస్ఐ) తాడిపత్రి ప్రాంతంలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రెండు గ్రామాల్లో పరిశోధన కేంద్రానికి అవసరమైన భూమి, నీటి వనరులను పరీక్షించి ఒక గ్రామాన్ని ఎంపిక చేయనున్నారు. రెండు గ్రామాల పరిధిలోని స్థలాలను కలెక్టర్ వినోద్కుమార్, బీబీఎస్ఎస్ఐకి చెందిన ప్రతినిధులకు పారిస్ దేశాయ్, జయప్రకాష్, తివారిలతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అనంతపురం: నగరంలోని కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డులో లక్ష్మీ టిఫెన్ సెంటర్ ఎదురుగా సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన వి. ఈశ్వరయ్య (54) రోడ్డు దాటుతుండగా , గుర్తు తెలియని స్కూటీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి రాయదుర్గంటౌన్: పట్టణంలోని రాయదుర్గం – మొలకాల్మూరు రైలు మార్గంలో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బేల్దారి చాంద్బాషా (25) మృతి చెందాడు. పట్టణంలోని గ్యాస్ గౌడోన్ ఏరియాకు చెందిన చాంద్బాషా కుటుంబ ఆర్థిక సమస్యలతో రైలు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం బళ్లారి ఓపిడీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ కృష్ణమూర్తి తెలిపారు. వేసవి శిక్షణ ప్రారంభం ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలో సత్యసాయి విద్యా సంస్థలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, మానవతా విలువలు అన్న అంశంపై శిక్షణ ఇస్తున్నారు. సోమవారం సాయంత్రం ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు రామ కథ పేరుతో ఆధ్యాత్మిక సంగీత విభావరి నిర్వహించారు. -
వడ్డీ వ్యాపారుల దాష్టీకం
● వడ్డీ చెల్లింపు ఆలస్యమైనందుకు బంగారు వ్యాపారిపై భౌతిక దాడి అనంతపురం: నగరంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు శ్రుతిమించాయి. వడ్డీ చెల్లింపు కాస్త ఆలస్యమైనందుకు బంగారు వ్యాపారిపై భౌతిక దాడి చేశారు. విచక్షణారహితంగా బూతులు తిడుతూ నడిరోడ్డుపైనే కాలితో తన్నుతూ కింద పడేసి కొట్టారు. దీంతో బాధితుడితో పాటు మరికొందరు బంగారు వ్యాపారులు స్థానిక వన్టౌన్ పోలీసుస్టేషన్కు చేరుకుని వడ్డీ వ్యాపారుల దాష్టీకాలపై ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం పాతూరుకు చెందిన తిరుపాల్ వద్ద బంగారు వ్యాపారి బాబ్జాన్ రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. వంద రూపాయలకు నెలకు రూ.10 చొప్పున వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. ఇలా ఇప్పటిదాకా దాదాపు రూ.10 లక్షలు వడ్డీ రూపంలో చెల్లించాడు. ఈ నెల కొంచెం ఆలస్యమైంది. దీంతో తిరుపాల్, అతని కుమారులు సూరి, శేషు ముగ్గురూ కలిసి వడ్డీ సరైన సమయానికి చెల్లించకపోతే ఎలా రా అంటూ విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడే ఉన్న కొంత మంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా..వారిపైనా దాడికి తెగబడ్డారు. దీంతో దాదాపు వంద మంది బంగారు వ్యాపారులు వన్టౌన్ పోలీసు స్టేషన్ వద్దకు వెళ్లారు. వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను భరించలేకపోతున్నామని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వడ్డీ డబ్బులు సకాలంలో ఇవ్వకపోతే భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు మహిళలను కూడా వేధిస్తున్నారని వాపోయారు. వారి ఫిర్యాదు మేరకు తిరుపాల్, అతని కుమారులు సూరి, శేషు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఇన్చార్జ్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపారు. -
కొనసాగుతున్న వరద
తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 52,566, అవుట్ఫ్లో 61,677 క్యూసెక్కులు ఉంది. 19 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని నదికి వదులుతున్నారు. జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భక్తజన సంద్రమైన గూగూడు ● మార్మోగిన కుళ్లాయిస్వామి నామస్మరణ ● కనుల పండువగా అగ్ని గుండ ప్రవేశం, జలధి కార్యక్రమం ● మొహర్రం వేడుకల్లో కీలకఘట్టం పరిసమాప్తం 8లో -
34 ఏళ్ల తర్వాత భేటీకి వచ్చిన పీర్లు
మొహర్రం ఉత్సవాల్లో 34 ఏళ్ల తర్వాత ధర్మవరం మండలం మల్కాపురం పీర్లు భేటీ కోసం బత్తలపల్లికి వచ్చాయి. గతంలో మండలంలోని 24 గ్రామాల పీర్లు వెంకటగారిపల్లి సత్రం వద్ద భేఠీ అయ్యేవి. 1992లో అక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం వల్ల భేటీకి కొన్ని గ్రామాల పీర్లు వెళ్లడం లేదు. అప్పటి నుంచి మల్కాపురం పీర్లు కూడా భేటీకి వెళ్లడం లేదు. ఇప్పడు బత్తలపల్లి కూడలిలో సోమవారం జరిగిన భేటీకి ఆ గ్రామానికి చెందిన పీర్లు రావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మల్కాపురంలో గ్రామోత్సవం అనంతరం పోట్లమర్రికి చేరుకున్న పీర్లకు ఇక్కడ పీర్లు ఘనస్వాగతం పలికి భేటీ తీసుకున్నారు. అక్కడ నుంచి బత్తలపల్లి కూడలికి రెండు గ్రామాలకు చెందిన పీర్లు తరలివచ్చాయి. -
జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం
అనంతపురం కార్పొరేషన్: జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం.. అందుకు కార్యకర్త నుంచి నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నారై కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆయన సోమవారం నగరానికి వచ్చారు. దీంతో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలూరు సాంబశివారెడ్డిని గజమాల, పుష్పగుచ్ఛాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం కల్పించినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. పార్టీ అనుబంధ విభాగాల బలోపేతానికి, సంస్థాగత నిర్మాణాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ నేతల సహకారంతో ముందుకెళ్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆలూరు సాంబశివారెడ్డిని కలసిన వారిలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి, పామిడి వీరాంజినేయులు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంగంపేట గోపాల్రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులునాయక్, ఎంపీపీ రాఘవరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు విజయప్రతాప్రెడ్డి, రఘునాథ్రెడ్డి, నరేంద్రనాథ్రెడ్డి, శ్రీరామిరెడ్డి, ఈశ్వర్రెడ్డి, పాలే జయరాం నాయక్, ఎగ్గుల శ్రీనివాసులు, వెన్నపూస రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి -
‘కలుషిత నీరు కలకలం’పై విచారణ
గుంతకల్లు: పట్టణంలో కలుషిత నీరు తాగి పలువురు అస్వస్థతకు గురైన అంశంపై అధికారులు విచారణ చేపట్టారు. గుంతకల్లులోని 11వ వార్డులో శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనపై ‘కలుషిత నీరు కలకలం’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ప్రజారోగ్యశాఖ ఎస్ఈ రామ్మోహన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహమ్మద్ స్పందించారు. ఆదివారం ఉదయం మున్సిపల్ అధికారులతో కలసి వారు 11వ వార్డులోని సాయికృష్ణ ఆస్పత్రిలో సమీపసంలోని వీధిలో పర్యటించారు. కలుషిత నీటి సరఫరాపై వివరాలు ఆరా తీశారు. ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా తీశారు. అటు నుంచి నేరుగా మున్సిపల్ కమిషనర్ చాంబర్కు చేరుకుని అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సమ్మర్ సోర్టేజ్ ట్యాంకులను క్రమం తప్పకుండా తనిఖీ చేయడంతోపాటు అక్కడ చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. పైపులైన్ లీకేజ్లతోపాటు మురికి కాలవలో ఉన్న తాగునీటి పైపులైన్ గుర్తించి వాటిని మార్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరు ప్రైవేట్ ప్లాంట్ల నిర్హాకులు సరఫరా చేసిన ప్యూరిఫైడ్ నీటిని తాగిన వారున్నారని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలిపారు. ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డీఈ షబానా, ఏఈ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఫిల్టర్బెడ్స్ పరిశీలన గుంతకల్లు టౌన్: స్థానిక తిలక్నగర్లో కలుషిత నీరు తాగి పలువురు ఆస్పత్రి పాలైన నేపథ్యంలో ఆదివారం ఉదయం పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రామ్మోహన్రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. తిలక్నగర్లో కొళాయి ద్వారా సరఫరా అయిన నీటిలో నాణ్యతా పరీక్షలు చేపట్టగా, నీరు కలుషితం కాలేదని తేలినట్లు వెల్లడించారు. అనంతరం సమ్మర్స్టోరేజీ ట్యాంక్లో నీటినిల్వలతో పాటు ఫిల్టర్బెడ్స్ను పరిశీలించారు. ఈఎల్ఎస్ఆర్ ట్యాంకు నుంచి సేకరించిన నీటిని పరీక్షల నిమిత్తం కర్నూలులోని మెడికల్ కళాశాల ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. ల్యాబ్ రిపోర్టు రాగానే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహమ్మద్, ఎంఈ ఇంతియాజ్, ఇతర అధికారులు ఉన్నారు. -
యువకుడిపై కత్తితో దాడి
హిందూపురం: స్థానిక సత్యసాయి నగర్లో పాత కక్షల కారణంగా యువకుడు నూర్ మహమ్మద్ కత్తి పోట్లకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రాఖీబ్ అలియాస్ టోక్రా కత్తితో దాడి చేయడంతో ముఖం, గొంతుపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. కాగా, గతంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారని, కొంతకాలంగా విభేధాలతో కక్షలు పెంచుకున్నట్లు తెలిసింది. దాడి చేసిన అనంతరం రాఖీబ్ నేరుగా వన్టౌన్ పీఎస్కు చేరుకుని లొంగిపోయినట్లు సమాచారం. -
ఊపందుకున్న నార్ల పెంపకం
బొమ్మనహాళ్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పరిధిలోని ఆయకట్టు భూముల్లో ముందస్తు నార్ల పెంపకం ఊపందుకుంది. ఈ నెల 10 తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీటి విడుదలపై ఇప్పటికే టీబీ బోర్డు అధికారులు స్పష్టత ఇవ్వడంతో జిల్లాలో మిరప, వరి పైర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో హెచ్చెల్సీ పరిధిలో బోరు బావుల కింద నార్ల పెంపకం చేపట్టారు. బొమ్మనహాళ్, కణేకల్లు, డి.హీరేహాళ్తో పాటు కర్ణాటకలోని బళ్లారి జిల్లా పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు దేవగిరి క్రాస్, దేవగిరి, బెంచికొట్టాలు, కణేకల్లు క్రాస్, ఉంతకల్లు గ్రామాల్లో నర్సరీలు, పొలాల్లో బోర్ల కింద ముందస్తుగా మిరప నార్లు పోసేందుకు పోటీ పడుతున్నారు. పెరుగుతున్న నార్ల ధరలు మార్కెట్లో రైతుల డిమాండ్ను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు విత్తన ధరలను అమాంతం పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం వివిధ కంపెనీలకు చెందిన మిరప విత్తనాలు డిమాండ్ను బట్టి కిలో రూ.25 వేల నుంచి రూ. లక్ష వరకు ధర పలుకుతున్నాయి. బ్యాడిగ మిరప విత్తనాల కోసం రైతులు కర్ణాటకలోని బ్యాడిగ పట్టణానికి వెళ్లి కిలో రూ. 900 చొప్పున మిరప కాయలను కొనుగోలు చేసి విత్తనాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరికొందరు రైతులు విడపనకల్లు మండలం వేల్పుమడుగు, ఆర్ కొట్టాల గ్రామాల్లో రైతుల వద్ద నుంచి బ్యాడిగ, డీలెక్స్, డబ్బీ కాయలను స్ధానికంగానే కిలో రూ. 700 నుంచి రూ. 900 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. బొమ్మనహాళ్, కనేకల్లు మండలాల్లో హెచ్చెల్సీ కింద వరి పంట సాగు ఎక్కువగా ఉన్నందున వరి నార్లకు భారీగా డిమాండ్ నెలకొంది. బీపీటీ సోనా, ఎన్ఎల్ఆర్, ఆర్ఎన్ఆర్ రకాలకు చెందిన వరి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు కర్ణాటకలోని కంప్లి వద్ద ఉన్న వసికేరి క్యాంపు నుంచి వరి విత్తనాలను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం 30 కిలోల విత్తనం రూ. 1,450 ధర పలుకుతోంది. ఇక స్ధానికంగా రైతులు పండించిన బీపీటీ సోనా 70 కిలోల విత్తనమైతే రూ.3,200, ఎల్ఎల్ఆర్ రూ.3,800, ఆర్ఎన్ఆర్ రూ.3,800 వరకు ధర పలుకుతున్నాయి. పత్తి విత్తనాలు కూడా 450 గ్రాములు రూ. 900 నుంచి రూ. వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. మొక్కజొన్న విత్తనాలు నాలుగు కిలోలు రూ.1,600 నుంచి రూ. 1,800 వరకు అమ్ముడు పోతోంది. ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీ విత్తనాలు కూడా సక్రమంగా పంపిణీ కాక పోవడంతో రైతులు బహిరంగ మార్కెట్కు వెళ్లి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో క్వింటా వేరుశనగ విత్తన కాయలు రూ.6,800 వరకు ధర పలుకుతోంది. సెంటు స్ధలం అద్దె రూ.700 బోర్లు లేని రైతులు బోరుబావులు ఉన్న రైతుల వద్ద ముందస్తుగా నార్లు పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సెంటు స్థలం, నీటికి రూ.700 అద్దె చెల్లిస్తున్నారు. ముందస్తుగా వరి నార్లు పెంచుకుటే రైతులకు 40 రోజుల నీరు ఆదా అవుతుంది. హెచ్చెల్సీకి నీరు అందగానే వరి, మిరప నార్లు వేసుకునేందుకు ఉపయోగపడుతుంది. మిరప, వరి నార్లకు పెరిగిన డిమాండ్ 10న హెచ్చెల్సీకి నీటి విడుదల రైతులు జాగ్రత్త వహించాలి విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు చాలా జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్లు వద్దనే విత్తనాలు కొనుగోలు చేయడంతో పాటు అందుకు తగిన రసీదును తీసుకోవాలి. కర్ణాటకలో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలి. – సాయికుమార్, వ్యవసాయాధికారి, బొమ్మనహాళ్ -
టీబీ డ్యాంకు కొత్త శోభ..
విద్యుద్దీపాల వెలుగులో తుంగభద్ర జలాశయంబొమ్మనహాళ్: తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో టీబీ డ్యాం కొత్త శోభ సంతరించుకుంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోనే డ్యాం 19 క్రస్ట్ గేట్లను పైకెత్తి నీటిని నదికి వదులుతున్నారు. ఆదివారం 54,815 క్యూసెక్కులు నదికి, 6 వేల క్యూసెక్కుల నీటిని వివిధ కాలువలకు పంపారు. డ్యాంలో 77 టీఎంసీలు నిల్వ ఉంచి, మిగిలిన నీటిని నదికి వదులుతున్నారు. మరో 4 రోజుల్లో హెచ్చెల్సీకి నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో ఆయకట్టు రైతులు వరినార్లతో పాటు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,625.21 అడుగులకు నీరు చేరింది. ఇన్ఫ్లో 52,805 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 62,027 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 77.180 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1,593.19 అడుగుల వద్ద 13.900 టీఎంసీల నీటి నిల్వతో, 25,556 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 190 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండిందని అధికారులు తెలిపారు. -
చెట్టు లేకుంటే అక్షరమే లేదు
● ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అనంతపురం కల్చరల్: మనిషి మనుగడకు జీవనాధారమైన చెట్టు లేకుంటే సాహిత్యానికి ఊతమైన అక్షరమే లేదని డాక్టర్ వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, డాక్టర్ శాంతినారాయణ అన్నారు. ద్విభాషా కవి జూటూరు షరీఫ్ రాసిన ‘చెట్టు’ వచన శతకాన్ని ఆదివారం అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో వారు ఆవిష్కరించారు. ఉప్పరపాటి వెంకటేశులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ అంకే శ్రీనివాస్ పుస్తక సమీక్ష చేశారు. సీనియర్ కవులు తరిమెల అమరనాథరెడ్డి, డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, మురళీకృష్ణ, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాయుడు, రియాజుద్దీన్, డాక్టర్ తన్నీరు నాగేంద్ర తదితరులు మాట్లాడుతూ.. షరీఫ్ విలక్షణ కవితా లక్షణాలను కొనియాడారు. గౌరవ అఽతిథిగా విచ్చేసిన రాచపాలెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. చెట్టు వంటి కవితా సంకలనాలు సమాజాన్ని చైతన్య పరుస్తాయని అన్నారు. అంతకు ముందు ప్రజాగాయకుడు దాసరి ఆదినారాయణ ఆలపించిన ఉద్దీపన గీతం ఆకట్టుకుంది. అనంతరం జూటూరు షరీఫ్కు సాహితీ సంస్థల నిర్వాహకులు చం.శాస్త్రి, జిరసం ప్రతినిధులు కొత్తపల్లి సురేష్, డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, ఒంటెద్దు రామలింగారెడ్డి, జెన్నే ఆనంద్, మహాబోధి కృష్ణమూర్తి, గోరా, సూర్యనారాయణరెడ్డి తదితరులు ఆత్మీయ సన్మానం చేశారు. రైల్లో నుంచి జారి పడి ప్రయాణికుడి మృతి గుత్తి/పెద్దవడుగూరు: స్థానిక జీఆర్పీ పరిధిలోని మిడుతూరు సమీపంలో ఆదివారం రైలు నుంచి జారి పడి ఓ గుర్తు తెలియని ప్రయాణికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న గుత్తి జీఆర్పీ ఎస్ఐ నాగప్ప, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు గుత్తి రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ నాగప్ప కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. కనుల పండువగా ఆషాఢ ఏకాదశి ప్రశాంతి నిలయం: సత్యసాయి భక్తుల నడుమ ప్రశాంతి నిలయంలో ఆషాఢ ఏకాదశి వేడుకలు కనుల పండువగా జరిగాయి. ఆదివారం ఉదయం మహారాష్ట్ర, గోవా సత్యసాయి భక్తులు సాయిని కీర్తిస్తూ దిండి పల్లకీని ఊరేగింపుగా మహాసమాధి చెంతకు తీసుకువచ్చారు. పొండురంగడు.. సత్యసాయిల అవతార లక్ష్యం ఒక్కటేన్న సందేశాన్నిస్తూ బాలవికాస్ చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. సనాతన భారత చరిత్రలో అనేకమంది సాధువులు మనిషిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన తీరును చక్కగా వివరించారు. సాయంత్రం మహారాష్ట్ర, గోవా బాలవికాస్ చిన్నారులు ‘వాల్యూస్ వర్సెస్ వాల్యూస్’ పేరుతో మనిషి నిత్య జీవితంలో విలువలు పాటించాల్సిన ఆవశ్యకతను, పురాణాల ఆధారంగా విలువల ప్రాముఖ్యతను వివరిస్తూ చక్కటి ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. -
నెట్టికంటుడి సన్నిధిలో కలెక్టర్ దంపతులు
గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాన్ని అందజేశారు. అనంతరం తనను కలసిన ఆలయ ఔట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను కలెక్టర్ ఆలకించి, త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ దంపతులు సమీపంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయాన్ని సందర్శించారు. పీర్ల ఉత్సవంలో అపశ్రుతిగుంతకల్లు: స్థానిక తాటాకులగేరిలో ఆదివారం జరిగిన పీర్ల ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. పీరును ఎత్తుకున్న ఖయ్యూం (48) గుండెపోటుతో మృతిచెందాడు. ఫక్కీరప్ప కాలనీలో నివాసముంటున్న ఆయన గత 20 ఏళ్లుగా పీర్ల స్వాములను ఎత్తుకునేవాడు. ఈ క్రమంలో పెద్ద సరిగెత్తులో భాగంగా ఆదివారం వేకువజామున పీర్లు అగ్నిగుండ ప్రవేశం ఉత్సవాన్ని వేడుకగా చేపట్టారు. పీరును ఎత్తుకున్న ఖయ్యూం.. కాసేపటికే ఛాతీలో నొప్పిగా ఉందంటూ ఇతరులకు అప్పగించి, జెండా కట్ట వద్ద కూర్చొని నీళ్లు తాగిన వెంటనే కుప్పకూలిపోయాడు. వెంటనే సహచరులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రావణికి భంగపాటు బుక్కరాయసముద్రం: టీడీపీ మండల కన్వీనర్ ఎంపిక విషయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్గీయులకు భంగపాటు తప్పలేదు. బీకేఎస్ మండల కేంద్రంలోని దేవరకొండ వద్ద ఆదివారం కన్వీనర్ ఎంపిక విషయంపై టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్నికల పరిశీలకుడు మల్లికార్జున, ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు హాజరయ్యారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి గైర్హాజరయ్యారు. టీడీపీ కన్వీనర్ పదవి కోసం బీకేఎస్ మాజీ సర్పంచ్ లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే వర్గీయుడైన ఈశ్వరయ్య మధ్య పోటీ నెలకొంది. అయితే సమావేశంలో 90 శాతం మంది లక్ష్మినారాయణకు మద్దతు తెలిపారు. ఆయన్ను కన్వీనర్గా ఎంపిక చేయకపోతే పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తామంటూ ఆడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రావణికి చుక్కెదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. -
●అ‘పూర్వ’ కలయిక
నాటి గురువులతో పూర్వ విద్యార్థులు యాడికి: స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 1979–80లో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకూ కలసి చదువుకున్న వీరు... తమ తరగతి గదులను ఆప్యాయంగా తాకుతూ తన్మయత్వంతో మురిసిపోయారు. వివిధ ప్రాంతాల్లో స్థిర పడిన వారందరూ 46ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాబుద్దులు నేర్పిన నాటి గురువులు విజయభాస్కర రెడ్డి, సుబ్బారెడ్డి, కేశవరెడ్డిను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు చవ్వా గోపాలరెడ్డి, సారెడ్డి రామశేఖరరెడ్డి, మల్లారెడ్డి, ధ్రువనారాయణ, ఈశ్వరప్ప, సాధు శేఖర్ తదితరులు నేతృత్వం వహించారు. -
కుళ్లాయిస్వామి క్షేత్రం.. భక్తజన సాగరం
నార్పల మండలంలోని గూగూడు కుళ్లాయిస్వామి క్షేత్రం భక్తజన సాగరమైంది. గూగూడు కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాల్లో భాగంగా ఆది వారం పెద్ద సరిగెత్తు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గూగూడు కిటకిటలాడింది. తెల్లవారుజామున స్వామి వారిని అర్చకులు హుసేనప్ప ప్రత్యేక పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. నాయీ బ్రాహ్మణులు సన్నాయి వాయిద్యాలతో నీరాజనాలర్పించగా.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మహిళలు పొర్లు దండాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఫకీర్లు పానకాలు సమర్పించుకున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. – నార్పల -
బేల్దారి ఆత్మహత్యాయత్నం
రాయదుర్గం టౌన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. రాయదుర్గంలోని భంభంస్వామి లే అవుట్ సమీపంలో నివాసముంటున్న చాంద్బాషా (25) బేల్దారి పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. కొంత కాలంగా సరైన పనులు లేకపోవడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో మనస్తాపం చెందిన చాంద్బాషా ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమై శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో తన ఇంటికి సమీపంలోనే ఉన్న రైలు పట్టాలపైకి చేరుకుని కూర్చొన్నాడు. కాసేపటి తర్వాత ఆ మార్గంలో వచ్చిన హొస్పేట–యశ్వంత్పూర్ రైలు ఢీ కొనడంతో చాంద్బాషా ఎగిరి పట్టాలకు అవతల పడ్డాడు. లోకో పైలెట్ సమాచారంతో రైల్వే ఎస్ఐ మహేంద్ర, హెడ్కానిస్టేబుల్ కృష్ణమూర్తి అక్కడకు చేరుకుని పరిశీలించారు. తలకు తీవ్రమైన గాయంతో అపస్మారక స్థితిలో చేరుకున్న చాంద్బాషాను వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని విమ్స్కు తరలించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. -
అనారోగ్యం తాళలేక బలవన్మరణం
రాప్తాడు: అనారోగ్యం తాళలేక జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని హమాలీ కాలనీలో నివాసముంటున్న వెన్నపూస విజయశేఖరరెడ్డి (39), మీన దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. విజయ శేఖర్ రెడ్డి గిఫ్ట్ అండ్ నావల్టీస్ షాపు నిర్వహిస్తుండగా, మీన టైలరింగ్తో కుటుంబానికి చేదోడుగా నిలిచింది. 2015లో చోటు చేసుకున్న ప్రమాదంలో విజయశేఖర్రెడ్డి వెన్నెముకతో పాటు తలకూ బలమైన గాయాలయ్యాయి. చికిత్స అనంతరం కోలుకున్నా... నరాల సంబంధిత వ్యాధితో తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. కట్టె సాయం లేనిదే అడుగు కూడా వేయలేని స్థితిలో తీవ్ర మానసిక క్షోభను అనుభవించిన ఆయన 2018, 2019లో రెండు సార్లు విషపూరిత ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయా సమయాల్లో కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ నెల 4న సాయంత్రం తన తల్లిదండ్రులను మాట్లాడి వస్తానంటూ ఇంట్లో తెలిపి ఎలక్ట్రిక్ లగేజ్ ఆటో తీసుకుని బయలుదేరిన ఆయన ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం ప్రసన్నాయపల్లి గ్రామ సచివాలయం సమీపంలో ఆటోలో వెనుక వైపు ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని వెన్నపూస విజయశేఖరరెడ్డిగా అనుమానిస్తూ సమాచారం ఇవ్వడంతో భార్య మీన అక్కడకు చేరుకుని పరిశీలించి నిర్ధారించారు. మృతుడి వద్ద మద్యం బాటిళ్లు, విషపు గుళికల బాటిళ్లు లభ్యం అయ్యాయి. మీన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు. -
ఇతరులకు చెబుతాం.. ఆచరించం!
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న రెవెన్యూ శాఖ తన సొంత ఉద్యోగుల నుంచే విమర్శలు మూటగట్టుకుంటోంది. మా ‘రూటే’ వేరయా అంటూ ఉద్యోగులు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇతరులకు చెబుతాం.. మేం ఆచరించం అన్నట్లుగా ఇక్కడ పరిస్థితి తయారైంది. పదోన్నతుల కల్పన.. మండలాల్లో ఇన్చార్జ్ పాలన.. బదిలీలు.. చివరికి వాహనాలు, పాత సామగ్రి వేలం విషయంలో ఇతర శాఖలకు ఇచ్చిన ఆదేశాలు ఈ శాఖలో మాత్రం అమలు కావనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పదోన్నతులేవీ...? ‘ఉద్యోగులకు పదోన్నతులు సకాలంలో కల్పించాలి.. విమర్శలకు తావివ్వకుండా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి’ అని ఇతర శాఖలకు రెవెన్యూ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తారు. తమ శాఖలో ఆ ఆదేశాలు అమలవుతున్నాయో లేదో మాత్రం పట్టించుకోరు. ఇక్కడి ఉద్యోగులకు పదోన్నతులు ఎండమావిగా మారాయి. వివిధ కేటగిరీలకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియ నిర్వహణలో ఏడాదిగా జాప్యం జరుగుతోంది. పదోన్నతి ఎప్పుడు కల్పిస్తారోనని ఉద్యోగులు చకోరపక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఇన్చార్జ్ పాలనే.. ‘‘ఏ శాఖలోనూ ఇన్చార్జ్ పాలన ఉండకూడదు... రెగ్యులర్ అధికారిని నియమించాలని ఉన్నతాధికారులకు లేఖలు రాయండి’’ అంటూ ఇతర ప్రభుత్వ శాఖలకు ఆదేశాలిస్తున్న రెవెన్యూ ఉన్నతాధికారులు తమ శాఖలో మాత్రం ఇన్చార్జ్ పాలనకు స్వస్తి చెప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు ఐదారు మండలాలకు తహసీల్దార్లను నియమించకుండా ఇన్చార్జ్లతోనే నెట్టుకొస్తుండడమే దీనికి నిదర్శనం. స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని కూడేరు మండలానికి తహసీల్దారును నియమించకుండా ఇన్చార్జ్తోనే కాలం నెట్టుకొస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బదిలీ బంతాట.. ‘బదిలీల ప్రక్రియ విమర్శలకు, వివాదాలకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలి’ అని ఇతర శాఖలకు రెవెన్యూ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తారు. కానీ, అదే శాఖలో నిర్వహించే బదిలీల ప్రక్రియలో పారదర్శకతను గాలికొదిలారు. ఇటీవల తహసీల్దార్ల బదిలీలు, పోస్టింగ్ విషయంలో ఈ విషయం స్పష్టమైంది. విమర్శలకు తావిచ్చేలా ప్రక్రియ నిర్వహించారు. ఒకసారి ఇచ్చిన స్థానాలను మార్పు చేస్తూ మరో ఉత్తర్వు... దాన్ని మార్పు చేస్తూ ఇంకో ఉత్తర్వు... ఇలా బంతిలా తహసీల్దార్లను బదిలీలతో ఆడుకున్నారు. సామగ్రి తుప్పుపట్టిపోవాల్సిందేనాఅనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం వెనుక దాదాపు 12 పాత వాహనాలు మూలనపడ్డాయి. కండీషన్లో ఉన్నవాటిని కూడా పడేయడంతో ఇప్పుడు ఎందుకూ పనిరాకుండా తయారయ్యాయి. కొత్త సామగ్రి రావడంతో పాత బీరువాలు, ఇనుప ర్యాక్లు తదితర వస్తువులు కార్యాలయ ఆవరణలో పడేశారు. అవి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చివరికి గుజరీకి కూడా పనికిరాకుండా పోతున్నాయి. మీ శాఖల పరిధిలో పాత వాహనాలు, సామగ్రిని బహి రంగ వేలం వేయండి అంటూ ఇతర శాఖలకు గడువులు విధిస్తున్న రెవెన్యూ అధికారులు తమ దగ్గర ఉన్న సామగ్రిని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ ‘రూటే’ వేరు పదోన్నతుల కల్పనలో ఏడాదిగా జాప్యం మండలాల్లో ఇంకా ఇన్చార్జ్ల పాలనే బదిలీల్లో కానరాని పారదర్శకత కొండెక్కిన వాహనాలు, పాత సామగ్రి వేలం -
ఘనంగా మన్రో వర్ధంతి
గుత్తి: దత్త మండలాల కలెక్టర్ సర్ థామస్ మన్రో 198వ వర్ధంతిని గుత్తి కోట సంరక్షణ సమితి , మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కోట వీధిలో ఉన్న సర్ థామస్ మన్రో సమాధిపై పూలు చల్లి నివాళులర్పించారు. గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్, గైడ్ రమేష్ మాట్లాడుతూ.. సర్ థామస్ మన్రో సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్బాషా, కళాకారుడు విజయకుమార్, కోట సంరక్షణ సమితి ఉపాధ్యక్షుడు సుధాకర్ నాయుడు, సభ్యులు దస్తగిరి, నిజాం, జిలాన్, నరసింహ పాల్గొన్నారు. జిల్లా స్థాయి యోగా పోటీలకు వేదిక కానున్న ఉరవకొండ ఉరవకొండ: జిల్లా స్థాయి యోగా పోటీలకు ఉరవకొండ వేదిక కానుంది. ఈ పోటీల నిర్వహణకు సంబంధించి స్థానిక మార్కండేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆయూష్ కార్యాలయంలో యోగా గురువులు, ఆయూష్ ప్రతినిధులు ఆదివారం సమావేశమై చర్చించారు. అనంతరం స్థానిక ఆయూస్ ప్రతినిధులు వెంకట్ తాడికొండ, సుధాకర్రెడ్డి, నాగమల్లి ఓబులేసు, అనంతపురం ప్రతినిధులు రాజశేఖరరెడ్డి, దివాకర్, మారుతీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆగస్టు 3న ఉరవకొండలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అసోసియేషన్ ఆఫ్ యోగ ఇన్ ఉరవకొండ వారి సహకారంతో సిలబస్ ఆధారంగా యోగాసన, రిథమిక్, యోగ, ఆర్టిస్టిక్పై పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. -
హెచ్చుమీరిన అసాంఘిక కార్యకలాపాలు.. విచ్చలవిడిగా వ్యభిచారం!
అనంతపురం: నగరంలో అసాంఘిక కార్యకలాపాలు పెచ్చుమీరాయి. పేద కుటుంబాల యువతులకు డబ్బు ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. నిర్వాహకుల మాటలు నమ్మి వచ్చిన వారిని నరకకూపంలోకి నెడుతున్నారు. ఇందులోకి దిగాక.. తిరిగి వెనక్కి వెళ్లలేక.. కుటుంబ కషాలే గుర్తుకు తెచ్చుకుని, ఇష్టం లేకున్నా మనసు చంపుకుని నిర్వాహకులు ఎలా చెబితే అలా నడచు కోవాల్సి వస్తోంది. చదువు రాకపోవడం, ఎవ రితోనూ బాధలు చెప్పుకోలేని నిస్సహాయ స్థితి, నెలన్నర వ్యవధిలోనే అనేక కేసులు..గతనెల 30న అనంతపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉప్పర లలిత అనే మహిళ నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఓ బాధితురాలిని కాపాడారు. నిర్వాహకురాలిపై కేసు నమోదు చేశారు. ఇదే కాలనీలో జూన్ 19నసాయంత్రం 7:30 గంటల సమయంలో వ్యభి చారం గృహంపై పోలీసులు రైడ్ చేసి నిర్వాహకు రాలు కె. లక్ష్మిని అరెస్ట్ చేసి, ఓ బాధితురాలిని కాపాడారు. అంతకు ముందు కొన్ని రోజులు అంటే జూన్ 12న హౌసింగ్ బోర్డులోనే ఓ వ్యభిచార గృహంపై దాడులు చేశారు.నిర్వాహకులు కుమ్మర లక్ష్మి, బోయ వనితను అరెస్టు చేసి ఇద్దరు బాధితు లను కాపాడారు. అదే రోజు హౌసింగ్ బోర్డులోనే వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న రామాజీ, మేరీ సుజాత, సరస్వతి అలియాస్ సాలమ్మ, విటులు జి. బాబావలి, గార్లదిన్నె లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు. ఓ బాధితురాలిని కాపాడారు. మే 11న హౌసింగ్బోర్డు ఎల్బాజీ బస్టాండు సమీపంలో ఒక ఇంట్లో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఆకుల నారాయణమ్మ, విటుడు అజయ్ కుమార్ను అరెస్ట్ చేశారు. ఇద్దరు బాధితులను రక్షించారు. అనతికా లంలోనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే నగరం లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.19-25 ఏళ్లలోపు వారే టార్గెట్.. ఒక వైపు పోలీసులు వ్యభిచార స్థావరాలపై దాడులు చేసి విటులు, నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా ఆక్రమ కార్యకలాపాలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. హైటెక్ హంగులతో యథేచ్ఛగా వ్యభిచారం. నిర్వహిస్తూ నిర్వాహకులు పోలీసులకు అనుమానం రాకుండా జగ్రత్తపడుతున్నారు. 19-25 ఏళ్ల లోపు ఉన్న యువతులనే ఈ ఊబిలోకి దింపుతున్నారు.నిర్వాహకులు తమ పర్మినెంట్ కస్టమర్లతో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి అందులోనే యువతుల ఫొటోలు పోస్ట్ చేసి విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తు న్నట్లు తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా కొందరు భార్యాభర్తలు కలిసి యువతులతో అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. కొందరు ప్రముఖుల వద్దకే యువతులను పంపిస్తున్నారు. నగరంలో కొన్ని లాడ్జీలు కేవలం వ్యభిచార కార్యకలాపాల కోసమే నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని నగరవాసులు కోరుతున్నారు. రాత్రి వేళ గస్తీని తీవ్రతరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కర్కశత్వం.. ‘అమ్మ’ను గుడి దగ్గర వదిలేశారు..!!
పెద్దపప్పూరు(అనంతపురం): అంధురాలు.. ఆపై నడవలేని స్థితిలో ఉన్న ఓ మహిళ పెద్దపప్పూరు మండలంలోని అశ్వత్థనారాయణ స్వామి క్షేత్రంలో అనాథలా ఉండిపోయింది. పుట్లూరు మండలం కందికాపుల గ్రామానికి చెందిన సంజమ్మను ఎవరో పది రోజుల క్రితం ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆరుబయట దోమల బెడదతో పాటు ఈదురుగాలులకు వణుకుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. నిత్యం స్వామి దర్శనానికి వచ్చే పాముల ఆది అనే భక్తుడు అమెను చూసి చలించిపోయి సపర్యలు చేస్తున్నారు. ఆమెకు స్నానం చేయించి.. అన్నపానీయాలు అందిస్తున్నారు. అలాగే వదిలేస్తే ఆమె ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉండటంతో అటువైపు వెళ్లిన ‘సాక్షి’ సదరు మహిళ సమీప బంధువుల ఫోన్ నంబర్ సేకరించి పరిస్థితి వివరించింది. సంజమ్మ యల్లనూరులో ఉందనుకున్నామని, వెంటనే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిపి అశ్వత్థం నుంచి తీసుకెళ్లాలని తెలియజేస్తామని సమాధానమిచ్చారు. -
తీవ్రంగా తాగునీటి సమస్య
● మంత్రి కేశవ్తో వాపోయిన మహిళలు విడపనకల్లు: తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డొనేకల్లు గ్రామ మహిళలు మంత్రి పయ్యావుల కేశవ్కు విన్నవించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని డొనేకల్లు, గడేకల్లు గ్రామాల్లో శనివారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా డొనేకల్లులో మహిళలు తాగునీటి సమస్యపై మంత్రి ఎదుట ఏకరువు పెట్టారు. అనంతరం కేశవ్ విలేకరులతో మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనపై రాష్ట్ర ప్రజల్లో అపారమైన నమ్మకం ఏర్పడిందని తెలిపారు. వలంటీర్ల ద్వారా ప్రజలకు జరిగిందేమీ లేదన్నారు. తల్లికి వందనం డబ్బులు ఎప్పుడొస్తాయి సారూ..? ● ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డిని ప్రశ్నించిన ప్రజలు యాడికి: ‘తల్లికి వందనం పథకం కింద మా పిల్లలకు డబ్బులు రాలేదు. సచివాలయ ఉద్యోగులను అడిగితే త్వరలో ఖాతాలో జమ అవుతుందంటున్నారు. ఇంతకూ డబ్బులు ఎప్పుడొస్తాయి’అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డిని ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ప్రజలను అడగగా.. ‘రాలేదు’అని పలువురు ఎమ్మెల్యేకు తెలియజేశారు. -
ఎంసెట్లో మంచి ర్యాంకు రాలేదని ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: ఎంసెట్లో అశించినస్థాయిలో ర్యాంకు రాలేదని మనస్తాపం చెందిన విద్యార్థి సాగర్కుమార్రెడ్డి (17) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను జీఆర్పీఎఫ్ ఎస్ఐ నాగప్ప శనివారం మీడియాకు వెల్లడించారు. యల్లనూరు మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన వ్యవసాయదారుడైన పద్మభూషణ్రెడ్డి కుమారుడు సాగర్కుమార్రెడ్డి అనంతపురంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివాడు. ఇంటర్ తరువాత ఎంసెట్లో మంచి ర్యాంకు రాకపోవడంతో లాంగ్టర్మ్ కోచింగ్కు వెళ్లాడు. రెండోసారి రాసిన ఎంసెట్లోకూడా మంచి ర్యాంకు రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం ఇంట్లోవారికి చెప్పకుండా తాడిపత్రికి మోటార్సైకిల్పై వచ్చాడు. చల్లవారిపల్లివద్ద మోటార్సైకిల్ను పార్క్ చేశానని, వచ్చి తీసుకెళ్లాలని ఇంట్లోవారికి సెల్ఫోన్లో మెసేజ్ పంపాడు. అనంతరం సాగర్కుమార్రెడ్డి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాల కోసం ఆరా తీశారు. ఎలాంటి అచూకీ తెలియకపోవడంతో ఫొటోలను తీశామన్నారు. రైలు కింద పడిన యువకుడు తన కుమారుడని పద్మభూషణ్రెడ్డి సమాచారం ఇవ్వడంతో ఫిర్యాదు తీసుకున్నామని ఎస్ఐ తెలిపారు. -
కలుషిత నీరు కలకలం
గుంతకల్లు: కలుషిత నీరు కలకలం సృష్టించాయి. వాంతులు, కడుపునొప్పితో బాధితులు ఆస్పత్రికి పరుగులు తీశారు. వివరాలు.. శనివారం ఉదయం గుంతకల్లు పట్టణంలోని పలు చోట్ల మున్సిపల్ కుళాయిలకు నీళ్లు వదిలారు. ఈ క్రమంలోనే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సాయిక్రిష్ట ఆస్పత్రి సమీపంలో నివాసముంటున్న వారు కుళాయి నీళ్లను పట్టుకుని తాగారు. కొంతసేపటికే వాంతులు, విరేచనలు, కడుపు నొప్పి మొదలవడంతో వనజ, స్వాతి, గీతమ్మ, దీపక, భరత్, కళ్యాణీ, చిట్టక్క, బ్రహ్మ, భీమలింగా, రామ్ లక్ష్మణ్, కార్తీక్, ఉదయ్తోపాటు మరో 10 మంది లబోదిబోమంటూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పరుగులు పెట్టారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆరుగురిని అడ్మిట్ చేసుకున్నారు. మిగిలిన వారికి ప్రాథమిక చిక్సితలు అందించి ఇంటికి పంపారు. కుళాయి నీళ్లు ఎర్రగా ఉండటంతో పాటు వాసన వెదజల్లాయని రోగులు తెలిపారు. పురుగులు కూడా కనిపించాయన్నారు. తమ ప్రాంతంలో మురికి కాలవలు శుభ్రం చేయకపోవడంతో చెత్త చెదారం పేరుకు పోయిందన్నారు. మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో కుళాయిల్లో కలుషిత నీరు వస్తున్నాయని వాపోయాచారు. ● రోగులను వైఎస్సార్సీపీ వార్డు ఇన్చార్జ్ మార్కెట్ వెంకటేష్ పరామర్శించారు. విషయాన్ని వైద్యారోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తిలక్నగర్ అర్బన్ హైల్ సెంటర్ డాక్టర్ స్వాతి, ఏఎన్ఎం శ్రీలత, ఆశా వర్కర్ జానికి వెంటనే ఆ ప్రాంతంలో పర్యటించారు. అందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణి చేశారు. నీళ్లను బాగా వేడి చేసి చల్లార్చిన తరువాత తాగాలని డాక్టర్ స్వాతి సూచించారు. గుంతకల్లులో వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి బాధితుల పరుగులు -
తాడిపత్రి వెళ్తా.. అనుమతివ్వండి
● ఎస్పీకి కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణానికి వెళ్లేందుకు తనకు అనుమతి కావాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీకి లేఖ రాశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ ఆంక్షలతో ఆయన తాడిపత్రికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పట్టణానికి వెళ్లేందుకు కోర్టులు అనుమతి ఇచ్చినా పోలీసులు వివిధ కారణాలు చూపుతూ అడ్డుకుంటున్న తరుణంలో పెద్దారెడ్డి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం నిర్వహిస్తున్నారని లేఖలో పెద్దారెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా తాడిపత్రిలో కార్యక్రమం చేపట్టాల్సి ఉందన్నారు. తాను దాదాపు 3 రోజుల పాటు పట్టణంలో ఉండాల్సి ఉంటుందన్నారు. కావున తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి కావాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో 10,089 కేసుల పరిష్కారం అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 10,089 కేసులు పరిష్కారమయ్యాయి. అనంతపురం జిల్లా కోర్టులో లోక్ అదాలత్ను ప్రధాన న్యాయమూర్తి భీమారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక్ అదాలత్ తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉండదన్నారు. రెగ్యులర్ కోర్టులో కేసులు పరిష్కారమైతే ఎవరో ఒకరే గెలిచే అవకాశం ఉంటుందని, అదే లోక్ అదాలత్లో అయితే ఇరు పార్టీలు సంతోషంగా ఇంటికి చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్, మొదటి అదనపు జిల్లా జడ్జి సత్యవాణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ● ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్లో మోటారు వాహనాల ప్రమాద కేసులు 28 పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.1.57 కోట్ల నష్ట పరిహారం ఇప్పించారు. సివిల్ కేసులు 75 పరిష్కారమయ్యాయి. వీటి విలువ రూ.5,35,59,388. ప్రీలిటిగేషన్ కేసులు 3,876 పరిష్కారం కాగా, ఇందులో మొత్తం రూ.1,98,98,382. ఎన్ఐ యాక్ట్ కేసులు– 22 మొత్తం రూ.31,50,000. రేపు పామిడిలో ‘పరిష్కార వేదిక’ అనంతపురం అర్బన్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈనెల 7వ తేదీ సోమవారం పామిడి మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాలని సూచించారు. 1100కు కాల్ చేయండి అర్జీదారులు 1100కు ఫోన్ చేసి పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా meekosam. ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి అర్జీలను సమర్పించి పరిష్కారం పొందవచ్చన్నారు. -
కుళ్లాయిస్వామికి విశేష పూజలు
నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారిని అర్చకులు హుసేనప్ప ప్రత్యేక పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆదివారం పెద్ద సరిగెత్తు, సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు గ్రామోత్సవం, ఉదయం 6 గంటలకు అగ్నిగుండ ప్రవేశం, సాయంత్రం గ్రామోత్సవం, జలధి కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలిపారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎస్ఐ సాగర్ గట్టి బందోబస్తు నిర్వహించారు. -
రమణీయం.. పూరీ జగన్నాథుడి రథోత్సవం
అనంతపురం కల్చరల్: ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. హరేరామ హరే కృష్ణ నామస్మరణతో పురవీధులు మార్మోగాయి. పూరీ జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని అనంతపురం భక్తిసాగరంలో మునిగితేలింది. ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పవిత్ర నదీజలాలతో సంప్రోక్షణ అనంతరం స్థానిక కేఎస్ఆర్ కళాశాల వద్ద రథోత్సవాన్ని సత్యగోపీనాథ్ ప్రభు జెండా ఊపి ప్రారంభించారు. సప్తగిరి సర్కిల్ నుంచి పాతూరు, శ్రీకంఠం సర్కిల్,ఆర్ట్స్ కళాశాల, టవర్ క్లాక్ మీదుగా వెళ్లి లలితళాపరిషత్తు వరకు రథయాత్ర సాగింది. ఈ సందర్భంగా రథం ముందు కళాకారులు సందడి చేశారు. చెక్కభజన, దేవతామూర్తుల వేషధారులు, కోలాటం, గురవయ్యలు, ఉరుముల కళాకారులు అద్భుతంగా కళారూపాలను ప్రదర్శించారు. నాట్యాచార్యులు దేవరకొండ కౌసల్య ఆధ్వర్యంలో కళాకారులు శాసీ్త్రయ నృత్యాలతో జగన్నాథుడికి భక్తి నీరాజనాలర్పించారు. ఇస్కాన్ విశిష్టతను తెలియజేశారు. ● అంతకుముందు లలితకళాపరిషత్తులో ఇస్కాన్ మందిర ఇన్చార్జ్ దామోదర గౌరంగదాసు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన సినీనటుడు సుమన్, సత్యగోపీనాథ్ మాట్లాడుతూ ఇస్కాన్ సేవలు అమూల్యమన్నారు. రథయాత్రలో కుల మతాలకతీతంగా ప్రజలు పాల్గొనడం సంతోషం కలిగిస్తోందన్నారు. కార్యక్రమంలో పర్చూరు నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణపై కఠినంగా వ్యవహరించాలి
అనంతపురం అర్బన్: ‘గర్భస్థ పిండ లింగ నిర్ధారణపై కఠినంగా వ్యవహరించాలి. స్కానింగ్ సెంటర్లను విస్తృతంగా తనిఖీ చేయాలి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేయండి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పీసీపీఎన్డీటీ యాక్ట్ (గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం) అమలుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ తీవ్ర నేరమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారి విషయంలో చాలా కఠినంగా ఉండాలని చెప్పారు. సమావేశంలో డీఎంహెచ్ఓ ఈబీదేవి, ఆర్డీటీ సంస్థ ప్రతినిధి డాక్టర్ దుర్గేష్, సీఐ బాషా, డెమో త్యాగరాజ్ పాల్గొన్నారు. మొక్కజొన్న వ్యాపారిపై కేసు యాడికి: రైతుల నుంచి మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వ్యాపారిపై యాడికి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన ఎ.సంతోష్కుమార్ అనే వ్యక్తి శ్రీ చంద్రాల పరమేశ్వర ట్రేడర్స్ ఆల్ పౌల్ట్రీ ఇంగ్రీడియ్స్ అండ్ రా మెటీరియల్స్ సంస్థ ఉంది. గత ఏడాది ఈ వివరాలతో కూడిన విజిటింగ్ కార్డును యాడికి మండలం తూట్రాళ్లపల్లికి చెందిన పెద్దయ్య కుమారుడు నూతల సాయి కల్యాణ్కు పంపాడు. దీంతో సాయి కల్యాణ్ రూ.1,28,14,340 విలువ గల మొక్కజొన్న పంటను హైదరాబాద్లోని సంతోష్ కుమార్కు విక్రయించాడు. ఇందులో రూ.68,26,080 మాత్రమే ఇచ్చి.. మిగతా సొమ్ము ఇవ్వకుండా మోసం చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో సాయి కల్యాణ్ ఫిర్యాదు మేరకు సంతోష్కుమార్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలి అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలైనా ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్సీ గురించి ఏమాత్రం పట్టించుకోలేదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, నాయకులు గోవిందరెడ్డి, రాధాకృష్ణరెడ్డి, వెంకటరమణప్ప, గోపాల్, వెంకటరెడ్డి, రామకృష్ణ శనివారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఉన్న పీఆర్సీ కమిటీ ఏడాది కిందట రద్దయిందని పేర్కొన్నారు. మళ్లీ పీఆర్సీ కమిటీ వేయకుండా, కనీసం ఐఆర్, డీఏ కూడా ప్రకటించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన పలువురు నాయకులకు చోటు లభించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా వెన్నం శివరామిరెడ్డి (ఎన్ఆర్ఐ), చింతకుంట వెంకటేశులు (అనంతపురం అర్బన్), మెట్టు విశ్వనాథ్రెడ్డి, కళేకుర్తి ఉషారాణి (రాయదుర్గం), జింకల రామాంజినేయులు, చుక్కలూరు దిలీప్రెడ్డి(గుంతకల్లు), బళ్లారి మహమ్మద్ జిలాన్, వెన్నపూస వెంకటరామిరెడ్డి (తాడిపత్రి), కురుబ నాగిరెడ్డి, గంగన గోపాల్రెడ్డి, ముదిగుబ్బ వీరాంజినేయులు, అంకె లక్ష్మణ్ణ(రాప్తాడు) నియమితులయ్యారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ‘కొర్రపాడు’ అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించారు. ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనంతపురానికి చెందిన కొర్రపాడు హుస్సేన్పీరా, రాష్ట్ర కార్యదర్శిగా బి.రాజాశేఖర్రెడ్డి (రాజారెడ్డి)ని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్వర్వులు అందాయి. ‘విద్యా శక్తి’ని టీచర్లపై రుద్దడం సరికాదు అనంతపురం ఎడ్యుకేషన్: బడి వేళల తర్వాత ‘విద్యాశక్తి’ అనే నూతన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపాధ్యాయులపై రుద్దడం సరికాదని స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ నాయకులు వాపోయారు. శనివారం సాయంత్రం నగరంలోని ఉపాధ్యాయ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి బి. రాజశేఖర్ మాట్లాడారు. ఏటా 10వ తరగతి విద్యార్థులకు ‘వంద రోజుల ప్రణాళిక’ కార్యక్రమం జనవరి నెలలో ప్రారంభమవుతుందన్నారు. కానీ జూలై 1 నుంచే పారంభించడం ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకురావడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అశాసీ్త్రయమైన విధానమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. రవాణా సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయన్నారు. కాలి బాటన వచ్చే గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికంగా ఉన్నారని, వారు ఇంటికి చేరుకోవడానికి చీకటి అవుతుందన్నారు. ముఖ్యంగా బాలికలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం నిర్ణయం ఏమాత్రమూ ఆమోదయోగ్యంగా లేదన్నారు. మరోవైపు రెగ్యులర్ బోధనకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అనాలోచిత నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివశంకరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, నాయకులు నాగన్న, ఓబులేసు, శ్రీరాములు పాల్గొన్నారు. -
దేవరకొండకు తూట్లు
అది ఒక కొండ కాదు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కొలిచే దేవతా స్వరూపం. కరువు నుంచి రక్షించే ‘దొణ తిమ్మరాయస్వామి దేవరకొండ’. తరతరాలుగా పూజలందుకుంటున్న ఈ కొండను ప్రజలు ‘ద్యావుర బండ’ అని పిలుచుకొని కొలుచుకుంటారు. అలాంటి ప్రజల విశ్వాసంపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తూటాలు (బండను పేల్చే పేలుడు పదార్థాలు) పేలుస్తుండటం ఆయా గ్రామాల ప్రజలకు నిద్రపట్టకుండా చేస్తోంది. శెట్టూరు: మండలంలోని ఐదుకల్లు, యాటకల్లు, మంగంపల్లి, ఉప్పొంక గ్రామాల మధ్య సర్వే నంబర్ 185లో సువిశాలమైన విస్తీర్ణంలో కొండ (ద్యావుర బండ) ఉంది. కొండపై తిమ్మరాయప్ప పాదం, స్వామివారి గుర్రం పాదం గుర్తులు ఉన్నాయి. వీటికి రైతులు ఉత్తరకార్తెలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టీడీపీ నాయకులకు ఈ కొండపై కన్ను పడింది. కొండను తవ్వి కంకర అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనుకున్నారు. ఇందు కోసం క్వారీ నిర్వహణకు అనుమతుల కోసం పావులు కదిపారు. కొండకు ఆనుకుని ఉన్న ఇద్దరు రైతుల డీ–పట్టా పొలాలను లీజుకు తీసుకుని.. అందులో క్రషర్ యంత్ర సామగ్రిని సమకూర్చారు. కొండకు చుట్టుపక్కలన్నీ సాగు భూములే. 70కి పైగా మామిడి తోటలు, 300కు పైగా బోరు బావులు ఉన్నాయి. క్వారీ నిర్వహణ విషయం రైతులకు ఏమాత్రం తెలియదు. అధికారులు కూడా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయినా సరే అధికార పార్టీ నాయకులు బండకు తూట్లు పొడుస్తున్నారు. బండను పేల్చే సమయంలో పొలాల్లోకి రాళ్లు ఎగిరి పడటం.. క్రషింగ్ చేసేటపుడు దుమ్ము, ధూళి పంటలను కప్పేయడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు వాపోతున్నారు. కొండకాదు మా దేవత.... దేవర కొండను తాము కొండగా చూడబోమని, దేవతగా ఆరాధిస్తామని ప్రజలు తెలిపారు. పురాతన కాలం నుంచి కొండపై వెలసిన దొణ తిమ్మప్పను పూజిస్తున్నట్లు చెప్పారు. ఐదుకల్లు, యాటకల్లు, మంగంపల్లి, ఉప్పొంక గ్రామాల రైతులను రక్షించే దైవం, ఇక్కడ వర్షాలు లేక కరువు వస్తే ఈ కొండపైకి వచ్చి తిమ్మప్పస్వామికి పూజలు చేసి, వంట వండి నైవేద్యం సమర్పిస్తే.. తిరిగి ఇంటికి వెళ్లేలోపే వర్షం పడేదని చెబుతున్నారు. కొండపై పూరాతన మాగాణి (పంటలు పండే భూమి) ఉండేదని, పూర్వానికి ఏడు గ్రామాల ప్రజలు ఇక్కడ నివసించి ఆహార ధాన్యాలు పండించేవారని గుర్తు చేస్తున్నారు. మామిడితోటే నా జీవనాధారం దేవరబండ అనే కొండకు ఆనుకుని నాకు ఏడు ఎకరాల పొలం ఉంది. ఐదేళ్ల క్రితం తోటలో మామిడి మొక్కలు నాటాను. ప్రస్తుతం కాపు కాస్తున్నాయి. అయితే ఇక్కడి కొండపై పేలుడు పదార్థాలు పెట్టి బండను పేలుస్తున్నారు. దీనివల్ల దుమ్ము, ధూళి వచ్చి మామిడి చెట్లపై పడుతోంది. దీనివల్ల కాపు రాకుండా పోతోంది. ఇక్కడ కంకర మిషన్ నిర్వహస్తే నా తోటపై ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందే. ఈ కొండను తవ్వేందుకు అధికారులు అనుమతులు ఇవ్వరాదు. – రామాంజనేయులు, రైతు, ఐదుకల్లు పరిశీలించి.. చర్యలు తీసుకుంటాం నేను ఐదురోజుల క్రితం తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్నా. క్వారీ నిర్వహణ, అనుమతులు విషయం ఏవీ తెలియదు. నా దృష్టకి వస్తే పరిశీలించి.. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసు కుని సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తా. – ఈశ్వరమ్మ, తహసీల్దార్, శెట్టూరు కొండపై ‘దొణ’లే జీవనాధారం... టీడీపీ నేతల నిర్వాకం సమీప పంట పొలాలకు దెబ్బ చుట్టుపక్కల 4 గ్రామాల వరకు ఎఫెక్ట్.. క్వారీ నిర్వహించరాదంటున్న రైతులుతిమ్మప్పకొండపై ఉన్న లోతైన దొణలు ఎప్పటికీ ఎండిపోవని, స్వచ్ఛమైన నీరు అప్పుడు, ఇప్పుడు ప్రజలకు జీవనాధారంగా ఉందని ప్రజలు తెలిపారు. కొండ ఇంతటి నీటిని పట్టి ఉంచటం వల్లే మా గ్రామాల్లో భూగర్భజలాలు ఎక్కువగా ఉన్నాయని, వన్యప్రాణులు అధిక సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు. పొలాల్లో ఉన్న రైతులకు ఈ ‘దొణ’ల్లోని నీరే దాహం తీర్చుతుందన్నారు. ప్రస్తుతం కూడా ఈ కొండపై పెద్ద నీటి ట్యాంకు నిర్మించారని, ఈ ట్యాంక్ నుంచే గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోందని తెలిపారు. ఇలాంటి కొండపై పేలుళ్లు జరిపి కంకర తీసుకొని కొండను నేలమట్టం చేయాలనే ఆలోచనను టీడీపీ నాయకులు విరమించు కోవాలని వేడుకుంటున్నారు. -
రైతుల్లో నమ్మకం కోల్పోయారు
మాట చెప్పడం దాన్ని దాటవేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. బీటీపీని 2014–19 మధ్య పూర్తి చేస్తామన్నారు. శంకుస్థాపనలతో హడావుడి చేశారు. రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మాజీ సీఎం జగన్ 2019–24 మధ్య రైతుల్ని ఆదుకునే చర్యలు చేపట్టారు. భూసేకరణకు నిధులిచ్చారు. ప్రాజెక్టు పనులు పరుగులు పెడుతున్న సమయంలోనే మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చింది. చిత్తశుద్ధి ఉంటే పనులను సకాలంలో పూర్తి చేసి రైతులకు నీరివ్వాలి. శంకుస్థాపనలు చేసి వదిలేస్తే ఊరుకునేది లేదు. రైతులతో కలసి ఉద్యమిస్తాం. – మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం ప్రజలు నమ్మడం లేదు ఒకే పనికి ముఖ్యమంత్రి ఓసారి, మంత్రులు మరోసారి శంకుస్థాపనలు చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీటీపీ ఎత్తిపోతల పథకం కొందరికి బంగారుబాతులా మారింది. రైతులకు మేలు చేకూరితే మొదటగా మేమే సంతోషిస్తాం. అలా కాకుండా శంకుస్థాపనల పేరిట రూ. లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేస్తామంటే మాత్రం ఒప్పుకునేది లేదు. మా ప్రభుత్వ హయాంలో భూసేకరణకు సంబంధించి రైతులకు డబ్బులిచ్చాం. మిగిలిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. – తలారి రంగయ్య, మాజీ ఎంపీ -
నాడు
నేడుసాక్షి టాస్క్ఫోర్స్: ‘నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్న’ చందంగా తయారైంది టీడీపీ ప్రజాప్రతినిధుల తీరు. మాటల్లో కోతలు కోస్తున్న వారు చేతల్లో మాత్రం చూపలేకపోతున్నారు. బీటీ ప్రాజెక్టు పూర్తి చేసి రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామంటూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చి ప్రజల ఓట్లు కొల్లగొట్టారు. అయితే, అధికారం చేపట్టాక ఆర్భాటాలతోనే సరిపెట్టారు. సభలు, శంకుస్థాపనల పేరిట రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. బీటీపీ అతిథి గృహం వద్ద ఏకంగా రూ.50 లక్షలతో పైలాన్ నిర్మించి ఆవిష్కరించారు. దీనికితోడు శిలాఫలకం ఆవిష్కరణ, సభ తదితరాలకు రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేయడం అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రైతులకు పైసా ఇవ్వకుండా.. బీటీపీ ఎత్తిపోతల పథకానికి మొదటి ప్యాకేజీ కింద అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.358.20 కోట్లు కేటాయించారు. ఆ పనుల టెండర్ను ప్రస్తుత కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. జీడిపల్లి నుంచి కామన్కెనాల్ ద్వారా గరుడాపురం చేరే నీటిని కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి– జంబుగుంపుల వరకు మళ్లించి 114 చెరువులు నింపేలా బ్రాంచ్ కెనాల్, బీటీ ప్రాజెక్టుకు మరో బ్రాంచ్ కెనాల్ తవ్వేందుకు 1,406.89 ఎకరాల భూసేకరణ చేపట్టారు.అయితే, భూసేకరణకు సంబంధించి రైతులకు పంపిణీ చేసేందుకు తొలి విడతగా రూ.20 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపితే.. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం పైసా కూడా జమచేయలేదు. దీంతో పనులను అన్నదాతలు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పనులు మరుగున పడిపోయాయి. సంతోషం పంచిన జగన్ బీటీపీ ఎత్తిపోతల పథకంలో ప్రధాన ఘట్టం భూములిచ్చిన రైతులకు పరిహారం పంపిణీ. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.202 కోట్ల నిధులు విడుదల చేశారు. దశల వారీగా రైతుల ఖాతాల్లో నగదు జమచేసి సంతోషం పంచారు. ఈ ప్రక్రియతో పాటు అనేక లోటుపాట్లు సరిదిద్ది పనులు పట్టాలెక్కిస్తున్న తరుణంలోనే కూటమి ప్రభుత్వం రావడంతో ప్రక్రియ మొత్తానికి బ్రేక్ పడింది. నేడు మళ్లీ హడావుడి.. అధికారంలోకి రాగానే బీటీపీ పనులు పూర్తి చేస్తామని గత ఎన్నికల్లోనూ వాగ్దానం చేసిన చంద్రబాబు.. అధికారంలో వచ్చి ఏడాది దాటినా ఆ ఊసే ఎత్తలేదు. బడ్జెట్లోనూ ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. అయితే ఇటీవల రైతుల నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో కూటమి ప్రజాప్రతినిధులు మళ్లీ హడావుడి మొదలుపెట్టడం గమనార్హం. ఇందులో భాగంగా శనివారం బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లి సమీపంలో రెండో సారి భూమి పూజలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మాయలు చేయకుండా ఈ సారైనా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. బీటీపీ కాలువ పనులకు మళ్లీ శంకుస్థాపన 2018లో సీఎం హోదాలో ఆర్భాటంగా పైలాన్ ఆవిష్కరించిన చంద్రబాబు నేడు మళ్లీ పనులకు టీడీపీ ప్రజాప్రతినిధుల ప్రారంభోత్సవాలు గత టీడీపీ ప్రభుత్వంలో రైతులకు పైసా విదల్చని చంద్రబాబు అప్పట్లో ఆర్భాటాలకే రూ.కోట్ల దుర్వినియోగం నేడు మళ్లీ పాతరాగం అందుకోవడంపై సర్వత్రా విమర్శలు ‘‘హంద్రీ–నీవా ద్వారా జీడిపల్లికి చేరే కృష్ణా జలాలను జనవరి 2019 నాటికి బీటీ ప్రాజెక్టుకు తరలిస్తాం. కరువు రైతుల కష్టాలు తీరుస్తాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాల్ని సస్యశ్యామలం చేస్తాం.’’ 2018 అక్టోబర్ 10న బీటీపీ వద్ద పైలాన్ ఆవిష్కరణ అనంతరం సభలో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివీ.. ‘‘బీటీపీకి త్వరలో నీరిస్తాం.రైతుల సంక్షేమమే లక్ష్యం’’... అప్పట్లో చంద్రబాబు భూమి పూజ చేసి ప్రారంభించిన పనులకే శనివారం మళ్లీ బ్రహ్మసముద్రం మండలం పొబ్బర్లపల్లి సమీపంలో పూజలు చేసి ప్రారంభోత్సవం చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పలికిన పలుకులివి. -
తాడిపత్రికి వెళ్లాలి.. ఎస్పీకి పెద్దారెడ్డి లేఖ
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తాడిపత్రికి వచ్చేందుకు అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్కు తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. దీంతో, ఎస్పీ జగదీష్ ఈసారైన అనుమతి ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.అనంతపురం ఎస్పీ జగదీష్కు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేఖ రాశారు. ఈ సందర్బంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాలి.. అందుకు తాను తాడిపత్రికి రావాల్సి ఉందని.. అనుమతి ఇవ్వాలని ఎస్పీని లేఖలో కోరారు. అయితే, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30వ తేదీన హైకోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని పోలీసు శాఖకు హైకోర్టు సూచించింది. కానీ, అనంతపురం పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఎస్పీకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి లేఖ రాశారు.ఇదిలా ఉండగా.. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్లారు. పెద్దారెడ్డి రాకపై సమాచారం అందుకున్న పోలీసులు తాడిపత్రిలోని తన నివాసంలో బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించారు. అనంతరం, అనంతపురం రాంనగర్లో తన నివాసంలో పెద్దారెడ్డిని వదిలి పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటికి తాను వెళితే పోలీసులకు ఇబ్బంది ఏంటి?. పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటా. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు గుప్పించారు.జేసీ ప్రభాకర్రెడ్డి ఓవరాక్షన్.. ‘ఈ రోజు నీ దగ్గరకు వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను రప్పా.. రప్పాలాడిస్తాం. చేతనైతే కాపాడుకో కేతిరెడ్డీ’ అంటూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత జేసీ తన ఇంటివద్ద విలేకరులతో మాట్లాడారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట ఎవరెవరు వచ్చారో వారి జాబితా, ఫొటోలు తనవద్ద ఉన్నాయని, వారిని ఇకపై టీడీపీ కార్యకర్తలు రప్పా.. రప్పాలాడిస్తారని అన్నారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ వాళ్లు శత్రువులు కాదంటూనే ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈరోజు మా వాళ్లను గట్టిగా పట్టుకుని కూర్చున్నా. రేపటి నుంచి నేను ఊళ్లో ఉండను. ఓ వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త చాలా మాట్లాడుతోంది. మా మహిళా కార్యకర్తలూ ఉన్నారు’ అని జేసీ రెచ్చిపోయారు. -
దళితులంటే అంత చులకనా?
అనంతపురం: దళితులంటే సీఎం చంద్రబాబు నాయుడుకు చులకన భావం ఎందుకని వైఎస్సార్సీపీ యువజన విభాగం, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందితే ‘కుక్కపిల్లను పడేసినట్లు పడేశారం’టూ సీఎం చేసిన వ్యాఖ్యలు దళితుల మనోభావాలను దెబ్బతీశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ‘దళితుల ఇళ్లలో ఎవరైనా పుట్టాలనుకుంటారా’ అని హేళనగా మాట్లాడారని, తరచూ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబుతో పాటు పత్రికలో ప్రచురించిన ‘ఈనాడు’ యాజమాన్యంపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అనంతపురం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లారు. అయితే ఆ సమయంలో సీఐ, ఎస్ఐ లేరు. మూడు గంటలపాటు ఫిర్యాదు తీసుకోకుండా అవమానానికి గురి చేశారంటూ ఆందోళనకారులు ఆవేదన చెందారు. పోలీసులు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారా.. లేకపోతే రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారా అని ప్రశ్నించారు. పోలీసుల వైఖరిని తప్పుపడుతూ నినాదాలు చేశారు. సాకే చంద్రశేఖర్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ మాట్లాడుతూ సింగయ్య భార్య మేరీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు వచ్చి ఆ రోజు జరిగిన ఘటనపై స్పష్టత ఇచ్చారన్నారు. సింగయ్య ప్రమాదానికి గురైన వెంటనే వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే పోలీసు అధికారులు అడ్డుజెప్పారన్నారు. అంబులెన్స్ వచ్చేంతవరకు తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన పోలీసులపైన, అధికారులపైన చర్యలు తీసుకోవాలన్నారు. సింగయ్యతో కలిసి అంబులెన్స్లో ప్రయాణించిన వారిని సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. సీఎం బాటలోనే టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్, తదితరులు దళితులు శుభ్రంగా ఉండరని, వారికి పదవులు అక్కర్లేదని హేళన చేస్తున్నారని మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు ఇస్తే అందుకు సంబంధించి రశీదు కూడా ఇవ్వడం లేదని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండటంతో పోలీసులు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే చిరంజీవి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసబాబు నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మిద్దె నగేష్, కుళ్లాయిస్వామి, కార్పొరేటర్లు కమల్భూషణ్, శ్రీనివాసులు, సర్పంచులు సాకే రామాంజినేయులు, ఓబులేసు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు పసలూరి ఓబులేసు, యువజన విభాగం నగర ఉపాధ్యక్షుడు వినీత్, ఉదయ్, నగర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, జెడ్పీటీసీ భాస్కర్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, కార్యదర్శి సాకే ఆనంద్, ఎస్సీ సెల్ నాయకులు వడియం పేట అంజి, వెంకటేశ్, ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సింగయ్యను కుక్కపిల్లతో చంద్రబాబు పోల్చడంపై ఆగ్రహం వైఎస్సార్సీపీ యువజన విభాగం, ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన సీఎంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ ఫిర్యాదు స్వీకరణకు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ వద్ద నిరసన -
‘అల్లూరి’.. ఒక సమూహ శక్తి
అనంతపురం అర్బన్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒక వక్తి కాదని, ఆయన ఒక సమూహ శక్తి అని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కలెక్టర్ వి.వినోద్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో అల్లూరి సీతారామారాజు 128వ జయంతి నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, కార్మిక సంక్షేమ బోర్డు రాష్ట్ర చైర్మన్ వెంకటశివుడు యాదవ్ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. అల్లూరి దేశభక్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఫైళ్లు పక్కాగా ఉండాలిచుక్కుల భూములు, 22ఏ జాబితాకు సంబంధించి ఫైళ్లు సమగ్ర వివరాలతో పక్కాగా ఉండాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. చుక్కల భూముల క్లెయిమ్ల పరిష్కారంపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా డాటెడ్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. -
రగులుతున్న కుంపట్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నేతల మధ్య కలహాల కుంపట్లు రాజుకున్నాయి. ఓవైపు హామీలు అమలు చేయలేదని సామాన్యులు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు ఎమ్మెల్యేలపై సొంతపార్టీలోనే అసమ్మతుల బెడద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సామాన్యులకు హామీలు అమలు చేయాల్సిన ఎమ్మెల్యేలు నిత్యం రాజకీయ గొడవలతో ఎత్తులకు పైఎత్తులు వేసుకోవడంలోనే సమయం సరిపోతోంది. సొంత పార్టీలోనే కార్యకర్తలు ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. స్వయానా ఎమ్మెల్యేలే ‘ఇంటింటికీ సుపరిపాలన’ పేరుతో తమ ఊరికి వచ్చినా కార్యకర్తలు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దగ్గుపాటికి ఆది నుంచీ అసమ్మతి పోరు.. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజునుంచీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దగ్గుపాటి వ్యవహారాలపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభాకర్పై కూడా దగ్గుపాటి ఫిర్యాదులు చేస్తున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి దగ్గుపాటిపై ఆరోపణలు వచ్చాయి. ఆ మరుసటి రోజే పాతూరులో ప్రభాకర్చౌదరి అక్రమ రవాణా చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వర్గీయులు వీడియోలను వైరల్ చేశారు. తాజాగా దగ్గుపాటికి సుధాకర్నాయుడు లాంటి నేతలు కూడా సొంత పార్టీలో అసమ్మతి వాదులుగా ముద్ర వేసుకున్నారు. శ్రావణిశ్రీపై ఫిర్యాదుల వెల్లువ.. శింగనమల ఎమ్మెల్యే శ్రావణిశ్రీపై రోజురోజుకూ అసమ్మతి వెల్లువెత్తుతోంది. నియోజకవర్గంలో ఇసుక దోపిడీ విచ్చలవిడి అయ్యింది. ఎమ్మెల్యే తల్లి వసూళ్లకు పాల్పడుతోందంటూ ఏకంగా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఇక్కడ కేశవరెడ్డి, నరసా నాయుడుతో కూడిన టీడీపీ ద్విసభ్య కమిటీ ఉంది. ఈ కమిటీ సభ్యుల అనుచరులకు కనీస విలువ ఇవ్వడం లేదని శ్రావణిశ్రీపై ఫిర్యాదు చేస్తున్నారు. నియోజకవర్గంలో వసూళ్లు తప్ప సొంత పార్టీ కార్యకర్తలకు ఏమాత్రమూ విలువ ఇవ్వడం లేదంటూ పలువురు కార్యకర్తలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. అమిలినేనికి ఈ–స్టాంప్ బ్రేకులు.. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు ఇటీవల ఈ–స్టాంప్ల కుంభకోణం మకిలి అంటుకుంది. ఇందులో తన ప్రమేయం లేదంటూ టీడీపీలోనే తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి కుమారుడు ఉన్నం మారుతీ చౌదరి పేరును తెరమీదకు తెచ్చారు. తనకంటూ సొంత పార్టీలో ప్రత్యర్థులు లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈయన పేరు బయటకు తెచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఉన్నం వర్గీయులకు సంబంధించి ఏ ఒక్కపనికీ ఎమ్మెల్యే సహకరించడం లేదని ఉన్నం ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీకి పనిచేసిన వారికి సొంతపార్టీ నాయకులే విలువనివ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఏడాది పాలన సందర్భంగా ఇంటింటికీ వెళుతున్న సమయంలోనూ ఎమ్మెల్యేలకు సొంతపార్టీ కార్యకర్తలు సహకరించడం లేదు. అంతర్గత విభేదాలతో నలిగిపోతున్న టీడీపీ కార్యకర్తలు మాకు ఈ ఎమ్మెల్యే వద్దంటూ బండారు శ్రావణిశ్రీపై ఫిర్యాదుల పర్వం తొలి నుంచీ అనంతపురం అర్బన్లో దగ్గుపాటి, వైకుంఠం మధ్య ఆగని పోరు పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపులో నువ్వంటే నువ్వేనని రచ్చకెక్కిన పరిస్థితి కళ్యాణదుర్గంలో అమిలినేని.. ఉన్నం మారుతీ చౌదరి మధ్య తారస్థాయికి వర్గపోరు నాయకుల మధ్య వైరంతో కార్యకర్తల్లో రోజురోజుకూ పెరుగుతున్న అసహనం -
గూగూడుకు పోటెత్తిన భక్తులు
నార్పల మండలం గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం తెల్లవారుజామున చిన్నసరిగెత్తు సందర్భంగా అర్చకులు హుసేనప్ప కుళ్లాయిస్వామి పీరును ప్రత్యేక పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. కుళ్లాయిస్వామి– ఆంజనేయస్వామి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కాసేపు తొక్కిసలాట జరిగింది. చిన్న సరిగెత్తులో భాగంగా స్వామి వారి భక్తులు ఫకీర్లుగా మారి జలధి పోయే వరకు నియమనిష్టగా ఉంటారు. – నార్పల/ సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
వజ్రకరూరు సర్పంచ్కు జాతీయ స్థాయి అవార్డు
వజ్రకరూరు: ఢిల్లీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ ఆధ్వర్యంలో డాన్బాస్క్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన షీరెప్రెజెంట్స్–2025 శిక్షణా తరగతులకు హాజరైన వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసాకు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. మొత్తం 45 మంది మహిళా ప్రజాప్రతినిధులు ఈ శిక్షణా తరగతులకు హాజరు కాగా, జూన్ 28 నుంచి ఈ నెల 4వ తేదీ వరకూ అవగాహన కల్పించారు. ప్రధానంగా పాలన, కమ్యూనికేషన్, ప్రజా నైతికత, నాయకత్వ నైపుణ్యాలు, సమస్యలు–వాటి పరిష్కారాలు, పార్లమెంట్ సందర్శన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బాల్య వివాహాలను అరికట్టడం, మహిళా సంఘాల బలోపేతం అంశాలపై మోనాలిసా మాట్లాడారు. దీంతో ఆమెను అవార్డుకు నిర్వాహకులు ఎంపిక చేసి, బెస్ట్ ఫర్మార్మెన్స్ అవార్డును అందజేశారు. -
● భిక్షమెత్తితేనే భుక్తి
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత ఇలాకాలోని ఓ దివ్యాంగుడు పింఛన్ అందక భిక్షమెత్తుకుని పొట్ట పోసుకుంటున్నాడు. హిందూపురానికి చెందిన రేణుక రాజు దివ్యాంగుడు. గత ప్రభుత్వంలో పింఛన్ వచ్చేది. కొత్త ప్రభుత్వంలో పింఛన్ మరింత పెరుగుతుందనుకున్నాడు. అయితే ఇందుకు విరుద్ధంగా పింఛన్ జాబితా నుంచి ఆయన పేరు కనుమరుగైంది. అధికారులను బతిమాలుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో కొన్ని నెలలుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచరిస్తూ భిక్షమెత్తుకుంటున్నాడు. శుక్రవారం గూగూడు కుళ్లాయి స్వామి ఉత్సవాల్లో ఈ దృశ్యం చూపరులను కలిచివేసింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
ఏమైందిరా నాన్నా..
ఈ సృష్టిలో ఏ జీవికై నా తల్లిప్రేమ ఒక్కటే. తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి. ఓ వానరం కూడా తన బిడ్డను పొత్తిళ్లలో జాగ్రత్తగా ఎత్తుకుని పరిసరాలంతా తిరిగింది. ఆహారం కోసం అన్వేషించింది. తినడానికి ఏదో దొరికిన తర్వాత బిడ్డను కిందకు దించింది. కానీ నిర్జీవంగా కన్పించిన బిడ్డ వైపు తదేకంగా చూస్తూ విషాదంలో మునిగిపోయింది.ఈ దృశ్యం శుక్రవారం అనంతపురం నగర శివారులోని వడియంపేట వద్ద– సాక్షిఫొటోగ్రాఫర్, అనంతపురం -
18 వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం పరికరాలు
● డీసీఓల సమావేశంలో పీడీ రఘునాథరెడ్డి అనంతపురం అగ్రికల్చర్: ఈ ఏడాది 18 వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం (డ్రిప్, స్ప్రింక్లర్లు) పరికరాలను రైతులకు సకాలంలో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి తెలిపారు. అయితే పరికరాల నాణ్యత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో కంపెనీ డీసీఓలు, మైక్రో ఇంజనీర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. గతేడాదిలో ఏవైనా పెండింగ్లో ఉంటే వారం రోజుల్లో పూర్తి చేసి పంపాలన్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటికే 1,359 హెక్టార్లకు కేటాయించిన యూనిట్లను సరఫరా చేసి సంబంధిత పొలాల్లో బిగించే (ఇన్స్టాలేషన్) పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి, ఏపీడీ ధనుంజయ, ఏడీహెచ్లు దేవానంద్, రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీ ప్యాట్లో ఓటీపీఆర్ఐ విద్యార్థుల సత్తా అనంతపురం: జీప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో జేఎన్టీయూ(ఏ) ఓటీపీఆర్ఐ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో గణనీయమైన ర్యాంకులు సాధించిన విద్యార్థులు డి.హేమంత్కుమార్ (204 ర్యాంకు ), కె.గురుచరణ్ (2,484), జి.దేవీప్రియ (3,828), ఎస్.కుష్వంత్ (4,058)ను ఓటీపీఆర్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీ సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ చక్కా గోపీనాథ్ అభినందించారు. -
ఫీజు బకాయిలు చెల్లించండి
రాయదుర్గం టౌన్: వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, కోశాధికారి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సుపరిపాలన సంబరాలు చేసుకోవడం కాదు.. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధులు విడుదల చేయాలనే డిమాండ్తో వందలాది మంది విద్యార్థులతో కలిసి శుక్రవారం రాయదుర్గంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు రూ.6,400 కోట్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. బకాయిలు విడుదలకాకపోవడంతో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్నాయక్, నియోజకవర్గ అధ్యక్షుడు శశి, ఉపాధ్యక్షుడు తరుణ్, మున్నా, నవీన్, సచిన్, నాగరాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా -
కేవీకేలో సర్టిఫైడ్ విత్తనాలు
బుక్కరాయసముద్రం: మండలంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో సర్టిఫైడ్ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి పేర్కొన్నారు. కందులు (పీఆర్జీ–176, ఉజ్వల), (ఎల్ఆర్జీ–52 అమరావతి) కిలో రూ.150, 4 కిలోల బ్యాగ్ రూ.600, పెసర (ఎల్జీజీ–607, ఎల్జీజీ 574), మినుములు (ఎల్బీజీ 884) కిలో రూ.150తో విక్రయిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 97046 66923, 70135 71755లో సంప్రదించాలని కోరారు. ఆయుర్వేద ఉత్పత్తుల సేవా కేంద్రంలో విజిలెన్స్ తనిఖీలు అనంతపురం: స్థానిక ఎ.నారాయణపురం పంచాయతీ రాఘవేంద్ర కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న ప్రజలను తప్పుదోవ పట్టించే ఆయుర్వేద ఉత్పత్తుల సేవా కేంద్రంలో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కస్టమర్ల నుంచి ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ కనిపించారు. కొనుగోలుదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, సేకరించిన మొత్తం ఇతర వివరాలు, వాట్సాప్ చాటింగ్లను స్వాధీనం చేసుకున్నారు. 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించారు. ఎస్–3 గ్రూప్స్ పవర్ సిరప్, సీహెచ్ఆర్ డీఐఏ కంట్రోల్ సిరప్, ఎస్3 గ్రూప్స్ ఆయుర్వేద ఉత్పత్తులపై సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా విరివిగా ప్రచారం చేస్తున్నారు. షుగర్ వ్యాధిని నియంత్రిస్తామని, ప్రజల్లో లైంగిక శక్తిని పెంచుతామని నమ్మబలికి కాల్ చేసే వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఈ వివరాలను నెల్లూరుకు చెందిన భరత్ అలియాస్ ఆలకుంట భరత్ కుమార్కు పంపిస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. తనిఖీల్లో విజిలెన్స్ సీఐ శ్రీనివాసులు, ఆయుర్వేద డాక్టర్లు డాక్టర్ కె.మాధవి, డాక్టర్ కేఎస్ రాంకుమార్, డాక్టర్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని వదలి వెళ్లకండి సార్.. కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు హనుమంతురాయుడు ఇటీవల మరొక పాఠశాలకు బదిలీ అయ్యారు. శుక్రవారం పాఠశాలలో వీడ్కోలు సభ నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ‘మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారు. హనుమంతురాయుడు విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకొని.. వారికి అనుగుణంగా బోధన చేసేవారని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. పేద విద్యార్థులకు గురుకులం, ఏపీఆర్ఎస్ వంటి వాటికి శిక్షణ ఇచ్చి.. ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. -
ఫైనాన్స్ కంపెనీలకు కుచ్చు టోిపీ
తాడిపత్రి టౌన్: నకిలీ ధ్రువీకరణ పత్రాలను ఫైనాన్స్ కంపెనీల్లో దాఖలు చేసి కొనుగోలు చేసిన వాహనాలను సగం ధరకే ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఆరుగురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రి పట్టణ పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఏఎస్పీ రోహిత్కుమార్ వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన కొందరు ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు జిల్లా ఎస్పీకి చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాడిపత్రి ప్రాంతంలోనే వందల సంఖ్యలో వాహనాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు పక్కా ఆధారాలతో తాడిపత్రికి చెందిన గయాజుద్దీన్, కలీముల్లా, ఇంతియాజ్, రోషన్, ముస్తాఫా ఖాధ్రీ, అనంతపురానికి చెందిన నూర్మహమ్మద్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవాలు బహిర్గమతయ్యాయి. ద్విచక్రవాహనాలతో పాటు కార్లు, ట్రాక్టర్లు, లారీలను సైతం వీరు సగం ధరకే విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకూ 92 ద్విచక్ర వాహనాలు, ఓ ఫోర్వీలర్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై శుక్రవారం కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాగా, ఈ ముఠాలోని మరికొందరు సభ్యులు అజ్ఞాతంలో ఉన్నారని త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని ఏఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రతి రెండు రోజులకు ఒకసారి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఎవరైనా సగం ధరకే వాహనాలు కొనుగోలు చేసి ఉంటే స్వచ్ఛందంగా పోలీసులకు అప్పగిస్తే వారిని బాధితులుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ అంశంలో నిర్లక్ష్యం వహిస్తే వారిని కూడా బాధ్యులుగా గుర్తిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ గౌస్ పాల్గొన్నారు. ఆరుగురు కేటుగాళ్ల అరెస్ట్ 92 ద్విచక్రవాహనాలు, ఆటో స్వాధీనం -
కార్మికుల జీవితాలతో చెలగాటమొద్దు
అనంతపురం అర్బన్: కార్మికుల జీవితాలతో చెలగాటమాడరాదని కూటమి ప్రభుత్వాన్ని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులు హెచ్చరించారు. ఏడు నెలలుగా బకాయిపడిన వేతనాన్ని తక్షణమే చెల్లించాలంటూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఐఎఫ్టీయూ ఏసురత్నం, రైతు కూలీ సంఘం రాయుడు, భవన నిర్మాణ కార్మిక సంఘం రామకృష్ణ మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు జి.ఓబుళు మాట్లాడుతూ.. నెలలుగా వేతనం చెల్లించకపోతే కార్మికులు ఎలా బతుకుతారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. వేతనాలు చెల్లించాలంటూ 85 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ఇటు ప్రభుత్వం కానీ, అటు అధికారులు కానీ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. యోగా డే అంటూ వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన కూటమి ప్రభుత్వానికి కార్మిక కుటుంబాల ఆకలి కేకలు వినిపించడం లేదని మండిపడ్డారు. తక్షణమే ఏడు నెలల వేతన, 40 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లింపుల విషయంలో వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ కార్మికులకు బకాయిలు చెల్లించినట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల బకాయిలు పూర్తిగా చెల్లించే వరకూ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎర్రిస్వామి, రాము పాల్గొన్నారు.